• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: RELIGION

కరోనా వాక్సిన్‌ జాతీయవాదం- దేశ ద్రోహం – బిజెపి విపరీత పోకడ !

05 Tuesday Jan 2021

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, Health, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, RELIGION, Science, USA

≈ Leave a comment

Tags

Bjp nationalism, COVAX, vaccine controversy, Vaccine Nationalism


ఎం కోటేశ్వరరావు
అన్నీ వివాదం అవుతున్నాయి, ఛీ ఛీ, చివరికి కరోనా వాక్సిన్‌ కూడా అనుకుంటున్నారా ! అవును, ఎవరి పాత్రను వారు పోషిస్తున్నారు. వాక్సిన్‌ తయారీ తన ఆత్మనిర్భర కలను నిజం చేయటంలో శాస్త్రవేత్తల ఆతురత కనిపించిందని అని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు.
కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీశ్రీ. అలాగే ఎదుటి వారి మీద తప్పుడు ముద్రలు వేసేందుకు కూడా అతీతంగా ఏవీ కనిపించటం లేదు. ఒక కంపెనీ వాక్సిన్‌ నీటి మాదిరి సురక్షితమైనది అని ఒకరు ఎత్తిపొడిచింది. మరో కంపెనీ వాక్సిన్‌కు 60శాతం దుష్ప్రభావాలు ఉన్నా పారాసిటమాల్‌ వేసి కనపడకుండా చేసినట్లు మేం చేయం, కేవలం వంద మంది మీదనే పరీక్షించి మా ఉత్పత్తి సురక్షితం అంటే ఎలా అన్నారు మరొకరు. ఇద్దరూ కరోనా వాక్సిన్‌ తయారు చేసే బడా కంపెనీల అధిపతులే, రోడ్డెక్కి చెప్పిన మాటలే కనుక ఒకరు సీరం సిఎండి అదర్‌ పూనావాలా అయితే మరొకరు భారత్‌ బయోటెక్‌ అధినేత కృష్ణ ఎల్ల అని చెప్పుకోవటానికి మనం సిగ్గుపడనవసరం లేదు. ఏమిటీ లొల్లి, ఎవరి మాట నమ్మాలి, ఎవరిని అనుమానించాలి ? కేంద్ర ప్రభుత్వం రెండు వాక్సిన్లను అత్యవసర పరిస్ధితిలో వినియోగానికి అనుమతి ఇచ్చింది. వాటిలో ఒకదాని ప్రభావం, పరీక్షా ఫలితాల గురించి ప్రశ్నించిన వారి మీద దాడి చేస్తున్నారు.


ఔషధం, వాక్సిన్‌ ఏదైనా సరే జీవుల ప్రాణాలను కాపాడాలి తప్ప తీయకూడదు. రోగాలు, మహమ్మారుల నుంచి కూడా లాభాలు పిండుకోవటమే పరమార్ధంగా ఉండకూడదు. ఏ కంపెనీ అయినా పూర్తి వివరాలు ప్రకటించనపుడు అనేక మందికి అనుమానాలు కలగటం, వాటిని బహిరంగంగా వ్యక్తం చేయటం సహజం. అది కూడా తప్పేనా ? ఏమిటీ ఉన్మాదం ! భారత్‌ బయోటెక్‌ కంపెనీ ఉత్పత్తి వలన ప్రయోజనం-హానీ రెండు లేవని ప్రత్యర్ధి కంపెనీ సీరం సంస్ధ ప్రతినిధి చెప్పారు. అది ఆరోపణో, నిజమో జనానికి తెలియదు. దాని మీద స్పందించిన భారత్‌ బయోటెక్‌ అధిపతి కృష్ణ తన ప్రత్యర్ధి కంపెనీ ఉత్పత్తి 60శాతం దుష్ప్రభావాలు కలిగిస్తుందని చెబుతున్నారు. నిజానికి జనం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించే వారు ఇలాంటి సమాచారాన్ని ఇప్పటి వరకు ఎందుకు దాచినట్లు ? తన ఉత్పత్తి మీద విమర్శచేసిన తరువాతనే స్పందించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. రెండు వాక్సిన్ల గురించి కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. దొంగల మధ్య పంపిణీలో తేడాలు వచ్చినపుడు దొంగతనం విషయం బయటకు వచ్చినట్లుగా లేదీ వ్యవహారం !


గర్భవిచ్చిత్తి జరిగిన మానవ పిండాల నుంచి తీసిన కణాలతో తయారు చేసిన వాక్సిన్లను మన క్రైస్తవులు వేసుకోకూడదని కొందరు, పంది మాంసం నుంచి తీసి కణాలతో చేసిన వాక్సిన్లు ముస్లింలు వేసుకోకూడదని మరికొందరు టీకా తాత్పర్యాలు చెబుతున్నారు. వీరందరికంటే ముందే వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని చెప్పిన వారు ఆవు మూత్రం తాగి, ఆవు పేడ పూసుకుంటే కరోనా ప్రభావం ఉండదని, దీపాలు వెలిగిస్తే వైరస్‌ నశిస్తుందని చెప్పిన విషయాలను గుర్తుకు తెచ్చుకోవాలి. గోమూత్ర సేవనం సర్వరోగ నివారిణి అని ఊరందరికీ చెప్పిన పెద్దలు తమవద్దకు వచ్చే సరికి ఆ పని చేయకుండా బతుకు జీవుడా అంటూ కరోనా సమయంలో ఆసుపత్రుల్లో చేరుతున్న విషయం తెలిసిందే. అదే మాదిరి క్రైస్తవ, ఇస్లామిక్‌ మత పెద్దలు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలలో వాక్సిన్లు తీసుకోవచ్చని ముక్తాయింపులు పలికారు. మతాలవారు చెప్పారని వాక్సిన్లు తీసుకోకుండా జనం ఆగుతారా ?


మన దేశంలో కరోనా వాక్సిన్‌ ఎందుకు రాజకీయ వివాదంగా మారింది ? ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం మరియు ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ను మన దేశంలోని సీరం ఇనిస్టిట్యూట్‌ తయారు చేసేందుకు అనుమతులు పొందింది. మరోవైపు దేశీయంగా హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న భారతబయోటెక్స్‌ కేంద్ర ప్రభుత్వ సంస్ధ ఐసిఎంఆర్‌ మరియు వైరాలజీ జాతీయ సంస్ధతో కలసి రూపొందించి కోవాగ్జిన్‌ పేరుతో వాక్సిన్‌ ప్రయోగాలు జరుపుతున్నది. కోవిషీల్డ్‌ మూడు దశల ప్రయోగాలు పూర్తి చేసుకుంది. కోవాగ్జిన్‌ మూడవ దశ ప్రయోగాలు పూర్తయినట్లు చెబుతున్నా ఇంకా ఫలితాలు ఇంకా వెలువడలేదు. అలాంటి వాక్సిన్‌ వినియోగానికి ముందుగానే అనుమతివ్వటం ఏమిటన్న ప్రశ్నను కొందరు లేవనెత్తారు. ఇది వివాదాస్పదమైంది. దీని మీద సమర్ధనలూ, విమర్శలూ వెలువడుతున్నాయి. జనంలో గందరగోళం, వాక్సిన్ల సామర్ధ్యం మీద అనుమానాలు తలెత్తాయి. కొందరు జాతీయవాదాన్ని ముందుకు తెచ్చేందుకు పూనుకున్నారు.ఇదొక అవాంఛనీయ పరిణామం. వాక్సిన్ల తయారీ కంపెనీల మధ్య వాణిజ్య పోరుగా రాబోయే రోజుల్లో బయటపడనుందా ?

కోవాగ్జిన్‌ వాక్సిన్‌ ప్రత్యామ్నాం అని పేర్కొనటం,వినియోగానికి సంబంధించి అనేక పరిమితులను పేర్కొని అనుమతులు ఇచ్చారు. ప్రత్యామ్నాయం అంటే ఏదీ దొరకనపుడు అనే అర్ధం కూడా ఉంది. అందువలన ఈ రెండు వాక్సిన్లలో దేనిని ఎవరు వేసుకోవాలి? నిర్ణయించేది ఎవరు ? మూడవ దశ ప్రయోగాల ఫలితాలు పూర్తిగాక ముందే కోవాగ్జిన్‌కు అనుమతులు ఎలా ఇచ్చారన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తొలుత మన సైనికుల పరాక్రమాన్ని ఇప్పుడు వాక్సిన్‌ తయారీని శంకిస్తున్నారంటూ కేంద్ర మంత్రి హర్దేవ్‌సింగ్‌ పూరీ, ఇతర బిజెపి నేతలు ప్రతిపక్షాలు, ఇతరుల మీద ఎదురుదాడికి దిగటం విస్మయం కలిగిస్తోంది. అసలు ఆ కంపెనీ తరఫున వీరు వకాల్తా పుచ్చుకోవటం ఏమిటి ? ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడతారా ? కోవాగ్జిన్‌ సామర్ధ్యం గురించి ఎవరూ అనుమానాలు వ్యక్తం చేయలేదు, వివరాలు వెల్లడించకుండా నమ్మటం ఎలా అన్నదే అసలు సమస్య.


కోవాగ్జిన్‌ గతేడాది ఆగస్టు 15నాటికే అది సిద్దం అవుతుందని స్వయంగా ఐసిఎంఆర్‌ లేఖలు రాసింది. ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్య్రదినోత్సవం రోజున ప్రకటన చేసేందుకు సన్నాహాలు చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఆ గడువు పోయింది, రిపబ్లిక్‌ దినోత్సవం లోపు అయినా పరిశోధనా ఫలితాలు వస్తాయా అన్న అనుమానాలు ఉన్న సమయంలో రాకముందే ఏకంగా ముందస్తు అనుమతి ఇచ్చేశారు. కొంత మంది చెబుతున్నట్లు ఇప్పటికే దాదాపు 7 కోట్ల డోసులు తయారు చేసిన సీరం సంస్ధ నుంచి కొనుగోలు బేరసారాల వత్తిడిలో భాగంగా కోవాగ్జిన్‌ పరీక్షలు పూర్తి కాకుండానే అనుమతులు ఇచ్చారా అన్న కోణం కూడా ఉంది. ఒకవేళ అదే వాస్తవం అయితే అలాంటి విషయాలు దాగవు.


కోవాగ్జిన్‌పై అనుమానాలు వ్యక్తం చేయటమే దేశ ద్రోహం అన్నట్లుగా వ్యాఖ్యానించి బిజెపి వాక్సిన్‌ జాతీయవాదాన్ని ముందుకు తెచ్చింది. టీవీ ఛానల్స్‌ పెద్దలు కూడా ముందూ వెనుకా చూడకుండా నిర్దారణ చేసుకోకుండా తప్పుడు వార్తలను ఎలా ప్రచారం చేస్తున్నారో కూడా ఈ సందర్భంగా వెల్లడైంది. ఎవరో ఒక చిన్న విలేకరి పొరపాటు లేదా అత్యుత్సాహం ప్రదర్శించాడంటే అర్ధం చేసుకోవచ్చు. ఇండియా టీవీ అధిపతి, ప్రధాన సంపాదకుడు అయిన రజత్‌ శర్మ ఏకంగా కోవాగ్జిన్‌ టీకాను ముందుగానే 190 దేశాలు ఆర్డర్‌ ఇచ్చాయని సెలవిచ్చారు. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాలను జోడించి చెప్పే వారి మాదిరి ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడారో చూడండి.” మన దేశంలో వృద్ది చేసిన ఈ వాక్సిన్‌ బాగా పని చేస్తుంది, ధర తక్కువ, నిల్వచేయటం సులభం. ఎందుకంటే నరేంద్రమోడీ విధానాలు మన శ్స్తావేత్తల నైపుణ్యం దీనికి కారణం. వాక్సిన్‌ గురించి అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారు ముందుగానే 190 దేశాలు దీని కొనుగోలుకు ఆర్డర్లు పెట్టాయని తెలుసుకోవాలి ” అని చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన ట్వీట్‌ చేశారు. దాన్ని బిజెపి మరుగుజ్జులు పెద్ద ఎత్తున రీ ట్వీట్‌ చేశారు.


తమ ఉత్పత్తి కేంద్రాన్ని 70దేశాల ప్రతినిధులు సందర్శించారని చెప్పారు తప్ప ఆర్డర్లు బుక్‌ చేశారని భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ ఎల్లా ఎక్కడా చెప్పలేదు. అలా సందర్శించిన వారు ఆర్డర్లు పెట్టినట్లు వార్తలు కూడా లేవు. మరి రజత్‌ శర్మగారికి 190 దేశాల సమాచారం ఎలా తెలిసింది? అనేక మంది సామాన్యులు భారత్‌ బయోటెక్‌ తయారీ కోవాగ్జిన్‌ వాక్సిన్‌, ప్రపంచ ఆరోగ్య సంస్ధ కార్యక్రమమైన కోవాక్స్‌తో గందరగోళపడుతున్నారు.ప్రపంచ దేశాలన్నింటికీ చౌకగా వాక్సిన్‌ అందించేందుకు ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలో 190 దేశాలు పాలుపంచుకుంటున్నాయని, భాగస్వామ్య దేశాలన్నింటికీ రెండువందల కోట్ల డోసుల వాక్సిన్‌ అందచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు డిసెంబరు 19న ప్రకటించారు. వీటిలో అనేక దేశాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిర్దారించిన వాక్సిన్లన్నీ ఉన్నాయి. ఇరవై కోట్ల డోసులు అందించేందుకు వాక్సిన్‌ అలయన్స్‌ గవీ, ఇతర సంస్ధలు ఒప్పందం చేసుకున్నాయి. వివిధ దేశాలకు చెందిన పది వాక్సిన్‌లను ఉటంకిస్తూ అవి ఏ దశలో ఉన్నాయో కూడా ప్రకటనలో తెలిపారు. చిత్రం ఏమిటంటే వీటిలో భారత బయోటెక్స్‌ కోవాగ్జిన్‌ లేదు. త్వరలో పరీక్షలు పూర్తి చేసుకొని ప్రపంచ ఆరోగ్య సంస్ధ అనుమతి పొంది ఇది కూడా చేరుతుందా లేదా అన్నది వేరే విషయం. ఇప్పటికైతే ఎగుమతి వార్తలు లేవు.

కోవాక్స్‌ కార్యక్రమం ప్రకారం దానిలో భాగస్వామ్య దేశాలకు ఆ కార్యక్రమం కింద పంపిణీ చేసే వాక్సిన్‌లో ఆయా దేశాల జనాభాను బట్టి 20శాతం డోసులను వారికి అందచేస్తారు. వాటిని ఆయా దేశాలు ఎలా ఉపయోగించుకుంటాయి, ఎవరికైనా అందచేస్తాయా అన్నది వారిష్టం. ఉదాహరణకు చైనాలో కరోనా కేసులు లేని కారణంగా చైనా రూపొందించిన వాక్సిన్లను బ్రెజిల్‌లో ఉన్న రోగుల మీద ప్రయోగాలు చేశారు. కోవాక్స్‌ కార్యక్రమంలో చైనా భాగస్వామి కనుక దానికి వచ్చే వాటాను ఇతర దేశాలకు అందచేయవచ్చు. అమెరికా దానిలో భాగం కాదు కనుక దానికి వాక్సిన్ల కోటా ఉండదు. అదే విధంగా ఐక్యరాజ్యసమితి నిర్వచనం ప్రకారం పేద దేశాలకు సబ్సిడీ ధరలకు వాక్సిన్‌ అందచేస్తారు. బిల్‌గేట్స్‌ కూడా ఈ పధకంలో భాగస్వామి కనుక తనకు వచ్చే వాక్సిన్‌ తన సంస్ధ ద్వారా ఎవరికైనా అందచేయవచ్చు.


సమాజవాది పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ తెలివి తక్కువ ప్రకటన చేసి శాస్త్రవేత్తలను అవమానించటం తన ఉద్దేశ్యం కాదంటూ తరువాత నష్ట నివారణ చర్యలకు పూనుకున్నారు. మన దేశంలో తయారయ్యే వాక్సిన్‌ బిజెపిదని దాన్ని తాను వేసుకోనని అఖిలేష్‌ వ్యాఖ్యానించారు. నిజానికి సర్వరోగనివాణి బిజెపి వాక్సిన్‌ లేదా ఔషధం ఆవు పేడ లేదా మూత్రం అన్నది అందరికీ తెలిసిందే . ఆవు మూత్ర సేవన కార్యక్రమాల సమయంలో ఆ ప్రకటన చేసి ఉంటే అర్ధం ఉండేది. ఆవు మూత్రం, పేడ కరోనాను నివారిస్తుందని చెప్పిన బిజెపి పెద్దలు అనేక చోట్ల వాటి సేవన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇలాంటి చర్యల ద్వారా మన వైద్యులు, శాస్త్రవేత్తలను అవమానించిందీ, ఇప్పటికీ అవమానిస్తున్నదీ కాషాయ దళాలే.
భారత బయోటెక్‌లో తయారు చేస్తున్నది ఆవు (మూత్రపు) శాస్త్రవేత్తలు కాదు. దాని మూడవ దశ ప్రయోగ ఫలితాలు ఇంకా రాలేదు కనుక వేసుకోను అన్నా అదొకరకం. ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి జిల్లాలోని ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గాల ఎంఎల్‌సి ఎన్నికల్లో బిజెపిని ఓడించి ఊపుమీద ఉండటం, వాక్సిన్‌ తయారీని తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు భ్రమ కల్పించేందుకు నరేంద్రమోడీ పూనా, హైదరాబాద్‌లోని ఆ సంస్దలను సందర్శించిన నేపధ్యంలో సమాజవాద పార్టీ నేత బిజెపి వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు ఆ వ్యాఖ్య పనికి వస్తుందని భావించి ఉండవచ్చేమోగాని, శాస్త్రవేత్తలను కించపరచాలనే ఉద్దేశ్యం ఉంటుందని చెప్పలేము. అఖిలేష్‌ యాదవ్‌ తెలివి తక్కువ ప్రకటన చేస్తే బిజెపి నేతలు తక్కువేమీ తినలేదు. వివరాలు లేని వాక్సిన్‌ సామర్ద్యాన్ని ప్రశ్నించటం దేశద్రోహం అనేంతవరకు వెళ్లారు.


వాక్సిన్లను స్వదేశీ-విదేశీ అని వర్ణించటం అర్ధంలేని విషయం. విదేశాల్లో రూపొందించిన వాక్సిన్లు, ఔషధాలను మన దేశంలోని సంస్ధలు తయారు చేయటమే కాదు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.ఇదొక వ్యాపారం. భారత్‌ బయోటెక్‌ సంస్ధకు ప్రపంచంలో అతి పెద్ద వాక్సిన్‌ వ్యాపారి బిల్‌ గేట్స్‌కు, అంతర్జాతీయ ఫార్మా లాబీకి ఉన్న వ్యాపార లావాదేవీల వివరాలు జనానికి తెలియకపోవచ్చుగానీ వారి సంబంధాలు బహిర్గతమే. ఏదో ఒక రూపంలో ఆ సంస్ధ బిల్‌గేట్స్‌, ఇతర సంస్ధల నుంచి నిధులు పొందింది. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తున్న డయేరియాకు ఉపయోగించే రోటోవాక్‌ వాక్సిన్‌ సామర్ధ్యం 56శాతమే అని, దాని మూడవ దశ ప్రయోగ ఫలితాలు ఇప్పటికీ అందుబాటులో లేవనే విమర్శలు ఉన్నాయి. ఈ వాక్సిన్‌ కొనుగోలుకు ఆ సంస్దతో బిల్‌ గేట్స్‌ ఒప్పందం ఉంది. దాన్ని ప్రభుత్వాలకు అంటగట్టి ప్రజారోగ్య కార్యమ్రాలలో వినియోగిస్తున్నారనే విమర్శలున్నాయి. బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌, అంతర్జాతీయ వాక్సిన్‌ లాబీ కంపెనీలు సరఫరా చేస్తున్న నాసిరకం లేదా ప్రభావం లేని వాక్సిన్ల కారణంగా ప్రపంచ వ్యాపితంగా 3.8కోట్ల మంది శిశువులు పుట్టక ముందే మరణించారనే విమర్శలు ఉన్నాయి.మన దేశంతో సహా అనేక దేశాలలో వాక్సిన్ల దుష్ప్రభావాలకు తయారీ కంపెనీల నుంచి పరిహారాన్ని కోరే చట్టాలు లేవు. ఈ నేపధ్యంలోనే కోట్లాది మందికి వేయదలచిన వాక్సిన్‌ గురించి భారత్‌ బయోటెక్‌ వివరాలు వెల్లడి చేయక ముందే అనుమతి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తాయి.

వాక్సిన్‌పై తలెత్తిన వివాదం ”సమాచార మహమ్మారి ” ని మరింత ఎక్కువ చేయనుందనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. ఎన్ని మహమ్మారులను అయినా ఎదుర్కొనగలంగానీ అంతకంటే వేగంగా తప్పుడు, నకిలీ వార్తలను వ్యాపింప చేసే సమాచార మహమ్మారి వైరస్‌ ఎంతో ప్రమాదకరమని ఆ రంగంలోని పెద్దలు చెబుతున్నారు. దీని గురించి ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరించింది. ఇప్పుడు కరోనా-వాక్సిన్‌ కూడా వివాదం అయింది కనుక దేన్నీ గుడ్డిగా నమ్మవద్దని సవినయమనవి. చివరిగా ఒక విషయం మరచి పోకూడదు. కరోనా వైరస్‌ గురించి తెలిసిన వెంటనే ప్రపంచంలోని అనేక మంది దాని నివారణకు వాక్సిన్‌ తయారీకి పూనుకున్నారు. మన దేశంలో తొలి వైరస్‌ కేసు బయటపడి, లాక్‌డౌన్‌ విధించిన రెండు నెలల తరువాత కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర కార్యక్రమం ప్రకటించింది. అది ఆర్ధిక ఉద్దీపన కార్యక్రమం అని అందరికీ తెలుసు. ఇప్పుడు వాక్సిన్‌ తయారీ ఆ కార్యక్రమ కల అని దాన్ని శాస్త్రవేత్తలు నెరవేర్చారని ప్రధాని చెప్పటంలో నిజాయితీ ఎంతో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు మన వాక్సిన్‌ సామర్ధ్యాన్ని ప్రశ్నించటం దేశవ్యతిరేక వ్యాఖ్యలు తప్ప మరొకటి కాదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్దన్‌, మరొక మంత్రి హరదేవ్‌ సింగ్‌ పూరీ వ్యాఖ్యానించారు. కలికాలం, వైపరీత్యం గాకపోతే బిజెపికి నచ్చని వారందరికీ ఈ ముద్ర తగిలిస్తారా ! ఏమిటీ అనారోగ్యపు వ్యాఖ్యలు !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

101 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎల్‌డిఎఫ్‌ ఆధిక్యత – వచ్చే ఎన్నికలలో నూతన అధ్యాయం !

20 Sunday Dec 2020

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Others, Political Parties, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

#Kerala CPI(M), #Pinarayi Vijayan, Kerala BJP, Kerala CPI(M), Kerala Local Body Election Results 2020, LDF, UDF


ఎం కోటేశ్వరరావు
కేరళ స్ధానిక సంస్దల ఎన్నికలలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ సాధించిన విజయానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. అటు కాంగ్రెస్‌, ఇటు బిజెపి కూటములు రెండూ శబరిమల వివాదం, ప్రమాదవశాత్తూ ఏనుగు మృతి, బంగారం స్మగ్లింగ్‌ ఉదంతం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియరి బాలకృష్ణన్‌ కుమారులు కేసుల్లో ఇరుక్కొని అరెస్టు కావటాన్ని అవకాశంగా తీసుకొని ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు, రాజకీయంగా సొమ్ము చేసుకొనేందుకు, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన నేపధ్యంలో సాధించిన విజయం సామాన్యమైంది కాదు.


ప్రాధమికంగా వెల్లడైన విశ్లేషణలను బట్టి కరోనా సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు జరిపిన ఆహార కార్యక్రమం, కరోనా చికిత్సలో చూపిన ప్రత్యేక శ్రద్ద, అవకాశవాద రాజకీయాలకు పాల్పడకుండా మత శక్తుల పట్ల అనుసరించిన సూత్రబద్దవైఖరి జనామోదం పొందింది కనుకనే ఎల్‌డిఎఫ్‌ విజయం సాధ్యమైంది.పైన పేర్కొన్న అంశాలతో పాటు యుడిఎఫ్‌ కూటమి నుంచి బయటకు వచ్చి ఎల్‌డిఎఫ్‌లో చేరిన కేరళ కాంగ్రెస్‌(ఎం) వర్గం కారణంగా దాని ప్రభావం కేరళ మధ్య జిల్లాల్లో విజయావకాశాలను పెంచింది. స్ధానిక సంస్ధల ఎన్నికలు కేరళలో సరికొత్త పరిణామాలకు తెరలేపినట్లు చెప్పవచ్చు. ప్రతిపక్షాలు చేసిన ప్రచారంతో ఊగిసలాడిన ఓటర్లు, గతంలో మద్దతుదార్లుగా ఉండి ఎల్‌డిఎఫ్‌కు దూరమైన వారు ఈ పరిణామంతో తిరిగి చేరువ కావచ్చు. ప్రజాభిప్రాయాన్ని మరింతగా కూడగట్టేందుకు వివిధ తరగతుల నుంచి సూచనలు పొందేందుకు ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పదమూడు జిల్లాల పర్యటన ఖరారైంది. మరొక జిల్లా కార్యక్రమాన్ని రూపొందించవలసి ఉంది. రానున్న రోజుల్లో ఎల్‌డిఎఫ్‌ మరిన్ని కార్యక్రమాలను రూపొందించి, అందరికంటే ముందుగానే ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దం అవుతోంది.


గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో ఒక సారి ఎల్‌డిఎఫ్‌ కూటమి అధికారానికి వస్తే మరోసారి యుడిఎఫ్‌ రావటం ఒక ఆనవాయితీగా మారింది. వచ్చే ఎన్నికలలో ఓటర్లు దానికి మంగళం పాడతారని ఇప్పటికే కొందరు వ్యాఖ్యానించటం ప్రారంభించారు. ఎన్నికల నాటికి అసాధారణ పరిస్దితులు ఏర్పడితే తప్ప ఎల్‌డిఎఫ్‌ ఇదే విజయ పరంపరను కొనసాగించవచ్చని, వరుసగా రెండో సారి ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అధికారానికి రావచ్చని భావిస్తున్నారు. తాజా ఎన్నికలలో కొత్తగా కేరళ కాంగ్రెస్‌(ఎం) వచ్చి చేరింది. ఎల్‌డిఎఫ్‌లోని కొన్ని పార్టీలు తమ సీట్ల గురించి ఆందోళన చెంది కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికలలో సీట్ల పంపిణీ, ఐక్యంగా పని చేయటంలో అదెక్కడా కనిపించలేదు. ఇదే సర్దుబాటు అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఉంటుందనే భావన వ్యక్తం అవుతోంది. మరోవైపు ప్రతిపక్ష యూడిఎఫ్‌లో కుమ్ములాటలు బజారున పడ్డాయి. ఫ్రంట్‌కు ఎవరు నాయకత్వం వహించాలో, ఏమి చేయాలో రెండవ భాగస్వామ్యపక్షమైన కాంగ్రెస్‌కు మార్గనిర్దేశనం చేయటం కాంగ్రెస్‌ దుస్దితిని తెలియ చేస్తోంది. మరోవైపు మత అజెండాను ముందుకు తెచ్చినా భంగపడిన బిజెపి తాను తిరిగి గెలుచుకున్న పాలక్కాడ్‌ మున్సిపల్‌ కార్యాలయంపై శ్రీరాముడి చిత్రం ముద్రించిన కాషాయ జెండాను ఎగురవేయటం, దానికి అభ్యంతరం తెలపటంపై అది చేస్తున్న వాదనల ద్వారా తన అజెండాను మరింతగా ముందుకు తీసుకుపోయేందుకు నిర్ణయించిందన్నది స్పష్టం.

స్ధానిక సంస్ధల ఎన్నికలలో అత్యధిక చోట్ల పార్టీలు పూర్తి మెజారిటీ సాధించాయి. మరికొన్ని చోట్ల ఏ పార్టీకీ మెజారిటీ రాని పరిస్ధితి ఏర్పడింది. ఎన్నికైన సభ్యులు పాలకవర్గాలను ఎన్నుకొనేందుకు ఈ నెల 21, 22 తేదీలలో సమావేశం కానున్నారు. కీలకంగా మారిన వార్డు సభ్యులు ఏ వైఖరి తీసుకుంటారనేదానిని బట్టి కొన్ని మున్సిపాలిటీలు, పంచాయతీలపై ఎవరి ఆధిపత్యం ఏర్పడ నుందో తేలుతుంది. ఇప్పటి వరకు స్పష్టమైన మెజారిటీలు వచ్చిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బ్రాకెట్లలో ఉన్న ప్లస్‌, మైనస్‌లు గత ఎన్నికల కంటే ఎక్కువ, తక్కువలుగా గమనించాలి. రెండు కార్పొరేషన్లలో పెద్ద పక్షంగా ఎల్‌డిఎఫ్‌ ఉంది. కేరళ ఎన్నికల నిబంధనల ప్రకారం హంగ్‌ ఏర్పడినపుడు అవసరమైతే రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. తొలుత సీట్లు సంపాదించిన పార్టీలన్నీ పోటీ చేయవచ్చు. సగం కంటే ఎక్కువ మెజారిటీ ఎవరికీ రాకపోతే మొదటి రెండు స్దానాలలో ఉన్న పార్టీలు రెండవ సారి పోటీ చేయాల్సి ఉంటుంది. పోటీలో లేని పార్టీలు ఓట్లు వేయవచ్చు లేదా ఓటింగ్‌కు దూరంగానూ ఉండవచ్చు. అప్పుడు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారికే పదవి దక్కుతుంది. కేరళలో ఉన్న రాజకీయ సమీకరణల నేపధ్యంలో స్వతంత్రులు ఏ వైఖరి అయినా తీసుకోవచ్చు గానీ ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌, బిజెపి పార్టీలు ఒకరికి వ్యతిరేకంగా మరొకర్ని బలపరిచే పరిస్ధితి లేదు. ఈ కారణంగానే రెండు కార్పొరేషన్లలో ఎల్‌డిఎఫ్‌ పెద్ద పక్షంగా అవతరించినందున అక్కడ కూడా వారే విజయం సాధిస్తారనే భావనతో మీడియాలో ఎల్‌డిఎఫ్‌ ఐదు మేయర్‌ స్దానాలను గెలుచుకున్నట్లు రాస్తున్నారు. జిల్లా పంచాయతీలలో ఒక చోట ఎల్‌డిఎఫ్‌ పెద్ద పార్టీగా అవతరించగా మరొక చోట రెండు కూటములకు సమానంగా స్ధానాలు వచ్చాయి.
స్ధానిక సంస్ధలు××××× ఎల్‌డిఎఫ్‌×××యుడిఎఫ్‌×××ఎన్‌డిఏ×××ఇతరులు×××హంగ్‌××× మొత్తం
గ్రామపంచాయతీలు×× 514(-2) ×××321(-51) ××19(+5) ×× 23(+15) ×× 64 ××× 941
బ్లాక్‌ పంచాయతీలు×× 108(+20)××× 38(-24) ×× 0(0) ×× 0(-5) ×× 6 ××× 152
జిల్లా పంచాయతీలు×× 10(+3) ××× 2(-3) ×× 0(0) ×× 0(0) ×× 2 ××× 14
మున్సిపాలిటీలు ×××× 35 ××× 39 ×× 2(+1) ×× 3 ×× 7 ××× 86
కార్పొరేషన్లు ×××× 3 ××× 1 ×× 0(0) ×× 0 ×× 2 ××× 6
వివిధ స్ధానిక సంస్ధలలో వార్డుల వారీగా వచ్చిన సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి. బ్రాకెట్లలో ఉన్న ప్లస్‌, మైనస్‌లు గత ఎన్నికల కంటే ఎక్కువ, తక్కువలుగా గమనించాలి.
స్ధానిక సంస్ధలు××××× ఎల్‌డిఎఫ్‌-××××యుడిఎఫ్‌×××××ఎన్‌డిఏ×××××ఇతరులు××× మొత్తం
గ్రామపంచాయతీలు×7,262(-361) ×5,893(-431) ×1,182(+249) ×1,620(+542) ×15,962
బ్లాక్‌ పంచాయతీలు ×1,266(+178) ××727(-190) ×× 37(+16) ×× 49(-4) ××× 2,080
జిల్లా పంచాయతీలు×× 212(+42) ××110(-35) ×× 2(-1) ××××× 6(+2) ×××× 331
మున్సిపాలిటీలు ××1,167(-96) ×× 1,173(-145) ×× 320(+84) ××416(+157) ××3,076
కార్పొరేషన్లు ××× 207(+11) ×× 120(-23 ×× 59(+8) ×× 27(+3) ××× 414
పై వివరాలను పరిశీలించినపుడు వెల్లడైన ధోరణులు ఇలా ఉన్నాయి. గ్రామ పంచాయతీలలో ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌ రెండూ 792 స్ధానాలు కోల్పోగా వాటిలో ఇతరులు 542 సాధించగా బిజెపికి పెరిగింది 249, బ్లాక్‌ పంచాయతీలలో కాంగ్రెస్‌ కోల్పోయిన 190లో ఎల్‌డిఎఫ్‌ 178, బిజెపి 16 అదనంగా సాధించింది. మున్సిపల్‌ వార్డులలో ఎల్‌డిఎఫ్‌, యూడిఎఫ్‌ కోల్పోయిన 241 స్ధానాలలో ఇతరులు 157 పొందగా బిజెపి 84 అదనంగా సాధించింది. కార్పొరేషన్‌ వార్డులలో యుడిఎఫ్‌్‌ 23 కోల్పోగా ఎల్‌డిఎఫ్‌ 11, బిజెపి 8, ఇతరులకు మూడు అదనంగా వచ్చాయి. ఈ ఎన్నికలలో తిరువనంతపురం కార్పొరేషన్‌తో పాటు పది మున్సిపాలిటీలు, 40 గ్రామ పంచాయతీలలో విజయం సాధిస్తామని బిజెపి చెప్పుకున్నది. ఏమి జరిగిందో చూశాము. ప్రత్యామ్నాయ శక్తిగా నిలుస్తామని చెప్పిన బిజెపి కంటే ఇతరులు ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌లు కోల్పోయిన స్ధానాలను ఎక్కువగా పొందారు. శబరిమల ప్రాంతంలోని పండలం మున్సిపాలిటీని బిజెపి అదనంగా సంపాదించింది. స్ధానిక ఎన్నికలలో గతంలో గెలిచిన స్ధానాలను కొన్నింటిని పోగొట్టుకోవటం, కొత్తవాటిని సాధించిన ఉదంతాల గురించి ప్రతి పార్టీ పరిశీలన జరుపుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో లోటు పాట్లను సరి చేసుకొనేందుకు ప్రయత్నించటం సహజం.
గత 2015స్దానిక సంస్ధలు, 2016 అసెంబ్లీ, 2019లోక్‌సభ ఎన్నికలు, తాజా 2020 స్ధానిక సంస్ధల ఎన్నికలలో పొందిన ఓట్ల శాతాల తీరు తెన్నులు ఎలా ఉన్నాయో చూద్దాం.
కూటమి××××× 2015 ×××× 2016×××× 2019×××× 2020
ఎల్‌డిఎఫ్‌×××× 37.4 ×××× 43.48 ××× 36.29 ××× 41.6
యుడిఎఫ్‌×××× 37.2 ×××× 38.81 ××× 47.48 ××× 37.1
బిజెపి ××× 13.3 ×××× 14.96 ××× 15.64 ××× 14.5
ఇతరులు ×××× 12.1 ×××× 2.75 ××× —– ××× 6.8
పైన పేర్కొన్న వివరాల ప్రకారం గత నాలుగు ఎన్నికలలో బిజెపి ఓట్లశాతాలలో పెద్ద మార్పు లేదు.(2011 అసెంబ్లీ ఎన్నికలలో 138 స్ధానాల్లో పోటీ చేసిన ఆ పార్టీకి 6.06శాతం ఓట్లు వచ్చాయి) అయినా స్ధానిక ఎన్నికలలో గతం కంటే అదనంగా వచ్చిన కొన్ని స్ధానాలను చూపి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన పోటీ తమకు ఎల్‌డిఎఫ్‌కు మధ్యనే ఉంటుందని బిజెపి నేతలు చెప్పుకోవటం గమనించాల్సిన అంశం. శబరిమల ఉదంతం, బంగారం స్మగ్లింగ్‌ కేసులను ఉపయోగించుకొని లబ్దిపొందేందుకు అటు మతాన్ని, ఇటు కేంద్రంలోని అధికారాన్ని వినియోగించుకొని ఎల్‌డిఎఫ్‌పై బురద చల్లేందుకు చేసిన యత్నాలు బహిర్గతమే. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయావకాశాల గురించి ఈ ఎన్నికలు ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. 2016 అసెంబ్లీ ఎన్నికలలో కూటముల వారీ సాధించిన స్ధానాలు, 2019 లోక్‌ ఎన్నికలు, 2020 స్ధానిక ఎన్నికలలో వచ్చిన ఓట్లను బట్టి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎవరిది పై చేయిగా ఉందో దిగువ చూద్దాం. 2016 వివరాలలో బ్రాకెట్లలో ఉన్న అంకెలు అంతకు ముందు అసెంబ్లీ స్ధానాలతో పోల్చితే అదనంగా తెచ్చుకున్నవీ, కోల్పోయినవని గమనించాలి.
ఏడాది ××××××× ఎల్‌డిఎఫ్‌ ××××× యూడిఎఫ్‌×××××× బిజెపి
2016 ×××××× 91(+23) ×××××× 47(-25) ×××××× 1(+1)
2019××××××× 16 ×××××× 123 ×××××× 1
2020××××××× 101 ×××××× 38 ××××××× 1
గత లోక్‌ సభ ఎన్నికలలో అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏడు చోట్ల బిజెపి రెండవ స్ధానంలో ఉంది, తాజా స్ధానిక ఎన్నికల్లో ఐదు చోట్ల రెండవ స్ధానంలో ఉంది.2016లో ఒక స్వతంత్ర అభ్యర్ధి ఎంఎల్‌ఏగా గెలిచారు. లోక్‌సభ ఎన్నికలకూ ఇప్పటికీ పరిస్ధితిలో వచ్చిన మార్పును, కాంగ్రెస్‌కు తగిలిన పెద్ద ఎదురుదెబ్బనూ ఈ వివరాలు వెల్లడిస్తున్నాయి. 2015 స్ధానిక సంస్ధల ఎన్నికల నాటికి యుడిఎఫ్‌ అధికారంలో ఉంది. ప్రతిపక్ష ఎల్‌డిఎఫ్‌కు యుడిఎఫ్‌ మధ్య ఓట్ల తేడా అసెంబ్లీ ఎన్నికలలో యుడిఎఫ్‌ కంటే ఎల్‌డిఎఫ్‌ ఓట్ల శాతం కేవలం 0.2శాతమే ఎక్కువ. తాజా ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌ అధికారంలో ఉండి, ప్రతిపక్షాలు ఎన్ని వ్యతిరేక ప్రచారాలు చేసినా యుడిఎఫ్‌ కంటే 4.5శాతం ఓట్లు ఎక్కువగా తెచ్చుకుంది. కనుకనే 101 అసెంబ్లీ సెగ్మెంట్లలో పై చేయి సాధించింది. ఇదే ఆదరణను ఎల్‌డిఎఫ్‌ నిలుపు కుంటే కొన్ని సీట్లు అటూ ఇటూ అయినా తిరిగి 2021 ఎన్నికలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే కేరళలో ఎల్‌డిఎఫ్‌ కొత్త చరిత్రకు నాంది పలికినట్లే అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డాగా తెలంగాణా గడ్డను మారుస్తారా ?

06 Sunday Dec 2020

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Telangana

≈ 1 Comment

Tags

AIMIM, BJP, GHMC election 2020, trs


ఎం కోటేశ్వరరావు
ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగుదామంటే ఎల్లవేళలా సాధ్యం కాదు.అందునా రాజకీయ పార్టీలకు అసలు కుదరదు. హైదరాబాద్‌ మహానగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు ప్రధాన పార్టీలన్నింటికీ ఒక కొత్త సవాలును ముందుకు తెచ్చాయి. దాన్ని ఏ పార్టీ ఎలా ఎదుర్కొంటుంది అన్నదాన్ని బట్టి వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల మీద ఒక తీవ్ర ప్రభావం చూపనుంది. హైదరాబాదు జనాభా రీత్యా రాష్ట్రంలో మూడోవంతు కలిగి ఉంది. తెలుగు ప్రాంతాల నుంచే గాక దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి స్ధిరపడిన, వలస వచ్చిన జనం ఇక్కడ ఉంది. ఈ నేపధ్యంలోనే తప్పించుకు తిరిగితే కుదరని స్ధితి ఏర్పడిందని చెప్పాల్సి వస్తోంది.
జిహెచ్‌ఎంసి ఫలితం తీరు తెన్నులు ఏమిటి ?
గత ఎన్నికలకు, వర్తమాన ఎన్నికలకు పోలికను చూడటం సహజమే అయినప్పటికీ అనేక అంశాలు ఒకదానితో ఒకటి పోల్చుకొనేందుకు వీలు లేదు. గత ఎన్నికల్లో బిజెపి తన మిత్రపక్షం తెలుగుదేశంతో కలసి 63 స్ధానాల్లో పోటీ చేసింది, ఈసారి అన్ని సీట్లకు పోటీ చేసింది. మజ్లిస్‌ పార్టీ గత ఎన్నికల్లో 60 చోట్ల పోటీ చేయగా ఈ సారి 51కే పరిమితం అయింది. అందువలన వచ్చిన సీట్లు, ఓట్లశాతలను పోల్చుకోలేము. టిఆర్‌ఎస్‌ అన్ని స్ధానాలకు కాంగ్రెస్‌ 146 చోట్ల పోటీ చేసింది. పార్టీల వారీ టిఆర్‌ఎస్‌ 55, బిజెపి 48, మజ్లిస్‌ 44, కాంగ్రెస్‌ రెండు సీట్లు తెచ్చుకుంది. ఒక స్ధానం ఫలితం ఖరారు కావాల్సి ఉంది. గత, తాజా ఎన్నికల్లో పార్టీల వారీ వచ్చిన ఓట్ల శాతాలు ఇలా ఉన్నాయి.
పార్టీ 2016 ——- 2020
టిఆర్‌ఎస్‌ 43.85 ——- 34.9
బిజెపి 10.34 ——– 34.6
మజ్లిస్‌ 15.85 ——– 18.28
కాంగ్రెస్‌ 13.11 ——— 6.5
టిడిపి 15.10 ——— 1.61
గత ఎన్నికల ఫలితాలు ఏమి వెల్లడించాయి ?
గత ఏడాది జరిగిన మున్సిపల్‌ ఎన్నికలలోనే కారు వేగం తగ్గటాన్ని చూశాము. మున్సిపల్‌ ఎన్నికలతో పాటు ఇతర ఎన్నికలు, పార్టీల వారీ ఓటింగ్‌ ఇతర అంశాలను క్లుప్తంగా చూద్దాం.
2019లో గ్రామీణ స్థానిక సంస్థలైన మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ ఘనవిజయాలు సాధించింది. మొత్తం 32 జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవులను టిఆర్‌ఎస్‌ దక్కించుకుంది. 537 జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే, టిఆర్‌ఎస్‌ 448 స్థానాలు (83.42 శాతం) దక్కించుకుంది. కాంగ్రెస్‌ కేవలం 75 స్థానాలు (13.96 శాతం), బిజెపి 8 స్థానాలు (0.14శాతం) దక్కించుకోగలిగాయి.
రాష్ట్రంలో మొత్తం 5,817 మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు (ఎంపిటిసి) ఎన్నికలు జరగగా, టిఆర్‌ఎస్‌ 3,556 స్థానాలు (61.13) దక్కించుకుంది. కాంగ్రెస్‌ 1,377 స్థానాలు (23.67 శాతం), బిజెపి 211 స్థానాలు (3.62 శాతం) గెలుచుకోగలిగాయి. మొత్తం 537 మండల పరిషత్‌ అధ్యక్ష పదవులకు గాను, టిఆర్‌ఎస్‌ 431, కాంగ్రెస్‌ 72, బిజెపి 6 చోట్ల ఎంపిపిలుగా గెలిచారు.
2016లో జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్‌ ఘనమైన రికార్డు విజయం సాధించింది. 150 వార్డులకు గాను, టిఆర్‌ఎస్‌ పార్టీ 99 స్థానాలు, ఎంఐఎం 44 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్‌ పార్టీ రెండు, బిజెపి 4, టిడిపి 1 స్థానం పొందాయి. జిహెచ్‌ఎంసి చరిత్రలో ఒక రాజకీయ పార్టీగా టిఆర్‌ఎస్‌ ఇన్ని స్థానాలు దక్కించుకోవడం, ఎవరితో పొత్తు లేకుండానే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ స్థానం దక్కించుకోవడం అదే మొదటి సారి.
2018 డిసెంబర్లో 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ ఏకపక్ష విజయం సాధించి, రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ 46.87 శాతం ఓట్లు సాధించి, 88 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్‌ పార్టీ 28.43 శాతం ఓట్లు పొంది, 19 స్థానాలు గెలుచుకుంది. బిజెపి 6.98 శాతం ఓట్లు పొంది, కేవలం ఒకే సీటుకు పరిమితం అయింది. ఎంఐఎం 2.71 శాతం ఓట్లు పొంది, 7 స్థానాలు గెలుచుకుంది.
2019 పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్రమోడీ హవా, బిజెపి ప్రభావం కనిపించినా తెలంగాణలో మాత్రం టిఆర్‌ఎస్‌ ఆధిక్యం కొనసాగింది. 17 లోక్‌ సభ స్థానాలున్న తెలంగాణలో టిఆర్‌ఎస్‌ పార్టీ 41.71 శాతం ఓట్లు సాధించి 9 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్‌ పార్టీ 29.79 శాతం ఓట్లతో 3 స్థానాలు, బిజెపి 19.65 శాతం ఓట్లతో 4 స్థానాలు, ఎంఐఎం 2.8 శాతం ఓట్లతో ఒక సీటు గెలిచింది. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ఓటింగ్‌ శాతం అసెంబ్లీతో పోలిస్తే ఐదుశాతం తగ్గగా కాంగ్రెస్‌ ఒకశాతం ఓట్లను పెంచుకుంది. బిజెపి అసాధారణంగా పన్నెండుశాతానికి పైగా ఓట్లు పెంచుకుంది. తరువాత జరిగిన గ్రామీణ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో లోక్‌సభలో వచ్చిన ఓట్లకు అనుగుణ్యంగా దానికి సీట్లు రాలేదు.
గ్రామీణ ఎన్నికలు జరిగిన ఆరు నెలల్లోపే పట్టణ ప్రాంతాల్లో కారు వేగం బాగా తగ్గింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి తెరాసకు 41.14శాతం, కాంగ్రెస్‌కు 19శాతం, బిజెపికి 17.80శాతం, మజ్లిస్‌కు 4.17 రాగా ఇతరులకు 17.86 శాతం వచ్చాయి.
మున్సిపాలిటీల వారీ పార్టీల ఓట్లశాతాలు
పార్టీ 50శాతంపైన 40-50 30-40 20-30 10-20 10శాతం కంటే తక్కువ
తెరాస 28 ———- 71 —– 20 —– 0 —— 1—— 1
కాంగ్రెస్‌ 1 ———- 10 —– 35 —– 30 —- 26 —- 18
బిజెపి 0 ———— 3 ——- 4 —– 14 —- 40 —- 59
మజ్లిస్‌ 0 ———— 0 ——- 2 ——- 1 —– 2 —- 40
–ఇతరులు 1 ———— 2 —— 11 —– 17—-48 —- 41

పురపాలక సంఘాలలోని 2727 వార్డులలో తెరాసకు 1579 అంటే 57.87శాతం, కాంగ్రెస్‌కు 541(19.80) ఇతరులు 300(11.01) బిజెపి 236(8.61) మజ్లిస్‌ 71(2.60) సీట్లు వచ్చాయి. కార్పొరేషన్ల విషయానికి వస్తే కరీంనగర్‌ మినహా తొమ్మిదింటిలో 325 స్ధానాలకు గాను తెరాస 152(47.38) బిజెపి 66(20.30), ఇతరులు 49(15.07) కాంగ్రెస్‌ 41(12.61) మజ్లిస్‌ 17(5.29) తెచ్చుకున్నాయి. మున్సిపల్‌, కార్పొరేషన్ల ఫలితాలను కలిపి చూస్తే తెరాసకు 52.62, కాంగ్రెస్‌కు 16.2, బిజెపికి 14.45 శాతం వచ్చాయి. గ్రామీణ ఎన్నికల్లో మండల ప్రాదేశిక నియోజక వర్గాలను ప్రాతిపదికగా తీసుకుంటే తెరాస సీట్ల శాతం 61.13 నుంచి 52.62కు పడిపోయింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ బలం 23.67 నుంచి 16.2కుతగ్గింది, మరోవైపు బిజెపి 3.62 నుంచి 14.45శాతానికి పెంచుకుంది, ఇదే సమయంలో బిజెపి అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని లోక్‌సభ ఎన్నికల నుంచీ చెబుతున్న బిజెపి ఆ స్ధితిలో లేదని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. పార్టీ 2727 మున్సిపల్‌ స్ధానాల్లో 2025 చోట్ల పోటీ చేసింది. 120 పురపాలక సంఘాలకు గాను 45, తొమ్మిదింటిలో రెండు కార్పారేేషన్లలో అసలు ఖాతాయే తెరవలేదు. కాంగ్రెస్‌ విషయానికి వస్తే 14 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో ప్రాతినిధ్యం పొందలేకపోయింది. కరీంనగర్‌ లోక్‌సభ స్ధానానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ కుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో 60 స్ధానాలకు గాను టిఆర్‌ఎస్‌ 36, దానితో ఉండే స్వతంత్రులు నలుగురు, బిజెపి 13, మజ్లిస్‌ 6,స్వతంత్ర ఒకరు ఉన్నారు.

