• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: BJP

మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డాగా తెలంగాణా గడ్డను మారుస్తారా ?

06 Sunday Dec 2020

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Telangana

≈ 1 Comment

Tags

AIMIM, BJP, GHMC election 2020, trs


ఎం కోటేశ్వరరావు
ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగుదామంటే ఎల్లవేళలా సాధ్యం కాదు.అందునా రాజకీయ పార్టీలకు అసలు కుదరదు. హైదరాబాద్‌ మహానగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు ప్రధాన పార్టీలన్నింటికీ ఒక కొత్త సవాలును ముందుకు తెచ్చాయి. దాన్ని ఏ పార్టీ ఎలా ఎదుర్కొంటుంది అన్నదాన్ని బట్టి వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల మీద ఒక తీవ్ర ప్రభావం చూపనుంది. హైదరాబాదు జనాభా రీత్యా రాష్ట్రంలో మూడోవంతు కలిగి ఉంది. తెలుగు ప్రాంతాల నుంచే గాక దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి స్ధిరపడిన, వలస వచ్చిన జనం ఇక్కడ ఉంది. ఈ నేపధ్యంలోనే తప్పించుకు తిరిగితే కుదరని స్ధితి ఏర్పడిందని చెప్పాల్సి వస్తోంది.
జిహెచ్‌ఎంసి ఫలితం తీరు తెన్నులు ఏమిటి ?
గత ఎన్నికలకు, వర్తమాన ఎన్నికలకు పోలికను చూడటం సహజమే అయినప్పటికీ అనేక అంశాలు ఒకదానితో ఒకటి పోల్చుకొనేందుకు వీలు లేదు. గత ఎన్నికల్లో బిజెపి తన మిత్రపక్షం తెలుగుదేశంతో కలసి 63 స్ధానాల్లో పోటీ చేసింది, ఈసారి అన్ని సీట్లకు పోటీ చేసింది. మజ్లిస్‌ పార్టీ గత ఎన్నికల్లో 60 చోట్ల పోటీ చేయగా ఈ సారి 51కే పరిమితం అయింది. అందువలన వచ్చిన సీట్లు, ఓట్లశాతలను పోల్చుకోలేము. టిఆర్‌ఎస్‌ అన్ని స్ధానాలకు కాంగ్రెస్‌ 146 చోట్ల పోటీ చేసింది. పార్టీల వారీ టిఆర్‌ఎస్‌ 55, బిజెపి 48, మజ్లిస్‌ 44, కాంగ్రెస్‌ రెండు సీట్లు తెచ్చుకుంది. ఒక స్ధానం ఫలితం ఖరారు కావాల్సి ఉంది. గత, తాజా ఎన్నికల్లో పార్టీల వారీ వచ్చిన ఓట్ల శాతాలు ఇలా ఉన్నాయి.
పార్టీ 2016 ——- 2020
టిఆర్‌ఎస్‌ 43.85 ——- 34.9
బిజెపి 10.34 ——– 34.6
మజ్లిస్‌ 15.85 ——– 18.28
కాంగ్రెస్‌ 13.11 ——— 6.5
టిడిపి 15.10 ——— 1.61
గత ఎన్నికల ఫలితాలు ఏమి వెల్లడించాయి ?
గత ఏడాది జరిగిన మున్సిపల్‌ ఎన్నికలలోనే కారు వేగం తగ్గటాన్ని చూశాము. మున్సిపల్‌ ఎన్నికలతో పాటు ఇతర ఎన్నికలు, పార్టీల వారీ ఓటింగ్‌ ఇతర అంశాలను క్లుప్తంగా చూద్దాం.
2019లో గ్రామీణ స్థానిక సంస్థలైన మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ ఘనవిజయాలు సాధించింది. మొత్తం 32 జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవులను టిఆర్‌ఎస్‌ దక్కించుకుంది. 537 జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే, టిఆర్‌ఎస్‌ 448 స్థానాలు (83.42 శాతం) దక్కించుకుంది. కాంగ్రెస్‌ కేవలం 75 స్థానాలు (13.96 శాతం), బిజెపి 8 స్థానాలు (0.14శాతం) దక్కించుకోగలిగాయి.
రాష్ట్రంలో మొత్తం 5,817 మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు (ఎంపిటిసి) ఎన్నికలు జరగగా, టిఆర్‌ఎస్‌ 3,556 స్థానాలు (61.13) దక్కించుకుంది. కాంగ్రెస్‌ 1,377 స్థానాలు (23.67 శాతం), బిజెపి 211 స్థానాలు (3.62 శాతం) గెలుచుకోగలిగాయి. మొత్తం 537 మండల పరిషత్‌ అధ్యక్ష పదవులకు గాను, టిఆర్‌ఎస్‌ 431, కాంగ్రెస్‌ 72, బిజెపి 6 చోట్ల ఎంపిపిలుగా గెలిచారు.
2016లో జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్‌ ఘనమైన రికార్డు విజయం సాధించింది. 150 వార్డులకు గాను, టిఆర్‌ఎస్‌ పార్టీ 99 స్థానాలు, ఎంఐఎం 44 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్‌ పార్టీ రెండు, బిజెపి 4, టిడిపి 1 స్థానం పొందాయి. జిహెచ్‌ఎంసి చరిత్రలో ఒక రాజకీయ పార్టీగా టిఆర్‌ఎస్‌ ఇన్ని స్థానాలు దక్కించుకోవడం, ఎవరితో పొత్తు లేకుండానే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ స్థానం దక్కించుకోవడం అదే మొదటి సారి.
2018 డిసెంబర్లో 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ ఏకపక్ష విజయం సాధించి, రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ 46.87 శాతం ఓట్లు సాధించి, 88 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్‌ పార్టీ 28.43 శాతం ఓట్లు పొంది, 19 స్థానాలు గెలుచుకుంది. బిజెపి 6.98 శాతం ఓట్లు పొంది, కేవలం ఒకే సీటుకు పరిమితం అయింది. ఎంఐఎం 2.71 శాతం ఓట్లు పొంది, 7 స్థానాలు గెలుచుకుంది.
2019 పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్రమోడీ హవా, బిజెపి ప్రభావం కనిపించినా తెలంగాణలో మాత్రం టిఆర్‌ఎస్‌ ఆధిక్యం కొనసాగింది. 17 లోక్‌ సభ స్థానాలున్న తెలంగాణలో టిఆర్‌ఎస్‌ పార్టీ 41.71 శాతం ఓట్లు సాధించి 9 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్‌ పార్టీ 29.79 శాతం ఓట్లతో 3 స్థానాలు, బిజెపి 19.65 శాతం ఓట్లతో 4 స్థానాలు, ఎంఐఎం 2.8 శాతం ఓట్లతో ఒక సీటు గెలిచింది. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ఓటింగ్‌ శాతం అసెంబ్లీతో పోలిస్తే ఐదుశాతం తగ్గగా కాంగ్రెస్‌ ఒకశాతం ఓట్లను పెంచుకుంది. బిజెపి అసాధారణంగా పన్నెండుశాతానికి పైగా ఓట్లు పెంచుకుంది. తరువాత జరిగిన గ్రామీణ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో లోక్‌సభలో వచ్చిన ఓట్లకు అనుగుణ్యంగా దానికి సీట్లు రాలేదు.
గ్రామీణ ఎన్నికలు జరిగిన ఆరు నెలల్లోపే పట్టణ ప్రాంతాల్లో కారు వేగం బాగా తగ్గింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి తెరాసకు 41.14శాతం, కాంగ్రెస్‌కు 19శాతం, బిజెపికి 17.80శాతం, మజ్లిస్‌కు 4.17 రాగా ఇతరులకు 17.86 శాతం వచ్చాయి.
మున్సిపాలిటీల వారీ పార్టీల ఓట్లశాతాలు
పార్టీ 50శాతంపైన 40-50 30-40 20-30 10-20 10శాతం కంటే తక్కువ
తెరాస 28 ———- 71 —– 20 —– 0 —— 1—— 1
కాంగ్రెస్‌ 1 ———- 10 —– 35 —– 30 —- 26 —- 18
బిజెపి 0 ———— 3 ——- 4 —– 14 —- 40 —- 59
మజ్లిస్‌ 0 ———— 0 ——- 2 ——- 1 —– 2 —- 40
–ఇతరులు 1 ———— 2 —— 11 —– 17—-48 —- 41

పురపాలక సంఘాలలోని 2727 వార్డులలో తెరాసకు 1579 అంటే 57.87శాతం, కాంగ్రెస్‌కు 541(19.80) ఇతరులు 300(11.01) బిజెపి 236(8.61) మజ్లిస్‌ 71(2.60) సీట్లు వచ్చాయి. కార్పొరేషన్ల విషయానికి వస్తే కరీంనగర్‌ మినహా తొమ్మిదింటిలో 325 స్ధానాలకు గాను తెరాస 152(47.38) బిజెపి 66(20.30), ఇతరులు 49(15.07) కాంగ్రెస్‌ 41(12.61) మజ్లిస్‌ 17(5.29) తెచ్చుకున్నాయి. మున్సిపల్‌, కార్పొరేషన్ల ఫలితాలను కలిపి చూస్తే తెరాసకు 52.62, కాంగ్రెస్‌కు 16.2, బిజెపికి 14.45 శాతం వచ్చాయి. గ్రామీణ ఎన్నికల్లో మండల ప్రాదేశిక నియోజక వర్గాలను ప్రాతిపదికగా తీసుకుంటే తెరాస సీట్ల శాతం 61.13 నుంచి 52.62కు పడిపోయింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ బలం 23.67 నుంచి 16.2కుతగ్గింది, మరోవైపు బిజెపి 3.62 నుంచి 14.45శాతానికి పెంచుకుంది, ఇదే సమయంలో బిజెపి అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని లోక్‌సభ ఎన్నికల నుంచీ చెబుతున్న బిజెపి ఆ స్ధితిలో లేదని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. పార్టీ 2727 మున్సిపల్‌ స్ధానాల్లో 2025 చోట్ల పోటీ చేసింది. 120 పురపాలక సంఘాలకు గాను 45, తొమ్మిదింటిలో రెండు కార్పారేేషన్లలో అసలు ఖాతాయే తెరవలేదు. కాంగ్రెస్‌ విషయానికి వస్తే 14 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో ప్రాతినిధ్యం పొందలేకపోయింది. కరీంనగర్‌ లోక్‌సభ స్ధానానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ కుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో 60 స్ధానాలకు గాను టిఆర్‌ఎస్‌ 36, దానితో ఉండే స్వతంత్రులు నలుగురు, బిజెపి 13, మజ్లిస్‌ 6,స్వతంత్ర ఒకరు ఉన్నారు.

రాబోయే రోజుల్లో బిజెపి వ్యూహమేమిటి ?
బిజెపి హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో తన వనరులను అన్నింటినీ కేంద్రీకరించటంతో పాటు తన మత అజెండాను పూర్తిగా ముందుకు తీసుకు వచ్చింది. మత పరమైన భావోద్వేగాలను గరిష్ట స్ధాయిలో రేపేందుకు అది ప్రయత్నించింది. ఎన్నికల ఫలితాలపై చర్చలలో ఆ పార్టీ ప్రతినిధులు వెలిబుచ్చిన అభిప్రాయాలను మొత్తంగా చూస్తే ఈ అజెండాను రాష్ట్ర వ్యాపితంగా ముందుకు తీసుకుపోవటం ద్వారా 2023 లేదా దానికి ముందే ఒక వేళ జమిలి ఎన్నికలను రుద్దితే 2022లో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలలో విజయం సాధించాలనే ఆశ, ఆకాంక్షలను అది దాచుకోలేదు. దుబ్బాక ఉప ఎన్నిక తరువాత హైదరాబాదులో వచ్చిన విజయాలతో రానున్న రోజుల్లో ప్రచారదాడిని మరింతగా పెంచనుంది. మజ్లిస్‌ను పరోక్షంగా ప్రోత్సహించి లబ్ది పొందుతుంది తప్ప ప్రత్యక్షంగా సంబంధాలను తీసుకొనే అవకాశాలు లేవు. ఒక రాష్ట్ర అధికారం వేరు ఒక కార్పొరేషన్‌ పరిధి వేరు.

కాంగ్రెస్‌ భవితవ్యం ఏమిటి ?
ఆంబోతుల మధ్య లేగ దూడలు నలిగిపోయినట్లుగా కాంగ్రెస్‌ పరిస్దితి తయారైంది. దుబ్బాకలో చివరి నిమిషం వరకు అభ్యర్ధిని తేల్చుకోలేకపోవటంలోనే దాని బలహీనత వ్యక్తమైంది. హైదరాబాదు కార్పొరేషన్‌ ఎన్నికలలో అలాంటి పరిస్ధితి లేదు. అంతర్గత విబేధాలు వెల్లడయ్యాయి. బిజెపి-మజ్లిస్‌-తెరాసలతో పోటీ పడి అది ప్రచారం నిర్వహించలేకపోయింది. సంఖ్యరీత్యా గతంలో ఉన్న రెండు సీట్లు నిలుపుకున్నా గణనీయంగా ఓట్లను కోల్పోయింది. ఆ పార్టీలో ఇప్పుడు మిగిలేవారు ఎందరు అన్నది ప్రశ్న. ఆ పార్టీకి ఓటు వేసి గెలిపించినా దానిలో ఉంటారనే విశ్వాసం ఓటర్లలో కోల్పోవటం ఒక ప్రధాన కారణం. పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమకుమార్‌ ఎప్పుడో తప్పుకుంటానని ప్రకటించినా ఆ స్ధానంలో మరొకరిని భర్తీ చేయలేని పార్టీ తీరా పూర్తిగా కాడి పడవేసిన తరువాత కూడా వెంటనే నిర్ణయం తీసుకోలేని బలహీనతతో అది ఉంది.

చౌరాస్తాలో ఉన్న టిఆర్‌ఎస్‌ కారు !
టిఆర్‌ఎస్‌ కారుకు దుబ్బాకలో ఓడిపోయిన దాని కంటే హైదరాబాద్‌లో గెలిచినా పెద్ద దెబ్బతగిలింది. నాలుగు రోడ్ల (చౌరాస్తా) కూడలిలో నిలిచింది.ఇది స్వయంకృతం. ఇప్పుడు అది ఏ దారిలో వెళ్లనుంది అన్నదే కీలకమైన ప్రశ్న. హైదరాబాదు ఓటర్లు ఇచ్చిన తీర్పు రాష్ట్ర రాజకీయాలను కొత్త బాట పట్టించేందుకు దోహదం చేశాయి. ఇప్పటి వరకు ఇతర పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలను ఆకర్షించి దెబ్బతీసిన ప్రశ్నించే వారు లేకుండా చూసుకోవాలని భావించిన ఆ పార్టీ ఇప్పుడు రాబోయే రోజుల్లో తన వారిని నిలుపుకొనేందుకు ఏ విధంగా ప్రయత్నిస్తుందన్న ప్రశ్నను ఈ పరిణామం ముందుకు తెచ్చింది. హైదరాబాద్‌ను చూపి బిజెపి తెరాస-కాంగ్రెస్‌ నేతలకు గాలం వేస్తున్నది. మజ్లిస్‌తో అది ఆడిన క్రీడ ఇప్పుడు అడుగడుగునా మజ్లిస్‌కు లొంగలేదు అని నిరూపించుకోవాల్సిన పరిస్ధితిని తెచ్చి పెట్టింది. మేయర్‌ ఎన్నికలో అది పోటీ చేసినా, చేయకుండా బేషరతు మద్దతు ఇచ్చినా తెరవెనుక ఏదో జరిగిందనే జనం భావించే స్దితిని స్వయంగా కల్పించుకుంది.

మజ్లిస్‌ ఏమి చేయనుంది ?
ఇతర రాష్ట్రాలలో బిజెపి వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు బిజెపి బి టీమ్‌గా పోటీలోకి దిగుతున్నదనే విమర్శ మజ్లిస్‌ మీద ఉంది. దాని వలన లబ్దిపొందిన తీరును మహారాష్ట్ర, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో చూశాము.మరికొన్ని చోట్ల కూడా అదే పాచికను ప్రయోగించవచ్చు. అయితే తెలంగాణా- ప్రత్యేకించి హైదరాబాదులో ఉన్న పరిస్ధితి వేరు. మజ్లిస్‌, ముస్లిం మైనారిటీలను బూచిగా చూపి బిజెపి మెజారిటీ మతానికి చెందిన వారిని తన ఓటు బ్యాంకుగా మార్చుకొనేందుకు ఎప్పటి నుంచో నిరంతరం ప్రయత్నిస్తోంది. బిజెపి ప్రచారంతో మజ్లిస్‌ తన స్ధానాన్ని పటిష్ట పరచుకుంది. రెండు మతశక్తులు రంగంలోకి దిగినపుడు జరిగే పరిణామం ఇదే. ఇప్పుడు మజ్లిస్‌ను ఒక అంటరాని పార్టీగా చేయటంలో బిజెపి ప్రచారం విజయవంతమైంది. ఎన్నికల ప్రచారంలో బిజెపి అంత తీవ్రంగా గాకపోయినా మజ్లిస్‌ను కూడా టిఆర్‌ఎస్‌ విమర్శించక తప్పలేదు. మజ్లిస్‌ మాత్రం టిఆర్‌ఎస్‌ మీద ఎలాంటి దాడి చేయలేదు. ఈ పరిణామాన్ని బిజెపి ఉపయోగించుకుంది. మజ్లిస్‌ను ఉపయోగించుకొని లబ్ది పొందేందుకు గతంలో అధికారంలో ఉన్న ప్రతి పార్టీ ప్రయత్నించింది. ఇదే టిఆర్‌ఎస్‌ కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చేసింది. ఒక విధంగా చూస్తే ఇప్పుడు మజ్లిస్‌ కూడా ఇరకాటంలో పడింది. అధికారం లేకుండా అది ముస్లింలను తనతో ఉంచుకోలేదు. గొంతెమ్మ కోరికలు కోరి తెగేదాక లాగకపోవచ్చు. ఒక ఎత్తుగడగా ఈ ఎన్నికలో వాటా కోరకపోవచ్చు. డిప్యూటీ మేయర్‌ లేదా కొంతకాలం మేయర్‌ పదవితో దానికి వచ్చే ప్రయోజనం కంటే బేషరతు మద్దతుతోనే ఎక్కువ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించవచ్చు.

ఇప్పుడేమి జరగనుంది ? ఏమి చేయాలి ?
హైదరాబాదు మేయర్‌ కంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగానే అన్ని పార్టీలు వ్యవహరించటం అనివార్యం. రాజకీయాల్లో దేశద్రోహులుగా లేదా దేశద్రోహశక్తులకు మద్దతు ఇచ్చిన పార్టీలని తాను విమర్శించిన వాటితో చేతులు కలపటానికి బిజెపికి ఎలాంటి అభ్యంతరం లేదు. కాశ్మీరులో పిడిపితో కలసి సంకీర్ణ మంత్రివర్గంలో పాల్గొనటమే దానికి పెద్ద నిదర్శనం. అలాంటి పార్టీకి మజ్లిస్‌తో చేతులు కలపటం పెద్ద సమస్య కాదు. అయితే అలంకార ప్రాయమైన మేయర్‌ పీఠం కంటే ముఖ్యమంత్రి గద్దె మీద బిజెపి కేంద్రీకరించినందున ప్రస్తుతానికి మజ్లిస్‌తో చేతులు కలిపే అవకాశాలు లేవు. మజ్లిస్‌తో చేతులు కలిపిందనే ప్రచారాన్ని నగర ఓటర్లు అనేక మంది నమ్మిన కారణంగానే గతంలో టిఆర్‌ఎస్‌కు ఓటు వేసిన వారు ఇప్పుడు బిజెపి వైపు మొగ్గారు. అలాంటపుడు మజ్లిస్‌తో చేతులు కలిపితే బిజెపికి మొదటికే మోసం వస్తుంది.
మేయర్‌ పీఠాన్ని టిఆర్‌ఎస్‌ దక్కించుకొనేందుకు ఉన్న అవకాశాలు ఏమిటి ? హాజరైన సభ్యులలో మెజారిటీ తెచ్చుకున్న పార్టీకి మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పీఠాలు దక్కుతాయి. తమ మధ్య ఎలాంటి అవగాహన లేదు అని చెప్పుకొనేందుకు మజ్లిస్‌ ఓటింగ్‌ను బహిష్కరించవచ్చు లేదా అది కూడా పోటీ పెడితే బిజెపి కూడా పోటీ చేయవచ్చు లేదా ఓటింగ్‌కు దూరంగా ఉండవచ్చు. ఏది జరిగినా టిఆర్‌ఎస్‌కు పీఠం ఖాయం. గత ఎన్నికల్లో టిర్‌ఎస్‌కు సంపూర్ణ మెజారిటీ ఉన్న కారణంగా రెండు పదవులనూ అదే దక్కించుకుంది. మజ్లిస్‌తో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంటే బిజెపి పన్నిన వలలో చిక్కినట్లే. పరోక్షంగా మద్దతు తీసుకున్నా బిజెపి దాడి ఆగదు.
తెలంగాణా వ్యాప్తంగా ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు అనువైన భౌతిక పరిస్ధితులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మీద అసంతృప్తి పెరిగితే ఇలాంటి మితవాద భావాలు ఓటర్ల మీద బలంగా ప్రభావం చూపుతాయి. అది హైదరాదు నగరం మీద ఉన్నంత తీవ్రంగా ఇతర ప్రాంతాల మీద ఉంటుందని చెప్పలేము. చారిత్రక నేపధ్యం, రజాకార్‌ వారసత్వం, గతంలో ఇక్కడ జరిగిన మతకలహాలు, రాజకీయ పార్టీల అవకాశవాదం దీనికి కారణం. హైదరాబాదులో మజ్లిస్‌ పార్టీ గూండాయిజం నుంచి రక్షణ కల్పించేది తామే అనే బిజెపి ప్రచారం దశాబ్దాలుగా పధకం ప్రకారం సాగుతోంది. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందన్నట్లుగా అనేక మంది ఆ ప్రచారానికి లోనుకావటం కూడా తాజా ఎన్నికల్లో బిజెపి పుంజుకోవటానికి దోహదం చేసింది. ముఖ్యంగా మజ్లిస్‌ ప్రభావం ఎక్కువ ఉన్న పరిసర ప్రాంతాల్లోనే బిజెపి ఎక్కువ సీట్లు గెలుచుకోవటం లేని ప్రాంతాలలో టిఆర్‌ఎస్‌ విజయం సాధించటం దానికి ఒక సూచిక అని చెప్పవచ్చు.
టిఆర్‌ఎస్‌-బిజెపి మధ్య తెరవెనుక అవగాహన ఉందన్నది గతంలో ఆ పార్టీ సభ్యులు పార్లమెంట్‌లో, వెలుపల రాష్ట్ర ప్రభుత్వం అనుసరించి వైఖరి స్పష్టం చేసింది. బిజెపితో రాజీపడి తమ జోలికి రాకుండా చూసుకోవాలన్నది టిఆర్‌ఎస్‌ నేతల అవకాశవాదం. అదే విధంగా మజ్లిస్‌ను బుజ్జగించే వైఖరితోనే ఆ పార్టీ నేతల రెచ్చగొట్టే ప్రసంగాలు, చర్యల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవటం లేదని బిజెపి చేస్తున్న ప్రచారదాడిని ఎదుర్కోవటంలో చట్టపరంగా, రాజకీయంగా కెసిఆర్‌ సర్కార్‌ అచేతనంగా ఉందని జనం భావిస్తున్నారు. తాము పార్లమెంట్‌లో బిజెపికి మద్దతు ఇచ్చి తప్పు చేశామనే టిఆర్‌ఎస్‌ నేతలు బహిరంగంగానే వ్యక్తం చేసినా రాజకీయంగా నిర్దిష్ట వైఖరిని తీసుకోలేదు. నవంబరు 26జాతీయ సమ్మెకు చివరి నిమిషంలో మద్దతు ప్రకటించింది.డిసెంబరు ఎనిమిదవ తేదీ భారత్‌ బంద్‌లో సంపూర్ణంగా పొల్గొనాలని రెండు రోజులు ముందుగానే కెసిఆర్‌ ప్రకటించారు. బిజెపి తమ గద్దెకు ఎసరు తెస్తోందని నిర్ధారించుకున్నట్లుగా ఇది సూచిస్తున్నది.
ఇక మజ్లిస్‌తో తమకు తెరచాటు అవగాహన లేదని నిరూపించుకొనే బాధ్యత టిఆర్‌ఎస్‌ మీద ఉంది. దాని వలన లబ్ది పొందేది కూడా అదే. తమకు ఎలాంటి సంబంధాలు లేవని చెబుతున్నా నిజమాబాద్‌ కార్పొరేషన్‌లో దాని సహకారంతోనే మేయర్‌ పదవిని దక్కించుకుంది. కనుక చెప్పే మాటలను అంత తేలికగా నమ్మటం కష్టం. ఎలా నిరూపించుకుంటారో ఆ పార్టీయే నిర్ణయించుకోవాలి. చిత్తశుద్ధి ఉంటే అదేమీ కష్టం కాదు. నిజంగానే అదే జరిగితే ఏం జరుగుతుంది ? రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలు గతంలో ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా ఇటీవల టిఆర్‌ఎస్‌ వైపు ఉన్నారు. మజ్లిస్‌తో సంబంధాలను తెంచుకుంటే ఆ పార్టీ ఇతర రాష్ట్రాలలో తన అభ్యర్ధులను పోటీ పెట్టి మైనారిటీల ఓట్లను చీల్చి బిజెపికి లబ్ది చేకూర్చినట్లే ఇక్కడ కూడా చేసేందుకు అవకాశం లేకపోలేదు. బిజెపి మెజారిటీ మతతత్వాన్ని వ్యతిరేకించినట్లే మజ్లిస్‌ మైనారిటీ మతతత్వాన్ని కూడా నిఖరంగా వ్యతిరేకిస్తే కోల్పోయిన ఓట్లలో కొన్నింటిని తిరిగి తెచ్చుకోవచ్చు. ఇదే విధంగా అసంతృప్తి చెందిన వివిధ తరగతుల సమస్యలను పరిష్కరిస్తే వారి మద్దతును కూడా తిరిగి పొందటం కష్టం కాదు. ప్రభుత్వం మీద ఒకసారి అసంతృప్తి ప్రారంభమైతే ఎన్ని సంక్షేమ పధకాలను అమలు జరిపినా అవి ఓట్లు తెచ్చి పెట్టవు అని ఇప్పటికైనా టిఆర్‌ఎస్‌ నాయకత్వం గుర్తించటం అవసరం. ఎవరు అధికారంలోకి వచ్చినా అమలు జరుపుతున్న సంక్షేమ పధకాలను కొనసాగిస్తారు కనుక తమకు ఇష్టమైన వారికి ఓటు వేసుకోవచ్చనే అభిప్రాయం ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ఓటర్లలో కనిపిస్తోంది. రోజులు గడిచే కొద్దీ అది మరింత స్ధిరపడుతుంది. కొత్తది ఏదైనా సాధారణ స్దాయికి చేరిన తరువాత దాని మీద ఆకర్షణ తగ్గి కొత్త అంశాల మీద కేంద్రీకరిస్తారు. ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగింది అదే. చంద్రబాబు నాయుడి సర్కార్‌ అమలు జరిపిన పధకాలేమీ తక్కువ కాదు, చివరి నిమిషంలో ముందుకు తెచ్చిన పసుపు-కుంకమ కంటే వైసిపి పార్టీ ఎక్కువగా అమలుజరుపుతుందని జనం భావించారన్నది స్పష్టం.
హైదరాబాదు ప్రచారంలో అభివృద్ది అంశాల కంటే మత అంశాలనే ఎక్కువగా ముందుకు తెచ్చారు. తెలంగాణాలో సంక్షేమ పధకాలతో పాటు మతోన్మాద భావాలను కూడా బిజెపి జమిలిగా ముందుకు తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణా రాష్ట్రసమితి, ఆ పార్టీ నాయకత్వం తమ వైఖరులను మార్చుకొని సామరస్యతగా మారుపేరుగా ఉన్న రాష్ట్రాన్ని ఇదే బాటలో నడిపిస్తారా ? అవకాశ వాదం, తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి మెజారిటీ-మైనారిటీ మతశక్తుల అడ్డాగా మారుస్తారా ? టిఆర్‌ఎస్‌కు అగ్ని పరీక్ష ఎదురైంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఖలిస్తాన్‌ ముద్రతో రైతుల ఉద్యమాన్ని బిజెపి అణచివేయనుందా ?

