• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Readers News Service

ఆదిత్యనాధ్‌ ఇలాకాలో బిజెపి తొలి ఓటమి !

24 Sunday Mar 2019

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

Bahujan Samaj Party, BJP, Congress party, Modi, Samajwadi Party, Shah, UP Loksabha elections 2019, UP's kairana, Yogi Adityanath

Image result for up lok sabha election 2019

ఎం కోటేశ్వరరావు

అవును ఎన్నికలు ఇంకా జరగముందే ఓడిపోవటం ఏమిటి అనుకుంటున్నారా ? అవును నిజంగానే ఏడాది క్రితం నిలిపిన అభ్యర్ధిని ఇప్పుడు మార్చటం అంటే నైతికంగా ఓటమిని అంగీకరించటం కాదా ? కైరానా నియోజకవర్గం ఏడాది క్రితం ఒక సంచలనం. మూడో వంతుకు పైగా ముస్లిం జనాభా వున్న ఈ నియోజకవర్గంలో వారు మెజారిటీగా వున్న చోట్ల నుంచి హిందువులను తరిమి వేస్తున్నారంటూ ఆ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన బిజెపి నేత హుకుం సింగ్‌, తదితరులు పెద్ద ఎత్తున ప్రచారం చేసి వుద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన గతాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. సదరు సింగ్‌ హఠాన్మరణంతో ఏడాది క్రితం వుప ఎన్నిక అవసరమైంది. అది ఒక్క వుత్తర ప్రదేశ్‌ రాజకీయాలనే కాదు, దేశ వ్యాపితంగా బిజెపి వ్యతిరేక శక్తులు ఒక్కతాటి మీదకు వస్తే కలిగే రాజకీయ ప్రయోజనం ఏమిటో వెల్లడించింది.

ఆ ఎన్నికలో బిజెపి అభ్యర్దిగా హుకుంసింగ్‌ కుమార్తె మృగాంకను నిలిపి సానుభూతి ఓట్లతో గెలవాలని చూసింది. అయితే సమాజవాదిపార్టీ, ఆర్‌ఎల్‌డి వుమ్మడి అభ్యర్ధిగా ఆర్‌ఎల్‌డికి చెందిన తబుసుమ్‌ హసన్‌ను రంగంలోకి దిగటమే కాదు గణనీయ మెజారిటీతో బిజెపిని ఓడించారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్‌ పోటీ చేయలేదు.బిజెపిని ఓడించండి అని కార్యకర్తలకు పిలుపునివ్వటం తప్ప ఫలానా వారికి మద్దతు ఇస్తున్నట్లు బహుజన సమాజవాది పార్టీ నాయకురాలు మాయావతి సూచించలేదు. ఈ ఎన్నిక తరువాత అనూహ్యంగా దశాబ్దాలుగా వుప్పు నిప్పుగా వుండే ఎస్‌పి, బిఎస్‌పి పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. ఒక ఫార్ములాను రూపొందించుకొని సీట్ల సర్దుబాటు చేసుకొని బిజెపి మీద బస్తీమే సవాల్‌ అంటూ బరిలోకి దిగాయి.

శనివారం నాడు బిజెపి ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో కైరానాలో మృగాంకకు మొండి చేయి చూపి పక్క జిల్లాకు చెందిన ఒక ఎంఎల్‌ఏను ఎంపిక చేశారు. వేరే కారణాలేమీ లేకుండా ఏడాదిలోనే అభ్యర్ధిని మార్చటం అంటే నైతికంగా బిజెపి ఓటమిని అంగీకరించటమే. వుప ఎన్నికల్లో ఆర్‌ఎల్‌డి అభ్యర్ధినిగా వున్న తబుసుమ్‌ ఈ సారి సమాజవాది పార్టీ అభ్యర్ధిగా రంగంలోకి దిగుతున్నారు. ఈ సారి కాంగ్రెస్‌ తమ అభ్యర్ధిని నిలిపే అవకాశం వుంది. ఏడుశాతంపైగా గత ఎన్నికల్లో ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్‌కు ఏకపక్షంగా సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్దానాలలో మద్దతు ప్రకటించి మిగిలిన అన్ని చోట్ల ఎస్‌పి, బిఎస్‌పి,ఆర్‌ఎల్‌డి కూటమి అభ్యర్దులను రంగంలోకి దించుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర బిజెపి సర్కార్‌పై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత ప్రధాన ప్రత్యర్ధులకే దోహదం చేస్తుంది తప్ప కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూర్చదు. అయినా అన్ని చోట్లా తమ అభ్యర్ధులను నిలుపుతామని ఆ పార్టీ ప్రకటించింది.ఓటర్లు ఎలా స్పందిస్తారో చూడాల్సివుంది.

Image result for up lok sabha election 2019

అయోధ్య ! రాముడిని వీధుల్లోకి, భారతీయ జనతాపార్టీతో పాటు దేశంలో అనేక మందిని మత రాజకీయాలవైపు నెట్టిన పేరు. పక్కా కాషాయంతో మతం, అయోధ్య రాముడిని వుపయోగించుకొని బిజెపి లాభపడిందన్నది నిస్సందేహం. దాని తీరు చూసి కాంగ్రెస్‌ కూడా పలుచబారిన కాషాయంతో ఓట్లు సంపాదించాలని చూస్తున్నదనే విమర్శలు ఎదుర్కొంటున్నది. అయోధ్యలోని బాబరీ మసీదు స్ధలంలో రామాలయ నిర్మాణం అన్నది గత ఎన్నికలలో బిజెపి వాగ్గానం. దానికి నరేంద్రమోడీ గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధి, నల్లధనం వెలికితీత వంటి నినాదాలు తోడయ్యాయి. సమాజవాది పార్టీ, బిఎస్‌పి, కాంగ్రెస్‌, తదితర పార్టీలు విడివిడిగా పోటీపడటం బిజెపికి అనూహ్యంగా 80కిగాను 71, దాని మిత్రపక్షం అప్నాదళ్‌కు రెండు, సమాజవాది పార్టీకి ఐదు, కాంగ్రెస్‌కు రెండు వచ్చాయి.

Image result for ayodhya priest surendra das

ఈ సారి రామ మందిరం కాదు, పుల్వామాయే బిజెపిని రక్షిఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని పుల్వామా మాత్రమే రక్షించగలదు తప్ప రామ మందిరం కాదని అయోధ్యలోని వివాదాస్పద తాత్కాలిక రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సురేంద్రదాస్‌ అన్నారు. సాధారణంగా రాజకీయాల గురించి నోరు విప్పని ఆ పెద్దమనిషి సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ‘కాశ్మీర్‌పై దాడితో బిజెపి రామ మందిర సమస్యను పక్కన పెడుతుంది. రామ్‌ రామ్‌ అని నినాదాలు ఇచ్చేవారు ఇప్పుడా పని చేయరు. వారు గనుక రామ మందిరం సమస్యను ముందుకు తెస్తే ఓడిపోతారు, జనం వారిని నమ్మటం లేదు, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు’ అని వ్యాఖ్యానించారు.

గతంలో బాబరీ మసీదు వున్న చోట ఇప్పుడు తాత్కాలిక గుడారంలో భద్రతా సిబ్బంది రక్షణ మధ్య నాలుగు రాముడి విగ్రహాలు వున్నాయి. నాలుగంచలలో సందర్శకులను తనిఖీ చేసిన తరువాత 50 మీటర్ల దూరం నుంచి ఆ విగ్రహాలను చూడనిస్తారు. గతంలో సంస్కృత పండితుడిగా పని చేసిన సురేంద్రదాస్‌ కొన్ని విషయాలను నిర్మొహమాటంగా చెబుతారు. బాబరీ మసీదు కూల్చివేత ముస్లింల కంటే హిందువులనే ఎక్కువగా బాధించిందని, కూల్చాల్సిన అవసరం లేదని అంటారు.

పుల్వామా వుదంతం బిజెపిని తిరిగి అధికారంలోకి తెస్తుందనే అభిప్రాయంతో అనేక మంది ఏకీభవించటం లేదు. గతంలో కార్గిల్‌ యుద్ధాన్ని, యూరి సర్జికల్‌ దాడులను బిజెపి ఎన్నికలలో వుపయోగించుకొని జనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను విస్మరించి ఓటర్లకు దూరమైన విషయాలను గుర్తు చేస్తున్నారు. పుల్వామా తాత్కాలికంగా భావోద్వేగాలను రగిలించగలదు తప్ప నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభాన్ని ఓటర్లు మరచిపోయే అవకాశం లేదంటున్నారు. పుల్వామా వుదంతాన్ని, అయోధ్య స్ధల వివాదం సుప్రీం కోర్టులో ఇంకా విచారణలో వుండగా దాన్ని ఏ రూపంలో ముందుకు తెచ్చినా బిజెపి విమర్శపాలయ్యే అవకాశం వుంది. రామాలయ నిర్మాణ వాగ్దానంతో అధికారానికి వచ్చిన యోగి ఆదిత్యనాధ్‌ భక్తులను తప్పుదారి పట్టించేందుకు లేదా సంతృప్తి పరచేందుకు ఆలయ నిర్మాణం బదులు ఫైజాబాద్‌ జిల్లా పేరును శ్రీ అయోధ్య అని మార్చటం, అయోధ్యలో అతి పెద్ద రాముడి విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసినదే. బాబరీ మసీదు స్ధలంలో రామాలయ నిర్మాణానికి ఆర్డినెన్స్‌ జారీ చేయాలని కోరిన ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూపరిషత్‌ వంటి సంస్ధలు ఎన్నికలు రాగానే మౌనం దాల్చాయి.

కాంగ్రెస్‌ స్వామిగా పేరున్న శంకరాచార్య స్వరూపానంద సరస్వతి ఫిబ్రవరి 21న అయోధ్యలో రామాలయానికి పునాది రాయి వేస్తానని ప్రకటించి తన అనుచరులందరూ రావాలని పిలుపునిచ్చారు. అయితే 14వ తేదీన పుల్వామా వుగ్రదాడితో ఆ కార్యక్రమం వెనక్కు పోయింది. బిజెపి ఎంతగానో వూపిరి పీల్చుకుంది. రామ మందిర నిర్మాణం జరుగుతుందని రామ ప్రభు సూచన ప్రాయంగా కూడా వెల్లడించలేదు, రామ మందిరం చుట్టూ నాటకం నడుస్తోంది, అదొక ప్రహసనంగా మారుతోంది, బిజెపి ఏమి చెప్పింది, ఏమి చేస్తుంది అన్నది సమస్య కాదు, చివరికి సుప్రీం కోర్టు నిర్ణయిస్తుంది, దాని పట్ల బిజెపి నిజాయితీతో వుండాలి అని పూజారి సురేద్రదాస్‌ వ్యాఖ్యానించారు.

లెక్కలు ఏమి చెబుతున్నాయి !

దేశంలో వుపాధి కల్పన మొదలు, అభివృద్ధి అంకెల వరకు ఎవరు చెప్పేది నిజమో దేన్ని నమ్మాలో నమ్మకూడదో నిర్ణయించుకోలేనంతగా జనాన్ని ఆయోమయంలో పడవేశారు. ఐదేండ్లలో ఎంత మందికి వుపాధి కల్పించారంటే వున్న లెక్కలు తప్పు, కొత్త లెక్కలు వేయాల్సి వుంది అంటారు. పకోడీలు అమ్ముకోవటం కూడా వుపాధి కల్పనకిందికే వస్తుందని స్వయంగా నరేంద్రమోడీయే చెప్పిన తరువాత పకోడీ బండ్లను కూడా తాను కల్పించిన వుపాధిలో భాగంగా పరిగణిస్తున్నారా ? వాటిని వదలి వేద్దాం. గత ఎన్నికలలో వచ్చిన ఓట్ల లెక్కలను తప్పు, కొత్త లెక్కలు వేయాల్సి వుంది అనటం కుదరదు. అందువలన వాటి ప్రాతిపదికగానే విశ్లేషణలు చేయటం మినహా మరొక మార్గం లేదు.

వుత్తర ప్రదేశ్‌లోని 80 నియోజక వర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.జరుగుతున్నాయి.గత లోక్‌సభ ఎన్నికలలో చిన్న పార్టీలను కలుపుకొని బిజెపి ఎన్‌డిఏ కూటమి పేరుతో, కాంగ్రెస్‌, ఎస్‌పి,బిఎస్‌పి, ఇతర పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. బిజెపి పోటీచేసిన 78 స్ధానాల్లో 71, మిత్రపక్షం అప్నాదళ్‌ రెండు చోట్ల పోటీ చేసి రెండూ గెలిచింది. కాంగ్రెస్‌ 66కు రెండు, సమాజవాది పార్టీ 78కి ఐదు గెలవగా 80చోట్ల పోటీ చేసిన బిఎస్‌పి అన్నింటా ఓడిపోయింది. బిజెపికి 42.3శాతం ఓట్లు రాగా ఎస్‌పికి 22.2, బిఎస్‌పికి 19.6, కాంగ్రెస్‌కు 7.5శాతం వచ్చాయి. ఈ ఎన్నికల్లో బిఎస్‌పి 38, ఎస్‌పి 37 చోట్ల వుమ్మడిగా పోటీ చేస్తూ మిగిలిన చోట్ల కాంగ్రెస్‌, ఆర్‌ఎల్‌డిని బలపరుస్తున్నాయి. కాంగ్రెస్‌ అన్ని సీట్లకు పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత గానీ నిజంగా ఎన్నిసీట్లలో పోటీ చేసేది తెలుస్తుంది. బిఎస్‌పి, ఎస్‌పి కూటమి గతంలో వచ్చిన ఓట్లను కలిపితే 41.8శాతం ఓట్లున్నాయి.

2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌ను చూస్తే బిజెపికి 39.7, దాని మిత్రపక్షానికి ఒక శాతం ఓట్లు వచ్చాయి. అదే బిఎస్‌పి,ఎస్‌పిలకు 22.2, 22శాతం వంతున 44.2శాతం వచ్చాయి. ఈ కారణంగానే ఈ ఎన్నికల్లో బిజెపి సీట్లు సగానికి సగం అంతకంటే ఎక్కువగా పడిపోతాయని చెబుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన పలు ఎన్నికల సర్వేలలో వెల్లడించిన అంకెల సగటును తీసుకుంటే బిజెపికి 29, కాంగ్రెస్‌కు 4, ఎస్‌పి-బిఎస్‌పి కూటమికి 47 వస్తాయని తేలింది.

వుత్తరాది రాష్ట్రాలలో, వుత్తర ప్రదేశ్‌లో బిజెపికి అయోధ్య అంశం ఓట్లు తెచ్చి పెట్టిందేమో కానీ అయోధ్య పట్టణం వున్న ఫైజాబాద్‌ నియోజకవర్గం ఎప్పుడూ దానితో లేదు. బిజెపి ఆయోధ్య ఆందోళన చేపట్టిన తరువాతే అక్కడ అది ఓట్లు తెచ్చుకోగలిగింది. బాబరీ మసీదు కూల్చివేత తరువాత జరిగిన ఎన్నికలలో దానికి ఎదురు దెబ్బలు కూడా తగిలాయి. 1957 నుంచి 2014వరకు జరిగిన 15 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఏడు సార్లు విజయం సాధించింది. 1991 తరువాత జరిగిన ఏడు ఎన్నికలలో బిజెపి నాలుగు సార్లు విజయం సాధించగా సమాజవాది పార్టీ, బిఎస్‌పి, కాంగ్రెస్‌ ఒక్కోసారి విజయం సాధించాయి. గత ఎన్నికలలో బిజెపి అభ్యర్ధి లాలూ సింగ్‌కు 48శాతం ఓట్లు రాగా సమాజవాది పార్టీ మిత్రసేన్‌ యాదవ్‌కు 20.43, బిఎస్‌పికి 13.87, కాంగ్రెస్‌కు 12.7శాతం వచ్చాయి.

Image result for up lok sabha election 2019

బాబరీ మసీదు కూల్చివేసిన రోజు సాయంత్రమే జిల్లా కలెక్టర్‌గా నియమితుడైన పరిస్ధితిని చక్కదిద్ది ప్రశంసలు పొందిన విజయ శంకర్‌ పాండే తాజా ఎన్నికల్లో లోక్‌ ఘటబంధన్‌ పార్టీ(ఎల్‌జిపి) అభ్యర్దిగా బరిలో దిగనున్నట్లు ప్రకటించారు. నిజాయితీ పరుడైన అధికారిగా పేరున్న విజయ శంకర్‌ బాబరీ మసీదు కూల్చివేత అనంతరం ఏర్పడిన పరిస్ధితిని చక్కదిద్దటంలో ఎంతో సమర్ధవంతంగా పని చేశారు. ముక్కుసూటిగా, అవినీతికి వ్యతిరేకంగా వ్యవహరించే పాండేను 52సార్లు బదిలీ చేశారంటే అవినీతి రాజకీయవేత్తలకు ఎంత దడపుట్టించారో అర్ధం అవుతుంది. అరవై రెండు సంవత్సరాల వయస్సున్న ఈ మాజీ అధికారి తాను ఇప్పుడు వునికిలో వున్న ఏ దైనా రాజకీయ పార్టీలో చేరితే ఇంతరకు తాను చేసిందంతా వృధా అయినట్లే అన్నారు.మార్పుకోసం సహకరించమని తాను సూటిగా ప్రజలను కోరుతున్నట్లు చెప్పారు. తాను కలెక్టర్‌గా నియమితమైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆ రోజు అయోధ్యలో మూకలు హింసాకాండకు పాల్పడ్డాయి. రోడ్లన్నింటినీ మూసివేశారు. ఫైజాబాద్‌ వెళ్లే రోడ్డును కూడా మూసివేయటంతో లక్నో నుంచి హెలికాప్టర్‌లో వచ్చి బాధ్యతలు తీసుకున్నట్లు చెప్పారు. వివాదాస్పద చంద్రస్వామి వివాదాస్పద స్దలం వద్ద హోమం చేయటానికి అనుమతించని కారణంగా కేవలం ఐదు నెలలకే తనను ఫైజాబాద్‌ నుంచి బదిలీ చేశారని చెప్పారు. మాయావతి, ములాయం సింగ్‌ యాదవ్‌, అఖిలేష్‌ యాదవ్‌ తనను వేధించారని చెప్పిన పాండే 2017లో వుద్యోగ విరమణ చేశారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వ్యవసాయ సబ్సిడీల అవసరం – అంతర్జాతీయ అనుభవాలు !

12 Tuesday Mar 2019

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Agri subsidies, agricultural subsidies, Agriculture, India Farm Subsidies

Image result for agriculture india

ఎం కోటేశ్వరరావు

ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ తప్పుకోవాలనే నిర్ణయం, ప్రతికూల వాతావరణం కారణంగా భవిష్యత్‌ అయోమయంగా మారటంతో బ్రిటన్‌ రైతాంగానికి ఆత్మహత్యల ముప్పు తలెత్తిందని గార్డియన్‌ పత్రిక మార్చినెల మూడవ తేదీన ఒక వార్త ప్రచురించింది. మన దేశంలో నిత్యం ఏదో ఒక మూల రైతాంగ ఆత్మహత్యల వార్తలను వింటున్న నేపధ్యంలో పెద్ద మొత్తంలో సబ్సిడీలు పొందుతున్న బ్రిటన్‌ రైతులు కూడా ఇలాంటి పరిస్ధితిలో వున్నారా అన్నది నిజంగా ఆశ్చర్యపరిచే అంశమే. ఐరోపా యూనియన్‌లో గణనీయంగా వ్యవసాయానికి సబ్సిడీలు ఇస్తున్న దేశాలలో బ్రిటన్‌ ఐదవ స్ధానంలో వుంది.అలాంటి చోట సగటున వారానికి ఒకరి కంటే ఎక్కువగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇంగ్లండ్‌, వేల్స్‌ ప్రాంతాలలో ఎక్కువగా వున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

మన దగ్గర ప్రమాదాలు జరిగినపుడు, వైద్యసాయం కోసం 108 సేవలు వున్నట్లే బ్రిటన్‌లో కూడా ఇబ్బందుల్లో వున్న జనం ఫోన్ల ద్వారా కొన్ని సంస్ధలకు తెలియచేస్తారు.ఇటీవల అలాంటి ఫోన్లు డజన్ల కొద్దీ వస్తున్నాయని, కొందరిని ఆత్మహత్యల నివారణ నిఘాలో వుంచినట్లు జాతీయ రైతు సంఘం(ఎన్‌ఎఫ్‌యు) తెలిపింది. మంచుతుపాన్లు, కరవు పరిస్థితులను ఎదుర్కొన్న రైతాంగం ఇప్పుడు ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు వెళ్లాలనే(బ్రెక్సిట్‌) నిర్ణయంతో మరింత అయోమయానికి గురైనట్లు పేర్కొన్నది. పలటానికి సిద్దం అవుతున్న టైం బాంబులా బ్రెక్సిట్‌ వుందని కొందరు వర్ణించారు. అదే జరిగితే ఒక్కొక్క గొర్రె లేదా మేకకు 25-30 పౌండ్లు( ఒక్కొక్క పౌండు విలువ 93-94 రూపాయల మధ్య వుంటుంది) నష్టపోతారని, రైతాంగాన్ని ఆదుకొనేందుకు సబ్సిడీలు తప్ప మరొక మార్గం లేదని వార్తలు వచ్చాయి.

కొంత మంది మేథావులు ఇటీవలి కాలంలో సబ్సిడీలు కోరేవారిని, మద్దతు ఇచ్చే వారిని చిన్న చూపుచూస్తున్నారు. దయాదాక్షిణ్యాలతో బిచ్చం వేస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఇది తప్పుడు అవగాహన. వ్యవసాయం, పరిశ్రమలు లేదా సేవలకు సబ్సిడీలు లేకుండా నడిచే అవకాశాలను చూపి వ్యతిరేకిస్తే అర్ధం వుంది. అయితే ఇక్కడ ఒక సందేహం తలెత్తుతుంది. కార్పొరేట్‌ పద్దతుల్లో లేదా ఎగుమతి వాణిజ్యం కోసం పంటల సాగు చేసే వ్యవసాయదారులకు, తన కుటుంబం, దేశ అవసరాల కోసం సాగు చేసే వారి పట్ల ఒకే విధమైన వైఖరి అనుసరించాలా? కచ్చితంగా వుండకూడదు, తేడా వుండాలి.

Image result for agriculture india

అసలు ఈ సబ్సిడీలు లేదా రాయితీలు అనే డిమాండ్‌ లేదా విధానం ఎందుకు అమల్లోకి వచ్చింది ? ఆయా దేశాల్లో తలెత్తిన సంక్షోభం, అవసరాలు వాటిని ముందుకు తెచ్చాయి. రాబోయే రోజుల్లో తెస్తాయి. తాను చేసిన వాగ్దానం మేరకు రైతులకు రెట్టింపు ఆదాయం వచ్చే విధంగా మద్దతు ధరలను నిర్ణయించినట్లు మన ప్రధాని నరేంద్రమోడీ కొద్ది నెలల క్రితం వూదరగొట్టిన విషయం తెలిసిందే. అయినప్పటికీ బిజెపి పాలిత రాష్ట్రాలలోని ఇతర జనంతో పాటు రైతాంగం ఆ పార్టీని సాగనంపారు. దీంతో దిమ్మెరపోయిన నరేంద్రమోడీ చిన్న రైతాంగానికి ఏడాదికి ఆరువేల రూపాయల నగదు సాయం అందించే పధకాన్ని ఎన్నికల మొక్కుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచ అనుభవాన్ని చూస్తే విదేశాల నుంచి వచ్చే చౌక దిగుమతులనుంచి తమ రైతాంగాన్ని రక్షించేందుకు, ప్రపంచ మార్కెట్లో పోటీకి తగిన విధంగా తయారు చేసేందుకు, ఇతర కారణాలతో సబ్సిడీలు ఇవ్వటం తెలిసిందే. తాజాగా వాణిజ్య యుద్ధంలో ఎదుటి దేశం మీద దాడి చేసేందుకు కూడా సబ్సిడీలను ఆయుధంగా ప్రయోగించవచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కొత్తగా ప్రపంచానికి చాటాడు.

ముందుగా ప్రపంచంలో వ్యవసాయ రంగం ద్వారా ఆయా దేశాల్లో ఎంతశాతం మందికి వుపాధి లభిస్తోందో చూద్దాం. ప్రపంచ బ్యాంకు రూపొందించిన వివరాల మేరకు 2017లో సగటున ప్రపంచ వ్యాపితంగా 181 దేశాలలో 26.81శాతం మంది వుపాధి పొందుతున్నారు. అత్యధికంగా ఆఫ్రికాలోని బురుండీలో 91.44శాతం కాగా ఆసియాలోని సింగపూర్‌లో అత్యల్పంగా 0.12శాతం మంది వున్నారు. సగటు కంటే ఎక్కువ మంది ఆధారపడుతున్న దేశాలు 72 వున్నాయి. 26-27శాతం మధ్య ఈక్వెడార్‌, శ్రీలంక, కాంబోడియా, కిర్కిజిస్తాన్‌, బోట్సవానా వున్నాయి. మనది ఎగువ 72లో 42.74శాతమందితో 43వ స్ధానంలో వుండగా 42.02శాతంతో పాకిస్ధాన్‌ 44వదిగాను, బంగ్లాదేశ్‌ 39.07శాతంతో 52వ స్ధానంలో వుంది. మన పొరుగునే వున్న చైనా 17.51శాతంతో 94వ స్ధానంలో వుంది. అమెరికా 1.66 శాతంతో 167వ స్ధానంలో వుంది. దీన్ని బట్టి మనకు తేలుతున్నదేమంటే సగటు కంటే ఎక్కువ మంది వ్యవసాయంమీద వుపాధి పొందుతున్న ప్రతి దేశంలోనూ వ్యవసాయ సబ్సిడీలు అంటే అర్ధం కేవలం పంటల సాగుకు మాత్రమే కాదు, వుపాధికి కూడా ఇస్తున్నట్లుగా భావించాలి. సబ్సిడీలు ఇంకా ఇతర అనేక అంశాల మీద ఆధారపడి ఇస్తున్నారు. స్ధలాభావం రీత్యా ప్రతి దేశం గురించి చర్చించటం ఇక్కడ సాధ్యం కాదు కనుక కొన్ని దేశాల గురించి చూద్దాం.

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయానికి బ్రిటన్‌ లేదా దాని వలసలుగా వున్న కొన్ని దేశాలకు అవసరమైన ముడిసరకులు సరఫరా చేసే దేశంగా మాత్రమే వుంది. మన జనానికి సరిపడా ఆహార ధాన్యాలు పండే పరిస్ధితి కూడా లేదు. బెంగాల్‌ కరవుతో సహా అనేక కరవు పరిస్ధితులు అందుకు నిదర్శనం. స్వాతంత్య్రం తరువాత ఆకలి, మన అవసరాలను అవకాశంగా తీసుకొని కొన్ని ధనిక దేశాలు మనల్ని లంగదీసుకొనేందుకు ప్రయత్నించాయి. అమెరికాలో చేసిన పబ్లిక్‌ లా 480(పిఎల్‌ 480)ని ఆధారం చేసుకొని అక్కడి నుంచి ఆహార ధాన్యాలను మన దేశ మార్కెట్లో కుమ్మరించారు. ప్రచ్చన్న యుద్దంలో సోవియట్‌ యూనియన్‌వైపు మొగ్గుచూపిన మన దేశాన్ని తనవైపు తిప్పుకోవటం కూడా దీని తెరవెనుక లక్ష్యం. ఈ పూర్వరంగంలో అమెరికా మీద ఆధారపడకుండా వుండేందుకు మన ఆహార ధాన్యాల స్వయం సమృద్ధి లక్ష్యంగా మన ప్రభుత్వం 1960 దశకంలో హరిత విప్లవానికి చర్యలు తీసుకుంది. అందరికీ తెలిసిన ఎంఎస్‌ స్వామినాధన్‌ చొరవతో అధిక దిగుబడి గోధుమ వంగడాల తయారీకి శ్రీకారం చుట్టారు. దానిలో భాగమే జై కిసాన్‌, జై జవాన్‌ నినాదం.

అమెరికా నుంచి చౌకగా వచ్చే ఆహార ధాన్యాల గురించి సంతృప్తి లేదా భ్రమలు కావచ్చు. నాటి విధాన నిర్ణేతలు స్వాతంత్య్రం తరువాత తొలి ప్రాధాన్యత పారిశ్రామికీకరణకు ఇచ్చారు.1956 నాటి అమెరికా పిఎల్‌ 480 చట్టం కింద చౌక ధరలకు ధాన్యం దిగుమతి కారణంగా మన దేశంలో ధరలు పడిపోవటం లేదా వ్యవసాయ ఖర్చులకు అనుగుణంగా ఆదాయం రాకపోవటం వంటి సమస్యలతో గ్రామీణ భారతంలో అసంతృప్తి ప్రారంభమైంది. అది వ్యవసాయ వుత్పత్తి పడిపోవటం లేదా ఎదుగుదల నిలిచిపోవటానికి దారి తీసింది. రెండవది రాజకీయంగా ప్రచ్చన్న యుద్దంలో అమెరికా వత్తిడి పెరగటం వంటి కారణాలు కూడా తోడై 1950దశకం చివరిలో వ్యవసాయ రంగం మీద కేంద్రీకరణతో హరిత విప్లవానికి శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా రాయితీ ధరలకు సంకరజాతి విత్తనాల సరఫరా, విద్యుత్‌, ఎరువుల రాయితీలు, విస్తరణ సేవల వంటి వాటికి తెరతీశారు.

