అమెరికాలో కార్మిక సమ్మెల తరంగం వస్తోందా ?

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


కార్మికులకు మెరుగైన వేతనాలివ్వండి :బెర్నీ శాండర్స్‌, ఆ పని నాది కాదు :వారెన్‌ బఫెట్‌. మొదటి వ్యక్తి అమెరికాలో డెమోక్రటిక్‌ సోషలిస్టుగా ప్రకటించుకున్న కార్మిక పక్షపాతి అని వేరే చెప్పనవసరం లేదు. రెండవ పెద్దమనిషి ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో తొమ్మిదవ స్ధానంలో ఉన్న కార్పొరేట్‌ అమెరికన్‌. అమెరికాలో కార్మిక సమ్మెల తరంగం వస్తోందని పరిశీలకులు చెబుతున్న తరుణంలో ఒక విశ్లేషణకు పెట్టిన శీర్షిక అది.పశ్చిమ వర్జీనియా రాష్ట్రంలోని హంటింగ్‌టన్‌లోని వారెన్‌ బఫెట్‌ స్టీలు కంపెనీలో జరుగుతున్న సమ్మెను పరిష్కరించాలని శాండర్స్‌ ఒక లేఖలో కోరారు.కాస్టింగ్‌ పరికరాలను తయారు చేసే ఈ కర్మాగారంలో 450 మంది సిబ్బంది మూడునెలలుగా సమ్మె చేస్తున్నారు.మీ కంపెనీలో పని చేస్తున్న కార్మికులు తమ పిల్లల కడుపు నింపగలమా లేదా ఆరోగ్య సంరక్షణ చూడగలమా లేదా అని ఎందుకు ఆందోళన చెందాలంటూ శాండర్స్‌ ప్రశ్నించారు. ఐదు సంవత్సరాలలో మొదటి ఏడాది ఎలాంటి వేతన పెంపుదల లేకుండా, రెండవ ఏడాది ఒక శాతం, తరువాత మూడు సంవత్సరాలు రెండుశాతం చొప్పున వేతన పెరుగుదల ఉంటుందని, కేవలం రెండువేల డాలర్లు మాత్రమే బోనస్‌ ఇస్తామని, ఆరోగ్యబీమాకు నెలకు ఇప్పుడున్న 275 డాలర్ల నుంచి 1000డాలర్లకు కార్మికుల వాటా పెరగాలని, ఇప్పుడున్న సెలవుల సంఖ్యను తగ్గించుకోవాలని యాజమాన్యం షరతులు విధించింది.


శాండర్స్‌ లేఖపై స్పందించిన బఫెట్‌ తాను సిఇఓగా ఉన్న సంస్ధకు అనేక అనుబంధ కంపెనీలు ఉన్నాయని, ఏ కంపెనీకి అకంపెనీ అక్కడి సమస్యల సంగతి చూసుకోవాలి తప్ప సిఇఓగా ఉన్నంత మాత్రాన తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు.మీరు పంపిన లేఖను సదరు స్పెషల్‌ మెటల్స్‌ ప్రిసిషన్‌ కాస్ట్‌పార్ట్స్‌ కంపెనీ సిఇవోకు పంపుతానని, ఎలాంటి సిఫార్సులు, చర్యలను తాను సూచించటం లేదని, వ్యాపారానికి అతనే బాధ్యుడని శాండర్స్‌కు జవాబిచ్చాడు.2016లో ఈ కంపెనీని బఫెట్‌ సిఇఓగా ఉన్న బెర్క్‌షైర్‌ కంపెనీ కొనుగోలు చేసింది. ఇక్కడ అంతరిక్ష నౌకలకు, విమానాలకు అవసరమైన నికెల్‌ అలాయి విడిభాగాలను తయారు చేస్తుంది. సిబ్బంది సమ్మెలో ఉన్నప్పటికీ కంపెనీ పని చేస్తూనే ఉందని, తాత్కాలిక సిబ్బందిని నియమించినట్లుగానీ, లేదా కార్మికులను పూర్తిగా తొలగించినట్లుగానీ ప్రకటించలేదని యునైటెడ్‌ స్టీల్‌ వర్కర్స్‌ యునియన్‌ వెబ్‌సైట్‌ పేర్కొన్నది. కార్మికులు కోరుతున్నదేమిటి ? సిబ్బంది సమ్మెలో ఉన్నా ఫ్యాక్టరీ ఎలా నడుస్తోందన్న ప్రశ్నలకు కంపెనీ సమాధానం ఇవ్వటం లేదు.


ఇటీవలి కాలంలో అమెరికాలో కార్మిక సమ్మెలు పెరుగుతున్నాయి. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో కార్మికులకు వ్యతిరేకమైన అంశాలున్నాయి. కార్మికనేతల లొంగుబాటు, ఉపాధి లేమి వంటి కారణాలతో యజమానులు రుద్దిన ఒప్పందాలను అంగీకరించారు. గత కొద్ది నెలలుగా నిపుణులైన కార్మికులకు డిమాండ్‌ పెరగటంతో కోట్లాది మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి మెరుగైన వేతనాలతో కొత్త కొలువుల్లో కుదురుతున్నారు. కొన్ని కంపెనీల్లో ఒప్పంద గడువులు ముగిసిన తరువాత మెరుగైన నూతన ఒప్పందాల కోసం సమ్మెలకు దిగుతున్నారు. కరోనా మహమ్మారి ప్రభావం చూపినప్పటికీ కార్పొరేట్ల లాభాలకు ఎలాంటి ఢోకాలేకపోవటాన్ని కార్మికులు గమనించారు, తామెందుకు నష్టపోవాలని వారు భావిస్తున్నారు.2020లో మొత్తం 3.63 కోట్ల మంది రాజీనామాలు చేసి మెరుగైన ఉపాధిని వెతుక్కోగా 2021లో అక్టోబరు నాటికే 3.86 కోట్ల మంది రాజీనామాలు చేశారని అంచనా. సమ్మె చేస్తున్న కంపెనీలలో యజమానులు గతంలో మాదిరి తమ షరతులను రుద్దేందుకు చూస్తుండగా కార్మికులు అంగీకరించటం లేదు, దాంతో నెలల తరబడి సమ్మెలు కొనసాగుతున్నాయి. కడుపు నిండిన యజమానులు కడుపు మండుతున్న కార్మికుల సహనాన్ని పరీక్షిస్తున్నారు.


అమెరికా చరిత్రలో గత 15 సంవత్సరాల్లో సుదీర్ఘ సమ్మెగా మసాచుసెట్స్‌లోని సెయింట్‌ విన్సెంట్‌ ఆసుపత్రిలోని 700 మంది నర్సుల ఆందోళన నమోదైంది. రోగులకు తగిన సంఖ్యకు తగ్గట్లుగా సిబ్బంది లేకపోగా కరోనా సమయంలో, అంతకు ముందూ తగ్గించారు. సమ్మెకు దిగిన వారందరినీ పూర్తిగా తొలగిస్తామని బెదిరించినా 301రోజుల పాటు సమ్మె జరిగింది. జనవరి మూడున ఒప్పందం కుదిరింది. నర్సులందరినీ తిరిగి తీసుకొనేందుకు, వేతన పెంపుదల, వైద్య బీమా మొత్తాల పెంపుదలకు అంగీకరించారు. డిసెంబరు పదవ తేదీ నాటికి దేశంలో 346 సమ్మెలు జరుగుతున్నట్లు కార్నెల్‌ విశ్వవిద్యాలయ కేంద్రం నమోదు చేసింది. గత కొద్ది సంవత్సరాలుగా అమెరికాలో కార్మిక సంఘాలలో చేరుతున్న వారి సంఖ్య తగ్గుతోంది.ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న వారిలో 34.8శాతం మంది సభ్యులుగా ఉంటే ప్రయివేటు రంగంలో కేవలం 6.3శాతం మందే ఉన్నారు. 2019తో పోలిస్తే 2020లో స్వల్పంగా పెరిగారు. అమెజాన్‌, గూగుల్‌ వంటి కంపెనీలు కార్మిక సంఘాలను లేకుండా చేసేందుకు అనేక అక్రమాలకు పాల్పడుతున్నాయి. కొత్తగా సంఘం పెట్టుకోవటమే గగనంగా మారుతోంది. స్టార్‌బక్స్‌ కార్పొరేట్‌ స్టోర్‌లో తొలిసారిగా సంఘాన్ని ఏర్పాటు చేస్తే గుర్తించాల్సి వచ్చింది.


కారన్‌ఫ్లేక్‌ వంటి తృణధాన్య ఉత్పత్తుల సంస్ధ కెలోగ్‌ కార్మికులు కూడా నెలల తరబడి సమ్మె చేశారు. అక్టోబరు ఐదు నుంచి డిసెంబరు 21వరకు సమ్మె చేశారు. ఐదు సంవత్సరాలు అమల్లో ఉండే ఒప్పందం చేసుకున్నారు.నాలుగు చోట్ల ఉన్న ఫ్యాక్టరీల్లోని 1,400 మంది కార్మికులు ఆందోళన చేశారు. ఒకే పని చేసే కార్మికులకు రెండు రకాల వేతనాలు ఇవ్వటాన్ని వారు నిరసించారు. పది సంవత్సరాలు, అంతకు మించి పని చేస్తున్నవారిని విశ్వాసపాత్రులైన కార్మికులనే పేరుతో వారికి గంటకు 35డాలర్లు, మెరుగైన బీమా, పెన్షన్‌ ఇస్తూ మిగిలిన వారిని తాత్కాలికం అనే పేరుతో ఒకే పని చేస్తున్న వారికి తక్కువ వేతనాలు ఇవ్వటాన్ని వ్యతిరేకించారు. కొత్త ఒప్పందం ప్రకారం అందరికీ వేతనాలు పెరుగుతాయి, ప్రతి ఏడాది ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పెంచుతారు. తాత్కాలిక కార్మికులకు కనీస వేతనం 24.11 డాలర్లు ఉంటుంది.అందరికీ ఒకే విధమైన ఆరోగ్యబీమా ఉంటుంది.రానున్న ఐదు సంవత్సరాల్లో ఏ ఫ్యాక్టరీని మూసివేయ కూడదు. రెండు రకాల కార్మికుల విభజన ఉన్నప్పటికీ నాలుగు సంవత్సరాలకు మించి పని చేసిన వారిని విశ్వాసపాత్రులుగా పరిగణించేందుకు అంగీకరించారు.పర్మనెంటు కార్మికుల సంఖ్య మీద పరిమితి విధించాలని అంతకు ముందు కంపెనీ వత్తిడి తెచ్చింది.


కోట్లాది మంది కార్మికులు ఉన్న ఉద్యోగాలకు రాజీనామా చేసి కొత్త ఉపాధి చూసుకున్న తరువాత అనేక కంపెనీలో సిబ్బంది సమ్మెకు దిగటం లేదా సమ్మె నిర్ణయాలు తీసుకొని సంప్రదింపులు జరుపుతున్నారు.దీనికి కారణాలను విశ్లేషిస్తే కార్మికుల్లో తలెత్తిన అసంతృప్తి కనిపిస్తోందని చెప్పవచ్చు. కరోనాకు ముందున్న స్ధితిలో 80శాతమే ఉపాధి పునరుద్దరణ జరిగింది. అయినా కార్మికులు రాజీనామా చేసి వేతనాలను మెరుగుపరుచుకోవాలని చూడటం ఒక ప్రత్యేక పరిస్ధితిగా కనిపిస్తోంది. కరోనా తీవ్రత సడలిన తరువాత ఆర్ధిక లావాదేవీలు ప్రారంభం కావటంతో సహజంగానే కార్మికులు తమ పని పరిస్ధితుల మెరుగుదలకు పూనుకుంటారు.అదే జరుగుతోందిప్పుడు. రికార్డు స్ధాయిలో ఉద్యోగాలకు రాజీనామాలు చేయటాన్ని చూసిన తరువాత యజమానులతో మన మెందుకు గట్టిగా బేరమాడకూడదనే ఆలోచనలు కార్మికుల్లో సహజంగానే తలెత్తాయని చెప్పవచ్చు. గత నాలుగు సంవత్సరాల్లో రిపబ్లికన్లు అధికారంలో ఉన్నారు. డెమోక్రాట్లలో కూడా కార్పొరేట్లకు వంతపాడేవారున్నప్పటికీ కార్మికులకు అనుకూలంగా ఉండేశక్తులు ఉండటం కూడా పోరాటాలకు ఊతమిస్తోందని చెప్పవచ్చు. మంత్రులుగా ఉన్నవారు కూడా సమ్మె కేంద్రాలను సందర్శించటం ఒక అసాధారణ పరిణామం. అసమానతలు విపరీతంగా పెరగటం సహజంగానే అసంతృప్తి, ఆందోళనలకు పురికొల్పుతుంది. సమ్మెలు విజయాలు సాధిస్తే మరిన్ని జరుగుతాయి. సమ్మె ఆయుధం మరింత పదునెక్కుతుంది. సంక్షోభాలు తలెత్తినపుడు,యుద్ధాలు ముగిసిన తరువాత కార్మికోద్యమాలు తలెత్తినట్లు గత చరిత్ర చెబుతోంది. ఆ సమయాలలో కార్మికులు త్యాగాలు చేస్తారు.కరోనా కూడా పెద్ద సంక్షోభమే. దానిలో తమ కష్టానికి,త్యాగాలకు దక్కిన ఫలితం ఏమిటని సహజంగానే ఆలోచిస్తారు. ప్రస్తుతం అమెరికాలో పెట్టుబడిదారీ విధానం విఫలమైనట్లు భావిస్తున్నవారు నానాటికీ పెరుగుతున్నారు. అది కూడా కార్మికశక్తి సంఘటితం కావటానికి, పోరాట రూపాలకు మళ్లటానికి దోహదం జరుగుతోందా అన్నది చూడాల్సి ఉంది.


గతంలో అనేక కంపెనీలు కార్మికులను బెదరించాయంటే అతిశయోక్తి కాదు. తాము ఇచ్చిన మేరకు వేతనాలు తీసుకొని చెప్పిన మేరకు పని చేయకపోతే ఫ్యాక్టరీలను మెక్సికో లేదా మరో దేశానికో తరలిస్తామని బెదరించేవారు.ఇప్పుడు అమెరికాలో వస్తు వినియోగానికి జనం(కార్మికులు) కావాలి, అందువలన కార్పొరేట్లు కొంత మేరకు దిగిరాకతప్పటం లేదని చెబుతున్నారు. కరోనాలో కెలోగ్‌ కంపెనీ కార్మికులు ఇబ్బంది పడినా కంపెనీకి రికార్డు స్ధాయిలో 120 కోట్ల డాలర్ల మేర లాభాలు వచ్చాయి. జనం ఇళ్ల వద్దే ఉండటం, లాక్‌డౌన్‌ కారణంగా డిమాండ్‌ పెరిగి దుకాణాల్లో సరకులన్నీ ఖాళీ అయ్యాయి. దీంతో కెలోగ్‌ కార్మికులు తమ వారాంతాలను వదులుకొని, పన్నెండు గంటల చొప్పున పని చేసి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేశారు. కంపెనీ వాటా ధర బాగా పెరిగింది, వాటాదార్లకు బోనస్‌లు, అధికార్లకు పెద్ద మొత్తాలు ఇచ్చారు. కానీ గత ఒప్పంద గడువు ముగిసిన తరువాత యాజమాన్యం కార్మికులను రాయితీలు కోరింది. ఇప్పుడున్న కార్మికులు తమ పెన్షన్లకు చెల్లింపు మొత్తాలను పెంచాలని, సెలవులకు ఇచ్చే మొత్తాల కోతకు అంగీకరించాలని, కొత్తగా పనిలోకి తీసుకొనే వారికి వేతనాల తగ్గింపునకు అంగీకరించాలని వత్తిడి చేసింది. విధి లేక కార్మికులు సమ్మెకు దిగారు. నెలలో మూడు రోజుల పాటు యంత్రాలను శుద్ది చేస్తారు, కార్మికులను కనీసం యంత్రాల మాదిరిగా కూడా చూడకుండా వరుసగా వంద నుంచి 130 రోజుల వరకు పనిచేయించిన ఉదంతాలున్నట్లు కార్మికులు వాపోయారు.
అనేక రంగాల కార్మికులు పోరుబాటలో ఉన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తొలిసారిగా హాలీవుడ్‌లో పని చేస్తున్న 60వేల మంది కార్మికులు ఆందోళన హెచ్చరిక చేశారు. పని గంటలు పెరిగినందున ఎక్కువ వేతనాలు చెల్లించాలన్నది వారి ప్రధాన డిమాండు. అనేక రంగాల్లోని కార్మికులు ఇదే బాటలో ఉన్నారు. ఒక చోట సమ్మెలు మొదలైతే దాని ప్రభావం ప్రపంచమంతా ఉండటం గతంలో చూశాము. అదే పునరావృతం కానుందా ?

2022 ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు : నరేంద్రమోడీ,యోగి ఓదార్పు – లఖింపూర్‌ ఖేరీ నేరం మధ్య నలుగుతున్న బిజెపి విధి రాత !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఉత్తర ప్రదేశ్‌ విధాన సభ ఎన్నికల్లో చరిత్రను తిరగరాసేందుకు బిజెపి నేతలు గంగకు ఎదురీదుతున్నారు.కరోనా శవాలను తనలోకి నెట్టిన వారిని గంగామాత ఏం చేస్తుందో చెప్పలేము. గడచిన నాలుగు దశాబ్దాలలో 1985 తరువాత ఇక్కడ ఒకసారి అధికారానికి వచ్చిన పార్టీ వరుసగా రెండవసారి గద్దెనెక్కలేదు.దాన్ని చరిత్రలోకి నెట్టివేసేందుకు నరేంద్రమోడీ ఆపసోపాలు పడుతున్నారు. రాష్ట్రాన్ని ఒకేసారి రెండు ఇంజన్లు (కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో యోగి) లాగుతూ అభివృద్ది పరుగుపెట్టిస్తున్నామని చెప్పుకొనే బిజెపి నేతలు కొత్త రికార్డు నెలకొల్పుతారా ? ఎన్నికల ముందు అనేకం అంటాం, అనుకుంటాంగానీ గానీ సంప్రదాయం కొనసాగింది తప్ప ఇది మా ఓటమి కాదు అని చెప్పే పరిస్ధితి వస్తుందా లేక చూశారా మా తడాఖా మల్లయోధుడి పార్టీ(సమాజవాది- ములాయం సింగ్‌ యాదవ్‌ రాజకీయాల్లోకి రాక ముందు మల్లయోధుడు, ఆయన కుమారుడే ప్రస్తుత పార్టీ నేత, మాజీ సిఎం అఖిలేష్‌ యాదవ్‌ )ని మట్టి కరిపించాం అని జబ్బలు చరుచుకుంటారా ? చూద్దాం, తినబోతూ రుచెందుకు ?


ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ముందు బిజెపిని ఇరుకున పెడుతుందని భావిస్తున్న లఖింపూర్‌ ఖేరీ కేసులో పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. అక్టోబరు మూడవ తేదీన లఖింపూర్‌ ఖేరీ వద్ద సాగు చట్టాలకు నిరసన తెలుపుతున్న రైతులపై మోటారు వాహనాలను తోలి రైతులను హత్యచేసిన ఉదంతంలో నలుగురు రైతులు మరణించారు. ఒక జర్నలిస్టు ప్రాణాలు కూడా తీశారు. ఆగ్రహించిన రైతుల చేతిలో వాహనాల్లో ఉన్న ముగ్గురు బిజెపి కార్యకర్తలు కూడా మరణించారు. రైతుల మీదకు కార్లను తోలిన వారిలో కేంద్ర మంత్రి అజయ మిశ్రా కుమారుడు ఆషిష్‌ మిశ్రా తదితరులు ఉన్నారని వచ్చిన వార్తలను అప్పుడు బిజెపి తోసి పుచ్చింది. అప్పుడు అతగాడు వేరే చోట ఉన్నట్లు కతలు చెప్పింది. కేసును నీరు కార్చేందుకు పూనుకోవటంతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. మూడు నెలల తరువాత పోలీసులు దాఖలు చేసిన ఐదువేల పేజీల ఛార్జి షీట్‌లో మంత్రి కుమారుడు ఆషిష్‌ మిశ్రా ప్రధాన నిందితుడని పేర్కొన్నారు. నిరసన తెలుపుతున్న రైతులను హత్యచేసేందుకు పధకం ప్రకారం కుట్రపన్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పేర్కొన్నది. ఉదంతం జరిగిన సమయంలో ఆషిష్‌ మిశ్రా ఘటనా స్ధలిలో ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని, ఆషిష్‌ బంధువు కూడా సహనిందుడని పేర్కొన్నారు. తాను ఆ సమయంలో అక్కడ లేనంటూ కొన్ని వీడియోలు, పది మందితో అఫిడవిట్‌లను పోలీసులకు అంద చేశారు. ఘటన జరిగినపుడు ధీరేంద్ర శుక్లా అనే అతను ఉన్నాడని, అతని కారు ఆషిష్‌ మిశ్రా కారువెనుకే ఉందని ఈ వాస్తవాన్ని ధీరేంద్ర దాచినట్లు సిట్‌ పేర్కొన్నది. ఈ కేసు తరువాత ఏమౌతుందో చెప్పలేము గానీ కేంద్ర మంత్రి అజయ మిశ్రాను మంత్రి వర్గం నుంచి తొలగించాలనే డిమాండ్‌ మరింత ఊపందుకోవటంతో పాటు ఎన్నికల్లో ప్రచార అంశంగా మారనుంది. కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఎంపిక చేసిన పార్టీ ఎంపీలతో ప్రధాని నరేంద్రమోడీ జరిపిన సమావేశానికి అజయ మిశ్రాను దూరంగా ఉంచినట్లు వార్తలు వచ్చాయి.


ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి తాజాగా టైమ్స్‌ నౌ నవభారత్‌కు వీటో సంస్ధ నిర్వహించిన సర్వేలో 403 స్ధానాలకు గాను బిజెపి 230-249 మధ్య తెచ్చుకొని సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందని తేలినట్లు ప్రకటించారు. సమీప సమాజవాది పార్టీకి 137-152, బిఎస్‌పికి 9-14, కాంగ్రెస్‌కు 4-7 మధ్య రావచ్చని పేర్కొన్నారు. బిజెపి ఏడు పార్టీలతో కూటమిగా పోటీలోకి దిగుతోంది. సమాజవాది , కాంగ్రెస్‌, బిఎస్‌పి, ఆప్‌ పార్టీ విడివిడిగా పోటీచేస్తున్నట్లు ప్రకటించాయి. వాటితో ఏ పార్టీలు జత కట్టేది చూడాల్సి ఉంది. టైమ్స్‌ నౌ సర్వే ప్రకారం బిజెపి కూటమికి 38.6శాతం, సమాజవాదికి 34.4, బిఎస్‌పికి 14.1 శాతం ఓట్లు రావచ్చని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు, ఓట్లు, వచ్చే ఎన్నికల్లో అంచనాల పోలిక ఇలా ఉంది.2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌పి 311, మిత్రపక్షం కాంగ్రెస్‌ 114 చోట్ల పోటీ చేసింది. 2019లో ఎస్‌పి, బిఎస్‌పి ఒక కూటమిగా, కాంగ్రెస్‌ విడిగా పోటీ చేసింది.
పార్టీ××××××× 2017×× శాతం×× 2019××శాతం ×× 2022××శాతం
బిజెపి కూటమి×× 325 ×× 40.78× 64 ××× 51.19×× 230-49×× 38.6
ఎస్‌పి కూటమి×× 48 ××× 21.82× 5 ×××18.11 ××137-152×× 34.4
బిఎస్‌పి×××××× 19 ××× 22.23× 10 ××× 19.43 ×× 9-14 ××× 14.4
కాంగ్రెస్‌ ××××× 7 ××× 6.25 × 1 ××× 6.41 ×× 4-7 ×××× 5
ఈ అంకెలను చూసినపుడు బిజెపి ఓటింగ్‌ 2017-2019 మధ్య పదిశాతంపైగా పెరిగింది. వచ్చే ఎన్నికల్లో 2017 కంటే తగ్గవచ్చని సర్వేలు చెబుతున్నాయి. సమాజవాది పార్టీ ఓటింగ్‌ 2017, 2019లో పెద్దగా మారలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో పార్లమెంటుతో పోలిస్తే రెట్టింపు కావచ్చని సర్వేలు చెబుతున్నాయి. ఈ సర్వే లఖింపూర్‌ ఖేరీ కేసులో చార్జిషీటు దాఖలు చేయక ముందు చేసినది. ప్రధాన సవాలు సమాజవాది నుంచే అనే వాతావరణం వచ్చిన తరువాత బిజెపి వ్యతిరేక ఓటర్లు సహజంగానే కొన్ని ఓట్లు ఎస్‌పికే పడతాయి.బిజెపిని ఓడించాలని కోరుకొనే బిఎస్‌పి, కాంగ్రెస్‌ అభిమానులు కూడా ఎస్‌పి వైపే మొగ్గవచ్చు. ఈ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలవచ్చనే వాతావరణం ఉన్నందున బిజెపి తన మత, కుల అజెండాను మరింతగా ముందుకు తీసుకురావచ్చని భావిస్తున్నారు. కరోనా రెండవ తరంగం నివారణలో వైఫల్యం, శవాలను గంగలోకి నెట్టివేసిన నిర్వాకం, లఖింపూర్‌ ఖేరీ ఉదంతం, రైతు ఉద్యమ ప్రతికూలతలన్నింటినీ అధిగమించి రామాలయ నిర్మాణం వంటి అంశాలు తమను గట్టెక్కిస్తాయని ఆ పార్టీ నమ్ముతోంది.
ఎన్నికల నోటిఫికేషన్‌తో నిమిత్తం లేకుండానే బిజెపి మాదిరి సమాజవాది కూడా జరుపుతున్న సభలకు పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు.తాము అధికారంలోకి వస్తే 300యునిట్ల వరకు విద్యుత్‌ ఉచితంగా ఇస్తామని ఎస్‌పి, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటించాయి. రైతులకు ఉచితంగా ఇస్తామని ఎస్‌పి పేర్కొన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు రకాల రేట్లు వసూలు చేస్తున్నారు. గ్రామాలలో వంద యూనిట్లకు రు. 3.35, 101నుంచి 150కి రు.3.85, 151 నుంచి 300కు రు.5, ఆ పైన రు. 6 కాగా పట్టణాల్లో 150 వరకు రు.5.50, 151 నుంచి 300 వరకు రు.6, 301 నుంచి 500వరకు రు.6.50, ఆ పైన రు.7 ఉంది.


పార్టీని బూత్‌ స్ధాయివరకు విస్తరించి ఉంటే వచ్చే ఎన్నికల్లో 325కు మించి గెలుస్తామని సిఎం యోగి ఆదిత్యనాధ్‌ చెబుతున్నారు. సోదరి మాయావతి ఎన్నికలంటే భయపడుతున్న కారణంగానే ప్రచారం ప్రారంభించలేదని,చలిని వదిలించుకోవాలని కేంద్ర మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యను ఆమె ఖండించారు. ప్రభుత్వ సొమ్ముతో బిజెపి నేతలు జనాన్ని చలికాలంలో కూడా వెచ్చగా ఉంచుతున్నారని తిప్పికొట్టారు. తాము ఇతర పార్టీలను అనుకరించబోమని, తమ శైలి తమకు ఉందన్నారు. ఎన్నికల ముందు అధికారంలో ఉన్న వారు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాల పేరు చెప్పి ప్రభుత్వ సొమ్ముతో సభలు పెడతారని, తమ వంటి వారికి సాధ్యం కాదన్నారు.తమను అపహాస్యం చేసినా తమ వైఖరి మారదని, ఇతర పార్టీలు తమ గురించి ఆందోళన చెందాల్సినపని లేదన్నారు.


కులాల సమీకరణలు,మత ధోరణుల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఉత్తర ప్రదేశ్‌ ఒకటి. ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టి మెజారిటీ ఓటు బాంకును ఏర్పాటు చేసుకొనేందుకు బిజెపి చేయని పని లేదు. రామ మందిర సమస్యను ముందుకు తెచ్చి గతంలో లబ్ది పొందిన ఆ పార్టీకి ఒక సర్వే అంశాలు ఆందోళన కలిగించక మానవు. కుల, మత ప్రాతిపదికన ఓటు వేస్తున్నామని 24శాతం మంది చెప్పగా వచ్చే ఎన్నికల్లో రామ మందిరం ఓటర్లను ప్రభావితం చేస్తుందని చెప్పిన వారు ఒక్కశాతమే అని ఇండియా న్యూస్‌ జన్‌కీ బాత్‌ సర్వే పేర్కొన్నది. బిజెపికి వస్తాయని చెబుతున్న ఓట్లలో యాదవేతర బిసి, బ్రాహ్మణ ఓట్లలో ఎక్కువ భాగం ఉంటాయని, ఎస్‌పికి ముస్లింలు, యాదవుల ఓట్లు గణనీయంగా వస్తాయని చెబుతున్నారు.


గో రక్షణ, గొడ్డుమాంసం పేరుతో బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రైతులు ఆగ్రహంతో ఉన్నారు. వట్టిపోయిన వాటిని అమ్ముకొనే వీలు లేకపోవటంతో యజమానులు వాటిని వదలి వేయటంతో పంటలను కాపాడుకొనేందుకు రైతులు కాపలాలు కాయాల్సి వస్తోంది.పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో పెద్ద ఎత్తున చెరకు బకాయిలు పేరుకు పోయాయి. అత్యంత వెనుకబడిన తరగతుల వారిని యాదవులు పైకి రానివ్వటం లేదనే పేరుతో బిజెపి ఇతర వెనుకబడిన తరగతుల వారిని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు తమకు ఒరిగిందేమీ లేదని యాదవుల బదులు ఠాకూర్ల పెత్తనం కిందికి వచ్చామని వారు ఇప్పుడు భావిస్తున్నారు. మత ప్రాతిపదికన బిజెపి పరివారం జనాన్ని చీల్చితే, రైతు ఉద్యమం ఐక్యం చేసేందుకు బాటలు వేసిందని వార్తలు వచ్చాయి. నామినేషన్లు వేసి, ఎవరెటో తేలిన తరువాత ఎన్నికల తీరు తెన్నులపై మరింత స్పష్టత వస్తుంది.

రాష్ట్రపతికి గౌరవ డాక్టరేట్‌ : రచ్చకీడ్చిన కేరళ గవర్నర్‌, బిజెపి – కాంగ్రెస్‌లో చిచ్చు !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


రాష్ట్రపతికి గౌరవ డాక్టరేట్‌ను ఇమ్మని తాను సిఫార్సు చేసినట్లు చెబుతూ కొందరు బాధ్యతారహిత, తెలివితక్కువ ప్రకటనలు చేస్తున్నారని, అవి జాతీయ వ్యవస్ధల గౌరవ, మర్యాదలను దెబ్బతీస్తున్నాయని, ఆందోళనకరమైన ధోరణులను చూస్తున్నానని కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆదివారం నాడు కోచిలో విలేకర్లతో చెప్పారు.రాష్ట్రపతి, గవర్నర్‌ జాతీయ వ్యవస్ధలని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 51ఏ ప్రకారం వాటిని గౌరవించాలని అన్నారు.వాటి గురించి ఆషామాషీగా చర్చించకూడదన్నారు.ఒక రాష్ట్రపర్యటనకు వచ్చిన రాష్ట్రపతికి గౌరవడాక్టరేట్‌ పట్టా ఇచ్చి సత్కరించాలా ? అలాంటి ప్రోటోకాల్‌ ఉంటే దాన్ని అమలు జరపటం రాష్ట్రాల విధి. లేనపుడు విశ్వవిద్యాలయాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చు. లేనపుడు రచ్చ చేస్తే రాష్ట్రపతికి అవమానం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు కేరళలో అదే జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసే కొంత మంది కాంగ్రెస్‌ నేతలు, బిజెపికి అందుకు పూనుకున్నారు. డిసెంబరు 21 నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ కేరళ పర్యటన జరిపారు. ఆ సందర్భంగా గౌరవ పట్టాతో సత్కరించకపోవటం అవమానించటమే అని బిజెపి ఆరోపించింది. కాంగ్రెస్‌లోని ఒక ముఠానేత రమేష్‌ చెన్నితల, పరోక్షంగా రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఈ అంశాన్ని రచ్చ రచ్చ చేస్తున్నారు.


రాష్ట్రపతికి గౌరవడాక్టరేట్‌ పట్టా ఇవ్వాలని గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ కేరళ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ను కోరినట్లు, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించినట్లు మీడియాలో కథలు వచ్చాయి. దీని గురించి కాంగ్రెస్‌ సిఎల్‌పి మాజీ నేత రమేష్‌ చెన్నితల తన ఫేస్‌బుక్‌లో ప్రకటన చేస్తూ గవర్నర్‌ సిఫార్సు నిజమేనా, రాష్ట్ర ప్రభుత్వానికి తిరస్కరించే హక్కు ఉందా ? దాని సంగతి తేల్చాలని కోరారు.సిఎల్‌పి నేత విడి సతీషన్‌ స్పందిస్తూ చెన్నితల చేసిన ప్రకటన గురించి తనకు తెలియదని, ఏదైనా ఒక అంశం మీద పార్టీ వైఖరి నిర్ణయించేది పిసిసి అధ్యక్షుడు, తాను మాత్రమే అన్నారు. పద్దతికి విరుద్దంగా ఎవరికైనా గౌరవడాక్టరేట్‌ను ఇమ్మని గవర్నర్‌ గనుక సూచించి ఉంటే అది చట్టవిరుద్దమని, గవర్నర్లకు అలాంటి అధికారం లేదని కూడా సతీషన్‌ చెప్పారు. దాంతో ప్రభుత్వానికి వంతపాడుతున్నారంటూ సతీషన్‌ మీద బిజెపి నేత, కేంద్ర మంత్రి మురళీధరన్‌ ధ్వజమెత్తారు, సిఫార్సు చేసేందుకు గవర్నర్‌కు పూర్తి అధికారం ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతిని అగౌరవపరచిందని ఆరోపించారు.


కన్నూరు విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌గా పని చేసిన గోపీనాధ్‌ రవీంద్రన్‌ పునర్నియాకాన్ని గవర్నర్‌ తిరస్కరించి వివాదం రేపారు. ఆమోదిస్తూ సంతకం చేసిన తరువాత నిరసన తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ వివాదంలో ఛాన్సలర్‌గా గవర్నర్‌కు హైకోర్టు ఇచ్చిన నోటీసును తీసుకొనేందుకు తిరస్కరించి తాను ఛాన్సలర్‌గా లేనని, రాష్ట్ర ప్రభుత్వానికే పంపాలని గవర్నర్‌ కోరారు. డిసెంబరు ఎనిమిది నుంచి ఛాన్సలర్‌ బాధ్యతల్లో లేనని చెబుతున్నారు.తనకు వచ్చే ఫైళ్లను ప్రభుత్వానికి తిప్పి పంపుతున్నారు. ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టమైన హామీ ఇస్తేనే తిరిగి బాధ్యతలు స్వీకరిస్తానని చెబుతున్నారు.


రాష్ట్రపతికి గౌరవడాక్టరేట్‌ ఇవ్వాలని తాను కోరిందీ లేనిదీ, ఎప్పుడు కోరిందీ, అసలేం జరిగిందన్నది గవర్నర్‌ చెప్పాలి, కానీ కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల సదరు అంశాన్ని ఎందుకు లేవనెత్తారు అన్నది సమస్య. ఒక పౌరుడిగా, ఎంఎల్‌ఏగా తనకు తెలుసుకోవాల్సిన అవకాశం, హక్కు ఉందనుకుంటే గవర్నర్‌, రాష్ట్రప్రభుత్వానికి రాసి తెలుసుకోవచ్చు, బహిరంగ రచ్చ ద్వారా గవర్నర్‌ పదవి, రాష్ట్రపతిని కూడా అవమానించటమే అని విమర్శలు వచ్చాయి.చెన్నితల, బిజెపి నేతల ప్రకటనలతో ఇబ్బంది పడిన గవర్నర్‌ వారిది బాధ్యతా రాహిత్యం, తెలివితక్కువతనమని చెప్పారు. తాను డిసెంబరు ఎనిమిది నుంచే ఛాన్సలర్‌గా తప్పుకున్నట్లు చెబుతున్న గవర్నర్‌ గౌరడాక్టరేట్‌ గురించి ఎప్పుడు సిఫార్సు చేశారు అన్నది ఒక సందేహమైతే, ఛాన్సలర్‌కు అలాంటి అధికారం ఉందా అన్నది ప్రశ్న. ఇంత రచ్చ జరిగిన తరువాత వివరణ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నరుకు లేదా ? గౌరవ పట్టా గురించి ఏదైనా సమస్య ఉంటే గవర్నర్‌ తప్ప మూడవ పక్షం ఎందుకు మాట్లాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియరి బాలకృష్ణన్‌ ప్రశ్నించారు. సిఫార్సు చేసి ఉంటే గవర్నరే స్వయంగా వివరణ ఇవ్వాలి, ఈ సమస్య పార్టీ, ప్రభుత్వం ముందుకు రాలేదు అన్నారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్‌ బిందు స్పందిస్తూ గవర్నర్‌ నుంచి ఈ అంశంలో వచ్చిన సిఫార్సులను తిరస్కరించలేదని స్పష్టం చేశారు.


ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ గవర్నర్‌గా కంటే బిజెపి ప్రతినిధిగా పని చేస్తున్నారు. గతంలో అసెంబ్లీ ప్రసంగంలోని కొన్ని భాగాలను చదివేందుకు తిరస్కరించిన అంశం తెలిసిందే. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా జరిపేందుకు అనుమతి నిరాకరించి వివాదం రేపారు. ఎందుకని కూడా ప్రశ్నించారు. పౌరసత్వ చట్ట సవరణ( సిఎఎ)కు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసినపుడు కూడా గవర్నర్‌ విమర్శలకు దిగారు. రాజ్యాంగ విరుద్దం, పనికిరాదని అన్నారు. కన్నూరు విసి నియామకాన్ని నిరసిస్తూ డిసెంబరు ఎనిమిదిన ప్రభుత్వానికి లేఖ రాశారు. ఒక ఛాన్సలర్‌గా అనుమతించాల్సింది తానేనని, మంచి చెడులను తానే బాగా నిర్ణయించగలని పేర్కొన్నారు. అంతేకాదు, ఆ లేఖను మీడియాకు విడుదల చేసి ఘర్షణకు దిగారు. ఈ వివాదం గురించి ముఖ్యమంత్రి హుందాగా స్పందించారు. మార్గదర్శక సూత్రాల ప్రకారమే విసి ఎంపిక జరిగిందన్నారు.గవర్నర్‌ మనస్సాక్షికి విరుద్దంగా పని చేయాలని తాము కోరటం లేదని, గవర్నర్‌ తన వైఖరిని మార్చుకుంటే అది నియామక ఉత్తరువు మీద సంతకం చేయక ముందు జరగాలని, తరువాత నిరసన వెల్లడించటం తనకు ఆశ్చర్యం కలిగించిందని, ఏదో ” జోక్యం లేదా వత్తిడి ” వచ్చి ఉండాలని అన్నారు.


