• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: BJP

చైనా నుంచి వస్తు దిగుమతులా ! తగ్గేదేలే !!

27 Thursday Jan 2022

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ Leave a comment

Tags

#Anti China, Anti China Propaganda, BJP, India imports from China, India-China trade in 2021, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


మన పాలకులు, వారికంటే ఎక్కువగా మన మీడియా జనాలకు ఎక్కిస్తున్న దేశభక్తి ఎక్కడికి పోతున్నది ? గాంధీ, నెహ్రూ వంటి నేతలు సరైన పునాది వేయని కారణంగా దేశభక్తి అంటే పంద్రాగస్టు, రిపబ్లిక్‌ దినోత్సవాలకే పరిమితం అయిందని అనుకుందాం కాసేపు. వారి కంటే దేశాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తున్నారు, ప్రపంచానికే గురువు అని చెబుతున్న నరేంద్రమోడీ ఓకల్‌ ఫర్‌ లోకల్‌( స్ధానిక వస్తువులనే వాడండి), మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత వగైరా , దేశ కాలాలతో నిమిత్తం లేకుండా ముందుకు తెచ్చిన చైనా వ్యతిరేకత ఏమైనట్లు ? ఎక్కడా ఆ ఛాయలే కనిపించటం లేదు. దేశానికి నిజమైన స్వాతంత్య్రం 2014లోనే వచ్చిందని సెలవిచ్చిన కంగనా రనౌత్‌ వంటి అసలు సిసలు సమరయోధులు గుండెలు దిటవు చేసుకోవాలి.


2021 చైనా-భారత వాణిజ్య లావాదేవీలలో నరేంద్రమోడీ సర్కార్‌ ఆల్‌టైం రికార్డు నెలకొల్పింది. డిసెంబరు నాటికి వంద బి.డాలర్లకు చేరతాయని అంచనా వేస్తే ఏకంగా 126 బిలియన్‌ డాలర్లకు చేరింది. చైనా నుంచి మనం దిగుమతి చేసుకున్నది 97.52 బి.డాలర్లు. అంతకు ముందు ఏడాదితో పోల్చితే 46.2శాతం ఎక్కువ. మనం చైనాకు ఎగుమతి చేసిన సరకుల విలువ 28.14బి.డాలర్లు. ఇది 34.2శాతం పెరిగింది. మన సరకుల ఎగుమతుల పెరిగినందుకు సంతోషించాలా, దిగుమతు ఎక్కువైనందుకు విచారించాలా ? ఎందుకిలా దిగుమతుల రికార్డులను బద్దలు కొడుతున్నాము ? మీకేం బాబూ ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి వాళ్లు ఎన్ని కబుర్లైనా చెబుతారు. వీలుపడక గానీ లేకపోతేనా దేశాన్ని వేల సంవత్సరాలు వెనక్కు తీసుకుపోయి ఉండేవారు.చైనా సెల్‌, కంప్యూటర్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఏవీ లేకుండా వారి వాట్సాప్‌ విశ్వవిద్యాలయాలు, ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీలు ఒక్క క్షణం పని చేయవు. వారికి ఒక న్యాయం ఇతరులకు ఒకటా ? పది మందికి పని కల్పించి తిండిపెడుతున్నాం. తగ్గేదేలే ! దిగుమతులను ఆపేదేలే, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. ఎవరు, ఇంకెవరు, చైనా వస్తు దిగుమతిదారులు.


రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టే ముందు ఎవరైనా వెనుకా ముందూ చూసుకోవాలి. చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవాలని ఇక్కడి కమ్యూనిస్టులెవరూ తీర్మానాలు చేయలేదు. ధర్నాలు, రాస్తారోకోల వంటివి అసలు చేపట్టలేదు. పార్టీ నేతల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా దిగుమతిదారులు ఉన్నట్లు ఎవరూ నిరూపించలేదు.మన దేశంలోని మూలస్దంభం వంటి పరిశ్రమల్లో ఔషధరంగం ఒకటి. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నవాటిలో 50-60శాతం వరకు ఈ రంగానికి అవసరమైన రసాయనాలు, సంబంధిత ఉత్పత్తులే అని తెలుసుకోవాలి. ఒక అర్ధరాత్రి అమెరికా వాడు కల్లోకి వచ్చి తెల్లవారేసరికి మీరు చైనా వ్యతిరేకతను ప్రచారం చేయాలి అనగానే చిత్తం దేవరా అన్నట్లు చేశారా లేదా ? ఎలాంటి అజెండా లేకుండానే మన ప్రధాని మోడీ ఊహాన్‌, చైనా అధినేత షీ మహాబలిపురం వచ్చి ఉయ్యాలలూగి, విందులు ఆరగించి, ఊసులు చెప్పుకున్నవారు ఒక్కసారిగా శత్రువులు ఎలా అవుతారు? జనం అమాయకులు కాదు కదా !


చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే అక్కడి నేతలు మన కాళ్ల దగ్గరకు వస్తారని ప్రచారం చేశారు.చైనా తొలిసారిగా ప్రస్తుతం ఏటా ఆరులక్షల కోట్ల డాలర్ల మేర ఎగుమతి దిగుమతులు జరుపుతున్నది. దానిలో పన్నెండవ వంతు అంటే 755బి.డాలర్ల మేరకు అమెరికాతో జరుగుతున్నాయి. మొదటి స్ధానంలో ఉన్న వారే ఎందుకు పెట్టుకున్నామురా బాబూ వీరితో తగాదాని తలలు పట్టుకుంటున్నారు. పదిహేనవ స్ధానంలో ఉన్న మనతో ఉన్న లావాదేవీలు కేవలం 126 బి.డాలర్లు మాత్రమే. అలాంటిది మనం దిగుమతులు ఆపేస్తే చైనా దారికి వస్తుందా ? పగటి కలలు గాకపోతే, మన గురించి మనకు అవగాహన ఉందా లేక హనుమాన్‌ తాయత్తు కట్టుకొని మాట్లాడుతున్నామా ? వెనుకటి రోజుల్లో పిచ్చి మంత్రం పెడతామని పిల్లల్ని బెదిరించినట్లుగా చైనా యాప్‌ల నిషేధం వలన ఒరిగిందేమిటి ? ఔషధ పరిశ్రమకు అవసరమైన దిగుమతులు చేసుకున్నామంటే అర్ధం ఉంది. పోనీ వాటిని కూడా అక్కడి నుంచి గాక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే అడ్డుకున్నదెవరు? అమెరికా నేతలతో కౌగిలింతలకు దిగినా మరొకటి చేసినా రెండు దేశాల లావాదేవీలు 2021లో 110 బి.డాలర్లు మాత్రమే. చైనా వస్తువులా అబ్బే అవి నాశిరకం, చౌకరకం అని ఒక వైపు ఈసడించుకుంటారు. కానీ అదే చైనా నుంచి విలాసవంతమైన సెల్‌ఫోన్లు, రంగురాళ్లు, ఆటోమొబైల్స్‌కు మన విలువైన విదేశీమారక నిల్వలను ఖర్చు చేయాలా? ఎందరు సామాన్యులకు ఉపయోగం ఉంటుంది ? వీటి మీద దిగుమతి పన్నులు పెంచినా జనం తగ్గటం లేదు, అసలు అనుమతి ఎందుకివ్వాలి ? మన దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి, మన దేశం నుంచి చైనా దిగుమతి చేసుకొనే సరకులేవీ ప్రపంచంలో ఎక్కడా దొరకనివి కాదు. వివాదాలు ఎన్ని ఉన్నా సర్దుకుంటాయనే భావంతో లావాదేవీలను నిర్వహిస్తున్నదా ?
ఒకవైపు పశ్చిమ దేశాలతో బేరసారాలు, మరోవైపు చైనా మీద అనధికారికంగా తప్పుడు ప్రచారం, మరోవైపు రికార్డులను బద్దతు కొడుతూ దిగుమతులు. పరస్పర విరుద్దం కదా ? ప్రపంచంలో మనకు విలువ ఉంటుందా ? గతంలో మన దేశాన్ని బ్రిటీష్‌ పాలకులు ఏలినపుడు మన దగ్గర నుంచి ముడిసరకులు దిగుమతి చేసుకొని వారి నుంచి పారిశ్రామిక ఉత్పత్తులను మన మీదకు వదిలారు. రెండింటిలోనూ వారికే లాభం. ఇప్పుడు చైనా విషయంలో కూడా జరుగుతున్నది అదే. మనం వాణిజ్య లోటుతో ఉన్నాము అంటే అది చైనా, మరొక దేశం ఏదైనా సరే మన సంపదలకు అక్కడకు తరలుతున్నట్లే కదా ?నాడు మనది ఆక్రమిత దేశం, పరాధీనత, నేడు మనది స్వతంత్ర దేశమైనా స్పష్టమైన వైఖరి లేకపోవటంమే కారణం. మనం నేర్చుకున్నది ఏమిటి ? చైనాను పక్కన పెట్టి పశ్చిమ దేశాలతో సంబంధాలు పెట్టుకొని జనాన్ని ఉద్దరించమనండి. ఎవరు వద్దన్నారు. కావలసింది పిల్లి ఎలుకలను పడుతుందా లేదా అన్నది తప్ప నల్లదా తెల్లదా అన్నది కాదు. చైనాతో సంబంధాలను వెనక్కు మళ్లించుకొనేందుకు అమెరికా వంటి బడా దేశాల వల్లనే కావటం లేదు, చైనా మూడు చెరువుల నీరు తాగిస్తున్నది. దీని అర్ధం చైనాకు లొంగిపొమ్మని కానే కాదు. చైనా వస్తువుల మీద అక్రమంగా దిగుమతి పన్ను విధించటం చట్టవిరుద్దమని జనవరి 16న ప్రపంచ వాణిజ్య సంస్ధ తీర్పు ఇచ్చింది. అంతే కాదు, పరిహారంగా అమెరికా వస్తువుల మీద 64.5 కోట్ల డాలర్ల మేర ఏటా పన్నులు విధించుకోవచ్చని కూడా తీర్పు ఇచ్చింది. నిబంధనలకు చెప్పిన భాష్యం అంతా తొండి, మొత్తంగా ప్రపంచ వాణిజ్య సంస్దనే సంస్కరించాలని అమెరికా ఇప్పుడు గోలగోల చేస్తున్నది.


ఇక్కడ జనం తీవ్రంగా ఆలోచించాలి. ఒకవైపు చైనా మీదకు మనల్ని ఉసిగొల్పుతున్న అమెరికా మరోవైపు వారితోనే ఏడాదికేడాది లావాదేవీలను ఎందుకు పెంచుకుంటున్నట్లు ? అంతకు ముందుతో పోల్చితే 2021లో 28.7శాతం లావాదేవీలు పెరిగాయి.చైనా మిగులు 396.5 బి.డాలర్లు ఉంది.2018లో వాణిజ్యయుద్దం ప్రారంభానికి ముందు ఇది 323 బి.డాలర్లు మాత్రమే ఉంది. 2021లో తొలిసారిగా చైనా ఆరులక్షల కోట్ల డాలర్ల వాణిజ్యలావాదేవీల మైలు రాయిని అధిగమించింది. అమెరికా తనను తానే రక్షించుకోలేని స్ధితిలో ఉన్నపుడు మరొక దేశాన్ని రక్షించగలదా ? అమెరికా అడ్డగోలుగా ప్రపంచాన్ని నడిపే రోజులు కావివి అని గ్రహించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి ఎన్నికల లబ్దికే చమురు ధరల స్ధంభన – మార్చి ఏడు తరువాత బాదుడే బాదుడు !

19 Wednesday Jan 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, fuel politics, Fuel Price in India, Fuel prices freezing, Narendra Modi, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


ప్రకటిత విధానాలను తుంగలో తొక్కటంలో కమ్యూనిస్టులు తప్ప మిగతా పార్టీల వారి గురించి ఎవరికీ తేడా లేదు. మాది మిగతా పార్టీలకు భిన్నం అని చెప్పుకున్న బిజెపిని ఏర్పాటు చేసింది ఆర్‌ఎస్‌ఎస్‌, కనుక అనేక మంది అది నిజమే అనుకున్నారు. క్రమంగా మా మీద అలాంటి భ్రమలేవీ పెట్టుకోవద్దని బిజెపి తన చర్యల ద్వారా పదే పదే జనాలకు చెబుతోంది. దానికి తాజా ఉదాహరణే చమురు ధరల స్ధంభన.


నవంబరు నాలుగవ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు దేశంలో చమురు ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. తరువాత కూడా మార్చి ఏడవ తేదీ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌ చివరి దశ ముగిసేవరకు ఇదే స్ధితి కొనసాగుతుంది. ఇలా చెబుతున్నామంటే జోశ్యం కాదు. ఆచరణ ప్రాతిపదిక ఉంది. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోండి. 2021 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 23 వరకు రు.91.17, మరుసటి రోజు రు.90.99, 25 నుంచి 29వరకు పెట్రోలు రేటు రు.90.78, మరుసటి రోజు నుంచి ఏప్రిల్‌ 14వరకు రు.90.56, ఆ మరుసటి రోజు నుంచి మే మూడవ తేదీ వరకు రు.90.40. ఇదంతా ఐదు రాష్ట్రాల ఎన్నికల అచ్చేదిన్‌లో జరిగింది. ఈ కాలంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఎలా ఉన్నాయి?


ఫిబ్రవరినెల 28 రోజుల్లో చమురు ధరలను 17 సార్లు సవరించారు. ఆ నెలలో ముడి చమురు మనం కొనుగోలు చేస్తున్నది పీపా ధర నెల సగటున 61.22 డాలర్లుంది. మార్చి నెలలో 64.73 డాలర్లకు పెరిగినా ధర ఫిబ్రవరి 27 నుంచి మార్చి 23వరకు ఒకే ధర(రు.91.17) ఆ తరువాత ఇంకా తగ్గింది. ఏప్రిల్‌ నెలలో ముడిచమురు సగటు ధర 63.40 డాలర్లు. మార్చి నెల కంటే ఏప్రిల్‌లో తగ్గింది 1.33 డాలర్లు, దాన్ని వినియోగదారులకు బదలాయించారు గనుక లీటరుకు 38 పైసలు తగ్గించారనుకుందాం ? మరి ఫిబ్రవరి-మార్చినెలల మధ్య పీపా ధరలో 3.51 డాలర్ల పెరుగుదల ఉంటే ధరలను స్ధిరంగా ఉంచటం ఎలా సాధ్యమైనట్లు ? ఇవి ఐదు రాష్ట్రాల ఎన్నికల అచ్చేదినాలు అన్నది స్పష్టం.


ఇప్పుడు జరగనున్న మరో ఐదు రాష్ట్రాల అచ్చేదిన్‌ సంగతి చూద్దాం. ఉప ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలతో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది చొప్పున పన్నులు తగ్గించినట్లు ప్రకటించింది. సంతోషం. బిజెపి పాలిత రాష్ట్రాలు నరేంద్రమోడీగారిని ఆదర్శంగా తీసుకొని వాట్‌ను తగ్గించాయి. ఇంకా సంతోషం. జరుగుతున్నదేమిటి ? అక్టోబరు ఒకటి నుంచి నవంబరు 3వరకు 34రోజుల్లో 28 సార్లు సవరించారు. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ ఎనాలసిస్‌( పిపిఎసి) సమాచారం ప్రకారం సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 27వరకు సగటున పీపా ముడి చమురు దిగుమతి ధర 81.54 డాలర్లు, అక్టోబరు 28 నుంచి నవంబరు 26వరకు 81.51 కాగా నవంబరు 27 నుంచి డిసెంబరు 29వరకు 72.93 డాలర్లకు తగ్గింది. దీపావళి ధమాకా పేరుతో కేంద్రం, రాష్ట్రాలు తగ్గించిన పన్నుల మేరకు తప్ప చమురు కంపెనీలు నవంబరు నాలుగవ తేదీ నుంచి ఇది రాసిన జనవరి 20వరకు 75 రోజులుగా తమ ధరలను ఎందుకు సవరించలేదు ? వాటికి పన్నులతో సంబంధం లేదు కదా ? ముడిచమురు ధరలు పెరిగితే పెంచుతాం తగ్గితే దించుతాం అని చెప్పిన విధానం ఏమైంది ? పాలకులు కంపెనీలను ఎందుకు ప్రశ్నించటం లేదు ? సమాధానం చెప్పే జవాబుదారీ తనం ఉందా ? అసలు కథేమిటి ?


అక్టోబరు 25న గరిష్టంగా మన ముడి చమురు కొనుగోలు ధర పీపా 84.77 డాలర్లను తాకింది.తరువాత క్రమంగా పడిపోతూ డిసెంబరు నాలుగున 69.52 డాలర్లకు తగ్గింది.పదిహేను డాలర్లు తగ్గినా చమురు ధరలు పైసా తగ్గించలేదు. డిసెంబరు సగటు ధర ముందే చెప్పుకున్నట్లు 72.93 డాలర్లు. చంబల్‌ బందిపోట్లు ధనికులను మాత్రమే దోచుకొనే వారు. ప్రభుత్వం ఎవరినీ వదలటం లేదు, అంతకంటే పెద్ద దోపిడీ సాగుతోందా లేదా ? ప్రభుత్వరంగ సంస్థలదే మార్కెట్‌లో ప్రధాన వాటా అయినా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత రిలయన్స్‌ బంకులు కొన్ని తిరిగి తెరుచుకున్నాయి.ప్రభుత్వ ధరలనే అవీ వసూలు చేస్తున్నాయి. ముడి చమురు ధర తగ్గిన మేరకు అదేమీ తగ్గించలేదు. ప్రభుత్వ విధానం దానికి లాభాల పంట పండిస్తున్నపుడు వాటిలో కొంత మొత్తాన్ని ఎన్నికల బాండ్లు, ఇతర రూపాల్లో బిజెపికి అప్పగిస్తుంది గానీ జనాలకు ఎందుకు తగ్గిస్తుంది. ఓకే రిలయన్స్‌ ప్రైవేటు కంపెనీ కనుక అలా చేస్తోంది అనుకుందాం, మరి ప్రభుత్వ కంపెనీలు ?


ఐదు రాష్ట్రాల ఎన్నికల తరుణంలో నెలల తరబడి ధరలను సవరించకుండా బిజెపికి సానుకూలతను సృష్టించేందుకు తమ వంతు చేస్తున్నాయి. దీని వలన ఇతర సరకుల ధరలు కూడా తాత్కాలికంగా కొంత మేరకు అదుపులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఐదు, పది రూపాయల మేరకు భారం తగ్గించిన తరువాత ముడి చమురు ధరలు తగ్గాయి. ఆమేరకు జనానికి తగ్గించలేదు. డిసెంబరు ఐదు నుంచి ముడి చమురు ధరలు మనం దిగుమతి చేసుకొనేది జనవరి 18వరకు 69.52 డాలర్ల నుంచి 87.03పెరిగింది. నరేంద్రమోడీ ఏలుబడిలో ఇది సరికొత్త రికార్డు. జనవరి 20వ తేదీన బ్రెంట్‌ రకం ముడిచమురు ధర 88.68 డాలర్లకు చేరింది, త్వరలో వంద డాలర్లకు చేరవచ్చని అంచనా.


