• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Economics

నరేంద్రమోడీ మరో వింత పేరే నాలుగో పారిశ్రామిక విప్లవం !

26 Friday Oct 2018

Posted by raomk in Communalism, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

4th industrial revolution, INDIA, Naredra Modi, WEF, WEF 4th industrial revolution

Image result for narendra modi, 4th industrial revolution

ఎం కోటేశ్వరరావు

భాయియోం, బహెనోం దేశాన్ని నాలుగో పారిశ్రామిక విప్లవం 4.0 వైపు నడిపిస్తున్నానంటూ మన ఘనత వహించిన ప్రధాని నరేంద్రమోడీ అక్టోబరు పదకొండవ తేదీన ఒక మహోపన్యాసం చేశారు. ప్రపంచ ఆర్ధిక వేదిక న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. గతంలో రాజీవ్‌ గాంధీ ప్రధానిగా వున్న సమయంలో మాట్లాడితే దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకుపోతానని చెప్పేవారు.ప్రధాని నరేంద్రమోడీ కంటే పక్షం రోజుల ముందే నాలుగున్నరేండ్లయినా రాజధాని శాశ్వత భవనాలను కట్టలేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనకు వెళ్లి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించి వచ్చారు. అంతేకాదు ఐక్యరాజ్యసమితిలో చేసిన ఒక వుపన్యాసంలో ఒక రూపాయి పెట్టుబడి అవసరం లేని ‘ఆవు’ వ్యవసాయం గురించి కూడా ప్రపంచానికి వివరించి వచ్చారు. నాలుగోపారిశ్రామిక విప్లవంలోని ప్రధాన అంశాలలోని ఐటి, బయోటెక్నాలజీ నిపుణులు కూడా వాటిని పక్కన పడేసి ఆవు వ్యవసాయానికి పూనుకొని అంతకంటే ఎక్కువ ఆదాయం సంపాదించాలని సలహా కూడా ఇచ్చివచ్చినట్లు మనం వార్తలు చదువుకున్నాం. ఒకే నోటితో పరస్పర విరుద్ధ అంశాలు మాట్లాగల నేర్పరులు కొందరు రాజకీయవేత్తలు. అసలు నాలుగో పారిశ్రామిక విప్లవం అంటే ఏమిటి? అందుకు మన దేశంలో పరిస్ధితులు అనువుగా వున్నాయా?

నాలుగో పారిశ్రామిక విప్లవం గురించి తెలుసుకొనే ముందు మన దేశంలో మొదటి మూడు విప్లవాలు జరిగాయా, ఎంతవరకు అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. వుట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా- వుట్టి కొట్టలేనయ్య ఆకాశాన్ని అందుకుంటాడా ! మొదటి విషయం ఏ విప్లవం అయినా ఒక రోజులో లేదా ఒక తేదీనో ప్రారంభం కాదు, ముగియదు. ప్రధమ సోషలిస్టు విప్లవం రష్యాలో 1917 అక్టోబరు ఏడున జరిగింది అని చెబుతాం. దానర్ధం ఆ రోజు విప్లవపరిణామలు ఒక మలుపు తిరిగి మరోపరిణామానికి నాంది పలికింది అని తప్ప విప్లవం జయప్రదమైందని కాదు. అలాగే పాఠాల్లో మనం చదువుకొనే పారిశ్రామిక విప్లవం కూడా అలాంటిదే. ఒక తేదీ ఏమీ లేదు.1760 నుంచి 1820-40సంవత్సరాల మధ్య కాలంలో అంతకు ముందున్న వుత్పాదకపద్దతులు అంటే చేతితో తయారు చేసే ప్రక్రియలో యంత్రాలను ప్రవేశపెట్టటం, వాటిని నడిపేందుకు ఆవిరిని వుపయోగించటం, రసాయనాల తయారీ వంటి పరిణామాలన్నీ ఆ 80సంవత్సరాల కాలంలో బాగా అభివృద్ధి చెందాయి. రెండవ పారిశ్రామిక విప్లవకాలంలో అంటే 1870-1914 సంవత్సరాల మధ్య కాలంలో అంతకు ముందున్న పరిశ్రమలను కొనసాగించటం, కొత్తవాటిని ఏర్పాటు చేయటంతో పాటు ఆవిరి స్ధానంలో యంత్రాలను నడిపేందుకు విద్యుత్‌ వినియోగం, చమురును కనుగొనటం, వాటితో వుత్పత్తిని ఇబ్బడి ముబ్బడి చేయటం వంటి పరిణామాలు జరిగాయి. ఆ తరువాత నుంచి 1980, నేటి వరకు జరిగిన సాంకేతిక అభివృద్ధిని మూడవ పారిశ్రామిక విప్లవంగా పిలుస్తున్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం ఎప్పుడు ప్రారంభమైందో చెప్పుకొనే ముందు దీని ప్రధాన లక్షణాలను చెప్పుకోవాల్సి వుంది.రోబోలు, కృత్రిమ మేథ, డిజిటల్‌, నానో టెక్నాలజీ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, బయోటెక్నాలజీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌,3డి ప్రింటింగ్‌, డ్రైవర్‌తో పని లేకుండా నడిచే వాహనాల వంటివి దీనిలో వున్నాయి. ప్రపంచ ఆర్ధిక వేదిక(అదే మన చంద్రబాబు నాయుడు సిఎంగా వున్నపుడు ప్రతి సంవత్సరం దవోస్‌ వెళ్లి వస్తుంటారు. ఎందుకు వెళతారో, దాని వలన రాష్ట్ర ప్రజలకు చేతి చమురువదలటం తప్ప సాధించిందేమిటో ఇంతవరకు మనకు తెలియదు)ను ఏర్పాటు చేసిన ప్రొఫెసర్‌ క్లాస్‌ ష్కవాబ్‌ నాలుగో పారిశ్రామిక విప్లవం అనే ఒక పుస్తకాన్ని రాశారు. మిగతా మూడు విప్లవాలం కంటే ఆధునాత సాంకేతిక పరిజ్ఞానమే నాలుగోదాని ప్రత్యేకత అంటారు. ఈ పరిజ్ఞానంతో వందల కోట్ల జనం ఇంటర్నెట్‌ వెబ్‌తో అనుసంధానం అవుతారని, వాణిజ్య, ఇతర సంస్ధల సామర్ధ్యం గణనీయంగా పెరుగుతుందని, మెరుగైన సంపదల యాజమాన్య పద్దతులతో సహజపర్యావరణాన్ని తిరిగి సృష్టించేందుకు తోడ్పడవచ్చునని చెప్పారు.2016లో జరిగిన ప్రపంచ ఆర్ధిక వేదిక వార్షిక సమావేశ ఇతివృత్తానికి ‘నాలుగవ పారిశ్రామిక విప్లవంలో సంపూర్ణత సాధన’ అని నామకరణం చేశారు. ఈ పద ప్రయోగం ఇదే మొదటి సారి. అదే ఏడాది అక్టోబరు పదిన శాన్‌ ఫ్రాన్సిస్‌కో నగరంలో నాలుగవ పారిశ్రామిక విప్లవ కేంద్రం పేరుతో విప్లవ పరిణామాలను అధ్యయనం చేయటానికి, సలహాలు ఇవ్వటానికి ఒక సంస్ధను ఏర్పాటు చేశారు. రెండు సంవత్సరాల తరువాత మన దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రపంచ ఆర్ధిక వేదిక ఆధ్వర్యాన ఏర్పాటుచేసి అలాంటి కేంద్రానికే అక్టోబరు 11వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభోత్సవం చేశారు.

Image result for narendra modi, 4th industrial revolution cartoons

ఆ రోజు మోడీగారు చెప్పిందాని సారాంశం ఇలా వుంది. మొదటి, రెండవ పారిశ్రామిక విప్లవాలు జరిగే నాటికి భారత దేశం స్వతంత్రంగా లేదు. మూడవది జరిగిన సమయంలో అపుడే వచ్చిన స్వాతంత్య్రంతో ఎదురైన సవాళ్లను ఎదుర్కొనేందుకు కుస్తీలు పడుతోంది. ఇప్పుడు నాలుగవ పారిశ్రామిక విప్లవానికి పెద్ద ఎత్తున దోహదపడుతుంది. సాంకేతిక పురోగతితో వుపాధి నష్టం జరుగుతుందని భయపడనవసరం లేదు, వుద్యోగాల స్వభాన్నే మార్చివేస్తుంది, మరిన్ని అవకాశాలను పెంచుతుంది.దీని ఫలితాలను పొందేందుకు అవసరమైన విధానపరమైన మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుంది. ప్రపంచ పరిశోధన మరియు అమలు కేంద్రంగా మారేందుకు అవసరమైన అవకాశాలు భారత్‌లో వున్నాయి. ఇంతకు ముందు వచ్చిన విప్లవాలు భారత్‌ను ఏమార్చాయి, నాలుగో విప్లవానికి భారత్‌ వంతు విస్మయకారిగా వుంటుంది.

ఇలా సాగిన వుపన్యాసంతో పాటు పనిలో పనిగా తన ప్రభుత్వం సాధించిన ఘనత గురించి కూడా చెప్పుకున్నారనుకోండి. తమ కారణంగానే టెలిఫోన్‌ సాంద్రత 93శాతానికి పెరిగిందని, 50కోట్ల మంది మొబైల్‌ ఫోన్లు వాడుతున్నారని, ప్రపంచంలో అత్యధికంగా మొబైల్‌ డాటా వాడుతున్నారని తక్కువ రేట్లకు దొరుకుతోందని, వినియోగం నాలుగు సంవత్సరాలలో 30రెట్లు పెరిగిందని, 120 కోట్ల మందికి ఆధార కార్డులు ఇచ్చామని, తాను అధికారంలోకి వచ్చిన 2014నాటికి కేవలం 59 గ్రామాలకు ఆప్టిక్‌ ఫైబర్‌ లైన్లు వుంటే త్వరలో రెండున్నర లక్షలకు చేరనున్నాయని చెప్పుకున్నారు. ఇది కూడా మరొక అర్ధ. అసత్యం. నేషనల్‌ ఆప్టికల్‌ ఫైబర్‌నెట్‌ వర్క్‌(నోఫెన్‌) అనే కేంద్ర ప్రభుత్వ పధకానికి 2011లో అనుమతి ఇచ్చారు.దీన్నే డిజిటల్‌ ఇండియా పేరుతో ఏదో తానే ప్రారంభించినట్లు మోడీ గొప్పలు చెప్పుకుంటారు. ఆ పధక కార్యాచరణ ప్రణాలిక ప్రకారం 2012 అక్టోబరు నాటికి రాజస్ధాన్‌,ఆంధ్రప్రదేశ్‌, త్రిపుర రాష్ట్రాలలోని 59గ్రామాలలో పైలట్‌ పధకాన్ని అమలు చేయాలి. 2014 మార్చి, 2015 మార్చి నాటికి ఏటా లక్ష చొప్పున రెండులక్షల గ్రామాలకు, 2015సెప్టెంబరు నాటికి 50వేల గ్రామాలకు ఆ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. అయితే ఆ లక్ష్యాన్ని 2016 డిసెంబరు వరకు పొడిగించారు. మోడీగారు చెప్పినట్లే గడువు తీరి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికి లక్ష గ్రామాలకే విస్తరించింది. తన అసమర్ధపాలనలో ఎప్పటికి పూర్తవుతాయో మోడీగారు చెబితే నిజాయితీగా వుండేది. నాలుగున్నర సంవత్సరాలలో లక్షగ్రామాలకు కూడా నెట్‌ వర్క్‌ విస్తరించలేదు, ఏర్పాటు చేసింది కూడా ఎంత వేగంతో పని చేస్తుందో తెలియని స్ధితిలో మోడీగారు మనకు డిజిటల్‌ విప్లవం గురించి చెబుతారు, నాలుగవ పారిశ్రామికవిప్లవంలో భాగస్వాములను చేస్తామంటున్నారు.

డిజిటల్‌ టెక్నాలజీ ఎంతో ప్రయోజనకారి అన్నది వాస్తవం. అన్న ప్రాసన నాడే ఆవకాయ అన్నట్లుగా, మెట్లు ఎ్క కుండానే మేడ ఎ్కవచ్చు అన్నట్లు అభివృద్ధిలో మిగతాదేశాలు అధిగమించిన దశలను మనం దాటకుండానే ఒక గెంతువేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని అందుబాటులోకి తెచ్చుకోవచ్చని, అభివృద్ధి చెందిన దేశాలలో అందుబాటులోకి వచ్చినవన్నీ మన కోసం కూడా సిద్దంగా వున్నాయని, అసలు ఇప్పటికే మనం ఆ దశలో ప్రవేశించిన విషయాన్ని అనేక మంది గుర్తించటం లేదని కొందరు చెబుతునాారు. వుపాధిని ఫణంగా పెట్టి ప్రవేశపెట్టే యాంత్రీకరణ సామాన్యులకు మేలు చేస్తుందా? ఎలా చేస్తుంది అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పే పెట్టుబడిదారులు లేరు. అమెరికా, ఇతర అనేక దేశాలలో యాంత్రీకరణ ఎంతో ఎక్కువ, దాని వలన కార్పొరేట్లకు లాభాలు పెరిగాయి తప్ప అదనంగా వుత్పత్తి అయిన సంపదలో జనానికి దక్కిన వాటా ఎంత? అక్కడ ఆర్ధిక అసమానతలు భరించరాని విధంగా పెరిగాయని పెట్టుబడిదారీ మేథావి అయిన థామస్‌ పికెటీ చెప్పిన విషయాన్ని ఎలా మరచిపోగలం.ఇప్పటికే వుపాధిరహిత అభివృద్ధి జరుగుతోంది. పని చేసే జనం తక్కువగా వున్న దేశాలకు ఆటోమేషన్‌ లేదా రోబోలు అవసరం గావచ్చు. ఏటా కోటీ ఇరవై నుంచి కోటీ 30లక్షల మంది వరకు యువత తమకు వుపాధికావాలని వస్తున్న మన దేశంలో మన పరిశ్రమలలో వాటిని ప్రవేశపెడితే జరిగేదేమిటి? బెంగలూరులోని కెనరా బ్యాంకులో కన్నడం మాట్లాడే ఒక రోబో ఏ కౌంటర్‌కు వెళ్లాలో కస్టమర్లకు చెబుతుందట. సదరు బ్యాంకుకు వచ్చే కస్టమర్లకు ఏ కౌంటర్‌ ఎక్కడుందో తెలిపే సూచనలు ప్రదర్శిస్తే సరిపోయేదానికి గొప్పలు చెప్పుకోవటానికి గాకపోతే ఎంతో ఖర్చు పెట్టి రోబోను పెట్టాల్సిన అవసరం ఏముంది? కన్నడేతరులు వస్తే ఏ భాష రోబో దగ్గరకు వెళ్లాలి.

మన దేశంలో ఆటోమేషన్‌ జరిగితే ఇప్పుడున్న ప్రతి నాలుగు వుద్యోగాలకు ఒకటి పోతుందని ఒక అంచనా. శ్రమశక్తి మీద ఆధారపడిన పరిశ్రమలు,వ్యవసాయం, వృత్తులు మిగతా దేశాలతో పోల్చితే చాలా ఎక్కువ వున్న మన దేశంలో ఇంకా అంతకంటే ఎక్కువే పోయినా ఆశ్చర్యం లేదు. మూడు సంవత్సరాల క్రితం ప్రపంచ ఆర్ధిక వేదిక రూపొందించిన ఒక నివేదిక ప్రకారం నాలుగో పారిశ్రామిక విప్లవం ప్రపంచవ్యాపితంగా వుపాధిని దెబ్బతీస్తుందన్నది నిరాకరించజాలని అంశమని తేలింది. ఆఫీసు,అడ్మినిస్ట్రేషన్‌, వుత్పాదకత, తయారీ, నిర్మాణ రంగాల మీద ప్రభావం చాలా ఎక్కువగా వుంటుంది. కొన్ని పరిశ్రమలను మూతవేయాలి, అనేకాన్ని అవసరాలకు అనుగుణ్యంగా మార్చుకోవాలి. అధునాత వుత్పాదకయంత్రాలు, పద్దతుల వలన వుత్పత్తి ఇబ్బడి ముబ్బడి అవుతుంది, ఆ మేరకు వుపాధిపెరగదు, అంతకు ముందుకంటే తగ్గినా ఆశ్చర్యం లేదు. అందువలన వుపాధి చర్చను పక్కన పెట్టి ముందుకు పోవాలని పెట్టుబడిదారులు సహజంగానే కోరుకుంటారు.ప్రతి పారిశ్రామిక విప్లవం సమాజంలో అసమానతలను పెంచింది తప్ప సంపదల పంపిణీని సమంగా పంచలేదు. సాంకేతిక ప్రగతి పెరిగిన కొద్దీ కొద్ది మంది చేతుల్లో పోగుపడుతున్న సంపదల వాటా కూడా పెరిగిపోతోంది.

Image result for BJP, 4th industrial revolution cartoons

ఎవరు కాదన్నా అవునన్నా మన దగ్గర వున్న కొనుగోలు శక్తి కలిగిన మధ్యతరగతి మార్కెట్‌ను ఎలా సొమ్ము చేసుకుందామా అని చూడటం తప్ప ప్రయివేటు రంగానికి మరొకటి పట్టదు. అదే చైనాలో మధ్యతరగతి మార్కెట్‌ను పెంచటంతో పాటు దిగువన వున్నవారిని కూడా మధ్యతరగతిగా మార్చే విధంగా సంపదల పంపిణీ జరగటమే దాని విజయానికి మూలం. మన జనానికి స్మార్ట్‌ ఫోన్‌ ఇస్తే దానిని ఎంత మంది వినియోగించగలరు అన్నది ప్రశ్నార్ధకంగా వున్న తరుణంలో అంతకు మించిన పరిజ్ఞానంతో ప్రమేయం వుండే నాలుగోపారిశ్రామిక విప్లవం గురించి మాట్లాడుకుంటున్నాం. దేశంలోని గ్రామాలన్నింటినీ విద్యుదీకరించామని నరేంద్రమోడీ ఘనంగా ప్రకటించిన వారం తిరగక ముందే 125కోట్ల మంది జనాభా వున్న భారత్‌లో 15శాతం మందికి(అంటే21కోట్ల మందికి) విద్యుత్‌ అందుబాటులో లేదని ప్రకటించింది. వారికి సెల్‌ఫోన్లు ఇచ్చినా ఛార్జింగ్‌ చేసుకోలేరు. ఈ ఏడాది జనవరి నాటికి మన దేశంలో ఇంటర్నెట్‌ను వినియోగించేవారు నూటికి 26శాతం మందే వున్నారట. ప్రస్తుతం మన దేశానికి ఏటా వచ్చే ఆదాయం ఒక రూపాయి అనుకుందాం. దానిలో వ్యవసాయరంగంలో వున్న 51శాతం కార్మికుల నుంచి 12పైసలు, 22శాతం మంది పని చేస్తున్న పారిశ్రామిక రంగం నుంచి 28, సేవారంగాలలో పని చేస్తున్న 27శాతం మంది నుంచి 60పైసల ఆదాయం వస్తోందని లెక్కలు చెబుతున్నాయి. మన జిడిపిలో 60శాతం సేవారంగం నుంచి వుండటం ఒక అస్ధిరతకు సూచిక. పశ్చిమ దేశాల ఆర్ధిక స్ధితిపై ఆధారపడి ఐటి, పొరుగుసేవల ఆదాయం వుంటుంది. అవి సజావుగా వున్నంత వరకు ఇబ్బంది లేదు, దెబ్బతింటే మనమూ నష్టపోతాం. చైనా విషయానికి వస్తే వ్యవసాయం నుంచి 2017లో 7.9శాతం, పరిశ్రమల నుంచి 40.5, సేవారంగం వాటా 51.6శాతం వుంది. ప్రపంచ పారిశ్రామిక కేంద్రంగా పేరుపొందిన చైనా మాదిరి మనం కూడా పారిశ్రామిక రంగాన్ని పటిష్టపరుచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.కృత్రిమ మేధస్సు అంటే ఆటోమేషన్‌ యంత్రాలు, రోబోలు రానున్న దశాబ్దంలో 20శాతం వుద్యోగాలను హరించనున్నాయని అంచనా. టాక్సీ డ్రయివర్లు, చేపలు పట్టటం, బేకరీ, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాలలో అయితే 80-90శాతం వుద్యోగాలు పోతాయని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆటోమేషన్‌, రోబోలతో పనులు చేయించేందుకు అవసరమైన అత్యున్నత నైపుణ్యం కలిగిన కొద్ది మందికి డిమాండ్‌ వుంటుంది.గతంలో దేశం నీకేమిచ్చిందనే కంటే దేశానికి నీవేమిచ్చావనేది దేశభక్తి అని నూరిపోశారు. ఇప్పుడు పెద్ద మొత్తంలో వుద్యోగాలు హరించే అవకాశాన్ని ముందుగానే తెలిసిన పెట్టుబడిదారీ మేథావులు మనకు వుద్యోగభద్రత కంటే నైపుణ్యం ముఖ్యమని చెబుతున్నారు.

మన నరేంద్రమోడీగారు 2022 నాటికి(చాలా మంది ఈ సంవత్సరం ఎందుకు అని అడుగుతున్నారు అప్పటికి మన స్వాతంత్య్రానికి 75ఏండ్లు నిండుతాయి) రైతాంగ ఆదాయాలు రెట్టింపు చేస్తామని వూదరగొడుతున్నారు. అదే సంవత్సరానికి మన పరిశ్రమల్లో సాంకేతిక పరిజ్ఞానం వుపయోగించటం గురించి కూడా లక్ష్యాలను నిర్ణయించింది.మనలో చాలా మందిమి కార్లు,బస్సులను గడిగేందుకు మనుషుల బదులు యంత్రాలను వాడటం చూసి వుంటాము. పరిశ్రమల్లో పని చేసే ప్రతి వేల మంది కార్మికులకు ఎన్ని పారిశ్రామిక రోబోలు వున్నాయనే అంశాన్ని రోబో సాంద్రత అని పిలుస్తున్నారు. 2016లెక్కల ప్రకారం ప్రపంచ రోబో సాంద్రత సగటు 74. మన దేశంలో మూడు, అత్యధికంగా దక్షిణ కొరియాలో 631. సింగపూర్‌ 488,జర్మనీ 309, జపాన్‌ 303, అమెరికా 198,బ్రిటన్‌ 71, చైనా 68, బ్రెజిల్‌ 10, రష్యా 3తో వుంది. మన దేశంలో ఏటా 24శాతం పెంచుకుంటూ పారిశ్రామిక రోబోలను మన పారిశ్రామికవేత్తలు దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో మొత్తంగా రోబో సాంద్రత మూడే అయినప్పటికీ ఆటోమొబైల్‌ రంగంలో అది 58గా వుంది. అంటే మన రాష్ట్ర ప్రభుత్వాలు పోటీబడి రాయితీలు ఇచ్చేది రోబోల ఏర్పాటుకు తప్ప కార్మికులకు వుపాధి కల్పించేందుకు కాదు.

