• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Economics

తాత్కాలిక బడ్జెట్‌ -ఓట్లకోసం నరేంద్రమోడీ వేసిన వల !

13 Wednesday Feb 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Pensioners, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Direct Benefit Transfer (DBT), India Interim budget 2019-20, India's first budget, kisan samman, Narendra Modi, subsidies

Image result for india Interim budget 2019-20 cartoons

ఎం కోటేశ్వరరావు

స్వతంత్ర భారత చరిత్రలో ఎవరు అంగీకరించినా లేకున్నా నరేంద్రమోడీ తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్నారని చెప్పక తప్పదు. ప్రపంచంలో ప్రజలెన్నుకున్న ఏ ప్రధానీ లేదా అధ్యక్షుడు ఒక్కసారంటే ఒక్కసారి కూడా విలేకర్లకు ప్రశ్నించే అవకాశం వుండే మీడియా గోష్టిలో మాట్లాడకుండా పదవీ కాలాన్ని ముగించినట్లు ఇంతవరకు వినలేదు. అలాంటి అసాధారణ రికార్డును మోడీ నెలకొల్పబోతున్నారు. మంచోడు మంచోడు అనుకుంటే మంచమంతా ఖరాబు చేశాడన్న సామెత మాదిరి తొలి రోజుల్లో ఎందరో అభిమానించిన మోడీ వున్న వ్యవస్ధలను మెరుగుపరచకపోగా అన్ని వ్యవస్ధలను దెబ్బతీశారనే విమర్శలకు గురయ్యారు. వాటిలో తాజాది కేంద్ర బడ్జెట్‌. సాంప్రదాయాలు, ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్దంగా తాత్కాలిక బడ్జెట్‌ ప్రసంగంలో వెనుకటి తేదీ నుంచి అమలులోకి వచ్చే పధకాల ప్రకటన. రాజకీయాలతో నిమిత్తం లేని వారికి ఇది కాస్త ఇబ్బందిగా వుంది. మోడీ రాజకీయ వ్యతిరేకులకు ఇది విమర్శనాస్త్రమైతే అనుకూల రాజకీయులకు ఇది ప్రతిపక్షాలపై బ్రహ్మాస్త్రంలా కనిపించటం సహజం. మొత్తంగా మీడియాలో వచ్చిన శీర్షిలు, వ్యాఖ్యల సారాంశం ఏమంటే అది ఎన్నికలను దృష్టిలో వుంచుకొని రూపొందించింది. ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రవేశపెట్టి చర్చలేమీ లేకుండానే పదకొండవ తేదీన బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

ప్రపంచ బడ్జెట్‌ చరిత్రలో ముఖ్యంగా ప్రజలెన్నుకున్న పాలకుల ఏలుబడిలో పదవీకాలం ముగిసే సమయానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి వస్తే తాత్కాలిక ఏర్పాట్లను వుపయోగించుకుంటారు.ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం వచ్చే వరకు రెండు నెలల కాలానికి అవసరమైన ఖర్చుల కోసం ఖజానా నుంచి డబ్బుతీసుకొనేందుకు అనుమతి తీసుకోవటాన్నే ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ అంటారు. ఎన్నికల్లో అంతకు ముందు పార్టీయే గెలిచినా లేదా కొత్త పార్టీ వచ్చినా తన విధానాలకు అనుగుణుంగా బడ్జెట్‌ రూపకల్పన చేసేందుకు వీలు కల్పించటం ఒక మంచి సాంప్రదాయం. మాకు అలాంటి సత్సాంప్రదాయలేమీ పట్టవు, బడ్జెట్‌ను ఫలానా విధంగా పెట్టాలనే నిబంధనలేమైనా వున్నాయా అని అడ్డగోలు వాదనకు దిగితే సమాధానం లేదు.

ఈ సాంప్రదాయానికి తిలోదకాలిచ్చి నరేంద్రమోడీ సర్కార్‌ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టి చెడు సాంప్రదాయానికి తెరలేపింది. మూజువాణి ఓటుతో ఆమోదించి ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలను రాబోయే ప్రభుత్వం తిరగదోడవచ్చు లేదా పూర్తిబడ్జెట్‌గా ఆమోదించాల్సి వుంటుంది. దీని మంచి చెడ్డల గురించి చెప్పుకోబోయే ముందు అసలు బడ్జెట్‌ గురించి కొన్ని అంశాలను తెలుసుకుందాం. బడ్జెట్‌ అనే మాట పాత ఫ్రెంచి వాడుక బౌగెట్టి నుంచి వచ్చింది. దాని అర్ధం చిన్న సంచి లేదా పర్సు. అయితే ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో పదహారవశతాబ్దిలో వాడుకనుబట్టి పండితులు చెప్పినదాని ప్రకారం ఒకరి దగ్గర వున్న సంచి లేదా పర్సును తెరవటం అంటే ఒక రహస్యం లేదా సందేహపూరితమైనది కూడా కావచ్చు. బడ్జెట్‌ అంటే మన వ్యాపార, వాణిజ్యవేత్తలు మనజనంలో బడ్జెట్‌ రాక ముందే కొనండి అంటూ ప్రచారం చేసినదాని ప్రకారం వివిధ వస్తువుల మీద పన్నుల పెంపు లేదా తగ్గింపు వ్యవహారం.నిజానికి బడ్జెట్‌ అంటే ప్రభుత్వ వార్షిక రాబడి, ఖర్చుల ప్రకటన. బ్రిటన్‌లో 1734 జరగాల్సిన ఎన్నికలలో లబ్ది పొందేందుకు భూమిశిస్తుగా వసూలు చేస్తున్న మొత్తంలో ఒక పౌండుకు ఒక షిల్లింగ్‌ (అంటే పౌండులో 20వ వంతు) తగ్గించి భూస్వాముల మద్దతు పొందాలని ప్రతిపాదించాడు. అందుకు గాను ముందుగానే వుప్పు మీద పన్ను విధించాడు. భూస్వాములకు ఇచ్చే రాయితీల మొత్తానికి వుప్పు పన్ను చాలదని తేలటంతో 1733లో ప్రధాన మంత్రిగా వున్న రాబర్ట్‌ వాల్‌పోల్‌ మద్యం, పొగాకు మీద కొత్తగా పన్నులు వేయాలని ప్రతిపాదించాడు. ఆ వివరాలను ఒక కరపత్రంగా ప్రచురించి సమర్ధించుకున్నాడు. అయితే ఆ ప్రకటనకు ముందుగానే వాల్‌పోల్‌ కొత్త పన్నులు వేయనున్నారనే వూహాగానాలు వచ్చి వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. అధికారికంగా ప్రకటించిన తరువాత వాటిని వ్యతిరేకించిన ప్రతిపక్ష సభ్యుడొకరు బడ్జెట్‌ బహిర్గతమైంది లేదా ఒక కరపత్రానికి సమాధానం పేరుతో మరొక కరపత్రాన్ని రాసి వాల్‌పోల్‌ ప్రతిపాదనలను ఖండించాడు. జనంలో ఎప్పటి నుంచో నానుతున్న ఒక పెద్ద రహస్యం బహిర్గతమైంది, పాత పన్నులనే కొత్త రూపంలో వసూలు చేయటం తప్ప మరేమీ కాదన్నది దాని సారం. దేశంలో తీవ్ర వ్యతిరేకత రావటంతో కొత్త పన్నుల ప్రతిపాదనను వాల్‌పోల్‌ వుపసంహరించుకున్నాడు. తరువాత 1764లో నాటి మంత్రి బడ్జెట్‌ పదాన్ని వుపయోగిస్తూ రెండు గంటలనలభై అయిదు నిమిషాల సేపు ప్రసంగించి దేశ ఆర్ధిక పరిస్దితిని వివరించి వలస దేశాలపై పన్నులతో సహా అనేక ప్రతిపాదనలు చేశాడు. దాన్ని తొలి బడ్జెట్‌గా కొందరు పరిగణిస్తున్నారు.

మనం బ్రిటీష్‌ వారి వలస దేశంగా వున్నాం కనుక మన దేశ తొలి బడ్జెట్‌ను 1860 ఏప్రిల్‌ ఏడున ఈస్టిండియా కంపెనీ తొలిసారిగా బడ్జెట్‌ను జేమ్స్‌ విల్సన్‌ ప్రవేశపెట్టారు. ఏప్రిల్‌లోనే ఎందుకు ప్రవేశపెట్టారు అంటే బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవం వూపందుకోక ముందు భూమి మీద వచ్చేదే ప్రధాన మైన ఆదాయం. అది ఏప్రిల్‌ నాటికి ఒక స్పష్టమౌతుంది కనుక, ఏప్రిల్‌లో బడ్జెట్‌ను రూపొందించారని రాశారు. సదరు విల్సన్‌ ఎకానమిస్ట్‌ పత్రికను, స్టాండర్డ్‌ అండ్‌ ఛార్టర్డ్‌ బ్యాంక్‌ను స్దాపించిన ఒక ఆర్దికవేత్త. మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిసారిగా ఏడున్నర నెలలకు గాను మధ్యంతర బడ్జెట్‌ను 1947 నవంబరు 26న ఆర్‌కె షణ్ముగం చెట్టి ప్రవేశపెట్టారు. తరువాత మన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 112 ప్రకారం ప్రతి ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి మరుసటి ఏడాది మార్చి 31వరకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దేశ తొలి సంపూర్ణ బడ్జెట్‌ మరుసటి ఏడాది నుంచి అమల్లోకి వచ్చింది. అయితే దేశమంతటికీ వర్తింపచేసిన సమగ్ర బడ్జెట్‌ 1949-50 నుంచి అమల్లోకి వచ్చింది.

బడ్జెట్‌ వివరాలను ఎంతో రహస్యంగా పరిగణించేవారు. వివరాలు ఏమాత్రం వెల్లడైనా తీవ్రపర్యవసానాలుంటాయని భావించారు. వివరాలను రూపొందించే బృందానికి నాయకత్వం వహించే అధికారి తప్ప చివరకు ఆర్దిక మంత్రి కూడా వాటిని కలిగి వుండేందుకు వీలు లేదు. తొలి రోజుల్లో 1950వరకు బడ్జెట్‌ పత్రాలను రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో ముద్రించేవారు. తరువాత ఆర్దిక మంత్రిత్వశాఖ కార్యాలయ ప్రాంగణంలో 1980వరకు, అప్పటి నుంచి వెలుపల ప్రభుత్వ ప్రచురణాలయంలో ముద్రిస్తున్నారు. బడ్జెట్‌ ప్రవేశానికి ముందు హల్వా తయారీని ఆర్ధిక మంత్రి ప్రారంభిస్తారు. అంటే బడ్జెట్‌ పత్రాల ముద్రణ ప్రారంభసూచిక. ఆప్రక్రియలో నిమగ్నమైన వారెవరినీ ముగిసే వరకు బయటకు వెళ్లకుండా చేస్తారు. ఆ ప్రాంగణంలో ఆర్ధిక మంత్రి కూడా సెల్‌ఫోన్‌ కలిగి వుండటానికి వీలు లేదు. మన దేశంలో తొలి బడ్జెట్‌ కాగితాలను ఒక బ్రీఫ్‌ కేసులో తెచ్చారు. అప్పటి నుంచి అదే సాంప్రదాయం కొనసాగుతోంది.

గతంలో బడ్జెట్‌లోకొన్ని ముఖ్యాంశాలు పుకార్ల రూపంలో వెల్లడయ్యేవి. వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు ముందుగానే వుప్పందేది.కొన్ని సంవత్సరాల తరువాత మోపదలచిన భారాలన్నింటినీ ముందుగానే మోపి బడ్జెట్లలో మాత్రం భారం మోపలేదని ప్రచారం చేసుకొనే విధంగా పాలకపార్టీలు తయారయ్యాయి. రాను రాను బడ్జెట్లు ఒక తంతుగా మారాయి. ఇప్పుడు జిఎస్‌టి వచ్చిన తరువాత దేని మీద పన్ను ఎంతో ముందుగానే నిర్ధారణ చేస్తున్నందున పన్నుల ప్రసక్తి వుండదు. జిఎస్‌టి కౌన్సిల్‌ సమీక్షలు జరిపి కొన్నింటి మీద పన్ను తగ్గించటం తెలిసిందే. ఇప్పుడు బడ్టెట్‌లు ఆదాయ, కార్పొరేట్‌, ఇతర కొన్ని పన్నుల సవరణ, పధకాల ప్రకటనకే పరిమితం అయ్యాయి. గతంలో రైల్వే బడ్జెట్‌ విడిగా వుండేది. కొన్ని సంస్ధానాలలో భారత ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా రైలు మార్గాలుండేవి గనుక రైల్వే బోర్టు ద్వారా ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. రెండు సంవత్సరాల క్రితం దాన్ని కూడా సాధారణ బడ్జెట్లోనే విలీనం చేశారు. సాధారణంగా బడ్జెట్లను ఆర్దిక మంత్రులే ప్రవేశపెడతారు. గతంలో ప్రధానిగా వున్న ఇందిరా గాంధీ వద్దే ఆర్ధికశాఖ కూడా వుండటంతో ఒకసారి ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. గతంలో ఫిబ్రవరి చివరి పని దినం రోజు ప్రవేశపెట్టేవారు ఇప్పుడు మొదటి రోజుకు మార్చారు.రాత్రంతా పని చేసిన సిబ్బందికి విశ్రాంతి నిచ్చేందుకు వీలుగా 1924 నుంచి సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశ పెట్టారు. దీనిని 2001 నుంచి వుదయం పదకొండు గంటలకు మార్చారు. స్వాతంత్య్రం తరువాత 25 మంది ఆర్దిక మంత్రులుగా పని చేశారు. గరిష్టంగా మొరార్జీదేశాయ్‌ పదిసార్లు, రెండవ స్ధానంలో పి చిదంబరం ఎనిమిదిసార్లు బడ్జెట్లను ప్రవేశపెట్టారు.1991లో మన్మోహన్‌ సింగ్‌ సుదీర్ఘంగా 18,650 పదాలతో ప్రసంగించగా 1977లో కేవలం 800 పదాలతో హెచ్‌ఎం పటేల్‌ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. తాజాగా పియూష్‌ గోయల్‌ వంద నిమిషాల సేపు ప్రసంగించి ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌ ఎలాంటిదో పాఠకులే నిర్ణయించుకోవచ్చు. సాంప్రదయాన్ని వుల్లంఘించి చేసిన ఈ పనిని ఎలాంటి జంకు గొంకు లేకుండా సమర్ధించుకోవటం మోడీ సర్కార్‌కే చెల్లింది.

ఫిబ్రవరి పదకొండవ తేదీన రాఫెల్‌ ఒప్పందంపై ప్రతిపక్షాల నిరసనల మధ్య మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించిన బడ్జెట్‌ను పియుష్‌ గోయల్‌ సమర్దించుకున్నారు. తాత్కాలిక బడ్జెట్‌ కనుక తాము కొత్త పధకాలేవీ ప్రకటించలేదని, పూర్తి స్దాయి బడ్జెట్‌ను తరువాత ప్రవేశపెడతాం, దానిలో మరిన్ని ప్రకటనలుంటాయి, అవి వచ్చే సంవత్సరానికి చెందినవని అన్నారు. బడ్జెట్‌ ప్రసంగంలో గోయల్‌ కొత్తదనమేమీ లేనట్లయితే గంటసేపు ప్రసంగంలో ఏమి చెప్పినట్లు ? ప్రధాని కిసాన్‌ పధకం కింద రెండేసి వేల రూపాయల చొప్పున చిన్న రైతాంగానికి డిసెంబరు నుంచి ఏడాదికి మూడుసార్లుగా మొత్తం ఆరువేలు చెల్లించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసినదే. ఇదిగాక అసంఘటిత రంగంలోని కార్మికులకు ఫిబ్రవరి 15 నుంచి పెన్షన్‌ పధకాన్ని కూడా ప్రకటించారు. ఇవి ఈ ఆర్దిక సంవత్సరం నుంచే అమలులోకి వస్తాయి కనుక సాంకేతికంగా వచ్చే ఏడాది నుంచి అమలు అయ్యే పధకాలుగా పరిగణించకూడదని గోయల్‌ వాదించారు. తమ నాయకుడు ఎంతో తెలివిగా మాట్లాడారని బిజెపి అభిమానులు పొంగిపోయేందుకు తప్ప బుర్రవున్నవారికి చిరాకు తెప్పిస్తాయి. ఆ పధకాలను ఎవరూ వ్యతిరేకించరు. బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా ముందే ప్రకటించినా ఎవరూ తప్పు పట్టరు. డిసెంబరు నుంచి అమల్లోకి వచ్చే పధకాన్ని ఫిబ్రవరి ఒకటిన ప్రకటించటం అంటే ఎన్నికల ఆపదమొక్కులని వేరే చెప్పనవసరం లేదు. కొత్త పధకాలని చెప్పుకుంటే ప్రవేశపెట్టింది తాత్కాలిక బడ్జెట్‌కిందికి రాదు, వచ్చే ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలుకు ఎన్నికల నిబంధనావళి అడ్డువస్తుంది కనుక బిజెపి సర్కార్‌ ఈ చర్యకు పాల్పడింది. అయినా గట్టెక్కుతారా అంటే పోగాలము దాపురించినపుడు ఇలాంటివేవీ గతంలో ఏ పాలకపార్టీని రక్షించిన దాఖలా లేదు.

Image result for india Interim budget 2019-20 cartoons

మోడీ సర్కార్‌ చివరి బడ్జెట్‌ను ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌గా పరిగణించటానికి లేదు. పూర్తి బడ్జెట్‌ కాదని సర్కారే చెప్పింది కనుక దీన్ని త్రిశంకు స్వర్గ స్దితి బడ్జెట్‌ అనుకోవాలి. విమర్శించటానికి, సమర్ధించటానికి ఏమీ లేదు. అయితే కొన్ని అంశాలను విశ్లేషించాల్సి వుంది. ఐదు ఎకరాలు, అంతకంటే తక్కువ భూమిగల కుటుంబానికి రూ.6000 ఇవ్వనున్నట్లు ప్రకటించారు.దీనికయ్యే వ్యయంలో రాష్ట్రాలు 40శాతం భరించాలని కేంద్రం కోరనున్నదని అసలు ఆర్థిక మంత్రిగావున్న అరుణ్‌ జైట్లీ చెప్పారు. వాస్తవంలో ఈ పథకానికి నిధుల కేటాయింపు చేసి వున్నట్టయితే జైట్లీ అలా ప్రకటించి ఉండేవారు కాదు. అంటే బడ్జెట్‌లో చూపిన అంకెలు మోసపూరితమైనవన్నమాట.ఈ పథకం కేవలం భూమిని కలిగివున్నవారికే వర్తిస్తుంది. భూమిలేని వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు కూడా ఈ పథకంలో చోటులేదు. 2018-19 సంవత్సరానికి చెందిన సవరించిన బడ్జెట్‌లో సీజీఎస్‌టీ 5.04లక్షల కోట్లు(ఇది అసలు బడ్జెట్‌లో చూపిన దానికి 1లక్ష కోట్లు తక్కువ) వస్తుందని అంచనా వేయగా వాస్తవంలో ఈ పన్ను ఈ మాత్రం కూడా వసూలు కాదని స్వతంత్ర పరిశోధకులు తేల్చారు. ఏప్రిల్‌-జనవరి మధ్యకాలంలో ఈ పన్ను ద్వారా వచ్చిన ఆదాయం సగటున నెలకు 37,635కోట్లు. వార్షికంగా చూసినప్పుడు ఈ మొత్తం 3.77లక్షల కోట్లు ఉంటుందని అంచనా. అంటే సంవత్సర కాలంలో వచ్చే ఆదాయం మొత్తం 4.52లక్షల కోట్లకు మించదు. ఇది సవరించిన అంచనా కంటే కూడా 52,000కోట్లు తక్కువ.

తాను చేస్తున్న అప్పులను ప్రభుత్వరంగ సంస్థలపైన రుద్దటం, రిజర్వ్‌బ్యాంకు, ఇతర జాతీయ బ్యాంకుల నగదు నిల్వలను డివిడెండ్‌ ఆదాయం పేరుతో వాడటం వంటి అడ్డగోలు చర్యలు ఆర్ధిక క్రమశిక్షణ వుల్లంఘనకు ప్రతిబింబాలు. ఇప్పటికే జిడిపి వృద్ధి రేటు లెక్కలను గందరగోళపరచి ఎక్కువ అభివృద్ది జరిగినట్లు చూపటం, వుపాధి అవకాశాలు తగ్గిన విషయాన్ని అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో నష్టం అని గ్రహించి లెక్కలను ఇంకా ఖరారు చేయలేదని ఒక మాట, సరిగా లెక్కలు తయారు కాలేదని ఇంకో మాట చెబుతున్నారు. పకోడీ బండి పెట్టుకున్నా వుపాధి కల్పించటమే అని ప్రధాని స్వయంగా చెప్పినందున గత నాలుగు సంవత్సరాలలో ఎందరు పకోడీ బండ్లవంటివి ఎన్ని పెట్టుకున్నారో లెక్కలు వేసిన తరువాత వాటిని కూడా వుపాధికల్పన అంకెల్లో చూపి చెబుతారనుకోవాల్సి వస్తోంది.

పన్నుల ద్వారా 2018-19 సంవత్సరానికి చెందిన సవరించిన అంచనాల ప్రకారం చూపిన 6.71లక్షల కోట్ల ఆదాయం వాస్తవరూపం ధరించే అవకాశంలేదు. దీనినే తిరిగి 2019-20 సంవత్సర బడ్జెట్‌ అంచనాలో పెద్ద ఎత్తున 7.6లక్షల కోట్లుగా చూపారు. ఇంతకుముందు చూపినవిధంగా సీజీఎస్‌టీ ద్వారా వచ్చే ఆదాయం 2018-19 సంవత్సరానికి 4.52లక్షల కోట్లకు మాత్రమే చేరే అవకాశం ఉంది. దీనినే 2019-20 సంవత్సర బడ్జెట్‌ అంచనాలో 6.10లక్షల కోట్లకు పెరుగుతుందని చూపారు. ఆదాయంవైపు చూపుతున్న అంచనాలలో వున్న బూటకమే సహజంగా వ్యయంవైపు కూడా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. 2019-20 సంవత్సర బడ్జెట్‌లో పేదల సమస్యలపట్ల ఏమాత్రం ఆసక్తి చూపలేదు. జాతీయ ఉపాధిహామీ పథకానికి చేసిన కేటాయింపులు 2018-19 సంవత్సరంలో కంటే వర్తమాన బడ్జెట్‌లో 1000కోట్లు తక్కువ. ఈ పథకంపట్ల కేంద్రానికున్న చిన్నచూపుకు ఇది సూచిక.

Image result for Interim budget-a narendra modi's trap to catch votes

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధిలో రాష్ట్ర ప్రభుత్వాలు 40శాతం భరించాలని జైట్లీ చేసిన ప్రకటనకు ప్రాధాన్యత వుంది. వ్యవసాయం రాష్ట్రాల అధికార పరిధిలోనిది. దీనికి కేంద్రం నిధులు ఇవ్వకూడదనేమీ లేదు. ఇంతవరకు ఇలా ఏకపక్షంగా ఇతర అంశాలు వేటికీ రాష్ట్రాల వాటాను తేల్చకుండా పధకాలను రూపొందించలేదు. దీని మీద రాష్ట్రాల అభిప్రాయం తీసుకోలేదు. అందువలన దీన్ని కొనసాగిస్తారా అని కూడా సందేహించక తప్పదు. ఎన్నికల ముందు ప్రచారానికి ఉపయోగపడటానికి దీనిని రూపొందించినట్టుగాఉంది. ఒకవేళ ఎన్నికల తరువాత ఎన్‌డీఏ తిరిగి అధికారంలోకివస్తే రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించటంలేదనే నిందమోపి ఈ పథకాన్ని ఎత్తేయవచ్చు. లేదూ ప్రతిపక్షంలో కూర్చుంటే అది కొనసాగకపోతే చూశారా రైతులకు అన్యాయం చేస్తున్నారని దాడి చేయవచ్చు. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో నగదు బదిలీ కోసం 20000కోట్లు ఖర్చు పెట్టాలి. అయితే ఎన్నికలు సమీపిస్తున్నందున ఎలాగోలా ఈ మొత్తాన్ని సమకూర్చటం కష్టమేమీ కాదు. తరువాత ఏమిటనేది అసలు ప్రశ్న. దేశంలో భూమి యాజమాన్యాలకు సంబంధించిన రికార్డుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. సరైన గణాంకాలు లేనందున లబ్దిదారుల ఎంపిక అంత తేలిక కాదు.

మధ్యతరగతి వారికి ఆదాయ పన్నులో వార్షికంగా 5లక్షలవరకు రాయితీలు ప్రకటించటం ఓట్ల కోసమే. స్లాబులు మార్పు గురించి ప్రకటించకుండా రాయితీ ఇవ్వటం ఒకసారి వ్యవహారం కూడా కావచ్చు. దీనివలన వారికి ఎంత లబ్ది ఎంత అన్నది ప్రశ్న. బడ్జెట్‌లో అసంఘటిత కార్మికుల కోసం పించను పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ పథకం ఇప్పటికేవున్న వ అద్ధులకు ఉపపయోగపడదు. ఈ పధకంలో 29ఏండ్లు నిండిన వ్యక్తి తనకు 60ఏండ్లు వచ్చేదాకా నెలకు రూ.100 జమ చేస్తే ఆ తరువాత అతనికి నెలకు రూ.3000 పింఛను వస్తుంది. 60వ ఏటవరకూ ఒక కార్మికుడు కట్టే మొత్తాన్ని 8శాతం కాంపౌండ్‌ వడ్డీతో లెక్కగట్టినప్పుడు రూ.1,50,000 అవుతుంది. పురుషుల జీవిత పరిమాణం 65ఏండ్లుగా ఉన్నప్పుడు 60ఏండ్ల తరువాత అతను అందుకోబోయే పింఛను అతని చేసిన పొదుపు నుంచే వస్తుంది. కాబట్టి ఈ కాంట్రిబ్యూటరీ పథకంలో ప్రభుత్వ పాత్ర నామమాత్రమే.గత ఐదు సంవత్సరాలలో ఎంత మందికి వుపాధి కల్పించారో లెక్కలే తేల్చలేని పాలకులు 50-60కోట్ల మంది అసంఘటిత కార్మికులున్నారని అంచనా కాగా వారందరికీ ఖాతాలు తెరవటం వూహకు అందని అంశం. తాత్కాలిక బడ్జెట్‌ను మొత్తంగా చూసినపుడు ఓటర్లకు వేసిన పెద్ద వల. దీనికి జనం చిక్కుతారా అన్నది ప్రశ్న !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా వ్యవసాయ పరిశోధనలు, రైతాంగానికి లబ్ది !