రాజభవన్‌లను రాజకీయ కేంద్రాలుగా మార్చటంలో బిజెపి ఏలికలు కాంగ్రెస్‌ను తలదన్నారు. బిజెపికి అధికారం వచ్చే అవకాశం ఉంటే సాధనాలుగా మారటం, లేని చోట ఏదో ఒక రచ్చ చేస్తూ గవర్నర్‌ పదవులకు మచ్చ తెస్తున్నారు. వివాదాస్పద గవర్నర్ల జాబితాలో ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ అగ్రభాగాన ఉంటారు. ఒక రాజకీయవేత్తగా ఆయన ప్రస్తానాన్ని చూసినపుడు సంఘపరివార్‌ నమ్మినబంటుగా మనకు కనిపిస్తారు. కేరళలోని కన్నూరు విశ్వవిద్యాలయంలో 2019 భారత చరిత్ర కారుల(ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌) 80వ మహాసభ జరిగింది. దాన్ని ప్రారంభిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ముందుగా తయారు చేసుకు వచ్చిన ప్రసంగాన్ని పక్కన పెట్టి అంతకు ముందు వక్తలు సిఎఎ, కాశ్మీర్‌ పరిణామాలపై చేసిన ప్రస్తావనలు లేదా విమర్శలకు రాజకీయ సమాధానాలు చెప్పటం ప్రారంభించటంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తనను ప్రసంగించకుండా చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌, శ్రోతల నుంచీ కొందరు అడ్డుకున్నారని, గేలిచేశారని తరువాత గవర్నర్‌ ఆరోపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న ఒక వ్యక్తిగా తాను తనకంటే ముందు మాట్లాడిన వక్తలు పేర్కొన్న కొన్ని అంశాలపై మాత్రమే తాను స్పందించానని పేర్కొన్నారు. కన్నూరు సభలో ఇర్ఫాన్‌ హబీబ్‌ గవర్నర్‌ను తోసివేయలేదు, కనీసం తాకను కూడా తాకలేదు. గవర్నర్‌ మౌలానా అజాద్‌, గాంధీ ఇతరుల పేర్లను పూర్తి అసందర్భంగా ప్రస్తావించారు, అదే సమయంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని కూడా పొగడటం ప్రారంభించారు. ఖాన్‌ మాట్లాడుతున్న సమయంలో మీరెందుకు అజాద్‌, గాంధీలను ఉదహరిస్తున్నారు గాడ్సే గురించి చెప్పండి అంటూ హబీబ్‌ అడ్డుకున్నారు.


షాబానో కేసు తీర్పును వమ్ము చేసేందుకు నిర్ణయించిన రాజీవ్‌ గాంధీ చర్యను ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ వ్యతిరేకించిన మాట వాస్తవం.ఆచర్యను అనేక మంది పురోగామి వాదులు ప్రశంసించారు. అలీఘర్‌ ముస్లిం విద్యార్ధి సంఘనాయకుడిగా పని చేశారు. తొలుత బికెడి తరఫున పోటీ చేసి ఓడిపోయారు, తరువాత 26 ఏండ్ల వయస్సులోనే ఎంఎల్‌సి అయ్యారు. తరువాత కాంగ్రెస్‌లో చేరి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మంత్రిగా పని చేస్తూ రాజీనామా చేశారు. తరువాత జనతాదళ్‌ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. మరోసారి మంత్రిగా పని చేశారు. తరువాత ఆ పార్టీ నుంచి బిఎస్‌పిలో చేరి మరోసారి ఎంపీ అయ్యారు. తరువాత 2004లో బిజెపిలో చేరి ఎన్నికలలో ఓడిపోయారు. మూడు సంవత్సరాల తరువాత బిజెపికి రాజీనామా చేసినట్లు ప్రకటించినా ఆ పార్టీతో సంబంధాలను వదులు కోని కారణంగానే నరేంద్రమోడీ సర్కార్‌ కేరళ గవర్నర్‌గా నియమించింది.

పశ్చిమ దేశాలకు దిగులు పుట్టిస్తున్న చైనా టెక్నాలజీ ప్రగతి !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


మాతో మరో ప్రచ్చన్న యుద్దానికి తలపడితే తాట తీస్తాం అని అమెరికా పాలకులను చైనా హెచ్చరించింది. డిసెంబరు చివరివారంలో వాషింగ్టన్‌ నగరంలో అమెరికా మీడియా సంపాదకులు, సీనియర్‌ జర్నలిస్టులతో చైనా రాయబారి క్విన్‌ గాంగ్‌ మాట్లాడారు.” మూడు దశాబ్దాల నాడు అమెరికా ఎలా ఉందో ఇప్పుడు అలా లేదు. చైనా మాజీ సోవియట్‌ రిపబ్లిక్‌ కాదు, చైనా కమ్యూనిస్టు పార్టీ కూడా నాటి సోవియట్‌ పార్టీ వంటిది కాదు. ఎవరైనా నిజంగా ప్రచ్చన్న యుద్ధం ప్రారంభించాలనుకుంటే చైనా ఓడిపోదని నేను చెప్పగలను. అమెరికాకు చైనా ఎంత అవసరమో చైనాకూ అమెరికా అంతే అవసరం ఉంది.” అని క్విన్‌ గాంగ్‌ చెప్పారు. ఎటువైపు నుంచి ప్రచ్చన్న యుద్దం వస్తుంది ? అసలు వస్తుందని కొందరు జనాలు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే అమెరికాలో కొందరు అలాంటి మన:ప్రవృత్తితో ఉన్నారు, సోవియట్‌ మాదిరి చైనా మీదకు పోవాలనుకుంటున్నారని విమర్శించారు.


ఈ దశాబ్ది చివరికి ఆర్ధిక అగ్రరాజ్యంగా అవతరించనున్న చైనా సాంకేతిక రంగంలో కూడా అదే స్ధాయికి చేరుకొనేందుకు అడుగులు వేస్తోంది. ప్రపంచంలో ఇ కామర్స్‌లో పెద్ద సంస్ధగా ఉన్న అలీబాబా గ్రూపు కంపెనీలను అణచివేస్తున్నదంటూ గగ్గోలు పెట్టిన వారు సాంకేతిక రంగంలో ఎలక్ట్రానిక్‌ చిప్స్‌ తయారీకి అదే కంపెనీని ప్రోత్సహిస్తున్నదనే అంశాన్ని కావాలనే విస్మరిస్తున్నారు. ఇటియాన్‌ 710 పేరుతో తన మూడవ ప్రోసెసర్‌ను అక్టోబరు నెలలో విడుదల చేసింది. మూడు సంవత్సరాల్లోనే ఈ పని చేసింది. దానిని ఇతర దేశాలకు అమ్మేది లేదని చెప్పింది. చిప్‌ రూపొందించినా తయారీ సమస్య ఉంది. ఇతర చైనా కంపెనీలు టెన్‌సెంట్‌, షియామీ అదే పోటీలో ఉన్నాయి. ప్రోసెసర్‌ చిప్‌లు ఫోన్లు, కార్లు, వైద్య, గృహ పరికరాల్లో ఎంతో ప్రాధాన్యవహిస్తున్నాయి. కరోనా కారణంగా సరఫరాలు దెబ్బతింటే, చైనాను ఆర్ధికంగా నష్టపరిచేందుకు కొన్ని కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టించాయి.


సెమీకండక్టర్లు లేదా చిప్స్‌ కోసం ప్రస్తుతం అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా, తన తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌పై చైనా ఎక్కువగా ఆధారపడుతోంది.ఈ రంగంలో చిప్స్‌ చైనా తనకు తానే సమకూర్చుకోగలిగితే అది మిగతా దేశాల్లో నవకల్పనలను, ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీస్తుందని కొందరు వాపోతున్నారు.జాతీయ ఆర్ధిక భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానంలో ఇతరుల మీద ఆధారపడకూడదని, సాంకేతిక అగ్రరాజ్యంగా మారాలని 2021 మార్చినెలలో చైనా నేత షీ జింపింగ్‌ పిలుపునిచ్చారు. తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా తస్కరిస్తున్నదనే తప్పుడు ప్రచారాన్ని అమెరికా, ఐరోపా ధనిక దేశాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చైనా తన చిప్స్‌ను తానే ప్రత్యేకంగా రూపొందించుకుంటే, తాము రూపొందించినవి చైనా కార్లు, సెల్‌ఫోన్లకు పనికి రాకపోతే, మిగతా దేశాలు కూడా అదే బాట పడితే తాము ప్రతి దేశానికి విడివిడి ప్రమాణాలతో ఎలా తయారు చేయగలం, అందుకు అవసరమైన పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయని, అభివృద్ధి మందగిస్తుందని అమెరికా, ఐరోపా బడా సంస్ధలు ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచం విడిపోకుండా చూడాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అమెరికా-చైనాలను కోరారు. ఒకచేత్తో చప్పట్లు కష్టం కదా !


ప్రస్తుతం చైనాలో తయారవుతున్న సెల్‌ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల వంటి వాటికి ఏటా 300 బి. డాలర్ల మేర చిప్స్‌ చైనా ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటోంది, చమురు తరువాత స్ధానం వీటిదే. 2016లో డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్యయుద్దంలో భాగంగా చైనాలోని హువెయి టెక్నాలజీస్‌ సంస్ధకు అవసరమైన చిప్స్‌, ఇతర సాంకేతిక పరిజ్ఞానం అందకుండా అమెరికా అడ్డుకుంది. ఆ కంపెనీ పరికరాలతో ఇతర దేశాల భద్రతకు ముప్పు అనే ప్రచారాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి చైనా తన ప్రయత్నాలను ముమ్మరం చేసి, చిప్స్‌ రూపకల్పనకు పూనుకుంది. దీంతో దిగ్గజాలైన క్వాలకమ్‌(అమెరికా) శాంసంగ్‌(దక్షిణ కొరియా, ఆర్మ్‌(బ్రిటన్‌) కంపెనీలకు సవాలు ఎదురైంది. సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన పరికరాలు, వస్తువులు, ఉత్పత్తి సాంకేతిక పరిజ్ఞానంలో చైనా వెనుకబడి ఉంది. దాన్ని అలుసుగా తీసుకొని ఆ రంగంలో ముందున్న దేశాలు బెదిరిస్తున్నాయి. తన సాంకేతిక పరిజ్ఞానంతో పని చేసే ఫౌండరీల్లో చైనా హువెయి కంపెనీ చిప్స్‌ తయారు చేయరాదని, ఒకవేళ చేసినా ఐదవ తరం ఫోన్లకు అసలు చేయకూడదని అమెరికా ఆంక్షలు విధించింది. ఐరోపా యూనియన్‌ కూడా తక్కువేమీ తినలేదు. జర్మనీలో రోబోలను తయారు చేసే కుకా కంపెనీని చైనా కొనుగోలు చేస్తే తమ పెట్టుడుల గురించి సమీక్షించాల్సి వస్తుందని బెదిరించింది.చిప్స్‌ తయారీకి అవసరమైన ఆధునిక యంత్రాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా నెదర్లాండ్స్‌ ప్రభుత్వం ఎటూ తేల్చకుండా ఉంది.


్ట మానవహక్కులు, టిబెట్‌, తైవాన్‌, హాంకాంగ్‌ అంశాలను ప్రపంచాన్ని తప్పుదారి పట్టిస్తూ రాజకీయ దాడులు, మిలిటరీ కవ్వింపులకు పశ్చిమ దేశాలు పూనుకున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా సెమికండక్టర్లను తయారు చేస్తున్న దిగ్గజ కంపెనీ ఇంటెల్‌ తాజాగా చైనాకు క్షమాపణ చెప్పింది.చైనాలో ముస్లింలు అధికంగా ఉండే షిజాంగ్‌ రాష్ట్రంలో వారిని అణచివేస్తున్నారను తప్పుడు ప్రచారం సాగించటమే కాదు, ఆంక్షలను కూడా అమెరికా, ఇతర దేశాలు అమలు చేస్తున్నాయి. తైవాన్ను ప్రత్యేకదేశంగా పిలిచినందుకు హాలీవుడ్‌ నటుడు, అమెరికా రెజ్లర్‌ జాన్‌ సెనా చైనాకు క్షమాపణలు చెప్పారు.తన సినిమాలకు చైనాలో టిక్కెట్లు అమ్ముకోవటానికి తప్ప వేరే కారణం లేదు. జెపి మోర్గాన్‌ బాంకు సిఇఓ జామీ డైమన్‌ చైనా కమ్యూనిస్టు పార్టీ మీద జోక్‌ వేసి తరువాత రెండుసార్లు క్షమాపణలు చెప్పాడు.జర్నలిజం నైతికవిలువలు, మానవత్వం గురించి చైనాకు వ్యతిరేకంగా నోరుపారవేసుకొన్న సిఎన్‌ఎన్‌ తరువాత క్షమాపణలు చెప్పింది. షిజాంగ్‌ రాష్ట్రంలో తయారయ్యే నూలును తాము వినియోగించబోమని ప్రకటించిన నైక్‌ కంపెనీ తరువాత చెంపలు వేసుకుంది.ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇవన్నీ చైనా మార్కెట్‌, లాభాల కోసం వేసే నక్కజిత్లులు తప్ప వేరు కాదు.వాణిజ్య సంస్ధలు రాజకీయాల్లో వేలు పెడితే పర్యవసానాలకూ సిద్దపడాలి. లేకుంటే పరువు పోగొట్టుకోవాలి.


తమ సరఫరాదారులు చైనా షిజాంగ్‌ రాష్ట్రం నుంచి ఉత్పత్తయ్యేవస్తువులు లేకుండా చూడాలని ఇంటెల్‌ కోరింది. ఆ రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలను అణచివేస్తున్నారని, బలవంతంగా పని చేయిస్తున్నారంటూ ఆ వస్తువులను కొనుగోలు చేయకూడదంటూ అమెరికా ఆంక్షలు విధించింది. దానికి అనుగుణంగానే తాము అలాంటి లేఖ రాసినట్లు ఇంటెల్‌ తెలిపింది. ఇది తమ దేశాన్ని అవమానించటమే అంటూ ఇంటెల్‌ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ చైనా సామాజిక మాధ్యమంలో నెటిజన్లు స్పందించటం, ఇంటెల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా తప్పుకుంటున్నట్లు చైనా పాప్‌ గాయకుడు వాంగ్‌ జుంకాయి ప్రకటించటం వంటి చర్యలతో కంపెనీ దిగివచ్చింది. షిజాంగ్‌ రాష్ట్రంలో దొరికే సిలికాను చిప్స్‌ తయారీకి వినియోగిస్తారు. ఆసియాలో ఉన్న ఏకైక ఇంటెల్‌ ఫ్యాక్టరీ చైనాలోని దలియాన్‌లో, బీజింగ్‌లో పరిశోధనా కేంద్రం ఉంది. ఇతర కంపెనీల చిప్స్‌ అందుబాటులో ఉండటంతో ఇంటెల్‌ దిగివచ్చింది. 2020లో ఆ కంపెనీ ఆదాయంలో నాలుగో వంతు చైనా నుంచే ఉంది. వేరే మార్కెట్‌ను వెతుక్కోవటం చాలా కష్టం, ఎంతో ఖర్చుతో కూడుకున్నది కావటం, వీటికి తోడు స్వంతంగా చిప్స్‌ తయారీకి పూనుకోవటం కూడా ఇంటెల్‌ను ప్రభావితం చేసింది. మానవహక్కుల కోసం నిలబడే అమెరికన్‌ కంపెనీలు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని వైట్‌హౌస్‌ మీడియా అధికారి జెన్‌ సాకీ అన్నారు.


రెండవ ప్రపంచయుద్దానికి ముందు తమతో పోటీ పడుతున్న జపాన్‌ సామ్రాజ్యవాదాన్ని అడ్డుకొనే క్రమంలో పశ్చిమ దేశాలు జపాన్‌కు అవసరమైన సహజవనరులు, ముడి సరకులను అందకుండా చూశాయి. ఇప్పుడు చైనా ఆర్ధికంగా పోటీపడుతున్న నేపధ్యంలో అడ్డుకొనేందుకు చిప్స్‌, సాంకేతిక పరిజ్ఞానం అందకుండా చూసేందుకు పశ్చిమ దేశాలు పూనుకోవటం గత పరిణామాలను గుర్తుకు తెస్తున్నాయి. రెండవ ప్రపంచయుద్దంలో ఓడిపోయిన జపాన్‌కు మిలిటరీని లేకుండా ఆంక్షలు విధించారు. మిలిటరీ ఖర్చును జపాన్‌ తన పరిశ్రమలకు అవసరమైన పరిశోధన-అభివృద్ధి, సబ్సిడీలకు మళ్లించి పశ్చిమ దేశాలకు ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌, ఆటోమొబైల్‌ రంగంలో సవాలు విసిరి వాటికి మారుపేరుగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చైనాను కూడా జపాన్‌తో సహా పశ్చిమ దేశాలన్నీ అదే దిశగా ఒకవైపుకు నెడుతున్నాయి. చైనా దీన్ని ముందుగానే అంచనావేసి వాటి మీద ఆధారపడకుండా ఉండేందుకు తగిన కార్యక్రమాలను రూపొందించుకొని ముందుకు పోతున్నది. అమెరికా 2016లో వాణిజ్య యుద్దం ప్రారంభించినప్పటికీ అది ఆచరణలో సాంకేతిక యుద్దంగా పరిణమించిందని చెప్పవచ్చు. మేడిన్‌ చైనా 2025 కార్యక్రమంతో ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి.


