• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Economics

నరేంద్రమోడీ ఏలుబడి : కమ్యూనిస్టు చైనాను పక్కన పెట్టి అమెరికానైనా అనుసరిస్తారా !

09 Sunday May 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Science, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti China Media, Corona vaccine, Fuel Price in India, Joe Biden, Narendra Modi Failures, Saudi Arabia


ఎం కోటేశ్వరరావు


దేశంలో, మన చుట్టుపట్ల, ప్రపంచంలో ఏం జరుగుతోంది ? అన్నింటినీ ఒకేసారి చూడలేం. ఆలోచనలను రేకెత్తిస్తున్న కొన్ని అంశాలను చూద్దాం. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. స్వతంత్ర భారతచరిత్రలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్ధాన అభిశంసనకు గురైందంటే అతిశయోక్తి కాదు. పేరు పెట్టి మందలించకపోవచ్చు, కొన్ని హైకోర్టుల మాదిరి తీవ్ర వ్యాఖ్యలు చేయకపోవచ్చు గానీ తీసుకున్న చర్య చెంప పెట్టువంటిది. ఆక్సిజన్‌, కరోనా సంబంధిత సమస్యను గతనెలలో సుప్రీం కోర్టు తనంతట తానుగా విచారణకు చేపట్టినపుడే నరేంద్రమోడీ సర్కార్‌ మొద్దు నిద్రను వీడి తెలివిగా వ్యవహరించి ఉండాల్సింది. అదేమీ లేకపోగా తన చర్యలను సమర్ధించుకొనేందుకు పూనుకుంది. రాష్ట్రాలకు ఆక్సిజన్‌ కేటాయింపు విషయంలో ప్రభుత్వం సూచించిన విధానాన్ని తోసి పుచ్చి శాస్త్రీయ పద్దతిలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆక్సిజన్‌ కేటాయింపులకు ఒక కార్యాచరణ కమిటీని ఆరునెలల కాలానికి సుప్రీం కోర్టు నిర్ణయించటం నరేంద్రమోడీ సర్కార్‌ను అభిశంచించటం గాక మరేమనాలి ? వివిధ రాష్ట్రాల హైకోర్టులు చేస్తున్న వ్యాఖ్యల నేపధ్యంలో సుప్రీం కోర్టు తగినంత గడువు ఇచ్చినప్పటికీ సంతృప్తికరమైన విధానాన్ని కేంద్రం రూపొందించలేకపోయింది. దేశం సురక్షితమైన చేతుల్లో ఉంది అని చెప్పిన వారు ఇప్పుడు ఏమంటారో తెలియదు. చెడు వినను, చెడు కనను, చెడు చెప్పను అన్న మూడు కోతుల బొమ్మలను చాలా మంది చూసే ఉంటారు. చెప్పింది చేయను, జరుగుతున్నది చూడను, నోరు విప్పను అన్నట్లుగా కేంద్ర పాలకుల వ్యవహారం ఉంది.

సురక్షితమైన చేతుల్లో జనం అంటే ఇదేనా ?


ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయల ఆత్మనిర్భర పాకేజ్‌ ప్రకటించామని ఎంత ప్రచారం చేసుకున్నారో తెలిసిందే. వాక్సినేషన్లకు 35వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రకటించారు. ఆ సొమ్ముతో రెండువందల కోట్ల వాక్సిన్‌ డోసులు కొనుగోలు చేయవచ్చు. వంద కోట్ల మందికి వేయవచ్చు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోకుండా 45 ఏండ్లు దాటిన వారికి మాత్రమే తాము వేస్తామని, మిగతా వారికి రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ఎవరికి వారు స్వంత ఖర్చుతో వేయించుకోవాలని చెబుతోంది. చిన్న వయసు వారికి కూడా కరోనా సోకుతున్నందున అందరికీ వాక్సిన్‌ వేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఖర్చుకు వెనకాడాల్సిన సమయమా ఇది. అందులోనూ దేశ రక్షకులమని తమకు కితాబు ఇచ్చుకుంటున్న వారు. పోనీ వాక్సిన్లు అందుబాటులోకి తెచ్చే చర్యలేమైనా తీసుకుందా అంటే అదీ లేదు. కోవాగ్జిన్‌, కోవీషీల్డ్‌ రెండింటిని అత్యవసర వినియోగ ప్రాతిపదిక మీదనే అనుమతి ఇచ్చారు. రష్యా స్పుత్నిక్కుకు కూడా అదే పద్దతిలో అనుమతి ఇచ్చి ఉంటే ఈ పాటికి అది కూడా ఉత్పత్తిలోకి వచ్చి ఉండేది. రెండు కార్పొరేట్‌ సంస్ధలకు వచ్చే లాభాలు, వాటి నుంచి అందే నిధుల గురించే ఆలోచించారని జనం అభిప్రాయం పడితే తప్పు పట్టగలమా ? తాజాగా చైనా వాక్సిన్‌లను ప్రపంచ ఆరోగ్య సంస్ద అనుమతి ఇచ్చింది. దాన్నైనా అనుమతిస్తారా లేక పంతానికి పోయి జనం ప్రాణాలను ఫణంగా పెడతారా ? అనుమతిస్తే చైనా కంపెనీ అనుబంధ సంస్ధ హైదరాబాద్‌లోని గ్లాండ్‌ ఫార్మాలో వెంటనే తయారీ మొదలు పెట్టవచ్చు.

బాధ్యతల నుంచి వైదొలగిన మోడీ సర్కార్‌ !


గత ఏడాది రాష్ట్రాలతో సంప్రదించకుండా, జనం స్వస్ధలాలకు చేరే అవకాశం ఇవ్వకుండా, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఆకస్మికంగా ప్రకటించిన తీరును ప్రతిపక్షాలు తప్పుపట్టాయి తప్ప లాక్‌డౌన్ను వ్యతిరేకించలేదు.ఈ సారి లాక్‌డౌన్‌ విధించాలా లేదా అన్న నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదలివేస్తున్నట్లు ప్రకటించి ఎంతో ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరిస్తున్నట్లు ఫోజు పెట్టారు. అసలు విషయం ఏమంటే కేంద్రం బాధ్యతలను వదలించుకోవటమే. ఇప్పటికే నిధుల కొరతతో ఉన్న రాష్ట్రాలు వాక్సిన్‌ ఉచితంగా వేసేందుకు నిర్ణయించాయి. లాక్‌డౌన్‌ లేదా అలాంటి చర్యలు తీసుకుంటే ఉపాధి కోల్పోతున్న వారికి సాయం చేసే స్ధితిలో రాష్ట్రాల ఆర్ధిక స్ధితిలేదు. కేంద్రం నుంచి ఇంతవరకు ప్రత్యేకమైన చర్యలు ఏమీ లేవు. ఐదేసి కిలోల బియ్యం ఇస్తే సరిపోతాయా ? కేరళలో 17 రకాల నిత్యావసర వస్తువులతో కూడిన ఆహారకిట్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తే అదంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే, ఎన్నికల కోసం అని కాంగ్రెస్‌, బిజెపి ప్రచారం చేశాయి. ఓటర్లు వాటికి చెప్పాల్సిన బుద్ది చెప్పారు. ప్రభుత్వం సాయం అందని వారు ఆరుశాతం మందే అని ఎన్నికల తరువాత జరిగిన ఒక సర్వేలో తేలింది. కేరళ ఇప్పుడు కూడా అదే కిట్‌ను అందిస్తున్నది, లాక్‌డౌన్‌ ప్రకటించినందున సామూహిక వంటశాలలను ప్రారంభించి అవసరమైన వారికి ఆహారం సరఫరా చేస్తున్నది. అలాంటి చర్యలను ఏ బిజెపి లేదా కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీల పాలిత ప్రభుత్వాలలో అయినా అమలు జరుపుతున్నారా ?

రచ్చ చేసిన మీడియా ఎందుకు మౌనం దాల్చినట్లు ?


చైనా వస్తువుల కొనుగోలు గురించి గత ఏడాది కాషాయ దళాలు, వాటికి వంత పాడి రేటింగ్‌ పెంచుకున్న టీవీ ఛానళ్లు, పత్రికలు ఎంత రచ్చ చేశాయో చూశాము. ఇరుగు పొరుగుదేశాలతో సమస్యలు వస్తాయి, వాటిని పరిష్కరించుకొనేందుకు చూడాలి గానీ శాశ్వతవైరంతో వ్యహరిస్తే ఉభయులకూ నష్టమే. బలహీనులకు మరింత నష్టం.మన దేశంలో కరోనా పెరిగిన కారణంగా చివరికి తమ పౌరులు స్వదేశానికి వచ్చినా జైలు శిక్ష విధిస్తామని ఆస్ట్రేలియా ప్రకటించింది. ఎదుటి వారు మంచి పని చేసినప్పటికీ ఎవరికైనా ఇష్టం లేకపోతే మౌనంగా ఉండటం ఒక పద్దతి. కానీ ఇష్టంలేని వారు చేసే ప్రతిదానిని బూతద్దంలో చూపి దాడి చేసేందుకు పూనుకునే వారిని ఏమనాలి ? కరోనా కారణంగా చైనా ప్రభుత్వరంగ విమానయాన సంస్ద మన దేశానికి తాత్కాలికంగా వాణిజ్య విమానాల నిలిపివేత ప్రకటన చేయగానే ఇంకేముంది చైనా మనకు వెన్ను పోటు పొడిచింది అని టీవీ చానల్స్‌ నానా యాగీ చేశాయి. కానీ అదే చైనా గురించి ఇప్పుడు మన విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఏమన్నారు.” మా దేశానికి చెందిన అనేక కంపెనీలు చైనా నుంచి వస్తువుల కొనుగోలుకు ఆర్డర్లు పెడుతున్నాయి. రవాణాలో మేము సమస్యలను ఎదుర్కొంటున్నాము. వాటిని పరిశీలించి తగుచర్యలు తీసుకొంటే మేము శ్లాఘిస్తాము ” అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇతో మాట్లాడారు.” మా సంభాషణ తరువాత పని జరిగింది. మన విమాన సంస్దలు కొన్నింటికి వెంటనే అనుమతులు వచ్చాయి.రవాణా జరుగుతోంది, అదెంతో శ్లాఘనీయం ” అని చెప్పారు. ఇప్పుడు యాగీ చేసిన ఛానల్స్‌ ఏమంటాయి ? అసలేమీ జరగనట్లు మౌనంగా ఉన్నాయా లేదా ?

భారత ఆర్డర్లతో చైనా కంపెనీల లాభాలు – భావ స్వేచ్చ సమస్య !


చైనా వస్తువులు, వాటి నాణ్యత గురించి ఏదేదో మాట్లాడిన వారు ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా ఉన్నారు. రికార్డు స్ధాయిలో మన దేశానికి చెందిన కంపెనీలు, ఏప్రిల్‌, మే మాసాల్లో చైనా వస్తువుల దిగుమతికి ఆర్డర్లు పెట్టాయి. ఏప్రిల్‌ ఆఖరు నాటికి 40వేల ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లకు అర్డరు పెట్టారు, వాటిలో 21వేలు వచ్చాయి. ఐదువేల వెంటిలేటర్లు, 2.1కోటి ముఖ తొడుగులు(మాస్క్‌లు),3,800 టన్నుల ఔషధాలకు ఆర్డర్లు పెట్టినట్లు చైనా కస్టమ్స్‌ వివరాలు తెలుపుతున్నాయి( ది హిందూ మే 9, 2021) మన దేశ ఆర్డర్ల కారణంగా చైనా కంపెనీల అమ్మకాలు, లాభాలు విపరీతంగా పెరిగాయి.
చైనాలో భావ ప్రకటనా స్వేచ్చ లేదనే ప్రచారం గురించి తెలిసిందే. అది నాణానికి ఒక వైపు మాత్రమే. సోషలిజం, కమ్యూనిజాలకు, దానికొరకు పనిచేసే రాజ్యాంగానికి దాన్ని అమలు జరిపే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ప్రచారానికి స్వేచ్చ లేదు. ఆ మాటకు వస్తే మన దేశంలో గానీ మరొక కమ్యూనిస్టేతర దేశంలో గానీ ఎవరైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే స్వేచ్చ ఉందా ? అలాంటి వారిని శిక్షించకుండా వదులుతారా ? రాజ్యాంగపరిధిలో అనుమతించిన స్వేచ్చ మేరకు మాట్లాడితేనే దేశద్రోహులుగా మనదేశంలో చిత్రిస్తున్న విషయం దాస్తే దాగుతుందా ? ఇటీవల చైనా కమ్యూనిస్టు పార్టీ విభాగమైన చట్ట అమలు కమిటీ ట్విటర్‌ ఖాతా నుంచి ఒక ట్వీట్‌ వెలువడింది. దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు-ప్రశంసలు వెలువడ్డాయి. వివాదాస్పదమైన ఆ ట్వీట్‌ను వెంటనే తొలగించారు. దాని గురించి కూడా మన మీడియాలో వార్తలు వచ్చాయి.(అలాంటి అవాంఛనీయమైన ట్వీట్లను మన కాషాయ దళాలు ఎన్ని తొలగించాయో వారే చెప్పాలి ) ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముంది ? రెండు ఫొటోలు పెట్టారు. ఒకటి నింగిలోకి దూసుకుపోతున్న చైనా రాకెట్‌, మరొకటి మన దేశంలోని శ్మశానంలో చితిమంటల చిత్రం. వాటి కింద చైనా వెలిగిస్తున్న మంటలు-భారత్‌ వెలిగిస్తున్న మంటలు అని వ్యాఖ్యానించారు.ఒక దేశంలోని విపత్తును అలా పోల్చటం తగిన చర్య కాదు, తప్పు పట్టాల్సిందే. ఒక వ్యక్తి లేదా ఆ విభాగాన్ని చూస్తున్న కొందరు వ్యక్తులు అనాలోచితంగా పెట్టినప్పటికీ దాన్ని యావత్‌ కమ్యూనిస్టు పార్టీకి అంట గట్టారు. కానీ ఆ ట్వీట్‌ మీద చైనా సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున విమర్శలు-ప్రశంసలు వెలువడ్డాయి. అక్కడ స్వేచ్చ లేకపోతే ఆ చర్చ ఎలా జరిగినట్లు ? ఆ ట్వీట్‌ను గ్లోబల్‌టైమ్స్‌ పత్రిక సంపాదకుడు గ్జీ జిన్‌ విమర్శించినందుకు పెద్ద ఎత్తున నెటిజన్లు మండిపడ్డారు.ఆ ట్వీట్‌ను విమర్శించటంతో పాటు భారత్‌కు చైనా స్నేహ హస్తం అందిస్తున్నప్పటికీ భారత్‌ ద్వేషంతో, సంకుచితంగా వ్యవహరిస్తోంది, అయినప్పటికీ సాయం చేయాల్సిందే అని సంపాదకుడు పేర్కొన్నారు.గ్జీ విమర్శపై ధ్వజమెత్తిన షాంఘైలోని పుడాన్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ షెన్‌ ఇ తొలగించిన ట్వీట్‌ను సమర్దించాడు. భారత్‌కు సానుభూతి చూపినందువలన సానుకూల ఫలితం ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించాడు. నెటిజన్లు గ్జీ-షెన్‌ వర్గాలుగా చీలిపోయినట్లు కొందరు వ్యాఖ్యానించారు.దీని గురించి అమెరికా అగ్రశ్రేణి పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ విశ్లేషణ రాసింది.

చమురు ధరలపై జనం ఊహించిందే జరిగింది !


ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తరువాత చమురు ధరలు పెరుగుతాయని జనం సరిగానే ఎంతగా అంటే పగలు తరువాత రాత్రి వస్తుందన్నంత కచ్చితంగా ఊహించారు. అదే జరుగుతోంది. చలికాలంలో గిరాకీ ఉంటుంది కనుక అది ముగిసిన తరువాత చమురు ధరలు తగ్గుతాయని చమురుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఫిబ్రవరి 26న చెప్పారు. ఆ మరుసటి రోజు నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కనుక ధరలు స్ధిరంగా ఉండి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత పెరుగుతున్నాయి. ఓట్ల కోసం అలాంటి పనులు బిజెపి చేయదు అని మరో వైపు ఆ పార్టీ నేతల డాంబికాలను జనం చూశారు. వేసవిలో జనాలు ఎక్కువగా తిరుగుతారు కనుక గిరాకీ పెరిగి వర్షాకాలం నాటికి ఎవరి పనుల్లో వారుంటారు గనుక ధరలు తగ్గుతాయని మంత్రిగారు చెబుతారేమో చూడాలి. పెట్రోలియం ప్లానింగ్‌ మరియు అనాలసిస్‌ విభాగం ప్రకటించిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి నెలలో మన దేశం దిగుమతి చేసుకొన్న ముడిచమురు పీపా సగటు ధర 61.22 డాలర్లు, మార్చినెలలో 64.73, ఏప్రిల్‌ నెలలో 63.40 డాలర్లు ఉంది. చైనా వస్తువుల కొనుగోలును ఆపివేస్తే వారు మన కాళ్ల దగ్గరకు వస్తారని చెప్పినట్లుగా మనం దిగుమతి చేసుకొనే దేశం కనుక దాన్ని ఆయుధంగా చేసుకొని ఒపెక్‌ దేశాలకు బదులు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తే అవి దిగివచ్చి ధరలు తగ్గిస్తాయని మంత్రిగారు సెలవిచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు అమెరికా నుంచి కొనుగోళ్లు పెంచాం గాని ధరలు దిగిరాలేదు. ఏ దేశమూ మన కాళ్ల దగ్గరకు రాలేదు-వృతం చెడ్డా ఫలం దక్కలేదు.

అడుసు తొక్కనేల – కాలు కడగనేల !

ఇప్పుడు ఏమైంది ? మన బెదిరింపులు, చమురు కొనుగోలు తగ్గింపు వంటి చర్యలను మనసులో పెట్టుకోకుండా మనకు అవసరమైన ద్రవరూప ఆక్సిజన్ను ఆరునెలల పాటు సరఫరా చేసేందుకు సౌదీ, యుయేఇ, కతార్‌ దేశాల ప్రభుత్వాలు కంటెయినర్లలో సరఫరా చేసేందుకు ముందుకు వచ్చాయి.అమెరికా నుంచి అలాంటిది రాలేదు.ప్రభుత్వరంగ చమురు కంపెనీలు సౌదీ నుంచి కొనుగోళ్లు తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా పూర్వం మాదిరే కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చినట్లు వార్తలు వచ్చాయి. అమెరికా మబ్బులను చూసి గల్ఫ్‌ దేశాల చమురు ముంతలను వలకపోసుకుంటే ఏమౌంతుందో మోడీ సర్కార్‌కు తెలిసివచ్చింది. ఇంతేనా, కాదు గత ఏడాది కాలంలో జరిగిన పరిణమాలను చూస్తే మన విదేశాంగ విధానం ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తోంది. ఇప్పటికైనా ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలును కేంద్రం ప్రారంభిస్తుందా ?

మనం సౌదీని బెదిరించిన సమయంలోనే సౌదీ అరేబియా ప్రభుత్వ కంపెనీ అరామ్‌కో ఒకశాతం వాటాను చైనా పెట్టుబడి-చమురు కంపెనీలకు విక్రయించే చర్చలు మరింత పురోగమించాయని వార్తలు.సౌదీ-అమెరికా ప్రభుత్వం మధ్య సంబంధాల గురించి 1945లో ఒక ఒప్పందం కుదిరింది. దాని నిబంధనలు, స్ఫూర్తికి మరింత దూరం జరిగి సౌదీ అరేబియా వాటా అమ్మకం గురించి చర్చలు జరుపుతోందన్నదే కీలక అంశం.ఈ పరిణామం ఒక అడుగు అమెరికాకు దూరం చైనాకు దగ్గర కావటంగా చెబుతున్నారు. అమెరికాను వెనక్కు నెట్టేసి 2030 నాటికి అతి పెద్ద ఆర్ధిక వ్యవస్దగా చైనా అవతరించనుందనే అంచనాలు తెలిసిందే. అరామ్‌కో కంపెనీ వాటాలను చైనా కొనటం గురించి జరిగే చర్చలు కొత్తవేమీ కాదు. గత ఏడాది తప్ప అంతకు ముందు మూడు సంవత్సరాలలో దీని గురించి చర్చలు జరిగాయి. గత కొద్ది సంవత్సరాల పరిణామాలను చూస్తే సౌదీ – అమెరికా సంబంధాలలో ముద్దులాట-దెబ్బలాట తీరుతెన్నులు కనిపిస్తాయి. న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రంపై 2011 సెప్టెంబరులో జరిగిన దాడికి సౌదీ మద్దతు ఉందన్న దగ్గర నుంచి అనేక పరిణామాల నేపధ్యంలో అమెరికాలో సౌదీ గురించి ప్రతికూల భావాలు పెరిగాయి.ఈ కారణంగానే అమెరికా,బ్రిటన్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లలో అరామ్‌కో కంపెనీ వాటాల లావాదేవీలకు అనుమతి ఇవ్వలేదు. ఈ వైఖరి కూడా చైనాకు వాటాలను అమ్మేందుకు సౌదీని పురికొల్పిందని చెబుతున్నారు. ఈ ఒప్పంద వివరాలు అన్నీ రహస్యమే. అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా తన కరెన్సీ డాలరుతో ప్రపంచంపై పెత్తనం చేస్తోంది. గతేడాది పెద్ద మొత్తంలో సౌదీ నుంచి చైనా చమురు కొనుగోలు చేసింది. ఆ లావాదేవీలలో డాలర్లకు బదులు తమ కరెన్సీ రెన్‌మిన్‌బీ(యువాన్‌)ను స్వీకరించాలని చైనా చేసిన ప్రతిపాదనకు సౌదీ అంగీకరిందని చెబుతున్నారు. ఇది అమెరికాకు ఆగ్రహం తెప్పించే చర్య. దాని పర్యవసానాలను అంచనా వేస్తున్నందున ఇవేవీ ఇంకా ఖరారు కాలేదు. ఇదే జరిగితే అనేక దేశాలు డాలర్లను పక్కన పెట్టి యువాన్లవైపు మళ్లుతాయని, తమ పలుకుబడికి దెబ్బ అన్నది అమెరికా భయం. ఇప్పటికే ఎస్‌డిఆర్‌ ఆస్ధులలో చైనా కరెన్సీని 2016లో చేర్చారు. దాని కొనసాగింపుగా డాలరు బదులు మరొక కరెన్సీని రిజర్వుగా ఉంచాలన్నది ఆలోచన. ఆర్ధికంగా చైనా అగ్రరాజ్యంగా మారనున్నందున దాని కరెన్సీ అవుతుందని మిగతా దేశాల భయం. అమెరికా విధిస్తున్న ఆంక్షల నేపధ్యంలో తాము డాలర్లకు బదులు మరొక కరెన్సీని ఉపయోగంచక తప్పదని రష్యా హెచ్చరిస్తున్నది. ఇరాన్‌, వెనెజులా, రష్యా వంటి చమురు ఎగుమతి దేశాలపై అమెరికా ఆంక్షలను విధిస్తున్నది, అందువలన వాటికి డాలర్‌ బదులు మరొక ప్రత్యామ్నాయ కరెన్సీ అవసరం కనుక చైనా కరెన్సీ వైపు చూస్తున్నాయి.

సౌదీ అరేబియాను కూడా దూరం చేసుకుంటున్నామా ?


అరామ్‌కో కంపెనీలో ఒక శాతం వాటాను 19 బిలియన్‌ డాలర్లకు చైనా కొనుగోలు చేయనున్నదని వార్తలు వచ్చాయి. అంతే కాదు రెండు దేశాలు సంయుక్తంగా చెరిసగం వాటాలతో 20 బిలియన్ల డాలర్లతో పెట్టుబడి నిధిని ఏర్పాటు చేయాలని కూడా సూత్ర ప్రాయంగా నిర్ణయించాయి. గత నాలుగు సంవత్సరాలలో వివిధ రంగాలలో వాణిజ్య ఒప్పందాలు కూడా కుదిరాయి. అరామ్‌కోలో చైనా వాటా కొనుగోలు చేస్తే దాని ప్రభావం, పర్యవసానాలు మన దేశం మీద ఎలా ఉంటాయనే చర్చ కూడా జరుగుతోంది. గతంతో పోలిస్తే సౌదీ నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించినప్పటికీ గణనీయంగానే కొంటున్నాము. అయితే చైనాతో సౌదీ ఒప్పందాలు చేసుకొని సంబంధాలు పెంచుకుంటే మన దేశంతో జరిగే వాణిజ్యం మీద దాని ప్రభావం పడుతుంది. మన ఎగుమతులు తగ్గిపోయే అవకాశం లేకపోలేదు. అంతే కాదు రాజకీయంగా కీలకమైన ప్రాంతంలో చైనా మరొక మంచి మిత్రదేశాన్ని సంపాదించుకుంటుంది. సౌదీ మన దేశంతో కూడా పెట్టుబడుల గురించి సంప్రదింపులు జరిపింది. రిలయన్స్‌ ఇండిస్టీస్‌లో పెట్రోకెమికల్స్‌ వాణిజ్యంలో 20శాతం వాటా తీసుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్ధలతో కలసి చమురుశుద్ధి మరియు పెట్రోకెమికల్స్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు ప్రతిపాదించింది. తరువాత ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇటీవల చమురు ధరలను పెంచటంతో సౌదీపై చమురు దిగుమతి ఆయుధాన్ని వినియోగిస్తామని మన చమురుశాఖ మంత్రి చేసిన బెదిరింపు అందుకు నిదర్శనం. గతేడాది చౌకగా కొనుగోలు చేసి నిల్వచేసుకున్న చమురును వినియోగించుకోండని సౌదీ మంత్రి తిప్పికొట్టారు. చైనాలో పూర్తి స్ధాయిలో ఆర్ధిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. అమెరికా, ఐరోపా దేశాలలో నియంత్రణలు ఎత్తివేస్తున్న కారణంగా అక్కడ చమురు డిమాండ్‌ పెరుగుతున్నదని ఇప్పుడున్న 68 డాలర్ల రేటు 80వరకు పెరగవచ్చని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే మన పరిస్ధితి ఏమిటి ? మే నెలలో 0.40 డాలర్లు పెంచిన సౌదీ అరేబియా జూన్‌ మాసంలో సరఫరా చేసే చమురుకు గాను ఆసియా దేశాలకు పీపాకు 0.28 డాలర్లు తగ్గించనున్నట్లు ప్రకటించింది. దీని వలన వినియోగదారులకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. గతేడాది డిసెంబరులో కూడా ఇదే విధంగా తగ్గించింది. నరేంద్రమోడీ కోరిన కారణంగానే తగ్గించినట్లు కాషాయ దళాలు ప్రచారం చేశాయి.

చైనా సంగతి పక్కన పెట్టండి అమెరికా పద్దతయినా అనుసరిస్తారా !


కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్ధను పునరుద్దరించేందుకు, దానిలో భాగంగా ఉపాధి కల్పించేందుకు రెండు లక్షల కోట్ల డాలర్లను ( మన రూపాయల్లో 146లక్షల కోట్లు ) ఖర్చు చేయాలని అమెరికాలో జోబైడెన్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఈ పనుల్లో రోడ్లు, విద్యుత్‌ వాహన స్టేషన్ల మరమ్మతులు, ప్రభుత్వ ఆసుపత్రులు, స్కూలు భవనాల నిర్మాణం, మరమ్మతులు,అల్పాదాయ వర్గాల, వృద్దుల ఇండ్ల నిర్మాణం, ఇంటర్నెట్‌ వేగం పెంపుదల వ్యవస్ధలు, ఇలా శాశ్వత వనరులను సమకూర్చటంతో పాటు ఉపాధికల్పించే పనులు ఈ మొత్తంతో చేపట్టనున్నారు. దీన్నుంచి పరిశోధన-అభివృద్ధికి కూడా ఖర్చు చేస్తారు. దీనికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు ప్రజల మీద పన్నులు విధింపునకు బదులు కార్పొరేట్‌ సంస్దల పన్ను పెంచాలని బైడెన్‌ నిర్ణయించారు. గతంలో డోనాల్డ్‌ ట్రంప్‌ కార్పొరేట్లకు పన్ను తగ్గించారు.కనీస కార్పొరేట్‌ పన్ను 21శాతానికి పెంచటంతో పాటు గరిష్టంగా 28శాతం విధించి నిధులు సమకూర్చి పైన పేర్కొన్న పనులను చేపడతారు. కార్పొరేట్‌ కంపెనీలు పన్నులు ఎగవేసేందుకు పెట్టుబడులు, లాభాలను పన్ను స్వర్గాలకు తరలించకుండా మేడ్‌ ఇన్‌ అమెరికా టాక్స్‌ పధకం పేరుతో స్వదేశంలో పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పించే సంస్ధలకు పన్ను రాయితీలను ప్రోత్సాహంగా ప్రకటించనున్నారు. విదేశాల్లో పెట్టుబడులు పెడితే తొలి పదిశాతం ఆదాయంపై పన్నులు చెల్లించనవసరం లేదన్న నిబంధనను ఎత్తివేయనున్నారు.


ఉపాధి పెంచే పేరుతో మన దేశంలో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు పెద్ద మొత్తంలో రాయితీలుఇచ్చింది. కరోనా కాలంలో సామాన్య జనం దివాలా తీస్తే కార్పొరేట్ల లాభాలు పెరిగాయి, బిలియనీర్లు కూడా పెరిగారు. వారు పెట్టుబడులు పెట్టకుండా తమ మూటలను అలాగే ఉంచారు. కనీసం కరోనా వాక్సిన్లు, వ్యాధి గ్రస్తుల వైద్య ఖర్చులకు అయినా కార్పొరేట్ల నుంచి తాత్కాలికంగా అయినా పన్ను రేటు పెంచి నిధులు సేకరించి దేశంలో ఖర్చు చేయవచ్చు. అలాంటి ప్రయత్నాలు గానీ ఆలోచనలు గానీ లేవు. అమెరికా మాదిరి అనేక ఐరోపా దేశాలలో ఇలాంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు ఎలుకలను పడుతుందా లేదా అన్నది గీటు రాయి అన్న సామెత మాదిరి వ్యవస్ధ ఏదనికాదు. కమ్యూనిస్టు చైనా మాదిరి మన దేశాన్ని కూడా ప్రపంచ ఫ్యాక్టరీగా మారుస్తామంటూ ఆర్ధిక సర్వేల్లో పుంఖాను పుంఖాలుగా రాసుకున్నాం. కమ్యూనిస్టు చైనాను పక్కన పెట్టండి కాపిటలిస్టు అమెరికా, ఐరోపా దేశాల పద్దతి అయినా అనుసరిస్తారా ? అసలు జనం కోసం పని చేస్తారా ? వట్టిస్తరి మంచి నీళ్ల ఆత్మనిర్భరతోనే సరిపెడతారా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మరోసారి మీడియా, కాషాయ దళాల చైనా వ్యతిరేక ప్రచారం- వాస్తవాలు !

