• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Politics

బీహార్‌ ఎన్నికల సమరం : నితీష్‌ కుమార్‌ను -మాయం – చేసిన బిజెపి !

29 Thursday Oct 2020

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Bihar Elections 2020, BJP, JDU, LJP, Nithish Kumar, RJD


ఎం కోటేశ్వరరావు


చాణక్య భూమి బీహార్‌. అన్ని ప్రధాన పార్టీలు అపరచాణక్య ఎత్తులు, జిత్తులతో తలపడుతున్న అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ముగిసింది. ఏకపక్షం అనుకున్న ఎన్నికలు ఎన్‌డిఏ కూటమికి వణుకుపుట్టిస్తున్నాయి. అక్టోబరు 28న జరిగిన తొలిదశ 71 స్ధానాల ఎన్నికల్లో ఎన్‌డిఏ కూటమి వెనుకబడిందని వార్తలు వచ్చాయి. కరోనాను లెక్క చేయకుండా గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కంటే ఎక్కువగా 55.69శాతం పోలింగ్‌ జరిగింది. నితీష్‌ కుమార్‌ను వదిలించుకోవాలనే ఓటర్ల వాంఛకు ఇది నిదర్శనమా ? నితీష్‌ కుమార్‌-నరేంద్రమోడీ కూటమిని గెలిపించాలనే ఉత్సాహం ఎక్కడా కనిపించటం లేదని పోలింగ్‌కు ముందు వచ్చిన వార్తల నేపధ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.


బిజెపి అంతర్గత సర్వేలలో ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ పట్ల ఓటర్లలో వ్యతిరేక భావం ఉందని వెల్లడి కావటం, మరికొన్ని సర్వేలలో కూడా అదే ప్రతిబింబించటంతో తొలి దశ ఓటింగ్‌కు రెండు రోజుల ముందు దర్శనమిచ్చిన బిజెపి పోస్టర్లలో నితీష్‌ కుమార్‌ మాయం అయ్యారు. నరేంద్రమోడీ చిత్రమే దర్శనమిచ్చింది. ఇది జెడియు శ్రేణులకు ఆగ్రహం తెప్పించిందని, అయితే పరువు పోతుందనే ఉద్దేశ్యంతో మౌనంగా ఉన్నారని వార్తలు వెలువడ్డాయి. బిజెపి అభ్యర్ధుల మీద జెడియు కార్యకర్తలు ప్రతీకారం తీర్చుకుంటారా ? చాణక్య భూమిగా పేరు గాంచిన బీహార్‌ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.


కరోనా లాక్‌ డౌన్‌ ముగిసినా ఇంకా కొన్ని ఆంక్షలు కొనసాగుతున్నాయి. దాని ప్రతికూల ప్రభావాలను జనం ఇంకా మరచి పోలేదు. ఎన్నికల ప్రకటన సమయంలో జెడియు నేత నితీష్‌ కుమార్‌ నాయకత్వంలోని ఎన్‌డిఏ కూటమి విజయం సాధించనుందంటూ సర్వేల పేరుతో తొలి ప్రచారబాణం వదిలారు. మూడు దశల్లో జరిగే ఎన్నికల్లో అక్టోబరు 28న తొలి దశ, నవంబరు మూడున మలి, ఏడున మూడవ చివరి పోలింగ్‌ ముగిసి పదవ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అమెరికాలోనే సర్వేలు గాడి తప్పాయి. మన దేశం సంగతి, ప్రత్యేకించి బీహార్‌ సంగతి సరేసరి. గత సర్వేలన్నీ నిజం కాలేదు. అంధులు ఏనుగును వర్ణించిన మాదిరి తొలి దశ ప్రచార ముగింపులో కూడా కొన్ని సంస్ధలు సర్వేల వివరాలను వెలువరించాయి. చివరి క్షణం వరకు ఎటూ తేల్చుకోని ఓటర్లు కొందరు ఉంటారు. వారిని ఆకర్షించటం కోసం ఇలాంటి జిమ్మిక్కులను పార్టీలు ప్రయోగిస్తుంటాయి.


ఎన్నికల ప్రకటన నాటికి-తొలి దశ నాటికీ పోలికే లేదన్నది స్పష్టం. నితీష్‌ కుమార్‌తో అధిక సీట్ల కోసం బేరం పెట్టిన లోక్‌జనశక్తి పార్టీ అది వీలుగాకపోవటంతో అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు తిరుగుబాటు జెండా ఎగురవేసి జెడియు పోటీ చేస్తున్న అన్ని స్ధానాల్లో అభ్యర్ధులను నిలిపింది. మిగిలిన చోట్ల బిజెపి అభ్యర్ధులను బలపరుస్తానని, తరువాత ఇద్దరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మరోవైపు ఆర్‌జెడి-కాంగ్రెస్‌ కూటమితో వామపక్షాలు సర్దుబాటు చేసుకుంటాయా లేదా అన్న సందేహాలు కూడా తొలగిపోయి సజావుగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలకు పైగా పదవిలో ఉన్న నితీష్‌ కుమార్‌ కుల రాజకీయాలతో పాటు, తాను లౌకిక వాదిని అని చెప్పుకొనేందుకు కొన్ని అంశాలతో విబేధించినా బిజెపితో కలసి అధికారాన్ని పంచుకొని మతవాసనలను కూడా అంటించుకున్నారని, అవినీతి పాలనకు తెరతీశారనే తీవ్ర విమర్శలు ఉన్నాయి.


బిజెపి ఆశలు పెట్టుకున్నట్లు ఈ ఎన్నికల్లో మోడీ గాలితో ఓట్లు వస్తాయా ? బీహార్‌ విషయానికి వస్తే మోడీ అధికారానికి వచ్చిన ఏడాది తరువాత జరిగిన 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓడిపోయింది. ఆ పార్టీ దీర్ఘకాలం అధికారంలో ఉన్న రాజస్దాన్‌, చత్తీస్‌ఘర్‌,మధ్య ప్రదేశ్‌, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ పలుకుబడి పని చేయలేదు. రెండోసారి పెద్ద సంఖ్యలో సీట్లతో గెలిచిన తరువాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ వలన బిజెపి సాధించిందేమీ లేదు. బీహార్‌లో దానికి భిన్నంగా ఎలా ఉంటుందన్న ప్రశ్నలకు బిజెపి వద్ద సమాధానం లేదు. నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఎన్నికల ప్రకటన తరువాత మరింతగా కనిపిస్తోంది. చాణక్యుడిగా భావించే అరవై తొమ్మిది సంవత్సరాల నితీష్‌ కుమార్‌ రాజకీయ జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు.

లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) విషయానికి వస్తే తాము ఎన్‌డిఏ, బిజెపి నుంచి విడిపోలేదని, నితీష్‌ కుమార్‌ను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని పదే చెబుతోంది. తాను గతం కంటే బలపడ్డాననే అంచనాకు వచ్చిన బిజెపి నితీష్‌ కుమార్‌ను వదిలించుకొనే ఎత్తుగడలో భాగంగానే ఎల్‌జెపిని రంగంలోకి దింపిందని, నితీష్‌ కుమార్‌ పార్టీతో నిమిత్తం లేకుండానే ఎల్‌జెపితో కలసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చనే అంచనాలో ఉందన్నది ఒక అభిప్రాయం. ఎన్నికల ప్రకటన వరకు కలసి ఉండి విడిపోతే ఇద్దరం నష్టపోతామనే భయంతో నితీష్‌ను ఎన్నికల వరకు ఒక ముసుగుగా బిజెపి ఉపయోగించుకుంటోందని, ఫలితాలను బట్టి చూసుకోవచ్చు లెమ్మని భావిస్తున్నదని చెప్పేవారూ లేకపోలేదు.రాముడికి హనుమంతుడు ఎలానో తాను నరేంద్రమోడీకి అలాంటి వాడినని తన గుండెను చీలిస్తే మోడీయే ఉంటారని ఎల్‌జెపి నేత చిరాగ్‌ పాశ్వాన్‌ తన ప్రభు భక్తిని ప్రదర్శించుకున్నాడు.

రంగంలోకి దిగిన తరువాత నితీష్‌కు పరిస్ధితి గడ్డుగా ఉందని అర్ధమైందని అందుకే స్ధిమితం కోల్పోయి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని భావిస్తున్నారు. ఒక సభలో మీరు ఓట్లు వేస్తే వేయండి లేకపోతే లేదు, అల్లరి చేయవద్దని విసుక్కున్నారు.కొడుకు కోసం ఏడెనిమది మందిని కన్నారు అంటూ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ గురించి పరోక్షంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాని మీద ఆర్‌జెడి నేత, లాలూ కుమారుడైన తేజస్వి యాదవ్‌ తిప్పి కొడుతూ ప్రధాని నరేంద్రమోడీకి కూడా తోడబుట్టిన వారు ఎక్కువగానే ఉన్నారని,నితీష్‌ వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశించి అయి ఉండవచ్చన్నారు.


బీహార్‌లో ఉన్న సంక్లిష్ట రాజకీయ పరిస్దితుల్లో రాష్ట్ర మంతటా పార్టీ విస్తరించకపోయినా 20శాతానికి లోబడి ఓట్లు ఉన్న నితీష్‌ కుమార్‌ ముఖ్యమంత్రిగా అంతకాలం పదవిలో ఉండటం సాధ్యమైంది. ఆర్‌జెడి-బిజెపి మధ్య పోరులో నితీష్‌కు అవకాశం వచ్చింది. కొందరు ఇది నితీష్‌ చాణక్య నీతి అంటారు. బీహార్‌లో లాలూ, నితీష్‌, రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ ముగ్గురూ మండల రాజకీయాల నుంచి ఎదిగినవారే.
సర్వేలను పూర్తిగా నమ్మనవసరం లేదు గానీ కొన్ని సర్వేల తీరు ఆసక్తికరం.2010లో నితీష్‌ కుమార్‌కు మద్దతు పలికిన వారు 77శాతం, 2015లో 80శాతం ఉన్నట్లు అప్పటి సర్వేలు తెలిపాయి. ప్రస్తుతం 52శాతానికి పడిపోయింది.లోక్‌నీతి-సిఎస్‌డిఎస్‌ సర్వే తిరిగి నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నవారు 38శాతమే అని వద్దంటున్నవారు 43శాతమని పేర్కొన్నది. సిఓటర్‌ సర్వే ప్రభుత్వ పనితీరుతో సంతోషంగా ఉన్నామని చెప్పింది 25శాతం, ఆశాభంగం చెందామన్నవారు 46శాతం అని పేర్కొన్నది ఈ కారణంగానే నితీష్‌తో ఇంక ప్రయోజనం లేదని బిజెపి ఎన్నికల గోదాలోకి దిగిన తరువాత భావిస్తున్నట్లు చెబుతున్నారు.


బీహార్‌లో మండల్‌- కమండల్‌ రాజకీయాలు పెద్ద ఎత్తున నడిచాయి. మండల్‌ త్రయంలోని నితీష్‌, రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ కమండలం పంచన చేరారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఒక్కరే మిగిలారు. బీహార్‌లో అరాజక శక్తులు చెలరేగిన మాట వాస్తవం. దానికి లాలూ కారకుడని చెప్పినప్పటికీ మిగిలిన నేతలు తప్పించుకోలేరు. ఉత్తర ప్రదేశ్‌ ఏమీ దానికి తక్కువ కాదు. రెండు చోట్లా భూస్వామిక శక్తులు బలంగా ఉన్నాయి. వాటిని ప్రతిఘటించటాన్ని కూడా అరాచకంగానే చిత్రించారు. పేదల పోరాటాలను అణచేందుకు భూస్వామిక శక్తులు కులాల వారీ బీహార్‌లో ప్రయివేటు సాయుధ ముఠాలను పెంచిపోషించాయి. దాడులకు పాల్పడ్డాయి. ప్రతిఘటించిన వారిని అరాజక శక్తులుగా వర్ణించారు. ప్రయివేటు సాయుధ ముఠాలను సమర్ధించిన వారిలో నితీష్‌ తక్కువ తినలేదు, బిజెపి నేతలుగా ఉన్న వారూ దూరంగా లేరు. ఇప్పుడు అలాంటి ముఠాలన్నీ దారి మార్చి ప్రభుత్వ కార్యాలయాల్లో తిష్టవేసి మామూళ్లు వసూలు చేస్తున్నాయని ఈ ఎన్నికల సందర్భంగా జనం చెబుతున్నారు. నితీష్‌-బిజెపి కూటమి పాలన మీద పెరిగిన వ్యతిరేకతకు ఇది కూడా ఒక కారణమే.
బీహార్‌ కుల సమీకరణలకు పెట్టింది పేరు. వామపక్షాలు మినహా మిగిలిన పార్టీలేవీ వాటికి అతీతంగా లేవు. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్ధితుల్లో ఏ కులం అభ్యర్ది అయినా నితీష్‌ కుమార్‌ నిలబెట్టిన వారిని ఓడిస్తారా లేదా అన్నదే ప్రధానంగా చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి.లోక్‌జనశక్తి పార్టీ నేత చిరాగ్‌ పాశ్వాన్‌ నిరంతరం నితీష్‌ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న కారణంగా ఆ పార్టీ పోటీ చేస్తున్న చోట కూడా ఓటర్లు జెడియును ఓడించే అభ్యర్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు బహిరంగంగానే చెబుతున్నారని బీహార్‌లో పర్యటించిన జర్నలిస్టులు రాస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్ధిగానూ, ఎన్‌డిఏ సారధిగా నితీష్‌ కుమారే అని ప్రకటించిన కారణంగా బిజెపి పోటీ చేస్తున్న చోటకూడా అసంతృప్తి చెందిన సాధారణ ఓటర్లకు నితీషే కనిపిస్తారు.

ఖండించినప్పటికీ బిజెపి-ఎల్‌జెపి మధ్య రహస్య ఒప్పందం ఉందనే ఊహాగానాలు మరింతగా పెరుగుతున్నాయని బిజెపి పక్కా మద్దతుదారు అయిన స్వరాజ్య పత్రిక ఒక విశ్లేషణకు శీర్షికగా పెట్టింది. పది రోజుల వ్యవధిలో రెండు సార్లు ఇదే అంశం గురించి ఆ పత్రిక రాసింది. తాజా విశ్లేషణలో వ్యాఖ్యాత పేర్కొన్న అంశాల సారం ఇలా ఉంది. తొలుత ప్రచారంలో భాగంగా బిజెపి ఏర్పాటు చేసిన బ్యానర్లు, ముద్రించిన పోస్టర్లు, మీడియా వాణిజ్య ప్రకటనలలో నరేంద్రమోడీతో పాటు నితీష్‌ కుమార్‌ చిత్రానికి సమాన ప్రాధాన్యత ఇచ్చారు. మొదటి దశ ఎన్నికలు దగ్గరపడే ముందు ప్రచురించిన వాటిలో కేవలం నరేంద్రమోడీ చిత్రమే ఉంది. వీటిని చూసి జెడియు నేతలు హతాశులయ్యారు గానీ మౌనం వహించారు. తొలి దశ ఎన్నికలకు ముందు ఇలాంటి వాటి మీద వ్యాఖ్యానించటం సరైంది కాదని, ఈ చర్య తమను గాయపరించిందని, బిజెపి-ఎల్‌జెపి మధ్య రహస్య ఒప్పందం ఉందన్న అభిప్రాయం బలపడేందుకే ఇది దోహదం చేస్తుందని జెడియు అగ్రనేత ఒకరు చెప్పారు.కేవలం మోడీ బొమ్మలతో ప్రచారం చేయటం తనకు సంతోషం కలిగిస్తున్నదని, మా బిజెపి మిత్రులు నితీష్‌ కుమార్‌ నష్టదాయకం అని గ్రహించారని ఎల్‌జెపి నేత చిరాగ్‌ పాశ్వాన్‌ వ్యాఖ్యానించారు. బీహార్‌లో ఎన్‌డిఏ నుంచి ఎల్‌జెపి బయటకు పోయిన తరువాత కేంద్రంలో కూడా ఆ పార్టీని బహిష్కరించాలని నితీష్‌ కుమార్‌ డిమాండ్‌ చేసినా బిజెపి తిరస్కరించటంతో పుకార్లకు ఆజ్యం పోసినట్లయింది. ఎన్నికల తరువాత బిజెపి-ఎల్‌జెపి ప్రభుత్వం ఏర్పడుతుందన్న ప్రకటనలు ఖండించదగ్గ పెద్దవి కాదని బిజెపి కొట్టిపారవేస్తోంది. చిరాగ్‌ పాశ్వాన్‌ గురించి నరేంద్రమోడీ ఎలాంటి ప్రస్తావనలు చేయకపోవటంతో జెడియు నేతలు ఆశాభంగం చెందారు. ఇరవై ఒక్క మంది బిజెపి తిరుగుబాటుదార్లకు చిరాగ్‌ సీట్లు ఇచ్చారు. ఊహాగానాలను బిజెపి నేతలు గట్టిగా ఖండించలేదని జెడియు నేతలు చెప్పారు. ఎల్‌జెపి నేతలు తాము పోటీ చేస్తున్న చోట్ల ఎన్నికల తరువాత తాము బిజెపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అందువలన మోడీ మద్దతుదారులు తమకు ఓటు వేయాలని కోరుతున్నారు.


బిజెపి వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పుకుంటుంది. అయితే బీహార్‌ ఎన్నికల్లో అది పోటీ చేస్తున్న 110 స్దానాల్లో 51 మంది అగ్రవర్ణాలుగా పరిగణించబడుతున్నవారికే ఇచ్చింది. జనాభాలో వారు కేవలం 16శాతమే. ఇరవై రెండు మంది రాజపుత్రులు,15 భూమిహార్లు, 11 మంది బ్రాహ్మలు, ముగ్గురు కాయస్ధులు ఉన్నారు. 2015 ఎన్నికల్లో 157 స్ధానాలకు పోటీ చేసిన ఆ పార్టీ 65 మంది ఈ సామాజిక తరగతుల వారికే సీట్లు ఇచ్చింది. గత మూడు దశాబ్దాలుగా లాలూ ప్రసాద్‌ అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడింది వారే గనుక మిగతావారి కంటే వారికే ప్రాధాన్యత ఇవ్వటం సహజమే అని బిజెపి నేతలు సమర్ధించుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న బీహార్‌కు చెందిన సినిమా నటుడు సుశాంత సింగ్‌ రాజపుత్‌ ఉదంతాన్ని పెద్ద ఎత్తున వివాదాస్పదం చేసి లబ్ది పొందేందుకు బిజెపి ప్రయత్నించిందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బిజెపి మిత్రపక్షమైన జెడియు పోటీ చేస్తున్న 115 స్ధానాలలో ఈ సామాజిక తరగతులకు కేవలం 19 మాత్రమే ఇచ్చారు.


దేశంలో తొలిసారిగా సంఘపరివార్‌ శక్తులకు లోక్‌సభలో తిరుగులేని మెజారిటీ వచ్చింది. నాలుగు ఉన్నత రాజ్యాంగ పదవుల్లో వారే ఉన్నారు. బలం లేని స్ధితిలో బిజెపి నేతలుగా ఉన్న అతల్‌-వాజ్‌పేయి ద్వయానికి ప్రస్తుత మోడీ-షా ద్వయం పని తీరు, ఎత్తుగడల్లో ఎంతో తేడా ఉంది. సంఘపరివార్‌ అసలు రూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎవరినైనా ఉపయోగించుకోవటం, అవసరం తీరిన తరువాత పక్కన పడేయటాన్ని చూస్తున్నాము. బీహార్‌లో బిజెపి పెరుగుదల లేదా స్ధిరపడటానికి నితీష్‌ ఎంతగానో సహకరించారన్నది స్పష్టం. అంతర్గతంగా బిజెపి చేయించిన సర్వేలలో పరిస్ధితి క్లిష్టంగా ఉన్నట్లు తేలిందనే వార్తలు వచ్చాయి. మూడింట రెండువంతుల మెజారిటీ తమ కూటమికి వస్తుందని, ఏ పార్టీకి మెజారిటీ సీట్లు వచ్చినా నితీష్‌ కుమారే తిరిగి సిఎం అని పార్టీ అగ్రనేతలు చెప్పినప్పటికీ వారి అనుమానాలు వారికి ఉన్నాయి. అందుకే నితీష్‌ కుమార్‌ గురించి చిరాగ్‌ పాశ్వాన్‌ ఎన్ని మాట్లాడుతున్నా నోరు మెదపటం లేదు. ఎన్నికల తరువాత తమను వదిలించుకొని ఆర్‌జెడి నాయకత్వంలోని కూటమితో నితీష్‌ కుమార్‌ చేరితే ఏమిటనే ఆందోళన కూడా బిజెపిలో లేకపోలేదు. గత ఎన్నికల్లో ఆర్‌జెడితో కలసి పోటీ చేసి బిజెపితో చేతులు కలిపిన పెద్దమనిషి మరోమారు అదే పని చేయరని ఎవరు చెప్పగలరు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

బొలీవియా మాస్‌ విజయం 2.0 – ప్రభుత్వం ముందు పెను సవాళ్లు !

25 Sunday Oct 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, USA

≈ Leave a comment

Tags

Bolivia’s 2020 election, Evo Morales, Luis Arce, MAS-Bolivia


ఎం కోటేశ్వరరావు


అనేక అనుమానాలు, సందేహాలకు తెరదించుతూ శుక్రవారం(అక్టోబరు 23వ తేదీ) రాత్రి లాటిన్‌ అమెరికా దేశమైన బొలీవియా ఎన్నికల సంఘం అధ్యక్ష, పార్లమెంట్‌ ఉభయ సభల ఎన్నికల ఫలితాలను ప్రకటించింది. దీంతో అక్కడి రాజకీయ పరిణామాలు మరోమలుపు తిరిగాయి. సోషలిజం కోసం ఉద్యమం(మాస్‌) పార్టీనేత ఇవోమొరేల్స్‌ గతేడాది జరిగిన ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని నిర్ధారణ అయింది. అమెరికా పన్నిన కుట్రలో భాగంగా నానా యాగీ, ఆరోపణలు చేసిన అమెరికా దేశాల సంస్ధ(ఓఏఎస్‌) పరువుపోయింది. దాని ప్రధాన కార్యదర్శి ఆల్‌మాగ్రో రాజీనామా చేయాలనే వత్తిడి పెరిగింది. తమ మద్దతుదార్లను అడుగడుగునా రెచ్చగొట్టేందుకు అమెరికా పన్నిన వలలో చిక్కకుండా మాస్‌ పార్టీ నాయకత్వం సమర్ధవంతంగా తిప్పికొట్టింది. అనేక చోట్ల కార్యకర్తలు, నేతలపై దాడులు, తప్పుడు కేసులతో వేధించటం, ఆ పార్టీకి తిరుగులేని పట్టు ఉన్న ప్రాంతాలకు పెట్రోలియం ఉత్పత్తుల వంటి వాటిని సరిగా సరఫరా చేయకపోవటం వంటి అనేక అక్రమాలకు తాత్కాలిక ప్రభుత్వం పాల్పడింది.


మాస్‌ పట్ల జనంలో తిరుగులేని విశ్వాసం వ్యక్తం కావటం ప్రపంచంలోని యావత్‌ వామపక్ష శక్తులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది, బాధ్యతను మరింతగా పెంచింది. మాస్‌ పార్టీ అభ్యర్ధి లూయీస్‌ ఆర్‌సికి పోలైన ఓట్లలో 55.1శాతం, ప్రత్యర్ధి కార్లోస్‌ మెసాకు 28.83, మూడవ అభ్యర్ధి ఫెర్నాండో కామ్చోకు 14శాతం వచ్చాయి. పార్లమెంట్‌ దిగువ సభలోని 130 స్ధానాల్లో మాస్‌ పార్టీకి 73, మిగతా రెండు పార్టీలకు 41,16 చొప్పున వచ్చాయి. ఎగువ సభలోని 36 స్ధానాలలో మాస్‌కు 21, రెండు, మూడు స్ధానాల్లో ఉన్న పార్టీలకు 11,4 చొప్పున వచ్చాయి. కొత్త ప్రభుత్వం వచ్చేనెల మధ్యలో ప్రమాణస్వీకారం చేయనుంది. దేశంలో 73లక్షల మంది ఓటర్లలో 60ఏండ్ల లోపు వారు విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది, ఈసారి 88శాతం పోలింగ్‌ జరిగింది.


గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మితవాదశక్తులు హింసాకాండకు పాల్పడ్డాయి. అసలు గత ఏడాది ఎన్నికలు జరగ ముందే బొలీవియా ఎన్నికలను తాము గుర్తించబోమని, అవి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించటం లేదని అమెరికా, బ్రెజిల్‌, కొలంబియా మరికొన్ని దేశాల మితవాద పాలకులు ప్రచారం ప్రారంభించారు. అనివార్యమై జరిపిన ఈ ఎన్నికల్లో మితవాద శక్తులు ఒకే అభ్యర్ధిని నిలిపేందుకు శతవిధాలా ప్రయత్నించాయి. అయితే వాటి మధ్య ఉన్న అధికార యావ కారణంగా సాధ్యం కాలేదు. మాస్‌ పార్టీ మెజారిటీ ఓట్లు సాధించనుందని సర్వేలు వెల్లడించినా తగినన్ని ఓట్లు రాక రెండవదఫా ఎన్నికల్లో పోటీలో నిలిచే మితవాద అభ్యర్ధి విజయం సాధిస్తాడనే అంచనాతో ఈ సారి ఆశక్తులు ఉన్నాయి. మరొక ప్రధాన కారణం తటస్ధ ఓటర్లకు ఆగ్రహం తెప్పించకుండా వారి ఓట్లను ఆకర్షించాలనే ఎత్తుగడ కూడా దాడులకు పాల్పడకుండా నిలువరించిందని చెబుతున్నారు. గత ఏడాది కుట్రదారులు గద్దెనెక్కిన తరువాత తమకు ప్రత్యర్ధులు అనుకున్నవారి మీద పెద్ద ఎత్తున దాడులు చేయటంతో భయవాతావరణం ఏర్పడి ఎన్నికల ముందు 20శాతం ఓటర్లు తామెవరికి ఓటు వేసేది నిర్ణయించుకోలేదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దాడులను తప్పించుకొనేందుకే వారలా చెప్పారని, చడీచప్పుడు లేకుండా పోలింగ్‌లో తమ నిర్ణయాన్ని మాస్‌కు అనుకూలంగా తీసుకున్నారని నిర్ధారణ అయింది. ఎన్నికల్లో అనూహ్యంగా ఫలితాలు ఎదురుకావటంతో కొన్ని చోట్ల ఈ శక్తులు విధ్వంసకాండ సృష్టించేందుకు అక్రమాలు జరిగాయంటూ ప్రదర్శనలు చేశాయి. అయితే అమెరికా దేశాల సంస్ధ, ఇతర పరిశీలకులు అలాంటివేమీ లేవని ప్రకటించటంతో వెనక్కు తగ్గాయి. గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఇవో మొరేల్స్‌ విజయం సాధించినట్లు ప్రకటించగానే పోలీసు, మిలిటరీ కుట్రచేసి అక్రమాలు జరిగాయని జనాన్ని నమ్మించేందుకు అనేక చోట్ల బ్యాలట్‌ బాక్సులు, ఎన్నికల కార్యాలయాలను దగ్దం చేసి ఇవో మొరేల్స్‌ మీద అనుమానాలు రేకెత్తించేందుకు ప్రయత్నించారు. అది కుట్ర అని, మాస్‌ పార్టీకి జనంలో మద్దతు ఉందని ఈ ఎన్నికలు నిర్ధారించాయి. మితవాదులు వెనక్కు తగ్గటానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.


దిగజారిన ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపరుస్తామని మాస్‌ వాగ్దానం చేసింది. అయితే దాని ప్రత్యర్ధి పార్టీలు మెజారిటీగా ఉన్న రెడ్‌ ఇండియన్‌ తెగల పట్ల అనుసరించే దురహంకార ధోరణులు, ప్రత్యామ్నాయ ఆర్ధిక విధానాలను ప్రకటించలేకపోవటం, శ్వేత జాతి, మిశ్రమ రంగు జాతీయుల ఓట్లకోసం వెంపర్లాడటం తప్ప మెజారిటీ జనాన్ని పట్టించుకోకపోవటం మితవాద శక్తుల ఓటమికి దోహదం చేసిన కారణాలలో కొన్ని. మితవాద పార్టీలు రెండూ అమెరికా అనుకూలశక్తులుగా జనం గుర్తించటం, అమెరికా,ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులు పొందటం, ఇవోమొరేల్స్‌ ప్రభుత్వ కూల్చివేత కుట్ర వెనుక వారి హస్తం ఉందన్న అంశాలు కూడా మాస్‌ విజయానికి దోహదం చేశాయి. కరోనా కేసులు విపరీతంగా ఉండటం, ఆరోగ్యశాఖ మంత్రి మెర్సిలో వెంటిలేటర్ల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిదొరికిపోయి అరెస్టు కావటం వంటి పరిణామాలు కుట్రదారుల ప్రభుత్వం అంటే ఏమిటో జనానికి స్పష్టమైంది. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించటం తప్ప ఉపాధి కోల్పోయిన వారికి ఎలాంటి సాయం అందించకపోవటంతో కార్మికులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. బొలీవియా ఎదుర్కొంటున్న సమస్యలకు పెట్టుబడిదారీ, మితవాద శక్తుల దగ్గర ఎలాంటి ప్రత్యామ్నాయం లేదని, వారు అధికారానికి వస్తే ఉన్న సంక్షేమ చర్యలను కూడా తిరగదోడతారనే విషయం ఓటర్లకు స్పష్టమైంది.