చైనాను దెబ్బతీయాలని చూస్తున్న వారికి జరుగుతున్న పరిణామాలు మింగుడు పడటం లేదు, అంతేకాదు బెంగపట్టుకుందని చెప్పవచ్చు.” ప్రపంచ అశాంతికి దోహదం చేస్తున్న చైనా సాంకేతిక స్వీయ ఆధార బాట ” అనే శీర్షికతో తాజాగా ఏపి వార్తా సంస్ధ ఒక కధనాన్ని వెలువరించింది. ఒక వైపు మార్కెట్లను మరింతగా తెరిచి తమ వస్తువులను కొనుగోలు చేయాలని అమెరికా నాలుడేండ్లుగా ప్రత్యక్షంగా సాగిస్తున్న వాణిజ్యయుద్దం, చైనాకు వ్యతిరేకంగా చేస్తున్న సమీకరణలు, విధిస్తున్న ఆంక్షల నేపధ్యంలో ఎవరి మీదా ఆధారపడకుండా సాంకేతిక రంగంలో స్వీయ ఆధార దిశగా చైనా అనేక చర్యలు తీసుకుంది. అది సాధిస్తున్న పురోగతిని దిగ్జజదేశాలు ఊహించలేదు. తమ కోడి కూయకపోతే ఎలా తెల్లవారుతుందో చూస్తామనట్లుగా ఉన్నాయి. ఇప్పుడు మొదటికే మోసం వస్తుందనే బెంగ పట్టుకుంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికలు : బెట్టింగ్‌ బంగార్రాజులూ జాగ్రత్త !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మాయాబజార్‌ వాగ్దానాలతో పార్టీలు ఓటర్లను ఎలా ప్రలోభాలకు గురిచేస్తున్నాయో తెలిసిందే. ఎన్నికల ఫలితాలు, కొందరు ప్రముఖుల గెలుపు, మెజారిటీల మీద తిధి, వార, నక్షత్రాల పేరుతో జోశ్యాలు చెప్పేవారు, పందెం రాయుళ్లు రంగంలోకి దిగారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశంతో పాటు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే సంఖ్యల మీద కూడా పందాలు ప్రారంభమయ్యాయి.ఒక అంచనా ప్రకారం 2021 మే నెలలో జరిగి ఎన్నికల్లో 25వేల కోట్ల రూపాయల వరకు ఉండగా 2022 ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 50 వేల కోట్ల రూపాయల లావాదేవీలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో పోటీ తీవ్రంగా ఉంటే ఇంకా పెరగవచ్చు కూడా. వచ్చే లోక్‌సభ ఎన్నికలు-2024లో రావాల్సినవి- ఎప్పుడు వస్తాయో తెలియదు. వాటిని ముందుకు నెట్టే లేదా గడువు నాటికి జరిగేట్లు ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తాయని భావిస్తున్న తరుణమిది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఈ సారి ఎవరు పాగావేస్తారన్న ఆసక్తి పెరిగిన నేపధ్యంలో ఈ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్‌కు ఆప్‌ గట్టి సవాలు విసురుతోంది. అకాలీదళ్‌ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి సొంత దుకాణం పెట్టుకున్న కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ – బిజెపి జట్టుగా రంగంలోకి దిగటంతో చతుర్ముఖ పోటీ జరగనుంది. జూదగాండ్లు ఇప్పటి వరకు ఈ జట్టును లెక్కలోకి తీసుకోలేదు.


క్రికెట్‌ మీద పందాలు కాయటం తెలిసిందే. గడచిన రెండు దశాబ్దాల్లో ఎన్నికల ఫలితాల మీద పందాలు అదీ సంఘటిత ముఠాలు నిర్వహించటం పెరిగింది. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల మీద పందాలు మొదలయ్యాయి. వివిధ సర్వే సంస్ధలు వెల్లడించే జోశ్యాల ప్రాతిపదికన జరిగే పందాలు కొన్ని కాగా పందెం ముఠాల వెనుక ఉండే పెద్దలు స్వంతంగా చేయించుకొనే సర్వేల ప్రాతిపదికన కూడా మరికొన్ని జరుగుతున్నాయి. ఎన్నికల సర్వేలు ఎలా బోల్తాపడుతున్నాయో పందెం ముఠాలు కూడా అలాగే బొక్కబోర్లాపడుతున్నాయి. అయితే ఇవన్నీ చట్టవిరుద్దం, చీకట్లో జరిగేవి కావటంతో డబ్బు పొగొట్టుకున్నవారు లేదా గెలిచినవారు గానీ పైకి చెప్పుకోలేరు.పందెగాళ్ల అంచనా ప్రకారం పంజాబ్‌లో ఎవరికీ మెజారిటీ రాదు, ఉత్తర ప్రదేశ్‌లో తిరిగి బిజెపి గద్దెనెక్కనుంది.ఎన్నికల ప్రచారంలో పార్టీల జన సమీకరణ, మీడియా విశ్లేషణలను బట్టి కూడా పోలింగ్‌ తేదీ వరకు పందాల మొత్తాలు పెరగటం లేదా తగ్గటాన్ని గతంలో చూశాము. సాధారణ పరిస్ధితుల్లో ఎన్నికలు జరిగితే పందాలు ఒకరకం- అవి ధరల పెరుగుదల, దారిద్య్రం, నిరుద్యోగం వంటి అంశాల తీవ్రతను బట్టి ఉంటాయి.అదే పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్‌ దాడుల వంటి ఉదంతాలు చోటు చేసుకుంటే మరోరకంగానూ మారతాయి.


ఈ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఏడాదికి పైగా మూడు సాగు చట్టాల రద్దు కోసం సాగిన మహత్తర ఉద్యమ ధాటికి దిగివచ్చిన నరేంద్రమోడీ వాటిని రద్దు చేయటమేగాక రైతులకు క్షమాపణలు చెప్పారు. కనీస మద్దతు ధర చట్టబద్దత పరిశీలనకు ఒక కమిటీని వేస్తామని ప్రకటించి వారాలు గడుస్తున్నా ఆ దిశగా ఎలాంటి కదలికా లేదు. సాగు చట్టాల రద్దుతో దూరమైన రైతులు తిరిగి తమవైపు చేరతారని ఆశించిన బిజెపికి అలాంటి సూచనలేమీ కనిపించటం లేదనే వార్తలు వస్తున్నాయి. రైతాంగం ఎటు మొగ్గుతుందన్నది ఆసక్తికరమైన అంశమే.2017 ఎన్నికల్లో బిజెపి ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీలోని 403 స్ధానాలకు గాను 312 సాధించింది. వచ్చే ఎన్నికల్లో 250తో గట్టెక్కవచ్చని ఒకవైపు వార్తలు, రెండంకెలకు మించవనే అంచనాలు మరోవైపు ఉన్నాయి.


ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో రెండు పార్టీల గురించే పందాలు కాస్తున్నారు. బిజెపి 200 స్ధానాలు గెలిస్తే ప్రతి రూపాయికి అదనంగా 20పైసలు, 222 గెలిస్తే రూపాయికి రు.1.15, సమాజవాది110 తెచ్చుకుంటే 35పైసలు, 125 గెలిస్తే రు.1.40 ఇస్తామని ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్‌, బిఎస్‌పికి ఐదు నుంచి పది స్ధానాలకు మించి రావని పందెంరాయుళ్లు చెబుతున్నారు. తరువాత ఈ అంచనాలు, పందాల మొత్తాలు మారిపోవచ్చు. పంజాబ్‌లోని 117 స్ధానాల్లో కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలకు కనీసంగా 25 గరిష్టంగా 40చొప్పున వస్తాయని, అకాలీదళ్‌, బిజెపిలకు ఐదు నుంచి పదిలోపు రావచ్చని, ఇక్కడ కూడా నామినేషన్ల తరువాత అంచనాలు మారవచ్చని అంటున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ప్రస్తుతం వివిధ పార్టీల సీట్ల అంచనా మేరకు వాటిని సాధిస్తే పందెం కాసిన వారికి రూపాయికి ఇచ్చే మొత్తాలు ఇలా ఉన్నాయి.


పార్టీ×××సీట్లు×××పైసలు×× పార్టీ×××సీట్లు×××పైసలు
బిజెపి×× 200×× 0.20 ××ఎస్‌పి×× 110×× 0.35
బిజెపి×× 210×× 0.35 ××ఎస్‌పి×× 115×× 0.60
బిజెపి×× 215×× 0.57 ××ఎస్‌పి×× 120×× 1.05
బిజెపి×× 222×× 1.15 ××ఎస్‌పి×× 125×× 1.40
బిఎస్‌పి×× 5 ×× 0.04 ××కాంగ్రెస్‌ ×× 5×× 0.55
బిఎస్‌పి××10 ×× 0.67 ××కాంగ్రెస్‌ ×× 6×× 0.70
బిఎస్‌పి××15 ×× 1.10 ××కాంగ్రెస్‌ ×× 8×× 1.00
బిఎస్‌పి×× 0 ×× 0.00 ××కాంగ్రెస్‌ ××10×× 2.50
పంజాబ్‌లోని 117కు గాను ప్రస్తుతం వివిధ పార్టీల సీట్ల అంచనా మేరకు వాటిని సాధిస్తే పందెం కాసిన వారికి రూపాయికి ఇచ్చే మొత్తాలు ఇలా ఉన్నాయి
పార్టీ×××సీట్లు×××పైసలు×× పార్టీ×××సీట్లు×××పైసలు
ఆప్‌×× 25 ×× 0.35 ××కాంగ్రెస్‌ ×× 25 ×× 0.45 ××అకాలీదళ్‌ ×× 5 ×× 0.35
ఆప్‌×× 30 ×× 0.40 ××కాంగ్రెస్‌ ×× 30 ×× 0.57 ××అకాలీదళ్‌ ×× 10 ×× 0.57
ఆప్‌×× 35 ×× 0.87 ××కాంగ్రెస్‌ ×× 35 ×× 0.90 ××అకాలీదళ్‌ ×× 15 ×× 0.87
ఆప్‌×× 40 ×× 1.15 ××కాంగ్రెస్‌ ×× 40 ×× 1.35 ××అకాలీదళ్‌ ×× 20 ×× 1.20

2021లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాడు అన్నాడిఎంకె గెలుస్తుందని, డిఎంకె ఓడిపోతుందని, స్టాలిన్‌కు సిఎం యోగం లేదని జోశ్యాలు చెప్పారు. పశ్చిమబెంగాల్లో మోడీ నాయకత్వంలో బిజెపి గెలుస్తుందన్నారు. బిజెపి పటాటోపం చూసి అక్కడ పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపారు.బిజెపికి 145 స్దానాలు వస్తాయని, టిఎంసికి 115-120కి మించి రావని పందాలు కాశారు. రూపాయి 22 నుంచి 150పైసల వరకు అవి ఉన్నాయి. ఎవరి తల రాత ఏమిటో ముందే రాసి ఉంటుందని చెప్పేవీరు ఎన్నికల అంశాల్లో నామినేషన్ల నాటి నుంచి ప్రచారం వరకు భిన్నమైన జోశ్యాలు చెబుతున్నారు. వీరందరు చెప్పే గ్రహాలు ఒకటే, అవి అందరికీ ఒకే సందేశాలు ఇవ్వాలి, కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పటాన్ని బట్టి ఊహాగానాలు తప్ప మరొకటి కాదన్నది స్పష్టం. అయినా ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్లుగా ప్రతివారూ జోత్యిష్కులను ఆశ్రయిస్తుండటంతో వారి వ్యాపారం కూడా రెండు చేతులు ఆరు కాసులు అన్నట్లుగా పెరిగిపోతోంది.


2004 ఎన్నికల్లో అతల్‌ బిహారీ వాజ్‌పాయి నాయకత్వంలోని ఎన్‌డిఏకు మరోసారి అవకాశం వస్తుందన్న ఎన్నికల సర్వేలు వాస్తవం కాదని తేలింది. 2009లో హంగ్‌ పార్లమెంట్‌ అన్న అంచనాలు తప్పి యుపిఏ మరింత బలపడింది. 2014లో ఎన్‌డిఏకు స్వల్ప మెజారిటీ అన్న అంచనాలు తారుమారైన సంగతి తెలిసిందే, 2019లో కూడా అదే జరిగి ఎన్‌డిఏ బలం మరింత పెరిగింది.అనేక మంది ప్రముఖ జ్యోతిష్కులు మోడీ అధికారానికి వచ్చినా సీట్లు తగ్గుతాయని చెప్పి నాలుక కరుచుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా, మధుర, హత్రాస్‌ వంటివి పందెగాండ్లకు పెద్ద కేంద్రాలు.2019 ఎన్నికలలో మోడీ సర్కార్‌కు తగినంత మెజారిటీ రాకపోతే సమాజవాది పార్టీతో బంధాన్ని తెంచుకొని బిఎస్‌పి నేత మాయావతి ఎన్‌డిఏలో చేరతారని, రాహులు గాంధీ పోటీ చేసిన రెండు స్ధానాల్లో గెలుస్తారని, సమాజవాది పార్టీ స్ధితి మెరుగుపడుతుందని కూడా పందాలు కాశారు.


సర్వే సంస్ధలు, మీడియాను మేనేజ్‌ చేసి అనుకూల సర్వేలు చేయించుకోవటం జగమెరిగిన సత్యం. అందుకే వాటిని జనం పెద్దగా విశ్వసించటం లేదు. ఫలితాలు కూడా అలాగే ఎక్కువ సందర్భాల్లో తారుమారయ్యాయి. సర్వేలతో పాటు ఇప్పుడు రాజకీయ పార్టీలు ముఖ్యంగా బిజెపి పందెగాళ్ల ముఠాలను కూడా ప్రభావితం చేస్తున్నట్లు విమర్శలు వచ్చాయి. పందాల వార్తలు మీడియాలో ప్రముఖంగా చోటు చేసుకొంటున్నందున తద్వారా ఓటర్లను ప్రభావితం చేయవచ్చన్న ఎత్తుగడ దీనివెనుక ఉంది. ఫలానా పార్టీ గెలుపు గురించి ఎక్కువ మంది పందెంకాస్తున్నారంటే దానికి మద్దతు ఉండబట్టే కదా అని మొగ్గేవారు కొందరైనా ఉండవచ్చు. ఈ కారణంగానే 2014తో పోల్చితే 2019లో పందాల మార్కెట్‌ రెండు రెట్లు పెరిగిందని, ఇప్పుడు ఇంకా పెరిగిందని అంచనా. కనీస మొత్తాలతో ప్రారంభమై కోట్ల వరకు ఉంటాయి. అనేక మొత్తాలు విదేశాల్లోనే జమ అవుతాయి, దానికి హవాలాతో సహా అనేక మార్గాలను ఎంచుకుంటారు, ఎక్కడా రాతకోతలుండవు.బుకీలు తెలిసి ఉంటే ముందుగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతా నమ్మకం, దందా మీదనే నడుస్తుంది.


ఎన్నికల ఫలితాలపై పందాలు మన దేశంలోనే కాదు ప్రపంచమంతటా ఉన్నాయి. మన దేశంలో గుర్రప్పందాలు మాత్రమే చట్టబద్దం. మిగిలినవన్నీ చాటు మాటు దొంగ వ్యవహారాలే. అనేక దేశాల్లో అన్ని రకాల జూదాలు చట్టబద్దంగానే జరుగుతాయి. 2020 అమెరికా ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌, జోబైడెన్‌ మీద కూడా జూదం నిర్వహించారు. ప్రతి అధ్యక్షుడు రెండోసారి ఎన్నిక అవటం ఆనవాయితీగా వస్తోంది. ఆ మేరకు ట్రంప్‌ ఎన్ని పిచ్చిపనులు చేసినా రెండోసారి గెలుస్తాడంటూ పందెగాళ్లు ఎక్కువ మంది అటువైపే మొగ్గి చేతులు కాల్చుకున్నారు. లెక్కింపులో జో బైడెన్‌ ముందంజలో ఉన్నట్లు వార్తలు వచ్చిన తరువాత కూడా ట్రంప్‌ ఏదో ఒక మాజిక్‌ చేసి గెలుస్తాడని భంగపడినవారు లేకపోలేదు. ట్రంప్‌ గెలుపు గురించి న్యూజిలాండ్‌లో 62 నుంచి 37 , జోబైడెన్‌ మీద 61-44 సెంట్ల వరకు పందాలు నడిచాయి(ఒక డాలరుకు వంద సెంట్లు).స్టాక్‌ ఎక్సేంజ్‌ల మాదిరి బ్రిటన్‌లో బెట్టింగ్‌ ఎక్సేంజ్‌ బెట్‌ఫెయిర్‌ ఉంది. అమెరికా ఎన్నికలు ప్రారంభం కాగానే ట్రంప్‌ రెండోసారి విజయానికి అవకాశాలున్నాయని 39 నుంచి 75శాతానికి బెట్‌ఫెయిర్‌ సూచిక పెరగ్గా బైడెన్‌ అవకాశాలు 61 నుంచి 25శాతానికి తగ్గాయి. స్మార్‌కెట్స్‌ అనే మరో ఎక్సేంజ్‌లో కూడా ఇదే మాదిరి సూచనలు వెలువడినా చివరికి ట్రంప్‌ ఇంటిదారి పట్టాడు. అక్కడ కొన్ని రాష్ట్రాల తీరు తెన్నులను బట్టి పందాలు కాస్తారు.

పని కోసం యువత రద్దీ – ఉపాధి రహిత దేశ వృద్ధి !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఉదరపోషణార్ధం బహుకృత వేషం అన్నట్లుగా ఉత్తర ప్రదేశ్‌ విధాన సభ ఎన్నికల్లో గెలుపుకోసం బిజెపి నేతలు చేయని శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు, చెప్పని మాటలు లేవు. పగలంతా భారీ సంఖ్యలో జనాన్ని సమీకరిస్తున్న సభల్లో మాట్లాడుతూ సాయంత్రానికి కరోనా నిరోధ చర్యల గురించి బోధలు చేస్తున్నారనే విమర్శను ప్రధాని నరేంద్రమోడీ మూటగట్టుకున్నారు.ప్రయాగ సభలో మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్‌లో యోగి సర్కార్‌ సాధించిన విజయాల్లో మహిళా సాధికారత ఒకటని చెప్పారు. జర్మన్‌ నాజీ మంత్రిగా పని చేసిన గోబెల్స్‌ స్వర్గంలో ఉన్నాడో నరకంలో ఉన్నాడో తెలియదు గానీ ఈ వార్తను చూసి ఎలా స్పందించి ఉంటాడో తెలియదు. ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే అదే నిజం అవుతుందన్న తన సిద్దాంతాన్ని ముందుకు తీసుకపోతున్నవారు తామర తంపరగా పెరుగుతున్నందుకు కచ్చితంగా సంతోష పడి ఉంటాడు. ప్రపంచ బాంకు సమాచారం ప్రకారం 2005లో మన దేశంలో మహిళా కార్మికుల భాగస్వామ్యం 26శాతంగా ఉందని,2019నాటికి అది 20.3శాతంగా ఉంది. పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌లో 30.5, శ్రీలంకలో 33.7శాతం మంది ఉన్నారు. కరోనా కారణంగా మన దేశంలో 2020 ఏప్రిల్‌-జూన్‌లో 15.5శాతానికి తగ్గింది. ఇక యోగి ఆదిత్యనాధ్‌ ఏలుబడిలో తొమ్మిదిశాతం, బీహార్‌లో ఐదుశాతం మాత్రమే అని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.


దేశం సంపద్వంతం కావటానికి ఇప్పుడు అమలు చేస్తున్న సంస్కరణలు ఏమాత్రం చాలవని కార్పొరేట్‌ శక్తులు వత్తిడి చేస్తున్నాయి. దానికి అనుగుణంగానే రద్దు చేసిన సాగు చట్టాలను తిరిగి పునరుద్దరిస్తామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఇటీవలనే చెప్పారు. దేశమంతటి నుంచి నిరసన తలెత్తటంతో అబ్బేఅలాంటిదేమీ లేదంటూ ప్రకటించిన అంశం తెలిసిందే.ఏటా రెండు కోట్ల మంది యువతీ,యువకులు మాకు పని కావాలంటూ రోడ్లమీదకు వస్తున్నారు.వారికి పని దొరకటం లేదు. కేంద్రంలో మెజారిటీ రాష్ట్రాల్లో ఏలుబడిలో ఉన్నది బిజెపి, అచ్చేదిన్‌ అని చెప్పినప్పటికీ పరిస్ధితులు రోజురోజుకూ దిగజారుగుతున్నాయి.అచ్చేదిన్‌ పేరుతో నరేంద్రమోడీ 2014లో అధికారానికి వచ్చినపుడు ఎనిమిది శాతంపైగా వృద్ధి రేటు ఉంది.కరోనాకు ముందు నాలుగుశాతానికి పడిపోయింది. వృద్ధి రేటు ఎంత ఉన్నప్పటికీ అది ఉపాధిరహితంగా ఉండటమే అసలు సమస్య. కార్పొరేట్ల లాభదాహం నానాటికీ పెరుగుతోంది.కరోనాలో జనాల పరిస్ధితి దిగజారితే వారి లాభాలు ఏమాత్రం తగ్గలేదు.అయినా అసంతృప్తి.