అక్టోబరు 25న మన దిగుమతి రకం 84.77 డాలర్లు ఒక రికార్డు. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఐనా ధరలు పెంచలేదు.మార్చి ఏడవ తేదీన ఎన్నికల చివరి దశ ముగుస్తుంది. అంటే ఆ రోజు వరకు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నా అప్పటి వరకు ఇప్పుడున్న ధరలే కొనసాగుతాయి. ఆ తరువాతే అసలు కథ మొదలౌతుంది. నవంబరు 4- మార్చి ఏడవ తేదీ మధ్య జరిగిన లావాదేవీల లెక్కలు చూసుకున్నపుడు వచ్చిన లాభం హరించుకుపోయి నష్టం ఉందనుకోండి, ఆమేరకు ధరలు పెంచి లోటు మొత్తాన్ని కంపెనీలు పూడ్చుకుంటాయి. ఈ లోగా బిజెపి తన ప్రచారం తాను చేసుకుంటుంది. కంపెనీలకు వచ్చే ఆర్ధిక నష్టం ఏమీ ఉండదు. అధికార పార్టీలపై వ్యతిరేకత పెరగటానికి ధరల పెరుగుదల ఒక కారణం మాత్రమే. అది ఒక్క చమురు ధరల మీదనే ఆధారపడి ఉండదు. అందువలన వాటిని నియంత్రించి జనాలను మాయ చేయ చూసినా వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు బిజెపికి ఎదురు దెబ్బలు తగలవచ్చు.


తమ పాలిత రాష్ట్రాల మాదిరి ఇతర పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాల్సిందే అని బిజెపి డిమాండ్‌ చేసింది. రాష్ట్రాలను దెబ్బతీసే కేంద్ర ప్రభుత్వ ఎత్తుగడ కారణంగా ఇప్పటికే రాష్ట్రాలు ఎక్సయిజు పన్ను వాటాను గణనీయంగా కోల్పోయాయి, వాటిలో మెజారిటీ బిజెపి పాలనలో ఉన్నవే. కేంద్రంలో అధికారం ఉంది కనుక ఆ మేరకు వేరే రూపంలో ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు అలాంటి అవకాశం లేదు.2017లో పెట్రోలు మీద ఎక్సయిజు పన్ను లీటరుకు రు.9.48, డీజిలు మీద రు.11.33 ఉండగా 2021 ఫిబ్రవరిలో ఆ మొత్తాలను కేంద్రం రు.1.40-1.80కి తగ్గించింది. ఆ మేరకు, తరువాత అదనంగా సెస్‌లను విధించింది. వినియోగదారులకు ఎలాంటి మార్పు లేనందున వారికి ఈ మతలబు అర్దం కాలేదు. దీపావళి పేరుతో తగ్గించిన మేరకు రాష్ట్రాలకు వాట్‌ శాతం తగ్గి రాబడి తగ్గింది. పరోక్షంగా అవీ తగ్గించినట్లే. బిజెపి పాలిత రాష్ట్రాలకు ఏదో ఒక రూపంలో కేంద్రం సొమ్ము ముట్టచెబుతుంది.


ఢిల్లీ చుట్టూ హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ ప్రాంతాలు ఉన్నాయి. అక్కడి బంకుల్లో ధరలు తక్కువగా ఉన్నపుడు ఢిల్లీ వాహనదారులందరూ కొద్ది కిలోమీటర్లు వెళ్లి అక్కడే కొనుగోలు చేస్తారు. అది బంకుల వారికి, ఢిల్లీ ప్రభుత్వానికి నష్టమే కనుక కొద్ది రోజు తరువాత ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం పెట్రోలుపై వాట్‌ను 30నుంచి 19.4శాతానికి తగ్గించటంతో డిసెంబరు ఒకటిన రు.104.01గా ఉన్న రేటు నాలుగవ తేదీన రు.95.41కి తగ్గింది. డీజిలు మీద అంతకు ముందే వాట్‌ 16.75శాతం ఉన్నందున డీజిలు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో ఇప్పుడు డీజిలుపై కేంద్ర పన్నులు, సెస్‌ల మొత్తం రు.21.80కాగా రాష్ట్ర పన్ను రు.12.69 మాత్రమే. పెట్రోలు మీద కేంద్ర పన్ను రు.27.90 కాగా ఢిల్లీ రాష్ట్రపన్ను రు.15.60 మాత్రమే. కేంద్ర పన్నులు అన్ని చోట్లా ఒకే విధంగా ఉంటాయి. రాష్ట్రాలలో వాట్‌ రేట్లు భిన్నంగా ఉన్నందున వాటికి అనుగుణంగా మొత్తాలు మారతాయి.


బిజెపి నేతలు, వారికి వంతపాడే నోళ్లు చేసే వాదనల గురించి తెలిసిందే. కేంద్రం విధించే పన్నుల్లో 41శాతం వాటా రాష్ట్రాలకు వస్తుంది. కేంద్రం చేసే ఖర్చు కూడా రాష్ట్రాలలోనే కనుక రాష్ట్రాలకే ఎక్కువ దక్కుతోందని, అందువలన రాష్ట్రాలే పన్ను తగ్గించాలనే కుతర్కాన్ని ముందుకు తెచ్చారు. ఇది జనాలను మోసం చేసే ప్రక్రియ. పిఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసర్చ్‌ సంస్ద వెల్లడించిన వివరాల మేరకు 2017 ఏప్రిల్‌లో పెట్రోలు మీద కేంద్రం విధించిన ఎక్సయిజు పన్ను (రాష్ట్రాలకు వాటా ఇచ్చేది) రు.9.48, సెస్‌,సర్‌ఛార్జీలు రు.12. కేంద్ర పన్నుల్లో వీటి శాతాలు 44-56, కాగా 2021ఫిబ్రవరి నాటికి ఇవి రు.1.40 – 31.50గా ఉన్నాయి, శాతాలు 4-96 మారాయి. ఇదే డీజిలు సంగతి చూస్తే ఎక్సయిజు – సెస్‌,సర్‌ఛార్జీలు 2017 ఏప్రిల్‌లో రు.11.33- రు.6 శాతాల వారీ 65-35గా ఉన్నాయి. 2021 ఫిబ్రవరి నాటికి ఇవి రు.1.80- రు.30 కాగా శాతాలు 6-94కు మారాయి. రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన వాటాకు మోడీ సర్కార్‌ ఎలా కోత పెట్టిందో స్పష్టం. కేంద్రం పన్నుల పేరుతో వసూలు చేసిన మొత్తాలు 2014 తరువాత గణనీయంగా పెరిగాయి.2019-20లో ఆ మొత్తాలు రు.2.38లక్షల కోట్లుండగా 2020-21కి అవి 3.84లక్షల కోట్లకు పెరిగాయి.2020 మేనెలలో పెట్రోలు మీద పది, డీజిలు మీద రు. 13 చొప్పున భారం మోపటమే దీనికి కారణం. ఇదే కాలంలో సెస్‌ను సవరించిన కారణంగా రాష్ట్రాలకు వచ్చే వాటా మొత్తం తగ్గింది. కేంద్రం తగ్గించిన ఐదు, పది వలన కేంద్రానికి ఆదాయం ఎంత తగ్గిందన్నది చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

యువతలో పెరుగుతున్న అసంతృప్తి, అప్పులు దేశానికి ముప్పు- ప్రపంచ ఆర్ధికవేదిక హెచ్చరిక

17 Monday Jan 2022

Posted by raomk in BJP, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Disillusionment among youth, Global Risk Report, India Youth, Narendra Modi, Narendra Modi Failures, World Economic Forum


ఎం కోటేశ్వరరావు


దవోస్‌ కేంద్రంగా ఉన్న ప్రపంచ ఆర్ధిక వేదిక వార్షిక సమావేశాలు గత నెలలో జరగాల్సినవి కరోనా కారణంగా జనవరి 17-21 తేదీలలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతి ఏటా ప్రపంచ ముప్పు నివేదికను వెలువరించటం ఆనవాయితీగా వస్తోంది. వివిధ దేశాలలో గడచిన ఏడాది కాలంలో సంభవించిన సంక్షోభాలను దీనిలో విశ్లేషిస్తారు.ఆర్ధిక వేదిక సమావేశాల్లో వాటికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రపంచ నేతలు చర్చిస్తారు. ఈ సారి ఏమి చర్చిస్తారో, ఏం జరుగుతుందో సమావేశాల తరువాత చూద్దాం. గతేడాది మాదిరే ఈ సారి కూడా కరోనా సంక్షోభం మీదే ప్రధానంగా కేంద్రీకరణ ఉంది. ప్రతిదేశం ఎదుర్కొంటున్న ముప్పుల గురించి దీనిలో చర్చించారు.
మన దేశం ఐదు ప్రధాన ముప్పులను ఎదుర్కొంటున్నదని 2022 నివేదికలో పేర్కొన్నారు. ఒకటి యువత అసంతృప్తి,రుణభారం, డిజిటల్‌ అసమానత, అంతర్రాష్ట సంబంధాలు దెబ్బతినటం, సాంకేతిక పాలన వైఫల్యంగా పేర్కొన్నారు. పని కోసం అడ్డాల మీదకు వస్తున్న వారికి ఉపాధి చూపకపోతే పక్కదార్లు పడతారు. అనేక సామాజిక సమస్యలు తలెత్తుతాయి. పర్యవసానాలను ఊహించలేము. జి-20 కూటమిలోని మన దేశంలో ఇది పెద్ద ముప్పుగా ఉంది. దేశంలో కార్మికశక్తి భాగస్వామ్యం 2020లో 46.29శాతం ఉండగా చైనాలో 66.82శాతం ఉంది. గతేడాది డిసెంబరులో సిఎంఐఇ సమాచారం ప్రకారం దేశం మొత్తంగా 7.91శాతం, పట్టణాల్లో 9.3,గ్రామాల్లో 7.28శాతం నిరుద్యోగులున్నారు. పరిస్ధితి ఎప్పుడు మెరుగుపడుతుందో అర్ధంగాని స్ధితిలో యువత ఉంది. కరోనాకు ముందే నిరుద్యోగం నాలుగున్నర దశాబ్దాల రికార్డును అధిగమించిందన్న సమాచారాన్ని లోక్‌సభ ఎన్నికల ముందు ప్రభుత్వం తొక్కిపెట్టింది. అనధికార మార్గం ద్వారా వెల్లడైన అంశాలను వాస్తవం కాదని తోసి పుచ్చి లెక్కలు సరిగా లేవని చెప్పింది. ఎన్నికలు ముగిశాక ఆ నివేదికనే గుట్టుచప్పుడు కాకుండా అంగీకరించింది. అప్పటితో పోల్చితే ఇప్పుడు పరిస్ధితి ఇంకా దిగజారింది.వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లో నిరుద్యోగం ద్రవ్యోల్బణం కూడా ఎక్కువగా ఉన్నట్లు వివరాలు చెబుతున్నాయి.


1975అత్యవసర పరిస్ధితికి ముందున్న నిరాశా, నిస్పృహలు కనిపిస్తున్నాయి.2014, 2019లో రెండు సార్లు మంచి రోజులను తెస్తానన్న నరేంద్రమోడీ వాగ్దానం,రేకెత్తించిన ఆశలకు ఇది విరుద్దం. వెనుకా ముందూ ఆలోచించకుండా, కుల, మతాలను అధిగమించి మద్దతు ఇచ్చిన వారు హతాశులౌతున్నారు. ఒకసారి అధికారంలో అన్నీ చేయటం ఎవరికైనా కష్టమే, రెండోసారి అవకాశం ఇద్దాం అనుకున్నవారు ఫలితాలు వచ్చిన దగ్గర నుంచీ ఊహించని పరిణామాలను చూస్తున్నారు.


నైపుణ్యశిక్షణ ఉంటే ఇంకేముంది ఉద్యోగం సిద్దం అన్నారు. డిగ్రీలు పుచ్చుకున్నవారు కాలేజీల నుంచి వెలుపలికి రాగానే వేలాది రూపాయలు వెచ్చించి పొందిన శిక్షణలు ఉపాధికి పనికి రాకుండా పోతున్నాయి. అసమానతలు, ఆర్ధిక రంగ పునరుద్దరణ, కరోనా పర్యవసానాలు కనీసం పదేండ్ల పాటు ప్రతికూల ప్రభావాలు చూపుతాయనే నిపుణుల అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కుటుంబాలు, దేశం అప్పుల పాలు కావటం కూడా యువత మీద ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. పాలకులు చేసిన అప్పులకు వడ్డీ, అసలు మొత్తాలకు వచ్చిన ఆదాయాలను ఖర్చు చేస్తారా లేక ఉపాధికి అవసరమైన పెట్టుబడులు పెడతారా అంటే మొదటి దానికే మొగ్గు. రెండవ దానికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే వనరుల వృద్ది జరిగి అపులు చేయాల్సి వచ్చినా పరిమితంగా ఉండేవి. కరోనా పేరుతో ఒకవైపు జనాల మీద భారాలు మోపుతూ అప్పులకు సైతం వాటినే కారణాలుగా చూపుతున్నారు. అసలు కార్పొరేట్లకు ఇచ్చే రాయితీలకే ఎక్కువగా మళ్లిస్తున్నారు.కరోనా కారణంగా అసమానతలు మరింత పెరిగినట్లు ప్రపంచబాంకు కూడా చెప్పింది. ప్రపంచంలోని ధనికుల్లో ఎగువన ఉన్న 20శాతం మంది 2021లో తమ నష్టాలలో సగాన్ని తిరిగి పొందగలిగితే, దిగువ 20శాతం మంది ఐదుశాతంపైగా ఆదాయాలను కోల్పోయారు. కరోనా ముందున్న పరిస్ధితితో పోల్చితే 2030 నాటికి 5.1 కోట్ల మంది ఎక్కువగా దుర్భరదారిద్య్రంలో ఉంటారని అంచనా.


ఒక్క యువతే కాదు, గత ఎనిమిది సంవత్సరాల మోడీ పాలన చూసినపుడు ఏ రంగంలోనూ ఆశాజనక పరిస్ధితి కనిపించటం లేదు. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లు ఏ రంగంలో చూసినా దిగజారుడు లేదా గిడసబారుడే.చెప్పుకొనే గొప్పలకు తక్కువ లేదు. దేశాన్ని అవినీతి నుంచి రక్షిస్తానని నేను తినను ఎవరినీ తిననివ్వను అని నరేంద్రమోడీ చెప్పినపుడు సంసార బంధాలు, బాధ్యతలు లేవు గనుక నిజంగానే చేస్తారని జనం నమ్మారు, ఇప్పటికీ నమ్ముతున్నారు. తన ఆశ్రితులకు అప్పనంగా జన సంపదలను అప్పగించటం ఏమిటన్నది ప్రశ్న. ఎవరి మేలుకోసం ఇది చేస్తున్నట్లు ?ప్రపంచ వాణిజ్య లంచాల ముప్పు సూచికలో మన దేశ స్ధానం 2021లో 82లో ఉంది, అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే ఏడు స్ధానాలు దిగజారింది. మొత్తంగా ఎనిమిదేండ్ల పాలన చూసినపుడు 2014లో ఉన్న 82వ స్ధానమే ఇప్పుడూ ఉంది. మరి అవినీతిని అరికట్టిందెక్కడ ? ట్రేస్‌ అనే అంతర్జాతీయ సంస్ధ 194 దేశాలతో రూపొందించిన జాబితాలో మన స్ధానం అది. 2020లో 45 మార్కులు వస్తే 2021నాటికి 44కు తగ్గాయి.2014లో కూడా అన్నే మార్కులొచ్చాయి. ప్రభుత్వంతో వాణిజ్యలావాదేవీలు, అవినీతి నిరోధక చర్యలు, పౌరయంత్రాంగ పారదర్శకత, మీడియాతో సహా పౌరసమాజ నిష్ట సామర్ధ్యం తదితర అంశాల ప్రాతిపదికన దీన్ని మదింపువేస్తారు. ముడుపుల డిమాండ్‌ ఎక్కువగా ఉందంటే విదేశీ సంస్ధలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి.


దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు. కాంగ్రెస్‌ 50 సంవత్సరాల్లో చేసిన వాటిని తాము ఐదు సంవత్సరాల్లోనే చేసినట్లు చెప్పుకున్న పాలకుల ఏలుబడిలో ఉన్నాము. అనేక సూచికలను చూస్తే వివిధ అంశాలలో మనం ఎక్కడున్నాం అన్నది అవలోకనం చేసుకోవాల్సి ఉంది. వైఫల్యాలను కాంగ్రెస్‌ మీదో మరొకరి మీదో నెడితే ఇంకేమాత్రం కుదరదు. స్వాతంత్య్రం తరువాత అత్యంతబలమైన ప్రభుత్వాన్ని నరేంద్రమోడీ మాత్రమే నెలకొల్పారని చెబుతున్నపుడు ఫలితాలు కూడా అలాగే ఉండాలి కదా ! లంచాల సూచికలో పని తీరు ఏమిటో చూశాము. మరికొన్నింటిలో ఏ స్ధానంలో ఉన్నామో పరిశీలించుదాం.
ప్రపంచ వాణిజ్య లంచాల ముప్పు సూచిక 82(2021)
నిరంతర అభివృద్ధిసూచిక(ఎస్‌డిజి) 120 (2021)
మానవాభివృద్ధి సూచిక(యుఎన్‌డిపి) 131 (2020)
ప్రపంచ లింగవివక్ష(ప్రపంచ ఆర్ధికవేదిక) 140 (2021)
ప్రపంచ ఆకలి సూచిక 94(2020)
ప్రపంచ యువత ఆభివృద్ధి సూచిక 122(2020)
ప్రపంచ ఆరోగ్య భద్రత సూచిక 57(2019)
ప్రపంచ ముప్పు సూచిక 89(2020)
ప్రపంచ పర్యావరణ ముప్పు సూచిక 7(2021)
ప్రపంచ ఉగ్రవాద ముప్పు సూచిక 8 (2020)
ప్రపంచ ప్రజాస్వామ్య (ఇఐయు) సూచిక 53(2020)
ప్రపంచ మానవ స్వేచ్చ (కాటో) సూచిక 111(2020)
ప్రపంచ ఆర్ధిక స్వేచ్చ సూచిక 105(2020)
ప్రపంచ అవినీతి దృష్టి సూచిక 86(2020)
ప్రపంచ పత్రికా స్వేచ్చ సూచిక 142(2021)
ప్రపంచ సుపరిపాలన సూచిక 49(2021)
ప్రపంచ సులభతర వాణిజ్య సూచిక 63(2019)
ప్రపంచ పోటీతత్వ సూచిక 43(2021)
ప్రపంచ నవకల్పన సూచిక 48(2020)
ప్రపంచ పిల్లల హక్కుల సూచిక 112(2021)
ప్రపంచ అసమానతల నివారణ నిబద్దత సూచిక 129(2020)
ప్రపంచ ఇంటర్నెట్‌ సూచిక 49(2021)
ప్రపంచ ప్రతిభ పోటీతత్వ సూచిక 72(2021)
ప్రపంచ శాంతి సూచిక 135(2021)
ప్రపంచ విద్యా సూచిక 135(2020)


దేశ రుణ భారం ఆకస్మికంగా పెరిగింది. ఇది అన్ని రంగాల మీద ప్రభావం చూపుతుంది. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం ప్రపంచ రుణం 226లక్షల కోట్ల డాలర్లు.2019 కంటే 27లక్షల కోట్ల డాలర్లు ఎక్కువ. కరోనా తరువాత విపరీతంగా పెరిగింది. మన జిడిపిలో అప్పు మొత్తం 90.6శాతం ఉంది. మన అప్పులు 2016లో 68.9శాతం కాగా 2020 నాటికి 89.6, మరుసటి ఏడాదికి 90.6శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు. తరువాత మొత్తంగా చూస్తే అప్పు పెరిగినప్పటికీ జిడిపి పెరుగుదల కూడా ఉంటుంది కనుక దానితో పోలిస్తే 2022లో 88.8 నుంచి 2026 నాటికి 85.2శాతానికి చేరుతుందని అంచనా. అంటే కరోనా ముందు స్ధితికి చేరే అవకాశమే లేదు. రుణాల పెరుగుదల వలన సామాజిక అశాంతి పెరుగుతుందని ఐఎంఎఫ్‌ నివేదిక హెచ్చరించింది. పాలకులు ఇప్పటికైనా పట్టించుకొని పరిష్కారాలను చూస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మూడవ ప్రత్యామ్నాయం-కెసిఆర్‌ ముందున్న సమస్యలు !

