• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: China

అమెరికా ఎడమ చంకలో ఇమ్రాన్‌ – కుడి వైపున నరేంద్రమోడీ ! వావ్‌ !!

10 Saturday Apr 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

China, F-16 jets, imperialism, imran khan, Narendramodi, US, yankees


ఎం కోటేశ్వరరావు


మరో ఆరు రాఫేల్‌ యుద్ద విమానాలు ఏప్రిల్‌ 28న మన దేశానికి రానున్నాయన్నది ఒక వార్త . తన వ్యూహాత్మక భాగస్వామి పాకిస్ధాన్‌కు ఎనిమిది ఎఫ్‌-16 జెట్‌ యుద్దవిమానాలను విక్రయించాలని నిర్ణయించిన అమెరికా ఆమేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా ఇచ్చింది. డోక్లాంతో సహా చైనా-భూటాన్‌ మధ్య ఉన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలని రెండు దేశాలూ మంగళవారం నుంచి శుక్రవారం వరకు జరిగిన సంప్రదింపులలో రెండు దేశాలూ నిర్ణయించాయి.


విమానాల కొనుగోలు లావాదేవీల్లో మధ్యవర్తిగా ఉన్న భారత ” దేశభక్తుడు ” సుషేన్‌ గుప్తా దొంగతనంగా మన సైన్యం వద్ద పత్రాలను దొంగిలించి అందచేసినందుకు బహుమతి పేరుతో గుప్తా, మరికొందరు మధ్యవర్తులకు రాఫేల్‌ కొన్ని మిలియన్ల యూరోలు సమర్పించుకుంది. మన పాలక దేశభక్తులు ఏం చేస్తారో తెలియదు. పాకిస్ధాన్‌కు ఎఫ్‌-16 యుద్ద విమానాలు అందచేయటం ‘ఉగ్రవాదం’ మీద జరిపే పోరుకు ఇబ్బంది అని నరేంద్రమోడీ ఎంత మొత్తుకున్నా -నిజంగా అలా చేశారో లేదో తెలియదు- అమెరికా ఖాతరు చేయలేదు. గెజిట్‌లో కూడా ప్రకటించాం తన్నుకు చావండి అన్నట్లుగా ఉంది.
డోక్లాంలో చైనా సైన్యాన్ని అడ్డుకొనేందుకు మన మిలిటరీ భూటాన్‌ ఆహ్వానం మీద వెళ్లిందా లేదా చిన్న దేశం కనుక పక్కకు నెట్టి వ్యవహరించిందా అన్నది ఇప్పటికీ తేలని విషయమే. తాజాగా చైనా-భూటాన్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం స్వతంత్రంగానే భూటాన్‌ వ్యవహరించనున్నదని వార్తలు వచ్చాయి. అంటే మీకు చైనా ముప్పు ఉందంటూ మనం జోక్యం చేసుకొనేందుకు దారి మూసినట్లేనా ? అంతిమ ఒప్పందం కుదిరే వరకు రెండు దేశాల మధ్య శాంతి, సుస్ధిరతలను కాపాడాలని నిర్ణయించాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు సరిగా లేకపోయినా ఈ ఒప్పందం కుదరటం విశేషం. భారత్‌ను దూరంగా ఉంచేందుకు చైనా వైపు నుంచి భూటాన్‌కు గణనీయంగా రాయితీలు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. డోక్లాంకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో చైనీయులు భూటాన్‌ భూ భాగంలో ఒక గ్రామాన్ని నిర్మించారని మన పత్రికలు కట్టుకధలు రాసిన విషయం తెలిసిందే. అరుణాచల్‌లో కూడా అదే విధంగా గ్రామాలను నిర్మించినట్లు రాసిన విషయం తెలిసిందే.


నరేంద్రమోడీ సర్కార్‌ అమెరికా, దాని మిత్రపక్షాలతో జతకట్టదలచుకుంటే సూటిగానే చెప్పవచ్చు. దాని మంచి చెడ్డలను సమయం వచ్చినపుడు జనం తేలుస్తారు. మేము ఏదైనా బస్తీమే సవాల్‌ అన్నట్లుగా చెప్పి చేస్తాము అని చెప్పుకుంటున్న మోడీ నాయకత్వం ఆచరణలో అలా ఉందా ? ప్రతిదేశం ప్రతి సమస్య, పరిణామం నుంచి తామెలా లబ్ది పొందాలన్న తాపత్రయంలోనే ఉంది.అందుకే ఎన్నో ఎత్తులు, జిత్తులూ దీనికి ఏ దేశమూ మినహాయింపు కాదు. వాటి వలన జనానికి లబ్ది చేకూరుతుందా, వారి ప్రయోజనాలను ఫణంగా పెట్టి కార్పొరేట్లకు లాభాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా అన్నదే గీటురాయి.ప్రపంచం వైరుధ్యాల మయం. అవి నిరంతరం ఉంటూనే ఉంటాయి. అయితే అన్నీ ఒకేసారి ముందుకు రావు. ఏదైనా ప్రధాన వైరుధ్యంగా ముందుకు వచ్చినపుడు వాటి పట్ల తీసుకొనే వైఖరి తరువాత వచ్చే వైరుధ్యాన్ని బట్టి మారిపోతూ ఉండవచ్చు. ప్రపంచం మొత్తాన్ని మింగివేయాలన్నది అమెరికా దురాశ. అది సాధ్యం కాదని ఐరోపాలోని ధనిక దేశాలకు ఇంతకు ముందే తెలుసు కనుక వైరుధ్యాలను ఉపయోగించుకోవాలని అవి నిత్యం చూస్తుంటాయి.అమెరికా, ఐరోపా ధనిక దేశాలు తమ పధకంలో ఏ దేశాన్ని ఎక్కడ నిలిపి ఎలా లబ్ది పొందాలా అని నిరంతరాన్వేషణ సాగిస్తున్నాయి.
ఇప్పుడు ప్రపంచంలో ఇండోాపసిఫిక్‌ ప్రాంతం మీద కేంద్రీకరణ పెరిగింది. భూమి తన చుట్టుతాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది ప్రకృతి. అమెరికా అన్ని దేశాలనూ తన చుట్టూతిప్పుకోవాలనుకుంటుంది, అది వికృతి. తాటిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడుంటాడని చైనా నిరూపించింది. అతి పెద్ద దేశంలో ప్రవేశించి అక్కడి మార్కెట్‌ను కొల్లగొట్టాలన్నది అమెరికా, ఐరోపా ధనిక దేశాల ఆకాంక్ష. తమ దగ్గర లేని సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులను బయటి నుంచి తెచ్చుకొని తాము అభివృద్ధి చెందాలన్నది చైనా కమ్యూనిస్టుల లక్ష్యం. నాలుగుదశాబ్దాల ఈ పయనంలో చైనా కమ్యూనిస్టులే పైచేయి సాధించారు. ఎంతగా అంటే ఆర్ధికంగా అమెరికాను అధిగమించి పోయేంతగా అని వేరే చెప్పనవసరం లేదు. అందుకే దాన్ని అడ్డుకొనేందుకు ఎన్నో పధకాలు.


తన ఆర్ధిక, మిలిటరీ శక్తిని ఉపయోగించి మన దేశంతో సహా అనేక దేశాలను చైనాకు వ్యతిరేకంగా నిలబెట్టాలన్నది దాని పధకం. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడచిన తరువాత అమెరికా కొంత మేరకు సఫలీకృతమైంది.దానిలో భాగమే గతేడాది జరిగిన లడఖ్‌, అంతకు ముందు సంభవించిన డోక్లాం పరిణామాలు. భూటాన్‌-చైనా మధ్య వివాదంగా ఉన్న ప్రాంతంలో చైనా రోడ్డు వేయకూడదని మన దేశం వెళ్లి అడ్డుకుంది. మన ప్రాంతాలను చైనా ఆక్రమించలేదని స్వయంగా ప్రధాని మోడీ చెప్పినప్పటికీ లడఖ్‌ ప్రాంతంలో రెండు దేశాల మధ్య సాయుధ ఘర్షణలు జరిగాయి.చైనాకు వ్యతిరేకంగా చతుష్టయం పేరుతో అమెరికా-జపాన్‌-ఆస్ట్రేలియాలతో మన దేశం జట్టుకట్టి బస్తీమే సవాల్‌ అంటున్నాయి.ఈ గుంపులోకి ఐరోపా ధనిక దేశాలను కూడా లాగాలని చూస్తున్నాయి. పశ్చిమ దేశాలు అనుకున్న, వేసిన పధకం సఫలం కావాలంటే కాగితాల మీద గీతలు గీసినంత సులువు కాదు. ముందుగా చైనా వస్తువుల మీద ధనిక దేశాలు ఆధారపడటం మానుకోవాలి. అంటే వాటికి చౌకగా వస్తువులను తయారు చేసి సరఫరా చేసే ప్రత్యామ్నాయ దేశాలు కావాలి. మన దేశంలో చౌకగా దొరికే మానవశక్తి ఉంది, పశ్చిమ దేశాల వస్తువులకు అవసరమైన మార్కెట్టూ ఉంది. అందుకే మన దేశాన్ని, ఎవరు గద్దెమీద ఉంటే వారిని ఇంద్రుడూ చంద్రుడూ అంటూ పొగుడుతున్నాయి. సమీప భవిష్యత్‌లో మనం ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని ఎవరూ అనుకోవటం లేదు.


వివిధ పరిణామాలను ఒక దగ్గరకు చేర్చి చూస్తే దారులన్నీ రోమ్‌కే అన్నట్లుగా ప్రస్తుతానికి ప్రయత్నాలన్నీ చైనాకు వ్యతిరేకంగానే ఉంటున్నాయి. గతంలో బ్రిటన్‌-జపాన్‌-ఫ్రాన్స్‌ -స్పెయిన్‌- ఇటలీ-జర్మనీ చరిత్రను చూసినపుడు ప్రపంచాన్ని పంచుకొనేందుకు వాటి మధ్య వచ్చిన పంచాయతీలే అనేక ప్రాంతీయ, రెండు ప్రపంచ యుద్దాలకు దారి తీశాయి. ఇప్పుడు వీటన్నింటినీ పక్కకు నెట్టి అమెరికా ముందుకు వచ్చి అదే చేస్తోంది.చైనా మార్కెట్లో వాటికి ప్రవేశం కల్పిస్తే, చైనా తమకు పోటీ ఇవ్వకుండా ఉంటే అసలు పేచీయే లేదు. అది జరగటం లేదు గనుకనే ఏదో ఒక గిల్లికజ్జా పెట్టుకుంటున్నాయి. చైనాకు పోటీగా మన దేశాన్ని వినియోగించుకోవాలని చూసిన పశ్చిమ దేశాలు తీవ్ర ఆశాభంగం చెందాయి. దాని దరిదాపుల్లో కూడా మనం లేకపోవటంతో చైనాతో విధిలేక ముద్దులాట-దెబ్బలాట అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. మన ప్రధాన బలహీనత జిడిపిలో 14శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగంలో 50శాతం మంది ఉపాధిపొందుతున్నారు.అరవైశాతంగా ఉన్న సేవారంగం 28శాతం మందికే ఉపాధి చూపగలుగుతోంది.

లాహిరి లాహిరిలో అన్నట్లుగా చైనా అధినేత గ్జీ జింపింగ్‌ ా మన నరేంద్రమోడీ వ్యవహరించిన తీరును మనం చూశాము. అలాంటిది ఆకస్మికంగా గాల్వన్‌లోయ ఉదంతాలకు ఎందుకు దారి తీసింది ? చైనా మన ప్రాంతాలను ఆక్రమించుకోలేదని ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశంలో చెప్పిన తరువాత సరిహద్దుల్లో జరిగిన ఉదంతాల గురించి పరిపరి విధాల ఆలోచనలు ముందుకు వచ్చాయి. చైనాతో వచ్చిన లేదా తెచ్చుకున్న సరిహద్దు వివాద అసలు లక్ష్యం ఏమిటి ?తెరవెనుక పాత్రధారులు, వారేం చేస్తున్నదీ మనకు కనిపించదు,వినిపించదు. తెర ముందు జరిగే వాటిని బట్టి నిర్దారణకు వస్తే తప్పులో కాలేస్తాము. చైనాతో సరిహద్దు వివాదం రాజకీయంగా నరేంద్రమోడీ పుట్టక ముందునుంచీ ఉంది.1962 తరువాత కొత్తగా మన భూభాగం చైనా ఆధీనంలోకి వెళ్లలేదని మోడీ సర్కారే పార్లమెంటులో కూడా చెప్పింది. మన పాలకులు చెబుతున్నట్లుగా సరిహద్దుల్లో చైనా కవ్వించిందనే అనుకుందాం. చర్చల ద్వారా అనేక అంశాలను పరిష్కరించుకుంటున్న మనం ఆ మార్గాన్ని ఎందుకు ఎందుకు ఎంచుకోలేదు ? కాసేపు పక్కన పెడదాం.

ఇరాన్‌తో మనకు గోడ-నీడ పంచాయతీల్లేవే. (ఇష్టం లేకపోతే నీ స్ధలమే గావచ్చు గోడ ఎత్తుగా కట్టావు, దాని నీడ మా ఇంటి మీద పడుతోందని గిల్లికజ్జా) ఇప్పుడు ఇరాన్‌-చైనా మధ్య ఏర్పడిన బంధం మన దేశానికి తలనొప్పిగా మారిందని, కొత్త సవాళ్లను ముందుకు తెచ్చిందని సంఘపరివార్‌ పత్రిక ఆర్గనైజర్‌ మాజీ సంపాదకుడు శేషాద్రి చారి పేర్కొన్నారు. తలనొప్పి స్వయంగా నరేంద్రమోడీ తెచ్చింది తప్ప మరొకటి కాదు. శేషాద్రి ముందుకు తెచ్చిన అంశాల సారాంశాన్ని చూద్దాం. ఇరాన్‌ మీద విధించిన ఆంక్షలను తొలగించే చిన్నపాటి సూచనలు కూడా అమెరికా నుంచి వెలువడని సమయంలో పాతికేండ్ల పాటు అమల్లో ఉండే 400 బిలియన్‌ డాలర్ల ఒప్పందాన్ని ఇరాన్‌తో చైనా కుదుర్చుకుంది.హార్ముజ్‌ జలసంధిలో కీలక స్ధానంలో ఉన్న బందర్‌ అబ్బాస్‌ రేవు ద్వారానే మన దేశానికి గరిష్టంగా సరకు రవాణా జరుగుతోంది.అమెరికా ఆంక్షల కారణంగా మన దేశానికి దాన్ని మూసివేసినందున మన రవాణా ఖర్చులు అనేక రెట్లు పెరుగుతున్నాయి.చమురు సరఫరాలు నిలిచిపోయిన కారణంగా ధరలు పెరిగిపోయి వాణిజ్యలోటులో సమస్యలు వస్తున్నాయి. అరవై రోజుల వరకు అరువు సౌకర్యం, ఆకర్షణీయమైన రాయితీలు, రూపాయి చెల్లింపులను అంగీకరించటం వంటివి ఇరాన్‌తో మనకున్న సానుకూల అంశాలలో కొన్ని మాత్రమే. ఇవన్నీ పోవటం మన వ్యూహాత్మక, రక్షణ ప్రయోజనాలకు వ్యతిరేకం. మధ్య ఆసియా దేశాలతో మన వాణిజ్యానికి ఇరాన్‌ ముఖద్వారం. పాకిస్ధాన్‌తో నిమిత్తం లేకుండా చబ్బార్‌ రేవు ద్వారా ఆఫ్ఘనిస్తాన్లో ప్రవేశించేందుకు ఉపయోగపడుతుంది. తుర్కుమెనిస్దాన్‌-ఆఫ్ఘనిస్దాన్‌-పాకిస్దాన్‌-భారత్‌ చమురు పైప్‌లైన్‌ మన ఇంధన భద్రతకు అవసరం. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ఇరాన్‌ సహకారం లేకుండా సాధ్యం కాదు, అందువలన ఇరాన్‌పై ఆంక్షల ఎత్తివేతకు మన దేశం అమెరికాను ఒప్పించాల్సి ఉందని శేషాద్రి చారి చెప్పారు. ఆ పెద్దమనిషి చైనా వ్యతిరేకి అని వేరే చెప్పనవసరం లేదు. అయినా నరేంద్రమోడీ సర్కార్‌ వైఖరిని ఎందుకు తప్పు పడుతున్నట్లు ? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.అమెరికాను నమ్ముకొని మోడీ ఇరుగు పొరుగు దేశాలను చైనా వైపు వెళ్లేట్లు నెడుతున్నారన్నది అసలు దుగ్ద. చైనాతో సరిహద్దు వివాదం ఉంది గనుక మన లడఖ్‌లో ప్రతాపం చూపాము అనుకుంటే అర్ధం ఉంది. మరి ఇరాన్‌ను ఎందుకు దూరం చేసుకుంటున్నాము ? అమెరికా కౌగిలింతలతో మునిగి తేలుతూ ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులు నిలిపివేశాము.


