• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Economics

చైనాతో ట్రంప్‌ చెలగాటం – బైడెన్‌కు ప్రాణ సంకటం !

24 Thursday Jun 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti China Propaganda, Donald trump, Joe Biden, Narendra Modi, Propaganda War, US-CHINA TRADE WAR


మన చుట్టూ జరుగుతున్నదేమిటి – 4

ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో నిత్యం అనేక కుట్ర సిద్దాంతాలు, వాటికి అనుగుణ్యంగా కట్టుకథలు-పిట్టకథలూ వెలువడుతుంటాయి. ఇది ప్రచార దాడిలో భాగం అని చాలా మందికి తెలియదు. నిజమే అని విశ్వసిస్తారు. వాస్తవం కాదని తెలిసేసరికి ఆ సమస్య ఉనికిలో ఉండదు కనుక పట్టించుకోరు. ఉదాహరణకు ఇరాక్‌ అధ్యక్షుడు సద్దామ్‌ హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసినందున తాము దాడి చేశామని అమెరికా ప్రపంచాన్ని నమ్మించింది. సద్దాంను అంతం చేసిన తరువాత అదే అమెరికా తరువాత కొన్ని సంవత్సరాల తరువాత అబ్బే అలాంటి గుట్టలేమీ దొరకలేదు అని చెప్పింది. ఎంత మంది దానిని పట్టించుకున్నారు.

గతంలో అమెరికన్లు రష్యన్లను విలన్లుగా చిత్రిస్తే ఇప్పుడు వారి బదులు చైనీయులను చేర్చారు. వారి పొడ మనకు గిట్టదు అని చెబుతుంటారు. కానీ అమెరికాలోని కాటో ఇనిస్టిట్యూట్‌ అనే ఒక మేథో సంస్ధకు చెందిన ఇద్దరు మేథావులు ఈ మధ్యే ఒక వ్యాసం రాశారు. చైనా నుంచి వలస వచ్చే వారిని అమెరికా ప్రోత్సహించాలి అని దానిలో ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్న డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా వారిని అమెరికా గడ్డమీద అడుగు పెట్టనివ్వొద్దు అన్నట్లుగా చెలరేగి పోయాడు.వారు గూఢచర్యాలకు పాల్పడుతున్నారని, విద్యా సంస్ధలలో కమ్యూనిస్టు సిద్దాంతాలను వ్యాపింపచేస్తున్నారని, అమెరికా సాంకేతిక పరిజ్ఞానాలను తస్కరిస్తున్నారని మొత్తం మీద అమెరికా భద్రతకే ముప్పు తెస్తున్నారన్నట్లుగా ప్రచారం చేయించాడు. చైనా మిలిటరీ-పౌర సంస్దలు సమ్మిళితంగా అనుసరించే వ్యూహాలతో సంబంధం ఉన్న ఎఫ్‌-1 విద్యార్ధులు, జె-1పర్యాటకులను అడుగుపెట్టనివ్వవద్దని ఆదేశాలు జారీ చేశాడు.చైనా సంస్ధల నుంచి నిధులు పొందే అమెరికన్‌ విశ్వవిద్యాలయాల మీద కూడా చర్యలు తీసుకున్నాడు. శాస్త్ర, సాంకేతిక సంస్ధలలో ప్రవేశం కోరే చైనీయుల వీసాలను ప్రత్యేకంగా తనిఖీ చేయాలన్నాడు.దాంతో ప్రతి వీసా నెలల తరబడి విచారణల్లోనే ఉండేది. కాటో సంస్ధ మేథావులు వీటన్నింటితో ఏకీ భావం కలిగిన వారే.


అయితే వారి దూరా లేదా దురాలోచనను దాచుకోలేదు.గతంలో సోవియట్‌ యూనియన్‌తో ప్రచ్చన్న యుద్దం సాగించినపుడు దాని పౌరులను ఆకర్షించటాన్ని ఒక విధానంగా అమెరికా అనుసరించింది. ఇప్పుడు దాన్ని చైనాకు ఎందుకు వర్తింప చేయకూడదన్నది వారి తర్కం. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో సోవియట్‌ యూనియన్‌ ఎర్రసైన్యం అనేక తూర్పు ఐరోపా దేశాలను హిట్లర్‌ ఆక్రమణ, దుర్మార్గాల నుంచి విముక్తి చేసింది. స్ధానిక కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీలు అధికారంలోకి వచ్చి సోషలిస్టు రాజ్యాలను నెలకొల్పటం ఒకపరిణామం. అదే సమయంలో ఆ దేశాలకు చెందిన కమ్యూనిస్టు వ్యతిరేకులు, పెట్టుబడిదారులను అమెరికాకు ఆహ్వానించి కమ్యూనిస్టు నియంతృత్వం నుంచి బయటపడిన స్వేచ్చా జీవులుగా ముద్రవేసి వారితో కట్టుకథలు చెప్పించి అమెరికన్లను, ప్రపంచాన్ని నమ్మించారు. నాటి అధ్యక్షుడు ట్రూమన్‌ అలా 80వేల మందికి ఆశ్రయం కల్పించాడు.1990లో సోవియట్‌, తూర్పు ఐరోపాలోని సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన సమయంలో కూడా అదే ఎత్తుగడను అనుసరించి వలసలను సరళతరం గావించారు.

అలా వచ్చిన లక్షలాది మంది రాజకీయ, నైతిక, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి ఎంతగానో తోడ్పడ్డారు. కమ్యూనిజం కంటే పెట్టుబడిదారీ విధానం ఎంత గొప్పదో వారి చేత చిలుకపలుకులు పలికించి ప్రపంచ కమ్యూనిస్టు వ్యతిరేకులకు వీనుల విందు చేశారు. అదే సమయంలో అమెరికాకు ఆర్ధికంగా ఎంతో ఉపయోగపడ్డారు. ఇప్పుడు చైనీయులు సాంకేతిక రంగంలో కూడా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు సవాలు విసురుతున్నారు. అందువలన అత్యంత ప్రతిభావంతులు, విద్యావంతులైన చైనీయులను అమెరికాకు రప్పించటం ఎంతో లాభదాయకం అన్నది కాటో తర్కం. అలావచ్చిన వారు గూఢచర్యానికి పాల్పడి, రహస్యాలను చైనాకు చేరవేస్తేనో అన్న ప్రశ్నకు కూడా వారే సమాధానం చెప్పారు.అలాంటి చర్యలవలన జరిగే నష్టం చాలా తక్కువ అని అంతకంటే ఎక్కువగా చైనా నుంచి వచ్చే వారు చేసే పరిశోధన, అభివృద్ధి ఎక్కువ లాభం అని బల్లలు చరిచి మరీ చెపుతున్నారు. కరోనా వైరస్‌ను ఊహాన్‌ పరిశోధనాకేంద్రంలోనే తయారు చేశారనే కథనాలు చైనా నుంచి ఫిరాయించిన ఒకరిద్దరు చెబుతున్నవే. వాటన్నింటితో ప్రపంచ మీడియా చైనా వ్యతిరేక పండగ చేసుకొంటోంది.


అయితే ఈ మేథావులు, వారిని సమర్ధించేవారు గానీ ఒక విషయాన్ని మరచి పోతున్నారు. మూడు దశాబ్దాల నాడు కూల్చి వేసిన సోవియట్‌ నాడు అమెరికాతో పోలిస్తే ఒక మిలిటరీ శక్తి తప్ప ఆర్ధిక శక్తి కాదు.ఇప్పుడు చైనా అమెరికా ఆర్ధికశక్తిని సవాలు చేసి రెండవ స్ధానం నుంచి మొదటి స్దానానికి పరుగులు తీస్తున్నది. మిలిటరీ పరంగా కూడా పటిష్టంగానే ఉంది. సోవియట్‌ నాయకత్వం సామ్రాజ్యావాదం, పెట్టుబడిదారీ విధానాల ప్రమాదాన్ని తక్కువ అంచనా వేసింది. పర్యవసానంగా జనానికి వాటి ముప్పు గురించి చైతన్యం కలిగించటంలో నిర్లక్ష్యం చేసింది. చైనా అలాంటి భ్రమల్లో లేదు. మూడు దశాబ్దాల క్రితం తూర్పు ఐరోపా రాజ్యాలను కూల్చివేసే సమయంలో సంభవించిన తియన్మెన్‌ స్క్వేర్‌ ఆందోళన వెనుక ఉన్న అంశాలను పసిగట్టి మొగ్గలోనే తుంచి వేసింది. జనాన్ని హెచ్చరించింది.ఇదే సమయంలో ప్రచ్చన్న యుద్దంలో విజయం సాధించామని చెప్పుకున్న అమెరికాలో నేడు పెట్టుబడిదారీ విధానం విఫలమైందని నమ్ముతున్న వారు రోజు రోజుకూ పెరుగుతున్నారు. సోషలిస్టు చైనా విజయాలు ఎలా సాధ్యం అవుతున్నాయనే ఆలోచన కలుగుతోంది.

అమెరికా ఇప్పటికీ బలమైన, ప్రమాదకర దేశమే అయినప్పటికీ దాని సమస్యలు దానికి ఉన్నాయి. అందుకే ఎక్కడన్నా బావేగానీ వంగతోట దగ్గర కాదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం మీద పట్టుకోసం అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌తో చతుష్టయం (క్వాడ్‌) పేరుతో జట్టుకడుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఫసిఫిక్‌ ప్రాంత భాగస్వామ్య కోసం సమగ్ర మరియు పురోగామి ఒప్పందం (సిపిటిపిపి) ఒప్పందంపై సంతకం చేసేందుకు అమెరికా సిద్దం కావటం లేదు. అది లేకుండా మిగతా దేశాలు చేసేదేమీ లేదు. అమెరికాలో తలెత్తిన ఆర్ధిక సమస్యల కారణంగా స్వంతగడ్డమీద పెట్టుబడులను ప్రోత్సహించాలని బైడెన్‌ సర్కార్‌ భావిస్తోంది. గడచిన నాలుగు సంవత్సరాలలో చైనాతో వాణిజ్యలోటు తగ్గింపులక్ష్యంతో దేశ భద్రత పేరుతో చైనా నుంచి వచ్చే ఉక్కు, అల్యూమినియం తదితర వస్తువుల మీద డోనాల్డ్‌ ట్రంప్‌ దిగుమతి సుంకాల పెంపు అమెరికన్ల మీదనే భారం మోపాయి. పనిలో పనిగా జపాన్‌, ఐరోపా మిత్ర దేశాల మీద కూడా అదేపని చేశాడు. ఈ పన్నులను ఎత్తివేయాలని చైనా కంటే అమెరికా వాణిజ్యవేత్తలే ఇప్పుడు బైడెన్‌ మీద ఎక్కువ వత్తిడి తెస్తున్నారు.


చైనాతో పోరు సంగతి తరువాత, అమెరికా వెలుపలి నుంచి వచ్చే వస్తువుల మీద దిగుమతి పన్నుల విధింపు కారణంగా తాము మార్కెట్లో పోటీ పడలేకున్నామని అందువలన వాటిని ఎత్తివేయాలని మూడువందల సంస్దలు బైడెన్‌కు విజ్ఞప్తి చేశాయి. అమెరికన్ల కొనుగోలు శక్తి పెంచేందుకు ఆరులక్షల కోట్ల డాలర్లతో అనేక పధకాలను అమలు జరిపేందుకు ఆమోదం తెలపాలని బైడెన్‌ పార్లమెంట్‌ను కోరారు. దీని వలన తమ మీద పడే ప్రభావం, పర్యవసానాలు ఏమిటని జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. అమెరికన్లు ఎంత హడావుడి చేసినా ఇతర దేశాల సహకారం లేకుండా చైనాను వారేమీ చేయలేరు. అదే సమయంలో చైనీయులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకుంటున్నారు. పరిశోధన-అభివృద్ధికి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. అమెరికా, ఐరోపా పశ్చిమ దేశాల మీద ఆధారపడకుండా స్వంత గడ్డమీద జనం కొనుగోలు శక్తి పెంచేందుకు, ఇతర దేశాల్లో మార్కెట్‌ను పెంచుకొనేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు ప్రారంభించారు.దానిలో భాగమే బెల్ట్‌ మరియు రోడ్‌ (బిఆర్‌ఐ) పధకాలు. రాజకీయంగా తమకు వ్యతిరేకంగా జట్టుకట్టిన ఆస్ట్రేలియాకు చైనా చుక్కలు చూపిస్తోంది.గతంలో ఏటా 50 కోట్ల డాలర్ల విలువగల పీతలు ఆస్ట్రేలియా ఎగుమతి చేసేది. అమెరికాతో జతకట్టి బస్తీమే సవాల్‌ అనగానే ఆ పీతల దిగుమతులను చైనా నిషేధించింది. ఇలాంటి అనేక చర్యలు తీసుకోవటంతో ఆస్ట్రేలియన్‌ వ్యాపారులు లబోదిబోమంటున్నారు. అమెరికా అండచూసుకొని చైనా వస్తువులను బహిష్కరించాలంటూ కొండంత రాగం తీసి హడావుడి చేసిన మన పాలకులు తిరిగి చైనా వస్తువుల దిగుమతులను పెంచారు.


మన దేశంలో చైనా అంటే అభిమానం లేని వారు కూడా దానితో వైరం తెచ్చుకొని సాధించేదేమిటి అన్న ప్రశ్నను ఇప్పుడు ముందుకు తెస్తున్నారు. మనతో సహా అమెరికా నాయకత్వంలోని దేశాలు చైనాను ఒంటరి పాటు చేయాలని చూస్తున్నాయి. చైనాను దెబ్బతీయటం అంటే తమను తాము నాశనం చేసుకోవటం అనే అంశాన్ని అవి మరచిపోతున్నాయి. నూటనలభై కోట్ల మంది జనాభా ఉన్న చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా ఉండటమే కాదు, వినియోగ మార్కెట్‌ అని మరచి పోరాదు. ఎవరి సంగతి వారు చూసుకుంటున్న ఈ తరుణంలో చైనాతో ఆసియన్‌ దేశాల కూటమి వాణిజ్యం 732 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.అమెరికా, ఐరోపాయూనియన్‌, జపాన్‌ వంటి దేశాలు చైనాతో జరుపుతున్న ఎగుమతి దిగుమతుల విలువ 1,600 బిలియన్‌ డాలర్లు. చైనా ప్రారంభించిన బిఆర్‌ఐ పధకానికి చైనా ప్రభుత్వం లక్ష కోట్ల డాలర్లను సమకూర్చగలదని వార్తలు వచ్చాయి. తానే స్వయంగా వాగ్దానం చేసినట్లుగా జనానికి వాక్సిన్లు వేయించకుండా భారాన్ని రాష్ట్రాల మీద నెట్టేందుకు ప్రయత్నించిన మన కేంద్ర ప్రభుత్వం నుంచి అంత మొత్తంలో విదేశాల్లో పెట్టుబడులను పెడుతుందని ఎవరైనా ఆశించగలరా ? దానితో పోటీగా మనమూ తయారైతే తప్ప కమ్యూనిస్టు వ్యతిరేకత పేరుతో అవి మనతో కలసి వస్తాయా ? మనలను నమ్ముకొని మిగతా దేశాలు చైనాకు వ్యతిరేకంగా జట్టుకడతాయా ?

పగలంతా ఎక్కడెక్కడో తిరిగిన సన్యాసులు రాత్రికి మఠానికి చేరి గంజాయి దమ్ము కొట్టి తెల్లవారిన తరువాత అది చేయాలి ఇది చేయాలని ప్రగల్భాలు పలికి తెల్లవారేసరికి మత్తు దిగి ఎవరి కర్రా బుర్రా వారు తీసుకొని ఎవరిదారిన వారు పోయినట్లు ఇప్పటికి 47 సార్లు జి7 దేశాల సమావేశాల కబుర్లున్నాయి తప్ప ఎవరికైనా విశ్వాసం కలిగించాయా ? గాల్వన్‌ లోయ ఉదంతాల సమయంలో మన ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశంలో చెప్పిందేమిటి ? చైనీయులు మన సరిహద్దుల్లోకి చొరబడిందీ లేదు, మన పోస్టులను తమతో తీసుకుపోయిందీ లేదు అన్నారు. అలాంటపుడు చైనాతో ఏ సమస్య మీద పోరాడుతారు ? చతుష్టయం పేరుతో శతృత్వం పెంచుకోవటం తప్ప సాధించేదేమిటి ? మనకంటే ఎంతో బలమైన చైనా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించగలిగిన ఆర్ధిక వనరులను కలిగి ఉంది. మన పరిస్ధితి ఏమిటి ? కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టటం ఎందుకు ? దాన్ని సంతుష్టీకరించేందుకు చైనాతో వైరం ఎందుకు, సైన్య మోహరింపు ఎవరికోసం, ఆ ఖర్చును జనం మీద మోపటం ఎందుకు ? గతంలో సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలతో పోరాడి అక్కడి వ్యవస్ధలను కూల్చివేసిన అమెరికా కొన్ని దేశాల మార్కెట్లను ఆక్రమించుకుంది. అయినా దాని ఆర్ధిక సమస్యలు తీరలేదు. 2008లో దానితో సహా తూర్పు ఐరోపాను పంచుకున్న ధనికదేశాలన్నీ ఆర్ధిక సంక్షోభానికి గురయ్యాయి. ఇప్పుడు చతుష్టయం పేరుతో చైనాను ఢకొీని దాని మార్కెట్‌ను ఆక్రమించుకోవటం సాధ్యమయ్యేనా. ఒకవేళ జరిగినా ఆమెరికా మిగతాదేశాలకు వాటా ఇస్తుందా ? ఎవరిపని వారు చేసుకోకుండా మనకెందుకీ ఆయాసం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనాను మించి భయపెడుతున్న చమురు – అచ్చేదిన్‌ కాదు జనం చచ్చే రోజులు !

23 Wednesday Jun 2021

Posted by raomk in Current Affairs, Economics, History, International, INTERNATIONAL NEWS, Opinion, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