15 Saturday Jan 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Telangana, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, CPI(M), KCR, RJD, Third front formation in India, trs


ఎం కోటేశ్వరరావు


తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పక్కాగా బిజెపి వ్యతిరేక వైఖరిని తీసుకోనున్నారా? మూడో రాజకీయ సంఘటన ఏర్పాటులో భాగస్వామి అవుతారా ? దక్షిణాది రాష్ట్రాలు ఈ సారి కేంద్రంలో చక్రం తిప్పుతాయా ? కెసిఆర్‌ ప్రకటనలు, చర్యలు దేనికి చిహ్నం అనే చర్చ కొంత మందిలో జరుగుతోంది. గతంలో జరిగిన పరిణామాలను బట్టి అలాంటి నిర్ధారణలకు రావటం లేదా ఆ దిశగా చర్చించటం తొందరపాటవుతుంది అనే అభిప్రాయం కూడా ఉంది. మరోసారి ఎందుకీ చర్చ ? దానికి దోహదం చేసిన అంశాలేమిటి ? జనవరి నెల మొదటి పక్షంలో తెలంగాణాలో కొన్ని ముఖ్యఘటనలు జరిగాయి. సంఘపరివార్‌ భేటీ, ఆ వెంటనే సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశం, ఇదే సమయంలో ఏఐవైఎఫ్‌ జాతీయ సభ, ఆలిండియా కిసాన్‌ సభ జాతీయ కౌన్సిలు సమావేశం,బీహార్‌ ఆర్‌జెడి నేత తేజస్వియాదవ్‌ సిఎం కెసిఆర్‌తో భేటీ, బిజెపి నేత బండి సంజయ అరెస్టు, విడుదల దానికి నిరసనగా జరిగిన సభలు, బిజెపి జాతీయ నేతల ప్రకటనల దాడి వంటివి ఉన్నాయి.


కేరళలోని కన్నూరులో జరిగే సిపిఎం జాతీయ మహాసభలో వచ్చే మూడు సంవత్సరాలలో అనుసరించాల్సిన రాజకీయ తీర్మానం ముసాయిదా ఖరారుకు హైదరాబాదులో పార్టీ కేంద్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, త్రిపుర మాజీ సిఎం మాణిక్‌ సర్కార్‌ను కెసిఆర్‌ విందుకు ఆహ్వానించారు.ఏఐవైఎఫ్‌ సభలో పాల్గొనేందుకు వచ్చిన సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఆ పార్టీ రాష్ట్రనేతలను విడిగా కెసిఆర్‌ ఆహ్వానించారు.అదే విధంగా ఆర్‌జెడి నేత తేజస్వియాదవ్‌ కలసినపుడూ మొత్తంగా మూడు పార్టీల నేతలతో రాజకీయ పరిస్ధితులపై అభిప్రాయ మార్పిడి చేసుకున్నారు. బిజెపితో సంబంధాలు సజావుగా ఉంటే సంఘపరివార్‌ సమావేశాలకు వచ్చిన నేతలకూ శాలువాల సత్కారం జరిపి ఉండేవారు. కానీ బిజెపిని గద్దెదింపాలని చెబుతున్న పార్టీల నేతలతో భేటీ ద్వారా కెసిఆర్‌ పంపదలచుకున్న సందేశం ఏమిటి ? తాను బిజెపి వ్యతిరేక కూటమి వైపే మొగ్గు చూపుతున్నట్లు టిఆర్‌ఎస్‌ నేత జనానికి చెప్పకనే చెప్పారు.


తేజస్వి యాదవ్‌ భేటీ సందర్భంగా తండ్రి, ఆర్‌జెడినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో కెసిఆర్‌ ఫోన్లో మాట్లాడారు. మూడవ ఫ్రంట్‌కు నేతృత్వం వహించాలని, జాతీయ రాజకీయాల్లోకి రావాలని కెసిఆర్‌ను లాలూ కోరినట్లు టిఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. బిజెపి ముక్త భారత్‌ కోసం లౌకిక పార్టీలన్నీ దగ్గరకు రావాలన్న కోరిక రెండు పార్టీల వైపు నుంచి వ్యక్తమైనట్లు వెల్లడించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2018లో కెసిఆర్‌ ఇంతకంటే బలమైన సూచనలే పంపారు.బిజెపి, కాంగ్రెస్‌ లేని ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు అంటూ బెంగళూరు వెళ్లి జెడిఎస్‌ నేతలతో చర్చలు జరిపారు. తెలుగువారంతా ఆ పార్టీకే ఓటు వేయాలని బహిరంగంగా పిలుపు ఇచ్చారు. తరువాత ఎలాంటి చొరవా చూపలేదు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ను కలసి రాజకీయాలను చర్చించినట్లు వార్తలు వచ్చాయి.తిరిగి మరోసారి అలాంటి సూచనలు ఇస్తున్నందున వివిధ పార్టీలు, జనంలో సహజంగానే సందేహాలు ఉంటాయి.కెసిఆర్‌తో భేటీ ఐన మూడు పార్టీలు కూడా బిజెపిని వ్యతిరేకించటంలో తిరుగులేని రికార్డు కలిగినవే కనుక, ఇప్పుడు కెసిఆర్‌ మీదనే చిత్తశుద్ది నిరూపణ బాధ్యత ఉందన్నది స్పష్టం.


వివిధ ప్రాంతీయ పార్టీలు అటు కాంగ్రెస్‌తోనూ, ఇటు బిజెపితోనూ జత కట్టటం-విడిపోవటం-తిరిగి కూడటం వంటి పరిణామాలను చూస్తున్నాము. ఇక ముందు కూడా అలాంటివి జరగవచ్చు. ఇప్పుడు దేశానికి ప్రధాన ముప్పుగా బిజెపి ఉందని వామపక్షాలు భావిస్తున్నాయి. అవి బిజెపికి వ్యతిరేకంగా నికార్సుగా నిలబడ్డాయి.గతంలో ఏ పార్టీ ఏవిధంగా వ్యవహరించినప్పటికీ బిజెపికి వ్యతిరేకంగా ముందుకు వస్తే ఆమేరకు ఆహ్వానిస్తామని ఆ పార్టీలు చెబుతున్నాయి.గతంలో బిజెపితో చేతులు కలినందున ఇప్పుడు వ్యతిరేకంగా ఉండే అర్హత లేదని అనలేవు కదా ! ఆ గూటికి ఈగూటికి తిరుగుతున్న అవకాశవాదుల పట్ల ఎలా ఉండాలనేది జనం నిర్ణయించుకుంటారు. ఒక వేళ నిజంగానే కొంత మంది అనుకుంటున్నట్లుగా బిజెపితో కుదరాలనుకుంటున్న రాజీ మేరకు లోక్‌సభ సీట్లను బిజెపికి వదలి, అసెంబ్లీని తమకు వదలివేయాలని టిఆర్‌ఎస్‌ కోరుతుందా ? ఆ బేరం చేసేందుకే బిజెపి మీద విమర్శలను తీవ్రం చేశారా? మరో ఫ్రంట్‌ గురించి టిఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతున్నారా ? అన్న అనుమాలను తీర్చాల్సిందే కెసిఆరే.


టిఆర్‌ఎస్‌ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి బిజెపిని వ్యతిరేకించింది,2009లో అదే పార్టీ బిజెపి, తెలుగుదేశం పార్టీతో కలసి ఎన్‌డిఏ కూటమిలో ఉంది.రాష్ట్రం విడిపోయిన తరువాత 2014 ఎన్నికల నుంచే టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపి రాష్ట్రంలో అధికారం కోసం పోటీ పడుతున్నాయి. వాటి మధ్య పంచాయతీ అదే కదా ! అందుకే అవిలేని మూడవ ఫ్రంట్‌ గురించి కెసిఆర్‌ మాట్లాడుతున్నారన్నది స్పష్టం. పైన చెప్పుకున్నట్లుగా కేంద్రం ఒకరికి రాష్ట్రం ఒకరికి అనే ఒప్పందం ఏ పార్టీతో కుదిరినా ఆ రెండు పార్టీలు ఒకటిగా ముందుకు పోతాయి. విధానాల పరంగా మూడు పార్టీలకు మౌలికమైన తేడాలేమీ లేవు.


రాష్ట్రంలో కెసిఆర్‌ ప్రభుత్వ విధానాలను సిపిఎం, సిపిఐ రెండూ విమర్శిస్తున్నాయి, వ్యతిరేకిస్తున్నాయి. అటువంటపుడు ఒక వేళ కెసిఆర్‌ జాతీయంగా బిజెపిని వ్యతిరేకించే శక్తులతో కలిసే వచ్చే ఎన్నికల్లో వామపక్షాల వైఖరి ఏమిటన్న ప్రశ్న వెంటనే వస్తుంది. వామపక్షాలకు ఎన్నికలే సర్వస్వం కాదు, ఓడినా గెలిచినా అవి తమ విధానాలతో ముందుకు పోతున్నాయి. ఎప్పుడో ఎన్నికలు వస్తాయని, వాటిలో బిజెపి వ్యతిరేక శక్తులకు మద్దతు ఇస్తామని చెబుతున్నాము గనుక ప్రభుత్వాలు చేసే తప్పిదాలను, ప్రజావ్యతిరేక విధానాలను అవి సమర్దిస్తూనో లేదా మౌనంగానో ఆ పార్టీలు ఉండవు. అలా ఉండేట్లైతే విడిగా కొనసాగాల్సిన అవసరం ఏముంది, ఏదో ఒక పార్టీలో చేరి పోవచ్చు. ఎన్నికలు వచ్చినపుడు కాంగ్రెస్‌తో సహా వివిధ పార్టీలతో అప్పుడు తమ ఎత్తుగడలు వుంటాయని, ఎన్నికలకు ముందు ఫ్రంట్‌ ఆలోచనలేదని సిపిఎం చెప్పింది. అంతిమంగా ఎలాంటి వైఖరి తీసుకుంటారన్నది కన్నూరు మహాసభ ఖరారు చేయనుంది. కోల్పోయిన తమ ప్రజాపునాదిని తిరిగి తెచ్చుకోవాలని సిపిఎం గట్టిగా భావిస్తోంది. అలాంటి ప్రక్రియకు నష్టం కలుగుతుందని భావిస్తే ఎవరితో సర్దుబాటు లేకుండానే పరిమిత సీట్లలో బరిలోకి దిగవచ్చు. మిగిలిన చోట్ల బిజెపిని ఓడించగలిగే పార్టీకి మద్దతు ఇవ్వవచ్చు, లేదా పరిస్ధితిని బట్టి సర్దుబాట్లకు సిద్దం కావచ్చు. ఒకసారి ఎన్నికల్లో సర్దుబాటు చేసుకున్నంత మాత్రాన ఆ పార్టీ పాలన ఎలా ఉన్నా మౌనంగా ఉండాలనే కట్టుబాటేమీ లేదు.


ఎన్నికలు వేరు, ప్రజాసమస్యలు వేరనే చైతన్యం ఓటర్లలో కూడా రావటం అవసరం. ఇటీవలి చిలీ ఎన్నికల్లో నాలుగు ప్రధాన పార్టీలో పోటీ పడ్డాయి. వాటిలో వామపక్షం నిలిపిన అభ్యర్ధి రెండవ స్ధానంలో, పచ్చి మితవాది,నిరంకుశ శక్తులను బలపరిచే అతను మొదటి స్ధానంలో వచ్చాడు. అక్కడి నిబంధనల ప్రకారం 51శాతం ఓట్లు తెచ్చుకున్నవారే విజేత, కనుక తొలి ఇద్దరి మధ్య తిరిగి పోటీ జరిగింది. వామపక్ష అభ్యర్ధి తిరుగులేని మెజారిటీతో గెలిచాడు.తొలి విడత ఓటు వేయని లేదా వ్యతిరేకించిన ఓటర్లు రెండోసారి ఓటు చేశారు. అంటే దాని అర్ధం తరువాత కూడా వారంతా వామపక్ష అభిమానులుగా మారతారని కాదు. అక్కడి ఎన్నికల నిబంధనల ప్రకారం తొలివిడతలో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లశాతాన్ని బట్టి ఆ దామాషాలో పార్లమెంటులో సీట్లు కేటాయించారు. అధ్యక్షుడిగా వామపక్ష నేత గెలిచినప్పటికీ పార్లమెంటులో మెజారిటీ లేదు. మన దగ్గర అలాంటి విధానం ఉంటే వేరు, ప్రతి పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుంది, దామాషా పద్దతిలో సీట్లు తెచ్చుకుంటుంది.దేశ ప్రధాని లేదా ముఖ్యమంత్రి పదవులకు ఎన్నికలు జరిగినపుడు తొలి రెండు స్ధానాల్లో ఉన్న పార్టీలలో ఏదో ఒకదానిని మిగతాపార్టీల ఓటర్లు ఎంచుకోవాల్సి వస్తుంది.


టిఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలను ఐదేండ్ల పాటు వామపక్షాలు వ్యతిరేకించవచ్చు. ఎన్నికల సమయానికి దేశ రాజకీయాల్లో ప్రధాన శత్రువుగా భావిస్తున్న బిజెపిని ఓడించాలని నిర్ణయించుకున్నపుడు అదే ప్రధాన ఎన్నికల అంశంగా మారినపుడు, రెండు ప్రధాన పార్టీలైన టిఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ రెండూ గట్టిగా బిజెపిని వ్యతిరేకిస్తున్నపుడు సమస్య వస్తుంది.ప్రస్తుతానికి దాన్ని ఊహాజనిత అంశంగానే చెప్పవచ్చు. ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేము. ఉత్తర ప్రదేశ్‌, ఇతర నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, పర్యవసానాలు, గుణపాఠాలను బట్టి పార్టీలు వ్యవహరిస్తాయి. ఇప్పటికి ఇప్పుడున్న స్ధితిలో టిఆర్‌ఎస్‌ను బిజెపి సవాలు చేసే స్ధితిలో లేదు. అందరూ ఊహిస్తున్నట్లుగా బిజెపి ఓడిపోతే బరిలో టిఆర్‌ఎస్‌-కాంగ్రెసే మిగులుతాయి. లేదూ దానికి భిన్నంగా గెలిస్తే బిజెపి మరింత రెచ్చిపోతే, టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, వామపక్షాలు అన్నీ చేతులు కలపాల్సి రావచ్చు.


అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ కాంగ్రెస్‌ నుంచి బిజెపిలోకి ఫిరాయించిన పెద్దమనిషి.శారదా చిట్‌ఫండ్‌ మొదలు అనేక అవినీతి ఆరోపణలు, కేసులు ఇంకా పరిష్కారం కాలేదు. తాము అధికారంలోకి వస్తే హిమంతను జైలుకు పంపుతామని ప్రగల్భాలు పలికిని వారిలో అమిత్‌ షా ఒకరు. అవినీతి గురించి బుక్‌లెట్స్‌ను విడుదల చేసింది బిజెపి. అలాంటి పార్టీ అతగాడిని తమ పార్టీలోకి చేర్చుకోవటం మంత్రి పదవి, తరువాత ముఖ్యమంత్రి పదవినే కట్టబెట్టింది.


కెసిఆర్‌ మీద ప్రస్తుతం ఆరోపణల ప్రచారదాడి తప్ప ఎలాంటి కేసులు లేనప్పటికీ ప్రతి ఒక్కరూ జైలుకు పంపుతామంటూ బెదిరింపులకు పూనుకున్నారు. అవినీతిని ఎవరూ సమర్ధించాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయంగా లొంగదీసుకొనేందుకే ఇలాంటి ప్రచారం అని భావిస్తున్న తరుణంలో కెసిఆర్‌ బిజెపి మీద తన దాడిని కూడా పెంచుతున్నారు. తాజాగా పెరగనున్న ఎరువుల ధరల మీద కేంద్రానికి లేఖ రాశారు. మొత్తం మీద చెప్పాలంటే బిజెపికి వ్యతిరేకంగా ఉన్నట్లు జనానికి, ఇతర పార్టీలకు విశ్వాసం కలిగించాలంటే టిఆర్‌ఎస్‌, దాని అధినేత కెసిఆర్‌ మరింత స్పష్టంగా ముందుకు రావాల్సిన, బిజెపి వ్యతిరేక శక్తులకు విశ్వాసం కలిగించాల్సిన అవసరం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నందున ఈ సారి కేంద్రంలో చక్రం తిప్పి అన్యాయాన్ని సరిదిద్దాలని కొందరు చెబుతున్నారు. అనేక అంశాల కారణంగా దక్షిణాది రాష్ట్రాలో జనభా నియంత్రణ ఎక్కువగా ఉంది. కేంద్ర నిధులు జనాభా ప్రాతిపదికన కేటాయిస్తున్నందున నష్టం జరుగుతున్నది వాస్తవం. దాన్ని ఎలా పరిష్కరించాలన్నది వేరు, రాజకీయ కూటమి వేరు. ప్రస్తుతం అలాంటి పరిస్ధితి, అవకాశం లేదు అని గ్రహించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉత్తర ప్రదేశ్‌ బిజెపికి తాళం కప్ప బహుమతి – ఒక మంత్రి, 15 మంది ఎంఎల్‌ఏలు రాం రాం !

12 Wednesday Jan 2022

Posted by raomk in BJP, Communalism, Congress, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION

≈ Leave a comment

Tags

#Akhilesh Yadav, BJP, Hinduthwa, Narendra Modi, OBC, Swami Prasad Maurya, UP BJP poll fate, UP poll 2022, Yogi Adityanath


ఎం కోటేశ్వరరావు


మంగళవారం నాడు ఉత్తర ప్రదేశ్‌ బిజెపికి అనూహ్య బహుమతి లభించగా, ఊహించని దెబ్బ తగిలింది. దాదాపు 60 మంది ఎంఎల్‌ఏలను తప్పించి కొత్త ముఖాలతో బరిలోకి దిగేందుకు ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు. కార్మిక శాఖ మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య పదవికి రాజీనామా చేసి సమాజవాది పార్టీ నేతతో ఫొటోకు ఫోజిచ్చారు. మరో ముగ్గురు ఎంఎల్‌ఏలు కూడా అదే బాట పట్టారు. పదమూడు మంది బిజెపి ఎంఎల్‌ఏలు రాజీనామా చేయనున్నట్లు ఎన్‌సిపి అధినేత శరద్‌ పవార్‌ ప్రకటించారు. తన బాటలో నడిచే వారు 15 మంది వరకు ఉన్నట్లు మౌర్య చెబుతున్నారు. మరో మంత్రి ధరమ్‌ సింగ్‌ సయానీ కూడా ఇదే బాటపట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. సీట్లు రాని వారు, బిజెపి గెలిచే అవకాశాలు లేవని గ్రహించిన వారు ఎందరు రాం రాం చెబుతారో తెలియదు. మార్చి పదవ తేదీ తరువాత పార్టీ కార్యాలయాన్ని మూసుకోవాల్సి వస్తుంది కనుక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌కు తాళం కప్పను బహుమతిగా పంపినట్లు సమాజవాది పార్టీ నేత ఐపి సింగ్‌ ప్రకటించారు. ” ఓం ప్రకాష్‌ రాజభర్‌, జయంత్‌ చౌదరి, రాజమాత కృష్ణపటేల్‌, సంజయ చౌహాన్‌, ఇప్పుడు స్వామి ప్రసాద్‌ మౌర్య మాతో ఉన్నారు. బిజెపి ప్రధాన కార్యాలయానికి తాళం కప్పను బహుమతిగా పంపాను. మార్చి పదవ తేదీ(ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు) తరువాత తాళం వేసి ఇంటికి వెళ్లి పోండి. ఇది అలకాదు, ఎస్‌పి తుపాను ” అని ట్వీట్‌ చేశారు.


