జాతీయ జండా ఆవిష్కరణ అంశం: గురువు గోల్వాల్కర్‌నే పక్కన పెట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఊసరవెల్లి !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


చారిత్రాత్మక దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఒకసారి చెప్పింది మరొకసారి మాట్లాడని ప్రధాని నరేంద్రమోడీ తన శైలి, సంప్రదాయాన్ని తప్పి వరుసగా మూడవ సంవత్సర ప్రసంగంలో కూడా వంద లక్షల కోట్ల పెట్టుబడుల గురించి పునశ్చరణ చేశారు. మార్పు ఏమంటే దానికి ” ప్రధాన మంత్రి గతిశక్తి ” అని పేరు పెట్టారు. ఈ మాత్రానికే మూడు సంవత్సరాలు తీసుకుంటే దాని అమలు గురించి చెప్పుకుంటే చాల బాగోదు. కరోనా సందర్భంగా ప్రకటించిన 25లక్షల కోట్ల ఆత్మనిర్భర పాకేజి బండారం ఏమిటో తెలిసిందే. 75వారాల ముందే అమృతోత్సవంగా ఈ సందర్భాన్ని ప్రారంభించుకున్నాము. ఇంకా ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయో చూసిన తరువాత వాటిని మరోమారు సమీక్షించుకుందాం.
డెబ్బయి అయిదవ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలను చేపట్టాలని సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయం గురించి మీడియాలో చిలవలు పలవలుగా వ్యాఖ్యానాలు వెలువడ్డాయి, ఇంకా రావచ్చు. కొత్త బిచ్చగాడికి పంగనామాలు ఎక్కువ అన్నట్లుగా అసలు స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధమే లేకపోగా లేకపోగా బ్రిటీష్‌ వారితో చేతులు కలిపిన కాషాయ దళాల వారసులు సిపిఎం నిర్ణయం మీద ఉక్రోషాన్ని దాచుకోలేక కక్కలేక ఇబ్బంది పడుతున్నారు. సిపిఐ(ఎం) వైఖరిలో మార్పు తమ విజయం అని బిజెపి నేతలు కొందరు విపరీత వ్యాఖ్యానాలు చేశారు. మార్క్సిస్టుల నిర్ణయాన్ని మీడియాలో ఇంత సంచలనాత్మకంగా ఎందుకు చేశారు ? కమ్యూనిస్టుల్లో మార్పును జీర్ణించుకోలేకపోతున్నారా లేక వారిమీద వేసే రాళ్ల సంఖ్య తగ్గిపోయిందనే దుగ్దా ? ఏమైనా కావచ్చు.


సంఘపరివార్‌ దళాలు సామాజిక మాధ్యమంలో స్పందించాయి. ప్రజాజీవనంలో ఒక ఉదంతం జరిగినపుడు స్పందించటం ఒక ప్రజాస్వామిక హక్కు. అందువలన దాన్ని తప్పు పట్టనవసరం లేదు. స్పందనలో ఉన్న విషయం ఏమిటనే అంశంపై ఇతరులకూ అదే హక్కు ఉంటుంది. అందువలన కమ్యూనిస్టులు, కాషాయవాదుల్లో వచ్చిన మార్పుల తీరుతెన్నుల గురించి ఒక పరిశీలన ఇది. ముందుగా ఆర్‌ఎస్‌ఎస్‌-దేశభక్తి, జాతీయ జెండా బండారాన్ని చూద్దాం. నిజాలను తట్టుకొనగలిగే, చరిత్ర పట్ల ఆసక్తి ఉన్నవారు ముందుకు పోవచ్చు. లేని వారు ఇంతటితో ముగించవచ్చు.


అతల్‌ బిహారీ వాజపాయి ప్రధాన మంత్రిగా ఉండగా 2000 సంవత్సరంలో లోక్‌సభలో జాతీయ పతాకం గురించి చర్చ జరిగింది. బిఆర్‌ అంబేద్కర్‌ మనవడు, తొలుత రిపబ్లికన్‌ పార్టీ తరువాత భరిపా బహుజన మహాసంఘ పార్టీ తరఫున ఎన్నికైన ప్రకాష్‌ అంబేద్కర్‌ జీరో అవర్‌లో మాట్లాడుతూ నాగపూర్‌లోని ప్రధాన కార్యాలయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నడూ జాతీయ పతాకాన్ని ఎగురవేయలేదని, మువ్వన్నెల జెండా అంటే గౌరవం లేదని విమర్శించారు. అప్పుడు తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు సుదీప్‌ బందోపాధ్యాయ మాట్లాడుతూ కొల్‌కతాలో సిపిఎం కార్యాలయం మీద కూడా జాతీయ జెండాను ఎగురవేయలేదని గొంతు కలిపారు. అప్పుడు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రిగా ఉన్న ప్రమోద్‌ మహాజన్‌ మాట్లాడుతూ తాను చిన్నతనం నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉన్నానని సంస్ధ కార్యాలయాల వద్ద జెండాను ఎగురవేశారని చెప్పారు. అలాంటి ఆరోపణలతో రాజకీయ లబ్ది పొందటం తగదన్నారు. కావాలంటే జనవరి 26న ప్రకాష్‌ అంబేద్కర్‌ను నాగపూర్‌ తీసుకు వెళ్లి ఆయనతోనే జెండా ఎగురవేయిస్తామన్నారు.మంత్రి మాటలను ఖండిస్తూ 1998లో నాగపూర్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశం ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం ముందు జెండాను ఆవిష్కరించాలని ప్రతినిధి వర్గాన్ని పంపాలని, ఒక వేళ వారే స్వంతంగా ఎగురవేయకపోతే వెళ్లిన వారు ఎగురవేయాలని నిర్ణయించినట్లు ప్రకాష్‌ అంబేద్కర్‌ గుర్తు చేశారు.1999లో వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు వెళ్లి జండాను ఎగురవేసేందుకు ప్రయత్నించగా వారి మీద లాఠీచార్జి జరిగిందని, 2000 సంవత్సరంలో కూడా అదే ప్రయత్నం చేయగా తమ భవనం మీద జెండా ఎగురవేయటాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ అడ్డుకున్నదని ప్రకాష్‌ అంబేద్కర్‌ చెప్పారు. వ్యక్తులు, సంస్ధలు ఎవరైనా తమ ఇండ్ల మీద భవనాలపై జెండాను ఎగురవేయవచ్చని, ఈ సందర్భంగా ఎంపీలు అందరూ తమ ఇండ్ల మీద జెండాలు ఎగురవేయటాన్ని తాను చూడలేదని, అంతమాత్రాన వారు దేశభక్తి లేని వారని అర్ధమా అని మంత్రి మహాజన్‌ ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ జెండా ఎగురవేయటం గురించి మహాజన్‌ నిజం చెప్పులేదు, మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం సభను తప్పుదారి పట్టించారు.


2002 జనవరి 26న తొలిసారిగా నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం దగ్గర జాతీయ జెండాను ఎగుర వేశారు. అంతకు ముందు సంవత్సరం ఆగస్టు 15న రాష్ట్ర ప్రేమీ యువదళ్‌ అనే సంస్ధకు చెందిన ముగ్గురు యువకులు బలవంతంగా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం ముందు జండా ఎగురవేశారు. జాతీయ జండాను ఎందుకు ఎగురవేయటం లేదు అని అడిగితే జెండా నిబంధనల ప్రకారం ప్రయివేటు వ్యక్తులు ఎగురవేయకూడదనే నిబంధన ఉందని, 2002లో దాన్ని సవరించినందున అప్పటి నుంచి ఎగురవేస్తున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ వారు చెబుతారు. వారు ప్రచారం చేసే పచ్చి అబద్దాల్లో ఇది ఒకటి. పోస్ట్‌ కార్డ్‌ న్యూస్‌ పేరుతో నిరంతరం ఫేక్‌ న్యూస్‌ వండి వడ్డించే విక్రమ్‌ హెగ్డే, ఓప్‌ ఇండియా పేరుతో వక్రీకరణ రాతలు రాయించే నూపూర్‌ శర్మ వంటి అనేక మంది ఈ మేరకు ట్వీట్లు చేశారు. జండా నిబంధనలను సడలించిన తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ ఎగురవేస్తున్నదని చెప్పారు. వాస్తవం ఏమిటి ?


1995 ఫిబ్రవరిలో నవీన్‌ జిందాల్‌ అనే పారిశ్రామికవేత్త ఢిల్లీ హైకోర్టులో ఒక పిటీషన్‌ దాఖలు చేశారు.తన ఫ్యాక్టరీ వద్ద అన్ని రోజులూ జాతీయ జెండాను ఎగురవేయకుండా అధికారులు ఆటంకాలు కల్పించారని ఆయన ఫిర్యాదు చేశారు. గాంధీ జయంతి, స్వాతంత్య్రదినోత్సవం, రిపబ్లిక్‌దినోత్సవం రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో పౌరులు జాతీయ జెండాను ఎగురవేయరాదనే నిబంధనలు ఉన్నాయని అధికారులు అడ్డుకున్నారు. తరువాత 2002 జనవరి 15న ప్రధాని అతల్‌ బిహారీ వాజపాయి అధ్యక్షతన కేంద్రమంత్రివర్గ సమావేశంలో ఈ అంశానికి సంబంధించి నియమించిన పిడి షెనారు కమిటీ నివేదికను ఆమోదించారు. అదే జనవరి 26 నుంచి అన్ని రోజులూ ఎవరైనా ఎగురవేయవచ్చని ప్రకటించారు. అయితే 1971 జూన్‌ 15న హౌంమంత్రిత్వశాఖ జారీ చేసిన లేఖలో ఈ మూడు రోజులలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎవరైనా జాతీయ జెండాను ఎగురవేయవచ్చని పేర్కొన్నారు.1982లో పంజాబ్‌ ప్రభుత్వం జారీ చేసిన వివరాల ప్రకారం ఆ మూడు రోజులతో పాటు జలియన్‌వాలాబాగ్‌ అమరజీవుల సంస్మరణ వారమైన ఏప్రిల్‌ ఆరు నుంచి పదమూడవ తేదీ వరకు, జాతియావత్తూ సంతోష పడే ఏదైనా రోజు కూడా జాతీయపతాకాన్ని ఎగురవేయవచ్చని పేర్కొన్నారు. అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా మరొకరు గానీ ఆ పని చేయవచ్చు, కానీ అనుమతి లేనందున తాము ఎగురవేయటం లేదన్న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల భాష్యం కుంటి సాకు,అవాస్తవం తప్ప మరొకటి కాదు.


నాగపూర్‌లో బిజెపిఏతర పార్టీలు, సంస్ధలకు చెందిన వారు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం దగ్గర జెండా ఎగురవేసేందుకు చేసిన యత్నాలు దేశవ్యాపితంగా చర్చనీయాంశం కావటం, సరిగ్గా ఆ సమయంలో వాజపాయి ప్రధానిగా ఉండటంతో విధిలేక తన వ్యతిరేకతను దిగమింగి ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ జెండాను ఎగురవేయటం ప్రారంభించింది. ఒకసారి అధికార రుచి మరిగిన తరువాత మైనారిటీలు, ఇతరుల సంతుష్టీకరణలో భాగంగా, ప్రపంచంలో ఉన్న మత శక్తి అనే ముద్రను చెరిపివేసుకొనేందుకు గురువుగా దశాబ్దాలుగా పిలుస్తున్న ఎంఎస్‌ గోల్వాల్కర్‌ రచనలతో తమకు సంబంధం లేదని చెప్పుకొనేంతవరకు వెళ్లింది. ఆయన ప్రఖ్యాత రచన బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌(ఆలోచనల గుచ్చము), ఇతర పుస్తకాలను ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రామాణికంగా తీసుకొని దశాబ్దాలుగా ప్రచారం చేస్తున్నది. ఆ సంస్ధ చెప్పే జాతీయతకు గోల్వాల్కర్‌ చెప్పిన అర్ధం ఏమిటి ? ” మేము లేదా మన జాతి గుర్తింపు నిర్వచనం(ఉరు ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్‌డ్‌ )” అనే శీర్షికన 1938లో రాసిన పుస్తకంలో ” హిందూస్తాన్‌లో హిందూయేతరులు వారు విధిగా హిందూమతంలోకి మారాలి లేదా హిందూ రాజ్య చేతికిందివారుగా(రెండవ తరగతి) దేశంలో ఉండవచ్చు.ఎలాంటి ప్రత్యేకహక్కులు, చివరికి పౌరహక్కులు కూడా కోరకూడదు.” 1940 నుంచి 1973లో మరణించే వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేతగా సుదీర్ఘకాలం కొనసాగిన గోల్వాల్కర్‌ ఆ కాలమంతా తన భావాలను ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలకు నూరిపోశారు. తరువాత కూడా అదే సాగింది.


2004లో దేశం వెలిగిపోతోంది అనే నినాదంతో బిజెపి ఎన్నికల్లో దిగి పరాజయం పాలు కావటం, దాని సిద్దాంతాలను చూసి కొన్ని పార్టీలు ఇబ్బంది పడటం తదితర కారణాలతో ఆర్‌ఎస్‌ఎస్‌ తన పులిచారలను కనపడకుండా చేసేందుకు ప్రయత్నించింది. దానిలో భాగంగానే 2006లో తొలిసారిగా గోల్వాల్కర్‌ జాతి గుర్తింపు నిర్వచన పుస్తకానికి – తమకూ సంబంధం లేదని ప్రకటించుకోవాల్సి వచ్చింది. ” గోల్వాల్కర్‌ పుస్తకంతో తమకు సంబంధం లేదని అధికారికంగా చెప్పిన ఆర్‌ఎస్‌ఎస్‌ ” అనే శీర్షికతో 2006 మార్చి 9న అక్షయ ముకుల్‌ అనే విలేకరి రాసిన వార్తను టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించింది. ” అందరూ నమ్ముతున్నట్లుగా ఉరు పుస్తకం ఆర్‌ఎస్‌ఎస్‌ బైబిలు కాదు. అది నిజంగా బైబిల్‌ అయి ఉంటే సంఘకార్యకర్త ప్రతిఒక్కరూ దాన్ని చదివి ఉండేవారు, ప్రతి వారి ఇంట్లో ఉండేది, అలా జరగలేదు ” అని ఆర్‌ఎస్‌ఎస్‌ అధికార ప్రతినిధిగా పని చేసిన ఎంజి వైద్య చెప్పిన మాటలను ఆ వార్తలో పేర్కొన్నారు. చిత్రం ఏమిటంటే గోల్వాల్కర్‌ బతికి ఉన్నంతవరకు మూడుదశాబ్దాలకు పైగా ఆ పుస్తకంలోని అంశాలను పక్కన పెట్టినట్లు ఎవరూ చెప్పలేదు. మరణించిన తరువాత మరో మూడు దశాబ్దాలు కూడా ఎవరూ మాట్లాడలేదు.


ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన లెక్చరర్‌ రాకేష్‌ సిన్హా 2006లో ”శ్రీ గురూజీ-ముస్లింలు ” అనే పేరుతో రాసిన పుస్తకంలో సరికొత్త కథను ముందుకు తెచ్చారు. గోల్వాల్కర్‌ రచన ఉరు పుస్తకంలోని అంశాలు నిజానికి గూరూజీవీ లేదా ఆర్‌ఎస్‌ఎస్‌వి కాదట. ఆ పుస్తకంలోని అంశాలు తనవి కాదని గురూజీ బతికి ఉండగా చెప్పేవారట. జిడి సావర్కర్‌ రాసిన ” రాష్ట్ర మీమాంస” అనే పుస్తక సంక్షిప్త రూపం తప్ప గోల్వాల్కర్‌ భావాలు కాదని, కానీ వాటిని గురూజీకి ఆపాదించి లౌకిక సామాజిక శాస్త్రవేత్తలు ఉపశమనం పొందారని రాకేష్‌ సిన్హా ధ్వజమెత్తారు. అప్పటి నుంచి ఆ పుస్తకం మినహా గోల్వాల్కర్‌ ఇతర పుస్తకాలన్నింటినీ ఆర్‌ఎస్‌ఎస్‌ ఇప్పటికీ ప్రచురించి బోధ చేస్తూనే ఉంది. గోల్వాల్కర్‌ పేరుతో సాగిన బోధనల గురించి సిగ్గుపడటం సరే. కానీ ఇక్కడ సమస్య ఏమిటి ? ఆ పుస్తకంలోని భావాలు, సూత్రీకరణలను ఆరు దశాబ్దాల పాటు సంఘపరివార్‌లోని వారెవరికీ అభ్యంతరం అనిపించలేదా ? భిన్నాభిప్రాయం వెల్లడికాలేదా ? ఎవరూ నోరుమెదపలేని పరిస్ధితి పరివార్‌లో ఉన్నట్లే అని భావించాలా ? జిడి సావర్కర్‌ పేరుతో సదరు పుస్తకాన్నే సంక్షిప్తం చేసి ప్రచురించవచ్చు, కానీ దాని సంక్షిప్త రూపానికి పేరు మార్చి గోల్వాల్కర్‌ తన పేరు ఎందుకు పెట్టుకున్నట్లు ? గోల్వాల్కర్‌ స్వయంగా చెప్పారు అంటున్నవారు అలా ఎందుకు చేశారనే ప్రశ్నించే స్వేచ్చ పరివార్‌లో లేకపోయిందా ? పోనీ ఆయన బతికి ఉండగా పక్కన పెట్టేందుకు ధైర్యం లేకపోతే మరణించిన తరువాత అయినా వెంటనే ఆ పని ఎందుకు చేయలేదు ? మొత్తం ఆరు దశాబ్దాల పాటు దాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ ఎందుకు ప్రచారం చేసింది. అందుకే విశ్వసనీయత సమస్య ముందుకు వస్తోంది. అది గురూజీది కాదంటున్నారు గనుక ఆయన పెద్ద కాపీ మాస్టర్‌ అని తేలిపోయింది.


2018 సెప్టెంబరు 20న న్యూస్‌ 18 టీవీ, ఇతర పత్రికలు కూడా ఒక వార్తను ప్రచురించాయి.ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగా ఉన్న మోహనభగవత్‌ ఒక కార్యక్రమంలో ప్రశ్నలకు సమాధానాలిస్తూ 1966లో గురు గోల్వాల్కర్‌ రాసిన బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌(ఆలోచన గుచ్చము) అనే పుస్తకం తమకు నిత్య అఖండజ్యోతి కాదని వాటిలో కొన్ని కాలానుగుణ్యంగా లేవని అన్నారు. హిందూయేతర మతపరమైన మైనారిటీలలో ఆర్‌ఎస్‌ఎస్‌ వైఖరి గురించి భయాలున్నాయన్న ప్రశ్నకు సమాధానమిస్తూ వాటిలో చెప్పిన అంశాలు కొన్ని పరిస్ధితులు, ఒక నిర్దిష్ట పూర్వోత్తర సంబంధంగా చెప్పినవి. మేము ”గూరూజీ- విషన్‌ అండ్‌ మిషన్‌ ” (గురూజీ ఊహ-కార్యక్రమం) అనే పుస్తకాన్ని ప్రచురించాము. వాటిలో కొన్ని పరిస్ధితుల్లో చెప్పిన వాటిని తొలగించాము. గురూజీ అనశ్వర ఆలోచనలను కొనసాగించాము” అన్నారు. బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ గురించి చెబుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ పరిధీకృత సంస్ధ కాదు (గీసుకున్న గిరికి పరిమితం), కాలంతో పాటు మా ఆలోచనలు, వాటి స్పష్టత వక్కాణింపులో కూడా మార్పులు ఉంటాయి. బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌లో రాసిన అంశాల ఆధారంగా ఆర్‌ఎస్‌ఎస్‌ గిరిగీసుకున్న సంస్ధ అనే సందేహాలుంటే మా పనేమిటో చూసేందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం” అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ గిరిగీసుకున్న సంస్ధ కానట్లయితే మహిళలకు, మైనారిటీ మతస్ధులకు సభ్యత్వాన్ని, బాధ్యతలు లేదా నాయకత్వ స్దానాలను ఎందుకు అనుమతించటం లేదు.


ఇక జాతీయ జెండా విషయానికి వస్తే ఆర్‌ఎఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ 1947 జూలై 17తేదీ సంచిక, తరువాత రాసిన సంపాదకీయాల్లో చెప్పిందేమిటి ? తంతే గారెల బుట్టలో పడ్డట్లు జనాలు అధికారానికి వచ్చి మన చేతుల్లో మూడు రంగుల జండాను పెట్టవచ్చు, కానీ హిందువులెవరూ ఎన్నడూ దాన్ని గౌరవించరు, తమదానిగా చేసుకోరు. మూడు అనే పదమే ఒక దుశ్శకునం, జండాకు ఉన్న మూడు రంగులు మానసిక ప్రభావాన్ని కలుగ చేస్తాయి, జెండా దేశాన్ని గాయపరుస్తుంది” అని పేర్కొన్నారు. 1946 జూలై 14న గోల్వాల్కర్‌ నాగపూర్‌ సభలో మాట్లాడుతూ కాషాయ జెండా మాత్రమే మన ఘనమైన సంస్కృతికి ప్రతీక, అది దేవుని అవతారం, అంతిమంగా యావత్‌ జాతి కాషాయ జెండా ముందు మాత్రమే తలవంచుతుందని మనం గట్టిగా నమ్ముతున్నాం ‘అన్నారు.


శ్యామ ప్రసాద ముఖర్జీని ఆర్‌ఎస్‌ఎస్‌ తమ హీరోగా పరిగణిస్తుంది. ఆయన 1943 నుంచి 46వరకు అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడిగా ఉన్నారు. క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని అణచివేయాలని బెంగాల్‌ కాబినెట్‌ మంత్రిగా ఉంటూ 1942 జూలై 26న నాటి బెంగాల్‌ గవర్నర్‌ జాన్‌ హరబర్టుకు లేఖ రాసిన అపర దేశభక్తుడు. బెంగాల్లో ఈ ఉద్యమాన్ని ఎలా ఎదుర్కోవాలన్నదే ప్రశ్న అని సదరు లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే ఈ దేశభక్తుడిని పార్టీలో చేర్చుకొనేందుకు, కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టేందుకు నాడు నెహ్రూకు అభ్యంతరం లేకపోయింది. కొద్ది కాలంలోనే నెహ్రూతో విభేదించి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చేరదీసి 1951లో భారతీయ జనసంఫ్‌ు పార్టీని ఏర్పాటు చేయించింది.


సంఘపరివారం వీర సావర్కర్‌గా పిలిచే వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జాతీయ జెండాను గురించి చెప్పిందేమిటి ? ( ఆయనకు వీర బిరుదు ఎవరిచ్చారంటే ఎవరూ సమాధానం చెప్పరు ) ” మూడు రంగుల జండాను హిందూస్తాన్‌ జాతీయ జండాగా ఎన్నటికీ గుర్తించలేము. కాషాయ జెండా మాత్రమే ఉండాలి… హిందువులు మరొక జెండాకు ఏ స్దాయిలోనూ విధేయులుగా వందనం చేయరు.” అన్నారు. పాకిస్తాన్‌ ఏర్పాటు చేయాలని 1940లో ముస్లింలీగ్‌ డిమాండ్‌ చేసింది.దానికి మూడు సంవత్సరాల ముందే 1937లో అహమ్మదాబాద్‌లో జరిగిన హిందూమహాసభ 19వ సమావేశంలో సావర్కర్‌ మాట్లాడుతూ రెండుదేశాల సిద్దాంతాన్ని సమర్ధించారు. ఈ రోజు దేశం ఇంకేమాత్రం ఐక్యంగా ఒకటిగా ఉండలేదు, హిందూ, ముస్లిందేశాలుగా ఉన్నాయి. జిన్నా రెండు దేశాల సిద్దాంతంతో నాకేమీ పేచీ లేదు, చారిత్రకంగా చూస్తే హిందూ ముస్లింలు రెండుదేశాలుగా ఉన్నారని 1943ఆగస్టు 15న నాగపూర్‌ సమావేశంలో సావర్కర్‌ చెప్పారు. తిరువాన్కూర్‌ సంస్ధాన దివానుగా ఉన్న సిపి రామస్వామి అయ్యర్‌ తమ సంస్దానం ప్రత్యేక దేశంగా ఉంటుందని 1947జూన్‌ 11న ప్రకటించారు.అఖండ భారత్‌ గురించి చెప్పిన సావర్కర్‌ జూన్‌ 20 ఆ నిర్ణయాన్ని సమర్ధిస్తూ టెలిగ్రామ్‌ పంపారు. ” తిరువాన్కూరును మన హిందూ స్వతంత్ర దేశంగా ప్రకటించేందుకు ముందు చూపు, దైర్యం కావాలి” అని పేర్కొన్నారు. కమ్యూనిస్టుల నాయకత్వాన జనం దాన్ని వ్యతిరేకించి విలీనానికి పోరాడారు. మన రాజ్యాంగం కంటే మనుస్మృతి మెరుగని వాటిని ప్రపంచమంతా ఆరాధిస్తుంటే మన రాజ్యాంగ పండితులకు అది పట్టలేదని 1949నవంబరు 30 ఆర్గనైజర్‌ పత్రిక రాసింది.


