• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Readers News Service

తప్పుడు లెక్కలతో పత్తి, చెరకు రైతులకు హాని తలపెట్టిన అమెరికా, ఆస్ట్రేలియా !

06 Thursday Dec 2018

Posted by raomk in Current Affairs, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, USA

≈ Leave a comment

Tags

cotton farmers, cotton subsidies, sugarcane, WTO

Image result for usa, australia stand against india farmers at wto

ఎం కోటేశ్వరరావు

అమెరికా, ఆస్ట్రేలియా వంటి ధనిక దేశాలు దౌత్యపరంగా మనకు మిత్ర దేశాలే. మన యువతీ యువకులు తెల్లారి లేస్తే ఏదో ఒక చోటికి వెళ్లాలని తహతహలాడుతుంటారు. మన పాలకులు అక్కడికి వెళ్లినపుడు, వారు ఇక్కడికి వచ్చినపుడు భారత దేశమా చుట్టుపక్కల 66 దేశాలకు పోతుగడ్డ అన్నట్లుగా మాట్లాడతారు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూస్తే ఎక్కడన్నా బావే కానీ వంగతోట దగ్గర కాదన్నట్లు, మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌, మా ఇంటికొస్తూ మాకేం తెస్తావ్‌ అన్నట్లుగా తమ దేశాల కార్పొరేట్ల ప్రయోజనాల విషయంలో మనకు ముఖ్యంగా రైతాంగానికి అవి శత్రుదేశాలే. ప్రపంచీకరణ పేరుతో మన పెట్టుబడిదారులు ఇతర దేశాలకు విస్తరించేందుకు, ఇప్పటికే విస్తరించిన బహుళజాతి కంపెనీలతో జత కట్టేందుకు మన పాలకవర్గం ప్రపంచీకరణ పేరుతో వాటికి ప్రాతినిధ్యం వహించే సంస్ధల సలహాలు, ఆదేశాలతో నడుస్తున్నాయి. దానిలో భాగంగానే ఇప్పటికే మన పాలకులు ఒక్కొక్క వలువ తీసివేసి చివరకు గోచి మీద నిలబెట్టినట్లు నామ మాత్ర రాయితీలు మిగిల్చాయి. ఇప్పుడు రైతాంగానికి మిగిలిన ఆ గోచిని కూడా తీసేయాల్సిందేనని ధనిక దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయంటే నమ్ముతారా? ఇప్పుడు ఆ పంచాయతీ ప్రపంచ వాణిజ్య సంస్ధలో నడుస్తోంది.

అమెరికాాచైనా మధ్య జూలైలో ప్రారంభమైన వాణిజ్య యుద్ధం గురించి మాత్రమే మనకు తెలుసు. ఆ యుద్దంలో దెబ్బతినే తన రైతాంగానికి ఇప్పటికే ఇస్తున్న సబ్సిడీలకు తోడు అదనంగా పత్తి, సోయా వంటి అనేక ఎగుమతి పంటలకు 12బిలియన్‌ డాలర్లు ఇవ్వాలని నిర్ణయించింది అమెరికా. అలాంటి దేశం గతంలో వరి, గోధుమలపై ఇప్పుడు మన మీద పత్తి రాయితీలు పరిమితికి మించి ఇస్తున్నారంటూ కనీస మద్దతు ధరకు ఎసరు పెట్టింది. తప్పుడు లెక్కలతో ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటివో)కు ఫిర్యాదు చేసింది. చెరకు రైతులకు, పంచదార ఎగుమతులకు ఇస్తున్న సబ్సిడీలు తమ రైతాంగాన్ని, మొత్తంగా ప్రపంచ పంచదార మార్కెట్‌ను దెబ్బతీశాయంటూ ఆస్ట్రేలియా కూడా అదే పని చేసింది. ఆ వాదన లేదా మనపై దాడికి ప్రాతిపదిక ఏమిటి? మన దేశంలో వున్న విభిన్న వాతావరణ పరిస్ధితుల కారణంగా అటు వుష్ణ మండల పంటలతో పాటు ఇటు శీతల మండల, సమశీతల మండల ప్రాంతాలలో సాగు చేసే పంటలలో కొన్ని మినహాదాదాపు అన్నింటినీ పండించే అవకాశం వుంది. అందుకే మన దేశాన్ని తన పరిశ్రమలకు ముడిసరకు సరఫరా చేసే ప్రాంతంగా పారిశ్రామిక విప్లవం తరువాత ఐరోపా ధనిక దేశాలు గుర్తించాయి. అందుకే ఆక్రమణ పోటీలో బ్రిటన్‌ది పైచేయి అయింది.మారిన పరిస్ధితుల్లో తమ అన్ని రకాల వ్యాపారాలు, వస్తుమార్కెట్లకు మన దేశం అనువుగా వుంది కనుక, భౌతికంగా ఆక్రమించుకొనే అవకాశం లేదు గనుక మన మార్కెట్‌ను ఆక్రమించుకొనేందుకు, తమకు అనుకూలంగా మన విధానాలను రూపుదిద్దేందుకు పూనుకున్నాయి. అందుకోసం ప్రపంచీకరణ, సరళీకరణ, సంస్కరణలు అంటూ ముద్దుపేర్లను ముందుకు తెచ్చాయి. ప్రస్తుతాంశం వ్యవసాయ సబ్సిడీలు కనుక వాటి గురించి చూద్దాం.

గత రెండు దశాబ్దాలలో మన వ్యవసాయ పెట్టుబడులు కనీసంగా నాలుగింతలు పెరిగాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) వునికిలో వచ్చి జనవరి ఒకటిన 24వ సంవత్సరంలో అడుగిడబోతోంది. ముఫ్పై సంవత్సరాల నాటి లెక్కల ఆధారంగా వర్ధమాన దేశాలకు నిర్ణయించిన పదిశాతం సబ్సిడీ పరిమితిని, వ్యవసాయ వుత్పత్తుల ధరలను పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు భారత్‌లో సబ్సిడీలు పరిమితికి మించి ఇస్తున్నారని అమెరికా, ఆస్ట్రేలియాలు ఫిర్యాదు చేశాయి. కనీస మద్దతు ధర ఆ నిబంధనను వుల్లంఘించేదిగా వుందని, తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. సరే అసలు ఎత్తివేయాలని కూడా మరోవైపు వత్తిడి తెస్తున్నాయనుకోండి. దీన్ని సులభంగా అర్ధం చేసుకోవాలంటే మన దేశంలో వుత్పత్తి అయ్యే మొత్తం పత్తి విలువ వెయ్యికోట్ల రూపాయలు అనుకుందాం. ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఐరోపాయూనియన్‌ వంటి ధనిక దేశాల వాదన ప్రకారం పత్తి మీద సబ్సిడీ మొత్తం విలువలో పదిశాతం అంటే వంద కోట్ల రూపాయలకు మించి ఇవ్వకూడదు. దీన్నే మరొక విధంగా చెప్పాలంటే కనీస మద్దతు ధరల పెంపుదల వందకోట్ల రూపాయలకు మించకూడదు.(ప్రత్యక్షంగా ఇచ్చే సబ్సిడీ మొత్తాలకు, కనీస మద్దతు ధరల సబ్సిడీ అవగాహనకు వున్న తేడా తెలిసిందే) మిగతా పంటలకూ ఇదే సూత్రం. ప్రపంచ వాణిజ్య సంస్ధ వునికిలోకి రాక ముందు దాని విధి విధానాలను రూపొందించే కసరత్తులో భాగంగా 1986-88 సంవత్సరాలలో ప్రపంచ మార్కెట్లో వున్న సగటు ధరలను ప్రాతిపదికగా తీసుకొని ధనిక దేశాలు ఐదుశాతం, అభివృద్ధి చెందుతున్న దేశాలు పదిశాతానికి మించి సబ్సిడీలు ఇవ్వకూడదని నిర్ణయించారు.

అంకెలతో ఎన్నో గారడీలు చేయవచ్చు. స్వామినాధన్‌ కమిటి సిఫార్సుల ప్రకారం వుత్పాదక ఖర్చుకు అదనంగా సగం కలిపి అంటే 150 గా కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వుత్పాదక ఖర్చులో కొన్నింటిని కలపలేదని మనం విమర్శిస్తున్నాం. అంతకంటే ముందే మన మద్దతు ధరలను వ్యతిరేకిస్తున్న అమెరికా ఏమి చెబుతోందో చూద్దాం. మన గోధుమలు, వరికి ప్రకటిస్తున్న మద్దతు ధర పదిశాతం పరిమితికి మించి 60,70 శాతం వుందని అమెరికా వాణిజ్య ప్రతినిధి ప్రపంచ వాణిజ్య సంస్ధకు ఫిర్యాదు చేశాడు. గాజు కొంపలో కూర్చొని ఎదుటివారి మీద రాళ్లు వేస్తున్నది అమెరికా. మన దేశం వరికి 60శాతం అదనంగా ఇస్తున్నట్లు యాగీ చేస్తున్న ఆ దేశం తన రైతాంగానికి 82శాతం, ఐరోపా యూనియన్‌ 66శాతం ఇస్తున్నది. ప్రపంచ వాణిజ్య సంస్ధ సూత్రాల ప్రకారం మొత్తం వ్యవసాయ పంటల విలువలో ధనిక దేశాలు ఐదుశాతం, అభివృద్ధి చెందుతున్న దేశాలు పదిశాతం పరిమితికి సబ్సిడీలు మించకూడదు. అయితే దీన్ని వక్రీకరించి కొన్ని పంటలకు కొన్ని సంవత్సరాలలో విపరీతమైన సబ్సిడీలను ఇచ్చి మొత్తం పంటల విలువకు దాన్ని వర్తింప చేసి ధనిక దేశాలు తప్పించుకుంటున్నాయి. అందుబాటులో వున్న సమాచారం మేరకు కొన్ని సంవత్సరాలలో అమెరికాకు అర్హత వున్న సబ్సిడీ మొత్తం వంద రూపాయలు అనుకుంటే 90రూపాయలను పాలు, పంచదార రైతులకే ఇచ్చింది, అలాగే ఐరోపా యూనియన్‌ 64రూపాయలను గోధుమ, వెన్నకే ఇచ్చింది.

గత ఇరవై ఏండ్లలో ఏడు సంవత్సరాల సమాచారాన్ని చూసినపుడు అమెరికాలో కొన్ని వుత్పత్తులకు వూలు 215, మేక బచ్చుతో చేసే శాలువలకు 141, వరి 82, పత్తి 74, పంచదార 66, కనోలా 61, ఎండు బఠాణీలకు 57శాతం, ఐరోపా యూనియన్‌లో పట్టుపురుగులకు 167, పొగాకు 155, పంచదార 120, కీరా 86, పియర్స్‌ పండ్లకు 82, ఆలివ్‌ ఆయిల్‌ 76, వెన్న 71,ఆపిల్స్‌ 68,పాలపొడి 67,టమాటా 61శాతాల చొప్పున ఇచ్చారు. ఇలా ప్రత్యేకించి ఒక వుత్పత్తికి ఇచ్చిన రాయితీలు సబ్సిడీల పరిధిలో చూపటం లేదు.

మన దేశం 53ా81శాతం మధ్య పత్తికి సబ్సిడీ ఇస్తున్నట్లు అమెరికా ఆరోపించింది. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా చేసిన కొనుగోళ్లను మాత్రమే సబ్సిడీలుగా భారత్‌ చూపుతున్నది.2015ా16లో 120 కోట్ల రూపాయలు చెల్లించినట్లు ప్రపంచ వాణిజ్య సంస్ధకు భారత్‌ తెలిపిందని అయితే 50,400 కోట్ల రూపాయలు చెల్లించినట్లు అమెరికా ఆరోపించింది. అంటే మొత్తం పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసినట్లు రైతులకు సబ్సిడీ ఇచ్చినట్లు చిత్రించింది. పంచదారను ప్రభుత్వం సేకరించే విధానం లేనప్పటికీ మద్దతు ధర నిర్ణయించటమే సబ్సిడీ చెల్లించటంగా ఆస్ట్రేలియా ఆరోపించింది. తాము నిర్ణయిస్తున్న మద్దతు ధరలను డబ్ల్యుటిఓ ఏర్పాటుకు ముందు 1986ా88 నాటి ధరలతో పోల్చి ఎక్కువగా వుంటున్నట్లు అమెరికా తప్పుడు లెక్కలు వేస్తోందని మన దేశం గతంలోనే సమాధానమిచ్చినా ఖాతరు చేయకుండా ఫిర్యాదు చేశారు. భారత్‌ డాలర్లలో లెక్కలు వేస్తుంటే అమెరికన్లు భారతీయ కరెన్సీలో గుణిస్తున్నారని అందువలన ఇరు దేశాలు చెప్పేదానికి పొంతన వుండదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 1990లో ఒక డాలరుకు 18 రూపాయలుండగా ఇప్పుడు 72 తాకింది. అందువలన రూపాయల్లో లెక్కవేసినపుడు నాలుగు రెట్లు ఎక్కువగా కనిపించటం సహజం. భారత, చైనా వంటి దేశాల వ్యవసాయ సబ్సిడీల గురించి అభ్యంతర పెడుతున్న ధనిక దేశాలు తాము ఇస్తున్నవాటి గురించి దాస్తున్నాయి. పలు ఖాతాల ద్వారా అందచేస్తూ వాటిని సబ్సిడీలుగా పరిగణించకుండా జాగ్రత్త పడుతున్నాయి.

అంతర్జాతీయ పత్తి సలహా సంస్ధ 2018 నవంబరులో విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొన్న అంశాలను గమనించటం అవసరం. కనీస మద్దతు ధరలు, ప్రత్యక్ష వుత్పాదక సబ్సిడీ, బీమా, తదితర రాయితీలన్నింటినీ కలిపి మొత్తంగా పత్తి సబ్సిడీలని పిలుస్తున్నారు.ప్రపంచ వ్యాపితంగా ఇవి 2016-17లో 4.4బిలియన్‌ డాలర్లుండగా 2017-18నాటికి 5.9బిలియన్లకు( ఒక బిలియన్‌ వంద కోట్ల డాలర్లు) 33శాతం పెరిగాయి. ఒక పౌను(453) దూదికి ఇచ్చిన సబ్సిడీ 17 నుంచి 18 సెంట్లకు(నవంబరు 27 విలువ ప్రకారం రు.12.03 నుంచి రు.12.74కు పెరిగాయి) 1997-98 నుంచి ఇప్పటి వరకు వున్న ధోరణుల ప్రకారం పత్తి ధరలు ఎక్కువగా వున్నపుడు సబ్సిడీలు తగ్గటం, తగ్గినపుడు పెరుగుదల వుంది.

పత్తి ధరల విషయానికి వస్తే 2013-14లో సగటున పౌనుకు 91సెంట్లు లభిస్తే 2014-16లో 70కి తగ్గి 2016-17లో 83కు, 2017-18లో 88 సెంట్లకు పెరిగింది.బ్రెజిల్‌,భారత్‌,పాకిస్ధాన్‌ వంటి అనేక దేశాలలో 2017-18లో కనీస మద్దతు ధరల కంటే మార్కెట్లో ఎక్కువ ధరలు వున్నాయి. అయినప్పటికీ కొన్ని దేశాలు ఎరువులు, రవాణా, గ్రేడింగ్‌, నిల్వ, ఇతర మార్కెటింగ్‌ ఖర్చులను సబ్సిడీగా ఇచ్చాయి.కొన్ని చోట్ల పంటల బీమా సబ్సిడీ పెరిగింది.1998-2008 మధ్య ప్రత్యక్ష, ఇతర సబ్సిడీల మొత్తం సగటున 55శాతం పెరిగింది, మరుసటి ఏడాది 83శాతానికి చేరింది, 2010-14 మధ్య 48శాతానికి తగ్గింది, తదుపరి రెండు సంవత్సరాలలో సగటున 75శాతానికి పెరిగి తదుపరి రెండు సంవత్సరాలలో 47శాతానికి తగ్గాయి. ఈ పూర్వరంగంలో చూసినపుడు మన దేశం గురించి అమెరికా చేసిన ఫిర్యాదు దురుద్దేశపూరితం, కనీస మద్దతు ధర వంటి కనీస రక్షణ కూడా ఎత్తివేయాలని వత్తిడి చేయటం తప్ప మరొకటి కాదు. చైనా, అమెరికాలలో మాదిరి వివిధ పధకాల కింద ఇస్తున్న రాయితీలు మన పత్తి రైతాంగానికి లేవు. ఎరువులు, పురుగు మందుల ధరల మీద నియంత్రణ ఎత్తివేయటం, పెరిగిన ధరలకు అనుగుణంగా సబ్సిడీ మొత్తాన్ని పెంచకపోవటం వంటి చర్యల కారణంగా పత్తి రైతాంగానికి ఏటే వుత్పాదక ఖర్చు పెరిగిపోతోంది. కనీస మద్దతు ధరకంటే పడిపోయినపుడు రంగంలోకి వస్తున్న సిసిఐ పరిమితంగానే కొనుగోళ్లు చేస్తూ ప్రయివేటు వ్యాపారులకు ఎక్కువగా తోడ్పడుతోంది. అనేక సందర్భాలలో రైతుల పేరుతో వ్యాపారుల నుంచే కొనుగోలు చేసిన కుంభకోణాల గురించి పత్తి రైతాంగానికి తెలిసిందే.

అమెరికా అభ్యంతర పెడుతున్న కనీస మద్దతు ధరల ప్రహసనం ఏమిటో మనకు తెలియంది కాదు. అంతర్జాతీయ పత్తి సలహా సంస్ధ నివేదిక రహస్యమేమీ కాదు. దానిలో మన దేశం గురించి పేర్కొన్న అంశాలు ఇలా వున్నాయి.’ భారత్‌లో కనీస మద్దతు ధర పద్దతి వుంది. 2014-15 మరియు 2015-16 సంవత్సరాలలో కనీస మద్దతు ధరల కంటే మార్కెట్‌ ధరలు తక్కువగా వున్నందున కొద్ది కాలమైనా ప్రభుత్వం నేరుగా పత్తి కొనుగోలు చేసింది.2016-17,2017-18లో మార్కెట్‌ ధరలు ఎక్కువగా వున్నందున మద్దతు ధరల వ్యవస్ధ కొనుగోలు అవసరం లేకపోయింది. మధ్యరకం పింజ రకమైన జె34 రకానికి 2017-18లో మద్దతు ధరగా క్వింటాలుకు రు.4,020 నిర్ణయించారు. అది పౌను దూది ధర 83సెంట్లకు సమానం. భారత్‌లో పత్తి రైతులు ప్రభుత్వ రుణ మాఫీ మరియు ఎరువుల సబ్సిడీ వలన లబ్ది పొందారు. పంటల బీమా ద్వారా కూడా కొంత మేర మద్దతు ఇచ్చారు. అయితే దీని విలువ ఎంతో తెలియదు. ఇది కాకుండా నాణ్యమైన విత్తనాల వుత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించటం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. టెక్నాలజీ మిషన్‌ ద్వారా జిన్నింగ్‌, ప్రెస్సింగ్‌ యూనిట్ల నవీకరణకు, పత్తి మార్కెటింగ్‌కు ఇటీవల తోడ్పడింది. వీటి గురించి బహిరంగంగా తెలిపే సమాచారం లేదు. ఇవి గాకుండా జౌళి రంగానికి ప్రత్యక్ష మద్దతు, చౌక రుణాల ద్వారా కూడా ప్రభుత్వం మద్దతు ఇస్తోంది.’ రుణాల రద్దును, నూలు, వస్త్ర మిల్లులకు ఇస్తున్న రాయితీలను కూడ పత్తి రైతులకు ఇస్తున్న రాయితీగా చిత్రించారు.

చైనా పత్తి రైతులకు ఇస్తున్న రాయితీల గురించి చూద్దాం. 2017-18లో అంతకు ముందు ఏడాది ఇచ్చిన 3.3బిలియన్‌ డాలర్ల సబ్సిడీని 4.3బిలియన్‌ డాలర్లకు పెంచారు(పౌనుకు 30సెంట్లు). ప్రపంచ వాణిజ్య ఒప్పందం ప్రకారం దిగుమతి చేసుకోవాల్సిన నిర్దేశిత వంతుకు మించి అదనంగా దిగుమతి చేసుకొనే పత్తి మీద 40శాతం పన్నుతో సహా రైతాంగానికి పలు రక్షణలు కల్పిస్తున్న కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌ ధరకంటే రైతాంగానికి ఎక్కువ గిట్టుబాటు అవుతున్నది. దిగుమతి చేసుకున్న పత్తి ధర, చైనా మిల్లులకు చేరిన ధరకు మధ్య వున్న వ్యత్యాసం రైతులకు నష్టదాయకంగా వుండకుండా చూసేందుకు చెల్లించిన లబ్ది మొత్తం 201-17లో ఒక బిలియన్‌ డాలర్లు వుండగా మరుసటి ఏడాది అది 1.5బిలియన్లకు పెరిగింది. ఇంతేగాకుండా మన దగ్గర కనీస మద్దతు ధర మాదిరిగా ప్రతి ఏటా రైతాంగానికి ఒక లక్షిత ధరను ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆ ఏడాది మార్కెట్‌లో వచ్చిన సగటు ధరతో దానిని పోల్చి తక్కువ వస్తే ఆ మేరకు రైతులకు ప్రభుత్వం నేరుగా చెల్లిస్తుంది. ఆ మేరకు 2015,16,17 సంవత్సరాలలో చెల్లింపులు చేసింది. 2018 సంవత్సరానికి ఒక టన్నుకు 18,600 యువాన్లుగా నిర్ణయించింది. ఇది పౌనుకు 130 సెంట్లకు సమానం. దాని ప్రకారం అంతకు ముందు సంవత్సరం చెల్లించిన 1.6బిలియన్ల నుంచి 2.1బిలియన్లకు మొత్తాన్ని పెంచింది. అంతే కాదు ప్రతి ఏటా 15క్లో డాలర్ల మేర నాణ్యమైన విత్తన సబ్సిడీ, మరో 15కోట్ల డాలర్లను దూర ప్రాంత రవాణా ఖర్చుల కింద రైతాంగానికి చెల్లించింది. ప్రపంచ వాణిజ్య సంస్ధలో సభ్యత్వం కోసం చైనా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఒక ఏడాదికి 8,94,000 టన్నుల పత్తి దిగుమతి చేసుకుంటే దాని మీద పన్ను ఒక శాతమే విధించాలి. అంతకు మించి దిగుమతులు వుంటే పరిమాణాన్ని బట్టి ఒక శాతం నుంచి 40శాతం వరకు పన్ను విధించవచ్చు. గత మూడు సంవత్సరాలుగా నిర్దేశిత మొత్తం మేరకే దిగుమతులు చేసుకుంటున్నది.

Image result for cotton picking in india

కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సిసిఐ) వార్షిక నివేదికలను ఆ సంస్ధ వెబ్‌ సైట్‌లో ఎవరైనా చూడవచ్చు. వాటిలో పేర్కొన్నదాని ప్రకారం 2014-15 సంవత్సరానికి పత్తి కనీస మద్దతు ధర అంతకు ముందు సంవత్సరం కంటే పెంచింది రు.50, ఇది ఒక శాతానికి దగ్గరగా వుంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ పడిపోయిన కారణంగా ఆ ఏడాది దేశీయ మార్కెట్లో ముడిపత్తి ధరలు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 19 నుంచి 30శాతం వరకు, అదే విధంగా దూది ధర 25 నుంచి 30శాతం వరకు పతనమైందని సిసిఐ నివేదిక తెలిపింది. ఇలాంటి సందర్భాలలో చైనా, అమెరికాలలో రైతాంగానికి ఆయా ప్రభుత్వాలు సబ్సిడీల రూపంలో నష్టం రాకుండా చూశాయి. మన దేశంలో అలాంటి విధానం లేదు. కనీస మద్దతు ధరకంటే మార్కెట్లో తక్కువ వున్నపుడు ఇష్టం లేని పెండ్లికి తలంబ్రాలు పోసినట్లుగా సిసిఐ కొనుగోళ్లు వుంటున్నాయి. అవి కూడా మద్దతు ధరకు మించటం లేదు. పైన చెప్పుకున్నట్లు ఒక ఏడాది ధరలు భారీగా పడిపోయినా రైతాంగం అప్పులపాలు కావాల్సిందే. ఈ ఏడాది ప్రస్తుతం మార్కెట్లో కనీస మద్దతు ధరల కంటే తక్కువ ధరలకే అధిక మొత్తాలను కొనుగోలు చేస్తున్నట్లు వివిధ మార్కెట్ల సమాచారం వెల్లడిస్తున్నది.

1966 నాటి చెరకు నియంత్రణ విధానం ప్రకారం మన ప్రభుత్వాలు చెరకు ధరను సూచిస్తున్నాయి. ఈ విధానం, పంచదార ఎగుమతులకు ఇస్తున్న రాయితీల కారణంగా ధరలు తగ్గి తమతో పాటు ప్రపంచ రైతాంగానికి, వ్యాపారులకు నష్టం జరుగుతోందంటూ ఆస్ట్రేలియా ప్రపంచ వాణిజ్య సంస్ధకు మన దేశం మీద చేసిన పరోక్ష ఫిర్యాదును ఇప్పుడు విచారిస్తున్నారు.’ చెరకు వుత్పాదనా సామర్ధ్యాన్ని పెంచేందుకు భారతీయ రైతులకు అధిక మూల్యం చెల్లిస్తున్నారు.దీంతో పంచదార మిల్లులకు ప్రభుత్వం అదనంగా చెల్లించేందుకు వీలు కలుగుతోంది. ప్రపంచ వాణిజ్య ఒప్పందం ప్రకారం భారత్‌ సబ్సిడీలను తగ్గించే జాబితాలో చెరకు లేదు ‘ అని ఆస్ట్రేలియా ఫిర్యాదు చేసింది. చెరకు సబ్సిడీలను తగ్గిస్తామని అంగీకరించిన దేశాలలో మన దేశం లేదు. ధనిక దేశాలు కోరుతున్న పద్దతిలో వ్యవసాయ సబ్సిడీలను తగ్గించాలనటాన్ని మనదేశం, చైనా వుమ్మడిగా ప్రపంచ వాణిజ్య సంస్ధలో వ్యతిరేకించాయి, ఈ అంశం మీద చర్చలు జరపాలని డిమాండ్‌ చేశాయి. అయితే అమెరికా, ఐరోపాయూనియన్‌, జపాన్‌, నార్వే, స్విడ్జర్లాండ్‌ తదితర దేశాలు చర్చను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 2011-17 మధ్య అంగీకరించిన సబ్సిడీ మొత్తాలకు మించి చెరకు సబ్సిడీలను భారత్‌లో ఇచ్చారని ఆస్ట్రేలియా వాదించింది. భారత చెరకు, పంచదార గురించి అమెరికా తయారు చేసిన తప్పుడు లెక్కలను వుదహరించి ఆస్ట్రేలియా కేసు దాఖలు చేసింది. ఒక్క చెరకు పంట మీదే కాదు, పప్పుధాన్యాలకు కూడా భారత్‌ ఇస్తున్న సబ్సిడీ వలన కూడా ప్రపంచ వాణిజ్యం ప్రభావితం అవుతోందని ఆరోపిస్తోంది.ఈ వైఖరి ఒక విధంగా మన దేశ సార్వభౌమత్వాన్నే సవాలు చేయటంగా కూడా చెప్పవచ్చు.

ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీల కారణంగా ఈ ఏడాది భారత్‌లో పంచదార వుత్పత్తి ఏకంగా 20 నుంచి 35 మిలియన్‌ టన్నులకు పెరిగిందని ఆస్ట్రేలియా ఆరోపించింది. భారత్‌ 85కోట్ల డాలర్ల మేర సబ్సిడీ ఇచ్చి ఐదులక్షల టన్నుల పంచదారను ప్రపంచ మార్కెట్లో కుమ్మరిస్తున్నదని, తమ దేశంలో టన్ను పంచదార వుత్పత్తికి 440-450 డాలర్ల వరకు ఖర్చవుతుండగా మార్కెట్లో 500డాలర్లుగా వున్న ధర పడిపోయి 400కు మించి రావటం లేదని ఆస్ట్రేలియా ఆరోపిస్తోంది. మరోవైపు మన దేశంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్న ధరలు రైతాంగానికి గిట్టుబాటు కావటం లేదని పెంచాలని కోరుతున్నారు. దీన్నే సబ్సిడీ చెల్లించటంగా చిత్రిస్తున్నారు.నిజానికి రాష్ట్రం లేదా కేంద్రంగానీ రైతులకు ఇస్తున్న ప్రోత్సాహక ధరలు లేదా రాయితీలు చెరకు-దాని వుత్పత్తుల మీద వచ్చే ఆదాయం, పన్నులతో పోల్చుకుంటే తక్కువే. ఈ మాత్రపు రక్షణ కూడా లేకుండా మార్కెట్‌ శక్తులకు వదలి వేయాలని అంతర్జాతీయ బడా పంచదార వ్యాపారులు వత్తిడి తెస్తున్నారు.

గత పదహారు సంవత్సరాలలో తొలిసారిగా భారత్‌ పంచదార వుత్పత్తిలో బ్రెజిల్‌ను అధిగమించి 35.9 మిలియన్‌ టన్నులతో ప్రధమ స్ధానంలోకి వచ్చింది. అయితే ఇది తాత్కాలికమే అని చెప్పవచ్చు. బ్రెజిల్‌లో ప్రతికూల వాతావరణం నెలకొనటం ఒక కారణమైతే, చమురు ధరలు 85డాలర్లకు పెరిగినందున పంచదార బదులు ఎథనాల్‌ తయారు చేయటం లాభసాటిగా వున్నందున పంచదార వుత్పత్తిని కావాలనే తగ్గించారు. చమురు ధరలు 60డాలర్లకు పడిపోయినందున ఎథనాల్‌ బదులు పంచదారకు మరలితే మన పరిస్థితి ఇబ్బందుల్లో పడుతుంది. ప్రపంచ వ్యాపితంగా 188.3మిలియన్‌ టన్నుల పంచదార వుత్పత్తి అవుతుందని అంచనా.