యోగి సర్కార్‌ ఒబిసిలు, దళితులు, రైతులు,చిన్న సన్నకారు వ్యాపారులు, నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తోందని మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య ట్వీట్‌ ద్వారా రాజీనామా లేఖ పంపారు. ఇది వెలువడిన కొన్ని నిమిషాల్లోనే మౌర్య సమాజవాది నేత అఖిలేష్‌ యాదవ్‌ను కలిసిన ఫొటో దర్శనమిచ్చింది.స్వామి ప్రసాద్‌ను పార్టీలోకి ఆహ్వానించినట్లు అఖిలేష్‌ ప్రకటించారు. ఐదు సార్లు ఎంఎల్‌ఏగా, మంత్రిగా పనిచేసి మాయావతి తరువాత నేతగా పేరున్న మౌర్య 2016లో బిఎస్‌పి నుంచి బిజెపిలో చేరారు. ఇప్పుడు సమాజవాదిలో నేరుగా చేరతారా లేక గతంలో ఏర్పాటు చేసిన వేదికను పునరుద్దరించి మిత్రపక్షంగా బరిలోకి దిగుతారా అన్నది ఇంకా స్పష్టం కాలేదు.
ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల గురించి వివిధ సర్వేలు వెలువడుతున్నాయి. ఏబిపి-సి ఓటర్‌ 2021 మార్చి 18న ఒక సర్వే, తాజాగా జనవరి 10న సర్వే వివరాలను ప్రకటించింది.మధ్యలో మరోనాలుగు సర్వేలను నిర్వహించింది.తొలి, తాజా సర్వేల అంచనా సీట్లు, ఓట్లశాతాలు ఇలా ఉన్నాయి.తొమ్మిది నెలల కాలంలో బిజెపి పలుకుబడి ఎలా పడిపోతోందో ఈ వివరాలు సూచిస్తున్నాయి. నామినేషన్లు, ఉపసంహరణల లోగా జరిగే పరిణామాలు పార్టీ ప్రభావాన్ని మరింతగా దిగజార్చేవే తప్ప పెంచేవిగా లేవు.


తేదీ××××××ఎన్‌డిఏ ×××××××ఎస్‌పి×××××××బిఎస్‌పి×××××××కాంగ్రెస్‌×× ఇతరులు
18.3.21××284-294(41)×××54-64(24.4)×××33-43(20.8)××1-7(5.9)××10-16(7.9)
10.1.22××223-235(41.5)××145-157(33.3)××8-16(12.9)××3-7(7.1)××4-8(5.3)
గతఫలితాలు××312(41.4)××47(23.6)××××19(22.2)××××××× 7(6.3)××××ు(6.5)


తన వంటి ఉదారవాదులు బిజెపి ఓడిపోవాలని కోరుకుంటున్నప్పటికీ ఉత్తర ప్రదేశ్‌లో అదే జరిగితే దేశంలో సంస్కరణలు వెనుకపట్టు పడతాయని కార్పొరేట్లకు కొమ్ముకాసే ప్రముఖ జర్నలిస్టు స్వామినాధన్‌ అంక్లేశ్వరియా అయ్యర్‌ పేర్కొన్నారు. ఎకనమిక్స్‌ టైమ్స్‌ ప్రతినిధితో మాట్లాడుతూ సాగు చట్టాల ప్రహసనంతో ఇప్పటికే సంస్కరణలు వెనుకపట్టు పట్టాయి.మానిటైజేషన్‌, కార్మిక సంస్కరణలు కూడా అదే విధంగా మారతాయన్నారు. ఉత్తర ప్రదేశ్‌ నుంచి వెలువడుతున్న చెడు సంకేతాల కారణంగా మానిటైజేషన్‌ మందగించిందన్నారు. బిజెపి గెలిస్తే సంస్కరణలు వేగంగా అమలు జరుగుతాయని, ఓడితే మిగతా రాష్ట్రాల సంస్కరణల మీద కూడా ప్రభావం ఉంటుందన్నారు. దేశ ఆర్ధిక రంగం ఏ బాటలో నడుస్తుందన్నది వచ్చే బడ్జెట్‌ మీదగాక ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. బిజెపి మతతత్వ వైఖరిని అయ్యర్‌ వంటి వారు ఆమోదించనప్పటికీ సమాజం ఏమైనా ఫరవాలేదు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం గెలవాలని కోరుకుంటున్నారు. కార్పొరేట్ల అంతరంగానికి ఇది ప్రతిబింబం.


సీట్ల సంఖ్య తగ్గినా తిరిగి అధికారం ఖాయం అనే ముక్తాయింపులు తప్ప గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో బిజెపికి ఓట్లశాతం పెరుగుతుందని ఏ సర్వే కూడా చెప్పటం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని చెబుతున్నపుడు ఓట్లు తగ్గకుండా ఎలా ఉంటాయన్న ప్రశ్న తలెత్తుతోంది.తన ఓటు బాంకును నిలుపుకొనేందుకు యోగి ఆదిత్యనాధ్‌ రాష్ట్ర ఎన్నికలు 80-20శాతాల మధ్య జరగనున్నాయంటూ మతాన్ని ముందుకు తెచ్చారు. ఉత్తర ప్రదేశ్‌ జనాభాలో 80శాతం హిందువులు, 20శాతం ముస్లింలు ఉన్నారన్న సంగతి తెలిసిందే.403కు గాను 140 నియోజకవర్గాలలో 70 చోట్ల ఓటర్లలో 30శాతం, మిగిలిన చోట్ల 25-30శాతం వరకు ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారున్నారని అంచనా. బిజెపి బీ టీమ్‌గా భావిస్తున్న మజ్లిస్‌ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది, ఐనప్పటికీ అత్యధిక ఓటర్లు ఎస్‌పి వైపు మొగ్గు చూపనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. బిఎస్‌పిలో మాయావతి తరువాత స్ధానంలో ఉన్న మౌర్య తమ పార్టీలో చేరినపుడు గొప్ప పరిణామంగా చిత్రించిన బిజెపి ఇప్పుడు అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా ఒక రోజు సంచలన వార్త తప్ప ఏదో ఒక రోజు ఇలా చేస్తారని తమకు తెలుసు అని బిజెపి చెబుతోంది. కుమార్తె సంఘమిత్ర ఎంపీగా ఉన్నారని, తన కుమారుడికి సీటు ఇవ్వాలన్న కోర్కెను పార్టీ తిరస్కరించినందున ఇలా చేశారని ఆరోపించింది.(గత ఎన్నికల్లో సీటు ఇచ్చారు, సమాజవాదీ చేతిలో ఓడారు) బిజెపి విధానానికి వ్యతిరేకంగా ఓబిసి జన గణన చేయాలని కోరిన వారిలో మౌర్యఒకరు.


సమాజవాదితో మౌర్య చేతులు కలిపితే యాదవేతర ఓబిసిల్లో కొంత శాతం బిజెపికి దూరమైనా ఫలితాలు చాలా చోట్ల తారుమారౌతాయి. వెనుకబడిన తరగతుల్లో మౌర్య, కుష్వాహ సామాజిక తరగతికి చెందిన వారిలో స్వామి ప్రసాద్‌ మౌర్య పలుకుబడి కలిగిన నేత. ఇదే సామాజికి తరగతికి చెందిన కేశవ ప్రసాద్‌ మౌర్య ఉపముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అంతపలుకుబడి కలిగిన వారని కాదని చెబుతారు. ఇప్పటికే బిజెపి కూటమి నుంచి మరో రెండు బిసి సామాజిక తరగతుల నేతలు సమాజవాది పార్టీతో చేతులు కలిపారు.యాదవులు మినహా మిగిలిన ఓబిసిలందరూ తమతో ఉన్నారని బిజెపి చెప్పుకొనేందుకు ఇప్పుడు అవకాశం లేదు. కాంగ్రెస్‌కు చెందిన బలమైన నేత ఇమ్రాన్‌ మసూద్‌ కూడా తాను ఎస్‌పిలో చేరుతున్నట్లు ప్రకటించారు. గణనీయ సంఖ్యలో ఉన్న ముస్లింలు ఎస్‌పి, బిఎస్‌పి, కాంగ్రెస్‌ పార్టీల వెనుక చీలి ఉన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో మెజారిటీ ఇప్పుడు ఎస్‌పి వెనుక సమీకృతులౌతున్నట్లు చెబుతున్నారు. గతంలో ముజఫర్‌ నగర్‌ ప్రాంతంలో మతఘర్షణల్లో జాట్లు-ముస్లింలు మతాల వారీ చీలినప్పటికీ ఇటీవలి రైతు ఉద్యమం వారిని సన్నిహితం చేసిందని వార్తలు వచ్చాయి. ఏడు దశలుగా జరిగే ఎన్నికల్లో తొలి రెండు దశలకు జనవరి 14న నామినేషన్లు ప్రారంభమౌతాయి. ఈ దశల్లోని 113 సీట్లకు ముందుగా బిజెపి అభ్యర్దులను ఖరారు చేయనుంది. సమాజవాది కూడా అదే పద్దతిని పాటించవచ్చు. తాను పోటీ చేయటం లేదని ప్రకటించిన మాయావతి బిఎస్‌పి తరఫున అన్ని చోట్లా పోటీ పెట్టనున్నట్లు ప్రకటించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఫిరోజ్‌పూర్‌లో పంజాబ్‌ రైతుల అనూహ్య నిరసన -సంయమనం కోల్పోయిన ప్రధాని నరేంద్రమోడీ ?

06 Thursday Jan 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Farmers agitations, Narendra Modi, Narendra Modi Failures, PM Modi security breach, Satya Pal Malik


ఎం కోటేశ్వరరావు


జనవరి ఐదు, బుధవారం నాడు జరిగిన అనూహ్యపరిణామాల మధ్య పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లా హుసేనీవాలాలో జరగాల్సిన సభలో పాల్గొనకుండా ప్రధాని నరేంద్రమోడీ వెనక్కు వెళ్లిపోయారు. సభా స్ధలికి 30కిలోమీటర్ల దూరంలోని రోడ్డుమీద ఒక పైవంతెన(ఫ్లైఓవర్‌) సమీపంలో రైతులు నిరసన తెలపటంతో 15-20నిమిషాల పాటు ప్రధాని, వాహన శ్రేణి వంతెన మీద నిలిచిపోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి ముందుకు వెళ్లకుండానే వెనుదిరిగి భటిండా విమానాశ్రయానికి వచ్చి ఢిల్లీ వెళ్లిపోయారు. పంజాబ్‌ ప్రభుత్వ భద్రతాలోపాల కారణంగానే ఇలా జరిగిందని బిజెపి, కేంద్ర ప్రభుత్వం ఆరోపించాయి. గురువారం నాడు భద్రత అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై సమీక్షించింది. రాష్ట్రపతి రామానాధ్‌ కోవింద్‌ను కలిసి బుధవారం జరిగిన ఉదంతం గురించి ప్రధాని నరేంద్రమోడీ వివరించారు. రాష్ట్రపతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపిలను దీనికి బాధ్యులుగా చేయాలని సుప్రీం కోర్టులో ఒక పిటీషన్‌ దాఖలైంది. నరేంద్రమోడీని కాంగ్రెస్‌ ద్వేషించింది, ఇప్పుడు హాని తలపెట్టాలని చూసిందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. జరిగిన దాని మీద విచారం వ్యక్తం చేసిన పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ , కాంగ్రెస్‌ కూడా బిజెపి ఆరోపణను తోసిపుచ్చింది.తగు సంఖ్యలో బలగాలను దింపి ఏర్పాట్లు చేయలేదని కేంద్ర హౌంమంత్రిత్వశాఖ ఆరోపించింది. కాంగ్రెసే ఇది చేసినట్లు ఆరోపిస్తూ అందుకు క్షమాపణ చెప్పాలని అమిత్‌ షా అన్నారు.
పంజాబ్‌ పోలీసు యంత్రాంగ భద్రతాపరమైన లోపాల కారణంగానే ఇది జరిగిందని, అధికారంలో ఉన్నది కాంగ్రెస్‌ పార్టీ గనుక దాని నేతలు క్షమాపణ చెప్పాలంటూ బిజెపి డిమాండ్‌ చేసింది. కేంద్ర హౌంశాఖ సహజంగానే వివరణ ఇవ్వాలని, బాధ్యులపై చర్య తీసుకోవాలని కోరింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు పంజాబ్‌ ప్రభుత్వం ఇద్దరితో విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు గురువారం నాడు ప్రకటించింది.విశ్రాంత న్యాయమూర్తి మెహతాబ్‌ సింగ్‌ గిల్‌, హౌంశాఖ ముఖ్యకార్యదర్శి అనురాగ్‌ వర్మ దీనిలో సభ్యులు. ఈ ఉదంతంపై విచారణ జరపాలని కోరటం గానీ, విచారించటంపైగానీ విబేధించాల్సిందేమీ లేదు. పంజాబ్‌ పోలీసులు తగువిధంగా వ్యవహరించలేదా లేక రైతుల చిన్నపాటి నిరసనను సాకుగా చూపి నరేంద్రమోడీ జనం లేని సభను రద్దుచేసుకొన్నారా అన్నది జనానికి తెలియాలి. అంతే కాదు ప్రధాని భద్రతను చూసే ప్రత్యేక రక్షణ దళం(ఎస్‌పిజి), కేంద్ర గూఢచార విభాగం ఏమి చేసిందన్నది, రోడ్డు మార్గంలో వెళ్లాలని ఎప్పుడు తెలిపారన్నది ఆసక్తికరంగా మారింది.


హుస్సేనీవాలా సభకు జనం చాలా తక్కువగా రావటంతో పాటు భారీ వర్షం, వాతావరణం కూడా అనుకూలించలేదని తెలియటంతో ఎన్నికల సభ కానప్పటికీ రాజకీయంగా ప్రభావం చూపుతుందనే దూరాలోచనతో నరేంద్రమోడీ సభను రద్దు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. సాగు చట్టాల మీద ఉద్యమించిన సంఘాల వేదిక కిసాన్‌ ఏక్తా మోర్చా ఒకట్వీట్‌ చేస్తూ రైతులు, పంజాబు జనం పెద్ద ఎత్తున నిరసన తెలిపిన కారణంగానే మోడీ తన సభను రద్దు చేసుకున్నారని, సభా స్ధలిలో చాలా తక్కువ మంది ఉన్నారని, వారిని కూడా బలవంతంగా తీసుకువచ్చినట్లు, పంజాబీల నుంచి ప్రతికూల స్పందన కారణంగా సభ రద్దు జరిగినట్లు పేర్కొన్నది.
ఢిల్లీ నుంచి భటిండా వరకు విమానంలో వచ్చిన ప్రధాని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హుస్సేనీవాలా వెళ్లాలన్నది ముందుగా నిర్ణయించిన కార్యక్రమం. మధ్యాహ్నం 1.30కు సభ ప్రారంభం కావాల్సి ఉంది. ఉదయం 10.20కి విమానశ్రయంలో దిగిన ప్రధాని వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న హుస్సేనీవాలా చేరాలంటే రెండు గంటలు పడుతుంది,వాతావరణం సరిగా లేని కారణంగా రోడ్డు మార్గాన వెళ్లాలని నిర్ణయించారు 11.50కి ప్రధాని రోడ్డు మార్గాన బయలు దేరారు.


ప్రధాని పర్యటనలకు ముందు ఎఎస్‌ఎల్‌(ముందస్తు పర్యవేక్షక సమావేశం) నిర్వహించి అనుకోని పరిస్ధితులు ఏర్పడినపుడు ప్రత్యామ్నాయ మార్గాల గురించి కూడా చర్చిస్తారు. తగు ఏర్పాట్లు చేస్తారు. రక్షణ బాధ్యత ఎస్‌పిజి కమాండోలదే.ఎస్‌పి హౌదా కలిగిన కమాండెంట్‌, 40 నుంచి 60 మంది వరకు సిబ్బంది ఉంటారు.వీరు అంతర వలయంగా పని చేస్తారు. తరువాత ఇతర భద్రతా సిబ్బంది ఉంటారు. . ప్రధాని ఒక బహిరంగ సభలో, ఇతర కార్యక్రమంలో పాల్గొన్నా,ఈ అంతరవలయంలోకి రాష్ట్రపోలీసులను అనుమతించరు.ప్రధాని ప్రయాణించే మార్గాన్ని ఖరారు చేయటం, సిబ్బందిని ఏర్పాటు చేయటంలో స్ధానిక పోలీసులకు పాత్ర ఉన్నప్పటికీ ఆ మార్గాన్ని రక్షించేందుకు పారామిలిటరీని రంగంలోకి దించుతారు. ఏవైనా టవర్లు, ఎత్తైన భవనాల వంటివి ఆ మార్గంలో ఉంటే అక్కడ వారే ఉంటారు. రోడ్డు మీదకు ఎవరూ రాకుండా, పనులు చేయకుండా స్ధానిక పోలీసులు చూస్తారు. మూడు నాలుగు గంటల ముందే రోడ్లను శుభ్రపరచటం వంటివి చేస్తారు. బుధవారం నాటి ప్రధాని పర్యటనకు అవన్నీ చేసేందుకు స్ధానిక పోలీసులకు అవకాశం ఉందా అన్నది ప్రశ్న. భారీ వర్షం, వాతావరణం సరిగా లేని కారణంగా (బిపిన్‌ రావత్‌ ఇతర మిలిటరీ అధికారుల దుర్మరణం నేపధ్యంలో ప్రధానిని హెలికాప్టర్‌లో తీసుకు వెళ్లేందుకు భద్రతా సిబ్బంది తిరస్కరించి ఉండవచ్చు) రోడ్డు మార్గాన వెళ్లాలని అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది. ఏఎస్‌ఎల్‌ సమావేశంలో ప్రత్నామ్నాయ మార్గం గురించి ఆలోచించి ఉంటే ఆ దిశగా వేరే మార్గంలోకి ఎందుకు మళ్లించలేదు, రైతుల ఆందోళనను ఊహించి ఎందుకు అంచనా వేయలేదు అన్న ప్రశ్నలు, ఆ ప్రాంతంలో మరొక మార్గం లేదన్న వార్తలు వచ్చాయి. రైతులు ఆందోళనకు దిగితే కేంద్ర, రాష్ట్ర ఇంటిలిజెన్స్‌ ఎందుకు పసిగట్టలేకపోయిందన్న ప్రశ్నలూ ఉన్నాయి. ఒకవేళ పసిగట్టినా రైతులు తప్పించుకొని నిరసన తెలిపి రోడ్డును ఎలా దిగ్బంధించారు అన్నది తేలాల్సి ఉంది. పర్యటన గురించి ఎంతో ముందుగానే తెలిపినందున తగు భద్రతతో పాటు ప్రత్నామాయ ఏర్పాట్ల బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నది కేంద్ర వాదన.