నిషేధాన్ని ఎత్తివేయించుకొనేందుకు రాజకీయాల్లో పాల్గొనబోమని, సాంస్కృతిక సంస్ధగా ఉంటా మంటూ రాతపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి రాసి ఇచ్చిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఆ సంతకాల తడి ఆరక ముందే జనసంఫ్‌ును ఏర్పాటు చేయించి తమవారిని నేతలుగా పెట్టింది. ఇప్పుడు బిజెపిలో ఉన్నవారందరూ వారే. అయినా తమది రాజకీయ సంస్ద కాదని ఇప్పటికీ చెప్పుకుంటుంది. నిత్యం స్వదేశీ అని పశ్చిమ దేశాలను విమర్శించే ఆర్‌ఎస్‌ఎస్‌ తన యూనిఫామ్‌ విషయానికి వస్తే ఆ పశ్చిమ దేశాల నుంచే అరువు తెచ్చుకుంది.నిక్కర్ల నుంచి పాంట్లకు మారినా స్వదేశీ ఊసులేదు.ఆరు సార్లు యూనిఫామ్‌లో మార్పులు చేసుకుంది. తమ వెనుక ఇన్ని పిల్లి మొగ్గలు, అవగాహనలను మార్చుకున్న చరిత్ర తమ వెనుక ఉంచుకొని సిపిఎం వైఖరి మార్చుకున్నదని చెప్పటం విశేషం. ఇక్కడ గమనించాల్సిందేమంటే గోల్వాల్కర్‌ పుస్తకాలను పక్కన పెట్టినా, జెండా ఎగరవేయటం గురించి విధానాన్ని మార్చుకున్నా, అవగాహన మారిందని చెప్పుకున్నా అదంతా పైపై వ్యవహారం తప్ప అసలైన హిందూత్వ అజెండాలో ఎలాంటి మార్పు లేదు. వచ్చిన అధికారాన్ని నిలుపుకోవాలంటే గతంలో తాము చెప్పిన వాటికి కట్టుబడి ఉన్నట్లు పునశ్చరణ చేసినా, ముందుకు తీసుకుపోయినా కుదరదు కనుకనే పులిచారలు కనిపించకుండా కొత్త దుస్తులు వేసుకుంటోంది, మాటలను మారుస్తోంది. మరి కమ్యూనిస్టుల సంగతేమిటి ? వారెందుకు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరిపేందుకు, జాతీయ జండాను ఎగురవేసేందుకు నిర్ణయించుకున్నారు ? మరో భాగంలో చూద్దాం !

సంబంధిత వ్యాస రెండవ భాగ లింకు దిగువ ఉంది.

జాతీయ జండా ఆవిష్కరణ అంశం: సిపిఐ(ఎం) వైఖరిలో మార్పు ఏమిటి ? ఎందుకు ? https://vedikaa.com/2021/08/17/indian-national-flag-matters-what-changed-in-cpim-stand/

బ్రిటన్‌ పెట్టుబడిదారులను హడలెత్తిస్తున్న ” పక్కతడిపే కుర్రాళ్లు ” !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ ఆందోళన చెందుతున్నది కమ్యూనిస్టులా ? పెట్టుబడిదారులా ? వారి చౌకీదార్లుగా ఉన్నవారా ? పెట్టుబడిదారీ విధానానికి, మతాలకు ఉన్నట్లే కమ్యూనిస్టు లక్ష్యాల కోసం, కుల, మత రహిత సమాజం కోసం పోరాడేవారికీ చౌకీదార్లు ఉంటారు. భిన్న లక్ష్యాలతో నిరంతరం కాపాడుతూ ఉంటారు. కమ్యూనిస్టులు చెబుతున్నట్లుగా తూర్పు ఐరోపా రాజ్యాలు, సోవియట్‌ సోషలిస్టు రిపబ్లిక్‌లను కూల్చివేసినపుడు లేదా ఇతరులు భావిస్తున్నట్లు అవి పతనమైనపుడు అనేక మంది కమ్యూనిస్టులు పార్టీల పేర్లు, జండాలు, అజెండాలు మార్చుకున్నారు. వేరే పార్టీల్లో చేరిపోయారు. కమ్యూనిస్టులకు భవిష్యత్‌ లేదని భావించటమే దానికి కారణం. అలాంటి వారంతా పునరాలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందా ?


రోజులెప్పుడూ ఒకే విధంగా ఉండవు. జనం ఎప్పుడూ మత్తులోనే ఉండరు. అది మానవ లక్షణం కాదు. అయినా కొందరు మార్పును గుర్తించేందుకు భయపడతారు.1948 ఫిబ్రవరి 21న కమ్యూనిస్టు ప్రణాళిక తొలి ముద్రణ జరిగింది. నాడు జర్మనీలో తీవ్ర నిర్బంధం కారణంగా మార్క్స్‌-ఎంగెల్స్‌ దాన్ని లండన్‌లో ముద్రించారు. ప్రస్తుతం ఐరోపాను ఒక భూతం భయపెడుతోంది. అది కమ్యూనిస్టు భూతం అన్న పదాలతో ప్రారంభం అవుతుంది. ఇప్పుడు అదే బ్రిటన్‌లో పెట్టుబడిదారులను మరోసారి వెంటాడుతోంది. కుర్రకారు సోషలిజం అంటున్నది, దీన్ని తేలికగా తీసుకోవద్దు అంటూ పెట్టుబడిదారీ విధాన చౌకీదారు డాక్టర్‌ క్రిస్టినా నిమెట్జ్‌ తీవ్ర హెచ్చరిక చేశాడు.


ఈ రోజు నేటి తరం వామపక్షం వైపు చూస్తున్నదని అనుకుంటున్నాము త్వరలో మొత్తం బ్రిటన్‌ జనాభాయే వామపక్షంగా మారిపోవచ్చని హెచ్చరిస్తూ లండన్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ ఎఫైర్స్‌(ఐఇఏ) సంస్ద జూలైనెలలో 76పేజీల ఒక పత్రాన్ని వెలువరించింది.డాక్టర్‌ క్రిస్టియన్‌ నిమిట్జ్‌ దాన్ని రాశారు. దానిలో పేర్కొన్న అంశాలు పెట్టుబడిదారీ వ్యవస్ధకు మేలుకొలుపు అని లండన్‌ ఎకనమిక్‌ సంస్ధ తన సమీక్షలో హెచ్చరించింది. ఇంకా అనేక పత్రికలు, ఇతర ప్రసార మాధ్యమాలు దాని గురించి చర్చించాయి. ఐఇఏ సర్వేలో తేలిన అంశాలేమిటి ? బ్రిటన్‌లోని 67శాతం మంది మిలీనియల్స్‌, జడ్‌ తరం (1981-96 మధ్య పుట్టిన వారిని మిలీనియల్స్‌ అని పిలిస్తే 1997 తరువాత పుట్టిన వారిని జెడ్‌ తరం అంటున్నారు) సోషలిస్టు వ్యవస్ధలో జీవించాలనుకుంటున్నారని, 70శాతం మంది పెట్టుబడిదారీ వ్యవస్ధ స్వార్ధాన్ని ప్రోత్సహిస్తున్నదని భావిస్తున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. వాతావరణ,గృహ సంక్షోభానికి పెట్టుబడిదారీ వ్యవస్తేకారణమని యువతరం భావిస్తున్నది. సోషలిజం అంటే సమానత్వం, న్యాయమైన, జనం కోసమనే సానుకూల వైఖరి, పెట్టుబడిదారీ వ్యవస్ధ అంటే దోపిడీ, అన్యాయం, ధనికులు, కార్పొరేట్లకోసం పని చేసేదనే ప్రతికూల అభిప్రాయాలను బ్రిటన్‌ యువతరం ఎక్కువగా కలిగి ఉంది.


యువతరం పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా ఉన్నారని, సోషలిస్టు ప్రత్యామ్నాయం పట్ల సానుకూలంగా ఉన్నట్లు పరిశోధన నిర్ధారించింది. లెఫ్ట్‌ టర్న్‌ ఎహెడ్‌ (వామపక్ష మార్గం ముందున్నది) అనే పేరుతో రూపొందించిన పత్రం మార్కెట్‌ ఆర్ధిక వ్యవస్ధ మద్దతుదార్లకు ఒక మేలుకొలుపుగా ఉండాలి.పెట్టుబడిదారీ విధానాన్ని తిరస్కరిస్తున్నట్లు సంగ్రహరూపంలోనే ఉండవచ్చు గానీ అది బ్రెక్సిట్‌ ( ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకు రావటం )కూ వర్తిస్తుంది. ఈ పరిశోధన 2021 ఫిబ్రవరి -మార్చినెలలో 16-34 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న రెండువేల మంది మీద జరిగింది. అరవై ఏడుశాతం మంది సోషలిస్టు ఆర్ధిక వ్యవస్ధలో జీవించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. వాతావరణ మార్పు ప్రత్యేకించి పెట్టుబడిదారీ వ్యవస్ధ సమస్య అని 75శాతం మంది అంగీకరించారు. బ్రిటన్‌లో గృహ సంక్షోభానికి పెట్టుబడిదారీ విధానమే కారణమని 78శాతం చెప్పారు. ఇంధనం, నీరు, రైల్వేలను తిరిగి జాతీయం చేయాలని 72శాతం మంది కోరారు. జాతీయ ఆరోగ్య సేవలు(ఎన్‌హెచ్‌ఎస్‌) ముప్పు ఎదుర్కోవటానికి ప్రయివేటు రంగమే కారణమని 72శాతం మంది నమ్ముతున్నారు. సోషలిజం మంచి భావనే, అయితే అది వైఫల్యం చెందటానికి అమల్లో లోపమే అని 75శాతం మంది చెప్పారు.


యువతలో వామపక్ష భావాలకు మద్దతు లేదని మార్కెట్‌ ఆర్ధిక వ్యవస్ధ మద్దతుదారులు చెబుతుంటారు. కానీ యువతరాన్ని వామపక్ష భావాలకు దూరంగా ఉంచగలమని పెట్టుబడిదారులు ఇంకెంతో కాలం తమకు తాము నచ్చచెప్పుకోలేరు. మిలీనియల్స్‌ మరియు జడ్‌ తరం మధ్య గతంతో పోల్చితే పెద్దగా తేడా లేదు.మిలినియల్స్‌ సోషలిస్టు భావన వెలుపల ఉన్నారనుకుంటే జూమర్స్‌(1990దశకం తరువాత పుట్టిన వారు) దానిలోనే పెరుగుతారని తేలింది. ఈ సర్వేలో తేలిన అంశాల అర్ధం భావజాల పోరులో పెట్టుబడిదారీ వ్యవస్ధ మద్దతుదారులు ఓటమిని అంగీకరిస్తూ తెల్లజెండా ఎత్తి, భవిష్యత్‌ సోషలిజానిదే అని అంగీకరించాల్సిందే అన్నట్లుగా వ్యహరించాలని కాదు, దాని బదులు మిలియన్ల సోషలిజాన్ని ఇప్పటి కంటే మరింత తీవ్రంగా పరిగణించాలని. విశ్లేషణ పత్ర రచయిత నిమిట్జ్‌ వాదించినట్లు లండన్‌ ఎకనమిక్‌ సమీక్షకుడు పేర్కొన్నారు.


తన పత్రంలో క్రిస్టియన్‌ నిమిట్జ్‌ ఇలా చెప్పారు.” మిలీనియల్‌ సోషలిజం కేవలం సామాజిక మాధ్యమంలో జరిగే తీవ్ర ప్రచారం కాదు. జర్మీ కార్బిన్‌(లేబర్‌ పార్టీ నేత) రాజీనామా మాదిరి తాత్కాలిక సంచలనంగా ముగిసేది కాదు. లేదా 1960దశకం నాటి విద్యార్ధుల సమూల సంస్కరణవాద పునశ్చరణ కాదు. వైఖరుల్లో వచ్చిన దీర్ఘకాలిక మొగ్గు ఇది. అది దానంతట అదే పోదు. మార్కెట్‌ ఆర్ధిక వ్యవస్ధ మద్దతుదారులు ఈ సవాలును స్వీకరించాల్సి ఉంది. దానికి అనుగుణ్యంగా ఎదగాలి. దాన్ని తోసిపుచ్చటం లేదా అదేమీ జరగటం లేదని నటించకూడదు. యువత ఎదుర్కొంటున్న సమస్యలకు మార్కెట్‌ ఆధారిత పరిష్కారాలను అభివృద్ది చేస్తూ పెట్టుబడిదారీ విధానాన్ని సానుకూలమైనదిగా చూపాల్సి ఉంది. ప్రతిచోట, అన్ని వేళలా సోషలిజానికి దారులు మూసుకుపోయినప్పటికీీ అది ఇంకా ఎందుకు మరులు గొల్పుతున్నదో మనం వివరించాలి.” అన్నారు. ” అనాసక్తి తరం ” వామపక్ష తరం ”గా మారుతున్నదని ఈ నివేదిక పేర్కొన్నది.


కుర్రాళ్లు సోషలిజాన్ని అభిమానిస్తున్నారనే ఐయిఏ విశ్లేషణను టాక్‌ రేడియో వ్యాఖ్యాత మైక్‌ గ్రాహమ్‌ కొట్టి పారవేశాడు. పక్కతడిపే-నిద్రలేవగానే కంప్యూటర్లపై వేళ్లాడించే మధ్యతరగతి కుర్రాళ్లు సోషలిజానికి మద్దతు ఇచ్చినంత మాత్రాన జరిగేదేమీ ఉండదన్నాడు. వారికి లేబర్‌ పార్టీ నేత జెర్మీ కోర్బిన్‌ ఒక ఆధ్యాత్మిక నేత, సాంకేతికంగా అతనింకే మాత్రం ప్రతిపక్ష నేతగా ఉండడు అన్నాడు. నోరుపారవేసుకున్న గ్రాహమ్‌పై పలువురు విరుచుకుపడ్డారు. బ్రిటన్‌ కమ్యూనిస్టు పార్టీ నేత ఆవెన్‌ జోన్స్‌ ట్వీట్‌ చేశాడు. వర్తమానంలో యువతలో ఎక్కువ మంది అప్పులు చేసి చదువుకున్నారు, అద్దె ఇండ్లలో ఉన్నారు, రుణభారంలో కూరుకుపోయారు.దారుణమైన పరిస్ధితుల్లో తక్కువ వేతనాలతో పని చేస్తున్నారు.అందరూ మధ్యతరగతి వారే. వృద్దులు ఎక్కువ మందికి స్వంత ఇళ్లు ఉన్నాయి, వారంతా కార్మికులు. సమాజంలో 75శాతం మంది మధ్యతరగతి ఉంటారా, వారంతా కలిగిన వారేనా, మీరు నిజాయితీగా ఆలోచిస్తున్నారా అంటూ మరికొందరు విమర్శించారు. గ్రాహమ్‌ వంటి వారిని ఉద్దేశించి నిమిట్జ్‌ పెట్టుబడిదారీ మద్దతుదార్లను తీవ్రంగా హెచ్చరించాడని చెప్పవచ్చు.


ఇటీవలి సామాజిక ఉద్యమాలు నల్లజాతీయుల జీవన సమస్యలు, గ్రేటా టన్‌బెర్గ్‌ వాతావరణ పరిరక్షణ, 2017ఎన్నికల్లో జెర్మీ కార్బిన్‌ ప్రచారం, అహింసాత్మక పర్యావరణ ఉద్యమం వంటి వాటితో ఇటీవలి కాలంలో యువత రాజకీయాలను అధ్యయనం చేస్తున్నది. వయస్సులో ఉన్నపుడు కమ్యూనిస్టు – ముదిరిన తరువాత కాపిటలిస్టుగా యువత మారిపోతుందనే వాదనలను నిమిట్జ్‌ కొట్టిపారవేశాడు. ఆర్ధిక విషయాల పట్ల యువతలోనూ, 40దశకం ప్రారంభంలో ఉన్నవారిలో పెద్దగా తేడాలు లేవు. పెద్దవారయ్యే కొద్దీ యువత సోషలిజానికి దూరం అవుతారనేది ఇంకేమాత్రం నిజం కాదు అన్నారు. నేడు వామపక్ష తరం చిన్నదిగానే ఉండవచ్చు గానీ రేపు బ్రిటన్‌లో అదే ప్రధాన స్రవంతి అభిప్రాయంగా మారవచ్చు. ఇటీవలి ఎన్నికల్లో వర్గ భావన కంటే వయస్సు ప్రధాన రాజకీయ విభజన అంశంగా మారింది. 2019 ఎన్నికల్లో బోరిస్‌ జాన్సన్‌ వయస్సు మీరిన ఓటర్లలో సామాజిక మితవాద భావనలను ముందుకు తెచ్చి వారిలోని మెజారిటీ ఓట్లను పొంది విజయం సాధించాడు. నాలుగు పదులు దాటిన వారు ఎక్కువ మంది లేబర్‌ పార్టీ బదులు కన్సర్వేటివ్‌ పార్టీనే ఎంచుకున్నారు. 1980 తరువాత పుట్టిన వారు(వామపక్ష తరం) అత్యధికులు జర్మీ కోర్బిన్‌ నాయకత్వంలోని లేబర్‌ పార్టీ వైపు మొగ్గారు. యువతరంతో పోల్చితే వయస్సు పైబడిన వారు ఒకరికి ఇద్దరు ఉన్నారు. రానున్న సంవత్సరాలలో ఈ తేడా క్రమంగా అంతరిస్తుంది. వామపక్ష తరం 2019లో ఓటర్లలో 38శాతం ఉండగా 2024 నాటికి 43శాతానికి, 2030 నాటికి 52శాతానికి పెరుగుతుందని అంచనా. ఇది మితవాద రాజకీయ వ్యూహానికి పెద్ద సవాలుగా మారనుంది. జుట్టునెరిసిన వారు ఎక్కువై 2010లో లేబర్‌ పార్టీ ఓడిపోయినట్లుగానే రాబోయే రోజుల్లో కన్సర్వేటివ్‌ పార్టీకి అదే పరిస్ధితి ఎదురు కావచ్చు.” పెట్టుబడిదారీ వ్యతిరేక యువతరం కేవలం నడుస్తున్న ఒక దశకాదు, వారు దాన్నుంచి బయటపడరు. ఇదే ధోరణి కొనసాగితే అవి భవిష్యత్‌లో మొత్తం జనాభాలో ప్రధాన స్రవంతి అభిప్రాయాలుగా మారతాయి. వామపక్ష తరం కాస్తా వామపక్ష జనంగా మారుతుందని నిమిట్జ్‌ అన్నాడు.

అసహనంతో ఉన్న అమెరికా -చైనా మీద యుద్దానికి దిగుతుందా !

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


అమెరికన్లు ఇప్పుడు అసహనంతో ఉన్నారు . ప్రపంచంలో తిరుగులేని శక్తి అన్న భావన క్రమంగా తగ్గిపోతోంది. దాని అర్దం అది బలహీనపడిందని కాదు. తమ పెద్దన్న పెత్తనాన్ని ప్రతి చిన్న దేశమూ సవాలు చేస్తోంది. అందువలన చైనాను దెబ్బతీసి మిగతా దేశాలను భయపెట్టాలని చూస్తోందా ? అందుకుగాను చేయబోయే తదుపరి యుద్దం చైనాతోనా ? దానికి అనుగుణ్యంగానే పావులు కదుపుతున్నారా ? రెండవ ప్రపంచ యుద్దరంగం ఐరోపా అయితే మూడవ యుద్దం ఆసియా కేంద్రంగా జరగనుందా ? ఐరోపాతో మొదలు పెట్టి ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలని చూసిన హిట్లర్‌ రెండవ యుద్దానికి కారకుడు. ప్రపంచం మీద తమ పట్టు జారిపోతోందని భావిస్తున్న అమెరికా తెగింపు మూడవ యుద్దానికి దారి తీస్తుందా ? ఇవన్నీ ఊహాజనితమైన ప్రశ్నలుగానే ఇప్పుడు కనిపించవచ్చుగానీ పరిణామాలన్నీ వీటి చుట్టూనే తిరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే నిజంగానే యుద్దం జరుగుతుందా? సామ్రాజ్యవాద కార్పొరేట్‌ల లాభాల కోసం వాటి చౌకీదార్లుగా ఉండే పాలకులు ఎంతకైనా తెగిస్తారన్నది గత అనుభవం. ఇప్పుడు యుద్దం లాభమా ? ఆ వాతావరణం సృష్టించి మార్కెట్‌ వాటాను దక్కించుకోవటం ముఖ్యమా అన్న మధనం జరుగుతోంది !


మరోవైపు తమ జోలికి వస్తే తాట తీస్తాం అన్నట్లుగా చైనా తన వ్యతిరేకులకు సందేశాలు పంపుతోంది.సోమవారం నుంచి శుక్రవారం వరకు(9 నుంచి 13వ తేదీ) చైనాలో జరిపే రష్యాతో కలసి జరిపే సంయుక్త మిలిటరీ విన్యాసాలు అమెరికా, దాని మిత్రదేశాలకు ఒక హెచ్చరికగా భావించవచ్చు. మరొక దేశంతో జరిపే విన్యాసాలకు తొలిసారిగా చైనా జె-20 యుద్ద విమానాలను తరలించటం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా అంబుల పొదిలో ఇవి కీలకంగా ఉన్నాయి. సైనిక విన్యాసాలు చైనా వాయువ్య మూలలోని నింగ్జియా హుయి రాష్ట్రంలోని సైనిక శిక్షణ కేంద్రంలో జరుగుతున్నాయి. యుద్ద విమానాలతో పాటు బడా రవాణా విమానాలు, ఇతర ఆధునిక ఆయుధాలను కూడా ప్రదర్శించనున్నారు. రష్యా నుంచి ఎస్‌యు-30 ఫైటర్‌ జెట్‌లు గతనెలలోనే ఇక్కడకు చేరుకున్నాయి. ఉభయదేశాల నిపుణులు, సిబ్బంది ఆయుధాల ప్రయోగం, మెళకువలను తెలుసుకుంటారు. యుద్ధ రంగంలో ఎలా వ్యవహరిస్తారో అదేమాదిరి ఇక్కడ ఆయుధాలను ప్రయోగించి ప్రదర్శనలు నిర్వహిస్తారు. పదివేల మంది మిలిటరీ సిబ్బంది దీనిలో పాల్గొంటారు. ఈ చర్య ద్వారా రెండు దేశాల మధ్య ఉన్న పరస్పర విశ్వాసం, సవాళ్లను ఎదుర్కోవాలనే సంకల్పం ఉన్నత స్ధాయికి చేరినట్లు ప్రదర్శితం అవుతుందని భావిస్తున్నారు. సముద్ర మట్టానికి రెండువేల మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో వివిధ విభాగాల సంక్లిష్టమైన సైనిక విన్యాసాలకు, శిక్షణకు అనువుగా ఉంటుంది. గత ఏడాది రష్యాలోని కవకాజ్‌ ప్రాంతంలో సైనిక విన్యాసాలు జరిగాయి. వాటిలో రష్యా తన ఆధునిక ట్యాంకులు, క్షిపణులు, ఇతర ఆధునిక ఆయుధాలను ప్రదర్శించింది.


ప్రపంచ పరిణామాలను గమనిస్తున్న వారు అనేక కోణాలను ఆవిష్కరిస్తున్నారు. వాటిని వేటిని కొట్టిపారవేయలేము, అలాగని యథాతధంగా స్వీకరించలేము. ఆసియా కీలకం లేదా ఇరుసు అన్న సామ్రాజ్యవాదుల పధకం ఎప్పుడో ప్రారంభమైంది. అధికారంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఎవరున్నా కొనసాగుతోంది. దానిలో భాగంగానే చైనా చుట్టూ వందలాది సైనిక స్ధావరాలను అమెరికా ఏర్పాటు చేస్తోంది. మూడింట రెండువంతుల నౌకా, వైమానిక దళాలను ఆసియా-పసిఫిక్‌ ప్రాంతానికి తరలిస్తోంది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఇంత పెద్ద మిలిటరీ కేంద్రీకరణ లేదు.ఇరవై ఒకటవ శతాబ్దివిజయాన్ని స్వంతం చేసుకొనేందుకు చైనాతో పోటీ పడుతున్నామని జోబైడెన్‌ పార్లమెంట్‌ తొలి ప్రసంగంలోనే చెప్పాడు.ఐరోపాలో నాటోతో ఎలా చేస్తున్నామో ఆసియాలో కూడా ఇండో-పసిఫిక్‌ అలాంటిదే అని కూడా దాచుకోకుండా చెప్పాడు. చైనాను బూచిగా చూపి మిలిటరీ ఖర్చును విపరీతంగా పెంచివేస్తున్నారు. ప్రచ్చన్న యుద్దంలో విజయం సాధించామని చెప్పుకున్న అమెరికా మూడు దశాబ్దాల తరువాత అనేక ప్రశ్నలకు జవాబులు చెప్పలేని స్ధితిలో పడిపోయింది.