అమెరికాలో కూడా పారిశ్రామిక విప్లవంతో తయారైన వస్తువులకు మార్కెట్‌ను కల్పించేందుకు భూమి లేని వారికి భూమి ఇచ్చి ఆదాయం కల్పించేందుకు అనేక చర్యలలో భాగమే పెద్ద ఎత్తున ఇస్తున్న సబ్సిడీలు. అమెరికాలో భూ గుత్తాధిపత్యాన్ని దెబ్బతీసే క్రమంలో 1862లో అనేక మందికి ప్రభుత్వం భూమి కేటాయించింది. అలా భూమి పొందిన వారికి అవసరమైన పెట్టుబడులు, ఇతర అవసరాల కోసం రుణాలు ఇచ్చేందుకు, విస్తరణ సేవలు అందించేందుకు తీసుకున్న చర్యలు కూడా సాగు సబ్సిడీలలో భాగమే. తెలుగు రాష్ట్రాలలో కూడా 1970దశకంలో భూమి అభివృద్ధి బ్యాంకులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ధనిక దేశాలలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కారణంగా అమెరికా వ్యవసాయ రంగం కూడా కుదేలైంది.1929లో ధరల పతనాన్ని నివారించేందుకు వ్యవసాయ మార్కెటింగ్‌ చట్టాన్ని చేశారు. పంటల సాగును తగ్గించాలని రైతులను కోరారు. ప్రభుత్వమే వుత్పత్తులను కొనుగోలు చేసి నిల్వచేసింది. తరువాత అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ న్యూ డీల్‌ పేరుతో అనేక చర్యలను ప్రకటించి మహా సంక్షోభం నుంచి గట్టెంకించేందుకు ప్రయత్నించాడు. దానిలో భాగంగా వ్యవసాయ సబ్సిడీలను అమలులోకి తెచ్చాడు. అవి రూపాలను మార్చుకున్నప్పటికీ ఇప్పటికీ ఏదో రూపంలో కొనసాగుతున్నాయి. 1999 నాటికి వ్యవసాయ సబ్సిడీలు రికార్డు స్దాయికి 22 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 1995-2010 మధ్య ఏడాదికి అన్ని రకాల వ్యవసాయ సబ్సిడీలు 52బిలియన్‌ డాలర్లకు చేరాయి.ఇటీవలి సంవత్సరాలలో అమెరికాలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభంలో చిన్న రైతాంగం దెబ్బతిన్నారు. ఒబామా సర్కార్‌ వ్యవసాయ, ఆహార సబ్సిడీలకు కోత పెట్టేందుకు ప్రతిపాదించి ఆమేరకు తగ్గించివేసింది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ రానున్న పది సంవత్సరాలలో ఆహార, వ్యవసాయ పరిశోధనలు, సబ్సిడీలకు 867బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయాలని గతేడాది నిర్ణయించింది. చైనాతో వాణిజ్య యుద్దాన్ని ప్రారంభించిన ట్రంప్‌ దాని వలన జరిగే నష్టాన్ని భరించేందుకు రైతాంగానికి 12బిలియన్‌ డాలర్ల ప్రత్యేక సబ్సిడీలు ఇస్తున్న విషయం తెలిసిందే.

అమెరికాలో వ్యవసాయ సబ్సిడీలను వ్యతిరేకించేవారు లేకపోలేదు. వారు చేస్తున్న కొన్ని వాదనలను చూద్దాం. పంటల బీమా పధకం కారణంగా రెతులు అనావృష్టికి తట్టుకోలేని పంటల విత్తనాలను నాటి పరిహారాన్ని పొందేందుకు మొగ్గు చూపుతున్నారు తప్ప అనావృష్టిని తట్టుకొనే రకాల సాగువైపు మొగ్గటం లేదు. కరవు ప్రాంతాల్లో సాగు వలన భూగర్భ జలాలను విపరీతంగాఆ రైతులు వాడుతున్నారు, ఇప్పుడున్న మాదిరి నీటి వెలికితీత కొనసాగితే ఈ శతాబ్ది అంతానికి అనేక జలాశయాలు ఎండిపోతాయి. ఇప్పటికే కొన్ని ఆ దశలో వున్నాయి. వాటిని తిరిగి వర్షపు నీటితో నింపాలంటే ఆరువేల సంవత్సరాలు పడుతుంది. మొక్కజన్న రైతాంగాన్ని నిరుత్సాహపరచాలి, 40శాతం వుత్పత్తి పశుదాణాకు మరలుతోంది. సబ్సిడీల కారణంగా ఎథనాల్‌ తయారీ కోసం కూడా రైతులు మొక్కజన్న సాగు చేస్తున్నారు. ఎథనాల్‌ తయారు చేసేందుకు ఏడాదికి 120బిలియన్‌ గ్యాలన్ల నీరు వృధా అవుతోంది. టెక్సాస్‌ రాష్ట్రంలో పత్తి రైతులకు ఏటా మూడు బిలియన్‌ డాలర్ల సబ్సిడీ ఇస్తున్నారు. దాన్ని చైనాకు ఎగుమతి చేసి అక్కడ చౌకగా తయారయ్యే దుస్తులను తిరిగి దిగుమతి చేసుకుంటున్నారు. ఆహార ధాన్యాలకు పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తున్న కారణంగా కూరగాయలు, పండ్లకంటే చౌకగా లభిస్తున్నందున అమెరికన్ల సగటు ఆహారంలో నాలుగో వంతు ధాన్యాలే ఆక్రమిస్తున్నాయి. పండ్లు, కూరగాయలు పదిశాతం కంటే తక్కువగా వున్నాయి. వ్యవసాయ సబ్సిడీల్లో ఆరుశాతం వూబకాయాలను పెంచే ఆహారానికి మరలుతున్నది.సబ్సిడీలు గ్రామీణ అమెరికాలో భూముల ధరల పెరుగుదలకు దారితీస్తున్నాయి. ఖర్చులను తగ్గించే ఆలోచనలకు రైతులను దూరం చేస్తున్నాయి. కొన్ని పంటలకు మాత్రమే సబ్సిడీ ఇస్తున్నారు.అమెరికా రైతులకు రాయితీలు అవసరం లేదు, ఎందుకంటే అత్యంత అనుకూలమైన ప్రాంతాలు అక్కడ వున్నాయి. కావలసినంత సారవంతమైన భూమి, నీరు అందుబాటులో వుంది. ఇతర పరిశ్రమల మాదిరే వ్యవసాయం కూడా సమస్యలను ఎదుర్కొంటోంది తప్ప వేరే కాదు కనుక దానికి ప్రాధాన్యత పెద్ద పీట వేయనవసరం లేదు. నాలుగు వందల మంది అత్యంత ధనవంతుల్లో 50 మంది వ్యవసాయ రాయితీలు పొందారు, 62శాతం సాగుదార్లకు అసలు రాయితీలు లేవు. ఎగువన వున్న ఒకశాతం మంది 26శాతం సబ్సిడీలు పొందారు. అమెరికా సబ్సిడీల వివాదం కారణంగానే దోహా దఫా చర్చలు, ఇతర వాణిజ్య చర్చలు విఫలమయ్యాయి.

1930లో అమెరికా జనాభాలో 25శాతం అంటే మూడు కోట్ల మంది 65లక్షల కమతాల్లో వ్యవసాయం మీద ఆధారపడి వున్నారు.అందువలన వారి ఆర్దిక స్ధితిని స్ధిరపరచటానికి సబ్సిడీలను ఒక మార్గంగా ఎంచుకున్నారు. 2012నాటికి కమతాలు 21లక్షలకు, వ్యవసాయం మీద ఆధారపడే జనాభా ముప్పైలక్షలకు తగ్గిపోయింది. తరువాత సంవత్సరాల్లో మరింత తగ్గుతుందని అంచనా. ఇంత తక్కువగా వ్యవసాయం మీద ఆధారపడే వారు వున్నా సాగు గిట్టుబాటు కావటం లేదని, సబ్సిడీలు అవసరమని చెబుతున్నారు.2011లో వ్యవసాయ రంగం నుంచి నిఖర ఆదాయం 94.7 బిలియన్లు అయితే 2018లో అది 59.5 బిలియన్లకు తగ్గిపోతుందని అంచనా. అమెరికా సబ్సిడీ మొత్తాలలో 15శాతం పెద్ద వ్యవసాయ వాణిజ్య సంస్దలు 85శాతం సబ్సిడీలను పొందుతున్నాయని కాటో సంస్ధ పేర్కొన్నది.1995-2016 మధ్య ఏడు రాష్ట్రాలు 45శాతం మేరకు సబ్సిడీలను పొందాయని పర్యావరణ బృందం పేర్కొన్నది. సబ్సిడీలు చిన్న రైతుల కంటే పెద్ద రైతులు అదీ పత్తి, సోయా, మొక్కజన్న, గోధుమ, వరి పండించే వారే ఎక్కువ భాగం పొందారని తెలిపింది. 2014లో చేసిన చట్టం ప్రకారం చురుకుగా సాగులో నిమగ్నమయ్యే ఒక రైతు గరిష్టంగా ఏడాదికి లక్షా 25వేల డాలర్లు మాత్రమే (మన రూపాయల్లో 88లక్షల రూపాయలు) పొందటానికి అర్హుడని విధించిన నిబంధనను తుంగలో తొక్కుతున్నారని కూడా వెల్లడించింది.

సబ్సిడీలు కొనసాగాలనే వారి వాదన ఎలా వుందంటే అత్యంత అభివృద్ధి చెందిన దేశాలలో ఇస్తున్న రాయితీల వలన అక్కడి రైతులు వాణిజ్యపరంగా అన్యాయమైన రీతిలో ప్రయోజనం పొందుతున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్ధ రాయితీల మొత్తాన్ని తగ్గిస్తున్న కారణంగా ధనిక దేశాల నుంచి ప్రపంచ ధాన్య నిల్వలకు తోడయ్యే మొత్తం తగ్గిపోతుంది. ఆహార లభ్యత తగ్గి ఆహార ధరలు తీవ్ర వడిదుడుకులకు గురవుతాయి.తుపాన్లు, అనావృష్టి, యుద్ధాలు, మాంద్యాల వంటి వాటి నుంచి రైతులను ఆదుకోవాలి, ఇతర వాణిజ్య వుత్పత్తుల కంటే ఆహారం ముఖ్యం. డాలరు విలువ పెరిగితే ఇతర దేశస్ధులు కొనేందుకు ముందుకు రారు.

ప్రభుత్వ రంగ సంస్ధలను ఆధారం చేసుకొని ఎదిగిన పెట్టుబడిదారులు ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్దలు అవసరం లేదు మేమే అన్ని పరిశ్రమలు నెలకొల్పుతాం, సబ్సిడీలు మాకే ఇవ్వండని మన దేశంలో చెబుతున్న విషయం తెలిసిందే. అలాగే వ్యవసాయ సబ్సిడీలకు కూడా వ్యతిరేకమైన వాదనలు ముందుకు తెస్తున్నారు. దీని వెనుక అంతర్జాతీయ కార్పొరేట్ల హస్తం వుంది. సబ్సిడీ విధానాలు వనరులను సక్రమంగా వినియోగించటానికి అవకాశం లేకుండా చేస్తున్నాయి. మారుతున్న మధ్యతరగతి ఆహార అలవాట్ల కారణంగా ప్రస్తుతం ఆహారంలో కూరగాయలు, మాంసవుత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతోంది. ధాన్య డిమాండ్‌ తగ్గుతోంది. ప్రస్తుత విధానాలు దీనికి అనుగుణంగా లేవు. వరి, గోధుమ పంటలు సాగు భూమిలో నాలుగింట మూడు వంతులు, మొత్తం విలువలో 85శాతం ఆక్రమిస్తున్నాయి. ఈ పంటలు ఇప్పటికే మిగులుగా వున్నాయి, రైతులకు ఇతర పంటలకు ప్రోత్సాహం లేనందున వీటిని కొనుగోలు చేసే హామీ వున్నంత కాలం ఇవే కొనసాగుతాయి. మార్కెట్‌ డిమాండ్లకు అనుగుణంగా వుత్పత్తిదారులు స్పందించే విధంగా ప్రస్తుత విధానాలను మార్చాల్సి వుంది. వనరులను అధికంగా వినియోగించటం ద్వారా పర్యావరణ సమస్యలు కూడా వస్తున్నాయి. భూమిలో చేరే నీటి కంటే రెండు రెట్లు దాని నుంచి తీసుకుంటున్నారు.నీటి లభ్యత తగ్గిపోయే కొద్దీ బోర్లను లోతుగా వేస్తూ విద్యుత్‌ అధిక వినియోగ సమస్యను పెంచుతున్నారు. రసాయన ఎరువులను ఎక్కువగా వాడుతున్నారు.

వివిధ దేశాలు లేదా కూటముల మధ్య కుదురుతున్న వాణిజ్య ఒప్పందాలు కొత్త సమస్యలను, సబ్సిడీలను ముందుకు తెస్తున్నాయి. వుదాహరణకు పసిఫిక్‌ ప్రాంత భాగస్వామ్య (టిపిపి) వాణిజ్య ఒప్పంద ప్రకారం కిలో పందిమాసం లేదా పంది వారుపై జపాన్‌లో విధిస్తున్న 482ఎన్‌లను పదిహేను సంవత్సరాల వ్యవధిలో 50ఎన్‌లకు తగ్గించాల్సి వుంది. దీనివలన పన్ను తగ్గేకొద్దీ విదేశీ మాంసం జపాన్‌లో ప్రవేశించి స్ధానిక పందుల పెంపక రైతులకు ఆదాయాల మీద ప్రభావం చూపుతుంది. అందువలన జపాన్‌ సర్కార్‌ వారికి సబ్సిడీలను పెంచేందుకు పూనుకుంది. గతంలో 1994-2001 మధ్య వురుగ్వే దఫా ఒప్పందం వలన జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు 6.1లక్షల ఎన్‌లను సబ్సిడీగా జపాన్‌ అందచేసింది. నలభై దేశాలకు సంబంధించి గత రెండు దశాబ్దాలలో సబ్సిడీల గురించి విశ్లేషించిన ఒక అమెరికన్‌ జర్నలిస్టు చెబుతున్నదాని ప్రకారం సగటున ఒక శాతం విదేశీ దిగుమతులు పెరిగితే 0.2శాతం మేరకు సబ్సిడీల కోసం ప్రభుత్వ ఖర్చు పెరుగుతోంది. అయితే దీనికి భిన్నంగా విదేశీ దిగుమతులపై పన్ను పెంపు కారణంగా ట్రంప్‌ సర్కార్‌ దానికి పరిహారంగా రైతులకు సబ్సిడీ అందిస్తున్నది. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే సోయాపై చైనా 20శాతం పన్నులను పెంచటంతో అమెరికా మార్కెట్లో 20శాతం మేరకు ధరలు పడిపోయాయి. దీని ప్రభావం వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల మీద పడకుండా చూసేందుకు ట్రంప్‌ కొత్త సబ్సిడీలను ముందుకు తెచ్చారు. సబ్సిడీలను రాజకీయవేత్తలు తమ రాజకీయ ప్రయోజనాలకు కూడా వినియోగించుకోవటం అంటే ఇదే.గత నాలుగు సంవత్సరాలుగా అమెరికా గ్రామీణ రైతాంగ వ్యవసాయ ఆదాయాలు తిరోగమనంలో వున్నాయి. ఫలితంగా రైతుల రుణ భారం అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 13.8బిలియన్లు పెరిగి 406.9 బిలియన్‌ డాలర్లకు చేరింది.2019లో తమ పరిస్ధితి మెరుగుపడుతుందనే ఆశాభావం వెలిబుచ్చిన వారు 22శాతం మందే వున్నారు. గత పది సంవత్సరాలలో దివాలా తీస్తున్న రైతుల సంఖ్య వున్నతస్ధాయికి చేరింది. 2013లో నిఖర వ్యవసాయ ఆదాయం 134.8 బిలియన్‌ డాలర్లుండగా 2018లో 66.3కు పడిపోయింది. రానున్న ఐదు సంవత్సరాలలో కూడా సగటున 77.3బిలియన్లకు మించదని అంచనా వేస్తున్నారు.

ఐరోపా యూనియన్‌(ఇయు)లో 2021-2027 మధ్య వ్యవసాయ సబ్సిడీలను తగ్గించాలని నిర్ణయించారు. యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలుగుతున్న కారణంగా అక్కడి నుంచి వచ్చే నిధులు ఆగిపోనున్న పూర్వరంగంలో ఈ మేరకు ప్రతిపాదించారు. అయితే బ్రిటన్‌ వాటా కూడా రద్దవుతున్న కారణంగా సబ్సిడీల మొత్తం కూడా తగ్గే అవకాశం కూడా వుంది. వుమ్మడి వ్యవసాయ విధానంలో భాగంగా ఇయు సభ్య దేశాలకు సబ్సిడీ మొత్తాలను కేటాయిస్తారు. ప్రస్తుతం 365బిలియన్‌ యూరోలను ప్రతిపాదించారు. ఎంత మేరకు కోత పెడతారనేది ఎలాంటి ఒప్పందం లేకుండా ఇయు నుంచి బ్రిటన్‌ తప్పుకోవటమా లేదా అన్నది తేలిన తరువాత వెల్లడి కావచ్చు. గరిష్టంగా లక్ష యూరోలకు పరిమితం చేయాలని, అరవై వేల యూరోలకు మించిన వాటిమీద ఎంత మేరకు కోత పెట్టాలనేది నిర్ణయిస్తారు. చిన్న, మధ్యతరగతి రైతాంగానికి ఎక్కువ మొత్తం చెల్లించాలనే ఆదేశాన్ని నిబంధనల్లో చేర్చాలని ప్రతిపాదించారు.

Image result for andhra pradesh agriculture

ఐరోపా యూనియన్‌లో ఆహార పంటలకే కాదు ద్రాక్ష సారా(వైన్‌)కు కూడా సబ్సిడీలు ఇస్తున్నారనే అంశం చాలా మందికి తెలియదు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక ప్రపంచమంతటా వుంది. ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారనే ఐరోపాలో దాన్ని దెబ్బతీసే ద్రాక్షసారాకు సబ్సిడీలు ఇవ్వటం వెనుక లాభాలు తప్ప ఆరోగ్యం కాదన్నది స్పష్టం. రెండు రకాల పద్దుల కింద ఈ సబ్సిడీలు ఇస్తున్నారు. కారణం ఏమిటయ్యా అంటే ఐరోపా వైన్‌ వుత్పత్తిదారులు ఇతరులతో మార్కెటింగ్‌ పోటీలో నిలవాలన్నదే. అంటే పోటీబడి తాగుబోతులకు సరఫరా చేస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఈ సబ్సిడీ మొత్తాలు పెరుగుతున్నాయి. ఈ నిధులలో 90శాతం స్పెయిన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ వుత్పత్తిదార్లకే చేరుతున్నాయి. 2014-18 మధ్య ఆరు బిలియన్ల యూరోలు సబ్సిడీ ఇచ్చారు.2007-13 సంవత్సరాలలో క్యాన్సర్‌పై పరిశోధనలకు కేటాయించిన మొత్తం 150 కోట్ల యూరోలు మాత్రమే. 2009-15 మధ్య వైన్‌ ఎగుమతులలో పెరుగుదల ద్వారా 67.1కోట్ల యూరోల ఆదాయం వచ్చింది. ఇందుకోసం చేసిన ఖర్చు 69.2బిలియన్‌ యూరోలు. దీన్ని సులభంగా అర్దమయ్యేట్లు చెప్పాలంటే కంపెనీల 97యూరోల సంపాదనకు జనం సొమ్ము 100 యూరోలు ఖర్చు చేశారు.టర్కీలో పశుసంవర్ధన, వ్యవసాయదార్లకు అంతకు ముందున్న మొత్తంపై 2018లో 15శాతం పెంచుతూ సబ్సిడీ బడ్జెట్‌ను ఆమోదించారు. రైతులు వాడే పెట్రోలు, డీజిల్‌ ఖర్చులో సగం మొత్తాన్ని సబ్సిడీగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

అమెరికన్లు ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా వ్యవసాయ సబ్సిడీ ఇస్తూనే మరోవైపు ఇతర దేశాల మీద ఎదురుదాడి చేస్తున్నారు. దోహా చర్చలు విఫలం కావటానికి ఇదొక కారణం. మన దేశంలో మద్దతు ధరలు ఎక్కువగా వున్నాయంటూ ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటివో) లో ఫిర్యాదు చేసిన అమెరికా మన పొరుగు దేశం చైనాను కూడా వదల్లేదు. అందువల్లనే సబ్సిడీల గురించి వుమ్మడిగా పోరాడాలని రెండు దేశాలు నిర్ణయించాయి. డబ్ల్యుటివోలో అంగీకరించిన మొత్తం కంటే చైనా ధాన్య రైతులకు ఎక్కువ సబ్సిడీ ఇస్తోందని అమెరికా ఫిర్యాదు చేసింది. చైనా తీసుకున్న ఈ చర్యల వలన అమెరికన్‌ రైతులు తమ ప్రపంచ స్ధాయి వుత్పత్తులను చైనాకు ఎగుమతి చేయలేకపోతున్నారన్నది దాని సారాంశం. 2015లో దిగుమతి చేసుకున్న మొక్కజన్నల కంటే తమ రైతాంగానికి 40శాతం అదనంగా ఇచ్చిందని 2016లో అది 50శాతానికి చేరినట్లు విశ్లేషకులు రాశారు.

ఎగుమతి మార్కెట్లో అందరికీ సమాన అవకాశాలను కల్పించే లక్ష్యంతో ప్రపంచ వాణిజ్య సంస్ధను ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసినదే. నిజానికి అది ధనిక దేశాల ప్రయోజనాలకోసం ఏర్పాటు చేసింది. ఈ కారణంగానే 2001లో ప్రారంభమైన దోహా దఫా చర్చలు ఇంతవరకు కొలిక్కి రాలేదు. ధనిక దేశాల ఆటలను సాగకుండా వర్ధమాన దేశాలు పతిఘటించటం, ధనిక దేశాలైన ఐరోపా-అమెరికా మధ్య విబేధాలు తలెత్తటం దీనికి కారణం. ఇంతవరకు గతంలో ధనిక దేశాలకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు అవి సబ్సిడీలను తగ్గించలేదు. మరోవైపు తమ ఆధిపత్యాన్ని వుపయోగించుకొని సభ్య దేశాలో ద్వైపాక్షిక ఒప్పందాలను రుద్దేందుకు అవి ప్రయత్నిస్తున్నాయి. సబ్సిడీ నిబంధనలకు వక్రభాష్యాలు చెబుతున్నాయి. మన దేశంలో కనీస మద్దతు ధరల ప్రకటన కూడా సబ్సిడీగానే పరిగణిస్తున్నది. ప్రపంచ ధరలు అత్యంత కనిష్ట స్ధాయిలో వున్న 1986-88నాటి మార్కెట్‌ ధరల ప్రాతిపదికన ఇప్పుడు అంటే 30సంవత్సరాల తరువాత సబ్సిడీలను లెక్కించటం తప్పుడు లెక్కలు తప్ప మరొకటి కాదు. ఈ విధానం సహజంగానే సబ్సిడీ ఎక్కువ వున్నట్లు చూపుతుంది.వర్తమాన విలువ ప్రకారం చూస్తే సగటున ఒక రైతుకు ఏడాదికి డాలర్లలో ఇస్తున్న మొత్తాలు ఇలా వున్నాయి.అమెరికా 68,910, జపాన్‌ 14,136, ఐరోపాయూనియన్‌ 12,384, బ్రెజిల్‌ 468, చైనా 348, భారత్‌ 228, ఇండోనేషియా 73 డాలర్లు ఇస్తున్నది. మన వంటి దేశాలకు వస్తువిలువలో పదిశాతం వరకు రాయితీలు ఇచ్చేందుకు ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలు అనుమతిస్తున్నాయి. భారత్‌, చైనా, ఇండోనేషియా,ఈజిప్పు వంటి దేశాలు ఇంకా ఆ స్ధాయికి చేరుకోలేదు అంటే ఇంకా రాయితీలు ఇవ్వవచ్చు. అయినా అమెరికా మన మీద, చైనా మీద డబ్ల్యుటిఓలో ఫిర్యాదు చేసిందని ముందే చెప్పుకున్నాము. ధనిక దేశాలు తమ వద్ద వున్న మిగులును మనవంటి దేశాల మీద కుమ్మరించేందుకు పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇస్తుంటే వర్ధమాన దేశాలు వున్న వుత్పత్తిని నిలబెట్టుకొనేందుకు, అవసరాలకు సరిపడా పెంచుకొనేందుకు రాయితీలు, సబ్సిడీలు ఇస్తున్నాయి. ఇదే తేడా, దీన్ని గమనించకుండా సబ్సిడీలంటే సబ్సిడీలే ఎవరు ఇస్తున్నా ఎత్తివేయాల్సిందే అని వితండ వాదనలు చేసే వారిని ఏ బాపతు కింద జమకట్టాలో రైతాంగమే నిర్ణయించుకోవాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ కౌగిలింతల దౌత్యం-వ్రతం చెడ్డా ఫలం దక్కేనా !

25 Monday Feb 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Hug diplomacy, Mohammed bin Salman (MBS), Narendra Modi, Narendra Modi Hug diplomacy, pakistan, Pulwama, Saudi Arabia

Image result for Narendra Modi’s  Hug diplomacy, saudi prince

ఎం కోటేశ్వరరావు

కాశ్మీరులోని పుల్వామాలో వుగ్రదాడిలో 40మంది సిఆర్‌పిఎఫ్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయి పది రోజులు దాటింది. ఫిబ్రవరి 14వ తేదీ సాయంత్రం 3-4గంటల మధ్య పేలుడు సంభవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలోని సామాజిక, సాంప్రదాయ మీడియా, రాజకీయ రంగంలో చూస్తే వుగ్రవాదుల దాడులను ఎలా అరికట్టాలనేదాని కంటే యుద్దోన్మాదాన్ని, కొన్ని సామాజిక తరగతుల పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టటం, పుల్వామా వుదంతం నుంచి రాజకీయ లబ్ది పొందే అంశాలకు ప్రాధాన్యత ఏర్పడటం నిజంగా విచారకరం. వామపక్షాలు మినహా బిజెపి కూటమి, కాంగ్రెస్‌ కూటమి పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో లబ్దిపొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మీడియాలోని కొంత మంది వుద్రేకాలను రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. దాడికి సంబంధించి భద్రతాలోపం ఎక్కడ జరిగిందో ఇంతవరకు వెల్లడి కాలేదు. ఇదేమీ చిన్న విషయం కాదు. గతంలో సైనిక కేంద్రాలపై జరిగితే ఇప్పుడు కదులుతున్న వాహన శ్రేణి లక్ష్యంగా జరిగింది.

దాడి జరిగిన సమయంలో నరేంద్రమోడీ ఒక వీడియో షూటింగ్‌లో మునిగిపోయి మూడుగంటల వరకు దాడిని పట్టించుకోలేదని, సమోసాలు, ఇతర తినుబండారాలు తిన్నారని కాంగ్రెస్‌ ఆరోపిస్తే ప్రభుత్వం, బిజెపినేతలు దాన్ని తిరస్కరిస్తూ నాలుగు గంటలకే ప్రధాని దాడి వుదంతం మీద సమీక్షలు ప్రారంభించారని ఆ రోజు రాత్రి అసలు భోజనమే చేయలేదని ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. తాము ఎవరు చెప్పింది వాస్తవమో కాదో తేల్చలేకపోయామని అందువలన రెండు పక్షాలు చెప్పిన అంశాలను వార్తలుగా ఇస్తున్నట్లు, ముందు చెప్పిన తీర్పును వెనక్కు తీసుకుంటున్నామని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక పేర్కొన్నది. ఇక్కడొక భట్టిప్రోలు తీర్పు అనే గుంటూరు జిల్లా పిట్టకధ చెప్పాల్సి వుంది. కొండమీద గొడవ జరుగుతుంటే చూద్దామని వెళ్లామని రెండువైపుల వారు వారు కత్తులు ఝళిపిస్తుండగా పెద్దగా వురుములు, మెరుపులు వచ్చాయని ఆ సమయంలో ఎవరు ఎవరిని ముందు కొట్టారో తాము చూడలేకపోయామని పెద్దలు చెప్పారన్నది సారాంశం. ఎన్నికల రోజులు, మోడీ తిరిగి పదవిలోకి వస్తారో రారో ఎందుకు పంచాయతీ అనుకుందేమో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా. దాన్ని కాసేపు పక్కన పెడదాం.

వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ పుల్వామా దాడి జరిగిన ఎనిమిదవ రోజు అంటే 22వ తేదీన లక్నో నగరంలో భారతీయ మనోగతం అనే అంశంపై నిర్వహించిన సభలో పాల్గన్నారు.ఒక విద్యార్ధి లేచి పుల్వామా దాడికి ముందు తరువాత కూడా అసలు మన భద్రతా సంస్ధలు ఏమి చేస్తున్నాయని సూటిగా ప్రశ్నించాడు. దానికి సమాధానంగా నువ్వనుకుంటున్నదే దేశంలోని ప్రతి సామాన్యుడి బుర్రలో మెదులుతోందంటూ వెంటనే బటబటా కన్నీళ్లు కారుస్తూ ఏడ్చేశారని వార్తలు వచ్చాయి. ఆయన సామాన్యుడేమీ కాదు, నరేంద్రమోడీకి ప్రత్యామ్నాయంగా ప్రధాని కావాలని అనుకుంటున్నవారిలో వున్నట్లు ప్రచారం జరుగుతున్న నేత. ఎనిమిది రోజుల తరువాత బహిరంగంగా ఏడవటం ఏమిటి?