కొత్త ప్రభుత్వం ముందు పెద్ద సవాళ్లే ఉన్నాయి. కరోనాను అదుపు చేయటం వాటిలో ఒకటి. ఈ ఏడాది జిడిపి 6.2శాతం తిరోగమనంలో ఉంటుందని అంచనా. అందువలన దిగజారిన ఆర్దిక వ్యవస్ధను తిరిగి గాడిలో పెట్టటం, సామాన్యులకు ఉపశమనం కలిగించటం, జాత్యహంకార శ్వేతజాతి, పచ్చి మితవాద శక్తులను అదుపు చేయటం, అన్నింటికీ మించి అమెరికా కుట్రలను ఎదుర్కోవటం వంటి అంశాలున్నాయి. పద్నాలుగు సంవత్సరాల ఇవో మొరేల్స్‌ పాలనలో గ్యాస్‌, పెట్రోలియం, టెలికమ్యూనికేషన్స్‌, గనులను జాతీయం చేయటం వంటి చర్యలు చేపట్టినప్పటికీ ప్రయివేటు రంగానికి లోబడే చేశారు. ఈ పరిమిత చర్యల కారణంగా కూడా దేశ ఆదాయం పెరిగింది. ఇవో మొరేల్స్‌ అధికారానికి రాక ముందు ప్రయివేటు రంగంలోని పెట్రోలియం, గ్యాస్‌ క్షేత్రాల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన వార్షిక ఆదాయం 73 కోట్ల డాలర్లు కాగా వాటిని జాతీయం చేసిన తరువాత 495 కోట్లకు పెరిగింది.దాంతో చేపట్టిన సంక్షేమ చర్యల కారణంగా 60శాతంగా ఉన్న పేదరికం 35కు తగ్గిపోయింది. ఇప్పుడు కరోనా కారణంగా తిరిగి పెరిగినట్లు వార్తలు వచ్చాయి. స్దానిక తెగల భాషలతో స్కూళ్లలో బోధన ప్రారంభించారు. బొలీవియాలో పండించే కోకాతో ఔషధాలతో పాటు కొకెయిన్‌ అనే మాదక ద్రవ్యాన్ని కూడా తయారు చేయవచ్చు. అయితే మాస్‌ ప్రభుత్వం రాక ముందు మాదక ద్రవ్యాల నిరోధం పేరుతో యంత్రాంగం కోకా రైతుల జీవితాలను నాశనం చేసింది. మొరేల్స్‌ అధికారానికి వచ్చాక కోకా సాగును చట్టబద్దం చేశాడు.మాదక ద్రవ్యాల నిరోధానికి తగుచర్యలు తీసుకున్నారు.


గత పదకొండు నెలల తాత్కాలిక ప్రభుత్వ పాలనలో ఆర్ధికరంగం దిగజారింది. నిరుద్యోగం 4.2 నుంచి 12శాతానికి చేరింది, నిర్మాణ రంగం వంటి వాటిలో 30శాతం ఉంది. ఉత్పత్తి 16శాతం పడిపోయింది. ద్రవ్యలోటు ఆరు నుంచి తొమ్మిది శాతానికి పెరిగింది. దారిద్య్రం, సంపద కేంద్రీకరణ పెరిగింది.ఇవో మొరేల్స్‌ ప్రభుత్వాన్ని కూలదోయటం వెనుకు బహుళజాతి కంపెనీల హస్తం ఉంది. మోటారు వాహనాలు, సెల్‌ఫోన్లలో వినియోగించే బ్యాటరీల తయారీకి అవసరమైన లిథియం నిల్వలకు బొలీవియా కేంద్రం. ప్రపంచ మొత్తం నిల్వల్లో అక్కడ 25 నుంచి 45శాతం వరకు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ముడి ఖనిజాన్ని ఎగుమతి చేయటం కంటే బ్యాటరీలు తయారు చేసి ఎగుమతి చేయటం మరింత లాభసాటిగా ఉంటుందని, ఆ వచ్చే సొమ్ముతో దారిద్య్రనిర్మూలనతో పాటు సంక్షేమ చర్యలను అమలు జరపవచ్చని మొరేల్స్‌ ప్రభుత్వం తలపెట్టింది. అక్కడ ఉన్న ఖనిజంతో ఏడాదికి నాలుగు లక్షల బ్యాటరీలను తయారు చేయవచ్చని అంచనా వేశారు. ఆమేరకు ప్రభుత్వ రంగ సంస్ధ ఒక ప్రకటన చేసిన తరువాత ఎన్నికలు జరగటం, ఇవోమొరేల్స్‌ ఘనవిజయం సాధించటం, కుట్ర చేసి తొలగించటం తెలిసిందే. అధికారానికి వచ్చిన అమెరికా అనుకూల కుట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలలో లిథియం శుద్దికి మొరేల్స్‌ సర్కార్‌ జర్మనీతో కుదుర్చుకున్న సంయుక్త పధకాన్ని రద్దుచేయటం ఒకటి.
లూయీస్‌ ఆర్‌సి నూతన ప్రభుత్వ ఏర్పాటు గురించి ఆచితూచి ప్రకటన చేశారు. అయితే గత ఏడాది కాలంలో జరిగిన హింసాకాండ, హత్యలకు బాధ్యులైన వారి మీద ఏ చర్యలు తీసుకుంటారు? 36 మంది మరణించగా 800మందికి పైగా గాయపడ్డారు. మంత్రుల మీద వచ్చిన అవినీతి ఆరోపణలను నిగ్గుతేలుస్తారా ? ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే మితవాదశక్తులు మరోసారి రెచ్చిపోయే అవకాశం ఉంది. దాన్నెలా ఎదుర్కొంటారు ? ఇవో మొరేల్స్‌ అర్జెంటీనా ప్రవాసం నుంచి ఎప్పుడు తిరిగి వస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.కుట్రదారులు మోపిన కేసులు ఇంకా పరిష్కారం కాలేదు. కొత్త ప్రభుత్వం వాటిని రద్దు చేస్తుందా లేక విచారణ కొనసాగించి నిజం లేదని నిగ్గుతేలుస్తుందా అన్నది స్పష్టం కాలేదు.


ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులకు తాజా ఎన్నికల్లో విజయం లభించినప్పటికీ రాబోయే ఐదు సంవత్సరాలలో మాస్‌ ప్రభుత్వ నడక నల్లేరు మీద బండిలా ఉండే అవకాశం ఉంటుందని చెప్పలేము. పద్నాలుగు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న మాస్‌ పార్టీ ఆర్ధిక రంగంలో లాటిన్‌ అమెరికాలోని మిగతా వామపక్ష పాలిత దేశాలలో మాదిరి నయాఉదారవాద పునాదులను కదిలించలేదు. కొన్ని సంక్షేమ చర్యలు తీసుకొని ఉపశమనం కలిగించటం తప్ప పెట్టుబడిదారీ వ్యవస్ధ ముందుకు తెచ్చిన అసమానత, దోపిడీలను అవి నివారించలేవు. వాటికి ఉన్న పరిమితులు కూడా ఏమిటో గత రెండు దశాబ్దాల అనుభవం వెల్లడించింది. అమెరికాతో కుమ్మక్కయిన పోలీసు, మిలిటరీ, మితవాద శక్తుల కుట్రలకు బొలీవియాలో తాత్కాలికంగా తెరపడింది. అవి తిరిగి మరోమారు తలెత్తలేవని చెప్పలేము. దానికి గాను పలు ఆటంకాలను అధిగమించాల్సి ఉంది.అయితే ఈ విజయంతో సంతృప్తి చెంది ఆదమరవకుండా అమెరికా కుట్రలను నిరంతరం కనిపెట్టటంతో పాటు విధానపరమైన మార్పులను చేపట్టి పురోగమించటం ఎలా అనే అతిపెద్ద సవాలు ఆ పార్టీ ముందు ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా కట్టడితో చైనాలో ఆనంద హేల – ముట్టడితో అమెరికాలో ఆరోపణల గోల !

03 Saturday Oct 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Blame game in US on Covid-19, Covid-19 two contrast scenarios, Revenge travel in China


ఎం కోటేశ్వరరావు


రెండు దృశ్యాలు ప్రపంచానికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకచోట ఆనంద హేల ! మరో చోట ఆరోపణల గోల !! కరోనా వైరస్‌ను కట్టడి చేసిన చైనాలో అక్టోబరు ఒకటవ తేదీన ప్రతి ఏటా జరుపుకొనే అరుణపతాక ఆవిష్కరణ ఎంతో ఆర్భాటంగా జరిగింది. 1949 అక్టోబరు ఒకటవ తేదీన చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. ఇదే సమయంలో శరత్కాల పండుగను కూడా జరుపుకుంటారు. అందువలన రెండింటికి కలిపి వారం రోజుల పాటు ఇచ్చే సెలవులు గడిపేందుకు దాదాపు 55 కోట్ల మంది వివిధ ప్రాంతాలకు పయనమై వెళ్లారు. కరోనాను కట్టడి చేసిన తరువాత చైనాలో సాధారణ జీవనం పునరుద్దరణ అయిందనేందుకు ఇది నిదర్శనం.


మరోవైపు కరోనా నిరోధాన్ని నిర్లక్ష్యం చేసి రెండు లక్షలకు పైగా ప్రాణాలు పోయేందుకు,75లక్షల మందికి కరోనా సోకేందుకు కారకుడైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన నేరం, వైఫల్య నెపాన్ని ఇతరుల మీద నెట్టేందుకు పూనుకున్నాడు. నిర్లక్ష్యంతో అధ్యక్షుడిగా యావత్‌ అమెరికా పౌరులను, చివరకు వ్యక్తిగతంగా తాను, సతీమణికి సైతం కరోనాను అంటించి క్వారంటైన్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలిసారి జరిగిన అభ్యర్ధుల సంవాదంలో ట్రంప్‌ పచ్చి అబద్దాలు, అసత్యాలను పలికాడు. ప్రత్యర్ధి జో బిడెన్‌, మీడియా, ఇతరులు ట్రంప్‌ మీద విరుచుకు పడ్డారు. ఎన్నికలు జరిగే నాటికి కోటి మంది వరకు కరోనా బారిన పడే తీరులో వ్యాధి వ్యాపిస్తోంది. మరోవైపు చైనాలో అడపాదడపా కొన్ని కేసులు వెలుగు చూడటం -అదీ విదేశాల నుంచి దిగుమతి అయ్యేది – తప్ప మొత్తంగా వ్యాధి అదుపులో ఉంది.


మహమ్మారులను ఎదుర్కోవటం,కట్టడి చేయటంలో సోషలిస్టు ప్రభుత్వాల ప్రత్యేకతేమిటో చరిత్రలో తొలిసారిగా ప్రపంచం చూసింది. వంద సంవత్సరాల క్రితం స్పానిష్‌ ఫ్లూ వ్యాప్తి చెందిపెద్ద సంఖ్యలో జనం మరణించిన సమయానికి రష్యాలో బోల్షివిక్‌ ప్రభుత్వం పూర్తిగా నిలదొక్కుకోలేదు. కరోనా కేసులు తొలుత చైనాలో బయట పడిన కారణంగా అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వ జీవ ఆయుధాల తయారీలో భాగంగా బయటకు వదిలారని, ప్రమాదవశాత్తూ బయల్పడిందని ఏ కారణం చెప్పినప్పటికీ చైనా మీద ఆరోపణలు చేసేందుకు, కమ్యూనిస్టు సిద్దాంతం మీద దాడి చేసేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. కరోనా పేరుతో అన్ని విధాలుగా ఒంటరి పాటు చేసేందుకు, ఆ పేరుతో ఆర్ధిక ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించిన దేశాలు ఏవో చూశాము. వాటన్నింటినీ తట్టుకొని తన దైన శైలిలో ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని కరోనా నుంచి బయటపడింది.


కరోనా కేసులు తొలుత బయట పడిన ఊహాన్‌ నగరం, హుబెయి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు జరిపిన తీరు ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగలేదు, అన్నింటికీ మించి జనం ఎక్కడా చైనా, వియత్నాంలో మాదిరి సహకరించలేదు. మహమ్మారి నుంచి చైనా సమాజాన్ని బయటపడవేసేందుకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం తీసుకున్న చర్యల మీద జనం అచంచల విశ్వాసాన్ని ప్రదర్శించారు. దీనికి గత నాలుగు దశాబ్దాలలో సంస్కరణలు అమలు జరిపి జనజీవితాలను మెరుగుపరచిన వాస్తవాన్ని స్వయంగా గమనించటమే కారణం. పదేండ్ల క్రితం ధనికదేశాల్లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కారణంగా తమ ఆర్ధిక వ్యవస్ధ కూడా ప్రభావితం అయినప్పటికీ జనాన్ని ఆదుకున్న తీరును, మిగిలిన దేశాల్లో జనజీవితాలు అస్తవ్యస్ధం కావటాన్ని చూశారు గనుకనే కరోనా మహమ్మారిని జయించేందుకు ప్రభుత్వంతో కలసి జనం పోరాడారు.
దాదాపు తొమ్మిది నెలల పాటు క్వారంటైన్‌, లాక్‌డౌన్‌, అనేక ఆంక్షలను అనుభవించిన జనం గత రెండు నెలలుగా కొత్తకేసులు లేకపోవటంతో పంజరాల నుంచి బయట పడిన పక్షులు స్వేచ్చగా ఎగిరే మాదిరి బయటకు వచ్చారు. పరిస్ధితులన్నీ బాగుపడ్డాయనే ధైర్యం వచ్చిన తరువాత కసిగా విహార యాత్రలకు వెళుతున్నారని విశ్లేషకులు వర్ణించారు. ఇది చైనా ఆర్ధిక వ్యవస్దకు కూడా ఎంతో మేలు చేకూరుస్తుంది. సెప్టెంబరు30వ తేదీన 12 కేసులు నమోదు కాగా అవి కూడా విదేశాల నుంచి వచ్చిన వారివే. ఎనిమిది రోజుల పాటు సెలవులను ప్రకటించటం ఏ దేశంలో అయినా జరుగుతుందా ? చైనాలో మాత్రమే చూడగలం. నూటనలభై కోట్ల జనాభా ఉన్న దేశంలో ఒక్కసారిగా 55 కోట్ల మంది బయటకు వస్తే బహిరంగ స్ధలాలు ఎంత రద్దీ అవుతాయో ఊహించుకోవాల్సిందే. ప్రయాణ సాధనాల్లో, హౌటళ్లలో రిజర్వేషన్లు దొరక్క, ఒక రోజు ముందే వాహనరద్దీతో ఇండ్లకే పరిమితమైన వారెందరో. వాహనాలు నత్తనడక నడిచాయి. ఐదు వందలకు పైగా విహార కేంద్రాలలో ప్రవేశానికి రాయితీలు లేదా ఉచితంగా అనుమతిస్తూ ప్రకటించారు. అక్టోబరు ఒకటవ తేదీ ఒక్కరోజే 14,941 విమానాలు ఏర్పాటు చేశారు. రద్దీని తట్టుకొనేందుకు ప్రత్యేక విమానాలు కూడా సిద్దం చేశారు. సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు ఎనిమిది వరకు రైల్వేశాఖ 10.8 కోట్ల మంది రైళ్లలో ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే చైనా సమాజం మీద ఆర్ధికంగా కరోనా ప్రభావం లేదా ? ఉంది కనుకనే గత ఏడాది 80 కోట్ల మంది ప్రయాణాలు చేస్తే ఈ ఏడాది 55 కోట్ల మందే చేస్తున్నారని వెల్లడైంది. గతేడాది 9.5బిలియన్‌ డాలర్ల మేరకు జనం ఖర్చు చేశారు. ఈ ఏడాది తగ్గనుంది.ఆగస్టు నుంచి సాధారణ వస్తుకొనుగోలు పెరిగింది.


కరోనా వైరస్‌ను అదుపు చేయటంలో ఒక్క చైనాయే కాదు, వియత్నాంతో పాటు సామ్రాజ్యవాదుల ఆంక్షల కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న క్యూబా,వెనెజులా కూడా ప్రపంచానికి మార్గంచూపాయి. వియత్నాంలో కరోనాను కట్టడి చేశారు. అయితే అదే పద్దతిని ఇతర దేశాల్లో ఎందుకు అనుసరించటం లేదు ? ఇబ్బందులేమిటి ? అనే చర్చ జరిగింది. చైనాతో వియత్నాంకు సరిహద్దు ఉన్న విషయం తెలిసిందే. ఊహాన్‌ నుంచి వియత్నాం వచ్చిన ఒక చైనా పౌరుడు, అతని కుమారుడిలో జనవరి 30న ఆ వ్యాధి లక్షణాలు బయట పడ్డాయి. 2003లో చైనాలో బయటపడిన సార్స్‌ సోకిన తొలి దేశం వియత్నాం కావటం, గత అనుభవాలను గమనంలో ఉంచుకొని అక్కడి కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం వెంటనే కరోనా నివారణకు కఠినమైన చర్యలు తీసుకుంది.వాటికి జనం నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. వియత్నాంలో కేంద్రీకృత అధికార వ్యవస్ధ ఉండటం, వెంటనే నిర్ణయాలు తీసుకొనేందుకు, అమలు చేసేందుకు దోహదం చేసింది. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించటం, లాక్‌డౌన్‌ నిబంధనలను గట్టిగా అమలు జరపటం ఎంతో తోడ్పడింది. ప్రతి ఒక్కరి ఆరోగ్యం మీద నిఘావేసే చర్యలు తీసుకున్నారు.అనేక దేశాల్లో ప్రభుత్వాలకు అలాంటి అధికారం ఉన్నప్పటికీ జవాబుదారీతనం, తగినన్ని నిధులు లేని కారణంగా ఆ పని చేయలేదు.


ఉత్తర వియత్నాంపై అమెరికా దాడి చేసిన సమయంలో జనాన్ని సిద్దం చేసేందుకు అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం అనుసరించిన పద్దతులు ఎంతగానో అమెరికా వ్యతిరేకతను, దేశాన్ని రక్షించుకోవాల్సిన జాతీయ భావనలను జనంలో కలిగించటంలో జయప్రదమయ్యాయి. అమెరికన్లను అడ్డుకొనేందుకు ప్రతి పౌరుడు సాయుధుడు కావాలని ప్రతి ఇల్లు ప్రతిఘటన కేంద్రంగా మారాలని అప్పుడు పిలుపు ఇచ్చారు. ఇప్పుడు కరోనా మీద యుద్దాన్ని కూడా అదే పద్దతుల్లో చేయాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. ఇది జనాన్ని కదిలించింది. జనం కూడా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు.ఇలాంటి పరిస్ధితి మరేదేశంలోనూ కనిపించదు. సెల్‌ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్ధితిని ప్రభుత్వం వివరించింది. మీడియా సరేసరి. మిలిటరీని కూడా రంగంలోకి దించి జనాన్ని అప్రమత్తం గావించింది. ఈ కసరత్తు అంతా జనానికి పరిస్ధితి తీవ్రతను తెలియ చేసేందుకు కరోనా పోరులో వారిని భాగస్వాములను చేసేందుకు అన్నింటికీ మించి ఆత్మవిశ్వాసాన్ని కలిగించేందుకు ఎంతగానో తోడ్పడింది. దీనికి సోషలిస్టు చైతన్య స్ఫూర్తి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే జాగ్రత్త అని వేరే చెప్పనవసరం లేదు. ఒక వైపు కరోనాను కట్టడి చేస్తూనే మరోవైపు ఆర్ధిక రంగంపై దాని ప్రభావం పడకుండా చూసిన కారణంగా ఈ ఏడాది ఎనిమిది నెలల్లో అమెరికాతో సహా అనేక దేశాలకు వియత్నాం ఎగుమతులు గత ఏడాది కంటే పెరిగాయి. అమెరికా ఖండ దేశాల నుంచి పెట్టుబడులు కూడా పెరిగాయి. దీనికి అమెరికా-చైనా మధ్య తలెత్తిన వివాదం కూడా తోడైంది.


క్యూబా మీద అమెరికా విధించిన అన్ని రకాల ఆంక్షలకు ఆరుదశాబ్దాలు నిండాయి.1991లో సోవియట్‌ రిపబ్లిక్‌లను కూల్చివేసిన తరువాత కూడా అవి కొనసాగుతున్నాయి. అక్కడి కమ్యూనిస్టు పార్టీ జనానికి కలిగించిన చైతన్యం కారణంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలిచింది. అనేక ఆటంకాల మధ్య తనదైన శైలిలో వైద్య రంగంలో అనేక విజయాలను క్యూబా నమోదు చేసింది. కోటీ 15లక్షల జనాభా ఉన్న అక్కడ 90వేలకు పైగా వైద్యులు ఉన్నారు. అక్టోబరు రెండవ తేదీ నాటికి 5,670 కేసులు నమోదు కాగా 122 మంది మరణించారు, 626 మంది చికిత్సపొందుతుండగా తొమ్మిది మంది పరిస్దితి విషమ స్దితిలో ఉన్నారు.1981లో డెంగ్యూ జ్వరాలు ప్రబలిన సమయంలో నివారణకు తీసుకున్న చర్యల అనుభవం ఇప్పుడు కరోనా నివారణకు ఎంతగానో తోడ్పడింది.


అమెరికాలోని జార్జియా రాష్ట్ర జనాభా కూడా క్యూబాకు దగ్గరా కోటీ ఐదు లక్షల మంది. అక్కడ అక్టోబరు రెండవ తేదీనాటికి 3,19,334 కరోనా కేసులు నమోదు కాగా 7,063 మంది మరణించారు, 2,12,023 మంది చికిత్స పొందుతున్నారు. జనం పట్ల బాధ్యత కలిగిన ప్రభుత్వానికి లేని పాలకులకు, సోషలిస్టు వ్యవస్దకు, పెట్టుబడిదారీ సమాజానికి ఉన్న తేడా ఇది. తన జనాన్ని కాపాడుకోవటమే కాదు 45దేశాలకు అవసరమైన ఔషధాలను, వైద్యులు, సిబ్బందిని పంపింది. క్యూబా ఔషధంగా పేరుగాంచిన ఇంటర్‌ఫెరాన్‌ ఆల్ఫా2బి తయారీ 2003నుంచి చైనాలో జరుగుతోంది. అది కరోనా చికిత్సకు ఉపయోగపడుతోంది.జనాన్ని చంపటానికైనా సిద్ధపడుతున్నాడు గానీ దాన్ని అమెరికాలో వినియోగించటానికి డోనాల్డ్‌ ట్రంప్‌కు అహం అడ్డువచ్చింది.


అనేక ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పరీక్షలన్నీ క్యూబా ప్రభుత్వం ఉచితంగానే చేసింది.వైద్యం అనేక దేశాల్లో బీమా కంపెనీల ఆదాయవనరుగా, వ్యాపారంగా మారిందంటే అతిశయోక్తి కాదు. క్యూబాలో 1960దశకం నుంచి అభివృద్ది చేసిన ప్రజారోగ్య వ్యవస్ధ జనాన్ని ఆరోగ్యంగా ఉంచటంతో పాటు తక్కువ ఖర్చుతోనే వైద్యాన్ని కూడా అందించగలుగుతోంది. అమెరికాలో ఒక రోజు ఆసుపత్రిలో ఉంటే 1,900డాలర్లు ఖర్చయితే క్యూబాలో ఐదు డాలర్లు, బుడ్డ(హెర్నియా) ఆపరేషన్‌కు 12వేల డాలర్లు అయితే 14, తుంటి ఎముక ఆపరేషన్‌కు 14వేలు అయితే క్యూబాలో 72 డాలర్లు మాత్రమే అవుతుంది. అమెరికాలో 2018లో తలకు 8,300 డాలర్లు ఖర్చు చేస్తే క్యూబాలో 400 డాలర్లు చేశారు. దీనికి అనుగుణ్యంగానే అమెరికాలో వైద్యులకు ఇచ్చే వేతనాలు క్యూబాలో లేవు అన్నది కూడా నిజం. వైద్యులకు వేతనాల కంటే జనానికి వైద్య ఖర్చు తగ్గించటమే సోషలిస్టు క్యూబా ప్రత్యేకత. మిగతావారితో పాటు వైద్యులు కూడా ప్రభుత్వం నుంచి సామాజిక భద్రతను పొందుతారు.


క్యూబా వైద్య విధానాన్ని చూసి ప్రపంచం చాలా నేర్చుకోవాల్సి ఉంది. ప్రస్తుతం వెనెజులాలో 20వేల మంది క్యూబన్‌ వైద్యులు,నర్సులు ఉన్నారు. స్ధానికులతో కలసి వారంతా ఇంటింటికీ తిరిగి కరోనా పరీక్షలు,చికిత్స, అవసరమైన సలహాలు అందించటం నిత్యకృత్యంగా చేస్తున్నారు.దేశంలో 15వేల క్లినిక్స్‌, 572 రోగనిర్దారణ పరీక్షా కేంద్రాలు, 586 చికిత్స కేంద్రాలు, 35 ఉన్నత సాంకేతిక వైద్య కేంద్రాలు గతంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటిలో అత్యధిభాగాన్ని కరోనా నిరోధ కేంద్రాలుగా పని చేయిస్తున్నారు. మూడు కోట్ల జనాభా ఉన్న వెనెజులాలో అక్టోబరు రెండవ తేదీ నాటికి 76వేల కేసులు నమోదు కాగా 635 మంది మృత్యువాత పడ్డారు.పక్కనే ఉన్న కొలంబియాలో 8.35లక్షల కేసులు, 26వేల మరణాలు సంభవించాయి. వెనెజులా గురించి అక్కడి జనం పడుతున్న ఇబ్బందుల గురించి కట్టుకధలు చెప్పేవారు ఈ వివరాల గురించి ఏమంటారు? ఆమెరికా, ఇతర అనేక దేశాలు కల్పిస్తున్న ఇబ్బందులను తట్టుకుంటూ వెనెజులా జనాన్ని కరోనా బారిన పడకుండా కాపాడుతున్నది. అంతా సజావుగా ఉందని చెబుతున్న కొలంబియా సంగతి చూశాము. అదే ప్రాంతానికి చెందిన మరో దేశం బ్రెజిల్‌లో 48.5లక్షల కేసులు నమోదు కాగా 1.44లక్షల మంది మరణించారు.


కరోనా కారణంగా ఆర్ధికంగా నష్టపోయిన దేశాల్లో చైనా కూడా ఒకటి. వైరస్‌ను అక్కడే తయారు చేసి వదిలారు అని చెబుతున్నవారు మరి దీనికేమంటారు ? జనవరి-మార్చినెలల మధ్య జిడిపి 6.8శాతం తిరోగమనంలో పడగా ఎక్కడైతే మహమ్మారి ప్రారంభమైందో ఆ హుబెరు రాష్ట్రంలో నష్టం 39.2శాతం ఉంది. అయితే ఆ విపత్తును త్వరలోనే అధిగమించి ఏప్రిల్‌-జూన్‌ మాసాల్లో మూడశాతం పురోగమనాన్ని సాధించింది. ఫిబ్రవరి నాటికి 80వేలకు పైగా కేసులుండగా అక్టోబరు రెండున 85,424 కేసులు నమోద కాగా చికిత్స పొందుతున్న వారు 189 మంది, ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది, కొత్తకేసులు పది నమోదయ్యాయి. మే మొదటి వారానికే ఊహాన్‌తో సహా దేశమంతటా 80శాతం ఉత్పాదక కార్యకలాపాలు నమోదయ్యాయి. ఎక్కడికక్కడ పరీక్షలు చేస్తూ వైరస్‌ జాడను కనుగొన్నారు.


