• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: CHANDRABABU

వివాదాస్పద కార్టూన్‌పై తెలుగుదేశం వివేచనతో వ్యవహరిస్తుందా ?

22 Saturday Apr 2017

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

cartoonist, cartoons, CHANDRABABU, derogatory jokes, Nara lokesh, social media, tdp

Image result for controversial cartoon, inturi ravikiran

ఎం కోటేశ్వరరావు

పెద్దలకు మాత్రమే అనే కాప్షన్‌తో ఒక ‘ముదురు’ సినిమా పోస్టర్‌, ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి భవనపు ముందుభాగం ఫొటో, నాన్నారూ నేను పెద్దల సభకే వెళతా అనే కాష్షన్‌తో నారా లోకేష్‌, ఆయన తండ్రి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడి ఫొటోలతో కూడిన ఒక చిత్రం సామాజిక మాధ్యమంలో పెద్ద ప్రాచుర్యం పొందింది. ఇదెలాంటి ప్రభావం చూపిందంటే వంద మంది వంది మాగధుల కొలువు మధ్య ఒక్క విమర్శకుడు నోరు విప్పితే రాజో, యువరాజో, యువరాణికో ఎలా వుంటుంది ? నూరు కాకుల కావ్‌ కావ్‌లే మధురగీతాలుగా తన్మయత్వంతో అప్పటికే వూగిపోతున్న వారి మధ్యలో ఒక్క కోయిల చేరి పాడితే ఎలా కర్ణకఠోరంగా వుంటుందో అలా !

కొన్ని మినహా అన్ని అగ్రశ్రేణి సాంప్రదాయక మాధ్యమాలన్నీ ఆహా ఓహో అంటూ పొగుడుతుంటే సామాజిక మాధ్యమంలో వచ్చిన పై చిత్రం కొంతమందికి అభ్యంతరగా కనిపించటంతో వివాదాస్పదమై, చట్టపరమైన చర్యలకు దారి తీసింది. ఇంటూరి రవికిరణ్‌ వేసిన కార్టూన్‌ ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి భవనాన్ని కించపరిచేదిగా వుందంటూ వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసి, బెయిలుపై విడుదల చేయటం రెండు తెలుగు రాష్ట్రాలు, జాతీయ మీడియాలో కూడా ఒక సంచలన వార్తగా మారింది. మీడియాలో వచ్చిన ఏదైనా అంశంపై ఎవరికైనా అభ్యంతరం అనిపించినపుడు ఇప్పుడేం జరుగుతోంది. సంబంధిత చట్టపరమైన సంస్ధలకు ఫిర్యాదు చేయటం అవి తీసుకొనే చర్యల కోసం కాలయాపన చేయటం కంటే అసలు చట్టాన్నే తమ చేతుల్లోకి తీసుకుంటే పోలా అన్నట్లు అనేక సందర్భాలలో ప్రత్యక్షంగా తేల్చుకొనేందుకు సిద్ధపడుతున్నారు.

రవికిరణ్‌ తయారు చేసిన చిత్రం విషయంలో ముందుగా చేయాల్సింది. ఏ సామాజిక మాధ్యమంలో అయితే అది తిరుగాడుతోందో దాని యజమానులకు ఫిర్యాదు చేసి దానిని ముందుగా వుపసంహరింప చేయించాలి. అదేమీ జరిగినట్లు లేదు. ఎందుకంటే రవికిరణ్‌ అరెస్టు, విడుదల తరువాత కూడా ఆ చిత్రాన్ని చూపమ్మా అని గూగులమ్మ తల్లిని ప్రార్ధిస్తే అంతకంటేనా నీ కోరిక తీరుతుంది భక్తా అన్నట్లు శనివారం సాయంత్రం మూడు గంటల సమయంలో చూపింది. దానిని పాఠకుల సౌకర్యార్ధం  ఇస్తున్నాం.

మీడియాలో సంచలనాన్ని చూసిన తరువాత ఈ చిత్రం ఇంకా అనేక మందిలో ఆసక్తిని రేకెత్తించి సామాజిక మాధ్యమానికి దూరంగా వున్న వారిలో కూడా ఆసక్తిని రేపి మరింత ప్రాచుర్యం పొందింది. ఆ విధంగా నారా లోకేష్‌, నారా చంద్రబాబు నాయుడి ప్రచార గ్రాఫ్‌లు పెరిగాయంటే అతిశయోక్తి కాదు. పైసా ఖర్చు లేకుండా వచ్చిన ఈ ప్రచారానికి ముందుగా ఆ చిత్రం అభ్యంతరంగా వుందని అనిపించిన పెద్దలకు, , రవి కిరణ్‌ను హైదరాబాదులో అరెస్టు చేసి తుళ్లూరుకు తీసుకురావటంలో ఆలశ్యం చేసి ఆసక్తి పెంచిన పోలీసులకు, దీన్నొక సమస్యగా చేసి సామాజిక మాధ్యమంలో చినబాబు, పెదబాబులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారికి ఒక గుణపాఠం చెప్పాలన్న ఆలోచన ముందుగా వచ్చిన వారికి, మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసి కిసుక్కున నవ్వినందుకు అన్నట్లుగా మా బాబులపై వ్యంగ్యాస్త్రం వేసినందుకు కాదు, శాసనమండలిని కించపరిచినందుకు అన్న ఒక తెలివైన పాయింటును ముందుకు తెచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయించిన, చేసిన వారికి, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ వుదంతంతో ప్రమేయం వున్నవారందరికీ ఎవరెన్ని అభ్యంతరాలు పెట్టినా అభినందనలు చెప్పక తప్పదు.

ఇదే జరిగి వుండకపోతే ప్రపంచానికి అనేక విషయాలు మరుగునపడి తెలియకుండా వుండేవి.భావ ప్రకటనా స్వేచ్చ గురించి అన్ని రకాల మీడియాల్లో నలుగురి నోళ్లలో నాని వుండేది కాదు. కొంత మంది గురించి కొందరు చేసిన పప్పు, సుద్ద పప్పు అన్న వ్యాఖ్యలు వారికి తగవు, పప్పులాగా వున్నా వుప్పు, నిప్పుగా నిరూపించుకొనే సందర్భాలు వస్తాయి అని రుజువైంది. ఏ మీడియా అయినా తమ రేటింగ్‌ను పెంచాలి తప్ప మరొక విధంగా చేయకూడదని రాజకీయ నేతలు కోరుకుంటారు తప్ప విమర్శిస్తే వూరుకోరని గతంలోనే మమతా బెనర్జీతో అనేక మంది నిరూపించారు. తెలుగు దేశం పార్టీ కూడా అందుకు మినహాయింపు కాదని రుజువైంది. సరే ఒక పార్టీకి చెందిన మరుగుజ్జు సేన(ట్రోల్స్‌) తమ నేతలపై విమర్శలు చేసిన వారి పట్ల ఎంత ఘోరంగా ప్రవర్తిస్తుందో సామాజిక మీడియాలో విమర్శనాత్మకంగా పరిశీలించే వారందరికీ తెలిసిందే.

చట్టపరంగా రవి కిరణ్‌ రూపొందించిన చిత్రం శిక్షార్హమైనదా, కాదా, ఆ చిత్రాన్ని ఎవరు ఎవరికోసం వేయించారు, ఎందుకు వేశారు, జరిగిన నష్టం ఏమిటి, అందుకు శిక్ష వుంటుందా, తప్పేమీ లేదని కొట్టి వేస్తారా అన్న అంశాలలో కొన్ని వూహా జనితమైనవి. కేసు దాఖలు చేశారు గనుక చట్టం తనపని తాను చేసుకుపోతుంది. ఆయేషా మీరా హత్య కేసులో పోలీసులు ప్రవేశపెట్టిన సత్యం బాబు నేరం చేయలేదని స్వయంగా ఆయేషా తల్లితండ్రులు కేసు విచారణ రోజు నుంచి ఎంత మొత్తుకున్నప్పటికీ పట్టించుకోకుండా చట్టం తనపని తాను చేసి నిర్దోషి అయిన సత్యంబాబును అన్యాయంగా జైలుపాలు చేసిందని తాజా కోర్టు తీర్పుతో వెల్లడైన విషయం తెలిసిందే. అందువలన కొన్ని సందర్భాలలో చట్టం తనపనే గాక అధికారంలో వున్నవారికి చుట్టంగా కూడా పని చేస్తుందని స్పష్టమైంది. సరే తాజా చిత్రం కేసులో ఏమౌతుందో తెలియదు.

ఈ సందర్భంగా జరుగుతున్న చర్చలో ప్రస్తావనకు వస్తున్న అంశాలేమిటంటే పేరుకు శాసన మండలిని కించపరిచారనేది సాంకేతికంగా కేసు బనాయించటానికి తప్ప వాస్తవానికి ఇద్దరు బాబుల ప్రస్తావన వున్నందుకు ఇది ప్రతీకారం అని ప్రజాభిప్రాయంగా వుంది. అనేక మంది రాజకీయ నాయకులు ఈ రోజుల్లో దేవతా వస్త్రాలు ధరించి రాజకీయాలు చేస్తున్నారు. పుణ్యం చేసుకున్న వారికే దేవతా వస్త్రాలు కనిపిస్తాయి అన్నట్లుగా వారి తీరు అందరికీ కనిపించదు. కొన్ని సందర్భాలలో ప్రజాభిప్రాయం కూడా తప్పు కావచ్చు. హిట్లర్‌ మంచివాడే, అతగాడిని బలపరచాలన్న అభిప్రాయం ప్రజలలో కలిగిన అంశం చరిత్రలో తెలిసిందే. అలాగే మన దేశంలో బాబరీ మసీదు కూల్చివేత కూడా ప్రజాభిప్రాయం, అభిష్టం మేరకే బహిరంగంగానే జరిగింది తప్ప దానిలో కుట్రేమీ లేదని చెబుతున్న విషయం తెలిసిందే. తెనాలి రామకృష్ణ సినిమాలో తాను నియోగినని ఎలా కావాలంటే అలా వినియోగపడతానని రామకృష్ణ కవిచేత చెప్పించారు. చట్టపరంగా ఓటింగ్‌ జరిపి తేలింది తప్ప మిగిలిన ప్రజాభిప్రాయాలన్నీ ఎలా కావాలంటే అలా వినియోగపడేవే.

ఒక చట్ట సభను కించపరచవచ్చా అంటే ఎవరూ సమర్ధించరు. కానీ చట్ట సభలలో జరుగుతున్న విషయాలను చూస్తే నేడు వాటి పట్ల ఎందరిలో సానుకూల వైఖరి వుంది. అనేక అవాంఛనీయ విషయాలు ప్రస్తావనకు వస్తున్నాయి, వుదంతాలు జరుగుతున్నాయి. సభాధ్యక్షుల నిర్ణయం మేరకు అనేక అంశాలు రికార్డుల నుంచి తొలగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతున్న కారణంగా అవన్నీ సమాజ రికార్డులలో నమోదు అవుతున్నాయి. వాటిని తొలగించే అవకాశం లేదు. అధికారాన్ని వుపయోగించలేరు. కర్ణాటక, గుజరాత్‌ అసెంబ్లీలలో ప్రజా ప్రతినిధులు, మంత్రులు సైతం తమ సెల్‌ఫోన్లలో బూతు చిత్రాలు చూస్తున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వారిని అరెస్టు చేసి శిక్షించినట్లు వార్తలు లేవు. ఒక వీధిలో ఎ ఇద్దరు కొట్లాడుకున్నా చట్టపరంగా వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవచ్చు. మన దేశంతో సహా అనేక దేశాలలో చట్ట సభలలో కొట్టుకున్న ప్రజాప్రతినిధులపై ఎక్కడా కేసులు నమోదు చేసినట్లు మనకు తెలియదు. తాజాగా తమిళనాడు అసెంబ్లీలో జరిగిన విషయాలు తెలిసిందే. అందుకనే ఒక గూండా బొమ్మ గీసి నా అడ్డా అసెంబ్లీలో వేయాలని వుంది అంటే అది అసెంబ్లీని కించపరిచినట్లు అవుతుందా ? అవదు, అయితే రవి కిరణ్‌ చిత్రంలో ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి అనే బోర్డుతో వున్న భవనపు బొమ్మ వుంది కనుకనే చట్టపరమైన సమస్యలు వచ్చాయి. ఐరోపాలోని ఐర్లండ్‌ పార్లమెంట్‌ భవనపు బొమ్మపై మార్ఫింగ్‌తో సర్కస్‌ టెంటు వేసి సర్కస్‌, ప్రవేశం అని రాశిన బొమ్మను ఎవరైనా చూడవచ్చు. పార్లమెంట్‌ను ఒక సర్కస్‌గా వర్ణించిన ఆ విమర్శకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ బొమ్మను దిగువ చూడండి.

Image result for derogatory jokes,cartoons on legislative buildings, ireland

ప్రముఖ దర్శకుడు విశ్వనాధ్‌ నిర్మించిన ఒక సినిమాలో ఒక పాత్రను మరో పాత్ర దద్దోజనం అని హేళన చేస్తుంది. అలాగే మరో సినిమాలో పండూ అని పిలిస్తే హీరోయిన్‌ ఎంతలా రెచ్చి పోతుందో తెలిసిందే. ఇండ్లలో వున్నంత వరకు కుటుంబ సభ్యులు, బాగా సన్నిహితులైన ఇరుగుపొరుగు పిల్లలకు చిన్నతనంలో పెట్టిన కొన్ని ముద్దు పేర్లు పెద్దయిన తరువాత కూడా వారిని వదలి పెట్టవు. ఎండ పెరిగే కొద్దీ దున్నలు రెచ్చిపోయి పొలందున్నుతుంటాయి, అదే ఎద్దులు ఎండ పెరిగే కొద్దీ నీడలోకి జారుకొనేందుకు లాగుతాయి. రాజకీయాలలోకి అంటే బహిరంగ జీవనంలోకి వచ్చిన తరువాత ప్రత్యర్ధులు కొన్ని పేర్లు పెడుతూ వుంటారు. అలాంటపుడు ఎంత ప్రతికూల వాతావరణం వున్నా పోలిక కాస్త ఇబ్బంది పెట్టినా దున్నపోతుల మాదిరి వాటన్నింటినీ భరించే విధంగా తయారు కావాలి తప్ప ఎద్దుల్లా సున్నితంగా వ్యవహరించకూడదు. లేదంటే రాజకీయాలకు దూరంగా వుండాలి. అనేక దేశాలలో ప్రత్యర్ధుల మీద ఎన్నో జోకులు వేస్తుంటారు. సందర్భం వచ్చినపుడు ప్రత్యర్ధులు కూడా అదే ప్రయోగం చేస్తుంటారు. వాటిని తేలికగా తీసుకోవాలి తప్ప అంతకు మించి పోకూడదు. కెనడా పార్లమెంట్‌ బొమ్మ వేసి ఎంపీలు, స్పీకర్‌పై వేసిన జోకును చూడండి.

Image result for derogatory jokes,cartoons on legislative buildings

క్షమించాలి స్పీకర్‌ గారూ పరస్పరం గౌరవించుకొనే మన యత్నాలలో భాగంగా దానిని మరో రూపంలో నన్ను చెప్పనివ్వండి !

గౌరవ నీయులైన ప్రతిపక్ష సభ్యుడు దయచేసి సున్నితమైన నోటిలో వున్న వాటిని బయటకు రాకుండా మూస్తారా !

చట్ట సభలలో వుపయోగించే భాషపై వేసిన జోక్‌ ఇది. అంటే దాని అర్ధం మొత్తం సభ్యులందరూ అలా వున్నారంటూ మా మనోభావాలను కించపరిచారని ఎవరూ ఆ కార్టూనిస్టు మీద చర్య తీసుకోలేదు. తొలి ప్రధాని నెహ్రూ ప్రభుత్వం, మంత్రుల వ్యవహారశైలి గురించి ప్రముఖ కార్టూనిస్టు శంకర్‌ తన చిత్రాల ద్వారా ఏకి వదలి పెట్టేవారు. ఒక సందర్భంలో నెహ్రూ నన్ను కూడా వదలి పెట్టవద్దని శంకర్‌తో అన్నారని అందరం చదువుకున్నాం.పూటకో పార్టీ మారుతున్న, అలాంటి వారిని నిస్సంకోచంగా పార్టీలలో చేర్చుకుంటున్న నేటి రాజకీయ నాయకులు కూడా చదువుకోవటం అవసరం.

గీతలతో తమ భావాలను స్వేచ్చగా వెలిబుచ్చే వారికి చట్టపరమైన అవగాహన కూడా అవసరం అని గతంలో కూడా అనేక అనుభవాలు రుజువు చేశాయి. ఐరోపాలోనో మరొకచోటో అలాంటి కార్టూన్లు వేస్తే సహించారు కదా ఇక్కడెందుకు చేయరు అని వాదిస్తే లాభం లేదు. అక్కడా చట్టాలున్నాయి.మనం బూతు అనుకొనే పదాలతో మరింత పచ్చిగా విమర్శలు, వ్యాఖ్యలు చేయటాన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకొనే దశను వారు దాటిపోయారు. పార్టీ మారిన వారు పూర్వపు పార్టీ పదవులకు రాజీనామా చేయాలన్నది ఒక నాటి నీతి. అలాంటిదేమీ లేదు ఏ పార్టీ గుర్తు మీద గెలిచినా చివరకు మంత్రి పదవులు కూడా పుచ్చుకోవచ్చన్నది నేటి ఆచరణ. అంటే సిగ్గుపడే దశను దాటి ముందుకు పోయాం. అలాంటి వారిపై గౌరవనీయ చట్ట సభలు, వాటి అధిపతులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. రక్షిస్తున్నారనే ఫిర్యాదులు, విమర్శలున్నాయి. రాజ్యాంగాన్ని అమలు జరిపే గవర్నర్లు సైతం అలాంటి వారి చేత ప్రమాణ స్వీకారాలు చేయిస్తున్నారు. మన రాజ్యాంగం, చట్టాలు, నిబంధనలలో వున్న లొసుగుల కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. గతంలో దిగంబర కవులుగా పేరు పెట్టుకున్న వారు పార్లమెంటు, అసెంబ్లీలను ఎలా తిట్టిపోశారో తెలిసిందే. ఇప్పుడు చట్ట సభలు, వాటిలో జరుగుతున్న వాటి గురించి నైతికంగా ఆలోచించే వారందరూ దిగంబరు కవులు కాకుండానే వాటిని ఏవగించుకుంటున్నారు. ఈ పూర్వరంగంలో సాంకేతికపరమైన, చట్టపర అంశాలకు అతీతంగా ఆలోచించి మందలింపుతోనో మరొక చర్యతోనో సరిపెట్టి కార్టూనిస్టు రవి కిరణ్‌పై క్రిమినల్‌ చర్యలను వుపసంహరిస్తే తెలుగు దేశం పార్టీకి సామాజిక మాధ్యమంలో జరిగిన నష్టం నివారించబడుతుంది. అటువంటి విశాల వైఖరిని వారు ప్రదర్శిస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కావాల్సింది వృధా చర్చా ! నమ్మక ద్రోహంపై రచ్చా !