పుల్వామా దాడి జరిగి 24 గంటలు కూడా గడవ లేదు, దేశం దిగ్భ్రాంతి నుంచి ఇంకా తేరుకోలేదు. ప్రధాని నరేంద్రమోడీ దేశంలో వేగంగా ప్రయాణించే తొలి రైలు వందే భారత్‌ను ప్రారంభించే అవకాశాన్ని వదులు కోలేదు. ఆ తరువాత నాలుగు రోజులకు 19వ తేదీ సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సుల్తాన్‌ నాయకత్వంలో పెద్ద ప్రతినిధి వర్గం మన దేశ పర్యటనకు వచ్చింది.ప్రాణాలు కోల్పోయిన 40మంది సిఆర్‌పిఎఫ్‌ సిబ్బంది కుటుంబాల కన్నీటి చారికలు ఇంకా కనిపిస్తూనే వున్నాయి. ఆ దాడికి జైషే మహమ్మద్‌ అనే పాక్‌ ప్రేరేపిత వుగ్రవాద సంస్ధ బాధ్యురాలు. ప్రపంచంలో మత ప్రాతిపదికన పని చేస్తున్న ప్రతి వుగ్రవాద సంస్ధకూ సౌదీ పెట్రో డాలర్లు నిత్యం అందుతుంటాయని తెలుసు.అమెరికా పధకం, సౌదీ ప్రోత్సాహం, సాయం లేకుండా పాకిస్దాన్‌లో వుగ్రవాద ముఠాలు మనుగడ సాగించటం సాధ్యం కాదు. మోడీకి అది తెలియంది కాదు. సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సుల్తాన్‌(ఎంబిఎస్‌) రాజరిక వారసుడిగా ఎంపికయ్యాడు తప్ప ఇంకా రాజు కాలేదు. రాజ ప్రముఖుడిగా అధికార మర్యాదలు పొందుతున్నాడు. యువరాజు బృందాన్ని మన ప్రధాని నరేంద్రమోడీ రాజభవన్‌లో కలవాల్సి వుండగా ప్రోటోకాల్‌( గౌరవ స్ధాన భేద సూచనం) పక్కన పెట్టి తనకంటే తక్కువ స్థాయి కలిగిన యువరాజును ఆహ్వానించేందుకు ఏకంగా విమానాశ్రయానికి వెళ్లి కౌగిలింతలతో స్వాగతం పలకటం విపరీతపోకడగా దేశ ప్రజలకు కనిపించింది.

నరేంద్రమోడీ అంతకు ముందు కూడా పలువురు విదేశీనేతల పర్యటనల్లో కౌగిలింతలతో సరికొత్త దౌత్యానికి తెరతీశారు. సౌదీ యువరాజు పుల్వామా దాడి జరిగిన తరువాత ముందుగా పాక్‌ పర్యటనకు వెళ్లాడు. మన దేశ పర్యటన, తరువాత చైనా పర్యటన కూడా అంతకు ముందే ఖరారైంది. నిజంగా సౌదీ మనకు అత్యంత ముఖ్యదేశమే అయితే మన దేశంలో ఇంత పెద్ద విషాదం జరిగి, దానికి బాధ్యత పాకిస్ధాన్‌దే అని మన దేశ ప్రకటించిన తరుణంలో రాకుమారుడి పర్యటన వాయిదా వేసుకొని వుండాల్సింది. అయితే నరేంద్రమోడీయే 24గంటలు కూడా గడవక ముందే వందేభారత్‌ రైలు ప్రారంభోత్సవానికి హాజరు కావటం, అభిలపక్ష సభను బహిష్కరించి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గంటున్నపుడు సౌదీ యువరాజు ఎందుకు పర్యటన వాయిదా వేసుకోవాలంటే సమాధానం వుండదు. కారణం చెప్పకపోయినా పుల్వామా వుదంతం కారణంగానే పాక్‌ పర్యటనను రెండు రోజులు వాయిదా వేసుకొని మన దేశానికి ముందనుకున్నట్లుగానే వచ్చాడు. అతగాడికి స్వాగతం పలకటానికి పాకిస్ధాన్‌, మన దేశం రెండూ పోటీ పడ్డాయి. రావల్పిండిలో 21తుపాకులు, జెట్‌ ఫైటర్‌తో ఘనస్వాగతం పలికారు, బంగారంతో చేసిన తుపాకిని బహుమతిగా ఇచ్చారు. మన దేశంలో ప్రధాని నరేంద్రమోడీ విమానాశ్రయానికి వెళ్లి మరీ కౌగిలింతలతో స్వాగతం పలికాడు. చైనాలో అధ్యక్షుడు జింపింగ్‌తో కలసి ఫొటో దిగాడు.

జింపింగ్‌ సౌదీ యువరాజుతో ఎందుకు ఫొటో దిగాడు అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. చైనా తన వాణిజ్య ప్రయోజనాలను రక్షించుకొనేందుకు రోడ్‌ మరియు బెల్ట్‌ పేరుతో ఒక పెద్ధ కార్యాచరణ తలపెట్టింది. దాన్నే కొందరు చైనా సిల్క్‌ మార్గం అని పిలుస్తున్నారు. చైనా పురాతన కాలంలో తన సిల్కును వివిధ దేశాలకు తీసుకుపోయి విక్రయించిన మార్గాన్ని అలా పిలిచారు. అయితే అది ఇప్పుడు అంతగా అతకదు. నిజానికి చైనా ఒక మార్గాన్నే తలపెట్టలేదు. చిన్నా పెద్దవి ఆరు మార్గాలు లేదా కారిడార్లను అభివృద్ధి చేసేందుకు పూనుకుంది. దానిలో అనేక దేశాలు చేరి ప్రయోజనం పొందేందుకు ముందుకు వస్తున్నాయి. వాటిలో సౌదీ అరేబియా ఒకటి. ప్రస్తుతం సౌదీ చేసుకుంటున్న దిగుమతులలో చైనా వాటా 19శాతం వుంది. తరువాత అమెరికా 8, జర్మనీ 7.5 శాతాలతో వుండగా 5.2శాతంతో మనది ఆరవ స్ధానం. పాకిస్ధాన్‌ది 0.34శాతం. అందువలన చైనా అధ్యక్షుడు సౌదీ యువరాజుతో ఎందుకు ఫొటో దిగాడో వేరే చెప్పనవసం లేదు. పాకిస్ధాన్‌కు సౌదీ అవసరం ఎంత వుందో సౌదీకి పాక్‌ అవసరం కూడా అంతే వుంది. మూడు బిలియన్‌ డాలర్ల నగదు అంద చేసేందుకు, మూడు సంవత్సరాల పాటు చమురు కొనుగోలు చెల్లింపులను వాయిదా వేసేందుకు జనవరిలోనే సౌదీ అంగీకరించింది. అందువలన ఇమ్రాన్‌ ఖాన్‌ ఘనస్వాగతాలు పలకటాన్ని అర్ధం చేసుకోవచ్చు. మన ప్రధానికి ఏమైంది. ఏమి సాధించాలని గౌరవ మర్యాదలను పక్కన పెట్టినట్లు ?నరేంద్రమోడీ అంటే రాజకీయంగా, ఇతరంగా అందరికీ ఆమోదయోగ్యుడు కాదన్నది తెలిసిందే. అయినా ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఎన్నికలలో విజయం సాధించి మన దేశ ప్రధాని అయ్యారు. అలాంటి పదవిలో వున్నవారు నియమ లేదా వ్రతభంగం కావించటం అంటే అది దేశం మొత్తానికి వర్తిస్తుంది. దాడిని అనేక దేశాల మాదిరి ఖండించింది తప్ప పాక్‌ గురించి సౌదీ ఒక్క మాట మాట్లాడని పూర్వరంగంలో పాకిస్దాన్‌కు మనకంటే దగ్గరి స్నేహితుడైన సౌదీ రాజ ప్రతినిధికి నిబంధనలను పక్కన పెట్టి స్వాగతం పలకటం మింగుడుపడని అంశమే. వ్రతం చెడ్డా ఫలం దక్కుతుందా ?

Image result for Narendra Modi’s  Hug diplomacy, saudi prince

వుగ్రవాది అంటే అందరికీ తెలిసింది బిన్‌ లాడెన్‌. అతగాడిని వుపయోగించుకుంది అమెరికా, పెంచి పోషించింది సౌదీ సర్కార్‌. చివరకు ఏకు మేకైనట్లు, గురువుకు పంగనామాలు పెట్టినట్లు తనను పెంచి పోషించిన అమెరికాలోనే న్యూయార్క్‌ పపంచ వాణిజ్య కేంద్రంపై దాడికి సూత్రధారి అయ్యాడు. సౌదీ వుగ్రవాదులతోనే ఆపని చేయించాడు. అమెరికాకు సౌదీ అనుంగు దేశం అని తెలిసిందే. ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా కుట్రలో సౌదీ పెద్ద భాగస్వామి. అలాంటి సౌదీ గురించి డోనాల్డ్‌ ట్రంప్‌ 2015లో రాసిన ‘టైమ్‌ టు గెట్‌ టఫ్‌ ‘( కఠినంగా వుండాల్సిన సమయం) పుస్తకంలో ప్రపంచంలో వుగ్రవాదానికి అత్యధిక నిధులు అందచేసే దేశం సౌదీ అని పేర్కొన్నాడు. బరాక్‌ ఒబామా సర్కార్‌లో విదేశాంగ మంత్రిగా పని చేసిన హిల్లరీ క్లింటన్‌ 2009లో రాసిన ఒక మెమోలో ప్రపంచవ్యాపితంగా వున్న సున్నీ వుగ్రవాద ముఠాలకు ఇప్పటికీ సౌదీ కీలకమైన ఆర్ధిక మద్దతుదారుగా వుంది. ఆల్‌ఖ్వైదా, తాలిబాన్‌, లష్కరే తోయబా ఇతర సంస్దలు ప్రతి ఏటా కోట్లాది డాలర్లను సౌదీ ద్వారా పొందుతున్నాయి అని పేర్కొన్నారు. వుగ్రవాదులకు నిధులు అందచేసే దేశాలలో సౌదీ అరేబియాను తీవ్ర ముప్పు వున్న దేశాల జాబితాలో చేర్చాలని జనవరిలోనే ఐరోపా యూనియన్‌ నిర్ణయించింది.

మన ప్రధాని నరేంద్రమోడీకి ఏ సమయంలో పెద్ద నోట్ల రద్దు ఆలోచన వచ్చిందోగానీ జిందాతిలిస్మాత్‌ సర్వరోగ నివారిణి అన్నట్లుగా వుగ్రవాదంతో సహా అన్ని సమస్యలను పెద్ద నోట్ల రద్దుతో పరిష్కరించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేయటం, దాన్ని మన మెజారిటీ జనం గుడ్డిగా నమ్మిన విషయం తెలిసిందే.నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బంది పడ్డారు, మన ఆర్ధిక వ్యవస్ధకు నష్టం జరిగింది తప్ప వుగ్రవాదులకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. మన దేశానికిి పాకిస్దాన్‌తో 3,323 కిలోమీటర్ల సరిహద్దు వుంటే, దానిలో వాస్తవాధీన రేఖతో సహా కాశ్మీర్‌లో 1,225కిమీ, పంజాబ్‌తో 553కిమీ వుంది.( పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌తో సరిహద్దు 744కిలోమీటర్లు వుంది.) ఒక్క కాశ్మీరులోనే అన్ని విభాగాలకు సంబంధించి దాదాపు ఏడులక్షల భద్రతా సిబ్బంది వున్నారు. పెద్ద నోట్ల రద్దుతో వుగ్రవాదుల నడుములు విరిచేసి వుంటే నిజానికి అక్కడ అంత మంది అవసరం వుండదు. అయినా యధావిధిగా కొనసాగుతున్నారంటే నరేంద్రమోడీ నోట్ల రద్దుకు జనాన్ని తప్పుదారి పట్టించినట్లే కదా !

Image result for Narendra Modi’s  Hug diplomacy, saudi prince

మనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పాకిస్ధాన్‌ను మరింత బలహీనపరచాలని మనం ప్రయత్నిస్తుంటే సౌదీ ఆర్ధికంగా ఆదుకుంటున్నది. ఆఫ్ఘనిస్తాన్‌లో పూర్వపు సోవియట్‌ పలుకుబడి పెరగకుండా చూసేందుకు, ఇరాన్‌, సిరియా తదితర పశ్చిమాసియా దేశాలలో తన రాజకీయ వ్యతిరేకులను దెబ్బతీసేందుకు తాలిబాన్లు, ఇతర అనేక పేర్లతో మత తీవ్రవాదుల తయారీని అమెరికా ఎంచుకున్నది. దానికి కార్యస్ధలం పాకిస్దాన్‌ అయితే, గణనీయ మొత్తంలో నిధులు సమకూర్చింది సౌదీ అరేబియా, ఆయుధాలు, మందుగుండువంటివి అందించింది అమెరికా, ఐరోపాధనిక దేశాలు. ఈ త్రయం ఇస్లాంలో మెజారిటీగా వున్న సున్నీ తెగవారిని ఎంచుకుంటే వీరి ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు ఇరాన్‌ షియా, ఇతర తెగలను ఎంచుకొని శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్దాన్లలో తాలిబాన్లు పెద్ద శక్తిగా వున్నారు. మారిన రాజకీయపరిణామాలలో ఆఫ్ఘన్‌ తాలిబాన్లు అమెరికాకు ఏకు మేకయ్యారు. వారిని అదుపు చేయనందుకు అమెరికన్లు పాకిస్దాన్‌పై ఆగ్రహంతో వున్నారు. రెండవది మన దేశ మార్కెట్‌ను ఆక్రమించటం అసలు లక్ష్యం గనుక మనలను సంతుష్టీకరించేందుకు పాకిస్దాన్‌కు తాత్కాలికంగా మిలిటరీ సాయాన్ని ఆపినట్లు ప్రకటించారు. అది బెదిరింపు తప్ప వేరు కాదు. తాలిబాన్లను అణచివేయటంలో విఫలమైన అమెరికా తన తట్టాబుట్ట సర్దుకుపోతామని చెబుతున్నది. ఈ ప్రక్రియలో భాగంగానే కతార్‌లో జరిపే చర్చలకు తాలిబాన్లను రప్పించే బాధ్యతను పాకిస్ధాన్‌కు అప్పగించారు. భవిష్యత్‌లో ఒక వేళనిజంగానే అమెరికన్లు నిష్క్రమిస్తే ఆఫ్ఘనిస్తాన్‌లోని ఇరాన్‌ అనుకూల తాలిబాన్ల ప్రభావాన్ని తగ్గించాలంటే అక్కడి, పాకిస్దాన్‌లోని కిరాయిమూకల అవసరం వుంటుంది. ఇదే సమయంలో ఇరాన్‌-పాక్‌ వైరుధ్యాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. పాక్‌ మద్దతు వున్న తాలిబాన్లు ఇరాన్‌కు వ్యతిరేకం. అందుకు ఇరాన్‌లోని సిస్టాన్‌-బలూచిస్తాన్‌ ప్రాంతంలో పాక్‌, ఆఫ్ఘన్‌వైపు నుంచి ప్రవేశించే వుగ్రవాదులు తరచూ దాడులు జరుపుతుంటారు. పుల్వామా దాడికి కొద్ది రోజుల ముందు పాక్‌ ప్రేరేపిత వుగ్రవాదులు జరిపిన దాడిలో 27 మంది ఇరాన్‌ రివల్యూషనరీ గార్డులు మరణించారు. అందువలన అనివార్యంగా పాక్‌తో సౌదీ అరేబియా సంబంధాలను కొనసాగించకతప్పదు. అమెరికా పధకంలో భాగంగా ఎమెన్‌పై ఇప్పటికే సౌదీ అరేబియా దాడులు జరుపుతోంది. పాకిస్ధాన్‌ను అదుపులోకి తెచ్చుకోవటం అమెరికన్లకు చిటికెలో పని.

ప్రోటోకోల్‌ను పక్కన పెట్టి కౌగిలించుకున్నంత మాత్రాన పాకిస్దాన్‌ను వదలి సౌదీ మనకు మిత్రదేశంగా మారే అవకాశాలు ఏమాత్రం లేవు. అంతదానికి అలాంటి మర్యాదలెందుకన్నది ప్రశ్న. ప్రపంచ రాజకీయాలు, మిలిటరీ వ్యూహాలలో పశ్చిమాసియా, మధ్య ఆసియా ప్రాంతానికి మొదటి ప్రపంచ యుద్దం నుంచీ ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఆ ప్రాంతంలో అపార చమురు, ఇతర ఖనిజ సంపదలతో పాటు మిలిటరీ రీత్యాకీలక ప్రాంతంగా వుండటమే కారణం. ఈ ప్రాంతాన్ని అదుపులో పెట్టుకొనేందుకు అమెరికన్లు చేయని దుర్మార్గం లేదు. సౌదీ ప్రభుత్వం లేదా అక్కడి ప్రయివేటు కార్పొరేట్‌ సంస్ధలు భారత్‌, పాక్‌, చైనాల్లో ఎక్కడ పెట్టుబడులు పెట్టినా వాటి ప్రయోజనాలకే పెద్ద పీట. ఈ మూడు దేశాలకు పెద్ద మొత్తంలో చమురు సరఫరా చేస్తోంది. తన వ్యూహాత్మక భాగస్వామ్యం, పెట్టుబడులకు అది ఎనిమిది దేశాలను ఎంచుకుంటే వాటిలో మనది ఒకటి. అన్ని దేశాలతో ఒకే విధంగా లేదు. దానిలో భాగమే పాక్‌తో ప్రత్యేక అనుబంధం. అందుకే కాశ్మీర్‌ సమస్యలో దాని మద్దతు పాకిస్దాన్‌కే వుంది. ముప్పైమూడు సంవత్సరాల సౌదీ రాకుమారుడిని ఇమ్రాన్‌ ఖాన్‌ కంటే నరేంద్రమోడీ గట్టిగా కౌగిలించుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తెలంగాణా రైతు బంధు లబ్దిదార్లపై 144 సెక్షన్‌ ఎందుకు ?

14 Thursday Feb 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices

≈ Leave a comment

Tags

farmers fate, Fertilizers subsidies, KCR, kisan samman, KTR, rythu bandhu beneficiaries, TRS government

Image result for why trs government imposed 144 section on rythu bandhu beneficiaries

ఎం కోటేశ్వరరావు

తెలంగాణా ‘రైతు బంధు ‘ సర్కార్‌ నిజామాబాద్‌ జిల్లాలో 13 మండలాల్లో రైతులు గుమి కూడకుండా 144వ సెక్షన్‌ విధించింది. పడిపోతున్న పసుపు, ఎర్రజొన్నల ధరలతో ఆందోళన చెందిన రైతన్నలు గత వారం రోజులుగా ఆందోళన హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోలేదు. ఏడవతేదీ ఒక రోజు ఆందోళన చేసి 11వ తేదీలోగా పంటలకు గిట్టుబాటు ధరలకు చర్యలు తీసుకోకపోతే పన్నెండున ఆందోళన చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం కదిలింది, ఎలా? ధరలకు హామీ ఇచ్చికాదు, పోలీసు శాఖ ద్వారా 144వ సెక్షన్‌, ముఖ్యనాయకులు అనుకున్నవారిని అరెస్టులు చేయించింది. అయినా రైతులు పెద్ద సంఖ్యలో ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి చౌరాస్తాలో ధర్నా చేశారు. వారంతా రైతు బంధు పధకం కింద ఎకరానికి నాలుగు వేలు తీసుకున్నవారే, అందుకు కృతజ్ఞతగా టిఆర్‌ఎస్‌కు ఓటు వేసిన వారే. ముఖ్య మంత్రి సచివాలయానికి రాకపోతే ఏమైతది అని కెసిఆర్‌ ప్రశ్నిస్తే అవును నిజమే ఏమైతది,ఏం కాలేదు రానవసరం లేదంటూ ఆయనకు మద్దతుగా గుండుగుత్తగా ఓట్లు వేసిన వారే. అసెంబ్లీ ఫలితాలు వచ్చి రెండు నెలలు దాటింది, అయినా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోతే ఏమైతది అని ఇంకా అదే కెసిఆర్‌ అనలేదు గానీ ఒక వేళ అన్నా నిజమే ఏమైతది అని మద్దతు ఇవ్వటానికి సిద్దంగా వున్నవారే వారంతా. నిజామాబాద్‌ ఎంపీ కవితక్క వారి దగ్గరకు రాలే, ప్రతి వారి దగ్గరకు వెళ్లి నే వున్నా, మీ వాడినే అని చెబుతున్న తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ఆ వైపు చూడలే. ఎంఎల్‌ఏలంతా తమకు అత్యవసరమైన, దరొక్కపోతే ప్రాణాలు పోయే మంత్రిపదవులు ఇతర అవసరాల కోసం తిరగటానికే ఖాళీ లేకపోవటంతో రైతుల గురించి పట్టించుకోలా. అయితే ఎవరూ పట్టించుకోనపుడు మనం చూస్తూ వూరుకోకూడదు కదా అని పోలీసులు 144వ సెక్షన్‌ ప్రయోగించి, కొందరిని అదుపు లేదా అరెస్టు చేసి తమకు చేతనైన సాయం చేశారు. దిక్కులేక, దరితోచక రైతులు ఆంక్షలను ధిక్కరించి రోడ్డెక్కారు.పదహారవ తేదీలోగా ధరల సంగతి చూడకపోతే తిరిగి ఆందోళన చేస్తామని ప్రకటించారు. రైతు బంధువు ఎలా స్పందిస్తారో !

రైతు బంధుపేరుతో కెసిఆర్‌ ఎకరానికి నాలుగు లేక ఐదు వేలు ఇస్తేనో, కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో ఐదెకరాలలోపు రైతులకు నరేంద్రమోడీ ఆరువేలు ఇస్తేనో దేశంలో రైతాంగ సమస్యలు, వ్యవసాయ సంక్షోభం పరిష్కారం కాదని నిజామాబాద్‌ రైతాంగ ఆందోళన వెల్లడిస్తోంది. ఇవాళ నిజామాబాద్‌ పసుపు రైతులైతే రేపు గుంటూరు జిల్లా దుగ్గిరాల, కడప పసుపు రైతులు కావచ్చు. రైతు బంధు లేదా కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో ఇచ్చే సాయాన్ని తప్పు పట్టనవసరం లేదు. నిర్దాక్షిణ్యంగా బలి ఇవ్వబోయే ముందు పశువులకు పూజలు చేసి అలంకరణలు చేయటం తెలిసిందే. ఈ బంధులు, సమ్మాన్‌లు కూడా అలాంటివే అని నమ్మేవారి నమ్మకాన్ని, అనుభవాన్ని కూడా కొట్టిపారవేయలేము. మార్కెటింగ్‌తో సహా వ్యవసాయరంగాన్ని తమకు పూర్తిగా అప్పగించి, ప్రత్యక్ష సాయం పేరుతో నాలుగు రూకలు వెదజల్లి రంగం నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలని ప్రయివేటు వాణిజ్య బకాసురులు ఎప్పటి నుంచో మనదేశం మీద వత్తిడి తెస్తున్నారు. నయా వుదారవాద విధానాలు లేదా సంస్కరణలు, నూతన ఆర్ధిక విధానాల వంటి ముద్దు పేర్లతో పిలుస్తున్న విధానాల సారం ఏమంటే సరిహద్దులు, మిలిటరీ, కరెన్సీ, పోలీసు, న్యాయవ్యవస్ధ వంటివి మినహా మిగిలిన అన్ని అంశాలను మార్కెట్‌ శక్తులకు అంటే పెట్టుబడిదారులు, పెట్టుబడిదారీ పద్దతుల్లో వ్యవసాయం చేసే వారికి అప్పగిస్తే అభివృద్ధి ఫలాలు కిందికి వూటమాదిరి దిగుతాయి. అన్నింటినీ తెల్లవారేసరికి అమలు జరపటం సాధ్యం కాదు గనుక ముందు వున్న వ్యవస్ధల లోపాలను చూపి కించపరచటం, పనికిరానివిగా చిత్రించటం, తరువాత వాటిని క్రమంగా కూల్చివేయటం.

స్వయం సమృద్ధి అన్నది స్వాతంత్య్ర వుద్యమ లక్ష్యం. అందుకే తొలి రోజుల్లో జై జవాన్‌ జైకిసాన్‌ పేరుతో హరిత విప్లవానికి శ్రీ కారం చుట్టి ఒక మేరకు జయప్రదం అయ్యాం. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్దతులను అందుబాటులోకి తెచ్చేందుకు విస్తరణ సేవలు, దిగుబడులను పెంచేందుకు సంకర విత్తనాలు, రసాయనికి ఎరువులు, పురుగుమందుల వినియోగం వంటిని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. రైతుల వద్ద తగిన పెట్టుబడులు లేని కారణంగా సబ్సిడీలను అందచేశారు. నయా వుదారవాద విధానాల బాట పట్టగానే సబ్సిడీలు ఇవ్వటం అంటే సోమరితనాన్ని ప్రోత్సహించటమే అని, లక్షిత ప్రయోజనాలకు బదులు ఇతర వాటికి వినియోగిస్తున్నారంటూ తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించి ఇప్పటికీ పెద్దఎత్తున కొనసాగిస్తున్నారు. దుర్వినియోగం, సద్వినియోగం అన్నది ఎప్పుడూ వుంటాయి. దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తీసుకొనే చర్యలను ఎవరూ తప్పు పట్టటం లేదు. ఇంట్లో ఎలుకలున్నాయని ఎవరైనా ఇంటికే నిప్పుపెట్టుకుంటారా?

వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీలు రైతాంగ జేబులు నింపేవి మాత్రమే అని ఎవరైనా అనుకుంటే అది తెలియని తనమే. అవి మొత్తం సమాజానికి ఇచ్చే రాయితీలు. వుదాహరణకు కాలువల ద్వారా , విద్యుత్‌ మోటార్ల ద్వారా వరిసాగు ఖర్చును పోల్చుకుంటే రెండవది రైతులకు గిట్టుబాటు కాదు. తాము పెట్టిన ఖర్చుకు అనుగుణంగా ఎక్కువ ధరకు అమ్ముతామంటే కొనే వారు వుండరు. అందువలన ప్రభుత్వాలు విద్యుత్‌ రాయితీ ఇస్తున్నాయి. అది రైతులకు మాత్రమే ఇస్తున్నట్లా లేక ఆ పొలాల్లో పని చేసే కార్మికులకు, బియ్యాన్ని ఆహారంగా వాడే అందరికీ ఇస్తున్నట్లా ? మొత్తం నీటి వనరులను పూర్తిగా వినియోగంలోకి తెచ్చి జనాభా అవసరాలకు సరిపడా పంటలను పండించే విధానాలను అనుసరిస్తే విద్యుత్‌తో వరిసాగు చేసే అవసరం వుండదు, రాయితీలతో పని లేదు. నీరు లేని చోట మరొక పంటను ప్రోత్సహించి రైతులకు గిట్టుబాటు కలిగిస్తే వారిలో అసంతృప్తి వుండదు.

Image result for nizamabad farmers agitation

నయా విధానాలు రైతాంగానికి గిట్టుబాటుగా లేవు, అందుకే వారు పదే పదే రుణగ్రస్తులౌతున్నారు. ఒకవైపు వారికి రుణమాఫీలు చేస్తాం, సాగు చేసినా చేయకపోయినా భూయజమానులకు నేరుగా వ్యవసాయ ఖర్చుల సాయం పేరుతో నేరుగా నగదు అందిస్తాం అని పార్టీలు వాగ్దానాలు చేస్తున్నాయి, పరిమితంగా అయినా కొన్ని రాష్ట్రాలలో అమలు జరుపుతున్నాయి. సబ్సిడీలు దుర్వినియోగం అవుతున్నాయని ప్రచారం చేసే వారు వీటిని వ్యతిరేకించకపోగా మద్దతు ఇస్తున్నారు. ఇవి దుర్వినియోగం అయ్యే అవకాశం లేదా ? తెలంగాణాలో వాస్తవంగా సాగు చేస్తున్న కౌలుదార్లకు మొండిచేయి చూపి, వ్యవసాయం చేయని భూ యజమానులకు నగదు ఇవ్వటం ఏమిటన్న విమర్శలు వచ్చాయి కదా ! ఆ లోపాన్ని సవరించాలి తప్ప ఆ పేరుతో సాయాన్ని వ్యతిరేకించనవసరం లేదు. రాబోయే రోజుల్లో ఈసాయాన్ని సాకుగా చూపి పంటలకు గిట్టుబాటు ధరల ప్రకటన, మార్కెట్‌ మాయాజాలం నుంచి రక్షణ చర్యలకు ప్రభుత్వాలు మంగళం పలుకుతాయని కొందరు చెబుతున్నదానిని కొట్టి పారవేయగలమా, నిప్పులేనిదే పొగ వస్తుందా ?