$100 Oil Predictions Soar, crude oil price, world oil prices



ఎం కోటేశ్వరరావు
కొంత అతిశయోక్తిగానే ఉండవచ్చు గానీ అంతర్జాతీయ చమురు మార్కెట్లో పెరుగుతున్న ధరల తీరు తెన్నులను చూస్తే మన జనాలను కరోనా కంటే చమురు ధరలే ఎక్కువగా భయపెట్టేట్లు ఉన్నాయి. బుధవారం నాడు ఇది రాస్తున్న సమయానికి బ్రెంట్‌ రకం చమురు ధర 75.30 డాలర్లుగా ఉంది. ఇరాన్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమెరికాతో కరాఖండిగా వ్యవహరించే ఇబ్రహీం రైసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు గనుక అని ఒక కారణం చెప్పారు. అమెరికా ఇతర దేశాలు ఇరాన్‌తో జరుపుతున్న అణు చర్చలలో ప్రతిష్ఠంభన ఏర్పడవచ్చని చెబుతున్నారు. అమెరికాలో చమురు నిల్వలు తగ్గిపోవటం, ఒపెక్‌ దేశాలు ఉత్పత్తిని పెంచుతాయో లేదో తెలియని పరిస్ధితి కూడా ఇతర కారణాల్లో ఉన్నాయి. కరోనా తగ్గిపోయి క్రమంగా సాధారణ పరిస్ధితి ఏర్పడితే ఈ ఏడాది ఆఖరుకు లేదా వచ్చే ఏడాది ముడిచమురు పీపా ధర వంద డాలర్ల వరకు పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ఇదే సమయంలో అమెరికాలో షేల్‌ అయిల్‌ ఉత్పత్తి పెరిగితే డిమాండ్‌ తగ్గి ధరలు అదుపులో ఉండటం లేదా కొంత మేరకు తగ్గవచ్చని జోశ్యాలు చెప్పిన వారు పునరాలోచనలో పడ్డారు. దీనితో పాటు ఇరాన్‌కు కొత్త అధ్యక్షుడు వస్తే అమెరికాతో అణు ఒప్పందం కుదిరి ఆంక్షలు ఎత్తివేస్తే సరఫరా పెరుగుతుందని ఆశించిన వారంతా అలాంటి అవకాశాలు లేవని భావించటంతో ధరలు భగ్గుమన్నాయి.
అమెరికన్‌ పెట్రోలియం ఇనిస్టిట్యూట్‌(ఏపిఐ) మంగళవారం నాడు వెల్లడించిన సమాచారం ప్రకారం జూన్‌ 18వ తేదీతో ముగిసిన వారంలో చమురు నిల్వలు 7.199 మిలియన్‌ పీపాలకు తగ్గాయి. అంతకు ముందు వారంలో 8.537 మిలియన్‌ పీపాలు ఉన్నాయి. గతేడాది జనవరితో పోల్చితే ఎక్కువే ఉన్నప్పటికీ ఈ ఏడాది జనవరితో పోల్చితే తగ్గాయి.ఇది కూడా ధరల పెరుగుదల మీద ప్రభావం చూపింది. ఊహించినదానికంటే ముందుగానే వంద డాలర్లకు పెరుగుతుందా ? వచ్చే నెలలో ఒపెక్‌+దేశాల అదనపు ఉత్పత్తి మార్కెట్‌కు వచ్చినా ధరలు తగ్గకపోవచ్చన్నది కొందరి అభిప్రాయం.
ద్రవ్యోల్బణం, చమురు గిరాకీ పెరుగుదల, చమురు కంపెనీల వాటాదార్ల వత్తిడి, పర్యావరణం వంటి కారణాలతో రానున్న మూడు సంవత్సరాలలో ధరల పెరుగుదలతో పాటు చమురు సంక్షోభం తలెత్తవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. కొన్ని దేశాల్లో విద్యుత్‌ వాహనాల తయారీ మీద కేంద్రీకరణ, అమెరికా వంటి దేశాలలో పునరుత్పాదక ఇంథనాలకు ప్రోత్సాహం వంటి కారణాలతో చమురు ఉత్పత్తి తగ్గిపోయి ధరలు పెరగవచ్చన్నది విశ్లేషణల సారాంశం. ఈ పరిణామాలు, పర్యవసానాలకు సిద్దం గాని మనవంటి దేశాల మీద తీవ్ర ప్రతికూల ప్రభావం పడవచ్చు. అది పాలకుల మీద వత్తిడికి దారి తీసి రాజకీయ పర్యవసానాలు ముందుకు వచ్చే అవకాశం ఉంది.
రానున్న ఆరునెలల్లో ముడి చమురు ధర వంద డాలర్లకు పెరగవచ్చన్నది ఒక అంచనా అయితే రానున్న సంవత్సరాలలో 130 డాలర్లకు పెరగవచ్చని చెబుతున్నారు. కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చిన తరువాత పరిణామాలు ఎలా ఉండేది చెప్పలేని స్ధితి. చమురు మార్కెట్‌ను కృత్రిమంగా అదుపు చేస్తున్నారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ కారణంగానే గతంలో పడిపోయిన 35 డాలర్ల నుంచి 130 డాలర్లకు పెరగవచ్చు లేదా తిరిగి 35 డాలర్లకు దిగిరావచ్చన్నది కొందరి తర్కం. గిరాకీకి అనుగుణంగా ఉత్పత్తి పెరగాలి, అది జరగాలంటే ఆ రంగంలో పెట్టుబడులు కావాలి. కరోనా కారణంగా తలెత్తిన అనిశ్చితి వలన ఎవరూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం లేదు. ఇది చమురు కొరతకు దారి తీయవచ్చు. పర్యావరణ సమస్యల కారణంగా అనేక కంపెనీలు ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. చమురు, గ్యాస్‌ ఉత్పత్తిని తగ్గించాలని డచ్‌ కోర్టు షెల్‌ కంపెనీని ఆదేశించింది. మరోవైపున అంతర్జాతీయ ఇంథన సంస్ధ కొత్తగా నిక్షేపాల అన్వేషణలను నిలిపివేయాలని కోరింది.
అమెరికాలో షేల్‌ చమురు ఉత్పత్తి పరిమితంగా ఉన్నందున, తిరిగి పెరిగినా మార్కెట్‌ పడిపోయే అవకాశం లేదని ఒపెక్‌ దేశాలు భావిస్తున్నాయి.ఈ ఏడాది అమెరికా చమురు ఉత్పత్తి రోజుకు కేవలం రెండు లక్షల పీపాలు మాత్రమే పెరుగుతుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది పెరగవచ్చు. షేల్‌ ఆయిల్‌ ఉత్పత్తి ఖర్చు ఎక్కువగా ఉండటాన్ని ఒపెక్‌ దేశాలు గమనంలోకి తీసుకున్నాయి. గతేడాది రికార్డు స్ధాయిలో చమురు ధరలు పడిపోయినందున షేల్‌ ఉత్పత్తి దాదాపు నిలిచిపోయింది. ఆ కంపెనీలు లాభాలనే ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటాయి. ఈ సంవత్సరం అమెరికా ఉత్పత్తి రోజుకు 11.2 మిలియన్‌ పీపాలు ఉంటుందని, అది గతేడాది కంటే లక్షా 20వేల పీపాలు తక్కువని తాజా జోశ్యాలు ఉన్నాయి. అమెరికాలోని వెస్ట్‌ టక్సాస్‌ ఇంటర్‌మీడియెట్‌(డబ్ల్యుటిఐ) రకం చమురు ధర పీపాకు 60 డాలర్లకు మించితేనే అక్కడి కంపెనీలు ఉత్పత్తిని పెంచుతాయి. అయితే ప్రస్తుతం అంతకంటే ఎక్కువే ఉంది. మార్కెట్‌ స్ధిరపడింది అనుకున్న తరువాత వచ్చే ఏడాది ఉత్పత్తి పెంచవచ్చని భావిస్తున్నారు. తమ లాభాలు పెరుగుతాయనుకుంటేనే పెట్టుబడిదారులు మరింత ఉత్పత్తి చేస్తారు.
ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ను బట్టి ఆగస్టులో ముడి చమురు ఉత్పత్తి పెంచాలా వద్దా అని చమురు ఉత్పత్తి దేశాల సంస్ధ (ఒపెక్‌) చర్చలు జరుపుతోంది.వచ్చే వారంలో జరిగే సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. మార్కెట్‌లో ఉన్న లోటును పూడ్చేందుకు ఉత్పత్తి పెంచాలా అన్న అంశాన్ని రష్యా పరిశీలిస్తోంది. రెండు సంవత్సరాల తరువాత లండన్‌ మార్కెట్‌లో ముడిచమురు బ్రెంట్‌ ధర 75 డాలర్లు దాటింది. మే నుంచి జూలై మధ్య రోజుకు 20లక్షల పీపాల ఉత్పత్తి పెంచాలన్న అంశాన్ని ఒపెక్‌ దేశాలు సమీక్షిస్తున్నాయి, అయితే ఊహించినదాని కంటే ధరలు పెరగటంతో అంతకంటే ఎక్కువే పెంచాలనే వత్తిడి వస్తోంది. గిరాకీ ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉంటేనే నిలిపివేసిన ఉత్పత్తిని పునరుద్దరించటం గురించి పరిశీలిస్తామని ఒపెక్‌ దేశాల నేతగా ఉన్న సౌదీ అరేబియా చమురు మంత్రి అబ్దుల్‌ అజీజ్‌ బిన్‌ సల్మాన్‌ చెప్పారు. ప్రస్తుతం రోజుకు 30లక్షల పీపాల కొరత ఉన్నట్లు గోల్డ్‌మన్‌ సాచ్స్‌ అంచనా వేసింది. ఒపెక్‌+దేశాలు రోజుకు 58లక్షల పీపాలు ఉత్పత్తి చేస్తున్నాయి. సౌదీతో రోజువారీ ఫోన్లో మాట్లాడుతున్న రష్యా తక్షణమే ప్రత్యక్షంగా కూర్చుని చర్చించాల్సిన పరిస్ధితి లేదని భావిస్తోంది.
అమెరికాలో చమురు నిల్వల గురించి వస్తున్న వార్తల కారణంగా ముందస్తు చమురు మార్కెట్‌లో ధరలు పెరుగుతున్నాయి. సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబరులో సరఫరా చేయాల్సిన డబ్య్లుటిఐ చమురు ధర పీపాకు 1.2 డాలర్లు పెరిగింది. గత పద మూడు సంవత్సరాలలో రెండు నెలల మధ్య ఒక డాలరుకు మించిన వ్యత్యాసం కేవలం రెండు సార్లు (2008, 2014)మాత్రమే జరిగింది. ఏడాది క్రితం కొనుగోలు చేసిన చమురును ఎక్కడ నిల్వచేసుకోవాలో తెలియక ఒప్పందం ప్రకారం చమురు సరఫరాను స్వీకరించలేని కంపెనీలు ఎగుమతిదార్లకు ఎదురు డాలర్లు ఇచ్చి నష్టాలను తగ్గించుకున్నాయి.ఇప్పుడు చమురుశుద్ది కర్మాగారాలు అమెరికాలో పూర్తి స్దాయిలో పని చేస్తుండటంతో ఆ నిల్వలన్నీ ఖాళీ అవుతున్న కారణంగా చమురు నిల్వ టాంకులు అద్దెకు ఇవ్వబడును అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. జూన్‌ తరువాత ఒపెక్‌ దేశాలు ఉత్పత్తిని పెంచనట్లయితే చమురు కొరత ఏర్పడుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్ధ హెచ్చరించింది.
ప్రపంచ చమురు నిల్వల్లో 2012 అంచనా ప్రకారం ఐదో వంతు (296.5 బిలియన్‌ పీపాలు) నిర్దారిత చమురు కలిగి ఉంది వెనెజులా. మార్కెట్లో ధరలు పెరిగిన కారణంగా అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున చమురు ఉత్పత్తిని పెంచనున్నది. గతేడాది చమురు ధరలు భారీగా పతనమైనందున రోజుకు నాలుగు లక్షల పీపాలకు ఉత్పత్తి తగ్గిపోయింది. ఇప్పుడు ఏడులక్షలు జరుగుతోందని చమురుశాఖ మంత్రి ఎల్‌ ఇసామీ వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి పదిహేను లక్షల పీపాలకు పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అయితే అమెరికా ఆంక్షలు కొనసాగుతున్నందున ఉత్పత్తి చేసినప్పటికీ కొనుగోలుదార్లు ముందుకు రాకపోతే ప్రయోజనం లేదు. అందువలన ఆంక్షల గురించి జో బైడెన్‌ సర్కార్‌తో చర్చలు జరుపుతున్నట్లు వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో చెప్పాడు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిస్తేనే చర్చలు, ఆంక్షల తొలగింపు అని అమెరికా అంటోంది. మన దేశంలోని రిలయన్స్‌ చమురు కంపెనీ కోసం గతంలో సెనెటర్‌గా బైడెన్‌ ఉన్నపుడు సహాయకుడిగా పని చేసిన భారతీయ లాబీయిస్టు అంకిత్‌ దేశారు ఇప్పుడు బైడెన్‌ యంత్రాంగంతో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. రిలయన్స్‌ చమురు శుద్ది కర్మాగారానికి పని కావాలంటే ముడి చమురు కావాలి. వెనెజులా వద్ద చమురు ఉన్నప్పటికీ డీజిల్‌ తయారీకి అవసరమైన శుద్ది కర్మాగారాలు లేవు. వెనెజులా నుంచి చమురు దిగుమతి చేసుకొని డీజిల్‌ను తయారు చేసి తిరిగి ఎగుమతి చేసే అవకాశం ఉన్నందున ఏదో ఒక రూపంలో ఆంక్షలను సడలించి రిలయన్స్‌ కంపెనీకి తోడ్పడాలని అంకిత్‌ దేశారు రాయబారాలు జరుపుతున్నారు. అంబానీలతో నరేంద్రమోడీకి విడదీయరాని సంబంధాలు ఉన్నందున ఆయన కూడా జోక్యం చేసుకోవచ్చు. అయితే తమ కంపెనీ అమెజాన్‌కు మోడీ మొండి చేయి చూపుతున్నందున బైడెన్‌ యంత్రాంగం ఏమేరకు దిగి వస్తుందో తెలియదు. అమెజాన్‌-రిలయన్స్‌ రాజీపడితే…..ఏమో ఏదైనా జరగవచ్చు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చమురు ధరల పెరుగుదల : బిజెపికి ముందుంది ముసళ్ల పండగ !

21 Monday Jun 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, Health, History, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP double standards, Fuel Price in India, Fuel tax hike in India, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


నాలుగు నెలల క్రితం లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్ధ ఒక సర్వే జరిపింది. దాని ప్రకారం పెరుగుతున్న చమురు ధరల ఖర్చును సర్దుబాటు చేసుకొనేందుకు ఇతర ఖర్చులను తగ్గించుకుంటున్నామని 51శాతం మంది చెప్పారు. అత్యవసర వస్తువుల మీద ఖర్చు తగ్గించుకోవటం బాధాకరంగా ఉందని 21శాతం మంది అన్నారు. ఆ సర్వే రోజు ఢిల్లీలో పెట్రోలు ధర 90.93, డీజిలు ధర రూ.81.32 ఉంది. జూన్‌ 21న 97.22, 87.97కు పెరిగాయి. అంటే పైన పేర్కొన్న జనాలు ఇంకా పెరుగుతారని వేరే చెప్పనవసరం లేదు. అచ్చేదినాలలో ఉన్నాం కనుక దేశభక్తితో ఇతర ఖర్చులు తగ్గించుకొని దేశం కోసం త్యాగం చేస్తున్నాం. జూన్‌ 21న చమురు మార్కెట్లో బ్రెంట్‌ రకం ముడిచమురు పీపాధర 73.50కు అటూ ఇటూగా, మన దేశం కొనుగోలు చేసే రకం ధర.72.39 డాలర్లుగా ఉంది. సాధారణంగా బ్రెంట్‌ కంటే ఒక డాలరు తక్కువగా ఉంటుంది.
కొంత మంది పాలకులకు, కొన్ని పార్టీలకు చరిత్ర అంటే మహాచిరాకు. ఎందుకంటే జనాలు వాటి పేజీలను తిరగేస్తే బండారం బయట పడుతుంది. గతంలో ఏమి చెప్పారో ఇప్పుడేమి చెబుతున్నారో జనం చర్చించుకుంటారు. ప్రతిఘటనకు ఆలోచనలే నాంది కనుక, జనాన్ని ఏదో ఒక మత్తులో చేతనా రహితంగా ఉంచాలని చూస్తారు. చమురు ధరల గురించి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఏమి చెప్పారో, ప్రధానిగా ఉంటూ ఆయనేమి చేస్తున్నారో, సచివులేమి మాట్లాడుతున్నారో తెలుసుకోవటం అవసరం.


మరోవైపున చమురు ధరలు పెంచటం వలన సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది లేదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గతేడాది జూన్‌30న చెప్పారు. ధరల పెంపుదలను నిరసిస్తూ కాంగ్రెస్‌ చేసిన ఆందోళనను ప్రస్తావించి ఈ వ్యాఖ్య చేశారు.కుటుంబంలో సమస్య తలెత్తినపుడు భవిష్యత్‌ అవసరాలను చూసుకొని జనాలు సొమ్మును జాగ్రత్తగా ఖర్చు పెడతారు. చమురు ధరల పెంపును కూడా ఇదే విధంగా చూడాలి. చమురు పన్నుల ద్వారా వసూలు చేస్తున్న డబ్బును ఆరోగ్యం, ఉపాధి, ఆర్ధిక భద్రత చేకూరే ఇతర వాటి మీద ఖర్చు చేస్తున్నాం. ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ యోజన పధకం కింద పేదలు, రైతులకు అనేక పధకాల కింది 1,70,000 కోట్ల రూపాయలు కేటాయించాం. జనాల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నాం. ఆరునెలల పాటు ఉచితంగా రేషన్‌ మరియు మూడు నెలల పాటు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నాం. పేదలకు సంక్షేమ పధకాలను అమలు జరుపుతుంటే సోనియా గాంధీ, కాంగ్రెస్‌ భరించలేకపోతున్నాయి.” అన్నారు. ఏడాది తరువాత కూడా ఇదే పద్దతిలో సమర్ధించుకున్నారు.


సంక్షేమ పధకాలకు ఖర్చు చేస్తున్నాం కనుక చమురు ధరలను తగ్గించేది లేదని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూన్‌ 13న కరాఖండిగా చెప్పేశారు. ధరలు జనానికి సమస్యగా ఉందని తెలిసినప్పటికీ చేసేదేమీ లేదన్నారు. వాక్సిన్ల కోసం 35వేల కోట్లు, ఎనిమిది నెలల పాటు పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వటానికి ప్రధాని మంత్రి గరీబ్‌ కల్యాణయోజన పధకం కింద లక్ష కోట్ల రూపాయలు కేటాయించారు.వేలాది కోట్ల రూపాయలను కిసాన్‌ సమ్మాన్‌ యోజన కింద బ్యాంకుల్లో జమచేశాము, రైతులకు కనీస మద్దతు ధరలను పెంచాము కనుక ఈ ఏడాది ఇవన్నీ ఉన్నందున చేయగలిగిందేమీ లేదన్నారు.


ఇవన్నీ ఇప్పుడు చెబుతున్న సాకులు మాత్రమే. ఆరు సంవత్సరాల క్రితం నుంచి క్రమంగా పెంచటంతో పాటు గతేడాది బడ్జెట్‌ సమయంలోనే చమురు పన్నులు భారీగా పెంచారు. గత మూడు సంవత్సరాలలో చమురు పన్ను ద్వారా వచ్చిన ఆదాయ సంఖ్యలే అందుకు సాక్షి. ఈ ఏడాది మార్చి ఎనిమిదవ తేదీన లోక్‌సభకు మంత్రి ప్రధాన్‌ ఇచ్చిన సమాధానం ప్రకారం గత మూడు సంవత్సరాలలో వచ్చిన ఆదాయం ఇలా ఉంది.2018-19లో 2.13లక్షల కోట్లు, 2019-20లో 1.78లక్షల కోట్లు, 2020-21లో ఏప్రిల్‌ నుంచి జనవరి వరకు (పది నెలలకు) 2.94లక్షల కోట్లు వచ్చింది. కరోనా రెండవ తరంగం వస్తుందని ముందే ఊహించి ఇంత భారీ ఎత్తునపన్నులు విధించినట్లు భావించాలా ? ఇన్ని కబుర్లు చెబుతున్నవారు వాక్సిన్ల భారాన్ని రాష్ట్రాల మీద వేసేందుకు ఎందుకు ప్రయత్నించినట్లు ? 2014-15లో అంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది కేంద్రం పెట్రోలు మీద రు.29,279 కోట్లు, డీజిలు మీద 42,881 కోట్లు వసూలు చేయగా ఆర్ధికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఈ ఏడాది మార్చి 22న లోక్‌సభలో చెప్పినదాని ప్రకారం 2020 ఏప్రిల్‌ నుంచి 2021 జనవరి వరకు పెట్రోలు మీద రు.89,575 కోట్లు, డీజిలు మీద రు.2,04,906 కోట్లు ఎక్సయిజ్‌ పన్ను వసూలైంది. ఇంత పెంపుదల రైతులు, కరోనా కోసమే చేశారా ? కరోనా నిరోధ పరికరాలు, ఔషధాల మీద జిఎస్‌టి తగ్గించటానికి ససేమిరా అని వత్తిడి తట్టుకోలేక నామ మాత్ర రాయితీ ఇచ్చిన పెద్దలు చెబుతున్నమాటలివి. బిజెపి పెద్దలు ప్రతిపక్షంలో ఉండగా ఏమి చెప్పారు ? ఏమి చేశారు ?


కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ ప్రభుత్వ వైఫల్యానికి చమురు ధరల పెరుగుదల గొప్ప తార్కాణం అని 2012 మే 23న ఒక ట్వీట్‌ ద్వారా నరేంద్రమోడీ విమర్శించారు.బహుశా అప్పటికి ప్రధాని పదవి ఆలోచన లేదా లేక ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి తప్పించుకొనే ఎత్తుగడలో భాగంగా చెప్పారా ? ధరల పెంపుదల వలన గుజరాత్‌ పౌరుల మీద వందల కోట్ల భారం పడుతుందని కూడా నాడు ముఖ్యమంత్రిగా మోడీ చెప్పి ఉంటారు. 2012లో రైలు ఛార్జీల పెంపు పేదలు, రైతులకు వ్యతిరేకం అని నిరసన తెలుపుతూ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ కేంద్రానికి లేఖ రాశారు.అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేశాడన్నట్లుగా 2014లో అధికారానికి వచ్చిన తొలి నెలలోనే ప్రధాని నరేంద్రమోడీ తన వాగ్దానాల్లో ఒకటైన ధరల పెరుగుదల అరికట్టటం, అచ్చేదిన్‌ అమల్లో భాగంగా రైలు ప్రయాణీకుల ఛార్జీలు 14.2శాతం, సరకు రవాణా 6.5శాతం పెంచారు. దివంగత సుష్మా స్వరాజ్‌, అరుణ్‌ జైట్లీ మాటలను పక్కన పెడితే ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న స్కృతి ఇరానీ తీరుతెన్నులు తెలిసిందే. బిజెపి కనుక కేరళలో అధికారానికి వస్తే లీటరు పెట్రోలు, డీజిల్‌ అరవై రూపాయలకే అందిస్తామని ఆ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కుమనమ్‌ రాజశేఖరన్‌ ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారు. వాటిని జిఎస్‌టి పరిధిలోకి తెస్తే ఆధరకు ఇవ్వవచ్చని చెప్పారు. చమురును జిఎస్‌టి పరిధిలోకి తెచ్చేందుకు ఎల్‌డిఎఫ్‌ అంగీకరించటం లేదని ఆరోపించారు. ఇంతకు ముందు ధర్మేంద్ర ప్రధాన్‌ గారు రోజువారీ ధరల పెంపుదల వినియోగదారులకే మంచిదని, తమ ప్రభుత్వం ధరలపై నియంత్రణ విధించదని చెప్పారు.
ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే చివరికి అదే నిజమై కూర్చుంటుందన్న జర్మన్‌ నాజీ మంత్రి గోబెల్స్‌ను బిజెపి పెద్దలు, పిన్నలు ఆదర్శంగా తీసుకున్నారు. కేంద్రం విధించే ఎక్సయిజ్‌ పన్నులో 41శాతం తిరిగి రాష్ట్రాలకే పోతుందని, అందువలన రాష్ట్రాలు పన్ను తగ్గించాలని నిరంతరం చెబుతుంటారు. అదే వాస్తవం అయితే బిజెపి పాలిత రాష్ట్రాలు ముందుగా ఆ పని చేసి ఆదర్శంగా నిలిచి ఇతర పార్టీల పాలిత రాష్ట్రాల మీద ఎందుకు వత్తిడి తేవటం లేదు ? ఒక్కటంటే ఒక్క రాష్ట్రమైనా ఆపని ఎందుకు చేయలేదు?


యుపిఏ పాలనా కాలంలో వార్షిక సగటు ముడిచమురు పీపా ధర డాలర్లలో ఎలా ఉందో, నరేంద్రమోడీ హయాంలో ఎలా ఉందో దిగువ చూడవచ్చు.
సంవత్సరం××× ధర డాలర్లలో
2010-11××× 85.09
2011-12××× 111.89
2012-13××× 107.97
2013-14××× 105.52
2014-15××× 84.16
2015-16××× 46.17
2016-17××× 47.57
2017-18××× 56.43
2018-19××× 69.88
2019-20××× 60.57
2020-21××× 44.82


2021-22 సంవత్సరం ఏప్రిల్‌ మాసంలో 66.61, మే నెలలో 72.08 డాలర్లు ఉంది. ఈ సంవత్సరాలలో ధరలు తగ్గితే వినియోగదారులకు ధరలు తగ్గాలి, పెరిగితే పెరగాలి అని చెప్పారు. అదే తర్కాన్ని వర్తింప చేస్తే ప్రభుత్వాలకు కూడా ఆదాయం తగ్గాలి. జరిగిందేమిటి ? ఎలా పెరిగిందో ముందే చూశాము. అంతర్జాతీయంగా ధరలు తగ్గినా వినియోగదారుల జేబులు గుల్ల అయ్యాయి. చమురు ధర 72 డాలర్లు ఉంటేనే మోడీ ఏలుబడిలో పెట్రోలు ధర వంద రూపాయలు దాటింది. అదే పూర్వపు స్ధాయికి చేరితే…… మోత మోగుతుందని వేరే చెప్పాలా ?


సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో బిజెపి చేస్తున్న ప్రచారం పని చేస్తున్న కారణంగానే అనేక మంది పన్ను తగ్గించాల్సింది రాష్ట్రాలే అనుకుంటున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే పెట్రోలు మీద యూపిఏ హయాంలో లీటరుకు విధించిన రూ.9.48 నుంచి 32.98కి డీజిలు మీద రు.3.56 నుంచి 31.80కి పెంచాలని ఏ రాష్ట్రం కోరిందో చెప్పాలని బిజెపి పెద్దలను నిలదీయండి, సమాధానం ఉండదు. ఈ మొత్తాలలో రాష్ట్రాలకు వాటా లేని సెస్‌లు, డ్యూటీలే ఎక్కువ ఉన్నాయి. అందువలన ఈ మొత్తాల నుంచి 41శాతం లెక్కవేసి దానికి, రాష్ట్రాలు విధించే వాట్‌ను కలిపి చూడండి రాష్ట్రాలకు వచ్చే ఆదాయమే ఎక్కువ కదా, కనుక రాష్ట్రాలే తగ్గించాలని బిజెపి పెద్దలు వాదిస్తారు. అందుకే మెజారిటీ రాష్ట్రాలు మీవే కదా ఆ పని ముందు అక్కడ ఎందుకు చేయలేదు అంటే అసలు విషయాలు బయటకు వస్తాయి. ఉదాహరణకు ఈ ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయ రంగం కోసం చమురు మీద లీటరు పెట్రోల మీద రెండున్నర, డీజిలు మీద నాలుగు రూపాయల సెస్‌ విధించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు వినియోగదారులకు పెంచలేదు. మరి ఆ సొమ్మును ఎలా వసూలు చేస్తారు ? పైన చెప్పుకున్న ఎక్సయిజు పన్ను నుంచి ఈ మొత్తాన్ని సెస్‌ ఖాతాకు మార్చారు. ఈ మొత్తాలనుంచి రాష్ట్రాలకు వచ్చేదేమీ ఉండదు. అలాగే లీటరుకు వసూలు చేస్తున్న రు.18 రోడ్డు మరియు మౌలిక సదుపాయాల సెస్‌. వీటి నుంచే చమురు, గ్యాస్‌ పైప్‌లైన్లు, జాతీయ రహదారులు, రాష్ట్రాలకు రహదారులకు నిధులు ఇస్తున్నారు. మరోవైపు వినియోగదారుల చార్జీల పేరుతో వాటిని వినియోగించుకున్నందుకు జనాల నుంచి వసూలు చేస్తున్నారు. సూటిగా చెప్పాలంటే మన డబ్బులతో మనమే రోడ్లు వేసుకొని వాటికి టోల్‌టాక్సు మనమే కడుతున్నాం. ఇవన్నీ పోను మిగిలిన మొత్తాల నుంచే రాష్ట్రాలకు 41శాతం వాటా ఇస్తారు. అసలు మోసం ఇక్కడే ఉంది.