ప్రధాని వచ్చే మార్గం పంజాబ్‌ పోలీసులకు తెలుసని, వారే ఉప్పందించి ఉండకపోతే అప్పటికప్పుడు రైతులు ఎలా సమీకృతులౌతారంటూ బిజెపి నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు.ప్రధాని రోడ్డుమార్గాన వస్తున్నట్లు టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయని, వాట్సాప్‌ గ్రూప్‌ల ద్వారా తెలిసిందని, హుస్సేనివాలా వెళ్లేందుకు ఒక్కటే రోడ్డు మార్గం ఉన్నందున తమకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదని రైతులు చెబుతున్నారు. సోమవారం నుంచే రైతులు ఆందోళనకు దిగారని మంగళవారం రాత్రి రైతులతో మాట్లాడి నిరసన తెలపవద్దని కోరగా అంగీకరించారని, తాను తెల్లవారు ఝామున 3గంటల వరకు చర్చించానని, తెల్లవారే సరికి కొందరు ఎలా వచ్చారో తెలియ లేదని ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ చెప్పారు. వాతావరణం సరిగా లేకపోవటం, రైతుల ఆందోళన కారణంగా కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని సూచించామని, తొలుత హెలికాప్టర్‌ ద్వారా అనుకున్న కార్యక్రమానికి భిన్నంగా ఆక్మసికంగా మార్చుకున్న నిర్ణయం గురించి సమాచారం లేదని సిఎం చెప్పారు. ఏ పోలీసు అధికారి మీద చర్య తీసుకొనేది లేదని, పంజాబీల మీద లాఠీలు, తూటాలను ప్రయోగించేది లేని కూడా చెప్పారు. నిరసన తెలిపిన రైతులు సమీపంలోని మిస్రీవాలా, పైరేవాలా గ్రామాలకు చెందిన వారని, మూడు రైతు సంఘాల జెండాలను ఎగురవేసినట్లు, సభకు వెళుతున్న బిజెపి మద్దతుదార్ల వాహనాలను కూడా ఆపినట్లు ఇండియా టుడే విలేకరి రాశారు.ప్రధానికి నిరసన తెలపాలని నిర్ణయించిన రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రి గజేంద్ర షెఖావత్‌ మంగళవారం రాత్రి చర్చలు జరిపిన తరువాత ఆందోళన కార్యక్రమాన్ని రైతులు వాయిదా వేశారు. జనవరి పదిహేను నాటికి ఎంఎస్‌పికి చట్టబద్దతను పరిశీలించే కమిటీని ఏర్పాటు చేస్తామని, మార్చి 15న రైతులతో ప్రధాని కలుస్తారని మంత్రి వారికి చెప్పారు.


” భటిండా విమానాశ్రయానికి ప్రాణాలతో తిరిగి వచ్చాను, అందుకుగాను మీ ముఖ్యమంత్రికి నా కృతజ్ఞతలు తెలపండి ” అని ప్రధాని నరేంద్రమోడీ పంజాబ్‌ అధికారులతో ఢిల్లీ తిరుగు ప్రయాణంలో అన్నట్లు ఎఎన్‌ఐ వార్తా సంస్ధ పేర్కొన్నది. ఈ ఎత్తిపొడుపు లేదా వ్యంగ్యం గురించి ఎలాంటి వివరణ వెలువడనందున ఆ వ్యాఖ్య నిజమే అనుకోవాలి. ఓట్ల కోసం రాజకీయ నేతలు ఏ అవకాశాన్నీ వదులుకోరని గతంలోనే రుజువైనందున ప్రధాని మోడీ ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవటంలో ఆశ్చర్యం ఏముంటుంది ! దేశంలో తనకు ఎదురులేదని భావిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ ఈ ఘటనను అవమానకరంగా భావించారా ? మయసభలో రారాజు మాదిరి మానసికంగా గాయపడ్డారా ?


నిజానికి ప్రధాని వెనక్కు కాకుండా ముందుకు సాగి నిరసన తెలుపుతున్న రైతుల వద్దకు వెళ్లి వారెందుకు అలా చేశారో తెలుసుకొని భరోసా ఇచ్చి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. సాగు చట్టాల రద్దు చేస్తూ క్షమాపణలు కూడా చెప్పి వారి డిమాండ్ల పరిశీలనకు కమిటీ వేస్తానని హామీ ఇచ్చిన తరువాత ఇంకా ఎందుకు నిరసన తెలుపుతున్నారో తెలుసుకుంటే రైతాంగానికి దగ్గర కావాలన్న లక్ష్యం కొంత మేరకు నెరవేరి ఉండేదేమో ! ఒకటి మాత్రం స్పష్టం. ఫిరోజ్‌పూర్‌ ఉదంతాన్ని కాంగ్రెస్‌ మీద దాడి చేసేందుకు ఉపయోగించుకొని ఒక రాజకీయవేత్తగా నరేంద్రమోడీ ప్రయత్నించారు. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు పంజాబ్‌లో బిజెపి, దానితో చేతులు కలిపిన మాజీ(కాంగ్రెస్‌)సిఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ పార్టీ, అకాలీదళ్‌ నుంచి వచ్చిన చిన్న చీలిక గ్రూపుకు గానీ దీంతో ఎలాంటి ప్రయోజనం కలగదు. కాంగ్రెస్‌కు ఆమ్‌ ఆద్మీపోటీ గట్టి పోటీదారుగా ఉందన్న వాతావరణం ఇప్పటికే ఏర్పడింది. ఫ్లైఓవర్‌ ఉదంతానికి ముందు జరిగిన పరిణామాలను చూస్తే సాగు చట్టాల అంశంలో రైతులు నరేంద్రమోడీ మీద ఇంకా ఆగ్రహంగానే ఉన్నారన్నది స్పష్టమైంది.

నోటిఫికేషన్‌ వెలువడక ముందే ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అభివృద్ది పనుల పేరుతో పలు చోట్ల ఓటర్లను ఆకట్టుకొనేందుకు నరేంద్రమోడీ సభలు పెడుతున్నారు. దానిలో భాగంగానే రు.42,750 కోట్లతో రూపొందించిన పధకాలను పంజాబీలకు ఎరగా వేసేందుకు బుధవారం నాడు సభను ఏర్పాటు చేశారు. అదేమీ రహస్యసభ కాదు కనుక నిరసన తెలపాలని రైతులు నిర్ణయించారు.
రైతులను రెండు వార్తలు మరింతగా ప్రేరేపించినట్లు చెప్పవచ్చు. సాగు చట్టాల మార్పును పరిశీలించాలని తాను కలిసినపుడు మోడీతో చెప్పానని, చాలా పెడసరంగా మాట్లాడినపుడు ఐదు నిమిషాలు ఆ సందర్భంగా వాదనలు జరిగినట్లు ప్రస్తుతం మేఘాలయ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్‌ మాలిక్‌ చెప్పారు. రైతులు మరణిస్తున్నారని, చట్టాలను సవరించాలని తాను కోరగా వారేమైనా నా కోసం చచ్చారా అని మోడీ దురహంకారంతో అన్నట్లు మాలిక్‌ చెప్పారు. ఈ వార్త కూడా పంజాబ్‌ రైతులకు ఆగ్రహం కలిగించి నిరసనలకు ప్రేరేపించిందన్నది స్పష్టం. దీనికి తోడు లఖింపూర్‌ ఖేరీలో రైతులపై( వారంతా సిక్కు సామాజిక తరగతి వారు) కార్లను తోలి నలుగుర్ని బలితీసుకున్న ఉదంతంలో కేంద్ర మంత్రి అజయ మిశ్రా కుమారుడు ఆషిష్‌ మిశ్రా ప్రధాన నిందుతుడని, ఆ దుర్మార్గం జరిగినపుడు అతడు అక్కడే ఉన్నట్లు దాఖలైన చార్జిషీట్‌ వార్త కూడా వచ్చిన అంశం తెలిసిందే. సదరు కేంద్రమంత్రిని పదవి నుంచి తొలగించాలని రైతు సంఘాలు చేసిన డిమాండ్‌ను నరేంద్రమోడీ పెడచెవిన పెట్టి కొనసాగిస్తున్నారు. సాగు చట్టాల రద్దు తరువాత ఎన్నికలు జరగాల్సిన పంజాబులో మోడీ తొలి పర్యటన అవమానకరంగా ముసిందని చెప్పవచ్చు.


ఈ ఉదంతం జరిగి ఉండాల్సింది కాదనటంలో మరోమాట లేదు. దేశ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ జరగలేదని కొందరు చెబుతున్నారు. ఇదొక్కటే కాదు, చరిత్రలో జరగనివి ఇటీవల అనేకం జరుగుతున్నాయి. రైతులు నిరసన తెలిపేందుకు తమ రాజధానికి వస్తే రోడ్ల మీద మేకులు కొట్టి, కాంక్రీటు దిమ్మలు పోసి నానాయాతనలకు గురి చేసింది నరేంద్రమోడీ కాదా ! ఒక ఇరవై నిమిషాలు నిలిచి పోవాల్సి వచ్చినందుకే అవమానంగా భావిస్తే రైతులు ఏడాది పాటు ఏం జరుగుతుందో తెలియని స్ధితిలో గడపారని మరచిపోవద్దు. వారిని ఉగ్రవాదులని, అసలు రైతులే కాదని చేసిన ప్రచారాలు, నిరసన శిబిరాల మీద దాడులకు పురికొల్పిన ఉదంతాలను అంత సులభంగా మరచిపోతారా? వాతావరణం బాగోలేనపుడు గతంలో అనేక కార్యక్రమాలను రద్దు చేసుకోలేదా ? బుధవారం నాడు కూడా అదే ఎందుకు చేయలేదు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

2022 ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు : నరేంద్రమోడీ,యోగి ఓదార్పు – లఖింపూర్‌ ఖేరీ నేరం మధ్య నలుగుతున్న బిజెపి విధి రాత !

04 Tuesday Jan 2022

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

#Akhilesh Yadav, 2022 UP polls, BJP, BSP, Lakhimpur Kheri killings, Narendra Modi Failures, Samajavadi party, UP BJP poll fate, Yogi Adityanath


ఎం కోటేశ్వరరావు


ఉత్తర ప్రదేశ్‌ విధాన సభ ఎన్నికల్లో చరిత్రను తిరగరాసేందుకు బిజెపి నేతలు గంగకు ఎదురీదుతున్నారు.కరోనా శవాలను తనలోకి నెట్టిన వారిని గంగామాత ఏం చేస్తుందో చెప్పలేము. గడచిన నాలుగు దశాబ్దాలలో 1985 తరువాత ఇక్కడ ఒకసారి అధికారానికి వచ్చిన పార్టీ వరుసగా రెండవసారి గద్దెనెక్కలేదు.దాన్ని చరిత్రలోకి నెట్టివేసేందుకు నరేంద్రమోడీ ఆపసోపాలు పడుతున్నారు. రాష్ట్రాన్ని ఒకేసారి రెండు ఇంజన్లు (కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో యోగి) లాగుతూ అభివృద్ది పరుగుపెట్టిస్తున్నామని చెప్పుకొనే బిజెపి నేతలు కొత్త రికార్డు నెలకొల్పుతారా ? ఎన్నికల ముందు అనేకం అంటాం, అనుకుంటాంగానీ గానీ సంప్రదాయం కొనసాగింది తప్ప ఇది మా ఓటమి కాదు అని చెప్పే పరిస్ధితి వస్తుందా లేక చూశారా మా తడాఖా మల్లయోధుడి పార్టీ(సమాజవాది- ములాయం సింగ్‌ యాదవ్‌ రాజకీయాల్లోకి రాక ముందు మల్లయోధుడు, ఆయన కుమారుడే ప్రస్తుత పార్టీ నేత, మాజీ సిఎం అఖిలేష్‌ యాదవ్‌ )ని మట్టి కరిపించాం అని జబ్బలు చరుచుకుంటారా ? చూద్దాం, తినబోతూ రుచెందుకు ?


ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ముందు బిజెపిని ఇరుకున పెడుతుందని భావిస్తున్న లఖింపూర్‌ ఖేరీ కేసులో పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. అక్టోబరు మూడవ తేదీన లఖింపూర్‌ ఖేరీ వద్ద సాగు చట్టాలకు నిరసన తెలుపుతున్న రైతులపై మోటారు వాహనాలను తోలి రైతులను హత్యచేసిన ఉదంతంలో నలుగురు రైతులు మరణించారు. ఒక జర్నలిస్టు ప్రాణాలు కూడా తీశారు. ఆగ్రహించిన రైతుల చేతిలో వాహనాల్లో ఉన్న ముగ్గురు బిజెపి కార్యకర్తలు కూడా మరణించారు. రైతుల మీదకు కార్లను తోలిన వారిలో కేంద్ర మంత్రి అజయ మిశ్రా కుమారుడు ఆషిష్‌ మిశ్రా తదితరులు ఉన్నారని వచ్చిన వార్తలను అప్పుడు బిజెపి తోసి పుచ్చింది. అప్పుడు అతగాడు వేరే చోట ఉన్నట్లు కతలు చెప్పింది. కేసును నీరు కార్చేందుకు పూనుకోవటంతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. మూడు నెలల తరువాత పోలీసులు దాఖలు చేసిన ఐదువేల పేజీల ఛార్జి షీట్‌లో మంత్రి కుమారుడు ఆషిష్‌ మిశ్రా ప్రధాన నిందితుడని పేర్కొన్నారు. నిరసన తెలుపుతున్న రైతులను హత్యచేసేందుకు పధకం ప్రకారం కుట్రపన్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పేర్కొన్నది. ఉదంతం జరిగిన సమయంలో ఆషిష్‌ మిశ్రా ఘటనా స్ధలిలో ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని, ఆషిష్‌ బంధువు కూడా సహనిందుడని పేర్కొన్నారు. తాను ఆ సమయంలో అక్కడ లేనంటూ కొన్ని వీడియోలు, పది మందితో అఫిడవిట్‌లను పోలీసులకు అంద చేశారు. ఘటన జరిగినపుడు ధీరేంద్ర శుక్లా అనే అతను ఉన్నాడని, అతని కారు ఆషిష్‌ మిశ్రా కారువెనుకే ఉందని ఈ వాస్తవాన్ని ధీరేంద్ర దాచినట్లు సిట్‌ పేర్కొన్నది. ఈ కేసు తరువాత ఏమౌతుందో చెప్పలేము గానీ కేంద్ర మంత్రి అజయ మిశ్రాను మంత్రి వర్గం నుంచి తొలగించాలనే డిమాండ్‌ మరింత ఊపందుకోవటంతో పాటు ఎన్నికల్లో ప్రచార అంశంగా మారనుంది. కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఎంపిక చేసిన పార్టీ ఎంపీలతో ప్రధాని నరేంద్రమోడీ జరిపిన సమావేశానికి అజయ మిశ్రాను దూరంగా ఉంచినట్లు వార్తలు వచ్చాయి.


ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి తాజాగా టైమ్స్‌ నౌ నవభారత్‌కు వీటో సంస్ధ నిర్వహించిన సర్వేలో 403 స్ధానాలకు గాను బిజెపి 230-249 మధ్య తెచ్చుకొని సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందని తేలినట్లు ప్రకటించారు. సమీప సమాజవాది పార్టీకి 137-152, బిఎస్‌పికి 9-14, కాంగ్రెస్‌కు 4-7 మధ్య రావచ్చని పేర్కొన్నారు. బిజెపి ఏడు పార్టీలతో కూటమిగా పోటీలోకి దిగుతోంది. సమాజవాది , కాంగ్రెస్‌, బిఎస్‌పి, ఆప్‌ పార్టీ విడివిడిగా పోటీచేస్తున్నట్లు ప్రకటించాయి. వాటితో ఏ పార్టీలు జత కట్టేది చూడాల్సి ఉంది. టైమ్స్‌ నౌ సర్వే ప్రకారం బిజెపి కూటమికి 38.6శాతం, సమాజవాదికి 34.4, బిఎస్‌పికి 14.1 శాతం ఓట్లు రావచ్చని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు, ఓట్లు, వచ్చే ఎన్నికల్లో అంచనాల పోలిక ఇలా ఉంది.2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌పి 311, మిత్రపక్షం కాంగ్రెస్‌ 114 చోట్ల పోటీ చేసింది. 2019లో ఎస్‌పి, బిఎస్‌పి ఒక కూటమిగా, కాంగ్రెస్‌ విడిగా పోటీ చేసింది.
పార్టీ××××××× 2017×× శాతం×× 2019××శాతం ×× 2022××శాతం
బిజెపి కూటమి×× 325 ×× 40.78× 64 ××× 51.19×× 230-49×× 38.6
ఎస్‌పి కూటమి×× 48 ××× 21.82× 5 ×××18.11 ××137-152×× 34.4
బిఎస్‌పి×××××× 19 ××× 22.23× 10 ××× 19.43 ×× 9-14 ××× 14.4
కాంగ్రెస్‌ ××××× 7 ××× 6.25 × 1 ××× 6.41 ×× 4-7 ×××× 5
ఈ అంకెలను చూసినపుడు బిజెపి ఓటింగ్‌ 2017-2019 మధ్య పదిశాతంపైగా పెరిగింది. వచ్చే ఎన్నికల్లో 2017 కంటే తగ్గవచ్చని సర్వేలు చెబుతున్నాయి. సమాజవాది పార్టీ ఓటింగ్‌ 2017, 2019లో పెద్దగా మారలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో పార్లమెంటుతో పోలిస్తే రెట్టింపు కావచ్చని సర్వేలు చెబుతున్నాయి. ఈ సర్వే లఖింపూర్‌ ఖేరీ కేసులో చార్జిషీటు దాఖలు చేయక ముందు చేసినది. ప్రధాన సవాలు సమాజవాది నుంచే అనే వాతావరణం వచ్చిన తరువాత బిజెపి వ్యతిరేక ఓటర్లు సహజంగానే కొన్ని ఓట్లు ఎస్‌పికే పడతాయి.బిజెపిని ఓడించాలని కోరుకొనే బిఎస్‌పి, కాంగ్రెస్‌ అభిమానులు కూడా ఎస్‌పి వైపే మొగ్గవచ్చు. ఈ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలవచ్చనే వాతావరణం ఉన్నందున బిజెపి తన మత, కుల అజెండాను మరింతగా ముందుకు తీసుకురావచ్చని భావిస్తున్నారు. కరోనా రెండవ తరంగం నివారణలో వైఫల్యం, శవాలను గంగలోకి నెట్టివేసిన నిర్వాకం, లఖింపూర్‌ ఖేరీ ఉదంతం, రైతు ఉద్యమ ప్రతికూలతలన్నింటినీ అధిగమించి రామాలయ నిర్మాణం వంటి అంశాలు తమను గట్టెక్కిస్తాయని ఆ పార్టీ నమ్ముతోంది.
ఎన్నికల నోటిఫికేషన్‌తో నిమిత్తం లేకుండానే బిజెపి మాదిరి సమాజవాది కూడా జరుపుతున్న సభలకు పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు.తాము అధికారంలోకి వస్తే 300యునిట్ల వరకు విద్యుత్‌ ఉచితంగా ఇస్తామని ఎస్‌పి, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటించాయి. రైతులకు ఉచితంగా ఇస్తామని ఎస్‌పి పేర్కొన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు రకాల రేట్లు వసూలు చేస్తున్నారు. గ్రామాలలో వంద యూనిట్లకు రు. 3.35, 101నుంచి 150కి రు.3.85, 151 నుంచి 300కు రు.5, ఆ పైన రు. 6 కాగా పట్టణాల్లో 150 వరకు రు.5.50, 151 నుంచి 300 వరకు రు.6, 301 నుంచి 500వరకు రు.6.50, ఆ పైన రు.7 ఉంది.


పార్టీని బూత్‌ స్ధాయివరకు విస్తరించి ఉంటే వచ్చే ఎన్నికల్లో 325కు మించి గెలుస్తామని సిఎం యోగి ఆదిత్యనాధ్‌ చెబుతున్నారు. సోదరి మాయావతి ఎన్నికలంటే భయపడుతున్న కారణంగానే ప్రచారం ప్రారంభించలేదని,చలిని వదిలించుకోవాలని కేంద్ర మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యను ఆమె ఖండించారు. ప్రభుత్వ సొమ్ముతో బిజెపి నేతలు జనాన్ని చలికాలంలో కూడా వెచ్చగా ఉంచుతున్నారని తిప్పికొట్టారు. తాము ఇతర పార్టీలను అనుకరించబోమని, తమ శైలి తమకు ఉందన్నారు. ఎన్నికల ముందు అధికారంలో ఉన్న వారు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాల పేరు చెప్పి ప్రభుత్వ సొమ్ముతో సభలు పెడతారని, తమ వంటి వారికి సాధ్యం కాదన్నారు.తమను అపహాస్యం చేసినా తమ వైఖరి మారదని, ఇతర పార్టీలు తమ గురించి ఆందోళన చెందాల్సినపని లేదన్నారు.