ఆధునిక యంత్రాలు, కంప్యూటర్లు, రోబోల మీద పని చేసే నిపుణులైన మానవశ్రమ శక్తి తప్ప కండలను కరగించే శారీరక శ్రమ చేసే వారు కాదని పెట్టుబడిదారీ ప్రతినిధులైన ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ ఎప్పుడో గుర్తించాయి. అలాంటి వారిని తయారు చేయాలంటే ధనిక దేశాలలో ఎంతో ఖర్చు అవుతుంది. కనుక మన వంటి దేశాలలో ఇంజనీరింగ్‌,మెడికల్‌ కాలేజీలను ఇబ్బడి ముబ్బడిగా పెట్టాలని సలహాయిచ్చి చౌకగా దొరికే ఇంజనీర్లను తయారు చేయాలని కోరింది. దాని ఫలితమే చెట్టుకొకటి పుట్టకొకటిగా వెలిసిన ఇంజనీరింగ్‌ కాలేజీలు. మన విద్యావ్యాపారులు కొన్ని చోట్ల కొందరు నిపుణులను తయారు చేస్తున్నప్పటికీ అత్యధికులకు నైపుణ్యం తప్ప సర్టిఫికెట్‌లు ఇచ్చి జనాన్ని మార్కెట్లోకి తోలుతున్నాయి. వారి ప్రతిభా, ప్రావిణ్యాల గురించి 2017లో యాస్పరింగ్‌ మైండ్స్‌ అనే సంస్ధ ఒక సర్వే చేసి నమ్మలేని నిజాలను వెల్లడించింది. విద్యావ్యాపారులు దాన్ని తోసిపుచ్చగా ఐటి కంపెనీల యజమానులు నిర్ధారించారు.తొంభై అయిదు శాతం ఇంజనీరింగు పట్టభద్రులు సాప్ట్‌వేర్‌ అభివృద్ధి వుద్యోగాలకు పనికి రారన్నది సర్వేసారం. పోనీ అది అతిశయోక్తితో కూడింది అనుకుందాం. పది సంవత్సరాల క్రితం మెకెన్సీ సంస్ధ పాతికశాతం మంది మాత్రమే వుద్యోగాలకు పనికి వస్తారు అన్నది. ఇలాంటి పరిస్ధితికి కారకులు ఎవరు? అన్నింటినీ మాకు వదలి పెట్టండి దేశాన్ని ఎలా ముందుకు తీసుకుపోతామో చూడండి అనే ప్రయివేటు రంగం కాదా ! విద్యావ్యాపారంలో లేని పారిశ్రామిక సంస్ధను ఒక్కదానిని చూపమనండి, ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలో అదే లాభసాటి వ్యాపారం. ఈరోజు ఇంజనీరింగ్‌ చదివి వుద్యోగం పేరుతో పనిచేస్తున్న అనేక మందికి చాలా మంది అడ్డామీది రోజువారీ కూలీకి వస్తున్న మొత్తాలకంటే తక్కువే అన్నది చేదు నిజం. గతంలో విదేశీ తెల్లజాతి మెకాలే తమకు అవసరమైన గుమస్తాలను తయారు చేసే విద్యావిధానం, వ్యవస్ధలను ఏర్పాటు చేస్తే నేటి మన నల్లజాతి మెకాలేలు కారుచౌక ఇంజనీరింగ్‌ గుమస్తాలను సరఫరా చేస్తున్నారు.’ఈ రోజు ఢిల్లీలో 60శాతం మార్కులు తెచ్చుకున్నవారు కూడా బిఏ ఇంగ్లీష్‌ కోర్సు సీటు తెచ్చుకోలేరుగాని ఇంజనీరింగ్‌కాలేజిలో సులభంగా చేరిపోతున్నారని’ టెక్‌ మహీంద్రా సిఇఓ సిపి గుర్నానీ వ్యాఖ్యానించారు. నాలుగో పారిశ్రామిక విప్లవం గురించి చెబుతున్న మన రాజకీయవేత్తలు, విధాన నిర్ణేతలకు ఏ నిపుణులు ఎందరు కావాలో, అందుకు అనుసరించాల్సిన ప్రణాళికలేమిటో ఎవరైనా చెప్పగలరా ? ఇంజనీరింగ్‌,మెడికల్‌ కాలేజీల్లో సంపూర్ణ అర్హతలు కలిగిన బోధకులు వున్నారా, అవసరమైన ప్రయోగశాలలు వున్నాయా లేదా అని ఎవరైనా పట్టించుకుంటున్నారా? వీరు దేశాన్ని నాలుగో పారిశ్రామిక విప్లవంలోకి దేశాన్ని తీసుకుపోతారా? మనం నమ్మేయాలా ?

ఇటీవలి కాలంలో నైపుణ్య అభివృద్ధి గురించి ప్రధాని మోడీ, మాట్లాడని ముఖ్యమంత్రి లేరు. అందుకోసం వందల కోట్లరూపాయలు తగలేస్తున్నారు.నివేదికల్లో అసంఖ్యాకంగా నిపుణులను సృష్టిస్తున్నారు. నరేంద్రమోడీ సర్కార్‌ చర్యల వలన ఇప్పటికే తన ఆదాయం రెట్టింపైందని చత్తీస్‌ఘర్‌కు చెందిన గిరిజన మహిళా రైతు చెప్పిన అంశాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారానికి వాడుకుంది. తీరా చూస్తే అధికారులు తనను అలా చెప్పమన్నారని ఆమె ఒకటీవి బృందానికి చెప్పింది. ఆ వార్తను ప్రసారం చేసిన సదరు ఎడిటర్‌, యాంకర్‌ను వుద్యోగాల నుంచి ఇంటికి పంపే విధంగా మోడీ సర్కార్‌ టీవీ ఛానల్‌ యాజమాన్యంపై వత్తిడి తెచ్చిన వుదంతం తెలిసిందే. అలాంటి వారందరినీ లెక్కలోకి తీసుకున్నా మన దగ్గర వున్న నిపుణులైన పనివారలెందరో చూస్తే దిమ్మదిరుగుతుంది. మన దగ్గర నిపుణులైన పనివారలే తక్కువ, అవసరమైన వృత్తి శిక్షణ ఇచ్చే సామర్ధ్యం కూడా మన దగ్గర లేదని నివేదికలు చెబుతున్నాయి. మొత్తం కార్మికుల సంఖ్యతో పోలిస్తే వృత్తిశిక్షణ సామర్ధ్యం చైనాలో 11.5శాతం కాగా అమెరికాలో 6.7, అదే మన దేశంలో 0.8శాతం మాత్రమే. దేశాల వారీగా దక్షిణ కొరియాలో 96, జపాన్‌లో 80, జర్మనీలో 75, బ్రిటన్‌లో 68శాతం మంది వున్నారు. రెండుశాతమే మన దగ్గర అని చెప్పుకోకపోవటమే మంచిది.

ఒక వైపు ప్రధాని నరేంద్రమోడీ పురోగామి మహోపన్యాసాలు మరోవైపు ఆయన అనుయాయులేమో స్త్రీల రుతుస్రావం అపవిత్రమంటూ వీధుల్లో అల్లరి, దాడులు చేస్తుంటారు. పనిలేని వారు ఏదో చేశారన్నట్లుగా కొందరు అలహాబాద్‌ను ప్రయాగరాజ్‌గానూ, సిమ్లాను శ్యామలాగా మార్చేందుకు, మసీదులను పడగొట్టి గుడులు ఎలా కట్టాలా అని, మరి కొందరు అయ్యప్ప గుడికి వచ్చే మహిళా భక్తులు మీద ఎలా దాడులు చెయ్యాలా అని తిరుగులేని తిరోగామి ఆచరణలో మునిగి తేలుతుంటారు. మోడీ, ఆయన అనుయాయులను తయారు చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ దళం చేస్తున్న వాదనల ప్రకారం రాజారామ్మోహన్‌ రాయ్‌ బ్రిటీష్‌ వారితో చేతులు కలిపి మన పవిత్ర సతీసహగమన ఆచారాన్ని మట్టికలిపారు. వితంతు పునర్వివాహ నిషేధం, బహుభార్యాత్వం, దేవదాసీ వంటి మన హిందూ ఆచారాలు సాంప్రదాయాలను తిరిగి పునరుద్దరించాల్సిందే. అవి లేకుండా పోయిందని చెబుతున్న మన గత గౌరవం, ఘనత తిరిగిరాదు. వాటన్నింటి పునరుద్ధరణ ప్రపంచంలో మరోమారు మన దేశాన్ని వున్నత స్ధానంలో వుంచుతుంది. అందుకుగాను వున్న రాజ్యాంగాన్ని రద్దు చేయాలి. మనువు కంటే ముందే మన ఆచారాలు వున్నాయి గనుక వాటిని క్రోడీకరించటం తప్ప కొత్తగా చేసిందేమీ లేని మనుస్మృతిని తిరిగి ప్రవేశపెట్టాలి. సాంప్రదాయాలు, ఆచారాల పరిరక్షణ పేరిట సామాజిక మాధ్యమం, వీధుల్లో వేస్తున్న వీరంగాలను చూస్తే అంతపనీ చేసినా ఆశ్చర్యం లేదు. అందుకే అంతరకు వచ్చినపుడు ఏం చేయాలో, ఏ వైపున వుండాలో ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే ఆలోచించుకోవటం మంచిది. ఇలాంటి వారి నాయకత్వంలో మహా అయితే కుక్కతోకపట్టుకొని గోదావరి కాక పోతే గత నాలుగేండ్లలో మరింతగా మురికి అయిందని వార్తలు వచ్చిన గంగానదిని ఈదగలమేమోగానీ నాలుగో పారిశ్రామిక విప్లవంలో ప్రవేశించగలమా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

2008 సంక్షోభానికి పదేండ్లు- మరో ముప్పు ముంచుకొస్తోంది !

12 Wednesday Sep 2018

Posted by raomk in Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

2008 financial crisis, 2008 meltdown, Another financial crisis, Collapse of Lehman brothers, Great Depression

Image result for ten years of 2008 financial crisis cartoons

ఎం కోటేశ్వరరావు

2008, ప్రపంచ ధనిక దేశాలలో తలెత్తిన మరొక మహా సంక్షోభానికి పది సంవత్సరాలు. అమెరికాలోని లేమాన్‌ బ్రదర్స్‌ బ్యాంకు 2008 సెప్టెంబరు15న దివాలా ప్రకటన చేయటాన్ని చాలా మంది మరచిపోయి వుంటారు. ప్రపంచ ధనికులు మాత్రం మెలకువగానే వున్నారు. వారిలో ఒకడిగా 92బిలియన్ల సంపదకలిగిన బిల్‌గేట్స్‌ ‘ఎప్పుడు అన్నది చెప్పటం కష్టంగానీ 2008 వంటి మరో సంక్షోభం రావటం తప్పని సరి ‘ అని ఈ ఏడాది మార్చి2న ఒక ఆస్ట్రేలియా మీడియాలో అడిగిన ప్రశ్నకు చెప్పారు. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తిరుగులేని విధంగా తెలిసినట్లే ఒకదాని తరువాత ఒక సంక్షోభం రావటం పెట్టుబడిదారీ విధానంలోనే ఇమిడి వున్న లక్షణం అని గేట్స్‌ వంటి వారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అందుకే తాము మునిగి పోకుండా వుండేందుకు నిరంతరం దారులు వెతుకుతుంటారు. పదేళ్ల నాటి సంక్షోభం దెబ్బకు అమెరికాలో 87లక్షల వుద్యోగాలు హరీమన్నాయి. సంక్షోభం నుంచి కోలుకున్నట్లు చెబుతున్నా ఇప్పటికీ పూర్వపు స్ధితికి చేరుకోలేదు.

ఇప్పటికీ ప్రధాన స్రవంతి మీడియా లేదా వామపక్షాలు మినహా ఇతర రాజకీయ పక్షాలు జనానికి ఇలాంటి వాటి గురించి వాస్తవాలు చెప్పటం లేదు. తప్పుడు నిర్ణయాలు, విధానాలతో దివాలా తీసిన సంస్ధలన్నింటినీ అమెరికా, ఇతర దేశాల పాలకులు ప్రజల సొమ్ముతో రక్షించారు. 1980దశకం నుంచి స్వేచ్చా మార్కెట్‌ విధాన సంస్కరణలను ముందుకు నెట్టటంలో ప్రముఖుడైన అమెరికా ఫెడరల్‌ రిజర్వు(మన రిజర్వుబ్యాంకు వంటిది) మాజీ అధ్య క్షుడైన అలాన్‌ గ్రీన్‌స్పాన్‌ 2008 మేనెలలో ఒకప్రకటన చేస్తూ 2007లో ప్రారంభమైన తనఖా సంక్షోభం మీద వ్యాఖ్యానిస్తూ ‘ ద్రవ్య సంక్షోభంలో అనర్ధం ముగిసింది లేదా త్వరలో ముగియ నుంది’ అన్నాడు. లేమాన్‌ బ్రదర్స్‌ దివాలా ప్రకటన వెలువడగానే తాను చాలా తొందరపడ్డానని, తన స్వేచ్చామార్కెట్‌ సిద్ధాంతంలో లోపాలున్నట్లు గుర్తించానని చెప్పాడు.

2001లో డాట్‌కాం బుడగ పేలటం, మాంద్యం తలెత్తటంతో ద్రవ్య సంస్ధలు లాభాల కోసం కొత్త మార్గాలు వెతికాయి. వడ్డీ రేట్లు తగ్గిపోయి, ద్రవ్యోల్బణం పరిమితమైంది. వడ్డీ రేట్లు తక్కువగా వుండటంతో ద్రవ్య సంస్ధల నిధుల సేకరణ సులభతరం, ఖర్చు తక్కువగావటం,మరిన్ని ఆస్ధుల కొనుగోలుకు, అధిక వడ్డీల కోసం తనఖా వంటి ముప్పుతో కూడిన రుణాలు ఇవ్వటానికి దారితీసింది.2004నాటికి రుణాలు తీసుకున్నవారు విపరీతంగా పెరగటంతో పాటు వాయిదాల చెల్లింపుల సమస్య తలెత్తింది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్లు పెంచింది. ఇండ్ల ధరలు పతనమయ్యాయి. అప్పులు తీర్చాలంటే అందుకోసం కొత్త అప్పులు చేద్దామంటే పుట్టని స్ధితి. తనఖా అంటే అనకాపల్లిలో అయినా అమెరికాలో అయినా వడ్డీ రేటు ఎక్కుగా వుండటంతో పాటు అసలుకు ముప్పు కూడా వుంటుంది. తీర్చగలరా లేదా అనేదానితో నిమిత్తం లేకుండా అధికవడ్డీలకు దురాశ పడిన ఆర్ధిక సంస్ధలు అప్పులు తెచ్చి మరీ అడిగిన ప్రతివారికీ రకరకాల తనఖాలు, షరతులతో గృహ రుణాలు ఇచ్చాయి. కొన్ని సంస్ధలు నేరుగా రుణాలు ఇవ్వక పోయినా ఇతర సంస్ధలు ఇచ్చిన రుణాలను వసూలు చేసుకొనేందుకు వాటిని కొనుగోలు చేశాయి. తీసుకున్న వారికి రుణ చెల్లింపులు భారంగా మారటం, బుడగపేలిపోయినట్లుగా ఇండ్ల ధరలు పతనం కావటంతో రుణాలు తీసుకున్నవారితో పాటు ఇచ్చిన ఆర్ధిక సంస్ధలు, బ్యాంకులు కూడా 2007లో కుప్పకూలాయి. తనఖా పత్రాల విలువ 6.8లక్షల కోట్ల డాలర్లని తేలింది. మన సత్యం కంప్యూటర్స్‌ అసత్య లెక్కలు రాసి కుప్పకూలినట్లుగానే 2008లో లేమాన్‌ బ్రదర్స్‌ లెక్కల బాగోతం బయటపడి దివాలా ప్రకటించింది. గత మూడు సంవత్సరాలుగా అమెరికాలో తిరిగి తనఖా రుణాలు పెరుగుతున్నాయని, మన దేశంతో సహా అనేక చోట్ల ఇస్తున్న గృహ రుణాలు చెల్లింపులో వైఫల్యం తప్పదని అనేక మంది చెబుతున్నారు. లసుగుల గురించి సామాన్యుల కంటే బిల్‌గేట్స్‌ వంటి వారికి ఎక్కువ తెలుసు కనుక వారు చెప్పిన ముప్పు ఏ క్షణంలో అయినా ఎదురు కావచ్చు.

పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఎలాగైనా లాభాలు సంపాదించటానికి ప్రాధాన్యత ఇస్తారు, వాటిలో అప్పు మీద ఆధారపడటం ఒకటి. కాసినో లేదా జూదశాలల్లో జూదాలు నిర్వహించేవారు మనకు కనపడరు. డబ్బు పోగొట్టుకున్నా, ఎప్పుడన్నా సంపాదించినా జూదాలు కాసేవారు, వాటిని నిర్వహించే మధ్యవర్తులే మనకు కనిపిస్తారు.లేమాన్‌ బ్రదర్స్‌ అలాంటి మధ్యవర్తిగా డబ్బు జూదంలో నిలిచింది.దానితో రకరకాల ద్రవ్యలావాదేవీలు జరిపిన ఇతర బ్యాంకులు, ఆర్ధిక సంస్ధల వారు అది ఇచ్చే లాభాలను చూశారు తప్ప రాసే తప్పుడు లెక్కలను గమనించలేక చివరికి మునిగిపోయారు. సంక్షోభం బద్దలు అయింతరువాత బ్యాంకులు బిలియన్లకొద్దీ డాలర్లను నిరర్దక ఆస్ధులుగా ప్రకటించాల్సి వచ్చింది. వ్యక్తిగతంగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకాడాయి. వ్యాపారాలకు కూడా రుణాలు దొరకటం గగనమైంది. వ్యాపారం తగ్గిపోయి దాని ప్రతికూల ప్రభావం ఆర్ధిక వ్యవస్ధ మీద పడింది. పెట్టుబడితగ్గి డిమాండ్‌, వుత్పత్తి తగ్గుదలకు దారి తీసి, వుద్యోగాల రద్దుకు కారణమైంది.మాంద్యం తలెత్తింది.సంక్షోభం అమెరికా నుంచి ఐరోపాకు, ఇతర ప్రాంతాలకూ పాకింది. వెంటనే రంగంలోకి దిగిన అమెరికా సర్కార్‌ పరిస్ధితులు మెరుగుపడిన తరువాత తిరిగి అమ్మే ప్రాతిపదిక మీద 700 బిలియన్‌ డాలర్ల పాకేజితో దివాలా తీసిన సంస్ధల బాండ్లు, ఇతర విలువ పడిపోయిన ఆస్ధులను కొనుగోలు చేసేందుకు పూనుకుంది. మెరుగుపడక పోగా ఇంకా దిగజారటంతో మరో 250 బిలియన్‌ డాలర్లను ఇతర చిన్న సంస్దలలో పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించింది.

మరోవైపున వినియోగాన్ని పెంచేందుకు బ్రిటన్‌ సర్కార్‌ వ్యాట్‌ను 17.5 నుంచి 15శాతానికి తగ్గించింది. అనేక బ్యాంకులకు నిధులు సమకూర్చి నిలబెట్టింది.బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ వడ్డీ రేట్లను 5నుంచి 0.5శాతానికి తగ్గించింది. 2009లో లండన్లో సమావేశమైన జి20 సమావేశం ఆర్ధిక వినాశనాన్ని తగ్గించేందుకు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలోకి 681బిలియన్‌ పౌండ్లను అందించాలని నిర్ణయించింది. బ్రిటన్‌లోని రాయల్‌ స్కాటిష్‌ బ్యాంక్‌(ఆర్‌బిఎస్‌) దివాలా తీసిన వాటిలో ఒకటి. పది సంవత్సరాల తరువాత కూడా అక్కడి జనం దివాలాకు మూల్యం చెల్లిస్తున్నారు. పది సంవత్సరాల తరువాత తొలిసారిగా ఆర్‌బిఎస్‌ తన వాటాదార్లకు గత నెలలో రెండు పెన్నీల డివిడెండ్‌ ప్రకటించింది.( బ్రిటీష్‌ పౌండుకు వంద పెన్నీలు, ఒక పెన్నీ మన 93పైసలకు సమానం). పదేండ్ల క్రితం దివాలా తీసిన సదరు బ్యాంకును నిలబెట్టేందుకు బ్రిటన్‌ సర్కార్‌ 45.5బిలియన్‌ పౌండ్లను అందచేసింది. ఇప్పటి వరకు నాలుగు బిలియన్‌ పౌండ్లు నష్టపోయింది.గతంలో 84శాతంగా వున్న వాటాలను(జనం సొమ్ము) నష్టాలకు విక్రయించి 62శాతానికి తగ్గించుకుంది. ప్రభుత్వం ఆదుకొనేందుకు ఇచ్చిన సొమ్ములో 21బిలియన్‌ పౌండ్లను ఖాతాదారులతో వివాద పరిష్కారాలకు, అపరాధరుసుములు చెల్లించేందుకు బ్యాంకు ఖర్చు ఖర్చు చేసింది.

150 సంవత్సరాల క్రితమే కారల్‌ మార్క్స్‌ వుత్పాదక రంగంలో చేసే పెట్టుబడికి, ద్రవ్య వుత్పత్తుల్లో పెట్టే పెట్టుబడికి వున్న తేదాను వివరిస్తూ బ్యాకింగ్‌ బుడగలు ఎలా పెరుగుతాయో, పేలిపోతాయో పేర్కొన్నారు. మరో సంక్షోభం సంభవించే వరకు పెట్టుబడిదారులు జనానికి ఏదో ఒక ఆశచూపుతూనే వుంటారు. వుత్పాదక రంగంలో తమ పెట్టుబడికి ఆకర్షణీయమైన లాభాలు రానపుడు పెట్టుబడిదారులు తమ సొమ్మును ద్రవ్య మార్కెట్లో పెట్టుబడులుగా పెడతారు. బడా కంపెనీల, దుకాణాల పోటీలో నిలదొక్కుకోలేని అనేక మంది చిన్న మదుపుదారులు దగ్గర మార్గంగా వడ్డీ వ్యాపారాన్ని ఎంచుకోవటం తెలిసిందే. గ్రామాలలో వస్తువ్యాపారం చేసే వారు తమ మిగులును వడ్డీ, తాకట్టు వ్యాపారాలకు మళ్లించటాన్ని మనం చూస్తున్నదే. ద్రవ్య పెట్టుబడి లాభాలు వుత్పాదకరంగం పెట్టుబడిపై ఆధారపడి వుంటాయి. నిజమైన ఆర్ధిక వ్యవస్ధలో సంభవించే మార్పులు ద్రవ్యవ్యాపారంపై ప్రభావం చూపుతాయి. నిజ ఆర్ధిక వ్యవస్ధ ఇబ్బందుల్లో పడితే ద్రవ్య పెట్టుబడి( బ్యాంకింగ్‌) రంగం కుప్పకూలిపోతుంది.

బిల్‌ గేట్స్‌, వారెన్‌ బఫెట్‌ వంటి వారు ఏ క్షణంలో అయినా మరో ద్రవ్య సంక్షోభం రావచ్చని చెబుతున్నారంటే దానికి ప్రాతిపదిక లేకపోలేదు.2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం తరువాత అమెరికా స్టాక్‌ మార్కెట్‌ డౌజోన్స్‌ సూచి 350శాతం పెరగ్గా, వాస్తవ ఆర్ధిక వ్యవస్ధ పెరుగుదల కేవలం 15శాతమే. తెలుగు ప్రాంతాల్లో సప్తగిరి, వుమ్మిడియార్స్‌ నుంచి కరక్కాయల పొడి వరకు అనేక మంది మోసగాళ్లు సగం ధరలకే వస్తువులు, అధిక వడ్డీలు, లాభాల ఆశచూపుతూనే వున్నారు. అలాంటివి ముంచుతాయని తెలిసినా ముందుగా పెట్టుబడి పెట్టి తాము తప్పించుకోవచ్చని ఎవరికి వారు దురాశకు లోనై నష్టపోవటం చూస్తున్నాము. ద్రవ్య పెట్టుబడిలో సంభవించే నష్టాలు ఆయా సంస్ధల యజమానుల కంటే జనాన్ని ఎక్కువగా నాశనం చేస్తున్నాయి. భూగోళంలో ఒక ప్రాంతంలో తలెత్తిన సంక్షోభం దానికే పరిమితం కాదు. ప్రపంచీకరణ పేరుతో ద్రవ్య పెట్టుబడిదారులు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను ముడివేయటంతో తరతమ తేడాలతో ప్రపంచ వ్యాపితంగా ప్రభావం, పర్యవసానాలు పడతాయి.

