• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Readers News Service

జగన్‌ సర్కార్‌ బడ్జెట్‌లో కొత్త దనం ఏమిటి !

14 Sunday Jul 2019

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, Economics, Farmers, Health, History, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Andhra Pradesh Budget 2019-20, Y S Jagan Govt 1st Budget

Image result for What is new in YS Jagan first Budget

ఎం కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ తన తొలి బడ్జెట్‌లో ఎన్నో విన్యాసాలు ప్రదర్శించారు. పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు, ఓట్ల యాత్రల సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన వాగ్దానాలు, విసిరిన వాగ్బాణాలకు అనుగుణ్యంగానే ఈ బడ్జెట్‌ను రూపొందించారు. అధికారానికి వచ్చిన రెండో నెల్లోనే బడ్జెట్‌ పెట్టాల్సి రావటం కసరత్తు చేసేందుకు తగిన సమయం లేదని చెప్పుకొనేందుకు, ఎవరైనా నిజమే కదా అనేందుకు ఆస్కారం వుంటుంది. దానిలో కొంత వాస్తవం కూడా లేకపోలేదు. బడ్జెట్‌ కొత్త మంత్రులకు హడావుడి తప్ప నిరంతరం కొనసాగే అధికార యంత్రాంగానికి రోజువారీ వ్యవహారమే. అందునా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌కు ముందుకు గానే ఏర్పాట్లు చేశారు కనుక, నూతన పాలకుల ఆకాంక్షలకు అనుగుణంగా కొన్ని శాఖల, పధకాలకు కోత, వాత, కొన్నింటికి మోత అన్నట్లుగా సవరణలు చేయటం తప్ప పెద్దగా ఇబ్బంది వుండదు. ఫిబ్రవరి మాసంలో నాటి ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు రెండు లక్షల 26వేల కోట్లతో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ప్రతిపాదిస్తే, రాజేంద్రనాధ్‌ రెండు లక్షల 27వేల కోట్లతో ప్రపతిపాదించారు.

అడుక్కొనే దగ్గర పిసినారి తనం ఎందుకన్నది పెద్దల మందలింపు వంటి సలహా. బడ్జెట్‌లో విషయంలో కూడా పాలకులు దీన్నే ప్రదర్శిస్తూ భారీగా ప్రతిపాదనలు చేస్తున్నారు. సంక్షేమ పధకాల అమలు విషయంలో ఎవరికీ పేచీ లేదు గానీ అవే సర్వస్వం, జిందా తిలిస్మాత్‌ (సర్వరోగ నివారిణి అన్నది దాని తయారీదార్ల ప్రచార నినాదం) అంటే కుదరదు. అవి సంక్షోభం లేదా సమస్యల్లో వున్న జనానికి పూత మందు వంటి వుపశమన చర్యలు మాత్రమే అన్నది ముందుగా చెప్పకతప్పదు. జగన్‌ సర్కార్‌ కూడా పిసినారితనం ప్రదర్శించలేదు. బడ్జెట్‌ అంటే అంకెల గజిబిజి కనుక సమీప అంకెల్లోకి మార్చి చెప్పుకుందాం. ప్రతిపాదించిన రెండులక్షల 27వేల కోట్లలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా, గ్రాంటులు, రాష్ట్రం తీసుకొనే అప్పులు అన్నీ కలసి వుంటాయి. బడ్జెట్లో చూపిన అంకెలను చూసి ఎవరైనా చూశారా మా జగన్‌ తడాఖా అని ఛాతీ విరుచుకున్నారో తెలుగుదేశం కార్యకర్తలకు జరిగిన పరాభవమే పునరావృతం అవుతుంది.

మార్చినెలతో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో చంద్రబాబు సర్కార్‌ లక్షా 91వేల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించి ఏడాది చివరికి వచ్చేసరికి లక్షా 62వేల కోట్లకు కుదించింది. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం దాన్నే రెండులక్షల 27వేల కోట్లకు పెంచి చూశారా చంద్రబాబు కంటే తాము 19శాతం బడ్జెట్‌ పెంచాము అని గొప్పలు చెప్పుకొంటోంది. ఆచరణలో ఏం జరుగుతుందన్నది ముఖ్యం. గతేడాది తెలుగుదేశం సర్కార్‌ అప్పుల ఆదాయం మినహా మిగిలిన మొత్తం ఆదాయంలో కేంద్రం నుంచి వచ్చే గ్రాంటుల మొత్తం 50,695 కోట్లుగా చూపితే సవరించిన దాని ప్రకారం వచ్చిన మొత్తం 19,456 కోట్లు మాత్రమే. జగన్‌ సర్కార్‌ వస్తుందని చూపిన మొత్తం 61,071 కోట్లు. గత ఏడాది ఆశించిన మేర రాని కారణంగానే లక్షా 55వేల 507 కోట్ల అంచనాను లక్షా 14వేల 684 కోట్లకు తగ్గించారు. అయినా రాజేంద్రనాధ్‌ వర్తమాన సంవత్సరంలో లక్షా 78వేల 697 కోట్లను చూపారు. రాకపోతే చంద్రబాబు నాయుడి సర్కార్‌ మాదిరే కోత పెట్టటం తప్ప మరొక మార్గం లేదు. తెలుగుదేశం సర్కార్‌ గతేడాది 33,461 కోట్ల రూపాయలను అప్పులు తేవాలని లక్ష్యంగా పెట్టి 38,245 కోట్లకు పెంచింది. ఇప్పుడు జగన్‌ ఆ మొత్తాన్ని 47వేల కోట్లకు పెంచనున్నట్లు ప్రతిపాదించారు.

ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాల్సి వుంది. బడ్జెట్‌కు ముందుగా ఆర్ధికశాఖ ఒక శ్వేత పత్రాన్ని వెల్లడించింది. ఇదే ఆర్ధిక శాఖ ఎన్నికలకు ముందు కూడా శ్వేతపత్రాన్ని ప్రకటించింది. ప్రభుత్వాలు మారగానే వాటిలోని పదజాలం వ్యాఖ్యానాలు కూడా మారిపోయాయి. ఆర్ధిక శాఖ లేదా ప్రభుత్వం ప్రకటించే పత్రాలు వాస్తవ అంకెలను జనం ముందుంచి వారి విచక్షణ, వ్యాఖ్యానాలకు వదలి వేయాలి తప్ప రాజకీయ వ్యాఖ్యానాలను చొప్పించినపుడు వాటి విశ్వసనీయతే ప్రమాదంలో పడుతుంది. వెంటనే వాటి మీద తలెత్తే ప్రశ్నలకు జవాబు చెప్పుకోవాల్సి వుంటుంది. గత ఐదు సంవత్సరాలలో పాలన, ఆర్ధిక యాజమాన్యంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, మానవ, భౌతిక పెట్టుబడులపై పూర్తి నిర్లక్ష్యం, దానికి అవినీతి తోడై చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా రాష్ట్రాన్ని చీకటి యుగంలోకి నెట్టారని (జగన్‌ సర్కార్‌ ఆర్ధిక శాఖ శ్వేత పత్రం-పేరా 8) వ్యాఖ్యానించారు. సహజవనరులను ప్రయివేటు వారు లబ్దిపొందే విధంగా ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారని, నీకిది నాకది అనే పద్దతుల్లో ప్రభుత్వ సంస్ధలను ప్రయివేటీకరించారని దానిలో పేర్కొన్నారు. ఈ విమర్శను తెలుగుదేశం అంగీకరించకపోవచ్చుగానీ మిగతా పార్టీలు, నిష్పాక్షికంగా చూసే వారికి ఎలాంటి అభ్యంతరమూ వుండదు. ఇక్కడ సమస్య జగన్‌ సర్కార్‌ దీన్నుంచి తీసుకున్న గుణపాఠాలు ఏమిటి? వాటిని సరిదిద్దేందుకు అనుసరించే వారి విధానం ఏమిటన్నదే అసలు ప్రశ్న. సహజవనరులను ప్రయివేటు వారి దోపిడికీ వదలి వేయకుండా తీసుకున్న లేదా తీసుకోబోయే చర్యలేమిటి? ప్రయివేటీకరణ మీద నూతన ప్రభుత్వ విధానం ఏమిటి అన్నదానికి ఆర్ధిక మంత్రి ప్రసంగంలో ఎక్కడా సమాధానం కనపడదు.

రెవెన్యూ ఖర్చు మీద గత ప్రభుత్వానికి అదుపు లేదని, అది విపరీతంగా పెరిగిపోయిందని,సమర్దవంతంగా నిర్వహించలేదని శ్వేత పత్రంలో పేర్కొన్నారు. పద్నాలుగవ ఆర్ధిక సంఘం నిర్ణయాల మేరకు రెవెన్యూ లోటు గ్రాంట్లను తీసుకుంటూనే రెవెన్యూ ఖాతా ఖర్చుకు గాను ప్రభుత్వం అప్పులు చేసిందని, మూలధన పెట్టుబడి ఖాతాకు అన్నింటికీ మించి మానవ వనరుల అభివృద్ధికి నిధులను గణనీయంగా తగ్గించటంతో విద్య, ఆరోగ్యం, పౌష్టికాహార సేవలు దిగజారి పోయినట్లు పేర్కొన్నారు. తాజా బడ్జెట్‌లో అందుకు భిన్నమైన విధానం అనుసరించారా అని చూస్తే అలాంటిదేమీ కనపడదు. ఆరోగ్యశ్రీకి నిధులు కేటాయించటం అంటే రాష్ట్ర ప్రజల ఆరోగ్య మెరుగుదలకు తోడ్పడుతుందని అనుకుంటే పొరపాటు. ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన మౌలిక సౌకర్యాలు, సిబ్బందిని సమకూర్చితే మొత్తంగా జనానికి చౌకగా వైద్యం అందుతుంది, కార్పొరేట్‌ ఆసుపత్రుల దోపిడీ నివారణ అవుతుంది. విద్యారంగంలో ప్రయివేటు సంస్ధలు ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్‌, లేదా ఇతర సంస్దలేవీ ప్రమాణాలను పెంచటం లేదని అనేక సర్వేలు వెల్లడించాయి.చేరే వారు లేక ఇంజనీరింగ్‌ కాలేజీలు మూతపడుతున్నాయి. అందువలన ప్రభుత్వం సర్కారీ బడులను అభివృద్ధి చేయకుండా అమ్మ వడి పేరుతో డబ్బు ఖర్చు చేస్తే ప్రయివేటు, కార్పొరేట్‌ సంస్ధలకే తిరిగి ప్రయోజనం జరుగుతుంది.

చంద్రబాబు సర్కార్‌ 2017ా18లో మూలధన పెట్టుబడి ఖాతాలో మొత్తం రూ.13,490 కోట్లు ఖర్చు చేసింది. గతేడాది 28,678 కోట్లు ప్రతిపాదించి, 20,398 కోట్లకు సవరించింది. ఇప్పుడు జగన్‌ సర్కార్‌ 32,293 కోట్లను ప్రతిపాదించింది.ఎంత ఖర్చు చేస్తారో తెలియదు. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని చూస్తే స్వల్ప పెంపుదల తప్ప చంద్రబాబుకుాజగన్‌కు పెద్ద తేడాలేదని అంకెలు చెబుతున్నాయి. దీనిలో కీలకమైన సాగునీటి రంగానికి గతేడాది బడ్జెట్‌లో 15,915 కోట్లు కేటాయించి 13,385 కోట్లకు సవరిస్తే, ఈ మొత్తం కూడా లేకుండా జగన్‌ 11,981 కోట్లు మాత్రమే ప్రతిపాదించటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. వ్యవసాయ ప్రధాన రాష్ట్రంగా మారటం, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో వున్న పూర్వరంగంలో దానికి జీవ ధార అయిన నీటి పారుదల రంగానికి కేటాయింపులు పెంచకుండా పోలవరం లేదా నిర్మాణంలో వున్న ఇతర సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తయి రైతులకు ఎలా వుపయోగపడతాయో తెలియదు. ఇదిలా వుంటే భారీ ఖర్చుతో తెలంగాణా గడ్డ మీద నుంచి శ్రీశైలానికి గోదావరి నీటిని తరలించే ఎత్తి పోతల పధకాల గురించి జగన్‌ సర్కార్‌ ఆలోచన చేయటం మరింత విడ్డూరంగా వుంది. మరోవైపు ఈ ప్రతిపాదనల మీద భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ వాటాగా వచ్చిన అప్పు 97వేల కోట్ల రూపాయలు. గత ఐదేండ్లలోఅది 2018ా19 నాటికి రెండులక్షల 59వేల కోట్ల రూపాయలకు చేరింది. ఇవి గాక రాష్ట్ర ప్రభుత్వశాఖలు తీసుకున్న మరో 57వేల కోట్ల రూపాయల అప్పులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే మొత్తం అప్పు మూడు లక్షల 20వేల కోట్లకు చేరింది. సర్కార్‌ అప్పుమీద వడ్డీ ఇరవైవేల కోట్లు, అసలు తీర్చేందుకు మరో ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. ఈ ఏడాది జగన్‌ సర్కార్‌ తీసుకోదలచినట్లు ప్రతిపాదించిన రుణం 47వేల కోట్ల రూపాయలు. ప్రభుత్వం తీసుకున్న అప్పు మొత్తాన్ని మూలధన పెట్టుబడులకు ఖర్చు చేసి వుంటే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ రూపురేఖలే మారిపోయి వుండేవని, మౌలిక వసతులు, నైపుణ్య శిక్షణ అభివృద్ధి చెందితే రాష్ట్రం పారిశ్రామిక, సేవారంగాల ఆధారిత రాష్ట్రంగా మారిపోయి వుండేదని తద్వారా ఆదాయ పెంపు సామర్ధ్యం పెరిగి వుండేదని శ్వేత పత్రం పేర్కొన్నది. దానికి అనుగుణమైన కేటాయింపులు బడ్జెట్లో కనిపించటం లేదు.

Image result for What is new in YS Jagan first Budget

బాబస్తే జాబస్తుందని ప్రచారం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం 2017-18లో పారిశ్రామిక రంగంలో మూలధన పెట్టుబడి ఖర్చు వంద కోట్ల రూపాయలు(బడ్జెట్‌ పత్రాల్లో అంకెల ప్రకారం). ఈ మొత్తాన్ని గతేడాది బడ్జెట్లో 1464 కోట్లుగా ప్రతిపాదించి 653 కోట్లకు సవరించారు. జగన్‌ సర్కార్‌ 1116 కోట్లుగా ప్రకటించింది. దీని భావమేమి తిరుమలేశా ! కడప వుక్కు కర్మాగారం గురించి ప్రస్తావన స్వల్ప నామ మాత్ర కేటాయింపు చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు అంటే అదొక్కటే కాదు.1991నుంచి ప్రారంభమైన నూతన ఆర్ధిక విధానాల్లో భాగంగా ప్రభుత్వాలు పరిశ్రమల స్ధాపన బాధ్యతను విస్మరించాయి. ఆ తరువాత ఎక్కడైనా ఒకటీ అరాచోట రక్షణ రంగ పరిశ్రమలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది తప్ప ఇతరంగా ఏవీ రాలేదు. ప్రభుత్వరంగ పరిశ్రమలను వదిలించుకొనేందుకు తెగనమ్మటమే విధానంగా ముందుకు వచ్చింది. జగన్‌ సర్కార్‌ బడ్జెట్‌ కూడా దాని కొనసాగింపుగానే వుంది తప్ప మరొకటి కాదు.ప్రతి ఏటా వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు నిధులు కేటాయించి కొనుగోలు చేసిన వారికి రాయితీలు ఇస్తున్నారు. దాని వలన వ్యవసాయ కార్మికులకు వుపాధి పోతోంది. వారికి ప్రత్యామ్నాయం పారిశ్రామిక రంగం తప్ప మరొకటి కాదు. మానవ శ్రమ పాత్రను తగ్గించేలా పాత పరిశ్రమలను నవీకరిస్తున్నారు, కొత్త పరిశ్రమల్లో అసలు ప్రారంభం నుంచి అదే పరిస్ధితి. అందుకే అభివృద్ధి అంకెలను వెల్లడిస్తున్నా దానికి తగిన విధంగా వుపాధి పెంపొందటం లేదు. వుపాధి రహిత అభివృద్ధి దశలోకి మన దేశం రోజురోజుకూ వేగంగా మారిపోతున్నది. ఆంధ్రప్రదేశ్‌ దానికి మినహాయింపుగా వుండజాలదు. రెండవది ప్రయివేటు రంగంలోని ఐటి సంస్ధలు ఇప్పటికే కేంద్రీకృతం అయిన నగరాల్లో తప్ప మిగతా చోట్లకు రావని గత ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్‌ అనుభవం తెలిపింది.

రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులు గణనీయంగా వున్నారు. కార్మికులు, వ్యవసాయ కార్మికులు, ఇతర చేతి వృత్తి దారుల ఆదాయాలు గణనీయంగా పెరగకుండా రాష్ట్రంలో వస్తు వినియోగం పెరగదు. అది లేకుండా పరిశ్రమలు, వ్యాపారాలు వృద్ధి కావు, ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరగదు. అసంఘటిత రంగ కార్మికులకు పదేండ్లు, అంతకు ముందు నిర్ణయించిన వేతనాలే ఇప్పటికీ అమలు జరుగుతున్నాయి. ప్రభుత్వ వుద్యోగులకు తాత్కాలిక భృతి ప్రకటించాల్సిందే, వేతన సవరణ జరగాల్సిందే. అసంఘటిత రంగ కార్మికుల, చిరుద్యోగుల సంగతేమిటి? బడ్జెట్‌ వుపన్యాసంలో అ సలు ఈ ప్రస్తావనే లేదు. జగన్‌ పర్యటనల్లో ఎవరూ వీటి గురించి అడగలేదు అనుకోవాలా ? ఈ పూర్వరంగంలో వివిధ తరగతుల ఆదాయాలను పెంచేందుకు,నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు జగన్‌ సర్కార్‌ నవరత్నాల పరిధి దాటి ఆలోచించటమే కొత్తదనం అవుతుంది. ఈ బడ్జెట్‌లో అదేమీ లేదు. అసెంబ్లీ చర్చలో అయినా ఇలాంటి లోపాలను సవరిస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

వంచన, వాస్తవ దూరంగా కేంద్ర బడ్జెట్‌ !

13 Saturday Jul 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

5 Trillion Dollar Economy, India budget 2019-20, Nirmala Sitharaman

Image result for india budget 2019-20, nirmala

ఎం కోటేశ్వరరావు

2019-20 సంవత్సర పూర్తి బడ్జెట్‌ను జూలై ఐదున నూతన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు.ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయాన్ని సంఘపరివార్‌కు చెందిన వారు కుహనా మేథావుల కేంద్రంగా వర్ణిస్తారు. అయితే వారి అదృష్టమో దురదృష్టమోగానీ అదే విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తీరుకు మొత్తంగా మీడియా ప్రశంసలు కురింపించింది. అఫ్‌ కోర్స్‌ అది కార్పొరేట్లకు, ప్రయివేటీకరణకు పెద్ద పీట వేసినందువలన కూడా కావచ్చు. ఒక వ్యక్తి హావభావాలు, ప్రవర్తన తీరుతెన్నులు వ్యక్తిగతమైనవి తప్ప వేరు కాదు. సదరు వ్యక్తులు ఏ భావాలకు, విధానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, వాటి పర్యవసానాలు,ఫలాలు ఏమిటన్నదే సమాజం చూస్తుంది. అందువలన నిర్మలా సీతారామన్‌ ఒక ప్రభుత్వ ప్రతినిధిగా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు గనుక దానిలోని అంశాలపై విమర్శలు లేదా ప్రశంసలను వ్యక్తిగతంగా తీసుకోనవసరం లేదు.

ఐదేండ్ల క్రితం నాటి అర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు, నిర్మల బడ్జెట్‌కు సామ్యాలను చూపుతూ ఎన్ని నిమిషాలు, ఎన్నిపదాలు, ఏ అంశానికి ఎంత సమయం కేటాయించారు అనే పద్దతుల్లో విశ్లేషించిన వారు కూడా లేకపోలేదు.ఆ రీత్యా చూసినపుడు 16,489 పదాలను జైట్లీ రెండు గంటల ఏడు నిమిషాల 42 సెకండ్లలో పూర్తి చేస్తే నిర్మల 20,223 పదాలను రెండు గంటల తొమ్మిది నిమిషాల 13 సెకండ్లలోనే ముగించారంటే వాగ్ధాటితో తక్కువ సమయంలో ఎక్కువ పదాలను కుమ్మరించారన్నది స్పష్టం. బడ్జెట్‌ తీరు తెన్నులను చూసే ముందు నాలుగవ తేదీన ప్రవేశపెట్టిన ఆర్ధిక సర్వేను కూడా కలిపి విశ్లేషించటం సముచితంగా వుంటుంది.

గతానికి చెందిన అంకెల వివరాలు ఇచ్చినప్పటికీ వాటికి చెప్పే భాష్యం, వుగాది పంచాంగంలా ఆశాభావం వెలిబుచ్చే నివేదికలుగానే మన అర్ధిక సర్వేలు వుంటున్నాయి. బడ్జెట్‌ కూడా అంతే. భవిష్యత్‌ మాసాల్లో సంభవించే పరిణామాల మీద అంచనాల ప్రాతిపదికగానే బడ్జెట్‌ కేటాయింపుల ప్రతిపాదనలు వుంటాయి. అంచనాలు తప్పితే కోతలతో సవరణలను ఆమోదించటం మనం చూస్తున్నాం. ఏ పార్టీ ప్రభుత్వం వున్నా అదే చేస్తుంది. ఏడాదిన్నర క్రితం పార్లమెంటుకు సమర్పించిన సర్వే 2018-19లో వ ద్ధిరేటు ఏడునుంచి ఏడున్నర శాతందాకా ఉండనుందన్నా, వాస్తవంలో అది 6.8శాతానికే పరిమితమైంది. కాగా వర్తమాన సంవత్సరంలో ఏడు శాతం ఆశాభావం, అంచనా మాత్రమే. ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల కోట్ల డాలర్లకు ఆర్ధిక వ్యవస్ధను పెంచుతామని అందుకుగాను ప్రతి ఏటా కనీసం ఎనిమిది శాతం అభివృద్ది వుండాలని చెప్పిన వారు. ఆదిలోనే హంసపాదు అన్నట్లు అంచనాలోనే ఒకశాతాన్ని తగ్గించారు. అలాంటపుడు ఆశించిన లక్ష్యాన్ని ఎలా సాధిస్తారు ?

Image result for india budget 2019-20, nirmala

అంకెల్లోకి పోతే ఒక పట్టాన తేలే అవకాశం వుండదు. వాటిని ఎలాగైనా వినియోగించవచ్చు, భాష్యం చెప్పవచ్చు. అందువలన ఎవరి భాష్యం వాస్తవాలకు దగ్గరగా వుందన్నది జనం నిర్ణయించుకోవాల్సిందే.ఆర్ధిక సర్వే, బడ్జెట్‌ వుపన్యాసం రెండింటిలోనూ 2024-25 నాటికి అంటే ఐదు సంవత్సరాలలో మన ఆర్ధిక వ్యవస్ధను ఐదులక్షలకోట్ల డాలర్లకు పెంచాలన్నది లక్ష్యంగా చెప్పారు. తప్పులేదు, అందుకు గాను ఏటా 8శాతం అభివృద్ధి రేటు వుండాలని చెప్పారు. ప్రస్తుతం ఆర్ధిక మంత్రి చెప్పినదాని ప్రకారం మన జిడిపి 2.7లక్షల కోట్ల డాలర్లు వుంది.ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా ప్రభుత్వాలు, మంత్రులూ తమ పబ్బంతాము గడుపుకొని ఓట్లు కొల్లగొట్టేందుకు జిమ్మిక్కులు చేస్తున్నారు. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇనిస్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసిన దీపాంకర్‌ దాసుగుప్తా చెబుతున్న లెక్కల ప్రకారం ఐదు లక్షల కోట్ల డాలర్లకు జిడిపి పెరగాలంటే 2018-19 రేట్ల ప్రకారం ఐదేండ్లలో ఎనిమిది శాతం వృద్ధి రేటు బదులు 13శాతం వుంటేనే సాధ్యం అంటున్నారు. అదే 2011-12 ధరల ప్రకారం అయితే 19శాతం వంతున పెరిగితే నాలుగేండ్లలోనే ఆ లక్ష్యాన్ని సాధించవచ్చని, అదే ఎనిమిదిశాతం చొప్పున అయితే 2030-31వరకు ఆగాల్సి వుంటుందని పేర్కొన్నారు.

ప్రస్తుత మన పాలకులు చెబుతున్న లక్ష్యం సాధించటం గురించి ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేస్తే అసలు నీవు దేశభక్తుడవేనా అని ప్రశ్నిస్తారు. మన గురించి ఐఎంఎఫ్‌ ఏమి చెప్పిందో ఒకసారి చూద్దాం.2020 నుంచి 2024 సంవత్సరాలలో సగటున 7.59శాతం అభివృద్ధి రేటుతో మన జిడిపి 2.97లక్షల కోట్ల డాలర్ల నుంచి 4.30లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ఈ ఏడాది మార్చినెలతో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో మన అభివృద్ధి రేటు 6.8శాతమే. అది ఈ ఏడాది ఏడుశాతంగా వుంటుందని అంచనా వేస్తున్నారు. అలాంటపుడు ఎనిమిదిశాతం వుంటే గింటే ఐదులక్షల కోట్ల డాలర్లకు చేరతామని చెప్పటం ఏమిటి? అదేమన్నా ప్రామాణిక సంఖ్యా? అంతకు మించి సాధిస్తే జనం వద్దంటారా ? లేకపోతే మరేదైనా చేస్తారా ? ఐదు సంవత్సరాల క్రితం అచ్చేదిన్‌(మంచి రోజులను) తెస్తామని, గుజరాత్‌ అభివృద్ధి నమూనాను దేశమంతటికీ విస్తరిస్తామని, 2022నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని చెప్పినట్లుగానే మైండ్‌ గేమ్‌లో ఇదొక భాగం అనుకోవాలి.

ఆర్ధిక సర్వే రచయితలు అభివృద్ధి గురించి పలుసార్లు చైనాను వుదహరించారు. బ్రిటీష్‌ వారి ఆలోచనా ధోరణి నుంచి బయటపడాలని చెప్పారు. చైనా మాదిరి పురోగమించాలని కోరుకోవటం తప్పుకాదు. బ్రిటీష్‌ వారి నమూనా వారి దేశాన్నే ఇబ్బందుల్లోకి నెట్టింది గనుక మనకు వాంఛనీయమూ కాదు. ఇక్కడ కొన్ని విషయాలను మనం గమనంలో వుంచుకోవాలి. ఈ రోజు ప్రపంచంలో ఎలాంటి పెద్ద సంక్షోభాలు లేకుండా అభివృద్ధి చెందుతున్న దేశం ఏదైనా వుంటే అది చైనా ఒక్కటే. కొంత మంది విమర్శకులు అక్కడ కమ్యూనిస్టు పార్టీ పేరుతో పెట్టుబడిదారీ విధానాన్ని అమలు జరుపుతున్నారని ఆరోపిస్తారు. వారు చెప్పిందాన్ని కాసేపు అంగీకరిద్దాం.చైనా సంస్కరణలకు నాలుగు పదులు నిండాయి. ఈ కాలంలో అమెరికాతో సహా ధనిక దేశాలన్నీ ప్రతి పది సంవత్సరాలకు ఏదో ఒక ఆర్ధిక సంక్షోభం, మాంద్యం వంటి తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నాయి. ధనిక దేశాల్లో 2008లో ప్రారంభమైన సంక్షోభం పరిష్కారం గాకపోగా త్వరలో మరో సంక్షోభానికి తెరలేవనుందనే వార్తలు, హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఆ సంక్షోభ ప్రభావం మనమీద కూడా పడుతోంది. చైనా ఎన్నడూ ధనిక దేశాల మాదిరి సంక్షోభాలను ఎదుర్కొన్నదా అంటే లేదు. అభివృద్ధి రేటులో స్వల్పతగ్గుదల వుండవచ్చు గానీ ఇతర దేశాల మాదిరి నామ మాత్రం లేదా తిరోగమన దారి పట్టలేదు కదా ? ఎందుకనో ఎప్పుడైనా మనం ఆలోచించామా ?