కులాల సమీకరణలు,మత ధోరణుల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఉత్తర ప్రదేశ్‌ ఒకటి. ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టి మెజారిటీ ఓటు బాంకును ఏర్పాటు చేసుకొనేందుకు బిజెపి చేయని పని లేదు. రామ మందిర సమస్యను ముందుకు తెచ్చి గతంలో లబ్ది పొందిన ఆ పార్టీకి ఒక సర్వే అంశాలు ఆందోళన కలిగించక మానవు. కుల, మత ప్రాతిపదికన ఓటు వేస్తున్నామని 24శాతం మంది చెప్పగా వచ్చే ఎన్నికల్లో రామ మందిరం ఓటర్లను ప్రభావితం చేస్తుందని చెప్పిన వారు ఒక్కశాతమే అని ఇండియా న్యూస్‌ జన్‌కీ బాత్‌ సర్వే పేర్కొన్నది. బిజెపికి వస్తాయని చెబుతున్న ఓట్లలో యాదవేతర బిసి, బ్రాహ్మణ ఓట్లలో ఎక్కువ భాగం ఉంటాయని, ఎస్‌పికి ముస్లింలు, యాదవుల ఓట్లు గణనీయంగా వస్తాయని చెబుతున్నారు.


గో రక్షణ, గొడ్డుమాంసం పేరుతో బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రైతులు ఆగ్రహంతో ఉన్నారు. వట్టిపోయిన వాటిని అమ్ముకొనే వీలు లేకపోవటంతో యజమానులు వాటిని వదలి వేయటంతో పంటలను కాపాడుకొనేందుకు రైతులు కాపలాలు కాయాల్సి వస్తోంది.పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో పెద్ద ఎత్తున చెరకు బకాయిలు పేరుకు పోయాయి. అత్యంత వెనుకబడిన తరగతుల వారిని యాదవులు పైకి రానివ్వటం లేదనే పేరుతో బిజెపి ఇతర వెనుకబడిన తరగతుల వారిని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు తమకు ఒరిగిందేమీ లేదని యాదవుల బదులు ఠాకూర్ల పెత్తనం కిందికి వచ్చామని వారు ఇప్పుడు భావిస్తున్నారు. మత ప్రాతిపదికన బిజెపి పరివారం జనాన్ని చీల్చితే, రైతు ఉద్యమం ఐక్యం చేసేందుకు బాటలు వేసిందని వార్తలు వచ్చాయి. నామినేషన్లు వేసి, ఎవరెటో తేలిన తరువాత ఎన్నికల తీరు తెన్నులపై మరింత స్పష్టత వస్తుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఐదు రాష్ట్రాల ఎన్నికలు : బెట్టింగ్‌ బంగార్రాజులూ జాగ్రత్త !

30 Thursday Dec 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

2022 UP polls, AAP, Betting market, BJP, Congress party, five states 2022 elections, Samajwadi Party


ఎం కోటేశ్వరరావు


ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మాయాబజార్‌ వాగ్దానాలతో పార్టీలు ఓటర్లను ఎలా ప్రలోభాలకు గురిచేస్తున్నాయో తెలిసిందే. ఎన్నికల ఫలితాలు, కొందరు ప్రముఖుల గెలుపు, మెజారిటీల మీద తిధి, వార, నక్షత్రాల పేరుతో జోశ్యాలు చెప్పేవారు, పందెం రాయుళ్లు రంగంలోకి దిగారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశంతో పాటు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే సంఖ్యల మీద కూడా పందాలు ప్రారంభమయ్యాయి.ఒక అంచనా ప్రకారం 2021 మే నెలలో జరిగి ఎన్నికల్లో 25వేల కోట్ల రూపాయల వరకు ఉండగా 2022 ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 50 వేల కోట్ల రూపాయల లావాదేవీలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో పోటీ తీవ్రంగా ఉంటే ఇంకా పెరగవచ్చు కూడా. వచ్చే లోక్‌సభ ఎన్నికలు-2024లో రావాల్సినవి- ఎప్పుడు వస్తాయో తెలియదు. వాటిని ముందుకు నెట్టే లేదా గడువు నాటికి జరిగేట్లు ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తాయని భావిస్తున్న తరుణమిది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఈ సారి ఎవరు పాగావేస్తారన్న ఆసక్తి పెరిగిన నేపధ్యంలో ఈ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్‌కు ఆప్‌ గట్టి సవాలు విసురుతోంది. అకాలీదళ్‌ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి సొంత దుకాణం పెట్టుకున్న కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ – బిజెపి జట్టుగా రంగంలోకి దిగటంతో చతుర్ముఖ పోటీ జరగనుంది. జూదగాండ్లు ఇప్పటి వరకు ఈ జట్టును లెక్కలోకి తీసుకోలేదు.


క్రికెట్‌ మీద పందాలు కాయటం తెలిసిందే. గడచిన రెండు దశాబ్దాల్లో ఎన్నికల ఫలితాల మీద పందాలు అదీ సంఘటిత ముఠాలు నిర్వహించటం పెరిగింది. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల మీద పందాలు మొదలయ్యాయి. వివిధ సర్వే సంస్ధలు వెల్లడించే జోశ్యాల ప్రాతిపదికన జరిగే పందాలు కొన్ని కాగా పందెం ముఠాల వెనుక ఉండే పెద్దలు స్వంతంగా చేయించుకొనే సర్వేల ప్రాతిపదికన కూడా మరికొన్ని జరుగుతున్నాయి. ఎన్నికల సర్వేలు ఎలా బోల్తాపడుతున్నాయో పందెం ముఠాలు కూడా అలాగే బొక్కబోర్లాపడుతున్నాయి. అయితే ఇవన్నీ చట్టవిరుద్దం, చీకట్లో జరిగేవి కావటంతో డబ్బు పొగొట్టుకున్నవారు లేదా గెలిచినవారు గానీ పైకి చెప్పుకోలేరు.పందెగాళ్ల అంచనా ప్రకారం పంజాబ్‌లో ఎవరికీ మెజారిటీ రాదు, ఉత్తర ప్రదేశ్‌లో తిరిగి బిజెపి గద్దెనెక్కనుంది.ఎన్నికల ప్రచారంలో పార్టీల జన సమీకరణ, మీడియా విశ్లేషణలను బట్టి కూడా పోలింగ్‌ తేదీ వరకు పందాల మొత్తాలు పెరగటం లేదా తగ్గటాన్ని గతంలో చూశాము. సాధారణ పరిస్ధితుల్లో ఎన్నికలు జరిగితే పందాలు ఒకరకం- అవి ధరల పెరుగుదల, దారిద్య్రం, నిరుద్యోగం వంటి అంశాల తీవ్రతను బట్టి ఉంటాయి.అదే పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్‌ దాడుల వంటి ఉదంతాలు చోటు చేసుకుంటే మరోరకంగానూ మారతాయి.


ఈ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఏడాదికి పైగా మూడు సాగు చట్టాల రద్దు కోసం సాగిన మహత్తర ఉద్యమ ధాటికి దిగివచ్చిన నరేంద్రమోడీ వాటిని రద్దు చేయటమేగాక రైతులకు క్షమాపణలు చెప్పారు. కనీస మద్దతు ధర చట్టబద్దత పరిశీలనకు ఒక కమిటీని వేస్తామని ప్రకటించి వారాలు గడుస్తున్నా ఆ దిశగా ఎలాంటి కదలికా లేదు. సాగు చట్టాల రద్దుతో దూరమైన రైతులు తిరిగి తమవైపు చేరతారని ఆశించిన బిజెపికి అలాంటి సూచనలేమీ కనిపించటం లేదనే వార్తలు వస్తున్నాయి. రైతాంగం ఎటు మొగ్గుతుందన్నది ఆసక్తికరమైన అంశమే.2017 ఎన్నికల్లో బిజెపి ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీలోని 403 స్ధానాలకు గాను 312 సాధించింది. వచ్చే ఎన్నికల్లో 250తో గట్టెక్కవచ్చని ఒకవైపు వార్తలు, రెండంకెలకు మించవనే అంచనాలు మరోవైపు ఉన్నాయి.


ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో రెండు పార్టీల గురించే పందాలు కాస్తున్నారు. బిజెపి 200 స్ధానాలు గెలిస్తే ప్రతి రూపాయికి అదనంగా 20పైసలు, 222 గెలిస్తే రూపాయికి రు.1.15, సమాజవాది110 తెచ్చుకుంటే 35పైసలు, 125 గెలిస్తే రు.1.40 ఇస్తామని ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్‌, బిఎస్‌పికి ఐదు నుంచి పది స్ధానాలకు మించి రావని పందెంరాయుళ్లు చెబుతున్నారు. తరువాత ఈ అంచనాలు, పందాల మొత్తాలు మారిపోవచ్చు. పంజాబ్‌లోని 117 స్ధానాల్లో కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలకు కనీసంగా 25 గరిష్టంగా 40చొప్పున వస్తాయని, అకాలీదళ్‌, బిజెపిలకు ఐదు నుంచి పదిలోపు రావచ్చని, ఇక్కడ కూడా నామినేషన్ల తరువాత అంచనాలు మారవచ్చని అంటున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ప్రస్తుతం వివిధ పార్టీల సీట్ల అంచనా మేరకు వాటిని సాధిస్తే పందెం కాసిన వారికి రూపాయికి ఇచ్చే మొత్తాలు ఇలా ఉన్నాయి.


పార్టీ×××సీట్లు×××పైసలు×× పార్టీ×××సీట్లు×××పైసలు
బిజెపి×× 200×× 0.20 ××ఎస్‌పి×× 110×× 0.35
బిజెపి×× 210×× 0.35 ××ఎస్‌పి×× 115×× 0.60
బిజెపి×× 215×× 0.57 ××ఎస్‌పి×× 120×× 1.05
బిజెపి×× 222×× 1.15 ××ఎస్‌పి×× 125×× 1.40
బిఎస్‌పి×× 5 ×× 0.04 ××కాంగ్రెస్‌ ×× 5×× 0.55
బిఎస్‌పి××10 ×× 0.67 ××కాంగ్రెస్‌ ×× 6×× 0.70
బిఎస్‌పి××15 ×× 1.10 ××కాంగ్రెస్‌ ×× 8×× 1.00
బిఎస్‌పి×× 0 ×× 0.00 ××కాంగ్రెస్‌ ××10×× 2.50
పంజాబ్‌లోని 117కు గాను ప్రస్తుతం వివిధ పార్టీల సీట్ల అంచనా మేరకు వాటిని సాధిస్తే పందెం కాసిన వారికి రూపాయికి ఇచ్చే మొత్తాలు ఇలా ఉన్నాయి
పార్టీ×××సీట్లు×××పైసలు×× పార్టీ×××సీట్లు×××పైసలు
ఆప్‌×× 25 ×× 0.35 ××కాంగ్రెస్‌ ×× 25 ×× 0.45 ××అకాలీదళ్‌ ×× 5 ×× 0.35
ఆప్‌×× 30 ×× 0.40 ××కాంగ్రెస్‌ ×× 30 ×× 0.57 ××అకాలీదళ్‌ ×× 10 ×× 0.57
ఆప్‌×× 35 ×× 0.87 ××కాంగ్రెస్‌ ×× 35 ×× 0.90 ××అకాలీదళ్‌ ×× 15 ×× 0.87
ఆప్‌×× 40 ×× 1.15 ××కాంగ్రెస్‌ ×× 40 ×× 1.35 ××అకాలీదళ్‌ ×× 20 ×× 1.20

2021లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాడు అన్నాడిఎంకె గెలుస్తుందని, డిఎంకె ఓడిపోతుందని, స్టాలిన్‌కు సిఎం యోగం లేదని జోశ్యాలు చెప్పారు. పశ్చిమబెంగాల్లో మోడీ నాయకత్వంలో బిజెపి గెలుస్తుందన్నారు. బిజెపి పటాటోపం చూసి అక్కడ పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపారు.బిజెపికి 145 స్దానాలు వస్తాయని, టిఎంసికి 115-120కి మించి రావని పందాలు కాశారు. రూపాయి 22 నుంచి 150పైసల వరకు అవి ఉన్నాయి. ఎవరి తల రాత ఏమిటో ముందే రాసి ఉంటుందని చెప్పేవీరు ఎన్నికల అంశాల్లో నామినేషన్ల నాటి నుంచి ప్రచారం వరకు భిన్నమైన జోశ్యాలు చెబుతున్నారు. వీరందరు చెప్పే గ్రహాలు ఒకటే, అవి అందరికీ ఒకే సందేశాలు ఇవ్వాలి, కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పటాన్ని బట్టి ఊహాగానాలు తప్ప మరొకటి కాదన్నది స్పష్టం. అయినా ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్లుగా ప్రతివారూ జోత్యిష్కులను ఆశ్రయిస్తుండటంతో వారి వ్యాపారం కూడా రెండు చేతులు ఆరు కాసులు అన్నట్లుగా పెరిగిపోతోంది.


2004 ఎన్నికల్లో అతల్‌ బిహారీ వాజ్‌పాయి నాయకత్వంలోని ఎన్‌డిఏకు మరోసారి అవకాశం వస్తుందన్న ఎన్నికల సర్వేలు వాస్తవం కాదని తేలింది. 2009లో హంగ్‌ పార్లమెంట్‌ అన్న అంచనాలు తప్పి యుపిఏ మరింత బలపడింది. 2014లో ఎన్‌డిఏకు స్వల్ప మెజారిటీ అన్న అంచనాలు తారుమారైన సంగతి తెలిసిందే, 2019లో కూడా అదే జరిగి ఎన్‌డిఏ బలం మరింత పెరిగింది.అనేక మంది ప్రముఖ జ్యోతిష్కులు మోడీ అధికారానికి వచ్చినా సీట్లు తగ్గుతాయని చెప్పి నాలుక కరుచుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా, మధుర, హత్రాస్‌ వంటివి పందెగాండ్లకు పెద్ద కేంద్రాలు.2019 ఎన్నికలలో మోడీ సర్కార్‌కు తగినంత మెజారిటీ రాకపోతే సమాజవాది పార్టీతో బంధాన్ని తెంచుకొని బిఎస్‌పి నేత మాయావతి ఎన్‌డిఏలో చేరతారని, రాహులు గాంధీ పోటీ చేసిన రెండు స్ధానాల్లో గెలుస్తారని, సమాజవాది పార్టీ స్ధితి మెరుగుపడుతుందని కూడా పందాలు కాశారు.


సర్వే సంస్ధలు, మీడియాను మేనేజ్‌ చేసి అనుకూల సర్వేలు చేయించుకోవటం జగమెరిగిన సత్యం. అందుకే వాటిని జనం పెద్దగా విశ్వసించటం లేదు. ఫలితాలు కూడా అలాగే ఎక్కువ సందర్భాల్లో తారుమారయ్యాయి. సర్వేలతో పాటు ఇప్పుడు రాజకీయ పార్టీలు ముఖ్యంగా బిజెపి పందెగాళ్ల ముఠాలను కూడా ప్రభావితం చేస్తున్నట్లు విమర్శలు వచ్చాయి. పందాల వార్తలు మీడియాలో ప్రముఖంగా చోటు చేసుకొంటున్నందున తద్వారా ఓటర్లను ప్రభావితం చేయవచ్చన్న ఎత్తుగడ దీనివెనుక ఉంది. ఫలానా పార్టీ గెలుపు గురించి ఎక్కువ మంది పందెంకాస్తున్నారంటే దానికి మద్దతు ఉండబట్టే కదా అని మొగ్గేవారు కొందరైనా ఉండవచ్చు. ఈ కారణంగానే 2014తో పోల్చితే 2019లో పందాల మార్కెట్‌ రెండు రెట్లు పెరిగిందని, ఇప్పుడు ఇంకా పెరిగిందని అంచనా. కనీస మొత్తాలతో ప్రారంభమై కోట్ల వరకు ఉంటాయి. అనేక మొత్తాలు విదేశాల్లోనే జమ అవుతాయి, దానికి హవాలాతో సహా అనేక మార్గాలను ఎంచుకుంటారు, ఎక్కడా రాతకోతలుండవు.బుకీలు తెలిసి ఉంటే ముందుగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతా నమ్మకం, దందా మీదనే నడుస్తుంది.


ఎన్నికల ఫలితాలపై పందాలు మన దేశంలోనే కాదు ప్రపంచమంతటా ఉన్నాయి. మన దేశంలో గుర్రప్పందాలు మాత్రమే చట్టబద్దం. మిగిలినవన్నీ చాటు మాటు దొంగ వ్యవహారాలే. అనేక దేశాల్లో అన్ని రకాల జూదాలు చట్టబద్దంగానే జరుగుతాయి. 2020 అమెరికా ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌, జోబైడెన్‌ మీద కూడా జూదం నిర్వహించారు. ప్రతి అధ్యక్షుడు రెండోసారి ఎన్నిక అవటం ఆనవాయితీగా వస్తోంది. ఆ మేరకు ట్రంప్‌ ఎన్ని పిచ్చిపనులు చేసినా రెండోసారి గెలుస్తాడంటూ పందెగాళ్లు ఎక్కువ మంది అటువైపే మొగ్గి చేతులు కాల్చుకున్నారు. లెక్కింపులో జో బైడెన్‌ ముందంజలో ఉన్నట్లు వార్తలు వచ్చిన తరువాత కూడా ట్రంప్‌ ఏదో ఒక మాజిక్‌ చేసి గెలుస్తాడని భంగపడినవారు లేకపోలేదు. ట్రంప్‌ గెలుపు గురించి న్యూజిలాండ్‌లో 62 నుంచి 37 , జోబైడెన్‌ మీద 61-44 సెంట్ల వరకు పందాలు నడిచాయి(ఒక డాలరుకు వంద సెంట్లు).స్టాక్‌ ఎక్సేంజ్‌ల మాదిరి బ్రిటన్‌లో బెట్టింగ్‌ ఎక్సేంజ్‌ బెట్‌ఫెయిర్‌ ఉంది. అమెరికా ఎన్నికలు ప్రారంభం కాగానే ట్రంప్‌ రెండోసారి విజయానికి అవకాశాలున్నాయని 39 నుంచి 75శాతానికి బెట్‌ఫెయిర్‌ సూచిక పెరగ్గా బైడెన్‌ అవకాశాలు 61 నుంచి 25శాతానికి తగ్గాయి. స్మార్‌కెట్స్‌ అనే మరో ఎక్సేంజ్‌లో కూడా ఇదే మాదిరి సూచనలు వెలువడినా చివరికి ట్రంప్‌ ఇంటిదారి పట్టాడు. అక్కడ కొన్ని రాష్ట్రాల తీరు తెన్నులను బట్టి పందాలు కాస్తారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పని కోసం యువత రద్దీ – ఉపాధి రహిత దేశ వృద్ధి !