ఇరాన్‌తో చైనా ఒప్పందం కేవలం దానికి అవసరమైన చమురు కోసమే అనుకుంటే పొరపాటు. అమెరికా ఆంక్షలతో ఇబ్బంది పడుతున్న ఇరాన్‌ ఆర్దిక వ్యవస్ధను ఆదుకోవటం కూడా దానిలో కీలక అంశం. ప్రపంచాన్ని ఆక్రమించాలని చూస్తున్న అమెరికాను కట్టడి చేసే మధ్య ప్రాచర్య వ్యూహంలో భాగం అది. ఇండో-పసిఫిక్‌ వ్యూహం పేరుతో చైనాను దెబ్బతీసేందుకు భారత్‌-జపాన్‌-ఆస్ట్రేలియాలను ఇప్పటికే అమెరికా ఒక దగ్గరకు చేర్చింది. దానికి ప్రతిగా చైనా తన ఎత్తుగడలను రూపొందించుకొంటోంది. రానున్న రోజుల్లో మధ్య ప్రాచ్యం అగ్రదేశాల అధికార పోరుకు వేదిక కానుందన్నది చైనా అంచనా.అందుకే ఆప్రాంతంతో పాటు ఆఫ్రికాలో కూడా చైనా వ్యూహాన్ని అమలు చేస్తూ అనేక దేశాలతో ఒప్పందాలతో ముందుకు పోతున్నది. పశ్చిమాసియాలో షియా-సున్నీ విభేదాలను ఉపయోగించుకొని అమెరికా రాజకీయం చేస్తుంటే చైనా దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నది.సున్నీలు మెజారిటీగా ఉన్న సౌదీ అరేబియా-షియాలు మెజారిటీగాఉన్న ఇరాన్‌తోనూ సత్సంబంధాలను కలిగి ఉంది. రెండు దేశాల నుంచీ పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తున్నది. అమెరికాను ఎదుర్కొనే ఎత్తుగడలో భాగంగా రష్యా కూడా తన పావులు కదుపుతున్నది. 2019లో చైనా-రష్యా-ఇరాన్‌ మిలిటరీ సంయుక్త విన్యాసాలు అమెరికాకు ఒక హెచ్చరిక తప్ప మరొకటి కాదు.


వర్దమాన దేశాలు తమలో తాము సహకరించుకోవటం ద్వారా అభివృద్ధి పొందాలి తప్ప సామ్రాజ్యవాదులతో చేతులు కలిపి బాగుపడదామనుకుంటే జరిగేది కాదన్నది ఇప్పటి వరకు ప్రపంచ అనుభవం. మన సంబంధాలు అమెరికా, జపాన్‌ వంటి దేశాలతో ఈ గీటురాయితోనే సరి చూసుకోవాలి. ఒకవైపు బ్రెజిల్‌, రష్యా,ఇండియా,చైనా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్‌) ఒక కూటమిగా సహకరించుకోవాలని సంకల్పం చెప్పుకున్నాయి. మరోవైపు మన దేశం చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో జతకడుతుంది. అలాంటపుడు ఈ కూటమి దేశాల మధ్య విశ్వాసం ఎలా ఉంటుంది, సహకారానికి ఎలా దారి చూపుతుంది ? అందుకే ముందుకు పోవటం లేదు. చతుష్టయంలో చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో చేతులు కలిపిన ఆస్ట్రేలియా, జపాన్‌ మరోవైపు అమెరికా వ్యతిరేకించే ఆర్‌సిఇపి కూటమిలో చైనాతో చేతులు కలుపుతాయి.అమెరికా బెదిరింపులను కూడా ఖాతరు చేయకుండా చైనాతో ఒప్పందాలు చేసుకున్న ఐరోపాధనిక దేశాలు మరోవైపున ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో జట్టుకట్టేందుకు ఆసక్తి చూపుతాయి. అమెరికా రెచ్చగొట్టగానే చైనాతో తాడోపేడో తేల్చుకుంటామన్న మన నరేంద్రమోడీ సర్కార్‌ మరోవైపు దానితో చర్చల ప్రక్రియ సాగిస్తోంది.బాలాకోట్‌ దాడులతో పాక్‌ను దెబ్బతీశామని ప్రకటించిన మన దేశం తెరవెనుక వారితో 2018 నుంచే సంప్రదింపులు జరుపుతున్నట్లు బయటపడింది. రెండు దేశాలూ సఖ్యంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవలనే నాటకీయంగా ప్రకటన చేశాయి. ఆట మనకై మనమే ఆడుతున్నామా లేక ఎవరైనా ఆడించినట్లు ఆడుతున్నామా ?

ప్రపంచీకరణను ముందుకు తెచ్చింది అమెరికా, ఐరోపా అగ్రరాజ్యాలు. మనవంటి వర్ధమాన, పేద దేశాలను దానిలోకి లాగిందీ అవే. దశాబ్దాల పాటు చైనాను ప్రపంచీకరణలో భాగస్వామిని చేసేందుకు నిరాకరించాయి. తీరా ఇప్పుడు ప్రపంచీకరణకు భిన్నమైన చర్యలు తీసుకుంటున్నదీ దాన్ని ప్రారంభించిన దేశాలే. నిజమైన ప్రపంచీకరణ స్ఫూర్తిని పాటించాలని చైనా డిమాండ్‌ చేస్తున్నది. ప్రపంచ పరిణామాల్లో ఎంత మార్పు ? ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్ధ వంటి వాటన్నింటినీ పక్కన పెట్టి అమెరికా తన సంగతి తాను చూసుకుంటోంది. మనవంటి దేశాలను తన అజెండాకు అనుగుణ్యంగా నడవమంటోంది, బెదిరిస్తోంది.(ఇరాన్‌ చమురు కొనవద్దని ఆదేశించటం పక్కా నిదర్శనం). రెండవ ప్రపంచ యుద్దం తరువాత ప్రపంచీకరణ ద్వారా తన మార్కెట్‌ను పెంచుకోవాలన్నది ధనిక దేశాల ఎత్తుగడ. అవి అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి.


మనలను ప్రధాన భాగస్వామి అని చెబుతున్న అమెరికన్లు పాకిస్ధాన్‌కూ అదే చెబుతున్నారు. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు గానీ అమెరికా చెరొక చంకలో ఇమ్రాన్‌ ఖాన్ను, నరేంద్రమోడీని ఎక్కించుకుంటున్నట్లు పరిణామాలు వెల్లడిస్తున్నాయి. అమెరికాను నమ్ముకొని చైనాతో శతృత్వం పెంచుకుంటే నష్టం మనకే. పశ్చిమాసియా, మధ్య ఆసియాలో అమెరికా ప్రయోజనాల రక్షణకు, ఇరాన్‌కు వ్యతిరేకంగా పాకిస్ధాన్‌ అవసరం. అందుకే మనలను మాయపుచ్చటానికి ఎన్ని కబుర్లు చెప్పినా చేయాల్సింది చేస్తోంది. పాక్‌తో సయోధ్యకు మన మెడలు వంచుతోంది. మనం లొంగిపోయామనే అంచనాకు వచ్చిన కారణంగానే వాణిజ్యం, దిగుమతుల విషయంలో సానుకూల ప్రకటన చేసిన పాకిస్ధాన్‌ మరుసటి రోజే అబ్బెబ్బె అదేం లేదంటూ మాట మార్చింది. ఎఫ్‌ -16 విమానాలను తెచ్చుకున్నాం గనుక తాడో పేడో తేల్చుకుందాం అన్నా ఆశ్చర్యం లేదు.


ఒక స్వతంత్ర విదేశాంగ విధానం లేనట్లయితే మనం ఎటువైపు ఉండాలో తేల్చుకోలేము.గతంలో నెహ్రూ, కాంగ్రెస్‌ హయాంలో సోవియట్‌కు అనుకూలంగా ఉండి భారీ పరిశ్రమలు, ఇప్పుడు అనేక విజయాలు సాధిస్తున్న అంతరిక్ష రంగానికి అవసరమైన వాటిని సాధించుకున్నాము. ఇప్పుడు అమెరికాకు అనుకూలంగా మారి చెప్పుకొనేందుకు సాధించింది ఏమైనా ఉందా ? లేకపోగా చుట్టుపక్కల వారినందరినీ దూరం చేసుకున్నాము. పాకిస్ధాన్‌, చైనాతో శతృత్వం పెంచుకుంటున్నాము. దాని ద్వారా ఆయుధాలు అమ్ముకుంటున్న అమెరికా తప్ప మనకు కలిగిన లబ్ది ఏమిటో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కరుడు గట్టిన నేరగాండ్లు, మాఫియా ముఠాలు కొత్త వారికి ఎరలు వేసి ఆకర్షిస్తారు. మెల్లగా వారికి తెలియకుండానే చిన్నపాటి నేరాలు చేయించి తమ బందీలుగా చేసుకుంటారు. తరువాత వారు చెప్పినట్లు చేయక తప్పని స్ధితిని కల్పిస్తారు. అమెరికా, ఇతర అగ్రదేశాలు కూడా అంతే ! ఈ అంశాన్ని మన పాలకులు గుర్తిస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

దొంగ చెవులు, సమాచార తస్కరణ బడా చోర్‌ అమెరికా సంగతేమిటి ?

20 Sunday Sep 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

China, Datamining, Eavesdroppers, EDWARD SNOWDEN, US CIA, US NSA


ఎం కోటేశ్వరరావు
నవంబరులో జరిగే ఎన్నికల్లో ప్రచారం కోసం డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి జో బిడెన్‌ తయారు చేయించిన ఓట్‌ జో ఆప్‌ నుంచి కీలకమైన సమాచారం బయటకు పోతున్నట్లు కనుగొన్నారు. ఓటర్ల రాజకీయ అనుబంధాలు ఏమిటి, గతంలో వారు ఎవరికి ఓటు వేశారు అన్న సమాచారం దానిలో ఉంటుందట, ఇప్పుడు అది ఎవరికి అవసరం, ఇంకెవరికి మన ప్రధాని నరేంద్రమోడీ జిగినీ దోస్త్‌ డోనాల్డ్‌ ట్రంప్‌కే.
గూగుల్‌ ఖాతాదారుల 2ఎఫ్‌ఏ ఎస్‌ఎంఎస్‌ కోడ్స్‌ను తస్కరించేందుకు ఇరానియన్‌ హాకర్ల గ్రూప్‌ ఒక ఆండ్రాయిడ్‌ అక్రమ చొరబాటుదారును అభివృద్ది చేసింది.
రాబోయే రోజుల్లో సమాచారాన్ని తస్కరించే అక్రమచొరబాటుదార్ల దాడులను ఎదుర్కొనేందుకు పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించుకోవాలని బ్రిటన్‌లోని ఎన్‌సిఎస్‌సి విద్యా సంస్ధలకు సలహాయిచ్చింది.


జర్మనీలో ఒక ఆసుపత్రి సమాచార వ్యవస్ధపై జరిగిన దాడి కారణంగా కంప్యూటర్‌ వ్యవస్ధలు పని చేయలేదు. దాంతో తక్షణం చికిత్స అందించవలసిన ఒక మహిళా రోగిని మరో పట్టణంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సి రావటంతో ఆమె మరణించింది.
తమ సంఘంలోని రెండు లక్షల మంది నర్సుల వ్యక్తిగత సమాచార భద్రతకు తగిన చర్య తీసుకోని కారణంగా చోరీకి గురైనట్లు కెనడాలోని అంటారియో రాష్ట్ర నర్సుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాలోని న్యూజెర్సీ యూనివర్సిటీ హాస్పిటల్‌ సమాచార వ్యవస్ధపై జరిగిన దాడిలో 48వేల మందికి సంబంధించిన సమాచారం చోరీకి గురైంది. అమెరికా ఫెడరల్‌ కోర్టుల ఫోన్‌ వ్యవస్ధ గురువారం నాడు పనిచేయలేదు.సైబర్‌దాడుల గురించి 75శాతం మంది ఐటి ఎగ్జిక్యూటివ్‌లు ఆందోళన వ్యక్తం చేసినట్లు కనెక్ట్‌వైజ్‌ అనే సంస్ధ తాజా నివేదికలో వెల్లడించింది. ఇవన్నీ తాజా వార్తల్లో కొన్ని మాత్రమే.


ఇక కంప్యూటర్‌ అక్రమ చొరబాటుదార్ల మధ్య పరస్పర సహకారం పెరుగుతున్నట్లు పాజిటివ్‌ టెక్నాలజీస్‌ అనే సంస్ధ తాజా నివేదికలో వెల్లడించింది.2020 సంవత్సరం రెండవ త్రైమాసికంలో జరిగిన సైబర్‌దాడుల గురించి చేసిన విశ్లేషణలో తొలి మూడు మాసాలతో పోల్చితే తొమ్మిది శాతం, 2019తో పోల్చితే 59శాతం పెరిగినట్లు, కరోనా కారణంగా ఏప్రిల్‌, మే మాసాల్లో రికార్డులను బద్దలు చేస్తూ దాడులు పెరిగినట్లు తెలిపింది. వస్తుతయారీ, పారిశ్రామిక కంపెనీలపై దాడులు పెరిగినట్లు తేలింది. తాము కోరిన మొత్తాన్ని చెల్లించని పక్షంలో తాము కాపీ చేసుకున్న లేదా తస్కరించిన సమాచారాన్ని బహిర్గతం చేస్తామని దాడులకు పాల్పడిన వారు బెదిరిస్తున్నట్లు విశ్లేషణలో తేలింది. లాక్‌బిట్‌ మరియు రాగనర్‌ లాకర్‌ వంటి చోరీ ముఠాలు ఈ రంగంలో గాడ్‌ ఫాదర్‌ లేదా డాన్‌గా ఉన్న మేజ్‌తో జతకట్టటం, సహకరించుకోవటానికి ముందుకు వస్తున్నట్లు తేలింది. అందరూ కలసి మేజ్‌ బృందం పేరుతో తస్కరించిన సమాచారాన్ని తమ వెబ్‌సైట్‌లో బహిర్గతం చేస్తున్నారు. దాన్ని చూపి కంపెనీలను బెదిరిస్తున్నారు. వీటన్నింటినీ చూసినపుడు ఒకటి స్పష్టం. సమాచార చౌర్యం అన్నది ప్రపంచ వ్యాపిత సమస్య. బడా కంపెనీలు తమ ప్రయోజనాల కోసం తస్కరిస్తే, దాన్ని చోరీ చేసి బెదిరించి సొమ్ము చేసుకొనే వారు కూడా తయారయ్యారు.


చైనా సంస్కరణల్లో భాగంగా విదేశీ పెట్టుబడులకు, సంస్దలకు ద్వారాలు తెరుస్తున్న సమయంలో వాటికి ఆద్యుడిగా ఉన్న డెంగ్‌ సియావో పింగ్‌ ఒక మాట చెప్పాడు. గాలి కోసం కిటికీలు తెరుస్తున్నపుడు మంచి గాలితో పాటు ఈగలు, దోమలు కూడా ప్రవేశిస్తాయి, వాటిని ఎలా అరికట్టాలో మాకు తెలుసుఅన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాల నుంచి, మన దేశం నుంచీ చైనా వెళుతున్నవారిలో గూఢచారులు లేరని ఎవరైనా చెప్పగలరా ? దానికి ప్రతిగా చైనా తన పని తాను చేయకుండా ఉంటుందా ?