పది సంవత్సరాల తరువాత నెలకొన్న పరిస్ధితి గురించి మెకెన్సీ సంస్ధ ప్రతినిధి సుసాన్‌ లండ్‌ చెప్పిన అంశాల సారాంశం ఇలా వుంది. ఐరోపా, అమెరికాలోని బ్యాంకులు ఇచ్చిన రుణాల కంటే వాటి దగ్గర వున్న పెట్టుబడి ఎక్కువగా వుంది. దీని అర్ధం అవి మరింత స్ధిరంగా వున్నాయి, భవిష్యత్‌లో తలెత్తే నష్టాలను తట్టుకోగలవు. అయితే వడ్డీ రేట్లు, రుణాలకు డిమాండ్‌ తక్కువగా వుండటం, పెట్టుబడిమీద వచ్చే ఆదాయం తక్కువగా వుండటం బ్యాంకుల అభివృద్ధికి పరిమితులను సూచిస్తున్నాయి. ద్రవ్య సంక్షోభం తరువాత బ్యాంకులకు పెట్టుబడిమీద వచ్చే ఆదాయం సగం తగ్గింది, దీంతో లాభాల కోసం నూతన వాణిజ్య పద్దతుల కోసం కుస్తీ పడుతున్నాయి. పదేండ్ల నాటి సంక్షోభం తరువాత ప్రపంచ రుణ భారం స్ధిరంగా వుండటం లేదా పడిపోవటంగాక 72లక్షల కోట్ల డాలర్లు పెరిగింది.

బ్యాంకుల వంటి ద్రవ్య సంస్ధలను ఇబ్బందుల నుంచి బయటపడవేసేందుకు పాలకవర్గ ప్రభుత్వాలు ఆ భారాన్ని జనం మీదనే మోపుతాయి. పొదుపు చర్యలు, సంక్షేమ పధకాలకు కోత, ప్రభుత్వ ఆస్ధుల విక్రయం, జనం మీద అదనపు పన్నులు ఇలా అనేక రూపాలలో వుంటున్నాయి.పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా కేంద్రీకరణ ముప్పుకు సూచన. గతేడాది ప్రపంచ జిడిపికి 217శాతం ఎక్కువగా అప్పు వున్నట్లు తేలింది. పదేండ్ల నాటి సంక్షోభానికి ముందు కంటే ఇది 40శాతం ఎక్కువ. లేమాన్‌ బ్రదర్స్‌ కుప్పకూలిపోగానే పెద్ద బ్యాంకులు, ద్రవ్య సంస్ధలను చిన్నవిగా చేయాలనే ఆలోచన చేశారు. అయితే మన దేశంతో సహా అనేక చోట్ల పోటీని తట్టుకోవాలంటే పెద్దవిగా వుండాలంటూ కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఎస్‌బిఐలో విలీనం చేసిన విషయం తెలిసిందే. 2007లో అమెరికాలోని బ్యాంకు ఆస్ధులలో 44శాతం కేవలం ఐదింటి చేతిలో వుండగా ఇప్పుడు ఆ మొత్తం 47శాతానికి పెరిగింది. ఒక శాతం మ్యూచ్యువల్‌ ఫండ్‌ సంస్ధల చేతుల్లో 45శాతం స్టాక్స్‌, బాండ్లు, ఇతర ఆస్ధులు వున్నాయి. ఇవిగాక షాడో బ్యాంకులు అంటే తెరవెనుక లావాదేవీలు నిర్వహించేవి కూడా వున్నాయని ఒక నగ్నసత్యం. 2010లో వాటి ఆస్ధుల విలువ 28లక్షల కోట్లయితే ఇప్పుడు హీనాతి హీనంగా లెక్కవేసినా 45లక్షల కోట్ల డాలర్లని చెబుతున్నారు. బ్యాంకుల మీద నియంత్రణలు పెరిగే కొద్దీ ఇలాంటివి ఎక్కువ అవుతుంటాయి. అందువలన వీటిలో ఏ ఒక్కటి మునిగినా పదేండ్ల నాటి సంక్షోభంతో పోల్చితే నష్టం కొన్ని రెట్లు ఎక్కువగా వుంటుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు ఏ రూపంలో సంక్షోభం బద్దలవుతుందో తెలియదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

డాలరు విలువను అమెరికా ఎందుకు తగ్గించదు !

07 Friday Sep 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, USA

≈ Leave a comment

Tags

Currency Value, Donald trump, US Dollar

Image result for donald trump us currency

ఎం కోటేశ్వరరావు

రూపాయి విలువ పతనం మీద ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ వ్యాఖ్యానం చూసినపుడు మాయాబజార్‌ సినిమాలో శశిరేఖ రూపంలో వున్న ఘటోత్కజుడు వివాహ ప్రహసనంలో లక్ష్మణ కుమారుడి పాదాన్ని తొక్కినపుడు నొప్పి పెడుతున్నా ఏడవ లేక నవ్విన దృశ్యం గుర్తుకు రాకమానదు. ఆ సంగతి జనం చూసుకుంటారు వదిలేద్దాం ! గురువారం నాడు రూపాయి విలువ 72.11కి దిగజారి 71.99 వద్ద ముగిసింది. ( ఎన్ని రోజులు ఇలా జరుగుతుందో తెలియదుగానీ దాదాపు రోజూ జరుగుతున్నదానికి వరుసగా కొత్త రికార్డులంటూ రాసి రాసి చదువరులకు బోరు కొట్టించదలచుకోలేదు.) మన రూపాయి లేదా చైనా యువాన్‌ విలువ పతనమైతే ఎగుమతులు పెరుగుతాయి కదా అలాగే అమెరికా కూడా తన డాలరు విలువను తగ్గించుకొని ఎగుమతులు పెంచి వాణిజ్య లోటును ఎందుకు తగ్గించుకోకూడదు అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది.

2008లో ప్రారంభమైన తీవ్ర ఆర్ధిక మాంద్యం, చైనా నుంచి దిగుమతుల కారణంగా కోల్పోయిన వుద్యోగాలను తిరిగి కల్పించేందుకు డాలరు విలువ తగ్గించాలన్న వూహలతో అధికారానికి వచ్చాడు డోనాల్డ్‌ ట్రంప్‌. అయితే అది ఎంత నష్టదాయకమో వెంటనే తెలిసి వచ్చింది. రాబోయే రోజుల్లో ఏం జరిగి పరిణామాలు ఎలా వుంటాయో చెప్పలేము గాని ప్రపంచంలో ఇప్పుడొక వినూత్న పరిస్ధితి ఏర్పడిందని చెప్పక తప్పదు.

ప్రపంచంలో అమెరికా ఎంత పెద్ద ధనిక దేశమో దానికి అప్పులు కూడా అంత ఎక్కువగా వున్నాయి. మొత్తం అప్పు19.19లక్షల కోట్ల డాలర్లు.దానిలో విదేశీ అప్పు 5.35 లక్షల కోట్ల డాలర్లు వుంది. డాలరు విలువ తగ్గితే అప్పులు పెట్టిన వారందరూ గగ్గోలు పెడతారు. అప్పులిచ్చిన విదేశాలలో చైనా 1.1877లక్షల కోట్లతో ప్రధమ స్ధానంలో వుండగా జపాన్‌ 1.0435 లక్షల కోట్లు, ఐర్లండ్‌ 317.9 బిలియన్‌ డాలర్లతో మూడో స్ధానంలో వుంది. మన విదేశీ అప్పు 500 బిలియన్‌డాలర్లకు మించి వుంది. అయితేనే మనం కూడా అమెరికాకు 157 బిలియన్‌ డాలర్ల అప్పిచ్చి 11వ స్ధానంలో వున్నాం.(అరవై వేల జనాభాగల కేమాన్‌ దీవులు 242.9 బిలియన్లిచ్చి ఏడవ స్ధానంలో వుంది) అమెరికా అప్పు దాని జిడిపికి 106శాతం వుంది. 2017లో అప్పులకు చెల్లించిన వడ్డీ రేటు 2.26శాతం. కొందరు ఇంకా తక్కువ వడ్డీరేటుకే అప్పు ఇచ్చారు.

ఒక్కసారిగా డాలరు విలువ తగ్గితే వారంతా ఏం కావాలి. దివాలా తీయాలి, చలికాచుకొనేందుకు నోట్లను వుపయోగించాలి. తక్కువ వడ్డీకి ఇచ్చిన వారికి డాలరు విలువ పెరిగితే లాభం తప్ప తగ్గితే మిగిలేది బూడిదే. అందువలన దాని విలువలో స్వల్ప మార్పులను అనుమతించటం తప్ప అధికారంలో ఎవరున్నా విలువ పతనం కాకుండా చూస్తారు. ప్రస్తుతం మన దేశంతో లావాదేవీలలో అమెరికా 23బిలియన్‌డాలర్ల మేరకు వాణిజ్యలోటు కలిగి వుంది. దాన్ని పూడ్చుకోవాలంటే రానున్న మూడు సంవత్సరాలలో పది బిలియన్‌ డాలర్ల మేరకు అదనంగా తమ నుంచి దిగుమతులు చేసుకోవాలని అమెరికన్లు మన మీద వత్తిడి చేస్తున్నారు.(సెప్టెంబరు 6 హిందూ పతాక శీర్షిక) ఇదే విధానాన్ని చైనా, ఇతర దేశాల మీద కూడా రుద్దాలని చూస్తోంది. డాలరు విలువ తగ్గనుంది అనే వార్త వచ్చిందో డాలరు పెట్టుబడులన్నీ ఇతర మెరుగైన కరెన్సీలకు మారిపోతాయి. మన రూపాయి విలువ తగ్గటంతో డాలర్లు వెళ్లిపోతున్న విషయం తెలిసిందే. అందువలన విశ్వం అంతమౌతుందనుకున్నపుడే చివరి చర్యగా డాలరు విలువను తగ్గిస్తారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

మన రూపాయి విలువ తగ్గుతున్నమేరకు మనం దిగుమతి చేసుకొనే పెట్రోలు, ఇతర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. డాలరు విలువ తగ్గితే అమెరికాలో కూడా అదే జరుగుతుంది. రోజువారీ వాడే వస్తువులన్నీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కారణంగా ఆ వస్తువుల ధరలు పెరుగుతాయి. ఆ పరిణామం ఎగుమతి చేసే దేశాలకు కూడా మంచిది కాదు. డాలరు విలువ తగ్గితే వాటి కరెన్సీ విలువ పెరుగుతుంది. ఇప్పుడు అమెరికాకు నామమాత్రపు లేదా అసలేమీ వడ్డీ లేకుండా విదేశీ పెట్టుబడులు, రుణాలు వస్తున్నాయి, దాని కరెన్సీ విలువ తగ్గితే వడ్డీ రేట్లు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ధరలు పెరుగుతాయి. అమెరికాలో ఇప్పుడున్న వేతనాలతో చైనా, భారత్‌ మాదిరి చౌక ధరలకు వస్తువులను తయారు చేసి ఎగుమతులు చేయటం కష్టం. వేతనాలు తగ్గిస్తే సామాజిక సంక్షోభం తలెత్తుతుంది. డాలరు విలువ ఎక్కువగా వుంటే ఎగుమతులు గిట్టుబాటుగాక వుత్పత్తి పడిపోతుంది.

అన్నింటికంటే ముఖ్యంగా డాలరు ఇప్పుడు రిజర్వు కరెన్సీగా వుంది. అనేక దేశాలు, కార్పొరేట్‌ సంస్ధలు పెద్ద మొత్తంలో వాటిని నిల్వ చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ లావాదేవీలు, పెట్టుబడులకు వాటిని వినియోగిస్తాయి. రిజర్వు కరెన్సీ కలిగిన ఏ దేశమైనా చౌకగా ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. బ్రిటన్‌ ప్రాభవం కోల్పోవటంతో దాని పౌండ్‌ స్ధానంలో తన డాలరును అలాంటి కరెన్సీగా చేయాలని అమెరికా నిర్ణయించుకుని అమలు చేస్తోంది. సాంప్రదాయ వస్తూత్పత్తి పెట్టుబడిదారుల స్ధానంలో ద్రవ్యపెట్టుబడిదారులది ఎప్పుడు పైచేయి అయిందో అప్పటి నుంచి డాలరును ముందుకు తెచ్చారు. దీని వలన ఇతర దేశాల నుంచి పెట్టుబడులు, అప్పులు తీసుకోవటం ద్వారా అమెరికా తన లోటును పూడ్చుకొంటోంది. ద్రవ్యపెట్టుబడిదారుల ఆధీనంలోని బ్యాంకుల పలుకుబడి, లావాదేవీలు, లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. డాలరును ఆయుధంగా చేసుకొని అమెరికా కార్పొరేట్‌ సంస్ధలు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో, ఆయా దేశాలలో చొరబడటంతో పాటు ప్రపంచ మిలిటరీ వుద్రిక్తతలలో అమెరికా జోక్యం, ఎక్కడైనా లేకపోతే సృష్టించటం జరుగుతున్నది. వాటి ద్వారా కార్పొరేట్ల ఆయుధ పరిశ్రమలు మూడుపువ్వులు ఆరుకాయలుగా లాభాలు పొందుతున్నాయి. వాటికి దెబ్బ తగుల కుండా వుండాలంటే ఒక చోట వుద్రిక్తతలు సడలితే, ముగిస్తే మరొక చోట తలెత్తేట్లు చేస్తున్నారు. మిలిటరిజం, సామ్రాజ్యవాదం ఒకదానితో ఒకటి కలసి పెరుగుతున్నాయి. డాలరు విలువను తగ్గిస్తే ఇది సాధ్యం కాదు.

చైనా పెద్ద మొత్తంలో అమెరికాకు అప్పు ఇచ్చినందున డాలరు విలువ తగ్గితే ఎక్కువగా నష్టపోయేది కూడా ఆ దేశమే. చైనా కనుక తన అప్పును తగ్గించుకుంటే, మిగతా దేశాలు కూడా దాని బాటనే నడిస్తే తక్షణం డాలరు విలువ పతనం అవుతుంది. చైనా కొత్తగా డాలర్లను కొనుగోలును తగ్గించినా సమస్యలు తలెత్తుతాయి. మొత్తం మీద అమెరికా లేదా చైనా ఏ విపరీత చర్యకు పాల్పడినా రెండు దేశాలతో పాటు ప్రపంచం సంక్షోభంలో మునుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే తెలిసిగానీ లేక తెలియకగానీ ట్రంప్‌ దూకుడు మీద వున్నాడు. పిచ్చి పనులు చేస్తే ఫలితాలు, పర్యవసానాలను అనుభవిస్తాడు. మన రూపాయితో పోలిస్తే జపాన్‌ ఎన్‌ విలువ ఇంకా తక్కువ, శుక్రవారం నాడు ఒక డాలరుకు 110.6 ఎన్‌ల వద్ద వుంది. దీని కంటే చాలా ఎక్కువగా వుండే చైనా యువాన్‌ విలువను పెంచాలని అమెరికా డిమాండ్‌ చేస్తోందిగానీ జపాన్‌ గురించి ఇంతవరకు మాట్లాడలేదు. రాబోయే రోజుల్లో జపాన్‌తో వాణిజ్య సమస్య మీద కూడా కేంద్రీకరిస్తానని ట్రంప్‌ ప్రకటించటంతో డాలర్‌ విలువ స్వల్పంగా పతనమైనట్లు వార్తలు వెలువడ్డాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెట్రో పన్ను తగ్గించం- గాల్లో దీపం రూపాయి !

05 Wednesday Sep 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

China Currency, Currency Value, India oil Tax, Naredra Modi, RBI, Rupee Fall

Image result for rupee value : narendra modi cartoons

రూపాయి విలువ- మోడీ భక్తుల గారడీ -3

ఎం కోటేశ్వరరావు

రూపాయి విలువ పతనానికి వాణిజ్య యుద్దం, చమురు ధరల పెరుగుదల వంటి బయటి అంశాలే కారణం, మనకు సంబంధం లేదు, కనుక రూపాయి దానికదే సర్దుకుంటుంది. రూపాయి విలువ పతనమైనందున పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగినంత మాత్రాన వాటి మీద కేంద్రం వసూలు చేస్తున్న పన్నులు తగ్గించాల్సిన అవసరం లేదు. తాజా పరిస్ధితులపై నరేంద్రమోడీ సర్కార్‌ అనధికార స్పందన లేదా అధికార యంత్రాంగం లీకుల ద్వారా వెల్లడి. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో తర్కం ఇది. అయినా సరే ఇంకా మోడీని సమర్ధించేవారు, బిజెపిని నెత్తికెత్తుకునే వారు వున్నారు. ప్రజాస్వామ్యం మనది, ఎవరి స్వేచ్చ వారిది.

వస్తుమార్పిడి పద్దతి నుంచి నగదు లావాదేవీలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో అప్పటి నుంచి ప్రతి దేశ కరెన్సీ ఏదో ఒక విధంగా ప్రభావితమౌతూనే వుంది. గత కొద్ది రోజులుగా రూపాయి విలువ పడిపోతూ వుండటం, నిత్యం పెట్రోలు, డీజిలు ధరల పెంపుదల ప్రకటనలు వెలువడుతుండటంతో కరెన్సీ విలువపై చర్చ జరుగుతోంది. బుధవారం వుదయం (11.20) రూపాయి విలువ మరింతగా దిగజారి ఒక డాలరుకు రు. 71.71గా నమోదైంది . ఇంత జరుగుతున్నా మన కరెన్సీ ఇంకా పతనమైనా ఫరవాలేదు అన్నట్లుగా కొందరు చెబుతున్నారు. నరేంద్రమోడీ తీరు తెన్నులను చూసినపుడు దేశమంతా చర్చనీయాంశం అయిన, ఆందోళన చెందిన విషయాల మీద సకాలంలో సూటిగా మాట్లాడిన వుదంతం ఒక్కటంటే ఒక్కటీ లేకపోవటం ఆశ్చర్యకరంగాకపోయినా ఆందోళనకరం. రూపాయి పతనాన్ని అరికడతారో లేక కొనసాగింపును అనుమతిస్తారో ఏదో ఒకటి చెప్పాల్సిన రాజధర్మం ఏమైనట్లు ?

కరెన్సీ విలువలను ప్రస్తుతం ఎక్కువ దేశాలు మార్కెట్‌ శక్తులకు వదలి వేశాయి. ఇప్పటికీ కొన్ని దేశాలు తెరచాటున విలువ నిర్ణయ అధికారాన్ని తమ చేతుల్లోనే వుంచుకున్నాయి. చైనా సర్కార్‌ తన యువాన్‌ విలువను నియంత్రిస్తున్నదని అమెరికాతో సహా పశ్చిమ దేశాలు ఆరోపిస్తాయి. అలాంటిదేమీ లేదని చైనా చెబుతోంది. ఇటీవలి కాలంలో మన కరెన్సీ పతనాన్ని అరికట్టేందుకు రిజర్వుబ్యాంకు డాలర్లను కొన్నింటిని అమ్మిందని అవి 20బిలియన్ల వరకు వున్నాయని వార్తలు వచ్చాయి. బ్యాంకు గానీ, కేంద్రం గానీ తాము తీసుకోబోయే చర్యల గురించి జనానికి చెప్పటం లేదు. మొత్తం మీద పరిణామాలను చూసినపుడు మార్కెట్‌ శక్తులకు వదలివేసినా అదుపు తప్పినపుడు ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటున్నాయి. లేకపోతే వాటి పుట్టి మునుగుతుంది కదా !

గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా అనుసరించిన విధానాలు దాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. అందుకే పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే నిర్ధారణలకు వస్తున్న యువత అక్కడ నానాటికీ పెరుగుతోంది. ఇదే సమయంలో చైనా తనదైన తరహా సోషలిస్టు పద్దతుల్లో ముందుకు పోతోంది, కొన్ని ఎగుడుదిగుడులున్నా సంక్షోభాలకు దూరంగా వుంది. అనేక దేశాలు అమెరికా నుంచి అధిక ధరలకు యంత్రాలు, పరికరాలు, ఇతర వస్తువులను కొనే బదులు తామే తయారు చేయటం, ప్రత్యామ్నాయాలను చూసుకోవటంతో పాటు ఎగుమతుల్లో అమెరికాకు పోటీగా తయారయ్యాయి. తన కరెన్సీ విలువను అధికంగా వుంచుతూ ఆధరకు తన వస్తువులను కొనాలంటూ ఇతర దేశాల మీద అమెరికా వత్తిళ్లు తెస్తోంది. బెదిరింపులకు పాల్పడుతోంది. చైనాపై ప్రారంభించిన వాణిజ్య యుద్ద సారమిదే. అమెరికా దాడిని ఎదుర్కొనేందుకు పరిమితంగా అయినా తన కరెన్సీ విలువ తగ్గింపును చైనా ఆయుధంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. తన ఎగుమతులకు కొత్త మార్కెట్లను చూసుకోవటం, వున్న మార్కెట్లలో దెబ్బ తగలకుండా చూసుకొనేందుకు కరెన్సీ విలువను పరోక్షంగా నియంత్రిస్తున్నట్లు కనిపిస్తోంది.

1930దశకంలో తలెత్తిన మహా ఆర్ధిక మాంద్యం నుంచి బయట పడేందుకు అమెరికా, జపాన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, ఆస్ట్రేలియా వంటి బడాదేశాలన్నీ చరిత్రలో తొలిసారిగా రికార్డు స్ధాయిలో 40శాతం వరకు తమ కరెన్సీ విలువలను తగ్గించాయి.బంగారంతో కరెన్సీ విలువ లింక్‌ను విస్మరించాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయి నష్టపరిహారం చెల్లించిన జర్మనీ యుద్ధ భారాలను తట్టుకోలేక తన కరెన్సీకి కావాలనే విలువ లేకుండా చేసింది. ఒక డాలరుకు వందకోట్ల మార్క్‌లుగా విలువ పతనం అయింది. తద్వారా కారుచౌకగా తన వస్తువులను ప్రపంచ మార్కెట్లో అమ్మి ప్రభుత్వం కష్టాల నుంచి గట్టెక్కిందిగానీ సామాన్య జర్మన్లు భారీ మూల్యం చెల్లించారు. ఆ దశలో అధికారానికి వచ్చిన హిట్లర్‌ జర్మన్‌ ఔన్నత్యాన్ని నిలబెట్టాలనే పేరుతో రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడైన విషయం తెలిసిందే. చరిత్రలో అతిపెద్ద వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన డోనాల్డ్‌ ట్రంప్‌ చర్యలు ఏ పర్యసానాలకు దారి తీస్తాయో ?

గత ఆరునెలల్లో జరిగిన పరిణామాలను చూస్తే అంతర్గత ఇబ్బందులను అధిగమించటం కోసం అమెరికా తన వడ్డీ రేట్లను పెంచటం, ఇంకా పెంచనున్నట్లు ప్రకటించటం, చైనా, ఇతర దేశాల మీద వాణిజ్య యుద్ధానికి దిగటం, ఇరాన్‌పై తిరిగి ఆంక్షలను ప్రకటించటం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు రేట్లు పెరగటం, టర్కీ లీరా, అర్జెంటీనా పెసో పతనం వంటి ముఖ్య పరిణామాలన్నీ ప్రపంచ కరెన్సీలను ప్రభావితం చేస్తున్నాయి. ఓట్ల కోసం ట్రంప్‌ తీసుకొనే చర్యల కారణంగా నవంబరులో అమెరికాలో జరిగే పార్లమెంట్‌ మధ్యంతర ఎన్నికల వరకు ఈ అనిశ్చితి కొనసాగే అవకాశం వుంటుంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుగా మన వంటి దేశాల పౌరుల పరిస్ధితి తయారైంది. కరెన్సీ విలువ వుద్ధాన, పతనాలతో ప్రతి దేశానికీ కొన్ని ప్రయోజనాలు, కొన్ని కష్టాలు వుంటాయి. వుదాహరణకు ఐటి వుత్పత్తులను ఎగుమతి చేసే మన కంపెనీల వాటాల ధరలు దూసుకుపోతుండగా దిగుమతులు చేసుకొనే కంపెనీలవి డీలా పడుతున్నాయి. వాణిజ్యలోటు వున్న మన వంటి దేశాలకు కరెన్సీ పతనం ప్రయోజనకరం అయినా మిగులు వున్న చైనా వంటి దేశాలకు వాటి సమస్యలు వాటికి వున్నాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో డాలర్లను కొనుగోలు చేయటం అంటే మిగతా కరెన్సీలను విక్రయించటం కూడా ఇమిడి వుంటుంది. ఏ లావాదేవీ జరిగినా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారులు వీటిని తమకు అనుకూలంగా నియంత్రిస్తారు.