01 Saturday May 2021

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti China Propaganda, Narendra Modi Failures, RSS Outfits anti china, vaccine controversy, Vaccine Nationalism


ఎం కోటేశ్వరరావు


మరోసారి మీడియా – కాషాయ దళాలు ప్రచారదాడితో రెచ్చిపోతున్నాయి. ఎవరెంత సమర్దవంతంగా జనాన్ని పక్కదారి పట్టించగలమో చూద్దాం అన్నట్లుగా మిత్రులుగా పోటీ పడుతున్నాయి. నరేంద్రమోడీ వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు ప్రతిసారీ వాటికి ఏదో ఒక అంశం, బకరాలు కావాలి. కరోనా రెండవ దశను ఊహించటంలో వైఫల్యం, అలక్ష్యం, అసమర్ధ నిర్వహణ ఒకటేమిటి ? వందకు ఒకటైనా ప్రతికూల వార్తకు చోటు కల్పించకపోతే ” చాల బాగోదు ” కనుక బాధ్యత ఎవరిది అనే అంశాన్ని తెలివిగా పక్కన పెట్టి సమస్య తీవ్రతను ప్రతిబింబించక మీడియాకు తప్పని స్ధితి. కాషాయ దళాల ఆరాధ్య దైవం గోబెల్స్‌. రాముడికైనా విరామం ఇస్తారేమో గానీ ఆయనకు రోజూ అబద్దాల నైవేద్యం పెట్టటం మానరు. ఎవరైనా నిజాలు చెప్పటంలో పోటీ పడితే మంచిదే. కానీ జరుగుతోందేమిటి ?


వద్దంటున్నా అనుమతించిన ఉత్తరాఖండ్‌ కుంభమేళా ( మనం పుష్కరాలు అంటాం) గంగలో మునిగిన వారు కరోనాను ఎలా వ్యాప్తి చేస్తున్నారన్నదాన్ని గురించి చెప్పటంలో వాటి మధ్య పోటీ లేదు. గతంలో తబ్లిగీ సమావేశాల సందర్భంగా చేసిన రచ్చ ఊసేలేకుండా జాగ్రత్త పడుతున్నాయి. జనవరి 14 నుంచి ఏప్రిల్‌ 27 వరకు 91లక్షల మంది గంగలో మునిగారని, ఒక్క ఏప్రిల్లోనే 60లక్షల మందని ప్రభుత్వ నివేదికలో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఉత్తరాఖండ్‌లో మార్చి 31న కేవలం 1,862 కేసులుండగా ఏప్రిల్‌ 24 నాటికి 33,330 పెరిగినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ రాసింది. దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఎంత మందికి అంటించారో తెలియదు. దేశాన్ని వస్తు ఉత్పత్తి కేంద్రంగా మార్చి యావత్‌ ప్రపంచానికే ఎగుమతులు చేస్తామని చెప్పిన వారు స్వంత జన ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన ఆక్సిజన్‌ ఉత్పిత్తి, పంపిణీ చేయటంలో కూడా ఎందుకు విఫలమయ్యారో, విదేశీ సాయం కోసం ఎదురు చూడాల్సిన అగత్యం గురించి చెప్పటం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే రామాయణం రంకు-భారతం బొంకు అన్న ఇతిహాసాలలోని అధ్యాయాలను మించిపోతాయి. రాబోయే రోజుల్లో వాటి గురించి ఎలాగూ చెప్పుకుంటాం గనుక అసలు విషయానికి వద్దాం.

ఆవులు, ఎద్దులు, దున్నలు, గేదెల వంటి జీవులు ఆహారం దొరకగానే ఆబగా కొద్దిగా నమిలి తింటాయి. తరువాత తీరికగా నోట్లోకి తెచ్చుకొని పూర్తిగా నమిలి మింగుతాయి, దీన్నే నెమరు వేసుకోవటం అంటారు. మనుషులు అలా చేసేందుకు అవకాశం లేదు గానీ జరిగిన అంశాలను తిరిగి జ్ఞప్తికి తెచ్చుకొని నెమరు వేసుకోవచ్చు. గత రెండు నెలల కాలంలో జరిగిన కొన్ని ముఖ్య పరిణామాల గురించి ఒక్కసారి చూద్దాం. ఏప్రిల్‌ 28నాటికి అమెరికాలో పది కోట్ల మందికి పూర్తిగా వాక్సిన్‌ వేశారు, మరో 23 కోట్ల మందికి ఒక డోసు వేశారు.వివిధ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం అమెరికాలో 80 కోట్ల డోసులు అందుబాటులోకి రానుంది. జనాభా అంతటికీ వేసిన తరువాత కూడా పది కోట్ల డోసుల వరకు అదనంగా ఉంటుంది. అయినా అదేమిటో డబ్బు చెల్లిస్తామురా నా ప్రియమైన ఒకే మంచం ఒకే కంచం దోస్తూ అని మన దేశం రెండు నెలల నుంచి మొత్తుకుంటున్నా కోవిషీల్డ్‌ వాక్సిన్‌ తయారీకి అవసరమైన 37 రకాల ముడి పదార్దాలు, పరికరాలను విక్రయించేందుకు కొద్ది రోజుల క్రితం అంగీకరించాం అన్న ప్రకటన తప్ప ఇంతవరకు (మే 1 ) పంపిన దాఖలా లేదు. ఇది కూడా పాక్షిక సడలింపు మాత్రమే అని చెబుతున్నారు.


గతేడాది జరిగిన పరిణామాల నేపధ్యంలో మొత్తంగా మీడియా లేదా పూర్తిగా కాషాయ దళాలుగానీ చైనాను దోస్తుగా పరిగణించటం లేదు. యాప్‌లను నిషేధించారు, అక్కడి నుంచి పెట్టుబడులను ఆపేశారు. వస్తువుల దిగుమతి నిలిపివేసి కాళ్ల దగ్గరకు వచ్చేలా చేసుకుంటామని చెప్పారు. చైనా వస్తువులు నాశిరకం అన్నారు. వాటిని బహిష్కరించాలని పెద్ద హడావుడి చేశారు. ఇదిగో చూడండి మన దిగుమతులు తగ్గిపోయాయని అంకెలు చెప్పారు. అక్కడ తయారు చేసిన వాక్సిన్‌లో పసలేదని రాశారు. ఔషధాల నాణ్యత ప్రశ్నార్దకం అన్నారు. గతేడాది నవంబరు నుంచి రెండు దేశాల మధ్య విమానాల రాకపోకలు, వీసాల జారీలేదు. సరిహద్దు వివాదం గురించి ఎడతెగని చర్చలు సాగుతున్నాయి, ఎటూ తేలటం లేదు. అవి ఎప్పుడు పూర్తవుతాయో లడఖ్‌ కొండలెక్కించిన మన సైనికులను కిందికి ఎప్పుడు దింపుతారో తెలియదు. ఏ విధంగా చూసినా చైనాను శత్రువుగానే పరిగణిస్తున్నారు. చైనా ప్రభుత్వ సిచువాన్‌ విమాన సంస్ధ పదిహేను రోజుల పాటు వస్తురవాణా విమానాల రాకపోకలను నిలిపివేస్తామని ప్రకటించింది. తరువాత వెంటనే తిరిగి అనుమతిస్తామని, అవసరాన్ని బట్టి కొత్త షెడ్యూలును ప్రకటిస్తామని చెప్పింది. ఈలోగా ఇంకే ముంది సాయం చేస్తామని మోసం చేసింది, సరఫరాలను అడ్డుకుంటున్నది అనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే గతేడాది నవంబరు నుంచి ప్రయాణీకుల విమానాల రాకపోకలు లేకున్నా మన దేశంలోని వివిధ ప్రాంతాలకు చైనా నుంచి సిచువాన్‌ సంస్ధ వస్తురవాణా విమానాలను నడుపుతూనే ఉంది.సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులను దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. భారత్‌తో కరోనా విపరీతంగా పెరిగిన కారణంగా పదిహేను రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఏప్రిల్‌ చివరి వారంలో ప్రకటించింది. అంటే అప్పటి వరకు అటు నుంచి ఇటు నుంచి అటు సరకు రవాణా జరుగుతూనే ఉంది. కాషాయ దళాలు చెప్పినట్లు చైనా వస్తువుల బహిష్కరణ లేదు, పాడూ లేదు. తమకు అనేక దేశాల నుంచి ఆర్డర్లు ఉన్నాయని, వాటి తయారీలో తలమునకలుగా ఉన్నామని, అందువలన భారత ప్రభుత్వం తమకు ఏమి కావాలో స్పష్టంగా చెబితే దానికి అనుగుణ్యంగా చర్య తీసుకుంటామని చైనా ప్రభుత్వం ప్రకటించింది. మన దేశం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ లోగా కాషాయ దళం రంగంలోకి దిగింది. చైనా ప్రకటనపై మోడీ సర్కార్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఇంతవరకు అధికారికంగా స్పందన లేదు. మీడియా, కాషాయ దళాలు రచ్చ చేస్తున్నాయి. దక్షిణాసియా దేశాలలో కరోనా నిరోధం గురించి చర్చించేందుకు చైనా విదేశాంగ మంత్రి ఏర్పాటు చేసిన సమావేశానికి మన దేశం డుమ్మాకొట్టింది.


ముడిసరకులపై నిషేధం ఎత్తివేసేందుకు నిరాకరించి వాక్సిన్‌ తయారీకి ఆటంకం కలిగేందుకు కారణమైన అమెరికా గురించి పల్తెత్తు మాట మాట్లాడని వారు చైనా పదిహేను రోజుల పాటు విమానాలను నిలిపివేస్తామని ప్రకటించగానే ఇంకేముంది నమ్మక ద్రోహం చేసింది, దాని బుద్ది బయటపెట్టుకుంది అంటూ రెచ్చిపోవటం ఏమిటి ? అప్రకటన చేసే ముందు రోజు వరకు మనకు అవసరమైన అత్యవసర సరఫరాలన్నింటినీ చైనా నుంచి తెచ్చుకున్నది వాస్తవం కాదా ? నేరుగా చైనా నుంచి గాకుండా ఇతర దేశాల మార్గాల ద్వారా తెచ్చుకొనేందుకు అవకాశం ఉంది, ప్రభుత్వ కంపెనీ గాకుండా ఉన్న మరో విమాన కంపెనీ ఎలాంటి నిషేధం విధించలేదు, దాని ద్వారా తెచ్చుకోవచ్చు. నిజానికి మనలను ఇబ్బంది పెట్టదలచుకుంటే అమెరికా మాదిరి నిషేధమే విధించవచ్చు కదా ! మనకు ఎగుమతి చేసే వాటి మీద మన నుంచి దిగుమతి చేసుకొనే వాటి మీద భారీ ఎత్తున పన్నులు విధించిందన్నది మరొక తప్పుడు ప్రచారం. నిజంగా ఆ పని చేస్తే దాపరికం ఏముంది ? గతంలో జిగినీ దోస్తు అమెరికా ట్రంపు అదేపని చేసినపుడు మీడియాలో వార్తలు వచ్చాయిగా, నిజంగా చైనా ఆ పని చేస్తే ఏ మీడియా కూడా ఎందుకు వార్తలు ఇవ్వలేదు.మన దేశం కూడా చైనా వస్తువుల మీద అదే మాదిరి పన్నులు ఎందుకు విధించకూడదు.

సిచువాన్‌ విమానాలను రద్దుచేసినట్లు ప్రకటించిన తరువాత హాంకాంగ్‌ నుంచి ఢిల్లీకి చైనాకు చెందిన 800 ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లు వచ్చినట్లు, వారంలో మరో పదివేలు పంపుతున్నట్లు కొలంబోలో చైనా రాయబారి ప్రకటించారు. ఏప్రిల్‌ నెలలో 26వేల వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ జనరేటర్లు పంపినట్లు చైనా విదేశాంగ మంత్రి ప్రకటించారు. చైనా నుంచి నేరుగా అవకాశం లేకపోతే సింగపూర్‌, ఇతర ప్రాంతాల మీదుగా తెచ్చుకొనేందుకు అవకాశం ఉంది.ఏప్రిల్‌ ఒకటి నుంచి 25వ తేదీ వరకు చైనా నుంచి ప్రతి రోజూ మన దేశానికి సగటున ఐదు విమానాలు నడిచాయి. వాటిలో సిచువాన్‌ ఎయిర్‌లైన్స్‌తో పాటు ఎస్‌ఎఫ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాలు కూడా ఉన్నాయి, అవి తిరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ సినిమా నటుడు చైనా తీసుకున్న నిర్ణయం కారణంగా తాను ఆర్డరు పెట్టిన ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లు ఆగిపోయాయని ఢిల్లీలోని చైనా రాయబారికి పంపిన ట్వీట్‌లో పేర్కొన్నారు. దాని మీద స్పందించిన రాయబారి ట్వీట్లద్వారా సమాధానం పంపుతూ రెండు దేశాల మధ్య సరకు రవాణా విమానాలు మామూలుగానే తిరుగుతున్నాయని, గత రెండు వారాల్లో 61 విమానాలు తిరిగాయని వెల్లడించారు. అనుమానాలుంటే ఎవరైనా తీర్చుకోవచ్చు, సమస్యలుంటే పరిష్కరించాలని కోరవచ్చు.
అందువలన నిజాలేమిటో, సమస్య ఏమిటో తెలుసుకోకుండా తొందరపడి తీవ్ర విమర్శలు చేయటం తగనిపని, మనకే నష్టం. కొద్ది రోజులుగా పద్దెనిమిది వేల ఆక్సిజన్‌ యంత్రాలకు మన దేశం నుంచి వివిధ సంస్ధలు ఆర్డరు చేశాయని చైనాలోని పెద్ద మెడికల్‌ కంపెనీ జియాంగ్‌సు యు మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ తెలిపింది. భారత్‌తో సహా వివిధ దేశాల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు ఉన్న కారణంగా వెంటనే సరఫరా చేయలేమని, నెల రోజులు కూడా పట్టవచ్చని, భారత మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చైనా సంస్దలు చెబుతున్నాయి.


గతేడాది చైనాతో తలెత్తిన సరిహద్దు వివాద నేపధ్యంలో మోడీ సర్కార్‌ వైఖరిలో అస్పష్టమైన మార్పు వచ్చింది. దానికి అనుగుణ్యంగానే చైనా నుంచి అత్యవసర వస్తువులను కొనుగోలు చేస్తున్నాము. భారత్‌ నుంచి వచ్చిన ఆర్డర్ల మేరకు 25వేల ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్లను సరఫరా చేసేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నామని భారత్‌లో చైనా రాయబారి సన్‌ వెయిడోంగ్‌ నిర్ధారించారు. వాటిని సరఫరా చేసేందుకు అసరమైన సరకు రవాణా విమానాలను సమకూర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.చైనా నుంచి వస్తువులను తీసుకుంటున్నామని భావనా పరమైన సమస్యలేవీ లేవని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకన్నట్లు మీడియా-కాషాయ దళాలు ఎందుకు రచ్చ చేస్తున్నాయి ?


లండన్‌ కేంద్రంగా పని చేస్తున్న ఎయిర్‌ఫినిటీ అనే సంస్ధ సేకరించిన సమాచారం ప్రకారం మార్చినెలాఖరుకు 16.4 కోట్ల కరోనా వాక్సిన్‌ డోసులను అమెరికా ఉత్పత్తి చేసింది. ఒక్కడోసు కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేయలేదు. ఐరోపా యూనియన్‌ పదకొండు కోట్ల డోసులు ఉత్పత్తి చేయగా 42శాతం ఎగుమతి జరిపింది. చైనాలో తయారైన సినోవాక్‌, సినోఫామ్‌ 20 కోట్ల డోసులను ఎగుమతి చేశారు. అమెరికా మీద తీవ్రమైన వత్తిడి రావటంతో రాబోయే రోజుల్లో ఆరుకోట్ల డోసుల ఆస్ట్రాజెనెకా వాక్సిన్‌ ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు అంగీకరించింది. ఇది గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం వంటిదే. ఈ వాక్సిన్‌ వినియోగానికి అమెరికాలో అనుమతి ఇవ్వాలో లేదో నిర్ణయించక ముందేే కొనుగోలు చేశారు. తరువాత అనుమతి ఇవ్వలేదు. అందువలన దాన్ని వదిలించుకొనేందుకు ముందుకు వచ్చింది. లేనట్లయితే అది నిరుపయోగంగా అక్కడే ఉండిపోతుంది.


వాక్సిన్‌ తయారీలో ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతిక పరిజ్ఞానంలో అమెరికా సంస్దలదే గుత్తాధిపత్యం.అక్కడి ఫైజర్‌ కంపెనీకి అవసరమైన ముడిపదార్దాల సరఫరా తద్వారా దాని లాభాలను ఇబ్బడి ముబ్బడి చేసేందుకు వాటి మీద నిషేధం విధించినట్లు చెబుతున్నారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అమెరికా, ఐరోపా స్వంతం కావటంతో వేగంగా పెద్ద మొత్తంలో తయారు చేసి సొమ్ము చేసుకొనేందుకు వాక్సిన్‌ తయారీని ఒక్కోదశలో ఒక్కో దేశానికి అప్పగించారు. మోడెర్నా వాక్సిన్‌ స్విడ్జర్లాండ్‌లో తయారు చేసి దాన్ని సీసాల్లో నింపేందుకు స్పెయిన్‌కు పంపుతారు. బ్రిటన్‌ కంపెనీ క్రోడా వాక్సిన్‌ తయారు చేసి సీసాల్లో నింపేందుకు నార్మండీ, ఫ్రాన్స్‌ పంపుతున్నారు. ఒక వేళ తమ కంపెనీ వాక్సిన్‌ వికటించి వినియోగించిన వారికి పరిహారం చెల్లించాల్సి వస్తే కోర్టు దావాల నుంచి ఔషధ కంపెనీలకు రక్షణ కల్పించేందుకు లాటిన్‌ అమెరికాలోని అర్జెంటీనా, బ్రెజిల్‌, ఇతర దేశాలు ప్రభుత్వ ఆస్తులను, రిజర్వుబ్యాంకుల నిధులు, మిలిటరీ కేంద్రాల వంటి వాటిని తాకట్టుపెట్టాలని ఫైజర్‌ కంపెనీ వత్తిడి చేసినట్లు వార్తలు వచ్చాయి. పూర్తిగా కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తే ఇదేంట్రాబాబూ తొలి రోజుల్లోనే బిడెన్‌ పెద్దమనిషి ట్రంప్‌ కంటే దారుణంగా తయారయ్యాడు అని ఎక్కడ అనుకుంటారో, అమెరికా వ్యతిరేకత ఎక్కడ పెరుగుతుందో అనే భయం – బిడియంతో వాక్సిన్‌ తయారీ వస్తువులపై నిషేధాన్ని కాస్త సడలించేందుకు నిర్ణయించుకున్నట్లుగా గత కొద్ది రోజుల పరిణామాలు స్పష్టం చేశాయి.

అజిత్‌ దోవల్‌ ఎవరికి ఏ భాషలో చెప్పాలో ఆ భాషలో చెప్పి దారికి తెస్తారని, అమెరికాను అదే విధంగా హెచ్చరించి మనకు సరఫరాలు చేసేందుకు అంగీకరింప చేయించారని కాషాయ దళాలు ప్రచారం ప్రారంభించాయి. మరి అదే అజిత్‌ దోవల్‌ చైనా విషయంలో కూడా అదే విధంగా ఎందుకు వ్యవహరించలేదు, అమెరికా కంటే బలహీనమైన చైనాను కాషాయ దళాల భాషలో చెప్పాలంటే ఎందుకు మన కాళ్లదగ్గరకు తేలేదు ? చివరికి బలహీన పాకిస్దాన్‌న్ను ఎందుకు అంకెకు తేలేకపోయారు ? మన ఇరుగు పొరుగుదేశాలను మన వైపు ఎందుకు తిప్పలేకపోయారు. అజిత్‌ దోవల్‌కు అంతసీన్‌ లేదు ! నరేంద్రమోడీ కంటే బలవంతుడా ! అందరికీ చెడ్డాం, చివరికి మీరు కూడా ఇలా చేస్తే మా మోడీ పరువు, పనేంగాను అని సాష్టాంగపడ్డారేమో ? చరిత్రలో ఇలాంటివారిని అమెరికన్లు ఎందరినో చూశారు. తిరిగే చక్రం మీద కూర్చున్న ఈగ దాన్ని తానే తిప్పుతున్నట్లు భావిస్తున్నట్లుగా ఈ ప్రచారం ఉంది. ఇలాంటి పోసుకోలు కబుర్లతో నరేంద్రమోడీ వైఫల్యాలను కప్పిపుచ్చగలరా ? తోకపట్టుకొని పోవటం తప్ప మరొక విధంగా వ్యవహరించలేని రీతిలో మనం అమెరికా చేతిలో చిక్కాము. దాన్ని నమ్మి రెచ్చి పోయి చైనా, పాకిస్దాన్‌, ఇతర ఇరుగు పొరుగు దేశాలను దూరం చేసుకున్నాం, వాటన్నింటినీ చైనాకు దగ్గర చేశాము. రెండునెలలుగా ససేమిరా అని మొరాయిస్తుంటే అజిత్‌ దోవల్‌ గానీ నరేంద్రమోడీ గానీ చేసిందేమీ లేదు. మిత్రదేశం అని చెప్పిన భారత్‌ను అమెరికన్లు ఎలా నిర్లక్ష్యం చేశారో చూడండి అంటూ చైనా మీడియాలో వ్యాఖ్యలు, ఇతర దేశాల నుంచి విమర్శలు, వత్తిడి, అన్నింటికీ మించి మన దేశంలో అమెరికా వ్యతిరేకత పెరిగితే తమకూ, అనుయాయి నరేంద్రమోడీకి నష్టం అని లెక్కలు వేసుకున్న తరువాతనే అమెరికా వైఖరిలో మార్పు వచ్చింది.


శ్రీరాముడంతటి శక్తివంతుడే రావణుడిపై పోరుకు ఉడత సాయం తీసుకున్నారని గొప్పగా చెప్పుకుంటారు. రాముడి అడుగుజాడల్లో నడుస్తున్నామని చెబుతున్నవారు పాక్‌ నుంచి సాయం తీసుకొనేందుకు తిరస్కరించటం శ్రీరాముడి పట్ల అపచారం చేసినట్లు కాదా ?వెంటిలేటర్లతో సహా కొన్ని ఇతర వైద్య సామగ్రిని పంపుతామని పాకిస్ధాన్‌ ప్రకటించింది. అయితే దాన్ని స్వీకరిస్తామని గానీ తిరస్కరిస్తున్నట్లుగానీ మోడీ సర్కార్‌ ప్రకటించలేదు. స్వీకరించటం తమ స్ధాయికి భంగకరమని, తలెత్తే ప్రశ్నలు, విమర్శలకు సమాధానాలు చెప్పలేమని ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.పాకిస్ధాన్‌తో సయోధ్య కుదిరినట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించినప్పటికీ ఈ వైఖరితో వ్యవహరించటం గమనించాల్సిన అంశం. పదహారు సంవత్సరాల క్రితం విదేశీ సాయం తీసుకోవటంపై మన్మోహన్‌ సింగ్‌ హయాంలో స్వయంగా విధించుకున్న ఆంక్షలను గుట్టుచప్పుడు కాకుండా నరేంద్రమోడీ ఎత్తివేసింది. చైనా నుంచి ప్రాణావసర ఔషధాలు, ఆక్సిజన్‌, సంబంధిత పరికరాలను తీసుకొనేందుకు భావనా పరమైన సమస్యల్లేవని ఒక అధికారి చెప్పినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక పేర్కొన్నది. అయితే పాకిస్ధాన్‌ నుంచి స్వీకరించే విషయంలో ఏం చేయాలనేది స్పష్టం చేయలేదు. ఇప్పటి వరకు ఉన్న విధానం ప్రకారం విదేశాల నుంచి బహుమతులు, విరాళాలను స్వీకరించాల్సి వస్తే వాటిని రెడ్‌ క్రాస్‌ సంస్ధకు మాత్రమే అందచేయాలి, దాని ద్వారానే పంపిణీ చేయాలి.ప్రభుత్వాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవాటికి వెల చెల్లించి మాత్రమే తీసుకోవాలి. గత కొద్ది రోజులుగా అమెరికాతో సహా వివిధ దేశాల నుంచి ప్రకటిస్తున్న సాయమంతా డబ్బు చెల్లించి కొనుగోలు చేసేదే అని గ్రహించాలి. విధాన సడలింపుల తరువాత వచ్చే సాయంలో కొంత విరాళం కొంత నగదు చెల్లింపులు ఉండే అవకాశం ఉంది. ఇంటా బయటా వెల్లువెత్తుతున్న విమర్శలు, ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేస్తున్న నేపధ్యంలో ఈ మార్పు చేసినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నేరుగా తమకు అవసరమైన వాటిని విదేశాల నుంచి సేకరించుకోవచ్చని కేంద్రం సూచించింది.

అంతకు ముందు ఉత్తరా ఖండ్‌ భూకంపం(1991) లాతూర్‌ భూకంపం(1993) గుజరాత్‌ భూకంపం(2001) బెంగాల్‌ తుపాను(2002) బీహార్‌ వరదలు(2004) సంభవించిన సమయాలలో విదేశీ సాయం తీసుకున్నాము.2004లో సునామీ తరువాత పరిస్ధితిని మనకు మనమే ఎదుర్కోగలమంటూ విదేశీ విరాళాలను తీసుకోవద్దని, అవసరమైతే వారి సాయం తీసుకుందామని నిర్ణయించారు. దీనికి అనుగుణ్యంగా 2005లో కాశ్మీరులో భూకంపం, అక్కడే 2014లో వరదల సమయాలో, 2013లో ఉత్తరా ఖండ్‌ వరదల సమయంలో విదేశీ విరాళాన్ని తీసుకొనేందుకు ప్రభుత్వ నిరాకరించింది.తాజా విషయానికి వస్తే లక్షలాది మంది మళయాలీలు పని చేసే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం 2018లో కేరళ వరదల సమయంలో 700 కోట్ల రూపాయల విరాళం అందచేస్తామని ముందుకు వచ్చినపుడు కేంద్రం తిరస్కరించింది. ఆ మేరకు కేంద్రం సాయం ఇవ్వకపోవటం తీవ్ర విమర్శలు రావటం అది వేరే విషయం. కానీ అదే ప్రభుత్వం పిఎం కేర్‌ నిధికి ఎవరు విరాళం ఇచ్చినా తీసుకోవాలని గతేడాది నిర్ణయించింది. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే స్వీకరించనుంది. అయితే ఈ అంశాన్ని బహిరంగంగా ప్రకటించలేదని, ఇదే సమయంలో సాయం చేయాల్సిందిగా ప్రభుత్వం ఎలాంటి వినతులు చేయలేదని, ప్రభుత్వాలు లేదా ప్రయివేటు సంస్ధలు ఏవైనా బహుమతిగా విరాళం ఇస్తే కృతజ్ఞతా పూర్వకంగా స్వీకరిస్తామని ఒక అధికారి చెప్పినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొన్నది. గతంలో మన ప్రభుత్వం ఇతర దేశాలకు విరాళంగా ఇచ్చిన హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ నుంచి వాక్సిన్లకు ప్రతిగా ఇలాంటి విరాళాలు వస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


ఇప్పుడు కావాల్సింది ఏమిటి ? ప్రపంచ లేదా ప్రాంతీయ రాజకీయాలు, శత్రుత్వమా ? ప్రజల రక్షణా ఏది ముఖ్యం. నిజమైన రాజనీతి ప్రాధాన్యత జన సంక్షేమం అన్నది స్పష్టం. గతంలో అన్ని దేశాలూ రాజకీయాలు చేశాయి. ఒకదానిని ఒకటి దెబ్బతీసుకొనేందుకు ప్రయత్నించాయి. మనం తప్ప మిగతావన్నీ అదే చేశాయనే కాషాయ ప్రచారాన్ని ఎవరైనా నమ్మితే తప్పుదారి పట్టినట్లే. చైనాకు వ్యతిరేకంగా మనం అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాతో చతుష్టయం పేరుతో కలిశాము. అయినా దానిని పక్కన పెట్టి చైనీయులు మనకు అవసరమైన వాటిని విక్రయిస్తున్నారు. ఎలాంటి నిషేధం పెట్టలేదు. మిత్రదేశం అనుకున్న అమెరికా ఆ పని చేసింది. మనకు వ్యతిరేకంగా పాకిస్ధాన్‌ -చైనా దగ్గరయ్యాయి. అమెరికాకు అనుకూలంగా మనం ఇరాన్‌ను దూరం చేసుకున్నాము. అమెరికాకు వ్యతిరేకంగా అది చైనాకు దగ్గరైంది. ఇతర ఇరుగుపొరుగు దేశాలు కూడా అమెరికాతో మన సంబంధాల కారణంగా చైనా వైపు మొగ్గుచూపుతున్నాయన్నది స్పష్టం. ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు, దేనితో ఎలా తేల్చుకోవాలో తరువాత నిర్ణయించుకోవచ్చు. సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ చైనాతో స్నేహం చేశాము, ఇప్పటికీ ఎగుమతి-దిగుమతి కొనసాగుతూనే ఉంది. పాకిస్ధాన్‌తో వైరం ఉన్నప్పటికీ నిన్న మొన్నటి వరకు వాణిజ్యంలో అత్యంత సానుకూల హౌదా ఇచ్చాము. ఒకవైపు మిత్ర రాజ్యం అంటూనే మరోవైపున మన ప్రయోజనాలకు వ్యతిరేకంగా అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్దలో ఫిర్యాదులు చేస్తున్నది, మన వస్తువుల దిగుమతులపై ఉన్న పన్ను రాయితీలను రద్దు చేసింది, కొత్తగా దిగుమతి పన్నులు వేసింది. మాకు మా దేశ పౌరులు తప్ప మిగతావారి గురించి పట్టించుకోము అంటూ వాక్సిన్‌ ముడిసరకులు, పరికరాలపై నిషేధం విధించినా అమెరికాతో సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అదే విధానం చైనా, పాకిస్దాన్‌తో ఎందుకు అనుసరించకూడదో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. వివాదాలు, విబేధాలతో రాజీపడాలని, లొంగిపోవాలని ఎవరూ చెప్పటం లేదు. ప్రజానుకూలంగా విధానాలుండాలని చెప్పటం తప్పుకాదు. అలాంటి వైఖరి, విదేశాల సాయం లేకుండా కరోనా బారి నుంచి మన జనాన్ని మన ప్రభుత్వం కాపాడగలదా ?