04 Thursday Aug 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ap special status, BJP, center's betrayal, CHANDRABABU, tdp

ఎం కోటేశ్వరరావు

     పుష్కర స్నానాల వలన పుణ్యం వస్తుందని బలంగా విశ్వసించటానికి కొంత మందికి ఎలా స్వేచ్ఛ వుందో అదొక మూఢనమ్మకం అని నమ్మేవారికి కూడా అంతే స్వేచ్చ మన దేశంలో వుంది. అందువలన సందర్భం వచ్చినపుడు దాని మంచి చెడ్డలను చర్చించటం తప్పుకాదు. వ్యతిరేక అభి ప్రాయాన్ని వ్యక్తీకరించటం ద్వారా మా మనోభావాన్ని దెబ్బతీశారని ఎవరైనా దెబ్బలాటకు వస్తేనే సమస్య. ప్రపంచంలో ప్రతి మతం, కులం, తెగ ఇలా ఎన్ని తరగతులుంటే అన్నింటికీ సారూప్యత గలిగిన మూఢనమ్మకాలు,ఆచారాలకు కొదవ లేదు. ఆధునిక ప్రవచన కారులు సరికొత్త మూఢనమ్మకాలను ఎక్కిస్తున్నారు. పుష్కరాలనేవి ఒక మతానికి చెందిన నమ్మకం తప్ప వేరు కాదు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పన్నెండు రోజుల పాటు పన్నెండు అంశాల మీద రోజుకొకదానిపై చర్చా గోష్టులు, సదస్సులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. రాష్ట్ర ప్రజానీకంలో పెద్ద ఎత్తున ఆశలు రేకెత్తించటానికి, ఓట్లు దండుకోవటానికి, చివరకు నమ్మక ద్రోహానికి మారుపేరుగా మారిన రాష్ట్ర ప్రత్యేక హోదా రాకపోతే ఏం చేయాలో, ఇప్పటికే చేయాల్సిందానికంటే ఎక్కువే చేశాం లెక్కలు చెప్పటం లేదంటున్న బిజెపి నేతల ప్రచార వాస్తవ అవాస్తవాలేమిటో ఒక సమగ్ర శ్వేత పత్రం ప్రకటించి పన్నెండు కోణాలలో పన్నెండు రోజులు చర్చలు జరపమని చంద్రబాబు నాయుడు రచ్చ చేసి వుంటే చర్చ సమంజసంగా వుండేది. కనీసం జనానికి వాస్తవాలు ఏమిటో అన్నా తెలిసేవి. కేంద్రం ఇచ్చే ప్రత్యేక నిధులతో ఆర్ధిక లోటు తీర్చి, ప్రత్యేక హోదాతో వచ్చే ఆకర్షణీయ రాయితీలతో పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్ర రూపు రేఖలు మార్చివేస్తామని చెప్పిన వారు అసలు ఆ ఆంశాలనే చర్చనీయాంశాల జాబితాలో లేకుండా చేశారు. పుష్కరాలలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసినట్లుగా ప్రత్యేక హోదాకు కూడా అదే చేస్తారా ? చిత్రం ఏమంటే ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేని ఒక మూఢనమ్మకం, ఒక మతానికి చెందిన కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వం జరప తలపెట్టిన చర్చలో సమాజ పురోగతికి అవసరమైన శాస్త్రీయ భావజాలాన్ని చర్చ నీయాంశంగా చేయకపోవటం. అసలు మత క్రతువుల సందర్భంగా ఇలాంటి కిరస్తానీ చర్చలేంటి అనే ‘గురజాడ అగ్నిహోత్ర అవధానులు’ ఎవరైనా వుంటే అది వేరే విషయం.

     చర్చ చేయండని చంద్రబాబు చెప్పిన పన్నెండు అంశాలు విజన్‌ 2050లో పేర్కొన్నవాటికి మించి సామాన్యజనానికి ఆసక్తి కలిగించేవి కొత్తగా ఏమన్నా వుంటే వాటి గురించి చర్చించవచ్చు. అన్నింటికీ మించి విచారకరమైన అంశం ఏమంటే రాష్ట్రాల హక్కులు, ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ముందుకు వచ్చిన తెలుగు దేశం పార్టీ ఇప్పుడు అంతకంటే మెరుగైన పరిస్థితేమీ లేకున్నా, నమ్మక ద్రోహం జరిగిందని యావత్‌ ప్రజానీకం భావిస్తున్న స్ధితిలో గతాన్ని గోతిలో పారవేసి ఏం చేసినా పొత్తు పెట్టుకున్నోళ్లతో సర్దుకు పోక తప్పదన్న వైఖరి తీసుకోవటం ఒక విషాదం. రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధి విషయాలలో తాను రాజకీయాలు చేయనని, అందుకు ఇతర సందర్భాలుంటాయని చంద్రబాబు అనేకసార్లు చెప్పి పెద్ద రాజనీతిజ్ఞుడిగా అనేక మంది ప్రశంసలు పొందారు. ఇప్పుడు రాజ్యసభలో బిజెపి తప్ప అన్ని పార్టీలు ప్రత్యేక హోదా గురించి ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన తరుణంలో పరిణితితో అన్ని పార్టీలను ఏకత్రాటిపై నడిపించి కేంద్రంపై వత్తిడి పెంచాల్సిన చంద్రబాబు అందుకు భిన్నంగా తాను, తన సైనికుల ద్వారా రాజకీయాలు మాట్లాడించి నిజమైన రాజనీతిజ్ఞుడు, రాష్ట్రంకోసం నిజాయితీగా పని చేస్తున్నారు అనే పేరు తెచ్చుకొనే అవకాశాన్ని జారవిడుచుకున్నారు.ప్రత్యేక హోదా విషయంలో మిగతా పార్టీలను కలుపుకుంటే దాని ద్వారా పొందే రాజకీయలబ్ది తగ్గుతుందనుకున్నారా ? తద్విరుద్ధంగా ప్రవర్తించి బిజెపిని ఒక్క మాట కూడా అనకుండా మొదటికే మోసం తెచ్చుకొనేందుకు పునాది వేసుకున్నారా ? గోదావరి పుష్కరాలలో మునిగి పుణ్యం పొంది ప్రత్యేక హోదా, కనీసం లోటు పూడ్చుకొనేందుకు నిధులు కూడా తెచ్చుకోలేకపోయారు. మరి ఆ పుణ్యం ఏమైనట్లు ?

     ఇక్కడ మరొక అంశాన్ని ప్రస్తావించటం సందర్భ సహితం అని భావిస్తున్నాను.ముస్లిం లేదా ఇస్లాం హాజ్‌ సబ్సిడీలను 2022 నాటికి రద్దు చేయాలని ఒకవైపు సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే అదే సమయంలో హిందు క్రతువులకు ప్రజల సొమ్మును ఖర్చు చేయటం విపరీతంగా పెరిగిపోతోంది. అవి పుష్కరాలు, కుంభమేళాలు, మానస సరోవర, చార్‌ధామ్‌ వంటి యాత్రలు ఏవైనా కావచ్చు. వాటి సందర్భంగా పెడుతున్న ఖర్చు హాజ్‌ సబ్సిడీల కంటే ఎంతో ఎక్కువగా వుంటోందా లేదా ? హాజ్‌ మాదిరి నగదు సబ్సిడీ ఇవ్వకపోవచ్చు, అందుకోసం ఏర్పాట్ల పేరుతో చేసే ప్రజాధనం ఖర్చు సంగతేమిటి ? ప్రతి సేవకూ రుసుము చెల్లించాల్సిందే ఏదీ వుచితం కాదు అని చెబుతున్న ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాల సందర్బంగా చేసే ఖర్చులకు ఒక ఖాతాను తెరిచి అందుకయిన ఖర్చును, వాటిలో పాల్గొన్నవారి నుంచి రాబడితే అది విమర్శలకు తావుండదు. అలా చేయటం లేదే ! పుష్కర యాత్రీకులను ఘాట్ల వద్దకు చేర్చేందుకు వుచితంగా బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రవాణాశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ప్రకటించారు. అసలే ఆర్టీసి నష్టాల్లో వుందని చెబుతూ ఇలా చేయటాన్ని ఎవడబ్బ సొమ్మని రామచంద్రా అన్నట్లు ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారు ?

    బ్రిటీష్‌ వారి కాలంలో రాణీగారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన హాజ్‌ సబ్సిడీ స్వాతంత్య్రం తరువాత కూడా కొనసాగించారు. స్వాతంత్య్రపోరాట కాలంలో ముస్లింలను పోరుబాట నుంచి వేరు చేయటానికి తెల్లవారు అనేక ఎత్తుగడలు వేశారు. వాటిలో ఇది కూడా ఒకటి. విమానాలు రాక ముందు ఓడలే ప్రయాణ సాధనాలు కనుక బ్రిటీష్‌ ప్రభుత్వం తమ దేశ ఓడల కంపెనీ ఓడ ఎక్కి సౌదీ వెళ్లిన వారికే సబ్సిడీ అని కూడా నిబంధన విధించినందున దానిలో కూడా షిప్పింగ్‌ కంపెనీ ప్రయోజనాలు దాగి వుంటాయనటంలో ఎలాంటి సందేహం లేదు.తెల్లవారిని తరిమేసి వారి స్ధానంలో అధికారానికి వచ్చిన నల్లవారు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలలో భాగంగా దానిని కొనసాగించారని చేసే విమర్శలో వాస్తవం లేకపోలేదు. చేసిన మార్పేమిటంటే ఓడల రాయితీని విమానాలకు వర్తింప చేశారు. అది కూడా ప్రభుత్వ రంగ విమానాలకే వర్తిస్తుంది. ఇది లౌకిక వాదానికి విరుద్ధం అంటూ కొందరు కోర్టుకు వెళ్లారు. దానిని విచారించిన సుప్రీం కోర్టు 2012లో ఒక తీర్పు ఇస్తూ 2022 నాటికి సబ్సిడీని పూర్తిగా ఎత్తివేయాలని ఆదేశించింది. ఈ సబ్సిడీని హిందూత్వ శక్తులు మతకారణంతో వ్యతిరేకిస్తే, మాకు సబ్సిడీ ఇచ్చే పేరుతో ఎయిరిండియాను బతికించేందుకు ప్రభుత్వం దానికి మాత్రమే ఇచ్చిందని, ఇతర కంపెనీల రేట్ల కంటే ఎయిరిండియా రేట్లు ఎక్కువని విమర్శించే ముస్లింలు కూడా లేకపోలేదు.

    పుష్కరాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి.ఒక మత పుష్కరాలను రాష్ట్ర వేడుకగా నిర్ణయించటం లౌకిక వ్యవస్ధకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమా, అనుకూలమా ? గతేడాది గోదావరి, ఈ ఏడాది కృష్ణా పుష్కరాల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పెడుతున్న ఖర్చు, చేస్తున్న హడావుడి గతంలో ఎన్నడూ లేదంటే అతిశయోక్తి కాదు.ఎన్నడూ లేని కొత్త కొత్త పద్దతులను ప్రవేశపెడుతున్నారు. నిజంగా పుష్కరుడు వుండి వుంటే గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన దానికి నిరసనగా కృష్ణా పుష్కర బహిష్కరణ జరిగేదేమో? పుష్కరాల కంటే ముఖ్యమంత్రుల కీర్తి కండూతిని పెంచుకోవటం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. దేశ విదేశాల్లో వున్న వారికి, రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నవారికి , షరా మామూలుగా గ్రామాలు, పట్టణాలలోని ప్రజా ప్రతినిధులు, ముఖ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సంతకంతో కూడిన ఆహ్వానాలు పంపటం ప్రచార ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. వాటి కాంట్రాక్టు పుచ్చుకున్న ముద్రణా సంస్ధలకు తప్ప వాటిని అందుకున్నవారికి, అందుకయ్యే అనవసర ఖర్చు భరించే జనానికి ఒక్క పైసా ప్రయోజనం వుంటుందా? హాజ్‌ సబ్సిడీని రద్దు చేస్తూ అందుకు చేసే ఖర్చును కావాలంటే మైనారిటీల సామాజిక, విద్యా అభివృద్ధికి ఖర్చు చేయవచ్చని సుప్రీం కోర్టు చెప్పిన సలహా ఇతర సందర్భాలకు వర్తించదా ?

   రెండు సంవత్సరాలు గడిచినా చేసిన ప్రధాన వాగ్దానాలలో ఒక్కటి కూడా అమలు జరపని స్ధితి.కొంతకాలం రాజధాని భూ సేకరణ, మరికొంత కాలం రాజధాని ఎలా వుండాలి, మరి కొంత కాలం తాత్కాలిక రాజధాని నిర్మాణం, మరి కొంత కాలం శాశ్వత రాజధాని ఎలా నిర్మించాలి, దానికి అప్పు ఎలా తేవాలి ఇలా ఆవు వ్యాసం రాసిన మాదిరి కాలక్షేపం చేయటం, ప్రతి సందర్భాన్ని అతిశయోక్తులతో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజల దృష్టి మళ్లించటం తప్ప మరొకటి కనిపించటం లేదు. ఇలాంటి వాటికి బుట్టలో పడేంత ఆమాయకంగా ఆంధ్రులు వున్నారా ? ఎవరైనా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అతి సర్వత్ర వర్జయేత్‌ అన్నారు పెద్దలు. అతిగా ప్రచారంలో జనాన్ని ముంచితే తామూ దానిలోనే మునుగుతారని గ్రహించటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అంతరాష్ట్ర మండలిలో తెలుగు చంద్రులేం ప్రసరించారు ?

18 Monday Jul 2016

Posted by raomk in AP, BJP, CPI(M), Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Others, Telangana

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, inter state council meet, Inter-State Council, ISC, KCR, Modi

ఎం కోటేశ్వరరావు

     పది సంవత్సరాల తరువాత జూలై 17న న్యూఢిల్లీలో సాదాసీదాగా అంతరాష్ట్ర మండలి సమావేశం జరిగింది. కేంద్రం-రాష్ట్ర సంబంధాలు, ముఖ్యంగా నిధులు, విధుల బదలాయింపులు, రాష్ట్రాల హక్కుల గురించి చర్చ జరుగుతుందని ఎవరైనా భావిస్తారు. సమాఖ్య స్పూర్తికి విరుద్ధంగా కేంద్రం ఎలా వ్యవహరిస్తున్నదో దశాబ్దకాలం పాటు అసలు సమావేశం జరగపోవటమే తేటతెల్లం చేసింది. ఈ విషయంలో కాంగ్రెస్‌-బిజెపి దొందూ దొందే. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌ మదన్‌ మోహన్‌ పంఛి అధ్యక్షతన 2007 ఏప్రిల్‌ 27న బాధ్యతలు స్వీకరించిన కమిషన్‌ 2010 మార్చి 30 కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. ఎలాంటి ప్రచార ఆర్బాటాలు లేకుండా తన పని తాను చేసిన కమిషన్‌గా ఇది పేరు తెచ్చుకుంది. అప్పటి నుంచి ఆ కమిషన్‌ నివేదికకు కాంగ్రెస్‌ హయాంలో నాలుగు సంవత్సరాలు, బిజెపి ఏలుబడిలో రెండు సంవత్సరాలు దుమ్ము పేరుకు పోయింది.దీనిలోని సిఫార్సులను ఏకాభిప్రాయంతోనే కేంద్రం అమలు జరుపుతుందని ముక్తాయింపుగా ప్రధాన మంత్రి నరేంద్ర అంతరాష్ట్ర మండలి సమావేశ ముగింపులో చెప్పారు. అంటే దీని సిఫార్సులు ఎప్పుడు ఆమోదం పొందుతాయో తెలియని స్ధితి.

    తెల్లవారే సరికి ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్ధానంలో నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టగలిగిన బిజెపికి కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఆసక్తి, అన్నింటికీ మించి నిజాయితీ వుంటే ఈ నివేదికపై సమావేశం జరపటానికి రెండు సంవత్సరాల వ్యవధి తీసుకోవాల్సిన అవసరం లేదు. సమాఖ్య స్పూర్తిని, రాజ్యాంగ నిబంధనలను దెబ్బతీయటంలో కాంగ్రెస్‌ రికార్డును తిరగరాసేందుకు బిజెపి పూనుకుందని వుత్తరాఖండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసేందుకు చేసిన పనులను బట్టి స్పష్టమైంది. తమది భిన్నమైన పార్టీ అని స్వంత డబ్బా కొట్టుకొని ఇతరులను విమర్శించే నైతిక హక్కును అది కోల్పోయింది. పూంఛీ కమిషన్‌ సిఫార్సులకు వ్యతిరేకంగా అది వ్యవహరించింది.తమది పనిచేసే ప్రభుత్వమని, కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన అని చెప్పుకున్న పార్టీ, ప్రభుత్వం ఈ సమావేశ ఏర్పాటుకు ముందే కమిషన్‌ చేసిన సిఫార్సులలో వేటిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందో వేటిని తిరస్కరించిందో, వేటిపై చర్చ జరగాలని కోరుకుంటోందో ఒక వైఖరిని తీసుకొని రాష్ట్రాల ముందు వుంచితే వాటి మంచి చెడ్డలపై మధనం జరిగి, ఒక కొలిక్కి వచ్చేందుకు దారి చూపేది. అదేమీ లేకుండా మొక్కుబడిగా సాగదీసేందుకు పూనుకుంది.

    ఇప్పటికే కేంద్రం-రాష్ట్రాల మధ్య వున్న సంబంధాలు, సత్సంప్రదాయాలు, వివిధ సమస్యలపై కోర్టులు వెలువరించిన అభిప్రాయాలతో కమిషన్‌ తాను వుచితం అనుకున్న సమస్యలన్నింటిపైన అభిప్రాయాలు తెలిపే విధంగా ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. సుదీర్ఘకాల కాంగ్రెస్‌, మధ్యలో అధికారంలోకి వచ్చి స్వల్పకాలమే వున్న జనతా, నేషనల్‌ ఫ్రంట్‌, బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వాలుగానీ గతంలో వివిధ కమిషన్లు చేసిన సిఫార్సులను తుచ తప్ప కుండా లేదా వాటి స్ఫూర్తిని గానీ అమలు జరిపిన పాపాన పోలేదు. అందువలన కమిషన్లు అంటే సాగదీయటానికి, రిటైరైన న్యాయమూర్తులు, వున్నతాధికారులకు వుపాధి కల్పన అంశాలుగా మారాయంటే అతిశయోక్తి కాదు, దాంతో జనానికి వాటిమీద విశ్వాసం పోయింది.పూంఛీ కమిషన్‌ సిఫార్సులు కూడా గత కమిషన్ల జాబితాలో చేరతాయా ?