కెనడాలోని ఫ్రాసర్‌ సంస్ధ విడుదల చేసిన ప్రపంచ ఆర్ధిక స్వేచ్చ సూచికలో 165దేశాలకు గాను మనదేశం ఇంతకు ముందున్న 103వ స్ధానం నుంచి 2021లో 108వ స్ధానానికి దిగజారింది.దీనికిగాను పరిగణనలోకి తీసుకొనే అంశాలన్నింటా పరిస్ధితి అధ్వాన్నంగా ఉన్నందున ప్రయివేటు రంగం వృద్ది చెందటం లేదట.సంస్కరణల గురించి కబుర్లు చెబుతున్నా పరిస్ధితి ఇలా ఉంది. కీలకమైన సేవా రంగాలను సరళతరం చేయటాన్ని నిలిపివేసినట్లు నివేదిక అసంతృప్తి వ్యక్తం చేసింది.తక్కువ ధరలకు సరకులను అందచేసేందుకు బహుళజాతి రిటైల్‌ కంపెనీలను అనుమతించటం లేదన్నది ఒకటి. సోషలిస్టు విధానాలను అనుసరిస్తున్నందున మరింతగా పరిస్ధితి దిగజారుతుందని కెనడా సంస్ద చెప్పిందంటే ఇప్పుడున్న వాటి నుంచి కూడా ప్రభుత్వం వెనక్కు తగ్గి మొత్తంగా కార్పొరేట్లకు అప్పగించాలని కోరుతున్నారు.


తాజాగా కేంద్ర ప్రభుత్వం అక్వీస్‌(ఆలిండియా క్వార్టర్లీ ఎస్టాబ్లిష్‌మెంట్‌ బేస్డ్‌ ఎంప్లాయిమెంట్‌ సర్వే) తొలి నివేదిక ప్రకారం 2021 ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉపాధి తొమ్మిది రంగాలలో 3.08 కోట్లకు పెరిగినట్లు పార్లమెంటుకు తెలిపారు.2013-14లో 2.37 కోట్లతో పోల్చుకుంటే వృద్ది రేటు 29శాతం అని చెప్పారు.వాస్తవం ఏమిటి ? 2021 అక్టోబరులో కార్మికశక్తి భాగస్వామ్య రేటు 40.41(ఎల్‌పిఆర్‌) శాతం ఉండగా నవంబరు నాటికి 40.15కు పడిపోయింది. కరోనాకు ముందు 43శాతం ఉంది, రెండు సంవత్సరాలు రెండు తరంగాల కారణంగా కనిష్టంగా 36శాతానికి పడిపోయి తిరిగి కోలుకున్నప్పటికీ కరోనా ముందు స్ధితికి చేరుకోలేదు. ప్రపంచబాంకు, ఐఎల్‌ఓ గణాంకపద్దతి ప్రకారం 2020లో ప్రపంచ సగటు ఎల్‌పిఆర్‌ 58.6 కాగా మనది 46శాతం మాత్రమే. మనకంటే అధ్వాన్నంగా ఉన్న దేశాలు మరొక 17 మాత్రమే అని ఐఎల్‌ఓ చెప్పింది. చిత్రం ఏమిటంటే వాటిలో చమురు సంపదలున్న ఇరాన్‌, ఇరాక్‌ వంటి దేశాలతో పాటు అంతర్యుద్ధాలతో అతలాకుతలం అవుతున్న సిరియా, లెెబనాన్‌, ఎమెన్‌ వంటివి ఉన్నాయి. అత్యంతవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా పేర్కొంటున్న మనం ఈ రెండు తరగతులకూ చెందం అన్నది స్పష్టం. సిఎంఐఇ అంచనాల ప్రకారం 40శాతానికి అటూ ఇటూ అంటే ఐఎల్‌ఓ కాస్త ఉదారంగా లెక్కించింది తప్ప పరిస్ధితి దారుణంగా ఉందన్నది స్పష్టం.


కరోనాకు ముందు దేశం మొత్తం మీద ఉపాధిలో పట్టణ వాటా 32శాతం కాగా 2021అక్టోబరులో 31.5శాతం ఉండగా నవంబరులో 31.2శాతానికి తగ్గింది. గ్రామాలతో పోల్చుకుంటే పట్టణాలలో సంఘటిత రంగం ఉంటుంది కనుక కాస్త మెరుగైన వేతనాలుంటాయి. అవే తగ్గాయంటే దాని ప్రభావం మొత్తం మీద ఉంటుంది. మొత్తంగా నవంబరు నెలలో అదనంగా వచ్చిన ఉపాధి 14లక్షలు, పట్టణాల్లో 9లక్షలు తగ్గినా గ్రామాల్లో 23లక్షలు పెరిగినందున ఈ పెరుగుదల ఉంది. నెలవారీ వేతనాలు పొందే వారి సంఖ్య తగ్గుతుండటం ఆందోళనకరం.2019 నవంబరులో నెలవారీ వేతన జీవుల సంఖ్యతో పోలిస్తే 2021లో 9.7శాతం తగ్గారు.ప్రస్తుతం ఒమైక్రాన్‌ కరోనా వైరస్‌ తరంగం ప్రపంచాన్ని, మన దేశాన్ని కూడా భయపెడుతున్నది. ఆర్ధికంగా కోలుకోవటం కష్టమనే అంచనాలు వెలువడతున్నాయి.


గత మూడు దశాబ్దాల సంస్కరణల ఫలితాలు, పర్యవసానాలను చూస్తే జిడిపి వృద్ది కనిపిస్తుంది, జనాభావృద్ధి రేటు తగ్గుతోంది. కానీ ఉపాధి వృద్ధి రేటు జనాభాకు అనుగుణంగా లేదు. ముఖ్యంగా గత దశాబ్దికాలంలో ఉపాధి రహిత వృద్ధి ఎక్కువగా కనిపిస్తోంది. వ్యవసాయం గిట్టుబాటు కాని స్ధితిలో ఆ రంగంలో యంత్రాల వాడకం గణనీయంగా పెరిగి ఉపాధి తగ్గింది. ఆ మేరకు పట్టణాలలో పెరగలేదు. పెరిగింది కూడా అసంఘటిత రంగంలో ఉంది.ప్రపంచీకరణ కారణంగా ఐటి, అనుబంధ రంగాలలో కొత్త ఉపాధి అవకాశాలు వచ్చిన్పటికీ అవి నైపుణ్యం ఉన్నవారికే పరిమితం అన్నది తెలిసిందే.2005-10 మధ్య సంఘటిత రంగంలో నిఖరంగా పెరిగిన ఉద్యోగాలు పదిలక్షల మాత్రమే కాగా 60లక్షల మంది ఉద్యోగార్ధులు మార్కెట్లో చేరారు. తామర తంపరగా వెలసిన ప్రయివేటు విద్యా సంస్ధల నుంచి ఇంజనీర్లు, ఎంబిఏ,ఎంఎ పట్టాల వారు లక్షల సంఖ్యలో తయారయ్యారు. మన అవసరాలకు మించి వారిని ఉత్పత్తి చేస్తున్నాము. వారిలో కొందరి నైపుణ్యం ప్రశ్నార్ధకం, అంతకంటే తక్కువ విద్య,నైపుణ్యం ఉన్నవారికి తగిన ఉపాధి అవకాశాలు పెరగలేదు.


ఇతర అనేక దేశాలతో పోల్చితే మన దేశంలో యువజనం ఎక్కువగా ఉన్నమాట నిజం. వీరికి కావాల్సింది ఉపాధి తప్ప మాటలు కాదు. సమగ్రమైన సమాచారం అందుబాటులో లేదు. వివిధ సంస్ధల అంచనాల ప్రకారం 2004-12 సంవత్సరాలలో ఏటా 25లక్షల ఉద్యోగ అవకాశాలు పెరిగితే 2012-16 మధ్య 15లక్షలకు తగ్గాయి. ఏదో ఒక సామాజిక భద్రత ఉన్న రెగ్యులర్‌ కార్మికులు 2011-16 కాలంలో 45 నుంచి 38శాతానికి తగ్గారు. సంస్కరణల కాలంలో మనకు వచ్చిన విదేశీ పెట్టుబడులు ఎక్కువ భాగం సేవా రంగానికే వచ్చాయి. మిగిలినవి కార్మికులు తక్కువగా ఉండే పరిశ్రమలకు వెళ్లాయి. జిడిపిలో సేవారంగం వాటా గణనీయంగా పెరిగింది కానీ ఆ మేరకు ఉపాధి పెరగలేదు. విధానపరమైన లోపాలు, మన పరిస్ధితులకు అనుగుణంగా పధకాలను రూపొందించలేదనే లోపాన్ని అంగీకరించేందుకు ఎవరూ సిద్దం కావటం లేదు. అధికారంలో ఎవరున్నా బడా పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను అమలు జరిపారు. ఎంత ఎక్కువ పెట్టుబడులు పెడితే అంత ఎక్కువ రాయితీలు, సదుపాయాలు కల్పించారు తప్ప ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలనే వైపు దృష్టి పెట్టలేదు. అందుకు అవకాశం ఉన్న చిన్న, సన్నకారు పరిశ్రమలను ఉపేక్షించారు. చివరకు వారి దగ్గర నుంచి కొనుగోలు చేసిన వస్తువులకు ఇవ్వాల్సిన సొమ్మును కూడా సకాలంలో ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు.

సంఘటిత వస్తూత్పత్తి రంగంలో 25శాతం ఉపాధి తగ్గటానికి పారిశ్రామిక వివాదాల చట్టమే కారణమని ప్రపంచబాంకు మేథావులు సూత్రీకరించారు. కార్మికుల ఉపాధి రక్షణకు పటిష్టమైన చట్టాలు ఉన్న కారణంగా యజమానులు కార్మికుల ఖర్చు తగ్గించుకొనేందుకు ఎక్కువ పెట్టుబడి అవసరమైన పద్దతులను ఎంచుకున్నారట.పోనీ అలా ఖర్చు తగ్గించుకొని ఎగుమతులు చేశారా అంటే అదీ లేదు కదా ! ఈ పేరుతో కార్మిక చట్టాలకే ఎసరు పెట్టి బానిసలుగా మార్చేందుకు పూనుకున్నారు.
2017-18లో నాలుగున్నర దశాబ్దాల రికార్డు స్ధాయికి 6.1శాతం నిరుద్యోగం పెరిగిందన్న ప్రభుత్వ సర్వే వివరాన్ని 2019 ఎన్నికల ముందు తొక్కిపెట్టారు, అది తప్పుల తడక, ఉపాధి గురించి లెక్కలు సరిగా వేయలేదన్నారు. ఎన్నికలు ముగిశాక గుట్టుచప్పుడు కాకుండా అదే నివేదికను ఆమోదించారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ నిరుద్యోగం ఉంది.2019-20లో 8.6 కోట్ల మంది నెలసరి వేతన జీవులుండగా 2021 ఆగస్టు నాటికి 6.5కోట్లకు తగ్గారు. వీరికి అదనంగా నిరుద్యోగులు తోడవుతారు.

మనకున్న యువశ్రమశక్తితో ప్రపంచాన్నే మన చెప్పుచేతల్లోకి తెచ్చుకోగలమని చెప్పేవారున్నారు. అది ఒక కోణంలో చూస్తే నిజమే. చైనా అలాంటి ఫలితాన్ని సాధించింది. మంచి ఉద్దేశ్యాలే కాదు, అందుకు తగిన విధానాలు కూడా ఉండాలి. లేనట్లయితే అదే అవకాశం ప్రతికూలంగా కూడా మారుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం జనాభాలో 54శాతం మంది పాతికేండ్ల లోపువారే, మరోవిధంగా చూస్తే 62శాతం మంది 15-59 ఏండ్ల మధ్య ఉంటారు. వీరికి తగిన నైపుణ్యాలను సమకూర్చి ఉపాధి చూపకపోతే పక్కదారులు పట్టే అవకాశం ఉంది.సిఎంఐసి సమాచారం ప్రకారం 2016లో ఉపాధిలో ఉన్నవారి సంఖ్య 40.73 కోట్ల మంది, 2018 -19నాటికి 40.09 కోట్ల మందికి తగ్గారు. ఆర్ధికవ్యవస్ధ పెరిగితే ఐదులక్షల కోట్ల డాలర్ల స్ధాయికి జిడిపిని తీసుకుపోతామని చెప్పినా, నిజంగా తీసుకుపోయినా యువతీ, యువకులకు ఒరిగేదేమిటి ? 2030నాటికి వ్యవసాయ రంగంలో ఉపాధి 44 నుంచి 30శాతానికి తగ్గుతుందని అంచనా, ప్రస్తుత అంచనా ప్రకారం 2030నాటికి 14.5 కోట్ల మందికి వ్యవసాయేతర రంగాల్లో పని కల్పించాల్సి ఉంటుంది.వారందరికీ ఉపాధి కల్పించే విధానాలను అవలంభించకపోతే తలెత్తే పర్యవసానాలకు బాధ్యులెవరు ? అందుకు గాను ఏటా 8-9శాతం చొప్పున వృద్ధి రేటు ఉండాలి. అదీ ఉపాధి సహితమైనది, అది జరగాలంటే విధానాలను అందుకనుగుణంగా మార్చాలి, అదే ఎలా ?

హరిద్వార్‌ ధర్మ సంసద్‌ : పరస్పర అవగాహనతోనే హిందూ- ముస్లిం మతోన్మాదుల ప్రసంగాలు !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో డిసెంబరు 17-19 తేదీల్లో ధర్మ సంసద్‌ పేరుతో ధర్మవిరుద్ద, పరమత విద్వేష సభ జరిగింది. హిందూమత నేతలుగా చెప్పుకొనే యోగులు, యోగినులు అక్కడ చేరారు. వారు హిందూమతం మంచి చెడ్డల గురించి ఏమి చర్చించారో తీర్మానించారో తెలియదు. ముస్లింలు, ఇతర మైనారిటీ మతాల వారి మీద మారణకాండ జరపాలని పిలుపు ఇస్తూ చేసిన ప్రసంగాల వీడియోలు సామాజిక మాధ్యమంలో తిరుగుతూ మరింత విద్వేషాన్ని జనాల బుర్రల్లో నింపుతున్నాయి. ఈ సమావేశాల్లో మాట్లాడిన వారు తమను సమర్ధించుకున్నారు, తప్పు చేశామనే భావన ఏ కోశానా కనిపించలేదు. పోలీసులు తమనేమీ చేయలేరనే ధీమా వ్యక్తం చేశారు. ఎవరి అండ చూసుకొని ఇలా బరితెగించినట్లు ? కొందరి ప్రసంగాంశాలు ఇలా ఉన్నాయి.


”ముస్లింలను చంపటానికి కత్తులు చాలవు, దిమ్మిసలాంటి ఆయుధాలు కావాలి” అన్న యతి నరసింగానంద, నాగరికత (సంస్కృతి) యుద్దంలో హిందువులను రక్షించేవి ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని కనటం, మెరుగైన ఆయుధాలు మాత్రమే అని కూడా సెలవిచ్చారు. ఎవరైనా హిందూ ప్రభాకరన్‌(శ్రీలంక ఎల్‌టిటిఇ నేత)గా మారితే వారికి ఒక కోటి రూపాయల అవార్డు ఇస్తామని ప్రకటించారు.బహిరంగ ప్రదేశాల్లో నమాజులు చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఒక వక్త మాట్లాడుతుండగా నరసింగానంద జోక్యం చేసుకొని ” మనకు అవసరమైనపుడు హిందూ సమాజం సాయం చేయదు, ఎవరైనా యువకార్యకర్త ముందుకు వచ్చి హిందూ ప్రభాకరన్‌ (శ్రీలంక ఎల్‌టిటిఇ నేత)గా మారేందుకు సిద్దమైతే నేను కోటి రూపాయలు ఇస్తాను, ఒక ఏడాది కొనసాగితే కనీసం వంద కోట్లు సేకరిస్తానని” చెప్పారు.


స్వామి సాగర్‌ సింధు మహరాజ్‌ మాట్లాడుతూ హిందువులు కనీసంగా కత్తులను కలిగి ఉండాలి అన్నారు. మనం ఉపయోగించే సెల్‌ఫోన్‌ విలువ ఐదువేల రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ హిందువులు ప్రతి ఒక్కరు కనీసం ఒక లక్ష రూపాయల విలువగల ఆయుధాలు కొనుగోలు చేయాలి. ఎవరైనా ఎప్పుడైనా ఇంట్లో ప్రవేశిస్తే సజీవంగా బయటకు పోలేరు అన్నారు. స్వామి ధర్మదాస్‌ మహరాజ్‌ మాట్లాడుతూ తన దగ్గర గనుక తుపాకి ఉండి ఉంటే నాధూరామ్‌ గాడ్సేగా మారి ఉండేవాడిని.మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నపుడు జాతీయ వనరుల మీద తొలి హక్కు మైనారిటీలకే తొలి హక్కు ఉండేది, నేను గనుక పార్లమెంటులో ఉండి ఉంటే నాధూరామ్‌ గాడ్సేను అనుసరించి తుపాకితో ఆరుసార్లు మన్మోహన్‌ సింగ్‌ గుండెల మీద కాల్చివుండేవాడిని అన్నారు. స్వామి ప్రబోధానంద మాట్లాడుతూ మయన్మార్‌లో మాదిరి మన పోలీసు, మన రాజకీయవేత్తలు, మన మిలిటరీ, ప్రతి హిందువు ఆయుధాలు తీసుకొని తుడిచిపెట్టే కార్యక్రమాన్ని నిర్వహించాలి, అంతకు మించి మరొక మార్గం లేదు అన్నారు. (ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ ధామి(బిజెపి) వేరే సందర్భంగా ఈ స్వామీజీ కాళ్లకు మొక్కిన చిత్రాలు ఈ సందర్భంగా దర్శనమిచ్చాయి.)


ప్రతి మతానికి చెందిన వారు తమ మంచి చెడ్డల గురించి సభలు జరుపుకోవచ్చు, ఉపన్యాసాలు చెప్పుకోవచ్చు. కానీ ఈ విద్వేషం, రెచ్చగొట్టే పనులేమిటి ? ఐతే ఇలా రెచ్చగొట్టే ఇతర మతాలవారి సంగతేమిటని వెంటనే కొందరు ప్రశ్నిస్తారు. ఎవరు రెచ్చగొట్టినా అది మైనారిటీ-మెజారిటీ ఎవరైనా కావచ్చు. అలాంటి వారిని నోరెత్తకుండా జైళ్లలో పెట్టాల్సిందే. వారి ఉపన్యాసాల వలన విద్వేషం తప్ప ప్రధాని నరేంద్రమోడీ మేకిన్‌ లేదా మేడిన్‌ ఇండియా పధకాల్లో ఒక్క వస్తువైనా ఉత్పత్తి అవుతుందా ? మనం మతంపేరుతో కుత్తుకలు ఉత్తరించిన మధ్యయుగాల్లో ఉన్నామా నాగరిక సమాజంలో బతుకుతున్నామా ?