12 Tuesday Feb 2019

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Farmers, History, Opinion

≈ Leave a comment

Tags

Agricultural, China's agricultural sector, chinese agricultural, chinese agricultural R&D, chinese agricultural revolution, chinese electro culture

Image result for Chinese agricultural

ఎం కోటేశ్వరరావు

చైనా ! నూట నలభై కోట్ల జనాభా !! వారికి అవసరమైన తిండి, బట్ట, విద్య, వైద్యం, గూడు కల్పన సామాన్యమైన విషయం కాదు.తిండి కలిగితే కండ కలదోయ్‌, కండగలవాడేను మనిషోయ్‌ అన్న మహాకవి గురజాడ వాక్కులు సార్వజనీనమైనవి. చైనాలో ప్రపంచ జనాభాలో 22శాతం, సాగుకు లాయకీ అయిన భూమిలో ఏడుశాతమే వుంది. మొత్తం భూమిలో వ్యవసాయానికి పనికి వచ్చేది 10-15శాతం మధ్య వుంది. అదే భారత్‌లో 50, ఫ్రాన్స్‌లో 32, అమెరికాలో 22, సౌదీ అరేబియాలో ఒకశాతం చొప్పున వుంది. ఈ పూర్వరంగంలో అక్కడి జనాభా అవసరాలను తీర్చటానికి ఎంతటి మహాయజ్ఞం చేయాల్సి వుందో వూహించుకోవాల్సిందే.అది ఒకరోజుతో ఆపేది కాదు. నిరంతర ప్రక్రియ. అలాంటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన చైనా కమ్యూనిస్టు పార్టీ గత ఏడుదశాబ్దాల విప్లవ కాలంలో అనేక విజయాలను సాధించింది. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలను తీర్చటం ఒక ఎత్తయితే, దాన్ని సమకూర్చే రైతాంగ మంచి చెడ్డలను చూసుకోవటం కూడా అంతే ప్రాధాన్యత కలిగిన అంశం. రైతుకు గిట్టుబాటు కాకుండా, ఇతర రంగాలతో పోల్చితే ఆదాయం తగ్గినా, ప్రభుత్వం సమన్వయం చేయకపోతే వ్యవసాయ రంగం సంక్షోభంలో పడుతుంది. భౌగోళికంగా తలెత్తే సహజ సమస్యల నుంచి ఎలా అధిగమించాలనేది ఒక సవాలు.చైనా గురించి మీడియాలో అనేక వక్రీకరణలు వస్తుంటాయి గానీ అక్కడి రైతాంగానికి లేదా మొత్తం వ్యవసాయ రంగానికి మన మాదిరి సంక్షోభ సమస్యలు, రుణ భారం, బలవన్మరణాల వంటివి కానరావు. మార్కెట్లలో ఆకస్మికంగా ధరలు పెరగటం, అదే విధంగా పతనం కావటం వంటి సమస్యలు అసలే లేవు. చైనా దిగుమతులు తగ్గించినా, నిలిపివేసినా ఇతర దేశాల మార్కెట్లు, రైతులు ప్రభావితం కావటం తప్ప చైనా రైతాంగానికి వాటి నుంచి అన్ని రకాల రక్షణలు వున్నాయి. సబ్సిడీలు, ఇతర రక్షణ పధకాలు ఎప్పటికప్పుడు మారుతున్నప్పటికీ అవి మరింత మెరుగుదలకే తోడ్పడతాయి.

రెండు కోట్ల పదిలక్షల మంది రైతుల చిన్న కమతాల సాగు తీరుతెన్నుల గురించి పది సంవత్సరాల అధ్యయనంతో శాస్త్రవేత్తలు సూచించిన మెరుగైన యాజమాన్య పద్దతులను ఆచరించిన రైతులు తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయంతో 12.2 బిలియన్‌ డాలర్ల మేరకు లబ్ది (ఎరువుల ఖర్చులో తగ్గుదల ద్వారా) పొందారని నేచర్‌ అనే పత్రిక తాజాగా ఒక విశ్లేషణలో పేర్కొన్నది. 2005-2050 మధ్య ప్రపంచ ఆహార అవసరాలు రెట్టింపు అవుతాయనే అంచనా పూర్వరంగంలో చైనా అధ్యయనం అంతర్జాతీయ శాస్త్రవేత్తలను అబ్బురపరచింది. అధ్యయన అంశాలను ఇతర దేశాలకు వర్తింప చేయవచ్చని ఆశిస్తున్నారు. బ్రిటన్‌ ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన జనాభా బయాలజిస్ట్‌ చార్లెస్‌ గాడ్‌ఫ్రే మాట్లాడుతూ ‘ 140కోట్ల జనాభాకు అవసరమైన ఆహారాన్ని వుత్పత్తి చేయటం ద్వారా వ్యవసాయ అద్బుతాన్ని సాధించింది. అయితే పర్యావణాన్ని ఫణంగా పెట్టారు, భూమి ఆమ్లీకృతమైంది, నీరు కలుషితమై ప్రపంచ తాపం పెరగటానికి దోహదం చేసింది. తాజా అధ్యయనం పెద్ద మొత్తంలో ఆర్ధిక ఫలితాలను రాబట్టటంతో పాటు ఎరువుల వాడకాన్ని తగ్గించటం సాధ్యమే అని సూచించింది.’ అన్నారు. ఏటా ఒక హెక్టారుకు చైనా రైతులు 305కిలోల నత్రజని వాడుతున్నారు. ఇది ప్రపంచ సగటుకు నాలుగు రెట్లు ఎక్కువ. పంటల దిగుబడులు తగ్గకుండా నత్రజని వినియోగాన్ని తగ్గించటం ఎలా అనే దిశగా బీజింగ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టిన పధకం 2005 నుంచి 2015వరకు సాగింది.ఈ వ్యవధిలో 13,123 క్షేత్రాలలో మొక్కజన్న, వరి, గోధుమల గురించి దిగుబడులు, పంటల రకాలు, నాటు పద్దతులు, ఎరువులు, నీరు, ఎండతీవ్రత ప్రభావం వంటి అనేక అంశాలను వారు పరిశీలించారు. ఈశాన్య చైనా రైతులు గరిష్టంగా 20శాతం నత్రజని వాడకాన్ని తగ్గించారు. అధ్యయనం, పరిశోధనా కాలంలో సగటున ధాన్య వుత్పత్తి 11శాతం పెరిగింది, 15శాతం నుంచి 18శాతం ఎరువుల వాడకం తగ్గింది. తద్వారా 12లక్షల టన్నుల నత్రజని పొదుపైంది. ఈ పధకంలో పది సంవత్సరాలలో 14వేల కార్యశాలలను నిర్వహించారు. చైనా అంతటి నుంచి 1200పరిశోధకులు, 65వేల మంది ప్రభుత్వ అధికారులు, సాంకేతిక నిపుణులు, లక్షా 40వేల మంది వ్యవసాయ వాణిజ్య సంస్ధల ప్రతినిధులు, 37.7 మిలియన్‌ హెక్టార్లలో రెండు కోట్ల పదిలక్షల మంది రైతులు వివిధ స్ధాయిలలో భాగస్వాములయ్యారు. ఐదుకోట్ల నలభైలక్షల డాలర్లు ఖర్చయింది.ఈ ప్రయోగం నుంచి మన దేశం కూడా నేర్చుకోవాల్సింది వుంది.ఈ ప్రయోగానికి ముందు గ్రీన్‌ హౌస్‌ గ్యాస్‌ గోధుమల్లో 549 నుంచి 434కు, వరిలో 941 నుంచి 812, మొక్కజన్నలో 422 నుంచి 328కి తగ్గాయని తేలింది.

పరిశోధనా అంశాలను అన్ని ప్రాంతాలకు వర్తింప చేయటంలో సమస్యలు తలెత్తవచ్చు, ఎంచుకున్న విధానాలను అమలు జరిపేందుకు చైనాలో కేంద్రీకృత ప్రభుత్వం వుంది కనుక సాధ్యం అవుతుంది, ఇతర దేశాలలో అలావుండదు అనే అభిప్రాయాలు కూడా వెల్లడయ్యాయి. ఇతర దేశాలు ఇలాంటి ప్రయోగాలు చేయటానికి సవాళ్లు ఆటంకం కారాదని, తమ జనాభా కడుపు నింపటానికి కలుషిత, సరస్సులు, నదులు, సముద్రాలను తయారు చేయాల్సిన అవసరం లేదని చైనా అధ్యయనం నిరూపించిందనే అభిప్రాయం కూడా వెల్లడైంది. వేల యకరాల కమతాలతో భారీ యంత్రాలతో అమెరికాలో వ్యవసాయం జరుగుతోంది. అత్యంత చిన్న కమతాలుతో చైనా తన సాగు పద్దతులను మెరుగుపరచుకుంటోంది. అమెరికాతో పోలిస్తే దిగుబడులలో వెనుకబడిన చైనా మన దేశంతో సహా అనేక దేశాలతో పోల్చితే ఎంతో ముందుందని మరచిపోరాదు. అగ్గిపుల్లా, సబ్బుబిళ్ల, తలుపు గొళ్లెం, హారతి పళ్లెం కాదేదీ కవిత కనర్హం అన్నట్లుగా కొండలు, గుట్టలు, ఫ్యాక్టరీ, రోడ్లపక్క ఖాళీ స్దలాలు, ఇండ్లపై కప్పులు వేటినీ వదల కుండా తమకు అవసరమైన పంటలను అక్కడి జనం సాగు చేస్తున్నారు.1980దశకంలో పెద్ద ఎత్తున రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని ప్రోత్సహించారు. తలెత్తిన దుష్పరిణామాలను గ్రహించి వాటిని అరికట్టేందుకు, దెబ్బతిన్న పర్యావరణాన్ని సరి చేసేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు. చైనాలో భూమి ప్రభుత్వానిదే. రైతులు సాగు చేసుకొనేందుకు 30 సంవత్సరాల వరకు కౌలుకు తీసుకోవచ్చు. తాకట్టు పెట్టటానికి, కొనుగోలు, అమ్మకం చేయటానికి లేదు. భూమి హక్కులను బదలాయించే అవకాశం వుంది. పండించిన పంటను మార్కెట్లో అమ్ముకోవచ్చు. సగటున ఒక్కో కుటుంబం 1.2 ఎకరాలు కౌలుకు తీసుకుంది. దేశ జనాభాలో ఇప్పటికీ 35శాతం మంది వ్యవసాయ మీద ఆధారపడుతున్నారు. పది సంవత్సరాల క్రితం 60శాతం వరకు వున్నారు.

Image result for chinese agricultural revolution

చైనా వ్యవసాయ విజయ గాధ కమ్యూనిస్టు పార్టీ లేదా ప్రభుత్వ నివేదికలలో చెప్పినదానిని కొంత మంది నమ్మకపోవచ్చు. మనీలా టైమ్స్‌ (ఫిలిప్పీన్స్‌) ప్రతినిధి జిల్‌ హెచ్‌ ఏ శాంటోస్‌ 2018 మార్చి 18,19 తేదీలలో చైనా వ్యవసాయ విజయం వెనుక నిజాలు అనే శీర్షికతో రాశారు. దానిలో ప్రపంచ వ్యవసాయ సంస్ధ(ఎఫ్‌ఏఓ) విస్తరణ మరియు విద్య అధికారి డాక్టర్‌ టిటో కాంటాడో మార్చినెల మొదటి వారంలో ఫిలిప్పీన్స్‌ అధికారి బెన్‌కు పంపిన ఒక మెయిల్‌లో పేర్కొన్న అంశాలను వుటంకించారు. వాటి సారాంశం ఇలా వుంది.

1982 నుంచి 1995 వరకు చైనాలో ఎఫ్‌ఏఓ కార్యక్రమాలు, చైనీయుల నుంచి అనేకం నేర్చుకోవచ్చు.1983లో నాటి చైనా వ్యవసాయ మంత్రి హె కాంగ్‌ రోమ్‌లోని ఎఫ్‌ఏఓ కార్యాలయానికి వచ్చారు. తమ ఎనభై కోట్ల రైతాంగానికి విస్తరణ సేవలు అందించేందుకు సాయం చేయాలని కోరారు. నాటి ప్రధాని డెంగ్‌ గ్జియో పింగ్‌ చైనా ముందుకు పోవటానికి చెప్పిన నాలుగు అంశాల విషయమై కాంగ్‌ వచ్చారు. అదేమంటే 1. పిల్లి రంగు ఏమిటన్నది కాదు అది ఎలుకలను పడుతుందా లేదా అన్నదే ముఖ్యం.2. బహిరంగ మార్కెట్‌, చైనీయుల అన్ని జీవన రంగాల నవీకరణ, జవాబుదారీ వ్యవస్ధ. బహిరంగ మార్కెట్‌ వ్యవస్ధను అభివృద్ధి చేయాలంటే వ్యవసాయం, ఇతర ఆర్ధిక రంగాన్ని నవీకరించాలి. అందువలన వ్యవసాయానికి రైతులు జవాబుదారీగా వుండాలి. మంత్రి కాంగ్‌ చెప్పినదాని ప్రకారం 80కోట్ల మంది రైతులు సగటున ఒకటిన్నర హెక్టార్ల వ్యక్తిగత కమతాలను పొందుతారు. ఏమి పండించాలో వారే నిర్ణయించుకుంటారు. వ్యవసాయ వుత్పత్తి పెంచటానికి, నిర్దేశిత లక్ష్యాలను చేరుకొనేందుకు, ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు వారికి మంచి విస్తరణ సేవలు అవసరం. మంత్రి కోరిన వెంటనే నలుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఎఫ్‌ఎఓ పంపింది. అది చేసిన సిఫార్సులు ఇలా వున్నాయి. కౌంటీ(మన జిల్లాల వంటివి) ప్రాతిపదికన విస్తరణ ప్రాజెక్టులను రూపొందించాలి.(చైనాలో 19 పెద్ద రాష్ట్రాలు వుంటే 2,300 కౌంటీలు వున్నాయి. ఒక్కొక్కదానిలో ఐదు నుంచి పదిలక్షలకు పైబడి జనాభా వున్నారు) కౌంటీ ఆగ్రో టెక్నలాజికల్‌ ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌ను(కాటెక్‌) ప్రతి కౌంటీకి ఏర్పాటు చేయాలి. ఆ కేంద్రం ప్రయోగాలు, శిక్షణ మరియు సమాచార చేరవేత, విస్తరణ, సలహా సేవలను అందించాలి. ప్రయోగాలకు అవసరమైన ప్రయోగశాలలు, సంబంధిత ప్రత్యేక నిపుణులు, వారికి అవసరమైన ప్రయోగ క్షేత్రం, వాటికి వున్నత స్ధాయిలో వున్న వ్యవసాయ పరిశోధనా సంస్ధలతో సంబంధాలుండాలి. కాటెక్‌లో ఐదుగురు అధికారులుండాలి. జిల్లా ప్రభుత్వ ప్రతినిధి, జిల్లా వ్యవసాయ అధికారి, స్ధానిక ప్రభుత్వ కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ ప్రతినిధి, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ ప్రతినిధులుండాలి. అయ్యే ఖర్చులో సగం కౌంటీ, 30శాతం రాష్ట్రం, 20శాతం కేంద్రం భరించాలి. ఎఫ్‌ఏఓ మరియు చైనా ప్రభుత్వ నిధులతో 6.8కోట్ల జనాభా వున్న జయింగ్‌షో, 11కోట్ల జనాభా వున్న సిచువాన్‌ రాష్ట్రాలలో పైలట్‌ ప్రాజెక్టులను అమలు జరపాలని ఎఫ్‌ఏఓ బృందం సిఫార్సు చేసింది. ఒకేడాది ఈ పధకాలు అమలు జరిగిన తరువాత పది సంవత్సరాల వ్యవధిలో దేశమంతటా అన్ని రాష్ట్రాలలో ఈ నమూనాను విస్తరించాలని మంత్రి ఆదేశించారు.1995 నాటికి 85శాతం కౌంటీలలో కాటెక్‌ కేంద్రాలు ఏర్పడ్డాయి. ఇందుకు గాను ప్రపంచబ్యాంకు నుంచి 12కోట్ల డాలర్ల రుణం తీసుకున్నారు. వ్యవసాయ వుత్పత్తి పెరిగింది, వ్యవసాయరంగంలో పనిచేసే వారి శాతం 73 నుంచి 37కు తగ్గింది. 2000 సంవత్సరంలో పదిశాతం వ్యవసాయ కార్మికుల లేదా రైతుల శాతం తగ్గిందని ప్రకటించారు. దీని అర్ధం పదిశాతం మంది రైతులకు పెద్ద కమతాలు అందుబాటులోకి వచ్చాయి, అది యాంత్రీకరణకు, అధిక ఆదాయానికి దోహదం చేసింది. వనరులు తక్కువగా వుండి, ఆసక్తి చూపని జనం వున్న రాష్ట్రాలు, కౌంటీలలో తప్ప వ్యవసాయంపై ఆధారపడిన వారిలో దారిద్య్రం మాయమైంది.

ఒక విషయాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. చైనా పురోగమనానికి ప్రధాని డెంగ్‌ పేర్కొన్న నాలుగు అంశాలలో అంతర్లీనంగా వున్న పారిశ్రామికీకరణ, నిర్మాణం, వాణిజ్యం, సేవలు, రవాణా తదితర ఆర్ధిక రంగాలు దేశవ్యాపితంగా అభివృద్ధి చెందాయి. వ్యవసాయంలో అదనంగా వున్న 63శాతం కార్మిక శక్తిని వేగంగా జరిగిన అభివృద్ది ఇముడ్చుకుంది. కాబట్టి చైనా విషయంలో వ్యవసాయ ఆధునీకరణ, రైతులకు అదనపు ఆదాయం మరియు వ్యవసాయ రంగంలో వున్న దారిద్య్రంలో అత్యధిక భాగాన్ని లేకుండా చేయటం దేశవ్యాపిత ఆర్ధిక అభివృద్ధిలో భాగంగా చూడాలి. చైనా నుంచి ఇతర పాఠాలను కూడా నేర్చుకోవాల్సి వుంది.1. వారు ఎంపిక చేసిన జాతీయ, రాష్ట్ర, కౌంటీ స్ధాయి ప్రతినిధులు జవాబుదారీ, గౌరవం కలిగిన వారు మరియు వారి సహచరులు, భాగస్వాములు వారిని అనుసరించారు. చైనా ముందుకు పోవటానికి నాలుగు సూత్రాలను జాతీయ నాయకత్వం ఒకసారి ప్రకటించిన తరువాత అవి చైనా అభివృద్దికి నూతన భావజాలమైంది, దానిని సమాజంలోని అన్ని తరగతులు అనుసరించి మరింత విస్తృత పరిచాయి. నాతో పాటు పని చేసిన అధికారులు, ఇతర జనాలు నిష్కపటంగా వున్నారు. ఇతర దేశాల నుంచి కొత్త అంశాలను, ఆలోచనలను నేర్చుకొనేందుకు ఆతృత పడేవారు, నిజాయితీ, అవసరమైన మేరకు పరిమితం కావటం, పురోభివృద్ధి, బాధ్యతలకు అంకితమైన వారు. వ్యవసాయేతర రంగాలలో ప్రత్యేకించి పారిశ్రామికీకరణలో(వ్యవసాయ యంత్రాల తయారీ సహా) పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టటం అంటే అది వ్యవసాయాభివృద్ధికి పెట్టుబడే. చైనాలో వ్యవసాయ విస్తరణ సేవల ఏర్పాటు సంక్లిష్టమైనది కాదు. ఖర్చు తక్కువ, అమలు జరిపేందుకు, పర్యవేక్షించేందుకు సులభమైనదే. జాతీయ ఆహార భద్రత సాధించేందుకుగాను ప్రభుత్వం నుంచి భూమిని కౌలుకు తీసుకున్న ప్రతి రైతు నిర్ణీత కోటా గోధుమలు,బియ్యాన్ని ప్రభుత్వ సంస్ధ డబ్బు చెల్లించి సేకరిస్తుంది. నిర్ణీత కోటాను అందచేయటంలో ఎవరైనా రైతులు పదే పదే విఫలమైతే సదరు భూమి నుంచి రైతులను మార్చ వచ్చు. అయితే అధికంగా పండించిన మొత్తాన్ని రైతులు బహిరంగ మార్కెట్లో అమ్ముకోవచ్చు. రైతులకు అప్పగించిన భూమిలో సగం గోధుమలు, వరి సాగు చేసి కోటా చెల్లించి మిగిలిన సగంలో కూరగాయలు, వాణిజ్య పంటలు సాగు చేసిన రైతాంగాన్ని 1980దశకంలో పురోగామి రైతులుగా గుర్తించారు.’ అని డాక్టర్‌ టిటో కాంటాడో పేర్కొన్నారు.

కొన్ని దేశాలలో అమెరికా వ్యవసాయశాఖ రూపొందించిన కొన్ని పంటల తాజా దిగుబడుల వివరాలు ఇలా వున్నాయి.( హెక్టారుకు టన్నులలో, పత్తి కిలోలు, 2019 ఫిబ్రవరి అంచనా )

దేశాలు                  వరి     గోధుమ     పత్తి      చమురు గింజలు    మొక్కజన్న

ప్రపంచ సగటు        4.55    3.39     779          2.31            5.81

అమెరికా              8.66    3.20     939          3.21          11.07

ఐరోపా యూనియన్‌   6.89    5.39      –             2.64            7.54

చైనా                   7.03    5.42     1787        2.49             6.11

భారత్‌                  3.8      3.32     480         0.97             2.83

గతంలో బ్రిటన్‌ సామ్రాజ్యవాదులు వలస దేశాలను తమ పరిశ్రమలకు అవసరమైన ముడిసరకు సరఫరా దేశాలుగా పరిమితం చేసేందుకు ప్రయత్నించాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా సామ్రాజ్యవాదం లాటిన్‌ అమెరికాలో అదేపని చేసింది. ఒక్కొక్క దేశంలో ఒక వుత్పత్తి మీద కేంద్రీకరించి ఇతర అవసరాల కోసం తన మీద ఆధారపడే విధంగా చేసుకుంది. వుదాహరణకు క్యూబాలో ఇతర పంటలు పండేందుకు అవకాశం వున్నా కేవలం పంచదారనే ఎక్కువగా ప్రోత్సహించటం, వెనెజులాలో చమురునిల్వల వెలికి తీత తప్ప వ్యవసాయాన్ని, పారిశ్రామిక రంగాన్ని నిర్లక్ష్యం చేయటం, ఇదే విధంగా ఇతర దక్షిణ అమెరికా దేశాలన్నింటా ఏదో ఒక వాణిజ్య పంటల వుత్పత్తికి లేదా గనులకే పరిమితం చేయటంతో అవి అని వార్యంగా ఇతర దేశాల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఆ బలహీనత ఆధారంగా క్యూబా పంచదార ఎగుమతుల మీద ఆంక్షలు పెట్టి అక్కడి సోషలిస్టు వ్యవస్ధను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు వెనెజులా చమురు ఆదాయాన్ని మదురో సర్కార్‌కు అందనివ్వకుండా ఆర్దికంగా ఇబ్బందుల పాల్జేసేందుకు పూనుకున్నారు. చైనా జనాభా అవసరాలను కూడా అందుకు వినియోగించుకొనే అవకాశం లేకుండా చైనా తీసుకున్న జాగ్రత్తలలో ఆహార స్వయం సమృద్ధి సాధన ఒకటి. జనాభా అవసరాలన్నింటినీ తీర్చే సోషలిస్టు కార్యక్రమం అమలు జరుపుతున్నందున చైనాలో సంభవించే పరిణామాలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. అక్కడ ప్రకృతి వైపరీత్యాల రీత్యా పంటల దిగుబడి, వుత్పత్తి తగ్గితే దిగుమతులు కారణంగా ప్రపంచ మార్కెట్లో వ్యవసాయ వుత్పత్తుల ధరలు పెరుగుతాయి, అదే బాగా పండి దిగుమతి అవసరాలు తగ్గితే ధరలు పడిపోతాయి. పత్తి విషయంలో మన దేశంలో ధరలపై ప్రభావం చూపిన విషయం తెలిసిందే. అందువలన పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణ్యంగా చైనాలో వ్యవసాయం గురించి నిరంతరం అక్కడి ప్రభుత్వం జాగరూకత ప్రదర్శిస్తోంది.2030 నాటికి జనాభా 150కోట్లకు చేరితే ప్రతి ఏటా పదికోట్ల టన్నుల ఆహార ధాన్యాలను అదనంగా వుత్పత్తి చేయాల్సి వుందని అంచనా. చైనాలో బియ్యం ప్రధాన ఆహారం. వరిసాగుకు నీరు అవసరం. ప్రపంచ తలసరి సగటు అందుబాటులో కేవలం నాలుగోవంతు మాత్రమే చైనా నీటి లభ్యత వున్నందున దాన్ని అధిగమించటం నిజంగా పెద్ద సవాలే. చైనాలో మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా పందిమాంసం, చేపలు, కోడి మాంస వినియోగం వేగంగా పెరుగుతోంది. వాటి వుత్పత్తిని కూడా పెంచాల్సి వుంది. అందుకు అవసరమైన దాణా కూడా ధాన్య అవసరాలు పెరుగుతున్నాయి. ఒక కిలోమాంసం కావాలంటే రెండు, పందిమాంసానికి నాలుగు నాలుగు, గొడ్డు మాంసానికి ఏడు కిలోల ధాన్యం కావాల్సి వుంది. అందువలన అమెరికా ఇతర దేశాల నుంచి సోయా, మొక్కజన్న, జన్నల వంటి వాటి దిగుమతులలో ఎక్కువ భాగం దాణాకే వినియోగిస్తున్నారు.