ఆపదలో ఆదుకుంటాయని నమ్మిన అమెరికా, జపాన్‌, ఐరోపా దేశాలు ముఖం చాటేశాయి.మనలను చైనాకు వ్యతిరేకంగా ఉపయోగించుకొనేందుకు ఇచ్చిన ప్రాధాన్యత ఆదుకొనేందుకు ఇవ్వలేదని కరోనా నిరూపించింది. మార్చినెలలో జరిగిన తొలి చతుష్టయ సమావేశంలో ప్రపంచానికి వంద కోట్ల వాక్సిన్లు అందించాలని, వాటిని భారత్‌లో తయారు చేసేందుకు అవసరమైన సాయం చేయాలని కూటమి నిర్ణయించింది. ఇప్పుడు మన దేశమే వాక్సిన్ల కొరతను ఎదుర్కొంటుంటే మిగతా దేశాలు ముఖం చాటేస్తున్నాయి. ముడిపదార్దాల సరఫరాను అడ్డుకుంటున్నాయి. లక్షల సంఖ్యలో ఆక్సిజన్‌ జనరేటర్లు మనకు అవసరం కాగా కొన్ని వందలు పంపుతూ దాన్నే పెద్ద సాయంగా అమెరికా చిత్రిస్తున్నది. జపాన్‌ మౌనంగా ఉంది.మానవహక్కుల గురించి నిత్యం కబుర్లు చెప్పే, గుండెలు బాదుకొనే అమెరికా, ఐరోపా ధనిక దేశాలు కరోనా వాక్సిన్ను మానవ హక్కుగా పరిగణించటం లేదు. అలాంటి వాటిని నమ్మి అలీన విధానానికి తిలోదకాలిచ్చి వాటి చంకనెక్కితే ప్రయోజనం లేదని తేలిపోయింది కనుక భేషజాలకు పోకుండా ఇప్పటికైనా మన విదేశాంగ విధానాన్ని పున:పరిశీలించుకోవటం అవసరం.
హొహొహొ

Share this:

  • Tweet
  • More
Like Loading...

వాక్సిన్‌లను కంపల్సరీ లైసెన్సు క్రిందకు తేవాలి !

01 Saturday May 2021

Posted by raomk in Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

Compulsory license clause, Corona vaccine, Cuba Corona Vaccine


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌

కరోనా మొదటి వేవ్‌ తోనే విలవిల్లాడిన ప్రజలు రెండవ సారి వచ్చిన కరోనా వేవ్‌ ను తట్టుకోలేకపోతున్నారు. తీవ్రమైన భయం, ఆందోళన తో జీవిస్తున్నారు. హాస్పిటల్‌ లో బెడ్స్‌ దొరకక, ఆక్సిజన్‌ లేక, మందులు అందుబాటులో లేక, హాస్పిటల్‌ ఖర్చులు, మందుల ధరలు భరించలేక సగం చచ్చిపోతున్నారు. మరణించినవారికి శ్మశానం లో కూడా చోటు దొరకటంలేదు. శ్మశాన వాటికలో ఖర్చులుకూడా పెరిగి బ్రోకర్లు చేరి పాకేజీలు ప్రవేశపెట్టారు.

కరోనా వ్యాక్సిన్‌ తయారీకి సంబంధించిన కీలకమైన ముడిపదార్ధాల ఎగుమతులపై నిషేదాన్ని ఎత్తి వేయమని కోరిన సీరమ్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అధినేత అభ్యర్ధనను అమెరికా ఫ్రభుత్వం నిరాకరించింది. ” మా ప్రయోజనాలే మాకు ముఖ్యం. అమెరికా ప్రజల ప్రాణాలను కాపాడుకోవలసిన భాధ్యత మా ప్రభుత్వం పై వుంది.అమెరికా కంపెనీలు దేశీయ వినియోగానికి ప్రాధాన్యత నివ్వాలనేదే ఇక్కడి చట్టం ” అని అమెరికా ప్రభుత్వ ప్రతినిధి మీడియాతో చెప్పాడు. తమకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు పంపకపోతే….ప్రతీకారం …తీర్చుకుంటామని ఆనాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బెదిరించిన కొద్ది సేపటికే తీవ్ర ప్రభావిత దేశాలకు ఇనోక్షేన్‌ నివారణకోసం మాత్రలను అందచేస్తామని భారత్‌ ప్రకటించింది. మన దేశాన్ని బెదిరించి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను తీసుకు వెళ్లిన అమెరికా, మన కవసరమయిన కరోనావాక్సిన్‌ ముడిపదార్ధాలు ఇవ్వడానికి నిరాకరించింది. డెమోక్రాటిక్‌ పార్టీ లోని ఇండియన్‌ అమెరికన్ల ఒత్తిడి, ప్రపంచప్రజాభిప్రాయం తరువాత వాక్సిన్‌ ముడిపదార్ధాలను ఇవ్వటానికి అంగీకరించారు.

దేశంలో ఆరోగ్యం అత్యవసర పరిస్థితిని అధిగమించటానికి సార్వత్రిక, సామూహిక వ్యాక్సినాటిన్‌ కార్యక్రమం చేపట్టాలి. మసూచి,బీ సీ జీ, అన్ని టీకాలూ అందరికీ ఉచితంగా ఇవ్వటం ఇప్పటిదాకా అనుసరించిన మంచి విధానం. పోలియో, యం యం ఆర్‌, పెంటావేలేవుట్‌ వాక్సిన్‌ వరకూ అన్ని కేంద్రప్రభుత్వమే ఉచితంగా ఇచ్చేది. కరోనా వాక్సిన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పుకొని రాష్ట్ర ప్రభుత్వాలపై బాధ్యతను నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నది. ప్రజలను కొనుక్కోమని కూడా చెప్తున్నది.
తెలుగు ప్రజలు త్యాగంతో సాధించుకున్న వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఔదార్యంతో ఆక్సిజెన్‌ ఇచ్చి అనేక రాష్టాల్లోని ప్రజల ప్రాణాలను నిలుపుతున్నది. ప్రాణాలను నిలిపేది సమాజ శ్రేయస్సు కోరేప్రభుత్వ సంస్థలేనని ఇప్పటికయినా ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వ మందుల కంపెనీలు ఐ డీ పీ యెల్‌ ఉంటే రెండేసివీర్‌ ఇంజక్షన్‌ అతి తక్కువ ధరకు లభ్యమయ్యేది. వేల రూపాయల్లో బ్లాక్‌ మార్కెట్‌ సాగే అవకాశం ఉండేదా?

కొత్త ఔషధాలను, టీకాలను సైంటిస్టులు ప్రజలప్రయోజనాలకోసం కనిపెట్తారు. ఆ ఖర్చులు భరించిన కంపెనీలు ఆ ఔషధాన్ని మరే కంపెనీ తయారుచేయకుండా ప్రభుత్వం దగ్గర పేటెంట్‌ ఆర్డరు వేయించుకుని అంతులేని ధనార్జనకు పూనుకుంటున్నారు.. అంటే పేటెంటె తీసుకుంటారు. 20 సంవత్సరాలు ఆ మందును తమ ఇష్టమొచ్చిన రేటుకి ప్రపంచంలో ఎక్కడైనాఅమ్ముకోంటున్నారు.

కంపల్సరీ లైసెన్సింగ్‌ ఇవ్వాలి

డబ్లు టీ ఓ నిబంధనలను తయారుచేసేటపుడు తెలిసో తెలియకో ఒక చిన్న వెసులుబాటును పేద దేశాలు కల్పించుకున్నాయి. ఆ ప్రకారం ఒక దేశంలో ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్ధితులు ఏర్పడినపుడు కంపల్సరీ లైసెన్సింగ్‌ ఇవ్వటానికి అవకాశంవున్నది. 1970 పేటెంట్‌ చట్టం సెక్షన్‌ 84 ప్రకారం ప్రజల అవసరాలను తీర్చలేనపుడు మందు అందుబాటులో లేకపోతే, మందు ఖరీదును ప్రజలు భరించలేకపోతే, స్ధానిక మార్కెట్‌ లో అందుబాటులో లేకపోతే పెటెంట్‌ ఆఫీసర్‌ స్ధానిక ఉత్పత్తి దారునికి తప్పనిసరిగా లైసెన్సను ఇవ్వవచ్చు. ఛాలా తక్కువ ధరకు ప్రాణాలను నిలిపే మందుల తయారీకి అనుమతించవచ్చు. పేటెంట్‌ చట్టాన్ని పక్కన పెట్టవచ్చు. సెక్షన్‌ 92 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ద్వారా కంపల్సరీ లైసెన్సును ఇవ్వవచ్చునని చట్టం లో ఉంది.. చాలా ఖర్చుపడి పరిశోధన జరిపినందుకు పేటెంట్‌ కంపెనీ కి అమ్మకాలలో 4-6 శాతం రాయల్టీగా ఇచ్చేటట్లుగా కూడా చట్టంలో వుంది.

సోరాఫెనిబ్‌ ( బ్రాండ్‌ నేమ్‌ ..నెక్సావార్‌) అనే లివర్‌ ,కిడ్నీకేన్సర్‌ మందును బేయర్‌ కంపెనీ తయారు చేసి మన దేశంలో అమ్ముతున్నది. అందుకు బేయర్‌ కంపెనీకి 1970 పేటెంటె చట్టం ప్రకారం హక్కులున్నాయి. ఆ కేన్సర్‌ మందును వేరెవరూ తయారుచేయకూడదు. అమ్మకూడదు . నెలకు సరిపోయే ఆ మందును రూ 2లక్షల80 వేల కు అమ్ముతున్నది. పేటెంటు చట్టం పేరున ప్రపంచ ప్రజలను పీక్కు తింటున్నారు. రీసర్చ్‌ ఖర్చులు ఒకటి రెండు సంవత్సరాలలోనే వసూలు చేసుకొంటున్నారు. మందు తయారీ ఖర్చుకు కొన్ని వేల రెట్లు అధికంగా 20 సంవత్సరాలు వసూలు చేస్తున్నారు. ఒక టన్ను ముడిసరుకును కొని మిల్లీ గ్రాముల పరిమాణంతో బిళ్ళలు , ఇంజక్షన్లు తయారుచేసి ఇష్టమొచ్చిన ధర కి అమ్ముకుంటున్నారు. 2012 మార్చినెలలో ఇండియన్‌ పెటెంట్‌ ఆఫీసర్‌ పీ హెచ్‌ కురియన్‌ ధైర్యంగా ప్రజలకు అనుకూలంగా తీర్పును ఇచ్చారు. మొదటిసారీ ఆఖరుసారీ ప్రజలకు అనుకూలంగా కంపల్సరీ లైసెన్సింగ్‌ ఆర్డరును ఇచ్చి కురియన్‌ చరిత్రలో నిలిచారు. భారతదేశంలో నెలకు సరిపోయే నెక్సావార్‌ కాన్సర్‌ మందును రూ.8800. కు అమ్మేటట్లుగానూ బేయర్‌ కంపెనీకి అమ్మకాలలో 6 శాతం ఇచ్చేటట్లుగా ఇండియన్‌ పేటెంట్‌ యాక్ట్‌ 2005 క్రింద పేటెంట్‌ ఆఫీసు చారిత్రాత్మక ఆర్డరును ఇచ్చింది. నాట్కో కంపెనీకి అనుమతించింది, 50 ఏళ్ళ పేటెంట్‌ చట్టం చరిత్ర లో ప్రజల మేలుకోసం ఇచ్చిన తీర్పు ఇదే.
అత్యవసర పరిస్ధితులలో ” కంపల్సరీ లైసెన్సు ” ఇవ్వవచ్చు. కరోనా మహమ్మారి కిమించి అత్యవసర పరిస్ధితి ఏమున్నది.? ప్రభుత్వం, మందుల కంపెనీలు కంపల్సరీ లైసెన్సును తీసుకోవచ్చు కదా. పేటెంట్‌ చట్టం ముఖ్యమా? ప్రజల ప్రాణాలు ముఖ్యమా? రెండేసివర్‌ మందును, కావాక్సిన్‌, కోవిషిల్డ్‌ వాక్సిన్లను కంపల్సరీ లైసెన్స్‌ క్రిందకు తీసుకురావచ్చు. కరోనా బాధితు లందరికీ కరోనా మందులను, వాక్సిన్లను అందించి ప్రాణాలను కాపాడ వచ్చు. ఈ అవకాశాన్ని మందుల కంపెనీలు, ప్రభుత్వం ఉపయోగించుకుని ప్రజలను కరోనానుండి కాపాడే అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇపుడు ఉపయోగిస్తున్న మందులన్నీ పాతవే. కోవిడ్‌-19 కి కాకపోయినా వైరస్‌ వ్యాధులైన సార్స్‌, మెర్స్‌, ఎబో లా, ఇన్‌ ఫ్లూయంజా. హెపటైటిస్‌-సీ, హెచ్‌.ఐ.వీ. వ్యాధుల కోసం అభివ ధిచేశారు. కోవిడ్‌-19 ని కట్టడి చేయటంలో ఆశించిన ఫలితాలు ఏ ఒక్కమందులోనూ లేవు. కొత్త మందులేవీ లేవు కాబట్టి పాత మందులను కారుణ్య కారణాలతో అనుమతిస్తున్నారు. పాత మందులకు కొత్త ఇండికేషన్స్‌, రీ పర్పస్‌ అంటే నూతన ప్రయోజనాలను, ఉపయోగాలను కనుగొని, క్లినికల్‌ ట్రయల్స్‌ చేసి పాత మందులను అమ్ముకునే ప్రయత్నం జరుగుతున్నది.

ఒక దశాబ్దం క్రితం కనిపెట్ట్టిన రెమిడెసివీర్‌ అనేమందును మొదట హెపటైటిస్‌ చికిత్సకు అభివృద్ది óచేశారు. ఆఫ్రికా లో ఎబోలా వ్యాధిని నియంత్రించటానికి మందుగా ప్రయోగించారు, ఉపయోగపడలేదు. అయినా ట్రయల్స్‌లో దుష్పలితాలేమీ కలగనందున కోవిడ్‌-19 చికిత్స లో క్లినికల్‌ ట్రయల్స్‌ మొదలెట్టారు. అమెరికాకు చెందిన గిలియాడ్‌-బయోఫార్మస్యూటికల్స్‌ కంపెనీలకు రెమిడెసివిర్‌ పై పేటెంట్‌ హక్కులున్నాయి. ఎబోలావ్యాధి తగ్గకపోయానా, మందు పనిచేసినా చేయకపోయినా గిలియడ్‌ కి వున్న పేటేంట్‌ హక్కు పోలేదు. వీలైన చోట తయారు చేయించుకొనటానికి, ఇష్టమొచ్చిన రేటుకి ఎక్కడైనా అమ్ముకోవటానికి పేటెంటే చట్టం అవకాశ మిచ్చింది. రెమిడెస్విర్‌ జనరిక్‌ మందును తయారు చేయటానికి డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ ) అనుమతిని ఇచ్చారు.ఆ మందును తయారుచేయటానికి హైదరాబాద్‌ కు చెందిన హెటిరో , సిప్లా, జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, జైడస్‌ కాడిలా కంపెనీలతో గిలియాడ్‌ ఒప్పందాలు కుదుర్చుకున్నది .కోవిఫర్‌ బ్రాండ్‌ పేరున 100 మి.గ్రా.ఇంజెక్షన్గను ఒకరు విడుదలచేసారు. దీని ప్రకారం ఈ ఔషదాన్ని తయారుచేసి మన దేశంతోపాటు, 127 దేశాలలో విక్రయించుకోవటానికి ఈ కంపెనీలకు అనుమతి లభించింది.

రెమ్డెసీవీర్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా మరణాల రోటు తగ్గకపోవటం ఆందోళన కలిగిస్తున్నది. అయితే రోగి శరీరంలోని వైరస్‌ లోడ్‌ తగ్గటం ప్రోత్సాహకరంగా వుంది. కరోనాకి మేజిక్‌ మందుకాకపోయినా, మ త్యువు నుండి కాపాడలేకపోయినా కొంత ప్రయోజనాన్ని సైంటిస్టులు గుర్తించారు. కోలుకోవడానికి సమయం తగ్గించటంలో స్పష్టమైన ప్రభావం చూపింది. ఆసుపత్రి లో వుండవలసిన కాలం 15 రోజులనుండి 11 రోజులకు తగ్గింది. రెమిడెసివీర్‌ ఎవరికి ఎలా ఇవ్వాలి 1) కరోనా వ్యాధి వచ్చిన రోగి ఆసుపత్రిలో అత్యవసర విభాగం (ఐసీయూ) లో డాక్టర్ల పర్యవేక్షణలో వుండాలి. ఆక్సిజన్‌ సాచ్యురేషన్‌ 94 శాతం కన్నా తక్కువ వుండాలి. 2) ఆక్సిజన్‌ సహాయం పై సీరియస్‌ గా వున్న రోగులకు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌ పై మందును ఇంట్రా వీనస్‌ ఇంజంక్షన్‌ గా ఇవ్వాలి.3) రెమిడెసివిర్‌ 100 మి.గ్రా.ల ఇంజెక్షన్‌ పొడిని ఐ వీ ఫ్లూయిడ్‌ ద్వారా నరానికి ఇవ్వాలి. మొదటి రోజు రెండు డోసులు, ఆ తర్వాత నాలుగు రోజులపాటు రోజుకి ఒక్కసారి ఇవ్వాలంటున్నారు. వ్యాధి తీవ్రంగా వుంటే మరో ఐదు రోజులు అంటే మొత్తం 10 రోజులు ఇంజెక్షన్లు ఇవ్వాలి.

అయిదురోజుల చికిత్సకు రెమిడెసివీర్‌ మందు ఖర్చు 40 వేల రూపాయలు అంటున్నారు, కానీ అపుడే బ్లాక్‌ మార్కెట్లో కొన్ని రెట్లు ఎక్కువకు అమ్ముతున్నారు. వందల రూపాయలకు ఇవ్వవలసిన ఒక డోసు మందును రూ. 30,000 వేలనుండి లక్ష వరకూ అమ్ముతున్నారు.పేటెంట్‌ హక్కు ఉన్నగిలియాడ్‌ సైన్సెస్‌ అనే అమెరికన్‌ కంపెనీ ఉత్పత్తి చేసిన రెమిడెసీవీర్‌ మందులన్నీ అమెరికాకే ఫస్ట్‌ ఇవ్వాలని ట్రంప్‌ దురహంకారంతో ఆదేశించాడు. రెమిడెసీవీర్‌ మందును ఇంజెక్షన్‌ గా తయారుచేయటానికి 3 డాలర్లు ఖర్చవుతుంది. 3000 డాలర్లకు కంపెనీ అమ్ముతున్నది. ధనవంతులు విమానాలలో విదేశాలు తిరిగి మన దేశానికి వచ్చి కరోనా వ్యాధిని అందరికీ పంచారు. ధనవంతులు ఆరోగ్యాన్ని కొనుక్కుంటున్నారు, పేదప్రజలు కరోనాతో సహజీవనం చేస్తున్నారు. గతేడాది మార్చి 19 న డోనాల్డ్‌ ట్రంప్‌ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ను ”చాలా ప్రోత్సహకరమైనది” ,” చాలా శక్తివంతమైనది” మరియు ”గేమ్‌ ఛేంజర్‌” అని పత్రికా విలేఖరుల సమావేశంలో అభివరి?ంచారు. తరువాత ప్రపంచవ్యాపితంగా అనూహ్యమైన డిమాండ్‌ ఏర్పడింది. మార్చి 28 న యు.యస్‌.ఎఫ్‌.డీ.ఏ ఆమోదించింది. ఏప్రిల్‌ 24 న వైద్యుల పర్యవేక్షణ లేకుండా ట్రంప్‌ చెప్పిన హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ను వాడటం ప్రమాదమని చెప్పింది.

అందరికీ వైద్యం, అందరికీ టీకాలు

స్పానిష్‌ ఫ్లూ తరువాత అధికారంలోకి వచ్చిన శ్రామికవర్గ సోవియట్‌ సోషలిస్టు కమ్యూనిస్టు ప్రభుత్వం , ప్రపంచంలో మొదటిసారిగా ప్రజలందరికీ వైద్యం అనే ఆలోచనను ఆచరణలోకి తెచ్చింది. ప్రపంచ ప్రజలందరికీ ఆదర్శమయింది. అందరికీ విద్యనందించి ప్రజలకు ప్రాధమిక ఆరోగ్యసూత్రా లను నేర్పి చైతన్యపరచింది. ఆ ఒరవడిలోనే క్యూబా పయనిస్తూ లాటిన్‌ అమెరికన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ 1999 లో స్ధాపించి ప్రపంచ పేద విద్యార్ధలను డాక్టర్లుగా తీర్చిదిద్దుతున్నది. ఎక్కడ వైద్య కార్యకర్తలు అవసరమైతే అక్కడికి డాక్టర్లను పంపుతుంది.క్యూబా లాంటి సోషలిస్ట్‌ దేశాల్లో పరిశోధలనకు ప్రభుత్వమే నిధులను సమకూరుస్తుంది. బయోటెక్నాలజీ లో అధ్బుత విజయాలను సాధించి. ప్రపంచంలోమొదటిసారిగా మెనింజిటిస్‌ -బీ, మెదడు జబ్బుకి వాక్సిన్‌ తయారు చేసింది. ఎం ఎమ్‌ ఆర్‌ వాక్సిన్‌ ను క్యూబా తయారు చేసి భారతదేశం తో సహా ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలకు అతి చౌకగా అందించిన ఘనత కాస్ట్రో ప్రభుత్వానికే దక్కింది. హవానా లోని ఫినిలే ఇన్స్టిట్యూట్‌లో 5 కరోనా వాక్సిన్ల అభివ ద్ధి లో పురోగతిని సాధించారు.

పేరులోకూడా ప్రతాపం
క్యూబా వాక్సిన్లకు పెట్టిన పేర్లు కూడా ప్రత్యేకమైనవే. మన దేశంలో వాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేని నరేంద్రమోడీ వాక్సినేషన్‌ సర్టిఫికెట్ల మీద తన బొమ్మను ముద్రించుకొని ప్రచార కండూతిని చాటుకుంటున్నారు. క్యూబాలో ఒక వాక్సిన్‌ పేరు ”సోబేరనా” అంటే అర్ధం ”సార్వాభౌమాధికారత ”. మరో వ్యాక్సిన్‌ పేరును క్యూబా విప్లవ వీరుడు జోస్‌ మార్తి రాసిన గేయం పేరున అబ్డాలా అని పెట్టారు. మామ్బిసా అని ముక్కు లో స్ప్రే ద్వారా ఇచ్చే వాక్సిన్‌ కు స్వాతంత్రం కోసం పోరాడిన గెరిల్లా పేరును పెట్టి వారి స్వాతంత్ర అభిలాష ను విప్లవ స్ఫూర్తిని చాటుకున్నారు. ఒక చిన్న దేశం తమ ప్రజల ప్రాణాలను కాపాడుకుంటూ ప్రపంచప్రజలకోసం అత్యంత ప్రేమతో దీక్ష తో క షి చేస్తున్నది. అమెరికా ఆంక్షలవలన క్యూబా ఆదాయం పూర్తిగా పడిపోయింది. ప్రధాన పంట అయిన చక్కెర ను ఎవరూ కొనకుండాఆంక్షలు విధించి ఎగుమతిచేయనీయటంలేదు. మరొక ఆదాయ వనరు టూరిజం. టూరిస్టులు ఎవరూ రాకుండా ఆంక్షలు విధించి క్యూబా ఆదాయాన్ని దెబ్బతీస్తున్నది. అయినా ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం తమ వాక్సిన్లను పేటెంట్‌తో నిమిత్తం లేకుండా ఎవరైనా తయారు చేసి ఉపయోగించుకోవచ్చని ప్రకటించింది.

ప్రాణం విలువ ఏమిటో నిర్వచించారు.

ప్రపంచంలోని అత్యంత ధనవంతుని మొత్తం ఆస్తి కన్నా ఒక ప్రాణం విలువైనది” అని క్యూబా వైద్య విధానాన్ని రూపొందించిన చే గువేరా అన్నారు. ప్రజల కోసం ప్రాణాలి చ్చే నాయకులు, సైంటిస్టులు ప్రపంచానికి కావాలి. లక్షలాది మంది పసిపిల్లలను పక్షవాతానికి గురిచేసే పోలియో జబ్బుకి వ్యాధినిరోధక మందును డాక్టర్‌ జోనాస్‌ సాల్క్‌ 1955 లో కనుగొన్నారు. తన పరిశోదనకు పేటెంట్‌ అడగ లేదు. 1955, ఏప్రిల్‌ 12 న పత్రికా విలేఖరి ముర్రో, ” పోలియో వాక్సిన్‌ పై పేటెంట్‌ ఎవరిది” అని డాక్టర్‌ సాల్క్‌ నిఅడిగితే ”ప్రజలది’ అని చెప్తూ ” సూర్యుని పేటెంట్‌ చేయగలమా” అన్నారు.
అందరికీ ఆరోగ్యం( యూనివర్సల్‌ హెల్త్‌ ) ఆచరించే దేశాలే కరోనా కట్టడి లో ముందున్నాయి. క్యూబా , వియత్నాం, చైనా, న్యూజిలాండ్‌,కేరళ లాంటి చోట్ల ప్రజలను చైతన్యపరిచారు. రోగంగురించి ప్రజలకు తెలియచేశారు. ప్రభుత్వం ఏంచేస్తున్నదో ప్రజలేమి చేయాలో చెప్పారు. చెప్పింది చేశారు. ప్రభుత్వ నాయకులు- ప్రజలు సైంటిస్టుల మాటలను విన్నారు. తూ చా తప్పకుండా పాటించారు. ప్రజారోగ్యంపట్ల బాధ్యతతో వ్యవహరించారు. అందువలననే క్యూబా, వియత్నాం లో. కేరళ రాష్టంలో ప్రభుత్వం-ప్రజలు ఒకటై మహమ్మారిని అదుపులో వుంచారు. కేరళలో ఇటీవల కేసులు పెరిగినా మరణాలు అత్యంత తక్కువగా ఉండటానికి వారు తీసుకున్న చర్యలు, ప్రజారోగ్యవ్యవస్ధకు ఇచ్చిన ప్రాధాన్యతే కారణం

కోవిడ్‌ -19 గురించి డిసెంబరు 30 న చైనా ప్రపంచ ఆరోగ్యసంస్ధ, పది రోజులలో కరోనా జెనిటిక్‌ మాప్‌ (జన్యు పటం) ని వాక్సిన్‌ పరిశోధన కొరకు ప్రపంచ సైంటిస్టులకు అందించింది. ఆ రోజు నుండీ సైంటిస్టులు వ్యాక్సిన్‌ కనుక్కొనటానికి అహౌరాత్రులు కష్టపడి అమెరికా, చైనా, రష్యా లలోవ్యాక్సిన్‌ కనుగొన్నారు.ఇంకా పరిశోధనలు దరుగుతూనేవున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్ధ రానున్న మహా విపత్తును గూర్చిఅన్ని దేశాలనూ హెచ్చరించింది. విదేశీ ప్రయాణీకుల నియంత్రణ, క్వారంటైన్‌, వైద్య పరికరాలు, వైద్యులకు ఆధునిక రీతులపై శిక్షణ లపై ద ష్టి సారించవలసిన సమయం వ ధా అయ్యింది. 2020, ఫిబ్రవరి 24,25 తేదీలలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ని ఆహ్వానించి లక్షలాదిమంది ప్రజలను ఒక చోట చేర్చి భారీ సభను నిర్వహించారు. కరోనాని ఆహ్వానించారు. మధ్యప్రదేష్‌ లో ప్రభుత్వాన్ని కూలదోసే రాచక్రీడ లో బిజీ గా వున్నారు.ప్రజా వ్యతిరేక చట్టాలను గుట్టుచప్పుడు కాకుండా చేసుకుంటూ 2020, మార్చ్‌ 22 న ప్రజా కరూా్య విధించి పళ్లాలు మోగించి కొవ్వొత్తులు వెలిగించి కరోనాని శపించారు. నాలుగు గంటల వ్యవధినిచ్చి , మార్చ్‌ 24 నుండీ లాక్‌ డౌన్‌ విధించారు. వలస కార్మికులు నిరుద్యోగులయి, తిండీ తిప్పలు లేకుండా కొన్ని వేల మైళ్ళు నడిచి ఆప్తబంధువులను కోల్పోయి పుట్టినఊరుకు జీవఛóవాేలుగా చేరారు. ఎన్నికలు, పదవులు, కుంభమేళాలు ప్రజల ప్రాణాలకన్నాముఖ్యమయ్యాయి.కరోనా వ్యాధిని అడ్డంపెట్టుకుని రైతువ్యతిరేక చట్టాలను ఆమోదింపచేసుకున్నారు. నిశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు పూనుకున్నారు.

ధనం-లాభం-పెట్టుబడి-ధనం, తప్ప మరే విలువలూ లేని పెట్టుబడి దారీ వ్యవస్ధలో భూమాత ముడిపదార్ధాల గనిగా , మనుష్యులు వినియోగదారులుగా . కార్మికుడు ఉత్పత్తిశక్తిగా మారారు. ప్రక తిని నాశనం చేసిన కార్పోరేట్‌ శక్తులు అంటువ్యాధి అంటకుండా దూరంగా వుండగలరు. ఆధునాతన వైద్యాన్ని అందుకోగలరు. ఎంతఖరీదైనా మందులు వాడుకోగలరు. వాక్సిన్‌ రాగానే కొనుక్కోగలరు. జనాభాలో సగంపైగావున్నపేదప్రజలకు వైద్యం, మందులు, టీకాలు అందుతాయా? రెక్కాడితే డొక్కాడని పేదప్రజల ఉనికికే ప్రమాదం తెచ్చిన ఈ కరోనాని ఎదుర్కోవటానికి ప్రజలు, మీడియా పూనుకోవాలి. డబ్బులు లేకపోతే మందులు లేవు,బెడ్‌ లేదు, ఆక్సిజన్‌ లేదు, వ్యాక్సిన్‌ లేదు అనే వ్యవస్ధ మార్పుకోసం పోరాడాలి. తక్షణకర్తవ్యంగా కరోనా మందులను, వాక్సిన్‌ లను కంపల్సరీ లైసెన్సుక్రిందకు తేవాలి.ప్రజలందరికీ వైద్యం, వాక్సిన్లు అందుబాటులోకి తేవటంకోసం ఆందోళన చేయాలి. సైన్సు ఫలితాలు అందరికీ అందేవరకూ పోరాడాలి.