ఈ వాస్తవాన్ని విస్మరించి పాఠకులను, వీక్షకులను ఆకర్షించేందుకు మన మీడియా పడుతున్న పాట్లు చెప్పనలవిగావటం లేదు. తాజా విషయానికి వస్తే బెంగళూరు నగరంలోని కేంద్ర ప్రభుత్వ జాతీయ సమాచార కేంద్రంలోని వంద కంప్యూటర్లు ఒక నెల రోజుల్లోనే రెండు సార్లు సైబర్‌ దాడికి గురైనట్లు వార్తలు వచ్చాయి. అంటే సమాచార తస్కరణ జరిగింది. జరిగినట్లు కూడా తెలియదు. ఎలక్ట్రానిక్‌ సమాచారాన్ని ఏమీ చేయకుండానే కాపీ చేసుకొనే సౌలభ్యం గురించి తెలియని వారెవరు ? ఈ దాడి పైన చెప్పుకున్న మేజ్‌ బృందం చేసినట్లు చెబుతున్నారు. ఈ కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరుపుతున్న ఎలక్ట్రానిక్‌ పాలనకు సంబంధించి అనేక అంశాలు నిక్షిప్తమై ఉన్నాయి. జాతీయ రహదారుల సంస్ధ సమాచార వ్యవస్ధమీద కూడా దాడి జరిగింది.ఇంకా ఇలాంటి దాడులు ఎన్ని జరిగాయో తెలియదు. ఆ వివరాలను బహిరంగంగా చెబితే ప్రభుత్వ పరువు పోతుంది కనుక అధికార యంత్రాంగం మూసిపెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నది వేరే చెప్పనవసరం లేదు.
చైనాకు చెందిన సంస్ధ ఒకటి మన దేశంలోని వేలాది మంది ప్రముఖులు, సంస్ధలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి అక్కడి ప్రభుత్వానికి అంద చేస్తున్నదని ఒక ఆంగ్ల పత్రిక రాసిన వార్త కొద్ది రోజుల క్రితం సంచలనం అయింది. దానిలో ఉన్న అంశాలు ఏమిటట ? పది వేల మంది ప్రముఖులకు సంబంధించి బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని జెన్‌హువా అనే సంస్ధ సేకరించి విశ్లేషిస్తోందట. ఎప్పటి నుంచి ? 2018లో ప్రారంభం అంటున్నారు ? అంతకు ముందు ఎందుకు చేయలేదు ? చెప్పేవారు లేరు. అప్పటి నుంచే ఆ సమాచారం ఎందుకు అవసరమైంది. మనకు తెలియదు. మరి సమాచార సేకరణ నిజమా కాదా ? నూటికి నూరుపాళ్లు నిజమే. బహిరంగంగా తెలిసిన సమాచారమే కాదు, తెలియని సమాచారాన్ని కూడా చైనా సేకరించుతుంది. ఎందుకని ? ప్రపంచంలో ఆ పని చేయని దేశం ఏది ? ఒక్కటి కూడా లేదు. ఇదంతా బహిరంగ రహస్యమే. సమాచార చోరీ గురించి పభుత్వానికి తెలుసు అని ఐటి శాఖ చెప్పింది. మరి తెలిసిందాన్ని సంచలన విషయంగా మీడియా వారు ఎందుకు చెబుతున్నారు ? అలా చెబితే తప్ప జనాలకు కిక్కు రావటం లేదు మరి. చైనాకు వ్యతిరేకంగా ఇప్పుడు ఏది చెప్పినా గిట్టుబాటు అవుతుందన్న లాభాపేక్ష. అమెరికా ఇతర దేశాల గురించి రాస్తే ఢిల్లీ ప్రభువులకు ఎక్కడ ఆగ్రహం వస్తుందో అన్న భయం. కమ్యూనిస్టు వ్యతిరేకత సరే సరి !
కొద్ది సంవత్సరాలు వెనక్కు వెళితే 2010లో చేరి అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేసిన ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ అనే కుర్రాడు (37) సిఐఏ, ఎన్‌ఎస్‌ఏ వంటి సంస్ధలు సేకరించిన వందల కోట్ల ఫైళ్లను ప్రపంచానికి బహిర్గతం చేశాడు. అమెరికా నగరం వాషింగ్టన్‌లోని మన రాయబార కార్యాలయం, న్యూయార్క్‌లోని మన ఐరాస కార్యాలయాల కంప్యూటర్‌ వ్యవస్ధలోకి చొరబడిన అమెరికన్‌ ఎన్‌ఎస్‌ఏ ప్రభుత్వ ఆదేశాలు, ఇతర సమాచారాన్ని తస్కరించింది.గూగుల్‌, ఆపిల్‌, మైక్రోసాప్ట్‌, యాహూ వంటి బడా ఐటి కంపెనీలు సేకరించిన అమెరికనేతర దేశాలకు చెందిన సమాచారం మొత్తం అమెరికాకు చేరిపోయింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది.


ప్రపంచ వ్యాపితంగా 97 బిలియన్లు అంటే 9,700 కోట్ల సమాచార అంశాలను అమెరికా చోరీ చేసిందని గార్డియన్‌ పత్రిక ఆరేండ్ల క్రితం వెల్లడించింది. దాని దౌత్యవేత్తలు, గూఢచారులు పంపిన నివేదికలు కూడా వాటిలో ఉన్నాయి. అమెరికన్లు తమ శత్రువుల సమాచారాన్ని మాత్రమే సేకరించి మిత్రులను మినహాయించలేదు. శత్రుదేశంగా పరిగణించే ఇరాన్‌ నుంచి 1400 కోట్లు, మిత్ర దేశమైన పాకిస్ధాన్‌ నుంచి 1350 కోట్లు, పశ్చిమాసియాలో అత్యంత సన్నిహిత దేశమైన జోర్డాన్‌ నుంచి 1270 కోట్లు, ఈజిప్టు నుంచి 760, మన దేశం నుంచి 630 కోట్ల ఫైళ్ల సమాచారాన్ని తస్కరించింది.


మన దేశం తమకు మిత్ర దేశమని చెబుతూనే రాజకీయ పార్టీలు, నేతలకు సంబంధించిన సమాచారాన్ని, వాణిజ్య అంశాలు ప్రత్యేకించి అణు, అంతరిక్ష కార్యక్రమాలను అమెరికా సేకరించినట్లు హిందూ పత్రిక వెల్లడించింది. ఇంటర్నెట్‌ నుంచి 630, టెలిఫోన్ల నుంచి 620 కోట్ల వివరాలను సేకరించినట్లు కూడా తెలిపింది. ఆరు సంవత్సరాల నాడు ఈ వివరాలు వెల్లడైనపుడు ప్రొఫెసర్‌ గోపాలపురం పార్ధసారధి అనే మాజీ సీనియర్‌ దౌత్యవేత్త మాట్లాడుతూ హిందూ పత్రిక ప్రకటించిన వార్తల గురించి ఎవరూ ఆశ్చర్య పడనవసరం లేదని, ప్రతివారూ ప్రతి ఒక్కరి మీద నిఘావేస్తారు, కొంత మంది మంచి పరికరాలను కలిగి ఉండవచ్చు, వారి సౌకర్యాలు మనకు గనుక ఉంటే మనమూ అదే పని చేస్తామని గట్టిగా చెప్పగలను అని గార్డియన్‌ పత్రికతో చెప్పారు.


అమెరికా తస్కరించిన సమాచారాన్ని బయట పెట్టటానికి మూడు సంవత్సరాల ముందు ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ అమెరికన్‌ సిఐఏ కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తూ న్యూ ఢిల్లీ వచ్చి ఆరు రోజులు ఉన్నాడు. కంప్యూటర్ల నుంచి సమాచార నైతిక తస్కరణ, సాఫ్ట్‌వేర్లను తెలుసుకోవటం ఎలా అనే అంశం మీద శిక్షణ పొందాడు. అంటే మన దేశంలో అలాంటి నిపుణులకు కొదవ లేదన్నది స్పష్టం. సమాచారాన్ని నిల్వ చేసే పద్దతులు తెలుసుకోవటం ఎలానో, కంప్యూటర్లలోకి దొంగలు ఎలా ప్రవేశిస్తారో, వారిని ఎలా నిరోధించాలో కూడా విద్యార్ధులకు శిక్షణ అవసరమే మరి. తమ దగ్గరకు వచ్చే వారు ఏ లక్ష్యంతో వస్తున్నారో శిక్షణా సంస్దలు తెలుసుకోలేవు. చాకుతో మామిడి, కూరగాయలను ఎలా కోయవచ్చో చెప్పటంతో పాటు అవసరం అయితే దాన్నే ఆత్మరక్షణకు ఎలా ఉపయోగించుకోవచ్చో చెబుతారు. అది తెలిసిన వారు దారి తప్పినపుడు నేరానికి ఉపయోగించటంలో ఆశ్చర్యం ఏముంది?


ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ తాను భారత్‌ వెళుతున్నట్లు అక్కడ సమాచార నిల్వ, తస్కరణ వంటి అంశాల్లో శిక్షణ పొందబోతున్నట్లు అమెరికా భద్రతా అధికారులకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడని ఒకవైపు చెబుతారు. తీరా అతను రహస్య సమాచారాన్ని బయట పెట్టిన తరువాత అమెరికా ఎన్‌ఎస్‌ఏ చెప్పిందేమిటి ? తమ కాంట్రాక్టు ఉద్యోగిగా అంటే భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు స్నోడెన్‌ను నియమించే సమయంలో సిఐఏ అధికారులు క్షుణ్ణంగా మంచి చెడ్డల గురించి ప్రశ్నించకుండానే ఎంపిక చేశారట. అతను విదేశాలకు దేనికి వెళ్లాడు, ఏం చేశాడు, అతన్ని కలిసిన, కలుస్తున్న వ్యక్తులెవరు ? వారెలాంటి వారు తదితర అంశాలను పట్టించుకోలేదని, జాగ్రత్త చేయాలంటూ 17లక్షల రహస్య ఫైళ్లను అతనికి అప్పగించారని తెలిపింది. అయితే అతను సిఐఏ కాంట్రాక్టరుగా, సాంకేతిక సహాయకుడిగా భారత్‌ వస్తున్నట్లు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి స్పష్టంగా తెలుసు. తాను వ్యాపారనిమిత్తం భారత్‌ వచ్చానని స్నోడెన్‌ చెప్పినట్లు అతనికి శిక్షణ ఇచ్చిన కోయింగ్‌ సొల్యూషన్స్‌ సిఇఓ రోహిత్‌ అగర్వాల్‌ చెప్పాడు. తాము సిఐఏ గూఢచారులమనిగానీ, దాని తరఫున వచ్చామని గాని ఎక్కడా వెల్లడించవద్దని సిఐఏ అధికారులు జారీ చేసిన మార్గదర్శక సూత్రాల్లోనే ఉంది కనుక స్నోడెన్‌ తాను వ్యాపారినని చెప్పాడు.అలాంటి వారందరూ ఏ దేశం వెళితే అక్కడి అమెరికా రాయబార కార్యాలయాల్లోనే పని చేస్తారు అన్నదీ బహిరంగ రహస్యమే.
సమాచారాన్ని సేకరించేందుకు, గూఢచర్యం కోసం కొన్ని కంపెనీలనే కొనుగోలు చేయటం అందరికీ తెలిసిందే.1970లో క్రిప్టో ఏజి అనే స్విస్‌ కంపెనీని అమెరికా, జర్మనీ గూఢచార సంస్ధలు కొనుగోలు చేసి వంద దేశాలల్లో వేగుల కార్యకలాపాలకు దాన్ని వేదికగా చేసుకున్నాయి. అయితే రెండు దేశాల అధికారుల మధ్య పరస్పర అనుమానాలు తలెత్తి ఫిర్యాదుల వరకు వెళ్లాయి. సిఐఏ సిబ్బందిలో కొంత మందికి జర్మన్‌ భాష రాకపోవటం కూడా దీనికి కారణమైంది.


ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్స్‌ను కూడా ఉపయోగించుకొని వాటి ద్వారా వివిధ దేశాలకు వెళుతున్న సమాచారాన్ని తెలుసుకున్నట్లు గార్డియన్‌ పత్రిక బ్రిటన్‌ గూఢచార సంస్ధ చేసిన నిర్వాకం గురించి వెల్లడించింది. అది తాను సేకరించిన సమాచారాన్ని అమెరికా ఎన్‌ఎస్‌ఏకు అంద చేసింది. రోజుకు 60 కోట్ల మేర ఫోన్‌ సంభాషణలు, సమాచారానికి సంబంధించిన అంశాలను అందచేసేది. సముద్ర గర్భంలో వేసిన ఇటలీలోని ఆప్టిక్‌ కేబుళ్ల కేంద్రాల నుంచి వీటిని సేకరించారు. ఇదంతా చట్టబద్దమే అని ఈ కుంభకోణం వెల్లడైనపుడు బ్రిటన్‌ ప్రభుత్వం పేర్కొన్నది. సమాచారాన్ని 30 రోజుల పాటు నిల్వచేసి విశ్లేషణ చేసిన తరువాత అవసరమైన వాటిని ఉంచుకొని మిగిలిన వాటిని పారవేసేవి. అందువలన ఏ దేశంలో అయినా ఆయా ప్రభుత్వ సంస్ధలు ఫోన్‌ కంపెనీలు, ప్రయివేటు కంపెనీల ద్వారా సంబంధించిన సమాచారాన్ని పర్యవేక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటాయి. అందువలన ఫోన్ల ద్వారా, టిక్‌టాక్‌ వంటి ఆప్‌ల ద్వారా సమాచారాన్ని చైనా లేదా మరొక దేశం సేకరించటం రహస్య వ్యవహారమేమీ కాదు. ప్రతి దేశమూ చేస్తున్నదే.
అమెరికా ప్రపంచ వ్యాపితంగా 61వేల హాకింగ్‌లకు అమెరికన్లు పాల్పడినట్లు ఆరు సంవత్సరాల క్రితం హాంకాంగ్‌ పత్రిక సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు బయటపెట్టింది. అన్నమైతే నేమిరా సున్నమైతే నేమిరా ఈ పాడు పొట్టకు అన్నమే వేతామురా అన్నట్లు కొన్ని అంశాల మీద భిన్నంగా మాట్లాడినా అమెరికా చేస్తున్న అన్ని అక్రమాలకు బాసటగా నిలుస్తున్న ఐరోపా యూనియన్‌ దేశాల కూటమితో సహా అమెరికా ఏ దేశాన్నీ వదలలేదు. ఎవరినీ నమ్మకపోవటమే దీనికి కారణం. చివరికి జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఫోన్లను కూడా దొంగచెవులతో విన్నట్లు పత్రికలు రాయటంతో బెర్లిన్‌లోని అమెరికా రాయబారిని పిలిపించి సంజాయిషీ అడిగారు. ఇదేం మర్యాద అంటూ ఆమె నాటి అధ్యక్షుడు ఒబామాతో ఫోన్లో మాట్లాడారు.

దొంగచెవులు, గూఢచర్యం వంటి పనులకు 2013లో అమెరికా 5,300 కోట్ల డాలర్ల( దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు) కేటాయించింది. రోజుకు 20కోట్ల వర్తమానాలను అమెరికా ప్రపంచవ్యాపితంగా సేకరించినట్లు 2014జనవరిలో గార్డియన్‌ పత్రిక రాసింది. మన ఆధార్‌ కార్డులు, వాటిని మన బ్యాంకు ఖాతాలు, ఇతర పధకాలకు అనుసంధానం చేసినందున వాటిలో ఉన్న సమాచారం మొత్తం చోరీకి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందువలన మన బతుకులన్నీ బజార్లో ఉన్నట్లే ! వ్యక్తిగత సమాచార తస్కరణకు ఎవరు పాల్పడినా గర్హనీయమే, ఖండించాల్సిందే. మన దేశంతో సహా అన్ని దేశాలూ చేస్తున్నదే అన్నది పచ్చి నిజం ! ఇక్కడ సమస్య పదివేల మంది మీద నిఘావేసింది అన్న చైనా గురించి గుండెలు బాదుకుంటున్న వారికి ప్రపంచ జనాభా పడక గదుల్లో కూడా ఏం జరుగుతోందో తెలుసుకొనే అమెరికా బడా చోరీలు, చోరుల గురించి పట్టదేం ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

టిబెట్‌ అరచేయి -ఐదువేళ్లు-అఖండ భారత్‌ పగటి కలలేనా ?

07 Tuesday Jul 2020

Posted by raomk in BJP, CHINA, Congress, COUNTRIES, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Akhand Bharat, China, Dalai Lama, Five fingers of Tibet, INDIA, Tibet