ఫిబ్రవరి ఆరున ఈ ఏడాది చైనా నూతన సంవత్సరాది వేడుకలు ప్రారంభమయ్యాయి. సూకర(పంది)నామ సంవత్సరంగా పాటిస్తున్నారు.చైనాలో మాంస వినియోగం ఏటేటా పెరుగుతోంది. 2011లో సగటున తలకు 43.8కిలోలుండగా ఈ ఏడాది 53.3కిలోలుగా వుంటుందని అంచనా వేశారు. దీనిలో సగం పంది మాంసం. ప్రపంచ తలసరి ప్రొటీన్ల వినియోగం రోజుకు 46 గ్రాములుండాలని ఆరోగ్య సంస్ధలు సిఫార్సు చేశాయి. ప్రస్తుతం ప్రపంచ సగటు 80గ్రాములుండగా మన దేశంలో 60 వుంది. 1990-2011 మధ్య వినియోగంలో పెద్ద మార్పు లేదు. అదే చైనాలో 75 నుంచి 95కు పెరిగింది. అమెరికా సగటు వినియోగదారుడికి అవసరమైన వాటిని సమకూర్చాలంటే అక్కడ ఒక ఎకరం అందుబాటులో వుంటే అదే చైనాలో 20సెంట్లు మాత్రమే వుంది. అందువలన వ్యవసాయ అభివృద్ధి చైనాకు ఎంత ముఖ్యమో చెప్పనవసరం లేదు. అందుకే పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తున్నారు. వాటిలో ఎలక్ట్రో కల్చర్‌ పరిశోధనలు ఒక భాగం గోబీ ఎడారి నుంచి పసిఫిక్‌ సముద్ర తీరం వరకు కూరగాయల సాగును పరిశోధించారు. మొక్కల పెరుగుదలకు విద్యుత్‌ ఎలా తోడ్పడుతుందనేది ముఖ్యాంశం. కొద్ది వారాల క్రితం విద్యుత్‌ వినియోగం ద్వారా 20 నుంచి 30శాతం వుత్పాదకత పెరిగితే, 70 నుంచి 100శాతం వరకు పురుగుమందులు, 20శాతం ఎరువుల వినియోగం తగ్గినట్లు తేలిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కూరగాయ మొక్కల మీద పది అడుగుల ఎత్తులో గ్రీన్‌ హౌస్‌లో రాగితీగల ద్వారా గరిష్టంగా 50వేల ఓల్టుల వరకు విద్యుత్‌ను ప్రసారం చేసి ఫలితాలను పరిశీలించారు. దీని వలన మొక్కలకు, సమీపంలోని మనుషులకు ఎలాంటి హాని జరగలేదు. ఎలక్ట్రోకల్చర్‌ సాగును క్రమంగా పెంచుతున్నారు. ఈ రంగంలో తాము ఇతర దేశాల కంటే ఒకడుగు ముందున్నామని, తమ సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలను అమెరికాతో సహా మరికొన్ని దేశాలకు అందచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

మొక్కలపై విద్యుత్‌ ప్రభావం గురించి ఆలోచన, ప్రయోగాలు కొత్తవి కాదు. చైనా రెండు వందల సంవత్సరాల తరువాత ఈ పరిశోధనల్లోకి దిగిందని చరిత్ర వెల్లడిస్తోంది.1990లో సేంద్రీయ వ్యవసాయ పరి శోధనల్లో భాగంగా చైనా సర్కార్‌ పరిశోధనలను ప్రోత్సహించింది.2014 నుంచి ఈ పరిశోధనల్లో భాగస్వామి అయిన ఒక ప్రయివేటు కంపెనీ ఎలక్ట్రో కల్చర్‌ ద్వారా రెండు సంవత్సరాలో పన్నెండు లక్షల యువాన్లను అదనంగా ఆదాయాన్ని పొందినట్లు పేర్కొన్నది. ఒక హెక్టారు గ్రీన్‌ హౌస్‌కు రోజుకు 15కిలోవాట్‌ గంటల విద్యుత్‌ అవసరం. అయితే అవసరమైన యంత్రాల ఏర్పాటుకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని, ప్రభుత్వ తోడ్పాటు లేకుండా సాధ్యం కాదని ఆ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నాడు. ప్రతి కుటుంబం ఇంట్లో ఒక గదిలో ఎలక్ట్రో కల్చర్‌ సాగుచేసే విధంగా ఖర్చు తగ్గించే దిశగా పరిశోధనలు చేస్తున్నట్లు ప్రొఫెసర్‌ ఒకరు చెప్పారు. నిజంగా అదే జయప్రదమైతే మరో వ్యవసాయ విప్లవం వచ్చినట్లే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

క్యూబా సేంద్రీయ సాగు ప్రాధాన్యత, పరిమితులు !

19 Saturday Jan 2019

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Agriculture, cuba organic agriculture, cuba organic agriculture importance and limitations, organic agriculture

Image result for cuba organic agriculture

ఎం కోటేశ్వరరావు

చమురు నుంచి తయారయ్యే రసాయనాలు అందుబాటులో వున్నప్పటికీ అవి లేకుండా వ్యవసాయం చేస్తున్నారా ? అవి లేకుండా వ్యవసాయాన్ని మీరు ఎంచుకుంటారా ? అని హవానా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలను అమెరికాకు చెందిన వ్యవసాయ పరిశోధకులు, విద్యార్దులు, రైతులతో కూడిన 13 మంది బృందం అడిగిన ప్రశ్న. హవానా శాస్త్రవేత్తలు సేంద్రీయ వ్యవసాయ రంగంలో తాము కనిపెట్టిన అంశాలను అమెరికన్లకు వివరించిన తరువాత వేసిన ప్రశ్న ఇది. ఆ బృందంలోని ముగ్గురు రైతులు తప్ప మిగతావారికి నిరంతర వ్యవసాయ అధ్యయనం ప్రధానం. ఆ బృందానికి ఆతిధ్యం ఇచ్చిన క్యూబన్లకు జీవన్మరణ సమస్య. అప్పటికే సోవియట్‌ కూలిపోయి పది సంవత్సరాలు గడుస్తున్నది. ఆ కాలాన్ని ప్రత్యేకమైనదిగా పిలిచారు. కోటీ పదిలక్షల మంది జనాభాకు ఆకస్మికంగా చమురు లభ్యత నిలిచిపోయింది. వ్యవసాయం రంగంతో సహా వాటితో నడిచే యంత్రాలన్నీ మూతబడ్డాయి. చేతిలో పంచదార తప్ప ఆహార పదార్ధాలను కొనుగోలు చేసేందుకు డబ్బు లేదు. మరొక దేశం నుంచి గతంలో మాదిరి ఆహారం, ఇతర అవసరాలు వచ్చే స్ధితి లేదు. ఆ నేపధ్యంలోంచే ఆహార సరఫరాకు నిరంతర వ్యవసాయ పద్దతుల పాటింపు ఒక అనివార్య పర్యవసానం. అనేక దేశాలలో ప్రాచుర్యంలో వున్న సేంద్రీయ వ్యవసాయానికి, క్యూబాలో చేస్తున్నదానికి తేడా వుంది. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల దుష్ఫలితాలకు దూరంగా వుండాలన్న ధనిక తరగతి అవసరాల కోసం స్వచ్చమైన వుత్పత్తుల సాగు ఒకటి. దానికి భిన్నంగా రసాయన ఎరువులు, పురుగు మందులు కొనటానికి డబ్బులేని పరిస్ధితుల్లో జనానికి సాధారణ ఆహార సరఫరా కోసం క్యూబా సోషలిస్టు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం మరొకటి. ఆ దిశగా అక్కడ సాధించిన విజయం గురించి అనేక మందిలో ఆసక్తి తలెత్తింది. అయినప్పటికీ ఈ విధానం ఎంతో సంక్లిష్టమైనదని మేము చెప్పదలచాము అని ఒకటిన్నర దశాబ్దాల తరువాత అమెరికా బృంద సభ్యుడొకరు క్యూబా వ్యవసాయం గురించి రాసిన విశ్లేషణలో పేర్కొన్నారు. సిద్ధాంత నిబద్దతతో సాధించిన పురోగతిగాక మరేమిటని ప్రశ్నించారు.

నిరంతర అభివృద్ధి సామాజిక పురోగమనానికి తోడ్పడుతుంది. కానీ తమకు అది సాధ్యమే కాదు అవసరం అని కూడా క్యూబన్లు నిరూపించారు. చచ్చిన చేపలు ఏటి వాలున కొట్టుకుపోతాయి, బతికిన చేపలు ఎదురీదుతాయి. ప్రతికూలతలను అధిగమించేందుకు సోషలిస్టు భావజాలం ఎలా వుత్తేజం కలిగిస్తుందో క్యూబాను చూస్తే అర్దం అవుతుంది. విప్లవానికి ముందు, తరువాత కూడా క్యూబా అంటే చెరకు,పంచదారకు మారుపేరు. సోషలిస్టు విప్లవం తరువాత అది సోవియట్‌ సాయంతో చెరకుతో సహా ఇతర పంటలను ఆధునిక యంత్రాల సాయంతో సాగు చేసింది.1991లో సోవియట్‌ కూలిపోయిన తరువాత ఒక్కసారిగా ఆ యంత్రాలన్నీ మూలనపడితే, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. కారణం అందరికీ తెలిసిందే, సోవియట్‌ నుంచి సాయంగా అందిన చమురు సరఫరా ఆగిపోయింది, ఎరువులు, పురుగుమందులు లేవు. తిరిగి గుర్రాలతో వ్యవసాయం చేసే స్ధితికి తిరోగమించింది. దానికి తోడు కరవు, తుపాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలు. పంచదారను కొనే వారు లేరు. కనీస అవసరాలను దిగుమతి చేసుకుందామంటే అమెరికా దిగ్బంధం, అంక్షలు. ఈ పరిస్ధితి మరొక విప్లవానికి దారి తీసిందంటే అతిశయోక్తి కాదు. అదే చమురు, యంత్రాలు, పురుగు మందులు, రసాయనిక ఎరువులతో నిమిత్తం లేకుండా వ్యవసాయం చేసి జనాల కడుపు నింపటం ఎలా అన్నదే ఆ విప్లవ లక్ష్యం. సోషలిస్టు భావజాలంతో వుత్తేజితులై, దానికి కట్టుబడి వున్న నాయకత్వం, తమ బాటలో జనాన్ని నడిపించిన తీరు క్యూబాలో సేంద్రీయ వ్యవసాయ విప్లవానికి దారితీసింది. దీని అర్ధం క్యూబా సమస్యలన్నింటినీ పరిష్కరించింది అని కాదు. విప్లవానికి ముందు, తరువాత కూడా క్యూబాలో ఆహారధాన్యాల స్వయం సమృద్ధి లేదు. అరవై నుంచి ఎనభై శాతం వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. ఇప్పటికీ విదేశాల మీద ఆధారపడుతున్నప్పటికీ ఆహార రంగంలో గణనీయ పురోగతి సాధించింది.

ముందే చెప్పుకున్నట్లు సోవియట్‌ కూలిపోయిన దగ్గర నుంచి క్యూబాలో ప్రత్యేక పరిస్ధితి ఏర్పడింది. శాంతి సమయంలో ప్రేత్యేక కాలమిది అని కాస్ట్రో వర్ణించారు. పంచదార ఎగుమతులతో విదేశీమారక ద్రవ్యం సంపాదించాలంటే ఎవరినీ కొనుగోలు చేయనివ్వకుండా అమెరికన్‌ ఆంక్షలు. వున్నంతలో పొదుపు చేసి చమురు, ఇతర అవసరాలను దిగుమతి చేసుకొందామంటే డబ్బు లేదు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా చమురు, యంత్రాలు, ఎరువులు, పురుగుమందులు లేకుండా పంటలు పండించే పద్దతులను కనుగొనేందుకు పూనుకున్నారు. అవసరమైన సేంద్రీయ పద్దతుల మీద శాస్త్రవేత్తలు పని చేశారు. భూమి ఇప్పటికీ ప్రభుత్వం చేతుల్లోనే వుంది. సంస్కరణల ఫలితంగా పండించి, పంటలను అమ్ముకొనే హక్కు మాత్రమే జనానికి వుంది. వంద ఎకరాలకు తక్కువగా వున్న కమతాలలో సేంద్రీయ సాగు పద్దతులను ప్రవేశపెట్టి అనేక విజయాలను సాధించారు. దిగుమతులను గణనీయంగా తగ్గించగలిగారు.

సేంద్రీయ వ్యవసాయం ఒక ఎండమావి కాదు, మా దేశ పంచదార కర్మాగారాలలో సగాన్ని మూసివేయటం మా ఆహార స్వయం ఆధారదిశగా వేసి తొలి అడుగు అని వ్యవసాయ పరిశోధకుడు ఫెర్నాండో ఫ్యూన్స్‌ మోంనోజోట్‌ అన్నారు. సోవియట్‌ నుంచి చమురు, ఎరువులు, పురుగు మందులు వచ్చే నావలు ఆకస్మికంగా ఆగిపోయాయి, అవింకేమాత్రం వచ్చే అవకాశం లేదు, మనకు ఈ రసాయనాలన్నీ అవసరమా అని జనం అడగటం ప్రారంభించారు అని ఒక సేంద్రీయ క్షేత్ర యజమాని మిగుయెల్‌ ఏంజెల్‌ సాల్సిని చెప్పారు . ప్రభుత్వం అనేక రాయితీలను ప్రకటించింది. వుత్పత్తులను స్ధానికంగా విక్రయించేందుకు అనుమతించింది. సేంద్రీయ పద్దతి జయప్రదం అవుతుందనే హామీ లేకపోయినప్పటికీ, నెమ్మదిగా జరిగినప్పటికీ ఆర్ధిక వ్యవస్ధ మెరుగైంది. మంత్లీ రివ్యూ అనే పత్రిక జరిపిన ఒక అధ్యయనంలో తేలిన అంశాల ప్రకారం 1988-2007 మధ్య కాలంలో పురుగుమందుల వినియోగం 72శాతం తగ్గింది, కూరగాయల వుత్పత్తి 145శాతం పెరిగింది. ఫ్రెంచి వ్యవసాయ శాస్త్రవేత్త రెనె డ్యూమోంట్‌ తగిన యాజమాన్య పద్దతులతో క్యూబా ప్రస్తుతం వున్న జనాభాకంటే ఐదు రెట్ల మందికి తగిన విధంగా తిండిపెట్టగలదు అన్నారు. 2010లో తన జనానికి అది కడుపునింపే స్ధితిలో లేదు, అది వినియోగించే ఆహారంలో 80శాతం దిగుమతి చేసుకొనేది, దానిలో 35శాతం అమెరికా నుంచి వచ్చేది. అన్నింటికి మించి క్యూబాలోని సగం భూమి వ్యవసాయానికి పనికి రానిది లేదా వృధాగా వుంది.

నియంత బాటిస్టా, అంతకు ముందున్న పాలకుల హయాంలో సారవంతమైన భూమిని చెరకుసాగుకు వుపయోగించారు. పంచదారను అమెరికా, ఇతర దేశాలకు ఎగుమతి చేశారు.ఆరుదశాబ్దాల క్రితం విప్లవం తరువాత ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. అనివార్య పరిస్ధితులలో అంతకు ముందు మాదిరే పంచదారను తయారు చేసి అమెరికా బదులు సోవియట్‌, ఇతర దాని మిత్ర దేశాలకు ఎగుమతి చేశారు. సోవియట్‌ కూలిపోయిన తరువాత 1990-94 మధ్య వ్యవసాయ వుత్పత్తి గణనీయంగా పడిపోయింది. పెద్ద క్షేత్రాలలో యంత్రాలతో వ్యవసాయం చేసే స్ధితి లేదు. చిన్న రైతాంగం వాటిని నిర్వహించలేరు. అమెరికా దిగ్బంధం మరింత పెరిగింది. ఆహార వినియోగం తగ్గి సగటున ప్రతి ఒక్కరు పది కిలోల వరకు బరువు తగ్గారు. ఈ పూర్వరంగంలో ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయ క్షేత్రాల యాజమాన్య పద్దతులను మార్చింది. స్వతంత్ర సహకార క్షేత్రాలతో పాటు ప్రయివేటు క్షేత్రాలను కూడా అనుమతించింది. స్వతంత్ర వ్యవసాయ క్షేత్రాలు వేటిని వుత్పత్తి చేయాలో నిర్ణయించుకొనే స్వేచ్చ ఇచ్చింది. అయితే వుత్పత్తులను నిర్ణీత ధరలకు ప్రభుత్వానికి విక్రయించాల్సి వుంటుంది. ఇప్పుడు 70శాతం మేరకు ప్రయివేటు క్షేత్రాలలో వుత్పత్తి అవుతోంది. వుత్పత్తిలో 80శాతం ప్రభుత్వానికి, మిగిలినదానిని ప్రయివేటుగా విక్రయించుకోవచ్చు. ఇటీవల చేసిన మార్పుల ప్రకారం 35లక్షల ఎకరాల మేర ప్రభుత్వ భూమిని కమతాలుగా విభజించి వుచితంగా రైతులకు కౌలుకు ఇచ్చారు. దానిని వారి వారసులకు బదలాయించే వీలు కల్పించారు. స్ధానిక కమిటీలకు వుత్పత్తి విషయాలలో స్వయంప్రతిపత్తి, అధికారాలను ఎక్కువగా కల్పించారు. ప్రయివేటు సహకార సంస్ధలు కూడా ఇప్పుడు ఆహారపంపిణీలో భాగస్వాములు కావచ్చు. ఇన్ని చేసినప్పటికీ దేశంలో ఆహార సమస్య వుంది.

వుష్ణమండల పర్యావరణంలో తెగుళ్లు త్వరగా వ్యాప్తి చెందుతాయి. ఇతర వ్యాధులు ఎక్కువే.భూ సారం, మంచినీటి నిర్వహణ కూడా అంతతేలిక కాదు. చిన్న, పెద్ద పట్టణ ప్రాంతాలలో అందుబాటులో వున్న ప్రతి నేలలో సేంద్రీయ పద్దతిలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారు.గణనీయ భాగం ఇక్కడ వుత్పత్తి అవుతోంది. ఒకే పంటకు బదులు బహుళ పంటల సాగును ప్రోత్సహించారు. పంటలు ఆరోగ్యంగా పెరిగేందుకు సహజ పద్దతులను అనుసరించారు. పరపరాగ సంపర్కాన్ని జరిపే కీటకాలను ఆకర్షించేందుకు బంతిపూలను వినియోగించారు.నత్రజని వున్న బీన్స్‌ను సేంద్రియ ఎరువుగా వుపయోగించారు. హానికారక క్రిమి, కీటకాలను దూరంగా వుంచేందుకు మిత్ర కీటకాలను ప్రయోగించారు. పోషక పదార్ధాలున్న కంపోస్టును పెద్ద ఎత్తున తయారు చేశారు. 1988లో వినియోగించిన రసాయనాలలో నాలుగోవంతుతోనే 2007లో మరింత ఆహారాన్ని వుత్పత్తి చేయటం నిజమైన వ్యవసాయ విజయమే. గత కొద్ది సంవత్సరాలలో మారిన పరిస్ధితులలో వెనెజులా రసాయన ఎరువులను పంపుతోంది. దాంతో సేంద్రీయ వ్యవసాయం ఎందుకు అనే అభిప్రాయం కూడా కొంత మందిలో తలెత్తింది. వాటితో పని లేకుండానే గణనీయ విజయాలు సాధించినపుడు తిరిగి వెనుకటి కాలానికి వెళ్లటం ఎందుకు అనేవారు కూడా గణనీయంగా వున్నారు. ప్రభుత్వ వుద్యోగాల ద్వారా వచ్చే ఆదాయం కంటే ప్రభుత్వం ఇచ్చిన రాయితీలతో పట్టణ ప్రాంతాలలో వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం నాలుగు రెట్లు ఎక్కువగా వుండటంతో అనేక మంది వుద్యోగాలకు రాజీనామా చేసి వ్యవసాయానికి పూనుకున్నారు.

Image result for cuba organic agriculture

సేంద్రియ వ్యవసాయ పద్దతి క్యూబన్ల కడుపు నింపుతుందా అన్నది ఒక ప్రశ్న. గత్యంతరం లేని స్ధితిలో ఏటికి ఎదురీదినట్లుగా సోషలిస్టు చైతన్యంతో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జనం సేంద్రీయ పద్దతుల్లో చిన్నతరహా కమతాలలో సాగు చేస్తూ అనేక దేశాలకు తమ అనుభవాలను పంచుతున్నారంటే అతిశయోక్తి కాదు. అనేక మందికి చెరకు తోటలు, పంచదార ఫ్యాక్టరీల్లో పని చేయటం తప్ప మరొకటి రాదు అలాంటి వారు నేడు ఇతర వుత్పాదక రంగంలో భాగస్వాములు అవుతున్నారు. క్యూబా ప్రస్తుతం మొక్క జన్నలను బ్రెజిల్‌, బియ్యాన్ని వియత్నాం, రొట్టెలను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. పట్టణాలలో పెరటి తోటలు, ఇండ్లపైన కోళ్ల పెంపకం వంటివి గతంలో వుండేవి. ఇప్పుడు పాడుపడిన పట్ణణ, పంచదార ఫ్యాక్టరీల ప్రాంతాలలో కూరగాయలు, పండ్లవంటి వాటిని ఎక్కడ ఖాళీ వుంటే అక్కడ సాగు చేస్తున్నారు. క్యూబాను సందర్శించే పర్యాటకులకు కొన్ని చోట్ల అవి దర్శనీయ స్ధలాలుగా మారాయంటే అతిశయోక్తి కాదు. తాము సాధించిన విజయాల గురించి క్యూబన్లు అతిశయోక్తులు చెప్పుకోవటం లేదు. ‘ సేంద్రీయ వ్యవసాయం పెద్ద మొత్తాలలో దిగుబడులు సాధించటానికి తోడ్పడదు, మా సమస్యలన్నింటినీ పరిష్కరించదు, కానీ అనేక సమస్యలను అది పరిష్కరించింది. అసలు ఆ పద్దతిని ప్రారంభించటమే ప్రాధాన్యత సంతరించుకుంది. దడాలున తగిలిన దెబ్బ వాస్తవం నుంచి తేరుకొనేందుకు పర్యావరణ వ్యవసాయ సాగు తలెత్తింది.సోవియట్‌ కూలిపోవటమే ఆ వాస్తవం, ఆ రోజులు ఎంతో కష్టమైనవి, ఏదో విధంగా ఎక్కడో ఒక చోట ఆహారాన్ని వుత్పత్తి చేయాల్సిన అనివార్యత ఏర్పడింది ‘ అని వ్యవసాయ శాఖ అధికారి జాన్‌ జోస్‌ లియోన్‌ చెప్పారు. సేంద్రీయ సాగు అంటే పాటించాల్సిన ప్రమాణాలేమిటో తెలియదు, స్ధానికంగా పండిన దానిని సాగు చేయటమే సోషలిస్టు క్యూబా భవిష్యత్‌ అవసరం అని కొందరు భావిస్తే మరి కొందరు పుదీనా వంటి అమెరికా, ఐరోపా మార్కెట్లకు అవసరమైనవి సాగు చేసే అవకాశంగా కొందరు భావించారు. మొత్తంగా సాగు మీద ఆసక్తిని కలిగించటంలో ప్రభుత్వం జయప్రదమైంది. ప్రభుత్వం కేటాయించిన భూమిలో సేంద్రీయ వ్యవసాయమే చేయాలి, ఫలానా పంటలనే పండించాలనే నిబంధనలేమీ పెట్టలేదు. స్ధానిక వ్యవసాయ పద్దతులను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని రూపొందించింది, ప్రభుత్వ మార్గదర్శనం, సంస్ధాగత నియంత్రణ, సోషలిస్టు చైతన్యంతో పాటు ఈ కార్యక్రమానికి సానుభూతిపరులైన విదేశీయుల సాయం కూడా తీసుకున్నారు. కెనడా, ఐరోపా యూనియన్‌కు చెందిన అనేక ధార్మిక సంస్ధలు పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చాయి. ఈ కార్యక్రమం, సహకారంలో భాగంగా సేంద్రియ సాగు మెళకువలు, నాణ్యమైన విత్తనాల అందచేత, వుత్పిత్తి విక్రయాలకు కొనుగోలుదార్లతో సంబంధాలను ఏర్పాటు చేయటం వంటి అంశాలున్నాయి.