రాబోయే రోజుల్లో బిజెపి వ్యూహమేమిటి ?
బిజెపి హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో తన వనరులను అన్నింటినీ కేంద్రీకరించటంతో పాటు తన మత అజెండాను పూర్తిగా ముందుకు తీసుకు వచ్చింది. మత పరమైన భావోద్వేగాలను గరిష్ట స్ధాయిలో రేపేందుకు అది ప్రయత్నించింది. ఎన్నికల ఫలితాలపై చర్చలలో ఆ పార్టీ ప్రతినిధులు వెలిబుచ్చిన అభిప్రాయాలను మొత్తంగా చూస్తే ఈ అజెండాను రాష్ట్ర వ్యాపితంగా ముందుకు తీసుకుపోవటం ద్వారా 2023 లేదా దానికి ముందే ఒక వేళ జమిలి ఎన్నికలను రుద్దితే 2022లో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలలో విజయం సాధించాలనే ఆశ, ఆకాంక్షలను అది దాచుకోలేదు. దుబ్బాక ఉప ఎన్నిక తరువాత హైదరాబాదులో వచ్చిన విజయాలతో రానున్న రోజుల్లో ప్రచారదాడిని మరింతగా పెంచనుంది. మజ్లిస్‌ను పరోక్షంగా ప్రోత్సహించి లబ్ది పొందుతుంది తప్ప ప్రత్యక్షంగా సంబంధాలను తీసుకొనే అవకాశాలు లేవు. ఒక రాష్ట్ర అధికారం వేరు ఒక కార్పొరేషన్‌ పరిధి వేరు.

కాంగ్రెస్‌ భవితవ్యం ఏమిటి ?
ఆంబోతుల మధ్య లేగ దూడలు నలిగిపోయినట్లుగా కాంగ్రెస్‌ పరిస్దితి తయారైంది. దుబ్బాకలో చివరి నిమిషం వరకు అభ్యర్ధిని తేల్చుకోలేకపోవటంలోనే దాని బలహీనత వ్యక్తమైంది. హైదరాబాదు కార్పొరేషన్‌ ఎన్నికలలో అలాంటి పరిస్ధితి లేదు. అంతర్గత విబేధాలు వెల్లడయ్యాయి. బిజెపి-మజ్లిస్‌-తెరాసలతో పోటీ పడి అది ప్రచారం నిర్వహించలేకపోయింది. సంఖ్యరీత్యా గతంలో ఉన్న రెండు సీట్లు నిలుపుకున్నా గణనీయంగా ఓట్లను కోల్పోయింది. ఆ పార్టీలో ఇప్పుడు మిగిలేవారు ఎందరు అన్నది ప్రశ్న. ఆ పార్టీకి ఓటు వేసి గెలిపించినా దానిలో ఉంటారనే విశ్వాసం ఓటర్లలో కోల్పోవటం ఒక ప్రధాన కారణం. పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమకుమార్‌ ఎప్పుడో తప్పుకుంటానని ప్రకటించినా ఆ స్ధానంలో మరొకరిని భర్తీ చేయలేని పార్టీ తీరా పూర్తిగా కాడి పడవేసిన తరువాత కూడా వెంటనే నిర్ణయం తీసుకోలేని బలహీనతతో అది ఉంది.

చౌరాస్తాలో ఉన్న టిఆర్‌ఎస్‌ కారు !
టిఆర్‌ఎస్‌ కారుకు దుబ్బాకలో ఓడిపోయిన దాని కంటే హైదరాబాద్‌లో గెలిచినా పెద్ద దెబ్బతగిలింది. నాలుగు రోడ్ల (చౌరాస్తా) కూడలిలో నిలిచింది.ఇది స్వయంకృతం. ఇప్పుడు అది ఏ దారిలో వెళ్లనుంది అన్నదే కీలకమైన ప్రశ్న. హైదరాబాదు ఓటర్లు ఇచ్చిన తీర్పు రాష్ట్ర రాజకీయాలను కొత్త బాట పట్టించేందుకు దోహదం చేశాయి. ఇప్పటి వరకు ఇతర పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలను ఆకర్షించి దెబ్బతీసిన ప్రశ్నించే వారు లేకుండా చూసుకోవాలని భావించిన ఆ పార్టీ ఇప్పుడు రాబోయే రోజుల్లో తన వారిని నిలుపుకొనేందుకు ఏ విధంగా ప్రయత్నిస్తుందన్న ప్రశ్నను ఈ పరిణామం ముందుకు తెచ్చింది. హైదరాబాద్‌ను చూపి బిజెపి తెరాస-కాంగ్రెస్‌ నేతలకు గాలం వేస్తున్నది. మజ్లిస్‌తో అది ఆడిన క్రీడ ఇప్పుడు అడుగడుగునా మజ్లిస్‌కు లొంగలేదు అని నిరూపించుకోవాల్సిన పరిస్ధితిని తెచ్చి పెట్టింది. మేయర్‌ ఎన్నికలో అది పోటీ చేసినా, చేయకుండా బేషరతు మద్దతు ఇచ్చినా తెరవెనుక ఏదో జరిగిందనే జనం భావించే స్దితిని స్వయంగా కల్పించుకుంది.

మజ్లిస్‌ ఏమి చేయనుంది ?
ఇతర రాష్ట్రాలలో బిజెపి వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు బిజెపి బి టీమ్‌గా పోటీలోకి దిగుతున్నదనే విమర్శ మజ్లిస్‌ మీద ఉంది. దాని వలన లబ్దిపొందిన తీరును మహారాష్ట్ర, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో చూశాము.మరికొన్ని చోట్ల కూడా అదే పాచికను ప్రయోగించవచ్చు. అయితే తెలంగాణా- ప్రత్యేకించి హైదరాబాదులో ఉన్న పరిస్ధితి వేరు. మజ్లిస్‌, ముస్లిం మైనారిటీలను బూచిగా చూపి బిజెపి మెజారిటీ మతానికి చెందిన వారిని తన ఓటు బ్యాంకుగా మార్చుకొనేందుకు ఎప్పటి నుంచో నిరంతరం ప్రయత్నిస్తోంది. బిజెపి ప్రచారంతో మజ్లిస్‌ తన స్ధానాన్ని పటిష్ట పరచుకుంది. రెండు మతశక్తులు రంగంలోకి దిగినపుడు జరిగే పరిణామం ఇదే. ఇప్పుడు మజ్లిస్‌ను ఒక అంటరాని పార్టీగా చేయటంలో బిజెపి ప్రచారం విజయవంతమైంది. ఎన్నికల ప్రచారంలో బిజెపి అంత తీవ్రంగా గాకపోయినా మజ్లిస్‌ను కూడా టిఆర్‌ఎస్‌ విమర్శించక తప్పలేదు. మజ్లిస్‌ మాత్రం టిఆర్‌ఎస్‌ మీద ఎలాంటి దాడి చేయలేదు. ఈ పరిణామాన్ని బిజెపి ఉపయోగించుకుంది. మజ్లిస్‌ను ఉపయోగించుకొని లబ్ది పొందేందుకు గతంలో అధికారంలో ఉన్న ప్రతి పార్టీ ప్రయత్నించింది. ఇదే టిఆర్‌ఎస్‌ కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చేసింది. ఒక విధంగా చూస్తే ఇప్పుడు మజ్లిస్‌ కూడా ఇరకాటంలో పడింది. అధికారం లేకుండా అది ముస్లింలను తనతో ఉంచుకోలేదు. గొంతెమ్మ కోరికలు కోరి తెగేదాక లాగకపోవచ్చు. ఒక ఎత్తుగడగా ఈ ఎన్నికలో వాటా కోరకపోవచ్చు. డిప్యూటీ మేయర్‌ లేదా కొంతకాలం మేయర్‌ పదవితో దానికి వచ్చే ప్రయోజనం కంటే బేషరతు మద్దతుతోనే ఎక్కువ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించవచ్చు.

ఇప్పుడేమి జరగనుంది ? ఏమి చేయాలి ?
హైదరాబాదు మేయర్‌ కంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగానే అన్ని పార్టీలు వ్యవహరించటం అనివార్యం. రాజకీయాల్లో దేశద్రోహులుగా లేదా దేశద్రోహశక్తులకు మద్దతు ఇచ్చిన పార్టీలని తాను విమర్శించిన వాటితో చేతులు కలపటానికి బిజెపికి ఎలాంటి అభ్యంతరం లేదు. కాశ్మీరులో పిడిపితో కలసి సంకీర్ణ మంత్రివర్గంలో పాల్గొనటమే దానికి పెద్ద నిదర్శనం. అలాంటి పార్టీకి మజ్లిస్‌తో చేతులు కలపటం పెద్ద సమస్య కాదు. అయితే అలంకార ప్రాయమైన మేయర్‌ పీఠం కంటే ముఖ్యమంత్రి గద్దె మీద బిజెపి కేంద్రీకరించినందున ప్రస్తుతానికి మజ్లిస్‌తో చేతులు కలిపే అవకాశాలు లేవు. మజ్లిస్‌తో చేతులు కలిపిందనే ప్రచారాన్ని నగర ఓటర్లు అనేక మంది నమ్మిన కారణంగానే గతంలో టిఆర్‌ఎస్‌కు ఓటు వేసిన వారు ఇప్పుడు బిజెపి వైపు మొగ్గారు. అలాంటపుడు మజ్లిస్‌తో చేతులు కలిపితే బిజెపికి మొదటికే మోసం వస్తుంది.
మేయర్‌ పీఠాన్ని టిఆర్‌ఎస్‌ దక్కించుకొనేందుకు ఉన్న అవకాశాలు ఏమిటి ? హాజరైన సభ్యులలో మెజారిటీ తెచ్చుకున్న పార్టీకి మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పీఠాలు దక్కుతాయి. తమ మధ్య ఎలాంటి అవగాహన లేదు అని చెప్పుకొనేందుకు మజ్లిస్‌ ఓటింగ్‌ను బహిష్కరించవచ్చు లేదా అది కూడా పోటీ పెడితే బిజెపి కూడా పోటీ చేయవచ్చు లేదా ఓటింగ్‌కు దూరంగా ఉండవచ్చు. ఏది జరిగినా టిఆర్‌ఎస్‌కు పీఠం ఖాయం. గత ఎన్నికల్లో టిర్‌ఎస్‌కు సంపూర్ణ మెజారిటీ ఉన్న కారణంగా రెండు పదవులనూ అదే దక్కించుకుంది. మజ్లిస్‌తో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంటే బిజెపి పన్నిన వలలో చిక్కినట్లే. పరోక్షంగా మద్దతు తీసుకున్నా బిజెపి దాడి ఆగదు.
తెలంగాణా వ్యాప్తంగా ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు అనువైన భౌతిక పరిస్ధితులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మీద అసంతృప్తి పెరిగితే ఇలాంటి మితవాద భావాలు ఓటర్ల మీద బలంగా ప్రభావం చూపుతాయి. అది హైదరాదు నగరం మీద ఉన్నంత తీవ్రంగా ఇతర ప్రాంతాల మీద ఉంటుందని చెప్పలేము. చారిత్రక నేపధ్యం, రజాకార్‌ వారసత్వం, గతంలో ఇక్కడ జరిగిన మతకలహాలు, రాజకీయ పార్టీల అవకాశవాదం దీనికి కారణం. హైదరాబాదులో మజ్లిస్‌ పార్టీ గూండాయిజం నుంచి రక్షణ కల్పించేది తామే అనే బిజెపి ప్రచారం దశాబ్దాలుగా పధకం ప్రకారం సాగుతోంది. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందన్నట్లుగా అనేక మంది ఆ ప్రచారానికి లోనుకావటం కూడా తాజా ఎన్నికల్లో బిజెపి పుంజుకోవటానికి దోహదం చేసింది. ముఖ్యంగా మజ్లిస్‌ ప్రభావం ఎక్కువ ఉన్న పరిసర ప్రాంతాల్లోనే బిజెపి ఎక్కువ సీట్లు గెలుచుకోవటం లేని ప్రాంతాలలో టిఆర్‌ఎస్‌ విజయం సాధించటం దానికి ఒక సూచిక అని చెప్పవచ్చు.
టిఆర్‌ఎస్‌-బిజెపి మధ్య తెరవెనుక అవగాహన ఉందన్నది గతంలో ఆ పార్టీ సభ్యులు పార్లమెంట్‌లో, వెలుపల రాష్ట్ర ప్రభుత్వం అనుసరించి వైఖరి స్పష్టం చేసింది. బిజెపితో రాజీపడి తమ జోలికి రాకుండా చూసుకోవాలన్నది టిఆర్‌ఎస్‌ నేతల అవకాశవాదం. అదే విధంగా మజ్లిస్‌ను బుజ్జగించే వైఖరితోనే ఆ పార్టీ నేతల రెచ్చగొట్టే ప్రసంగాలు, చర్యల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవటం లేదని బిజెపి చేస్తున్న ప్రచారదాడిని ఎదుర్కోవటంలో చట్టపరంగా, రాజకీయంగా కెసిఆర్‌ సర్కార్‌ అచేతనంగా ఉందని జనం భావిస్తున్నారు. తాము పార్లమెంట్‌లో బిజెపికి మద్దతు ఇచ్చి తప్పు చేశామనే టిఆర్‌ఎస్‌ నేతలు బహిరంగంగానే వ్యక్తం చేసినా రాజకీయంగా నిర్దిష్ట వైఖరిని తీసుకోలేదు. నవంబరు 26జాతీయ సమ్మెకు చివరి నిమిషంలో మద్దతు ప్రకటించింది.డిసెంబరు ఎనిమిదవ తేదీ భారత్‌ బంద్‌లో సంపూర్ణంగా పొల్గొనాలని రెండు రోజులు ముందుగానే కెసిఆర్‌ ప్రకటించారు. బిజెపి తమ గద్దెకు ఎసరు తెస్తోందని నిర్ధారించుకున్నట్లుగా ఇది సూచిస్తున్నది.
ఇక మజ్లిస్‌తో తమకు తెరచాటు అవగాహన లేదని నిరూపించుకొనే బాధ్యత టిఆర్‌ఎస్‌ మీద ఉంది. దాని వలన లబ్ది పొందేది కూడా అదే. తమకు ఎలాంటి సంబంధాలు లేవని చెబుతున్నా నిజమాబాద్‌ కార్పొరేషన్‌లో దాని సహకారంతోనే మేయర్‌ పదవిని దక్కించుకుంది. కనుక చెప్పే మాటలను అంత తేలికగా నమ్మటం కష్టం. ఎలా నిరూపించుకుంటారో ఆ పార్టీయే నిర్ణయించుకోవాలి. చిత్తశుద్ధి ఉంటే అదేమీ కష్టం కాదు. నిజంగానే అదే జరిగితే ఏం జరుగుతుంది ? రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలు గతంలో ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా ఇటీవల టిఆర్‌ఎస్‌ వైపు ఉన్నారు. మజ్లిస్‌తో సంబంధాలను తెంచుకుంటే ఆ పార్టీ ఇతర రాష్ట్రాలలో తన అభ్యర్ధులను పోటీ పెట్టి మైనారిటీల ఓట్లను చీల్చి బిజెపికి లబ్ది చేకూర్చినట్లే ఇక్కడ కూడా చేసేందుకు అవకాశం లేకపోలేదు. బిజెపి మెజారిటీ మతతత్వాన్ని వ్యతిరేకించినట్లే మజ్లిస్‌ మైనారిటీ మతతత్వాన్ని కూడా నిఖరంగా వ్యతిరేకిస్తే కోల్పోయిన ఓట్లలో కొన్నింటిని తిరిగి తెచ్చుకోవచ్చు. ఇదే విధంగా అసంతృప్తి చెందిన వివిధ తరగతుల సమస్యలను పరిష్కరిస్తే వారి మద్దతును కూడా తిరిగి పొందటం కష్టం కాదు. ప్రభుత్వం మీద ఒకసారి అసంతృప్తి ప్రారంభమైతే ఎన్ని సంక్షేమ పధకాలను అమలు జరిపినా అవి ఓట్లు తెచ్చి పెట్టవు అని ఇప్పటికైనా టిఆర్‌ఎస్‌ నాయకత్వం గుర్తించటం అవసరం. ఎవరు అధికారంలోకి వచ్చినా అమలు జరుపుతున్న సంక్షేమ పధకాలను కొనసాగిస్తారు కనుక తమకు ఇష్టమైన వారికి ఓటు వేసుకోవచ్చనే అభిప్రాయం ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ఓటర్లలో కనిపిస్తోంది. రోజులు గడిచే కొద్దీ అది మరింత స్ధిరపడుతుంది. కొత్తది ఏదైనా సాధారణ స్దాయికి చేరిన తరువాత దాని మీద ఆకర్షణ తగ్గి కొత్త అంశాల మీద కేంద్రీకరిస్తారు. ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగింది అదే. చంద్రబాబు నాయుడి సర్కార్‌ అమలు జరిపిన పధకాలేమీ తక్కువ కాదు, చివరి నిమిషంలో ముందుకు తెచ్చిన పసుపు-కుంకమ కంటే వైసిపి పార్టీ ఎక్కువగా అమలుజరుపుతుందని జనం భావించారన్నది స్పష్టం.
హైదరాబాదు ప్రచారంలో అభివృద్ది అంశాల కంటే మత అంశాలనే ఎక్కువగా ముందుకు తెచ్చారు. తెలంగాణాలో సంక్షేమ పధకాలతో పాటు మతోన్మాద భావాలను కూడా బిజెపి జమిలిగా ముందుకు తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణా రాష్ట్రసమితి, ఆ పార్టీ నాయకత్వం తమ వైఖరులను మార్చుకొని సామరస్యతగా మారుపేరుగా ఉన్న రాష్ట్రాన్ని ఇదే బాటలో నడిపిస్తారా ? అవకాశ వాదం, తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి మెజారిటీ-మైనారిటీ మతశక్తుల అడ్డాగా మారుస్తారా ? టిఆర్‌ఎస్‌కు అగ్ని పరీక్ష ఎదురైంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తనిష్క ”ఏకత్వం”పై హిందూత్వ రంధ్రాన్వేషకుల దాడి !

15 Thursday Oct 2020

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Hindutva cynics trolling, Tanishq Ekatvam ad


ఎం కోటేశ్వరరావు


హిందూ – ముస్లిం ఐక్యత ఇతివృత్తంతో టాటా గ్రూపు ఆభరణాల కంపెనీ తనిష్క రూపొందించిన ఒక వాణిజ్య ప్రకటనను వివాదాస్పదం కావించారు. దాంతో కంపెనీ దాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. తొలుత తమ ప్రకటనపై వ్యతిరేక, అనుకూలతలను వ్యక్తం చేసే వ్యాఖ్యలకు అవకాశం లేకుండా చేసింది. తరువాత ఏకంగా ప్రకటనను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే భారత ప్రకటనల ప్రమాణాల మండలి(ఎఎస్‌సిఐ) వెంటనే ఒక ప్రకటన చేస్తూ తనిష్క ప్రకటన ఏ ప్రమాణాలనూ ఉల్లంఘించనందున దాని మీద చేస్తున్న ఫిర్యాదులు నిలిచేవి కాదని, కావాలనుకుంటే ప్రకటనదారులు ప్రసారం చేసుకోవచ్చని పేర్కొన్నది. తనిష్క ప్రకటనలో ఎలాంటి అసభ్యత లేదా అసహ్యకరమైనదేమీ లేదని పేర్కొన్నది. ప్రకటనలు, మీడియా రంగంలో ఉన్న అనేక సంస్దలు ఇదే విధమైన మద్దతును ప్రకటించాయి. అయినా హిందూత్వశక్తులు దాడులకు దిగుతాయనే భయంతో ప్రకటనను వెనక్కు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
కొందరి మనోభావాలు దెబ్బతినటాన్ని గమనంలో ఉంచుకొని తమ ఉద్యోగులు, దుకాణ సిబ్బంది, భాగస్వాముల సంక్షేమం దృష్ట్యా ప్రకటనను వెనక్కు తీసుకుంటున్నట్లు తనిష్క తెలిపింది. గుజరాత్‌ రాష్ట్రంలోని కచ్‌ జిల్లా గాంధీ ధామం పట్టణంలోని తనిష్క దుకాణంలో ఈ మేరకు ఒక ప్రకటనను కంపెనీ అంటించింది. దుకాణంపై కొందరు దాడికి దిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే కొంత మంది దుకాణం వద్దకు వెళ్లి ప్రశ్నించారు తప్ప దాడి లేదా దుకాణ ధ్వంసం గానీ జరగలేదని, ఫోన్లద్వారా అనేక మంది నిరసన తెలిపారని పోలీసులు చెబుతున్నారు. ఈ దాడిని పలువురు నెటిజన్లు, ఖండించారు. ఈ ప్రకటనపై వెల్లడైన ధోరణి ఆందోళన కలిగిస్తున్నదని, ప్రకటనను రూపొందించిన వారికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు అడ్వర్టైజింగ్‌ క్లబ్‌ ప్రకటించింది.


ఇటీవలి కాలంలో రంధ్రాన్వేషణ చేసే శక్తులు ప్రతి దానిలో హిందూత్వకు హాని జరుగుతోందంటూ మనోభావాలను రెచ్చగొట్టేందుకు ఏ అవకాశాన్నీ వదులుకోవటం లేదు. గర్భిణీతో ఉన్న హిందువు అయిన కోడలికి ఒక ముస్లిం కుటుంబం హిందూ సాంప్రదాయ ప్రకారం సీమంతం జరపటం, ఆ సందర్భంగా కోడలికి తనిష్క ఆభరణాన్ని బహుకరించే 44 సెకండ్ల ప్రకటనను తనిష్క కంపెనీ తయారు చేయించి విడుదల చేసింది. ముస్లిం యువకులు కుట్రతో హిందూ యువతులను ప్రలోభ పెట్టి వివాహాలు చేసుకొనటాన్ని -లవ్‌జీహాద్‌- ప్రోత్సహించేదిగా, ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చేదిగా ప్రకటన ఉందంటూ కొందరు నెటిజన్లు సామాజిక మాధ్యమంలో దాడికి దిగితే గాంధీ ధామం, ముంబై తనిష్క దుకాణాల వద్ద మతశక్తులు గుమికూడి నిరసన తెలిపినట్లు వార్తలు వచ్చాయి.


అనేక మంది బిజెపి అగ్రనేతల కుమార్తెలు హిందువులను వివాహాలు చేసుకున్నారు. పోనీ వారేమీ చదువు సంధ్యలు లేని లేదా మంచీ చెడ్డలు తెలియని వారు కాదు. అదే విధంగా కొందరు బిజెపి పెద్దలు ముస్లిం మతానికి చెందిన యువతులను తమ కుమారులకు ఇచ్చి వివాహాలు చేసినవారు కూడా ఉన్నారు. హిందూ అమ్మాయిలను ముస్లింలు చేసుకోవటం తప్ప హిందూ అబ్బాయిలు ఎంత మంది ముస్లిం అమ్మాయిలను చేసుకున్నారో చెప్పండి అని కొంత మంది అడ్డు సవాళ్లు విసురుతారు. దీనిలో ఏమన్నా రిజర్వేషన్లు ఉన్నాయా ? వివాహం వ్యక్తిగతం, దానికి మతాన్ని ముడి పెట్టే దుష్ట యత్నంలో భాగమే లవ్‌ జీహాద్‌ ప్రచారం.
మతం ఒకటే అయినా హిందువులలో వేర్వేరు కులాల మధ్య జరుగుతున్న వివాహాలను కులపెద్దలు అంగీకరించకుండా పంచాయతీలతో విడదీయటం, దాడులు, హత్యలకు పాల్పడటాన్ని చూస్తున్నాము. మిర్యాలగూడెంలో అమృత-ప్రణరు, హైదరాబాదులో అవంతిక-హేమంత్‌ ఉదంతాలు అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. రెండు ఉదంతాల్లో హిందూ యువకులను చంపించింది హిందూ మత మామలే కదా ! ముస్లిం కుటుంబం హిందూ యువతికి సీమంతం జరపటానికి బదులు హిందూ కుటుంబం ముస్లిం యువతికి సీమంతం జరిపే విధంగా ఏకత్వ ప్రకటనను ఎందుకు రూపొందించలేదంటూ రంధ్రాన్వేషకులు తనిష్క ప్రకటన మీద అర్దం లేని, వితండ వాదనకు దిగారు. నిజానికి వారికి మతద్వేషం లేకపోతే ఆ ప్రకటనను సమర్ధించి రెండో విధంగా కూడా ప్రకటనలు రూపొందించి రెండు మతాల మధ్య సమదూరం పాటించాలని కంపెనీకి సలహా ఇవ్వవచ్చు, దానికి బదులు ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు, తనిష్క ఆభరణాల కొనుగోలును బహిష్కరించాలని పిలుపు ఇవ్వటాన్ని ఏమనుకోవాలి ?