మన మార్కెట్‌ను బహుళజాతి గుత్త సంస్ధలకు తెరిచిన కారణంగా ఇప్పటికే పత్తి, ఇతర విత్తన రంగం,పురుగు మందుల రంగం విదేశీ, స్వదేశీ గుత్త సంస్ధల ఆధిపత్యంలోకి పోయింది.వారు నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయాల్సిందే. కార్గిల్‌ వంటి బహుళజాతి గుత్త సంస్ధలు కనీస మద్దతు ధరలను దెబ్బతీసే విధంగా పరోక్షంగా కొనుగోళ్లు జరుపుతూ మార్కెట్లను నిర్దేశిస్తున్నాయని 2017 జనవరిలో వార్తలు వచ్చాయి. లోపాలతో కూడినదే అయినప్పటికీ ఆ విధానం కూడా వుండకూడదని, అప్పుడే తాము ప్రత్యక్షంగా రంగంలోకి దిగవచ్చని అవి భావిస్తున్నాయి. దానిలో భాగంనే పారిశ్రామిక రంగానికి ఇచ్చే రాయితీలను కూడా రైతుల ఖాతాలో వేసి అమెరికా వంటి దేశాలు కనీస మద్దతు ధరల విధానం మీద దాడి చేస్తున్నాయన్నది స్పష్టం. దీని వెనుక అంతర్జాతీయ వ్యవసాయ కార్పొరేట్ల ప్రయోజనాలు తప్ప మరొకటి లేదు. ధనిక దేశాల లాబీ, వత్తిడికి లంగి వాటికి అనుకూలమైన విధానాలు అమలు జరుపుతున్న పాలకవర్గాల మీద, అదే విధంగా కార్పొరేట్‌ శక్తుల కుట్రల మీద రైతాంగం చైతన్యవంతులై ఆ విధానాలను తిప్పికొట్టకపోతే వున్న రాయితీలు కూడా వూడ్చిపెట్టుకుపోయే ప్రమాదం వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఒప్పందం లేకుండానే బ్రిటన్‌ విడిపోతుందా !

21 Wednesday Nov 2018

Posted by raomk in Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion, UK

≈ Leave a comment

Tags

brexit, brexit deal or no deal, European Union, Theresa May

Image result for brexit deal or no deal

ఎం కోటేశ్వరరావు

తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్న లుబ్దావన్ల ప్రకటనతో కన్యాశుల్కం నాటకం ఏ మలుపులు తిరిగిందీ మనకు తెలిసిందే. ఇప్పుడు ఐరోపా యూనియన్‌(ఇయు)నుంచి విడిపోయిన(బ్రెక్సిట్‌) అనంతర సంబంధాల గురించి తాను కుదుర్చుకున్న ముసాయిదా ఒప్పందానికి పార్లమెంటు ఆమోదం పొందాలని బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆమె ప్రత్యర్దులు ఒప్పందాన్ని తిరస్కరించటం ద్వారా ఎలాంటి ఒప్పందం లేకుండానే ఇయుతో తెగతెంపులు చేసుకోవాలనే కొత్త వాదనను తాజాగా ముందుకు తెస్తున్నారు. దాంతో ఒప్పందం వుంటే ఏమిటి లేకుంటే ఏమి జరుగుతుంది అన్న చర్చ ఇప్పుడు బ్రిటన్‌లో జరుగుతోంది. మరోవైపు బడాకార్పొరేట్‌ లాబీ ఇయు నుంచి బయటకు పోయినా తమ లాభాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకొనే విధంగా ప్రయత్నిస్తున్నది. బ్రిటన్‌లోని వివిధ కమ్యూనిస్టు పార్టీలు బ్రెక్సిట్‌కు అనుకూలంగా రెండు సంవత్సరాల క్రితం ఓటు వేశాయి. ప్రధాన టోరీ, లేబర్‌ పార్టీలలో పునరాలోచన తలెత్తినప్పటికీ విడిపోయే విషయంలో కమ్యూనిస్టుపార్టీలు ఎలాంటి పునరాలోచన చేయటం లేదు. అయితే అక్కడి రాజకీయాలలో వీటి పాత్ర పరిమితం అన్న విషయం తెలిసిందే. పార్టీలోని పచ్చి మితవాదులు ప్రధాని థెరెసా మే మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని చూస్తుండగా మరికొందరు అంతవరకు రాకుండా పార్టీలోనే సభా నాయకురాలిగా విశ్వాసతీర్మానం ఎదుర్కోవాలనే ప్రయత్నాల్లో వున్నారు. మరోవైపు ఒక వేళ ఎలాంటి ఒప్పందం లేకుండా ఇయు నుంచి విడిపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సాంకేతికపరమైన నోటీసుల పేరుతో ప్రభుత్వం అన్ని తరగతులకు సమాచారాన్ని తెలియ చేస్తున్నది. దీంతో ఒప్పందం లేకుండానే బ్రిటన్‌ వేరు పడుతుందా అన్న వూహాగానాలకు తెరలేచింది. ఈ సమస్య చివరకు థెరెసా మే వుద్యోగం వూడగొతుందా? ఆమె ప్రత్యర్ధులు చిత్తవుతారా అనేది వెండితెరపై చూడాల్సిందే. అసలు సమస్య ఏమిటి?

రెండు సంవత్సరాల క్రితం ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలా లేదా అనే అంశంపై ప్రజాభిప్రాయసేకరణ జరిగింది. దాన్నే క్లుప్తంగా బ్రెక్సిట్‌ అని పిలుస్తున్నారు. వెళ్లిపోవాలనే అభిప్రాయానికి మెజారిటీ ప్రజలు అంగీకరించారు. ఇప్పుడు ఎలా వుపసంహరించుకోవాలనే అంశం మీద కూడా మరో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలన్న ప్రతిపాదనలు కూడా వున్నాయి.ఐరోపా యూనియన్‌లో బ్రిటన్‌ చేరటం నుంచి విడిపోవటం, అంతిమంగా ఎలా విడిపోవాలన్నది కూడా వివాదాస్పదం కావటం అంటే ప్రపంచ పెట్టుబడిదారీ వర్గం ఎదుర్కొంటున్న సంక్షోభ తీవ్రతను వెల్లడించటమే. ఎలా విడిపోవాలి అనే అంశంపై కుదుర్చుకున్న ఒప్పందానికి పార్లమెంట్‌లో మెజారిటీ వుందా లేదా అన్నది కూడా సందేహంగా మారింది.మెరుగైన తన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ప్రధాని ప్రకటించిన 24 గంటలు కూడా గడవ ముందే బ్రెక్సిట్‌ మంత్రి, మరొకరు రాజీనామా ప్రకటించి వత్తిడి పెంచారు. స్వపక్షంతో పాటు ప్రతిపక్ష లేబర్‌ పార్టీ కూడా ఒప్పందాన్ని వ్యతిరేకిస్తోంది.

2016 జూన్‌లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 52శాతం మంది ఇయు నుంచి బ్రిటన్‌ బయటకు రావాలని ఓటు వేయగా 48శాతం వుండాలని ఓటు వేశారు. బయటకు వస్తేనే సార్వభౌమత్వాన్ని తిరిగి పొందటం, వలసల విషయంలో భూభాగంపై మరింత అదుపు సాధ్యమని బ్రెక్సిట్‌ మద్దతుదార్లు పేర్కొన్నారు. బయటకు వస్తే ఆరోగ్య పరిరక్షణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేసేందుకు అవకాశం వుంటుందని ఓటర్లను తప్పుదారి పట్టించారు. దశాబ్దాల పాటు యూనియన్‌లో కొనసాగి ఇప్పుడు వుపసంహరించుకుంటే అనూహ్య సమస్యలు తలెత్తుతాయని సమర్ధకులు పేర్కొన్నారు.నిజానికి ఐరోపా యూనియన్‌లో వున్నప్పటికీ బ్రిటన్‌ కోల్పోయిందేమీ లేదు. మిగతా దేశాలన్నీ తమ కరెన్సీలను రద్దు చేసుకొని యూరోకు మారితే బ్రిటన్‌ తన పౌండ్‌ను అలాగే కొనసాగిస్తోంది. తన స్వంత వడ్డీ రేట్లు,ద్రవ్య విధానాలు, సరిహద్దులలో సందర్శకుల తనిఖీ స్వంత నిబంధనలు అమలు జరుపుతోంది. ప్రజాభిప్రాయ సేకరణ చట్టబద్దమైనది కాదు. పార్లమెంట్‌ అనుమతి లేనిదే వుపసంహరణ ప్రక్రియ ప్రారంభం కారాదని బ్రిటన్‌ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో పార్లమెంట్‌ ఒక చట్టం చేయాల్సి వచ్చింది. ఐరోపా యూనియన్‌ నిబంధన ప్రకారం ఏ సభ్యదేశమైనా బయటకు వెళ్ల దలచుకుంటే ఆర్టికల్‌ 50 అమలు జరపాలని కోరాల్సి వుంది. ఆ మేరకు పరివర్తనా కాల వ్యవధి ముగిసే 2019, మే 29నాటికి ఒప్పందం కుదుర్చుకోవాల్సి వుంది. ఈలోగా గతంలో కుదిరిన ఒప్పందాలు,భవిష్యత్‌ సంబంధాలపై బ్రిటన్‌ -ఇయు మధ్య ఒక ఒప్పందం జరగాల్సి వుంది. ఇప్పుడు ప్రధాని థెరేసా మే దాన్నే ప్రతిపాదించారు.

Image result for brexit deal or no deal cartoons

ఒప్పందానికి కట్టుబడతారో లేదో తేల్చుకోవాల్సింది బ్రిటన్‌ తప్ప బ్రెక్సిట్‌ విషయంలో ఎలాంటి పున:సంప్రదింపులు లేవని ఐరోపాయూనియన్‌ కరాఖండిగా చెప్పింది. పరివర్తన కాల వ్యవధి పొడిగింపు, అస్పష్టంగా వున్న కొన్ని అంశాల గురించి సంప్రదింపులు తప్ప ప్రధాన మార్పులకు అవకాశం లేదని ఐరోపా యూనియన్‌ స్పష్టం చేసింది.యూనియన్‌ చర్చల ప్రధాన ప్రతినిధి మైఖేల్‌ బార్నియర్‌ విలేకర్లతో మాట్లాడుతూ బ్రిటన్‌లో రాజకీయ పరిస్ధితి ఎలా వున్నప్పటికీ ఇయు రాయబారులెవరూ వారితో విడిగా మాట్లాడవద్దని కోరారు. అనేక మంది ఐరోపా నేతలు బ్రిటన్‌ ప్రధాని వైఖరికి మద్దతుగా మాట్లాడటం విశేషం. వారిలో ఆస్ట్రియన్‌ ఛాన్సలర్‌ సెబాస్టియన్‌ కర్జ్‌ ఒకరు. ఒప్పందంలో ఎలాంటి మార్పులు చేయవద్దని డచ్‌ ప్రధాని మార్క్‌ రూటే వ్యాఖ్యానించారు. యూనియన్‌ నుంచి బయటకు వస్తే బ్రిటీష్‌ పౌరులకు బంగారు భవిష్యత్‌ వుంటుందని అక్కడి బాధ్యతారహితమైన అనేక మంది రాజకీయ నాయకులు జనానికి చెప్పారు, నిజం ఏమిటంటే ఆ నిర్ణయం వారికి కాళరాత్రి అవుతుంది అని ఫ్రెంచి మంత్రి వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది మార్చి 29లోగా ఒప్పందం కుదరకపోతే వెంటనే సంబంధాలు రద్దవుతాయి. ఎలాంటి పరివర్తన వ్యవధి వుండదు.

బ్రిటన్‌లో టోరీ లేదా లేబర్‌ పార్టీగానీ రెండూ మౌలికంగా పెట్టుబడిదారీ వర్గప్రతినిధులే.అయినా వాటి మధ్య అధికారం విషయంలో తగాదాలున్నాయి.వివరాలు వెల్లడైన మేరకు ఒక అభిప్రాయం ప్రకారం ఆ ఒప్పంద సారాంశాన్ని చెప్పాలంటే కార్పొరేట్‌, ఇతర ధనికుల ప్రయోజనాలను రక్షించేదిగా, వలస వచ్చే వారి మీద దాడి చేసేదిగా వుంది. గతంలో బ్రిటన్‌ తీసుకున్న నిర్ణయం ప్రకారం వచ్చే ఏడాది మార్చినెలాఖరుకు ఐరోపా యూనియన్‌(ఇయు) నుంచి బయటకు వస్తుంది. ఆ తరువాత 21నెలల పాటు పరివర్తన కాలం వుంటుంది. ఆ సమయంలో అనేక ఐరోపా స్వేచ్చా మార్కెట్‌ నిబంధనలు వర్తించే కస్టమ్స్‌ పన్నుల పరిధిలో బ్రిటన్‌ వుంటుంది. తరువాత ఏమిటన్నది సమస్య. తరువాత కూడా కార్పొరేట్‌, ధనికులకు వుపయోగపడే విధంగా బ్రెక్సిట్‌ ఒప్పంద అంశాలను రూపొందించాలన్న వత్తిడి మేరకు బ్రెక్సిట్‌ ఒప్పంద అంశాలను పొందుపరిచారన్నది ఒక అభిప్రాయం.పరివర్తన వ్యవధిలో బ్రెక్సిట్‌ అనంతర సంబంధాలపై బ్రిటన్‌-ఇయు మధ్య ఒప్పందం కుదరకపోతే పరివర్తన కాలం పొడిగింపు వుంటుంది. అంటే యూనియన్‌ నుంచి బయటకు వెళ్లిన తరువాత కూడా బ్యాంకింగ్‌, రవాణా, పౌరసేవల వంటి అంశాలలో బ్రిటన్‌కు కూడా ఇయు సభ్యదేశాలతో సమాన అవకాశాలు కల్పించాలన్నది బ్రిటన్‌ కార్పొరేట్ల డిమాండ్‌. పరివర్తన కాలం ముగిసిన తరువాత బ్రిటన్‌లో వున్న దాదాపు 30లక్షల మంది ఇయు వలస పౌరులు అక్కడే వుండేందుకు తమకు అవకాశం ఇవ్వాలని బ్రిటన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఐదేండ్లనుంచి వుంటున్నట్లు రుజువు చేసుకున్నవారు అక్కడే స్ధిరపడిన స్ధితిలో కొనసాగవచ్చు. ఇదే నిబంధన ఇయు దేశాలలో వున్న బ్రిటన్‌ వలస పౌరులకు కూడా వర్తిస్తుంది.ఐరోపా యూనియన్‌ విధానాలను బట్టి ఇతర దేశాల వాసులు స్ధిరపడిన స్ధితిని బ్రిటన్‌ సర్కార్‌ రద్దు కూడా చేయవచ్చు. ఆర్ధికంగా సంపాదన లేని వారు తమ కుటుంబసభ్యులకు భారంగా లేమని తమకు తగినన్ని ఆర్ధిక వనరులు, సమగ్ర ఆరోగ్యబీమా వుందని రుజువు చేసుకోవాల్సి వుంది. వలస వచ్చిన వారికి బీమా సౌకర్యాన్ని వర్తింప చేయకూడదనే వత్తిళ్లు ఇప్పటికే వున్నాయి.వివాహ బంధంలో విడిపోయినపుడు భరణం చెల్లించటం గురించి తెలిసిందే.అలాగే విడిపోవాలని బ్రిటనే కోరుకుంది గనుక పరిహారంగా ఇయుకు 50బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి వుంటుంది.

పాలక టోరీ పార్టీలో బ్రెక్సిట్‌ ఒప్పందం మీద భిన్నాభిప్రాయాలున్నాయి. అది చివరకు ఇద్దరు మంత్రుల రాజీనామా, ప్రధానిపై అవిశ్వాసతీర్మానం పెట్టాలనేంతవరకు దారితీశాయి. ఇయు నుంచి వెళ్లిపోవాలని గట్టిగా పట్టుబడుతున్నవారు పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలని, వాణిజ్యం నుంచి వలసలు, వుత్పత్తుల క్రమబద్దీకరణ వరకు అన్నింటికీ బ్రిటీష్‌ చట్టాలు తప్ప ఇయు చట్టాలతో సంబంధం వుండకూడదని చెబుతున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్నవారు బ్రిటన్‌-ఇయు మధ్య కొన్ని సంబంధాలను కానసాగించాలని, పూర్తిగా తెగతెంపులు చేసుకుంటే దేశ ఆర్ధిక వ్యవస్ధకు, రాజకీయ స్ధిరత్వానికి విపత్కరమని వాదిస్తున్నారు. ఇలాంటి అభిప్రాయాలే ప్రతిపక్ష లేబర్‌ పార్టీలోనూ వున్నాయి.బ్రెక్సిట్‌ తరువాత కూడా ఇయు కస్టమ్స్‌ యూనియన్‌లో బ్రిటన్‌ కొనసాగేందుకు వీలైన అంశం థెరేసా మే ఒప్పందంలో వుంది. ఐర్లండ్‌ అంతర్యుద్ధంలో వుత్తర ఐర్లండ్‌ ప్రాంతంలో మెజారిటీగా వున్న ప్రొటెస్టెంట్‌లు తాను బ్రిటన్‌లో భాగంగా వుండాలని కోరుకున్నారు. కాథలిక్కులు మెజారిటీ ఐర్లండ్‌లో వుండిపోయారు. రెండు ప్రాంతాల మధ్య సయోధ్యలో భాగంగా 1999లో కుదిరిన గుడ్‌ ఫ్రైడే ఒప్పందం మేరకు ఐర్లండ్‌ – వుత్తర ఐర్లండ్‌ మధ్య సరిహద్దు నిబంధనలు సులభతరంగా వున్నాయి. ఇప్పుడు బ్రిటన్‌ బయటకు పోయిన తరువాత ఐర్లండ్‌ గనుక ఇయు కఠిన నిబంధనలు అమలు జరిపితే అది 1999 ఒప్పందానికి విరుద్ధం అవుతుంది. అందువలన సరిహద్దు నిబంధనలు సులభతరంగా వుండాలని బ్రిటన్‌ కోరుతోంది. ఆ అవకాశాన్ని వినియోగించుకొని బ్రిటన్‌ తన వుత్పత్తులను ఐర్లండ్‌లోకి పంపితే ఎలా అన్నది ఇయు సమస్య.

Image result for brexit deal or no deal

ఐరోపా యూనియన్‌తో కుదుర్చుకోదలచిన ముసాయిదా పత్రంలోని అంశాలను వ్యతిరేకిస్తూ ఇద్దరు మంత్రులు రాజీనామా చేయగా, వారి బదులు మరొక ఇద్దరిని వెంటనే నియమించారు. ఒప్పందం తనకోసం కాదని జాతీయ ప్రయోజనాలకోసమే అని ప్రధాని చెబుతున్నారు. తన ప్రతిపాదనలకు మద్దతు ఇవ్వాలని ప్రధాని థెరెసా మే సోమవారం నాడు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ బ్రిటీష్‌ ఇండస్ట్రీ(సిబిఐ)కివిజ్ఞప్తి చేశారు. ఈ ఒప్పందం వలన తమకు చౌకగా దొరికే కార్మికుల కొరత ఏర్పడుతుందని, తద్వారా తాము నష్టపోతామని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడినట్లు వార్తలు వచ్చాయి.ఒప్పందం కుదురుతుందన్న వార్తలు వెలువడగానే బ్రిటన్‌ కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయం నుంచి వెనక్కు తగ్గుతున్నాయని ఒక కంపెనీ తూర్పు ఐరోపాకు తరలాలని నిర్ణయించినట్లు సిబిఐ ప్రతినిధులు పేర్కొన్నారు. ఒప్పందం లేకుండా బ్రిటన్‌ విడిపోతే 50 బిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించాల్సిన అవసరం వుండదని కొందరు భాష్యం చెబుతుండగా ఒప్పందం వున్నా లేకపోయినా పరిహారం చెల్లించాలని మరికొందరు చెబుతున్నారు.ఈనెల 25న బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఐరోపా యూనియన్‌ నేతలతో ఆమె సమావేశం తరువాత బ్రిటన్‌లో ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో నాయకత్వ మార్పు సమస్యను ముందుకు తెచ్చినంత మాత్రాన జరిగేదేమీ వుండదని, సంప్రదింపులు ఆలస్యమయ్యే కొద్దీ ముప్పు మరింత పెరుగుతుందని ఆమె హెచ్చరించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా రైతాంగానికి వ్యవసాయ పరిశోధనల తోడ్పాటు !

13 Tuesday Nov 2018

Posted by raomk in CHINA, Current Affairs, Farmers, History, INTERNATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

agricultural research, automation in china agriculture, china agriculture, chinese farmers

Image result for how the chinese farmers are benefits of agricultural research

ఎం కోటేశ్వరరావు

అలవిగాని ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు సోకితే తప్ప రైతు ఎంత ఎక్కువగా పెట్టుబడి పెడితే దిగుబడి అంత ఎక్కువగా వస్తుందన్నది అందరికీ తెలిసిన సత్యం. ఆ పెట్టుబడులు కూడా గుడ్డిగా కాకుండా శాస్త్రీయంగా వుంటే మరింత ప్రయోజనం. దానికి మార్కెట్‌ రక్షణ కూడా వుంటే నాలుగు డబ్బులు మిగులుతాయి. శాస్త్రీయ పద్దతులు, సమాచారం రైతులకు కావాలంటే ఎవరికి వారు సంపాదించుకోలేరు. అందరికీ ఆఫలాలు అందే విధంగా పభుత్వాలే సమకూర్చాలి. వాటినే పరిశోధన, అభివృద్ధి అంటున్నారు. కొత్త వాటి కోసం పరిశోధన, వున్నవాటిని మెరుగుపరటం అభివృద్ధి జరగాలి. అటువంటి దానికి ఏ దేశం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నది అనేదాన్ని బట్టి ఫలితాలు వుంటాయి.

ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా అన్ని రంగాలలో చైనా ముందుకు దూసుకుపోతున్నది అనేది వాస్తవం. దాన్ని పాలించే కమ్యూనిస్టు పార్టీ రాజకీయాలతో ఎవరైనా విబేధించవచ్చుగాని జనం కోసం చేస్తున్న వారి కృషిని కాదనలేరు. గత నెలలో చైనా వ్యవసాయ రంగ అభివృద్ధికి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఎలా వుపయోగపడుతున్నదో ఒక నివేదికను ప్రకటించారు. దాని వలన చైనాకు ఆహార భద్రత సమకూరటంతో పాటు రైతుల ఆదాయాలు పెరిగాయన్నది దాని సారాంశం. అయితే వుత్పాదక ఖర్చు ఇంకా ఎక్కువగానే వుందని, వుత్పత్తుల ధరలు ఒక పరిమితికి చేరాయని ఫలితంగా లాభాలు తగ్గుతున్నాయంటూ ఈ సమస్యతో పరిమిత వనరులు, పర్యావరణ కాలుష్యం, కీలకమైన పోటీ లేమి వంటి సవాళ్లను చైనా ఎదుర్కొంటున్నదని, వాటిని అధిగమించటానికి అవసరమైన సంస్కరణలు చేపట్టాల్సి వుందని కూడా దానిలో పేర్కొన్నారు.

వాటిలో భాగంగా మరింత నాణ్యమైన పంటల రకాలు, స్వయం చాలిత యంత్రాలు, వ్యవసాయ, ఆహార వుత్పత్తుల తయారీ, సమర్ధ నీటి వినియోగం, కాలుష్య అదుపు, వ్యవసాయ వృధాను వుపయోగించుకోవటం, పర్యావరణ పరిరక్షణ, పునరుద్ధరణ వంటి అంశాలపై ప్రభుత్వ అకాడమీ ఐదు సంవత్సరాల ప్రణాళికను కూడా రూపొందించింది.వ్యవసాయ రంగంలో చైనా సాధించిన అంశాల గురించి ఆ నివేదికలో పేర్కొన్నవాటి సారాంశం ఇలా వుంది. శాస్త్ర, సాంకేతిక రంగాలలో సాధించిన పురోగతి చైనా వ్యవసాయ అభివృద్దికి 2012లో 53.5శాతం దోహదం చేస్తే 2017నాటికి 57.5శాతంగా వుంది. ఆ పురోగతి వరి, పత్తిలో అధిక దిగుబడి, చీడపీడల నిరోధ రకాల రూపకల్పన, ప్రమాదరకర బర్డ్‌ ఫ్లూ నిరోధానికి సమర్ధవంతంగా పని చేసే వాక్సిన్ల తయారీ వంటి వాటిలో వుంది.వ్యవసాయ భూమి, మంచినీరు, ఇతర వనరుల లభ్యత తగ్గుతున్నా గత ఐదు సంవత్సరాలలో ఆహార ధాన్యాల వుత్పత్తి 60కోట్ల టన్నుల వద్ద స్ధిరంగా వుంది. జన్యుపరమైన పరిజ్ఞానంలో కనుగొన్న అంశాల ఆధారంగా పందులు, పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు, బాతుల సంతతి వృద్ధి గణనీయంగా పెరిగింది. అనేక పంటలకు జన్యుపరమైన మాప్‌లను తయారు చేశారు. వ్యవసాయ రంగంలోని యంత్రాలు, పరికరాలను ఇంటర్నెట్‌తో అనుసంధానం చేశారు. పురుగుమందులను చల్లేందుకు డ్రోన్‌లను వినియోగిస్తున్నారు.చైనాలో సాధించిన పురోగతి ప్రపంచంలోని అనేక దేశాలలో వ్యవసాయ రంగానికి వుపయోగపడుతోంది.

Image result for how the chinese farmers are benefits of agricultural research

వివిధ పంటల దిగుబడులకు సంబంధించి 2015లో భారత్‌, చైనా, ప్రపంచ సగటు వివరాలు

హెక్టారుకు కిలోలు

పంట         భారత్‌        చైనా          ప్రపంచ సగటు

వరి          3608       6891          4604

గోధుమ      2750       5393         3317

జన్న        2597       5893         5538

పప్పులు    647          1741         950

చెరకు       71466     73121        70764

వేరుశనగ   1485         3562        1682

(ఆధారం: కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఈ ఏడాది జూన్‌లో విడుదల చేసి 2017 పాకెట్‌ బుక్‌లో పేర్కొన్న వివరాలు )

ఒక దేశం సాధించిన పురోగతి గురించి చెప్పుకుంటున్నామంటే మనం సాధించినదాని గురించి తక్కువ చేయటం కాదు. పోటీ పడాలన్న వాంఛను వ్యక్తం చేయటమే.ప్రధాని నరేంద్రమోడీ వాగ్దానం చేసినట్లు 2022నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేసేందుకు ఆచరణ ఏమిటన్నది విమర్శనాత్మకంగా చూడటం అవసరం. వ్యవసాయ పరిశోధన, అభివృద్ధికి మనం చేస్తున్న ఖర్చు చైనా కంటే మరీ అంత వెనుకబడి లేదని నీతి అయోగ్‌ సభ్యుడైన ప్రముఖవ్యవసాయ శాస్త్రవేత్త రమేష్‌ చంద్‌ ఆ మధ్య చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 2017-18 ఆర్ధిక సర్వేలో పేర్కొన్నదాని ప్రకారం అన్ని రంగాలలో పరిశోధన, అభివృద్దికి ఆయా దేశాల జిడిపిలో దక్షిణ కొరియా 4.3, ఇజ్రాయెల్‌ 4.2,అమెరికా 2.8,చైనా 2.1 శాతాల చొప్పున ఖర్చు చేస్తుండగా మన దేశం గత రెండుదశాబ్దాలుగా 0.6-07శాతం మధ్య ఖర్చు చేస్తున్నది. మన కంటే అమెరికా, చైనా జిడిపిలు ఏడు, నాలుగు రెట్లు అధికం అని గమనంలో వుంచుకోవాలి. అయితే చైనా కంటే మనం పెద్దగా వెనుకబడిలేమని రమేష్‌ చంద్‌ ఎలా చెప్పారు? ఆ పెద్దమనిషి మన స్ధూలాదాయంలో వ్యవసాయరంగం నుంచి వస్తున్న మొత్తాన్ని లెక్కల్లోకి తీసుకొని దానిలో వ్యవసాయ అభివృద్ధికి ఎంత ఖర్చు చేస్తున్నామో చెప్పారు. దాని ప్రకారం ట్రేడింగ్‌ ఎకనోమిక్స్‌ డాట్‌కామ్‌ అందచేసిన వివరాల ప్రకారం చూస్తే దక్షిణాఫ్రికా 3.6, బ్రెజిల్‌ 1.82, అమెరికా 1.2, చైనా 0.62, భారత్‌ 0.30శాతం ఖర్చు చేస్తున్నాయి. దీన్ని చూపి చైనాకు మనకు పెద్ద తేడాలేదని రమేష్‌ చంద్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.