చైనాలో వైరస్‌ అదుపులోకి వచ్చిన మే మాసం నుంచి నామ మాత్రంగా కేసులు నమోదు కాగా అమెరికాలో పది లక్షల నుంచి అక్టోబరు రెండు నాటికి 75లక్షలకు పెరిగాయి.25లక్షల మంది చికిత్స పొందుతున్నారు. కరోనాకు ముందు ఎక్కువ మంది ఆర్ధికవేత్తలు 2020లో చైనా ఆర్ధిక వ్యవస్ధ ఆరుశాతానికి అటూ ఇటూగా వృద్ది రేటుతో ఉంటుందని అంచనా వేశారు. 2021 నాటికి చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది. నాటికి 2010లో ఉన్న జిడిపిని రెట్టింపు చేయాలని కమ్యూనిస్టు పార్టీ పిలుపు ఇచ్చింది. దాన్ని చేరుకోవాలంటే ఆరుశాతం వృద్ధి రేటు ఉంటే సాధ్యమే అని అనేక మంది భావించారు. కరోనాతో అది కష్టం కావచ్చని అయినప్పటికీ ఆ దిశగా పని చేయాలని అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ పిలుపునిచ్చారు. 2021నాటికి కాకున్నా ఆ ఏడాది చివరికి అయినా లక్ష్యాన్ని చేరాలనే పట్టుదలతో పని చేస్తున్నారు.


కరోనా కారణంగా ఉద్దీపన పధకాలకు అమెరికా 2.3లక్షల కోట్ల డాలర్లు కేటాయించింది. చైనా 50వేల కోట్ల డాలర్లు కేటాయించింది. అమెరికా అంత మొత్తం ప్రకటించినా ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ 2020లో 8శాతం తిరోగమనంలో ఉంటుందని, 2021లో 4.5శాతం వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ జూన్‌ అంచనాలో పేర్కొన్నది. అదే చైనా విషయానికి వస్తే ఒకటి, 8.2శాతాలుగా ఉంటుందని పేర్కొన్నది. ప్రపంచంలో ఒక్క చైనా మాత్రమే 2020లో పురోగమన వృద్ధి రేటుతో ఉంటుందని ఐఎంఎఫ్‌ అంచనా. కరోనా విషయంలోనే కాదు, ఆర్ధిక రంగంలో చైనా తన సోషలిస్టు వ్యవస్ధ విశిష్టతను ప్రదర్శిస్తోందన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హైదరాబాద్‌, కాశ్మీర్‌, జునాగఢ్‌ సంస్ధానాల విలీనాలు-భిన్న వైఖరులు ఎందుకు ? ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వంద్వ వైఖరి !

17 Thursday Sep 2020

Posted by raomk in AP, BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

BJP hypocrisy, Hyderabad liberation day, Razakars (Hyderabad), RSS - Hyderabad’s liberation, TRS government


ఎం కోటేశ్వరరావు


చరిత్ర నిర్మాతలు ప్రజలు. కానీ చరిత్రను ఎలా రాయాలో నిర్దేశించేది విజేతలు లేదా పాలకులు అన్నది ఒక అభిప్రాయం. ప్రతి దానికీ కొన్ని మినహాయింపులు ఉన్నట్లుగానే చరిత్ర నమోదులో కూడా అలాంటివి ఉండవచ్చు. చరిత్రలో మనకు నిరంకుశులు – ప్రజాస్వామ్య వాదులు, శ్రామికజన పక్షపాతులు – శ్రామిక జన వ్యతిరేకులు కనిపిస్తారు. ఆ రాణీ ప్రేమ పురాణం ఈ ముట్టడి కైన ఖర్చులు ఇవి కాదోయి చరిత్ర సారం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అందువలన చరిత్రను చూసే, రాసేవారి ఆసక్తి వెనుక ప్రయోజనాలు కూడా ఉంటాయి. అవి వ్యక్తిగతం కావచ్చు, భావజాల పరంగానూ ఉంటాయి.


చరిత్రను వర్గదృష్టితో పరిశీలిస్తే ఒక మాదిరి, కులం – మతం- ప్రాంతీయం వంటి కళ్లద్దాలతో చూస్తే మరొక విధంగా కనిపిస్తుంది. స్వాతంత్య్ర ఉద్యమం, సంస్కరణ, అభ్యుదయ, వామపక్ష ఉద్యమాలతో ప్రభావితులైన తరం రాసిన చరిత్రలో ఆ భావజాల ప్రభావాలు కనిపిస్తాయి. అలాంటి శక్తులు పాలకులుగా ఉన్నారు కనుక దాన్ని వివాదాస్పదం కావించలేదు. ఆ చరిత్రకు ఆమోదం లభించింది. అయితే ఆ చరిత్ర మొత్తాన్ని కమ్యూనిస్టులు రాసిన చరిత్రగా వక్రీకరిస్తూ మన దేశంలోని మత శక్తులు ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వారు ఎప్పటి నుంచో చరిత్రను తిరగరాయాలని చూస్తున్నారు. వారి చరిత్ర మత ప్రాతిపదికగానే ఉంటుంది. ఆ ప్రాతిపదికతో జనాల మధ్య విభజన గోడలు కట్టాలనే ఎత్తుగడదాగి ఉంది. ఆ గోడలతో వారేమి చేసుకుంటారు అన్నది వెంటనే వచ్చే ప్రశ్న.


ఏ కులం, ఏ ప్రాంతం, మతం వారైనా కష్టజీవులుగా తాము దోపిడీకి గురవుతున్నామా లేదా అనే ప్రాతిపదికన ఆలోచించాలని కమ్యూనిస్టులు చెబుతారు. దానికి భిన్నంగా కులం, ప్రాంతం, మత ప్రాతిపదికన సమీకృతం కావాలన్నది ఆ శక్తుల వాంఛ. అదే జరిగితే నష్టపోయేది శ్రామికులు, లబ్ది పొందేది దోపిడీదార్లు. అందుకే ఏ దేశ చరిత్ర చూసినా పాలకులు, మతం మధ్య సఖ్యత, ఒకదాన్ని ఒకటి బలపరుచుకోవటం ముఖ్యంగా ఫ్యూడల్‌ సమాజాలలో కనిపిస్తుంది. దోపిడీదార్లకు మతం ఆటంకంగా మారినపుడు దాని పెత్తనాన్ని బద్దలు కొట్టి పక్కన పెట్టటాన్ని ఐరోపా పరిణామాల్లో చూస్తాము.


ఆసియా, ఆఫ్రికా వంటి వెనుకబడిన ఇంకా ఫ్యూడల్‌ వ్యవస్ధ బలంగా ఉన్న చోట్ల మతం ప్రభావితం చేస్తూనే ఉంది. మన దేశానికి వస్తే పెట్టుబడిదార్లు మతంతో, ఫ్యూడల్‌ వ్యవస్దతో రాజీపడటం కనిపిస్తుంది. బిర్లా వంటి పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద దేవాలయాల నిర్మాణం చేయటం (వారి పేర్లతో దేవాలయాలను పిలవటం-హైదరాబాద్‌ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని బిర్లా మందిర్‌ అనే పిలుస్తారు.) మతంతో రాజీ, దాన్ని ఉపయోగించుకొనే యత్నం తప్ప మరొకటి కాదు. అలాగే ఇతర మతాలకు చెందిన పారిశ్రామికవేత్తలు మసీదు, చర్చ్‌లు కట్టించినా లక్ష్యం ఒకటే.
బ్రిటీష్‌ వారి పాలనలో సంస్ధానాలు తిరుగుబాటు చేసిన చోట విలీనం చేసుకున్నారు. రాజీపడిన చోట సామంత రాజ్యాలుగా లేకా ప్రత్యేక అధికారాలు, రక్షణతో కొనసాగాయి. చరిత్రను మత ప్రాతిపదికన చూడటం ఎలా జరుగుతోందో చూద్దాం. స్వతంత్ర భారత్‌లో కలిసేందుకు హైదరాబాద్‌, కాశ్మీర్‌, జునాగఢ్‌ సంస్ధానాలు వ్యతిరేకించి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు పన్నిన వ్యూహంలో భాగంగా స్వతంత్ర రాజ్యాలుగా ఉంటామని ప్రకటించాయి. నిజానికి అవెన్నడూ స్వతంత్ర రాజ్యాలు కాదు, బ్రిటీష్‌ ఇండియాకు సామంత రాజ్యాలుగానే ఉన్నాయి. అవి స్వతంత్ర దేశాలుగా అవతరించటం అంటే మన తల మీద ఒక సామ్రాజ్యవాద తొత్తును, గుండెల మీద మరొకతొత్తును ప్రతిష్టించుకోవటం తప్ప వేరు కాదు. ఈ కుట్రను ఛేదిస్తూ నాటి కేంద్ర ప్రభుత్వం సంస్ధాలను విలీనం చేసుకున్నది.
హైదరాబాదులో సంస్ధానాధీశుడు ముస్లిం, మెజారిటీ జనాభా హిందువులు. కాశ్మీరులో మెజారిటీ జనాభా ముస్లింలు, పాలకుడు హిందువు. నిజాం నవాబు లొంగిపోయి ఒప్పందం చేసుకోవటాన్ని ముస్లిం పాలకుల నుంచి హిందువులు విమోచన పొందినట్లుగా బిజెపి, దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ వర్ణిస్తుంది. కాశ్మీరు స్వతంత్ర రాజ్యంగా ఉండాలనటాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ సమర్దించింది. దాని వాంఛలకు భిన్నంగా కాశ్మీరు విలీనంగాక తప్ప లేదు. మరి దీన్నేమనాలి ? హిందూపాలకుల నుంచి ముస్లింలు విముక్తి పొందినట్లా ?


1921లో కేరళలోని మలబారు ప్రాంతంలో జరిగిన మోప్లా తిరుగుబాటును కూడా మత కోణంతో బిజెపి చూస్తోంది. బ్రిటీష్‌ వారు, స్ధానిక భూస్వాముల మీద ఆ ప్రాంతంలో గణనీయంగా ఉన్న ముస్లింలు, ఇతరులు జరిపిన తిరుగుబాటును హిందువుల మీద జరిగిన దాడులుగా చిత్రించి దాన్ని స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా నిరాకరిస్తూ పాఠ్యపుస్తకాల నుంచి తొలగించేందుకు నిర్ణయించింది.


ఆపరేషన్‌ పోలో పేరుతో సైనిక చర్య ద్వారా 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్దానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసుకున్న రోజు. నాలుగు రోజుల్లోనే యూనియన్‌ సైన్యాలను ప్రతిఘటించకుండానే నిజాం నవాబు సైన్యం చేతులెత్తేసింది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో తిలక్‌ వంటి వారు జనాన్ని సమీకరించేందుకు నాటి ముంబై ప్రావిన్సులో వినాయకచవితి పండుగలను ప్రోత్సహించారు. అలాగే నిజాం రాజు సంఘం పేరుతో కమ్యూనిస్టుల నాయకత్వాన ప్రారంభమైన పోరుతో తన అధికారానికి ఎసరు రావటాన్ని గమనించి మతం పేరుతో సంస్ధానంలో ఉన్న ముస్లింలను ఆ ఉద్యమానికి దూరం చేసేందుకు, అణచివేసేందుకు రజాకార్ల పేరుతో ప్రయివేటు మిలిటెంట్లను ప్రోత్సహించాడు. ఆ శక్తులు మతోన్మాదంతో ఉత్తేజం పొందినవి కావటంతో వారి చర్యల్లో ఎక్కడైనా కొన్ని మత ప్రాతిపదికన జరిగి ఉండవచ్చు తప్ప రజాకార్లు నాటి హిందూ, ముస్లిం మతాలకు చెందిన జాగీర్దార్లు, దేశముఖుల రక్షణకోసమే పని చేశారు. వారిని వ్యతిరేకించిన వారిలో ఎందరో సామాన్య ముస్లింలు ఉన్నారు. తెలంగాణా సాయుధ పోరాటానికి నాంది అయిన భూ సమస్యలో దేశముఖ్‌కు వ్యతిరేకంగా చట్టబద్దమైన పోరు సాగించిన సామాన్య ముస్లిం రైతు బందగీ కోర్టులో విజయం సాధించిన తరువాత హత్యకు గురికావటం ఉద్యమానికి నిప్పురవ్వను రగిలించిన ఉదంతం కాదా ?


నిజాం రాచరికపు దౌర్జన్యాలను ఎండగట్టిన కలం యోధుడు షోయబుల్లాఖాన్‌. నిజాం రజాకార్‌ మూకల దాడిలోనే కన్నుమూసిన వీరుడు. రాచరికపు నిర్బంధాన్ని లెక్కచేయక, 1938లోనే ఔరంగాబాద్‌లో శ్రామిక మహాసభలో పాల్గొని మఖ్దూం మొహియుద్దీన్‌, హబీబ్‌లు కార్మిక వర్గాన్ని ఐక్యం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. భూస్వామ్య, పెట్టుబడిదారీ దోపిడీలకు వ్యతిరేకంగా, రాచరికానికి వ్యతిరేకంగా 1939లో హైదరాబాద్‌లో కామ్రేడ్స్‌ అసోసియేషన్‌ ప్రారంభించిన వారిలో ఆలం ఖుంద్‌మిరీ ఒకరు. ఆల్‌ హైదరాబాద్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ తొలి అధ్యక్షుడు మఖ్దూం మొహియుద్దీన్‌. 1947 ఆగస్టు 15న ఆల్‌ హైదరాబాద్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ కార్యాలయం మీద త్రివర్ణ పతాకం ఎగురవేశారు. నిజాం కాలేజీలో విద్యార్థి నాయకుడు రఫీ అహ్మద్‌ కూడా జాతీయ పతాకం ఆవిష్కరించారు. వీరంతా ఎవరు ?


విసునూరు దేశ్‌ ముఖ్‌ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఐలమ్మ భూమి రక్షణ కోసం జరిగిన పోరాటం రైతాంగానికి స్ఫూర్తి నిచ్చింది. 1946, జూలై 4న దొడ్డి కొమరయ్య నేలకొరగటంతో రైతాంగం తిరుగుబాటు ప్రారంభమైంది. పోరాటం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలోనే 1947, ఆగస్టు 15న స్వతంత్ర భారతదేశం ఆవిర్భవించింది. అప్పటికే చైనాలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన సాగుతున్న లాంగ్‌ మార్చ్‌ అనేక ప్రాంతాలను విముక్తి చేసింది. తెలంగాణాలో కమ్యూనిస్టులు నిజాం సైన్యాలు, రజాకార్లను చావు దెబ్బతీస్తున్నారు. అక్కడ కూడా కమ్యూనిస్టులు ఆధిపత్యం వహిస్తే నైజాం సంస్ధానం మరో ఏనాన్‌గా మారుతుందేమో అని అమెరికా,బ్రిటన్‌ పాలకులు భయపడి దాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ అణచివేయాలని నెహ్రూ ప్రభుత్వాన్ని కోరారు.


కమ్యూనిస్టుల నాయకత్వంలో పేదలు సంఘటితంగా ముందుకు సాగటం తట్టుకోలేని భూస్వాముల పెద్దలైన బూర్గుల రామక్రిష్ణారావు, కెవి రంగారెడ్డి వంటి వారు ఢిల్లీ వెళ్లి అక్కడ నెహ్రూ, పటేల్‌ తదితర పెద్దలకు మొరపెట్టుకొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏజంటు కె యం మున్షీ ని వివరాలు కోరారు. ఆయన ఇక్కడ కమ్యూనిస్టుల ప్రాబల్యం రోజురోజుకు పెరిగిపోతోందని చెప్పాడు. నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో కమ్యూనిస్టులు బలంగా ఉన్న గ్రామాల్లోకి నైజాం పోలీసులు కానీ, రజాకారు మూకలు గానీ పోలేకపోతున్నాయి. ఇంతకుముందు గ్రామాల మీదే కేంద్రీకరించే వాళ్ళు, ఇప్పుడు పారిశ్రామిక ప్రాంతాలపై కూడా కేంద్రీకరిస్తున్నారు. వాళ్ళకు ప్రజామద్దతు రోజరోజుకు పెరిగిపోతోంది. ఇదంతా బెజవాడ కేంద్రంగా కమ్యూనిస్టులు ఏర్పాటు చేసుకున్న పట్టు అని రిపోర్టు ఇచ్చాడు. అసలే హైదరాబాద్‌ దేశానికి నడిబొడ్డున ఉంది. ఇది ఇలాగే ఉంటే కమ్యూనిస్టుల చేతికిపోతే మొత్తం దక్షిణ భారత దేశంపై దీని ప్రభావం పడుతుంది. ఆ తరువాత దేశం మొత్తానికి విస్తరించినా విస్తరించవచ్చు. ఇక మనం ఉపేక్షించటం మంచిది కాదని భావించిన కేంద్రం వెంటనే సైనికచర్యకు ఉపక్రమించింది. దానికే ఆపరేషన్‌ పోలో అని పేరు పెట్టారు. ఆ కారణంగానే కాశ్మీర్‌ను ఆక్రమించుకున్న పాకిస్ధాన్‌పై దాడి కంటే నెజాం సంస్ధాన విలీనానికి ఎక్కువ మంది మిలిటరీని దించారు. జనరల్‌ జెయన్‌ ఛౌదరి నాయకత్వలో సైన్యాలు వచ్చాయి. సెప్టెంబర్‌ 13న వచ్చాయి. 17కల్లా ఆపరేషన్‌ క్లోజ్‌ అయింది.


తెలంగాణలో కమ్యూనిస్టు నాయకత్వంలో రైతాంగ పోరాటం జరుగుతున్న కాలంలోనే కాశ్మీర్‌ రైతాంగం కూడా షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలో పోరాడారు. భూమికోసం, ప్రజాస్వామ్యం కోసం, రాచరికానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అక్కడ కూడా రైతాంగం కాశ్మీరు రాజు సైన్యం, తరువాత పాకిస్థాన్‌ సైన్యాలనూ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే కాశ్మీర్‌ కూడా ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైంది.
రెండు చోట్లా ప్రజాపోరాటాలు ముందుకు తెచ్చిన భూ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. కొత్త సమస్యలు తలెత్తాయి. వాటిని పక్కన పెట్టి తెలంగాణా బీజేపీ, ఆరెస్సెస్‌ పరివారం విలీనమా? విమోచనమా? అన్న చర్చను ముందుకు తెస్తున్నది. విలీనం ప్రాధాన్యతను తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. హిందూ ముస్లిం ఘర్షణగా చిత్రీకరిస్తున్నారు. ముస్లిం రాజు నుంచి హిందువుల విమోచనగా వక్రీకరిస్తున్నారు. కాశ్మీరు విలీనానికి అంగీకరించిన ప్రత్యేక రక్షణలను తొలగించటమే కాదు చివరకు ఆ రాష్ట్రాన్నే బిజెపి రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చివేసింది. హైదరాబాద్‌ రాజ్యం గానీ, కాశ్మీర్‌ సంస్థానం గానీ ప్రత్యేక చారిత్రక నేపథ్యంలో విలీనమైన విషయం బీజేపీ నాయకత్వానికి మింగుడుపడదు. మెజారిటీ మత సంతుష్టీకరణ, ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే ఈ అంశాల మీద ఆ పార్టీ వ్యవహరిస్తోంది అని చెప్పవచ్చు.


హైదరాబాద్‌, కాశ్మీర్‌ రాచరికాలను కూలదోయటం గొప్ప ప్రజాస్వామ్య ప్రక్రియ. ఈ రెండు ప్రాంతాలలోనూ రైతాంగ పోరాటాలతో సాధించుకున్న ప్రజాస్వామ్య విలువలే, స్వాతంత్య్రోద్యమ సంప్రదాయాల ఫలితంగా ఏర్పడిన ఇండియన్‌ యూనియన్‌లో విలీనానికి పునాది. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం సరైనదా కాదా అన్నది కాసేపు పక్కన పెడితే దాని ప్రకారం హిందువుల విముక్తి కోసం పోరాడే చిత్తశుద్ది దానికి నిజంగా ఉంటే బ్రిటీష్‌ ఇండియాలో ముస్లిం పాలకుడి పాలనలో అణచివేతకు గురైన మెజారిటీ హిందువులున్న హైదరాబాదు సంస్దానంవైపు అది ఎందుకు చూడలేదు. దానిలో 85శాతం హిందువులు, 12శాతమే ముస్లింలు ఉన్నారు. దేశ సగటు కంటే ఎక్కువ మంది హిందువులున్న ప్రాంతం. తెలంగాణా ఫ్యూడల్‌ శక్తుల వ్యతిరేక పోరాటంతో అణుమాత్రం కూడా ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం లేదు. కాశ్మీర్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కావద్దనీ, రాచరికమే కొనసాగాలనీ చెప్పిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. అంతే కాదు అక్కడి భూమిలో ఎక్కువ భాగం హిందూ భూస్వాముల చేతుల్లో ఉంది. ఆ భూమి కోసం పోరాటం నిర్వహించిన షేక్‌ అబ్దుల్లాను ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకించి భూస్వాముల కొమ్ము కాచింది. అటు స్వాతంత్య్రోద్యమంతోనూ సంబంధం లేకపోగా తెల్లదొరల సేవలో తరించిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. మెజారిటీ పౌరులు ముస్లింలు, పాలకుడు, భూస్వాములు హిందువులు కావటంతో వారికి మద్దతుగా కాశ్మీరులో తన శాఖలను ఏర్పాటు చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేకంగా ప్రయత్నించింది. ప్రజాపరిషత్‌ అనే సంస్ధ ముసుగులో భూస్వాముల తరఫున పని చేసింది. అదే హైదరాబాదు సంస్ధానంలో రాజు ముస్లిం, 95శాతంపైగా భూస్వాములు హిందువులు, వారంతా రాజు మద్దతుదారులుగా ఉన్నందున ఆ ప్రాంతంలో తన మత రాజకీయాలకు చోటు ఉండదు,అన్నింటికీ మించి రాజు – భూస్వాములు కలసే జనాన్ని దోపిడీ చేస్తున్నందున భూస్వాములకు ప్రత్యేకంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అవసరం కలగలేదు కనుకనే కేంద్రీకరించలేదని చెప్పవచ్చు.మహాత్మా గాంధీ హత్య కారణంగా నిషేధానికి గురైన ఈ సంస్ద భవిష్యత్‌లో రాజకీయాల్లో పొల్గొనబోమని, సాంస్కృతిక సంస్ధగా కొనసాగుతామని కేంద్ర ప్రభుత్వానికి హామీ పత్రం రాసి ఇచ్చింది. దాంతో రాజకీయ రంగంలో కార్యకలాపాల కోసం 1950దశకంలో జనసంఫ్‌ు అనే రాజకీయ పార్టీని ముందుకు తెచ్చింది.


” భారత రాజ్యాంగ సభలో చేరేందుకు తిరస్కరించిన సంస్థానాలలో కాశ్మీరు ఒకటి. మంత్రివర్గ పధకం కింద ఏర్పాటైన ఆ సభ 1946 డిసెంబరు నుంచి పని చేస్తున్నది. ఏ రాష్ట్రమైనా అలా తిరస్కరిస్తే దాన్ని శత్రుపూరిత చర్యగా పరిగణించాల్సి ఉంటుందని తాత్కాలిక ప్రభుత్వ ఉపాధ్యక్షుడిగా ఉన్న జవహర్‌లాల్‌ నెహ్రూ హెచ్చరించినప్పటికీ మహరాజు తిరస్కరించారు. సంస్థానాధీశులకు స్వతంత్రంగా ఉండే హక్కుకు నిర్ద్వంద్వంగా ముస్లిం లీగు మద్దతు ప్రకటించటం రాజ్యాంగ సభలో చేరకూడదనే రాజు మూర్ఖత్వాన్ని మరింత బలపరించింది.1947 జూన్‌ 17న ముస్లింలీగ్‌ నేత మహమ్మదాలీ జిన్నా ఈ మేరకు ప్రకటించారు. జమ్ము -కాశ్మీరు గనుక స్వతంత్ర దేశంగా ఉండదలచుకుంటే పాకిస్తాన్‌ స్వాగతిస్తుందని, స్నేహపూరిత ఒప్పందాలు చేసుకుంటుందని 1947 జూలై 11న మరింత స్పష్టంగా వెల్లడించారు.


విడిపోవటం ఖాయమని స్పష్టమైన తరువాత మహరాజు(కాశ్మీర్‌) భారత్‌లో చేరే మానసిక స్థితిలో లేరు. జమ్ము మరియు కాశ్మీర్‌ పేర్కొంటున్నదానిని హిందూ రాజ్యంగా ఉంచాలని, లౌకిక భారత్‌గా గుర్తింపు ఉండకూడదని, విలీనం చేయకూడదని రాజుకు విధేయులుగా ఉన్న జమ్మూలోని హిందూ నేతలు రాజుకు మద్దతు ఇచ్చారు.ఆల్‌ జమ్మూ మరియు కాశ్మీర్‌ రాజ్య హిందూ సభ (ప్రస్తుత భారతీయ జనతా పార్టీ పూర్వ అవతారము) 1947 మే నెలలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మహారాజు పట్ల విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ విలీనం గురించి ఇప్పుడు చేస్తున్నదానికి తరువాత చేయాల్సినదానికి తమ మద్దతు ఉంటుందని దానిలో పేర్కొన్నారు.1947 మే నెలలోనే ఆల్‌ జమ్మూ మరియు కాశ్మీర్‌ ముస్లిం కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు చౌదరి హమీదుల్లా ఖాన్‌ కూడా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తక్షణమే కాశ్మీర్‌ స్వాతంత్య్రాన్ని ప్రకటించాలని, దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేయాలని మహరాజును కోరారు. దీనికి ముస్లింలంతా సహకరిస్తారని, స్వతంత్ర మరియు ప్రజాస్వామిక కాశ్మీర్‌ దేశానికి తొలి రాజ్యాంగబద్ద పాలకుడిగా మహరాజుకు మద్దతు ఇస్తామని హామీని ప్రకటించారు. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పాకిస్తాన్‌ ప్రభుత్వం కాశ్మీర్‌ మీద దాడికి వస్తే దేశంలోని ముస్లింలు దానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపడతారు, అవసరమైతే భారత్‌ సాయం కూడా కోరతామని చెప్పారు. నాతో సహా భారత్‌కు అనుకూలంగా గళమెత్తిన వారందరినీ హిందూ వ్యతిరేకులు, ద్రోహులు అని హిందూ దురహంకారులు ఖండించారు.భారత్‌లో విలీనం కావాలని, షేక్‌ అబ్దుల్లాను విడుదల చేయాలని ముల్కరాజ్‌ సరాఫ్‌ సంపాదకత్వంలోని జమ్మూ దినపత్రిక రణవీర్‌ రాసినందుకు 1947 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.”
ఈ వివరాలను ఎపిలోగ్‌ అనే పత్రిక 2010 నవంబరు సంచికలో ప్రత్యక్ష సాక్షి అనే శీర్షికతో 2005లో పద్మ విభూషణ్‌ అవార్డు అందుకున్న, జమ్మూకు చెందిన ప్రముఖ జర్నలిస్టు బలరాజ్‌ పూరీ రాశారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూత్వ వాదుల నిజస్వరూపం. ఇప్పుడు వారు దేశ సమగ్రత గురించి జనాలకు సుభాషితాలు చెబుతున్నారు. ఈ విద్రోహకర పాత్ర దాస్తే దాగేది కాదు. నేటి తరాలకు చరిత్రపట్ల ఆసక్తి లేదనే భావంతో పచ్చి అవాస్తవాలు, ద్రోహాన్ని కప్పి పుచ్చుకొనేందుకు దేశంలో మరింతగా సామాజిక విభజనను రెచ్చగొట్టేందుకు విషపు బీజాలు నాటారు. అవి ఇప్పుడు వృక్షాలుగా మారి విషఫలాలను ఇస్తున్నాయి.


సెప్టెంబర్‌ 17ను కొందరు విద్రోహ దినోత్సవం అంటు న్నారు. కొందరు విమోచన దినోత్సవం అంటున్నారు. కొందరు విలీన దినోత్సవం అంటున్నారు. దీనిని ఎలా చూడాలి? నైజాం వ్యతిరేక పోరాటం ముమ్మరంగా జరుగుతున్న సమయంలో సంస్దాన విలీనం జరిగింది. నిజాం వ్యతిరేక పోరుకు నాయకత్వం వహిస్తున్న కమ్యూనిస్టు పార్టీలో కొందరు యూనియన్‌ సైన్యాలు వచ్చినందున నెహ్రూ ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తుంది కనుక సాయుధ పోరాటాన్ని విరమించాలని చెప్పటమే కాదు, ఆయుధాలు పారవేశారు. అయితే కొద్ది రోజుల్లోనే నెహ్రు ప్రభుత్వ వర్గనైజం బయట పడింది. సాధించిన విజయాల రక్షణకు మరికొన్ని సంవత్సరాలు పోరు జరపాల్సి వచ్చింది.