02 Wednesday Dec 2020

Posted by raomk in BJP, Current Affairs, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

#Farmers’ protest, BJP, Farmers, farmers agitation 2020, Farmers Delhi agitation


ఎం కోటేశ్వరరావు
రైతులకు మద్దతుగా ఈనెల ఎనిమిది నుంచి సరకు రవాణా వాహనాలను నిలిపివేయనున్నట్లు ఆలిండియా మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌ (ఎఐఎంటిసి) బుధవారం నాడు ప్రకటించింది. కోటి మంది ట్రక్కు యజమానులు దీనిలో సభ్యులుగా ఉన్నారు.తొలుత ట్రక్కుల నిలిపివేత ఉత్తర భారత్‌లోని ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, హిమచల్‌ ప్రదేశ్‌, ఉత్తరా ఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌, కాశ్మీర్‌లలో అమలు జరుగుతుందని తెలిపారు. తరువాత కూడా కేంద్రం రైతుల డిమాండ్లను పట్టించుకోని పక్షంలో దేశవ్యాపితంగా చక్కాజామ్‌(రవాణా బంద్‌) ప్రకటించనున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు కులతరన్‌ సింగ్‌ అతవాల్‌ తెలిపారు. ఇప్పటికే ఢిల్లీకి అనేక ప్రాంతాల నుంచి సరఫరాలు నిలిచిపోయాయి. ఆపిల్‌ పండ్లు మార్కెట్‌కు వస్తున్న తరుణంలో ఈ ఆందోళన రైతులకు, వ్యాపారులకు తీవ్ర సమస్యలను సృష్టించే అవకాశం ఉంది. డిసెంబరు ఒకటిన ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. ఒక కమిటీని ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను రైతులు తిరస్కరించారు.
తమకు నష్టదాయకమైన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని కోరుతూ నవంబరు 26 నుంచి ఢిల్లీ శివార్లలో కొనసాగుతున్న రైతుల ఆందోళన అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.ఒక విదేశీ ప్రధాని మన దేశంలో జరుగుతున్న ఒక ప్రజా ఉద్యమానికి మద్దతు ప్రకటించటం బహుశా ఇదే ప్రధమం కావచ్చు. గురునానక్‌ జయంతి సందర్భంగా కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌ మాట్లాడుతూ నిరసన తెలిపే హక్కును తాము సమర్ధిస్తామని, భారత్‌లో రైతుల ఉద్యమం సందర్భంగా పరిస్ధితి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని, ఈ విషయాన్ని భారత అధికారుల దృష్టికి తీసుకుపోతామని చెప్పాడు.
రైతుల ఆందోళన గురించి మన దేశంలోని మీడియాలో కొన్ని తప్ప ఎక్కువ భాగం నిర్లిప్తంగా ఏదో ఇచ్చామంటే ఇచ్చాం అన్నట్లుగా వార్తలు ఇస్తున్నాయి. వీటితో పోల్చితే అంతర్జాతీయ వార్తా సంస్ధలు, విలేకర్ల ద్వారా అనేక విదేశీ పత్రికలు,టీవీ ఛానళ్లు వార్తలను ప్రముఖంగా ఇచ్చాయి. డిసెంబరు మూడవ తేదీన రైతు ప్రతినిధులను చర్చలకు పిలుస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఒకటవ తేదీనే ఆహ్వానించటం వెనుక విదేశాల్లో తలెత్తిన వత్తిడితో పాటు ఉద్యమానికి దేశీయంగా పెరుగుతున్న మద్దతు ప్రధాన అంశాలుగా చెప్పవచ్చు. ప్రస్తుతం సాగుతున్న ఉద్యమంలో సిక్కు రైతాంగం ప్రధాన పాత్రధారులుగా ఉండటం, సిక్కు జనాభా గణనీయంగా ఉన్న కెనడాలో గురునానక్‌ జయంతి రోజున కెనడా ప్రధాని స్పందించటం గమనించాల్సిన అంశం. కెనడా రాజకీయ రంగంలో సిక్కులు ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. కెనడా రక్షణ మంత్రి, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రులుగా సిక్కులు ఉన్నారు. దేశజనాభాలో ఒకటిన్నర శాతానికి పైగా ( ఆరులక్షల మంది ) ఉన్నారు. రైతుల ఆందోళనకు సంబంధించి భారత్‌ నుంచి వస్తున్న వార్తలను గుర్తించకపోతే అశ్రద్ధ చేసిన వాడిని అవుతానని కెనడా ప్రధాని పేర్కొన్నారు. రైతుల ఆందోళన గురించి వాస్తవాలు తెలియకుండా కెనడా నేతలు మాట్లాడారని, ఒక ప్రజాస్వామ్య దేశ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి అలా మాట్లాడటం అవాంఛనీయమని మన విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ వ్యాఖ్యానించారు. దౌత్యపరంగా జరిగిన సంభాషణలను రాజకీయ అవసరాల కోసం తప్పుగా వ్యాఖ్యానించటం తగదన్నారు. కెనడా ప్రధానితో పాటు బ్రిటన్‌ లేబర్‌ పార్టీ నేతలు జాన్‌ మెక్‌డెనెల్‌,తన్మన్‌జీత్‌ సింగ్‌ దేశీ, ప్రీత్‌ కౌర్‌ గిల్‌ కూడా రైతుల ఆందోళన పట్ల మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న తీరును విమర్శించారు.
రైతుల ఆందోళన వెనుక ఖలిస్తానీ ఉగ్రవాదులు ఉన్నారని బిజెపి నేతలు చెప్పటం సమస్యను పక్కదారి పట్టించే ఎత్తుగడతప్ప మరొకటి కాదు. గడ్డం పెంచిన వారందరూ ముస్లింలే అని ఉగ్రవాదులందరూ ముస్లింలే అన్నట్లుగా ప్రచారం చేస్తున్న శక్తులు సిక్కులు అనగానే ఖలిస్తానీ ఉగ్రవాదులని ముద్రవేయటంలో ఆశ్చర్యం ఏముంది ? సామాజిక మాధ్యమంలో బిజెపి మరుగుజ్జులు, చివరికి కొన్ని మీడియా సంస్దలు కూడా అదే పాటపాడాయి. దీనికి గాను రైతుల్లో కొందరు ఖలిస్తానీ తీవ్రవాది, ఆపరేషన్‌ బ్లూస్టార్‌లో హతుడైన భింద్రన్‌వాలే ఫొటోలను ప్రదర్శించటాన్ని సాక్ష్యంగా చూపుతున్నారు. ఆందోళనకు అనేకరైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. వాటి అనుయాయులుగా ఉన్నవారిలో భింద్రన్‌వాలే మీద సానుభూతి ఉన్నవారు కొందరు ఉండవచ్చు, అతని చిత్రాలను ప్రదర్శించవచ్చు. అంత మాత్రాన రైతు ఉద్యమాన్ని ఉగ్రవాదులే నడుపుతున్నారని చెప్పటం తప్పుడు ప్రచారమే.
ఆంగ్లో-మరాఠాల మధ్య జరిగిన యుద్దాలలో మూడవది మహారాష్ట్రలోని భీమా కొరేగావ్‌ గ్రామం దగ్గర జరిగింది. పీష్వా రెండవ బాజీరావు దళితులను అవమానపరచి తన సైన్యం నుంచి వారిని తొలగించారు. దీంతో పీష్వాలను వ్యతిరేకించిన బ్రిటీష్‌ సైన్యంలో వారు చేరారు. 1818 జనవరి ఒకటవ తేదీ భీమా కొరేగావ్‌ యుద్దంలో పీష్వాలు ఓడిపోయారు. ఇది తమ ఆత్మగౌరవ విజయంగా అప్పటి నుంచి దళితులు భావిస్తున్నారు. ఆ ఉదంతం జరిగిన 200 సంవత్సరాలు గడచిన సందర్భంగా భీమా కొరెగావ్‌లో దళిత సంఘాలు పెద్ద ఎత్తున ప్రదర్శన, సభ నిర్వహించాయి. దాని నిర్వాహకులు, మద్దతు తెలిపిన వారి మీద బిజెపి ప్రభుత్వ కుట్ర కేసు నమోదు చేసింది. తెలుగు రచయిత వరవరరావుతో సహా అనేక మందిని ఆ కుట్ర కేసులో ఇరికి బెయిలు కూడా ఇవ్వకుండా నిర్బంధించిన విషయం తెలిసిందే. అదే విధంగా సిఎఎ, ఎన్‌ఆర్‌సిలను వ్యతిరేకించిన ఢిల్లీ ముస్లింలు, వారికి మద్దతు ఇచ్చిన వారి మీద కూడా కేంద్ర బిజెపి ప్రభుత్వం కేసులు దాఖలు చేసింది. ఈ ఉదంతాలను గోరంతలు కొండంతలు చేసి నిర్వాహకుల మీద దేశద్రోహ ముద్రవేసి వేధిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులకు ఖలిస్తానీ ఉగ్రవాదులు మద్దతు ఉందనే ప్రచారం ప్రారంభించారు. అనేక దేశాలలో స్ధిరపడిన సిక్కులు ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు. ఖలిస్తానీ ఆందోళన దేశ వ్యతిరేకమైనది, వేర్పాటు వాదాన్ని రెచ్చగొట్టింది. తీవ్రవాదులు సాయుధ దాడులకు పాల్పడ్డారు. కానీ రైతుల నవంబరు 26 ఆందోళన ఎంతో ముందుగానే ప్రకటించిన కార్యక్రమమే, అదే విధంగా రైతుల ఢిల్లీ చలో పిలుపులో కూడా దాపరికం లేదు. వారేమీ ఖలిస్తానీ డిమాండ్లను ముందుకు తేలేదు, వారంతా ట్రాక్టర్లలో ఆహార పదార్ధాలతో వచ్చారు తప్ప ఆయుధాలు తీసుకు రాలేదు. నిరవధిక ఆందోళనకు సిద్దపడి వస్తున్నారని ముందుగానే కేంద్ర ప్రభుత్వానికి తెలిసినప్పటికీ ఆందోళన నివారణకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోగా వారిని మరింతగా రెచ్చగొట్టే విధంగా చివరికి హర్యానా బిజెపి ముఖ్యమంత్రి కూడా వ్యవహరించారు. నవంబరు 26 నుంచి ఆందోళనకు దిగితే డిసెంబరు మూడున చర్చలు జరుపుతామని ప్రకటించటంలోనే దుష్టపన్నాగం ఉంది. ఎక్కడైనా పోలీసులు, మిలిటరీ రాకుండా ఆందోళనకారులు రోడ్ల మీద గోతులు తవ్వటం, ఆటంకాలను కల్పించటం సాధారణం. కానీ ఢిల్లీ పోలీసులు, కేంద్ర దళాలే రైతులను అడ్డుకొనేందుకు ఆపని చేయటం మోడీ సర్కార్‌ ప్రత్యేకత.
పంజాబ్‌ రైతులు ఉద్యమించటం ఇదేమీ కొత్త కాదు. గతంలో అనేక ఉద్యమాలు చేశారు. వాటి వెనుక ధనిక రైతులు, పేద రైతులూ ఉన్నారు.1984 మే నెలలో చండీఘర్‌లోని గవర్నర్‌ నివాసాన్ని వారం రోజుల పాటు దిగ్బంధించారు. పంజాబ్‌ రైతాంగం అనేక పోరాటాలు సాగించిన అనుభవం కలిగి ఉంది. కమ్యూనిస్టులు, అకాలీలు వాటికి ప్రధాన మద్దతుదారులుగా ఉన్నారు. 1984ఆందోళన సమయంలో ఆపరేషన్‌ బ్లూస్టార్‌కు రూపకల్పన జరిగింది. భింద్రన్‌వాలే, అతని అనుచరుల ఆక్రమణలో ఉన్న స్వర్ణ దేవాలయంలోని హర్‌మందిర్‌ సాహిబ్‌ భవనాన్ని స్వాధీనం చేసుకొనేందుకు సైనిక చర్య జరిపారు. తరువాత ఎనిమిది సంవత్సరాల పాటు పంజాబ్‌లో అన్ని రకాల ఉద్యమాల మీద నిషేధం కొనసాగింది.
ఇప్పుడు సాగుతున్న ఉద్యమం మీద ఖలిస్తానీ ముద్రవేయటం ద్వారా ఇతర రాష్ట్రాల రైతాంగాన్ని వేరు చేయటం, ఆందోళనను అణచివేసే దుష్టాలోచన కూడా లేకపోలేదు. హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్‌ ఖట్టర్‌ స్వయంగా అలాంటి ఆరోపణ చేశారు. నరేంద్రమోడీ సర్కార్‌ హయాంలోనే భీమా కొరేగావ్‌ కుట్ర కేసు, ఢిల్లీలో సిఎఎ వ్యతిరేక ఆందోళన కారులపై, వారికి మద్దతు ఇచ్చిన వారి మీద తప్పుడు కేసులు బనాయించిన విషయం తెలిసిందే. రైతుల ఉద్యమం తీవ్రతరం అయినా మరికొంత కాలం సాగినా అలాంటి పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది.
పంజాబ్‌, హర్యానా వాటికి సమీపంలో ఉన్న రైతులు ప్రస్తుతం ఉద్యమంలో ముందు పీఠీన ఉన్నారు. దీని ప్రభావం 2022లో జరిగే పంజాబ్‌ ఎన్నికలలో పడుతుందనే భయంతో అకాలీదళ్‌ కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలిగింది. ఇప్పుడు మిగతా రాష్ట్రాల మీద కూడా పడనుందనే భయం బిజెపి మిత్రపక్షాల్లో తలెత్తింది. అవి చిన్న పార్టీలు, వ్యక్తులే కావచ్చు గానీ ప్రజావ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుందనే భయాన్ని తెలుపుతున్నది. హర్యానాలో బిజెపి మిత్రపక్షమైన జననాయక్‌ జనతా పార్టీ (జెజెపి) తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేసింది. సవరించిన చట్టాలలో కనీస మద్దతు ధరలకు హామీ ఇస్తూ ఒక్క ముక్కను చేర్చేందుకు వచ్చే ఇబ్బంది ఏమిటని ఆ పార్టీ నేత అజరు చౌతాలా ప్రశ్నించారు. డిసెంబరు మూడు వరకు వేచి చూడకుండా ముందే ఎందుకు చర్చలు జరపకూడదని అజరు చౌతాలా కుమారుడు జెజెపి నేత దిగ్విజయ సింగ్‌ చౌతాల కూడా ప్రశ్నించారు. రైతుల పట్ల అనుసరించే వైఖరిని బట్టి తమ పార్టీ భవిష్యత్‌లో నిర్ణయం తీసుకుంటుందన్నారు. బిజెపి ప్రభుత్వానికి మద్దతు తాను ఇస్తున్న మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు స్వతంత్ర ఎంఎల్‌ఏలు సోంబిర్‌ సింగ్‌ సంగవాన్‌, బలరాజ్‌ కుందు ప్రకటించారు. హర్యానా ప్రభుత్వం రైతు వ్యతిరేక వైఖరితో ఉన్నదని పేర్కొన్నారు. తొంభై మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో పెద్ద పార్టీగా ఎన్నికైన బిజెపి బలం 40 కాగా పది సీట్లున్నజెజెపి, ఏడుగురు స్వతంత్ర సభ్యుల మద్దతు ఉంది. రాష్ట్రంలోని అనేక ఖాప్‌(గ్రామ పెద్దలతో కూడిన కమిటీలు)లు రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. రాజస్ధాన్‌లో బిజెపి మిత్రపక్షమైన రాష్ట్రీయ లోకతాంత్రిక్‌ పార్టీ(ఆర్‌ఎల్‌పి) అధ్యక్షుడు, పార్లమెంట్‌ సభ్యుడు హనుమాన్‌ వేణీవాల్‌ ఒక ప్రకటన చేస్తూ పార్లమెంట్‌ ఆమోదించిన మూడు చట్టాలను వెనక్కు తీసుకోవాలని కోరారు.తాము జవాన్లు, కిసాన్ల మద్దతుతో ఎన్నికయ్యామని రైతుల సమస్యల మీద పునరాలోచన చేయనట్లయితే ఎన్‌డిఏలో కొనసాగే అంశాన్ని పునరాలోచిస్తామని చెప్పారు.
పార్లమెంట్‌ ఆమోదించిన వ్యవసాయ సవరణ చట్టాలను వెనక్కు తీసుకొనే ప్రసక్తి లేదని, రైతులతో చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని బిజెపి నేతలు చెబుతున్నారు. పంజాబ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల్లో భయాలు రేపింది తప్ప రైతుల్లో నిజంగా వ్యతిరేకత లేదని ఆరోపిస్తున్నారు. వచ్చేఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని బిజెపి ఏర్పాట్లు చేసుకుంటున్నది. వ్యవసాయ చట్టాలు చారిత్రాత్మకమైనవని, ప్రతిపక్షాలు రైతులను తప్పుదారి పట్టిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన నేపధ్యంలో కేంద్రం వెనక్కు తగ్గే ధోరణిలో లేదన్నది స్పష్టమౌతోంది. రైతులతో చర్చలు కాలయాపన ఎత్తుగడగా భావిస్తున్నారు. ఈ కారణంతోనే రైతులు ఢిల్లీకి రాకుండా రాష్ట్రాల నుంచి వచ్చే రహదారులన్నింటినీ మూసివేయటం, రైతులకు ఆటంకాలను కలిగిస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చుకోకుండా వెనక్కు తగ్గేది లేదని రైతులు ప్రకటించారు. షాహిన్‌ బాగ్‌ ఆందోళనకు, భీమా కొరేగావ్‌ కేసులకు రైతుల ఆందోళనకు ఉన్న తేడాను గమనించకుండా కుట్రతో అణచివేయాలని చూస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని గమనించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బీహార్‌ ఎన్నికల సమరం : నితీష్‌ కుమార్‌ను -మాయం – చేసిన బిజెపి !

29 Thursday Oct 2020

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Bihar Elections 2020, BJP, JDU, LJP, Nithish Kumar, RJD


ఎం కోటేశ్వరరావు


చాణక్య భూమి బీహార్‌. అన్ని ప్రధాన పార్టీలు అపరచాణక్య ఎత్తులు, జిత్తులతో తలపడుతున్న అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ముగిసింది. ఏకపక్షం అనుకున్న ఎన్నికలు ఎన్‌డిఏ కూటమికి వణుకుపుట్టిస్తున్నాయి. అక్టోబరు 28న జరిగిన తొలిదశ 71 స్ధానాల ఎన్నికల్లో ఎన్‌డిఏ కూటమి వెనుకబడిందని వార్తలు వచ్చాయి. కరోనాను లెక్క చేయకుండా గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కంటే ఎక్కువగా 55.69శాతం పోలింగ్‌ జరిగింది. నితీష్‌ కుమార్‌ను వదిలించుకోవాలనే ఓటర్ల వాంఛకు ఇది నిదర్శనమా ? నితీష్‌ కుమార్‌-నరేంద్రమోడీ కూటమిని గెలిపించాలనే ఉత్సాహం ఎక్కడా కనిపించటం లేదని పోలింగ్‌కు ముందు వచ్చిన వార్తల నేపధ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.


బిజెపి అంతర్గత సర్వేలలో ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ పట్ల ఓటర్లలో వ్యతిరేక భావం ఉందని వెల్లడి కావటం, మరికొన్ని సర్వేలలో కూడా అదే ప్రతిబింబించటంతో తొలి దశ ఓటింగ్‌కు రెండు రోజుల ముందు దర్శనమిచ్చిన బిజెపి పోస్టర్లలో నితీష్‌ కుమార్‌ మాయం అయ్యారు. నరేంద్రమోడీ చిత్రమే దర్శనమిచ్చింది. ఇది జెడియు శ్రేణులకు ఆగ్రహం తెప్పించిందని, అయితే పరువు పోతుందనే ఉద్దేశ్యంతో మౌనంగా ఉన్నారని వార్తలు వెలువడ్డాయి. బిజెపి అభ్యర్ధుల మీద జెడియు కార్యకర్తలు ప్రతీకారం తీర్చుకుంటారా ? చాణక్య భూమిగా పేరు గాంచిన బీహార్‌ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.


కరోనా లాక్‌ డౌన్‌ ముగిసినా ఇంకా కొన్ని ఆంక్షలు కొనసాగుతున్నాయి. దాని ప్రతికూల ప్రభావాలను జనం ఇంకా మరచి పోలేదు. ఎన్నికల ప్రకటన సమయంలో జెడియు నేత నితీష్‌ కుమార్‌ నాయకత్వంలోని ఎన్‌డిఏ కూటమి విజయం సాధించనుందంటూ సర్వేల పేరుతో తొలి ప్రచారబాణం వదిలారు. మూడు దశల్లో జరిగే ఎన్నికల్లో అక్టోబరు 28న తొలి దశ, నవంబరు మూడున మలి, ఏడున మూడవ చివరి పోలింగ్‌ ముగిసి పదవ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అమెరికాలోనే సర్వేలు గాడి తప్పాయి. మన దేశం సంగతి, ప్రత్యేకించి బీహార్‌ సంగతి సరేసరి. గత సర్వేలన్నీ నిజం కాలేదు. అంధులు ఏనుగును వర్ణించిన మాదిరి తొలి దశ ప్రచార ముగింపులో కూడా కొన్ని సంస్ధలు సర్వేల వివరాలను వెలువరించాయి. చివరి క్షణం వరకు ఎటూ తేల్చుకోని ఓటర్లు కొందరు ఉంటారు. వారిని ఆకర్షించటం కోసం ఇలాంటి జిమ్మిక్కులను పార్టీలు ప్రయోగిస్తుంటాయి.