కిసాన్‌ సమ్మాన్‌ యోజన పేరుతో ఏడాదికి ఒక్కో రైతుకు ఆరువేల రూపాయలు ఇస్తున్నట్లు ఎన్నికల కోసం ఒక పధకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. మరోవైపున ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పెట్రోలు,డీజిలు మీద వ్యవసాయ సెస్‌ పేరుతో ప్రతిపాదించిన మొత్తాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఏటా 49వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. జనమంతా చమురు కొంటారా అని వాదించే వారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. వాహనాలు నడిపేవారందరూ వ్యవసాయం చేయరు కదా ? వారి కోసం అందరిదగ్గర నుంచి ఎందుకు వసూలు చేయాలి ? కరోనా కారణంగా చమురు వాడకం తగ్గింది గానీ, ప్రభుత్వాలకు గణనీయంగా ఆదాయం పెరగటం వెనుక మతలబు పెంచిన పన్నులే. మంచి జరిగితే తమ ఖాతాలో, చెడు జరిగితే రాష్ట్రాల ఖాతాలో వేయటం కరోనా విషయంలో చూశాము. కరోనా మీద విజయం సాధించామని చెప్పుకొన్నపుడు నరేంద్రమోడీ అండ్‌కోకు రాష్ట్రాలు గుర్తుకు రాలేదు, తీరా రెండవ తరంగంలో పరిస్ధితి చేజారటంతో ఆరోగ్యం, వైద్యం రాష్ట్రాల బాధ్యత అంటూ ప్రచారానికి దిగారు.


2014 మే నెలలో ఢిల్లీలో ఒక లీటరు పెట్రోలు ధర రు.71.41. దీనిలో చమురు ధర 63శాతం, కేంద్ర పన్నులు 16శాతం, రాష్ట్ర పన్ను 18శాతం, డీలరు కమిషన్‌ మూడు శాతం ఉంది. అదే 2021 ఫిబ్రవరిలో లీటరు ధర రూ.86.30. దీనిలో కేంద్ర పన్ను 37శాతం, చమురు ధర 36శాతం రాష్ట్ర పన్ను 23శాతం, డీలరు కమిషన్‌ నాలుగుశాతం ఉంది. ఇప్పుడు చమురు ధరలు పెరుగుతున్నందున ఈ శాతాల్లో మార్పులు ఉంటాయి. దీన్ని రూపాయల్లో చెప్పుకుంటే రు.86.30లో కేంద్రానికి రు.32.98, చమురు కంపెనీలకు రు.29.71, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.19.92, డీలరు కమిషన్‌ రు.3.69 వస్తాయి.


పేదలందరూ పెట్రోలు కొంటారా ? వాహనాలు లేని వారు కూడ కొని తాగుతారా అంటూ వితండవాదనలు చేసే వారిని చూస్తాము. అవన్నీ జనాన్ని తప్పుదారి పట్టించేందుకు ముందుకు తెచ్చిన ప్రచార అస్త్రాలు. ప్రతి వస్తువు ధర పెరుగుదల, పన్నుల పెంపు మొత్తంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. ఆ సూచికలను నిర్ణయించేందుకు అన్ని రకాల వినియోగ వస్తువుల ధరలను పరిగణనలోకి తీసుకొని ప్రతి నెలా సూచిక తగ్గిందా లేదా అని నిర్ధారిస్తారు. ఉద్యోగులకు, కార్మికులకు, ఇతర వేతన జీవులకు ఆ ప్రాతిపదికనే కరువు భత్యాన్ని నిర్ణయిస్తారు.ద్రవ్యోల్బణాన్ని ఖరారు చేస్తారు. డీజిలు ధరలు పెరిగితే ప్రజారవాణాకు వినియోగించే బస్సుల నిర్వహణ, సరకు రవాణా లారీ, వ్యవసాయదారుల ట్రాక్టర్లు, పంపుసెట్ల ఖర్చు పెరుగుతుంది. పరిశ్రమల్లో జనరేటర్లను వాడితే అక్కడ తయారయ్యే వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇలా పరోక్షంగా యావత్‌ జనజీవనం మీద చమురు ధరల పెరుగుదల ప్రభావం ఉంటుంది.


రానున్న కొద్ది వారాల్లో పీపా చమురు 80డాలర్లకు చేరవచ్చని జోశ్యం చెబుతున్నారు. గత రెండు నెలల్లో మార్కెట్‌ తీరుతెన్నులను చూసినపుడు ముందుగానే పెరిగినా ఆశ్చర్యం లేదు. వివిధ దేశాల్లో కరోనా తీవ్రత తగ్గి ఆర్ధిక కార్యకలాపాల పెరుగుదల దానికి ఒక కారణంగా చెబుతున్నారు. జోశ్యాలు నిజమౌతాయా లేదా అన్నది పక్కన పెడితే 70-80 డాలర్ల మధ్య చమురు ధరలు ఉన్నప్పటికీ మన వినియోగదారులకు మూలిగే నక్కమీద తాటిపండు పడిన చందంగానే ఉంటుంది. ఇదే జరిగితే వినియోగదారులకు, ముందే చెప్పుకున్నట్లు యావత్‌ జనానికి ధరల సెగ, అది పాలకులకు రాజకీయ సెగగా తగలటం అనివార్యం. యుపిఏ చివరి మూడు సంవత్సరాలలో జరిగింది అదే. అదే నరేంద్రమోడీ సర్కార్‌కూ పునరావృతం అవుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మన చుట్టూ జరుగుతున్నదేమిటి – 2 ఇతరుల భుజాల మీద తుపాకితో చైనాను కాల్చాలని చూస్తున్న అమెరికా – జి7 47వ శిఖరాగ్ర సభ, !

14 Monday Jun 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

47th G7 Summit, China, G7, G7-India, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


ఏడు ధనిక దేశాల (జి7) బృంద 47వ వార్షిక సమావేశం జూన్‌ 11-13 తేదీలలో బ్రిటన్‌లోని ఇంగ్లండ్‌ సముద్రతీరంలోని కారన్‌వాల్‌లో జరిగింది. ఈ సమావేశానికి భారత్‌,ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికాను ఆహ్వానించారు. ప్రతి ఏటా చేస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా అనేక అంశాల మీద తీర్మానాలు చేశారు, సంకల్పాలు చెప్పుకున్నారు. హడావుడి చేశారు. చైనా మీద జబ్బ చరచటం ఈ సమావేశాల ప్రత్యేకత. జి7కు భారత్‌ సహజ మిత్రదేశమని మన ప్రధాని నరేంద్రమోడీ అంతర్జాలంద్వారా చేసిన ప్రసంగంలో చెప్పటం ద్వారా తామెటు ఉన్నదీ మరోసారి స్పష్టం చేశారు.


రెండవ ప్రపంచ యుద్దం తరువాత ధనిక దేశాల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన బ్రెట్టన్‌ ఉడ్‌ కవలలు( ప్రపంచ బ్యాంక్‌, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్ధ) తమ ప్రయోజనాలను సక్రమంగా నెరవేర్చటం లేదనే అసంతృప్తి వాటిని ఏర్పాటు చేసిన దేశాల్లోనే తలెత్తింది. దాంతో వాటిని కొనసాగిస్తూనే తమ ప్రయత్నాలు తాము చేయాలనే లక్ష్యంతో 1973లో అమెరికా చొరవతో సన్నాహక సమావేశం జరిగింది. దానిలో అమెరికా, పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ ఆర్ధిక మంత్రులు పాల్గొన్నారు.మీకు అభ్యంతరం లేకపోతే జపాన్ను కూడా కలుపుకుందాం అన్న అమెరికా ప్రతిపాదనకు మిగతా దేశాలు అంగీకరించటంతో జి5గా ప్రారంభమైంది.1975లో తొలిశిఖరాగ్ర సమావేశానికి ఇటలీని కూడా ఆహ్వానించారు.మరుసటి ఏడాది సమావేశంలో బృందంలో ఆంగ్లం మాట్లాడేవారు మరొకరు ఉంటే బాగుంటుందంటూ కెనడాను కూడా ఆహ్వానించాలని అమెరికా ప్రతిపాదించటంతో 1976 నాటికి జి7గా మారింది. ఈ బృంద సమావేశాలకు ఐరోపా యూనియన్ను శాశ్వత ఆహ్వానితురాలిగా నిర్ణయించారు. సోవియట్‌ యూనియన్ను కూల్చివేసిన తరువాత 1997లో రష్యాను జి7లోకి ఆహ్వానించి, జి8గా మార్చారు. 2014వరకు సభ్యురాలిగా కొనసాగింది. ఉక్రెయిన్‌లోని క్రిమియా ప్రాంతాన్ని ఆక్రమించటంతో అదే ఏడాది దాన్ని సస్పెండ్‌ చేశారు. 2018లో ఈ బృందం నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా ప్రకటించింది. అయితే 2020లో అమెరికా, ఇటలీ రెండు దేశాలూ తిరిగి రష్యాను చేర్చుకోవాలని చేసిన ప్రతిపాదనను మిగిలిన దేశాలు తిరస్కరించాయి. తమకసలు చేరాలనే ఆసక్తి లేదని రష్యా చెప్పేసింది. ఏ దేశంలో సమావేశం జరిగితే ఆ దేశం ఎవరిని కోరుకుంటే వారిని ఆహ్వానితులుగా పిలుస్తారు. మన దేశం పెద్ద మార్కెట్‌ గనుక ప్రతి దేశమూ ప్రతిసారీ మనలను ఆహ్వానిస్తున్నది.


జి7 మౌలికంగా సామ్రాజ్యవాద దేశాల కూటమి. వలసలుగా చేసుకోవటం ఇంకేమాత్రం కుదిరే అవకాశం లేకపోవటంతో రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఈ కూటమి దేశాలన్నీ రాజీకి వచ్చి దేశాలకు బదులు మార్కెట్‌ను పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. వాటి మధ్య విబేధాలున్నప్పటికీ తాత్కాలికంగా పక్కన పెట్టాయి. అయితే రష్యా పెట్టుబడిదారీ వ్యవస్ధకు మారి రంగంలోకి వచ్చిన తరువాత అది కూడా తన వాటా సంగతేమిటని డిమాండ్‌ చేసింది. ద్వితీయ శ్రేణి పాత్ర పోషించేందుకు సిద్దం కాదని ప్రధమ స్ధానంలో ఉండాలని కోరింది కనుకనే జి7 మొత్తంగా దాని మీద దాడికి దిగాయి. దాన్నుంచి తట్టుకొనేందుకు వర్గరీత్యా ఒకటి కాకున్నా ప్రస్తుతానికైతే చైనాతో కలసి ఎదిరించాలని రష్యా నిర్ణయించుకుంది. ఈ కూటమి దేశాలు మన దేశాన్ని కూడా వినియోగించుకోవాలని చూస్తున్నాయి తప్ప తమ భాగస్వామిగా చేసుకొనేందుకు సిద్దం కావటం లేదు. బ్రెజిల్‌ పరిస్ధితీ అదే.

జి7 47వ సమావేశం ఆమోదించిన అంశాలను క్లుప్తంగా చూద్దాం. వీటిలో రెండు రకాలు, ఒకటి రాజకీయ పరమైనవి, రెండవది ఆర్ధిక, ఇతర అంశాలు. మొదటిదాని సారం ఏమంటే అన్ని దేశాలు కలసి చైనా మెడలు వంచాలి, కాళ్లదగ్గరకు తెచ్చుకోవాలి. గ్జిన్‌ జియాంగ్‌, హాంకాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్లు, తైవాన్ను బెదిరిస్తున్నట్లు ప్రచారం చేయాలి, వత్తిడి తేవాలి. అర్ధిక అంశాలలో తప్పుడు పద్దతులకు పాల్పడుతున్నని ఊదరగొట్టాలి. రెండవ తరగతిలో కంపెనీలు పన్ను ఎగ్గొట్టేందుకు పన్నుల స్వర్గాలుగా ఉన్న ప్రాంతాలకు తరలిపోతున్నందున కార్పొరేట్‌ పన్ను కనీసంగా 15శాతం విధించాలని పేర్కొన్నాయి. పేద దేశాలకు వందకోట్ల డోసుల కరోనా వాక్సిన్‌ అందించాలి. అభివృద్ది చెందుతున్న దేశాల అభివృద్ధికి తోడ్పడాలి.దానిలో భాగంగా బి3డబ్యు పధకాన్ని అమలు చేయాలి.


ఈ బృందంలో ఒకటైన బ్రిటన్‌ మన దేశాన్ని వలసగా చేసుకొని మన మూల్గులను పీల్చింది. మనం ఎదగాల్సినంతగా ఎదగకపోవటానికి అది కూడా ఒక కారణం. అదే విధంగా మిగిలిన దేశాలు కూడా అలాంటి చరిత్ర కలిగినవే. అలాంటి వాటికి మన దేశం సహజ బంధువు అని చెప్పటం అసలు సిసలు దేశభక్తుడిని అని చెప్పుకొనే నరేంద్రమోడీ చెప్పటం విశేషం. మన స్వాతంత్య్ర స్ఫూర్తికి అది విరుద్దం. సంఘపరివార్‌ దానిలో భాగం కాదు కనుక ఆ స్ఫూర్తితో దానికి పనిలేదు. ఆ కూటమి దేశాలతో వాణిజ్య లావాదేవీలు జరపటం వేరు, వాటికి సహజ మిత్రులం అని చెప్పుకోవటం తగనిపని. అణచివేసినవారు-అణిచివేతకు గురైన వారు సంబంధీకులు ఎలా అవుతారు? జి7 కూటమి దేశాల పాలకవర్గాల చరిత్ర అంతా ప్రజలు, ప్రజాస్వామ్యాన్ని అణచివేయటం లేదా అణచివేతకు మద్దతు ఇచ్చిందే తప్ప మరొకటి కాదు. రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యవారసుడైన ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తాజా సమావేశాల్లో దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా చైనా వంటి నియంతృత్వ దేశం కంటే తమ కూటమి పేద దేశాలకు మంచి స్నేహితురాలని చెప్పుకున్నారు. కమ్యూనిస్టు చైనా ఉనికిలో లేకముందు ఆ దేశాల చరిత్ర ఏమిటో లోకానికి తెలియదా ? పులిమేకతోలు కప్పుకున్నంత మాత్రాన సాధు జంతువు అవుతుందా ?

నలుగురు కూర్చుని ప్రపంచాన్ని శాసించే రోజులు ఎప్పుడో గతించాయని జి7 కూటమి గ్రహిస్తే మంచిదని చైనా తిప్పికొట్టింది.ఐక్యరాజ్యసమితి సూత్రాల ప్రాతిపదికన నిజమైన ఉమ్మడి లక్ష్యంతో మాత్రమే నిర్మాణం జరగాలని పేర్కొన్నది. దేశాలు చిన్నవా – పెద్దవా, బలమైనవా – బలహీనమైనవా పేద-ధనికా అన్నది కాదు అన్నీ సమానమైనవే, వ్యవహారాలన్నీ అన్ని దేశాలు సంప్రదింపులతో నిర్ణయం కావాల్సిందే. ఏదైనా ఒక పద్దతి అంటూ ఉంటే అది ఐరాస వ్యవస్ధ ప్రాతిపదికనే తప్ప కొన్ని దేశాలు నిర్ణయించేది కాదు అని స్పష్టం చేసింది. ధనిక దేశాల్లో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించుకొనేందుకు ఏర్పాటు చేసుకున్న కూటమి ఇది. మరో మూడు సంవత్సరాల్లో ఐదు దశాబ్దాలు నిండనున్నాయి. ఈ కాలంలో ఈ కూటమి తన సమస్యలనే పరిష్కరించుకోలేకపోయింది, ఇక పేద దేశాల గురించి ఎక్కడ ఆలోచిస్తుంది? కరోనా విషయంలో ఇవన్నీ ఎంత ఘోరంగా విఫలమయ్యాయో ప్రత్యక్షంగా చూశాము. కరోనాను అదుపు చేయటమే గాక ఆర్ధికంగా పురోగమిస్తున్న చైనా మరింత బలపడుతుందన్న దుగ్ద, దాన్ని అడ్డుకోవాలన్నది తప్ప మరొకటి ఈ సమావేశాల్లో వ్యక్తం కాలేదు.


ఒక వైపు అమెరికాలో ఉన్న వాక్సిన్లు సకాలంలో వినియోగంచకు మురిగిపోతున్నాయనే వార్తలు మరోవైపు ప్రపంచాన్ని ఆదుకుంటామనే గంభీర ప్రకటనలు. ఇంతవరకు ఒక్కటంటే ఒక్కడోసును కూడా అమెరికా ఇతర దేశాలకు ఇవ్వలేదు. వాటి తయారీకి అవసరమైన ముడిసరకులు, పరికరాల ఎగుమతులపై నిషేధం కొనసాగిస్తూనే ఉంది. చైనా బెల్ట్‌ మరియు రోడ్‌ చొరవ (బిఆర్‌ఐ) పేరుతో తలపెట్టిన ప్రాజెక్టుల అమలుకు ఇప్పటి వరకు వందకు పైగా దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. 2013లో ప్రారంభమైన ఈ పధకాన్ని 2049లో కమ్యూనిస్టు చైనా ఆవిర్భావ వందవ సంవత్సరం నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. నిజానికి ఇలాంటి పధకాలను ఏ దేశం లేదా కొన్ని దేశాల బృందం ప్రారంభించటానికి ఎలాంటి ఆటంకం లేదు. చైనా చెప్పేది అమలు జరిగేనే పెట్టేనా అని నిర్లక్ష్యం చేసిన దేశాలు దాని పురోగమనాన్నిచూసి ఎనిమిది సంవత్సరాల తరువాత దానికి పోటీగా ఇప్పుడు బి3డబ్ల్యు (బిల్డ్‌ బాక్‌ బెటర్‌ వరల్డ్‌ )పేరుతో ఒక పధకాన్ని అమలు జరపాలని ప్రతిపాదించాయి. మంచిదే, అభివృద్దిలో పోటీ పడటం కంటే కావాల్సింది ఏముంది.


బ్రిటన్‌ సమావేశాల్లో జి7 ఎన్ని కబుర్లు చెప్పినా, ఎంత చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టినప్పటికీ దానికి నాయకత్వం వహిస్తున్న అమెరికా ప్రస్తుతం చైనాతో యుద్దానికి సిద్దంగా లేదన్నది స్పష్టం. ఇతర దేశాల భుజాల మీద తుపాకి పెట్టి కాల్చాలని చూస్తున్నది. అయితే మూడు దశాబ్దాల క్రితం ప్రచ్చన్న యుద్దం ముగిసింది, విజేతలం మేమే అని ప్రకటించుకున్న తరువాత ఇప్పటి వరకు అమెరికన్లు తమ మిలిటరీ మీద 19లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేశారు. ఇదే కాలంలో చైనా ఖర్చు మూడులక్షల కోట్ల డాలర్లని అంచనా. అయినప్పటికీ అమెరికా యుద్దాన్ని కోరుకోవటం లేదని అనేక మంది విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతవరకు అమెరికా ఏ ఒక్క యుద్దంలోనూ చిన్న దేశాల మీద కూడా విజయం సాధించలేదు, అలాంటిది చైనాతో తలపడే అవకాశాలు లేవన్నది వారి వాదన. అయితే ఉక్రోషం పట్టలేక తెగించి అలాంటి పిచ్చిపనికి పూనుకున్నా ఆశ్చర్యం లేదు. తైవాన్‌ను బలవంతంగా విలీనం చేసుకోవాలని చైనా గనుక పూనుకుంటే అడ్డుపడే అమెరికా మిలిటరీని పనికిరాకుండా చేయగలదని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇంతకాలం అమెరికా అనుసరించిన మిలిటరీ ఎత్తుగడలు దానికి పెద్ద భారంగా మారాయి.అందువల్లనే నాటో ఖర్చును ఐరోపా దేశాలే భరించాలని డోనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. చైనాకు పోటీగా భారత్‌ను తీర్చి దిద్దుతామనే బిస్కట్లు వేసి ముగ్గులోకి దించి మన దేశం కేంద్రంగా ఆసియా నాటో కూటమి ఏర్పాటు చేయాలన్నది అమెరికా ఎత్తుగడ. ఇన్ని దశాబ్దాల నాటో కూటమితో ఐరోపా బావుకున్నదేమిటో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అమెరికన్లు యుద్దాన్ని కూడా లాభనష్టాల లెక్కల్లో చూస్తారు. 1986లో అమెరికా దళాల చర్యలు, నిర్వహణకు పెంటగన్‌ (రక్షణ) బడ్జెట్‌లో 28శాతం ఖర్చు అయ్యేది, ఇప్పుడది 41శాతానికి పెరిగింది, ఆయుధాల కొనుగోలు కంటే ఇది రెండు రెట్లకంటే ఎక్కువ.

అమెరికా మిలిటరీ బడ్జెట్‌, ఆయుధాలతో పోలిస్తే చైనా బలం తక్కువే అని వేరే చెప్పనవసరం లేదు. వేల మైళ్ల దూరం నుంచి అమెరికా వచ్చి యుద్దం చేయాలన్నా లేదా దానికి ముందు చైనా చుట్టూ తన దళాలను మోహరించాలన్నా చాలా ఖర్చుతో కూడింది. కానీ చైనాకు అలాంటి అదనపు ఖర్చు, ప్రయాస ఉండదు. రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ చేతులెత్తేసిన తరువాత అణుబాంబులు వేసి భయపెట్టింది అమెరికా. ఇప్పుడు పశ్చిమాసియాలో అమెరికాను ఎదిరించే ఇరాన్‌, సిరియా వంటి దేశాలు, సాయుధశక్తుల వద్ద ఉన్న ఆయుధాలు అంతగొప్పవేమీ కాదు, అలాంటి వారి మీద అమెరికా అత్యంత అధునాతన ఆయుధాలను ప్రయోగించి చూడండి మా ప్రతాపం అంటున్నది. అది చైనా విషయంలో కుదిరేది కాదు. నిజంగా చైనాతో యుద్దమంటూ వస్తే అది ఒక్క దక్షిణ చైనా సముద్రానికే పరిమితం కాదు.కరోనా నేపధ్యంలో వైరస్‌ పేరుతో అమెరికా, ఇతర దేశాలు చేస్తున్న ప్రచార యుద్దంతో జనాల్లో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటంలో విజయవంతం అయ్యారని చెప్పవచ్చు. అది వాస్తవ యుద్దంలో అంత తేలిక కాదు. సాధ్యమైన మేరకు అదిరించి బెదిరించి తన పబ్బంగడుపుకొనేందుకే అమెరికా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి.తాజా జి7 సమావేశాలను కూడా అందుకే వినియోగించుకుంది. అమెరికాను నమ్ముకొని తాయత్తులు కట్టుకొని ముందుకు దూకిన దేశాలకు చైనా చుక్కలు చూపుతుందని ఇప్పటికే కొన్ని ఉదంతాలు వెల్లడించాయి.మన దేశం వాస్తవ దృక్పధంతో ఆలోచిస్తుందా ? దుస్సాహసం, దుందుడుకు చర్యలకు మొగ్గుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మన చుట్టూ జరుగుతున్నదేమిటి -1 వైఫల్యాలపై దృష్టి మరల్చేందుకు మరో వివాదం : మోడీపై చైనా అనుమానం !