విద్వేషపూరిత ప్రసంగాలు చేయటం, రెచ్చగొట్టటంలో మజ్లిస్‌ లేదా కొందరు ఇతర పార్టీల ముస్లిం నేతలు, మత పెద్దలు కూడా తక్కువేమీ కాదు.వారి రెచ్చగొట్టే మాటలు, నమోదైన కేసుల గురించి చూద్దాం. కొద్ది నెలల క్రితం 2021లో ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకీలో మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ విద్వేష ప్రసంగంతో పాటు నరేంద్రమోడీ మీద అనుచిత భాషను ఉపయోగించారని, కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు పెట్టారు.2020లో కర్ణాటకలో సిఎఎ వ్యతిరేక సభలో ముంబై మజ్లిస్‌ పార్టీ నేత వార్సి పఠాన్‌ విద్వేష పూరిత ప్రచారం చేశారని కేసు పెట్టారు. పదిహేను కోట్ల మంది ముస్లింలకు వందకోట్ల మంది హిందువులు సరితూగరంటూ రెచ్చగొట్టినట్లు పేర్కొన్నారు.సిఎఎ, ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా మా ఆడవారు ముందుకు వస్తేనే చెమటలు పడుతున్నాయి, అదే పురుషులు వస్తే అంటూ రెచ్చగొట్టినట్లు ఆరోపణ.తన మాటలను వక్రీకరించారని, ఎవరినైనా బాధిస్తే వెనక్కు తీసుకుంటానని అతగాడు తరువాత చెప్పినట్లు వార్తలు వచ్చాయి.అతని ప్రసంగ తీరుతెన్నులను తాము సమర్ధించటం లేదని మజ్లిస్‌ నేత ఒవైసీ, మహారాష్ట్ర మజ్లిస్‌ అధ్యక్షుడు, ఔరంగాబాద్‌ ఎంపీ జలీల్‌ ప్రకటించారు. మజ్లిస్‌ నేతల మాదిరి హిందూత్వశక్తులు లేరు. దీని అర్ధం మజ్లిస్‌ నేతలు నిజాయితీతో ఆ ప్రకటనలు చేశారని కాదు.


టైమ్స్‌ నౌ టీవీ ఛానల్‌ చర్చలో ఇరవైలక్షల మందిని హతమార్చాలని పిలుపు ఇవ్వటం మతాలు చేసే పనేనా అన్న యాంకర్‌ ప్రశ్నకు అవును ఇది మా విధి అని సాధ్వి అన్నపూర్ణ చెప్పారు.మా మతాన్ని వ్యతిరేకించే వారిని ఎవరినైనా హతమారుస్తాం అన్నారు. అన్నపూర్ణ మాతగా పిలిపించుకొనే ఈమె హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శిగానూ, నిరంజనీ అఖారా మహామండలేశ్వర్‌గానూ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈమె నోటి వెంట వెలువడిందేమిటి ? ” మీరు వారిని(ముస్లింలను) అంతం చేయ దలచుకొంటే వారిని హతమార్చండి.వారిలో ఒక ఇరవై లక్షల మందిని చంపటానికి మనకు వంద మంది సైనికులు చాలు ” అన్నారు. హరిద్వార్‌లో తాము చేసిన ప్రసంగాలకు కట్టుబడి ఉన్నామని స్వామి ఆనంద స్వరూప్‌ తదితరులు పునరుద్ఘాటించారు, సమర్దించుకున్నారు.
ప్రబోధానంద ఎన్‌డిటివీతో మాట్లాడుతూ నేను చెప్పిన మాటలకు సిగ్గుపడటం లేదు, పోలీసులను చూసి భయ పడటమూలేదు. చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నా. మీ ఆలోచనకు నాకూ తేడా ఉంది. రాజ్యాంగాన్ని చదవండి, నా మాటలు ఏ విధంగానూ రెచ్చగొట్టేవి కాదు. ఎవరైనా నన్ను చంపేందుకు పూనుకుంటే నేను పోరాడతాను. నేను చట్టానికి భయ పడటం లేదు. ” అన్నారు. ప్రబోధానంద ముస్లిం వ్యతిరేకత కొత్తదేమీ కాదు.హిందూత్వను, సమాజాన్ని రక్షించుకొనేందుకు ప్రతి ఒక్కరూ ఎనిమిది మంది పిల్లల్ని కనాలని 2017లో పిలుపిచ్చారు. ముస్లింలు మాత్రమే హిందూ మహిళల మీద అత్యాచారాలు చేస్తారని రెచ్చగొట్టారు. జీహాదీలను తుడిచిపెట్టాలని 2021జూన్‌లో ఇతరులతో కలసి రెచ్చగొట్టారు. అన్నపూర్ణ మాత ఎన్‌డిటీవితో మాట్లాడుతూ తన మాటలను మరింతగా సమర్ధించుకున్నారు.” భారత రాజ్యాంగం తప్పు, భారతీయులు నాధూరామ్‌ గాడ్సే(మహాత్మాగాంధీ హంతకుడు) కోసం ప్రార్ధనలు జరపాలి, నేను పోలీసుల గురించి భయపడను ” అన్నారు.


ముస్లిం వ్యతిరేక, బిజెపి అనుకూల ప్రచారానికి పేరు మోసిన సుదర్శన ఛానల్‌తో మాట్లాడుతూ దేశం వేగంగా ముస్లిం రాజ్యంగా మారుతోంది దాన్ని నిరోధించి సనాతన వేద దేశంగా మార్చాలని నరసింగానంద చెప్పారు. అదే ఇంటర్వ్యూలో మాట్లాడిన స్వామి దర్శన భారతి ఉత్తరాఖండ్‌లో ముస్లింలు భూమి కొనుగోలు చేయ కుండా లాండ్‌ జీహాద్‌ను పాటించాలని సెలవిచ్చారు.( ఇలాంటి వారంతా కాశ్మీరులో స్ధానికేతరులు భూముల కొనుగోలుకు వీలు కల్పించాలని డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ మతాన్ని ముందుకు తెచ్చారు) నరసింగానంద మాట్లాడుతూ స్వామి దర్శన భారతి గొప్పతనం అంటూ గత ఐదు సంవత్సరాలుగా ఉత్తరాఖండ్‌లో మసీదు, మదార్సాలు ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారని, అలాంటి యోధుడికి మనం మద్దతు ఇవ్వాలన్నారు. ధర్మ సంసద్‌లో హఠ యోగి మహరాజ్‌ మనకు ఒక ప్రభాకరన్‌ కావాలని చెప్పారు.నేను అన్నాను ఒక ప్రభాకరన్‌, ఒక భింద్రన్‌వాలే( పంజాబ్‌ తీవ్రవాది), ఒక జనరల్‌ సాహెబ్‌ సింగ్‌ (భింద్రన్‌వాలేకు సలహదారు, శిక్షకుడు) కావాలి. ప్రతి హిందూ దేవాలయానికి అలాంటి ఒకరు కావాలి, లేనట్లైతే హిందూమతానికి రక్షణ ఉండదు, రక్షించేవారు ఎవరూ ఉండరు.” అన్నారు. సత్యమేవ జయతే (సత్యమే ఎప్పటికీ జయిస్తుంది) అన్న సూక్తిని ఈ పెద్దమనిషి శస్త్రమేవ జయతే (ఆయుధమే జయిస్తుంది) అంటూ ముస్లింల మీద దాడులకు పురికొల్పారు.


తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే (కల్లు కోసం అని చెప్పకుండా ) దూడగడ్డి ఎక్కడ దొరుకుతుందో చూద్దామని ఎవరో చెప్పారట. స్వామీజీలకు బిజెపికి ఉన్న బంధం కొత్తదేమీ కాదు. హరిద్వార్‌ సభకు మీరెందుకు వెళ్లారు అన్న ప్రశ్నకు వారికి హిందీలో దేశ రాజ్యాంగ ప్రతులను సేకరించటం కష్టం కనుక వారికి వాటిని అందచేసేందుకు, వివరించేందుకు తాను పాల్గొన్నట్లు బిజెపి నేత అశ్వనీ ఉపాధ్యాయ చెప్పారు. ” అది మూడు రోజుల సభ, నేను ఒక రోజు ఉన్నాను.నేను అక్కడ ఉన్న సమయంలో 30నిమిషాలు వేదిక మీద ఉన్నాను. రాజ్యాంగం గురించి మాట్లాడాను. నాకంటే ముందు, తరువాత ఇతరులు మాట్లాడినదానికి నేను బాధ్యుడిని కాదు” అని కూడా అన్నారు. తరువాత తానే ఒక వీడియో ప్రకటన చేస్తూ తాను హరిద్వార్‌ సభలో చివరి రోజు పదినిమిషాలు ఉన్నానని, రాజ్యాంగంలో అసంపూర్ణంగా ఉన్న జనాభా అదుపు, అక్రమ వలసదార్ల అదుపు, మతమార్పిడుల అదుపు వంటి గురించి ప్రసంగించానని వివరణ ఇచ్చారు. రాజ్యాంగ ప్రతులు పంచటం, దాని గురించి మాట్లాడటం నేరమే అయితే నేను ఆ నేరం చేశాను అని చెప్పుకున్నారు. రోగి కోరుకున్నదే వైద్యుడు రాసి ఇచ్చాడన్నట్లుగా ఇవన్నీ ముస్లింల గురించే అన్నది వేరే చెప్పనవసరం లేదు.అశ్వనీ ఉపాధ్యాయ విద్వేష పూరిత ప్రసంగం చేసిన ఒక కేసులో ప్రస్తుతం బెయిలు మీద ఉన్నారు. బిజెపి మహిళానేత ఉదితా త్యాగి మరికొందరు పార్టీనేతలు కూడా పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సభలో పాల్గొన్న అనేక మందికి బిజెపి నేతలతో సంబంధాలున్నాయి.2029 నాటికి ఈ దేశానికి ఒక ముస్లిం ప్రధాని కాకుండా అడ్డుకోవాలని, ముస్లిం జనాభాకు పోటీగా హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని యోగులు, సాధ్వులు చేస్తున్న ప్రసంగాలు తెలిసిందే.


మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ 2014లో ఢిల్లీలో విద్వేషపూరిత ప్రసంగం చేసినట్లుగా అక్కడి పోలీసులు ఒక కేసు నమోదు చేశారు.దాని మీద మరింతగా దర్యాప్దు జరపాలని ఢిల్లీలోని కరకార్‌దూమా కోర్టు 2019జనవరిలో ఉత్తరువులు జారీ చేసింది. ఈ కేసులో ఏమీ దొరకనందున కేసును మూసివేయాలని 2018లో పోలీసులు కోర్టుకు దరఖాస్తు చేశారు.కేసు దాఖలు చేసిన అజయ గౌతమ్‌ దీన్ని సవాలు చేశారు. గత మూడు సంవత్సరాలుగా ఏ పోలీసూ తన వివరణ కోరలేదని, విచారణా జరపలేదని, దీనికి ఉన్నత స్ధాయిలో ఉన్న రాజకీయ పలుకుబడే కారణమని కూడా పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా మరింతగా విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది.2015లో ఇదే పోలీసులు కోర్డు ఆదేశాలతోనే ఒవైసీ మీద కేసు దాఖలు చేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే బిజెపి నేతలు పొద్దున లేస్తే మజ్లిస్‌నేత అసదుద్దీన్‌ ఒవైసీ పారాయణం చేస్తారు. ఢిల్లీ పోలీసులు సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ -అదీ అమిత్‌ షా-ఆధీనంలో పని చేస్తారు. వారి మీద రాజకీీయ పలుకుబడి లేదా వత్తిడి తేగలిగింది బిజెపి తప్ప మరొక పార్టీకి లేదు. అందుకే అనేక మంది బిజెపి-మజ్లిస్‌ పార్టీల మధ్య పరస్పర ప్రయోజనదాయకమైన మౌఖిక ఒప్పందం ఉందని అనుమానిస్తున్నారు.లేనట్లైతే నిజంగా ఢిల్లీ పోలీసులు తలచుకుంటే ఆధారాలు సంపాదించటం అసాధ్యమా ?బిజెపి బి టీమ్‌గా మజ్లిస్‌ పని చేస్తున్నట్లు వచ్చిన విమర్శల సంగతి తెలిసిందే. రెండు పార్టీలకు చెందిన వారు పరస్పరం అవగాహనతో విద్వేషాన్ని రెచ్చగొట్టి తమ ఓటు బాంకును ఏర్పాటు చేసుకుంటున్నారనే భావన నానాటికీ బలపడుతోంది.


హరిద్వార్‌ సభలో విద్వేష పూరిత ప్రసంగాలు చేశారంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత సాకేత్‌ గోఖలే ఉత్తరాఖండ్‌లోని జ్వాలాపూర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు దాఖలు చేశారు. ఇరవై నాలుగు గంటల్లో కేసు నమోదు చేయని పక్షంలో జుడీషియల్‌ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేస్తానని కూడా హెచ్చరించారు. ఆ మేరకు విధిలేక కేసు దాఖలు చేశారు. హరిద్వార్‌లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినప్పటికీ వాటి కారణంగా ఎలాంటి హింసాకాండ జరగనందున ఉగ్రవాద చట్టం(ఉపా) కింద కేసులు నమోదు చేయలేదని ఉత్తరాఖండ్‌ డిజిపి అశోక్‌ కుమార్‌ చెప్పారు. ఇది తప్పించుకోవటం తప్ప వేరు కాదు. నరసింగానంద నాయకత్వంలో 2020 జనవరిలో ధర్మ సంసద్‌ జరిగింది. సరిగ్గా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు జరగ్గా మరుసటి నెలలోనే ఈశాన్య ఢిల్లీలో మతఘర్షణలు జరిగాయి. ఇప్పుడు హరిద్వార్‌ సమావేశం ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ముందే జరిగింది. అక్కడ చేసిన ప్రతిజ్ఞలేమిటి ?


డిసెంబరు 19న సభ చివరి రోజు నరసింగానంద సభకు వచ్చిన వారితో ఒక ప్రతిజ్ఞ చేయించారు. …. అను నేను నా కుటుంబ సనాతన ధర్మం కోసం, నా సోదరీమణులు, కుమార్తెల రక్షణ కోసం గంగానది తీరాన ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా మతం, నా కుటుంబం, నా పిల్లలు, మహిళలకు ఈ ప్రపంచంలో ఏమి జరిగినా, ఏ సమస్యలు వచ్చినా, ఏ వ్యక్తి హాని తలపెట్టినా అతన్ని ప్రాణాలతో వదలను. మా మతం కోసం మేము జీవిస్తాము. మా మతం కోసం మేము మరణిస్తాము. ఇస్లామ్‌ జీహాద్‌ను అంతం చేస్తాను. సనాతన ధర్మం చిరకాలం ఉండాలి. సనాతన శత్రువులనందరినీ నాశనం చేయాలి. ” హిందూమతానికి ముప్పు వచ్చినట్లు గోబెల్స్‌ ప్రచారం చేయటం, దేశం ముస్లిం రాజ్యంగా మారుతుందనే ప్రచారంతో జనాల బుర్రలను ఖరారు చేస్తున్నారు. వందల సంవత్సరాలు ముస్లిం పాలకులు, బ్రిటీష్‌ వారు పాలించినప్పటికీ 80శాతం మంది జనం హిందువులుగానే ఉన్నారు. ఆ పాలకులకే సాధ్యం కానిది ఇప్పుడు కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాల్లో హిందూత్వ బిజెపి అధికారంలో ఉండగా ఎవరో మతమార్పిడి చేసి జనాన్ని హిందూమతానికి దూరం చేస్తున్నారనే ప్రచారం చిన్న మెదడు చితికిన వారు చేసేది తప్ప మరొకటి కాదు. గత ఎనిమిది సంవత్సరాల్లో వచ్చిన మార్పేమిటో చెప్పమనండి అసలు సంగతి బయటపడుతుంది.


సరిగ్గా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అందరూ సిద్దం అవుతున్న సమయంలో జరిపిన ఈ సమావేశంలో చేసిన విద్వేష పూరిత ప్రసంగాలు ఓట్ల రాజకీయంలో భాగం కాదని ఎవరైనా చెప్పగలరా ? మతం పేరుతో ఉన్మాదాన్ని రెచ్చగొడితే అది వెంటనే దిగదు. హిందూత్వ శక్తులుగా ఛాతీవిరుచుకొని చెప్పే బిజెపికి ఎన్నికల్లో ఓట్లు సంపాదించి పెట్టటమే దీని వెనుక ఉన్న ఎత్తుగడ. అది నెరవేరుతుందా ? గతంలో కూడా ఇలాంటి పనులు చేశారు. కొన్ని ప్రాంతాల్లో లబ్దిపొందారు. సరిగ్గా ఎన్నికల ముందే ఉగ్రవాద చర్యలు జరగటం వాటిని ప్రచార అస్త్రాలుగా చేసుకోవటాన్ని గమనిస్తున్న జనం క్రమంగా వాటి గురించి కూడా ఆలోచిస్తున్నారు. కొందరిని కొంతకాలం మభ్యపెట్టవచ్చు, మోసం చేయవచ్చు. అందరినీ ఎల్లకాలం అలా చేయలేరు.జనాలు వెర్రివాళ్లు కాదు, బుర్రలను వాట్సాప్‌ పండితుల ప్రచారానికి తాకట్టు పెట్టలేదు.

.

సాగు చట్టాల పునరుద్దరణకు కొత్త ఎత్తుగడ – ఆందోళన పేరుతో బికెఎస్‌ను దించిన ఆర్‌ఎస్‌ఎస్‌ !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


అనేక మంది ఊహించినట్లుగానే సాగు చట్టాల పునరుద్దరణకు ఆర్‌ఎస్‌ఎస్‌ తనదైన శైలిలో రంగంలోకి దిగింది. రద్దు చేసిన మూడు సాగు చట్టాలను కొన్ని మార్పులతో తిరిగి ప్రవేశపెట్టాలంటూ దాని అనుబంధ భారతీయ కిసాన్‌ సంఫ్‌ు(బికెఎస్‌) జనవరిలో ఆందోళన చేస్తామని ప్రకటించింది. రద్దు చేసిన చట్టాలు 90శాతం రైతులకు లబ్ది చేకూర్చుతాయని, ప్రధాని నరేంద్రమోడీ లొంగిపోవాలని కోరుకున్న వారికి సంతోషం కలగటం తప్ప రద్దు తరువాత రైతులకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నది. అందువలన కొన్ని మార్పులతో తిరిగి వాటిని ప్రవేశపెట్టాలని కోరుతూ తాము దేశవ్యాపిత ఆందోళన చేస్తామని సంఘ ప్రధాన కార్యదర్శి బదరీ నారాయణ చౌదరి ప్రకటించారు. జై జవాన్‌-జైకిసాన్‌ పిలుపు ఇచ్చిన మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి వర్ధంతి రోజైన జనవరి 11న దేశమంతటా తహసీల్దారు కార్యాలయాల ముందు నిరసన, బహిరంగ సభలు జరుపుతామని వెల్లడించారు. అంతకు ముందు ఒకటవ తేదీ నుంచి పది వరకు గ్రామగ్రామాన రైతులను చైతన్యవంతులను చేసే కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సాగు చట్టాల రద్దు కోసం సాగించామని చెబుతున్న ఉద్యమం సాధించిందేమీ లేదని, తొలుత తాము కూడా దానికి మద్దతు ఇచ్చామని తరువాత హింసా కాండ, దేశ. సంఘ వ్యతిరేక చర్యల కారణంగా ఉపసంహరించుకున్నామని చెప్పారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి తెలుపుతూ గతంలో 20వేల గ్రామాల నుంచి వినతులు పంపామని, 513 జిల్లాల్లో సెప్టెంబరు ఎనిమిదిన ధర్నాలు చేసినట్లు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.