    పూంఛీ కమిషన్‌ చేసిన ప్రధాన సిఫార్సుల సారాంశం ఇలా వుంది.కల్లోలం సంభవించిన నిర్దిష్ట ప్రాంతాలను పరిమిత కాలం పాటు కేంద్రం తన పాలన కిందకు తెచ్చుకొనేందుకు ఆర్టికల్‌ 355,356ను సవరించాలి. ఒక జిల్లా లేదా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో స్ధానిక అత్యవసర పరిస్ధితిని ప్రకటించేందుకు కేంద్రానికి అధికారం ఇచ్చే విధంగా 355,356 ఆర్టికల్స్‌ను సవరించాలి. అయితే అలాంటి అత్యవసర పరిస్థితి వ్యవధి మూడునెలలకు మించి వుండకూడదు. మత హింసాకాండ తలెత్తినపుడు రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో నిమిత్తం లేకుండా స్వల్పకాలం పాటు కేంద్ర దళాలను దించేందుకు కేంద్రానికి అనుమతిచ్చే విధంగా మత హింసాకాండ బిల్లుకు సవరణ చేయాలి. సాయుధ దళాలను దించేందుకు రాష్ట్రాల అనుమతి ఆటంకంగా మారకుండా సవరణ చేయాలి.అయితే బలగాల మోహరింపు ఒక వారానికి మాత్రమే పరిమితం చేయాలి. అంతకు మించి వుండేందుకు రాష్ట్రాల అనుమతి తీసుకోవాలి.ముఖ్యమంత్రుల నియామకానికి సంబంధించి ఎన్నికలకు ముందు వున్న ఎన్నికల కూటమిని ఒక రాజకీయ పక్షంగా పరిగణిస్తూ స్పష్టమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించాలి. ఎవరికీ మెజారిటీ రాని పక్షంలో గవర్నర్లు ఏ పద్దతిని పాటించాలో కూడా స్పష్టం చేయాలి.ఎన్నికలకు ముందు వున్న కూటములలో ఎక్కువ సంఖ్య వున్నదానిని ఆహ్వానించాలి.ఎన్నికల అనంతరం ఏర్పడే కూటములలోని పార్టీలన్నీ ప్రభుత్వంలో చేరే విధంగా నిర్దేశించాలి. ఒక మంత్రిపై చర్య తీసుకోకూడదని మంత్రివర్గం చేసిన సిఫార్సును తోసిపుచ్చి చర్యకు అనుమతి మంజూరు చేసే అధికారం గవర్నర్లకు వుండాలి. గవర్నర్లను విశ్వవిద్యాలయాల చాన్సలర్లుగా చేసే సాంప్రదాయాన్ని రద్దు చేయాలి. గవర్నర్లుగా నియమితులయ్యే వారు స్ధానిక స్ధాయిలలో కూడా నియామకానికి ముందు కొన్ని సంవత్సరాల పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా వుండాలి. గవర్నరు సంబంధిత రాష్ట్రానికి చెందకూడదు, ప్రముఖ వ్యక్తి అయివుండాలి. గవర్నర్లను నిరంకుశంగా తొలగించకూడదు, గవర్నర్లను రాజకీయ ఫుట్‌బాల్‌ మాదిరి పరిగణించటాన్ని నిలిపివేయాలి.గవర్నర్లను ఐదేళ్ల కాలానికి నియమించాలి, మధ్యలో వారిని తొలగించాలంటే అసెంబ్లీ అభిశంసన ద్వారా మాత్రమే జరగాలి. తొలగింపునకు కారణం బాధ్యతల నిర్వహణకు సంబంధించినదై వుండాలి. గవర్నర్‌ నియామకంలో ముఖ్యమంత్రి పాత్ర వుండాలి. గవర్నర్ల నియామకానికి ప్రధాని, హోంమంత్రి, లోక్‌సభ స్పీకర్‌, సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలి.ఈ క్రమంలో వుపరాష్ట్రపతికి కూడా ప్రమేయం కల్పించవచ్చు.ఈ సిఫార్సులపై కూలంకషంగా చర్చ జరగాలి. అంతరాష్ట్ర మండలి సమావేశాలు ఏడాదికి మూడు సార్లు జరపాలి. జాతీయ సమగ్రతా మండలిని కనీసం ఏడాదికి ఒకసారి సమావేశ పరచాలి. ఎక్కడైనా మతపరమైన సమస్య తలెత్తినపుడు వెంటనే మండలిలోని ఐదుగురు సభ్యులను అక్కడికి పంపి నివేదిక తెప్పించుకోవాలి. రాష్ట్రాలపై ఏకాభిప్రాయ బాధ్యతను పెట్టబోయే ముందు కేంద్రం తన వైఖరి ఏమిటో తెలపాలి. నరేంద్రమోడీ అధికారానికి రాకముందే ఈ సిఫార్సులను చేశారు. ఒక వేళ వాటిని బిజెపి లేదా ఎన్‌డిఏ ఆమోదిస్తున్నట్లయితే వాటి స్ఫూర్తితో నిర్ణయాలు చేసి వుండవచ్చు. ఆచరణలో గవర్నర్ల విషయంలో సిఫార్సులకు విరుద్ధంగా వ్యవహరించటాన్ని మనం చూశాము.

   నువ్వొకందుకు పోస్తే నేనొకందుకు తాగా అన్నట్లుగా కేంద్రం మొక్కుబడిగా నిర్వహించిన ఈ సమావేశం సందర్భంగా కొందరు ముఖ్యమంత్రులు, పార్టీలు కూడా అదే విధంగా వ్యవహరించాయి. అంతరాష్ట్ర మండలి సమావేశ ప్రారంభంలో ప్రధాని ప్రసంగిస్తూ పన్నుల వాటాను 32 నుంచి 42కు పెంచామని, 2014-15తో పోలిస్తే రాష్ట్రాలకు మరుసటి ఏడాది 21శాతం ఎక్కువ నిధులు ఇచ్చామని చెప్పారు. మరోవైపు వాస్తవాలు అంకెలు వేరే సందేశాన్ని ఇస్తున్నాయి. రాష్ట్రాలకు ఇస్తున్న గ్రాంట్లలో గణనీయమైన కోత పెడుతున్నది కేంద్రం. ఇది కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో ఒక ముఖ్యమైన అంశం. కేంద్రం గొప్పగా చెబుతున్న 32 నుంచి 42 శాతం పన్నుల బదిలీ 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల ప్రకారం జరుగుతుంది. బదిలీ 2015 ఏప్రిల్‌ ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వ్యవధిలో జరపాలి. అంటే ఐదేండ్ల వరకు క్రమంగా పెంచుకుంటూ పోయి ఐదవ ఏట నుంచి ప్రతి ఏటా పదిశాతం నిధుల బదిలీ జరుపుతారు.దీనికి అనుగుణంగా 2015-16లో రాష్ట్రాలకు జిడిపిలో 6.3శాతం నిధులను బదలాయించాలని ప్రతిపాదించారు.సవరించిన అంచనాల ప్రకారం అది 6.1శాతానికి తగ్గింది. వాస్తవ బదిలి తరువాత గానీ తెలియదు.కేంద్రం నుంచి రాష్ట్రాలకు రెండు రకాలుగా బదిలీ జరుగుతుంది. ఒకటి పన్నుల బదిలీ. దానికేమీ షరతులు వుండవు.రెండవది గ్రాంట్లు. వీటికి సవాలక్ష షరతులు విధిస్తారు. ఇది కూడా కేంద్ర-రాష్ట్ర సంబంధాలలో వివాదాస్పద అంశమే. గతేడాది జిడిపిలో 3.4శాతం పన్నులను రాష్ట్రాలకు బడ్జెట్‌లో చూపారు. అది సవరించిన అంచనాలలో 3.7శాతానికి పెరిగింది. చూశారా మేం ఎంత వుదారంగా వున్నామో కేంద్రం గొప్పలు చెప్పుకోవచ్చు. పన్నులలో వాటాను పెంచినప్పటికీ అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గతేడాది సర్‌చార్జీలు, సెస్‌ల రూపంలో వసూలు చేసి కేంద్ర ఖజానాకు చేర్చిన మొత్తం పన్ను ఆదాయంలో 6.1 నుంచి 8.1 శాతానికి పెరిగింది.ఈ మొత్తంలో రాష్ట్రాలకు వాటా వుండదు. గ్రాంట్లుగా రాష్ట్రాలకు బడ్జెట్‌లో 2.9శాతం చూపి సవరించిన దానిలో 2.4కు తగ్గించారు.వర్తమాన సంవత్సరంలో ఈ కేటాయింపులు ఎలా అమలు జరుగుతాయో చూడాల్సి వుంది. అందువలన ఆర్ధిక మంత్రి, నరేంద్రమోడీ ఏం చెప్పినప్పటికీ ఆచరణ ఏమిటన్నదే గీటురాయి. సేవా, రైతుల పేరుతో వసూలు చేసే సెస్సులన్నీ కేంద్ర ఖాతాకే పోతాయి అంటే కేంద్రానికి చేరే నిధుల శాతం మరింతగా పెరుగుతుంది.

    కేంద్ర పధకాల పేరుతో రాష్ట్రాలపై మోపుతున్న భారాల గురించి తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వంటి వారు ప్రముఖంగా తమ వైఖరిలో వెల్లడించారు.కేంద్ర ప్రాయోజిత పధకాలన్నీంటికీ గ్రాంట్ల రూపంలో తొలుత కేంద్రం నిధులు కేటాయిస్తుంది. తరువాత అసలు కధ మొదలౌతుంది. నరేంద్రమోడీ చెప్పినట్లు పన్నుల వాటా ఖరారు గాక ముందు కేంద్రం నుంచి రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు బదిలీ అయ్యాయి. పన్నుల వాటాను 42శాతానికి పెంచేందుకు అంగీకరించిన కేంద్రం,ఆ వెంటనే ఎలక్ట్రానిక్‌ పాలన, మోడల్‌ స్కూళ్ల వంటి ఎనిమిది పధకాలకు అంతకు ముందు వున్న 60:40 దామాషాలో వున్న నిధుల కేటాయింపులో కేంద్ర వాటాను తగ్గించింది. మిగతా పధకాలకు నిధుల విడుదలకు షరతులను కఠినతరం గావించింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదిలీ అయ్మే నిధుల మొత్తం పెరిగిన తరువాత రాష్ట్రాల రుణ భారం, ఆర్దిక వత్తిడి తగ్గాలి. అయితే బడ్జెట్లలో చూపిన దానికంటే 16 రాష్ట్రాలు ఎక్కువగా అప్పులు తీసుకున్నట్లు జపాన్‌ సంస్ధ నోమురా నివేదిక తెలిపింది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయటాన్ని కేరళ ముఖ్యమంత్రి తప్పుపట్టారు. పూంఛీ కమిటీ సిఫార్సులపై చర్చకు ఒక స్టాండింగ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.

     తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో చేసిన ప్రసంగ పూర్తి పాఠాలను మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు తన రీతికి తగినట్లుగా 13పేజీల ప్రసంగం చేస్తే చంద్రశేఖరరావు ఏడు పేజీలకే పరిమితం అయ్యారు. అందువలన వారిద్దరూ ఏం చెప్పారనే అంశాన్ని పరిశీలించుదాం. తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రసంగ సారాంశం ఇలా వుంది. జాతీయ రహదారులకు కేంద్రం కేటాయింపులు పెంచటం మంచిదే అదే సమయంలో సాగునీరు, విద్య, ఆరోగ్య రంగానికి కూడా నిధులు పెంచాలి. సాగునీటి రంగంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక భారీ పధకానికి కేంద్రం నిధులు ఇవ్వాలి.వుమ్మడి జాబితాలోని అంశాలకు సంబంధించి కేంద్రం ఏదైనా నూతన చట్టం లేదా వున్న వాటికి సవరణలు తీసుకురాదలిస్తే ప్రతి సందర్భంలోనూ రాష్ట్రాల ఆమోదం తీసుకోవాలి. ఒక వేళ ఆర్ధికంగా భారం మోపేదైతే కేంద్రమే పూర్తిగా చెల్లించాలి. వుదాహరణకు విద్యాహక్కు చట్టాన్ని అమలు జరపాలంటే ఏటా తెలంగాణా ఒక్కదానికే 300 కోట్ల రూపాయలు అవసరం. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మోడల్‌ స్కూళ్ల వంటి వాటికి ఇప్పుడు నిధులు పూర్తిగా నిలిపివేశారు, వేతనాలు, ఇతర ఖర్చులు రాష్ట్రాలకు భారం అవుతున్నాయి. కేంద్రం ప్రకటించే ఏ పధకానికైనా మధ్యలో నిధులు నిలిపివేయటం గాక దాని నిర్వహణకు అయ్యే పూర్తి మొత్తాన్ని కేంద్రమే భరించాలి. వుమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర ప్రభుత్వ సంస్ధల ఏకపక్ష అదుపును నివారించాలి. వుదాహరణకు విశ్వవిద్యాలయాలు నిరభ్యంతర సర్టిఫికెట్‌ ఇవ్వకుండా కాలేజీలకు ఏఐసిటిఇ అనుమతులు ఇవ్వరాదు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన సమాయానికి ఈ సంస్ధ అనుమతులు ఇచ్చిన ఇంజనీరింగ్‌ కాలేజీలు 356వరకు వున్నాయి.తగిన వసతులు లేని కారణంగా విశ్వవిద్యాలయాలు అనుబంధాలను రద్దు చేసిన కారణంగా వాటి సంఖ్య 172కు పడిపోయాయి. కొద్ది సంఖ్యలో వున్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు యుజిసి నిధులలో 65శాతం, మిగతావాటన్నింటికీ కలిపి 35శాతం నిధులు ఖర్చు చేయటం అన్యాయం.గవర్నర్ల ఎంపికలో రాష్ట్రాలను సంప్రదించాలి. ఏదైనా ఒక బిల్లును నిరవధికంగా నిలిపివుంచే విచక్షణాధికారం గవర్నర్లకు వుండకూడదు, ఒక కాలపరిమితి నిర్ణయించాలి. విశ్వవిద్యాలయాలకు గవర్నర్లను ఛాన్సలర్లుగా చేయరాదన్న పూంఛీ కమిషన్‌ సిఫార్సుకు మద్దతు ఇస్తున్నాం, దానిని ఇప్పటికే అమలు జరిపాము. అంతరాష్ట్ర నదీ జలవివాదాలపై ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్‌ నిర్ణీత వ్యవధిలో ఇచ్చే విధంగా నిర్ధేశించాలి, కేంద్రం మరింత నిర్ణయాత్మక పాత్ర వహించాలి.

      ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రసంగ సారాంశం ఇలా వుంది. సర్కారియా, ప్రస్తుత పుంఛీ కమిషన్‌ సిఫార్సులకు విరుద్దంగా ఏకపక్షంగా రాష్ట్ర విభజన చేశారు. అది అశాస్త్రీయంగా వుండటమే గాక మిగిలిన ఆంధ్రప్రదేశ్‌కు ఇబ్బందులను కలిగించింది.అందరికీ వర్తించేదిగా ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి భిన్న ప్రమాణాలను పాటించారు. వుదాహరణకు జనాభాలో 58శాతం వున్న రాష్ట్రానికి వుమ్మడి రాష్ట్ర ఆదాయంలో 46శాతమే కేటాయించారు. అప్పులను జనాభా ప్రాతిపదికన, ఆస్థులను మాత్రం ఎక్కడివి అక్కడే అన్న పద్దతిలో పంచారు. విద్యుత్‌ రంగంలో వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారు. రాష్ట్ర దుస్థితిని తగ్గించేందుకు ప్రధాన మంత్రి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నది.పొరుగు రాష్ట్రాలతో పోటీ పడేందుకు కేంద్రం మౌలిక సదుపాయాల కల్పన, ఆర్ధికంగానూ ఎంతో సాయం చేయాల్సి వుంది.రాష్ట్ర విభజన సందర్భంగా రాజ్యసభలో ప్రధాన మంత్రి చేసిన హామీలన్నింటినీ అమలు జరిపేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాటిలో అత్యంత ముఖ్యమైన ప్రత్యేక రాష్ట్ర తరగతి హోదా, రాజధాని నిర్మాణానికి ప్రత్యేక నిధులు, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి పూర్తి చేయటం, విశాఖ రైల్వే జోన్‌ మంజూరు, పరిశ్రమలకు పన్నుల రాయితీలు కల్పిస్తూ వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక పధకం, వనరుల లోటు పూడ్చేందుకు అవసరమైన గ్రాంటు మంజూరు చేయాలి. చివరి రాష్ట్రంగా వున్నందున ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటున్నది, గోదావరి, కృష్ణ బోర్డులను ఈ రోజు వరకు వేయలేదు.

     గవర్నరన్లు ఐదేండ్ల వ్యవధికి నియమించాలన్న పూంఛీ సిఫార్సుల వంటికి కొన్ని ఆచరణ సాధ్యం కాదు, తగిన విధంగా లేవు.గవర్నర్ల అభిశంసనకు అనుసరించాల్సిన పద్దతిపై సిఫార్సు అంగీకారం కాదు. బిల్లుల ఆమోదం, సూచనలకు ఆరునెలల వ్యవధి అవసరం లేదు, ఒక నెల చాలు. స్ధానికంగా అత్యవసర పరిస్ధితి విధింపునకు 355,356 ఆర్టికల్‌ను సవరించకూడదు. అది రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని అతిక్రమించటమే. ఆర్ధిక మంత్రుల సాధికార కమిటీ పనితీరును చూసిన తరువాత ఇతర రంగాలకు అలాంటి సాధికార కమిటీలను వేయటం సరైంది కాదు. రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తే పెద్ద రాష్ట్రాల ప్రయోజనాలకు నష్టం. కేంద్ర బలగాలను ఏకపక్షంగా నియమించటం ఫెడరలిజం సూత్రానికే విరుద్దం.జల వివాదాలపై ట్రిబ్యునళ్లు ఇచ్చిన తీర్పులపై అప్పీలుకు సుప్రీం కోర్టుకు వెళ్లాలనటం సరైంది కాదు, రాజ్యాంగ బద్దంగా అప్పిలేట్‌ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలి.