Image result for nizamabad farmers agitation

రైతాంగానికి వ్యవసాయం ఎందుకు గిట్టుబాటు కావటం లేదు అంటే సాగు పెట్టుబడులు పెరగటం, తగిన ఆదాయం లేకపోవటం తప్ప మరొకటి కాదు. ఒకవైపు అమెరికా వంటి ధనిక దేశాలు ప్రపంచ వాణిజ్య నిబంధనల పరిమితులకు మించి మన రైతాంగానికి సబ్సిడీలు ఇస్తున్నారంటూ దాడి చేస్తున్నాయి. మరోవైపు మన దేశంలోనే కొంత మంది పెద్దలు ఇప్పటికే మనం ఆహార ధాన్యాలు, పత్తి వంటి పంటల విషయంలో మిగులు సాధించి ఎగుమతులు చేసే దశకు చేరుకున్నాం గనుక వ్యవసాయ సబ్సిడీలు ఇవ్వనవసరం లేదు, ఎఫ్‌సిఐ, సిసిఐ, మార్క్‌ఫెడ్‌ వంటి ప్రభుత్వ సంస్ధల అవసరం ఇంకేమాత్రం లేదని చెబుతున్నారు. అమెరికా వంటిదేశాలు తమ కార్పొరేట్‌ బకాసురుల కోసం మన వ్యవసాయ మార్కెట్‌ను చేజిక్కించుకొనేందుకు వత్తిడి తెస్తుంటే, మన మేథావులు కొందరు వారి ఏజంట్లుగా రంగంలోకి దిగితే మరికొందరిలో సమగ్రదృష్టి లోపించి వారికి తెలియకుండానే అవే వాదనలను బుర్రలకు ఎక్కించుకుంటున్నారు. మన దేశంలో ఆహార ధాన్యాల వుత్పత్తి గణనీయంగా పెరిగిన మాట నిజం, అయితే అది దేశ అవసరాలకు అనుగుణంగా పెరిగిందా అంటే లేదు. ఒక వైపు మన దేశం 2018 ఆకలి సూచికలో 119 దేశాల జాబితాలో 103వ స్ధానంలో, ఆక్స్‌ఫామ్‌ ఆహార లభ్యత 125 దేశాల సూచికలో 97వ స్ధానంలో వున్నాం అని చెబుతుండగా మనం ఆహారాన్ని ఎగుమతి చేస్తున్నామంటే మన దగ్గర కొనుగోలు చేయలేక కడుపు మాడ్చుకుంటున్నవారు గణనీయంగా వున్నారన్నది చేదు నిజం. అందుకే పోషకాహార లేమి, రక్తహీనతతో బాధపడుతున్నవారు, వాటితో వచ్చే జబ్బులతో జేబు గుల్ల చేసుకుంటున్నవారు గణనీయంగా వుంటున్నారు. భరించలేని వైద్య ఖర్చు కూడా రైతాంగాన్ని రుణవూబిలోకి దించే అంశాలలో ఒకటిగా వుందని తెలిసిందే.

మన సినిమా హీరోలు కంటి చూపుతో కాల్చి చంపుతుంటే, నరేంద్రమోడీ సర్కార్‌ అంకెలతో జనాన్ని పిచ్చివాళ్లను చేస్తోంది. దేన్ని గురించి ప్రశ్నించినా మన దగ్గర అంకెలు సరైనవి కాదు అంటోంది. దాన్ని పక్కన పెడదాం వున్న అంకెల సమాచారం ప్రకారం 1903-08 సంవత్సరాల మధ్య బ్రిటీష్‌వారి పాలనలో మన తలసరి ఆహార ధాన్యాల లభ్యత 177.3కిలోలు. నూతన అర్దిక విధానాలు లేదా సంస్కరణలు ప్రారంభమైన 1991లో 186.2కిలోలు వుండగా పాతిక సంవత్సరాల తరువాత 2016లో 177.7కిలోలుగా వుంది. మనది ప్రజాస్వామ్యం కనుక కమ్యూనిస్టు చైనాతో పోల్చవద్దని కొందరు చెబుతుంటారు. అక్కడ 2015లో తలసరి లభ్యత 450, మన కంటే దరిద్రం తాండవించే బంగ్లాదేశ్‌లో 200, అమెరికాలో 1,100కిలోలు వుంది. ప్రజాస్వామ్యం అంటే జనాన్ని కడుపు మాడ్చటమా ? ఈ పరిస్దితుల్లో మన వుత్పత్తిని ఇంకా పెంచాలంటే ప్రభుత్వ ప్రోత్సహకాలు లేకుండా సాధ్యమా ?

మన ఆహార వుత్పత్తి పెరగటానికి దోహదం చేసిన వాటిలో రసాయన ఎరువుల వినియోగం ఒక ముఖ్యపాత్రపోషించింది. రైతులకు తగినంత ఆదాయం లేదు కనుక ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చాయి. సంస్కరణల పేరుతో అమలు జరుపుతున్న నయా వుదారవాద విధానాలు వాటికి మంగళం పాడమని వత్తిడి చేసి విజయం సాధించాయి. పోషకాల ప్రాతిపదికన(ఎన్‌బిఎస్‌) సబ్సిడీ విధానం మరొక పేరు ఏదైనా పెట్టనివ్వండి, ఒక్క యూరియా మినహా మిగిలిన అన్ని మిశ్రమ, ఇతర రకాల ఎరువుల ధరలపై నియంత్రణ ఎత్తివేశారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సమాచారం ప్రకారం 2017 నవంబరు నుంచి 2018నవంబరు మధ్యకాలంలో మనం దిగుమతి చేసుకొనే యూరియా, డిఏపి, ఎంఓపి, ఫాస్పారిక్‌ యాసిడ్‌, రాక్‌ ఫాస్ఫేట్‌, అమోనియా, సల్పర్‌లలో మొదటి ఐదు రకాల ధరలు సగటున 21.47శాతం పెరిగాయి. చివరి రెండింటి ధర 8.51శాతం తగ్గింది. అంటే ఒక కిలో ధర వంద రూపాయలు అనుకుంటే ఏడు కిలోల ఎరువులు కొంటే ఏడాది కాలంలో ఐదింటికి అదనంగా చెల్లించింది రు.107 .35, రెండింటికి తగ్గిన ధర రు 17.02 నికరంగా రైతుమీద పడిన భారం 90రూపాయలకు పైమాటే. 2010-11లో డిఏపి క్వింటాలు ధర రు.1075, ఎంఓపి రు.505రులు వుండగా, మరుసటి ఏడాదికి అవి రు.1775, రు.1036కు పెరిగాయి.2018 నవంబరులో గరిష్ట ధరలు రు.2,862, రు.1799గా వున్నాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే 2011-12 నుంచి 2016-17 మధ్యకాలంలో ఎరువుల సబ్సిడీ రు.74570 కోట్లనుంచి 70100 కోట్లకు తగ్గాయి. ఆరు సంవత్సరాల సగటు రు.73,024 కోట్లు అంటే ధరల పెరుగుదలతో నిమిత్తం లేకుండా సబ్సిడీ మొత్తం స్ధిరంగా వుందంటే పెరుగుతున్న ధరల భారాన్ని రైతాంగమే మోస్తోంది. ఈ కాలంలో రూపాయి విలువ పతనమై అదనపు భారాన్ని మోపింది. ఇది యుపిఏ మన్మోహన్‌ సింగ్‌-బిజెపి మోడీ పాలనా కాలం.పాలకులు మారినా సబ్సిడీ మొత్తం మారలేదు.

2002ా03 నుంచి 2008ా09 నాటికి ఎరువుల మీద ఇచ్చిన సబ్సిడీల మొత్తం జిడిపిలో 0.48 నుంచి 1.51శాతానికి పెరిగాయి. అప్పటి నుంచి క్రమంగా తగ్గుతూ 2018ా19నాటికి 0.43శాతానికి తగ్గింది. రైతులకు ఎంతో మేలు చేస్తానని చెప్పిన నరేంద్రమోడీ హయాంలో 2014ా15లో 0.62శాతం వుండగా అది 0.43శాతానికి పడిపోయింది.నరేంద్రమోడీ సర్కార్‌ ఐదేండ్ల లోపు రైతాంగానికి ఏడాదికి ఆరువేల రూపాయలు, చంద్రబాబు నాయుడు దానికి మరో నాలుగువేలు కలిపి పదివేలు చెల్లించేందుకు నిర్ణయించటం తాజా వార్త. ఈ విధంగా సబ్సిడీలను తగ్గిస్తూ రైతుల మీద భారాలు మోపుతుంటే సాగు సాగేదెట్లా ? గత్యంతరం లేని రైతాంగం రోడ్డెక్కకుండా ఎలా వుంటుంది?

Share this:

  • Tweet
  • More
Like Loading...

తాత్కాలిక బడ్జెట్‌ -ఓట్లకోసం నరేంద్రమోడీ వేసిన వల !

13 Wednesday Feb 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Pensioners, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Direct Benefit Transfer (DBT), India Interim budget 2019-20, India's first budget, kisan samman, Narendra Modi, subsidies

Image result for india Interim budget 2019-20 cartoons

ఎం కోటేశ్వరరావు

స్వతంత్ర భారత చరిత్రలో ఎవరు అంగీకరించినా లేకున్నా నరేంద్రమోడీ తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్నారని చెప్పక తప్పదు. ప్రపంచంలో ప్రజలెన్నుకున్న ఏ ప్రధానీ లేదా అధ్యక్షుడు ఒక్కసారంటే ఒక్కసారి కూడా విలేకర్లకు ప్రశ్నించే అవకాశం వుండే మీడియా గోష్టిలో మాట్లాడకుండా పదవీ కాలాన్ని ముగించినట్లు ఇంతవరకు వినలేదు. అలాంటి అసాధారణ రికార్డును మోడీ నెలకొల్పబోతున్నారు. మంచోడు మంచోడు అనుకుంటే మంచమంతా ఖరాబు చేశాడన్న సామెత మాదిరి తొలి రోజుల్లో ఎందరో అభిమానించిన మోడీ వున్న వ్యవస్ధలను మెరుగుపరచకపోగా అన్ని వ్యవస్ధలను దెబ్బతీశారనే విమర్శలకు గురయ్యారు. వాటిలో తాజాది కేంద్ర బడ్జెట్‌. సాంప్రదాయాలు, ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్దంగా తాత్కాలిక బడ్జెట్‌ ప్రసంగంలో వెనుకటి తేదీ నుంచి అమలులోకి వచ్చే పధకాల ప్రకటన. రాజకీయాలతో నిమిత్తం లేని వారికి ఇది కాస్త ఇబ్బందిగా వుంది. మోడీ రాజకీయ వ్యతిరేకులకు ఇది విమర్శనాస్త్రమైతే అనుకూల రాజకీయులకు ఇది ప్రతిపక్షాలపై బ్రహ్మాస్త్రంలా కనిపించటం సహజం. మొత్తంగా మీడియాలో వచ్చిన శీర్షిలు, వ్యాఖ్యల సారాంశం ఏమంటే అది ఎన్నికలను దృష్టిలో వుంచుకొని రూపొందించింది. ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రవేశపెట్టి చర్చలేమీ లేకుండానే పదకొండవ తేదీన బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

ప్రపంచ బడ్జెట్‌ చరిత్రలో ముఖ్యంగా ప్రజలెన్నుకున్న పాలకుల ఏలుబడిలో పదవీకాలం ముగిసే సమయానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి వస్తే తాత్కాలిక ఏర్పాట్లను వుపయోగించుకుంటారు.ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం వచ్చే వరకు రెండు నెలల కాలానికి అవసరమైన ఖర్చుల కోసం ఖజానా నుంచి డబ్బుతీసుకొనేందుకు అనుమతి తీసుకోవటాన్నే ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ అంటారు. ఎన్నికల్లో అంతకు ముందు పార్టీయే గెలిచినా లేదా కొత్త పార్టీ వచ్చినా తన విధానాలకు అనుగుణుంగా బడ్జెట్‌ రూపకల్పన చేసేందుకు వీలు కల్పించటం ఒక మంచి సాంప్రదాయం. మాకు అలాంటి సత్సాంప్రదాయలేమీ పట్టవు, బడ్జెట్‌ను ఫలానా విధంగా పెట్టాలనే నిబంధనలేమైనా వున్నాయా అని అడ్డగోలు వాదనకు దిగితే సమాధానం లేదు.

ఈ సాంప్రదాయానికి తిలోదకాలిచ్చి నరేంద్రమోడీ సర్కార్‌ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టి చెడు సాంప్రదాయానికి తెరలేపింది. మూజువాణి ఓటుతో ఆమోదించి ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలను రాబోయే ప్రభుత్వం తిరగదోడవచ్చు లేదా పూర్తిబడ్జెట్‌గా ఆమోదించాల్సి వుంటుంది. దీని మంచి చెడ్డల గురించి చెప్పుకోబోయే ముందు అసలు బడ్జెట్‌ గురించి కొన్ని అంశాలను తెలుసుకుందాం. బడ్జెట్‌ అనే మాట పాత ఫ్రెంచి వాడుక బౌగెట్టి నుంచి వచ్చింది. దాని అర్ధం చిన్న సంచి లేదా పర్సు. అయితే ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో పదహారవశతాబ్దిలో వాడుకనుబట్టి పండితులు చెప్పినదాని ప్రకారం ఒకరి దగ్గర వున్న సంచి లేదా పర్సును తెరవటం అంటే ఒక రహస్యం లేదా సందేహపూరితమైనది కూడా కావచ్చు. బడ్జెట్‌ అంటే మన వ్యాపార, వాణిజ్యవేత్తలు మనజనంలో బడ్జెట్‌ రాక ముందే కొనండి అంటూ ప్రచారం చేసినదాని ప్రకారం వివిధ వస్తువుల మీద పన్నుల పెంపు లేదా తగ్గింపు వ్యవహారం.నిజానికి బడ్జెట్‌ అంటే ప్రభుత్వ వార్షిక రాబడి, ఖర్చుల ప్రకటన. బ్రిటన్‌లో 1734 జరగాల్సిన ఎన్నికలలో లబ్ది పొందేందుకు భూమిశిస్తుగా వసూలు చేస్తున్న మొత్తంలో ఒక పౌండుకు ఒక షిల్లింగ్‌ (అంటే పౌండులో 20వ వంతు) తగ్గించి భూస్వాముల మద్దతు పొందాలని ప్రతిపాదించాడు. అందుకు గాను ముందుగానే వుప్పు మీద పన్ను విధించాడు. భూస్వాములకు ఇచ్చే రాయితీల మొత్తానికి వుప్పు పన్ను చాలదని తేలటంతో 1733లో ప్రధాన మంత్రిగా వున్న రాబర్ట్‌ వాల్‌పోల్‌ మద్యం, పొగాకు మీద కొత్తగా పన్నులు వేయాలని ప్రతిపాదించాడు. ఆ వివరాలను ఒక కరపత్రంగా ప్రచురించి సమర్ధించుకున్నాడు. అయితే ఆ ప్రకటనకు ముందుగానే వాల్‌పోల్‌ కొత్త పన్నులు వేయనున్నారనే వూహాగానాలు వచ్చి వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. అధికారికంగా ప్రకటించిన తరువాత వాటిని వ్యతిరేకించిన ప్రతిపక్ష సభ్యుడొకరు బడ్జెట్‌ బహిర్గతమైంది లేదా ఒక కరపత్రానికి సమాధానం పేరుతో మరొక కరపత్రాన్ని రాసి వాల్‌పోల్‌ ప్రతిపాదనలను ఖండించాడు. జనంలో ఎప్పటి నుంచో నానుతున్న ఒక పెద్ద రహస్యం బహిర్గతమైంది, పాత పన్నులనే కొత్త రూపంలో వసూలు చేయటం తప్ప మరేమీ కాదన్నది దాని సారం. దేశంలో తీవ్ర వ్యతిరేకత రావటంతో కొత్త పన్నుల ప్రతిపాదనను వాల్‌పోల్‌ వుపసంహరించుకున్నాడు. తరువాత 1764లో నాటి మంత్రి బడ్జెట్‌ పదాన్ని వుపయోగిస్తూ రెండు గంటలనలభై అయిదు నిమిషాల సేపు ప్రసంగించి దేశ ఆర్ధిక పరిస్దితిని వివరించి వలస దేశాలపై పన్నులతో సహా అనేక ప్రతిపాదనలు చేశాడు. దాన్ని తొలి బడ్జెట్‌గా కొందరు పరిగణిస్తున్నారు.

మనం బ్రిటీష్‌ వారి వలస దేశంగా వున్నాం కనుక మన దేశ తొలి బడ్జెట్‌ను 1860 ఏప్రిల్‌ ఏడున ఈస్టిండియా కంపెనీ తొలిసారిగా బడ్జెట్‌ను జేమ్స్‌ విల్సన్‌ ప్రవేశపెట్టారు. ఏప్రిల్‌లోనే ఎందుకు ప్రవేశపెట్టారు అంటే బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవం వూపందుకోక ముందు భూమి మీద వచ్చేదే ప్రధాన మైన ఆదాయం. అది ఏప్రిల్‌ నాటికి ఒక స్పష్టమౌతుంది కనుక, ఏప్రిల్‌లో బడ్జెట్‌ను రూపొందించారని రాశారు. సదరు విల్సన్‌ ఎకానమిస్ట్‌ పత్రికను, స్టాండర్డ్‌ అండ్‌ ఛార్టర్డ్‌ బ్యాంక్‌ను స్దాపించిన ఒక ఆర్దికవేత్త. మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిసారిగా ఏడున్నర నెలలకు గాను మధ్యంతర బడ్జెట్‌ను 1947 నవంబరు 26న ఆర్‌కె షణ్ముగం చెట్టి ప్రవేశపెట్టారు. తరువాత మన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 112 ప్రకారం ప్రతి ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి మరుసటి ఏడాది మార్చి 31వరకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దేశ తొలి సంపూర్ణ బడ్జెట్‌ మరుసటి ఏడాది నుంచి అమల్లోకి వచ్చింది. అయితే దేశమంతటికీ వర్తింపచేసిన సమగ్ర బడ్జెట్‌ 1949-50 నుంచి అమల్లోకి వచ్చింది.

బడ్జెట్‌ వివరాలను ఎంతో రహస్యంగా పరిగణించేవారు. వివరాలు ఏమాత్రం వెల్లడైనా తీవ్రపర్యవసానాలుంటాయని భావించారు. వివరాలను రూపొందించే బృందానికి నాయకత్వం వహించే అధికారి తప్ప చివరకు ఆర్దిక మంత్రి కూడా వాటిని కలిగి వుండేందుకు వీలు లేదు. తొలి రోజుల్లో 1950వరకు బడ్జెట్‌ పత్రాలను రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో ముద్రించేవారు. తరువాత ఆర్దిక మంత్రిత్వశాఖ కార్యాలయ ప్రాంగణంలో 1980వరకు, అప్పటి నుంచి వెలుపల ప్రభుత్వ ప్రచురణాలయంలో ముద్రిస్తున్నారు. బడ్జెట్‌ ప్రవేశానికి ముందు హల్వా తయారీని ఆర్ధిక మంత్రి ప్రారంభిస్తారు. అంటే బడ్జెట్‌ పత్రాల ముద్రణ ప్రారంభసూచిక. ఆప్రక్రియలో నిమగ్నమైన వారెవరినీ ముగిసే వరకు బయటకు వెళ్లకుండా చేస్తారు. ఆ ప్రాంగణంలో ఆర్ధిక మంత్రి కూడా సెల్‌ఫోన్‌ కలిగి వుండటానికి వీలు లేదు. మన దేశంలో తొలి బడ్జెట్‌ కాగితాలను ఒక బ్రీఫ్‌ కేసులో తెచ్చారు. అప్పటి నుంచి అదే సాంప్రదాయం కొనసాగుతోంది.

గతంలో బడ్జెట్‌లోకొన్ని ముఖ్యాంశాలు పుకార్ల రూపంలో వెల్లడయ్యేవి. వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు ముందుగానే వుప్పందేది.కొన్ని సంవత్సరాల తరువాత మోపదలచిన భారాలన్నింటినీ ముందుగానే మోపి బడ్జెట్లలో మాత్రం భారం మోపలేదని ప్రచారం చేసుకొనే విధంగా పాలకపార్టీలు తయారయ్యాయి. రాను రాను బడ్జెట్లు ఒక తంతుగా మారాయి. ఇప్పుడు జిఎస్‌టి వచ్చిన తరువాత దేని మీద పన్ను ఎంతో ముందుగానే నిర్ధారణ చేస్తున్నందున పన్నుల ప్రసక్తి వుండదు. జిఎస్‌టి కౌన్సిల్‌ సమీక్షలు జరిపి కొన్నింటి మీద పన్ను తగ్గించటం తెలిసిందే. ఇప్పుడు బడ్టెట్‌లు ఆదాయ, కార్పొరేట్‌, ఇతర కొన్ని పన్నుల సవరణ, పధకాల ప్రకటనకే పరిమితం అయ్యాయి. గతంలో రైల్వే బడ్జెట్‌ విడిగా వుండేది. కొన్ని సంస్ధానాలలో భారత ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా రైలు మార్గాలుండేవి గనుక రైల్వే బోర్టు ద్వారా ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. రెండు సంవత్సరాల క్రితం దాన్ని కూడా సాధారణ బడ్జెట్లోనే విలీనం చేశారు. సాధారణంగా బడ్జెట్లను ఆర్దిక మంత్రులే ప్రవేశపెడతారు. గతంలో ప్రధానిగా వున్న ఇందిరా గాంధీ వద్దే ఆర్ధికశాఖ కూడా వుండటంతో ఒకసారి ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. గతంలో ఫిబ్రవరి చివరి పని దినం రోజు ప్రవేశపెట్టేవారు ఇప్పుడు మొదటి రోజుకు మార్చారు.రాత్రంతా పని చేసిన సిబ్బందికి విశ్రాంతి నిచ్చేందుకు వీలుగా 1924 నుంచి సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశ పెట్టారు. దీనిని 2001 నుంచి వుదయం పదకొండు గంటలకు మార్చారు. స్వాతంత్య్రం తరువాత 25 మంది ఆర్దిక మంత్రులుగా పని చేశారు. గరిష్టంగా మొరార్జీదేశాయ్‌ పదిసార్లు, రెండవ స్ధానంలో పి చిదంబరం ఎనిమిదిసార్లు బడ్జెట్లను ప్రవేశపెట్టారు.1991లో మన్మోహన్‌ సింగ్‌ సుదీర్ఘంగా 18,650 పదాలతో ప్రసంగించగా 1977లో కేవలం 800 పదాలతో హెచ్‌ఎం పటేల్‌ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. తాజాగా పియూష్‌ గోయల్‌ వంద నిమిషాల సేపు ప్రసంగించి ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌ ఎలాంటిదో పాఠకులే నిర్ణయించుకోవచ్చు. సాంప్రదయాన్ని వుల్లంఘించి చేసిన ఈ పనిని ఎలాంటి జంకు గొంకు లేకుండా సమర్ధించుకోవటం మోడీ సర్కార్‌కే చెల్లింది.

ఫిబ్రవరి పదకొండవ తేదీన రాఫెల్‌ ఒప్పందంపై ప్రతిపక్షాల నిరసనల మధ్య మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించిన బడ్జెట్‌ను పియుష్‌ గోయల్‌ సమర్దించుకున్నారు. తాత్కాలిక బడ్జెట్‌ కనుక తాము కొత్త పధకాలేవీ ప్రకటించలేదని, పూర్తి స్దాయి బడ్జెట్‌ను తరువాత ప్రవేశపెడతాం, దానిలో మరిన్ని ప్రకటనలుంటాయి, అవి వచ్చే సంవత్సరానికి చెందినవని అన్నారు. బడ్జెట్‌ ప్రసంగంలో గోయల్‌ కొత్తదనమేమీ లేనట్లయితే గంటసేపు ప్రసంగంలో ఏమి చెప్పినట్లు ? ప్రధాని కిసాన్‌ పధకం కింద రెండేసి వేల రూపాయల చొప్పున చిన్న రైతాంగానికి డిసెంబరు నుంచి ఏడాదికి మూడుసార్లుగా మొత్తం ఆరువేలు చెల్లించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసినదే. ఇదిగాక అసంఘటిత రంగంలోని కార్మికులకు ఫిబ్రవరి 15 నుంచి పెన్షన్‌ పధకాన్ని కూడా ప్రకటించారు. ఇవి ఈ ఆర్దిక సంవత్సరం నుంచే అమలులోకి వస్తాయి కనుక సాంకేతికంగా వచ్చే ఏడాది నుంచి అమలు అయ్యే పధకాలుగా పరిగణించకూడదని గోయల్‌ వాదించారు. తమ నాయకుడు ఎంతో తెలివిగా మాట్లాడారని బిజెపి అభిమానులు పొంగిపోయేందుకు తప్ప బుర్రవున్నవారికి చిరాకు తెప్పిస్తాయి. ఆ పధకాలను ఎవరూ వ్యతిరేకించరు. బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా ముందే ప్రకటించినా ఎవరూ తప్పు పట్టరు. డిసెంబరు నుంచి అమల్లోకి వచ్చే పధకాన్ని ఫిబ్రవరి ఒకటిన ప్రకటించటం అంటే ఎన్నికల ఆపదమొక్కులని వేరే చెప్పనవసరం లేదు. కొత్త పధకాలని చెప్పుకుంటే ప్రవేశపెట్టింది తాత్కాలిక బడ్జెట్‌కిందికి రాదు, వచ్చే ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలుకు ఎన్నికల నిబంధనావళి అడ్డువస్తుంది కనుక బిజెపి సర్కార్‌ ఈ చర్యకు పాల్పడింది. అయినా గట్టెక్కుతారా అంటే పోగాలము దాపురించినపుడు ఇలాంటివేవీ గతంలో ఏ పాలకపార్టీని రక్షించిన దాఖలా లేదు.

Image result for india Interim budget 2019-20 cartoons

మోడీ సర్కార్‌ చివరి బడ్జెట్‌ను ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌గా పరిగణించటానికి లేదు. పూర్తి బడ్జెట్‌ కాదని సర్కారే చెప్పింది కనుక దీన్ని త్రిశంకు స్వర్గ స్దితి బడ్జెట్‌ అనుకోవాలి. విమర్శించటానికి, సమర్ధించటానికి ఏమీ లేదు. అయితే కొన్ని అంశాలను విశ్లేషించాల్సి వుంది. ఐదు ఎకరాలు, అంతకంటే తక్కువ భూమిగల కుటుంబానికి రూ.6000 ఇవ్వనున్నట్లు ప్రకటించారు.దీనికయ్యే వ్యయంలో రాష్ట్రాలు 40శాతం భరించాలని కేంద్రం కోరనున్నదని అసలు ఆర్థిక మంత్రిగావున్న అరుణ్‌ జైట్లీ చెప్పారు. వాస్తవంలో ఈ పథకానికి నిధుల కేటాయింపు చేసి వున్నట్టయితే జైట్లీ అలా ప్రకటించి ఉండేవారు కాదు. అంటే బడ్జెట్‌లో చూపిన అంకెలు మోసపూరితమైనవన్నమాట.ఈ పథకం కేవలం భూమిని కలిగివున్నవారికే వర్తిస్తుంది. భూమిలేని వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు కూడా ఈ పథకంలో చోటులేదు. 2018-19 సంవత్సరానికి చెందిన సవరించిన బడ్జెట్‌లో సీజీఎస్‌టీ 5.04లక్షల కోట్లు(ఇది అసలు బడ్జెట్‌లో చూపిన దానికి 1లక్ష కోట్లు తక్కువ) వస్తుందని అంచనా వేయగా వాస్తవంలో ఈ పన్ను ఈ మాత్రం కూడా వసూలు కాదని స్వతంత్ర పరిశోధకులు తేల్చారు. ఏప్రిల్‌-జనవరి మధ్యకాలంలో ఈ పన్ను ద్వారా వచ్చిన ఆదాయం సగటున నెలకు 37,635కోట్లు. వార్షికంగా చూసినప్పుడు ఈ మొత్తం 3.77లక్షల కోట్లు ఉంటుందని అంచనా. అంటే సంవత్సర కాలంలో వచ్చే ఆదాయం మొత్తం 4.52లక్షల కోట్లకు మించదు. ఇది సవరించిన అంచనా కంటే కూడా 52,000కోట్లు తక్కువ.

తాను చేస్తున్న అప్పులను ప్రభుత్వరంగ సంస్థలపైన రుద్దటం, రిజర్వ్‌బ్యాంకు, ఇతర జాతీయ బ్యాంకుల నగదు నిల్వలను డివిడెండ్‌ ఆదాయం పేరుతో వాడటం వంటి అడ్డగోలు చర్యలు ఆర్ధిక క్రమశిక్షణ వుల్లంఘనకు ప్రతిబింబాలు. ఇప్పటికే జిడిపి వృద్ధి రేటు లెక్కలను గందరగోళపరచి ఎక్కువ అభివృద్ది జరిగినట్లు చూపటం, వుపాధి అవకాశాలు తగ్గిన విషయాన్ని అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో నష్టం అని గ్రహించి లెక్కలను ఇంకా ఖరారు చేయలేదని ఒక మాట, సరిగా లెక్కలు తయారు కాలేదని ఇంకో మాట చెబుతున్నారు. పకోడీ బండి పెట్టుకున్నా వుపాధి కల్పించటమే అని ప్రధాని స్వయంగా చెప్పినందున గత నాలుగు సంవత్సరాలలో ఎందరు పకోడీ బండ్లవంటివి ఎన్ని పెట్టుకున్నారో లెక్కలు వేసిన తరువాత వాటిని కూడా వుపాధికల్పన అంకెల్లో చూపి చెబుతారనుకోవాల్సి వస్తోంది.