ఎన్నికల ప్రకటన నాటికి-తొలి దశ నాటికీ పోలికే లేదన్నది స్పష్టం. నితీష్‌ కుమార్‌తో అధిక సీట్ల కోసం బేరం పెట్టిన లోక్‌జనశక్తి పార్టీ అది వీలుగాకపోవటంతో అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు తిరుగుబాటు జెండా ఎగురవేసి జెడియు పోటీ చేస్తున్న అన్ని స్ధానాల్లో అభ్యర్ధులను నిలిపింది. మిగిలిన చోట్ల బిజెపి అభ్యర్ధులను బలపరుస్తానని, తరువాత ఇద్దరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మరోవైపు ఆర్‌జెడి-కాంగ్రెస్‌ కూటమితో వామపక్షాలు సర్దుబాటు చేసుకుంటాయా లేదా అన్న సందేహాలు కూడా తొలగిపోయి సజావుగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలకు పైగా పదవిలో ఉన్న నితీష్‌ కుమార్‌ కుల రాజకీయాలతో పాటు, తాను లౌకిక వాదిని అని చెప్పుకొనేందుకు కొన్ని అంశాలతో విబేధించినా బిజెపితో కలసి అధికారాన్ని పంచుకొని మతవాసనలను కూడా అంటించుకున్నారని, అవినీతి పాలనకు తెరతీశారనే తీవ్ర విమర్శలు ఉన్నాయి.


బిజెపి ఆశలు పెట్టుకున్నట్లు ఈ ఎన్నికల్లో మోడీ గాలితో ఓట్లు వస్తాయా ? బీహార్‌ విషయానికి వస్తే మోడీ అధికారానికి వచ్చిన ఏడాది తరువాత జరిగిన 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓడిపోయింది. ఆ పార్టీ దీర్ఘకాలం అధికారంలో ఉన్న రాజస్దాన్‌, చత్తీస్‌ఘర్‌,మధ్య ప్రదేశ్‌, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ పలుకుబడి పని చేయలేదు. రెండోసారి పెద్ద సంఖ్యలో సీట్లతో గెలిచిన తరువాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ వలన బిజెపి సాధించిందేమీ లేదు. బీహార్‌లో దానికి భిన్నంగా ఎలా ఉంటుందన్న ప్రశ్నలకు బిజెపి వద్ద సమాధానం లేదు. నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఎన్నికల ప్రకటన తరువాత మరింతగా కనిపిస్తోంది. చాణక్యుడిగా భావించే అరవై తొమ్మిది సంవత్సరాల నితీష్‌ కుమార్‌ రాజకీయ జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు.

లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) విషయానికి వస్తే తాము ఎన్‌డిఏ, బిజెపి నుంచి విడిపోలేదని, నితీష్‌ కుమార్‌ను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని పదే చెబుతోంది. తాను గతం కంటే బలపడ్డాననే అంచనాకు వచ్చిన బిజెపి నితీష్‌ కుమార్‌ను వదిలించుకొనే ఎత్తుగడలో భాగంగానే ఎల్‌జెపిని రంగంలోకి దింపిందని, నితీష్‌ కుమార్‌ పార్టీతో నిమిత్తం లేకుండానే ఎల్‌జెపితో కలసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చనే అంచనాలో ఉందన్నది ఒక అభిప్రాయం. ఎన్నికల ప్రకటన వరకు కలసి ఉండి విడిపోతే ఇద్దరం నష్టపోతామనే భయంతో నితీష్‌ను ఎన్నికల వరకు ఒక ముసుగుగా బిజెపి ఉపయోగించుకుంటోందని, ఫలితాలను బట్టి చూసుకోవచ్చు లెమ్మని భావిస్తున్నదని చెప్పేవారూ లేకపోలేదు.రాముడికి హనుమంతుడు ఎలానో తాను నరేంద్రమోడీకి అలాంటి వాడినని తన గుండెను చీలిస్తే మోడీయే ఉంటారని ఎల్‌జెపి నేత చిరాగ్‌ పాశ్వాన్‌ తన ప్రభు భక్తిని ప్రదర్శించుకున్నాడు.

రంగంలోకి దిగిన తరువాత నితీష్‌కు పరిస్ధితి గడ్డుగా ఉందని అర్ధమైందని అందుకే స్ధిమితం కోల్పోయి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని భావిస్తున్నారు. ఒక సభలో మీరు ఓట్లు వేస్తే వేయండి లేకపోతే లేదు, అల్లరి చేయవద్దని విసుక్కున్నారు.కొడుకు కోసం ఏడెనిమది మందిని కన్నారు అంటూ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ గురించి పరోక్షంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాని మీద ఆర్‌జెడి నేత, లాలూ కుమారుడైన తేజస్వి యాదవ్‌ తిప్పి కొడుతూ ప్రధాని నరేంద్రమోడీకి కూడా తోడబుట్టిన వారు ఎక్కువగానే ఉన్నారని,నితీష్‌ వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశించి అయి ఉండవచ్చన్నారు.


బీహార్‌లో ఉన్న సంక్లిష్ట రాజకీయ పరిస్దితుల్లో రాష్ట్ర మంతటా పార్టీ విస్తరించకపోయినా 20శాతానికి లోబడి ఓట్లు ఉన్న నితీష్‌ కుమార్‌ ముఖ్యమంత్రిగా అంతకాలం పదవిలో ఉండటం సాధ్యమైంది. ఆర్‌జెడి-బిజెపి మధ్య పోరులో నితీష్‌కు అవకాశం వచ్చింది. కొందరు ఇది నితీష్‌ చాణక్య నీతి అంటారు. బీహార్‌లో లాలూ, నితీష్‌, రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ ముగ్గురూ మండల రాజకీయాల నుంచి ఎదిగినవారే.
సర్వేలను పూర్తిగా నమ్మనవసరం లేదు గానీ కొన్ని సర్వేల తీరు ఆసక్తికరం.2010లో నితీష్‌ కుమార్‌కు మద్దతు పలికిన వారు 77శాతం, 2015లో 80శాతం ఉన్నట్లు అప్పటి సర్వేలు తెలిపాయి. ప్రస్తుతం 52శాతానికి పడిపోయింది.లోక్‌నీతి-సిఎస్‌డిఎస్‌ సర్వే తిరిగి నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నవారు 38శాతమే అని వద్దంటున్నవారు 43శాతమని పేర్కొన్నది. సిఓటర్‌ సర్వే ప్రభుత్వ పనితీరుతో సంతోషంగా ఉన్నామని చెప్పింది 25శాతం, ఆశాభంగం చెందామన్నవారు 46శాతం అని పేర్కొన్నది ఈ కారణంగానే నితీష్‌తో ఇంక ప్రయోజనం లేదని బిజెపి ఎన్నికల గోదాలోకి దిగిన తరువాత భావిస్తున్నట్లు చెబుతున్నారు.


బీహార్‌లో మండల్‌- కమండల్‌ రాజకీయాలు పెద్ద ఎత్తున నడిచాయి. మండల్‌ త్రయంలోని నితీష్‌, రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ కమండలం పంచన చేరారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఒక్కరే మిగిలారు. బీహార్‌లో అరాజక శక్తులు చెలరేగిన మాట వాస్తవం. దానికి లాలూ కారకుడని చెప్పినప్పటికీ మిగిలిన నేతలు తప్పించుకోలేరు. ఉత్తర ప్రదేశ్‌ ఏమీ దానికి తక్కువ కాదు. రెండు చోట్లా భూస్వామిక శక్తులు బలంగా ఉన్నాయి. వాటిని ప్రతిఘటించటాన్ని కూడా అరాచకంగానే చిత్రించారు. పేదల పోరాటాలను అణచేందుకు భూస్వామిక శక్తులు కులాల వారీ బీహార్‌లో ప్రయివేటు సాయుధ ముఠాలను పెంచిపోషించాయి. దాడులకు పాల్పడ్డాయి. ప్రతిఘటించిన వారిని అరాజక శక్తులుగా వర్ణించారు. ప్రయివేటు సాయుధ ముఠాలను సమర్ధించిన వారిలో నితీష్‌ తక్కువ తినలేదు, బిజెపి నేతలుగా ఉన్న వారూ దూరంగా లేరు. ఇప్పుడు అలాంటి ముఠాలన్నీ దారి మార్చి ప్రభుత్వ కార్యాలయాల్లో తిష్టవేసి మామూళ్లు వసూలు చేస్తున్నాయని ఈ ఎన్నికల సందర్భంగా జనం చెబుతున్నారు. నితీష్‌-బిజెపి కూటమి పాలన మీద పెరిగిన వ్యతిరేకతకు ఇది కూడా ఒక కారణమే.
బీహార్‌ కుల సమీకరణలకు పెట్టింది పేరు. వామపక్షాలు మినహా మిగిలిన పార్టీలేవీ వాటికి అతీతంగా లేవు. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్ధితుల్లో ఏ కులం అభ్యర్ది అయినా నితీష్‌ కుమార్‌ నిలబెట్టిన వారిని ఓడిస్తారా లేదా అన్నదే ప్రధానంగా చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి.లోక్‌జనశక్తి పార్టీ నేత చిరాగ్‌ పాశ్వాన్‌ నిరంతరం నితీష్‌ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న కారణంగా ఆ పార్టీ పోటీ చేస్తున్న చోట కూడా ఓటర్లు జెడియును ఓడించే అభ్యర్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు బహిరంగంగానే చెబుతున్నారని బీహార్‌లో పర్యటించిన జర్నలిస్టులు రాస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్ధిగానూ, ఎన్‌డిఏ సారధిగా నితీష్‌ కుమారే అని ప్రకటించిన కారణంగా బిజెపి పోటీ చేస్తున్న చోటకూడా అసంతృప్తి చెందిన సాధారణ ఓటర్లకు నితీషే కనిపిస్తారు.

ఖండించినప్పటికీ బిజెపి-ఎల్‌జెపి మధ్య రహస్య ఒప్పందం ఉందనే ఊహాగానాలు మరింతగా పెరుగుతున్నాయని బిజెపి పక్కా మద్దతుదారు అయిన స్వరాజ్య పత్రిక ఒక విశ్లేషణకు శీర్షికగా పెట్టింది. పది రోజుల వ్యవధిలో రెండు సార్లు ఇదే అంశం గురించి ఆ పత్రిక రాసింది. తాజా విశ్లేషణలో వ్యాఖ్యాత పేర్కొన్న అంశాల సారం ఇలా ఉంది. తొలుత ప్రచారంలో భాగంగా బిజెపి ఏర్పాటు చేసిన బ్యానర్లు, ముద్రించిన పోస్టర్లు, మీడియా వాణిజ్య ప్రకటనలలో నరేంద్రమోడీతో పాటు నితీష్‌ కుమార్‌ చిత్రానికి సమాన ప్రాధాన్యత ఇచ్చారు. మొదటి దశ ఎన్నికలు దగ్గరపడే ముందు ప్రచురించిన వాటిలో కేవలం నరేంద్రమోడీ చిత్రమే ఉంది. వీటిని చూసి జెడియు నేతలు హతాశులయ్యారు గానీ మౌనం వహించారు. తొలి దశ ఎన్నికలకు ముందు ఇలాంటి వాటి మీద వ్యాఖ్యానించటం సరైంది కాదని, ఈ చర్య తమను గాయపరించిందని, బిజెపి-ఎల్‌జెపి మధ్య రహస్య ఒప్పందం ఉందన్న అభిప్రాయం బలపడేందుకే ఇది దోహదం చేస్తుందని జెడియు అగ్రనేత ఒకరు చెప్పారు.కేవలం మోడీ బొమ్మలతో ప్రచారం చేయటం తనకు సంతోషం కలిగిస్తున్నదని, మా బిజెపి మిత్రులు నితీష్‌ కుమార్‌ నష్టదాయకం అని గ్రహించారని ఎల్‌జెపి నేత చిరాగ్‌ పాశ్వాన్‌ వ్యాఖ్యానించారు. బీహార్‌లో ఎన్‌డిఏ నుంచి ఎల్‌జెపి బయటకు పోయిన తరువాత కేంద్రంలో కూడా ఆ పార్టీని బహిష్కరించాలని నితీష్‌ కుమార్‌ డిమాండ్‌ చేసినా బిజెపి తిరస్కరించటంతో పుకార్లకు ఆజ్యం పోసినట్లయింది. ఎన్నికల తరువాత బిజెపి-ఎల్‌జెపి ప్రభుత్వం ఏర్పడుతుందన్న ప్రకటనలు ఖండించదగ్గ పెద్దవి కాదని బిజెపి కొట్టిపారవేస్తోంది. చిరాగ్‌ పాశ్వాన్‌ గురించి నరేంద్రమోడీ ఎలాంటి ప్రస్తావనలు చేయకపోవటంతో జెడియు నేతలు ఆశాభంగం చెందారు. ఇరవై ఒక్క మంది బిజెపి తిరుగుబాటుదార్లకు చిరాగ్‌ సీట్లు ఇచ్చారు. ఊహాగానాలను బిజెపి నేతలు గట్టిగా ఖండించలేదని జెడియు నేతలు చెప్పారు. ఎల్‌జెపి నేతలు తాము పోటీ చేస్తున్న చోట్ల ఎన్నికల తరువాత తాము బిజెపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అందువలన మోడీ మద్దతుదారులు తమకు ఓటు వేయాలని కోరుతున్నారు.


బిజెపి వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పుకుంటుంది. అయితే బీహార్‌ ఎన్నికల్లో అది పోటీ చేస్తున్న 110 స్దానాల్లో 51 మంది అగ్రవర్ణాలుగా పరిగణించబడుతున్నవారికే ఇచ్చింది. జనాభాలో వారు కేవలం 16శాతమే. ఇరవై రెండు మంది రాజపుత్రులు,15 భూమిహార్లు, 11 మంది బ్రాహ్మలు, ముగ్గురు కాయస్ధులు ఉన్నారు. 2015 ఎన్నికల్లో 157 స్ధానాలకు పోటీ చేసిన ఆ పార్టీ 65 మంది ఈ సామాజిక తరగతుల వారికే సీట్లు ఇచ్చింది. గత మూడు దశాబ్దాలుగా లాలూ ప్రసాద్‌ అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడింది వారే గనుక మిగతావారి కంటే వారికే ప్రాధాన్యత ఇవ్వటం సహజమే అని బిజెపి నేతలు సమర్ధించుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న బీహార్‌కు చెందిన సినిమా నటుడు సుశాంత సింగ్‌ రాజపుత్‌ ఉదంతాన్ని పెద్ద ఎత్తున వివాదాస్పదం చేసి లబ్ది పొందేందుకు బిజెపి ప్రయత్నించిందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బిజెపి మిత్రపక్షమైన జెడియు పోటీ చేస్తున్న 115 స్ధానాలలో ఈ సామాజిక తరగతులకు కేవలం 19 మాత్రమే ఇచ్చారు.


దేశంలో తొలిసారిగా సంఘపరివార్‌ శక్తులకు లోక్‌సభలో తిరుగులేని మెజారిటీ వచ్చింది. నాలుగు ఉన్నత రాజ్యాంగ పదవుల్లో వారే ఉన్నారు. బలం లేని స్ధితిలో బిజెపి నేతలుగా ఉన్న అతల్‌-వాజ్‌పేయి ద్వయానికి ప్రస్తుత మోడీ-షా ద్వయం పని తీరు, ఎత్తుగడల్లో ఎంతో తేడా ఉంది. సంఘపరివార్‌ అసలు రూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎవరినైనా ఉపయోగించుకోవటం, అవసరం తీరిన తరువాత పక్కన పడేయటాన్ని చూస్తున్నాము. బీహార్‌లో బిజెపి పెరుగుదల లేదా స్ధిరపడటానికి నితీష్‌ ఎంతగానో సహకరించారన్నది స్పష్టం. అంతర్గతంగా బిజెపి చేయించిన సర్వేలలో పరిస్ధితి క్లిష్టంగా ఉన్నట్లు తేలిందనే వార్తలు వచ్చాయి. మూడింట రెండువంతుల మెజారిటీ తమ కూటమికి వస్తుందని, ఏ పార్టీకి మెజారిటీ సీట్లు వచ్చినా నితీష్‌ కుమారే తిరిగి సిఎం అని పార్టీ అగ్రనేతలు చెప్పినప్పటికీ వారి అనుమానాలు వారికి ఉన్నాయి. అందుకే నితీష్‌ కుమార్‌ గురించి చిరాగ్‌ పాశ్వాన్‌ ఎన్ని మాట్లాడుతున్నా నోరు మెదపటం లేదు. ఎన్నికల తరువాత తమను వదిలించుకొని ఆర్‌జెడి నాయకత్వంలోని కూటమితో నితీష్‌ కుమార్‌ చేరితే ఏమిటనే ఆందోళన కూడా బిజెపిలో లేకపోలేదు. గత ఎన్నికల్లో ఆర్‌జెడితో కలసి పోటీ చేసి బిజెపితో చేతులు కలిపిన పెద్దమనిషి మరోమారు అదే పని చేయరని ఎవరు చెప్పగలరు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమరావతి మూడు ముక్కలాట మరో మలుపు ?

01 Saturday Aug 2020

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Aandhra Pradesh three Capitals, BJP, CHANDRABABU, Ycp, YS jagan