నైజాం రాజు స్వాతంత్య్ర వ్యతిరేకి. విలీనానికి ముందు ఒక ఫర్మానా జారీ చేశాడు. ఎవ్వరూ ఎక్కడా సంస్ధానంలో త్రివర్ణ పతాకం ఎగురవేయగూడదనేది ఆ హుకుం. ఏ వ్యక్తి అయినా జాతీయ జండా ఎగురవేస్తే ఇతర దేశాల జండా ఎగరేసినట్టే. అందుకు 3ఏండ్లు జైలుశిక్ష గానీ, జరిమానా కానీ లేదా ఆ రెండూ కానీ అమలు చేస్తామనేది ఆ ఫర్మానా సారాంశం. కమ్యూనిస్టులు, యువత, విద్యార్ధులు ఈ ఫర్మానాను ధిక్కరించి ముందుకురికారు. హైదరాబాద్‌ స్టూడెంట్‌ యూనియన్‌ నాయకుడు రఫీ అహ్మద్‌ నిజాం కాలేజీలో త్రివర్ణ పతాకం ఎగరేశాడు. సుల్తాన్‌బజార్‌లో కాంగ్రెస్‌ నాయకుడు స్వామి రామానంద తీర్థ జాతీయ జెండా ఎగరేశాడు. బ్రిజ్‌రాణీ గౌర్‌ కోఠీ మహిళా మండలిలో జండా ఎగరేశారు. ఇలా అనేక చోట్ల పతాకావిష్కరణలు జరిగాయి. ఈ పరిస్థితులలో భారత ప్రభుత్వం, నైజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌తో యధాతధస్థితి ఒప్పందం (స్టాండ్‌ స్టిల్‌ ఎగ్రిమెంట్‌) 1947 నవంబర్‌ 29న చేసుకుంది.


ప్రజల మీద సాగించిన దాడులు, హత్యాకాండకు నిజాం రాజు, రజాకార్‌ మూకలు, వారికి మద్దతుగా ఉన్న దేశ ముఖ్‌లు, జాగిర్దార్లను విచారణ జరిపి శిక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిజాంను విలీనం తరువాత రాజప్రముఖ్‌గా నియమించింది. అపార ఆస్తులు వదిలేశారు. ఆ రోజుల్లో సంవత్సరానికి 50లక్షల జీతం ఇచ్చారు. 1951 అక్టోబర్‌ 31వరకూ ఆయనను ఆ పదవిలో కొనసాగించారు. రాజాభరణాలు ఇచ్చారు. నవాబుకే కాకుండా, జమిందార్లు, జాగీర్‌దార్లకు కూడా వారి వార్షికాదాయాన్ని లెక్కగట్టి పరిహారం చెల్లించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ నవాబ్‌ ఫర్మానా జారీ చేశాడు. భారత రాజ్యాంగం అమలులోకి రాకముందు వరకు అంటే 1950 జనవరి 26 వరకు నిజాం విడుదల చేసిన ఫర్మానా ఆధారంగానే హైదరాబాద్‌ రాష్ట్రంలో పరిపాలన సాగింది. 1950 జనవరి 26న ఎం.కె వెల్లోడిని ముఖ్యమంత్రిగా నియమించడం నైజాం చేతులమీదుగానే సాగింది.


యూనియన్‌ మిలిటరీ రావటంతో అంతకు ముందు గ్రామాల నుంచి పారిపోయిన జాగీర్దార్లు, దేశముఖులు తిరిగి గ్రామాలకు వచ్చి రైతాంగం చేతుల్లోని భూములను లాక్కోవటం ప్రారంభించారు. వాటిని రక్షించుకొనేందుకు కమ్యూనిస్టులు 1951వరకు సాయుధపోరాటాన్ని కొనసాగించారు. యూనియన్‌ సైన్యాలు రైతాంగం మీద విరుచుకుపడ్డాయి. నిజాం ప్రభుత్వ దాడిలో మరణించింది 1500మంది కాగా, నెహ్రూ సైన్యాలు 2500 మందిని పొట్టన పెట్టుకున్నాయి. అందువలన కమ్యూనిస్టులలో కొందరు సెప్టెంబరు 17ను విద్రోహదినంగా పరిగణించారు. ఇప్పటికీ అదే భావంతో ఉన్నవారు కూడా ఉన్నారు.
భూసంస్కరణలకు, కౌలుదార్ల హక్కులు కాపాడేందుకు కేంద్రం ఒప్పుకోవటంతో కమ్యూనిస్టులు సాయుధ పోరాటం విరమించారు. దీన్ని తరువాత నక్సల్స్‌గా మారిన వారు రివిజనిజంగా, తెలంగాణా రైతాంగానికి చేసిన ద్రోహంగా పరిగణించటమే కాకుండా పోరాటాన్ని కొనసాగించి ఉండాల్సిందని సూత్రీకరించారు. కొనసాగించి ఉంటే చైనాలో మాదిరి దేశంలో విప్లవానికి దారితీసేదన్నది వారి భావం.

సెప్టెంబరు 17ను తెలంగాణా విమోచన పేరుతో బిజెపి, సమైక్యతా దినంగా తెలంగాణా ప్రభుత్వం పాటిస్తున్నది. తెలంగాణా రైతాంగం సాధించుకున్న హక్కులను హరించిన విద్రోహ దినంగా పరిగణించిన కమ్యూనిస్టులు బిజెపి ఇతర కొన్ని శక్తులు చరిత్రను వక్రీకరిస్తున్న పూర్వరంగంలో వారు కూడా ఈ సందర్భంగా సభలు జరిపి జనాన్ని చైతన్య పరిచేందుకు, నైజాం సంస్థాన విలీనంలో చెరగని కమ్యూనిస్టుల పాత్రను వివరించేందుకు నిర్ణయించారు.


రైతాంగం, వృత్తుల వారిని అణచేందుకు హిందూ జమీందార్లూ, ముస్లిం రాజూ ఏకమయ్యారు. రైతాంగానికీ, జమీందార్లకు మధ్య సాగిన వర్గపోరాటం అది. ఈ వర్గ ఐక్యతను మరుగుపరచేందుకే బీజేపీ నేతలు ఇప్పుడు మతపరమైన ఘర్షణగా చిత్రీకరిస్తున్నారు. ప్రత్యేకించి ఈ పోరాటంతో ఏ సంబంధమూలేని ఆ పార్టీ దీనిని హిందువుల విమోచనా దినోత్సవంగా జరపాలని అంటున్నది. 1947 అక్టోబరు 26న విలీనమైన కాశ్మీర్‌ దినోత్సవం లేదా సెప్టెంబరు 15న విలీనమైన జునాగఢ్‌ దినోత్సవాలను గానీ జరపాలని ఆ పార్టీ ఎన్నడూ చెప్పలేదు. సెప్టెంబర్‌ 17న నైజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయి హైదరాబాద్‌ సంస్థానాన్ని దేశంలో విలీనం చేసింది వాస్తవం. ఈ నేపధ్యంలో విలీనాన్ని ఉత్సవంగా జరపాలా లేక ఆ రోజును స్మరించుకుంటూ కర్తవ్యాలను నిర్ణయించుకోవాలా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే.

గమనిక : 2020 సెప్టెంబరు 17న రాసిన ఈ విశ్లేషణను నవీకరించి తిరిగి పాఠకులకు అందించటమైంది

Share this:

  • Tweet
  • More
Like Loading...

కుట్ర సిద్దాంతాల హల్‌చల్‌ : నాడు కమ్యూనిజం-నిన్న సోవియట్‌-నేడు చైనా బూచి !

10 Thursday Sep 2020

Posted by raomk in BJP, CHINA, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

anti china, Anti communist, China Threat, conspiracy theories, Pentagon on China military


ఎం కోటేశ్వరరావు
మానవాళి చరిత్రలో రాజ్యము – అధికారము ఉనికిలోకి వచ్చిన తరువాత కుట్రలు, కుట్ర సిద్దాంతాలు వాటి వెన్నంటే తలెత్తాయి. అధికారం లేని వారు లేదా బలహీనులు కుట్ర సిద్ధాంత ఆశ్రయం పొందుతారు అన్నది కొందరి అభిప్రాయం. దీనికి విస్తృత అర్ధం, భిన్న భాష్యాలు చెప్పవచ్చు. వాటితో అందరూ ఏకీభవించాలని లేదు. ప్రపంచంలో నిరంతరం కుట్ర సిద్దాంతాలు పుడుతూ జనారణ్యంలో కలియ తిరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి ఒక్కో అంశం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మరోవిధంగా చెప్పాలంటేే వాటితో లబ్ది పొందాలనుకొనే బలమైన శక్తులు వాటిని ముందుకు తెస్తాయి.


కమ్యూనిజం ప్రపంచాన్ని ఆక్రమిస్తోంది, ప్రజాస్వామ్యాన్ని హరిస్తోంది కనుక దాన్ని అడ్డుకోవాలన్న కుట్ర సిద్దాంతాన్ని ముందుకు తీసుకువచ్చింది బలవంతులైన సామ్రాజ్యవాదులే. అది వాస్తవం కాదని గ్రహించలేని వారు దాన్ని నిజమే అని నమ్మి ఆ సిద్దాంతానికి ఊతమివ్వటాన్ని చూస్తున్నాము. తరువాత కాలంలో సోషలిస్టు సోవియట్‌ను బూచిగా చూపి భయపెట్టటం ఎరిగిందే. ప్రాంతీయంగా పశ్చిమాసియాలో ఇరాక్‌ అధ్యక్షుడు సద్దామ్‌ హుస్సేన్‌ను మారణాయుధాలను గుట్టలుగా పోసిన బూచాడిగా చూపిన వైనం మన కళ్ల ముందే జరిగింది. ఇప్పుడు చైనా బూచిని ముందుకు తెచ్చారు. దాన్ని అర్దం చేసుకోలేని వారు ఆశ్రయం ఇస్తున్నారు. కుట్ర సిద్దాంత వైరస్‌ ఒకసారి ఎవరిలో అయినా ప్రవేశించిందంటే అది కరోనా కంటే ప్రమాదకరంగా వ్యాపిస్తుంది. భౌతిక దూరాన్ని పాటిస్తే కరోనా మన దరిచేరదు. కానీ కుట్ర సిద్దాంత వైరస్‌కు అలాంటివేమీ ఉండదు. ఒకరి వాట్సాప్‌లో ప్రవేశించినా, చెవి అప్పగించినా చాలు ప్రపంచాన్ని చుట్టి వస్తుంది.


ప్రస్తుతం మన దేశంలో బిజెపి వంటి సంఘపరివార్‌ సంస్ధలు. మీడియా, సామాజిక మాధ్యమం చైనా బూచిని జనాల మెదళ్లకు ఎక్కిస్తున్నదా ? తమ అనుభవంలోకి వచ్చిన దాని బట్టి ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. చైనా నుంచి ముప్పు వస్తోందంటూ అనేక దేశాలను రెచ్చగొడుతూ, కూడగడుతూ అంతర్జాతీయంగా అమెరికా అటువంటి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. చైనా అణ్వాయుధాలు ప్రపంచానికి ఆటంకంగా ఉన్నాయని, నౌకా దళంలో చైనా తమను మించి పోయిందని అమెరికా రక్షణశాఖ కార్యాలయం పెంటగన్‌ తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. ఇవి చైనా మిలిటరీ ముప్పు అనే కుట్ర సిద్ధాంత అంశాలే.
ఇలాంటి ప్రచారం అమెరికా ఉత్తిపుణ్యానికే చేయదు. రక్షణ ఖర్చును ఇబ్బడి ముబ్బడి చేసేందుకు దేశీయంగా పార్లమెంట్‌ మీద వత్తిడి తేవటం, ముప్పును ఎదుర్కోవాలంటే ఆయుధాలు సమకూర్చుకోవాలి, అంటే యుద్ద పరిశ్రమల కార్పొరేట్లకు జనం సొమ్మును కట్టబెట్టేందుకు మానసికంగా జనాన్ని ఒప్పించే ఎత్తుగడ దీనిలో ఉంది. మిలిటరీ రీత్యా చైనా విజయవంతంగా ఎన్నో మార్పులు చేసిందని పొగడటం అంటే అమెరికాలోని సామాన్యులను భయపెట్టటమే. ఇవన్నీ నిజానికి పాతబడిన విద్యలే. అమెరికన్లను బురిడీ కొట్టించేందుకు తమను తాము నిందించుకొనేందుకు సైతం సిద్ద పడతారు. దానితో వారికి పోయేదేమీ లేదు. ఉదాహరణకు అమెరికా నిద్రపోతుంటే చైనా ఆయుధాలతో ఎదిగిపోయింది అని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో చేసిన వ్యాఖ్య దానిలో భాగమే. వాస్తవానికి అది అతిశయోక్తి తప్ప వేరు కాదు. రాచపీనుగ ఒంటరిగా పోదు అన్నట్లు, తామే కాదు తమ స్నేహితులు కూడా నిద్రపోయారని చెప్పాడు. అదే సమయంలో అమెరికా స్నేహితులు, అనుయాయులు కలిస్తే చైనా కంటే ఎంతో బలం కలిగి ఉన్నామని పాంపియో చెప్పాడు.ఇది చైనాను బెదిరించటం.


ఇటీవలి కాలంలో తాను నాయకత్వం వహిస్తున్న నాటో కూటమి ఖర్చును రక్షణ పొందుతున్న దేశాలే ఎక్కువ భాగం భరించాలని ట్రంప్‌ బహిరంగంగా వత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. తాము 70శాతం ఖర్చు చేస్తుంటే మొత్తం ఐరోపా సభ్యదేశాలు 30శాతమే చెల్లిస్తున్నాయని ట్రంప్‌ రుసురుసలాడాడు. అయితే ఖర్చు ఎక్కువ భాగం అమెరికన్‌ సిబ్బందికి, ఆయుధాలకే ఖర్చు అవుతున్నందున తాము అదనంగా చెల్లించాల్సిన పనిలేదని నాటో దేశాలు బదులిచ్చాయి. ఇప్పుడు చైనా బూచిని చూపటం అంటే ఆసియాలోని దేశాలకు రక్షణ కల్పిస్తున్న తమ ఖర్చులో సింహభాగాన్ని భరించాలని అమెరికన్లు కోరటమే.


ఖండాంతర, నియంత్రిత క్షిపణులను చైనా మిలిటరీ తయారు చేసిందని, అవి అమెరికాకు ముప్పు తెస్తాయని, రాబోయే పది సంవత్సరాలలో ఇప్పుడున్న రెండువందల అణ్వాయుధాలు రెట్టింపు అవుతాయని పెంటగన్‌ పేర్కొన్నది. నిజానికి ఏ దేశం దగ్గరైనా అలాంటి ఆయుధాలు ఎన్ని ఉన్నాయో మిలిటరీ ఉన్నతాధికారులందరికీ కూడా తెలియదు. ఊహాగానాలు తప్ప సంఖ్యను ఎన్నడూ బయట పెట్టరు. ఇలాంటి అంకెలన్నీ చీకట్లో బాణాలు వేయటం తప్ప మరొకటి కాదు. ” గతంలో చైనాకు క్షిపణులు ఎక్కువ అవసరం ఉండేది కాదు. కానీ చైనాను తన వ్యూహాత్మక పోటీదారుగా అమెరికా పరిగణిస్తున్నది. ఈ నేపధ్యంలో తగినన్ని ఆయుధాలను సమకూర్చుకోని పక్షంలో చైనా ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని ” పెంటగన్‌ నివేదిక గురించి చైనా రక్షణ నిపుణులు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో గమనించాల్సిన అంశం ఏమంటే తనకు అవసరం అనుకుంటే చైనా అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే అణ్వాయుధాలను తయారు చేయగల స్ధితిలో ఉంది. అయితే తన 140 కోట్ల జనాభా జీవన ప్రమాణాలను మెరుగుపరచే మహత్తర కృషికి అది ప్రాధాన్యత ఇస్తున్నది తప్ప వనరులను ఆయుధాల కోసం దుర్వినియోగం చేయటం లేదు.


క్షిపణులు లేదా రాకెట్ల ద్వారా ప్రయోగించే ఆయుధాల సంఖ్య ఎంత అన్నదాన్ని బట్టి ఒక దేశ సైనిక పాటవాన్ని లెక్కించటం ఒక పద్దతి. చైనా మరో రెండువందలను తయారు చేయనుంది గనుక తమకు ముప్పు అని అమెరికా చెబుతున్నది. కానీ తన దగ్గర దానికి ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్న ఆయుధాలను యావత్‌ ప్రపంచానికి ముప్పుగానా లేక శాంతి కోసం తయారు చేసిందా ? స్టాక్‌హౌమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(సిప్రి) 2020 వార్షిక నివేదిక అమెరికా మోహరించిన అణ్వాయుధాలు 1,750, ఇతరంగా 4,050, అమ్ముల పొదిలో మరో 5,800 ఉన్నాయని పేర్కొన్నది. రష్యాతో ఒప్పందంలో భాగంగా కొన్ని మధ్యంతర శ్రేణి ఆయుధాలను ఉపసంహరించిన తరువాత పరిస్ధితి ఇది. 2019లో అమెరికా స్వయంగా చెప్పినదాని ప్రకారం దాని దగ్గర మొత్తం 6,185 అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిలో 2,385 వినియోగానికి స్వస్తి చెప్పారు లేదా నాశనం చేశారు. మోహరించిన ఆయుధాలు 1365. వీటిని చూపే అమెరికా ప్రపంచాన్ని భయపెడుతోంది. బయటకు వెల్లడించనివి ఎన్ని ఉన్నాయో తెలియదు. వాటి ముందు చైనా వద్ద ఉన్న ఆయుధాలెన్ని, అది తెచ్చే ముప్పు ఎంత ?


నిజానికి ఒక దేశం దగ్గర ఎన్ని అణ్వాయుధాలున్నా ఎదుటి దేశం మీద ప్రయోగిస్తే సర్వనాశనం తప్ప ఏ దేశమూ మిగలదు. చైనా దగ్గర కూడా గణనీయంగా అణ్వాయుధాలు ఉన్నాయి గనుకనే అమెరికా దూకుడు తగ్గిందన్నది వాస్తవం, అయితే మానసిక ప్రచారదాడి కొనసాగుతూనే ఉంటుంది.1980 దశకం నుంచీ చైనా వద్ద రెండువందలకు మించి అణ్వాయుధాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. వాటి సంఖ్యను పెంచటం లేదు. కొద్ది సంవత్సరాల క్రితం స్టాక్‌ హౌం సంస్ధ సిప్రి మరియు అమెరికన్‌ సైంటిస్ట్స్‌ ఫెడరేషన్‌ 320 ఉన్నట్లు జోశ్యం చెప్పాయి. కనుక పెంటగన్‌ కొత్తగా కనుగొన్నదేమీ లేదన్నది స్పష్టం.గతంలో సోవియట్‌ యూనియన్‌, ఇప్పుడు చైనా ఒక్కటే ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోమని చెప్పిన దేశం. అంతే కాదు అణ్వాయుధాలు లేని దేశాల మీద వాటిని ప్రయోగించబోమని, బెదిరించబోమని కూడా ప్రకటించింది.


పెంటగన్‌ అంచనా ప్రకారం భూమి మీద నుంచి ఖండాంతరాలకు ప్రయోగించే క్షిపణులు చైనా వద్ద 1250కు పైగా ఉన్నాయి. అవి 500 నుంచి 5,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయని చెబుతోంది. అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం ప్రకారం అమెరికా మధ్యంతర శ్రేణి క్షిపణుల తయారీ నిలిపివేసింది. చైనా బూచిని చూపి ట్రంప్‌ సర్కార్‌ ఆ ఒప్పందాన్ని పక్కన పెట్టి కొత్త క్షిపణులను పరీక్షిస్తోంది. ఈ చర్య మరింతగా ఆయుధ పోటీని పెంచేదే తప్ప తగ్గించేది కాదు. రాడార్లు పసి గట్టకుండా, ధ్వని లేకుండా వేగంగా ప్రయాణించే అమెరికన్‌ బాంబర్లను కూడా కూల్చివేయగల రష్యా ఎస్‌-400 దీర్ఘ శ్రేణి ఆయుధం అమెరికా దూకుడుకు అడ్డుకట్ట వేయనుంది. చైనా త్వరలో వీటన్నింటినీ అధిగమించే ఆయుధాలను రూపొందిస్తున్నదని పెంటగన్‌ నివేదిక పేర్కొన్నది.


చైనా నౌకాదళంలో 350 యుద్ద ఓడలు, జలాంతర్గాములున్నాయని, సంఖ్యరీత్యా ప్రపంచంలో పెద్దదని, కొన్ని రంగాలలో తమకంటే ముందున్నదని, తమ వద్ద 293 మాత్రమే ఉన్నాయని పెంటగన్‌ పేర్కొన్నది. ఇది కూడా మైండ్‌ గేమ్‌ తప్ప మరొకటి కాదు. అమెరికా వద్ద ఉన్న ఆధునిక యుద్ద ఓడలతో పోల్చితే చైనా బలం తక్కువే. అమెరికా వద్ద భారీ అణ్వాయుధాలను ప్రయోగించే పదకొండు బడా యుద్ద నౌకలు ఉన్నాయి. ఒక్కొక్కదాని మీద 80 యుద్ద విమానాలను ఉంచేంత పెద్దవి ఉన్నాయి. గత రెండు దశాబ్దాల కాలంలో చైనా నౌకాదళం విస్తరించినప్పటికీ అణ్వాయుధేతర విమానవాహక నౌకలు రెండు మాత్రమే ఉన్నాయి. వాటిలో క్షిపణులును కూల్చివేసే విధ్వంసక క్షిపణులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం చైనా నిర్మిస్తున్న నౌకలు అమెరికా వద్ద ఉన్నవాటి కంటే పెద్దవిగా ఉండబోతున్నాయని పశ్చిమ దేశాలు జోశ్యాలు చెబుతున్నాయి. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఉంటాడని ఇప్పటికే చైనా అనేక రంగాలలో నిరూపించింది.


అమెరికా కనుసన్నలలో పని చేసే జపాన్‌, దక్షిణ కొరియా ఇటీవలి కాలంలో విమానవాహక నౌకలతో సహా అనేక భారీ యుద్ద నావలను రంగంలోకి దించాయి. చైనా దగ్గర ఉన్న చిన్న తరహా యుద్ద నావలు కలిగించే భారీ నష్టాన్ని పెంటగన్‌ పరిగణనలోకి తీసుకోవటం లేదని ఒక విశ్లేషకుడు వాపోయాడు, అమెరికాను హెచ్చరించాడు. వెయ్యి అంతకు పైగా టన్నుల సామర్ధ్యం ఉన్న తీర రక్షక గస్తీ నౌకలు చైనాలో గత పది సంవత్సరాలలో 60 నుంచి 130కి పెరిగితే అమెరికా వద్ద 70 మాత్రమే ఉన్నాయని,రెండు నుంచి ఎనిమిది లక్షల వరకు ఉన్న సైనీకీకరణ గావించిన చేపల పడవలను తక్కువ అంచనా వేయకూడదని పేర్కొన్నాడు.
పెంటగన్‌ నివేదిక వచ్చిన సమయంలోనే చైనా విమాన వాహక రెండవ యుద్ద నౌక షాండోంగ్‌ శిక్షణ విన్యాసాలను ప్రారంభించింది. ఇది గత ఏడాది డిసెంబరులో నౌకాదళంలో చేరింది. తొలి నౌక లయనింగ్‌ కూడా పచ్చ సముద్రంలో సంచరిస్తున్నది. ఒకేసారి రెండు యుద్ద నౌకలు విన్యాసాలు జరపటం ఇదే తొలిసారి. తైవాన్‌ నుంచి అమెరికా పిచ్చిపనులు చేసేట్లయితే సమన్వయంతో వాటిని అరికట్టేందుకు వీలుకలుగుతుందని వార్తలు వచ్చాయి. ఈ రెండు నౌకల సంచారం ఎందుకనే విషయాన్ని చైనా ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే జోశ్యాలు వెలువడ్డాయి. షాండోంగ్‌ యుద్ద విమానాలతో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుందని, లయనింగ్‌ తన రేవు నుంచి ఎక్కువ దూరం ప్రయాణించనందున సాధారణ శిక్షణ కార్యక్రమాలకు పరిమితం కావచ్చని భావిస్తున్నారు. రెండు నౌకలు సమీపం నుంచి అదే విధంగా దూరం నుంచి సమన్వయం చేసుకోవటం గురించి కూడా పరీక్షలు జరుపుతాయి.


జాతీయ వాదం ప్రపంచానికి ఎంతటి చేటు తెచ్చిందో అనేక ప్రాంతీయ, రెండు ప్రపంచ యుద్ధాలతో మానవాళి చవి చూసింది. అందువలన జాతీయ వాదానికి గురైన ఏ జాతీ ప్రశాంతంగా లేదు, ప్రపంచాన్ని శాంతంగా ఉండనివ్వలేదన్నది చరిత్ర చెప్పిన సత్యం. జాతీయ వాదం వేరు దేశభక్తి వేరు. జాతీయవాదాన్నే దేశభక్తిగా చిత్రించి జాతీయవాదాన్ని వ్యతిరేకిస్తున్న వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్న రోజులివి.


బ్రిటీష్‌ వారి పాలనకు వ్యతిరేకంగా పోరాడటమే నాడు జాతీయవాదం-దేశ భక్తి. నేడు అసలు సిసలు దేశభక్తులుగా చెప్పుకుంటున్న సంఘపరివార్‌కు నాడు అవి పట్టలేదు. ఒక దేశం స్వాతంత్య్రం పొందిన తరువాత జాతీయవాదం ముందుకు వస్తే దాని స్వభావం భిన్నంగా ఉంటుంది. జర్మనీలో ముందుకు తెచ్చిన జాతీయవాదాన్ని నాజీలు దేశభక్తిగా ప్రచారం చేశారు. ఐరోపాలో ఉన్న జర్మన్‌లు, జర్మనిక్‌ భాష మాట్లాడేవారందరూ ఒకే దేశంగా ఉండాలి. జర్మన్‌ జాతి ఔన్నత్యాన్ని నెలకొల్పాలి. యూదులు, పోల్స్‌, రుమేనియన్లు అల్పజాతి వారు కనుక వారిని జర్మన్‌ గడ్డ నుంచి పంపివేయాలి. ఇదే నాజీల దేశభక్తి. దీన్ని ఆమోదించిన వారు జాతీయవాదులు, దేశభక్తులు.ఈ వాదాన్ని వ్యతిరేకించిన వారు దేశద్రోహులు, జర్మనీలో వారికి చోటు లేదు, ఇదీ తీరు. హిట్లర్‌ జాతీయ వాదాన్ని సమర్ధించిన వారు దేశభక్తులు, వ్యతిరేకించిన కమ్యూనిస్టులను జర్మన్‌ ద్రోహులని ఆరోజు చిత్రహింసల పాలు చేశారు.


చైనాతో మన సరిహద్దును బ్రిటీష్‌ వారి హయాంలో వివిధ సందర్భాలలో అధికారులు ఇష్టమొచ్చినట్లు గీశారు. ఒకరు గీసినదానిలో ఆక్సారుచిన్‌ చైనా ప్రాంతంగా మరొక దానిలో మనదిగా ఉంది. అదే విధంగా అరుణాచల్‌ ప్రదేశ్‌ను టిబెట్‌ అంతర్భాగంగా, బ్రిటీష్‌ ఇండియా భాగంగా పేర్కొన్న సందర్భాలున్నాయి. స్వాతంత్య్రానికి ముందు ఆ ప్రాంతాన్ని బ్రిటీష్‌ ఇండియా సర్కార్‌ ఆధీనంలో ఉన్నదానిని టిబెట్‌ స్వాధీనం చేసుకున్న సందర్భాలున్నాయి. బ్రిటీష్‌ వారితో టిబెట్‌ పాలకులు చేసుకున్న ఒప్పందాలను వేటినీ చైనా పాలకులు అంగీకరించలేదు. తమ సామంత రాజ్యానికి అలాంటి హక్కులేదని వాదించారు. ఒప్పందాలు అమలు కూడా కాలేదు. సరిహద్దులను ఖరారు చేసుకోవాలని నాడు చైనా గానీ బ్రిటీష్‌ ఇండియా గానీ పూనుకోలేదు.


అంతెందుకు మన దేశంలో ఆశ్రయం పొందిన 14 దలైలామా 1959లో తిరుగుబాటు చేసి మన దేశానికి పారిపోయి రావటానికి ముందు అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లో భాగమే అని చెప్పాడు. ఆ తరువాత 2003లో కూడా వాస్తవానికి అరుణాచల్‌ ప్రదేశ్‌ టిబెట్‌కు చెందిందని చెప్పాడు.