మూడు సాగు చట్టాల్లో మార్పుల్లో భాగంగా కనీస మద్దతు ధరలకు హామీతో సహా కొనుగోలు దార్ల నమోదుకు ఒక పోర్టల్‌, రైతుల ఫిర్యాదుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తూ సవరించాలని కోరుతున్నామన్నారు. తమ సంఘం సన్న, చిన్నకారు రైతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నదని రద్దైన చట్టాలు 90శాతం మంది రైతులకు మేలు చేసేవన్నారు. వాటి రద్దు తమకు ఆశ్చర్యం, ఆశాభంగం కలిగించిందని,విచ్చిన్నం, హింసను సృష్టించిన వారి మాటలనే ప్రభుత్వం వినటం, తమ వంటి శాంతియుత, ప్రజాస్వామికంగా ఉండే వారు చెప్పేవాటిని పట్టించుకోకపోవటం విచారకరమని చెప్పారు. ప్రస్తుత కనీస మద్దతు ధర విధానం దేశమంతటా రైతులకు తోడ్పడేదిగా లేదన్నారు. ఎంఎస్‌పిగా ఇస్తున్న మొత్తాలు నైపుణ్యం లేని కార్మికులకు సైతం చాలదని గిట్టుబాటు ధర ఇవ్వాలని సంఫ్‌ు జాతీయ కార్యదర్శి కె.శాయిరెడ్డి చెప్పారు.రైతులకు గిట్టుబాటు కావాలంటే సహజ వ్యవసాయ పద్దతులు అనుసరించాలని రసాయన ఎరువుల బదులు ఆవు పేడ వంటి వాటిని వాడాలన్నారు.


బికెఎస్‌ నేతలు గత ఏడాది కాలంగా ఉద్యమించిన రైతుల మీద బిజెపి మోపిన నిందలనే మరోసారి పునశ్చరణ కావించించారు తప్ప కొత్తగా చెప్పిందేమీ లేదు. ఆందోళన ప్రారంభమైన నాటి నుంచి బిజెపి, కేంద్ర మంత్రులు చేసిన ఆరోపణలు, నిందలకు తందాన తాను అంటూ వాటినే బికెఎస్‌ వల్లె వేసింది. ఆ సంస్ధ ఇప్పుడు చెబుతున్న అంశాల మీదనే వేరు దుకాణం పెట్టి ఆందోళన చేసి ఉంటే అదొక తీరు. మొక్కుబడిగా ప్రకటనలు తప్ప చేసిందేమీ లేదు. పోనీ వారు చేసిన పోరాటం లేదా ఆరాటం నిజంగా జరిగి ఉంటే మోడీ సర్కార్‌ సదరు అంశాలకు సానుకూలంగా ఎందుకు మాట్లాడలేదు ? ఎంఎస్‌పికి చట్టబద్దతకు ఇప్పటికీ కేంద్రం ఆమోదం చెప్పకుండా కమిటీ వేసి పరిశీలిస్తామని అంటోంది. కొన్ని మార్పులతో పాత వాటినే పునరుద్దరించాలని బికెఎస్‌ చెప్పటం వెనుక ఉన్న ఎత్తుగడ, ప్రభుత్వ హస్తం గురించి తెలియనంత అమాయకంగా ఇప్పుడు రైతులు లేరు. ఏడాది పాటు ఉద్యమం సాగిన సమయంలో బికెఎస్‌ వ్యవహరించిన తీరు, ప్రభుత్వానికి అనుకూలంగా రైతులను సమీకరించేందుకు చేసిన విఫల యత్నాలు ఎవరికి తెలియనివి. అవన్నీ విఫలం అయిన కారణంగానే తప్పనిసరై మోడీ వెనక్కు తగ్గారు తప్ప మరొకటి కాదు. ఇప్పుడు బికెఎస్‌ చెబుతున్నవి కొత్త ప్రతిపాదనలేమీ కాదు, ఎంఎస్‌పికి చట్టబద్దత కుదరదంటే కుదరదని ఏడాది పాటు మొండికేసిన మోడీ ఇప్పుడు సానుకూలంగా ఉండేట్లయితే కమిటీ పేరుతో కాలయాపన ఎందుకు ? బికెఎస్‌ను ఏర్పాటు చేసిందే ఆర్‌ఎస్‌ఎస్‌ అన్నది బహిరంగ రహస్యం. మరణించేంత వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా ఉన్న దత్తోపంత్‌ టేంగిడీ 1979లో దీన్ని ఏర్పాటు చేశారు.

ఢిల్లీ శివార్లలో రైతుల నిరవధిక ఆందోళనకు పోటీగా బిజెపి రైతు సంపర్క యాత్రల పేరుతో తన మద్దతుదార్లను సమీకరించేందుకు అనేక చోట్ల విఫల యత్నం చేసింది. ప్రత్యేకించి కీలకమైన ఎన్నికలు జరిగే ఉత్తర ప్రదేశ్‌లో రైతులను ప్రసన్నం చేసుకొనేందుకు పడని పాట్లు లేవు.డిసెంబరు 23వ తేదీ మాజీ ప్రధాని చౌదరి చరణ్‌ సింగ్‌ జన్మదినం సందర్భంగా బిజెపి ఎక్కడలేని శ్రద్ద చూపింది. చరణ్‌ సింగ్‌ కుటుంబ, రాజకీయ వారసులు ఆర్‌ఎల్‌డి పార్టీలో ఉన్నారు. బిజెపికి వ్యతిరేకంగా ఆ పార్టీని గద్దె దించేందుకు సమాజవాది పార్టీతో జతకట్టారు. చరణ్‌ సింగ్‌ జన్మదినాన్ని రైతుదినోత్సవంగా బిజెపి పాటించింది.లఖింపూర్‌ ఖేరీలో కేంద్రమంత్రి అజయ మిశ్రా తనయుడు, అనుచరులు చేసిన దుర్మార్గంతో అవన్నీ కొట్టుకపోయాయి. బిజెపి నేతలు గ్రామాలకు వెళ్లలేని స్ధితి కొన్ని చోట్ల ఏర్పడింది. దాని సెగ ఎంతగా ఉందంటే ప్రధాని నరేంద్రమోడీ ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఎన్నికైన బిజెపి ఎంపీలతో జరిపిన సమావేశానికి అజయ మిశ్రాను దూరంగా పెట్టాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో ఇప్పుడు బికెఎస్‌ను రంగంలోకి దించారు.


లఖింపూర్‌ ఖేరీలో పధకం ప్రకారమే రైతుల మీదకు మోటారు వాహనాలను నడిపి హత్యచేసినట్లు విధిలేని పరిస్ధితిలో దర్యాప్తు సంస్ధ కూడా నివేదిక ఇచ్చింది. ఆ ఉదంతం గురించి బికెఎస్‌ నేతలు చెప్పిందేమిటి ? తమ మీదకు వాహనాలు నడిపి తోటి వారిని చంపి దొరికిన హంతకులను రైతులు రాచమర్యాదలలో సాగనంపుతారా ? వారు రైతులు కాదు, హత్యలే రోజువారీ పనిగా ఉన్న వారని, వామపక్ష పద్దతుల్లో చేశారని, గుమికూడిన వారు రాజకీయ పార్టీల మద్దతుదారులు తప్ప రైతులు కాదని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారని నిందిస్తూనేే జరిగిన సంఘటనలు దురదృష్టకరం అని సన్నాయి నొక్కులు నొక్కింది. పధకం ప్రకారం జరిపిన హత్యాకాండను ఘర్షణలు అని వర్ణించింది. రైతుల మీదకు కార్లను తోలి చంపిన బిజెపి మద్దతుదారులు అమాయకులన్నట్లు, రైతులు హంతకులైనట్లు చిత్రించటం రైతు సంఘం పేరుతో ఊరేగుతున్నవారికి తగినపనేనా ? ఇంతగా నిందించిన వారు చట్టాలను పునరుద్దరించాలని రోడ్లెక్కుతామనటంలో ఆశ్చర్యం ఏముంది ! బిజెపికి కార్పొరేట్లు అందచేస్తున్న వేలాది కోట్ల రూపాయల నిధులతో రైతుల ముసుగులో తన మద్దతుదార్లను సమీకరించి కృత్రిమ ఆందోళనలు చేయించినా ఆశ్చర్యం లేదు.

సైన్సు పరిశోధనలు : అవని చుట్టూ ఇతర జనం – ఆవు చుట్టూ మనం !

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


ఉన్నత స్ధాయిలో ప్రామాణికంగా పేర్కొన్న పరిశోధకుల పేర్లతో లండన్‌లోని శాస్త్ర సమాచార సంస్ద, క్లారివేట్‌ రూపొందించిన 6,602 మంది వివరాలను పరిశీలించినపుడు అమెరికా ప్రధమ స్థానంలో, తరువాత చైనా ఉంది. డెబ్బయి దేశాలకు చెందిన వారితో 2021నవంబరు 16న ఈ వివరాలను ప్రకటించారు. తొలి ఐదు దేశాలకు చెందిన వారు 71.4శాతం మంది కాగా, మొదటి పది దేశాలను తీసుకుంటే 82.9శాతం ఉండటాన్ని బట్టి కేంద్రీకరణను అర్ధం చేసుకోవచ్చు. అమెరికాలో 2,622, చైనాలో 935 మంది ఉన్నారు. గత పది సంవత్సరాలలో తమ పరిశోధనలతో గణనీయ ప్రదర్శన, ప్రచురించిన పత్రాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. వీరిలో 3,774 మంది ఒక నిర్ణీత రంగంలో, 2,828 మంది ఒకటి కంటే ఎక్కువ రంగాలలో పరిశోధనలు చేస్తున్నవారు ఉన్నారు. మూడవ స్ధానంలో ఉన్న బ్రిటన్‌కు చెందిన వారు గత మూడు సంవత్సరాల్లో తగ్గి 492 లేదా 7.5శాతంగా ఉన్నారు. జర్మనీని అధిగమించి ఆస్ట్రేలియన్లు 332 మంది నాలుగో స్ధానంలో, 331 మందితో జర్మనీ ఐదవ, నెదర్లాండ్స్‌(207, కెనడా(196), ఫ్రాన్స్‌ 146) స్పెయిన్‌(109), స్విడ్జర్లాండ్‌(102)తో తొలి పదిస్దానాల్లో ఉన్నాయి.

గతంతో పోల్చితే అమెరికన్లు 2014లో 55శాతం, 2018నాటికి 43.3, 2021కి 39.7శాతానికి తగ్గారు. చైనీయులు 2018లో 7.9శాతం కాగా 2021కి 14.2కు పెరిగారు.చైనాలో 2014లో కేవలం 122 మంది మాత్రమే ఉన్నారు. గడచిన నాలుగు సంవత్సరాలలో చైనీయుల పెరుగుదల, అమెరికన్ల తగ్గుదల మరింత స్పష్టంగా కనిపిస్తోందని సీనియర్‌ విశ్లేషకుడు డేవిడ్‌ పెండెల్‌బరీ అన్నాడు. బ్రిటన్‌లో పరిశోధన తగ్గుతున్నది. హాంకాంగ్‌లో ఒక ఏడాది కాలంలోనే పరిశోధకుల సంఖ్య 40 నుంచి 79కి పెరిగింది.తొలిసారిగా బంగ్లాదేశ్‌, కువైట్‌, మారిషస్‌, మొరాకో, జార్జియా ఈ జాబితాకు ఎక్కాయి. క్లారివేట్‌ సంస్ధ దేశాల జనాభా సంఖ్య-శాస్త్రవేత్తలతో పోల్చింది.నూట ముఫ్పై ఎనిమిది కోట్ల మంది ఉన్న భారత్‌లో 22 మంది,22.1 కోట్ల మంది ఉన్న పాకిస్ధాన్‌ నుంచి ఐదుగురు, 27.3 కోట్ల మంది ఉన్న ఇండోనేషియా నుంచి ఒక్కరు ఉన్నట్లు పేర్కొన్నది. ఇండోనేషియా నుంచి ఉన్న ఒక్కరు కూడా మహిళ కావటం విశేషం.ఆమె బయోఫ్యూయల్‌ మీద పరిశోధనలు చేస్తున్నారు. సంస్ధల వారీగా చూస్తే 1,300లో శాస్త్రవేత్తలు పని చేస్తున్నారు.హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం 214 మందితో అగ్రస్ధానంలో ఉంటే చైనా సైన్స్‌ అకాడమీ 194 మందితో రెండవ స్ధానంలో, స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం 122 మందితో తృతీయ స్ధానంలో ఉంది. యాభై అగ్రశ్రేణి సంస్ధలలో 28 అమెరికాలో, ఐదు బ్రిటన్‌, నాలుగేసి చైనా,ఆస్ట్రేలియాలో సింగపూర్‌, సౌదీ అరేబియాలో రెండేసి, హాంకాంగ్‌, జర్మనీ, కెనడా, నెదర్లాండ్స్‌, బెల్జియంలలో ఒక్కొక్కటి ఉన్నాయి.


పరిశోధనారంగంలో వివిధ దేశాలు పోటీ పడుతున్నతీరును చూశాము.ఊరందరిదీ ఒకదారి ఉలిపికట్టెది మరొకదారి అన్నట్లుగా మనం ఉన్నాం.నరేంద్రమోడీ సర్కార్‌ గత ఏడున్నర సంవత్సరాల్లో ఈ రంగానికి అందించిన ప్రోత్సాహంతో మనంపైన పేర్కొన్న పరిశోధకుల్లో 22 మందైనా ఉన్నారని భక్తులు భజనకు దిగవచ్చు.పరిశోధనలు, నవకల్పనల పాత్ర ఎంత కీలకమో చెప్పాల్సిన పని లేదు. దేశీయ ఆవుల అద్వితీయత,వాటి పాలు, పేడ, మూత్రంలో ఉన్న రోగనిరోధకత లేదా కాన్సర్‌తో సహా రకరకాల వ్యాధులను నయం చేసే గుణాల గురించి పరిశోధించాలని మన కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇది అశాస్త్రీయం, నిధులను దుర్వినియోగం చేయటం తప్ప మరొకటి కాదని ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఐదు వందల మంది శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా వెనక్కు తగ్గలేదు. విశ్వాసాల ప్రాతిపదికన ముందుకు తెస్తున్న కుహనా సైన్సును సక్రమమైనదిగా చెల్లుబాటు చేసే యత్నమని పేర్కొన్నారు. హౌమియోపతి, అల్లోపతి, నేచురోపతి వంటి వాటి సరసన కౌపతిని చేర్చేందుకు పూనుకున్నారు. ఆవు మూత్రం, పాలు, పేడలతో చీడపీడల నివారణ మందులు, షాంపూలు, తలనూనెలు, నేలను శుభ్రం చేసే ద్రవాల వంటి వాటి తయారీకి పరిశోధనలు జరపాలని కేంద్రం నిధులు కేటాయించింది. పుక్కిటి పురాణాల్లో రాసిన ఊహాజనితమైన వాటిని రుజువు చేసేందుకు డబ్బు దుర్వినియోగం తప్ప మరొకటి కాదు.దీనికి ”సూత్రా-పిక్‌ అని పేరు పెట్టారు ఆవు మూత్రంతో తన కాన్సర్‌ మాయమైందని బిజెపి ఎంపీ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.


కేంద్రం వెనక్కు తగ్గలేదు సరికదా ఆవు శాస్త్ర పధకాలను వేగంగా అమలు జరిపి 2021 ఆగస్టు పదిహేనున ప్రధాని ప్రసంగానికి ముందే పురోగతిని చూపాలని కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ ఏప్రిల్‌ నెలలో ఆదేశించారు. అనుమతులు, నిధుల మంజూరులో ఎందుకు జాప్యం చేశారంటూ అధికారుల మీద మండిపడ్డారు. ఆలస్యానికి సాకులు చెబితే కుదరదని హెచ్చరించారు.ప్రధాని నరేంద్రమోడీకి దేశీయ ఆవులు ఎంతో ముఖ్యమని కూడా చెప్పారు. ఢిల్లీ ఐఐటి రూపొందించిన ఈ పధకంలో 2016 నుంచి ఎలాంటి పురోగతి లేదన్నారు.2017లో తొలుత పంచగవ్య సుగుణాలను శాస్త్రీయంగా నిరూపించాలని ఆదేశించారు. తరువాత 2020లో దాన్ని మరింత విస్తరించి కొత్త పధకంగా ప్రారంభించారు. రాబోయే రోజుల్లో పెట్రోలు లేకుండా పైకీ కిందికీ, ఎందరెక్కినా ఒకరికి జాగా ఉండే పురాణాల్లోని విమానాలు,వినాయకుడు పాలు తాగాడు వంటి నమ్మకాలు, ఇతర ఊహలన్నింటినీ 2024 ఎన్నికల నాటికి ఫాస్ట్‌ట్రాక్‌ ప్రాజక్టులుగా చేపట్టి నిర్ధారించమని నిధులు కేటాయించినా ఆశ్చర్యం లేదు.


పిండికొద్దీ రొట్టె అన్నారు పెద్దలు, కుండలో కూడు కుండలోనే ఉండాలి బిడ్డడు దుడ్డుగా ఉండాలి అంటే కుదరదని కూడా అదే పెద్దలు అన్నారు. వీటిని ఎవరు ఎలా వర్తింప చేస్తున్నారు ? చైనాతో పోటీ పడాలని, దేవుతలు కరుణిస్తే అధిగమించాలని మనం కోరుకోవటం తప్పుకాదు. స్టాటిస్టా డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం 2021లో పరిశోధన-అభివృద్ధికి గాను చైనా పెట్టుబడి 621.5బిలియన్‌ డాలర్లు కాగా అమెరికా 598.7, జపాన్‌ 182.36, జర్మనీ 127.25, భారత్‌ 93.48 బి.డాలర్లు. ఈ మొత్తం నుంచే ఆవు పాలు, పేడ, మూత్ర పరిశోధనలు జరుగుతున్నాయి. మన జనాలకు తెలివితేటలేమైనా తక్కువా, సోమరిపోతులు మరొకటి కాదే. ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో మాదిరి అదృష్టం కోసం ఎదురు చూసే బాపతు కూడా గణనీయంగా ఉన్నందున కాళ్లు, చేతులూ చూసే, జోశ్యాలు చెప్పే రకరకాల మోసగాండ్లు తామర తంపరగా పెరిగిపోతున్నారు. మన అప్పును నరేంద్రమోడీ 55 లక్షల కోట్ల నుంచి 130లక్షల కోట్లకు పెంచటం పట్ల చూపిన శ్రద్ద పరిశోధనకు కేటాయింపుల్లో లేదు. ఈ అంశంలో అంతకు ముందున్న వాజ్‌పాయి, మన్మోహన్‌ సింగ్‌ సర్కార్లు కూడా ఇంతకు మించి పొడిచిందేమీ లేదు.