మన దేశంలో కొంత మంది భలే చిత్రమైన వాదనలు చేస్తుంటారు, వాటిని నిజమని నమ్మేవారు కూడా లేకపోలేదు. వాటిలో కొన్ని పచ్చి అబద్దాలు కూడా వున్నాయి. వాటి తీరుతెన్నులు ఎలా వున్నాయో చూద్దాము. చైనా అభివృద్ధి చెందిన మాట నిజమేగానీ అది కమ్యూనిస్టు దేశమండీ, మనది ప్రజాస్వామ్యం, ఒక నిర్ణయం చేస్తే అక్కడ తప్పయినా ఒప్పయినా అమలు జరగాల్సిందే, మన దగ్గర అలా కాదు. చైనా భిన్నమైన దారుల్లో పయనిస్తున్నది, దాని తరువాత స్ధానం పొందేందుకు భారత్‌ ప్రయత్నించకూడదు, అది సాధ్యం కాదు.ఏక పార్టీ నిరంకుశ పాలనతో పాటు దశాబ్దాల తరబడి మౌలిక సంస్కరణల గురించి చేసిన ప్రచారంతో పాటు మెజారిటీగా వున్న హాన్‌ జాతీయులు, చైనా భాష మాట్లాడేవారిని సమీకరించారు. భారత్‌లో అటువంటి అవకాశం లేదు.బహుళపార్టీ వ్యవస్ధ వున్నది. సామాజిక పరంగా, భాషా పరంగా వందలాది మైనారిటీలను ఒక లక్ష్యం కోసం సమీకరించటం సాధ్యం కాదు. చైనాలో రైతులను భూముల నుంచి తరమివేశారు, మన దగ్గర అలా కుదరదు. నిరంకుశ పాలకులు వున్న అన్ని చోట్లా అభివృద్ధి జరుగుతుందని చెప్పలేము, క్యూబా, వుత్తర కొరియా, వెనెజులాల్లో వైఫల్యం చెందారు. మంచి నియంతలను కలిగి వుండటం చైనీయుల అదృష్టం. ఇంకా ఇలాంటి బుర్రతక్కువ ప్రచారాలు చాలా వున్నాయి. అలాంటపుడు మన అభివృద్ధి రేటు చైనా కంటే ఎక్కువ వుంది, త్వరలో మనం చైనాను అధిగమిస్తాము, ఎగుమతుల్లో చైనాతో పోటీపడతాము, దాన్ని వెనక్కు నెట్టి ముందుకు పోతాము అని చెప్పుకోవటం ఎందుకు అన్నది ప్రశ్న.

సోషలిస్టు, కమ్యూనిస్టు దేశాల్లో జనం ఆహారం తిని బతికితే ప్రజాస్వామ్య దేశాల్లో స్వేచ్చతో ప్రాణాలు నిలుపుకుంటారా? అక్కడ అభివృద్ధి చెందితే ఇక్కడ నిత్యదరిద్రంతో బతకాలా ? అసలు ఇలాంటి వాదనలు చేసే వారి సమస్య ఏమిటో మనకు అర్ధం కాదు. కమ్యూనిస్టులు ఏపనైనా మెడమీద కొడవలి, తలమీద సుత్తిపెట్టి చేస్తావా, చస్తావా అంటారన్నట్లుగా కొందరు చెబుతారు. పోనీ, మచ్చుకు అలా చేసి చైనాలో హెక్టారుకు1,751 కిలోల పత్తి పండిస్తే మనది ప్రజాస్వామ్యం గనుక 502కిలోలే పండిస్తారని అనుకుందాం. మరి బ్రెజిల్‌, టర్కీ, ఇజ్రాయెల్‌, ఆస్ట్రేలియా వంటి దేశాలన్నీ ప్రజాస్వామ్య వ్యవస్ధలున్నవేగా అక్కడ చైనా తరువాత అధికంగా 1,600-1700 కిలోల వరకు పండిస్తున్నారుగా దాన్నేమనాలి? పత్తి రైతులు మన దేశంలోనే ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలి? ఇలా ప్రశ్నించుకుంటూ పోతే గుడ్డి కమ్యూనిస్టు వ్యతిరేకత తప్ప సరైన సమాధానం వుండదు.

Image result for india budget 2019-20, nirmala

ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన దేశంలో భిన్న భాషలు, జాతులు, మతాలు, కులాలు, ఆచారాలు వున్న మాట నిజం. ఇలాంటి చోట హిందూత్వ పేరుతో మెజారిటీవాదాన్ని బలవంతంగా రుద్ద చూస్తున్నారు. ఇది జనాన్ని ఏకత్రాటి మీద నడిపించటానికి దోహదం చేస్తుందా ? ఫలానా వారి ఇంట్లో ఆవు మాంసం వుందనో, ఫలానా వారు ఆవులను వధించటానికే తరలిస్తున్నారనో సాకులు చూపి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని సామూహికంగా దాడులు, హత్యలు చేసే వారు గోరక్షకుల పేరుతో చలామణి అవుతున్నారు. వారికి పాలకపార్టీ అండదండలున్నాయి. ఒక్క వుదంతంలో కూడా ఇంతవరకు దుండగులకు శిక్షలు పడలేదు. అది అలా వుండగా కొత్తగా ఆకస్మికంగా కొందరు ప్రత్యక్షమై మైనారిటీ తరగతులకు చెందిన వారిని పట్టుకొని నీవు దొంగతనానికి వచ్చావు లేదా జైశ్రీరామ్‌ అంటావా లేదా అంటూ చావచితక కొట్టి పోతుంటే వారిని అడ్డుకొనే వారు లేరు. అలాంటి వారిని ఎవరైనా విమర్శిస్తే అదిగో చూడండి వీరు హిందూమతానికి, హిందూత్వకు వ్యతిరేకులు, మెజారిటీగా వున్న వారికి తమ దేవుడిని తలచుకొనే అవకాశం కూడా వుండకూడదా అంటూ విద్వేష ప్రచారాన్ని రెచ్చగొడుతున్న స్ధితిలో వారి ఏలుబడిలో చైనా మాదిరి దేశాన్ని అభివృద్ధి చేస్తామని ఎవరైనా చెబితే ఎలా నమ్మాలి?

ఏ దేశ పురోగమనానికైనా పరిశోధన, అభివృద్ధి కీలకం. వేల సంవత్సరాల నాడే మన వారు సముద్ర వాణిజ్యం చేశారని ఒకవైపు గొప్ప చెప్పుకుంటాం. మరోవైపు సముద్రం దాటి ప్రయాణిస్తే మ్లేచ్చులు అవుతారు, మైలపడతారు, ధర్మం చెడుతుంది, కులం నుంచి వెలి అంటూ గిరులు గీసి కూర్చోపెట్టిన కారణంగానే మనకు ఒక కొలంబస్‌ లేకుండా పోయాడు. మన పూర్వులు పెట్రోలు లేకుండానే విమానాలు నడిపారు, ఎందరు ఎక్కినా ఒకరికి ఖాళీ వుండేది, అసలు వేదాల్లోనే అన్నీ వున్నాయంటూ లొట్టలు వేసుకుంటూ గొప్పలు చెప్పుకోవటానికే మనకు సమయం చాల్లేదు. మిగతా దేశాల్లో ఇలాంటి పిచ్చి ముదరలేదు కనుకనే కొత్తవాటిని కనిపెట్టాలనే తపనతో ఎంతో ముందుకు పోయారు. దేశంలో జరిగిన ప్రతి అనర్ధానికి లేదా తమకు నచ్చని ప్రతి అంశానికి కారకుడు నెహ్రూ అంటూ బిజెపి నేతలు దాడిచేస్తుంటారు. వాదనకోసం సరే అందాం. గత ఐదు సంవత్సరాల్లో నరేంద్రమోడీ, అంతకు ముందు వాజ్‌పేయి పాలనా కాలంలో బిజెపి చేసిందేమిటి? చైనా గత కొద్ది సంవత్సరాలుగా పరిశోధన, అభివృద్ధికి తన జిడిపిలో రెండుశాతం మొత్తం ఖర్చు చేస్తున్నది. మనం 0.7శాతం దాటలేదు. ఐదు సంవత్సరాల క్రితం స్ధానికుల పేటెంట్‌ దరఖాస్తుల విషయంలో మనం 52వ స్ధానంలో వుంటే 2018లో అది 55కు దిగజారింది. ఇదే సమయంలో చైనా మూడు నుంచి ఒకటవ స్ధానానికి చేరుకుంది. ఆవు మూత్రంలో బంగారం వుందా, అవితాగితే కాన్సర్‌ నయమౌతుందా, ఆవు పేడలో ఏముంది, దాన్ని పూసుకుంటే సొగసుగా తయారవుతామా అనే దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. యధారాజా తధా పరిశోధకా అన్నట్లుగా తయారైంది పరిస్ధితి. కావాలంటే వేదాల్లో అన్నీ వున్నాయని చెప్పే సంస్కృత పండితులకు, అగ్రహారాలకు వాటి పరిశోధన అప్పగించి వాటిలో దాగి వున్నవాటిని వెలికి తీయమనండి. పైసా ఖర్చు కాదు. ఇప్పటికే ఐదేండ్ల కాలాన్ని వృధా చేశారు. దాని దారిన అది నడుస్తుంటే మిగతా అంశాల మీద ఇతరులను ప్రోత్సహించాలి, పోటీ పెట్టాలి తప్ప కాలు గడపదాట కుండా వేదకాలం గురించి చెప్పుకుంటే ప్రయోజనం ఏముంటుంది.

ఏ దేశంలోనూ ఇవ్వని విధంగా పరిశోధన పేరుతో చేసే ఖర్చులకు మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను మినహాయింపులు, ఇతర రాయితీలు ఇస్తున్నాయి. ప్రయివేటు సంస్ధలు ఆ రాయితీలను ఎలా స్వాహా చేయాలనే అంశం మీద పెడుతున్న శ్రద్ద పరిశోధన మీద లేదు. అందుకే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వుంది. దాంతో పన్ను మినహాయింపులను తగ్గించగానే ప్రయివేటు రంగం గగ్గోలు పెడుతోంది. మరో వైపున అన్ని బాధ్యతల నుంచీ తప్పుకుంటున్నట్లుగానే పరిశోధనా రంగం నుంచి కూడా ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయి.1996లో చైనా జిడిపిలో 0.56శాతం ఖర్చు చేయగా మన దేశం 0.63శాతం పెట్టింది. అదే 2015నాటికి చైనా 2.07శాతానికి పెంచగా మనది అదే 0.63దగ్గరే వుండిపోయింది.ఇదే కాలంలో ప్రపంచ సగటు 1.97 నుంచి 2.23శాతానికి పెరిగింది. మనం ప్రపంచ సగటుకు ఇంకా ఎంతో దూరంలో వున్నాం. ఇజ్రాయెల్‌ గరిష్టంగా 4.27శాతం ఖర్చు చేస్తోంది. పరిశోధనకు కూడా ప్రజాస్వామ్యమే అడ్డువస్తోందనుకోవాలా ? రాజకీయంగా ఎవరైనా అడ్డుపడుతున్నారా ?

Image result for india budget 2019-20, nirmala

దేశంలో పెట్టుబడుల విషయానికి వస్తే 2004జూన్‌ నుంచి 2019 మార్చి వరకు లభ్యమైన సమాచారం మేరకు జిడిపిలో ప్రతి మూడు మాసాల పెట్టుబడి సగటు 34.8శాతంగా వుంది. గరిష్టం 2011సెప్టెంబరులో 41.2శాతం కాగా కనిష్టం 2017 మార్చిలో 29.5శాతం వుంది. తాజా పరిస్ధితికి వస్తే గతేడాది చివరి మాసాల్లో 32.2శాతం వుండగా ఈ ఏడాది మార్చిలో 29.8శాతం వుంది. చైనాలో ఏడాదికి ఒకసారి వివరాలను వెల్లడిస్తారు. ఆ మేరకు 2018 డిసెంబరులో పెట్టుబడి జిడిపిలో 44.8శాతం వుంది. అంతకు ముందు ఏడాది 44.6 శాతం. 1952 డిసెంబరు నుంచి 2018 డిసెంబరు వరకు సగటు 36శాతం వుంది. 2011 డిసెంబరులో గరిష్టంగా 48 శాతం కాగా 1962లో కనిష్టంగా 15.1శాతం నమోదైంది.

నరేంద్రమోడీ 2.0 సర్కార్‌ ప్రయివేటు పెట్టుబడుల మీద పెద్ద ఎత్తున మరులుగొన్నట్లు కనిపిస్తోంది. మనదేశంలో ప్రయివేటు రంగ పెట్టుబడులు ప్రస్తుతం 14సంవత్సరాల కనిష్ట స్ధాయికి పడిపోయిన తరుణంలో వాటి గురించి జనానికి భ్రమలు కొల్పే విధంగా పారాయణం చేస్తున్నది. మంచి రోజులు తెస్తా మంచి రోజులు తెస్తా అని నరేంద్రమోడీ చెప్పటం తప్ప అలాంటి సూచనలు ఎండమావుల్లా కూడా కనిపించటం లేదు. 2018 డిసెంబరుతో ముగిసిన మూడు నెలల కాలంలో దేశంలో నూతన ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని చెప్పిన కంపెనీల విలువ లక్ష కోట్ల రూపాయలని సిఎంఐఇ(భారత ఆర్ధిక వ్యవస్ధ పర్యవేక్షణ కేంద్రం) పేర్కొన్నది. అయితే ఆ మొత్తం సెప్టెంబరుతో ముగిసిన మూడునెలలతో పోల్చితే 53శాతం, ఏడాదితో పోల్చితే 55శాతం తక్కువ అని తెలిపింది. ప్రయివేటు రంగం పధకాలు ఇదే కాలంలో 62,64శాతాల చొప్పున తగ్గాయి. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్ధల పధకాలు కూడా 37,41శాతాల చొప్పున పడిపోయాయి. ఇది 2004 తరువాత ఇది కనిష్టం. కొత్త పధకాలు రాకపోవటం ఒకటైతే అమల్లో వున్న ప్రాజెక్టులు నిలిచిపోవటం మరింత ఆందోళనకరం. మొత్తంగా 11శాతం వుంటే ప్రయివేటు రంగంలో ఇది 24శాతం వరకు వుంది. అనేక రాష్ట్రాలలో విద్యుత్‌ కోతలు ఎత్తివేత గురించి పాలకులు తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. విద్యుత్‌ వుత్పత్తి కేంద్రాల స్ధాపక సామర్ధ్యం పెరిగినంతగా విద్యుత్‌ వినియోగం పెరగకపోవటమే కొరతలేకపోవటానికి కారణం. ప్రయివేటీకరణలో భాగంగా విదేశాల నుంచి అప్పులు దొరుకుతున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లుగా తెచ్చి విద్యుత్‌ ప్రాజెక్టులు ప్రారంభించారు. నిలిచిపోయిన ప్రాజెక్టులలో 35.4శాతం విద్యుత్‌, 29.2శాతం వస్తూత్పత్తి రంగానికి చెందినవి. నిధులు, ఇంధనం, ముడిసరకుల కొరత, మార్కెట్‌ పరిస్ధితులు అనుకూలంగా లేకపోవటం దీనికి ప్రధాన కారణాలు. వీటిలో కూడా ఎక్కువ శాతం నిధుల కొరతే. ఇటువంటి స్ధితిలో ప్రయివేటు పెట్టుబడుల గురించి దేశ ప్రజల్లో ఆశలు రేపుతున్నారు. ఈ పేరుతో మరిన్ని ప్రజా, కార్మిక వ్యతిరేక సంస్కరణలను రుద్దే యత్నం తప్ప ఇది వేరు కాదు.

ఆశలు ఆకాశంలో ఎగురుతుంటే భూమ్మీద పరిస్ధితి ఎలా వుంది ? అన్నదాతలు సంక్షోభం ఎదుర్కొంటున్న వ్యవసాయ ప్రధాన దేశంలో రైతుల రాబడిని రెండింతలు చేసేందుకు 14.5శాతం మేర వ్యవసాయాభివ ద్ధి రేటు అవసరమని నిపుణులు చెబుతున్నారు. వానలు కురిసినప్పుడే రెండు శాతానికి పరిమితమైనప్పుడు, లోటు వర్షపాత సూచనలు కనిపిస్తున్న ఈ ఏడాది ఎలా పుంజుకోగలదో ఆర్థికవేత్తలే వివరించాలి! పెట్టుబడులు, పొదుపు, ఎగుమతులు, వ ద్ధి, ఉపాధి అవకాశాలు ఇతోధికమైతే భారత ఆర్థిక స్వస్థతకు తిరుగుండదని క ష్ణమూర్తి సుబ్రమణియన్‌ విరచిత సర్వే నమ్మకంగా చెబుతోంది. ప్రపంచ ధనిక దేశాలు వ ద్ధిపరమైన సవాళ్లను ఎదుర్కొంటుండగా, మరోవైపు వాణిజ్య యుద్ధమేఘాలు కలవరపరుస్తుండగా- మన వ ద్ధి ప్రస్థానం గతాన్ని అధిగమిస్తుందన్నది ప్రశ్న.

Image result for india budget 2019-20, nirmala

సోషలిస్టు చైనా గురించి ఇటీవలనే కొన్ని వార్తలు వచ్చాయి. అక్కడ కార్మికుల వేతనాలు పెరుగుతున్న కారణంగా అనేక మంది ప్రయివేటు పారిశ్రామికవేత్తలు తమ సంస్ధలను అక్కడి నుంచి తరలించేందుకు చూస్తున్నారని, భారత్‌ అనువుగా వుంటుందని భావిస్తున్నారన్నది వాటి సారాంశం. దీని అర్ధం ఏమిటి? తన ఎగుమతులను చౌకగా ప్రపంచానికి అందించేందుకు కార్మికుల శ్రమను ఫణంగా పెడుతోందన్న కొందరి వక్రీకరణలకు ఇది చెంపపెట్టు. ఆ స్ధాయిలో మన దేశంలో వేతనాలు లేవన్నది మన పాలకులకు అభిశంసన. ముందే చెప్పుకున్నట్లు ప్రపంచ ధనిక దేశాలు ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న కారణంగా దాని ఎగుమతులపై కొంత ప్రభావం పడినా ఆరుశాతం పైగా అభివృద్ధి రేటు కొనసాగించటానికి కారణం తన జనాల ఆదాయాలను పెంచి అంతర్గత వస్తు వినియోగాన్ని క్రమంగా పెంచుకుంటూ పోవటమే. కేవలం ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధలుగా మారిన లాటిన్‌ అమెరికా దేశాలు దెబ్బతినటానికి కార్మికవర్గ ఆదాయాలను పెంచకపోవటం ప్రధాన కారణం. వ ద్ధి, ఉపాధి చెట్టపట్టాలు కట్టి సాగితేనేగాని ప్రగతి సాధ్యం. రిజర్వ్‌బ్యాంక్‌ బాధ్యతలు చేపట్టకముందు ఏడేళ్లనాటి ఆర్థిక సర్వేలో రఘురాం రాజన్‌ ఉపాధి కల్పన ప్రభుత్వ తక్షణ కర్తవ్యమని ఉద్బోధించారు. రెండేళ్ల క్రితం తనవంతుగా ముఖ్య ఆర్థిక సలహాదారు హోదాలో అరవింద్‌ సుబ్రమణియన్‌ ‘ఉపాధి రహిత వ ద్ధి’పై ఆందోళన చెందినా- కార్యాచరణ లేదు. దేశంలో ఉపాధి అవకాశాల విస్తరణకు నూతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం దోహదపడగలదంటున్న తాజా సర్వే- ముఖ్యంగా సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ (ఎస్‌ఎమ్‌ఎస్‌ఈ)లకు మద్దతు ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మేకిన్‌ ఇండియా పిలుపు లక్ష్యానికి ఇది విరుద్దం. భారీ పరి శమలతో పెద్ద ఎత్తున వుత్పత్తి చేసి వుత్పాదక ఖర్చు తగ్గిస్తే తప్ప ఎగుమతుల్లో మనం పోటీ పడలేము. చిన్న, మధ్య తరహా సంస్దలకు అలాంటి వెసులుబాటు వుండదు.

ప్రయివేటు పెట్టుబడులతో పెద్ద ఎత్తున వుపాధి కల్పిస్తామని యువతకు భ్రమలు కల్పిస్తున్నారు. అభివృద్ధి రేటు గురించి డబ్బాకొట్టుకుంటున్న పాలకులు వుపాధి గురించి మాట్లాడటం లేదు. గతంలో వుపాధి రహిత అభివృద్ధి సంఘటిత రంగ సంస్ధలకే పరిమితం అయింది. ఇప్పుడు అది అసంఘటిత రంగానికి కూడా విస్తరించటం వుపాధి కల్పన మరింత క్లిష్టం కానుంది. దేశంలో పదిహేను సంవత్సరాలకు పైబడిన వారిలో పని చేస్తున్నవారు లేదా పనికోసం ఎదురుచూస్తున్నవారు గానీ 2012లో 55.5 శాతం మంది వుంటే 2018లో 49.7శాతానికి పడిపోయింది. అంటే నిరుద్యోగులు పెరిగారు.

ఉపాధి కల్పన, ఎగుమతుల పెంపుదల, ఆర్థికాభివ ద్ధి తదితరాలు పరస్పరం ముడివడిన అంశాలంటున్న సర్వే ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో రాబడి పెంపొందే అవకాశాలు ఉంటాయని ఒకవైపు చెబుతోంది. మరోవైపు వ్యవసాయంలో యంత్రాల వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇటీవలి కాలంలో అనేక ప్రాంతాలలో నాట్లు, కోత, నూర్పిడి పనులను యంత్రాలే చేస్తున్నాయి. వుపాధి రహిత అభివృద్దికి ఇది ఒక సూచిక. వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాల కారణంగా సేద్య రాబడి 20-25 శాతం మేర క్షీణిస్తుందన్న గత సర్వే మాటేమిటి అంటే సమాధానం లేదు. చిన్నా, పెద్ద అనేతేడా లేకుండా అన్ని రంగాల్లో రోబోలు ప్రవేశిస్తున్నాయి. ఆర్ధిక సర్వే చెబుతున్నదానికి భిన్నంగా నీతి ఆయోగ్‌ వ్యవసాయ శాస్త్రవేత్త రమేష్‌ చంద్‌ వాదన వుంది. గత ఐదు సంవత్సరాలుగా సగటు వర్షపాతం కంటే తక్కువ నమోదు అవుతోంది. ప్రస్తుత స్ధితిని చూస్తే ఆరో సంవత్సరం కూడా ఇదే స్ధితి కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అయినా వ్యవసాయ వృద్ధి రేటు 2.9శాతం తక్కువేమీ కాదు.కానీ వృద్ది రేటు ఐదుశాతం గనుక వుంటే పంటల ధరలు పడిపోయి రైతుల ఆదాయాలు 30 నుంచి 40శాతం వరకు పడిపోయే అవకాశం వుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని వూదరగొడుతున్న మోడీ సర్కార్‌ ప్రచారం ఒక వాగాడంబరమే తప్ప వాస్తవం కాదని కూడా రమేష్‌ తేటతెల్లం చేశారు. ఆదాయాలు రెట్టింపు కావాలంటే ఏడాదికి పదిశాతం వృద్దిరేటు అవసరం. తన అంచనా ప్రకారం గత మూడు సంవత్సరాలుగా ఆరుశాతానికి మించి లేదు. ఇప్పుడున్న ధరలకు పదిశాతం అదనంగా రైతులు పొందితే వారి ఆదాయం 16శాతం పెరుగుతుందని రమేష్‌ అంటారు. మరి ఆ పరిస్ధితి ఇప్పుడు వుందా ? ప్రతి పభుత్వ పథకానికి, కార్యక్రమానికి ‘గావ్‌, గరీబ్‌, కిసాన్‌’ కేంద్ర బిందువులని ఘనంగా చాటిన ఆర్థిక మంత్రి వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలకు ప్రత్యేకించింది బడ్జెట్‌లో అయిదు శాతమే! పెట్టుబడి లేని వ్యవసాయంపై ద ష్టి సారించామని, రైతుల రాబడి రెండింతలయ్యేందుకు అది దోహదపడుతుందన్న హామీ ఉత్తచేతులతో మూరలేసిన చందమే. ‘కిసాన్‌ సమ్మాన్‌’ అల్పసంతోషులను కొంత ఊరడిస్తున్నా, రైతుకు జీవన భద్రత కల్పించగల విశేష చొరవ ఈ బడ్జెట్‌ కసరత్తులోనూ కొరవడింది. రైతాంగంలో కేవలం ఆరు శాతానికే దక్కుతున్న కనీస మద్దతు ధరల పెరుగుదల ఎంత ప్రహసన ప్రాయంగా వుందో బడ్జెట్‌కు ముందు పెంచిన నామమాత్ర ధరలను చూస్తే తెలుస్తుంది.

దేశంలో పారిశుద్ధ్య సేవలు అంతంతమాత్రమేనని గత ఏడాది పార్లమెంటరీ స్థాయీసంఘం విమర్శించింది. వివిధ రాష్ట్రాల్లో రూ.14 వేలకోట్లకు పైగా స్వచ్ఛ నిధులు మురిగిపోతున్నాయని లెక్కచెప్పింది. ఆ ఊసెత్తని తాజా ఆర్థిక సర్వే స్వచ్ఛభారత్‌ నుంచి స్వస్థ భారత్‌ మీదుగా సుందర భారత్‌ వైపు నడుద్దామని పిలుపునిచ్చింది. బడ్జెట్‌ పరిమాణం 27 లక్షల 86 వేలకోట్ల రూపాయలకు ఎగబాకింది. నిరుటి బడ్జెట్‌ ప్రతిపాదనలకన్నా మూడు లక్షల 44 వేలకోట్ల రూపాయలు అధికం! ఆదాయపన్ను మినహాయింపుల గురించి ఎదురు చూసిన ప్రభుత్వ వుద్యోగుల ఆశాభంగం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నాలుగునెలల క్రితం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌ ప్రతిపాదనలనే తిరిగి వల్లించారు. నిజానికి వుద్యోగులకు మినహాయింపులు పెంచితే ఆ మేరకు మార్కెట్లో వినియోగం పెరిగి ఆర్ధిక వ్యవస్ధకు మేలు జరుగుతుంది. అధిక ఆదాయం వచ్చే వారి మీద సర్‌ఛార్చి పెంపుదల హర్షణీయమే అయినా అసమానతల తగ్గింపు రీత్యా చూస్తే ఇది సముద్రంలో కాకిరెట్ట వంటిదే. మరోవైపు బడా సంస్ధలకు ఇచ్చిన రాయితీలను చూస్తే 25శాతం ఆదాయపన్ను జాబితాలోకి వచ్చి సంస్ధల వార్షిక లావాదేవీల మొత్తాన్ని 250 నుంచి 400 కోట్లకు పెంచారు. పోనీ దీని వలన ఆర్ధిక వ్యవస్ధకు మేలు జరుగుతుందా అంటే చెప్పలేము. అనేక సంస్ధలు తమ లాభాలను, పన్ను రాయితీలను సరిహద్దులు దాటించి విదేశీ పెట్టుబడుల రూపంలో తెచ్చి వాటి మీద కూడా రాయితీలు పొందుతున్నారు.

మోదీ ప్రభుత్వం ‘సాగరమాల’ పేరిట రేవుల్ని నవీకరించి, నూతనంగా ప్రపంచ స్ధాయి నౌకాశ్రయాలు నిర్మించి, వాటన్నింటినీ అనుసంధానిస్తూ కోస్తా ఆర్థిక మండళ్లు నెలకొల్పుతామన్నా- జల మార్గాల గురించి చెప్పినా ఎక్కడి గొంగళి అక్కడే వున్నట్లుగా వుంది. ఇప్పుడు హైవేల గ్రిడ్‌ గురించి కబుర్లు చెబుతున్నారు. ‘గ్రామీణ సడక్‌ యోజన’ నిధులు ఖర్చు చేయలేదు. ఈ సారి మొత్తాన్ని పెంచలేదు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కేటాయింపులు తగ్గాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులను కుదించారు. ఇవన్నీ గ్రామీణుల ఆదాయాలను తగ్గించేవే తప్ప పెంచేవి కాదు. గత బడ్జెట్‌లో వివిధ పధకాలకు చేసిన కేటాయింపుల్లో దాదాపు లక్షా 50వేల కోట్ల రూపాయల మేర కోతలు పెట్టి లోటు అదుపులో వుందని నమ్మబలికారు. జనాన్ని మాయ చేయటం తప్ప వేరే కాదు. ప్రభుత్వ రంగ సంస్ధలలో పెట్టుబడుల వుపసంహరణ ద్వారా వచ్చిన నిధులను కొత్త పెట్టుబడిగా పెడితే ప్రయోజనం, అలాగాక వాటిని లోటును పూడ్చు కోవటానికి వినియోగిస్తున్నారు.