1947లో మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది, 1948లో చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. తరువాత కాలంలో సరిహద్దుల సమస్య ముందుకు వచ్చింది. రెండు దేశాలూ తమ వైఖరే సరైనదే అనే విధంగా వ్యవహరించాయి. దానికి తోడు దలైలామా సమస్య తోడై అది యుద్దానికి దారి తీసింది. వివాదం తెగలేదు. అయితే పరిష్కారం కావాలి, రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలి. అందుకు సంప్రదింపులు పరిష్కారం తప్ప ఆయుధాలు మార్గం కాదు. 1962లో యుద్ద సమయంలో అన్ని పార్టీలు జాతీయవాదానికి గురై చైనాను దురాక్రమణదారుగా పేర్కొని యుద్దాన్ని సమర్ధించాయి. సిపిఐ జాతీయ నాయకత్వం దీని గురించి ఒక వైఖరి తీసుకోవాల్సివచ్చింది. ఆ సమయంలో జరిగిన చర్చలలో కొందరు సరిహద్దు వివాదాన్ని సంప్రదింపుల ద్వారా శాంతియుతంగా పరిష్కరించాలనే వైఖరిని పార్టీ ప్రకటించాలని ప్రతిపాదించారు. మిగిలిన వారు యుద్దాన్ని సమర్ధిస్తూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలనే వైఖరి తీసుకున్నారు. అప్పటికి సైద్దాంతిక విభేదాల గురించి చర్చ తప్ప పార్టీలో చీలిక లేదు. సంప్రదింపులతో సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పిన పార్టీనేతలను, ఆ అభిప్రాయాన్ని బలపరిచిన వారిని దేశ వ్యాపితంగా నాటి ప్రభుత్వం అరెస్టు చేసి జైలుపాలు చేసింది. తరువాత వారంతా సిపిఎంగా ఏర్పడ్డారు.


దేశభక్తి పేరుతో రెచ్చగొట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ దాని రాజకీయ విభాగం జనసంఫ్‌ు, ఇతర సంస్దలు చైనా వ్యతిరేక వైఖరిని తీసుకొని, యుద్దాన్ని వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా చిత్రించాయి. కానీ తరువాత కాంగ్రెస్‌ పాలకులు, జనతా పార్టీలో చేరి అధికారంలో భాగస్వాములైన జనసంఘనేతలు, తరువాత బిజెపిగా అధికారానికి వచ్చిన వారూ చేసిందేమిటి ? సరిహద్దు సమస్యను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని, రెండు వైపులా తుపాకులు పేల కూడదని ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పుడు కారణాలు ఏమైనా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. మరోసారి ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, ఇతర సంస్ధల నేతలు చైనా వ్యతిరేక ప్రచారాన్ని పెద్ద ఎత్తున సాగిస్తున్నారు. దానికి మీడియా తోడైంది సరే. 1962లో యుద్దాన్ని సమర్దించి జాతీయవాదానికి గురైన సిపిఐ ఇప్పుడు ఆ వైఖరిని సవరించుకున్నది. సిపిఎం మాదిరే సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలనే వైఖరినే తీసుకున్నది.
అనేక దేశాలలో కమ్యూనిస్టులు ఇలాంటి సమస్యలు వచ్చినపుడు జాతీయవాదానికి లోను కాకుండా ఒక సూత్రబద్ద వైఖరిని తీసుకున్నారు. పాలస్తీనాను ఆక్రమించి స్వతంత్ర దేశంగా ఏర్పడకుండా అడ్డుకుంటున్న పాలకుల వైఖరిని ఇజ్రాయెల్‌ కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకిస్తున్నది. అక్కడి యూదుదురహంకారులు కమ్యూనిస్టులను దేశద్రోహులని నిందిస్తున్నా, దాడులకు పాల్పడినా కమ్యూనిస్టులు తమ వైఖరిని మార్చుకోలేదు.


చైనాతో సరిహద్దు వివాద పరిష్కారానికి శాంతియుత చర్చలు-ఇచ్చిపుచ్చుకోవటాలు తప్ప మరొక పరిష్కారం అసాధ్యం. ఈ విషయం ప్రతిపార్టీకీ తెలుసు. అయినప్పటికీ పైకి జాతీయవాదాన్ని ముందుకు తెస్తున్నాయి. మే, జూన్‌ మాసాలలో కొత్తగా చైనా వారు మన భూభాగాన్ని ఆక్రమించుకున్నారని చెప్పారు. తీరా మన ప్రధాని అఖిలపక్ష సమావేశంలో అబ్బే అలాంటిదేమీ లేదు అని ప్రకటించారు. తాజాగా మన ప్రాంతాన్ని ఆక్రమించుకొనేందుకు వస్తున్న చైనా వారిని పసిగట్టిన మన మిలిటరీయే చొరవ తీసుకొని కొన్ని కొండలను ఆధీనంలోకి తెచ్చుకుందని ప్రకటించారు. అసలేం జరుగుతోంది అన్నది తెలియటం లేదు.


యుద్దం వద్దు అన్న వారిని మన మిలిటరీ సత్తాను అవమానించే వారిగా చిత్రిస్తూ దాడి చేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీ శక్తి అమెరికా. అలాంటి దేశం జరిపిన యుద్దాలలో ఎక్కడైనా విజయం సాధించిందా ? అలాంటపుడు చైనా మనలను గానీ, మనం చైనాను గానీ యుద్ధంలో ఓడించి సమస్యలను పరిష్కరించుకోగలమా ? మన దగ్గర ఉన్న నాలుగు రూకలను అటు అమెరికా లేదా రష్యా మరొక దేశం నుంచో కొనుగోలు చేసే ఆయుధాలకు సమర్పించుకోవటం తప్ప మరొకటేమైనా జరుగుతుందా ? మన ప్రాంతాలను చైనాకు అప్పగించాలని ఎవరూ కోరటం లేదు. గతంలో లేదు భవిష్యత్‌లో కూడా ఉండదు. దేశభక్తి గురించి ఏ పార్టీ మరొక పార్టీకి బోధలు చేయాల్సిన,నేర్చుకోవాల్సిన అవసరం లేదు. భిన్న అభిప్రాయం వ్యక్తం చేసినంత మాత్రాన ఎవరూ దేశద్రోహులు కాదు. ఉద్రేకాలకు లోనుకాకుండా ఆలోచించాల్సిన సమయమిది. గతంలో ప్రపంచంలో జరిపిన అనేక యుద్దాలు ఆయా ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి జనాన్ని పక్కదారి పట్టించేందుకు లేదా జాతీయ దురహంకారంతో చేసినవే. అలాంటి వైఖరికి జనం మూల్యం చెల్లించాలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

సుత్తీ, కొడవలి, నక్షత్రాలుంటే బ్రెజిల్లో 15 ఏండ్ల జైలు !

08 Tuesday Sep 2020

Posted by raomk in Current Affairs, History, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Anti communist, Brazil, Brazill Communists, equate communist symbols with Nazi ones, Jail time for hammer and sickle, Jair Bolsonaro


ఎం కోటేశ్వరరావు
పారిశ్రామిక విప్లవ కాలంలో యజమానులు ప్రవేశపెట్టిన యాంత్రిక మగ్గాలు తమ ఉపాధిని హరించటంతో పాటు, ప్రాధాన్యతను తగ్గిస్తాయని, వాటి మీద పని చేసే నైపుణ్యంలేని కార్మికులకు ప్రాధాన్యత ఇస్తారని బ్రిటన్‌లోని నిపుణులైన చేనేత కార్మికులు భావించారు. వాటిని విధ్వంసం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని నిర్ధారణకు వచ్చి అదే పని చేశారు. చరిత్రలో యంత్రవిధ్వంసక కార్మికులుగా మిగిలిపోయారు. పెట్టుబడిదారీ విధానాన్ని సరిగా అర్ధం చేసుకోలేని తొలి రోజుల్లో అది జరిగింది.


ప్రపంచంలో సోషలిజం, కమ్యూనిజం గురించి గత రెండు శతాబ్దాలుగా తెలిసినప్పటికీ వాటిని వ్యతిరేకించే నిరంకుశ శక్తుల ఆలోచన యంత్రవిధ్వంసకుల స్ధాయినిదాటలేదని జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఆ కార్మికులకు దిక్కుతోచక యంత్ర విధ్వంసం చేస్తే ప్రస్తుతం కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా దిక్కుతోచక చిహ్నాల నిషేధానికి పాల్పడుతున్నారా ?
కమ్యూనిస్టు చిహ్నాలుగా పరిగణిస్తున్న సుత్తీ, కొడవలి, నక్షత్రం కమ్యూనిస్టు భావజాలం పురుడు పోసుకోక ముందే ఉన్నాయి. సుత్తీ, కొడవలిని కార్మిక-కర్షక మైత్రికి, నక్షత్రాన్ని ఐదు భూ ఖండాలకు గుర్తుగా కార్మికవర్గంపై జరిపినదాడిలో పారిన రక్తానికి చిహ్నంగా ఎర్రజెండాను కమ్యూనిస్టులు స్వీకరించారు. వాటిమీద కమ్యూనిస్టులకేమీ పేటెంట్‌ హక్కు లేదు. అయితే ఆ చిహ్నాలను వినియోగించిన వారికి పది నుంచి పదిహేనేండ్ల పాటు జైలు శిక్ష విధించాలని కోరుతూ సెప్టెంబరు రెండవ తేదీన బ్రెజిల్‌ పార్లమెంట్‌లో ఒక బిల్లును ప్రవేశ పెట్టారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనారో కుమారుడు, పార్లమెంట్‌ సభ్యుడు అయిన ఎడ్వర్డ్‌ బోల్జానో దాన్ని ప్రతిపాదించాడు. వాటిని తయారు చేసినా, విక్రయించినా, పంపిణీ చేసినా శిక్షార్హంగా పరిగణిస్తూ చట్టసవరణకు నిర్ణయించారు. నాజీలు, తరువాత కమ్యూనిస్టులు పోలాండ్‌ను ఆక్రమించారని అందువలన వారిని హంతకులుగా పరిగణించాలని, వారి చిహ్నాలను ఉపయోగించిన వారిని శిక్షించాలని బోల్జానో చెప్పాడు. అది పార్లమెంట్‌ ఆమోదం పొందుతుందా? లేదా, పొందితే తదుపరి కమ్యూనిస్టుల మీద నిషేధం విధిస్తారా ? ఏమైనా జరగొచ్చు.


పచ్చి మితవాదులైన తండ్రీ కొడుకులు తాము కమ్యూనిస్టు వ్యతిరేకులమని బహిరంగంగానే గతంలో ప్రకటించుకున్న నేపధ్యంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవటం ఆశ్చర్యమేమీ కాదు. కమ్యూనిస్టులు, నాజీలు ఒకటే అనేందుకు రుజువులు ఇవిగో అంటూ నాటి సోవియట్‌లోని ఉక్రెయిన్‌లో కమ్యూనిస్టులు కరవుకు కారకులయ్యారని ఒక చిత్రాన్ని, నాజీల చిత్రహింసలకు సంబంధించి ఒక చిత్రాన్ని ట్వీట్‌ చేశాడు. అయితే కరవు అని చెప్పిన చిత్రం బ్రిటీష్‌ ఇండియాలోని బెంగాల్‌ కరవుకు సంబంధించింది. కొందరు ఆ విషయాన్ని చెప్పినప్పటికీ ఎడ్వర్డ్‌ వెనక్కు తీసుకొనేందుకు నిరాకరించాడు. కరోనా వైరస్‌కు కారణం చైనాయే అంటూ గతంలో ప్రకటించి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కూడా కారకుడయ్యాడు.


కమ్యూనిస్టు సంబంధిత లేదా కమ్యూనిస్టు నేతల పేర్లతో ఉన్న బహిరంగ స్ధలాలు, సంస్ధలు, కట్టడాల పేర్లు కూడా మార్చాలని బ్రెజిల్‌ పాలకులు ఆలోచిస్తున్నారు. పాలకపక్ష చర్యను బ్రెజిల్‌ కమ్యూనిస్టు యువజన సంఘం ఖండించింది. గతంలో నిరంకుశ పాలకులు ఇదే విధంగా తమ సంస్ధను, కమ్యూనిస్టు పార్టీని పని చేయనివ్వకుండా చేశారని తిరిగి అదే చర్యకు ఒడిగట్టారని పేర్కొన్నది. తూర్పు ఐరోపాలోని పోలాండ్‌, హంగరీ వంటి దేశాలలో చేస్తున్న మాదిరే ఇక్కడ కూడా చేస్తున్నారని పేర్కొన్నది. కమ్యూనిజం-నాజీజాలను ఒకే గాటన కడుతున్న ఐరోపా యూనియన్‌ వైఖరినే బ్రెజిల్‌ పాలకులు అనుసరిస్తున్నారని ఇది చరిత్రను వక్రీకరించటం తప్ప వేరు కాదని విమర్శించింది. రెండవ ప్రపంచ యుద్దంలో నాజీలను ఓడించేందుకు సోవియట్‌ కమ్యూనిస్టులు తమ రక్తాన్ని ధారపోశారన్న నిజం దాస్తే దాగేది కాదని పేర్కొన్నది.


తమ భావజాలాన్ని వ్యక్తపరిచేందుకు విధించే ఈచర్యలను తాము సహించబోమని, ప్రజల్లో తమ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తామని స్పష్టం చేసింది.ఇవి బ్రెజిల్‌ ప్రజాస్వామిక స్వేచ్చ, సామాజిక ఉద్యమాల మీద దాడి తప్ప మరొకటి కాదన్నది. కమ్యూనిస్టులను అరెస్టులు చేయాలని, హతమార్చాలని తండ్రీ కొడుకులు, వారితో కుమ్మక్కయిన జనరల్‌ హామిల్టన్‌ మౌరో చూస్తున్నారని వారి ఆటలను అరికట్టేందుకు ప్రజాఉద్యమాన్ని నిర్మిస్తామని కమ్యూనిస్టు యువజన సంఘం పేర్కొన్నది.
ఉక్రెయిన్‌,మరికొన్ని తూర్పు ఐరోపా దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత అధికారానికి వచ్చిన నియంతలు, ఫాసిస్టు శక్తులు కమ్యూనిస్టు చిహ్నాలను నిషేధించారు. కొన్ని చోట్ల కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికలలో పోటీ చేయకుండా ఆంక్షలు పెట్టారు.తాను ఉక్రెయిన్‌ దేశాన్ని ఆదర్శంగా తీసుకొని కమ్యూనిస్టు చిహ్నాలను నిషేధించాలని బిల్లును ప్రతిపాదించినట్లు ఎడ్వర్డ్‌ బోల్జానో చెప్పాడు.

బ్రెజిల్‌ పార్లమెంట్‌లో కమ్యూనిస్టు పార్టీ(పిసిడిఓబి)కి ఎనిమిది మంది సభ్యులున్నారు, 27కు గాను ఒక రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంది, అనేక మున్సిపల్‌, కార్పొరేషన్లలో పార్టీ అధికారంలో ఉంది. కమ్యూనిస్టు చిహ్నాల బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం పొందిన తరువాత కమ్యూనిస్టు, ఇతర పురోగామి శక్తుల కార్యకలాపాలను నిషేధించినా ఆశ్చర్యం లేదు. కరోనా వైరస్‌ నివారణలో వైఫల్యం, కార్మికుల హక్కులపై దాడి, ఆర్ధిక రంగంలో తిరోగమనం వంటి సమస్యలతో బోల్సనారో ప్ర భుత్వం నానాటికీ ప్రజావ్యతిరేకంగా మారుతున్నది. కమ్యూనిస్టు పార్టీ ఆ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది, ప్రజా ఉద్యమాలకు పిలుపు ఇచ్చింది.
గత ఎన్నికలలో మితవాద బోల్సనారో అధికారానికి వచ్చిన తరువాత విదేశాంగ విధానాలలో ప్రభుత్వం గుడ్డిగా అమెరికాను అనుసరిస్తున్నది. దానిలో భాగంగానే బ్రిక్స్‌ కూటమిలో భాగస్వామిగా ఉంటూనే మరో భాగస్వామి అయిన చైనాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. మంత్రులు బహిరంగంగానే చైనా వ్యతిరేక ప్రకటనలు చేస్తూ డోనాల్డ్‌ ట్రంప్‌ను సంతోష పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆగస్టు 11న బ్రెజిల్‌-అమెరికా సంబంధాలను కాపాడాలనే పేరుతో ఎడ్వర్డ్‌ బోల్జానో ఒక ఉపన్యాసం చేశాడు. ఒక దేశాన్ని ఎలా నాశనం చేయవచ్చు అనే పేరుతో నిర్వహించిన ఒక కార్యక్రమంలో వెనెజులా గురించి అభూత కల్పనలతో సంక్షేమ చర్యలకు వ్యతిరేకంగా వక్తలు ఉపన్యాసాలు చేశారు. అంతకు ముందు గ్లోబలిజం-కమ్యూనిజం పేరుతో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇంకా ఇలాంటివే క్యూబాకు వ్యతిరేకంగా కూడా నిర్వహించారు.


కమ్యూనిస్టు వ్యతిరేకతకే బ్రెజిల్‌ ప్రభుత్వం పరిమితం కాలేదు. క్రైస్తవ విలువల పేరుతో అబార్షన్లకు వ్యతిరేకంగా ఉపన్యాసాలను ఇప్పించారు. విదేశాంగ విధానంలో లాటిన్‌ అమెరికన్‌ దేశాల ఐక్యత, రక్షణ అనే వైఖరికి బ్రెజిల్‌ దూరం అవుతున్నది. అంతర్జాతీయ విధానాలకు సంబంధించి రాజ్యాంగం రూపొందించిన విధానాలకు వ్యతిరేకంగా ముందుకు సాగుతున్నది.
ఇటీవలి కాలంలో ఐరోపా, అమెరికాలో కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులు రెచ్చిపోతున్నాయి. అనేక దేశాల్లో మితవాద శక్తుల పట్టు పెరుగుతోంది. గతేడాది సెప్టెంబరులో ఐరోపా యూనియన్‌ పార్లమెంటులో కమ్యూనిస్టు వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించటాన్ని చూస్తే ఒక వ్యవస్ధగానే కమ్యూనిస్టు వ్యతిరేకతను ప్రోత్సహిస్తోంది. రెండవ యుద్ద ప్రారంభంలో సోవియట్‌ యూనియన్‌ ఒక ఎత్తుగడగా జర్మనీతో చేసుకున్న ఒప్పందాన్ని సాకుగా చూపుతూ నాజీలు – కమ్యూనిస్టులూ ఒకటే అనే పేరుతో కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు ప్రచారం చేస్తున్నాయి. నాజీలు సోవియట్‌ మీద జరిపిన దాడి, కమ్యూనిస్టుల చేతుల్లోనే నాజీలు నాశనమైన చరిత్రను దాచేందుకు ప్రయత్నిస్తున్నారు.


అమెరికా ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడుతున్న నేపధ్యంలో బ్రెజిల్‌ పార్లమెంట్‌లో కమ్యూనిస్టు చిహ్నాల మీద నిషేధం విధించాలనే బిల్లు ప్రతిపాదనను చూడాల్సి ఉంది. అధ్యక్ష , ఉపాధ్యక్షులుగా జో బిడెన్‌, కమలాహారిస్‌ ఎన్నికైతే అమెరికా కమ్యూనిజం వైపుకు పోయినట్లే అని గత పది రోజులుగా రిపబ్లికన్‌ పార్టీ నేతలు ప్రసంగాలు చేస్తున్నారు. డెమోక్రటిక్‌ పార్టీలో బెర్నీ శాండర్స్‌ వంటి డెమోక్రటిక్‌ సోషలిజం గురించి మాట్లాడేవారు, ఎలిజబెత్‌ వారెన్‌, అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌, కమలా హారిస్‌ వంటి ఉదారవాదులను కమ్యూనిస్టులుగా చిత్రించి రిపబ్లికన్‌ పార్టీ కమ్యూనిస్టు వ్యతిరేకత ఉన్న అమెరికన్ల ఓట్లకోసం నానా గడ్డీ కరుస్తున్నది. మన దేశంలో ఇందిరా గాంధీని కూడా సోషలిస్టుగా పశ్చిమ దేశాల మీడియా చిత్రించిన విషయం తెలిసిందే. అందువలన వారి పరిభాషలో సోషలిస్టులు, కమ్యూనిస్టులుగా చిత్రించిన వారందరూ కమ్యూనిస్టులు కాదు. కొన్ని అంశాలలో మితవాదులతో విబేధించే పరిమిత పురోగామి భావాలు కలిగిన వారిగానే చూడాల్సి ఉంది.


బ్రిటన్‌, ఫ్రాన్స్‌లలో పారిశ్రామిక విప్లవకాలంలో యంత్రాలను విధ్వంసం చేసినంత మాత్రాన ఆ క్రమం ఆగలేదు, పెట్టుబడిదారీ విధానం మరింతగా యాంత్రిక విధానాలతో ముందుకు పోతున్నది. ఐరోపా లేదా బ్రెజిల్‌ మరొక దేశంలో కమ్యూనిస్టు చిహ్నాల మీద నిషేధం విధించినంత మాత్రాన, వాటిని వినియోగించే పార్టీలను ఎన్నికలకు దూరం చేసినంతనే పురోగామి శక్తుల రధచక్రాలు ఆగిపోతాయనుకుంటే అంతకంటే పిచ్చి భ్రమ మరొకటి ఉండదు. మహత్తర తెలంగాణా సాయుధ పోరాట ప్రారంభంలో వడిసెలతో శత్రువులను ఎదుర్కొన్న యోధులకు తుపాకులు సమకూర్చుకోవటం పెద్ద సమస్యగా మారలేదు. శిక్షణ పొందిన మిలిటరీతో సమంగా తమకు తామే ప్రాధమిక పరిజ్ఞానంతో తుపాకులు పేల్చిన సామాన్యులు కిరాయి మూకలు, సైన్యాన్ని ఎలా ఎదిరించారో చూశాము. అవసరాలు అన్నింటినీ సంపాదించుకొనే మార్గాలను కూడా చూపుతాయి.


బ్రెజిల్‌, ఇండోనేషియా, ఐరోపా మరొక చోట ఎక్కడైనా దోపిడీ శక్తులను హతమార్చక తప్పదు, దోపిడీ లేని సమాజాన్ని నిర్మించుకోవాలనే నిశ్చయానికి కార్మికవర్గం, రైతులు రావాలే గాని సుత్తీ, కొడవలి, నక్షత్రం, ఎర్రజెండాగాక పోతే మరో గుర్తులు, పతాకంతో సంఘటితం అవుతారు. లాటిన్‌ అమెరికా, ఐరోపా, ఆసియాలోని కొన్ని దేశాలలో విప్లవాన్ని సాధించిన పార్టీలన్నీ తొలుత కార్మిక మరొక పేరుతో ప్రారంభమయ్యాయి తప్ప కమ్యూనిస్టు పార్టీలుగా కాదన్నది చరిత్రలో ఉంది. వియత్నాం కమ్యూనిస్టు నేత హౌచిమిన్‌ వియత్నాం వర్కర్స్‌ పార్టీ ప్రధమ కార్యదర్శిగా పని చేశారు. క్యూబాలో ఫిడెల్‌ కాస్ట్రోతొలుత క్యూబా ప్రజా పార్టీలో చేరారు. వివిధ ఉద్యమాల పేరుతో కార్యకలాపాలు నిర్వహించారు.పాపులర్‌ సోషలిస్టు పార్టీ పేరుతో ఉన్న కమ్యూనిస్టులతో అంతర్గతంగా సంబంధాలు పెట్టుకున్నారు తప్ప బహిరంగంగా పార్టీతో కలవలేదు. కమ్యూనిస్టుల గురించి జరిగిన తప్పుడు ప్రచార నేపధ్యంలో నియంతలను వ్యతిరేకించే వారిని సమీకరించేందుకు ఆ పని చేశారు. అధికారానికి వచ్చిన రెండు సంవత్సరాల తరువాత తాను కమ్యూనిస్టును అని కాస్ట్రో ప్రకటించారు. కమ్యూనిస్టుల మీద నిషేధం విధించిన పూర్వరంగంలో కమ్యూనిస్టులు వివిధ దేశాలలో అనేక మారు పేర్లతో పని చేశారు. మన దేశంలో కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ పేరుతో కమ్యూనిస్టులు పని చేసిన విషయం తెలిసినదే. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు చూడాల్సింది. ఎలుకలను పడుతుందా లేదా అన్నది ముఖ్యం. పార్టీ చిహ్నాలు, జెండాలు వేరుగావచ్చు, అధికారాన్ని శ్రామికవర్గ రాజ్య నిర్మాణానికి ఉపయోగిస్తున్నాయా లేదా అన్నదే గీటు రాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

74 ఏండ్ల స్వాతంత్య్రం-2 : ద్రవ్య పెట్టుబడి-నయా ఉదారవాదం- హిందూత్వ !

17 Monday Aug 2020

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics

≈ Leave a comment

Tags

74th independence day India, Finance Capital, Narendra Modi, Neoliberalism in India, RSS-Hindutva


ఎం కోటేశ్వరరావు
ప్రస్తుతం ఉన్న పార్లమెంట్‌, పాలకుల నివాసాలు శుభ్రంగా ఉన్నాయి, మన సామాన్యుల ఇండ్ల మాదిరి వర్షాలకు కురుస్తున్నట్లు వార్తలేమీ లేవు. దేశం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉంది, లోటు బడ్జెట్‌ను పూడ్చుకొనేందుకు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగపోయినా ఎడా పెడా వేల కోట్ల రూపాయల పన్నులు, ధరల పెంపుతో జనాల జేబులు కొల్లగొడుతున్నారు.లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. కరోనా నివారణ చర్యలకు రాష్ట్రాలు నిధుల్లేక నానా అగచాట్లు పడుతున్నాయి. అయినా నూతన పార్లమెంట్‌ భవనం, ఇతర కట్టడాలు నరేంద్రమోడీ హయాంలో నిర్మిత మయ్యాయనే కీర్తి కండూతి కోసం దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలను తగలేసి కట్టేందుకు నిర్ణయించారు. దీన్ని చూస్తే హిట్లర్‌ గుర్తుకు వస్తున్నాడు. చరిత్రలో నిలిచిపోయేలా ఐరోపాలో ఎక్కడా లేని విధంగా జర్మనీలో గ్రేట్‌ హాల్‌ నిర్మించాలని నిర్ణయించి, నమూనాలను గీయించాడు. రెండవ ప్రపంచ యుద్దంలో కమ్యూనిస్టుల చేతిలో పరాజయం పాలై ఆత్మహత్య చేసుకున్నాడు గానీ గెలిచి ఉంటే దాన్ని నిర్మించి ఉండేవాడు. నెహ్రూ నీటిపారుదల ప్రాజెక్టులకు, ఇతర పారిశ్రామిక సంస్దలకు నాంది పలిక ఆధునిక దేవాలయాలకు ఆద్యుడయ్యాడనే పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నరేంద్రమోడీ తన ఖాతాలో ఆర్టికల్‌ 370 రద్దు, విగ్రహాలు, ఆయోధ్యరామ మందిరం తదితర అంశాలతో పాటు పార్లమెంట్‌ భవనాన్ని చేర్చి నెహ్రూ పేరును చెరిపి వేయాలన్న తాపత్రయం, ప్రయత్నం కనిపిస్తోంది.


సుప్రీం కోర్టు తీర్పు మాత్రమే చెప్పింది !
సుప్రీం కోర్టు బాబరీ మసీదు స్ధలం రాముడికే చెందాలని తీర్పు చెప్పింది తప్ప న్యాయం చేకూర్చలేదు అనే విమర్శలు ఉన్నాయి. మసీదు కూల్చివేతను ఒక నేరపూరిత చర్యగా వర్ణించింది.దోషులను శిక్షించేందుకు విచారణను వేగవంతం చేయాలన్నది. అదే కోర్టు మరోవైపున మసీదు కూల్చివేతలో ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రమేయం ఉన్నవారికి ఆ స్ధలంలో రామాలయనిర్మించే బాధ్యతను అప్పగించింది. అయితే అది ఒక ట్రస్టు ఆధ్వర్యాన జరగాలని తీర్పు చెప్పింది. కానీ నరేంద్రమోడీ అండ్‌కో దాన్ని ఒక అధికారిక కార్యక్రమంగా మార్చివేశారు. లౌకిక రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేసిన మోడీ దీనికి హాజరు కావటాన్ని రాజ్యాంగ ఉల్లంఘన అని తప్ప ఏమనాలి ? రామాలయ నిర్మాణం కోసం శతాబ్దాల తరబడి అనేక మంది త్యాగాలు చేశారంటూ స్వాతంత్య్ర ఉద్యమంతో పోల్చటం చరిత్రను కించపరచటం కాదా ? నరేంద్రమోడీ మాతృసంస్ధ స్వాతంత్య్ర ఉద్యమంలో భాగస్వామి కాదు. ఉద్యమాన్ని వ్యతిరేకించింది. ఒక సంస్ధగా ఆర్‌ఎస్‌ఎస్‌ స్వాతంత్య్రం పోరాటంలో ఎందుకు పాల్గొనలేదు అని తనకు తానే ప్రశ్న వేసుకొని ఆ సంస్ధ ప్రముఖుడు నానాజీ దేశముఖ్‌ ఇచ్చిన వివరణే అందుకు నిదర్శ నం.