దక్షిణ, తూర్పు చైనా సముద్రాలలో ఇటీవలి కాలంలో అమెరికా యుద్ద నౌకలు పదే పదే సంచరిస్తున్నాయి. చైనాను రెచ్చగొట్టటం ఒకటైతే, ఆ ప్రాంత అనుపానులు-చైనా కదలికల మీద కన్నువేయటం రెండవది, చూశారా చైనా సమీపంలోకి మేము వచ్చాం అని పరిసర ప్రాంతదేశాలలో విశ్వాసం కలిగించే లక్ష్యం వంటివి ఉన్నాయి. అమెరికా ఒక్కటే కాదు, మేము సైతం యుద్ద అగ్నికి అన్నట్లుగా ఈ ప్రాంతంలో రెండు యుద్ద నౌకలను శాశ్వతంగా ఉంచుతామని జపాన్‌తో కలసి బ్రిటన్‌ ప్రకటించింది.ప్రస్తుతం మిలిటరీ కూటమి కాదని చెబుతున్నప్పటికీ అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌తో కూడిన చతుష్టయ కూటమిని ఆసియా నాటోగా మార్చాలన్న ఎత్తుగడ ఉంది. తైవాన్‌ విలీనానికి చైనా బలప్రయోగం చేయనున్నదనే ప్రచారం వెనుక కూడా తమ మిలిటరీ చర్యలను సమర్దించుకొనేందుకే అన్నది స్పష్టం. తైవాన్‌ రక్షణకు తాము, అమెరికా ఉమ్మడిగా వ్యవహరిస్తామని జపాన్‌ ఉప ప్రధాని తారో అసో చెప్పాడు. తైవాన్‌ సమీపంలోని ఒకినావా, ఇతర జపాన్‌ దీవుల్లో 50వేల మంది సైనికులతో అమెరికా అనేక స్దావరాలను నిర్వహిస్తున్నది. అమెరికాలోని ఇండో-పసిఫిక్‌ వ్యవహారాల అధిపతి కర్ట్‌ కాంప్‌బెల్‌ మాట్లాడుతూ తొలిసారిగా తమ వ్యూహాత్మక, ఆర్ధిక ప్రయోజనాలు, మిలిటరీ కేంద్రీకరణను ఇండో-పసిఫిక్‌ ప్రాంతానికి మళ్లిస్తున్నామని వెల్లడించాడు. ఒబామా హయాంలో పన్నెండు సార్లు యుద్ద నావలను తైవాన్‌ జలసంధివైపు నడిపిస్తే ట్రంప్‌ 13సార్లతో ఆ రికార్డును తిరగరాశాడు. బైడెన్‌ ఆరునెలల్లోనే ఏడుసార్లు నడిపి సరికొత్త రికార్డు దిశగా పయనిస్తున్నాడు.


తన ఉపగ్రహం లేదా తొత్తు దేశమైన ఇజ్రాయెల్‌ ప్రభుత్వ కనుసన్నలలో నడిచే పెగాసస్‌ నిఘా, చొరబాటు గురించి అమెరికా ఇంతవరకు స్పందించలేదు, అనధికారికంగా జర్నలిస్టుల మీద నిఘావేయటాన్ని ఖండిస్తున్నామని మాత్రమే వ్యాఖ్యానించింది.కానీ అదే అమెరికా గతంలో రష్యా మీద, ఇప్పుడు చైనా మీద రుజువు కాని ఆరోపణలతో ఆంక్షలకు తెగబడుతోంది. తమ దేశ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు జోక్యం చేసుకున్నట్లు, మైక్రోసాఫ్ట్‌ సర్వర్‌ను దెబ్బకొట్టేందుకు, సమాచారాన్ని తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించింది. ఇప్పుడు పెగాసెస్‌ మీద మౌనం ఎందుకు ? చైనాకు వ్యతిరేకంగా సెంటర్‌ ఫర్‌ ఏ న్యూ అమెరికన్‌ సెక్యూరిటీ(సిఎన్‌ఏఎస్‌) పేరుతో ఆసియా ఇరుసు పధకాన్ని రూపొందించిన కాంప్‌బెల్‌, యుద్ద నేరగాడు మైఖేల్‌ ఫ్లోర్‌నోరు ఏర్పాటు చేసిన సంస్ధకు పెద్ద మొత్తంలు మైక్రోసాఫ్ట్‌ నిధులు ఇచ్చింది. యుద్దమంటూ వస్తే 72 గంటల్లో యావత్‌ చైనా పౌర, మిలిటరీ నౌకలను నాశనం చేసేందుకు అవసరమైన సామర్ధ్యాన్ని పెంటగన్‌కు సమకూర్చటమే తమ లక్ష్యమని బహిరంగంగానే చెప్పాడు.ఈ సంస్ద, దానితో సంబంధాలు ఉన్న అనేక మంది ఇప్పుడు బైడెన్‌ యంత్రాంగంలో తిష్టవేశారు.ఈ సంస్ధకు అమెరికా విదేశాంగశాఖ,తైవాన్‌ ప్రభుత్వం, నార్త్‌రాప్‌ గ్రుమన్‌, లాక్‌హీడ్‌ మార్టిన్‌, బోయింగ్‌, కామ్‌కాస్ట్‌, ఎక్సాన్‌, మాస్టర్‌కార్డ్‌, అమెరికాలోని జపాన్‌ రాయబార కార్యాలయం, సిటీగ్రూప్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, రేథియాన్‌, జార్జిటౌన్‌ యూనివర్సిటీ వంటి సంస్దలు పెద్ద మొత్తాలలో నిధులు అందచేస్తున్నాయి. ఇలాంటి సంస్ధలు ఒక్క చైనాకే వ్యతిరేకం అనుకుంటే పొరపాటు, అనేక దేశాలలో అమెరికన్‌,మిలిటరీ, కార్పొరేట్లకు, ఇజ్రాయెల్‌, సౌదీ అరేబియావంటి దేశాలకు అనుకూలంగా వ్యవహరిస్తాయి. రష్యాకు వ్యతిరేకంగా 2014లో దాని ముంగిట ఉన్న ఉక్రెయిన్‌లో నయా నాజీలను అధికారంలో కూర్చోబెట్టాయి.ఇలా అనేక దేశాల్లో వ్యవహరిస్తున్నాయి.


ప్రపంచంలో ప్రతివారి నుంచి తమకు ప్రమాదం ఉందనే ప్రచారంతో అమెరికన్లను మభ్యపెట్టి ఆ దేశ పాలకులు 70దేశాలలో 800వందల సైనిక స్దావరాలు, కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రపంచాన్ని తమ గుప్పిట పెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖండాంతర క్షిపణులు, మధ్యశ్రేణి అణ్వాయుధాల పరిమితి ఒప్పందం, గగనతలాన్ని స్వేచ్చగా ఉంచాలనే ఒప్పందాల నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగింది.ఇది ఆయుధ పోటీకి దారితీస్తోంది. రెండువేల సంవత్సరం వరకు అమెరికా తన సేనలను ప్రధానంగా జర్మనీ, ఉత్తర ఆఫ్రికా దేశాలు, మధ్యప్రాచ్యం, దక్షిణ ఆసియాలో అధికంగా మోహరించింది.2011 సెప్టెంబరులో న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై దాడి తరువాత మధ్యప్రాచ్యంలో కేంద్రీకరించారు. ఒక దశలో ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లో లక్ష మంది చొప్పున అమెరికన్‌ సైనికులు ఉన్నారు. తరువాత తూర్పు ఆసియాలో మోహరించారు.


సోవియట్‌ యూనియన్ను కూల్చివేసిన తరువాత స్వతంత్ర రాజ్యాలుగా ఆవిర్భవించిన రిపబ్లిక్‌లు మిలిటరీల్లో 50శాతం వరకు తగ్గించాయి. ఇదే సమయంలో ఇండోనేషియా, ఫిలిప్పైన్స్‌, మన దేశం 40,30,15శాతం చొప్పున మిలిటరీని, బడ్జెట్లను పెంచాయి.జిడిపిలో ఒకశాతం లోపుగానే ఖర్చు చేయాలని స్వయంగా విధించుకున్న నిబంధనను జపాన్‌ పక్కన పెట్టింది.తనను చక్రబంధంలో బిగించేందుకు అమెరికా పూనుకున్నదని అర్ధం చేసుకున్న చైనా తన బలగాలను గణనీయంగా పెంచుకుంటున్నది. వాటికి సంబంధించి అంచనాలే తప్ప నిర్ధిష్ట సమాచారం బయటికి తెలియదు.1995లో కేవలం 50 స్వల్ప శ్రేణి ఖండాంతర క్షిపణులు కలిగి ఉన్న చైనా 2019లో 750 నుంచి 1500వరకు, 950 మధ్యశ్రేణి ఖండాంతర క్షిపణులు సమకూర్చుకున్నట్ల్లు వార్తలు వచ్చాయి.


రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికన్లు చేసిన ప్రతి యుద్దంలోనూ, ప్రతి చిన్న దేశం చేతిలోనూ ఓడిపోయారు. అలాంటిది చైనాతో పెట్టుకొని నెగ్గుకు రావటం అన్నది కలలో మాట.మొదటి ప్రపంచ యుద్దంలో ఓటమి, విజేతలు రుద్దిన ఒప్పందాలు జర్మన్‌ కార్పొరేట్ల అవకాశాలను దెబ్బతీసిన పరిస్ధితి, దాన్ని అవకాశంగా తీసుకొని హిట్లర్‌ మాదిరి జాతీయ ఉన్మాదాన్ని రెచ్చగొట్టాల్సిన అవసరం చైనాకు లేదు. తన ప్రయోజనాల రక్షణకు వెనుకడుగువేసే అవకాశమూ లేదు. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా తప్పుకున్నప్పటికీ పశ్చిమ, మధ్య ఆసియాలో తన ప్రయోజనాల కోసం మరొక చోట దుకాణం తెరిచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అది ఆ ప్రాంత దేశాలతో పాటు రష్యా, చైనాలకు ముప్పుతెచ్చే పరిణామం అవుతుంది.

కట్టు కథలు. పిట్ట కథలు, అతిశయోక్తులు !

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


మన జీవితాలు ఎలా తయారయ్యాయంటే రోజుకు ఒక కుహనా వార్త లేదా వక్రీకరణ అంశం లేకుండా గడవని పరిస్ధితి. నరేంద్రమోడీ గారు మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చి వస్తువులను తయారు చేసి ఎగుమతి చేసి చైనాను మించి పోవాలని చెప్పారు. దానికి బదులు కొద్ది పెట్టుబడితో పుంఖాను పుంఖాలుగా కుహనా వార్తలను తయారు చేసే ఫ్యాక్టరీలు ఇటీవలి కాలంలో పుట్టుకువచ్చాయి. మంచి వార్తలు రాసే వారికి జీతాలు సరిగా ఉండవు గానీ వక్రీకరణ వార్తలు, వీడియోలు తయారు చేసే వారికి ఎలాంటి సమస్యలూ లేవు. కరోనాతో అనేక మీడియా సంస్దలు సిబ్బందిని తొలగించాయి గానీ కుహనా వార్తల తయారీ ఇంకా పెరిగింది. లేని గొప్పలు చెప్పుకోవటంలో భాగంగా కట్టు కధలు అల్లటం, పిట్టకథలు చెప్పటం ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగి పోయింది. ముఖ్యంగా వాట్సాప్‌ యూనివర్సిటీ పండితులు, పట్టభద్రులు పెరిగిపోయిన తరువాత ఇక చెప్పనవసరం లేదు. చెబుతున్న కథలు కూడా కాపీ, పేర్లు మారతాయంతే ! కొందరికి అభిమానులుగా ఉన్న వారు నిజానిజాలను నిర్దారించుకోకుండా వారి గురించిన అతిశయోక్తులను తాము నమ్మటమే కాకుండా ఇతరులకూ పంపిణీ చేస్తుంటారు. కొన్నింటిని పరిశీలించుదాం.


వియత్నాంలోని హౌచిమిన్‌ సిటీలో ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టారన్నది వాటిలో ఒకటి. వియత్నాం ఒక చిన్న దేశం. జపాన్‌, ఫ్రెంచి, అమెరికన్‌ సామ్రాజ్యవాదులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరుతాగించి తమ గడ్డమీది నుంచి పారదోలిన వీరగడ్డ. అంత పెద్ద దేశం మీద మీరు ఎలా విజయం సాధించారు అని ఒక విలేకరి అడిగితే మాకు ఛత్రపతి శివాజీ గెరిల్లా యుద్ద పద్దతి ఉపయోగపడింది అని వియత్నాం అధ్యక్షుడు చెప్పాడట. నేను గొప్ప రాజైన శివాజీ వ్యక్తిత్వం,చర్యల గురించి చదివాను, యుద్దతంత్రం నన్ను ఎంతో ఉత్తేజపరించింది. అమెరికా దళాలకు వ్యతిరేకంగా వాటిని ఉపయోగించాం, విజయం సిద్దించింది. అలాంటి రాజు గనుక మా దేశంలో జన్మించి ఉంటే ప్రపంచాన్ని ఏలి ఉండేవారం.
శివాజీకి నివాళిగా ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించారన్నది ఒక పిట్టకధ. తన సమాధిరాయి మీద శివాజీ మహరాజ్‌ గురించి రాయించుకున్నాడని కూడా కథలు చెప్పారు. తరువాత కొన్నేండ్లకు వియత్నాం మహిళా విదేశాంగ మంత్రి భారత పర్యటనకు వచ్చి ఎర్ర కోట, మహాత్మాగాంధీ సమాధులను సందర్శించినపుడు శివాజీ సమాధి ఎక్కడ అని అడిగారట. కంగారు పడిన అధికారులు మహారాష్ట్రలోని రైగఢ్‌లో ఉందని చెప్పగా తాను అక్కడికి వెళ్లాలని చెప్పినట్లు, తరువాత సమాధిని సందర్శించి అక్కడి మట్టి తీసుకొని తన బ్రీఫ్‌కేసులో వేసుకున్నట్లు, విలేకర్లు ఎందుకా మట్టి అని అడగ్గా తమ దేశమట్టిలో దాన్ని కలుపుతానని, అలా చేస్తే శివాజీ వంటి ధైర్యవంతులు అక్కడ పుడతారని ఆమె చెప్పినట్లు కథనాలు వచ్చాయి. దీన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ విలేకరి రాసినట్లు పేర్కొన్నారు. అసలు విషయం ఏమంటే అమెరికా మీద యుద్దం ముగిసిన తరువాత ముగిసిన తరువాత వియత్నాం విదేశాంగ మంత్రిగా మహిళలెవరూ పని చేయలేదు. అమెరికా దురాక్రమణలో ఉన్న దక్షిణ వియత్నాంలో కమ్యూనిస్టులు ఏర్పాటు చేసిన తిరుగుబాటు ప్రభుత్వంలో 1969-76 మధ్య కాలంలో గుయెన్‌ తీ దిన్‌ అనే కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు విదేశాంగ మంత్రిగా ఉన్నారు. అన్నింటికీ మించిన పెద్ద అబద్దం ఏమంటే హౌచిమిన్‌ సిటీలో ఉన్నట్లు చెబుతున్న విగ్రహం అసలు శివాజీది కాదు. వియత్నాం మాజీ రాజు ట్రాన్‌ నగాన్‌ హన్‌ విగ్రహమది.


మరొక కధలో శివాజీతో పాటు రాజపుత్ర రాజు మహారాణా ప్రతాప్‌ సింగ్‌ పేరు చేర్చి ప్రచారం చేశారు. రెండు కథల్లోను రాసిన మరొక అంశం ఏమంటే వియత్నాం అధ్యక్షుడు తాను మరణించిన తరువాత తన సమాధి మీద ” ఇతడు శివాజీ, రాణాప్రతాప్‌ ఆరాధకుడు ” అని రాయించాలని ఆదేశిస్తే అలాగే చేశారట ఇక్కడ మనం గమనించాల్సింది. శివాజీ, రాణా ప్రతాప్‌ సింగ్‌లు వియత్నాం కమ్యూనిస్టులకు ఉత్తేజమిచ్చారని చెప్పటం కట్టుకధలు తప్ప మరొకటి కాదు. భారత చరిత్ర గురించి అధ్యయనం చేసిన పండితులు ఒకరిద్దరికి ఆ పేర్లు తగిలి ఉండవచ్చు తప్ప కమ్యూనిస్టు పార్టీకి ఉత్తేజమిచ్చేంత సీన్‌ లేదు.వియత్నామీయులకు ఉత్తేజమిచ్చింది మార్క్సిజం-లెనినిజం, సోవియట్‌ యూనియన్‌, చైనా కమ్యూనిస్టు పార్టీ తప్ప శివాజీ, రాణాలు కాదు. వారి నుంచి మన దేశంలోని వారే ఉత్తేజం పొందలేదు. అదే జరిగి ఉంటే మొగలాయీల పాలనకు, తరువాత ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి ఉండేవారు. అదేమీ లేదు.


శివాజీ, రాణా ప్రతాప్‌ కథలను ప్రచారం చేసింది కాషాయ దళాలు అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారిని కాపీకొట్టిన వారు వారి పేర్ల బదులు అంబేద్కర్‌ పేరు చేర్చి మరొక కథను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. అదెలా ఉందో చూడండి. ” వియత్నాం ప్రపంచంలో ఒక చిన్న దేశం. అది అమెరికా లాంటి బలమైన దేశం మెడలు వంచింది.దాదాపు 20 సంవత్సరాల వరకు జరిగిన యుద్ధంలో అమెరికా పరాజయం చెందింది. అమెరికాపై విజయం సాధించిన తర్వాత వియత్నాం దేశాధ్యక్షున్ని ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు.ప్రశ్న అందరికీ విదితమే, మీరు యుద్ధం ఎలా గెలిచారు? అమెరికాను ఎలా తలవంచేలా చేశారు.కాని,ఆ ప్రశ్న కు ఇచ్చిన జవాబు మీరు వింటే కేవలం ఆశ్చర్యమే కాదు. మీ గుండె గర్వం తో నిండి పోతుంది.ఇచ్చిన జవాబును మీరు చదవండి. దేశాలన్నీంటిలోకీ అమెరికా చాల బలమైన దేశాన్ని ఓడించుటకు భారతదేశానికి చెందిన ఒక గొప్ప మహా నేత చరిత్ర ను చదివాను.ఆయన జీవితం యొక్క ప్రేరణను ఆచరించి నేను సులభంగా విజయాన్ని సాధించాను.ఎవరు ఆ గొప్ప నాయకుడు అని జర్నలిస్ట్‌ అడిగాడు.


”మిత్రులారా! ఇది నేను చదినప్పటినుండి నా గుండె గర్వంతో ఉప్పొంగినది. అలాగే మీ గుండె కూడ గర్వంతో నిండి పోతుంది. వియత్నాం అధ్యక్షుడు లేచి నిలబడి ఇలా సమాధానం చెప్పాడు.ఆయనే భారతదేశ మహానాయకుడు భీంరావ్‌ అంబేద్కర్‌. ఆయన అగ్రవర్ణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అన్నారు. బాబాసాహేబ్‌ అంబేద్కర్‌ పేరును ఉచ్చరించే సమయంలో తన కళ్ళలో వీరత్వం మెరిసిసింది.అంతేకాదు, ఒకవేళ ఆ వ్యక్తి మా దేశంలో పుట్టిఉంటే నేను ప్రపంచాన్నే పాలించేవాన్ని అన్నారు.కొన్ని సంవత్సరాలకు ఆ దేశాధ్యక్షుడు మరణించిన తరువాత తన సమాధి పై ఏం రాయించుకున్నాడో తెలుసా! ”ఈ సమాధి ఒక భీంరావ్‌ అంబేద్కర్‌ శిష్యుని సమాధి అని”. కొన్ని సంవత్సరాల తరువాత వియత్నాం విదేశాంగ శాఖ మంత్రి భారత పర్యటన కు వచ్చాడు. నిర్ణీత షెడ్యూలు ప్రకారం మొదట ఎర్రకోట తరువాత గాంధీ సమాధి చూపించారు. ఇదంతా చూచిన తరువాత ఆ మంత్రి మహానీయ భీంరావ్‌ అంబేద్కర్‌ సమాధిó ఎక్కడ అని అడిగాడు.అప్పుడు భారత అధికారి ఆశ్చర్య పోయి ముంబై లోని దాదర్‌లో ఉన్న చైత్య భూమి అని చెప్పాడు.ఆ వియత్నాం విదేశాంగ మంత్రి ముంబై వెళ్ళారు.అక్కడ బాబాసాహేబ్‌ సమాధిని దర్శించుకున్నారు. సమాధి వద్ద కొంత మట్టిని తిసుకుని బ్యాగ్‌ లో నింపుకున్నాడు.ఓ విలేకరి ఆ మట్టి గురించి అడగగా ఆ మంత్రి ఇలా అన్నారు.”ఈ మట్టి బాబాసాహేబ్‌ పాదాల వద్ద ఉన్నది. ఈ మట్టిని నాదేశ మట్టితో కలుపుతాను ,దీనితో నాదేశంలో ఇలాంటి నాయకుడు జన్మిస్తాడని ఆశిస్తున్నాను.బాబాసాహేబ్‌ భీం రావ్‌ అంబేద్కర్‌ కేవలం భారత దేశానికే కాకుండా సమస్త విశ్వానికే గర్వ కారణం.” ఈ కథ ఇప్పుడు వాట్సాప్‌లలో తిరుగుతున్నది. అంబేద్కర్‌ ఒక సంస్కర్తగా దేశ చరిత్రలో ఆయన స్దానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ అతిశయోక్తులు చెప్పటం ద్వారా సాధించేదేమిటి ? కాపీ కథ ఆయనకు గౌరవం పెంచుతుందని భావిస్తున్నారా ?


ఇక అతిశయోక్తులు, ఘనతల చెప్పుకోవటాలు సరేసరే ! ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలి రోజువారీ అంశాల గురించి చర్చ జరుపుతుంది. దాని నిబంధనల ప్రకారం శాశ్వత, రెండు సంవత్సరాల పాటు సభ్యులుగా ఉండే దేశాలలో నెలకు ఒకరు చొప్పున అధ్యక్షత వహిస్తుంటారు. సాధారణంగా ఐరాసలో శాశ్వత అధికారులుగా ఉన్న ఆయా దేశాల ప్రతినిధులే ఆ పని చేస్తారు. ఆగస్టు నెల అధ్యక్ష పదవి మన దేశానికి వచ్చింది. ఆంగ్ల అక్షరమాల ప్రకారం వంతులను నిర్ణయిస్తారు. ఇదేదో ప్రధాని నరేంద్రమోడీ పలుకుబడికి నిదర్శనం అన్నట్లుగా కొందరు ప్రచారం చేశారు. భద్రతా మండలికి మన దేశం ఎన్నిక కావటం మొదటిసారి కాదు, ఎన్నికైన ప్రతిసారీ మనవంతు వచ్చినపుడు ఆ బాధ్యత నిర్వహిస్తూనే ఉన్నాం. ప్రస్తుతం టిఎస్‌ తిరుమూర్తి మన శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు. గతంలో మోడీ సర్కార్‌లో మంత్రిగా ఉన్న హర్దీప్‌ సింగ్‌ పూరీ రెండు సార్లు అధ్యక్షుడిగా వ్యవహరించారు. మరొకటి తొలిసారిగా ఒక భారత ప్రధాని భద్రతా మండలి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారంటూ అదొక ఘనతగా ప్రచారం చేస్తున్నారు. భద్రతా మండలిలో ప్రతినెలా వివిధ అంశాల మీద బహిరంగ చర్చలు జరుగుతుంటాయి. భద్రతా మండలి సభ్యదేశాల అధిపతులు లేదా ప్రతినిధులు వాటిలోప్రత్యక్షంగా పాల్గొంటారు, కాని దేశాల వారు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా సమర్పిస్తారు. అలాంటి నెలవారీ కార్యక్రమంగా ఈనెలలో సముద్రయాన భద్రత అంశం గురించి చర్చిస్తున్నారు. దానికి మన ప్రధాని మోడీ అధ్యక్షత వహిస్తున్నట్లు ప్రకటించారు. ఎంత మంది దేశాధినేతలు పాల్గొంటారో తెలియదు. ఇదొక గోష్టి వ్యవహారం తప్ప అంతకు మించి ప్రాధాన్యత ఉండదు. పెగాసస్‌ భూతంతో అనేక అంశాలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోడీకి ఈ గోష్టి ప్రపంచ మీడియాలో చోటు కల్పిస్తుంది. ఇలాంటి వాటిని గొప్పగా చెప్పుకోవటమా లేదా అన్నది ఎవరి అభిరుచి వారిది !

ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రం -2 : పెరుగుతున్న మతోన్మాద ముప్పు !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


1757లో ప్లాసీ యుద్దంలో ఈస్టిండియా కంపెనీ విజయం సాధించిన తరువాత ఆంగ్లేయులు మన దేశంలో అత్యధిక భాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొని 1947వరకు పాలించారు, మన సంపదలను దోచుకున్నారు, వారి పారిశ్రామిక ఉత్పత్తులకు మన దేశాన్ని ముడి వస్తువులను సరఫరా చేసేదిగానూ, వినియోగ మార్కెట్‌గా మార్చివేశారు. ఏడున్నర దశాబ్దాల తరువాత చూస్తే పరిస్ధితి ఏమిటి ? బ్రిటీష్‌ వారు భౌతికంగా మనలను పాలించటం లేదు తప్ప ఆ దేశానికి చెందిన వాటితో సహా అనేక దేశాల సంస్దలు మనలను కొత్త రూపాల్లో ఇంకా దోపిడీ చేస్తూనే ఉన్నాయి. మన దగ్గర లేని పెట్టుబడులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెచ్చుకొనేందుకు విదేశీ కంపెనీలను అనుమతించాలా వద్దా అంటే అనుమతించక తప్పదు, ఎవరూ అభ్యంతర పెట్టటం లేదు. కానీ ఆ పేరుతో విదేశీ కంపెనీలకు మన మార్కెట్‌ ద్వారాలు తెరిస్తే మనం అభివృద్ధి చెందేది ఎప్పుడు, మన జనానికి ఉపాధి దొరికేది ఎన్నడు ? ప్రభుత్వ రంగమూ లేదు, ప్రయివేటు రంగం ముందుకు రావటం లేదు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు చైనాకు పోటీగా మన దేశాన్ని మరో ప్రపంచ ఫ్యాక్టరీగా చేస్తామని నరేంద్రమోడీ మేక్‌ ఇండియా,మేకిన్‌ ఇండియా అన్నారు. వాటి సూచనలే లేవు. పిలుపులు ఇస్తే చాలదు, ఆచరణకు అనువైన విధానాలను చేపట్టాలి. చివరకు ఆ చైనా నుంచే వస్తువులను దిగుమతి చేసుకోకపోతే గడవని స్ధితి.