వ్యాసకర్త ఢాక్టర్‌ కొల్లా రాజమోహన్‌ నల్లమడ రైతు సంఘం నేత, గుంటూరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రూపాయి పాపాయి మీద అనుమానం, అమెరికా నిఘా : మోడీకి అడుగడుగునా అవమానాలు, భంగపాటు !

24 Saturday Apr 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

currency manipulators, Currency watch list of US, India’s Rupee, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ఎదుటి వారిలో ఏమీ లేకుండా మనం ఎగిరెగిరి కౌగలించుకున్నంత మాత్రాన ఒరిగిందేమీ లేకపోగా అడుగడుగునా అవమానాలు. విదేశీనేతలను ముఖ్యంగా డోనాల్డ్‌ ట్రంప్‌ను మన నరేంద్రమోడీ కౌగిలించుకున్న తీరు తెన్నులు చూసి ఎబ్బెట్టుగా అనిపించి ఇదేమిటని విమర్శించిన వారు కొందరు ఉండవచ్చు. కానీ మోడీ ఏం చేసినా దేశం కోసమే అని నమ్మి సమర్ధించిన వారెందరో. ఒక్కొక్క నేతది ఒక్కో శైలి. అధికారంలో ట్రంపు ఉన్నా బైడెన్‌ వచ్చినా అమెరికా నుంచి అడుగడుగునా ఆటంకాలు, అవమానాలే. అన్నింటికీ మించి మనకు ఒరిగిందేమీ లేకపోగా నష్టాలే. వాటిని పదే పదే చెప్పుకున్నా అల్లు అర్జున్‌ ఒక సినిమాలో చెప్పినట్లు చాల బాగోదు.


తాజా విషయానికి వస్తే అమెరికా మనల్ని మోసకారుల జాబితాలో చేర్చింది. కరెన్సీతో మోసాలకు పాల్పడుతూ అమెరికా ప్రయోజనాలను దెబ్బతీస్తున్నదంటూ కన్నేసి ఉంచాల్సిన దేశాల జాబితాలో మన పేరు చేర్చింది. తొలిసారి 2018లో చేర్చి మరుసటి ఏడాది తొలగించింది, మరోసారి గత డిసెంబరులో చేర్చింది. దాన్ని మరోసారి తాజా పరిచినట్లు గతవారంలో వార్తలు వచ్చాయి. అమెరికా ఆర్ధికశాఖ రూపొందించిన జాబితాలో చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, జర్మనీ, ఐర్లాండ్‌, ఇటలీ, ఇండియా, మలేషియా, సింగపూర్‌,థాయిలాండ్‌, మెక్సికో ఉంది. అమెరికాకు తన ప్రయోజనాలు తప్ప మిత్ర-శత్రుదేశాలనేవి లేవని ఈ జాబితా స్పష్టం చేస్తున్నది. డిసెంబరు జాబితాలో మెక్సికో, ఐర్లండ్‌లు లేవు. ఈ జాబితా లేదా ఈ దేశాల మీద ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేసింది ఏ ప్రపంచ వాణిజ్య సంస్దో లేక ఐక్యరాజ్యసమితో అయితే అదోదారి. ఏదో ఒక అంతర్జాతీయ చట్టం కింద అనుకోవచ్చు. అదేమీ లేదు, 2015నాటి అమెరికా వాణిజ్య చట్టం ప్రకారం ఈ పని చేశారు. వారు దాడి చేయాలనుకున్నవారిని జాబితాలో పెడతారు, ఎత్తుగడగా వద్దనుకున్న వారిని మినహయిస్తారు. దానిలో భాగంగానే వియత్నాం, చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌, స్విడ్జర్లాండ్‌లను ఆరునెలల క్రితం ఈ జాబితాలో చేర్చారు. అయినప్పటికీ రాజకీయ కారణాలతో జాబితా నుంచి తొలగించి మిగతావాటితో పాటు ఓ కన్నేసి ఉంచాలని మాత్రమే నిర్ణయించారు.


ఒక దేశం కరెన్సీతో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించేందుకు అమెరికాకు ప్రాతిపదిక ఏమిటి? అమెరికాతో వాణిజ్యం చేసే దేశపు మిగులు ఏడాదిలో 20 బిలియన్‌ డాలర్లు ఉండటం, ఆయా దేశాల జిడిపిలో కరెంటు ఖాతా మిగులు మూడుశాతం వరకు ఉన్నపుడు, ఒక దేశం ఏడాది కాలంలో కొనుగోలు చేసిన విదేశీ కరెన్సీ దాని జిడిపిలో రెండుశాతం దాటితే అమెరికాను మోసం చేస్తున్నట్లు పరిగణిస్తారు. 2020 జనవరి నుంచి డిసెంబరు మధ్యకాలంలో వియత్నాం, స్విడ్జర్లాండ్‌, తైవాన్‌, భారత్‌, సింగపూర్‌ లావాదేవీల గురించి అమెరికాకు అనుమానం వచ్చినట్లు ఏప్రిల్‌ 16వ తేదీన విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. పైన పేర్కొన్న మూడు ప్రాతిపదికలలో మన దేశం రెండింటిలో గీత దాటినట్లు పేర్కొన్నది. 2020లో పన్నెండు నెలలకు గాను పదకొండు నెలల్లో భారత్‌ నిఖరంగా 131 బిలియన్‌ డాలర్లను కొనుగోలు చేసింది, ఇది జిడిపిలో ఐదుశాతానికి సమానం. 2001,02,03 తరువాత 2020లో భారత కరెంటు ఖాతా మిగులు 1.3శాతం ఉంది. అదే ఏడాది అమెరికాతో భారత వాణిజ్య మిగులు 24 బిలియన్‌ డాలర్లు ఉంది, సేవల వాణిజ్యంలో కూడా ఎనిమిది బిలియన్‌ డాలర్ల మిగులు ఉంది. 2019తో పోల్చితే కరోనాతో ఆర్ధిక వ్యవస్ధ కుదేలయినా మన దేశ స్టాక్‌ మార్కెట్లోకి విదేశీ మదుపరులు పెద్ద మొత్తంలో ప్రవేశించారు. మన డాలర్ల నిల్వ పెరగటానికి అది కూడా ఒక కారణం. ఒక దేశ ఆర్ధిక మౌలిక అంశాలను ప్రతిబింబించే విధంగా కరెన్సీ మారకపు విలువ ఉండాలి. విదేశీ కరెన్సీ జోక్యం పరిమితంగా ఉండాలి, ఎక్కువగా నిలువ చేసుకోకూడదని అమెరికా ఆర్ధికశాఖ నివేదిక పేర్కొన్నది.


వారి జాబితా నుంచి తొలగించిన వాటిలో స్విడ్జర్లండ్‌ ఐరోపాలోని తటస్ధదేశం, అయినా గతంలో మోసకారుల జాబితాలో చేర్చి తాజాగా తొలగించింది. వియత్నాం సోషలిస్టు దేశం. దక్షిణ చైనా సముద్రంలో కొన్ని దీవుల విషయంలో చైనాతో విబేధిస్తున్నది కనుక దాన్ని తనవైపు తిప్పుకోవాలంటే ఇలాంటి తాయిలం పెట్టాలన్నది ఒక ఎత్తుగడ. ఇక తైవాన్‌ విషయానికి వస్తే చైనాలోని తిరుగుబాటు రాష్ట్రం, స్వంతంగా మిలిటరీని కలిగి ఉంది. అమెరికా నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తున్నది. దాన్ని కూడా అనుమానితుల జాబితాలో చేర్చితే అక్కడి జనంలో అమెరికా వ్యతిరేకత పెరుగుతుంది, దీనికి తోడు చైనాను రెచ్చగొట్టేందుకు తైవాన్‌ ఒక శిఖండిలా ఉపయోగపడుతోంది కనుక దానికీ అమెరికన్లు మినహాయింపు ఇచ్చారు. మనల్ని మిత్రదేశం అంటూనే మరింతగా లొంగదీసుకొనేందుకు మోసకారి ముద్రవేశారు.


అమెరికా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నది. స్వార్ధం, బెదిరింపు,లొంగదీసుకొనే ప్రక్రియలో భాగం తప్ప మరొకటి కాదు. దీనిలో కీలక అంశం కరెన్సీ విలువ. ప్రస్తుతం ప్రపంచంలో వివిధ దేశాల మధ్య టవమారకానికి డాలర్లను వినియోగిస్తున్నారు. కరెన్సీ విలువలను మోసపూరిత పద్దతుల్లో కృత్రిమంగా తగ్గించి లేదా పెంచి తమ కార్మికులను దెబ్బతీస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. పారిశ్రామిక, వాణిజ్యవేత్తలని చెబితే బాగోదు కనుక కార్మికుల పేరుతో రాజకీయం చేస్తోంది. ఆయా దేశాలు తమ కరెన్సీ విలువలను కావాలని తగ్గిస్తున్నాయన్నది దాని ప్రధాన ఆరోపణ. చిత్రం ఏమంటే ట్రంప్‌ యంత్రాంగం చైనాను మోసకారి అని ప్రకటించగా, బైడెన్‌ యంత్రాంగం నిఘావేసి ఉంచాల్సిన మోసకారుల జాబితాలో మన దేశంతో పాటు చైనాను కూడా చేర్చింది, అంటే చైనా మీద దాడి తీవ్రతను తగ్గించింది. ఈ జాబితా రూపకల్పనలో ఎలాంటి ఆర్ధిక పరమైన తర్కం తనకు అర్ధం కావటం లేదని మన వాణిజ్యశాఖ కార్యదర్శి అనుప్‌ వాధ్వాన్‌ వ్యాఖ్యానించారు. పోనీ మోసకారులంటే ఏ ఒక్కరి మీద అమెరికా ఆంక్షలు ఎందుకు లేవు అన్నారు. మార్కెట్‌ శక్తుల ప్రాతిపదికగానే రిజర్వుబ్యాంకు వ్యవహరిస్తోందన్నారు.


ఇక అమెరికా ఆగ్రహం విషయానికి వస్తే మన రూపాయి పాపాయి బలపడుతోంది- చిక్కిపోతోంది. తాజాగా ఆసియాలో అత్యంత దారుణమైన పని తీరు కనపరుస్తున్న కరెన్సీగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. డాలర్ల కొనుగోలు రూపాయి పెరుగుదలను నిరుత్సాహపరచేందుకు తీసుకున్న చర్యగా కొందరు చెబుతున్నారు. రూపాయి చిక్కితే ఎగుమతిదార్లకు లాభం- దిగుమతిదార్లకు నష్టం, బలపడితే ఎగుమతిదార్లకు నష్టం-దిగుమతిదార్లకు లాభం. మార్కెట్లోని ఈ రెండు శక్తులు తమకు అనువైన వాదనలను ముందుకు తెస్తూ వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటాయి.మనతో వాణిజ్యం జరిపే దేశాల ప్రమేయం కూడా దీనిలో ఉంటుంది. తమ డాలరు విలువ తగ్గకుండానే తమ సరకులను అమ్ముకోవాలన్నది అమెరికా లక్ష్యం. కరెన్సీ విలువ ఎక్కువ-తక్కువలు ఒకే దేశంలో ఎగుమతి-దిగుమతిదార్లు ఇద్దరి మీద ప్రభావం చూపుతాయి. ఇలా ఇంటా బయటి వత్తిళ్లతో రూపాయి పరిస్ధితి అగమ్యగోచరంగా ఉంటుంది. గత ఏడు సంవత్సరాల కాలంలో చూసినపుడు రూపాయి 58 నుంచి 75కు దిగజారింది కనుక దీనిలో రెండు అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యుపిఏ కంటే తన పాలనలో ఎగుమతులను పెంచి దేశాన్ని ముందుకు తీసుకుపోయానని చెప్పుకొనేందుకు మోడీ సర్కార్‌ రూపాయి విలువను దిగజార్చిందని చెప్పవచ్చు. అంతకు ముందు రూపాయి విలువ పడిపోతే ముఖ్యమంత్రిగా మోడీ, బిజెపి నేతలు ఎంత యాగీ చేశారో, ఎన్ని మాటలన్నారో తెలిసిందే. తమ దాకా వచ్చే సరికి ప్లేటు ఫిరాయించారు.నోరు మూసుకున్నారు. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు.


2010 నుంచి 2019వరకు ఉన్న వివరాలను చూసినట్లయితే మన ఎగుమతులు జిడిపిలో 2010లో 22.4శాతం ఉండగా 2013 నాటికి 25.43శాతానికి పెరిగాయి. అప్పటి నుంచి పడిపోతూ 2019నాటికి 18.41శాతానికి తగ్గాయి. ఇదే సమయంలో దిగుమతులు కూడా తగ్గినప్పటికీ ఎగుమతుల కంటే ఎక్కుగానే ఉన్నాయి. 2010 -21 మధ్య డాలరుతో రూపాయి మారకపు విలువ 45 నుంచి 75కు పడిపోయింది (ఏప్రిల్‌ 24న 75.22). మే నెలలో 76.50వరకు పతనం కావచ్చని అంచనా. ఇదే కాలంలో ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నపుడు రూపాయి విలువ అంతర్గతంగా 100 నుంచి 202.96(ఏప్రిల్‌ 24వ తేదీ)కు పడిపోయింది. అంటే ఒక వస్తువు ధర పదేండ్లలో ఆ స్ధాయిలో పెరిగింది అని చెప్పవచ్చు. ఒక దేశ కరెన్సీ విలువ డాలరుతో మారకపు ధర ఎంత తక్కువ ఉంటే అంతగా ఎగుమతి అవకాశాలు ఉంటాయన్నది సాధారణ సిద్దాంతం. దానికి మినహాయింపుగా మన దేశ పరిస్ధితి ఉన్నట్లు పై వివరాలు వెల్లడిస్తున్నాయి. నరేంద్రమోడీ సర్కార్‌ ఏడు సంవత్సరాలుగా ఎగుమతుల గురించి కబుర్లు చెప్పటం తప్ప పెరగలేదంటే ఇతర దేశాల సామర్ధ్యం లేదా మన అసమర్ధత అయినా కావచ్చు. ఎగుమతుల మీద ఆధారపడిన ఆర్ధిక వ్యవస్దలను నిర్మించిన దేశాలన్నీ చైనా మాదిరి విజయవంతం కాలేదు.మనం అసలు పోటీలోకే ప్రవేశించ కుండా లేస్తే మనిషిని కాదు అన్న మల్లయ్య కథమాదిరి మాట్లాడుతున్నాము.


ప్రస్తుతం అమెరికాతో మన వాణిజ్యం మిగులులో ఉంది. ఇలాంటి పరిస్ధితి ఏ దేశంతో ఉన్నా అమెరికన్లకు నిదురపట్టదు.చైనాతో లోటు మరింత ఎక్కువగా ఉంది కనుక దానితో వాణిజ్య యుద్దానికి దిగింది.మనది పెద్ద మార్కెట్‌గా ఉన్నందున ఖరీదైన తన వస్తువులను మన మీద రుద్దాలని చూస్తున్నది. వాటికి మార్కెట్‌ ఉండదు కనుక దానికి మన దిగుమతిదారులు కూడా అంగీకరించరు. ఎక్కడ వస్తువుల ధరలు తక్కువగా ఉంటే అక్కడికే దారితీస్తారు. అందుకే కమ్యూనిజానికి నరేంద్రమోడీ బద్ద వ్యతిరేకి అయినప్పటికీ వాణిజ్యవేత్తల వత్తిడికి తలొగ్గి భారీ ఎత్తున దిగుమతులకు అనుమతించక తప్పలేదు. మరోవైపు అమెరికాను సంతృప్తి పరచేందుకు పెద్ద మొత్తంలో ఆయుధాలు, చమురు కొనుగోలు చేస్తున్నారు, మరో దేశం నుంచి దొరకని వైద్యపరికరాల వంటివాటిని కూడా దిగుమతి చేసుకుంటున్నాము. అయినా అమెరికన్లకు తృప్తి లేదు.


మన దేశ కరెంటు ఖాతా ఎప్పుడూ లోటులోనే ఉంటున్నది. గతేడాది కరోనా వలన కొనుగోలు చేసేవారు లేక దిగుమతులు పెద్ద ఎత్తున పడిపోయినందున మన వాణిజ్యం మిగుల్లో ఉంది తప్ప నిజానికి మన ఎగుమతులు పెరిగి కాదు. నికర వాణిజ్యలోటు నిరంతరం ఉండే మన వంటి దేశాలకు తగినన్ని డాలర్ల నిల్వలు లేనట్లయితే అసాధారణ రీతిలో చమురు ధరలు పెరిగితే చెల్లింపుల సమస్య తలెత్తుతుంది. అయితే నరేంద్రమోడీ అధికారానికి వచ్చినప్పటికీ ఆరు సంవత్సరాల కాలంలో చమురు ధరలు కనిష్టస్ధాయికి పడిపోయి విదేశీమారక ద్రవ్య నిల్వలు బాగా పెరిగాయి.కరోనా కారణంగా స్టాక్‌మార్కెట్‌ పడిపోయింది, దాంతో విదేశీమదుపుదార్లు వాటాలను అమ్ముకొని పెట్టుబడులు తరలించుకుపోయినపుడు రిజర్వుబ్యాంకు డాలర్లను కొనుగోలు చేసింది. అయితే మన ప్రభుత్వం కార్పొరేట్‌శక్తులకు పెద్దమొత్తంలో రాయితీలు ఇవ్వటంతో స్టాక్‌మార్కెట్‌లో వాటాలు ధరలు పెరిగినందున తిరిగి విదేశీ పెట్టుబడుల ప్రవాహం వచ్చింది. గతేడాది ఏప్రిల్‌ 24న రూపాయి విలువ 76.22కు పడిపోయింది. తరువాత పెరిగి, స్వల్పంగా తగ్గినా 2021మార్చి 21న 72.32కు పెరిగింది. తిరిగి గత నెల రోజుల్లో ఏప్రిల్‌ 21న 75.22కు పతనమైంది. తరువాత అదే స్ధాయిలో కొనసాగుతోంది. ఇప్పుడు ముడిచమురు ధర 65 డాలర్లకు అటూ ఇటూగా ఉన్నపుడు ఇలా ఉంటే విశ్లేషకులు చెబుతున్నట్లు 75డాలర్లకు పెరిగితే పతనం మరింత ఎక్కువగా ఉండవచ్చు. ఉన్న డాలర్లు కూడా హరించుకుపోతాయి గనుక డాలర్లను కొనుగోలు చేయకతప్పదు.


2020-21 ఆర్ధిక సంవత్సరంలో తొలి ఆరునెలల్లో మన వాణిజ్య మిగులు 15.1 బిలియన్‌ డాలర్లు ఉండగా, సెప్టెంబరు-డిసెంబరు కాలంలో 1.3 బిలియన్‌ డాలర్లలోటు నమోదైంది. తరువాత మూడు నెలల్లో అది 5-7 బిలియన్‌ డాలర్ల వరకు పెరగవచ్చని అంచనా. అనూహ్యమైన పరిణామాలు జరిగితే తప్ప ఇప్పటి వరకు ఉన్న పరిస్ధితిని బట్టి రూపాయి విలువ 74.50 నుంచి 76 మధ్య కదలాడవచ్చని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. ఇంతకు మించి పతనం కాకుండా ఆర్‌బిఐ చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నారు. అంతకు మించితే మన దిగుమతుల బిల్లు పెరిగి, పర్యవసానంగా జనం మీద మరింత భారం పడుతుంది.


వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పన్నెండు లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పులు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటికి మార్కెట్లో వడ్డీ రేట్లు తక్కువగా ఉండేట్లు చూసే లక్ష్యంతో ఏప్రిల్‌-జూన్‌ మాసాల మధ్య రిజర్వుబ్యాంకు లక్ష కోట్ల రూపాయల బాండ్లను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా రూపాయి పతనాన్ని అరికట్టవచ్చని కూడా చెబుతున్నారు. ఇదే సమయంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణ ప్రభావం వీటి మీద ఎలా ఉంటుందో ఊహించలేని స్ధితి. ఇక్కడ సమస్య మనకు అవసరమైన డాలర్లు కొనుగోలు చేస్తే అమెరికాకు అభ్యంతరం ఎందుకు ఉండాలి ? తర్కబద్దంగా చెప్పాలంటే డాలరు విలువను నిర్ణయించేది మార్కెట్‌శక్తులైనపుడు మన రూపాయిని కూడా అవే శక్తులు నిర్ణయిస్తాయని ఎందుకు అనుకోకూడదు. అయితే అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఏమంటే ప్రతి దేశమూ తన అవసరాలకు అనుగుణ్యంగా కరెన్సీ విలువలను నియంత్రిస్తోంది. ఈ క్రీడలో అమెరికా లబ్ది పొందలేదా ? కరెన్సీని అదుపు చేస్తున్నదని చైనా మీద ఆరోపణలు చేసే అమెరికన్లు అదే చైనా కరెన్సీ రేటు తక్కువగా ఉన్నందునే అక్కడినుంచి పెద్ద ఎత్తున సరకులను దిగుమతి చేసుకున్నది వాస్తవం కాదా ? అంతేకాదు, ఉత్పత్తి ఖర్చు కూడా తక్కువగా ఉన్న కారణంగా తమ గడ్డమీద పరిశ్రమలను మూసి చైనాకు తరలించలేదా ? కొత్తగా చైనాలో పెట్టలేదా ?


గతంలో అమెరికా-సోవియట్‌ యూనియన్‌ మధ్య ప్రచ్చన్న యుద్దం సాగిన సమయంలో ఆ రెండు దేశాల మధ్య ఆర్ధిక సంబంధాలు లేవు. అందుకు విరుద్దంగా అమెరికా-చైనా సంబంధాలు ఉన్నాయి. చైనా తన మార్కెట్‌ను తెరిచిన తరువాతనే ప్రపంచ వాణిజ్య సంస్దలో చేరేందుకు అమెరికా అనుమతించింది. సోవియట్‌యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాలను పతనం గావించి ప్రచ్చన్న యుద్దంలో తామే విజయం సాధించామని 1990 దశకంలో అమెరికా ప్రకటించుకుంది. అంతకు ముందు సోవియట్‌ – చైనా మధ్య ఉన్న విబేధాలను ఉపయోగించుకొనేందుకు, చైనా మార్కెట్‌లో ప్రవేశించేందుకు అమెరికన్లు చైనాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు.వారు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. సోవియట్‌ కూలిపోయిన తరువాత ప్రచ్చన్న యుద్దరంగాన్ని చైనాకు మార్చారు. గత మూడు దశాబ్దాలలో వాటి మధ్య వాణిజ్యంతో పాటు వైరమూ పెరిగింది. ఇలాంటి స్ధితి సోవియట్‌తో లేదు.


అలాంటి చైనాతో అమెరికన్లకు ఇప్పుడు వాణిజ్యలోటు చాలా ఎక్కువగా ఉంది. ట్రంపు నాలుగు సంవత్సరాల పాటు పరోక్షంగా, ప్రత్యక్షంగా చైనాతో వాణిజ్య యుద్దం చేశాడు.2019తో పోలిస్తే 2020లో తొమ్మిది శాతం తగ్గినా అమెరికాలోటు 310.8 బిలియన్‌ డాలర్లు ఉంది. అమెరికన్లు 124 బిలియన్‌ డాలర్ల సరకు, వస్తువులను ఎగుమతి చేయగా చైనా నుంచి 435.5 బిలియన్‌ డాలర్ల మేరకు దిగుమతి చేసుకున్నారు. అలాటి చైనా మీద తుపాకి పేల్చేందుకు మన భుజాన్ని వాడుకుంటున్నారు, చివరికి మనలను కూడా మోసకారుల జాబితాలో చేర్చారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వాక్సిన్‌ దౌత్యం : డోనాల్డ్‌ ట్రంప్‌ ధైర్యం నరేంద్రమోడీకి ఎందుకు లేకపోయింది ?

21 Wednesday Apr 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

Corona vaccine, US Vaccine Diplomacy, vaccine controversy, Vaccine Nationalism


ఎం కోటేశ్వరరావు


నిజమే, అవసరం మనదైనపుడు తగ్గి ఉండాలని పెద్దలు చెప్పిన బుద్దులు- సుద్దులను పరిగణనలోకి తీసుకోవాల్సిందే-కానీ ఆత్మగౌరవాన్ని చంపుకొని లొంగి పోవాలని పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు ఏవీ చెప్పలేదే ? మన గత చరిత్ర కూడా అది కాదు కదా ! కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా వ్యవహరించకపోతే ఎవరికైనా ఏం గౌరవం ఉంటుంది. అయితే అందుకు తగిన దమ్మూ-ధైర్యం ఉండాలి. మనమూ అమెరికా విడదీయలేనంతటి సహ భాగస్వాములమని చెప్పారు. నిజమే కామోసు, మన నరేంద్రమోడీ గారిని చూసి భయపడకపోయినా అమెరికా మారు మనసు పుచ్చుకుందేమో అనుకున్నారు ఎందరో ! కానీ జరుగుతోందేమిటి ? కరోనాతో ప్రాణాలు పోతున్నా వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి పదార్ధాలను మనకు అందచేసేందుకు – సొమ్ము తీసుకొనే సుమా – మన సహ భాగస్వామి అంగీకరించటం లేదు. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా అబ్బే మేము నిషేధం పెట్టలేదు ట్రంప్‌ హయాంలో దుమ్ముదులిపిన మా చట్టాన్నే అమలు జరుపుతున్నాం, దాని ప్రకారం ఎగుమతి చేసేందుకు అవకాశం లేకపోతే మేమేం చేయగలం, ఎగుమతుల మీద పని గట్టుకొని నిషేధం అయితే లేదబ్బా …. ఏవమ్మా కమలా హారిస్‌ మీ పూర్వీకుల దేశం వారు ఏదేదో అంటున్నారు నువ్వయినా చెప్పమ్మా అన్నట్లుగా జో బైడెన్‌ మాట్లాడుతున్నారు. మీ అవసరాలను గుర్తించాంగానీ ఇప్పటికైతే మా చేయి ఖాళీ లేదు, ఏమీ చేయలేం అంటున్నారు అధికారులు. ఏం చేయాలో పాలుపోక మన నరేంద్రమోడీ గారి నోట మాట రావటం లేదు.(మామూలుగానే మాట్లాడే అలవాటు లేదు, కరోనా కదా నోరు విప్పుతారేమో అనుకున్నవారికి ఆశాభంగం).

సరిగ్గా ఏడాది క్రితం మన ప్రధాని నరేంద్రమోడీ జిగినీ దోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికాలో కరోనా వ్యాప్తిని అలక్ష్యం చేసి ఎందరి ప్రాణాలను ఎలా తీశాడో చూశాము. ఆ సమయంలో మలేరియాకు వాడే హైడ్రోక్సీక్లోరోక్విన్‌ కరోనాకు కూడా దివ్వ ఔషధంగా పని చేస్తుందని ఎవరో చెప్పగానే మన దేశం దాని ఎగుమతుల మీద నిషేధం విధించింది. అది నిజమా కాదా అని నిర్దారించుకోకుండా తక్షణమే మాకు సరఫరా చేయండి లేకపోతే మన పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మాదిరి మీ తాట వలుస్తా అని డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించిన విషయమూ-యాభై ఆరు అంగుళాల ఛాతీ గల మనదేశం వెంటనే ఎందుకంత కోపం కావాలంటే పంపకుండా ఉంటామా అంటూ ఆఘమేఘాల మీద అందచేయటం తెలిసిందే. శ్రీశ్రీ అన్నట్లుగా తారీఖులు, దస్తావేజులను పక్కన పెడితే శనివారం నాడు మనం నిషేధం విధించాం, ఆదివారం నాడు మోడీతో ట్రంప్‌ ఫోన్లో మాట్లాడాడు. సోమవారం నాడు విలేకర్లతో మాట్లాడుతూ ఔషధాన్ని పంపకపోతే ప్రతీకార చర్యలు తీసుకుంటామని బహిరంగంగా బెదిరించాడు. మంగళవారం నాడు ఆంక్షలను సడలించి అమెరికాకు ఎగుమతి చేశాము. ఇదీ ఏడాది క్రితం జరిగిన ఉదంతం.


ఇంతేనా జర్మనీకి రవాణా అవుతున్న లక్షలాది మాస్కులు, తొడుగులను మధ్యలోనే అడ్డుకొని తమ దేశానికి మళ్లించుకున్న డోనాల్డ్‌ ట్రంప్‌ అదరగొండితనం కూడా అదే సమయంలో జరిగిన సంగతి తెలిసిందే. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో తాము దేశీయంగా చేసుకున్న రక్షణ ఉత్పత్తి చట్టానికి పదును పెట్టామని, దాని ప్రకారం అవి ఎగుమతి నిషేధ జాబితాలో ఉన్నాయని, తమ కంపెనీలు తయారు చేసినందున వాటిని తాము స్వాధీనం చేసుకున్నామని అమెరికా సమర్ధించుకుంది. ఇప్పుడు కరోనా వాక్సిన్‌ కోవీషీల్డ్‌ తయారీకి అవసరమైన ముడి పదార్దాలు, ఇతర వస్తువుల సరఫరా మీద కూడా అదే చట్టాన్ని ప్రయోగించి ఎగుమతుల మీద జోబైడెన్‌ సర్కార్‌ నిషేధం విధించింది. ట్రంప్‌ అయినా బైడెన్‌ అయినా తమ అవసరాలకు ఇస్తున్న ప్రాధాన్యత తమ సహజ భాగస్వాములుగా వర్ణించి, ఉబ్బేసిన మన విషయంలో ఇవ్వటం లేదని తేలిపోయింది. ఎక్కడైనా బావే గానీ వంగతోట దగ్గర కాదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ముద్దులాట వ్యవహారం దగ్గర మొహమాటానికి సిద్దమే గాని వ్యాపారం దగ్గర కాదు అంటే ఇదే. మనం నొప్పిని తట్టుకోలేని-బయటకు చెప్పుకోలేని స్దితిలో పడిపోయామా ?