చెప్పింది చెయ్యరు- చేసేది చెప్పరు !
అచ్చేదిన్‌ (మంచి రోజులు) అని నినాదమిచ్చిన నరేంద్రమోడీ ఏలుబడిలో ఎన్నికల తరువాత అసలు ఆ మాటను ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రస్తావించలేదంటే అతిశయోక్తి కాదు. అదే విధంగా గుజరాత్‌ అభివృద్ది నమూనాను దేశమంతటా అమలు జరుపుతానని చెప్పారు. దాని ప్రస్తావనా లేదు. విదేశాల్లో దాచుకున్న దొంగ సొమ్మును తీసుకువస్తే ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు వస్తాయి, ఇస్తామన్నట్లుగా మాట్లాడారు. అదేమైందో తెలియదు. నిరుద్యోగం 40 సంవత్సరాల రికార్డు స్ధాయికి చేరింది అని ప్రభుత్వ గణాంకాల నివేదిక తేల్చింది. అయితే అదంతా తప్పుల తడక, కల్పించిన ఉపాధిని పరిగణనలోకి తీసుకోలేదు, ఉదాహరణకు పకోడీల తయారీ కూడా ఉపాధికల్పనలో భాగమే అలాంటి వాటిని పరిగణనలోకి తీసుకోలేదు, సరైన లెక్కల పద్దతిని రూపొందించి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
ఎన్నికల తరువాత అదే నివేదికను ఆమోదించారు. కొత్త గణాంకాలను తెచ్చిందీ లేదు.2019 పిరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే(పిఎల్‌ఎఫ్‌ఎస్‌)ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల కోసం ఆరునెలల పాటు తొక్కిపెట్టింది.2011-12 సంవత్సరాలలో 467.7 మిలియన్‌లుగా ఉన్నకార్మికశక్తి 2017-18 నాటికి 461.5మిలియన్లకు తగ్గిపోయారు. వ్యవసాయ రంగంలో 29.3 మిలియన్ల మంది ఉపాధి కోల్పోగా వారిలో 24.7 మిలియన్ల మంది మహిళలే ఉన్నారు. అయినప్పటికీ పాలకులు మహిళా ఉద్దరణ, విజయగాధల గురించి కబుర్లు చెబుతూనే ఉన్నారు. ఉపాధి తగ్గిపోయినట్లు ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం .రూపొందించిన నివేదికలో నాలుగు దశాబ్దాల రికార్డు స్ధాయి 6.1.శాతానికి నిరుద్యోగం పెరిగిందని పేర్కొన్నది. దీనికి 2016లో నరేంద్రమోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు కారణం అన్నది దాని సారాంశం. దాన్ని ఎన్నికల ముందు విడుదల చేస్తే నష్టదాయకం కనుక తొక్కి పెట్టారు.


నరేంద్రమోడీ హయాంలో జిడిపి పెరుగుదల మొదలు అనేక గణాంకాలు వివాదాస్పదం అయ్యాయి. ఏది నిజమో కాదో తెలియని సందిగ్ద స్దితిలో జనాన్ని పెట్టారు. మోడీ గణానికి కావాల్సింది అదే. అలాంటి పరిస్ధితిలో తమ ప్రచార యంత్రాంగం ద్వారా అర్ధసత్యాలు, అసత్యాలను ప్రచారం చేసి తమ పబ్బం గడుపుకోవాలన్నది ఎత్తుగడ. లెక్కించే పద్దతి సరిగా లేదు, మేము సాధించిన వృద్ధి గణాంకాల్లో చేరటం లేదని చెబుతున్న మోడీ సర్కార్‌ ఇంతవరకు సరైన పద్దతిని ఎందుకు రూపొందించలేకపోయింది.అంతచేతగాని స్ధితిలో మన యంత్రాంగం, ప్రధాని సలహాదారులు ఉన్నారా ? లేదూ కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు ఉన్న విధానం ప్రకారం రూపొందించిన అంకెలను అంగీరించాలి, జనానికి అందించాలా లేదా ? పెద్ద నోట్ల రద్దు వలన సాధించేదేమిటి అంటే తరువాత కాలంలో లావాదేవీలన్నీ నమోదు అవుతున్నాయని చెబుతున్నారు. దానికోసమే అయితే యావత్‌ జనాన్ని అంత ఇబ్బంది పెట్టటం ఎందుకు, ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీయటమెందుకు? నల్లధనాన్ని బయటపెట్టేందుకు అని చెప్పిన పెద్దలు అసలా మాటనే మరచిపోయినట్లు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారి గురించి దేశం ఏమి ఆశిస్తుంది? ఆచరణలో ఎన్ని లావాదేవీలు నమోదు అవుతున్నాయి. క్రెడిట్‌ కార్డు ద్వారా చిన్న దుకాణదారులందరూ రెండున్నరశాతం అదనంగా వసూలు చేస్తున్నందున వినియోగదారులు నగదు చెల్లింపుకే మొగ్గు చూపుతున్నారు. రియలెస్టేట్‌ రంగంలో లెక్కల్లో చూపుతున్నది ఎంతో నల్లధనం ఎంత చెల్లిస్తున్నారో బహిరంగ రహస్యం. అనేక దుకాణాల్లో కార్డు చెల్లింపులను అంగీకరించటం లేదన్నదీ తెలిసిందే. బిజెపి ఎన్నడూ కాశ్మీరు రాష్ట్రాన్ని రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తానని ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఎంత నాటకీయంగా ఆపని చేసిందో చూశాము


అభివృద్ధికి ఆటంకం కార్మిక చట్టాలా – పాలకుల విధానాలా ?
దేశంలో అభివృద్ది కుంటుపడటానికి, ముందుకు పోయేందుకు కార్మిక చట్టాలు ఆటంకంగా ఉన్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. కాపలాగా ఉన్న ఒక కుక్కను తప్పించాలంటే దాన్ని పిచ్చిదని ప్రచారం చేయాలన్నట్లుగా కార్మిక చట్టాలను రద్దు చేసి లేదా నీరు గార్చి యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలి వేసి దోపిడీని స్వేచ్చగా కొనసాగనివ్వాలన్నది అసలు లక్ష్యం. ముందే చెప్పుకున్నట్లు ద్రవ్య పెట్టుబడి, నయా ఉదారవాద విధానం కార్మికుల హక్కులను, బేరమాడే, పోరాడేశక్తిని సహించదు.
ఈ నేపధ్యంలోనే 1991 నుంచి ఒక పధకం ప్రకారం కార్మిక చట్టాల సంస్కరణల గురించి ప్రచార దాడి ప్రారంభించారు. మన కేంద్ర ప్రభుత్వం 45, అన్ని రాష్ట్రాలూ కలిపి మరో 170వరకు కార్మిక చట్టాలను చేశాయి. వీటిలో అత్యధిక భాగం కార్మికశక్తిలో పదిశాతానికి అటూ ఇటూగా ఉండే సంఘటిత కార్మికుల కోసం రూపొందించినవే. అసంఘటిత కార్మికులకు ఉన్న రక్షణ నామమాత్రం. అయినప్పటికీ పదిశాతం కార్మికులకు ఉన్న చట్టాలు అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయని నమ్మబలుకుతున్నారు. అసంఘటిత రంగ కార్మికుల్లో వలస కార్మికులు ఎందరున్నారో, వారికి ఎలాంటి రక్షణ లేదని కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా రుజువైంది. అసలు వారెంత మంది ఉన్నారో, ఎక్కడెక్కడ పని చేస్తున్నారో కేంద్రం లేదా రాష్ట్రాల వద్ద సమాచారమే లేదు, రికార్డులు అంతకంటే లేవు. కరోనా నివారణ కాలేదు కానీ కార్మికశాఖ డొల్లతనం, పాలకుల బండారం బట్టబయలైంది.
కార్మిక చట్టాలను సంస్కరించవద్దని ఎవరూ చెప్పటం లేదు. ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటిదంటే తిరస్కరించిన దరఖాస్తులను కూడా పరిష్కరించిన జాబితా అంకెల్లో చూపుతుంది. అలాగే సంస్కరణలు అంటే ఉన్నవాటిని మరింత మెరుగుపరచటం గాకుండా అసలు పూర్తిగా ఎత్తివేయటంగా తయారైంది. పారిశ్రామిక, వాణిజ్య సంస్దలలో తనిఖీ యంత్రాంగం అక్రమాలకు పాల్పడుతోంది బాబూ అని కార్మికులంటే యజమానులకు అనుగుణ్యంగా అసలు తనిఖీలనే ఎత్తివేశారు. యాజమాన్యాలు నిబంధనలను సక్రమంగా అమలు జరపటం లేదంటే చట్టాల అమలు గురించి యజమానులు స్వయంగా అఫిడవిట్లు ఇస్తే చాలన్నట్లుగా చెబుతున్నారు.
కోర్టులు ఏ దేశంలో ఏ పాలనా వ్యవస్ధ ఉంటే దాని విధానాలకు అనుగుణ్యంగానే నడుచుకుంటాయన్నది ప్రపంచ అనుభవం. ప్రభుత్వ ఉద్యోగులు, అత్యవసర సేవలు అందించే వారికే కాదు యావత్‌ ఉద్యోగులు, కార్మికులకు సమ్మె హక్కు లేదిప్పుడు అంటే అతిశయోక్తి కాదు. సమ్మెను ఒక ఆయుధంగా వాడుతూ అత్యధిక సందర్భాలలో దుర్వినియోగం చేస్తున్నారని కోర్టులు వ్యాఖ్యానించాయి. సమ్మె ప్రాధమిక హక్కు కాదని వ్యాఖ్యానించాయి.


పరస్పర విరుద్ద వాదనలు !
ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో మాదిరి పరస్పర విరుద్ద వాదనలు ఎలా ఉంటాయో చూద్దాం. నిరుద్యోగం ఎందుకు పెరుగుతుంది? పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఉన్న లోపాల కారణంగా తలెత్తుతుంది అని కమ్యూనిస్టులు చెబుతారు. కాదు మేము వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఉత్పాదకత పెరుగుతుంది, మాలాభాలు పెరుగుతున్నాయి, పని చేసే వారు ఎక్కువ మంది అవసరం లేదు, అందువలన నిరుద్యోగం పెరుగుతుంది అని యజమానులు, వారికి మద్దతు ఇచ్చే వారు చెబుతారు. ఇదే వాదన చేసే వారు కార్మిక చట్టాలు, కార్మికులకు హక్కులు కలిగించటం వలన వారు వేతనాల పెంపుదల కోసం, హక్కుల కోసం డిమాండ్లు చేస్తారు. వారి చర్యలు ఉత్పత్తికి ఆటంకంగా మారతాయి, ఉత్పాదక ఖర్చులు పెరుగుతాయి అని చెబుతారు. ఒక వైపు యాంత్రీకరణ ద్వారా ఖర్చులు తగ్గించామని చెప్పేవారు ఇక్కడ వేతనాలు పెరిగితే ఖర్చు పెరుగుతుంది అని వాదిస్తారు.


ఉత్పత్తి పడిపోవటానికి కార్మిక సమ్మెలు కారణం కానేకాదు. 2011లో దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి సామర్ధ్య వినియోగం 83శాతం ఉండగా క్రమంగా తగ్గుతూ పెరుగుతూ కరోనాకు ముందు 2019లో 76శాతం ఉండగా ఈ ఏడాదిలో ప్రస్తుతం 68శాతానికి పడిపోయింది.2003 నుంచి 2014వరకు సమ్మెలు 75శాతం తగ్గితే, పని దినాల నష్టం 90శాతం తగ్గింది. 2014లో 119 సమ్మెలు జరిగితే తరువాత రెండు సంవత్సరాలలో 106,93కు తగ్గాయి. 2017 జనవరి-అక్టోబరు మధ్య కాలంలో 82 జరిగాయి. ఇటీవలి కాలంలో వాణిజ్య సులభతర సూచికలో ఎన్నో పాయింట్ల మెరుగుదల ఉంది, నరేంద్రమోడీ ఏ ప్రధానీ చేయనన్ని విదేశీ పర్యటనలు చేసి సంబంధాలు మెరుగుపరచినట్లు, దేశ ప్రతిష్టను పెంచినట్లు చెప్పటాన్ని విన్నాం. అయినా మన ఎగుమతులు పెరగకపోగా పడిపోయాయి. దీనికి కార్మికులు కారణం కాదు. అయినా కార్మిక చట్టాలను మరింతగా సంస్కరిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే ఎగుమతి ఆధారిత, ప్రత్యేక ఆర్ధిక ప్రాంతాలలో చట్టాలు పని చేయవు, ఇప్పుడు వాటిని ఇతర అన్ని ప్రాంతాలకు విస్తరిస్తారా ? అనుమానం అక్కర లేదు.
అప్రెంటిస్‌ల పేరుతో చట్టబద్దంగానే శ్రమశక్తిని దోచుకొనేందుకు యజమానులకు అవకాశం కల్పించారు. కనీసం 15శాతం అప్రెంటిస్‌లు ఉండాలి. అంటే వారికి ఎలాంటి చట్టాలు, చట్టబద్ద వేతనాలు వర్తించవు. స్టైఫండ్‌ మాత్రమే ఇస్తారు.రిజిస్టర్లు, ఇతర రికార్డుల నిర్వహణలో కూడా మినహాయింపులు ఇచ్చారు గతంలో 19 మంది కార్మికులున్న ఫ్యాక్టరీలు, సంస్ధలకు ఇలాంటి వెసులుబాటు ఇస్తే నరేంద్రమోడీ గారు ఆ సంఖ్యను 40కి పెంచారు.


మన కార్మికుల శ్రమ శక్తిని దోపిడీ చేసేందుకు స్వదేశీ-విదేశీ కంపెనీలకు విచ్చల విడి అధికారాలను ఇచ్చేందుకు పూనుకున్నారు. మన దేశం మీద విదేశాలకు ఆసక్తి ఏమిటి, ఎందుకు ? ఉదాహరణకు జర్మనీలో గంటకు సగటున 35యూరోలు ఉన్నది. అంటే 41.5డాలర్లు. అందువలన మన దేశంలో గంటకు రెండు డాలర్లు ( రు.150 ) ఇచ్చినా ఇబ్బంది లేదన్నది విదేశీ పెట్టుబడిదార్ల లెక్క. రోబోలను వినియోగించినా గంటకు నాలుగు డాలర్లు అవుతుందని అందువలన రోబోల మాదిరి పని చేసే భారతీయ కార్మికులను వినియోగించుకోవటమే లాభం అని లెక్కలు వేసుకుంటున్నారు. అందుకు అవసరమైన నైపుణ్యం కలిగిన వారు కావాలి గనుకనే, పెద్ద సంఖ్యలో గతంలో పాలిటెక్నిక్‌లను ప్రోత్సహిస్తే తరువాత తామర తంపరగా ఇంజనీరింగ్‌ కాలేజీలను ఏర్పాటు చేయించిన విషయం తెలిసిందే. నైపుణ్య అభివృద్ధి పేరుతో కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించటం కూడా దీనిలో భాగమే.


జర్మనీలో నాజీలు ప్రపంచ యుద్దంలో జర్మనీ పొందిన పరాజయాన్ని పరాభవంగా చిత్రించి జనాల్లో జాతీయ ఉన్మాద భావనలను రెచ్చగొట్టారు. తిరిగి పూర్వ ప్రాభవాన్ని నెలకొల్పాలనే మనోభావాన్ని చొప్పించారు. మన దేశంలో అదే పద్దతుల్లో పన్నెండు వందల సంవత్సరాలుగా హిందువులు బాధితులు అనే ప్రచారాన్ని సంఘపరివార్‌ సంస్దలు నిరంతరం ప్రచారం చేస్తున్నాయి. పూర్వ వైభవాన్ని పునరుద్దరించాలని దానికి హిందూత్వ అని పేరు పెట్టారు. దాన్ని అంగీకరించని వారు దేశం వదలి పోవాలని హెచ్చరిస్తుంటారు. చరిత్రకు మతం రంగు పులుముతున్నారు. దేశంలో పాలన మత ప్రాతిపదికనే జరిగినట్లయితే మెజారిటీ ముస్లింలు ఉన్న కాశ్మీరులో రాజు హిందువు ఎలా అయ్యాడు ? మెజారిటీ జనం హిందువులుగా ఉన్న హైదరాబాద్‌, మైసూరు, జునాగఢ్‌ వంటి సంస్దానాలలో ముస్లింలు పాలకులుగా వందల సంవత్సరాలు ఎలా ఉన్నారు ?


మన దేశంలో కోట్లాది కుటుంబాలకు కనీస సౌకర్యాలు లేవు గానీ ప్రస్తుతం ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరికైనా స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులో ఉన్నాయని చెప్పవచ్చు. వాట్సాప్‌ గురించి వేరే చెప్పనవసరం లేదు. దీన్ని గరిష్టంగా ఉపయోగించుకుంటున్న బిజెపి కుహనా వార్తలను ప్రచారం చేసేందుకు పెద్ద యంత్రాంగాన్నే ఏర్పాటు చేసుకుంది. వాట్సాప్‌లో వచ్చిన వాటిని నమ్మకూడదని ఒక వైపు అనుకుంటూనే పదే పదే ఆ సమాచారం వస్తుండటంతో తమకు తెలియకుండానే నమ్ముతూ బుర్రను ఉపయోగించని విద్యావంతులైన వారెందరో ఉన్నారు. వాట్సాప్‌కు భారత్‌ను అతిపెద్ద మార్కెట్‌గా మార్చిన వినియోగదారులయ్యారు.


బిజెపి, దాని విధానాలను విమర్శించే జర్నలిస్టులను ప్రెస్టిట్యూట్స్‌(పత్రికా వ్యభిచారులు), ముజాహిదిన్స్‌, రెడ్‌ తాలిబాన్స్‌ ఇలా అనేక పదాలతో అవమానిస్తున్నారు. బెదిరిస్తున్నారు, లొంగని గౌరీలంకేష్‌ వంటి వారిని హతమార్చుతున్నారు. మీడియాను నియంత్రించే కార్పొరేట్లు సహజంగానే తమ ప్రయోజనాల కోసం మీడియాను పాకేజ్‌లకు, ప్రలోభాలకు అప్పగించే శారు.
ఫాసిస్టు, నాజీజాన్ని పెంచి పోషించిన శక్తులు తమ లక్ష్యాలను సాధించుకొనేందుకు ప్రయివేటు దళాలను ఏర్పాటు చేసుకున్నాయి, కొన్ని సందర్భాలలో ప్రత్యర్ధులను హతమార్చేందుకు కిరాయిహంతకులను కూడా వినియోగించుకున్నాయి. మన దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన అనేక సంస్ధలు విశ ్వహిందూపరిషత్‌, భజరంగ్‌దళ్‌ వంటివి అలాంటివే. గౌరీ లంకేష్‌, కులుబుర్గి, నరేంద్ర దబోల్కర్‌ వంటి వారిని కాషాయ భావజాలంతో ఉన్మాదులైన వారు లేదా వారు ఉపయోగించిన కిరాయి హంతకులు హతమార్చారు. గోరక్షకులు, హిందూత్వ పరిరక్షకుల పేరుతో ఎవరికి వారే దళాలుగా ఏర్పడటం ప్రత్యర్ధులు లేదా మైనారిటీ మతాలకు చెందిన వారిని హత్యలు చేయటాన్ని చూశాము.


మన దేశంలో ఫాసిస్టు శక్తులు అధికారంలో ఉన్నాయని చెప్పేవారు కొందరున్నారు. కాదు ఫాసిస్టు తరహా ధోరణులు నానాటికీ ప్రబలుతున్నాయనే వారు మరికొందరు. లేదు లేదు అసలైన ప్రజాస్వామ్యం ఇదే అని నమ్మబలుకుతున్నవారు ఎందరో ఉన్నారు. నువ్వేమిటో తెలుసు కోవాలంటే నీ గురించి ఆలోచించుకో అని సుప్రస్దిద్ద గ్రీకు తత్వవేత్త సోక్రటీస్‌ చెప్పాడు. అందువలన ఎవరేమి చెప్పినా, రాసినా, దృశ్యరూపంలో ప్రదర్శించినా ముందు వాటిని ‘సహనంతో ‘ వ్యక్తపరచనివ్వాలి, వినాలి, చదవాలి, చూడాలి. అలాంటి పరిస్ధితి దేశంలో ఉందా లేదా అని ప్రతి ఒక్కరూ మెదడుకు పదును పెట్టాలి. ఈ నేపధ్యంలో వ్యక్తం చేసిన కొన్ని అభిప్రాయాలను, దేశంలో వ్యక్తమౌతున్న కొన్ని ధోరణుల తీరు తెన్నులను చూశారు. ప్రపంచ వ్యాపితంగా ద్రవ్య పెట్టుబడి-నయా ఉదారవాదం- మితవాదం జమిలిగా ముందుకు వస్తున్నాయి. మన దేశంలో వాటికి మతోన్మాదం కూడా తోడైంది. కనుక పరిణామాలు, పర్యసానాలు ఎలా ఉంటాయి అన్నది ఎప్పటికప్పుడు జాగరూకులై ఉండాల్సిందే ! ముందే చెప్పుకున్నట్లు తద్దినం మాదిరి ఒక్క స్వాతంత్య్ర దినం రోజునే కాదు, నిరంతరం ప్రతి ఒక్కరూ ఆలోచించినపుడే స్వాతంత్య్రం నిలుస్తుంది. ( తొలి భాగం – 74 ఏండ్ల స్వాతంత్య్రం – 1: మేకిన్‌ ఇండియాకు పాతర -మేక్‌ ఫర్‌ వరల్డ్‌ జాతర ! )

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమరావతి మూడు ముక్కలాట మరో మలుపు ?

01 Saturday Aug 2020

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Aandhra Pradesh three Capitals, BJP, CHANDRABABU, Ycp, YS jagan