ఎం కోటేశ్వరరావు
సామాజిక మాధ్యమంలోనూ, సాంప్రదాయ మీడియాలోనూ కొన్ని సమస్యల మీద వెల్లడిస్తున్న అభిప్రాయాలూ, సమాచారమూ జనాలను తప్పుదారి పట్టించేదిగా ఉందా ? ఎందుకు అలా చేస్తున్నారు ? దాని వలన ఒరిగే ప్రయోజనం ఏమిటి ? కొంత మంది భిన్న ఆలోచన లేకుండా ఎందుకు నమ్ముతున్నారు ? జనం మెదళ్ల మీద ప్రచార యుద్ధం జరుగుతోందా ? విజేతలు ఎవరు ? వారికి కలిగే లాభం ఏమిటి ? ఇలా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు ! అన్నింటినీ తీర్చటం సాధ్యం కాదు. కొన్ని అంశాలను పరిశీలించుదాం.
కమ్యూనిజం గురించి జనంలో భయాలను రేపితే దానివైపు అమెరికన్‌ కార్మికవర్గం చూడదనే అభిప్రాయంతో అక్కడి పాలకవర్గం కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారదాడిని ఒక ఆయుధంగా చేసుకుంది. దాని దెబ్బకు అనేక మంది కోలుకోలేని మానసిక వికలాంగులయ్యారు. అయితే కాలం ఎల్లకాలమూ ఒకే విధంగా ఉండదు. ” కొంత మందిని మీరు వారి జీవితకాలమంతా వెర్రివాళ్లను చేయగలరు, అందరినీ కొంత కాలం చేయగలరు, కానీ అందరినీ అన్ని వేళలా వెర్రివాళ్లను చేయలేరు” అని అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో వివిధ అంశాలపై జరుగుతున్న ప్రచారానికి, పాలకులకు ఇది వర్తిస్తుందా ?
మన దేశ చరిత్ర గురించి చెబుతూ ఎప్పుడైనా పొరుగుదేశం మీద దండెత్తిన చరిత్ర ఉందా అడుగుతారు. మనకు తెలిసినంత వరకు అలాంటి చరిత్ర లేదు. అదే సమయంలో ఇరుగు పొరుగుదేశాలతో స్నేహంగా ఉండటం తప్ప పాలకులు ఇప్పటి మాదిరి విద్వేషం రెచ్చగొట్టిన చరిత్ర కూడా లేదు. మిత్రులుగా ఉండేందుకు అవరోధంగా ఉన్న సమస్యల పరిష్కారం కంటే వాటి మీద నిత్యం ద్వేషాన్ని రెచ్చగొట్టటం, అదే అసలైన దేశభక్తి అని ప్రచారం చేయటం , నరేంద్రమోడీ ఏమి చేసినా సరైనదే, బలపరుస్తాం అనే వెర్రిని జనాల మెదళ్లలోకి ఎక్కించి బిజెపి తాత్కాలికంగా లబ్ది పొందవచ్చు. కమ్యూనిస్టు నేత లెనిన్‌ ” ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగుందో తెలుసుకోనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు ” అని చెప్పారు. అయన కంటే ఎంతో ముందు వాడైన అబ్రహాం లింకన్‌ చెప్పినట్లు అందరినీ అన్ని వేళలా వెర్రివాళ్లను చేయలేరు.
” చైనా కుడి చేతి అరచేయి టిబెట్‌ . లడఖ్‌, నేపాల్‌, సిక్కిం, భూటాన్‌, అరుణాచల ప్రదేశ్‌ దాని అయిదు వేళ్లు, వాటిని విముక్తి చేయాలని చైనా కమ్యూనిస్టు నేత మావో జెడాంగ్‌ చెప్పారు ” అన్నది ఒక ప్రచారం. వాస్తవం ఏమిటి ? మావో జెడాంగ్‌ ఆ విధంగా చెప్పిన దాఖలాలు గానీ, కమ్యూనిస్టు చైనాలో అధికారిక చర్చ జరిగినట్లుగానీ ఎలాంటి ఆధారాలు లేవు. అయితే ఇది ఎలా ప్రచారం అయింది ?
క్రీస్తు పూర్వం 221లో ప్రారంభమైన చైనా క్విన్‌ రాజరిక పాలన నుంచి 1912వరకు సాగిన పలు రాజరికాలు నేపాల్‌, సిక్కిం,భూటాన్‌ తమ టిబెట్‌లో భాగమే అని భావించాయి. 1908లో టిబెట్‌లోని చైనా రాజప్రతినిధి నేపాల్‌ అధికారులకు పంపిన వర్తమానంలో నేపాల్‌ మరియు టిబెట్‌ చైనా అశీస్సులతో సోదరుల్లా కలసి పోవాలని, పరస్పర ప్రయోజనం కోసం సామరస్యంగామెలగాలని, చైనా, టిబెట్‌, నేపాల్‌, సిక్కిం, భూటాన్‌లు పంచరంగుల మిశ్రితంగా ఉండాలని, బ్రిటీష్‌ వారిని ఎదుర్కోవాలని పేర్కొన్నాడు. ఇది బ్రిటన్‌ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొనేందుకు ముందుకు తెచ్చిన ఒక అంశం, చైనా ప్రభువుల వాంఛకు ప్రతిబింబం అని కూడా అనుకోవచ్చు. దానిని ప్రస్తుతం చైనాకు వర్తింప చేస్తూ ప్రచారం చేయటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో ఎవరికి వారు ఆలోచించుకోవాలి. అయితే మరి మావో జెడాంగ్‌ రంగంలోకి ఎలా తెచ్చారు ?
ఇక్కడ అఖండ భారత్‌ గురించి చెప్పుకోవటం అవసరం. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా మన జనాన్ని సమీకరించేందుకు నేను సైతం అన్నట్లుగా అనేక మంది తమ భావజాలం, నినాదాలతో ముందుకు వచ్చారు. వాటితో అందరూ ఏకీభవించకపోవచ్చు గానీ అదొక వాస్తవం. దానిలో ఒకటి అఖండ భారత్‌. దీనికి అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి. హిమాలయాల నుంచి హిందూ మహా సముద్ర ప్రాంతంలోని దీవులు, ఆఫ్రికా ఖండం, మధ్య ఆసియా, మధ్య ప్రాచ్యం, అస్త్రాలయ(ఆస్ట్రేలియా) ప్రాంతంలోని అనేక దేశాలలోని భాగాలతో కూడినది అఖండ భారత్‌ అన్నది ఒకటి. ఈ ప్రాంతంలోని ఇప్పటి దేశాల పేర్లు పేర్కొనాల్సి వస్తే భారత్‌, ఆప్ఘనిస్తాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, పాకిస్ధాన్‌, టిబెట్‌, మయన్మార్‌, ఇరాన్‌,యుఏయి, బహరెయిన్‌, తుర్క్‌మెనిస్ధాన్‌, తజికిస్తాన్‌, లావోస్‌, కంపూచియా, వియత్నాం, థాయలాండ్‌, ఇండోనేషియా, బ్రూనె, సింగపూర్‌, ఫిలిప్పీన్స్‌, మలేషియాలలోని కొన్ని ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. మహాభారతం, మరికొన్ని పురాణాల్లో అందుకు సంబంధించిన కొన్ని ప్రస్తావనల ఆధారంగా అలా చెప్పారు. ఇవన్నీ చరిత్రలో ఒక మహారాజ్యంగా ఉన్నాయటానికి ఆధారం లేదు గానీ మతపరమైన, సాంస్కృతిక అంశాలలో సారూపత్యల కారణంగా అలా పరిగణించారని చెప్పాలి. ఉదాహరణకు ఇండోనేషియా నేడు ముస్లిం దేశం, అయినా అక్కడి వారి పేర్లు ఎలా ఉంటాయో చూడండి. మాజీ దేశాధ్యక్షుడు సుకర్ణో(సుకర్ణుడు) ఆయన కుమార్తె మాజీ దేశాధ్యక్షురాలు మేఘావతి సుకర్ణో పుత్రి.
మన స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీష్‌ వారు మన దేశాన్ని ఎలా ముక్కలు చేశారో చెప్పేందుకు కెఎం మున్షీ తొలిసారిగా అఖండ హిందుస్తాన్‌ అంశాన్ని ముందుకు తెచ్చారు. మన దేశాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్న బ్రిటీష్‌ వారిని విమర్శించే సమయంలో మహాత్మాగాంధీ కూడా దాన్ని ఉదహరించారు. ఖాన్‌ సోదరుల్లో ఒకరైన మజహర్‌ అలీఖాన్‌ కూడా అఖండ హిందుస్తాన్‌ గురించి చెబితే ముస్లిం లీగు వ్యతిరేకించింది. స్వాతంత్య్ర పోరాటానికి దూరంగా, జైలు జీవితాన్ని భరించలేక బ్రిటీష్‌ వారికి విధేయుడిగా మారిన హిందూమహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత సావర్కర్‌ అఖండ భారత్‌తో పాటు హిందూ రాష్ట్ర భావనను కూడా ముందుకు తెచ్చారు. తరువాత సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన సంస్ధలన్నీ ఇప్పటికీ ఈ భావనలను ప్రచారం చేస్తూనే ఉన్నాయి, అఖండ భారత్‌ ఏర్పాటు లక్ష్యంగా చెబుతున్నాయి. అది సాధించినపుడే నిజమైన స్వాతంత్య్రం అని ప్రచారం చేస్తాయి.1993లో సంఘపరివార్‌కు చెందిన బిఎంఎస్‌ తన డైరీ మీద ముద్రించిన చిత్రపటంలో పాకిస్ధాన్‌, నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌,శ్రీలంక, థాయలాండ్‌, కంబోడియాలతో కూడిన అఖండభారత్‌ ప్రచురించినట్లు వికీ పీడియా పేర్కొన్నది. నరేంద్రమోడీ కూడా సంఘపరివార్‌కు చెందిన వ్యక్తే గనుక 2012లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సింధీల సభలో మాట్లాడుతూ పాకిస్ధాన్‌లో సింధు రాష్ట్రం ఒకనాటికి మన దేశంలో కలుస్తుందని సెలవిచ్చారు.2025 నాటికి పాకిస్ధాన్‌, టిబెట్‌లోని మానస సరోవరం తిరిగి మన దేశంలో కలుస్తుందని, లాహౌర్‌, మానసరోవర ప్రాంతాల్లో భారతీయులు స్ధిర నివాసం ఏర్పరచుకోవచ్చని, బంగ్లాదేశ్‌లో కూడా మనకు అనుకూలమైన ప్రభుత్వమే ఉన్నందున ఐరోపా యూనియన్‌ మాదిరి అఖండ భారత్‌ ఏర్పడుతుందని ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఇంద్రేష్‌ కుమార్‌ చెప్పారు.
1937 జపాన్‌ సామ్రాజ్యవాదులు చైనాను ఆక్రమించారు. దాంతో చైనీయులు రెండో సారి జపాన్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా పోరుసల్పారు. చాంగకై షేక్‌ నాయకత్వంలోని చైనా మిలిటరీతో పాటు లాంగ్‌ మార్చ్‌ జరుపుతున్న కమ్యూనిస్టు గెరిల్లాలు కూడా జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడారు. అయితే అనేక మంది యుద్ధ ప్రభువులు జపాన్‌కు లొంగిపోయారు. ఈ నేపధ్యంలో చరిత్రలో చైనా పొందిన అవమానాలను గుర్తుచేస్తూ జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరాన్ని కమ్యూనిస్టు పార్టీనేతగా మావో చైనీయులకు చెప్పారు. ఆ సందర్భంగా చరిత్రను ప్రస్తావిస్తూ సామ్రాజ్యవాదులు చైనాను యుద్దాలలో ఓడించి అనేక సామంత రాజ్యాలను బలవంతగా చైనా నుంచి వేరు చేశారని, జపాన్‌ వారు కొరియా, తైవాన్‌,రైకూ దీవులు, పోర్ట్‌ ఆర్ధర్‌, పెస్కాడోర్స్‌ను, బ్రిటీష్‌ వారు బర్మా, నేపాల్‌, భూటాన్‌, హాంకాంగ్‌లను వేరు చేశారని, ఫ్రాన్స్‌ అన్నామ్‌(ఇండోచైనా ప్రాంతం)ను, చివరకు ఒక చిన్న దేశం పోర్చుగల్‌ చైనా నుంచి మకావోను స్వాధీనం చేసుకుందని మావో చెప్పారు. అంతే తప్ప ఎక్కడా ఐదువేళ్ల గురించి మాట్లాడలేదు. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత వాటిని స్వాధీనం చేసుకుంటామని ఏనాడూ చెప్పలేదు. తైవాన్‌ చైనా అంతర్భాగమని ఐక్యరాజ్యసమితి గుర్తించింది, దాని మీద ఎలాంటి వివాదమూ లేదు. అయితే 1948 నుంచి అది తిరుగుబాటు రాష్ట్రంగా ఉంటూ అమెరికా అండచూసుకొని కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా సామరస్య పూర్వకంగా విలీనం కావాలని చైనా కోరుతోంది తప్ప సైనిక చర్యకు పూనుకోలేదు.
అయితే నిప్పులేనిదే పొగ వస్తుందా ? రాదు.1954లో టిబెట్‌లోని చైనా అధికారులు మాట్లాడుతూ భారత సామ్రాజ్యవాదులు అక్రమంగా పట్టుకున్న సిక్కిం, భూటాన్‌, లడఖ్‌,నీఫా(నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ ఏజన్సీ-అరుణాచల్‌ ప్రదేశ్‌)ను విముక్తి చేయాలని చెప్పినట్లు, అదే ఏడాది 1840-1919 మధ్య సామ్రాజ్యవాదులు చైనా ప్రాంతాలను కొన్నింటినీ ఆక్రమించారంటూ రాసిన ఒక స్కూలు పాఠంలో లడఖ్‌, నేపాల్‌,భూటాన్‌, సిక్కిం, ఈశాన్య భారతాన్ని విముక్తి చేయాలని దానిలో రాసినట్లుగా చెబుతారు.1959లో చైనా జనరల్‌ ఝాంగ్‌ గుహువా టిబెట్‌ రాష్ట్ర రాజధాని లాసాలో మాట్లాడుతూ భూటానీలు, సిక్కిమీయులు, లఢకీలు టిబెట్‌ ఉమ్మడి కుటుంబంలో ఐక్యం కావాలని అన్నట్లు వార్తలు ఉన్నాయి. వీటిని ఎలా చూడాలి. అధికారికంగా అఖండ భారత్‌ గురించి ఎవరైనా మాట్లాడితే దాన్ని తీవ్రంగా పరిగణించుతారు. అందుకే ఆయా దేశాలు ఎన్నడూ మన దేశంతో దాన్నొక సమస్యగా చూడలేదు. మన మీద ద్వేషాన్ని రెచ్చగొట్టలేదు. చైనా నుంచి వేరు పడి స్వాతంత్య్రం కావాలని 1912కు ముందుగానీ తరువాత కమ్యూనిస్టులు అధికారానికి వచ్చేంత వరకు గానీ ఎన్నడూ టిబెట్‌లో ఉద్యమించిన ఉదంతాలు లేవు. అమెరికా జరిపిన కుట్రలో భాగంగా చైనాకు వ్యతిరేకంగా తిరుగుబాటును రెచ్చగొట్టిన నాటి నుంచి దలైలామాకు మన దేశంలో ఆశ్రయం కల్పించి, ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించి తిరుగుబాట్లకు మద్దతు ఇచ్చిన గత కాంగ్రెస్‌ పాలకులు, ఇప్పటికీ టిబెట్‌ తురుపుముక్కను ఉపయోగించాలనే సంఘపరివార్‌ ఎత్తుగడలు కొనసాగుతున్నంత కాలం అటూ ఇటూ అలాంటి రెచ్చగొట్టే, వివాదాస్పద మాటలు వెలువడుతూనే ఉంటాయి. అధికారికంగా పాలకుల వైఖరి ఏమిటనేదే గీటురాయిగా ఉండాలి. అలా చూసినపుడు అఖండ భారత్‌ను ఎలా విస్మరించాలలో, టిబెట్‌ ఐదు వేళ్ల ప్రచారాన్ని కూడా అదేపని చేయాలి. కానీ సంఘపరివారం తన అజెండాలో భాగంగా ఐదువేళ్ల వార్తలను అధికారికమైనవిగా చిత్రించి చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకుంది. ఆ ప్రచారానికి కొట్టుకపోతే బుర్రలను ఖరాబు చేసుకోవటం తప్ప మరొక ప్రయోజనం లేదు.
చైనా ఆక్రమించుకుంటుంది అని చేస్తున్న ప్రచారంలో ఒకటైన సిక్కింను 1975లో మన దేశం విలీనం చేసుకుందని, తరువాత మన దేశ చర్యను చైనా అధికారికంగా గుర్తించిందని ఈ తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి తెలియదా? తెలిసీ ఇంకా ఎందుకు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నట్లు ? దలైలామాను రెచ్చగొట్టి తిరుగుబాటు చేయించి మన దేశానికి రప్పించింది అమెరికా. తీరా చైనాతో సర్దుబాటు కుదరగానే ఆ పెద్దమనిషిని, టిటెటన్‌ తిరుగుబాటుదార్లను తాను వదలించుకొని మనకు అంటగట్టింది. తమ దేశానికి రావటానికి కూడా ఆంక్షలు పెట్టింది. టిబెట్‌ చైనాలో అంతర్భాగం కాదని మన దేశం ఎన్నడూ అధికారికంగా చెప్పలేదు. ఆ వైఖరిని తీసుకోలేదు. గత ఆరు దశాబ్దాలుగా వేలాది మంది టిబెటన్లు మన దేశంలో విదేశీయులుగా నమోదై ఉన్నారు తప్ప వారికి పౌరసత్వం ఇచ్చేందుకు గానీ, శరణార్ధులుగా గుర్తింపుగానీ ఇవ్వలేదు. అక్రమంగా టిబెట్‌ నుంచి తరలిస్తున్నవారిని అనుమతిస్తున్నది. అనేక చోట్ల వారికి నివాసాలను ఏర్పాటు చేసేందుకు భూములు కేటాయించారు. సంఘపరివార్‌ కమ్యూనిస్టు వ్యతిరేకతను సంతుష్టీకరించటానికి తప్ప దలైలామాను నెత్తికి ఎక్కించుకొని మనం ఎందుకు వీరంగం వేస్తున్నామో, దాని వలన ప్రయోజనం ఏమిటో ఎప్పుడైనా, ఎవరైనా ఆలోచించారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా పెట్టుబడులు : ఆంక్షలు పెట్టింది కేంద్రం – నింద కమ్యూనిస్టుల మీద !