ప్రతి దేశమూ అధికారిక లావాదేవీలను జరిపే సమయంలో ఒక నిర్ణీత విలువతోనే ఖరారు చేసుకుంటుంది. ఒక పరిధి నిర్ణయించుకొని దానికి లోబడి మార్పులున్నంత వరకు లావాదేవీలను అనుమతిస్తుంది. దాటినపుడు చర్యలకు వుపక్రమిస్తుంది. కొన్ని దేశాలు ప్రయివేటు రంగంలో కూడా నిర్ణీత విలువను మాత్రమే అనుమతిస్తాయి. అటువంటి చోట్ల డాలర్ల క్రయ విక్రయాలు బ్లాక్‌ మార్కెట్‌కు చేరే అవకాశాలూ లేకపోలేదు. పీకల్లోతు నీరు వచ్చింది తప్ప ప్రాణాలకు ముప్పు లేదు, అయినా వచ్చిన వరద వచ్చినట్లే పోతుంది లేదా స్ధిరపడుతుంది ఆందోళన అవసరం లేదన్నట్లుగా మన అధికార యంత్రాంగం వుంది. రూపాయి పతనానికి వాణిజ్యం యుద్ధం, చమురు ధరల పెరుగుదల ప్రధాన కారణాలు, వాటిని ప్రభుత్వం ఏమీ చేయగలిగింది లేదు, రూపాయి దానంతట అదే స్ధిరపడుతుందని ఆర్ధికశాఖ అధికారి ఒకరు అనధికారికంగా వ్యాఖ్యానించారు. పతనం మరింతగా కొనసాగుతుందనటానికి తగినన్ని కారణాలున్నాయని ఎస్‌బిఐ ప్రధాన ఆర్ధిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్‌ చెప్పారు.

డబ్బు బయటకు పోకుండా చర్యలు తీసుకోవటం ద్వారా కరెన్సీ పతనాన్ని కొంతమేరకు అరికట్టిన వుదంతాలు వున్నాయి. గతంలో చైనా అలా వ్యవహరించిందని విశ్లేషకులు చెబుతున్నారు. స్ధానిక కరెన్సీని విక్రయించకుండా ఆర్ధిక సంస్ధలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసి అదుపు చేయటం, వుల్లంఘించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవటం ఒకపద్దతి. రిజర్వుబ్యాంకులు బయటకు ప్రకటించకుండానే ఒక నిర్ణీత ధరను సూచించటం మరొకటి. లావాదేవీలపై పరిమితులు విధించటం, అన్నింటిని విధిగా నమోదు చేయటం వంటివి మరికొన్ని చర్యలు.

అమెరికాలో వడ్డీ రేట్లను ఎప్పుడైతే పెంచారో అప్పటి నుంచి డాలర్లు మన దేశం నుంచి అక్కడికి తరలటం ప్రారంభించాయి. ఆ ప్రవాహాన్ని ఆపేందుకు మన బ్యాంకులు వడ్డీరేట్లను పెంచాయి, రూపాయి పతనం ఇంకా కొనసాగితే రానున్న రోజుల్లో ఇంకా పెంచే అవకాశాలున్నాయి. చివికి పోయిన వస్త్రానికి ఒక దగ్గర మాసిక వేస్తే మరో చోట చిరిగి పోతుందన్నట్లుగా ఒకదాని కోసం ఒక చర్య తీసుకుంటే కొత్త సమస్యలు తలెత్తుతాయి. జనం మీద విపరీత భారం, ప్రభుత్వాలకు ద్రవ్యలోటు పెరగటం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఒక దేశ కరెన్సీ విలువ పెరగటం కూడా ఒక్కోసారి నష్టదాయకమే. వుదాహరణకు స్విడ్జర్లాండ్‌ వుదంతం. బలమైన మారకపు విలువ కారణంగా అక్కడ డబ్బు దాచుకోవటం ఎంతో భరోసాగా భావించి ఒకప్పుడు మన దేశంతో సహా ప్రపంచంలోని నల్లధనమంతా స్విస్‌ బ్యాంకులకు చేరేది. దాంతో వాటి లాభాలు ఇబ్బడి ముబ్బడి అయ్యాయి. అయితే స్విస్‌ ఫ్రాంక్‌ విలువ పెరిగి ఆ దేశ ఎగుమతులు ఖరీదయ్యాయి. పారిశ్రామికవేత్తలు లబోదిబో మన్నారు. దాంతో నల్లధన ప్రవాహాన్ని అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవటంతో నల్లధన కుబేరులు వేరే దేశాల బాట పట్టారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రూపాయి విలువ- మోడీ భక్తుల గారడీ-1

03 Monday Sep 2018

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

fall in the value of the rupee, Indian currency, Narendra Modi, Rupee, Rupee Fall

Image result for Rupee value : narendra modi  cartoons

ఎం కోటేశ్వరరావు

ఈ మధ్య కిరాయి ప్రచార యంత్రాంగం పడిపోతున్న రూపాయిని కూడా ప్రధాని నరేంద్ర మోడీకి అనుకూలంగా మార్చేందుకు పూనుకుంది. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి మోడీని ధన్యుడిని చేయాలన్న తాపత్రయంలో వారున్నారు. మన కంటే కొన్ని కరెన్సీల విలువలు ఎక్కువగా పడిపోతున్నాయి. మన కరెన్సీ విలువ కూడా పెరిగింది అయితే కొన్ని కరెన్సీల విలువలు ఇంకా పెరిగాయి అంటూ కొన్ని అంకెలను ప్రచారంలో పెట్టారు. తెనాలి రామకృష్ణుడు నియోగులను ఎలాగైనా వినియోగించుకోవచ్చు అన్నట్లుగా అంకెలు కూడా అలాంటివే.

మన్మోహన్‌ సింగ్‌ హయాంలో గరిష్టంగా పతనమైన రూపాయి విలువను తాజాగా పడిపోయిన విలువను పోల్చి పెద్దగా పడిందేమీ లేదని జనానికి చెప్పదలచుకున్నారు.2013 ఆగస్టు 31న 65.70రులకు పడిపోయింది. 2018ఆగస్టు 30న విలువ 70.74ను చూపి తేడా ఐదు రూపాయలే కదా అన్నట్లుగా చిత్రిస్తున్నారు. 2009 మార్చి ఆరున రు.51.69 కనిష్టంగా వున్నది తరువాత క్రమంగా పడిపోతూ 2011 ఆగస్టు ఒకటిన 44.05 గరిష్ట స్ధాయికి చేరింది, అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ పైన చెప్పుకున్న 65.70కి పతనమైంది. ఆ తరువాత మోడీ ఏలుబడికి వచ్చే నాటికి 2014 మే 25న 58.52కు పెరిగింది. అప్పటి నుంచి గత నాలుగు సంవత్సరాలలో ఇంతవరకు కనీసం ఆస్ధాయిని ఒక్క రోజు కూడా చేరుకోలేదు, క్రమంగా పెరుగుతూ సోమవారం నాడు (సెప్టెంబరు 3న) 71.21గా ముగిసి మరో రికార్డు సృష్టించింది. ఈ వివరాలను ఎవరైనా కాదనగలరా చెప్పండి. కావాలంటే క్రింది లింక్‌లో గ్రాఫ్‌ను చూడండి. మోడీ భక్తుల బండారం బయట పడుతుంది.https://www.poundsterlinglive.com/bank-of-england-spot/historical-spot-exchange-rates/usd/USD-to-INR

Image result for Rupee value cartoons

మన కరెన్సీ విలువ కూడా పెరిగింది, మన కంటే డాలరు విలువ ఇంకా పెరిగింది. ఇది అతితెలివితో కూడిన వాదన.మన కరెన్సీ విలువ మరొక కరెన్సీతో పోల్చితే పెరిగింది లేదా తగ్గింది అంటే అర్ధం ఏమిటి? వుభయులము పరస్పరం కరెన్సీలను కొనుగోలు చేసి ఆ మేరకు చెల్లించే వప్పందం వున్నపుడు పాకిస్ధాన్‌-మనమ ధ్య లావాదేవీలు జరిగితే ఏం జరుగుతుంది. మన దేశం నుంచి వంద రూపాయల విలువ గల వస్తువును పాకిస్ధాన్‌ కొంటే గతేడాది సెప్టెంబరు 28న పాక్‌ కొనుగోలు దారులు మనకు వారి కరెన్సీ 162 రూపాయలు చెల్లించాలి.అదే ఈ ఏడాది జూలై 28న 188 అయింది, ఈ నెల రెండున 173 అయింది. అంటే జూలై 28తో పోల్చితే సెప్టెంబరు రెండుకు పాక్‌ కరెన్సీ విలువ(మనతో పోల్చుకుంటే) పెరిగినట్లు. మనం పాకిస్ధాన్‌ నుంచి వంద రూపాయల వస్తువు కొంటే జూలై 26న 53 రూపాయలు ఇస్తే సరిపోయింది, అదే వస్తువుకు మనం సెప్టెంబరు 2న 58 చెల్లించాల్సి వచ్చింది. అంటే పాక్‌ కరెన్సీతో మన రూపాయి విలువ పడిపోయింది. అదే మన మధ్య డాలర్ల మార్పిడి జరిగిందను కోండి. మన దగ్గర వుంటే వాటిని లేదా మార్కెట్లో కొని చెల్లించాలి. ఆగస్టు ఆరున మనం పాక్‌ నుంచి ఒక డాలరుకు ఒక పెన్ను దిగుమతి చేసుకుంటే మనం ఆరోజున్న మార్కెట్‌ రేటు ప్రకారం రు.68.46 పెట్టి ఒక డాలరు కొని పాక్‌ వ్యాపారికి ఇచ్చాము. అదే పెన్నును సెప్టెంబరు మూడున కొంటే సెప్టెంబరు రెండున డాలరుకు రు.71.21చెల్లించాల్సి వచ్చింది. డాలర్లలో ఏ దేశానికైనా అదే రీతిలో చెల్లించాలి. అమెరికా మన నుంచి ఒక చాక్లెట్‌ దిగుమతి చేసుకుంటే ఆగస్టు 3న 0.015 డాలర్లు చెల్లించాలి. ఒక నెల తరువాత సెప్టెంబరు మూడున ఆ మొత్తం 0.014కు పడిపోయింది. అంటే మన కరెన్సీ విలువ తగ్గింది, అమెరికా విలువ పెరిగింది.

త్వరలో మనల్ని చైనాను అధిగమించేట్లు నడిపిస్తామని మోడీ బృందం నమ్మిస్తున్నది. మంచిదే, అంతకంటే కావాల్సింది ఏముంది. మనం చైనాతో సహా అన్ని దేశాలకు మేకిన్‌ ఇండియా పేరుతో వస్తువులను ఎగుమతి చేయాలని అనుకుంటున్నాం. దానిలో భాగంగా మనం అదానీ లేదా అంబానీ దుకాణం నుంచి ఒక కిలో కందిపప్పు ఒక రూపాయికి ఎగుమతి చేశామనుకోండి( మోడీ ప్రత్యేక ఎగుమతి సబ్సిడీ అందచేస్తున్నారు అనుకోవాలి మరి) మనకు చైనా తన కరెన్సీలో ఆగస్టు 3న 0.1యువాన్లు చెల్లించింది. అదే సెప్టెంబరు రెండున 0.096 యువాన్లకు తగ్గిపోయింది. దీనర్ధం మన కరెన్సీ విలువ తగ్గిపోయింది, అమెరికా, ఇతరులతో మన సంఘపరివార్‌ తదితరులు దెబ్బతీయాలని చూస్తున్న చైనా కరెన్సీ విలువ పెరిగింది.

Image result for Rupee value cartoons

మన కంటే అధ్వాన్నం అయిన పాకిస్ధాన్‌తోనే మన కరెన్సీ దిగజారింది, మోడీ భక్తులు చెబుతున్న మన కరెన్సీ పెరుగుదల అంటే దాని కంటే అధ్వాన్న దేశంతో అనుకోవాలి. ఆశలు చైనాను దెబ్బతీయటం, ఆచరణ వూరూ పేరులేని దేశాలతో పోల్చుకొని సంబర పడటం ! ఏమి సామర్ధ్యం, ఏమి దేశభక్తి బాబూ ఇది !! ‘ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు,రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు ‘ ఈ మాటలు అన్నదెవరో తెలుసా మిన్నువిరిగి మీద పడ్డా మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్న నరేంద్రమోడీ ! మరి ఈ మాటలు ఎలా చెప్పారు అని వెంటనే అడిగేందుకు ఆయన భక్తులు కాచుకొని వుంటారు. కాస్త నిదానించి పై వ్యాఖ్య ఎప్పుడు చేశారో ఇప్పుడేం చేస్తున్నారో చూడండి.http://www.business-standard.com/article/politics/modi-blames-upa-govt-s-inaction-for-falling-rupee-113082000623_1.html

Share this:

  • Tweet
  • More
Like Loading...

రూపాయితో కనిపించని దెబ్బలు కొడుతున్న నరేంద్ర మోడీ

31 Friday Aug 2018

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Uncategorized

≈ Leave a comment

Tags

Demonetisation, Narendra Modi, RBI Report on Demonitisation, Rupee Fall

Image result for narendra modi hitting  below the belt with currency cartoons

ఎం కోటేశ్వరరావు

కత్తులతో పని లేకుండా కంటి చూపుతో ఖతం చేస్తా అన్న హీరోలను సినిమాల్లో చూశాము. రూపాయితో 135కోట్ల జనాన్ని చావు దెబ్బలు కొడుతున్న హీరో ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక్కడో పెద్ద విజయగాధను చెప్పుకోకతప్పదు. నరేంద్రమోడీ పాలనలో హిందూ మహిళలు పెద్ద సంఖ్యలో పిల్లల్ని కనాలని సంసారాలతో పని లేని యోగులు, యోగినులు చేసిన ప్రచారం వల్లకానీయండి, మరో విధంగా గానీ నరేంద్రమోడీ తన ఖాతాలో మరొక విజయాన్ని నమోదు చేసుకున్నారు. 2015 నుంచి ఈ విశ్లేషణ రాసే సమయానికి ప్రపంచంలో మన జనాభా శాతం 17.73 నుంచి 17.74శాతానికి పెరిగింది. ఇదే సమయంలో చైనా వాటా 18.92 నుంచి 18.54కు పడిపోయింది. యోగులు, యోగినులు కూడా సన్యాసాన్ని త్యజించి, భార్యలను వదిలేసిన భర్తలు కూడా ఒకింటి వారై సంతానోత్పత్తిలో పాల్గని వుంటే మన జనాభా ఇంకా పెరిగి వుండేది, చౌకగా శ్రమను ధారపోసి మేకిన్‌ ఇండియా పిలుపును జయప్రదం చేసి వుండేవారు.

మన సమాజం ఎంతటి నేరాన్ని అయినా సహించింది, క్షమించింది. నాడు నేడు రేపు నమ్మక ద్రోహాన్ని మాత్రం సహించదు. 2016 నవంబరు 14న గోవాలోని మోపా విమానాశ్రయ శంఖుస్థాపన సందర్భంగా గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ దేశానికి ఒక విన్నపం చేశారు. ‘నేను కేవలం 50రోజులు మాత్రమే అడుగుతున్నాను. డిసెంబరు 30వరకు గడువు ఇవ్వండి. ఆ తరువాత నా వుద్ధేశ్యాలు లేదా చర్యలలో ఏదైనా లోపం కనపడితే దేశం ఏ శిక్ష విధించినా భరించటానికి నేను సిద్దంగా వున్నాను, వురికైనా సిద్దమే, సజీవ దహనం చేయండి’ అన్నట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. డెబ్బయ్యేండ్ల నుంచి కుంభకోణాలకు పాల్పడిన వారు నన్ను బతకనివ్వరు, వారంతా ఇప్పుడు తమ దగ్గర వున్న నల్లధనాన్ని మార్చుకొనేందుకు బ్యాంకుల ముందు బారులు తీరారని కూడా సెలవిచ్చారు. ఆ గడువు తీరిపోయి త్వరలో పెద్ద నోట్ల రద్దు రెండవ వార్షికోత్సవాలకు సిద్ధం అవుతున్నారు. ప్రతి నెలా మన్‌కీ బాత్‌ పేరుతో మాట్లాడుతూనే వున్నారు. ఒక్కసారంటే ఒక్కసారి కూడా తన పెద్ద నోట్ల రద్దు వుద్ధేశ్యం ఏమేరకు నెరవేరిందో చెప్పలేదు. హైదరాబాదు వంటి మహానగరంలో ఇది రాస్తున్న సమయానికి కూడా కొన్ని ఎటిఎంలలో గరిష్టంగా ఒకసారికి ఐదువేలకు మించి డబ్బుతీసుకొనే పరిస్ధితి లేదు. ఎక్కువసార్లు తీసుకుంటే బ్యాంకుల బాదుడు మీకు తెలిసిందే.

పోనీ రిజర్వుబ్యాంకు అయినా నిజం చెప్పిందా ! బ్యాంకింగ్‌ లావాదేవీల్లో ఏ రోజుకు ఆరోజు ఖరారు అవుతాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఇచ్చిన గడువు ప్రకారం ఏ రోజు ఎన్ని రద్దయిన నోట్లు వచ్చాయో తెలుసుకోవటం కష్టం కాదు. గడువు ముగిసి నెలలు, సంవత్సరం గడిచినా ఎన్ని నోట్లు తిరిగి వచ్చాయో చెప్పలేదు. కొద్ది రోజులు నోట్ల లెక్కింపుపూర్తి కాలేదని చెప్పారు. ఈలోగా జనం మరచి పోయారు. ఎంతకాలం దాచినా ఏదో ఒక నివేదికలో వాస్తవాలను ప్రచురించకతప్పదు కనుక తాజాగా రిజర్వుబ్యాంకు నివేదికలో వెల్లడించకతప్ప లేదు. దాని ప్రకారం 99.3శాతం రద్దయిన నోట్లు వెనక్కు తిరిగి వచ్చాయి.రాని వాటి విలువ కేవలం గాకపోయినా మరుసటి రోజుకు ఆన్‌లైన్‌లో లెక్కలు సరి చూసి 10,720 కోట్లు మాత్రమే వెనక్కు రాలేదని, మొత్తం నోట్లలో 0.0005శాతం అంటే 5,22,783 మాత్రమే నకిలీ నోట్లను కనుగొన్నట్లు రిజర్వుబ్యాంకు వెల్లడించింది.

Image result for demonetisation, rbi report cartoons

కనీసం మూడు లక్షల కోట్ల రూపాయల విలువగల నోట్లు వెనక్కు రావని, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి అనూహ్య ఆదాయం వస్తుందని మోడీ సర్కార్‌ లెక్కలు వేసుకుంది. నోట్ల రద్దు వలన ఎలాంటి ఫలితం వుండదని అనేక మంది నిపుణులు ముందే చెప్పారు. వారందరూ నల్లధనాన్ని కలిగి వున్నవారి మద్దతుదార్లుగా చిత్రించారు. రద్దయిన నోట్లను మార్చుకొనేందుకు, కొత్త నోట్లు తీసుకొనేందుకు బ్యాంకుల ముందు గంటల తరబడి వరుసలలో నిలబడటం దేశభక్తికి చిహ్నంగా అనేక మంది నిజంగానే భావించారు, భ్రమించారు. ఎవరైనా నోట్లరద్దును విమర్శిస్తూమాట్లాడితే దేశద్రోహి అన్నట్లు అసహ్యించుకొని చూసినవారు, కొట్టేందుకు వచ్చిన వారు కూడా లేకపోలేదు. నోట్ల రద్దు చర్య తీసుకున్నవారు గానీ దానిని సమర్ధించిన వారుగానీ తేలు కుట్టిన దొంగల మాదిరి ఎవరూ ఇప్పుడు మాట్లాడటం లేదు. నోట్ల రద్దు ఎవరికీ తెలియదు నరేంద్రమోడీ తీసుకున్న అత్యంత గుప్త నిర్ణయం అని అప్పుడు అందరూ మోడీకీర్తిని పెంచేందుకు ప్రచారం చేశారు. అది వికటించిన తరువాత ఇతరుల మీద నెపం మోపేందుకు అవకాశం లేకపోవటంతో ఎన్ని విమర్శలు వచ్చినా దాని గురించిన వివరాలు బయటపెట్టకుండా అడ్డుకున్నారు.

Image result for demonetisation, rbi report cartoons

ఇంతకాలం తరువాత అయినా నోట్ల రద్దు తప్పిదమనే నిజాయితీ ఎక్కడా ప్రదర్శితం కావటం లేదు. దాని వలన వచ్చిన లాభం ఏమిటో నష్టాలు ఏమిటో అధికారికంగా చెప్పే ధైర్యం కేంద్ర ప్రభుత్వానికి లేదా రిజర్వుబ్యాంకుకు లేదు. అనేక సర్వేలు చేస్తున్న బ్యాంకు నష్టాల గురించి ఇంతవరకు ఎలాంటి అధ్యయనం చేయలేదు, లేదా రహస్యంగా చేసి వుంటే బయటకు చెప్పటం లేదు. దేశం, జనాభాపట్ల జవాబుదారీతనం అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.నష్టాల గురించి ఎవరైనా మాట్లాడిదే దానిని రాజకీయంగా మార్చి పక్కదారి పట్టిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకర ధోరణి. నోట్ల రద్దు ఫలితంగా ఒక శాతం జిడిపి నష్టం జరిగిందని 2017 జనవరి-ఏప్రిల్‌ మాసాల మధ్య పదిహేను లక్షల వుద్యోగాలు హరీ మన్నాయన్నది(సిఎంఐయి) అంచనా. ఈ నష్టం సంగతి ఏమిటి? కొత్త నోట్ల మార్పిడి లేదా ఎటిఎంలు, బ్యాంకుల ముందు తమ డబ్బు తాము తీసుకోవటానికి వెచ్చించిన పని గంటలు, పెట్టిన సెలవులు దీనికి అదనం. మాజీ అర్ధిక మంత్రి పి చిదంబరం చెప్పిన లెక్కల ప్రకారం ఏడాది కాలంలో జిడిపి 1.5శాతం నష్టం విలువ 2.25లక్షల కోట్లు, అనేక వారాల పాటు 15కోట్ల మంది రోజువారీ కూలీలు పని కోల్పోయారు, నోట్ల కోసం వరుసల్లో నిలబడి వంద మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వేలాది చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి, ఫలితంగా లక్షల మంది కార్మికులకు పని పోయింది. ఆ నష్టం ఎంతో ఎవరూ లెక్క గట్టలేదు. ఐదు వందలకు బదులు వెయ్యి, రెండు వందలు, యాభై కొత్త నోట్లను ఎటిఎం యంత్రాలలో అమర్చేందుకు వాటిని మూసివేసినపుడు జనం అనుభవించిన యాతనలు చెప్పనవసరం లేదు. యంత్రాలలో మార్పులు చేర్పులకు ఆయా బ్యాంకుల మీద పడిన భారం గురించి కూడా ఎవరూ నోరు విప్పటం లేదు. ఎవరైనా చెబితే అది నేరుగా నరేంద్రమోడీకే తగులుతుంది, సదరు అధికారి బలి ఖాయం. ఇలా బయటకు చెప్పుకోలేని,లోపల తట్టుకోలేని ఇబ్బందులెన్నో. రిజర్వుబ్యాంకు అధికారికంగా చెప్పినదాని ప్రకారమే వెనక్కు రాని నోట్ల కంటే కొత్త నోట్లు అచ్చేసి, పంపిణీ చేసేందుకు అయిన ఖర్చు ఎక్కువ. పదమూడు వేల కోట్ల రూపాయలని చెప్పింది. నోట్లు రద్దు చేయటానికి ముందు అంటే 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ఆర్‌బిఐ కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్‌గా 65,876 కోట్లు ఇచ్చింది, నోట్ల రద్దు తరువాత 2016-17లో ఆ మొత్తం 30,659 కోట్ల రూపాయలకు తగ్గిపోయింది. తదుపరి ఏడాది చెల్లించిన మొత్తం కూడా 50వేల కోట్లకు మించలేదు. అంటే కేవలం రెండు సంవత్సరాలలోనే 55వేల కోట్ల మేరకు కేంద్రానికి ఆదాయ నష్టం జరిగింది. ఇతర వాణిజ్యబ్యాంకులకు నిరర్ధక ఆస్ధులు పెరిగిపోవటంతో నష్టాలు వచ్చాయి, మరి రిజర్వుబ్యాంకు లాభాలు ఎందుకు పడిపోయినట్లో ఎవరైనా చెబుతారా ? దేవగిరి-ఢిల్లీ మధ్య రాజధానులను మార్చిన మహమ్మద్‌బిన్‌ తుగ్లక్‌ చర్యకు సైన్యం, పరివారమే ఇబ్బంది పడింది. నరేంద్రమోడీ చర్యకు యావత్‌ దేశం ఇబ్బంది పడింది. ఇద్దరిలో ఎవరు మెరుగు ?