13 Sunday Jun 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ 1 Comment

Tags

anti china, Anti China Propaganda, Indo-China trade, Narendra Modi Failures, Quadrilateral Security Dialogue


ఎం కోటేశ్వరరావు


లడఖ్‌ సరిహద్దులోని గాల్వన్‌ లోయలో భారత్‌-చైనా ఘర్షణ జరిగి ఏడాది గడిచింది. మనవైపు 20 మంది మరణించగా తమవారు నలుగురు చనిపోయినట్లు చైనా చెప్పింది. అది ఒక బాధాకరమైన, అవాంఛనీయ ఉదంతం. సాధారణ పరిస్ధితులను పునర్దురించాలని ఇరుదేశాలూ సంకల్పం ప్రకటించాయి, చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. అయినా ఒకరి మీద ఒకరికి అనుమానాలు తొలగలేదు. అందుకే ఉభయులూ కొన్ని చోట్ల బలగాలను కొంత మేరకు ఉపసంహరించుకున్నా, పూర్తిగా వైదొలగలేదు. చైనా వైపు నుంచి బలగాలను మోహరిస్తున్నారని మన మీడియాలో, మనమూ అదే పని చేస్తున్నామని చైనా ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఏడాది గడచిన సందర్భంగా ప్రపంచ మీడియాలోనూ దాని గురించి రాశారు.

బ్రిటన్‌కు చెందిన టెలిగ్రాఫ్‌ పత్రిక జూన్‌ ఎనిమిదవ తేదీన రాసిన వార్తలో కొత్త వివాదాలు తలెత్తుతాయనే భయంతో భారత్‌ సరిహద్దుల్లో మిలిటరీ బలగాలను పటిష్ట పరుస్తున్నదని పేర్కొన్నది. వేసవి కాలం వచ్చినందున రెండు దేశాల మధ్య ఘర్షణలు జరిగే పెద్ద ముప్పు ఉన్నట్లు రష్యా పత్రిక ఇండిపెండెంట్‌ పేర్కొన్నది. ఈ పత్రికల వార్తలను ప్రస్తావిస్తూ అనేక పత్రికలు విశ్లేషణలు రాశాయి.కరోనా వైరస్‌, ఆర్ధిక రంగంలో వైఫల్యాల నుంచి జనం దృష్టిని మరల్చేందుకు భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రయత్నించవచ్చని చైనా విశ్లేషకులు చెప్పిన అంశాలను చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌ ప్రచురించింది. ” యుద్దం రాదు, అయితే 2020 మేనెలలో సంక్షోభం ప్రారంభమైనప్పటి కంటే ఇప్పుడు ముప్పు గణనీయంగా ఎక్కువగా ఉంది, ఉభయపక్షాలూ పోరుకు ఎంతో సన్నద్దంగా ఉన్నాయి ” అని ఆసియా రక్షణ వ్యవహారాల విశ్లేషకుడు అర్జన్‌ తారాపోర్‌ చెప్పినట్లు టెలిగ్రాఫ్‌ రాసింది. కరోనా మహమ్మారి, ఆర్ధిక పరిస్ధితి మరింతగా దిగజారితే సరిహద్దుల్లో భారత్‌ మరో ఘర్షణకు పాల్పడవచ్చని షాంఘైలోని సామాజిక అధ్యయనాల సంస్ధ అంతర్జాతీయ సంబంధాల విభాగపు పరిశోధకుడు హు ఝియాంగ్‌ చెప్పారు.దేశీయంగా సంక్షోభం ఉన్నపుడు ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎప్పుడూ సరిహద్దు సమస్యలవైపు చూసే రాజకీయ సంప్రదాయం భారత్‌కు ఉందని, ఈ విషయమై చైనా చాలా జాగ్రత్తగా ఉండాలని హు చెప్పాడు.

ఎక్కువ భాగం సైన్యాలను రెండు దేశాలూ ఉపసంహరించుకున్నాయి. హాట్‌స్ప్రింగ్స్‌, డెస్పాంగ్‌ మైదానాల వంటివాటి నుంచి ఇంకా జరగాల్సి ఉందని సింఘువా విశ్వవిద్యాలయంలోని జాతీయ వ్యూహ సంస్ధ డైరెక్టర్‌ క్వియాన్‌ ఫెంగ్‌ చెప్పారు.సరిహద్దు వెంబడి చైనా మౌలిక సదుపాయాలు చక్కగా ఉన్నాయి,అయినప్పటికీ ముందు పీఠీన అక్కడ ఎక్కువ దళాలు లేవు, రెండవ వరుసలో బలాలను మోహరించాల్సి ఉందని క్వియాన్‌ చెప్పారు. వివాదం చిన్నదే అన్నారు. గత ఏడాదితో పోలిస్తే సరిహద్దులో పరిస్దితి ఎంతో మెరుగ్గా ఉంది, అయితే ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగితే రెండు దేశాల మిలిటరీ మధ్య సంబంధాలకు, పశ్చిమ సరిహద్దులో స్ధిరత్వానికి ముప్పు అని కొందరు అభిప్రాయపడ్డారు. సరిహద్దుకు సమీపంలోని టిబెట్‌లో చైనా తన దళాలం సంఖ్యను పెంచిందని కొన్ని వార్తలు సూచించాయి. భారత-చైనా నేతలు జనాలకు జవాబుదారీ కనుక సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోగలరని, ఇతర ప్రాంతాల వారు ఆ ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా ఉండటం ముఖ్యమని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ వ్యాఖ్యానించాడు. మే నెలలో జరిగిన కీలక ఎన్నికలలో ఓటమి తరువాత ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి వచ్చే ఎన్నికల్లో మద్దతు పొందాలని చూస్తోందని గ్లోబల్‌టైమ్స్‌ వ్యాఖ్యాత పేర్కొన్నారు.

రెండు దేశాల సైన్యాల ఉపసంహరణకు రెండు రోజుల ముందు చైనా నుంచి బెదిరింపులు ఉన్నందున ఇండో – పసిఫిక్‌ అవగాహనను మరింత పటిష్టపరుచుకోవాల్సిఉందని ఫిబ్రవరి 8న ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ అంగీకరించినట్లు ప్రకటించారు.ఇరు దేశాల సంబంధాలు చౌరాస్తాలో ఉన్నాయి, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నంత కాలం సహకారం గురించి ఆలోచించలేమని మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ మేనెలలో వ్యాఖ్యానించారు. పరిస్ధితి ఇలా ఉన్నప్పటికీ ఈ ఏడాది జనవరి-మే మాసాల మధ్యకాలంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం డాలర్ల విలువలో చూస్తే 70.1శాతం జరిగినట్లు చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపింది. చైనా నుంచి భారత్‌కు ఎగుమతులు 64.1 పెరిగితే, భారత్‌ నుంచి చైనా దిగుమతుల 90.2శాతం పెరిగినట్లు వెల్లడించింది. 2020 సంవత్సరంలో రెండు దేశాల మధ్య 86.4 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరిగింది. తిరిగి అమెరికాను వెనక్కు నెట్టేసి మన దేశం చైనాతో అత్యధికంగా వాణిజ్యం నిర్వహించింది. ఈ ఏడాది తొలి ఐదునెలల్లో 48.16బిలియన్‌ డాలర్ల లావాదేవీలు జరిగినట్లు చైనా కస్టమ్స్‌శాఖ వద్ద జూన్‌ ఏడవ తేదీనాటికి నమోదైన వివరాలు వెల్లడించాయి. గతేడాది జరిగిన సరిహద్దు వివాదాలు చాలా వరకు వెనక్కు పోయినట్లు అసాధారణ వాణిజ్య లావాదేవీలు సూచిస్తున్నాయని చెప్పవచ్చు. అయితే గతంలో రెండు దేశాల మధ్య వాణిజ్యంలో చైనా 63 బిలియన్‌ డాలర్ల మేరకు మిగుల్లో ఉంటే 2020-21లో అది 44 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.మన ఎగుమతులు ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి.


ఒక వైపు చైనాను కట్టడి చేసే లక్ష్యంతో ఏర్పడిన చతుష్టయ బృందంలో అమెరికా, జపాన్‌,ఆస్ట్రేలియా,మన దేశం ఉన్నప్పటికీ మరోవైపున వాణిజ్యంలో మన దేశం చైనాతో ప్రధమ స్దానంలో ఉంది. వాణిజ్యం గురించి చర్చిందేందుకు మేము సిద్దమే అని ఆస్ట్రేలియా ప్రకటించింది. అమెరికా వైపు నుంచి కూడా అలాంటి సంకేతాలే వెలువడుతున్నాయి. సరిహద్దు వివాదాలకు వాణిజ్యానికి లంకె పెట్టవద్దని చైనా చెబుతున్నది. అయితే చైనా వస్తువులను బహిష్కరించాలని, చైనా మన శత్రువు, ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని ఒకవైపున ప్రచారంతో జనాన్ని సంతృప్తి పరుస్తున్నారు. మరోవైపు అదే చైనా నుంచి వస్తువుల దిగుమతులు, లాభాలతో వాణిజ్యవేత్తలను ప్రధాని నరేంద్రమోడీ సంతుష్టులను గావిస్తున్నారు. టెలికామ్‌ రంగంలో ఐదవ తరం ఫోన్లను ప్రవేశపెట్టేందుకు చౌకగా ఉండే చైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని తిరస్కరించి అధిక ఖర్చుతో కూడిన అమెరికా, ఐరోపాల వైపు మన దేశం చూస్తున్నది. అదే జరిగితే సెల్‌ఫోన్‌ ఛార్జీలు ఇంకా పెరుగుతాయి.
బీజింగ్‌ కేంద్రంగా పని చేస్తున్న ఆసియా మౌలికసదుపాయాల పెట్టుబడుల బ్యాంకు (ఏఐఐబి)లో మన దేశం ఒక వాటాదారు. చైనాకు దానిలో 30.34శాతం వాటాలు ఉండగా మన దేశం 8.52, రష్యా 6.66శాతంతో రెండు, మూడు స్ధానాలలో ఉన్నాయి. చైనా వద్దుగానీ దాని డబ్బు ముద్దు అన్న విమర్శలు వచ్చిన నేపధ్యంలో ఈ బ్యాంకులో మనమూ వాటాదారులమే గనుక సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ రుణం తీసుకుంటే తప్పేముందని మన అధికారులు వ్యాఖ్యానించారు. అయితే ఈ బ్యాంకు లేదా ఆసియా అభివృద్ది బ్యాంకు(ఏడిబి), ప్రపంచబ్యాంకు వంటి సంస్దల నుంచి రుణాలు తీసుకుంటే ఆ పధకాలకు సభ్యదేశాల కంపెనీలన్నీ టెండర్లు వేసి పాల్గొనేందుకు హక్కును కలిగి ఉంటాయి. గతేడాది ఏడిబి రుణంతో చేపట్టిన రైల్వే ప్రాజక్టులలో చైనా కంపెనీలను అనుమతించవద్దని కొందరు పెద్ద వివాదం సృష్టించిన విషయం తెలిసినదే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

భవిష్యత్‌ కోసమే మోడీ చమురు బాదుడా – తల్లికి కూడు పెట్టని వారు పిన్నమ్మకు బంగారు గాజులేయిస్తారా !

12 Saturday Jun 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP’s trolling army, India oil bonds, India oil Tax, Narendra Modi Failures, RSS Propaganda War


ఎం కోటేశ్వరరావు


మన జనాల సహనానికి (బి పాజిటివ్‌ వైఖరి) ముందుగా శతకోటి నమస్కారాలు చెప్పక తప్పదు. భరతమాత ఆమెను పక్కకు నెట్టేసి పెత్తనం చేస్తున్న గోమాత మహత్తులో, నరేంద్రమోడీ గమ్మత్తులో గానీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్ధిరంగా ఉన్న చమురు ధరలు అదేమిటో ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచీ పెరుగుతూనే ఉన్నాయి. అనేక దేశాల్లో చమురు ధరల పెంపు ఉద్యమాలకు దారితీసి పాలకులను గడగడలాడించింది, వెనక్కు తగ్గేట్లు చేసింది. మన జనం సహనంతో ఇంతగా సహకరిస్తున్నా ఖాతరు చేయటం లేదు. జనాన్ని వెర్రివెంగళప్పలుగా భావిస్తున్నారు కొందరు, అయినా భరిస్తున్నాం, మన మీద మనకే జాలి వేస్తోంది కదా ! సామాజిక మాధ్యమాల్లో కాషాయ మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో ఊరూ పేరూ లేకుండా కొన్ని పోస్టులు తిప్పుతున్నారు. భవిష్యత్‌ కోసమే నరేంద్రమోడీ చమురు బాదుడు కొనసాగిస్తున్నారంటూ రంగుల కలను చూపుతూ జనాన్ని తప్పుదారి పట్టించే పోస్టు ఒకటి తిరుగుతోంది. దాని మంచి చెడ్డలను, ముఖ్య అంశాలను ఒక్కొక్కటిగా పరిశీలించుదాం.


” మీ చుట్టూ జరుగుతున్న మార్పులను మీరు నిశితంగా గమనిస్తే, ఇది అందరి వల్ల కాదు. మోడీ ప్రభుత్వం మీ కోసం మరియు మీ సౌలభ్యం కోసం ఏమి మన భవిష్యత్‌ తరాల కోసం ఏమి చేస్తుందో మీకు అర్థం అవుతుంది.”
ఏ పాలకులైనా వర్తమాన, భవిష్యత్‌ తరాలకోసమే తప్ప గతించిన వారికోసం చేయరు. వర్తమానం వాస్తవం, భవిష్యత్‌ ఆశ. అందువలన ఇప్పుడు ఏమి చేస్తున్నారనేది కీలకం. జనాలు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు. మోడీ ఇంకా కొనసాగుతున్నారు గనుక ఇప్పటి వరకు ప్రభుత్వం చేసింది, ఏమి చేస్తున్నదీ చెప్పకుండా పిట్టల దొర లేదా తుపాకీ రాముడి కబుర్ల వలన ప్రయోజనం లేదు. ఇప్పుడు తల్లికి కూడు పెట్టని వాడు రేపు పిన్నమ్మకు బంగారు గాజులేయిస్తానంటే నమ్మగలమా ? పది రూపాయల నుంచి 33 రూపాయలకు పెంచిన చమురు ఎక్సయిజు పన్ను నిర్వాకం గురించి చెప్పతరమా ? దేశమంతటికీ ఉచితంగా వాక్సిన్లు వేయించేందుకు సిద్దపడని పెద్దలు పెద్దలు మహమ్మారి నివారణ, నిరోధానికి ఉపయోగపడే పరికరాలు, వాక్సిన్లపై జిఎస్‌టి ఎత్తివేసేందుకు గీచిగీచి బేరాలాడుతున్నారు. అలాంటి వారు డబ్బుదా(దో)చి రాబోయే వారికి ఖర్చు చేస్తారంటే నమ్మాలట !

గతంలో బిజెపి పెద్దలు చేసిన హడావుడి గురించి మరిచిపోతే ఎలా !

” పెట్రోల్‌ మరియు డీజిల్‌ ధరలపై మన చుట్టూ చాలా మంది హడావిడి చేస్తారు ఎందుకంటే వారికి భారత్‌ భవిష్యత్‌ ఎలా. వున్నా ఈ పుట గడిస్తే చాలు సరే ఆ విషయాలు పక్కన పెడితే…”
ఇదొక తప్పుడు ప్రచారం ఇప్పుడున్న కేంద్ర మంత్రుల్లో స్మృతి ఇరానీ సిలిండర్లు వేసుకొని చేసిన ప్రదర్శనలు, బిజెపి నేతలు చేసిన ఆర్భాటాలూ జనానికి తెలుసు. కాస్త ఓపిక తెచ్చుకొని గూగులమ్మను కోరుకుంటే వాటన్నింటినీ భక్తా ఇంద అంటూ వారి నాటకాల చిత్రాలు, వార్తలను మన ముందు ప్రత్యక్షం చేస్తుంది. మోడీ అనుచరుల బండారాన్ని బయటపెడుతుంది. గతంలో ఆందోళన చేసినపుడు ఈ పెద్దలకు భారత భవిష్యత్‌ గురించి తెలియదా లేక శ్రద్దలేదా ? పోనీ ఎందుకు ఆందోళన చేశారో అయినా చెప్పాలి. చిత్తశుది,్ద నిజాయితీ లేని రాతలు, ఆరోపణలు.

మోడీ నిక్కర్లు వేసుకొని తిరుగుతున్న రోజుల నుంచే శుభ్రమైన చమురు !

” ప్రస్తుతం ప్రపంచంలోనే పరిశుభ్రమైన యూరో 6 గ్రేడ్‌ పెట్రోల్‌ ఈ రోజు భారతదేశంలో దొరుకుతోంది.”
ఇది ఎలా ఉందంటే అరే పాతికేండ్ల క్రితం నువ్వు పుట్టినపుడు చాలా చిన్నగా ఉన్నావు, ఇప్పుడు ఎంత ఎత్తు, బరువు పెరిగావో గ్రేట్‌ కదా అన్నట్లుంది. పుట్టినోళ్లు ఎప్పుడూ ఒకేలా ఎలా ఉంటారు ! పెట్రోలు, డీజిలు వాడకం పెరుగుతూ కాలుష్యాన్ని వెదజల్లుతున్నందున ప్రతి దేశం, ప్రతి ఖండం దాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంది.ఇదేదో నరేంద్రమోడీతోనే దేశంలో ప్రారంభమైందన్నట్లుగా నమ్మబలుకుతున్నారు. ఆ పెద్దమనిషి నిక్కర్లు వేసుకొని(ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తగా) తిరుగుతున్న రోజుల్లోనే అంటే 1990దశకంలోనే ఇంధన శుద్ధి కార్యక్రమం భారత్‌లో ప్రారంభమైంది. 1994లో ఢిల్లీ, ముంబై, కొల్‌కతా, చెన్నరు నగరాల్లో తక్కువ సీసం ఉండే పెట్రోలు అమ్మకాలు ప్రారంభమయ్యాయి. సీసం, గంధకం వంటి వాటిని తగ్గించటానికి, తొలగించటానికి మన చమురు శుద్ది కర్మాగారాల్లో మార్పులు చేసుకోవాలి, దానికి అవసరమైన పెట్టుబడులు సమకూర్చుకోవాలి. ఇప్పటికి ప్రభుత్వరంగ చమురు సంస్ధలు 95వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. అన్నింటికీ మించి అలాంటి చమురును వాడే విధంగా వాహనతయారీదారులు కూడా ఇంజన్లలో మార్పులు చేయాలి.ఇవన్నీ మంత్రదండాలతో జరిగేవి కాదు.యూరో-3కు సమానమైన భారత్‌-3 రకం చమురు 2010 నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు ఆరో గ్రేడ్‌కు వచ్చాము. ఇది మనవంటి అన్ని దేశాల్లోనూ ఉంది. ఇది నరేంద్రమోడీ గొప్ప అని చెబితే జనాలకు దేనితో నవ్వాలో అర్ధం కావటం లేదు. ఏ గ్రేడ్‌ అయినా దాని ఉత్పత్తి ఖర్చు వినియోగదారుల నుంచి వసూలు చేసేదే తప్ప రాయితీలేమీ లేవు కదా. దాన్ని బట్టే ఉత్పాదక ఖర్చు నిర్ణయిస్తున్నారు. పోనీ చమురు సంస్దలకు ప్రభుత్వం 95వేల కోట్లు ఇస్తే అది మోడీగారి ఘనత అని చెప్పుకుంటే అర్ధం ఉంది. అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా జనం సొమ్ముతో మోడీకి ప్రచారం అంటే ఇదే.

ముందేం మాట్లాడుతున్నారో తరువాతే చెబుతున్నారో స్పృహ ఉందా !

” పెట్రోల్‌ మరియు డీజిల్‌పై మొత్తం పన్నులో 71% రాష్ట్ర ప్రభుత్వాలకు వెళుతుంది, కేంద్రానికి 29% మాత్రమే లభిస్తుంది.”
తిమ్మిని బమ్మిని చేయటంలో కాషాయ దళాలకు మించిన మాయగాండ్లు మరొకరు లేరు. సముద్రాలున్నయన్న దగ్గర ఎడారి ఉంటుంది. ఏడు సంవత్సరాల మోడీ ఏలుబడిలో పెట్రోలు మీద లీటరుకు రు.10.38 నుంచి రు. 32.98( రెండు వందల శాతం)డీజిలు మీద రు.4.58 నుంచి రు.31.83 (600శాతం) పెంచింది. రాష్ట్రాలు పెంచిన మొత్తం ఈకాలంలోనే 60, 68శాతాలకు అటూ ఇటూగా ఉన్నాయి తప్ప ఎక్కడా వందల రెట్లు పెరగలేదు. కేంద్రం పెంచిన దానిలో ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు 41శాతం తిరిగి రాష్ట్రాలకు బదలాయిస్తారు, అందువలన మొత్తం పన్నుల్లో రాష్ట్రాల వాటాయే ఎక్కువ అని వాదిస్తారు. ఇక్కడే అసలు మోసం ఉంది. మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు బిజెపి ఏలుబడిలోనే ఉన్నాయి కదా ? ఎన్ని రాష్ట్రాలు, ఎంత మొత్తం పన్నుతగ్గించాయో ఎవరినైనా చెప్పమనండి. కేంద్రం ఎక్సయిజ్‌ పేరుతో విధించే పన్నులో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ఎక్సయిజ్‌, రెండవది సెస్‌. మొదటిదానిలో మాత్రమే రాష్ట్రాలకు వాటా వస్తుంది. సర్‌ఛార్జీలు, సెస్‌లో ఉండదు.
ఇలాంటి జిమ్మిక్కుల కారణంగా ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు కేటాయింపులు పెరిగినట్లు కనిపించినా వాస్తవంలో రాష్ట్రాలకు బదలాయించిన నిధులు 2019తో పోల్చితే 2020లో 36.6 నుంచి 32.4శాతానికి పడిపోయాయి. అందువలన రాష్ట్రాలు పన్ను తగ్గించాలనే బిజెపి వాదన అసంబద్దం మోసపూరితం. తమ నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయి స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల అభివృద్ధికి నాంది పలికారని బిజెపి గొప్పగా చెప్పుకుంటుంది. నిజమే, అదే వాజ్‌పేయి ఆ రోడ్లకు నిధులను జనం నుంచి వసూలు చేసే పధకానికి , రోడ్లను ఉపయోగించినందుకు టోలు పన్ను వసూలుకూ నాంది పలికారు. మన దగ్గర నుంచి వసూలు రోడ్లు వేసి మన చేతనే పన్ను కట్టిస్తున్నారు. ఎంత మోసం ?
ప్రస్తుతం ఎక్సయిజు పన్ను పెట్రోల మీద లీటరుకు రు.32.98. దీనిలో వాస్తవానికి మౌలిక ఎక్సయిజ్‌ పన్ను(బెడ్‌) రు.2.98 మాత్రమే.మిగిలిన రూ.30లో ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ పన్ను(సీడ్‌) రూ.12, రోడ్డు మరియు మౌలిక సదుపాయాల పన్ను రు.18. తాజాగా విధించిన వ్యవసాయ సెస్‌ను సర్దుబాటు చేసేందుకు బెడ్‌ను రు.1.41కి సీడ్‌ను రూ.11కు తగ్గించారు. డీజిలు విషయానికి వస్తే వ్యవసాయ సెస్‌కోసం బెడ్‌ను రు.4.83 నుంచి రూ.1.80కి సీడ్‌ను 9నుంచి 8కి తగ్గించారు. బెడ్‌, సీడ్ల నుంచి రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఆమేరకు తగ్గిపోతుంది.