ఎం కోటేశ్వరరావు
మొండి వాడు రాజుకంటే బలవంతుడు అన్నది బాగా ప్రాచుర్యంలో ఉన్న సామెత. ఏకంగా రాజే మొండి అయితే ….గతంలో అలాంటి చరిత్ర మనకు తెలియదు, మన పెద్దలూ చెప్పలేదు. ఇప్పుడు రాజరికం లేదు గానీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి గురించి అలాంటి అభిప్రాయం అయితే ఉంది. ఆయన ఏమి చేసినా ప్రత్యర్ధులు దాన్ని వేరే విధంగా చూస్తే మద్దతుదారులు సానుకూలంగా చూస్తూ మురిసిపోతున్నారు.
మూడు రాజధానుల ఏర్పాటుకు రూపొందించిన బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేయటంతో ఇతర ప్రాంతాల్లోని జగన్‌ మద్దతుదారులు ఫెళ్లున నవ్వారు. గవర్నర్‌ మీద దింపుడు కల్లం ఆశలు పెట్టుకున్నవారు, బిజెపి-జనసేన, తెలుగుదేశం పార్టీ నేతల మీద భ్రమలు పెంచుకున్నవారు గొల్లుమంటున్నారు. ఇంత ద్రోహమా అని గుండెలు బాదుకుంటున్నారు. ఇల్లు అలకగానే పండగ కాదు అన్నట్లుగా ఈ బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్రవేయగానే అంతా అయిపోలేదు కోర్టులు ఉన్నాయి అనే వారు కూడా ఉన్నారు. ఊహించినట్లుగానే గవర్నర్‌ చర్య మీద రాజధాని గ్రామాల్లో ఆగ్రహం వ్యక్తమైనా మిగతా చోట్ల లోలోపల ఉడికి పోయినా, గ్రామాల్లో, పట్టణాల్లో కరోనా పెద్ద ఎత్తున వ్యాపిస్తున్న కారణంగా పెద్ద స్పందన వెల్లడి కాలేదు. అమరావతి కారణంగా తమ ఆస్ధుల విలువ పెరిగిందని సంతోషించిన వైసిపి మద్దతుదారులు తక్కువేమీ కాదు. రాజధాని, పరిసర ప్రాంతాల్లో గెలిచిన ఎంఎల్‌ఏలందరూ ఆ పార్టీకి చెందిన వారే. ఇప్పుడు సచివాలయం తరలింపు గురించి పైకి బింకంగా ఏమి మాట్లాడినా తమ ఆస్ధుల విలువ కూడా హరించుకుపోతున్నపుడు వైసిపి మద్దతుదారుల్లో అంతర్గతంగా సంతోషం ఏమీ ఉండదు. తమ నేతకు చెప్పలేకపోయినా గవర్నర్‌ అడ్డుకుంటే బాగుండు అని కోరుకున్న వారు లేకపోలేదు.
సుప్రీం కోర్టు, రాష్ట్రపతి ఆమోదంతో హైకోర్టు ఏర్పడింది కనుక, ఆ వ్యవస్ధల పాత ఆమోదాన్ని చెత్తబుట్టలో వేసి కొత్త ప్రతిపాదన చేస్తే దానికి కూడా ఆమోదం పొందవచ్చని కొందరు న్యాయవాదులు చెబుతున్నారు. ఇలాంటి సలహాలను నమ్మే జగన్‌ సర్కార్‌ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విషయంలో చేతులు కాల్చుకుంది అని గమనించాలి. లేదూ హైకోర్టు మార్పు విషయంలో హక్కుల అంశం లేదు కనుక ఎవరైనా కోర్టులకు ఎక్కినా విధాన పర నిర్ణయంగా భావించి కోర్టులు అభ్యంతర పెట్టవు అన్నది ఒక అభిప్రాయం. హైకోర్టును కర్నూలులో పెట్టాలని బిజెపి కూడా కోరుతున్నది, దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర అవసరం అయితే కేంద్ర అధికారంలో ఉన్న తాము దాని సంగతి చూసుకుంటామని, సాయం చేస్తామని బిజెపి నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రపతి అంటే రబ్బరు స్టాంపు గనుక ఎక్కడ ముద్రవేయమంటే అక్కడ వేస్తారు అని చెప్పేవారూ ఉన్నారు. తనకు లాభం అని బిజెపి భావించినా- వైసిపితో తెరవెనుక ముడి గట్టిగా పడినా అది కూడా జరిగినా ఆశ్చర్యం లేదు. పాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయంతో సహా కార్యాలయాల తరలింపును కోర్టులు అడ్డుకోలేవు.
ముందు అమరావతి నుంచి సచివాలయాన్ని తరలించి తమ పంతం నెగ్గించుకోవాలన్నది వైసిపి పట్టుదల కనుక దాని కోసం బిజెపితో ఎలాంటి రాజీకైనా అంగీకరించే అవకాశం ఉంది. ఒక వేళ హైకోర్టు తరలింపులో అనుకోని అవాంతరాలు ఎదురై ఆగిపోయినా వైసిపికి పోయేదేమీ లేదు. ఆ సాకును చూపి న్యాయ రాజధానిని సీమలో ఏర్పాటు చేయలేక పోయామని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే రాజధాని ప్రాంత రైతుల్లో భూ సమీకరణ దగ్గర నుంచి అధికారంలో ఉన్నంత కాలం అది కల్పించిన ఆశలు, భ్రమలు, మునగచెట్టు ఎక్కించిన తీరు ఒకటైతే, జగన్‌ అధికారంలోకి వచ్చి అమరావతికి మంగళం పాడటానికి నిర్ణయించుకున్న తరువాత కూడా కేంద్రంలో తమకు ఉన్న పలుకుబడితో చక్రం అడ్డువేస్తామని తెలుగుదేశం నమ్మించింది. రైతులు కూడా నమ్మారు. ఇప్పుడు చంద్రబాబు నిజంగానే భావోద్వేగానికి గురైనా అదంతా నటన అనుకొనే వారే ఎక్కువగా ఉంటారు. ఎవరైనా ఒకసారి విశ్వసనీయత కోల్పోతే నిజం చెప్పినా నమ్మరు !
బిజెపి విషయానికి వస్తే అది నమ్మించి మోసం చేసిన తీరును జనం మరచిపోరు. అందువలన కన్నా లక్ష్మీనారాయణ అనే బొమ్మను పక్కన పెట్టి సోము వీర్రాజు అనే మరో బొమ్మను జనం ముందు పెట్టినా దానికి ఉన్నది పోయేదేమీ లేదు కొత్తగా వచ్చేదేమీ కనిపించటం లేదు. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పరిస్ధితి ఏమిటో అర్దం కాకుండా ఉంది. నటుడు కనుక తిరిగి సినిమాల్లోకి పూర్తిగా వెళ్లవచ్చు, లేదా కాల్షీట్లు తీసుకొని బిజెపి రాజకీయ సినిమాలో పాత్రపోషించవచ్చు, నమ్ముకున్న కార్యకర్తలేమౌతారు ?
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌-బిజెపి రెండూ తమ వంతు పాత్రలను ఎలా పోషించాయో పదే పదే చెప్పుకోవనవసరం లేదు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది. బిజెపి నాటకాలు ఇంకా ఆడుతూనే ఉంది. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర పాత్ర ఉండదని, 2015 నోటిఫికేషన్‌ ప్రకారం రాజధాని అమరావతే అని, మూడు రాజధానుల విషయం పత్రికల్లో మాత్రమే చూస్తున్నామని కేంద్ర ప్రభుత్వం గతంలో పార్లమెంటులో ప్రకటించింది. వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటుకు అవసరమైన బిల్లులను రూపొందించటం, వాటిని గవర్నర్‌ ఆమోదించటంతో చట్టాలు కావటం తెలిసిందే. ఇప్పుడు గతంలో మాదిరి చెబితే కుదరదు. తన వైఖరి ఏమిటో చెప్పకతప్పదు.
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని విషయమై శివరామకృష్ణన్‌ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రమే. రాజధాని ఖరారు అయ్యేంత వరకు పదేండ్ల పాటు హైదరాబాదులో రాజధాని కొనసాగవచ్చనే అవకాశం ఇచ్చిందీ కేంద్రమే. శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులపై తెలుగుదేశం-బిజెపి సంకీర్ణ రాష్ట్ర ప్రభుత్వం నారాయణ కమిటీని వేసి అది చేసిన సిఫార్సుల ప్రకారం రాజధానిని ప్రతిపాదించింది. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రకారం అమరావతిని ఖరారు చేయటాన్ని కేంద్రం అంగీకరించింది. తాము నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక స్ఫూర్తి లేదా సిఫార్సులకు అనుగుణ్యంగా అమరావతి ఎంపిక లేదని కేంద్రం నాడు ఎలాంటి వివరణా కోరలేదు, అభ్యంతరమూ వ్యక్తం చేయలేదు. అక్కడ సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు నిధులు కూడా మంజూరు చేసి విడుదల చేసింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వయంగా వచ్చి రాజధానికి శంకుస్ధాపన చేశారు. చంద్రబాబు రమ్మంటే వచ్చి రాయి వేసి వెళ్లారు తప్ప దానితో బిజెకి సంబంధం లేదని ఇప్పుడు ఆ పార్టీ వారు చెబుతున్నారు. రేపు మరి విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని శంకుస్ధాపనలకు కూడా పిలిస్తే వస్తారా ? వైసిపి ప్రభుత్వం అసలు పిలుస్తుందా ? ఏం జరుగుతుందో ఎలా కథ నడిపిస్తారో చూడాలి. ఈ మూడు రాజధానుల గురించి కేంద్రానికి రాష్ట్రం ఏ రూపంలో నివేదిస్తుందో కూడా ఆసక్తి కలిగించే అంశమే.
రాజధాని ఏర్పాటులో కేంద్రం జోక్యం చేసుకోదని బిజెపి కొత్త నేత సోము వీర్రాజు చెప్పారు. దీనిలో కొత్తదనం ఏముంది. గతం నుంచీ చెబుతున్నదే. బిజెపి నేతలు పార్టీగా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నాం తప్ప కేంద్ర ప్రభుత్వ పరంగా జోక్యం చేసుకొనే అవకాశం లేదని చెబుతున్నారు, దీనిలో అవకాశవాదం తప్ప పెద్ద తెలివితేటలేమీ లేవు. ఇప్పుడు మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్రవేయటాన్ని కూడా సమర్ధిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నియామకం విషయంలో గవర్నర్‌ తీసుకున్న చర్య సరైనది అయినపుడు రాజధానుల బిల్లుల విషయంలో గవర్నర్‌ చర్య తప్పిదం ఎలా అవుతుందని చెట్టుకింది ప్లీడర్‌ వాదనలు చేస్తున్నారు. మేము గవర్నర్ల వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని పత్తిత్తు కబుర్లు చెబుతున్నారు.
ఎన్నికల కమిషనర్‌ నియామకం గవర్నర్‌ చేయాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెచ్చింది, కొత్త కమిషనర్‌ పదవీకాలం గురించి తెచ్చిన ఆర్డినెన్స్‌, కొత్త కమిషనర్‌ నియామకం తప్పని హైకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు దాని మీద ఎలాంటి స్టే ఇవ్వలేదు కనుక తన పదవి గురించి రమేష్‌ కుమార్‌ తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్‌ను కలవండన్న కోర్టు సూచన మేరకే కలిశారు. కానీ మూడు రాజధానుల బిల్లుల విషయం వేరు. వాటిని ఆమోదించవద్దని గవర్నర్‌కు లేఖ రాసిన పార్టీలలో బిజెపి కూడా ఉందని వారు మరచిపోతే ఎలా ? గవర్నర్‌ వ్యవస్ధలో జోక్యం చేసుకోము అని చెబుతున్నవారు లేఖ ఎందుకు రాసినట్లు ? లేఖ రాసినందుకే కన్నా లక్ష్మీ నారాయణను పదవి నుంచి తప్పించారా ? పోనీ లేఖ రాయటం తప్పని కొత్త అధ్యక్షుడు పశ్చాత్తాపం ఏమైనా ప్రకటిస్తారా ?
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను శాసనమండలి ఆమోదించలేదు, సెలెక్టు కమిటీకి నివేదిస్తున్నట్లు మండలి అధ్యక్షుడు ప్రకటించారు.సిఆర్‌డిఏ రద్దు బిల్లు, రాజధానికి సంబంధించి ఇతర అంశాల గురించి కోర్టులలో కొన్ని కేసులు దాఖలై ఉన్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ద చర్యలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్న వారు రాజ్యాంగ ప్రతినిధి గవర్నర్‌ గనుక వాటిని ఆమోదించవద్దని లేదా న్యాయసలహాలు తీసుకోవాలని బిజెపితో పాటు ఇతర పార్టీలు కోరాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు. కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా లేదా ఆయన కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చిన తరువాతే గవర్నర్‌ ఈ చర్య తీసుకున్నారనే విమర్శలు వున్నాయి.వాటికి సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు లేదా లేదని నిరాకరిస్తున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా మూడు రాజధానుల గురించి బిజెపిలో ఏకాభిప్రాయం లేదు. ఈ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్న లేదా ప్రకటనలు చేస్తున్న వారిని ఆ పార్టీ ఇంతవరకు కట్టడి చేయలేకపోయింది.
ఇక హైకోర్టు గురించి గతంలో చేసిన వాదనలనే బిజెపి నేతలు చేస్తున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక ముందే ప్రావిన్సులలో హైకోర్టులు ఉన్నాయి. రాష్ట్ర రాజధానిలోనే హైకోర్టు ఉండాలన్న అంశం రాజ్యాంగంలో స్పష్టంగా లేదు. అందువలన రాష్ట్రాల ఏర్పాటు, సంస్దానాల విలీనాల సమయంలో జరిగిన ఒప్పందాల ప్రకారం రాజధాని ఒక చోట హైకోర్టు ఒక చోట ఏర్పాటు చేశారు. తిరువాన్కూరు-కొచ్చిన్‌ సంస్ధానాల విలీనం సమయంలో రాజధాని తిరువనంతపురం, హైకోర్టు కొచ్చిన్‌లో ఉండాలన్నది ఒప్పందం. అలాగే మద్రాసు ప్రావిన్సు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు రాజధాని కర్నూల్లో, హైకోర్టు గుంటూరులో ఉండాలన్నది పెద్ద మనుషుల ఒప్పందం. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినపుడు ఈ సమస్యకు బదులు ఇతరంగా ముల్కీ వంటి ఒప్పందాలు జరిగాయి. రాజధానిని విజయవాడలో పెట్టాలని కొందరు కోరినా హైకోర్టుతో సహా చివరకు హైదరాబాద్‌ను ఖరారు చేశారు. రాజధానులలో కాకుండా ఇతర చోట్ల హైకోర్టులు ఉన్న ప్రాంతాలన్నింటికీ ఇలాంటి ఏదో ఒక నేపధ్యం ఉన్నది. తరువాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలలో ఉత్తరాఖండ్‌లో హైకోర్టు నైనిటాల్‌ నగరంలో ఉంది. రాజధాని చలికాలంలో డెహ్రాడూన్‌లో, వేసవి కాలంలో దానికి 250కిలోమీటర్ల దూరంలోని గైరాసియన్‌ పట్టణంలో ఉంటుంది. ఇవేవీ వివాదం కాలేదు, ఒక సారి ఖరారు అయిన తరువాత మార్పులు జరగలేదు. ఆంధ్రప్రదేశ్‌లోనే ఖరారైన రాజధాని విషయంలో రాజకీయం మొదలైంది.
న్యాయమూర్తుల నియామకం, హైకోర్టు బెంచ్‌ల ఏర్పాటు వంటివి సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వ వ్యవహారం కనుక హైకోర్టు తరలింపు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవాల్సింది సుప్రీం కోర్టు, కేంద్రమే. సచివాలయాన్ని తరలిస్తే కేంద్రం చేయగలిగిందేమీ లేదు. కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు లేదా తీరుస్తారు అన్నట్లుగా హైకోర్టు తరలింపును సుప్రీం కోర్టు ఆమోదించకపోతే, అది జరగకుండా కేవలం సచివాలయాన్నే తరలిస్తే జగన్‌ సర్కార్‌ రాజకీయంగా చిక్కుల్లో పడుతుంది. దాన్ని సొమ్ము చేసుకొనేందుకు బిజెపి రంగంలోకి దిగవచ్చు. అనేక రాష్ట్రాలు హైకోర్టు బెంచ్‌లను ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రాన్ని ఇప్పటికే అనేక సార్లు కోరి ఉన్నాయి. వాటిలో దేనినీ కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు తరలింపుకు ఆమోదం తెలిపితే కొత్త సమస్యలకు తెరలేపినట్లవుతుంది.
ఇక 2015లో వెలువరించిన గజెట్‌ నోటిఫికేషన్‌ లేదా రాజధానిగా అమరావతి ఉత్తర్వు మార్చటానికి వీలు లేని శిలాశాసనమో, చంద్రబాబు చెక్కిన శిలాఫలకమో కాదని, కొత్త ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా మరొకదానిని జారీ చేయవచ్చని బిజెపి నేత జివిఎల్‌ నరసింహారావు గతంలోనే చెప్పారు. 2015లో అప్పటి ప్రభుత్వం జీవో ద్వారా నోటిఫై చేసింది కనుక ప్రస్తుతానికి అమరావతే రాజధాని అని లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో కేంద్రం పేర్కొందని ప్రస్తుత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకొని భవిష్యత్తులో రాజధానిని మరోచోటుకి మార్చి, ఆ విషయాన్ని తెలియజేస్తే కేంద్రం గుర్తిస్తుందని కూడా నరసింహారావు చెప్పారు. అదే ముక్క పార్లమెంటు సమాధానంలో బిజెపి సర్కార్‌ ఎందుకు చెప్పలేదు అని అడిగినవారు లేకపోలేదు.
ఏదీ శిలాఫలకం, శాసనం కానపుడు, మార్చుకోవటానికి అవకాశం ఉన్నపుడు స్వయంగా బిజెపి నేతలు కోరిన పదేండ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హౌదాకు విధానాలను మార్చటానికి, ఉత్తర్వులు జారీ చేసేందుకు కేంద్రానికి ఉన్న అడ్డంకి, అభ్యంతరం ఏమిటి? ఎందుకు హౌదా ఇవ్వరు. పోనీ ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు తీసుకున్న ఇతర చర్యలేమైనా ఉన్నాయా అంటే లేవు.
చంద్రబాబు నాయుడు అమరావతిని ఒక భ్రమరావతిగా చూపుతూ సింగపూర్‌, కౌలాలంపూర్‌, మరొకటో మరొక దాని పేరో చెప్పి రైతులకు, జనాలకు భ్రమలు కల్పించారు. రాజధాని తరలింపు జరిగితే రైతులకు ఎలా న్యాయం చేస్తారనే ప్రశ్న ముందుకు వచ్చింది. రాజధాని తమ ప్రాంతంలో పెడతామని చెప్పారు గనుకనే మేము భూములను ఇచ్చామని, ఇప్పుడు రాజధాని తరలిపోయి, తాము ఇచ్చిన భూములు దేనికీ పనికి రాకుండా పోతే తామేమి కావాలని వారు అడుగుతున్నారు. దానిలో తప్పు లేదు. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. వారు ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకొని భూములు ఇచ్చారు. దానికి ప్రతిఫలంగా కొన్ని సంవత్సరాల పాటు కౌలు చెల్లింపు, వారు ఇచ్చిన భూమి విస్తీర్ణాన్ని బట్టి అభివృద్ధి చేసిన రాజధాని ప్రాంతంలో కొంత స్ధలాన్ని వారికి అందచేయాల్సి ఉంది. చట్టపరంగా ప్రభుత్వం ఆ పని చేయకపోతే కోర్టులకు వెళ్లి దాన్ని సాధించుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఇక్కడ సమస్య అది కాదు. రాజధాని ఏర్పడితే ఆ ప్రాంతంలో తమ వాటాగా వచ్చిన స్ధలాలకు మంచి రేట్లు వస్తాయని, అవి మొత్తం భూముల విలువ కంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉంటాయని ఆశించారు. ప్రభుత్వం అభివృద్ధి చేసిన ప్లాట్లు అంటే రోడ్లు, డ్రైనేజి వంటి మౌలిక సదుపాయాలు కల్పించి అందచేయటం. అలా ఇచ్చినా తాము ఆశించిన మేరకు ధరలు రావన్నది రైతుల అసలు ఆందోళన. దీనికి తోడు పేదలకు ఇండ్ల స్ధలాలు ఇచ్చే పేరుతో ఇతర ప్రాంతాల వారికి ఇక్కడ స్ధలాలు కేటాయిస్తే తమ భూములకు డిమాండ్‌ పడిపోతుందని, ఇలాంటి ఎన్నో అనుమానాలు ఆ ప్రాంత వాసుల్లో ఉన్నాయి.
ఇప్పటికీ బిజెపి నేతలు రాజధాని ప్రాంత రైతులకు న్యాయం చేస్తామని, చేయాలనే తాము కోరుతున్నట్లు చెబుతుంటారు. మరోవైపు మూడు రాజధానుల విషయంలో తాము చేయగలిగిందేమీ లేదంటారు. వారితో కలసిన లేదా గత ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నందున వారిని కలుపుకు ఉద్యమిస్తానని ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌ ఏమి చేస్తారో, ఏమి చెబుతారో చూద్దాం. వైసిపి నాయకులు కూడా రాజధాని రైతులకు న్యాయం చేస్తామనే చెబుతున్నారు. వారి ఆచరణ ఏమిటో చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చెంచా ఛానళ్లు – జర్నలిస్టు చెంచాలు !

12 Wednesday Feb 2020

Posted by raomk in Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Arvind Kejriwal, BJP, chamcha channels, chamcha Journalists, Delhi Polls, Media, NDTV anchor Ravish Kumar

Image result for chamcha channels-journalist chamcha cartoons
ఎం కోటేశ్వరరావు
ఇటీవలి కాలంలో మీడియా పాత్ర వివాదాస్పదం అవుతోంది, ఇదే సమయంలో మీడియా యాంకర్ల ప్రవర్తన కూడా అంతకంటే వివాదాస్పదం, కొన్ని సందర్భాలలో జుగుప్సాకరంగా తయారవుతోంది. రాజును మించిన రాజభక్తి మాదిరి యాజమాన్యాల వైఖరికి అనుగుణ్యంగా తాన్వొక ఇతరులను నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా వ్యవహరించటం ఒక పద్దతి. దాన్ని మించి యాంకర్లు స్వయంగా రెచ్చిపోవటం పెరిగిపోతోందంటే అతిశయోక్తి కాదు. ఇది జాతీయ ఛానళ్లకే కాదు, కొన్ని తెలుగు వాటికి కూడా ఈ జబ్బు అంటుకొని కొందరు పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. తాజా ఉదంతాలకు వస్తే ఢిల్లీ ఎన్నికల సందర్భంగా కొందరు యాంకర్ల తీరు జర్నలిస్టు లోకానికే కళంకం, వృత్తి ప్రమాణాలు, నైతికనియమావళికే విరుద్దం. ఇలా చెబుతున్నామంటే అన్ని ఛానళ్లు, యాంకర్లు అందరూ అలా ఉన్నారని కాదు. పురుషుల్లో పుణ్యపురుషులుంటారయా అన్నట్లుగా ఛానళ్లు, యాంకర్లలో కూడా అలాంటి వారు ఉన్నారు కనుకనే మీడియాకు ఇప్పటికీ విశ్వసనీయత మిగిలి ఉంది.
జి న్యూస్‌ ఎడిటర్‌ మరియు యాంకర్‌గా పని చేస్తున్న సుధీర్‌ చౌదరి జిందాల్‌ కంపెనీని వంద కోట్ల రూపాయల ప్రకటనల కోసం బొగ్గుకుంభకోణంలో బ్లాక్‌మెయిల్‌ చేసిన ఉదంతం తెలిసిందే. ఆ కేసులో పోలీసు కస్టడీలో భాగంగా జైలుకు వెళ్లి వచ్చిన పెద్దమనిషి, పక్కా బిజెపి మనిషి అని అందరికీ తెలుసు. ఒక యాంకర్‌కు బిజెపి కార్యకర్తకు ఉన్న తేడాను చెరిపి వేశాడు. చివరికి బిజెపి కార్యకర్తలు లేదా నేతలు కూడా ప్రయివేటు సంభాషణల్లో ఏ అంశం గురించి అయినా ఎంత చెత్త మాట్లాడినప్పటికీ బహిరంగంగా అందునా టీవీ ఛానళ్లలో అలా మాట్లాడేందుకు సాహసించరు. కానీ యాంకర్‌ ముసుగులో అతగాడు అన్ని రకాల గీతలను చెరిపివేశాడు. హద్దులు మీరి వ్యవహరించాడు. అలాంటి వ్యక్తిని ఎడిటర్ల సంఘం ఏమి చేస్తుందో తెలియదు. ఒక వేళ ఏదైనా చర్యకు సాహసిస్తే సదరు సంఘం ఢిల్లీ పెద్దల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని భయపడుతుందేమో !
కునాల్‌ కమ్రా అనే ఒక కమెడియన్‌ ఒక రోజు తాను ప్రయాణిస్తున్న విమానంలో రిపబ్లిక్‌ టీవీ యాంకర్‌ ఆర్నాబ్‌ గోస్వామిని చూసి టీవీ చర్చల్లో ఎదుటి వారి మీద ఎందుకలా విరుచుకుపడతావు, అదేం పద్దతి అంటూ చెడామడా కడిగేశాడు. ఆర్నాబ్‌ మాట్లాడకుండా అలాగే ఉండిపోయాడు. అయితే సదరు విమాన పైలట్‌ ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకుండానే కునాల్‌ను ఆ విమాన కంపెనీతో పాటు మరో మూడు సంస్ధలు తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించాయి. కునాల్‌ కమ్రా బిజెపిని విమర్శిస్తాడు , ఆర్నాబ్‌ గోస్వామి అడ్డగోలుగా సమర్ధిస్ధాడు కనుక కేంద్ర ప్రభుత్వ మౌఖిక లేదా ఇతర ఆదేశాలతో ఈ చర్య తీసుకున్న విషయం తెలిసిందే. సుధీర్‌ చౌధురి మీద కూడా ఎడిటర్ల సంఘం చర్య తీసుకుంటే మరో రూపంలో సంపాదకులు ఢిల్లీ పెద్దల ఆగ్రహానికి గురికావచ్చు.

Image result for chamcha channels-delhi polls
ఇక సుధీర్‌ చౌధురికి ఢిల్లీ జనం ఏడాది కాలంలో రెండు రకాలుగా కనిపించారు. ముందుగా గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో జనం ఎలా కనిపించారో చూద్దాం ” ఈ రోజు మోడీ మద్దతుదారులు సంతోషంగా ఉండి ఉండాలి. మరోవైపు మోడీ వ్యతిరేకులు విచారిస్తూ ఉండి ఉంటారు. వ్యతిరేకించేవారి బుర్రల్లో తప్పుకుండా ఆ ఒక్క వాక్యం తప్పక ఉండాలి, నాకు నిజం చెప్పండి ఇది నిజం కాదా” అని వ్యాఖ్యానించిన పెద్ద మనిషి ఢిల్లీ జనం మోడీ మద్దతుదారుల్లో లేరని చెప్పలేదు.
కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు నరేంద్రమోడీ అండ్‌కోకు దిమ్మదిరిగే విధంగా ఉండబోతున్నాయనే సూచనలు వెలువడగానే కల్లుతాగిన కోతిలా మారిపోయాడు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశాడు. అవమానించాడు. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం వాటి సారాంశం ఇలా ఉంది.” ఢిల్లీ ఓటర్లకు ఏ సమస్య పట్టింది, ఏది పట్టలేదు అని అతనే ప్రశ్న వేసుకున్నాడు. దానికి తానే సమాధానం చెప్పుకుంటూ వారు సొమ్ము చెల్లించి ఏదీ పొందాలనుకోవటం లేదు, అన్నీ ఉచితంగా ఇచ్చే పార్టీలను కోరుకుంటున్నారు. ఢిల్లీ జనం సోమరిపోతులు. వారి సగటు ఆదాయం రూ30,000 అయినా అన్నీ ఉచితంగా కావాలని కోరుకుంటారు. అందరూ చదువుకున్నారు, కార్లు, ద్విచక్రాలు ఎక్కువ మందికి ఉన్నాయి, అయినా ఓటింగ్‌కు రారు.సామాజిక మాధ్యమ ఎన్నికల్లోనే వారు పాల్గొంటారు.
ఢిల్లీ జనం కేవలం ఉచితం కోసమే చూస్తారు, ఇందుకోసం వారే మిగతా దేశం గురించి పట్టించుకోరు,హిందుస్ధాన్‌-పాకిస్ధాన్‌ పట్టదు, కాశ్మీర్‌ పట్టదు, రామమందిరాన్ని పట్టించుకోరు, ఇంకా ఏవైనా ఇతర జాతీయ సమస్యలున్నా వాటినీ లెక్కచేయరు. మొఘల్‌ పాలన తిరిగి వస్తుంది. రామమందిరం, ఆర్టికల్‌ 370, కాశ్మీర్‌ ఇవేవీ ఢిల్లీ జనం దృష్టిలో అర్ధం లేనివి, దేశం ముక్కలవుతున్నా వారికి పట్టదు. వారికి రోజూవారీ జీవితాలే ముఖ్యం. మిగతా దేశం ఏమైనా వారు లెక్కచేయరు. ఈ జాతీయ సమస్యలను టీవీలలో చూడటం, పత్రికల్లో చదవాల్సినవి తప్ప తమకు గొప్పవి కాదని ఢిల్లీ జనం చెబుతున్నారు. మనం ఎక్కడికైనా పార్టీకి పోతే తాగుతాము ఇలాంటి విషయాలను చర్చించుకుంటాము, అదే మనం ఓటు వేయటానికి పోతే మాత్రం మనకు ఉచితంగా ఏమి వస్తుందా అని చూస్తాము, తాము సోమరిపోతులమని ఢిల్లీ జనం రుజువు చేశారు.”
ఇక్కడ గమనించాల్సిందీ, సుధీర్‌ చౌధురి వంటి వారు కళ్లుండీ చూడలేనిదీ, చెవులుండీ వినిపించుకోనిదీ మెదడుండీ అర్ధం చేసుకోనిదీ ఏమంటే కాలేజీలకు వెళ్లే యువతులకు ఉచితంగా సైకిళ్లు, ఎలక్ట్రానిక్‌ స్కూటర్లను ఉచితంగా ఇస్తామని ఢిల్లీ బిజెపి ఎన్నికల మానిఫెస్టో పేర్కొన్నది. అంతే కాదు మోడీ సర్కార్‌ స్వయంగా ఉచితంగా మరుగుదొడ్లు, ఎల్‌ఇడి బల్బులు, గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చినట్లు గత ఐదు సంవత్సరాలుగా ప్రచారం చేసుకుంటున్న విషయం మరిచిపోయినట్లు నటిస్తున్నాడా ?
ఇలాంటి జర్నలిస్టులు చర్చలను ఎలా నడుపుతారో వేరే చెప్పనవసరం లేదు. తమ తమ లేదా తమ రాజకీయ యజమానుల అజెండాలోకి ఇతరులను లాగేందుకు ప్రయత్నిస్తారు. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా అదే జరిగింది. కేజరీ వాల్‌, ఆమ్‌ ఆద్మీపార్టీని బిజెపి వలలోకి లాగేందుకు ప్రయత్నించారు. జాతీయ రాజకీయాల గురించి వ్యాఖ్యానించాలని యాంకర్లు పదే పదే కోరగా తాను ఢిల్లీ అభివృద్ధికే కట్టుబడి ఉన్నానని ఆయన పదే పదే చెబుతూ చిరునవ్వు నవ్వారు.
ఈ ఎన్నికల్లో బిజెపి ప్రచారం మొత్తం నరేంద్రమోడీ చుట్టూ తిప్పింది. దాన్ని ఆమ్‌ ఆద్మీ ఒకే చిన్న ప్రశ్నతో ఎదుర్కొన్నది. మాకు కేజరీ వాల్‌ ఉన్నారు. మరి మీకు ఎవరున్నారు? మోడీ గారు ఢిల్లీ ముఖ్యమంత్రి కాలేరు కదా, అవుతారా చెప్పండి అంటే ఎలాంటి సమాధానం లేదు. షాహిన్‌ బాగ్‌ నిరసనకారులు ఆ ప్రాంత జనాన్ని ఇబ్బంది పెడుతున్నారనే పేరుతో కేజరీవాల్‌ను ఇబ్బంది పెట్టేందుకు బిజెపి పదే పదే ఆ అంశాన్ని ప్రస్తావించింది. తొలుత కేజరీవాల్‌ దానిని పట్టించుకోలేదు. బిజెపి ముప్పేటదాడికి దిగి ఆ పేరుతో ఓటర్లను విభజించి హిందూఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నించింది. ఒక ఇంటర్వ్యూలో కేజరీవాల్‌ దానిని ఇలా తిప్పికొట్టారు. నిరసనతెలుపుతున్నవారిని తొలగించే బాధ్యత ఢిల్లీ పోలీసులకు లేదా ? కేంద్ర హౌం మంత్రికి వారు ఆ విషయాన్ని నివేదించలేదా ? అంతటి శక్తివంతుడైన హౌం మంత్రికి తెలియకుండా ఎలా ఉంటుంది? అని ఎదురు ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర ఆధీనంలో ఉంటారు, శాంతి భద్రతల సమస్య బాధ్యత కేంద్రానిదే అన్న విషయం తెలిసినదే. కేజరీ వాల్‌ను హిందూ వ్యతిరేకిగా చిత్రించేందుకు మీడియా, బిజెపి నేతలు ప్రయత్నించారు. ఒక ఛానల్‌ యాంకర్‌ ఉన్నట్లుండి మీరు నిజంగా హనుమాన్‌ భక్తులే అయితే హనుమాన్‌ చాలీసా చదవగలరా అన్న సవాల్‌ విసిరారు. వెంటనే కేజరీవాల్‌ చదివి వినిపించారు. దాంతో యాంకర్‌తో పాటు బిజెపి కూడా కంగుతిన్నది.
యాంకర్లు నిర్వహిస్తున్న పాత్ర గురించి ఎన్‌డిటీవీ హిందీ యాంకర్‌, రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత రవీష్‌ కుమార్‌ మాట్లాడుతూ యాంకర్లు ప్రచారమనే సరకును చేరవేసే రోజూ కుర్రాళ్ల మాదిరి తయారయ్యారని వ్యాఖ్యానించారు. టీవీల్లో అజెండా, చర్చ ఎలా ఉండాలో ఒక చోట తయారవుతాయి, వాటిని యాంకర్లు సరఫరా చేస్తారు. న్యూస్‌ యాంకర్ల భాష పూర్తి హింసాపూరితంగా, బెదిరింపులతో ఉంటోంది, మీడియాలో ప్రతిపక్షానికి చోటు ఉండటం లేదు, ప్రతి రోజూ ప్రతిపక్షాన్ని మీడియా చంపివేస్తోంది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని హతమార్చేందుకు ప్రధాన స్రవంతి మీడియా ఎంతో కష్టపడుతోంది. రాజీపడని జర్నలిస్టులు ఎవరైనా ఉంటే వారిని సంస్దల నుంచి బయటకు గెంటివేస్తున్నారు, అయినా కొందరు జర్నలిస్టులు తెగించి పని చేస్తున్నారు అన్నారు.