నోట్ల రద్దుకు ముందు అంటే 2016నవంబరు నాలుగున మన వుపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తాజాగా కూడా చెప్పినట్లు కొంత మంది బాత్‌ రూముల్లో దాచుకున్నదానితో సహా దేశంలో 17.97లక్షల కోట్ల రూపాయల నగదు చెలామణిలో వుంది. ఈ ఏడాది మార్చి నాటికి చెలామణిలో వున్న నగదు 18.03లక్షల కోట్లు, అయినా సరే బ్యాంకుల్లో వున్న తమ డబ్బును తీసుకోవాలంటే అడిగినంత మొత్తం ఇవ్వలేమని బ్యాంకులు ఎందుకు చెప్పినట్లు? అంటే తిరిగి బాత్‌రూముల్లోకి పోయిందా? పోకుండా మోడీ సర్కార్‌ ఏం చేస్తున్నట్లు ? స్వయం సేవకులతో సహా చెప్పేవారెవరూ లేరు…… పోతే పోనీ గానీ గుండు మాత్రం పొన్నకాయలా బలే వుందే అన్న ముతక సామెత మాదిరి నోట్ల రద్దు వలన జరిగిన నష్టం కంటే వచ్చిన ఫలితాలు బాగున్నాయని ఇప్పటికీ అధికారపక్ష పెద్దలూ, వారికి అనుగుణంగా, కొందరు మేథావులూ, అధికారులూ అతిశయోక్తులు చెప్పటం విశేషం. నోట్ల రద్దు వలన పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణమే ఎక్కువగా ప్రభావితమైందని ఒక అధ్యయనంలో ప్రపంచబ్యాంకు పేర్కొన్నది. గురుచరణ దాస్‌ అనే ఆర్ధికవేత్త మాట్లాడుతూ ఇండ్లలో దాచుకున్న సొమ్ము బ్యాంకుల్లోకి వచ్చింది, బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన వారందరూ భవిష్యత్‌లో పన్ను చెల్లింపుదారులుగా మారతారు, డిజిటల్‌ ఆర్ధిక వ్యవస్ధ వేగంగా పెరిగింది అన్నారు. అయితే సానుకూల ఫలితాలు రావటానికి ఇది(పెద్ద నోట్ల రద్దు) మార్గం కాదు. జనాలు చెల్లించిన మూల్యం చాలా ఎక్కువగా వుంది. నా అంచనా ప్రకారం ఒక ఏడాది ఆర్ధిక అభివృద్ధిని మనం నష్టపోయాము. దేశంలో వుపాధి సమస్యను పరిష్కరించాలంటే మనం ఏటా ఎనిమిదిశాతం చొప్పున 20సంవత్సరాల పాటు పెరగాలి అని కూడా దాస్‌ చెప్పారు.

Image result for demonetisation, rbi report cartoons

రాజుగారు నందంటే నంది, పందంటే పంది గురించి చెప్పగలిగిన సమర్ధులు మన వున్నతాధికారులు.కేంద్ర ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్క్‌ నోట నోట్ల రద్దు విజయగానంలో చోటు చేసుకున్న అంశాలు ఇలా ఆవు వ్యాసంలో విషయాల మాదిరి వున్నాయి. గతంమాదిరే కరెన్సీ వ్యవస్ధ కొనసాగి వుంటే మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయల మేరకు నోట్ల చలామణి తక్కువ వుండేది. మూడు లక్షల కోట్ల రూపాయల నల్లధనం బ్యాంకింగ్‌ వ్యవస్ధకు దూరంగా వుండేది, నోట్ల రద్దు తరువాత రెండులక్షల కోట్ల మేరకు బ్యాంకులకు చేరింది. ఆదాయపన్ను శాఖ 1.75లక్షల కోట్ల రూపాయల మొత్తంతో ప్రమేయమున్న అనుమానిత ఖాతాల గురించి పరిశీలన చేస్తున్నది. పద్దెనిమిది లక్షల మందికి ఆదాయానికి మించి ఆదాయం వున్నట్లు గుర్తించారు. వారిమీద చర్యల ద్వారా నల్లధనం మీద దాడి లక్ష్యం నెరవేరుతుంది. గతంలో నకిలీనోట్లు పెద్ద ఎత్తున చలామణిలో వుండేవి. నోట్ల రద్దు తరువాత అవి పెద్దలెక్కలోకి వచ్చేవిగా లేవు. ఇప్పుడు ఎవరైనా ఆ నోట్లను గుర్తించగలరు, ఎవరినీ మోసం చేయలేరు. నగదు రహిత(డిజిటల్‌ ) లావాదేవీలు పెరిగి ఒక నెలలో 25కోట్లకు చేరుకున్నాయి. ఫిబ్రవరి, మార్చినెలల్లో నగదుకు కొరత వుండేది ఇప్పుడు ఆ సమస్య లేదు. ఇలా బూతద్దంలో చూపేందుకు గార్గ్‌ ప్రయత్నించారు.

పెద్ద మొత్తంలో కరెన్సీ చలామణిలోకి వచ్చిందని ఏలుబడిలో వున్నవారు చెబుతుంటే కొన్ని కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చలామణిలో వున్న కరెన్సీ విలువ 19.38లక్షల కోట్ల రూపాయలని, పొదుపు 2.8శాతానికి పెరిగిందని అంగీకరిద్దాం. ఇదే సమయంలో పొదుపు సొమ్ము బ్యాంకులు లేదా కార్పొరేట్‌ డిపాజిట్లలో ఐదు దశాబ్దాల కనిష్టం 2.9శాతానికి ఎందుకు పడిపోయిందన్నది విశ్లేషకుల ప్రశ్న. డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు చేరిన మొత్తంలో కొంత నోట్ల రద్దు తరువాత బ్యాంకింగ్‌ వ్యవస్ధ నుంచి వెళ్లిపోయింది. వడ్డీ రేటు తగ్గటంతో వ్యక్తిగతంగా బ్యాంకుల్లో డిపాజిట్లు చేయటం తగ్గింది. అంతకు ముందు సంవత్సరంలో 6.3శాతం వున్న డిపాజిట్లు వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో 2.9శాతానికి పడిపోయాయి.

నోట్ల రద్దుతో జనం మీద దాడి చేసిన మోడీ ఇప్పుడు కరెన్సీ విలువతో దాడికి దిగినట్లు కనిపిస్తోంది. మోడీకి దీనికి సంబంధం ఏమిటని కొందరు అడ్డు తగల వచ్చు. మోడీ సర్వాంతర్యామి, ఇందుగలదందు లేడను సందేహము వలదు లేదా అన్నీ నేనే అని గీతాకారుడు చెప్పినమన భూమిలో కరెన్సీలో ఆయన లేకుండా ఎలా వుంటాడు. నోట్ల రద్దు తన స్వంత నిర్ణయం చెప్పిన పెద్ద మనిషి పడిపోతున్న రూపాయి విలువకు కారణాలేమిటో, తన ప్రమేయం లేకపోతే జనాన్ని ఎలా ఆదుకుంటారో రాజధర్మంగా అయినా చెప్పాలి కదా ? శుక్రవారం నాడు మార్కెట్‌ వేళలు ముగిసే సమయానికి డాలరుతో మారకానికి రు.70.94గా పతనం చెంది సరికొత్త రికార్డు నమోదు అయింది. ప్రభుత్వ ఆసుపత్రుల కెళితే ఏ జబ్బుకైనా ఒకే రంగు గోళీలు, నీళ్ళ మందుపోస్తారని ప్రతీతి. రూపాయి విలువ పతనాన్ని అడ్డుకొనేందుకు గత కొద్ది రోజులుగా మన రిజర్వుబ్యాంకు అటువంటి పనే చేసింది. జబ్బు ఒకటైతే నీళ్ల మందు చికిత్సలకు తగ్గుతుందా? ఐఎఫ్‌ఏ గ్లోబల్‌ కరెన్సీ నివేదిక ప్రకారం చమురు ధరలు ఎక్కువగా వున్నంత వరకు మన వంటి దేశాల కరెన్సీ విలువ పతనం కొనసాగుతూనే వుంటుంది. రూపాయి విలువ 70.45-70.90 లేదా అంతకు దిగువకు పడిపోవచ్చు. ఆ జోశ్యాన్ని కూడా మన రూపాయి వమ్ము చేసి ఆగస్టు 31న 70.96 నమోదు చేసింది. దిగుమతిదారులకు 70.20, ఎగుమతిదారులకు 69.75 స్ధాయిల్లో వుంటుందనే అంచనాతో లావాదేవీలను సాగించుకోవచ్చని ఐఎఫ్‌ఏ సలహా ఇచ్చింది. దిగుమతిదారుల నుంచి డిమాండ్‌ పెరగటం, మరింత పతనం అవుతుందేమో దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకుందామనే ముందుచూపుతో విదేశీ మదుపుదారులు తమ సొమ్మును వెనక్కు తీసుకోవటం ఎక్కువగా చేస్తుండటంతో రూపాయి పతనం కొనసాగుతోంది. అది త్వరలో 71లేదా 72కు చేరనుందని అనేక మంది చెబుతున్నారు.ఇప్పటికే ఈ ఏడాది పదిశాతం పతనమై ఆసియాలో అత్యంత అధ్వాన్నంగా మారిన కరెన్సీగా రూపాయి పేరు తెచ్చుకుంది.

దేశంలోపలివా, వెలుపలివా కారణాలు ఏవైనప్పటికీ డాలర్లకు డిమాండ్‌ పెరగటం మన రూపాయి విలువ పతన కారణాల్లో ఒకటి. పెట్రోలు, డీజిలు లేకపోతే గడవదు కనుక ఎన్ని డాలర్లయినా ఇచ్చి తెచ్చుకోవాలనుకుందాం.విదేశీ లిప్‌స్టిక్‌లు,లో దుస్తులు, పై దుస్తులు, నగలు, వాచీలు, బంగారం చివరికి అమెరికా నుంచి బాదం పప్పు, దోసకాయల వంటి నిత్యావసర వస్తువులు లేకపోతే తమకు గడవదు అనుకొనే వారికి కూడా మన జనం మొత్తం తరఫున అధిక ధరలకు డాలర్లను కొని ఇస్తున్నాం. ఇరాన్‌ మీద అమెరికా వాడికి కోపం వస్తే పెరిగే చమురు ధరలకు మన ఇతర దేశాల నుంచి కొనాలి తప్ప చౌకగా ఇచ్చే ఇరాన్‌ నుంచి కొనుగోలు చేయం. ఎందుకంటే ట్రంప్‌కు మన మీద కోపం వస్తుంది. ఇలాంటి వాటి కారణంగా మన కరెంట్‌ ఖాతాలోటు పెరుగుతోంది. మనం చేసుకొనే దిగుమతులకు చెల్లించే మొత్తం, మన ఎగుమతుల ద్వారా సంపాదించే ఆదాయ మొత్తానికి మధ్య వుండే తేడానే కరెంట్‌ ఖాతా లోటు లేదా మిగులు అంటాం.మరో విధంగా చెప్పాలంటే పెట్టుబడులు సంపాదించటానికి, పలుకుబడి పెంచే పేరుతో విదేశాలకు విమానాల్లో తిరగటానికి, రోజుకో కొత్త కోటు వేసుకోవటానికి మన మోడీకి అయ్యే ఖర్చు ఆయన సంపాదించిన దాని కంటే ఎక్కువ వుంది అనుకోండి.

2018 ఆర్ధిక సంవత్సరంలో మన కరెంట్‌ ఖాతా లోటు జిడిపిలో 1.9శాతం వుంటే అది 2019కి 2.8కి పెరుగుతుందని అంచనా. ప్రత్యక్ష పెట్టుబడుల మొత్తం తగ్గుతోంది. మన దేశ స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు, ప్రభుత్వాలకు అప్పులు ఇచ్చేవారు ఇంతకు ముందు గణనీయంగా పెరిగారు. ఇప్పుడు ఎందుకైనా మంచిదని వెనక్కు వెళ్లిపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 50వేల కోట్ల రూపాయల మేర వెనక్కు తీసుకున్నారు. మనకు అప్పులు ఇచ్చేవారు డాలర్లలో ఇస్తారు, డాలర్లలోనే తీసుకుంటారు. మనరూపాయలను అంగీకరించరు. మన్మోహన్‌ సింగ్‌ పది సంవత్సరాల కాలంలో కిందికీ మీదికీ పడుతూ లేస్తూ రు.45.32 నుంచి గరిష్టంగా 68.85 వరకు పతనమై నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సమయానికి రు.58.43కు పెరిగింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు మోడీ హయాంలో తొలిసారిగా మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడి నాటి గరిష్ట పతనాన్ని తాకి 2017 జనవరి ఆరున రు.67.96 గా ముగిసింది. ఇప్పుడు ముందే చెప్పుకున్నట్లు 71రూపాయలను ఏక్షణంలో అయినా దాటేట్లు వుంది. పది సంవత్సరాల మన్మోహన్‌ సింగ్‌ కాలంలో నిఖర పతనం పదమూడు రూపాయలకు అటూ ఇటూగా అయితే నరేంద్రమోడీ పాలనలో కూడా అదే స్ధాయిలో జరిగింది, త్వరలో నూతన రికార్డులను కూడా నమోదు చేయవచ్చు. మోడీ అధికారానికి వచ్చినపుడు మనం ఒక వంద డాలర్లు అప్పు తీసుకున్నామనుకుంటే అసలు రు.5843. దానికి మార్కెట్లో వున్న రేటున బట్టి వడ్డీ చెల్లించాలి.( అలాగాక చంద్రబాబు నాయుడు అమరావతి నగర నిర్మా ణానికి అప్పుకు అధికవడ్డీ రేటు ఇచ్చినట్లుగా ఇస్తే అది వేరే.) చైనాతో పేచీ వచ్చింది, మాక్కూడా డాలర్ల అవసరం పెరిగింది మా సొమ్ము మాకివ్వండని అమెరికా వాడు అడిగాడనుకోండి. గత నాలుగేండ్లుగా చెల్లించాల్సిన బారు లేదా చక్ర వడ్డీగాక, అసలే 7096కు పెరిగిపోయింది. మన రూపాయి విలువ పతన పర్యవసానమిది.

దీన్నే మరో విధంగా చెప్పుకోవటం అవసరం. 2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభాన్ని అధిగమించేందుకు అక్కడి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు అమెరికా, ఇతర ధనిక దేశాలలో వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించారు. వుదాహరణకు ట్రేడింగ్‌ ఎకనమిక్స్‌ అనే వెబ్‌సైట్‌ విశ్లేషణ ప్రకారం అమెరికాలో సంక్షోభ సమయంలో వడ్డీ రేటు 3.6శాతం వుండగా ఒక ఏడాదిలో అది 0.25శాతానికి పడిపోయింది.2016 వరకు అదే కొనసాగి, అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం రెండుశాతానికి పెరిగింది. అంతకంటే ఎక్కువగా మన దేశంలో వడ్డీ రేట్లు వున్నాయి కనుక. డాలరు బాబులు మనకు వుదారంగా అప్పులిచ్చారు. ఇప్పుడు తమ దగ్గరే వడ్డీ రేట్లు పెరిగాయి, ఇంకా పెంచుతామని అమెరికా ఫెడరల్‌ రిజర్వు( రిజర్వుబ్యాంకు వంటిది) ప్రకటించింది. గనుక మనకు అప్పు లేదా పెట్టుబడులు పెట్టటం కంటే తమ దేశమే నయమని ఎవరికి వారు వెనక్కి తీసుకుంటున్నారు. ఇది కూడా మన రూపాయి పతనానికి దారి తీస్తోంది.

మన వాణిజ్యమంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం 2018 ఏప్రిల్‌ా జూలై నెలల్లో మన చమురు దిగుమతుల విలువ 46.98 బిలియన్‌ డాలర్లు. అదే నెలల్లో ఒక ఏడాది క్రితం ఆ మొత్తం 31.02 బిలియన్లు మాత్రమే. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరగటమే దీనికి కారణం. ఇది ప్రామాణిక బ్రెంట్‌ ముడిచమురు ప్రస్తుతం పీపా ధర 78 డాలర్లు వుంది. ఈ ఏడాది అది 80 దాట వచ్చని అంచనా. చమురు ధరలు అంతకు మించి 90 డాలర్లకు పెరిగితే మన కరెంటు ఖాతా లోటు 3.6శాతానికి చేరుతుందని అంచనా. ఇదే జరిగితే జనంలో గగ్గోలు చెలరేగకుండా వుండాలంటే చమురు మీద పెంచిన పన్నులను అయినా తగ్గించాలి. లేదా పెరిగిన భారాన్ని జనం మీద మోపాలి. తగ్గిస్తే ప్రభుత్వం అదనంగో నోట్లను ముద్రించాలి, అదే జరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, అంటే ధరలు పెరుగుతాయి. భారం తగ్గించకపోయినా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. కరంట్‌ ఖాతా లోటు పెరిగితే అప్పులు తెచ్చి లేదా జనం మీద భారాలు మోపీ చెల్లింపులు చేయాల్సి వుంటుంది. ఏది జరిగినా భరించాల్సింది జనమే.

గతంలో చూసిన అనుభవాల కారణంగా విదేశీమారక ద్రవ్యనిల్వలకు ఆర్‌బిఐ కొన్ని చర్యలు తీసుకుంది. వాటి నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకు ఏప్రిల్‌-జూన్‌ మాసాల మధ్య 14.5బిలియన్‌ డాలర్లను విక్రయించి డాలర్లకు డిమాండ్‌ను తగ్గించేందుకు తద్వారా రూపాయి విలువ మరింత పతనం కాకుండా చూసేందుకు ప్రయత్నించింది. రూపాయి బాండ్లను ప్రవేశపెట్టటం, ఎలక్ట్రానిక్‌ వస్తువులపై దిగుమతి సుంకాన్ని గణనీయంగా పెంచటం ద్వారా డాలర్ల డిమాండ్‌ను తగ్గించటం వంటి చర్యలు తీసుకుంది. రూపాయి విలువ పతనాన్ని సొమ్ము చేసుకొనేందుకు ప్రవాస భారతీయులు ఇటీవలి కాలంలో పెద్ద మొత్తంలో డాలర్లు, ఇతర విదేశీ కరెన్సీని మన దేశానికి పంపుతున్నారు. మన కరెన్సీ ఎంత పతనమైతే వారికి అంతగా కష్టపడకుండానే ఎక్కువ రూపాయలు వస్తాయి మరి. చైనాలో కరెన్సీ విలువ మన మాదిరి పతనం కాలేదు, డాలరుతో పోటీ పడుతోంది కనుక ప్రవాస చైనీయులు మనవారి కంటే ఐదు బిలియన్‌ డాలర్లు తక్కువ పంపారట. చమురు ధరలు తక్కువగా వున్నాయి గనుక సొమ్ము చేసుకుందామని పెద్ద ఎత్తున రంగంలోకి దిగిన విమాన కంపెనీలు ఇప్పుడు దివాలా బాటలో వుండటానికి చమురు ధరలు పెరగటమే కారణం.రాబోయే రోజుల్లో దిగుమతి చేసుకొనే ఆధునిక పరికరాలు ధరలు పెరిగి టెలికాం కంపెనీలపై భారం పెరగనున్నదని అప్పుడే వార్తలు వస్తున్నాయి. మన్మోహన్‌ సింగ్‌ చివరి రోజుల్లో అంటే 2013లో ఆరునెలల దిగుమతి అవసరాలకు సరిపడా విదేశీమారక ద్రవ్య నిల్వలుంటే ఇప్పుడు మోడీ చివరి రోజుల్లో పది నెలలకు సరిపడా వున్నాయి. అనూహ్యపరిస్ధితులు తలెత్తితే పరిస్ధితి ఇంకా దిగజారి మరోసారి అప్పుల చిప్ప పట్టుకోవాల్సి వచ్చినా ఆశ్చర్య ం లేదు. ఇటువంటి విధానాలతో లబ్ది పొందేవారి కంటే నష్టపోయేవారే ఎక్కువ.1991 తరువాత అధికారంలో వున్నవారు వరుసగా రెండవ సారి ఎన్నిక అవటం 2009 ఒక్క మన్మోహన్‌ సింగ్‌ హయాంలోనే జరిగింది. మరే పార్టీ వరుసగా అధికారంలోకి రాలేదు. అందుకే పరిస్ధితులు మరింతగా దిగజారకముందే ఓటర్ల ముందుకు వెళితే ఫలితం వుంటుందేమో అన్నఆశతో నరేంద్రమోడీ ముందస్తు ఎన్నికల గురించి దూరాలోచన చేస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వ్యూహ ప్రతి వ్యూహాలతో విస్తరిస్తున్న వాణిజ్య యుద్ధం !

01 Wednesday Aug 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Counter tariffs, counterstrategies, TRADE WAR, Trade war Expanding

Image result for Trade war

ఎం కోటేశ్వరరావు

జూలై ఆరున తాను ప్రారంభించిన వాణిజ్య యుద్ధం కొనసాగించటంపై అమెరికా, తనను తాను రక్షించుకోవటంపై దాడికి గురైన చైనా వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు పోతున్నాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ మొదలు పెట్టిన ఈ పోరు మీద ఇప్పటికీ అనేక కోణాల నుంచి విమర్శలే ఎక్కువగా వస్తున్నాయంటే ప్రపంచ పెట్టుబడిదారులు దీనిని ‘ మంచి యుద్ధం’ గా పరిగణించటం లేదనే అనేకోవాలి. తాజా పరిణామాలు, విశ్లేషణలను బట్టి వాణిజ్య దాడులను దీర్ఘకాలం కొనసాగించేందుకే అమెరికా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్‌ చర్యలు చైనా నాయకత్వ పట్టుదలను మరింత పెంచుతాయని ప్రముఖ ఆర్ధికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ హెచ్చరించాడు. ఇప్పటి వరకు వచ్చిన వార్తలను బట్టి చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై పన్నుల పెంపుద్వారా మోపిన భారాన్ని అమెరికన్‌ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు వినియోగదారులపై మోపటం ప్రారంభమైంది. పంటల ధరలు పడిపోవటంతో రైతులకు 12బిలియన్‌ డాలర్ల మేర చెల్లించాలని ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఈ ప్రకటన వెలువడగానే మా సంగతేమిటని పారిశ్రామికవేత్తలు అడగటం ప్రారంభించారు. ఇదే సమయంలో అమెరికా దాడి ప్రభావం చైనాపై పెద్దగా పడిన దాఖలాలు లేవని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా కరెన్సీ యువాన్‌ విలువ తగ్గటంతో చైనా ఎగుమతులపై పెద్ద ప్రభావం లేదన్నది వాటి సారాంశం. వెలువడుతున్న విమర్శలు, వాణిజ్య యుద్ధం ఇరుపక్షాలకూ నష్టం కలిగిస్తుందనే విశ్లేషణల పూర్వరంగంలో రెండు దేశాలూ మరోమారు చర్చలకు పూనుకోవచ్చన్నది తాజా వార్త.