పన్నుల ద్వారా 2018-19 సంవత్సరానికి చెందిన సవరించిన అంచనాల ప్రకారం చూపిన 6.71లక్షల కోట్ల ఆదాయం వాస్తవరూపం ధరించే అవకాశంలేదు. దీనినే తిరిగి 2019-20 సంవత్సర బడ్జెట్‌ అంచనాలో పెద్ద ఎత్తున 7.6లక్షల కోట్లుగా చూపారు. ఇంతకుముందు చూపినవిధంగా సీజీఎస్‌టీ ద్వారా వచ్చే ఆదాయం 2018-19 సంవత్సరానికి 4.52లక్షల కోట్లకు మాత్రమే చేరే అవకాశం ఉంది. దీనినే 2019-20 సంవత్సర బడ్జెట్‌ అంచనాలో 6.10లక్షల కోట్లకు పెరుగుతుందని చూపారు. ఆదాయంవైపు చూపుతున్న అంచనాలలో వున్న బూటకమే సహజంగా వ్యయంవైపు కూడా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. 2019-20 సంవత్సర బడ్జెట్‌లో పేదల సమస్యలపట్ల ఏమాత్రం ఆసక్తి చూపలేదు. జాతీయ ఉపాధిహామీ పథకానికి చేసిన కేటాయింపులు 2018-19 సంవత్సరంలో కంటే వర్తమాన బడ్జెట్‌లో 1000కోట్లు తక్కువ. ఈ పథకంపట్ల కేంద్రానికున్న చిన్నచూపుకు ఇది సూచిక.

Image result for Interim budget-a narendra modi's trap to catch votes

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధిలో రాష్ట్ర ప్రభుత్వాలు 40శాతం భరించాలని జైట్లీ చేసిన ప్రకటనకు ప్రాధాన్యత వుంది. వ్యవసాయం రాష్ట్రాల అధికార పరిధిలోనిది. దీనికి కేంద్రం నిధులు ఇవ్వకూడదనేమీ లేదు. ఇంతవరకు ఇలా ఏకపక్షంగా ఇతర అంశాలు వేటికీ రాష్ట్రాల వాటాను తేల్చకుండా పధకాలను రూపొందించలేదు. దీని మీద రాష్ట్రాల అభిప్రాయం తీసుకోలేదు. అందువలన దీన్ని కొనసాగిస్తారా అని కూడా సందేహించక తప్పదు. ఎన్నికల ముందు ప్రచారానికి ఉపయోగపడటానికి దీనిని రూపొందించినట్టుగాఉంది. ఒకవేళ ఎన్నికల తరువాత ఎన్‌డీఏ తిరిగి అధికారంలోకివస్తే రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించటంలేదనే నిందమోపి ఈ పథకాన్ని ఎత్తేయవచ్చు. లేదూ ప్రతిపక్షంలో కూర్చుంటే అది కొనసాగకపోతే చూశారా రైతులకు అన్యాయం చేస్తున్నారని దాడి చేయవచ్చు. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో నగదు బదిలీ కోసం 20000కోట్లు ఖర్చు పెట్టాలి. అయితే ఎన్నికలు సమీపిస్తున్నందున ఎలాగోలా ఈ మొత్తాన్ని సమకూర్చటం కష్టమేమీ కాదు. తరువాత ఏమిటనేది అసలు ప్రశ్న. దేశంలో భూమి యాజమాన్యాలకు సంబంధించిన రికార్డుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. సరైన గణాంకాలు లేనందున లబ్దిదారుల ఎంపిక అంత తేలిక కాదు.

మధ్యతరగతి వారికి ఆదాయ పన్నులో వార్షికంగా 5లక్షలవరకు రాయితీలు ప్రకటించటం ఓట్ల కోసమే. స్లాబులు మార్పు గురించి ప్రకటించకుండా రాయితీ ఇవ్వటం ఒకసారి వ్యవహారం కూడా కావచ్చు. దీనివలన వారికి ఎంత లబ్ది ఎంత అన్నది ప్రశ్న. బడ్జెట్‌లో అసంఘటిత కార్మికుల కోసం పించను పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ పథకం ఇప్పటికేవున్న వ అద్ధులకు ఉపపయోగపడదు. ఈ పధకంలో 29ఏండ్లు నిండిన వ్యక్తి తనకు 60ఏండ్లు వచ్చేదాకా నెలకు రూ.100 జమ చేస్తే ఆ తరువాత అతనికి నెలకు రూ.3000 పింఛను వస్తుంది. 60వ ఏటవరకూ ఒక కార్మికుడు కట్టే మొత్తాన్ని 8శాతం కాంపౌండ్‌ వడ్డీతో లెక్కగట్టినప్పుడు రూ.1,50,000 అవుతుంది. పురుషుల జీవిత పరిమాణం 65ఏండ్లుగా ఉన్నప్పుడు 60ఏండ్ల తరువాత అతను అందుకోబోయే పింఛను అతని చేసిన పొదుపు నుంచే వస్తుంది. కాబట్టి ఈ కాంట్రిబ్యూటరీ పథకంలో ప్రభుత్వ పాత్ర నామమాత్రమే.గత ఐదు సంవత్సరాలలో ఎంత మందికి వుపాధి కల్పించారో లెక్కలే తేల్చలేని పాలకులు 50-60కోట్ల మంది అసంఘటిత కార్మికులున్నారని అంచనా కాగా వారందరికీ ఖాతాలు తెరవటం వూహకు అందని అంశం. తాత్కాలిక బడ్జెట్‌ను మొత్తంగా చూసినపుడు ఓటర్లకు వేసిన పెద్ద వల. దీనికి జనం చిక్కుతారా అన్నది ప్రశ్న !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా వ్యవసాయ పరిశోధనలు, రైతాంగానికి లబ్ది !

12 Tuesday Feb 2019

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Farmers, History, Opinion

≈ Leave a comment

Tags

Agricultural, China's agricultural sector, chinese agricultural, chinese agricultural R&D, chinese agricultural revolution, chinese electro culture

Image result for Chinese agricultural

ఎం కోటేశ్వరరావు

చైనా ! నూట నలభై కోట్ల జనాభా !! వారికి అవసరమైన తిండి, బట్ట, విద్య, వైద్యం, గూడు కల్పన సామాన్యమైన విషయం కాదు.తిండి కలిగితే కండ కలదోయ్‌, కండగలవాడేను మనిషోయ్‌ అన్న మహాకవి గురజాడ వాక్కులు సార్వజనీనమైనవి. చైనాలో ప్రపంచ జనాభాలో 22శాతం, సాగుకు లాయకీ అయిన భూమిలో ఏడుశాతమే వుంది. మొత్తం భూమిలో వ్యవసాయానికి పనికి వచ్చేది 10-15శాతం మధ్య వుంది. అదే భారత్‌లో 50, ఫ్రాన్స్‌లో 32, అమెరికాలో 22, సౌదీ అరేబియాలో ఒకశాతం చొప్పున వుంది. ఈ పూర్వరంగంలో అక్కడి జనాభా అవసరాలను తీర్చటానికి ఎంతటి మహాయజ్ఞం చేయాల్సి వుందో వూహించుకోవాల్సిందే.అది ఒకరోజుతో ఆపేది కాదు. నిరంతర ప్రక్రియ. అలాంటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన చైనా కమ్యూనిస్టు పార్టీ గత ఏడుదశాబ్దాల విప్లవ కాలంలో అనేక విజయాలను సాధించింది. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలను తీర్చటం ఒక ఎత్తయితే, దాన్ని సమకూర్చే రైతాంగ మంచి చెడ్డలను చూసుకోవటం కూడా అంతే ప్రాధాన్యత కలిగిన అంశం. రైతుకు గిట్టుబాటు కాకుండా, ఇతర రంగాలతో పోల్చితే ఆదాయం తగ్గినా, ప్రభుత్వం సమన్వయం చేయకపోతే వ్యవసాయ రంగం సంక్షోభంలో పడుతుంది. భౌగోళికంగా తలెత్తే సహజ సమస్యల నుంచి ఎలా అధిగమించాలనేది ఒక సవాలు.చైనా గురించి మీడియాలో అనేక వక్రీకరణలు వస్తుంటాయి గానీ అక్కడి రైతాంగానికి లేదా మొత్తం వ్యవసాయ రంగానికి మన మాదిరి సంక్షోభ సమస్యలు, రుణ భారం, బలవన్మరణాల వంటివి కానరావు. మార్కెట్లలో ఆకస్మికంగా ధరలు పెరగటం, అదే విధంగా పతనం కావటం వంటి సమస్యలు అసలే లేవు. చైనా దిగుమతులు తగ్గించినా, నిలిపివేసినా ఇతర దేశాల మార్కెట్లు, రైతులు ప్రభావితం కావటం తప్ప చైనా రైతాంగానికి వాటి నుంచి అన్ని రకాల రక్షణలు వున్నాయి. సబ్సిడీలు, ఇతర రక్షణ పధకాలు ఎప్పటికప్పుడు మారుతున్నప్పటికీ అవి మరింత మెరుగుదలకే తోడ్పడతాయి.

రెండు కోట్ల పదిలక్షల మంది రైతుల చిన్న కమతాల సాగు తీరుతెన్నుల గురించి పది సంవత్సరాల అధ్యయనంతో శాస్త్రవేత్తలు సూచించిన మెరుగైన యాజమాన్య పద్దతులను ఆచరించిన రైతులు తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయంతో 12.2 బిలియన్‌ డాలర్ల మేరకు లబ్ది (ఎరువుల ఖర్చులో తగ్గుదల ద్వారా) పొందారని నేచర్‌ అనే పత్రిక తాజాగా ఒక విశ్లేషణలో పేర్కొన్నది. 2005-2050 మధ్య ప్రపంచ ఆహార అవసరాలు రెట్టింపు అవుతాయనే అంచనా పూర్వరంగంలో చైనా అధ్యయనం అంతర్జాతీయ శాస్త్రవేత్తలను అబ్బురపరచింది. అధ్యయన అంశాలను ఇతర దేశాలకు వర్తింప చేయవచ్చని ఆశిస్తున్నారు. బ్రిటన్‌ ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన జనాభా బయాలజిస్ట్‌ చార్లెస్‌ గాడ్‌ఫ్రే మాట్లాడుతూ ‘ 140కోట్ల జనాభాకు అవసరమైన ఆహారాన్ని వుత్పత్తి చేయటం ద్వారా వ్యవసాయ అద్బుతాన్ని సాధించింది. అయితే పర్యావణాన్ని ఫణంగా పెట్టారు, భూమి ఆమ్లీకృతమైంది, నీరు కలుషితమై ప్రపంచ తాపం పెరగటానికి దోహదం చేసింది. తాజా అధ్యయనం పెద్ద మొత్తంలో ఆర్ధిక ఫలితాలను రాబట్టటంతో పాటు ఎరువుల వాడకాన్ని తగ్గించటం సాధ్యమే అని సూచించింది.’ అన్నారు. ఏటా ఒక హెక్టారుకు చైనా రైతులు 305కిలోల నత్రజని వాడుతున్నారు. ఇది ప్రపంచ సగటుకు నాలుగు రెట్లు ఎక్కువ. పంటల దిగుబడులు తగ్గకుండా నత్రజని వినియోగాన్ని తగ్గించటం ఎలా అనే దిశగా బీజింగ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టిన పధకం 2005 నుంచి 2015వరకు సాగింది.ఈ వ్యవధిలో 13,123 క్షేత్రాలలో మొక్కజన్న, వరి, గోధుమల గురించి దిగుబడులు, పంటల రకాలు, నాటు పద్దతులు, ఎరువులు, నీరు, ఎండతీవ్రత ప్రభావం వంటి అనేక అంశాలను వారు పరిశీలించారు. ఈశాన్య చైనా రైతులు గరిష్టంగా 20శాతం నత్రజని వాడకాన్ని తగ్గించారు. అధ్యయనం, పరిశోధనా కాలంలో సగటున ధాన్య వుత్పత్తి 11శాతం పెరిగింది, 15శాతం నుంచి 18శాతం ఎరువుల వాడకం తగ్గింది. తద్వారా 12లక్షల టన్నుల నత్రజని పొదుపైంది. ఈ పధకంలో పది సంవత్సరాలలో 14వేల కార్యశాలలను నిర్వహించారు. చైనా అంతటి నుంచి 1200పరిశోధకులు, 65వేల మంది ప్రభుత్వ అధికారులు, సాంకేతిక నిపుణులు, లక్షా 40వేల మంది వ్యవసాయ వాణిజ్య సంస్ధల ప్రతినిధులు, 37.7 మిలియన్‌ హెక్టార్లలో రెండు కోట్ల పదిలక్షల మంది రైతులు వివిధ స్ధాయిలలో భాగస్వాములయ్యారు. ఐదుకోట్ల నలభైలక్షల డాలర్లు ఖర్చయింది.ఈ ప్రయోగం నుంచి మన దేశం కూడా నేర్చుకోవాల్సింది వుంది.ఈ ప్రయోగానికి ముందు గ్రీన్‌ హౌస్‌ గ్యాస్‌ గోధుమల్లో 549 నుంచి 434కు, వరిలో 941 నుంచి 812, మొక్కజన్నలో 422 నుంచి 328కి తగ్గాయని తేలింది.

పరిశోధనా అంశాలను అన్ని ప్రాంతాలకు వర్తింప చేయటంలో సమస్యలు తలెత్తవచ్చు, ఎంచుకున్న విధానాలను అమలు జరిపేందుకు చైనాలో కేంద్రీకృత ప్రభుత్వం వుంది కనుక సాధ్యం అవుతుంది, ఇతర దేశాలలో అలావుండదు అనే అభిప్రాయాలు కూడా వెల్లడయ్యాయి. ఇతర దేశాలు ఇలాంటి ప్రయోగాలు చేయటానికి సవాళ్లు ఆటంకం కారాదని, తమ జనాభా కడుపు నింపటానికి కలుషిత, సరస్సులు, నదులు, సముద్రాలను తయారు చేయాల్సిన అవసరం లేదని చైనా అధ్యయనం నిరూపించిందనే అభిప్రాయం కూడా వెల్లడైంది. వేల యకరాల కమతాలతో భారీ యంత్రాలతో అమెరికాలో వ్యవసాయం జరుగుతోంది. అత్యంత చిన్న కమతాలుతో చైనా తన సాగు పద్దతులను మెరుగుపరచుకుంటోంది. అమెరికాతో పోలిస్తే దిగుబడులలో వెనుకబడిన చైనా మన దేశంతో సహా అనేక దేశాలతో పోల్చితే ఎంతో ముందుందని మరచిపోరాదు. అగ్గిపుల్లా, సబ్బుబిళ్ల, తలుపు గొళ్లెం, హారతి పళ్లెం కాదేదీ కవిత కనర్హం అన్నట్లుగా కొండలు, గుట్టలు, ఫ్యాక్టరీ, రోడ్లపక్క ఖాళీ స్దలాలు, ఇండ్లపై కప్పులు వేటినీ వదల కుండా తమకు అవసరమైన పంటలను అక్కడి జనం సాగు చేస్తున్నారు.1980దశకంలో పెద్ద ఎత్తున రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని ప్రోత్సహించారు. తలెత్తిన దుష్పరిణామాలను గ్రహించి వాటిని అరికట్టేందుకు, దెబ్బతిన్న పర్యావరణాన్ని సరి చేసేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు. చైనాలో భూమి ప్రభుత్వానిదే. రైతులు సాగు చేసుకొనేందుకు 30 సంవత్సరాల వరకు కౌలుకు తీసుకోవచ్చు. తాకట్టు పెట్టటానికి, కొనుగోలు, అమ్మకం చేయటానికి లేదు. భూమి హక్కులను బదలాయించే అవకాశం వుంది. పండించిన పంటను మార్కెట్లో అమ్ముకోవచ్చు. సగటున ఒక్కో కుటుంబం 1.2 ఎకరాలు కౌలుకు తీసుకుంది. దేశ జనాభాలో ఇప్పటికీ 35శాతం మంది వ్యవసాయ మీద ఆధారపడుతున్నారు. పది సంవత్సరాల క్రితం 60శాతం వరకు వున్నారు.

Image result for chinese agricultural revolution

చైనా వ్యవసాయ విజయ గాధ కమ్యూనిస్టు పార్టీ లేదా ప్రభుత్వ నివేదికలలో చెప్పినదానిని కొంత మంది నమ్మకపోవచ్చు. మనీలా టైమ్స్‌ (ఫిలిప్పీన్స్‌) ప్రతినిధి జిల్‌ హెచ్‌ ఏ శాంటోస్‌ 2018 మార్చి 18,19 తేదీలలో చైనా వ్యవసాయ విజయం వెనుక నిజాలు అనే శీర్షికతో రాశారు. దానిలో ప్రపంచ వ్యవసాయ సంస్ధ(ఎఫ్‌ఏఓ) విస్తరణ మరియు విద్య అధికారి డాక్టర్‌ టిటో కాంటాడో మార్చినెల మొదటి వారంలో ఫిలిప్పీన్స్‌ అధికారి బెన్‌కు పంపిన ఒక మెయిల్‌లో పేర్కొన్న అంశాలను వుటంకించారు. వాటి సారాంశం ఇలా వుంది.

1982 నుంచి 1995 వరకు చైనాలో ఎఫ్‌ఏఓ కార్యక్రమాలు, చైనీయుల నుంచి అనేకం నేర్చుకోవచ్చు.1983లో నాటి చైనా వ్యవసాయ మంత్రి హె కాంగ్‌ రోమ్‌లోని ఎఫ్‌ఏఓ కార్యాలయానికి వచ్చారు. తమ ఎనభై కోట్ల రైతాంగానికి విస్తరణ సేవలు అందించేందుకు సాయం చేయాలని కోరారు. నాటి ప్రధాని డెంగ్‌ గ్జియో పింగ్‌ చైనా ముందుకు పోవటానికి చెప్పిన నాలుగు అంశాల విషయమై కాంగ్‌ వచ్చారు. అదేమంటే 1. పిల్లి రంగు ఏమిటన్నది కాదు అది ఎలుకలను పడుతుందా లేదా అన్నదే ముఖ్యం.2. బహిరంగ మార్కెట్‌, చైనీయుల అన్ని జీవన రంగాల నవీకరణ, జవాబుదారీ వ్యవస్ధ. బహిరంగ మార్కెట్‌ వ్యవస్ధను అభివృద్ధి చేయాలంటే వ్యవసాయం, ఇతర ఆర్ధిక రంగాన్ని నవీకరించాలి. అందువలన వ్యవసాయానికి రైతులు జవాబుదారీగా వుండాలి. మంత్రి కాంగ్‌ చెప్పినదాని ప్రకారం 80కోట్ల మంది రైతులు సగటున ఒకటిన్నర హెక్టార్ల వ్యక్తిగత కమతాలను పొందుతారు. ఏమి పండించాలో వారే నిర్ణయించుకుంటారు. వ్యవసాయ వుత్పత్తి పెంచటానికి, నిర్దేశిత లక్ష్యాలను చేరుకొనేందుకు, ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు వారికి మంచి విస్తరణ సేవలు అవసరం. మంత్రి కోరిన వెంటనే నలుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఎఫ్‌ఎఓ పంపింది. అది చేసిన సిఫార్సులు ఇలా వున్నాయి. కౌంటీ(మన జిల్లాల వంటివి) ప్రాతిపదికన విస్తరణ ప్రాజెక్టులను రూపొందించాలి.(చైనాలో 19 పెద్ద రాష్ట్రాలు వుంటే 2,300 కౌంటీలు వున్నాయి. ఒక్కొక్కదానిలో ఐదు నుంచి పదిలక్షలకు పైబడి జనాభా వున్నారు) కౌంటీ ఆగ్రో టెక్నలాజికల్‌ ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌ను(కాటెక్‌) ప్రతి కౌంటీకి ఏర్పాటు చేయాలి. ఆ కేంద్రం ప్రయోగాలు, శిక్షణ మరియు సమాచార చేరవేత, విస్తరణ, సలహా సేవలను అందించాలి. ప్రయోగాలకు అవసరమైన ప్రయోగశాలలు, సంబంధిత ప్రత్యేక నిపుణులు, వారికి అవసరమైన ప్రయోగ క్షేత్రం, వాటికి వున్నత స్ధాయిలో వున్న వ్యవసాయ పరిశోధనా సంస్ధలతో సంబంధాలుండాలి. కాటెక్‌లో ఐదుగురు అధికారులుండాలి. జిల్లా ప్రభుత్వ ప్రతినిధి, జిల్లా వ్యవసాయ అధికారి, స్ధానిక ప్రభుత్వ కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ ప్రతినిధి, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ ప్రతినిధులుండాలి. అయ్యే ఖర్చులో సగం కౌంటీ, 30శాతం రాష్ట్రం, 20శాతం కేంద్రం భరించాలి. ఎఫ్‌ఏఓ మరియు చైనా ప్రభుత్వ నిధులతో 6.8కోట్ల జనాభా వున్న జయింగ్‌షో, 11కోట్ల జనాభా వున్న సిచువాన్‌ రాష్ట్రాలలో పైలట్‌ ప్రాజెక్టులను అమలు జరపాలని ఎఫ్‌ఏఓ బృందం సిఫార్సు చేసింది. ఒకేడాది ఈ పధకాలు అమలు జరిగిన తరువాత పది సంవత్సరాల వ్యవధిలో దేశమంతటా అన్ని రాష్ట్రాలలో ఈ నమూనాను విస్తరించాలని మంత్రి ఆదేశించారు.1995 నాటికి 85శాతం కౌంటీలలో కాటెక్‌ కేంద్రాలు ఏర్పడ్డాయి. ఇందుకు గాను ప్రపంచబ్యాంకు నుంచి 12కోట్ల డాలర్ల రుణం తీసుకున్నారు. వ్యవసాయ వుత్పత్తి పెరిగింది, వ్యవసాయరంగంలో పనిచేసే వారి శాతం 73 నుంచి 37కు తగ్గింది. 2000 సంవత్సరంలో పదిశాతం వ్యవసాయ కార్మికుల లేదా రైతుల శాతం తగ్గిందని ప్రకటించారు. దీని అర్ధం పదిశాతం మంది రైతులకు పెద్ద కమతాలు అందుబాటులోకి వచ్చాయి, అది యాంత్రీకరణకు, అధిక ఆదాయానికి దోహదం చేసింది. వనరులు తక్కువగా వుండి, ఆసక్తి చూపని జనం వున్న రాష్ట్రాలు, కౌంటీలలో తప్ప వ్యవసాయంపై ఆధారపడిన వారిలో దారిద్య్రం మాయమైంది.

ఒక విషయాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. చైనా పురోగమనానికి ప్రధాని డెంగ్‌ పేర్కొన్న నాలుగు అంశాలలో అంతర్లీనంగా వున్న పారిశ్రామికీకరణ, నిర్మాణం, వాణిజ్యం, సేవలు, రవాణా తదితర ఆర్ధిక రంగాలు దేశవ్యాపితంగా అభివృద్ధి చెందాయి. వ్యవసాయంలో అదనంగా వున్న 63శాతం కార్మిక శక్తిని వేగంగా జరిగిన అభివృద్ది ఇముడ్చుకుంది. కాబట్టి చైనా విషయంలో వ్యవసాయ ఆధునీకరణ, రైతులకు అదనపు ఆదాయం మరియు వ్యవసాయ రంగంలో వున్న దారిద్య్రంలో అత్యధిక భాగాన్ని లేకుండా చేయటం దేశవ్యాపిత ఆర్ధిక అభివృద్ధిలో భాగంగా చూడాలి. చైనా నుంచి ఇతర పాఠాలను కూడా నేర్చుకోవాల్సి వుంది.1. వారు ఎంపిక చేసిన జాతీయ, రాష్ట్ర, కౌంటీ స్ధాయి ప్రతినిధులు జవాబుదారీ, గౌరవం కలిగిన వారు మరియు వారి సహచరులు, భాగస్వాములు వారిని అనుసరించారు. చైనా ముందుకు పోవటానికి నాలుగు సూత్రాలను జాతీయ నాయకత్వం ఒకసారి ప్రకటించిన తరువాత అవి చైనా అభివృద్దికి నూతన భావజాలమైంది, దానిని సమాజంలోని అన్ని తరగతులు అనుసరించి మరింత విస్తృత పరిచాయి. నాతో పాటు పని చేసిన అధికారులు, ఇతర జనాలు నిష్కపటంగా వున్నారు. ఇతర దేశాల నుంచి కొత్త అంశాలను, ఆలోచనలను నేర్చుకొనేందుకు ఆతృత పడేవారు, నిజాయితీ, అవసరమైన మేరకు పరిమితం కావటం, పురోభివృద్ధి, బాధ్యతలకు అంకితమైన వారు. వ్యవసాయేతర రంగాలలో ప్రత్యేకించి పారిశ్రామికీకరణలో(వ్యవసాయ యంత్రాల తయారీ సహా) పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టటం అంటే అది వ్యవసాయాభివృద్ధికి పెట్టుబడే. చైనాలో వ్యవసాయ విస్తరణ సేవల ఏర్పాటు సంక్లిష్టమైనది కాదు. ఖర్చు తక్కువ, అమలు జరిపేందుకు, పర్యవేక్షించేందుకు సులభమైనదే. జాతీయ ఆహార భద్రత సాధించేందుకుగాను ప్రభుత్వం నుంచి భూమిని కౌలుకు తీసుకున్న ప్రతి రైతు నిర్ణీత కోటా గోధుమలు,బియ్యాన్ని ప్రభుత్వ సంస్ధ డబ్బు చెల్లించి సేకరిస్తుంది. నిర్ణీత కోటాను అందచేయటంలో ఎవరైనా రైతులు పదే పదే విఫలమైతే సదరు భూమి నుంచి రైతులను మార్చ వచ్చు. అయితే అధికంగా పండించిన మొత్తాన్ని రైతులు బహిరంగ మార్కెట్లో అమ్ముకోవచ్చు. రైతులకు అప్పగించిన భూమిలో సగం గోధుమలు, వరి సాగు చేసి కోటా చెల్లించి మిగిలిన సగంలో కూరగాయలు, వాణిజ్య పంటలు సాగు చేసిన రైతాంగాన్ని 1980దశకంలో పురోగామి రైతులుగా గుర్తించారు.’ అని డాక్టర్‌ టిటో కాంటాడో పేర్కొన్నారు.

కొన్ని దేశాలలో అమెరికా వ్యవసాయశాఖ రూపొందించిన కొన్ని పంటల తాజా దిగుబడుల వివరాలు ఇలా వున్నాయి.( హెక్టారుకు టన్నులలో, పత్తి కిలోలు, 2019 ఫిబ్రవరి అంచనా )

దేశాలు                  వరి     గోధుమ     పత్తి      చమురు గింజలు    మొక్కజన్న

ప్రపంచ సగటు        4.55    3.39     779          2.31            5.81

అమెరికా              8.66    3.20     939          3.21          11.07

ఐరోపా యూనియన్‌   6.89    5.39      –             2.64            7.54

చైనా                   7.03    5.42     1787        2.49             6.11

భారత్‌                  3.8      3.32     480         0.97             2.83

గతంలో బ్రిటన్‌ సామ్రాజ్యవాదులు వలస దేశాలను తమ పరిశ్రమలకు అవసరమైన ముడిసరకు సరఫరా దేశాలుగా పరిమితం చేసేందుకు ప్రయత్నించాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా సామ్రాజ్యవాదం లాటిన్‌ అమెరికాలో అదేపని చేసింది. ఒక్కొక్క దేశంలో ఒక వుత్పత్తి మీద కేంద్రీకరించి ఇతర అవసరాల కోసం తన మీద ఆధారపడే విధంగా చేసుకుంది. వుదాహరణకు క్యూబాలో ఇతర పంటలు పండేందుకు అవకాశం వున్నా కేవలం పంచదారనే ఎక్కువగా ప్రోత్సహించటం, వెనెజులాలో చమురునిల్వల వెలికి తీత తప్ప వ్యవసాయాన్ని, పారిశ్రామిక రంగాన్ని నిర్లక్ష్యం చేయటం, ఇదే విధంగా ఇతర దక్షిణ అమెరికా దేశాలన్నింటా ఏదో ఒక వాణిజ్య పంటల వుత్పత్తికి లేదా గనులకే పరిమితం చేయటంతో అవి అని వార్యంగా ఇతర దేశాల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఆ బలహీనత ఆధారంగా క్యూబా పంచదార ఎగుమతుల మీద ఆంక్షలు పెట్టి అక్కడి సోషలిస్టు వ్యవస్ధను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు వెనెజులా చమురు ఆదాయాన్ని మదురో సర్కార్‌కు అందనివ్వకుండా ఆర్దికంగా ఇబ్బందుల పాల్జేసేందుకు పూనుకున్నారు. చైనా జనాభా అవసరాలను కూడా అందుకు వినియోగించుకొనే అవకాశం లేకుండా చైనా తీసుకున్న జాగ్రత్తలలో ఆహార స్వయం సమృద్ధి సాధన ఒకటి. జనాభా అవసరాలన్నింటినీ తీర్చే సోషలిస్టు కార్యక్రమం అమలు జరుపుతున్నందున చైనాలో సంభవించే పరిణామాలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. అక్కడ ప్రకృతి వైపరీత్యాల రీత్యా పంటల దిగుబడి, వుత్పత్తి తగ్గితే దిగుమతులు కారణంగా ప్రపంచ మార్కెట్లో వ్యవసాయ వుత్పత్తుల ధరలు పెరుగుతాయి, అదే బాగా పండి దిగుమతి అవసరాలు తగ్గితే ధరలు పడిపోతాయి. పత్తి విషయంలో మన దేశంలో ధరలపై ప్రభావం చూపిన విషయం తెలిసిందే. అందువలన పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణ్యంగా చైనాలో వ్యవసాయం గురించి నిరంతరం అక్కడి ప్రభుత్వం జాగరూకత ప్రదర్శిస్తోంది.2030 నాటికి జనాభా 150కోట్లకు చేరితే ప్రతి ఏటా పదికోట్ల టన్నుల ఆహార ధాన్యాలను అదనంగా వుత్పత్తి చేయాల్సి వుందని అంచనా. చైనాలో బియ్యం ప్రధాన ఆహారం. వరిసాగుకు నీరు అవసరం. ప్రపంచ తలసరి సగటు అందుబాటులో కేవలం నాలుగోవంతు మాత్రమే చైనా నీటి లభ్యత వున్నందున దాన్ని అధిగమించటం నిజంగా పెద్ద సవాలే. చైనాలో మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా పందిమాంసం, చేపలు, కోడి మాంస వినియోగం వేగంగా పెరుగుతోంది. వాటి వుత్పత్తిని కూడా పెంచాల్సి వుంది. అందుకు అవసరమైన దాణా కూడా ధాన్య అవసరాలు పెరుగుతున్నాయి. ఒక కిలోమాంసం కావాలంటే రెండు, పందిమాంసానికి నాలుగు నాలుగు, గొడ్డు మాంసానికి ఏడు కిలోల ధాన్యం కావాల్సి వుంది. అందువలన అమెరికా ఇతర దేశాల నుంచి సోయా, మొక్కజన్న, జన్నల వంటి వాటి దిగుమతులలో ఎక్కువ భాగం దాణాకే వినియోగిస్తున్నారు.