Image result for chamcha channels-journalist chamcha cartoons
అనివార్యమై ఢిల్లీ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌సు అన్ని ప్రధాన ఛానళ్లు ప్రసారం చేశాయి.ఓటర్ల నాడిని ముందే పసిగట్టిన అనేక మంది ఎదురులేని మనిషి మోడీ ఎదురీదుతున్నారని, ఓటమి ఖాయమని ముందే పసిగట్టాయి. వివిధ రాష్ట్రాల నుంచి ప్రచారానికి వెళ్లి వచ్చిన బిజెపి చోటా మోటా నాయకులు తమ పార్టీ ఓడిపోతున్నదనే సమాచారంతోనే తమ స్వస్ధలాలకు తిరిగి వచ్చారు. చిత్రం ఏమంటే ఫలితాలు వెలువడుతుండగా సాయంత్రం మూడు గంటల తరువాతనే తాము ఓటమిని అంగీకరిస్తామని, ఫలితాలు తమకు అనుకూలంగా మారతాయని ఆశాభావంతో టీవీ చర్చలలో వాదించటం గమనించాల్సిన అంశం. మొత్తం మీద ఢిల్లీ ఫలితాలు టీవీ ఛానళ్ల యాజమాన్యాలకు, రెచ్చిపోయి వ్యవహరించే యాంకర్లకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఇదే సమయంలో జర్నలిస్టు పాత్రలో సంయమనం పాటించాల్సిన వారు పార్టీ కార్యకర్తలుగా మారితే ఛానళ్లు ఎలా ప్రజావ్యతిరేకంగా మారతాయో, ఎలా నిందిస్తాయో చూపాయి. అయినా ఇంకా మీడియా పక్షపాతం చూపదని ఎవరైనా నమ్ముతుంటే చేయగలిగిందేమీ లేదు. దేనికైనా కొన్ని మినహాయింపులు, ఏటికి ఎదురీదే చేపలు ఎప్పుడూ ఉంటాయి. మీడియాలోనూ అలాంటి వున్నాయని, వాటిని రక్షించుకోవాలని మరచి పోరాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు: నూతన రాజకీయ సమీకరణలకు నాంది కానున్నాయా ?

09 Sunday Feb 2020

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Others, Politics

≈ Leave a comment

Tags

Arvind Kejriwal, BJP, BJP motor mouths, Delhi election result, Delhi Polls, political polarization

Image result for delhi election result

ఎం కోటేశ్వరరావు
నోటి తుత్తర గాళ్లు మీడియా ముందు నోరు మూసుకొంటే మంచిదని రెండు సంవత్సరాల క్రితం ప్రధాని నరేంద్రమోడీ హెచ్చరించారు. అదంతా జుమ్లా అని రుజువైంది. విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కు తీసుకువస్తారని చేసిన నరేంద్రమోడీ వాగ్దానం ఏమైందని ప్రశ్నిస్తే అది జుమ్లా పట్టించుకోవద్దు అని మోడీ ఆత్మ అమిత్‌ షా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఏదో చెబుతుంటాం, జనాలు వాటిని పెద్దగా పట్టించుకోవద్దు అన్నది జుమ్లా అనే ఉర్దూపదానికి భాష్యం. ఢిల్లీ ఎన్నికల సమయంలో బిజెపి నేతల నోటితుత్తరను యావత్‌ ప్రపంచమూ చూసింది.
మోడీ భజన టీవీ ఛానళ్లతో సహా అన్నీ ఢిల్లీ గద్దె మీద తిరిగి అరవింద్‌ కేజరీవాల్‌నే ప్రతిష్టించేందుకు జనం నిర్ణయించుకున్నారని ఎగ్జిట్‌ పోల్స్‌లో స్పష్టం చేశాయి. ఏ పార్టీకి ఓటు వేసినా అది కమలం గుర్తుకే పడేట్లుగా ఓటింగ్‌ యంత్రాల్లో మార్పులు చేస్తారనే ప్రచారాన్ని నేను విశ్వసించను గానీ, అనేక మంది అనుమానిస్తున్నట్లుగా అసలు యంత్రాలనే మార్చివేసి కొత్తవాటిని పెట్టి తీర్పును వమ్ము చేస్తే తప్ప ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ గెలుపు తధ్యం. ఎందుకంటే బిజెపి వారు ఎంతకైనా తెగిస్తారని అనేకసార్లు స్పష్టమైంది.
దేశమంతటా తమకు ఎదురులేదని విర్రవీగుతున్న వారికి దేశపాలనా కేంద్రంలో అధికారం లేకపోతే తలకొట్టేసినట్లు అవుతుంది. అందుకే ప్రధాని మొదలు గల్లీ నేతల వరకు ఎన్ని పాట్లు పడ్డారో చూశాము. జాత్యంహంకార ఉన్మాదాన్ని రెచ్చగొట్టినపుడు అనేక దేశాల్లో ఎలాంటి ప్రమాదకర ధోరణులు వ్యక్తమయ్యాయో, గత కొన్ని దశాబ్దాలుగా రెచ్చగొట్టిన మతోన్మాదం ఎలాంటి వెర్రితలలు వేస్తుందో ఢిల్లీ ఎన్నికలు చూపాయి. ఈ ఉన్మాదం కేవలం ముస్లింలకే పరిమితం అని ఎవరైనా అనుకుంటే పొరపాటు పడినట్లే. మతం, కులం, ప్రాంతంతో నిమిత్తం లేకుండా తమతో విబేధించే అంశాలన్నింటినీ శాసించేందుకు మతోన్మాదం పూనుకుంటుంది.
తాము వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని బిజెపి స్వంతడబ్బా కొట్టుకుంటుంది.బిజెపినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్‌ సింగ్‌ వర్మ పుత్రరత్నమైన పరవేష్‌ వర్మ పశ్చిమ ఢిల్లీ బిజెపి ఎంపీ. ఎన్నికల సమయంలో కేజరీవాల్‌ను ఉగ్రవాది అని నిందించాడు, షాహిన్‌బాగ్‌లో గుడారాలు వేసిన వారు మీ ఇండ్లలోకి ప్రవేశించి మీ కూతుళ్లను, అక్కచెళ్లళ్ల మీద అత్యాచారాలు చేస్తారు, వారిని చంపేయండి, అక్కడ నిరసన తెలుపుతున్న వారికి కేజరీవాల్‌ బిర్యానీలు పెడుతున్నారు, డబ్బులు ఇస్తున్నారని నోరు పారవేసుకున్నందుకు ప్రచారంలో పాల్గనకుండా రెండు సార్లు ఎన్నికల సంఘం నిషేధం విధించింది. చివరికి ఓటింగ్‌ జరుగుతున్న సమయంలో సామాజిక మాధ్యమంలో ఒక వీడియోను విడుదల చేస్తూ షాహిన్‌బాగ్‌ జనం పెద్ద సంఖ్యలో వరుసల్లో నిలిచారు, ఆమ్‌ ఆద్మీ పార్టీ పెట్టిన బిర్యానీ తిని, ఇచ్చిన డబ్బులు తీసుకొన్న వారందరూ రుణం తీర్చుకొనేందుకు ఆ పార్టీకే ఓటు వేస్తామని నినదిస్తున్నారు. దానికి ప్రతిగా ఇండ్లలో ఉన్న జాతీయవాదులంతా బయటకు రావాలి. మీరు దేశానికి ఎంతో రుణపడి ఉన్నారు. పెద్ద సంఖ్యలో వరుసల్లో నిలిచి జాతీయ పార్టీకి ఓటు వేయాలి, అది మాత్రమే చాలదు తమ గుర్తింపు కార్డులను చూపుతూ జై శ్రీరామ్‌ అని నినాదాలు చేయాలి, దేశభక్తియుత పార్టీకే ఓటు వేస్తామని చెప్పాలి అని దానిలో పేర్కొన్నాడు. మత విద్వేషాన్ని, ఉన్మాదాన్ని రెచ్చగొట్టటం గాక దీన్నేమనాలి.
అంతే కాదు కర్ణాటక బిజెపి కూడా రెచ్చగొట్టే ట్వీట్లు చేసింది. ఢిల్లీ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు వచ్చిన ముస్లిం మహిళలు కాగితాలను (ఆధారాలను) చూపబోము అనే నినాదాన్ని ప్రదర్శిస్తు నిలుచున్న ఫొటోలను చూపుతూ మీ వద్ద ఉన్న గుర్తింపు పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోండి, రేపు ఎన్‌పిఆర్‌ సందర్భంగా ఇవ్వాల్సి వస్తుందంటూ ట్వీట్లు చేశారు. ఇది మతదురభిమానం తప్ప మరొకటి కాదు. ఒక వైపు ఎన్‌పిఆర్‌కు ఎలాంటి ఆధారాలూ చూపనవసరం లేదని మోడీ సర్కార్‌ చెప్పేదానికి ఇది విరుద్దం. ఎన్‌పిఆర్‌, ఎన్‌సిఆర్‌ గురించి బిజెపి ఏమి చెప్పినప్పటికీ ఆధారాలు లేవనే పేరుతో తమను ఇబ్బందులు పెడతారని ముస్లింలు, సంచార జాతులు, గిరిజనులు, దళితులు, ఇతర వెనుకబడిన తరగతుల వారు ఆందోళన చెందుతున్న తరుణంలో అధికార పార్టీ నుంచి ఇలాంటి ట్వీట్లు వెలువడటం వారి కడుపులో ఏముందో వెల్లడి చేస్తున్నది.
ఢిల్లీ ఎన్నికల సమయంలో, అంతకు ముందు బిజెపి నేతలు రెచ్చగొట్టుడు ప్రచారానికి ప్రభావితులైన వారు ఎలా ప్రవర్తిస్తారో చూశాము. అలాంటి పరిస్ధితినే బిజెపి కోరుకుంటోందని అనేక మంది భయపడుతున్నది నిజమే అని వెల్లడి అయింది. ఈనెల ఐదవ తేదీ రాత్రి రాజస్ధాన్‌కు చెందిన కవి,రచయిత బప్పతీయ సర్కార్‌ ముంబైలో తన స్నేహితుడిని కలుసుకొనేందుకు ఉబెర్‌ కాబ్‌ను బుక్‌ చేసుకున్నాడు. ప్రయాణ సమయంలో తన స్నేహితుడితో ఫోన్‌లో దేశంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల గురించి, జైపూర్‌లో ఎలా నిర్వహించాలో చర్చించాడు. కారు డ్రైవర్‌ రోహిత్‌ సింగ్‌ ఆ మాటలు విన్నాడు. గమ్యస్ధానం బదులు శాంతాక్రజ్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆపాడు. కొద్ది సేపటిలో వస్తానని చెప్పి ఇద్దరు కానిస్టేబుళ్లను వెంటబెట్టుకు వచ్చాడు. తన కారులో ఒక కమ్యూనిస్టు ఎక్కాడని, దేశాన్ని ఎలా తగులబెట్టాలో ఇతరులతో చర్చించాడని,దేశం మొత్తాన్ని షాహిన్‌బాగ్‌గా మార్చేందుకు చూస్తున్నాడని, తాను ఆ మాటలన్నింటినీ రికార్డు చేశానని కాబ్‌ డ్రైవర్‌ పోలీసులకు చెప్పాడు. ఇదెక్కడి విడ్డూరమయ్యా బాబూ అని డ్రైవర్‌ను ప్రశ్నిస్తే మీరు దేశాన్ని నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా ? నేను గాబట్టి వేరే చోట్లకు తీసుకుపోకుండా పోలీస్‌ స్టేషన్‌కు తీసుకు వచ్చాను సంతోషించండి అని డ్రైవర్‌ సమాధానమిచ్చినట్లు సర్కార్‌ తెలిపాడు. పోలీసులు రెండున్నర గంటల పాటు రచయితను స్టేషన్‌లో కూర్చోబెట్టి ఆయన రచనలు,ఇ తర విషయాల గురించి అనేక రకాలుగా ప్రశ్నించి అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో వదలి పెట్టారు.
భిన్నాభిప్రాయం కలిగి ఉండటం, వ్యక్తం చేయటం దాని ప్రాతిపదికన నిరసన వ్యక్తం చేయటాన్ని దేశద్రోహంగా బిజెపి, ఇతర సంఘపరివార్‌ శక్తులు చేస్తున్న ప్రచారం ఎలాంటి ప్రభావం కలిగిస్తోందో ఈ ఉదంతం తెలియ చేస్తోంది. అదే డ్రైవర్‌కు ఉన్మాద స్దాయి మరింత పెరిగి ఉంటే రచయిత సర్కార్‌ పరిస్ధితి ఏమై ఉండేదో ఊహించుకోవటానికే భయమేస్తోంది.
ఢిల్లీలో షాహిన్‌బాగ్‌ శిబిరం వద్దకు వచ్చిన యువకుడు కపిల్‌ గుజ్జార్‌ నిరసన కారులను దూషిస్తూ చంపివేస్తానంటూ జై శ్రీరామ్‌ అని నినాదాలు చేస్తూ గాలిలోకి కాల్పులు జరిపిన ఉదంతం తెలిసిందే. అతడు ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్త అంటూ వెంటనే పోలీసులు ఒక ఫొటోను విడుదల చేసి బిజెపి ఎన్నికల ప్రచారానికి తోడ్పడేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆమ్‌ ఆద్మీ పార్టీయే అతని చేత అలా చేయించిందని చెప్పటంలో పోలీసులు బిజెపితో కుమ్మక్కయ్యారు. అలా ప్రకటించటం నిబంధనావళికి విరుద్దం. తీరా చూస్తే తమ కుమారుడు నరేంద్రమోడీ భక్తుడు, అమిత్‌ షా అభిమాని తప్ప అరవింద కేజరీవాల్‌తో ఎలాంటి సంబంధాలు లేవని కపిల్‌ తండ్రి, సోదరుడు మీడియాతో చెప్పారు. గతేడాది లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వచ్చిన ఆమ్‌ ఆద్మీ పార్టీ అందరికీ తమ టోపీలు పెట్టి ఓట్లు అడిగిందని, ఆ సందర్భంగా తీసిన ఫొటోను పోలీసులు విడుదల చేశారని, తమ కుటుంబానికి ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. తమ కుమారుడు ఎప్పుడూ హిందుస్తాన్‌, హిందుత్వ గురించి మాట్లాడుతూ ఉంటాడని కూడా తెలిపారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బిజెపి ఎలాంటి చౌకబారు చర్యలకు పాల్పడుతుందో ఈ ఉదంతం వెల్లడించింది.
మనకు గిరిరాజ్‌ సింగ్‌ అనే ఒక కేంద్ర మంత్రి ఉన్నారు. నోటి నుంచి ఒక్కటీ సరైన మాట రాదు. బహుశా ఆయన నోట్లో పుట్టే విద్వేష వైరస్‌లు అలా మాట్లాడిస్తూ ఉండి ఉండాలి. షాహిన్‌బాగ్‌ ఆత్మహత్యా దళాలను తయారు చేసే కేంద్రంగా మారిందని ఢిల్లీ ఎన్నికల సమయంలో నోరు పారవేసుకున్నాడు. షాహిన్‌బాగ్‌లో ఒక మహిళ మరణించిన తన కుమారుడు అమరజీవి అంటోంది, ఆత్మహాత్యాబాంబరు కాకపోతే ఏమిటిది అని కూడా ప్రశ్నించాడా పెద్ద మనిషి.
షాహిన్‌ బాగ్‌లో పాకిస్ధాన్‌ ప్రవేశించిందని, ఎన్నికలు భారత్‌-పాకిస్దాన్‌ మధ్య పోటీగా జరగాలని కపిల్‌ మిశ్రా అనే బిజెపి అభ్యర్ధి ప్రకటించారు. అలాంటి వారందరికీ ఉపదళపతి అమిత్‌ షా ఎన్నికల్లో మాట్లాడినదేమిటి ? ఢిల్లీ ఎన్నికలు రెండు పార్టీల మధ్య పోటీ కాదు. షాహిన్‌బాగ్‌కు మద్దతు ఇస్తున్న రాహుల్‌ బాబా-కేజరీవాల్‌ మరియు దేశాన్ని రక్షిస్తున్న ప్రధాని మోడీ మధ్య పోటీ అని చెప్పారు.
మతోన్మాద భావజాలం తలకెక్కిన గుంజా కపూర్‌ అనే ఒక జర్నలిస్టు తానెవరో బయట పడకుండా ఉండేందుకు బుర్ఖా తగిలించుకొని షాహిన్‌ బాగ్‌ శిబిరంలో ప్రవేశించింది. నిజానికి ఆ శిబిరానికి ఎందరో ఆందోళనతో విబేధించే వారు కూడా సందర్శనకు వచ్చారు గానీ ఎవరూ ఇలాంటి ముసుగులతో రాలేదు. బహుశా అంతకు ముందు జెఎన్‌యులో ముసుగులు వేసుకొని దాడులు జరిపిన ఎబివిపి, వారి మద్దతు దారులనుంచి స్ఫూర్తి పొంది ఉండాలి. అనుమానం వచ్చిన షాహిన్‌బాగ్‌ మహిళలు అడిగిన ప్రశ్నలకు తడబడటంతో సదరు కాషాయ జర్నలిస్టు అసలు రూపాన్ని బహిర్గతం చేసి మర్యాదగా పోలీసులకు అప్పగించారు. అంతకు ముందు తుపాకి ధరించిన ఒక వ్యక్తిని శిబిరంలోని వారు పట్టుకున్న విషయం, మరో సందర్భంలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌ మీద వెళుతూ శిబిరం సమీపంలో గాల్లోకి కాల్పులు జరుపుతూ పారిపోయిన సంగతి తెలిసిందే.
జరియాను షరియాగా చిత్రించిన బిజెపి నేత
ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అమంతుల్లా ఖాన్‌ షరియా చట్టాన్ని అమలు జరపాలని కోరాడంటూ బిజెపి నేత సంబిత్‌ పాత్ర వక్రీకరించారు.హమ్‌ జరియా బనాయేంగే(మనం ఒక మార్గాన్ని కనుగొనాలి) అని వాడిన పదజాలాన్ని షరియా(ఇస్లామిక్‌ చట్టం)గా పేర్కొని సంబిత్‌ పాత్ర వక్రీకరించారు.ఇలాంటి పనులు చేయటం పాత్రకు అలవాటే. ఉత్తర ప్రదే శ్‌ కాంగ్రెస్‌ నేత ఒకరు కేసు కూడా నమోదు చేశారు.
భావోద్వేగాలను ముందుకు తేవటంలో, వాటిని రాజకీయంగా ఉపయోగించుకోవటం మీద ఉన్న శ్రద్ద దేశ ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపచటం,జనం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం మీద లేదని ఆరేండ్ల పాలన రుజువు చేసింది. సుదీర్ఘ బడ్జెట్‌ ప్రసంగం చేసి ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలని, అన్ని అంశాలను వివరించేందుకు తప్పలేదని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. నిజానికి ఆమె స్వయంగా ఇబ్బంది పడి చివరి పేజీలను చదవకుండా వదలి వేశారు. అన్నింటికంటే ఆ బడ్జెట్‌ అసలు సమస్యల జోలికిపోలేదు.

Image result for delhi election
ముందే చెప్పుకున్నట్లు బ్యాలట్‌ బాక్సుల తారుమారుకు పాల్పడకపోతే ఎన్నికలకు ముందు, తరువాత సర్వేల ప్రకారం ప్రకారం ఆమ్‌ ఆద్మీ అధికారానికి వస్తే దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపటం ఖాయం. 2014లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి విజయం తరువాత మరుసటి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘోరపరాజయం పాలైంది.తాజా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అన్ని స్ధానాలను తిరిగి గెలుచుకుంది.ఆమ్‌ ఆద్మీ పద్దెనిమిదిశాతం ఓట్లతో మూడవ స్ధానంలో కాంగ్రెస్‌ 22శాతం, బిజెపి 56శాతం ఓట్లతో ముందంజలో ఉంది.ఎనిమిది నెలల కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలైతే తమకు ఎదురులేదని అని ఛాతీ విరుచుకొనే వారు వెనక్కు తగ్గాల్సి ఉంటుంది. ఇప్పటికే మోడీ మీద అనేక మందిలో భ్రమలు తొలిగాయి, భావోద్రేకాలు లేదా భావోద్వేగాలతో ఓటు వేసిన వారిలో కూడా ఢిల్లీ ఎన్నికలు పునరాలోచనకు, నూతన రాజకీయ సమీకరణలకు నాంది పలుకుతాయి. ఒక వేళ ఎన్నికలను తారు మారు చేస్తే ఆ పరిణామం కూడా కొత్త సమీకరణలకు మరో రూపంలో నాంది పలుకుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పవన్‌ కల్యాణ్‌ బుర్ర తిరిగిందా ? మెదడు మార్పిడి జరిగిందా !