అమెరికా తన మిత్రదేశాలైన కెనడా, మెక్సికోలతో పాటు ఐరోపా యూనియన్‌ వుత్పత్తులపై కూడా దిగుమతి పన్నుల విధింపుతో వాణిజ్య యుద్ధానికి తెరతీసింది. అయితే జూలై నెల మూడవ వారంలో ఐరోపా కమిషన్‌ అధ్యక్షుడు జీన్‌ క్లాడ్‌ జుంకర్‌-డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య రాజీకుదిరింది. అమెరికా నుంచి సోయా, సహజవాయువు(ఎల్‌ఎన్‌జి), ఐరోపా నుంచి కార్లు మరియు ఆటో విడి భాగాలను పరస్పరం దిగుమతులు చేసుకొనేందుకు, ఆటోయేతర పారిశ్రామిక వుత్పత్తులపై ఎగుమతులు, దిగుమతులపై ఆటంకాలు, పన్నులు, సబ్సిడీలను ఎత్తివేసేందుకు అంగీకరించారు. అయితే పన్నులను పూర్తిగా రద్దు చేయటం అన్నది ఎంత మేరకు సాధ్యం అన్నది ప్రశ్న. అంతిమంగా కుదిరే ఒప్పందాన్ని బట్టి స్పష్టం అవుతుంది. ఈ చర్య బహుముఖాలుగా దాడులు చేయటం తనకు మంచిది కాదన్న గ్రహింపు అమెరికాకు వచ్చినందునే ఈ తాత్కాలిక రాజీ, దానికి అది ఎంత కాలం కట్టుబడి వుంటుందన్నది కూడా సందేహమే. మా తల మీద తుపాకి గురి పెట్టి మమ్మల్ని ఒప్పించాలని చూస్తే కుదరదని ఇటీవలి కాలంలో ఐరోపా దేశాలు అమెరికాకు స్పష్టం చేశాయి. అందువల్లనే ట్రంప్‌ ఒక అడుగు వెనక్కు వేశాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో చొక్కా నలగకుండా, అటూ ఇటూ ఆయుధాలను విక్రయించి లాభపడిన అమెరికాను ఎదుర్కోవాలంటే, విజయం సాధించినప్పటికీ ఎంతో నష్టాన్ని మూటగట్టుకొని, వికలాంగులుగా మారిన తాము ఐక్యంగా వుంటే తప్ప సాధ్యం కాదని గ్రహించిన ఫలితమే నేటి ఐరోపా యూనియన్‌. అందువలన వాటి రెండింటి మధ్య ఇప్పటికీ వైరుధ్యాలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో అనూహ్యంగా తమకు సవాలుగా పరిణమించిన చైనాను ఎదుర్కోవటంలోనూ అవి చేతులు కలిపేందుకు వెనుకాడవు. కమ్యూనిస్టు ్యవతిరేకత, మార్కెట్లను ఆక్రమించుకోవటంలో అవి ఏవీ తక్కువ కాదు. అందువలన తమపై దాడి ప్రారంభించిన అమెరికా మీద ఐరోపా ధనిక దేశాలు వత్తిడి తెస్తాయనే భ్రమలు, తమతో చేతులు కలుపుతాయనే ఆశలు చైనాకు లేవు. అతి పెద్ద దేశంగా వున్నందున జిడిపి ఎక్కువగా వున్నట్లు కనిపించినా, అమెరికా, ఐరోపా ధనిక దేశాలతో పోల్చితే ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్నదేశమే, ఈ కారణంగానే ప్రపంచ వాణిజ్య సంస్ధలో కొన్ని రాయితీలను పొందుతున్నది.

అమెరికా తరువాత మరో ధనిక దేశమైన జపాన్‌ కూడా ఇటీవలే ఐరోపా యూనియన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఒక బహిరంగ వాణిజ్య ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తాయి. జపాన్‌ నుంచి చేసుకొనే దిగమతులలో 99శాతం వస్తువులపై పన్నులను ఐరోపా యూనియన్‌ రద్దు చేస్తుంది. అమెరికా-ఐరోపా యూనియన్‌ కూడా ఇదే మాదిరి ఒప్పందానికి వస్తే అప్పుడు చైనా ఇతర దేశాలతో వాణిజ్యం చేయటం కష్టం అవుతుంది లేదా వత్తిడికి లంగి తన దిగుమతి పన్నులను తగ్గించి మరింతగా తన మార్కెట్‌ను తెరవాల్సి వుంటుంది. నూతన ఆర్ధిక విధానాల పేరుతో చైనా ప్రారంభించిన సంస్కరణలకు నలభై సంవత్సరాలు నిండాయి. పశ్చిమ దేశాలకు పెద్ద ఎత్తున మార్కెట్‌ ద్వారాలు తెరిచిన కారణంగా పరస్పరం లబ్దిపొందాయి. ఈ క్రమంలో అది వాణిజ్య మిగులు దేశంగా మారింది. ఇంకా తమ వస్తువులను అదనంగా కొనాలని పశ్చిమ దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. వాణిజ్య యుద్ధ మూలకారణమిదే. చైనా ఈ కాలంలో పరిశోధన, అభివృద్ధికి పెద్ద మొత్తంలో ఖర్చు చేసినప్పటికీ పశ్చిమ దేశాలతో పోల్చితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఇప్పటికీ వెనుకబడే వుంది. తమ వైపు నుంచి సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపును అడ్డుకుంటే చైనా దారికి రావచ్చన్నది పశ్చిమ దేశాల వూహ. అమెరికా ఇప్పుడు క్రమంగా వాణిజ్య యుద్ధాన్ని 500బిలియన్‌ డాలర్ల మేరకు విలువగల వస్తువులకు పెంచుతానని బెదిరించింది. దీనితో పాటు చైనా పశ్చిమ దేశాల ఆధునిక పరిజ్ఞాన కంపెనీలను కొనుగోలు చేయకుండా చూడటంతో పాటు వాణిజ్య సంస్ధలో సంస్కరణల పేరుతో కొత్త నిబంధనలను ప్రవేశ పెట్టాలని కూడా అమెరికా నిర్ణయించింది. అంటే చైనాను చక్రబంధంలో బిగించి దారికి తెచ్చుకోవాలన్నది వ్యూహం.

‘చైనాతో వాణిజ్య సమస్యలను పరిష్కరించుకోవాలంటే సంవత్సరాలు పడుతుంది. అంటే వాణిజ్య యుద్ధం నిరవధికంగా కొనసాగవచ్చు, ఇతర దేశాల ద్వారా చైనా వుక్కు అమెరికా చేరకుండా వుండాలంటే ప్రపంచం అంతటి నుంచి వచ్చే వాటి మీద పన్నులు విధించటమే ఏకైక మార్గం ‘ అని అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్‌ లైట్జర్‌ పార్లమెంటరీ కమిటీ ముందు చెప్పారు. అమెరికా మరో వాణిజ్య ప్రతినిధి డెనిస్‌ షెయా చైనా కమ్యూనిస్టుపార్టీపై విరుచుకుపడుతూ చైనా ప్రభుత్వ ఒప్పందాలకు విరుద్దంగా కమ్యూనిస్టు పార్టీ వాణిజ్య విధానాన్ని ఆదేశిస్తున్నదని, చైనా ఆర్ధిక విధానాల కారణంగా ప్రపంచ వాణిజ్య సంస్ధ సభ్యులు నష్టపోవాల్సి వస్తోందని ఆరోపించారు. ప్రపంచ వాణిజ్య సంస్ధ సభ్యురాలిగా లబ్ది పొందిన చైనా 2005-16 మధ్య 9.5శాతం నిజ జిడిపి అభివృద్ధి రేటుతో రెండవ ఆర్ధికశక్తిగా ఎదిగిందని కూడా వుక్రోషం వెలిబుచ్చాడు. ప్రపంచ వాణిజ్య సంస్ధలో ధనిక దేశాలన్నీ చైనా మీద కత్తి గట్టటానికి సన్నద్ధం అవుతున్నాయి.

ముందు తన ఇంటిని చక్కదిద్దుకొని వాణిజ్య లోటు ఏర్పడకుండా దేశీయంగా పొదుపును పెంచుకోవాలని చైనా తిప్పి కొట్టింది. వాణిజ్య యుద్ధం ప్రారంభం సాంకేతికంగా జూలై ఆరున ప్రారంభమైనప్పటికీ దానికి నిర్ణయం, సన్నాహాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అనేక సంవత్సరాలుగా తమ సరకులను ఎక్కువగా కొనుగోలు చేసి వాణిజ్య లోటును తగ్గించాలని అమెరికా వత్తిడి చేస్తోంది. ఇదే సమయంలో ధనిక దేశాలపై ఆధారపడిన తన ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధకు వున్న పరిమితులను చైనా నాయకత్వం గుర్తించకపోలేదు. తమ పౌరుల కొనుగోలు శక్తిని పెంచటం, వెనుక బడిన ప్రాంతాల పారిశ్రామికీకరణ వంటి అంతర్గత చర్యలతో పాటు ఆఫ్రికా, దక్షిణ అమెరికాతో సహా అన్ని ఖండాలలో తన వాణిజ్య అవకాశాలను పెంచుకొనేందుకు పూనుకుంది, ఆ దిశగా అనేక చర్యలను చేపట్టింది. తమ పన్నుల దాడి నుంచి కాచుకొనేందుకు చైనా తన కరెన్సీ విలువను తగ్గిస్తున్నదని అమెరికా ఆరోపిస్తోంది. దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఏ దేశమైనా తన కరెన్సీ విలువను తగ్గిస్తే లాభాలతో పాటు నష్టాలు కూడా వుంటాయి. కరెన్సీ విలువ తక్కువగా వుంటే ప్రపంచ మార్కెట్‌లో ధరలపోటీలో నిలబడవచ్చు. అదే సమయంలో సదరు దేశం నుంచి పెట్టుబడులు తరలిపోతాయి. చైనా దగ్గర డాలర్‌ నిల్వలు భారీగా వున్నందున తన కరెన్సీ విలువ తగ్గించి కుక్క కాటుకు చెప్పు దెబ్బమాదిరి ప్రతీకారం తీర్చుకోవచ్చన్నది ఒక వాదన. పదకొండువందల వస్తువులపై అమెరికా విధించిన 25శాతం దిగుమతి పన్ను భారాన్ని తమ కంపెనీలపై తగ్గించేందుకు వాణిజ్య యుద్ధం ప్రారంభానికి ముందు నుంచే అంటే తన కరెన్సీ విలువ పతనాన్ని ప్రోత్సహించిందని, గత మూడునెలల్లో డాలరుతో 7.7శాతం పడిపోయిందని చెబుతున్నారు. ఇదే కాలంలో మన దేశంతో సహా అనేక దేశాల కరెన్సీ విలువలు పడిపోయాయి.’ చైనా, ఐరోపా యూనియన్‌లు కరెన్సీ విలువలను తిమ్మిని బమ్మిని చేస్తున్నాయి, వడ్డీ రేట్లు తక్కువగా వుంచుతున్నాయని’ ట్రంప్‌ స్వయంగా ట్వీటర్‌లో ఆరోపించాడు. దీనికి తగిన ఆధారాలు కనిపించటం లేదు. జర్మనీలో పదేండ్ల బాండ్లపై 0.5, అమెరికాలో 2.6 శాతం వడ్డీ వస్తుండగా చైనాలో 3.75శాతం వస్తున్న కారణంగా ఏప్రిల్‌కు ముందు పన్నెండు నెలల కాలంలో వంద బిలియన్‌ డాలర్లు చైనాకు తరలి వచ్చాయి. చైనా వడ్డీ రేటును స్ధిరంగా వుంచుతుందనే నమ్మకమే దీనికి కారణమని కొందరి విశ్లేషణ. కరెన్సీ విలువ తగ్గితే విత్త (వడ్డీ) వ్యాపారులు చైనా నుంచి బయటకు పోతారు. చైనాకు సంపదలతో పాటు అప్పులు కూడా భారీగానే వున్నాయి, అలాంటపుడు విదేశీ నిధులు బయటకుపోతే ఎన్నో చిక్కులు తలెత్తుతాయి కనుక చైనా నాయకత్వం అలాంటి పరిస్ధితిని కొని తెచ్చుకోదు అని కొందరి వాదన.

Image result for Trade war

ఒక దేశంలో కరెన్సీ విలువ పడిపోతే అది దిగుమతి చేసుకొనే వస్తువుల ధరలు పెరుగుతాయి. యువాన్‌ విలువ తగ్గితే చైనాలో అమెరికా వస్తువులు ప్రియం అవుతాయి. జూలై ఆరు తరువాత ఇప్పటి వరకు యువాన్‌ విలువ రెండున్నర శాతం తగ్గింది. అయితే ఇలాంటి హెచ్చు తగ్గులు గతంలో కూడా వున్నాయి. గతనెలలో చైనా పిఎంఐ సూచిక 51.2గా వుంది. అంతకు తగ్గితే ఆర్ధిక వ్యవస్ధ ఇబ్బందుల్లో పడినట్లు. ఏమైనా ప్రభావం, పర్యవసానాల గురించి ఇప్పుడే ఒక నిర్ధారణకు రాలేము. గత నాలుగు సంవత్సరాలుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను తప్పించుకొనేందుకు రష్యా తన కరెన్సీ విలువను తక్కువగా వుంచిందని, చైనా కూడా అదే మార్గాన్ని అనుసరిస్తుందని కొందరు అంటున్నారు.అయితే రష్యాకు దాని వలన కొన్ని సమస్యలు కూడా తలెత్తకపోలేదు. వాణిజ్య యుద్ద పర్యవసానాలు అటు చైనా ఇటు అమెరికా మీద మెల్లగా ప్రభావం చూపుతున్నాయి. అమెరికాలో సోయా, ఇతర వ్యవసాయ వుత్పత్తుల ధరలు పతనం కావటంతో రైతులను ఆదుకొనేందుకు ట్రంప్‌ సర్కార్‌ 12బిలియన్‌ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. అమెరికాకు ప్రతిగా తాము విధించిన పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభావితమయ్యే పరిశ్రమలు, సంస్ధలకు రాయితీల రూపేణా అందిస్తామని చైనా ఎప్పుడో ప్రకటించింది. రైతులకు రాయితీలు ప్రకటించటంతో మిగతా పరిశ్రమల వారు కూడా తమ సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. తమకు కూడా రాయితీలు ఇస్తే 39బిలియన్‌ డాలర్లు అవుతాయని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రకటించింది. గతంలో తాము ఎన్నో మాంద్యాలు, అంతర్యుద్ధాల కాలంలో కూడా నిలబడ్డామని కానీ ఇప్పుడు వాణిజ్య యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే మనుగడ కష్టమని 1839 నుంచి వునికిలో వున్న బ్రిన్లీ-హార్డీ కంపెనీ ప్రతినిధి చెప్పారు. వుక్కు ధరలు 33శాతం పెరిగాయని వాపోయారు. అనుచిత యుద్ధం, అసమర్ధులైన సైన్యాధికారులు, ప్రజల మద్దతు లేనపుడు గెలవటం అసాధ్యమని, ట్రంప్‌ ప్రారంభించి వాణిజ్య యుద్దం కూడా అలాంటిదే అని ప్రముఖ ఆర్ధికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ పేర్కొన్నారు. వాణిజ్య యుద్ద పర్యవసానాలు ఏమైనప్పటికీ 2020 నాటికి అమెరికా ఆర్ధిక లోటు లక్ష కోట్ల డాలర్లకు చేరుతుందని, అదే జరిగితే పెట్టుబడులు, దిగుమతులు పడిపోవటంతో పాటు ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి జారిపోయే ప్రమాదం వుందని ఆయన పేర్కొన్నారు. అమెరికా సమస్య చైనా కాదని, దేశీయంగా పొదుపు చాలా తక్కువగా వుండటం అసలు సమస్య అన్నారు. ట్రంప్‌ కోరుతున్నట్లు అమెరికా నుంచి చైనా మరింతగా చమురు, గ్యాస్‌ కొనుగోలు చేసి ఇతరులకు అమ్మితే చైనాతో వాణిజ్యలోటు తగ్గించానని ట్రంప్‌ చెప్పుకోవటానికి తప్ప పెద్ద తేడా ఏమీ వుండదు, రవాణా ఖర్చులు పెరుగుతాయి అన్నారు. చైనా వస్తువులకు డిమాండ్‌ తగ్గితే ప్రభుత్వ ప్రమేయం లేకుండానే దాని కరెన్సీ విలువ బలహీనమౌతుంది, అప్పుడు ఇతర దేశాలతో చైనా పోటీతత్వం పెరుగుతుంది. 2015లో చైనా ఆమోదించిన మేడిన్‌ చైనా 2025 విధానాన్ని అడ్డుకొనేందుకు ట్రంప్‌ ప్రయత్నించినట్లయితే కచ్చితంగా విఫలమౌతాడు, మరోవైపు నూతన ఆవిష్కరణలు, సాంకేతికంగా పైచేయి సాధించాలన్న చైనా నేతల పట్టుదలను మరింత పెంచినవారవుతారు, తాము ఇతరులపై ఆధారపడలేమని వారు గుర్తించిన తరువాత అమెరికా పట్ల వ్యతిరేకత పెరుగుతుంది అని స్టిగ్జిజ్‌ చేసిన హెచ్చరికను ట్రంప్‌ పట్టించుకుంటాడా?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రేమతో ఆవుల బహుమతి: నరేంద్రమోడీ ర్వాండా గో మాంస ప్రియుల సంతుష్టీకరణ దౌత్యం !

26 Thursday Jul 2018

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, RELIGION

≈ Leave a comment

Tags

cows, Girinka, Girinka Programme, Modi, Modi gifts 200 cows, Rwanda

ఎం కోటేశ్వరరావు

విదేశీ పర్యటనల సమయంలో లేదా విదేశీ అతిధులు మన దేశాన్ని సందర్శించినపుడు మన ప్రధాని నరేంద్రమోడీ అందచేసే బహుమతుల గురించి ఒక పెద్ద పరిశోధనే చేయవచ్చునంటే అతిశయోక్తి కాదు. ఆయన రూటే వేరు. కాదేదీ కవిత కనర్హం అన్నట్లుగా ఆవులతో కూడా దౌత్యనీతిని ప్రదర్శించవచ్చని తొలిసారిగా ప్రపంచానికి చాటి చెప్పిన రాజనీతిజ్ఞుడిగా కూడా చరిత్రకెక్కారు. దేశంలో మోడీ మాతృసంస్ధ సంఘపరివార్‌, దాని అనుబంధ రాజకీయ, ఇతర సంస్ధల కార్యకర్తలందరూ ‘గోరక్షణ కర్తవ్యం పేరుతో’ ముస్లింలపై మూకదాడులు, హత్యలకు పాల్పడుతున్నారు. గోరక్షణకు కంకణం కట్టుకున్నానని నమ్మబలుకుతున్న నరేంద్రమోడీ దేశ ప్రజల అదృష్టం లేదా ఖర్మకొద్దీ ప్రధానిగా వున్నందున ప్రస్తుతానికి గోరక్షణ కార్యక్రమాలలో పాల్గనే అవకాశాలు లేవు. విదేశీ అతిధులు మన దేశానికి వచ్చినా, నరేంద్రమోడీ విదేశీ పర్యటనలు జరిపినా పురుష నేతల భుజాలపై చేతులు వేయటం లేదా కౌగలించుకొని ఎంతో ఆత్మీయతను ప్రదర్శించటం తెలిసిందే. బ్రిక్స్‌ సమావేశంలో పాల్గనేందుకు దక్షిణాఫ్రికా వెళుతూ దానితో పాటు కోటీ 20లక్షల జనాభా వున్న ర్వాండా అనే దేశాన్ని సందర్శించిన మోడీ అక్కడి వారికి 200 ఆవులను బహుమతిగా ఇచ్చి ఇటు జాతీయంగా ప్రతిపక్షాల వారిని అటు అంతర్జాతీయంగా తామే తిరుగులేని తలపండిన పెద్ద దౌత్యవేత్తలమని విర్రవీగుతున్న వారిని కూడా ఆశ్చర్యపరుస్తూ కొత్త వరవడికి శ్రీకారం చుట్టారని చెప్పకతప్పదు. ర్వాండా అధ్యక్షుడికి గోవుల పంపిణీ ఇష్టమని మనసెరిగి గోపాలుడి అవతారమెత్తిన నరేంద్రమోడీ ఒక గ్రామానికి ప్రత్యేకంగా వెళ్లి కార్యక్రమంలో పాల్గని ఆ దేశాధ్యక్షుడిని పడేశారు.

మోడీ ప్రయాణించే విమానంలో మన దేశం నుంచి గోవులను రవాణా చేయటం కుదరదు, ఇక్కడి హిందూ గోమాతలు ఆఫ్రికా వాతావరణానికి సరిపడతాయో లేదో తెలియదు, అన్నింటికీ మించి అక్కడి క్రైస్తవ, ముస్లిం ఆచార వ్యవహారాలతో సరిపడక వాటి మనోభావాలు దెబ్బతినవచ్చు. సంకరంతో వ్రతం చెడవచ్చు. అందువలన ఎవరి మనోభావాలకు దెబ్బతగుల కుండా స్ధానికంగా దొరికే మెజారిటీ క్రైస్తవ గోమాతలనే కొనుగోలు చేయించి వాటిని అక్కడి వారికి బహుమతిగా ఇచ్చి ర్వాండాతో సంబంధాలను మెరుగుపరచుకొనేందుకు ప్రయత్నించారు. ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధానిగా చరిత్రకెక్కారు.

ర్వాండా పేదల సంక్షేమ పధకాలలో భాగంగా గిరింకా పేరుతో అధ్యక్షుడు పాల్‌ కగామే ఆవుల పంపిణీ పధకం చేపట్టినట్లు మోడీ సర్కార్‌ తెలుసుకుంది. అందువలన దానికి సంబంధించిన బహుమతి ఇచ్చి అక్కడి ప్రభుత్వాన్ని ఆకట్టుకోవచ్చని మోడీ సలహాదారులు భావించి వుండాలి.ఆవుల పంపిణీ కార్యక్రమంపై ర్వాండా అధ్యక్షుకి స్వయంగా ఆసక్తి వున్నందున దానిలో మన దేశం కూడా భాగస్వామి కావటం ప్రాముఖ్యత సంతరించుకుందని విదేశీ వ్యవహారాల ఆర్ధిక సంబంధాల కార్యదర్శి టిఎస్‌ తిరుమూర్తి విలేకర్లతో స్వయంగా చెప్పారు. దాని ఫలితమే ఆవుల బహుమతి. ర్వాండాతో సోదర, సౌహార్ధ్ర సంబంధాల మెరుగుదలకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

గిరింకా పధకం ప్రకారం ప్రభుత్వం పేదలకు ఆవులను బహుమతిగా ఇస్తుంది. వాటిని పొందిన వారు సదరు ఆవులకు పెయ్య దూడలు పుడితే వాటిని పొరుగు పేదలకు బహుమతిగా ఇవ్వాలి. ఇలా మూడున్నరలక్షల ఆవులను పంపిణీ చేయాలని అధ్యక్షుడు నిర్ణయించాడు. ఆవుల పధకంతో కుటుంబాలకు అవసరమైన పాలతో పాటు వ్యవసాయానికి కావాల్సిన ఎరువు సమకూరుతుంది, వట్టిపోయిన తరువాత ఆవులను, కోడెదూడలను మాంసానికి వినియోగిస్తారు కావున పోషకాహారలేమితో బాధపడుతున్న దేశంలోని పిల్లలకు దానిని సరఫరా చేయాలన్నది ఆ పధక లక్ష్యం. ర్వాండా జనాభాలో అత్యధికులు క్రైస్తవులు. వారి ఆహారంలో గొడ్డు మాంసం ముఖ్యమైనది. మనకు ప్రతి వూరిలో హోటల్‌లో ఇడ్లీ, దోసె దొరికినట్లుగా అక్కడ అది దొరుకుతుంది.

గో గూండాలు మరోమారు విజృంభించి మరొకరి ప్రాణం తీసిన వుదంతం మీడియాలో ప్రముఖంగా వచ్చిన తరుణంలోనే మోడీ గో దౌత్యం గురించి కూడా ఆ వార్తలతో పాటు దీన్ని చదువుకున్నాం గోవధను ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో నిషేధించారు, దేశమంతటా అమలు చేయాలని హిందూత్వ శక్తులు పట్టుబడుతున్న తరుణంలో దానికి అనుగుణంగానే గో గూండాలు చెలరేగుతున్నారు. మూక హత్యలు పెరిగిపోతున్నాయి. అలాంటి దేశానికి అసలు సిసలైన ప్రతినిధిని అని చెప్పుకుంటున్న మోడీ గొడ్డు మాంసం లేనిదే ముద్ద దిగని దేశంలో ఆవులను బహుమతిగా ఇవ్వటంపై గో అభిమానులే పరిహాసాలాడుతున్నారు.కోరిన చెయ్యే కొట్టు, కొట్టిన చెయ్యే కోరు అన్నట్లు పేటెంట్‌ కలిగి వుండకపోయినా గోవుల స్వంతదారుల మాదిరి ప్రవర్తిస్తున్నవారు ఏం చేసినా తప్పులేదని ఎవరైనా వాదించినా ఆశ్చర్యం లేదు.