30 Tuesday Jun 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

China, chinese investments, Communists, FDI, India FDI, Restrictions imposed by NDA Government


ఎం కోటేశ్వరరావు
చైనా నుంచి ఎఫ్‌డిఐల రాక మీద కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెడితే దాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారంటూ ఒక పోస్టు సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది. అసలు వాస్తవం ఏమిటి ? తమ దేశాలలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మీద జర్మనీ, ఆస్ట్రేలియా,చెక్‌ వంటి దేశాలు నిబంధనలలో కొన్ని మార్పులు చేశాయి. అదే పద్దతులలో మన కేంద్ర ప్రభుత్వం కూడా నిబంధనలను సవరించింది. దాని ప్రకారం ” భారత్‌తో భూ సరిహద్దు ఉన్న దేశాలకు చెందిన సంస్ధలు లేదా పెట్టుబడుల ద్వారా లబ్దిపొందే యజమానులైన పౌరులు అటువంటి దేశాలకు చెందిన వారైనా పెట్టుబడులు పెట్టవచ్చు, అయితే అది ప్రభుత్వ మార్గాల ద్వారానే జరగాలి” అని పేర్కొన్నారు.
ప్రస్తుతం రెండు మార్గాల ద్వారా విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం లేదా రిజర్వుబ్యాంకు అనుమతితో నిమిత్తం లేకుండా నేరుగా వచ్చేవి. ప్రభుత్వ అనుమతితో వచ్చేవి రెండవ తరగతి. మొదటి మార్గంలో వస్తున్న పెట్టుబడులతో మన దేశంలోని సంస్ధలను చైనా కంపెనీలు కబ్జా చేస్తున్నాయన్నది ఒక తీవ్ర ఆరోపణ. ఒక గూండా, పలుకు బడిన రాజకీయ నేత, అధికారో బలహీనులను అదిరించి బెదిరించి స్దలాన్నో పొలాన్నో రాయించుకుంటే అది అక్రమం. ఎవరైనా అలాంటి ఫిర్యాదు చేస్తే కేసు అవుతుంది. ఏ కంపెనీ అయినా తన సంస్ధను లేదా వాటాలను అమ్మకానికి పెట్టినపుడు ఎవరి దగ్గర సత్తా ఉంటే వారే కొనుక్కుంటారు. దానిలో బలవంతం ఏమి ఉంటుంది.1963లో భారతీయులు నెలకొల్పిన విద్యుత్‌ పరికరాల సంస్ధ యాంకర్‌ గురించి తెలియని వారు ఉండరు. ఆ కంపెనీని 2007లో జపాన్‌ కంపెనీ పానాసోనిక్‌ కొనుగోలు చేసింది. అది చట్టబద్దమే, అలాగే అనేక స్వదేశీయుల మధ్యనే చేతులు మారాయి. రుచి గ్రూప్‌ కంపెనీ రుచి సోయా దివాళా తీసింది. దాన్ని రామ్‌దేవ్‌ బాబా పతంజలి కంపెనీ కొనుగోలు చేసింది. అంకుర సంస్ధల ఏర్పాటులో అనేక మంది చైనాతో సహా పలుదేశాలకు చెందిన సంస్ధలు, వ్యక్తుల నుంచి పెట్టుబడులు తీసుకొని భాగస్వామ్యం కల్పిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచ వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో చైనా దూసుకుపోతున్నది. ఆర్ధికంగా, సాంకేతిక పరంగా ఎన్నో విజయాలు సాధిస్తున్నందున వచ్చిన అవకాశాలను మన వారు వినియోగించుకుంటున్నారు. అలాంటి వెసులు బాటు చైనా కంపెనీలకు ఉన్నది. తమ వ్యాపార విస్తరణ వ్యూహాల్లో భాగంగా అవి లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. మన దేశం విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఏప్రిల్‌ నుంచి అమల్లోకి తెచ్చిన నిబంధనల్లో ఎక్కడా చైనా అనో మరో దేశం పేరో పేర్కొన లేదు. అయితే మన దేశంతో భూ సరిహద్దు ఉన్న దేశాలలో పెట్టుబడులు పెట్టగలిగింది ఒక్క చైనాయే గనుక ఆ సవరణ వారిని లక్ష్యంగా చేసుకున్నదే అని మీడియా లేదా వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. అది వాస్తవం. భారత ప్రభుత్వ చర్య వివక్షాపూరితం అని చైనా పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వ చర్యను భారత కమ్యూనిస్టులు వ్యతిరేకించినట్లు ఒక్క ఆధారం కూడా లభ్యం కాలేదు, ఎవరైనా చూపితే సంతోషం. ” బందీ అయిన వామపక్షం ” కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద ఎలాంటి వైఖరీ తీసుకోలేరు అంటూ రిపబ్లిక్‌ టీవీ వ్యాఖ్యాత 2020 ఏప్రిల్‌ 19న పేర్కొన్నారు. అయినా కమ్యూనిస్టులు వ్యతిరేకించినవి ఏవి ఆగాయి గనుక ?
చైనాతో సంబంధాలను ప్రోత్సహించి రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ లబ్ది పొందిందని కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్‌ రుస రుసలాడుతున్నారు. గత ఆరు సంవత్సరాలుగా రవిశంకర ప్రసాద్‌గారు మంత్రిగా ఉన్న మోడీ సర్కార్‌ నిర్వాకం ఏమిటి ? గత పాలకుల వైఖరిని కొనసాగించిందా ? నిరుత్సాహపరచిందా ? రవిశంకర ప్రసాద్‌కు మద్దతుగా బిజెపి ఐటి విభాగం అధిపతి అమిత్‌ మాలవీయ ట్వీట్‌ చేస్తూ 2003-04లో 101 కోట్ల డాలర్లుగా ఉన్న చైనా వాణిజ్యం 2013-14 నాటికి 362 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్‌ నిర్వాకమే అనుకుందాం. 2014 నాటికి మన దేశంలో చైనా పెట్టుబడులు 160 బిలియన్‌ డాలర్లు ఉంటే ప్రస్తుతం 2,600 కోట్లు, ఇవిగాక ప్రతిపాదనల్లో మరో 1,500 కోట్ల డాలర్లు, ఇవిగాకుండా సింగపూర్‌, మలేసియా తదితర మూడో దేశాల పేరుతో ఉన్న మరికొన్ని వందల కోట్ల డాలర్ల చైనా పెట్టుబడుల సంగతేమిటో బిజెపి మంత్రులు,నేతలు చెప్పాలి. ఇవన్నీ కమ్యూనిస్టులు చెబితే మన దేశానికి వచ్చాయా ? పోనీ బిజెపి నేతలకు తెలివితేటలు ఎక్కువ కనుక మనకు అవసరమైన పెట్టుబడులు తెచ్చుకొని మన వస్తువులను చైనాకు ఎగుమతి చేశారా అంటే అదీ లేదు. వాణిజ్య లోటు 36బిలియన్‌ డాలర్లు కాస్తా 63 బిలియన్‌ డాలర్లకు పెరిగిన తీరు చూశాము. ఇదిగాక హాంకాంగ్‌, ఇతర దేశాల ద్వారా మన దేశంలో ప్రవేశిస్తున్న చైనా వస్తువులను కూడా కలుపుకుంటే మన వాణిజ్యలోటు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ నిర్వాకాన్ని ఏమనాలి ? ఇన్ని సంవత్సరాలుగా లేని ఈ చర్చను, ఇలాంటి తప్పుడు ప్రచారాలను బిజెపి ఇప్పుడు ఎందుకు లేవనెత్తుతున్నట్లు ? లడఖ్‌ లడాయి కారణం. చైనా వారు మన భూభాగంలోకి రాలేదు, మన సైనికపోస్టులను ఏమీ చేయలేదు అని ప్రధాని మోడీ చెప్పటంతో పోయిన పరువు నుంచి జనాన్ని తప్పుదారి పట్టించేందుకు బిజెపి ముందుకు తెచ్చిన ప్రచారదాడి. చైనా గురించి అలా చెప్పాలని ఏ కమ్యూనిస్టు పార్టీ లేదా నేతలు ఎవరైనా ప్రధాని నరేంద్రమోడీ గారికి చెప్పారా ? చైనా మన ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చిందని చెప్పింది మోడీ మంత్రులు, మోడీగారేమో అలాంటిదేమీ లేదు అని చెబుతారు. అసలు కేంద్ర ప్రభుత్వంలో సమన్వయం ఉందా ? దేశ ప్రజలను గందరగోళ పరచటం తప్ప ఒక పద్దతి ఉందా ?
జూలై ఒకటి తరువాత బంగ్లాదేశ్‌ నుంచి ఎగుమతి చేసే 97శాతం వస్తువులపై చైనా దిగుమతి పన్ను రద్దు చేసేందుకు రెండు దేశాల మధ్య కొద్ది రోజుల క్రితం ఒప్పందం కుదిరింది. ఇదే సమయంలో భారత్‌-చైనాల మధ్య లడక్‌ వాస్తవాధీన రేఖ వద్ద వివాదం తలెత్తింది. ఈ నేపధ్యంలో ఇంకే ముంది భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌ను బుట్టలో వేసుకొనేందుకు చైనా ఈ రాయితీలు ప్రకటించిందంటూ మీడియాలో టీకా తాత్పర్యాలు వెలువడ్డాయి. గత కొద్ది సంవత్సరాలుగా చైనా అనేక దేశాలతో తన వాణిజ్య సంబంధాలను విస్తరించుకుంటున్నది. అవి ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలకు వ్యతిరేకం అయితే ప్రభావితమైన ఏదేశమైనా దానికి ఫిర్యాదు చేయవచ్చు, కేసు దాఖలు చేయవచ్చు.
అసలు ఇది ఎంత వరకు నిజం ? మీడియా పండితులకు వాస్తవాలు తెలిసి ఇలాంటి ప్రచారానికి దిగారా లేక తెలియక దిగారా ? తెలిసి చేస్తే జనాన్ని తప్పుదారి పట్టించే యత్నం, తెలియకపోతే తమ విశ్వసనీయతను తామే దెబ్బతీసుకోవటం. ఆసియా ఫసిపిక్‌ వాణిజ్య ఒప్పందం(ఆప్టా) కింద ఇప్పటికే 3,095 బంగ్లా ఉత్పత్తులకు చైనాలో పన్నులు లేవు. వాటిని ఇప్పుడు 8,256కు పెంచారు.
ఇంతకీ ఈ ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1975లో జరిగిన ఆప్టాలో భారత్‌, బంగ్లాదేశ్‌,దక్షిణ కొరియా, శ్రీలంక, లావోస్‌ మధ్య జరిగిన బ్యాంకాక్‌ ఒప్పందం ఇది. తరువాత 2005లో ఆసియా ఫసిపిక్‌ వాణిజ్య ఒప్పందం అని పేరు మార్చారు. 2001లో చైనా, 2013లో మంగోలియా ఒప్పందంలో చేరాయి. సభ్య దేశాల మధ్య దిగుమతులపై పన్నులు తగ్గించుకోవటం ప్రధాన లక్ష్యం. ఈ ఒప్పంద లక్ష్యానికి ఇది విరుద్దమైతే మన ప్రభుత్వమే బహిరంగంగా అభ్యంతరం చెప్పవచ్చు. రెండు దేశాల సంబంధాలను మరింతగా పెంచుకోవాలని షేక్‌ హసీనా-గ్జీ జింపింగ్‌ నిర్ణయించుకున్న నెల రోజుల తరువాత జూన్‌లో జరిగిన పరిణామమిది. ఈ ఒప్పందం ప్రకారం చైనా తీసుకున్న చర్య నిబంధనలకు విరుద్దం అయితే కేంద్ర ప్రభుత్వమే తన అభ్యంతరాన్ని ఎందుకు చెప్పలేదు ? లేదా ఇలాంటి పనులు చేస్తే తాము ఒప్పందం నుంచి వైదొలుగుతామని అయినా హెచ్చరించాలి కదా ?
భారతదేశంతో తన సరిహద్దులతో కూడిన చిత్రపటానికి చట్టబద్దత కల్పించేందుకు నేపాల్‌ పార్లమెంట్‌ ఒక రాజ్యాంగ సవరణను ఆమోదించింది. కాళీ నది తూర్పు ప్రాంత భూమి తమది అని అక్కడి నుంచే తమ పశ్చిమ సరిహద్దు ప్రారంభం అవుతుందని నేపాల్‌ చెబుతోంది. కాళీ నది నేపాల్‌ చెబుతున్న ప్రాంతం కంటే బాగా దిగువన ప్రారంభమైనందున ఆ ప్రాంతంతో నేపాల్‌కు సంబంధం లేదని నది ప్రారంభ స్ధానం గురించి నేపాల్‌ చెబుతున్నదానిని అంగీకరించటం లేదని మన దేశం చెబుతున్నది. ఈ వివాదం గురించి నేపాల్‌తో చర్చించవచ్చు, పరిష్కరించవచ్చు. నేపాల్‌ తన దేశ చిత్రపటాన్ని రాజ్యాంగంలో చేర్చటం వెనుక చైనా ఉన్నది అంటూ ఈ సమస్యలో కూడా చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది.
స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు మన లాభదాయకమా? నష్టమా ? నష్టం అయితే నరేంద్రమోడీ సర్కార్‌ ఆరు సంవత్సరాల కాలంలో ఒక్కసారైనా సమీక్షించిందా ? నష్టం అని తేలితే గతంలో చేసుకున్న ఒప్పందాలన్నింటి నుంచి వైదొలిగేందుకు తీసుకున్న చర్య లేమిటి ? పది దేశాలతో కూడిన ఆగేయ ఆసియా దేశాల అసోసియేషన్ను ” ఆసియన్‌” అని పిలుస్తున్నాము. వీటితో మరో ఆరు దేశాలు పలు ఒప్పందాలు చేసుకున్నాయి. మన దేశం 2010జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఒక స్వేచ్చా వాణిజ్య ఒప్పందాన్ని చేసుకుంది. మన ఉత్పతులను ఆదేశాల మార్కెట్లలో నింపాలన్నది మన ఆలోచన. కానీ దానికి బదులు వాటి ఉత్పత్తులే మన మార్కెట్లో ఎక్కువగా వచ్చి చివరకు మనకు వాణిజ్యలోటును మిగిల్చాయి. ఆ ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలోనే కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న సిపిఎం నేత విఎస్‌ అచ్యుతానందన్‌ నాటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకతను తెలిపారు. రబ్బరు, సుగంధ ద్రవ్యాల వంటి తోట పంటల ఉత్పత్తులు మన మార్కెట్లోకి వస్తే కేరళ రైతాంగానికి నష్టదాయకమని నాడు చెప్పారు. అదే జరిగింది.
2019 సెప్టెంబరు నెలలో బాంకాక్‌లో జరిగిన ఆసియన్‌-భారత్‌ సమావేశంలో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాన్ని సమీక్షించాలని నిర్ణయించారు. అనేక దేశాలు, అసోసియేషన్లతో చేసుకున్న స్వేచ్చావాణిజ్య ఒప్పందాలు తమకు పెద్దగా ఉపయోగపడటం లేదని, వాటిని సమీక్షించాలని మన వాణిజ్య, పారిశ్రామికవేత్తలు గత కొంతకాలంగా ప్రభుత్వం మీద వత్తిడి తెస్తున్నారు.యుపిఏ అయినా ఎన్‌డిఏ అయినా అనుసరిస్తున్నది దివాలా కోరు విధానాలే. స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు మన దేశానికి హానికరం అనుకుంటే వాటిని చేసుకోబోయే ముందు బిజెపి ఎలాంటి వ్యతిరేకతను వ్యక్తం చేయలేదు. ఆసియాలో గరిష్ట సంఖ్యలో అలాంటి వాటిని చేసుకున్నది మనమే అని నివేదికలు చెబుతున్నాయి. మొత్తం 42 ఒప్పందాల మీద అవగాహనకుదిరితే వాటిలో 13 అమల్లో, 16 సంప్రదింపుల్లో , 12 పరిశీలనలో ఉన్నాయి. మొత్తం మీద అమలు జరిగిన వాటి సారం ఏమిటంటే అవి లేకపోతే మన వాణిజ్య పరిస్ధితి ఇంకా దిగజారి ఉండేది. దక్షిణాసియా స్వేచ్చా వాణిజ్య ఒప్పందం( సాఫ్టా) 2006 నుంచి అమల్లో ఉంది. అప్పుడు 680 కోట్ల డాలర్లుగా ఉన్న వాణిజ్యం 2018-19 నాటికి 2850 కోట్ల డాలర్లకు పెరిగింది. మన వాణిజ్య మిగులు 400 నుంచి 2100 కోట్లడాలర్లకు పెరిగింది. ఆసియన్‌ దేశాలతో కుదిరిన ఒప్పందం లావాదేవీలు గణనీయంగా పెరగటానికి తోడ్పడింది గానీ మన ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువగా ఉన్నాయి. వాణిజ్యలోటు పెరిగింది. దక్షిణ కొరియాతో మన దేశం కుదుర్చుకున్న ఒప్పందం ఫలితంగా మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా పెరిగాయి. జపాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం తీరు తెన్నులు చూస్తే ఎగుడుదిగుడులు ఉన్నా మన దిగుమతులే ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలతో వాణిజ్య లావాదేవీలు పెరిగాయి. ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువ. ఒక్క సాఫ్టా తప్ప మిగిలిన వన్నీ మనకు పెద్దగా ఉపయోగపడలేదు. అందువలన వాటిని సమీక్షించటానికి కమ్యూనిస్టులు లేదా కాంగ్రెస్‌ వారు గానీ ఎన్నడూ అభ్యంతరం చెప్పలేదు. అధికారానికి వచ్చినప్పటి నుంచి జనాన్ని మత ప్రాతిపదికన చీల్చి మెజారిటీ ఓటు బ్యాంకును ఎలా పెంచుకోవటమా అన్న యావతప్ప దేశ అభివృద్ధి గురించి పట్టించుకొని ఉంటే నేడు ఈ పరిస్ధితి ఉండేదా అని అందరూ ఆలోచించాలి.
పదమూడు సంవత్సరాల పాటు పారిశ్రామికంగా ముందున్న గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉన్నందున ఆ నమూనాను దేశమంతటా అమలు జరుపుతామని నరేంద్రమోడీ ఎన్నికల్లో చెప్పారు. గత పాలనా అనుభవం కారణంగా ప్రధానిగా నేరుగా రంగంలోకి దిగుతానని చెప్పిందీ మోడీ గారే. అలాంటి వ్యక్తి పాలనలో ఆరేండ్లు తక్కువేమీ కాదు. దక్షిణాసియాలో అగ్రరాజ్యం మనదే. సాఫ్టా ఒప్పందం కూడా ఉంది. అయినా ఏమి జరిగింది ?
ఆప్ఘనిస్తాన్‌, పాకిస్దాన్‌, శ్రీలంక, మాల్దీవులు, మయన్మార్‌, భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌లతో 2014-18 మధ్య చైనా తన ఎగుమతులను 41 నుంచి 51.7 బిలియన్‌ డాలర్లకు పెంచుకున్నది. ఇదే సమయంలో తన దిగుమతులను 19.4 నుంచి 8.3 బిలియన్‌ డాలర్లకు తగ్గించుకుంది.2018లో ఈ దేశాలతో చైనా వాణిజ్యం 55.99 బిలియన్‌ డాలర్లు కాగా మన దేశం 30.95బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉంది. చైనాకు ఒక్క పాకిస్ధాన్‌తో మాత్రమే స్వేచ్చావాణిజ్య ఒప్పందం ఉంది. నేపాల్‌, భూటాన్‌, ఆఫ్‌ఘనిస్తాన్‌తో మన వాణిజ్యం 9.88 బిలియన్‌ డాలర్లు ఉంటే ఈ దేశాలతో చైనా 1.8 బిలియన్‌ డాలర్లు మాత్రమే. మొత్తం మీద ఈ పరిణామాన్ని మోడీ సర్కార్‌ వైఫల్యం అనాలా లేక చైనా విజయం అనాలా ? మన వైపు నుంచి లోపం ఎక్కడుందో ఆలోచించుకోవాలా వద్దా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

” దేశభక్తి ” ట్రంప్‌ ఆకాశంలో…. మోడీ పాతాళంలోనా ! హతవిధీ !!