    ఇద్దరు ముఖ్య మంత్రులు చేసిన ప్రసంగ పాఠాలను చూసినపుడు చంద్రశేఖరరావు ఆర్ధికాంశాలపై ఎక్కువగా కేంద్రీకరించారు.చంద్రబాబు నాయుడు వాటిని దాదాపుగా విస్మరించారు. ఎవడబ్బ సొమ్మంటూ కేంద్రంపై ధ్వజమెత్తిన ఎన్‌టిరామారావు వారసులమని చెప్పుకొనే చంద్రబాబు నాయుడు ఏపీకి ఇస్తామన్న నిధుల గురించి అడిగారు తప్ప రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధులు, విధుల గురించి విస్మరించటం విస్మయం గొలుపుతోంది. మాకు మా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తే చాలు ఇంకేమీ లేదు, బంగారు తెలంగాణాగా మార్చుకుంటాం అని వేర్పాటు వాదాన్ని ముందుకు తెచ్చిన చంద్రశేఖరరావుకు కేంద్ర పధకాల భారపు సెగతగలటం, తెలంగాణాను బంగారంగా మార్చటం సాధ్యం కాదని అర్ధమైందేమో అనివార్యంగా నిధుల గురించి నిర్మొహమాటంగా చెప్పాల్సి వచ్చింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చంద్రబాబు-వైఎస్‌ జగన్‌ తిట్ల దండకంలో ఎవరిది తప్పు, ఒప్పు

05 Sunday Jun 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, tdp, YS jagan, ys jagan vs chandrababu, ysrcp

ఎం కోటేశ్వరరావు

   ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడిని చెప్పులతో కొట్టాలని ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించటంపై రెండు పార్టీల మధ్య మరోసారి మాటల యుద్ధం జరుగుతోంది. కవి చౌడప్పకు సమాజం మీద కోపం వచ్చి తిట్లదండకం రచించారు. మరి ఈ పార్టీల వారికి ఏమి వచ్చి అందుకు పాల్పడుతున్నారో తెలియదు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకులు ప్రత్యేకించి తెలుగుదేశం-వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వారు కొన్ని సార్లు సభ్యతగా మాట్లాడినపుడు మాట్లాడుతున్నది మనవారే అని వారి అభిమానులకే అనుమానం వస్తుంది, నీరసపడిపోతారు. రాజకీయాలంటే తిట్లు, నిందలుగా తయారు చేసి కార్యకర్తలకు, జనానికి గంజాయి దమ్ము వంటి కిక్కు ఎక్కించారు. అది లేకపోతే డీలా పడిపోతారు. దొందూ దొందే అన్నట్లు ఎవరూ తక్కువ కాదు. ఎవరినైనా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా తిట్లకు దిగటం అంటేనే విమర్శలలో పసలేక వాటిని ఆశ్రయిస్తున్నారని లేదా అసలు విషయాల నుంచి పక్కదారి పట్టించేందుకు ప్రయత్నపూర్వకంగా చేస్తున్నారని అనుకోవాలి.

    ముఖ్యమంత్రి చంద్రబాబును చెప్పులతో కొట్టాలని అది బాగాలేదంటే చీపుర్లతో కొట్టాలని ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించటం కొంత మందికి వినోదంగా మరికొందరికి అభ్యంతరంగా కనిపిస్తోంది. అదే చంద్రబాబు , తెలుగుదేశం మంత్రులు, నేతలు జగన్‌ను నేరస్థుడు, దొంగ వంటి ఎన్నో పద ప్రయోగాలు చేసినపుడు కూడా పైన చెప్పిందే జరిగింది. అందువలన ఎవరు ఎవరిని తప్పుపట్టాలి? వారికి వారు కూర్చుని నిర్ధారించుకుంటే తప్ప దీనిని ఎవరు ముందు ప్రారంభించారని తేల్చటం కూడా కష్టమే. ఒక ప్రముఖుడిని చెప్పుతో, చీపుర్లతో కొట్టాలి అని విమర్శించటం చట్టవిరుద్దమా, సభ్య సమాజంలో పలకాల్సిన మాట కాదా ? కానీ ఏ నేరం రుజుకు కాకుండానే ఒకరిని నేరస్ధుడు అని వర్ణించటం చట్ట బద్దమా ? జగన్‌ కొట్టాలి అన్నారు, కానీ తెలుగు తమ్ముళ్లు అనంతపురం జిల్లాలో ఏకంగా చెప్పులతో దాడి చేసి కొట్టి చూపించారు. ఏది మంచో ఏది చెడో ఎవరూ వినే పరిస్థితి లేదు. ఒక అసహ్యకర పరిస్థితిని రెండు పార్టీలూ సృష్టించాయన్నది మాత్రం స్పష్టం. దాని నుంచి వెనక్కు తగ్గే చైతన్యం, సంస్కారాన్ని ఎవరు ముందు ప్రదర్శిస్తారో చూడాలి.

    చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఫిరాయించిన వైసిపి ఎమ్మెల్యేలతో కలసి సంఖ్యా పరంగా ఎంతో బలంగా కనిపిస్తున్నారు. కానీ అనూహ్యంగా రాజకీయంగా ఎంతో బలహీనపడి పోయారు.ఎప్పుడైతే కేంద్రం నుంచి ఆశించింది రాకపోవటంతో శాశ్వత రాజధానికి అట్టహాసంగా శంకుస్థాపన చేసి తాత్కాలిక రాజధానిపేరుతో కొన్ని వందల కోట్ల రూపాయలను తగలేస్తున్నారో అప్పుడే చంద్రబాబు బలహీనత వెల్లడైంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోగా వూరించిన పాకేజీకీ కూడా గతి లేకపోయింది. అయినా కేంద్ర ప్రభుత్వాన్ని, బిజెపిని కనీసం సానుకూల విమర్శలు కూడా చంద్రబాబు చేయలేకపోయారు. తన ఎంఎల్‌ఏలు ఒక్కొక్కరుగా జారిపోతుంటే జగన్‌ నిస్సహాయుడై గుడ్లప్పగించి చూస్తూ సంఖ్యా పరంగా బలహీనపడిపోయారు. పోయినవారు పోగా ఇంకా ఎంత మంది మిగులుతారన్నది ప్రశ్న. అయితే ఇదే సమయంలో చంద్రబాబు తన వాగ్దానాలు, విజన్‌ రంగుల కలలు మసకబారి పోయేకొద్దీ ఆ బలహీనతను ఆధారం చేసుకొని రాజకీయంగా దాడి చేయటానికి రాబోయే రోజుల్లో జగన్‌కు ఇంకా అవకాశాలు పెరగవచ్చు. కేంద్ర ప్రభుత్వంపై పల్లెత్తు విమర్శ చేయకుండా చంద్రబాబుకే పరిమితమైతే జనం మెచ్చరని, అనుమానిస్తారని జగన్‌ గుర్తించాలి.

    బిజెపి నేతలు ఒకవైపు తమ కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశమంతటా సభలు, ప్రదర్శనలు పెడుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో విభజన కారణంగా తాము నష్టపోయామని చెబుతున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పునర్‌నిర్మాణం పేరుతో దీక్షలను పాటిస్తోంది. కేంద్ర ప్రభుత్వ విజయాలు దానికి కనిపించే స్ధితి లేదు.అలాగే రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని చూసే స్ధితిలో బిజెపి నేతలూ లేరు. ఈ తరుణంలో కోరని వరంలా జగన్‌ విమర్శలు తెలుగుదేశం పార్టీ వారి నోళ్లకు పని చెప్పి వుత్సాహాన్ని నింపాయి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహించిన రెండు సంవత్సరాల కాలంలో ఎన్నో చేశానని చెబుతున్నారు. ఇప్పుడు ఆమె స్ధానాన్ని రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు అలంకరించారు. రైల్వే ప్రత్యేక జోన్‌ ఎలాగూ ఇచ్చే, వచ్చే పరిస్ధితి కనిపించటం లేదు, కనీసం దీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న రైల్వే ప్రాజెక్టులలో రానున్న మూడు సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్కటి పూర్తి అయినా మద్దతు ఇచ్చి అందలం ఎక్కించినందుకు చంద్రబాబు జన్మ ధన్యమైనటే.్ల .

Share this:

  • Tweet
  • More
Like Loading...

విశ్వసనీయతను దిగజార్చుకుంటున్న చంద్రబాబు

02 Thursday Jun 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Congress party, special status to Andhra pradesh

ఎం కోటేశ్వరరావు

   ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ జనాలను వెర్రివాళ్ల కింద జమకడుతున్నారా ? తన విశ్వసనీయతను తానే దెబ్బతీసుకుంటున్నారా ? ఇది ప్రతిపక్ష పార్టీల వారికి వస్తున్న ఆలోచన కాదు, స్వంత బుర్రలను వుపయోగించి తెలుగు దేశం పార్టీని పది కాలాలపాటు పరిరక్షించుకోవాలని కోరుకొనే కార్యకర్తలలో కూడా తలెత్తున్న ప్రశ్న. విజయవాడ బెంజి సర్కిల్‌లో జూన్‌ రెండవ తేదీన నవ నిర్మాణ దీక్ష పేరుతో చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని చూసిన తరువాత కలుగుతున్న సందేహాలివి.

   ముఖ్యమంత్రి, అనుచర గణం రాష్ట్ర నవనిర్మాణం కోసం దీక్ష అనే ఒక పెద్ద బ్యానర్‌ కింద మౌనంగా కూర్చొని వుంటే ఎంతో హుందాగా వుండేది. లేదూ తస్మదీయ పత్రికలు, ఛానళ్ల వారిని,తెలుగుదేశం కార్యకర్తలను సంతోష పెట్టేందుకు అసలు ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు సంవత్సరాలలో జరిగిందేమిటి? జరగాల్సిందేమిటి? విభజన సమయంలో కేంద్రం చేసిన చట్టం, వాగ్దానాలు ఏమిటి ? అవి ఎంతవరకు అమలు జరిగాయి? జరగకపోతే ఎదురైన సమస్యలేమిటి మొదలైన అంశాలతో రాష్ట్ర ప్రజల ముందు శ్వేత పత్రం పెట్టి ఏం చేయాలో చర్చించండని ఒక్క మాట చెప్పి వుంటే జనం అర్ధం చేసుకొని వుండేవారు. తమ నిర్ణయం తాము తీసుకొని వుండేవారు.

     అటువంటి సదవకాశాన్ని చంద్రబాబు చేతులారా పోగొట్టుకున్నారు. వుపాధి హామీ పధకం కింద జనానికి పని కల్పించినా లేకపోయినా, బాబొస్తే జాబొస్తుందని ఎదురు చూస్తున్న జనాలు గోళ్లు గిల్లు కుంటూ కూర్చున్నా, వున్న వుద్యోగాలు కూడా వూడగొడుతున్నారని అనేక మంది చిరుద్యోగులు నిస్సహాయులైన స్ధితిలో వున్నా, వెంకయ్య నాయుడు చెప్పినట్లు ఎవరికైనా దేవదూతేమో గాని తమకు మాత్రం మాత్రం సైతాన్‌గా పరిణమించారని నరేంద్రమోడీ గురించి ఆంధ్ర ప్రదేశ్‌ జనం భావిస్తున్న తరుణంలో చంద్రబాబు వుభయుల పక్షాన ప్రతిపక్షాలకు మాత్రం చేతి నిండా పని కల్పిస్తున్నారు. సమీప భవిష్యత్‌లో తనను సవాలు చేసే ప్రతిపక్ష పార్టీ ఏదీ లేదని, జనం విసుక్కున్నా, తిట్టుకున్నా తిరిగి తనకు తప్ప మరొకరికి పట్టం కట్టే అవకాశం లేదన్న ధీమాతో చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారా ? గతంలో కాంగ్రెస్‌ కూడా ఇలాంటి చులకన భావంతోనే ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించి ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో తెలియంది కాదు. గతం మాదిరి కాకపోయినా, పాత్రలు మారినా కొత్త రూపంతో చరిత్ర పునరావృతం కాక తప్పదు.

     గతంలో చంద్రబాబు ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు, అదేమిటంటే ఎన్నికలపుడు మాత్రమే రాజకీయాలు చేస్తాను, మాట్లాడతానని మిగతా సమయాలలో రాష్ట్ర అభివృద్ధి తప్ప తనకు మరొకటి పట్టదని, ప్రతిపక్షాలు ప్రతిదానిని రాజకీయం చేస్తున్నాయని ఆరోపించేవారు. ఒకవైపు గత రెండు సంవత్సరాలుగా దేశ, విదేశాలలో పెట్టుబడులు కోసం తిరిగిన దారి ఖర్చులు తప్ప పర్యటనలు ఏ మేరకు ఫలించాయో కనిపించటం లేదు. తరుణం రాక ముందే కూసిన కోయిల మాదిరి కొత్త రాజధాని నిర్మాణానికి ఐదు లక్షల కోట్ల రూపాయలు కావాలని రాష్ట్రం విడిపోక ముందే కోరిన చంద్రబాబు కేంద్రం నుంచి ఐదువేల కోట్ల రూపాయలు కూడా తీసుకురాలేక, వచ్చిన డబ్బుతో తాత్కాలిక రాజధాని కడుతున్నారని జనం సానుభూతి చూపుతున్నారు. తొలి బిడ్డ పెళ్లికి అవసరమైన డబ్బు సంగతి తేల్చుకోకుండానే అన్నీ కుదుర్చుకొని, చివరకు ముహూర్తాలు కూడా పెట్టుకొని పనులు మొదలు పెట్టిన తరువాత అప్పు ఇస్తానన్న వారు సొమ్ము ఇవ్వకపోతే ఆ గృహస్థు పరిస్థితి ఎలా వుంటుందో ప్రత్యేక రాష్ట్ర హోదా గురించి జనానికి కలిగించిన ఆశలు కూడా అలాగే కల్లలయ్యాయి. అప్పు ఇస్తామన్న వారు కనీసం మధ్యవర్తితో అయినా కొద్ది రోజుల ముందు డబ్బు సర్దుబాటు కాలేదు ఇవ్వలేకపోతున్నాము వేరే చూసుకోండని కబురు చేస్తారు. అదేమి చిత్రమో ఐదు కోట్ల ఆంధ్రప్రజలు ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తున్న ప్రత్యేక హోదా, లోటు నిధుల భర్తీ , పాకేజ్‌ల గురించి ప్రధాని నరేంద్రమోడీ వులకరు పలకరు, అవుననీ చెప్పరు కాదనీ చెప్పకపోగా ఇప్పటికే చాలా ఇచ్చామని పార్టీ వారి చేత చెప్పిస్తున్నారు, ఎవరైనా ప్రశ్నిస్తే ఇచ్చిన దానికి లెక్కలు చెప్పమంటున్నారు. ప్రత్యేక హోదా గురించి వూరించి చివరికి పొమ్మనకుండా పొగబెట్టినట్లు, ఇంక దాని గురించి అయితే న్యూఢిల్లీ రావద్దు అని జనానికి బాగా స్పష్టమయ్యే రీతిలో సందేశాలు పంపారు.

     ఇటువంటి స్ధితిలో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. దీనికంటే మౌనంగా దీక్ష చేసి వుంటే అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో పాటు అధోగతి పాలు చేస్తున్న బిజెపి గురించి కూడా చంద్రబాబు ఆగ్రహంతో వున్నారని అయినా జనం అనుకొనే వారు. చంద్రబాబు చెబుతున్నట్లు అసాధారణ రీతిలో అప్రజాస్వామికంగా పార్లమెంట్‌లో ఎలా విభజన బిల్లును ఆమోదించిదీ పదే పదే చెప్పనవసరం లేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో అదేగా చెప్పారు. ఇప్పుడు ఆ కాంగ్రెస్‌లేదు, అలాంటి పని చేసిన వారికి రాష్ట్ర శాసన సభలో కనీసం ప్రాతినిధ్యం కూడా లేకుండా జనం తగిన విధంగా తీర్పు నిచ్చారు. అంతటితో ఆ అధ్యాయం ముగిసింది. ఇంకా చంద్రబాబు దాని గురించి మాత్రమే మాట్లాడితే ఆయన విశ్వసనీయత సమస్య తలెత్తుతుంది. రెండు కళ్ల సిద్దాంతాలు చెప్పి విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ చరిత్ర చెరిగిపోదు. పార్లమెంట్‌లో చట్టం చేస్తున్న సమయంలో కాంగ్రెస్‌ ఒక్కటే లేదు, అంతకంటే ఎక్కువ హడావుడి చేసిన బిజెపి ఏం చేసింది? పోనీ వారేమీ చిన్న పిల్లలు, తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టిన వారు కాదే. అందువలన చంద్రబాబు చెప్పినట్లు సంబరాల బదులు విభజన కారణంగా జరిగిన అన్యాయానికి దీక్షలు చేయాల్సి రావటానికి కాంగ్రెస్‌ ఎంత కారకురాలో బిజెపి కూడా అంతే బాధ్యురాలు. కాంగ్రెస్‌ అధికారం నుంచి పోయింది. ఇంకా మూడు సంవత్సరాలు అధికారంలో కొనసాగాల్సిన బిజెపికి న్యాయం చేయాల్సిన బాధ్యత లేదా ? అలాంటి పార్టీతో స్నేహం కొనసాగించాలా లేదా అనేది తెలుగు దేశం పార్టీ ఇష్టం. తమ్ముడు తమ్ముడే న్యాయం న్యాయమే బిజెపి కూడా ఏపికి న్యాయం చేయలేదు అనే మాట చెప్పటానికి నోరు రావటం లేదే. అవ్వతో వసంత మాడినట్లు అన్నీ అయి పోయిన కాంగ్రెస్‌ను మాత్రమే విమర్శిస్తే అది జనాన్ని మభ్యపెట్టే రాజకీయం తప్ప మేలు చేసేది కాదు.

    విభజన చేసి అప్పులు మాత్రమే జనాభా దామాషాలో పంచారు, ఆస్థులు మాత్రం ఎక్కడివి అక్కడే అన్నారని చంద్రబాబు మాట్లాడుతున్నారు. సచివాలయం, ఇతర ప్రభుత్వ భవనాలను తరలించుకుపొమ్మని చెబితే చంద్రబాబు తీసుకు వస్తారా? అనేక రాష్ట్రాలను విడగొట్టారు. ఎక్కడైనా ఎక్కడి ఆస్థులు అక్కడే వుంచారు, అప్పులు పంచారు తప్ప మరొక పద్దతిని పాటించలేదు. పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా, మరో పదేండ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా దేశంలో ఒక రికార్డు సృష్టించిన చంద్రబాబుకు నిజంగా ఈ మాత్రం తెలియదా ? తెలిసినా ఎందుకు ఇలాంటి అంశాలను జనం మెదళ్లకు ఎక్కిస్తున్నారు ? ఒక సీనియర్‌ రాజకీయవేత్తగా విశ్వసనీయత కోల్పోవటం, పోసుకోలు కబుర్లకు తప్ప దాని వలన ఆంధ్రప్రదేశ్‌కు ఏమైనా వుపయోగం వుంటుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మహానాడు జయప్రదంగా జరిగింది, అయితే ఏమిటి ?