ఫిబ్రవరి ఆరున ఈ ఏడాది చైనా నూతన సంవత్సరాది వేడుకలు ప్రారంభమయ్యాయి. సూకర(పంది)నామ సంవత్సరంగా పాటిస్తున్నారు.చైనాలో మాంస వినియోగం ఏటేటా పెరుగుతోంది. 2011లో సగటున తలకు 43.8కిలోలుండగా ఈ ఏడాది 53.3కిలోలుగా వుంటుందని అంచనా వేశారు. దీనిలో సగం పంది మాంసం. ప్రపంచ తలసరి ప్రొటీన్ల వినియోగం రోజుకు 46 గ్రాములుండాలని ఆరోగ్య సంస్ధలు సిఫార్సు చేశాయి. ప్రస్తుతం ప్రపంచ సగటు 80గ్రాములుండగా మన దేశంలో 60 వుంది. 1990-2011 మధ్య వినియోగంలో పెద్ద మార్పు లేదు. అదే చైనాలో 75 నుంచి 95కు పెరిగింది. అమెరికా సగటు వినియోగదారుడికి అవసరమైన వాటిని సమకూర్చాలంటే అక్కడ ఒక ఎకరం అందుబాటులో వుంటే అదే చైనాలో 20సెంట్లు మాత్రమే వుంది. అందువలన వ్యవసాయ అభివృద్ధి చైనాకు ఎంత ముఖ్యమో చెప్పనవసరం లేదు. అందుకే పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తున్నారు. వాటిలో ఎలక్ట్రో కల్చర్‌ పరిశోధనలు ఒక భాగం గోబీ ఎడారి నుంచి పసిఫిక్‌ సముద్ర తీరం వరకు కూరగాయల సాగును పరిశోధించారు. మొక్కల పెరుగుదలకు విద్యుత్‌ ఎలా తోడ్పడుతుందనేది ముఖ్యాంశం. కొద్ది వారాల క్రితం విద్యుత్‌ వినియోగం ద్వారా 20 నుంచి 30శాతం వుత్పాదకత పెరిగితే, 70 నుంచి 100శాతం వరకు పురుగుమందులు, 20శాతం ఎరువుల వినియోగం తగ్గినట్లు తేలిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కూరగాయ మొక్కల మీద పది అడుగుల ఎత్తులో గ్రీన్‌ హౌస్‌లో రాగితీగల ద్వారా గరిష్టంగా 50వేల ఓల్టుల వరకు విద్యుత్‌ను ప్రసారం చేసి ఫలితాలను పరిశీలించారు. దీని వలన మొక్కలకు, సమీపంలోని మనుషులకు ఎలాంటి హాని జరగలేదు. ఎలక్ట్రోకల్చర్‌ సాగును క్రమంగా పెంచుతున్నారు. ఈ రంగంలో తాము ఇతర దేశాల కంటే ఒకడుగు ముందున్నామని, తమ సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలను అమెరికాతో సహా మరికొన్ని దేశాలకు అందచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

మొక్కలపై విద్యుత్‌ ప్రభావం గురించి ఆలోచన, ప్రయోగాలు కొత్తవి కాదు. చైనా రెండు వందల సంవత్సరాల తరువాత ఈ పరిశోధనల్లోకి దిగిందని చరిత్ర వెల్లడిస్తోంది.1990లో సేంద్రీయ వ్యవసాయ పరి శోధనల్లో భాగంగా చైనా సర్కార్‌ పరిశోధనలను ప్రోత్సహించింది.2014 నుంచి ఈ పరిశోధనల్లో భాగస్వామి అయిన ఒక ప్రయివేటు కంపెనీ ఎలక్ట్రో కల్చర్‌ ద్వారా రెండు సంవత్సరాలో పన్నెండు లక్షల యువాన్లను అదనంగా ఆదాయాన్ని పొందినట్లు పేర్కొన్నది. ఒక హెక్టారు గ్రీన్‌ హౌస్‌కు రోజుకు 15కిలోవాట్‌ గంటల విద్యుత్‌ అవసరం. అయితే అవసరమైన యంత్రాల ఏర్పాటుకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని, ప్రభుత్వ తోడ్పాటు లేకుండా సాధ్యం కాదని ఆ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నాడు. ప్రతి కుటుంబం ఇంట్లో ఒక గదిలో ఎలక్ట్రో కల్చర్‌ సాగుచేసే విధంగా ఖర్చు తగ్గించే దిశగా పరిశోధనలు చేస్తున్నట్లు ప్రొఫెసర్‌ ఒకరు చెప్పారు. నిజంగా అదే జయప్రదమైతే మరో వ్యవసాయ విప్లవం వచ్చినట్లే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

క్యూబా సేంద్రీయ సాగు ప్రాధాన్యత, పరిమితులు !

19 Saturday Jan 2019

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Agriculture, cuba organic agriculture, cuba organic agriculture importance and limitations, organic agriculture

Image result for cuba organic agriculture

ఎం కోటేశ్వరరావు

చమురు నుంచి తయారయ్యే రసాయనాలు అందుబాటులో వున్నప్పటికీ అవి లేకుండా వ్యవసాయం చేస్తున్నారా ? అవి లేకుండా వ్యవసాయాన్ని మీరు ఎంచుకుంటారా ? అని హవానా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలను అమెరికాకు చెందిన వ్యవసాయ పరిశోధకులు, విద్యార్దులు, రైతులతో కూడిన 13 మంది బృందం అడిగిన ప్రశ్న. హవానా శాస్త్రవేత్తలు సేంద్రీయ వ్యవసాయ రంగంలో తాము కనిపెట్టిన అంశాలను అమెరికన్లకు వివరించిన తరువాత వేసిన ప్రశ్న ఇది. ఆ బృందంలోని ముగ్గురు రైతులు తప్ప మిగతావారికి నిరంతర వ్యవసాయ అధ్యయనం ప్రధానం. ఆ బృందానికి ఆతిధ్యం ఇచ్చిన క్యూబన్లకు జీవన్మరణ సమస్య. అప్పటికే సోవియట్‌ కూలిపోయి పది సంవత్సరాలు గడుస్తున్నది. ఆ కాలాన్ని ప్రత్యేకమైనదిగా పిలిచారు. కోటీ పదిలక్షల మంది జనాభాకు ఆకస్మికంగా చమురు లభ్యత నిలిచిపోయింది. వ్యవసాయం రంగంతో సహా వాటితో నడిచే యంత్రాలన్నీ మూతబడ్డాయి. చేతిలో పంచదార తప్ప ఆహార పదార్ధాలను కొనుగోలు చేసేందుకు డబ్బు లేదు. మరొక దేశం నుంచి గతంలో మాదిరి ఆహారం, ఇతర అవసరాలు వచ్చే స్ధితి లేదు. ఆ నేపధ్యంలోంచే ఆహార సరఫరాకు నిరంతర వ్యవసాయ పద్దతుల పాటింపు ఒక అనివార్య పర్యవసానం. అనేక దేశాలలో ప్రాచుర్యంలో వున్న సేంద్రీయ వ్యవసాయానికి, క్యూబాలో చేస్తున్నదానికి తేడా వుంది. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల దుష్ఫలితాలకు దూరంగా వుండాలన్న ధనిక తరగతి అవసరాల కోసం స్వచ్చమైన వుత్పత్తుల సాగు ఒకటి. దానికి భిన్నంగా రసాయన ఎరువులు, పురుగు మందులు కొనటానికి డబ్బులేని పరిస్ధితుల్లో జనానికి సాధారణ ఆహార సరఫరా కోసం క్యూబా సోషలిస్టు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం మరొకటి. ఆ దిశగా అక్కడ సాధించిన విజయం గురించి అనేక మందిలో ఆసక్తి తలెత్తింది. అయినప్పటికీ ఈ విధానం ఎంతో సంక్లిష్టమైనదని మేము చెప్పదలచాము అని ఒకటిన్నర దశాబ్దాల తరువాత అమెరికా బృంద సభ్యుడొకరు క్యూబా వ్యవసాయం గురించి రాసిన విశ్లేషణలో పేర్కొన్నారు. సిద్ధాంత నిబద్దతతో సాధించిన పురోగతిగాక మరేమిటని ప్రశ్నించారు.

నిరంతర అభివృద్ధి సామాజిక పురోగమనానికి తోడ్పడుతుంది. కానీ తమకు అది సాధ్యమే కాదు అవసరం అని కూడా క్యూబన్లు నిరూపించారు. చచ్చిన చేపలు ఏటి వాలున కొట్టుకుపోతాయి, బతికిన చేపలు ఎదురీదుతాయి. ప్రతికూలతలను అధిగమించేందుకు సోషలిస్టు భావజాలం ఎలా వుత్తేజం కలిగిస్తుందో క్యూబాను చూస్తే అర్దం అవుతుంది. విప్లవానికి ముందు, తరువాత కూడా క్యూబా అంటే చెరకు,పంచదారకు మారుపేరు. సోషలిస్టు విప్లవం తరువాత అది సోవియట్‌ సాయంతో చెరకుతో సహా ఇతర పంటలను ఆధునిక యంత్రాల సాయంతో సాగు చేసింది.1991లో సోవియట్‌ కూలిపోయిన తరువాత ఒక్కసారిగా ఆ యంత్రాలన్నీ మూలనపడితే, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. కారణం అందరికీ తెలిసిందే, సోవియట్‌ నుంచి సాయంగా అందిన చమురు సరఫరా ఆగిపోయింది, ఎరువులు, పురుగుమందులు లేవు. తిరిగి గుర్రాలతో వ్యవసాయం చేసే స్ధితికి తిరోగమించింది. దానికి తోడు కరవు, తుపాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలు. పంచదారను కొనే వారు లేరు. కనీస అవసరాలను దిగుమతి చేసుకుందామంటే అమెరికా దిగ్బంధం, అంక్షలు. ఈ పరిస్ధితి మరొక విప్లవానికి దారి తీసిందంటే అతిశయోక్తి కాదు. అదే చమురు, యంత్రాలు, పురుగు మందులు, రసాయనిక ఎరువులతో నిమిత్తం లేకుండా వ్యవసాయం చేసి జనాల కడుపు నింపటం ఎలా అన్నదే ఆ విప్లవ లక్ష్యం. సోషలిస్టు భావజాలంతో వుత్తేజితులై, దానికి కట్టుబడి వున్న నాయకత్వం, తమ బాటలో జనాన్ని నడిపించిన తీరు క్యూబాలో సేంద్రీయ వ్యవసాయ విప్లవానికి దారితీసింది. దీని అర్ధం క్యూబా సమస్యలన్నింటినీ పరిష్కరించింది అని కాదు. విప్లవానికి ముందు, తరువాత కూడా క్యూబాలో ఆహారధాన్యాల స్వయం సమృద్ధి లేదు. అరవై నుంచి ఎనభై శాతం వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. ఇప్పటికీ విదేశాల మీద ఆధారపడుతున్నప్పటికీ ఆహార రంగంలో గణనీయ పురోగతి సాధించింది.

ముందే చెప్పుకున్నట్లు సోవియట్‌ కూలిపోయిన దగ్గర నుంచి క్యూబాలో ప్రత్యేక పరిస్ధితి ఏర్పడింది. శాంతి సమయంలో ప్రేత్యేక కాలమిది అని కాస్ట్రో వర్ణించారు. పంచదార ఎగుమతులతో విదేశీమారక ద్రవ్యం సంపాదించాలంటే ఎవరినీ కొనుగోలు చేయనివ్వకుండా అమెరికన్‌ ఆంక్షలు. వున్నంతలో పొదుపు చేసి చమురు, ఇతర అవసరాలను దిగుమతి చేసుకొందామంటే డబ్బు లేదు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా చమురు, యంత్రాలు, ఎరువులు, పురుగుమందులు లేకుండా పంటలు పండించే పద్దతులను కనుగొనేందుకు పూనుకున్నారు. అవసరమైన సేంద్రీయ పద్దతుల మీద శాస్త్రవేత్తలు పని చేశారు. భూమి ఇప్పటికీ ప్రభుత్వం చేతుల్లోనే వుంది. సంస్కరణల ఫలితంగా పండించి, పంటలను అమ్ముకొనే హక్కు మాత్రమే జనానికి వుంది. వంద ఎకరాలకు తక్కువగా వున్న కమతాలలో సేంద్రీయ సాగు పద్దతులను ప్రవేశపెట్టి అనేక విజయాలను సాధించారు. దిగుమతులను గణనీయంగా తగ్గించగలిగారు.

సేంద్రీయ వ్యవసాయం ఒక ఎండమావి కాదు, మా దేశ పంచదార కర్మాగారాలలో సగాన్ని మూసివేయటం మా ఆహార స్వయం ఆధారదిశగా వేసి తొలి అడుగు అని వ్యవసాయ పరిశోధకుడు ఫెర్నాండో ఫ్యూన్స్‌ మోంనోజోట్‌ అన్నారు. సోవియట్‌ నుంచి చమురు, ఎరువులు, పురుగు మందులు వచ్చే నావలు ఆకస్మికంగా ఆగిపోయాయి, అవింకేమాత్రం వచ్చే అవకాశం లేదు, మనకు ఈ రసాయనాలన్నీ అవసరమా అని జనం అడగటం ప్రారంభించారు అని ఒక సేంద్రీయ క్షేత్ర యజమాని మిగుయెల్‌ ఏంజెల్‌ సాల్సిని చెప్పారు . ప్రభుత్వం అనేక రాయితీలను ప్రకటించింది. వుత్పత్తులను స్ధానికంగా విక్రయించేందుకు అనుమతించింది. సేంద్రీయ పద్దతి జయప్రదం అవుతుందనే హామీ లేకపోయినప్పటికీ, నెమ్మదిగా జరిగినప్పటికీ ఆర్ధిక వ్యవస్ధ మెరుగైంది. మంత్లీ రివ్యూ అనే పత్రిక జరిపిన ఒక అధ్యయనంలో తేలిన అంశాల ప్రకారం 1988-2007 మధ్య కాలంలో పురుగుమందుల వినియోగం 72శాతం తగ్గింది, కూరగాయల వుత్పత్తి 145శాతం పెరిగింది. ఫ్రెంచి వ్యవసాయ శాస్త్రవేత్త రెనె డ్యూమోంట్‌ తగిన యాజమాన్య పద్దతులతో క్యూబా ప్రస్తుతం వున్న జనాభాకంటే ఐదు రెట్ల మందికి తగిన విధంగా తిండిపెట్టగలదు అన్నారు. 2010లో తన జనానికి అది కడుపునింపే స్ధితిలో లేదు, అది వినియోగించే ఆహారంలో 80శాతం దిగుమతి చేసుకొనేది, దానిలో 35శాతం అమెరికా నుంచి వచ్చేది. అన్నింటికి మించి క్యూబాలోని సగం భూమి వ్యవసాయానికి పనికి రానిది లేదా వృధాగా వుంది.

నియంత బాటిస్టా, అంతకు ముందున్న పాలకుల హయాంలో సారవంతమైన భూమిని చెరకుసాగుకు వుపయోగించారు. పంచదారను అమెరికా, ఇతర దేశాలకు ఎగుమతి చేశారు.ఆరుదశాబ్దాల క్రితం విప్లవం తరువాత ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. అనివార్య పరిస్ధితులలో అంతకు ముందు మాదిరే పంచదారను తయారు చేసి అమెరికా బదులు సోవియట్‌, ఇతర దాని మిత్ర దేశాలకు ఎగుమతి చేశారు. సోవియట్‌ కూలిపోయిన తరువాత 1990-94 మధ్య వ్యవసాయ వుత్పత్తి గణనీయంగా పడిపోయింది. పెద్ద క్షేత్రాలలో యంత్రాలతో వ్యవసాయం చేసే స్ధితి లేదు. చిన్న రైతాంగం వాటిని నిర్వహించలేరు. అమెరికా దిగ్బంధం మరింత పెరిగింది. ఆహార వినియోగం తగ్గి సగటున ప్రతి ఒక్కరు పది కిలోల వరకు బరువు తగ్గారు. ఈ పూర్వరంగంలో ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయ క్షేత్రాల యాజమాన్య పద్దతులను మార్చింది. స్వతంత్ర సహకార క్షేత్రాలతో పాటు ప్రయివేటు క్షేత్రాలను కూడా అనుమతించింది. స్వతంత్ర వ్యవసాయ క్షేత్రాలు వేటిని వుత్పత్తి చేయాలో నిర్ణయించుకొనే స్వేచ్చ ఇచ్చింది. అయితే వుత్పత్తులను నిర్ణీత ధరలకు ప్రభుత్వానికి విక్రయించాల్సి వుంటుంది. ఇప్పుడు 70శాతం మేరకు ప్రయివేటు క్షేత్రాలలో వుత్పత్తి అవుతోంది. వుత్పత్తిలో 80శాతం ప్రభుత్వానికి, మిగిలినదానిని ప్రయివేటుగా విక్రయించుకోవచ్చు. ఇటీవల చేసిన మార్పుల ప్రకారం 35లక్షల ఎకరాల మేర ప్రభుత్వ భూమిని కమతాలుగా విభజించి వుచితంగా రైతులకు కౌలుకు ఇచ్చారు. దానిని వారి వారసులకు బదలాయించే వీలు కల్పించారు. స్ధానిక కమిటీలకు వుత్పత్తి విషయాలలో స్వయంప్రతిపత్తి, అధికారాలను ఎక్కువగా కల్పించారు. ప్రయివేటు సహకార సంస్ధలు కూడా ఇప్పుడు ఆహారపంపిణీలో భాగస్వాములు కావచ్చు. ఇన్ని చేసినప్పటికీ దేశంలో ఆహార సమస్య వుంది.

వుష్ణమండల పర్యావరణంలో తెగుళ్లు త్వరగా వ్యాప్తి చెందుతాయి. ఇతర వ్యాధులు ఎక్కువే.భూ సారం, మంచినీటి నిర్వహణ కూడా అంతతేలిక కాదు. చిన్న, పెద్ద పట్టణ ప్రాంతాలలో అందుబాటులో వున్న ప్రతి నేలలో సేంద్రీయ పద్దతిలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారు.గణనీయ భాగం ఇక్కడ వుత్పత్తి అవుతోంది. ఒకే పంటకు బదులు బహుళ పంటల సాగును ప్రోత్సహించారు. పంటలు ఆరోగ్యంగా పెరిగేందుకు సహజ పద్దతులను అనుసరించారు. పరపరాగ సంపర్కాన్ని జరిపే కీటకాలను ఆకర్షించేందుకు బంతిపూలను వినియోగించారు.నత్రజని వున్న బీన్స్‌ను సేంద్రియ ఎరువుగా వుపయోగించారు. హానికారక క్రిమి, కీటకాలను దూరంగా వుంచేందుకు మిత్ర కీటకాలను ప్రయోగించారు. పోషక పదార్ధాలున్న కంపోస్టును పెద్ద ఎత్తున తయారు చేశారు. 1988లో వినియోగించిన రసాయనాలలో నాలుగోవంతుతోనే 2007లో మరింత ఆహారాన్ని వుత్పత్తి చేయటం నిజమైన వ్యవసాయ విజయమే. గత కొద్ది సంవత్సరాలలో మారిన పరిస్ధితులలో వెనెజులా రసాయన ఎరువులను పంపుతోంది. దాంతో సేంద్రీయ వ్యవసాయం ఎందుకు అనే అభిప్రాయం కూడా కొంత మందిలో తలెత్తింది. వాటితో పని లేకుండానే గణనీయ విజయాలు సాధించినపుడు తిరిగి వెనుకటి కాలానికి వెళ్లటం ఎందుకు అనేవారు కూడా గణనీయంగా వున్నారు. ప్రభుత్వ వుద్యోగాల ద్వారా వచ్చే ఆదాయం కంటే ప్రభుత్వం ఇచ్చిన రాయితీలతో పట్టణ ప్రాంతాలలో వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం నాలుగు రెట్లు ఎక్కువగా వుండటంతో అనేక మంది వుద్యోగాలకు రాజీనామా చేసి వ్యవసాయానికి పూనుకున్నారు.

Image result for cuba organic agriculture

సేంద్రియ వ్యవసాయ పద్దతి క్యూబన్ల కడుపు నింపుతుందా అన్నది ఒక ప్రశ్న. గత్యంతరం లేని స్ధితిలో ఏటికి ఎదురీదినట్లుగా సోషలిస్టు చైతన్యంతో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జనం సేంద్రీయ పద్దతుల్లో చిన్నతరహా కమతాలలో సాగు చేస్తూ అనేక దేశాలకు తమ అనుభవాలను పంచుతున్నారంటే అతిశయోక్తి కాదు. అనేక మందికి చెరకు తోటలు, పంచదార ఫ్యాక్టరీల్లో పని చేయటం తప్ప మరొకటి రాదు అలాంటి వారు నేడు ఇతర వుత్పాదక రంగంలో భాగస్వాములు అవుతున్నారు. క్యూబా ప్రస్తుతం మొక్క జన్నలను బ్రెజిల్‌, బియ్యాన్ని వియత్నాం, రొట్టెలను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. పట్టణాలలో పెరటి తోటలు, ఇండ్లపైన కోళ్ల పెంపకం వంటివి గతంలో వుండేవి. ఇప్పుడు పాడుపడిన పట్ణణ, పంచదార ఫ్యాక్టరీల ప్రాంతాలలో కూరగాయలు, పండ్లవంటి వాటిని ఎక్కడ ఖాళీ వుంటే అక్కడ సాగు చేస్తున్నారు. క్యూబాను సందర్శించే పర్యాటకులకు కొన్ని చోట్ల అవి దర్శనీయ స్ధలాలుగా మారాయంటే అతిశయోక్తి కాదు. తాము సాధించిన విజయాల గురించి క్యూబన్లు అతిశయోక్తులు చెప్పుకోవటం లేదు. ‘ సేంద్రీయ వ్యవసాయం పెద్ద మొత్తాలలో దిగుబడులు సాధించటానికి తోడ్పడదు, మా సమస్యలన్నింటినీ పరిష్కరించదు, కానీ అనేక సమస్యలను అది పరిష్కరించింది. అసలు ఆ పద్దతిని ప్రారంభించటమే ప్రాధాన్యత సంతరించుకుంది. దడాలున తగిలిన దెబ్బ వాస్తవం నుంచి తేరుకొనేందుకు పర్యావరణ వ్యవసాయ సాగు తలెత్తింది.సోవియట్‌ కూలిపోవటమే ఆ వాస్తవం, ఆ రోజులు ఎంతో కష్టమైనవి, ఏదో విధంగా ఎక్కడో ఒక చోట ఆహారాన్ని వుత్పత్తి చేయాల్సిన అనివార్యత ఏర్పడింది ‘ అని వ్యవసాయ శాఖ అధికారి జాన్‌ జోస్‌ లియోన్‌ చెప్పారు. సేంద్రీయ సాగు అంటే పాటించాల్సిన ప్రమాణాలేమిటో తెలియదు, స్ధానికంగా పండిన దానిని సాగు చేయటమే సోషలిస్టు క్యూబా భవిష్యత్‌ అవసరం అని కొందరు భావిస్తే మరి కొందరు పుదీనా వంటి అమెరికా, ఐరోపా మార్కెట్లకు అవసరమైనవి సాగు చేసే అవకాశంగా కొందరు భావించారు. మొత్తంగా సాగు మీద ఆసక్తిని కలిగించటంలో ప్రభుత్వం జయప్రదమైంది. ప్రభుత్వం కేటాయించిన భూమిలో సేంద్రీయ వ్యవసాయమే చేయాలి, ఫలానా పంటలనే పండించాలనే నిబంధనలేమీ పెట్టలేదు. స్ధానిక వ్యవసాయ పద్దతులను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని రూపొందించింది, ప్రభుత్వ మార్గదర్శనం, సంస్ధాగత నియంత్రణ, సోషలిస్టు చైతన్యంతో పాటు ఈ కార్యక్రమానికి సానుభూతిపరులైన విదేశీయుల సాయం కూడా తీసుకున్నారు. కెనడా, ఐరోపా యూనియన్‌కు చెందిన అనేక ధార్మిక సంస్ధలు పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చాయి. ఈ కార్యక్రమం, సహకారంలో భాగంగా సేంద్రియ సాగు మెళకువలు, నాణ్యమైన విత్తనాల అందచేత, వుత్పిత్తి విక్రయాలకు కొనుగోలుదార్లతో సంబంధాలను ఏర్పాటు చేయటం వంటి అంశాలున్నాయి.

సాధించిన విజయాలతో పాటు సేంద్రియ సాగుతో క్యూబన్‌ రైతులు సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. ఆశించిన స్ధాయిలో ఆహార వుత్పత్తి పెరగటం లేదు. దిగుబడులు తక్కువగా వుంటున్నాయి. దశాబ్దం క్రితం నామ మాత్రంగా వున్న వుత్పత్తి ఇప్పుడు మొత్తం వుత్పత్తిలో 20శాతం వరకు సేంద్రియ సాగు వాటా వుంది. ‘విదేశాల్లో వున్నవారు నిరంతర వ్యవసాయం సాగించే ఒక స్వర్గంగా మమ్మల్ని చూస్తున్నారు. మేము అలా అనుకోవటం లేదు. ఒక చెడు వ్యవసాయ పద్దతి నుంచి బయటపడుతూ అంతకంటే మెరుగైన దానిని అనుసరిస్తున్నాము అని హవానా జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేస్తున్న మైకేల్‌ మార్కెవెజ్‌ వ్యాఖ్యానించాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పరిహాసం పాలైన జలంధర్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ !

11 Friday Jan 2019

Posted by raomk in Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Science

≈ Leave a comment

Tags

Indian Science Congress (ISC), pseudo-scientific beliefs, science congress 2019, scientific temper, unscientific statements

Image result for science congress 2019

ఎం కోటేశ్వరరావు

పరస్పర విరుద్దశక్తులు నిరంతరం పని చేస్తూనే వుంటాయి. ఒకటి వెనక్కు లాగుతుంటే మరొకటి ముందుకు తీసుకుపోయేందుకు ప్రయత్నిస్తుంది. ఈ పోరులో ఇప్పటి వరకు జరిగిన చరిత్ర అంతా మొత్తం మీద పురోగామి శక్తుల విజయమే. అయినా సరే ఎప్పటికప్పుడు తిరోగామి శక్తులు తమ పని తాము చేస్తూనే వుంటాయి. జనవరి మూడు నుంచి ఏడవ తేదీ వరకు పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగిన భారత సైన్స్‌ కాంగ్రెస్‌ 106వ సమావేశాలలో కూడా జరిగింది అదే. అక్కడ చేసిన కొన్ని వుపన్యాసాలు, సమర్పించిన పత్రాలు ప్రపంచంలో మనల్ని నగుబాట్లపాలు చేశాయి. ప్రపంచ మీడియా వీటి గురించి బహుళ ప్రచారమిచ్చింది.రెండు సంవత్సరాల క్రితం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన బయాలజిస్ట్‌, నోబెల్‌ బహుమతి గ్రహీత అయిన వి రామకృష్ణన్‌ తాను హాజరైన సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశంలో సైన్సు గురించి చర్చించింది తక్కువని తానింకోసారి ఇలాంటి సమావేశాలకు హాజరు కానని చెప్పిన మాటలు ఇంకా మన చెవుల్లో గింగురు మంటున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా సదరు వుపన్యాసాలను అడ్డుకొనేందుకు ప్రయత్నించలేదు. గత మూడు సమావేశాలలోనూ జరిగింది అదే. తాజా సమావేశాలు భవిష్యత్‌ భారత్‌ : శాస్త్రము, సాంకేతికము అనే ఇతివృత్తంగా జరిగాయి. ఆందోళనకరమైన అంశం ఏమంటే గత సమావేశాల అనుభవాలను చూసి అలాంటి శక్తులు ఆ వేదికను వుపయోగించుకోవటాన్ని అడ్డుకొనేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. అశాస్త్రీయ విషయాలను నిరూపిత అంశాలుగా చిత్రిస్తున్న వారిని ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సమావేశాలలో నిలదీసి ప్రశ్నించకపోవటం మన శాస్త్రవేత్తల భావదారిద్య్రానికి నిదర్శనమా ! లేక తాము నమ్మిన, పరిశోధించిన అంశాలమీదే అపనమ్మకమా ? రెండూ ప్రమాదకరమే !