ఎం కోటేశ్వరరావు
మొండి వాడు రాజుకంటే బలవంతుడు అన్నది బాగా ప్రాచుర్యంలో ఉన్న సామెత. ఏకంగా రాజే మొండి అయితే ….గతంలో అలాంటి చరిత్ర మనకు తెలియదు, మన పెద్దలూ చెప్పలేదు. ఇప్పుడు రాజరికం లేదు గానీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి గురించి అలాంటి అభిప్రాయం అయితే ఉంది. ఆయన ఏమి చేసినా ప్రత్యర్ధులు దాన్ని వేరే విధంగా చూస్తే మద్దతుదారులు సానుకూలంగా చూస్తూ మురిసిపోతున్నారు.
మూడు రాజధానుల ఏర్పాటుకు రూపొందించిన బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేయటంతో ఇతర ప్రాంతాల్లోని జగన్‌ మద్దతుదారులు ఫెళ్లున నవ్వారు. గవర్నర్‌ మీద దింపుడు కల్లం ఆశలు పెట్టుకున్నవారు, బిజెపి-జనసేన, తెలుగుదేశం పార్టీ నేతల మీద భ్రమలు పెంచుకున్నవారు గొల్లుమంటున్నారు. ఇంత ద్రోహమా అని గుండెలు బాదుకుంటున్నారు. ఇల్లు అలకగానే పండగ కాదు అన్నట్లుగా ఈ బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్రవేయగానే అంతా అయిపోలేదు కోర్టులు ఉన్నాయి అనే వారు కూడా ఉన్నారు. ఊహించినట్లుగానే గవర్నర్‌ చర్య మీద రాజధాని గ్రామాల్లో ఆగ్రహం వ్యక్తమైనా మిగతా చోట్ల లోలోపల ఉడికి పోయినా, గ్రామాల్లో, పట్టణాల్లో కరోనా పెద్ద ఎత్తున వ్యాపిస్తున్న కారణంగా పెద్ద స్పందన వెల్లడి కాలేదు. అమరావతి కారణంగా తమ ఆస్ధుల విలువ పెరిగిందని సంతోషించిన వైసిపి మద్దతుదారులు తక్కువేమీ కాదు. రాజధాని, పరిసర ప్రాంతాల్లో గెలిచిన ఎంఎల్‌ఏలందరూ ఆ పార్టీకి చెందిన వారే. ఇప్పుడు సచివాలయం తరలింపు గురించి పైకి బింకంగా ఏమి మాట్లాడినా తమ ఆస్ధుల విలువ కూడా హరించుకుపోతున్నపుడు వైసిపి మద్దతుదారుల్లో అంతర్గతంగా సంతోషం ఏమీ ఉండదు. తమ నేతకు చెప్పలేకపోయినా గవర్నర్‌ అడ్డుకుంటే బాగుండు అని కోరుకున్న వారు లేకపోలేదు.
సుప్రీం కోర్టు, రాష్ట్రపతి ఆమోదంతో హైకోర్టు ఏర్పడింది కనుక, ఆ వ్యవస్ధల పాత ఆమోదాన్ని చెత్తబుట్టలో వేసి కొత్త ప్రతిపాదన చేస్తే దానికి కూడా ఆమోదం పొందవచ్చని కొందరు న్యాయవాదులు చెబుతున్నారు. ఇలాంటి సలహాలను నమ్మే జగన్‌ సర్కార్‌ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విషయంలో చేతులు కాల్చుకుంది అని గమనించాలి. లేదూ హైకోర్టు మార్పు విషయంలో హక్కుల అంశం లేదు కనుక ఎవరైనా కోర్టులకు ఎక్కినా విధాన పర నిర్ణయంగా భావించి కోర్టులు అభ్యంతర పెట్టవు అన్నది ఒక అభిప్రాయం. హైకోర్టును కర్నూలులో పెట్టాలని బిజెపి కూడా కోరుతున్నది, దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర అవసరం అయితే కేంద్ర అధికారంలో ఉన్న తాము దాని సంగతి చూసుకుంటామని, సాయం చేస్తామని బిజెపి నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రపతి అంటే రబ్బరు స్టాంపు గనుక ఎక్కడ ముద్రవేయమంటే అక్కడ వేస్తారు అని చెప్పేవారూ ఉన్నారు. తనకు లాభం అని బిజెపి భావించినా- వైసిపితో తెరవెనుక ముడి గట్టిగా పడినా అది కూడా జరిగినా ఆశ్చర్యం లేదు. పాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయంతో సహా కార్యాలయాల తరలింపును కోర్టులు అడ్డుకోలేవు.
ముందు అమరావతి నుంచి సచివాలయాన్ని తరలించి తమ పంతం నెగ్గించుకోవాలన్నది వైసిపి పట్టుదల కనుక దాని కోసం బిజెపితో ఎలాంటి రాజీకైనా అంగీకరించే అవకాశం ఉంది. ఒక వేళ హైకోర్టు తరలింపులో అనుకోని అవాంతరాలు ఎదురై ఆగిపోయినా వైసిపికి పోయేదేమీ లేదు. ఆ సాకును చూపి న్యాయ రాజధానిని సీమలో ఏర్పాటు చేయలేక పోయామని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే రాజధాని ప్రాంత రైతుల్లో భూ సమీకరణ దగ్గర నుంచి అధికారంలో ఉన్నంత కాలం అది కల్పించిన ఆశలు, భ్రమలు, మునగచెట్టు ఎక్కించిన తీరు ఒకటైతే, జగన్‌ అధికారంలోకి వచ్చి అమరావతికి మంగళం పాడటానికి నిర్ణయించుకున్న తరువాత కూడా కేంద్రంలో తమకు ఉన్న పలుకుబడితో చక్రం అడ్డువేస్తామని తెలుగుదేశం నమ్మించింది. రైతులు కూడా నమ్మారు. ఇప్పుడు చంద్రబాబు నిజంగానే భావోద్వేగానికి గురైనా అదంతా నటన అనుకొనే వారే ఎక్కువగా ఉంటారు. ఎవరైనా ఒకసారి విశ్వసనీయత కోల్పోతే నిజం చెప్పినా నమ్మరు !
బిజెపి విషయానికి వస్తే అది నమ్మించి మోసం చేసిన తీరును జనం మరచిపోరు. అందువలన కన్నా లక్ష్మీనారాయణ అనే బొమ్మను పక్కన పెట్టి సోము వీర్రాజు అనే మరో బొమ్మను జనం ముందు పెట్టినా దానికి ఉన్నది పోయేదేమీ లేదు కొత్తగా వచ్చేదేమీ కనిపించటం లేదు. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పరిస్ధితి ఏమిటో అర్దం కాకుండా ఉంది. నటుడు కనుక తిరిగి సినిమాల్లోకి పూర్తిగా వెళ్లవచ్చు, లేదా కాల్షీట్లు తీసుకొని బిజెపి రాజకీయ సినిమాలో పాత్రపోషించవచ్చు, నమ్ముకున్న కార్యకర్తలేమౌతారు ?
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌-బిజెపి రెండూ తమ వంతు పాత్రలను ఎలా పోషించాయో పదే పదే చెప్పుకోవనవసరం లేదు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది. బిజెపి నాటకాలు ఇంకా ఆడుతూనే ఉంది. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర పాత్ర ఉండదని, 2015 నోటిఫికేషన్‌ ప్రకారం రాజధాని అమరావతే అని, మూడు రాజధానుల విషయం పత్రికల్లో మాత్రమే చూస్తున్నామని కేంద్ర ప్రభుత్వం గతంలో పార్లమెంటులో ప్రకటించింది. వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటుకు అవసరమైన బిల్లులను రూపొందించటం, వాటిని గవర్నర్‌ ఆమోదించటంతో చట్టాలు కావటం తెలిసిందే. ఇప్పుడు గతంలో మాదిరి చెబితే కుదరదు. తన వైఖరి ఏమిటో చెప్పకతప్పదు.
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని విషయమై శివరామకృష్ణన్‌ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రమే. రాజధాని ఖరారు అయ్యేంత వరకు పదేండ్ల పాటు హైదరాబాదులో రాజధాని కొనసాగవచ్చనే అవకాశం ఇచ్చిందీ కేంద్రమే. శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులపై తెలుగుదేశం-బిజెపి సంకీర్ణ రాష్ట్ర ప్రభుత్వం నారాయణ కమిటీని వేసి అది చేసిన సిఫార్సుల ప్రకారం రాజధానిని ప్రతిపాదించింది. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రకారం అమరావతిని ఖరారు చేయటాన్ని కేంద్రం అంగీకరించింది. తాము నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక స్ఫూర్తి లేదా సిఫార్సులకు అనుగుణ్యంగా అమరావతి ఎంపిక లేదని కేంద్రం నాడు ఎలాంటి వివరణా కోరలేదు, అభ్యంతరమూ వ్యక్తం చేయలేదు. అక్కడ సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు నిధులు కూడా మంజూరు చేసి విడుదల చేసింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వయంగా వచ్చి రాజధానికి శంకుస్ధాపన చేశారు. చంద్రబాబు రమ్మంటే వచ్చి రాయి వేసి వెళ్లారు తప్ప దానితో బిజెకి సంబంధం లేదని ఇప్పుడు ఆ పార్టీ వారు చెబుతున్నారు. రేపు మరి విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని శంకుస్ధాపనలకు కూడా పిలిస్తే వస్తారా ? వైసిపి ప్రభుత్వం అసలు పిలుస్తుందా ? ఏం జరుగుతుందో ఎలా కథ నడిపిస్తారో చూడాలి. ఈ మూడు రాజధానుల గురించి కేంద్రానికి రాష్ట్రం ఏ రూపంలో నివేదిస్తుందో కూడా ఆసక్తి కలిగించే అంశమే.
రాజధాని ఏర్పాటులో కేంద్రం జోక్యం చేసుకోదని బిజెపి కొత్త నేత సోము వీర్రాజు చెప్పారు. దీనిలో కొత్తదనం ఏముంది. గతం నుంచీ చెబుతున్నదే. బిజెపి నేతలు పార్టీగా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నాం తప్ప కేంద్ర ప్రభుత్వ పరంగా జోక్యం చేసుకొనే అవకాశం లేదని చెబుతున్నారు, దీనిలో అవకాశవాదం తప్ప పెద్ద తెలివితేటలేమీ లేవు. ఇప్పుడు మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్రవేయటాన్ని కూడా సమర్ధిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నియామకం విషయంలో గవర్నర్‌ తీసుకున్న చర్య సరైనది అయినపుడు రాజధానుల బిల్లుల విషయంలో గవర్నర్‌ చర్య తప్పిదం ఎలా అవుతుందని చెట్టుకింది ప్లీడర్‌ వాదనలు చేస్తున్నారు. మేము గవర్నర్ల వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని పత్తిత్తు కబుర్లు చెబుతున్నారు.
ఎన్నికల కమిషనర్‌ నియామకం గవర్నర్‌ చేయాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెచ్చింది, కొత్త కమిషనర్‌ పదవీకాలం గురించి తెచ్చిన ఆర్డినెన్స్‌, కొత్త కమిషనర్‌ నియామకం తప్పని హైకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు దాని మీద ఎలాంటి స్టే ఇవ్వలేదు కనుక తన పదవి గురించి రమేష్‌ కుమార్‌ తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్‌ను కలవండన్న కోర్టు సూచన మేరకే కలిశారు. కానీ మూడు రాజధానుల బిల్లుల విషయం వేరు. వాటిని ఆమోదించవద్దని గవర్నర్‌కు లేఖ రాసిన పార్టీలలో బిజెపి కూడా ఉందని వారు మరచిపోతే ఎలా ? గవర్నర్‌ వ్యవస్ధలో జోక్యం చేసుకోము అని చెబుతున్నవారు లేఖ ఎందుకు రాసినట్లు ? లేఖ రాసినందుకే కన్నా లక్ష్మీ నారాయణను పదవి నుంచి తప్పించారా ? పోనీ లేఖ రాయటం తప్పని కొత్త అధ్యక్షుడు పశ్చాత్తాపం ఏమైనా ప్రకటిస్తారా ?
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను శాసనమండలి ఆమోదించలేదు, సెలెక్టు కమిటీకి నివేదిస్తున్నట్లు మండలి అధ్యక్షుడు ప్రకటించారు.సిఆర్‌డిఏ రద్దు బిల్లు, రాజధానికి సంబంధించి ఇతర అంశాల గురించి కోర్టులలో కొన్ని కేసులు దాఖలై ఉన్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ద చర్యలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్న వారు రాజ్యాంగ ప్రతినిధి గవర్నర్‌ గనుక వాటిని ఆమోదించవద్దని లేదా న్యాయసలహాలు తీసుకోవాలని బిజెపితో పాటు ఇతర పార్టీలు కోరాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు. కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా లేదా ఆయన కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చిన తరువాతే గవర్నర్‌ ఈ చర్య తీసుకున్నారనే విమర్శలు వున్నాయి.వాటికి సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు లేదా లేదని నిరాకరిస్తున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా మూడు రాజధానుల గురించి బిజెపిలో ఏకాభిప్రాయం లేదు. ఈ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్న లేదా ప్రకటనలు చేస్తున్న వారిని ఆ పార్టీ ఇంతవరకు కట్టడి చేయలేకపోయింది.
ఇక హైకోర్టు గురించి గతంలో చేసిన వాదనలనే బిజెపి నేతలు చేస్తున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక ముందే ప్రావిన్సులలో హైకోర్టులు ఉన్నాయి. రాష్ట్ర రాజధానిలోనే హైకోర్టు ఉండాలన్న అంశం రాజ్యాంగంలో స్పష్టంగా లేదు. అందువలన రాష్ట్రాల ఏర్పాటు, సంస్దానాల విలీనాల సమయంలో జరిగిన ఒప్పందాల ప్రకారం రాజధాని ఒక చోట హైకోర్టు ఒక చోట ఏర్పాటు చేశారు. తిరువాన్కూరు-కొచ్చిన్‌ సంస్ధానాల విలీనం సమయంలో రాజధాని తిరువనంతపురం, హైకోర్టు కొచ్చిన్‌లో ఉండాలన్నది ఒప్పందం. అలాగే మద్రాసు ప్రావిన్సు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు రాజధాని కర్నూల్లో, హైకోర్టు గుంటూరులో ఉండాలన్నది పెద్ద మనుషుల ఒప్పందం. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినపుడు ఈ సమస్యకు బదులు ఇతరంగా ముల్కీ వంటి ఒప్పందాలు జరిగాయి. రాజధానిని విజయవాడలో పెట్టాలని కొందరు కోరినా హైకోర్టుతో సహా చివరకు హైదరాబాద్‌ను ఖరారు చేశారు. రాజధానులలో కాకుండా ఇతర చోట్ల హైకోర్టులు ఉన్న ప్రాంతాలన్నింటికీ ఇలాంటి ఏదో ఒక నేపధ్యం ఉన్నది. తరువాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలలో ఉత్తరాఖండ్‌లో హైకోర్టు నైనిటాల్‌ నగరంలో ఉంది. రాజధాని చలికాలంలో డెహ్రాడూన్‌లో, వేసవి కాలంలో దానికి 250కిలోమీటర్ల దూరంలోని గైరాసియన్‌ పట్టణంలో ఉంటుంది. ఇవేవీ వివాదం కాలేదు, ఒక సారి ఖరారు అయిన తరువాత మార్పులు జరగలేదు. ఆంధ్రప్రదేశ్‌లోనే ఖరారైన రాజధాని విషయంలో రాజకీయం మొదలైంది.
న్యాయమూర్తుల నియామకం, హైకోర్టు బెంచ్‌ల ఏర్పాటు వంటివి సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వ వ్యవహారం కనుక హైకోర్టు తరలింపు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవాల్సింది సుప్రీం కోర్టు, కేంద్రమే. సచివాలయాన్ని తరలిస్తే కేంద్రం చేయగలిగిందేమీ లేదు. కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు లేదా తీరుస్తారు అన్నట్లుగా హైకోర్టు తరలింపును సుప్రీం కోర్టు ఆమోదించకపోతే, అది జరగకుండా కేవలం సచివాలయాన్నే తరలిస్తే జగన్‌ సర్కార్‌ రాజకీయంగా చిక్కుల్లో పడుతుంది. దాన్ని సొమ్ము చేసుకొనేందుకు బిజెపి రంగంలోకి దిగవచ్చు. అనేక రాష్ట్రాలు హైకోర్టు బెంచ్‌లను ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రాన్ని ఇప్పటికే అనేక సార్లు కోరి ఉన్నాయి. వాటిలో దేనినీ కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు తరలింపుకు ఆమోదం తెలిపితే కొత్త సమస్యలకు తెరలేపినట్లవుతుంది.
ఇక 2015లో వెలువరించిన గజెట్‌ నోటిఫికేషన్‌ లేదా రాజధానిగా అమరావతి ఉత్తర్వు మార్చటానికి వీలు లేని శిలాశాసనమో, చంద్రబాబు చెక్కిన శిలాఫలకమో కాదని, కొత్త ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా మరొకదానిని జారీ చేయవచ్చని బిజెపి నేత జివిఎల్‌ నరసింహారావు గతంలోనే చెప్పారు. 2015లో అప్పటి ప్రభుత్వం జీవో ద్వారా నోటిఫై చేసింది కనుక ప్రస్తుతానికి అమరావతే రాజధాని అని లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో కేంద్రం పేర్కొందని ప్రస్తుత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకొని భవిష్యత్తులో రాజధానిని మరోచోటుకి మార్చి, ఆ విషయాన్ని తెలియజేస్తే కేంద్రం గుర్తిస్తుందని కూడా నరసింహారావు చెప్పారు. అదే ముక్క పార్లమెంటు సమాధానంలో బిజెపి సర్కార్‌ ఎందుకు చెప్పలేదు అని అడిగినవారు లేకపోలేదు.
ఏదీ శిలాఫలకం, శాసనం కానపుడు, మార్చుకోవటానికి అవకాశం ఉన్నపుడు స్వయంగా బిజెపి నేతలు కోరిన పదేండ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హౌదాకు విధానాలను మార్చటానికి, ఉత్తర్వులు జారీ చేసేందుకు కేంద్రానికి ఉన్న అడ్డంకి, అభ్యంతరం ఏమిటి? ఎందుకు హౌదా ఇవ్వరు. పోనీ ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు తీసుకున్న ఇతర చర్యలేమైనా ఉన్నాయా అంటే లేవు.
చంద్రబాబు నాయుడు అమరావతిని ఒక భ్రమరావతిగా చూపుతూ సింగపూర్‌, కౌలాలంపూర్‌, మరొకటో మరొక దాని పేరో చెప్పి రైతులకు, జనాలకు భ్రమలు కల్పించారు. రాజధాని తరలింపు జరిగితే రైతులకు ఎలా న్యాయం చేస్తారనే ప్రశ్న ముందుకు వచ్చింది. రాజధాని తమ ప్రాంతంలో పెడతామని చెప్పారు గనుకనే మేము భూములను ఇచ్చామని, ఇప్పుడు రాజధాని తరలిపోయి, తాము ఇచ్చిన భూములు దేనికీ పనికి రాకుండా పోతే తామేమి కావాలని వారు అడుగుతున్నారు. దానిలో తప్పు లేదు. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. వారు ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకొని భూములు ఇచ్చారు. దానికి ప్రతిఫలంగా కొన్ని సంవత్సరాల పాటు కౌలు చెల్లింపు, వారు ఇచ్చిన భూమి విస్తీర్ణాన్ని బట్టి అభివృద్ధి చేసిన రాజధాని ప్రాంతంలో కొంత స్ధలాన్ని వారికి అందచేయాల్సి ఉంది. చట్టపరంగా ప్రభుత్వం ఆ పని చేయకపోతే కోర్టులకు వెళ్లి దాన్ని సాధించుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఇక్కడ సమస్య అది కాదు. రాజధాని ఏర్పడితే ఆ ప్రాంతంలో తమ వాటాగా వచ్చిన స్ధలాలకు మంచి రేట్లు వస్తాయని, అవి మొత్తం భూముల విలువ కంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉంటాయని ఆశించారు. ప్రభుత్వం అభివృద్ధి చేసిన ప్లాట్లు అంటే రోడ్లు, డ్రైనేజి వంటి మౌలిక సదుపాయాలు కల్పించి అందచేయటం. అలా ఇచ్చినా తాము ఆశించిన మేరకు ధరలు రావన్నది రైతుల అసలు ఆందోళన. దీనికి తోడు పేదలకు ఇండ్ల స్ధలాలు ఇచ్చే పేరుతో ఇతర ప్రాంతాల వారికి ఇక్కడ స్ధలాలు కేటాయిస్తే తమ భూములకు డిమాండ్‌ పడిపోతుందని, ఇలాంటి ఎన్నో అనుమానాలు ఆ ప్రాంత వాసుల్లో ఉన్నాయి.
ఇప్పటికీ బిజెపి నేతలు రాజధాని ప్రాంత రైతులకు న్యాయం చేస్తామని, చేయాలనే తాము కోరుతున్నట్లు చెబుతుంటారు. మరోవైపు మూడు రాజధానుల విషయంలో తాము చేయగలిగిందేమీ లేదంటారు. వారితో కలసిన లేదా గత ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నందున వారిని కలుపుకు ఉద్యమిస్తానని ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌ ఏమి చేస్తారో, ఏమి చెబుతారో చూద్దాం. వైసిపి నాయకులు కూడా రాజధాని రైతులకు న్యాయం చేస్తామనే చెబుతున్నారు. వారి ఆచరణ ఏమిటో చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వామపక్ష శక్తుల నిర్మూలనకు అమెరికా పెట్టిన పేరే ” జకర్తా పద్దతి ” !

17 Wednesday Jun 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

annihilation of communists Jakarta Method, Indonesian Communist Party (PKI)., Jakarta Method, US anti communism


జోర్డాన్‌ రాజధాని అమ్మాన్‌ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న మీడియా సంస్ద అల్‌ బవాబా డాట్‌ కామ్‌ లండన్‌ ప్రతినిధి నికోలస్‌ ప్రిట్‌చర్డ్‌ ఇటీవల అమెరికన్‌ జర్నలిస్టు విన్సెంట్‌ బెవిన్స్‌తో ఇంటర్వ్యూ చేశాడు. ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టు , వామపక్ష శక్తుల నిర్మూలనకు అమెరికా, దాని అండతో వివిధ దేశాలు అనుసరించిన దుర్మార్గ పద్దతుల గురించి వర్తమాన తరాలకు ఆసక్తి కలగించే అంశాలను వెల్లడించారు.1960దశకంలో ఇండోనేషియాలో నియంత సుహార్తో అమెరికన్ల అండతో దాదాపు పదిలక్షల మంది కమ్యూనిస్టులు లేదా కమ్యూనిస్టులని అనుమానించిన వారిని ఎలా చంపివేశారో విన్సెంట్‌ బెవిన్స్‌ అధ్యయనం చేశాడు. ఇండోనేషియాలో పరిమితంగానే బయలు పరచిన నాటి రహస్య పత్రాలను పరిశీలించాడు. అంతకు ముందు తరువాత అనేక దేశాలలో జకర్తా పద్దతి పేరుతో అమలు జరిపిన మారణకాండ గురించి ఈ క్లుప్త ఇంటర్వ్యూలో వివరించాడు.(జకర్తా మెథడ్‌ : వాషింగ్టన్స్‌ యాంటీ కమ్యూనిస్టు క్రూసేడ్‌ అండ్‌ ద మాస్‌ మార్డర్‌ ప్రోగ్రామ్‌ దట్‌ షేప్‌డ్‌ అవర్‌ వరల్డ్‌ ” అనే పేరుతో విన్సెంట్‌ బెవిన్స్‌ రాసిన పుస్తకాన్ని మే నెలలో పబ్లిక్‌ ఎఫైర్స్‌ అనే సంస్ధ ప్రచురించింది. ఈ సందర్భంగా చేసిన ఇంటర్వ్యూను జూన్‌ పదకొండున అల్‌ బవాబా ప్రచురించింది.) 2017లో పత్రాలను విడుదల చేసిన సమయంలో వచ్చిన వార్తల ఆధారంగా ఈ అనువాదకుడు రాసిన వ్యాసపు లింక్‌ చివరిలో ఉంది.

నికొలస్‌ ప్రిచర్డ్‌ : జకర్తా పద్దతి అంటే ఏమిటి ?
విన్సెంట్‌ బెవిన్స్‌: వామపక్ష వాదులు లేదా వామపక్ష వాదులని ముద్రవేసిన అమాయక పౌరులను కావాలని సామూహికంగా హతమార్చటమే జకర్తా పద్దతి. ప్రచ్చన్న యుద్ద సమయంలో ఈ ఎత్తుగడను వినియోగించారు. ఇది ముఖ్యమైన మూలమలుపు. అమెరికా మరియు ప్రపంచ వ్యవస్దను రూపొందించాలని చూసిన వారి వైపు నుంచి చూస్తే పెద్ద విజయం, అంతిమంగా విజయం సాధించింది. ఈ విజయం రూఢి అయింది కాబట్టే అమెరికా దాని అనుయాయి దేశాలు ఈ పద్దతిని కాపీ చేయటం ప్రారంభించాయి.1970దశకం ప్రారంభంలో చిలీ, బ్రెజిల్‌లో తమకు ముప్పుగా పరిణమిస్తారు లేదా అనిపించిన అమాయకులను హతమార్చేందుకు ఈ పద్దతిని అనుసరించారు. సామూహిక హత్యలని అర్ధమిచ్చే విధంగా జకర్తా పదాన్ని వినియోగించారు. అయితే ప్రతి దేశం ఆ పదాన్ని వినియోగించలేదు గానీ ఇరవైకి పైగా అమెరికా అనుయాయి దేశాల్లో నిరాయుధులైన వామపక్ష శక్తులను సామూహికంగా హతమార్చటానికి ప్రభుత్వాలు జకర్తా పద్దతి పధకాలను అమలు జరపటాన్ని గమనించాను.

హొనికొలస్‌ ప్రిచర్డ్‌ :వలసల అనంతర స్వాతంత్య్ర దేశాలను పురికొల్పిందేమిటి ?
విన్సెంట్‌ బెవిన్స్‌: ప్రచ్చన్న యుద్ద సందర్భంలో తృతీయ ప్రపంచ దేశాల ఆవిర్భావం జరిగింది. ఇప్పుడు ఈ పదాన్ని తరచూ నీచ అర్ధంలో వాడుతున్నారు. కానీ ఆ సమయంలో అది పూర్తిగా సానుకూల మరియు ఆశావాదంతో ఉండేది. ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో ఈ ఉద్యమ స్ధాపక ప్రముఖులు, దార్శనికులలో ఒకరు.1955లో ఆసియా, ఆఫ్రికా దేశాలను దగ్గరకు చేర్చారు.వాషింగ్టన్‌(అమెరికా)కు ఇది ఒక సమస్యగా మారింది.

నికొలస్‌ ప్రిచర్డ్‌: అనేక తృతీయ ప్రపంచ దేశాలు అమెరికా-సోవియట్‌ యూనియన్‌ మధ్య సమతూకాన్ని పాటించేందుకు ప్రయత్నించాయి. కానీ సుకర్నో అమెరికా శత్రువు అయ్యాడు, అప్పుడు ఏమైంది?
విన్సెంట్‌ బెవిన్స్‌: అంతకు ముందు ఉనికిలో లేని ఒక పెద్ద అగ్రరాజ్యంతో దెబ్బలాడేందుకు ఎలాంటి కారణం లేదు. వలస అనంతర కమ్యూనిస్టులలో కొందరు అమెరికాతో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నించారు.1945లో ఫ్రాన్స్‌ నుంచి స్వాతంత్య్రం ప్రకటించిన సమయంలో వియత్నాం నేత హౌచిమిన్‌ అమెరికా స్వాతంత్య్ర ప్రకటనను ప్రస్తావించారు. సుకర్నో కూడా అమెరికా విమోచన యుద్ద వారసత్వ పరిధిలోనే 1955 సభ నిర్వహించారు.అయితే చివరికి అమెరికా పరిష్కరించాల్సిన సమస్యలు లేదా ఇతర కారణాలతో శత్రువులుగా తేలారు.అది విషాదకర ఫలితాలకు దారి తీసింది.

నికొలస్‌ ప్రిచర్డ్‌: ఇండోనేషియాలో మిలిటరీకి మద్దతుగా అమెరికా నిలిచేందుకు దారి తీసిన కీలక విధాన నిర్ణయాలేమిటి ?
విన్సెంట్‌ బెవిన్స్‌: ప్రచ్చన్న యుద్దం తొలి రోజులలో అమెరికా తీసుకున్న వైఖరి గురించి మాట్లాడుకున్నట్లయితే తటస్ధంగా ఉన్నప్పటికీ ప్రతి తృతీయ ప్రపంచ దేశాన్ని అది వ్యతిరేకించింది. దానికి రెండు విరుద్ద వివరణలు ఉన్నాయి. ఒకటేమి చెబుతుందంటే కమ్యూనిజం, జాతీయ భావనలతో ఉన్న దేశాలతో తమకు ముప్పు అనే తీవ్ర మానసిక వ్యాధికి అమెరికా గురైంది. ప్రపంచంలో దోపిడీ చేస్తున్న దేశాలను కుదురుగా ఉంచాలంటే ప్రపంచ వ్యవస్దలో హింసాత్మక ఆధిపత్యం చలాయించే స్దితిని అమెరికా వారసత్వంగా పొందింది అని రెండో వివరణ చెప్పింది. వందల సంవత్సరాలుగా ఐరోపా దేశాలు చేస్తున్న మాదిరి విధానాలను కొనసాగించేందుకు ఒక సాకుగా కమ్యూనిస్టు వ్యతిరేకత పని చేసింది. నేనయితే ఈ రెండింటి మధ్య వైరుధ్యం ఉందనుకోను. ఒకదానినొకటి పరస్పరం బలపరుచుకుంటాయి.
ఇండోనేషియా విషయానికి వస్తే అమెరికా తీసుకున్న ఈ వైఖరి అత్యంత భయంకర పర్యవసానాలకు దారితీసింది. అంతకు ముందు దశాబ్దకాలంగా ” ఒక సమస్యను ” పరిష్కరించాలని చూస్తున్న అమెరికా చివరి యత్నంగా సామూహిక వధే పరిష్కారం అని నిర్ణయించుకుంది. తొలి యత్నంగా ఎన్నికల్లో ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ విజయాన్ని అడ్డుకుంటుంది అనే ఆశతో 1955లో ఒక మితవాద ముస్లిం పార్టీని స్ధాపించేందుకు సిఐఏ నిధులు ఇవ్వటం ప్రారంభించింది. అది పని చేయలేదు. రెండవ యత్నంగా ఇండోనేషియా దీవులపై బాంబులు వేస్తూ సిఐఏ పైలట్లు దొరికి పోయారు. మూడవ యత్నంగా వాషింగ్టన్‌ తన బలం మొత్తాన్ని ఒక హింసాత్మక పరిష్కారానికి అందించింది.

నికొలస్‌ ప్రిచర్డ్‌: అమెరికా ఏమి చేసింది ?
విన్సెంట్‌ బెవిన్స్‌ : ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ, మితవాద మిలిటరీ మధ్య ఘర్షణలు సృష్టించేందుకు 1964-05లో సిఐఏ, ఎం16 రహస్యంగా పని చేశాయి. వివాదం తలెత్తగానే కమ్యూనిస్టులను అణచివేయటానికి అది సరైన సమయం అని అమెరికా రాయబారి గుర్తించాడు. అది వాస్తవం కాదని తెలిసినా కమ్యూనిస్టులు కుట్రపన్నారంటూ అమెరికా తనశక్తికొద్దీ ప్రచారం చేసింది. ఇండోనేషియా మిలిటరీకి కావాల్సిన వాటన్నింటినీ అందించింది. బ్యాంకాక్‌లో ఉన్న సిఐఏ కేంద్రం నుంచి ఆయుధాలను అందచేసేందుకు అనుమతించింది. సమాచార వ్యవస్ధకు అవసరమైన పరికరాలను అందచేసింది.
హత్యాకాండ ప్రారంభం కాగానే అమెరికా అధికారులు నిరంతరం నివేదికలు తెప్పించుకున్నారు. జరుగుతున్నదాని పట్ల తాము సంతోషంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. మరిన్ని హత్యలను ప్రోత్సహించారు.హత్య చేయాల్సిన వారి జాబితాలను అందచేశారు. ఒక ఉద్యోగి జాబితాల్లోని వారిని అంతం చేశారా లేదా అని సరి చూసేవాడు. అది ఎంత భయంకరంగా ఉండేదో మీరు ఊహించుకోవాల్సిందే. అయితే ఇలా చేయటం ఇదే తొలిసారి కాదు. అంతకు ముందు నుంచీ జరుగుతోందనే ఆధారాలు మనకు ఉన్నాయి.1954లో గౌతమాలాలో, సిఐఏ మద్దతుతో ఇరాక్‌లోని బాత్‌ పార్టీ తిరుగుబాటు సందర్భంగా కమ్యూనిస్టు పార్టీలో, ఇతర వామపక్ష కార్యకర్తల్లో హతమార్చవలసిన వారి జాబితాలను 1963లో అమెరికా అధికారులు అందచేశారు.

నికొలస్‌ ప్రిచర్డ్‌: ఇండోనేషియాలో ఎంత మందిని చంపారు ?
విన్సెంట్‌ బెవిన్స్‌: షుమారు పది లక్షల మంది ఉంటారని నేను చెబుతున్నా. అనేక మంది నిపుణులు ఐదు నుంచి పదిలక్షల మంది ఉన్నారని చెప్పారు. తాజాగా జరిగిన సంచలనాత్మక అధ్యయనం ప్రకారం దాదాపుగా పది లక్షల మంది అని చెప్పారు.ఈ అనిశ్చితికి కారణం లేకపోలేదు.విచారణల్లో సరైన సంఖ్య ఇంతవరకు రాకపోవటానికి ఇప్పటికీ అమెరికా మద్దతు ఉన్న మిలిటరీ ఎంతో పట్టుకలిగి ఉండటమే కారణం. అసలేమి జరిగింది అని తెలుసుకొనే ఆసక్తి ఇండోనేషియా ప్రభుత్వంలో కూడా ఎన్నడూ లేదు.దీనికి తోడు ఏమి జరిగిందో వెలికి తీయాలంటూ ప్రభుత్వం మీద అంతర్జాతీయంగా తగిన వత్తిడి కూడా రాలేదు.

నికొలస్‌ ప్రిచర్డ్‌: హత్యల మీద అమెరికాలో స్పందన ఏమిటి ?
విన్సెంట్‌ బెవిన్స్‌ : ఉల్లాసం. విధాన నిర్ణేతలు, మరియు జర్నలిస్టులు స్వీకరించిన తీరు అమెరికాలో ఎంతో ఉల్లాసంగా ఉంది. బాబీ కెన్నడీ మాత్రమే ప్రముఖుల్లో వ్యతిరేకంగా గళం విప్పారు. సంతోషం, సంబరాల సముద్రంలో అది గులకరాయి విసిరినట్లుగా ఉంది. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో ఒక ప్రముఖ ఉదారవాది ఆసియాలో మిణుగురు వెలుగు పేరుతో రాసిన దాన్ని నేను నా రచనలో ఉటంకించాను. అత్యంత అనారోగ్య పద్దతిలో వారికి సరైనదే. వారికి అది విజయం. భౌగోళిక రాజనీతి ప్రాధాన్యతల ప్రకారం 1960దశకంలో వియత్నాం కంటే వారికి ఇండోనేషియా ముఖ్యం. పశ్చిమదేశాల ప్రవాహంలో ఇండోనేషియా పడితే వియత్నాంను నిలువరించటం ప్రాధాన్యత సంతరించుకుంటుందని రాబర్డ్‌ మెక్‌నమారా తన జ్ఞాపకాల్లో రాశాడు. ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ పతనం వియత్నాంలో అమెరికాకు ముప్పును ఎంతగానో తగ్గించింది, ఇప్పుడు ఇంకా కొన్ని పాచికలు మాత్రమే ఉన్నాయి అవి సులభంగానే పడిపోయేట్లు కనిపిస్తున్నాయి అని కూడా మెక్‌నమారా రాశాడు. సోవియట్‌ యూనియన్‌ ఊచకోతను ఆపేందుకు ప్రయత్నించలేదు లేదా వాస్తవానికి ఖండించలేదు. మౌలికంగా చూస్తే నిరాయుధ ఇండోనేషియన్‌ కమ్యూనిస్టు పార్టీని అంతం చేయటాన్ని అంతర్జాతీయ సమాజం పట్టించుకోలేదు.