27 Saturday Jun 2020

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

#India-China border, China, Donald trump, INDIA, Narendra Modi, Trade Protectionism


ఎం కోటేశ్వరరావు
అవును ! శీర్షికను చూసి కొంత మందికి ఆగ్రహం కలగటాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఎక్కడైనా వ్యక్తి పూజ ముదిరితే వారి మీద ఏ చిన్న వ్యాఖ్యను కూడా సహించలేరు. ఉద్రేకాలను తగ్గించుకొని ఆలోచించాలని మనవి. ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయిపోతుందో వాడే పండుగాడు. ఇక్కడ ఎవరు, ఎవరిని కొట్టారు ? ఎవరి మైండ్‌ బ్లాంక్‌ అయింది? పండుగాడు ఎవడో తెలియదు గానీ సంఘపరివారం మొత్తానికి మైండ్‌ బ్లాక్‌ అయినట్లుగా వారి మాటలను బట్టి కనిపిస్తోంది. ఎవరేమి మాట్లాడుతారో తెలియని స్ధితి. అఖిలపక్ష సమావేశం ప్రధాని మాట్లాడిన అంశాలు టీవీలలో ప్రసారం అయ్యాయి.” ఎవరూ చొరబడలేదు లేదా ఎవరూ చొరబడటం లేదు, కొంత మంది ఏ పోస్టునూ పట్టుకోలేదు ” అన్నారు. అంతకు ముందు వరకు మాట్లాడిన ప్రతి కేంద్ర మంత్రి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న బిజెపి మరికొన్ని పార్టీల నేతలందరూ, మీడియా కూడా మన ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది, మన మిలిటరీ పోస్టులను కూల్చివేసింది అని ఊదరగొట్టిన వారందరి మైండ్లు నరేంద్రమోడీ మాటలతో బ్లాంక్‌ అయ్యాయి. పోనీ ఆయన ఆంగ్లంలో మాట్లాడారా అంటే అదేమీ కాదు, ఆయనకు బాగా తెలిసిన హిందీలోనే కదా చెప్పారు. ఈ మాటల ప్రభావం, పర్యవసానాలేమిటో గ్రహించిన తరువాత కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యల్లో భాగంగా మోడీ గారి మాటల అర్ధం ఇది తిరుమలేశా అన్నట్లుగా ఒక వివరణ ఇచ్చింది.
వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసి) మన ప్రాంతంలో చైనీయులెవరూ లేరు, గాల్వాన్‌ లోయ ప్రాంతంలో ఆతిక్రమణకు పాల్పడేందుకు చేసిన మన ప్రయత్నాన్ని భారత సైనికులు విఫలం చేశారు అన్నది ప్రధాని అభిప్రాయం అన్నది వివరణ. దానికి ముందు విదేశాంగ మంత్రి జైశంకర్‌ చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ ఇతరులతో మాట్లాడిన తరువాత జూన్‌ 17న రాతపూర్వక పత్రికా ప్రకటన విడుదల చేశారు. యథాతధ స్ధితిని మార్చేందుకు ఎవరూ ప్రయత్నించరాదన్న ఒప్పందాలను అతిక్రమించి వాస్తవ పరిస్ధితిని మార్చేందుకు చేసిన యత్నం కారణంగానే హింస, మరణాలు సంభవించాయని దానిలో పేర్కొన్నారు. దీని అర్ధం ఏమిటి ? మన సైనికులు ఎందుకు మరణించారు అన్న ప్రశ్నకు చెప్పిందేమిటి ? సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడిన చైనా మన ప్రాంతంలో పోస్టులను ఏర్పాటు చేసిందని, వాటిని తొలగించాలని ఉభయ దేశాల మిలిటరీ అధికారులు చేసిన నిర్ణయాన్ని చైనా అమలు జరపలేదని, ఆ కారణంగానే చైనా పోస్టును తొలగించేందుకు మన సైనికులు ప్రయత్నించినపుడు చైనీయులు పధకం ప్రకారం దాడి చేసి మన వారిని చంపారని చెప్పిన విషయం తెలిసిందే. ఆ ఉదంతం మన ప్రాంతంలో జరిగినట్లా మరొక చోట జరిగినట్లా ? ఇదే నిజమా లేక చైనా వారు చెబుతున్నట్లు తమ ప్రాంతంలోకి మన సైనికులు వెళ్లి దాడికి పాల్పడ్డారన్నది వాస్తవమా ? మన ప్రధాని మరి అలా ఎందుకు మాట్లాడినట్లు, విదేశాంగ, రక్షణ శాఖల నుంచి సమాచారం తీసుకోరా ? అసలేం జరిగింది ? ఇప్పటికీ మైండ్‌ బ్లాంక్‌ అయ్యే రహస్యమే కదా ! ఇంత జరిగిన తరువాత అయినా మోడీ ప్రత్యక్షంగా విలేకర్లతో మాట్లాడి వివరణ ఎందుకు ఇవ్వరు ?
లడఖ్‌ లడాయితో మోడీ గణానికి ఏదో జరిగింది. జనంలో తలెత్తిన మనోభావాల నేపధ్యంలో ఎవరేం మాట్లాడుతున్నారో, అసలు వారి మధ్య సమన్వయం ఉందో లేదో కూడా తెలియటం లేదు. ఒక నోటితో చైనా వస్తువులను బహిష్కరించాలంటారు. అదే నోటితో ప్రపంచ వాణిజ్య సంస్ధలో మన దేశం భాగస్వామి గనుక అధికారయుతంగా చైనా వస్తువులను నిషేధించలేము, ప్రజలే ఆ పని చేయాలంటారు. వారు చెప్పే ఈ మాటల్లో నిజాయితీ ఉందా ?
బిజెపి, విశ్వహిందూపరిషత్‌, ఎబివిపి, బిఎంఎస్‌, భజరంగదళ్‌, ఎస్‌జెఎం వంటి అనేక సంస్దలను ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసింది అనే విషయం తెలిసిందే. అంటే ఈ సంస్ధలన్నీ తెరమీది తోలుబొమ్మలైతే వాటిని తెరవెనుక నుంచి ఆడించేది, మాట్లాడించేది ఆర్‌ఎస్‌ఎస్‌.1991లో సంస్కరణల పేరుతో మన మార్కెట్‌ను విదేశాలకు తెరిచారు. ఆ విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు ఫోజు పెట్టేందుకు స్వదేశీ జాగరణ మంచ్‌(ఎస్‌జెఎం)ను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ పాలనలో మాత్రమే అవసరమైనపుడు నాటకాలాడుతుంది. నాటి నుంచి నేటి వరకు వాజ్‌పేయి, నరేంద్రమోడీ ఎవరు అధికారంలో ఉన్నా మార్కెట్లను మరింతగా తెరిచారు తప్ప స్వదేశీ వస్తువులకు రక్షణ లేదా దేశంలో చౌకగా వస్తువుల తయారీకి వారు చేసిందేమీ లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ వాణిజ్య ఒప్పందం కారణంగా చైనా వస్తువుల మీద అధికారికంగా చర్యలు తీసుకోలేము అని చెబుతారు. ఇది జనం చెవుల్లో పూలు పెట్టే యత్నమే. ప్రపంచ వాణిజ్య సంస్ధలోని దేశాలన్నీ అలాగే ఉన్నాయా ?
స్వదేశీ జాగరణ మంచ్‌ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ (2020 జూన్‌ 19వ తేదీ ఎకనమిక్‌ టైమ్స్‌) మాట్లాడుతూ మన దేశం గత రెండు సంవత్సరాలలో అనేక చర్యలు తీసుకున్నా చైనా మీద కేవలం 350 పన్నేతర ఆంక్షలను మాత్రమే విధిస్తే అమెరికా 6,500 విధించిందని, మనం ఇంకా ఎన్నో చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. అమెరికాకు అగ్రతాంబూలం అని ట్రంప్‌ పదే పదే చెబుతాడు, దానికి అనుగుణ్యంగానే ప్రపంచ దేశాల మీద దాడులకు దిగుతాడు. మనం మరో దేశం మీద దాడికి దిగకపోయినా మనల్ని మనం రక్షించుకోవాలి కదా! అదే దేశభక్తి అని అనుకుంటే ట్రంప్‌కు ఉన్న అమెరికా భక్తితో పోలిస్తే మన నరేంద్రమోడీ భారత్‌ భక్తి ఎక్కడ ఉన్నట్లు ? 2016లో పేటియంకు అనుమతి ఇచ్చినపుడు తాము వ్యతిరేకించామని, అనుమతి ఇచ్చి ఉండాల్సింది కాదని, జనం దాన్ని వినియోగించకూడదని కూడా ఆ పెద్దమనిషి చెప్పారు. అమెరికాకు లేని ప్రపంచ వాణిజ్య అభ్యంతరాలు మనకేనా ? చేతగాని తనాన్ని కప్పి పుచ్చుకొనేందుకు చెప్పే సొల్లు కబుర్లు తప్ప మరేమైనా ఉందా ? 2014 నుంచి మన దేశం చైనాతో సహా వివిధ దేశాలకు చెందిన 3,600 వస్తువులపై దిగుమతి పన్నుల పెంపు లేదా ఇతర ఆంక్షలను విధించింది (ఎకనమిక్‌ టైమ్స్‌ జూన్‌ 19). పోనీ దేశమంతా తమకే మద్దతు ఇచ్చిందని, రెండోసారి పెద్ద మెజారిటీతో గెలిపించారని చెప్పుకుంటున్న పెద్దలు మరి తమ జనం చేత అయినా పేటిఎం లేదా చైనా వస్తువులను ఎందుకు బహిష్కరించేట్లు చేయలేకపోయారు ? వినియోగం కనీసం ఆగలేదు, రోజు రోజుకూ ఎందుకు పెరుగుతున్నట్లు ? అంటే కబుర్లు తప్ప వాటిని చెప్పేవారు కార్యాచరణకు పూనుకోవటం లేదు. మరో వైపు కమ్యూనిస్టుల మీద పడి ఏడుస్తారు. ఎన్నడైనా, ఎక్కడైనా కమ్యూనిస్టులు చైనా వస్తువులనే వాడమని గానీ, రక్షణాత్మక చర్యలు తీసుకోవద్దని చెప్పారా ?
ప్రపంచ దేశాలన్నీ ఇటీవలి కాలంలో రక్షణాత్మక చర్యలను నానాటికీ పెంచుతున్నాయి. ప్రపంచ ఎగుమతుల్లో అగ్రస్ధానంలో ఉన్న చైనా సైతం అలాంటి చర్యలకు పాల్పడుతున్నపుడు మన దేశం ఎందుకు తీసుకోకూడదు ? ఏ కమ్యూనిస్టులు వద్దన్నారు ? 2020 జనవరి ఆరవ తేదీ ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ విశ్లేషకుడు బనికర్‌ పట్నాయక్‌ అందచేసిన వివరాల ప్రకారం ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య (ఆర్‌సిఇపి) స్వేచ్చా వాణిజ్య ఒప్పందంలో దేశాలు భారత్‌తో సహా 5,909 సాంకేతిక పరమైన ఆటంకాలను (టిబిటి) విధించినట్లు పేర్కొన్నారు. ఆ ఒప్పందం నుంచి మన దేశం ఉపసంహరణకు ముందు మన వాణిజ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన అంతర్గత విశ్లేషణలో ఈ వివరాలు ఉన్నాయి. దాని ప్రకారం పన్నేతర ఆటంకాలు (ఎన్‌టిబి) ఇతర ఆటంకాలు ఉన్నాయి. వివిధ దేశాలు విధించిన సాంకేతిక పరమైన ఆటంకాలలో చైనా 1,516, దక్షిణ కొరియా 1,036, జపాన్‌ 917, థాయలాండ్‌ 809 విధించగా మన దేశం కేవలం 172 మాత్రమే విధించింది. ఈ బృంద దేశాలలో సగటు పన్ను విధింపులో మన దేశం 17.1శాతంతో అగ్రస్ధానంలో ఉండగా దక్షిణ కొరియా 13.7, చైనా 9.8, జపాన్‌ 4.4శాతం విధించాయి. శానిటరీ మరియు ఫైటోశానిటరీ(ఎస్‌పిఎస్‌) ఆంక్షలను చైనా 1,332ప్రకటించగా దక్షిణ కొరియా 777, జపాన్‌ 754 విధించగా మన దేశం కేవలం 261 మాత్రమే ప్రకటించింది. ఇలా ప్రతి దేశంలో అనేక ఆంక్షలను విధిస్తూనే ఉండగా మనం ప్రపంచ వాణిజ్య సంస్ద ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం కనుక విధించటం లేదు అని చెప్పటాన్ని వంచన అనాలా మరొకటని చెప్పాలా ? పన్నేతర ఆంక్షలకు చెప్పే రక్షణ, పర్యావరణం, నాణ్యత వంటివన్నీ ఎక్కువ భాగం దిగుమతుల నిరోధానికి పరోక్షంగా చెప్పే సాకులే అన్నది అందరికీ తెలిసిందే. కొన్ని వాస్తవాలు కూడా ఉండవచ్చు. రాజకీయ పరమైన వివాదాలు తలెత్తినపుడు ఇలాంటి పరోక్ష దాడులకు దిగటం మరింత ఎక్కువగా ఉంటుంది.
చైనా వస్తువుల నాణ్యత గురించి అనేక మంది చెబుతారు, చైనా పేరుతో వచ్చే వస్తువులన్నీ అక్కడివి కాదు, ఆ పేరుతో మన దేశంలో తయారైన వాటిని కూడా విక్రయిస్తున్నారు. ఏ వస్తువైనా మన నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండాల్సిందే. రోజు రోజుకూ చైనాతో విదేశీ వస్తువులు కుప్పలు తెప్పలుగా వస్తున్నపుడు ప్రమాణాలను అభివృద్ధి చేసేందుకు గత ఆరు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. పోనీ అత్యవసరం గాని వస్తువుల దిగుమతులను అయినా నిరోధించిందా అంటే అదీ లేదు.
” చైనాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను చేసుకొనేందుకు రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ అనేక అధ్యయనాలు చేసింది. ఒప్పందాలు చైనా కంటే భారత్‌కే ఎక్కువ అవసరమని పేర్కొన్నది. చైనా నుంచి మూడులక్షల డాలర్లు లేదా నాటి విలువలో 90లక్షల రూపాయలను విరాళంగా పొందింది.” కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్‌, బిజెపి తాజాగా ముందుకు తెచ్చిన ఆరోపణ ఇది. నిజమనే అంగీకరిద్దాం, చైనా నుంచి వచ్చిన విరాళం సంగతి ఫౌండేషన్‌ తన వార్షిక నివేదికలో స్పష్టంగా పేర్కొన్నది.
పదిహేను సంవత్సరాల క్రితం తీసుకున్న విరాళం గురించి, రాజీవ్‌ ఫౌండేషన్‌ చేసిన అధ్యయనాలు, సిఫార్సుల గురించి ఇంతకాలం తరువాత బిజెపికి ఎందుకు గుర్తుకు వచ్చినట్లు ? వాటిలో తప్పుంటే ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదు. అంటే, ” నా గురించి నువ్వు మూసుకుంటే నీ గురించి నేను మూసుకుంటా, నన్ను లడక్‌ విషయంలో వేలెత్తి చూపుతున్నావ్‌ గనుక నీ పాత బాగోతాలన్నీ బయటకు తీస్తా ! ఇది బిజెపి తీరు.” బయటకు తీయండి, పోయిన సూదికోసం సోదికి పోతే పాత రంకులన్నీ బయటపడ్డాయన్నది ఒక సామెత. బిజెపి -కాంగ్రెస్‌ వారు ఇలా వివాదపడుతుంటేనే కదా వారిద్దరి బండారం జనానికి తెలిసేది.
బిజెపి వారు ఎదుటి వారి మీద ఎదురు దాడికి దిగితే ఇంకేమాత్రం కుదరదు. ఆ రోజులు గతించాయి. ఇంకా తాను ప్రతిపక్షంలో ఉన్నట్లు, కొద్ది క్షణం క్రితమే అధికారాన్ని స్వీకరించినట్లు కబుర్లు చెబితే చెల్లవు. గురివింద గింజ మాదిరి వ్యవహరిస్తే రాజకీయాల్లో కుదరదు.రాహుల్‌ గాంధీ చైనా నేతలతో జరిపిన భేటీలో ఏమి చర్చించారో చెప్పాలని కూడా బిజెపి వారు సవాళ్లు విసురుఉన్నారు. సూదులు దూరే కంతల గురించి గుండెలు బాదుకుంటూ పదిహేనేండ్ల క్రితం చైనానుంచి తీసుకున్న 90లక్షల రూపాయలను ఏమి చేశారో చెప్పమని కాంగ్రెస్‌ వారిని ఇప్పుడు సవాల్‌ చేస్తున్నారు. దాన్ని వెల్లడించిన వార్షిక నివేదికలోనే ఖర్చుల గురించి కూడా చెప్పి ఉంటారు కదా ! ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత పెద్ద కార్యాలయాన్ని ఏడువందల కోట్ల రూపాయలు పెట్టి బిజెపి ఢిల్లీలో కట్టింది. దానికి అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందని కాంగ్రెస్‌తో సహా అనేక మంది అడిగారు, ఇంతవరకు ఎవరైనా చెప్పారా ?
గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ నాలుగుసార్లు, ప్రధానిగా ఐదుసార్లు చైనా వెళ్లారని, చైనా అధ్యక్షు గ్జీ జింపింగ్‌ను మూడుసార్లు మన దేశం ఆహ్వానించారని, గత ఆరు సంవత్సరాలలో వివిధ సందర్భాలలో జింపింగ్‌తో మోడీ 18సార్లు కలిశారని కాంగ్రెస్‌ ప్రతినిధి సూర్జేవాలా చెప్పారు.2009లో బిజెపి అంతకు ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ చైనా కమ్యూ నిస్టు పార్టీతో సంప్రదింపులు జరిపిందని,2011లో నాటి బిజెపి అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ నాయకత్వంలో బిజెపి ప్రతినిధి బృందం చైనా పర్యటన జరిపిందని అక్కడ భారత వ్యతిరేక చర్చలు జరిపారా అని కూడా సూర్జేవాలా ప్రశ్నించారు. చైనా రాజకీయ వ్యవస్ధను అధ్యయనం చేసేందుకు 2014లో బిజెపి 13 మంది ఎంపీలు, ఎంఎల్‌ఏల బృందాన్ని చైనా పంపిందని ఇవన్నీ భారత వ్యతిరేక కార్యకలాపాలా అని కాంగ్రెస్‌ వేస్తున్న ప్రశ్నలకు బిజెపికి మైండ్‌ బ్లాంక్‌ కావటం తప్ప సమాధానం ఏమి చెబుతుంది ?
ప్రపంచంలోనే చైనా అత్యంత విశ్వాస ఘాతుక దేశమని విశ్వహిందూ పరిషత్‌ నేత సురేంద్ర జైన్‌ (2020 జూన్‌ 19వ తేదీ ఎకనమిక్‌ టైమ్స్‌) ఎకనమిక్‌ టైమ్స్‌తో చెప్పారు. అలాంటి దేశంతో అంటీముట్టనట్లుగా ఉండాల్సింది పోయి ఎందుకు రాసుకుపూసుకు తిరుగుతున్నారని తమ సహచరుడు నరేంద్రమోడీని ఎందుకు అడగరు? చైనాతో వ్యవహరించేటపుడు చైనాది హంతక భావజాలమని, దాని ఆధారంగా పని చేసే ఆ దేశ నాయకత్వంతో వ్యవహరించేటపుడు ఆ విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని 2020 జూన్‌ నాలుగవ తేదీ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ వెలిబుచ్చిన అభిప్రాయం ఈ రోజు కొత్తది కాదు, ఎప్పటి నుంచో చెబుతున్నదే మరి బిజెపి నాయకత్వం ఎందుకు పెడచెవిన పెట్టింది ? వెనుక నుంచి ఆడించే ఆర్‌ఎస్‌ఎస్‌ ఎందుకు అనుమతించినట్లు ? ప్రశ్నించకుండా అనుసరించే జనాన్ని వెర్రి వెంగళప్పలను చేయాలని గాకపోతే ఏమిటీ నాటకాలు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాడు సారస్‌, నేడు చైనాను వణికిస్తున్న ఉహాన్‌ న్యుమోనియా