గేట్‌వేహౌస్‌ డాట్‌ఇన్‌ సమాచారం ప్రకారం 2000 సంవత్సరంలో జిడిపిలో మన పరిశోధన ఖర్చు 0.7శాతం ఉంటే 2012 నాటికి 0.8శాతం, ఇదే కాలంలో చైనా 0.9 నుంచి 1.8కి పెరిగింది. ప్రపంచబాంకు సమాచారం ప్రకారం 2018లో చైనా 2.14శాతం, మన దేశం 0.65శాతం ఖర్చు చేసింది. రూపాయల్లో పెరుగుదల చూడండి అని ఎవరైనా అంటే చేసేదేమీ లేదు. వాటి విలువ సంగతేమిటని అడగాల్సి వస్తుంది. దేశభక్తి దేశభక్తి అని అరిస్తే,వేషాలు వేస్తే, ఇరుగు పొరుగుదేశాల గురించి కుట్ర సిద్దాంతాలతో జనాలను భయపెడితే, ఆ సాకుతో అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తే, గంజాయి దమ్ముకొట్టి ప్రగల్భాలు పలికినట్లు వారిని అధిగమిస్తాం వీరిని దాటిపోతాం, మా గత ఘనం చూడండి అంటే సరిపోతుందా ? కృత్రిమ మేథలో కొన్ని రంగాల్లో ఇప్పటికే అమెరికాను అధిగమించి, మొత్తంగా సవాలు విసురుతున్న చైనాతో పోల్చుకుంటే మనమెక్కడ ? నేచర్‌ ఇండెక్సు డాట్‌కామ్‌ ప్రకారం 2015-19 సంవత్సరాలలో అమెరికన్లు 7,020,బ్రిటీషర్లు 2,073, జర్మన్లు 1,756, చైనీయులు1,446 ఆర్టికల్స్‌ను ప్రచురిస్తే మొదటి 25లో 20వ స్దానంలో ఉన్న మనవారికి 192 మాత్రమే. మనం గొప్పగా చెప్పుకొనే ఆంగ్ల భాషా జ్ఞానం, సంస్కృత పరిజ్ఞానం ఏమైనట్లు ? ఆ రెండింటిలోనూ మనకంటే వెనుకబడిన చైనా శాస్త్ర పరిశోధనలో ఎందుకు ముందున్నట్లు ? ఇతర దేశాల జనం ప్రపంచాన్ని చుట్టి వస్తుంటే మనం ఆవుచుట్టూ తిరుగుతున్నాం ?తీవ్రంగా ఆలోచించాలా వద్దా ?

చిలీలో వామపక్ష చారిత్రక విజయం – ఎదురయ్యే సవాళ్లు !

Tags

, , ,



ఎం కోటేశ్వరరావు


గతంలో ఎన్నడూ లేనంత భయం, విపరీత కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచార నేపధ్యంలో డిసెంబరు 19న జరిగిన చిలీ మలి విడత అధ్యక్ష ఎన్నికలలో వామపక్ష కూటమి అభ్యర్ధి గాబ్రియెల్‌ బోరిక్‌ ఘనవిజయం సాధించాడు.నవంబరు 21న జరిగిన ఎన్నికలలో క్రిస్టియన్‌ సోషల్‌ ఫ్రంట్‌ అభ్యర్ధి జోస్‌ ఆంటోనియో కాస్ట్‌ 27.92 శాతం ఓట్లతో ప్రధమ స్దానంలో ఉండగా బోరిక్‌ 25.82శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. మరో ఐదుగురు మిగతా ఓట్లను పంచుకున్నారు. నిబంధనల ప్రకారం విజేత 50శాతం పైగా ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంది. దాంతో తొలి ఇద్దరి మధ్య డిసెంబరు 19 పోటీ జరిగింది. బోరిక్‌ 55.87శాతం, కాస్ట్‌ 44.13శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. నవంబరు 21నే పార్లమెంటు ఉభయ సభలు, 15-17 తేదీలలో స్ధానిక సంస్దల ఎన్నికలు కూడా జరిగాయి. నయా ఉదారవాద తొలి ప్రయోగశాల లాటిన్‌ అమెరికా కాగా, దానిలో చిలీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే అక్కడి యువత నయా ఉదారవాదం పుట్టింది ఇక్కడే దానికి గోరీ కట్టేది ఇక్కడే అనే నినాదంతో ఉద్యమించింది, దానికి బోరిక్‌ రూపంలో విజయం లభించింది. పదేండ్ల క్రితం విద్యార్ధి ఉద్యమం ముందుకు తెచ్చిన నేతలలో బోరిక్‌ ఒకడు, 2014 నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. అధ్యక్షపదవి పోటీకి 35 సంవత్సరాలు నిండాలి. అది నిండిన తరువాత ఎన్నికలు వచ్చాయి. వచ్చే ఏడాది మార్చి 11న పదవీ బాధ్యతలు స్వీకరించే సమయానికి 36వ పడిలో ప్రవేశిస్తాడు.


1973లో సోషలిస్టు పార్టీ నేత (మార్క్సిజం-లెనినిజానికి కట్టుబడిన) సాల్వెడార్‌ అలెండీ ప్రభుత్వంపై జరిగిన కుట్రలో భాగంగా మిలిటరీ, పోలీసు తిరుగుబాటు చేసింది. దాన్ని ప్రతిఘటించేందుకు ఆయుధం పట్టిన అలెండీని కుట్రదారులు కాల్చి చంపారు. అయితే ప్రాణాలతో మిలిటరీకి పట్టుబడటం ఇష్టం లేక ఆత్మహత్యచేసుకున్నట్లు 2011లో కోర్టు ప్రకటించింది. ఈ కథను ఎవరూ నమ్మకపోయినా తాము విశ్వసిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పటంతో ఆ కేసు విచారణ ముగించారు. అలెండీ మీద తిరుగుబాటు చేసిన జనరల్‌ పినోచెట్‌ తరువాత పగ్గాలు చేపట్టి నయాఉదారవాద విధానాలను జనం మీద రుద్దాడు.1973 నుంచి 1990వరకు నియంతగా పాలించాడు. తరువాత పౌరపాలన పునరుద్దరణ జరిగింది. మధ్యలో రెండు సార్లు గతంలో అలెండీ నాయకత్వం వహించిన సోషలిస్టు పార్టీకి చెందిన మిచెల్లీ బాచలెట్‌ అధికారానికి వచ్చినప్పటికి మిగతావారి మాదిరే మొత్తం మీద నయా ఉదారవాద విధానాలనే కొనసాగించారు. ఆ పార్టీ ఇప్పుడు వామపక్షాలతో లేదు. గత పది సంవత్సరాలలో అనేక ఉద్యమాలు జరగటంతో నూతన రాజ్యాంగ రచనకు జరిగిన రాజ్యాంగపరిషత్‌ ఎన్నికల్లో వామపక్ష వాదులు, వారిని బలపరిచేవారే ఎక్కువ మంది గెలిచారు. దాని కొనసాగింపుగా జరిగిన ఎన్నికల్లో గాబ్రియెల్‌ బోరిక్‌ విజయం సాధించాడు. పార్లమెంటు ఎన్నికల్లో దానికి భిన్నమైన ఫలితాలు వచ్చాయి.


నయా ఉదారవాద విధానాలు లాటిన్‌ అమెరికా జనజీవితాలను అతలాకుతలం చేశాయి. సంపదలన్నీ కొందరి చేతుల్లో కేంద్రీకృతం కావటంతో ఆర్ధిక అంతరాలు పెరిగి సామాజిక సమస్యలను ముందుకు తెచ్చాయి. ఆ విధానాలను వ్యతిరేకించే-సమర్ధించేశక్తులుగా సమాజం సమీకరణ అవుతోంది.గడచిన రెండు దశాబ్దాల్లో వామపక్ష శక్తులు ఎదిగి విజయాలు సాధించటం వెనుక ఉన్న రహస్యమిదే. ఆ విధానాలను సంపూర్ణంగా మార్చకుండా జనానికి తక్షణ ఉపశమనం కలిగించే చర్యలకు మాత్రమే పరిమితమైతే చాలదని ఆ దేశాల అనుభవాలు వెల్లడించాయి. ఉదారవాద మౌలిక వ్యవస్ధలను అలాగే కొనసాగిస్తే ఫలితం లేదని, ఎదురు దెబ్బలు తగులుతాయని కూడా తేలింది. చిలీ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కమూనిస్టు పార్టీ భాగస్వామిగా ఉన్న నాలుగు పార్టీల కూటమి చిలీ డింగో తన అభ్యర్ధిగా కమూనిస్టు డేనియల్‌ జాడ్యూను ప్రకటించింది. తరువాత జరిగిన పరిణామాల్లో బోరిక్‌ నేతగా ఉన్న కన్వర్జన్స్‌ పార్టీతో సహా ఐదు పార్టీల కూటమి బ్రాడ్‌ఫ్రంట్‌, చిలీ డింగో ఉమ్మడిగా పోటీ చేయాలని అంగీకరించి ” మర్యాదకు మన్నన” అనే అర్దం ఉన్న అప్రూవ్‌ డిగ్నిటీ అనే కూటమి ఏర్పాటు చేశాయి. అభ్యర్ధిగా బోరిక్‌ను ఎన్నుకున్నారు. చిలీ రాజకీయాల్లో ఉన్న పరిస్ధితుల్లో వివిధ పార్టీల కూటములు తప్ప ఒక పెద్ద పార్టీగా ఎవరూ రంగంలోకి దిగలేదు.


సాధారణంగా తొలిదఫా ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ రాకున్నప్పటికీ ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీ అంతిమ పోటీలో గెలుస్తుంది. చిలీలో దానికి భిన్నంగా రెండవ స్ధానంలో వచ్చిన బోరిక్‌ ఘనవిజయం సాధించాడు. మితవాద శక్తులన్నీ ఒకవైపు, వారిని ప్రతిఘటించే పురోగామి, ఉదారవాదులందరూ మరోవైపు సమీకరణయ్యారు.ఈ క్రమంలో బోరిక్‌ను ఎన్నుకుంటే కమ్యూనిస్టు ప్రమాదం వస్తుందని, దేశం మరొక వెనెజులాగా మారిపోతుందనే ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. సామాజిక, మతపరమైన అంశాలను కూడా ముందుకు తెచ్చారు. భయం మీద ఆశ విజయం సాధించిందని, ఒక పద్దతి ప్రకారం కమ్యూనిస్టునిస్టు వ్యతిరేక విష ప్రయోగాన్ని కూడా జనం అధిగమించారని బోరిక్‌ తన విజయ సందేశంలో చెప్పాడు. ఉదారవాద విధానాలను అణచివేసేందుకు గత పాలకులు స్వజనం మీదనే మిలిటరీని ప్రయోగించారని అటువంటిది మరోసారి పునరావృతం కాదని అన్నాడు.ప్రస్తుత అధ్యక్షుడు పినేరా 2019లో మిలిటరీని దించి జనాన్ని అణచివేశాడు.


అధ్యక్షపదవిలో వామపక్షవాది విజయం సాధించినప్పటికీ పార్లమెంటు ఉభయ సభల్లోనూ మితవాదులే అత్యధికంగా గెలవటం ఒక ప్రమాదాన్ని సూచిస్తున్నది.1973లో సాల్వెడోర్‌ అలెండీ మీద అమెరికా సిఐఏ అండతో చేసిన కుట్రలో పార్లమెంటులోని మెజారిటీ మితవాదశక్తులు ఒక్కటయ్యాయి. ఇప్పుడు అనేక దేశాలు వామపక్ష శక్తులకు పట్టంగట్టటం మొత్తం ఉదారవాద విధానాలనే సవాలు చేస్తున్న తరుణంలో చిలీలో ఉన్న మితవాద శక్తులు ఎలా స్పందిస్తాయో ఎవరూ చెప్పలేరు. మరోసారి 1973 పునరావృతం అవుతుందా అంటే సామ్రాజ్యవాదులు ఎంతకైనా తెగిస్తారని హెచ్చరించక తప్పదు.పార్లమెంటు దిగువ సభ డిప్యూటీల ఛాంబర్‌లో 155 స్ధానాలకు గాను వామపక్ష కూటమి పార్టీలకు వచ్చింది 37 మాత్రమే, రెండు పచ్చి మితవాద కూటములకు 105వచ్చాయి. ఇదే విధంగా ఎగువ సభలోని 50 స్దానాలకు గాను వామపక్షాలకు ఐదు, స్వతంత్రులు ఇద్దరు, మిగిలిన 43మితవాద పార్టీలకే వచ్చాయి. వామపక్షాలలో ప్రధాన పార్టీగా ఉన్న కమ్యూనిస్టులు గతంలో ఉన్నఎనిమిదింటిని 12కు పెంచుకున్నారు, ఎగువ సభలో కొత్తగా రెండు స్దానాలను గెలుచుకున్నారు. ఈ నేపధ్యంలో వామపక్ష అధ్యక్షుడికి ఆటంకాలు ఎదురవుతాయని చెప్పనవసరం లేదు. నయా ఉదారవిధానాలను జనం ప్రతిఘటించిన చరిత్ర, లాటిన్‌ అమెరికాలో ఉన్న వామపక్ష ప్రభుత్వాల మద్దతు ఉన్న పూర్వరంగంలో మితవాదశక్తులు ఎలా వ్యవహరిస్తాయో చూడాల్సి ఉంది. అవసరమైతే జనం మరోసారి వీధుల్లోకి వస్తారు.


తొలి రౌండులో ఆధిక్యత సాధించిన మితవాదులు తమదే అంతిమ గెలుపు అని భావించారు. సర్వేలన్నీ పరిస్ధితి పోటాపోటీగా ఉంటుందని, ప్రతి ఓటూ ఫలితాన్ని నిర్దేశించేదేనని చెప్పాయి. ఈ కారణంగానే మితవాద అభ్యర్ది జోస్‌ ఆంటోనియో కాస్ట్‌ ఎన్నికలకు ముందు మాట్లాడుతూ మెజారిటీ 50వేలకు అటూఇటూగా ఉంటే ఫలితాన్ని న్యాయ స్దానాలే తేల్చాలని మరీ చెప్పాడు. కాస్ట్‌కు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం బోరిక్‌ మద్దతుదార్లుగా ఉన్న పేద, మధ్యతరగతి ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా చూసేందుకు ఎన్నికల రోజున రాజధాని పరిసర ప్రాంతాలలో ప్రజారవాణాను గణనీయంగా నిలిపివేసింది. అయినా ఓటర్లు గత అన్ని ఎన్నికలంటే ఎక్కువగా 55.4శాతం మంది ఓటు హక్కు వినియోగించుకొని రికార్డు నెలకొల్పారు. మితవాదులు, వారికి మద్దతుగా ఉన్న మీడియా దీన్ని ఊహించలేదనే చెప్పాలి. గత రెండు ఎన్నికల్లో 46.7,41.98శాతాల చొప్పున ఓటింగ్‌ జరిగింది. గత పదేండ్లుగా ఉద్యమించిన యువత తమ నేతకు పట్టం కట్టాలని మరింత పట్టుదలతో పని చేశారు. మరో వెనెజులా, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్ని ఓటర్లు ఖాతరు చేయ లేదు. ఇలాంటి ప్రచారాలను మిగతా దేశాల్లో కూడా చేసినా అనేక చోట్ల ఓటర్లు వామపక్షాలకు పట్టం కట్టటాన్ని చిలీయన్లు గమనించారు. రెండవ దఫా ఎన్నికల్లో మితవాద శక్తులు వామపక్షాలను రెచ్చగొట్టేందుకు ఎంతగానో ఉసిగొల్పినా బోరిక్‌ ఎంతో సంయమనం పాటించాడు. మాదక ద్రవ్యాలకు బానిస అంటూ టీవీ చర్చలు, సామాజి మాధ్యమాల్లో చేసిన తప్పుడు ప్రచారాన్ని ఒక టీవీ చర్చలో బోరిక్‌ తిప్పి కొడుతూ ప్రత్యర్దుల నోరు మూతపడేలా ఎలాంటి మాదక ద్రవ్యాలు తీసుకోలేదంటూ అధికారికంగా జారీ చేసిన ధృవీకరణ పత్రాన్ని ప్రదర్శించి నోరు మూయించాడు. గత ఏ ఎన్నికలోనూ ఈసారి మాదిరి దిగజారుడు ప్రచారం జరగలేదని విశ్లేషకులు చెప్పారు.


చిలీ ఆర్ధిక స్ధితి సజావుగా లేదు. బోరిక్‌ విజయవార్తతో స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలింది. సోమవారం నాడు ఒమిక్రాన్‌, తదితర కారణాలతో లాటిన్‌ అమెరికా కరెన్సీ ఐదుశాతం పడిపోతే చిలీ పెసో 18శాతం దిగజారింది. కొత్త ప్రభుత్వం మార్కెట్‌ ఆర్ధిక విధానాల నుంచి వైదొలగనుందనే భయమే దీనికి కారణం. వచ్చే ఏడాది బడ్జెట్‌లో 22శాతం కోత విధించాలన్న ప్రతిపాదనను తాను గౌరవిస్తానని బోరిక్‌ ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానం అంటే ఏమిటో అతనికి తెలియనట్లు అని పిస్తోందని హెచ్చరించిన వారు కూడా ఉన్నారు. ఒకశాతం మంది ధనికుల చేతిలో దేశంలోని సంపదలో నాలుగో వంతు ఉంది. మితవాది కాస్ట్‌ తాను గెలిస్తే పన్నులతో పాటు సామాజిక సంక్షేమానికి ఖర్చు తగ్గిస్తానని బహిరంగంగానే ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. దానికి భిన్నంగా ధనికుల మీద అధికపన్నులు వేస్తామని, సంక్షేమానికి పెద్ద పీటవేస్తామని చెప్పాడు. పెన్షన్‌ సొమ్ముతో ఇప్పటి మాదిరి పెట్టుబడిదారులు లాభాలు పొందకుండా పెన్షనర్లకు ఫలాలు దక్కేలా చేస్తానని కూడా వాగ్దానం చేశాడు. దేశంలో విద్యా, వైద్యం, రవాణా వంటి సేవలన్నీ కొనుగోలు చేసే వినిమయ వస్తువులుగా గత పాలకుల ఏలుబడిలో మారిపోయాయి.2018లో మెట్రో చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా విద్యార్ధి ఉద్యమం ప్రారంభమైంది.అది చివరకు మితవాద ప్రభుత్వాన్ని దిగివచ్చేట్లు చేసింది. దాని నేతలలో గాబ్రియెల్‌ బోరిక్‌ ఒకడు. అందువలన సహజంగానే యువత పెద్ద ఆశలతో ఉంది. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తయితే ఇక ముందు జరగనున్నది మరొకటి.ఎన్నికలు రసరమ్యమైన కవిత్వంలా ఉంటాయని పాలన దానికి భిన్నమైన వచనంలా ఉంటుందనే నానుడిని కొందరు ఉటంకిస్తూ బోరిక్‌ ఎలా పని చేస్తారో చూడాలని చెప్పారు.తాను పుట్టక ముందు 1973లో సాల్వడార్‌ అలెండీపై జరిగిన కుట్ర చరిత్రను గమనంలో ఉంచుకొని సామ్రాజ్యవాదుల పన్నాగాలను ఎదుర్కొంటూ బోరిక్‌ ముందుకు పోవాలని యావత్‌ వామపక్ష శ్రేణులు ఎదురు చూస్తున్నాయి