29 Wednesday Dec 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, employees, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Uncategorized

≈ Leave a comment

Tags

#India jobless growth, #India unemployment, BJP, India economy, India employment, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ఉదరపోషణార్ధం బహుకృత వేషం అన్నట్లుగా ఉత్తర ప్రదేశ్‌ విధాన సభ ఎన్నికల్లో గెలుపుకోసం బిజెపి నేతలు చేయని శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు, చెప్పని మాటలు లేవు. పగలంతా భారీ సంఖ్యలో జనాన్ని సమీకరిస్తున్న సభల్లో మాట్లాడుతూ సాయంత్రానికి కరోనా నిరోధ చర్యల గురించి బోధలు చేస్తున్నారనే విమర్శను ప్రధాని నరేంద్రమోడీ మూటగట్టుకున్నారు.ప్రయాగ సభలో మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్‌లో యోగి సర్కార్‌ సాధించిన విజయాల్లో మహిళా సాధికారత ఒకటని చెప్పారు. జర్మన్‌ నాజీ మంత్రిగా పని చేసిన గోబెల్స్‌ స్వర్గంలో ఉన్నాడో నరకంలో ఉన్నాడో తెలియదు గానీ ఈ వార్తను చూసి ఎలా స్పందించి ఉంటాడో తెలియదు. ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే అదే నిజం అవుతుందన్న తన సిద్దాంతాన్ని ముందుకు తీసుకపోతున్నవారు తామర తంపరగా పెరుగుతున్నందుకు కచ్చితంగా సంతోష పడి ఉంటాడు. ప్రపంచ బాంకు సమాచారం ప్రకారం 2005లో మన దేశంలో మహిళా కార్మికుల భాగస్వామ్యం 26శాతంగా ఉందని,2019నాటికి అది 20.3శాతంగా ఉంది. పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌లో 30.5, శ్రీలంకలో 33.7శాతం మంది ఉన్నారు. కరోనా కారణంగా మన దేశంలో 2020 ఏప్రిల్‌-జూన్‌లో 15.5శాతానికి తగ్గింది. ఇక యోగి ఆదిత్యనాధ్‌ ఏలుబడిలో తొమ్మిదిశాతం, బీహార్‌లో ఐదుశాతం మాత్రమే అని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.


దేశం సంపద్వంతం కావటానికి ఇప్పుడు అమలు చేస్తున్న సంస్కరణలు ఏమాత్రం చాలవని కార్పొరేట్‌ శక్తులు వత్తిడి చేస్తున్నాయి. దానికి అనుగుణంగానే రద్దు చేసిన సాగు చట్టాలను తిరిగి పునరుద్దరిస్తామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఇటీవలనే చెప్పారు. దేశమంతటి నుంచి నిరసన తలెత్తటంతో అబ్బేఅలాంటిదేమీ లేదంటూ ప్రకటించిన అంశం తెలిసిందే.ఏటా రెండు కోట్ల మంది యువతీ,యువకులు మాకు పని కావాలంటూ రోడ్లమీదకు వస్తున్నారు.వారికి పని దొరకటం లేదు. కేంద్రంలో మెజారిటీ రాష్ట్రాల్లో ఏలుబడిలో ఉన్నది బిజెపి, అచ్చేదిన్‌ అని చెప్పినప్పటికీ పరిస్ధితులు రోజురోజుకూ దిగజారుగుతున్నాయి.అచ్చేదిన్‌ పేరుతో నరేంద్రమోడీ 2014లో అధికారానికి వచ్చినపుడు ఎనిమిది శాతంపైగా వృద్ధి రేటు ఉంది.కరోనాకు ముందు నాలుగుశాతానికి పడిపోయింది. వృద్ధి రేటు ఎంత ఉన్నప్పటికీ అది ఉపాధిరహితంగా ఉండటమే అసలు సమస్య. కార్పొరేట్ల లాభదాహం నానాటికీ పెరుగుతోంది.కరోనాలో జనాల పరిస్ధితి దిగజారితే వారి లాభాలు ఏమాత్రం తగ్గలేదు.అయినా అసంతృప్తి.


కెనడాలోని ఫ్రాసర్‌ సంస్ధ విడుదల చేసిన ప్రపంచ ఆర్ధిక స్వేచ్చ సూచికలో 165దేశాలకు గాను మనదేశం ఇంతకు ముందున్న 103వ స్ధానం నుంచి 2021లో 108వ స్ధానానికి దిగజారింది.దీనికిగాను పరిగణనలోకి తీసుకొనే అంశాలన్నింటా పరిస్ధితి అధ్వాన్నంగా ఉన్నందున ప్రయివేటు రంగం వృద్ది చెందటం లేదట.సంస్కరణల గురించి కబుర్లు చెబుతున్నా పరిస్ధితి ఇలా ఉంది. కీలకమైన సేవా రంగాలను సరళతరం చేయటాన్ని నిలిపివేసినట్లు నివేదిక అసంతృప్తి వ్యక్తం చేసింది.తక్కువ ధరలకు సరకులను అందచేసేందుకు బహుళజాతి రిటైల్‌ కంపెనీలను అనుమతించటం లేదన్నది ఒకటి. సోషలిస్టు విధానాలను అనుసరిస్తున్నందున మరింతగా పరిస్ధితి దిగజారుతుందని కెనడా సంస్ద చెప్పిందంటే ఇప్పుడున్న వాటి నుంచి కూడా ప్రభుత్వం వెనక్కు తగ్గి మొత్తంగా కార్పొరేట్లకు అప్పగించాలని కోరుతున్నారు.


తాజాగా కేంద్ర ప్రభుత్వం అక్వీస్‌(ఆలిండియా క్వార్టర్లీ ఎస్టాబ్లిష్‌మెంట్‌ బేస్డ్‌ ఎంప్లాయిమెంట్‌ సర్వే) తొలి నివేదిక ప్రకారం 2021 ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉపాధి తొమ్మిది రంగాలలో 3.08 కోట్లకు పెరిగినట్లు పార్లమెంటుకు తెలిపారు.2013-14లో 2.37 కోట్లతో పోల్చుకుంటే వృద్ది రేటు 29శాతం అని చెప్పారు.వాస్తవం ఏమిటి ? 2021 అక్టోబరులో కార్మికశక్తి భాగస్వామ్య రేటు 40.41(ఎల్‌పిఆర్‌) శాతం ఉండగా నవంబరు నాటికి 40.15కు పడిపోయింది. కరోనాకు ముందు 43శాతం ఉంది, రెండు సంవత్సరాలు రెండు తరంగాల కారణంగా కనిష్టంగా 36శాతానికి పడిపోయి తిరిగి కోలుకున్నప్పటికీ కరోనా ముందు స్ధితికి చేరుకోలేదు. ప్రపంచబాంకు, ఐఎల్‌ఓ గణాంకపద్దతి ప్రకారం 2020లో ప్రపంచ సగటు ఎల్‌పిఆర్‌ 58.6 కాగా మనది 46శాతం మాత్రమే. మనకంటే అధ్వాన్నంగా ఉన్న దేశాలు మరొక 17 మాత్రమే అని ఐఎల్‌ఓ చెప్పింది. చిత్రం ఏమిటంటే వాటిలో చమురు సంపదలున్న ఇరాన్‌, ఇరాక్‌ వంటి దేశాలతో పాటు అంతర్యుద్ధాలతో అతలాకుతలం అవుతున్న సిరియా, లెెబనాన్‌, ఎమెన్‌ వంటివి ఉన్నాయి. అత్యంతవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా పేర్కొంటున్న మనం ఈ రెండు తరగతులకూ చెందం అన్నది స్పష్టం. సిఎంఐఇ అంచనాల ప్రకారం 40శాతానికి అటూ ఇటూ అంటే ఐఎల్‌ఓ కాస్త ఉదారంగా లెక్కించింది తప్ప పరిస్ధితి దారుణంగా ఉందన్నది స్పష్టం.


కరోనాకు ముందు దేశం మొత్తం మీద ఉపాధిలో పట్టణ వాటా 32శాతం కాగా 2021అక్టోబరులో 31.5శాతం ఉండగా నవంబరులో 31.2శాతానికి తగ్గింది. గ్రామాలతో పోల్చుకుంటే పట్టణాలలో సంఘటిత రంగం ఉంటుంది కనుక కాస్త మెరుగైన వేతనాలుంటాయి. అవే తగ్గాయంటే దాని ప్రభావం మొత్తం మీద ఉంటుంది. మొత్తంగా నవంబరు నెలలో అదనంగా వచ్చిన ఉపాధి 14లక్షలు, పట్టణాల్లో 9లక్షలు తగ్గినా గ్రామాల్లో 23లక్షలు పెరిగినందున ఈ పెరుగుదల ఉంది. నెలవారీ వేతనాలు పొందే వారి సంఖ్య తగ్గుతుండటం ఆందోళనకరం.2019 నవంబరులో నెలవారీ వేతన జీవుల సంఖ్యతో పోలిస్తే 2021లో 9.7శాతం తగ్గారు.ప్రస్తుతం ఒమైక్రాన్‌ కరోనా వైరస్‌ తరంగం ప్రపంచాన్ని, మన దేశాన్ని కూడా భయపెడుతున్నది. ఆర్ధికంగా కోలుకోవటం కష్టమనే అంచనాలు వెలువడతున్నాయి.


గత మూడు దశాబ్దాల సంస్కరణల ఫలితాలు, పర్యవసానాలను చూస్తే జిడిపి వృద్ది కనిపిస్తుంది, జనాభావృద్ధి రేటు తగ్గుతోంది. కానీ ఉపాధి వృద్ధి రేటు జనాభాకు అనుగుణంగా లేదు. ముఖ్యంగా గత దశాబ్దికాలంలో ఉపాధి రహిత వృద్ధి ఎక్కువగా కనిపిస్తోంది. వ్యవసాయం గిట్టుబాటు కాని స్ధితిలో ఆ రంగంలో యంత్రాల వాడకం గణనీయంగా పెరిగి ఉపాధి తగ్గింది. ఆ మేరకు పట్టణాలలో పెరగలేదు. పెరిగింది కూడా అసంఘటిత రంగంలో ఉంది.ప్రపంచీకరణ కారణంగా ఐటి, అనుబంధ రంగాలలో కొత్త ఉపాధి అవకాశాలు వచ్చిన్పటికీ అవి నైపుణ్యం ఉన్నవారికే పరిమితం అన్నది తెలిసిందే.2005-10 మధ్య సంఘటిత రంగంలో నిఖరంగా పెరిగిన ఉద్యోగాలు పదిలక్షల మాత్రమే కాగా 60లక్షల మంది ఉద్యోగార్ధులు మార్కెట్లో చేరారు. తామర తంపరగా వెలసిన ప్రయివేటు విద్యా సంస్ధల నుంచి ఇంజనీర్లు, ఎంబిఏ,ఎంఎ పట్టాల వారు లక్షల సంఖ్యలో తయారయ్యారు. మన అవసరాలకు మించి వారిని ఉత్పత్తి చేస్తున్నాము. వారిలో కొందరి నైపుణ్యం ప్రశ్నార్ధకం, అంతకంటే తక్కువ విద్య,నైపుణ్యం ఉన్నవారికి తగిన ఉపాధి అవకాశాలు పెరగలేదు.


ఇతర అనేక దేశాలతో పోల్చితే మన దేశంలో యువజనం ఎక్కువగా ఉన్నమాట నిజం. వీరికి కావాల్సింది ఉపాధి తప్ప మాటలు కాదు. సమగ్రమైన సమాచారం అందుబాటులో లేదు. వివిధ సంస్ధల అంచనాల ప్రకారం 2004-12 సంవత్సరాలలో ఏటా 25లక్షల ఉద్యోగ అవకాశాలు పెరిగితే 2012-16 మధ్య 15లక్షలకు తగ్గాయి. ఏదో ఒక సామాజిక భద్రత ఉన్న రెగ్యులర్‌ కార్మికులు 2011-16 కాలంలో 45 నుంచి 38శాతానికి తగ్గారు. సంస్కరణల కాలంలో మనకు వచ్చిన విదేశీ పెట్టుబడులు ఎక్కువ భాగం సేవా రంగానికే వచ్చాయి. మిగిలినవి కార్మికులు తక్కువగా ఉండే పరిశ్రమలకు వెళ్లాయి. జిడిపిలో సేవారంగం వాటా గణనీయంగా పెరిగింది కానీ ఆ మేరకు ఉపాధి పెరగలేదు. విధానపరమైన లోపాలు, మన పరిస్ధితులకు అనుగుణంగా పధకాలను రూపొందించలేదనే లోపాన్ని అంగీకరించేందుకు ఎవరూ సిద్దం కావటం లేదు. అధికారంలో ఎవరున్నా బడా పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను అమలు జరిపారు. ఎంత ఎక్కువ పెట్టుబడులు పెడితే అంత ఎక్కువ రాయితీలు, సదుపాయాలు కల్పించారు తప్ప ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలనే వైపు దృష్టి పెట్టలేదు. అందుకు అవకాశం ఉన్న చిన్న, సన్నకారు పరిశ్రమలను ఉపేక్షించారు. చివరకు వారి దగ్గర నుంచి కొనుగోలు చేసిన వస్తువులకు ఇవ్వాల్సిన సొమ్మును కూడా సకాలంలో ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు.

సంఘటిత వస్తూత్పత్తి రంగంలో 25శాతం ఉపాధి తగ్గటానికి పారిశ్రామిక వివాదాల చట్టమే కారణమని ప్రపంచబాంకు మేథావులు సూత్రీకరించారు. కార్మికుల ఉపాధి రక్షణకు పటిష్టమైన చట్టాలు ఉన్న కారణంగా యజమానులు కార్మికుల ఖర్చు తగ్గించుకొనేందుకు ఎక్కువ పెట్టుబడి అవసరమైన పద్దతులను ఎంచుకున్నారట.పోనీ అలా ఖర్చు తగ్గించుకొని ఎగుమతులు చేశారా అంటే అదీ లేదు కదా ! ఈ పేరుతో కార్మిక చట్టాలకే ఎసరు పెట్టి బానిసలుగా మార్చేందుకు పూనుకున్నారు.
2017-18లో నాలుగున్నర దశాబ్దాల రికార్డు స్ధాయికి 6.1శాతం నిరుద్యోగం పెరిగిందన్న ప్రభుత్వ సర్వే వివరాన్ని 2019 ఎన్నికల ముందు తొక్కిపెట్టారు, అది తప్పుల తడక, ఉపాధి గురించి లెక్కలు సరిగా వేయలేదన్నారు. ఎన్నికలు ముగిశాక గుట్టుచప్పుడు కాకుండా అదే నివేదికను ఆమోదించారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ నిరుద్యోగం ఉంది.2019-20లో 8.6 కోట్ల మంది నెలసరి వేతన జీవులుండగా 2021 ఆగస్టు నాటికి 6.5కోట్లకు తగ్గారు. వీరికి అదనంగా నిరుద్యోగులు తోడవుతారు.

మనకున్న యువశ్రమశక్తితో ప్రపంచాన్నే మన చెప్పుచేతల్లోకి తెచ్చుకోగలమని చెప్పేవారున్నారు. అది ఒక కోణంలో చూస్తే నిజమే. చైనా అలాంటి ఫలితాన్ని సాధించింది. మంచి ఉద్దేశ్యాలే కాదు, అందుకు తగిన విధానాలు కూడా ఉండాలి. లేనట్లయితే అదే అవకాశం ప్రతికూలంగా కూడా మారుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం జనాభాలో 54శాతం మంది పాతికేండ్ల లోపువారే, మరోవిధంగా చూస్తే 62శాతం మంది 15-59 ఏండ్ల మధ్య ఉంటారు. వీరికి తగిన నైపుణ్యాలను సమకూర్చి ఉపాధి చూపకపోతే పక్కదారులు పట్టే అవకాశం ఉంది.సిఎంఐసి సమాచారం ప్రకారం 2016లో ఉపాధిలో ఉన్నవారి సంఖ్య 40.73 కోట్ల మంది, 2018 -19నాటికి 40.09 కోట్ల మందికి తగ్గారు. ఆర్ధికవ్యవస్ధ పెరిగితే ఐదులక్షల కోట్ల డాలర్ల స్ధాయికి జిడిపిని తీసుకుపోతామని చెప్పినా, నిజంగా తీసుకుపోయినా యువతీ, యువకులకు ఒరిగేదేమిటి ? 2030నాటికి వ్యవసాయ రంగంలో ఉపాధి 44 నుంచి 30శాతానికి తగ్గుతుందని అంచనా, ప్రస్తుత అంచనా ప్రకారం 2030నాటికి 14.5 కోట్ల మందికి వ్యవసాయేతర రంగాల్లో పని కల్పించాల్సి ఉంటుంది.వారందరికీ ఉపాధి కల్పించే విధానాలను అవలంభించకపోతే తలెత్తే పర్యవసానాలకు బాధ్యులెవరు ? అందుకు గాను ఏటా 8-9శాతం చొప్పున వృద్ధి రేటు ఉండాలి. అదీ ఉపాధి సహితమైనది, అది జరగాలంటే విధానాలను అందుకనుగుణంగా మార్చాలి, అదే ఎలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

హరిద్వార్‌ ధర్మ సంసద్‌ : పరస్పర అవగాహనతోనే హిందూ- ముస్లిం మతోన్మాదుల ప్రసంగాలు !

25 Saturday Dec 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

#Haridwar hate speeches, AIMIM, ‘Hate’ speeches at Dharma Sansad, BJP, Haridwar hate speeches, Hinduthwa, RSS


ఎం కోటేశ్వరరావు


ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో డిసెంబరు 17-19 తేదీల్లో ధర్మ సంసద్‌ పేరుతో ధర్మవిరుద్ద, పరమత విద్వేష సభ జరిగింది. హిందూమత నేతలుగా చెప్పుకొనే యోగులు, యోగినులు అక్కడ చేరారు. వారు హిందూమతం మంచి చెడ్డల గురించి ఏమి చర్చించారో తీర్మానించారో తెలియదు. ముస్లింలు, ఇతర మైనారిటీ మతాల వారి మీద మారణకాండ జరపాలని పిలుపు ఇస్తూ చేసిన ప్రసంగాల వీడియోలు సామాజిక మాధ్యమంలో తిరుగుతూ మరింత విద్వేషాన్ని జనాల బుర్రల్లో నింపుతున్నాయి. ఈ సమావేశాల్లో మాట్లాడిన వారు తమను సమర్ధించుకున్నారు, తప్పు చేశామనే భావన ఏ కోశానా కనిపించలేదు. పోలీసులు తమనేమీ చేయలేరనే ధీమా వ్యక్తం చేశారు. ఎవరి అండ చూసుకొని ఇలా బరితెగించినట్లు ? కొందరి ప్రసంగాంశాలు ఇలా ఉన్నాయి.


”ముస్లింలను చంపటానికి కత్తులు చాలవు, దిమ్మిసలాంటి ఆయుధాలు కావాలి” అన్న యతి నరసింగానంద, నాగరికత (సంస్కృతి) యుద్దంలో హిందువులను రక్షించేవి ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని కనటం, మెరుగైన ఆయుధాలు మాత్రమే అని కూడా సెలవిచ్చారు. ఎవరైనా హిందూ ప్రభాకరన్‌(శ్రీలంక ఎల్‌టిటిఇ నేత)గా మారితే వారికి ఒక కోటి రూపాయల అవార్డు ఇస్తామని ప్రకటించారు.బహిరంగ ప్రదేశాల్లో నమాజులు చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఒక వక్త మాట్లాడుతుండగా నరసింగానంద జోక్యం చేసుకొని ” మనకు అవసరమైనపుడు హిందూ సమాజం సాయం చేయదు, ఎవరైనా యువకార్యకర్త ముందుకు వచ్చి హిందూ ప్రభాకరన్‌ (శ్రీలంక ఎల్‌టిటిఇ నేత)గా మారేందుకు సిద్దమైతే నేను కోటి రూపాయలు ఇస్తాను, ఒక ఏడాది కొనసాగితే కనీసం వంద కోట్లు సేకరిస్తానని” చెప్పారు.