‘ బుగెసెరాలో ఏర్పాటవుతున్న అతి పెద్ద గోమాంస(పరిశ్రమ) కబేళాకు ప్రేమతో 200 గోవులను బహుమతిగా ఇచ్చిన నరేంద్రమోడీ ‘ అన్నది వాటిలో ఒకటి. పన్నెండు వేల ఎకరాల విస్తీర్ణంలో గోవులు, ఇతర పశుసంపదను పెంచి, వాటి నుంచి మాంసం వుత్పత్తి చేసేందుకు ఒక పెద్ద పరిశ్రమ బుగెసెరా అనే చోట దశలవారీ ఏర్పాటు అవుతున్నది. దానికి దేశాధ్యక్షుడు పాల్‌ కగామే అనుమతి ఇచ్చారు. ఏటా 1200 గోవులతో ప్రారంభమై 2018నాటికి మూడువేల స్ధాయికి పెంచనున్నట్లు ప్రభుత్వమే ప్రకటించింది. ఒక్కో ఆవు నుంచి 160కిలోల మాంసం తయారవుతుంది. దేశం మొత్తంలో 2015లో 86వేల టన్నులుగా వున్న వుత్పత్తిని 2018 నాటికి 2,30,000 టన్నులకు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ప్రతి పశువును 120 రోజులు బాగా మేపి తరువాత కబేళాకు తరలిస్తారు. గో మాంస ఎగుమతులకు బుగెసెరాలో ఏర్పాటు కానున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా వినియోగించుకుంటారు. గోవులను పెంచేందుకు, కబేళాల ఏర్పాటుకు ప్రభుత్వమే భూములను కౌలుకు ఇస్తుంది.

‘ మోడీ ర్వాండాకు 200 గోవులను బహుమతిగా ఇవ్వటం కొంత గందరగోళం కలిగిస్తోంది. ఆ దేశంలో ప్రతి చోటా ఆవులు వుండాలని ఆరు కోరుకుంటారు, ప్రత్యేకించి భోజన బల్లల మీద, త్వరిత గతిన దూకే గోరక్షక దళాన్ని ఏర్పాటు చేయాల్సి రావచ్చు, వారిని తెల్లవారే సరికి పారా చూట్ల ద్వారా దించటాన్ని నేను చూడగలను’

‘ గోరక్షకులందరికీ సామూహిక అప్రమత్త సందేశం, ర్వాండాలో ఈ ఆవులను రక్షించేందుకు దయచేసి వెళ్లండి, వెళ్లండి, ఇప్పుడే వెళ్లండి’ ‘ ర్వాండాకు రెండువందల ఆవులను తరలిస్తున్న స్మగ్లర్‌ కనిపించాడు.’ ‘ ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి రెండు ఆవులను తరలిస్తున్న ఒక వ్యక్తిని వధించారు, మరొక వ్యక్తి 200 ఆవులను భారత్‌ నుంచి ర్వాండాకు తరలిస్తున్నట్లు నేను ఇప్పుడే విన్నాను. అయితే అతనికేమీ కాకూడదని ఆశిస్తున్నాను, అతని కోసం నేను ప్రార్ధిస్తాను.’ ‘200 ఆవులను ర్వాండాకు స్మగ్లింగ్‌ చేస్తున్నందుకు యునెస్కో మోడీకి అతి పెద్ద ఆవుల స్మగ్లర్‌ అనే అవార్డు ఇచ్చింది. వావ్‌ మోడీ వావ్‌, ప్రియమైన భక్తులారా మన ప్రధానిని వధించవద్దు, ఎందుకంటే ఆయన భాగీదారు తప్ప చౌకీదారు కాదు ‘

మాంసం కోసం లేత ఆవులు, కోడె దూడలను వధించటం, అతిధులకు దానిని వడ్డించటం ఒక మర్యాదగా మన దేశంలో ఒకప్పుడు విలసిల్లింది. మా మనోభావాలను గాయపరిచారనే పేరుతో పుక్కిటి పురాణ పాత్రలను విమర్శిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. దాడులకు తెగబడుతున్నారు. ఆవు పేరుతో ఎలాంటి తప్పు చేయని ఒక మనిషిని మూకదాడిలో చంపితే తోటి మనుషుల మనోభావాలు దెబ్బతినకపోగా మరింతగా జరగాలని ప్రోత్సహిస్తున్నవాతావరణం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇది సామూహిక వున్మాదం తప్ప వ్యక్తిపరమైన సమస్య కాదు.వ్యక్తికి, ఇంటికి పరిమితం చేయాల్సిన దేవుడు, దేవతలను ఓట్లకోసం వీధుల్లోకి తెచ్చారు. దాని కొనసాగింపుగానే ఆవును గోమాతను, దేవతను చేశారు. ఓట్ల కోసం మన దేశంలో ఆహారం కోసం గోవును వధించకూడదని నానా రాద్దాంతం చేస్తున్న వారు, మరో దేశంలో మార్కెట్‌, పెట్టుబడుల కోసం పడుతున్న పాట్లలో భాగంగా అక్కడ గోవులను తింటారని, ఆ దేశాధ్యక్షుడికి గోపంపిణీ అంటే ప్రీతి అని తెలిసి గోవులనే బహమతులుగా ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ మనోభావాలు ఏమైనట్లు? ప్రతిదానికీ మా మనోభావాలు గాయపడ్డాయంటూ నానా యాగీ చేస్తున్న వారు ఇప్పుడేమంటారు? ఇప్పుడేం చేస్తారు? ప్రాణ, విత్త, మానభంగములందు ఆడి తప్పవచ్చు అని మినహాయింపులిచ్చినట్లుగానే పెట్టుబడిదారులు, వ్యాపారుల లాభాల కోసం వధిస్తారని తెలిసీ నరేంద్రమోడీ గోవులను బహుమతిగా ఇచ్చినపుడు, జీవనోపాధికోసం తప్ప వధించటానికి కాదు మేము గోవులను కొనేదీ అమ్మేదీ అని నెత్తీ నోరు కొట్టుకుంటున్న ముస్లింల గోడును ఆయన అనుయాయులు, మద్దతుదారులు ఎందుకు పట్టించుకోరు? మోడీ మాదిరి మనోభావాలకు అతీతంగా వ్యవహరించలేరా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వాణిజ్య యుద్ధంతో ఇండోనేషియా, భారత్‌లకు ముప్పు

10 Tuesday Jul 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

INDIA, Indonesia, TRADE WAR, Trade war India, Trade war puts Indonesia and India at risk

Image result for trade war

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ పౌరుల ఆకాంక్షలకు విరుద్దంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చరిత్రలో అతిపెద్ద ప్రపంచ వాణిజ్య యుద్ధం ప్రారంభసూచికగా జూలై ఆరవతేదీ అర్ధరాత్రి చైనా మీద తొలి తూటా పేల్చాడు. గతంలో కూడా వాణిజ్య యుద్ధాలు జరిగినప్పటికీ తాజా పరిణామం పర్యవసానాలు తీవ్రంగా వుంటాయనే అభిప్రాయాలు, భయాలు వెలువడుతున్నాయి. చైనా, ఇతర దేశాల మీద ప్రారంభించిన యుద్ధంతోతాము ఎంతో కొంత లాభపడవచ్చనే ఆశ అమెరికన్‌ కార్పొరేట్లలో అంతర్గతంగా వుంది. అయితే అదే సమయంలో జరిగే నష్టాల గురించి కూడా అంతే భయపడుతున్నా. లాభాల గురించి బహిరంగంగా చెప్పుకోలేరు, ఇదే సమయంలో ప్రతికూలతల గురించి మీడియాలో ఎన్నో హెచ్చరికలు వెలువడుతున్నాయి. అమెరికా దిగుమతులపై విధించిన పన్నుద్వారా వసూలయ్యే మొత్తాన్ని అమెరికా ఆంక్షలతో ప్రభావితమయ్యే చైనా కంపెనీలు, కార్మికుల కోసం వినియోగిస్తామని చైనా ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులను ఇతర దేశాల నుంచి సేకరించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కూడా సూచించింది. అమెరికా-చైనా రెండూ కూడా దీర్ఘకాల వాణిజ్య యుద్ధానికి సిద్దపడుతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. అమెరికా వుత్పత్తులపై అదనపు పన్ను వసూలు ప్రారంభించిన చైనా మరోవైపు గతంలో నిలిపివేసిన తమ కోడి మాంస దిగుతులకు అనుమతించినట్లు జర్మనీ మంత్రి ప్రకటించారు.

వాణిజ్య యుద్ధాలను, వాటిలో భాగంగా దిగుమతి పన్నులను విధించేందుకు అధ్యక్షుడికి వున్న అధికారాలను పరిమితం చేయాలని నేషనల్‌ టాక్స్‌ పేయర్స్‌ ఫౌండేషన్‌ విశ్లేషకుడు ఆండ్రూ విల్‌ఫోర్డ్‌ ‘యుఎస్‌ఏ టుడే’లో పేర్కొన్నాడు. దాని సారాంశం ఇలా వుంది. 1962లో చేసిన వ్యాపార విస్తరణ చట్టంలోని అవకాశాలను ట్రంప్‌ వినియోగిస్తున్నాడు. నిర్దిష్ట జాతీయ భద్రతకు ముప్పు తెచ్చే వాటికోసం చేసిన చట్టాలను దుర్వినియోగపరుస్తూ దేశ వినియోగదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నందున, పార్లమెంట్‌ జోక్యం చేసుకొని అధ్య క్షుడిని నిలువరించాలి. అల్యూమినియం, వుక్కు దిగుమతుల ద్వారా దేశభద్రతకు ముప్పు తలెత్తిందని ట్రంప్‌ పేర్కొన్నాడు. అయితే 2010-15 మధ్య దేశీయంగా వుత్పత్తి అయిన వుక్కులో కేవలం సగటున మూడుశాతం లోపే జాతీయ భద్రతకు వినియోగిస్తున్నట్లు తేలింది, అవసరానికి మించి దేశంలో వుత్పత్తి వుంది, అదే విధంగా దిగుమతి చేసుకున్న వుక్కులో జాతీయ భద్రతకు వినియోగిస్తున్నది సగటున 2.4నుంచి 2.8శాతం మధ్యనే వుంది, ఆ దిగుమతులలో కూడా అత్యధిక భాగం భాగస్వామ్య లేదా మిత్ర దేశాల నుంచే వున్నాయి. వుక్కు పరిశ్రమలో వుపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. గత ఐదు సంవత్సరాలలో ఐదు పెద్ద కంపెనీలు మార్కెట్‌ కాపిటలైజేషన్‌ను రెట్టింపు చేసుకున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం కారణంగా వుత్పాదకత గణనీయంగా పెరిగింది.అల్యూమినియం, వుక్కు దిగుమతులపై పన్నుల విధింపు కారణంగా నిఖరంగా 4.7లక్షల వుద్యోగాలు పోతాయి. ఇవి అమెరికా వుక్కు పరిశ్రమలో పని చేస్తున్న లక్షా 40వేల మందికి మూడు రెట్లు. బలమైన ఆర్ధిక వ్యవస్ధ లేకుండా బలమైన జాతీయ భద్రత సాధ్యం కాదని వాణిజ్య మంత్రి విల్‌బర్‌ రోస్‌ స్వయంగా చెప్పాడు. పన్నుల విధింపు తగదని వంద మంది రిపబ్లికన్‌ ఎంపీలు లేఖ రాశారు. ట్రంప్‌ వినియోగిస్తున్న చట్టంలోని నిబంధనను 1979,82 సంవత్సరాలలో ఇరాన్‌, లిబియా చమురు దిగుమతుల నిరోధానికి వినియోగించారు.

రక్షణాత్మక చర్యలను చేపట్టబోయే ముందు వస్తువుల నిజమైన జాతీయత ఏమిటో తెలుసుకోవాలని లాసానే విశ్వవిద్యాలయ ఎమిరిటస్‌ ప్రొఫెసర్‌ స్టెఫానే గారెలీ హితవు చెప్పాడు. ఆయన వాదన ఇలా వుంది. ప్రపంచీకరణ యుగంలో వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవటం అంత సులభం కాదు. కొద్ది సంవత్సరాల క్రితం కాలిఫోర్నియా, లాస్‌ ఏంజల్స్‌ విశ్వవిద్యాలయాల పరిశోధకులు ఒక ఐపాడ్‌లోని 431భాగాలు ఎక్కడి నుంచి వచ్చాయో కనుగొన్నారు.ప్రపంచంలోని పలు దేశాల నుంచి వచ్చిన ఆ భాగాలను చైనాలోని ఫాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీలో ఐపాడ్‌గా రూపొందిస్తారు. అంతిమ వుత్పత్తిపై చైనా జోడించే విలువ ఐదుశాతం మించటం లేదు. అయితే అమెరికా కస్టమ్స్‌ శాఖ వద్దకు వచ్చే సరికి అది చైనా తయారీ వుత్పత్తిగా పరిగణించబడుతోంది. అది నిజంగా చైనా వుత్పత్తా ? అమెరికా వాణిజ్యలోటు అది చేసుకొనే దిగుమతుల కారణంగా ఏర్పడుతోంది. మెక్సికో నుంచి అమెరికా దిగుమతి చేసుకొనే వాటిలో 40శాతం మెక్సికోలోని అమెరికన్‌ కంపెనీలు లేదా అమెరికాకు మాత్రమే ఎగుమతి చేసే మెక్సికో స్ధానిక కంపెనీల నుంచి వుంటున్నాయి. చైనా నుంచి చేసుకొనే దిగుమతులు కూడా అలాంటివే. వాణిజ్య వ్యూహాలలో భాగంగా స్మార్ట్‌ ఫోన్ల తయారీకి గూగుల్‌ ఆండ్రాయిడ్‌ వుచితంగా సాప్ట్‌వేర్‌ను అందచేస్తున్నది. దానికి గనుక ధర నిర్ణయిస్తే ఏడాదికి రెండువందల బిలియన్‌ డాలర్లు వుంటుంది. ఆ మొత్తం అమెరికా వాణిజ్యలోటులో సగం.

వాణిజ్యం యుద్ధం విస్తరిస్తే అమెరికా అధ్య క్షుడు జర్మన్‌ ఆటో పరిశ్రమకు కూడా ముప్పు తెస్తున్నట్లే. బిఎండబ్ల్యు సౌత్‌ కరోలినా లోని స్పార్టన్‌బర్గ్‌, అలబామాలోని వాన్స్‌లో మెర్సిడెస్‌, టెనెసీలోని ఛాటూంగాలో ఓక్స్‌వాగన్‌ కార్లు తయారవుతాయి. ఇవి ఎగుమతుల కోసం కూడా తయారు చేస్తాయి. గతేడాది బిఎండబ్ల్యు తయారు చేసిన వాటిలో 70శాతం ఎగుమతి చేశారు. వీటిని అమెరికన్‌ కార్లు అనాలా జర్మనీవి అనాలా ? వాణిజ్య యుద్ధానికి ముందు అమెరికా తయారీ కార్లపై చైనా దిగుమతి పన్ను తగ్గించిన కారణంగా ఫోర్డ్‌, టెల్సా వంటి కంపెనీలు కొద్దివారాల ముందు చైనాలో పదిహేనుశాతం వరకు కార్లధరలను తగ్గించాయి. అమెరికా ప్రారంభించిన యుద్ధంతో చైనా విధించిన ప్రతికూల సుంకాల కారణంగా ఇప్పుడు 40శాతం పన్నుతో ధరలు పెరిగాయి. ఈ పన్నులను వినియోగదారుల నుంచి వసూలు చేయటం తప్ప తాము భరించలేమని బిఎండబ్ల్యు చైనా ప్రకటించింది.1974 నుంచి అమలులోకి వచ్చిన కొయొటో ఒప్పందం ప్రకారం ఒక వస్తువు తయారీలో కనీసంగా స్ధానిక అంశం ఎంత వుంది లేదా చివరి తయారీ క్రమం పాత్ర ఎంత అనేది నిర్ధారించవచ్చు. అయితే ప్రపంచీకరణ మరియు డిజిటలైజేషన్‌ సంక్లిష్టతను పెంచాయి. వివిధ విడిభాగాలతో తయారైన ఒక వస్తువులు అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాలకు ఆయాప్రాంతాల సామర్ధ్యం, ధరలను బట్టి మారిపోతుంటాయి.

ప్రపంచీకరణ కారణంగా ఒక ఆర్ధిక వ్యవస్ధను వేరు చేసి చూడటం కష్టం అనే విషయాన్ని బ్రెక్సిట్‌ మద్దతుదారుల మాదిరి అమెరికా అధ్యక్షుడు విస్మరించినట్లు కనిపిస్తోంది. ఇతర దేశాలలో అమెరికా ఎనిమిది లక్షల కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టింది, అలాగే ఇతర దేశాలు అమెరికాలో ఏడులక్షల కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టాయి. మొత్తం మీద ప్రపంచ జిడిపిలో ప్రత్యక్ష పెట్టుబడులు 35శాతం వరకు వుంటాయి. ఎనిమిది కోట్ల మందికి వుపాధి కల్పిస్తున్నాయి. ప్రయివేటు జీవితంలో వివాహం చేసుకోవటం కంటే విడిపోవటం ఎంతో సంక్లిష్టం, ఖరీదైనది. అంతర్జాతీయ వాణిజ్యం మీద చూపే ప్రభావాన్ని స్పష్టంగా చూడాలంటే కస్టమ్స్‌ లెక్కల నుంచి ఏ ప్రాంతం నుంచి వచ్చింది అనేదానికంటే ఒక వస్తువు వుత్పత్తిలో విలువ జోడింపు మీద కేంద్రీకరించాలి. బ్లాక్‌ చెయిన్‌ ద్వారా నమోదయ్యే లావాదేవీల ద్వారా వికేంద్రీకరణ చెందిన మరియు నిరాకార ప్రపంచంలో ఎవరు దేనికి యజమానులో ఎలా చెప్పగలం? జాన్‌మైేునార్డ్‌ కీన్స్‌ చెప్పినట్లు సమస్యలన్నీ ఆర్ధిక పరమైనవి అయితే పరిష్కారాలన్నీ రాజకీయ పరమైనవి అయినందున ట్రంప్‌తో మనం జీవించాల్సి వుంది.

వాణిజ్య యుద్ధం జరిగితే నష్టపోయేది అమెరికా అని గతంలో బిల్‌క్లింటన్‌ హయాంలో సహాయ విత్తమంత్రిగా చేసిన ప్రొఫెసర్‌ జె బ్రాడ్‌ఫోర్డ్‌ డెలాంగ్‌ స్పష్టం చేశారు. మోటార్‌ సైకిళ్ల తయారీలో పేరెన్నికగన్న హార్లే డేవిడ్స్‌న్‌పై ఇటీవల డోనాల్డ్‌ ట్రంప్‌ విరుచుకుపడటం అమెరికా ప్రజాస్వామ్యం మీదే దాడి వంటిదని, నవంబరులో జరిగే ఎన్నికలలో వుభయ సభలలో ఒకదానిలో అయినా మెజారిటీ సంపాదించగలిగితే తప్ప ట్రంప్‌, రిపబ్లికన్‌ పార్టీ నేతలు ప్రపంచంలో దేశ ప్రతిష్టకు చేసిన నష్టాన్ని సరిచేయలేమని అన్నారు. బ్రాడ్‌ఫోర్డ్‌ విశ్లేషణలో ఇలా పేర్కొన్నారు. 2017 ఫిబ్రవరిలో హార్లే డేవిడ్స్‌న్‌ అధికారులు, యూనియన్‌ నేతలతో ట్రంప్‌ ఒక సమావేశం జరిపారు. ఈ కంపెనీ అమెరికాలో వస్తువులను తయారు చేస్తున్నది, నేను చూస్తుండగానే దాన్ని విస్తరించాలని చెప్పాడు. ఏడాది తిరగ్గానే పరిస్ధితులు మారిపోయాయి. దిగుమతి చేసుకున్న అల్యూమినియం, వుక్కుపై పన్నులు విధిస్తామని ట్రంప్‌ చేసిన ప్రకటన కారణంగా ఐరోపా యూనియన్‌ ప్రతికూల చర్యలకు గురికాని ప్రాంతాలకు కొన్ని కార్యకలాపాలను తరలిస్తామని మోటార్‌ సైకిల్‌ కంపెనీ ప్రకటించింది. దాన్ని చూడగానే ట్రంప్‌ ఆ కంపెనీ మీద దాడి చేశాడు. ఒకసారి బయటకు పోయిన తరువాత తిరిగి అమెరికాలో పెద్ద మొత్తంలో పన్ను చెల్లించకుండా అమ్ముతామంటే కుదరదు అని హెచ్చరించాడు. వారు మరొక దేశంలో ఫ్యాక్టరీ నిర్మించటానికి వీల్లేదంటే వీల్లేదు, వారు ఇక్కడి నుంచి తరలటం అంటే అంతానికి ఆరంభం అని ట్వీట్లలో వాగాడు.

వాణిజ్య యుద్ధం తధ్యమనే అభిప్రాయంతో చైనాలోని కొన్ని కంపెనీలు వేరే దేశాలకు తరలించేందుకు ఆలోచన చేశాయి, ఇంకా చేస్తున్నాయి. అక్కడ పెరుగుతున్న వేతనాలతో అనేక కంపెనీలు ఎప్పటి నుంచో తక్కువ వేతనాలకు శ్రమ దొరికే చోటికి తరలిపోవాలని చూస్తున్నాయి. ఇదే సమయంలో అమెరికాతో వాణిజ్యంలో చైనాకు ఎంతో మిగులున్న కారణంగా చైనాను లంగదీసుకోవచ్చనే అభిప్రాయం కొంత మందిలో లేకపోలేదు. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఐదువందల బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువుల మీద పన్ను విధిస్తానంటున్నాడు ట్రంప్‌, దానికి పోటీగా చైనా ఎంతపన్ను విధించినా 130 బిలియన్‌ డాలర్ల మేరకే దాని దిగుమతులున్నాయని వారు గుర్తు చేస్తున్నారు. వాణిజ్య యుద్ధాలు మంచివి, విజయం సాధించటం సులభం అని ట్రంప్‌ చెప్పారు, వాస్తవం ఏమంటే వాటిలో పాల్గనేవారే కాదు వాణిజ్య యుద్ధాలు ప్రతి ఒక్కరినీ నష్టపరుస్తాయి, ఎవరూ గెలవజాలరని ఆస్ట్రేలియా సిడ్నీ మోర్నింగ్‌ హెరాల్డ్‌ పత్రికలో ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు. ఒక వేళ విజయం సాధించినా అది పరిమితం. ట్రంప్‌ తన కలలను నిజం చేసుకోవాలంటే చైనా లేదా ఐరోపా యూనియన్‌ అందచేసే వస్తువులను స్ధానికంగా తయారుచేసేందుకు మరిన్ని ఫ్యాక్టరీలను పెట్టాలి, వాటిద్వారా మరిన్ని వుద్యోగాలను కల్పించవచ్చు. అయితే అలా తయారు చేసే వస్తువులు ఎంతో ప్రియమైనవిగా పరిమితంగా వుంటాయి.

వాణిజ్యయుద్ధ తుపాకి గుండు పేల్చాలన్న నిర్ణయం దెబ్బకు దెబ్బ అన్నట్లుగా ఒక్క చైనాకే పరిమితం చేయలేదు, కెనడా, మెక్సికో, ఐరోపా యూనియన్‌ నుంచి దిగుమతి చేసుకొనే వాటి మీద కూడా పన్నులు విధించాడు. అదే జరిగితే అమెరికా దిగుమతి చేసుకొనే 300 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులపై కూడా ఐరోపా యూనియన్‌ పన్నులు విధిస్తుంది. ప్రభావాలు, అనిశ్చిత పరిస్ధితులు పరిస్ధితిని మరింత దిగజార్చుతాయి. ఐరోపా యూనియన్‌, ఇతర అమెరికా మిత్రదేశాలకు చైనాతో స్వంత సమస్యలు వున్నాయి. ట్రంప్‌ గనుక వాణిజ్యదాడిని ఒక్క చైనాకే పరిమితం చేసి వుంటే వారంతా కలసి వచ్చేవారు. దానికి బదులుగా ఐరోపా యూనియన్‌, జపాన్‌, దక్షిణ కొరియా, కెనడా, మెక్సికోలపై చర్యల ద్వారా అమెరికాను ఒంటరిపాటు చేశాడని ఆస్ట్రేలియా పత్రిక పేర్కొన్నది.