అమెరికా విధించిన ఆంక్షల కారణంగా ముడి సరుకులు నిండుకొని వాక్సిన్‌ ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని పూనాలోని సీరం సంస్ధ మార్చి తొమ్మిదవ తేదీన ప్రపంచ బ్యాంకు ఏర్పాటు చేసిన వాక్సిన్‌ తయారీదారుల సమవేశంలో ఆందోళన వ్యక్తం చేసింది. ఆరువారాలు గడచిపోయాయి. తమ నేత ప్రపంచాన్ని శాసించగలుగుతున్నారని చెబుతున్న మోడీ భక్తులు గానీ, బహుశా గడ్డాన్ని చూసి విశ్వగురువు అని వర్ణిస్తున్నవారు గానీ, చివరికి నరేంద్రమోడీ గానీ ఈ విషయంలో ఇంతవరకు చేసిందేమీ లేదు. భారత వినతిని పరిశీలిస్తున్నామని, సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటామని జో బైడెన్‌ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఎప్పుడు ? తాత చచ్చి అవ్వ వితంతువు అయిన తరువాతనా అని తెలుగులో ఒక సామెత ఉంది. కరోనా కాటుకు మన జనం బలైన తరువాతనా లేక అమెరికా సంస్దలు తయారు చేస్తున్న వాక్సిన్ను మనం అధిక ధరలకు కొనుగోలు ఒప్పందం కుదిరిన తరువాత అనా ?


గతేడాది పిపిఇ కిట్ల తయారీ నిర్ణయాన్ని తీసుకోవటంలో జరిగిన జాప్యం గురించి వచ్చిన విమర్శలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అనేక దేశాల్లో రెండవ, మూడవ కరోనా తరంగం వచ్చిన విషయమూ తెలిసినా ఒకవేళ మన దగ్గర వస్తే ఏం చెయ్యాలన్న ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. మరోసారి లాక్‌డౌన్‌ విధించే పరిస్ధితులను తెచ్చుకోవద్దని ఘనమైన ప్రధాని నరేంద్రమోడీ గారు నెపాన్ని జనం మీద నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.కరోనా మీద విజయం సాధించామన్న స్వంతడబ్బా ప్రకటనలు తప్ప మరోసారి వస్తే అన్న ముందుచూపు లేకపోయింది. గతేడాది అనేక చోట్ల ఆక్సిజన్‌ కొరత ఏర్పడి రోగులు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఇరవైఆరులక్షల కోట్ల ఆత్మనిర్బర పాకేజీ గురించి గొప్పలు చెప్పుకోవటం తప్ప అది అవసరమై ఆక్సిజన్‌ అందించి ప్రాణాలను నిలిపేందుకు ఉపయోగపడలేదు. గతేడాది అనుభవాన్ని చూసి ఇప్పటికే ఆక్సిజన్‌ సరఫరాకు కొత్త ప్లాంట్లకు అనుమతి ఇచ్చి సిద్దం చేసి ఉంటే అనేక రాష్ట్రాల్లో కొందరు రోగులు దిక్కులేని చావు చచ్చేవారా ? ఒక్క సిలిండరు ఉత్పత్తికి కూడా పనికి రాని లక్షల కోట్ల పాకేజ్‌లు ఎందుకు ? ఇల్లుకాలుతుండగా నీటికోసం బావులు తవ్వినట్లుగా ఇప్పుడు వంద ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ఆదేశాలిచ్చినట్లు తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. కేవలం రెండు వందల కోట్ల రూపాయలతో 150 ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచేందుకు ఎనిమిది నెలలు పట్టిందంటే మన కేంద్ర ప్రభుత్వ నిర్వాకం ఎలా ఉందో ఇంతకంటే చెప్పాలా ? ఇలాంటి స్దితికి విచారించాలా, బాధ్యతా రాహిత్యాన్ని గర్హించాలా ? యుద్దం వస్తుందో రాదో తెలియకపోయినా లక్షల కోట్ల రూపాయల ఆయుధాలను కొని పెట్టుకుంటున్నాం. అవి కొంత కాలానికి పనికి రావని తెలిసినా కొనుగోలు చేస్తున్నాం. అలాంటిది కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఆక్సిజన్‌ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలా లేదా ? డబ్బుల్లేక అడుక్కుంటే ఇచ్చే దాతలు ఎందరు సిద్దంగా లేరు ?

మార్చినెల 26వ తేదీ నుంచి దేశంలో కరోనా అనూహ్యంగా వ్యాపిస్తోన్న విషయం తెలిసినా, అంతకంటే ముందే తయారీదార్లు హెచ్చరించినా వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి సరకులు మీద నిషేధం ఎత్తివేయించేందుకు అమెరికా మీద ఎలాంటి వత్తిడీ ఎందుకు తేలేదు. గత వారం వరకు మన కేంద్ర మంత్రులు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? అన్నీ తానై చూసుకుంటున్న ప్రధాని ఏమి చేస్తున్నట్లు ? ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యతలో వందో వంతైనా ఇచ్చి ఉంటే అమెరికా నుంచి వస్తాయో రావో ఎప్పుడో తేలిపోయి ఉండేది. ప్రపంచం గొడ్డుపోలేదుగా ! మరో దేశం నుంచి తెచ్చుకొనేందుకు ప్రయత్నం చేసినట్లు కూడా ఎవరూ చెప్పటం లేదు. అమెరికా కోడి కూయకపోతే ప్రపంచానికి తెల్లవారదా ? వాక్సిన్‌ తయారు చేస్తున్న దేశాల్లో చైనా ఒకటి. కావాలంటే ముడిసరకులు సరఫరా చేస్తామంటూ వారు ముందుకు వచ్చారు. అక్కడి నుంచి తెచ్చుకొనేందుకు ఇబ్బంది ఏమిటి ? గాల్వన్‌ ఉదంతానికి, సరిహద్దు ఉద్రిక్తతలు, సమస్యలకు ఇతర అంశాలను ముడి పెట్టవద్దని వారు చెబుతున్నారు. అలాంటపుడు అక్కడి నుంచి తెచ్చుకుంటే తప్పేముంది?


చైనా నుంచి తెచ్చుకోవచ్చుగానీ వారి సరకుల నాణ్యత గురించి సందేహాలున్నాయి అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. గతకొన్ని సంవత్సరాలుగా మన ఔషధ పరిశ్రమలకు అవసరమైన ముడి సరకులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము, వాటి మీదే ఆధారపడి ఉన్నాము. వాటికి లేని నాణ్యత సమస్య వాక్సిన్‌ ముడి పదార్దాలు, వస్తువులకు మాత్రమే వచ్చిందా ? ఎందుకీ సాకులు, ప్రాణాలు పోతున్నా రాజకీయమేనా ? చైనాలో తయారైన వాక్సిన్ను ఇతర దేశాలు వినియోగించటం లేదా ? కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకత ఎక్కిన వ్యవహారం తప్పితే మరొకటి ఏదైనా ఉందా ? నువ్వు మిత్రుడు అనుకుంటున్న అమెరికా వాడు ఇవ్వడు-శత్రువు అంటున్న చైనా వారు ఇస్తానంటే జనం ప్రాణాలను పోగొట్టటానికైనా సిద్దం అవుతున్నాము తప్ప తెచ్చుకోవటానికి ముందుకు కదలటం లేదు. ఇదేమి జవాబుదారీతనం ! ఇదేమి రాజధర్మం !! ప్రపంచంలో ఏదేశమూ ఎదుర్కోని విధంగా మన దేశంలో కరోనా విజృంభిస్తోందన్న కఠోర సత్యాన్ని కేంద్ర పాలకులు గుర్తిస్తున్నట్లు లేదు. బతికుంటే కావాలంటే తరువాత చైనాతో సమస్యలను తేల్చుకోవచ్చు. 1962లో యుద్దం జరిగిన తరువాత వివాదం ఉండగానే సాధారణ సంబంధాలు నెలకొల్పుకోలేదా, వాణిజ్యం చేయలేదా ? గాల్వన్‌లో మరో వివాదం వచ్చింది, ఆ పేరుతో ప్రాణావసరాలను కూడా తెచ్చుకోకుండా మడికట్టుకు కూర్చుందామా ? ఉత్తరాఖండ్‌ కుంభమేళాకు అనుమతి ఇస్తే కరోనా పుచ్చిపోతుందని అనేక మంది హెచ్చరించారు. అయినా బిజెపి పెద్దలు ఖాతరు చేయలేదు.మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ఏమైంది, కరోనాతో అనేక మంది మరణించిన తరువాత మధ్యలోనే విరమించాలని ప్రధాని చెప్పాల్సి వచ్చిందా లేదా ? వాయిదా కూడదు కూడదు అని చెప్పిన అఖాడాలు బతుకు జీవుడా అంటూ మూటా ముల్లె సర్దుకొని గుడారాలు ఎత్తివేశాయా లేదా ?

ముప్పు పేరుతో అమెరికా ఆయుధవ్యాపారులు చెప్పిన ఆయుధాలన్నీ కొంటున్నాము. సమాచారం ఇస్తామంటే దానికీ ఒప్పందాలు చేసుకున్నాము. ఇటు నుంచి అటుపోవటం తప్ప అటు నుంచి ఇటు వచ్చిందేమీ లేదు. చైనా మీద, అదే విధంగా పెరుగుతున్న చమురు ధరల మీద మన ఆయుధాలను ప్రయోగిస్తామని చెప్పారు.చైనా యాప్‌లను నిషేధించారు, కొన్ని పెట్టుబడులను అడ్డుకొని, ఆయుధాలు కొనుగోలు చేసి అమెరికాను సంతోష పెట్టారు తప్ప మనం సాధించింది ఏమిటి? అమెరికా నుంచి వాక్సిన్‌ ముడిసరకులను అప్పనంగా అడిగామా ? ఆపదలో ఆదుకోని మిత్రుడి గురించి వెంపర్లాడటం ఎందుకు ? చైనా వస్తువుల కొనుగోలు మానుకుంటే వారు మన కాళ్ల దగ్గరకు వస్తారని, మనం చెప్పినట్లు వింటారని ప్రచారం చేశారు. అలాంటి సూచనలేమీ లేవు, తొలి మూడు మాసాల్లో 18శాతం అభివృద్ది రేటు సాధించినట్లు వార్తలు వచ్చాయి. కీలకమైన లడఖ్‌ సరిహద్దు ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైన్యాలు పూర్వపు స్ధానాలకు తగ్గాలంటే మనం పెడుతున్న ప్రతిపాదనలను అంగీకరించటం లేదు. అంటే మన వత్తిడిలో పసలేదని తేలిపోయింది. అమెరికా అండ చూసుకొని ఆయాసపడటం అవసరమా ? పోనీ చమురు ఎగుమతి దేశాల మీద కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పినట్లు దిగుమతి ఆయుధ ప్రయోగంచేసి వత్తిడి తెచ్చి చమురు ధరలు తగ్గించామా అంటే అదీ లేదు. చివరకు చమురును కూడా అమెరికానుంచే కొనుగోలు చేస్తున్నాము. గల్ఫ్‌, పశ్చిమాసియా దేశాలను శత్రువులుగా చేసుకుంటున్నాము. చతుష్టయ కూటమి నుంచి తప్పుకుంటాము, ఆయుధాలు, చమురు కొనుగోలు నిలిపివేస్తాము అంటే అమెరికా దిగిరాదా ? జనం చస్తున్నా ఎందుకీ లొంగుబాటు ?ముడి పదార్దాల సరఫరా గురించి మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ అమెరికా మంత్రితో మాట్లాడామని చెప్పారు తప్ప ఫలితం ఏమిటో వెల్లడించలేదు. వాక్సిన్లకోసం ముడి సరకులు సజావుగా అందేందుకు అందుబాటులో ఉంచాలని పెద్ద దేశాలను కోరినట్లు జై శంకర్‌ చెప్పారు. అలాంటపుడు సూటిగానే చైనా నుంచి ముడిసరకులను ఎందుకు తీసుకోకూడదు ?

వాక్సిన్‌ రాజకీయాల్లో భాగంగా చతుష్టయ దేశాలైన అమెరికా, జపాన్‌, భారత్‌,ఆస్ట్రేలియా కూటమి వాక్సిన్‌ తయారీకి చర్యలు తీసుకొని చైనా పలుకుబడిని తగ్గించాలని నిర్ణయించాయి. దానిలో భాగంగా మన దేశానికి వాక్సిన్‌ ముడి పదార్దాలతో పాటు అమెరికా, జపాన్‌ నుంచి పెట్టుబడులూ వస్తాయని చెప్పారు. బ్రిటన్‌ ఆస్ట్రాజెనెకాతో పాటు సీరం సంస్ద అమెరికాకు చెందిన నోవాక్స్‌ వాక్సిన్‌ కూడా తయారీకి ఒప్పందం చేసుకుంది. పోనీలే రాజకీయం చేస్తే చేశారు, ఏదో ఒక పేరుతో వాక్సిన్‌ అందించేందుకు పూనుకున్నాయి అని సంతోషించిన వారికి ముడిసరకులను బ్లాక్‌చేసిన అమెరికా తానే మోకాలడ్డింది. దీంతో కోవిషీల్డ్‌ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది, నోవాక్స్‌ ప్రారంభానికి నోచుకోలేదు.


తూర్పు చైనాలోని జియాంగ్‌సు రాష్ట్రంలో ఔషధాలు తయారు చేస్తున్న కంపెనీ ప్రతినిధి చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌తో మాట్లాడుతూ ఇప్పటికే తాము భారత్‌కు సరఫరా చేస్తున్న సోడియం క్లోరైడ్‌ను వైద్య అవసరాలకు వినియోగిస్తున్నారని, దానిలో కొంత వాక్సిన్లకూ ఉపయోగించవచ్చని చెప్పారు. ప్రస్తుతం తాము దేశీయ అవసరాలకోసమే ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ఇతర దేశాలు కోరితే వాటికీ అందచేసే సామర్ధ్యం తమకు ఉందని చెప్పారు. షాంగ్‌డోంగ్‌ రాష్ట్రానికి చెందిన మరో సంస్ధ ప్రతినిధి మాట్లాడుతూ ఔషధాలకు అవసరమైన సీసాల తయారికి వినియోగించే సిలికాన్‌ గ్లాస్‌ను తయారు చేస్తున్నామని, ఏటా ఐదు కోట్ల సీసాలు తయారు చేయగలమని అవసరమైతే విదేశాలకూ అందచేయగలమని చెప్పారు. క్యూబాలో వాక్సిన్‌ తయారు చేసినా దానిని సరఫరా చేసేందుకు అవసరమైన సీసాల తయారీ సమస్యగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి, అదే పరిస్ధితి మన దేశంతో పాటు మరికొన్ని చోట్ల కూడా ఉంది.


మనకు అవసరమైన వాక్సిన్ల తయారీకి విదేశాల్లో కూడా ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. మంచిదే ! మన పాలకులు చేయాల్సిందేమిటి ? ప్రయివేటు కంపెనీలను నమ్ముకొని మన ఐడిపిఎల్‌ను మూతపెట్టాము, వాక్సిన్‌ తయారీ కేంద్రాలలో చెట్లు మొలిపిస్తున్నాము.లాభాలే ధ్యేయంగా పని చేసే సీరం సంస్దలో ఉత్పత్తిని పెంచటానికి 1500 కోట్ల రూపాయల రుణాన్ని ఎలాంటి హామీలు లేకుండా ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తప్పులేదు, తమిళనాడులో ఆరువందల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సమగ్ర వాక్సిన్‌ కేంద్రాన్ని ఎందుకు ఖాళీగా ఉంచుతున్నారు ? ఇలాంటివే ఇంకా కొన్ని సంస్ధలు ఉన్నాయి. యుద్ద ప్రాతిపదికన వాటిని కరోనా వాక్సిన్ల తయారీకి ఎందుకు ఉపయోగించటం లేదు ? ఎవరి ప్రయోజనాలకోసమీ నిర్లక్ష్యం ? ఇంత పెద్ద దేశంలో ఎప్పుడే అవసరం ముంచుకు వస్తుందో తెలియదు. అవసరం తీరిన తరువాత ఇతర వాక్సిన్లను తయారు చేయవచ్చు, ఇతర దేశాలకు ఎగుమతికి ఉపయోగించవచ్చు. ప్రభుత్వ రంగంలో ఔషధతయారీని మూతపెట్టిన కారణంగా ఈ రోజు అవసరమైన డెమిసెవిర్‌ వంటి ఔషధాలు బ్లాక్‌ మార్కెట్‌కు తరలుతున్నా గుడ్లప్పగించి చూస్తున్నారు. మహారాష్ట్రలో అలా దొరికిపోయిన దొంగలకు మద్దతుగా ఆ రాష్ట్ర బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ ధర్నాకు దిగారంటే ఏమనుకోవాలి. తీరా అసలు విషయం బయటపడిన తరువాత మహారాష్ట్ర కోసమే డామన్‌ కంపెనీ నుంచి తెప్పిస్తున్నట్లు మాట మార్చారు. అంటే అక్కడి శివసేన-ఎన్‌సిపి-కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వం చేతగానిదైంది, మా పలుకు బడి ఉపయోగించి తెచ్చామనే చౌకబారు చావు రాజకీయం తప్ప దీనిలో ఏమైనా ఉందా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా కమ్యూనిస్టులు జాక్‌ మాకు ఎందుకు చెక్‌ పెట్టారు ?

19 Monday Apr 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Alibaba, china communist party, Jack Ma, U.S. Cold War on China, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


జాక్‌ మా, అలీ బాబా పేరు ఏదైనేం, వ్యక్తి-సంస్ద పేరు విడదీయలేనంతగా మారిపోయాయి. కొద్ది నెలల క్రితం జాక్‌ అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. జనవరిలో దర్శనమిచ్చిన తరువాత కట్టుకథలు-పిట్టకథలకు తెరపడింది. తాజాగా చైనా ప్రభుత్వం జాక్‌ మా కంపెనీల పెట్టుబడులపై తీవ్ర ఆంక్షలు విధించిందన్న సమాచారంతో మరోసారి వార్తలకు ఎక్కాడు. ఆలీబాబా, ఆంట్‌ తదితర గ్రూపు కంపెనీల నుంచి అతగాడు బయటికి పోవటం, కొన్ని వాటాల విక్రయం, మరికొన్నింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం వంటి అంశాల గురించి వార్తలు వస్తున్నాయి. తన వాటాలను కొన్నింటిని ప్రభుత్వానికి స్వాధీనం చేస్తానని నవంబరు నెలలోనే జాక్‌ మా ప్రతిపాదించినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ గతంలో రాసింది. జనవరి నుంచి పీపుల్స్‌ బాంక్‌ ఆఫ్‌ చైనా( మన రిజర్వుబ్యాంకు వంటిది), బ్యాంకింగ్‌, బీమా నియంత్రణ కమిషన్‌ వివిధ అంశాలకు సంబంధించి చర్చలు జరుపుతున్నాయి. ఇంత వరకు ఏ విషయమూ ఇదమిద్దంగా తెలియదు.


ఒకటి మాత్రం స్పష్టం, చైనా ప్రభుత్వం జాక్‌ మాను అదుపులోకి తెచ్చింది. దేశంలోని ఇతర ప్రయివేటు సంస్ధలను నిరుత్సాహపరచకుండా ఒక వైపు అడుగులు వేస్తూ మరో వైపు సోషలిస్టు వ్యవస్ధకే ఎసరు తెచ్చే విధంగా బడా సంస్ధలను అనుమతించబోమనే సందేశాన్ని జాక్‌ మా ద్వారా చైనా కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక్కడ అనేక మందిలో తలెత్తే సందేహం ఏమంటే అసలు అలాంటి బడా సంస్ధలను మొగ్గలోనే తుంచి వేయకుండా ఎందుకు ఎదగనిచ్చింది ? ప్రపంచ కార్పొరేట్‌ శక్తుల ప్రతినిధులు చెబుతున్నట్లుగా ఈ చర్యలతో చైనా నవకల్పనలు కుంటుపడతాయా ? అభివృద్ధికి ఆటంకం కలుగుతుందా ? కొంత మంది చైనాలో జాక్‌ మా యుగం ప్రారంభమైందని ప్రచారం చేశారు.అది నిజమే అని అతగాడు భ్రమించి చైనా వ్యవస్ధనే సవాలు చేశాడా ? వాస్తవానికి చైనా యుగంలో జాక్‌ మా వంటి వారు కొందరు తప్ప వ్యక్తుల యుగాలు ఉండవు.


దీన్ని వివరిస్తే కొంత మందికి జీర్ణం గాకపోవచ్చు, అయినా తప్పదు . అందువలన క్లుప్తంగా చెప్పుకుంటే పెట్టుబడిదారీ విధానం అంటే శ్రమను అమ్ముకొనే ఒప్పందం మేరకు పని, ఆ మేరకు వేతనం. మిగతా వాటితో సంబంధం ఉండదు. సోషలిజం అంటే శక్తికొద్దీ పని, శ్రమకొద్దీ ప్రతిఫలం. మొదటిదానిలో లాభం లేదా మిగులు పెట్టుబడిదారుల స్వంతం అవుతుంది. రెండవ దానిలో శ్రామికులకు గౌరవప్రదమైన వేతనాలతో పాటు మిగులు సామాజిక పరం అవుతుంది. దాన్ని వివిధ రూపాలలో అందరికీ వినియోగిస్తారు. సోషలిజం అంటే దరిద్రాన్ని పారదోలటం తప్ప దాన్ని అలాగే ఉంచి అందరికీ పంచటం కాదు. సోషలిజం దాని తరువాత కమ్యూనిజం అంటే శక్తికొద్దీ పని, అవసరం కొద్దీ వినియోగం. ఇప్పటికైతే కమ్యూనిజం ఒక ఉత్తమ భావన. మరి దీనికి ప్రాతిపదిక లేదా అంటే, ఉంది. ఆదిమ కమ్యూనిజం అనే దశలో నాటి మానవులు సామూహిక శ్రమ ద్వారా సాధించిన వాటిని అవసరం కొద్దీ పంచుకొనే వారు గనుక ఆ స్ధాయిలో ఉత్పత్తి సాధిస్తే ఆధునిక కమ్యూనిజం సాధ్యమే అన్నది మార్క్స్‌-ఎంగెల్స్‌ భావన. దాన్ని సాధించాలంటే జనం అందరి అవసరాలు తీరేంతగా ఉత్పత్తిని, ఉత్పాదక శక్తులను పెంచటం ఎంతకాలంలో సాధ్యం అవుతుంది అంటే ఎవరమూ చెప్పలేము. వ్యక్తిగత ఆసక్తి కొద్దీ ఒకరు కత్తి పట్టుకొని వైద్య పరమైన శస్త్ర చికిత్సలు చేయవచ్చు, మరొకరు అదే కత్తితో అందమైన క్రాఫులూ చేయవచ్చు. ఏది చేసినా సమాజం తగిన గుర్తింపు, గౌరవంతో పాటు వారి పూర్తి అవసరాలు తీరుస్తుంది. దోపిడీ, పీడన, యుద్దాలు ఉండవు, మారణహౌమాలు జరగవు. అదే కమ్యూనిజం భావన.

ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఆధునిక పెట్టుబడిదారీ విధానం అమల్లో ఉన్న ప్రాంతాలతో పాటు కొండకోనలకే పరిమితమై దుస్తులు కూడా వేసుకోని ఆదిమానవుల లక్షణాలను ఇంకా కలిగి ఉన్న వారి వరకు వివిధ దశల్లో ఉన్న జనం ఉన్నారన్నది వాస్తవం. పెట్టుబడిదారీ వ్యవస్ధ సంక్షోభంలో ఉన్నపుడు దాని బలహీనపు లింకును తెగగొట్టి సోషలిస్టు వ్యవస్ధను ఏర్పాటు చేయవచ్చు అన్నది రష్యాలో కమ్యూనిస్టులు నిరూపించారు. అయితే దాన్ని విఫలం చేశారు అని కొందరి అభిప్రాయం, కాదు అంతర్గత లోపాల కారణంగా అది విఫలమైంది అని కొందరు చెబుతారు. నెలలు నిండకుండానే పుట్టిన బిడ్డ అని కొందరు భావిస్తే అలాంటి బిడ్డను బతికించుకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను తీసుకోని కారణంగా అంతరించిందని కొందరు చెప్పవచ్చు. దేన్నీ పూర్వపక్షం చేయకుండా అనుభవాలు తీసుకోవటం ఇక్కడ ముఖ్యం. చైనాలో సోషలిస్టు వ్యవస్ధను ఏర్పాటు చేసిన వారు ఈ అనుభవాన్ని తీసుకొని తమదైన శైలిలో ఆ వ్యవస్ధను ముందుకు తీసుకుపోతున్నామని చెబుతున్నారు.


దానిలో భాగమే జాక్‌ మా వంటి వారు, ఆంట్‌ వంటి సంస్ధలూ వాటి మీద చర్యలూ అని చెప్పవచ్చు. రష్యాలో విప్లవం వచ్చిన నాటికి ఆ ప్రాంతం అభివృద్ది చెందిన పెట్టుబడిదారీ వ్యవస్ధలలో ఒకటి. అదే చైనా విప్లవ సమయంలో ఫ్యూడల్‌ సంబంధాలతో ఉన్న వ్యవస్ధ, పారిశ్రామికంగా మనకంటే వెనుకబడిన దేశం. పెట్టుబడిదారీ విధానం ఉన్నత స్ధాయిలోకి రావటం అంటే ఉత్పాదకశక్తులు గణనీయంగా అభివృద్ది చెంది ఉత్పత్తి ఇబ్బడి ముబ్బడి కావటం. దానితో పాటు దోపిడీ విపరీతంగా పెరిగి దాన్ని కూలదోసే సైన్యాన్ని కూడా అది పెంచుతుందన్నది కమ్యూనిస్టులు చెప్పే సిద్దాంతం. ఈ నేపధ్యంలో చూసినపుడు చైనాలో సోషలిస్టు వ్యవస్ధ లక్ష్యంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ అధికారానికి వచ్చిన తరువాత ఉత్పాదకశక్తుల పెరుగుదల ఆశించిన మేరకు పెరగలేదు. కనుకనే డెంగ్‌సియావో పింగ్‌ సంస్కరణలలో భాగంగా విదేశీ పెట్టుబడులు, పెట్టుబడిదారులను చైనాకు ఆహ్వానించారు. దేశీయంగా కూడా పరిమితుల మేరకు అనుమతించారు. దీనికి తోడు జాక్‌ మా వంటి వారు ఐటి, దాని అనుబంధ రంగాలలో ప్రవేశించి అనూహ్య స్దాయిలో సంపదలను సృష్టించారు, బిలియనీర్లుగా పెరిగిపోయారు. అయితే వారు సోషలిస్టు వ్యవస్ధకే ఎసరు తెచ్చే సూచనలు వెల్లడిస్తే కమ్యూనిస్టు పార్టీ అనుమతిస్తుందా ?


జాక్‌ మా వంటి వారి పెరుగుదలను చూసి ఇతర దేశాల్లో ఉన్న కమ్యూనిస్టుల్లో కొంత మంది ఇంకేముంది అక్కడ పెట్టుబడిదారీ విధానం అమల్లోకి వచ్చింది అని సూత్రీకరించారు, విచారపడ్డారు. ఇదేమిటని పెదవి విరిచారు. అదే జాక్‌ మా మీద ఆంక్షల విషయం వెల్లడికాగానే ప్రపంచంలోని కమ్యూనిస్టు వ్యతిరేకులు, పెట్టుబడిదారులందరూ గుండెలు బాదుకున్నారు. మేము ఇలా అనుకోలేదు అంటూ మొసలి కన్నీరు కార్చారు. ఇంకేముంది చైనా తిరోగమనం ప్రారంభం అయిందని చంకలు కొట్టుకున్నారు. ఒకటి స్పష్టం, గ్లాస్‌నోస్త్‌ పేరుతో నాటి సోవియట్‌ యూనియన్‌లో అమలు చేసిన అనుభవాలు చూసిన తరువాత తియన్మెన్‌ స్కేర్‌లో విద్యార్ధుల పేరుతో జరిపిన ప్రతీఘాత ప్రయత్నాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ మొగ్గలోనే తుంచి వేసింది. తాను పెరిగి, ఇతర సంస్దలను మింగివేసేందుకు పూనుకున్నట్లు జాక్‌మా గురించి వచ్చిన వార్తలు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినట్లు వెల్లడైన సమాచారం మేరకు తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అలీబాబా, ఆంట్‌ ఇతర కంపెనీల్లోని జాక్‌ మా వాటాలను చిన్న మదుపర్లకు విక్రయిస్తారని, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని పరిపరి విధాలుగా వార్తలు వస్తున్నాయి. ఏమి జరిగినప్పటికీ ప్రభుత్వ అనుమతుల మేరకు ఉంటాయి.

గుత్త సంస్ధలు పెరగకుండా నిరోధించే చట్టాలు అన్ని దేశాలలో మాదిరి చైనాలో కూడా ఉన్నాయి. వాటిని లోపభూయిష్టంగా తయారు చేయటం, సరిగా అమలు జరపని కారణంగా అనేక దేశాలలో సంస్ధలు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగి ప్రభుత్వాలనే శాసిస్తున్నాయి. చైనాలో వాటి అమలుకు నిదర్శనమే తాజా పరిణామాలు అని చెప్పవచ్చు.ఆంట్‌ కంపెనీ 37 బిలియన్‌ డాలర్ల వాటాల విక్రయానికి పూనుకోగా గతేడాది డిసెంబరులో చైనా ప్రభుత్వం అడ్డుకున్నది. ఈ చర్యలను చైనా అధినేత గ్జీ జింపింగ్‌ తన వ్యతిరేకులను అణచివేసే వాటిలో భాగంగా తీసుకుంటున్నట్లు చిత్రిస్తున్నారు. మన దేశంలో కాంగ్రెస్‌ లేదా బిజెపి ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో తమ ప్రత్యర్ధులుగా ఉంటూ వాణిజ్య, పారిశ్రామికవేత్తలుగా ఉన్న వారి మీదనే దాడులు జరుగుతాయి. ఆ రీత్యా చూసినపుడు చైనాలో అలాంటి వాటికి అవకాశం లేదు. మూడు సంవత్సరాల క్రితం జాక్‌ మా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అక్రమాలకు పాల్పడిన అనేకమంది కమ్యూనిస్టులు, ఇతరుల మీద చర్యలు తీసుకున్నారు. రియలెస్టేట్‌ కంపెనీ వాండా యజమాని వాంగ్‌ జియాన్‌లిన్‌, ఇన్సూరెన్సు కంపెనీ అనబాంగ్‌ అధిపతి ఉ గ్జియావోహురు మీద చర్యలు తీసుకోవటమే గాక వారి వ్యాపారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.(మన దేశంలో మాదిరి మేం వ్యాపారం చేయటం లేదు అని ఉన్న ప్రభుత్వ రంగ సంస్ధలకు ఎసరు తెస్తున్నదానికి విరుద్దం).