Image result for india budget 2019-20

రానున్న ఐదు సంవత్సరాలలో మౌలిక వసతుల కల్పనకు వందలక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని కొండంత రాగం తీసి బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం 3.38లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. మరోవైపు రైల్వే మౌలిక సదుపాయాల నిమిత్తమే 2030 సంవత్సరంలోగా రూ.50 లక్షల కోట్లు కావాలని చెప్పి కేటాయించిన మొత్తం 66వేల కోట్ల రూపాయలు మాత్రమే. తొలిసారి అధికారానికి వచ్చిన కొత్తలో తెల్లారి లేస్తే నరేంద్రమోడీ ఏదో ఒక దేశంలో వుండేవారు. ఎందుకయ్యా అంటే దేశానికి అవసరమైన విదేశీ పెట్టుబడులు తీసుకురావటానికి అని చెప్పారు. మరోవైపు తమ నేత కొత్తగా అప్పులు చేయటం లేదని, పాత అప్పులను తీర్చినట్లు మోడీ అనుయాయులు ఎన్నికల ముందు వూదరగొట్టారు. తాజా బడ్జెట్‌లో విదేశీ బాండ్ల ద్వారా రుణాలను సేకరిస్తామని చెబుతున్నారు. ఐదేండ్లుగా సాగించిన కౌగిలింతల దౌత్యం, విదేశీయులకు పరచిన ఎర్రతివాచీ మర్యాదలద్వారా ఏమి సాధించినట్లు? ఏమాటను, ఏ చేతనూ విశ్వసించే స్దితి కనిపించటం లేదు.

మరోవైపు జనాన్ని బాదేందుకు ఏ అవకాశాన్నీ వదలటం లేదు. వివాహ సమయంలో నూతన వధూ వరులకు అరుంధతి నక్షత్రాన్ని చూడమని చెబుతారు. వారికి అది కనిపిస్తుందో లేదో తెలియదు గానీ అమ్మాయి తండ్రికి అప్పులు స్పష్టంగా కళ్ల ముందుంటాయి. అలాగే ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆశాభావం వెలిబుచ్చినట్లు చమురు ధరలు తగ్గుతాయో లేదో గాని పెట్రోలు, డీజిల్‌ మీద ప్రకటించిన ఒక రూపాయి ప్రత్యేక సుంకం మాత్రం స్పష్టంగా ధరల పెరుగుదలకు దారి తీసింది. గత ఐదు సంవత్సరాలలో తగ్గిన చమురు ధరలను వినియోగదారులు లబ్ది పొందకుండా పన్నులను పెంచారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో చమురు ధరలు తగ్గుతాయని ఏ అంచనాతో చెబుతున్నారో తెలియదు గానీ ఆ పేరుతో జనానికి వడ్డించారు. ఇష్టమైనపుడు వుంగరాల వేళ్లతో మొట్టినా సరదాగానే వుంటుందంటారు. ఇది కూడా అంతేనా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ ప్రసంగం 1: జగన్‌ సర్కార్‌ విస్మరించిందేమిటి? చేయాల్సిందేమిటి?

16 Sunday Jun 2019

Posted by raomk in AP, BJP, Current Affairs, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Telugu

≈ Leave a comment

Tags

AP Governor Speech, CHANDRABABU, CM YS Jagan, Narendra Modi 2.0, YS jagan, ys jagan vs chandrababu

https://s3.ap-south-1.amazonaws.com/hansindia-bucket/2975_YS-jagan-Mohan-Reddy.jpg

ఎం కోటేశ్వరరావు

ఎన్నికలు ముగిశాయి, మంత్రివర్గ ముచ్చట కూడా తీరింది. మరో అయిదు సంవత్సరాల వరకు ఢోకాలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి సీట్లు తెచ్చుకుంది. రాజకీయాల్లో ఈక్షణంలో మిత్రులుగా వున్న వారు మరుక్షణం శత్రువులౌతుండటాన్ని చూస్తున్నాం, అందువలన ఆంధ్రప్రదేశ్‌లో ఈ స్ధిరత్వం కేంద్రంలోని బిజెపి నాయకత్వం వైసిపిని మింగేయనంత వరకే అని గుర్తు పెట్టుకోవాలి.శుభం పలకవయ్యా అంటే ఈ జోశ్యం ఏమిటి అని ఎవరికైనా కాస్త కటువుగా అనిపించవచ్చు.” ప్రత్యేక హోదా మాత్రమే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కొంతమేర పూడ్చగలదు. ప్రత్యేక హోదా వల్ల మాకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా వచ్చే మొత్తం పెరుగుతుంది. దానికి తోడు పారిశ్రామిక రాయితీలు, పన్ను రాయితీలు ఇతర మినహాయింపులు, జీఎస్టీ ఇతర అంశాల్లో పెట్టుబడిదార్లకు ప్రోత్సాహకాన్ని ఇస్తాయి. తద్వారా ఉద్యోగ కల్పన పెరిగి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే అవకాశం ఏర్పడుతుంది. ప్రత్యేక హోదా ద్వారానే మా రాష్ట్రానికి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, స్టార్‌ హోటళ్లు, పరిశ్రమలు, సేవా రంగాల అభివ అద్ధి జరుగుతుంది.ఇందుమూలంగా మనవి చేయునది ఏమనగా. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు పార్లమెంట్‌ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవెర్చే ఉదార స్వభావం చూపాల్సిందిగా ప్రధానిని కోరుకుంటున్నాను’ అని సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఎక్కడ అంటే శనివారం నాడు(జూన్‌15న) న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశంలో అని వేరే చెప్పనవసరం లేదు.

గతంలో ప్రత్యేక హోదా వాగ్దానాన్ని అమలు జరపమని నరేంద్రమోడీకి చంద్రబాబు నాయుడు నాలుగు సంవత్సరాల పాటు ఎంత వినయంగా ఎన్నిలేఖలు రాశారో, ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినపుడు విజ్ఞాపనలు చేశారో, ఎన్ని పిల్లి మొగ్గలు వేశారో మనం చూశాము, చంద్రబాబు నాయుడు కూడా జనానికి చెప్పారు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు, దాన్ని గురించి మరచిపోండి అని అదే ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేసిన తరువాత నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నట్లుగా మోడీ మనసు కరిగేట్లు చూడండి సార్‌ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెబుతున్నారు. మనం చూస్తున్నాము. జగన్‌ పదే పదే దేవుడి ప్రస్తావన తీసుకువస్తున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారీ తాను అడుగుతూనే వుంటానని ప్రకటించారు. అటు ప్రధాని నరేంద్రమోడీ, ఇటు వైఎస్‌ జగన్‌ ఇద్దరూ దేవుడిని నమ్మినవారే. ఇద్దరు దేవుని భక్తులూ కలసి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ముంచుతారా తేల్చుతారా, మోడీ మారుమనసు పుచ్చుకొని జగన్‌ ఆశిస్తున్నట్లు ప్రత్యేక హోదా ఇస్తారా అన్నది చూడాల్సిందే.

రాజు తలచుకోవాలేగాని దెబ్బలకు కొదవా అన్నారు తప్ప జనానికి మేళ్ల గురించి ఎలాంటి సామెతలు, లోకోక్తులు, సరస సంభాషణలు లేవు. ఇది తెలిసి కూడా అనేక మంది విశ్లేషకులు, ఆశాజీవులు ఏదీ అసాధ్యం కాదు, అలాంటపుడు ప్రత్యేక హోదా ఎందుకు రాదు అంటున్నారు. ఇప్పటికే ఎన్నో భ్రమలు కల్పించిన వారిని గుడ్డిగా నమ్మిన జనం మరికొన్నింటిని నమ్మలేరా ! కర్మ సిద్ధాంతం మాదిరి ఈ మధ్య బి పాజిటివ్‌ (సానుకూలంగా వుండండి) అన్నదానిని కూడా జనానికి బాగా ఎక్కించారు. ఒక చెంప కొడితే మరో చెంప ఖాళీగా వుందని అందించే మనం దీన్ని కూడా అలాగే చూద్దాం. పదే పదే అడక్కపోతే జనానికి కోపం, అడిగితే…… చెయ్యి ఖాళీలేదని చెబితే అర్ధం కాదా మీకు, విసిగించకుండా చెప్పదలచుకున్నదానిని ఫిర్యాదులు, సలహాల బాక్సు పెట్టాం, దానిలో వేసి వెళ్లండి అన్నట్లుగా బిజెపి చెప్పకపోతుందా ! ఒక్కటి మాత్రం ఖాయం, ప్రతి సందర్భంలోనూ, ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి సందర్భోచితంగా ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే వుంటామని జగన్‌ చెప్పారు కనుక వాటిని వినలేక బోరు కొట్టి బాబూ మరోసారి అడక్కండి అని జనం వేడుకొనే పరిస్ధితిని తీసుకు వచ్చే తీరు కనిపిస్తోంది. ఎవరి తరహా వారిది మరి ! ఈ నాటకం ఇలా కొనసాగాల్సిందేనా ?

శాసనమండలి మరియు నూతన శాసనసభ సభ్యుల నుద్దేశించి జూన్‌ 14 రాష్ట్ర గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహం చేసిన ప్రసంగం మీద చర్చించి లాంఛనంగా ధన్యవాదాల తీర్మానం ఆమోదిస్తారు. వాస్తవానికి గవర్నర్‌ పేరుతో అది జరిగినా తమ ప్రభుత్వానికి తామే ధన్యవాదాలు తెలుపుకోవటం తప్ప మరేమీ కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు తయారు చేసి ఇచ్చిన ప్రసంగాన్నే గవర్నర్‌ చదవటం ఒక రాజ్యాంగ విధి. ఇప్పుడున్న స్ధితిలో దీని మీద వుభయ సభల్లో ఏదైనా చర్చిస్తారో లేక వివాదాలతో చర్చలేకుండా ముగిస్తారో వూహించలేము. అలాగాకుండా సజావుగా జరగాలని కోరుకుందాం. గవర్నర్‌ ప్రసంగం అంటే ప్రభుత్వ విధానాలను సూచించే వైఖరి అందుకే నా ప్రభుత్వం అని సంబోధిస్తారు. ఆ ప్రసంగ మంచి చెడ్డలను ఒక్కసారి అవలోకిద్దాం. దీనిలో నవరత్నాల గురించి వివరణ తప్ప ప్రత్యేక హోదా సాధన గురించి ఎలాంటి ప్రస్తావనా లేదు. ప్రత్యేక హోదాలోనే పుట్టి ,ప్రత్యేక హోదా గాలినే పీల్చుతున్న జగన్‌ దాని గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని ఎవరైనా అడగవచ్చు. దాని మీద అవగాహనను పైన పేర్కొన్న నీతి ఆయోగ్‌ సమావేశంలో చెప్పారు గనక దాన్నే ప్రమాణంగా తీసుకుందాం.

2014లో చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చాక గవర్నర్‌ ప్రసంగంలో చెప్పిన అంశాలేమిటో చూద్దాం.” 1995-96లో రెండవ తరం సంస్కరణలు ప్రారంభించబడిన సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ధికాభివృద్ధిని పెంచి దారిద్య్రాన్ని నిర్మూలించటం కోసం దాదాపు ఒక దశాబ్దం పాటు కఠినంగా సంస్కరణలు అమలయ్యాయి.1990దశాబ్దం మధ్యలో సమాచార, సాంకేతిక రంగాల్లో మార్పు వచ్చింది. ఈ కాలంలో భూమి, నీరు, అటవీ వనరుల భాగస్వామ్య నిర్వహణ విషయంలో గణనీయమైన మార్పులు చేయటం జరిగింది. మునుపటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మహిళా, స్వయం సహాయక బృందాలు మరియు డ్వాక్రా గ్రూపులు ప్రపంచ విజయగాధగా నిలిచాయి. వీటి ద్వారా సామాజిక సమీకరణ,సామాజిక సాధికారత, సామర్ధ్య నిర్మాణం పేదరిక నిర్మూలన విధానంలో కీలకంగా మారాయి. ఈ చర్యలు ఆర్ధిక సంస్కరణలలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌కు మంచి పేరు తెచ్చి పెట్టాయి. దేశ విదేశాలలో అంచనాలు పెరగటానికి దారితీశాయి. అయితే ప్రభుత్వం నుంచి తగినంత ఆర్ధిక మద్దతు లేకపోవటం వల్ల ఈ బృహత్తర వుద్యమం 2004 నుంచి వేగంగా క్షీణించటం ప్రారంభమైంది.దురదృష్ట వశాత్తూ గత దశాబ్దంలో రాష్ట్ర ఆర్ధిక విషయంలో ముఖ్యంగా సహజ వనరుల కేటాయింపు అంశంలో అనేక అవకాశాలను కోల్పోవటం జరిగింది.” ఇలా సాగిన ప్రసంగంలో అవినీతి తదితర అంశాల గురించి ప్రస్తావన వుంది.

ఐదు సంవత్సరాల తరువాత అధికారానికి వచ్చిన జగన్‌ గవర్నర్‌ ద్వారా ఏం చెప్పించారు? ” నూతన ప్రభుత్వానికి తక్షణ సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్న మైంది. వాటిలో కొన్ని రాష్ట్ర విభజన పర్యవసానంగా ఏర్పడినవి. మిగిలినవి విభజనానంతరం తలెత్తిన సవాళ్ల అసంగత నిర్వహణకు పర్యవసానాలుగా వున్నాయి. మానవ మరియు భౌతిక వనరులు రెండింటినీ దుర్వినియోగ పరచటం రాష్ట్రం యొక్క దుస్ధితిని మరింత తీవ్రతరం చేసింది. నా ప్రభుత్వానికి దాదాపు ఖాళీ ఖజానా సంక్రమించినందున ప్రజాధనాన్ని మరియు అన్ని సహాయకవనరులను పూర్తి జవాబుదారీగా, సమర్ధవంతంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడింది……పేదలు, నిరుపేదలు, అభాగ్యులకు సహాయపడే మార్గాలను అన్వేషిస్తూ తప్పనిసరిగా కేంద్రీకృత పరిపాలన అంతటా దృష్టి సారించాలనేది మునుపటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి భావజాలం ప్రస్తుత సందర్భంలో ప్రతి ఒక్కరూ గ్రహిస్తారు. ఇది బహుశా ఏ సమయంలో వున్నదాని కంటే ఇప్పుడు సంగతంగా వుంటుంది. దీనిని దృష్టిలో వుంచుకొని ప్రస్తుత ప్రభుత్వం తొమ్మిది ఇతి వృత్తాలతో కూడి వున్న నవరత్నాలు అనే ఒక ఏకీకృత సంక్షేమ అజెండాను రూపొందిస్తున్నది,” అని పేర్కొన్నారు.

Image result for YS Jagan

దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవాల్సింది ఏమిటి? ఎవరు కొత్తగా అధికారానికి వచ్చినా గత పాలకులు తమకు ఖాళీ ఖజనా అప్పగించి వెళ్లారనో, ఆర్ధిక వ్యవస్ధను అస్తవ్యస్తం చేశారనో చెబుతారు. పోనీ వీరికి ముందుగా తెలియదా అంటే ఎన్నికలకు ముందువరకు ప్రతిపక్షంలో వుండి చేసే పని పాలకుల లోపాలను ఎండగట్టటమే కదా, మరి తెలియకుండా ఎలా వుంటుంది, తెలిసి కూడా వాగ్దానాలు చేయటమెందుకు, అమలు విషయానికి వచ్చే సరికి ఖజానా గురించి సొల్లు కబుర్లెందుకు? పార్టీ కార్యకర్తలూ, సామాన్యజనమూ, మీడియా విసిగిపోయేంత వరకు ప్రపంచ బ్యాంకు ఆదేశిత విజయగాధలను వినిపించటం, ఆ విధానాలను అమలు జరపిన కారణంగానే తెలుగుదేశం పార్టీని 2004లో, 2014లో జనం తిరస్కరించారు. వాటిని మరింత ముమ్మరంగా అమలు జరిపిన కారణంగానే వైఎస్‌ రాజశేఖరరెడ్డి సర్కార్‌ను జనం ఓడించేందుకు నిర్ణయించుకున్న తరుణంలో ప్రత్యామ్నాయం అంటూ ప్రజారాజ్యం పార్టీ వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు గండి కొట్టటంతో వైఎస్‌ఆర్‌ రెండవ సారి మైనారిటీ ఓట్లతో బొటాబొటి సీట్లతో అధికారానికి వచ్చారు. తన పాత విధానాల అమలు వల్లనే తాము పది సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో వుండాల్సి వచ్చిందని 2014లో అధికారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ గుణపాఠం తీసుకోలేదు, తిరిగి అదే విధానాలను అమలు జరుపుతూ జనాన్ని మభ్యపెట్టిన కారణంగానే జనం నిర్ణయాత్మకంగా ఓటు వేసి మరోసారి సాగనంపారు. దీన్ని గుర్తించకుండా తమపై జరిగిన తప్పుడు ప్రచారం ఓటమికి కారణం అనే తీరులో తెలుగుదేశం నేతలు మాట్లాడుతున్నారు. తన తండ్రి రెండవసారి ఓటమి అంచుదాకా ఎందుకు పోయారో జగన్‌ కూడా గుణపాఠంగా తీసుకోలేదు. అంతకంటే ఎక్కువగా సంక్షేమ పధకాల గురించి చెబుతున్నారు. విధానాలను మార్చుకోకపోతే, సంక్షేమ పధకాల బాటలోనే నడిస్తే ఐదేండ్ల తరువాత ఏమౌతుందో వూహించుకోవటం కష్టం కాదు.

సంక్షేమ పధకాలు, వాటి గురించి వూదరగొట్టుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా కొంత కాలం వరకు సంక్షేమ పధకాలకు ఎలాంటి ఆటంకం కలగదు, కొనసాగుతాయి. వృద్దాప్య, ఇతర, అభాగ్య జీవుల పెన్షన్లను రద్దు చేసే అవకాశం లేదు. కొన్నింటిని రద్దు చేస్తారు. ఎన్ని పధకాలను అమలు చేసినా జనంలో అసంతృప్తి తగ్గటం లేదు అంటే అసలు సమస్యను ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదనే అర్ధం. అయినప్పటికీ వాటినే మరింత ఎక్కువగా అమలు జరపనున్నట్లు జగన్‌ చెబుతున్నారు.

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణా విడిపోయిన తరువాత మిగిలి వున్న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మార్పులేమిటి? విభజనకు ముందు రాష్ట్ర జిడిపిలో వ్యవసాయ రంగ వాటా 23శాతం. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో అది 30.2శాతం అయింది. తరువాత 2017-18 ముందస్తు అంచనా ప్రకారం 34.4శాతం వుంది. ఇదే సయమంలో పారిశ్రామిక రంగం వాటా 25.5శాతం నుంచి 22.1శాతానికి,సేవారంగం వాటా 44.6 నుంచి 43.5శాతానికి పడిపోయింది. దేశంలో ఈ మూడు రంగాల వాటా వరుసగా 17.09, 29.06, 53.85 శాతాలుగా వున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్‌ జాతీయ సగటు కంటే బాగా వెనుక బడి వుంది. ఇదే సమయంలో మిగిలిన నాలుగు దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణా, కర్ణాటక, కేరళ జిడిపిలో సేవారంగం వాటా 64శాతానికి పైగా వుంది. తమిళనాడులో 53.7శాతం సేవారంగం నుంచి గరిష్టంగా, 34.05శాతం పారిశ్రామికరంగం నుంచి వస్తున్నది. వ్యవసాయ రంగ వాటా కర్ణాటకలో 10.82, కేరళలో 12.51, తమిళనాడులో 12.58, తెలంగాణాలో 14.28 శాతం వుంది. ప్రస్తుత ఆర్ధిక వ్యవస్ధలో ఆంధ్రప్రదేశ్‌ పరిస్ధితి ఆందోళనకరంగా వుందన్నది స్పష్టం. గణనీయంగా పెరిగిన ఎరువుల ధరలతో సహా వ్యవసాయ పెట్టుబడులు పెరిగి రైతాంగ నిజ ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. వ్యవసాయం గిట్టుబాటు కాని స్ధితి ఏర్పడింది. బాబొస్తే జాబొస్తుందని చేసిన తెలుగుదేశం పార్టీ నినాదం విఫలం కావటానికి, ఎదురు దెబ్బలు తగలటానికి కారణం దీని పర్యవసానాలే. పని చేసే వారిలో 58శాతం మంది వ్యవసాయ రంగంలో వున్నారు. ఈ కారణంగా రుతుపవనాలు విఫలమైనా, జలాశయాలు నిండకపోయినా, ఇతర ఏ కారణాల వల్ల అయినా వ్యవసాయం కుంటుపడితే దానిలో పని చేసే వారంతా వుపాధికోసం రోడ్డెక్కవలసిందే, దీనికి తోడు చేతుల వృత్తులు నానాటికీ దెబ్బతింటున్నందున ఆ రంగం నుంచి వచ్చేవారు కూడా నిరుద్యోగ సైన్యంలో చేరతారు.

భ్రమలు కల్పించటం ప్రజాకర్షక నినాదాలు ఇచ్చే నేతల లక్షణాలలో ఒకటి. వైఫల్యాలను ప్రశ్నించే లేదా తమ సమస్యలను పరిష్కరించాలని గళమెత్తేవారిని సహించకపోవటం, అణచివేయటం కూడా వారి లక్షణాలలో భాగమే. చంద్రబాబు నాయుడిలో ఈ లక్షణాలు అడుగడుగునా మనకు కనిపిస్తాయి. ప్రపంచ స్ధాయి రాజధాని నిర్మాణం చేస్తా, సింగపూర్‌, వాషింగ్టన్‌లా చేస్తా అని వూదరొట్టటం దానిలో భాగమే. అలా అనుకుంటే ప్రపంచంలో ఒక్కోదేశంలోనే అలాంటి నగరాలు అనేకం వున్నాయి. అయినప్పటికీ ఆర్ధిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. రెండో లక్షణానికి వస్తే ఆయన ఎక్కడ పర్యటనకు వెళితే అక్కడ వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, ఇతర పార్టీల కార్యకర్తలు, నేతలను అరెస్టు చేయించటం తెలిసిందే. పరిశ్రమలకు పెట్టుబడులను ఆకర్షించే పేరుతో చంద్రబాబు నాయుడు సదస్సులతో కాలక్షేపం చేస్తే ఐటి మంత్రిగా ఆయన తనయుడు ఒప్పందాల పేరుతో అదే బాటలో నడచి హడావుడి చేయటం తప్ప సాధించింది లేదు. నాలుగున్నర సంవత్సరాల పాలన తరువాత చంద్రబాబు నాయుడు సర్కార్‌ ప్రవేశ పెట్టిన శ్వేత పత్రాల గురించి మీడియాలో లేదా బయటగానీ పెద్దగా చర్చ, ప్రస్తావనలు లేవు.

Image result for YS Jagan

వాటిలో పరిశ్రమలు, వుపాధి, నైపుణ్య శిక్షణ పేరుతో ఒక పత్రం వుంది. దానిలో వున్న కొన్ని అంశాలు ఇలా వున్నాయి. 201,17,18 సంవత్సరాలలో పెద్ద ఎత్తున హడావుడి చేసి విశాఖలో పెట్టుబడి భాగస్వామ్య సదస్సులంటూ జరిపారు.2,622 ప్రాజక్టులకు ఒప్పందాలు కుదిరాయని వాటిలో పెట్టుబడులు 15,48,743 కోట్ల రూపాయలని, 32,35,916 మందికి వుద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. ఆచరణలో వుత్పాదనలోకి వెళ్లిన ప్రాజక్టులు 810, వాటిలో పెట్టుబడి 1.77లక్షల కోట్లు, వుపాధి కల్పించామని చెప్పింది 2.51లక్షల మందికి. కాగితాల మీద వున్న అంకెలకు వాస్తవాలకు ఎంత తేడా వుంటుందో తెలిసిందే. ఆరోగ్యశ్రీ పధకం కింద రోగులు ఆసుపత్రులకు వెళితే ఎంత ఎక్కువ బిల్లులు వేసి ప్రభుత్వాల నుంచి తెలుగు రాష్ట్రాలలో కార్పొరేట్‌ ఆసుపత్రులు గుంజుతున్నాయో తెలిసిందే. అలాగే పెట్టుబడులు, వుపాధిని ఎక్కువగా చూపి రాయితీలు పొందేందుకు పెట్టుబడిదారులు కూడా అలాంటి పనులే చేస్తారు. శ్వేత పత్రంలో వున్న అంశాల ప్రకారం మరో 1211 ప్రాజెక్టులకు సివిల్‌ పనులు జరుగుతున్నాయట, వాటిలో పెట్టుబడి 5.27లక్షల కోట్లు, వుపాధి అంచనా 7.66 లక్షలు. ఇవిగాక అసలు ప్రారంభమే కానివి ఆరువందల ప్రాజెక్టులు, వాటిలో వుంటాయనుకునే పెట్టుబడులు వాటిలో పెట్టుబడులు 8.45లక్షల కోట్ల రూపాయలైతే వుపాధి 22,18,916 మందికి వస్తుందా ? వీటిని కాకి లెక్కలను కోవాలా, నిజమనుకోవాలా ?

ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ఐదు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో( సుమారుగా 35వేల కోట్ల రూపాయలకు సమానం) రెండు లక్షల మందికి, రెండు బిలియన్‌ డాలర్లతో(14వేల కోట్ల రూపాయలకు సమానం)తో లక్ష మంది ఐటి లేదా ఐటి అనుబంధ వుద్యోగాలు కల్పించే లక్ష్యం గురించి వూదరగొట్టారు. నాలుగున్నర సంవత్సరాల తరువాత ఎలక్ట్రాన్స్‌ రంగంలో ఐదు కంపెనీలు 927 కోట్ల రూపాయలతో వుత్పత్తి ప్రారంభించాయని, 21,850 మందికి వుపాధి కల్పించినట్లు పేర్కొన్నారు.హైదరాబాదులో ఐటి పరిశ్రమను తానే నెలకొల్పానని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎంత మందికి ఐటి రంగంలో వుపాధి కల్పించారో శ్వేతపత్రంలో పేర్కొనలేదు. ఈ పూర్వరంగంలో ఏ ప్రభుత్వం ముందైనా పెద్ద సవాలే వుంటుంది. మొత్తంగా వుపాధి గురించి జగన్‌ నవరత్నాలలో గానీ, గవర్నర్‌ ప్రసంగంలోగానీ పేర్కొన్నదేమీ లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పకోడానోమిక్స్‌ ఫలితాలేమిటి !