” మారుమూల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన సరఫరాను వేగవంతం చేయటానికి మొబైల్‌ రీఫిల్లింగ్‌ యూనిట్‌ నడుస్తోంది. ”
వీటితో జనానికి ఒరిగేదేమిటి ? జొమాటో, స్వీగ్గీ వంటి కంపెనీల ద్వారా తెప్పించుకొనే ఆహారానికి ఎక్కువ వెల చెల్లించాలి. అలాగే వీటికీ అదనంగా సేవా రుసుము చెల్లించాలి. గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో గతంలో కిరోసిన్‌ డీలర్లు చిన్న పీపాల్లో తెచ్చి వినియోగదార్లకు అందించేవారు. ఇది అలాంటిది కాదు, కనీసం రెండు వందల లీటర్లు, అంతకు మించి ఆర్డరు పెట్టిన వారికే అందచేస్తారు, అందుకు ఛార్జీ వసూలు చేస్తారు. ఇదేమన్నా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమా ?

” ఇవే కాకుండా, కాంగ్రెస్‌ ప్రభుత్వం తన పదవీకాలంలో తీసుకున్న 2026 నాటికి చెల్లించవలసి ఉన్న 2.48 లక్షల కోట్ల ఆయిల్‌ బాండ్‌ రుణం కూడా మోడీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ”

ఇది హిమాలయమంత పచ్చి అబద్దం, జనాన్ని మోసపుచ్చే వ్యవహారం. ప్రభుత్వాలు బాండ్లను జారీ చేయటం ప్రపంచమంతటా జరుగుతున్నదే. 2010వరకు అంతకు ముందున్న వాజ్‌పారుతో సహా ప్రభుత్వాలన్నీ చమురు బాండ్లను జారీ చేశాయి. వినియోగదారులకు ఎంత సబ్సిడీ ఇస్తే అంత మొత్తాన్ని చమురు కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాలి. ఆ మొత్తాలను చెల్లించకుండా ప్రామిసరీ నోట్లు రాసి ఇవ్వటాన్నే బాండ్లు అంటున్నారు. వడ్డీతో సహా ఈ మొత్తాలను పది నుంచి 20 సంవత్సరాల వ్యవధిలో చెల్లించవచ్చు. దాని వలన చమురు కంపెనీలకు నష్టం ఉండదు, ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది.


2002-03 సంవత్సర బడ్జెట్‌ ప్రసంగంలో నాడు వాజ్‌పారు సర్కార్‌ ఆర్ధిక మంత్రిగా ఉన్న యశ్వంత సిన్హా ప్రభుత్వం చమురు బాండ్లను జారీ చేయనున్నదని చెప్పారు. 2014-15 సంవత్సర బడ్జెట్‌ పత్రాలలో పేర్కొన్నదాని ప్రకారం 2013-14 సంవత్సరం నాటికి చెల్లించాల్సిన బాండ్ల విలువ మొత్తం రు.1,34,423 కోట్లు. 2018లో చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇలా చెప్పారు.” కాంగ్రెస్‌ హయాంలో కొనుగోలు చేసిన రు.1.44లక్షల కోట్ల రూపాయల చమురు బాండ్లు మాకు వారసత్వంగా వచ్చాయి. ఈ మొత్తమే కాదు, వీటికి గాను కేవలం 70వేల కోట్ల రూపాయలు వడ్డీగా చెల్లించాము. రెండు లక్షల కోట్ల రూపాయలను చెల్లించటం ద్వారా మా ప్రభుత్వ బాధ్యతను నెరవేర్చాము. చమురు ధరలు ఎక్కువగా ఉండటానికి ఇంకా చెల్లించాల్సిన చమురు బాండ్లు దోహదం చేశాయి ” అని చెప్పుకున్నారు. మంత్రి చెప్పింది వక్రీకరణ. వినియోగదారుల మీద వడ్డించే పన్ను భారాన్ని సమర్ధించుకొనేందుకు ఆడిన నాటకం తప్ప మరొకటి కాదు. మరో విధంగా చెప్పాలంటే గతంలో వినియోగదారులు పొందిన సబ్సిడీ మొత్తాలను ఇప్పుడు వారి నుంచి మోడీ సర్కార్‌ తిరిగి వసూలు చేస్తోంది. లేదూ మంత్రి చెప్పిందే నిజమైతే, అప్పు తీరింది కదా పన్ను ఎందుకు తగ్గించటం లేదు ? అసత్యాలను చెప్పటంలో కాషాయ దళం ఆరితేరింది. గత యుపిఏ ప్రభుత్వం జారీ చేసిన చమురు బాండ్లకు గాను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం 1.3లక్షల కోట్ల రూపాయలను చెల్లించాల్సి వచ్చిందని గతంలో ప్రచారం చేశారు, చమురు మంత్రిగారయితే 1.5లక్షల కోట్లన్నారు. బిజెపి అబద్దాల ఫ్యాక్టరీ నుంచి వెలువడిన దాని ప్రకారం 40వేల కోట్ల రూపాయల వడ్డీ, 1.3లక్షల కోట్ల అప్పుకు చెల్లించినట్లు ఒక బొమ్మను చూపారు. తీరా 2018లో రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు ఇదే పాలకులు చెప్పిందేమిటి చెల్లించిన మొత్తం రూ.3,500 కోట్లు. గత ఏడు సంవత్సరాలుగా ఆ పేరుతో జనాల నుంచి వసూలు చేసిన లక్షల కోట్ల రూపాయలను ఏమి చేశారు ? కరోనా సమయంలో జనమంతా దివాలా తీస్తే బిలియనీర్లు మరింత బలిశారు, కొత్తగా 40 మంది చేరి 177కు చేరారు. జనాన్ని కొట్టి పోగేసిందంతా ఇలాంటి వారికి కట్టబెట్టకపోతే అది సాధ్యమయ్యేనా ?పన్నులు పెంచకపోతే ప్రభుత్వం ఎలా నడుస్తుందని ఒకసారి అంటారు, సరిహద్దు రక్షణకు పన్నులేయకపోతే ఎలా అని మరోసారి సెంటిమెంట్‌ రెచ్చగొడతారు. ఇవన్నీ మోడీ పాలనలోనే కొత్తగా వచ్చిన సమస్యలా ?


” పెట్రోల్‌ లో 2025 నాటికి 20% దేశీయ ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం ద్వారా కొంత భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాబోయే 5 లేదా 10 సంవత్సరాల్లో, హైబ్రిడ్‌ వాహనాలు అందుబాటులో రానున్నాయి, ఇవి 100% పెట్రోల్‌, డీజిల్‌, ఇథనాల్‌, సిఎన్జి మరియు బ్యాటరీపై నడుస్తాయి.


సాధారణ పెట్రోల్‌ బుంకుల వద్ద ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. భారతదేశంలో తొలిసారిగా విద్యుత్‌ రహదారిని నిర్మించబోతున్నారు. కొన్ని సంవత్సరాలలో, రోడ్‌ రైల్‌ ట్రక్కులు కూడా భారతదేశ రహదారులపై పరుగులెత్తనున్నాయి. ఎల్‌పిజి గ్యాస్‌ను దేశవ్యాప్తంగా ఇంటింటికీ పైప్‌లైన్‌ ద్వారా అందించే పనులు వేగంగా జరుగుతున్నాయి. డీజిల్‌ ట్రాక్టర్‌ను సిఎన్‌జి ట్రాక్టర్‌గా మార్చడానికి కిట్‌ వచ్చింది. దీంతో డీజిల్‌ కోసం ఖర్చు చేసే రైతులకు వేల రూపాయల ఆదా అవుతుంది. హైడ్రోజన్‌ ఇంధన బ్యాటరీలు మరియు అల్యూమినియం ఎయిర్‌ బ్యాటరీల వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై భారతదేశంలో వేగంగా పరిశోధన మరియు అభివ ద్ధి జరుగుతోంది. ఇది కొత్త భారత్‌ యొక్క భవిష్యత్తు. ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఆగమనంతో, మనము క్రమంగా పెట్రోల్‌ మరియు డీజిల్‌పై ఆధారపడవలసిన అవసరం వుండదు. రాబోయే పదేళ్లలో ఇవన్నీ జరగబోతున్నాయి.ఇవన్నీ మన సౌలభ్యం కోసం భవిష్యత్‌ కోసం మాత్రమే జరుగుతున్నాయి. ఇందనాల పై వస్తున్న కేంద్ర 29% పన్నుల ద్వారా మౌలిక సదుపాయాల అభివ ద్ధి, సైనిక దళాల ఆధునీకరణ సశక్తికరణ సాధికారత మొదలైన వాటిపై ఖర్చు జరుగుతున్నాయి. ”

ఇవన్నీ చేస్తున్నాం, చేయబోతున్నాం కనుక జనం మీద ఎంత పన్ను భారం మోపినా నోరు మూసుకొని చెల్లించాలి అని చెప్పటమే. రాజీవ్‌ గాంధీ దేశాన్ని కొత్తశతాబ్దంలోకి తీసుకు పోబోతున్నాం అన్నారు. చంద్రబాబు నాయుడు విజన్‌ 2020 అన్నారు. కేబుల్‌ టీవీ రాక ముందు విదేశాల్లో చూసివచ్చి సెటప్‌బాక్సుల గురించి వాటి ద్వారా కొన్ని వందల ఛానళ్లు రావటం గురించి కథకథలుగా చెప్పారు. అందువలన నవీకరణ అనేది నిరంతర ప్రక్రియ. ఎవరున్నా లేకపోయినా ఆగేది కాదు. నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు అచ్చేదిన్‌ అన్నారు, గుజరాత్‌ తరహా అభివృద్ధి అన్నారు. అవన్నీ ఎక్కడా కానరావటం లేదు గనుక ఇప్పుడు కొత్త కహానీలు వినిపిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కనిపించిన కేసు ఒక్కటే, పరీక్షలు కోటీ 80లక్షలు – కరోనా కట్టడిలో చైనా రహస్యం అదే !

11 Friday Jun 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Science

≈ 1 Comment

Tags

china communists action to fight against covid-19, China Covid-19, COVID- 19 pandemic, Guangzhou tests 18m people, Narendra Modi Failures, nucleic acid test


ఎం కోటేశ్వరరావు


ఏ రోజు, ఏ నెలలో చైనా ఎలా ప్రవర్తిస్తుందో అర్ధం చేసుకోవటం ఎంతో కష్టంగా మారిందంటూ ఒక విశ్లేషకుడు కొద్ది రోజుల క్రితం ఒక వ్యాఖ్యానం రాశాడు. ఇది నిజమే. అది అతని వ్యక్తిగతం కాదు, చైనా వారు చెప్పే అంశాలపై నమ్మకం కోల్పోయిన వారందరి తీవ్ర మానసిక సమస్య ఇది. వారికి పూర్తిగా తెలియదు, ఇతరులు చెబితే వినరు. చైనా వారు చెప్పేవన్నీ అతిశయోక్తులే, అంత అభివృద్ది, పురోగమనం లేదూ, పాడూ లేదు, అన్నీ నాశిరకరం అని కొట్టి పారవేసిన వారు ఇప్పుడు నమ్మలేని అంశాలతో బిత్తరపోతున్నారు. అది నేల నుంచి నింగి విజయాల వరకు దూసుకుపోతున్నది. త్వరలో ఆర్ధికంగా అమెరికాను అధిగమించనుంది. సాంకేతిక రంగంలో కొన్ని అంశాలలో అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలదే పైచేయిగా ఉన్నప్పటికీ వాటికి ధీటుగా ముందుకు వస్తోంది.


అనేక మంది చైనా గురించి సరైన సమాచారం తెలుసుకోవటం కష్టం అంటూనే రకరకాల చెత్తకథనాలు రాయటం, చూపటం, వినిపించటం చూస్తున్నాము. ఎంతో స్వేచ్చ, దేన్ని గురించైనా మాట్లాడుకోవచ్చు, తెలుసుకోవచ్చు, బయట పెట్టవచ్చు అడ్డూ అదుపు ఉండదు అని చెప్పుకొనే అమెరికా వంటి దేశాలలో కూడా అక్కడి పాలకుల కనుసన్నలలో వారికి పనికిరానిదాన్ని, వారి ప్రయోజనాలకు పనికి వచ్చే సమాచారాన్నే బయటికి వదులుతారు తప్ప ప్రతిదాన్నీ బహిరంగపరచరు. చైనా దానికి మినహాయింపు కాదు. చైనా విలేకర్ల పేరుతో వ్యవహరించే వారిలో అత్యధికులు తైవాన్‌, హాంకాంగ్‌, దక్షిణకొరియా, జపాన్‌లో ఉండి వార్తలు రాస్తారు. వారికి సిఐఏ ఏజంట్లు, చైనా వ్యతిరేకులు అందించే అంశాలే ఆధారం. చైనా ప్రధాన భూభాగంలో ఉండేవారు కూడా ఎక్కువ మంది అసత్య, అర్ధసత్య వార్తలనే వండి వడ్డిస్తారు. వీరిలో చాలా మంది జర్నలిస్టుల ముసుగులో విదేశీ గూఢచార ఏజంట్లు ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. రెండు పనులూ చేస్తారు. మరి చైనా జర్నలిస్టులు ఇతర దేశాల్లో ఎలా ఉంటారు ? వ్యతిరేకులు బాంబులు వేస్తుంటే చైనా వారు రసగుల్లాలు విసురుతూ ఉంటారా ? అయితే ఎవరూ నిజాన్ని అంగీకరించరు.

విదేశీ జర్నలిస్టులు ప్రశ్నించినపుడు సహజంగానే జనాలు ఏ దేశంలో అయినా సందేహిస్తారు. దానికి చైనా మినహాయింపు కాదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎవరైనా పార్టీ కార్యకర్తలను విదేశీ జర్నలిస్టులు కలిసినపుడు వారు చెప్పదలచుకున్న అంశాలను వక్రీకరించకుండా ఉండేందుకు రాతపూర్వకంగా అందచేస్తారు. ప్రభుత్వ వైఖరి గురించి జనాలు స్వేచ్చగా అభిప్రాయాలు వెల్లడించేందుకు అవకాశం, వేదికలు ఉండవు అని చాలా మంది చెబుతారు. కానీ చైనా పేరుతో విశ్లేషణలు రాసే అనేక మంది అక్కడి సామాజిక మాధ్యమాల్లో వెల్లడయ్యే వైఖరుల ఆధారంగా, వాటిని ఉటంకిస్తూ, భిన్నఅభిప్రాయాలను తీసుకొని కాళిదాసు కవిత్వానికి తమపైత్యం జోడించి అన్నట్లుగా రాస్తారు.


కరోనా వైరస్‌ గురించి చేసిన తప్పుడు ప్రచారాల్లో వెయ్యోవంతు ఆ వైరస్‌ నివారణ, అంతానికి చైనా సర్కార్‌ తీసుకుంటున్న చర్యల గురించి రాసినా ప్రపంచానికి ప్రయోజనం ( అది చైనాకు కాదు ) ఉండి ఉండేది. అక్కడ అనుసరిస్తున్న పద్దతులను ఎందుకు అమలు చేయరంటూ ఆయా దేశాల జనాలు పాలకుల మీద వత్తిడి తెచ్చేందుకు అవకాశం ఉండేది. వరల్డో మీటర్‌ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం ఇది రాసిన సమయానికి ప్రపంచలో మొత్తం కరోనా కేసులు 17కోట్ల 56లక్షల 79వేల 912. మరణించిన వారు 37లక్షల 90వేల 392 మంది. మన దేశానికి సంబంధించి మొత్తం కేసులు రెండు కోట్ల 92లక్షల 74,823, మరణాలు 3,63,097. కేసుల సంఖ్యలో అమెరికా తరువాత రెండవ స్ధానంలో ఉంది, మరణాల్లో అమెరికా,బ్రెజిల్‌ తరువాత మూడవ స్ధానం. మొత్తం 222 దేశాలు, ప్రాంతాలలో చైనా 98వ స్ధానంలో ఉంది. అక్కడ నమోదైన కేసులు 91,359, మరణాలు 4636.చైనాలో కరోనా కేసులు, మరణాలు అంత తక్కువ ఎందుకున్నాయని ఇప్పటికీ సందేహించే వారున్నారు. వారిని ఎవరూ ఒప్పించలేరు,మెప్పించలేరు.ఇంకా మరికొన్ని దేశాల్లో కూడా కేసులు, మరణాలు తక్కువే ఉన్నాయని వారికి తెలిస్తే తట్టుకోలేరేమో !

తాజాగా ప్రపంచ మీడియాలో వచ్చిన ఒక వార్త మరోసారి చైనా కరోనా కట్టడి గురించి ఆసక్తిరేపింది. దేశీయంగా ఒక వాక్సిన్‌ తయారు చేసినందుకు మన ప్రధాని నరేంద్రమోడీ తన భుజాలను తానే చరుచుకొని అభినందించుకున్నారు. పొగడ్తలకు అలవాటు పడ్డ ప్రాణం కదా, పోనీయండి అని అనేక మంది సమర్ధిస్తున్నారు. దక్షిణ చైనాలోని గ్వాంగ్‌ఝౌ అనే పట్టణం, పరిసరాల జనాభా కోటీ 86లక్షలు. ఒక మహిళ (75) ఒక హౌటల్‌కు వెళ్లినపుడు కరోనా లక్షణాలు కనిపించాయి. దాంతో అప్రమత్తమైన అధికారులు మేనెల 21 నుంచి జూన్‌ 8వ తేదీ వరకు నగరంలో కోటీ 80లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 115 మందికి కరోనా లక్షణాలు కనిపించాయి, 106 మందికి నిర్ధారణ అయింది. ఈ కేసులన్నింటిలో భారత్‌లో బయటపడిన డెల్టా రకం కనిపించింది. ఇది వేగంగా వ్యాపించే లక్షణం కలిగినదని చైనా అధికారులు చెప్పారు. ఒక గంటలోపే ఫలితాన్ని వెల్లడించే న్యూక్లియక్‌ యాసిడ్‌ టెస్టులు చేశారు. రక్తం,కండరాలు,మూత్రంలో ఏవైనా వైరస్‌, బాక్టీరియాలు ఉంటే వెంటనే పసిగట్టే ఆధునిక పరిజ్ఞానంతో ఆ పరీక్షను చేస్తారు. ప్రపంచంలో పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించిన పట్టణంగా రికార్డులకెక్కింది. గతంలో చైనాలోనే మరికొన్ని పట్టణాల్లో కూడా ఈ పరీక్షలు పెద్ద సంఖ్యలో నిర్వహించినా సంఖ్యరీత్యా ఇదే అత్యధికం. వాన్‌ఫు బయోటెక్నాలజీ అభివృద్ది చేసిన విధానం ప్రకారం బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ దేశాలలో బయటపడిన కరోనా వైరస్‌ లక్షణాలను ఈ పరీక్ష వెల్లడిస్తుంది. గ్వాంగఝౌ పట్టణం, పరిసరాలలో 5,500 బయో, ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమలు, ఈ రంగంలోనే వెయ్యి ఆధునిక పరిజ్ఞాన సంస్ధలు ఉన్నాయి. కింగ్‌మెడ్‌ డయాగస్టిక్స్‌ గ్రూప్‌ రోజుకు మూడున్నరలక్షల పరీక్షలు చేయగల సామర్ధ్యం కలిగినది ఇక్కడ ఉంది, ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. తమకు కరోనా వచ్చిన విషయాన్ని దాచినందుకు లేదా తెలియచేయనందుకు, పరీక్షకు నిరాకరించినందుకు కొందరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఒక హౌటల్‌లో ఉన్న వ్యక్తి పరీక్షకు నిరాకరించి పోలీసులతో వాగ్వాదానికి దిగటమేగాకుండా భోజనానికి ఉపయోగించే ఫోర్క్‌తో పోలీసు మీద దాడి చేశాడు.

చైనాలో కరోనా కట్టడికి ఇప్పటివరకు మూడు రకాల వ్యూహాలను అనుసరించారు. వైరస్‌ బయటపడగానే దానికి చికిత్స ఏమిటో తెలియలేదు గనుక తొలి దశలో ప్రజారోగ్య నిరోధం మరియు అదుపు పద్దతులను అమలు జరిపారు. రెండవ దశలో వాక్సిన్లను ఉపయోగించారు. ఇప్పుడు మూడవ దశలో నిరోధం మరియు అదుపు పద్దతులను కూడా పాటిస్తున్నట్లు చైనా సిడిసి అధిపతిగా గతంలో పని చేసిన జెంగ్‌ గ్వాంగ్‌ చెప్పారు.ఈ చర్యలతో పాటు వాటిని అమలు జరిపే క్రమంలో చైనీయుల సామాజిక అలవాట్లను, అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొన్నారు. గ్వాంగ్‌ఝౌ నగరంలో కేసులు 115 మాత్రమే బయటపడినప్పటికీ కొన్ని ప్రాంతాలలో లాక్‌డౌన్‌ ప్రకటించి జన సంచారాన్ని పరిమితం చేశారు.చైనాలో అనేక సంస్ధలు వాక్సిన్ల తయారీకి పరిశోధనలు, పరీక్షలు చేస్తున్నాయి. వాటిలో ఇప్పటి వరకు ఏడు రకాలకు చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు 80 కోట్ల మందికి తొలి, రెండవ డోసు వాక్సిన్లు వేసినట్లు చైనా ప్రకటించింది.


గత ఏడాది ఊహాన్‌ నగరంలో కరోనాను కట్టడి చేయటం అనేక అనుభవాలను ముందుకు తెచ్చింది. తరువాత కాలంలో చెదురుమదురుగా వివిధ నగరాల్లో చాలా పరిమితంగా అయినా కేసులు బయటపడ్డాయి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లుగా వైరస్‌ విస్తరించకుండా చూసేందుకు నూక్లియక్‌ యాసిడ్‌ పరీక్షలు చేసి జల్లెడ పట్టాలని నిర్ణయించారు. దీనికి కూడా ఊహాన్‌ అనుభమేతోడ్పడింది. అక్కడ ప్రారంభంలో యాభైవేల పరీక్షలు చేసి సమాచారాన్ని విశ్లేషించారు. తరువాత గతేడాది మేనెల ప్రారంభంలో అక్కడి కోటి మంది జనాభాకు పది రోజుల్లో ఈ పరీక్షలు చేసి దాగున్న వైరస్‌ను వెలికి తీసే యత్నం చేశారు.లక్షణాలు బయటకు కనిపించకుండా వైరస్‌ ఉన్న మూడు వందల కేసులు వెల్లడయ్యాయి.తరువాత బీజింగ్‌లోని కోటి ఇరవైలక్షల మందికి పరీక్షలు చేశారు, 174కేసులు బయటపడ్డాయి.