Image result for automation in china agriculture

ఏదేశమైనా మొత్తంగా పరిశోధన, అభివృద్ధికి చేసే ఖర్చును చూసుకోవాలి. వుదాహరణకు ఒక డ్రోన్‌ తయారు చేస్తే దాన్ని ఏ ఖాతాలో వేయాలి? దానిని నిఘా, లేదా రహస్యంగా ఫొటోలు తీయటానికి, కొన్ని చోట్ల సరకు రవాణాకూ వినియోగిస్తున్నారు. వ్యవసాయంలో కూడా వినియోగపడుతోంది. అందువలన అంకెల గారడీ చేసి అధికారంలో వున్నవారిని మెప్పించవచ్చు. సామాన్య జనానికి ప్రయోజనం లేదు. మన దేశంలో స్వాతంత్య్రానికంటే ముందే 1880లోనే దేశంలో, ప్రతి రాష్ట్రంలో వ్యవసాయ శాఖను ఏర్పాటు చేయటం ద్వారా ఒక పెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు.1919లో ఇంపీరియల్‌ అగ్రికల్చర్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ను నెలకొల్పారు. స్వాతంత్య్రం తరువాత వ్యవసాయ విశ్వవిద్యాలయాను ఏర్పాటు చేసి పరిశోధన, అభివృద్ది బాధ్యతలను వాటికి అప్పగించారు. దీని వల్లనే హరిత విప్లవం జయప్రదం అయింది. తాజా పరిస్ధితిని చూస్తే మనకు అవసరమైన శాస్త్రవేత్తలు, వసతులు వున్నప్పటికీ వాటికి తగిన మొత్తంలో నిధులు, అన్నింటికీ మించి ప్రభుత్వరంగంలో పరిశోధనలు చేయించాలన్న వుత్సాహం, చొరవ పాలకుల్లో లేదు. ఇప్పటికే విత్తనాభివృద్ధి సంస్ధలను నామమాత్రం చేసి ప్ర యివేటు రంగానికి అప్పగించారు. ఏ రంగంలో అయినా పరిశోధన అంటే తక్షణమే లాభాలు చేకూర్చదు, కొన్ని సార్లు పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా ఫలితాలు కూడా రాకపోవచ్చు. దీర్ఘకాలంలో వచ్చే ఫలితాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. అది జరగటం లేదు.భిన్న వాతావరణ పరిస్ధితులున్న మన దేశంలో పరిశోధన అవసరం గురించి చెప్పనవసరం లేదు. వ్యవసాయం, హరిత విప్లవం అంటే గోధుమలు, వరి వుత్పత్తి పెంపుదల ఒక్కటే కాదు. మనదేశం ఆ రెండు పంటల విషయంలో గణనీయమైన పురోగతి సాధించిన తరువాత మన పాలకులు వ్యవసాయం మీద శ్రద్ద తగ్గించారు.ఫలితంగా వ్యవసాయ పెట్టుబడుల తగ్గింపు, వుత్పాదకత పెంపు, నీటి కొరతను అధిగమించటం, మార్కెటింగ్‌, ఆహార తయారీ వంటి అంశాలపై మన శాస్త్రవేత్తలు అవసరాలకు తగినట్లుగా స్పందించలేని స్ధితికి కారణం పాలకులు, వారి మెప్పు పొందేందుకు తాపత్రయపడే వున్నత విధాన నిర్ణాయక అధికార యంత్రాంగం తప్ప మరొకరు కాదు.భారతీయ రైతులకు మద్దతు, సరైన మార్గం అనే పుస్తకంలో రాసినదాని ప్రకారం ప్రకారం ఎరువుల సబ్సిడీకి ఒక రూపాయి ఖర్చు చేస్తే దాని మీద 88, విద్యుత్‌కు 79, రోడ్లకు 110, కాలువల మీద 0.31 పైసల వంతున తిరిగి ఆదాయం వస్తుంది, అదే వ్యవసాయ పరిశోధనకు ఒక రూపాయి ఖర్చు చేస్తే రు.11.20 ఆదాయం వస్తుందట. అమెరికాలోని వాషింగ్టన్‌ కేంద్రంగా పని చేస్తున్న అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్ధ(ఐఎఫ్‌పిఆర్‌ఐ) అధ్యయనం ప్రకారం 2030సంవత్సరానికి నిరంతర అభివృద్ధి లక్ష్యాలుగా నిర్ణయించిన పదిహేడింటిలో సగం నెరవేరాలంటే వ్యవసాయమే కీలకమని, దాని మీద పరిశోధనకు చేసే ఖర్చు నిరంతర అభివృద్ధికి తోడ్పడుతుందని, మిగతావాటితో పోల్చితే మరింతగా వనరుల సమపంపిణీ జరుగుతుందని తేలింది.

చైనా వ్యవసాయ పరిశోధనా రంగంలో ప్రభుత్వ వ్యవస్ధదే పైచేయి. ప్రయివేటు రంగం కూడా వుంది. ప్రభుత్వరంగ అదుపు అంటే వ్యవసాయ పరిశోధన ప్రజలకు చెందినది అన్న చైనా కమ్యూనిస్టు పార్టీ అవగాహన. దాని మీద చేసే ఖర్చు ప్రజలదే, వచ్చే ఫలితాలు కూడా ప్రజలకే చెందాలి. ఒక ప్రయివేటు కంపెనీ ఒక అంశంపై కేంద్రీకరించి దాని మీదే పని చేస్తుంది. కానీ ప్రభుత్వం అలా వ్యవహరించలేదు. దీన్ని చూపి ప్రభుత్వ రంగం వుత్సాహాన్ని నీరుగార్చుతుంది అని కొందరు చిత్రించవచ్చు. అటువంటి స్ధితి నుంచి ఎలా ముందుకు పోవాలా అన్నది చర్చించవచ్చు, మార్గం కనుగొనవచ్చు. చైనా సర్కార్‌ ఈ అంశం మీద అభిప్రాయాలు, సూచనలు తీసుకొంటోంది.చైనా వ్యవసాయ రంగంలో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో జనం పని చేస్తున్నారు. అందువలన ఆ రంగాన్ని కమ్యూనిస్టు పార్టీ విస్మరించజాలదు. వ్యవసాయ అభివృద్ధికి చైనా ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఒక అధ్యయన పత్రం పేటెంట్ల రూపంలో వెల్లడించింది. 1985-2009 మధ్య స్ధానిక పేటెంట్‌ దరఖాస్తులు 69రెట్లు పెరగ్గా, విదేశీ పేటెంట్ల దరఖాస్తులు తొమ్మిది రెట్లు వున్నాయి. స్ధానిక దరఖాస్తులలో నవకల్పన లేదా సృష్టిగా 57.2శాతానికి గుర్తింపు వచ్చింది. విదేశీ దరఖాస్తుల విషయంలో అది 99శాతం వుంది.

వ్యవసాయానికి సబ్సిడీల ద్వారా చేయూత నివ్వటం బుద్దితక్కువ వ్యవహారమని మన దేశంలో కొందరి వాదన. సబ్సిడీలు ఇచ్చి అసమర్ధతను పెంచుతున్నారని, దాని కంటే ఆ రంగంలో పెట్టుబడులు పెట్టి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోకి తేవటం వలన ఎక్కువ ప్రయోజమన్నది వారి భావం. యూరియాకు పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తున్నందువలన దాన్ని దుర్వినియోగ పరచి అతిగా వాడి భూములు దెబ్బతినటానికి కారకులౌతున్నారని, అవసరం కంటే విలువైన నీటిని అధికంగా వాడి దుర్వినియోగం చేస్తున్నారని రైతుల మీద చేసే ఆరోపణ గురించి తెలిసిందే. మిగతా ఎరువులను సరసమైన ధరలకు అందిస్తే ఏ రైతూ తన భూమిని పనికిరాకుండా చేసుకోడు.అలాగే రైతాంగానికి సరైన మార్గదర్శనం చేస్తే నీటి దుర్వినియోగమూ వుండదు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు 1980-81లో 3.9శాతంవుండగా 2014-15 నాటికి 2.2శాతానికి( 2016-17లో 2.6) తగ్గిపోగా ఇదే కాలంలో పెట్టుబడుల సబ్సిడీల మొత్తం 2.8 నుంచి 8శాతానికి పెరిగిందని సపోర్టింగ్‌ ఇండియన్‌ ఫార్మర్స్‌, ది స్మార్ట్‌ వే( భారతీయ రైతులకు మద్దతు, సరైన మార్గం) అనే పేరుతో రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. పెట్టుబడులకు-సబ్సిడీలకు లంకె పెట్టటం అసంబద్దం. పెట్టుబడులు పెట్టద్దని ఏ రైతూ అడ్డుకోలేదు. ప్రభుత్వ ప్రయివేటీకరణ విధానాల కారణంగా ఎరువులు, విద్యుత్‌ వంటివి రైతాంగానికి భారం అవుతున్నాయనే విషయం తెలిసిందే.ఇలాంటి అంశాల గురించి మేథోమధనం, అధ్యయనాలు జరిపి ఒక మార్గం కనుగొనటం కష్టమేమీ కాదు. ఏ రంగంలో అయినా ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది అంటే దాని వలన వచ్చే లాభం పౌరులందరికీ చెందుతుంది. ప్రభుత్వాలు మిలిటరీ, పోలీసు, కరెన్సీ, దేశ సరిహద్ధు భద్రతల వంటి విషయాలకే పరిమితమై మిగిలిన అన్ని అంశాలను ప్రయివేటురంగానికి వదలి వేయాలన్నది ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌, ప్రపంచ వాణిజ్య సంస్ధ వంటి బహుళజాతి గుత్త సంస్ధల కనుసన్నలలో వాటి ప్రయోజనాలకు అనుగుణంగా పని చేసే సంస్ధలు ఆదేశం. ప్రపంచంలో ఏడు బడా కంపెనీలు వ్యవసాయ రంగంలో పరిశోధనకు ఏటా ఏడువందల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. ఈ మొత్తం మన దేశంలో భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఖర్చుకు ఏడు రెట్లు ఎక్కువ. మనం చేసే ఖర్చు మన అవసరాలకు తగినదిగా లేదన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ మరో వింత పేరే నాలుగో పారిశ్రామిక విప్లవం !

26 Friday Oct 2018

Posted by raomk in Communalism, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

4th industrial revolution, INDIA, Naredra Modi, WEF, WEF 4th industrial revolution

Image result for narendra modi, 4th industrial revolution

ఎం కోటేశ్వరరావు

భాయియోం, బహెనోం దేశాన్ని నాలుగో పారిశ్రామిక విప్లవం 4.0 వైపు నడిపిస్తున్నానంటూ మన ఘనత వహించిన ప్రధాని నరేంద్రమోడీ అక్టోబరు పదకొండవ తేదీన ఒక మహోపన్యాసం చేశారు. ప్రపంచ ఆర్ధిక వేదిక న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. గతంలో రాజీవ్‌ గాంధీ ప్రధానిగా వున్న సమయంలో మాట్లాడితే దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకుపోతానని చెప్పేవారు.ప్రధాని నరేంద్రమోడీ కంటే పక్షం రోజుల ముందే నాలుగున్నరేండ్లయినా రాజధాని శాశ్వత భవనాలను కట్టలేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనకు వెళ్లి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించి వచ్చారు. అంతేకాదు ఐక్యరాజ్యసమితిలో చేసిన ఒక వుపన్యాసంలో ఒక రూపాయి పెట్టుబడి అవసరం లేని ‘ఆవు’ వ్యవసాయం గురించి కూడా ప్రపంచానికి వివరించి వచ్చారు. నాలుగోపారిశ్రామిక విప్లవంలోని ప్రధాన అంశాలలోని ఐటి, బయోటెక్నాలజీ నిపుణులు కూడా వాటిని పక్కన పడేసి ఆవు వ్యవసాయానికి పూనుకొని అంతకంటే ఎక్కువ ఆదాయం సంపాదించాలని సలహా కూడా ఇచ్చివచ్చినట్లు మనం వార్తలు చదువుకున్నాం. ఒకే నోటితో పరస్పర విరుద్ధ అంశాలు మాట్లాగల నేర్పరులు కొందరు రాజకీయవేత్తలు. అసలు నాలుగో పారిశ్రామిక విప్లవం అంటే ఏమిటి? అందుకు మన దేశంలో పరిస్ధితులు అనువుగా వున్నాయా?

నాలుగో పారిశ్రామిక విప్లవం గురించి తెలుసుకొనే ముందు మన దేశంలో మొదటి మూడు విప్లవాలు జరిగాయా, ఎంతవరకు అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. వుట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా- వుట్టి కొట్టలేనయ్య ఆకాశాన్ని అందుకుంటాడా ! మొదటి విషయం ఏ విప్లవం అయినా ఒక రోజులో లేదా ఒక తేదీనో ప్రారంభం కాదు, ముగియదు. ప్రధమ సోషలిస్టు విప్లవం రష్యాలో 1917 అక్టోబరు ఏడున జరిగింది అని చెబుతాం. దానర్ధం ఆ రోజు విప్లవపరిణామలు ఒక మలుపు తిరిగి మరోపరిణామానికి నాంది పలికింది అని తప్ప విప్లవం జయప్రదమైందని కాదు. అలాగే పాఠాల్లో మనం చదువుకొనే పారిశ్రామిక విప్లవం కూడా అలాంటిదే. ఒక తేదీ ఏమీ లేదు.1760 నుంచి 1820-40సంవత్సరాల మధ్య కాలంలో అంతకు ముందున్న వుత్పాదకపద్దతులు అంటే చేతితో తయారు చేసే ప్రక్రియలో యంత్రాలను ప్రవేశపెట్టటం, వాటిని నడిపేందుకు ఆవిరిని వుపయోగించటం, రసాయనాల తయారీ వంటి పరిణామాలన్నీ ఆ 80సంవత్సరాల కాలంలో బాగా అభివృద్ధి చెందాయి. రెండవ పారిశ్రామిక విప్లవకాలంలో అంటే 1870-1914 సంవత్సరాల మధ్య కాలంలో అంతకు ముందున్న పరిశ్రమలను కొనసాగించటం, కొత్తవాటిని ఏర్పాటు చేయటంతో పాటు ఆవిరి స్ధానంలో యంత్రాలను నడిపేందుకు విద్యుత్‌ వినియోగం, చమురును కనుగొనటం, వాటితో వుత్పత్తిని ఇబ్బడి ముబ్బడి చేయటం వంటి పరిణామాలు జరిగాయి. ఆ తరువాత నుంచి 1980, నేటి వరకు జరిగిన సాంకేతిక అభివృద్ధిని మూడవ పారిశ్రామిక విప్లవంగా పిలుస్తున్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం ఎప్పుడు ప్రారంభమైందో చెప్పుకొనే ముందు దీని ప్రధాన లక్షణాలను చెప్పుకోవాల్సి వుంది.రోబోలు, కృత్రిమ మేథ, డిజిటల్‌, నానో టెక్నాలజీ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, బయోటెక్నాలజీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌,3డి ప్రింటింగ్‌, డ్రైవర్‌తో పని లేకుండా నడిచే వాహనాల వంటివి దీనిలో వున్నాయి. ప్రపంచ ఆర్ధిక వేదిక(అదే మన చంద్రబాబు నాయుడు సిఎంగా వున్నపుడు ప్రతి సంవత్సరం దవోస్‌ వెళ్లి వస్తుంటారు. ఎందుకు వెళతారో, దాని వలన రాష్ట్ర ప్రజలకు చేతి చమురువదలటం తప్ప సాధించిందేమిటో ఇంతవరకు మనకు తెలియదు)ను ఏర్పాటు చేసిన ప్రొఫెసర్‌ క్లాస్‌ ష్కవాబ్‌ నాలుగో పారిశ్రామిక విప్లవం అనే ఒక పుస్తకాన్ని రాశారు. మిగతా మూడు విప్లవాలం కంటే ఆధునాత సాంకేతిక పరిజ్ఞానమే నాలుగోదాని ప్రత్యేకత అంటారు. ఈ పరిజ్ఞానంతో వందల కోట్ల జనం ఇంటర్నెట్‌ వెబ్‌తో అనుసంధానం అవుతారని, వాణిజ్య, ఇతర సంస్ధల సామర్ధ్యం గణనీయంగా పెరుగుతుందని, మెరుగైన సంపదల యాజమాన్య పద్దతులతో సహజపర్యావరణాన్ని తిరిగి సృష్టించేందుకు తోడ్పడవచ్చునని చెప్పారు.2016లో జరిగిన ప్రపంచ ఆర్ధిక వేదిక వార్షిక సమావేశ ఇతివృత్తానికి ‘నాలుగవ పారిశ్రామిక విప్లవంలో సంపూర్ణత సాధన’ అని నామకరణం చేశారు. ఈ పద ప్రయోగం ఇదే మొదటి సారి. అదే ఏడాది అక్టోబరు పదిన శాన్‌ ఫ్రాన్సిస్‌కో నగరంలో నాలుగవ పారిశ్రామిక విప్లవ కేంద్రం పేరుతో విప్లవ పరిణామాలను అధ్యయనం చేయటానికి, సలహాలు ఇవ్వటానికి ఒక సంస్ధను ఏర్పాటు చేశారు. రెండు సంవత్సరాల తరువాత మన దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రపంచ ఆర్ధిక వేదిక ఆధ్వర్యాన ఏర్పాటుచేసి అలాంటి కేంద్రానికే అక్టోబరు 11వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభోత్సవం చేశారు.

Image result for narendra modi, 4th industrial revolution cartoons

ఆ రోజు మోడీగారు చెప్పిందాని సారాంశం ఇలా వుంది. మొదటి, రెండవ పారిశ్రామిక విప్లవాలు జరిగే నాటికి భారత దేశం స్వతంత్రంగా లేదు. మూడవది జరిగిన సమయంలో అపుడే వచ్చిన స్వాతంత్య్రంతో ఎదురైన సవాళ్లను ఎదుర్కొనేందుకు కుస్తీలు పడుతోంది. ఇప్పుడు నాలుగవ పారిశ్రామిక విప్లవానికి పెద్ద ఎత్తున దోహదపడుతుంది. సాంకేతిక పురోగతితో వుపాధి నష్టం జరుగుతుందని భయపడనవసరం లేదు, వుద్యోగాల స్వభాన్నే మార్చివేస్తుంది, మరిన్ని అవకాశాలను పెంచుతుంది.దీని ఫలితాలను పొందేందుకు అవసరమైన విధానపరమైన మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుంది. ప్రపంచ పరిశోధన మరియు అమలు కేంద్రంగా మారేందుకు అవసరమైన అవకాశాలు భారత్‌లో వున్నాయి. ఇంతకు ముందు వచ్చిన విప్లవాలు భారత్‌ను ఏమార్చాయి, నాలుగో విప్లవానికి భారత్‌ వంతు విస్మయకారిగా వుంటుంది.

ఇలా సాగిన వుపన్యాసంతో పాటు పనిలో పనిగా తన ప్రభుత్వం సాధించిన ఘనత గురించి కూడా చెప్పుకున్నారనుకోండి. తమ కారణంగానే టెలిఫోన్‌ సాంద్రత 93శాతానికి పెరిగిందని, 50కోట్ల మంది మొబైల్‌ ఫోన్లు వాడుతున్నారని, ప్రపంచంలో అత్యధికంగా మొబైల్‌ డాటా వాడుతున్నారని తక్కువ రేట్లకు దొరుకుతోందని, వినియోగం నాలుగు సంవత్సరాలలో 30రెట్లు పెరిగిందని, 120 కోట్ల మందికి ఆధార కార్డులు ఇచ్చామని, తాను అధికారంలోకి వచ్చిన 2014నాటికి కేవలం 59 గ్రామాలకు ఆప్టిక్‌ ఫైబర్‌ లైన్లు వుంటే త్వరలో రెండున్నర లక్షలకు చేరనున్నాయని చెప్పుకున్నారు. ఇది కూడా మరొక అర్ధ. అసత్యం. నేషనల్‌ ఆప్టికల్‌ ఫైబర్‌నెట్‌ వర్క్‌(నోఫెన్‌) అనే కేంద్ర ప్రభుత్వ పధకానికి 2011లో అనుమతి ఇచ్చారు.దీన్నే డిజిటల్‌ ఇండియా పేరుతో ఏదో తానే ప్రారంభించినట్లు మోడీ గొప్పలు చెప్పుకుంటారు. ఆ పధక కార్యాచరణ ప్రణాలిక ప్రకారం 2012 అక్టోబరు నాటికి రాజస్ధాన్‌,ఆంధ్రప్రదేశ్‌, త్రిపుర రాష్ట్రాలలోని 59గ్రామాలలో పైలట్‌ పధకాన్ని అమలు చేయాలి. 2014 మార్చి, 2015 మార్చి నాటికి ఏటా లక్ష చొప్పున రెండులక్షల గ్రామాలకు, 2015సెప్టెంబరు నాటికి 50వేల గ్రామాలకు ఆ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. అయితే ఆ లక్ష్యాన్ని 2016 డిసెంబరు వరకు పొడిగించారు. మోడీగారు చెప్పినట్లే గడువు తీరి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికి లక్ష గ్రామాలకే విస్తరించింది. తన అసమర్ధపాలనలో ఎప్పటికి పూర్తవుతాయో మోడీగారు చెబితే నిజాయితీగా వుండేది. నాలుగున్నర సంవత్సరాలలో లక్షగ్రామాలకు కూడా నెట్‌ వర్క్‌ విస్తరించలేదు, ఏర్పాటు చేసింది కూడా ఎంత వేగంతో పని చేస్తుందో తెలియని స్ధితిలో మోడీగారు మనకు డిజిటల్‌ విప్లవం గురించి చెబుతారు, నాలుగవ పారిశ్రామికవిప్లవంలో భాగస్వాములను చేస్తామంటున్నారు.

డిజిటల్‌ టెక్నాలజీ ఎంతో ప్రయోజనకారి అన్నది వాస్తవం. అన్న ప్రాసన నాడే ఆవకాయ అన్నట్లుగా, మెట్లు ఎ్క కుండానే మేడ ఎ్కవచ్చు అన్నట్లు అభివృద్ధిలో మిగతాదేశాలు అధిగమించిన దశలను మనం దాటకుండానే ఒక గెంతువేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని అందుబాటులోకి తెచ్చుకోవచ్చని, అభివృద్ధి చెందిన దేశాలలో అందుబాటులోకి వచ్చినవన్నీ మన కోసం కూడా సిద్దంగా వున్నాయని, అసలు ఇప్పటికే మనం ఆ దశలో ప్రవేశించిన విషయాన్ని అనేక మంది గుర్తించటం లేదని కొందరు చెబుతునాారు. వుపాధిని ఫణంగా పెట్టి ప్రవేశపెట్టే యాంత్రీకరణ సామాన్యులకు మేలు చేస్తుందా? ఎలా చేస్తుంది అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పే పెట్టుబడిదారులు లేరు. అమెరికా, ఇతర అనేక దేశాలలో యాంత్రీకరణ ఎంతో ఎక్కువ, దాని వలన కార్పొరేట్లకు లాభాలు పెరిగాయి తప్ప అదనంగా వుత్పత్తి అయిన సంపదలో జనానికి దక్కిన వాటా ఎంత? అక్కడ ఆర్ధిక అసమానతలు భరించరాని విధంగా పెరిగాయని పెట్టుబడిదారీ మేథావి అయిన థామస్‌ పికెటీ చెప్పిన విషయాన్ని ఎలా మరచిపోగలం.ఇప్పటికే వుపాధిరహిత అభివృద్ధి జరుగుతోంది. పని చేసే జనం తక్కువగా వున్న దేశాలకు ఆటోమేషన్‌ లేదా రోబోలు అవసరం గావచ్చు. ఏటా కోటీ ఇరవై నుంచి కోటీ 30లక్షల మంది వరకు యువత తమకు వుపాధికావాలని వస్తున్న మన దేశంలో మన పరిశ్రమలలో వాటిని ప్రవేశపెడితే జరిగేదేమిటి? బెంగలూరులోని కెనరా బ్యాంకులో కన్నడం మాట్లాడే ఒక రోబో ఏ కౌంటర్‌కు వెళ్లాలో కస్టమర్లకు చెబుతుందట. సదరు బ్యాంకుకు వచ్చే కస్టమర్లకు ఏ కౌంటర్‌ ఎక్కడుందో తెలిపే సూచనలు ప్రదర్శిస్తే సరిపోయేదానికి గొప్పలు చెప్పుకోవటానికి గాకపోతే ఎంతో ఖర్చు పెట్టి రోబోను పెట్టాల్సిన అవసరం ఏముంది? కన్నడేతరులు వస్తే ఏ భాష రోబో దగ్గరకు వెళ్లాలి.

మన దేశంలో ఆటోమేషన్‌ జరిగితే ఇప్పుడున్న ప్రతి నాలుగు వుద్యోగాలకు ఒకటి పోతుందని ఒక అంచనా. శ్రమశక్తి మీద ఆధారపడిన పరిశ్రమలు,వ్యవసాయం, వృత్తులు మిగతా దేశాలతో పోల్చితే చాలా ఎక్కువ వున్న మన దేశంలో ఇంకా అంతకంటే ఎక్కువే పోయినా ఆశ్చర్యం లేదు. మూడు సంవత్సరాల క్రితం ప్రపంచ ఆర్ధిక వేదిక రూపొందించిన ఒక నివేదిక ప్రకారం నాలుగో పారిశ్రామిక విప్లవం ప్రపంచవ్యాపితంగా వుపాధిని దెబ్బతీస్తుందన్నది నిరాకరించజాలని అంశమని తేలింది. ఆఫీసు,అడ్మినిస్ట్రేషన్‌, వుత్పాదకత, తయారీ, నిర్మాణ రంగాల మీద ప్రభావం చాలా ఎక్కువగా వుంటుంది. కొన్ని పరిశ్రమలను మూతవేయాలి, అనేకాన్ని అవసరాలకు అనుగుణ్యంగా మార్చుకోవాలి. అధునాత వుత్పాదకయంత్రాలు, పద్దతుల వలన వుత్పత్తి ఇబ్బడి ముబ్బడి అవుతుంది, ఆ మేరకు వుపాధిపెరగదు, అంతకు ముందుకంటే తగ్గినా ఆశ్చర్యం లేదు. అందువలన వుపాధి చర్చను పక్కన పెట్టి ముందుకు పోవాలని పెట్టుబడిదారులు సహజంగానే కోరుకుంటారు.ప్రతి పారిశ్రామిక విప్లవం సమాజంలో అసమానతలను పెంచింది తప్ప సంపదల పంపిణీని సమంగా పంచలేదు. సాంకేతిక ప్రగతి పెరిగిన కొద్దీ కొద్ది మంది చేతుల్లో పోగుపడుతున్న సంపదల వాటా కూడా పెరిగిపోతోంది.

Image result for BJP, 4th industrial revolution cartoons

ఎవరు కాదన్నా అవునన్నా మన దగ్గర వున్న కొనుగోలు శక్తి కలిగిన మధ్యతరగతి మార్కెట్‌ను ఎలా సొమ్ము చేసుకుందామా అని చూడటం తప్ప ప్రయివేటు రంగానికి మరొకటి పట్టదు. అదే చైనాలో మధ్యతరగతి మార్కెట్‌ను పెంచటంతో పాటు దిగువన వున్నవారిని కూడా మధ్యతరగతిగా మార్చే విధంగా సంపదల పంపిణీ జరగటమే దాని విజయానికి మూలం. మన జనానికి స్మార్ట్‌ ఫోన్‌ ఇస్తే దానిని ఎంత మంది వినియోగించగలరు అన్నది ప్రశ్నార్ధకంగా వున్న తరుణంలో అంతకు మించిన పరిజ్ఞానంతో ప్రమేయం వుండే నాలుగోపారిశ్రామిక విప్లవం గురించి మాట్లాడుకుంటున్నాం. దేశంలోని గ్రామాలన్నింటినీ విద్యుదీకరించామని నరేంద్రమోడీ ఘనంగా ప్రకటించిన వారం తిరగక ముందే 125కోట్ల మంది జనాభా వున్న భారత్‌లో 15శాతం మందికి(అంటే21కోట్ల మందికి) విద్యుత్‌ అందుబాటులో లేదని ప్రకటించింది. వారికి సెల్‌ఫోన్లు ఇచ్చినా ఛార్జింగ్‌ చేసుకోలేరు. ఈ ఏడాది జనవరి నాటికి మన దేశంలో ఇంటర్నెట్‌ను వినియోగించేవారు నూటికి 26శాతం మందే వున్నారట. ప్రస్తుతం మన దేశానికి ఏటా వచ్చే ఆదాయం ఒక రూపాయి అనుకుందాం. దానిలో వ్యవసాయరంగంలో వున్న 51శాతం కార్మికుల నుంచి 12పైసలు, 22శాతం మంది పని చేస్తున్న పారిశ్రామిక రంగం నుంచి 28, సేవారంగాలలో పని చేస్తున్న 27శాతం మంది నుంచి 60పైసల ఆదాయం వస్తోందని లెక్కలు చెబుతున్నాయి. మన జిడిపిలో 60శాతం సేవారంగం నుంచి వుండటం ఒక అస్ధిరతకు సూచిక. పశ్చిమ దేశాల ఆర్ధిక స్ధితిపై ఆధారపడి ఐటి, పొరుగుసేవల ఆదాయం వుంటుంది. అవి సజావుగా వున్నంత వరకు ఇబ్బంది లేదు, దెబ్బతింటే మనమూ నష్టపోతాం. చైనా విషయానికి వస్తే వ్యవసాయం నుంచి 2017లో 7.9శాతం, పరిశ్రమల నుంచి 40.5, సేవారంగం వాటా 51.6శాతం వుంది. ప్రపంచ పారిశ్రామిక కేంద్రంగా పేరుపొందిన చైనా మాదిరి మనం కూడా పారిశ్రామిక రంగాన్ని పటిష్టపరుచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.కృత్రిమ మేధస్సు అంటే ఆటోమేషన్‌ యంత్రాలు, రోబోలు రానున్న దశాబ్దంలో 20శాతం వుద్యోగాలను హరించనున్నాయని అంచనా. టాక్సీ డ్రయివర్లు, చేపలు పట్టటం, బేకరీ, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాలలో అయితే 80-90శాతం వుద్యోగాలు పోతాయని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆటోమేషన్‌, రోబోలతో పనులు చేయించేందుకు అవసరమైన అత్యున్నత నైపుణ్యం కలిగిన కొద్ది మందికి డిమాండ్‌ వుంటుంది.గతంలో దేశం నీకేమిచ్చిందనే కంటే దేశానికి నీవేమిచ్చావనేది దేశభక్తి అని నూరిపోశారు. ఇప్పుడు పెద్ద మొత్తంలో వుద్యోగాలు హరించే అవకాశాన్ని ముందుగానే తెలిసిన పెట్టుబడిదారీ మేథావులు మనకు వుద్యోగభద్రత కంటే నైపుణ్యం ముఖ్యమని చెబుతున్నారు.