30 Monday May 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Amitshaw, BJP, CHANDRABABU, Nara lokesh, tdp, tdp mahanadu, YS jagan, ysrcp

ఎం కోటేశ్వరరావు

   తిరుపతిలో తెలుగుదేశం మహానాడు మూడు రోజుల సువార్త కూటములు ముగిశాయి. రాష్ట్ర దేవదూత చంద్రబాబు నాయుడు అన్నీ తానే అయి తెలుగు రాష్ట్రాల ప్రతినిధులకు సందేశాలను అందచేశారు. ఇదే సమయంలో కేంద్ర దేవదూత నరేంద్రమోడీ ప్రభుత్వ విజయ గానోత్సవాలు దేశమంతటా ప్రారంభమయ్యాయి. అయితే ఏమిటి అన్న సామాన్యుల ప్రశ్నలకు సమాధానాలు మాత్రం దొరకటం లేదు. తిరుపతిలో మిగిలిపోయిన తీర్మానాలు లేదా అక్కడ చేసిన వాటినే పునరుద్ఘాటిస్తూ జూన్‌ రెండున విజయవాడలో నవ నిర్మాణ దీక్ష చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అసలు సమస్యల గురించి తేల్చకుండా ఎన్ని దీక్షలు చేసినా ఆ ప్రాంతంలో జనాన్ని ట్రాఫిక్‌ ఇబ్బందులకు గురిచేయటం తప్ప సాధించేదేమీ వుండదు. గతేడాది దీక్ష ఫలితంగా ఏం సాధించారో చెప్పి ఈ ఏడాది ఎందుకు చేస్తున్నారో చెబితే అర్ధం వుంటుంది.

    ఇటు చంద్రబాబు మూడు రోజుల ప్రసంగాలు, ఆయన వంది మాగధుల స్త్రోత్రాలు, అటు కేంద్రంలో నరేంద్రమోడీ వుపన్యాసాలు, భజనపరుల కీర్తనలు అతిశయోక్తులతో నిండి దాదాపు ఒకే విధంగా వున్నాయి. సందేశ, వుపదేశ, భజన వ్యూహాలను బహుశా ఒకటి కొంటే ఒకటి వుచితం అన్నట్లుగా ఒకే నిపుణుల బృందం రెండు చోట్లా సమకూర్చి వుండాలి. చేసిన పనులను వాస్తవాలతో నిమిత్తం లేకుండా పెద్దవి చేసి చెప్పటం (తమపాలనలో దేశం వెలిగిపోతోంది అన్న ప్రచారం చేసి 2004 ఎన్నికలలో ఆరిపోయిన విషయాన్ని నరేంద్రమోడీ, చంద్రబాబు మరిచి పోయి లేదా గోబెల్స్‌ను ఆదర్శంగా అయినా తీసుకొని వుండాలి), ఆత్మస్తుతి, పరనిందలతో మోతెక్కించారు. కాంగ్రెస్‌ తన ప్రభుత్వానికి ఆటంకం కలిగిస్తున్నదని మోడీ చెబితే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తమ పాలనకు ఆటంకం కలిగిస్తున్నదని తెలుగుదేశం మహానాడు తీర్మానించింది. వాస్తవం ఏమంటే కేంద్రంలో కాంగ్రెస్‌కు లోక్‌సభలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యమే లేదు, వైఎస్‌ఆర్‌సిపికి వున్నా ప్రయోజనం లేని పార్టీగా కనిపిస్తున్నది. అవ్వతో వసంత మాడినట్లు రెండు చోట్లా రెండు సంవత్సరాల తరువాత కూడా వాటిపై దాడి చేస్తూ కాలం గడుపుతున్నారు. తన ప్రభుత్వం చేసిన అవినీతి ఏదైనా వుంటే చూపమని ఢిల్లీలో మోడీ సవాలు విసిరితే, తన ప్రభుత్వంలో అవినీతి లేదుకను రాత్రుళ్లు హాయిగా నిద్రపోతున్నానని చంద్రబాబు, తన మీద అవినీతి ఆరోపణలను రుజువు చేస్తే తానే వెళ్లి జైల్లో కూర్చుంటానని కుమారుడు నారా లోకేష్‌ తమ ప్రసంగాలలో చెప్పారు.

    ఈ రెండు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు, పువ్వు పుట్టగానే పరిమళించినట్లు( లోకేష్‌ తొమ్మిదో, పదో చదువుతుండగానే 1996లో తాత్కాలిక మైన ప్రధాని పదవి చేపట్ట వద్దని తనకు సలహా యిచ్చినట్లు చంద్రబాబు నాయుడు మహానాడు సందర్భంగా విలేకర్లతో ఇష్టాగోష్టిగా వెల్లడించారని వార్తలు)కుమారుడు లోక్‌ష్‌, మంత్రులు గత రెండు సంవత్సరాలుగా దేశ, విదేశాలలో తిరిగి తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని, పెట్టుబడులు పెట్టేవారికి ఎన్నో రాయితీలు వస్తాయి గనుక రా రమ్మని ఆహ్వానాలు పలికి వచ్చారు. ఇప్పుడు అది రాదని తేలిపోయింది. పాండవులకు చివరకు ఐదూళ్లు కాదు కదా సూది మోపినంత స్ధలం కూడా ఇవ్వం అని కౌరవులు స్పష్టం చేసినట్లుగా ఏపికి ప్రత్యేక హోదా కాదు కదా ప్రత్యేక పాకేజి కూడా సాధ్యం కాదని బిజెపి వారు తేల్చిపారవేశారు. మరి ఇప్పుడేమి చేస్తారు?

    పద్నాలుగవ ఆర్ధిక సంఘం నిబంధనలు ప్రత్యేక హోదాకు ఆటంకంగా వున్నాయని పిట్టకధలు చెబుతున్నారు. అటువంటపుడు ఆ నిబంధనలు ప్రత్యేక పాకేజికి కూడా ఆటంకమే కదా. లేకుంటే గత రెండు సంవత్సరాలుగా ఎందుకు ఇవ్వలేదు. పోనీ ఇప్పటికైనా సూటిగా ఎందుకు తేల్చరు? ప్రపంచంలో పెట్టుబడులు ఎక్కడ లాభం వుంటే అక్కడకు తరలుతాయి. టాటా తన నానో కార్ల ఫ్యాక్టరీని బెంగాల్‌ నుంచి భారీగా రాయితీలు ఇచ్చిన గుజరాత్‌కు తరలించారు. మిగతా రాష్ట్రాలు పోటీ పడలేకపోయాయి. వుమ్మడిగా వున్నపుడే ఆంధ్రప్రదేశ్‌ పోటీ పడలేక అనేక పరిశ్రమలను ఇరుగు పొరుగు రాష్ట్రాలకు పోయేట్లు చేసింది. ఇప్పుడు అసలే ఇబ్బందుల్లో వున్న స్థితిలో స్వంత నిధులతో రాయితీలు ఇచ్చి ఆకర్షించటం సాధ్యమయ్యేదేనా ? కేంద్రం ఇతర రాష్ట్రాలలో వెనుక బడిన ప్రాంతాలకు ఇస్తున్న మాదిరే ఆంధ్రప్రదేశ్‌కూ ఇస్తున్నది తప్ప దయా దాక్షిణ్యం కాదు, లోటు భర్తీ చేస్తామన్న వాగ్దానాన్ని కూడా కేంద్రం నెరవేర్చటం లేదని స్వయంగా చంద్రబాబే చెబుతున్నారు. ఈ స్ధితిలో వుద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు మహానాడు ఇచ్చిన సందేశం లేదా భరోసా ఏమిటి ?

   తెలుగు దేశం మహానాడు జరుగుతున్న కాలంలోనే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హైదరాబాదు పర్యటనకు వచ్చారు. తెలుగు దేశం పార్టీ 2019 తెలంగాణాలో అధికారానికి రావాలని తీర్మానం చేసిన సమయంలోనే తామే ప్రత్యామ్నాయంగా ఎదగాలని అమిత్‌ షా తెలంగాణా బిజెపికి దిశానిర్ధేశం చేశారు. అంటే తెలుగు దేశం పార్టీని పక్కకు నెట్టేయమనేగా ? ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి నేతలు పదే పదే మాట్లాడుతున్నదేమిటి ? దేశమంతటా చెబుతున్నదేమిటి? తమకు అవకాశం లేని చోట పాగా వేయటానికి ప్రాంతీయ పార్టీలను సోపానాలుగా చేసుకోవటం తరువాత, వాటిని పక్కన పెట్టి తమ చుట్టూ తిప్పుకోవటమేగా. మహారాష్ట్రలో బలంగా వున్న శివసేన, అసోంలో వున్న ఏజిపీలను బిజెపి అలాగే పక్కకు నెట్టివేయలేదా ? కర్ణాటకలో జరిగిందేమిటి ? తెలుగు దేశం పార్టీతో సఖ్యత తెగకొట్టుకున్నది తాము కాదనే పేరు తెచ్చుకోకుండా బిజెపి జాగ్రత్త పడుతున్నది. తెలంగాణాలో తెలుగు దేశం పార్టీ ఫినిష్‌ అయిందన్న అంచనాతోనే బిజెపి నేతలు తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ వైఖరిని వెల్లడించేందుకు అది సమయం కోసం ఎదురు చూస్తున్నది. విజయోత్సవాలలో భాగంగా విజయవాడలో కూడా బిజెపి ఒక కార్యక్రమాన్ని తలపెట్టింది.

     కేంద్రం ఇప్పటికే ఎంతో చేసింది, వాటికి లెక్కలు చెప్పాలంటున్న బిజెపి నేతలకు సమాధానంగా మహానాడులో ఇప్పటి వరకు జరిగిందేమిటో శ్వేత పత్రం ద్వారా వెల్లడించి వుంటే రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు వెల్లడి అయి వుండేవి. భక్తులు స్వామీజీల, బాబాల వుపన్యాసాలు వినేందుకు ఎంతో భక్తి శ్రద్ధలతో వెళతారు. బోధనలు విన్నంత సేపు అలాగే వుండాలనుకుంటారు. ఇంటికి వచ్చిన తరువాత షరా మామూలే. అలాగే తెలుగు దేశం కార్యకర్తలు, జనానికి వుపన్యాసాలతో చంద్రబాబు బోధలు చేసి పంపారు. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులలో ప్రత్యామ్నాయ పంటల పధకాల గురించి ప్రభుత్వాలు ఆలోచిస్తాయి, ప్రత్యేక హోదా రాకపోవటం, లోటు భర్తీకి చర్యలు తీసుకోకపోవటం, రాజధాని నిర్మాణానికి తగినన్ని నిధులు ఇవ్వకపోవటం కూడా అంతకంటే తక్కువేమీ కాదు. ప్రభుత్వానికి దిశా నిర్ధేశం చేసే మహానాడు ఈ విషయంలో ఆలోచించిన ప్రత్యామ్నాయం ఏమిటి ? 2050వరకు ఎలాంటి ఆటంకం లేకుండా అధికారంలో వుండాలని వూదరగొట్టటంద్వారా యువతకు వుద్యోగాలు వస్తాయా ?అవినీతి, కేసుల గురించి వూకదంపుడుగా చెప్పటమే తప్ప సత్వర విచారణకు తీసుకున్న చర్యలు లేవు, తెలుగుదేశం పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లేదా తండ్రీ ,కొడుకులు ప్రతిపక్ష నేతపై ఎంత కాలం శాపనార్ధాలు పెడుతూ, తిట్టిపోస్తూ ఎంత కాలం గడుపుతారు? దాని వలన రాష్ట్రానికి ఒరిగేదేమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

వాచ్‌మన్ల జాతి పిత నరేంద్రమోడీ

29 Sunday May 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, Literature., Others

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, Narendra Modi, tdp, tdp mahanadu, telugudesam, YS jagan

ఎం కోటేశ్వరరావు

సార్‌ నేను అర్ధరాత్రి తరువాత నిద్రపోతానని మీరంతా అంటారు, ఇక నుంచీ నేను నరేంద్రమోడీ మాదిరి కాపలాదారుగా వుంటా సార్‌ అని మా అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌ అర్ధరాత్రి తలుపుకొట్టీ మరి చెప్పాడు.

ఏం ఈ వుద్యోగం చేయాలని లేదా అన్నాను. అదేంటి సార్‌ అలా అంటారు అన్నాడు.

ఓరి పిచ్చోడా నరేంద్రమోడీ మాదిరి కాపలాదారుగా వుంటానంటే ఇక్కడ వున్న వుద్యోగం వూడగొడతారు, కొత్తగా ఎక్కడా ఇవ్వరు అన్నాను. అదేంటి సార్‌ అని నిజంగానే వూడగొట్టిన వుద్యోగి మాదిరి నీరసపడిపోయాడు.

న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ విజయగాన బజానాలను ఎప్పుడూ లేనిది శుక్రవారం రాత్రి దూర దర్శన్‌లో చూసి అమాయకుడు వుత్సాహపడిపోయాడు. ఎన్నడూ లేనిది పొద్దున్నే లేచి నా కోసమే ఎదురు చూస్తున్నట్లున్నాడు. కనిపించగానే సార్‌ రాత్రి మీరు అలా అన్నారేంటి సార్‌ అని అడిగాడు.

తొమ్మిదివేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎగవేసిన విజయ మాల్య దేశం విడిచి పోతుంటే గుడ్లప్పగించి చూసిన నరేంద్రమోడీ, ఫాదర్‌ ఆఫ్‌ వాచ్‌మెన్‌ అంటే దేశంలోని వాచ్‌మన్లకు తలకాయ. ఆ పెద్దమనిషి మాదిరి పని చేస్తా అంటే దొంగలు దోచుకొని పారిపోతుంటే చూస్తూ వూరుకుంటా, ఎటు వెళ్లిందీ చెబుతా తప్ప పట్టుకోను అని చెప్పటమే అన్నాను.

రాత్రి నుంచి నిద్రపోకుండా ఎంత ఆలోచించినా మీరెందుకు అలా అన్నారో తట్టలేదు సార్‌. ఇప్పుడు మీరు చెప్పిన తరువాత ఇంక చచ్చినా ఎక్కడా నేను వాచ్‌మన్‌ వుద్యోగం చేస్తున్నా అని చెప్పను గాక చెప్పను సార్‌ అన్నాడు ఏదో ధృఢ నిర్ణయం తీసుకున్న వ్యక్తి మాదిరి.

పొద్దున్నే పాలకోసం దుకాణానికి వెళ్లా. మూమూలుగా నన్ను చూడగానే పాలు ఇచ్చేసి తన పనిలో తాను నిమగ్నమయ్యే దుకాణదారు ఎన్నడూ లేని విధంగా అదేంటి సార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ భజన చేశాడు రాత్రి అన్నాడు.

ఏం తప్పేముంది నలుగురితో నారాయణా, గుంపుతో గోవిందా అన్నా. అమితాబ్‌ కాంగ్రెస్‌, నెహ్రూ కుటుంబానికి బాగా దగ్గర కదా అలాంటిది ఇప్పుడు ఇలా ఫిరాయించాడేమిటి అన్నాడు సంభాషణ పొడిగిస్తూ.

అపుడు కాంగ్రెస్‌ ‘మా’ ఇప్పుడు పనామా పత్రాలలో పేరు కనిపించటంతో నరేంద్రమోడీ ‘బా'(పు) అయ్యాడు. అయినా ఎన్నడూ దేని గురించి అడగనిది ఇవాళ ఇదేమిటి? నీకూ రాజకీయాలలో చేరాలని వుందా అని అడిగా.

పాత సినిమాల్లో వీలునామా పత్రాల గురించి చూశా, పనామా పత్రాల పేరు ఎప్పుడూ వినలే, కొత్త ప్రభుత్వాలు రాగానే పాత పధకాలకు కొత్త పేర్లు పెట్టినట్లుగా వీలునామా పత్రాలకూ పేరు మార్చారా ఏమిటి అన్నాడు.

దొంగడబ్బు దాచుకున్నవారి వివరాలను మా జర్నలిస్టులు కొందరు బయట పెట్టారులే, ఆ ఖాతాలు పనామా అనే దేశంలో వున్నాయి, కనుక వాటిని పనామా పత్రాలు అంటున్నారులే.

అంటే కొంత మంది ఇంట్లో వారికి తెలియకుండా నా దగ్గర డబ్బు, నోట్లు పెట్టి వడ్డీకి తిప్పుతుంటార్లే అలాగేనా అన్నాడు.

ఓర్నీ, అంటే ప్రతి దుకాణమూ ఒక పనామా యేనా ఏమిటి కొంపదీసి, నీ సంగతి తెలిస్తే అమితాబ్‌ బచ్చన్‌, ఆయన కోడలు ఐశ్వర్యారాయ్‌ కూడా నీ దగ్గరకే వచ్చి వుండేవారన్నమాట.

అంత పెద్ద మొత్తాలను నేనెక్కడ తిప్పగలను సార్‌, ఏదో….. ఏదో నాతో అంటే అన్నావు గానీ ఇంకెవరితో అనకు….ఏం సార్‌ అన్నాడు.

ఎన్నికలకు ముందు విదేశాల్లో నల్లధనం గురించి చెప్పిన బిజెపి వారు ఇప్పుడు విదేశాల్లో కంటే స్వదేశంలోనే ఎక్కువ వుంది అంటున్నారు, నువ్వు ఇలాగే నలుగురితో చెప్పావనుకో ఏదో ఒక రోజు భారత మాతాకీ జై అంటూ ఖాకీ నిక్కరు వాళ్లు వచ్చి దాడి చేసి నీ దగ్గర ఎవరెవరు నల్లధనం దాచుకుంటున్నారో బయట పెట్టు అంటారు జాగ్రత్త.

సార్‌ ఖాకీ నిక్కరంటే గుర్తుకు వచ్చింది మా పక్కింటి పోరగాడికి వుద్యోగమేదీ రాలేదు, ఈ మధ్య కొత్తగా నిక్కర్లేసుకొని కర్ర పట్టుకొని తిరుగుతున్నాడు, పిల్లలు నిక్కరంటే సరేగానీ అదేంటి సార్‌ పెద్ద వారు కూడా అలా అసహ్యంగా, వారు వస్తుంటే వీధిలో అడవాళ్లు సిగ్గుతో తలవంచుకుంటారు, ఈ మధ్య మీరన్నారే భారత మాతాకీ జై అంటూ నిద్రలో కలవరించటమే కాదట, పక్కనున్నవారిని పట్టుకొని మీరూ అనరెందుకు అని నిద్రలోనే కొడుతున్నాడట ఏం చేయాలో తెలియటం లేదంటూ వాళ్ల నాన్న తలపట్టుకుంటున్నాడు.అయ్యో పాపం ఎంత కష్టం వచ్చిందీ అంటూ పాలు తీసుకొని బయలు దేరా.

ఇంతలో పచ్చ చొక్కా వేసుకొని మా ఎదురింటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనిపించాడు.ఏం తిరుపతి మహానాడుకు వెళ్లలేదా ఆహా ఏమి రుచి తినరా మై మరచి అన్నట్లుగా తిరుపతి వెంకన్న దర్శనం, ఎంచక్కా మూడు రోజుల పాటు మంచి భోజనాలు పెడుతున్నారట కదా !