22 Wednesday Jan 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS

≈ Leave a comment

Tags

China, Novel Coronavirus, SARS


ఎం కోటేశ్వరరావు
ప్రస్తుతం ఊహాన్‌ న్యూమోనియాగా పిలుస్తున్న వ్యాధికి కారణమైన వైరస్‌ను అదుపు చేసేందుకు చైనా ప్రయత్నిస్తుండగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిపుణులు బుధవారం నాడు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాల గురించి చర్చించనున్నారు. చైనాతో పాటు మరో మూడు దేశాల్లో ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. గతంలో 2003లో వ్యాపించిన సారస్‌ మాదిరి వైరస్‌ మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తున్నదని చైనా ప్రకటించింది. దీని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని చెబుతున్నప్పటికీ అటు చైనాలోనూ, ఇటు ప్రపంచ వ్యాపితంగా ఆందోళన వ్యక్తం అవుతోంది.
మీడియాలో నోవెల్‌ కొరోనా వైరస్‌(2019-ఎన్‌సిఓవి), ఉహాన్‌ సీఫుడ్‌ మార్కెట్‌ న్యుమోనియా వైరస్‌, ఉహాన్‌ న్యుమోనియా, ఉహాన్‌ కొరోనావైరస్‌ అని ఏ పేరుతో పిలిచినా అవన్నీ ఒకటే. దీనికి గుడ్లగూబల నుంచి వ్యాప్తి చెందే ఒక వైరస్‌ లక్షణాలున్నట్లు ప్రాధమికంగా తేలింది. గతనెలలో గుర్తు తెలియని ఈ వైరస్‌తో బాధపడుతున్న వారిని గుర్తించారు. ఇప్పటి వరకు 9 మంది మరణించారని వార్తలు వచ్చాయి. బుధవారం ఉదయం ఏడు గంటల సమయానికి పద్నాలుగు రాష్ట్రాలలో 324 మందికి వైరస్‌ సోకినట్లు చైనా ప్రకటించింది. అంతకు రెండు రోజుల ముందు లండన్‌లోని ఇంపీరియల్‌ మెడికల్‌ కాలేజీ నిపుణులు కనీసం 1700కి సోకి వుండవచ్చునని పేర్కొన్నారు. చైనా వెలుపల దక్షిణ కొరియాలో ఒకరికి సోకినట్లు సోమవారం నాడు, చైనా నుంచి అమెరికా వెళ్లిన ఒక యువకుడికి వైరస్‌ సోకినట్లు మంగళవారం నాడు అమెరికా వెల్లడించింది. హాంకాంగ్‌లో 117 మందికి సోకినట్లు అనుమానం తప్ప నిర్దారణ కాలేదు.
మధ్యచైనా రాష్ట్రంగా పిలిచే హుబెరు రాష్ట్ర రాజధాని ఉహాన్‌ పట్టణం. చైనా నూతన సంవత్సర సందర్భంగా కోట్లాది మంది చైనీయులు బంధు, మిత్రులను స్వయంగా కలిసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేడుకలు జరుపుకుంటారు. పెద్ద ఎత్తున స్వదేశంలోనూ, విదేశాలకు విహార యాత్రలకు వెళతారు. ఈ సమయంలో చైనాలో 20 కోట్ల మంది ప్రయాణాలు చేస్తారని అంచనా కాగా ఒక్క ఉహాన్‌ నగరం నుంచి కోటిన్నర మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన నేపధ్యంలో ఇప్పటికే అనేక మంది తమ ప్రయాణాలను పరిమితం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనవరి 25 నుంచి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. ఇరవై అయిదు నుంచి 30వ తేదీ వరకు అధికారిక సెలవుదినాలుగా ప్రకటించారు. జనవరి పది నుంచి ఫిబ్రవరి 18వరకు వసంత రుతు ఉత్సవాలు జరుగుతాయి. ఈ కాలంలో కనీసం 20 కోట్ల మంది ప్రయాణాలు చేస్తారని అంచనా. ఉహాన్‌ నగర జనాభా కోటీ పదిలక్షలు, పెద్ద రవాణా కేంద్రం. జనవరి 20-27 తేదీల మధ్య దేశంలోని వివిధ ప్రాంతాలకు 2,105, విదేశాలకు 231 విమానాలను నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఉహాన్‌ న్యూమోనియా వైరస్‌ లక్షణాలు కనిపించిన వెంటనే చైనా సర్కార్‌ దేశవ్యాపితంగా శ్వాస సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్నవారిని గుర్తించి పరీక్షించిన కారణంగా నూతన కేసులు బయట పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్ధ పేర్కొన్నది. ఉహాన్‌ నుంచే గాక హుబెరు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి మీద కూడ వ్యాధిలక్షణాల గురించి నిఘావేశామని, హాంకాంగ్‌లో వంద మందిని పర్యవేక్షిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. అనేక దేశాల విమానాశ్రయాలలో చైనా నుంచి వచ్చేవారిని పరీక్షించే ఏర్పాట్లు చేశారు.
తాజా వైరస్‌ వార్తలతో యావత్‌ చైనా సమాజంలో ఒక విధమైన ఆందోళన, అప్రమత్తత కూడా వెల్లడి అయినట్లు వార్తలు వచ్చాయి. దీని గురించి దాయాల్సిన అవసరం లేదని, అదే సమయంలో గతంలో సారస్‌ మాదిరి పరిస్దితి లేదని చైనా మీడియా పేర్కొన్నది. 2004 తరువాత ఇంతవరకు చైనాలో సారస్‌ లక్షణాలు వెల్లడి కాలేదు. ఇదే సమయంలో సారస్‌ వైరస్‌ను నిరోధించే టీకాలను కూడా ఇంతవరకు రూపొందించలేకపోయారు. ఆ లక్షణాలున్న వారి నుంచి ఇతరులకు వ్యాపించకుండా నిరోధ చర్యలు మాత్రమే తీసుకుంటున్నారు, ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఇంటర్నెట్‌ అందరికీ అందుబాటులో ఉన్నందున ప్రభుత్వం సమాచారాన్ని దాచినా దాగదని, అంతర్జాతీయ మీడియా కూడా మిన్నకుండజాలదని చైనా అధికారులు చెబుతున్నారు. సంక్లిష్ట పరిస్ధితులు తలెత్తినపుడు వాస్తవాలను వెల్లడించటం ద్వారానే జనానికి భరోసా కల్పించవచ్చని అన్నారు. సారస్‌ వ్యాప్తి నుంచి చైనా వైద్యనిపుణులు ఎన్నో అనుభవాలను పొందారని, ఇలాంటి పరిస్ధితులను ఎలా ఎదుర్కోవాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని అంటున్నారు. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు యావత్‌ చైనా సమాజాన్ని కదిలించాల్సిన అవసరం ప్రస్తుతానికైతే లేదని చెబుతున్నారు.
గతంలో సారస్‌ వైరస్‌ దక్షిణ చైనాలోని గ్వాంగ్‌ డాంగ్‌ రాష్ట్రం షండే ప్రాంతం నుంచి ప్రారంభమై 2002 నవంబరు నుంచి 2003 జూలై మధ్యకాలంలో పద్నాలుగు దేశాల ( పదిహేడు ప్రాంతాలు)లో వ్యాపించింది. మొత్తం 8,273మందికి సోకగా 775 మంది ఐదు దేశాల(ఏడు ప్రాంతాలు)లో మరణించారు, వీరిలో సారస్‌ సోకినప్పటికీ ఇతర కారణాలతో మరణించిన వారు 60 మంది ఉన్నారు. సగటున 9.6శాతం మంది మృతి చెందారు. దేశాల వారీ చైనా ప్రధాన భూభాగంలో 5,328 మందికి సోకగా 349 మంది మరణించారు, చైనాలో భాగమైన హాంకాంగ్‌లో 1,755 మందికి గాను 299 మంది చనిపోయారు. కెనడాలో 251 మందికి 44, సింగపూర్‌లో 238 మందికి 33, చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌లో 346 మందికి 37, వియత్నాంలో 63కు ఐదు, ఫిలిప్పైన్స్‌లో 14కు రెండు మరణాలు సంభవించాయి. చైనా గ్వాంగ్‌ డాంగ్‌లో వైరస్‌ ప్రారంభమైన బీజింగ్‌ నగరంలో పెద్ద ఎత్తున వ్యాపించింది. ఆ సమయంలో అక్కడి ప్రాధమిక, మాధ్యమిక పాఠశాలలను మూసివేశారు. చైనాలో ప్రతి ఏటా వసంత రుతు సమయంలో జలుబు సాధారణంగా వస్తుంది. అయితే జలుబు చేసిన వారి శరీర ఉష్ణోగ్రత 37.3 సెంటీగ్రేడ్‌ డిగ్రీలు దాటితే వారికి ఉహాన్‌ న్యుమోనియా అనుమానంతో చికిత్స చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మీరు ఎక్కడెక్కడికి ప్రయాణాలు చేశారని వైద్య సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ఉహాన్‌ వెళ్లి వచ్చిన తరువాత జ్వరంలో కూడిన జలుబు చేస్తే పనులకు పోవద్దని, రక్షణ ముసుగులు ధరించాలని సలహా ఇస్తున్నారు. దేశంలో కొన్ని చోట్ల ఉహాన్‌ న్యుమోనియా లక్షణాలు,తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పెద్ద ఎత్తున బ్యానర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.
ప్రస్తుతం చైనాలో ప్రపంచంలోనే అతి పెద్దదైన వ్యాధికారక వైరస్‌, బాక్టీరియాలను పరిశీలించే ప్రయోగశాలల వ్యవస్ధ ఉంది. దేశంలో పన్నెండు ప్రధాన ప్రయోగశాలలు, 91 ప్రాంతీయ, 800 ఆసుపత్రుల ప్రయోగశాలలు ఉన్నాయి. ఇప్పటికి తెలిసిన 300 వ్యాధికారక వైరస్‌లను అక్కడ వెంటనే గుర్తించే ఏర్పాట్లు ఉన్నాయి. 2003 సారస్‌ విస్తరణ తరువాత వీటిని మరింత పటిష్ట పరిచారు. గుర్తు తెలియని వైరస్‌లను గుర్తించే నిరంతర పరిశోధనల గురించి చెప్పనవసరం లేదు. సారస్‌ తరువాత పెద్ద ఎత్తున వ్యాప్తి చెందే వ్యాధులను గుర్తించేందుకు 17ప్రత్యేక బృందాలకు శిక్షణ ఇచ్చారు. సాధారణ న్యూమోనియా వైరస్‌ పది రోజుల కంటే ప్రభావం చూపలేదు, అయితే సారస్‌ మూడు నెలలకు మించి ఉన్నట్లు విదేశీ నిపుణులు గుర్తించారు.
ప్రస్తుతం వ్యాపించిన ఉహాన్‌ న్యూమోనియా కోరోనా వైరస్‌ కేంద్రం నగరంలోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌గా గుర్తించారు. ఇతర ప్రాంతాల్లోని చేపలు, కోళ్ల మార్కెట్లలో అలాంటి లక్షణాలు కనిపించనందున వైరస్‌ సాధారణ లక్షణాలను నిర్ధారించటం ఆలస్యం అవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది ఉహాన్‌లో వైరస్‌ వ్యాప్తికి తోడ్పడే వాతావరణం ఉండటంతో వైరస్‌ల గుర్తింపు, నివారణ సవాలుగా మారింది. ఈ నగరంలో 198 మందిలో వైరస్‌ను గుర్తించారు, 25 మందికి చికిత్స చేసి ఆసుపత్రి నుంచి పంపారు, తొమ్మిది మంది పరిస్ధితి విషమంగా ఉంది. చికిత్స చేస్తున్న సిబ్బందిలో 15 మందికి సోకినట్లు గుర్తించగా వారిలో ఒకరి పరిస్ధితి తీవ్రంగా ఉంది. అవసరమైతే తప్ప జనాలు బయటకు రావద్దని నగరపాలక సంస్ధ సలహా ఇచ్చింది.
చైనాలో కలరా, ప్లేగ్‌ వంటి వాటికి కారణమయ్యే వైరస్‌ను మొదటి తరగతిగా వర్గీకరించి అధిక ప్రాధాన్యత ఇస్తారు, సారస్‌, ఎయిడ్స్‌ వంటి వైరస్‌ల వంటి బి తరగతిలో ఉహాన్‌ వైరస్‌ను చేర్చారు. అంటే వీటిని ఎదుర్కొనేందుకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. జపాన్‌, థారులాండ్‌, దక్షిణ కొరియాల్లో కూడా ఈ వైరస్‌ను గుర్తించిన కారణంగా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని దేశాధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ అధికారులను కోరారు.
ఈ వైరస్‌ గురించి దీని గురించి చైనా వాస్తవాలను బయటకు వెల్లడించటం లేదని పశ్చిమ దేశాల మీడియాలో కథనాలు రాస్తున్నారు. నిజానికి చైనా దాచిందీ లేదు, పశ్చిమ దేశాలు శోధించి కనుగొన్నదీ లేదు. డిసెంబరు 31న ఉహాన్‌లో అంతుబట్టని న్యుమోనియాను గుర్తించినట్లు చైనా ప్రపంచ ఆరోగ్య సంస్దకు తెలియ చేసింది. వ్యాధి వ్యాపించటానికి కారణమైన వైరస్‌ కేంద్రంగా అనుమానించిన సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌ను జనవరి ఒకటిన మూసివేశారు. ఈ వ్యాధి గురించి తమకు తెలిసిందని జనవరి రెండున సింగపూర్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. జనవరి ఒకటిన ఈ వైరస్‌ కారణంగా తమ దేశంలో తొలి మరణం సంభవించినట్లు చైనా తెలిపింది. ఉహాన్‌ నుంచి వచ్చిన ఒక మహిళకు వ్యాధి సోకినట్లు థారులాండ్‌లో జనవరి 13న గుర్తించారు, పదహారవ తేదీన జపాన్‌లో ఒక కేసు బయట పడింది.పదిహేడవ తేదీన రెండవ,20న మూడవ,21న నాల్గవ వ్యక్తి మరణించారు. ఉహాన్‌ నుంచి దక్షిణ కొరియాకు వచ్చిన ఒక వ్యక్తికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. చైనా నుంచి వచ్చే కొన్ని విమానాల ప్రయాణీకులకు పరీక్షలు జరుపుతామని ఆస్ట్రేలియా ప్రకటించింది.
ఇలాంటి అంతుతెలియని ప్రమాదకర వైరస్‌లు వ్యాప్తి చెందినపుడు వాటిని యావత్‌ అంతర్జాతీయ సమాజం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ప్రతి వారు తమ అనుభవం, పరిశోధనల సమాచారాన్ని ఏ దేశంలో అయితే వైరస్‌ ప్రారంభమైందో దానికి అందచేస్తే మానవాళికి మేలు కలుగుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాపై పోప్‌, ఇస్లామిక్‌ దేశాల మౌనం ఎందుకు ?