1999లో కేవలం 20 మంది స్నేహితులు, సిబ్బందితో తన స్వంత ఫ్లాట్‌లో ఐటి కార్యకలాపాలను ప్రారంభించిన జాక్‌ మా కేవలం రెండు దశాబ్దాల కాలంలోనే 2020 నాటికి ఏడాదికి 72 బిలియన్‌ డాలర్ల ఆదాయం తెచ్చే కంపెనీలకు అధిపతి అయ్యాడు.కెఎఫ్‌సి కంపెనీ తమ దుకాణంలో ఉద్యోగానికి పనికి రాడని జాక్‌ను తిరస్కరించింది. తాను జన్మించిన పట్టణానికి వచ్చే విదేశీయుల పరిచయాలతో ఆంగ్లం నేర్చుకున్న జాక్‌ తరువాత ఆంగ్లబోధకుడయ్యాడు. అదే సమయంలో ఇంటర్నెట్‌ చైనాలో ఊపందుకుంటున్నది. తన ఆంగ్ల పరిజ్ఞానంతో వాణిజ్య సంస్దలకు వెబ్‌ పేజీలను తయారు చేయటంతో తన కార్యకలాపాలను ప్రారంభించి ఆ రంగంలో ఉన్నత స్ధానాలకు ఎదిగాడు. ఇలాంటి వారెందరో తమ ప్రతిభతో బిలియనీర్లుగా మారారు.చైనాలో బిలియనీర్లుగా ఉన్న వారిలో ఇలాంటి వారే అత్యధికులు. స్వాతంత్య్రం వచ్చినపుడు మన దేశంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాని ప్రయివేటు సంస్ధలు ఇప్పుడు ప్రభుత్వ అండతో బడా సంస్ధలుగా ఎదిగి ప్రభుత్వ రంగాన్నే కొనుగోలు చేసే స్ధాయికి ఎదిగినట్లుగా, తమకు అనుకూలమైన విధానాలను అనుసరించాలని శాసిస్తున్నారు. జాక్‌ మా వంటి వారు చైనా ప్రభుత్వ విధానాలనే ప్రశ్నించే స్దాయికి ఎదిగారు. దానికి పరాకాష్టగా గతేడాది అక్టోబరులో చేసిన ఒక ప్రసంగంలో తన అంతరంగాన్ని బయటపెట్టారు. దేశ ఆర్ధిక, నియంత్రణ, రాజకీయ వ్యవస్ధలను సంస్కరించాలని, వస్తు తనఖా లేదా ఆస్తి హామీ లేకుండా రుణాలు ఇవ్వని వడ్డీ వ్యాపార దుకాణ ఆలోచనల నుంచి బ్యాంకులు బయటపడాలని చెప్పారు. ఇవి చైనా వ్యతిరేక శక్తులు చేస్తున్న ప్రచారానికి ప్రతిబింబం తప్ప మరొకటి కాదన్నది స్పష్టం. 2008లో ఇతర ధనిక దేశాల్లో వచ్చిన బ్యాంకింగ్‌ సంక్షోభం చైనాను తాకలేదు, దీనికి కారణం అక్కడి వ్యవస్ధపై ప్రభుత్వ అదుపు, ఆంక్షలు ఉండటమే. అలీబాబా ప్రభావం ఎంతగా పెరిగిపోయిందంటే దాన్ని అదుపులోకి తేవాల్సినంతగా అని సాంగ్‌ క్వింగ్‌హురు అనే ఆర్ధికవేత్త వ్యాఖ్యానించాడు.

చైనా మీద తరువాత కాలంలో వాణిజ్య యుద్దం ప్రకటించిన డోనాల్డ్‌ ట్రంప్‌ తాను అధికారం స్వీకరించిన తరువాత భేటీ అయిన తొలి చైనీయుడు జాక్‌ మా అన్నది చాలా మందికి గుర్తు ఉండకపోవచ్చు. తొలి పది రోజుల్లోనే న్యూయార్క్‌లో వారి భేటీ జరిగింది. అమెరికా వస్తువులను తన వేదికల ద్వారా చైనాలో మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించి పది లక్షల మంది అమెరికన్లకు ఉపాధి కల్పిస్తామని జాక్‌ మా ఆ సందర్భంగా ట్రంప్‌కు వాగ్దానం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఒక పారిశ్రామికవేత్తగా అలా చెప్పటాన్ని తప్పు పట్టనవసరం లేదు. తమ దేశ అవసరాలు, వ్యూహంలో భాగంగా చైనా ప్రభుత్వమే జాక్‌ మా వంటి వాణిజ్యవేత్తలను ప్రోత్సహించింది. ఐక్యరాజ్యసమితి వేదికల మీద రాజులు, రాణులు, దేశాల అధ్యక్షులు, ప్రధానుల సరసన కూర్చో పెట్టింది. దాన్ని చూసి అది తన పలుకుబడే, గొప్పతనమే అనుకుంటే అది పతనానికి నాంది. ఎంత పెద్ద వారైనా తిరుగుతున్న చట్రం మీద కూర్చున్న జీవులు తప్ప చట్రాన్ని తిప్పే వారు కాదు. ఈ నేపధ్యంలో చైనాలో జరుగుతున్న పరిణామాలను చూడాల్సి ఉంది. వ్యవస్ధకు కంపెనీలు, వ్యక్తులు అనువుగా ఉండాలి తప్ప వ్యక్తులు,సంస్ధల కోసం వ్యవస్ధలు కాదని చైనా నాయకత్వం స్పష్టం చేయదలచుకుంది.


ఇదే సమయంలో ఒక దేశం – రెండు వ్యవస్ధలు అనే అవగాహనకు చైనా కమ్యూనిస్టు నాయకత్వం దూరంగా పోతున్నదనే వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. బ్రిటన్‌ కౌలు గడువు తీరిన తరువాత 1997లో హాంకాంగ్‌ ప్రాంతం, అదే విధంగా పోర్చుగీసు నుంచి మకావో ప్రాంతాలు చైనాలో విలీనం అయిన సమయంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం, ప్రభుత్వం ఇచ్చిన హామీ, ఒప్పందం అది. ఆ మేరకు 2047 నాటికి ఈ రెండు ప్రాంతాలూ పూర్తిగా చైనా ప్రధాన వ్యవస్ధలో అంతర్భాగంగా మారాల్సి ఉంది. అప్పటి వరకు హాంకాంగ్‌లో ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్ధ, మకావూలో ఉన్న జూద కేంద్రాల కొనసాగింపు, పెట్టుబడులకు స్వేచ్చ ఉంటుంది. ఆ తరువాత అక్కడ కూడా ప్రధాన ప్రాంతంలోని చట్టాలు, వ్యవస్ధలోకి మారాల్సి ఉంటుంది. దీనికి అక్కడి పౌరులు సిద్దం కావాల్సి ఉంటుంది. అయితే అమెరికా, బ్రిటన్‌, ఇతర దేశాలు జోక్యం చేసుకొని హాంకాంగ్‌కు స్వాతంత్య్రం కావాలనే డిమాండ్‌ చేస్తూ ఆందోళనలకు పూనుకొనే విధంగా అక్కడి జనాలను రెచ్చగొడుతున్నారు. దాన్ని ఎదుర్కొంటూ విలీనానికి అవసరమైన చర్యలను ఒక్కొక్కటిగా చైనా తీసుకొంటోంది. అది పూర్తిగా చైనా అంతర్గత వ్యహారం, అయినా ఏదో ఒక పేరుతో మన దేశంతో సహా అనేక దేశాలు జోక్యం చేసుకుంటున్నాయి.

తైవాన్‌ మీదకు చైనా యుద్ద విమానాలు వెళ్లాయంటూ ఇటీవల కొన్ని సంచలనాత్మకంగా వార్తలను మీడియా ముందుకు తెచ్చింది. అది నిరంతర ప్రక్రియ. చైనా ప్రధాన భూ భాగానికి దూరంగా ఉన్న ఒక దీవి రాష్ట్రం తైవాన్‌.అది తిరుగుబాటు రాష్ట్రంగా విడిగా ఉంటోంది. తైవాన్‌ ప్రత్యేక దేశం కాదని, చైనాలో అంతర్భాగమే అని ఐక్యరాజ్యసమితి ఎప్పుడో గుర్తించింది. బలవంతంగా విలీనం చేసుకోవాలంటే చైనాకు పెద్ద సమస్య కాదు, సామరస్యపూర్వకంగా విలీనం జరగాలని కోరుకుంటోంది. అమెరికా, ఇతర దేశాలు తైవాన్‌లో జోక్యం చేసుకొని దానికి ఆయుధాలు అందిస్తున్నాయి, దాని తీరాలకు యుద్ద నావలను పంపి విన్యాసాల పేరుతో చైనాను రెచ్చగొడుతున్నాయి. ఇలా చేసినపుడల్లా విదేశీ జోక్యం దారులకు హెచ్చరికా చైనా నౌకలు విన్యాసాలు చేస్తుంటాయి, విమానాలు ఎగిరి వెనక్కు వస్తుంటాయి తప్ప ఎన్నడూ దాడులు చేయలేదు.తైవాన్‌లో, హాంకాంగ్‌లో జోక్యం ద్వారా చైనాను రెచ్చగొట్టి యుద్దానికి దింపాలన్నది సామ్రాజ్యవాదుల ఎత్తుగడ. వాటి వలలో పడకుండా చైనా తనదైన శైలిలో వ్యవహరిస్తోంది. తన జన జీవితాలను మెరుగుపరచటమే చైనాకు ప్రధమ ప్రాధాన్యత తప్ప యుద్దం కాదు.అదే సమయంలో అనివార్యం అయితే అందుకు అనుగుణ్యంగా తన ఆయుధాలకూ పదును పెడుతోంది. దాని బలం అమెరికా, ఇతర దేశాలనూ దుందుడుకు చర్యలకు పాల్పడకుండా నిలువరిస్తోంది.

అమెరికా, ఇతర పెట్టుబడిదారీ ధనిక దేశాలు చైనా మీద సాగిస్తున్న ప్రచ్చన్న యుద్దంలో చైనాలోని గ్జిన్‌ జియాంగ్‌ రాష్ట్రం కేంద్ర స్ధానంగా మారింది. అక్కడ ఉన్న ముస్లిం మైనారిటీలను సర్కార్‌ అణచివేస్తున్నదని, నిర్బంధంగా చాకిరీ చేయిస్తూ మానవ హక్కులకు భంగం కలిగిస్తున్నదని కొంత కాలం ప్రచారం చేశారు. ఇప్పుడు దాని కొనసాగింపుగా మానవహక్కులకు భంగం కలిగించే ప్రాంతం నుంచి ఉత్పత్తి అయ్యే చైనా వస్తువులను బహిష్కరించాలని అనేక దేశాలు పిలుపునిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా ఆంక్షలు ప్రకటించింది, మరికొన్ని దేశాలు అప్రకటితంగా అమలు చేస్తున్నాయి. ఆ రాష్ట్రం చుట్టూ రష్యా, మంగోలియా, కిర్ఖిజిస్తాన్‌, తజికిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్దాన్‌, మన దేశ సరిహద్దులు ఉన్నాయి. కోటీ 30లక్షల మంది ముస్లిం మైనారిటీలు ఉన్నారు. పొరుగుదేశాల నుంచి జోక్యం చేసుకుంటున్న శక్తులు అక్కడ వేర్పాటు వాదులను, ఉగ్రవాదులకు ప్రోత్సహిస్తున్నాయి. అనేక దేశాల మాదిరే చైనా కూడా తన జాగ్రత్తలు తాను తీసుకుంటున్నది. వాటిని మానవహక్కుల హననంగా చిత్రించి ప్రచారం చేస్తున్నారు. ఇస్లామిక్‌ దేశాలను రెచ్చగొడుతున్నారు. ప్రపంచ మార్కెట్లో మూడో వంతు దుస్తులు, వస్త్రాలు చైనా నుంచి వస్తున్నాయి. ఏటా చైనా చేస్తున్న 300 బిలియన్‌ డాలర్ల వస్తు ఎగుమతుల్లో 120బిలియన్‌ డాలర్లు వీటి నుంచే వున్నాయి. చైనాలో ఉత్పత్తి అయ్యే పత్తిలో 87శాతం గ్జిన్‌ జియాంగ్‌ రాష్ట్రం నుంచే ఉంది.ఆ రాష్ట్రం కొత్తగా చైనాలో చేరింది కాదు, జౌళి ఉత్పత్తులు కొత్తగా జరుగుతున్నవీ కాదు. వాటిని దిగుమతి చేసుకొని లబ్ది పొందని పశ్చిమ దేశమూ లేదు. అందువలన అక్కడ మానవ హక్కులకు భంగం కలుగుతోందనే పేరుతో చైనా జౌళి ఎగుమతులను దెబ్బతీయాలన్నది అమెరికా అండ్‌కో ఎత్తు గడ. అందుకోసం ప్రచార, దౌత్య, ఆర్ధిక యుద్ద రంగాలను తెరిచి చైనాను ఉక్కిరి బిక్కిరి చేయటం అసలు లక్ష్యం.అదే జరుగుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎరువుల ధరల పెంపుదల-కేంద్ర ప్రభుత్వ దోబూచులాట !

18 Sunday Apr 2021

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

#Indian Farmers, fertilizer prices enhancement, IFFCO, P&K fertilisers


ఎం కోటేశ్వరరావు


రైతాంగానికి తమ పంటలకు గిట్టుబాటు ధరలు ఎంత ముఖ్యమో వాటిని సాగు చేసేందుకు అవసరమైన పెట్టుబడులు-వాటి ధరలు కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఇఫ్‌కో సంస్ద ప్రస్తుతం ఉన్న మిశ్రమ ఎరువుల ధరలపై 45 నుంచి 58 వరకు పెంచుతూ ఒక ప్రకటన చేసింది. కొన్ని వార్తల ప్రకారం ఈ కంపెనీ తన మేనేజర్లకు పంపిన సమాచారం బయటకు పొక్కటంతో వాటిని నిర్దారిస్తూ ప్రకటన చేయాల్సి వచ్చింది. యూరియా మినహా ఇతర ఎరువుల మీద ప్రభుత్వ నియంత్రణ ఎత్తివేసిన విషయం తెలిసిందే.


తాజా పెంపు ప్రతిపాదన రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగించేదిగా కనిపించటంతో అనూహ్యంగా ప్రభుత్వమే వేగంగా స్పందించింది. అయితే ఇది ఎత్తుగడా ? చిత్తశుద్ధి ఎంత ? కేంద్ర మంత్రి ప్రకటించినట్లుగా దౌత్య మార్గాల ద్వారా దిగుమతి చేసుకొనే ఎరువులు, ముడి పదార్ధాల ధరలను నిజంగా తగ్గించటం సాధ్యమేనా ? ఇలాంటి ప్రయత్నం ముడి చమురు విషయంలో, ఇతర దిగుమతుల విషయంలో ఎందుకు చేయటం లేదు ? వ్యాపార విషయాల్లో దౌత్య పద్ధతు ఎంత మేరకు సఫలీకృతం అవుతాయి ? మేం ప్రయత్నించాం, సాధ్యం కాలేదు, దేశం కోసం భారం భరించకతప్పదు అనే పేరుతో చివరకు రైతుల మీద మోపుతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇఫ్‌కో సంస్ద మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద సహకార సంస్ధ. దేశంలో 19శాతం యూరియా, 29శాతం మిశ్రమ ఎరువుల మార్కెట్‌ వాటా కలిగి ఉంది. ఉత్పత్తి-మార్కెటింగ్‌ కార్యకలాపాలే కాదు, ఇతర రంగాల్లోకి కూడా అది ప్రవేశిస్తోంది. ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి రానున్న ధరల పెంపుదల ప్రకటన వెలువడగానే ప్రభుత్వం రంగంలోకి దిగి ఇఫ్‌కోతో పాటు ఇతర ఎరువుల కంపెనీలతో సంప్రదింపులు ప్రారంభించింది. అంతర్గతంగా ఏమి జరిగిందో తెలియదు, ప్రస్తుతం ఉన్న నిల్వలు అయిపోయేంతవరకు పాతధరలకు విక్రయిస్తామని కంపెనీలు హామీ ఇచ్చినట్లు ప్రకటనలు వెలువడ్డాయి. దీనికి నిజంగా కంపెనీలు కట్టుబడి ఉంటాయా, అమలు చేసేందుకు ప్రభుత్వాలు పూనుకుంటాయా అన్నది చెప్పలేము. ఫ్యాక్టరీల నుంచి వెలువడిన ఎరువుల సంచుల మీద పాత ధరలు ముద్రించిన నిల్వల వరకు ఆ ధరలే ఉంటాయని వార్తలు వచ్చాయి. అవి ఎన్ని ఉన్నాయి ? ప్రభుత్వం వైపు నుంచి స్పష్టంగా ప్రకటన లేదు.చిల్లర, టోకు వర్తకులు, రవాణా కేంద్రాలు, గోడౌన్లలో ఉన్న ఎరువులను పాత ధరలకు విక్రయిస్తామని చెప్పినట్లు, ఇఫ్‌కో సంస్ధ వద్ద 11.25లక్షల టన్నుల పాత నిల్వలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.పాత రేట్లతో ముద్రించిన ఎరువులను మాత్రమే విక్రయించాలని మార్కెటింగ్‌ విభాగాన్ని ఆదేశించినట్లు ఇఫ్కో ఎండీ యుఎస్‌ అవస్తి చెప్పారు.


గత కొద్ది నెలలుగా అంతర్జాతీయంగా ఎరువుల ధరల పెరుగుదల, మన దేశంలో ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేని కారణంగా ముందు చూపుతో తయారీదారులు ఉత్పత్తి నిలిపివేశారా ఇవన్నీ ఇప్పటికైతే సమాధానం లేని ప్రశ్నలే. ఈ ఏడాది ఖరీఫ్‌ వరకు పాత ధరలకే ఎరువులు లభిస్తాయని మంత్రులు నమ్మబలుకుతున్నారు. ఈ రంగంలో అసలేం జరుగుతోందో, పాలకుల హామీలు ఏ మేరకు అమలు జరుగుతాయో చూద్దాం. ఏప్రిల్‌ ఎనిమిదవ తేదీన ఎరువుల సంచులపై కొత్త ధరలను ముద్రించింది. అయితే అవి సుమారు ధరలు మాత్రమే అని-రైతుల కోసం ముద్రించినవి కాదని పేర్కొనటం గమనార్హం. శివకాశీ బాణసంచా ధరల మాదిరి ఇలా కూడా ముద్రిస్తారా ?


ఇఫ్‌కో సంస్ధ ప్రకటించిన దాని ప్రకారం ఎరువుల ధరల పెంపుదల ప్రతిపాదన ఇలా ఉంది.( యాభై కిలోల ధర రూపాయలలో )
ఎరువు రకం××× పాత ధర×× కొత్త ధర
10:26:26×××××× 1,175 ×××× 1,775
12:32:16×××××× 1,185 ×××× 1,800
20:0:13 ×××××× 925 ×××× 1,350
డిఏపి ×××××× 1,200 ×××× 1,900


ఇంత భారీ ఎత్తున ధరలను పెంచితే రైతాంగం మీద పెను భారం పడనుంది. ఇప్పటికే మూడు వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ ఆందోళన చేస్తున్న రైతాంగ ఆందోళన మరింతగా పెరిగేందుకు ఇది తోడ్పడుతుంది. గత పది సంవత్సరాలుగా ఎరువుల మీద ఇస్తున్న సబ్సిడీ మొత్తాలలో ఎలాంటి మార్పు లేదు. అంతకు మించి కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా లేదు. పెరిగిన మేరకు అదనపు భారాన్ని రైతులే భరిస్తున్నారు. ఇప్పుడు పెరిగేది కూడా పూర్తిగా వారే మోయకతప్పదు. ఎరువుల తయారీకి దిగుమతి చేసుకుంటున్న ముడి వస్తువుల ధరలు, దిగుమతి ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిన కారణంగా ధరలు పెంచకతప్పదని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. ఎరువుల శాఖ మంత్రి డివి సదానందగౌడ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. సరఫరా సక్రమంగా ఉంటే, దిగుమతుల ధరలు తగ్గితే తాము ధరలను పెంచాల్సిన అవసరం ఉండదని, అందువలన ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకోవాలని బంతిని అటువైపు నెట్టారు. మొరాకో, రష్యా దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న ఎరువులు, ముడి సరకుల మీద బైడెన్‌ సర్కార్‌ దిగుమతి సుంకాలను గణనీయంగా పెంచింది. అందువలన వాటిని మన దేశానికి సరసమైన ధరలకు మన దేశానికి మరలిస్తే ఉపయోగమని కంపెనీల ప్రతినిధులు చెప్పారు. దౌత్యపరమైన చర్యల ద్వారా ఆ ప్రయత్నం చేస్తామని, అంతవరకు ధరలు పెంచవద్దని మంత్రి కోరారు. ఇది సాధ్యమేనా ? ప్రయివేటు కంపెనీలకు మరో రూపంలో మనం ప్రయోజనం కలిగిస్తే అవి ఎరువులను తక్కువకు మనకు ఇస్తాయి. రైతులకు ఎరువుల సబ్సిడీ పెంచటానికే మొరాయిస్తున్న సర్కార్‌ విదేశీ కంపెనీలకు అలాంటి లబ్ది చేకూర్చేందుకు పూనుకుంటుందా ?

అమెరికా, బ్రెజిల్‌, చైనాలలో ఎరువుల వినియోగం ఎక్కువగా ఉన్నందున అక్కడి నుంచి గిరాకీ కారణం కూడా అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదలకు దారితీసింది. మన ప్రధాని నరేంద్రమోడీ పలుకుబడి కారణంగా ఒకవేళ మనకు సరఫరా ఎరువులు, ముడిసరకుల ధరలను తగ్గిస్తే మిగతా దేశాలు చూస్తూ ఊరుకుంటాయా ? ఐరోపా, అమెరికా మార్కెట్లలో డిఏపి ఎరువుకు మంచి డిమాండ్‌ ఉంది. గతేడాది అక్టోబరులో డిఏపి టన్ను ధర 400 డాలర్లు ఉండగా ఇప్పుడు 540 డాలర్లవరకు పెరిగింది.


ఇఫ్‌కో డిఏపి కొత్త ధర రు.1,900 అని ప్రకటించగా అదే ఎరువు ధరను క్రిబ్‌కో, జువారీ, పారాదీప్‌, ఎంసిఎఫ్‌ఎల్‌ రు.1,700 అని, చంబల్‌ ఫెర్టిలైజర్స్‌ రు.1,600, ఇండోరామ్‌ రు.1,495గా పేర్కొన్నాయి. గత ఆరు సంవత్సరాల కాలంలో దేశంలో రసాయన ఎరువుల వినియోగం 16శాతం లేదా 2015-16 నుంచి 2020-21 మధ్య 510లక్షల టన్నుల నుంచి 590లక్షల టన్నులకు పెరిగింది. వీటిలో యూరియా 55 నుంచి 60శాతం వరకు ఉంటున్నది. ఎరువుల వినియోగం పెరుగుతున్నప్పటికీ వాతావరణ పరిస్ధితులను బట్టి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి. గత పదేండ్ల సగటును చూసినపుడు 500 లక్షల టన్నులు ఉంది. గత ఆరు సంవత్సరాలలో 2020-21లో డిఏపి, మిశ్రమ ఎరువుల వాడకం ఎక్కువగా ఉన్నట్లు ఫిబ్రవరి వరకు అందిన సమాచారం వెల్లడించింది.


కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు అందించిన సమాచారం ప్రకారం సగటున హెక్టారుకు 2015-16లో ఎరువుల వినియోగం 135.76కిలోలు ఉండగా మరుసటి ఏడాదికి 123.41కి తగ్గింది, 2019-20కి 133.44 కిలోలకు పెరిగింది.పైన పేర్కొన్న పట్టిక ప్రకారం నాలుగు ఎరువులను కలిపి 50కిలోల యూనిట్‌గా తీసుకుంటే సగటున పాత ధర రూ.1,121 ఉంది, పెంపుదల అమల్లోకి వస్తే రు.1,706 అవుతుంది. ఈ లెక్కన దేశ సగటు వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఒక హెక్టారుకు పెరిగే పెట్టుబడి భారం రు.2,991 నుంచి రు.4,553కు పెరుగుతుంది. గరిష్ట స్ధాయిలో బీహార్‌లో హెక్టారుకు 245.25కిలోలు వినియోగిస్తుండగా అత్యల్పంగా కేరళలో 36.49 కిలోలు మాత్రమే వినియోగిస్తున్నారు. సగటున రెండువందల కిలోలు వినియోగిస్తున్న రాష్ట్రాలలో పంజాబ్‌, హర్యానా, తెలంగాణా ఉన్నాయి. దేశ సగటు కంటే తక్కువ వినియోగం ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌ఘర్‌ ఉన్నాయి. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే బీహార్‌లో ఒక హెక్టారు ఉన్న రైతుకు భారం రు.2,991 నుంచి రు.4,553కు పెరిగితే అదే కేరళలోని రైతుకు రు.818 నుంచి రు.1,245కు పెరుగుతుంది. బీహార్‌ రైతుకు అదే విధంగా కేరళ రైతుకు కేంద్రం నిర్ణయించే ధాన్య మద్దతు ధర ఒకే విధంగా ఉంటుంది.(బీహార్‌లోని బిజెపి-జెడియు సర్కార్‌ రైతులను గాలికి వదలి వేస్తే కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం అదనంగా చెల్లిస్తున్నది అది వేరే విషయం.)


మన కంపెనీలు ఎరువుల ధరలు పెంచటం గురించి బెలారస్‌ (పూర్వపు సోవియట్‌ యూనియన్‌లోని బైలో రష్యా రిపబ్లిక్‌) బెలారష్యన్‌ పొటాష్‌ కంపెనీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జనవరి నెలలో అంగీకరించిన దానికంటే 13శాతం అదనంగా టన్ను ధర 280 డాలర్లకు తాము ఇండియన్‌ పొటాష్‌ లిమిటెడ్‌తో కొత్త కాంటాక్టు ( ఏప్రిల్‌ )కుదుర్చుకున్నామని కంపెనీ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఈ కంపెనీయే చైనాకు ఏడాది పాటు ఇదే ధరకు సరఫరా చేసేందుకు ఫిబ్రవరిలో ఒప్పందం చేసుకుంది. ఇదే విధంగా ఇజ్రాయెల్‌కు చెందిన ఐసిఎల్‌ గ్రూప్‌ కూడా గతం కంటే 50 డాలర్లు అదనంగా అదే ధరకు ఇండియన్‌ పొటాష్‌కు ఆరులక్షల టన్నులు అందించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. అయితే బెలారస్‌ కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఇతర దేశాల్లోని పొటాష్‌ కంపెనీలు తప్పు పట్టాయి. ఈ ధరలు మార్కెట్‌ స్ధితిని ప్రతిబింబించటం లేదని, తాము ఆ ధరకు విక్రయించేది లేదని ప్రకటించాయి. బెలారస్‌ కంపెనీ పెంచినది 13శాతం అయితే మన కంపెనీలు 50శాతంపైగా పెంపుదలను ప్రకటించటాన్ని చూసి అనేక విదేశీ కంపెనీలు ఆశ్చర్యపోవటమే కాదు, ధరల పెంపుదల ఆలోచన కలిగించినందుకు భారత కంపెనీలకు కృతజ్ఞతలు చెబుతున్నాయి.

అమ్మోనియం(డిఎపి) కంటే పొటాష్‌ (ఎంఓపి)ధరలు తక్కువగా ఉన్నప్పటికీ అవి కూడా పెరుగుదలను సూచిస్తున్నాయి. బెలారస్‌, రష్యా, కెనడా,ఇజ్రాయెల్‌, జోర్డాన్‌, జర్మనీల నుంచి మన దేశం పొటాష్‌ దిగుమతి చేసుకుంటున్నది. పొటాష్‌ పూర్తిగా మన దేశం దిగుమతుల మీదే ఆధారపడి ఉంది. డిఏపి పరిస్ధితి కూడా దాదాపు అదే. ముడి పదార్ధాలను దిగుమతి చేసుకొని ఇక్కడ ఎరువును తయారు చేస్తున్నాము. పొటాష్‌, ఫాస్పేట్‌ ఎరువులకు నిర్ణీత మొత్తం మాత్రమే సబ్సిడీ ఇస్తామని 2010లో యుపిఏ ప్రభుత్వం నిర్ణయించిన విధానాన్నే మోడీ సర్కార్‌ కూడా అనుసరిస్తున్నది. కంపెనీలు ధరలు పెంచితే ఆ మొత్తాన్ని రైతులే భరించాలి. ఒక్క యూరియా విషయంలోనే కేంద్రం ధరలను నిర్ణయిస్తున్నది. ఆ మేరకు కంపెనీలకు సబ్సిడీని చెల్లిస్తున్నది.