మన కంటే రెండు సంవత్సరాలు ఆలశ్యంగా విదేశీ దురాక్రమణ నుంచి రెండవసారి స్వాతంత్య్రం తెచ్చుకుంది చైనా. ఆ నాటికి వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో మనకంటే వెనుకబడి ఉంది. అలాంటి దేశం ఇప్పుడు ఎక్కడ ఉంది ? అత్యంత అభివృద్ది చెందిన అమెరికా, ఐరోపా ధనిక దేశాలను అధిగమించి ముందుకు పోతున్నది. మరో పది సంవత్సరాలలో ఆర్ధికంగా అమెరికాను వెనక్కు నెట్టి ప్రధమ రాజ్యంగా అవతరించనుంది. ఇప్పటికే టెలికాం రంగం, మరికొన్ని పరిజ్ఞానాల్లో పశ్చిమ దేశాల కంటే ముందుంది. వారికి సాధ్యమైంది మనకు ఎందుకు కావటం లేదు ? అది కమ్యూనిస్టు నియంత దేశం మనది ప్రజాస్వామ్యం కనుక చైనాతో పోల్చకూడదు అంటారు. ప్రపంచంలో అనేక దేశాలను ఏలిన నియంతలందరూ తమను ప్రజాస్వామ్యవాదులుగా వర్ణించుకున్నారు. మరి ఆ దేశాలు చైనా మాదిరి వృద్ది చెందలేదేం ? పోనీ మనది నిజమైన ప్రజాస్వామ్యం అనుకుంటే చైనాతో పోల్చితే మనం ఎక్కడ ఉన్నాం. స్వేచ్చ, స్వాతంత్య్రం అవసరం అయినదాని కంటే ఎక్కువ ఉందంటున్నారు గనుక అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో మన జనం పని చేయాలి కదా ? లోపం ఎక్కడుంది ?


బ్రిటీష్‌ వారు వెళ్లిపోతూ దేశాన్ని రెండు ముక్కలు చేశారు. హిందూ-ముస్లిం విబేధాలను రగిలించారు. ఆ సందర్భంగా జరిగిన హింసాత్మక ఉదంతాలలో లక్షలాది మంది మరణించారు, ఆ సంఖ్యను రెండు నుంచి 20లక్షలుగా చెబుతారు. అలాగే కోటి నుంచి రెండు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. నాడు ఆంగ్లేయులు తమ అజెండాను అమలు చేసేందుకు తనకు అనుకూలంగా పాకిస్ధాన్‌ పేరుతో కొంత ప్రాంతాన్ని మరల్చుకొనేందుకు మత విభజనను ముందుకు తెచ్చారు. ఏడున్నర దశాబ్దాల తరువాత ఇప్పుడు దేశంలో పెరుగుతున్న మత విభజనను ఎవరు తెస్తున్నారు, ఎవరి ప్రయోజనం కోసం ? వీరికీ బ్రిటీష్‌ వారికీ తేడా ఏముంది ? బ్రిటీష్‌ వారిని తప్పు పట్టిన వారు వీరి విషయంలో అలా ఎందుకు ఉండలేకపోతున్నారు ?


మనకు స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ప్రభుత్వం దగ్గర అవసరమైన పెట్టుబడిలేకపోవటంతో ప్రభుత్వ రంగంతో పాటు ప్రయివేటు రంగాన్ని కూడా ప్రోత్సహిస్తూ మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధ పేరుతో ప్రభుత్వం ఒక పునాది వేసింది. పంచవర్ష ప్రణాళికల ద్వారా అభివృద్ధి సాధించాలనే పద్దతిని అనుసరించారు. ప్రభుత్వ రంగం ప్రజల ఆస్తులను పెంచటమే కాదు, సామాజిక న్యాయాన్ని అమలు జరపటంలో, ఆదర్శయజమానిగా వ్యవహరించటంలో ముందుంది. మిలిటరీ, కరెన్సీ, పోలీసుల, సరిహద్దుల భద్రత, కీలకమైన రక్షణ పరిశ్రమల వంటి తప్ప మిగిలిన రంగాల నుంచి ప్రభుత్వం వైదొలగాలన్న ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ ఆదేశాల మేరకు 1990దశకం నుంచి ప్రభుత్వం క్రమంగా వైదొలుగుతోంది. ప్రభుత్వ రంగ సంస్ధలను క్రమంగా వదిలించుకుంటున్నారు. ఈ విధానాలలో కాంగ్రెస్‌-బిజెపికి ఉన్న తేడా ఏమంటే బిజెపి వేగం పెంచింది. గత మూడు దశాబ్దాలలో ఎవరు అధికారంలో ఉన్న కొన్ని రక్షణ విభాగాల్లో తప్ప మిగతావాటిలో ఎక్కడా ఒక్క పైసా కూడా పెట్టుబడులు పెట్టటం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే చేస్తున్నాయి. తాజాగా రక్షణ రంగంలో కూడా ప్రయివేటుకు ద్వారాలు తెరిచారు. అమెరికా, ఐరోపా దేశాల అనుభవం చూసినపుడు ముఖ్యంగా అమెరికాలో మిలిటరీ పరిశ్రమల సముదాయాలు అభివృద్ధి చెందాయి. ఫలితంగా వాటి లాభాలను పెంచేందుకు ప్రపంచ వ్యాపితంగా నిత్యం ఎక్కడో ఒకచోట స్వయంగా యుద్దాలకు దిగటం లేదా రెండు దేశాల మధ్య తంపులు పెట్టి ఇరుపక్షాలకూ ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకుంటున్నది. గతంలో భారత్‌ -పాక్‌ మధ్య అదేపని చేసిన అమెరికా ఇప్పుడు చైనా మీదకు మనలను ఉసిగొల్పి మనకు ఆయుధాలు అమ్ముతున్నది. విమానాలతో సహా స్వంతంగా తయారు చేసుకొనే స్ధితిలో వారున్నారు గనుక అమెరికా ఆయుధాల భారం మోసేది మనమే. ఏడు సంవత్సరాలుగా చమురు పన్నులు పెంచుతున్న పాలకులు ఎందుకు పెంచారంటే గాల్వన్‌ ఉదంతాన్ని చెబుతున్నారు. అది జరిగింది ఎప్పుడు ? మనల్ని బాదటం ప్రారంభించింది ఎప్పుడు ?


ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారీ పరిశ్రమలను ఆసరా చేసుకొని అనేక ప్రయివేటు పరిశ్రమలు అభివృద్ది చెందాయి. ఐడిపిఎల్‌లో పని చేసిన వారు అనేక మంది ఔషధ రంగంలో ఎంత ఎత్తుకు ఎదిగారో చూస్తున్నాము. అలాంటి వారు నేడు ప్రభుత్వ రంగంలో ఫార్మా పరిశ్రమలను మూసివేసే విధంగా వత్తిడి తెచ్చి వాటి స్ధానాన్ని వారు అక్రమించటం తెలిసిందే. వాక్సిన్ల తయారీని సీరం, భారత్‌ బయోటెక్‌ వంటి ప్రయివేటు సంస్ధలకు వదలివేసి ప్రభుత్వరంగంలోని సంస్ధలను పాడు పెట్టటం గురించి ఇటీవలనే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మన దేశంలో తయారీ బదులు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే లాభమా నష్టమా అని లెక్కలు వేసుకొని మన బిహెచ్‌యిఎల్‌ను దెబ్బతీసి దిగుమతులు చేసుకోవటం విద్యుత్‌ రంగంలో చూశాము.ఇదే పరిణామం అనేక రంగాల్లో కనిపిస్తుంది. మన దేశంలో అనేక మంది నిపుణులు ఉన్నప్పటికీ పరిశోధన-అభివృద్ది రంగంలో తగిన పెట్టుబడులు పెట్టకుండా సాంకేతిక రంగంలో ముందుకు పోవటం ఏ దేశానికీ సాధ్యం కాదు. చైనాలో సోషలిస్టు వ్యవస్ధను నిర్మించాలన్న కమ్యూనిస్టు పార్టీ లక్ష్యమొక్కటే కాదు, పరిశోధనా రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన కారణంగానే నేడు పశ్చిమ దేశాలకు సవాలుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కూడా ముందుకు పోతోంది.


ప్రభుత్వం పెట్టుబడులు పెట్టటం నిలిపివేసింది. ప్రయివేటు రంగం మీద అన్నింటినీ వదలివేసింది. అమెరికా, ఐరోపా దేశాల ప్రయివేటు సంస్ధలు తమ దేశాల్లో పరిశ్రమలు పెట్టటం కంటే చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌ వంటి దేశాలనుంచి వినియోగవస్తువులను దిగుమతి చేసుకొని లబ్దిపొందాయి. గత ఏడు సంవత్సరాల కాలంలో నరేంద్రమోడీ ఏలుబడిలో చైనా నుంచి దిగుమతులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయంటే దాని అర్ధం ఇక్కడి పారిశ్రామిక-వాణిజ్య సంస్దలు కూడా అదేబాట పట్టాయన్నది స్పష్టం.లడఖ్‌ సరిహద్దులోని గాల్వన్‌లోయలో రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణల తరువాత చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టారు. ఏడాది కాలంలో కరోనా కారణంగా మొత్తంగా మన దిగుమతులు తగ్గాయి కనుక ఆమేరకు చైనా నుంచి తగ్గాయి తప్ప ఇప్పటికీ అక్కడి నుంచే మనం ఎక్కువగా దిగుమతులు చేసుకుంటున్నాము. ఇటీవలి కాలంలో తిరిగి పెరుగుదల ప్రారంభమైంది.


విదేశాంగ విధానంలో అటు అమెరికా ఇటు సోవియట్‌ వైపు మొగ్గకుండా అలీన విధానాన్ని అనుసరించి అలాంటి దేశాల నేతగా మన దేశం ఎదగటమే కాదు స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించింది. సోవియట్‌ యూనియన్ను కూల్చివేసిన తరువాత మన దేశం అలీన విధానానికి స్వస్తిపలికింది. అమెరికాకు చేరువ కావటమే కాదు, దాని జూనియర్‌ భాగస్వామిగా మారేందుకు అడుగులు వేసింది. దానితో సంబంధాల కారణంగానే యుపిఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. గత ఏడు సంవత్సరాల పరిణామాలను చూస్తే అమెరికాకు దగ్గరయ్యే వేగం పెరిగింది. ట్రంప్‌ హయాంలో మన దేశం నుంచి చేసుకుంటున్న దిగుమతుల మీద ఇస్తున్న పన్ను రాయితీలను అమెరికా రద్దు చేసింది. అదే విధంగా మనం అనుసరిస్తున్న కనీస మద్దతు ధరల విధానం ద్వారా పరిమితులకు మించి సబ్సిడీలు ఇస్తున్నామనే పేరుతో దాన్ని రద్దు చేసేందుకు ప్రపంచ వాణిజ్య సంస్ధలో అమెరికా కేసులు దాఖలు చేసింది. ఆ వత్తిడికి లొంగి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణల పేరుతో చట్టాలను పార్లమెంట్‌లో ఎంత హడావుడిగా ఆమోదింప చేయించుకుందో చూశాము. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొని విదేశీ-స్వదేశీ ప్రయివేటు కార్పొరేట్లకు అప్పగించేందుకు వేసిన తొలి అడుగు అవి. వాటి ప్రమాదాన్ని గ్రహించిన పంజాబ్‌, హర్యానా, యుపిలోని వ్యవసాయ ప్రధాన ప్రాంతాల రైతాంగం గతేడాది నవంబరు నుంచి నిరవధిక ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.


అలాంటి అమెరికాతో కలసి మలబార్‌ తీరంలో సైనిక విన్యాసాలు జరుపుతున్నాము. మనకు సంబంధం లేని దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్చగా నౌకారవాణాను అనుమతించాలనే పేరుతో అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాతో కలసి చతుష్టయం పేరుతో చైనా వ్యతిరేక కూటమిలో చేరాము. అంతేకాదు అమెరికాకు అంగీకారం లేదు గనుక ప్రాంతీయ ఆర్దిక సమగ్ర భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)లో చేరేందుకు నిరాకరించాము. దానిలో చేరితే మన రైతాంగం, పరిశ్రమలు, వాణిజ్యాలకు హాని జరిగే మాట నిజం. దాన్ని సాకుగా చూపినప్పటికీ అమెరికాతో బిగుస్తున్న ముడే ప్రధానంగా వెనక్కు లాగింది. మరోవైపు తమ ప్రయోజనాలను బేరీజు వేసుకొని అమెరికా వద్దని వారిస్తున్నా ఆర్‌సిఇపిలో జపాన్‌, ఆస్ట్రేలియా భాగస్వాములయ్యాయి. ఈ పరిణామాల తరువాత ఆకస్మికంగా గాల్వన్‌ ఉదంతాలు జరిగాయి. అంతకు ముందు ఎలాంటి ప్రత్యేక అజెండా లేకుండానే నరేంద్రమోడీ చైనా పర్యటన తరువాత గ్జీ జింపింగ్‌ అదే మాదిరి మహాబలిపురం వచ్చిన విషయం తెలిసిందే.


రాచపీనుగ ఒంటరిగా పోదన్న సామెత తెలిసిందే. అమెరికాతో అంటకాగితే దానికి వచ్చే సమస్యలను మనం కూడా అనుభవించాల్సి ఉంటుంది. దానికి చక్కటి ఉదాహరణ ఆఫ్ఘన్‌ ఉదంతమే. అక్కడి నుంచి అమెరికా సేనల ఉపసంహరణ తరువాత వారి నమ్మి పెట్టుబడులు ఏమౌతాయో తెలియదు. అన్నింటికీ మించి తాలిబాన్ల ముప్పు మన దేశానికి ఎదురవుతుందా అన్న సమస్య ముందుకు వచ్చింది. ఉగ్రవాదంపై పోరు పేరుతో అమెరికాతో వ్యవహరించిన మన దేశం అమెరికా మాదిరే ఉగ్రవాదులైన తాలిబాన్లతో రహస్యంగా చర్చలు జరపాల్సి వచ్చింది. తాలిబాన్లను అదుపు చేయాలంటే పాకిస్దాన్‌ సహకారం అవసరం గనుక నాటకీయ పరిణామాల మధ్య సరిహద్దులో కాల్పుల విరమణ గురించి ఒప్పందం కుదిరినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో మన ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఇరాన్‌ – అమెరికా వివాదంలో మనకేమీ సంబంధం లేదు. అమెరికన్లు ఇరాన్‌ మీద ఆంక్షలు విధించారు. తమ నిర్ణయాన్ని ఉల్లంఘించే దేశాల మీద కూడా చర్యలు తీసుకుంటామని అమెరికా బెదిరించింది. మన దేశం భయపడిపోయి ఇరాన్‌ నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసింది.అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటోంది. మన మిత్రదేశం ఇరాన్‌ గతంలో సమదూరంలో ఉండేది ఇప్పుడు చైనాకు దగ్గర అయింది. మన చుట్టుపక్కల దేశాలన్నీ అదే విధంగా మారాయి. కారణం అమెరికాను మనం కౌగలించుకోవటమే.


తొలి 75 సంవత్సరాల స్వాతంత్య్ర దేశంలో రాజకీయ రంగంలో ప్రధానంగా ముందుకు వచ్చిన ధోరణి కాంగ్రెస్‌ వ్యతిరేకత. ఇప్పుడు 75 సంవత్సరాల తరువాత దాని స్ధానంలో బిజెపి వ్యతిరేకతకు పునాది పడింది. రెండింటికీ కారణం ఒక్కటే. కాంగ్రెస్‌ ఎలా అయితే అప్రజాస్వామికంగా ప్రత్యర్ది పార్టీల ప్రభుత్వాలను కూల్చివేయటం, పార్టీలను దెబ్బతీయటం చేసిందో, బిజెపి ఏడు సంవత్సరాల్లోనే దాన్ని మించి పోయింది. దానికి తోడు మతతత్వాన్ని జోడిస్తోంది. ఇది సమాజం చీలిపోవటానికి దారి తీస్తుంది. వామపక్షాలు మినహా కాంగ్రెస్‌, బిజెపి, వివిధ ప్రాంతీయ పార్టీల మధ్య ఆర్దిక విధానాల విషయంలో ఎలాంటి పేచీ లేదు. పంచాయతీ అల్లా అధికారం దగ్గరే. అందుకే గతంలో కాంగ్రెస్‌ వ్యతిరేకత ముందుకు వస్తే దాని స్దానంలో ఇప్పుడు బిజెపి వచ్చింది. అయితే జనం కాంగ్రెస్‌కు ఇచ్చినంత అవకాశం బిజెపికి ఇచ్చే స్ధితి లేదు.


ఏ దేశమైనా తమ ప్రయోజనాలకు తొలి పీట వేయటం ఇప్పుడు ప్రపంచమంతటా జరుగుతోంది. అది దురహంకారంగా మారకపోతే, ఇతర దేశాల ప్రయోజనాలకు ఎసరు పెట్టే విధంగా లేకపోతే ఇబ్బంది లేదు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా అమెరికా, జపాన్‌, ఐరోపా దేశాలు తమ దేశాల ఆర్ధిక వ్యవస్ధలను బాగు చేసుకోవటం లేదా ముందుకు పోవటం ఎలా అనేదాని కంటే చైనాను దెబ్బతీయటం మీదనే కేంద్రీకరిస్తున్నాయి.దేశీయంగా దివాలా కోరు విధానాలను అనుసరిస్తున్నంత కాలం మరో 75 సంవత్సరాలు గడచినా జన జీవితం మెరుగు పడదు. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని వదలి ఏదో ఒక దేశానికి తోకగా మారితే దాని తప్పులకు మనం కూడా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. పాలకులు ఎలాగూ ఈ విషయాలను పట్టించుకొనే స్ధితి లేదు. జనం పట్టించుకోకపోతే ఆమృత మహౌత్సవం ముగిసిన తరువాత హాలా హలాన్ని మింగాల్సి వస్తుందన్నదే 75వ స్వాతంత్య్రదినోత్సవ హెచ్చరిక !

మొదటి భాగం https://vedikaa.com/2021/08/08/india-independence-75-what-is-happening-part-one/

ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రం-1 : అమృత ఉత్సవమా ! హాలాహలమా !!

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


” ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం- నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం,
తారీఖులు దస్తావేజులు ఇవి కాదోయి చరిత్ర సారం ” అన్న శ్రీశ్రీని మనం ఇప్పుడు 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుర్తు తెచ్చుకోవటం అవసరం. స్వాతంత్య్రానికి ముందు పుట్టి తరువాత దేశాన్ని చూసిన వారి కలలు కల్లలయ్యాయి. తరువాత పుట్టిన వారు ఈ దేశం మాకేమిచ్చిందన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్ధితి. బిడ్డ పుట్టి పెరిగే క్రమంలో జరిగే పరిణామాల మాదిరే స్వాతంత్య్ర తరువాత దేశంలో కూడా మార్పులు వచ్చాయి. పుట్టిన బిడ్డ ఆరోగ్యంతోనా లేక ఈసురో మంటూ ఎదిగినట్లా అన్నదే అసలు సమస్య. స్వాతంత్య్ర దేశాన్ని కూడా అలాగే చూడాలి.


కాలం గడిచే కొద్దీ మెరుగు పరచాల్సిన ప్రజాస్వామ్య వ్యవస్ధలకు తూట్లు పొడుస్తున్నారు. విపరీత అర్ధాలు చెబుతున్నారు. పోరాడి సాధించుకున్న హక్కులు ఒక్కొక్కటి హరించుకుపోతున్నాయి లేదా కదలా మెదల్లేని బంధనాల్లో ఇరుక్కు పోతున్నాయి. మనకు నిజంగా స్వాతంత్య్రం వచ్చిందా ? స్వాతంత్య్రం అంటే ఇదా, ఇలాంటిది మనకు అవసరమా అనే ప్రశ్నలు అనేక మందిలో ఉన్నాయి. ఇంతకాలం తరువాత ఇలాంటి ఆలోచనలు కలగటం విచార, విషాదకర స్దితి. ప్రస్తుత తీరు తెన్నులు చూస్తుంటే రానున్న రోజుల్లో పరిస్దితి ఇంకా దిగజారుతుందా అన్న ఆందోళన తలెత్తుతోంది. సాగు, నిత్య పర్యవేక్షణ లేకపోతే పంట భూముల్లో కలుపు మొక్కలు పుట్టినట్లు లేదా కబ్జాకు గురైనట్లుగానే అనేక దేశాల్లో ఇలాంటి పరిస్ధితులు తలెత్తినపుడు నియంతలు ముందుకు వచ్చేందుకు అనువుగా ఉంటుంది. ఎవడొస్తే మనకేంలే మన మీద భారాలు, మనకు బాధలు తప్పవు అని జనం నిర్లిప్తతకు లోనవుతారు.


డెబ్బయి అయిదేళ్ల స్వాతంత్య్ర సందర్భాన్ని ఏమని పిలవాలి అన్నది ఒక మీమాంస. వజ్రోత్సవం లేదా ప్లాటినం వాటి నిర్వచనాలకు సరిపోదు. నూటయాభయ్యవ సంవత్సరాన్ని ఆంగ్లంలో సెస్‌కో సెంటెనియల్‌ అన్నారు. దీనికి తెలుగులో తగిన పదం లేదని గూగుల్తల్లి నిఘంటువు సమాధానం చెప్పింది. తెలిసిన వారెవరైనా సూచిస్తే దాన్నే ఉపయోగిద్దాం. డెబ్బయి అయిదు అంటే నూటయాభైలో సగం కనుక సెమీ సెస్‌కో సెంటినియల్‌ అనాలన్నారు. మన ప్రధాని నరేంద్రమోడీ గారు అమృత మహౌత్సవ్‌ అన్నారు. పేరులోనేమున్నది పెన్నిధి. వదిలేద్దాం. దానితో ఎవరికీ పేచీ లేదు.
జూలై ఒకటిన చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలైన సందర్భంగా వారు ఎంత గొప్పగా ఆ ఉత్సవాన్ని జరుపుకున్నారో, కమ్యూనిస్టు ఆశయాలకు ఎలా పునరంకితమయ్యారో యావత్‌ ప్రపంచం చూసింది. మనకంటే రెండు సంవత్సరాలు ఆలశ్యంగా అక్కడ కష్టజీవుల ప్రభుత్వం ఏర్పడింది, 75 ఏండ్ల ఉత్సవాన్ని వారెలా జరుపుకుంటారో తరువాత చూద్దాం. మోడీ గారు ఏడేళ్ల క్రితం అనేక మాటలు చెప్పారు. తరువాత చెప్పిన మాట చెప్పకుండా చేసేది చెప్పకుండా చెప్పింది చెయ్యకుండా అసాధారణ ప్రతిభతో ” నిత్య నూతనత్వంతో ” గడుపుకు వస్తున్నారు. నిజంగా మనం ఇప్పుడు అమృత మహౌత్సవం జరుపుకొనే స్ధితిలో ఉన్నామా హాలాహలం మింగాల్సిన దుస్దితిలో ఉన్నామో తెలియటం లేదు. అచ్చేదిన్‌ (మంచి రోజులు) తెస్తామని వాగ్దానం చేసిన ప్రస్తుత కేంద్ర పాలకులు జనం చేత దేన్ని మింగిస్తారో అర్ధం కావటం లేదు.


ప్రతి ఏడాదీ పంద్రాగస్టు పండగ జరుపుకుంటున్నాం. అదొక తంతులా మారిపోయిందని ఎవరైనా అంటే తప్పు పట్టాల్సిన పని లేదు. అంతకు మించి జరుగుతున్నదేమీ లేనపుడు ఎవరైనా అలాగే అనుకుంటారు మరి. పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు అయ్యవార్లకు చాలు ఐదు వరహాలు అన్నట్లుగా మార్చివేశారు. ఉదయాన్నే దేశభక్తి గీతాలు, పాటలను వినిపించటం, మూడు రంగుల జండా ఎగురవేయటం, ప్రతిజ్ఞలు, పప్పు బెల్లాల స్ధానంలో ఏదో ఒకటి తిని మిగిలిన రోజంతా సెలవుగా గడిపేయటానికి అలవాటు పడ్డాము. స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన సంస్దగా ఉన్న కాంగ్రెస్‌ను రాజకీయ పార్టీగా మార్చి వేశారు. ఆ ఉద్యమం ఏ లక్ష్యాలనైతే ముందుకు తెచ్చిందో వాటిని ఆ పార్టీ 1947 ఆగస్టు 16 నుంచే మరచి పోయింది. దాన్ని నీరుగార్చే, ముప్పు తెచ్చే, జనానికి విశ్వాసం కోల్పోయే చర్యలకు పాల్పడింది. చరిత్ర దాస్తే దాగేది కాదు. విజేతలే చరిత్రను రాస్తారు అన్నది తెలిసిందే. అందువలన అది వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఇప్పుడు జనం కూడా చరిత్రను రాస్తున్నారు. అందువలన దానిలో ఎలాంటి వివక్ష, పక్షపాతం ఉండదు. చరిత్ర నిర్దాక్షిణ్యంగా ఉంటుంది. కాంగ్రెస్‌ వైఫల్యాలను ఉపయోగించుకొనేందుకు స్వాతంత్య్ర ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేకపోవటమే కాదు బ్రిటీష్‌ వారికి సేవచేసుకుంటామని రాతపూర్వకంగా హామీ ఇచ్చిన వారి వారసులతో నిండిన బిజెపి రంగంలోకి దిగింది. బ్రిటీష్‌ పాలన నుంచి దేశ విముక్తి అన్న నినాదాన్ని కాపీ కొట్టి కాంగ్రెస్‌ విముక్త భారత్‌ అనే పేరుతో జనం ముందు మాట్లాడింది. కాంగ్రెస్‌ విధానాలనే వేగంగా అమలు చేస్తూ దేశం మరింత దిగజారే విధంగా ఏలుబడి సాగిస్తోంది.