సాధించిన విజయాలతో పాటు సేంద్రియ సాగుతో క్యూబన్‌ రైతులు సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. ఆశించిన స్ధాయిలో ఆహార వుత్పత్తి పెరగటం లేదు. దిగుబడులు తక్కువగా వుంటున్నాయి. దశాబ్దం క్రితం నామ మాత్రంగా వున్న వుత్పత్తి ఇప్పుడు మొత్తం వుత్పత్తిలో 20శాతం వరకు సేంద్రియ సాగు వాటా వుంది. ‘విదేశాల్లో వున్నవారు నిరంతర వ్యవసాయం సాగించే ఒక స్వర్గంగా మమ్మల్ని చూస్తున్నారు. మేము అలా అనుకోవటం లేదు. ఒక చెడు వ్యవసాయ పద్దతి నుంచి బయటపడుతూ అంతకంటే మెరుగైన దానిని అనుసరిస్తున్నాము అని హవానా జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేస్తున్న మైకేల్‌ మార్కెవెజ్‌ వ్యాఖ్యానించాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాలుగు దశాబ్దాల చైనా సంస్కరణలు 2 : అమెరికాకు 69 ఏండ్లు , చైనాలో 18కే సాధ్యమైంది !

23 Sunday Dec 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

China, Forty years of China Reforms, Xi Jinping

Related image

ఎం కోటేశ్వరరావు

1929 మాంద్యం ప్రారంభంలో అమెరికా వాస్తవ జిడిపి 1.109 లక్షల కోట్ల డాలర్లు కాగా అది పన్నెండు లక్షల కోట్ల డాలర్లకు చేరేందుకు 69 ఏండ్లు తీసుకుంది. 2017లో 18లక్షల కోట్ల డాలర్లకు చేరటానికి చేరటానికి 88 సంవత్సరాలు పట్టింది. చైనా జిడిపి 1999లో 1.09లక్షల కోట్ల డాలర్లుగా వున్నది 2017లో 12లక్షల కోట్ల డాలర్లకు చేరటానికి కేవలం 18 సంవత్సరాలే పట్టింది. అమెరికా ఆర్ధిక చరిత్రలో కనిపించే అనేక ఎగుడుదిగుడులు అది ఎదుర్కొన్న సమస్యలకు నిదర్శనం, అటువంటి పరిస్ధితి చైనా విషయంలో కనపడదు.1952-2017 మధ్య అమెరికాలో తొమ్మిది సంవత్సరాలు అంతకు ముందున్న జిడిపి కంటే తగ్గగా చైనాలో అటువంటి పరిస్ధితి ఐదు సంవత్సరాలలోనే కనిపించింది. 1978 సంస్కరణల ప్రారంభం తరువాత తిరుగులేకుండా సాగింది. అదే అమెరికాలో 1978 తరువాత ఐదు సంవత్సరాలు తరుగుదల వుంది. వీటిని మొత్తంగా చూసినపుడు అభివృద్ధిరేటులో కొద్ది హెచ్చు తగ్గులు వుండవచ్చుగానీ సంస్కరణల తరువాత చైనా ఎలాంటి పెట్టుబడిదారీ సంక్షోభాలను ఎదుర్కోలేదు.

ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ వునికిలోకి వచ్చి కొందరి అవగాహన ప్రకారం ఐదు వందల సంవత్సరాలు దాటింది. అమెరికాలో 1817లో న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ ప్రారంభాన్ని అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రారంభంగా తీసుకుంటే దానికి రెండువందల సంవత్సరాలు నిండినట్లు. అంత అనుభవం వున్న అమెరికాను, సంస్కరణలు ప్రారంభించిన 50సంవత్సరాల నాటికి జిడిపిలో చైనా అధిగమించగలదని అంచనా వేస్తున్నారు. అయితే జనాభా రీత్యా తలసరి ఆదాయంలో మరికొన్ని దశాబ్దాల పాటు అమెరికాయే అగ్రస్ధానంలో కొనసాగుతుంది. రెండు వందల సంవత్సరాల సుదీర్ఘపెట్టుబడిదారీ విధాన అనుభం తరువాత కూడా ఇంకా అమెరికాలో స్వంత ఇల్లులేని వారు, అద్దె భరించలేక కారుల్లో కాపురాలు చేసే వారున్నారంటే, 140 కోట్ల జనాభా వున్న చైనాలో జనానికి కనీస ప్రాధమిక వసతులు కల్పించటానికి ఎంత వ్యవధి కావాలో చెప్పనవసరం లేదు. కొందరు చెబుతున్నట్లు చైనాలో నిజంగా పెట్టుబడిదారీ విధానమే అమలు జరిపితే ఆ వ్యవస్ధకు సహజంగా వుండే జబ్బులన్నీ రావాలి, రావటం లేదు. సంక్షోభాలు లేకుండా శరవేగంగా అభివృద్ధి చెందటం పెట్టుబడిదారీ వ్యవస్ధ లక్షణం కాదు. అయితే చైనాలో పెట్టుబడిదారీ విధాన లక్షణాలు లేవా అంటే వున్నాయి.స్టాక్‌ ఎక్సేంజ్‌, ప్రయివేటు పెట్టుబడులు, లాభాలు తీసుకోవటం, ప్రయివేటు కంపెనీలను విస్తరించుకోవటం, బిలియనీర్ల పెరుగుదల వంటివి దాని లక్షణాలే. బలమైన పెట్టుబడిదారులు పెరిగిన తరువాత వారు సోషలిస్టు వ్యవస్దను అనుమతిస్తారా అని కొంత మంది వ్యక్తం చేస్తున్న సందేహాలను తీర్చటం అంతసులభమూ కాదు. తమ జనాభా అవసరాలు తీరాలంటే కొంతకాలం ఆ విధమైన విధానాలు తప్పవని చైనా కమ్యూనిస్టు పార్టీ చెబుతోంది. అధికారికంగానే అది ఒకే దేశం-రెండు వ్యవస్ధల విధానాన్ని 2050వరకు అనుమతిస్తామని ఎన్నడో చెప్పింది. సోషలిజం అంటే దారిద్య్రాన్ని పంచుకోవటం కాదు. పెట్టుబడిదారులను ఆహ్వానించటం, అనుమతించే వైఖరి మీద సందేహాలు కొత్తగా తలెత్తినవి కాదు. నాలుగు దశాబ్దాల నాడే వాటి గురించి చైనా నాయకత్వం చెప్పింది. గాలి కోసం కిటికీలు తెరిచినపుడు చెడుగాలితో పాటు, క్రిమి కీటకాలూ ప్రవేశిస్తాయని తెలుసు, వాటిని ఎలా అదుపు చేయాలో కూడా తమ గమనంలో వున్నదని చెప్పారు. ఈ నేపధ్యంలో అక్కడ అనుసరించిన విధానాలు ఎలా అద్భుతాలను సృష్టించాయో చూద్దాం.

Related image

1980లో చైనా జిడిపి 305బిలియన్‌ డాలర్లు కాగా 2017నాటికి 12.7ట్రిలియన్‌లకు పెరిగింది.(ఒక ట్రిలియన్‌ లక్ష కోట్లు) నాడు కేవలం 21 బిలియన్‌ డాలర్ల విలువగల వుత్పత్తులను ఎగుమతి చేసిన చైనా 2017నాటికి 2.49లక్షల కోట్ల డాలర్లతో ప్రపంచంలోనే అతి పెద్ద ఎగుమతిదారుగా తయారైంది.1980-2016 మధ్య సగటు అభివృద్ధి రేటు 10.2శాతం.1980లో చైనాకు వచ్చిన విదేశీ పెట్టుబడులు దాదాపు లేవు, 2017లో 168 బిలియన్‌ డాలర్లు వచ్చాయి, 2016నాటికి ప్రపంచంలోని వివిధ దేశాలలో చైనా పెట్టుబడులు 216 బిలియన్‌ డాలర్లున్నాయి. ఈ కాలంలో చైనీయుల సగటు జీవిత కాలం 66 నుంచి 76 సంవత్సరాలకు పెరిగింది.22శాతంగా వున్న నిరక్షరాస్యులు 3.2శాతానికి తగ్గారు. చైనా కుటుంబాల వినియోగం 49 బిలియన్‌ డాలర్ల నుంచి 90రెట్లు పెరిగి 2016నాటికి 4.4లక్షల కోట్లకు చేరింది.

సిఐఏ వెల్లడించిన వివరాల ప్రకారం 2017లో చైనా 2.16లక్షల కోట్ల డాలర్ల విలువగల వస్తువులను ఎగుమతి చేస్తే మనం 299.3బిలియన్‌ డాలర్ల దగ్గర వున్నాం.2016లో మనం 1.15లక్షల కోట్ల యూనిట్ల విద్యుత్‌ వుత్పత్తి చేస్తే చైనాలో అది 6.14లక్షల కోట్ల యూనిట్లు. అంతర్జాతీయ ఆటోమొబైల్‌ సంస్ధ తెలిపిన వివరాల ప్రకారం 2016లో చైనా 244లక్షల కార్లు, 36లక్షల వాణిజ్య వాహనాలను తయారు చేస్తే మనం 36లక్షల కార్లు, 8.1లక్షల వాణిజ్య వాహనాలను వుత్పత్తి చేశాము. బ్రిక్స్‌ దేశాలలోని వంద అగ్రశ్రేణి కంపెనీలలో చైనాకు చెందినవి 87శాతం ఆదాయం, 85శాతం లాభాలను కలిగి వుండగా మనవి 4,3శాతాలుగా వున్నాయి. రైలు మార్గాల విషయంలో మనకూ చైనాకూ పెద్ద తేడా లేదు. అయితే అక్కడ 22వేల కిలోమీటర్ల హైస్పీడ్‌ రైలు మార్గం వుండగా మన దగ్గర అలాంటిది లేదు. పరిశోధన, అభివృద్దికి జిడిపిలో చైనా 2.1శాతం ఖర్చు చేస్తుండగా మన దగ్గర ఒకశాతానికిలోపుగానే వుంది.2016లో చైనాలో పదిలక్షల 34వేల పేటెంట్లకు దరఖాస్తు చేశారు. ప్రపంచం మొత్తం మీద ఇవి 42శాతం. మన దేశంలో దాఖలైనవి 45,057 మాత్రమే. మన దేశంలో రోజుకు 24కిలోమీటర్ల గ్రామీణ రహదారులను నిర్మిస్తుండగా చైనాలో 1994-2000 మధ్య రోజుకు 1,200 కిలోమీటర్లునిర్మించారు.

ఇవన్నీ సానుకూల అంశాలైతే సమాజంలో ఆర్ధిక అసమానతలు పెరగటం ప్రతికూల అంశం.సంస్కరణల ప్రారంభంలో జాతీయ సంపదలో జనాభాలో ఒకశాతంగా వున్న ధనికుల చేతిలో 6.4శాతంగా వున్న దేశ సంపద 2015లో 13.9శాతానికి పెరిగింది. ఏ దేశంలోనూ లేని విధంగా 620 మంది బిలియనీర్లు వున్నారు. పేదలలోని 50శాతం మంది చేతిలో వున్న 26.7శాతం సంపద 14.8శాతానికి తగ్గిపోయింది. దేశంలో కొన్ని ప్రాంతాలు బాగా అభివృద్ది చెందగా మరికొన్ని దూరంగా వున్నాయి. పట్టణ, గ్రామీణుల మధ్య వ్యత్యాసాలు కూడా వున్నాయి. నలభై సంవత్సరాలలో చైనా జనాభా 96 నుంచి 139 కోట్లకు పెరిగింది. అభివృద్ది క్రమంలో చైనా ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలలో పట్టణీకరణ ఒకటి. పట్టణ ప్రాంతాలలో ఆదాయం, సౌకర్యాలు మెరుగ్గా వుండటంతో సహజంగానే యువతీ యువకులు పట్టణ ప్రాంతాలవైపు మొగ్గుచూపుతారు.

Image result for Forty years China Reforms

గత నాలుగు దశాబ్దాలలో 17.9శాతంగా వున్న చైనా పట్టణ జనాభా 58.5శాతానికి పెరిగింది. సంఖ్య రీత్యా 17 కోట్ల నుంచి 81 కోట్లకు పెరిగింది. అక్కడ జరుగుతున్న అభివృద్దికి అనుగుణ్యంగా 1980లో 54.5లక్షల మంది పట్టణాలకు వలస వెళ్లగా 1990నాటికి 65.5లక్షలకు, 1995 నుంచి ఏటా రెండు కోట్ల మందికి చేరింది. ఇటువంటి మార్పు ప్రపంచంలో మరే దేశంలోనూ జరగలేదు. గ్రామాల నుంచి రోజూ పట్టణాలకు వచ్చిపోయే వారి సంఖ్య కూడా ఎక్కువే.2025 నాటికి పట్టణ జనాభా వంద కోట్లకు చేరుతుందని అంచనా. అందువలన చైనా ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ ఇంకా సాధించాల్సింది ఎంతో వుంది. ఈ కారణంగానే తమది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే చైనా నాయకత్వం చెబుతోంది. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణంతో పాటు అధిగమించాల్సిన సమస్యలు కూడా చైనా తరహాలోనే వున్నాయని వేరే చెప్పనవసరం లేవు. వెనుకబడిన ఆఫ్రికా ఖండంలోనూ, అభివృద్ధి చెందిన అమెరికా ఖండంలోనూ కార్మికవర్గం వున్నప్పటికీ సమస్యల తీరుతెన్నులు ఒకే విధంగా వుండవు. ఒకే విధమైన సోషలిస్టు నిర్మాణం కుదరదు. ప్రతి దేశానికి విప్లవం దాని తరహాలోనే వస్తుందన్నది శాస్త్రీయ మార్క్సిస్టు సూత్రం. అందువలన సోషలిస్టు సమాజ నిర్మాణ లక్షణాలు కూడా ప్రత్యేకంగానే వుంటాయి. అమెరికా 69 ఏండ్లలో సాధించినదానిని చైనా 18 సంవత్సరాల్లోనే అధిగమించింది.రెండు చోట్లా వున్నది పెట్టుబడిదారీ విధానమే అయితే అంత తేడా ఎందుకున్నట్లు ? భారత్‌ ఎందుకు విఫలమైనట్లు ? అధ్యయనం చేయాల్సిన అవసరం లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాపై అమెరికా టెక్‌ వార్‌లో భారత్‌ ఎటువైపు !

19 Wednesday Dec 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

5G, Huawei, us china tech war, US-CHINA TRADE WAR

Image result for  us china tech war

ఎం కోటేశ్వరరావు

మూడు నెలలపాటు వాణిజ్య యుద్ధ దాడులకు విరామం ఇద్దామని అమెరికా-చైనా నిర్ణయించాయి. ఇంతలోనే అమెరికా మరో యుద్దానికి తెరలేపింది. అదే టెక్నాలజీ యుద్ధం. చైనాలోని ప్రముఖ హైటెక్‌ సెల్‌ఫోన్ల తయారీ కంపెనీ హువెయి యజమాని కుమార్తె, కంపెనీ సిఎఫ్‌ఓ మెంగ్‌ వాన్‌జౌ అరెస్టు దానికి నాంది అని కొందరంటుంటే పర్యవసానాలపై గత ఇరవై రోజులుగా అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఎలాంటి కారణాలు చూపకుండా అమెరికా వినతి మేరకు కెనడాలో అరెస్టు చేసిన మెంగ్‌ను కోర్టుకు హాజరుపరిచారు. తమను రెచ్చగొట్టే ట్రంప్‌ సర్కార్‌ చర్యమీద చైనా ఇప్పటి వరకు ఎంతో సంయమనంతో వ్యవహరించింది. మెంగ్‌ అరెస్టు అయిన నాటి నుంచి తన కనుసన్నలలో వ్యవహరించే దేశాల మీద అమెరికా వత్తిడి తెస్తోంది. హువెయి కంపెనీ పరికరాలు, ఫోన్లు కొనవద్దని కోరుతోంది. దానిలో భారత్‌ కూడా ఒకటి. ఈ వ్యవహారం నరేంద్రమోడీ సర్కార్‌కు కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే చైనాతో వాణిజ్యలోటు కొండలా పెరిగిపోతోంది.మన వస్తువులను మరింతగా కొనుగోలు చేయాలంటూ చైనాతో సర్కారు సంప్రదింపులు జరుపుతోంది. ఆవు పేడను తయారు చేయటం తప్ప మోడీ మేకిన్‌ ఇండియా పధకం ముందుకు సాగటం లేదు. అమెరికా ఆదేశాల మేరకు హువెయి కంపెనీ వుత్పత్తుల కొనుగోలు నిలివి పేస్తే మరొక అగ్రదేశం తయారు చేసే ఐదవ తరం పరికరాల కోసం ఎదురు చూడటం తప్ప మనకు మరొక మార్గం లేదు. అదే చేస్తే చైనాకు ఇప్పుడు మనం చేస్తున్న ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

ఈ చర్య కారణంగా మరింతగా స్వదేశీయ పరిజ్ఞానం మీద ఆధారపడాలనే కసితో చైనా వ్యవహరించకూడదు అని హాంకాంగ్‌ నుంచి వెలువడే కమ్యూనిస్టు వ్యతిరేక పత్రిక సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది. చైనాకు ఎదురైన చేదు అనుభవాలంటూ కొన్ని అంశాలను పేర్కొని టెక్నో జాతీయవాదం తెలివితక్కువ తనమని, వాణిజ్యదారులను మూసివేస్తుందని, భద్రతను బలహీనపరుస్తుందని వ్యాఖ్యానించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మెంగ్‌ అరెస్టుపై నోరు మూసుకొని గత నాలుగు దశాబ్దాలుగా మార్కెట్‌ను తెరిచినట్లుగానే రాబోయే రోజుల్లో కూడా వ్యవహరించకపోతే ఇప్పటి వరకు సాధించిన ప్రగతి దెబ్బతింటుందని పరోక్షంగా బెదిరించిందని చెప్పవచ్చు. ప్రపంచ కార్పొరేట్ల ప్రతినిధి అయిన మీడియా సంస్ధ నుంచి ఇలాంటివి వెలువడటంలో ఆశ్చర్యం లేదు.

డిసెంబరు ఒకటవ తేదీన కెనడాలోని వాంకోవర్‌లో మెంగ్‌ ఒక విమానం నుంచి మరో విమానంలోకి మారుతున్న సమయంలో కెనడా పోలీసులు ఎలాంటి కారణాలు చూపకుండా అమెరికా వినతి మేరకు అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. ఈ చర్య ఆమె మానవ హక్కులను హరించటమే అని చైనా పేర్కొనగా, ఆ చర్య కిడ్నాపింగ్‌ తప్ప మరొకటి కాదని చైనా మీడియా వర్ణించింది. అరెస్టులో తమ సర్కార్‌ ప్రమేయం లేదని కొద్ది రోజుల ముందే నోటీసు ఇచ్చామని కెనడా ప్రధాని ట్రడేవ్‌ ఆరు రోజుల తరువాత ప్రకటించారు. కొద్ది నెలల ముందే అరెస్టు వారంటు జారీ చేసినట్లు అమెరికా చెప్పింది. అమెరికా ఆంక్షలను వుల్లంఘిస్తూ ఇరాన్‌తో వ్యాపారం చేసేందుకు హువెయి కంపెనీ స్కైకామ్‌ అనే హాంకాంగ్‌ సంస్ధను అనధికార అనుబంధ సంస్ధగా వుపయోగించుకొని ద్య్రవ్య సంస్ధలను మోసం చేసేందుకు కుట్రపన్నిందని, తమ దేశ భద్రతకు ముప్పు కలిగించేవిగా దాని చర్యలున్నాయని బెయిలు విచారణ సమయంలో అమెరికా చేసిన ఆరోపణలను కెనడా సర్కార్‌ వల్లించింది.అరెస్టయిన పదకొండవ రోజున వాంకోవర్‌లోని ఆమె ఇంటి నుంచి బయటకు పోకుండా షరతులతో కూడిన బెయిలు మంజూరు చేశారు. ఇదే సమయంలో ఇద్దరు కెనడియన్లను భద్రతా కారణాలతో అరెస్టుచేసినట్లు చైనా అధికారులు ప్రకటించారు. అరెస్టు చేసిన మెంగ్‌ను తమకు అప్పగించాలని అమెరికా కోరింది. ఈ కేసులో 30సంవత్సరాల శిక్షపడే అవకాశం వుంది. అదే జరిగితే అమెరికా-చైనా సంబంధాలు ఏ మలుపులు తిరుగుతాయో చెప్పలేము.

ఇటీవలి కాలంలో హైటెక్‌ వుత్పత్తులలో ఇతర దేశాలకు చైనా కంపెనీలు పోటీ ఇస్తున్నాయి. మనందరికీ తెలిసిన శాంసంగ్‌ కంపెనీ సెల్‌ఫోన్లు, టెలికమ్యూనికేషన్ల పరికరాల తయారీలో మొదటి స్ధానంలో వుండగా చైనా హువెయి కంపెనీ రెండవ స్ధానానికి ఎదిగింది. ఇప్పుడు అది 5జి సాంకేతిక రంగంలో ముందున్నదని, ఒకటవ స్ధానానికి ఎదగ నుందని వార్తలు వచ్చాయి. వ్యాపారంలో తలెత్తిన పోటీయే కంపెనీ సిఎఫ్‌ఓ అరెస్టుకు అసలు కారణమని చెబుతున్నారు. చైనాపై వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించిన ట్రంప్‌ చైనా కంపెనీల పరికరాలు తమ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించాయని ఆరోపించిన విషయం తెలిసిందే. దానిలో భాగంగానే అమెరికా పౌరులు హువెయి కంపెనీ సెల్‌ఫోన్లు, సంస్ధలు పరికరాలను వాడవద్దనే నిషేధాలను విధించారు. అమెరికా కనుసన్నలలో కెనడా, బ్రిటన్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా కూడా నిషేధం విధించాయి.ఈ ఐదు దేశాలకు చెందిన గూఢచార సంస్ధలు ‘ఫైవ్‌ ఐస్‌’ (ఐదు నేత్రాలు) పేరుతో చైనా కంపెనీ పరికరాలలో రహస్య పరికరాలు వున్నట్లు నివేదికలను రూపొందించాయి. జూలై 17న ఐదుగురు గూఢచార అధిపతులతో కెనడా ప్రధాని కెనడాలోని అట్టావాలో ఒక రహస్య సమావేశం నిర్వహించారు. దీనిలో సిఐఏ డైరెక్టర్‌ గినా హాస్పెల్‌, బ్రిటన్‌ ఎం16 అధిపతి మైఖేల్‌ యంగర్‌ పాల్గన్నారు. ఈ సమావేశం గురించి ఆస్ట్రేలియా పత్రిక సిడ్నీ మోర్నింగ్‌ హెరాల్డ్‌ దీన్నొక సాదాసీదా సమావేశంగా వార్తను ప్రచురించింది. ఆ తరువాతే చైనా, రష్యాల మీద పెద్ద ఎత్తున ప్రచార దాడిని ప్రారంభించారు. హువెయి కంపెనీ పరికరాలను కొన వద్దనే ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. కంపెనీ అధికారిణి అరెస్టు దానికొనసాగింపు.జపాన్‌ ప్రభుత్వం, మూడు టెలికాం కంపెనీలు కూడా హువెయి పరికరాల కొనుగోలు నిలిపివేసినట్లు ప్రకటించాయి.

Image result for us china tech war cartoons

ప్రపంచంలో అన్ని దేశాలలో గూఢచర్యం జరిపే అమెరికాకు ఇప్పుడు తన నీడను చూస్తే తానే భయపడుతున్నట్లుగా వుంది. తమ అధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకున్నదన్న ఆరోపణలు దానిలో భాగమే. గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక అన్నట్లుగా ఆధునిక పరికరాలతో గూఢచర్యం ఎలా జరపవచ్చో అమెరికాకు వేరొకరు చెప్పనవసరం లేదు. అవే అస్త్రాలతను తమ మీద కూడా ప్రయోగిస్తున్నారని అది కంగారు పడుతోంది. ఈ రోజు ప్రతి దేశం తన అవసరాల కోసం, ఇతరుల కుట్రల గురించి జాగ్రత్తలు తీసుకొనేందుకు గూఢచర్యం జరపటం సాధారణ విషయం. దానిలో చైనా, మరొక దేశానికి ఎలాంటి మినహాయింపులు వుండవు. ఇప్పుడు అమెరికాలోని టెలికాం కంపెనీలు ఇబ్బందుల్లో వున్నాయి. స్మార్ట్‌ ఫోన్లను అక్కడ తయారు చేయటం లేదు. చైనా ఫోన్లమీదే అమెరికన్లు ఆధారపడుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో డెలాయిట్‌ కన్సల్టింగ్‌ విడుదల చేసిన ఒక నివేదికలో ఐదవ తరం(5జి) నెట్‌వర్క్‌ ఏర్పాటు పరుగులో అమెరికా మీద చైనా విజయం సాధించనున్నది.అమెరికా వెంటనే రంగంలోకి దిగకపోతే భవిష్యత్‌లో నూతన కంపెనీల ఏర్పాటులో తీవ్ర ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించింది. ఈ రంగంలో ముందున్న వారికి వెనుకబడినవారితో పోల్చితే ఎంతో ఆర్ధిక ప్రయోజనం వుంటుందని కూడా వ్యాఖ్యానించింది. ఇంకా అనేక కంపెనీలు ఇలాంటి హెచ్చరికలనే చేశాయి.