మన నరేంద్రమోడీగారు 2022 నాటికి(చాలా మంది ఈ సంవత్సరం ఎందుకు అని అడుగుతున్నారు అప్పటికి మన స్వాతంత్య్రానికి 75ఏండ్లు నిండుతాయి) రైతాంగ ఆదాయాలు రెట్టింపు చేస్తామని వూదరగొడుతున్నారు. అదే సంవత్సరానికి మన పరిశ్రమల్లో సాంకేతిక పరిజ్ఞానం వుపయోగించటం గురించి కూడా లక్ష్యాలను నిర్ణయించింది.మనలో చాలా మందిమి కార్లు,బస్సులను గడిగేందుకు మనుషుల బదులు యంత్రాలను వాడటం చూసి వుంటాము. పరిశ్రమల్లో పని చేసే ప్రతి వేల మంది కార్మికులకు ఎన్ని పారిశ్రామిక రోబోలు వున్నాయనే అంశాన్ని రోబో సాంద్రత అని పిలుస్తున్నారు. 2016లెక్కల ప్రకారం ప్రపంచ రోబో సాంద్రత సగటు 74. మన దేశంలో మూడు, అత్యధికంగా దక్షిణ కొరియాలో 631. సింగపూర్‌ 488,జర్మనీ 309, జపాన్‌ 303, అమెరికా 198,బ్రిటన్‌ 71, చైనా 68, బ్రెజిల్‌ 10, రష్యా 3తో వుంది. మన దేశంలో ఏటా 24శాతం పెంచుకుంటూ పారిశ్రామిక రోబోలను మన పారిశ్రామికవేత్తలు దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో మొత్తంగా రోబో సాంద్రత మూడే అయినప్పటికీ ఆటోమొబైల్‌ రంగంలో అది 58గా వుంది. అంటే మన రాష్ట్ర ప్రభుత్వాలు పోటీబడి రాయితీలు ఇచ్చేది రోబోల ఏర్పాటుకు తప్ప కార్మికులకు వుపాధి కల్పించేందుకు కాదు.

ఆధునిక యంత్రాలు, కంప్యూటర్లు, రోబోల మీద పని చేసే నిపుణులైన మానవశ్రమ శక్తి తప్ప కండలను కరగించే శారీరక శ్రమ చేసే వారు కాదని పెట్టుబడిదారీ ప్రతినిధులైన ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ ఎప్పుడో గుర్తించాయి. అలాంటి వారిని తయారు చేయాలంటే ధనిక దేశాలలో ఎంతో ఖర్చు అవుతుంది. కనుక మన వంటి దేశాలలో ఇంజనీరింగ్‌,మెడికల్‌ కాలేజీలను ఇబ్బడి ముబ్బడిగా పెట్టాలని సలహాయిచ్చి చౌకగా దొరికే ఇంజనీర్లను తయారు చేయాలని కోరింది. దాని ఫలితమే చెట్టుకొకటి పుట్టకొకటిగా వెలిసిన ఇంజనీరింగ్‌ కాలేజీలు. మన విద్యావ్యాపారులు కొన్ని చోట్ల కొందరు నిపుణులను తయారు చేస్తున్నప్పటికీ అత్యధికులకు నైపుణ్యం తప్ప సర్టిఫికెట్‌లు ఇచ్చి జనాన్ని మార్కెట్లోకి తోలుతున్నాయి. వారి ప్రతిభా, ప్రావిణ్యాల గురించి 2017లో యాస్పరింగ్‌ మైండ్స్‌ అనే సంస్ధ ఒక సర్వే చేసి నమ్మలేని నిజాలను వెల్లడించింది. విద్యావ్యాపారులు దాన్ని తోసిపుచ్చగా ఐటి కంపెనీల యజమానులు నిర్ధారించారు.తొంభై అయిదు శాతం ఇంజనీరింగు పట్టభద్రులు సాప్ట్‌వేర్‌ అభివృద్ధి వుద్యోగాలకు పనికి రారన్నది సర్వేసారం. పోనీ అది అతిశయోక్తితో కూడింది అనుకుందాం. పది సంవత్సరాల క్రితం మెకెన్సీ సంస్ధ పాతికశాతం మంది మాత్రమే వుద్యోగాలకు పనికి వస్తారు అన్నది. ఇలాంటి పరిస్ధితికి కారకులు ఎవరు? అన్నింటినీ మాకు వదలి పెట్టండి దేశాన్ని ఎలా ముందుకు తీసుకుపోతామో చూడండి అనే ప్రయివేటు రంగం కాదా ! విద్యావ్యాపారంలో లేని పారిశ్రామిక సంస్ధను ఒక్కదానిని చూపమనండి, ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలో అదే లాభసాటి వ్యాపారం. ఈరోజు ఇంజనీరింగ్‌ చదివి వుద్యోగం పేరుతో పనిచేస్తున్న అనేక మందికి చాలా మంది అడ్డామీది రోజువారీ కూలీకి వస్తున్న మొత్తాలకంటే తక్కువే అన్నది చేదు నిజం. గతంలో విదేశీ తెల్లజాతి మెకాలే తమకు అవసరమైన గుమస్తాలను తయారు చేసే విద్యావిధానం, వ్యవస్ధలను ఏర్పాటు చేస్తే నేటి మన నల్లజాతి మెకాలేలు కారుచౌక ఇంజనీరింగ్‌ గుమస్తాలను సరఫరా చేస్తున్నారు.’ఈ రోజు ఢిల్లీలో 60శాతం మార్కులు తెచ్చుకున్నవారు కూడా బిఏ ఇంగ్లీష్‌ కోర్సు సీటు తెచ్చుకోలేరుగాని ఇంజనీరింగ్‌కాలేజిలో సులభంగా చేరిపోతున్నారని’ టెక్‌ మహీంద్రా సిఇఓ సిపి గుర్నానీ వ్యాఖ్యానించారు. నాలుగో పారిశ్రామిక విప్లవం గురించి చెబుతున్న మన రాజకీయవేత్తలు, విధాన నిర్ణేతలకు ఏ నిపుణులు ఎందరు కావాలో, అందుకు అనుసరించాల్సిన ప్రణాళికలేమిటో ఎవరైనా చెప్పగలరా ? ఇంజనీరింగ్‌,మెడికల్‌ కాలేజీల్లో సంపూర్ణ అర్హతలు కలిగిన బోధకులు వున్నారా, అవసరమైన ప్రయోగశాలలు వున్నాయా లేదా అని ఎవరైనా పట్టించుకుంటున్నారా? వీరు దేశాన్ని నాలుగో పారిశ్రామిక విప్లవంలోకి దేశాన్ని తీసుకుపోతారా? మనం నమ్మేయాలా ?

ఇటీవలి కాలంలో నైపుణ్య అభివృద్ధి గురించి ప్రధాని మోడీ, మాట్లాడని ముఖ్యమంత్రి లేరు. అందుకోసం వందల కోట్లరూపాయలు తగలేస్తున్నారు.నివేదికల్లో అసంఖ్యాకంగా నిపుణులను సృష్టిస్తున్నారు. నరేంద్రమోడీ సర్కార్‌ చర్యల వలన ఇప్పటికే తన ఆదాయం రెట్టింపైందని చత్తీస్‌ఘర్‌కు చెందిన గిరిజన మహిళా రైతు చెప్పిన అంశాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారానికి వాడుకుంది. తీరా చూస్తే అధికారులు తనను అలా చెప్పమన్నారని ఆమె ఒకటీవి బృందానికి చెప్పింది. ఆ వార్తను ప్రసారం చేసిన సదరు ఎడిటర్‌, యాంకర్‌ను వుద్యోగాల నుంచి ఇంటికి పంపే విధంగా మోడీ సర్కార్‌ టీవీ ఛానల్‌ యాజమాన్యంపై వత్తిడి తెచ్చిన వుదంతం తెలిసిందే. అలాంటి వారందరినీ లెక్కలోకి తీసుకున్నా మన దగ్గర వున్న నిపుణులైన పనివారలెందరో చూస్తే దిమ్మదిరుగుతుంది. మన దగ్గర నిపుణులైన పనివారలే తక్కువ, అవసరమైన వృత్తి శిక్షణ ఇచ్చే సామర్ధ్యం కూడా మన దగ్గర లేదని నివేదికలు చెబుతున్నాయి. మొత్తం కార్మికుల సంఖ్యతో పోలిస్తే వృత్తిశిక్షణ సామర్ధ్యం చైనాలో 11.5శాతం కాగా అమెరికాలో 6.7, అదే మన దేశంలో 0.8శాతం మాత్రమే. దేశాల వారీగా దక్షిణ కొరియాలో 96, జపాన్‌లో 80, జర్మనీలో 75, బ్రిటన్‌లో 68శాతం మంది వున్నారు. రెండుశాతమే మన దగ్గర అని చెప్పుకోకపోవటమే మంచిది.

ఒక వైపు ప్రధాని నరేంద్రమోడీ పురోగామి మహోపన్యాసాలు మరోవైపు ఆయన అనుయాయులేమో స్త్రీల రుతుస్రావం అపవిత్రమంటూ వీధుల్లో అల్లరి, దాడులు చేస్తుంటారు. పనిలేని వారు ఏదో చేశారన్నట్లుగా కొందరు అలహాబాద్‌ను ప్రయాగరాజ్‌గానూ, సిమ్లాను శ్యామలాగా మార్చేందుకు, మసీదులను పడగొట్టి గుడులు ఎలా కట్టాలా అని, మరి కొందరు అయ్యప్ప గుడికి వచ్చే మహిళా భక్తులు మీద ఎలా దాడులు చెయ్యాలా అని తిరుగులేని తిరోగామి ఆచరణలో మునిగి తేలుతుంటారు. మోడీ, ఆయన అనుయాయులను తయారు చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ దళం చేస్తున్న వాదనల ప్రకారం రాజారామ్మోహన్‌ రాయ్‌ బ్రిటీష్‌ వారితో చేతులు కలిపి మన పవిత్ర సతీసహగమన ఆచారాన్ని మట్టికలిపారు. వితంతు పునర్వివాహ నిషేధం, బహుభార్యాత్వం, దేవదాసీ వంటి మన హిందూ ఆచారాలు సాంప్రదాయాలను తిరిగి పునరుద్దరించాల్సిందే. అవి లేకుండా పోయిందని చెబుతున్న మన గత గౌరవం, ఘనత తిరిగిరాదు. వాటన్నింటి పునరుద్ధరణ ప్రపంచంలో మరోమారు మన దేశాన్ని వున్నత స్ధానంలో వుంచుతుంది. అందుకుగాను వున్న రాజ్యాంగాన్ని రద్దు చేయాలి. మనువు కంటే ముందే మన ఆచారాలు వున్నాయి గనుక వాటిని క్రోడీకరించటం తప్ప కొత్తగా చేసిందేమీ లేని మనుస్మృతిని తిరిగి ప్రవేశపెట్టాలి. సాంప్రదాయాలు, ఆచారాల పరిరక్షణ పేరిట సామాజిక మాధ్యమం, వీధుల్లో వేస్తున్న వీరంగాలను చూస్తే అంతపనీ చేసినా ఆశ్చర్యం లేదు. అందుకే అంతరకు వచ్చినపుడు ఏం చేయాలో, ఏ వైపున వుండాలో ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే ఆలోచించుకోవటం మంచిది. ఇలాంటి వారి నాయకత్వంలో మహా అయితే కుక్కతోకపట్టుకొని గోదావరి కాక పోతే గత నాలుగేండ్లలో మరింతగా మురికి అయిందని వార్తలు వచ్చిన గంగానదిని ఈదగలమేమోగానీ నాలుగో పారిశ్రామిక విప్లవంలో ప్రవేశించగలమా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

శబరిమల తీర్పు 4: సామాజిక మాధ్యమంలో అసంబద్ధ, కుతర్కం !

12 Friday Oct 2018

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

Anti Hindu, Hindu scriptures, illogical and inconsistent arguments in social media on Sabarimala verdict, sabarimala verdict, social media on Sabarimala verdict

Image result for illogical and inconsistent arguments in social media on  Sabarimala verdict

ఎం కోటేశ్వరరావు

ఏ మతం వారి ఆచార వ్యవహారాలలోని మంచి చెడ్డలను ఆ మతాల వారే ప్రశ్నించాలి, అంతేనా మతం పట్ల నమ్మకం వున్న వారే అందుకు అర్హులు, దేవుడు, దేవత, దేవదూత, ప్రవక్త, దేవుని బిడ్డల మీద ప్రశ్నించే వారికి నమ్మకం వుందని రుజువు ఏమిటి? ఒక మతం వారు మరొక మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. సామాజిక మాధ్యమంలో, సాంప్రదాయక మాధ్యమాల్లో వస్తున్న,వేస్తున్న, వేయిస్తున్న ప్రశ్నలివి.ఈ వాదన అక్కడితో ఆగటం లేదు, హిందూ దేవాలయాల్లో మహిళల ప్రవేశంపై ఆంక్షలు కూడదన్న కోర్టు మసీదుల్లో ప్రవేశాలకు ఆదేశాలు జారీ చేస్తాయా, ముస్లిం మహిళల బురఖాలను తీసివేయిస్తాయా, అన్ని మతాల ఆచార, వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటాయా? ఇలా చర్చ సాగుతోంది. ఈ తర్కంలో పరస్పర వైరుధ్యాలు, వుక్రోషం, అవకాశవాదం వున్నాయి.

ఈ క్రమంలో మసీదుల్లో మహిళల ప్రవేశానికి అనుమతించాలని ఆదేశాలివ్వాలంటూ కేరళ హిందూ మహాసభ నేత స్వామి దత్తాత్రేయ శాయి స్వరూపనాధ్‌ ఆ రాష్ట్ర హైకోర్టులో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్య పిటీషన్‌ను న్యాయమూర్తులు తిరస్కరించారు. తన వాదనకు తగిన ఆధారాలను చూపటంలో విఫలమైన కారణంగా పిటీషన్‌ విచారణ అర్హం కాదని కొట్టి వేశారు. తగిన సాక్ష్యాలతో మరొకరు ఎవరైనా అవసరమైతే అలాంటి కేసులు వేసుకోవచ్చు లేదా ముస్లిం మత పెద్దలు అంతవరకు తెచ్చుకోకుండా మసీదుల్లోకి మహిళలను అనుమతించే వివేచనను అయినా చూపవచ్చు. అయ్యప్ప ఆలయంలో అలాంటి వివక్ష వుందని బలమైన ఆధారాలు, సాక్ష్యాలు వుండబట్టే అయ్యప్ప కేసు విచారణకు నిలిచింది, తీర్పును ప్రకటించాల్సి వచ్చింది. వివక్షను పాటించే వారు తమ వాదనలకు తగిన సాక్ష్యాలను చూపలేకపోయినందున కేసును ఓడిపోయారు.

పైన పేర్కొన్న వాదనలను సామాన్యులు చేశారంటే అర్ధం చేసుకోవచ్చు. ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన మార్కండేయ కట్జూయే ఎలాంటి ఫీజు లేకుండా ఇలాంటి వాదనలు, సుప్రీం కోర్టుకు సలహాలు ఇచ్చేందుకు పూనుకున్నారు. శబరిమల అయ్యప్ప దేవాలయంలో అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి అనుకూలంగా ఇచ్చిన తీర్పు మీద కట్జూ స్పందించారు.’ కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి ఆ కేసు తీర్పును పునర్విచారణ చేసేందుకు ఏడుగురు సభ్యుల బెంచ్‌ను ఏర్పాటు చేయాలి లేదా దేశమంతటా మసీదుల్లో మహిళల ప్రవేశాన్ని అమలు చేయించాలి. సిద్దాంత రీత్యా మసీదుల్లో మహిళల ప్రవేశానికి ఎలాంటి ఆంక్షలు లేవు, మక్కా, మదీనాల్లో అనుమతిస్తున్నారు, ఇండ్లలో ప్రార్ధనలు చేసుకోవాల్సిన మహిళలను భారత్‌లో ఒకటి రెండు శాతం మసీదుల్లో మాత్రమే అనుమతిస్తున్నారు. మసీదుల్లో తగినంత స్ధలం లేదన్నది సాధారణంగా సమర్ధనకు చెబుతున్నారు. అదే కారణం అయితే పురుషులకే ప్రాధాన్యత ఎందుకు? మహిళలు మసీదుల్లో పురుషులు బయట ఎందుకు చేయకూడదు. లేదా సగం సగం పద్దతిలో వేర్పాటు చేయాలి. కాబట్టి దీనిలో మీరు దేన్ని ఎంచుకుంటారు ‘ అని ప్రధాన న్యాయమూర్తిని ప్రశ్నించారు. అంతే కాదు, ఎవరైతే మత ఆచారాలను పాటిస్తున్నారో వారికే సమానత్వం గురించి అడిగే హక్కు వుందని, సదరు ఆచారం హేతుబద్దమైనదా కాదా అని నిర్ణయించే అధికారం కోర్టుకు లేదని శబరిమల కేసులో మిగతా నలుగురితో విబేధించిన ఐదవ న్యాయమూర్తి ఇందు మల్హోత్రా వాదనను కట్జూ సమర్ధించారు.

మనది లౌకిక రాజ్యం. ఏ మతానికి లేదా మత ఆచారాలకు రాజ్యాంగంలోని అంశాల నుంచి మినహాయింపు ఇవ్వలేదు. అలాగని ఏ మత ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే అంశాలు కూడా లేవు. అవసరమని భావిస్తే ఏ ప్రజా ప్రయోజన లేదా సంబంధ అంశంపై అయినా కోర్టు స్వయంగా జోక్యం చేసుకోవచ్చు. ఏ రూపంలోనూ ప్రాధమిక హక్కులకు భంగం కలిగించేందుకు, వివక్ష పాటించేందుకు వీలు లేదు. ఈ పరిమితులకు లోబడే కోర్టులు తీర్పులు చెబుతున్నాయి.భర్త నుంచి మనోవర్తి పొందేందుకు ముస్లిం మహిళలకు హక్కు వుందని షాబానో కేసులో తీర్పు చెప్పిన కోర్టు మూడుసార్లు తలాక్‌ చెబితే విడాకులు చెల్లవని కూడా చెప్పింది.ఈ కేసులను ఇస్లాంను పాటించే ముస్లిం న్యాయమూర్తులే విచారించాలి,న్యాయవాదులే వాదించాలి, ముస్లింలు మాత్రమే కోర్టులో గుమస్తాలుగా వుండాలి అని ఆ మతానికి చెందిన వారితో సహా ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. లేదా శబరిమల ఆలయ కేసు విచారణ సమయంలోనూ ఏ వ్యక్తి లేదా ఏ సంస్ధా కేసులో పైన పేర్కొన్న వాదనతో ప్రతివాదులుగా చేరలేదు.

ఇప్పుడు అలాంటి వాదనలు ఎందుకు చేస్తున్నట్లు ? మూలం, పర్యవసానాలు ఏమిటి? అస్థిత్వ భావజాలం. సమాజంలో నిరాదరణకు గురయ్యే మైనారిటీ తరగతులు తమ ప్రయోజనాల పరిరక్షణకు ఈ భావనను ముందుకు తెచ్చారనే అభిప్రాయం వుంది. అది ప్రారంభంలో అభివృద్ధికరంగానే వున్నప్పటికీ ఒక పరిధి దాటిన తరువాత అదే ఆటంకంగా మారటంతో పాటు దోపిడీ వర్గాలు శ్రామిక వర్గాన్ని విభజించి పాలించేందుకు ఆ భావజాలాన్ని పెంచి పోషించాయనే అభిప్రాయం కూడా వుంది. వుదాహరణకు ఇటీవల సిపిఎస్‌(కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌)కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. నిజానికి కార్మిక, వుద్యోగ, వుపాధ్యాయ సంఘాలు ఈ అంశం మీద గట్టిగా కేంద్రీకరించి వ్యతిరేకించి వుండాల్సింది, అది జరగలేదు. ఆ పధకం కింద వుద్యోగంలో చేరిన వారికి కూడా ప్రారంభంలో దాని వలన కలిగే హానితెలియలేదు, పట్టించుకోలేదు. ముందు వుద్యోగం చాలనుకున్నారు. ఇప్పుడు వుద్యమంలో పాత పధకంలో వున్నవారు దానికి వ్యతిరేకంగా జరిగే వుద్యమంలో అంతగా ఆసక్తి చూపుతున్నారా అన్నది ప్రశ్న. కాడర్‌ వారీ సంఘాల ఏర్పాటు కూడా ఈ భావజాల పుణ్యమే. ఒక క్యాడర్‌ సమస్య మీద వుద్యమిస్తే మరో కాడర్‌లో స్పందన వుండదు. ప్రారంభంలో ఎలా వున్నప్పటికీ ఇప్పుడు అస్ధిత్వ భావజాలం ఐక్యతకు ఆటంకంగా మారిందనేందుకు ఇలా అనేక దృష్టాంతాలను పేర్కొనవచ్చు. స్ధూలంగా అస్థిత్వ రాజకీయాలుగా నామకరణం జరిగిన ఈ అంశం అన్ని జీవన రంగాల్లో ప్రబలంగా వ్యాపించింది. దళితుల సమస్యల మీద పోరాడాలంటే దళితులే నాయకత్వం వహించాలి, వారికి తెలిసినంతగా వారి సమస్యలు,వేదన ఇతరులకు అర్ధం కాదు. ఇదే తర్కాన్ని మహిళలకు వర్తింప చేశారు.కార్మిక సంఘాలకు కార్మికులే నాయకత్వం వహించాలి, బయటి రాజకీయ నాయకులు, ఇతరులు వుండకూడదు అని కార్మికుల కంటే యజమానులే గట్టిగా చెబుతున్నారు. ఆ మేరకు చట్ట సవరణ కూడా చేయాలనే డిమాండ్‌ ముందుకు తెచ్చారు. ఏ మతంవారి దురాచారాలను ఆ మతం వారే, అందునా వాటిని పాటించే వారే ప్రశ్నించాలి అనే తర్కానికి ఇదే మూలం. ఈ దేశంలో దేవుడు,దేవత, మతం, కులంతో ప్రమేయం లేకుండా జీవించాలని కోరుకొనే స్వేచ్చ, దేనినైనా ప్రశ్నించే హక్కు పౌరులకు వుంది అనే విషయాన్ని కొంత మంది మరచిపోతున్నారు.

ఆచారాలు, అలవాట్లను పాటించేవారే ప్రశ్నించేందుకు అర్హులు అనే వితండవాదానికి తావిస్తే గోవధ నిషేధించాలని డిమాండ్‌ చేసే హక్కు గోమాంసం తినని వారికి, వధించని వారికి ఎక్కడిది? ఆ పనిచేసే వారి నుంచే అది రావాలి కదా ! ఇలాంటి వాదనలు సమాజం యథాతధంగా వుండాలని కోరుకొనే తిరోగమన వాదులకు, మన రాజ్యాంగాన్ని వ్యతిరేకించే లేదా తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూసే శక్తులకు మాత్రమే సంతోషం కలిగిస్తాయి.మెజారిటీ పౌరులు హిందువులు కనుక హిందూ రాజ్యంగా వుండాలని, వారు చెప్పిందే అమలు జరగాలంటూ మనువాద పున:ప్రతిష్ట చేయాలని చూస్తున్న శక్తులు ప్రయత్నిస్తున్నాయి. దాని ప్రకారం మనం మతరాజ్యాల్లోకి మారిపోవాలి, రాజ్యాంగమెందుకు, పార్లమెంట్‌, కోర్టులెందుకు ?

మసీదుల్లోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని కోర్టులెందుకు జోక్యం చేసుకోవు లేదా అమలు జరిపించవు అనే వాదనను చూద్దాం.మొదటి విషయం మన రాజ్యాంగం న్యాయవ్యవస్ధకు అలాంటి కార్యనిర్వాహక అధికారం ఇవ్వలేదు. మన రాత పూర్వక రాజ్యాంగంలో పేర్కొన్న అంశాల ప్రకారం న్యాయం జరుగుతున్నదా లేదా తీర్పు చెప్పటానికి, జరగటం లేదని కోర్టుకు స్వయంగా తెలిసినపుడు లేదా భావించినపుడు అమలు జరపాలని ప్రభుత్వాలకు మార్గదర్శనం, రాజ్యాంగ విరుద్దం అయితే ఆదేశాలు ఇస్తాయి. రాజ్యాంగం ప్రకారం నిర్ణీత వయస్సు వచ్చిన యువతీ యువకులు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చు. కానీ రోజూ ఏదో ఒక మూల అలాంటి వివాహాలు చేసుకున్నవారిని వెంటాడి, వేటాడి చంపుతున్న వుదంతాలు దేనికి సూచిక, అలాగే అంటరాని తనం నేరం, శిక్షార్హం. సమాజంలో అదింకా కొనసాగుతున్నదా లేదా ? ఆ వివక్ష, నేరానికి వ్యతిరేకంగా లేదా తమకు న్యాయం చేయాలని ఎవరైనా కోర్టు తలుపు తడితేనో లేదా ఆ దురాచారం కొనసాగుతున్నతీరు గురించి మీడియా ఇచ్చిన వార్తలను చూసి స్పందిస్తేనో కోర్టులు జోక్యం చేసుకుంటాయి. అంతే తప్ప కోర్టులు ప్రతి ఇంటికి లేదా ప్రతి ప్రార్ధనా స్ధలానికి వెళ్లి అంటరానితనాన్ని పాటిస్తున్నారా లేదా అని చూడవు. మసీదులైనా అంతే. ఎవరైనా తమను ఫలానా మసీదులో ప్రవేశానికి ఆటంకం కలిగిస్తున్నారని కోర్టుకో, పోలీసులకో ఫిర్యాదు చేయకుండా ఆ వ్యవస్ధలు ఎలా స్పందిస్తాయి. మహిళలను మసీదులకు వెళ్లటాన్ని ఎవరు అడ్డగించారు, వెళ్ల వచ్చు అన్నది ఒక వాదన. వెళ్ల వచ్చు నిజమే, వెళ్లటం లేదన్నది వాస్తవం. ఎవరు అడ్డగించారు అని ఎదురు ప్రశ్న వేసే వారే ఎందుకు వెళ్లటం లేదో సమాధానం చెప్పాలి. ప్రతి మతంలోనూ సంస్కరణోద్యమాలు రావాలి, దీనికి ఇస్లాం మినహాయింపు కాదు. మా మతం మా ఇష్టం అంటే కుదరదు.

ముస్లిం మహిళల చేత బురఖాలు తీసేయిస్తారా అన్నదొక ప్రశ్న. కొన్ని దేశాలలో ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే లేదా వ్యతిరేక చర్యల్లో భాగంగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు లేదా ప్రతిపాదిస్తున్నారు. వాటిని చూసి ఇక్కడి ముస్లిం వ్యతిరేకులు ఈ అంశాన్ని తలకెత్తుకుంటున్నారు. ఫలాన దుస్తులు వేసుకోవాలి, ఫలానావి వేసుకోకూడదు, ఫలనాది తినకూడదు, ఫలానాదే తినాలి అనే తాలిబాన్ల ఫర్మానాలు కూడా ఇలాంటి వాటి మీద ప్రభావం చూపుతున్నాయి. బురఖా లేదా ముసుగు ధరించేది ఒక్క ముస్లిం మహిళలేనా? పూర్తిగా ముఖాన్ని కప్పి వుంచుతూ హిందువుల్లో అలాంటి వేషధారణ వున్నవారి సంగతేమిటి? వాటికి ఏ పేరు పెట్టినా వారిని కూడా ముసుగులు తొలగించే విధంగా కోర్టులు ఆదేశాలు జారీ చేయాలా?

ఇంకా మరికొన్ని వాదనలు, అయ్యప్ప బ్రహ్మచారి కనుక వయస్సులో వున్న యువతులు సందర్శిస్తే ఆయన వ్రత భంగం అవుతుంది. హిందూ పురాణాల ప్ర కారం కార్తికేయుడు కూడా బ్రహ్మచారే, ఆయన సోదరుడు వినాయకుడూ, రామ భక్త హనుమంతుడూ బ్రహ్మచారే. వారు కూడా బ్రహ్మచర్యాన్ని నిష్టగా పాటించినట్లు చదివాం తప్ప మినహాయింపులు తీసుకున్నట్లు తెలియదు. వారి దేవాలయ ప్రవేశాలకు ఎలాంటి ఆంక్షలు లేవు. వారి వ్రతానికి మహిళలు ఎలాంటి భంగమూ కలిగించటం లేదు. ఖురాన్‌ ప్రకారం బహిష్టులో వున్న మహిళలు నమాజు చేయటానికి లేదు, దానికి కూడా మనం వ్యతిరేకంగా పోరాడదాం. సుప్రీం కోర్టు దేవుడైతే భక్తుల మనోభావాలను గౌరవించాలి తప్ప సంస్కారం లేని మహిళావాదులను కాదు, ఇంకా ఇలాంటి అనేక వాదనలను ముందుకు తెచ్చారు. వీటన్నింటిని మొత్తంగా బేరేజు వేస్తే కోర్టు తీర్పు హిందూమతానికి వ్యతిరేకంగా ఇచ్చిందనే భావాన్ని కలిగించేందుకు తీవ్ర ప్రయత్నం కనిపిస్తోంది. ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏమంటే హిందూయేతర మతాల్లో వున్న వివక్ష లేదా అసంబద్దతలను గుర్తించటానికి, తొలగించటానికి ఈ తీర్పు దోహదం చేస్తుందన్నది పురోగామి వాదుల అభిప్రాయం అని చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

శబరిమల తీర్పు 3 : ప్రజాకర్షక నినాదాలతో భారతీయ మితవాదం !