గతంలో కూడా కొన్ని ప్రకటనలను ఆధారం చేసుకొని హిందూమతోన్మాదాన్ని, ముస్లిం ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాయి. హిందూస్తాన్‌ లీవర్‌ కంపెనీ ఉత్పత్తి సర్ఫ్‌ఎక్సెల్‌ పౌడర్‌ గురించిన ప్రకటనలో స్నేహితులైన హిందూ బాలిక ముస్లిం బాలుడితో హౌలీ సందర్భాన్ని చిత్రించారు. దానిలో నువ్వు నమాజుకు వెళ్లిరా తరువాత రంగు పడుతుంది అని బాలిక అంటుంది. దాన్ని వక్రీకరించి హౌలీ పండుగ కంటే నమాజుకు ప్రాధాన్యత ఇచ్చారంటూ రంధ్రాన్వేషకులు దాడి చేశారు. ఇదే కంపెనీ తన రెడ్‌ లేబుల్‌ టీ పౌడర్‌ ప్రకటనకు కుంభమేళాను ఇతివృత్తంగా ఎంచుకుంది. వృద్దుడైన తన తండ్రితో మేళాకు వెళ్లిన కొడుకు నుంచి జనం రద్దీలో తండ్రి విడిపోతాడు. కొద్ది సేపటి తరువాత కొడుకు దాన్ని గ్రహించి తండ్రిని వెతుక్కుంటూ వెళ్లి ఒక టీ స్టాల్‌ దగ్గర తండ్రిని కలుసుకుంటాడు. ఇద్దరూ టీ తాగుతూ ముసలి వారిని వదిలించుకొనే చోట నాకోసం తిరిగి వచ్చావంటూ కొడుకును తండ్రి అభినందిస్తాడు.


దీని మీద హిందువులు పవిత్రంగా భావించే కుంభమేళాను కించపరుస్తారా బహిష్కరించండి హిందుస్తాన్‌ లీవర్‌ కంపెనీ ఉత్పత్తులను అంటూ సామాజిక మాధ్యమంలో దాడికి దిగారు. దాని మీద ఆ కంపెనీ తన ప్రకటనను సమర్ధించుకుంది. ముసలి వారిని వదిలించుకొనేవాటిలో సకుంభమేళా స్ధలం ఒకటి. మన పెద్దవారి సంరక్షణ పట్టించుకోకపోవట విచారకరం కాదా ? అలాంటి చోట్ల చేతులు పట్టుకొని పెద్దవారిని తీసుకు పోవాలని ప్రోత్సహించే లక్ష్యంతోనే ఆప్రకటనను రూపొందించామని, ఆ ప్రకటన చూడండి ఒక నగసత్యం గురించి కళ్లు తెరిపిస్తుంది అని పేర్కొన్నది. దానికి విపరీత అర్ధం చెబుతూ హిందువుల మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు.


మామూలుగానే వృద్దులను వదిలించుకొనే బాధ్యతా రహితులైన వారు నిత్యం మనకు దర్శనమిస్తుంటారు. ఉత్తరాదిలో కుంభమేళా సందర్భంగా కొందరు కావాలనే ముసలివారిని వదలి వేసి తమదారి తాము చూసుకుంటారన్నది నమ్మలేని నిజం. మేళా ముగిసిన తరువాత అలాంటి వారందరినీ వృద్దాశ్రమాలకు తరలిస్తారు. ఆ దుర్మార్గాన్ని ఖండించి, నిరసించాల్సింది పోయి ఒక సందేశాత్మక అంశంతో రూపొందించిన ప్రకటనకు మతానికి ముడిపెట్టటం దేశంలో మతోన్మాద భావనలను ఎంతగా మెదళ్లకు ఎక్కించారో స్పష్టం చేస్తున్నది.


కుంభమేళాలో ఇలాంటి దురాచారం, కొందరు బిడ్డల బాధ్యతా రాహిత్యం గురించి 2013 ఫిబ్రవరిలో నేషనల్‌ జాగ్రఫిక్‌ న్యూస్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. తమ కుటుంబాల్లోని ముసలి వారిని వదిలించుకొనేందుకు కుంభమేళా కోసం ఎదురు చూసే వారు కూడా ఉంటారని అనుష్‌ మాలవీయ అనే ఒక సామాజిక కార్యకర్త చెప్పిన అంశాన్ని దానిలో పేర్కొన్నారు. వదలివేసినట్లు ఎవరూ అంగీకరించరు గానీ అది వాస్తవం అని అనుష్‌ చెప్పారు. అలా విస్మరణకు గురైన వారిలో తాము ఎక్కడి నుంచి వచ్చామో కూడా తెలియని వారు ఉంటారని, కొందరు వృద్దాశ్రమాల్లో చేరితే మిగిలిన వారు వీధులపాలై యాచకులుగా మారతారని చెప్పారు. వారణాసి, బృందావన్‌ ప్రాంతాల్లో వితంతు మహిళలను వదలివేసే దురాచారం ఇప్పటికీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏ పురాణం లేదా వేదాలు కూడా అనాధలైన వారిని ఇలా విస్మరించమని చెప్పలేదు.


తనిష్క ఏకత్వ ప్రకటనను వెనక్కు తీసుకోవటం గురించి సానుకూల విమర్శలు కూడా వెలువడ్డాయి. ఇలాంటి చర్యలు సామాజిక మాధ్యమంలోని మతోన్మాదులకు మరింత ప్రోత్సాహాన్నిస్తాయని ట్రస్ట్‌ రిసర్చ్‌ ఎడ్వజరీ సంస్ధ సిఇఓ ఎన్‌ చంద్రమౌళి చెప్పారు.భవిష్యత్‌లో మిగిలిన ప్రకటనదారులకు ఇదొక సంప్రదాయంగా మారుతుందన్నారు. ప్రకటన వెనక్కు తీసుకోవటం విచారకరమని, తనిష్క మీద ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. ప్రకటనను వెనక్కు తీసుకోవటం వలన మంచి కంటే మరింత నష్టం జరుగుతుందని మరో మీడియా అధిపతి సందీప్‌ గోయల్‌ అన్నారు. ఒక బ్రాండ్‌గా నమ్మిన దానికి నూటికి నూరుశాతం కట్టుబడి ఉండాలి, లేనట్లయితే అది తెచ్చిపెట్టుకున్నదని, వెన్నుముక లేదని అనుకోవాల్సి ఉంటుందన్నారు. తనిష్క తన ప్రకటనకు కట్టుబడి ఉండాల్సిందని ఎక్కువ మంది ప్రకటనల రంగంలోని వారు అభిప్రాయపడ్డారు.


హిందువులను కించపరిచే ప్రకటనల పేరుతో ఆయా కంపెనీల వస్తువులను బహిష్కరించాలని సామాజిక మాధ్యమాల్లో ఇస్తున్న పిలుపులను వినియోగదారులు పట్టించుకుంటారా ? దానికి ఎలాంటి ఆధారాలు లేవు. పట్టించుకొనేట్లయితే చైనా వస్తువులను బహిష్కరించాలని కాషాయ తాలిబాన్లు నిత్యం పారాయణం చేస్తుంటారు. ఎందరు పట్టించుకున్నారు ? నరేంద్రమోడీ హయాంలో వాటి దిగుమతులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. అలాంటి పిలుపు ఇచ్చే వారు వాడే సెల్‌ఫోన్‌ లేదా కంప్యూటర్లలో చైనావే ఎక్కువగా ఉంటున్నాయి లేదా చైనా విడిభాగాలు లేని పరికరాలు దాదాపుగా లేవు. అయితే అలాంటి ప్రచారం మెదడు ఉపయోగించని లేదా సరిగా ఎదగని వారి బుర్రలను ఖరాబు చేసేందుకు పనికి వస్తాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా వైరస్‌ : కట్టడిలో కమ్యూనిస్టుల విజయం- జాడలేని మతాలు, యోగులు, యోగినులు !

11 Saturday Apr 2020

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, RUSSIA, UK, USA

≈ 1 Comment

Tags

catholic religion, COVID- 19 pandemic, Good friday 2020, Pope Francis

Coronavirus

ఎం కోటేశ్వరరావు
బ్రహ్మాండం బద్దలు కాలేదు, సముద్రాలు ఇంకి పోలేదు, ఇటు సూర్యుడు అటు పొడవ లేదు. కరోనా కారణంగా వందల సంవత్సరాలుగా పాటిస్తున్న గుడ్‌ఫ్రైడే క్రతువును పోప్‌ స్వయంగా పక్కన పెట్టాల్సి వచ్చింది. తన నివాసంలోనే తంతును పూర్తి చేశారు. అనేక దేశాల్లో ఇదే జరిగింది.ఎక్కడైతే ఏసు క్రీస్తును శిలువ వేశారని భక్తులు నమ్ముతారో జరూసలెంలోని ఆ ప్రాంతంలో నిర్మించిన హౌలీ పుల్చెర్‌ చర్చ్‌లో అతి కొద్ది మంది ప్రార్ధనలు చేశారు. ఫిలిప్పైన్స్‌లో ఊరేగింపునే రద్దు చేశారు. కొందరు సామాజిక దూరం నిబంధనలను ఉల్లంఘించి కొన్ని చోట్ల ప్రార్ధనలు చేశారు. అందువలన మత చాదస్తులు, ఉన్మాదులు ఎవరైనా ఉంటే వారికి ఈ సమాచారాన్ని చేరవెయ్యాలి, కళ్లారా చూసేందుకు దృశ్యాలను వారి ముందు ప్రదర్శించాలి. అయినా మారకపోతే అలాంటి వారిని కరోనా క్వారంటైన్‌ మాదిరి ఎక్కడైనా పెట్టి తాళం వెయ్యాలి. ఇది ఒక్క క్రైస్తవుల గురించే వ్యాఖ్య అనుకుంటే పొరపాటు ఏ మతం వారికైనా జరగాల్సింది ఇదే.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మతాల మూఢనమ్మకాల ఉక్కు గోడలను తుత్తునియలు చేస్తోంది. మతాలతో నిమిత్తం లేని దేవుడు, దేవతలు, దయ్యాలతో ప్రమేయం లేని కమ్యూనిస్టు చైనా కరోనాను కట్టడి చేసి సాధారణ జనజీవితాన్ని పునరుద్దరించింది. మరోవైపు దేవుడు,దేవతలు, దేవుడు, దేవుని కుమారుడు, దేవ దూతలు తమను రక్షిస్తారని కూర్చున్న మూర్ఖశిఖామణులను వారెవరూ కాపాడటం లేదు, దిక్కులేని చావు చస్తున్నారు, పూడ్చేందుకు కూడా ఎవరూ లేని వారిని అమెరికాలో గుట్టలుగా పడవేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామం మత పునరుద్దరణ, మతోన్మాదశక్తులకు ఊహించని ఎదురుదెబ్బ. మూఢనమ్మకాలను నల్లేరు మీద బండిలా ముందుకు తీసుకుపోవచ్చన్న అజెండాతో ముందుకు పోతున్నవారికి పెద్ద కుదుపు. ఊగిసలాటతో ఉన్న అనేక మందికి ఈ పరిణామం దేవుడు, దేవతలు, మతాలు వాటి మహిమల మీద నమ్మకాలను వమ్ము చేస్తుంది.
ప్రపంచంలో ఏదైనా ఒక ప్రధాన ఘటన జరిగిన తరువాత జ్యోతిష్కులు అదిగో చూడండి మేము ముందే చెప్పాము అంటూ ముందుకు వస్తారు. కొంత మంది తమ మెదళ్లలో ఉన్న అశాస్త్రీయ సరుక్కు ఇదిగో నాసా(అమెరికా నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) చెప్పింది అని ముద్ర తగిలిస్తారు. మరికొందరు మన పోతులూరి వీరబ్రహ్మం, ఫ్రెంచి జ్యోతిష్కుడు మైఖేల్‌ డే నోస్ట్రాడామస్‌ పేరు ఉపయోగించి 1551లో ఇలా రాశాడు అంటూ ప్రచారం చేస్తారు. వాటిలో ఒకటి ఇప్పుడు కరోనా మీద తిరుగుతోంది. దానిలో ఇలా ఉంది.” ఒక జంట సంవత్సరం(2020) ఉంటుంది. దాన్నుంచి ఒక రాణి (కరోనా) తూర్పు దిక్కు(చైనా) నుంచి వస్తుంది.ఏడు కొండలు ఉన్న ఒకదేశం(ఇటలీ) మీద ఒక చీకటి రాత్రి ఒక ప్లేగ్‌(వైరస్‌)ను చల్లుతుంది.అది జీవిత చరమాంకంలో ఉన్న పురుషులలో ప్రవేశించి మట్టి(మరణం)గా మారుస్తుంది. ప్రపంచాన్ని నాశనం చేస్తుంది.అది ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను అంతం చేస్తుంది”.

These photos show how coronavirus fears left religious sites empty ...
దీన్ని సృష్టించిన వారు, దాన్ని గుడ్డిగా నమ్మేవారు, సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసే వారి గురించి చెప్పాలంటే ఏమాత్రం బుర్ర ఉపయోగించని వారే అన్నది స్పష్టం. నోస్ట్రోడామస్‌ ఒక జంట సంవత్సరం వస్తుంది, అది 2020 అని చెప్పటమే తెలివితక్కువ తనం. ప్రతి నూట ఒక్క సంవత్సరాలకు అలాంటి సంవత్సరాలు వస్తాయి. అవి నోస్ట్రోడామస్‌కు ముందు వచ్చాయి, తరువాత వస్తాయి. అతగాడు చెప్పింది 1551లో అంటున్నారు గనుక 1616,1717,1818,1919 వచ్చాయి. అవే కాదు మూడంకెల సంవత్సరాలు కూడా వచ్చాయి. మిగతా సంవత్సరాలలో ఈ సంవత్సరాలలో కూడా ప్రపంచాన్ని కుదిపివేసిన ఉదంతాలు ఎన్నో జరిగాయి. ఈ ప్రచార సృష్టి కర్తలకు బాక్టీరియాకు, వైరస్‌కు తేడా తెలియదు. అది ఇటలీలో ముసలి వారిని చంపేస్తుంది అన్నారు. ప్రపంచ వ్యాపితంగా అన్ని వయసుల వారినీ కబళిస్తోంది. ఇటలీతో పాటు అనేక ఐరోపా దేశాలలో విలయతాండవం చేస్తోంది. అన్నిదేశాల కంటే వ్యాధి అమెరికాలో ఎక్కువగా ఉంది.
గణేషా స్పీక్స్‌ డాట్‌ కామ్‌ పేరుతో జ్యోతిషాన్ని చెబుతున్నవారు మార్చి 30 తరువాత వైరస్‌ నుంచి కాస్త ఉపశమనం పొందుతారని పేర్కొన్నారు. ఇప్పుడు అనేక చోట్ల ఎంత వేగంగా విస్తరిస్తోందో, దేశ ఆర్ధిక వ్యవస్ధలు ఎలా అతలాకుతలం అవుతున్నాయో చూస్తున్నాము. ఇలాంటి చెత్త కబుర్లు చెప్పటంలో ఒక మతం అని లేదు. స్వాములు, బాబాలు, గురువులు, గురవమ్మలు, గంటల, దిన, వార పంచాంగాలు,రాసి ఫలాలను ప్రచురించి సొమ్ము చేసుకొనే మీడియా గురించి ఏం చెప్పాలి? హిందూ మహాసభ గోమూత్ర పార్టీలను ఏర్పాటు చేసింది, ఇంకే ముంది కొందరు బిజెపి నేతలూ అదే పాట అందుకున్నారు.
కరోనా వైరస్‌ మతశక్తులలో విబేధాలు తెచ్చినట్లు ప్రముఖ పత్రిక ”ఎకనోమిస్ట్‌ ” తాజాగా ఒక వార్తను ప్రచురించింది. గుడ్‌ ప్రైడే సందర్భంగా రోమ్‌లో ప్రతి ఏటా పోప్‌ భక్తులతో కలసి శిలువను మోస్తూ ఏసు క్రీస్తు జీవితంలోని పద్నాలుగు ఘట్టాలకు చిహ్నంగా (మహాభారత పర్వాలు, రామాయణ కాండల మాదిరి) 14చోట్ల ఆగుతూ నడుస్తారు. ఆ దారిలో వేలాది మంది అనుచరులు శిలువను ముద్దాడుతూ తమ భక్తిని ప్రదర్శిస్తారు. వాటన్నింటినీ పక్కన పెట్టారని, ఏ ఏదేశాల్లో ఏమి జరుగుతోంది ఆ పత్రిక ప్రకటించింది. తాను 51 సంవత్సరాలుగా బోధకుడిగా ఉన్నానని ఇప్పుడు జనాన్ని చర్చ్‌లకు రావద్దని చెప్పాల్సి రావటం తనకు ఎంత కష్టమో ఆలోచించాలని రష్యన్‌ ఆర్ధోడాక్స్‌ చర్చ్‌ ప్రధాన గురువు కిరిల్‌ ప్రకటించారు. అయితే కొందరు అమెరికన్‌ ఇవలాంజికల్స్‌ మూర్ఖంగా వ్యవహరించి కటకటాల పాలయ్యారు. ప్రార్ధన చేసి వైరస్‌ను నిర్మూలిస్తామంటూ జనాన్ని తరలించిన ఫ్లోరిడా బోధకుడు రోడ్నీ హౌవార్డ్‌ బ్రౌన్‌ వారిలో ఒకడు. మన తిరుపతి వేంకటేశ్వర స్వామి, ఇతర దేవాలయాల్లో మాదిరి భక్తులు లేకుండా తప్పనిసరి అనుకున్న మత క్రతువులను నిర్వహించవచ్చని ఫ్లోరిడా గవర్నర్‌ ప్రకటించాడు. గతంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నపుడు కూడా ఈస్టర్‌ పూజలను ఇలా పూర్తిగా అడ్డుకోలేదని తూర్పు ఐరోపా దేశాల్లో సామాన్యులు భావిస్తున్నారని ఎకనమిస్ట్‌ పేర్కొన్నది. యూదు మతంలో ఒక బహిరంగ మత క్రతువు నిర్వహించాలంటే కనీసం పది మంది హాజరు ఉండాలి, ఇప్పుడు సాధ్యం కాదు కానుక వాట్సాప్‌ లేదా మరొక పద్దతిలో పది మందిని చూపి దాన్ని పూర్తి చేస్తున్నారు.
ఇరాక్‌లో వైరస్‌ను వ్యాపింప చేసే వారు హంతకులతో సమానమని షియా మత పెద్ద గ్రాండ్‌ అయాతుల్లా అలీ అల్‌ సస్తానీ చేసిన వ్యాఖ్యలను ముక్తాదా అల్‌ సదర్‌ అనే మత పెద్ద వ్యతిరేకించాడు. నజఫ్‌ లోని ఇమామ్‌ అలీ మందిరాన్ని తెరవాల్సిందే అంటూ ప్రార్ధన ధర్నా చేశాడు. తలుపులు తెరిచిన తరువాత శవాలతో జనం దాని చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కొందరు మతఛాందుసులైన క్రైస్తవులు, స్వలింగ వివాహాలకు మద్దతు ఇస్తున్న కారణంగా కరోనా వైరస్‌ శిక్షిస్తున్నదని ముక్తాదా ముక్తాయింపులు ఇస్తున్నాడు. ఈనెల 23న రంజాన్‌ మాసం ప్రారంభం కానుంది. ఆ సందర్భంగా ఇస్లామిక్‌ దేశాలలో ఏమి చేస్తారన్నది చూడాల్సి ఉంది. ఇరాన్‌లో అన్ని మత ప్రదేశాలకు భక్తులు రావటాన్ని గతనెల 16న ప్రభుత్వం నిషేధించింది. అప్పటికే పరిస్ధితి చేయిదాటి పోయిందని లౌకికవాదులు విమర్శిస్తే, ఇది తగని చర్య అని మతోన్మాదులు విరుచుకుపడ్డారు. అయోధ్యలో రామనవమి ఉత్సవాలను పరిమితం చేయాలని అధికారులు ప్రయత్నిస్తే హిందూ సంస్ధల వారు అయిష్టంగానే అంగీకరించారని ఎకనమిస్ట్‌ పేర్కొన్నది.
కరోనా వైరస్‌ బతికి ఉన్నవారి మధ్య దూరం పెంచటమే కాదు, మరణించిన వారి అంత్యక్రియలకు సైతం పరిమితులు విధించింది. సంప్రదాయాలను పక్కన పెట్టమంది. క్రైస్తవులు, ముస్లింలు అనేక దేశాల్లో మరణించిన వారికి అంత్యక్రియలు జరిపేందుకు మూడు రోజులు తీసుకుంటారు. ఇప్పుడు మరణించిన రోజే ఆపని చేయాలని అధికారులు ఆదేశిస్తున్నారు. కొన్ని చోట్ల రోజుల తరబడి శవాలను ఇచ్చే పరిస్ధితి లేదు. కరోనా వ్యాధి గ్రస్తులు మరణించిన తరువాత వైరస్‌ ఉండదని వైద్యులు చెబుతున్నారు. అయినా సరే అలాంటి వారిని అనుమతించేది లేదని అనేక శ్మశానవాటికలు నిరాకరిస్తున్నాయి. హాజరయ్యేవారి సంఖ్యపై పరిమితులు పెడుతున్నాయి. కొన్ని చోట్ల గుమికూడకుండా సామాజిక దూరం పాటిస్తూ రెండు కిలోమీటర్ల దూరం పైగా నిలబడి శ్రద్దాంజలి ఘటించిన ఉదంతాలు కూడా ఉన్నాయి.
మత మూర్ఖశిఖామణులే కాదు కొన్ని ప్రభుత్వాలు కూడా జనం ముఖ్యంగా లక్షలాది మంది మహిళల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం వైరస్‌ వ్యాప్తికి అబార్షన్లే కారణమని అనటమే కాదు, అబార్షన్లను నిషేధించింది. అసలే ఉద్యోగాలు పోయి, ఆదాయం లేని అనేక మంది ఇదేమి అదనపు భారంరా బాబూ అని గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో అంతకు ముందు అప్పాయింట్‌మెంట్‌ ఇచ్చిన ఆసుపత్రులన్నీ వాటిని రద్దు చేశాయి. అతిక్రమించిన వారి మీద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో ఇతర రాష్ట్రాల్లో అత్యవసరంగా గర్భవిచ్చిత్తి చేసే ఆసుపత్రుల కోసం పరుగులు తీస్తున్నారు.
కరోనా వైరస్‌ కారణంగా ఇది రాస్తున్న సమయానికి వ్యాధిగ్రస్తులైన వారు 17లక్షల 16వేలు, మరణించిన వారు లక్షా మూడువేల 848మంది. ఒక్క అమెరికాలోనే 30శాతం మంది వ్యాధి బారిన పడ్డారు. మానవాళితో పాటు వారిని నడిపిస్తున్న మతాలు కూడా దీని ప్రభావానికి గురయ్యాయి. దీని దెబ్బకు మతాలు బోధకుల మీదనే విశ్వాసం సన్నగిల్లే పరిస్ధితి వచ్చిందంటే అతిశయోక్తి కాదు. గత చరిత్రను చూసినపుడు ప్రళయాలు సంభవించినపుడు, వర్తమాన కాలంలో ఆర్ధిక సంక్షోభాలు వచ్చినపుడు జనం మరింతగా మతాలు, దేవుళ్లవైపు చూశారని స్పష్టమైంది. సమాజాన్ని వెనుక్కుతీసుకుపోయే మతశక్తులు మత, క్రతువుల పునరుద్దరణకు చేసే సంఘటిత ప్రయత్నాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. వర్తమాన కాలంలో హిందూత్వ శక్తులు హిందూమతం కోసం ప్రయత్నిస్తుంటే తబ్లిగీ జమాత్‌ వంటి సంస్దలు ఇస్లామ్‌ పునరుద్దరణ ప్రయత్నంలో ఉన్నాయి. ఇలాగే ప్రతి మతంలోనూ తిరోగామి శక్తులు చెలరేగుతున్నాయి. మానవ ప్రవర్తన మీద మతాల ప్రభావం ఇప్పుడు పెరుగుతోందా తరుగుతోందా అనే చర్చ ఉండనే ఉంది. ఆర్ధిక పరిస్ధితులు బాగుంటే దేవుడ్ని పట్టించుకోరనే మాట తరచూ వినిపించటం అందరికీ తెలిసిందే.
1960 దశకంలో అమెరికాలో 40శాతం లోపే మతాన్ని నమ్మటం లేదా తమ జీవితాల మీద మత ప్రభావం ఉందని భావించగా న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై ఉగ్రవాదులు రెండు విమానాలతో దాడులు చేసిన తరువాత మతం మీద విశ్వాసం ఉండాలని భావించిన వారు 71శాతం ఉన్నట్లు గ్యాలప్‌ సర్వే పేర్కొన్నది.14వ శతాబ్దంలో ఐరోపాలో ప్లేగ్‌ వ్యాధి ప్రబలినపుడు జనజీవితంలో చేస్తున్న తప్పుల కారణంగానే శిక్షగా దేవుడు ప్లేగ్‌ను పంపాడని మత పెద్దలు చెప్పారు. హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడం చార్మినార్‌ గురించి అందరికీ తెలిసిందే. ప్లేగు వ్యాధితో జనం మరణించకుండా నివారణ ప్రార్ధనలు జరిపేందుకు నాటి రాజు కులీ కుతుబ్‌ షా 1591లో నిర్మించిన కట్టడం అది. ప్రపంచంలో అనేక చోట్ల అలాంటివి వెలిశాయి. తరువాత హైదరాబాదు సంస్ధానంలో ప్లేగు వచ్చినపుడు పాలకులు భారం దానిమీదే వేసి ఊరుకోలేదు.ఐరోపాలో ప్లేగు కోట్లాది మందిని బలితీసుకుంది. ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. ప్లేగు వ్యాధి పదే పదే రావటంతో జనాలకు మతం మీద నమ్మకం సన్నగిల్లింది. దేవుడు మంచి వాడే గానీ మత పెద్దలు కాదన్నట్లుగా ఆగ్రహం వారి మీదకు మళ్లింది. ఆ పరిణామం మత సంస్కరణ ఉద్యమానికి నాంది పలికింది.
కరోనా సందర్భంగా అక్కడా ఇక్కడ అని లేకుండా ప్రపంచ వ్యాపితంగా అన్ని మతాల ప్రార్ధనా మందిరాలను మూసుకోవాల్సి వచ్చింది. ఎవరైనా చాదస్తం, మూర్ఖత్వంతో వ్యవహరిస్తే ఆయా మతాల వారిలోనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మలేసియా, పాకిస్దాన్‌, భారత్‌లలో తబ్లిగీ జమాత్‌ సమావేశాలు కరోనా వైరస్‌ వ్యాప్తి కేంద్రాలుగా, వాటిలో పాల్గొన్నవారు వైరస్‌ను మోసుకు వచ్చిన వారిగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ తప్పు ఇస్లాం మతానిది కాదు, ఆ మతాన్ని పునరుద్దరించే పేరుతో పనిచేస్తున్న సంస్ధలు, వ్యక్తులు కరోనా వ్యాప్తి గురించి తెలిసి కూడా మూర్ఖంగా సమావేశాలు నిర్వహించటం నేరపూరిత వ్యవహారం. దాని మీద ఆ మతంలోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. మతాన్ని పునరుద్దరిస్తాం అంటే సరి పెట్టుకున్నంత మాత్రాన అసలుకే ఎసరు తెస్తే ఎలా అంగీకరిస్తాం అనే ఆగ్రహం ఆ మతంలోని వారి నుంచే వ్యక్తం అవుతోంది. సరే ఈ ఉదంతాలను కూడా మతోన్మాదాన్ని, ఇస్లాం వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకున్న వారి గురించి తెలిసిందే. వారికి సోకిన మత వైరస్‌ కరోనా కంటే ప్రమాదకరం.