రెండుసార్లు సిఐఏ తాత్కాలిక డైరెక్టర్‌గా పని చేసిన మైఖేల్‌ మోరెల్‌ వాషింగ్టన్‌ పోస్టుకు రాసిన వ్యాఖ్యానంలో ఇది వాణిజ్య యుద్దం కాదు, సాంకేతిక యుద్ధం, ఐదవతరం పోటీలో మైలు దూరంలో అమెరికా వెనుకంజలో ఓడిపోతోందని మరింత స్పష్టంగా పేర్కొన్నాడు. అమెరికా అధ్యక్షుడు తరచుగా వాణిజ్య యుద్ధం గురించి చెబుతాడు, నిజానికి అమెరికా సాంకేతికపరమైన ప్రచ్చన్న యుద్దం చేస్తోంది. ఐదవతరం నెట్‌వర్క్‌లతో గతంలో ఎన్నటి కంటే వేగంగా ఎక్కువ సమాచారాన్ని సేకరించవచ్చు, ఈ నెట్‌వర్క్‌ల ద్వారా గూఢచర్యమే కాదు, విద్రోహానికి కూడా పాల్పడవచ్చు, ఈ రంగంలో పై చేయి సాధించిన వారు ఆర్ధికంగా ముందుంటారు, తమ రహస్యాలను పదిలపరుచుకోవటంతో పాటు ఇతరుల వాటిని తెలుసుకోవటంలో ముందుంటారు. వీటన్నింటినీ గమనంలోకి తీసుకున్నపుడు అమెరికా ఆందోళనపడక తప్పదని హెచ్చరించాడు.

ఐదవతరం ఇంటర్నెట్‌ సాంకేతిక పరిజ్ఞానం పరిశోధన, అభివృద్దిలో హువెయి కంపెనీ ఏటా 14బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తూ అమెరికా కంటే ముందున్నది. చైనా మార్కెట్‌ను ఇతర దేశాలకు తెరిచిన సమయంలో అమెరికాకు చెందిన మైక్రోసాప్ట్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, ఐఫోన్‌ వంటి సంస్దలు తమ పరికరాల ద్వారా పెద్ద ఎత్తున చైనా గూఢచర్యానికి పాల్పడ్డాయి. నిజానికి అమెరికన్లు అన్ని దేశాలలో అలాంటి చర్యలకు పాల్పడ్డారు. జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఫోన్‌ వర్తమానాలను దొంగిలించారు. చైనా అధ్యక్షుడు ప్రయాణించే బోయింగ్‌ 737 విమానంలో అమర్చిన రహస్య పరికరాన్ని చైనీయులు తొలగించారు. అమెరికా పరికరాలనే వుపయోగించి ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ అమెరికా రహస్య సమాచారాన్నే పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. చైనా తమ పరిజ్ఞానాన్ని తస్కరిస్తున్నదంటూ పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే ఐదవ తరం పరిజ్ఞానంలో అమెరికా ఎందుకు వెనుకబడిపోయినట్లు? చైనాలో పరిశోధనలు చేయకుండా అది ముందుకు ఎలా పోయినట్లు ? నిజానికిది ప్రచార దాడి తప్ప ఒకసారి తస్కరించినట్లు తేలితే ఏ దేశమైనా జాగ్రత్తలు తీసుకోకుండా వుంటుందా ?

Image result for  us china tech war

గతేడాది అక్టోబరులో చైనా కమ్యూనిస్టు పార్టీ 19వ మహాసభ జరిగింది. మేడిన్‌ చైనా 2025 పేరుతో అది కొన్ని లక్ష్యాలను దేశం ముందుంచింది. దాని కొనసాగింపుగానే అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ అనేక చర్యలను చేపట్టారు. అన్ని రంగాలలో సాంకేతిక పరంగా పై చేయి సాధించాలన్నదే ఆ లక్ష్యాల, చర్యల సారాంశం. అది యుద్ధ ప్రాతిపదిక మీద అమలు జరుగుతోందా సాదాసీదాగా జరుగుతోందా అంటే గత నాలుగు దశాబ్దాల చైనా అభివృద్ధిని చూసినపుడు వారు ఏ లక్ష్యాన్ని సాదాసీదాగా అమలు జరపలేదు. నిర్ణీత వ్యవధిలో లక్ష్యాన్ని చేరేందుకు ప్రతి అంశంలోనూ యుద్ధం మాదిరి పని చేశారు. గతంలో సూపర్‌ కంప్యూటర్లంటే అమెరికా తప్ప మరొకపేరు వినపడేది కాదు. గత రెండు దశాబ్దాల్లో పరిస్ధితి మారిపోయింది. టాప్‌ 500 పేరుతో ఒక సంస్ధ రూపొందించిన సమాచారం ప్రకారం ప్రపంచంలోని 500 వేగవంతమైన కంప్యూటర్లలో 206 చైనా వద్ద, 124 అమెరికా వద్ద వున్నాయి. నాలుగు అగ్రశ్రేణి కంప్యూటర్లలో రెండు చైనా వద్ద వున్నాయి, ఇటీవలనే అమెరికా మూడవదానిని రూపొందించి మొదటి స్దానం తిరిగి పొందింది. పోటీలో నువ్వానేనా అన్నట్లుగా అమెరికా-చైనా వున్నాయి. మైక్రోచిప్స్‌ విషయంలో చైనా ఎంతో వెనుకబడి వుంది. అమెరికా పది తయారు చేస్తే చైనాలో ఒకటి మాత్రమే వుత్పత్తి అవుతోంది. 2025నాటికి అమెరికాతో ఢీకొనేందుకు చైనా 30బిలియన్‌ డాలర్లు కేటాయించింది.ప్రపంచమంతా ఇపుడు కృత్రిమ మేధస్సు గురించి మాట్లాడుతోంది. 2030నాటికి ప్రపంచంలో అగ్రస్ధానంలో వుండేందుకు చైనా 150బిలియన్‌ డాలర్లను కేటాయించి పరిశోధనలను ప్రోత్సహిస్తోంది. ఈ పరిజ్ఞానం రెండంచుల పదును కలది అటు మానవ కల్యాణానికి, వినాశకరమైన మిలిటరీ అవసరాలకు రెండింటికీ వినియోగపడుతుంది. ఐదవ తరం టెలికమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటులో అమెరికా ఇంకా ఆలోచనలోనే వుండగా చైనా దూసుకుపోయి కీలకమైన సాంకేతిక ప్రమాణాలను ప్రపంచం ముందుంచింది. మిగతా ప్రపంచం చైనాను అసుసరించటం తప్ప మేం కూడా వచ్చేంతవరకు మీరు ముందుకు పోవటానికి వీల్లేదంటే కుదరదు. క్వాంటమ్‌ కంప్యూటర్‌ తయారీకి ఇప్పుడు అగ్రరాజ్యాలు పోటీపడుతున్నాయి. దానిలో కూడా చైనా వెనుకబడి లేదు. ఇప్పటికే పది బిలియన్‌ డాలర్లతో పని ప్రారంభించింది. అదే అమెరికా రానున్న ఐదు సంవత్సరాలలో 1.25 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఖర్చు చేయనున్నది. ఈ పూర్వరంగంలో అమెరికా దుష్ట స్వభావం గురించి కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్ధికవేత్త జెఫ్రీ శాచస్‌ సిబిసి టీవీతో చెప్పిన మాటలతో ఈ విశ్లేషణను ముగిద్దాం.

‘ మెంగ్‌ అరెస్టు మరో ప్రచ్చన్న యుద్దానికి నాంది అవుతుంది, అందుకు అమెరికాను కెనడా ప్రేరేపించింది. ఎట్టి పరిస్ధితుల్లో అయినా చైనా ఎదుగుదలను అడ్డుకోవాలని అమెరికా ప్రయత్నిస్తున్నది.ప్రత్యర్ధి ఆర్ధిక ఎదుగుదలను దెబ్బతీసేందుకు తన అధికారాన్ని వుపయోగించే అమెరికా వైఖరి బాగా తెలిసిందే, ఇది చాలా చెడ్డది, ప్రమాదకరమైంది, వాస్తవానికి ప్రపంచానికి మరొక కొత్త ప్రచ్చన్న యుద్ధాన్ని తెచ్చేది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఒప్పందం లేకుండానే బ్రిటన్‌ విడిపోతుందా !

21 Wednesday Nov 2018

Posted by raomk in Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion, UK

≈ Leave a comment

Tags

brexit, brexit deal or no deal, European Union, Theresa May

Image result for brexit deal or no deal

ఎం కోటేశ్వరరావు

తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్న లుబ్దావన్ల ప్రకటనతో కన్యాశుల్కం నాటకం ఏ మలుపులు తిరిగిందీ మనకు తెలిసిందే. ఇప్పుడు ఐరోపా యూనియన్‌(ఇయు)నుంచి విడిపోయిన(బ్రెక్సిట్‌) అనంతర సంబంధాల గురించి తాను కుదుర్చుకున్న ముసాయిదా ఒప్పందానికి పార్లమెంటు ఆమోదం పొందాలని బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆమె ప్రత్యర్దులు ఒప్పందాన్ని తిరస్కరించటం ద్వారా ఎలాంటి ఒప్పందం లేకుండానే ఇయుతో తెగతెంపులు చేసుకోవాలనే కొత్త వాదనను తాజాగా ముందుకు తెస్తున్నారు. దాంతో ఒప్పందం వుంటే ఏమిటి లేకుంటే ఏమి జరుగుతుంది అన్న చర్చ ఇప్పుడు బ్రిటన్‌లో జరుగుతోంది. మరోవైపు బడాకార్పొరేట్‌ లాబీ ఇయు నుంచి బయటకు పోయినా తమ లాభాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకొనే విధంగా ప్రయత్నిస్తున్నది. బ్రిటన్‌లోని వివిధ కమ్యూనిస్టు పార్టీలు బ్రెక్సిట్‌కు అనుకూలంగా రెండు సంవత్సరాల క్రితం ఓటు వేశాయి. ప్రధాన టోరీ, లేబర్‌ పార్టీలలో పునరాలోచన తలెత్తినప్పటికీ విడిపోయే విషయంలో కమ్యూనిస్టుపార్టీలు ఎలాంటి పునరాలోచన చేయటం లేదు. అయితే అక్కడి రాజకీయాలలో వీటి పాత్ర పరిమితం అన్న విషయం తెలిసిందే. పార్టీలోని పచ్చి మితవాదులు ప్రధాని థెరెసా మే మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని చూస్తుండగా మరికొందరు అంతవరకు రాకుండా పార్టీలోనే సభా నాయకురాలిగా విశ్వాసతీర్మానం ఎదుర్కోవాలనే ప్రయత్నాల్లో వున్నారు. మరోవైపు ఒక వేళ ఎలాంటి ఒప్పందం లేకుండా ఇయు నుంచి విడిపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సాంకేతికపరమైన నోటీసుల పేరుతో ప్రభుత్వం అన్ని తరగతులకు సమాచారాన్ని తెలియ చేస్తున్నది. దీంతో ఒప్పందం లేకుండానే బ్రిటన్‌ వేరు పడుతుందా అన్న వూహాగానాలకు తెరలేచింది. ఈ సమస్య చివరకు థెరెసా మే వుద్యోగం వూడగొతుందా? ఆమె ప్రత్యర్ధులు చిత్తవుతారా అనేది వెండితెరపై చూడాల్సిందే. అసలు సమస్య ఏమిటి?

రెండు సంవత్సరాల క్రితం ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలా లేదా అనే అంశంపై ప్రజాభిప్రాయసేకరణ జరిగింది. దాన్నే క్లుప్తంగా బ్రెక్సిట్‌ అని పిలుస్తున్నారు. వెళ్లిపోవాలనే అభిప్రాయానికి మెజారిటీ ప్రజలు అంగీకరించారు. ఇప్పుడు ఎలా వుపసంహరించుకోవాలనే అంశం మీద కూడా మరో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలన్న ప్రతిపాదనలు కూడా వున్నాయి.ఐరోపా యూనియన్‌లో బ్రిటన్‌ చేరటం నుంచి విడిపోవటం, అంతిమంగా ఎలా విడిపోవాలన్నది కూడా వివాదాస్పదం కావటం అంటే ప్రపంచ పెట్టుబడిదారీ వర్గం ఎదుర్కొంటున్న సంక్షోభ తీవ్రతను వెల్లడించటమే. ఎలా విడిపోవాలి అనే అంశంపై కుదుర్చుకున్న ఒప్పందానికి పార్లమెంట్‌లో మెజారిటీ వుందా లేదా అన్నది కూడా సందేహంగా మారింది.మెరుగైన తన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ప్రధాని ప్రకటించిన 24 గంటలు కూడా గడవ ముందే బ్రెక్సిట్‌ మంత్రి, మరొకరు రాజీనామా ప్రకటించి వత్తిడి పెంచారు. స్వపక్షంతో పాటు ప్రతిపక్ష లేబర్‌ పార్టీ కూడా ఒప్పందాన్ని వ్యతిరేకిస్తోంది.

2016 జూన్‌లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 52శాతం మంది ఇయు నుంచి బ్రిటన్‌ బయటకు రావాలని ఓటు వేయగా 48శాతం వుండాలని ఓటు వేశారు. బయటకు వస్తేనే సార్వభౌమత్వాన్ని తిరిగి పొందటం, వలసల విషయంలో భూభాగంపై మరింత అదుపు సాధ్యమని బ్రెక్సిట్‌ మద్దతుదార్లు పేర్కొన్నారు. బయటకు వస్తే ఆరోగ్య పరిరక్షణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేసేందుకు అవకాశం వుంటుందని ఓటర్లను తప్పుదారి పట్టించారు. దశాబ్దాల పాటు యూనియన్‌లో కొనసాగి ఇప్పుడు వుపసంహరించుకుంటే అనూహ్య సమస్యలు తలెత్తుతాయని సమర్ధకులు పేర్కొన్నారు.నిజానికి ఐరోపా యూనియన్‌లో వున్నప్పటికీ బ్రిటన్‌ కోల్పోయిందేమీ లేదు. మిగతా దేశాలన్నీ తమ కరెన్సీలను రద్దు చేసుకొని యూరోకు మారితే బ్రిటన్‌ తన పౌండ్‌ను అలాగే కొనసాగిస్తోంది. తన స్వంత వడ్డీ రేట్లు,ద్రవ్య విధానాలు, సరిహద్దులలో సందర్శకుల తనిఖీ స్వంత నిబంధనలు అమలు జరుపుతోంది. ప్రజాభిప్రాయ సేకరణ చట్టబద్దమైనది కాదు. పార్లమెంట్‌ అనుమతి లేనిదే వుపసంహరణ ప్రక్రియ ప్రారంభం కారాదని బ్రిటన్‌ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో పార్లమెంట్‌ ఒక చట్టం చేయాల్సి వచ్చింది. ఐరోపా యూనియన్‌ నిబంధన ప్రకారం ఏ సభ్యదేశమైనా బయటకు వెళ్ల దలచుకుంటే ఆర్టికల్‌ 50 అమలు జరపాలని కోరాల్సి వుంది. ఆ మేరకు పరివర్తనా కాల వ్యవధి ముగిసే 2019, మే 29నాటికి ఒప్పందం కుదుర్చుకోవాల్సి వుంది. ఈలోగా గతంలో కుదిరిన ఒప్పందాలు,భవిష్యత్‌ సంబంధాలపై బ్రిటన్‌ -ఇయు మధ్య ఒక ఒప్పందం జరగాల్సి వుంది. ఇప్పుడు ప్రధాని థెరేసా మే దాన్నే ప్రతిపాదించారు.

Image result for brexit deal or no deal cartoons

ఒప్పందానికి కట్టుబడతారో లేదో తేల్చుకోవాల్సింది బ్రిటన్‌ తప్ప బ్రెక్సిట్‌ విషయంలో ఎలాంటి పున:సంప్రదింపులు లేవని ఐరోపాయూనియన్‌ కరాఖండిగా చెప్పింది. పరివర్తన కాల వ్యవధి పొడిగింపు, అస్పష్టంగా వున్న కొన్ని అంశాల గురించి సంప్రదింపులు తప్ప ప్రధాన మార్పులకు అవకాశం లేదని ఐరోపా యూనియన్‌ స్పష్టం చేసింది.యూనియన్‌ చర్చల ప్రధాన ప్రతినిధి మైఖేల్‌ బార్నియర్‌ విలేకర్లతో మాట్లాడుతూ బ్రిటన్‌లో రాజకీయ పరిస్ధితి ఎలా వున్నప్పటికీ ఇయు రాయబారులెవరూ వారితో విడిగా మాట్లాడవద్దని కోరారు. అనేక మంది ఐరోపా నేతలు బ్రిటన్‌ ప్రధాని వైఖరికి మద్దతుగా మాట్లాడటం విశేషం. వారిలో ఆస్ట్రియన్‌ ఛాన్సలర్‌ సెబాస్టియన్‌ కర్జ్‌ ఒకరు. ఒప్పందంలో ఎలాంటి మార్పులు చేయవద్దని డచ్‌ ప్రధాని మార్క్‌ రూటే వ్యాఖ్యానించారు. యూనియన్‌ నుంచి బయటకు వస్తే బ్రిటీష్‌ పౌరులకు బంగారు భవిష్యత్‌ వుంటుందని అక్కడి బాధ్యతారహితమైన అనేక మంది రాజకీయ నాయకులు జనానికి చెప్పారు, నిజం ఏమిటంటే ఆ నిర్ణయం వారికి కాళరాత్రి అవుతుంది అని ఫ్రెంచి మంత్రి వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది మార్చి 29లోగా ఒప్పందం కుదరకపోతే వెంటనే సంబంధాలు రద్దవుతాయి. ఎలాంటి పరివర్తన వ్యవధి వుండదు.

బ్రిటన్‌లో టోరీ లేదా లేబర్‌ పార్టీగానీ రెండూ మౌలికంగా పెట్టుబడిదారీ వర్గప్రతినిధులే.అయినా వాటి మధ్య అధికారం విషయంలో తగాదాలున్నాయి.వివరాలు వెల్లడైన మేరకు ఒక అభిప్రాయం ప్రకారం ఆ ఒప్పంద సారాంశాన్ని చెప్పాలంటే కార్పొరేట్‌, ఇతర ధనికుల ప్రయోజనాలను రక్షించేదిగా, వలస వచ్చే వారి మీద దాడి చేసేదిగా వుంది. గతంలో బ్రిటన్‌ తీసుకున్న నిర్ణయం ప్రకారం వచ్చే ఏడాది మార్చినెలాఖరుకు ఐరోపా యూనియన్‌(ఇయు) నుంచి బయటకు వస్తుంది. ఆ తరువాత 21నెలల పాటు పరివర్తన కాలం వుంటుంది. ఆ సమయంలో అనేక ఐరోపా స్వేచ్చా మార్కెట్‌ నిబంధనలు వర్తించే కస్టమ్స్‌ పన్నుల పరిధిలో బ్రిటన్‌ వుంటుంది. తరువాత ఏమిటన్నది సమస్య. తరువాత కూడా కార్పొరేట్‌, ధనికులకు వుపయోగపడే విధంగా బ్రెక్సిట్‌ ఒప్పంద అంశాలను రూపొందించాలన్న వత్తిడి మేరకు బ్రెక్సిట్‌ ఒప్పంద అంశాలను పొందుపరిచారన్నది ఒక అభిప్రాయం.పరివర్తన వ్యవధిలో బ్రెక్సిట్‌ అనంతర సంబంధాలపై బ్రిటన్‌-ఇయు మధ్య ఒప్పందం కుదరకపోతే పరివర్తన కాలం పొడిగింపు వుంటుంది. అంటే యూనియన్‌ నుంచి బయటకు వెళ్లిన తరువాత కూడా బ్యాంకింగ్‌, రవాణా, పౌరసేవల వంటి అంశాలలో బ్రిటన్‌కు కూడా ఇయు సభ్యదేశాలతో సమాన అవకాశాలు కల్పించాలన్నది బ్రిటన్‌ కార్పొరేట్ల డిమాండ్‌. పరివర్తన కాలం ముగిసిన తరువాత బ్రిటన్‌లో వున్న దాదాపు 30లక్షల మంది ఇయు వలస పౌరులు అక్కడే వుండేందుకు తమకు అవకాశం ఇవ్వాలని బ్రిటన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఐదేండ్లనుంచి వుంటున్నట్లు రుజువు చేసుకున్నవారు అక్కడే స్ధిరపడిన స్ధితిలో కొనసాగవచ్చు. ఇదే నిబంధన ఇయు దేశాలలో వున్న బ్రిటన్‌ వలస పౌరులకు కూడా వర్తిస్తుంది.ఐరోపా యూనియన్‌ విధానాలను బట్టి ఇతర దేశాల వాసులు స్ధిరపడిన స్ధితిని బ్రిటన్‌ సర్కార్‌ రద్దు కూడా చేయవచ్చు. ఆర్ధికంగా సంపాదన లేని వారు తమ కుటుంబసభ్యులకు భారంగా లేమని తమకు తగినన్ని ఆర్ధిక వనరులు, సమగ్ర ఆరోగ్యబీమా వుందని రుజువు చేసుకోవాల్సి వుంది. వలస వచ్చిన వారికి బీమా సౌకర్యాన్ని వర్తింప చేయకూడదనే వత్తిళ్లు ఇప్పటికే వున్నాయి.వివాహ బంధంలో విడిపోయినపుడు భరణం చెల్లించటం గురించి తెలిసిందే.అలాగే విడిపోవాలని బ్రిటనే కోరుకుంది గనుక పరిహారంగా ఇయుకు 50బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి వుంటుంది.

పాలక టోరీ పార్టీలో బ్రెక్సిట్‌ ఒప్పందం మీద భిన్నాభిప్రాయాలున్నాయి. అది చివరకు ఇద్దరు మంత్రుల రాజీనామా, ప్రధానిపై అవిశ్వాసతీర్మానం పెట్టాలనేంతవరకు దారితీశాయి. ఇయు నుంచి వెళ్లిపోవాలని గట్టిగా పట్టుబడుతున్నవారు పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలని, వాణిజ్యం నుంచి వలసలు, వుత్పత్తుల క్రమబద్దీకరణ వరకు అన్నింటికీ బ్రిటీష్‌ చట్టాలు తప్ప ఇయు చట్టాలతో సంబంధం వుండకూడదని చెబుతున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్నవారు బ్రిటన్‌-ఇయు మధ్య కొన్ని సంబంధాలను కానసాగించాలని, పూర్తిగా తెగతెంపులు చేసుకుంటే దేశ ఆర్ధిక వ్యవస్ధకు, రాజకీయ స్ధిరత్వానికి విపత్కరమని వాదిస్తున్నారు. ఇలాంటి అభిప్రాయాలే ప్రతిపక్ష లేబర్‌ పార్టీలోనూ వున్నాయి.బ్రెక్సిట్‌ తరువాత కూడా ఇయు కస్టమ్స్‌ యూనియన్‌లో బ్రిటన్‌ కొనసాగేందుకు వీలైన అంశం థెరేసా మే ఒప్పందంలో వుంది. ఐర్లండ్‌ అంతర్యుద్ధంలో వుత్తర ఐర్లండ్‌ ప్రాంతంలో మెజారిటీగా వున్న ప్రొటెస్టెంట్‌లు తాను బ్రిటన్‌లో భాగంగా వుండాలని కోరుకున్నారు. కాథలిక్కులు మెజారిటీ ఐర్లండ్‌లో వుండిపోయారు. రెండు ప్రాంతాల మధ్య సయోధ్యలో భాగంగా 1999లో కుదిరిన గుడ్‌ ఫ్రైడే ఒప్పందం మేరకు ఐర్లండ్‌ – వుత్తర ఐర్లండ్‌ మధ్య సరిహద్దు నిబంధనలు సులభతరంగా వున్నాయి. ఇప్పుడు బ్రిటన్‌ బయటకు పోయిన తరువాత ఐర్లండ్‌ గనుక ఇయు కఠిన నిబంధనలు అమలు జరిపితే అది 1999 ఒప్పందానికి విరుద్ధం అవుతుంది. అందువలన సరిహద్దు నిబంధనలు సులభతరంగా వుండాలని బ్రిటన్‌ కోరుతోంది. ఆ అవకాశాన్ని వినియోగించుకొని బ్రిటన్‌ తన వుత్పత్తులను ఐర్లండ్‌లోకి పంపితే ఎలా అన్నది ఇయు సమస్య.

Image result for brexit deal or no deal

ఐరోపా యూనియన్‌తో కుదుర్చుకోదలచిన ముసాయిదా పత్రంలోని అంశాలను వ్యతిరేకిస్తూ ఇద్దరు మంత్రులు రాజీనామా చేయగా, వారి బదులు మరొక ఇద్దరిని వెంటనే నియమించారు. ఒప్పందం తనకోసం కాదని జాతీయ ప్రయోజనాలకోసమే అని ప్రధాని చెబుతున్నారు. తన ప్రతిపాదనలకు మద్దతు ఇవ్వాలని ప్రధాని థెరెసా మే సోమవారం నాడు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ బ్రిటీష్‌ ఇండస్ట్రీ(సిబిఐ)కివిజ్ఞప్తి చేశారు. ఈ ఒప్పందం వలన తమకు చౌకగా దొరికే కార్మికుల కొరత ఏర్పడుతుందని, తద్వారా తాము నష్టపోతామని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడినట్లు వార్తలు వచ్చాయి.ఒప్పందం కుదురుతుందన్న వార్తలు వెలువడగానే బ్రిటన్‌ కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయం నుంచి వెనక్కు తగ్గుతున్నాయని ఒక కంపెనీ తూర్పు ఐరోపాకు తరలాలని నిర్ణయించినట్లు సిబిఐ ప్రతినిధులు పేర్కొన్నారు. ఒప్పందం లేకుండా బ్రిటన్‌ విడిపోతే 50 బిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించాల్సిన అవసరం వుండదని కొందరు భాష్యం చెబుతుండగా ఒప్పందం వున్నా లేకపోయినా పరిహారం చెల్లించాలని మరికొందరు చెబుతున్నారు.ఈనెల 25న బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఐరోపా యూనియన్‌ నేతలతో ఆమె సమావేశం తరువాత బ్రిటన్‌లో ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో నాయకత్వ మార్పు సమస్యను ముందుకు తెచ్చినంత మాత్రాన జరిగేదేమీ వుండదని, సంప్రదింపులు ఆలస్యమయ్యే కొద్దీ ముప్పు మరింత పెరుగుతుందని ఆమె హెచ్చరించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ మరో వింత పేరే నాలుగో పారిశ్రామిక విప్లవం !