2013 తరువాత అంతర్జాతీయంగా టన్ను డిఏపి ధర 560 డాలర్లకు పెరగటం ఇదే ప్రధమం. దీనికి తోడు మన రూపాయి విలువ పతనం కూడా ఎరువుల ధరల మీద ప్రతికూల ప్రభావం చూపుతోంది. డిఏపి ధరలు అక్టోబరులో 400 డాలర్లు ఉండగా ఇప్పుడు 540కి పెరిగాయి. అదే విధంగా ఎరువుల తయారీకి అవసరమైన అమ్మోనియా, సల్ఫర్‌ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరం మొత్తం ఎరువుల వినియోగం 610లక్షల టన్నులు ఉంటుందని అంచనా. కాగా దీనిలో 55శాతం యూరియా ఉంది. మిశ్రమ ఎరువుల ధరలు గణనీయంగా పెరిగినందున చౌకగా లభించే యూరియాను రైతులు విరివిగా వాడుతున్నారు. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 79వేల కోట్ల రూపాయలు ఎరువుల సబ్సిడీకి కేటాయించగా దానిలో యూరియా ఒక్కదానికే 59వేల కోట్లు పోనుంది. ఇప్పటికే యూరియా ధర తక్కువగా ఉన్నందున అవసరానికి మించి వాడుతున్నారని, అది భూ ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నదని చెబుతున్నారు. దీనిలో వాస్తవమూ ఉంది, యూరియా సబ్సిడీ తగ్గించే ఎత్తుగడా ఉంది. ఇతర మిశ్రమ ఎరువులకు సబ్సిడీ ఇస్తే ఏ రైతు కూడా తన పొలం ఆరోగ్యాన్ని చేతులారా చెడుగొట్టుకోడు, వాటినే వినియోగిస్తాడు.

చివరిగా ఎరువుల ధరల తగ్గింపునకు ప్రభుత్వ పలుకుబడి, దౌత్యాన్ని వినియోగిస్తామని చెప్పటం గురించి చూద్దాం. నిజానికి కేంద్ర ప్రభుత్వానికి అంత పలుకుబడే ఉంటే దాన్ని ఒక్క ఎరువుల దిగుమతికే ఎందుకు పరిమితం చేయాలి ? ఎరువులు ఎంత ముఖ్యమో, పెట్రోలియం ఉత్పత్తులు కూడా అంతే ప్రాధాన్యత కలిగినవి. అంతర్జాతీయ ధరలకు అనుగుణ్యంగా ఎంత పెరిగితే అంత మేరకు డీజిలు, పెట్రోలు మీద వడ్డిస్తామని చెబుతున్న కేంద్రం ఎరువుల విషయంలో భిన్నంగా వ్యవహరించటానికి కారణం ఏమిటి ? చమురు ధరలు ఎంత పెరిగినా, కేంద్రం పన్ను వడ్డింపు ఎంత పెంచినా వినియోగదారులు కిక్కురు మనటం లేదు. వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడుల ధరలు పెరిగితే అది ఆ రంగంలో తీవ్ర సంక్షోభానికి దారి తీస్తుంది. గతంలో అనేక రాష్ట్రాలలో రైతులు ఆందోళనలు జరిపిన చరిత్ర ఉంది. ఇప్పుడు రాజధాని ఢిల్లీ పరిసరాల్లో కొనసాగుతున్న రైతుల తిష్ట కూడా దానిలో భాగమే. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత ఫలితాలు బిజెపికి ప్రతికూలంగా వచ్చినా అనుకూలంగా వచ్చినా రైతు ఉద్యమాన్ని ఏదో ఒక రూపంలో అణచివేసేందుకు సిద్దం అవుతున్నారు. ఈ క్రమంలో ఎరువుల ధరలు పెంచితే అందునా త్వరలో ఖరీఫ్‌ తరుణం ప్రారంభం కానున్నందున రైతుల ఉద్యమానికి ఆజ్యం పోస్తాయి. నియంత్రణ ఎత్తివేసిన ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచకుండా కార్పొరేట్‌ కంపెనీలను ఎంతకాలం కట్టడి చేయగలదు ? ముడి చమురు ధరలను కట్టడి చేసేందుకు సౌదీ, ఇతర దేశాల మీద వత్తిడి తెస్తామని, చమురు ఆయుధాన్ని వినియోగిస్తామని ఆశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రగల్భాలు పలికారు, ఏమైంది ? ఇప్పుడు ఎరువుల మంత్రి సదానంద గౌడ ప్రకటనలకూ అదే గతి పడుతుందా ? వ్యాపారం, లాభాలే ధ్యేయంగా వ్యవహరించే కార్పొరేట్లు ఒక దేశానికి తక్కువ రేటుకు, మరొక దేశానికి ఎక్కువ రేటుకూ ఇచ్చిన దాఖలాలు ఇంతవరకు లేవు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ (కౌగిలింతల ) వ్రతం చెడ్డా ఫలం దక్కలే ! అమెరికాతో వాణిజ్య యుద్దానికి సిద్దమా !!

05 Monday Apr 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Digital Service Tax, DST, Katherine Tai, Narendra Modi, Retaliatory tariffs on Indian goods, Trade Protectionism, USTR


ఎం కోటేశ్వరరావు


తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోయినా, మీడియా పెద్దగా పట్టించుకోని కారణంగా అనేక విషయాలు మరుగున పడిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం మన ప్రభుత్వం సౌదీ అరేబియా మీద చమురు ఆయుధాన్ని ప్రయోగించాలంటూ వార్తలు వెలువడ్డాయి. చమురు ధరలు పెరిగితే కొనుక్కోలేము, తగ్గితే కొని నిలవ చేసుకొనేందుకు సౌకర్యాలు, స్వంత ఉత్పత్తిని పెంచుకోలేని మనం చమురు ఎగుమతి దేశాల మీద దాడి చేయటం ఏమిటి ? సౌదీ అరేబియా నుంచి కొనుగోళ్లను నిలిపివేసి లేదా బాగా తగ్గించి ఇతర మార్కెట్లలో ఏ రోజు ధర ఎంత ఉంటే అంతకు కొనుగోలు చేసి మన సత్తా ఏమిటో చూపాలన్నట్లుగా వార్తలు వచ్చాయి. మనది సర్వసత్తాక స్వతంత్ర భారత్‌ – స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం, వారసత్వం లేని కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలకు ఆ విషయం తెలుసో లేదో తెలియదు ( అయినా అమెరికా ఆదేశించింది గనుక మనమే ” స్వంత ” నిర్ణయం తీసుకొని ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు నిలిపివేశాము. ఇరాక్‌ నుంచి గణనీయంగా తగ్గించాము.) ఇప్పుడు సౌదీ అరేబియా ( కొద్ది రోజుల క్రితం సామాజిక మాధ్యమంలో బిజెపి మరుగుజ్జులు నరేంద్రమోడీ మీద గౌరవంతో సౌదీ అరేబియా మనకు రాయితీధరలకు చమురు విక్రయించేందుకు అంగీకరించిందని ప్రచారం చేశారు ) మీద కారాలు మిరియాలు నూరుతున్నాము. వారు నందంటే నంది పందంటే పంది అని జనం కూడా మాట్లాడాలి మరి, లేకుంటే దేశభక్తి లేదని ముద్రవేస్తారు మరి !


అసలు విషయం ఏమిటి ? గత కొద్ది సంవత్సరాలుగా చమురు దిగుమతి చేసుకొనే దేశంగా ఉన్న అమెరికా ఇటీవలి కాలంలో షేల్‌ ఆయిల్‌ ఉత్పత్తి కారణంగా చమురు ఎగుమతి దేశంగా మారిపోయింది. అమెరికాతో మన వాణిజ్యం కొద్దిగా మిగులులో ఉంది.కనుక తమ కంపెనీల నుంచి పారిశ్రామిక ఉత్పత్తులు, ఆయుధాలతో పాటు చమురు కూడా కొంటారా లేదా అని వత్తిడి చేస్తోంది. పశ్చిమాసియా, గల్ఫ్‌దేశాలు మనకు ఎప్పుడూ మిత్రులుగానే ఉన్నాయి తప్ప శత్రువులు కాదు. గల్ఫ్‌ దేశాల నుంచి కొనుగోళ్లు తగ్గించి ఆమేరకు అమెరికా చమురు కొనాలంటే ఏదో ఒకసాకు కావాలి. సౌదీ అరేబియా ఇటీవల చమురు ఉత్పత్తిని తగ్గించిన కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయి. తగ్గినపుడు ఆ మేరకు మన జనానికి తగ్గించకుండా పన్నులు వేసి ఆ మొత్తాలను అదానీ, అంబానీల వంటి కార్పొరేట్లకు పన్నుల రాయితీల రూపంలో మూటగట్టి మరీ ఇచ్చారు, ఇస్తున్నారు. ఇప్పుడు చమురు ధరలు పెరిగితే ప్రస్తుతం నరేంద్రమోడీ మత్తులో ఉన్న జనానికి అది వదిలిన తరువాత ఏం జరుగుతుందో అందరికంటే నరేంద్రమోడీకే బాగా తెలుసు గనుక చమురు ఎగుమతి దేశాల మీద రుసరుసలాడుతున్నారు. గతంలో మా దగ్గర కారుచౌకగా కొన్న చమురు ఉంది కదా ఆమేరకు మీ వినియోగదారులకు భారం తగ్గించండి అని సౌదీ అరేబియా సలహాయిచ్చింది.దాన్ని సాకుగా తీసుకొని వేరే మార్కెట్లలో కొనుగోలు చేయాలని మన చమురు కంపెనీలను కోరారు.


పోనీ ఆ వేరే మార్కెట్లలో మన లావు – పాత పోలిక వద్దు లెండి ఇప్పుడు గడ్డం పొడవు చూసి అనాలేమో ! తక్కువ ధరలకు ఏమైనా ఇస్తాయా ? ఒక్క సెంటు(మన ఏడు పైసలకు సమానం) కూడా తగ్గించవు. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ధరల ప్రకారమే, డాలర్లు మరీ చెల్లించి మనం కొనుక్కోవాలి, మన పొరుగునే ఉన్న గల్ఫ్‌ నుంచి రవాణా ఖర్చులు తక్కువ, అదే అమెరికా నుంచి కొనుగోలు చేస్తే తడచిమోపెడంత అవుతాయి……తనది కాదు గనుక తాటిపట్టవేసి గోక్కోమన్నాడట వెనుకటికెవడో ! అలాగే కేంద్ర పెద్దలదేముంది, భరించేది మనమే కదా ఎంతైనా, ఎక్కడి నుంచైనా తెస్తారు ? చమురు కార్పొరేట్లతో వారి సంబంధాలు ముఖ్యం కదా ! మన ప్రధాని నరేంద్రమోడీ అమెరికా స్నేహం పట్టినప్పటి నుంచీ కొంత చమురును మన రూపాయల్లో కొనే వెసులుబాటు కల్పించిన ఇరాన్‌ను వదలి పెట్టి అమెరికన్లను మెప్పించేందుకు చమురు కొనుగోళ్లను ఎలా పెంచారో తెలుసా ?


2017-18లో రోజుకు 38వేల పీపాల చమురు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నాము.2021 ఫిబ్రవరిలో ఆ మొత్తం 5,45,300 పీపాలకు పెరిగింది.ప్రస్తుతం 8,67,500 పీపాలతో మొదటి స్ధానంలో ఉన్న ఇరాక్‌ నుంచి దిగుమతులను గణనీయంగా తగ్గించి అమెరికా మీద అధికంగా ఆధారపడే విధంగా మోడీ వేగంగా ప్రయాణిస్తున్నారు. మన పశ్చిమాసియా మిత్ర దేశాలతో చమురు వైరుధ్యం తెచ్చుకొని ఆ దారులన్నీ మూసుకున్న తరువాత అమెరికా ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి, ఎక్కడ, ఎలా నిలబడమంటే అలా నిలబడాల్సిన రోజు వచ్చినా ఆశ్చర్యం లేదు. మన చమురు ఆయుధాన్ని మనమీదే ప్రయోగిస్తే చేయగలిగిందేమీ లేదు.మనం ట్రంప్‌ హయాంలో కౌగిలింతల కోసం ఎంతగా లొంగిపోయామో అందరికీ తెలిసిందే. ఇప్పుడు జో బైడెన్ను మరింతగా ఆకర్షించేందుకు నానా పాట్లు పడుతున్నాము. అయినా వారు చేస్తున్నదేమిటి ?
డోనాల్డ్‌ ట్రంప్‌, జో బైడెన్‌ ఎవడైతేనేం అమెరికన్‌ కార్పొరేట్ల చౌకీదార్లు. వారికోసం ఏ గడ్డికరవమన్నా కరుస్తారు. వాటంగా ఉంటే కౌగలించుకొని మత్తులో ముంచుతారు లేకపోతే కాటువేసి దెబ్బతీస్తారు. ఈ మధ్య కాలంలో నరేంద్రమోడీ డిజిటలైజేషన్‌ గురించి ఎన్నో కబుర్లు చెబుతున్నారు. ఆయన ప్రత్యేకత ఏమంటే అసలు మన దేశంలో ఇంటర్నెట్‌, డిజిటల్‌ కెమెరా రాకముందే వాటిని ఉపయోగించి అద్వానీగారినే ఆశ్చర్యపరిచిన ఘనత ఆయన సొంతం. స్వయంగా ఆయనే చెప్పుకున్న విషయం, దాని మంచిచెడ్డలు వదలివేద్దాం. విదేశాలకు చెందిన సంస్ధలు మన దేశంలో డిజిటల్‌ సేవలను అందించి వ్యాపారం చేస్తున్నపుడు దానికిగాను డిజిటల్‌ సర్వీసు టాక్సు(డిఎస్‌టి) చెల్లించాలని మన దేశం 2016లోనే అనేక దేశాలతో పాటు ఆదాయం మీద ఆరుశాతం పన్ను విధించాలని నిర్ణయించింది. అయితే అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్ధల వత్తిడి మేరకు మోడీ సర్కార్‌ దాన్ని ఆన్‌లైన్‌ ప్రకటనల సేవలకు మాత్రమే పరిమితం చేసింది. తరువాత అన్ని రకాల డిజిటల్‌ సేవలకు గాను రెండు శాతం చెల్లించాలని గత ఏడాది మార్చినెలలో 2020 ఫైనాన్స్‌ చట్టం ద్వారా నిర్ణయించింది. అలాంటి సేవలందించే సంస్ధలలో అత్యధికభాగం అమెరికాకు చెందినవే. మన దేశం విధించిన పన్ను పరిధిలోకి వివిధ దేశాలకు చెందిన 119 సంస్ధలు వస్తాయి, వీటిలో కేవలం అమెరికా నుంచే 86 ఉన్నాయి. ఈ పన్ను అంతర్జాతీయ చట్టాలకు విరుద్దం, అమెరికా వాణిజ్య సంస్ధల పట్ల వివక్ష చూపటమే అని అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాపితంగా డిజిటల్‌ ఆర్ధిక వ్యవస్ధ శరవేగంగా అభివృద్ది చెందుతున్న దశలో ఏ దేశమూ దాని ద్వారా రావాల్సిన ఆదాయాన్ని వదులుకోజాలదు. మన దేశ వినియోగదారులతో విదేశీయులు జరిపే ప్రతిలావాదేవీకి ఈ పన్ను వర్తిస్తుంది.


అమెరికా వారు ఎంత అదరగొండి బాపతు అంటే వారికి అంతర్జాతీయ చట్టాలు పట్టవు. 1974వారు చేసిన అమెరికా వాణిజ్య చట్టంలోని 301 సెక్షన్‌ ప్రకారం ఏ దేశమైనా అమెరికా వాణిజ్యానికి వ్యతిరేకమైన చర్యలు తీసుకున్నదని భావిస్తే తమ స్వంత చట్టం ద్వారా విచారణ జరుపుతారట. ఆ మేరకు చర్యలు కూడా తీసుకుంటారు. మన దేశం విధించిన డిఎస్‌టి అమెరికా, తదితర విదేశీ డిజిటల్‌ సంస్ధలకు మాత్రమే వర్తింప చేస్తూ భారతీయ సంస్దలకు మినహాయింపు ఇవ్వటం వివక్ష కిందకు వస్తుందన్నది ఒక అభ్యంతరం.ఉదాహరణకు అమెజాన్‌,గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి వాటితో పాటు అంబానీ-అదానీ కంపెనీలు డిజిటల్‌ సేవలు అందించినా ఈ చట్టం ప్రకారం అదానీ-అంబానీలు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రెండవది కొన్ని నాన్‌ డిజిటల్‌ సేవా సంస్దలు డిజిటల్‌ సేవల మాదిరి వాటిని అందచేసినా వాటికి మినహాయింపు ఇవ్వటం వివక్షా పూరితం అన్నది అమెరికా అభ్యంతరం. దీన్ని మన దేశం అంగీకరించలేదు. ఏ కంపెనీ అయినా మన దేశంలో శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేసుకుంటే దానికి మన దేశంలోని పన్ను చట్టాలు వర్తిస్తాయి గనుక వాటి మీద మరొక పన్ను విధించాల్సిన అవసరం లేదన్నది మన వాదన. అమెరికా సంస్ధలు ఏవైనా మన దేశంలో శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేసుకుంటే అదే సూత్రం వర్తిస్తుంది. మనకు ఎలాంటి పన్నులు చెల్లించకుండా మన సేవల ద్వారా లాభాలు పొంది వాటిని తమ దేశాలకు తరలించుకుపోవాలన్నది విదేశీ కార్పొరేట్‌ శక్తుల ఎత్తుగడ. చైనా, భారత్‌ వంటి దేశాలలో పెద్ద ఎత్తున డిజిటల్‌ సేవలను విస్తరిస్తున్నందున వాటి నుంచి పన్ను ఆదాయం రాబట్టకుండా ఆర్ధిక వ్యవస్ధలు నడవవు.
అనేక దేశాలు వివిధ రూపాలలో వస్తు, సేవల మీద పన్నులు వసూలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు చైనాలో డిఎస్‌టి లేదు. చైనాకు చెందిన అలీబాబా వంటి సంస్దలు డిజిటల్‌ సేవలు అందిస్తున్నాయి.చైనాలో ప్రస్తుతం 18 రకాల పన్నులు ఉన్నాయి. డిజిటల్‌ సేవల మీద కూడా పన్ను విధించాలనే ఆలోచన చేస్తున్నారు. అక్కడ కూడా అమలు చేస్తే ప్రస్తుతం సాగుతున్న వస్తు,సేవల వాణిజ్య యుద్దం డిజిటల్‌ సేవల వాణిజ్యానికి కూడా విస్తరించవచ్చు. మన దేశం విధించిన రెండుశాతం డిఎస్‌టికి ప్రతిగా కొన్ని భారతీయ వస్తువులపై 25శాతం దిగుమతి పన్ను విధించి బదులు తీర్చుకుంటామని మార్చినెల చివరి వారంలో అమెరికా నూతన వాణిజ్యప్రతినిధి కాథరీన్‌ తాయి బెదిరించారు.ఆస్ట్రియా, బ్రిటన్‌, ఇటలీ, టర్కీ, స్పెయిన్‌, ఇతర దేశాల మీద కూడా బస్తీమే సవాల్‌ అన్నారు. టర్కీ 7.5, ఆస్ట్రియా 5, ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్సు మూడు శాతం చొప్పున, బ్రిటన్‌ రెండుశాతం డిఎస్‌టి విధిస్తామని ప్రకటించాయి, బ్రెజిల్‌ కూడా పన్ను విధింపు ఆలోచన చేస్తున్నది. ఒకవైపు డిజిటల్‌ సేవల పన్ను మీద ప్రపంచ ఒప్పందం చేసుకొనే అంశం గురించి చర్చించుదామని జో బైడెన్‌ మాట మాత్రంగా అంటున్నా, అది కుదిరే వరకు గతంలో ట్రంప్‌ ప్రతిపాదించిన ప్రతికూల చర్యలను ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించుకున్నట్లుగా తారు ప్రకటన నిర్దారించింది.ఆమె ప్రకటనను అమెరికా ఇంటర్నెట్‌ అసోసియేషన్‌ అభినందించింది.

మన దేశం విధించిన డిఎస్‌టి ద్వారా ఏటా 5.5 కోట్ల డాలర్ల మేరకు పన్ను ఆదాయం వస్తుందని అంచనా. అంత మొత్తానికి సమంగా మన దేశం నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై అమెరికా పన్ను విధించే ఆలోచన చేస్తున్నది. అదే గనుక జరిగితే మన రొయ్యలు, బాసుమతి బియ్యం, రంగురాళ్లు, వెదురు ఉత్పత్తులు, ఫర్నీచర్‌, బంగారు ఆభరణాలు మొదలైన వాటి మీద 25శాతం వరకు పన్నులు విధిస్తామని ప్రకటించింది. ఇంతకు ముందే మన ఎగుమతులకు ఇచ్చే రాయితీలను కొన్నింటిని ట్రంప్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు ఉన్నవి పోయాయి, ఇప్పుడు కొత్తవి తగులుకుంటాయి. అయితే అమెరికా చర్యలకు ప్రతీకారంగా అమెరికాను ప్రపంచ వాణిజ్య సంస్ద కోర్టులోకి లాగవచ్చు. అమెరికా నుంచి వస్తున్న ఆడియో-వీడియో ప్రసారాల మీద పన్ను వేయవచ్చు, అమెరికా క్రెడిట్‌ కార్డు కంపెనీలు, మెసేజింగ్‌ సేవలను నిలిపివేయవచ్చు. ఆ చర్యలు తీసుకొనే దమ్మూ ధైర్యం మన 56 అంగుళాల ప్రధానికి ఉందా ? బహుశా మరొక పద్దతిలో బైడెన్‌న్ను ప్రసన్నం చేసుకొనేందుకు సౌదీ బదులు మరింతగా అమెరికా నుంచి చమురు కొంటామనే సంకేతం పంపారా ? అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్‌ తాయి బెదిరింపు-ఈ సంకేతం ఒకే సమయంలో వెలువడటాన్ని ఎలా అర్దం చేసుకోవాలి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాడు ఈస్టిండియా అక్రమ చొరబాటు – నేడు వెస్ట్‌ ఇండియా కంపెనీలకు బిజెపి రాచబాట !

27 Saturday Mar 2021

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, Economics, employees, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Privatization, Vizag steel agitation, Vizag Steel Plant Privatisation


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


ఆంధ్ర ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నూరు శాతం అమ్మేస్తాం లేదా ఫ్యాక్టరీని మూసేస్తాం అని నిస్సిగ్గుగా పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రులు ప్రకటించారు. సోషలిస్ట్‌, సెక్యూలర్‌ అని రాసి ఉన్న రాజ్యాంగం పై ప్రమాణం చేసి అధికార పీఠం పై కూర్చున్న మంత్రులు రాజ్యాంగం స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా అన్ని ప్రభుత్వ సంస్థలనూ ప్రైవేట్‌ పరం చేయటానికి తయారయ్యారు.
ప్రభుత్వం వ్యాపారం చేయటం కోసం లేదు! కాబట్టి ప్రభుత్వ సంస్థల అన్నిటినీ ప్రైవేట్‌ పరం చేస్తున్నారా? లేక తనవారైన గుజరాతీ కార్పొరేట్‌ కంపెనీలకు లేక పోస్కో కు కారుచౌకగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను హారతి పళ్లెం లో అమర్చి అందించాలని అనుకుంటున్నారా? ప్రభుత్వ సంస్దలనేనా ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటుపరం చేసి అమ్మ తలుచుకున్నారా?

ప్రభుత్వరంగం లో భారీ పరిశ్రమలు ప్రజల ధనంతో ఏర్పడ్డాయి

1947 నాటికి ఆంధ్ర లో భారీ పరిశ్రమలు లేవు. ఏ ప్రాంతమైనా ఎదగాలంటే పారిశ్రామికంగా అభివ ద్ధి చెందాలి. 1947 నాటికి దేశంలోనే భారీ పరిశ్రమలు చాలా తక్కువగా ఉన్నాయి. మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వం వ్యవసాయ రంగంపై కేంద్రీకరించింది. రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో దేశ అభివ ద్ధికి భారీ పరిశ్రమల అవసరాన్ని గుర్తించారు. దేశం లోని పెట్టుబడిదారులను విదేశాలలోని పెట్టుబడిదారులను ఆహ్వానించారు. సాంకేతిక, ఆర్ధిక సహకారాన్ని అర్ధించారు. స్వదేశీ, విదేశీ ప్రైవేట్‌ సంస్థలు భారీ పరిశ్రమల స్థాపనకు ముందుకు రాలేదు. తమ దేశాలనుండి ఉక్కు, మందులు, ఎరువులు దిగుమతులు చేసుకోమని యూరప్‌, అమెరికా దేశాలు సలహాలిచ్చాయి, సహాయ నిరాకరణ చేశాయి.
సోషలిస్ట్‌ దేశమైన సోవియట్‌ ప్రభుత్వం నిస్వా ర్ధంగా సాంకేతిక సహాయాన్నే కాకుండా ఆర్ధిక సహాయాన్ని కూడా అందించింది. వందకు పైగా భారీ పరిశ్రమల స్థాపనకు సహాయం చేసింది. మన దేశానికి పారిశ్రామిక పునాదిని కల్పించింది. మందులు, ఎరువులు, ఉక్కు, భారీ ఇంజనీరింగ్‌, భారత్‌ హెవీ ఎలక్ట్రికల్‌, ఐడిపిఎల్‌, భిలారు,విశాఖ ఉక్కు కర్మాగారాలు స్థాపించారు. అప్పటికి ప్రైవేటు రంగంలో ఒక టాటా స్టీల్‌ మాత్రమే ఉండేది. ప్రభుత్వం భారీ పరిశ్రమలు స్థాపించిన తర్వాత దేశ పెట్టుబడిదారులు పెద్ద పరిశ్రమలకు అనుబంధంగా కొన్ని పరిశ్రమలు స్థాపించడం ప్రారంభించారు. పారిశ్రామికంగా కొంత అభివ ద్ధిని సాధించిన తరువాత ఆ ఫలాలను అనుభవించటానికి దేశ, విదేశీ పెట్టుబడిదారులు తయారయ్యారు.


బ్రిటీష్‌ ఈస్డిండియా కంపెనీ మన దేశాన్ని తన పరిశ్రమలకు ముడిసరకులను అందచేసేదిగా, తన ఉత్పత్తులకు మార్కెట్‌గా మార్చిన కారణంగా స్వాతంత్య్ర ఉద్యమం కంపెనీ, బ్రిటీష్‌ వారి పాలనకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించింది. ఆ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేని, వ్యతిరేకించిన వారి వారసులుగా ఉన్న బిజెపి పెద్దలు ఉన్న పరిశ్రమలను, సహజ సంపదలను వెస్ట్‌ ఇండియా కంపెనీలకు కారుచౌకగా అప్పగించేందుకు పూనుకున్నారు. పరోక్షంగా పరాయి దేశాల పాలనను మన మీద రుద్దుతున్నారు. నాటికీ నేటికీ ఎంత తేడా !


ఈస్ట్‌ ఇండియా కంపెనీ తనకు తానే వస్తే రాజరిక పాలకులు ఆశ్రయం కల్పించారు. నేడు ప్రజాస్వామ్యం అని చెప్పుకొనే పెద్దలు స్వయంగా వెస్ట్‌ ఇండియా కంపెనీలకు ఎర్ర తివాచీలు పలుకుతున్నారు. అందుకే విశాఖ ఉక్కు ఈ వెస్ట్‌ ఇండియా కొరల్లో చిక్కుకోవటం యాద చ్చికం కాదు. ప్రపంచ ద్రవ్య పెట్టుబడి లాభాల వేటలో పడింది. వడ్డించిన విస్తరి లాగా భారత దేశ పరిశ్రమలను కారు చౌకగా కొట్టేయటానికి కాచుకొని ఉంది. మూడు లక్షల ఇరవై కోట్ల విలువ చేసే వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ను ముప్పైరు వేల కోట్లకు అమ్మేస్తాం అంటున్నారు. కేవలం 4889కోట్ల పెట్టుబడితో ప్రారంభించి 3.2 లక్షల కోట్ల ఆస్తులను పొందడం అంటే- సంస్థ నష్టాల్లో ఉందా లాభాల్లో ఉందా?

విశాఖ ఉక్కు నష్టాలలోలేదు


విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నష్టాలలో ఉన్నదన్న ప్రచారం వాస్తవమేనా? కాదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడి 4889 కోట్ల రూపాయలు. హిందూ పత్రిక అంచనా ప్రకారం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రస్తుత ఆస్తుల విలువ మూడు లక్షల 20 వేల కోట్ల పైనే ఉంటుంది. 4889కోట్ల పెట్టుబడితో 3.2 లక్షల కోట్ల ఆస్తులను పొందడం అంటే- సంస్థ నష్టాల్లో ఉందా లాభాల్లో ఉందా? ప్లాంట్‌ విస్తరణకు ప్రభుత్వం పౖసా ఇవ్వలేదు. ప్లాంటు విస్తరణకు కావలసిన ధనాన్ని కార్మికులు తమ కష్టంతో వచ్చిన సొంత లాభాలతో సమకూర్చుకున్నారు . ఇంకా కావలసి వస్తే బ్యాంకు నుండి అప్పు తీసుకున్నారు. టాటా స్టీల్‌ కంపెనీ కి 8 శాతం వడ్డీ కి బ్యాంకు లు అప్పులు ఇచ్చాయి. విశాఖ ఉక్కుకి 14 శాతం వడ్డీ రేటు ప్రకారం అప్పులు ఇచ్చారు. పన్నెండు లక్షల నుండి 63 లక్షల ఉక్కు ఉత్పత్తిని సాధించారు.72 లక్షల టన్నులఉత్పత్తిని సాధించటానికి విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలతో 2 కోట్ల టన్నుల ఉక్కు ఉత్పత్తి స్థాయికి చేరుకోగల సామర్ధ్యం ఉంది. దేశ అభ్యున్నతికి కి విశాఖ ఉక్కు ను వనరుగా ఉపయోగించుకుని ప్రగతి ని సాధించ వచ్చని విశాఖ ఉక్కు నిరూపించింది. ప్లాంట్‌ నష్టాల్లో కూరుకు పోతుందని దుష్ప్రచారం చేస్తున్నారు. పన్ను చెల్లింపు దారుల ధనాన్ని నష్టాలలో కూరుకుపోతున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లో పెట్టలేమని విడ్డూ రపు ప్రకటనలు చేస్తున్నారు.5 వేల కోట్లను మించి ప్రభుత్వం ఏమాత్రం పన్ను చెల్లింపు దారుల ధనాన్ని పెట్టుబడి పెట్టిందో ప్రజలకు చెప్పాలి.

లాభాలు ఎందుకు తగ్గాయి?