10 Wednesday Oct 2018

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Women

≈ Leave a comment

Tags

BJP, Far right populism in India, RSS, RSS game, sabarimala verdict

Image result for Far right  in india cartoons

ఎం కోటేశ్వరరావు

దేశంలో పచ్చి మితవాద శక్తులు చెలరేగిపోవటం ఒకవైపు వాటి భావాజాలానికి విరుద్దంగా కొన్ని పురోగామి తీర్పులను సుప్రీం కోర్టు వెలువరించటం ఒక చిత్రమైన స్ధితి. అధికారంలో వున్న బిజెపి కొన్ని తీర్పుల మీద ఎలాంటి వైఖరులను వెల్లడించటం లేదు. ఆ పార్టీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి శబరిమల వివాదంలో మెజారిటీ తీర్పును వ్యతిరేకిస్తూ, మహిళలపై ఆంక్షలను కొనసాగించాలన్న న్యాయమూర్తి తీర్పును సమర్ధిస్తున్నట్లు ప్రకటించారు. దానికి వ్యక్తిగత అభిప్రాయమనే షరతు పెట్టారు. ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగాó నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం ఏముంది, ఎవరు అడిగారు? బిజెపి లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధలు ఒకవైపు సదరు న్యాయమూర్తి తీర్పుతో ఏకీభవిస్తూ, మెజారిటీ బెంచ్‌ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ వీధులకు ఎక్కిన తరువాత ఆమెనుంచి అంతకు మించి ఎవరైనా ఎలా ఆశించగలరు?

ప్రధాన ప్రతిపక్షంగా వున్న కాంగ్రెస్‌ గోడమీద పిల్లి వాటంగా వ్యవహరిస్తోంది. ఇక ప్రాంతీయ పార్టీల సంగతి సరేసరి. వామపక్షాలు మాత్రమే తమ సూత్రబద్దమైన వైఖరులను స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను చూసినపుడు పురోగామి శక్తుల కంటే ప్రజాకర్షక నినాదాలతో తిరోగామి భావజాలానిదే పైచేయిగా వున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో దానికి గురయ్యేవారిలో పురుషులతో పాటు మహిళలూ వుంటారు. ఐరోపాలోని అనేక దేశాలలో నయా నాజీలు, ఫాసిస్టులు పెరుగుతున్నారు. మన దేశంలో ఈ భావజాలంతో పనిచేస్తున్న శక్తులు అధికార కేంద్రాలలో తిష్టవేశాయి. మరింతగా విస్తరించాలని ప్రయత్నిస్తున్నాయి. నాజీలు యూదువ్యతిరేకతను రెచ్చగొట్టి ఐరోపాలో మారణహోమం సృష్టిస్తే ఇప్పుడు ప్రపంచవ్యాపితంగా ముస్లిం వ్యతిరేకతను ముందుకు తెస్తున్నారు. మన దేశంలో ముస్లింలతో పాటు క్రైస్తవ వ్యతిరేకతను కూడా జోడించారు. ఎందుకిలా జరుగుతోంది. సమగ్రంగా చర్చ, పరిశోధన జరగాల్సి వుంది. ప్రజాకర్షక నినాదాలంటే సంక్షేమ కార్యక్రమాలే కానవసరం లేదు.అసోం, త్రిపురల నుంచి బంగ్లాదేశీయులను ఒకవైపు వెళ్లగొట్టాలంటున్న బిజెపి మరో వైపు గుజరాత్‌లో వుత్తరాది రాష్ట్రాల వారిని వెళ్లగొడుతుంటే అచేతనంగా వుంది.

వస్తు వ్యాపారం చేసే ఒక సాధారణ వ్యాపారి కంటే డబ్బుతో వ్యాపారం చేసే ఒక వడ్డీ వ్యాపారిని చూస్తే సామాన్యులు ఎక్కువగా భయపడతారు. పెట్టుబడిదారీ వ్యవస్దలో సంభవిస్తున్న సంక్షోభాలను అధిగమించటానికి ఒక వైపు ప్రయత్నిస్తూనే రెండోవైపు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సోషలిజం, కమ్యూనిజాల వ్యాప్తిని అరికట్టేందుకు సామ్రాజ్యవాదం తీవ్రంగా నిమగ్నమైంది. మొదటి అంశంలో భాగంగా నయా వుదారవాద విధానాలను ముందుకు తెచ్చింది, రెండవ అంశంలో సోషలిస్టు వ్యవస్ద నిర్మాణంలో జరిగిన లోపాలను ఆసరా చేసుకొని, కుట్రలు చేసి ప్రధమ సోషలిస్టు రాజ్యాన్ని, దాని సాయంతో ఏర్పడిన తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాలను కూల్చివేయటంలో జయప్రదమయ్యారు. సాధారణ వడ్డీ వ్యాపారి స్ధానంలో పట్టణాలలో గూండా వడ్డీవ్యాపారుల మాదిరి నయావుదారవాదం కార్మికవర్గం పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నది. దాని దెబ్బకు వుదారవాద ముసుగులు వేసుకున్న సోషలిస్టు, లేబర్‌ పార్టీల వంటివి జనం మీద భారాలు మోపటంలో మితవాదుల కంటే తక్కువేమీ కాదని ఈ కాలంలో రుజువు చేసుకున్నాయి. సాంప్రదాయ పార్టీల మీద జనానికి విశ్వాసం పోయింది. మరోవైపు పెట్టుబడిదారీ వ్యవస్ధలో అంతరాలు పెరగటంతో పాటు నయావుదారవాద విధానాలు ఎంత వేగంగా పెట్టుబడిదారుల సంపదలను పెంచుతాయో సంక్షోభాలను కూడా అంతేవేగంగా ముందుకు తెస్తాయని తేలిపోయింది. సోషలిస్టు వ్యవస్ధలకు ప్రత్యామ్నాయం పెట్టుబడిదారీ విధానమే అంటూ చూపిన రంగుల కలలు పాతికేండ్లలో కల్లలయ్యాయి. సోషలిజం, కమ్యూనిజాల మీద చేసిన తప్పుడు ప్రచారం, వాటికి తగిలిన తీవ్రమైన ఎదురుదెబ్బలను చూసిన తరువాత జనానికి తాత్కాలికంగా అయినా ఎటుపోవాలో తెలియని స్ధితి మితవాద శక్తుల పెరుగుదలకు అనువుగా తయారైందని చెప్పవచ్చు. అవి అనేక చోట్ల జనాకర్షక నినాదాలతో ముందుకు వస్తున్నాయి.అసంతృప్తి, ప్రత్యామ్నాయం గురించి అవగాహనలేని, విశ్వాసంలేని యువత ఇటువంటి శక్తుల వెనుక చేరటం గతంలో కూడా జరిగింది. ఈ స్ధితి ఎంతోకాలం వుండదని గత చరిత్ర రుజువు చేసింది.

పచ్చి మిత, తీవ్రవాద భావాలను రాజీకీయాలు, సమాజంలో మరింతగా వ్యాప్తి, అమలు చేసే క్రమంలో వాటిని అందంగా, మహిళీకరణ(ఫెమినైజ్‌కు ఈ పదం దగ్గరగా వుంటుందని ప్రయోగించాను, అంతకంటే మెరుగు, అర్ధవంతమైన పదాన్ని సూచిస్తే స్వీకరిస్తాను) చేయటం కనిపిస్తోంది. మరోసారి యూదులను చూపి ద్వేషం రెచ్చగొట్టే పరిస్ధితులు పునరావృతం అవుతాయా ? ఇప్పటికైతే అలాంటి సూచనలు లేవు. దాని స్ధానంలో ముస్లింలపట్ల ద్వేషాన్ని రెచ్చగొట్టటం, కొంత మేరకు జనాన్ని తప్పుదారి పట్టించగలిగినట్లు చెప్పవచ్చు. ముస్లింలందరూ వుగ్రవాదులు గాకపోవచ్చుగాని వుగ్రవాదులందరూ ముస్లింలే అనే ఒక ప్రమాదకరవాదన రూపంలో ద్వేషాన్ని పెంచుతున్నారు. ఫ్రెంచి మితవాద రాజకీయ వారసత్వ క్రమంలో మూడవతరానికి చెందిన యువతి మరియం మార్చల్‌ లీపెన్‌. ఆమె తన తాత మారీ లీపెన్‌, పిన్ని మారినే లీపెన్‌ బాటలో ముందుకు వచ్చింది.తాత కంటే పిన్ని ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించింది. ఇరవై మూడు సంవత్సరాలకే పార్లమెంట్‌కు ఎన్నికైన మరియం లీపెన్‌ పుట్టినప్పటి నుంచి మితవాద భావాల వుగ్గుపాలతో పెరిగా నంటూ తన భావాలను మరింత స్పష్టంగా చెబుతోంది. జాతీయవాదం కూడా నాజీజమే. మీరు కనుక జాతీయ ప్రయోజనాలను సమర్ధిస్తే వేదనామయ క్రమాన్ని ప్రారంభించినట్లే, అది యుద్దము, ప్రళయానికి దారి తీస్తుందని అంటోందా అమ్మడు.28ఏండ్ల మార్చెల్‌ లీపెన్‌ పచ్చి ముస్లిం వ్యతిరేకి. ఇస్లామ్‌ను మనం అంతమొందించాలి లేదా అదే మనల్ని పదే పదే చంపుతుంది అని విద్వేషాన్ని వెళ్లగక్కారు. నేషనల్‌ పార్టీలో వున్న వారికి ఈమె ప్రతిరూపం. గతంలో నేషనల్‌ ఫ్రంట్‌ పేరుతో ప్రస్తుతం నేషనల్‌ ర్యాలీ పార్టీ నేతగా మారీ లీపెన్‌ పని చేస్తున్నారు. తండ్రి నాయకత్వస్ధానాన్ని ఆమె అందుకున్నారు. ఐరోపా రాజకీయాలలో ఇలాంటి వారసత్వ ధోరణులు ఇటీవలి వరకు లేవు. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికలలో ఈమె తొలి రౌండులో 21.3శాతం ఓట్లు తెచ్చుకొని అంతిమపోటీలో 33.9శాతం తెచ్చుకొని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.

Image result for Far right  in india cartoons

బ్రిటన్‌లో రంగంలోకి వచ్చిన మరొక ముస్లిం వ్యతిరేక సంస్ధ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఇండిపెండెన్స్‌ పార్టీ(యుకెఐపి). ఇది ఐరోపాయూనియన్‌లో బ్రిటన్‌ చేరటాన్ని, వలస కార్మికుల, ముస్లిం వ్యతిరేకపార్టీ. పురుటి సమయంలో ఇచ్చే వేతనాలకు, ముస్లిం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో బురఖాలు ధరించేందుకు ఇది వ్యతిరేకం. దీని వత్తిడి కారణంగానే 2016లో ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగాలా లేదా అన్న ప్రజాభిప్రాయ సేకరణ జరపటం, వైదొలగాలని తీర్పు రావటం తెలిసిందే. వలస కార్మికుల రాకను వ్యతిరేకిస్తున్న కారణంగా బ్రిటన్‌ కార్మికవర్గం గణనీయ భాగానికి దీనిపట్ల సానుకూల అభిప్రాయం వుందని వార్తలు వచ్చాయి. బ్రిటన్‌లో ఇదే మూడవ పెద్ద పార్టీ. స్ధానికంగా వున్నవారి కంటే వలస వచ్చిన వారికి అవకాశాలు ఎక్కువగా ఇస్తున్నారనే అభిప్రాయం యువతలో పెరుగుతున్నది.

అబార్షన్లను వ్యతిరేకించటంతో సహా మహిళపట్ల అనేక తిరోగమన ధోరణులు కలిగిన జిమ్‌ డౌసన్‌ బ్రిటన్‌లో కంటికి కనిపించని పెద్ద మితవాది అని టైమ్స్‌ పత్రిక వర్ణించింది. ఇలాంటి నీచులైన మగవారందరూ ఇస్లాం నుంచి మహిళలను రక్షించేవారుగా తమకు తామే ముందుకు వస్తున్నారని డేనియల్‌ ట్రిల్లింగ్‌ అనే రచయిత ‘క్రూరమైన నీచులు: బ్రిటన్‌లో పచ్చి మితవాదుల పెరుగుదల’అనే తన పుస్తకంలో పేర్కొన్నారు. ప్రధాన స్రవంతి రాజకీయాలకు దూరంగా వుండే భావజాలాల పట్ల ఆసక్తిని రేకెత్తించటంలో ఇంటర్నెట్‌ కూడా కూడా దోహదం చేస్తోందని, పచ్చి మిత వాద వైఖరులకు యువతగురి అవుతోందని కూడా పేర్కొన్నారు. కుహనా వార్తల యుగంలో అసంఖ్యాక వనరులు ఈ భావాలకు ఆసరా అవుతున్నాయి ప్రత్యేకించి ఈ మితవాదులలో అనేక మంది ప్రధాన స్రవంతి మీడియాను నమ్మటం లేదని ట్రిల్లంగ్‌ పేర్కొన్నారు.

జర్మనీలో ఇటీవల వునికిలోకి వచ్చి గత ఏడాది ఎన్నికలలో 709 స్ధానాలున్న పార్లమెంటులో 94సీట్లతో మూడవ పెద్ద పార్టీగా ఆల్టర్‌నేటివ్‌ ఫర్‌ జర్మనీ(ఎఎఫ్‌డి) అవతరించింది. ఆ పార్టీ పార్లమెంటరీ నేత 39 సంవత్సరాల ఎలిస్‌ ఎలిజబెత్‌. ఈ పార్టీ ముస్లిం, వలస కార్మికులకు వ్యతిరేకత, ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు రావాలని చెబుతుంది.దేశంలోకి ప్రవేశించేవారిని అడ్డుకొనేందుకు అవసరమైతే మారణాయుధాలను వుపయోగించమని అంటోంది. నాజీల అత్యాచారాలను గుర్తు చేసుకోవటం ఆపివేయాలని, వాటి గురించి తక్కువ మాట్లాడాలని కోరుతోంది.

నార్వేలో అధికారంలో వున్న సంకీర్ణ కూటమిలోని ప్రోగ్రెస్‌ పార్టీ మితవాది. దేశాన్నీ ముస్లిమీకరణ చేస్తున్నారని, పోలీసు యూనిఫాంలో హిజబ్‌ ధరించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించే ఈమె ఇజ్రాయెల్‌ను పచ్చిగా సమర్ధిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ఇలా అనేక దేశాలలో వున్న ఇలాంటి మహిళల ద్వేషపూరిత వైఖరి, మాటలకు మన దేశంలో సాధ్వుల మని చెప్పుకుంటూ నోరుపారవేసుకొనే వారికి పెద్ద తేడా లేదు. మచ్చుకు ఢిల్లీని పాలించేందుకు రాముడి అంశలో పుట్టిన వారు కావాలో లంజలకు పుట్టిన వారు కావాలో తేల్చుకోవాలని సాధ్వి నిరంజన జ్యోతి గత ఎన్నికలలో ప్రసంగాలు చేసిన విషయం తెలిసినదే.ఈమె నరేంద్రమోడీ నాయకత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. ఇక యోగులుగా చెప్పుకొనేవారి గురించి చెప్పనే అవసరం లేదు. చిత్రం ఏమిటంటే వీరందరూ బిజెపి మద్దతుదారులు, నేతలే కావటం విశేషం. ఏ విత్తనం వేస్తే ఆ కాయలే కాస్తాయి మరి.

మన దేశంలో పచ్చి మితవాద శక్తులతో నిండిన ఆర్‌ఎస్‌ఎస్‌, అది ఏర్పాటు చేసిన సంఘాల నాయకులు అనేక సందర్భాలలో తమ తిరోగామి భావాలను ఎలాంటి శషభిషలు లేకుండా వెల్లడిస్తూనే వున్నారు. అయినా అనేక మంది విద్యావంతులైన మహిళలు ఇలాంటి శక్తులను అనుసరిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో మహిళలకు ప్రవేశం లేదనే విషయం వేరే చెప్పనవసరం లేదు. ఎందుకు లేదో చెప్పరు. 2013 జనవరి ఆరున పిటిఐ ఒక వార్తను అందించింది.ఇండోర్‌ పట్టణంలో జరిగిన ఒక సభలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ చేసిన వుపన్యాసంలోని అంశాలు ఇలా వున్నాయి.’ భర్త మరియు భార్య మధ్య ఒక ఒప్పందం వుంటుంది. దాని ప్రకారం నువ్వు నా ఇంటిని జాగ్రత్తగా చూడు, నేను నీ అవసరాలన్నింటినీ తీరుస్తాను, నిన్ను సురక్షితంగా వుంచుతాను అని భర్త చెబుతాడు. కాబట్టి భార్య ఒప్పందానికి అనుగుణ్యంగా వున్నంత వరకు భర్త కాంట్రాక్టు నిబంధనలను అనుసరిస్తాడు, భార్యతో వుంటాడు. భార్య ఒప్పందాన్ని వుల్లంఘిస్తే అతను ఆమెను వదిలించుకోవచ్చు ‘. ఈ వుపన్యాసం గురించి సిపిఎం నాయకురాలు బృందాకరత్‌ స్పందిస్తూ ‘ఇలా మాట్లాడటం నాకేమీ ఆశ్చర్యం అనిపించలేదు అంతిమంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అంటే ఇదే. అందుకే దీనిని రాష్ట్రీయ తిరోగమన సంఘ్‌ అని నేనంటాను. అధికారంలో వున్న బిజెపి పెద్దలు మనుస్మృతి ఆధారంగా కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని కోరుతున్నారు. ఆయనిలాంటి భాషలో మాట్లాడారంటే తన భావజాలాన్ని ప్రతిబింబించినట్లే ‘ అన్నారు.

అంతకు ముందు అసోంలోని సిల్చార్‌లో మాట్లాడుతూ పశ్చిమ దేశాల ప్రభావం కారణంగా ప్రధానంగా పట్టణ ప్రాంతాలలోనే మానభంగాలు జరుగుతున్నాయి, దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో జరగవు అని ఇదే భగవత్‌ గారు సెలవిచ్చారని కూడా పిటిఐ వార్తలో పేర్కొన్నది.’దేశ పట్టణ ప్రాంతాలలో మహిళలపై నేరాలు జరగటం సిగ్గు చేటు, ఇది ప్రమాదకర ధోరణి. అయిటే అటువంటి నేరాలు ‘భారత్‌ లేదా దేశ గ్రామీణ ప్రాంతాలలో జరగవు. మీరు గ్రామీణ ప్రాంతాలు లేదా అడవులకు వెళ్లండి అక్కడ సామూహిక మానభంగాలు లేదా లైంగిక పరమైన నేరాలు వుండవు. పశ్చిమ దేశాల సంస్కృతి ప్రభావంతో భారత్‌ ఎప్పుడు ఇండియాగా మారిందో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అన్నారు. సమాజంలోని ప్రతి దొంతరలో నిజమైన భారతీయ విలువలు మరియు సంస్కృతిని చొప్పించాలి, అక్కడ మహిళను తల్లిగా చూస్తారు’ అన్నారు. భగవత్‌కు భారత్‌ గురించిగానీ ఇండియా గురించీ తెలియదు, ప్రభుత్వ లెక్కల ప్ర కారం గరిష్టంగా జరుగుతున్న అత్యాచారాలు పేదలు, దళితులు, గిరిజనుల మీదే అని బృందాకరత్‌ వ్యాఖ్యానించారు.

ప్రపంచ వ్యాపితంగా సామాజిక మీడియాలో మితవాద శక్తులు పెరుగుతున్నాయి. ఐరోపా, అమెరికా వంటి చోట్ల మితవాదానికి శ్వేతజాతి జాతీయవాదం తోడవుతున్నది. మన దేశంలో హిందూత్వ జాతీయవాదాన్ని ముందుకు తెస్తున్నారు. దీనికి కులదురహంకారం, వెనుకబడిన తరగతులు, షెడ్యూలు కులాల పట్ల ద్వేషం తోడవుతున్నదని ఇటీవల జరిగిన ప్రణయ్‌ హత్యతో సహా అనేక వుదంతాలు వెల్లడించాయి. అనేక మంది యువతులు ఫేస్‌బుక్‌లో వీడియోలను పెట్టి తిరోగమన భావాలను వెల్లడించటం కొత్త పరిణామం. సమాజంలోని వున్నత తరగతులకు చెందిన మహిళలు పచ్చి మితవాద శక్తులు, వారు జరిపే ఆందోళనలవైపు మొగ్గటం గతంలో కూడా వున్నది ఇటీవలి కాలంలో పెరగటం గమనించాల్సిన అంశం. గొర్రె కసాయివాడిని నమ్మినట్లు పచ్చిమితవాదులను మహిళా రక్షకులుగా అంగీకరించటం తప్ప ఇది వేరు కాదు. తమను యాజమాన్యాలకు అమ్మివేసే తొత్తులను కార్మికులు నమ్మినాయకత్వ స్ధానాలలో కూర్చో పెట్టటాన్ని చూస్తున్నాం. అలాంటిదే ఇది, గుండెలు బాదుకొని ఆందోళన చెందినందువలన ప్రయోజనం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

శబరిమల తీర్పు 2 : ఆర్‌ఎస్‌ఎస్‌ రెండు నాలికల వైఖరి !

08 Monday Oct 2018

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, RELIGION, Women

≈ Leave a comment

Tags

RSS doublespeak, RSS doublespeak on sabarimala, sabarimala, sabarimala verdict

Image result for rss doublespeak on sabarimala cartoons

ఎం కోటేశ్వరరావు

భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 125 ప్రకారం విడాకుల తరువాత ముస్లిం మహిళలు భర్త నుంచి భరణం పొందేందుకు అర్హులే అని సుప్రీం కోర్టు ఒక ముఖ్యమైన తీర్పు నిచ్చింది. ఇది తమ మత సాంప్రదాయాలు, వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమే అని ముస్లింలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆ తీర్పును వమ్ము చేస్తూ కాంగ్రెస్‌ సర్కార్‌ ఏకంగా ఒక బిల్లునే పార్లమెంట్‌లో ఆమోదించింది. ఆ చర్యను వ్యతిరేకించిన బిజెపి అది ముస్లింల సంతుష్టీకరణ, ఓట్ల రాజకీయం అని విమర్శించింది. కానీ అదే పార్టీ నేడు ఇప్పటి వరకు ఆ డిమాండ్‌ చేయలేదుగానీ దాన్ని మద్దతు దారులు అదే డిమాండ్‌ చేస్తున్నారు. తీర్పును పునర్విచారణ జరపాలని బిజెపి కోరుతున్నది. గమనించాల్సిందేమిటంటే శని శింగనాపూర్‌ దేవాలయంలో అసలు మొత్తంగా మహిళలకు ప్రవేశం లేదు. అది చెల్లదని కోర్టు ఇచ్చిన తీర్పును పునర్విచారణ చేయాలని బిజెపి లేదా మహిళామోర్చా, ఇతర సంఘాలు గానీ డిమాండ్‌ చేయలేదు. పండలం మాజీ రాజకుటుంబం వారు షాబానో కేసు మాదిరి నరేంద్రమోడీ సర్కార్‌ కూడా శబరిమల తీర్పును రద్దు చేస్తూ పార్లమెంట్‌లో చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దాని గురించి ఇంతవరకు బిజెపి లేదా కేంద్రం నోరెత్తలేదు. నెపాన్ని సిపిఎం మీద నెట్టాలని చూస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం భక్తుల మనోభావాలను పట్టించుకోవటం లేదని ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి చెబుతున్నాయి. కమ్యూనిస్టులు కనుక వారి వైఖరి వారికి వుంటుంది. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ కొద్ది సంవత్సరాల క్రితం శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశించే అవకాశం ఇవ్వాలని కోరినపుడు భక్తులు గుర్తురాలేదా? ఎందుకీ అవకాశం వాదం, రెండు నాల్కల ధోరణి? కాంగ్రెస్‌ మైనారిటీ ముస్లిం ఛాందసవాదులను సంతృప్తి పరచేందుకు ప్రయత్నిస్తే నేడు బిజెపి మెజారిటీ హిందువుల ఓట్ల కోసం ఛాందసులను తృప్తి పరచేందుకు పూనుకుంది. కోర్టు తీర్పు అమలు గురించి చర్చించేందుకు రావాలని ఆలయ ప్రధాన పూజారి, ఆలయ నిర్మాణం చేసిన పండలం రాజకుటుంబీకుల వారసులను ప్రభుత్వం ఆహ్వానించింది. తీర్పుపై పునర్విచారణకు ప్రభుత్వం నిర్ణయించకుండా తాము చర్చలకు వచ్చేదని వారి ప్రతినిధులు ప్రకటించారు.

నాడు హిందూ కోడ్‌ బిల్లు ద్వారా హిందూ మత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆర్‌ఎస్‌ఎస్‌ వాదించిన విషయం ముందే చెప్పుకున్నాము. అదే సంస్ధ సృష్టి అయిన బిజెపి జమ్మూకాశ్మీర్‌లో మహిళల వారసత్వహక్కు విషయంలో వివక్ష చూపుతున్నారని మొసలి కన్నీరు కార్చుతున్నది. అసలు లక్ష్యం దానికి ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్‌ 370కి ఎసరు తేవటం. ఇదే బిజెపి వుమ్మడి పౌరస్మృతి గురించి చెబుతుంది. దీని వెనుక ముస్లిం, క్రిస్టియన్‌ వ్యతిరేకత వుంది. ఒక వైపు ముస్లింలు, క్రైస్తవులు ఎలాంటి కుటుంబ నియంత్రణ పాటించకుండా పిల్లలను ఎక్కువ మందిని కంటూ హిందూ జనాభాను మైనారిటీగా చేసేందుకు కుట్రపన్నారని చెబుతారు, మరోవైపు బిజెపిలోని నోటి తుత్తర గాళ్లు, పెండ్లీ పెటాకులు లేని సన్యాసులు, సన్యాసినులు హిందూ మహిళలు కుటుంబ నియంత్రణను పక్కన పెట్టి ఎక్కువ మంది పిల్లలను కనాలని చెబుతారు.

లవ్‌జీహాద్‌ పేరుతో హిందూ యువతులు ఇతర మతాలకు చెందిన వారిని వివాహం చేసుకోకుండా చూసేందుకు సంఘపరివార్‌ సంస్ధలు నిరంతర ప్రచారం చేస్తున్నాయి. మత వుద్రిక్తతలను రెచ్చగొడుతున్నాయి. వాలెంటైన్స్‌ డే రోజున వారంతా బృందాలుగా పార్కుల వెంట తిరుగుతూ కనిపించిన యువతీ యువకులను కొట్టటం, వివాహం చేసుకోమని బలవంత పెట్టటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. నిచ్చెన మెట్ల వంటి మన కుల వ్యవస్ధలో పై మెట్టులో వున్న అమ్మాయి ఎవరైనా కింది మెట్టులో వున్న అబ్బాయిని వివాహం చేసుకుంటే యువకులను హత్య చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. అలాంటి చర్యలను సామాజిక మాధ్య మాల్లో నిస్సిగ్గుగా సమర్ధించేవారంతా పై తరగతికి చెందిన వారే అన్నది అందరికీ తెలిసిన నిజం. అనేక మంది బిజెపి అగ్రనేతల కుమార్తెలు, బంధువులు ముస్లింలను వివాహాలు చేసుకున్నారు. అది మాత్రం ఇలాంటి బాపతుకు లవ్‌ జీహాద్‌గా కనిపించదు. సుబ్రమణ్యస్వామి కుమార్తె సుహాసిని మాజీ అధికారి సల్మాన్‌ హైదర్‌ కుమారుడు నదీమ్‌ను, బిజెపినేతలు సికిందర్‌ భక్త్‌, షా నవాజ్‌ ఖాన్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ హిందూ యువతులను వివాహం చేసుకున్నారు. ఎల్‌కె అద్వానీ మేనకోడలు ఒక ముస్లింను వివాహం చేసుకుంది. సామాన్యులనే సమిధలుగా చేస్తున్నారు. మతకొట్లాటలను రెచ్చగొట్టేందుకు అలాంటి వుదంతాలను వినియోగించుకుంటున్నారు.

ఆమోదంతో స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సెక్షన్‌ 377ను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. దీని మీద కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఎనిమిదేండ్ల పాటు ఈ కేసు నడిచింది. ప్రస్తుతం వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వున్న యోగి ఆదిత్యనాధ్‌ 2013లో బిజెపి పార్లమెంట్‌ సభ్యుడిగా వుండి ఏం మాట్లాడారో చూడండి. ‘ సామాజిక నీతికి స్వలింగ సంపర్కం ప్రమాదకరం, సామాజిక కట్టుబాట్లు, సరిహద్దులను చెరిపివేస్తే ఆ తరువాత మనిషి జంతువుకు తేడా వుండదు. చౌకబారు కుతర్కంతో మత గ్రంధాలకు వీటిని జత చేయటం పూర్తి అనైతికం, ఇంట్లో చేసే వాటిని నాలుగు రోడ్ల కూడలిలో చేస్తామని ఎవరైనా అంటే దాన్ని సమాజం అంగీకరించకూడదు. దానికి ఏవిధమైన రాజ్యాంగ బద్దత కూడా వుండకూడదు’ అన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షం వున్న కాంగ్రెస్‌ నేత గులాం నబీ అజాద్‌ 2011లో కేంద్ర మంత్రిగా మాట్లాడుతూ ‘ దురదృష్టం కొదీ ఎయిడ్స్‌ వ్యాధి ప్రపంచానికి మన దేశానికి వచ్చింది. ఒక పురుషుడు మరొక పురుషుడితో కలిస్తే ఇది వస్తుంది. ఇది పూర్తిగా అసహజమైనది, జరగకూడనిది, కానీ జరుగుతోంది. బిజెపి ఎంపీ సుబ్రమణ్య స్వామి మరొక అడుగు ముందుకు వేసి 2013లో మాట్లాడుతూ స్వలింగ సంపర్కాన్ని చట్టబద్దం చేస్తే అది లాభదాయకంగా మారి అన్ని పట్టణాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో స్వలంగ సంపర్క బార్లను తెరవటానికి దారి తీస్తుంది’ అన్నారు. ఇప్పటికి ఎన్ని బార్లు తెరిచారో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం తిరుగుతున్న నరేంద్రమోడీ సర్కార్‌ మనకు చెప్పాలి. ఇక ప్రతిదాన్నీ తన కంపెనీ లాభాల కోసం వినియోగించుకుంటున్న యోగా గురు బాబారామ్‌ దేవ్‌ ఈ అంశాన్ని కూడా వదల లేదు. స్వలింగ సంపర్కులు తన యోగాశ్రమానికి వస్తే దీనికి గ్యారంటీగా చికిత్స చేస్తామని చెప్పాడు. ఇది సాధారణంగా, సహజంగా మానవ మాత్రులెవరూ చేయకూడనిది అని టీవీల్లో బోధలు చేసే ముస్లిం పండితుడు జకీర్‌ నాయక్‌ చెప్పారు.