26 Friday Oct 2018

Posted by raomk in Communalism, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

4th industrial revolution, INDIA, Naredra Modi, WEF, WEF 4th industrial revolution

Image result for narendra modi, 4th industrial revolution

ఎం కోటేశ్వరరావు

భాయియోం, బహెనోం దేశాన్ని నాలుగో పారిశ్రామిక విప్లవం 4.0 వైపు నడిపిస్తున్నానంటూ మన ఘనత వహించిన ప్రధాని నరేంద్రమోడీ అక్టోబరు పదకొండవ తేదీన ఒక మహోపన్యాసం చేశారు. ప్రపంచ ఆర్ధిక వేదిక న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. గతంలో రాజీవ్‌ గాంధీ ప్రధానిగా వున్న సమయంలో మాట్లాడితే దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకుపోతానని చెప్పేవారు.ప్రధాని నరేంద్రమోడీ కంటే పక్షం రోజుల ముందే నాలుగున్నరేండ్లయినా రాజధాని శాశ్వత భవనాలను కట్టలేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనకు వెళ్లి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించి వచ్చారు. అంతేకాదు ఐక్యరాజ్యసమితిలో చేసిన ఒక వుపన్యాసంలో ఒక రూపాయి పెట్టుబడి అవసరం లేని ‘ఆవు’ వ్యవసాయం గురించి కూడా ప్రపంచానికి వివరించి వచ్చారు. నాలుగోపారిశ్రామిక విప్లవంలోని ప్రధాన అంశాలలోని ఐటి, బయోటెక్నాలజీ నిపుణులు కూడా వాటిని పక్కన పడేసి ఆవు వ్యవసాయానికి పూనుకొని అంతకంటే ఎక్కువ ఆదాయం సంపాదించాలని సలహా కూడా ఇచ్చివచ్చినట్లు మనం వార్తలు చదువుకున్నాం. ఒకే నోటితో పరస్పర విరుద్ధ అంశాలు మాట్లాగల నేర్పరులు కొందరు రాజకీయవేత్తలు. అసలు నాలుగో పారిశ్రామిక విప్లవం అంటే ఏమిటి? అందుకు మన దేశంలో పరిస్ధితులు అనువుగా వున్నాయా?

నాలుగో పారిశ్రామిక విప్లవం గురించి తెలుసుకొనే ముందు మన దేశంలో మొదటి మూడు విప్లవాలు జరిగాయా, ఎంతవరకు అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. వుట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా- వుట్టి కొట్టలేనయ్య ఆకాశాన్ని అందుకుంటాడా ! మొదటి విషయం ఏ విప్లవం అయినా ఒక రోజులో లేదా ఒక తేదీనో ప్రారంభం కాదు, ముగియదు. ప్రధమ సోషలిస్టు విప్లవం రష్యాలో 1917 అక్టోబరు ఏడున జరిగింది అని చెబుతాం. దానర్ధం ఆ రోజు విప్లవపరిణామలు ఒక మలుపు తిరిగి మరోపరిణామానికి నాంది పలికింది అని తప్ప విప్లవం జయప్రదమైందని కాదు. అలాగే పాఠాల్లో మనం చదువుకొనే పారిశ్రామిక విప్లవం కూడా అలాంటిదే. ఒక తేదీ ఏమీ లేదు.1760 నుంచి 1820-40సంవత్సరాల మధ్య కాలంలో అంతకు ముందున్న వుత్పాదకపద్దతులు అంటే చేతితో తయారు చేసే ప్రక్రియలో యంత్రాలను ప్రవేశపెట్టటం, వాటిని నడిపేందుకు ఆవిరిని వుపయోగించటం, రసాయనాల తయారీ వంటి పరిణామాలన్నీ ఆ 80సంవత్సరాల కాలంలో బాగా అభివృద్ధి చెందాయి. రెండవ పారిశ్రామిక విప్లవకాలంలో అంటే 1870-1914 సంవత్సరాల మధ్య కాలంలో అంతకు ముందున్న పరిశ్రమలను కొనసాగించటం, కొత్తవాటిని ఏర్పాటు చేయటంతో పాటు ఆవిరి స్ధానంలో యంత్రాలను నడిపేందుకు విద్యుత్‌ వినియోగం, చమురును కనుగొనటం, వాటితో వుత్పత్తిని ఇబ్బడి ముబ్బడి చేయటం వంటి పరిణామాలు జరిగాయి. ఆ తరువాత నుంచి 1980, నేటి వరకు జరిగిన సాంకేతిక అభివృద్ధిని మూడవ పారిశ్రామిక విప్లవంగా పిలుస్తున్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం ఎప్పుడు ప్రారంభమైందో చెప్పుకొనే ముందు దీని ప్రధాన లక్షణాలను చెప్పుకోవాల్సి వుంది.రోబోలు, కృత్రిమ మేథ, డిజిటల్‌, నానో టెక్నాలజీ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, బయోటెక్నాలజీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌,3డి ప్రింటింగ్‌, డ్రైవర్‌తో పని లేకుండా నడిచే వాహనాల వంటివి దీనిలో వున్నాయి. ప్రపంచ ఆర్ధిక వేదిక(అదే మన చంద్రబాబు నాయుడు సిఎంగా వున్నపుడు ప్రతి సంవత్సరం దవోస్‌ వెళ్లి వస్తుంటారు. ఎందుకు వెళతారో, దాని వలన రాష్ట్ర ప్రజలకు చేతి చమురువదలటం తప్ప సాధించిందేమిటో ఇంతవరకు మనకు తెలియదు)ను ఏర్పాటు చేసిన ప్రొఫెసర్‌ క్లాస్‌ ష్కవాబ్‌ నాలుగో పారిశ్రామిక విప్లవం అనే ఒక పుస్తకాన్ని రాశారు. మిగతా మూడు విప్లవాలం కంటే ఆధునాత సాంకేతిక పరిజ్ఞానమే నాలుగోదాని ప్రత్యేకత అంటారు. ఈ పరిజ్ఞానంతో వందల కోట్ల జనం ఇంటర్నెట్‌ వెబ్‌తో అనుసంధానం అవుతారని, వాణిజ్య, ఇతర సంస్ధల సామర్ధ్యం గణనీయంగా పెరుగుతుందని, మెరుగైన సంపదల యాజమాన్య పద్దతులతో సహజపర్యావరణాన్ని తిరిగి సృష్టించేందుకు తోడ్పడవచ్చునని చెప్పారు.2016లో జరిగిన ప్రపంచ ఆర్ధిక వేదిక వార్షిక సమావేశ ఇతివృత్తానికి ‘నాలుగవ పారిశ్రామిక విప్లవంలో సంపూర్ణత సాధన’ అని నామకరణం చేశారు. ఈ పద ప్రయోగం ఇదే మొదటి సారి. అదే ఏడాది అక్టోబరు పదిన శాన్‌ ఫ్రాన్సిస్‌కో నగరంలో నాలుగవ పారిశ్రామిక విప్లవ కేంద్రం పేరుతో విప్లవ పరిణామాలను అధ్యయనం చేయటానికి, సలహాలు ఇవ్వటానికి ఒక సంస్ధను ఏర్పాటు చేశారు. రెండు సంవత్సరాల తరువాత మన దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రపంచ ఆర్ధిక వేదిక ఆధ్వర్యాన ఏర్పాటుచేసి అలాంటి కేంద్రానికే అక్టోబరు 11వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభోత్సవం చేశారు.

Image result for narendra modi, 4th industrial revolution cartoons

ఆ రోజు మోడీగారు చెప్పిందాని సారాంశం ఇలా వుంది. మొదటి, రెండవ పారిశ్రామిక విప్లవాలు జరిగే నాటికి భారత దేశం స్వతంత్రంగా లేదు. మూడవది జరిగిన సమయంలో అపుడే వచ్చిన స్వాతంత్య్రంతో ఎదురైన సవాళ్లను ఎదుర్కొనేందుకు కుస్తీలు పడుతోంది. ఇప్పుడు నాలుగవ పారిశ్రామిక విప్లవానికి పెద్ద ఎత్తున దోహదపడుతుంది. సాంకేతిక పురోగతితో వుపాధి నష్టం జరుగుతుందని భయపడనవసరం లేదు, వుద్యోగాల స్వభాన్నే మార్చివేస్తుంది, మరిన్ని అవకాశాలను పెంచుతుంది.దీని ఫలితాలను పొందేందుకు అవసరమైన విధానపరమైన మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుంది. ప్రపంచ పరిశోధన మరియు అమలు కేంద్రంగా మారేందుకు అవసరమైన అవకాశాలు భారత్‌లో వున్నాయి. ఇంతకు ముందు వచ్చిన విప్లవాలు భారత్‌ను ఏమార్చాయి, నాలుగో విప్లవానికి భారత్‌ వంతు విస్మయకారిగా వుంటుంది.

ఇలా సాగిన వుపన్యాసంతో పాటు పనిలో పనిగా తన ప్రభుత్వం సాధించిన ఘనత గురించి కూడా చెప్పుకున్నారనుకోండి. తమ కారణంగానే టెలిఫోన్‌ సాంద్రత 93శాతానికి పెరిగిందని, 50కోట్ల మంది మొబైల్‌ ఫోన్లు వాడుతున్నారని, ప్రపంచంలో అత్యధికంగా మొబైల్‌ డాటా వాడుతున్నారని తక్కువ రేట్లకు దొరుకుతోందని, వినియోగం నాలుగు సంవత్సరాలలో 30రెట్లు పెరిగిందని, 120 కోట్ల మందికి ఆధార కార్డులు ఇచ్చామని, తాను అధికారంలోకి వచ్చిన 2014నాటికి కేవలం 59 గ్రామాలకు ఆప్టిక్‌ ఫైబర్‌ లైన్లు వుంటే త్వరలో రెండున్నర లక్షలకు చేరనున్నాయని చెప్పుకున్నారు. ఇది కూడా మరొక అర్ధ. అసత్యం. నేషనల్‌ ఆప్టికల్‌ ఫైబర్‌నెట్‌ వర్క్‌(నోఫెన్‌) అనే కేంద్ర ప్రభుత్వ పధకానికి 2011లో అనుమతి ఇచ్చారు.దీన్నే డిజిటల్‌ ఇండియా పేరుతో ఏదో తానే ప్రారంభించినట్లు మోడీ గొప్పలు చెప్పుకుంటారు. ఆ పధక కార్యాచరణ ప్రణాలిక ప్రకారం 2012 అక్టోబరు నాటికి రాజస్ధాన్‌,ఆంధ్రప్రదేశ్‌, త్రిపుర రాష్ట్రాలలోని 59గ్రామాలలో పైలట్‌ పధకాన్ని అమలు చేయాలి. 2014 మార్చి, 2015 మార్చి నాటికి ఏటా లక్ష చొప్పున రెండులక్షల గ్రామాలకు, 2015సెప్టెంబరు నాటికి 50వేల గ్రామాలకు ఆ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. అయితే ఆ లక్ష్యాన్ని 2016 డిసెంబరు వరకు పొడిగించారు. మోడీగారు చెప్పినట్లే గడువు తీరి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికి లక్ష గ్రామాలకే విస్తరించింది. తన అసమర్ధపాలనలో ఎప్పటికి పూర్తవుతాయో మోడీగారు చెబితే నిజాయితీగా వుండేది. నాలుగున్నర సంవత్సరాలలో లక్షగ్రామాలకు కూడా నెట్‌ వర్క్‌ విస్తరించలేదు, ఏర్పాటు చేసింది కూడా ఎంత వేగంతో పని చేస్తుందో తెలియని స్ధితిలో మోడీగారు మనకు డిజిటల్‌ విప్లవం గురించి చెబుతారు, నాలుగవ పారిశ్రామికవిప్లవంలో భాగస్వాములను చేస్తామంటున్నారు.

డిజిటల్‌ టెక్నాలజీ ఎంతో ప్రయోజనకారి అన్నది వాస్తవం. అన్న ప్రాసన నాడే ఆవకాయ అన్నట్లుగా, మెట్లు ఎ్క కుండానే మేడ ఎ్కవచ్చు అన్నట్లు అభివృద్ధిలో మిగతాదేశాలు అధిగమించిన దశలను మనం దాటకుండానే ఒక గెంతువేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని అందుబాటులోకి తెచ్చుకోవచ్చని, అభివృద్ధి చెందిన దేశాలలో అందుబాటులోకి వచ్చినవన్నీ మన కోసం కూడా సిద్దంగా వున్నాయని, అసలు ఇప్పటికే మనం ఆ దశలో ప్రవేశించిన విషయాన్ని అనేక మంది గుర్తించటం లేదని కొందరు చెబుతునాారు. వుపాధిని ఫణంగా పెట్టి ప్రవేశపెట్టే యాంత్రీకరణ సామాన్యులకు మేలు చేస్తుందా? ఎలా చేస్తుంది అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పే పెట్టుబడిదారులు లేరు. అమెరికా, ఇతర అనేక దేశాలలో యాంత్రీకరణ ఎంతో ఎక్కువ, దాని వలన కార్పొరేట్లకు లాభాలు పెరిగాయి తప్ప అదనంగా వుత్పత్తి అయిన సంపదలో జనానికి దక్కిన వాటా ఎంత? అక్కడ ఆర్ధిక అసమానతలు భరించరాని విధంగా పెరిగాయని పెట్టుబడిదారీ మేథావి అయిన థామస్‌ పికెటీ చెప్పిన విషయాన్ని ఎలా మరచిపోగలం.ఇప్పటికే వుపాధిరహిత అభివృద్ధి జరుగుతోంది. పని చేసే జనం తక్కువగా వున్న దేశాలకు ఆటోమేషన్‌ లేదా రోబోలు అవసరం గావచ్చు. ఏటా కోటీ ఇరవై నుంచి కోటీ 30లక్షల మంది వరకు యువత తమకు వుపాధికావాలని వస్తున్న మన దేశంలో మన పరిశ్రమలలో వాటిని ప్రవేశపెడితే జరిగేదేమిటి? బెంగలూరులోని కెనరా బ్యాంకులో కన్నడం మాట్లాడే ఒక రోబో ఏ కౌంటర్‌కు వెళ్లాలో కస్టమర్లకు చెబుతుందట. సదరు బ్యాంకుకు వచ్చే కస్టమర్లకు ఏ కౌంటర్‌ ఎక్కడుందో తెలిపే సూచనలు ప్రదర్శిస్తే సరిపోయేదానికి గొప్పలు చెప్పుకోవటానికి గాకపోతే ఎంతో ఖర్చు పెట్టి రోబోను పెట్టాల్సిన అవసరం ఏముంది? కన్నడేతరులు వస్తే ఏ భాష రోబో దగ్గరకు వెళ్లాలి.

మన దేశంలో ఆటోమేషన్‌ జరిగితే ఇప్పుడున్న ప్రతి నాలుగు వుద్యోగాలకు ఒకటి పోతుందని ఒక అంచనా. శ్రమశక్తి మీద ఆధారపడిన పరిశ్రమలు,వ్యవసాయం, వృత్తులు మిగతా దేశాలతో పోల్చితే చాలా ఎక్కువ వున్న మన దేశంలో ఇంకా అంతకంటే ఎక్కువే పోయినా ఆశ్చర్యం లేదు. మూడు సంవత్సరాల క్రితం ప్రపంచ ఆర్ధిక వేదిక రూపొందించిన ఒక నివేదిక ప్రకారం నాలుగో పారిశ్రామిక విప్లవం ప్రపంచవ్యాపితంగా వుపాధిని దెబ్బతీస్తుందన్నది నిరాకరించజాలని అంశమని తేలింది. ఆఫీసు,అడ్మినిస్ట్రేషన్‌, వుత్పాదకత, తయారీ, నిర్మాణ రంగాల మీద ప్రభావం చాలా ఎక్కువగా వుంటుంది. కొన్ని పరిశ్రమలను మూతవేయాలి, అనేకాన్ని అవసరాలకు అనుగుణ్యంగా మార్చుకోవాలి. అధునాత వుత్పాదకయంత్రాలు, పద్దతుల వలన వుత్పత్తి ఇబ్బడి ముబ్బడి అవుతుంది, ఆ మేరకు వుపాధిపెరగదు, అంతకు ముందుకంటే తగ్గినా ఆశ్చర్యం లేదు. అందువలన వుపాధి చర్చను పక్కన పెట్టి ముందుకు పోవాలని పెట్టుబడిదారులు సహజంగానే కోరుకుంటారు.ప్రతి పారిశ్రామిక విప్లవం సమాజంలో అసమానతలను పెంచింది తప్ప సంపదల పంపిణీని సమంగా పంచలేదు. సాంకేతిక ప్రగతి పెరిగిన కొద్దీ కొద్ది మంది చేతుల్లో పోగుపడుతున్న సంపదల వాటా కూడా పెరిగిపోతోంది.

Image result for BJP, 4th industrial revolution cartoons

ఎవరు కాదన్నా అవునన్నా మన దగ్గర వున్న కొనుగోలు శక్తి కలిగిన మధ్యతరగతి మార్కెట్‌ను ఎలా సొమ్ము చేసుకుందామా అని చూడటం తప్ప ప్రయివేటు రంగానికి మరొకటి పట్టదు. అదే చైనాలో మధ్యతరగతి మార్కెట్‌ను పెంచటంతో పాటు దిగువన వున్నవారిని కూడా మధ్యతరగతిగా మార్చే విధంగా సంపదల పంపిణీ జరగటమే దాని విజయానికి మూలం. మన జనానికి స్మార్ట్‌ ఫోన్‌ ఇస్తే దానిని ఎంత మంది వినియోగించగలరు అన్నది ప్రశ్నార్ధకంగా వున్న తరుణంలో అంతకు మించిన పరిజ్ఞానంతో ప్రమేయం వుండే నాలుగోపారిశ్రామిక విప్లవం గురించి మాట్లాడుకుంటున్నాం. దేశంలోని గ్రామాలన్నింటినీ విద్యుదీకరించామని నరేంద్రమోడీ ఘనంగా ప్రకటించిన వారం తిరగక ముందే 125కోట్ల మంది జనాభా వున్న భారత్‌లో 15శాతం మందికి(అంటే21కోట్ల మందికి) విద్యుత్‌ అందుబాటులో లేదని ప్రకటించింది. వారికి సెల్‌ఫోన్లు ఇచ్చినా ఛార్జింగ్‌ చేసుకోలేరు. ఈ ఏడాది జనవరి నాటికి మన దేశంలో ఇంటర్నెట్‌ను వినియోగించేవారు నూటికి 26శాతం మందే వున్నారట. ప్రస్తుతం మన దేశానికి ఏటా వచ్చే ఆదాయం ఒక రూపాయి అనుకుందాం. దానిలో వ్యవసాయరంగంలో వున్న 51శాతం కార్మికుల నుంచి 12పైసలు, 22శాతం మంది పని చేస్తున్న పారిశ్రామిక రంగం నుంచి 28, సేవారంగాలలో పని చేస్తున్న 27శాతం మంది నుంచి 60పైసల ఆదాయం వస్తోందని లెక్కలు చెబుతున్నాయి. మన జిడిపిలో 60శాతం సేవారంగం నుంచి వుండటం ఒక అస్ధిరతకు సూచిక. పశ్చిమ దేశాల ఆర్ధిక స్ధితిపై ఆధారపడి ఐటి, పొరుగుసేవల ఆదాయం వుంటుంది. అవి సజావుగా వున్నంత వరకు ఇబ్బంది లేదు, దెబ్బతింటే మనమూ నష్టపోతాం. చైనా విషయానికి వస్తే వ్యవసాయం నుంచి 2017లో 7.9శాతం, పరిశ్రమల నుంచి 40.5, సేవారంగం వాటా 51.6శాతం వుంది. ప్రపంచ పారిశ్రామిక కేంద్రంగా పేరుపొందిన చైనా మాదిరి మనం కూడా పారిశ్రామిక రంగాన్ని పటిష్టపరుచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.కృత్రిమ మేధస్సు అంటే ఆటోమేషన్‌ యంత్రాలు, రోబోలు రానున్న దశాబ్దంలో 20శాతం వుద్యోగాలను హరించనున్నాయని అంచనా. టాక్సీ డ్రయివర్లు, చేపలు పట్టటం, బేకరీ, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాలలో అయితే 80-90శాతం వుద్యోగాలు పోతాయని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆటోమేషన్‌, రోబోలతో పనులు చేయించేందుకు అవసరమైన అత్యున్నత నైపుణ్యం కలిగిన కొద్ది మందికి డిమాండ్‌ వుంటుంది.గతంలో దేశం నీకేమిచ్చిందనే కంటే దేశానికి నీవేమిచ్చావనేది దేశభక్తి అని నూరిపోశారు. ఇప్పుడు పెద్ద మొత్తంలో వుద్యోగాలు హరించే అవకాశాన్ని ముందుగానే తెలిసిన పెట్టుబడిదారీ మేథావులు మనకు వుద్యోగభద్రత కంటే నైపుణ్యం ముఖ్యమని చెబుతున్నారు.

మన నరేంద్రమోడీగారు 2022 నాటికి(చాలా మంది ఈ సంవత్సరం ఎందుకు అని అడుగుతున్నారు అప్పటికి మన స్వాతంత్య్రానికి 75ఏండ్లు నిండుతాయి) రైతాంగ ఆదాయాలు రెట్టింపు చేస్తామని వూదరగొడుతున్నారు. అదే సంవత్సరానికి మన పరిశ్రమల్లో సాంకేతిక పరిజ్ఞానం వుపయోగించటం గురించి కూడా లక్ష్యాలను నిర్ణయించింది.మనలో చాలా మందిమి కార్లు,బస్సులను గడిగేందుకు మనుషుల బదులు యంత్రాలను వాడటం చూసి వుంటాము. పరిశ్రమల్లో పని చేసే ప్రతి వేల మంది కార్మికులకు ఎన్ని పారిశ్రామిక రోబోలు వున్నాయనే అంశాన్ని రోబో సాంద్రత అని పిలుస్తున్నారు. 2016లెక్కల ప్రకారం ప్రపంచ రోబో సాంద్రత సగటు 74. మన దేశంలో మూడు, అత్యధికంగా దక్షిణ కొరియాలో 631. సింగపూర్‌ 488,జర్మనీ 309, జపాన్‌ 303, అమెరికా 198,బ్రిటన్‌ 71, చైనా 68, బ్రెజిల్‌ 10, రష్యా 3తో వుంది. మన దేశంలో ఏటా 24శాతం పెంచుకుంటూ పారిశ్రామిక రోబోలను మన పారిశ్రామికవేత్తలు దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో మొత్తంగా రోబో సాంద్రత మూడే అయినప్పటికీ ఆటోమొబైల్‌ రంగంలో అది 58గా వుంది. అంటే మన రాష్ట్ర ప్రభుత్వాలు పోటీబడి రాయితీలు ఇచ్చేది రోబోల ఏర్పాటుకు తప్ప కార్మికులకు వుపాధి కల్పించేందుకు కాదు.

ఆధునిక యంత్రాలు, కంప్యూటర్లు, రోబోల మీద పని చేసే నిపుణులైన మానవశ్రమ శక్తి తప్ప కండలను కరగించే శారీరక శ్రమ చేసే వారు కాదని పెట్టుబడిదారీ ప్రతినిధులైన ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ ఎప్పుడో గుర్తించాయి. అలాంటి వారిని తయారు చేయాలంటే ధనిక దేశాలలో ఎంతో ఖర్చు అవుతుంది. కనుక మన వంటి దేశాలలో ఇంజనీరింగ్‌,మెడికల్‌ కాలేజీలను ఇబ్బడి ముబ్బడిగా పెట్టాలని సలహాయిచ్చి చౌకగా దొరికే ఇంజనీర్లను తయారు చేయాలని కోరింది. దాని ఫలితమే చెట్టుకొకటి పుట్టకొకటిగా వెలిసిన ఇంజనీరింగ్‌ కాలేజీలు. మన విద్యావ్యాపారులు కొన్ని చోట్ల కొందరు నిపుణులను తయారు చేస్తున్నప్పటికీ అత్యధికులకు నైపుణ్యం తప్ప సర్టిఫికెట్‌లు ఇచ్చి జనాన్ని మార్కెట్లోకి తోలుతున్నాయి. వారి ప్రతిభా, ప్రావిణ్యాల గురించి 2017లో యాస్పరింగ్‌ మైండ్స్‌ అనే సంస్ధ ఒక సర్వే చేసి నమ్మలేని నిజాలను వెల్లడించింది. విద్యావ్యాపారులు దాన్ని తోసిపుచ్చగా ఐటి కంపెనీల యజమానులు నిర్ధారించారు.తొంభై అయిదు శాతం ఇంజనీరింగు పట్టభద్రులు సాప్ట్‌వేర్‌ అభివృద్ధి వుద్యోగాలకు పనికి రారన్నది సర్వేసారం. పోనీ అది అతిశయోక్తితో కూడింది అనుకుందాం. పది సంవత్సరాల క్రితం మెకెన్సీ సంస్ధ పాతికశాతం మంది మాత్రమే వుద్యోగాలకు పనికి వస్తారు అన్నది. ఇలాంటి పరిస్ధితికి కారకులు ఎవరు? అన్నింటినీ మాకు వదలి పెట్టండి దేశాన్ని ఎలా ముందుకు తీసుకుపోతామో చూడండి అనే ప్రయివేటు రంగం కాదా ! విద్యావ్యాపారంలో లేని పారిశ్రామిక సంస్ధను ఒక్కదానిని చూపమనండి, ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలో అదే లాభసాటి వ్యాపారం. ఈరోజు ఇంజనీరింగ్‌ చదివి వుద్యోగం పేరుతో పనిచేస్తున్న అనేక మందికి చాలా మంది అడ్డామీది రోజువారీ కూలీకి వస్తున్న మొత్తాలకంటే తక్కువే అన్నది చేదు నిజం. గతంలో విదేశీ తెల్లజాతి మెకాలే తమకు అవసరమైన గుమస్తాలను తయారు చేసే విద్యావిధానం, వ్యవస్ధలను ఏర్పాటు చేస్తే నేటి మన నల్లజాతి మెకాలేలు కారుచౌక ఇంజనీరింగ్‌ గుమస్తాలను సరఫరా చేస్తున్నారు.’ఈ రోజు ఢిల్లీలో 60శాతం మార్కులు తెచ్చుకున్నవారు కూడా బిఏ ఇంగ్లీష్‌ కోర్సు సీటు తెచ్చుకోలేరుగాని ఇంజనీరింగ్‌కాలేజిలో సులభంగా చేరిపోతున్నారని’ టెక్‌ మహీంద్రా సిఇఓ సిపి గుర్నానీ వ్యాఖ్యానించారు. నాలుగో పారిశ్రామిక విప్లవం గురించి చెబుతున్న మన రాజకీయవేత్తలు, విధాన నిర్ణేతలకు ఏ నిపుణులు ఎందరు కావాలో, అందుకు అనుసరించాల్సిన ప్రణాళికలేమిటో ఎవరైనా చెప్పగలరా ? ఇంజనీరింగ్‌,మెడికల్‌ కాలేజీల్లో సంపూర్ణ అర్హతలు కలిగిన బోధకులు వున్నారా, అవసరమైన ప్రయోగశాలలు వున్నాయా లేదా అని ఎవరైనా పట్టించుకుంటున్నారా? వీరు దేశాన్ని నాలుగో పారిశ్రామిక విప్లవంలోకి దేశాన్ని తీసుకుపోతారా? మనం నమ్మేయాలా ?