చైనాలో ప్రయాణాలు చేసే వారు గణనీయ సంఖ్యలో ఉంటారు. ప్రతివారినీ ప్రతి చోటా పరీక్షించటం సాధ్యంకాదు, అవసరమైన సిబ్బంది లభ్యత కూడా పెద్ద సమస్యే. అందువలన చైనా ప్రయాణ ఆరోగ్య సూచిక (కోడ్‌)లను రూపొందించాలని ఐటి కంపెనీలను కోరారు. ఆమేరకు తయారు చేసి ప్రతి ఒక్కరికీ ఒక సూచికను కేటాయించారు. వారి సెల్‌ఫోన్లలో యాప్‌ ఏర్పాటు చేశారు. దానిలో మూడు రంగుల సూచికలను పొందుపరిచారు.దానిలో సదరు వ్యక్తి చిరునామా వంటి ప్రాధమిక సమాచారంతో పాటు అనుమతించిన ఆరోగ్య వివరాలు, సందర్శించిన ఆసుపత్రులు, వాడిన మందుల వంటి వాటిని పొందుపరిచారు.అంతే కాదు, వారు పర్యటించిన ప్రాంతాలు, హౌటల్స్‌, మాల్స్‌, రైలు, విమానం, బస్‌, స్వంత వాహనం వంటి వివరాలు కూడా ఉంటాయి. ఎక్కడైనా తనిఖీ సిబ్బంది ఫోన్లలో వారి కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఆ వివరాలన్నీ కనిపిస్తాయి. ఉదాహరణకు ఆకుపచ్చ సూచిక ఉన్నవారి వివరాలను చూస్తే వారు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యలు లేవని, కరోనా ప్రాంతాల్లో సంచరించలేదని అర్ధం. పసుపు పచ్చ కోడ్‌ వస్తే వారు శ్వాస సంబంధ సమస్యలను ఎదుర్కొన్నారని, కరోనా ముప్పు ప్రాంతాలను సందర్శించటం, వైరస్‌ సోకిన వారితో కలిసినట్లు అర్ధం. ఎరుపు సూచిక ఉంటే ప్రమాదం ఉందని అర్ధం. వారికి లేదా కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకటం, సోకినవారిని కలిసినందున విడిగా ఉంచాల్సిన అవసరం ఉందని అర్ధం. కరోనాను మహమ్మారిగా ప్రభుత్వం ప్రకటించినందున పసుపు, ఎరుపు సూచికలు ఉన్న వారికి ప్రయాణించేందుకు అవసరమైన టిక్కెట్లను తిరస్కరించే, ప్రయాణ అనుమతి నిరాకరించే అధికారం యంత్రాంగానికి ఉంటుంది. ఆకుపచ్చ సూచిక ఉన్నవారు మాత్రమే ప్రయాణించేందుకు వీలుంటుంది.

కరోనా నివారణకు వాక్సిన్‌ రూపొందించే వరకు ఫలానా ఔషధంతో నివారించవచ్చనే హామీ ఎక్కడా లేదు. అనేక రకాలతో ప్రయోగాలు చేశారు. . రెమిడెసివర్‌ కరోనా చికిత్సకు పనికిరాదని గతేడాది ఏప్రిల్‌ 15 నుంచే చైనాలో దాన్ని పక్కన పెట్టారు. అయినా మన నిపుణులు దాని గురించి జనంలో పెద్ద ఎత్తున ఆశలు కల్పించేందుకు కారకులయ్యారు. దాంతో మన జనాన్ని ఎలా పిండుకున్నారో చూశాము. ఫార్మా మాఫియాల పీకనులిమే కొత్త దేవుడు మోడీ అంటూ ప్రచారం చేసినప్పటికీ ఇది జరిగింది. తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్ధ పరిశోధనలో కూడా అదే తేలింది. చైనాలో మన ఆయుర్వేదం మాదిరే స్ధానిక వైద్య పద్దతిలో వాడుతున్న ఔషధాలను కూడా చికిత్సలో ఉపశమనానికి వినియోగించారు. ఆ రంగ నిపుణులను కూడా అల్లోపతి ఆసుపత్రుల్లో నియమించారు, పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. అయితే ఆ వైద్యపద్దతి, ఔషధం వైరస్‌ను అంతం చేస్తుందనే భ్రమలు కల్పించలేదు. కనుకనే అక్కడ బాబా రామ్‌దేవ్‌ వంటి వారు వాటితో సొమ్ము చేసుకోవటం గానీ, ఆనందయ్య పచ్చడి వంటివి రంగంలోకి రావటం గానీ జరగలేదు.


ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్న కారణంగానే చైనాలో వైరస్‌ అదుపులో ఉంది. అయితే ఇందుకయ్యే ఖర్చు కూడా తక్కువేమీ కాదు. అయినప్పటికీ కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం అక్కడ ఉంది కనుక దేశ సంపదలను జనం కోసం ఖర్చు చేసేందుకు వెనుకాడలేదు.లాభ నష్టాల లెక్కలు వేసుకోలేదు. ముందు ప్రాణాలను రక్షించటమే ప్రధమ కర్తవ్యంగా పెట్టుకున్నారు. మన వంటి దేశాలలో పెట్టుబడిదారులు దేని మీద ఎంత ఖర్చు చేస్తే ఎంత లాభం వస్తుందనే లెక్కలు ముందే వేసుకుంటారు. కొత్తదాని మీద ఖర్చు పెడితే ఒకవేళ ప్రయోజనం లేకపోతే మొత్తం దండగే అని భావిస్తే అసలు ముందుకు రారు. పాలకులు కూడా వారినే అనుసరిస్తారు గనుక అంబానీ, అదానీ అండ్‌కోకు ఆత్మనిర్భర అనో మరొక పేరుతోనే రాయితీలు ఇచ్చేందుకు చూపే శ్రద్ద జనం మీద చూపరు. ఆ కారణంగానే కేవలం రెండు వందల కోట్ల ఖర్చుతో జనానికి అవసరమైన ఆక్సిజన్‌ అందించే యంత్రాల ఏర్పాటు టెండర్లను ఎనిమిది నెలల పాటు కేంద్రం ఖరారు చేయలేదు. తీరా ముప్పు ముంచుకు వచ్చిన తరువాత, సుప్రీం కోర్టు మందలింపులతో చేయటాన్ని చూశాము. వాక్సిన్లు కూడా అంతే కదా ! అందుకోసం కేటాయించినట్లు చెప్పిన 35వేల కోట్లకు లెక్కలు చెబుతారా లేదా అని నిలదీసిన తరువాత విధిలేక మేమే వాక్సిన్లు వేయిస్తాం అనే ప్రకటన వెలువడింది. కేసులు తక్కువే అయినప్పటికీ చైనాలో ఖర్చు తక్కువేమీ కాలేదు. దాని కంటే ఆర్ధిక కార్యకలాపాలు నిలిచిపోవటం పెద్ద దెబ్బ అని వెంటనే గ్రహించింది. అందుకే ప్రపంచంలో పెద్ద ఆర్ధిక వ్యవస్ధలున్న దేశాల్లో ఎక్కడా లేనిóంగా వైరస్‌ కనిపించిన నాలుగు నెలల్లోనే దాన్ని అదుపులో ఉంచి ఆర్ధిక కార్యకలాపాలన్నింటినీ పునరుద్దరించింది. అది ఖర్చు కంటే లబ్దే ఎక్కువ చేకూర్చిందని రుజువైంది. దాన్నుంచి మనం పాఠాలు నేర్చుకుంటామా ? మన భుజాలను మనమే చరుచుకుంటామా ?
అనువుగాని చోట అధికులమన రాదు,
కొంచెమైన నదియు కొదువగాదు,
కొండ అద్దమందు కొంచెమై ఉండదా,
విశ్వదాభిరామ వినుర వేమా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

టీకాల్లేక జనం చావులు – భారత్‌, చైనా తీరుతెన్నులు !

05 Saturday Jun 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, Science, USA

≈ Leave a comment

Tags

anti china, China's vaccine diplomacy, Global COVID vaccine diplomacy, India vaccine diplomacy, India Vaccine Matters, Vaccine Nationalism


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ సలహాదారులెవరో గానీ అచ్చతెలుగులో చెప్పాలంటే దిక్కుమాలిన సలహాలు ఇస్తున్నారు.అఫ్‌కోర్స్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దగ్గర కూడా అలాంటి వాటిని ఇచ్చేవారు పుష్కలంగా ఉన్నారనుకోండి. లేకపోతే వధువు-వరుడు లేకుండా పెళ్లి చేసినట్లు టీకాలు లేకుండా నాలుగు రోజుల పాటు కరోనా టీకా ఉత్సవాలు జరపటం ఏమిటి ? అత్యున్నత న్యాయస్ధానం కరోనాటీకా విధానం గురించి తీవ్ర ఆక్షేపణ తెలియచేయటం వ్యక్తులు ఎవరని కాదు ఒక దేశ ప్రధానికి ఎంత నామర్ధా ! ఒక విధానం అంటూ లేదని వ్యాఖ్యానించటాన్ని చూసి అడ్డగోలు పాలన నడుస్తున్నట్లుగా ప్రపంచమంతా అనుకుంటుంటే ఎంత అవమానం!


మన జనానికి జ్ఞాపకశక్తి తక్కువ అన్నది మోడీ భక్తులకు పూర్తి విశ్వాసం. ఒక్క విషయాన్ని గుర్తు చేసి అసలు విషయానికి వద్దాం. పదమూడు కోట్ల వాక్సిన్లు వేసేందుకు నరేంద్రమోడీ నాయకత్వం కేవలం 95 రోజులే తీసుకుంటే అగ్రరాజ్యం అమెరికాకు 101, చైనాకు 109రోజులు పట్టిందని పెద్ద ఎత్తున కాషాయ దళాలు ప్రచారం చేశాయి. భారత్‌ ఎంత వేగంగా స్పందించిందో చూడండి అంటూ దాన్నొక పెద్ద విజయంగా విర్రవీగాయి. నరేంద్రమోడీ సర్కార్‌ కరోనా రెండవ తరంగం గురించి స్పందించకుండా నిర్లక్ష్యం చేశారన్న దుమారం నేపధ్యంలో ఈ విజయగాధను గానం చేశారు.


ఇప్పుడు పరిస్ధితి ఏమిటి ? ప్రపంచంలో మే నెలాఖరుకు 209 కోట్ల మందికి కనీసం ఒక డోసు వాక్సిన్లు వేశారు. ఒక్క చైనా లోనే 72 కోట్ల మందికి వేయగా మన దేశం 22 కోట్ల దగ్గర ఉంది. జూన్‌ నాలుగవ తేదీ నాటికి మన దేశంలో రెండు డోసుల వాక్సిన్‌ తీసుకున్నవారు 4.44 కోట్ల మంది, జనాభాలో కేవలం 3.3శాతమే. చైనా గురించిన సమాచారం లేనప్పటికీ అంతకంటే ఎక్కువే అన్నది స్పష్టం. వారిని పక్కన పెడదాం ఫైనాన్సియల్‌ టైమ్స్‌ జూన్‌ మూడవ తేదీ నాటి సమాచారం ప్రకారం బ్రిక్స్‌లోని బ్రెజిల్‌లో 10.6, రష్యాలో 8.9శాతం చొప్పున పూర్తిగా వేస్తే మనం ఎక్కడ ఉన్నాం అని ఆలోచించాలి. ఆలశ్యంగా ప్రారంభించినా ఈ ఏడాది చివరికి చైనాలో 80శాతం మందికి పూర్తిగా రెండు డోసులూ వేస్తారంటూ వార్తలు రాస్తున్నారు. మనం ఆస్ధాయిలో ఉన్నామా ? కొంత మంది మన దేశంలో వాక్సిన్లు వేయటం గురించి ఆలోచించకుండా చైనాలో ఎడతెగని వరుసల్లో జనం రోజుల తరబడి వేచి చూస్తున్నారంటూ ఈ మధ్య కొన్ని వీడియోలను సామాజిక మాధ్యమంలో తిప్పారు.ఇది కూడా నరేంద్రమోడీ వైఫల్యాన్ని సమర్ధించుకొనే యత్నంలో భాగమే. లేదూ సదరు వీడియోలు నిజమే అనుకుందాం. మోడీ తప్పేమీ లేదు, అంతా అలాగే ఉంది అని చెప్పేందుకు గాకపోతే దాని వలన మనకు కలిగే ప్రయోజనం ఏమిటి ? రోజుకు ఇప్పుడు కోటీ 90 లక్షల వాక్సిన్లు చైనాలో వేస్తున్నట్లు వార్తలు. ఎవరైనా అవన్నీ మేం నమ్మం అంటే అది వారిష్టం. చైనా గురించి కొన్ని నమ్ముతున్న వారు కొన్నింటిని ఎందుకు నమ్మటం లేదు ? లోకంలో నిత్యం ప్రతిదాన్నీ చివరికి తమను తామే నమ్మకుండా శంకించేవారు కొందరు ఉంటారు. మరికొందరు అతి తెలివి గలవారు అది కమ్యూనిస్టు నియంతృత్వం అండీ అవసరమైతే బలవంతంగా వాక్సిన్‌ వేస్తారు, మనది ప్రజాస్వామ్యం అని చెప్పే బాపతు కూడా తగలవచ్చు. దేశంలో ఇంతగా వ్యాధిని పుచ్చబెట్టమని, చంపమని ప్రజాస్వామ్యం చెప్పిందా ?

గేట్స్‌ ఫౌండేషన్‌ మాజీ డైరెక్టర్‌ రే ఇప్‌ చైనా గురించి వంకర బుద్దిని బయట పెట్టుకుంటూ అమానుష వ్యవస్ధలో భాగంగా ప్రతి గ్రామంలోనూ చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యులు ఉంటారు, అయితే వారు ఎంతో శక్తివంతంగా జనాన్ని సమీకరిస్తారు కూడా అని వాక్సినేషన్‌కు జనాన్ని సమీకరించటం గురించి చెప్పారు. చైనా కమ్యూనిస్టు పార్టీ కంటే తమ పార్టీలో ఎక్కువ మంది సభ్యులున్నారని బిజెపి చెప్పుకుంటుంది కదా ఇప్పుడు వారంతా ఏమయ్యారు? మైనారిటీ మతాల వారి మీద విద్వేషం రెచ్చగొట్టటం, మెజారిటీ మతోన్మాదాన్ని ఎక్కించటం తప్ప వారు చేస్తున్నది ఏమిటి ? నిజంగా కరోనాపై పోరులో రంగంలోకి దిగితే నరేంద్రమోడీ ఖ్యాతి ఇంకా పెరుగుతుంది కదా ? ఏప్రిల్‌ నెలలో అమెరికాలో గరిష్ట స్దాయిలో వాక్సినేషన్‌ జరిగింది. రోజుకు 34 లక్షల మందికి వేశారు, అదే చైనాలో ఏడు రోజుల సగటు కోటీ 90లక్షల మంది అని ఏపి వార్తా సంస్ధ తన కథనంలో పేర్కొన్నది. రాజధాని బీజింగ్‌లో 87శాతం మందికి ఒక డోసు వేశారు. సినోవాక్‌, సినోఫామ్‌ అనే రెండు రకాల వాక్సిన్ల తయారీకి అంతకు ముందున్న ఫ్యాక్టరీలేగాక కొత్తగా నిర్మించి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు, ఫ్లూ(జలుబు) మాదిరి కరోనా వైరస్‌ కూడా పదే పదే వచ్చే అవకాశం ఉన్నందున నివారణకు రానున్న రోజుల్లో కూడా వాక్సిన్‌ అవసరం అని కొంత మంది నిపుణులు భావించటం, అవసరమైతే మూడో డోసు కూడా వేయాల్సి రావచ్చన్న హెచ్చరికల నేపధ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. అవసరం లేకపోతే ఆ ఫ్యాక్టరీలను వేరే ఔషధాలు లేదా వాక్సిన్ల తయారీకి వినియోగిస్తారు. గతేడాది కరోనా కట్టడికి కొద్ది రోజుల్లోనే తాత్కాలిక ఆసుపత్రులను నిర్మించిన విషయం తెలిసిందే. సినోవాక్‌ ఏడాదికి రెండు వందల కోట్లు, సినోఫామ్‌ మూడు వందల కోట్ల డోసుల తయారీ సామర్ధ్యం కలిగి ఉన్నాయి. అనేక దేశాలలో మాదిరి వాక్సిన్ల తయారీకి చైనా ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చినప్పటికీ దాని తీరు వేరేగా ఉంది. మిగతాదేశాల మాదిరి వాక్సిన్ల తయారీకి అవసరమైన ముడి పదార్దాలకు అమెరికా నుంచి దిగుమతులపై ఆధారపడినందున మన దేశంలో సీరం సంస్ధ ఉత్పత్తికి ఆటంకం కలిగింది. చైనా కంపెనీలు దిగుమతుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు.
కొంత కాలం తరువాత వాక్సిన్‌ ప్రభావం తగ్గిపోతుంది కనుక రాబోయే రోజుల్లో తిరిగి తీసుకోవాల్సి రావచ్చని షాండోంగ్‌ రాష్ట్రంలోని క్వింగ్‌డావోలో ఉన్న బోయావో ఫోరమ్‌ ఫర్‌ ఆసియా సంస్ద ప్రతి ఝాంగ్‌ చెప్పారు. కొత్త రూపాన్ని సంతరించుకున్న వైరస్‌ల మీద వాక్సిన్ల ప్రభావం ఇంకా రుజువు కానందున మరింత సమాచారాన్ని పరిశీలించిన తరువాత గానీ మరోసారి వాక్సిన్లు తీసుకోవాలా లేదా అనేది చెప్పజాలమన్నారు. ఇన్‌ఫ్లూయంజా వైరస్‌ మాదిరి కరోనా కూడా మారవచ్చని కొందరు భావిస్తున్నారు. అమెరికా వంటి కొన్ని చోట్ల ఇప్పటికీ ఫ్లూ కారణంగా జనం మరణిస్తున్నప్పటికీ మనవంటి అనేక దేశాలలో జనంలో రోగనిరోధకశక్తి పెరిగి కొద్ది రోజులు ఇబ్బంది పెట్టి మాయం అవుతున్నది. గతంలో పది కోట్ల డోసుల లభ్యతకు 25 రోజులు పడితే తరువాత క్రమంగా 16,9, 7 రోజులకు తగ్గి ఇప్పుడు ఐదు రోజుల్లోనే అందుబాటులోకి వచ్చింది. ఇంజెక్షన్ల ద్వారా ఇచ్చే డోసు 0.5 మిల్లీ లీటర్లు ఉంటుంది. చైనాలో ఇలాంటి వాటితో పాటు ఒక కంపెనీ 0.1 మిల్లీలీటరును ముక్కుతో పీల్చుకొనే విధంగా ఒక వాక్సిన్‌ తయారు చేసి పరీక్షలు నిర్వహించింది. అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకుంది. దీనికి అనుమతి వస్తే వాక్సిన్‌ లభ్యత ఇబ్బడి ముబ్బడి అవుతుంది, రవాణా కూడా సులభంగా చేయవచ్చు.

కరోనా రెండవ దశ గురించి చేసిన హెచ్చరికలను కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పట్టిందనే విమర్శలు తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అలాంటిదేమీ లేదని చెబుతోంది, అంగీకరిద్దాం. కరోనా నిరోధానికి వాక్సిన్‌ అవసరాన్ని గుర్తించారు కదా ! తానే స్వయంగా ఉత్పత్తిని పర్యవేక్షిస్తున్నారని జనం అనుకొనే విధంగా ప్రధాని నరేంద్రమోడీ పూనా, హైదరాబాద్‌ పర్యటనలను జరిపారు కదా ! దాని మీద చూపిన శ్రద్ద ప్రణాళిక మీద ఎందుకు పెట్టలేదు, సుప్రీం కోర్టుకు సరైన సమాధానం ఎందుకు ఇవ్వలేకపోయింది ? నరేంద్రమోడీ సర్కార్‌ మనోవైకల్యం కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ విమర్శించారు. ప్రభుత్వంలో గందరగోళంలో పడిన కారణంగానే సత్తా అంతటినీ చూపలేకపోయిందన్నారు. ఆర్ధిక రంగంలో, సామాజిక సంబంధాల వైఫల్యం మహమ్మారి దాడిని ఎదుర్కోవటంలో వైఫల్యానికి ప్రాతిపదిక అన్నారు.


వాక్సిన్‌ తయారీ కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు తప్ప మూడు ధరల విధానాన్ని కేంద్రం ముందుకు తీసుకురావటంలో మరొక పరమార్ధం లేదు.ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధానమిది. కేంద్రానికి 150 రూపాయలకు ఇచ్చిన కంపెనీలు రాష్ట్రాలు, ప్రయివేటు ఆసుపత్రులకు భారీ మొత్తాలను వసూలు చేయటంలో ఆంతర్యం ఏమిటి ? కేంద్రానికి ఇచ్చిన రాయితీలను కూడా ఈ రూపంలో పూడ్చుకోవాలన్న కంపెనీల ఎత్తుగడ, వాటితో కుమ్మక్కైన ప్రభుత్వ పెద్దల అతి తెలివి తప్ప మరొకటి కాదు. నరేంద్రమోడీ ప్రతిష్ట పెంచటంతో పాటు కంపెనీలకు లాభం చేకూర్చటమే దీని అంతరార్ధం. ముడిపదార్దాలు, అవసరమైన పరికరాల ఎగుమతులపై అమెరికా ఇంతవరకు ఆంక్షలు ఎత్తివేయలేదు. మరోవైపు రాష్ట్రాలు వాక్సిన్ల కోసం ప్రపంచ స్ధాయి టెండర్లను పిలిచినా కంపెనీల నుంచి స్పందన లేదు. అవి పెడుతున్న షరతుల మీద నిర్ణయం తీసుకోవాల్సిందీ, పరిష్కరించాల్సిందీ కేంద్ర తప్ప రాష్ట్రాలు చేయగలిగినది కాదు. ఇంత జరుగుతున్నా, వాక్సిన్‌ విధానం మీద కేంద్రం చురుకుగా కదులుతున్న దాఖలాలు లేవు.


కరోనా రెండవ తరంగాన్ని నిర్లక్ష్యం చేయటం ఒకటైతే దాని కొనసాగింపుగా వాక్సిన్‌ దౌత్యంతో దూరమైన ఇరుగు పొరుగు, ఇతర దేశాలకు దగ్గర కావాలని మోడీ సర్కార్‌ ఆలోచన చేసింది. ఇప్పుడు ఇటు దేశంలో తీవ్ర విమర్శలపాలు కావటమే గాక దౌత్య రంగంలో కూడా అనుకున్నది సాధించే స్ధితిలో లేవని పరిణామాలు వెల్లడిస్తున్నాయి. అనేక దేశాలు ఇప్పుడు చైనా వైపు చూస్తున్నాయి. ప్రతి దేశానికి దౌత్య సంబంధమైన, అంతర్జాతీయ సహకారానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు కొన్ని ఉంటాయి. వాటిలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ పేద దేశాలకు కోవాక్స్‌ పేరుతో వాక్సిన్లు అందచేసేందుకు నిర్ణయించింది. వాక్సిన్‌ తయారీ దేశాలన్నీ తమ శక్తిమేరకు దానికి విరాళంగా వాక్సిన్లు అందచేస్తున్నాయి. మన దేశం కూడా అలాంటి బాధ్యత నిర్వహించాల్సిన అవసరం ఉంది. అంతవరకు ఓకే. కానీ జరిగిందేమిటి ? కేంద్ర ప్రభుత్వ సంస్ధ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పిఐబి) మార్చినెల 23న ఒక ప్రకటన విడుదల చేసింది. దానిలో పేర్కొన్న సమాచారం ప్రకారం 74 దేశాలకు గ్రాంట్‌ (ఉచితం) వాణిజ్యం, కోవాక్స్‌ కార్యక్రమానికి గాను వాక్సిన్లు ఎన్ని డోసులు అందచేసిందీ వివరంగా ఉంది. మూడు తరగతులకు సంబంధించి మొత్తం 5.959 కోట్ల డోసులను ఎగుమతి చేసింది. వీటిలో గ్రాంట్లుగా 81.25లక్షలు, కోవాక్స్‌ కార్యక్రమానికి కోటీ 75లక్షల డోసులు ఇవ్వగా వాక్సిన్‌ ఎగుమతి చేసే కంపెనీలు వాణిజ్య పరంగా ఎగుమతి చేసినవి 3.396 కోట్ల డోసులు ఉన్నాయి. విశ్వగురువు నరేంద్రమోడీ పేరుతో ప్రచారం మాటున ఇదంతా జరిగింది. అంటే దానం, విరాళం అనే పేరుతో దౌత్యం దాని వెనుక పక్కా లాభసాటి వ్యాపారం. మరోవైపు నరేంద్రమోడీ కార్పొరేట్ల తాట తీస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో భక్తుల ప్రచారం. మార్చినెలలో మన రాయబారి ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతూ భారత్‌ దేశీయంగా ఉపయోగించే వాటి కంటే ఎగుమతులు చేసిందే ఎక్కువ అని గొప్పగా చెప్పుకున్నారు.