14 Friday Jun 2019

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Arvind Subramanian, ‘Pakodanomics’ and employment, India employment, India Unemployment, Narendra Modi, pakodanomics, Raghuram Rajan

Image result for pakodanomics results

ఎం కోటేశ్వరరావు

లాహిరి లాహిరిలో ఓహో జగమే వూగెనుగా తూగెనుగా అంటూ సాగుతున్న నరేంద్రమోడీ 2.0 నావ ఒక్కసారిగా కుదుపుకు గురైంది. నాలుగు సంవత్సరాల పాటు ఆయనకు ఆర్ధిక సలహాదారుగా పని చేసిన అరవింద్‌ సుబ్రమణియన్‌ జిడిపి వృద్ధి రేటు గురించి పేల్చిన బాంబు ప్రభావమది. కోర్టు తీర్పు పూర్తి కాపీ వచ్చిన తరువాత స్పందిస్తామన్నట్లుగా అరవింద్‌ సుబ్రమణియన్‌ పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఆయన లేవనెత్తిన ప్రతి అంశానికి సమాధానం చెబుతామని ప్రస్తుతం ప్రధాని ఆర్ధిక సలహాదారులుగా వున్న బృందం ఒక ప్రకటన చేసింది. 2011 నుంచి 2017 మధ్య వాస్తవ జిడిపి వృద్ధి రేటు అంటే యుపిఏ 2 చివరి మూడు సంవత్సరాలు, ఎన్‌డిఏ 1 మొదటి మూడు సంవత్సరాల అభివృద్ధి రేటును అంకెల గారడీ చేసి లేనిదాన్ని వున్నట్లుగా చూపారన్నది సుబ్రమణియన్‌ విమర్శ. సత్యం కంప్యూటర్స్‌ దగా మాదిరి లేని లాభాలను వున్నట్లు కాగితాల మీద చూపిన తీరు అనుకోండి. వాస్తవ అభివృద్ధి ఏడు కాదు నాలుగున్నరశాతమే అన్నారు సుబ్రమణియన్‌. ఆయన ప్రధాన ఆర్దిక సలహాదారుగా వున్నపుడే ఈ విషయం చెప్పి వుండాల్సింది, అంకెలను తయారు చేసేది రాజకీయ నాయకులు కాదు, అంగీకరించిన ప్రమాణాల ప్రకారమే అంకెలు తయారు చేశాము, ఈ పద్దతి యుపిఏ హయాంలోనే ప్రారంభమైంది, సుబ్రమణియన్‌ లెక్కించిన విధానం అసాధారణమైనది, దాన్ని కూడా ప్రశ్నించాల్సిందే అంటూ సన్నాయి నొక్కులతో కేంద్రం ఒక వివరణ కూడా జారీ చేసింది. అభివృద్ధి అంకెలతో నరేంద్రమోడీకి ఎలాంటి సంబంధం లేదని ముందే చెప్పటం ఇది.

Image result for arvind subramanian, raghuram rajan

ప్రభుత్వం చెప్పినట్లు సుబ్రమణియన్‌ లేవెనెత్తిన అంశాలకు జవాబు ఏమి చెబుతారో చూద్దాం. అయితే ఆయన కంటే ముందుగానే రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ లేవనెత్తిన ప్రశ్నకు మూడునెలలు కావస్తున్నా ఇంతవరకు ప్రధాని ఆర్ధిక సలహాదారులు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. రాజన్‌ లేవనెత్తిన విమర్శను తట్టుకోలేని బిజెపి మరుగుజ్జులు (పోకిరీలు అని కూడా అంటున్నారు) మాత్రం సామాజిక మాధ్యమంలో విరుచుకుపడ్డారు. పదవి నుంచి దిగిపోయిన ప్రతివారూ ఇలాగే అంటారు, మోడీని బదనామ్‌ చేసే కుట్రలో భాగం, ఆయన కాంగ్రెస్‌ మనిషి ఇలా దాడి సాగింది. ఇప్పుడు అరవింద్‌ సుబ్రమణియన్‌ మీద కూడా అదే తరహాదాడి జరగటంలో ఆశ్చర్యం లేదు. ఆయన విధుల్లో వున్నపుడే ఈ మాటలు చెప్పి వుండాల్సిందని మోడీ ప్రభుత్వం ప్రకటించింది అంటే ఎలా దాడి చేయాలో వుప్పందించటమే. సమస్యను పక్కదారి పట్టించటమే. రఘురామ్‌ రాజన్‌ లేవనెత్తిన ప్రశ్న ఏమిటి ? ప్రభుత్వం ప్రకటించినట్లు జిడిపి వృద్ధి రేటు ఏడుశాతం అయితే తగినన్ని వుద్యోగాలు వచ్చి వుండాలి కదా, ఎందుకు రాలేదు అన్నదానికి ఇంతవరకు సమాధానం లేదు. రికార్డు స్ధాయికి నిరుద్యోగం చేరిందని ఎన్నికలకు ముందు అధికారిక సమాచారాన్ని అనధికారికంగా ఒక పత్రిక ప్రచురించినపుడు దానిని ఖండించిన సర్కార్‌ ఎన్నికల తరువాత సదరు సమాచారం వాస్తవమే అని చెప్పింది. ఓట్ల కోసం కక్కుర్తిపడ్డారని అనుకుందా. నిరుద్యోగం ఎందుకు పెరిగిందో అధికారులు చెప్పరు, రాజకీయనేతలు మాట్లాడరు ? ఇప్పుడు సుబ్రమణియన్‌ లేవనెత్తిన అంశాలకు జవాబు చెబుతామని పలికితే నమ్మే దెట్లా ? మరో అయిదేండ్లు చేసేదేమీ లేదు కనుక గోళ్లు గిల్లుకుంటూ ప్రభుత్వం చెప్పేదాన్ని వినేందుకు వేచి చూద్దాం.

Image result for pakodanomics results

మోడీ1.0 హయాంలో తెచ్చిన మంచి రోజు లేమిటో తాజాగా వెల్లడించిన కొన్ని అంకెలు వెల్లడించాయి. మరోసారి మోడీ పాలన కోరుకోవటంలో జనానికి కనిపించిన, అనిపించిన కారణాల గురించి మోడీ 2.0 పనితీరుమీద చర్చ జరిగినపుల్లా ప్రస్తావన వస్తూనే వుంటుంది. ఎవరైనా అలాంటిదేమీ వద్దు అనే ప్రజాస్వామిక భావనను వ్యక్తీరిస్తే ఈ దేశంలో ఇంకా భావప్రకటనా స్వేచ్చ అంతరించి పోలేదు అని చెప్పాల్సి వుంటుంది. జూలై ఐదున కొత్త ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ వర్తమాన సంవత్సర పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రతి క్రతువుకు ఒక తతంగం వున్నట్లుగానే బడ్జెట్‌ గురించి అభిప్రాయసేకరణ వుంటుంది. అది ఈనెల 11-23 మధ్య జరుగుతుంది. దానికి చాయ్‌వాలాలు, చౌకీదార్లెవరూ రారు. పారిశ్రామిక- వాణిజ్యవేత్తలూ, వారి ప్రయోజనాలను కాపాడే బ్యాంకర్లూ, ఆర్ధికవేత్తలు, వారి ఆకాంక్షలకు అనుగుణ్యంగా వార్తలు రాసే జర్నలిస్టులూ హాజరై చెప్పాల్సింది చెబుతారు, పాలకులు చేయాల్సింది చేస్తారు. అరవింద్‌ సుబ్రమణియన్‌ ప్రభుత్వం ముందు కొత్త అజెండాను ముందుకు తెచ్చారు కనుక బడ్జెట్‌ సమాలోచనలు ఎలా సాగుతాయో చూద్దాం !

ఐదు సంవత్సరాల క్రితం అధికారానికి వచ్చినపుడు నరేంద్రమోడీ సర్కార్‌ తీసుకున్న చర్యలకు ‘ మోడినోమిక్స్‌ ‘ అని పేరు పెట్టారు. మరో ఐదు సంవత్సరాలకు ఓటర్లు ఆమోదం తెలిపారు కనుక నిజం చెబితే ఎవరైనా చేసేదేముంది అనే వుదారబుద్దితో కేంద్ర ప్రభుత్వం అసలు లెక్కలను బయట పెట్టింది. దాని ప్రకారం 2017-18లో నిరుద్యోగ రేటు 6.1శాతం, అది 45సంవత్సరాల రికార్డు స్దాయి. మోడీ నావ వడ్డుకు చేరింది, నిరుద్యోగులు మునిగారు. బతికి వున్నవారు అర్ధం చేసుకోవాల్సిందేమంటే సిఎంఐఇ సమాచారం మేరకు 2018 జూన్‌ నుంచి 2019 మే నెల వరకు పన్నెండు నెలల సగటు నిరుద్యోగశాతం 6.66, జూన్‌ ఒకటి నుంచి తొమ్మిది వరకు సగటు 7.36 శాతంగా గ్రాఫ్‌ పైకి ఎగబాకుతోంది. మరోవైపున జిడిపి వృద్ధి రేటు గతేడాది చివరి మూడు మాసాలలో 5.8శాతానికి పడిపోయింది. ఇది మూడు సంవత్సరాలలో కనిష్టం. అరవింద్‌ సుబ్రమణియన్‌ చెప్పిన ప్రకారం ఏడు అంటే నాలుగున్నర, ఏడుకు తగ్గితే ఇంకా పడిపోతుంది. వాస్తవం చెప్పటం మన ధర్మం, కార్యాచరణ ప్రభుత్వానికి, ప్రతిపక్షాలు, నిరుద్యోగులకు వదలివేద్దాం.

గతేడాది ఒక టీవీ ఇంటర్వ్యూలో నరేంద్రమోడీ గారు చెప్పిందేమిటి? ‘ ఒక ఏడాది కాలంలో 70లక్షలకు పైగా ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాలు జత అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ముద్ర యోజన పధకం ద్వారా పది కోట్ల మంది లబ్ది పొందారు. కేంద్ర ప్రభుత్వ చొరవల కారణంగా చిన్న తరహా సంస్ధలు, అసంఘటితరంగాలకు సాధికారత ఒనకూడింది. మీ కార్యాలయం ముందు ఎవరైనా ఒకరు పకోడీ బండిని ప్రారంభించారనుకోండి, అది వుద్యోగం లెక్కలోకి రాదా ? సదరు వ్యక్తి రోజువారీ ఆదాయం రెండు వందలు ఏ పుస్తకాలకు, ఖాతాలకు ఎక్కదు. వాస్తవం ఏమంటే పెద్ద సంఖ్యలో జనం వుపాధి కలిగి వున్నారు.’అని నరేంద్రమోడీ సెలవిచ్చారు కనుక దాన్ని కొందరు ‘ పకోడినోమిక్స్‌’ అని వర్ణించారు. ఇంత అభివృద్ధి జరిగిన తరుణంలోనే నిరుద్యోగులు రికార్డు స్ధాయిలో పెరిగారు అంటే ఇప్పుడు పరిస్ధితి ఏమిటి? కొనుగోలు చేసే వారు లేక, కొందరికి వుపాధి వున్నా కొనుగోలు శక్తి పడిపోయిన కారణంగా బండ్లను పక్కన పడేసి పకోడీలు చేసే వారు పని కోసం అడ్డామీదకు చేరుతున్నారని అనుకోవాలి.

Image result for pakodanomics results

ఎన్నికల ప్రచారంలో అక్కడక్కడయినా విజయవంతమైన తమ విధానాలను కొనసాగిస్తామని బిజెపి నేతలు చెప్పారు. అదేగనుక జరిగితే రానున్న రోజుల్లో హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నడిపే చౌక భోజన కేంద్రాలు, షిరిడీ సాయి బాబా, ఇతర దేవాలయాల్లో పెట్టే వుచిత అన్నం కోసం నిలబడే వారు మరింత పెరిగిపోతారు. కార్యాలయాలల్లో ఫ్లాస్కుల్లో టీ అమ్ముకొనే వారు కూడా గిట్టుబాటుగాక నిరుద్యోగ సైన్యంలో చేరతారు. ఆర్ధిక వ్యవహారాలు, నిరుద్యోగం మీద, వుపాధి మరియు నైపుణ్యశిక్షణ వంటి 14 అంశాలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ వుపసంఘాలలో రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌కు చోటు కల్పించని కారణంగా ఆయన అలిగినట్లు వచ్చిన వార్తల కారణంగానే అనేక మంది అలాంటి కమిటీలు వుంటాయని తెలుసుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఆ కమిటీలు గతంలో కూడా వున్నాయి. దేశంలో పరిస్ధితులు దిగజారుతుంటే గత ఐదేండ్లుగా ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నాయి, ఇప్పుడేం చేయనున్నాయన్నది ప్రశ్న.15-29 సంవత్సరాల వయస్సున్న గ్రామీణ యువకుల్లో 2017-18లో 17.4శాతం, యువతుల్లో 13.6శాతం, పట్టణ యువకుల్లో 18.7, యువతుల్లో 27.2శాతం నిరుద్యోగం వుందని తేలింది. గత ఏడాది కాలంలో ఇంకా పెరిగాయి. గ్రామాల్లో మహిళల వుపాధి, పట్టణాల్లో మొత్తంగా వుపాధి అవకాశాలు పడిపోతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నవభారత నిర్మాణం చేస్తానంటున్న నరేంద్రమోడీ బండి నల్లేరు మీదమాదిరి సాఫీగా సాగదని చెబుతున్నాయి.

రైతాంగానికి ఏటా ఆరువేల రూపాయల నగదు ఇస్తామని నరేంద్రమోడీ సర్కార్‌ ప్రకటించింది. దానికి కారణం వ్యవసాయ ఆర్ధిక వ్యవస్ధ మరింతగా దిగజారటమే. అసంతృప్తి మరింత పెరగకుండా వుండాలన్నా, ఎన్నికల్లో లబ్ది పొందాలన్నా ఏదో ఒకటి చేయాలి గనుక చివరి క్షణంలో ఆపని చేశారు. మన జిడిపిలో వ్యవసాయ రంగ వాటా తక్కువే అయినప్పటికీ వుపాధి పొందుతున్నవారు ఎక్కువగా వున్నారు.2017-18 సంవత్సర చివరి మూడు మాసాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధి 6.5 శాతం కాగా తరువాత సంవత్సరంలో ప్రతి మూడు మాసాలకు 5.1,4.2,2.7,0.1శాతాలకు పడిపోయింది. అది 2019-20లో కూడా కొనసాగితే సంక్షోభం మరింత తీవ్రం అవుతుంది. దాని నివారణలో భాగంగానే ఏడాదికి ఆరువేల రూపాయల అందచేత అనుకోవాలి. ఇది రైతాంగాన్ని గట్టుకు చేరుస్తుందా అంటే కాదనే చెప్పాలి. మొత్తంగా జిడిపి వృద్ధి రేటు 2018-19తొలి త్రైమాసికంలో 8శాతం వుండగా తరువాత మూడు త్రైమాసికాలలో అది వరుసగా 7, 6.6, 5.8శాతాలకు పడిపోయింది.అంకెలు ఎక్కువగా చెబితే కాస్త గందరగోళంగా వుండవచ్చుగానీ మరొక మార్గం లేదు.2018 మార్చినెలలో పారిశ్రామికవుత్పత్తి వృద్ధి రేటు 5.3శాతం వుండగా 2019 మార్చినాటికి అది 0.1కి చేరింది.

Image result for what are the pakodanomics results

ఇతర అనేక అంశాలు ప్రతికూలంగా వున్నప్పటికీ మొదటి సారి మోడీ అధికారానికి వచ్చిన తొలి మూడు సంవత్సరాలలో ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు బాగా పడిపోయిన కారణంగా అది అనుకోని వరంలా మారింది. ఇప్పుడు మరోసారి పైవైపు చూసే ధోరణే తప్ప తగ్గే పరిస్ధితి కనిపించటం లేదు. రంజాన్‌ మాసం ముగిసింది కనుక పశ్చిమాసియా, మధ్య ప్రాచ్యంలో యుద్దం వంటి పిచ్చిపనులకు డోనాల్డ్‌ట్రంప్‌ పాల్పడితే మోడీ సర్కార్‌కు పెద్ద పరీక్ష అవుతుంది. ఐదేండ్లు అంతా బాగుంది అని చెప్పిన తరువాత బ్యాంకుల్లో పెరిగిపోతున్న నిరర్ధక ఆస్ధులకు కాంగ్రెసే కారణమని చెబితే ఇంకేమాత్రం అతకదు. పడిపోతున్న పారిశ్రామిక, వాణిజ్య రంగాన్ని నిలబెట్టేందుకు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీలకు రుణాలిస్తే పరిస్ధితి మెరుగుపడుతుందనే అభిప్రాయంతో రిజర్వుబ్యాంకుద్వారా వడ్డీని తగ్గిస్తున్నారు. గతంలో తగ్గించిన ఫలితాలేమీ కనపడలేదు. అనేక పెట్టుబడిదారీ దేశాలలో వడ్డీ రేటు మన కంటే చాలా తక్కువ, జపాన్‌లో అయితే డబ్బు దాచుకున్నవారే బ్యాంకులకు సొమ్ము చెల్లించాల్సిన పరిస్ధితి. అయినా అక్కడ వృద్ధి రేటు పెరగటం లేదు. అమెరికాతో వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కోవటం, తదితర కారణాలతో చైనాలో వృద్ధి రేటు కాస్త తగ్గినప్పటికీ నిలకడగా వుంటోంది. దానికి ప్రధాన కారణం ఎగుమతులకు కొత్త మార్కెట్లను చూడటంతో పాటు అంతర్గత వినియోగ మార్కెట్‌ను పెంచటమే. అందుకోసం అది కార్మికుల వేతనాలను ఏడాదికేడాది పెంచుతోంది. ఈ కారణంగానే తమకు గిట్టుబాటు కావటం లేదు కనుక అంతకంటే తక్కువ వేతనాలకు కార్మికులు దొరికే దేశాలకు తమ పరిశ్రమలను తరలిస్తామని అమెరికా, తదితర దేశాల యజమానులు ప్రకటించిన విషయం తెలిసిందే.

అమెరికాాచైనా వాణిజ్య యుద్దం, ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోవటం(బ్రెక్సిట్‌), అమెరికా – ఇరాన్‌ వైరం, ఐరోపాలో పరిష్కారం కాని ఆర్దిక ఇబ్బందులను అవకాశాలుగా మలుచుకొని మన దేశాన్ని తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చినా, మరొకటి చేసినా మన దేశానికి వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమలు లేవు, ఎగుమతులూ పెరగలేదు. అమెరికాతో ఎంతగా అంటకాగుతున్నా మన ఎగుమతులకు ఎంతో కాలంగా ఇస్తున్న పన్ను తగ్గింపు ప్రాధాన్యతను తగ్గించటం వంటి చర్యలతో మనకు మరింత నష్టం జరగనుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి, మరో సందర్భంలో చెప్పుకోవచ్చు. ఒకవైపు రికార్డు స్ధాయికి నిరుద్యోగం చేరిందని ప్రభుత్వమే అంగీకరించింది కనుక దాని గురించి ఎలాంటి అనుమానాలు లేవు. మరోవైపు నరేంద్రమోడీ సర్కార్‌ చెప్పినట్లు పెద్ద ఎత్తున మన యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చిందనే అంగీకరిద్దాం, మరి వుద్యోగాలెందుకు రాలేదు ? ఈ సారైనా మోడీ నోరు విప్పుతారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

రైతులకు పెట్టుబడి సాయం- మోడీ సర్కార్‌ బండారం !

08 Saturday Jun 2019

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, Latin America, Literature., Loksabha Elections, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

agriculture in india, cash support schemes for farmers, Distressed farm sector, Modi sarkar secrecy, PM-KISAN scheme

Image result for cash support schemes for farmers

ఎం కోటేశ్వరరావు

ఢిల్లీ మెట్రోలో మహిళలకు వుచిత ప్రయాణం కల్పించాలనే ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వ ఆలోచన లేదా నిర్ణయం రాబోయే ఎన్నికలలో లబ్ది పొందేందుకే అని బిజెపి గోలగోల చేసింది. ఐదేండ్లూ చేయని ఆలోచన ఇప్పుడు చేస్తున్నారని రుసరుసలాడింది. అధికారమే యావగా వున్న పార్టీలకు ప్రత్యర్ధుల ఎత్తులు బాగా అర్ధం అవుతాయి. చిన్న, సన్నకారు రైతాంగానికి ఏడాదికి ఆరువేల రూపాయలు వ్యవసాయ పెట్టుబడి సొమ్ము చెల్లించాలని నరేంద్రమోడీ సర్కార్‌ ఐదేండ్లూ ఏమీ చేయకుండా హడావుడిగా ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు తాత్కాలిక బడ్జెట్‌లో వెనుకటి తేదీ నుంచి అమలులోకి వచ్చే పధకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్నేమనాలి ? రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలలో బిజెపి ఓడిపోవటం, అంతకు ముందు పలుచోట్ల రైతాంగ ఆందోళనల నేపధ్యంలో ఓట్లకోసం మోడీ సర్కార్‌ ఆ పని చేసిందన్నది బహిరంగ రహస్యం. ఆమ్‌ ఆద్మీ కూడా అంతే !

ఆమధ్య, బహుశా ఇప్పటికీ సామాజిక మాధ్యమంలో తిరుగుతూనే వుండి వుంటుంది. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్‌ వెనెజులాలో అమలు జరుపుతున్న సంక్షేమ పధకాల మాదిరే మన దేశంలో కూడా ప్రకటిస్తున్నారు, దేశాన్ని దివాలా తీయిస్తారు జాగ్రత్త అనే అర్ధంలో ఒక పోస్టు పెట్టారు. సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టిన ప్రతిసారీ ప్రతి చోటా దేశాన్ని దివాలా తీయించటంతో పాటు జనాన్ని సోమరులుగా మారుస్తున్నారనే వాదనలు వినిపిస్తూనే వున్నాయి. కిలో రెండు రూపాయల బియ్యం పధకం, గతంలో పనికి ఆహార పధకం, ఇప్పుడు మహాత్మాగాంధీ గ్రామీణ వుపాధి పధకం, నిరుద్యోగ భృతి ఇలా ఒకటేమిటి ప్రతిదానికి ఏదో ఒక కారణం చూపి వ్యతిరేకించే వారు మనకు కనిపిస్తారు. ఇది మనదేశం లేదా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. అమెరికాలో కూడా ఆరోగ్యబీమా, ఆహార కూపన్లు( మన దగ్గర రెండురూపాయల బియ్యం పధకం మాదిరి), నిరుద్యోగభృతి, స్కూళ్లలో వుచిత మధ్యాహ్నభోజన పధకం, బలహీనవర్గాలకు గృహనిర్మాణం, పిల్లల సంరక్షణ సహాయం వంటి పధకాలన్నీ జనాన్ని ప్రభుత్వం మీద ఆధారపడే విధంగా చేస్తాయని, పనిచేయటానికి ఇష్టపడని వాతావరణాన్ని సృష్టిస్తాయనే అభిప్రాయాలు బలంగా వ్యక్తం చేసే పార్టీలు, శక్తులలో రిపబ్లికన్లు ముందుంటారు. ఓడిపోయినా సరే పార్టీలు ఇలాంటి వాగ్దానాలు చేయకూడదు, సోమరిపోతులను తయారు చేయకూడదని చెప్పేవారు మనకు అన్ని చోట్లా కనిపిస్తారు. పన్నుల రూపంలో తాము చెల్లించిన మొత్తాలను సంక్షేమ పధకాల పేరుతో కొంత మందికి దోచిపెడుతున్నారని, ఎందుకు పెట్టాలనే భావం దీని వెనుక వుంటుంది. ఇలాంటి వారు మహాఅయితే వికలాంగులు, పని చేయలేని వారి వరకు ఏదో దయా దాక్షిణ్యంగా సాయం చేసేందుకు సరే అంటారు.

Image result for cash support schemes for farmers

ఈ వాదన నిజమే అనుకుందాం, సంక్షేమ పధకాల పేరుతో పొందుతున్న నిధులను కుటుంబ అవసరాలు లేదా వినియోగానికి ఖర్చు చేస్తారనే అంగీకరిద్దాం. దాని వలన లబ్ది పొందేది పారిశ్రామికవేత్తలు, వ్యాపారులే కదా ! అంటే వారి వుత్పత్తులు వినియోగించేవారు లేకపోతే పరిశ్రమలూ నడవవు, వ్యాపారాలూ సాగవు. వుదాహరణకు వృద్దులకు ఇచ్చే పెన్షన్లూ, పిల్లలను బడికి పంపిన తలిదండ్రులకు ఇచ్చే ప్రోత్సాహక మొత్తాల వంటివి వాటిని ఏదో ఒక అవసర నిమిత్తం ఖర్చు చేసుకొనేందుకు తప్ప మరొకందుకు కాదు. అసలేమీ ఆదాయం లేకపోతే వారికి ఇచ్చే సొమ్ము వస్తు లేదా సేవల మార్కెట్లోకి వచ్చే అవకాశం వుండదు. ఆ మేరకు లావాదేవీలు తగ్గిపోతాయి. పెట్టుబడిదారీ వ్యవస్ధలో అనారోగ్యంతో వుంటూ పని చేయలేకపోతే అలాంటి వారిని భారంగా ఆ సమాజం భావిస్తుంది. పని చేస్తేనే పెట్టుబడిదారులకు లాభం. అందుకోసమైనా జనానికి వైద్య రాయితీలు ఇచ్చేందుకు పెట్టుబడిదారులకు అనుకూలమైన పాలకులు ముందుకు వస్తారు. అవి తమ ఘనతగా ఫోజు పెడతారు. ఎన్నికల ప్రచారానికి వాడుకుంటారు పని చేయగలిగిన వారు అనారోగ్యాలకు గురైతే సంభవించే నష్టం ఎంతో గతంలో అనేక సర్వేలు, పరిశోధకులు అంచనా వేశారు. సంక్షేమ పధకాల వెనుక దాగి వున్న అంశాలలో ఇవి కొన్ని. అన్నింటి కంటే వీటి గురించి ప్రపంచ బ్యాంకు ఏమి చెప్పిందనేది మరొక ముఖ్యాంశం.

ఎస్కే వాన్‌ గిల్స్‌, ఎర్డెమ్‌ ఓరక్‌ అనే ఇద్దరు పరిశోధకుల వ్యాసాన్ని సేజ్‌ వెబ్‌సైట్‌ 2015లో ప్రచురించింది. దానిలో అంశాల సారాంశాన్ని చూద్దాం.(అసక్తి వున్నవారు ఇక్కడ ఇస్తున్న లింక్‌లో దానిని పూర్తిగా చదువుకోవచ్చు). ‘ అభివృద్ధి చెందుతున్న మరియు సంధి దశలో వున్న దేశాలలో సామాజిక సాయం: రాజకీయ మద్దతు సాధన, రాజకీయ అశాంతిని అదుపు చేసేచర్య ‘ అన్నది దాని శీర్షిక. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధల ఏర్పాటుతో రెండవ ప్రపంచ యుద్దం తరువాత మార్కెట్లను అదుపులోకి తెచ్చుకొనేందుకు సూచించిన విధానాలనే నయా వుదారవాద విధానాలు లేదా నూతన ఆర్ధిక విధానాలు అని పిలుస్తున్నారు. ఆ విధానాలను అమలు జరుపుతున్నామని చెప్పుకొనే ధైర్యం లేని పాలకవర్గం వాటికి సంస్కరణలు అనే ముద్దు పేరు పెట్టి జనం మీద రుద్దారు. తామే ప్రవేశపెట్టామని చెప్పుకున్నారు. ప్రపంచ బ్యాంకు 1980-2013 మధ్య సిఫార్సు చేసిన 447 విధానపరమైన పత్రాలను ప్రచురించింది. వాటిని తీసుకున్న పరిశోధకులు తేల్చిన సారం పైన పేర్కొన్న శీర్షికలో వుంది. తమకు అభివృద్ధి తప్ప రాజకీయ అజెండా లేదు అని ప్రపంచబ్యాంకు ఎంతగా చెప్పుకున్నా, అవి వెల్లడించిన పత్రాలలో పరోక్షంగా చేసిన ప్రస్తావనల ప్రకారం ఆయా దేశాలలో తలేత్తే సామాజిక అశాంతిని చల్లార్చేందుకు, పక్కదారి పట్టించేందుకు, తమ విధానాలను అమలు జరుపుతున్న పాలకులకు రాజకీయ మద్దతు వుండాలంటే ఏమి చేయాలో ప్రపంచబ్యాంకు నిపుణులు సూచించారు. వాటిలో భాగమే సంక్షేమ పధకాలు.

Image result for cash support schemes for farmers-ysrcp

లాటిన్‌ అమెరికాలో అనేక దేశాలలో మిలిటరీ, ఇతర నియంతలను సమర్ధించటం, గద్దెనెక్కించి తమ ప్రయోజనాలను నెరవేర్చుకున్న అమెరికా, ఇతర ధనిక దేశాలు వుక్కు పాదాలతో జనంలో తలెత్తిన అసంతృప్తి, తిరుగుబాటును అణచలేమని గ్రహించి వారిని తప్పించి ప్రజాస్వామ్య పునరుద్దరణ పేరుతో తమకు అనుకూలమైన శక్తులను అధికారంలోకి తెచ్చారు. ఇది కూడా ప్రపంచబ్యాంకు సలహా ప్రకారమే అన్నది గమనించాలి.లాటిన్‌ అమెరికాలో జరిపిన ప్రయోగంలో నియంతలను తొలగించినా జనంలో అసంతృప్తి తొలగలేదని గ్రహించారు. అందువల్లనే సామాజిక సహాయ పధకాలను ముందుకు తెచ్చారు. ఈ పూర్వరంగంలో మన దేశంలో 1990దశకంలో తలుత్తిన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రపంచ బ్యాంకు షరతులను మన పాలకులు ఆమోదించారు. వాటికే సంస్కరణలు, నూతన ఆర్ధిక విధానాలు, నూతన శతాబ్దంలోకి తీసుకుపోతామనే తీపి కబుర్లు చెప్పారు. పాలకులకు ప్రజల నుంచి నిరసన ఎదురు కాకుండా చూసేందుకు 1995లో మన దేశంలో సామాజిక సహాయపధకాలకు శ్రీకారం చుట్టారు. వాటిలో భాగమే వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్‌లు తదితరాలు. తరువాత అవి ఇంకా విస్తరించాయి.

రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని చెప్పిన నరేంద్రమోడీ 2014లో గద్దెనెక్కిన తరువాత అనుసరించిన విధానాలు రైతాంగంలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించాయి. చివరికి పదిహేను ఏండ్లుగా ఎదురులేని రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ ఘడ్‌ రాష్ట్రాలలో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఆ రైతాంగాన్ని బుజ్జగించేందుకు, ఆ పరిస్ధితిని రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకొనేందుకు రూపొందించిందే ఎన్నికలకు ముందు రైతులకు పెట్టుబడి సాయం పధకం. రెండవ సారి గద్దెనెక్కిన తరువాత నరేంద్రమోడీ సర్కార్‌ ప్రకటించిన రైతుల భాగస్వామ్య పెన్షన్‌ పధకం అన్నది స్పష్టం. ఇలాంటి పధకాల గురించి ప్రపంచబ్యాంకు గతంలోనే సూచించింది. తెలంగాణాలో చంద్రశేఖరరావుకు రైతు బంధు పధకం గురించి సలహాయిచ్చిన అధికార యంత్రాంగానికి వాటి గురించి తెలుసు, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకం కాదని కూడా అవగాహన వుంది కనుకనే ముందుగా ప్రకటించి అమలు జరిపిన ఖ్యాతిని పొంది ఎన్నికల్లో ఎలా వినియోగించుకున్నారో చూశాము.

Image result for cash support schemes for farmers

నయా విధానాలు రైతాంగానికి గిట్టుబాటుగా లేవు, అందుకే వారు పదే పదే రుణగ్రస్తులౌతున్నారు. ఒకవైపు వారికి రుణమాఫీలు చేస్తాం, సాగు చేసినా చేయకపోయినా భూయజమానులకు నేరుగా వ్యవసాయ ఖర్చుల సాయం పేరుతో నేరుగా నగదు అందిస్తాం అని పార్టీలు వాగ్దానాలు చేస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలలో అమలు జరుపుతున్నాయి.రాబోయే రోజుల్లో ఇంకా రావచ్చు కూడా. ఈ సంక్షేమ పధకాలు శాశ్వతమా అంటే అవునని ఎవరూ చెప్పలేరు. వీటితో సమస్యలు పరిష్కారం అవుతాయా అంటే కావని లాటిన్‌ అమెరికా అనుభవాలే తిరిగి చెబుతున్నాయి. అక్కడ అధికారంలోకి వచ్చిన వామపక్ష శక్తులు మౌలిక విప్లవ సంస్కరణల జోలికి పోలేదు. నయా వుదారవాద పునాదుల మీద నిర్మించిన వ్యవస్ధల పరిధిలోనే అనేక సంక్షేమ పధకాలను అమలు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. వాటిని కూలదోసేందుకు అమెరికా సామ్రాజ్యవాదులు చేసే నిరంతర కుట్రలు ఒక భాగమైతే, వామపక్ష ప్రభుత్వాలు అనుసరించిన విధానలకు వున్న పరిమితులు కూడా వెల్లడయ్యాయి. అందుకే పదిహేనేండ్లు, ఇరవై సంవత్సరాల తరువాత ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. జనం ప్రజాకర్షక మితవాదులను గుడ్డిగా నమ్ముతున్నారు. తెలంగాణా పసుపు రైతులు, ఎర్రజొన్నల రైతులు కూడా రైతు బంధు పధకంతో లబ్ది పొందిన వారే. అయినా సరే మార్కెట్లో తమ వుత్పత్తులకు పడిపోయిన ధరలు అంతకంటే ఎక్కువ నష్టాన్ని కలిగించాయి గనుకనే ఎన్నికలు ముగిసిన వెంటనే రోడ్డెక్కారు. లోక్‌సభ ఎన్నికలలో దాన్నొక సమస్యగా ముందుకు తెచ్చారు.

Image result for cash support schemes for farmers

మన ఆహార వుత్పత్తి పెరగటానికి దోహదం చేసిన వాటిలో రసాయన ఎరువుల వినియోగం ఒక ముఖ్యపాత్రపోషించింది. రైతులకు తగినంత ఆదాయం లేదు కనుక ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చాయి. సంస్కరణల పేరుతో అమలు జరుపుతున్న నయా వుదారవాద విధానాలు వాటికి మంగళం పాడమని వత్తిడి చేసి విజయం సాధించాయి. పోషకాల ప్రాతిపదికన(ఎన్‌బిఎస్‌) సబ్సిడీ విధానం మరొక పేరు ఏదైనా పెట్టనివ్వండి, ఒక్క యూరియా మినహా మిగిలిన అన్ని మిశ్రమ, ఇతర రకాల ఎరువుల ధరలపై నియంత్రణ ఎత్తివేశారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సమాచారం ప్రకారం 2017 నవంబరు నుంచి 2018నవంబరు మధ్యకాలంలో మనం దిగుమతి చేసుకొనే యూరియా, డిఏపి, ఎంఓపి, ఫాస్పారిక్‌ యాసిడ్‌, రాక్‌ ఫాస్ఫేట్‌, అమోనియా, సల్పర్‌లలో మొదటి ఐదు రకాల ధరలు సగటున 21.47శాతం పెరిగాయి. చివరి రెండింటి ధర 8.51శాతం తగ్గింది. అంటే ఒక కిలో ధర వంద రూపాయలు అనుకుంటే ఏడు కిలోల ఎరువులు కొంటే ఏడాది కాలంలో ఐదింటికి అదనంగా చెల్లించింది రు.107 .35, రెండింటికి తగ్గిన ధర రు 17.02 నికరంగా రైతుమీద పడిన భారం 90రూపాయలకు పైమాటే. 2010-11లో డిఏపి క్వింటాలు ధర రు.1075, ఎంఓపి రు.505రులు వుండగా, మరుసటి ఏడాదికి అవి రు.1775, రు.1036కు పెరిగాయి.2018 నవంబరులో గరిష్ట ధరలు రు.2,862, రు.1799గా వున్నాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే 2011-12 నుంచి 2016-17 మధ్యకాలంలో ఎరువుల సబ్సిడీ రు.74570 కోట్లనుంచి 70100 కోట్లకు తగ్గాయి. ఆరు సంవత్సరాల సగటు రు.73,024 కోట్లు అంటే ధరల పెరుగుదలతో నిమిత్తం లేకుండా సబ్సిడీ మొత్తం స్ధిరంగా వుందంటే పెరుగుతున్న ధరల భారాన్ని రైతాంగమే మోస్తోంది. ఈ కాలంలో రూపాయి విలువ పతనమై అదనపు భారాన్ని మోపింది. ఇది యుపిఏ మన్మోహన్‌ సింగ్‌-బిజెపి మోడీ పాలనా కాలం.పాలకులు మారినా సబ్సిడీ మొత్తం మారలేదు.

2002-03 నుంచి 2008-09 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ మొత్తంలో ఎరువుల మీద ఇచ్చిన సబ్సిడీల వాటా 26.56శాతం నుంచి 62.22 శాతానికి పెరిగింది. అంటే వంద రూపాయల సబ్సిడీ ఇస్తే దానిలో ఎరువులకు రూ 62.22, దీన్ని జిడిపితో పోల్చి చూస్తే మొత్తం జిడిపిలో 0.48 నుంచి 1.51శాతానికి పెరిగాయి. అప్పటి నుంచి క్రమంగా తగ్గుతూ 2018-19నాటికి నిఖర ఎరువుల సబ్సిడీ 26.51 శాతానికి జిడిపిలో 0.43శాతానికి తగ్గింది. రైతులకు ఎంతో మేలు చేస్తానని చెప్పిన నరేంద్రమోడీ హయాం తొలి ఏడాది 2014-15లో 0.62శాతం వుండగా ఐదేండ్లలో అది 0.43శాతానికి పడిపోయింది. ఐదేండ్ల సగటు నిఖర సబ్సిడీ 28.73శాతంగానూ, జిడిపిలో సగటు 0.51శాతంగా వుంది. అంటే చివరి ఏడాది గణనీయ మొత్తం తగ్గిపోయింది. అక్కడ మిగిల్చిన మొత్తంలో కొంత రైతులకు పెట్టుబడి సాయం పేరుతో బదలాయించి అదనపు సాయం అన్నట్లుగా ప్రచారం చేసుకొని ఎన్నికల్లో రైతాంగాన్ని మాయచేసిన తీరును చూశాము.

Image result for cash support schemes for farmers

జరిగిన మోసం, దగా ఎలా వుందో చూద్దాం. ఎరువుల సబ్సిడీ విధానంలో మార్పు పేరుతో నూట్రియంట్స్‌ ప్రాతిపదికన సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. నిజానికి ఇది ఎడమ చేయి కాదు పుర చేయి అని చెప్పటమే.ఎన్‌పికె మిశ్రమ ఎరువును రైతు ఒక కిలో కొనుగోలు చేశారని అనుకుందాం. ఆ మూడింటికి కలిపి 2010లో ఇచ్చిన సబ్సిడీ రూ.24.66 వుంటే 2014-15 నాటికి రూ.18.35కు, 2018-19కి రూ.15.08కి తగ్గిపోయింది. అందువల్లనే పైన పేర్కొన్నట్లుగా బడ్జెట్‌లో సబ్సిడీ మొత్తాలను పెంచలేదు. గత పదేండ్ల కాలంలో పది రూపాయల వరకు రైతుల సబ్సిడీ కోత పడింది. ఇదిగాక మార్కెట్లో పెరిగిన ధరలు అదనం. దీన్నే చెంపదెబ్బ గోడదెబ్బ అంటారు. వ్యవసాయ పెట్టుబడుల మొత్తం పెరగటానికి ,రైతాంగానికి గిట్టుబాటు కాకపోవటానికి ఇదొక కారణం కాదా ! ఒక దగ్గర తగ్గించి మరొక దగ్గర ఇవ్వటం వలన అసలు సమస్య పరిష్కారం కాదు. సంక్షేమ పధకాలు శాశ్వతం అని చెప్పలేము. ఏదో ఒకసాకుతో రద్దు చేసినా ఆశ్చర్యం లేదు. ఒక వేళ కొనసాగించినా పెరుగుతున్న ఖర్చులతో పోల్చితే అవి ఏమూలకు సరిపోతాయన్న ప్రశ్న వుండనే వుంది. అసలు లేని దాని కంటే ఎంతో కొంత సాయం చేస్తున్నారుగా ! అని ఎవరైనా అనవచ్చు. అదే ఆ సంతృప్తితో వ్యవసాయ రంగంలో తలెత్తుతున్న ఆగ్రహాన్ని చల్లార్చటమే అసలు లక్ష్యం. పోగాలము దాపురించినపుడు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పసుపు-కుంకము పేరుతో బదలాయించిన డబ్బు తెలుగుదేశం పార్టీని కాపాడగలిగిందా ! ఎవరికైనా అదే గతి, వెనుకా ముందూ తేడా అంతే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

జన తీర్పులు అన్ని వేళలా సరిగానే వుంటాయా ?

25 Saturday May 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Latin America, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

Adolf Hitler, are the people's verdict always perfect ?, India elections 2019, Naredra Modi, people's verdicts, RSS

Image result for are the people's verdict always perfect

ఎం కోటేశ్వరరావు

తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్న లుబ్దావధాన్ల మాదిరి ఓటర్లు తీర్పు చెప్పారు. కేంద్రంలో పాత పాలకులే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచనున్నారు. కొన్ని కొత్త ముఖాలు, పాత ముఖాలు కొత్త వేషాలతో జనం ముందుకు వస్తారు. ఎన్నికల ప్రచారంలో వారూ, వీరూ అందరూ కలసి గత ఐదేండ్లలో తాము చేసింది సరైనదే అని సమర్ధించుకున్నారు కనుక విధానాలు, వైఖరిలో పెద్ద మార్పు వుండదు. సంస్కరణలను ఎంత వేగంగా అమలు జరిపితే అంతగా తలెత్తే పర్యవసానాల గురించి జనానికి పెద్దగా పట్టలేదన్నది స్పష్టం. కష్టాలు, నష్టాలను భరించటమే దేశభక్తి అనుకుంటున్నారు. ప్యూడల్‌ సమాజపు అవశేషాలు ఇంకా మనలను వెన్నాడుతున్నాయి గనుక గత జన్మల్లో చేసిన పాపాలు ఇంకా మనల్ని వెంటాడుతున్నాయి అనే వేదాంతంలో వున్నారు.

ఎందుకు అంటే, మన దేశంలో యోగులు, యోగినులు, బాబాలు, గురువులు ఇలా ఏ పేరైనా పెట్టండి. అంతా భక్తులు, అభిమానులుగా వచ్చే జనాన్ని మాయలో పడవేసినపుడు వారు మిగతా వాటి గురించి దేనినీ ఆలోచించరు, పట్టించుకోరు, ఎవరైనా హేతువాదులు ఇదేమిటి అని ప్రశ్నించినా సహనం కోల్పోయి అవాంఛనీయ చర్యలకు సైతం దిగటాన్ని మనం చూశాం. మన కళ్ల ముందే ఆశారాంబాపు, డేరాబాబా,కల్కి భగవాన్‌ ఇలా ఎందరో జనాన్ని ఎలా భక్తులుగా, వున్మాదులుగా మార్చుకున్నారో, ఎలా రెచ్చగొట్టారో చూశాము. వారంతా కొన్ని ప్రాంతాలకే పరిమితమైతే ఇప్పుడు బిజెపి అనే ఆశ్రమం, మోడీ అనే గురువు దేశమంతటా గణనీయమైన సంఖ్యలో జనాన్ని అటువంటి మాయలోకి నెట్టారు. గతంలో అనేక ఆశలతో మోడీకి ఓటు వేస్తే అవి అడిఆశలయ్యాయని అనుభవం చెబుతున్నా తిరిగి ఓటు వేశారు. అంటే దీన్ని మరో విధంగా చెప్పాలంటే గత ఐదు సంవత్సరాలలో పలు ఎత్తుగడలతో జనాన్ని తన భక్తులుగా, ప్రశ్నించని మత్తులోకి దించటంలో సఫలమయ్యారు. సమస్యల సంగతి తరువాత చూసుకుందాం ముందు మన మతానికి ముప్పు ఏర్పడిందట దాన్ని రక్షించుకుందాం అనే కుహనా ప్రచారం మాయలో పడిన జనం తమకు తెలియకుండానే పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లారు, ఓట్లు వేశారు. నరేంద్రమోడీ నాయకత్వంలోని పార్టీ, కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు.

జనం తీర్పును తప్పు పట్టకూడదు అనే ఒక వైఖరి ఫలితాలపై చర్చల సందర్భంగా వెల్లడైంది. ఇది దొంగను కూడా గారు అని మర్యాదగా పిలవాలి కదా అనే అతి మంచితనం కలిగిన వారు, తీర్పు మీద చర్చలోతుల్లోకి పోకూడదని భావించే వారు గెలిచిన వారిని, గెలిపించిన వారిని అభినందించాలి అనే వైఖరితో వచ్చిన సమస్య ఇది. న్యాయమూర్తులకు వుద్ధేశ్యాలను ఆపాదించకూడదు గానీ వారి తీర్పుల మంచి చెడ్డల మీద వ్యాఖ్యానించేందుకు ప్రజాస్వామ్యం హక్కునిచ్చింది. జన తీర్పుకు సైతం అదే వర్తిస్తుంది. జనానికి దురుద్ధేశ్యాలను ఆపాదించనవసరం లేదు. పని గట్టుకొని తప్పు పడితే ప్రయోజనం లేదు, అలాగని సమర్ధించనవసరమూ లేదు. వారి తీర్పు పర్యవసానం గురించి విమర్శనాత్మకంగా వైఖరిని చెప్పే హక్కును కలిగి వుండాలి.

అత్యాచారాలు,హత్యలకు కారకులైన ఆశారాంబాపు, డేరాబాబాల నిజస్వరూపం బయట పడేంతవరకు వారి మీద మాట పడనివ్వని రాజకీయ పార్టీలను చూశాము. వారి మీద నేర ఆరోపణలే తప్ప అవి రుజువు కాలేదుగా అని సమర్ధించి వారికి సాష్టాంగ పడిన వారిని, వారి మద్దతుతో ఓట్లు పొందిన వారినీ చూశాము. సామాన్యుల విషయానికి వస్తే గుడ్డిగా నమ్మి వారి మీద చిన్న విమర్శ చేసినా సహించక ఎంతకైనా తెగించిన వారిని చూశాము.

హిట్లర్‌ వంటి నరహంతకులను కూడా అధికార అందలం ఎక్కించింది జనమే.చరిత్రలో నియంతలు, నరహంతకులను జనం ముందుగా గుర్తించిన దాఖలాలు లేవు. చరిత్ర పాఠాలను సక్రమంగా తీసుకొని జాగ్రత్తలు పడుతున్నదీ లేదు. ఐరోపాలో హిట్లరూ, ముస్సోలినీ, ఫ్రాంకో, లాటిన్‌ అమెరికా, కొన్ని ఆఫ్రికన్‌, ఆసియా దేశాలలో ఇలా ఎందరినో జనం చూశారు. అలాంటి శక్తులకు అధికారం వస్తే ఏమి జరుగుతుందో మిగతా ప్రపంచం కంటే అలాంటి పాలనల్లో మగ్గిన వారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాంటి అనేక దేశాలలో, ఆ నియంతలకు బలైన దేశాలలో ఫాసిస్టు శక్తులు పెరుగుతున్న తరుణమిది. ఆర్ధిక వ్యవస్ధ తీవ్ర వడిదుడుకులు, వదలని మాంద్య పరిస్ధితులు వున్నపుడు వాటిని మార్చి అచ్చే దిన్‌( మంచి రోజులు) తెచ్చే దేవదూతలుగా నిరంకుశ శక్తులు ముందుకు రావటం గత చరిత్ర. ఇప్పుడు కూడా ప్రపంచంలో అదే పరిస్ధితిని ఆసరా చేసుకొని ఆశక్తులు తలెత్తుతున్నాయి. చరిత్ర పునరావృతం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అది పాత రూపం, పాత పద్దతుల్లోనే వుండనవసరం లేదు, వుండదు కూడా. మితవాద భావజాలానికి వూతమిస్తున్నదీ, దాని వెంట నడుస్తున్నదీ కూడా జనమే. అంటే జనం కూడా తప్పులు చేస్తారు అని చరిత్రే చెప్పింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ముందే చెప్పుకున్నట్లు అలాంటి తప్పు మెజారిటీ చేస్తే మెజారిటీ, తక్కువ మంది చేస్తే మైనారిటీ చేశారనే చెప్పాలి.

మధ్యయుగాల నాడు దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు మత యుద్ధాలు జరిగాయని చరిత్ర చదువుకున్నాము. క్రైస్తవులకు చెందిన పవిత్ర భూమిని ముస్లింలు ఆక్రమించారని దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని 1095లో పోప్‌ రెండవ అర్బన్‌ పిలుపు మేరకు కానిస్టాంటినోపుల్‌ రాజధానిగా వున్న బైజాంటైన్‌ రాజ్య రాజు తొలి మత యుద్ధాన్ని ప్రారంభించాడు.అవి 1291వరకు సాగాయి. పవిత్ర ప్రాంతాల స్వాధీనంలో విఫలమయ్యాయి. తరువాత ముస్లిం రాజులు విజృంభించి 150 సంవత్సరాల తరువాత బైజాంటైన్‌ రాజ్యాన్నే స్వాధీనం చేసుకొని ఒట్టోమన్‌ సామ్రాజ్యాన్ని విస్తరించి 20వ శతాబ్దం వరకు తిరుగులేకుండా ఏలారు. మత యుద్ధాలను సమర్ధించాలా లేదా అనేదాన్ని పక్కన పెడితే దానికి పవిత్ర ప్రాంతాలను మరొక మతం వారు స్వాధీనం చేసుకున్నారనే ఒక సాకు వుంది. నిజానికి ఆ ప్రాంతాలను ఎవరూ స్వాధీనం చేసుకోలేదు. పవిత్ర ప్రాంతాలుగా వర్ణితమైన చోట ఒక నాడు యూదు మతాన్ని జనం అవలంభించారు, అదే చోట యూదుమతం మీద తిరుగుబాటు లేదా విబేధించిగానీ క్రైస్తవం, తిరిగి అదే కారణాలతో క్రైస్తవం పరిఢవిల్లిన చోటనే ఇస్లాం మతం వునికిలోకి వచ్చింది తప్ప ఎవరో వచ్చి ఆ ప్రాంతాలను ఆక్రమించలేదు. మతం ఒక మత్తు, అది ఎక్కిన వారికి వేరే ఏమీ పట్టదు కనుక అబ్రహామిక్‌ మతాలుగా వున్న యూదు, క్రైస్తవ, ఇస్లాం మతాల పెద్దలు చరిత్రలో మారణకాండకు కారకులయ్యారన్నది చరిత్ర చెప్పిన సత్యం. మన దేశంలో మతాల చరిత్ర చూసినా ఆ ఛాయలు కనిపిస్తాయి.

మన దేశంలో కూడా మత యుద్ధాలకు గతశతాబ్దిలో నాంది పలికారు. అయితే క్రైస్తవ మతయుద్ధాలు కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకొనేందుకు జరిగితే ఇక్కడ హిందూ మత పునరుద్దరణ పేరుతో ప్రారంభమైంది. దానికి గాను హిందూ మత ప్రార్ధనా మందిరాలను ముస్లింలు ఆక్రమించి వాటిని మసీదులుగా మార్చారనే ఆధారాలు లేని వివాదాలను ముందుకు తెచ్చారు. బాబరీ మసీదు ప్రాంతంలోనే రాముడు జన్మించాడని, అక్కడే రామాలయం వుండేదని తమ నమ్మకం అని చెబుతారు. నిజానికి మొఘల్‌ , ఇతర ముస్లిం పాలకులు దేవాలయాలను నాశనం చేసి మసీదులుగా మార్చి లేదా నిర్మించి వుంటే ఆలయాలేవీ మిగిలేవి కాదు. ఇతర మతాల వారు హిందూ మతాన్ని నాశనం చేస్తున్నారు, మతమార్పిడులకు పాల్పడుతున్నారు అనే పేరుతో వారి మీద బస్తీమే సవాల్‌ అంటూ అన్ని రకాల దాడులు చేస్తున్నారు. మెజారిటీ మతానికి ముప్పు ఏర్పడింది అనే ఒక అభిప్రాయాన్ని గణనీయమైన సంఖ్యలో కలిగించటంలో జయప్రదమయ్యారు. అలాంటి వారికి మరొక అంశం పట్టదు. బెంగాల్‌ రాష్ట్ర విభజనకు బ్రిటీష్‌ వారు చెప్పిన కారణాలు ఏవైనప్పటికీ దాన్ని కొందరు హిందూ-ముస్లిం విభజనగా చూశారు. హిందువుల హక్కల పరిరక్షణ పేరుతో 1910దశకంలో ప్రారంభమైన హిందూమహాసభ, తరువాత 1925లో వునికిలోకి వచ్చిన ఆర్‌ఎస్‌ఎస్‌ హక్కుల స్ధానంలో హిందుత్వ పరిరక్షణగా మార్చివేశారు. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే అది చివరికి నిజమై కూర్చుంటుందన్న గోబెల్స్‌ సూత్రీకరణను అమలు జరిపి హిందూ మతానికి ముప్పు ఏర్పడిందని నిజంగానే నమ్మేట్లు చేశారు. వందల సంవత్సరాల మొగలాయీల, బ్రిటీష్‌ వారి పాలనలో దేశంలో ఎన్ని మతమార్పిడులు జరిగినప్పటికీ 80శాతం మంది హిందువులుగానే వున్నారు.ఎన్నడో వందల సంవత్సరాల నాడు మతం మార్చుకున్నవారు కూడా హిందువులే అన్నది హిందూత్వ వాదుల అభిప్రాయం. దానిలో పాక్షిక సత్యం వుండవచ్చు, పంచముల పేరుతో గణనీయమైన జనాన్ని సామాజిక, ఆర్ధిక అణచివేతకు గురించి చేసిన హిందూ మనువాదమే దానికి కారణం. ఒక వేళ హిందూత్వ వాదులు కోరుకుంటున్నట్లు ఎవరైనా ముస్లింలు, క్రైస్తవులు తిరిగి హిందూమతంలోకి వారిని ఏ కులంలో చేర్చుకుంటారు. ఇప్పటికే వున్న వందలు, వేల కులాలకు తోడుగా ముస్లిం, క్రైస్తవ కులాలను ఏర్పాటు చేయటం తప్ప మరొక మార్గం ఏముంది. అలా మారి వారు బావుకునేదేముంది?

మత యుద్ధాలు రెండు వందల సంవత్సరాలు సాగాయంటే సామాన్యులు పాల్గొన కుండా సాధ్యమేనా ? మరి ఆ సామాన్యులు చేసింది మంచా, చెడా ? చెడే అని చరిత్ర తీర్పు చెప్పింది. వారెందుకు ఆ చెడ్డపని చేశారు అన్నది వెంటనే వచ్చే ప్రశ్న. చరిత్ర కారుడు గిల్స్‌ కానిస్టేబుల్‌ అభిప్రాయం ప్రకారం మత యుద్ధాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎవరి కారణాలు వారికున్నాయి. క్లారివాక్స్‌కు చెందిన సెయింట్‌ బెర్నాడ్‌ 1140వ సంవత్సరంలో శక్తిశాలి సైనికుడు లేదా యుద్ద వీరుడు అనే పేరుతో రాసిన దానిలో నీవు ఇప్పుడు యుద్దం చేయాల్సిన తరుణం వచ్చింది. నీవు గనుక విజయం సాధిస్తే అది కీర్త నీయం అవుతుంది. ఒక వేళ జెరూసలేము కొరకు పోరాటంలో మరణించావనుకో నీవీ స్వర్గంలో ఒక చోటును గెలుచుకుంటావు, పవిత్ర నగరాన్ని మత ద్రోహుల నుంచి విముక్తి చేసి యాత్రీకులకు దారి ఏర్పాటు చేయాలంటే దాన్ని విముక్తి చేయాలన్న పోప్‌ పిలుపులను నీవు పాటించాలి అని పేర్కొన్నారు. గతంలో చేసిన తప్పిదాల నుంచి క్షమాపణ పొందటానికి పాల్గొనాలి. మత యుద్ధాల్లో పాల్గొన్న ఎవరినైనా క్షమిస్తానని పోప్‌ ఒక అవకాశం ఇచ్చారు. అనేక యుద్ధాల్లో ఎందరి ప్రాణాలనో తీసిన రాజులకు ఇది అవసరంగా కనిపించింది. యుద్ధంలో పాల్గొనటం ద్వారా కొత్త ప్రపంచాన్ని చూడవచ్చు, ఒక సాహసం చేసినట్లు వీరత్వాన్ని ప్రదర్శించటానికి అవకాశం దొరుకుతుంది అని కొందరు భావించారు. తలిదండ్రుల నుంచి వారసత్వంగా భూములు, సంపదలు పొందే అవకాశం లేని కుమారులు విదేశాల్లో భూములు, సంపదలు పొందవచ్చని పాల్గొన్నారు. ఈ యుద్దంలో పాల్గొంటే స్వేచ్చ నిస్తామని పోప్‌ వాగ్దానం చేశారు కనుక బానిసలు, ఫ్యూడల్‌ శక్తుల వద్ద బందీలుగా వున్న రైతులు అందుకోసం దాడుల్లో భాగస్వాములయ్యారు. తమకు తలనొప్పిగా వున్న సామంత రాజులు, లేదా రాజకుటుంబీకులను వదలించుకొనేందుకు వారిని మతయుద్ధాలకు పోవాల్సిందిగా రాజులు ఆదేశాలు జారీ చేశారు. మరి కొందరు చరిత్ర కారుల అభిప్రాయం ప్రకారం మత యుద్దాల వెనుక ప్రధాన లక్ష్యం మతపరమైనదే అయినప్పటికీ పాల్గొన్న అనేక మందికి పైన పేర్కొన్న సంపదలు, భూమి, అధికారం వంటి ఆకాంక్షలు కూడా వున్నాయి. జెరూసలెమ్‌కు వెళ్లే దారిలో కానిస్టాంటినోపుల్‌ సమీపంలోని ఎడేసా అనే ప్రాంతం లేనప్పటికీ దాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకొనేందుకు అక్కడి క్రైస్తవులను కూడా హతమార్చటాన్ని అందుకు తార్కాణంగా చూపారు.