ఎందుకీ పరిస్ధితి తలెత్తింది ? దీక్షా దినంగా పాటించాల్సిన స్వాతంత్య్ర దినాన్ని సెలవుగా మార్చినపుడే ఆ మహౌద్యమాన్ని జనం మరచి పోవాలన్న అంశం దానిలో ఇమిడి ఉంది. చివరకు అది ఎంతవరకు వచ్చిందంటే స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యాలకు ముప్పు వచ్చిందని చెబుతున్నవారిని ఇప్పుడు జనం అపహాస్యం చేస్తున్నారు. అవి ఉంటేనేం లేకపోతేనే అంటున్నారు. పంద్రాగస్టు పండగకు 75 వారాల ముందే ప్రధాని నరేంద్రమోడీ మార్చి 12న గుజరాత్‌లో అజాదీ కా అమృతమహౌత్సవాన్ని ప్రారంభించారు. 2022 ఆగస్టు 15న నాటికి డెబ్బయిఅయిదు సంవత్సరాలు నిండి 76వ ఏట ప్రవేశిస్తాము. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్రాలు కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాయి. ఇది రాసిన సమయానికి వాటిని ఖరారు చేయలేదు. అమృతమహౌత్సవాన్ని ప్రజాఉద్యమంగా నిర్వహించాలని దాని అమలుకు హౌమ్‌ మంత్రి అమిత్‌ షా నాయకత్వాన ఒక జాతీయ కమిటీ ఉంటుందని చెప్పారు. వారేమి చేస్తారో, అవెలా ఉంటాయో మరో సందర్భంగా చర్చించుకుందాం.


స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నవారు అందరూ ఒకే పార్టీలో లేరు, అనేక పార్టీలలో చేరారు. మెజారిటీ కాంగ్రెస్‌ పార్టీలో చేరినందున తామే దేశాన్ని విముక్తి చేశామని వారు చెప్పుకుంటారు. అలాంటి కాంగ్రెస్‌ దేశానికి శనిలా దాపురించిందని దాన్నుంచి ముక్తి కలిగిస్తామంటూ కాంగ్రెస్‌ ముక్త భారత్‌గా మారుస్తామని బిజెపి ప్రకటించుకుంది. దేశ రాజ్యాంగం ప్రకారం నాలుగు ఉన్నత పదవుల్లో అసలు స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేకపోవటమే కాదు, ముందే చెప్పుకున్నట్లు బ్రిటీష్‌ వారికి లొంగిపోయిన వారి రాజకీయ వారసులు ఇప్పుడు అధిష్టించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి,ప్రధాని,లోక్‌సభ స్పీకర్లుగా సంఘపరివార్‌ రాజకీయ విభాగమైన బిజెపికి చెందిన వారే ఉన్నారు. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాధూరామ్‌ గాడ్సే ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తి, హత్య సమయంలో అతను తమ సంస్ధలో లేడని వారు చెబుతారు గానీ గాడ్సే కుటుంబసభ్యులు సంఘపరివార్‌లోనే ఉన్నట్లు చెప్పారు. అది తేలేది కాదు గనుక ఆ వివాదాన్ని పక్కన పెడదాం. గాంధీని నేనెందుకు చంపాను అంటూ కోర్టులో గాడ్సే చేసిన వాదనలను పుస్తకరూపంలో ప్రచురించి ప్రచారం చేస్తున్నవారు, సామాజిక మాధ్యమంలో అవే వాదనలను చేస్తున్న వారెవరో మనకు తెలుసు, అయితే అదంతా అనధికారికంగానే అనుకోండి. అలాంటి వారికి స్వాతంత్య్రం , దాని లక్ష్యాల మీద , ప్రజాస్వామిక వ్యవస్ధల పట్ల గౌరవం ఉంటుందా ? ఒకవైపు గాంధీకి నివాళులు అర్పిస్తూ మరోవైపు గాడ్సేను ఆరాధించే వారు పెరుగుతున్నారు, వారు ఎంతకైనా తెగిస్తారు. ఇంతకంటే ఆందోళనకరమైన అంశం ఏముంటుంది ?


జనాభాలో సగ భాగం గురించి ఇన్నేండ్లుగా కబుర్లు చెప్పటమే తప్ప ఫ్యూడల్‌ భావజాలం నుంచి ఇంకా బయటపడలేని స్ధితి ఇప్పటికీ కొనసాగుతోంది. అనేక దేశాల చట్ట సభల్లో మహిళలు సగం మంది ఉన్నారు. తాజాగా చిలీ రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికలే అందుకు నిదర్శనం. మన దేశంలో చట్టసభల్లో 33శాతం గురించి ఎప్పటి నుంచో చర్చ. తమకు సంపూర్ణ మెజారిటీ ఉంటే అమలు జరుపుతామని బిజెపి చెప్పింది. ఇప్పుడు పార్లమెంట్‌ ఉభయ సభల్లో వారికి, వారిని బలపరిచే మిత్రపక్షాలతో కలిపి అవసరమైన మెజారిటీ ఉంది. మెజారిటీ రాష్ట్రాలూ వారివే. అయినా దాని గురించి ఎప్పుడైనా ప్రధాని మన్‌కీబాత్‌లో ప్రస్తావన చేశారా అంటే లేదు.


మన దేశం అనేక రంగాలలో అభివృద్ధి చెందింది అని చెబుతుంటాం, నిజమే. కానీ అది జనానికి ఏ మేరకు ఉపయోగపడిందన్నదే గీటురాయి. వేల కోట్ల రూపాయలను పెట్టి రాఫెల్‌ విమానాలను కొనుగోలు చేయటానికి, అవసరం లేకపోయినా కొత్త పార్లమెంట్‌ భవనం కట్టేందుకు నిధుల కొరత లేదు. కరోనా మహమ్మారి పోరు గురించి కబుర్లకూ అంతకంటే కొదవ లేదు. అంతరిక్ష రంగంలో అనేక విజయాలు సాధించి రాకెట్లను ఎగరేశాం గానీ చాలా చౌకగా లభించే ఆక్సిజన్‌ ఇవ్వలేకపోయారు. అనేక మంది కరోనా పీడితులు ఆ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆనందయ్య ఆకుల పసరు ఆక్సిజన్‌ అందిస్తుందంటే, పచ్చడి కరోనాను అరికడుతుందంటే నిజమని జనం నమ్మారు. దీన్ని ఎలా చూడాలి ? కరోనా నిరోధం కోసం లాక్‌డౌన్‌ పెట్టినపుడు రెక్కాడితే తప్ప డొక్కాడని వలస కార్మికులు స్వస్ధలాలకు వెళ్లేందుకు అయ్యే రైలు ఖర్చులను కేంద్రం – రాష్ట్రాలు ఎవరు భరించాలి అని వివాదపడిన అపర మానవతా వాదులను మనం తప్ప మరేదేశమూ చూడలేకపోయింది.

పది లక్షల కోట్ల రూపాయల పారుబాకీలను వేళ్ల మీద లెక్కించదగిన బడాబాబులకు రద్దు చేయటానికి ఉదారంగా నిర్ణయాలు చేసిన పాలకులకు వాక్సిన్లు వేయటానికి చేతులు రాలేదు. తాము స్వయంగా చెప్పిన ఉచితవాక్సిన్లు వేసేందుకు మధ్యలో ఠలాయించి సగం భారం రాష్ట్రాల మీద మోపేందుకు, చివరకు సుప్రీం కోర్టు వాక్సిన్ల పేరుతో కేటాయించిన సొమ్ముకు లెక్కలు చెప్పండని నిలదీస్తే తప్ప లొంగని నేతలు ఇప్పుడున్నారు. కరోనాను ప్రపంచ విపత్తుగా ప్రకటించారు. మనం దేశంలో విపత్తు సహాయ చట్టం ప్రకారం ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇస్తారు. కరోనా జాతీయ విపత్తుగా పరిగణించినపుడు నష్టపరిహారం ఎందుకు ఇవ్వరు. ఎవరి జేబులో డబ్బు ఇస్తున్నారు ? ఎవరు ఎవరికి జవాబుదారులుగా ఉన్నారు, ఎవరు ఎవరిని రక్షిస్తున్నారు ? రెండు విడతలుగా ఇరవై ఆరులక్షల కోట్ల ఆత్మనిర్భర తాయిలాలను అందించిన కేంద్ర పెద్దలు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మూడు వాయిదాల కరువు భత్యం చెల్లింపునకు ఎసరు పెట్టారు. నీవు నేర్పిన విద్యయే అన్నట్లుగా రాష్ట్రాలు కూడా అదే బాటలో పయనిస్తాయా అన్నది చూడాల్సి ఉంది. అనేక దేశాలలో కరోనా సహాయ చర్యలకు గాను ప్రభుత్వాలు కార్పొరేట్ల మీద ప్రత్యేక పన్ను విధించి నిధులు సమకూర్చుకున్నారు. మన దేశంలో అలాంటిదేమీ లేకపోగా ఉద్యోగుల పొట్టగొట్టేందుకు పూనుకున్నారు. నిలిపివేసిన కరవు భత్యాన్ని వాయిదాల రూపంలో లేదా పిఎఫ్‌ ఖాతాలకు జమ చేస్తామన్నా అదొక దారి, ఎగ్గొట్టటం ఏమిటి ?
(రెండవ భాగంలో ముగింపు https://vedikaa.com/2021/08/09/india-independence-75-what-is-happening-part-two/ )

జపాన్‌ మీద అణుబాంబు వేస్తామని చైనా బెదిరించిందా ? నిందలు-నిజాలేమిటి ?

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


జూలై మూడవ వారంలో మన దేశంతో సహా ప్రపంచ మీడియాలో ఒక వార్త వచ్చింది. అదేమంటే జపాన్‌ మీద అణుబాంబులు వేస్తామని చైనా కమ్యూనిస్టు పార్టీ బెదిరించింది లేదా ప్రకటించింది. నిత్యం చైనాను రెచ్చగొట్టే దేశాలలో జపాన్‌ కూడా ఒకటి గనుక దానికి చైనా దిమ్మతిరిగే జవాబు ఇచ్చిందని ఎవరైనా కమ్యూనిస్టులు కూడా లోలోపల సంతోషించారేమో తెలియదు. వ్యతిరేకులు మాత్రం వెంటనే అందుకున్నారు. దీనిలో నిందలు- నిజాలేమిటి ? కౌపీన సంరక్షణార్ధం చివరికి ఒక సర్వసంగ పరిత్యాగి సంసార ఊబిలోకి దిగాల్సి వచ్చిందనే కథ తెలిసిందే కదా ! సదరు వార్తను పట్టుకొని గోతికాడ నక్కల్లా కూర్చున్న కొందరు అలాంటి కథలనే అల్లారు, వ్యాఖ్యానాలు చేశారు. వాటిలో చెప్పింది ఏమిటి ?


” అణ్వాయుధాలను తాముగా ముందు ఉపయోగించబోమని గతంలో ప్రకటించిన విధానానికి చైనా తిలోదకాలు ఇచ్చింది. ఇప్పుడు జపాన్ను బెదిరించింది కనుక యావత్‌ దేశాలకూ ముప్పు వచ్చింది. చైనా వారు 250 అణుబాంబులను భూగర్భంలో దాస్తున్నారు. వాటిని ప్రత్యర్ధులు పసిగట్టలేరు. కానీ అమెరికా కనుగొన్నది. ప్రత్యర్ధుల దాడికి దొరకవు. అందువలన ఆసియన్‌ దేశాలన్నీ అణ్వాయుధాలను సమకూర్చుకోవాలి.” ఇలాంటి వ్యాఖ్యానాలతో చైనా బెదిరింపుల గురించి సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రచారం జరుగుతోంది. ఈ కధనాలను ఆగస్టు ఆరవ తేదీన ఈనాడు పత్రికలో వ్యాసరచయిత కూడా తలకెత్తుకొని నేను సైతం అన్నట్లుగా ఒక రాయి వేశారు.


చైనా గురించి వచ్చిన వార్తలు, వ్యాఖ్యల్లో నిజమెంత, అసలేం జరుగుతోంది ? తైవాన్ను ఆక్రమించుకొనేందుకు చైనా ప్రయత్నించినపుడు దాన్ని అడ్డుకొనేందుకు జపాన్‌ ఒక సైనికుడు, ఒక నౌక, ఒక విమానాన్ని పంపినప్పటికీ అది లొంగిపోయేంతవరకు అణుబాంబులను ప్రయోగించాల్సిందే అని చైనా కమ్యూనిస్టు పార్టీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. చైనా ప్రధాన ప్రాంతానికి 130 కిలోమీటర్ల దూరంలో తైవాన్‌ దీవి ఉంది. అది చైనాలో తిరుగుబాటు రాష్ట్రం. దానికి ఒక వైపున దక్షిణ చైనా సముద్రం, రెండో వైపు తూర్పు చైనా సముద్రం ఉంది. మరోవైపున జపాన్‌ ఉంది. ఐక్యరాజ్యసమితి జాబితాలో తైవాన్‌ అనే దేశం లేదు. నిత్యం వివాద పడుతున్న అమెరికా, జపాన్‌ కూడా ఆ ప్రాంతం చైనాకు చెందినదే అని అంగీకరించాయన్న వాస్తవాన్ని ముందు తెలుసుకోవాలి. చైనా విప్లవ సమయంలో కమ్యూనిస్టులను ఎదిరించిన నాటి పాలకుడు చాంగ్‌కై షేక్‌ అప్పటి మిలిటరీ, ఆయుధాలను అన్నింటినీ తీసుకొని తైవాన్‌ దీవిలో కేంద్రీకరించాడు. అతగాడికి అమెరికా,బ్రిటన్‌,జపాన్‌ వంటి దేశాలన్నీ ఆయుధాలు అందించి పటిష్టపరిచాయి. కమ్యూనిస్టులు తైవాన్‌ దీవి మీద తమ బలాన్నంతటినీ కేంద్రీకరించటం కంటే మిగతా దేశంలో ఎదురవుతున్న ప్రతిఘటనను అణచివేయటమే ముఖ్యం, తరువాత తైవాన్‌ సంగతి చూద్దాం లెమ్మని అనుకున్నారు. మావో నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ తన అధికారాన్ని స్ధిరపరచుకొనేందుకు పది సంవత్సరాల పట్టింది. ఈలోగా తైవాన్‌లోని మిలిటరీని మరింత పటిష్టపరిచారు.

1970వరకు అంటే రెండు దశాబ్దాల పాటు తైవాన్‌ ప్రభుత్వాన్నే అసలైన చైనాగా ఐక్యరాజ్యసమితిలో గుర్తించటం, అధికారిక సంబంధాలు పెట్టుకోవటం వంటి పరిణామాలు జరిగాయి. ఈ నేపధ్యంలో సైనిక చర్య కంటే శాంతియుత విలీనానికే ప్రాధాన్యత ఇవ్వాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. తరువాత రెండు చైనాలు అనేవి లేవు, ఉన్నది ఒకటే, అది కమ్యూనిస్టుల నాయకత్వంలో ఉన్న ప్రధాన ప్రాంతంలోనిదే అసలైన చైనా అని, తైవాన్‌ దానిలో అంతర్భాగమే అని ఐరాస గుర్తించింది. కానీ విలీనానికి తగిన పరిస్ధితులు లేవు, తైవానీయుల్లో అనుమానాలు ఉన్నాయి, అవి తొలగిన తరువాతే విలీనం జరగాలి అంటూ అమెరికా నాయకత్వంలోని దేశాలు అప్పటి నుంచి నేటికీ విలీనానికి అడ్డుపడుతున్నాయి.


జపాన్ను బెదిరించిందంటూ పేర్కొంటున్న ఆ వీడియో కథేమిటి ? మిలిటరీ వ్యవహారాలను పరిశీలించే కొందరు వ్యాఖ్యాతలు సిక్స్‌ ఆర్మీ స్ట్రాటజీస్‌ పేరుతో నడుపుతున్న ఇంటర్నెట్‌ ఛానెల్లో సదరు వీడియోను ప్రసారం చేశారు. దాన్ని గ్జి గువా (యు ట్యూబ్‌ వంటిది)లో పెట్టారు. సదరు ఛానల్‌తో కమ్యూనిస్టు పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అవసరం అయితే అణుబాంబులు వేయాలి అన్న వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ వీడియోను తొలగించాలని చైనా ప్రభుత్వం సలహా ఇచ్చి ఉండవచ్చు లేదా ఛానల్‌ స్వయం నిర్ణయంతోగానీ దాన్ని తొలగించారు. అయితే అప్పటికే దానిని లక్షలాది మంది షేర్‌ చేశారు. స్ధానిక కమ్యూనిస్టు పార్టీ శాఖలు నిర్వహించే సామాజిక మాధ్యమ ఛానళ్లు వాటిలో ఉన్నాయి. వాటిని కూడా తరువాత తొలగించారు. ప్రపంచ మీడియాలో వార్తలకు కారణమైన సదరు వీడియో బావోజీ అనే పట్టణంలోని కమ్యూనిస్టు పార్టీ ఛానల్‌లో అలాగే ఉంది. దాన్ని చూపి అమెరికాలో స్ధిరపడిన చైనా జాతీయురాలు ఒకామె జపాన్ను కమ్యూనిస్టు పార్టీ బెదిరించింది అంటూ ట్వీట్లు చేశారు, దానిలో ఉన్న వ్యాఖ్యానాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. వాటిని ఆధారం చేసుకొని మీడియాలో కథలు రాశారు. తరువాత దాన్నుంచి కూడా తొలగించారు.


దేశ విధానం, ప్రభుత్వాలతో, అధికార పార్టీలతో నిమిత్తం లేకుండా ఇలాంటి అనధికార వ్యక్తులు, వారి వ్యాఖ్యలతో కూడిన వీడియోల ప్రచారాన్ని పార్టీలు, ప్రభుత్వాలకు అంటగట్టటం రాళ్లు వేసే కార్యక్రమం తప్ప మరొకటి కాదు. ఇక్కడ మౌలిక సమస్య ఆ వీడియో ఇప్పుడు ఎందుకు వచ్చింది ? ప్రధాన భూభాగంతో తైవాన్‌ విలీనానికి చైనా చేసే యత్నాలు తమ అస్తిత్వానికే ముప్పు అంటూ జూలై రెండవ వారంలో విడుదల చేసిన జపాన్‌ మిలిటరీ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. గడచిన ఐదు దశాబ్దాల్లో జపాన్‌ వైపు నుంచి ఇలాంటి పదజాలంతో ఆరోపణలు లేదా నివేదికలు లేవు, ఇదే తొలిసారి. ప్రస్తుతం అమల్లో ఉన్న జపాన్‌ రాజ్యాంగం ప్రకారం ఆత్మరక్షణకు అవసరమైతే యుద్దానికి దిగేందుకు అనుమతి ఉంది. అందుకే జాగ్రత్తగా అస్తిత్వం అనే పదాలను వినియోగించారు.దీని ప్రకారం చైనా మిలిటరీ గనుక తైవాన్‌ విలీనానికి పూనుకుంటే అది తమ ఉనికికే ముప్పు గనుక యుద్ధానికి దిగి అమెరికా దళాలతో కలసి జపాన్‌ ప్రతిఘటిస్తుందని జపాన్‌ ఉపప్రధాని తారో అసో ప్రకటించారు. అదే చేస్తే జపాన్‌ మిలిటరీని నాశనం చేస్తామని చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌లో వ్యాఖ్యాతలు పేర్కొన్నారు తప్ప అణుదాడి చేస్తామని ఎక్కడా చెప్పలేదు. చైనా 1964లో అణుబాంబును రూపొందించింది. ఆత్మరక్షణకు ప్రత్యర్ధులు ఉపయోగిస్తే తప్ప తాముగా ముందు వాటిని ప్రయోగించబోమని ప్రకటించింది. జపాన్‌ విషయంలో ఆ విధానాన్ని పాటించాల్సిన అవసరం లేదని సిక్స్‌ ఆర్మీ స్ట్రాటజీస్‌ వీడియో సలహా యిచ్చింది.


జపాన్‌ మీద చైనాలో అంత ఆగ్రహం ఎందుకు ఉంది ? ఎవరినుంచి ఎవరికి ముప్పు ఉంది? ఆసియాలో మిలిటరీ శక్తిగా ఎదిగిన జపాన్‌ ఆక్రమించిన దేశాలలో చైనా కూడా ఒకటి. దానికి వ్యతిరేకంగా జరిపిన పోరాటాలు తెలిసినవే. అందుకే జపాన్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను పెద్ద సంఖ్యలో నెటిజన్లు బలపరిచారు. జపాన్‌ దేశం దీవుల సముదాయం. ప్రధాన దీవుల ప్రాంతం నుంచి ఒకినావా అనే దీవి 640కిలోమీటర్లు, (అదే టోకియో నగరానికి 1,550 కిలోమీటర్లు,) అక్కడి నుంచి తైవాన్‌ 500కిలోమీటర్ల దూరంలో ఉంది. చైనా సముద్రతీర ప్రాంతం ఏడు వందల కిలోమీటర్లలో ఉంది. జపాన్‌ మొత్తంలో ఎన్ని అమెరికా నౌకా స్దావరాలు ఉన్నాయో వాటిలో 62శాతం అంటే 28 ఈ దీవిలోనే ఉన్నాయి. అక్కడ పన్నెండు వందల అణ్వాయుధాలు, యాభైవేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఎందుకటా ? అక్కడికి పన్నెండువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూయార్క్‌, ఇతర అమెరికా ప్రాంతాల భద్రత కోసం ఇక్కడ తిష్టవేయాలని అమెరికా చెబుతోంది. అందుకు జపాన్‌ అంగీకరించింది. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి ఎక్కడుందో చూద్దామని అని చెప్పినట్లుగా లేదూ !


సదరు వీడియోలో ఉన్నదేమిటి ? ” మనం తైవాన్ను విముక్తి చేసినపుడు ఒక వేళ జపాన్‌ బలంతో జోక్యం చేసుకుంటే, అది ఒక సైనికుడిని, ఒక విమానాన్ని, ఒక నౌకను మాత్రమే దించినా మనం ప్రతిదాడికి దిగటమే కాదు, పూర్తి స్ధాయి యుద్దానికి పూనుకోవాలి. తొలిసారిగా మనం అణుబాంబులను వినియోగించాలి. బేషరతుగా లొంగిపోతున్నట్లు రెండవ సారి జపాన్‌ ప్రకటించే వరకు అణుబాంబులను వినియోగిస్తూనే ఉండాలి.(రెండవ ప్రపంచ యుద్దంలో తొలిసారిగా బేషరతుగా లొంగిపోతున్నట్లు బ్రిటన్‌,చైనాలతో జపాన్‌ ఒప్పందం చేసుకుంది) జపాన్‌ యుద్ద సామర్ధ్యం పూర్తిగా కోల్పోయేవరకు మన లక్ష్యం ఉండాలని మేము చెబుతున్నాము.ఇంకే మాత్రం యుద్ద మూల్యం చెల్లించలేమని జపాన్‌ గుర్తించినపుడే తైవాన్‌కు దూకుడుగా అది సైన్యాన్ని పంపేందుకు సాహసించదు.


ఇప్పుడు అంతర్జాతీయ పరిస్ధితి నాటకీయంగా మారిపోయింది.ప్రస్తుతం మన దేశం ఒక శతాబ్ది కాలంలో ఎన్నడూ చూడని విధంగా ఒక ప్రధాన పరివర్తన మధ్యలో ఉంది. అన్ని రాజకీయ విధానాలు, ఎత్తుగడలు, వ్యూహాలను దానికి అనుగుణ్యంగా సర్దుబాటు చేసుకోవాలి, పరివర్తనకు అనుగుణ్యంగా మార్చుకోవాలి. అణువిధానాన్ని కూడా పరిమిత సర్దుబాట్లకు వీలుగా మార్చాల్సి ఉంది. జపాన్‌ మినహాయింపు అనే సిద్దాంతాన్ని ఒక నిష్టగా మనం ముందుకు తీసుకుపోవాలి. అణ్వాయుధాలను తొలి సారిగా ఉపయోగించకూడదు అనే విధానానికి జపాన్‌ మినహాయింపు అని సూచించాలి. మనం జపాన్‌కు హెచ్చరిక చేస్తున్నాం, ప్రపంచానికి తెలియచేస్తున్నాం. అదేమంటే ప్రధాన భూభాగంతో తైవాన్‌ విలీనంతో సహా జపాన్‌ మిలిటరీ పద్దతుల్లో మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే జపాన్‌కు వ్యతిరేకంగా అణ్వాయుధాలను ఉపయోగించాలి. బేషరతుగా లొంగిపోయేంతవరకు వాటిని వినియోగిస్తూనే ఉండాలి.