ఇటీవలి కాలంలో నైపుణ్య అభివృద్ధి గురించి ప్రధాని మోడీ, మాట్లాడని ముఖ్యమంత్రి లేరు. అందుకోసం వందల కోట్లరూపాయలు తగలేస్తున్నారు.నివేదికల్లో అసంఖ్యాకంగా నిపుణులను సృష్టిస్తున్నారు. నరేంద్రమోడీ సర్కార్‌ చర్యల వలన ఇప్పటికే తన ఆదాయం రెట్టింపైందని చత్తీస్‌ఘర్‌కు చెందిన గిరిజన మహిళా రైతు చెప్పిన అంశాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారానికి వాడుకుంది. తీరా చూస్తే అధికారులు తనను అలా చెప్పమన్నారని ఆమె ఒకటీవి బృందానికి చెప్పింది. ఆ వార్తను ప్రసారం చేసిన సదరు ఎడిటర్‌, యాంకర్‌ను వుద్యోగాల నుంచి ఇంటికి పంపే విధంగా మోడీ సర్కార్‌ టీవీ ఛానల్‌ యాజమాన్యంపై వత్తిడి తెచ్చిన వుదంతం తెలిసిందే. అలాంటి వారందరినీ లెక్కలోకి తీసుకున్నా మన దగ్గర వున్న నిపుణులైన పనివారలెందరో చూస్తే దిమ్మదిరుగుతుంది. మన దగ్గర నిపుణులైన పనివారలే తక్కువ, అవసరమైన వృత్తి శిక్షణ ఇచ్చే సామర్ధ్యం కూడా మన దగ్గర లేదని నివేదికలు చెబుతున్నాయి. మొత్తం కార్మికుల సంఖ్యతో పోలిస్తే వృత్తిశిక్షణ సామర్ధ్యం చైనాలో 11.5శాతం కాగా అమెరికాలో 6.7, అదే మన దేశంలో 0.8శాతం మాత్రమే. దేశాల వారీగా దక్షిణ కొరియాలో 96, జపాన్‌లో 80, జర్మనీలో 75, బ్రిటన్‌లో 68శాతం మంది వున్నారు. రెండుశాతమే మన దగ్గర అని చెప్పుకోకపోవటమే మంచిది.

ఒక వైపు ప్రధాని నరేంద్రమోడీ పురోగామి మహోపన్యాసాలు మరోవైపు ఆయన అనుయాయులేమో స్త్రీల రుతుస్రావం అపవిత్రమంటూ వీధుల్లో అల్లరి, దాడులు చేస్తుంటారు. పనిలేని వారు ఏదో చేశారన్నట్లుగా కొందరు అలహాబాద్‌ను ప్రయాగరాజ్‌గానూ, సిమ్లాను శ్యామలాగా మార్చేందుకు, మసీదులను పడగొట్టి గుడులు ఎలా కట్టాలా అని, మరి కొందరు అయ్యప్ప గుడికి వచ్చే మహిళా భక్తులు మీద ఎలా దాడులు చెయ్యాలా అని తిరుగులేని తిరోగామి ఆచరణలో మునిగి తేలుతుంటారు. మోడీ, ఆయన అనుయాయులను తయారు చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ దళం చేస్తున్న వాదనల ప్రకారం రాజారామ్మోహన్‌ రాయ్‌ బ్రిటీష్‌ వారితో చేతులు కలిపి మన పవిత్ర సతీసహగమన ఆచారాన్ని మట్టికలిపారు. వితంతు పునర్వివాహ నిషేధం, బహుభార్యాత్వం, దేవదాసీ వంటి మన హిందూ ఆచారాలు సాంప్రదాయాలను తిరిగి పునరుద్దరించాల్సిందే. అవి లేకుండా పోయిందని చెబుతున్న మన గత గౌరవం, ఘనత తిరిగిరాదు. వాటన్నింటి పునరుద్ధరణ ప్రపంచంలో మరోమారు మన దేశాన్ని వున్నత స్ధానంలో వుంచుతుంది. అందుకుగాను వున్న రాజ్యాంగాన్ని రద్దు చేయాలి. మనువు కంటే ముందే మన ఆచారాలు వున్నాయి గనుక వాటిని క్రోడీకరించటం తప్ప కొత్తగా చేసిందేమీ లేని మనుస్మృతిని తిరిగి ప్రవేశపెట్టాలి. సాంప్రదాయాలు, ఆచారాల పరిరక్షణ పేరిట సామాజిక మాధ్యమం, వీధుల్లో వేస్తున్న వీరంగాలను చూస్తే అంతపనీ చేసినా ఆశ్చర్యం లేదు. అందుకే అంతరకు వచ్చినపుడు ఏం చేయాలో, ఏ వైపున వుండాలో ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే ఆలోచించుకోవటం మంచిది. ఇలాంటి వారి నాయకత్వంలో మహా అయితే కుక్కతోకపట్టుకొని గోదావరి కాక పోతే గత నాలుగేండ్లలో మరింతగా మురికి అయిందని వార్తలు వచ్చిన గంగానదిని ఈదగలమేమోగానీ నాలుగో పారిశ్రామిక విప్లవంలో ప్రవేశించగలమా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

2008 సంక్షోభానికి పదేండ్లు- మరో ముప్పు ముంచుకొస్తోంది !

12 Wednesday Sep 2018

Posted by raomk in Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

2008 financial crisis, 2008 meltdown, Another financial crisis, Collapse of Lehman brothers, Great Depression

Image result for ten years of 2008 financial crisis cartoons

ఎం కోటేశ్వరరావు

2008, ప్రపంచ ధనిక దేశాలలో తలెత్తిన మరొక మహా సంక్షోభానికి పది సంవత్సరాలు. అమెరికాలోని లేమాన్‌ బ్రదర్స్‌ బ్యాంకు 2008 సెప్టెంబరు15న దివాలా ప్రకటన చేయటాన్ని చాలా మంది మరచిపోయి వుంటారు. ప్రపంచ ధనికులు మాత్రం మెలకువగానే వున్నారు. వారిలో ఒకడిగా 92బిలియన్ల సంపదకలిగిన బిల్‌గేట్స్‌ ‘ఎప్పుడు అన్నది చెప్పటం కష్టంగానీ 2008 వంటి మరో సంక్షోభం రావటం తప్పని సరి ‘ అని ఈ ఏడాది మార్చి2న ఒక ఆస్ట్రేలియా మీడియాలో అడిగిన ప్రశ్నకు చెప్పారు. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తిరుగులేని విధంగా తెలిసినట్లే ఒకదాని తరువాత ఒక సంక్షోభం రావటం పెట్టుబడిదారీ విధానంలోనే ఇమిడి వున్న లక్షణం అని గేట్స్‌ వంటి వారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అందుకే తాము మునిగి పోకుండా వుండేందుకు నిరంతరం దారులు వెతుకుతుంటారు. పదేళ్ల నాటి సంక్షోభం దెబ్బకు అమెరికాలో 87లక్షల వుద్యోగాలు హరీమన్నాయి. సంక్షోభం నుంచి కోలుకున్నట్లు చెబుతున్నా ఇప్పటికీ పూర్వపు స్ధితికి చేరుకోలేదు.

ఇప్పటికీ ప్రధాన స్రవంతి మీడియా లేదా వామపక్షాలు మినహా ఇతర రాజకీయ పక్షాలు జనానికి ఇలాంటి వాటి గురించి వాస్తవాలు చెప్పటం లేదు. తప్పుడు నిర్ణయాలు, విధానాలతో దివాలా తీసిన సంస్ధలన్నింటినీ అమెరికా, ఇతర దేశాల పాలకులు ప్రజల సొమ్ముతో రక్షించారు. 1980దశకం నుంచి స్వేచ్చా మార్కెట్‌ విధాన సంస్కరణలను ముందుకు నెట్టటంలో ప్రముఖుడైన అమెరికా ఫెడరల్‌ రిజర్వు(మన రిజర్వుబ్యాంకు వంటిది) మాజీ అధ్య క్షుడైన అలాన్‌ గ్రీన్‌స్పాన్‌ 2008 మేనెలలో ఒకప్రకటన చేస్తూ 2007లో ప్రారంభమైన తనఖా సంక్షోభం మీద వ్యాఖ్యానిస్తూ ‘ ద్రవ్య సంక్షోభంలో అనర్ధం ముగిసింది లేదా త్వరలో ముగియ నుంది’ అన్నాడు. లేమాన్‌ బ్రదర్స్‌ దివాలా ప్రకటన వెలువడగానే తాను చాలా తొందరపడ్డానని, తన స్వేచ్చామార్కెట్‌ సిద్ధాంతంలో లోపాలున్నట్లు గుర్తించానని చెప్పాడు.

2001లో డాట్‌కాం బుడగ పేలటం, మాంద్యం తలెత్తటంతో ద్రవ్య సంస్ధలు లాభాల కోసం కొత్త మార్గాలు వెతికాయి. వడ్డీ రేట్లు తగ్గిపోయి, ద్రవ్యోల్బణం పరిమితమైంది. వడ్డీ రేట్లు తక్కువగా వుండటంతో ద్రవ్య సంస్ధల నిధుల సేకరణ సులభతరం, ఖర్చు తక్కువగావటం,మరిన్ని ఆస్ధుల కొనుగోలుకు, అధిక వడ్డీల కోసం తనఖా వంటి ముప్పుతో కూడిన రుణాలు ఇవ్వటానికి దారితీసింది.2004నాటికి రుణాలు తీసుకున్నవారు విపరీతంగా పెరగటంతో పాటు వాయిదాల చెల్లింపుల సమస్య తలెత్తింది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్లు పెంచింది. ఇండ్ల ధరలు పతనమయ్యాయి. అప్పులు తీర్చాలంటే అందుకోసం కొత్త అప్పులు చేద్దామంటే పుట్టని స్ధితి. తనఖా అంటే అనకాపల్లిలో అయినా అమెరికాలో అయినా వడ్డీ రేటు ఎక్కుగా వుండటంతో పాటు అసలుకు ముప్పు కూడా వుంటుంది. తీర్చగలరా లేదా అనేదానితో నిమిత్తం లేకుండా అధికవడ్డీలకు దురాశ పడిన ఆర్ధిక సంస్ధలు అప్పులు తెచ్చి మరీ అడిగిన ప్రతివారికీ రకరకాల తనఖాలు, షరతులతో గృహ రుణాలు ఇచ్చాయి. కొన్ని సంస్ధలు నేరుగా రుణాలు ఇవ్వక పోయినా ఇతర సంస్ధలు ఇచ్చిన రుణాలను వసూలు చేసుకొనేందుకు వాటిని కొనుగోలు చేశాయి. తీసుకున్న వారికి రుణ చెల్లింపులు భారంగా మారటం, బుడగపేలిపోయినట్లుగా ఇండ్ల ధరలు పతనం కావటంతో రుణాలు తీసుకున్నవారితో పాటు ఇచ్చిన ఆర్ధిక సంస్ధలు, బ్యాంకులు కూడా 2007లో కుప్పకూలాయి. తనఖా పత్రాల విలువ 6.8లక్షల కోట్ల డాలర్లని తేలింది. మన సత్యం కంప్యూటర్స్‌ అసత్య లెక్కలు రాసి కుప్పకూలినట్లుగానే 2008లో లేమాన్‌ బ్రదర్స్‌ లెక్కల బాగోతం బయటపడి దివాలా ప్రకటించింది. గత మూడు సంవత్సరాలుగా అమెరికాలో తిరిగి తనఖా రుణాలు పెరుగుతున్నాయని, మన దేశంతో సహా అనేక చోట్ల ఇస్తున్న గృహ రుణాలు చెల్లింపులో వైఫల్యం తప్పదని అనేక మంది చెబుతున్నారు. లసుగుల గురించి సామాన్యుల కంటే బిల్‌గేట్స్‌ వంటి వారికి ఎక్కువ తెలుసు కనుక వారు చెప్పిన ముప్పు ఏ క్షణంలో అయినా ఎదురు కావచ్చు.

పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఎలాగైనా లాభాలు సంపాదించటానికి ప్రాధాన్యత ఇస్తారు, వాటిలో అప్పు మీద ఆధారపడటం ఒకటి. కాసినో లేదా జూదశాలల్లో జూదాలు నిర్వహించేవారు మనకు కనపడరు. డబ్బు పోగొట్టుకున్నా, ఎప్పుడన్నా సంపాదించినా జూదాలు కాసేవారు, వాటిని నిర్వహించే మధ్యవర్తులే మనకు కనిపిస్తారు.లేమాన్‌ బ్రదర్స్‌ అలాంటి మధ్యవర్తిగా డబ్బు జూదంలో నిలిచింది.దానితో రకరకాల ద్రవ్యలావాదేవీలు జరిపిన ఇతర బ్యాంకులు, ఆర్ధిక సంస్ధల వారు అది ఇచ్చే లాభాలను చూశారు తప్ప రాసే తప్పుడు లెక్కలను గమనించలేక చివరికి మునిగిపోయారు. సంక్షోభం బద్దలు అయింతరువాత బ్యాంకులు బిలియన్లకొద్దీ డాలర్లను నిరర్దక ఆస్ధులుగా ప్రకటించాల్సి వచ్చింది. వ్యక్తిగతంగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకాడాయి. వ్యాపారాలకు కూడా రుణాలు దొరకటం గగనమైంది. వ్యాపారం తగ్గిపోయి దాని ప్రతికూల ప్రభావం ఆర్ధిక వ్యవస్ధ మీద పడింది. పెట్టుబడితగ్గి డిమాండ్‌, వుత్పత్తి తగ్గుదలకు దారి తీసి, వుద్యోగాల రద్దుకు కారణమైంది.మాంద్యం తలెత్తింది.సంక్షోభం అమెరికా నుంచి ఐరోపాకు, ఇతర ప్రాంతాలకూ పాకింది. వెంటనే రంగంలోకి దిగిన అమెరికా సర్కార్‌ పరిస్ధితులు మెరుగుపడిన తరువాత తిరిగి అమ్మే ప్రాతిపదిక మీద 700 బిలియన్‌ డాలర్ల పాకేజితో దివాలా తీసిన సంస్ధల బాండ్లు, ఇతర విలువ పడిపోయిన ఆస్ధులను కొనుగోలు చేసేందుకు పూనుకుంది. మెరుగుపడక పోగా ఇంకా దిగజారటంతో మరో 250 బిలియన్‌ డాలర్లను ఇతర చిన్న సంస్దలలో పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించింది.

మరోవైపున వినియోగాన్ని పెంచేందుకు బ్రిటన్‌ సర్కార్‌ వ్యాట్‌ను 17.5 నుంచి 15శాతానికి తగ్గించింది. అనేక బ్యాంకులకు నిధులు సమకూర్చి నిలబెట్టింది.బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ వడ్డీ రేట్లను 5నుంచి 0.5శాతానికి తగ్గించింది. 2009లో లండన్లో సమావేశమైన జి20 సమావేశం ఆర్ధిక వినాశనాన్ని తగ్గించేందుకు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలోకి 681బిలియన్‌ పౌండ్లను అందించాలని నిర్ణయించింది. బ్రిటన్‌లోని రాయల్‌ స్కాటిష్‌ బ్యాంక్‌(ఆర్‌బిఎస్‌) దివాలా తీసిన వాటిలో ఒకటి. పది సంవత్సరాల తరువాత కూడా అక్కడి జనం దివాలాకు మూల్యం చెల్లిస్తున్నారు. పది సంవత్సరాల తరువాత తొలిసారిగా ఆర్‌బిఎస్‌ తన వాటాదార్లకు గత నెలలో రెండు పెన్నీల డివిడెండ్‌ ప్రకటించింది.( బ్రిటీష్‌ పౌండుకు వంద పెన్నీలు, ఒక పెన్నీ మన 93పైసలకు సమానం). పదేండ్ల క్రితం దివాలా తీసిన సదరు బ్యాంకును నిలబెట్టేందుకు బ్రిటన్‌ సర్కార్‌ 45.5బిలియన్‌ పౌండ్లను అందచేసింది. ఇప్పటి వరకు నాలుగు బిలియన్‌ పౌండ్లు నష్టపోయింది.గతంలో 84శాతంగా వున్న వాటాలను(జనం సొమ్ము) నష్టాలకు విక్రయించి 62శాతానికి తగ్గించుకుంది. ప్రభుత్వం ఆదుకొనేందుకు ఇచ్చిన సొమ్ములో 21బిలియన్‌ పౌండ్లను ఖాతాదారులతో వివాద పరిష్కారాలకు, అపరాధరుసుములు చెల్లించేందుకు బ్యాంకు ఖర్చు ఖర్చు చేసింది.

150 సంవత్సరాల క్రితమే కారల్‌ మార్క్స్‌ వుత్పాదక రంగంలో చేసే పెట్టుబడికి, ద్రవ్య వుత్పత్తుల్లో పెట్టే పెట్టుబడికి వున్న తేదాను వివరిస్తూ బ్యాకింగ్‌ బుడగలు ఎలా పెరుగుతాయో, పేలిపోతాయో పేర్కొన్నారు. మరో సంక్షోభం సంభవించే వరకు పెట్టుబడిదారులు జనానికి ఏదో ఒక ఆశచూపుతూనే వుంటారు. వుత్పాదక రంగంలో తమ పెట్టుబడికి ఆకర్షణీయమైన లాభాలు రానపుడు పెట్టుబడిదారులు తమ సొమ్మును ద్రవ్య మార్కెట్లో పెట్టుబడులుగా పెడతారు. బడా కంపెనీల, దుకాణాల పోటీలో నిలదొక్కుకోలేని అనేక మంది చిన్న మదుపుదారులు దగ్గర మార్గంగా వడ్డీ వ్యాపారాన్ని ఎంచుకోవటం తెలిసిందే. గ్రామాలలో వస్తువ్యాపారం చేసే వారు తమ మిగులును వడ్డీ, తాకట్టు వ్యాపారాలకు మళ్లించటాన్ని మనం చూస్తున్నదే. ద్రవ్య పెట్టుబడి లాభాలు వుత్పాదకరంగం పెట్టుబడిపై ఆధారపడి వుంటాయి. నిజమైన ఆర్ధిక వ్యవస్ధలో సంభవించే మార్పులు ద్రవ్యవ్యాపారంపై ప్రభావం చూపుతాయి. నిజ ఆర్ధిక వ్యవస్ధ ఇబ్బందుల్లో పడితే ద్రవ్య పెట్టుబడి( బ్యాంకింగ్‌) రంగం కుప్పకూలిపోతుంది.

బిల్‌ గేట్స్‌, వారెన్‌ బఫెట్‌ వంటి వారు ఏ క్షణంలో అయినా మరో ద్రవ్య సంక్షోభం రావచ్చని చెబుతున్నారంటే దానికి ప్రాతిపదిక లేకపోలేదు.2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం తరువాత అమెరికా స్టాక్‌ మార్కెట్‌ డౌజోన్స్‌ సూచి 350శాతం పెరగ్గా, వాస్తవ ఆర్ధిక వ్యవస్ధ పెరుగుదల కేవలం 15శాతమే. తెలుగు ప్రాంతాల్లో సప్తగిరి, వుమ్మిడియార్స్‌ నుంచి కరక్కాయల పొడి వరకు అనేక మంది మోసగాళ్లు సగం ధరలకే వస్తువులు, అధిక వడ్డీలు, లాభాల ఆశచూపుతూనే వున్నారు. అలాంటివి ముంచుతాయని తెలిసినా ముందుగా పెట్టుబడి పెట్టి తాము తప్పించుకోవచ్చని ఎవరికి వారు దురాశకు లోనై నష్టపోవటం చూస్తున్నాము. ద్రవ్య పెట్టుబడిలో సంభవించే నష్టాలు ఆయా సంస్ధల యజమానుల కంటే జనాన్ని ఎక్కువగా నాశనం చేస్తున్నాయి. భూగోళంలో ఒక ప్రాంతంలో తలెత్తిన సంక్షోభం దానికే పరిమితం కాదు. ప్రపంచీకరణ పేరుతో ద్రవ్య పెట్టుబడిదారులు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను ముడివేయటంతో తరతమ తేడాలతో ప్రపంచ వ్యాపితంగా ప్రభావం, పర్యవసానాలు పడతాయి.

పది సంవత్సరాల తరువాత నెలకొన్న పరిస్ధితి గురించి మెకెన్సీ సంస్ధ ప్రతినిధి సుసాన్‌ లండ్‌ చెప్పిన అంశాల సారాంశం ఇలా వుంది. ఐరోపా, అమెరికాలోని బ్యాంకులు ఇచ్చిన రుణాల కంటే వాటి దగ్గర వున్న పెట్టుబడి ఎక్కువగా వుంది. దీని అర్ధం అవి మరింత స్ధిరంగా వున్నాయి, భవిష్యత్‌లో తలెత్తే నష్టాలను తట్టుకోగలవు. అయితే వడ్డీ రేట్లు, రుణాలకు డిమాండ్‌ తక్కువగా వుండటం, పెట్టుబడిమీద వచ్చే ఆదాయం తక్కువగా వుండటం బ్యాంకుల అభివృద్ధికి పరిమితులను సూచిస్తున్నాయి. ద్రవ్య సంక్షోభం తరువాత బ్యాంకులకు పెట్టుబడిమీద వచ్చే ఆదాయం సగం తగ్గింది, దీంతో లాభాల కోసం నూతన వాణిజ్య పద్దతుల కోసం కుస్తీ పడుతున్నాయి. పదేండ్ల నాటి సంక్షోభం తరువాత ప్రపంచ రుణ భారం స్ధిరంగా వుండటం లేదా పడిపోవటంగాక 72లక్షల కోట్ల డాలర్లు పెరిగింది.

బ్యాంకుల వంటి ద్రవ్య సంస్ధలను ఇబ్బందుల నుంచి బయటపడవేసేందుకు పాలకవర్గ ప్రభుత్వాలు ఆ భారాన్ని జనం మీదనే మోపుతాయి. పొదుపు చర్యలు, సంక్షేమ పధకాలకు కోత, ప్రభుత్వ ఆస్ధుల విక్రయం, జనం మీద అదనపు పన్నులు ఇలా అనేక రూపాలలో వుంటున్నాయి.పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా కేంద్రీకరణ ముప్పుకు సూచన. గతేడాది ప్రపంచ జిడిపికి 217శాతం ఎక్కువగా అప్పు వున్నట్లు తేలింది. పదేండ్ల నాటి సంక్షోభానికి ముందు కంటే ఇది 40శాతం ఎక్కువ. లేమాన్‌ బ్రదర్స్‌ కుప్పకూలిపోగానే పెద్ద బ్యాంకులు, ద్రవ్య సంస్ధలను చిన్నవిగా చేయాలనే ఆలోచన చేశారు. అయితే మన దేశంతో సహా అనేక చోట్ల పోటీని తట్టుకోవాలంటే పెద్దవిగా వుండాలంటూ కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఎస్‌బిఐలో విలీనం చేసిన విషయం తెలిసిందే. 2007లో అమెరికాలోని బ్యాంకు ఆస్ధులలో 44శాతం కేవలం ఐదింటి చేతిలో వుండగా ఇప్పుడు ఆ మొత్తం 47శాతానికి పెరిగింది. ఒక శాతం మ్యూచ్యువల్‌ ఫండ్‌ సంస్ధల చేతుల్లో 45శాతం స్టాక్స్‌, బాండ్లు, ఇతర ఆస్ధులు వున్నాయి. ఇవిగాక షాడో బ్యాంకులు అంటే తెరవెనుక లావాదేవీలు నిర్వహించేవి కూడా వున్నాయని ఒక నగ్నసత్యం. 2010లో వాటి ఆస్ధుల విలువ 28లక్షల కోట్లయితే ఇప్పుడు హీనాతి హీనంగా లెక్కవేసినా 45లక్షల కోట్ల డాలర్లని చెబుతున్నారు. బ్యాంకుల మీద నియంత్రణలు పెరిగే కొద్దీ ఇలాంటివి ఎక్కువ అవుతుంటాయి. అందువలన వీటిలో ఏ ఒక్కటి మునిగినా పదేండ్ల నాటి సంక్షోభంతో పోల్చితే నష్టం కొన్ని రెట్లు ఎక్కువగా వుంటుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు ఏ రూపంలో సంక్షోభం బద్దలవుతుందో తెలియదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

డాలరు విలువను అమెరికా ఎందుకు తగ్గించదు !