మన దేశంలో మత యుద్దాన్ని ప్రోత్సహిస్తున్న వారి వెనుక బయటికి కనిపించని అంశాలెన్నో వున్నా పైకి చెబుతున్నది మాత్రం హిందూ మత రక్షణ. ఇది పవిత్ర యుద్దం అని భావిస్తున్నవారికి తెలియని ఆవేశం, మతానికి ఏదో ముప్పు వచ్చి పడుతోందన్న మానసిక భయం తప్ప పైన పేర్కొన్న మతయుద్ధాలలో మాదిరి సంపదలు, భూములు, రాజ్యాల వంటి లక్ష్యాలు వున్నాయని చెప్పలేము, వారికి హిందూత్వ శక్తుల ముసుగు అజెండా ఏమిటో తెలుసా అంటే తెలియదనే చెప్పాలి. ఎవరైనా మాకు తెలుసు అంటే విద్వేషం తలకు ఎక్కించుకున్న వారు తప్ప వేరు కాదు. వివేచనలేని ఆవేశం, గుడ్డి నమ్మకాలు, గుడ్డి ద్వేషంతో బాబరీ మసీదును కూల్చివేసింది, లేదా గోరక్షణ పేరుతో దాడుల్లో, మత ఘర్షణల్లో పాల్గొంటున్నదీ సామాన్యులే. వీరిలో కేంద్ర ప్రభుత్వ విధానాల వలన నష్టపోతున్న రైతు బిడ్డలు, వ్యవసాయ కార్మికులు, వృత్తులు అంతరించి నిరుద్యోగ సైన్యంలో చేరుతున్న చేతివృత్తుల వారూ, నిరుద్యోగులూ, ధరల పెరుగుదల వలన బతుకు అతలాకుతలం అవుతున్నవారూ అందరూ వున్నారు. వారెవరూ ఓటు వేయకుండా బిజెపి, దాని మిత్రపక్షాలకు అన్ని ఓట్లు ఎలా వస్తాయి. ఇలా ఎందుకు జరుగుతోందో అంతు తెలియని అంశమేమీ కాదు. దాన్నుంచి జనాన్ని ఎలా మళ్లించాలనేదే అసలైన సమస్య.

జనం ఆమోదం పొందటం వేరు, జనం చేత ఆమోదింప చేయటం, మాయలో పడవేయటం వేరు. రెండోదాన్ని ఆంగ్లంలో మాన్యుఫాక్చరింగ్‌ కన్సెంట్‌ అంటున్నారు. దీన్ని ఒక విధంగా చెప్పాలంటే మాయలో పడవేసి జనం చేత తలూపించటం. సంఘటితమైనదిగా పైకి కనిపించకుండా అది సామాజిక లేదా సాంప్రదాయ మాధ్యమాల ద్వారా, మౌఖిక ప్రచారం, ప్రతిదానినీ వాణిజ్యీకరణ ద్వారా కొన్ని సిద్ధాంతాలు, పదసమూహాలు, రూపాలు లేదా నమ్మకాలు వేటినైనా సరే ఎలాంటి వివరణ అడగకుండా, హేతుబద్దమైన ప్రశ్నలు లేకుండా ఆమోదం తెలిపేట్లు, విధేయత చూపేట్లు, మొగమాటం పెట్టి తలూపేట్లు చేసే విధానం ఇప్పుడు ప్రపంచ సమాజాన్ని వూపివేస్తున్నది. అందుకు మనది మినహాయింపు కాదు. మచ్చుకు ఏమిటీ మీకు ఎయిడ్సా అన్నట్లుగా మీ పిల్లలను ప్రభుత్వ స్కూలుకు పంపుతున్నారా, మీరు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళుతున్నారా , మీకు కారు కూడా లేదా అని ఎవరైనా అడిగితే ఎదుటి వారు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం. ఈ ఎన్నికల సందర్భంగా టీవీ ఛానల్స్‌ చర్చల్లో ప్రజల సమస్యల మీద జరిగిన చర్చ లెన్ని, రాజకీయ వివాదాలు, ఆరోపణలు,ప్రత్యారోపణలపై చర్చలెన్నో పరిశీలించండి. అంటే యాజమాన్యాల ప్రయోజనాలకు నష్టం లేని లేదా పాలకులకు ఆగ్రహం కలిగించని అంశాల చుట్టూ చర్చలను పరిమితం చేయటం, బలవంతంగా చూపటం వాటికి అలవాటు చేయటం దీనిలో భాగమే. టీవీ ఛానల్స్‌, పత్రికలను మనం డబ్బు చెల్లించే పొందుతున్నాం. మనం డబ్బు చెల్లించేటపుడు మనకు కావాల్సింది పొందుతున్నామా లేదు, డబ్బిచ్చి మరీ వారు చూపింది చూస్తున్నాం, ఇచ్చిన వార్తలను చదువుతున్నాం. వాట్సాప్‌ గ్రూపుల్లో వచ్చే సమాచారం వాస్తవమైనదా కాదా అనే విచక్షణతో ఎందరు పరిశీలిస్తున్నారు. ఎవరు, ఏమిటి,ఎక్కడ,ఎప్పుడు, ఎందుకు, ఎలా అనే ఆరు ప్రశ్నలను అడగలేని బలహీనతకు లోనైన స్ధితిలోకి మనల్ని నెట్టారంటే అతిశయోక్తి కాదు. మన పిల్లలకు వాటిని నేర్పుతున్నామా అంటే లేదు. మా పెద్దలు చేశారు, మేము చేస్తున్నాము, మీరు కూడా చేయండి. మేము కూడా ప్రశ్నించలేదు అంటూ ప్రశ్నించే తత్వాన్ని మొగ్గలోనే తుంచి వేస్తున్నాం. అలాంటి తరం మా పెద్దలు పాలకులను నిలదీయలేదు మేము మాత్రం ఎందుకు చేయాలి అంటే దేశం ఎటుపోతుంది.ప్రతి కొన్ని సంవత్సరాలకు తమను అణచివేసే అసామాన్య ప్రతినిధులెవరో నిర్ణయించుకొనేందుకు అణచివేతకు గురయ్యే వారు అనుమతిస్తారు అని కారల్‌ మార్క్స్‌ చెప్పారు. ఇప్పుడు మన దేశంలో అదే జరుగుతోందా? గతంలో కాంగ్రెస్‌ను అనుమతిస్తే ఇప్పుడు మతవాదుల వంతు వచ్చిందా ?

Image result for people's verdict, hitler

బ్రిటీష్‌ వారు, అంతకు ముందు మొగల్స్‌, ఇతరులు మన దేశాన్ని ఆక్రమించటం గురించి, దీర్గకాలం పాటు మన సమాజం విదేశీ ఆక్రమణను వ్యతిరేకించకపోవటం, ప్రతిఘటన, స్వాతంత్య్ర పోరాటం, దీర్ఘకాలం కాంగ్రెస్‌ పాలన కొనసాగటం, అసలు స్వాతంత్య్రవుద్యమంతో ప్రమేయం లేకపోవటమే కాదు, వ్యతిరేకించిన శక్తుల వారసులు ఇప్పుడు తామే అసలైన జాతీయవాదులమని చెప్పటం, ప్రత్యామ్నాయ విధానాల వంటి ప్రతి అంశాన్ని పైన చెప్పిన ఆరు ప్రశ్నలతో మన సమాజంలో కొందరైనా విశ్లేషించి వైఖరులను నిర్దేశించుకొన్న రోజునే సమాజ మార్పుకు నాంది అవుతుంది. ఇది ఎలా అన్నది ఒక సమస్య. జనానికి ఇలాగే కావాలి అని జనాన్ని తిడితే ప్రయోజనం లేదు. పాలకుల విధానాలతో పాటు సమాజంలో జనాన్ని ప్రభావితం చేస్తున్న అన్ని రంగాల మంచి చెడ్డలతో పాటు జనంలో వుండే అవకాశవాదాన్ని కూడా మిత్ర వైరుధ్యంలో భాగంగా చర్చించాలి. మేథావులు ప్రజారంగంలోకి రావాలి, ఈ రంగంలోని కార్యకర్తలు మేథోపరమైన అధ్యయనాలను చేసి వాస్తవిక పరిస్ధితులకు అనుగుణంగా మేళవించి విశ్వసనీయతను పొందటం ద్వారానే జరుగుతుంది. దీని అర్ధం పరస్పరం పాత్రలను మార్చుకోవాలని కాదు. ఒకరి అనుభవాన్ని మరొకరు వుపయోగించుకొని ఆచరణాత్మక వైఖరిని, ఎత్తుగడలను అనుసరించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వర్తమానంలో మేడే ప్రాధాన్యత !

26 Friday Apr 2019

Posted by raomk in Current Affairs, employees, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

International Workers' Day, may day, May Day 2019, May Day significance, May day significance in the contemporary period

Image result for may day haymarket

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ అభివృద్ధి రేటు గతేడాది వున్న 3.6శాతం నుంచి ఈ ఏడాది 3.3కి తగ్గుతుందని, వచ్చే ఏడాది తిరిగి 3.6శాతం వుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) ప్రకటించింది. ఏడాదిలో ప్రతి ఆరునెలలకు ఒకసారి ఆర్ధిక వ్యవస్ధల మంచి చెడ్డల గురించి తన అంచనాలను వెల్లడిస్తుంది. ఈ సంస్ధ వునికిలోకి వచ్చిన ఏడు దశాబ్దాలలో ప్రపంచంలో ముఖ్యంగా ధనిక దేశాలలో తలెత్తిన ఆర్దిక సంక్షోభం గురించి ఎన్నడూ జోస్యం చెప్పలేకపోయింది. అందువలన అది చెప్పే అంచనాలకూ అదే పరిస్ధితి. ఈ ఏడాది జనవరిలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ 3.5శాతం రేటుతో అభివృద్ధి చెందనుందని చెప్పింది. మన విషయానికి వస్తే 2019-20లో 7.5 అని గతంలో చెప్పిన జోశ్యాన్ని 7.3%కు తగ్గించింది. వచ్చే ఏడాది మాత్రం 7.5శాతం తగ్గదట. మన రిజర్వుబ్యాంకు, ఏడిబి 7.2 అని, ఫిచ్‌ అనే రేటింగ్‌ సంస్ధ 6.8, ప్రపంచ బ్యాంకు 7.5శాతంగా తమ అంచనాలను పేర్కొన్నాయి. సరే నరేంద్రమోడీ సర్కార్‌ ప్రారంభించిన లెక్కల సవరింపు చివరికి ఎంత అని తేలుస్తుందో తెలియదు. ప్రపంచంలో 70శాతం ఆర్ధిక వ్యవస్ధలు మందగమనాన్ని సూచిస్తున్నాయని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్ధిక వేత్త మన దేశానికి చెందిన గీతా గోపీనాధ్‌ పేర్కొన్నారు.2020 తరువాత అభివృద్ధి 3.5శాతం దగ్గర స్ధిరపడనుందని ఆమె పేర్కొన్నారు. ఐఎంఎఫ్‌ చెప్పే అంకెల విశ్వసనీయత సమస్యను కాసేపు పక్కన పెడదాం. వాటినే పరిగణనలోకి తీసుకుంటే కార్మికవర్గానికి అర్దం అయ్యేదేమిటి? గతేడాది కంటే ఈ ఏడాది పరిస్ధితి దిగజారుతుంది, వచ్చే ఏడాది గతేడాది మాదిరే వుంటుంది. ప్రపంచీకరణ యుగంలో వున్నాం. మనకు ఆమోదం వున్నా లేకపోయినా మన పాలకులు మన దేశాన్ని ప్రపంచీకరణ రైలు ఇంజనుకు బోగీగా తగిలించారు. అందువలన దాని నడతను బట్టే మన పరిస్ధితీ వుంటుంది. గీతా గోపీనాధ్‌ చెప్పినట్లు రాబోయే రోజుల్లో పరిస్ధితిలో పెద్దగా మార్పు వుండదంటే మూడు సంవత్సరాలలో కార్మికవర్గం ఎదుర్కొనే సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయే తప్ప తగ్గవు అన్నది స్పష్టం. అందువలన తామేం చేయాలో కూడా కర్తవ్యాన్ని నిర్ణయించుకోవాలి. అదే ఈ మే డే సందేశం.

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. మిగతా చోట్ల మిగిలిన దశ ఎన్నికలు జరగున్నాయి. పోలింగ్‌ ముగిసిన చోట ఓటరు తీర్పు రిజర్వు అయింది. అందువలన భావోద్వేగాలను పక్కన పెట్టి వుద్యోగులు, కార్మికులు ఆలోచించటం అవసరం. ఈ ఎన్నికలకు ముందు రెండు తెలుగు రాష్ట్రాలలో వుపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలు జరిగాయి. చిత్రం ఏమిటంటే రెండు చోట్లా అధికారపార్టీతో అంటకాగిన వుపాధ్యాయ నేతలు మట్టి కరిచారు. గత ఐదు సంవత్సరాలుగా వారు ఆయా ప్రభుత్వాల మీద కల్పించిన భ్రమలు టీచర్లు, గ్రాడ్యుయేట్లలో తొలగిపోతున్నాయనేందుకు ఇదొక సంకేతం. వుద్యోగులు, వుపాధ్యాయుల్లో ఏడాది కేడాది నూతన పెన్షన్‌ స్కీం అమలయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ పధకాన్ని ప్రవేశపెట్టి, అమలు జరిపిన పార్టీలు కూడా దానిని రద్దు చేస్తామని ఎన్నికల ఆపదమొక్కులు మొక్కుతున్నాయి. వాగ్దానాలు చేసిన పార్టీలు లేదా వాటికి మద్దతు పలికిన వుద్యోగ సంఘాల నేతలు గానీ అధికారంలో వున్నపుడు కొత్త పెన్షన్‌ స్కీము రద్దు చేసి పాతదానిని ఎందుకు పునరుద్దరించలేదో సంజాయిషీ ఇవ్వాలి, వుద్యోగులు నిలదీయాలి.

ప్రపంచ వ్యాపితంగా అమలు జరుగుతున్న నయా వుదారవాద విధానాలు మొత్తంగా జనాన్ని భ్రమలకు గురి చేస్తాయి. అలాంటపుడు శ్రమ జీవులు దానికి అతీతంగా ఎలా వుంటారు. అందుకే ఆశల పల్లకిలో వున్న వారు కుదుపుకు గురైతే తట్టుకోలేరు. ఎప్పుడు వుద్యోగాలు వూడతాయో తెలియదు. ఏటా రెండు కోట్ల వుద్యోగాలను కల్పిస్తాన్న నరేంద్రమోడీ వాగ్దానాన్ని జనం నమ్మారు. కొత్తవాటి సంగతి దేవుడెరుగు వున్న వుద్యోగాలే వూడుతున్నాయన్నది వాస్తవం. ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు విషయంలో ఐఎంఎఫ్‌ ప్రపంచంతో పాటు మన దేశ అంచనాను తగ్గించింది. మన విషయానికి వస్తే 2019-20లో 7.5 అని గతంలో చెప్పిన జోశ్యాన్ని 7.3%కు తగ్గించింది. వచ్చే ఏడాది మాత్రం 7.5శాతం తగ్గదట. మన రిజర్వుబ్యాంకు, ఏడిబి 7.2 అని, ఫిచ్‌ అనే రేటింగ్‌ సంస్ధ 6.8, ప్రపంచ బ్యాంకు 7.5శాతంగా తమ అంచనాలను పేర్కొన్నాయి. సరే నరేంద్రమోడీ సర్కార్‌ ప్రారంభించిన లెక్కల సవరింపు చివరికి ఎంత అని తేలుస్తుందో తెలియదు. ప్రపంచంలో 70శాతం ఆర్ధిక వ్యవస్ధలు మందగమనాన్ని సూచిస్తున్నాయని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్ధిక వేత్త , మన దేశానికి చెందిన గీతా గోపీనాధ్‌ పేర్కొన్నారు.2020 తరువాత అభివృద్ధి 3.5శాతం దగ్గర స్ధిరపడనుందని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి అంకెలను పరిగణనలోకి తీసుకున్నపుడు ఎక్కువ అభివృద్ధి వున్న చోట నిరుద్యోగం తగ్గాలి, తక్కువ వున్న చోట పెరగాలి. ఆ రీత్యాచూసినపుడు మనది చైనా కంటే ఎక్కువ అభివృద్ధి రేటుతో ముందుకు పోతోంది. కానీ మన దగ్గర రికార్డు స్దాయిలో నిరుద్యోగం వున్నట్లు అంకెలు చెబుతున్నాయి. ఫిబ్రవరి నెలలో గరిష్ట స్ధాయిలో 7.2%కి పెరిగింది. మార్చినెలలో 6.7కు తగ్గింది. పన్నెండు నెలల సగటును ఏడాదికి తీసుకుంటారు, ఆవిధంగా గత ఏడాది 6.1శాతం 45ఏండ్ల రికార్డును తాకింది. అభివృద్ధి రేటు తగ్గనున్నందున నిరుద్యోగం మరింత పెరగనుంది.

మన ఆర్ధిక వ్యవస్ధలో కార్మిక భాగస్వామ్య రేటు ఫిబ్రవరి కంటే మార్చినెలలో 42.7 నుంచి 42.6కు పడిపోయింది. పట్టణ ప్రాంతాలలో పని చేస్తున్న వారి సంఖ్య 129 మిలియన్ల నుంచి 127కు పడిపోయింది.2016 తరువాత పట్టణ కార్మిక వర్గ భాగస్వామ్యం 40.5శాతానికి తొలిసారిగా పడిపోయింది. ఇంతవరకు 2018 నవంబరులో హీనస్ధాయిలో 37.3శాతంగా నమోదైంది.నిరుద్యోగశాతం 7.9గా వుంది. మార్చినెలలో పదిలక్షల వుద్యోగాలు పెరిగితే పదిలక్షల మంది పురుష వుద్యోగులు ఇంటిదారి పట్టారు. పట్టణ ప్రాంతాల్లో మహిళా వుపాధి కూడా తగ్గిపోయింది.

Image result for may day india citu

అభివృద్ధి రేటు ఎక్కువ వున్నపుడు వుద్యోగాలేమైనట్లు అని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ప్రశ్నించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం పాకిస్ధాన్‌లో జిడిపి వృద్ధి రేటు 2.9శాతానికి తగ్గనుంది. గత ఏడాది 5.2శాతం వుంది. అభివృద్ధి రేటు తగ్గనున్న కారణంగా ప్రస్తుతం వున్న 6.1శాతం నిరుద్యోగం 6.2శాతానికి పెరగనుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. దాయాది దేశం కంటే మన వృద్ధి అంకెలు ఎంతో మెరుగ్గా వున్నా నిరుద్యోగం విషయంలో మనం దానికి దగ్గరగా లేదా ఎక్కువగా వుండటం ఏమిటన్నది ప్రశ్న. వుపాధి రహిత అభివృద్ధి వుద్యోగుల, కార్మికుల బేరసారాలాడే సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుంది. గతంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరించే డిఏను వుద్యోగులకు నష్టదాయకంగా ఆరునెలలకు చేస్తే సంఘాలేమీ చేయలేకపోయాయి. కారుచౌకగా పనిచేసేందుకు సిద్దం సుమతీ అంటున్నవారు క్యూకడుతున్న కారణంగానే పర్మనెంటు వుద్యోగాల స్ధానంలో కాంట్రాక్టు, పొరుగు సేవల పేరుతో తక్కువ వేతనాలకు పనిచేయించుకుంటున్నారు. ఒకే పనికి ఒకే వేతనం అన్న సహజన్యాయం అన్యాయమై పోతోంది. దీనికి వ్యతిరేకంగా వుద్యో గులు, నిరుద్యో గులూ ఐక్యంగా పోరాడకపోతే రేపు వుద్యోగుల మీద జరిగే దాడిని అన్యాయం అనేవారు కూడా మిగలరు. కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమును ప్రవేశపెట్టినపుడు అప్పటికే వుద్యోగాల్లో వున్న తమకు అది వర్తించదు కదా అని వుద్యో గులు పట్టించుకోలేదు, అసలు వుద్యోగాలు లేనపుడు ఏదో ఒకటి అని నిరుద్యోగులు ఆలోచించలేదు. తీరా కొత్త పెన్షన్‌ స్కీములో చేరిన కొత్తవుద్యో గులకు రోజులు గడిచే కొద్దీ జరిగే నష్టం ఏమిటో అర్ధం అయింది. ప్రపంచీకరణ యుగంలో కార్పొరేట్ల లాభాలు తగ్గేకొద్దీ శ్రమజీవుల సంక్షేమ చర్యల మీద ముందు దాడి జరుగుతుంది. అందువలన ప్రతి పరిణామాన్ని జాగరూకులై పరిశీలించాల్సి వుంది.

ఏడాది క్రితం అమెరికన్లు చైనా, ఇతర దేశాలతో ప్రారంభించిన వాణిజ్య యుద్ధం కారణంగా గతేడాది అక్టోబరు నుంచి ఐఎంఎఫ్‌ మూడు సార్లు ప్రపంచ అభివృద్ధి అంచనాలను తగ్గించింది. అమెరికన్లు వాణిజ్య యుద్ధాన్ని ఒక్క చైనాకే పరిమితం చేయటం లేదు. ఐరోపా యూనియన్‌ నెదర్లాండ్స్‌లోని ఎయిర్‌ బస్‌ విమాన కంపెనీకి అనుచితంగా సబ్సిడీలు ఇస్తున్నందున తమ దేశంలోని బోయింగ్‌ కంపెనీ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని చాలా కాలంగా అమెరికన్‌ కార్పొరేట్లు గుర్రుగా వున్నాయి. ఐరోపా యూనియన్‌ వుత్పత్తులపై 11బిలియన్‌ డాలర్ల మేరకు దిగుమతి పన్నులు విధిస్తాంటూ ఏప్రిల్‌ పదిన డోనాల్డ్‌ ట్రంప్‌ వాణిజ్య యుద్దంలో కొత్త రంగాన్ని తెరిచాడు. బోయింగ్‌ కంపెనీకి ఇస్తున్న సబ్సిడీల సంగతి తాము తేలుస్తామంటూ ఐరోపా యూనియన్‌ ప్రతిసవాల్‌ చేసింది. ట్రంప్‌ జపాన్‌ మీద కూడా దాడి ప్రారంభించేందుకు పూనుకున్నాడు. భారత్‌తో సహా వాణిజ్య లోటు వున్న ప్రతిదేశం మీద అమెరికా దాడి చేసేందుకు పూనుకుంది. అంటే బలవంతంగా తన వస్తువులను కొనిపించే గూండాయిజానికి పాల్పడుతోంది. ఇది ఏ దేశానికి ఆ దేశం రక్షణాత్మక చర్యలకు పూనుకొనేట్లు చేస్తోంది, కొత్త వివాదాలను ముందుకు తెస్తోంది. ముందే చెప్పుకున్నట్లు ఏ దేశానికి ఆదేశం తన కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడేందుకు పూనుకోవటం అంటే జనం మీద భారాలు మోపటం, వున్న సంక్షేమ చర్యలకు మంగళం పాడటమే. ఫ్రాన్స్‌లో పసుపు చొక్కాల వుద్యమం ప్రతి శనివారం ఏదో ఒక రూపంలో జరుగుతోంది, ఇలాగే అనేక దేశాల్లో కార్మికవర్గం నిరసన తెలుపుతోంది. వేగంగా పెరుగుతున్న సంపద అంతరాలు వుద్యమాలు, విప్లవాలకు దారి తీస్తాయన్న హెచ్చరికలు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదు.

ప్రపంచంలో ప్రస్తుతం 66దేశాల్లో మేడే రోజున ప్రభుత్వాలు సెలవులు ఇస్తున్నాయి. ఇది కార్మికవర్గ విజయం. దీన్నే మరొక విధంగా చెప్పాలంటే మెజారిటీ దేశాలలో సెలవు లేదంటే దాన్నే సంపాదించలేని కార్మికవర్గం దోపిడీని అంతం చేయాలంటే ఇంకా ఎంతో చేయాల్సి వుందన్నది స్పష్టం. సెలవు వున్న దేశాల్లో కూడా కార్మికవర్గంలో కొన్ని అపోహలు, అవాంఛనీయ ధోరణులు వున్నాయి.

Image result for may day

ఈ రోజుల్లో కూడా మేడే ఏమిటండీ. ప్రపంచమంతా సోషలిజం, కమ్యూనిజం అంతరించిపోయింది. కొంత మంది పొద్దున్నే జండాలు ఎగరేసి, మధ్యాహ్నం నుంచి తాగి తందనాలాడటం, లేకపోతే మొక్కుబడిగా ఒక ర్యాలీ, సభో జరపటం తప్ప చేస్తున్నదేమిటి? అయినా అసలు మేడే గురించి దానిని పాటించే వారికి ఎందరికి తెలుసు, ఒక రోజు పని మానివేయటం తప్ప ఎందుకిది అని పెదవి విరిచే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతోంది. ప్రపంచవ్యాపితంగా కార్మికోద్యమాలు వెనుక పట్టుపట్టిన కారణంగా ఇటువంటి చైతన్య రహిత భావాలు ప్రబలుతున్నాయి. ప్రభుత్వ, బ్యాంకు, మార్కెటింగు, విత్త కంపెనీల కార్యకలపాలు నిర్వహించే వుద్యోగులు ఇప్పటికే తాము కార్మికులని అనుకోవటం మానేశారు. కంపెనీ క్యాబుల్లో పని ప్రదేశాలకు వెళుతూ మహానగరాలలో పని చేసే ఐటి కంపెనీలు, వాటి అనుబంధ కార్యకలాపాలు నిర్వహించే వారు తమది ప్రత్యేక తరగతి అనుకుంటున్నారు. ఆ లెక్కన సంప్రదాయ భాష్యం ప్రకారం అసలు కార్మికులు ఎందరు ? ఎవరు? ఇప్పటికీ కార్మికులం అని భావించే అనేక మందికి మేడే ఒక వుత్సవం. మరి కొంత మందికి ఆ రోజు దీక్షా దినం. వుత్సవానికి, దీక్షా దినానికి తేడా ఏమిటి ?

మేడేను వుత్సవంగా జరిపినా, దీక్షా దినంగా పాటించినా కార్మికుల బతుకులు ఆదివారం నాడు అరటి మొలచింది…. శనివారం నాడు పాపాయి చేతికి పండు వచ్చిందన్నంత సులభంగా మారటం లేదు, మారవు అని గమనించాలి. ఈ పూర్వరంగంలో కార్మికులు, ఇతర కష్ట జీవులు మే డేని ఎలా జరుపుకోవాలా అన్నది వారి చైతన్యానికి గీటురాయి.