స్వామి సాగర్‌ సింధు మహరాజ్‌ మాట్లాడుతూ హిందువులు కనీసంగా కత్తులను కలిగి ఉండాలి అన్నారు. మనం ఉపయోగించే సెల్‌ఫోన్‌ విలువ ఐదువేల రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ హిందువులు ప్రతి ఒక్కరు కనీసం ఒక లక్ష రూపాయల విలువగల ఆయుధాలు కొనుగోలు చేయాలి. ఎవరైనా ఎప్పుడైనా ఇంట్లో ప్రవేశిస్తే సజీవంగా బయటకు పోలేరు అన్నారు. స్వామి ధర్మదాస్‌ మహరాజ్‌ మాట్లాడుతూ తన దగ్గర గనుక తుపాకి ఉండి ఉంటే నాధూరామ్‌ గాడ్సేగా మారి ఉండేవాడిని.మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నపుడు జాతీయ వనరుల మీద తొలి హక్కు మైనారిటీలకే తొలి హక్కు ఉండేది, నేను గనుక పార్లమెంటులో ఉండి ఉంటే నాధూరామ్‌ గాడ్సేను అనుసరించి తుపాకితో ఆరుసార్లు మన్మోహన్‌ సింగ్‌ గుండెల మీద కాల్చివుండేవాడిని అన్నారు. స్వామి ప్రబోధానంద మాట్లాడుతూ మయన్మార్‌లో మాదిరి మన పోలీసు, మన రాజకీయవేత్తలు, మన మిలిటరీ, ప్రతి హిందువు ఆయుధాలు తీసుకొని తుడిచిపెట్టే కార్యక్రమాన్ని నిర్వహించాలి, అంతకు మించి మరొక మార్గం లేదు అన్నారు. (ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ ధామి(బిజెపి) వేరే సందర్భంగా ఈ స్వామీజీ కాళ్లకు మొక్కిన చిత్రాలు ఈ సందర్భంగా దర్శనమిచ్చాయి.)


ప్రతి మతానికి చెందిన వారు తమ మంచి చెడ్డల గురించి సభలు జరుపుకోవచ్చు, ఉపన్యాసాలు చెప్పుకోవచ్చు. కానీ ఈ విద్వేషం, రెచ్చగొట్టే పనులేమిటి ? ఐతే ఇలా రెచ్చగొట్టే ఇతర మతాలవారి సంగతేమిటని వెంటనే కొందరు ప్రశ్నిస్తారు. ఎవరు రెచ్చగొట్టినా అది మైనారిటీ-మెజారిటీ ఎవరైనా కావచ్చు. అలాంటి వారిని నోరెత్తకుండా జైళ్లలో పెట్టాల్సిందే. వారి ఉపన్యాసాల వలన విద్వేషం తప్ప ప్రధాని నరేంద్రమోడీ మేకిన్‌ లేదా మేడిన్‌ ఇండియా పధకాల్లో ఒక్క వస్తువైనా ఉత్పత్తి అవుతుందా ? మనం మతంపేరుతో కుత్తుకలు ఉత్తరించిన మధ్యయుగాల్లో ఉన్నామా నాగరిక సమాజంలో బతుకుతున్నామా ?


విద్వేషపూరిత ప్రసంగాలు చేయటం, రెచ్చగొట్టటంలో మజ్లిస్‌ లేదా కొందరు ఇతర పార్టీల ముస్లిం నేతలు, మత పెద్దలు కూడా తక్కువేమీ కాదు.వారి రెచ్చగొట్టే మాటలు, నమోదైన కేసుల గురించి చూద్దాం. కొద్ది నెలల క్రితం 2021లో ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకీలో మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ విద్వేష ప్రసంగంతో పాటు నరేంద్రమోడీ మీద అనుచిత భాషను ఉపయోగించారని, కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు పెట్టారు.2020లో కర్ణాటకలో సిఎఎ వ్యతిరేక సభలో ముంబై మజ్లిస్‌ పార్టీ నేత వార్సి పఠాన్‌ విద్వేష పూరిత ప్రచారం చేశారని కేసు పెట్టారు. పదిహేను కోట్ల మంది ముస్లింలకు వందకోట్ల మంది హిందువులు సరితూగరంటూ రెచ్చగొట్టినట్లు పేర్కొన్నారు.సిఎఎ, ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా మా ఆడవారు ముందుకు వస్తేనే చెమటలు పడుతున్నాయి, అదే పురుషులు వస్తే అంటూ రెచ్చగొట్టినట్లు ఆరోపణ.తన మాటలను వక్రీకరించారని, ఎవరినైనా బాధిస్తే వెనక్కు తీసుకుంటానని అతగాడు తరువాత చెప్పినట్లు వార్తలు వచ్చాయి.అతని ప్రసంగ తీరుతెన్నులను తాము సమర్ధించటం లేదని మజ్లిస్‌ నేత ఒవైసీ, మహారాష్ట్ర మజ్లిస్‌ అధ్యక్షుడు, ఔరంగాబాద్‌ ఎంపీ జలీల్‌ ప్రకటించారు. మజ్లిస్‌ నేతల మాదిరి హిందూత్వశక్తులు లేరు. దీని అర్ధం మజ్లిస్‌ నేతలు నిజాయితీతో ఆ ప్రకటనలు చేశారని కాదు.


టైమ్స్‌ నౌ టీవీ ఛానల్‌ చర్చలో ఇరవైలక్షల మందిని హతమార్చాలని పిలుపు ఇవ్వటం మతాలు చేసే పనేనా అన్న యాంకర్‌ ప్రశ్నకు అవును ఇది మా విధి అని సాధ్వి అన్నపూర్ణ చెప్పారు.మా మతాన్ని వ్యతిరేకించే వారిని ఎవరినైనా హతమారుస్తాం అన్నారు. అన్నపూర్ణ మాతగా పిలిపించుకొనే ఈమె హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శిగానూ, నిరంజనీ అఖారా మహామండలేశ్వర్‌గానూ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈమె నోటి వెంట వెలువడిందేమిటి ? ” మీరు వారిని(ముస్లింలను) అంతం చేయ దలచుకొంటే వారిని హతమార్చండి.వారిలో ఒక ఇరవై లక్షల మందిని చంపటానికి మనకు వంద మంది సైనికులు చాలు ” అన్నారు. హరిద్వార్‌లో తాము చేసిన ప్రసంగాలకు కట్టుబడి ఉన్నామని స్వామి ఆనంద స్వరూప్‌ తదితరులు పునరుద్ఘాటించారు, సమర్దించుకున్నారు.
ప్రబోధానంద ఎన్‌డిటివీతో మాట్లాడుతూ నేను చెప్పిన మాటలకు సిగ్గుపడటం లేదు, పోలీసులను చూసి భయ పడటమూలేదు. చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నా. మీ ఆలోచనకు నాకూ తేడా ఉంది. రాజ్యాంగాన్ని చదవండి, నా మాటలు ఏ విధంగానూ రెచ్చగొట్టేవి కాదు. ఎవరైనా నన్ను చంపేందుకు పూనుకుంటే నేను పోరాడతాను. నేను చట్టానికి భయ పడటం లేదు. ” అన్నారు. ప్రబోధానంద ముస్లిం వ్యతిరేకత కొత్తదేమీ కాదు.హిందూత్వను, సమాజాన్ని రక్షించుకొనేందుకు ప్రతి ఒక్కరూ ఎనిమిది మంది పిల్లల్ని కనాలని 2017లో పిలుపిచ్చారు. ముస్లింలు మాత్రమే హిందూ మహిళల మీద అత్యాచారాలు చేస్తారని రెచ్చగొట్టారు. జీహాదీలను తుడిచిపెట్టాలని 2021జూన్‌లో ఇతరులతో కలసి రెచ్చగొట్టారు. అన్నపూర్ణ మాత ఎన్‌డిటీవితో మాట్లాడుతూ తన మాటలను మరింతగా సమర్ధించుకున్నారు.” భారత రాజ్యాంగం తప్పు, భారతీయులు నాధూరామ్‌ గాడ్సే(మహాత్మాగాంధీ హంతకుడు) కోసం ప్రార్ధనలు జరపాలి, నేను పోలీసుల గురించి భయపడను ” అన్నారు.


ముస్లిం వ్యతిరేక, బిజెపి అనుకూల ప్రచారానికి పేరు మోసిన సుదర్శన ఛానల్‌తో మాట్లాడుతూ దేశం వేగంగా ముస్లిం రాజ్యంగా మారుతోంది దాన్ని నిరోధించి సనాతన వేద దేశంగా మార్చాలని నరసింగానంద చెప్పారు. అదే ఇంటర్వ్యూలో మాట్లాడిన స్వామి దర్శన భారతి ఉత్తరాఖండ్‌లో ముస్లింలు భూమి కొనుగోలు చేయ కుండా లాండ్‌ జీహాద్‌ను పాటించాలని సెలవిచ్చారు.( ఇలాంటి వారంతా కాశ్మీరులో స్ధానికేతరులు భూముల కొనుగోలుకు వీలు కల్పించాలని డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ మతాన్ని ముందుకు తెచ్చారు) నరసింగానంద మాట్లాడుతూ స్వామి దర్శన భారతి గొప్పతనం అంటూ గత ఐదు సంవత్సరాలుగా ఉత్తరాఖండ్‌లో మసీదు, మదార్సాలు ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారని, అలాంటి యోధుడికి మనం మద్దతు ఇవ్వాలన్నారు. ధర్మ సంసద్‌లో హఠ యోగి మహరాజ్‌ మనకు ఒక ప్రభాకరన్‌ కావాలని చెప్పారు.నేను అన్నాను ఒక ప్రభాకరన్‌, ఒక భింద్రన్‌వాలే( పంజాబ్‌ తీవ్రవాది), ఒక జనరల్‌ సాహెబ్‌ సింగ్‌ (భింద్రన్‌వాలేకు సలహదారు, శిక్షకుడు) కావాలి. ప్రతి హిందూ దేవాలయానికి అలాంటి ఒకరు కావాలి, లేనట్లైతే హిందూమతానికి రక్షణ ఉండదు, రక్షించేవారు ఎవరూ ఉండరు.” అన్నారు. సత్యమేవ జయతే (సత్యమే ఎప్పటికీ జయిస్తుంది) అన్న సూక్తిని ఈ పెద్దమనిషి శస్త్రమేవ జయతే (ఆయుధమే జయిస్తుంది) అంటూ ముస్లింల మీద దాడులకు పురికొల్పారు.


తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే (కల్లు కోసం అని చెప్పకుండా ) దూడగడ్డి ఎక్కడ దొరుకుతుందో చూద్దామని ఎవరో చెప్పారట. స్వామీజీలకు బిజెపికి ఉన్న బంధం కొత్తదేమీ కాదు. హరిద్వార్‌ సభకు మీరెందుకు వెళ్లారు అన్న ప్రశ్నకు వారికి హిందీలో దేశ రాజ్యాంగ ప్రతులను సేకరించటం కష్టం కనుక వారికి వాటిని అందచేసేందుకు, వివరించేందుకు తాను పాల్గొన్నట్లు బిజెపి నేత అశ్వనీ ఉపాధ్యాయ చెప్పారు. ” అది మూడు రోజుల సభ, నేను ఒక రోజు ఉన్నాను.నేను అక్కడ ఉన్న సమయంలో 30నిమిషాలు వేదిక మీద ఉన్నాను. రాజ్యాంగం గురించి మాట్లాడాను. నాకంటే ముందు, తరువాత ఇతరులు మాట్లాడినదానికి నేను బాధ్యుడిని కాదు” అని కూడా అన్నారు. తరువాత తానే ఒక వీడియో ప్రకటన చేస్తూ తాను హరిద్వార్‌ సభలో చివరి రోజు పదినిమిషాలు ఉన్నానని, రాజ్యాంగంలో అసంపూర్ణంగా ఉన్న జనాభా అదుపు, అక్రమ వలసదార్ల అదుపు, మతమార్పిడుల అదుపు వంటి గురించి ప్రసంగించానని వివరణ ఇచ్చారు. రాజ్యాంగ ప్రతులు పంచటం, దాని గురించి మాట్లాడటం నేరమే అయితే నేను ఆ నేరం చేశాను అని చెప్పుకున్నారు. రోగి కోరుకున్నదే వైద్యుడు రాసి ఇచ్చాడన్నట్లుగా ఇవన్నీ ముస్లింల గురించే అన్నది వేరే చెప్పనవసరం లేదు.అశ్వనీ ఉపాధ్యాయ విద్వేష పూరిత ప్రసంగం చేసిన ఒక కేసులో ప్రస్తుతం బెయిలు మీద ఉన్నారు. బిజెపి మహిళానేత ఉదితా త్యాగి మరికొందరు పార్టీనేతలు కూడా పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సభలో పాల్గొన్న అనేక మందికి బిజెపి నేతలతో సంబంధాలున్నాయి.2029 నాటికి ఈ దేశానికి ఒక ముస్లిం ప్రధాని కాకుండా అడ్డుకోవాలని, ముస్లిం జనాభాకు పోటీగా హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని యోగులు, సాధ్వులు చేస్తున్న ప్రసంగాలు తెలిసిందే.


మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ 2014లో ఢిల్లీలో విద్వేషపూరిత ప్రసంగం చేసినట్లుగా అక్కడి పోలీసులు ఒక కేసు నమోదు చేశారు.దాని మీద మరింతగా దర్యాప్దు జరపాలని ఢిల్లీలోని కరకార్‌దూమా కోర్టు 2019జనవరిలో ఉత్తరువులు జారీ చేసింది. ఈ కేసులో ఏమీ దొరకనందున కేసును మూసివేయాలని 2018లో పోలీసులు కోర్టుకు దరఖాస్తు చేశారు.కేసు దాఖలు చేసిన అజయ గౌతమ్‌ దీన్ని సవాలు చేశారు. గత మూడు సంవత్సరాలుగా ఏ పోలీసూ తన వివరణ కోరలేదని, విచారణా జరపలేదని, దీనికి ఉన్నత స్ధాయిలో ఉన్న రాజకీయ పలుకుబడే కారణమని కూడా పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా మరింతగా విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది.2015లో ఇదే పోలీసులు కోర్డు ఆదేశాలతోనే ఒవైసీ మీద కేసు దాఖలు చేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే బిజెపి నేతలు పొద్దున లేస్తే మజ్లిస్‌నేత అసదుద్దీన్‌ ఒవైసీ పారాయణం చేస్తారు. ఢిల్లీ పోలీసులు సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ -అదీ అమిత్‌ షా-ఆధీనంలో పని చేస్తారు. వారి మీద రాజకీీయ పలుకుబడి లేదా వత్తిడి తేగలిగింది బిజెపి తప్ప మరొక పార్టీకి లేదు. అందుకే అనేక మంది బిజెపి-మజ్లిస్‌ పార్టీల మధ్య పరస్పర ప్రయోజనదాయకమైన మౌఖిక ఒప్పందం ఉందని అనుమానిస్తున్నారు.లేనట్లైతే నిజంగా ఢిల్లీ పోలీసులు తలచుకుంటే ఆధారాలు సంపాదించటం అసాధ్యమా ?బిజెపి బి టీమ్‌గా మజ్లిస్‌ పని చేస్తున్నట్లు వచ్చిన విమర్శల సంగతి తెలిసిందే. రెండు పార్టీలకు చెందిన వారు పరస్పరం అవగాహనతో విద్వేషాన్ని రెచ్చగొట్టి తమ ఓటు బాంకును ఏర్పాటు చేసుకుంటున్నారనే భావన నానాటికీ బలపడుతోంది.


హరిద్వార్‌ సభలో విద్వేష పూరిత ప్రసంగాలు చేశారంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత సాకేత్‌ గోఖలే ఉత్తరాఖండ్‌లోని జ్వాలాపూర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు దాఖలు చేశారు. ఇరవై నాలుగు గంటల్లో కేసు నమోదు చేయని పక్షంలో జుడీషియల్‌ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేస్తానని కూడా హెచ్చరించారు. ఆ మేరకు విధిలేక కేసు దాఖలు చేశారు. హరిద్వార్‌లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినప్పటికీ వాటి కారణంగా ఎలాంటి హింసాకాండ జరగనందున ఉగ్రవాద చట్టం(ఉపా) కింద కేసులు నమోదు చేయలేదని ఉత్తరాఖండ్‌ డిజిపి అశోక్‌ కుమార్‌ చెప్పారు. ఇది తప్పించుకోవటం తప్ప వేరు కాదు. నరసింగానంద నాయకత్వంలో 2020 జనవరిలో ధర్మ సంసద్‌ జరిగింది. సరిగ్గా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు జరగ్గా మరుసటి నెలలోనే ఈశాన్య ఢిల్లీలో మతఘర్షణలు జరిగాయి. ఇప్పుడు హరిద్వార్‌ సమావేశం ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ముందే జరిగింది. అక్కడ చేసిన ప్రతిజ్ఞలేమిటి ?


డిసెంబరు 19న సభ చివరి రోజు నరసింగానంద సభకు వచ్చిన వారితో ఒక ప్రతిజ్ఞ చేయించారు. …. అను నేను నా కుటుంబ సనాతన ధర్మం కోసం, నా సోదరీమణులు, కుమార్తెల రక్షణ కోసం గంగానది తీరాన ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా మతం, నా కుటుంబం, నా పిల్లలు, మహిళలకు ఈ ప్రపంచంలో ఏమి జరిగినా, ఏ సమస్యలు వచ్చినా, ఏ వ్యక్తి హాని తలపెట్టినా అతన్ని ప్రాణాలతో వదలను. మా మతం కోసం మేము జీవిస్తాము. మా మతం కోసం మేము మరణిస్తాము. ఇస్లామ్‌ జీహాద్‌ను అంతం చేస్తాను. సనాతన ధర్మం చిరకాలం ఉండాలి. సనాతన శత్రువులనందరినీ నాశనం చేయాలి. ” హిందూమతానికి ముప్పు వచ్చినట్లు గోబెల్స్‌ ప్రచారం చేయటం, దేశం ముస్లిం రాజ్యంగా మారుతుందనే ప్రచారంతో జనాల బుర్రలను ఖరారు చేస్తున్నారు. వందల సంవత్సరాలు ముస్లిం పాలకులు, బ్రిటీష్‌ వారు పాలించినప్పటికీ 80శాతం మంది జనం హిందువులుగానే ఉన్నారు. ఆ పాలకులకే సాధ్యం కానిది ఇప్పుడు కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాల్లో హిందూత్వ బిజెపి అధికారంలో ఉండగా ఎవరో మతమార్పిడి చేసి జనాన్ని హిందూమతానికి దూరం చేస్తున్నారనే ప్రచారం చిన్న మెదడు చితికిన వారు చేసేది తప్ప మరొకటి కాదు. గత ఎనిమిది సంవత్సరాల్లో వచ్చిన మార్పేమిటో చెప్పమనండి అసలు సంగతి బయటపడుతుంది.


సరిగ్గా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అందరూ సిద్దం అవుతున్న సమయంలో జరిపిన ఈ సమావేశంలో చేసిన విద్వేష పూరిత ప్రసంగాలు ఓట్ల రాజకీయంలో భాగం కాదని ఎవరైనా చెప్పగలరా ? మతం పేరుతో ఉన్మాదాన్ని రెచ్చగొడితే అది వెంటనే దిగదు. హిందూత్వ శక్తులుగా ఛాతీవిరుచుకొని చెప్పే బిజెపికి ఎన్నికల్లో ఓట్లు సంపాదించి పెట్టటమే దీని వెనుక ఉన్న ఎత్తుగడ. అది నెరవేరుతుందా ? గతంలో కూడా ఇలాంటి పనులు చేశారు. కొన్ని ప్రాంతాల్లో లబ్దిపొందారు. సరిగ్గా ఎన్నికల ముందే ఉగ్రవాద చర్యలు జరగటం వాటిని ప్రచార అస్త్రాలుగా చేసుకోవటాన్ని గమనిస్తున్న జనం క్రమంగా వాటి గురించి కూడా ఆలోచిస్తున్నారు. కొందరిని కొంతకాలం మభ్యపెట్టవచ్చు, మోసం చేయవచ్చు. అందరినీ ఎల్లకాలం అలా చేయలేరు.జనాలు వెర్రివాళ్లు కాదు, బుర్రలను వాట్సాప్‌ పండితుల ప్రచారానికి తాకట్టు పెట్టలేదు.

.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d