17 Friday Jan 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Aandhra Pradesh Politics, BJP, Pawan kalyan

Image result for pawan kalyan, bjp
ఎం కోటేశ్వరరావు
పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ గారికి
ఒక తెలుగు వాడిగా ఈ లేఖ రాస్తున్నా, వాడిగా, వేడిగా ఉందని విసుక్కోకుండా ఒక సారి గడ్డం సవరించుకొని కాస్త తీరిక చేసుకొని చదివి ఒకసారి గతాన్ని గుర్తుకు తెచ్చుకొని, భవిష్యత్‌లో కాస్త ఆచితూచి మాట్లాడతారని అనుకుంటున్నా. ఒక వేళ మీకు ఎవరైనా స్క్రిప్టు రాసిస్తూ ఉంటే (అదేమీ తప్పు కాదు, ఏం మాట్లాడాలో తెలియనపుడు పెద్ద పెద్ద నేతలందరూ అదే చేస్తారు ) వారికి ఈ లేఖను అందించండి. లేకపోతే ఏదేదో మాట్లాడి మీరు అభాసుపాలౌతారు. మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఏదో జరిగినట్లు అని పిస్తోంది. చిల్లంగా లేక చేతబడా మరొకటా ? లేఖ ముగింపుకు వచ్చే సరికి ఏదైనా సమాధానం దొరుకుతుందేమో చూస్తా !
రాజకీయ పార్టీకి నిజాయితీ ముఖ్యం. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరిగి ధన్యత పొందాలంటే కుదదరదు. అందునా ప్రజాజీవితంలో ఉన్నపుడు తనను ఎవరూ చూడటం లేదనుకొనే పిల్లి మాదిరి ఆలోచిస్తే ఎదురుతన్నుతుంది. ప్రజా జీవితంలో ఉన్నపుడు
” ఆడిన మాటలు తప్పిన – గాడిద కొడుకంచు తిట్టగా విని,
మదిలో వీడా కొడుకని ఏడ్చును – గాడిదయును కుందవరపు కవి చౌడప్పా ”

అన్న కవి చౌడప్ప పద్యం గుర్తుకు తేవాల్సి వచ్చినందుకు ఏమీ అనుకోవద్దేం ! వహ్వా వహ్వా అనే అభిమానుల పూలే కాదు, ఏమిటిది అనే విమర్శకుల రాళ్లను కూడా సమంగా చూడాలి మరి ! మీకు తెలిసిన సినిమా భాషలో చెప్పాలంటే హిట్లను చూసి పొంగిపోకూడదు, ప్లాప్‌లను చూసి కుంగిపోకూడదు మరి !
ఆదిలోనే హంసపాదు అన్నట్లు మరిచాను. ” నేను ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చాను” అని చెప్పారు మీరు. మీ అంత హీరో చెప్పారు కనుక మేమంతా మీ పుణ్యమా అని కొత్తగా ప్రశ్నించటం నేర్చుకున్నాం. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అని మేమూ కొన్ని ప్రశ్నలు అడిగేందుకు మీరు అవకాశం ఇచ్చారు. ఊరందరిని ఉల్లిపాయను తినొద్దని చెప్పాను గానీ ఇంట్లో నిన్ను వేయవద్దని చెప్పానా అని పెళ్లాన్ని బాదిన ప్రవచన కారుడిలా మారవదు,్ద వీలైతే నాలుగు సమాధానాలు చెప్పండి.
బిజెపితో జతకడుతున్న మీరు వామపక్షాలకేమి చెబుతారని విలేకర్లడిిగితే అదేమిటి పీకే గారూ ఠకీమని వామపక్షాలకు నేనేమన్నా బాకీ ఉన్నానా అన్నారు. అప్పులు వడ్డీల లెక్కల పద్దతిలో చెప్పాలంటే మీరు బిజెపితో రెండో సారి జతకడుతున్నారంటే మరో పాకేజీయా అనటం లేదు గానీ, బిజెపి మీకు కొత్తగా ఏమన్నా అప్పు ఇచ్చిందా లేక ఇప్పుడు సినిమాలేమీ లేవు, రాబోయే నాలుగున్నరేండ్లు రాజకీయాలే రాజకీయాలు అంటున్నారు గనుక బిజెపి దగ్గర మీరేమన్నా అప్పు తీసుకున్నారా అన్న అనుమానం మాత్రం వస్తోంది. ఎందుకంటే గతంలో మీ ఆర్ధిక పరిస్ధితి ఎంత దిగజారిందో మీరే చెప్పిన విషయం గుర్తుకు వస్తోంది. వామపక్షాలకు నేను చెప్పాల్సిందేమీ లేదు బ్రదర్‌ అని మామూలుగా చెబితే మీ సొమ్మేం పోయేది, రాజకీయాల్లో అంత ఎటకారాలాడితే, జనం మిమ్మల్ని ఆడుకుంటారనే చిన్న లాజిక్కు మర్చిపోతే ఎలా ! కాస్త మన్నన నేర్చుకుంటే మంచిదేమో !
ఏ పార్టీతో కలవాలో ఏం ఊరేగాలో అది మీ ఇష్టం. దానిలో కాస్త నిజాయితీ ఉండాలి సార్‌ ! వివిధ సందర్భాల్లో మీరు చేసిన కొన్ని ఆణిముత్యాలందామా లేక గోల్డెన్‌ వర్డ్స్‌ అందామా అన్నది తరువాత మాట్లాడుకుందాం. మచ్చుకు కొన్నింటి కోసం పాత సినిమాల్లో లేదా కొత్త సినిమాల్లో మాదిరి అయినా ఒక్కసారి వెనక్కు చూద్దాం. మీకు గతాన్ని గుర్తు చేసినందుకు కోపం రావచ్చు. తప్పదు మరి ?
”చస్తే చస్తాం గానీ.. జనసేన పార్టీని ఎప్పటికీ భారతీయ జనతా పార్టీలో విలీనం చేయం. తెలుగుజాతి ఉన్నతిని, గౌరవాన్ని ఎప్పటికీ కాపాడుకుంటూనే ఉంటాం” అంటూ ప్రజాపోరాట యాత్ర సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సభలో సెలవిచ్చారు. సరే ప్రస్తుతం విలీనం లేదు కనుక అది నాకు వర్తించదు అంటారా !
” పాచిపోయిన లడ్డూ లాంటి ప్రత్యేక ప్యాకేజీ కూడా మోదీ సర్కారు రాష్ట్రానికి సరిగా ఇవ్వలేదు. ఉడుముకు ముఖంపై రాసిన తేనెలా రాష్ట్రం పరిస్థితి తయారైంది. కేంద్ర ప్రభుత్వం స ష్టించిన అయోమయ పరిస్థితి వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను నాలుగేళ్లుగా అమలు చేయలేదు. నన్ను, బీజేపీని, టీడీపీని భాగస్వాములుగా ప్రజలు భావించారు. అందువల్ల వారికి నైతికంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. ” సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ నివేదికపై తుది కసరత్తు అనంతరం హైదరాబాద్‌ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలివి.
”ప్రధాన మంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్‌ను అభివ ద్ధి చేయకుండా మోసం చేశారు. సీఎం చంద్రబాబు మీద కోపం ఉంటే ఆయన మీద చూపించండి. మా రాష్ట్రం మీద ఎందుకు చూపిస్తారు? ” రాజమహేంద్రవరంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో చెప్పిన గౌరవ ప్రదమైన మాటలివి. ‘
‘ 10 లక్షల రూపాయల సూట్‌ వేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ వ థా చేసేంది ప్రజాధనమే. సర్దార్‌ వల్లభారు పటేల్‌ విగ్రహం ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీని అడగాల్సి ఉంది. ” విశాఖలో మీట్‌ ది ప్రెస్‌. ” నా దేశభక్తిని శంకిస్తున్న బీజేపీ నేతలు హద్దుల్లో ఉండాలి. అవాకులు, చెవాకులు పేలితే సహించే ప్రశ్నే లేదు. నేను మొదలు పెడితే బీజేపీ నేతలు నోరు తెరవలేరు. ”చిత్తూరులో జరిగిన బహిరంగ సభలో. ” వెనుకేసుకురావడానికి నాకు బీజేపీ బంధువూ కాదు. మోదీ అన్నయ్యా కాదు. అమిత్‌షా బాబయ్యా కాదు. వారిని ఎందుకు వెనుకేసుకొస్తాను? రాజకీయ జవాబుదారీతనం లేనందునే ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన ప్రత్యేక హౌదా దక్కలేదు. ఈ విషయంలో ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరూ మాట తప్పారు. ” విజయవాడలో జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా.
బిజెపితో కమ్యూనికేషన్‌ గ్యాప్‌ (సమాచార అంతరం) కారణంగా మధ్యలో విడిపోయామని పవన్‌ కల్యాణ్‌ చెబుతున్నారు. ఇది రాజకీయం, సినిమా లావాదేవీల్లో మాదిరి లెక్కల్లో చూపేందుకు వీలుగా ఇచ్చే ప్రతిఫలం ఒకటి, చాటు మాటుగా ఇచ్చేది మరొకటి కాదు కదా ! చెప్పుకోలేని చాటు మాటు వ్యవహారాల్లో సైగలను అర్ధం చేసుకోలేక, బయటకు చెప్పుకోలేక అపార్ధాలతో మేము గత కొంత కాలంగా మౌనంగా ఉన్నామనో మాట్లాడుకోవటం లేదనో, ఇప్పడు మబ్బులు వీడెనులో, తనువులు కలిసెనులే అని పాట పాడుకుంటున్నాం అంటే అర్ధం చేసుకుంటాం. పైన మీరు చేసిన వ్యాఖ్యలు, చెప్పిన మాటలు చూస్తే సమాచార అంతరం కాదు. మీరేమీ మౌనంగా లేరు, 2014-2019 ఎన్నికల సందర్బంగా మాట్లాడిన మాటలను చూస్తే ఎడమ జేబులో ఒక ప్రకటన, కుడి జేబులో ఒక ప్రకటన పెట్టుకొని వచ్చే అనుకూల, వ్యతిరేక సిగల్‌ను బట్టి జేబులో ప్రకటనలు తీసి రెచ్చిపోయి చదివినట్లుగా ఉంది.
రాజకీయాల్లో నీతి, నిజాయితీలకు కట్టుబడి ఉండాలనుకుంటే అసలు మీ మధ్య వచ్చిన సమాచార అంతరం ఏమిటి, అప్పుడెందుకు అలా మాట్లాడారు, ఇప్పుడు తొలిగిన అంతరం ఏమిటి, ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారో చెప్పాలి మరి. లేకపోతే మిమ్మల్మి నమ్మేదెలా ? కొంత కాలం తరువాత మరొక వైఖరి తీసుకొని అప్పుడు మరొక సమాచార అంతర కథతో జనాల చెవిలో పూలు పెడితే పరిస్ధితి ఏమిటి ? ఎందుకంటే ఏ సినిమా వ్యక్తిని కదలించినా బోల్డు కధలు ఉన్నాయి అని చెబుతుంటారు కదా !
ప్రత్యేక హౌదా గురించి అడిగితే దాన్ని ఇవ్వాల్సిన నరేంద్రమోడీని అడగండి అని చెప్పాల్సిన మీరు అడ్డం తిరిగి తెలుగుదేశం పార్టీని, వైసిపిని అడగండి అంటారేమిటి స్వామీ ! ఢిల్లీ పర్యటనల తరువాత కిందిది పైన పైది కిందకు కనిపిస్తున్నట్లుగా ఉంది మీకు. తాట తీస్తా, తోలు వలుస్తా అన్న మీకు ఏమీ కాకపోతే ఇవ్వాల్సిన వారినా అడగాల్సింది తీసుకొనే వాళ్లనా ? ఇదెక్కడి విడ్డూరం, ఇదేమి ట్విస్టు, సినిమా కథ అనుకుంటున్నారా ? మీరు హీరో కనుక మీతో సినిమా తీయాలనుకొనే వారు మీరు చెప్పినట్లు కథను మార్చవచ్చు తప్ప, ఇది రాజకీయం, మీ ఇష్టం వచ్చినట్లు మారిస్తే కుదరదు.
ఒకే భావం జాలం కలిగినట్లు చెప్పుకుంటున్న మీరు విరుద్ద భావజాలంతో పని చేసే కమ్యూనిస్టులతో ఎలా కలిశారు, ఒకే భావజాలం కలిగిన బిజెపి వారిని అంత తీవ్రంగా ఎలా విమర్శించారు? ఎన్నికలు ముగిశాక మారు మనసు పుచ్చుకున్నారా, బిజెపి జమానాలో బుర్ర మార్పిడి జరిగిందా? ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బ హిట్‌ అనుకున్న సినిమా అట్టర్‌ ప్లాఫ్‌ అయినట్లుగా మీరు అనుకున్న అధికారం రాకపోవటంతో రగిలిన విరహంతో మీరే ఢిల్లీ చూట్టూ ప్రదక్షిణలు చేశారా లేక బిజెపికి రాష్ట్రంలో కిక్కు ఇచ్చేవారెవరూ లేరని వారే మీ కోసం రాయబారాలు(కొందరు మీ వ్యతిరేకులు రాయ బేరాలు అనుకుంటున్నారు) పంపారో చెప్పాలి. గతంలో పాచిపోయింది మీకు మోడీ సర్కార్‌ ఇప్పుడే తయారు చేసి పెట్టిన ఘుమఘమ లాడుతున్న లడ్డులా అనిపించిందా ? లేక కొన్ని స్వీట్‌ షాపుల్లో మిగిలిపోయిన స్వీట్లను పారవేయకుండా వాటితోనే కొత్త స్వీట్లు తయారు చేసి వినియోగదారులకు సరికొత్తగా విక్రయించినట్లు మీకు వడ్డించారేమో చూసుకోండి.

Image result for pawan kalyan anti bjp
సరే చంద్రబాబు ప్రత్యేక హౌదా మీద డింకీలు కొట్టారు. దాని కంటే ప్రత్యేక పాకేజి మెరుగు అన్నారు. అసలు ప్రత్యేక పాకేజిలో ఉన్న ఇతర రాష్ట్రాలకు లేని ప్రత్యేకత ఏమిటి ? దాన్నెందుకు కేంద్రం అమలు జరపలేదో తాజాగా జరిపిన ఢిల్లీ ప్రదక్షిణలలో అయినా దేవుడు మోడీని ప్రార్ధించారా ? నిజానికి ప్రత్యేక పాకేజీ మోడీ – చంద్రబాబు లేదా ఇప్పుడు మోడీ-జగన్‌ ప్రయివేటు వ్యాపారం కాదు. రాష్ట్రానికి చేసిన వాగ్దానం. బాబు గద్దె దిగి పోయారు జగన్‌ వచ్చారు, కేంద్రం అమలు జరపటానికి వచ్చిన అడ్డంకి ఏమిటి ? ఏడు నెలలుగా ఏమి చేశారు ? పౌర సత్వ సవరణ చట్టం గురించి బిజెపి ఏ పలుకులనైతే వల్లిస్తోందో వాటినే మీరు వల్లించారు. ఏ గూటి చిలక ఆ గూటి పలుకులే పలుకుతుందంటే ఇదే కదా !
చివరాఖరుగా పేపరు కాగితం మీద ఇంక్‌ సిరాతో మీరు రాసిస్తారో లేక టైపు చేసి ఇస్తారో తెలియదు. జగన్‌ మూడు రాజధానులతో మూడు ప్రాంతాల అభివృద్ధి అంటూ సరికొత్త ప్రమాదకర రాజకీయానికి తెరతీసింది వైసిపి. దాన్ని జనసేన-బిజెపి కూడా అదే అభివృద్ధి నినాదంతోనే ఎదుర్కొంటామని చెబుతున్నాయి. జగన్‌ దగ్గర ఒక నిర్ధిష్ట అజెండా లేదా ప్రతిపాదనలు లేవు. మీ దగ్గర ఉన్న మంత్రదండం ఏమిటి ? దాన్ని ఎప్పుడు బయటకు తీస్తారు ? నాలుగున్నర సంవత్సరాల పాటు కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

సావర్కర్‌పై రాహుల్‌ వ్యాఖ్యతో బిజెపి రుసరుస !

15 Sunday Dec 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Not Rahul Savarkar, Rahul Jinnah, vd savarkar

Image result for rahul gandhi ramlila maidan

ఎం కోటేశ్వరరావు
మరోసారి కాషాయ పరివారం హిందుత్వ ప్రతీక విడి సావర్కర్‌ను దేశ భక్తుడిగా దేశం ముందుకు తెచ్చింది. నరేంద్రమోడీ పాలన దేశాన్ని మేకిన్‌ ఇండియాగా మార్చటానికి బదులు రేప్‌ ఇన్‌ ఇండియా(అత్యాచారాల భారత్‌)గా మార్చిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కొద్ది రోజుల క్రితం ఒక ఎన్నికల సభలో చేసిన వ్యాఖ్య దీనికి మూలం. రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ బిజెపి పార్లమెంట్‌లోపలా బయటా డిమాండ్‌ చేసింది. ఈ అంశంపై వివాదం చెలరేగటంతో పార్లమెంట్‌ పలుసార్లు వాయిదా పడింది. రాహుల్‌ వ్యాఖ్య దేశాన్ని, మహిళలను అవమానించటమే అని, అత్యాచారాలు చేయాల్సిందిగా ఆహ్వానం పలకటం వంటిదే అని బిజెపి ఎంపీలు ఆరోపించారు. సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలో దేశద్రోహంతో సమానమని అందుకు రాహుల్‌ను జైల్లో పెట్టాలని సంఘపరివార్‌కు చెందిన వారు డిమాండ్‌ చేశారు. రాహుల్‌ ఇటలీకి పోవాలన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దావ్‌ ధాకరే బహిరంగంగా రాహుల్‌ గాంధీని కొట్టాలని సావర్కర్‌ మనవడు కోరారు.
‘నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా గురించి మాట్లాడతారు, అయితే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అది అత్యాచారాల భారత్‌గా కనిపిస్తోంది’ అన్నది రాహుల్‌ గాంధీ వ్యాఖ్య. క్షమాపణ చెప్పాలని బిజెపి చేసిన డిమాండును న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారత్‌ను రక్షించండి అనే నినాదంతో కాంగ్రెస్‌ నిర్వహించిన సభలో రాహుల్‌ గాంధీ తిప్పి కొట్టారు. పదే పదే క్షమాపణలు చెప్పటానికి నేనేమీ రాహుల్‌ సావర్కర్‌ను కాదు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తనకు క్షమాభిక్ష పెడితే బ్రిటీష్‌ వారికి సేవచేసుకుంటానని అండమాన్‌ జైలు నుంచి విడి సావర్కర్‌ పదే పదే లేఖలు రాసి వేడుకున్న అంశాన్ని రాహుల్‌ గాంధీ తన వ్యాఖ్యద్వారా ప్రస్తావించారు. దీనిపై చెలరేగిన వివాదం కారణంగా సావర్కర్‌ దే శభక్తుడని నమ్ముతున్నవారికి సావర్కర్‌ అసలు రూపం ఏమిటో చూసేందుకు ఆసక్తి రేకెత్తించినందుకు బిజెపికి ‘అభినందనలు’ చెప్పాల్సిందే.
తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేది లేదంటూ రాహుల్‌ గాంధీ విమర్శలను తిప్పికొట్టారు. ఢిల్లీని అత్యాచారాల రాజధాని అని ప్రతిపక్షంలో ఉన్నపుడు అనేక సార్లు బిజెపి పేర్కొన్నదని, సాక్షాత్తూ నరేంద్రమోడీ 2014 ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్‌ను విడుదల చేశారు. గుక్కతిప్పుకోలేని బిజెపి నేతలు రాహుల్‌ గాంధీకి తగిన పేరు రాహుల్‌ జిన్నా అని వ్యాఖ్యానించారు. సిపాయి తిరుగుబాటుగా బ్రిటీష్‌ చరిత్రకారులు వర్ణించిన 1857 పరిణామాలను ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం అని ముందుగా వర్ణించిన సావర్కర్‌ గొప్ప దేశభక్తుడని కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా గతంలో చేసిన వ్యాఖ్యను ఈ సందర్భంగా మరోసారి పునరుద్ఘాటించారు.
1857 మే పదవ తేదీన బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా మీరట్‌లో ప్రారంభమైన మిలిటరీ తీరుగుబాటు తరువాత దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించింది.1858 జూన్‌ 20న గ్వాలియర్‌లో తిరుగుబాటుదార్లను అణచివేయటంతో వెనుకపట్టు పట్టింది. అయితే సిపాయిలపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే తమ పాలన అంతానికి నాంది అవుతుందని భయపడిన బ్రిటీష్‌ పాలకులు హత్యకేసులతో సంబంధం ఉన్నవారికి మినహా మిగిలిన తిరుగుబాటుదారులందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటించారు.1859 జూలై ఎనిమిది తిరుగుబాటు లాంఛనంగా ముగిసింది.
ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం గురించి నాటి పాలకుల కనుసన్నలలో నడిచే బ్రిటన్‌ పత్రికలు, అధికారిక ప్రకటనలు తప్ప ప్రపంచానికి ప్రత్యామ్నాయ వాస్తవ సమాచారం అందుబాటులో లేదు. అయినప్పటికీ తిరుగుబాటు ప్రారంభమైన 50 రోజుల్లోనే కారల్‌ మార్క్స్‌- ఫెడరిక్‌ ఎంగెల్స్‌ దాని స్వభావాన్ని పసిగట్టారు. తరువాత మరొక నెల రోజులకే భారత్‌లో జరిగిన అలజడి ఒక సిపాయి తిరుగుబాటు కాదు, ఒక జాతీయ తిరుగుబాటు, జాన్‌ బుల్‌ దానిని మిలిటరీ తిరుగుబాటుగా పరిగణించవచ్చుగానీ వాస్తవం ఏమంటే అది జాతీయ తిరుగుబాటు అని 1857 జూలై 28, 31 తేదీలలోనే కారల్‌ మార్క్సు వ్యాఖ్యానించారు. 1857 జూన్‌ 30న భారత్‌లోని పరిణామాలను మార్క్స్‌ ఇలా వర్ణించారు. ‘ ముస్లింలు, హిందువుల తమ ఉమ్మడి యజమానులకు వ్యతిరేకంగా ఐక్యమయ్యారు. తిరుగుబాటు కొన్ని ప్రాంతాలకే పరిమితం కాలేదు. ఆసియా దేశాలలో తలెత్తిన సాధారణ అసంతృప్తి కాలంలోనే ఇది జరిగింది.’ అని రాశారు.ఆ తిరుగుబాటును అణచివేయటంలో నాటి సంస్ధానాధీశులలో ఒకరైన సింధియా, ఇతర ప్యూడల్‌ శక్తుల పాత్ర గురించి కూడా మార్క్స్‌-ఎంగెల్స్‌ అనుమానించారు.
సిపాయిల తిరుగుబాటులో ప్రధమ భారత స్వాతంత్య్రం సంగ్రామ లక్షణాల గురించి మార్క్స్‌-ఎంగెల్స్‌ వ్యాఖ్యానించే నాటికి అసలు వి డి సావర్కర్‌ పుట్టనే లేదు. ఐదు ద శాబ్దాల తరువాత లండన్‌లో బారిష్టర్‌ చదవటానికి వెళ్లిన సమయంలో వారి రచనలు చదివి సావర్కర్‌ ఆ అభిప్రాయానికి వచ్చి వుండవచ్చు, వారి అవగాహన, అభిప్రాయాన్ని అంగీకరించారంటే అర్ధం చేసుకోవచ్చు గానీ అసలు ముందుగా వ్యాఖ్యా నించింది సావర్కరే అంటే చరిత్రను వక్రీకరించటమే. సావర్కర్‌ లండన్‌లో ఉన్న సమయంలో 1909లో మరాఠీలో సిపాయి తిరుగుబాటును ప్రధమ భారత స్వాతంత్య్రం సంగ్రామంగా వర్ణిస్తూ పుస్తకాన్ని రాశారు. దానికి మూలం లండన్‌లో విద్యార్ధి విప్లవకారులకు కేంద్రంగా ఉన్న ఇండియా హౌస్‌లో ఏర్పడిన పరిచయాలు, అధ్యయనమే అన్నది వేరే చెప్పనవసరం లేదు.
అభినవ్‌ భారత్‌ లేదా ఇండియా హౌస్‌లో సావర్కర్‌ పని చేసిన కాలంలో ఆయన పాత్ర గురించి ఎవరికీ పేచీ లేదు. బ్రిటీష్‌ వారి అరెస్టు నుంచి తప్పించుకొని ఫ్రెంచి వారికి చిక్కారు. వారు సావర్కర్‌ను బ్రిటీష్‌ వారికి అప్పగించారు.1910లో అరెస్టయిన కేసులో మరుసటి ఏడాది అండమాన్‌ జైలుకు తరలించిన తరువాత సావర్కర్‌ లొంగుబాటు అధ్యాయం ప్రారంభమైంది. 1911,13,17,20 సంవత్సరాలలో లేఖల మీద లేఖలు రాసి క్షమాభిక్ష కోసం ప్రాకులాడిన విషయం దాస్తే దాగదు. ఎలా కావాలంటే అలా బ్రిటీష్‌ వారికి అనుకూలంగా పని చేస్తానని రాశారు. 1923లో జైలు నుంచి విడుదల అయిన తరువాత ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా స్వాతంత్య్ర పోరాటానికి దూరమయ్యారు. అంతవరకైతే అదొక దారి క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించి బ్రిటీష్‌ వారికి తన విధేయతను చాటుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులు మిలిటరీలో చేరి బ్రిటీష్‌ వారికి తోడ్పడాలని ప్రచారం చేశారు. అదే ఏడాది హిందూ మహాసభ నాయకత్వాన్ని స్వీకరించి తొలిసారిగా హిందుత్వను ప్రతిపాదించి ద్విజాతి సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు. ముస్లిం ద్వేషిగా మారి చివరకు మహాత్మా గాంధీ హత్య కుట్రకేసులో ముద్దాయిగా మారిన విషయం తెలిసిందే. సాక్ష్యాలను సరిగా ప్రవేశ పెట్టని కారణంగా ఆ కేసునుంచి బయటపడ్డారు.
సావర్కర్‌తో పాటు అనేక మంది దే శభక్తులు అండమాన్‌ జైలు పాలయ్యారు. వారెవరూ బ్రిటీష్‌ వారి దయాదాక్షిణ్యాల కోసం పాకులాడలేదు. అనేక మంది తరువాత కమ్యూనిస్టులుగా మారారు. అయితే సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి లేఖలు రాసిన విషయం చాలా కాలం వరకు బయటకు రాలేదు. ఆయన 1966లో మరణించారు. 1975లో నాటి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ స్వాతంత్య్ర పోరాటంలో అండమాన్‌ జైలుకు వెళ్లినవారి గురించి ఒక పుస్తకం ప్రచురించాలని నిర్ణయించింది. దాన్ని ఆర్‌సి మజుందార్‌ అనే చరిత్రకారుడు రాశారు. ఆయన 1857 తిరుగుబాటును ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామంగా గుర్తించేందుకు నిరాకరించిన వ్యక్తి. సావర్కర్‌ అభిమానిగా ఆయన గొప్పతనాన్ని చిత్రించేందుకు ఎంతగా ప్రయత్నించినా బ్రిటీష్‌ వారికి రాసిన లొంగుబాటు లేఖలను దాచిపెట్టలేకపోయారు. అలాంటి సావర్కర్‌కు భారత రత్న బిరుదు ఇవ్వాలని కాషాయ దళాలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. మోడీ సర్కార్‌ అందుకు ఇప్పటి వరకు ‘ఆ సాహసానికి ‘పూనుకొనేందుకు జంకింది. అక్టోబరు నెలలో మహారాష్ట్ర ఎన్నికల సమయంలో తాము అధికారానికి వస్తే సావర్కర్‌కు భారత రత్న కోసం కృషి చేస్తామని బిజెపి-శివసేన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నాయి.