Image result for may day haymarket

ప్రతి ఏడాదీ చెప్పుకొనేదే అయినప్పటికీ కొత్త తరాలు వస్తుంటాయి గనుక ముందుగా మే డే చరిత్ర గురించి తెలుసుకుందాం. చాలా మంది మే డే అంటే ఎర్రజెండా పార్టీల రోజు, కమ్యూనిస్టుల వ్యవహారం అనుకుంటారు. నిజానికి దీనికీ కమ్యూనిస్టుపార్టీకి సంబంధం లేదు. మన దేశంతో సహా అనేక చోట్ల కమ్యూనిస్టులతో సంబంధం లేకుండానే కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి. అనేక డిమాండ్లను యజమానుల ముందుంచాయి. రోజుకు ఎనిమిది గంటల పని దినాన్ని అమలు జరపాలని కోరుతూ అమెరికాలోని కార్మికవర్గం కమ్యూనిస్టుపార్టీ పుట్టక ముందే అనేక ఆందోళనలు చేసింది. వాటిలో భాగంగా 1886 ఏప్రిల్‌లో అనేక చోట్ల సమ్మెలు, ప్రదర్శనలు జరిగాయి.వాటిపై స్పందన లేకపోవటంతో కొనసాగింపుగా మే ఒకటవ తేదీన అమెరికా అంతటా ఒక రోజు సమ్మె జరపాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.ప్రభుత్వం సమ్మెను అణచేందుకు పూనుకుంది.దానిపై చికాగో నగరంలో మే మూడవ తేదీన నిరసన ప్రదర్శనలు జరిగాయి. అనేక చోట్ల పోలీసులు కార్మికులపై విరుచుకుపడ్డారు. అనేక మంది గాయపడ్డారు, కొంత మంది మరణించారు. దాంతో మరింతగా ఆగ్రహించిన కార్మికులు మే నాలుగవ తేదీన హే మార్కెట్‌ ప్రాంతంలో సభ జరిపేందుకు పిలుపునిచ్చారు. పోలీసు యంత్రాంగ కుట్రలో భాగంగా అక్కడకు వచ్చిన పోలీసులపై వారి ఏజంటుతో బాంబుదాడి చేయించారు. ఒక పోలీసు మరణించాడు. దానిని సాకుగా చూపి పోలీసులు జరిపిన కాల్పులలో అనేక మంది కార్మికులు మరణించారు. సంఖ్య ఇప్పటికీ తెలియదు. రక్తం ఏరులై పారింది. అయినా కార్మికులు వెనక్కు తగ్గలేదు. బాంబు పేలుడుపై ఎనిమిది మంది కార్మినేతలను ఇరికించి ఒక తప్పుడు కేసు పెట్టారు. వారిలో ఏడుగురికి దిగువ కోర్టు మరణశిక్ష విధించింది. పై కోర్టులలో శిక్షలను ఖరారు చేశారు. 1887 నవంబరు పదిన ఒక కార్మికుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. మరుసటి రోజు నలుగుర్ని వురితీశారు. తరువాత ఆరు సంవత్సరాలకు మిగిలిన ఇద్దరికి ఇల్లినాయిస్‌ గవర్నర్‌ క్షమాభిక్షతో వురిశిక్షను రద్దు చేశారు.

Image result for may day haymarket

1889 జూలైలో పారిస్‌లో సమావేశమైన అంతర్జాతీయ సోషలిస్టు, కార్మిక పార్టీల ప్రతినిధులు(రెండవ ఇంటర్నేషనల్‌) చికాగో కార్మికుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది మే ఒకటవ తేదీని కార్మికుల దీక్షా దినంగా పాటించాలని, ఆ మేరకు 1890లో మే ఒకటిన అంతర్జాతీయంగా ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చారు. మరుసటి ఏడాది సమావేశమైన రెండవ ఇంటర్నేషనల్‌ వార్షిక సమావేశం మే ఒకటవ తేదీని ప్రతి ఏడాదీ జరపాలని పిలుపు ఇచ్చింది. ఇది జరిగిన మూడు దశాబ్దాల తరువాత అమెరికాలో 1919లో, తరువాత మన దేశంలో, ఇంకా అనేక దేశాలలో కమ్యూనిస్టుపార్టీలు ఏర్పడ్డాయి. అందువలన ఎవరైనా మే డేను కమ్యూనిస్టుపార్టీలకు చెందినదిగా చిత్రిస్తే అది చరిత్రను వక్రీకరించటం తప్ప మరొకటి కాదు. అది కార్మికవర్గ వుద్యమం నుంచి ఆవిర్భవించింది. కమ్యూనిస్టు పార్టీలు కార్మిక, కర్షక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి కనుక మేడేను విధిగా పాటించటంతో చివరికి అది కమ్యూనిస్టుల కార్యక్రమంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

మన దేశంలో కార్మికోద్యమ పితామహుడు ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే ముఖ్య అనుచరుడైన నారాయణ్‌ మేఘాజీ లోఖాండే. ఒక జర్నలిస్టు, ఆయనేమీ కమ్యూనిస్టు కాదు, అప్పటికి కమ్యూనిస్టు వాసనలు మన దేశంలో లేవు. బొంబాయి వస్త్ర మిల్లు కార్మికుల పని పరిస్థితులను చూసి చలించిపోయిన ఆ జర్నలిస్టు జ్యోతిబా పూలే సహకారంతో 1880 నుంచీ కార్మికులను సంఘటిత పరిచేందుకు పూనుకున్నాడు.1884లో మిల్లు కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. యజమానుల ముందుంచిన వారి ప్రధాన కోరికలు ఇలా వున్నాయి. కార్మికులకు వారానికి ఒకరోజు ఆదివారం నాడు సెలవు ఇవ్వాలి.ప్రతి రోజు మధ్యాహ్నం అరగంట పాటు విరామం కల్పించాలి. మిల్లులను వుదయం ఆరున్నర గంటలకు ప్రారంభించి సూర్యాస్తమయానికి మూసివేయాలి.కార్మికుల వేతనాలు ప్రతినెల పదిహేనవ తేదీన చెల్లించాలి. ఇదే సమయంలో చికాగోలో కార్మికులు ఎనిమిది గంటల పని కోసం డిమాండ్‌ చేస్తే బొంబాయి కార్మికులు పన్నెండు గంటల పని డిమాండ్‌ చేశారంటే ఇంకా ఎక్కువ గంటలు పని చేసే వారన్నది స్పష్టం.

ప్రపంచాన్ని వూపి వేస్తున్న ఐటి, దాని అనుబంధ కార్యకలాపాలు, వివిధ టెక్నాలజీలలో శిక్షణ పొంది పరిశ్రమలలో పని చేస్తున్న ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు కార్మికులు కారా? యజమానులైతే కాదు, కనుక వారిని ఏ పేరుతో పిలవాలి. తెల్లచొక్కాల వారు కార్మికులు కాదా ? వారిని ఎలా సమీకరించాలి? ఇలాంటి ప్రశ్నలు వారినే కాదు, కార్మికవర్గాన్ని సమీకరించి దోపిడీ లేని నూతన సమాజాన్ని స్ధాపించాలని పని చేస్తున్న కమ్యూనిస్టు, సోషలిస్టు శక్తులన్నీ పరిష్కరించాల్సినవే. యాజమాన్యం తరఫు విధులు నిర్వహిస్తూ ప్రత్యక్షంగా వుత్పాదన, సేవలలో నిమగ్నం కాని సిఇఓ, డైరెక్టర్‌ వంటి వున్నత పదవులలో వున్నవారు తప్ప, ఒక యజమాని దగ్గర వేతనం తీసుకొని ఏదైనా ఒక వుత్పత్తి, సేవలలో భాగస్వామి అయిన ప్రతి వారూ కార్మికులే. వారు ఐటి నిపుణుడు, బ్యాంకు అధికారి, గుమస్తా, ఫ్యాక్టరీ ఇంజనీరు, డాక్టరు, యాక్టరు, జర్నలిస్టు, ప్రతిఫలం తీసుకొనే రచయిత ఇలా ఎవరైనా కావచ్చు. కొంత మంది వుత్పాదక, సేవల విలువ ఎక్కువ మొత్తంలో వుంటుంది కనుక ఆ రంగాలలో పని చేసే వారు పెద్ద మొత్తంలో వేతనంలో పొందినంత మాత్రాన కార్మికులు కాకుండా పోరు. ఆచరణలో అలాంటి వారంతా తాము కార్మికులం కాదనుకుంటున్నారు. వారిని ఆ భావజాలం నుంచి బయటకు తెచ్చి సమీకరించకుండా కార్మికవర్గ పార్టీలు ఎలా ముందుకు పోతాయన్నది ప్రశ్న. దోపిడీ వర్గం సంపదల సృష్టితో పాటు తమను అంతం చేసే కార్మికవర్గ సైన్యాన్ని కూడా తయారు చేస్తుందన్నది చరిత్ర సారమని మార్క్సిస్టు మహోపాధ్యాయులు చెప్పారు. బానిస యజమానులను బానిసలు, భూస్వాములను వ్యవసాయ కార్మికులు అంతం చేయటం గత చరిత్ర. పెట్టుబడిదారులను పారిశ్రామిక కార్మికులు అంతం చేయటం భవిష్యత్‌ చరిత్ర. అందుకే దోపిడీదారులు తమ హక్కులను అడగని కార్మికులను ప్రోత్సహిస్తారు, అడిగేవారిని అంతం చేసేందుకు చూస్తారు. తాగి తందనాలాడేందుకు డబ్బిచ్చి మరీ ప్రోత్సహించే యజమానులు, కార్మిక సంఘాన్ని పెట్టుకుంటే తొలగించటం, వేధించటం అందుకే.

రెండవ ప్రపంచ యుద్దం తరువాత సోషలిస్టు శక్తులు సాధించిన విజయాలతో మన దేశంలో కార్మికవర్గం సమరశీలంగా తయారు కాకుండా , సోషలిస్టు, కమ్యూనిస్టు భావాలవైపు మళ్లకుండా చూసేందుకు ప్రయత్నాలు జరిగాయి. పాలకపార్టీ ఒక కార్మిక సంఘాన్ని ప్రోత్సహించింది. మరోవైపున 1953న భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా ఒక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. జాతీయవాదం ముసుగులో మే ఒకటవ తేదీకి బదులు విశ్వకర్మ జయంతి రోజు పేరుతో కార్మికదినాన్ని పాటించాలని ఆ సంస్ధ నిర్ణయించింది. ఇలాంటివే చరిత్రలో అనేకం గురించి చెప్పుకోవచ్చు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడటం వలన ఆశాభంగమే తప్ప జరిగేదేమీ వుండదు. సంఘాలలో చేరటమే కాదు, వాటి నాయకత్వాలు అనుసరిస్తున్న రాజీ పద్దతుల గురించి నిలదీయాలి. న్యాయమైన డిమాండ్లపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి. కార్మికులేమీ గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. నేడు, నా సంగతి నేను చూసుకుంటే చాలు అని గాక రేపు, మన సంగతేమిటి అని విశాల దృక్పధంతో ఆలోచించటం అవసరం. అందుకే మే డేను వుత్సవంగా జరుపుకోవటం గాక దీక్షా దినంగా పాటించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సామాన్యులే కాదు, కార్పొరేట్ల సంపాదనా తగ్గింది!

12 Friday Apr 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Commoners, India elections 2019, India Inc's earnings, Modi era

ఎం కోటేశ్వరరావు

నరేంద్రమోడీ తొలి రోజుల్లో విమానాల్లో విహరించి గత ప్రధానుల రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను నెలకొల్పారు. విదేశాల వారికి మన పేదరికం లేదా పిసినారితనం ఎక్కడ కనపడుతోందో అని దేశ గౌరవాన్ని నిలిపేందుకు ప్రతిపక్షాల విమర్శలను కూడా దిగమించి ఖరీదైన సూట్లు వేసుకొని విదేశాల్లో తిరిగారు, విదేశీ అతిధులు వచ్చినపుడు వారితో సమంగా వ్యవహరించారు. ఇవన్నీ పెట్టుబడుల ఆకర్షణ, మేకిన్‌ ఇండియా పిలుపులో భాగంగా విదేశీయులు మన దగ్గర వస్తువులన తయారు చేయించుకొనేందుకు ఎగబడే విధంగా చేయటం కోసమే అని బిజెపి నేతలందరూ సమర్ధించారు. ఐదేండ్ల పాలన తరువాత అంతర్జాతీయ వార్తా సంస్ధ రాయిటర్స్‌ సరిగ్గా ఎన్నికలకు ఒక రోజు ముందు ఒక వార్తను విడుదల చేసింది.

అసాధ్యం అనుకున్న వాటిని అయిదేండ్లలో సుసాధ్యం చేశానని ఎన్నికల ప్రచారంలో వూరూ వాడా ప్రచారం చేస్తున్నారు. తాను తీసుకున్న చర్యలన్నీ దేశంలో వర్తక,వాణిజ్యాలు, పరిశ్రమల అభివృద్ధి కోసమే అని తద్వారా వుపాధి పెరుగుతుందని నరేంద్రమోడీ నాయకత్వం చెబితే జనం ఎలాంటి శషభిషలు లేకుండా నమ్మారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో జనం రోజుల తరబడి తమ సొమ్మును తామే తీసుకొనేందుకు బ్యాంకుల ముందు రోజుల తరబడి నిలబడి ప్రదర్శించిన దేశ భక్తిని చూశాము. రాష్ట్రాల అమ్మకపు పన్ను అధికారాన్ని తొలగించి జిఎస్‌టి అంటే దానికీ సై అన్నారు. అయితే రాయిటర్స్‌ వార్త సారాంశం ఏమంటే మోడీ ప్రభుత్వం తీసుకున్న వాణిజ్య అనుకూల అజెండా ఎక్కువ కార్పొరేట్‌ సంస్ధల లాభాల పెరుగుదల ప్రతిబింబించటంలో విఫలమైంది. అయినా మదుపుదారుల్లో ఇంకా ఆశచావలేదు. వడ్డీ రేట్లు గణనీయంగా పడిపోయాయి. చిన్న మదుపుదార్లకు అవకాశాలు తగ్గిపోయాయి. స్టాక్‌ మార్కెట్‌లో మదుపు చేసేందుకు ముందుకు వస్తున్నారు, మాడీ మార్కెట్లను వుత్సాహంతో వుంచారు అని అలాట్‌ మెంట్‌ కాపిటల్‌ అధికారి కృష్‌ సుబ్రమణ్యం చెప్పారు.

మోడీ తిరిగి ప్రధానిగా వస్తారనే ఆశలతో విదేశీ మదుపుదారులు వుత్సాహంతో వున్నారు.గతేడాది జనవరి-మార్చినెలల్లో 4.4బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెడితే ఈ ఏడాది ఆ మొత్తం 6.7బిలియన్లకు పెరిగింది. మోడీ అధికారం చేపట్టినప్పటి నుంచి నిఫ్టీ 63శాతం పెరిగితే ఈ ఏడాది ఇంతవరకు ఏడు శాతం పెరిగింది. స్వల్ప మెజారిటీతో బిజెపి తిరిగి అధికారానికి వస్తుందని ఇటీవలి సర్వేలు పేర్కొన్నాయి. ఒక వేళ మోడీ తిరిగి రాకపోతే కొంత మేర నీరసం ఆవహిస్తుందని యుబిఎస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ ఛోఛోరియా అన్నారు. ఆర్జన లేకుండానే స్టాక్‌ మార్కెట్‌ పెరిగింది. స్టాక్‌ మార్కెట్‌లో నమోదైన 399 కంపెనీల వివరాలను విశ్లేషించినపుడు మన్మోహన్‌ సింగ్‌ ఐదేండ్ల పాలనలో ఒక ఏడాది పడిపోతే మోడీ హయాంలో ఐదేండ్లలో నాలుగేండ్లు పడిపోయాయి.

రీఫినిటివ్‌ అనే సంస్ధ సేకరించిన సమచారాన్ని విశ్లేషిస్తే గత ప్రభుత్వ హయాంలో ఏటా 11.94% ఆర్జన పెరగ్గా మోడీ హయాంలో అది 3.72%కు పడిపోయింది.పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి వలన దేశ ఆర్ధిక వ్యవస్ధ పెరుగుదలను దెబ్బతీసిందని విశ్లేషకులు పేర్కొన్నారు.2018లో నిప్టీ 500 సూచిక కంపెనీల లాభం జిడిపిలో 2.8శాతం వుందని అది గత పదిహేను సంవత్సరాలలో కనిష్టమని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ నివేదిక తెలిపింది. 2014లో మోడీ అధికారంలోకి రాగానే భారత ఆర్ధిక రూపురేఖలనే మార్చివేస్తారన్న ఆశాభావం వుండేది, అయితే ఆశించిన వేగంగా అభివృద్ధి లేకపోయినప్పటికీ సంస్కరణలు తమకు ప్రయోజనం చేకూర్చుతాయని పెట్టుబడిదారులు ఇంకా ఆశాభావంతో వున్నారు. 2016లో పెద్ద నోట్ల రద్దు కారణంగా సాంప్రదాయకంగా రియలెస్టేట్‌, బంగారం కొనుగోళ్లకు బదులు మదుపుదారులు స్టాక్‌ మార్కెట్‌కు మళ్లారు. మోడీ హయాంలో నిఫ్టీ 75శాతం పెరిగింది. అయితే అంతకు ముందు కాంగ్రెస్‌ నాయకత్వంలోని ప్రభుత్వాల హయాంలో ప్రతి ఐదేండ్లకు ఆ పెరుగుదల వందశాతం చొప్పున వుంది. అంటే మోడీ పాలన ఈ విషయంలో కూడా వెనుకపడే వుంది.

గతం కంటే ఆర్జన తక్కువగా వున్నప్పటికీ స్టాక్‌ మార్కెట్‌ సూచిక పెరిగింది అంటే దాని అర్ధం కంపెనీల విలువలు ఎక్కువగా వుండటమే. స్టాక్‌ మార్కెట్‌ పరిభాషలో నిఫ్టీ 500 సూచిక కంపెనీలలో సగటు పియి గత ఐదు సంవత్సరాలలో 18 వుంది. అదే అంతకు ముందు ప్రభుత్వ హయాంలో 14.22 మాత్రమే. దీన్ని సులభంగా అర్ధం చేసుకోవాలంటే ఇలా చెప్పుకోవచ్చు.ఎవరైనా ఒక కంపెనీ నుంచి ఒక రూపాయి ఆర్జించాలనుకుంటే గత ఐదు సంవత్సరాలలో 18 రూపాయలు పెట్టుబడి పెట్టారు. అదే అంతకు ముందు రూ. 14.22 మాత్రమే పెట్టారు. ఏది లాభమో వేరే చెప్పనవసరం లేదు.

ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు విషయంలో ఐఎంఎఫ్‌ ప్రపంచంతో పాటు మన దేశ అంచనాను తగ్గించటం ఎన్నికల ముందు బిజెపికి ఒక ఎదురుదెబ్బ అనవచ్చు.పాకిస్ధాన్‌ అభివృద్ధి రేటును తగ్గించటం కొన్ని రాజకీయ పక్షాలకు వూరట కలిగిస్తే, ఇదే సమయంలో చైనా వృద్ధి రేటు పెంచటం మింగుడు పడని విషయం అనవచ్చు. మన విషయానికి వస్తే 2019-20లో 7.5 అని గతంలో చెప్పిన జోశ్యాన్ని 7.3%కు తగ్గించింది. వచ్చే ఏడాది మాత్రం 7.5శాతం తగ్గదట. మన రిజర్వుబ్యాంకు, ఏడిబి 7.2 అని, ఫిచ్‌ అనే రేటింగ్‌ సంస్ధ 6.8, ప్రపంచ బ్యాంకు 7.5శాతంగా తమ అంచనాలను పేర్కొన్నాయి. సరే నరేంద్రమోడీ సర్కార్‌ ప్రారంభించిన లెక్కల సవరింపు చివరికి ఎంత అని తేలుస్తుందో తెలియదు. ప్రపంచంలో 70శాతం ఆర్ధిక వ్యవస్ధలు మందగమనాన్ని సూచిస్తున్నాయని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్ధిక వేత్త మన దేశానికి చెందిన గీతా గోపీనాధ్‌ పేర్కొన్నారు.2020 తరువాత అభివృద్ధి 3.5శాతం దగ్గర స్ధిరపడనుందని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి అంకెలను పరిగణనలోకి తీసుకున్నపుడు ఎక్కువ అభివృద్ధి వున్న చోట నిరుద్యోగం తగ్గాలి, తక్కువ వున్న చోట పెరగాలి. ఆ రీత్యాచూసినపుడు మనది చైనా కంటే ఎక్కువ అభివృద్ధి రేటుతో ముందుకు పోతోంది. కానీ మన దగ్గర రికార్డు స్దాయిలో నిరుద్యోగం వున్నట్లు అంకెలు చెబుతున్నాయి. ఫిబ్రవరి నెలలో గరిష్ట స్ధాయిలో 7.2%కి పెరిగింది. మార్చినెలలో 6.7కు తగ్గింది. పన్నెండు నెలల సగటును ఏడాదికి తీసుకుంటారు, ఆవిధంగా గత ఏడాది 6.1శాతం 45ఏండ్ల రికార్డును తాకింది. అభివృద్ధి రేటు తగ్గనున్నందున నిరుద్యోగం మరింత పెరగనుంది.

మన ఆర్ధిక వ్యవస్ధలో కార్మిక భాగస్వామ్య రేటు ఫిబ్రవరి కంటే మార్చినెలలో 42.7 నుంచి 42.6కు పడిపోయింది. పట్టణ ప్రాంతాలలో పని చేస్తున్న వారి సంఖ్య 129 మిలియన్ల నుంచి 127కు పడిపోయింది.2016 తరువాత పట్టణ కార్మిక వర్గ భాగస్వామ్యం 40.5శాతానికి తొలిసారిగా పడిపోయింది. ఇంతవరకు 2018 నవంబరులో హీనస్ధాయిలో 37.3శాతంగా నమోదైంది.నిరుద్యోగశాతం 7.9గా వుంది. మార్చినెలలో పదిలక్షల వుద్యోగాలు పెరిగితే పదిలక్షల మంది పురుష వుద్యోగులు ఇంటిదారి పట్టారు. పట్టణ ప్రాంతాల్లో మహిళా వుపాధి కూడా తగ్గిపోయింది.

అభివృద్ధి రేటు ఎక్కువ వున్నపుడు వుద్యోగాలేమైనట్లు అని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ప్రశ్నించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం పాకిస్ధాన్‌లో జిడిపి వృద్ధి రేటు 2.9శాతానికి తగ్గనుంది. గత ఏడాది 5.2శాతం వుంది. అభివృద్ధి రేటు తగ్గనున్న కారణంగా ప్రస్తుతం వున్న 6.1శాతం నిరుద్యోగం 6.2శాతానికి పెరగనుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. దాయాది దేశం కంటే మన అభివృద్ధి అంకెలు ఎంతో మెరుగ్గా వున్నా నిరుద్యోగం విషయంలో మనం దానికి దగ్గరగా లేదా ఎక్కువగా వుండటం ఏమిటన్నది ప్రశ్న.

ఇక మన దేశంలో అనేక మంది అభివృద్ధి విషయంలో చైనా కంటే మనం ముందున్నామని పోల్చుకుంటారు. కానీ మిగతా విషయాలకు వచ్చే సరికి అబ్బే అది కమ్యూనిస్టు నియంతృత్వం మనది అతి పెద్ద ప్రజాస్వామ్యం, దానికి దీనికి పోలిక పెట్టకూడదంటారు. ఈ ఏడాది దాని అభివృద్ధి 6.2 నుంచి 6.3శాతానికి పెరగనుందని ఐఎంఎఫ్‌ నివేదిక పేర్కొన్నది. డిసెంబరులో 4.9శాతంగా వున్న నిరుద్యోగ రేటు జనవరిలో 5.3శాతానికి పెరిగింది. అభివృద్ధి రేటు పెరగనున్నందున నిరుద్యోగశాతం తగ్గనుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

యువతకు ముందుంది మరింత కష్ట కాలం !

04 Thursday Apr 2019

Posted by raomk in Congress, Current Affairs, Economics, employees, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

gloomy jobs scenario in india, jobs for machines in india, jobs scenario in india, Machines Vs humans

Image result for gloomy jobs scenario in india

ఎం కోటేశ్వరరావు

కాంగ్రెస్‌ ప్రకటించిన ఎన్నికల ప్రణాళికను నమ్మి జనం ఓటేసి గెలిపిస్తే తరువాత దాని అమలు విషయానికి వస్తే జుమ్లా (ఏదో అవసరానికి అలా చెబుతాం) అవుతుందా ? ఏమో ! నరేంద్రమోడీ వాగ్దానం చేసిన మేరకు నల్లధనాన్ని వెలికి తీసి ఆ మొత్తం నుంచి ప్రతి ఒక్కరికి వేస్తామన్న పదిహేను లక్షల రూపాయల సొమ్ము తమ బ్యాంకు ఖాతాల్లో ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూసే అమాయకులు ఇంకా వున్నారు కదా ! ఎన్నికల సమయంలో చేసే వాగ్దానాలకు అచరణకూ పొంతన వుండదని ఏడు దశాబ్దాల అనుభవం చెబుతోంది. రానున్న పది సంవత్సరాలలో దేశంలో నిరుద్యోగ సమస్య మరింత తీవ్రం కానుంది. అందువలన యువత, వారి భవిష్యత్‌ను కోరే వారు ఆలోచించి తమ ప్రతినిధులను ఎన్నుకోవాల్సి వుంది.

తాము అధికారంలోకి రాగానే 2020 నాటికి నాలుగు లక్షల కేంద్ర వుద్యోగాలను భర్తీ చేస్తామని ఇవిగాక రాష్ట్రాలలో వున్న మరొక ఇరవై లక్షల వుద్యోగాల భర్తీకి కూడా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్‌ పేర్కొన్నది. ఇవి గాక ఏటా 22లక్షల కొత్త వుద్యోగాల కల్పన కూడా చేస్తామని చెప్పారు. స్ధానిక సంస్దలలో పదిలక్షల సేవామిత్రల ఏర్పాటు గురించి కూడా వాగ్దానం వుంది. 2013 మార్చినెల నాటికి ఆరులక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ వుద్యోగ ఖాళీలు వుండగా 2014 మార్చి ఒకటి నాటికి అవి 4లక్షల 21వేల వుద్యోగాలు ఖాళీగా వుండగా గత ఐదు సంవత్సరాలలో కూడా దాదాపు అదే స్దాయిలో ఖాళీలు వున్నాయి.గత ఏడాది పార్లమెంటులో వివిధ సందర్భాలలో అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలను క్రోడీకరించగా కేంద్ర, రాష్ట్రాలలో, ప్రభుత్వ రంగ సంస్ధలలో మొత్తం 24లక్షల మేరకు ఖాళీలు వున్నాయి. విద్యా రంగంలో పదిలక్షలు, పోలీసుశాఖల్లో 5.4, రైల్వేల్లో 2.5, రక్షణ రంగంలో 1.2లక్షలు, పారా మిలిటరీలో 61వేలు ఖాళీలు వున్నాయి. కేంద్ర ప్రభుత్వశాఖలలో మంజూరైన పోస్టుల సంఖ్య 36,33,935 కాగా వున్న సిబ్బంది 32,21,183 మాత్రమే.

కేంద్ర ప్రభుత్వరంగ సంస్ధలలో (సిపిఎస్‌ఇ) 2013-14లో 13.49లక్షల మంది సిబ్బంది వున్నట్లు నమోదు కాగా మోడీ అధికారానికి వచ్చాక 2016-17 నాటికి ఆ సంఖ్య 11.31లక్షలకు పడిపోయిందని తాజా ప్రభుత్వ రంగ సంస్దల సర్వే వెల్లడించింది. ఈ అంకెలు చెబుతున్న వాస్తవాలేమిటి? ఖాళీగా వున్న కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగసంస్దల వుద్యోగాల గురించి కాంగ్రెస్‌ ఏమీ చెప్పలేదు. మన్మోహన్‌ సింగ్‌ హయాంలో కూడా నాలుగు లక్షల ఖాళీలు వున్నాయి. పదేండ్లు అధికారంలో వున్నపుడు చేయలేని పనిని రేపు వస్తే గిస్తే ఎలా చేస్తారో చెప్పాలా లేదా ?

India-automation-jobs-layoffs

దేశంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు, వునికిలో వున్నవాటి నవీకరణ వలన మనుషుల కంటే యంత్రాలకే ఎక్కువగా వుపాధి దొరుకుతోంది. విల్స్‌ టవర్‌ వాట్సన్‌ కంపెనీ ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం పశ్చిమ భారత్‌లో అంటే మహారాష్ట్ర, గుజరాత్‌ వస్త్ర,నూలు మిల్లుల్లో కార్మికుల కంటే యంత్రాలే ఎక్కువగా వుండబోతున్నాయి. కార్ల తయారీలో నలుగురు కార్మికులు చేసే పనిని ఒక రోబో చేస్తోంది.ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ప్రస్తుతం 13శాతం పనిని యంత్రాలు చేస్తుండగా రానున్న మూడు సంవత్సరాలలో అది 23శాతానికి పెరగనుంది. అదే మన దేశంలో 14 నుంచి 30శాతానికి పెరగనుంది. అందువలన అనంతపురంలో కియో కార్ల పరిశ్రమ గురించి చంద్రబాబు నాయుడు ఎన్ని కబుర్లు చెప్పినా వుద్యోగాలు రోబోట్లకు తప్ప అనంతపురం జనానికి కాదు.ఈ పరిశ్రమను తమ రాష్ట్రానికి తీసుకురాలేదని తెలంగాణా యువత నిరాశ చెందనవసరం లేదు.