తొలి దఫా పన్నుల అర్ధం వాణిజ్య యుద్ధ పూర్తి స్ధాయి ప్రభావం ఎలా వుంటుందో అనుభవించటానికి అమెరికన్‌ వినియోగదారులు ఒక అడుగు దగ్గర కావటమే అని నేషనల్‌ రిటైల్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు మాథ్యూ సాహే అన్నారు. విధించే పన్నులు అమెరికా వుద్యోగాలనేమాత్రం కాపాడలేవు, కానీ అవి పన్నుల సంస్కరణద్వారా పొందిన లబ్దిని దెబ్బతీస్తాయి, అనేక వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తాయి, తమ గదులకు అవసరమైన చిన్న ఫ్రిజ్‌లకు విద్యార్ధులు అధిక మొత్తాలను చెల్లించాల్సి వస్తుంది, ఏకపక్షంగా పన్నులు విధించటం తప్పుడు పద్దతి, దానిని వెంటనే నిలిపివేయాలి అని కూడా సాహే చెప్పారు.

ఇరవై లక్షల కోట్ల పెద్ద అమెరికా ఆర్ధిక వ్యవస్ధతో పోల్చితే వాణిజ్య యుద్ధం, దానిలో 34బిలియన్‌ డాలర్ల వస్తువులపై 25శాతం పన్ను విధించటం సముద్రంలో కాకిరెట్ట వంటిదని, దీని వలన కొంత మంది నష్టపోతారు, కొందరు లాభపడతారు అని ఓక్స్‌ డాట్‌కామ్‌ విశ్లేషణలో పేర్కొన్నారు. చట్టపరంగా చెప్పాలంటే 34బిలియన్‌ డాలర్ల చైనా వస్తువులపై 25శాతం పన్ను విధింపు అక్రమంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని తస్కరిస్తున్న చైనాను శిక్షించటమే. ట్రంప్‌ వాక్పటిమలో 300బిలియన్‌ డాలర్లపై పన్ను విధిస్తామని చెప్పాడు. ఇరవైలక్షల కోట్ల ఆర్ధిక వ్యవస్ధ కలిగిన అమెరికాకు గతేడాది చైనా నుంచి దిగుమతి చేసుకున్న 478బిలియన్‌ డాలర్ల దిగుమతులు చాలా తక్కువ. మరో విధంగా చెప్పాలంటే 2017లో ఏడాదికి 150 బిలియన్‌ డాలర్ల మేరకు పన్ను రాయితీలు ఇవ్వాలన్న పార్లమెంట్‌ తీర్మానంతో పోలిస్తే 25శాతం పన్ను విధింపుద్వారా ఏడాదికి వచ్చే 8.5బిలియన్‌ డాలర్లు ఏపాటి? వాషింగ్‌మెషిన్ల పరిశ్రమకు పన్నుల మొత్తం పెద్దగా వుండవచ్చుగాని ఒక మిషన్‌ కొనే పౌరుడికి పెద్ద భారం అనిపించదు. వాషింగ్టన్‌ పోస్టు పత్రిక సమాచారం ప్రకారం 1977 తరువాత తొలిసారిగా జనవరిలో పన్నులు పెంచిన కారణంగా మార్చినెల నుంచి వాషింగ్‌ మెషిన్ల ధరలు 16శాతం పెరిగాయి. పౌరులు వాటిని రోజూ కొనరు కదా ! అయినప్పటికీ 2015లో వున్న ధరలకంటే ఇప్పుడు చౌకగానే వున్నాయి. అనేక పరికరాల ధరలు గత కొద్ది సంవత్సరాలుగా పడిపోతున్నాయి, ట్రంప్‌ వాటిని కొద్దిగా పెంచారు. దాని కధనం ఇలా సాగింది.

Image result for trade war

వాణిజ్య యుద్ధం కారణంగా అమెరికాలో ధరలు పెరిగి, అభివృద్ధి దిగజారుతుందని ప్రభుత్వ నిధులతో నడిచే వాయిస్‌ ఆఫ్‌ అమెరికా రేడియో పేర్కొన్నది.తొలుత 34 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులపై విధించిన 25శాతం పన్నుతో అటు చైనా, ఇటు అమెరికాపై ఆర్ధికంగా పెద్దగా ప్రభావం చూపదు. నష్టం తరువాత పెరుగుతుంది. గతేడాది చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ 506బిలియన్‌ డాలర్లు కాగా అవసరమైతే తాను 550 బిలియన్‌ డాలర్ల వస్తువులపై పన్ను విధిస్తానని ట్రంప్‌ పేర్కొన్నాడు. పన్నులను విస్తరించే కొద్దీ వినియోగదారులకు ధరలు పెరుగుతాయి, దిగుమతి చేసుకొనే విడిభాగాలపై ఆధారపడిన కంపెనీల ఖర్చు పెరుగుతుంది.ద్రవ్యమార్కెట్‌లు దడదడలాడతాయి.కొంత మందిని లేఆఫ్‌ చేయవచ్చు, చైనాతో ట్రంపేమైనా రాజీకి వస్తారా అని వాణిజ్యపెట్టుబడులపై నిర్ణయం తీసుకొనేందుకు వేచి చూస్తారు. గతేడాది పన్నుల తగ్గింపు ద్వారా కల్పించిన అనేక ఆర్ధిక లబ్దులు ప్రమాదంలో పడతాయి. పూర్తి స్ధాయి వాణిజ్య యుద్దం జరిగితే బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌, ఇతరులు హెచ్చరించినట్లుగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి పోయే ప్రమాదముంది. అమెరికా సోయాలో 60శాతం దిగుమతి చేసుకుంటున్న చైనా హెచ్చరిక కారణంగా గత నెలలో 17శాతం మేరకు ధరలు పడిపోయాయి. ఇదే సమయంలో చైనా కరెన్సీ విలువ డాలరు మారకంతో గతనెలలో 3.5శాతం పడిపోయింది. ఇది అమెరికా కంపెనీలతో పోటీ పడటానికి చైనా కంపెనీలకు వూతమిస్తుంది. అమెరికా వినియోగదారుల మీద ప్రభావాన్ని పరిమితం చేసేందుకు ట్రంప్‌ యంత్రాంగం చైనా పారిశ్రామిక వస్తువుల మీదనే తొలుత కేంద్రీకరించింది. అయితే ఆ చర్య ద్వారా కంపెనీల యంత్రాల ధరలు పెరిగితే ఆ భారాన్ని అవి చివరికి తమఖాతాదారులు, వినియోగదారులమీదనే మోపుతాయని వాయిస్‌ ఆఫ్‌ అమెరికా తెలిపింది.

అమెరికా-చైనాల మధ్య ప్రారంభమైన వాణిజ్య యుద్ధం ఇండోనేషియా, భారత్‌లకు ముప్పు కలిగించవచ్చని ఎస్‌ అండ్‌ పి గ్లోబల్‌ రేటింగ్స్‌ ప్రధాన ఆర్ధికవేత్త పాల్‌ గ్రుయెన్‌వాల్‌ హెచ్చరించాడు. వర్ధమాన దేశాల మార్కెట్లనుంచి మంచి వడ్డీ రేట్లు వస్తున్న అమెరికాకు మదుపుదార్లు తమ పెట్టుబడులను తరలిస్తున్నారని, మిగతా ఆసియా దేశాలతో పోల్చితే ఇండోనేషియా, భారత్‌లకు ఎక్కువ ముప్పు వుందన్నాడు.పతనమౌతున్న ఇండోనేషియా కరెన్సీ రుపయా విలువ నిలబెట్టేందుకు, స్టాక్‌మార్కెట్ల నుంచి పెట్టుబడుల వుపసంహరణను నివారించేందుకు మే, జూన్‌ నెలల్లో వడ్డీ రేట్లను పెంచింది. పెట్టుబడులరాక మందగించటం, వున్న పెట్టుబడులు బయటకు పోతుండటంతో భారత్‌ కూడా నాలుగేండ్లలో తొలిసారి వడ్డీ రేట్లను పెంచింది. క్రమంగా పెరుగుతున్న వేతనాలు ఆర్ధిక వ్యవస్ధపై విశ్వాసాన్ని కలిగిస్తూ చైనా ఆర్ధిక పురోగతిని కొనసాగిస్తున్నాయి, అది బ్యాంకింగ్‌ వ్యవస్ధలో డబ్బును మదుపు చేయటానికి జనాన్ని ప్రోత్సహిస్తున్నది, ఆ సొమ్మును కంపెనీలకు రుణాలుగా ఇస్తున్నారని, ఈ వలయం తిరుగుతున్నంత వరకు బయటకు పోయే అవకాశం లేదు, తరువాత ఆ విధానం కొనసాగుతుంది, ఒక వేళ విశ్వాసం కోల్పోయినట్లయితే కరెన్సీ మారకపు విలువమీద, విదేశీమారపు నిల్వల మీద వత్తిడి పెరుగుతుందని గ్రుయెన్‌వాల్‌ పేర్కొన్నాడు.

వాణిజ్య యుద్ధం ప్రారంభమై ఇంకా వారం కూడా గడవ లేదు. దాని ప్రభావం గురించి ప్రారంభానికి ముందూ వెనుకూ ఎలా వున్నాయో చూశాము. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు, ప్రభావాలు వెల్లడవుతాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

విదేశీ అప్పు- నరేంద్రమోడీ భక్తుల తిప్పలు !

08 Sunday Jul 2018

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

fall in the value of the rupee, India’s External Debt, RBI, Rupee Fall, value of the rupee

Image result for india’s external debt, modi 2018

ఎం కోటేశ్వరరావు

లేని ప్రతిష్టకోసం అనేక మంది రాజులు, రంగప్పలు భట్రాజులు, కిరాయి కవులను పోషించినట్లు విన్నాం. ఇప్పుడు వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం నరేంద్రమోడీ గురించి అలాంటి కిరాయిబాపతు రేయింబవళ్లు పని చేస్తున్నది. వారు సృష్టించిన అవాస్తవాలు, వక్రీకరణలను అనేక మంది అమాయకులు నిజమని నమ్మటమే కాదు, వారు కూడా జీతం భత్యం లేని ప్రచారకర్తలుగా పని చేస్తున్నారు. అలాంటి వాటిలో గత నాలుగు సంవత్సరాల నరేంద్రమోడీ పాలనలో ఒక్క రూపాయి కూడా విదేశీ అప్పులు చేయలేదు అనే హిమాలయపర్వత మంత అబద్దాన్ని ప్రచారం ఒకటి.. నిజం నిదానంగా ఒక అడుగు వేసేసరికి అబద్దం వంద అడుగుల ముందు వుంటుంది. ఇలాంటి వాటిని ప్రచారం చేసే వారంతా బాగా చదువుకున్న ప్రబుద్ధులు కావటమే విచారకరం, ఆందోళన కలిగించే అంశం.

ప్రతి మూడు మాసాలకు ఒకసారి మన అప్పుల గురించి రిజర్వుబ్యాంకు అధికారికంగా వివరాలను ప్రకటిస్తుంది. దానిలో అప్పుల తీరుతెన్నుల గురించి వుంటాయి. అయినా సరే రిజర్వుబ్యాంకు వివరాలను ఎంత మంది చూస్తారు, నిజం తెలిసే లోపల మనం చెప్పే అబద్దాలను జనం గుడ్డిగా నమ్ముతారు, ప్రయోజనం నెరవేరుతుందనే తెంపరితనంతో మోడీ పరివారం వ్యవహరిస్తోంది.

అసలు గత నాలుగేండ్లలో మా మోడీ సర్కార్‌ అప్పులే చేయలేదని చెబుతారు. అది అవాస్తవమని రుజువు చూపితే తేలు కుట్టిన దొంగల మాదిరి దాని గురించి మాట్లాడరు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సరికి అంటే 2014 మార్చి 30 నాటికి మన విదేశీ అప్పు 446.2 కోట్లు, అది 2018 మార్చి నాటికి ఖరారుగాని అంకెల ప్రకారం 529 బిలియన్‌ డాలర్లకు చేరింది. రిజర్వుబ్యాంకు వివరాలివి. దీనితో మోడీకి ఎలాంటి సంబంధం లేదని చెబుతారా? ఒకవేళ అదే ప్రాతిపదిక అయితే గత పాలకులకు కూడా సంబంధం వుండదు. అలాంటపుడు మోడీ అప్పు చేయలేదని ఎలా చెబుతారు. ఈ వివరాల సంగతేమిటి అని అడిగితే, గత ప్రభుత్వాలు ఎక్కువ మొత్తంలో చేశాయి, మోడీ చేసింది తక్కువ అని కిందపడ్డా పైచేయి మాదే అన్నట్లుగా వాదనలు చేసే వారి గురించి చెప్పాల్సిందేముంది?

గతంలో అప్పు చెయ్యలేదని ఎవరు చెప్పారు. అవసరమైతే తీసుకోవచ్చు. అది అవమాన షరతులు లేదా మన ఇల్లు గుల్ల అయ్యేట్లుగా వుండకూడదు. అప్పుల కోసం ప్రపంచబ్యాంకు,ఐఎంఎఫ్‌ షరతులను అమలు జరిపారనే కదా వామపక్షాలు విమర్శలు చేశాయి. దివాలాకోరు, ప్రజావ్యతిరేక విధానాలను అమలు జరిపిన కారణంగానే మన ఆర్ధిక వ్యవస్ధలో ఇన్నేండ్లలో ధనికులు మరింత ధనికులయ్యారు, సంపద అంతా కొద్ది మంది చేతిలో పోగుపడుతోంది. ఫలితంగా మెజారిటీ జనంలో కొనుగోలు శక్తి లేక మన అభివృద్దికి పరిమితులు ఏర్పడ్డాయి. ప్రపంచీకరణ పేరుతో మన ఆర్ధిక వ్యవస్ధను బార్లా తెరవటంతో విదేశీ సరకులతో మన దుకాణాలు నిండుతున్నాయి. లాభాల పేరుతో సంపద విదేశాలకు తరలిపోతోంది. ఆ విధానాలను బిజెపి పూర్తిగా సమర్ధించింది, వ్యతిరేకించిన చరిత్ర దానికి లేదు. ఆ విధానం నుంచి మోడీ సర్కార్‌ వైదొలగదలచుకుంటే ఎవరు అడ్డు పడ్డారు. 2016లో 484బిలియన్‌ డాలర్ల అప్పును మోడీ 2017నాటికి 471కి అంటే 13 బిలియన్‌ డాలర్లు తగ్గించిన ఘనుడని మోడీ భక్తులు బాజా వాయిస్తున్నారు. దీన్నే అతి తెలివి అంటారు. ప్రవాస భారతీయులు చేసే డిపాజిట్లు కూడా మన విదేశీ రుణాల్లో కలసి వుంటాయి. పైన పేర్కొన్న 13 బిలియన్‌ డాలర్ల అప్పు తగ్గటానికి ఆ ఏడాది ప్రవాసభారతీయుల డిపాజిట్లలో పది బిలియన్‌ డాలర్లు తగ్గాయి. అది కూడా మోడీగారి గొప్పతనమే అంటారా? విదేశాల్లో వుపాధి లేదా డబ్బు సంపాదన ధ్యేయంగా వున్నవారు మాత్రమే ప్రవాస భారతీయులు. వారు సంపాదించిన ఒక డాలరు మరొక డాలరును ఎలా జత చేసుకుంటుంది అనేదే వారికి ప్రధాన లక్ష్యంగా వుంటుంది. అందువలన ఆయా పరిస్ధితులను బట్టి ఎక్కడ లాభసాటిగా వుంటే అక్కడ తమ సొమ్మును డిపాజిట్లుగా పెడతారు. ఇక్కడ దేశభక్తి మరొకటో సమస్యగా రాదు. ఇలాంటి కారణాలతో విదేశీ రుణాలలో ఒక ఖాతాలో తగ్గవచ్చు, ఒకదానిలో పెరగవచ్చు. మొత్తంగా అప్పు పెరుగుతోందా తగ్గుతోందా అన్నదే గీటురాయి. 2018 మార్చి నాటికి చూపిన అంచనాల్లో వాణిజ్య రుణాలు, స్వల్పకాలిక రుణాలలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. అందువల్లనే 471 నుంచి 529 బిలియన్‌ డాలర్లుగా ఆర్‌బిఐ పేర్కొన్నది. అసలు నాలుగేండ్లలో అప్పులే చేయలేదు అని ప్రచారం చేసే వారు లేదా దానిని నమ్ముతున్న వారు ఆర్‌బిఐ ఖరారు చేసిన అంకెల ప్రకారం మోడీ పాలన తొలి ఏడాదే అప్పు 446.2 బిలియన్‌ డాలర్ల నుంచి 474.7 బిలియన్‌ డాలర్లకు ఎలా పెరిగిందో చెబుతారా ? రాజు కంటే మొండి వాడు బలవంతుడు అన్నట్లుగా అడ్డగోలు వాదనలు చేసే వారిని ఎవరేమీ చేయలేరు.

Image result for india’s external debt, modi

రిజర్వుబ్యాంకు అంకెల ప్రకారం 2006-14(మార్చి31) మధ్యకాలంలో మన విదేశీ అప్పు సగటున జడిపిలో 17.5 శాతం వుంది. అదే మోడీ నాలుగేండ్లపాలనలో 21.95 శాతం వుంది. ఇదే సమయంలో విదేశీ అప్పులపై మనం చెల్లించిన వడ్డీ యుపిఏ ఎనిమిదేండ్ల సగటు 5.23 శాతం కాగా మోడీ పాలనలో అది 8.05 వుంది, మొత్తం రుణాలలో రాయితీలతో కూడినవాటి శాతం తొమ్మిదేండ్ల యుపిఏ కాలంలో 17.36 శాతం కాగా మోడీ ఏలుబడిలో 9.07 శాతానికి పడిపోయాయి. ఇన్ని చేదు నిజాలను రిజర్వుబ్యాంకు మనకు అందిస్తుంటే గతంలో చేసిన అప్పులతో పోలిస్తే మోడీ కాలంలో పెరుగుదల శాతం తక్కువగా వుంది కనుక ఈ మంచిని విమర్శకులు చూడటం లేదనే వాదనను ముందుకు తెస్తున్నారు. ఇక్కడ చూడాల్సింది మొత్తంగా ఫలితం, పర్యవసానాలు ఏమిటి అన్నది. వాటిని చూసినపుడు మోడీని అభినందించాల్సిందేమీ కనిపించటం లేదు.

మన విదేశీ అప్పులలో ప్రభుత్వం చేసేవి, ఇతర వాణిజ్య రుణాలు, ప్రవాస భారతీయుల లేదా విదేశీయుల డిపాజిట్లన్నీ కలిసే వుంటాయి. రిజర్వుబ్యాంకు అందచేసిన వివరాల ప్రకారం ప్రభుత్వ అప్పుల తీరుతెన్నులు చూద్దాం. 2014-16 మధ్య మన ప్రభుత్వ అప్పు 83.7 నుంచి 93.4 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.అది 2018 నాటికి 111.9 బిలియన్లకు చేరింది. అంటే నాలుగేండ్లలో మోడీ సర్కార్‌ చేసిన అప్పు 83.7 నుంచి 111.9 బిలియన్‌ డాలర్లకు చేరింది. మొత్తం పెరిగినా అది జిడిపితో పోలిస్తే శాతాల రూపంలో తగ్గింది. ఇది ఒక్క ప్రభుత్వ రుణాలకే కాదు, ప్రయివేటు రుణాలకూ వర్తిస్తుంది. మన విదేశీ అప్పు పెరుగుదల తగ్గుదలలో రూపాయి విలువ ప్రమేయం కూడా వుంటోంది. రూపాయి విలువ తగ్గితే కొత్త అప్పులు తీసుకోకపోయినా మన అప్పు కొండలా పెరిగిపోతుంది.

మన విదేశీ అప్పులో 2007లో ప్రవాస భారతీయుల డిపాజిట్లు, వాణిజ్య రుణాలు దాదాపు సమంగా వున్నాయి. ఆ ఏడాది మొత్తం అప్పు 172 బిలియన్‌ డాలర్లయితే 41 చొప్పున డిపాజిట్లు, వాణిజ్య రుణాలు వున్నాయి. 2018 నాటికి అవి 126-189 బిలియన్‌ డాలర్లుగా మారిపోయాయి. మన విదేశీ రుణాలలో అత్యధిక భాగం డాలర్‌లో ముడి పెట్టి వున్నాయి. రూపాయి విలువ పెరిగితే మనకు లాభం తగ్గితే అదనపు భారం అవుతుంది. యుపిఏ పాలన అయినా నరేంద్రమోడీ ఏలుబడి అయినా మన రూపాయి విలువ తగ్గటం తప్ప పెరగటం లేదు. ఫలితంగా మనకు తెలియకుండానే విదేశీ అప్పులకు ఎక్కువ మొత్తాలను చెల్లిస్తున్నాము. మన అప్పులో (2017 డిసెంబరునాటికి) 78.8శాతం ప్రభుత్వేతర ప్రయివేటు కంపెనీల రుణాలే వున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇంత వరకు మన రూపాయి విలువ ఏడుశాతం పతనమైంది. ఈ మేరకు ప్రభుత్వమైనా, ప్రయివేటు సంస్దలైనా డాలర్‌ చెల్లింపులకు అమేరకు అదనంగా రూపాయలు చెల్లించి డాలర్లను కొనుగోలు చేయాల్సిందే. చమురు ధరలు పెరుగుతున్న కారణంగా చెల్లింపులకు అదనపు డాలర్లు అవసరమయ్యాయి. దీంతో డాలర్లకు డిమాండ్‌ పెరిగంది. రూపాయి విలువ తగ్గింది. రూపాయి విలువ పతనం గాకుండా కాపాడాల్సిన బాధ్యత దాని నిర్వహణ చూస్తున్న కేంద్ర ప్రభుత్వానిది, దాని నేత నరేంద్రమోడీదే. ఆయన భక్తులు చెబుతున్నట్లు అప్పులు తక్కువగా చేసినందుకు మోడీ ఖాతాలో ఎన్ని అభినందనలు వేస్తే రూపాయి విలువ పతనం కారణంగా అదే మోడీ ఖాతాలో అక్షింతలు కూడా వేస్తే రెండూ సమానం అవుతున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను పెంచగానే మన దేశం నుంచి డాలర్ల ప్రవాహం అటు తిరిగింది. దాంతో మన రూపాయి పతనానికి అదొక కారణమైంది. ఇప్పటికే ఈ ఏడాది రెండుసార్లు వడ్డీ రేట్లు పెంచిన అమెరికా ఈ ఏడాది ఆఖరికి మరో రెండుసార్లు పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మన రూపాయి మరింత పతనం అయ్యే ముప్పు వుంది. ఈ ముప్పును తప్పించేందుకు మన రిజర్వు బ్యాంకు ఇప్పటికే ఒకసారి వడ్డీరేట్లను పెంచింది. ఇది మన దేశం నుంచి డాలర్లు తరలిపోకుండా చేసేందుకు తీసుకున్న చర్య. వడ్డీ రేట్లను ఇంకా తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్న వాణిజ్య, పారిశ్రామికవర్గాలకు ఇది ఎదురుదెబ్బ. మొత్తం జనం మీద అదనపు భారాలకు కారణం అవుతుంది. ఈ పరిస్ధితిని నివారించేందుకు మోడీ దగ్గర వున్న మంత్రదండాన్ని బయటకు తీయమని ఆయన భక్తులు డిమాండ్‌ చేయాలి తప్ప విమర్శకుల మీద ఎదురు దాడి చేస్తే ప్రయోజనం ఏముంది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d