శబరి మల తీర్పుపై పునర్విచారణ పిటీషన్‌ వేయాలన్న డిమాండుకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నదని ముస్లింలీగ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి పికె కున్హాలికుట్టి ప్రకటించారు.భక్తుల మనోభావాలను గౌరవిస్తున్న కారణంగానే ఆలయపవిత్రతను కాపాడాలని యుడిఎఫ్‌ ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిందన్నారు.కోర్టు తీర్పు కంటే భక్తుల విశ్వాసాలు, ఆలయ సాంప్రదాయాలను కాపాడాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న వైఖరి వల్లనే అలజడి తలెత్తింది. నేడు ఇది శబరిమల విషయంలో జరిగింది రేపు దీని ప్రభావం ఇతర విశ్వాసాల మీద కూడా పడవచ్చు అన్నారు. శబరిమల తీర్పు అమలు హేతువాదులకు,నాస్తికులకు ఒక సమస్యగాకపోవచ్చుగానీ కోట్లాది భక్తులకు ఇది ప్రధాన సమస్య. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పునర్విచారణ పిటీషన్‌ దాఖలు చేయవచ్చు. మసీదుల్లో మహిళల ప్రవేశం గురించి కొన్ని ముస్లిం సంస్ధలు అనుమతించాలని కోరుతుండగా మరికొన్ని వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు.

భక్తుల విశ్వాసాలను గౌరవించాలంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన అనేక సంస్ధలు మహిళలను వీధుల్లోకి సమీకరిస్తున్నాయి. తొలుత కోర్టు తీర్పుకు అనుకూలంగా మాట్లాడిన ఆ సంస్ధ వెంటనే ప్లేటు ఫిరాయించింది. సుప్రీం కోర్టు తీర్పు చెప్పినప్పటికీ భక్తుల మనోభావాలను విస్మరించకూడదని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సురేష్‌ భయ్యాజీ జోషి సన్నాయి నొక్కులు నొక్కారు. సమీక్ష పిటీషన్‌ వేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఇది జరిగిన మరుసటి రోజు కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి నడిపే జన్మభూమి దినపత్రికలో జోషి ప్రకటన తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ మేధావి, భారతీయ విచార కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌ అయిన ఆర్‌ సంజయన్‌ రాసిన ఒక వ్యాసంలో కోర్టు తీర్పును సమర్ధించటం గమనించాల్సిన అంశం. వున్నత న్యాయ స్ధానం తీర్పు ఆలయ మౌలిక సాంప్రదాయాలు, క్రతువులను ఏ విధంగానూ మార్పు చేయదని, వాస్తవానికి మరింత మంది మహిళా భక్తులు దేవాలయాన్ని సందర్శిస్తే దాని ప్రాధాన్యత, ప్రజాదరణ పెరుగుతుందని వ్యాఖ్యానించారు. పది-యాభై సంవత్సరాల మధ్య వయస్సున్న వారి మీద వున్న ఆంక్షలను మాత్రమే కోర్టు కొట్టివేసింది. అటువంటి సాంప్రదాయాలు సక్రమం అని నిరూపించటానికి తర్కబద్దంగా లేదా తగిన శాస్త్రీయ పద్దతులు కూడా లేవని స్పష్టం చేశారు. ఆలయ అధికారుల సహాయంతో గతంలో అన్న ప్రాసన కార్యక్రమాలు కూడా జరిగాయని, పిల్లలను కనే వయస్సులో వున్న మహిళ ప్రవేశంపై ఆంక్షలు విధించాలని 1991లోనే కేరళ హైకోర్టు ఆంక్షలు విధించిందని పేర్కొన్నారు. దేవాలయాన్ని సందర్శించాలా లేదా అనే, ఎప్పుడు ఆ పని చేయాలి అనే అంశాలను నిర్ణయించుకొనే స్వేచ్చ మహిళలకే వదలి వేయాలి.వారికి నిర్ణయించుకొనే సామర్ధ్యం వుంది, పితృస్వామ్య రోజులు అంతరించాయని ప్రతి ఒక్కరూ గుర్తించటం అవసరం అని కూడా పేర్కొన్నారు. తిరువనంతపురం లోని భారతీయ విచార కేంద్రం డైరెక్టర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత అయిన పి పరమేశ్వరన్‌ 2006నవంబరులో త్రిసూర్‌లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ మహిళలు దేవాలయ సందర్శనను కోరుకుంటే వారిని అనుమతించాలి, అనుమతించకపోవటానికి ఎలాంటి కారణం లేదు అన్నారు.

మహిళలు కొండమీద వున్న ఆలయాన్ని చేరుకొనేందుకు ఎక్కలేరు, మహిళా కార్యకర్తలు తప్ప మూమూలు నిజమైన భక్త మహిళలెవరూ ఆలయాన్ని సందర్శించరు అనేవారు కొందరు. రెడీ టు వెయిట్‌ అంటే మాకు ఆలయ ప్రవేశ అర్హత వచ్చేంత వరకు వేచి చూస్తాం అనే నినాదంతో కొందరు మహిళలు ప్రచారం చేస్తున్నారు. మహిళలు అంత ఎత్తు ఎక్కలేరు, గంటల తరబడి వేచి వుండలేరు అని చెప్పే మహానుభావులారా అంతరిక్షంలోకి ప్రయాణిస్తున్న వారు అయ్యప్ప ఆలయానికి వెళ్లలేరా? వెళ్లాలా లేదా అనేది ఎవరిష్టం వారిది. వివక్ష కూడదన్నది సహజన్యాయం తప్ప బలవంతంగా వారిని గుళ్ల చుట్టూ తిప్పాలని ఏ కోర్టూ చెప్పలేదు, చెప్పదు. బస్సుల సౌకర్యం లేనపుడు ఏడుకొండలు ఎక్కి తిరుమలలో వెంకటేశ్వరుడిని మహిళలు దర్శించలేదా? ఇప్పుడు నడకదారిలో వెళుతున్నవారు లేరా ? శక్తి వున్న వారు నడుస్తారు. శబరిమల ఆలయంలోకి ప్రవేశ అర్హత వున్న పదేండ్ల లోపు వారు, యాభై ఏండ్ల పైబడిన వారు నడవగలరని ఎవరైనా చెప్పగలరా? ఇక మహిళా కార్యకర్తలు మాత్రమే ఆలయాన్ని సందర్శిస్తారని వుక్రోషంతో చెబుతున్నమాట తప్ప మరొకటి కాదు, ఆ మాట చెప్పిన ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పద్మకుమార్‌ మహిళలకు సౌకర్యం కోసం వంద ఎకరాల స్ధలం కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారని గుర్తు చేయటం అవసరం. ఆసక్తి వున్న వారికి అవకాశం కల్పించమని అడగటం తప్ప ఆంక్షలను వ్యతిరేకించే కమ్యూనిస్టు పురుషులు, మహిళా కార్యకర్తలెవరూ అయ్యప్పమాల వేసుకొని దర్శనాలు గతంలో చెయ్యలేదు, ఇప్పుడు చెయ్యరు.

శబరిమల తీర్పును ఆలిండియా కాంగ్రెస్‌ స్వాగతిస్తే కేరళ కాంగ్రెస్‌ నాయకుడు రమేష్‌ చెన్నితల మాత్రం అతని కంటే ఘనుడు ఆచంటమల్లన అన్నట్లు బిజెపి కంటే రెండాకులు ఎక్కువ చదివాడు. విశ్వాసం కంటే హేతుబద్దత పైచేయిగా వుండకూడదు అనటాన్ని నేను సమర్ధిస్తాను, తప్పుడు వాదాల ఆధారంగా కోర్టు తీర్పు ఇచ్చినట్లు కనిపిస్తున్నది, ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం, దేవస్ధానం బోర్డు భిన్నవైఖరులు తీసుకున్నాయి, తీర్పు పునర్విచారణ కోరాలి అని చెన్నితల వ్యాఖ్యానించారు. కోర్టు విచారణ ఒక రోజు ప్రారంభమై మరుసటి రోజుకు ముగియలేదు. సంవత్సరాల పాటు సాగింది, అదేమీ రహస్యంగా జరగలేదు, ఒక పక్షం తప్పుడు వాదాలు చేస్తే రెండవ పక్షం ఏమిచేసినట్లు? కోర్టు అంత గుడ్డిగా తీర్పు ఇచ్చినట్లా ? ప్రజాస్వామ్యంలో కోర్టు తీర్పు మీద అప్పీలు చేయవచ్చు.

ఎవరైనా ఒక వివాదంలో తనకు న్యాయం జరగలేదనుకున్నపుడు, తన వాదనను సరిగా పట్టించుకోలేదని భావించినపుడు కోర్టు తీర్పు మీద అప్పీలు చేసుకొనేందుకు, పునర్విచారణ కోరేందుకు అవకాశం, హక్కు వుంటుంది. శబరిమల కేసులో మహిళల ప్రవేశంపై ఎలాంటి ఆంక్షలు వుండరాదన్నది ఎల్‌డిఎఫ్‌ వైఖరి, దాన్నే కోర్టుకు సమర్పించింది, దానికి అనుగుణ్యంగానే తీర్పు వచ్చింది. అందుకే అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. తన వైఖరికి అనుగుణ్యంగానే తీర్పు వచ్చినందున పునర్విచారణ కోరటం అనే సమస్య ప్రభుత్వం ముందు వుండదు. అయినా సరే కోరకపోవటం తప్పని సిపిఎం వ్యతిరేకులు దాడి చేస్తున్నారు. ప్రజలకు ప్రధాన శత్రువుగా ఏ పార్టీ వుంది, ఏ అంశం ముప్పు కలిగిస్తుంది అని ఎంచుకోవటం, దానికి అనుగుణ్యంగా ఎత్తుగడలు నిర్ణయించుకోవటం గురించి సిపిఎం తీసుకున్న నిర్ణయాలతో ఎవరైనా ఏకీభవించకపోవచ్చు, మంచి చెడ్డలను విమర్శించవచ్చు. అయితే సామాజిక విషయాల్లో ఇంతవరకు ఓట్లకోసమో, మరొకదాని కోసమో గతంలో ప్రకటించిన తన సూత్రబద్ద వైఖరులను నవీకరించుకుందేమోగాని ఒకసారి నిర్ణయించుకున్న తరువాత దానికి విరుద్దంగా మార్చుకున్న దాఖలాలు ఇంతవరకు లేవు అనే అంశంలో దాని రాజకీయ వ్యతిరేకులు కూడా ఏకీభవించకతప్పదు. శబరిమల ఆలయ విషయంలో కూడా అదే రుజువైంది. విఎస్‌ అచ్యుతానందన్‌ ముఖ్య మంత్రిగా వుండగా ఇచ్చిన అఫిడవిట్‌లో ఆంక్షలను వ్యతిరేకించింది. తరువాత అధికారానికి వచ్చిన యుడిఎఫ్‌ దానికి విరుద్ధంగా సుప్రీం కోర్టుకు మరొక అఫిడవిట్‌ను సమర్పించింది. ఐదేండ్ల తరువాత తిరిగి అధికారానికి వచ్చిన సిపిఎం తన పూర్వపు వైఖరినే కోర్టులో పునరుద్ఘాటించింది.

మాటతప్పదు, మడమ తిప్పదు అని ఎంతో మంది నమ్మే ఆర్‌ఎస్‌ఎస్‌ శబరిమల విషయంలో అవకాశవాద వైఖరిని ప్రదర్శించింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సురేష్‌ భయ్యాజీ జోషి ఇప్పుడు రెండు నాలికలతో మాట్లాడారు.దీని వెనుక వున్న కారణాన్ని తరువాత చెప్పుకుందాం. రెండు సంవత్సరాల క్రితం ఆలయ ప్రవేశం గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ ఏం చెప్పిందో చూద్దాం. ‘ కొన్ని ప్రాంతాలలో కొన్ని అనుచిత సాంప్రదాయాల కారణంగా ఆలయ ప్రవేశం సమస్యపై ఏకాభిప్రాయం లేదు. ఎక్కడైతే అటువంటి సమస్యలు ముందుకు వచ్చాయో, తగిన చర్చల ద్వారా అలాంటి ఆలోచనా వైఖరిని మార్చేందుకు ప్రయత్నించాలి.సమాజ హితానికి వ్యతిరేకులైన కొందరు గత కొద్ది రోజులుగా మహిళల ఆలయ ప్రవేశంపై మింగుడు పడని వివాదాన్ని లేవనెత్తుతున్నారు. మత, ఆధ్యాత్మిక వ్యవహారాలు, ఆరాధన, విశ్వాసాల వంటి విషయాలలో స్త్రీ పురుషులు సహజంగానే సమాన భాగస్వాములు అనే ఒక వున్నత సాంప్రదాయాన్ని గతం నుంచీ పాటిస్తున్నాము. మహిళలు వేదాలు నేర్చుకుంటున్నారు, సహజపద్దతుల్లోనే వారు ఆలయ పూజారులుగా కూడా పని చేస్తున్నారు ‘ 2016 మార్చి రెండవ వారంలో రాజస్ధాన్‌లోని నాగౌర్‌ సమీపంలో జరిగిన మూడు రోజుల ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధుల సభకు సమర్పించిన నివేదికలో సురేష్‌ భయ్యాజీ ఈ మాటలు చెప్పినట్లు డక్కర్‌ హెరాల్డ్‌ పత్రిక వెల్లడించింది. శబరిమల ఆలయంలో కొన్ని వయస్సుల మహిళలకు ఆలయ ప్రవేశ నిషిద్ధం వెయ్యి సంవత్సరాల నాటి ఆచారం అని చెప్పినా అర్ధం లేదు, పురుషులకు ఏ పరిమితులు విధించారో మహిళందరికీ అవే వుండాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కోరుతోందని కూడా సురేష్‌ చెప్పారు. నాడు కేరళలో అధికారంలో వున్న కాంగ్రెస్‌ మహిళల ప్రవేశానికి వ్యతిరేకం. అదే సమయంలో మహారాష్ట్రలోని శని శింగనాపూర్‌ ఆలయంలో మహిళల ప్రవేశం గురించి వివాదం నడుస్తున్నది. ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌లో ఒక వ్యాసం వచ్చింది, అంతకు ముందు అదే పత్రిక సంపాదకీయంలో గౌరవ ప్రదమైన చర్చ జరగాలని బోధ చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రవేశానికి సుముఖత వ్యక్తం చేయగా మంత్రి పంకజ్‌ ముండే వంటి వారు వ్యతిరేకించారు.ఈ సమావేశంలోనే నిక్కర్లను విప్పేసి పాంట్లు( పురాణాలు, వేదాలు, ఛాందసవాదుల ప్రకారం నిక్కరు,పాంట్లు మన సంస్కృతి కాదు) వేసుకోవాలని తీర్మానించారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ, అనుసరించే సంస్ధలు విశ్వాసాలు, నమ్మకాలు, సాంప్రదాయాల మీద కోర్టులు తీర్పు చెప్పజాలవనే వాదనను చాలా కాలంగా ముందుకు తెస్తున్నాయి. కూల్చివేసిన బాబరీ మసీదు స్ధలంలోనే రాముడు పుట్టాడని, అక్కడి రామాలయాన్ని కూల్చి బాబరు కాలంలో మసీదు నిర్మి ంచారని వాదిస్తున్నది. దానికి ఎలాంటి ఆధారాలు లేవు. విశ్వాసాలకు ఆధారాలేమిటని ఎదురుదాడికి దిగుతున్నది. బాబరీ మసీదు స్థల యాజమాన్య హక్కుల గురించి దీర్ఘకాలంగా నడుస్తున్న కోర్టు వివాదంలో అది తమకు అనుకూలంగా వస్తే ఈ శక్తులు మిన్నకుంటాయి లేకపోతే తమ విశ్వాసాలను దెబ్బతీశారంటూ ఆ తీర్పును వ్యతిరేకించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. అందుకే శబరిమల, శని సింగనాపూర్‌ వంటి వాటిని ఆసరా చేసుకొని తమ వాదనలను ముందుకు తెస్తున్నాయి. అందుకు గాను మహిళలను ముందు నిలుపుతున్నాయి.

మత ప్రాతిపదికన జనాన్ని చీల్చి అధికారానికి రావాలన్న మతోన్మాదుల ఎత్తుగడల్లో ప్రార్ధనా స్దలాలను వివాదాస్పదం చేయటం. దానిలో భాగమే రామాలయాన్ని కూల్చివేసి బాబరీ మసీదును కట్టారనటం, వారణాసిలో ఔరంగజేబ్‌ కాలంలో నిర్మించిన జ్ఞానవాపి మసీదు కాశీవిశ్వనాధుని ఆలయమని వివాదాలను రేపిన విషయం తెలిసినదే. కేరళలో పట్టు సంపాదించేందుకు శబరిమల ఆలయం మీద క్రైస్తవులు కుట్ర చేస్తున్నారనే ప్రచారం కూడా దానిలో భాగమే. ఆలయం పరిసర ప్రాంతాలలో క్రైస్తవులు ఎక్కువగా నివశిస్తున్నారు. అయ్యప్ప ఆలయ సమీపంలో పెద్ద చర్చిని నిర్మించి క్రైస్తవ యాత్రా కేంద్రంగా మార్చాలన్న కుట్ర వుందని ప్రచారం చేస్తున్నారు. నిజానికి కేరళలో క్రైస్తవం ఎన్నో శతాబ్దాల క్రితమే వ్యాపించింది. బ్రాహ్మలతో సహా అనేక నిచ్చెన మెట్ల వ్యవస్ధలో ఎగువున వున్న కులాలవారు ఎప్పుడో క్రైస్తవులుగా మారిపోయారన్నది చరిత్రలో దాగని సత్యం. తెలుగు ప్రాంతాలలో రెడ్డి, కమ్మ క్రైస్తవుల మాదిరి కేరళలో సిరియన్‌ క్రైస్తవులంటే అగ్రకులాలకు చెందిన వారే. తెలుగు ప్రాంతాలలో మాదిరి తాళిబట్టుతో సహా అనేక హిందూ సంప్రదాయాలను వారు పాటిస్తారు. సిరియన్‌ క్రిస్టియన్లు అనేక రంగాలలో ప్రముఖులుగా, ధనికులుగా వున్నారు.వారే ఆ ప్రాంతంలో చర్చి నిర్మించతలపెట్టారన్నది ఆరోపణ. బాబరీ మసీదు నిర్మాణంలో రామాలయ నిర్మాణ స్ధంభాలను వుపయోగించారని ఆధారంలేని ప్రచారం చేస్తున్నట్లే శబరిమల ఆలయానికి 20కిలోమీటర్ల దూరంలోని నీలక్కల్‌ శివాలయంలో రెండువేల సంవత్సరాల నాటి కొయ్య శిలువ బయటపడిందని, దానిని సిరియన్‌ క్రిస్టియన్‌ సమూహ ఆద్యుడు సెయింట్‌ థామస్‌ స్వయంగా తీసుకువచ్చిన 1983లో ప్రచారంలోకి వచ్చింది. సెయింట్‌ థామస్‌ చర్యను సహించని తమిళ బ్రాహ్మడు ఆయనను కత్తితో పొడిచి చంపాడని ప్రచారం చేశారు. దాన్ని నమ్మిన క్రైస్తవులు ఆ ప్రాంతాన్ని సందర్శించటంతో పాటు చర్చి నిర్మాణానికి స్ధలం కావాలని కోరారు. దానికి నిరసనగా బిజెపి నేత, ప్రస్తుతం మిజోరాం గవర్నర్‌గా వున్న కుమనం రాజశేఖర్‌ ఆందోళనకు నాయకత్వం వహించాడు.తరువాత అక్కడకు నాలుగు కిలోమీటర్ల దూరంలో అటవీ భూమిని కేటాయించారు. నిజానికి రెండువేల సంవత్సరాల నాటి కొయ్య మన దేశవాతావరణ పరిస్ధితులలో చెక్కుచెదరకుండా వుండటం అసాధ్యం. అయితే తరువాత వచ్చిన వార్తల ప్రకారం బాబరీ మసీదు ప్రాంగణంలో దొంగతనంగా రాముడి విగ్రహాన్ని పెట్టినట్లే అక్కడి శివాలయంలో శిలువను పెట్టారని తేలింది.హైదరాబాదులో హుస్సేన్‌ సాగర్‌ చెరువుకు హిందూమతశక్తులు వినాయకసాగర్‌ పేరు పెట్టినట్లుగానే క్రైస్తవమతశక్తులు అయ్యప్ప కొండను సెయింట్‌ థామస్‌ కొండగా పిలవటం ప్రారంభించారు.సెయింట్‌ థామస్‌ హత్య వాస్తవం కాదని, ఆయన ఇటలీలోని ఓర్టానాలో మరణించాడని వాటికన్‌ తరువాత వివరణ ఇచ్చింది. నిజానికి సిరియన్‌ క్రిస్టియన్లు వలస వచ్చిన వారి వారసులు కాదని, స్ధానిక బ్రాహ్మలే మతం మార్చుకున్నారని 1883లోనే ప్రచురించిన పుస్తకంలో పేర్కొన్నారు. హిందూ మతశక్తులు ఎలా కుట్రలు చేస్తున్నాయో శబరిమల ప్రాంతంలోని క్రైస్తవ మతోన్మాదులు కూడా అలాంటి వాటిలోనే నిమగ్నమయ్యారని జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

శబరిమల తీర్పు 1 : సాంప్రదాయ ముసుగులో బిజెపి-ముస్లింలీగ్‌-కాంగ్రెస్‌ బృందగానం !

07 Sunday Oct 2018

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Women

≈ Leave a comment

Tags

congress- bjp- muslim league chorus, Kerala LDF, Ready to wait, Sabarimala Entry Case, sabarimala verdict

TDB says Only real women devotees expected to visit Sabarimala temple

ఎం కోటేశ్వరరావు

శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు బెంచ్‌ మెజారిటీ (4ా1) తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో బిజెపి అనుబంధ విభాగమైన మహిళా మోర్చా,యువమోర్చా తదితర సంస్ధలు రంగంలోకి దిగాయి. ప్రదర్శనలు, ఇతర రూపాల్లో ఆందోళనలు చేయిస్తున్నాయి. మహిళలకు అనుకూలంగా వచ్చిన తీర్పులను బిజెపి ఎంత రెచ్చగొట్టినా మహిళలే వ్యతిరేకిస్తూ వీధుల్లోకి రావటం ఏమిటని అనేక మందిలో ఆశ్చర్యం, ఆవేదన, ఆందోళన కలిగి వుండవచ్చు.వేలు, లక్షల సంఖ్యలో రైతులు, కార్మికులు, వుద్యోగులు ఆందోళనలు చేస్తున్నా ఒక్క ముక్క కూడా వార్తలు, చిత్రాలను ప్రచురించని పత్రికలు వీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు అతిశయోక్తులను జోడించటం కూడా చాలా మందికి మింగుడుపడటం లేదు. సమాజం మొత్తం మీద చూసినపుడు వెనుకబడిన వారిలో మహిళలు అత్యంత వెనుకబడిన వారని, ప్రస్తుతం దేశంలో, ప్రపంచంలో వున్న పరిస్ధితులు, పరిణామాలను గుర్తిస్తే ఇలాంటి ప్రదర్శనల గురించి ఆశ్చర్యపడాల్సిన పని వుండదు. తిరోగామి భావజాల ప్రభావం సామాజికంగా వెనుకబడిన వారి మీద ఎక్కువగా వుంటుంది. మహిళలకు మినహాయింపు ఎలా వుంటుంది. అనేక వుదంతాలలో వారిని వారిని ముందుకు తెచ్చిన ఫ్యూడల్‌, ఇతర తిరోగామి శక్తులను చూశాము. అనేక ఆందోళనలు అవి రిజర్వేషన్లకు వ్యతిరేకం నుంచి దళితుల మీద దాడులు, వేర్పాటు వాదం నుంచి విచ్చిన్న వాదాల ఆందోళనల వరకు జరిగిన వాటిలో మహిళలు గణనీయంగా పాల్గనటం తెలిసిందే. అలాంటి వాటి గురించి వార్తలను గుప్పించటం, ఆందోళనలు, పోరాటాలను విస్మరించటం కార్పొరేట్‌, పాలకవర్గాల మీడియా వర్గదృష్టిలో భాగమని వేరే చెప్పనవసరం లేదు.

శబరిమల తీర్పు వివిధ రాజకీయపార్టీల, స్వచ్చంద లేదా సాంస్కృతిక సంస్ధల ముసుగులో వున్న శక్తుల బండారాన్ని, ఫ్యూడల్‌ శక్తుల సంతుష్టీకరణకు పడే తాపత్రయాన్ని బయట పెడుతున్నది. చిత్రం ఏమిటంటే మహిళల పట్ల మత విషయాలలో నాణానికి బమ్మా బరుసు వంటి బిజెపి-ముస్లింలీగ్‌ ఒకే పాట పాడుతున్నాయి, ఆ బృందగానంలో కాంగ్రెస్‌ గొంతు కలిపింది. శబరిమల ఆలయంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అడ్డుకొనేందుకు సాంప్రదాయ ముసుగు వేసుకొని రంగంలోకి దిగటమే కాదు, ఓట్ల రూపంలో సొమ్ము చేసుకొనేందుకు బిజెపి, కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌, ఇతర శక్తులు పోటీ పడుతున్నాయి. తీర్పుపై పునర్విచారణకు అప్పీలు చేయరాదని నిర్ణయించినందుకు సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నాయి. కారాలు మిరియాలు నూరుతున్నాయి. మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకతను ముఖ్యంగా మహిళ్లో రెచ్చగొట్టేందుకు పూనుకున్నాయి.ఒక కుక్కను చంపాలంటే దానికి పిచ్చిదనే ముద్రవేయాలన్నది కుటిలనీతి. ఒక పురోగామి తీర్పు, పరిణామాన్ని అడ్డుకోవాలంటే దానికి సాంప్రదాయ ముసుగువేయి అన్నది మతోన్మాద, కులోన్మాద శక్తులు, వాటికి అంటకాగే అవకాశవాద శక్తులఎత్తుగడ. వివిధ సందర్భాలలో ఇది వెల్లడైంది. మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్ష శక్తులన్నీ ఏకమైన తరుణంలో ఆచితూచి వ్యవహరించేందుకు అక్కడి వామపక్ష ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. సరిగ్గా అరవై సంవత్సరాల క్రితం ఇదే కేరళలో హిందూ, ముస్లిం, క్రైస్తవ మతసంస్ధలు, వాటి రాజకీయ ప్రతినిధులు, వారికి నాయకత్వం వహించిన కాంగ్రెస్‌కు అమెరికా గూఢచార సంస్ధ డబ్చిచ్చి మరీ విమోచన సమరం పేరుతో ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ ఆధ్వర్యాన ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సి వుంది. ఇప్పుడు శబరిమల పేరుతో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అని ఇప్పుడే చెప్పలేము గాని శాంతి భద్రతల సమస్యను సృష్టించే ప్రయత్నం కనిపిస్తున్నది. నంబూద్రిపాద్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలేమీ కమ్యూనిస్టు విప్లవ అజెండాలోనివి కాదు, ప్రజాస్వామిక స్వభావం కలిగినవే. స్వాతంత్య్రవుద్యమంలో ముందుకు వచ్చిన భూ సంస్కరణల అమలుకు పూనుకుంది. కౌలుదార్లకు రక్షణ కల్పించటం, వ్యవసాయ కార్మికుల కనీసవేతనాలు పెంచటం, ప్రయివేటు విద్యా సంస్ధలలో వుద్యోగనియామకాల క్రమబద్దీకరణ, వేతనాలను ట్రెజరీల ద్వారా చెల్లించాలని, చట్టాన్ని వుల్లంఘించిన విద్యా సంస్ధలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం వంటి సాధారణ అంశాలు మాత్రమే వున్నాయి. నిజానికి వీటి మీద వాగ్దానాలు చేయని పార్టీ లేదు. కమ్యూనిస్టు ప్రభుత్వం చేసిన ‘నేరం’ ఏమిటంటే చేసిన వాగ్దానాన్ని అమలు జరపటమే. దీనికి వ్యతిరేకంగా సర్వమత శక్తులతో పాటు నేతిబీరలో నెయ్యి మాదిరి సోషలిస్టు పార్టీల ముసుగులో వున్న శక్తులు కూడా మతశక్తులు, కాంగ్రెస్‌తో చేతులు కలిపి తమ బండారాన్ని తాము బయట పెట్టుకున్నాయి. ఇప్పుడు ఆందోళనకు దిగిన అంశం కూడా కమ్యూనిస్టు అజెండాలోనిది కాదు. చట్టబద్దమైన పాలనకు కట్టుబడడిన వారిగా శబరిమల తీర్పును అమలు జరుపుతామని ముఖ్య మంత్రి పినరయి విజయన్‌ ప్రకటించటంతో రాజకీయ లబ్ది పొందేందుకు అన్ని రకాల శక్తులు రంగంలోకి దిగాయి. గతంలో చేసిన కుట్రలను జయప్రదంగా తిప్పి కొట్టిన కమ్యూనిస్టులు ఈ సారి దానిని ఎలా అధిగమిస్తారన్నదే ఆసక్తి కలిగించే అంశం.