హుదూద్‌ తుఫాన్‌ వలన స్టీల్‌ ప్లాంట్‌ కు 1000 కోట్ల నష్టం సంభవించింది. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ సహాయం చేయలేదు. రాజకీయ అవసరాల కోసం రాయబరేలీ రైల్‌ వీల్‌ ఫ్యాక్టరీలో 2 వేల కోట్ల రూపాయలను పెట్టమని విశాఖ స్టీల్‌ ను ప్రభుత్వం ఆదేశించింది.ఫలితంగా 2వేల కోట్ల రూపాయల ను స్టీల్‌ ప్లాంట్‌ నష్ట పోయింది.గనుల కోసం, ఒరిస్సా మినరల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ లో 381 కోట్ల రూ.వాటాల ను ప్రభుత్వం కొనిపించింది. పర్యావరణ అనుమతుల కోసం మరో 500 కోట్లను ఖర్చు పెట్టించారు. మొత్తం 881 కోట్ల రూ. స్టీల్‌ ప్లాంట్‌ ధనం ఖర్చు పెట్టించారు. కానీ గనులు లోంచి ఇనుప ఖనిజం రాలేదు. 2010 లో బర్డ్‌ గ్రూప్‌ లో 361 కోట్లను పెట్టుబడిగా పెట్ట్టి 51 శాతం వాటాలు కొనమని కేంద్రం ఆదేశించింది.వాటాలు కొని 10 ఏళ్ళైనా, నేటికీ ఒక్క టన్ను ఇనప ఖనిజం కూడా రానివ్వలేదు.చెయ్యని నేరానికి 1400 కోట్ల అపరాధ రుసుము విధించారు. ఇప్పటికే 500 కోట్లు చెల్లించారు. 1971 లో విశాఖ ఉక్కును సెయిల్‌ సంస్థ క్రింద ప్రారంభించారు. సెయిల్‌ సంస్థకు, 200 సం.తవ్వినా తరగని ఇనప గనులున్నాయి. సెయిల్‌ సంస్థ నుండి 1982లో విశాఖ ఉక్కు ను ఎందుకు విడకొట్టారు? రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగం సంస్ధను ఎందుకు ఏర్పాటు చేశారు ?సెయిల్‌ లో ఎందుకు విలీనం చేయరు? గత మూడు నాలుగు సంవత్సరాల సమస్యలను మాత్రమే చెబుతూ అంతకుముందు ప్లాంట్‌ సాధించిన అద్భుత ఫలితాలను విస్మరించడం సమంజసం కాదు. 279 కోట్ల అమ్మకాలతో మొదలై 2018-19 సంవత్సరానికి 20 వేల కోట్లకు పైగా అమ్మకాల తో సాలీనా 14.5 శాతం వ ద్ధిరేటును సాధించింది. ఇంత వ ద్ధి రేట్ను సాధించిన మరొక ఉక్కు ఫ్యాక్టరీ ని చూపించమనండి.

స్వంత గనులు ఎందుకు కేటాయించలేదు?

ఉక్కు తయారీకి వంద రూపాయలు ఖర్చు అయితే అందులో 61% కేవలం ముడిపదార్థమైన ఇనుపఖనిజం కొనటం కోసమే ఖర్చవుతున్నది. సొంత గనులు ఉంటే ఈ ఖర్చు తగ్గటమే కాకుండా విశాఖ ఉక్కు లాభాల బాటలో ప్రయాణించేది. వివరమైన ప్రాజెక్టు రిపోర్ట్‌ ను ఏం యన్‌ దస్తూరి కం పెనీ 1971 లో తయారు చేసింది. అందులో బైలాదిల్లా ఇనుప ఖనిజ గనుల్లో 4 మరియు 5 బ్లాకులను కేటాయించాలని చాలా వివరంగా ప్రాజెక్టు రిపోర్ట్‌ లోనే నివేదించారు. అయినా ఇప్పటివరకు స్వంత గనులను ఎందుకు కేటాయించలేదు? ఇప్పటివరకు అధికారంలోఉన్న అన్ని ప్రభుత్వాల నాయకులు ఆంధ్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఉక్కు ఉత్పత్తి ప్రారంభించిన 1991 నుంచి మార్కెట్‌ రేటుకి ఇనప ఖనిజాన్ని కొనక తప్పటంలేదు. 1991 లో టన్ను ఇనప ఖనిజం రేటు 396. రూ. ఉంటే,2004 సంవత్సరానికి 1085 రూ, 2020 కి 4779 రూ.అయింది.మధ్యలో 5424. రూ.కూడా పెరిగింది.
స్వంత గనులున్న స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రతి టన్ను ఇనప ఖానిజానికి 2396 రూ ఖర్చు పెడుతూవుంటే, విశాఖ ఉక్కు సంస్థ ప్రతి టన్ను ఇనప ఖనిజానికి 6584 రూ. ఖర్చు పెట్టవలసి వచ్చింది. అంటే స్వంత ఇనప గనులు లేనందున విశాఖ ఉక్కు సంస్థ ప్రతి టన్నుకూ అదనంగా 4188 రూ ఖర్చు పెట్టి ఉక్కు ను ఉత్పత్తి చేసింది. ఉక్కు ఫ్యాక్టరీ లు లేని బ్రాహ్మణి స్టీల్స్‌ కు, గాలి జనార్ధనరెడ్డి కి గనులను కేటాయించారు. జిందాల్‌, ఎస్సార్‌,వంటి ప్రైవేట్‌ సంస్థలకు కూడా ఇచ్చారు. స్వదేశీ ప్రభుత్వ సంస్థ అయిన విశాఖ స్టీల్‌ కు ఇనప ఖనిజ గనులు ఇవ్వలేదు కానీ ఇనుప ఖనిజాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దేశీయ ప్రభత్వ సంస్థ అయిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఏం పాపం చేసింది? ఎందుకు ఇవ్వలేదు? ఉత్పత్తి పరమైననష్టం లేదు. ఆపరేషన్‌ నష్టాలు లేవు. పెట్టుబడికి అయిదు రెట్లకు మించి లాభాలను ఆర్జించింది.కేంద్ర ప్రభుత్వానికి 43 వేల కోట్ల రూపాయలు పన్నులు, డివిడెండ్ల రూపంలో చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వానికి 8 వేల కోట్ల రూపాయలు పన్ను చెల్లించారు.
ఇనుప ఖనిజం బయట కొన్నా 2014- 15 వరకూ లాభల్లో నడిచింది.2020 డిసెంబర్‌ లో 212 కోట్ల లాభం వచ్చింది.2021 జనవరిలో 135 కోట్ల లాభం వచ్చింది.2021 ఫిబ్రవరి లో 165 కోట్ల లాభం వచ్చింది.2021 మార్చ్‌ లో 300 కోట్ల లాభం రావచ్చంటున్నారు. ప్రైవేట్‌ వారికీవిశాఖ ఉక్కు ను ఇవ్వటానికే స్వంత గనులను కేటాయించలేదు అని అర్ధ మౌతూనే ఉంది.నష్టాల్లో ఉన్న గుజరాత్‌ పెట్రోల్‌ కార్పొరేషన్‌ ను ఓఎన్‌జిసిలో కలిపేశారు. అలానే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను సెయిల్‌ సంస్థ లో కలపవచ్చు కదా! గుజరాత్‌ కి ఒక న్యాయం!ఆంధ్ర కొక న్యాయమా? ఒకే దేశం ఒకే న్యాయం అవసరం లేదా?

కార్మికులకు జీతాలు ఎక్కువ- పని తక్కువ !

కార్మికులకు జీతాల ఖర్చులు ఎక్కువ అని, కార్మికులు సరిగ్గా పని చేయరనీ అబద్ధాలను కూడా ప్రచారం చేస్తున్నారు. మొత్తం ఖర్చులో ఉద్యోగుల వేతన ఖర్చు 15 శాతానికి ఎప్పుడూ మించలేదు. విపరీతమైన ఉష్ట్నోగ్రత లో, ప్రతికూల వాతావరణంలో కూడా కార్మికులు శ్రమించి. ప్రమాదాలను ఎదుర్కొంటూ ఉత్పత్తిని పెంచుతూనే ఉన్నారు. ప్రిఫరెన్షియల్‌ షేర్‌ లను ఉపహరించడం వలన షేర్‌ కాపిటల్‌ ను తిరిగి ఇవ్వవలసి వచ్చింది. ఫలితంగా ప్లాంట్‌ పై 2930 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. గత 30 సంవత్సరాల నుండి నికర ఆస్తులు పెంచుకుంటూ, ప్రిఫరెన్సియల్‌ షేర్స్‌ డబ్బులు ఇచ్చేస్తూ, అప్పులు వడ్డీతో సహా తీరుస్తూ, ఉక్కు ఉత్పత్తిని 63 లక్షల టన్నులకు పెంచుకుంటూ అప్రతిహతంగా పురోగమిస్తున్న విశాఖ ఉక్కును అప్రతిష్ట పాలు చేయలేరు.
కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు ఎత్తిన బావుటా దించేది లేదని ఆంధ్ర ప్రజలు, కార్మికులు ముక్తకంఠంతో తేల్చి చెప్తున్నారు. ప్రభుత్వం ఎంత మొండి గా ఉందో కార్మికులు, ప్రజలు కూడా అంతే పట్టుదల తో ఉన్నారు. జనవరి 27న కేంద్ర క్యాబినెట్‌ కమిటీ విశాఖ ఉక్కు ను ప్రైవేటీకరణ చెయ్యాలని నిర్ణయించిన తర్వాత కార్మికులంతా ఐక్యం అయ్యారు. కార్మిక సంఘాలన్నీ కలిసాయి.విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ గా ఏర్పడ్డారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం తో విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్లాంట్‌ మెయిన్‌ గేట్‌ ముందు ప్రారంభించిన నిరాహార దీక్ష శిబిరం ప్రజలతో కిక్కిరిసిపోతూ వున్నది. ”ఎవడు రా అమ్మేది? ఎవడు రా కొనేది? ” అనే నినాదంతో ప్రభుత్వాన్ని గద్ధిస్తున్నారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఆనాటి ఆంధ్రప్రదేశ్‌ అంతటా ప్రతిధ్వనించింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ స్థాపించేవరకూ పోరాడాలన్న ఉక్కు సంకల్పం తో పోరాడి సాధించారు. వీధులు, గ్రామాలు, పట్టణాలు, హైస్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, కళాశాలలు, పరిశ్రమలు, పార్లమెంటు, శాసనసభ అన్నీ పోరాట వేదికలుగా మార్చుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ నలుమూలలకూ విస్తరించిన సమరశీల పోరాటం ప్రతిఫలమే విశాఖ ఉక్కు. విశాఖ ఉక్కు ఎవరి దయా దాక్షిణ్యాల వలన రాలేదు. ప్రజా పోరాట చరిత్రను పాలకులు మరిచిపొతే చరిత్రహీనులు కాక తప్పదు. ఆ పోరాటమే తిరిగి దారిన పడుతున్నది. నూతన శక్తీతో కార్మికులు, రైతులు ఐక్యమై విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఎదుర్కొంటున్నారు. ప్రజా శక్తి ముందు ఎంతటి వారైనా తల వంచక తప్పదు.


వ్యాస రచయిత డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌ గుంటూరు, ఆనాటి విశాఖ ఉక్కు ఉద్యమ కార్యకర్త.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పసుపు బోర్డు -బిజెపి నేతల పచ్చి అవాస్తవాలు !

20 Saturday Mar 2021

Posted by raomk in AP, BJP, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Telangana

≈ Leave a comment

Tags

BJP hypocrisy, BJP MP Bond on Turmeric Board, Turmeric board issue, Turmeric Prices


ఎం కోటేశ్వరరావు
వాగ్దానం చేసినట్లుగా నిజామాబాద్‌కు పసుపు బోర్డు తీసుకురావటంలో విఫలమైన బిజెపి నేతలు రైతాంగానికి సంతృప్తి కలిగించే సమాధానం చెబుతున్నారా ? తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు ఇతర పార్టీల మీద ఎదురుదాడి చేస్తున్నారా ? పసుపు బోర్డు కంటే సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ విస్తరణ కార్యాలయమే రైతులకు మేలు చేస్తుందని చెప్పటం ద్వారా రైతులను మరీ అంత అమాయకులుగా భావిస్తున్నారా ? ఒక్క సమస్య – వంద ప్రశ్నలు అన్నట్లుగా బిజెపి ముందుకు వచ్చాయి . చేసిన వాగ్దానాన్ని అదీ బాండ్‌ పేపర్‌పై రాసి ఇచ్చిన దాని సాధన లేదా వాగ్దానం అమలు గురించి ఎవరూ అడగ కూడదా ! అసలు పసుపు బోర్డు కథేమిటి ? బిజెపి నేతల ప్రచారంలో నిజానిజాలేమిటి ? తెలిసి కూడా రైతాంగం, సాధారణ జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారా ? ఒక్కో అంశాన్ని చూద్దాం !


బిజెపి నేత ధర్మపురి అరవింద్‌ పసుపు బోర్డు వాగ్దానాన్ని ఎందుకు ముందుకు తెచ్చారు ?


2019లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశంలో మిగతా ప్రాంతాలతో పాటు నిజామాబాద్‌ మార్కెట్లో కూడా పసుపు ధరలు పడిపోయాయి. అప్పుడు కూడా అధికారంలో ఉన్నది నరేంద్రమోడీ సర్కారే.2018లో పసుపు ధరలు పెరగటంతో రైతాంగం పెద్ద మొత్తంలో సాగు చేశారు. దాంతో 2019 మార్కెట్‌ సీజన్‌లో అంతకు ముందు వచ్చిన ధర కంటే నాలుగో వంతు పడిపోయింది. రైతులు ఆందోళనలకు దిగారు. అదే సమయంలో ఎన్నికలు వచ్చాయి. పసుపు రైతుల ఓట్లను కొల్లగొట్టాలంటే ధర రాకపోవటానికి బోర్డు లేకపోవటమే కారణమని, కేంద్రంలో అధికారంలో ఉన్నాము గనుక తనను గెలిపిస్తే బోర్టు ఏర్పాటు చేయిస్తానని ధర్మపురి అరవింద్‌ బాండ్‌ పేపర్‌ మీద రాసి రైతులను నమ్మించారు. దాన్ని ఊరూరా చూపి ఓట్లడిగారు. బోర్డు ఏర్పాటు ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ప్రకటించటంతో అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు పసుపు బోర్డు కంటే సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ విస్తరణ కార్యాలయ ఏర్పాటే ఎక్కువ ప్రయోజనమని, అది పసుపు ఒక్కదానికే గాక అల్లం వంటి పంటల రైతులకు కూడా ఉపయోగమని చెబుతున్నారు.


పసుపు బోర్డు రాదని బిజెపి నేతలకు తెలియదా ? ఇప్పటికీ రైతులను మభ్యపరుస్తున్నారా ?


పూర్తిగా తెలుసు, అంత అమాయకులు కాదు. ముందే చెప్పినట్లు ఇప్పటికీ రైతులను మభ్యపరుస్తున్నారు. ఏలకుల కోసం 1968 నుంచి పని చేస్తున్న బోర్డును విస్తరించి పసుపుతో సహా 52 సుగంధ ద్రవ్యాల కోసం 1986లో ఒక చట్టాన్ని చేసి మరుసటి ఏడాది సుగంధద్రవ్యాల బోర్డును ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అది సుగంధ ద్రవ్యాల దిగుబడులు పెంచటం, మార్కెటింగ్‌, ఎగుమతుల కోసం పని చేస్తున్నది. సుగంధ ద్రవ్యాల తరగతి కిందకు వచ్చే 52 పంటలలో మిర్చిది అగ్రస్దానం. గతంలో ఒకదానికి ఉన్న బోర్డును అన్నింటికీ విస్తరించినపుడు వాటిలో ఒకదానికి ప్రత్యేకంగా తిరిగి ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు అవకాశాలు లేవు. మిర్చికి లేని బోర్డును పసుపు ఏర్పాటు చేసే అవకాశాలే లేవు. అయినా పసుపు రైతులను అమాయకుల కింద జమకట్టి బాండ్లను రాసి నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులు అనుకోవటంలో తప్పులేదు. రైతులు ఎదుర్కొంటున్న ధరల అస్ధిరత సమస్య బోర్డు లేనందు వలన కాదు, ప్రభుత్వ విధానాలే పరిష్కారమని తెలియచెప్పాల్సిన వారు, తప్పుదారి పట్టించారు.


సుగంధ ద్రవ్యాలలో పసుపు వాటా ఎంత ?


పసుపు ఉత్పత్తి, వినియోగం, ఎగుమతిలో మనదే అగ్రస్ధానం. సుగంధ ద్రవ్యాలన్నింటినీ మన దేశంలోనే వినియోగించే అవకాశం లేదు. విదేశాలకు ఎగుమతి చేయటం ద్వారా విలువై విదేశీ మారకద్రవ్యాన్ని రైతులు సమకూర్చుతున్నారు. నరేంద్రమోడీ ఏలుబడిలో కొన్ని సుగంధ ద్రవ్యాల ఎగుమతులు ఎలా ఉన్నాయో, వాటి ద్వారా వస్తున్న ఆదాయం ఎలా ఉందో చూద్దాం. (2019-20 సంవత్సర అంకెలు ప్రభుత్వ లక్ష్యాలు, మిగిలినవి వాస్తవ అంకెలు. సరకు పరిమాణం టన్నులలో, విలువ కోట్ల రూపాయల్లో ఉంది.
సరకు సంవత్సరం సంవత్సరం సంవత్సరం సంవత్సరం సంవత్సరం
2015-16×××2016-17 ××× 2017-18 ×××2018-19××× 2019-20
టన్నులు- కోట్లలో×టన్నులు- కోట్లలో×టన్నులు- కోట్లలో×టన్నులు-కోట్లలో×టన్నులు-కోట్లలో
మిర్చి 3,47,500-3,997×4,00,250-5,070×4,43,900-4,256×4,685-5,411×4,84,000-6,221
జిలకర 97,970-1,531×1,19,000-1,963×1,43,670-2,418×1,80,300-2,885×2,10,000-3,225
పసుపు 88,500-921×1,16,500-1,242×1,07,300-1,035×1,33,600-1,416×1,36,000-1,215
మిరియాలు 28,100-1,730×17,600-1,143×16,840-820× 13,540- 568×16,250-519
ఏలకులు 6,100-525×× 4,630-541 ×× 6.440-664 ×× 3,710-417 ××3,190-493

ప్రాంతీయ విస్తరణ కార్యాలయం పసుపు కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుందా ?


ముందే చెప్పుకున్నట్లు బోర్డు పరిధిలోకి తెచ్చిన 52 సుగంధ ద్రవ్యాల కోసం పని చేసేందుకే ఆ బోర్డు పని చేస్తున్నది. అది సక్రమంగా పని చేస్తున్నదా లేదా అన్న అంశం మీద తేడాలుండవచ్చు తప్ప ప్రత్యేకంగా నిజామాబాద్‌ కార్యాలయం కొత్తగా చేసేదేమీ ఉండదు, ఇతర కార్యాలయాలకు మించి దానికి ప్రత్యేక అధికారాలేమీ ఉండవు. కార్యాలయ బోర్డును చూపి జనాన్ని మభ్యపెట్టటం తప్ప మరొకటి కాదు. ఈ కార్యాలయం ఏర్పాటు చేయక ముందే కొన్ని కొత్త రకాలను రూపొందించి రైతులకు అందచేశారు, చేస్తున్నారు, పరిశోధనలు నిరంతరం జరుగుతున్నాయి.బోర్డు కంటే సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ విస్తరణ కార్యాలయం ద్వారా ఎక్కువ లబ్ది చేకూరుతుందని మరో అబద్దాన్ని చెబుతున్నారు. ఇది మరీ అన్యాయం నరేంద్రమోడీ కంటే ఒక ఎంపీకి ఎక్కువ అధికారాలున్నాయని చెప్పటమే ఇది. మిర్చి, పసుపు వంటి పంటలకు అసలు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలనే ప్రకటించలేదు. అందువలన బోర్డు అయినా ప్రాంతీయ కార్యాలయం అయినా ఈ విషయంలో చేసేదేమీ లేదు.


పసుపు ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించిందా ? ధరలకోసం ఎంపీ పోరాటం చేశారా ?


బిజెపి నేతలు కొన్ని టీవీ చర్చలలో చెప్పిన అంశాలను చూస్తే ఎంత అలవోకగా అసత్యాలు చెప్పగలరో అర్ధం చేసుకోవచ్చు. పసుపు ఎగుమతులను నరేంద్రమోడీ సర్కార్‌ నిషేధించిన కారణంగానే ధరలు పెరిగాయంటూ మాట్లాడే మేక కథలు చెబుతున్నారు, అందుకోసం తమ ఎంపీ అరవింద్‌ పోరాటం చేశారని చెప్పుకుంటున్నారు. ధరలు పెరిగినందున రైతులు పాలాభిషేకం చేశారని చెబుతున్నారు. మొదటి విషయం పసుపు ఎగుమతులను కేంద్రం నిషేధించలేదు. మన పసుపును దిగుమతి చేసుకోకూడదని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించటంతో పక్కనే ఉన్న తమిళనాడు రైతులు నష్టపోయారని వార్తలు వచ్చాయి. ప్రపంచ నేతగా ఎంతో ప్రభావితం చూపుతున్నారని లేని గొప్పలను ఆపాదిస్తున్న వారు నరేంద్రమోడీ గారు కనీసం శ్రీలంక నిషేధాన్ని కూడా ఎత్తివేయించలేకపోయారన్నది అసలు నిజం. ధరల కోసం ఎంపీ చేసింది ఏమిటో రైతులకు ఎప్పుడూ, ఎక్కడా కనపడదు.పాలాభిషేకాలు చేయించుకోవటం ఈ రోజుల్లో ఎంతసులువో తెలిసిందే. దేశమంతటా పసుపు ధరలు పెరిగాయి. అన్నిచోట్లా ధర్మపురికి పాలాభిషేకాలు ఎందుకు చేయటం లేదు ? ఆంధ్రప్రదేశ్‌లో ఎంతవరకు అమలు చేస్తారో తెలియదు గానీ మిర్చికి క్వింటాలుకు రు.7,000, పసుపుకు రు.6,350 కంటే మార్కెట్లో ధరలు తగ్గితే ఆమేరకు తాము కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.ప్రపంచం దిగుమతి చేసుకొనే పసుపులో 80శాతం మనమే చేస్తున్నాము. దిగుమతుల ప్రశ్నేలేదు. ఇతన అనేక సుగంధ ద్రవ్యాలతో పాటు తమ దేశంలో పసుపు దిగుబడి పెంచే చర్యల్లో భాగంగా 2018 డిసెంబరు నుంచి మన పసుపు మీద కూడా శ్రీలంక నిషేధం విధించింది.అది తమిళనాడులో రాజకీయ అలజడులను కూడా సృష్టించింది. 2014 నుంచి బిజెపి మిత్రపక్షంగానే ఉంది. లంక నిషేధాన్ని ఎత్తివేయించాలని రెండు సంవత్సరాల నుంచి కోరుతున్నా నరేంద్రమోడీ ఆపని చేయించలేకపోయారు.
కాంగ్రెస్‌ పాలకులు పసుపు దిగుమతులు చేసి రైతాంగాన్ని దెబ్బతీశారా ?బిజెపి ఎంపీ కారణంగా ధరలు పెరిగాయా !
కాంగ్రెస్‌ అనేక తప్పులు చేసింది కనుక తమ వైఫల్యం ప్రతిదానికి గత కాంగ్రెస్‌ పాలకులే కారణం అని చెప్పటం బిజెపికి మామూలై పోయింది. అధికారానికి వచ్చి ఏడు సంవత్సరాలైంది కనుక ఆ పాచిపాటను మరీ ఎక్కువ సాగదీస్తే జనానికి చిరాకు తరువాత ఆగ్రహం వస్తుంది. గతంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం పసుపు దిగుమతులు చేసి రైతులను దెబ్బతీసిందన్నట్లుగా కూడా ఎంపీ చెబుతున్నారు. దానికి సాక్ష్యంగా ఎప్పుడు ఎంత దిగుమతి చేసుకుందో వివరిస్తే అసలు బండారం బయటపడుతుంది. మన దేశం ఎగుమతులు చేయటం తప్ప దిగుమతులు ఎన్నడూ లేవు. ఉంటే ఎవరైనా వివరాలు వెల్లడించవచ్చు.


పసుపు, చెరకు దోఫసలీ పంటల కిందకు వస్తాయి, అంటే సాగు వ్యవధి ఎక్కువగా ఉంటుంది. గతేడాది పడిన వర్షాలకారణంగా అనేక చోట్ల పంట దెబ్బతిన్నది.ఈ ఏడాది పంట ఉత్పత్తి నాలుగోవంతు పడిపోనుందన్నది వ్యాపారుల అంచనా దిగుబడి తగ్గనుందనే అంచనాతో రేట్లు పెరిగాయి తప్ప బిజెపి సర్కార్‌ లేదా ఎంపీ చేసిందేమీ లేదు. మన దేశంలోనే కాదు,ప్రపంచ వ్యాపితంగా పెరిగాయి. పెరిగిన ధరలతో రైతులు సంతృప్తి చెందారా అంటే అంతకు ముందు పతనమైన వాటితో పెరిగినపుడు కొంత సంతృప్తి ఉండటం సహజం. కానీ పెరిగిన ధరలెంత, వ్యవసాయ ఖర్చులెంత ? దానికి అనుగుణ్యంగా ధరలు పెరిగాయా ? ఒక వైపు ప్రధాని నరేంద్రమోడీ గారేమో ప్రభుత్వం వ్యాపారం చేసేందుకు కాదు అంటారు. మరోవైపు బిజెపి వారు వ్యాపారుల ధరలు తమవే అంటారు. ఒకే, వారి ప్రతిభే అనుకుంటే ఇంకా ధరలు ఎందుకు పెంచలేదు అనే ప్రశ్నకు వారు జవాబు చెప్పాల్సి ఉంటుంది.గతంలో ఇంతకంటే రైతులకు ఎక్కువ ధరలు వచ్చిన రోజులున్నాయి.


రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ సమాచారం ప్రకారం 2008-09లో సగటు ధర క్వింటాలుకు రు.3,850 ఉంటే తరువాత రెండు సంవత్సరాలలో రు.11,000, 11,500లకు పెరిగింది, 2011-12లో పతనమై రూ.3,500, తరువాత నాలుగు సంవత్సరాలు రు.6,400 నుంచి రు.8,100కు పెరిగింది.2016-17లో రు.5,850,2017-18లో రు.5,575 పడిపోయాయి. ఈ కారణంగానే రైతుల్లో ఆందోళన తలెత్తింది. అదే పసుపు బోర్డు ప్రతిపాదన, వాగ్దానానికి దారి తీసింది. నరేంద్రమోడీ ఏలుబడిలో హెచ్చుతగ్గులకు కారణం ఏమిటి ? వీటికి కూడా కాంగ్రెస్‌ పాలనే కారణం అంటారా ? నేషనల్‌ కమోడిటీస్‌ అండ్‌ డెరివేటివ్స్‌ ఎక్సేంజ్‌లో (ముందస్తు మార్కెట్‌) లావాదేవీల సమాచారం ఎవరికైనా అందుబాటులో ఉంది. అనుమానాలు ఉన్న వారు చూసుకోవచ్చు. 2021 అంకెలు ఏప్రిల్‌ నుంచి జూలై వరకు ధరలు
సంవత్సరం ××××× క్వింటాలు కనిష్ట ధరలు రూ.
2004-2007××× 2,800-2,460
2008 ××××××× 3,084-3,894
2009 ××××××× 5,254 -10,756
2010 ××××××× 12,730 – 14,232
2011 ××××××× 9,550 – 4,410
2012 ××××××× 3,460 – 5,400
2013 ××××××× 6,704 – 5,330
2014 ××××××× 6,478- 6,800
2015 ××××××× 7,998 – 9,656
2016 ××××××× 8,728 – 6,998
2017 ××××××× 5,974 – 7,758
2018 ××××××× 6,800 – 6,230
2019 ××××××× 6,298 – 6,134
2020 ××××××× 5,730 – 5,700
2021 ××××××× 8,108 – 8,778
మార్చి పందొమ్మిదవ తేదీన ఏప్రిల్‌లో అందచేయాల్సిన పసుపు ధర రు.7,890-8,220 మధ్య ఉన్నది, అదే మేనెలలో అందచేయాల్సిన దాని ధర రు.7,960-8,300 మధ్య ఉన్నది. (కొనుగోలు-అమ్మకం దారుల మధ్య వాస్తవంగా సరకు లావాదేవీలే జరగనవసరం లేదు. ఒప్పందానికి అనుగుణ్యంగా ధరల తేడాను చెల్లించటమే ముందుస్తు మార్కెట్లో సాధారణంగా జరుగుతుంది.ఏది వాటంగా ఉంటే దాన్ని కోరవచ్చు) ఈ ధరలకు అనుగుణ్యంగానే నిజామాబాద్‌, దుగ్గిరాల, కడప, ఈరోడ్‌, సాంగ్లీ వంటి మార్కెట్లలో ధరలు ఉంటాయి. నాణ్యతను బట్టి హెచ్చుతగ్గులు కూడా ఉండవచ్చు. ముందస్తు – ఏరోజుకు ఆరోజు కొనుగోలు చేసే ధరల్లో కూడా తేడా ఉంటాయి. జనవరి మొదటి వారంలో ఉన్న ముందస్తు ధర రు.5,580 నుంచి 5,725 వరకు ఉన్న ధరలతో పోల్చితే తరువాత పెరిగింది. సరకు మార్కెట్‌కు వచ్చే దాన్ని బట్టి రాబోయే రోజుల్లో తగ్గవచ్చు, మరికాస్త పెరగవచ్చు. వీటిని చూపి అది తమ ప్రతిభే అని బిజెపి నేతలు చెప్పుకోవటమే విచిత్రం, విపరీతం. పసుపు బోర్డు గురించి పార్లమెంటులో తెరాస, కాంగ్రెస్‌ ఎంపీలు అడగటమే దేశద్రోహం అన్నట్లుగా బిజెపి ఎంపీ అరవింద్‌ విరుచుకుపడ్డారు. పేరుకు పసుపు బోర్డు అంశం మాట్లాడిందంతా సంబంధం లేని విషయాలు.నిండా మునిగిన వారికి చలేమిటి అన్న సామెత తెలిసిందే. పసుపు బోర్డు విషయంలో తెలంగాణా రైతాంగాన్ని నిండా ముంచిన వారికి చలేముంటుంది ! లేకపోగా ఎదురుదాడులకు దిగుతున్నారు !! ఇదే ప్రమాదకర పోకడ !!!

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d