న్యూటన్‌ పుట్టక ముందే గురుత్వాకర్షణ శక్తి వుంది, డార్విన్‌ తాను చెప్పిన పరిణామ క్రమంలో భాగంగానే ఒక మానవుడిగా పుట్టాడు. వాటిని ఒక శాస్త్రీయ పద్దతిలో వివరించటమే వారు చేసింది. ఆ రంగాలలో నిష్ణాతులైన వారు వాటిని అంగీకరించారు. అవి ప్రపంచం ముందుకు వచ్చినపుడు ఏ వేద లేదా సంస్కృత పండితుడు అవన్నీ తమకు ఎప్పుడో తెలుసని సవాలు చేసిన వారుగానీ, వివరించిన వారు గానీ లేరు. రాబోయే రోజుల్లో ఎవరైనా ఆ సిద్ధాంతాలు తప్పని ఆధారాలతో నిరూపిస్తే ఆ నూతన సిద్ధాంతాలను సమాజం అంగీకరిస్తుంది, అనుకరిస్తుంది. అదేమీ లేకుండా ఫలానా సిద్దాంతాన్ని నేను తప్పు అంటున్నాను, లేకపోతే ఇవన్నీ వేదాల్లోనే వున్నాయనో పిచ్చివారెవరైనా చెబితే శాస్త్రవేత్తలు ప్రశ్నించలేకపోవటం నిజంగా మన దౌర్భాగ్యం కదూ ! ఇతర దేశాలతో పోటీపడి మన దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని అందరూ కోరుకుంటారు. ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సభలు జరుగుతున్నాయంటే ఆ రంగంలో మన పురోగతి, సాధించిన విజయాలను సమాజం ముందుంచి శాస్త్రవిషయాల పట్ల భావిభారత పౌరుల్లో ఆసక్తికలిగించాలని ఎవరైనా ఆశిస్తారు. కానీ గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్నదేమిటి? దానికంటే ఆశాస్త్రీయ విషయాలను ముందుకు తెచ్చి వేదాల్లో అన్నీ వున్నాయష అనే రోజుల్లోకి తీసుకుపోతున్నారు. నిజానికి ఇదొక మానసిక వ్యాధి లక్షణంలా వుంది. ప్రతి సమాజం ఘనమైన గతంతో పాటు సిగ్గుపడాల్సిన అంశాలను కూడా కలిగి వుంటుంది. గత సమాజాల్లో అంతా ఘనతే వుంటే జనం మార్పులను ఎందుకు కోరుకున్నట్లు ?

జలంధర్‌ సైన్స్‌ సభల్లో కొందరు చేసిన ప్రవచన అంశాలు దేశాన్ని వెనక్కు తీసుకుపోయేవిగా వున్నాయి. అవేమిటో సంక్షిప్తంగా చూద్ధాం. మహాభారత కాలం నాటికే మన దేశంలో బడ్డు తాడు కణాల పరిశోధన వుంది, వంద కుండల్లో వంద అండాలను పెట్టి కౌరవులను పుట్టించారు, ఇది టెస్ట్‌ ట్యూబ్‌ పిల్లల పరిజ్ఞానం కాదా అంటూ ఆంధ్రావిశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ జి నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఈ పేరుమోసిన విద్యావేత్త మేధస్సు అంతవరకే పరిమితం కాలేదు, రావణుడికి ఎందరు ఎక్కినా ఒకరికి ఖాళీ వుండే పుష్పక విమానం వుండటమే కాదు, లంకలో ఇరవైనాలుగు చిన్నా పెద్ద విమానాలు, ఎన్నో విమానాశ్రయాలు వుండేవని, సైనిక అవసరాలకువిమానాలను వాడారని కూడా రామాయణం చదివితే మనకు తెలుస్తుందని కూడా సెలవిచ్చారు. అంతేనా చార్లెస్‌ డార్విన్‌ పరిణామ సిద్ధాంతం కంటే ముందే దాని గురించి మనకు తెలుసని డార్విన్‌ చెప్పినదాని ప్రకారం తొలి జీవి నీటి నుంచి ప్రారంభమైందని దశావతారాల్లో మత్స్యావతారం మొదటిదని అంటే దశావతారాలు పరిణామ సిద్దాంతమని కూడా నాగేశ్వరరావు చెప్పారు. విష్ణువు దగ్గర లక్ష్యాన్ని చేధించి తిరిగి వచ్చే నియంత్రిత క్షిపణుల మాదిరి శంఖుచక్రం వుందని కూడా చెప్పారు.

రావణుడి గురించి చెప్పిన రావుగారు రాముడి విమానాల గురించి చెప్పలేదు. పురాణాల ప్రకారం సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాల్లో రకరకాల విమానాలున్నాయి. వాటిలో ఎక్కువ భాగం మానసిక శక్తితోనే నడిచాయి. అలాంటపుడు రాముడికి విమానాలెందుకు లేవు, అడవులకు రధాల మీద, నదులు దాటేందుకు పడవలు ఎందుకు ఎక్కారు. విమానాల మీద పోవచ్చు కదా ! రావణుడు అడవిలోని సీతను అపహరించేందుకు రధంలో వచ్చాడు, సీతను రధంలో ఎక్కించుకొని పోయి సముద్రాన్ని ఎలా దాటాడు, రధాన్ని ఎక్కడ వుంచాడు, సముద్ర ప్రయాణానికి ఓడను వుపయోగించాడా ? విష్ణుమూర్తి అవతారంగా చెబుతున్న రాముడి దగ్గర నియంత్రిత క్షిపణి శంఖుచక్రం బదులు విల్లు, బాణాలు ఎందుకున్నాయి, విమానాలు ఎందుకు లేవు? లంకను చేరుకొనేందుకు రాముడి దగ్గర ఓడలు కూడా లేవా, వుంటే వానర సైన్య సాయంతో వారధిని ఎందుకు కట్టించినట్లు ? రావణుడిని సంహరించేందుకు క్షిపణి ప్రయోగం ఎందుకు చేయలేదు. హనుమంతుడు లంకా దహనం చేశాడని రాశారు తప్ప రావణుడి దగ్గర వున్న పుష్పక విమానాన్ని, ఇతర విమానాలను, లంకలోని విమానాశ్రయాలను దహనం చేయలేదా, వానర లేదా రాముడి సేనలపై రావణుడు వైమానిక దాడులు ఎందుకు చేయలేదు, రావణుడిని వధించిన తరువాత రాముడు ఆ విమానాలను స్వాధీనం చేసుకోలేదా ? ఆ తరువాత ఆ విమానాలు, క్షిపణులు ఏమయ్యాయి అనే ప్రశ్నలకు కూడా వైస్‌ ఛాన్సలర్‌గారు సమాధానాలు చెప్పాల్సి వుంది. మన వేదాలు లేదా సంస్కృత గ్రంధాలను పరదేశీయులు అపహరించారు, వాటి ఆధారంగా నూతన అవిష్కరణలు చేశారు అని చెబుతారు. ఇలాంటి కాకమ్మ కధలు వినటానికి వీనుల వింపుగా వుంటాయి. మనమెందుకు చేయలేదు ? ఇలాంటివి ఇంకా చాలా వున్నాయి.

Image result for science congress 2019,protests

సమస్య ఏమంటే మన శాస్త్రవేత్తలు ఇలాంటి ప్రచారాన్ని ఖండిస్తూ ఎందుకు ముందుకు రావటం లేదు. వేదికలపై ఎందుకు అనుమతిస్తున్నారు. దీనికి ప్రధానంగా ఒకటి కనిపిస్తోంది. ప్రభుత్వం సైన్స్‌ కాంగ్రెస్‌ వంటి వాటికి ధన, ఇతర రూపాలలో కొంత సాయం చేస్తున్నది. వాటిని ప్రారంభిస్తున్న ప్రధాని, కేంద్ర మంత్రులు స్వయంగా ఇలాంటి అశాస్త్రీయ విషయాలను తమ సందేశాలలోవెల్లడిస్తున్నారు. అందువలన వారికి లేదా వారి దివాలాకోరు భావజాలానికి వ్యతిరేకత వ్యక్తం చేస్తే సాయం ఆగిపోవచ్చు, నిర్వాహకుల వుద్యోగాలకు ముప్పు రావచ్చు, ప్రమోషన్లు ఆగిపోవచ్చు, అలాంటపుడు ఎవరేమి చెబితే మన కెందుకు అనే దిగజారుడుతనం తప్ప మరొకటి కనిపించటం లేదు. వినాయకుడికి ఏనుగు తల అతికించటాన్ని బట్టి మనకు గతంలోనే ప్లాస్టిక్‌ సర్జరీ తెలుసుని సాక్షాతూత ప్రధాని నరేంద్రమోడీయే చెప్పిన తరువాత గతంలో ఒక సైన్స్‌ కాంగ్రెస్‌లో కేంద్ర మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఆల్జీబ్రా, పైధాగరస్‌ సిద్ధాంతాలను ప్రపంచానికి భారత్‌ ఇచ్చిందని చెప్పటంలో ఆశ్చర్యం ఏముంది. ముంబై విశ్వవిద్యాలయ సంస్కృత విభాగ అధిపతి గౌరీ మహులీకర్‌ ఒక పత్రికలో రాసిన వ్యాసంలో జామెట్రిక్‌ ఫార్ములా గురించి క్రీస్తుకు పూర్వం 800 సంవత్సరాల క్రితమే సులభ సూత్ర అనే గ్రంధంలో బౌధాయన రాశాడని వాటినే పైథాగరస్‌ సిద్దాంతం అంటున్నామని ఆ పెద్దమనిషి పేర్కొన్నాడు. ఏడు వేల సంవత్సరాల క్రితమే భరద్వాజ మహర్షి విమానాల గురించి రాశాడని యుద్ధాలకు వుపయోగించే వాటిలో ఒక్కోదానికి 30 ఇంజన్లు వుండేవని, అవి ఎటు కావాలంటే అటు తిరిగి, ఎగిరేవని కెప్టెన్‌ ఆనంద్‌ జె బోడాస్‌ చెప్పాడు. కిరణ్‌ నాయక్‌ అనే మరో పెద్దమనిషి అయితే మహాభారత యుద్ధకాలంలో విమానాలతో యుద్ధం చేసిన వారు తలకు హెల్మెట్లు వాడారని నేను చెప్పేది నమ్మకపోయినా అలాంటి ఒక హెల్మెట్‌ను నాసా కనుగొన్నదని కావాలంటే గూగుల్‌లో తెలుసుకోవచ్చని పేర్కొన్నాడు. ఇలాంటి చెత్తను సమర్ధించుకోవటానికి నాసా పేరును వుపయోగించుకోవటం ఒక ఫ్యాషన్‌గా మారింది.తాజా సమావేశాలలో శాస్త్రవేత్తను అని చెప్పుకొన్న కెజె కృష్ణన్‌ అనే వ్యక్తి న్యూటన్‌, ఐనిస్టీన్‌లకు పెద్దగా భౌతిక శాస్త్రం గురించి తెలియదని, ప్రపంచాన్ని మోసం చేశారంటూ తాను చెప్పేదాన్ని అంగీకరిస్తే భవిష్యత్‌కు మరింత వుపయోగమన్నాడు. ఇప్పుడు ప్రపంచానికంతకూ తెలిసిన గురుత్వాకర్షణ తరంగాలకు నరేంద్రమోడీ తరంగాలని పేరు పెట్టాలని, గురుత్వాకర్షక కాంతికి హర్షవర్దన్‌(కేంద్రమంత్రి) పేరు పెట్టాలని ఒక శాస్త్రవేత్తకు వుండకూడని తన లక్షణాన్ని చక్కగా బయట పెట్టాడు. ఏ శాస్త్రవేత్తయినా కొత్త సిద్ధాంతం లేదా పద్దతిని కనిపెడితే అనేక సందర్భాలలో అతను లేదా ఆమె పేరు పెడతారు. ఈ పెద్దమనిషి ఎలాగూ తనను శాస్త్రలోకం ఆమోదించదు కనుక గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లుగా మోడీ, హర్షవర్ధన్‌ పేర్లు పెట్టాలని కోరాడు. అబ్దుల్‌ కలాం కంటే భవిష్యత్‌లో కేంద్ర మంత్రి హర్షవర్దన్‌ పెద్ద శాస్త్రవేత్త అవుతారని కృష్ణన్‌ సెలవిచ్చాడు. కొంత మంది అతితెలివి గల వారు సంస్కృత అనువాదాలు కాదు అసలు రాతలను చదివితేనే వాటిలో చెప్పిన సిద్ధాంతాలను వెలికి తీయవచ్చునని వాదిస్తారు. ఎవరు వద్దన్నారు ? పాలకులకు ఇలాంటి విషయాలు ఇష్టంగా వున్నట్లు గమనించిన తరువాత ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి మెప్పించర సుమతీ అన్నట్లు చెప్పేవారు తయారైతే అదుపు చేయాల్సిన వారు కూడా మన కెందుకులే అని వూరుకుంటున్నారు.

సైన్స్‌ కాంగ్రెస్‌లో అశాస్త్రీయ ప్రకటనలు చేయటాన్ని సభకు హాజరైన వారు ఖండించకపోయినా బెంగళూరులో కొందరు శాస్త్రవేత్తలైనా నిరసించి పరువు కాపాడారు. ఇదేమాత్రం చాలదు. వివిధ సంస్ధలకు చెందిన వున్నతాధికారులేమి చేస్తున్నారు. సైన్స్‌ కాంగ్రెస్‌ అజెండా నిర్ణయంలో ప్రభుత్వానికేమీ పాత్ర వుండదని ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు కె విజయ రాఘవన్‌ చెప్పారు. అంధ్రవిశ్వవిద్యా లయ వైస్‌ ఛాన్సలర్‌ నాగే శ్వరరావు చెప్పిన అంశాలను విమర్శిస్తూ అతని మీద ఒక ఫిర్యాదును దాఖలు చేయాలన్నారు. ఒక ప్రముఖ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌గా వున్న బయాలజిస్ట్‌ నాగేశ్వరరావు చెత్త మాట్లాడుతున్నపుడు శాస్త్రవేత్తల్లో వేడి పుట్టాలని అన్నారు. నాగేశ ్వరరావు, కృష్ణన్‌ మాట్లాడిన అంశాలు అపహాస్యం పాలుగావటంతో వాటితో తమకేమీ సంబంధం లేదని సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రేమేందు పి మాధుర్‌ ప్రకటించారు. తదుపరి తమ సమావేశాల్లో ప్రసంగించే వారికి సంబంధించి నిబంధనలు సవరించనున్నామని, వారేమి మాట్లాడేది తెలుసుకొని, ఇతర విషయాలు మాట్లాడబోమనే హామీలు తీసుకొని సరైన వారిని ఎంపిక చేస్తామని చెప్పారు. తానే గనుక ప్రసంగ సమయంలో అక్కడ వుండి వుంటే ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించేవాడినని, ఆధారం చూపమని కోరి వుండే వాడినని అన్నారు. సైన్స్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మనోజ్‌ చక్రవర్తి విలేకర్లతో మాట్లాడుతూ నాగేశ్వరరావు మాటలతో తాను దిగ్భ్రాంతి చెందానని, అతనికి ఈ విషయాలు ఎలా తెలుసు, ఏదైనా ఆధారం వున్నదా, శాస్త్ర సమాజం దిగ్భ్రాంతి చెందింది అని వ్యాఖ్యానించారు. తాము కొల్‌కతా వెళ్లిన తరువాత అతను చేసిన ప్రసంగాన్ని ఖండిస్తూ లాంఛనంగా ఒక ప్రకటన చేస్తామని వెల్లడించారు. ఈ ప్రకటనలతో వైస్‌ ఛాన్సలర్‌ నాగేశ్వరరావుకు ఏమైనా పరువు ప్రతిష్టలుంటే పదవి నుంచి తప్పుకొని వుండాల్సింది.

ఇలాంటి చెత్త మాట్లాడేవారి గురించి సైన్స్‌ కాంగ్రెస్‌ పెద్దలకు గతంలో ఫిర్యాదులు అందలేదా అంటే మూడు సంవత్సరాల క్రితమే ముంబై సమావేశం తరువాత తాము ఆందోళన చెందుతున్న అంశాల గురించి సైన్స్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశామని బెంగళూరుకు చెందిన బ్రేక్‌ త్రూ సైన్స్‌ సొసైటీ కార్యదర్శి కెఎస్‌ రజని చెప్పారు. తరువాత మైసూరు, తిరుపతి, ఇపుడు జలంధర్‌లో అదే పునశ్చరణ అయిందని, ఇలాంటి వాటిని ఎలా అనుమతిస్తున్నారని జనం నిర్వాహకులను నిలదీయాలని అన్నారు. ప్రముఖ రసాయన శాస్త్ర ప్రొఫెసర్‌ సిఎఆర్‌ రావు మాట్లాడుతూ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలకు తాను రావటం లేదని, వస్తే ఇలాంటి ప్రకటనలను ఆమోదించినట్లు అవుతుందని అన్నారు.

గత పాతిక సంవత్సరాలుగా డైనోసార్లపై పరిశోధనలు జరుపుతున్నట్లు చెప్పుకుంటున్న పంజాబ్‌ విశ్వవిద్యాలయ జియాలజిస్టు అషు ఖోస్లా ఈ సమావేశాలకు సమర్పించిన ఒక పత్రంలో బ్రహ్మ ఒక పెద్ద శాస్త్రవేత్త అని, డైనోసార్ల గురించి వేదాల్లో ప్రస్తావన వుందని, అసలు వాటికా పేరు మన సంస్కృతం నుంచే వచ్చిందన్నారు. భారతీయ డైనోసార్‌ అస్దికలను తమ బృందం గుజరాత్‌లోని ఖేదా జిల్లాలో కనుగొన్నదని చెప్పారు. నిజంగానే కనుగొని వుండవచ్చు, కానీ బ్రహ్మ పెద్ద శాస్త్రవేత్త, ఈలోక సృష్టికర్త, ఆయనకు డైనోసార్ల గురించి తెలుసు అని చెప్పిన మాటలతో అతని పరిశోధనను అనుమానించాల్సి వస్తోంది.

https://mkrvedika.com/wp-content/uploads/2019/01/ff809-1465846477930.png

ప్రపంచం మీద ప్రభావం చూపిన నాలుగువేల మంది శాస్త్రవేత్తలలో భారతీయులు కేవలం పది మందే అన్నది టెక్‌2 న్యూస్‌ విశ్లేషణ. ప్రతి ఏటా ప్రపంచవ్యాపితంగా ఎక్కువగా వుటంకించిన శాస్త్రవేత్తల జాబితాను క్లారివేట్‌ అనలిటిక్స్‌ అనే సంస్ధ గత ఐదు సంవత్సరాలుగా ప్రచురిస్తున్నది.2018 జాబితాలో పేర్కొన్న పది మందిలో సిఎన్‌ఆర్‌ రావు (ప్రముఖ రసాయన శాస్త్రవేత్త, బెంగళూరు),దినేష్‌ మోహన్‌ (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌), రాజీవ్‌ వర్షనే (వ్యవసాయ శాస్త్రవేత్త, ఇక్రిశాట్‌), అశోక్‌ పాండే, టాక్సికాలజీ పరిశోధకులు, అవినిష్‌ అగర్వాల్‌, అలోక్‌ మిట్టల్‌, జ్యోతి మిట్టల్‌ (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సు), రజనిష్‌ కుమార్‌(కెమికల్‌ ఇంజనీరింగ్‌), సంజీవ్‌ సాహు(నానో టెక్నాలజీ), శక్తివేల్‌ రత్నస్వామి(కంప్యుటేషనల్‌ మాథమాటిక్స్‌). నాలుగువేల మంది శాస్త్రవేత్తలు 60దేశాలకు చెందిన వారు. వీరిలో 80శాతం మంది కేవలం పదిదేశాలకు చెందిన వారైతే 70శాతం ఐదుదే శాల నుంచి వున్నారు. దేశాల రీత్యా అమెరికా 2,639,బ్రిటన్‌ 546, చైనా 482, భారత్‌ 10 మంది వున్నారు. సంస్ధల రీత్యా హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం 186మందితో అగ్రస్ధానంలో వుంది. ఒకే అంశం మీద పరిశోధన చేసే వారినే గతంలో జాబితాలో చేర్చగా ఈ ఏడాది వివిధ రంగాలలో పని చేస్తున్నవారికి చోటు కల్పించటంతో మన సంఖ్య పదికి చేరిందట. పదిహేను సంవత్సరాల క్రితం చైనా-భారత్‌ ఒకే స్దాయిలో వుండేవి, ఇప్పుడు ప్రపంచ శాస్త్ర పరిశోధన ఫలితాల్లో చైనా 15-16 శాతం సమకూర్చుతుండగా మన దేశ వాటా నాలుగు శాతమే అని సిఎన్‌ఆర్‌ రావు చెప్పారు. సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక అంశాలు దీనికి దోహదం చేసే అంశాలలో వున్నాయి. ఇవిగాక పారిశ్రామిక భాగస్వామ్యాలు, పెట్టుబడులు కూడా ప్రభావం చూపుతాయి.

పురాతన భారత దేశం వేదాలకే కాదు, వాటి ప్రామాణ్యతను ప్రశ్నించిన చార్వాకులకు కూడా నిలయమే. ప్రపంచంలో ప్రతి మతం తాను ప్రవచించిన దానిని వ్యతిరేకించిన లేదా ప్రశ్నించిన వారిని నాశనం చేసింది. దానికి మన దేశం మినహాయింపు కాదు.వేదాలను లేదా వాటిలో చెప్పిన అంశాల ప్రాతిపదికగా వున్న నాటి మతం, దాన్ని ఆశ్రయించిన నాటి పాలకులు చార్వాకులను భౌతికంగా అంతం చేయటమే కాదు, వారి రచనలను కూడా నాశనం చేశారు. విమర్శిస్తూ రాసిన వారి రచనల నుంచే చార్వాకులు ఏమి చెప్పారనేది మనకు తెలుస్తున్నది. ప్రత్యక్ష ప్రమాణం ప్రాతిపాదికగా వారు వ్యవహరించారన్నది స్పష్టం. చార్వాకులు లేదా లోకాయతుల అణచివేత తరువాత కాలంలో ఆ దృష్టి మన సమాజంలో కొరవడింది. చివరకు అది బ్రాహ్మలు మాత్రమే వేదాలు చదవాలి. క్షత్రియుడు మాత్రమే కత్తి పట్టాలి. శూద్రులు వ్యవసాయమే చేయాలి. పంచములు వూరికి దూరంగా వుండాలి. స్త్రీలు ఏ సామాజిక తరగతిలో వున్నా వారికి స్వాతంత్య్రం లేదు. చదువు అవసరం లేదు. సముద్ర ప్రయాణాలు చేసిన వారికి ప్రోత్సాహం సంగతటుంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనేదాకా పోయింది. ఇలా సమాజంలో అనేక బంధనాలు, ఆటంకాలను సృష్టించిన సమాజం కొన్ని వందల, వేల సంవత్సరాలు కొనసాగిన కారణంగా మన జనంలో శాస్త్ర స్పృహ అడుగంటింది. కుల వృత్తికి సాటిరాదు గువ్వల చెన్నా అన్నట్లుగా ఎదుగూబదుగూ లేకుండా సాగింది.

ప్రతి సమాజం అనేక వూహలకు నిలయమైంది. వాస్తవంతో పని లేకుండా వూహలతో నిండిన సాహిత్యాన్ని సృష్టించారు. అందుకు మన దేశం మినహాయింపు కాదు. వాటినే ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ నుంచి వైస్‌ ఛాన్సలర్‌ నాగేశ్వరరావు వంటి వారి వరకు అనేక మంది పురాతన శాస్త్రంగా చెప్పటమే కాదు, ఆధునిక ఆవిష్కరణలకు జోడించి చెబుతున్నారు. ఆ కాలంలో అయినా ఈ కాలంలో అయినా మానవుడికి ఏనుగుకు పరిమాణంలో ఎంతో తేడా వుంటుంది. వినాయకుడికి అంత పెద్ద ఎనుగు తలను అతికిస్తే ఆ భారాన్ని ఎలా భరించేవాడు, దాన్ని వేసుకొని అతి చిన్న ఎలుకవాహనం మీద ఎలా ఎక్కేవాడు, అన్నింటికీ మించి ప్లాస్టిక్‌ సర్జరీ నిపుణులు వుంటే తెగిన వినాయకుడి తలనే ఎందుకు అతికించ కుండా, ఏనుగు తలను ఎందుకు తెచ్చారు, అంతకంటే చిన్న జంతువులు దొరకలేదా అనే సందేహాలు రానవసరం లేదా ?

ఆశాస్త్రీయ భావజాలాన్ని ప్రచారం చేస్తున్న పాలకులు, వారికి వంత పలికే కుహనా లేదా ఆత్మను చంపుకొని తాము చదివిన దానికి భిన్నంగా కుహనా శాస్త్ర అంశాలను చెప్పేవారిని ఎదిరించేందుకు ధైర్యం చేయని అశక్తులు అసలు సైన్సు సమావేశాలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. కేవలం ఇటు వంటి సమావేశాలే సమాజంలో సైన్సు పట్ల ఆసక్తి కలిగిస్తాయని చెప్పలేము గానీ ఇవొక అవకాశం. పరిశోధన, ప్రచారానికి తగిన నిధులు కేటాయించేందుకు రానురాను పాలకులు విముఖత చూపుతున్నారు. సమాజాన్ని తిరోగమనంలో నడపాలని చూసే వారికి శాస్త్రీయ, ప్రత్యామ్నాయ విధానాల అవగాహన పెరగటం ఏమాత్రం ఇష్టం వుండదు. పరిశోధన, అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించని దేశమూ, సమాజమూ ముందుకు పోయిన దాఖలా మనకు కనపడదు. యధారాజా తధా ప్రజ అన్నట్లు ఆ పని చేయని పాలకులు వున్నపుడు వారికి వంతపాడే మేథావులు కూడా ఇష్టగానాలు, నృత్యాలే చేస్తారు. జలంధర్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లో జరిగింది అదే. ఇలాంటి ధోరణులను ప్రతిఘటించకపోతే రాబోయే సమావేశాల్లోనూ అదే పునరావృతం అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాలుగు దశాబ్దాల చైనా సంస్కరణలు 2 : అమెరికాకు 69 ఏండ్లు , చైనాలో 18కే సాధ్యమైంది !

23 Sunday Dec 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

China, Forty years of China Reforms, Xi Jinping

Related image

ఎం కోటేశ్వరరావు

1929 మాంద్యం ప్రారంభంలో అమెరికా వాస్తవ జిడిపి 1.109 లక్షల కోట్ల డాలర్లు కాగా అది పన్నెండు లక్షల కోట్ల డాలర్లకు చేరేందుకు 69 ఏండ్లు తీసుకుంది. 2017లో 18లక్షల కోట్ల డాలర్లకు చేరటానికి చేరటానికి 88 సంవత్సరాలు పట్టింది. చైనా జిడిపి 1999లో 1.09లక్షల కోట్ల డాలర్లుగా వున్నది 2017లో 12లక్షల కోట్ల డాలర్లకు చేరటానికి కేవలం 18 సంవత్సరాలే పట్టింది. అమెరికా ఆర్ధిక చరిత్రలో కనిపించే అనేక ఎగుడుదిగుడులు అది ఎదుర్కొన్న సమస్యలకు నిదర్శనం, అటువంటి పరిస్ధితి చైనా విషయంలో కనపడదు.1952-2017 మధ్య అమెరికాలో తొమ్మిది సంవత్సరాలు అంతకు ముందున్న జిడిపి కంటే తగ్గగా చైనాలో అటువంటి పరిస్ధితి ఐదు సంవత్సరాలలోనే కనిపించింది. 1978 సంస్కరణల ప్రారంభం తరువాత తిరుగులేకుండా సాగింది. అదే అమెరికాలో 1978 తరువాత ఐదు సంవత్సరాలు తరుగుదల వుంది. వీటిని మొత్తంగా చూసినపుడు అభివృద్ధిరేటులో కొద్ది హెచ్చు తగ్గులు వుండవచ్చుగానీ సంస్కరణల తరువాత చైనా ఎలాంటి పెట్టుబడిదారీ సంక్షోభాలను ఎదుర్కోలేదు.

ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ వునికిలోకి వచ్చి కొందరి అవగాహన ప్రకారం ఐదు వందల సంవత్సరాలు దాటింది. అమెరికాలో 1817లో న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ ప్రారంభాన్ని అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రారంభంగా తీసుకుంటే దానికి రెండువందల సంవత్సరాలు నిండినట్లు. అంత అనుభవం వున్న అమెరికాను, సంస్కరణలు ప్రారంభించిన 50సంవత్సరాల నాటికి జిడిపిలో చైనా అధిగమించగలదని అంచనా వేస్తున్నారు. అయితే జనాభా రీత్యా తలసరి ఆదాయంలో మరికొన్ని దశాబ్దాల పాటు అమెరికాయే అగ్రస్ధానంలో కొనసాగుతుంది. రెండు వందల సంవత్సరాల సుదీర్ఘపెట్టుబడిదారీ విధాన అనుభం తరువాత కూడా ఇంకా అమెరికాలో స్వంత ఇల్లులేని వారు, అద్దె భరించలేక కారుల్లో కాపురాలు చేసే వారున్నారంటే, 140 కోట్ల జనాభా వున్న చైనాలో జనానికి కనీస ప్రాధమిక వసతులు కల్పించటానికి ఎంత వ్యవధి కావాలో చెప్పనవసరం లేదు. కొందరు చెబుతున్నట్లు చైనాలో నిజంగా పెట్టుబడిదారీ విధానమే అమలు జరిపితే ఆ వ్యవస్ధకు సహజంగా వుండే జబ్బులన్నీ రావాలి, రావటం లేదు. సంక్షోభాలు లేకుండా శరవేగంగా అభివృద్ధి చెందటం పెట్టుబడిదారీ వ్యవస్ధ లక్షణం కాదు. అయితే చైనాలో పెట్టుబడిదారీ విధాన లక్షణాలు లేవా అంటే వున్నాయి.స్టాక్‌ ఎక్సేంజ్‌, ప్రయివేటు పెట్టుబడులు, లాభాలు తీసుకోవటం, ప్రయివేటు కంపెనీలను విస్తరించుకోవటం, బిలియనీర్ల పెరుగుదల వంటివి దాని లక్షణాలే. బలమైన పెట్టుబడిదారులు పెరిగిన తరువాత వారు సోషలిస్టు వ్యవస్దను అనుమతిస్తారా అని కొంత మంది వ్యక్తం చేస్తున్న సందేహాలను తీర్చటం అంతసులభమూ కాదు. తమ జనాభా అవసరాలు తీరాలంటే కొంతకాలం ఆ విధమైన విధానాలు తప్పవని చైనా కమ్యూనిస్టు పార్టీ చెబుతోంది. అధికారికంగానే అది ఒకే దేశం-రెండు వ్యవస్ధల విధానాన్ని 2050వరకు అనుమతిస్తామని ఎన్నడో చెప్పింది. సోషలిజం అంటే దారిద్య్రాన్ని పంచుకోవటం కాదు. పెట్టుబడిదారులను ఆహ్వానించటం, అనుమతించే వైఖరి మీద సందేహాలు కొత్తగా తలెత్తినవి కాదు. నాలుగు దశాబ్దాల నాడే వాటి గురించి చైనా నాయకత్వం చెప్పింది. గాలి కోసం కిటికీలు తెరిచినపుడు చెడుగాలితో పాటు, క్రిమి కీటకాలూ ప్రవేశిస్తాయని తెలుసు, వాటిని ఎలా అదుపు చేయాలో కూడా తమ గమనంలో వున్నదని చెప్పారు. ఈ నేపధ్యంలో అక్కడ అనుసరించిన విధానాలు ఎలా అద్భుతాలను సృష్టించాయో చూద్దాం.

Related image

1980లో చైనా జిడిపి 305బిలియన్‌ డాలర్లు కాగా 2017నాటికి 12.7ట్రిలియన్‌లకు పెరిగింది.(ఒక ట్రిలియన్‌ లక్ష కోట్లు) నాడు కేవలం 21 బిలియన్‌ డాలర్ల విలువగల వుత్పత్తులను ఎగుమతి చేసిన చైనా 2017నాటికి 2.49లక్షల కోట్ల డాలర్లతో ప్రపంచంలోనే అతి పెద్ద ఎగుమతిదారుగా తయారైంది.1980-2016 మధ్య సగటు అభివృద్ధి రేటు 10.2శాతం.1980లో చైనాకు వచ్చిన విదేశీ పెట్టుబడులు దాదాపు లేవు, 2017లో 168 బిలియన్‌ డాలర్లు వచ్చాయి, 2016నాటికి ప్రపంచంలోని వివిధ దేశాలలో చైనా పెట్టుబడులు 216 బిలియన్‌ డాలర్లున్నాయి. ఈ కాలంలో చైనీయుల సగటు జీవిత కాలం 66 నుంచి 76 సంవత్సరాలకు పెరిగింది.22శాతంగా వున్న నిరక్షరాస్యులు 3.2శాతానికి తగ్గారు. చైనా కుటుంబాల వినియోగం 49 బిలియన్‌ డాలర్ల నుంచి 90రెట్లు పెరిగి 2016నాటికి 4.4లక్షల కోట్లకు చేరింది.

సిఐఏ వెల్లడించిన వివరాల ప్రకారం 2017లో చైనా 2.16లక్షల కోట్ల డాలర్ల విలువగల వస్తువులను ఎగుమతి చేస్తే మనం 299.3బిలియన్‌ డాలర్ల దగ్గర వున్నాం.2016లో మనం 1.15లక్షల కోట్ల యూనిట్ల విద్యుత్‌ వుత్పత్తి చేస్తే చైనాలో అది 6.14లక్షల కోట్ల యూనిట్లు. అంతర్జాతీయ ఆటోమొబైల్‌ సంస్ధ తెలిపిన వివరాల ప్రకారం 2016లో చైనా 244లక్షల కార్లు, 36లక్షల వాణిజ్య వాహనాలను తయారు చేస్తే మనం 36లక్షల కార్లు, 8.1లక్షల వాణిజ్య వాహనాలను వుత్పత్తి చేశాము. బ్రిక్స్‌ దేశాలలోని వంద అగ్రశ్రేణి కంపెనీలలో చైనాకు చెందినవి 87శాతం ఆదాయం, 85శాతం లాభాలను కలిగి వుండగా మనవి 4,3శాతాలుగా వున్నాయి. రైలు మార్గాల విషయంలో మనకూ చైనాకూ పెద్ద తేడా లేదు. అయితే అక్కడ 22వేల కిలోమీటర్ల హైస్పీడ్‌ రైలు మార్గం వుండగా మన దగ్గర అలాంటిది లేదు. పరిశోధన, అభివృద్దికి జిడిపిలో చైనా 2.1శాతం ఖర్చు చేస్తుండగా మన దగ్గర ఒకశాతానికిలోపుగానే వుంది.2016లో చైనాలో పదిలక్షల 34వేల పేటెంట్లకు దరఖాస్తు చేశారు. ప్రపంచం మొత్తం మీద ఇవి 42శాతం. మన దేశంలో దాఖలైనవి 45,057 మాత్రమే. మన దేశంలో రోజుకు 24కిలోమీటర్ల గ్రామీణ రహదారులను నిర్మిస్తుండగా చైనాలో 1994-2000 మధ్య రోజుకు 1,200 కిలోమీటర్లునిర్మించారు.

ఇవన్నీ సానుకూల అంశాలైతే సమాజంలో ఆర్ధిక అసమానతలు పెరగటం ప్రతికూల అంశం.సంస్కరణల ప్రారంభంలో జాతీయ సంపదలో జనాభాలో ఒకశాతంగా వున్న ధనికుల చేతిలో 6.4శాతంగా వున్న దేశ సంపద 2015లో 13.9శాతానికి పెరిగింది. ఏ దేశంలోనూ లేని విధంగా 620 మంది బిలియనీర్లు వున్నారు. పేదలలోని 50శాతం మంది చేతిలో వున్న 26.7శాతం సంపద 14.8శాతానికి తగ్గిపోయింది. దేశంలో కొన్ని ప్రాంతాలు బాగా అభివృద్ది చెందగా మరికొన్ని దూరంగా వున్నాయి. పట్టణ, గ్రామీణుల మధ్య వ్యత్యాసాలు కూడా వున్నాయి. నలభై సంవత్సరాలలో చైనా జనాభా 96 నుంచి 139 కోట్లకు పెరిగింది. అభివృద్ది క్రమంలో చైనా ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలలో పట్టణీకరణ ఒకటి. పట్టణ ప్రాంతాలలో ఆదాయం, సౌకర్యాలు మెరుగ్గా వుండటంతో సహజంగానే యువతీ యువకులు పట్టణ ప్రాంతాలవైపు మొగ్గుచూపుతారు.

Image result for Forty years China Reforms

గత నాలుగు దశాబ్దాలలో 17.9శాతంగా వున్న చైనా పట్టణ జనాభా 58.5శాతానికి పెరిగింది. సంఖ్య రీత్యా 17 కోట్ల నుంచి 81 కోట్లకు పెరిగింది. అక్కడ జరుగుతున్న అభివృద్దికి అనుగుణ్యంగా 1980లో 54.5లక్షల మంది పట్టణాలకు వలస వెళ్లగా 1990నాటికి 65.5లక్షలకు, 1995 నుంచి ఏటా రెండు కోట్ల మందికి చేరింది. ఇటువంటి మార్పు ప్రపంచంలో మరే దేశంలోనూ జరగలేదు. గ్రామాల నుంచి రోజూ పట్టణాలకు వచ్చిపోయే వారి సంఖ్య కూడా ఎక్కువే.2025 నాటికి పట్టణ జనాభా వంద కోట్లకు చేరుతుందని అంచనా. అందువలన చైనా ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ ఇంకా సాధించాల్సింది ఎంతో వుంది. ఈ కారణంగానే తమది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే చైనా నాయకత్వం చెబుతోంది. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణంతో పాటు అధిగమించాల్సిన సమస్యలు కూడా చైనా తరహాలోనే వున్నాయని వేరే చెప్పనవసరం లేవు. వెనుకబడిన ఆఫ్రికా ఖండంలోనూ, అభివృద్ధి చెందిన అమెరికా ఖండంలోనూ కార్మికవర్గం వున్నప్పటికీ సమస్యల తీరుతెన్నులు ఒకే విధంగా వుండవు. ఒకే విధమైన సోషలిస్టు నిర్మాణం కుదరదు. ప్రతి దేశానికి విప్లవం దాని తరహాలోనే వస్తుందన్నది శాస్త్రీయ మార్క్సిస్టు సూత్రం. అందువలన సోషలిస్టు సమాజ నిర్మాణ లక్షణాలు కూడా ప్రత్యేకంగానే వుంటాయి. అమెరికా 69 ఏండ్లలో సాధించినదానిని చైనా 18 సంవత్సరాల్లోనే అధిగమించింది.రెండు చోట్లా వున్నది పెట్టుబడిదారీ విధానమే అయితే అంత తేడా ఎందుకున్నట్లు ? భారత్‌ ఎందుకు విఫలమైనట్లు ? అధ్యయనం చేయాల్సిన అవసరం లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాపై అమెరికా టెక్‌ వార్‌లో భారత్‌ ఎటువైపు !

19 Wednesday Dec 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

5G, Huawei, us china tech war, US-CHINA TRADE WAR

Image result for  us china tech war

ఎం కోటేశ్వరరావు

మూడు నెలలపాటు వాణిజ్య యుద్ధ దాడులకు విరామం ఇద్దామని అమెరికా-చైనా నిర్ణయించాయి. ఇంతలోనే అమెరికా మరో యుద్దానికి తెరలేపింది. అదే టెక్నాలజీ యుద్ధం. చైనాలోని ప్రముఖ హైటెక్‌ సెల్‌ఫోన్ల తయారీ కంపెనీ హువెయి యజమాని కుమార్తె, కంపెనీ సిఎఫ్‌ఓ మెంగ్‌ వాన్‌జౌ అరెస్టు దానికి నాంది అని కొందరంటుంటే పర్యవసానాలపై గత ఇరవై రోజులుగా అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఎలాంటి కారణాలు చూపకుండా అమెరికా వినతి మేరకు కెనడాలో అరెస్టు చేసిన మెంగ్‌ను కోర్టుకు హాజరుపరిచారు. తమను రెచ్చగొట్టే ట్రంప్‌ సర్కార్‌ చర్యమీద చైనా ఇప్పటి వరకు ఎంతో సంయమనంతో వ్యవహరించింది. మెంగ్‌ అరెస్టు అయిన నాటి నుంచి తన కనుసన్నలలో వ్యవహరించే దేశాల మీద అమెరికా వత్తిడి తెస్తోంది. హువెయి కంపెనీ పరికరాలు, ఫోన్లు కొనవద్దని కోరుతోంది. దానిలో భారత్‌ కూడా ఒకటి. ఈ వ్యవహారం నరేంద్రమోడీ సర్కార్‌కు కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే చైనాతో వాణిజ్యలోటు కొండలా పెరిగిపోతోంది.మన వస్తువులను మరింతగా కొనుగోలు చేయాలంటూ చైనాతో సర్కారు సంప్రదింపులు జరుపుతోంది. ఆవు పేడను తయారు చేయటం తప్ప మోడీ మేకిన్‌ ఇండియా పధకం ముందుకు సాగటం లేదు. అమెరికా ఆదేశాల మేరకు హువెయి కంపెనీ వుత్పత్తుల కొనుగోలు నిలివి పేస్తే మరొక అగ్రదేశం తయారు చేసే ఐదవ తరం పరికరాల కోసం ఎదురు చూడటం తప్ప మనకు మరొక మార్గం లేదు. అదే చేస్తే చైనాకు ఇప్పుడు మనం చేస్తున్న ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

ఈ చర్య కారణంగా మరింతగా స్వదేశీయ పరిజ్ఞానం మీద ఆధారపడాలనే కసితో చైనా వ్యవహరించకూడదు అని హాంకాంగ్‌ నుంచి వెలువడే కమ్యూనిస్టు వ్యతిరేక పత్రిక సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది. చైనాకు ఎదురైన చేదు అనుభవాలంటూ కొన్ని అంశాలను పేర్కొని టెక్నో జాతీయవాదం తెలివితక్కువ తనమని, వాణిజ్యదారులను మూసివేస్తుందని, భద్రతను బలహీనపరుస్తుందని వ్యాఖ్యానించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మెంగ్‌ అరెస్టుపై నోరు మూసుకొని గత నాలుగు దశాబ్దాలుగా మార్కెట్‌ను తెరిచినట్లుగానే రాబోయే రోజుల్లో కూడా వ్యవహరించకపోతే ఇప్పటి వరకు సాధించిన ప్రగతి దెబ్బతింటుందని పరోక్షంగా బెదిరించిందని చెప్పవచ్చు. ప్రపంచ కార్పొరేట్ల ప్రతినిధి అయిన మీడియా సంస్ధ నుంచి ఇలాంటివి వెలువడటంలో ఆశ్చర్యం లేదు.

డిసెంబరు ఒకటవ తేదీన కెనడాలోని వాంకోవర్‌లో మెంగ్‌ ఒక విమానం నుంచి మరో విమానంలోకి మారుతున్న సమయంలో కెనడా పోలీసులు ఎలాంటి కారణాలు చూపకుండా అమెరికా వినతి మేరకు అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. ఈ చర్య ఆమె మానవ హక్కులను హరించటమే అని చైనా పేర్కొనగా, ఆ చర్య కిడ్నాపింగ్‌ తప్ప మరొకటి కాదని చైనా మీడియా వర్ణించింది. అరెస్టులో తమ సర్కార్‌ ప్రమేయం లేదని కొద్ది రోజుల ముందే నోటీసు ఇచ్చామని కెనడా ప్రధాని ట్రడేవ్‌ ఆరు రోజుల తరువాత ప్రకటించారు. కొద్ది నెలల ముందే అరెస్టు వారంటు జారీ చేసినట్లు అమెరికా చెప్పింది. అమెరికా ఆంక్షలను వుల్లంఘిస్తూ ఇరాన్‌తో వ్యాపారం చేసేందుకు హువెయి కంపెనీ స్కైకామ్‌ అనే హాంకాంగ్‌ సంస్ధను అనధికార అనుబంధ సంస్ధగా వుపయోగించుకొని ద్య్రవ్య సంస్ధలను మోసం చేసేందుకు కుట్రపన్నిందని, తమ దేశ భద్రతకు ముప్పు కలిగించేవిగా దాని చర్యలున్నాయని బెయిలు విచారణ సమయంలో అమెరికా చేసిన ఆరోపణలను కెనడా సర్కార్‌ వల్లించింది.అరెస్టయిన పదకొండవ రోజున వాంకోవర్‌లోని ఆమె ఇంటి నుంచి బయటకు పోకుండా షరతులతో కూడిన బెయిలు మంజూరు చేశారు. ఇదే సమయంలో ఇద్దరు కెనడియన్లను భద్రతా కారణాలతో అరెస్టుచేసినట్లు చైనా అధికారులు ప్రకటించారు. అరెస్టు చేసిన మెంగ్‌ను తమకు అప్పగించాలని అమెరికా కోరింది. ఈ కేసులో 30సంవత్సరాల శిక్షపడే అవకాశం వుంది. అదే జరిగితే అమెరికా-చైనా సంబంధాలు ఏ మలుపులు తిరుగుతాయో చెప్పలేము.

ఇటీవలి కాలంలో హైటెక్‌ వుత్పత్తులలో ఇతర దేశాలకు చైనా కంపెనీలు పోటీ ఇస్తున్నాయి. మనందరికీ తెలిసిన శాంసంగ్‌ కంపెనీ సెల్‌ఫోన్లు, టెలికమ్యూనికేషన్ల పరికరాల తయారీలో మొదటి స్ధానంలో వుండగా చైనా హువెయి కంపెనీ రెండవ స్ధానానికి ఎదిగింది. ఇప్పుడు అది 5జి సాంకేతిక రంగంలో ముందున్నదని, ఒకటవ స్ధానానికి ఎదగ నుందని వార్తలు వచ్చాయి. వ్యాపారంలో తలెత్తిన పోటీయే కంపెనీ సిఎఫ్‌ఓ అరెస్టుకు అసలు కారణమని చెబుతున్నారు. చైనాపై వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించిన ట్రంప్‌ చైనా కంపెనీల పరికరాలు తమ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించాయని ఆరోపించిన విషయం తెలిసిందే. దానిలో భాగంగానే అమెరికా పౌరులు హువెయి కంపెనీ సెల్‌ఫోన్లు, సంస్ధలు పరికరాలను వాడవద్దనే నిషేధాలను విధించారు. అమెరికా కనుసన్నలలో కెనడా, బ్రిటన్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా కూడా నిషేధం విధించాయి.ఈ ఐదు దేశాలకు చెందిన గూఢచార సంస్ధలు ‘ఫైవ్‌ ఐస్‌’ (ఐదు నేత్రాలు) పేరుతో చైనా కంపెనీ పరికరాలలో రహస్య పరికరాలు వున్నట్లు నివేదికలను రూపొందించాయి. జూలై 17న ఐదుగురు గూఢచార అధిపతులతో కెనడా ప్రధాని కెనడాలోని అట్టావాలో ఒక రహస్య సమావేశం నిర్వహించారు. దీనిలో సిఐఏ డైరెక్టర్‌ గినా హాస్పెల్‌, బ్రిటన్‌ ఎం16 అధిపతి మైఖేల్‌ యంగర్‌ పాల్గన్నారు. ఈ సమావేశం గురించి ఆస్ట్రేలియా పత్రిక సిడ్నీ మోర్నింగ్‌ హెరాల్డ్‌ దీన్నొక సాదాసీదా సమావేశంగా వార్తను ప్రచురించింది. ఆ తరువాతే చైనా, రష్యాల మీద పెద్ద ఎత్తున ప్రచార దాడిని ప్రారంభించారు. హువెయి కంపెనీ పరికరాలను కొన వద్దనే ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. కంపెనీ అధికారిణి అరెస్టు దానికొనసాగింపు.జపాన్‌ ప్రభుత్వం, మూడు టెలికాం కంపెనీలు కూడా హువెయి పరికరాల కొనుగోలు నిలిపివేసినట్లు ప్రకటించాయి.

Image result for us china tech war cartoons

ప్రపంచంలో అన్ని దేశాలలో గూఢచర్యం జరిపే అమెరికాకు ఇప్పుడు తన నీడను చూస్తే తానే భయపడుతున్నట్లుగా వుంది. తమ అధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకున్నదన్న ఆరోపణలు దానిలో భాగమే. గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక అన్నట్లుగా ఆధునిక పరికరాలతో గూఢచర్యం ఎలా జరపవచ్చో అమెరికాకు వేరొకరు చెప్పనవసరం లేదు. అవే అస్త్రాలతను తమ మీద కూడా ప్రయోగిస్తున్నారని అది కంగారు పడుతోంది. ఈ రోజు ప్రతి దేశం తన అవసరాల కోసం, ఇతరుల కుట్రల గురించి జాగ్రత్తలు తీసుకొనేందుకు గూఢచర్యం జరపటం సాధారణ విషయం. దానిలో చైనా, మరొక దేశానికి ఎలాంటి మినహాయింపులు వుండవు. ఇప్పుడు అమెరికాలోని టెలికాం కంపెనీలు ఇబ్బందుల్లో వున్నాయి. స్మార్ట్‌ ఫోన్లను అక్కడ తయారు చేయటం లేదు. చైనా ఫోన్లమీదే అమెరికన్లు ఆధారపడుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో డెలాయిట్‌ కన్సల్టింగ్‌ విడుదల చేసిన ఒక నివేదికలో ఐదవ తరం(5జి) నెట్‌వర్క్‌ ఏర్పాటు పరుగులో అమెరికా మీద చైనా విజయం సాధించనున్నది.అమెరికా వెంటనే రంగంలోకి దిగకపోతే భవిష్యత్‌లో నూతన కంపెనీల ఏర్పాటులో తీవ్ర ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించింది. ఈ రంగంలో ముందున్న వారికి వెనుకబడినవారితో పోల్చితే ఎంతో ఆర్ధిక ప్రయోజనం వుంటుందని కూడా వ్యాఖ్యానించింది. ఇంకా అనేక కంపెనీలు ఇలాంటి హెచ్చరికలనే చేశాయి.

రెండుసార్లు సిఐఏ తాత్కాలిక డైరెక్టర్‌గా పని చేసిన మైఖేల్‌ మోరెల్‌ వాషింగ్టన్‌ పోస్టుకు రాసిన వ్యాఖ్యానంలో ఇది వాణిజ్య యుద్దం కాదు, సాంకేతిక యుద్ధం, ఐదవతరం పోటీలో మైలు దూరంలో అమెరికా వెనుకంజలో ఓడిపోతోందని మరింత స్పష్టంగా పేర్కొన్నాడు. అమెరికా అధ్యక్షుడు తరచుగా వాణిజ్య యుద్ధం గురించి చెబుతాడు, నిజానికి అమెరికా సాంకేతికపరమైన ప్రచ్చన్న యుద్దం చేస్తోంది. ఐదవతరం నెట్‌వర్క్‌లతో గతంలో ఎన్నటి కంటే వేగంగా ఎక్కువ సమాచారాన్ని సేకరించవచ్చు, ఈ నెట్‌వర్క్‌ల ద్వారా గూఢచర్యమే కాదు, విద్రోహానికి కూడా పాల్పడవచ్చు, ఈ రంగంలో పై చేయి సాధించిన వారు ఆర్ధికంగా ముందుంటారు, తమ రహస్యాలను పదిలపరుచుకోవటంతో పాటు ఇతరుల వాటిని తెలుసుకోవటంలో ముందుంటారు. వీటన్నింటినీ గమనంలోకి తీసుకున్నపుడు అమెరికా ఆందోళనపడక తప్పదని హెచ్చరించాడు.

ఐదవతరం ఇంటర్నెట్‌ సాంకేతిక పరిజ్ఞానం పరిశోధన, అభివృద్దిలో హువెయి కంపెనీ ఏటా 14బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తూ అమెరికా కంటే ముందున్నది. చైనా మార్కెట్‌ను ఇతర దేశాలకు తెరిచిన సమయంలో అమెరికాకు చెందిన మైక్రోసాప్ట్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, ఐఫోన్‌ వంటి సంస్దలు తమ పరికరాల ద్వారా పెద్ద ఎత్తున చైనా గూఢచర్యానికి పాల్పడ్డాయి. నిజానికి అమెరికన్లు అన్ని దేశాలలో అలాంటి చర్యలకు పాల్పడ్డారు. జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఫోన్‌ వర్తమానాలను దొంగిలించారు. చైనా అధ్యక్షుడు ప్రయాణించే బోయింగ్‌ 737 విమానంలో అమర్చిన రహస్య పరికరాన్ని చైనీయులు తొలగించారు. అమెరికా పరికరాలనే వుపయోగించి ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ అమెరికా రహస్య సమాచారాన్నే పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. చైనా తమ పరిజ్ఞానాన్ని తస్కరిస్తున్నదంటూ పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే ఐదవ తరం పరిజ్ఞానంలో అమెరికా ఎందుకు వెనుకబడిపోయినట్లు? చైనాలో పరిశోధనలు చేయకుండా అది ముందుకు ఎలా పోయినట్లు ? నిజానికిది ప్రచార దాడి తప్ప ఒకసారి తస్కరించినట్లు తేలితే ఏ దేశమైనా జాగ్రత్తలు తీసుకోకుండా వుంటుందా ?

Image result for  us china tech war

గతేడాది అక్టోబరులో చైనా కమ్యూనిస్టు పార్టీ 19వ మహాసభ జరిగింది. మేడిన్‌ చైనా 2025 పేరుతో అది కొన్ని లక్ష్యాలను దేశం ముందుంచింది. దాని కొనసాగింపుగానే అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ అనేక చర్యలను చేపట్టారు. అన్ని రంగాలలో సాంకేతిక పరంగా పై చేయి సాధించాలన్నదే ఆ లక్ష్యాల, చర్యల సారాంశం. అది యుద్ధ ప్రాతిపదిక మీద అమలు జరుగుతోందా సాదాసీదాగా జరుగుతోందా అంటే గత నాలుగు దశాబ్దాల చైనా అభివృద్ధిని చూసినపుడు వారు ఏ లక్ష్యాన్ని సాదాసీదాగా అమలు జరపలేదు. నిర్ణీత వ్యవధిలో లక్ష్యాన్ని చేరేందుకు ప్రతి అంశంలోనూ యుద్ధం మాదిరి పని చేశారు. గతంలో సూపర్‌ కంప్యూటర్లంటే అమెరికా తప్ప మరొకపేరు వినపడేది కాదు. గత రెండు దశాబ్దాల్లో పరిస్ధితి మారిపోయింది. టాప్‌ 500 పేరుతో ఒక సంస్ధ రూపొందించిన సమాచారం ప్రకారం ప్రపంచంలోని 500 వేగవంతమైన కంప్యూటర్లలో 206 చైనా వద్ద, 124 అమెరికా వద్ద వున్నాయి. నాలుగు అగ్రశ్రేణి కంప్యూటర్లలో రెండు చైనా వద్ద వున్నాయి, ఇటీవలనే అమెరికా మూడవదానిని రూపొందించి మొదటి స్దానం తిరిగి పొందింది. పోటీలో నువ్వానేనా అన్నట్లుగా అమెరికా-చైనా వున్నాయి. మైక్రోచిప్స్‌ విషయంలో చైనా ఎంతో వెనుకబడి వుంది. అమెరికా పది తయారు చేస్తే చైనాలో ఒకటి మాత్రమే వుత్పత్తి అవుతోంది. 2025నాటికి అమెరికాతో ఢీకొనేందుకు చైనా 30బిలియన్‌ డాలర్లు కేటాయించింది.ప్రపంచమంతా ఇపుడు కృత్రిమ మేధస్సు గురించి మాట్లాడుతోంది. 2030నాటికి ప్రపంచంలో అగ్రస్ధానంలో వుండేందుకు చైనా 150బిలియన్‌ డాలర్లను కేటాయించి పరిశోధనలను ప్రోత్సహిస్తోంది. ఈ పరిజ్ఞానం రెండంచుల పదును కలది అటు మానవ కల్యాణానికి, వినాశకరమైన మిలిటరీ అవసరాలకు రెండింటికీ వినియోగపడుతుంది. ఐదవ తరం టెలికమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటులో అమెరికా ఇంకా ఆలోచనలోనే వుండగా చైనా దూసుకుపోయి కీలకమైన సాంకేతిక ప్రమాణాలను ప్రపంచం ముందుంచింది. మిగతా ప్రపంచం చైనాను అసుసరించటం తప్ప మేం కూడా వచ్చేంతవరకు మీరు ముందుకు పోవటానికి వీల్లేదంటే కుదరదు. క్వాంటమ్‌ కంప్యూటర్‌ తయారీకి ఇప్పుడు అగ్రరాజ్యాలు పోటీపడుతున్నాయి. దానిలో కూడా చైనా వెనుకబడి లేదు. ఇప్పటికే పది బిలియన్‌ డాలర్లతో పని ప్రారంభించింది. అదే అమెరికా రానున్న ఐదు సంవత్సరాలలో 1.25 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఖర్చు చేయనున్నది. ఈ పూర్వరంగంలో అమెరికా దుష్ట స్వభావం గురించి కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్ధికవేత్త జెఫ్రీ శాచస్‌ సిబిసి టీవీతో చెప్పిన మాటలతో ఈ విశ్లేషణను ముగిద్దాం.

‘ మెంగ్‌ అరెస్టు మరో ప్రచ్చన్న యుద్దానికి నాంది అవుతుంది, అందుకు అమెరికాను కెనడా ప్రేరేపించింది. ఎట్టి పరిస్ధితుల్లో అయినా చైనా ఎదుగుదలను అడ్డుకోవాలని అమెరికా ప్రయత్నిస్తున్నది.ప్రత్యర్ధి ఆర్ధిక ఎదుగుదలను దెబ్బతీసేందుకు తన అధికారాన్ని వుపయోగించే అమెరికా వైఖరి బాగా తెలిసిందే, ఇది చాలా చెడ్డది, ప్రమాదకరమైంది, వాస్తవానికి ప్రపంచానికి మరొక కొత్త ప్రచ్చన్న యుద్ధాన్ని తెచ్చేది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d