మీరు జర్నలిస్టు కనుక వూరుకున్నా అదే ఇంకొకరు అని వుంటేనా అంటూ, అయినా మహానాడులో మీకు కనిపించింది భోజనాలేనా, తీర్మానాలు, వుపన్యాసాలు వినిపించలేదా అన్నాడు వుక్రోషంగా.

మిత్రమా లైట్‌ తీస్కో అదేదో సామెత చెప్పినట్లు పండగనాడూ పాత….. పాడిందే పాడరా…. అన్నట్లు ఎన్నికలకు ముందు నుంచి తరువాత గత రెండు సంవత్సరాలుగా జగన్‌ భజన చేస్తూనే వున్నారు బోరు కొట్టటం లేదా ! ఒకవైపు జగన్‌ పార్టీని ఫినిష్‌ చేశాం చూడమంటారు, మరోవైపు తద్దినపు తంతు మాదిరి ఎన్‌టిఆర్‌ పేరన్నా అప్పుడపుడు చెబుతున్నారు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్‌ పేరు తలవకుండా, పలకకుండా తెలుగుదేశం సమూహం మాట్లాడలేని స్ధితికి వచ్చింది, భాషా దారిద్య్రం పట్టుకుందా ! ఒకవైపు మా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు జనంలోకి వెళ్లటం లేదని మీరే చెబుతుంటారు, జగన్‌ భజన మాని ఆ పని ఎందుకు చేయరు ? అయినా అదేమిటయ్యా నేను నిద్రపోను, ఇతరులను నిద్రపోనివ్వను అని పదే పదే చెప్పే చంద్రబాబు హాయిగా నిద్రపోతున్నా అని మహానాడులో చెప్పాడు విడ్డూరంగా లేదూ !

మనలో మన మాట ఆఫ్‌ది రికార్డు, ప్రధాని నరేంద్రమోడీకి భార్యను వదిలేశారు కనుక ఆయన న్యూఢిల్లీలో వున్నపుడు నిశ్చింతగా నిద్రపోతున్నారు, మా నాయకుడికి భార్యా కుటుంబం వున్నా వారంతా హైదరాబాదులో వుంటున్నారు, ఈయనేమో వుండేది వుండవల్లిలో ఇంక నిద్రపోకేమీ చేస్తారు.

అదేమిటి ? వుండవల్లికి నిద్రకు సంబంధం ఏమిటి, ఆ వూరి వారంతా రేయింబవళ్లు కష్టపడి బాగా పని చేస్తారే అన్నాను నిజంగానే ఆశ్చర్యంగా !

ఎక్కడైనా దేవుళ్లందరూ నిలబడే వుంటారు, కానీ వుండవల్లి గుహలలోని అనంత పద్మనాభ స్వామి పడుకొని కదా వుండేది, మరి చంద్రబాబు నిద్రపోకుండా రాత్రంతా మేలుకొని వుంటే పద్మనాభునికి అంతరాయం కలుగుతుంది కదా అందుకని అన్నాడు.

నీ లాజిక్‌ వినటానికి బాగానే వుంది గానీ బాబొస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, దానితో ఇంటికో జాబొస్తుందని ఆశించారు, ఇప్పుడే హోదా లేదు గీదా లేదు, ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశాం కావాలంటే లెక్కలు తీయండి అని బిజెపి, కేంద్ర ప్రభుత్వం వారు సవాళ్లు విసురుతున్నారు. వాటి గురించి చెప్పకుండా నా పాలనలో అవినీతి లేదు కనుక నిద్ర పోతున్నా అంటారేమిటి ?

సార్‌ మరోసారి మనలో మాట, కొడదామంటే కడుపుతో వుంది, తిడదామంటే అక్కకూతురైపాయే అన్నట్లు మా పరిస్ధితి వుంది. అందుకే కేంద్రాన్ని మోడీని, వెంకయ్య నాయుడిని ఏమీ అనలేక ఆ కసిని జగన్‌, కాంగ్రెస్‌ మీద తీర్చుకుంటున్నాం అంటూ మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చక్కా పోయాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చంద్రబాబు : చరిత్రకు విరుద్దమైన సమాచారం

22 Sunday May 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, History, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Amaravathi, CHANDRABABU, Facts, History

ఎం కోటేశ్వరరావు

ఈనెల 20వ తేదీన విజయవాడలో ప్రముఖ సంపాదకులు పొత్తూరు వెంకటేశ్వరరావు రచించిన’అమరావతి ప్రభువు -వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు’ అనే గ్రంధాన్ని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన చేసిన ప్రసంగంలోని అంశాల గురించి ప్రభుత్వ మీడియా సలహాదారు కార్యాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దానిలోని కొన్ని అంశాల మంచి చెడ్డల గురించి చూద్దాం.

1.’గతంలో వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని ఐటిలో అభివృద్ధి చేయగా నవ్యాంధ్రప్రదేశ్‌లో పోర్టుల(రేవుల) అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.ఓడ రేవుల ఆధార ఆర్ధిక వ్యవస్ధగా రూపొందితే భవిష్మత్‌ వుజ్వల రీతిలో వుంటుందని వివరించారు.’

   కొంత మంది అంగీకరించినా అంగీకరించకపోయినా, అతిశయోక్తులు చెబుతారని అన్నా చంద్రబాబు నాయుడు అంటే ఐటి రంగ అభివృద్దికి మారుపేరుగా కీర్తి కండూతి దక్కింది. అంతకంటే ఎక్కువగా ఇరుగు పొరుగు రాష్ట్రాలు అభివృద్ది చెందాయి కనుక విమర్శకులు అంగీకరించరు. దానివలన నష్టం లేదు వదిలేద్దాం. ఇప్పుడేం చేయాలన్నదే అసలు సమస్య. ఇజాలేమీ లేవు ఒక్క టూరిజం తప్ప అని ఒకసారి, ఐటి తప్ప చరిత్ర పాఠాలు చదవనవసరం లేదు అని ఒకసారి ఇలా చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ అధికార ప్రస్తానంలో ఎన్నో ఆణిముత్యాలను ప్రవచించారు. గతంలో గ్రామాలలో హరికధలు, బుర్ర కధల వంటి జానపద కళారూపాలను ప్రదర్శించేవారు భుక్తి కోసం ఏ వూరు వెళితే ఆ వూరును మీ వూరు చుట్టుపక్కల అరవై ఆరు గ్రామాలకు పోతు గడ్డ అని చెప్పేవారు. కొంత మంది నిజమే కదా అనుకొనే వారు.

    ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఐటి రంగం అభివృద్ధి పట్ల ఆ దిగ్గజాలకు ఆసక్తి లేదని ఆపిల్‌ సిఇవో టిమ్‌ కుక్‌ హైదరాబాదు పర్యటనలో చేసిన హడావుడి స్పష్టం చేసింది. గతంలో ఏ కంపెనీ సిఇఓ వచ్చినా చంద్రబాబును కూడా తోటి సిఇఓగా పరిగణించి కలవకుండా వెళ్లే వారు కాదు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అందుకనే ఐటి గురించి గాక రేవుల అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధ పెడతానని చెబుతున్నారా ? ఇదే నిజమైతే ఇంజనీరింగ్‌ కళాశాలల పెట్టుబడిదారులు, ఏటా లక్షల మంది పట్టభద్రులను తయారు చేస్తున్న వారి పరిశ్రమలు ఏం కావాలి ?

  చంద్రబాబు నాయుడు గొప్ప దార్శనికుడని చెప్పటానికి గతంలోనూ, ఇపుడు మరొకసారి రూపొందించిన విజన్‌ పత్రాలు సజీవ సాక్ష్యాలు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు కన్న కలలు ఏమిటి అని ఎవరైనా భవిష్యత్‌లో పరిశోధన చేస్తే వారికి మంచి సమాచారంగా అవి వుపయోగపడతాయి.ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతం వ్యవసాయ ఆర్ధిక వ్యవస్థగా వుంది. పరిశ్రమలు, సేవారంగం వంటివి అభివృద్ధి చెందకుండా యువతరానికి వుపాధి దొరకదు. ఇప్పటికే వున్న ఓడ రేవుల ద్వారా జరిగే అభివృద్ధి ఏదో జరిగింది. మన తూర్పు, పశ్చిమ తీరాలలో మన కంటే పెద్ద ఓడరేవులు ఇప్పటికే వున్నాయి. సింగపూర్‌ మాదిరి తయారు చేయటానికి మన భౌగోళిక పరిస్థితులు అనువుగా లేవు.

   పరిశ్రమలు పెట్టటానికి, వారికి పదేళ్ల పాటు పలు రాయితీలు ఇవ్వటానికి ఏపికి ప్రత్యేక రాష్ట్ర హోదా రాదని తేలిపోయింది. అందువలన వారు మరొకదారి చూసుకుంటారు. లేదా ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోటీపడి పారిశ్రామికవేత్తలకు రాయితీలు కుమ్మరించటానికి రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదని, లోటుతో వున్నట్లు చంద్రబాబే స్వయంగా చెబుతున్నారు. అది ఇప్పట్లో పూడేది కాదన్నది వాస్తవం. పరిశ్రమలు లేకుండా రేవులను అభివృద్ధి చేసి ఏమి ఎగుమతి చేస్తారు. బొగ్గు దిగుమతులు చేసుకోవటానికి ఇప్పటికే కృష్ణపట్నం వంటివి వున్నాయి. చంద్రబాబు నాయుడు పుట్టక ముందు నుంచీ చెబుతున్న భావనపాడు, నిజాంపట్నం చేపల రేవులు ఏమయ్యాయో తెలియదు. ఈ స్ధితిలో ఓడరేవుల ఆధారిత ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందటానికి వున్న అవకాశాలేమిటో నిపుణులు చెప్పాలి.

2. తాను జపాన్‌లో పర్యటించినపుడు జపాన్‌లో బౌద్దాన్ని ఆచరించేవారు బుద్ధిజం అమరావతి నుంచే వచ్చిందని తమకు చెప్పారని, నాగార్జునుడి పేరు విన్నామని తెలిపారని చంద్రబాబు తెలిపారు.

3.లండన్‌లో పర్యటించినపుడు లండన్‌ మ్యూజియాన్ని సందర్శించానని అక్కడ రెండే రెండు గ్యాలరీలు వున్నాయని ఒకటి గ్రీసు గ్యాలరీ, రెండు అమరావతి గ్యాలరీ అని మ్యూజియం అధికారులు వివరించారని చెప్పారు. అమరావతి గ్యాలరీ అని ఎందుకు నామకరణం చేశారని తాను ప్రశ్నించానని, ప్రపంచంలో అమరావతి వుత్కృష్టమైనదిగా వారు తనకు చెప్పారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.

    ఈ రెండూ చరిత్రకు సంబంధించిన అంశాలు. ఈ మధ్య సౌదీ అరేబియాలో అక్కడి యువతులు భారత మాతాకీ జై అని నినాదాలు చేస్తున్న వీడియో ఒక దానిని సామాజిక మాధ్యమంలో కొందరు పెద్ద ఎత్తున ప్రమోట్‌ చేశారు. వారు మాత భక్తులని వేరే చెప్పనవసరం లేదు. ప్రధాని నరేంద్రమోడీ సౌదీ పర్యటన సందర్భంగా ఆయనకు పలికిన ఆహ్వానంలో అదొక భాగం. దీన్ని గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఎవరైనా విదేశీ అతిధులు వచ్చినపుడు వారిని ప్రసన్నం చేసుకొనేందుకు వారి మనసెరిగి ఇష్టమైన కార్యక్రమాలు రూపొందించటం, వంటకాలు వడ్డించటం అంతర్జాతీయ దౌత్యం మొదలైప్పటి నుంచి జరుగుతున్నదే. దానిలో భాగంగానే మోడీని వబ్బేయటానికి భారత మాతాకు జై అనిపించారు సౌదీవారు. అక్కడి ముస్లింలే జై అంటే ఇక్కడి వారు ఎందుకు అనరనే వాదనలో భాగంగా ఆ వీడియోను హిందుత్వ భక్తులు వినియోగించుకున్నారు.

    జపాన్‌, లండన్‌ పర్యటనలో చంద్రబాబు నాయుడికి కూడా అదే జరిగిందా అన్న అనుమానం కలుగుతోంది. చంద్రబాబు నాయుడి పుణ్యమా అంటూ ఇప్పుడు చరిత్ర పాఠాలు చదివేవారు లేకుండా పోయారు. ఒక వేళ హైస్కూలు స్ధాయిలో కాస్తో కూస్తో చదివినా అదెవరికీ గుర్తుండటం లేదు. అయినా చరిత్ర చరిత్రే. దాన్నెవరూ చెరిపి వేయలేరు.

   జపాన్‌కు అమరావతి నుంచి బుద్ధిజం వెళ్లిందని ఏ చరిత్ర చెప్పలేదు. చైనీయుల నుంచి కొరియా అక్కడి నుంచి జపాన్‌కు వెళ్లినట్లు చరిత్ర చెబుతోంది.జపనీయులు అలా ఎందుకు చెప్పారన్నది ప్రశ్న.

   రెండవది లండన్‌ మ్యూజియంలో వున్న గ్యాలరీల గురించి ఇంటర్నెట్‌లో ఎన్నిసార్లు వెతికినా అమరావతి, గ్రీసు గ్యాలరీల పేరే మనకు కనపడదు, మిగతా గ్యాలరీల గురించి మాత్రమే మనకు దొరుకుతోంది. అక్కడి అధికారులు కూడా చంద్రబాబును తప్పుదారి పట్టించారా ?

   రాజకీయ నేతలు అనేక అంశాలను చెబుతుంటారు, వాటిని అధికారిక ప్రకటనలలో చేర్చినపుడు అధికారయంత్రాంగం ముందు వెనుకలు ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. లేకపోతే చంద్రబాబు నాయుడి వంటి వారు ఇబ్బందులలో పడతారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఫ్లయింగ్‌ మోడీ నుంచి ఫెయిల్యూర్‌ మోడీ వరకు

21 Saturday May 2016

Posted by raomk in AP, BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Telangana

≈ Leave a comment

Tags

Acheedin, BJP, CHANDRABABU, CHANDRABABU TWO YEARS RULE, failure Modi, flying Modi, KCR, KCR TWO YEARS RULE, Narendra Modi, NDA, NDA Two years rule, Two years Modi rule

అచ్చే దిన్‌ ఆమడ దూరం

ఎం కోటేశ్వరరావు

    కేంద్రంలో, రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. మూడు చోట్లా అధికారానికి వచ్చిన వారు రాజకీయ, పాలనా రంగాలకు కొత్తవారు కాదు. అందువలన అనుభవాల గురించి మాట్లాడుకోవటంలో అర్ధం వుండదు. ఈ ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు ఏమిటి ? జనానికి వాటి పర్యవసానాలు ఏమిటన్నది ముఖ్యం. గత పాతిక సంవత్సరాలుగా కేంద్రంలో, రాష్ట్రాలలో ఎవరు అధికారంలో వున్నప్పటికీ నయా వుదారవాద విధానాల చట్రంలో పనిచేయాల్సి వచ్చింది.ఈ క్రమంలో కేంద్రంలో కాంగ్రెస్‌ లేదా బిజెపి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వాలు ఏవి వున్నా ఎడమ చేయికి,పురచేయికి వున్న తేడా తప్ప వేరు కాదు. నయా వుదార వాద విధానాలు విదేశీ కార్పొరేట్లు, అంతర్జాతీయ సంస్ధలైన ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్ధల విధానాలకు స్వదేశీ ముద్రవేసి అమలు జరుపుతున్నారన్నది స్పష్టమైంది. వాటి ప్రకారం దేశమంతటా అన్ని రాష్ట్రాలలో ఒకే విధమైన అమలు జరపాల్సి వుంటుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధానం వుంటే విదేశీ కంపెనీలకు తలనొప్పి. పన్ను రేట్లు, చట్టాలు ఒకే విధంగా వుండేట్లు ఇప్పటికే చూశారు. వాట్‌ బదులు జిఎస్‌టిని అమలు జరపాలన్నది కూడా దానిలో భాగమే.ఇలా ఎన్నో వున్నాయి. వాటి గురించి మరో సందర్భంలో చర్చించుకోవచ్చు.మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు అంటే పెద్ద మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల స్థాయికి ఎక్కువ, కేంద్రానికి తక్కువ.

   ఎవరు అవునన్నా కాదన్నా , అభిమానులు గింజుకున్నా ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంగా కేంద్రంలో నరేంద్రమోడీ, రాష్ట్రాలలో చంద్రబాబు, కెసిఆర్‌ పట్ల మోజు తగ్గిపోతున్నది.వెంకయ్య నాయుడి వంటి వంది మాగధులు నరేంద్రమోడీని దేవదూత, దేవుడు అని పొగడవచ్చు. కేంద్రంలో లేని ప్రత్యేకత ఏమంటే తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను, వారి కుటుంబ సభ్యులను కూడా పొగడాల్సి రావటం బోనస్‌ వంటిది. పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు నరేంద్రమోడీ తమ పాలిట బంగారు పళ్లెంతో వస్తారని రెండు సంవత్సరాల క్రితం ఇదే సమయంలో వారు సంబరాలు చేసుకున్నారు.తొలి ఏడాది ఫ్లయింగ్‌ మోడీగా పేరు తెచ్చుకున్న ప్రధాని రెండో ఏడాది ఫెయిల్యూర్‌ మోడీగా పిలిపించుకుంటున్నారు. మనువాదం పట్ల వున్న శ్రద్ధ జనవాదం గురించి లేకపోవటంతో అటు పారిశ్రామికవేత్తలు, బడా వాణిజ్యవేత్తలు, సామాన్య జనం కూడా అసంతృప్తికి గురవుతున్నారు. విదేశీయులకు మన దేశం అంటే కనిపించేది నరేంద్రమోడీ తప్ప రాష్ట్రాలు కాదు. అందువలన శరభ శరభ దశ్శరభ శరభ అంటూ వీరతాళ్లతో చంద్రబాబు, కెసిఆర్‌ వంటి వారు విదేశాలలో, స్వదేశంలో ఎన్ని వీరంగాలు వేసినా వారిని కొమ్ముగాసే స్వరాష్ట్రాల మీడియాను తప్ప విదేశీ కార్పొరేట్లను రంజింపచేయవు.