In a test of faith, Christians mark Good Friday in isolation - The ...

మత శక్తులు వారు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా ఒకటే. ఇండోనేషియాలో మార్చి 19వ తేదీ నుంచి జరపతలపెట్టిన తబ్లిగీ జమాత్‌ ఐదు రోజుల ఆసియా వార్షిక మత సమావేశాలను రద్దు చేసుకోవాలని అక్కడి ప్రభుత్వం చెప్పినా నిర్వాహకులు పెడచెవిన పెట్టారు. ప్రభుత్వం కూడా గట్టిగా చెప్పలేకపోయింది. అల్లాకు తప్ప మరొకరెవరికీ భయపడాల్సిన పనిలేదని ప్రచారం చేశారు. సమావేశ రద్దు ప్రతిపాదన వెనుక నిషేధిత ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ ఉందని కూడా రెచ్చగొట్టారు. చావు పుట్టుకలన్నీ దేవుడు ముందే నిర్ణయిస్తాడని, కనుక కరోనా గురించి భయపడాల్సిన పనిలేదన్నారు. దానికి భయపడితే ఇస్లాం నుంచి వైదొలిగినట్లే అని రెచ్చగొట్టారు. మసీదు నిర్వాహకులు అల్లా కంటే సమావేశాలను వాయిదా వేయాల్సిందే అన్న రాష్ట్ర గవర్నర్‌ రిదవాన్‌ కమిల్‌కే ఎక్కువ భయపడ్డారని జనం భావించారు. అనుమతి లేకపోయినా భక్తులు ప్రారంభానికి ముందే వేలాది మంది చేరుకున్నారు. చివరికి అధికార యంత్రాంగం కరకుగా వ్యవహరించటంతో రద్దు చేసుకున్నారు.
సరిగ్గా ఇదే సమయంలో మన దేశంలో అయోధ్యలో శ్రీరామ నవమి ఉత్సవాలను ఎట్టి పరిస్ధితుల్లోనూ జరిపి తీరాల్సిందే అని రామాలయ ట్రస్టు సభ్యుడు మహంత పరమహంస పట్టుబట్టిన విషయం తెలిసిందే. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, భక్తుల మంచి చెడ్డలను రాముడే చూసుకుంటాడని వాదించారు.
ఇక మంత్రాలకు చింతకాయలను రాలుస్తాం అనే అన్ని మతాలకు చెందిన బాబాలు, యోగులు,యోగినులు దుకాణాలు మూసుకొని కరోనా దెబ్బకు ఎక్కడికి పోయారో తెలియదు. వారిని గుడ్డిగా నమ్మిన జనం కష్ట కాలంలో ఏమయ్యారు అని నిలదీయకుండా ఉంటారా ? అంత ధైర్యం చెయ్యకపోతే వారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కరోనా కథ ముగిసిన తరువాత వారంతా తిరిగి దుకాణాలు తెరుస్తారు, జనానికి ఎలాంటి సంజాయిషీ చెబుతారో చూద్దాం. అలాంటి వారందరి చేత తెల్లారగానే బోధలు చేయించే మీడియా పెద్దలు కూడా జనానికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిందే. ఈ సమయంలో అన్ని మతాల వారు ఇండ్లలో ఉండే ప్రార్ధనలు జరపండి అని చెప్పకతప్పటం లేదు. అదే పని సాధారణ సమయాల్లో సైతం ఎందుకు చేయకూడదు అని కొందరైనా ఆలోచించకుండా ఉంటారా ? దర్శనాల వేలం వెర్రి తగ్గుతుందా? అదే జరిగితే అత్యంత లాభదాయకంగా మారిన భక్తి వాణిజ్య కేంద్రాలు, వాటి నిర్వాహకుల ఆదాయాలు ఏమి అవుతాయి ? ప్రభుత్వాలకూ ఆదాయం పడిపోతుంది. గతంలో ప్రింటింగ్‌ ప్రెస్‌ మత ప్రచారంలో పెద్ద విప్లవాన్నే తెచ్చింది. మత గ్రంధాల ప్రచురణ, పంపకం ద్వారా భక్తి విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్‌ ఫోన్‌ వాడకం బాగా పెరిగి పోయిన ఈ రోజుల్లో ఫోన్‌ భక్తి వెల్లువ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇష్టదైవాన్ని ఫోన్లో చూస్తూనే బస్సులు, రైళ్లు, కార్యాలయాల్లో పూజలు ప్రారంభం కావచ్చు. ఇవన్నీ మత వాణిజ్యం, మతశక్తులకు మంచి సూచనలు కావు.

Chinese President Xi Says He Was Leading COVID-19 Since Jan. 7 | Time
ప్రపంచమే ఒక గ్రామంగా మారిపోయిందని ప్రతివారూ చెబుతారు. కానీ ఆ గ్రామంలోనే ప్రతి వారూ తమ కులం, మతాలకే పరిమితమైన గోడలతో గృహ సముదాయాలను నిర్మించుకోవటాన్ని మనం చూస్తున్నాము. ప్రతి కులం, ప్రతి మతం తమ పవిత్రతను కాపాడుకొనేందుకు ఎంతకైనా తెగించే ధోరణులు నానాటికీ పెరిగిపోతున్నాయి. పాలు తాగుతూ తననెవరూ చూడటం లేదు అనుకునే పిల్లుల మాదిరి ప్రతి వారూ తమ కుళ్లును మూసిపెడుతూ ఎదుటి వారి దాని మీద దాడి చేస్తున్నారు. అంతరించి పోతున్న మత, కుల మడులను పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నారు.గతంలో మతాల పేరుతో అధికారాన్ని నిలుపుకొనేందుకు రాజులు,రంగప్పలు చేస్తే ఇప్పుడు వారి వారసులుగా కొన్ని పార్టీలు పుట్టుకు వస్తున్నాయి. మృత భాషగా మారిపోయిన సంస్కృత శ్లోకాలను తమ పిల్లలకు నేర్పుతూ అనేక మంది ముఖ్యంగా విదేశాలలో ఉంటూ తెలియకుండానే హిందూ మత ఉద్దారకులుగా మారిపోతున్నవారిని చూస్తున్నాము. అదే పద్దతిలో ఏ మతానికి ఆ మతం వారు పడరాని పాట్లు పడుతున్నారు.
ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
అని రాయప్రోలు సుబ్బారావు గారు చెప్పారు. కానీ దానికి భిన్నంగా భారతీయులమని చెప్పుకోవాల్సింది పోయి ఫలానా కులం, ఫలానా మతం ప్రాంతాల వారీగా కొట్టుకు చస్తున్న ప్రవాస భారతీయలను చూసి సిగ్గుపడుతున్నాము. అయితే ఏ విత్తనాలు వేస్తే ఆ పండ్లు, కాయలే కాస్తాయి అన్నట్లుగా మన దేశంలో, రాష్ట్రాలలో కుల మతాల కంపుతో పెరిగిన మన వారు పరాయి ప్రాంతంలో కూడా దాన్నే వ్యాపింప చేయటంలో ఆశ్చర్యం ఏముంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తబ్లిగీ జమాత్‌ దెబ్బకు వణికి పోతున్న పాకిస్ధాన్‌, పలువురు ఇమామ్‌ల అరెస్టు !

05 Sunday Apr 2020

Posted by raomk in Current Affairs, Health, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

Coronavirus, Coronavirus in Pakistan, Imams were arrested for prayers ban violation, Panic in Pakistan, Tablighi jamaat meet effect

Sindh, Balochistan ban congregational prayers - Newspaper - DAWN.COMఎం కోటేశ్వరరావు
తబ్లిగీ జమాత్‌ సమావేశాలకు హాజరై కనిపించకుండా ఉన్నవారి కోసం, రైళ్లలో, ఇతర ప్రయాణ సాధనాలలో వారితో ప్రయాణించిన వారి కోసం యావత్‌ దేశంలో గాలింపు జరుగుతోంది. దొరికిన వారిని పరీక్షించి వైరస్‌ సోకినట్లు గమనిస్తే చికిత్సా కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రియమైన పాఠకులారా కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన తరువాత జమాత్‌ సమావేశాలు జరిగిన ప్రతి దేశంలోనూ ఇదే జరుగుతోంది అని గమనించ మనవి. ఆ సమావేశాలు ముస్లింలు అత్యధికంగా ఉన్న దేశాల్లో కూడా జరిగాయి. కుట్ర సిద్ధాంతాన్ని నమ్మేవారు ఆ సమావేశాల్లో పాల్గొన్నవారందరూ హిందూ-ముస్లిం, ఈ దేశమా ఆ దేశమా అనే విచక్షణ లేకుండా తమ తమ ప్రాంతాలకు వైరస్‌ను జయప్రదంగా మోసుకు పోయారు అని తెలుసుకోవాలని మనవి. ముస్లింలు మన దేశంలో వైరస్‌ను వ్యాపింప చేస్తున్నారని పనిగట్టుకొని కొందరు మతోన్మాద వైరస్‌ను ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు దానితో బుర్రలను చెడగొట్టుకోవటం కాదు, కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పాకిస్తాన్‌ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం శుక్రవారం నాడు మసీదుల్లో ప్రార్ధనలకు దూరంగా ఉండాలన్న సూచనను పలు చోట్ల ఉల్లంఘించారు. అంతేకాదు ఇమామ్‌లు జనాన్ని రెచ్చ గొట్టే ప్రసంగాలు చేశారు. కొన్ని చోట్ల ప్రార్ధనలను నివారించేందుకు వెళ్లిన పోలీసుల మీద దాడులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. రాజధాని ఇస్లామాబాద్‌లోని ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ముగ్గురు, నలుగురు చొప్పున ఇమామ్‌లు, ఖతీబ్‌లను అరెస్టు చేసి మరోసారి ఉల్లంఘించబోమని చెప్పిన వారిని వదలి పెట్టినట్లు డాన్‌ పత్రిక తెలిపింది. ఆదివారం నాటికి పాకిస్ధాన్‌లో 2,818 కేసులు నమోదు కాగా 41 మంది మరణించారు. మలేసియాలో 3,483 కేసులు, 57 మరణాలు సంభవించాయి.
మార్చినెలలోనే పాకిస్ధాన్‌లోని లాహౌర్‌ పట్టణానికి 43కిలోమీటర్ల దూరంలోని రాయవింద్‌ పట్టణంలో తబ్లిగీ జమాత్‌ వార్షిక సమావేశాలు జరిగాయి. మూడు రోజులకు కుదించిన ఈ సమావేశాలకు ప్రపంచమంతటి నుంచీ రెండున్నరలక్షల మంది హాజరయ్యారని ఒక అంచనా. ప్రభుత్వం వైపు నుంచి తీవ్ర వత్తిడి, వర్షాల కారణాంగా గానీ సమావేశాలకు వచ్చిన వెళ్లిపోయారు. అక్కడ ముగిసిన రోజే మన దేశంలో ప్రారంభమైంది. మన నిజాముద్దీన్‌ సమావేశాలను రద్దు చేయాలని లేదా ముగించమని గానీ మన పాలకులు ఎలాంటి వత్తిడి తేలేదు. నరేంద్రమోడీ పాలనలో మత సామరస్యం ఎలా వెల్లివిరిసిందో చూడండి అని భజన చేసే వారికి ఇదొక ఉదాహరణగా మిగులుతుంది. అసలు కథ ఏమంటే పది లక్షల మందితో మార్చి 25 నుంచి ఏప్రిల్‌ రెండు వరకు శ్రీరామ నవమి ఉత్సవాలు జరపాలని నిర్ణయించిన పెద్దలు ఈ సమావేశాలకు అభ్యంతరం చెబితే దాని గురించి అడుగుతారని తప్ప మత సామరస్యం కాదు, మట్టిగడ్డా కాదు. పాకిస్ధాన్‌ ప్రభుత్వం మార్చి 13నాటికే అంతర్జాతీయ విమాన ప్రయాణాలను నిలిపివేయటంతో దాదాపు మూడు వందల మంది విదేశీయులు రాయవింద్‌లోనే చిక్కుకు పోయారు. ఘనమైన మన పాలకులు మార్చి 22న ఆ పని చేశారు. అప్పటివరకు నిజాముద్దీన్‌లో ఉన్నవారు చిక్కుకు పోయారు. పాక్‌ ప్రభుత్వం సమావేశాలను రద్దు చేయాలని చెప్పినా అప్పటికే అనేక మంది వచ్చి ఉన్నారని, చివరి నిమిషంలో రద్దు చేయటం కుదరదని జమాత్‌ నేతలు మంకు పట్టుపట్టి సమావేశాలను నిర్వహించారు. ప్రభుత్వ భయాందోళనలు వాస్తవమే అని తరువాత రుజువైందని లాహౌర్‌ డిప్యూటీ కమిషనర్‌ డానిష్‌ అఫ్జల్‌ వ్యాఖ్యానించారు.
జమాత్‌ సభ్యులు లేదా వారి బంధువులు దురుసుగా ప్రవర్తించినట్లు మన దేశంలో వచ్చిన వార్తల నేపధ్యంలో పాకిస్ధాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలోని లయ్యా పట్టణంలోని తగ్లిబీ జమాత్‌ కేంద్రంలో క్వారంటైన్‌ నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నించిన ఒక సభ్యుడు పోలీసును పొడిచాడని తెలుసుకోవాలి. దురుసు దురుసు తనం ప్రతి చోటా ఉంటుంది, అలాంటి ఘటనలను ఖండించాలి తప్ప మతాన్ని ఆపాదించకూడదు. కరాచీ పట్టణంలో గత శుక్రవారం నాడు సామూహిక ప్రార్ధనలు జరపవద్దని కోరిన పోలీసుల మీద లియాఖతాబాద్‌ మసీదు, ఘౌసియా మసీదు వద్ద జనం పోలీసుల మీద దాడి చేశారు. ఈ ఉదంతంలో నలుగురిని అరెస్టు చేశారు. మన తెలుగు ప్రాంతంలో ఒక గుడిలో పూజలు వద్దని చెప్పిన పోలీసును పూజారీ, పూజలకు వచ్చిన వారు ఎలా దాడి చేశారో సామాజిక మీడియాలో మనం చూశాము.
పాకిస్ధాన్‌ శాస్త్ర, సాంకేతిక శాఖా మంత్రి ఫవాద్‌ చౌదరి మీడియాతో మాట్లాడుతూ సమావేశాలను పరిమితం చేయాలన్న తమ సూచనను పెడచెవిన పెట్టి తగ్లిబీ జమాత్‌, సంస్ధ తిరోగమన భావాలే ఈ ముప్పుకు బాధ్యత వహించాలని స్పష్టంగా చెప్పారు. అనేక ఇస్లామిక్‌ దేశాలలో మసీదులను మూసివేసినప్పటికీ పాకిస్ధాన్‌లోని సున్నీ, షియా మసీదుల నిర్వాహకులు ప్రభుత్వ సూచనను పెడచెవిన పెట్టారు. అలాంటి వారి మీద ముందుగానే చర్య తీసుకొని ఉంటే ఇంత జరిగేది కాదన్న విమర్శలు పాక్‌లో వెల్లువెత్తుతున్నాయి. అదే మనదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తే రాజకీయం అంటూ ఎదురుదాడి చేస్తున్న పరిస్ధితి.
మన దేశంలో కరోనా వైరస్‌ నిర్మూలనకు ప్రభుత్వాలే యజ్ఞాలు, యాగాలు, పూజలు చేయమని ప్రోత్సహించటాన్ని చూశాము. ఇక ఛాందసులు, ఈ పేరుతో మతోన్మాదులు రెచ్చి పోవటం గురించి చెప్పనవసరం లేదు. పాకిస్ధాన్లో కూడా అలాంటి వారికి కొదవ లేదు. పాక్‌ మతవ్యవహారాల మంత్రి నూరుల్‌ హక్‌ ఖాద్రి విలేకర్లతో మాట్లాడుతూ మసీదులు తెరిచే ఉంటాయని, అయితే పిల్లలకు నిషేధమని, పెద్ద వారు 50 మందికి మించి ప్రార్ధనలకు రాకూడదనే నిబంధన విధించినట్లు చెప్పారు. పాకిస్ధాన్‌ ఉలేమా ఇస్లామిక్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు మౌలానా జహిద్‌ ఖ్వాసమి మాట్లాడుతూ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నచోట్లనే ఇండ్లలో ప్రార్ధనలు చేయాలని చెప్పామని, తక్కువగా లేదా లేని చోట ఆరోగ్య సమస్యలను వివరిస్తూ ప్రార్ధనలు కొనసాగిస్తామని, మహమ్మారి వైరస్‌ నుంచి కాపాడాలని దేవుడిని ప్రార్ధించకపోతే ఎలా అని ప్రశ్నించారు. టీవీలలో బోధనలు చేసే జమీల్‌ మాట్లాడుతూ ఎవరికి వైరస్‌ను సోకించాలో ఎవరికి కూడదో దేవుడు నిర్ణయిస్తాడు, దేవుడు మనలను రక్షిస్తాడని సెలవిచ్చాడు. అనేక చోట్ల సామాజిక దూరాన్ని పాటించటం, తమ సాంప్రదాయ కార్యకలాపాలపై ఆంక్షలు విధించటాన్ని తబ్లిగీ జమాత్‌ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. క్షమించమని దేవుడిని అడగటం తప్ప వేరే మార్గం లేదని తెగేసి చెబుతున్నారు.
మత మౌఢ్యం తలకెక్కించిన తరువాత అది హిందూ, ముస్లిం, క్రైస్తవం ఏదైనా ఒక పట్టాన తగ్గదు. పూజారి, ఉలేమా, పాస్టర్‌ ఎవరైనా ఒకటే. అలాంటి వారే వైరస్‌ను వ్యాప్తి చేసే వాహకులుగా మారతారు,వైరస్‌ను యావత్‌ సమాజానికి అంటిస్తారు.అందువలన అలాంటి మూఢుల సంగతి జనమే తేల్చుకోవాలి. ముందు బతికి ఉంటే కదా పూజలు, పునస్కారాలు !

Chief cleric of Islamabad's Red Mosque Maulana Abdul Aziz . — AFP/File
పాకిస్దాన్‌ రాయవింద్‌ జమాత్‌కు రెండున్నరలక్షల మంది వచ్చారన్నది ఒక అంచనా అయితే లక్షమందికి మించి రాలేదని జమాత్‌ నేతలు చెబుతున్నారు. అది కూడా తక్కువేమీ కాదు.ఇప్పుడు వారి కోసం దేశమంతటా అధికారులు గాలిస్తున్నారు. నిర్దిష్టమైన జాబితా లేనప్పటికీ హాజరైన వారి మధ్య ఏర్పడిన పరిచయాల కారణంగా పంజాబ్‌ రాష్ట్రంలో ఇప్పటికే ఎనిమిది వేల మందిని గుర్తించారు. మరో దేశమైన మలేసియాలో కూడా జమాత్‌ సమావేశాలు జరిగాయి, అక్కడ అంటించుకున్నవారు మన దేశానికి వచ్చారన్నది ఒక సమాచారం. మలేసియాలో 3,483 మందికి సోకింది. వీటిలో 44శాతం కేసులు శ్రీ పెటాలింగ్‌ మసీదులో ప్రార్ధనలకు వచ్చిన వారి ద్వారా సోకినవే అని మలేసియా ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ జనరల్‌ నూర్‌ హిషమ్‌ అబ్దుల్లా చెప్పారు. మనదేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో జమాత్‌కు వచ్చిన వారు లేదా వారు అంటించినవి 30శాతమే అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జరగాల్సింది కరోనాపై పోరు. మతవిద్వేషాలను వ్యాపింప చేయటం కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ పాలనలో ఈ వాస్తవాలను కాదనే ధైర్యం ఉందా !

16 Sunday Feb 2020

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Narendra Modi, Narendra Modi governance, RBI

Image result for modi governance cartoons
ఎం కోటేశ్వరరావు
దేశమంతటా ఎన్‌ఆర్‌సి గురించి అబ్బే అసలు ఆలోచన కూడా చేయలేదని నరేంద్రమోడీ-అమిత్‌ షా పలికిన ‘సత్య’ వ్యాక్యాలతో వారు అపర సత్యహరిశ్చంద్రులని నమ్మే వారిలో చాలా మందికి దూల తీరింది. వారు కాదన్నా ఎన్‌ఆర్‌సి పెట్టాలంటూ వీరంగం వేసే వారు ఉన్నారు. మోడీ గారి పాలనలో అప్పులు చేయలేదని చెప్పటం కూడా ‘సత్యవాక్పరిపాలన’లో భాగమే. నేతలు అబద్దాలు చెప్పవచ్చు, అంకెలు, అందునా రిజర్వుబ్యాంకు చెప్పదు కదా (ఏమో ఇప్పుడు దాని మీద కూడా అనుమానాలు రావచ్చు)
రిజర్వుబ్యాంకు నివేదికల్లో చెప్పిన దాని ప్రకారం 2014 మన్మోహన్‌ సింగ్‌ గారు దిగిపోయే నాటికి మన స్వదేశీ, విదేశీ అప్పు మొత్తం :64,11,200 కోట్లు. దీనిలో స్వదేశీ 60,45,007 కోట్లు కాగా విదేశీ 3,66,193 కోట్లు.
నేను గానీ వస్తే మంత్ర దండం వేసి అప్పులు తీర్చివేస్తా, కొత్త అప్పులు చేయను, విదేశాల నుంచి నల్లధనపు నిల్వలు తెస్తా అని ఊరూ వాడా టాంటాం వేసిన నరేంద్రమోడీగారు ఎంత నల్లధనం తెచ్చారో మనకైతే తెలవదు. కానీ అప్పులు మాత్రం 2019 సెప్టెంబరు 15న ఆర్‌బిఐ ప్రచురించిన సమాచారం ప్రకారం 2019 మార్చినెల నాటికి మొత్తం అప్పును 1,02,55,099 (అరవైనాలుగు లక్షల కోట్ల నుంచి అక్షరాలా ఒక కోటీ రెండు లక్షల యాభైఐదు వేల తొంభై తొమ్మిది కోట్లకు) పెంచారు. పోనీ ఇంతా చేసి అభివృద్ధి సాధించారా అంటే ఉన్నదాన్ని ఉన్నట్లు కూడా ఉంచకపోగా ఐదుశాతానికి లోపుగా దిగజార్చారు.
ఎడా పెడా విదేశాలకు ఎందుకు తిరుగుతున్నారు ప్రధాని గారూ అంటే దేశ పలుకుబడి పెంచటానికి అని చెప్పారు. ఆయన భక్తులైతే మోడీ పలుకుబడితో రాయితీలతో కూడిన అప్పులను పెద్ద మొత్తంలో తెస్తున్నారని భజన చేశారు. ఇది కూడా అబద్దమే. మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో విదేశీ రుణాల(అన్ని రకాలు కలిపి)లో రాయితీలతో ఉన్న మొత్తం 35.8శాతం నుంచి 10.4శాతానికి పడిపోయింది. విదేశాల్లో పలుకు బడి పెంచి, విశ్వసనీయతను పెంచామని చెప్పిన మోడీ గారి ఏలుబడిలో 2019 నాటికి ఆ మొత్తం 8.7శాతానికి పడిపోయింది. విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచుతామని చెప్పారు.
2014-15లో (మోడీగారి తొలి ఏడాది) రూపాయల్లో అన్ని రకాల విదేశీ పెట్టుబడుల ప్రవాహ విలువ రూ.4,49,072 (డాలర్లలో 73456 మిలియన్స్‌) ఉండగా 2019 మార్చినాటికి ఆ మొత్తాలు రూ.2,12,179 కోట్లకు(30094 మిలియన్‌ డాలర్లు) పడిపోయింది. ట్రంప్‌తో సహా విదేశీ నేతలందరినీ కౌగలించుకోవటం, ఎంతో సన్నిహిత సంబంధాలున్నాయని ఫొటోలకు ఫోజులివ్వటం తప్ప ఎందుకు విదేశీ పెట్టుబడులు తగ్గిపోతున్నాయో ఎవరైనా చెప్పగలరా ? మన ఆర్ధిక వ్యవస్ధ మీద, దాన్ని నడిపించే నరేంద్రమోడీ మీద విశ్వాసం తగ్గటానికి ఇది సూచిక కాదా ? గత ఆరు సంవత్సరాలలో ముస్లిం, క్రైస్తవ మైనారిటీల వ్యతిరేకతను రెచ్చగొట్టటం, భావోద్వేగాలను రేకెత్తించటం మీద పెట్టిన శ్రద్ద ఆర్ధిక వ్యవస్ధను బాగు చేసేందుకు పెట్టి ఉంటే ఇలా జరిగేదా ? మోడీ అభిమానులు వెనక్కు తిరిగి ఆలోచిస్తారా ?