దేశంలో వాక్సిన్ల కొరత తలెత్తటంతో అబ్బే అంతా ఉత్తిదే అని జనాన్ని నమ్మించేందుకు కొత్త నాటకం. ప్రపంచం అంతా రాజకీయమయంగా ఉన్నపుడు ఎవరికి అవకాశం దొరికితే వారు ఉపయోగించుకుంటారన్నది జగమెరిగిన సత్యం. చైనా అదే చేస్తున్నది, ఎవరెంత గింజుకున్నా చేయగలిగిందేమీ లేదు. మనల్ని నమ్ముకొని వాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టిన వారు ఇప్పుడు మన మీద జాలి చూపుతూ చైనా వైపు చూస్తున్నారు. చిన్న దేశమైన భూటాన్‌ మన మీద ఆధారపడుతున్న దేశం, డోక్లాం వివాదంలో మన మిలిటరీ వెళ్లి చైనా వారిని అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇండియా మాకు విశ్వసనీయమైన మిత్ర దేశమే, మేము అడిగితే రెండో డోసుకు వాక్సిన్లు ఇవ్వగలదు కానీ ఆ దేశంలోనే ప్రాణాలను నిలిపేందుకు ఎంతో అవసరం పడుతున్నపుడు మేము వత్తిడి చేయలేము అని ఆ దేశ ప్రధాని లోటే షెరింగ్‌ గత నెలలో ప్రకటించాడు.చైనా నుంచి దిగుమతి చేసుకొనేందుకు పూనుకున్నారు.నేపాల్‌దీ అదే పరిస్ధితి. మన వాక్సిన్ల కంటే చైనావి ధర ఎక్కువే అయినప్పటికీ, అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఎగుమతులు చేయనందున మిగతా ప్రపంచ దేశాలు చైనా వైపు చూడక తప్పని స్ధితి.

చైనాలో తయారు చేస్తున్న సినోఫామ్‌, సినోవాక్‌ వాక్సిన్‌న్లకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఆమోదం తెలపటంతో ఇప్పుడు అనేక దేశాలు అంతకు ముందు వచ్చిన వార్తలతో సందేహాలు వెలిబుచ్చినవి కూడా ఇప్పుడు వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. అమెరికా, ఐరోపాల వెలుపల తయారు చేసిన వాక్సిన్లలో ప్రపంచ ఆరోగ్య సంస్ద ఆమోదం పొందిన వాటిలో ఇంతవరకు చైనావి మాత్రమే ఉన్నాయి. మన దేశానికి చెందిన కోవాక్సిన్‌కు ఇంతవరకు ఆమోదం లేదు. ఒకసారి వాగ్దానం చేస్తే అది గ్రాంటు అయినా వాణిజ్య ప్రాతిపదిక అయినా కచ్చితంగా చైనా సరఫరా చేస్తుందనే నమ్మకం ప్రపంచ దేశాల్లో ఉంది. ఎనిమిది కోట్ల డోసులను అందచేస్తామని అమెరికా ప్రకటించటమే తప్ప వారాలు గడుస్తున్నా ఎటూ తేల్చటం లేదు. ఈ నెలాఖరుకు వస్తాయని చెబుతున్నారు. వాటిలో కొన్నింటిని మనకు అమెరికా ఉచితంగా ఇచ్చే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా ఆవి అక్కడి గోడౌన్లలో పడి ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలకు 26.5కోట్ల డోసులు సరఫరా చేసిన చైనా మరో 50కోట్ల డోసుల సరఫరా చేయనుందని ఎయిర్‌ ఫినిటీ అనే సంస్ద నెల రోజుల క్రితం వెల్లడించింది. చైనా తరువాత ఐరోపా యూనియన్‌ వంద దేశాలకు 6.7 కోట్ల డోసులను ఎగుమతి చేసింది. మన దేశం నుంచి వాక్సిన్లు వస్తాయని ఆశించిన ఫిలిప్పైన్స్‌ అధికారి ఒకడు వాస్తవ పరిస్ధితిని అర్ధం చేసుకోకుండా దక్షిణ చైనా సముద్ర దీవుల వివాదంలో చైనాను విమర్శిస్తూ ట్వీట్లు చేశాడు. ప్రభుత్వం ఒకవైపు వాక్సిన్‌కోసం సంప్రదింపులు జరుపుతుంటే ఇలాంటి చర్యలేమిటని సదరు అధికారిని అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెరేట్‌ మందిలించాడు. చైనాతో వివాదం ఉన్నంత మాత్రాన దాని పట్ల దురుసుగా, అమర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సిన అవసరం లేదన్నాడు. మన దేశం వాక్సిన్‌ ఎగుమతులపై నిషేధం విధించటంతో ఇండోనేషియా ప్రభుత్వం చైనా నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. చైనాతో వివాదం పేరుతో వాక్సిన్లు కొనుగోలు చేయకుండా జనం ప్రాణాలను ఫణంగా పెట్టటమా వివాదం ఉంటే తరువాత తేల్చుకుందాం ముందు ప్రాణాలు కాపాడటం ముఖ్యం అని వాక్సిన్లు కొనుగోలు చేసి సరఫరా చేస్తారా అన్నది మోడీ సర్కార్‌ తేల్చుకోవాల్సి ఉంది.


అవసరమైతే మనం కూడా చైనా నుంచి వాక్సిన్లు ఎందుకు దిగుమతి చేసుకోకూడదనే సూచనలు ఇప్పటికే వెలువడుతున్నాయి. మన మాదిరే చైనా కూడా గ్రాంటుగా ఇచ్చేది ఇస్తోంది, మరోవైపు వాక్సిన్లను ఆమ్ముతోంది. గత నెలాఖరులో మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ అమెరికా వెళ్లి వాక్సిస్లు ఆమ్ముతారా అంటూ వాకబు చేసి వచ్చారు. అమెరికన్లు ఏవీ ఉచితంగా ఇవ్వరు. ఒక వేళ ఒకదాన్ని ఇచ్చినా మరొకదానితో మొత్తం రాబడతారు. చైనా నుంచి ఆక్సిజన్‌ పరికరాలు, ఇతర సరఫరాలకు ఆటంకం లేకుండా సరకు రవాణా విమానాలు నడపాలని అదే జైశంకర్‌ చైనాను అడిగారు గానీ వాక్సిన్ల దగ్గర మొహమాట పడ్డారు. వాక్సిన్లు లేక జనం చస్తుంటే ఇదేమి వైఖరో, రాజకీయమో అర్ధం కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ కాకపోతే , నీ అమ్మా మొగుడా…?

26 Wednesday May 2021

Posted by raomk in Current Affairs, Economics, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ 1 Comment

Tags

an indian open letter to pm narendra modi, narendra modi bhakts, Narendra Modi Failures


శీర్షిక చూసి అపార్ధం చేసుకోకండి. ఒక సగటు భారతీయుడి ఆవేదన అర్ధం చేసుకోండి. సుమారు ఏడేళ్ళ క్రితం దేశం చాలా క్లిష్ట పరిస్దితుల్లో ఉంది అనుకునప్పుడు అందరిలాగే ‘మోడీ హై తో ముమ్కిన్‌ హై’ అని నమ్మిన వెర్రిబాగులోళ్లలో నేనూ ఒకడిని. పదేళ్ళ కాంగ్రెస్‌ పాలనతో విసుగు చెంది మార్పు కోరుకుంటున్న భారతీయుడికి అప్పటి ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ చూపించిన హీరో నరేంద్ర మోడీ. వారు ఎరగా చూపించిన గుజరాత్‌ మోడల్ని అందరిలాగే నేనూ నోరు వెళ్ళబెట్టుకు చూశాను. శంకర్‌ సినిమాల్లో కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌లో చక చకా అభివద్ది చెందే ఊళ్ళలాగే మన ఊర్లని, జీవితాల్ని మంత్రదండంతో మోడీ చకచకా చక్కదిద్దేస్షాడని నమ్మాను. అందుకనే… కేవలం అందుకనే, మతతత్వ సిద్దాంతాలతో నిర్మితమైన పార్టీ అయినా సరే ఖాతరు చేయకుండా భాజపాని, బలపరుస్తున్న పార్టీలకు మద్దతు తెలిపాను, ఓటు వేశాను. గెలిచాడు…నన్నే కాదు అప్పటి భారతీయ ప్రజలందరి మనసులు గెలిచాడు. ఎలక్షన్లూ గెలిచాడు. ప్రమాణ స్వీకారం రోజు చేసిన వాగ్దానాలు, పలికిన ప్రగల్బాలు ఇంకా నా చెవిలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. మర్చిపోయే శపథాలా అవి. అవన్నీ నిజమై ఉంటే ఇవాళ నేను ఇలా ఒక వ్యాసం రాయాల్సిన అవసరం వచ్చి ఉండేదే కాదు.


ఓపిక పట్టా గురూ…శానా ఓపిక పట్టా. నీ చేతకానితనాన్ని అమాయకత్వం అనుకున్న. మీడియాకు దొరక్కుండా మన్‌కీ బాత్‌ అంటే మూసుకుని విన్నా. నల్లడబ్బు అంతు చూస్షా అంటే నీతో వంత పాడి ఎటిఎం బయట క్యూల్లో నిల్చున్న. ఆ క్యూల్లో చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకు దేశం సరిహద్దుల్లో నిల్చున్న సైనికుడిని చూపించా. మార్పు కోసం త్యాగాలు తప్పవు అని నీతులు చెప్పా, అవి బూతులని ఆనాడు తెలియలేదే. అకౌంట్లో పదిహేను లక్షలు వేస్షా అన్నావు. నాకు రాకున్నా ఫర్లేదు …బీద, శ్రామిక వర్గాల వాళ్లకు వెళ్తే సంతోషం అనుకున్నా. డబ్బుల విషయం పక్కనెట్టు వాళ్లు అసలు నీకంటికి ఏనాడైనా కనిపిస్తేగా! ఆకలి చావులు తగ్గలా! రైతుల ఆత్మహత్యలూ, వలసలూ ఆగలా! పరువు హత్యలూ ఆగలా! అయినా సరే ఓర్పుగా నీ విమర్శకులని ఎదుర్కొన్నా. డెబ్బయి ఏళ్ళ కుళ్లుని కడగడం చిన్న విషయమా అని వారినే నిలదీశాను కానీ నిన్నుఏ రోజూ పల్లెత్షు మాట అనలా. నీ మీద పెంచుకున్న గుడిి ్డప్రేమ అచంచలంగా, స్దిరంగా ఉన్న తరుణంలో వచ్చిన అతి గొప్ప ఆర్షిక సంస్కరణ జిఎస్‌టి. మధ్యతరగతి వాడి నడుము వంచి… వెన్ను విరిచి… డొక్క చీల్చి పన్ను వసూళ్లు మొదలెట్టావ్‌. ఆ మధ్యతరగతి వాడు ఎవడో అయితే నాకు పెద్ద తెలిసేది కాదేమో కాని అందులో నేనూ ఒకడిని అవవడం వలన కాబోలు గుండే,జేబూ చివుక్కు మన్నాయి.


ఎట్టెట్టా..! ఇల్లు కట్టుకునే ఇటుక మీద పన్ను, ఇసుక మీద పన్ను, ఇనుము మీద పన్ను, మళ్లీ మొత్తంగా ఇల్లు మీద పన్నా..? పళ్లు రాల కొట్టే వాడు లేక. అయినప్పటికీ ఆలోచన మందగించిన మెదడు కదా ! బూజు సరిగ్గా వదలక ఇంకా నిను ప్రేమించా. నీ విహారయాత్రలు, నీ కాస్టిలీ కళ్ళద్దాలు, హై ఫై బట్టలు, మైనారిటీల మీద గోరక్షణ పేరుతో అఘాయిత్యాలు, విద్యార్ధుల మీద దాడులు, జర్నలిస్టు హత్యలు, ప్రభుత్వం మీద నోరెత్షిన వారి అరెస్టులూ అన్నీ..అన్నీ..చూసి చూడనట్లు ఊరుకున్నా. పుల్వామా దాడి ప్రతి స్పందనను మెచ్చా. బాలాకోట్‌ దాడులని సమర్ధించా, ఐదేళ్ళ నర్వం మరిచా, మళ్లీ నీకే అధికారం ఇచ్చా.

నీ అంతటోడు లేడన్నా , నీ యాభై ఆరు అంగుళాల ఛాతి దేశానికే కంచుకోట అనుకున్నా, మొక్కవోని నీ సంకల్పంతో ఈ దఫా భారత దేశాన్ని ప్రపంచ పటంలో ఉన్నత స్తానాల్లో నిలబెడతావ్‌ అని నమ్మా.నా నమ్మకాన్ని నిలబెట్టావ్‌. కోరోనా కేసుల్లో దేశాన్ని అగ్రస్దానంలో నిలబెట్టావ్‌. శభాష్‌ మోడీజీ శభాష్‌. మేము ఎదురు చూసిన అచ్చే దిన్‌ ఎలాగూ రాలేదు, కానీ ప్రజలు చచ్చే దిన్‌కి మాత్రం ముందుండి బాట వేశావు.

ప్రకతికి అందరూ ఒకటే! మోడీ అనా వాళ్ళ డాడీ అయినా . నీ వల్ల కరోనా వచ్చిందని చెప్పేటంత కుంచిత మనస్వత్వం కాదు, నిన్ను ఆడిపోసుకుంటే నాకు ఒరిగేదేమీ లేదు. కానీ ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఆత్మ విమర్శ అనేది అవసరం. గడిచిన ఏడాది కాలంలో సగం పైన లాక్‌డౌన్‌ జీవితం గడిపిన ప్రతి సోదరుడూ ఏదో ఒక సందర్భంలో ఆత్మవిమర్శ చేసుకునే ఉంటాడు. మరి నువ్వే చేస్తున్నావ్‌ ప్రధానీ ? ఆత్మ విమర్శ పక్కన పెట్టు. కనీసం విమర్శని హుందాగా స్వీకరించగలవా నువ్వు..? ఏం చేస్షోంది నీ యంత్రాంగం గత ఏడాది మార్చి నుంచి.? మా చేత బత్తీలు వెలిగించావ్‌. చపట్లు కొట్టింంచావ్‌. నువ్వేం చేశావు..? పక్కనే ఉన్న చైనాలో విస్తతంగా విజంభిస్తున్న కోవిడ్‌ మహమ్మారిని పట్టించుకోకపోవడం మొదటి తప్పు అయితే జనతా కర్ప్యూ అని మభ్యపెట్టి ఒకేసారి లాక్‌డౌన్‌ అమలు చేసి జనాలను భయాందోళనకు గురిచేశావ్‌. ఫలితం- కేసులు పెరుగుదల, వలస కూలీల ఇక్కట్లు,చావులూ. ప్రధానిగా నువ్వు కాకపోతే ఎవడు చెప్తాడు ఆ చావులకు సమాధానం..? ఆ క్లిష్ట సమయంలో తెగించి పని చేసిన ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పని చేసిన డాక్టర్స్‌. సమాజంలో సాటి మనిషి తోడు లేకపోయి ఉంటే ఇవాళ నువ్వు భారత దేశానికి కాదు ఒక శ్మశానానికి ప్రధానిగా ఉండేవాడివి. ఆనాడు ఏమీ తెలియని సమయంలోనే తబ్లిగీ జమ్మత్‌ తప్పయితే ఈనాడు అంతా తెలిశాక కుంభమేళా ఏంటి..? దీనిని సమాధానం నువ్వు కాక ఇంకెవరు చెస్తారు మోడీ..? అమెరికా మెడలు వంచి వీసా వేయించుకున్న మొనగాడు, బాలాకోట్‌ను బెంబేలెత్తించటంలో సైన్యానికే సూచనలిచ్చిన వీరుడు, ఇస్రో శాస్త్రవేత్తలకు సలహాలు ఇవ్వగల గడుగ్గాయి. కరోనాకు మాత్రం బాధ్యత వహించట్లేిదు. ఇది కాదా ఈ దేశ దౌర్భాగ్యం?


సెకండ్‌ వేవ్‌ ఊపందుకుంటున్న సమయంలో కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ అన్నీ తుంగలో తొక్కి నిర్లజ్జగా నీ యంత్రాంగాన్ని మొత్తం బెంగాలుకు తీసుకెళ్లి బహిరంగ సభలు పెట్టింది నువ్వా నేనా ? మరి నిన్ను కాక ఇంకెవడిని అడగను..? ఓ విజనరీ మోడీ! జనవరి 2021 లోనే కదా ప్రపంచ ఫార్మా కేంద్రం ఇండియా అని ప్రగల్భాలు పలికావు, మనం ఇచ్చే స్ధాయిలో ఉన్నాం కానీ తీసుకునే పరిస్దితుల్లో లేమని తొడకాట్టావ్‌. డెబ్బె దేశాలకు పంపణీ చేసిన వాక్సిన్‌, గోమూత్రం ఆవు పిడకలంత కాకపోయినా ఓ మోస్తరుగా అయినా నీ దేశ ప్రజలకు పని చేయదా..? మరి వాక్సిన్‌ ఏది..? నిన్ను కాకపోతే పాకిస్దాన్‌ ప్రధానిని అడగనా ..? అమెరికా అధ్యక్షుడిని నిలదీయనా ..? ఆ వాక్సినే ఉంటే రెమిడెసివిర్‌ కోసం బారులు తీరిన బ్లాకు లైన్లలో నుంచునే ఇక్కట్లు తప్పుతాయి కదా ? ఆ వాక్సిన్‌ పంపిణీ సరిగ్గా జరిగి ఉంటే మిత్రులని, వారి సహచరులని, వారి ఆప్ష్తులని అందరినీ పోగొట్టుకునేవాళ్ళం కాదు కదా !

ఏం మోడీజీ మాట్లాడవే..? దేశం అట్టుడిపోతుంటే మాట్లాడవే..? వాక్సిన్లు లేవు, ఆక్జిజన్‌ సిలిండర్లు దొరకటల్లేదు, హాస్నిటల్లో జాయిన్‌ అవ్వాలంటే బెడ్లు లేవు, ఒకవేళ ఉన్నా జాయిన్‌ అయ్యే స్షోమత లేదు, ఆఖరికి అయిన వాళ్లు ఛస్తే బొంద పెట్టటానికి శ్మశానాలు కూడా లేవు. నీ చేతకానితనాన్ని ప్రజల నిర్లక్ష్యంగా చిత్రీకరించే నీకూ, నీ యంత్రాంగానికీ, నిన్ను సమర్ధించే నీ భక్తులకూ శ్మశానం బయట క్యూలో నుంచుని అయిన వారికి వీడ్కోలు చెప్పటానికి ఎదురు చూస్షున్న వారిని పలకరించే దమ్ముందా..? ఆ కన్పీళ్ళని తుడవడానికి మీ కర్చీఫులు సరిపోతాయా.? ఆ ఆక్రందనలని మీ ఆత్మ నిర్భర పాకేజీలు ఆపగలవా..?


ప్రపంచ దేశాలు మనల్ని చూసి నవ్వుతున్నందుకు బాధ లేదు. నా దేశంలో నన్ను పట్టించుకోవటం లేదనే నా బాధ అంతా. పోరాడాల్సింది రోగితో కాదు వ్యాధితో అని టెలిఫోన్‌ సందేశాలు చెప్పించావ్‌. కానీ ఈ సారి మాత్రం యుద్ధం వ్యాధితో కాదు…మనల్ని పాలిస్తున్న ప్రభుత్వంతో అన్న తీరుకి పరిస్దితి దిగజారిపోయింది. మరి దీనికి నిన్ను కాక ఇంకెవరిని ప్రశ్నంచాలి.? నీతో నాకేం శతృత్వం లేదు. కానీ నీ చేతకానితనమంటేనే నాకు అసహ్యం. ఎందుకంటే దానికి మూల్యం చెల్లించాల్సింది నువ్వు, నీ భక్తులు కాదు. ప్రాణాలు పోగొట్టుకుంటున్న ప్రజలూ వారి కుటుంబాలూ.
ఇపుటికీ నీ చెరగని చిరునవ్వుతో ఉండే స్టిక్కర్లు అంటించిన వాక్సిన్లూ, పులి హౌర పొట్లాలూ, మందులూ మాకు అందుబాటులోకి తెస్తే కళ్ళకు అద్ఱుకుని తీసుకుంటాం. మాకు వేరే దారి లేదే. కానీ ఏం జరిగినా నిన్నే నిగ్గదీసి అడుగుతాం, నిన్నే నిలదీస్షాం. ఎందుకంటే నిన్ను మేము ఎన్నుకున్నాం. నిన్ను ఎందుకు అడుగుతున్నావని ఎవడైనా నన్ను ప్రశ్నిస్తే మళ్లీ వాడిని తిరిగి నేను ప్రశ్నస్షా….సమాధానం చెప్పాల్సింది మోడీ కాకపోతే నీ అమ్మా మొగుడా..?
ఇట్లు
సగటు భారతీయుడు
18/05/2021

గమనిక. ఇది నా రచన కాదు, వాట్సప్‌, ఇతర సామాజిక మాధ్యమంలో తిరుగుతున్న పోస్టు. దీనిలో అంశాలు ఆలోచించతగినవిగా ఉన్నాయని భావించి నరేంద్రమోడీ ఏడు సంవత్సరాల ఏలుబడి పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠకుల కోసం పోస్టు చేస్తున్నా.
భవదీయుడు
ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

సరఫరాలు ఆపొద్దు, ధరలు పెంచొద్దని చైనాను కోరిన మోడీ సర్కార్‌ !

14 Friday May 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, Science, UK, USA

≈ 1 Comment

Tags

Big Pharma Vaccine Profits, BJP Propaganda, China's vaccine diplomacy, Narendra Modi Failures, vaccination Policy, Vaccine Nationalism, WHO


ఎం కోటేశ్వరరావు


మన దేశంలో ఆక్సిజన్‌, ఇతర ఔషధాల ధరలు ముఖ్యంగా కరోనా చికిత్సలో వినియోగించే వాటి ధరలు ఎలా పెరుగుతున్నాయో, బ్లాక్‌ మార్కెట్‌ ఎలా ఉందో పదే పదే చెప్పనవసరం లేదు.బాధితులు, వారి బాధలు పంచుకున్నవారందరికీ అనుభవమే. దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్దితిని విధించి ముఖ్యమైన ఔషధాలు,వాక్సిన్లకు కంపల్సరీ లైసెన్సింగ్‌ విధానం కింద అనుమతులు ఇచ్చి అవసరాల మేరకు ఉత్పత్తిని పెంచేందుకు, ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమీ లేవు. ఇదేం పనయ్యా బాబూ అని ఎవరైనా ప్రశ్నిస్తే బిజెపి ప్రతినిధులు ఆరోగ్యం రాష్ట్రాలకు సంబంధించింది అని ఎదురుదాడులకు దిగుతున్నారు. మరోవైపున తొలి దశలో కరోనాను జయించింది తమ ప్రధాని మోడీ అని ఆయన లేకపోతే అదుపుఅయ్యేది కాదని, జనం ప్రాణాలు నిలిచేవి కాదంటూ పాడిన భజన గీతాల సంగతేమిటి, ఇప్పుడు ఇలా తాళం మార్చారేమిటి అని అడిగితే కష్ట కాలంలో సహకరించాల్సింది పోయి దెప్పి పొడుపులు, విమర్శలా అంటూ విరుచుకు పడుతున్నారు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువారు అంటూ సుమతీ శతకకారుడు బహుశా ఇలాంటి వారి గురించే చెప్పి ఉంటాడు.