మన దేశంలో పురోగమన వాదానికి కమ్యూనిస్టులు, ఇతర అభ్యుదయ వాదులు, తిరోగమన వాదానికి ఆర్‌ఎస్‌ఎస్‌, దాని భావజాలంతో ఏకీభవించే బిజెపి, శివసేన, వాటిఅనుబంధ సంస్థలు, ఏది వాటంగా వుంటే ఆవైపు మొగ్గే అవకాశవాదానికి ప్రతీకలుగా కాంగ్రెస్‌, ఇతర ప్రాంతీయ బూర్జువా పార్టీలని స్థూలంగా చెప్పవచ్చు. వూహాజనితమైన, భావోద్రేకాలను రెచ్చగొట్టే అంశాలను ముందుకు తెచ్చి దేశాన్ని పట్టి పీడిస్తున్న తక్షణ సమస్యలుగా చిత్రించటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పెట్టింది పేరు. వుదాహరణకు లవ్‌ జీహాద్‌. ముస్లిం యువకులు హిందూ బాలికలను ఆకర్షించి వివాహాలు చేసుకొని ముస్లింలుగా మార్చివేస్తున్నారన్నది వాటిలో ఒకటి. అందుకోసం హిందూ కుటుంబాలన్నింటినీ కలసి దాని గురించి చెప్పాలని పిలుపునిస్తారు. వాలెంటైన్స్‌ డే రోజున ఏడాదికి ఒకసారి పార్కుల వెంట తిరిగి ప్రేమికుల కోసం వెతకటం రెండవది. ఈ బాపతు భాషలో చెప్పాలంటే రుక్మిణిని లేపుకు పోయి వివాహం చేసుకున్న కృష్ణుడిని మాత్రం ఆదర్శ పురుషుడిగా కొలుస్తారు.

మూడుసార్లు తలాక్‌ చెప్పటం ద్వారా విడాకులు చెల్లవని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో తాము ముస్లిం మహిళలను విముక్తి చేశామని, అందువలన వారంతా బిజెపికే ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. నిజానికి మహిళల పట్ల ఆ పార్టీకి లేదా దానిని సృష్టించిన ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి చిత్తశుద్ది లేదు. హిందూకోడ్‌ బిల్లు విషయంలో అదెలా వ్యవహరించింది చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ గాంధీ తరువాత భారత్‌ అనే తన పుస్తకంలో చెప్పిన అంశాల సారాంశం ఇలా వుంది. ధర్మశాస్త్రాల ప్రాతిపదికన ఏర్పడిన హిందూ చట్టాలలో జోక్యం చేసుకొనేందుకు రాజ్యాంగపరిషత్‌కు ఎలాంటి హక్కు లేదంటూ 1949లోనే ఆలిండియా యాంటీ హిందూకోడ్‌ బిల్‌ కమిటీ ఏర్పడింది. దేశమంతటా సభలు పెట్టారు. వుపన్యాసాలు చేసిన వారు, పాల్గన్న వారంతా ధర్మ యుద్ధ సైనికులుగా పోరాడతామన్నారు. ఢిల్లీ రామలీలా మైదానంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక సభను ఏర్పాటు చేసింది. హిందూ సమాజంపై బిల్లు ఆటంబాంబు వంటిదని ఒక వక్త వర్ణించాడు. రౌలట్‌ చట్టం బ్రిటీష్‌ రాజ్య పతనానికి నాంది పలికినట్లుగా ఈ బిల్లు నెహ్రూ ప్రభుత్వపతనానికి దారి తీస్తుందన్నారొకరు. మరుసటి రోజు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు రాజ్యాంగపరిషత్‌ భవనం వద్ద ప్రదర్శన చేశారు. నెహ్రూ, అంబేద్కర్‌ దిష్టిబమ్మలను తగులబెట్టారు. ఒక అంటరాని వ్యక్తికి బ్రాహ్మ ణులు కాపాడే విషయాలతో పనేమిటని కరపత్రిజీ మహరాజ్‌ అనే పెద్దగా తెలియని ఒక స్వామిజీ అంబేద్కర్‌ను వుద్దేశించి వ్యాఖ్యానించాడు. పురుషులు రెండో వివాహం చేసుకోవటం గురించి యాజ్ఞవల్క్యుడే స్వయంగా ఇలా చెప్పాడంటూ సమర్ధించాడు. దాని ప్రకారం భార్యకు నిరంతరం మద్యం తాగే అలవాటు వుంటే, పిల్లలు పుట్టరని తేలితే, మాయలాడి, పెద్ద నోరుగలది, మగ పిల్లలు లేకుండా కేవలం ఆడపిల్లలను మాత్రమే కన్నపుడు, భర్తను ద్వేషించినపుడు మొదటి భార్య జీవించి వున్నా భర్త రెండవ వివాహం చేసుకోవచ్చనిచెప్పాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం విడాకులు నిషేధం ఇలా సాగింది స్వామీజి సమర్దన. బిల్లుకు వ్యతిరేకంగా ద్వారకా పీఠ శంకరాచార్య ఒక ఫత్వా జారీచేశారు.

ఈ పూర్వరంగంలో లింగవివక్ష నివారణ, మహిళలకు సమాన స్థాయి కల్పించే లక్ష్యంతో రాజ్యాంగ పరిషత్‌ అధ్యక్షుడు అంబేద్కర్‌ నాటి ప్రధాని నెహ్రూ మద్దతుతో 1951లో హిందూ కోడ్‌ బిల్లును ప్రతిపాదించారు. దానిలో మహిళలకు వారసత్వం, విడాకులు,భరణపు హక్కులను ఇవ్వటంతో పాటు వివాహవయస్సు పెంపు, బహుభార్యాత్వానికి వ్యతిరేకత, వితంతు వివాహాలు, బాల్యవివాహాల నిరోధం వంటి అనేక పురోగామి అంశాలను దానిలో చేర్చారు. ఈ బిల్లును ఆనాడు హిందూ మహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌, నేటి బిజెపి పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్‌ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. అది హిందూ జీవన విధానాన్ని, మహోన్నతంగా నిర్మితమైన హిందూ సంస్కృతిని నాశనం చేస్తాయని నాశనం చేస్తాయని గగ్గోలు పెట్టాయి. వారికి మిగతా మితవాద సంస్థలు, కాంగ్రెస్‌లోని మితవాదులు తోడయ్యారు. ఇహ సంఘపరివార్‌ వంటి సంస్థలున్న తరువాత పుకార్లకు కొదవేముంటుంది. తన కుమార్తె ఇందిరా గాంధీ విడాకులకోసమే నెహ్రూ ఈ బిల్లును తెచ్చారని ప్రచారం చేశారు. వత్తిడికి తలగ్గిన నెహ్రూ బిల్లును వాయిదా వేయించారు. దానికి నిరసనగా అంబేద్కర్‌ రాజీనామా చేశారు. 1952తొలి పార్లమెంట్‌ ఎన్నికలలో ఆ బిల్లును ఒక సమస్యగా చేసి ప్రచారం చేసిన నెహ్రూ ఆ తరువాత 1956లో అదే బిల్లు ఆమోదానికి దోహదం చేశారు.

ఇటీవల కాలానికి వస్తే రూప్‌ కన్వర్‌ అనే ఒక 18ఏండ్ల యువతి రాజస్ధాన్‌లోని దేవరాల గ్రామంలో మరణించిన ఆమె భర్తతో కలిపి సజీవ దహనం చేశారు. అప్పట్లో వచ్చిన వార్తల ప్రకారం ఆమె తప్పించుకొని పారిపోతే అత్తమామలు, ఇతర బంధువులు లాక్కొచ్చి మరీ చితిపై పడవేశారు. ఈ దుర్మార్గాన్ని కొందరు సతికి సహకరించటంగా వర్ణించి సమర్ధించారు.దీన్ని సమర్ధించటంలోనూ, అనుకూలంగా ప్రదర్శనలు, ఆందోళనలు చేయటంలోనూ ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి వంటి మతోన్మాద సంస్ధలు ముందున్నాయని మరచిపోకూడదు.( సాంప్రదాయం ఇతరులకే గాని తమకు కాదు అన్నట్లుగా ఆ దురాచారాన్ని నిస్సిగ్గుగా సమర్ధించిన బిజెపిలో ఏ ఒక్కరు కూడా సతికి పాల్పడినట్లు మనకు ఎక్కడా వార్తలు కనిపించవు). అది రాజపుత్రుల సాంప్రదాయమని, స్వచ్చందంగానే సతికి పాల్పడతారని ప్రచారం చేశారు. ఈ వుదంతంలో కూడా కాంగ్రెస్‌ అవకాశవాద వైఖరి కనిపించింది. అందుకు పాల్పడిన వారి మీద కేసు నమోదు చేసేందుకు, తీరా నమోదు చేసినా కేసు నిలిచేందుకు వీలుగా వ్యవహరించటంలో విఫలమైంది. కేసులో సాక్షులుగా పేర్కొన్నవారు అడ్డం తిరగటంతో అది వీగిపోయింది. హిందూకోడ్‌ బిల్లును తన కుమార్తె విడాకుల కోసం నెహ్రూ తెచ్చాడని ప్రచారం చేసిన వారి వారసులే, రూపకన్వర్‌ వుదంతంలో నెహ్రూమనవడు, ప్రధానిగా వున్న రాజీవ్‌ గాంధీ పట్ల కూడా అలాగే వ్యవహరించారు. ఒక పార్సీ అయిన ప్రధాని రాజీవ్‌ గాంధీ ఒక విదేశీ మహిళను వివాహం చేసుకొని హిందూ మతాన్ని అవమానిస్తున్నారని భక్తిలాల్‌ అనే రాజస్ధాన్‌ మాజీ ఎంపీ ఒకరు బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. తరువాత సతి నిరోధక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినపుడు బిజెపి దానిని వ్యతిరేకించింది. సతి రాజపుత్రుల సంప్రదాయమని దానిని విధిగా రక్షించాలని వాదించింది.

శబరిమల ఆలయ పవిత్రతను రక్షించాలని కోరే వారిలో ఆధునిక ఛాందసవాద మహిళలేమీ తక్కువ తినలేదు. రెడీ టు వెయిట్‌ అంటే తమకు ఆలయ సందర్శన అర్హత వచ్చేవరకు(50నిండేవరకు) వేచి చూస్తాం అనే వారికి ఒక మనవి, ఒక సవినయ ప్రశ్న. ఆలయ సందర్శన మీ ఇష్టం, వెళ్లే వారిని అడ్డుకోవద్దు అని చెప్పటం తప్ప మిమ్మల్ని దేవాలయ ప్రవేశానికి బలవంతం చేసేవారెవరూ లేరు. ఇక్కడ తర్కంతో ఆలోచిస్తే ఈ నినాదం ఇచ్చేవారు ఇబ్బందుల్లో పడతారు. సాంప్రదాయాలను కాపాడాలి, పాటించాలి, అమలు జరపాలి అనే వారు ఒక్క శబరిమల ఆలయానికే పరిమితమా లేక ఇతర సాంప్రదాయాలన్నింటి విషయంలో అదే వైఖరిని కలిగి వుంటారా? సతి కూడా సాంప్రదాయమే దాని పరిరక్షించాలి, అనుమతించాలని రెడీ టు వెయిట్‌ పూర్వీకులు గతంలో ప్రదర్శనలు చేసిన విషయాన్ని వారు గుర్తుకు తెచ్చుకోవాలి. మరి ఈ విషయంలో రెడీ టు సతి బర్న్‌ (సతి చితిమంటలకు సిద్ధం) అని పిలుపిస్తారా? బహుభార్యాత్వం కూడా మన సాంప్రదాయంలో భాగమే, అందుకు కూడా సిద్దపడతారా ? పురాణ పురుషుడు కౌశికుడికి వేశ్యకొంపల వెంట తిరిగే అలవాటుంది.కుష్టువ్యాధి సోకినా ఆ బుద్ది పోలేదు, ఏకంగా భార్యనే వారి వద్దకు తీసుకుపొమ్మని చెప్పిన అంశం తెలిసిందే. తెల్లవారే సరికి మరణించాలని దారిలో మాండవ్యముని శాపానికి గురైన భర్తను రక్షించుకొనేందుకు కౌశికుడి భార్య తన ప్రాతివ్రత్యంతో సూర్యోదయాన్నే నిలిపివేయించిందట. అంత చేయకపోయినా సాంప్రదాయాలను పాటించాలి, వాటికి కట్టుబడివుండాలని చెబుతున్నవారు కౌశికుడి భార్య బాటలో నడచి భర్తలను వేశ్య కొంపల వెంట తిప్పుతారా? సూర్యోదయాన్ని ఆపలేకపోయినా కనీసం పోలీసు అరెస్టులనైనా అడ్డుకుంటారా? వుద్రేకం వివేచనను లేకుండా చేస్తుంది, అవి వేరు ఇవి వేరు అని అవకాశవాదంతో మాట్లాడకండి. ఇలాంటి వాటిని అడ్డుకుంటే తిరోగామి శక్తులు వదలి వేసిన పనికి మాలిన సాంప్రదాయాలకు ఘనత ముసుగు తొడిగి స్త్రీలను తిరిగి వెనుకటి స్ధితిలోకి నెట్టినా ఆశ్చర్య పడనవసరం లేదు. నిదానంగా ఆలోచించండి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వున్న రాయితీలనే ఎత్తి వేస్తున్నవారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తారా ?

06 Saturday Oct 2018

Posted by raomk in AP NEWS, BJP, CHINA, Current Affairs, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, USA

≈ Leave a comment

Tags

cutting down the farm subsidies, DFI, double the farmers income, India Farm Subsidies

Related image

ఎం కోటేశ్వరరావు

ప్రతి ఏటా స్విడ్జర్లాండ్‌లోని ప్రతి కుటుంబం రెండున్నరవేల ఫ్రాంక్‌లు(స్విస్‌ కరెన్సీ) దేశ వ్యవసాయ విధానాల అమలుకు మూల్యంగా చెల్లించాల్సి వస్తోందని సెప్టెంబరు రెండవ వారంలో ఒక వార్త వచ్చింది. ఇది రాసే సమయానికి ఒక ఫ్రాంక్‌ విలువ 75రూపాయలకు పైబడి వుంది. అంటే ప్రభుత్వం నుంచి ఏటా లక్షా తొంభైవేల రూపాయలు రైతాంగానికి సబ్సిడీ లేదా మరో రూపంలో అందుతున్నది. దేశ ఆర్ధిక వ్యవస్ధకు వ్యవసాయ రంగం నుంచి వస్తున్న ఆదాయం 340 కోట్ల ఫ్రాంక్‌లైతే ఆ రంగానికి దేశం ఖర్చు చేస్తున్న మొత్తం 1990 కోట్ల ఫ్రాంక్‌లుగా వుందని, ఇలా ఇంకెంత మాత్రం కొనసాగకూడదని తాజాగా ఒక సంస్ధ తన అధ్యయనంలో పేర్కొన్నది. కేంద్ర, ప్రాంతీయ ప్రభుత్వాలు నేరుగా ఇస్తున్న మొత్తాలు, పన్నుల రాయితీలు 490, దిగుమతుల ఆంక్షల కారణంగా వినియోగదారులకు ధరలు పెరిగి 460, ఎగుమతుల కోసం ఇస్తున్న రాయితీలు 310, పర్యావరణ నష్టం 730 కోట్ల ఫ్రాంక్‌ల వంతున వున్నట్లు దానిలో తేల్చారు. పురుగు మందుల వాడకం, మాంసం కోసం పెంచే పశువుల పెంపకం, మాంస పరిశ్రమల ద్వారా జరిగే పర్యావరణ నష్టాల వంటివాటిని వ్యవసాయానికి చేస్తున్న ఖర్చుగా లెక్కించారు.

ఐరోపాలో వ్యవసాయానికి రాయితీలు ఇచ్చే దేశాల వరుసలో నార్వే, ఐస్‌లాండ్‌, స్విడ్జర్లాండ్‌ మొదటి మూడు స్ధానాల్లో వున్నాయి. స్విస్‌లో వ్యవసాయ రంగానికి అవుతున్న మొత్తం ఖర్చు పైన చెప్పుకున్నట్లుగా 1990 కోట్ల ఫ్రాంక్‌లైతే ఆ రంగం ద్వారా వచ్చే మొత్తం 340 కోట్లకు వ్యవసాయ వస్తువులపై విధించే దిగుమతి పన్ను ద్వారా వచ్చే 60కోట్లను కూడా కలుపుకుంటే నికరంగా ప్రభుత్వం అంటే జనం భరించే మొత్తం 1590 కోట్ల ఫ్రాంక్‌లని, ప్రతి కుటుంబానికి 4,500 ఫ్రాంక్‌లైతే పర్యావరణ నష్టాన్ని మినహాయించి లెక్కవేస్తే 2,570 ఫ్రాంక్‌లను భరించాల్సి వస్తోందని లెక్కలు చెప్పారు. ఈ నివేదిక చదివిన,విన్న,కన్నవారు ఇంత భారం మోపి వ్యవసాయం చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది, కావాల్సినవి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే పోదా అనుకోవటం సహజం.ఈ లెక్కలు అక్కడి పాలకులకు తెలియవా ? అసలు విషయం ఏమంటే వ్యవసాయ సబ్సిడీలను ఎత్తివేయాలనేవారి కుతర్కమిది. స్విస్‌ వ్యవసాయ- ఆహార పరిశ్రమ ద్వారా ఏటా జిడిపికి 9000 కోట్ల ఫ్రాంక్‌లు సమకూరుతున్నాయి.వ్యవసాయం లేకపోతే దానికి ముడిసరకులు ఎక్కడి నుంచి వస్తాయని కొన్ని పార్టీల వారు ఆ నివేదిక మీద ధ్వజమెత్తారు. ప్రస్తుతం అక్కడ వున్న వ్యవస్ధలో పన్నెండుశాతం మంది రైతులు నష్టపోతున్నారన్నది వాస్తవమని ఒక పత్రిక రాసింది.

అయినప్పటికీ 2018ా21మధ్య 78.9 కోట్ల ఫ్రాంక్‌ల సబ్సిడీ కోత పెట్టాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.2014 వివరాల ప్రకారం అక్కడి రైతు కుటుంబం సగటున ఏడాదికి 65వేల ఫ్రాంక్‌ల రాయితీలు పొందుతున్నది. వ్యవసాయ పంటల మీద వచ్చే నిఖరాదాయం 3000 ఫ్రాంక్‌లు, ఇతర ఆదాయం 26వేలు కలుపుకుంటే మొత్తం 94వేల ఫ్రాంక్‌లు పొందుతున్నట్లు అంచనా వేశారు. 2004ా14 మధ్య సగటున అక్కడి రైతు కుటుంబాల ఆదాయం 12శాతం పెరిగింది. గమనించాల్సిన అంశం ఏమంటే వ్యవసాయం ద్వారా వచ్చే నిఖరాదాయం ఇదే కాలంలో 13 నుంచి మూడు వేల ఫ్రాంక్‌లకు పడిపోయింది. మరి పెరుగుదల ఎలా సాధ్యమైందంటే సబ్సిడీలు 37శాతం, వ్యవసాయేతర ఆదాయం 22శాతం పెరుగుదల ఫలితం. భారీ ఎత్తున సబ్సిడీలు ఇస్తున్నప్పటికీ రైతాంగంలో కొంత మంది ఇప్పటికీ దారిద్య్రంలోనే వున్నారు.మన దగ్గర దారిద్య్రం గోచిపాతరాయుళ్ల రూపంలో కనిపిస్తే అక్కడ సూటు, కోటు వేసుకొని కనిపిస్తారు. దాదాపు 50శాతం వరకు రాయితీలు పొందుతున్న రైతుల పరిస్ధితే అలా వుంటే మన దగ్గర రోజు రోజుకూ సబ్సిడీలు తగ్గిస్తున్న పాలకులు మరోవైపు రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపుతున్నారు.

తల్లికి తిండి పెట్టని వాడు పిన్నమ్మ చేతికి బంగారు గాజులు వేయిస్తానంటే నమ్మగలమా ! గతంలో రైతులకు ఇచ్చిన రాయితీలకు కోత పెడుతూ, మేం ఇచ్చిన రాయితీలు మీతో అంగీకరించిన వ్యవసాయరాబడిలో పదిశాతం మొత్తానికి లోబడే వున్నాయని ప్రపంచ వాణిజ్య సంస్ధకు సంజాయిషీ ఇస్తున్న మన పాలకులు రాబోయే రోజుల్లో రాయితీలు తగ్గించటం తప్ప పెంచే అవకాశాలు లేవని ముందుగా తెలుసుకోవాలి. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీలు పదిశాతం మేరకు పెరిగినట్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టినపుడు మీడియా పేర్కొన్నది. ఎరువుల సబ్సిడీ 64970 కోట్ల రూపాయల నుంచి 70100 కోట్లకు పెంచుతూ ప్రతిపాదించారు. దేశ స్ధూల జాతీయోత్పత్తి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది, త్వరలో చైనాను అధిగమిస్తాం, దానికి మా నరేంద్రమోడీఏ కారణమంటూ ఒక వైపు భజన సాగుతోంది. దానికి అనుగుణ్యంగా లేదా ద్రవ్యోల్బణం మేరకు రైతాంగానికి సబ్సిడీలు మాత్రం పెరగటం లేదు. 2008-09లో మిశ్రమ ఎరువులకు ఇచ్చిన సబ్సిడీ 65554 కోట్లు యూరియాకు 33940 కోట్లు మొత్తం 989494 కోట్ల రూపాయలకు గాను తాజా బడ్జెట్‌లో కేటాయింపుపైన పేర్కొన్న మొత్తం. అంటే 30వేల కోట్లకు కోత పడింది. తాజా 70వేల కోట్లలో యూరియా సబ్సిడీ 45వేల కోట్లు అయితే మిశ్రమ ఎరువులకు 25వేల కోట్లు మాత్రమే. అంటే మిశ్రమ ఎరువులు వాడే రైతుల మీద ఈ కాలంలో 40వేల కోట్ల అదనపు భారం పడుతున్నట్లే. నూతన ఎరువుల రాయితీ విధానం ప్రకారం నూట్రియంట్‌లను బట్టి రేటు నిర్ణయిస్తున్నారు.2013-14లో అంటే మోడీ అధికారానికి రాక ముందు ఎన్‌పికె,సల్పర్‌ ఎరువులను ఒక్కొక్క కిలో చొప్పున కొన్న రైతుకు రు.20.875,18.679,18.833,1.677 అంటే మొత్తం రు.60.06లను ప్రభుత్వ సబ్సిడీగా ఇచ్చింది. ఇదే ఎరువులను మోడీ హయాంలో అంటే ఇప్పుడు కొనుగోలు చేస్తే ఆ మొత్తం రు.47.96కు తగ్గిపోయింది. ఎరువుల ధరలపై నియంత్రణ ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం మార్కెట్‌ శక్తులకు వదలి వేసింది. నిర్ణీత మొత్తాన్ని రాయితీగా ఇస్తోంది. 2011-12నుంచి ఈ విధానం అమలులోకి వచ్చిన తరువాత అప్పటి నుంచి సబ్సిడీ మొత్తం 70వేల కోట్లకు అటూ ఇటూగానే వుంటోంది. రాబోయే రోజుల్లో ఒక వేళ యూరియా ధరలను పెంచితే ఇంతకంటే తగ్గవచ్చు తప్ప పెరిగే అవకాశాలు లేవు. కొన్ని ఎరువుల ధరలు ఎలా పెరిగాయో చూద్దాం. డిఏపి 2017 ఏప్రిల్‌లో టన్ను రు. 21,818, 2018 మార్చి నాటికి 23,894కు చేరింది. జూలై నెలలో 25,706 వున్నట్లు ఎరువులు, రసాయనాల శాఖ మంత్రిత్వశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు. టన్నుకు నాలుగు వేలు పెరిగింది. అన్నింటికీ ఇంత పెద్ద ఎత్తున లేనప్పటికీ గణనీయంగా పెరిగాయి.

దేశంలో వినియోగించే డీజిల్‌ ప్రతి వందలో 14 లీటర్లు వ్యవసాయానికి అవుతోంది. వ్యవసాయ వుత్పత్తులను రవాణా చేసే ట్రక్కులది కూడా కలుపుకుంటే ఇంకా పెరుగుతుంది. డీజిల్‌ ధరలపై నియంత్రణను మోడీ సర్కార్‌ ఎత్తివేసింది. నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు ఢిల్లీలో ఒక రైతు ట్రాక్టర్‌కు ఒక రోజు పది లీటర్ల డీజిల్‌ను వాడితే 2014 మార్చినెల ఒకటవ తేదీన రు 554.80 చెల్లించాడు. లీటరుకు రు.8.37 చొప్పున 83.70 సబ్సిడీ పొందాడు. అదే రైతు 2018 సెప్టెంబరు 17న అదే ఢిల్లీ బంకులో రు.738.70 చెల్లించాడు. నాలుగేండ్ల క్రితం పీపా అన్ని ఖర్చులతో 126.93 డాలర్లకు దిగుమతి చేసుకున్నాం. సెప్టెంబరు 17న 93.45 డాలర్లకే వచ్చింది. అప్పటికీ ఇప్పటికీ జరిగిన మార్పేమిటంటే దిగుమతి చేసుకున్న ముడి చమురు ధర తగ్గింది, ఇతరులతో పాటు రైతులకు వచ్చే రాయితీ ఎగిరిపోయింది, 180 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. నాలుగేండ్ల క్రితం ఒక లీటరు డీజిలుపై ఎక్సయిజు పన్ను రు.3.56, దాన్ని మోడీ గారు రు.15.33 చేశారు.

మోడీ అధికారానికి వచ్చినపుడు రూపాయి విలువ 58 అయితే ఇప్పుడు 73వరకు పతనమైంది. దీని వలన రైతాంగం వినియోగించే పురుగుమందులలో దిగుమతి చేసుకొనే వాటి ధర ఆ మేరకు పెరుగుతుంది. ఒక లీటరు మందును నాలుగు సంవత్సరాల క్రితం 58కి కొంటే ఇప్పుడు 73 చెల్లించాల్సిందే. ప్రస్తుతం మన దేశంలో వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ 45-50 మధ్యనే వుంది. రానున్న రోజుల్లో ఇంకా పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలను కొనసాగిస్తున్నాయి. అమెరికా 95, బ్రెజిల్‌ 75శాతం స్ధాయికి చేరుకుంటే డీజిల్‌ వినియోగం ఇంకా పెరుగుతుంది. వ్యవసాయ ఖర్చు తగ్గించే పేరుతో యాంత్రీకరణ, దానికి డీజిల్‌ ఖర్చు తడిచి మోపెడైతే బాగుపడేది యంత్రాలను తయారు యజమానులు, చమురు కంపెనీల వారు, పన్నులతో జనాల జేబులకు కత్తెర వేసే ప్రభుత్వం తప్ప ఇంక రైతాంగానికి మిగిలేదేముంటుంది.

Image result for double the farmers income

ఇప్పటికే వున్న సబ్సిడీలు రద్దు లేదా నామమాత్రం అవుతున్నాయి. వాటి కంటే మోయలేని కొత్త భారాలు పడుతున్నాయి. కాంగ్రెస్‌ లేదా బిజెపి ఎవరు గద్దెనెక్కినా లేదా వాటికి మద్దతు పలికి భుజాలు నొప్పి పుట్టేట్లు మోసిన ప్రాంతీయ పార్టీల వారు గానీ రైతాంగానికి, మొత్తంగా జనానికి నిజాలు చెప్పటం లేదు. మన దేశంలో ఆహార భద్రతలో భాగంగా పౌరపంపిణీ వ్యవస్ధ ద్వారా సరఫరా చేసే ఆహార ధాన్యాలకు ఇచ్చే రాయితీలు లేదా నిర్వహణకు అయ్యే ఖర్చును కూడా కొన్ని సందర్భాలలో వ్యవసాయ రాయితీలలో భాగంగా చూపుతున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్ధలో మోడీగారు ఆబగా కౌగలించుకొనే డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ ఫిర్యాదులో సారాంశమిదే. కనీస మద్దతు ధరల ప్ర కటనను కూడా రాయితీల కిందనే జమకడుతోంది. పౌర పంపిణీ వ్యవస్ధను రద్దు చేయాలని, రాయితీలు ఇవ్వాలనుకుంటే లబ్దిదార్లకు నేరుగా నగదు ఇవ్వాలని, ఎఫ్‌సిఐ ద్వారా కొనుగోళ్లను నిలిపివేసి మొత్తం వ్యాపారాన్ని ప్రయివేటు రంగానికి వదలి వేయాలన్నది అమెరికాతో సహా ధనిక దేశాలన్నీ సంస్కరణల పేరుతో కార్పొరేట్‌ కంపెనీలకు వంతపాడుతున్నాయి. అందుకు అంగీకరించిన మోడీ సర్కార్‌ తొలి దశలో కేంద్ర పాలిత ప్రాంతాలైన ఛండీఘర్‌, పాండిచ్చేరిలో చౌకదుకాణాలను ఎత్తివేసింది. క్లబ్బుడాన్సర్‌లు ఒంటి మీది దుస్తులను ఒకటకటి తొలగించే మాదిరి మన పాలకులు సబ్సిడీలను ఎత్తి వేస్తున్నారు.ఎఫ్‌సిఐకి చెల్లించాల్సిన సబ్సిడీ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం అప్పుగా మార్చివేస్తోంది. 2015-16లో లక్షా35వేల కోట్ల రూపాయలు ఆహార సబ్సిడీ కాగా మరుసటి ఏడాది దానిని లక్షా ఐదువేల కోట్లకు తగ్గించి 25వేల కోట్ల రూపాయలను జాతీయ చిన్నపొదుపు మొత్తాల నిధి నుంచి ఎఫ్‌సిఐ తీసుకున్న అప్పుగా అందచేశారు. కేటాయించిన మొత్తాలను కూడా చెల్లించకుండా బకాయి పెట్టి మరుసటి ఏడాది ఆ బకాయిలను కూడా చెల్లింపులలో చేర్చి ఆహార సబ్సిడీ మొత్తాన్ని పెంచినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

వివిధ కారణాలతో కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ మార్కెట్లో ఆహార ధాన్యాల ధరల్లో పెరుగుదల లేకపోవటం లేదా తగ్గుదల కనిపిస్తోంది. ఈ సమయంలోనే మోడీ సర్కార్‌ రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తానంటూ ముందుకు వచ్చింది. ప్రపంచ మార్కెట్‌తో పోల్చితే కొన్ని సందర్భాలలో మన దేశంలో ధరలు ఎక్కువగా వున్నాయి. అవి తమకు గిట్టుబాటు కావటం లేదని మన రైతాంగం గగ్గోలు పెడుతోంది. ఈ పరిస్ధితులలో అనేక దేశాలు తమ రైతాంగాన్ని ఆదుకొనేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. 2015లో అమెరికాలో ఒక్కొక్క రైతుకు సగటున 7,860 డాలర్లు, బ్రిటన్‌లో 28,300 పౌండ్లు, జపాన్‌లో 14,136, న్యూజిలాండ్‌లో 2,623 డాలర్లు చెల్లించగా మన దేశంలో 417 డాలర్లు మాత్రమే ఇచ్చినట్లు తేలింది. రైతుల ఆదాయాల రెట్టింపు చేయాల్సిన అవసరం, వ్యూహం, కార్యాచరణ ప్రణాళిక గురించి నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేష్‌ చంద్‌ ఒక పత్రాన్ని రూపొందించారు. 2004-05 నుంచి 2011-12 మధ్య దేశంలో వ్యవసాయదారుల సంఖ్య 16.61 కోట్ల నుంచి 14.62కోట్లకు పడిపోయింది. ఈ ధోరణే కొనసాగితే 2015-16 నుంచి 2022-23 మధ్య మరొక కోటీ 96లక్షల మంది అంటే రోజుకు 6,710 మంది వ్యవసాయం మానుకొంటారని అంచనా వేశారు. జనం తగ్గుతారు గనుక వ్యవసాయ ఆదాయం పెరుగుతుందని, కనుక సబ్సిడీలు తగ్గించవచ్చని కొందరు వాదించేవారు లేకపోలేదు.