Image result for modi governance cartoons
మోడీ ఏలుబడిలో ఉపాధి తగ్గిందా పెరిగిందా ! ఆర్‌బిఐ సమాచారం ఏమి చెబుతోంది !
భజన బృందం అంటే చెవుల్లో పూలు పెట్టుకొని ఎలా చేయమంటే అలా భజన చేస్తుంది. కానీ అందరికీ కుదరదే. దేశంలో ఎందరికీ ఉపాధి కల్పించారన్నది ఒక బ్రహ్మపదార్ధం. రిజర్వుబ్యాంకు కమ్యూనిస్టు సంస్ధ కాదు, దానిలో పని చేసే వారు తుకడే తుకడే గ్యాంగ్‌ కాదు. 2019 సెప్టెంబరు మాసాంతానికి ఆర్‌బిఐ అందించిన సమాచారంలో ఉపాధి గురించి ఈ అంశాలున్నాయి.
1996-97లో ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య దేశ చరిత్రలో గరిష్టం : 195.6లక్షలు
2011-12 నాటికి ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య :176.1లక్షలు
1996-97లో ప్రయివేటు రంగంలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 86.9లక్షలు
2011-12 నాటికి ప్రయివేటు రంగంలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య :119.7లక్షలు
1996-97లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 374.3లక్షలు
2011-12 లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 401.7లక్షలు
2011-12 తరువాత ప్రభుత్వ రంగం, ప్రయివేటు రంగంలో ఎంతెంత మంది ఉన్నారో విడివిడిగా లెక్కలు లభ్యం కాలేదని ఆర్‌బిఐ పేర్కొన్నది. అయితే మొత్తంగా రిజిస్టర్లలో ఉన్న సంఖ్య సంవత్సరాల వారీ దిగువ విధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ సమాచారాన్ని ఉటంకిస్తూ ఆర్‌బిఐ తన గణాంక పుస్తకంలో పేర్కొన్నది.
2012-13లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 447.9లక్షలు
2013-14లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 468 లక్షలు
2014-15లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 482.6 లక్షలు
2015-16లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 435 లక్షలు
తరువాతి సంవత్సరాల సమాచారాన్ని ఆర్‌బిఐ ఇవ్వలేదు.

Image result for modi governance cartoons
ధరల పెరుగుదల లేదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, దానికి రుజువుగా ద్రవ్యోల్బణం ఎంత తక్కువ ఉందో చూసుకోమంటారు. 2014 మార్చినెలతో ముగిసిన ఏడాదిలో వినియోగదారుల ధరల సూచిక 112.2 కాగా 2019 మార్చినెలతో ముగిసిన ఏడాదిలో అది 139.6కు పెరిగింది. తరువాత 2020జనవరి నాటికి 145.7కు పెరిగింది. దీన్నేమంటారు ? ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు, కొంత మేరకు చెల్లించే యాజమాన్యాలుంటే కార్మికులకు కరవు భత్యం పెరుగుతుంది. అసంఘటిత రంగంలోని కార్మికులు, ఇతరులు, నిరుద్యోగల పరిస్దితి ఏమిటి ? కాబట్టి భక్తులారా గుడ్డి అభిమానం లేదా దురభిమానంతో మీరు ఎలాగైనా రెచ్చిపోవచ్చు, సామాన్యులారా మోడీ ఏలుబడి గురించి మీకై మీరు నిర్ణయించుకోవచ్చు. దీనిలో పేర్కొన్న అంకెలు వాస్తవం కాదని ఎవరైనా నిరూపిస్తే సంతోషం, లేకపోతే స్వంత బుర్రలతో ఆలోచించటం ప్రారంభించండి, ఇంతకంటే దేశభక్తి మరొకటి లేదు. నేనైతే రాసిన దానికి కట్టుబడి ఉన్నా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాపై పోప్‌, ఇస్లామిక్‌ దేశాల మౌనం ఎందుకు ?

02 Thursday Jan 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

China, Islam, Islam in China, Islamic Countries, Pope Francis, Religion in China

Image result for pope  china
ఎం కోటేశ్వరరావు
ఇటీవల చైనా గురించి మీడియాలో వస్తున్న అనేక అంశాలు చదువరులు, వీక్షకులను గందరగోళపరుస్తున్నాయి. వక్రీకరణలు, అవాస్తవాలను విశ్లేషణలు, వార్తల పేరుతో కుమ్మరిస్తున్నారు. వాటిలో కొన్నింటి మంచి చెడ్డల గురించి చూద్దాం. క్రైస్తవులను, ముస్లింలను అణిచి వేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై పోప్‌, ఇస్లామిక్‌ దేశాలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయి అనే ప్రశ ్నలు అనేక మందిలో తలెత్తుతున్నాయి. జర్మనీలో యూదులను లక్ష్యంగా చేసుకున్న హిట్లర్‌ మాదిరి మన దేశంలో ముస్లింలు, క్రైస్తవ మైనారిటీలపై ప్రచార, భౌతిక దాడులకు పాల్పడుతున్న ఫాసిస్టు తరహా పరివార్‌ పట్ల మన దేశంలోని మీడియా మౌనం వహించటం లేదా సమర్దించటాన్ని చూస్తున్నాము.
‘ బైబిల్‌ మరియు ఖురాన్‌లను తిరగరాసేందుకు చైనా పూనుకుంది ‘ ఇది ఇటీవలి ముఖ్యమైన వార్త !
అంతేనా 2018లో చైనాలో బైబిల్‌ అమ్మకాలను నిషేధిస్తున్నారు అని ప్రచారం జరిగింది.చట్టబద్దమైన మార్గాల ద్వారా బైబిల్‌ లేదా ఖురాన్‌ లేదా ఏ మత గ్రంధాన్ని అయినా చైనీయులు తెప్పించుకోవచ్చు. అందుకు ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సి ఉంది, అది అన్ని దేశాలకు వర్తించే నిబంధనే. చైనా సర్కార్‌ దగ్గర నమోదు గానీ లేదా అనుమతి లేని పుస్తకాలు, పత్రికల మీద అక్కడి ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. దాన్ని మతాల మీద దాడిగా చిత్రించారు. చైనాలో ఉన్న నిబంధనల ప్రకార బైబిళ్లను చర్చ్‌ల ద్వారానే తెప్పించుకోవాలి లేదా కొనుగోలు చేయాలి, పుస్తకాల దుకాణాల్లో అనుమతించరు. అక్కడి సామాజిక యాజమాన్య వ్యవస్ద ప్రకారం ఒక పుస్తకంగా ఒక్క బైబికే కాదు ఏ మత గ్రంధానికి పవిత్రతను ఆపాదించకూడదు. పశ్చిమ దేశాలను చైనా అనుకరించకపోతే దాన్ని మత వ్యతిరేకం, అణచివేతగా చిత్రిస్తున్నారు.

చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చి ఏడుపదులు దాటింది. మావో సేటుంగ్‌ నాయకత్వంలో కమ్యూనిస్టులు అధికారంలోకి రాగానే క్రైస్తవ మత చర్చీలు, ఇస్లామిక్‌ మసీదులను కూల్చివేశారు, మతాలను నాశనం చేశారని ప్రచారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. అదే నిజమైతే ఒక్కరూ ఇప్పటికి మిగిలి ఉండేవారు కాదు. 1953లో హాన్స్‌ జాతీయులు 93.94శాతంగా మిగిలిన 6.06శాతం బౌద్ద, క్రైస్తవ, ముస్లిం తదితర మైనారిటీలు ఉన్నారు. అదే 2010 లెక్కల ప్రకారం 91.40, 8.60శాతాలుగా ఉన్నారు. అంటే మైనారిటీలు పెరిగారు. వీరిలో ముస్లిం యుఘీర్‌లు 0.62 నుంచి 0.76శాతానికి పెరిగారు. దీనికి కారణం మైనారిటీలకు జనాభా నియంత్రణ నిబంధనను వర్తింప చేయలేదు. మన దేశంలో బాబరీ మసీదును కూల్చివేసిన మతోన్మాదుల చర్యను ప్రపంచమంతా చూసింది గానీ, చైనా, రష్యా(కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నపుడు) ఇతర దేశాల్లో కమ్యూనిస్టులు ప్రార్ధనా స్ధలాలను కూల్చివేసిన దాఖలాలు లేవు. అన్నీ సురక్షితంగానే ఉన్నాయి. రష్యాలో కమ్యూనిస్టుల అధికారం ముగిసిన తరువాత అనేక మంది అక్కడి చర్చ్‌లను చూసి ప్రభువా కమ్యూనిస్టులు చర్చ్‌లను కూల్చివేశారని చేసిన తప్పుడు ప్రచారాన్ని నమ్మి వ్యతిరేకించినందుకు మన్నించు అని ప్రార్ధించారంటే అతిశయోక్తి కాదు. కమ్యూనిస్టులు మత రాజకీయాలు చేయరు, మతాన్ని రాజకీయాల్లో అనుమతించరు.

Image result for famous churches in china
బైబిల్‌ విషయానికి వస్తే పాత నిబంధన, కొత్త నిబంధన అని ఆ మతాలకు చెందిన వారే రాసుకున్నారు. వాటిలో అనేక అంశాలను చొప్పించారని అనేక మంది విమర్శిస్తారు. వాటిని పక్కన పెడదాం. బైబిల్‌ రాసిన లేదా దేవుడు లేదా దేవుని కుమారుడు, దేవదూతలు ప్రవచించిన సమయానికి ప్రపంచంలో ఎక్కడా కమ్యూనిజం, దాని సిద్దాంతాల జాడలేదు. సోషలిజం, కమ్యూనిజాలకు క్రైస్తవం వ్యతిరేకం అని బైబిల్‌ లేదా ఖురాన్‌ లేదా మరొక మత గ్రంధంలో ఉన్న ఉన్న అంశాల మీద రాస్తున్న లేదా చేస్తున్న తప్పుడు భాష్యాలు పుంఖాను పుంఖాలుగా ఉన్నాయి. అలాంటి తప్పుడు వ్యాఖ్యానాలతో సోషలిజానికి వ్యతిరేకంగా జనాలను రెచ్చగొడుతూ ఉంటే అది తమ రాజ్యాంగానికి వ్యతిరేకం కనుక వాటి వ్యాప్తిని అరికట్టేందుకు చైనా చర్యలు తీసుకోవచ్చు. లేదా మత గ్రంధాల్లో ఉన్న అంశాలు కొన్ని సోషలిజం, కమ్యూనిజాలకు ఎలా వ్యతిరేకం కావో, సానుకూలమో వివరించి జనాల్లో ఉన్న పొరపాటు అవగాహనలను తొలగించేందుకు తమ రాజ్యాంగ లక్ష్యాలకు అనుకూలమైన భాష్యంతో పుస్తకాలను రాయాలని, చైనా లక్షణాలతో కూడిన మత వ్యవస్ధను నిర్మించాలని అక్కడి ప్రభుత్వం చెప్పిందే తప్ప, వాటిని తిరిగి రాయటం అంటూ ఎక్కడా ఉండదు.
మారుతున్న కాలానికి అనుగుణంగా లేని మత పరమైన గ్రంధాలకు సమగ్ర భాష్యాలు రాయాలని, కమ్యూనిస్టు పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా ఉన్న వాటిని నిరోధించాలని గతేడాది నవంబరులో జరిగిన చైనా మత వ్యవహారాల కమిటీ సమావేశంలో చెప్పారు తప్ప బైబిల్‌, ఖురాన్‌ అని ఎక్కడా చెప్పలేదు. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించి చెప్పినట్లుగా పశ్చిమ దేశాల మీడియా దానికి మత గ్రంధాల పేర్లను జోడించి కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి ఉపయోగించుకుంది. ఈ సమావేశంలో వివిధ మతాలకు చెందిన వారు, నిపుణులు, ప్రజాప్రతినిధులు 16 మంది పాల్గొన్నారు. మతాలను, వ్యక్తిగత మత విశ్వాసాలను చైనా కమ్యూనిస్టు పార్టీ అనుమతిస్తుంది తప్ప మతం, విశ్వాసాల ముసుగులో రాజ్యాంగ పరమైన సోషలిజం, కమ్యూనిస్టు, మత రహిత లక్ష్యాలను వ్యతిరేకించే శక్తులను చైనాలో అనుమతించరన్నది స్పష్టం. మన దేశంలో మత వి శ్వాసాలు కలిగి ఉన్నప్పటికీ కమ్యూనిస్టు పార్టీలలో సభ్యులుగా చేరవచ్చు. అలాంటి వారు అనర్హులు అనే నిబంధనలు లేవు.

Image result for why pope and islamic countries silence on china
” కైస్తవులను చైనా అణచివేస్తోంది, చర్చీలను కూల్చివేస్తోంది”
అంతే కాదు వాటికన్‌ను గుర్తించటం లేదు, వాటికన్‌ నియమించిన వారిని అరెస్టు చేస్తోంది, బిషప్పులను స్వంతంగా నియమించుకుంటోంది.ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారంలో ఇదొకటి. ముందుగా తెలుసుకోవాల్సిన అంశం. వాటికన్‌ ఇంతవరకు కమ్యూనిస్టు చైనాను ఒక దేశంగానే గుర్తించలేదు. ఇప్పటికీ దాని దృష్టిలో చైనా అంటే తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ మాత్రమే. కమ్యూనిస్టు పాలన ఏర్పడిన తరువాత ఒక్క పోప్‌ కూడా చైనా సందర్శనకు రాలేదు. అందువలన వాటికన్‌ అధికారాన్ని చైనా గుర్తించే ప్రశ్నే ఉదయించదు. రెండవది, చైనాలో ఉన్న క్రైస్తవులు తమ బిషప్పులను తామే నియమించుకుంటున్నారు అంటే అక్కడ క్రైస్తవులను అణచివేస్తే బిషప్పులు దేనికి ? అంటే అణచివేత కూడా వాస్తవం కాదు. మరి ఎవరిని అరెస్టు చేస్తున్నారు? చైనా సర్కార్‌ అనుమతి లేదా గుర్తింపు లేకుండా రహస్యంగా చర్చ్‌లను ఏర్పాటు చేస్తూ, రహస్య, చైనా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిని అరెస్టు చేస్తున్నారు. దేశవ్యతిరేక శక్తులను ఏ దేశంలో అయినా అదే చేస్తారు కదా ! సామాన్యులకు ఏసుక్రీస్తును ఆరాధించటానికి స్వేచ్చ ముఖ్యమా లేక వాటికన్‌ పెద్దలు చెప్పినట్లుగా చేయటం ముఖ్యమా ? ప్రపంచంలో అనేక దేశాలలో సాగుతున్న దోపీడీని, నియంతలను వాటికన్‌ లేదా క్రైస్తవం వ్యతిరేకించటం లేదు, సమసమాజం కోరుతున్న కమ్యూనిస్టులను ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. చైనాతో సంబంధాలు పెట్టుకోవాలని వాటికన్‌ పెద్దలు కొందరికి ఉన్నా, అమెరికా కనుసన్నలలో పని చేసే కమ్యూనిస్టు వ్యతిరేక చైనా జాతీయుడైన జోసెఫ్‌ జెన్‌ వంటి వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చివరికి వాటికన్‌ పెద్దలు కూడా రాజీపడి లొంగిపోతున్నారని, చైనాను సంతృప్తిపరచేందుకే ఎల్ల వేళలా పని చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశాడు. ఇంతకాలం చైనాలో క్రైస్తవులను అణచివేస్తున్నారని చేసిన ప్రచారం వాటికన్‌కు తెలియంది కాదు. వాటి వెనుక ఉన్న నిజానిజాలు కూడా తెలుసు. అందువల్లనే ఎన్ని విమర్శలు వచ్చినా, ఎందరు వ్యతిరేకించినప్పటికీ 2018లో పోప్‌ ఫ్రాన్సిస్‌ చైనాతో ఒప్పందం చేసుకున్నారు. చైనా నియమించిన బిషప్పులను కూడా గుర్తించారు. ఒప్పందం చేసుకుంటే ఇంతకాలం చైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ రహస్యంగా చర్చ్‌లను నిర్వహించిన నిజమైన విశ్వాసులను మోసం చేసినట్లే అని జోసెఫ్‌ జెన్‌ అన్నాడు. ఒప్పందం ప్రకారం రహస్యంగా ఉన్న చర్చ్‌లను వాటికన్‌ ప్రోత్సహించకూడదు.

Image result for why pope and islamic countries silence on china
” ముస్లింలను అణచివేస్తున్నారు, నిర్బంధ శిబిరాల్లో పెడుతున్నారు ”
చైనాలోని గ్జిన్‌జియాంగ్‌ రాష్ట్ర జనాభా రెండు కోట్లు. అది చైనా వాయువ్య సరిహద్దులో ఉంది. ఒక స్వయం పాలిత ప్రాంత హౌదా కలిగి ఉంది. ఒక వైపు మంగోలియా, కిర్కిజిస్తాన్‌, కజకస్తాన్‌, తజికిస్తాన్‌, రష్యా, ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్ధాన్‌,భారత్‌ సరిహద్దులుగా ఉంది. అయితే ఆక్సారు చిన్‌గా పిలుస్తూ మనది అని చెప్పుకుంటున్న ప్రాంతం గ్జిన్‌జియాంగ్‌లో భాగమైన తమది అని చైనా చెబుతోంది, అది ప్రస్తుతం చైనా అధీనంలో ఉన్న భారత-చైనా వివాదాస్పద ప్రాంతాలలో ఒకటి. ముస్లింలలో ఒక పెద్ద తెగ యుఘిర్‌కు చెందిన జనాభా దాదాపు 46శాతం ఉండటంతో దానిని యుఘిర్‌ రాష్ట్రం అని కూడా పిలుస్తారు.నలభైశాతం మంది హాన్‌ చైనా జాతీయులు, మిగిలిన వారు ఇతర ముస్లిం తెగలకు చెందిన వారున్నారు. కమ్యూనిస్టులు అధికారానికి రాక ముందు ఆ ప్రాంతంలోని యుద్ద ప్రభువులు నాటి కొమింటాంగ్‌ చైనా పాలకులకు వ్యతిరేకంగా సోవియట్‌ మద్దతుతో స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారని చెబుతారు గానీ స్వతంత్ర దేశంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత చైనాలో అంతర్భాగంగానే ఉంది. సోవియట్‌ కూలిపోయిన తరువాత ఇరుగు పొరుగు రాజ్యాలు, ఇతర విదేశీ జోక్యంతో కొంత మంది తప్పుదారి పట్టిన యుఘిర్‌లు కమ్యూనిస్టులు అధికారానికి రాకముందు కొంత కాలం తాము స్వతంత్ర దేశంగా ఉన్నామని, హాన్‌ జాతీయులు తమ మీద పెత్తనం చేస్తున్నారని, తమకు స్వాతంత్య్రం ఇవ్వాలంటూ వేర్పాటు వాదాన్ని ముందుకు తెచ్చారు. కొన్ని ఉగ్రవాద చర్యలకు సైతం పాల్పడ్డారు. మనకు కాశ్మీర్‌ ఎలాంటి కీలక ప్రాంతమో చైనాకు అది అంత ముఖ్యమైనది. ఈ నేపధ్యంలో చైనా ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యల గురించి చిలవలు పలవలుగా చిత్రిస్తున్నారు. ముస్లింలను అణచివేసేందుకు తీసుకున్న నిర్ణయాల పత్రాలు బయట పడ్డాయని కొన్ని పత్రికలు కథలు రాశాయి.
చైనా లక్షణాలతో సోషలిజాన్ని నిర్మిస్తామని చైనా కమ్యూనిస్టు పార్టీ చెబుతున్నది. దీనిని కొంత మంది కమ్యూనిస్టులే అంగీకరించటం లేదు. ఆ పేరుతో అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్దను నిర్మిస్తున్నారనే ప్రచారం చేస్తున్నారు కూడా. నూరు పూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్నట్లుగా ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలను వారిని వ్యక్తం చేసుకోనివ్వటం తప్ప మరొక మార్గం లేదు. పెట్టుబడిదారీ విధానం అన్ని దేశాల్లో ఒకే మూసగా అభివృద్ది చెందలేదు. అలాగే సోషలిజాన్ని కూడా అభివృద్ధి చేయలేమని, ఏ దేశానికి ఆదేశ ప్రత్యేక పరిస్ధితులను గమనంలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు సోషలిజాన్ని నిర్మించే క్రమంలో దశల గురించి తెలియదు, చైనీయుల అవగాహన ప్రకారం అనేక ద శల్లో తమది ఒకటి అంటున్నారు. మొత్తంగా చూసినపుడు వారి దారి ఎటు అన్నదే ముఖ్యం.