    తాను అధికారానికి వస్తే గుజరాత్‌ మోడల్‌ను దేశమంతటికీ విస్తరిస్తానని మోడీ చెప్పారు. ఇప్పుడు దాని గురించి అసలు ప్రస్తావన కూడా చేయటం లేదు. అమలు జరుపుతున్నట్లా లేదా కనీసం ఆ నమూనా ఏమిటో అయినా జనానికి వివరించారా అంటే లేదు. చిత్రం ఏమిటంటే గుజరాత్‌ మోడల్‌ బండారం గురించి అనేక మంది అనేక సందర్భాలలో వెల్లడించారు. ఇక్కడ స్ధలాభావం వలన దాని గురించి వివరించటం లేదు. మోడీ మహాశయుడు చెప్పినట్లు అదొక ఆదర్శ నమూనా, వాస్తవమే అయితే అందుకు దోహదం చేసింది పంచవర్ష ప్రణాళికలే. నరేంద్రమోడీ అధికారానికి రాగానే అసలు ఆ విధానాన్నే రద్దు చేశారు. నీతి ఆయోగ్‌ పేరుతో ప్రణాళికా సంఘాన్ని తెరమరుగు చేశారు. రెండు సంవత్సరాలు సాము చేసి ఇప్పుడు చెబుతున్నదాని ప్రకారం పదిహేను సంవత్సరాల పాటు అమలు జరిపే ఒక స్వప్న పత్రాన్ని రూపొందించబోతున్నారు.అది 2018 నుంచి అమలులోకి వస్తుంది. దాని ప్రకారం తొలి ఏడు సంవత్సరాలకు ‘ జాతీయ అభివృద్ధి అజెండా’ను రూపొందిస్తారు. దానిని ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సమీక్షిస్తారు. దాని ప్రకారం తొలి సమీక్ష 2020లో జరుగుతుంది. దీన్నే చిల్లి కాదు తూటు అంటారు. మరి అప్పటి వరకు అంటే 2018 వరకు ఏ విధానాలను అమలు జరుపుతారు? విఫల కాంగ్రెస్‌ విధానాలను కొనసాగిస్తున్నట్లా ?

    రెండు సంవత్సరాల పాలనలో పరిశ్రమలు, సేవలు, నిర్మాణం,వ్యవసాయం మొదలైన రంగాలలో వాణిజ్య అవకాశాల తీరుతెన్నుల గురించి విశ్లేషణ జరిపిన జర్మనీకి చెందిన ఎంఎన్‌ఐ బిజినెస్‌ సూచిక 2014లో గరిష్టంగా 80.3 వుండగా ఈఏడాది ఏప్రిల్‌ నెలలో 69.6కు దిగజారింది. ఇదే కాలంలో చైనా సూచిక 50-55 పాయింట్ల మధ్య కదలాడినట్లు అదే సంస్ధ తెలిపింది. ఏ దేశంలో ఎలాంటి పరిస్ధితులు వున్నాయో ఎక్కడ పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయో సూచిస్తూ అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తల నిమిత్తం ఇలాంటి సూచికలను రూపొందిస్తారు. వాటి ఆధారంగా పెట్టుబడిదారులు నిర్ణయాలు తీసుకుంటారు. దేశం మొత్తానికి ఈ సూచికను రూపొందించినప్పటికీ రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టేవారు కూడా వీటిని గమనంలోకి తీసుకుంటారు. మన రిజర్వుబ్యాంకు విశ్లేషణ ప్రకారం వాణిజ్య ఆశల సూచిక 2014 అక్టోబరు-డిసెంబరు మాసాలలో 117.9 వుండగా 2016 తొలి మూడు నెలల్లో 111 పాయింట్లకు పడిపోయింది. దేశ ఆర్ధిక వ్యవస్ధ 8.2శాతం చొప్పున అభివృద్ధి చెందుతుందని గతంలో చెప్పారు. రిజర్వుబ్యాంకు తాజా జోస్యం ప్రకారం సమీప భవిష్యత్‌లో ఆ అంకెను చేరుకొనే అవకాశం లేదని ఆచరణ వెల్లడిస్తోంది.

 అంతర్జాతీయంగా వినియోగదారుల విశ్వాసాన్ని అభివృద్ధి సూచికలలో ఒకదానిగా పరిగణిస్తున్నారు.మోడీ అధికారానికి వచ్చిన సమయంలో 98.2 వుండగా తరువాత అది 109కి పెరిగి ప్రస్తుతం 104.1 పడిపోయింది.గ్రామీణ ప్రాంతాలలో దిగజారిన పరిస్థితులకు ఇది ప్రతిబింబం అని భావిస్తున్నారు.ఈ ఏడాది మంచి వర్షాలు పడితే, కేంద్ర ప్రభుత్వం వుద్యోగులకు వేతనపెంపుదల చేస్తే సూచిక తిరిగి పెరగవచ్చని వాణిజ్యవేత్తలు ఆశిస్తున్నారు. పారిశ్రామిక వుత్పత్తి సామర్ధ్య వినియోగ సూచిక కూడా దేశ పరిస్ధితికి దర్పణం పడుతుంది. 2013-14 చివరి మూడు నెలల్లో ఈ సూచిక 76శాతం వుండగా 2015-16 మూడవ త్రైమాసికంలో 72.5 పాయింట్లకు పడిపోయింది. పారిశ్రామిక ఆర్డర్లు కూడా సగటున ప్రతి మూడు నెలలకు 1.45 బిలియన్‌ రూపాయల నుంచి 1.15 బిలియన్లకు పడిపోయింది. అంటే పెట్టుబడులను ఆకర్షించే పరిస్ధితి లేదన్నది దీని అర్ధం. ఈ పూర్వరంగంలోనే చంద్రబాబు నాయుడు, లోకేష్‌, కెసిఆర్‌, కెటిఆర్‌లు ఎన్ని రాష్ట్రాలు, దేశాలు తిరిగినా వాగ్దానాలు తప్ప పెట్టుబడులు వచ్చేఅవకాశాలు ఏమేరకు వుంటాయో అర్ధం చేసుకోవచ్చు.గడచిన 24నెలల పాలనలో వరుసగా 17వ నెలలో కూడా మన ఎగుమతులు పడిపోయాయని అధికారికంగా ప్రకటించారు.2014-15తో పోల్చితే గతేడాది ఎగుమతుల మొత్తం 310 బిలియన్‌ డాలర్ల నుంచి 261 బిలియన్లకు పడిపోయింది. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు.మోడీ అధికారానికి వచ్చిన తరువాత మన రూపాయి పతనం చెంది జనం మీద భారమూ పెరిగింది, అదే సమయంలో మన ఎగుమతులూ పడి పోయాయి. రూపాయి పతనమౌతుంటే గుడ్లప్పగించి చూడటం తప్ప నిలబెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే సమయంలో మన దిగుమతులు కూడా గణనీయంగా తగ్గిపోయాయి కనుక విదేశీ మారకద్రవ్య చెల్లింపుల సమస్య తీవ్రత కూడా తగ్గింది. ఈ స్థితిలో మేకిన్‌ ఇండియా గురించి చెప్పుకోవటం అంటే నరేంద్రమోడీ ఘోర వైఫల్యం గురించి గుర్తు చేయటమే.

  చిత్రం ఏమిటంటే ఆర్ధిక రంగంలో ఇన్ని వైఫల్యాలు,దిగజారుడు కనిపిస్తున్నప్పటికీ కిందపడ్డా పైచేయి మాదే అన్నట్లు ఇప్పటికీ బిజెపి అధికార ప్రతినిధి నరేంద్ర తనేజా మాట్లాడుతున్నారు. అసాధారణ రీతిలో ఆర్ధికంగా దేశాన్ని ముందుకు తీసుకుపోవటం ప్రతిపక్షాలకు కనిపించటం లేదని, కోమాలోకి పోయిన ఆర్ధిక వ్యవస్ధను చైతన్యంలోకి తీసుకువచ్చి ఇప్పుడు మరమ్మతులు ప్రారంభించి మార్పుకోసం పనిచేస్తున్నామని నమ్మబలుకుతున్నారు.

    నరేంద్రమోడీ పాలనలో ఒక్క అవినీతి వుదంతమైనా వున్నదా? అవినీతి సూచికలో మన స్థానం తగ్గిందని ప్రకటించటం చూడ లేదా అని ఆయన అభిమానులు అడ్డు సవాళ్లు విసురుతుంటారు. నిజమే, అసలు కొత్తగా ఏదైనా పనిచేస్తే కదా అవినీతి వున్నదీ లేనిదీ తెలిసేది. తొమ్మిదివేల కోట్లరూపాయలు ఎగవేసిన విజయ మాల్య వుదంతం ఏమి తెలియ చేస్తోంది. దాని గురించి అడిగితే అతగాడికి కాంగ్రెస్‌ హయాంలో రుణాలు ఇచ్చారని తెలివిగా సమాధానమిచ్చారు.అదే పెద్దమనిషి దేశం నుంచి పరారీ అవుతుంటే దొంగగారు పోతుంటే చూసి చెప్పమన్నారు తప్ప పట్టుకోమనలేదని నిఘా సంస్థలు చెప్పటం చూస్తే తెలివితక్కువ తనానికి సరికొత్త వుదాహరణగా మోడీ సర్కార్‌ను కొందరు వర్ణించారు. వీడ్కోలు ఇచ్చి మరీ విదేశాలకు పంపిన నిర్వాకాన్ని చూసి దేశం నివ్వెర పోతోంది. నిజానికి ఇది తెలివితక్కువ తనం కాదు, వున్నత స్థానాలలోని పెద్దల ప్రాపకం లేకుండా పట్టుకోవాల్సిన వ్యవస్థలను దానికి బదులు ఎటువెళుతున్నారో చెబితే చాలని ఆదేశాలు జారీచేయించింది ఎవరు? రేపు కోర్టులో ఫిర్యాదు దాఖలు చేస్తారనగా ముందురోజే దేశం నుంచి పరారీ కావటానికి పెద్దల సహకారంలేకుండా సాధ్యమా? అధికారం వున్నంత కాలం కాంగ్రెస్‌ను వుపయోగించుకొని పోగానే బిజెపిలో చేరిన మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు కూడా విజయమాల్యను ఆదర్శంగా తీసుకున్న పెద్దమనిషే,తమ దగ్గర తీసుకున్న రుణాలు చెల్లించాలంటూ బ్యాంకుల సిబ్బంది ధర్నా చేసిన విషయం తెలిసిందే. కర్ణాటకలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు లోకాయుక్త నివేదన ఆధారంగా బిజెపి ముఖ్యమంత్రి ఎడ్డియూరప్ప పదవి నుంచి తప్పుకున్న విషయం లోకవిదితం. తిరిగి అదే పెద్ద మనిషిని ఆ పార్టీ అందలమెక్కించించింది. ఇలాంటి వారందరినీ పార్టీలో చేర్చుకుంటూ అవినీతి వ్యతిరేక కబుర్లు చెబితే ప్రయోజనం వుందా ? కాంగ్రెస్‌ హయాంలో అవినీతి అక్రమాలపై విచారణను వేగవంతం చేసేందుకు తీసుకున్న చర్యలేమిటి? ఎంత మందిని శిక్షించారు? వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదా ? గొప్పగా చెబుతున్న గుజరాత్‌ మోడల్‌ ఏమిటి, అప్పనంగా ప్రకృతి సంపదలైన నీరు, భూముల వంటి వాటిని పెట్టుబడిదారులకు కట్టపెట్టమేగా ? దాన్ని ఏమంటారు ? వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ జరుగుతోంది . చంద్రబాబు నాయుడు వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ అవినీతి గురించి ఎన్నికలపుడూ, ఇప్పుడూ నానా యాగీ చేశారు, చేస్తున్నారు. కానీ గత రెండు సంవత్సరాలలో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను ఫిరాయింపులకు ప్రోత్సహించి తన పార్టీలో కలుపుకొనేందుకు చూపిన శ్రద్ధ తాను చేసిన ఆరోపణలను రుజువు చేసేందుకు చూపటం లేదేమి? చంద్రశేఖరరావు కూడా కాంగ్రెస్‌ అవినీతి గురించి అలాగే కబుర్లు చెప్పారు. అక్కడ కూడా జరుగుతున్నది అదే ఫిరాయింపులు, ఫిరాయింపులు.

  ఆరు ప్రభుత్వరంగ బ్యాంకులు గతేడాది నాలుగవ త్రైమాసిక ఫలితాల ప్రకారం ఏడువేల కోట్లరూపాయలను నష్టపోయాయి. అధికారానికి వచ్చిన వంద రోజుల్లో విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తానని వూరూ వాడా ప్రచారం చేసిన నరేంద్రమోడీ సర్కార్‌ ఆ దిశగా తీసుకున్న చర్యలేమీ కనిపించటం లేదు. బ్యాంకులకు వుద్ధేశ్యపూర్వకంగా రుణాలు ఎగవేసే వారిపై కఠిన చర్యలు తీసుకొనేందుకు చట్ట సవరణలు ప్రతిపాదించటానికేే రెండు సంవత్సరాలు పట్టిందంటే దున్నపోతు మీద వానపడ్డట్లుగా వుంది తప్ప మరొకటి కాదు. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపియే హయాంలో 2008-13 సంవత్సరాలలో బ్యాంకుల నిరర్ధక ఆస్థుల సగటు 2.6శాతం వుండగా తమ అసలైన ప్రతినిధి మోడీ అనుకున్నారేమో పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు రెండు సంవత్సరాలలో వాటిని 4.5శాతానికి పెంచి ఎంతో లబ్దిపొందారు, 2008లో 2.3శాతంగా వున్నవి కాస్తా 2015 నాటికి 4.3 శాతానికి పెరిగాయి. వుద్ధేశ్యపూర్వంగా రుణాలు ఎగవేసిన పెద్ద మనుషులు 2015 డిసెంబరు నాటికి 7,686 మంది వుంటే వారి నుంచి రావాల్సిన సొమ్ము 66వేల కోట్ల రూపాయలు. అందువలన కాంగ్రెస్‌ హయాంలో రుణాలు ఇచ్చారన్నది సాకు మాత్రమే వారి మీద చర్య తీసుకుంటే, డబ్బువసూలు చేస్తే వీరికి ఎవరు అడ్డుపడ్డారు? అవినీతికి పాల్పడటం ఎంత నేరమో పాలకులుగా వుండి అవినీతి పరులను వుపేక్షించటం కూడా దానితో సమానమైన నేరమే అవుతుంది.సుగర్‌, బిపి కవల పిల్లల వంటివి. అలాగే పెట్టుబడిదారీ విధానంతో అవినీతి పెనవేసుకొనే వుంటుంది. అందుకే అధికారాంత మందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్‌ అన్నట్లు ఎవరి గురించి అయినా ముందే సంబరపడిన వారు తరువాత విచారించకతప్పదు.

   జపాన్‌లో పిల్లలకు వేసే డైపర్ల కంటే వృద్ధులకు వేస్తున్న వాటి సంఖ్య పెరిగిపోతోంది. అంటే అభివృద్ధి చెందిన దేశాలన్నీ ముంచుకు వస్తున్న వృద్ధాప్య సమస్యను ఎలా పరిష్కరించాలా అని తలలు పట్టుకుంటున్నాయి. మన దేశంలో పశు ‘వృద్ధాప్యం’ రైతాంగానికి, కొందరు వృత్తిదారులకు ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. నరేంద్రమోడీ సర్కార్‌ కొత్తగా అన్న వస్త్రాలు ఇవ్వకపోగా వున్న వస్త్రాలను లాగేస్తున్నారని మహారాష్ట్రలో కరువు ప్రాంతాల రైతాంగం వాపోతోంది. అనేక రాష్ట్రాలలో గొడ్డు మాంసంపై నిషేధం కారణంగా వ్యవసాయానికి, పాడికి పనికిరాని పశువులను వదిలించుకోవటం రైతాంగానికి కొత్త కష్టాలు తెచ్చి పెడుతోంది. పశువుల ధరలు సగానికి సగం పడిపోయాయి. ప్రయోజనం లేని పశువులకు నీరు, మేత అందించటం పెద్ద సమస్యగా మారిందంటే అతిశయోక్తి కాదు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆది గోద్రెజ్‌ చేసిన వ్యాఖ్య బడా పారిశ్రామికవేత్తలలో నరేంద్రమోడీ విధానాల పట్ల వున్న అసంతృప్తిని వెల్లడిస్తోంది.ఆయనేమీ కమ్యూనిస్టు కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వ్యక్తి, శక్తి కాదు.’ కొన్ని అంశాలు అభివృద్ధిని ప్రభావితం చేస్తున్నాయి, వుదాహరణకు కొన్ని రాష్ట్రాలలో గొడ్డు మాంసంపై నిషేధం. ఇది స్పష్టంగా వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధిని దెబ్బతీస్తోంది, ఎందుకంటే ఈ వృధాగా వున్న ఆవులను మనం ఏమి చేసుకుంటాం, ఇది వాణిజ్యాన్ని కూడా ప్రభావితం చేస్తోంది,ఎందుకంటే ఇది అనేక మంది రైతులకు మంచి ఆదాయ వనరు, అందువలన ఆ చర్య ప్రతికూలం. వేదకాలంలో కూడా భారతీయులు గొడ్డు మాంసం తినేవారు, కరవు పరిస్థితులు ఏర్పడినపుడు రైతులు పశువులను వధశాలలకు తరలించేవారు.’ అని చెప్పారు. దేశంలోని 24 రాష్ట్రాలలో జంతు వధ నిషేధం, జరిమానాలు, ఇతరంగా ఏదో ఒక రూపంలో ఆంక్షలు అమలు చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌-డిసెంబరు మాసాలలో పశువుల ధరలు 13శాతం పడిపోయాయని రాయిటర్‌ వార్తా సంస్ధ తెలిపింది.