పశ్చిమ దేశాలతో పోల్చితే మన దేశంలో ప్రస్తుతం యువతరం ఎక్కువ శాతం వున్నారు. ఈ కారణంగా రానున్న దశాబ్దిలో వుద్యోగాలు లేదా వుపాధి అవసరమైన వారు లేబర్‌ మార్కెట్‌లో 13.8కోట్ల మంది తోడు కానున్నారు. దేశంలో వున్న శ్రామిక శక్తిలో కేవలం 18.5శాతమే ఇంటర్‌ లేదా అంతకు మించిన విద్యతో నైపుణ్యం కలిగిన కార్మికులు వున్నారు. యాంత్రీకరణ కారణంగా దిగువ తరగతి కార్మికులే ఎక్కువగా వుద్యోగాలను కోల్పోతారని సర్వేలు తేల్చాయి. రాజకీయ పార్టీలు, నాయకులు వుపాధి గురించి ఎన్ని కబర్లు చెప్పినప్పటికీ రానున్న పది సంవత్సరాలలో యాంత్రీకరణ మరింత పెరిగి నిరుద్యోగ సమస్య మరింత తీవ్రం కానున్నదని నిపుణులు చెబుతున్నారు. దీన్నే మరొక విధంగా చెప్పాలంటే వుపాధి రహిత అభివృద్ది, వేతన వృద్ధి లేని వుపాధి పెరుగుతుంది. ఈ పరిణామం కొత్త సమస్యలకు దారి తీస్తుంది. ఇదొక విష వలయం.

కేంద్ర ప్రభుత్వ వుద్యోగులకు కనీస వేతనంగా నెలకు 18వేలు వుండాలని ఏడవ వేతన సంఘం సిఫార్సు చేసింది. ఇప్పుడు ఖాళీగా వున్న నాలుగులక్షల ఖాళీలను నింపితే ఏడాదికి అయ్యే ఖర్చు పదివేల కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. వేతనం పెరిగితే ఈ మొత్తం కూడా పెరుగుతుంది. కాంగ్రెస్‌ ప్రకటించిన నుయంతమ్‌ ఆయ యోజన(న్యాయ్‌) లేదా కనీస ఆదాయ పధకం కింద ఏటా ఇరవై శాతం పేదలు ఐదు కోట్ల కుటుంబాలకు 72వేల రూపాయలు నేరుగా బ్యాంకుల్లో వేస్తామని చెబుతున్నారు. అందుకు గాను తొలి ఏడాది 3.6లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, మరుసటి ఏడాది ఇంకా పెరుగుతాయని చెబుతున్నారు. సార్వత్రిక కనీస ఆదాయ పధకం గురించి 2016-17 ఆర్ధిక సర్వేలో నాటి ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణ్యం ప్రతిపాదించారు. దాని అమల్లో వున్న సమస్యల గురించి ఆయనే చెప్పారు. ప్రస్తుతం వున్న దారిద్ర నిర్మూలన పధకాలను రద్దు చేసి దాన్ని అమలు జరపకపో అదనపు భారం అవుతుందన్నారు. అందువలన కాంగ్రెస్‌ గానీ ఇలాంటి వాటి గురించే చెబుతున్న ఇతర పార్టీలుగానీ ముందుగా ఆ విషయాన్ని స్పష్టం చేయాలి. వున్న పధకాలను కొనసాగిస్తూనే దీన్ని అమలు జరుపుతారా లేక వాటిని రద్దు చేసి ఈ కొత్త పధకాన్ని పెడతారా ? రెండవదే అయితే పేదలకు నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం వుండదు. లేదూ రెండూ అమలు జరుపుతామంటే అందుకు అవసరమైన వనరులను ఎలా సమకూర్చుతారో వివరించాలి. ఇండియా రేటింగ్స్‌ సంస్ధ ప్రధాన ఆర్దికవేత్త దేవేంద్రకుమార్‌ పంత్‌ రెండూ ఒకేసారి అమలు సాధ్యం కాదని ఆర్ధికంగా ఎంతో వత్తిడి పెరుగుతుందన్నారు. విద్యమీద జిడిపిలో ఖర్చును ఆరుశాతానికి పెంచుతామన్నారు. గతంలో మోడీ సర్కార్‌ మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ చెప్పిన మేరకు విద్యకు 4.6శాతం అంటే 8.76లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ చెప్పినదాని ప్రకారం ప్రతి ఏడాది మరొక 2.66లక్ష కోట్ల రూపాయలు కావాలి, ఏటా 11.4లక్షల కోట్ల రూపాయలు అవసరం.

ఆరోగ్య సంరక్షణ ఖర్చు జిడిపిలో మూడు శాతానికి పెంచుతామన్నది ఒకటి. ఇప్పుడు 1.3శాతంగా వున్న ఖర్చుకు ఏటా 2.47లక్షల కోట్ల రూపాయలు అవుతున్నాయి. మూడుశాతానికి పెంచితే 5.71లక్షల కోట్లు కావాలి. ఇలా కాంగ్రెస్‌ చేసిన వాగ్దానాలను అమలు జరపాలంటే ఏటా కనీసం పదిలక్షల కోట్లరూపాయలు అవసరం అని అంచనా వేస్తున్నారు.2018-19 బడ్జెట్‌ 24.57లక్షల కోట్ల రూపాయలు, 2023-24 నాటికి 45లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. వాగ్దానాల అమలుకు అదనపు నిధులు ఎలా సమకూర్చుకుంటారో చెప్పలేదు. మరోవైపున జిఎస్‌టిని తగ్గిస్తామని వాగ్దానం చేసింది. జనానికి తగిన ఆదాయం లేనందున ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. దాని అర్ధం జిఎస్‌టి వసూళ్ల మీద పడుతుంది.

గతంలో రైల్వేకు వున్న మాదిరి రైతాంగానికి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిస్తామని కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది. ప్రతి తరగతి తనకు ప్రత్యేక బడ్జెట్‌ కోరుతున్న నేపధ్యంలో ఇది చెప్పటానికి ఆకర్షణీయంగా వుంటుంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దళితులు, గిరిజనులకు వుప ప్రణాళికలు వున్నాయి. అయినా వారి స్ధితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుందని గమనించాలి. రైతాంగానికి అలాంటి ప్రణాళిక ఆచరణ సాధ్యమా ? వ్యవసాయం ఏమాత్రం గిట్టుబాటు కావటం లేదు. రైతాంగం బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నూటికి 76 మంద సాగుదార్లు వ్యవసాయం మానుకొని అంతకంటే మెరుగైన వుపాధికి మరలాలని కోరుతున్నట్లు గతేడాది సిఎస్‌డిఎస్‌ సర్వేలో వెల్లడైంది. ఆ సర్వే తరువాత దేశంలో వ్యవసాయ సంక్షోభం ఇంకా పెరిగింది. రైతుల్లో 62శాతం మందికి కనీస మద్దతు ధరల గురించి అవగాహన లేదని, వాటి గురించి తెలిసిన వారిలో 64శాతం మంది మద్దతు ధరలు సంతృప్తికరం లేవని చెప్పారు.

జాతీయ గ్రామీణ వుపాధి హామీ పధకం కింద పని దినాలను 100 నుంచి 150కి పెంచుతామని కాంగ్రెస్‌ ప్రకటించింది. దేశంలో రైతాంగ సంఖ్య తగ్గిపోతుండగా వ్యవసాయ కార్మికుల సంఖ్య పెరుగుతున్నదని 2011 జనాభా వివరాలు తెలిపాయి. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుదల కారణంగా వ్యవసాయ కార్మికుల పని దినాలు తగ్గిపోతున్న పూర్వరంగలో ఆ మేరకు వారికి పని చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద వుంది. కనుక అది సమర్ధనీయమే.

2001లో దేశంలో రైతులు 12,73,12,851 మంది వుండగా 2011 నాటికి 11,87,00,000కు తగ్గిపోయారు. ఇదే సమయంలో వ్యవసాయ కార్మికుల సంఖ్య 10,67,75,330 నుంచి 14,43,00,000కు పెరిగారు. దేశంలో పారిశ్రామికీకరణ పెరుగుదల కారణంగా అనేక చేతి వృత్తులు నశించి వాటిలో వున్న వారు వ్యవసాయ కార్మికులుగా మారుతున్న విషయం తెలిసిందే. కేంద్రం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరల ప్రాతిపదిక ఆశాస్త్రీయంగా వుంటోంది. వ్యవసాయ ఖర్చులను పూర్తిగా పరిగణనలోకీ తీసుకోవటం లేదు. అన్ని పంటలకు ప్రకటించటం లేదు పోనీ ప్రకటించిన మేరకైనా అమలు జరిపే యంత్రాంగం రాష్ట్రాలలో లేదు. తెలంగాణాలో గతం కంటే ఎర్రజన్నలు, పసుపు ధరలు గణనీయంగా పడిపోవటం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అచేతనంగా వుండటంతో రైతాంగం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. చివరకు చేసేదేమీ లేక నిజామాబాద్‌ ఎన్నికల బరిలో 178 మంది రైతులు నామినేషన్లు వేసి కొత్త రూపంలో నిరసన తెలుపుతున్నారు. తమిళనాట రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో అక్కడి అన్నాడిఎంకె, కేంద్ర సర్కార్‌ విఫలం కావటంతో వారణాసిలో నరేంద్రమోడీ మీద పోటీ చేసేందుకు వంద మంది రైతులు నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. చివరి దశలో ఎన్నికలు జరగనున్నందున నామినేషన్లకు ఇంకా గడువు వుంది.

నిజామాబాద్‌ రైతులు రాష్ట్ర ప్రభుత్వం అందచేసిన రైతు బంధు నగదు తీసుకున్నా, పడిపోయిన ధరలతో పోల్చితే ఆ మొత్తం ఏమాత్రం చాలకనే ఆందోళనలకు దిగారు. అందువలన వివిధ పార్టీలు ఇప్పుడు ప్రకటిస్తున్న నగదు బదిలీ పధకాలు సంక్షోభాన్ని, సమస్యలను పరిష్కరించేవి కాదు, ఇప్పుడున్న వాటితో పాటు అమలు జరిపితే కాస్త వుపశమనం మాత్రమే దొరుకుతుంది.

Image result for jobs scenario in india

దేశ ఆర్ధిక వ్యవస్ధను మెరుగుపరుస్తామని కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది. ప్రస్తుతం మన దేశం ప్రపంచంలో జిడిపి రీత్యా ఐదవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా వుంది. ఏడుశాతానికి అటూ ఇటూగా అభివృద్ధి చెందుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అభివృద్ధి వున్నా దానికి అనుగుణంగా వుపాధి ఎందుకు పెరగటం లేదని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వేసిన ప్రశ్నకు ఇంతవరకు ఎవరూ సమాధానం చెప్పలేదు. పారిశ్రామిక, సేవారంగాలలో యాంత్రీకరణ, ఐటి కారణంగా ఆయా సంస్ధల ఆదాయాలు, లాభాలు పెరగటం తప్ప వుద్యోగాల వుపాధి తగ్గిపోతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రాహుల్‌ గాంధీ కనీస ఆదాయ పధకం వెనుక లాజిక్కేమిటి ?

29 Friday Mar 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

Congress party, LOK SABHA Election 2019, Nyay scheme, populist schemes, Rahul Nyay scheme

Image result for rahul gandhi

ఎం కోటేశ్వరరావు

కాంగ్రెస్‌ అధికారానికి వస్తే తాము ప్రతి కుటుంబానికి నెలకు ఆరువేల రూపాయల చొప్పున పేద కుటుంబాలకు అందచేస్తామని రాహుల్‌ గాంధీ ప్రకటించారు. దీని మీద కొందరికి లోపల ఇది జరిగేదేనా అన్న గుంజాటన వుంటే అటు సమర్ధించలేక, ఇటు వ్యతిరేకించలేక కొన్ని రాజకీయ పార్టీలు డోలాయమానంలో వున్నాయి. ఈ పధకాన్ని రూపొందించింది, రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆయనే ఆర్ధిక మంత్రి అవుతారన్న వార్తలు వచ్చాయి. దాని మంచి చెడ్డల గురించి చర్చించుకోబోయే ముందు ఆ పధకం ఆచరణ సాధ్యమేనా అని సందేహించే వారు ఎందుకు సాధ్యం కాదో ఆలోచించాలి.

ఏడాదికి 25కోట్ల మంది జనాభా వుండే ఐదు కోట్ల పేద కుటుంబాలకు ఏడాదికి 72వేల రూపాయల చొప్పున కనీస ఆదాయాన్ని అందచేస్తామని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ చేసిన ఎన్నికల వాగ్దానం మోసం, జనాలూ జాగ్రత్త అంటూ కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ గుండెలు బాదుకుంటున్నారు. అదే సమయంలో ఆ పెద్ద మనిషి మరో మాట కూడా చెప్పారు. తాము అమలు చేస్తున్న పధకాలన్నింటినీ కలిపి చూస్తే అంతకంటే ఎక్కువగానే వివిధ రూపాలలో పేదలకు చెల్లిస్తున్నామని అన్నారు. అంటే రాహుల్‌ గాంధీ ప్రకటించింది అసాధ్యమైన దేమీ కాదని జెట్లీ అంగీకరించినట్లే కదా !

ఇంతకీ రాహుల్‌ గాంధీ ఏమి చెప్పారు. ప్రతి పేద కుటుంబానికి నెలకు కనీసం పన్నెండువేలకు ఆదాయం తగ్గకూడదన్నది తమ ఆకాంక్ష అని దానిలో భాగంగా డెబ్బయి రెండు వేల రూపాయలను నేరుగా కుటుంబాల ఖాతాలో వేస్తామని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ వుపాధి హామీ పధకం కింద 14కోట్ల మందిని దారిద్య్రరేఖ దిగువ నుంచి ఎగువకు చేర్చామని, దాని కొనసాగింపుగా ఈ రెండవ పధకంలో 25కోట్ల మందిని దారిద్య్రరేఖనుంచి ఎగువకు తీసుకు వస్తే దేశంలో మొత్తం దారిద్య్ర నిర్మూలన జరుగుతుందని కాంగ్రెస్‌ నమ్మబలుకుతున్నది. ఇందుకు గాను 3.6లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కాంగ్రెస్‌ చెబుతున్నది. తన నాన్నమ్మ ఇందిరా గాంధీ 1970దశకంలో గరీబీ హఠావో నినాదమిచ్చి ఓట్లను కొల్లగొట్టారు. దాదాపు ఐదు దశాబ్దాల తరువాత మనవడు పేదరికం నిర్మూలనకు బదులు పేద కుటుంబాలకు నగదు బదలాయింపు గురించి చెబుతున్నారు. అంటే పేదరిక నిర్మూలన చేయలేం, దానికి బదులు డబ్బు ఇస్తాం అనటమే. అంటే సమస్య తిరిగి మొదటికి వచ్చింది.

మన దౌర్భాగ్యం ఏమంటే మన పాలకులు వారు కాంగ్రెస్‌ అయినా బిజెపి అయినా మన దేశంలో దరిద్రం ఏ స్దాయిలో, ఎంత మంది వున్నారన్నది ఇంతవరకు నిజాయితీగా నిక్కచ్చి లెక్కలు చెప్పలేదు. దారిద్య్రం నిర్వచనం మీద ఏకాభిప్రాయం లేదు. మన పాలకులు జిడిపి విషయానికి వస్తే ప్రపంచ ధనిక దేశాలతో పోటీ పడుతున్నామని త్వరలో రెండవ స్ధానంలో వున్న చైనాను అధిగమిస్తామని చెబుతారు. కానీ దారిద్య్రరేఖ విషయానికి వస్తే మాత్రం అంతసీను లేదు. రోజుకు 1.9 డాలర్ల కంటే తక్కువ సంపాదించే వారు ( మార్చినెల 28 డాలరు మారకం రేటులో రు 131) దారిద్య్రరేఖకు దిగువన వున్నట్లు లెక్క. ఇది అంతర్జాతీయ దారిద్య్రరేఖ పాతలెక్క, ప్రపంచ బ్యాంకు తాజాగా వేసిన మదింపులో రెండు రేఖలను సూచించింది ఒకటి రోజుకు 3.2 డాలర్లు రెండవది 5.5 డాలర్లకంటే తక్కువ సంపాదించే వారు దారిద్య్రంలో వున్నట్లే. రెండవదాని ప్రకారం ప్రపంచంలో 58శాతం మంది దారిద్య్రంలో వున్నారు.

2012లో మన కేంద్ర ప్రభుత్వం చెప్పినదాని ప్రకారం 22శాతం దారిద్య్రరేఖకు దిగువన వున్నారు. ప్రపంచబ్యాంకు లెక్కల ప్రకారం 2005లో 23.6శాతం మంది వున్నారు. ఐక్యరాజ్యసమితి సహ్రస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల ప్రకారం రోజుకు 1.25 డాలర్ల కంటే తక్కువ ఆదాయం వున్నవారు 2012లో 21.9శాతం. సురేష్‌ టెండూల్కర్‌ కమిటీ నివేదిక ప్రకారం కూడా అంతే వుంది. తరువాత రంగరాజన్‌ కమిటీ 2014లో చెప్పిన లెక్క 29.5శాతం. 2015లొ రోజుకు 1.9 డాలర్ల ప్రకారం 12.5 శాతం వున్నారు. జిడిపిలో దూసుకుపోతున్న మనం ఇప్పుడు తాజాగా ప్రపంచ బ్యాంకు చెప్పిన 3.2 డాలర్లతో లేదా 5.5డాలర్లతో దేని ప్రాతిపదికన దారిద్య్రాన్ని, దరిద్రులను లెక్కించాలి. రెండవదాని ప్రకారం అయితే ప్రపంచ సగటు 58శాతం లేదా అటూ ఇటూగా మన జనం దరిద్రంలో వున్నట్లే .

రాజీవ్‌ గాంధీ లేదా ఆయనకు సలహాలు ఇస్తున్నవారు రెండవ దానిని పరిగణనలోకి తీసుకొని రోజుకు 5.5 డాలర్లు (రు 380) లేదా నెలకు 12000 వేల రూపాయలు కనీస ఆదాయం అవసరమని తెల్చారు. అందుకే దానిలో సగం సంపాదించుకుంటే సగం నెలకు ఆరు చొప్పున ఏడాదికి 72వేలను ప్రభుత్వం నేరుగా కుటుంబాలలోని మహిళల ఖాతాలలో వేస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఇదంతా మోసం అని చెబుతున్న ఆర్దిక మంత్రి అరుణ్‌ జెట్లీ ఏమంటున్నారు. ప్రస్తుతం తాము అమలు జరుపుతున్న వివిధ పధకాలు వుపాధి హామీ పధకం, ఆయుష్మాన్‌ భవ, ఎరువుల సబ్సిడీ వంటి వాటికింద ఏటా 7.8లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, దీనివలన లబ్ది పొందుతున్నది పేదవారే నని అయితే వివిధ పధకాల కింద వున్నందున మొత్తం ఎంత లభిస్తుందో లెక్కవేసుకోవచ్చు అంటున్నారు. ప్రతి పేద కుటుంబానికి నెలకు పన్నెండు వేల చొప్పున ఆదాయం వచ్చేట్లు చేయాలంటే జిడిపిలో 1.5శాతం అవుతుందని కాంగ్రెస్‌ లెక్కలు వేసింది. తాము వాగ్దానం చేసిన పధకాన్ని అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు రెండూ పంచుకోవాల్సి వుంటుందని కూడా చెబుతున్నది. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల మొదలు పెట్టి రెండు సంవత్సరాల వ్యవధిలో దేశ మంతటికీ విస్తరింప చేస్తామని కాంగ్రెస్‌ ప్రతినిధి చెప్పారు. ఏటా కేంద్ర ప్రభుత్వ ఎగుమతుల ప్రోత్సాహం, పరిశ్రమలకు ఇస్తున్న రాయితీలు, పన్నుల రాయితీలతో పోల్చుకుంటే 3.6లక్షల కోట్ల రూపాయలను పేదలకు ఇవ్వటం పెద్ద లెక్కలోనిది కాదు

రాహుల్‌ గాంధీ ప్రకటించిన ఈ పధకం కొత్తదేమీ కాదు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న వివిధ సబ్సిడీలు, పధకాలకు అయ్యే ఖర్చు తగ్గించేందుకు గాను వాటిని అందుకు కేటాయిస్తున్న నిధులను నగదు బదిలీ రూపంలో అందచేయాలన్నది ప్రపంచబ్యాంకు,ఐఎంఎఫ్‌ చేసిన సూచనల సారం.వుదాహరణకు వరి పండించే రైతులకు నగదు బదిలీ పధకం కింద కొంత మొత్తం, పేదలకు సబ్సిడీ బియ్యం బదులు నగదు ఇస్తే భారత ఆహార సంస్ధను పూర్తిగా ఎత్తివేయవచ్చు. ఈ దిశగా కేంద్ర పాలిత ప్రాంతాలలో కొన్ని చోట్ల పేదలకు బియ్యం బదులు నగదు బదిలీని ప్రయోగాత్మకంగా అమలు జరుపుతున్నారు. రైతులకు రైతు బంధు మరొక పేరుతో నగదు అందచేసేందుకు నిర్ణయించారు. తెలంగాణాలో ఆ రైతు బంధు పధకం కింద సొమ్ము తీసుకున్న రైతులు తమ ఎర్రజొన్నలు, పసుపు పంటలకు గిట్టుబాటు ధర లేదని బంద్‌లు చేయటమే కాదు, అరెస్టులయ్యారు. చివరికి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా నిజామాబాద్‌ లోక్‌సభ బరిలో 178 మంది రైతులు అధికార పార్టీ అదిరింపులు, బెదిరింపులను లెక్కచేయకుండా పోటీకి నిలిచారు. ఎకరానికి ఎనిమిది వేలు ఇస్తే తాము చేయాల్సిందేమీ లేదని అధికార పార్టీ వూహించింది. పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులతో పోల్చుకుంటే ఎకరానికి ఎనిమిది వేలు ఒక లెక్క కాదు. అందుకే రైతులు రోడ్డెక్కారు.

కాంగ్రెస్‌ చెబుతున్న నెలకు 12వేల కనీస ఆదాయం కూడా ఇప్పటి ధరల ప్రకారం నలుగురు లేక ఐదుగురు వున్న కుటుంబ సభ్యుల అవసరాలకు సరిపోయే మొత్తం కాదు. అంతకు రెట్టింపు అవసరమని గణాంకాలు తెలుపుతున్నాయి. పట్టణ ప్రాంతాలలో ఒక వ్యక్తికి రోజుకు 2100, గ్రామాలలో 2400 కాలరీల శక్తినిచ్చే ఆహారం కావాలని అందుకు 1973-74లో రు.56.64, 49.09ల చొప్పున అవసరమని లెక్కవేశారు. ఇప్పుడు అంత మొత్తాలు రోజూ తాగే టీ, టిఫిన్‌ ఖర్చులకే చాలవు. అందువలన ఏటేటా దిగజారుతున్న రూపాయి విలువ, పెరుగుతున్న ధరలకు అనుగుణ్యంగా ప్రతి కుటుంబానికి అవసరమైన ఆదాయం వచ్చే విధంగా వుపాధి చూపితే దయాదాక్షిణ్యాలతో ఇచ్చే సొమ్ముకు ఎవరూ ఆశపడరు.

పేదలకు కనీస ఆదాయ పధకం అన్నది కొత్త ఆలోచన కూడా కాదు. మహమ్మద్‌ ప్రవక్త మామ, ఇస్లామిక్‌ రాజ్య తొలి పాలకుడు అయిన అబూ బకర్‌ ఏటా ప్రతి స్త్రీ, పురుషుడు, పిల్లలకు పది దిర్హామ్‌లు కనీసంగా అందచేయాలనే పధకాన్ని ప్రవేశపెట్టాడు. తరువాత ఆ మొత్తాన్ని ఇరవైకి పెంచాడు. క్రైస్తవ రాజ్యాలకు వ్యతిరేకంగా తమ పాలనను సుస్ధిర పరచేందుకు జనాన్ని ఆకర్షించే పధకమే ఇది. అమెరికాలో 1795లో భూ యాజమాన్య వ్యవస్ధను ప్రవేశపెట్టిన సందర్భంగా సహజంగా వచ్చిన వారసత్వ ఆస్ధులు కోల్పోయినందున నాటి మానవతా వాది ధామస్‌ పెయిన అమెరికా పౌరులందరికీ పరిహారంగా పౌర లాభం పేరుతో కొంత మొత్తాన్ని చెల్లించాలని ప్రతిపాదించాడు. అమెరికా ఆర్ధికవేత్త హెన్రీ జార్జి భూమి విలువ పన్నుద్వారా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని అమెరికన్లందరకూ డివిడెండ్‌గా చెల్లించాలని కోరాడు. 1966లో అమెరికాలో తలెత్తిన ఆర్ధిక సమస్యల పూర్వరంగంలో సంక్షేమ కార్యక్రమాల ఖర్చును తగ్గించేందుకు దారిద్య్ర నిర్మూలనకు కనీస వార్షిక ఆదాయం పేరుతో ఒక పధకాన్ని ప్రవేశపెట్టారు.1968లో 1200 మంది ఆర్దికవేత్తలు ఒక మెమో రాండంపై సంతకాలు చేసి ఆదాయ హామీ పధకాన్ని అమలు జరపాలని కోరారు. అయినా ఇప్పటికీ అమెరికాలో పేదరికం పోలేదు. ఫ్రెంచి పాలకుడు నెపోలియన్‌ బోనపార్టే కూడా పౌరుల మనుగడకు నిమిత్తం అవసరాలు తీర్చేందుకు కొంత మొత్తాన్ని తీసుకోవటం వారి జన్మహక్కని చెప్పాడు.

దీని వెనుక వున్న లాజిక్కును కూడా అర్ధం చేసుకోవాలి. మహమ్మద్‌ ప్రవక్త మామ అయినా మరొకరు అయినా వర్గ సమాజాలకు ప్రతినిధులు. అది బానిస సమాజం, ఫ్యూడలిజం, పెట్టుబడిదారీ విధానమైనా యజమానులకు పనిచేసేందుకు కార్మికులు కావాలి. వారు కావాలంటే కనీసం బతికి, పని చేసేందుకు అవసరమైన శక్తి అవసరం. ఆ కనీసఅవసరం వారికి తీరకపోతే పని చేసే వారు దొరకరు. అందుకే కనీస సంక్షేమ పధకాలను అమలు జరిపిన తీరు ప్రతి సమాజంలోనూ మనకు కనిపిస్తుంది. పశ్చిమ దేశాలలో కార్మికులు జబ్బుపడి పని మానితే వచ్చే నష్టం కంటే వారికి ఆరోగ్య సంరక్షణకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తే యజమానులకు వచ్చే లాభమే ఎక్కువగా వుంది కనుక పరిమితంగా అయినా ఆరోగ్య రక్షణ కల్పిస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఏదీ వుచితం కాదు, అలాంటపుడు అమలు జరిపే సంక్షేమ పధకాలను వుచితంగా అమలు జరుపుతారని ఎందుకు అనుకోవాలి.

ప్రస్తుతం అనేక దేశాలలో కనీస ఆదాయ హామీ పధకాలు అమలు జరుగుతున్నాయి, అయితే వాటికి షరతులు వర్తిస్తాయి. బ్రెజిల్‌లో పిల్లలను బడులకు పంపటం ఒక షరతు. మన దేశంలో 1934లో కాంగ్రెస్‌ నేత సుభాస్‌ చంద్రబోస్‌ తొలుత ఇలాంటి పధకం గురించి ప్రతిపాదించారు. తరువాత 1942లో జవహర్‌లాల్‌ నెహ్రూ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి ప్రతిపాదనలు చేయాలని కోరినప్పటి అది జరగలేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d