జపాన్‌ గనుక మూడోసారి చైనాతో యుద్దానికి దిగితే చైనా జనం పాత, కొత్తల బదులు తీర్చుకోవాలి. వారితో శాంతి చర్చలు వద్దు. దియాయు,రియుకు దీవులను (ఒకినావా పరిసరాల్లో ఉన్న దీవులు) తిరిగి స్వాధీనం చేసుకుందాం ” అనే వ్యాఖ్యానం ఆ వీడియోలో ఉంది.
జపాన్‌ మిలిటరీ నివేదికను వెలువరించక ముందే తైవాన్‌ గురించి జపాన్‌ రెచ్చగొడుతున్నది. జూన్‌ 24న రక్షణ మంత్రి నోబు కిషి మాట్లాడుతూ తైవాన్‌ భద్రతకు జపాన్‌కు ప్రత్యక్ష సంబంధం ఉంది అన్నాడు. చైనా ఒకటే అనే విధానం అనుసరించాలంటే అది కాలపరీక్షకు నిలబడుతుందా ? అది సరైనదేనా, నాకు తెలియదు అని జపాన్‌ ఉపరక్షణ మంత్రి యుషిహైడ్‌ నకయామా అన్నాడు. అధికారికంగా జపాన్‌ వైఖరిలో మార్పు లేనప్పటికీ దానికి కట్టుబడి ఉండాల్సిన అగత్యం లేదని పరోక్షంగా చెప్పటం, తైవాన్‌ సమస్యను తురుపుముక్కగా ఉపయోగించుకొనే యత్నమే. తైవాన్‌ వేరు కాదు, చైనాలో అంతర్భాగమే అని గుర్తిస్తూనే దానికి ఆయుధాలు అందిస్తున్న అమెరికా బాటలోనే జపాన్‌ కూడా నడుస్తున్నది. చైనాాజపాన్‌ సాధారణ సంబంధాలు నెలకొల్పుకొని ఐదు దశాబ్దాలు గడచింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, జపాన్‌ ప్రధాని సుగా విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో తొలిసారిగా తైవాన్‌ సమస్యను ప్రస్తావించారు. ప్రస్తుతం జపాన్‌ రాజ్యాంగం ప్రకారం జపాన్‌ నేరుగా చైనా మీద యుద్దానికి దిగకపోయినా తన గడ్డపై ఉన్న అమెరికా స్దావరాలకు అవసరమైన అన్ని రకాల సాయాన్ని అందించగలదు. ఒక వేళ నేరుగా యుద్దంలోకి దిగితే చైనా చేతిలో చావు దెబ్బలు తింటుంది.


చైనా వీడియో ప్రయివేటు వ్యవహారం గనుకనే జపాన్‌ అధికారికంగా స్పందించలేదు. దాని రక్షణకు హామీ ఇచ్చిన అమెరికా వైపు నుంచి కూడా వ్యాఖ్యలేమీ లేవు. మరి మీడియా వార్తలు ఏమిటి అంటే, స్పందన ఎలా ఉంటుందో తెలుసుకొనేందుకు అమెరికా, జపాన్‌ ప్రచారదాడిలో భాగంగా వెలువడిన కట్టుకధలు మాత్రమే.ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్దంలో బైడెన్‌ కొత్తగా చేరినా అమెరికన్లు నెగ్గే సూచనలు కనుచూపు మేరలో లేవు. ఏదో విధంగా చైనాతో గిల్లి కజ్జా పెట్టుకోవాలంటే దక్షిణ చైనా సముద్రం, తైవాన్‌, హాంకాంగ్‌ సాకులు ఉన్నాయి. జపాన్‌, ఆస్ట్రేలియాలు అన్ని విషయాల్లో, కొంత మేరకు మన దేశం అమెరికాతో యుగళగీతాలు పాడుతోంది.

అమెరికా కోసం మనం చైనాను రెచ్చగొట్టటం అవసరమా ?

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


చైనాతో సరిహద్దు వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవటం మినహా మరొక మార్గం లేదని తేలిపోయింది. ఎవరెన్ని మాటలు మాట్లాడినా, ఎంతగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా గాల్వన్‌ ఉదంతం తరువాత రెండు దేశాల మధ్య మరో ఘర్షణకు తావు లేకుండా ఇప్పటి వరకు 12 దఫాల చర్చలు జరపటమే అందుకు నిదర్శనం. పరస్పరం విశ్వాసం కుదిరి రెండు వైపులా మోహరించిన సేనల ఉపసంహరణ జరిగేందుకు ఎంతకాలం పడుతుందో తెలియదు. చర్చలు ఒకవైపు జరుపుతూనే మరోవైపు ఉభయ దేశాలూ సరిహద్దు వెంట బలాలను మోహరిస్తున్నాయి. ఎవరు ముందు, ఎవరు వెనుక అన్నది పక్కన పెడితే ఎవరి సైనికులను వారు ఉత్సాహపరిచేందుకు లేదా నైతికంగా మద్దతు ప్రకటించేందుకు ఉభయ దేశాల నేతలు సరిహద్దు సందర్శనలు చేశారు. ఎవరి జాగ్రత్త వారు పడాలనటంలో ఎలాంటి పేచీ లేదు. పరస్పరం అనుమానాలను పెంచినప్పటికీ ఈ చర్యలు తప్పదు. యుద్దం జరిగే అవకాశాలేమీ లేవు, అందుకు ఎవరూ సిద్దంగా లేరు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ గత నెలాఖరులో మన దేశ సందర్శనకు వచ్చారు. రావటాన్ని తప్పు పట్టనవసరం లేదు, వచ్చి ఏం చేశాడనేదే సమస్య.


ఈ సమావేశాల తరువాత ఢిల్లీలోని టిబెట్‌ హౌస్‌ డైరెక్టర్‌ గెషె డోర్జీ డామడుల్‌ వివిధ మీడియా సంస్ధల ప్రతినిధులతో మాట్లాడాడు.గెషె గతంలో దలైలామాకు దుబాసీగా వ్యవహరించాడు. పౌర సమాజంతో కలయిక పేరుతో జరిగిన సమావేశంలో అమెరికా మంత్రి బ్లింకెన్‌ పాల్గొన్నాడు.ఈ సందర్భంగా దలైలామా ప్రతినిధి, టిబెట్‌ తిరుగుబాటు ప్రభుత్వంలో కీలక వ్యక్తి అయిన గోడుప్‌ డోంగ్‌ చంగ్‌లతో ప్రత్యేకంగా భేటీ అయ్యాడు. చైనా విస్తరణ వ్యూహాన్ని అమెరికా, భారత్‌ ఐక్యంగా దెబ్బతీయాలని,ప్రపంచ శాంతికి చైనా శత్రువు అని టిబెట్‌ హౌస్‌ డైరెక్టర్‌ గెషె ఆరోపించాడు. టిబెట్‌కు అమెరికా మద్దతు ఇవ్వటం చైనా కమ్యూనిస్టు పార్టీని నిలువరించేందుకే అని ప్రపంచానికి బలమైన సందేశం ఇవ్వటమే అని కూడా అన్నాడు.ప్రపంచంలో ప్రజాస్వామ్య సూత్రాలు, చట్టాలు, నాగరికతను చైనా నాశనం చేస్తున్నదని, టిబెట్‌కు ఏం జరిగిందో ప్రపంచానికి అదే జరుగుతుందని ఆరోపించాడు.


పాక్‌ ఆక్రమిత కాశ్మీరులో జరిపిన ఎన్నికలు, తాలిబాన్ల ప్రతినిధులు చైనా సందర్శన, చైనా-పాక్‌ అర్ధిక నడవా గురించి మన దేశం స్పందించింది. ఆక్రమించిన ప్రాంతాలన్నింటి నుంచి పాక్‌ వైదొలగాలని మన విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్జీ డిమాండ్‌ చేశారు. ఆక్రమిత ప్రాంతంలో ఎన్నికలు మసిపూసి మారేడు కాయ చేయటం తప్ప మరొకటి కాదు, చట్టవిరుద్దం అన్నారు. దీని గురించి తీవ్ర నిరసన తెలిపామన్నారు. ఆ ఎన్నికలను స్ధానికులు నిరసించి తిరస్కరించారన్నారు. చైనా-పాక్‌ ఆర్ధిక నడవా అక్రమంగా పాకిస్తాన్‌ ఆక్రమించిన మన ప్రాంతం నుంచి పోతున్నదని చెప్పారు. ఆక్రమిత ప్రాంతాలలో యథాతధ స్దితిలో మార్పు చేయటాన్ని అంగీకరించబోమన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ మన దేశాన్ని సందర్శించిన సమయంలోనే తాలిబాన్ల ప్రతినిధులు బీజింగ్‌లో చైనా విదేశాంగ అధికారులను కలిశారు. తమ గడ్డను మరో దేశానికి వ్యతిరేకంగా వినియోగించుకొనేందుకు అంగీకరించేది లేదని వారు అంతకు ముందే ప్రకటించారు. ఏకపక్షంగా మరో దేశం ఆప్ఘనిస్తాన్‌ మీద తమ వాంఛలను రుద్దటాన్ని భారత్‌ అంగీకరించదని, అలాంటి చర్య అక్కడ స్ధిరత్వాన్ని, చట్టబద్దతను కల్పించదని మన ప్రతినిధి అరిందమ్‌ అన్నారు. గత రెండు దశాబ్దాలుగా సాధించిన విజయాలను పరిరక్షించాలని చెప్పారు.


టిబెట్‌ లేదా చైనా విషయంలో భారత్‌ చేయాల్సినంతగా చేయటం లేదని,తన ప్రయోజనాలను సాధించుకొనేందుకు టిబెట్‌ సమస్యను భారత్‌ ఉపయోగించుకోరాదని మన దేశంలోని టిబెట్‌ తిరుగుబాటు ప్రభుత్వ నూతన అధ్యక్షుడు పెంపా సెరింగ్‌ అన్నారు. మే నెలలో తాను ఎన్నికైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. దౌత్య, రాజకీయ అవసరాల కోసం టిబెట్‌ను ఉపయోగించుకోరాదని ఇప్పుడు భారత్‌ గుర్తిస్తున్నదని, ఇప్పటి వరకు అదే చేశారని, దానికి బదులు సమస్యను పరిష్కరించేందుకు పూనుకోవాలన్నాడు.అసలు భారత్‌ – చైనా మధ్య సరిహద్దే లేదని అది టిబెట్‌ -భారత్‌ మధ్య సరిహద్దు అన్నాడు. ఆ రీత్యా చైనాకు భూమి దక్కదన్నాడు. దీర్ఘకాలంగా భారత దేశం చైనా పట్ల సానుకూలంగా ఉందని, అయితే భారతీయుల మనోభావాలను చైనా గాయపరచిందన్నాడు. సెరింగ్‌ కర్ణాటకలోని టిటెట్‌ శరణార్దుల శిబిరం బయలకుప్పెలో జన్మించాడు.


తాలిబాన్ల చేతుల్లో చావు దెబ్బలు తినటం లేదా వారిని అణచివేయటంలో వైఫల్యంతో అమెరికా, దాని మిత్రపక్షాలు వారికి ఒక సలాంగొట్టి తమ మిలిటరీని ఉపసంహరించుకొనేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చిందన్నట్లుగా వారిద్దరూ బాగానే ఉన్నారు, మనకు సమస్యను తెచ్చిపెట్టారు. తాము తప్పుకుంటూ తాలిబాన్లతో పోరాడే బాధ్యతను మనకు అంట గట్టేందుకు అమెరికా తెలివిగా పావులు కదిపింది. ఇప్పటికీ వదలటం లేదు. నరేంద్రమోడీని ”దేశపిత ” అని కీర్తిస్తూ మనలను మునగ చెట్టు ఎక్కించటంలో గతంలో ట్రంప్‌ ఏమి చేశాడో ఇప్పుడు బైడెన్‌ కూడా అదే బాటలో ఉన్నాడు. లేకపోతే ఢిల్లీ వచ్చిన బ్లింకెన్‌ ఆఫ్ఘనిస్తాన్‌ స్ధిరత్వానికి, అభివృద్దికి భారత్‌ ఎంతో చేయాల్సి ఉంది, కొనసాగిస్తుంది అని చెప్పడు. ఆ సమస్య మనలను వదిలేట్లు లేదు. నరేంద్రమోడీ అమెరికా తలనొప్పిని తగిలించుకుంటారా, లేదా, ఏం జరగనుందో తెలియదు.


అమెరికా ఖాళీ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ స్ధానాన్ని చైనా ఆక్రమించుకుంటుందనే వార్తలను వండి వారుస్తున్నారు.చైనాను భూతంగా చూపి మన దేశాన్ని ఇరికించే ఎత్తుగడ దీనివెనుక ఉందన్నది స్పష్టం. అక్కడ అధికారంలో ఎవరు ఉండాలనేది తేల్చుకోవాల్సింది అదేశ వాసులే. తాలిబాన్లే అధికారాన్ని పొందినా లేదా మిలిటరీ పైచేయి సాధించి వారిని అణచివేసి ఇప్పుడున్న ప్రభుత్వమే కొనసాగినా తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇతర దేశాలు దౌత్య సంబంధాలను కొనసాగించాల్సి ఉంటుంది. అక్కడ స్ధిరత్వం ముఖ్యం. మిగతా అంశాలు తరువాత. ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లాలని ఎవరు కోరారు, ఇప్పుడు ఖాళీ చేయాలని ఎవరు చెప్పారు ? అమెరికా అనుభవం చూసిన తరువాత ఎవరైనా అక్కడ అడుగుపెట్టి చేతులు కాల్చుకుంటారా ? ఒకటి స్పష్టం ఆక్కడ స్ధిరత్వం ఉండటం సరిహద్దు బంధం లేని మన దేశానికి ఎంత అవసరమో బంధం ఉన్న చైనాకూ అంతకంటే ఎక్కువే ఉంది. ఇప్పటి వరకు మనకు పాకిస్తాన్‌ ద్వారా తాలిబాన్లు దిగుమతి అయితే చైనాకు నేరుగా వెళ్లారు, చైనా తాలిబాన్లకు తమ గడ్డమీద ఆశ్రయం కల్పించారు.


అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకన్‌ మన దేశంలో దలైలామా ప్రతినిధులను కలవటాన్ని చైనా వ్యతిరేకించింది. టిబెట్‌ ప్రాంతం చైనా అంతర్భాగమే అని గుర్తించిన అమెరికా విధానానికి ఇది వ్యతిరేకమని, దలైలామా కోరుతున్న స్వాతంత్య్రాన్ని అంగీకరించరాదని, చైనా నుంచి వేరు చేసే చర్యలను సమర్ధించరాదని వ్యాఖ్యానించింది. టిబెట్‌ సమస్యల పేరుతో తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేసింది. తైవాన్‌, టిబెట్‌, హాంకాంగ్‌తో సహా చైనాలో అంతర్భాగమే అని అధికారికంగా అమెరికా గుర్తిస్తున్నది. అయితే ఏదో ఒకసాకుతో వాటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నది. భౌగోళికంగా టిబెట్‌ ప్రధాన ప్రాంతానికి దూరంగా ఉండటం, చైనా పాలకులకు సామంత రాజ్యంగా ఉంది తప్ప చరిత్రలో స్వతంత్ర దేశంగా లేదు. అయితే బ్రిటన్‌, నేపాల్‌, మంగోలియాలు అక్కడ దౌత్య కార్యాలయాల ఏర్పాటు, కొన్ని ఒప్పందాలు చేసుకోవటం, వాటిని గుర్తించకపోవటం వంటి అంశాలన్నీ చరిత్రలో ఉన్నాయి. వాటికి ఎవరికి తోచిన, అవసరమైన భాష్యాన్ని వారు చెబుతున్నారు. టిబెట్‌ సామంత పాలకులు బ్రిటీష్‌ వారితో చేసుకున్న ఒప్పందాన్ని చైనా గుర్తించలేదు.

1910లో నాటి చైనా పాలకులు(కమ్యూనిస్టులు కాదు) దలైలామా తిరుగుబాటును అణచేందుకు సైన్యాన్ని పంపారు. నాటి దలైలామా పారిపోయి మన దేశం వచ్చి మూడు సంవత్సరాలు ఇక్కడే ఉండి తిరిగి టిబెట్‌ వెళ్లాడు. మనకు స్వాతంత్య్రం వచ్చే నాటికి అక్కడ ఉన్న బ్రిటీష్‌ వారి దౌత్య కార్యాలయం భారత కార్యాలయంగా మారింది. కమ్యూనిస్టులకు ముందు చాంగ్‌కై షేక్‌ అధికారంలో ఉన్నపుడు అమెరికా, బ్రిటన్‌ వంటి పశ్చిమ దేశాలన్నీ టిబెన్‌ను చైనా అంతర్భాగంగానే గుర్తించాయి. స్వాతంత్య్రం తరువాత మన ప్రభుత్వం మాత్రం స్వతంత్ర దేశమనే వైఖరితోనే వ్యవహరించింది. దాని కొనసాగింపుగానే 1959లో దలైలామా తిరుగుబాటుకు అమెరికా పన్నిన కుట్రలో మనమూ భాగస్వాములమై ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని సౌకర్యాలను కల్పించాము. తరువాత 1962లో యుద్దం, సరిహద్దు వివాద చరిత్ర తెలిసిందే. 1988లో ప్రధాని రాజీవ్‌ గాంధీ చైనా పర్యటన చేసిన సమయంలో టిబెట్‌ స్వయం ప్రతిపత్తి కలిగిన చైనా రాష్ట్రమనే దీర్ఘకాలిక వైఖరిని పునరుద్ఘాటిస్తున్నట్లు ప్రకటించి ఒక స్పష్టతను ఇచ్చారు.2003లో ఎన్‌డిఏ ప్రధాని అతల్‌ బిహారీ వాజపాయి ఈ మేరకు చైనాతో ఒక ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు. రాజీవ్‌ గాంధీ తొలుత ప్రకటన చేసినప్పటికీ వాజపాయి మాత్రమే అధికారిక గుర్తింపు ఇచ్చారు. అదే సమయంలో టిబెట్‌ ప్రవాస ప్రభుత్వాన్ని కూడా మన గడ్డపై కొనసాగించారు. అదే ద్వంద్వ వైఖరి ఇప్పటికీ కొనసాగుతున్నది. టిబెట్‌ వ్యవహారాల్లో పరోక్షంగా మనం వేలుపెడుతూనే ఉన్నాం.

టిబెట్‌ తిరుగుబాటు దారులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాము.2014లో నరేంద్రమోడీ ప్రమాన స్వీకార ఉత్సవానికి టిబెట్‌ తిరుగుబాటు ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న టిబెన్‌-అమెరికన్‌ లోబ్‌ సాంగ్‌ సాంగేకి ఆహ్వానం పంపాము.2017లో అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేమా ఖండు ఒక ప్రకటన చేస్తూ తమ రాష్ట్రానికి టిబెట్‌తో తప్ప చైనాతో సరిహద్దు లేదని ప్రకటించాడు. తరువాత దలైలామా అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ పట్టణ పర్యటనకు వెళ్లాలన్న నిర్ణయాన్ని చైనా అభ్యంతర పెట్టింది.ప్రధాని నరేంద్రమోడీ 2018లో చైనాలో ఊహాన్‌ నగర సందర్శన తరువాత మన అధికారులు తిరుగుబాటు టిబెట్‌ ప్రభుత్వ కార్యక్రమాలకు, దలైలామా కార్యక్రమాలకు ఎవరూ హాజరు కాకూడదని మన విదేశాంగశాఖ ఆదేశాలు జారీ చేసింది. గాల్వన్‌ ఉదంతమైనా, అదే విధంగా సరిహద్దు సమస్య అయినా చైనాతో మన ప్రభుత్వం పరిష్కరించుకోవాల్సి ఉంది. చైనాకు వ్యతిరేకంగా తిరుగుబాటు టిబెటన్లతో ఏర్పాటు చేసిన అనధికార, కిరాయి స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌(ఎస్‌ఎఫ్‌ఎఫ్‌) వంటి చర్యలు చైనాను రెచ్చగొట్టేవే అన్నది స్పష్టం. ప్రవాస టిబెటన్‌ ప్రభుత్వం, దలైలామాలను మనం చైనాతో బేరసారాలకు వినియోగించుకోవటం, కీడెంచటం ప్రతికూల ఫలితాలకు దారి తీసిందని మన విదేశాంగశాఖ కార్యదర్శిగా పని చేసిన శ్యామ్‌ చరణ్‌ వ్యాఖ్యానించారు.

గత నెలాఖరులో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ తిరుగుబాటు టిబెటన్‌ ప్రతినిధులతో భేటీ కావటాన్ని మన గడ్డ మీద అనుమతించటం కూడా అలాంటిదే. అమెరికా కోసం మనం చైనాతో తగాదా తెచ్చుకోవాల్సిన అగత్యం ఏమిటి ? కావాలంటే అమెరికన్లు దలైలామాను తమ దేశానికి పిలిపించుకోవచ్చు. చైనా నుంచి టిబెట్‌ను విడదీయటం అమెరికా కాదు,దాని తాతలు దిగివచ్చినా జరిగేది కాదు.మనం సహకరిస్తే అది జరుగుతుందని ఎవరైనా అనుకుంటే వారు ఈ లోకానికి చెందిన వారు కాదు. కాశ్మీరులో కొంత భాగం మన ఆధీనంలో లేదు. టిబెట్‌ విషయంలో చైనాకు అలాంటి సమస్య లేదు. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లో భాగమే అని చెబుతున్నప్పటికీ దానికోసం సాయుధ చర్యకు పూనుకుంటామనే మాట చైనా వైపు నుంచి లేదు. టిబెట్‌ వ్యవహారంలో మనం ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్న కారణంగానే కాశ్మీరు విషయంలో చైనా కూడా అదే పద్దతిలో వ్యహరిస్తున్నది. చైనా పూర్తి మద్దతు లేకుండా ఎప్పటికైనా ఆక్రమిత కాశ్మీరును తిరిగి తెచ్చుకోవాలనుకొనే మన ప్రభుత్వం అనుసరించే ఎత్తుగడలు సరైనవేనా ? అంతిమంగా నష్టపోయేది ఎవరు అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. చైనాను కాల్చేందుకు అమెరికా మన భుజాల మీద తుపాకి ఎక్కుపెడుతున్నది. మనమెందుకు దాన్ని మోయాలి ? కాశ్మీరు సమస్యను మరింత సంక్లిష్టం చేసుకోవాల్సిన అవసరం ఏముంది ?

ముస్లిం సంతుష్టీకరణ : ఆర్‌ఎస్‌ఎస్‌ టక్కు టమార, గజకర్ణ గోకర్ణ విన్యాసాలు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


చరిత్ర అడక్కు చెప్పింది విను ! ఇది ఒక సినిమాలో మాట.పాకిస్తాన్‌ జాతిపితగా పరిగణించే మహమ్మదాలీ జిన్నాను పొగిడినందుకు 2005లో ఎల్‌కె అద్వానీ పార్టీ అధ్యక్ష పదవిని పోగొట్టుకున్నారు. ఆ వ్యాఖ్యలకు ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్ర అభ్యంతరం తెలిపినట్లు వార్తలు వచ్చాయప్పుడు. కేంద్ర మంత్రిగా పని చేసిన జస్వంత సింగ్‌ రాసిన పుస్తకంలో జిన్నా గురించి చేసిన సానుకూల వ్యాఖ్యలకు గాను ఏకంగా పార్టీ నుంచే పంపేశారు. బిజెపి, అంతకు ముందు దాని పూర్వ రూపం జన సంఫ్‌ు చరిత్ర చూసినపుడు వారి పార్టీల గొప్పతనం కంటే తాము తప్ప ఇతర పార్టీలన్నీ ముస్లింలను సంతుష్టీకరించి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయన్న నిరంతర ప్రచారమే ఎక్కువగా ఉండేది. హిందువులు-ముస్లింల డిఎన్‌ఏ ఒకటే అని ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన భగవత్‌ జూలై నాలుగున వ్యాఖ్యానించారు. ఘజియాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కుదురులోని ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ సమావేశంలో ఉపన్యసించారు. దీని గురించి అనేక విమర్శలు, సమర్దనలూ వెలువడ్డాయి.భారత్‌లో ఇస్లాం ప్రమాదంలో పడిందని ఎవరూ భయవలయంలో చిక్కుకోవద్దని, మతం ఏదైనా భారతీయుల డిఎన్‌ఏ ఒకటే అని, అసలు హిందూ-ముస్లిం ఐక్యత అనేదే తప్పుదారి పట్టించే మాట అని భగవత్‌ చెప్పారు. తరువాత జూలై 21న గౌహతిలో ఒక పుస్తక ఆవిష్కరణ సభలో కూడా దాన్ని పునరుద్ఘాటించారు. భిన్నమైన మతాలలో ఉన్నప్పటికీ శతాబ్దాల తరబడి కలసి మెలసి ఉన్నారని, ఆహార అలవాట్లు, సంస్కృతి ఒకటే అని చెప్పారు. ఇంతవరకు అద్వానీ, జస్వంత్‌ ఉదంతాలు పునరావృతం కాలేదు. అయ్యే సూచనలు కూడా లేవు.


భగవత్‌ ప్రసంగం మీద వెల్లడైన, ఇంకా వెల్లడవుతున్న కొన్ని స్పందనల తీరు తెన్నులు చూద్దాం. ముస్లింలకు సన్నిహితం అయ్యేందుకు చేసిన సంతుష్టీకరణ వ్యవహారమిది అన్నది కొందరి అభిప్రాయం. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగా విరమించుకొనేందుకు మోహన్‌ భగవత్‌ తేదీని స్వయంగా ముందుకు జరిపారు అని మరుసటి రోజే మితవాద ప్రతీకగా ఉండే జర్నలిస్టు మధు కిష్వర్‌ ట్వీట్‌ చేశారు. ” హిందూ భావజాలాన్ని ప్రచారం చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్నదేమీ లేదు, వారు గాంధీ కంటే ఎక్కువ గాంధేయులుగా ఉన్నారు. స్వంత జనాలను, భావజాలాన్ని వారు రక్షించటం లేదు, వారు మంచి పిల్లలుగా కనిపించాలని కోరుకుంటున్నారు. వారికి మద్దతు ఇవ్వటానికి మేమేమీ ఆర్‌ఎస్‌ఎస్‌ నేపధ్యం నుంచి వచ్చిన వాళ్లం కాదు, కానీ హిందువులను రక్షించే చిత్తశుద్ది వారిలో లేదని తరువాత కనుగొన్నాం. వారి కంటే కాంగ్రెస్‌ ఎంతో నిజాయితీగా ఉంది.” అన్నారు. సిబిఐ తాత్కాలిక ఉన్నతాధికారిగా పనిచేసిన సంఘపరివార్‌కు చెందిన రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారి ఎం నాగేశ్వరరావు గౌహతిలో భగవతి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. ” కేవలం జిన్నాను పొగిడినందుకే అద్వానీని అవమానకరంగా బిజెపి జాతీయ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఎంఆర్‌ఎం, సర్వధర్మ సంభవ్‌ లేదా సమాదరణ, ఒకే డిఎన్‌ఏ, రోటీ-బేటీ సంపర్క తదితరాల ప్రచారంతో హిందూ సమాజానికి అంత (అద్వానీ) కంటే పదిలక్షల రెట్ల హాని చేశారు.” అని ట్వీట్‌చేశారు.