    రాజకీయ రాజధాని న్యూఢిల్లీ అయితే దేశ ఆర్ధిక రాజధాని ముంబై.మహారాష్ట్రలోని బిజెపి-శివసేన సంకీర్ణ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ‘ గొడ్డు మాంసం, మరాఠీ చిత్రాలు తరువాత ఏమిటి; మధ్యాహ్న భోజనంలో విధిగా వడపావ్‌ తినాలి, మరాఠీ మాట్లాడాలి, ప్రతి రోజూ దేవాలయాలను సందర్శించాలనే చట్టాలు చేస్తారేమో అని పారిశ్రామికవేత్త హర్ష గోయంకా వ్యాఖ్యానించారు.’ భారత్‌ ఇప్పుడు భవిష్యత్‌లో వెలిగిపోవాలంటే జనానికి ఏం చేయాలో నిర్ణయించుకొనే స్వేచ్చ వుండాలి.ప్రభుత్వం పర్యవేక్షణ కార్యకలాపాలకు పరిమితం కావాలి, జనం ఏం చేయాలో చెప్పాల్సిన పాత్ర ధరించకూడదు’ అని రతన్‌ టాటా ఈ ఏడాది జనవరిలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

    ఒక పార్టీ మరొక పార్టీ విధానాలను విమర్శించటం ప్రజాస్వామ్య పద్దతి. కానీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రతిపక్షం లేకుండా చేసుకోవటం క్షంతవ్యం కాదు. కానీ అధికార రాజకీయాలలో ఒక్క వామపక్షాలు తప్ప మిగిలిన పార్టీలేవీ విలువలను పాటించటం లేదు. కేరళ, బెంగాల్‌,త్రిపుర రాష్ట్రాలలో ఎవరైనా ఒకరో అరో వామపక్షాల నుంచి ఇతర పార్టీలలో చేరటం తప్ప ఇతర పార్టీల నుంచి వామపక్షాలు ఫిరాయించిన వుదాహరణలు లేవని చెప్పవచ్చు. గతంలో కాంగ్రెస్‌ అధికారంలో వున్నపుడు ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను అస్థిరపరచటం, ఫిరాయింపులను ప్రోత్సహించాటాన్ని బిజెపి విమర్శించింది. కానీ అల్లుడికి బుద్ది చెప్పి మామ అదే తప్పుడు పనిచేసినట్లు అరుణాచల్‌, వుత్తరాంచల్‌ రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలను పడగొట్టేందకు ప్రయత్నించి భంగపడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ నుంచి దేశాన్ని విముక్తి చేయాలన్న పిలుపును ఈ విధంగా అమలు జరిపేందుకు ప్రయత్నించింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ పార్టీలు కూడా అదే చేస్తున్నాయి. వైఎస్‌ఆర్‌సిపి నుంచి ఒక్కొక్క ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సిని ఒక పద్దతి ప్రకారం ఆకర్షించటమే పనిగా తెలుగుదేశం పార్టీ చేస్తోంది. తెలంగాణాలో వైఎస్‌ఆర్‌సిపిని పూర్తిగా పూర్తిగా, తెలుగుదేశం పార్టీని కూడా దాదాపు అదే విధంగా స్వాహా చేయటంలో టిఆర్‌ఎస్‌ జయప్రదమైంది. కాంగ్రెస్‌ నుంచి కూడా వలసలను ప్రోత్సహిస్తోంది. వీటన్నింటినీ చూసినపుడు పార్టీ ఫిరాయింపులు సాధారణ అంశంగా మార్చివేయటంలో ఈ పార్టీలన్నీ జయప్రదమయ్యాయి. రాజకీయాలలో హుందాగా ప్రవర్తించటం అన్నది దాదాపు కనుమరుగైంది. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి స్థాయిలలో వున్నవారు కూడా అందుకు అతీతులు కాదని రుజువు చేశారు.

    చివరిగా రెండు తెలుగు రాష్ట్రాల గురించి చిన్నమాట. కేంద్ర ప్రభుత్వ విధానాలను అనుసరించటం తప్ప వీటికంటూ ప్రత్యేక విధానాలు లేవు. అందువలన ధరల పెరుగుదలను నివారించటంలో రెండు చోట్లా వైఫల్యమే. కరవు పరిస్థితులను కప్పి పెట్టేందుకు ప్రయత్నించటం తప్ప జనాన్ని ఆదుకొనేందుకు, కేంద్రం నుంచి నిధులు పొందేందుకు చూపిన ప్రత్యేక శ్రద్ధ ఏమిటో జనానికి తెలియదు. రాష్ట్రం విడిపోతే యువతకు పెద్ద ఎత్తున వుపాధి దొరుకుతుందని తెలంగాణా నేతలు చెప్పారు. ఈ రెండు సంవత్సరాలలో అంతకు ముందుతో పోల్చితే పెద్ద మార్పేమీ కనపడటం లేదు. బాబొస్తే జాబు గ్యారంటీ అన్న నినాదం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి, వున్న వుద్యోగాలు పోతున్నాయి తప్ప కొత్తవాటి జాడ కనిపించటం లేదు. తెలంగాణాలో ముడుపుల కోసమే ప్రాజక్టుల రూపురేఖలన్నీ మార్చివేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గొర్రెల గోత్రాలు కాపరులకే తెలుస్తాయన్నట్లు గతంలో అధికారాన్ని అనుభవించి ఇప్పుడు ప్రతిపక్షంలో వున్నవారికి, అధికారంలో వున్నవారికి కూడా ఈ విషయాలన్నీ కొట్టిన పిండి కనుక దేన్నీ కాదనలేము.ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క పోలవరం తప్ప కొత్తగా కట్టే పెద్ద ప్రాజక్టులేమీ లేవు. వున్నవన్నీ పూర్తి చేయాల్సినవే. పోలవరం వంటి వాటికి నీళ్లు లేకుండానే ముందుగానే కాలువలు తవ్వి గత పాలకులు సొమ్ము చేసుకున్నారు. ఇప్పటి వారు వాటి పూడికలు తీసి సొమ్ము చేసుకుంటారు. అన్నింటి కంటే రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో అతి పెద్ద ప్రాజెక్టుకు తెరలేపారు.గతంలో చంద్రబాబు నాయుడే చెప్పినట్లు ఐదులక్షల కోట్ల పధకమది. అందువలన శ్రీశ్రీ చెప్పినట్లు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం పరపీడన పరాయణత్వం అన్నట్లు ఏ పార్టీ చరిత్ర చూసినా గత రెండు సంవత్సరాలలో గర్వించదగిన చర్యలేమీ లేవు. రానున్నవి మంచి రోజులని చెప్పారు. అవి ఎండమావుల మాదిరి కనిపిస్తున్నాయి. ఈ చెంపమీద కొడితే మరో చెంప చూపమని మన వేదాంతం చెబుతుంది తప్ప కొట్టిన వారి చెంప చెళ్లు మనిపించమని చెప్పలేదు. అందుకే మన జనం కూడా అంత నిస్సారంగా తయారయ్యారు. ఏది జరిగినా మన మంచికే అనుకుంటున్నారు. ఇదొక చిత్రం !

గమనిక :ఈ వ్యాసం ‘ఎంప్లాయీస్‌ వాయిస్‌’ మాసపత్రిక జూన్‌ సంచికలో ప్రచురణ నిమిత్తం రాసినది

Share this:

  • Tweet
  • More
Like Loading...

అయిననూ పోయి రావలె హస్తినకు…..

18 Wednesday May 2016

Posted by raomk in AP, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, Chandrababu Delhi mission, Narendra Modi, special status to Andhra pradesh, tdp

చంద్రబాబు ఢిల్లీ యాత్ర విఫలం !

ఎం కోటేశ్వరరావు

   అయిననూ పోయి రావలె హస్తినకు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు మరోసారి హస్థినాపురి పర్యటనకు వెళ్లి వచ్చారు. జూదంలో ఓడిపోయిన పాండవులకు చివరకు ఐదు వూళ్లు కాదుకదా సూదిమోపినంత స్థలం కూడా ఇచ్చేది లేదని కౌరవులు చెప్పినట్లుగా కేంద్రమంత్రులు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా గురించి ఎంతో స్పష్టంగానే చెప్పారు. కాదని చెప్పటానికి మీరెవరు. అవునన్నా కాదన్నా అగ్రజుడితోనే మాట్లాడి అమీతుమీ తేల్చుకుంటా అన్నట్లగా చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు, తిరిగి వచ్చారు. సాధించేదిమిటి అన్నది అర్ధంగాక రాష్ట్ర జనం జుట్టుపీక్కుంటున్నారు. తెలుగుదేశం వీరాభిమానులు కూడా వారిలో వుంటారు. కసు ఓడిపోయిన వారు కోర్టులోనే ఏడిస్తే గెలిచిన వారు ఇంట్లో ఏడ్చినట్లుగా వారు బయట పడరు అదే తేడా. ప్రధాన మంత్రిని కలిసిన తరువాత చంద్రబాబు నాయుడు మాట్లాడింది విలేకర్లందరితో ఒకేసారి, ఒకటే అయినా ఒకే పత్రికను చదివితే ఆయనేం మాట్లాడిందీ పూర్తిగా తెలియని స్థితి.

    చంద్రబాబు నాయుడు గతంలో చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వ పత్రిక ‘సాక్షి ‘(దాని ఆస్థులు ప్రభుత్వ ఆధీనంలో వున్నాయన్నారు కనుక) పత్రిక ‘ హోదాతో ఏం వస్తుంది ‘ అని చంద్రబాబు అన్నట్లు శీర్షిక పెట్టింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి చెప్పినట్లు ‘ ఆ రెండు ‘ పత్రికలలో ఒకటైన ‘ఆంధ్రజ్య్రోతి’ ‘కేంద్రానిదే బాధ్యత ‘ అనగా ‘ఈనాడు’ ప్రత్యేక హోదాపై ఆందోళన వద్దు ‘ అని ‘ప్రజాశక్తి ‘ చట్టంలోని అంశాలే ‘ అని పేర్కొన్నది. మొత్తం మీద రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది అనే దింపుడు కళ్లం ఆశను కూడా చంద్రబాబు తీర్చేశారు. రాష్ట్ర రాజకీయాలలో ఇదొక పెద్ద మలుపుకు నాంది. రాబోయే రోజుల్లో రాష్ట్రం రాజకీయం ఏ రకంగా వుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. వ్యూహాలు పన్నటానికి ప్రతి పార్టీ కొంత సమయం తీసుకోవచ్చు.లేస్తే మనిషిని కాదు అన్నట్లు ఫోజు పెడుతున్న పవన్‌ కల్యాణ్‌ వంటి వారు ఎలా లేస్తారు ? తెలుగుదేశం-బిజెపి తెగతెంపులు చేసుకుంటే పరస్పరం లాభమని భావిస్తాయా, కలిసి వుంటేనే కలదు సుఖం అనుకుంటాయా అన్నది స్పష్టం కావటానికి సమయం పట్టవచ్చు.

    దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియనట్లు ప్రత్యేక హోదా గానీ, ప్రత్యేక పాకేజీ కూడా రాదని చంద్రబాబుకు తెలిసినంతగా మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదు.గతేడాది రాజధాని శంకుస్థాపనకు ప్రధాని రాక సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక పాకేజిని అడిగినట్లు ప్రకటించి ప్రతిపక్షాల విమర్శలు ఎదుర్కొన్నారు. తరువాత నష్ట నివారణ చర్యగా తాను పొరపాటున హోదాబదులు పాకేజి అన్నానని సవరించుకున్నారు. కేంద్రంపై వున్న భ్రమలు, దింపుడు కళ్లం ఆశతో వున్నారని అప్పుడే వెల్లడైంది. అందువలనే గత రెండు సంవత్సరాలుగా ఎవరైనా కెలికితే తప్ప సాధ్యమైన మేరకు వాటి ప్రస్తావన రాకుండా చూసుకున్నారు, ఒక వేళ వచ్చినా బి పాజిటివ్‌ అన్న ధోరణిలో మాట్లాడారు. ఎంతైనా తెలివైన రాజకీయవేత్త కదా ! హోదా వచ్చినా పెద్దగా ఒరిగేదేమీ వుండదని జనానికి, హోదారాకపోయినా కనీసం ఆర్ధికంగా మంచి పాకేజి ఇచ్చినా సరిపెట్టుకుంటామన్నట్లుగా కేంద్రానికి అనేక సంకేతాలు పంపారు. మరోవైపు రాజధాని నిర్మాణం, విదేశాల నుంచి భారీఎత్తున పెట్టుబడుల పేరుతో పెద్ద హంగామా సృష్టించారు. ఎన్నిదేశాలు తిరిగినా ,ఎవరితో కూర్చున్నా వూసులు తప్ప కాసుల రాశులు రావటం లేదు. మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌, మా యింటికొస్తే మాకేం తెస్తావ్‌ అన్నట్లుగా ప్రతివారూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే పెట్టుబడుల కోసం పోటీ పడని రాష్ట్రం లేదని వారికీ అర్ధం అయింది. ఎవరైనా వూరికి దూరంగా ఇల్లు కడుతుంటే సామాన్లు వేసుకోవటానికి అవసరమైన తాత్కాలిక షెడ్డు వేసుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు ఏకంగా తాత్కాలిక రాజధాని నిర్మాణానికే వందల కోట్ల రూపాయలు తగలేస్తున్నారు. అంటే శాశ్వత రాజధాని శంకుస్థాపన దగ్గరే ఆగిపోతుందన్నది స్పష్టం. తనను సవాలు చేసే బలమైన ప్రతిపక్షం లేకపోయినా తాను సృష్టించుకున్న సమస్యలే ఎంతో బలంగా చంద్రబాబును నిలదీస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

    ప్రత్యేక హోదా, ప్యాకేజీల వంటివి ఏమీ రాకపోయినా జనాన్ని ఏదో విధంగా జోకొట్ట వచ్చు, అందుకు గాను ముందు ప్రతిపక్షం లేకుండా చూసుకోవాలన్నది చంద్రబాబు చాణక్యంగా కనిపిస్తోంది. ఒక వేళ బిజెపి తనను వదలి పెట్టి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటే దానికి అంత సీన్‌ లేదని అందరికీ తెలుసు. అందులోనూ ఐదు కాదు పదేండ్లు ప్రత్యేక హోదా అని పార్లమెంట్‌లోపలా, వెలుపలా హడావుడి చేసిన పార్టీ అది. చివరికి నిధులు ప్రత్యేక నిధులు కూడా ఇవ్వకుండా బిజెపి ఏ మొహం పెట్టుకొని ఓటర్ల వద్దకు వెళుతుంది.అందులోనూ దానిలో కాంగ్రెస్‌ ముఖాలే కనిపిస్తాయి. చంద్రబాబు అంచనా ప్రకారం కాంగ్రెస్‌ కోలుకోలేనంతగా దెబ్బతిన్నది, దానిని పునరుద్ధరించే నాయకత్వం కూడా లేదు. వైఎస్‌ఆర్‌సిపి నేత జగన్‌ విఫల ప్రతిపక్ష నేత. ఆ పార్టీని మరింతగా దెబ్బకొట్టటానికి ఒక పధకం ప్రకారం ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఇంకా ఎవరెవరో వస్తారని మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారు. అన్ని పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి తెలుగు దేశం పార్టీని కూడా ముఠాలతో మునిగి వుండే మరొక కాంగ్రెస్‌ పార్టీగా తయారు చేసినా ఒకరి జుట్టును మరొకరికి ముడివేసి తాను చక్రం తిప్పవచ్చు. వైఎస్‌ఆర్‌సిపిని బలహీన పరిస్తే పరిపాలనలో తాను వైఫల్యం చెందినా మరొక ప్రత్యామ్నాయం వుండదు కనుక బొటాబొటా మెజారిటీతో అయినా జనం తమను తప్ప మరొకరిని ఎన్నుకొనే అవకాశం లేదన్న అంచనాతో వున్నట్లు చెబుతున్నారు. అయితే రాజకీయ నేతలు వూహించిన విధంగా పరిణామాలు వుంటాయని చెప్పలేము. అందుకు ఒకసారి వెనక్కు తిరిగి చూడాలి. అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తరువాత జరిగిన ఎన్నికలలో జనతా పార్టీ గణనీయంగా ఓట్లు సంపాదించినప్పటికీ సీట్లు పొందటంలో విఫలమైది. 1978 అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ తరఫున ఎన్నికైన ఒకరిద్దరు తప్ప మిగిలిన వారందరినీ కాంగ్రెస్‌ తనలో కలిపేసుకొని ప్రతిపక్షం లేకుండా చేసుకుంది. అయితే తెలుగు దేశం రూపంలో తన ఏకపక్ష పాలనకు తెరదించే రోజులు వస్తాయని కాంగ్రెస్‌ నాయకత్వం ఆనాడు కనీసంగా వూహించలేదు. చంద్రబాబు నాయుడు కూడా అదే పరిణామాలను పునరావృతం చేస్తూ వైఎస్‌ఆర్‌సిపి దుకాణాన్ని ఖాళీ చేస్తున్నారు. ఆయన వూహిస్తున్నట్లు లేదా చెబుతున్న విధంగా విధిలేక జనం తననే ఎన్నుకుంటారా ? ఊహించని విధంగా కొత్త శక్తులు రంగంలోకి వస్తాయా ? ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు ?

     దేశంలోని కరవు పరిస్థితులపై సుప్రీం కోర్టు చీవాట్లు వేసిన తరువాత కేంద్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరుపుతున్న క్రమంలో భాగంగానే చంద్రబాబును ఢిల్లీకి ఆహ్వానించారు తప్ప ప్రత్యేక హోదా గురించి చర్చించటానికి కాదు అన్నది తెలుసుకోవాలి. ఈ సందర్బాన్ని చంద్రబాబు వుపయోగించుకొని ప్రధానితో ప్రత్యేకంగా భేటీ అయి ప్రత్యేక హోదా, ఇతర ఆర్ధిక సమస్యలను గురించి నివేదించారు. దీన్ని గురించి కూడా అధికారిక ప్రకటనేమీ లేదు. లీకుల సమాచారమే. ఎందుకంటే నరేంద్రమోడీ, చంద్రబాబు ఇద్దరు మాత్రమే మాట్లాడుకున్నారు. వారి మధ్య ఏం నడిచిందన్నది ఎవరో ఒకరు ఏదో రూపంలో ఎక్కడో అక్కడ వెల్లడించి వుండాలి. ఈ భేటీ గురించి ఒక పత్రికలో ప్రధానితో చంద్రబాబు సూటిగా మాట్లాడారని రాశారు అంటే చేతులు నలుపుకోకుండా గట్టిగా అడిగారనే అర్ధం ధ్వనించే విధంగా. ఒక ప త్రిక పదినిమిషాలే సమయం ఇచ్చినప్పటికీ రెట్టింపు సమయం మాట్లాడినట్లు రాస్తే మరొక పత్రిక అరగంట సేపు అని రాసింది. ఏది నిజం.

   మొత్తం మీద హోదా, నిధుల గురించి నెపాన్ని కేంద్రంపై నెట్టేందుకు తెలుగు దేశం నాయకత్వానికి మార్గాలు వెతికేందుకు మరికొంత కాలం గడపవచ్చు. ఇప్పటికే తెలుగుదేశంపై ధ్వజమెత్తుతున్న బిజెపి రానున్న రోజులలో మరింతగా తెలుగుదేశం పార్టీని రెచ్చగొట్టి నెపం మోపేందుకు ప్రయత్నించవచ్చు. మంగళవారం నాడు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు విలేకర్లతో మాట్లాడిన అంశాల తీరు తెన్నులను చూస్తే బిజెపికి వ్యతిరేకంగా సెంటి మెంట్‌ను రెచ్చగొట్టే ధోరణి కనిపించింది. రాష్ట్రానికి అన్యాయం చేసిందని పదే పదే కాంగ్రెస్‌ను ఆడిపోసుకుంటున్న చంద్రబాబు మరి బిజెపి సంగతి ఏమిటంటే తాను ఎన్నికలపుడే రాజకీయాలు మాట్లాడతానని తప్పించుకున్నారు. అన్ని పార్టీలు తనకు మద్దతు ఇవ్వాలని మరొక మాట. మొత్తం మీద ప్రధానితో మాట్లాడిన తరువాత గందరగోళానికి, వత్తిడికి గురైనట్లు ఆయన మాటలు వెల్లడిస్తున్నాయి.ఎవరికి ఏమైనా రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d