Image result for rahul gandhi ramlila maidan
రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలతో తలెత్తిన వివాదంలో శివసేన నేతలు సావర్కర్‌ దే శభక్తుడనే తమ పాత వైఖరిని పునరుద్ఘాటించారు. నాటకీయ పరిణామాల మధ్య శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్‌ మహారాష్ట్రలో సంకీర్ణ సర్కార్‌ భాగస్వాములుగా ఉన్నాయి. తాము గాంధీ, నెహ్రూలను గౌరవిస్తామని అలాగే కాంగ్రెస్‌ కూడా సావర్కర్‌ను గౌరవించాలని శివసేన నేత సంజయరౌత్‌ వ్యాఖ్యానించారు. ప్రతిఒక్కరూ ప్రతిదానినీ అంగీకరించలేరని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను కూడా అలాగే చూడాలంటూ ఎన్‌సిపి నేత ఛాగన్‌ భుజబల్‌ రాహుల్‌కు మద్దతు ప్రకటించారు. ఆవు మన మాతృమూర్తి కాదని సావర్కర్‌ అన్నారు, బిజెపి దానితో విబేధిస్తోంది, అదే మాదిరి పెద్ద వారి గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని చెప్పారు. దేశంలో ఈ వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉన్నప్పటికీ ఈ కారణంగా మహారాష్ట్ర సంకీర్ణ కూటమికి వచ్చే ముప్పు ఉండదని చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వెంట తిరిగే హచ్‌ కుక్కలు – చంకనెక్కే బొచ్చు కుక్కలు !

05 Thursday Dec 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Janasena, P&K, pavan kalyan, tdp, Ycp, YS jagan

Image result for pawan kalyan chandrababu naidu jagan

ఎం కోటేశ్వరరావు
కొత్త సర్కార్‌కు ఈ మధ్యనే ఆరు నెలలు నిండాయి. అసాధారణ పరిస్ధితులు ఏర్పడితే తప్ప ఇప్పుడప్పుడే ఎన్నికలు రావు. అయినా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ రంగంలో వేడి పుడుతోంది. ఇది ప్రకటనలకు ఆవేశ, కావేషాలకే పరిమితం అవుతుందా ? అంతకు మించుతుందా ? ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చదరంగంలో ఎలా గెలవాలా అని ప్రతిపక్షాలు చూస్తుంటే ప్రత్యర్ధులను ఎలా కట్టడి చేయాలా అని సహజంగానే అధికారపక్షం ప్రయత్నిస్తుంది.ఈ క్రమంలో ఎత్తులు పై ఎత్తులు సహజం.
ఆరునెలల క్రితం జరిగిన ఎన్నికలకు ముందు వైసిపి-బిజెపి బంధం గురించి తెలుగుదేశం మైండ్‌ గేమ్‌ ఆడింది. ఇప్పుడు వైసిపి నాయకత్వం ఆడుతున్న ప్రతి క్రీడలో భాగంగా బిజెపి-తెలుగుదేశం-జనసేన బంధాన్ని ముందుకు తెస్తోంది. గత ఎన్నికల్లో జనసేన-వామపక్షాలు సర్దుబాట్లతో ఐక్యంగా పోటీ చేశాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఏ పార్టీతోనూ కలసి కార్యాచరణ చేపట్టకూడదని జనసేన నాయకత్వం నిర్ణయించినపుడే ఆ పార్టీ వామపక్షాలకు దూరంగా ఉండదలచుకున్నదని తేలిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో ఏమి జరగనున్నది అనే చర్చకు తెరలేచింది. వైసిపికి తామే అసలైన ప్రతిపక్షమని బిజెపి నేతలు ప్రకటించారు.బిజెపితో తెలుగుదేశం పార్టీ సంబంధాల గురించి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. వాటి ఆధారంగా నిర్ధారణలకు రావటం, జోశ్యాలు చెప్పాల్సిన అవసరం లేదు.అవి కలసినా, విడిగా వున్నా సంఖ్యా పరంగా వైసిపికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు. ఇక బిజెపితో పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలోని జనసేన పార్టీ సంబంధాల గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఊహాగానాలు వచ్చినా వారే చెబుతున్నారు గనుక తలలు బద్దలు కొట్టుకోవాల్సిన పనిలేదు.
‘బిజెపికి నేను ఎప్పుడు దూరమయ్యాను? దగ్గరగానే ఉన్నా. రాష్ట్రానికి ప్రత్యేక హౌదా కోసం కేండ్రంతో విభేదించాను. అమిత్‌షా అంటే నాకు అమితమైన గౌరవం. వైసిపి వాళ్లకు ఆయనంటే భయం.’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తిరుపతి విలేకర్ల సమావేశంలో చెప్పారు. దేశ ప్రజలు బిజెపిని మంచి మోజార్టీతో రెండోసారి అధికారంలో కూర్చోబెట్టారు. మోడీ అమిత్‌షా దేశ ప్రయోజనాలు, దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారు. నేను సెక్యులరిస్టును. ఓట్లు వచ్చినా, రాకపోయినా నేను నమ్మే హిందూ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను. జగన్‌ నివాసానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా పుష్కర ఘాట్‌లో సామూహిక మత మార్పిడి చేస్తుంటే ఆయనకు తెలియదా? ఎవరి అండ చూసుకొని 40 మందిని సామూహిక మతమార్పిడి చేశారో చెప్పాలన్నారు. హిందూధర్మ పరిరక్షణ గురించి నేను మాట్లాడితే, దాన్ని వక్రీకరించి వైసిపి అసత్య ప్రచారం చేసింది. ఎవరైనా సరే మత విశ్వాసాలను గౌరవించి తీరాల్సిందే అన్నారు. ‘మీరు టిడిపి, బిజెపితో పొత్తు పెట్టుకుంటారా?’ అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ‘చెప్పలేం… ఉండొచ్చు ఏమో…’ అంటూ సమాధానం దాటవేశారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి దళిత, బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారని, రెండోసారి అధికారం కోసం ఎవరిని పక్కన పెట్టి పార్టీని స్థాపించించారో ఆ బ్రాహ్మణులను అక్కున చేర్చుకున్నారని. రాజకీయాలు ఇలా ఉంటాయంటూ సమాధానం చెప్పారు.
జనసేనను బీజేపీలో విలీనం చేయమని ఎన్నికలకు ముందే పవన్‌ కల్యాణ్‌ని అడిగామని, అప్పుడు ఆయన ఒప్పుకోలేదని భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు గుర్తుచేశారు. ఇప్పుడు ఏమైనా పవన్‌ కల్యాణ్‌ మనసు మారి ‘జనసేన’ను భారతీయ జనతా పార్టీలో విలీనం చేసే ఆలోచన ఉంటే తప్పనిసరిగా స్వాగతిస్తామని చెప్పారు.’మా నాయకత్వం కొత్త ఒరవడిని తీసుకురావడానికి ఇష్టపడుతోంది. కేవలం రాజకీయ కారణాలతో ఆరడుగుల బుల్లెట్‌ (పవన్‌ కల్యాణ్‌)ను మా భుజాలపై నుంచి సంధించాలని వేరే వారు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే, పొత్తులు పెట్టుకునే సమయం కాదు ఇది. ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికలు జరగడానికి ఇంకా నాలుగున్నర సంవత్సరాల వ్యవధి వుంది. మాతో కలిసి పనిచేయదలచుకున్న పార్టీలు ఏవైనా విలీనం కాదలచుకుంటే స్వాగతిస్తాం.లేదా కలిసి పనిచేసేలా ప్రయత్నిస్తాం’ అని జీవీఎల్‌ పేర్కొన్నారు.

Image result for pawan kalyan chandrababu naidu jagan
తిరుపతి వెంకన్న సాక్షిగా పవన్‌ చెప్పిన మాటలు, బిజెపి నేత జివిఎల్‌ నరసింహారావు స్పందన గురించి వేరే వ్యాఖ్యానాలు అవసరం లేదు. గతంలో సినిమా సమీక్షలు రాసేవారు కథంతా వివరించి చిత్ర ముగింపు ఎలా ఉంటుందో చెప్పకుండా ఆసక్తిని కలిగించేందుకు ప్రయత్నించేవారు. ఇప్పుడు బిజెపి-జనసేన మధ్యలో తెలుగుదేశం అన్నట్లుగా ఉంటుందా ? బిజెపి-జనసేన విలీనం అవుతాయా, మిత్రపక్షాలుగా ఉంటాయా అన్నది కూడా త్వరలోనే స్పష్టం అవుతుంది. అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌-బిజెపిలతో సఖ్యతను చూస్తే కాంగ్రెస్‌ నుంచి విడిపోయిన శక్తులు తిరిగి దానితో సర్దుబాటు చేసుకున్నా ప్రత్యేక పార్టీలుగానే కొనసాగి బేరసారాలు జరుపుతున్నాయి.
చిన్న పార్టీలను కాంగ్రెస్‌ ఎలా మింగివేసిందో గత అనుభవం ఉంది గనుక బిజెపి విషయానికి వస్తే ప్రాంతీయ పార్టీలు ముందు నుంచి తగుజాగ్రత్తలతో వ్యహరిస్తున్నాయి. రెండు పెద్ద జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు విలీనం అయితే ముద్రవేయించుకొని మందలో కలవటం తప్ప చేసేదేమీ ఉండదని ప్రజారాజ్యం నేత చిరంజీవి అనుభవం తెలిసిందే. అన్నింటికీ మించి విడిగా ఉంటేనే ప్రాంతీయ పార్టీలకు బేరసారాలాడే శక్తి ఎక్కువగా ఉంటుంది. అంతకు మించి ఎప్పుడు ఎటుకావాలంటే అటు సులభంగా దూకే సౌలభ్యం ఉంటుంది. అందుకు మహారాష్ట్ర శివసేన చక్కటి ఉదాహరణ. హిందూత్వ విషయంలో విడదీయలేని బిజెపితో పోటీ పడిన ఆ పార్టీ అధికారం విషయంలో పేచీకి దిగి ఎన్‌సిపి-కాంగ్రెస్‌ కూటమితో ఎలా చేతులు కలిపిందో చూశాము. దీన్ని చూసిన తరువాత ఏ పార్టీ ఎప్పుడు దేనితో చేతులు కలుపుతుందో చెప్పలేని స్ధితి ఏర్పడింది. ఎవరి తురుపు ముక్కలను వారు తమ దగ్గరే పెట్టుకొని జూదం ఆడతారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ను తెలుగుదేశం పార్టీనేత చంద్రబాబు నాయుడు వెనుక తిరిగే హచ్‌ కుక్క వంటి వాడని వ్యాఖ్యానించారు. అంతకు ముందు మరో మంత్రి కొడాలి నాని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని లుచ్చాగాడు అని సంబోధించారు. గతంలోకి వెళితే 2016 రైతు భరోసా యాత్రలో వైఎస్‌జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ నవనిర్మాణ దీక్షల గురించి చంద్రబాబు చెప్పింది నిజంగా జరగాలంటే చంద్రబాబు నాయుడిని ఎక్కడ కనపడితే అక్కడ చెప్పులతో కొట్టాలన్నారు. చంద్రబాబు సిగ్గుమాలిన మనిషి, నారాసురుడు అని జగన్‌ అంటే, వైఎస్‌ఆర్‌ దొంగలు అని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలంతా విన్నారు, కన్నారు. ఇవన్నీ చూసినపుడు రాష్ట్ర రాజీకీయాల్లో నోరుబట్టని బూతులు, కూతలు నిత్యకృత్యమయ్యాయి.రాబోయే రోజుల్లో బూతులతో పాటు మత,కులాల అంశాలను మరింతగా ముందుకు తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
బూతులు ఎవరు మొదలు పెట్టారు, ఎవరు ఎంత సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు అన్నది నేడు గ్రామాలలో రచ్చబండ చర్చల్లో రచ్చ అవుతోంది. ఏ పార్టీ అభిమానులు ఆ పార్టీ నేతల బూతులను నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల ఉన్మాదంతో ఊగిపోతున్నారు. దాన్నింకా పెంచేందుకు నేతలు బూతుల పంచాంగాలను మరింత శ్రావ్యంగా వినిపిస్తున్నారు. ఇలా బూతులు మాట్లాడటం తప్పనే జ్ఞానం ఎక్కడా కనిపించటం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి, ఆయన అనుయాయుల మీద తమ అనుచరుల నోటి దురుసుతనాన్ని విని ఆనందిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ మీద తన మంత్రులు, ఇతర నేతల బూతులు, కూతలను చూసి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి మహదానందం పొందుతున్నట్లు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రంలో ఇలాంటి వాతావరణం ఉందంటే మన నేతలకు ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో ఎలాంటి గౌరవం దక్కుతుందో చెప్పనవసరం లేదు. తెలుగు సమాజం ఇలాంటి వారిని ఎలా భరిస్తున్నదని ప్రశ్నించే రోజులు రాబోతున్నాయి. ఎవ్వరేమనుకుంటేనేమి నాకేటి సిగ్గు అనుకుంటే చేసేదేముంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకీ పరిస్ధితి, ఎందుకీ దిగజారుడు ? గతంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, స్వతంత్రపార్టీ వంటివి అధికార, ప్రతిపక్షాలుగా ఉన్నపుడు ఇలాంటి దిగజారుడుతనం లేదు. రాజకీయ వైరం తీవ్రంగా ఉన్నప్పటికీ పరస్పర నిందలు లేవు. ఎన్‌టి రామారావు రాజకీయ రంగంలోకి వచ్చినపుడు కుక్కమూతి పిందెలు అని చేసిన విమర్శకు మమ్మల్ని ఇంతలా నిందిస్తారా అని కాంగ్రెస్‌ వారు నొచ్చుకున్నారు. ఇప్పుడు వెలువడుతున్న పదజాలంతో పోల్చితే నిజానికి ఆ విమర్శ పార్లమెంటరీ సంప్రదాయాలకులోబడిందే తప్ప నింద కాదు.
1991 నుంచి అమల్లోకి వచ్చిన నయావుదారవాద విధానాలను అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న జాతీయ, ప్రాంతీయ పార్టీలు(కొన్ని అంశాలలో పరిమితంగా వామపక్షాలు మినహా) ఒకే రకమైన ఆర్ధిక విధానాలను అమలు జరుపుతున్నాయి. అందువలన తెలుగుదేశం, వైసిపి, కాంగ్రెస్‌, జనసేన, బిజెపి వంటి పార్టీలేవీ విధానాల గురించి చట్ట సభల్లో లేదా వెలుపలా ఎక్కడా ప్రస్తావించవు, ఘర్షణ పడవు. వాటి పంచాయతీ అల్లా అధికారం, దాన్ని అడ్డం పెట్టుకొని ఆస్ధులు కూడబెట్టుకోవటం గురించి మాత్రమే. అందువల్లనే అధికారం కోసం ఎంత ఖర్చు పెట్టటానికైనా వెనుదీయరు, ఏమి చేయటానికైనా సిద్దం అవుతారు.
గతంలో అంటే నూతన ఆర్ధిక విధానాలు రాకముందు భూమి దాని మీద పట్టు, గ్రామీణ ప్రాంతాలలోని వనరుల మీద ఆధిపత్యం కోసం పాలెగాళ్లు, భూస్వాములు, ధనిక రైతులు వెంపర్లాడేవారు. గడచిన మూడు దశాబ్దాలుగా వ్యవసాయం గిట్టుబాటు గాకపోవటం, దాని మీద వచ్చేదాని కంటే పరిశ్రమలు, వ్యాపారాలు, రియలెస్టేట్‌ మీద వచ్చే ఆదాయం ఆకర్షణీయంగా మారటంతో రాయలసీమ ఫ్యాక్షనిస్టులు, ఇతర ప్రాంతాల్లోని భూస్వాములు, ధనిక రైతులు వాటి వైపు మొగ్గుచూపారు. రాయలసీమలో ఇప్పటికీ ఫ్యాక్షనిజం ఉన్నప్పటికీ వాటి నేతలకు గ్రామీణ ప్రాంతాలలో వచ్చే ఆదాయాల కంటే పట్టణాలు ఆకర్షణీయంగా ఉండటంతో వారి మధ్య సర్దుబాట్లకు తెరలేచింది. ఒకరి సంపాదనకు మరొకరు అడ్డుపడకుండా ఎవరి సంపాదన వారు చూసుకుందామనే పెట్టుబడిదారీ ఆలోచనలు అందుకు దోహదం చేస్తున్నాయి.అందువల్లనే పేరు మోసిన వైరి ఫ్యాక్షనిస్టులు అటు తెలుగుదేశం పార్టీలో ఇటు వైసిపిలో ఒకేవరలో ఇమిడిపోగలుగుతున్నారు.
నయావుదారవాద విధానాలు ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి తెరలేపాయి.ప్రపంచ బ్యాంకు విధానాల అమలు ప్రయోగశాలగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మారింది. దీనిలో ప్రభుత్వరంగ సంస్ధల ఆస్ధులను ఆశ్రితులకు అయినకాడికి తెగనమ్మటం ద్వారా లబ్ది చేకూర్చటం. విలువైన భూములను కారు చౌకగా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు కట్టబెట్టి వారి నుంచి రాజకీయనేతలు లబ్ది పొందటం తెలిసిందే. అది అపరిమిత లాభాలు చేకూర్చటంతో ఎన్నికలు వ్యాపారంగా మారాయి. పదుల కోట్ల రూపాయలు అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికలలో ఖర్చు చేయటానికి కారణమిదే. దీనికి అనుగుణ్యంగానే స్ధానిక సంస్ధల ఎన్నికలు కూడా డబ్బుమయంగా మారాయి.
ఇదే సమయంలో రాజకీయ వైరం తీవ్రంగా ఉన్న సందర్భాలలో ఎదుటి వారికి ఆర్ధిక మూలాలను దెబ్బతీయటం చేస్తున్నారు. అది కేంద్రంలోనూ, రాష్ట్రాల్లో అధికారాల్లో ఉన్నవారూ చేస్తున్నారు. కాంట్ట్రాక్టర్లుగా ఉన్నవారికి దీర్ఘకాలం పాటు బిల్లులు నిలిపివేయటం, కొర్రీలు వేయటం, గనులు పొందిన వారి మీద దాడులు చేయించటం. గతంలో పొందిన కాంట్రాక్టులను రద్దు చేస్తామని బెదిరించటం ఇలా రకరకాల పద్దతులను రంగంలోకి తీసుకువస్తున్నారు. తెలుగుదేశం హయాంలో గ్రామాల్లో కాంట్రాక్టులు పొంది పనులు చేసిన వారు పార్టీ మారి వైసిపిలోకి వెళితే వెంటనే బిల్లులు మంజూరు చేయటం, మారని వారిని సతాయించటం గురించి వస్తున్న ఫిర్యాదుల సారమిదే.

Image result for pawan kalyan chandrababu naidu jagan

ఎన్నికల్లో డబ్బు ప్రమేయం పెరుగుదల రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సర్దుబాట్లకు-కక్షలకు తెరలేపింది. ఎవరు బిస్కెట్‌ వేస్తే లేదా కర్ర చూపితే వారి వైపు తోకాడించుకుంటూ వెళ్లి చంకనెక్కే బొచ్చుకుక్కల మాదిరి వెళుతున్న వాణిజ్య రాజకీయనేతలను చూస్తున్నాము. డబ్బు, ఓట్లను రాబట్టగలిగిగే సామాజిక తరగతిని బట్టి నిన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీలో పదవులు వెలగబెట్టిన వారు తెల్లవారే సరికి వాటంగా ఉంటుందనుకొంటే మరొక పార్టీలోకి సులభంగా మారిపోతున్నారు. చేర్చుకొనే వారికి, చేరేవారికి ఎలాంటి విలువలు, వలువలు ఉండటం లేదు. ఒక పార్టీలో గెలిచి ప్రజాప్రతినిధిగా ప్రమాణ స్వీకారం కూడా చేయక ముందే మరో పార్టీలో చేరిన వారిని చూశాము. ఫిరాయింపుదార్లను కాపాడేందుకు స్పీకర్ల వ్యవస్ధను దుర్వినియోగం చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఎవరు అధికారంలో వుంటే వారికి వ్యతిరేకంగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొనేందుకు ప్రతిపక్షంగా ఉన్న ప్రతి పార్టీ ప్రయత్నిస్తుంది.దానిలో తప్పులేదు. ఇప్పుడు ప్రతిపార్టీ అధికారంలోకి వచ్చేందుకు సంక్షేమ చర్యల విషయంలో పోటీపడుతున్నది తప్ప వేరే అంశాలే లేవు. సంక్షేమ చర్యలను విమర్శించేందుకు ఎవరూ ముందుకు రారు. రాజకీయంగా వేడి పుట్టించాలంటే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని బూతులతో రక్తి కట్టిస్తే తప్ప జనానికి కిక్కు ఎక్కటం లేదు. ఇప్పుడు బిజెపితో స్నేహం కారణంగా మతాన్ని కూడా ముందుకు తెస్తున్నారు. ఆరు నెలల క్రితం బిజెపికి వ్యతిరేకంగా పని చేస్తా అని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ అప్పటికీ ఇప్పటికీ ఆ బిజెపిలో వచ్చిన మార్పేమిటో, రాష్ట్రానికి చేసిన మేలు ఏమిటో, ఎందుకు తన వైఖరిని మార్చుకున్నారో జనసేనాని జనానికి చెప్పాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పాలకుల దాడి – ప్రశ్నార్ధకంగా మారిన మీడియా విశ్వసనీయత !

06 Friday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ 1 Comment

Tags

attacks on journalists, BJP, BJP's social media, Indian media credibility, Journalism in India, Media, Narendra Modi

Image result for government attack and question of indian media credibility

ఎం కోటేశ్వరరావు

ఒకే దేశం ఒకే చట్టం అనే భావోద్వేగాల ముసుగులో దేశ చరిత్రలో తొలిసారిగా ఒక్క దెబ్బతో ఒక రాష్ట్రాన్ని ఏకంగా రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేసి అక్కడి జనానికి దేశంతో సంబంధాలను తెంపివేసిన ఆగస్టు ఐదు, 2019 నాటి అత్యంత అప్రజాస్వామిక చర్య వారాలు గడిచినా సాధారణ పరిస్ధితులు ఏర్పడలేదు. దేశంలో ఎన్ని పత్రికలు, టీవీలు ఈ చర్యను విమర్శనాత్మకంగా చూశాయి అన్నది ఒక ప్రధానమైన అంశం. కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి వున్న అనేక వివాదాస్పద అంశాలు, జనజీవితంతో పెనవేసుకున్న ఆర్ధిక వ్యవస్ధ దిగజారుడు పర్యవసానాల గురించి మీడియాలో ఎంత చోటు దక్కిందన్నది ఒక శేష ప్రశ్నగా మారింది.కాశ్మీరు గురించి మీడియా చర్చల్లో ఎక్కడో కొంత మంది చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలు తప్ప స్వంత కధనాలను జనం ముందుకు ఎన్ని తెచ్చాయంటే చెప్పలేని స్ధితి. అధికార పార్టీని చూసి నిజం చెప్పలేని స్ధితిలో మీడియా పడిపోయిందా ?ప్రస్తుతం భారత మీడియాలో వేళ్ల మీద లెక్కించదగిన సంస్ధలు తప్ప మొత్తం మీద విశ్వసనీయత సమస్యను ఎదుర్కొంటున్నది. అంతకు ముందు కూడా ఆ సమస్య వున్నప్పటికీ గత ఐదు సంవత్సరాలుగా వేగంగా దిగజారుతున్నది.