వక్రీకరణలకు, తప్పుడు వార్తలకు పేరు మోసిన ఒపిఇండియా వెబ్‌ సైట్‌ రాసిన వ్యాసంలో డిఎన్‌ఏ వ్యాఖ్యలు ఆర్‌ఎస్‌ఎస్‌ గాంధియన్‌ బలహీనత (దోషం) అని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంతో గౌరవం పొందిన సంస్ధ. లౌకికవాదం అనే అబద్దం గురించి మేలుకున్న సామాన్య హిందువులను దూరం చేసుకొనే ప్రమాదాన్ని కొని తెచ్చుకొంటోంది అని హెచ్చరించారు. ”ఆర్‌ఎస్‌ఎస్‌ను స్ధాపించిన గురు గోల్వాల్కర్‌ దాన్ని ఒక హిందూ సంస్దగా ఏర్పాటు చేశారు తప్ప ముస్లింల కోసం కాదు. ముస్లింలు, క్రైస్తవులకు ఓటు హక్కు నిరాకరించాలని కూడా గోల్వాల్కర్‌ చెప్పారు. హిందువులు-ముస్లింలకు సంబంధం లేని ఆయన స్పష్టం చేశారు. ముస్లింల మీద ఇవన్నీ కొత్తగా వృద్ది చెందిన ఆలోచనలు ” అని నయా ఇండియా అనే పత్రికలో శంకర షరాన్‌ అనే జర్నలిస్టు పేర్కొన్నారు. ” భగవత్‌ ప్రతి ఒక్కరి సంరక్షకుడు కాదు. ఆయన తన డిఎన్‌ఏ గురించి ఎలా అయినా మాట్లాడవచ్చు. బహుశా ఆయన ఔరంగజేబు డిఎన్‌ఏ పంచుకొని ఉండవచ్చు, అది అందరి విషయంలో వాస్తవం కాదు ” అని ఘజియాబాద్‌లోని దర్శన దేవి దేవాలయ వివాదాస్పద పూజారి యతి నరసింహానంద సరస్వతి వ్యాఖ్యానించారు. ఇక విశ్వహిందూ పరిషత్‌ నేత సాధ్వి ప్రాచీ అయితే ” ఆవు మాంసాన్ని తినేవారెవరినీ ఎన్నడూ మనలో కనుగొనలేము” అన్నారు.


ఆర్‌ఎస్‌ఎస్‌ నేత భగవత్‌ మీద ధ్వజమెత్తిన వారే కాదు, భజన చేసిన వారు కూడా ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి పుస్తకాలు రాసిన రతన్‌ శారద ఆయన ఉపన్యాసంలో కొత్తగా చెప్పిన విషయాలేమీ లేవన్నారు. సుదర్శన్‌ గారు అధిపతిగా ఉన్న 2000-09లో కూడా హిందూాముస్లిం ఐక్యత గురించి చెప్పారు. అందుకోసమే ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ను ఏర్పాటు చేశారు.ఆహార అలవాట్లు, పూజా పద్దతులు వేర్వేరుగా ఉండవచ్చుగానీ ఏకీకరణ మీద అవి పెత్తనం చేయలేవు, మెజారిటీ, మైనారిటీ అనేవి లేవు. ప్రార్ధించే పద్దతిని బట్టి సమాజంలో వర్గీకరణ చేయటమే ముస్లింల సంతుష్టీకరణ, ఓటు బ్యాంకు రాజకీయాలకు కారణం, ఆర్‌ఎస్‌ఎస్‌ దాన్ని వ్యతిరేకిస్తున్నది ” అన్నారు. భగవత్‌ డిఎన్‌ఏ ఉపన్యాసంతో తలెత్తిన ఆగ్రహాన్ని చల్లార్చేందుకు సంఘీయులు ఊహించినట్లుగానే సాము గరిడీలు చేస్తున్నారు. గురూజీ హిందూత్వను వదులుకున్నట్లు ప్రకటించలేదు, దానికే కట్టుబడి ఉన్నారు, ఐక్యతను మాత్రమే కోరుకుంటున్నారు. విశ్వహిందూ పరిషత్‌, ఇతర హిందూ సంస్ధలు చేపట్టిన ఘర్‌వాపసీ కార్యక్రమాన్ని ఆయన ప్రోత్సహించిన అంశాన్ని గుర్తు తెచ్చుకోండి. గోవధ హిందూత్వ వ్యతిరేకం అని కూడా చెప్పారు. సంఫ్‌ు ఇంతకాలంగా చెబుతున్నదానిని-భగవత్‌ ప్రసంగాన్ని విడదీసి చూస్తే కొత్తగా చెప్పినట్లు అనిపించవచ్చు తప్ప కొత్తేమీ లేదు అంటూ మొత్తం మీద సంఫ్‌ు అజెండాలో ఎలాంటి మార్పూ లేదు కనుక ఎవరూ కంగారు పడనవసరం లేదనే భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.భగవత్‌ ప్రసంగాన్ని విమర్శించిన వారిని ఎక్కడా తప్పు పట్టటం లేదు. ఆయన మాట్లాడింది ముస్లింలు పాల్గొన్నసభ, ఐక్యతను కోరుకుంటున్నది, రెండు మతాల మధ్య ఒక చర్చను ప్రారంభించాలనే లక్ష్యంతో మాట్లాడినవిగా గుర్తించాలని ఓదార్పు పలుకుతున్నారు. భారతీయత గురించి మాట్లాడటం అంటే దాని అర్ధం ముస్లింలు, ఇతర మైనారిటీలను తిరిగి మతమార్పిడి చేస్తామని కాదు, వారు ఈ గడ్డను స్వంతంగా చేసుకొని, విధేయులై జీవించాలన్నదే అని ముస్లింలకు హామీ ఇస్తున్నారు.


అయితే ఇప్పుడెందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత డిఎన్‌ఏ, హిందూ ముస్లిం ఐక్యత అంశాన్ని మరోసారి ముందుకు తెచ్చారు. ఊరకరారు మహాత్ములు అన్నట్లుగా ఎలాంటి ఉద్దేశ్యం లేకుండానే అలా మాట్లాడతారా ? ప్రతి పార్టీ తనకంటూ ఒక ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకొనేందుకు ప్రయత్నించటం రాజకీయాల్లో సహజం. బిజెపి పత్తిత్తేం కాదు. మెజారిటీగా ఉన్న హిందూ మత ఓటు బ్యాంకును సృష్టించుకొనేందుకు దాని మాతృ సంస్ధ సంఘపరివార్‌ ఎంచుకున్న మార్గం వారి సంతుష్టీకరణ. హిందువుల ఉనికికే ప్రమాదం ముంచుకు వస్తోందని, కొద్ది కాలంలో ముస్లింలు మెజారిటీగా మారేందుకు ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారని ప్రచార యుద్దం చేస్తున్న విషయం తెలిసిందే. సాధ్వి ప్రాచీ ఎవరు ఎంత మంది భార్యలను అయినా కలిగి ఉండండి, పిల్లలు మాత్రం ఇద్దరి కంటే ఎక్కువగా ఉండకూడదని చెప్పారు. 1990దశకం చివరిలో వాజ్‌పాయి అధికారానికి వచ్చారు. అందువలన భవిష్యత్‌లో 14శాతంగా ఉన్న ముస్లిం ఓట్లను గంపగుత్తగా ప్రతిపక్షాలకు వేయించటం మంచిది కాదు గనుక వారి పట్ల రాగం, తానం, పల్లవి మార్చాలనే ఆలోచన సంఘపరివార్‌లో ప్రారంభమైంది. ఈ సమయంలోనే 2002 మార్చినెలలో జరిగిన గుజరాత్‌ మారణకాండ ముస్లింలలో మరింత భయాన్ని రేకెత్తించటమే కాదు, బిజెపికి పెద్ద మచ్చగా మారింది. అంతకు ముందు వరకు ఇతర పార్టీల మీద తాను పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ముస్లిం సంతుష్టీకరణకు తానూ నాంది పలికింది. అదే ఏడాది డిసెంబరులో ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ కొత్త దుకాణాన్ని తెరిచింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో అంతకు ముందు వచ్చిన ఓట్లు సీట్లను కూడా బిజెపి నిలుపుకోలేకపోయింది. ఎన్నికలకు మూడు నెలల ముందే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన భగవత్‌ అదే ఏడాది డిసెంబరులో తొలిసారిగా డిఎన్‌ఏ ప్రస్తావన చేశారు. ఆ సమయంలో బిజెపి, దాని అభిమానులు ఓటమి విషాదంలో ఉన్నారు గనుక పెద్దగా పట్టించుకోలేదనిపిస్తుంది.
ఇటీవలి కాలంలో అభిమానులు విశ్వగురువుగా కీర్తించే నరేంద్రమోడీ పరువు ప్రపంచ వ్యాపితంగా పోయింది. అసహనం, ఢిల్లీ దాడులు, రైతుల ఉద్యమం సందర్భంగా రోడ్లపై మేకులు కొట్టటాలు, టూల్‌కిట్‌ కేసులు, కరోనాను నిర్లక్ష్యంలో పేరుమోసిన ప్రపంచ నేతల్లో ఒకరిగా మోడీ పేరు చేరటం వంటి అనేక కారణాలు అంతర్జాతీయంగా, జాతీయంగా పలుకుబడిని మసకబార్చాయి. మోడీ ఉంటే ఆర్‌ఎస్‌ఎస్‌ పెత్తనం, ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు ఉంటేనే మోడీకి పదవి అన్నది స్పష్టం కనుక పరస్పరం రక్షించుకోవటంలో భాగంగా మోహన్‌ భగవత్‌ డిఎన్‌ఏ సుభాషితాలకు తెరతీశారన్నది కొందరి అభిప్రాయం.
అన్నింటి కంటే ముఖ్యమైనది ఆఫ్ఘనిస్తాన్‌ పరిణామాలు అన్నది మరో బలమైన అభిప్రాయం. సంపాదించే ఇంటి యజమాని కరోనాతో అనూహ్యంగా మరణిస్తే ఆ కుటుంబం ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో ఇప్పుడు నరేంద్రమోడీ అదే స్ధితిలో ఉన్నారు. రవి గాంచనిది అజిత్‌ దోవల్‌కు కనిపించింది. నాటకీయ పరిణామాల మధ్య ఫిబ్రవరిలో పాకిస్తాన్‌తో మన ప్రభుత్వం సయోధ్య కుదుర్చుకుంది. ఒకేసారి పాక్‌, చైనాలతో వైరుధ్యం కొనసాగించటం సాధ్యం కాదు కనుక ఈ ఏర్పాటు అని కొందరు చెబితే, తాలిబాన్ల సమస్య దానికి పురికొల్పిందన్న వారు మరికొందరు. ఏ ఉగ్రవాదం మీద పోరు సలుపుతామని మోడీ సర్కార్‌ అమెరికాతో కలసి భీకర ప్రతిజ్ఞలు చేసిందో, ఆ ఉగ్రవాద తాలిబాన్లతో తెరముందు -వెనుక మంతనాలు ప్రారంభించింది. అమెరికా ట్రంపు లేడు, తిరిగి వచ్చే అవకాశాలూ లేవు, జో బైడెన్‌తో ఇంకా కౌగిలింతలు ప్రారంభం కాలేదు. చైనాతో సయోధ్యగా ఉంటామని ఆ తాలిబాన్లు ఏకపక్షంగా ప్రకటించటమే కాదు బీజింగ్‌ వెళ్లి మరీ ఆ దేశ నేతలను కలసి వచ్చారు. ఈ నేపధ్యం కూడా దేశంలోని ముస్లింలను సంతుష్టీకరించాల్సిన అవసరం ఉందని సంఘపరివార్‌ ఆలోచించి ఉండవచ్చన్నది కొందరి అభిప్రాయం. ఈ దశలో దేన్నీ తోసిపుచ్చలేము.
2009 డిసెంబరు నాలుగున ఢిల్లీలోని బాబా సాహెబ్‌ ఆప్టే స్మారక సమితి దేశ విభజన గురించి ఒక జాతీయ గోష్టిని ఏర్పాటు చేసింది. దానిలో మోహన భగవత్‌ ఒక వక్త.దేశంలో నివసిస్తున్న వారందరూ హిందూ వారసులే, ఈ ప్రాంతంలోని వారందరి డిఎన్‌ఏ ఒకటే అని సైన్సు కూడా నిరూపించింది. మనం కోరుకుంటే జాతీయ ఐక్యత మరియు ఏకత్వాన్ని పునరుద్దరించవచ్చు, మనల్ని విడదీస్తున్న విబేధాలను తొలగించుకోవచ్చు అని భగవత్‌ చెప్పారు. సరే హిందూత్వ గురించి అంతకు ముందు నుంచీ చెబుతున్నవాటినే పునశ్చరణ చేశారు. ఆ గోష్టిలో పాల్గొన్నవారందరూ కాషాయ దళానికి చెందిన వారే. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ నివేదించినదాని ప్రకారం బిజెపి నేత విజయకుమార్‌ మల్హోత్ర చేసిన ప్రసంగం ఎలా ఉందో చూడండి.ఐక్యతా యత్నాలతో పాటు దేశంలో నేడున్న పరిస్దితిని కూడా చూడాలంటూ ” హిందువుల జనాభా 90 నుంచి 80శాతానికి తగ్గింది. ముస్లింలు 13శాతానికి పెరిగారు. దేశంలోని అనేక ప్రాంతాలలో ముస్లింలు అధికులుగా ఉన్నారు. జాతీయ సంపదల మీద తొలి హక్కు ముస్లింలకే ఉందని చివరికి ప్రధాని కూడా బహిరంగంగా చెబుతున్నారు. ఇది సిగ్గు చేటు. పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల్లోని ముస్లిం జనాభా ప్రస్తుతం దేశంలోని ముస్లింలను కలుపుకుంటే మొత్తం నలభైశాతానికి పెరుగుతారు, అప్పుడు హిందువుల పరిస్ధితి ఎలా ఉంటుందో సులభంగానే ఊహించుకోవచ్చు.” అన్నారు.
ఇటీవలి సంవత్సరాలలో గోవులను తరలిస్తున్నారనో, గో మాంసం తింటున్నారనే సాకుతోనో గోరక్షకుల పేరుతో ముస్లింలను వధించటం తెలిసిందే. మోహన్‌ భగవత్‌ తన ప్రసంగంలో గోవులను వధించటం హిందూత్వకు వ్యతిరేకం అన్నారు. ఇది ఎదురుదాడి, గోరక్షణలో వాటిని వధించేవారి కంటే రక్షించేవారే ఎక్కువ మంది మరణిస్తున్నారని పరివార్‌ ప్రచారం తెలిసిందే. ముస్లింలందరూ గోవులను వధించకపోయినా వధిస్తున్నవారందరూ ముస్లింలే అని మాట్లాడుతున్నారు. ముస్లింలందరూ ఉగ్రవాదులు కాకపోయినా ఉగ్రవాదులందరూ ముస్లింలే అనే ప్రచారం తెలిసిందే. ఉగ్రవాదం, చర్యలు ఇస్లామ్‌కు వ్యతిరేకం అని అనేక సంస్ధలు ప్రకటించాయి. ఇలాంటి మాటలను ఎవరు చెప్పినా తప్పు పట్టాల్సిన పని లేదు. ఆచరణ ఏమిటన్నదే ముఖ్యం.


తాము మారిపోయామని చెప్పుకొనేందుకు, బిజెపికి వ్యతిరేకతను తగ్గించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ పడుతున్న తంటాలు ఒకటి రెండు కాదు, టక్కు టమార గోకర్ణ గజకర్ణ విద్యలన్నింటినీ ప్రయోగిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతుల్లో ఎంఎస్‌ గోల్వాల్కర్‌కు ప్రత్యేక స్దానం ఉంది. రెండవ అధిపతిగా దీర్ఘకాలం ఉన్నారు. బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌(ఆలోచనల గుత్తి ) పేరుతో ఆయన హిందూత్వ గురించి రాసిన అంశాలు పరివార్‌కు ప్రామాణికాలుగా ఉన్నాయి. రెండవసారి నరేంద్రమోడీ సర్కార్‌ తిరిగి అధికారానికి వచ్చే అవకాశాల్లేవనే అభిప్రాయం సర్వత్రా వెల్లడి అవుతున్న తరుణంలో ఎన్నికలకు ఆరునెలల ముందు 2018 సెప్టెంబరులో విజ్ఞాన్‌ భవన్‌లో మూడు రోజుల పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ ఉపన్యాసాల కార్యక్రమం జరిగింది. చివరి రోజు ప్రశ్నోత్తరాల సమయంలో మారిన పరిస్ధితులకు అనుగుణ్యంగా లేని గోల్వాల్కర్‌ చెప్పిన అంశాలను కొన్నింటిని తిరస్కరిస్తున్నట్లు భగవత్‌ చెప్పారు. ఇదేదో అనాలోచితంగా చెబుతున్నది కాదు, కొన్ని సంవత్సరాలుగా సంఫ్‌ు అంతర్గత మధనంలో ఉన్నదే, ఇప్పుడు బయటికి చెబుతున్నా, అందరికీ తెలియాల్సిన సమయం అసన్నమైందన్నారు. కొన్ని సందర్భాలలో చెప్పిన మాటలు అప్పటికి తగినవి కావచ్చు, అవే శాశ్వతంగా ఉండవు, కాలాలతో బాటు ఆలోచనలు కూడా మారుతుంటాయి.మారేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్దాపకుడు డాక్టర్‌ హెడ్గెవార్‌ అనుమతి ఇచ్చారు అన్నారు. అదే భగవత్‌ ఏడాది తరువాత 2019 అక్టోబరు 2న ఒక పుస్తకాన్ని విడుదల చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌కు హెడ్గేవార్‌ ప్రవచించిన హిందూ రాష్ట్ర తప్ప ప్రత్యేక సిద్దాంతం, సిద్దాంతకర్తలంటూ ఎవరు లేరు అని చెప్పారు. గోల్వాల్కర్‌ రాసిన ఆలోచనల గుత్తి పుస్తకంతో సహా ఏదీ ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రతినిధి కాదు, హెడ్గెవార్‌ కూడా సంఘగురించి తనకు పూర్తిగా తెలుసని ఎప్పుడూ చెప్పలేదు, అర్ధం చేసుకోవటం ప్రారంభించానని మాత్రమే చెప్పారు అని భగవత్‌ చెప్పారు. అందువలన గోల్వాల్కర్‌నే కాదంటున్న వారు రేపు మరో అధిపతి వచ్చిన తరువాత డిఎన్‌ఏ సిద్దాంతం కూడా మారదని భగవత్‌తో సహా ఎవరూ చెప్పలేరు. హిందూ రాష్ట్రతప్ప ప్రతిదీ మారుతుంటుంది, దానికోసం దేనికైనా సిద్దపడతారు.


అసలు సంతుష్టీకరణ అన్నదానిని కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ విదేశాల నుంచి అరువు తెచ్చుకున్నదే అని చెప్పవచ్చు.జర్మన్‌ కార్మికులు కమ్యూనిస్టుల వైపు ఎక్కడ మొగ్గుతారో అనే భయంతో వారిని సంతుష్టీకరించేందుకు మొదటి ప్రపంచ యుద్దం తరువాత ” నేషనల్‌ సోషలిస్టు జర్మన్‌ వర్కర్స్‌ పార్టీ ”ని 1920లో ఏర్పాటు చేశారు.ఒక ఏడాది పాటు వేరే అతను అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ 1921నుంచి 1945వరకు హిట్లర్‌ అధిపతిగా ఉన్నాడు.మెజారిటీ జర్మన్లను యూదుల మీద రెచ్చగొట్టటం, కుహనా జాతీయవాదాన్ని ముందుకు తీసుకురావటం వంటి అంశాలన్నీ తెలిసినదే. మన దేశంలో యూదులు లేరు గనుక హిందూత్వ శక్తులు ముస్లింలను ఎంచుకున్నాయి. అందువలన ఆ విధానాలన్నీ విదేశీ హిట్లర్‌ నుంచి అరువు తెచ్చుకున్నారని అంటే ఎవరూ ఉడుక్కోనవసరం లేదు. దానికి కాంగ్రెస్‌ అనుసరించిన దివాలా కోరు విధానాలు అవి పెరగటానికి దోహదం చేశాయి. హిందువుల చట్టాల్లో జోక్యం, మార్పులు చేసిన మాదిరి ఇతర మతాల వారి విషయంలో జరగలేదని సంఘపరివార్‌ చేస్తున్న ప్రచారాన్ని షా బానో కేసులో సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్‌ ప్రభుత్వం వమ్ము చేయటం నిర్దారించింది. వివాదాస్పద బాబరీ మసీదు గేట్లను తెరిచేందుకు రాజీవ్‌ గాంధీ సర్కార్‌ తీసుకున్న నిర్ణయం మెజారిటీ హిందువులను సంతుష్టీకరించేందుకే అన్నది స్పష్టం.1989 ఎన్నికల ప్రచారాన్ని తొలుత నాగపూర్‌ నుంచి ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ వేదికను అయోధ-ఫైజాబాద్‌కు మార్చటం ఆ రాజకీయాల కొనసాగింపే అన్నది స్పష్టం. తొలుత మైనారిటీ సంతుష్టీకరణ తరువాత మెజారిటీ సంతుష్టీకరణకు పూనుకుంది. చివరికి రెండిటికీ చెడ్డ రేవడిలా మారటాన్ని చూశాము.


కాంగ్రెస్‌కు భిన్నంగా సంఘపరివార్‌-బిజెపి తొలుత మెజారిటీ సంతుష్టీకరణ-మైనారిటీ విద్వేషాన్ని రెచ్చగొట్టింది. అధికారం వచ్చాక దాన్ని నిలుపు కొనేందుకు ఇప్పుడు మైనారిటీ సంతుష్టీకరణకు పూనుకుంది.నిత్యం ముస్లింలు, ఇతర మైనారిటీల పట్ల విద్వేష ప్రసంగాలు, ప్రచారం చేసే వారందరూ ఆర్‌ఎస్‌ఎస్‌ అంశ నుంచి వచ్చిన వారు లేదా అది తయారు చేసిన ప్రచార వైరస్‌ బాధితులే. దేశం మొత్తాన్ని మెజారిటీ మతోన్మాద పులిని ఎక్కించేందుకు తీవ్ర ప్రయత్నం జరుగుతోంది. వామపక్షాలు మినహా రాజకీయంగా బిజెపిని వ్యతిరేకించే ఇతర పార్టీల వారు కూడా గణనీయంగా పులిని ఎక్కారు. చెవులు కొరుకుతారు తప్ప బహిరంగంగా చెప్పరు. ఈ నేపధ్యంలో భగవత్‌ వ్యాఖ్యలు చేశారు. భగవత్‌ వ్యాఖ్యలలో నిజాయితీ ఉందా ? రెండు మతాలవారూ కలసి మెలసి ఉండాలని, డిఎన్‌ఏ ఒకటే అని చెబుతున్నవారు ఆర్‌ఎస్‌ఎస్‌లో ముస్లింలకు చోటు, నాయకత్వంలో భాగస్వామ్యం కల్పించ కుండా ఇతర వేదికలను ఎందుకు ఏర్పాటు చేసినట్లు ? ఇంతకాలం తాము నిర్వహించిన విద్వేష ప్రచారానికి స్వస్తి పలుకుతామని, ఇంతకు ముందు చేసిన దానికి చెంపలు వేసుకుంటున్నామని చెప్పి ఉంటే కాస్తయినా విశ్వసనీయత ఉండేది ! అవేమీ లేవు. అందుకే టక్కు టమార విద్యలని అనాల్సి వస్తోంది, కాదంటారా !

మూడు దశాబ్దాల సంస్కరణలు : టీవీలు, సెల్‌ ఫోన్లు వచ్చాయి- ఉద్యోగాలు పోయాయి !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


1991 సంస్కరణలకు ముందు తరువాత అంటూ కొంత మంది మనకు మహారంజుగా కథలు వినిపిస్తారు. నా చిన్నతనంలో పల్లెటూరిలో ఉన్న నాకు పక్కనే ఉన్న పట్టణంలో సినిమా చూసి వచ్చిన వారు వాటి కధ, నటీ నటుల గురించి చెబుతుంటే, కొన్న పాటల పుస్తకాలను గర్వంగా చూపుతుంటే మనదీ ఒక బతుకేనా ! ఛా మనకు ఆ ఛాన్స్‌ ఎప్పుడు వస్తుందో అన్నట్లు ఉండేది. ఆ రోజులు మారాయి, ఇప్పుడు సినిమాల స్ధానాన్ని సీరియళ్లు ఆక్రమించాయి. ఎంతకాలం సాగుతాయో తెలియదు. చూసినవారందరూ తరువాత ఏం జరుగుతుందో అన్న ఆందోళనతో చర్చలు జరుపుకుంటున్నారు. అందువలన కొత్త కథలు వినదగు నెవ్వరు చెప్పిన అన్నట్లుగా విందాం. వినినంతనే వేగపడక బుర్రలతో ఆలోచిద్దాం. ఆశల పల్లకి నుంచి దిగుదాం, నేల మీద నడుద్దాం !