Image result for china islamic
సోషలిజం గురించే ఇలా ఉన్నపుడు ఇక మతాల గురించి చెప్పాల్సిందేముంది. ఎంతో సున్నితమైన అంశం, శత్రువులు కాచుకొని ఉంటారు. ఒక లౌకిక వ్యవస్దలో మతం పట్ల ఎలా వ్యవహరించాలి అన్నది ఒక ముఖ్యాంశం, అది కూడా కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న చోట(మన దేశంలో మాదిరి ఒకటో అరో రాష్ట్రంలో అధికారం పొందటం కాదు) మరింత సంక్లిష్టం. సోషలిస్టు సమాజ లక్ష్యం కలిగిన ఏ వ్యవస్దలో అయినా మతం దాని నిర్మాణానికి దోహదం చేసేదిగా ఉండాలి తప్ప వ్యతిరేకించేదిగా ఉండకూడదు. మత విశ్వాసాలు వ్యక్తి, కుటుంబానికి పరిమితం కావాలి తప్ప నా మతం చెప్పినట్లుగా పాలన నడవాలంటే కుదరదు. మతాలే దానికి అనుగుణ్యంగా మారాల్సి ఉంటుంది.అనేక దేశాల్లో అలా మారినపుడు సోషలిస్టు దేశాల్లో కుదరదంటే ఎలా ?
చైనాలోని ఎనిమిది ముస్లిం తెగల పెద్దలతో ప్రభుత్వం సమావేశం జరిపి సోషలిజానికి తగిన విధంగా ఇస్లాం మారాల్సిన అవసరం గురించి వివరించింది, అందుకు గాను ఐదు సంవత్సరాలలో శీఘ్రగతిన తెలియచెప్పేందుకు తీసుకోవాల్సిన చర్యలను వారి ముందుంచింది. పశ్చిమ దేశాల మీడియా దీన్ని దొరకబుచ్చుకొని యుఘిర్‌లో ఉగ్రవాద నిర్మూలన చర్యలుగా కొందరు చిత్రీకరిస్తే మరి కొందరు ఆ పేరుతో మతాన్ని అణచివేసేందుకు పూనుకున్నట్లు రాశారు. అనేక దేశాల్లో మితవాద శక్తులు మత పెత్తనాన్ని తిరిగి పునరుద్దరించేందుకు, పాలకుల మీద వత్తిడి తెచ్చేందుకు ఇటీవలి కాలంలో తీవ్రంగా ప్రయత్నిస్తున్న అంశాన్ని మరచిపోకూడదు. మతపరమైన దేశాల్లో పరిస్ధితులు ఎంత దారుణంగా ఉన్నాయో చూసిన తరువాత ప్రతి లౌకిక దేశం తన జాగ్రత్తలు తాను తీసుకోనట్లయితే అనేక కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంటర్నెట్‌ ఎంత వేగంగా చొచ్చుకుపోతోందో దాన్ని వినియోగించుకొని మత శక్తులు అంతగా రెచ్చిపోవటాన్ని మనం చూస్తున్నాం. ఇదే పరిస్ధితి ప్రపంచమంతటా ఉంది. పోప్‌ జాన్‌ పాల్‌ 2 పోలెండ్‌లో సోషలిస్టు వ్యవస్ధ కూల్చివేతకు ఎలా చేతులు కలిపిందీ మనం చూశాము. వాటికన్‌ కేంద్రం ఉన్న ఇటలీ ఉప ప్రధాని మాటియో సల్వవినీ 2018 ప్రారంభంలో ఒక ప్రకటన చేశాడు.’ మన మీద దాడి జరుగుతోంది, మన సంస్కృతి, సమాజం, సంప్రదాయాలు, జీవన విధానానికి ముప్పు ఏర్పడింది.’ అని మాట్లాడితే ఒక మీడియా 2019లో మత యుద్ధాలు తిరిగి రానున్నాయని రాసింది. ఛాందసవాదం వెర్రి తలలు వేస్తోంది, అది మితవాద జాతీయ వాద భావనలను ముందుకు తెస్తోంది, హింసాకాండకు, సామాజిక అస్ధిరతకు కారణం అవుతోంది. ఈ అనుభవాలను ప్రతి దేశం తీసుకోవాలి, అవసరమైన చర్యలు తీసుకోవాలి. చైనా దీనికి మినహాయింపుగా ఉండజాలదు.
సోషలిజానికి అనుగుణ్యంగా ఒక్క ఇస్లామే కాదు, చైనాలోని అన్ని మతాలూ మారాలని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అందుకు అనుగుణ్యమైన చర్యలు తీసుకొంటోంది. ఏ మతానికి మినహాయింపు లేదు. మన దేశంలో కేంద్రంలో, అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న సంఘపరివార్‌ నేతల మాదిరి హిందూ మతానికి ఇతర మతాల నుంచి, లౌకిక వాదుల నుంచి ముప్పు వస్తోందని చెబుతన్నట్లుగా చైనాలో మెజారిటీ మతానికి ముప్పు వస్తోందని చెప్పటం లేదు. ఒక మైనారిటీ మతాన్నుంచి వస్తోందనే ముప్పును మరొక మెజారిటీ మతోన్మాదం అరికట్టలేదు, అది తన ఉన్మాదాన్ని జనం మీద రుద్దుతుంది. జనాన్ని అణచివేస్తుంది. 2018లో చైనా విడుదల చేసిన ఒక శ్వేత పత్ర సమాచారం ప్రకారం 20 కోట్ల మంది మతాన్ని నమ్మేవారున్నారు. ప్రభుత్వం వద్ద నమోదైన ప్రార్దనా స్ధలాలు 1,44,000 ఉన్నాయి. వాటిలో 3,80,000 మంది మత పరమైన క్రతువులు నిర్వహించే వారున్నారు. ఉగ్రవాద నిరోధ చర్యలు, మత పరమైన స్వేచ్చ పూర్తిగా భిన్నమైన అంశాలు. ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకోవటం, దాన్ని నివారించటం మత స్వేచ్చను అడ్డుకోవటం కాదు. మన దేశంలో సంఘపరివార్‌ చేస్తున్న ప్రచారం మాదిరి ముస్లింలు మొత్తం ఉగ్రవాదులే అని లేదా అందరూ ఉగ్రవాదులు కాదు గానీ ఉగ్రవాదులుగా ఉన్నవారందరూ ముస్లింలే అనే తప్పుడు ప్రచారాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ చేయటం లేదు.
ముస్లిం దేశాలు చైనా చర్యను ఎందుకు ఖండించటం లేదు ?
చైనాలో ఒక రాష్ట్రంలోని ముస్లింలను ఇంతగా హింస పెడుతుంటే ఒక్క ముస్లిం దేశమూ ఖండిచదు ఎందుకు అని కొందరు సామజిక మాధ్యమం, మీడియాలో అమాయకంగా అడుగుతున్నట్లు కనిపిస్తారు. వారే వాటికి సమాధానం కూడా చెబుతారు.చైనాతో ఉన్న ఆర్దిక సంబంధాలే కారణం అన్నది అది. మరి అమెరికా ఎందుకు అంతగా గొంతు చించుకుంటున్నది, చైనాతో అందరి కంటే ఎక్కువ వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నది, చైనా దగ్గర పెద్ద మొత్తంలో డాలర్లు అప్పుగా తెచ్చుకున్నదీ అమెరికాయే కదా ? చైనా రాజకీయంగా, ఆర్ధికంగా తనకు నచ్చినట్లు లంగలేదు కనుక బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నది అనుకోవాలా ?
చైనా పదిలక్షల మంది యుఘిర్‌ ముస్లింలను నిర్బంధ శిబిరాల్లో పెట్టింది. దీనికి పశ్చిమ దే శాలూ, వాటి మీడియా చూపే ఆధారాలు లేవు, దగ్గరుండి సరిగ్గా లెక్క పెట్టినట్లు రాస్తున్నారు. కోటి మంది ముస్లింలు ఉన్న ప్రాంతంలో పది లక్షల మందిని నిర్భందిస్తే మిగిలిన వారంతా ఈ పాటికి పొరుగు దేశాలకు శరణార్దులుగా వెళ్లి ఉండాల్సింది. కానీ సరిహద్దుల్లో ఉన్న ఏ ఒక్క ముస్లిం దేశం, మరొక దేశం గానీ తమ దేశానికి అలాంటి సమస్య ఉన్నట్లు ఇంతవరకు ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయలేదు. దాదాపు పదకొండువేల కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు కలిగిన ప్రాంతమది, తప్పించుకోకుండా కట్టడి చేయటం ఏ దేశానికైనా సాధ్యమేనా ? ఉపగ్రహ చిత్రాలంటూ పత్రికల్లో టీవీల్లో కొన్ని భవనాలను చూపుతారు, అవి ఏ భవనాలైనా కావచ్చు. చైనాలో జరుగుతున్నట్లు చెబుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి అమెరికా తప్ప మరొక దేశం ఏదీ చొరవ తీసుకొని ఫిర్యాదు చేసేందుకు ఇంతవరకు ముందుకు రాలేదు.

Image result for pope  china
తామే తుమ్మి తామే తధాస్తు అనుకున్నట్లుగా తాము పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కారణంగా నిర్బంధ శిబిరాలను పెద్ద సంఖ్యలో మూసివేసిందని కూడా పశ్చిమ దేశాల వారు ప్రచారం చేస్తున్నారు. ముందే చెప్పుకున్నట్లుగా దేశ వ్యవస్ధకు అనుగుణ్యంగా వ్యవహరించాల్సిన తీరుతెన్నులను వివరించేందుకు పిల్లలు, యువతకు ప్రభుత్వం కొన్ని పాఠశాలలను ఏర్పాటు చేసింది. వాటిలో ఉగ్రవాదం, దానికి దూరంగా ఉండాల్సిన అవసరం, బతికేందుకు అవసరమైన నైపుణ్యాలలో శిక్షణ వంటివి అన్నీ అక్కడ వున్నాయని చైనా అధికారులే చెబుతున్నారు. వాటిని శత్రువులు నిర్భంద శిబిరాలంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో నక్సల్స్‌గా మారి నేరాలు చేసిన వారిని పట్టిస్తే బహుమతులు ప్రకటించటం లేదా వారే లొంగిపోతే ప్రభుత్వాలు ఆర్దిక సాయం చేసి జనజీవన స్రవంతిలోకి తెచ్చే పధకాలను అమలు జరపటం తెలిసిందే. చైనా నిర్వహిస్తున్న అలాంటి పాఠశాలలను సందర్శించాలని అనేక దేశాల, దౌత్యవేత్తలు, జర్నలిస్టులను ఆహ్వానించింది. వారందరూ చైనా అనుకూలురు అని ఒక నింద. వాటిలో ఖురాన్‌ చదవ నివ్వటం లేదని, పంది మాంసం బలవంతంగా తినిపిస్తున్నారంటూ రంజుగా కథలు చెబుతున్నారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని సామాజిక, మానవతా పూర్వక, సాంస్కృతిక వ్యవహారాల కమిటీ ముందు గతేడాది అక్టోబరు 23 యుఘీర్స్‌పై జరుగుతున్నదాడులంటూ అమెరికా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి 23దేశాలు ఫిర్యాదు చేశాయి,54దేశాలు చైనా తీసుకున్న చర్యలను సమర్ధించాయి. ఇస్లామిక్‌ దేశాలు పాలస్తీనియన్లు, మయన్మార్‌లో రోహింగ్యాల మీద జరుగుతున్న దాడులను ఖండించాయి గానీ, యుఘీర్స్‌ పట్ల కేవలం ఆందోళన మాత్రమే వ్యక్తం చేశాయని అమెరికన్లు కస్సుబుస్సుమంటున్నారు. పాలస్తీనియన్ల మీద జరుగుతున్నదాడులను అమెరికా ఎప్పుడైనా ఖండించిందా, ఖండించకపోగా ఐరాసలో ఇజ్రాయెల్‌ను సమర్దిస్తున్నది. సిరియాపై దాడికి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు పంపిన ఆల్‌ఖైదా ఉగ్రవాద ముఠాలలో యుఘీర్‌లు దొరికిపోయారు. వారిని అక్కడకు పంపిందెవరు చైనా వారా అమెరికన్లా ? ఆప్ఘన్‌ తాలిబాన్ల ముఠాలలో అనేక మంది యుఘీర్లు పట్టుబడ్డారు, వారిని తాలిబాన్లలోకి పంపిందెవరు ? ఈ విషయాలు ముస్లిం దేశాలకు తెలియవా ?చైనాను ఏమని విమర్శిస్తాయి?

Share this:

  • Tweet
  • More
Like Loading...

పౌరసత్వ సవరణ చట్టం-వాదనలు, వాస్తవాలు !

16 Monday Dec 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION

≈ 1 Comment

Tags

CAA, CAB, citizenship amendment act 2019 : some arguments and facts, India citizenship amendment act 2019

Image result for citizenship amendment act 2019పౌరసత్వ సవరణ చట్టం-వాదనలు, వాస్తవాలు !
ఎం కోటేశ్వరరావు
పార్లమెంట్‌ ఆమోదించిన పౌరసత్వ సవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారింది.దీని చట్టబద్దతను సవాలు చేస్తూ అనేక మంది సుప్రీం కోర్టు తలుపు తట్టనున్నారు. ఈ చట్టం గురించి అనేక మందిలో తలెత్తిన అనుమానాలు, కొన్ని వాదనలు, వాస్తవాలను చూద్దాం.
ఈ చట్టం ద్వారా ప్రస్తుతం దేశంలో ఉన్న ముస్లింలకు పోయేదేమీ లేదు, అయినా ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు, వారిని ఎవరో రెచ్చగొడుతున్నారు, విదేశీ ముస్లింలను ఆహ్వానించి పౌరసత్వం ఇవ్వాలని వారు కోరుతున్నారా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మాటలు మాట్లాడే వారు ఈశాన్య రాష్ట్రాలలో నిరసనలు తెలుపుతున్నది ప్రధానంగా హిందువులే అన్న అంశాన్ని కావాలనే విస్మరిస్తున్నారు. అసోంలో ఇప్పటికే కొందరు బిజెపి నేతలు పదవులకు రాజీనామాలు చేశారు, బిజెపి మద్దతుదారైన ఏజిపి పునరాలోచనలో పడింది. మరి వీరిని ఎవరు ప్రేరేపిస్తున్నట్లు ?
1985లో కుదిరిన అస్సాం ఒప్పందం ప్రకారం 1971 మార్చి 24 తరువాత దేశంలో అక్రమంగా ప్రవేశించిన వారందరినీ మతంతో నిమిత్తం లేకుండా వెనక్కు పంపాల్సి ఉండగా విదేశీయులకు స్వాగతం పలికేందుకు ఎవరూ సిద్ధం కాదు, అలాంటి అవసరమూ లేదు. దేశంలోని ఏ ముస్లిమూ అలాంటి డిమాండ్‌ను ఎన్నడూ ముందుకు తేలేదు. గతంలో లేని మాదిరి శరణార్దులుగా వచ్చిన వారికి మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించిన వారు, రేపు అదే ప్రాతిపదికన ఇచ్చిన పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు కూడా వెనుకాడరన్నదే ఇప్పుడు తలెత్తిన భయం. రాజ్యాంగాన్ని దెబ్బతీసే అనేక చర్యలను వేగంగా తీసుకుంటున్న పూర్వరంగంలో ఇతర మత రాజ్యాలలో మాదిరి తమ హక్కులను హరిస్తారా, రెండవ తరగతి పౌరులుగా మారుస్తారా అన్న ఆందోళనే మైనారిటీలను ఆందోళనకు గురి చేస్తోంది.
సవరించిన చట్టం ప్రకారం పాకిస్ధాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘ్‌నిస్తాన్‌లో ఉన్న హిందువులు ఎవరైనా మన దేశంలోని బంధువులు, కుటుంబాలతో కలసిపోయేందుకు అక్కడి నుంచి వలస వస్తే వారికి పౌరసత్వం ఇచ్చే వీలు కల్పిస్తుంది. ఇదే సూత్రం ముస్లింలకు వర్తించదు. హిందువుల మాదిరే ఈ దేశాల్లో ఉన్న ముస్లింలకు కూడా మన దేశంలో బంధుత్వాలు, కుటుంబాలు ఉన్నాయి. ఒక మతం వారికి ఒక సూత్రం, మరొక మతం వారికి మరొక సూత్రం మన రాజ్యాంగంలో లేదే !
ఈ మూడు దేశాల్లో ఉన్నది ఇస్లామిక్‌ ప్రభుత్వాలు. పాక్‌, ఆప్ఘనిస్తాన్‌ మాత్రమే ఇస్లామిక్‌ అని ప్రకటించుకున్నాయి.1972లో బంగ్లాదేశ్‌ లౌకిక రాజ్యంగా ఏర్పడింది. తరువాత దానిని 1980లో ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చారు.1972లో ఆమోదించిన లౌకిక సూత్రాలే చెల్లుబాటు అవుతాయని 2010లో అక్కడి సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అయినప్పటికీ ఆచరణలో మత రాజ్యంగా ఉందనే కొందరు చెబుతారు.
ఈ మూడు దేశాల్లో అత్యధికులు ముస్లింలు, మిగిలిన వారందరూ మైనారిటీలు, వారి మీద దాడులు జరుగుతున్నాయి కనుక వారు మాత్రమే భారత్‌లో పౌరసత్వం పొందేందుకు అర్హులు అన్నది ఒక వాదన. ప్రపంచంలో మైనారిటీలు అన్నిదేశాలలో ఉన్నారు. పాకిస్ధాన్‌లో కంటే ఇండోనేషియాలో హిందువుల సంఖ్య. మన దేశంలో మైనారిటీల మీద దాడులు జరుగుతున్నట్లుగానే ప్రపంచంలో అనేక దేశాల్లో దాడులు జరుగుతున్నాయి. అలాంటి వారు మరొక దేశంలో ఆశ్రయం కోరితే వారికి మత ప్రాతిపదికన పౌరసత్వం మంజూరు చేసే పద్దతి ఏ దేశంలోనూ లేదు.
పాకిస్ధాన్‌లో మైనారిటీలు అంటే ఒక్క హిందువులే కాదు. హిందువులలో వివిధ తరగతులు ఉన్నట్లే ముస్లింలలో కూడా మెజారిటీ, మైనారిటీలు ఉన్నారు. అక్కడి షియాలు, అహమ్మదీయాలు, సూఫీలు మైనారిటీలే. హిందువులు ఇతర మైనారిటీల మీద దాడులు జరిగినట్లే వీరి మీద కూడా నిత్యం దాడులు జరుగుతున్నాయి.హిందువులకు ఉన్నట్లే వీరి పూర్వీకులు కూడా మన దేశంలో ఉన్నారు. అయినప్పటికీ ఈ మైనారిటీలు ఆశ్రయం కోరితే తాజాగా చేసిన సవరణ చట్టంలో అంగీకరించే అవకాశం లేదు. పాకిస్ధాన్‌లో లష్కరే జాంగ్వీ పేరుతో ఒక ఉగ్రవాద సంస్ధ ఉంది. దీని పని షియాల మీద దాడులు, వారిని చంపటమే. వారిని ముస్లిమేతరులుగా ప్రకటించాలని అది డిమాండ్‌ చేస్తోంది. 2003-16 మధ్య 2,558 మందిని హత్య చేయగా 4,518 మందిని గాయపరిచారు. జనాభాలో షియాలు 15నుంచి 20శాతం వరకు ఉన్నారు.
1974లో పాకిస్ధాన్‌ ఒక రాజ్యాంగ సవరణ చేసి అహమ్మదీలను ముస్లిమేతరులుగా ప్రకటించింది. తరువాత నియంత జియావుల్‌ హక్‌ అహమ్మదీయాలు తమను ముస్లింలుగా పిలుచుకోవటాన్ని నిషేధించాడు. తెహరిక్‌ ఇ తాలిబాన్‌ పాకిస్ధాన్‌ అనే సంస్ధ లాహౌర్‌ తదితర చోట్ల అహమ్మదీలు, వారి మసీదులపై దాడులు చేస్తున్నది. పోలీసులు కూడా అదే దుండగాలకు పాల్పడుతున్నారు. మన దేశంలో ముస్లింలు, క్రైస్తవుల మీద విద్వేష ప్రచారం చేస్తున్నట్లుగానే అహమ్మదీల మీద పత్రికల్లోనే అలాంటి ప్రచారానికి సంబంధించి 3,963 వార్తలు, 532 వ్యాసాలను ఉటంకిస్తూ బాధితులు ఒక నివేదికను విడుదల చేశారు. బంగ్లాదేశ్‌లో దేవుడు, దేవదూతలు, ప్రవక్తల పట్ల విశ్వాసం లేని వారు గణనీయ సంఖ్యలో ఉన్నారు. వారందరూ ఆచరణలో ముస్లిం మైనారిటీలే, వారు గాక బీహారీ ముస్లింలు, అస్సామీ ముస్లింల పట్ల బంగ్లాదేశ్‌లో వివక్ష కొనసాగుతోంది, వారు దాడులకు గురవుతున్నారు, వారు శరణు కోరితే వైఖరి ఏమిటి ?

Image result for citizenship amendment act 2019
బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలోని సంస్క త విద్యా ధర్మ విజ్ఞాన కేంద్రంలో సంస్క తంలో ఉన్న హిందూ పురాణాలను జంధ్యం లేని, ఫిరోజ్‌ ఖాన్‌ అనే ఒక ముస్లిం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ బోధించటాన్ని అంగీకరించేది లేదంటూ అక్కడి విద్యార్ధులు, కొందరు టీచర్లు కూడా ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దాంతో ఫిరోజ్‌ఖాన్‌ రాజీనామా చేశారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పోయిన తన పరువును కాపాడుకొనేందుకు రాజీమార్గంగా ఫిరోజ్‌ఖాన్‌ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకొని ఆర్ట్స్‌ విభాగంలో సంస్క త సాహిత్యం, భాషా విభాగంలో నియమించింది.
పాకిస్ధాన్‌లో కూడా మతఛాందస శక్తులు అతిఫ్‌ మియాన్‌ అనే అహమ్మదీ సామాజిక తరగతికి చెందిన ఆర్ధికవేత్తను ఆర్ధిక సలహా మండలిలో పని చేయటానికి అంగీకరించబోమని వత్తిడి చేయటంతో వారంలోపే నియామకాన్ని రద్దు చేశారు. మత అసహనం, వివక్షకు ఇది పక్కా నిదర్శనం. సూఫీ ముస్లింల మీద కూడా అక్కడ ఇలాంటి దాడులే జరుగుతున్నాయి. వారు కూడా పాక్‌లో హిందువుల మాదిరే మన పూర్వీకులే కదా ! శరణార్ధులంటే ఎవరైనా శరణార్ధులే, వారిని అనుమతించటమా లేదా అనే ఒక విధానం తీసుకోవటంలో తప్పు లేదు కానీ వారి పట్ల మత విబేధాన్ని పాటించటం అంటే ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటమే. ఇది మన భారతీయ సంప్రదాయం కానే కాదు. అఖండ్‌ భారత్‌ను పునరుద్దరించాలని చెప్పే వారు, ఈ సంకుచిత వైఖరిని అనుసరించటంలో హిందూ ఓటు బ్యాంకు రాజకీయం తప్ప, విశాల భావనకు చోటెక్కడ ? పౌరసత్వ చట్ట సవరణ ద్వారా అఖండ భారత్‌లో విభజనకు పూర్వం ఉన్న ముస్లింలకు చోటు లేదని తేల్చి చెప్పారు.
రాజ్యాంగ విరుద్దం అని ఎందుకు అంటున్నారు ?
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే వారు ముస్లిం అనుకూలురు, ఇతర దేశాల నుంచి ముస్లింలు వలస రావాలని కోరుతున్నారనే తప్పుడు ప్రచారం జరుగుతోంది. రాజ్యాంగ విరుద్దమైన చర్యను వ్యతిరేకించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ముస్లింలే వ్యతిరేకిస్తున్నారు అనేది తప్పుడు ప్రచారం, వక్రీకరణ. దేశ విభజన నేపధ్యంలో తలెత్తే పౌరసత్వ సమస్యలను పరిష్కరించేందుకు హింద్షూముస్లిం అనే వివక్ష లేకుండా రాజ్యాంగంలోని ఐదు నుంచి పదకొండు వరకు ఉన్న ఆర్టికల్స్‌ నిబంధనలు, విధి విధానాలను స్పష్టంగా పేర్కొన్నాయి. ఆర్టికల్‌ పదకొండు ప్రకారం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు, తిరస్కరించేందుకు పార్లమెంట్‌కు అధికారం ఇచ్చింది. ఇప్పుడు దాన్ని వినియోగించుకొని ఆ ఆర్టికల్‌ను సవరిస్తూ మత ప్రాతిపదికన ముస్లిం మినహా పైన పేర్కొన్న మూడు దేశాల నుంచి వచ్చిన హిందూ, బౌద్ద, జైన, సిక్కు, పార్సీ, క్రైస్తవులకు పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఎన్‌డిఏ సర్కార్‌ చట్టసవరణ చేసింది. గతంలో లేని మత వివక్షను చొప్పించింది, ఇది లౌకిక స్వభావం నుంచి మత రాజ్యంవైపు వేసే అడుగులో భాగం తప్ప మరొకటి కాదు. ఆర్టికల్‌ 14కు విరుద్ధం.
1955 చట్టం ప్రకారం అక్రమంగా దేశంలో ప్రవేశించిన వారికి పౌరసత్వాన్ని ఇచ్చే అవకాశం లేదు. సవరించిన చట్టంలో దీనికి మినహాయింపులు ఇచ్చారు. 2015లో పాస్‌పోర్టు, విదేశీయుల చట్టానికి సంబంధించి చేసిన సవరణల ప్రకారం ముస్లిమేతరులు తగిన పత్రాలు లేకుండా దేశంలో ప్రవేశించినప్పటికీ పౌరసత్వాన్ని పొందేందుకు అవసరమైన ఎత్తుగడ దీనిలో స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది చట్టసవరణకు ప్రవేశపెట్టిన బిల్లుకు ఈశాన్య రాష్ట్రాలలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. దాంతో రాజ్యాంగ ఆరవ షెడ్యూలులో చేర్చిన గిరిజన ప్రాంతాలకు ఇప్పుడు ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే ఒకసారి పౌరసత్వం ఇచ్చిన తరువాత ఈ ప్రాంతాలకు వలసలను ఎలా నిరోధిస్తారన్నది ఒక ప్రశ్న. తెలుగు రాష్ట్రాలలో ఒన్‌ ఆఫ్‌ 70 చట్టం ఉన్నప్పటికీ గిరిజనేతరులు గిరిజన ప్రాంతాలకు ఎలా చేరుతున్నదీ చూస్తున్నాము.ఈశాన్యరాష్ట్రాలలోని గిరిజనేతర ప్రాంతాలను ఇప్పటి వరకు శరణార్ధులుగా ఉన్న వారికి పౌరసత్వం ఇచ్చి నింపితే స్ధానికులు తాము మైనారిటీలుగా మారతామని, తమ భాష, భూమి, సంస్క తులకు ముప్పు వస్తుందనే భయంతో ఆ ప్రాంతాలన్నీ ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