అన్ని తరగతుల వారికీ టోకరా వేసి వచ్చే ఎన్నికలలో ఏదో విధంగా తిరిగి అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు పూనుకున్న పెద్ద మనుషులు అమాయకపు రైతాంగాన్ని వదలి పెడతారా ? 2022 అంటే మనకు స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు గడిచే నాటికి రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తామన్నది నరేంద్రమోడీ అండ్‌ కో చేసిన వాగ్దానం. దాన్ని ఎలా అమలు జరుపుతారు,ఆ దిశలో ఎంతవరకు పయనించారు అని అడుగుదామంటే కుదరదు.ఎందుకంటే ఆ పెద్దమనిషి చెప్పరు, అడుగుదామంటే మీడియాతో మాట్లాడరు. భజనపరులకు అడిగే ధైర్యం ఎలాగూ వుండదు. మౌనమునిగా మన్మోహన్‌సింగ్‌ను వర్ణించిన బిజెపి పెద్దలు తమలో అంతకంటే పెద్ద మహామౌన మునిని పెట్టుకొని లేనట్లే ప్రవర్తిస్తున్నారు. మన్మోహన్‌ సింగ్‌ పదేండ్ల పాలనా కాలంలో మూడు సార్లు మీడియాతో మాట్లాడితే నరేంద్ర ముని ఐదేండ్లలో ఇంతవరకు ఒక్కసారి కూడా నోరు విప్పలేదు. రైతు జనోద్ధారకుడిగా రాబోయే రోజుల్లో ఓటర్ల ముందుకు వెళ్లేందుకు అమలులో వున్న మూడు పాత పధకాలను కలిపి స్వల్పమార్పులతో కొత్తగా ప్రధాన మంత్రి ఆషా పేరుతో అమలు జరుపుతామని ప్రకటించారు.

రైతాంగ ఆదాయాల రెట్టింపు అన్నది ఆషామాషీ సమస్య కాదు. దానిలో ఎన్నో అంశాలు ఇమిడి వున్నాయి. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్న నేపధ్యంలో వారి బాగుకోసం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ నానాటికీ పెరుగుతున్నది. స్వామినాధన్‌ కమిషన్‌ వున్నంతలో ఒక శాస్త్రీయ సూత్రాన్ని చెప్పింది. చిత్రం ఏమిటంటే మోడీ అధికారానికి వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచినా రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేయటం గురించి ఇంతవరకు ఎలాంటి సర్వే జరపలేదు, ఒక ప్రాతిపదికను ఏర్పరచలేదన్నది పచ్చి నిజం.ఈ విషయాన్ని వ్యవసాయశాఖ సహాయ మంత్రి పురుషోత్తమ్‌ రూప్లా రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2013లో జరిపిన జాతీయ నమూనా సర్వే(ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) తప్ప తరువాత ఇంతవరకు అలాంటిది జరగలేదు. దానిలో ( 2012 జూలై 2013జూన్‌ మధ్య జరిపిన సర్వే) వ్యవసాయ రంగం పరిస్ధితి మదింపు సర్వే అంశాలనే పార్లమెంట్‌కు సమర్పించారు.

ఆ నివేదికలో వున్న అంశాలేమిటి? దేశ రైతు కుటుంబ తలసరి నెలసరి ఆదాయం రు.6,426, బీహార్‌లో అతి తక్కువ రు.3,558, పశ్చిమ బెంగాల్‌లో రు.3980, వుత్తరా ఖండ్‌లో రు.4,701 కాగా అత్యధికంగా పంజాబ్‌లో రు.18,059, హర్యానాలో రు.14,434, జమ్మూకాశ్మీర్‌లో రు.12,683 వున్నాయి. ఇక తెలుగురాష్ట్రాలకు వస్తే తెలంగాణా రు.6,311, ఆంధ్రప్రదేశ్‌ రు.5,979 చొప్పున వున్నాయి. మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో కేరళ రు.11,888, కర్ణాటక రు.8,832, తమిళనాడు రు.6,980. నాబార్డు రూపొందించిన నివేదిక ప్ర కారం 2015-16లో దేశ తలసరి కుటుంబ నెలాదాయం రు. 8,931కి పెరిగింది. అత్యధికంగా మొదటి మూడు రాష్ట్రాలైన పంజాబ్‌లో రు.23,133, హర్యానాలో రు.18,49,, కేరళలోరు.16,927 వున్నాయి. చివరి మూడు రాష్ట్రాలైన వుత్తర ప్రదేశ్‌లో 6,668,ఆంధ్రప్రదేశ్‌లో రు.6,920, ఝార్ఖండ్‌లో రు.6,991 వుంది. తెలంగాణాలో రు.8,951, తమిళనాడులో రు.9,775, కర్ణాటకలో రు.10,603గా నమోదైంది.

Image result for cutting down the farm subsidies,india cartoons

ఈ రెండు నివేదికల మధ్య ఆదాయ పెరుగుదల దేశ సగటు 39శాతం వుంది. మహారాష్ట్ర ఒక్కటే దేశ సగటును కలిగి వుంది. వివిధ రాష్ట్రాల మధ్య అంతరాలను పరిశీలిస్తే నాలుగు రాష్ట్రాలలో ఒకటి నుంచి 16.5శాతం వరకు తగ్గగా గరిష్టంగా మూడు రాష్ట్రాలలో 94.9 నుంచి 130.9శాతం వరకు పెరుగదల వుంది. దేశ సగటుకు ఎగువన తొమ్మిది రాష్ట్రాలు 39-65.7శాతం మధ్య వున్నాయి. మిగిలిన చోట్ల తక్కువ నమోదైంది. తెలంగాణాలో 41.8శాతం పెరగ్గా ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 15శాతమే వుంది. మూడు సంవత్సరాలలోనే ఇంతటి ఎగుడుదిగుడులు వున్నపుడు ఆదాయాల రెట్టింపునకు ప్రాతిపదిక దేనిని తీసుకోవాలి అన్నది సమస్య. భిన్న ప్రాంతాలు, భిన్న వాతావరణం, భిన్న పంటలు, వనరులు ఇలా అనేక అంశాలలో ఏ ఒక్క రాష్ట్రమూ మిగతావాటితో వాటితో పోల్చటానికి లేదు. ఈ పూర్వరంగంలోనే నీతి ఆయోగ్‌ తొలిసారిగా ఏడాదికేడాది రైతుల ఆదాయాన్ని మదింపు వేసేందుకు పూనుకుంది, వాటి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి వుంది. ఒక అంచనా మేరకు నిజధరల ప్రకారం ప్రస్తుతం రైతుల ఆదాయం ఏటా 3.8శాతం పెరుగుతున్నది. మరోవైపు మార్కెట్‌ ధరల ప్రకారం 11శాతం పెరుగుదల చూపుతున్నది. ఈ లెక్కన మోడీ చెబుతున్నట్లు 2022 నాటికి ఆదాయాలు రెట్టింపు ఎలా అవుతాయి? నిజధరల మేరకు ఆదాయాలు రెట్టింపు కావాలంటే రెండుదశాబ్దాలకుపైనే పడుతుంది. ఈ లోగా వచ్చే మార్పుల సంగతేమిటి?

వ్యవసాయం, పశుసంపద, చేపల పెంపకాన్ని పరిగణనలోకి తీసుకొని వ్యవసాయ ఆదాయం లెక్కలు వేస్తున్నారు. కేరళ, హిమచల్‌ ప్రదేశ్‌, వుత్తరాఖండ్‌ వంటి కొన్ని రాష్ట్రాలలో అడవి మీద ఆధారపడే వారు గణనీయంగా వున్నారు. వారిని ఎలా లెక్కిస్తారు. మిగతా రాష్ట్రాలలో అడవుల నుంచి వచ్చే ఆదాయాన్ని కలిపి వాటికి తేడాలు రావా ? ఆదాయం ఎక్కువగా వున్న పంజాబ్‌, హర్యానా, లేదా దేశ సగటుకు దగ్గరగా వున్న మహారాష్ట్రల్ల వ్యవసాయ రంగంలో సంక్షోభం కనిపిస్తున్నది. గణాంకాల ప్రకారం మధ్యప్రదేశ్‌లో ఏటా 16.5శాతం వ్యవసాయ అభివృద్ధిని సాధిస్తున్నది. చిత్రం ఏమిటంటే గిట్టుబాటు ధరలు కావాలని, రుణాల రద్దును కోరుతూ అక్కడ పెద్ద ఎత్తున రైతులు వీధుల్లోకి వచ్చారు. అందువలన అభివృద్ధి అంటే ఏమిటి? ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వే తరువాత మూడు సంవత్సరాలలో సగటున రైతుల ఆదాయం 39శాతం పెరిగిందని నాబార్డు నివేదిక చెప్పింది. ఈ కాలంలో పాత విధానాల కొనసాగింపు తప్ప ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలేమీ లేవు. ఆ నివేదికే వాస్తవం అనుకుంటే కొన్ని చోట్ల రెట్టింపు ఆదాయాలు ఇప్పటికే వచ్చాయి, మరికొన్నిచోట్ల వున్న ఆదాయాలకే గండిపడింది. వీటిని ఎలా చూడాలి? ఏనుగు ఎలా వుందని అడిగితే తలా ఒక వర్ణన చేసినట్లుగా ఎవరి అవగాహనకు అనుగుణంగా వారు నివేదికలు ఇస్తున్నట్లు మనకు స్పష్టం అవుతున్నది. దారీ తెన్నూ నిర్ధారించుకోలేని మోడీ సర్కార్‌ రైతాంగాన్ని ఎక్కడికో తీసుకుపోతోంది తప్ప ఎక్కడికి తీసుకుపోతుందో తెలియదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

497 వివాదం పురుషుల పట్ల వివక్ష మీద- తీర్పు, చర్చ మహిళల సమానత్వం గురించి !

29 Saturday Sep 2018

Posted by raomk in Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Women

≈ Leave a comment

Tags

Adultery, adultery law, IPC section 497, Supreme Court of India

Image result for adultery law : challenged by men, ruling and discussion focused on women

ఎం కోటేశ్వరరావు

‘భర్త అంటే భార్యకు యజమాని కాదు, వేరొకరి భార్యతో మరో పురుషుడు సంబంధం పెట్టుకుంటే ఆ కారణంగా విడాకులు కోరవచ్చు అది తప్పిదం తప్ప ఆ చర్య శిక్షార్హమైన నేరపూరితమైది కాదు ‘ సుప్రీం కోర్టు మన శిక్షా స్మృతిలోని 158 ఏండ్ల నాటి చట్టం చెల్లదంటూ కొట్టి వేస్తూ ఇచ్చి తీర్పు సారాంశమిది. అయితే ఈ తీర్పు వివాహితుల విశృంఖలతకు, వివాహ వ్యవస్ధ విచ్చిత్తికి దోహదం చేస్తుందంటూ ఆడమగా తేడా లేకుండా కొందరి నుంచి తీవ్ర వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.(ఈ రచయిత న్యాయ నిపుణుడు కాదు, కనుక పరిమితులు వున్నాయని గమనించ మనవి). న్యాయమూర్తులకు దురుద్ధేశ్యాలను ఆపాదించకుండా వారిచ్చే ఏ తీర్పునైనా విమర్శించ వచ్చు కనుక వారికా స్వేచ్చ వుంది. ఇక తాజా తీర్పు విషయానికి వస్తే అసలు ఈ కేసును దాఖలు చేసిన వ్యక్తి వుద్ధేశ్యం వేరు. ఇప్పుడున్న చట్టం పురుషుల పట్ల వివక్షతో కూడుకున్నదని తన స్నేహితుడు ఆత్మహత్యకు పాల్పడిన కారణంగా ఆ వివక్షను సవాలు చేస్తూ పగబట్టిన మహిళలు, వారి భర్తల నుంచి వివాహేతర సంబంధాల విషయంలో పురుషులను రక్షించేందుకు తాను కేసు దాఖలు చేసినట్లు కేరళకు చెందిన ప్రవాస భారతీయుడు జోసెఫ్‌ షైనీ చెప్పాడు. అతను ఇటలీలో ఒక హోటల్‌ నిర్వహిస్తున్నాడు. దీనిపై వెలువడిన తీర్పు, దాని మీద జరుగుతున్న చర్చ మహిళల సమానత్వం, ఇతర అంశాల చుట్టూ తిరగటం విశేషం.

రంకుతనం నేరపూరితమైనదిగా నిర్దేశించిన భారతీయ శిక్షా స్మృతిలోని 497వ సెక్షన్‌ చెల్లదని ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. భారతీయ శిక్షా స్మృతిలో రంకుతనం గురించి చెబుతున్న సెక్షన్‌ 497 ప్రకారం దానికి పాల్పడిన మహిళలను శిక్షించే అవకాశం లేదు. భర్త అంగీకారం లేకుండా అతని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పురుషుడు మాత్రమే నేరం చేసినట్లుగా అది చెబుతున్నది. ఎవరైనా రంకుతనానికి పాల్పడితే భాగస్వామి ఆ కారణంగా విడాకులు కోరవచ్చు. ఈ సెక్షన్‌ భర్తను ఒక యజమానిగా పరిగణిస్తున్నదంటూ కోర్టు కొట్టి వేసింది. రంకుతనం(వివాహేతర సంబంధం) అంటే ఒక వ్యక్తి అంగీకారం లేదా చూసీచూడనట్లుగా వుంటే తప్ప అతని భార్యతో ఎవరైతే లైంగిక సంబంధం కలిగి వున్నారో దాన్ని రంకుతనంగా పరిగణిస్తారు. అటు వంటి సంబంధం అత్యాచార నేరం కిందికి రానప్పటికీ రంకుతనపు నేరస్దుడిగా పరిగణించబడతాడు. అందుకుగాను జరిమానాతో లేదా జరిమానా లేకుండా, లేదా జరిమానాతో సహా ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. అలాంటి కేసులలో దుష్కృత్యాన్ని ప్రోత్సహించిందంటూ భార్యను శిక్షించటానికి వీలు లేదు.

ఈ భాష్యం అనేక అంశాలను ముందుకు తెచ్చింది. రంకుతనం నేరంలో దుష్కృత్యాన్ని ప్రోత్సహించిన వ్యక్తిగా వివాహిత మహిళను పరిగణించరు. అంటే రంకుతనానికి పురుషులను తప్ప మహిళలను బాధ్యురాలిగా చూడటం లేదు. వివాహంగాని ఒక మహిళ ఒక వివాహితుడితో సంబంధం పెట్టుకుంటే ఈ సెక్షన్‌ వర్తించదు. ముందే చెప్పినట్లు భర్త అనుమతించినా, చూసీచూడనట్లు వ్యవహరించినా ఆ రంకుతనం నేరం కాదు. రంకుతనానికి పాల్పడిన వ్యక్తి మీద కేసు నమోదు చేయటానికి సదరు వివాహిత మహిళ భర్తకు మాత్రమే హక్కు వుంది. సదరు పురుషుడి భార్య హక్కు గురించి ఏమీ చెప్పలేదు. అంటే ఒక మహిళ ఒక పురుషుడికి చెందినది మాత్రమే అని, ఒక వేళ ఆమె వివాహేతర సంబంధానికి అంగీకరించినప్పటికీ ఆమెకు స్వంతంగా ఎలాంటి ఆలోచనలు, అభిప్రాయాలు వుండవని సెక్షన్‌ పరిగణిస్తున్నది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 మరియు 15ను వుల్లంఘిస్తున్నదని అందువలన దాని మీద విచారణ జరపాలంటూ 2017 డిసెంబరులో సుప్రీం కోర్టు ముందు ఒక జోసెఫ్‌ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయగా సుప్రీం కోర్టు విచారణకు అనుమతించింది.

రాజ్యం ఏ వ్యక్తికీ చట్టం ముందు సమానత్వాన్ని, చట్టపరమైన సమాన రక్షణను నిరాకరించజాలదని ఆర్టికల్‌ 14 చెబుతుండగా కుల, మత, తెగ, లింగ, పుట్టిన ప్రాంతం తదితరాలు కారణాలుగా ఏ పౌరుడి పట్ల వివక్ష చూపరాదని ఆర్టికల్‌ 15చెబుతున్నది. జోసెఫ్‌ పిటీషన్‌ స్వీకరించిన కోర్టు 497 సెక్షన్‌ను సవాలు చేసిన తొలి పిటీషన్‌ ఇది కాదని 1954 నుంచీ సవాలు చేస్తున్నారు, చర్చలు జరుగుతున్నాయి, కేసులున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. పెద్ద ప్రయాస లేకుండానే దీని గురించి నిర్ణయించవచ్చని పేర్కొన్నది. చట్టాలు లింగ సంబంధంగా తటస్ధంగా వుండాలని భావించింది. పురుషుల పట్ల వివక్ష చూపుతున్నదని పిటీషన్‌దారు వాదించాడు. ఈ పిటీషనర్‌ వాదనను అంగీకరిస్తే ఇప్పటి కంటే వివాహేతర సంబంధాలు మరింత స్వేచ్చగా చెలరేగుతాయని, దీని బదులు సంస్కరణల కమిటీ సూచించినట్లుగా ‘ మరొక వ్యక్తి భాగస్వామి లేదా మరొకరితో ఎవరు లైంగిక సంబంధాలు నెరిపినా దానిని రంకుతనంగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం వాదించింది. ఆగస్టు ఒకటిన వాదనలు వినటం ప్రారంభించిన కోర్టు సెప్టెంబరు 27న ఆ సెక్షన్‌ చెల్లదంటూ ఐదుగురు సభ్యుల బెంచ్‌ తీర్పు చెప్పింది.

తీర్పు పట్ల పిటీషనర్‌ జోసెఫ్‌ హర్షం వ్యక్తం చేశారు. తన స్నేహితుడితో కలసి పని చేస్తున్న వుద్యోగిని ఒకరు ఒకరు తప్పుడు అత్యాచార ఆరోపణ చేయటంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని, ఈ వుదంతం తనను పిటీషన్‌ వేసేందుకు ప్రేరేపించిందని చెప్పాడు. మహిళలు ఇష్టపూర్వకంగానే భాగస్వాములై వుండవచ్చు, కానీ భర్తలు ఫిర్యాదు చేసినపుడు సంబంధం పెట్టుకున్న పురుషుడు బాధితుడు అవుతున్నాడు. ఇలాంటి ఫిర్యాదులు దాఖలైనపుడు పురుషుడు ఒంటరి తనం ఫీలవుతాడు. తట్టుకోలేకపోవచ్చు. ఈ సెక్షన్‌ రద్దు ఒక ప్రాధమిక చర్య, అది అనేక మార్పులకు దారి తీయవచ్చు అన్నాడు. కేరళ పురుషుల్లో రంకుతనం విచ్చలవిడిగా వున్నప్పటికీ బయటకు ఖండిస్తారు అన్నాడు.

భారతీయ సంస్కృతి ఏమౌతుందో అని ఆవేదన చెందే వారు ఈ తీర్పు వివాహేతర సంబంధాలకు ఇప్పటి వరకు వున్న బంధనాలను ఛేదించి స్వేచ్చ ప్రసాదించిందని, దీన్ని అవకాశంగా తీసుకొని స్త్రీ, పురుషులు ఇక తెగబడతారని, ఇంక పెళ్లెందుకు అని ఈసడించుకుంటున్నారు. గతాన్ని ఒకసారి అవలోకించటం అవసరం. ఇక్కడ ఇతిహాసాలు, మనుస్మృతి లేదా పురాణాల వుదంతాలను ప్రస్తావిస్తున్నామంటే అర్ధం వాటిన నమ్మిలేదా అవి మంచివి అని అర్ధం కాదు. వాటి ప్రభావం సమాజం మీద తీవ్రంగా వుందన్నది కాదనలేని వాస్తవం. కొన్ని సందర్భాలలో తమకు వాటంగా వుందనుకున్నపుడు వాటిని మన సంస్కృతిగా చూపుతూ రక్షణగా తీసుకోవటం, ఇష్టం లేనపుడు వాటికి విరుద్దంగా వాదించే అవకాశవాద వైఖరి మన సమాజంలో కనిపిస్తుంది. దాన్ని చెప్పేందుకే వాటి ప్రస్తావన పరిమితి. మిర్యాలగూడెం ప్రణయ్‌-అమృత వివాహ విషయాన్నే చూడండి.మిర్యాల గూడెం అమృత, ప్రణయ్‌ వివాహ వుదంతంలో తొమ్మిదో తరగతిలో ప్రేమ ఏమిటి అని బుగ్గలు నొక్కుకుంటున్న వారు రుక్మిణిని లేపుకుపోయి పెళ్లి చేసుకున్న సమయంలో కృష్ణుడి వయసెంతో చెబుతారా ? రుక్మిణికి 13 లేదా 14, కృష్ణుడికి 14, కొన్ని పురాణాల ప్ర కారం ఎనిమిది, 16, ఆ సమయానికి కృష్ణుడు ఇంకా సెటిల్‌ కాలేదు. సీతారాముల వివాహ సమయంలో వారి వయస్సు 12-6 సంవత్సరాలట. ఆ వుదంతాలను లట్టలు వేసుకుంటూ భక్తి పారవశ్యంతో చూస్తాం. మరి దీన్నెందుకు ద్వేషిస్తున్నాం. వారు అవతారపురుషులు అనేట్లయితే, ముందే రాసి పెట్టిన దాని ప్రకారం ఎలాగూ వివాహం అవుతుంది కదా? అంత చిన్న వయస్సులో అలా చేసుకోవాల్సిన ఖర్మేం పట్టింది. మనుస్మృతిలోని ఒక శ్లోకం ప్రకారం యుక్త వయస్సు వచ్చిన యువతి తనను చేపట్టే పెండ్లికొడుకు కోసం మూడు సంవత్సరాలు ఆగాలి. పెండ్లికొడుకులు రానపుడు ఆయువతే తనకు కావాల్సిన వాడిని చూసుకోవచ్చు.అని కామకోటి.ఓఆర్‌జిలో రాశారు.వీటన్నింటినీ చూసినపుడు చూసినపుడు ప్రణయ్‌-అమృత బాల్య వివాహం చేసుకోలేదు. చట్ట ప్రకారం వయస్సు వచ్చిన తరువాతే చేసుకున్నారు.శివుడిని తన కుమార్తె పార్వతి వివాహం చేసుకోవటం ఇష్టం లేని దక్షుడు వారిమానాన వారిని వదలి వేశాడు తప్ప శివుడ్ని చంపించేందుకు సుపారీ ఇచ్చి ఏర్పాట్లు చేయలేదే. విధి రాతను తప్పించలేం అని నమ్మేట్లయితే అందుకు విరుద్దంగా హత్య చేయించటం విధిని వెనక్కు తిప్పే ప్రయత్నమే కదా? అలాంటి మారుతీరావుకు మద్దతుగా ప్రదర్శనలు జరపటం, సామాజిక మాధ్యమాల్లో మద్దతు ప్రకటించట అంటే సమాజరీతిని వెనక్కు నడిపించాలని చూడటం తప్ప వేరు కాదు.

మహాభారతంలో పాండు రాజు ఇతరుల నుంచి పిల్లలను కనాలని కుంతిని స్వయంగా ప్రోత్సహించాడు. కుంతి తొలుత అంగీకరించలేదు. భార్య ఒక భర్తకే కట్టుబడి వుండాలన్న ఆంక్షలేవీ లేవని చెబుతాడు. ఆమె ఒకరికి పరిమితం కాకుండా ఒకరిని అనధికారికంగా ఐదుగుర్ని ఐదుగురితో అధికారికంగా కన్నదనుకోండి అది వేరే విషయం. ద్రౌపది ఆ పాండవులను ఐదుగుర్నీ భర్తలుగా చేసుకుంది. దాని వలన మన సమాజానికి హాని కలిగిందని ఎవరూ చెప్పలేదు. ఏదో ఒకసాకుతో ఆమోదించారు. వుద్ధాలకుడి కుమారుడు శేవత్‌కేతు తన తల్లి ఇతరులతో సంబంధాలను కలిగి వుండటాన్ని చూసి భార్యలు భర్తలకే పరిమితం కావాలన్న కొత్త నిబంధనను తీసుకువచ్చిన విషయమూ తెలిసిందే. భర్త చనిపోయినపుడు నియోగి విధి పేరుతో అంబిక, అంబాలిక పిల్లలను కనవచ్చని వ్యాసుడే చెప్పాడు. ఇప్పుడెవరైనా ఆ పని చేస్తే అంగీకరిస్తారా? రామాయణం విషయానికి వస్తే కొంత కాలం పరపురుషుడి పంచన వున్న ఒక మహిళ పవిత్రంగా ఎలా వుంటుందన్న మాటలు విన్న రాముడు సీత పవిత్రతను నిరూపించుకొనేందుకు అగ్ని ప్రవేశం చేయమన్న విషయం తెలిసిందే. అదే రాముడి సాయం పొందిన సుగ్రీవుడు తన భార్య రుమ వాలి చెరలో వున్నప్పటికీ ఆమె పవిత్రను నిరూపించుకోమని కోరలేదు. రాముడు కూడా దాన్ని రుద్దలేదు. మన ఇతిహాసాలు, పురాణాల ప్రకారం మహిళలు పురుషుల ఆస్తులుగానే వున్నారు తప్ప వారి ప్రత్యేక వ్యక్తిత్వాన్ని గుర్తించలేదు. మనుస్మృతి ప్రకారం ఒక మహిళ ఎగువ తరగతి కులపు వ్యక్తితో సంభోగిస్తే అది శిక్షించదగిన చర్య కాదు. అదే దిగువ కులపు పురుషుడితో చేస్తే శిక్షార్హమేకాదు ఆమెను విడిగా వుంచాలి. దిగువ తరగతి పురుషుడు ఎగువ తరగతి మహిళతో సంబంధం కలిగి వుంటే అతనికి వురి శిక్ష విధించాలి. ఎవరైనా పురుషుడు (భార్యకాని) తన స్వంతకులపు మహిళతో తన ఇచ్చ తీర్చుకుంటే అతడు ఆమెకు పరిహారం చెల్లించాలి. ఈ తీరు తెన్నులను మన గత ఘన సంస్కృతి అని కీర్తిద్దామా?

ఎవరి వాదనలు వారు, ఎవరి తర్కం వారు చెప్పవచ్చు. తమకు నచ్చని భావాలను వ్యతిరేకించటం,అసహనాన్ని ప్రదర్శించవద్దు.తమ భావాలను ఇతరుల మీద రుద్ద వద్దు. సమాజం తనకు ఆటంకం కలిగించే వాటిని నిర్దాక్షిణ్యంగా పక్కకు నెట్టివేసి ముందుకు పోతుంది. వివాహేతర సంబంధాలు నేరాలు కావని చెప్పటమంటే అలాంటి సంబంధాలు పెట్టుకోమని చెప్పినట్లు కాదు. చట్టం వున్నప్పటికీ రోజూ జరుగుతున్న అనేక నేరాలకు అవే కారణమని మనకు తెలిసిందే. అందువలన రంకుతనం అనేది చట్టం వుంటే అదుపులో వుంటుందని లేకపోతే విచ్చలవిడిగా పెరిగిపోతుందని వాదించటం అంటే మనమీద మనకే నమ్మకం లేకపోవటం. అనేక దేశాలలో ఇలాంటి బూజుపట్టిన చట్టాలు ఎప్పుడో రద్దయ్యాయి. అక్కడ వివాహవ్యవస్ధ, కుటుంబ జీవనం లేదా, నైతిక విలువలు లేవా? ఏ సమస్య మీద అయినా మధనం జరగనివ్వండి, ఎవరికి వారిని మంచి చెడ్డలను నిర్ణయించుకోనివ్వండి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d