మన దేశంలో కరోనా వాక్సిన్‌ ధరల మీద కేంద్ర ప్రభుత్వం నియంత్రణ విధించలేదు. కేంద్రానికి ఇచ్చే వాక్సిన్లకు ఒక రేటు, రాష్ట్రాలకు ఇచ్చేదానికి ఒక రేటు, ప్రయివేటు ఆసుపత్రులకు అమ్మేది ఒక రేటు. ఒక వైపు సామాజిక మాధ్యమాలు, సాంప్రదాయ మాధ్యమాల్లో బిజెపి ప్రతినిధులు ఇప్పటికీ చైనా వైరస్‌ అంటూ దాడులు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ జనానికి తెలియాల్సిందేమంటే చైనా వస్తువులను బహిష్కరిస్తాం, చైనాకు బుద్ది చెబుతాం, కాళ్ల దగ్గరకు రప్పిస్తాం అని ఏడాది నుంచి ప్రగల్భాలు పలుకుతున్న వారు తేలు కుట్టిన దొంగల మాదిరి అదే చైనా నుంచి చేసుకుంటున్న దిగుమతుల గురించి మాత్రం మాట్లాడటం లేదు. గుండెలు తీసిన బంట్ల సంగతేమోగానీ అలాంటి వారిని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. కొద్ది రోజుల క్రితం రవాణా విమానాలు ఆపేసి మనలను దెబ్బతీసిందంటూ చైనాను నిందించారు. ఆ సమస్య పరిష్కారం అయిన విషయం మాత్రం జనానికి చెప్పకుండా ఇంకా అదే అభిప్రాయంతో ఉండాలని కోరుకొనే వారు మాత్రమే దాన్ని మూసిపెడతారు.


తాజా విషయానికి వస్తే భారత్‌ దిగుమతి చేసుకొనే వైద్యపరమైన వస్తువుల సరఫరా ఆగకుండా, ధరలు పెరగకుండా చూడండి సారో అని మన దేశం చైనా నాయకత్వాన్ని అభ్యర్ధిస్తున్నది. ఈ సమాచారం కొందరికి మింగుడు పడకపోవచ్చు. నరేంద్రమోడీ విఫల ప్రధాని అంటే మింగుడు పడుతోందా ! ఇదీ అంతే !! నిజం త్వరగా ఎక్కదు. చైనా ప్రత్యేక ప్రాంతంగా ఉన్న హాంకాంగ్‌లోని భారత కాన్సుల్‌ జనరల్‌ ప్రియాంక చౌహాన్‌ అక్కడి నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు పత్రిక విలేకరితో మాట్లాడారు.” చైనా సరఫరా వ్యవస్ద తెరిచే ఉండాలని, ఉత్పత్తుల ధరలు స్ధిరంగా ఉండాలన్నది ఈ దశలో మా ఆకాంక్ష. సరఫరా గిరాకి వత్తిడి కొంత పెరిగినప్పటికీ ఉత్పత్తుల ధరలు స్ధిరంగా, అంచనాకు అందేట్లు ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రభుత్వ స్ధాయిలో కూడా మద్దతు, ప్రయత్నాలు అవసరం. అయితే ఈ విషయంలో చైనా ప్రభుత్వ పలుకుబడి ఎంత ఉంటుందో, ఏమి చేయగలదో నాకు సమాచారం లేదు, అయితే వారు చేయగలరు, అలా చేస్తే మేము స్వాగతిస్తాం ” అని ప్రియాంక చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొన్నది. సూటిగా మన రాజకీయ నాయకత్వం అడిగేందుకు ముఖం చెల్లక తడిక రాయబారం చేశారన్నది స్పష్టం.


మనకు అవసరమైన ముఖ తొడుగులు, పిపిఇ కిట్లు అన్నీ మనమే తయారు చేసుకోగలుగుతున్నట్లు కాషాయ దళాలు ప్రచారం చేస్తున్నాయి. మంచిదే, ఇంతకంటే కావాల్సింది ఏముంది ? మేకిన్‌ ఇండియా కింద గత ఏడు సంవత్సరాలుగా ఇబ్బడి ముబ్బడిగా ప్రపంచానికే వస్తువులను ఎగుమతి చేస్తున్నాము కదా అని పగటి కలలు కంటున్న వారున్నారు. మే 14వ తేదీ హిందూ పత్రిక వార్త వారి కళ్లు తెరిపిస్తుందా ? దాని ప్రకారం మన దేశం చైనా కంపెనీలకు ఏప్రిల్‌ నుంచి 40వేల ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లకు ఆర్డరు పెడితే 21వేలు మనకు వచ్చాయి. వీటితో పాటు ఐదువేల వెంటిలేటర్లు, రెండు కోట్ల పది లక్షల ముఖతొడుగులు( మాస్కులు), 3,800 టన్నుల ఔషధాలు భారత్‌కు ఎగుమతి చేసినట్లు చైనా కస్టమ్స్‌శాఖలో నమోదైనట్లు దానిలో పేర్కొన్నారు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు అని కొట్టి పారవేస్తే చేసేదేమీ లేదు. ప్రచారానికి – వాస్తవానికి ఉన్న తేడాను జనానికి చెప్పేందుకే ఈ విషయాలు తప్ప నరేంద్రమోడీని దెప్పాలని కాదు. ఇప్పటి వరకు విదేశీ పత్రికలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాయి. ప్రభుత్వమే కనపడటం లేదని మన దేశానికి చెందిన అవుట్‌లుక్‌ పత్రిక తాజా ముఖచిత్రంగా ప్రచురించినందున మోడీని వెతికి తెచ్చి ఎక్కడికి పోయారని ప్రశ్నించాలి తప్ప దెప్పి ప్రయోజనం ఏముంది ? ఒక వేళ ప్రశ్నించినా నోరు విప్పుతారా ?

కరోనా మహమ్మారి నుంచి రక్షణకు వినియోగించే వాక్సిన్లకు కొంత కాలం పాటు పేటెంట్‌ హక్కుల అమలు నిలిపివేయాలని ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటివో)లో దక్షిణాఫ్రికా, మన దేశం కూడా ప్రతిపాదించాయని, నరేంద్రమోడీ చొరవ ఎలాంటిదో చూడండి, చివరికి అగ్రరాజ్యం అమెరికా కూడా అంగీకరించింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.(మనకు అవసరమైన వాక్సిన్‌ ముడిపదార్దాలనే ఇచ్చేందుకు అంగీకరించని వారు పేటెంట్ల రద్దుకు అంగీకరిస్తారా ? ) దీనితో పాటు కంపల్సరీ లైసెన్సు విధానం కింద గతంలో నాట్కో కంపెనీకి కాన్సర్‌ ఔషధ తయారికి అనుమతి ఇచ్చినట్లుగా వాక్సిన్లకు సైతం ఇవ్వాలన్న ప్రతిపాదనను ప్రజారోగ్య నిపుణులు, ఆ రంగంలో పని చేస్తున్నవారు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందువలన మన ప్రభుత్వం ప్రపంచ సంస్ధలో అలాంటి ప్రతిపాదన చేయటం మంచిదే, ఎవరు చేసినా అభినందించాల్సిందే. ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు ఏం జరుగుతోంది. ఇదే నరేంద్రమోడీ సర్కార్‌ మే తొమ్మిదవ తేదీన సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో దానికి విరుద్దమైన వాదన చేసింది. సుప్రీం కోర్టు సూచించిన విధంగా కంపల్సరీ లైసెన్సు నిబంధనను ఈ దశలో ఉపయోగిస్తే, మేథోసంపత్తి హక్కుల ఒప్పందానికి విరుద్దంగా చర్యలు తీసుకుంటే ప్రతికూల ఫలితాలు వస్తాయని వాదించింది. ప్రచారం కోసం, జనాన్ని మభ్యపెట్టేందుకు ప్రపంచ వాణిజ్య సంస్దలో ఒక వైఖరి, తన అధికారాన్ని వినియోగించాల్సి వచ్చే సరికి కార్పొరేట్‌ కంపెనీల అనుకూల వాదనలు. ఎంత దగా ! పోనీ ఇప్పటి వరకు సానుకూలంగా వ్యవహరించి నరేంద్రమోడీ సర్కార్‌ సాధించింది ఏమిటి ? కోవిషీల్డ్‌ తయారీకి అవసరమైన ముడి పదార్ధాలు, పరికరాల ఎగుమతులపై అమెరికా ప్రభుత్వం నిషేధం విధించినపుడు దానికి రాని ప్రతికూల ఫలితాలు ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పూనుకుంటే మనకు వస్తాయా ? ఒక వేళ వస్తే ఏమిటి ? మిన్ను విరిగి మీద పడుతుందా ? చైనాకు వ్యతిరేకంగా మనం చతుష్టయం పేరుతో అమెరికాతో జతకట్టి బస్తీమే సవాల్‌ అన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి వారు మనకు అవసరమైన వాటిని అందచేస్తున్నారా లేదా ? అమెరికా ఒక వైపు తమ జనం కోసం యుద్దసమయాల్లో వినియోగించే చట్టాలకు దుమ్ముదులిపి అమలు జరుపుతుంటే దాని భాగస్వామి అని చెప్పుకొనే మనం మన సార్వభౌమ అధికారాన్ని వినియోగించలేనంత దుర్బలంగా ఉన్నామా ? అసలు నరేంద్రమోడీ గారి సమస్య ఏమిటి ? ఇంత విపత్తు వస్తే కనీసం ప్రతిపక్షాలతో అఖిలపక్ష సమావేశం వేసి పరిస్ధితిని వివరించి సలహాలను కోరేందుకు తీరికలేనంతగా ఏం చేస్తున్నట్లు ? కేంద్రం చెబుతున్నట్లు ఆరోగ్య సమస్య రాష్ట్రాలదే అయినపుడు కేంద్రంలో ప్రధాని, ఇతర మంత్రులకు గోళ్లు గిల్లు కుంటూ కూర్చోవటం తప్ప ఇప్పుడు మరొక పనేముంటుంది. తీవ్రత తక్కువ మొదటి దశలో మోడీ చేయించిన పళ్లాలు, గ్లాసుల మోత, దీపాలు వెలిగించటం వంటి చర్యలన్నింటినీ జనం పాటించారుగా, ఇప్పుడు ఆ చొరవ ఏమైనట్లు ? పిచ్చిదో ఎచ్చిదో ఏదో ఒకటి ఎందుకు చేయించటం లేదు ? ఏమీ లేదు, ఎంత హడావుడి చేస్తే అంతగా జనం కేంద్రం వైపు చూస్తారు. ఉచిత వాక్సిన్‌ సరఫరాకే చేతులెత్తేసి అధిక భారాన్ని రాష్ట్రాల మీద నెట్టింది. గతేడాది మాదిరి 27లక్షల కోట్ల ఆత్మనిర్భర వంటి బూటకపు ప్రకటనలు చేస్తే నమ్మే జనం లేరు. అందుకే ప్రజాస్వామ్యబద్దంగా రాష్ట్రాల నిర్ణయానికే వదిలేస్తున్నానంటూ బాధ్యత నుంచి తప్పుకుంటున్నారు.

కోవిషీల్డు లేదా కోవాగ్జిన్‌కు గానీ ప్రయోగాలు పూర్తిగాక ముందే అత్యవసర వినియోగం పేరుతో ముందుగానే అనుమతి ఇచ్చారు. దాదాపు అన్ని దేశాలూ అదే చేశాయి. కోవిషీల్డు మన స్వంత తయారీ కాదు. దాని మాదిరే రష్యా స్పుత్నిక్‌ వాక్సిన్‌ ఉత్పత్తికి రెడ్డీలాబ్స్‌ ఒప్పందం చేసుకుంది. ఈ రెండింటితో పాటు దానికి, ఇతర వాక్సిన్లకు అనుమతి ఇచ్చి ఉంటే ఇప్పుడు తలెత్తిన వాక్సిన్‌ గిరాకీని సులభంగా అధిగమించి ఉండేవారం కదా ? రెండు కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనం కాపాడేందుకు చూపిన శ్రద్ద వేగంగా వాక్సిన్‌ తయారీ మీద ఎందుకు లేకపోయింది. మొదటి డోసు తీసుకున్న తరువాత నెల రోజుల్లోగా రెండవ డోసు తీసుకోవాలని చెప్పింది ప్రభుత్వమూ, నిపుణులే. ఇప్పుడున్న నెలన్నర – రెండు నెలల వ్యవధిని పొడిగించి మూడు నుంచి నాలుగు నెలల్లోపు కోవిషీల్డు తీసుకోవచ్చు అంటున్నారు. జనం దేన్ని నమ్మాలి ?
ప్రపంచంలో 184 వాక్సిన్లను జంతువుల మీద ప్రయోగించి పరిశీలిస్తున్నారు. ఆరోగ్యవంతులైన యువతీయువకుల మీద 32 వాక్సిన్లు మొదటి దశ ప్రయోగంలోనూ, 35 వాక్సిన్లు వివిధ తరగతుల మీద రెండవ దశ, 25వాక్సిన్ల ప్రభావం గురించి మూడవ దశ ప్రయోగాలు జరుగుతున్నాయి. పద్నాలుగు వాక్సిన్లను వినియోగిస్తున్నారు. అవన్నీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్ధ అనుమతి పొందినవే. ఎవరు ముందుకు వస్తే వాటి తయారీకి మన దేశం ఆహ్వానించి ఉంటే వెంటనే అన్ని వయస్సుల వారికి వాక్సిన్‌ పూర్తయ్యేది, రోజుకు నాలుగువేల మరణాలు తప్పి ఉండేవి కదా ? ఎందుకు ఇవ్వలేదు ?
ఔషధాల తయారీలో మన దేశం పురోగమించిన మాట వాస్తవం. అది చైనా కంటే ఎక్కువ అని కొందరు అనుకుంటారు, అనుకోనివ్వండి మనకు ఇబ్బంది లేదు. మన ఔషధ పరిశ్రమలకు అవసరమైన ముడి సరకు పూర్తిగా లేదా పాక్షికంగా తయారైన వాటిని మన ఫార్మారంగం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్న పచ్చినిజం తెలిసిందే. ఇప్పుడు చైనా నుంచి మన దేశం అత్యవసర ఔషధాలను తెచ్చుకుంటున్నది దానికి లేని అభ్యంతరం తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్ద ఆమోదించిన చైనా వాక్సిన్‌ తెచ్చుకొనేందుకు, జనం ప్రాణాలను కాపాడేందుకు ఇబ్బంది ఏమిటి ? చైనా వాక్సిన్లు అంతగా పని చేయవని ఆ దేశ నిపుణులే చెప్పారని కట్టుకధలు ప్రచారం చేశారు. చైనాలో ఏటా ఐదు వందల కోట్ల డోసులను ఉత్పత్తి చేయగల సామర్ధ్యం ఉంది. మన దేశంలో ఐసిఎంఆర్‌తో కలసి భారత బయోటెక్‌ తయారు చేసిన కోవాగ్జిన్‌ పూర్తిగా వినియోగ అనుమతి మన దేశంలోనే ఉంది. మరో 14 దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతించారు. ఇదే సమయంలో చైనాలో తయారైన నాలుగు వాక్సిన్లలో ఒకటైన సినో ఫార్మ నాలుగు దేశాల్లో పూర్తి వినియోగం 50 దేశాల్లో అత్యవసర అనుమతి పొందింది. మరొకటి కరోనా వాక్సిన్‌ పూర్తి వినియోగం చైనాలో, మరో 35దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందింది. మరో రెండు పరిమితంగా అనుమతి పొందాయి. అందువలన మన దేశం వాక్సిన్ల రంగంలో ముందుంది అని చెప్పుకోవటం అతిశయోక్తి తప్ప మరొకటి కాదు.


నరేంద్రమోడీ ప్రపంచ ఫార్మా కంపెనీలను దెబ్బతీసినందున అవన్నీ కక్ష కట్టాయంటూ ఆయన భక్తులు మహిమలను అంటగట్టి ప్రచారం చేస్తున్నారు. మన దేశంలో తయారయ్యే వాక్సిన్లు మన అవసరాలకే సరిపోని స్ధితి కళ్ల ముందు కనిపిస్తుంటే ఇలాంటి అతిశయోక్తులను చూసి నవ్వాలో ఏడవాలో అర్ధం కాదు. ఆపని చేసింది చైనా అన్నది పచ్చి నిజం. వాక్సిన్‌ మానవ హక్కు. ఎవరు జాతీయ వాదంతో సంకుచితంగా వ్యవహరిస్తున్నారు, ఎవరు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారో ప్రపంచం చూస్తూనే ఉంది. ఏప్రిల్‌ 25 నాటికి చైనా 41.5 కోట్ల డోసులను ఉత్పత్తి చేసి 20 కోట్ల డోసులను ఎగుమతి చేసి మిగిలిన దాన్ని తన దగ్గర ఉంచుకుంది. అమెరికా 26.8 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి మొత్తం అంతర్గత వినియోగానికి ఉంచుకుంది. బ్రిటన్‌ కూడా అదే మాదిరి 2.3 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి మొత్తం ఉంచుకుంది. ఐరోపా యూనియన్‌ 22 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి తొమ్మిది కోట్ల డోసులు ఎగుమతి చేసి మిగిలింది తన సభ్య దేశాలకు వినియోగించింది. మన దేశం 19.6 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి పన్నెండున్నర కోట్ల డోసులు మన దేశంలో వినియోగించి మిగతాది ఎగుమతి చేసింది. ఇప్పటి వరకు ఎవరు ప్రపంచ ఫార్మాను దెబ్బతీసినట్లు ? ఎవరు ప్రపంచాన్ని ఆదుకొనేందుకు ముందుకు వచ్చినట్లు ? నేడు ఆంగ్లో-శాక్జన్‌ (అమెరికా-బ్రిటన్‌) దేశాలు వాక్సిన్ల తయారీకి అవసరమైన ముడిపదార్దాలను దాచివేస్తున్నాయని కడుపు మండిన ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ వ్యాఖ్యానించాడు. మన ప్రధాని నరేంద్రమోడికి నోరు పెగల్లేదు.


చైనా వాక్సిన్‌ సినోఫార్మకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ అనుమతి ఇవ్వటంతో ఇప్పుడు పెద్ద ఎత్తున వాక్సిన్‌ పేద దేశాలకు అందేందుకు వీలు కలిగింది. త్వరలో చైనా మరో వాక్సిన్‌ సిన్‌వాక్‌ కూడా అనుమతి రాబోతున్నదని వార్తలు. మన కోవాగ్జిన్‌కు ఇంకా రాలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్ధలోని సభ్య దేశాలలో 192 కోవాక్స్‌ పేరుతో వాక్సిన్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ప్రాంతాలకు 2021 చివరి నాటికి 200 కోట్ల డోసుల వాక్సిన్‌ అందించాలన్నది లక్ష్యం. ఇప్పటి వరకు కోవాక్స్‌ పధకంలో భాగంగా 5.4 కోట్ల డోసులను 121 దేశాలకు అందించింది. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో వాక్సిన్ల ద్వారా ఫైజర్‌ కంపెనీ 350 కోట్ల డాలర్లు సంపాదించింది. మోడెర్నా కంపెనీ ఏడాదిలో 1900 కోట్ల డాలర్లను సంపాదించనుందని అంచనా. కార్పొరేట్‌ కంపెనీల లాభాల కోసం మహమ్మారిని దీర్ఘకాలం పొడిగిస్తున్నారా ? అంటూ ప్రపంచబ్యాంకు మాజీ అధిపతి, ఆర్ధికవేత్త జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ మరొకరితో కలసి రాసిన వ్యాసంలో ప్రశ్నించారు. ఫైజర్‌, మోడెర్నా కంపెనీలు ఎంఆర్‌ఎన్‌ఏ వాక్సిన్ల తయారీలో గుత్తాధిపత్యం వహిస్తున్నాయి. వాటి తయారీకి ఇతరులను అనుమతించటం లేదు. ఎంతకాలం వీలైతే అంతకాలం మహమ్మారిని పొడిగించి సొమ్ము చేసుకోవాలన్నది వాటి ఎత్తుగడ. వైరస్‌ కొత్త రూపం సంతరించుకుంటున్న కారణంగా వాటికి అవసరమైన వాక్సిన్ల కోసం తమ వనరులను పదిలపరచుకోవాలని పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయన్నది స్పష్టం. కోవాక్స్‌ పధకానికి కోటి డోసులు ఉచితంగా సమకూర్చుతామని చైనా ఇప్పటికే వాగ్దానం చేసింది. వాక్సిన్‌తో పని లేకుండానే వైరస్‌ను అదుపు చేసిన చైనా పెద్ద ఎత్తునవాక్సిన్‌ తయారు చేస్తూ అత్యవసరమైన ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నది. మరోవైపు తన జనానికి తాపీగా వాక్సిన్‌ వేస్తున్నది. మరోవైపు దాని ఉత్పత్తిలో సగం కంటే తక్కువ ఉన్న మనం దేశం చైనా కంటే వేగంగా వాక్సిన్‌ వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది.


మన దేశంలో ఆగస్టు -డిసెంబరు నాటికి మొత్తం 216 కోట్ల డోసుల వాక్సిన్‌ అందుబాటులోకి రానున్నదని నీతి ఆయోగ్‌ సభ్యుడు వికె పాల్‌ చెప్పారు. ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీలు కూడ అత్యవసర వినియోగం కింద తయారీకి దరఖాస్తు చేసుకోవాలని కోరినట్లు పాల్‌ తెలిపారు. ఆయన చెప్పినట్లు, అనుకున్నట్లు సవ్యంగా జరిగితే డిసెంబరు నాటికి గాని మన జనాభాకు వాక్సిన్‌ వేసే అవకాశం లేదు. కొందరు చెబుతున్నట్లు ప్రతివారికీ బూస్టర్‌ మూడో డోసు వేయాల్సి వస్తే , మూడో తరంగంలో వస్తుందని చెబుతున్న కొత్త వైరస్‌కు పాత వాక్సిన్లు పనికి రాకపోతే పరిస్ధితి ఏమిటి ? చైనా వాక్సిన్‌ సిన్‌ఫార్మకు అనుమతి ఇస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్ధ చేసిన ప్రకటనలో చైనా మరో 15వాక్సిన్ల తయారీ పురోగమనంలో ఉన్నట్లు తెలిపింది. వాక్సిన్ల తయారీలో చైనా – రష్యా సహకరించుకోనున్నాయి. మరి మనం ఎక్కడ ? అది ఉత్పత్తి కావచ్చు, వాక్సిన్‌ దౌత్యం కావచ్చు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d