Image result for citizenship amendment act 2019
శరణార్ధుల విషయంలో మత ప్రాతిపదికను ప్రవేశపెట్టిన కేంద్రం ఇంతటితో ఆగుతుందనే హామీ లేని కారణంగా మైనారిటీల్లో భయం ఏర్పడింది. ఈశాన్య ప్రాంతాలలో తమ అస్ధిత్వం, అవకాశాల గురించి హిందువులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా వీధుల్లోకి వచ్చింది వారే. ఇదే సమయంలో దేశ వ్యాపితంగా ఎన్‌ఆర్‌సిని అమలు జరుపుతామని కేంద్రం ప్రకటించింది. అసోం ఎన్‌ఆర్‌సి జాబితాలో అవకతవకలు, పేర్లను తొలగించే అధికారం అధికారులకు కట్టబెట్టం మైనారిటీల్లో ఇప్పటికే అనేక అనుమానాలు, ఆందోళనలను రేకెత్తించింది. శరణార్ధుల విషయంలో మతవివక్షను ప్రవేశపెట్టిన కేంద్రం ఎన్‌ఆర్‌సి పేరుతో దేశంలో ఉన్న లక్షల మంది ముస్లింల పౌరసత్వాలను రద్దు చేస్తారనే భయం అనేక చోట్ల వారిని ఆందోళనకు పురికొల్పింది.
ఆఫ్ఘనిస్తాన్‌కు మన దేశానికి ఇప్పుడు ఆచరణలో సరిహద్దులేదు. అయినప్పటికీ ఆ దేశాన్ని ఎందుకు చేర్చారో తెలియదు. మన పొరుగునే ఉన్న మయన్మార్‌లో మైనారిటీలుగా ఉన్న రోహింగ్యాలు, శ్రీలంకలో మైనారిటీలుగా హిందువులు, ముస్లింలు ఉన్నారు. నేపాల్‌, భూటాన్‌ ప్రాంతాల్లో మైనారిటీలు ఉన్నారు. వారందరినీ మినహాయించటానికి తగిన కారణాలను చెప్పలేదు. 1985లో కుదిరిన అస్సాం ఒప్పందం ప్రకారం 1971 మార్చి 24 తరువాత అక్రమంగా దేశంలో ప్రవేశించిన వారందరినీ మతంతో నిమిత్తం లేకుండా వెనక్కు పంపాల్సి ఉంది.
ఇతర దేశాల్లో ఉన్న హిందువులు, సిక్కులు అక్కడ పౌరులు కానట్లయితే, మన దేశం పౌరసత్వం కావాలనుకుంటే మంజూరు చేయాలన్న మత ప్రాతిపదిక ప్రతిపాదనను రాజ్యాంగ రచన సమయంలోనే కొందరు ముందుకు తెచ్చారు.1949 ఆగస్టు పన్నెండున ఆ ప్రతిపాదనపై రాజ్యాంగ పరిషత్‌లో ఓటింగ్‌ జరపగా తిరస్కరించారు. ఇప్పుడు హిందూత్వశక్తులు, వారిని సమర్ధించే వారు గతంలో తిరస్కరించిన ప్రాతిపదికనే ఇప్పుడు ముందుకు తెచ్చారు. పార్లమెంట్‌లో మెజారిటీ ఉన్నందున 70సంవత్సరాల తరువాత మత ప్రాతిపదికను అమల్లోకి తెస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగుతుందనే హామీ లేదు. ఆర్టికల్‌ పదకొండు ప్రకారం పౌరసత్వాన్ని మంజూరు చేసే రద్దు చేసే హక్కు పార్లమెంట్‌కు ఉంది. ఇప్పుడు మతాల ఆధారంగా మంజూరుకు చట్టాన్ని సవరించిన వారు, రేపు అదే ప్రాతికన మైనారిటీల పౌరసత్వాన్ని రద్దు చేస్తే, ఆంక్షలు విధిస్తే పరిస్ధితి ఏమిటి ? ఇప్పటికి లేదు కదా రాబోయే రోజుల్లో ఏదో చేస్తారని ఎందుకు అనుమానించాలి అని కొందరు అతితెలివిగా ప్రశ్నిస్తున్నారు. ఈ దే శాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని నిరంతరం ప్రచారం చేస్తున్నవారిని సమర్ధిస్దున్న వారే కేంద్రంలో పాలకులుగా ఉండగా వారికి మద్దతు ఇచ్చేందుకు తెలుగుదే శం, వైసిపి వంటి పార్టీలు పోటీపడుతున్నాయి. ఎవరైనా జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తారని, మొత్తం రాష్ట్రాన్ని అప్రకటిత కర్ఫ్యూ ప్రాంతంగా మార్చివేస్తారని, అభ్యంతర తెలిపిన పార్టీల నేతలను జైలు పాలు చేస్తారని ఊహించారా ? బాబరీ మసీదును కూల్చివేస్తామని సంఘపరివార్‌ ఎన్నడూ చెప్పలేదు, అయినా ఉత్తర ప్రదే శ్‌లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని దాన్ని కూల్చివేస్తుంటే ఎవరేమి చేయగలిగారు? ఒకసారి మతరాజ్యంగా మారిన తరువాత హిందూ మతానికి ప్రాతిపదిక మనుధర్మం కనుక ఇస్లామిక్‌ దేశాల్లో షరియత్‌ను అమలు చేసినట్లుగా మనుధర్మాన్ని జనం మీద రుద్దరనే హామీ ఉందా ? సామాజిక వివక్ష నివారణలో భాగంగా ఏర్పాటు చేసిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా లేదా చర్చ జరగాలనే పేరుతో వాటి రద్దు డిమాండ్‌ను ముందుకు తెస్తున్నది సంఘపరివార్‌, అందువలన ఒక విషయంలో ఒక సామాజిక తరగతి మౌనం వహిస్తే మరొక విషయంలో వారికే ముప్పు తెస్తే దిక్కేమిటి ? ఈ సందర్భంగా హిట్లర్‌ దాష్టీకానికి గురైన జర్మన్‌ మతాధికారి మార్టిన్‌ నైమిలర్‌ జైలులో పశ్చాత్తాపం లేదా కుట్రను గ్రహించి నాజీల తీరుతెన్నుల గురించి రాసిన కవితను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవటం అవసరం.

తొలుత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు !
నేను కమ్యూనిస్టును కాదు కనుక మాట్లాడలేదు.
తరువాత వారు సోషలిస్టుల కోసం వచ్చారు !
నేను సోషలిస్టును కాదు గనుక నోరు విప్పలేదు.
తరువాత వారు కార్మికనేతల కోసం వచ్చారు !
నేను కార్మికుడిని కాదు కనుక పెదవి విప్పలేదు.
తరువాత వారు యూదుల కోసం వచ్చారు !
నేను యూదును కాదు గనుక మౌనంగా ఉన్నాను.
తరువాత వారు నాకోసం వచ్చారు !
మాట్లాడేందుకు అక్కడ ఎవరూ మిగల్లేదు .

సవరణ చట్టం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందంటూ అనేక మంది సుప్రీం కోర్టులో సవాలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రాజ్యాంగ మౌలిక స్వభావానికి విరుద్దంగా ఉన్న ఆర్టికల్‌ 370 రద్దు అంశం ఉన్నత న్యాయ స్ధానం ముందు ఉంది. ఇటీవలి కొన్ని తీర్పుల తీరు తెన్నులు చూసిన తరువాత అనేక మందిలో తలెత్తిన సందేహాలు, అనుమానాలకు సుప్రీం కోర్టు తెరదించుతుందా ? మన రాజ్యాంగం మనుగడలో ఉంటుందా ? మత రాజ్యాంగంగా మారనుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

49 మంది ప్రముఖులపై దేశద్రోహం కేసు : బిజెపి, మిత్ర పక్షాల వైఖరి ఏమిటి ?

07 Monday Oct 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Intolerance, Narendra Modi, Prime Minister Narendra Modi, sedition case against 49 celebrities

Image result for sedition case against 49 celebrities

ఎం కోటేశ్వరరావు

జై శ్రీరామ్‌, గోరక్షణ తదితర నినాదాల మాటున దేశంలో జరుగుతున్న అసహన, విద్వేషపూరిత, మూక దాడులను నివారించాలని కోరుతూ వివిధ రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులు ప్రధాని నరేంద్రమోడీకిి బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ చర్య ద్వారా దేశ ద్రోహానికి పాల్పడ్డారంటూ బీహార్‌లోని ముజఫర్‌ పూర్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి (సిజెఎం) కేసు నమోదుకు జారీ చేసిన ఆదేశాలు మరోసారి ఆ లేఖపై మరో రూపంలో చర్చకు దారి తీశాయి. అసలు దేశ ద్రోహం ఏమిటి అన్న ప్రశ్నను ముందుకు తెచ్చాయి. కోర్టు తీరు తెన్నులపై సామాజిక, సాంప్రదాయ మాధ్యమంలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. (మేథావులూ మీరెటు వైపో తేల్చుకోండి అనే శీర్షికతో 49 మంది మేథావులు, దానికి పోటీగా 62 మంది రాసిన లేఖ గురించిన విశ్లేషణలో చర్చించినందున చర్విత చరణం కాకుండా వుండేందుకు ఆసక్తి కలిగిన వారికోసం లింక్‌ను అందచేస్తున్నాను.https://vedikaa.com/2019/07/27/intellectuals-which-side-are-you-on/)

Image result for sedition case against 49 celebrities: what is the bjp and its allies view ?

కేసును ఆమోదించి ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి , కేసును దాఖలు చేసిన లాయరు ఎలాంటి రాజకీయ అభిప్రాయాలు కలిగివున్నారన్నది ఒక అంశం. విధులలో వున్న న్యాయమూర్తి గనుక ఆయనకు వాటిని ఆపాదించలేము. ఫిర్యాదులోని అంశాలను బట్టి న్యాయవాది సుధీర్‌ కె ఓఝా బిజెపి మద్దతుదారుగా కనిపిస్తున్నది, కాకపోవచ్చు కూడా, ఎందుకంటే సదరు పెద్దమనిషి గత చరిత్రను చూస్తే మీడియాలోనూ, న్యాయవ్యవస్ధలో పేరు కోసం, తన వృత్తి, కక్షిదారులను పెంచుకొనేందుకు వందల కేసులు దాఖలు చేసి ఒక పెద్ద లిటిగెంట్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఏ పార్టీ వారిని, ఏ రంగ ప్రముఖులను వదలిపెట్టలేదు. అది ఎప్పటి నుంచో సాగుతోంది. మానసిక సమస్య కూడా కావచ్చు.

ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినవి, కోర్టులలో ప్రజాప్రయోజన వాజ్యాల (పిల్స్‌) దాఖలుకు సంబంధించి కొన్ని సవరణలు లేదా సంస్కరణలు తీసుకురావాల్సి వుంది. న్యాయవాది సుధీర్‌ కె ఓఝా చేసిన ప్రధాన ఆరోపణ 49 మంది ప్రముఖులు రాసిన లేఖ కారణంగా ప్రపంచ వ్యాపితంగా దేశ పరువుకు నష్టం కలిగింది, ప్రభావం కలిగించే ప్రధాని పని తీరును గుర్తించలేదు, దేశద్రోహ ధోరణులను ప్రోత్సహించేదిగా వుంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేదిగా వుంది.

నలభై తొమ్మిది మంది ప్రముఖుల లేఖ అంశాలలో ఎక్కడా పై లక్షణాలు లేవు. ప్రధానికి దేశంలో తలెత్తిన పరిస్ధితి గురించి వినతి మాత్రమే వుంది. ఒక వేళ వున్నాయి అనుకుంటే దానికి పోటీగా రాసిన 62 మంది ప్రముఖుల లేఖతో ఆ నష్టం పూడినట్లే, దేశ పరువు నిలబడినట్లే, ప్రధాని పని తీరు దేశానికి తెలిసింది, దేశద్రోహ ధోరణులకు అడ్డుకట్ట వేసింది కనుక న్యాయవాది దాఖలు చేసిన పిటీషన్‌ను న్యాయమూర్తి కొట్టివేసి వుండాల్సింది. లేదూ మరొక కోణంలో చూస్తే దేశద్రోహ ధోరణులను ప్రోత్సహించేదిగా 49 మంది లేఖ వుందనుకుంటే 62 మంది లేఖకే మీడియాలో ఎక్కువ ప్రచారం వచ్చింది. తొలి లేఖ అంశాలను చూడని వారు అనేక మంది దీన్ని చూసి తెలుసుకున్నారు. అంటే పరోక్షంగా ‘దేశద్రోహాన్ని ప్రోత్సహించే ధోరణులకు ‘ 62 మంది ప్రచారం ఇచ్చి, వ్యాప్తికి దోహదం చేసినట్లే కదా ! కేసు దాఖలు చేసిన వారికి, అంగీకరించిన న్యాయమూర్తి ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నారా ? అలాంటి వారి మీద చర్య వుండాలా వద్దా ?

ఈ కేసులో నిర్దిష్టమైన నేరం లేదు. ఆవు వ్యాసం వంటిది. ఆవును పెంచితే అలా జరుగుతుంది, ఇలా లబ్ది కలుగుతుంది అని చెప్పినట్లుగా వుంది తప్ప మరొకటి కాదు. అందువలన కేసు నమోదైంది బీహార్‌లో గనుక దీని పట్ల రాష్ట్ర జెడియు-బిజెపి సంకీర్ణ సర్కార్‌ వైఖరి ఏమిటి ? రాసిన లేఖ కేంద్రానికి కనుక కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పరిగణిస్తోందన్నది స్పష్టం కావాలి. లేఖ రాసిన ప్రముఖులను, లేఖలోని అంశాలను ఈ ప్రభుత్వాలు ఏ విధంగా పరిగణిస్తున్నాయి. దేశ ద్రోహానికి పాల్పడినట్లు అవికూడా భావిస్తే తమ వైఖరి కూడా అదే అని, లేనట్లయితే వారికి వున్న భావప్రకటనా స్వేచ్చను వుపయోగించుకున్నారు, అది దేశద్రోహం కాదని అయినా కోర్టుకు చెప్పాలి. అలాగాక మేము కేసు పెట్టలేదు, దానితో మాకు సంబంధం లేదు, చట్టం తనపని తాను చేసుకుపోతుంది అని చెబితే భావ ప్రకటనా స్వేచ్చను హరించటానికి మద్దతు ఇస్తున్నట్లే లెక్క !

రాజ్యాంగంలో కోర్టుల పరిధులు స్పష్టంగా వున్నాయా ? వుంటే ఈ కేసులో నిందితులుగా వున్న వారు ముజఫర్‌ నగర్‌ జిల్లా వాసులు లేదా బీహార్‌, ఒక రాష్ట్రానికి చెందిన వారు కాదు. ఒక వేళ కుట్రకేసు అయితే అది ఎక్కడ జరిగిందో దాని వివరాలను పోలీసులు దాఖలు చేయాలి. లేఖ రాసిన వారిలో ఒక రైన ఆదూర్‌ గోపాలకృష్ణన్‌ తమ మీద దాఖలైన దేశద్రోహ కేసు వార్త విని ‘ ఈ దేశంలో ఏమి జరుగుతోందో నాకు అర్ధం కావటం లేదు, అలాంటి పిటీషన్‌ను ఒక కోర్టు ఎలా స్వీకరిస్తుంది ? గాడ్సేను పొగిడిన వారు దేశ వ్యతిరేకులుగా కనిపించటం లేదు. గాంధీ చిత్రాలపై కాల్పులు జరిపిన వారు ఎంపీలుగా స్వేచ్చగా తిరుగుతున్నారు. వారిని ఏ కోర్టూ ప్రశ్నించలేదు.” ఈ మాటలు ఒక్క గోపాలకృష్ణన్‌వే కాదు, కాస్త బుర్రవున్న ప్రతివారి మదిలో తలెత్తినవి. అనేక అంశాలను సూమోటోగా తీసుకొని విచారిస్తున్న కోర్టులు ఈ మాటలను పరిగణనలోకి విచారణ తీసుకోవాలని ఎవరైనా కోరుకోవటం తప్పెలా అవుతుంది?

కోర్టులు ఒక నిర్ణయం తీసుకొనే ముందు, అదీ ఇలాంటి అంశాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంది. కోర్టు ఆదేశాల ప్రకారం దాఖలైన కేసు నిందితులలో ఒకరైన ప్రముఖ దర్శకులు శ్యాం బెనెగల్‌ బంగ్లాదేశ్‌తో కలసి నిర్మించబోయే ఒక చిత్ర పధకానికి మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి తన మీద దేశద్రోహం కేసులా, ఏం జరుగుతోందో అర్ధం కావటం లేదు అని శ్యాం బెనెగల్‌ ఆశ్చర్యపోయారు. దేశద్రోహం నేరారోపణ ఎందుకు చేశారో నాకు చిన్నమెత్తు కూడా అర్ధం కాలేదు, అసంగతానికి పరాకాష్ట. దేశంలో భయంతో కూడిన వాతావరణం వుంది, దాన్ని మనం తొలగించాలి. ఆ పని ఎవరు చేయగలరు? ప్రధాన మంత్రి దేశాన్ని నడుపుతున్నారు. అందుకే మేము అయనకు విజ్ఞప్తి చేశాము. మా మీద దాఖలైన కేసుకు సంబంధించి నేను ఎలాంటి చర్య తీసుకోను. నేను ఇక్కడ ఒక సామాన్య పౌరుడిని. పెరుగుతున్న నేరాలను గమనంలోకి తీసుకోవాలని ప్రధాని ముందుకు ఒక సమస్యను తీసుకువచ్చాము. ఆ విధంగా ఆయనకు తెలుస్తుంది. జూలైలో ప్రముఖులు లేఖ రాస్తే అప్పటి నుంచి ఇంతవరకు ప్రధాని కార్యాలయం నుంచి స్పందన లేదు’ అన్నారు. బంగ బంధు ముజిబుర్‌ రహ్మాన్‌ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమాలో ఆయన భాగస్వామి. మరి ఆయన వ్యాఖ్యలకు కోర్టు సమాధానం ఏమిటి ?

ఈ అంశం మీద ఇంకా అనేక స్పందనలు వెలువడ్డాయి. కేసును వెనక్కు తీసుకోవాలని వినతులు వచ్చాయి. స్ధలాభావం రీత్యా ప్రస్తావించటం లేదు. కోర్టుద్వారా కేసు నమోదు చేయటంతో మరోసారి దేశ ప్రధాని, కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల తీరు తెన్నులు మరోసారి మీడియా, జనం నోళ్లలో నానుతున్నాయి. అంతర్జాతీయ ప్రచారం వచ్చింది. అంటే మరోసారి దేశ ప్రతిష్టకు, ప్రధాని పనితీరుకు మచ్చ వచ్చింది కనుక స్పందించిన రాజకీయ పార్టీలు, ప్రముఖులతో పాటు ఇప్పుడు మీడియాను కూడా దేశద్రోహం కేసుల్లో ఇరికిస్తారా ?

న్యాయవాది సుధీర్‌ కె ఓఝా విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు ఒక లిటిగెంట్‌గా కనిపిస్తోంది. అనేక మందిపై గతంలో కేసులు దాఖలు చేశాడు. ఢిల్లీలో దొరికే వుచిత వైద్య లబ్దికోసం జనాలు ఇక్కడికి వాలిపోతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజరీ వాల్‌ అన్నారని, బీహార్‌ నుంచి వచ్చేవారిని వేరు చేసి మాట్లాడారంటూ తాను కేజరీవాల్‌పై కూడా కేసు దాఖలు చేస్తానంటూ ఓఝా తాజాగా ప్రకటించాడు. జాతీయ రాజధాని ఢిల్లీలో అమలు చేస్తున్న వైద్య సౌకర్యాల గురించి సెప్టెంబరు 30న కేజరీవాల్‌ ఒక ప్రకటన చేశారు. దానిలో ‘ ఒక వ్యక్తి బీహార్‌ నుంచి ఐదు వందల రూపాయల టికెట్‌ కొని ఢిల్లీ వస్తాడు. ఇక్కడ లభించే ఐదు లక్షల రూపాయల విలువైన వుచిత చికిత్స తీసుకొని తిరిగి వెళ్లిపోతాడు. పరిస్ధితి అలా వుంది. వారు మన దేశ పౌరులు గనుక అలా జరగటం సంతోషమే, అయితే ఢిల్లీ సామర్ధ్యం పరిమితమే కదా ‘ అని పేర్కొన్నారు. దీనిలో బీహార్‌ అని పేర్కొన్నారు కనుక కేసు వేస్తా అని ఓఝా చెప్పాడు. నిజానికి ఓఝా కేసు దాఖలు చేయాల్సింది బీహార్‌ పాలకుల మీద. వారి నిర్వాకం కారణంగానే అక్కడి జనం ఇతర చోట్లకు పోయి అవమానాల పాలు కావాల్సి వస్తోంది కనుక స్వంత జనానికి వుచిత ఆరోగ్య సదుపాయం కల్పించాలని కేసులు దాఖలు చేస్తే అర్ధం వుంది.

1996లో న్యాయవాదిగా వృత్తి ప్రారంభించినప్పటి నుంచి 745 ప్రజాప్రయోజన వ్యాజ్య కేసులు దాఖలు చేసినట్లు చెప్పుకున్నాడు. వాటిలో ఒకటి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మీద కూడా స్ధానిక కోర్టులో వేసింది వుందట.భారత్‌కు వ్యతిరేకంగా అణ్వాయుధాలు ప్రయోగిస్తామని ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడటం పరోక్షంగా యుద్దానికి కాలుదువ్వటమే అన్నది అభియోగం.

ఏమిటంటే కాశ్మీరులో హింస, గుజరాత్‌లో కొట్లాటలు, ముంబై వుగ్రముట్టడికి గురైనపుడు నలభై తొమ్మిది మంది ప్రముఖులు ఎందుకు స్పందించలేదని ఓఝా ప్రశ్నించాడు. వారు స్పందించారా లేదా అన్నది పక్కన పెడదాం. ఆ వాదన ప్రకారం అయితే ఆయా సందర్భాలలో స్పందించని యావత్‌ రాతి గుండెల మీద కేసులెందుకు దాఖలు చేయలేదు, వాటిని నివారించటంలో విఫలమైన పాలకులను ఎందుకు బోనెక్కించ లేదు, అనేక అంశాల మీద స్వయంగా స్పందించే కోర్టులు, న్యాయమూర్తులు కూడా స్పందించలేదని కేసులు ఎందుకు వేయలేదు. స్పందించిన అంశం సరైనదా కాదా అన్నది వదలి పెట్టి మిగతా వాటి మీద ఎందుకు స్పందించలేదని ఎదురు దాడి చేయటం అంటే ప్రశ్నించే తత్వాన్ని సహించకపోవటం తప్ప వేరు కాదు. సచిన్‌ టెండూల్కర్‌కు భారత రత్న అవార్డు ఇవ్వటం గురించి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మీద క్రిమినల్‌ కేసు దాఖలు చేశాడు. ఇలా ఎందరి మీదనో కేసులు వేశాడు.

Related image

ఈ సందర్భంగా ఇలాంటి వారి వల్ల కోర్టుల సమయం వృధా అవుతోంది. కేసుల్లో వున్నవారికి చేతి చమురు వదులుతుంది. అందువలన న్యాయవ్యవస్ధలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం కూడా వుంది. తమ పరిధి వెలుపుల వున్న కేసులను కోర్టులు దాఖలు చేసిన సమయంలోనే తోసి పుచ్చి ఎక్కడ దాఖలు చేయాలో ఫిర్యాదుదారుకు దారి చూపాలి. ఏదీ వూరికే రాదు అన్నట్లు తమ సమయాన్ని వృధా చేసినందుకు తగిన ఫీజును అర్జీదారు నుంచి వసూలు చేయాలి. వుదాహరణకు 49 మంది ప్రముఖులు ఒక రాష్ట్రానికి చెందిన వారు కాదు. అలాంటి వారి మీద కేసును ఒక జిల్లా కోర్టు చేపట్టటం అర్ధరహితం. ఇటీవలి కాలంలో ఈ ధోరణి పెరిగిపోతోంది. పని గట్టుకొని ప్రశ్నించే, విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించే గొంతులను అణగదొక్కేందుకు ప్రయత్నం జరుగుతోంది. జనాలకు న్యాయం మరీ దూరంగా వుండకూడదు, ప్రాధమిక సాక్ష్యాలు వున్నాయి అనుకుంటేే స్ధానిక కోర్టుల్లో దాఖలైన వాటిని పై కోర్టులకు నివేదించాలి. లేదూ అంత సీన్‌ లేదనుకుంటే అసలు స్వీకరణ దశలోనే తిరస్కరించాలి. రాజకీయ పరమైన, భావజాలాలకు, విమర్శలకు సంబంధించిన అంశాలను ఏ కోర్టులు విచారించాలో, కేసులను ఎక్కడ దాఖలు చేయాల్లో నిర్దిష్ట నిబంధనలను రూపొందించటం అవసరం. అన్ని ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్నది అదే. తమ పరిధిలో లేని వాటిని వున్నతాధికారులకు పంపినట్లే, కోర్టులు కూడా అలాగే వ్యవహరించినపుడే వాటి పని తీరు మెరుగుపడుతుంది. దుర్వినియోగమూ తగ్గుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d