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్ధగా చెప్పుకుంటున్న మన దేశంలో జర్నలిజం ఎదుర్కొంటున్న ఇబ్బందుల పర్యవసానాలు తీవ్రంగా వుంటాయి. వుత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాధ్‌ సర్కార్‌ చర్య ఒక వుదాహరణ. మధ్యాహ్న భోజన పధకంలో రొట్టెలతో కూరలకు బదులు వుప్పు అందచేసిన అంశాన్ని వీడియో తీసి వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టు మీద అక్కడి అధికార యంత్రాంగం కేసు పెట్టింది. మీరు కావాలంటే ఫొటోలు తీసుకోవచ్చు, మీకు తప్పుగా కనిపించినదాని గురించి ఏమైనా రాసుకోవచ్చు. కానీ వీడియో తీయటం అంటే అనుమానించాల్సి వస్తోంది. ఒక కుట్రలో భాగంగానే వీడియో తీశారంటూ జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ పటేల్‌ సదరు జర్నలిస్టు మీద పెట్టిన కేసును సమర్ధించారు. కేసు పెట్టాలి, దానికి ఒక సాకు చూపాలి అంతకు మించి దీనిలో మరొకటి కనిపించటం లేదు. ఫొటోలు తీయటానికి అర్హత వున్న ఒక జర్నలిస్టు వీడియో తీయకూడదని ఏ నిబంధనలు చెబుతున్నాయి. జర్నలిస్టుల పట్ల బిజెపి పాలకుల వైఖరికి ఇది చక్కటి నిదర్శనం. అధికారంలో వున్న వారికి వ్యతిరేకంగా నిజం చెప్పకూడదు, చూపకూడదు.

నరేంద్రమోడీ తొలిసారి ఎన్నికైనపుడు చమురు ధరలు భారీగా క్షీణించి జనానికి పెద్దగా వుపయోగపడకపోయినా దిగుమతి బిల్లు తగ్గించి కేంద్ర ప్రభుత్వానికి ఎంతో మేలు చేశాయి. అయినా ఎప్పుడైతే ఆర్ధికంగా దిగజారుడు ప్రారంభమైందో దాన్నుంచి దృష్టి మళ్లించేందుకు ఎన్నో జిమ్మిక్కులు చేశారు.1970దశకం తరువాత గత ఏడాది నిరుద్యోగ శాతం 6.1శాతానికి పెరిగి పాత రికార్డును బద్దలు కొడితే ఇప్పుడు మొత్తంగా 8.2శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 9.4శాతానికి చేరిందని తాజా పరిశీలనలు వెల్లడించాయి. వుద్యోగాలు ఎంత మందికి కల్పించారు అని అడిగితే లెక్కలు సరిగా వేయటం లేదు అని ఒకసారి, పకోడీలు తయారు చేయటం కూడా వుపాధి కల్పనే వాటన్నింటినీ కూడి తరువాత చెబుతామంటూ మోడీ దాటవేశారు. ఇంతవరకు లెక్కలు చెప్పలేదు. కొత్త వుద్యోగాలు కల్పించకపోగా వున్న వుద్యోగాలు కూడా పోతున్నాయని, ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి జారుతోందనే సూచనలు కనిపిస్తున్నాయి. పలుకే బంగారమాయెగా అన్నట్లు అసలేం జరుగుతోందో చెప్పటానికి మోడీ నోరు విప్పటం లేదు. బ్యాంకులకు పని గట్టుకొని రుణాలు ఎగవేసినట్లుగా ముఖ్య విషయాలపై మౌనం ఒక ప్రధాన సమస్యగా మారింది అంటే అతిశయోక్తి కాదు. ప్రజాస్వామ్యంలో ఒక దేశాధినేత లేదా ప్రభుత్వ తీరు తెన్నుల గురించి మీడియా శల్యపరీక్ష చేయాల్సి వుంది. జర్నలిస్టులు, మీడియా ఈ విషయంలో శక్తిహీనులైతే అది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచటం తప్ప మరొకటి కాదు. విమర్శనాత్మకంగా తమ కలాలు, గళాలను పని చేయించే జర్నలిస్టులు వున్నప్పటికీ మీడియా మొత్తంగా కార్పొరేట్ల చేతిలోకి పోవటంతో యాజమాన్యాలు తొక్కిపడుతున్నాయి. ఇది మరింత ప్రమాదకరం.

Image result for government attack and question of indian media credibility

మూడు సంవత్సరాల క్రితం దేశంలో నల్లధనాన్ని వెలికి తీసేందుకు, అవినీతిని అరికట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ప్ర్రకటించారు. దాని ఫలితాలు వెంటనే కాదు, తరువాత వస్తాయని నరేంద్రమోడీ చెప్పారు. జిందా తిలిస్మాత్‌ సర్వరోగ నివారిణి అన్నట్లుగా తన చర్యతో అవినీతి మటుమాయం అవుతుందని బల్లగుద్దారు. ఆర్ధికవేత్తలుగా వున్న వారు కూడా ఖాళీ పత్రం మీద సంతకాలు చేసినట్లుగా సమర్ధించారు. ఆ సమయంలో ఒకటీ అరా తప్ప మొత్తంగా మీడియా నిజమే నిజమే అన్నట్లుగా వంత పాడి జనాల్లో భ్రమలను పెంచింది తప్ప ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి చర్యలతో అవినీతి తగ్గిందా అనే చర్చకు తెరతీయలేదు. విషాదం ఏమిటంటే త్వరలో పెద్ద నోట్ల రద్దు మూడో వార్షికోత్సవానికి సిద్దం అవుతున్నాము. ఈ కాలంలో నరేంద్రమోడీ దాని గురించి ఒక్కసారి కూడా ఎందుకు నోరు విప్పలేదో ఏ మీడియా అయినా అడిగిందా, ఏ జర్నలిస్టు అయినా ధైర్యం చేశారా? ఏ ఆర్ధిక వేత్త అయినా తాము చెప్పింది తప్పని చెంపలు వేసుకున్నారా?

పుల్వామా వుగ్రదాడి తరువాత మన సైనిక దళాలు బాలాకోట్‌ పట్టణం మీద మెరుపుదాడి చేసి వందల మంది వుగ్రవాదులను మట్టుబెట్టినట్లు మీడియాకు చెప్పారు. అందుకు రుజువు ఏమిటని అడిగిన రాజకీయపార్టీలను దేశద్రోహులు, మన సైనిక సామర్ధ్యాన్ని అవమానిస్తున్నారంటూ మనోభావాలను రెచ్చగొట్టి బిజెపి, దాని సోదర సంస్ధలు జనాన్ని వుసిగొల్పాయి. అది రాజకీయ క్రీడలో భాగం అనుకోండి. మీడియా ఎలాంటి తటపటాయింపులు లేకుండా ఒకదానితో మరొకటి పోటీపడి ఆ ప్రచారాన్ని తలకెత్తుకొని యుద్దోన్మాదాన్ని, దాన్ని వ్యతిరేకించిన వారిపై వ్యతిరేకతను రెచ్చగొట్టటాన్ని చూశాము. అధికార రాజకీయ పక్షానికి, మీడియా వైఖరికి తేడా చెరిగిపోయింది. రాయిటర్స్‌, ఇతర అంతర్జాతీయ మీడియా సంస్ధలు మాత్రమే ప్రభుత్వ, అధికారపక్ష ప్రచారాన్ని సవాలు చేశాయి. ఫలితంగా దేశీయ మీడియా విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారింది.

ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు గురించి ఎన్నికలకు ముందు మార్చినెలలో వందకు పైగా ఆర్ధికవేత్తలు రాసిన ఒక బహిరంగలేఖను మీడియా విస్మరించిది. వార్త ముగింపులో ఫలానా వారు కూడా ప్రసంగించారు అని రాసినట్లుగా మోడీ సర్కార్‌ చెప్పుకుంటున్న అభివృద్ధిని తమ లేఖలో ప్రశ్నించారు అన్నట్లుగా వార్తలు ఇచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వమే అసలు విషయాలను బయటపెట్టాల్సి వస్తోంది. మీడియా దాన్ని పాఠకులకు అందించే సమయంలో గతంలోనే ఫలానా ఆర్ధికవేత్తలు సర్కార్‌ ప్రచారాన్ని ప్రశ్నించారు అని రాయటానికి చేతులు, చెప్పటానికి నోరు రావటం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తమ మనుగడకోసం విధిలేక కొన్ని అంశాలను వెల్లడించాల్సి రావటం తప్ప ఎక్కువ భాగం జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్ధలు పాలకపార్టీల బాకాలుగా మారాయి.

ఒక ప్రధానిగా ఇంతవరకు నరేంద్రమోడీ పత్రికా గోష్టి పెట్టలేదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కొద్ది రోజుల్లో వెలువడ నుండగా బిజెపి ప్రధాన కార్యాలయంలో ఒక పత్రికా గోష్టి నిర్వహించారు. ముందే తయారు చేయించిన ఒక ప్రకటన విడుదల చేసి పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా పక్కన చిరునవ్వులు చిందిస్తూ మోడీ కూర్చున్నారు, విలేకర్ల ప్రశ్నలకు అమిత్‌ షా సమాధానం చెప్పారు. చూశారా ప్రధాని అయ్యుండి కూడా పార్టీ అధ్యక్షుడికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అంటూ దాన్ని కూడా మోడీ ఘనతగా మీడియా చిత్రించింది.ఎన్నికల సమయంలో మోడీతో ప్రత్యేక ఇంటర్వ్యూల పేరుతో జాతీయ మీడియా సంస్ధలు గంటల తరబడి ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించాయి. అలాంటి అవకాశం ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వని కారణంగా అదంతా అధికారపక్ష ఆర్ధిక పాకేజీల్లో భాగమని జనం అనుకున్నారు. లాలూచీ కుస్తీ మాదిరి ఇంటర్వ్యూలు సాగాయి తప్ప విమర్శనాత్మక ప్రశ్నలు ఒక్కటీ వేయలేదు. ఎన్నికల సమయంలో విమర్శనాత్మకంగా వార్తలిచ్చిన హిందూ, టెలిగ్రాఫ్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలకు రెండోసారి అధికారానికి వచ్చిన తరువాత మోడీ సర్కార్‌ ప్రభుత్వ ప్రకటనల జారీలో కోత పెట్టిందని రాయిటర్స్‌ పేర్కొన్నది. 2002లో మీడియా స్వేచ్చలో 139దేశాల్లో మన స్ధానం 80వది, అలాంటిది తాజాగా సరిహద్దులు లేని విలేకర్ల సంస్ధ ప్రకటించిన 180 దేశాల్లో మనది 140వ స్ధానం. నిత్యం హింసా వాతావరణం వుండే దేశాలకంటే మనది దిగువన వుంది అని చెప్పుకోవాల్సి రావటం సిగ్గు చేటు.

1975లో నాటి కాంగ్రెస్‌ ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితిని ప్రకటించినపుడు దేశంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలంటే జనం బిబిసి రేడియో మీద ఆధారపడాల్సి వచ్చింది. ఎదిరించిన మీడియాను అణచివేస్తే లొంగిపోయిన మీడియా ప్రభుత్వ బాకాగా మారిపోయింది. ఇప్పుడు దేశంలో అత్యవసర పరిస్ధితి లేదు. అయినా కాశ్మీరులో ఏం జరుగుతోంది అని తెలుసుకోవాలంటే జాతీయా మీడియాతో ఫలితం లేదని తేలిపోయింది. నాటి అత్యవసర పరిస్ధితిలో మాదిరి తిరిగి నేడు కాశ్మీర్‌లో వేలాది మందిని అరెస్టు చేశారనే వార్తల కోసం విదేశీమీడియాను, ఇంటర్నెట్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. అలాంటి ఆసక్తి ఎందరికి , అందరిలో వుండే అవకాశం లేదు, అందువలన హిజ్‌మాస్టర్‌ వాయిస్‌ లేదా రాణీగారీ ప్రతిపక్షం మాదిరి మన మీడియా అందిస్తున్న అంతా బాగుంది వార్తలనే చదవటం, చూడాల్సి వస్తోంది. జమ్మూకాశ్మీర్‌ను మొత్తంగా మూసివేసిన మోడీ సర్కార్‌ చర్యను ఏ విదేశీ నేత కూడా ప్రశ్నించలేదు కదా అనే వాదనను మన మీడియా ముందుకు తెస్తోంది. నాణానికి రెండోవైపు చూస్తే ఏ నేత ఏ దేశం కూడా సమర్ధించిన దాఖలా కూడా లేదు. మన దేశంతో వున్న ఆర్ధిక సంబంధాలు, మార్కెట్‌ మీద ఆశతో విదేశాలేవీ మన సర్కార్‌తో ఘర్షణపడేందుకు సిద్దంగా లేవు.

భారత్‌లో పత్రికలు, టీవీ ఛానల్స్‌ పైకీ కిందికీ గంతులు వేస్తూ కేరింతలు కొడుతున్నాయని కాశ్మీర్‌లో పరిస్ధితి గురించి అంతర్జాతీయ పత్రిక ఎకానమిస్టు పేర్కొన్నది. విదేశీ మీడియా ఛానల్స్‌ కధనాల మీద దాడి చేయటంలో సామాజిక మాధ్యమంలో ప్రభుత్వ అనుకూల మరుగుజ్జుల(ట్రోల్స్‌)తో పాటు, సాంప్రదాయక మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టులు కూడా తోడవుతున్నారు. ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులను కాశ్మీర్‌లో ప్రవేశించకుండా ప్రభుత్వం అడ్డుకోవటాన్ని మీడియా దాదాపుగా సమర్దించిందని బ్లూమ్‌బెర్గ్‌ వ్యాఖ్యానించింది. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తామని తమ ఎన్నికల ప్రణాళికల్లో ఎప్పటి నుంచో చెబుతున్నామని బిజెపి చెబుతోంది. దాని మంచి చెడ్డల గురించి ఇప్పటికే ఎంతో చర్చ జరిగింది కనుక కాసేపు పక్కన పెడదాము. కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేస్తామని, రెండుగా చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తామని, ఆప్రక్రియకు ముందూ, తరువాత దాన్ని మొత్తంగా బహిరంగ జైలుగా మారుస్తామని, కమ్యూనికేషన్‌ వ్యవస్ధను మూలన పడేస్తామని బిజెపి ఎక్కడా ముందు చెప్పలేదు కదా ? దీన్ని గురించి మన మీడియా ఎన్నడైనా ప్రశ్నించిందా ? ప్రభుత్వ చర్యలను ప్రశ్నించే గళాలకు చోటు ఇస్తోందా ? కాశ్మీర్‌పై తీసుకున్న చర్యలకు మద్దతుగా మీడియాలో ఇచ్చిన కవరేజి, దేశవ్యాపితంగా దిగజారుతున్న ఆర్ధిక వ్యవస్ధ మంచి చెడ్డల గురించి వివరించేందుకు కేటాయిస్తున్న సమయం, స్ధలం ఎంత ?.

కాశ్మీరు ఒక పంజరం అనే ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం వత్తిడి తీసుకురావటంతో క్లబ్‌ నిర్వాహకులు ఆ కార్యక్రమాన్ని రద్దుచేశారు. అదే విధంగా సంత్‌ రవిదాస్‌ దేవాలయ కూల్చివేతకు నిరసనగా కొన్ని సంస్ధల వారు ఢిల్లీలోని మహిళా జర్నలిస్టుల క్లబ్బులో పత్రికా గోష్టి నిర్వహించేందుకు హాలును అద్దెకు తీసుకున్నారు. ప్రభుత్వం క్లబ్‌ నిర్వాహకుల మీద వత్తిడి తీసుకువచ్చి అనుమతిని రద్దు చేయించింది.1992లో బాబరీ మసీదును కూల్చివేయటాన్ని ఖండిస్తూ అనేక మంది పారిశ్రామికవేత్తలు పత్రికలకు ఇచ్చిన యాడ్స్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారని, ఇప్పుడు కాశ్మీర్‌ విషయంలో అలా బహిరంగంగా వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు భయపడుతున్నారని చరిత్రకారుడు రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు. 2015లో అద్వానీ, ఆయనేమీ మోడీ అభిమాని కాదు, వెంటనే గాకపోయినా త్వరలో దేశంలో మరో అత్యవసర పరిస్ధితిని ప్రకటిస్తే తాను ఆశ్చర్యపోనని చెప్పారు.అది తీవ్రమైన అనుమానంగానే వుంటుంది, అయితే ఒక విషయం ఖాయం, దాన్ని సమర్ధించేందుకు మీడియా సిద్దంగా వుంటుంది అని ఎకానమిస్ట్‌ పేర్కొన్నది.

డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను మౌన మునిగా వర్ణించిన నరేంద్రమోడీ అండ్‌ కో ఆయన మాదిరిగా కూడా నోరు విప్పిన పాపాన పోలేదు. సామాజిక మాధ్యమం గురించి జరిపిన పరిశీలనలో 201-18 మధ్య సోషల్‌ నెట్‌వర్క్‌ల సంఖ్య 16.8 కోట్ల నుంచి 32.6 కోట్లకు పెరిగింది. వీటి ద్వారా పాలక బిజెపి అర్ధసత్యాలు, అసత్యాలను పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చింది. వాటికి సమాధానం చెప్పేందుకు ప్రయత్నించిన జర్నలిస్టుల మీద ప్రచారదాడులు జరుగుతున్నాయి. భారత సంస్కృతి పరిరక్షణ, వున్నతి గురించి సుద్దులు చెప్పిన నోళ్లతోనే మహిళా జర్నలిస్టులను నోరు బట్టని బూతులు తిట్టటం, మానభంగాలు చేస్తామని బెదిరింపులు కూడా సాగించిన, సాగిస్తున్న వుదంతాలు తెలిసిందే. విమర్శకుల నోరు మూయించే ఆయుధాలుగా సామాజిక మాధ్యమాలను ప్రయోగిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించిన, విమర్శించిన వారిని దేశద్రోహులుగా, పాకిస్ధాన్‌, చైనా ఏజంట్లుగా, వుగ్రవాదుల మద్దతుదారులుగా ముద్రవేశారు. స్వాతి చతుర్వేది అనే జర్నలిస్టు బిజెపికి చెందిన వారు ఎలా ఈ ప్రచార దాడిని సాగిస్తున్నారో ఒక పుస్తకంలో వివరించారు. తమ పట్ల విమర్శనాత్మకంగా వ్యవహరించే ఛానల్స్‌,పత్రికల యాజమాన్యాల మీద సిబిఐ, ఇడి వంటి సంస్ధలతో దాడులు చేయించటం, ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయటం, అధికారపక్షం నుంచి చర్చలను బహిష్కరించటం వంటి చర్యలు సర్వసాధారణం అయ్యాయి.

తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి గొప్పలు చెప్పుకొనేందుకు మీడియాను నరేంద్రమోడీ ఎలా వుపయోగించుకున్నారో 2018లో ఒక వుదంతం వెల్లడించింది. చత్తీస్‌ఘర్‌కు చెందిన ఒక గిరిజన మహిళా రైతుతో నరేంద్రమోడీ మాట్లాడినదానిని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ధాన్యం బదులు సీతాఫలాలను పండించటం ద్వారా తన ఆదాయం రెట్టింపు అయిందని ఆ మహిళ చెప్పింది. అయితే దాని గురించి అనుమానం వచ్చిన ఎబిపి ఛానల్‌ ప్రతినిధులు ఆ మహిళ వద్దకు వెళ్లి విచారించగా అలా చెప్పాలని బిజెపి నేతలకు తనకు చెప్పినట్లు ఆమె వెల్లడించింది. ఈ వార్తను మాస్టర్‌ స్ట్రోక్‌ కార్యక్రమాన్ని నిర్వహించే పుణ్య ప్రసూన్‌ వాజ్‌పేయి ప్రసారం చేయటంతో ప్రధాని పరువుపోయింది. దాంతో కక్ష గట్టిన ప్రభుత్వం రామ్‌దేవ్‌ బాబా కంపెనీ పతంజలితో సహా దాదాపు వంద కోట్ల రూపాయల విలువగల అనేక ప్రయివేటు కంపెనీల వాణిజ్య ప్రకటనలను ఆ ఛానల్‌కు నిలిపివేయాలని వత్తిడి తెచ్చింది. దాంతో యాజమాన్యం ఆ జర్నలిస్టును బలవంతంగా రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని తృప్తి పరచింది. తన కార్యక్రమంలో మోడీ ప్రస్తావన రాకుండా చూడాలని యాజమాన్యం ఆదేశించిందని, మీడియాలో మోడీ గురించి వస్తున్న వార్తల తీరుతెన్నులను విశ్లేషించేందుకు రెండు వందల మందితో ప్రభుత్వం ఒక విభాగాన్ని ఏర్పాటు చేసిందని, అక్కడి నుంచి మోడీ గురించి ఏమి చెప్పాలో, ఎలా చెప్పాలో సంపాదకులకు ఆదేశాలు వెళతాయని ప్రసూన్‌ వాజ్‌పేయి వెల్లడించారు. దేశంలో విద్వేష నేరాలు ఎలా పెరుగుతున్నాయో తెలిపేందుకు హిందూస్ధాన్‌ టైమ్స్‌లో ఒక పర్యవేక్షణ ప్రారంభించిన బాబీ ఘోష్‌ అనే జర్నలిస్టు పని తీరు ప్రభుత్వానికి నచ్చలేదంటూ యాజమాన్యంపై వత్తిడి తేవటంతో అతను రాజీనామా చేసి ఇంటికిపోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఆ పత్రిక ఆ పర్యవేక్షణను నిలిపివేసింది. లైసన్సు రాజ్యం అంటూ కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించే బిజెపి ఆ విషయంలో తక్కువేమీ తినలేదు. టీవీ ఛానల్స్‌ ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం. బిజెపి ఎంపీ యాజమాన్యంలో, బిజెపి అనుకూల ఆర్నాబ్‌ గోస్వామి నిర్వహణలో రిపబ్లిక్‌ టీవీకి అలా దరఖాస్తు చేయగానే ఇలా అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే మోడీ సర్కార్‌ పట్ల విమర్శనాత్మకంగా వుండే రాజీవ్‌ బహాల్‌ నిర్వహణలో బ్లూమ్‌బెర్గ్‌ క్వింట్‌ సంస్ధ దరఖాస్తు చేసి రెండు సంవత్సరాలు గడిచినా ఎటూ తేల్చలేదు.

Image result for government attack and question of indian media credibility

దేశంలో అతి పెద్ద పారిశ్రామిక సంస్ధ రిలయన్స్‌, దాని యజమాని ముకేష్‌ అంబానీ పెద్ద సంఖ్యలో అన్ని భాషలల్లో ఛానళ్లను ప్రారంభించటం లేదా కొనుగోలు చేసి పెద్ద మీడియా అధిపతిగా మారిన విషయం తెలిసిందే. తన వ్యాపారాలకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారంలో ఎవరుంటే వారికి మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచార అవకాశాలు కల్పించటం, విమర్శలకు దూరంగా వాటిని నిర్వహిస్తారు. కోబ్రాపోస్ట్‌ నిర్వహించిన ఒక శూల శోధనలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ఇండియా టుడే వంటి బడా సంస్ధలతో పాటు 25 మీడియా సంస్ధల ప్రతినిధులు మాట్లాడుతూ ఇచ్చే సొమ్మును బట్టి బిజెపికి ప్రచారంతో పాటు మతపరమైన విద్వేషాన్ని కూడా రెచ్చగొట్టేందుకు సిద్దం అని చెప్పిన విషయాలు వెల్లడయ్యాయి. అంటే మన మీడియా సంస్ధలు డబ్బుకోసం ఎంతకైనా తెగించటానికి సిద్దపడుతున్నాయి.అయితే అన్నీ ఇలాంటి సంస్ధలే లేవు. హిందూ పత్రిక, ఎన్‌డిటివీ వంటి న్యూస్‌ ఛానల్స్‌, వైర్‌, స్క్రోల్‌, బూమ్‌లైవ్‌, న్యూస్‌ మినిట్‌, ఆల్ట్‌న్యూస్‌ వంటి వెబ్‌ మీడియా సంస్ధలు వాస్తవాలను వెల్లడించటానికి వెనుకాడటం లేదు. అలాంటి సంస్ధలు వెల్లడించిన కుంభకోణాలు, అక్రమాల మీద వందల కోట్ల రూపాయల మేర నేరపూరిత పరువు నష్టదావాలను వేస్తూ వాటి నోరు మూయించే ప్రయత్నం జరుగుతున్నది. అలాంటి సంస్ధలకు ఆదాయాలు పరిమితం, ప్రభుత్వ దాడులను తట్టుకొని అవి ఎంత కాలం నిలబడగలవు అన్నది శేష ప్రశ్న.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d