07 Friday Sep 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, USA

≈ Leave a comment

Tags

Currency Value, Donald trump, US Dollar

Image result for donald trump us currency

ఎం కోటేశ్వరరావు

రూపాయి విలువ పతనం మీద ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ వ్యాఖ్యానం చూసినపుడు మాయాబజార్‌ సినిమాలో శశిరేఖ రూపంలో వున్న ఘటోత్కజుడు వివాహ ప్రహసనంలో లక్ష్మణ కుమారుడి పాదాన్ని తొక్కినపుడు నొప్పి పెడుతున్నా ఏడవ లేక నవ్విన దృశ్యం గుర్తుకు రాకమానదు. ఆ సంగతి జనం చూసుకుంటారు వదిలేద్దాం ! గురువారం నాడు రూపాయి విలువ 72.11కి దిగజారి 71.99 వద్ద ముగిసింది. ( ఎన్ని రోజులు ఇలా జరుగుతుందో తెలియదుగానీ దాదాపు రోజూ జరుగుతున్నదానికి వరుసగా కొత్త రికార్డులంటూ రాసి రాసి చదువరులకు బోరు కొట్టించదలచుకోలేదు.) మన రూపాయి లేదా చైనా యువాన్‌ విలువ పతనమైతే ఎగుమతులు పెరుగుతాయి కదా అలాగే అమెరికా కూడా తన డాలరు విలువను తగ్గించుకొని ఎగుమతులు పెంచి వాణిజ్య లోటును ఎందుకు తగ్గించుకోకూడదు అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది.

2008లో ప్రారంభమైన తీవ్ర ఆర్ధిక మాంద్యం, చైనా నుంచి దిగుమతుల కారణంగా కోల్పోయిన వుద్యోగాలను తిరిగి కల్పించేందుకు డాలరు విలువ తగ్గించాలన్న వూహలతో అధికారానికి వచ్చాడు డోనాల్డ్‌ ట్రంప్‌. అయితే అది ఎంత నష్టదాయకమో వెంటనే తెలిసి వచ్చింది. రాబోయే రోజుల్లో ఏం జరిగి పరిణామాలు ఎలా వుంటాయో చెప్పలేము గాని ప్రపంచంలో ఇప్పుడొక వినూత్న పరిస్ధితి ఏర్పడిందని చెప్పక తప్పదు.

ప్రపంచంలో అమెరికా ఎంత పెద్ద ధనిక దేశమో దానికి అప్పులు కూడా అంత ఎక్కువగా వున్నాయి. మొత్తం అప్పు19.19లక్షల కోట్ల డాలర్లు.దానిలో విదేశీ అప్పు 5.35 లక్షల కోట్ల డాలర్లు వుంది. డాలరు విలువ తగ్గితే అప్పులు పెట్టిన వారందరూ గగ్గోలు పెడతారు. అప్పులిచ్చిన విదేశాలలో చైనా 1.1877లక్షల కోట్లతో ప్రధమ స్ధానంలో వుండగా జపాన్‌ 1.0435 లక్షల కోట్లు, ఐర్లండ్‌ 317.9 బిలియన్‌ డాలర్లతో మూడో స్ధానంలో వుంది. మన విదేశీ అప్పు 500 బిలియన్‌డాలర్లకు మించి వుంది. అయితేనే మనం కూడా అమెరికాకు 157 బిలియన్‌ డాలర్ల అప్పిచ్చి 11వ స్ధానంలో వున్నాం.(అరవై వేల జనాభాగల కేమాన్‌ దీవులు 242.9 బిలియన్లిచ్చి ఏడవ స్ధానంలో వుంది) అమెరికా అప్పు దాని జిడిపికి 106శాతం వుంది. 2017లో అప్పులకు చెల్లించిన వడ్డీ రేటు 2.26శాతం. కొందరు ఇంకా తక్కువ వడ్డీరేటుకే అప్పు ఇచ్చారు.

ఒక్కసారిగా డాలరు విలువ తగ్గితే వారంతా ఏం కావాలి. దివాలా తీయాలి, చలికాచుకొనేందుకు నోట్లను వుపయోగించాలి. తక్కువ వడ్డీకి ఇచ్చిన వారికి డాలరు విలువ పెరిగితే లాభం తప్ప తగ్గితే మిగిలేది బూడిదే. అందువలన దాని విలువలో స్వల్ప మార్పులను అనుమతించటం తప్ప అధికారంలో ఎవరున్నా విలువ పతనం కాకుండా చూస్తారు. ప్రస్తుతం మన దేశంతో లావాదేవీలలో అమెరికా 23బిలియన్‌డాలర్ల మేరకు వాణిజ్యలోటు కలిగి వుంది. దాన్ని పూడ్చుకోవాలంటే రానున్న మూడు సంవత్సరాలలో పది బిలియన్‌ డాలర్ల మేరకు అదనంగా తమ నుంచి దిగుమతులు చేసుకోవాలని అమెరికన్లు మన మీద వత్తిడి చేస్తున్నారు.(సెప్టెంబరు 6 హిందూ పతాక శీర్షిక) ఇదే విధానాన్ని చైనా, ఇతర దేశాల మీద కూడా రుద్దాలని చూస్తోంది. డాలరు విలువ తగ్గనుంది అనే వార్త వచ్చిందో డాలరు పెట్టుబడులన్నీ ఇతర మెరుగైన కరెన్సీలకు మారిపోతాయి. మన రూపాయి విలువ తగ్గటంతో డాలర్లు వెళ్లిపోతున్న విషయం తెలిసిందే. అందువలన విశ్వం అంతమౌతుందనుకున్నపుడే చివరి చర్యగా డాలరు విలువను తగ్గిస్తారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

మన రూపాయి విలువ తగ్గుతున్నమేరకు మనం దిగుమతి చేసుకొనే పెట్రోలు, ఇతర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. డాలరు విలువ తగ్గితే అమెరికాలో కూడా అదే జరుగుతుంది. రోజువారీ వాడే వస్తువులన్నీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కారణంగా ఆ వస్తువుల ధరలు పెరుగుతాయి. ఆ పరిణామం ఎగుమతి చేసే దేశాలకు కూడా మంచిది కాదు. డాలరు విలువ తగ్గితే వాటి కరెన్సీ విలువ పెరుగుతుంది. ఇప్పుడు అమెరికాకు నామమాత్రపు లేదా అసలేమీ వడ్డీ లేకుండా విదేశీ పెట్టుబడులు, రుణాలు వస్తున్నాయి, దాని కరెన్సీ విలువ తగ్గితే వడ్డీ రేట్లు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ధరలు పెరుగుతాయి. అమెరికాలో ఇప్పుడున్న వేతనాలతో చైనా, భారత్‌ మాదిరి చౌక ధరలకు వస్తువులను తయారు చేసి ఎగుమతులు చేయటం కష్టం. వేతనాలు తగ్గిస్తే సామాజిక సంక్షోభం తలెత్తుతుంది. డాలరు విలువ ఎక్కువగా వుంటే ఎగుమతులు గిట్టుబాటుగాక వుత్పత్తి పడిపోతుంది.

అన్నింటికంటే ముఖ్యంగా డాలరు ఇప్పుడు రిజర్వు కరెన్సీగా వుంది. అనేక దేశాలు, కార్పొరేట్‌ సంస్ధలు పెద్ద మొత్తంలో వాటిని నిల్వ చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ లావాదేవీలు, పెట్టుబడులకు వాటిని వినియోగిస్తాయి. రిజర్వు కరెన్సీ కలిగిన ఏ దేశమైనా చౌకగా ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. బ్రిటన్‌ ప్రాభవం కోల్పోవటంతో దాని పౌండ్‌ స్ధానంలో తన డాలరును అలాంటి కరెన్సీగా చేయాలని అమెరికా నిర్ణయించుకుని అమలు చేస్తోంది. సాంప్రదాయ వస్తూత్పత్తి పెట్టుబడిదారుల స్ధానంలో ద్రవ్యపెట్టుబడిదారులది ఎప్పుడు పైచేయి అయిందో అప్పటి నుంచి డాలరును ముందుకు తెచ్చారు. దీని వలన ఇతర దేశాల నుంచి పెట్టుబడులు, అప్పులు తీసుకోవటం ద్వారా అమెరికా తన లోటును పూడ్చుకొంటోంది. ద్రవ్యపెట్టుబడిదారుల ఆధీనంలోని బ్యాంకుల పలుకుబడి, లావాదేవీలు, లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. డాలరును ఆయుధంగా చేసుకొని అమెరికా కార్పొరేట్‌ సంస్ధలు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో, ఆయా దేశాలలో చొరబడటంతో పాటు ప్రపంచ మిలిటరీ వుద్రిక్తతలలో అమెరికా జోక్యం, ఎక్కడైనా లేకపోతే సృష్టించటం జరుగుతున్నది. వాటి ద్వారా కార్పొరేట్ల ఆయుధ పరిశ్రమలు మూడుపువ్వులు ఆరుకాయలుగా లాభాలు పొందుతున్నాయి. వాటికి దెబ్బ తగుల కుండా వుండాలంటే ఒక చోట వుద్రిక్తతలు సడలితే, ముగిస్తే మరొక చోట తలెత్తేట్లు చేస్తున్నారు. మిలిటరిజం, సామ్రాజ్యవాదం ఒకదానితో ఒకటి కలసి పెరుగుతున్నాయి. డాలరు విలువను తగ్గిస్తే ఇది సాధ్యం కాదు.

చైనా పెద్ద మొత్తంలో అమెరికాకు అప్పు ఇచ్చినందున డాలరు విలువ తగ్గితే ఎక్కువగా నష్టపోయేది కూడా ఆ దేశమే. చైనా కనుక తన అప్పును తగ్గించుకుంటే, మిగతా దేశాలు కూడా దాని బాటనే నడిస్తే తక్షణం డాలరు విలువ పతనం అవుతుంది. చైనా కొత్తగా డాలర్లను కొనుగోలును తగ్గించినా సమస్యలు తలెత్తుతాయి. మొత్తం మీద అమెరికా లేదా చైనా ఏ విపరీత చర్యకు పాల్పడినా రెండు దేశాలతో పాటు ప్రపంచం సంక్షోభంలో మునుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే తెలిసిగానీ లేక తెలియకగానీ ట్రంప్‌ దూకుడు మీద వున్నాడు. పిచ్చి పనులు చేస్తే ఫలితాలు, పర్యవసానాలను అనుభవిస్తాడు. మన రూపాయితో పోలిస్తే జపాన్‌ ఎన్‌ విలువ ఇంకా తక్కువ, శుక్రవారం నాడు ఒక డాలరుకు 110.6 ఎన్‌ల వద్ద వుంది. దీని కంటే చాలా ఎక్కువగా వుండే చైనా యువాన్‌ విలువను పెంచాలని అమెరికా డిమాండ్‌ చేస్తోందిగానీ జపాన్‌ గురించి ఇంతవరకు మాట్లాడలేదు. రాబోయే రోజుల్లో జపాన్‌తో వాణిజ్య సమస్య మీద కూడా కేంద్రీకరిస్తానని ట్రంప్‌ ప్రకటించటంతో డాలర్‌ విలువ స్వల్పంగా పతనమైనట్లు వార్తలు వెలువడ్డాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెట్రో పన్ను తగ్గించం- గాల్లో దీపం రూపాయి !

05 Wednesday Sep 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

China Currency, Currency Value, India oil Tax, Naredra Modi, RBI, Rupee Fall

Image result for rupee value : narendra modi cartoons

రూపాయి విలువ- మోడీ భక్తుల గారడీ -3

ఎం కోటేశ్వరరావు

రూపాయి విలువ పతనానికి వాణిజ్య యుద్దం, చమురు ధరల పెరుగుదల వంటి బయటి అంశాలే కారణం, మనకు సంబంధం లేదు, కనుక రూపాయి దానికదే సర్దుకుంటుంది. రూపాయి విలువ పతనమైనందున పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగినంత మాత్రాన వాటి మీద కేంద్రం వసూలు చేస్తున్న పన్నులు తగ్గించాల్సిన అవసరం లేదు. తాజా పరిస్ధితులపై నరేంద్రమోడీ సర్కార్‌ అనధికార స్పందన లేదా అధికార యంత్రాంగం లీకుల ద్వారా వెల్లడి. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో తర్కం ఇది. అయినా సరే ఇంకా మోడీని సమర్ధించేవారు, బిజెపిని నెత్తికెత్తుకునే వారు వున్నారు. ప్రజాస్వామ్యం మనది, ఎవరి స్వేచ్చ వారిది.

వస్తుమార్పిడి పద్దతి నుంచి నగదు లావాదేవీలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో అప్పటి నుంచి ప్రతి దేశ కరెన్సీ ఏదో ఒక విధంగా ప్రభావితమౌతూనే వుంది. గత కొద్ది రోజులుగా రూపాయి విలువ పడిపోతూ వుండటం, నిత్యం పెట్రోలు, డీజిలు ధరల పెంపుదల ప్రకటనలు వెలువడుతుండటంతో కరెన్సీ విలువపై చర్చ జరుగుతోంది. బుధవారం వుదయం (11.20) రూపాయి విలువ మరింతగా దిగజారి ఒక డాలరుకు రు. 71.71గా నమోదైంది . ఇంత జరుగుతున్నా మన కరెన్సీ ఇంకా పతనమైనా ఫరవాలేదు అన్నట్లుగా కొందరు చెబుతున్నారు. నరేంద్రమోడీ తీరు తెన్నులను చూసినపుడు దేశమంతా చర్చనీయాంశం అయిన, ఆందోళన చెందిన విషయాల మీద సకాలంలో సూటిగా మాట్లాడిన వుదంతం ఒక్కటంటే ఒక్కటీ లేకపోవటం ఆశ్చర్యకరంగాకపోయినా ఆందోళనకరం. రూపాయి పతనాన్ని అరికడతారో లేక కొనసాగింపును అనుమతిస్తారో ఏదో ఒకటి చెప్పాల్సిన రాజధర్మం ఏమైనట్లు ?

కరెన్సీ విలువలను ప్రస్తుతం ఎక్కువ దేశాలు మార్కెట్‌ శక్తులకు వదలి వేశాయి. ఇప్పటికీ కొన్ని దేశాలు తెరచాటున విలువ నిర్ణయ అధికారాన్ని తమ చేతుల్లోనే వుంచుకున్నాయి. చైనా సర్కార్‌ తన యువాన్‌ విలువను నియంత్రిస్తున్నదని అమెరికాతో సహా పశ్చిమ దేశాలు ఆరోపిస్తాయి. అలాంటిదేమీ లేదని చైనా చెబుతోంది. ఇటీవలి కాలంలో మన కరెన్సీ పతనాన్ని అరికట్టేందుకు రిజర్వుబ్యాంకు డాలర్లను కొన్నింటిని అమ్మిందని అవి 20బిలియన్ల వరకు వున్నాయని వార్తలు వచ్చాయి. బ్యాంకు గానీ, కేంద్రం గానీ తాము తీసుకోబోయే చర్యల గురించి జనానికి చెప్పటం లేదు. మొత్తం మీద పరిణామాలను చూసినపుడు మార్కెట్‌ శక్తులకు వదలివేసినా అదుపు తప్పినపుడు ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటున్నాయి. లేకపోతే వాటి పుట్టి మునుగుతుంది కదా !

గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా అనుసరించిన విధానాలు దాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. అందుకే పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే నిర్ధారణలకు వస్తున్న యువత అక్కడ నానాటికీ పెరుగుతోంది. ఇదే సమయంలో చైనా తనదైన తరహా సోషలిస్టు పద్దతుల్లో ముందుకు పోతోంది, కొన్ని ఎగుడుదిగుడులున్నా సంక్షోభాలకు దూరంగా వుంది. అనేక దేశాలు అమెరికా నుంచి అధిక ధరలకు యంత్రాలు, పరికరాలు, ఇతర వస్తువులను కొనే బదులు తామే తయారు చేయటం, ప్రత్యామ్నాయాలను చూసుకోవటంతో పాటు ఎగుమతుల్లో అమెరికాకు పోటీగా తయారయ్యాయి. తన కరెన్సీ విలువను అధికంగా వుంచుతూ ఆధరకు తన వస్తువులను కొనాలంటూ ఇతర దేశాల మీద అమెరికా వత్తిళ్లు తెస్తోంది. బెదిరింపులకు పాల్పడుతోంది. చైనాపై ప్రారంభించిన వాణిజ్య యుద్ద సారమిదే. అమెరికా దాడిని ఎదుర్కొనేందుకు పరిమితంగా అయినా తన కరెన్సీ విలువ తగ్గింపును చైనా ఆయుధంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. తన ఎగుమతులకు కొత్త మార్కెట్లను చూసుకోవటం, వున్న మార్కెట్లలో దెబ్బ తగలకుండా చూసుకొనేందుకు కరెన్సీ విలువను పరోక్షంగా నియంత్రిస్తున్నట్లు కనిపిస్తోంది.

1930దశకంలో తలెత్తిన మహా ఆర్ధిక మాంద్యం నుంచి బయట పడేందుకు అమెరికా, జపాన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, ఆస్ట్రేలియా వంటి బడాదేశాలన్నీ చరిత్రలో తొలిసారిగా రికార్డు స్ధాయిలో 40శాతం వరకు తమ కరెన్సీ విలువలను తగ్గించాయి.బంగారంతో కరెన్సీ విలువ లింక్‌ను విస్మరించాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయి నష్టపరిహారం చెల్లించిన జర్మనీ యుద్ధ భారాలను తట్టుకోలేక తన కరెన్సీకి కావాలనే విలువ లేకుండా చేసింది. ఒక డాలరుకు వందకోట్ల మార్క్‌లుగా విలువ పతనం అయింది. తద్వారా కారుచౌకగా తన వస్తువులను ప్రపంచ మార్కెట్లో అమ్మి ప్రభుత్వం కష్టాల నుంచి గట్టెక్కిందిగానీ సామాన్య జర్మన్లు భారీ మూల్యం చెల్లించారు. ఆ దశలో అధికారానికి వచ్చిన హిట్లర్‌ జర్మన్‌ ఔన్నత్యాన్ని నిలబెట్టాలనే పేరుతో రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడైన విషయం తెలిసిందే. చరిత్రలో అతిపెద్ద వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన డోనాల్డ్‌ ట్రంప్‌ చర్యలు ఏ పర్యసానాలకు దారి తీస్తాయో ?

గత ఆరునెలల్లో జరిగిన పరిణామాలను చూస్తే అంతర్గత ఇబ్బందులను అధిగమించటం కోసం అమెరికా తన వడ్డీ రేట్లను పెంచటం, ఇంకా పెంచనున్నట్లు ప్రకటించటం, చైనా, ఇతర దేశాల మీద వాణిజ్య యుద్ధానికి దిగటం, ఇరాన్‌పై తిరిగి ఆంక్షలను ప్రకటించటం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు రేట్లు పెరగటం, టర్కీ లీరా, అర్జెంటీనా పెసో పతనం వంటి ముఖ్య పరిణామాలన్నీ ప్రపంచ కరెన్సీలను ప్రభావితం చేస్తున్నాయి. ఓట్ల కోసం ట్రంప్‌ తీసుకొనే చర్యల కారణంగా నవంబరులో అమెరికాలో జరిగే పార్లమెంట్‌ మధ్యంతర ఎన్నికల వరకు ఈ అనిశ్చితి కొనసాగే అవకాశం వుంటుంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుగా మన వంటి దేశాల పౌరుల పరిస్ధితి తయారైంది. కరెన్సీ విలువ వుద్ధాన, పతనాలతో ప్రతి దేశానికీ కొన్ని ప్రయోజనాలు, కొన్ని కష్టాలు వుంటాయి. వుదాహరణకు ఐటి వుత్పత్తులను ఎగుమతి చేసే మన కంపెనీల వాటాల ధరలు దూసుకుపోతుండగా దిగుమతులు చేసుకొనే కంపెనీలవి డీలా పడుతున్నాయి. వాణిజ్యలోటు వున్న మన వంటి దేశాలకు కరెన్సీ పతనం ప్రయోజనకరం అయినా మిగులు వున్న చైనా వంటి దేశాలకు వాటి సమస్యలు వాటికి వున్నాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో డాలర్లను కొనుగోలు చేయటం అంటే మిగతా కరెన్సీలను విక్రయించటం కూడా ఇమిడి వుంటుంది. ఏ లావాదేవీ జరిగినా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారులు వీటిని తమకు అనుకూలంగా నియంత్రిస్తారు.

ప్రతి దేశమూ అధికారిక లావాదేవీలను జరిపే సమయంలో ఒక నిర్ణీత విలువతోనే ఖరారు చేసుకుంటుంది. ఒక పరిధి నిర్ణయించుకొని దానికి లోబడి మార్పులున్నంత వరకు లావాదేవీలను అనుమతిస్తుంది. దాటినపుడు చర్యలకు వుపక్రమిస్తుంది. కొన్ని దేశాలు ప్రయివేటు రంగంలో కూడా నిర్ణీత విలువను మాత్రమే అనుమతిస్తాయి. అటువంటి చోట్ల డాలర్ల క్రయ విక్రయాలు బ్లాక్‌ మార్కెట్‌కు చేరే అవకాశాలూ లేకపోలేదు. పీకల్లోతు నీరు వచ్చింది తప్ప ప్రాణాలకు ముప్పు లేదు, అయినా వచ్చిన వరద వచ్చినట్లే పోతుంది లేదా స్ధిరపడుతుంది ఆందోళన అవసరం లేదన్నట్లుగా మన అధికార యంత్రాంగం వుంది. రూపాయి పతనానికి వాణిజ్యం యుద్ధం, చమురు ధరల పెరుగుదల ప్రధాన కారణాలు, వాటిని ప్రభుత్వం ఏమీ చేయగలిగింది లేదు, రూపాయి దానంతట అదే స్ధిరపడుతుందని ఆర్ధికశాఖ అధికారి ఒకరు అనధికారికంగా వ్యాఖ్యానించారు. పతనం మరింతగా కొనసాగుతుందనటానికి తగినన్ని కారణాలున్నాయని ఎస్‌బిఐ ప్రధాన ఆర్ధిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్‌ చెప్పారు.

డబ్బు బయటకు పోకుండా చర్యలు తీసుకోవటం ద్వారా కరెన్సీ పతనాన్ని కొంతమేరకు అరికట్టిన వుదంతాలు వున్నాయి. గతంలో చైనా అలా వ్యవహరించిందని విశ్లేషకులు చెబుతున్నారు. స్ధానిక కరెన్సీని విక్రయించకుండా ఆర్ధిక సంస్ధలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసి అదుపు చేయటం, వుల్లంఘించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవటం ఒకపద్దతి. రిజర్వుబ్యాంకులు బయటకు ప్రకటించకుండానే ఒక నిర్ణీత ధరను సూచించటం మరొకటి. లావాదేవీలపై పరిమితులు విధించటం, అన్నింటిని విధిగా నమోదు చేయటం వంటివి మరికొన్ని చర్యలు.

అమెరికాలో వడ్డీ రేట్లను ఎప్పుడైతే పెంచారో అప్పటి నుంచి డాలర్లు మన దేశం నుంచి అక్కడికి తరలటం ప్రారంభించాయి. ఆ ప్రవాహాన్ని ఆపేందుకు మన బ్యాంకులు వడ్డీరేట్లను పెంచాయి, రూపాయి పతనం ఇంకా కొనసాగితే రానున్న రోజుల్లో ఇంకా పెంచే అవకాశాలున్నాయి. చివికి పోయిన వస్త్రానికి ఒక దగ్గర మాసిక వేస్తే మరో చోట చిరిగి పోతుందన్నట్లుగా ఒకదాని కోసం ఒక చర్య తీసుకుంటే కొత్త సమస్యలు తలెత్తుతాయి. జనం మీద విపరీత భారం, ప్రభుత్వాలకు ద్రవ్యలోటు పెరగటం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఒక దేశ కరెన్సీ విలువ పెరగటం కూడా ఒక్కోసారి నష్టదాయకమే. వుదాహరణకు స్విడ్జర్లాండ్‌ వుదంతం. బలమైన మారకపు విలువ కారణంగా అక్కడ డబ్బు దాచుకోవటం ఎంతో భరోసాగా భావించి ఒకప్పుడు మన దేశంతో సహా ప్రపంచంలోని నల్లధనమంతా స్విస్‌ బ్యాంకులకు చేరేది. దాంతో వాటి లాభాలు ఇబ్బడి ముబ్బడి అయ్యాయి. అయితే స్విస్‌ ఫ్రాంక్‌ విలువ పెరిగి ఆ దేశ ఎగుమతులు ఖరీదయ్యాయి. పారిశ్రామికవేత్తలు లబోదిబో మన్నారు. దాంతో నల్లధన ప్రవాహాన్ని అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవటంతో నల్లధన కుబేరులు వేరే దేశాల బాట పట్టారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ట్రంప్ ఉత్సాహాన్ని నీరుగార్చిన అమెరికా మిలిటరీ !
  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ట్రంప్ ఉత్సాహాన్ని నీరుగార్చిన అమెరికా మిలిటరీ !
  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ట్రంప్ ఉత్సాహాన్ని నీరుగార్చిన అమెరికా మిలిటరీ !
  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d