హొనికొలస్‌ ప్రిచర్డ్‌: జకర్తా పద్దతిని ఇరాక్‌లో ఎలా ఉపయోగించారు ?
విన్సెంట్‌ బెవిన్స్‌ : జవహర్‌లాల్‌ నెహ్రూ, గమాల్‌ అబ్దుల్‌ నాజర్‌, సుకర్ణో వంటి వారి నాయకత్వాన తృతీయ ప్రపంచం ఒక్కటైనపుడు ఆఫ్రో-అసియన్‌ ప్రపంచంలో ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ(అధికారంలో లేని పార్టీలలో) మొదటి స్ధానంలో, ఇరాక్‌ పార్టీ రెండవ, సూడాన్‌ పార్టీ మూడవ స్ధానంలో ఉన్నాయి. ఈ మూడింటిని దాదాపుగా తుడిచిపెట్టారు.
1963లో బాత్‌ పార్టీ తిరుగుబాటు చేసింది, కమ్యూనిస్టు పార్టీ, ఇతర వామపక్ష శక్తులను అంతం చేసింది. నేను ఒక ప్రముఖ ఇరాకీ జర్నలిస్టును ఇంటర్వ్యూ చేశాను. ఇరాకీ వామపక్ష శక్తులను నిర్దాక్షిణ్యంగా అణచివేసిన సమయంలో అత్యంత దుర్మార్గంగా వ్యవహరించిన వారిలో ఒకడిగా సద్దామ్‌ హుసేన్‌ పేరు మోశాడు. ఎవరెవరిని అంతం చేయాలో సూచిస్తూ బాత్‌ పార్టీకి అమెరికా అధికారులు జాబితాలను అందచేశారు. తరువాత ఇండోనేషియాలో అదే పద్దతిని అమలు జరిపారు.

నికొలస్‌ ప్రిచర్డ్‌: ఈ ఉదంతాలలో విదేశాల్లో అమెరికా చేసిన దానికీ, స్వంత గడ్డమీద తలెత్తే ఘర్షణల పట్ల స్పందించటానికి ఏదైనా సంబంధం ఉందా ?
విన్సెంట్‌ బెవిన్స్‌ : ప్రపంచంలో తిరుగుబాట్లను అణచివేసేందుకు అనుసరించిన పద్దతులు, తన స్వంత పౌరుల పట్ల అనుసరించిన విధానాల గురించి ఎంతో ఆసక్తికరమైన పరిశోధనలు ఉన్నాయి. స్టువర్డ్‌ ష్క్రాడర్‌ రాసిన బాడ్జెస్‌ వితౌట్‌ బోర్డర్స్‌ అనే పుస్తకం ఉంది. విదేశాల్లో తిరుగుబాట్లను అణచివేసే అర్ధ సామ్రాజ్యవాద పోలీసుగా పనిచేసిన అమెరికా తన స్వంత జనంపైనే యుద్ధం చేసేదిగా ఎలా పరిణమించిందో దానిలో వెల్లడించారు.అమెరికా సెటిలర్‌ వలసవాదం, జాత్యహంకార నేపధ్యంలో తృతీయ ప్రపంచ దేశాలలో అమెరికా జోక్యాన్ని చూడాల్సి ఉంది. అది ఆఫ్రికా, అసియాల్లో అత్యాచారాలకు పాల్పడిన పూర్తి జాత్యహంకార ప్రభుత్వంగానే వ్యవహరించింది. అంతేకాదు ప్రపంచ కమ్యూనిస్టు వ్యతిరేక విధానాలు మరియు తిరుగుబాట్ల అణచివేత యుద్ధ చరిత్ర పరిధిలో వర్తమాన అమెరికా పోలీసు వ్యవస్ధ ఎలా పని చేస్తున్నదో చూడాల్సి ఉంది. ప్రపంచ మంతటా అదే పద్దతుల్లో వ్యవహరించిందో తన స్వంత గడ్డమీద కూడా అదే విధంగా ఉంది.
https://vedikaa.com/2017/10/19/us-hand-in-1960s-indonesia-anti-communist-massacre-revealed/
అనువాదం : ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా వైరస్‌ కట్టడికి చైనా కమ్యూనిస్టులు చేసిందేమిటి !

09 Tuesday Jun 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

china communists action to fight against covid-19, China Covid-19, COVID-19 China white paper



ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ను చైనాయే సృష్టించిందనో, దాని ప్రయోగాల్లో పొరపాటున బయటకు వచ్చిందనో రకరకాలుగా ఏదో విధంగా బాధ్యతను అంట కట్టి దోషిగా నిలిపేందుకు ఇప్పటికీ అమెరికా వంటి దేశాలూ, వాటి కనుసన్నలలో నడిచే మీడియా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. మన దేశంతో సహా అనేక చోట్ల కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తమ ప్రభుత్వం కరోనా నిరోధానికి కఠినంగా వ్యవహరించినట్లు కొందరు తొలి రోజుల్లో భావించినా అమెరికా, ఐరోపా దేశాలు, బ్రెజిల్‌ తదితర దేశాల్లో పెరుగుతున్న కేసులు, మరణాలను చూసి తమ ప్రభుత్వం చేసింది సరైనదే అని పార్టీ, ప్రభుత్వం పట్ల మరింతగా చైనీయులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరోనా నిరోధానికి తీసుకోవాల్సిన చర్యల గురించి నివారించిన చైనా అనుభవాలను పరిగణనలోకి తీసుకోకపోతే నష్టం ఆయా దేశాల జనాలకే. మహమ్మారులు ప్రబలిన సమయంలో సుభాషితాలు చెప్పటం, చప్పట్లు కొట్టించటం, దీపాలు ఆర్పటం-హారతులు వెలిగించట కాదని, తమ సభ్యులను కదన రంగంలోకి దింపటం ముఖ్యమని చైనా కమ్యూనిస్టు పార్టీ వెల్లడించింది. ఈ నేపధ్యంలో కరోనాను ఎలా కట్టడి చేసిందీ వివరిస్తూ చైనా సమాచారశాఖ ఈనెల ఏడవ తేదీన ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. అరవై అయిదు పేజీలు ఆ పత్రంలోని అంశాల సారాంశం దిగువ విధంగా ఉంది.(పూర్తి పాఠం చదవాలని ఆసక్తి కనపరిచే వారి సౌకర్యం కోసం దాని లింక్‌ను చివరిలో చూడవచ్చు)
1949లో చైనా ప్రజారిపబ్లిక్‌ను స్ధాపించిన తరువాత కోవిడ్‌19 ఒక పెద్ద ప్రజారోగ్య అత్యవసర పరిస్దితిగా ముందుకు వచ్చింది. మరొకటేదీ ఇంత వేగంగా వ్యాపించలేదు, నిరోధించటం ఎంతో కష్టం అని రుజువు చేసింది. చైనా కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం దీనికి అగ్రశ్రేణి ప్రాధాన్యత ఇచ్చాయి.అది చైనీయుల విశ్వాసాన్ని పదిలపరచింది.బాధాకరమైన ప్రయత్నాలు, ఎంతో మూల్యం చెల్లించాల్సి వచ్చినా చైనా తన పౌరులను రక్షించుకుంది. ఏ తేదీన ఏమి జరిగిందీ అని చైనా చెబుతున్నప్పటికీ అనేక మంది ఆ సమాచారాన్ని అనుమానంతో చూస్తున్నారు. మరి కొందరు చూస్తూనే ఉంటారు. గతంలో తాము సాధించిన అభివృద్ది గురించి చైనా ప్రకటిస్తే అదంతా అంకెల గారడీ అని చెప్పిన వారున్నారు. ఇప్పటికీ నమ్మని వారి సంగతి సరే సరి. తీరా నమ్మక తప్పని పరిస్ధితి వచ్చినపుడు ఆ అక్కడ కమ్యూనిస్టు నియంతృత్వం కనుక సాధ్యమైంది, మనది ప్రజాస్వామ్యం అని వైఫల్యాన్ని సమర్దించుకుంటున్నారు. కరోనా విషయంలో కూడా అదే జరుగుతోంది. వైరస్‌ కట్టడికి అక్కడి కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం ఏ చర్యలను ఎలా అమలు జరిపిందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోని కారణంగా అనేక దేశాల పాలకులు తమ పౌరుల ప్రాణాలను ఫణంగా పెట్టారు. ఇప్పటికీ నేర్చుకొనేందుకు ముందుకు రావటం లేదు. అభివృద్ధి వైఫల్యాన్ని ప్రజాస్వామ్య ముసుగులో దాచి పెడుతున్న మేథావులమని చెప్పుకొనే వారు ప్రాణాలను బలి పెట్టకుండా మీరు చెప్పే నియంతృత్వ చైనాలో ఎలా కట్టడి చేశారో కనీసం తెలుసుకొనేందుకు పూనుకుంటారా ? మేథావులు అనేక మంది ప్రతిసారీ బస్సు మిస్సవుతున్నారు కనుక వారిని వదలి వేద్దాం. సామాన్యుల కోసం చైనా ప్రభుత్వం వెల్లడించిన శ్వేతపత్రంలోని అంశాల సారాంశం దిగువ విధంగా ఉంది.(స్ధలాభావం రీత్యా ఏ రోజు ఏమి జరిగిందీ అనే సమాచారాన్ని ఇవ్వటం లేదు. ఎలా అరికట్టారనే భాగానికే ఇది పరిమితం)
వైరస్‌ తొలుత బయటపడిన ఊహాన్‌ నగరంలోని 4.21 మిలియన్ల కుటుంబాలలో ఏ ఒక్కదానిని, కుటుంబంలో ఏ ఒక్కరినీ వదల కుండా వైరస్‌ పరీక్షలు చేశారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష వ్యవధిని రెండు రోజుల నుంచి 4-6 గంటలకు తగ్గించారు. తొలి రోజుల్లో రోజుకు 300 పరీక్షలు చేస్తే ఏప్రిల్‌ మధ్యనాటికి 50వేలకు చేరింది. నివాసులందరూ ప్రతి రోజూ ఆరోగ్య పరిస్ధితి ఎలా ఉందో అధికారులకు తెలియచేయాలని కోరారు. మరోవైపున సామాజిక కార్యకర్తలు ఆ సమాచారాన్ని నిర్ధారించుకొనేందుకు ఇంటింటికీ తిరిగారు. జ్వరాల ఆసుపత్రులలో పరీక్షలు చేసిన సమాచారాన్ని రెండు గంటల్లోగా ఉన్నతాధికారులకు చేరవేయాలని కోరారు. పరీక్షా ఫలితాలను పన్నెండు గంటలలో వెల్లడించారు. ఇరవైనాలుగు గంటలలో నిర్ధారిత పరీక్షలను పూర్తి చేసి రోగులను గుర్తించి ఆసుపత్రులకు తరలించారు.
ఉహాన్‌ నుంచి వచ్చిపోయే అన్ని రకాల దారులను పూర్తిగా మూసివేశారు.హువెరు రాష్ట్రం, వెలుపల ఉన్న ప్రాంతాలలో కేసుల తీవ్రతను బట్టి ఆంక్షలను అమలు జరిపారు. వైద్యపరమైన అత్యవసరాలకు మినహా గృహస్తులు ఇతర అవసరాలకు బయటకు రాకుండా కట్టడి చేశారు. సామాజిక కార్యకర్తలు వారికి అవసరమైన రోజు వారీ అవసరాలను తీర్చే ఏర్పాట్లు చేశారు. పరిమిత రాకపోకలను అనుమతించిన ఇతర ప్రాంతాలలో రాక-పోక సమయాల్లో శరీర ఉష్ణ్రోగ్రతలను విధిగా నమోదు చేశారు. దేశవ్యాపితంగా నిరోధ చర్యల్లో భాగంగా వీటితో పాటు ఇతర చర్యలను అమలు జరిపారు, అందుకు అవసరమైన వైద్య, ఇతర సదుపాయాలను అత్యవసర ప్రాతిపదికన మెరుగుపరిచారు.
దేశవ్యాపితంగా పదివేల ఆసుపత్రులను కోవిడ్‌-19 చికిత్సకు ప్రత్యేకించి అవసరమైన వసతులు కల్పించారు.ఆన్‌లైన్‌ ద్వారా అవసరమైన సాంకేతిక మద్దతు అందించారు. ప్రధాన కేంద్రమైన ఉహాన్‌లో 80శాతం కేసులు తీవ్రమైనవి కాదు. అయినా ఎటుపోయి ఎటు వస్తుందో అన్న ముందు జాగ్రత్తగా పద్నాలుగువేల పడకలతో స్టేడియాలు, ప్రదర్శన కేంద్రాలలో 16 తాత్కాలిక చికిత్స ఏర్పాట్లు చేశారు. నివారణలో ఇవి ప్రధాన పాత్ర పోషించాయి. ఆరోగ్యవ్యవస్ధ మీద వత్తిడిని తగ్గించటంలో ఇవి కీలక పాత్ర పోషించినట్లు బ్రిటీష్‌ వైద్య పత్రిక లాన్‌సెట్‌ పేర్కొన్నది. రోగ నిర్ధారణ, చికిత్సలో సంప్రదాయ చైనా వైద్య పద్దతులు, ఔషధాలను, ఆధునిక వైద్య పద్దతులు, ఔషధాలను రెండింటినీ వినియోగించారు. కొన్ని సంప్రదాయ చైనా వైద్య ఆసుపత్రులలో పూర్తిగా రోగులకు చికిత్స చేశారు, దానితో పాటు ప్రతి ఆసుపత్రిలోనూ ఆ వైద్య నిపుణులను అందుబాటులో ఉంచారు. తీవ్రత తక్కువ ఉన్న కేసులను ఈ ఆసుపత్రులలో చికిత్స చేసి తీవ్రమైన వారిని ఆధునిక వైద్య ఆసుపత్రులకు పంపారు. ఇందుకోసం ఈ రంగ వైద్య నిపుణులతో ఒక జాతీయ సమన్వయ సంస్ధను ఏర్పాటు చేశారు. తొంభై రెండుశాతం నిర్ధారిత కరోనా కేసులలో చైనా మూలికా ఔషధాలను వినియోగించారు. హుబెరు రాష్ట్రంలో చికిత్స పొందిన 90శాతం కేసులలో అవి సమర్దవంతంగా పని చేసినట్లు తేలింది.
కేంద్ర, రాష్ట్ర, స్ధానిక ప్రభుత్వాలన్నీ కలసి మే31 నాటికి 162.4 బిలియన్‌ యువాన్లు మహమ్మారి నివారణ, చికిత్సకు కేటాయించారు. బీమా కంపెనీలు పరిష్కరించిన యాభై ఎనిమిది వేల మంది ఆసుపత్రి చికిత్స బిల్లులను విశ్లేషించినపుడు సగటున ఒక్కొక్కరికి 23వేల యువాన్లు కాగా, తీవ్ర పరిస్ధితికి చేరిన వారికి లక్షా 50వేలు దాటింది. ఒక యువాను మన కరెన్సీలో పది రూపాయలకు పైగా విలువ కలిగి ఉంది. కొన్ని సంక్లిష్ట కేసులలో పది లక్షల యువాన్ల వరకు ఖర్చయింది. వ్యక్తులకు అయిన ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించింది.
మే 31వ తేదీనాటికి చైనా కేంద్ర సమాచార మండలి 161 పత్రికా సమావేశాలను ఏర్పాటు చేసింది. పద్నాలుగు వందల ప్రశ్నలకు 50శాఖల అధికారులు సమాధానాలు చెప్పారు. ఇవిగాక హుబెరు రాష్ట్రంలో 103 పత్రికా గోష్టులు ఏర్పాటు చేయగా ఇతర చోట్ల మరో 1050 నిర్వహించారు.మరోవైపు వాక్సిన్‌తో సహా కరోనా వైరస్‌కు సంబంధించి వివిధ అంశాలపై పరిశోధన మరియు అభివృద్దికి గాను కొత్తగా 83 కార్యక్రమాలను ప్రారంభించారు.
పౌరుల ప్రాణాలు, ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఆర్ధికంగా ఖర్చు గురించి ఆలోచించకుండా అనేక కఠిన చర్యలు తీసుకున్నది.” భారీ సామాజిక, ఆర్ధిక నష్టంతో చైనా విజయం వచ్చింది.ఆరోగ్యం మరియు ఆర్ధిక రక్షణ మధ్య ఉండాల్సిన సమతూకాన్ని సాధించేందుకు చైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది” అని లాన్‌సెట్‌ సంపాదకీయం పేర్కొన్నది. ఒకటిన్నర రోజు పసి గుడ్డు నుంచి వంద సంవత్సరాల పండు ముదుసలి వరకు ఖర్చు ఎంతైనా సరే ప్రాణాలను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది.చికిత్సకు, మరణాలను తగ్గించేందుకు ప్రాధాన్యత ఇచ్చింది.కరోనా తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు దేశంలోని నిపుణులైన వైద్యులు, సిబ్బందిని తరలించింది. ఊహాన్‌లో తీవ్ర స్ధితిలో ఉన్న 9,600 రోగులకు చికిత్స అందించారు.
బతికేందుకు ఏమాత్రం అవకాశం ఉన్నప్పటికీ ఖర్చుకు వెనుకాడకుండా వైద్యులు అన్ని ప్రయత్నాలు చేశారు. మే 31 నాటికి ఏడుగురు శతాధిక వృద్దులతో సహా 80 ఏండ్లు దాటిన మూడువేల మంది ప్రాణాలను రక్షించారు. వారిలో డెబ్బయి ఏండ్ల రోగి ఒకరికి పది మంది సిబ్బంది అనేక వారాల పాటు చికిత్సలో పాల్గొన్నారు. అందుకు పదిహేను లక్షల యువాన్లు ఖర్చు కాగా మొత్తం ప్రభుత్వమే భరించింది. వివిధ దేశాలలోని ప్రవాస చైనా విద్యార్ధులకు పదిలక్షల ఆరోగ్య కిట్లను చైనా పంపింది.
జనవరి 24 నుంచి మార్చి 8వ తేదీ వరకు హుబెరు రాష్ట్రంలోని ఊహాన్‌, మరో 16 పట్టణాలకు ఇతర ప్రాంతాలకు దేశమంతటి నుంచీ అన్ని రకాల వైద్య వనరులను సమీకరించారు, 346 జాతీయ వైద్య బృందాలలో 42,600 సిబ్బంది ఉన్నారు. వీరుగాక 900 మంది ప్రజారోగ్య నిపుణులు ఉన్నారు. చైనా ప్రజావిముక్త సైన్యం(పిఎల్‌ఏ) నుంచి నాలుగువేల మంది వైద్య సిబ్బందిని సమీకరించారు. ఆదేశాలిచ్చిన రెండు గంటల్లోనే బృందాలను ఏర్పాటు చేయటం, 24గంటల్లోగా నిర్దేశిత కేంద్రాలకు చేరటం ఏడు రోజులకు సరిపడా రక్షణ సామాగ్రితో వచ్చిన వెంటనే చికిత్స అందించటం ఆ బృందాల ప్రత్యేకత.
నలభైవేల మంది నిర్మాణ కార్మికులను రప్పించి వేయిపడకల ఆసుపత్రిని అన్ని రకాల పరికరాలతో పది రోజుల్లో, మరో 1600 పడకల ఆసుపత్రిని పన్నెండు రోజుల్లో నిర్మించారు.మరో 14వేల పడకల తాత్కాలిక ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేశారు.పది రాష్ట్రాల నుంచి 45వేల ఎర్ర రక్తకణ యూనిట్లు, 1762 ప్లేట్‌లెట్స్‌ డోస్‌లు, 1370 లీటర్ల గడ్డకట్టించిన ప్లాస్మాను సిద్ధం చేశారు. ఏ రకమైన వైద్య పరికరాలు, ముఖతొడుగులు,ఔషధాలకు కొరత రాకుండా ఉత్పత్తికి ఏర్పాటు చేశారు. చికిత్సా సమయంలో 17రకాల, వాక్సిన్లు, ఔషధాలను(క్లినికల్‌ ట్రయల్స్‌, వినియోగం) వినియోగించేందుకు అధికారులు అనుమతులు ఇచ్చారు. దేశవ్యాపితంగా నిరాటంకంగా ఎక్కడకు అవసరమైతే అక్కడకు తరలించే సమన్వయ వ్యవస్ధలను ఏర్పాటు చేశారు.
ఉహాన్‌ నగరంలో కోటి మంది, ఇతర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌లో ఉన్న జనాలకు అవసరమైన ధాన్యం, కూరగాయలు, నూనెలు, పాలు, గుడ్లు, మాంసం తదితర నిత్యావసర వస్తువులను సరఫరా చేసేందుకు తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 500 సంస్దలతో సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు.
చైనా ప్రధాన భూభాగంలోనూ, తైవాన్‌, హాంకాంగ్‌, మకావు ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో ఉన్న చైనీయులు పెద్ద ఎత్తున స్పందించి 38.93 బిలియన్‌ యువాన్లు, 990 మిలియన్ల వస్తువులను విరాళంగా అందచేశారు. లాక్‌డౌన్‌తో పాటే చిన్న వ్యాపారులు, పారిశ్రామికవేత్తల మీద భారాలు తగ్గించటం, ప్రభుత్వ సబ్సిడీల పెంపు, ఉపాధి స్ధిరీకరణ, ప్రభుత్వ సేవల మెరుగుదల వంటి అనేక చర్యలను తీసుకుంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత తమ పని స్ధలాలకు చేరేందుకు వలస కార్మికులకు ప్రత్యేక రైళ్లు, విమానాలను ఏర్పాటు చేశారు. ఏప్రిల్‌ చివరి నాటికి ఏడాదికి రెండు కోట్ల యువాన్ల ఆదాయం వచ్చే కంపెనీలలో 99శాతం పనిలోకి వచ్చాయి. తీవ్రంగా ప్రభావితమైను హుబెరు రాష్ట్రంలో కూడా 98.2శాతం సంస్ధలు తిరిగి పని చేస్తుండగా 92.1శాతం కార్మికులు విధుల్లో చేరారు. ప్రజా రవాణా పూర్తిగా పునరుద్దరణ అయింది. యావత్‌ ప్రజాజీవనం సాధారణ స్ధాయికి చేరుకుంది.
హుబెరు రాష్ట్రంలోని 5,40,000 ఆరోగ్య కార్యకర్తలు, బయటి నుంచి వచ్చిన నలభైవేల మంది పౌర, మిలిటరీ వైద్య సిబ్బంది, మిలియన్ల కొలది ఆరోగ్య సిబ్బంది కరోనాను అడ్డుకొనేందుకు మరో గ్రేట్‌ వాల్‌ నిర్మించారు. పుట్టుకతో ఎవరూ వీరులు కాదు. ఈ పోరులో రెండువేల మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది, అనేక మంది మరణించారు. కరోనా పోరులో సామాన్య జనాన్ని సిద్దం చేసేందుకు, వారిని ఆదుకొనేందుకు 6,50,000 పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు, రోగులను గుర్తించేందుకు, పౌరుల రోజువారీ సమస్యల పరిష్కారానికి 40లక్షల మంది సామాజిక కార్యకర్తలు పని చేశారు. పద్దెనిమిది లక్షల మంది పారిశుధ్యకార్మికులు బహిరంగ స్ధలాలు, ముఖ్యమైన ప్రాంతాలను శుభ్రం చేయటంలోనూ, వైద్య, ఇతర చెత్తను సేకరించటంలోనూ పాలొన్నారు. పోలీసులు విధి నిర్వహణలో 130 మంది మరణించారు. వలంటీర్లుగా నమోదు చేసుకున్న 88లక్షల మంది 4,60,00 కార్యక్రమాల్లో 29కోట్ల గంటల పాటు సేవలు అందించారు.
చైనా కమ్యూనిస్టు పార్టీలో 46లక్షలకు పైగా ప్రాధమిక శాఖలు ఉన్నాయి.మహమ్మారిని ఎదుర్కోవటం,జనాన్ని సమీకరించటం, వారికి సేవ చేయటంలోనూ అవి గట్టిగా పని చేశాయి. మూడు కోట్ల 90లక్షల మంది పార్టీ సభ్యులు అగ్రగామి దళంగా ఉన్నారు. కోటీ 30లక్షల మంది వలంటీర్లుగా సేవలందించారు. సేవారంగంలో ముందున్న వారిని ఉన్నత స్ధానాల్లోకి ప్రమోట్‌ చేశారు,బాధ్యతా రహితంగా ఉన్నవారిని గుర్తించి చర్యలు తీసుకున్నారు. ఉత్పాతాల నుంచి కాపాడటంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం అత్యంత విశ్వసనీయంగా ఉంటుందని లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత సాధారణ జనం ఎంతగానో గ్రహించారు, రాజకీయ వ్య వస్ధ మీద తమ విశ్వాసాన్ని ప్రకటించారు. 170దేశాల నేతలు, 50 ప్రపంచ, ప్రాంతీయ సంస్దల అధిపతులు, 300 విదేశీ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు చైనాకు బాసటగా నిలిచాయి. డెబ్బరు ఏడు దేశాలు, పన్నెండు అంతర్జాతీయ సంస్ధలు అత్యవసర విరాళాలు అందచేశాయి.84దేశాల నుంచి వివిధ సంస్ధలు సాయాన్ని పంపాయి. బ్రిక్స్‌ అభివృద్ధి బ్యాంకు, ఏఐఐబి ఏడు,2.48బిలియన్‌ యువాన్ల చొప్పున అత్యవసర రుణాలు అందచేశాయి. నూటపది దేశాలకు చెందిన 240 పార్టీలతో కలసి చైనా కమ్యూనిస్టు పార్టీ సంయుక్త విజ్ఞాపనలు చేసింది. యాభై మంది నేతలు, అంతర్జాతీయ సంస్ధల అధిపతులతో దేశాధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ స్వయంగా మాట్లాడి చైనా తీసుకుంటున్న చర్యలను వివరించారు.
శ్వేత పత్రంలోని ముఖ్యాంశాలను పైన చూశాము. గత నెలలో అమెరికా వ్యాపింప చేసిన 24 అబద్దాలను తిప్పి కొడుతూ చైనా ఒక పత్రాన్ని విడుదల చేసింది. ఇప్పుడు కరోనాను ఎదుర్కొన్న తీరు తెన్నులను వివరిస్తూ శ్వేత పత్రాన్ని ప్రకటించింది. ఇంతవరకు ఏ దేశమూ ఇలాంటి చర్యలు తీసుకోలేదు. తాము తీసుకున్న చర్యలను అధికారికంగా విడుదల చేసి జనం ముందుంచటం కనీస బాధ్యత. వాటి మంచి చెడ్డలను జనం స్వయంగా తెలుసుకుంటారు. ప్రపంచంలో గతంలో అనేక మహమ్మారులు వచ్చాయి. అవి ముందుగా బయటపడిన దేశాలను అందుకు బాధ్యులుగా చేసి రచ్చ చేసిన ఉదంతం ఇదొక్కటే అని చెప్పవచ్చు. కరోనా వైరస్‌ దెబ్బలను ఎదుర్కొన్న ఒక బాధిత దేశంగా ఉన్న చైనా దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొని తానేమిటో, తన రాజకీయ వ్యవస్ధ ఔన్నత్యం ఏమిటో నిరూపించుకుంది. సాధారణ కార్యకలాపాలతో తిరిగి ముందుకు పోతున్నది.చైనా తీసుకున్న చర్యలను కూడా ఎవరైనా సహేతుకంగా విమర్శించవచ్చు, లోపాలను ఎత్తిచూపవచ్చు. ఇదే సమయంలో ఏ దేశం, ఏ పాలకులు బాధ్యతా రహితంగా వ్యవహరించి తమ పౌరుల ప్రాణాల మీదకు తెచ్చారో తెలుసుకోవటం పౌరుల హక్కులలో ఒకటి. అందుకే మిగిలిన దేశాలు కూడా తామేమి చేసిందీ ప్రపంచ జన కోర్టుకు చెప్పాలి. చైనాతో పోటీ పడుతున్నామని చెప్పుకుంటున్న, చైనా తరువాత జనాభా రీత్యా రెండవ స్ధానంలో ఉన్న మన పాలకుల మీద ఆ బాధ్యత మరింత ఎక్కువగా ఉందంటే ఏకీభవిస్తారా !
https://news.cgtn.com/news/2020-06-07/Full-Text-Fighting-COVID-19-China-in-Action-R7xr2aKsyA/index.html

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d