మూడు దశాబ్దాల క్రితం ఉన్న జిడిపితో పోల్చితే ఇప్పుడు పది రెట్లు పెరిగింది అని లొట్టలు వేసుకుంటారు. కాదని ఎవరన్నారు. కొందరు చెప్పే అభివృద్ది ఆర్ధిక శాస్త్రం ప్రకారం మూడు దశలు ఉంటాయి. సేవారంగం మూడవ దశలో అగ్రస్ధానంలో ఉంటుంది. ఈ ప్రాతిపదికన అభివృద్ది చెందిన దేశాలలో దాని వాటా 70శాతంపైన (అమెరికాలో 80శాతం వరకు ఉంది), వర్ధమాన దేశాలలో 50శాతంపైగా ఉంటుంది. మనదేశంలో 1980దశకంలో సేవారంగం వాటా 38.6శాతం ఉంది. ఆరోజుల్లో ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి ట్రంకాల్‌ కలవటానికి పట్టే వ్యవధిలో వెళ్లి తిరిగి రావచ్చు అనే జోకులు పేలేవి. నిజమే మరి. 1991సంస్కరణల తరువాత ఆ దశకంలో సేవారంగం వాటా 44.3శాతానికి పెరిగింది. ఇప్పటి పరిస్ధితిని చూస్తే 2017లో చైనా సేవారంగం వాటా 52.2శాతం ఉండగా మనది 61.5శాతం ఉంది.దాని ప్రకారం మనం కేవలం మూడు సంవత్సరాలకే నరేంద్రమోడీ నాయకత్వాన చైనాను అధిగమించాం అని చెప్పినా మారు మాట్లాడకుండా అంగీకరించాల్సిందే. లేకపోతే దేశద్రోహి అని కేసులు పెడతారు లేదా మన ఫోన్లలో పెగాసెస్‌ వచ్చి కూర్చుంటుంది. 2020 సంవత్సరంలో సేవారంగం వాటా మన దగ్గర 53.89శాతానికి తగ్గింది. ఇదే చైనా వాటా 54.5 శాతం ఉంది. దీన్ని బట్టి మన దేశం తగ్గి చైనా పెరిగి ఇప్పుడు రెండు దేశాలూ అభివృద్దిలో సమంగా ఉన్నట్లా ? మన జిడిపిలో వ్యవసాయవాటా 20.19, పారిశ్రామికరంగం 25.92 కాగా ఇదే సమయంలో చైనా వాటాలు 7.7, 37.8శాతాల చొప్పున ఉన్నాయి.


మూడు దశాబ్దాల సంస్కరణలు దేశాన్ని ఎంతో ముందుకు తీసుకుపోయాయని, అందువలన ఇప్పుడు మరిన్ని సంస్కరణలు అమలు చేస్తే మరింత ముందుకు పోతామని, చైనాను అధిగమిస్తామని చెబుతున్నవారు మనకు ఎక్కడ చూసినా కనిపిస్తారు. అభివృద్దిలో ఎవరు ఎవరితో అయినా పోటీ పడాలి. స్వార్ధం బాగా పెరిగి పోయిన వర్తమానంలో అందరూ బాగుండాలి అందులో మనముండాలి అన్న మాట ఈ మధ్య కాలంలో బాగా ప్రచారం అవుతోంది.ఎదుటి వారి గురించి ఏడవటం మన భారతీయ సంస్కృతి కాదు, అయినా చైనా, పాకిస్దాన్‌ నాశనం కావాలి, వాటి స్దానంలో మనమే బాగు పడాలి అని సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసే, కోరుకొనే వారు కూడా ఉన్నారు. చైనా గురించి కమ్యూనిస్టులో లేదా ఆ దేశ అభిమానులో చెబితే అబ్బే అంతా ఉత్తిదే అనేవారి సంగతి తెలిసిందే. అందుకే ప్రపంచబ్యాంకు విడుదల చేసిన సమాచారాన్ని ఇక్కడ పరిశీలనకు తీసుకుందాం. ప్రతి పది సంవత్సరాలకు జిడిపి విలువ బిలియన్‌ డాలర్లలో, తలసరి జిడిపి డాలర్లలో ఏదేశంలో ఎలా పెరిగిందో దిగువ చూడవచ్చు.1990వ సంవత్సరం నుంచి వివరాలను తీసుకుందాం.
సంవత్సరం××× చైనా ××× భారత్‌ ××× చైనా ××× భారత్‌
1990 ×× 361 ×× 321 ××× 318 ××× 368
2000 ×× 1,211 ×× 468 ××× 959 ××× 449
2010 ×× 6,087 ×× 1,675 ××× 4,550 ×× 1,358
2019 ××14,280 ×× 2,869 ××× 10,217 ×× 2,100


సంస్కరణలు ఏ దేశంలో ఎంత మేరకు పురోగతి సాధించాయో, మన దేశ అభివృద్ది ఎక్కడ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎందుకు ఇంత తేడా ఉందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ కాలంలో చైనా జిడిపి 39.66 రెట్లు పెరగ్గా మనదేశంలో 8.9 రెట్లు, తలసరి జిడిపి చైనాలో 32 రెట్లు మన దేశంలో 5.8 రెట్లు మాత్రమే పెరిగాయి.చైనా జిడిపి 361 నుంచి 960 బి.డాలర్లకు చేరేందుకు ఏడు సంవత్సరాలు పట్టింది. అదే భారత్‌ జిడిపి 321 నుంచి 940 బి.డాలర్లకు చేరేందుకు పదహారు సంవత్సరాలు పట్టింది. సంస్కరణల ద్వారా స్ధానిక సంస్ధలు దశలవారీగా అంతర్జాతీయ పోటీ తత్వాన్ని సంతరించుకుంటాయని, సామర్ద్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని 1991లో ఆర్ధిక మంత్రిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ చెప్పారు. ఎగుమతి-దిగుమతి విధానంలో మార్పులు చేశామని, దిగుమతుల అనుమతులను తగ్గిస్తామని, ఎగుమతులను పెంచుతామని కూడా చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల విషయానికి వస్తే 1990లో దిగుమతి పన్నులు 82శాతంగా ఉండగా 1992నాటికి 56శాతానికి తగ్గాయి. ఇదే సమయంలో డాలరు విలువతో సంబంధం ఉండే పన్ను మొత్తాలు 1995-96 నాటికి 50 నుంచి 25 శాతానికి తగ్గించాలని రాజా చెల్లయ్య కమిటీ సూచించింది. ఇవి ప్రపంచబ్యాంకు లక్ష్యానికి(ఆదేశాలకు) దగ్గరగా ఉన్నాయి. సగటు పన్నుల శాతం 38.7శాతానికి, డాలరు విలువతో సంబంధం ఉన్న పన్ను మొత్తం 23.6శాతానికి తగ్గింది. ప్రపంచబ్యాంకు చెప్పినదాని కంటే ఇంకా ఎక్కువగానే పన్నులను తగ్గించారు. రెండంకెల పన్నులను ఒక అంకెకు తగ్గిస్తామని యుపిఏ ప్రభుత్వం చెప్పినప్పటికీ పూర్తిగా జరగలేదు.


సంస్కరణల గురించి రంజుగా చెబుతారని ముందే అనుకున్నాం. వారు చెప్పే అంశాలను ఒక్కసారి చూద్దాం.1991లో 84 కోట్ల మంది జనాభాకు కేవలం ఐదు కోట్ల మందికి మాత్రమే ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు అన్ని రకాల ఫోన్లు 117 కోట్ల మందికి అందుబాటులోకి వచ్చాయి. డబ్బు కోసం మీరు ఈ రోజు బ్యాంకులకు వెళ్లాల్సిన పనిలేదు, సమీపంలోని ఎటిఎంకు వెళ్లి ఏ సమయంలో అయినా డబ్బు తీసుకోవచ్చు. ఫోన్‌ ద్వారా మీరు ఉన్న చోట నుంచి ఎవరికైనా, ఎక్కడికైనా పంపవచ్చు. ఇప్పుడు 82 కోట్ల డెబిట్‌ కార్డులు, 5.7 కోట్ల క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. జేబులు ఎత్తుగా డబ్బు కట్టలను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. టీవీ తొలిసారిగా 1959లో వచ్చినపుడు దూరదర్శన్‌ విద్యా సంబంధమైన ఒక గంట కార్యక్రమం వారానికి రెండుసార్లు ప్రసారం చేసేవారు. ఆరు సంవత్సరాల తరువాత రోజుకు నాలుగు గంటలు అవి కూడా ప్రధానంగా వార్తా కార్యక్రమాలు మాత్రమే. వచ్చేవి, అదే ఇప్పుడు పదిహేను భాషల్లో నాలుగు వందలకు పైగా వార్తా ఛానళ్లతో సహా 926 ఛానళ్లు జనాలకు అందుబాటులోకి వచ్చాయి.


నిజమే ఈ అభివృద్దిని ఎందుకు కాదనాలి, కళ్ల ముందు కనిపిస్తుంటే ఎలా అంటాం ? సంస్కరణలు ఎందుకు అంటే మనకు చెప్పింది వీటిని గురించా ? కానే కాదు. ఉపాధి, దారిద్య్ర నిర్మూలన, అభివృద్ది మంత్రాన్ని జపించారు. జరిగిందేమిటి ? అభివృద్ధి చెందిన దేశాల లక్షణం ఏమిటి ? వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నవారు తగ్గిపోయి, వస్తూత్పత్తి, సేవారంగాల ఉపాధి పెరగటం. ప్రస్తుతం దేశంలో ఎటు చూసినా వేతనాలు తక్కువ, కాంట్రాక్టు లేదా తాత్కాలిక ఉపాధి, భారీ పెట్టుబడులు-తక్కువ మందికి ఉపాధి, ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు. బిఏ అంటే బొత్తిగా అన్యాయం, ఎంఏ అంటే మరీ అన్యాయం అనే రోజులు పోయి అంతకంటే ఎక్కువగా ఇంజనీరింగ్‌ పట్టాలు పెరిగాయి. వారి పరిస్ధితి ఏమిటి ? మరీ ఘోరంగా ఉంది. మంచి వేతనాలు పొందిన వారిలో గతంలో బిఏలు, ఎంఎలు ఉన్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్‌ ఉన్నా రోజు వారి సాధారణ కార్మికుడికి పని దొరికిన రోజుల్లో వస్తున్న వేతనాలు కూడా చాలా మందికి రావటం లేదు.


సెల్‌ఫోన్లు, టీవీ ఛానళ్లు, ఏటిఎంలు ఉపాధి చూపవు, తిండి పెట్టవు అని తేలిపోయింది. పరిశ్రమల్లో ఇచ్చే వేతనాలు గౌరవ ప్రదమైన జీవితాలను గడిపేందుకు అనువుగా లేవు. ఇదే సమయంలో ఐటి వచ్చింది. ఆ రంగంలో వేతనాలు, విదేశీ అవకాశాలు ఉండటంతో తలిదండ్రులు, యువత పొలోమంటూ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ వైపు వెళ్లారు. ఇప్పుడు ఆ రంగంలో కూడా పరిస్ధితి తారుమారైంది.కొద్ది మందికి ఇప్పటికీ మెరుగైన పరిస్ధితే ఉన్నా అత్యధికులు అరకొర జీతాలకే శ్రమను అమ్ముకోవాల్సి వస్తోంది. వారంతా చిరు, నిరుద్యోగ చౌరస్తాలో ఉన్నారు. 2011లో యుపిఏ ప్రభుత్వం ఒక జాతీయ వస్తు తయారీ విధానాన్ని ప్రకటించింది. దాని ప్రకారం 2022 నాటికి జిడిపిలో 15శాతంగా ఉన్న వస్తూత్పత్తి వాటాను 25శాతానికి పెంచాలని, తద్వారా కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించాలని చెప్పారు. 2014లో మోడీ గారు అధికారానికి వచ్చి దాని పేరు మార్చి కొత్తగా మేకిన్‌ ఇండియా అని నినాదంగా ప్రచారం చేశారు.గడువు కంటే ముందుగానే ఆమేరకు పెరిగింది. దానిలో ఎవరి వాటా ఇంత అని వారు తేల్చుకోవచ్చు. కానీ ఉద్యోగాలు రాలేదే, జిడిపి వృద్ది రేటు ఎనిమిది నుంచి నాలుగు శాతానికి పడిపోయిందే. ఇదీ అసలు సమస్య. కరోనాకు ముందే నిరుద్యోగం 45 ఏండ్ల రికార్డును దాటిపోయింది. ప్రభుత్వాలు ఇప్పుడు కరోనా మాటున తమ వైఫల్యాలను దాస్తున్నాయి. ఎంతకాలం మూసిపెడతాయో చూద్దాం !


చైనా గురించి ఎవరైనా ఏదైనా చెబితే దానికి ఒక ముద్రవేయటం లేదా చెప్పేదంతా వాస్తవం కాదు అనేవారు మనకు ఎక్కడబడినా తారసపడతారు. చైనాలో కార్మికుల వేతనాలు పెరిగాయి గనుక అనేక విదేశీ కంపెనీలు అక్కడి నుంచి బయటకు వస్తున్నాయి, అవి మన దేశానికి వస్తాయి అని ఏడాది క్రితం స్వయంగా ప్రధాని మోడీయే చెప్పారు. అందుకోవటానికి సిద్దంగా ఉండాలని రాష్ట్రాలను కోరారు. దీని అర్ధం ఏమిటి ? అంకెలతో పని లేదు. అక్కడితో పోల్చితే మన దగ్గర వేతనాలు తక్కువ అనే కదా ! లేకపోతే ఎందుకు వస్తారు ? లేబర్‌ కోడ్‌ పేరుతో కార్మిక చట్టాలను నీర్చుగార్చబోతున్నాం వాటిలో కొన్ని ఉన్నా అమలు గురించి పట్టించుకోం అనే సూచనలు ఇస్తున్నా వస్తున్నవారు లేరు. చైనా నుంచి ఒకరూ అరా బయటికి వచ్చినా వేరే దేశాలకు పోతున్నారు తప్ప మన దేశానికి రావటం లేదు.


2000 సంవత్సరం నుంచి మన దేశంలో నిజ వేతనాలలో పెరుగుదల లేదని లెక్కలు చెబుతున్నాయి. పరిశ్రమల్లో కాంట్రాక్టు కార్మికుల పెరుగుదల ఒక కారణమని 2017లో అంతర్జాతీయ కార్మిక సంస్ధ చెప్పింది. సంఘటిత రంగంలో 1997-98లో కాంట్రాక్టు కార్మికులు 16శాతం ఉంటే 2014-15 నాటికి 35శాతానికి పెరిగినట్లు పరిశ్రమల వార్షిక సర్వేలు వెల్లడించాయి. వారికి ఎలాంటి సంక్షేమ పధకాలు, చట్టాలు వర్తించవు. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే సంఘటిత రంగంలో 2000-01లో7.75 మిలియన్ల మంది ఉపాధి పొందితే 2015-16 నాటికి 13.26 మిలియన్లకు పెరిగారు. దీన్ని బట్టి కాంట్రాక్టు కార్మికుల సంఖ్య ఎంత ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. దీని వలన వేతనాలు, హక్కుల కోసం పోరాడేశక్తి కూడా కార్మిక సంఘాలకు తగ్గిపోతోంది.ఒక యజమాని ఒక కార్మికుడిని తొలగిస్తే ఆ స్ధానంలో పని చేసేందుకు పదిమంది సిద్దంగా ఉన్నారు, ఒకరు నిచ్చెన ఎక్కితే ఇరవై మంది కింద ఉండిపోతున్న పరిస్ధితి ఉన్నపుడు వేతనాల కోసం బేరమాడే శక్తిగానీ, సంఘాలలో చేరి సంఘటితం అయ్యే అవకాశాలు ఎలా ఉంటాయి.

నూతన సాంకేతిక పరిజ్ఞానం నూతన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందన్నది నిజం. దానికి సంస్కరణలే అవసరం లేదు.టెలికాం రంగంలో ప్రయివేటు సంస్ధలను అనుమతించిన కారణంగా పది నుంచి 30లక్షల వరకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కొన్ని సంస్దలు అంచనాలు వేశాయి. జిరాక్సు మెషిన్లు రావటంతో ప్రతి పెద్ద గ్రామం మొదలు పట్టణాల్లో వాటిని వినియోగిస్తున్నారు. కొందరికి ఉపాధి కలిగిన మాట నిజం. ఎక్కడో తప్ప కేవలం జిరాక్స్‌ మిషన్‌ మీద వచ్చే ఆదాయంతోనే బతుకు వెళ్లదీయటం సాధ్యం కాని వారు, నెట్‌, లామినేషన్‌ వంటి వాటిని కూడా జతచేశారు. టెలికాం రంగంలో ప్రయివేటు కంపెనీలు ఉపాధి కల్పించాయి, పోగొట్టాయి. రిలయన్స్‌ కంపెనీ 52వేల మందికి ఉద్యోగాలు కల్పించి అది పోటీకి తట్టుకోలేక మూతపడటంతో మొత్తం సిబ్బందిని తొలగించింది. రిలయన్స్‌ టెలికమ్యూనికేషన్స్‌ మూత పడిన లేదా వేరేదానిలో విలీనం తరువాత రిలయన్స్‌ జియో వచ్చింది. అది కొన్ని కొత్త ఉద్యోగాలను కల్పిస్తే దాని పోటీకి తట్టుకోలేని మిగతా సంస్దలు ఆ మేరకు సిబ్బందిని ఇంటికి పంపి ఖర్చులను తగ్గించుకున్నాయి. కొన్ని విలీనమయ్యాయి, దాంతో సిబ్బంది మరింత తగ్గారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులను ఎలా ఇంటికి పంపిందో తెలిసిందే. ఇక టెలికాం సేవారంగం కొత్త ఉపాధి అవకాశాలను కల్పించినట్లే ఉన్న ఉపాధిని కూడా పోగొట్టింది. సెల్‌ఫోన్లు రాక ముందు మన ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఎస్‌టిడి బూత్‌ ఏర్పాటు పధకాన్ని ప్రకటించింది, అమలు జరిపింది. ఇప్పుడు ఎక్కడైనా ఎవరికైనా కనిపిస్తున్నాయా ? ఎంత మంది ఎస్‌టిడి బూత్‌లను నెట్‌ సెంటర్లుగా మార్చారు ? ఒక వేళ మార్చారే అనుకుందాం. ఒక రంగంలో పోయిన ఉపాధి మరోరంగంలో వచ్చింది.అదనం ఏమిటి ? టెలికాం, వస్తూత్పత్తి, వ్యవసాయం ఏ రంగంలో చూసినా ఆధునిక పరిజ్ఞానం,ఆటోమేషన్‌, రోబోల ప్రవేశం గత మూడు దశాబ్దాలలో పెద్ద ఎత్తున పెరిగింది.పెట్టుబడులు కూడా పెరిగాయి, కార్మికుల సంఖ్య తగ్గిపోయింది. దాని వలన సంస్ధల యాజమాన్యాలకు ఖర్చులు తగ్గాయి, ఉత్పత్తి పెరిగింది. ఈ పోటీలో భారీ పెట్టుబడులు పెట్టలేనివారు తమ సంస్దలను మూసివేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఎక్కువ మందికి ఉపాధి కల్పించే చిన్న పరిశ్రమల మూత పెరిగింది. అందుకే మూడుదశాబ్దాల తరువాత మంచి చెడ్డలను బేరీజు వేసుకుంటే ఇప్పుడు తలెత్తిన నిరుద్యోగం, కొనుగోలు శక్తి తగ్గిపోవటం, అది మాంద్యానికి దారిదీయటానికి కారణాలు ఏమిటి ? మనం చైనాతో పోటీ పడాలని చెప్పుకుంటున్నాం గనుక ఇదే సమయంలో చైనాలో అభివృద్ది రేటు ఒక ఏడాది ఒకశాతం తగ్గవచ్చు మరోఏడాది పెరగవచ్చు తప్ప మనం ఎదుర్కొంటున్న మాదిరి సమస్యలు అక్కడ లేవు. ఎందుకో అధ్యయనవేత్తలు చెప్పాలి, జనం ఆలోచించాలి.


మన దేశంలో టాటా మోటార్స్‌ కంపెనీ కోసం గతంలో రాష్ట్రాలు రాయితీలు ఇస్తామంటూ రాష్ట్రాలు ఎలా పోటీ పడ్డాయో చూశాము. తాజాగా కేరళకు చెందిన కిటెక్స్‌ కంపెనీకోసం కూడా అదే పద్దతిలో రాష్ట్రాలు పోటీ పడ్డాయి. తెలంగాణా సర్కార్‌ సదరు కంపెనీ ప్రతినిధుల కోసం ప్రత్యేక విమానాన్ని కేరళకు పంపటాన్ని చూశాము. ఇన్నేండ్ల సంస్కరణల తరువాత మాంసం ముక్క కోసం కుక్కలు కొట్లాడుకున్న మాదిరి రాష్ట్రాలు పరిశ్రమల కోసం ప్రయత్నించటం సిగ్గు చేటు. ఈ పోటీ ఎంతవరకు పోతుంది? కేంద్ర ప్రభుత్వానికి, బాధ్యత, ఒక అభివృద్ది అజండా పద్దతి ఉంటే ఇలాంటి పోటీని సహిస్తుందా ? అభివృద్దిలో అసమానతలు పెరగవా ? చైనాలో పరిస్ధితి దీనికి భిన్నం. వారు ఎక్కడ పరిశ్రమలు పెట్టమంటే అక్కడ పెట్టటమా లేదా అన్నది కంపెనీలు తేల్చుకోవాలి. రాష్ట్రాలు కొట్లాడుకోవు. తొలి సంవత్సరాలలో కొన్ని అనువైన ప్రాంతాలలో పరిశ్రమలను ప్రోత్సహించిన తరువాత దేశంలో తలెత్తిన సమస్యను గమనంలో ఉంచుకొని వెనుక బడిన ప్రాంతాలలో మాత్రమే కొత్తవాటిని ప్రోత్సహిస్తున్నారు. అందుకు అంగీకారమైతేనే సంస్దలు పెడుతున్నారు. గ్రామీణ, టౌన్‌షిప్‌ సంస్దలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహమిచ్చిన ఫలితంగా వ్యవసాయంలో మిగులు ఉన్న శ్రామికులు వాటిలో చేరిపోయారు. ఈ సంస్ధలు అక్కడ అధ్బుతాలు సృష్టించాయి.


మన సంస్కరణలు గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలను తేలేకపోయాయి. నీతి అయోగ్‌ నివేదిక ప్రకారం 2004-05 నుంచి 2011-12 మధ్య గ్రామీణ ప్రాంతంలో కేవలం 12లక్షల ఉద్యోగాలు మాత్రమే పారిశ్రామిక రంగంలో పెరిగాయి. అదే చైనాలో 1980 నుంచి 2000 సంవత్సరాల మధ్య పది కోట్ల మందికి పని దొరికింది. మన వంటి దేశాలకు మరిన్ని పారిశ్రామిక ఉద్యోగాలు అవసరమని అందరూ అంగీకరిస్తారు. మూడు దశాబ్దాల సంస్కరణలు ఆ లక్ష్యాన్ని ఎంతమేరకు సాధించాయి.1980-2018 మధ్య ఈ రంగంలో ఉన్న కార్మికులు మొత్తం శ్రామిక శక్తిలో 30 నుంచి 10శాతానికి తగ్గిపోయారు.2019లో వ్యవసాయంలో 14 కోట్ల మంది, నిర్మాణ రంగంలో ఆరుకోట్ల మంది, ఉండగా పారిశ్రామికరంగంలో నాలుగు కోట్ల మంది ఉన్నట్లు సిఎంఐఇ విశ్లేషణ తెలిపింది. పెద్ద సంఖ్యలో నైపుణ్యం లేని కార్మికులు ఉన్నందున వారిని ఎలా ఉపయోగించుకోవాలో ప్రత్యామ్నాయ విధానాలను వెతకాలని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణల పేరుతో తెచ్చిన మూడు చట్టాలు రైతుల బాగుకోసం కాదు. అధ్యయనాలు వెల్లడించిన అంశాల ప్రకారం రెండువేల సంవత్సరం తరువాత వాణిజ్యం వ్యవసాయం, అనుబంధ రంగాల వైపు మళ్లింది, పెరిగింది. దారిద్య్రం తగ్గింపులో ఇది గణనీయమైన పాత్ర పోషించిందని చెబుతున్నారు. ఈ కారణంగానే వ్యవసాయంలో ప్రవేశించేందుకు విదేశీ-స్వదేశీ కార్పొరేట్లకు అవకాశాలు కల్పించేందుకే వ్యవసాయ చట్టాలు. ఇదే సమయంలో గత ఏడు సంవత్సరాలుగా వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది.వృద్ది రేటు గిడసబారింది. వేతనాలు కూడా పెద్దగా పెరగలేదు. ఈ నేపధ్యంలో వ్యవసాయాన్ని కార్పొరేట్‌ జలగలకు అప్పగిస్తే అనే భయమే రైతాంగ ఉద్యమానికి అంకురార్పణ చేసింది. ప్రస్తుతం నరేంద్రమోడీ సర్కార్‌ తలపెట్టిన మరిన్ని సంస్కరణలు మరింత మందిని ఉద్యమాల్లోకి తీసుకు వస్తుందా ? ఆర్ధిక వృద్దిని తిరోగమనం నుంచి పురోగమానికి తీసుకుపోతాయా ? ఏం జరగనుంది ? ఊహలు ఎందుకు, చూద్దాం !