02 Thursday Jan 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

China, Islam, Islam in China, Islamic Countries, Pope Francis, Religion in China

Image result for pope  china
ఎం కోటేశ్వరరావు
ఇటీవల చైనా గురించి మీడియాలో వస్తున్న అనేక అంశాలు చదువరులు, వీక్షకులను గందరగోళపరుస్తున్నాయి. వక్రీకరణలు, అవాస్తవాలను విశ్లేషణలు, వార్తల పేరుతో కుమ్మరిస్తున్నారు. వాటిలో కొన్నింటి మంచి చెడ్డల గురించి చూద్దాం. క్రైస్తవులను, ముస్లింలను అణిచి వేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై పోప్‌, ఇస్లామిక్‌ దేశాలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయి అనే ప్రశ ్నలు అనేక మందిలో తలెత్తుతున్నాయి. జర్మనీలో యూదులను లక్ష్యంగా చేసుకున్న హిట్లర్‌ మాదిరి మన దేశంలో ముస్లింలు, క్రైస్తవ మైనారిటీలపై ప్రచార, భౌతిక దాడులకు పాల్పడుతున్న ఫాసిస్టు తరహా పరివార్‌ పట్ల మన దేశంలోని మీడియా మౌనం వహించటం లేదా సమర్దించటాన్ని చూస్తున్నాము.
‘ బైబిల్‌ మరియు ఖురాన్‌లను తిరగరాసేందుకు చైనా పూనుకుంది ‘ ఇది ఇటీవలి ముఖ్యమైన వార్త !
అంతేనా 2018లో చైనాలో బైబిల్‌ అమ్మకాలను నిషేధిస్తున్నారు అని ప్రచారం జరిగింది.చట్టబద్దమైన మార్గాల ద్వారా బైబిల్‌ లేదా ఖురాన్‌ లేదా ఏ మత గ్రంధాన్ని అయినా చైనీయులు తెప్పించుకోవచ్చు. అందుకు ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సి ఉంది, అది అన్ని దేశాలకు వర్తించే నిబంధనే. చైనా సర్కార్‌ దగ్గర నమోదు గానీ లేదా అనుమతి లేని పుస్తకాలు, పత్రికల మీద అక్కడి ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. దాన్ని మతాల మీద దాడిగా చిత్రించారు. చైనాలో ఉన్న నిబంధనల ప్రకార బైబిళ్లను చర్చ్‌ల ద్వారానే తెప్పించుకోవాలి లేదా కొనుగోలు చేయాలి, పుస్తకాల దుకాణాల్లో అనుమతించరు. అక్కడి సామాజిక యాజమాన్య వ్యవస్ద ప్రకారం ఒక పుస్తకంగా ఒక్క బైబికే కాదు ఏ మత గ్రంధానికి పవిత్రతను ఆపాదించకూడదు. పశ్చిమ దేశాలను చైనా అనుకరించకపోతే దాన్ని మత వ్యతిరేకం, అణచివేతగా చిత్రిస్తున్నారు.

చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చి ఏడుపదులు దాటింది. మావో సేటుంగ్‌ నాయకత్వంలో కమ్యూనిస్టులు అధికారంలోకి రాగానే క్రైస్తవ మత చర్చీలు, ఇస్లామిక్‌ మసీదులను కూల్చివేశారు, మతాలను నాశనం చేశారని ప్రచారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. అదే నిజమైతే ఒక్కరూ ఇప్పటికి మిగిలి ఉండేవారు కాదు. 1953లో హాన్స్‌ జాతీయులు 93.94శాతంగా మిగిలిన 6.06శాతం బౌద్ద, క్రైస్తవ, ముస్లిం తదితర మైనారిటీలు ఉన్నారు. అదే 2010 లెక్కల ప్రకారం 91.40, 8.60శాతాలుగా ఉన్నారు. అంటే మైనారిటీలు పెరిగారు. వీరిలో ముస్లిం యుఘీర్‌లు 0.62 నుంచి 0.76శాతానికి పెరిగారు. దీనికి కారణం మైనారిటీలకు జనాభా నియంత్రణ నిబంధనను వర్తింప చేయలేదు. మన దేశంలో బాబరీ మసీదును కూల్చివేసిన మతోన్మాదుల చర్యను ప్రపంచమంతా చూసింది గానీ, చైనా, రష్యా(కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నపుడు) ఇతర దేశాల్లో కమ్యూనిస్టులు ప్రార్ధనా స్ధలాలను కూల్చివేసిన దాఖలాలు లేవు. అన్నీ సురక్షితంగానే ఉన్నాయి. రష్యాలో కమ్యూనిస్టుల అధికారం ముగిసిన తరువాత అనేక మంది అక్కడి చర్చ్‌లను చూసి ప్రభువా కమ్యూనిస్టులు చర్చ్‌లను కూల్చివేశారని చేసిన తప్పుడు ప్రచారాన్ని నమ్మి వ్యతిరేకించినందుకు మన్నించు అని ప్రార్ధించారంటే అతిశయోక్తి కాదు. కమ్యూనిస్టులు మత రాజకీయాలు చేయరు, మతాన్ని రాజకీయాల్లో అనుమతించరు.

Image result for famous churches in china
బైబిల్‌ విషయానికి వస్తే పాత నిబంధన, కొత్త నిబంధన అని ఆ మతాలకు చెందిన వారే రాసుకున్నారు. వాటిలో అనేక అంశాలను చొప్పించారని అనేక మంది విమర్శిస్తారు. వాటిని పక్కన పెడదాం. బైబిల్‌ రాసిన లేదా దేవుడు లేదా దేవుని కుమారుడు, దేవదూతలు ప్రవచించిన సమయానికి ప్రపంచంలో ఎక్కడా కమ్యూనిజం, దాని సిద్దాంతాల జాడలేదు. సోషలిజం, కమ్యూనిజాలకు క్రైస్తవం వ్యతిరేకం అని బైబిల్‌ లేదా ఖురాన్‌ లేదా మరొక మత గ్రంధంలో ఉన్న ఉన్న అంశాల మీద రాస్తున్న లేదా చేస్తున్న తప్పుడు భాష్యాలు పుంఖాను పుంఖాలుగా ఉన్నాయి. అలాంటి తప్పుడు వ్యాఖ్యానాలతో సోషలిజానికి వ్యతిరేకంగా జనాలను రెచ్చగొడుతూ ఉంటే అది తమ రాజ్యాంగానికి వ్యతిరేకం కనుక వాటి వ్యాప్తిని అరికట్టేందుకు చైనా చర్యలు తీసుకోవచ్చు. లేదా మత గ్రంధాల్లో ఉన్న అంశాలు కొన్ని సోషలిజం, కమ్యూనిజాలకు ఎలా వ్యతిరేకం కావో, సానుకూలమో వివరించి జనాల్లో ఉన్న పొరపాటు అవగాహనలను తొలగించేందుకు తమ రాజ్యాంగ లక్ష్యాలకు అనుకూలమైన భాష్యంతో పుస్తకాలను రాయాలని, చైనా లక్షణాలతో కూడిన మత వ్యవస్ధను నిర్మించాలని అక్కడి ప్రభుత్వం చెప్పిందే తప్ప, వాటిని తిరిగి రాయటం అంటూ ఎక్కడా ఉండదు.
మారుతున్న కాలానికి అనుగుణంగా లేని మత పరమైన గ్రంధాలకు సమగ్ర భాష్యాలు రాయాలని, కమ్యూనిస్టు పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా ఉన్న వాటిని నిరోధించాలని గతేడాది నవంబరులో జరిగిన చైనా మత వ్యవహారాల కమిటీ సమావేశంలో చెప్పారు తప్ప బైబిల్‌, ఖురాన్‌ అని ఎక్కడా చెప్పలేదు. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించి చెప్పినట్లుగా పశ్చిమ దేశాల మీడియా దానికి మత గ్రంధాల పేర్లను జోడించి కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి ఉపయోగించుకుంది. ఈ సమావేశంలో వివిధ మతాలకు చెందిన వారు, నిపుణులు, ప్రజాప్రతినిధులు 16 మంది పాల్గొన్నారు. మతాలను, వ్యక్తిగత మత విశ్వాసాలను చైనా కమ్యూనిస్టు పార్టీ అనుమతిస్తుంది తప్ప మతం, విశ్వాసాల ముసుగులో రాజ్యాంగ పరమైన సోషలిజం, కమ్యూనిస్టు, మత రహిత లక్ష్యాలను వ్యతిరేకించే శక్తులను చైనాలో అనుమతించరన్నది స్పష్టం. మన దేశంలో మత వి శ్వాసాలు కలిగి ఉన్నప్పటికీ కమ్యూనిస్టు పార్టీలలో సభ్యులుగా చేరవచ్చు. అలాంటి వారు అనర్హులు అనే నిబంధనలు లేవు.

Image result for why pope and islamic countries silence on china
” కైస్తవులను చైనా అణచివేస్తోంది, చర్చీలను కూల్చివేస్తోంది”
అంతే కాదు వాటికన్‌ను గుర్తించటం లేదు, వాటికన్‌ నియమించిన వారిని అరెస్టు చేస్తోంది, బిషప్పులను స్వంతంగా నియమించుకుంటోంది.ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారంలో ఇదొకటి. ముందుగా తెలుసుకోవాల్సిన అంశం. వాటికన్‌ ఇంతవరకు కమ్యూనిస్టు చైనాను ఒక దేశంగానే గుర్తించలేదు. ఇప్పటికీ దాని దృష్టిలో చైనా అంటే తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ మాత్రమే. కమ్యూనిస్టు పాలన ఏర్పడిన తరువాత ఒక్క పోప్‌ కూడా చైనా సందర్శనకు రాలేదు. అందువలన వాటికన్‌ అధికారాన్ని చైనా గుర్తించే ప్రశ్నే ఉదయించదు. రెండవది, చైనాలో ఉన్న క్రైస్తవులు తమ బిషప్పులను తామే నియమించుకుంటున్నారు అంటే అక్కడ క్రైస్తవులను అణచివేస్తే బిషప్పులు దేనికి ? అంటే అణచివేత కూడా వాస్తవం కాదు. మరి ఎవరిని అరెస్టు చేస్తున్నారు? చైనా సర్కార్‌ అనుమతి లేదా గుర్తింపు లేకుండా రహస్యంగా చర్చ్‌లను ఏర్పాటు చేస్తూ, రహస్య, చైనా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిని అరెస్టు చేస్తున్నారు. దేశవ్యతిరేక శక్తులను ఏ దేశంలో అయినా అదే చేస్తారు కదా ! సామాన్యులకు ఏసుక్రీస్తును ఆరాధించటానికి స్వేచ్చ ముఖ్యమా లేక వాటికన్‌ పెద్దలు చెప్పినట్లుగా చేయటం ముఖ్యమా ? ప్రపంచంలో అనేక దేశాలలో సాగుతున్న దోపీడీని, నియంతలను వాటికన్‌ లేదా క్రైస్తవం వ్యతిరేకించటం లేదు, సమసమాజం కోరుతున్న కమ్యూనిస్టులను ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. చైనాతో సంబంధాలు పెట్టుకోవాలని వాటికన్‌ పెద్దలు కొందరికి ఉన్నా, అమెరికా కనుసన్నలలో పని చేసే కమ్యూనిస్టు వ్యతిరేక చైనా జాతీయుడైన జోసెఫ్‌ జెన్‌ వంటి వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చివరికి వాటికన్‌ పెద్దలు కూడా రాజీపడి లొంగిపోతున్నారని, చైనాను సంతృప్తిపరచేందుకే ఎల్ల వేళలా పని చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశాడు. ఇంతకాలం చైనాలో క్రైస్తవులను అణచివేస్తున్నారని చేసిన ప్రచారం వాటికన్‌కు తెలియంది కాదు. వాటి వెనుక ఉన్న నిజానిజాలు కూడా తెలుసు. అందువల్లనే ఎన్ని విమర్శలు వచ్చినా, ఎందరు వ్యతిరేకించినప్పటికీ 2018లో పోప్‌ ఫ్రాన్సిస్‌ చైనాతో ఒప్పందం చేసుకున్నారు. చైనా నియమించిన బిషప్పులను కూడా గుర్తించారు. ఒప్పందం చేసుకుంటే ఇంతకాలం చైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ రహస్యంగా చర్చ్‌లను నిర్వహించిన నిజమైన విశ్వాసులను మోసం చేసినట్లే అని జోసెఫ్‌ జెన్‌ అన్నాడు. ఒప్పందం ప్రకారం రహస్యంగా ఉన్న చర్చ్‌లను వాటికన్‌ ప్రోత్సహించకూడదు.

Image result for why pope and islamic countries silence on china
” ముస్లింలను అణచివేస్తున్నారు, నిర్బంధ శిబిరాల్లో పెడుతున్నారు ”
చైనాలోని గ్జిన్‌జియాంగ్‌ రాష్ట్ర జనాభా రెండు కోట్లు. అది చైనా వాయువ్య సరిహద్దులో ఉంది. ఒక స్వయం పాలిత ప్రాంత హౌదా కలిగి ఉంది. ఒక వైపు మంగోలియా, కిర్కిజిస్తాన్‌, కజకస్తాన్‌, తజికిస్తాన్‌, రష్యా, ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్ధాన్‌,భారత్‌ సరిహద్దులుగా ఉంది. అయితే ఆక్సారు చిన్‌గా పిలుస్తూ మనది అని చెప్పుకుంటున్న ప్రాంతం గ్జిన్‌జియాంగ్‌లో భాగమైన తమది అని చైనా చెబుతోంది, అది ప్రస్తుతం చైనా అధీనంలో ఉన్న భారత-చైనా వివాదాస్పద ప్రాంతాలలో ఒకటి. ముస్లింలలో ఒక పెద్ద తెగ యుఘిర్‌కు చెందిన జనాభా దాదాపు 46శాతం ఉండటంతో దానిని యుఘిర్‌ రాష్ట్రం అని కూడా పిలుస్తారు.నలభైశాతం మంది హాన్‌ చైనా జాతీయులు, మిగిలిన వారు ఇతర ముస్లిం తెగలకు చెందిన వారున్నారు. కమ్యూనిస్టులు అధికారానికి రాక ముందు ఆ ప్రాంతంలోని యుద్ద ప్రభువులు నాటి కొమింటాంగ్‌ చైనా పాలకులకు వ్యతిరేకంగా సోవియట్‌ మద్దతుతో స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారని చెబుతారు గానీ స్వతంత్ర దేశంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత చైనాలో అంతర్భాగంగానే ఉంది. సోవియట్‌ కూలిపోయిన తరువాత ఇరుగు పొరుగు రాజ్యాలు, ఇతర విదేశీ జోక్యంతో కొంత మంది తప్పుదారి పట్టిన యుఘిర్‌లు కమ్యూనిస్టులు అధికారానికి రాకముందు కొంత కాలం తాము స్వతంత్ర దేశంగా ఉన్నామని, హాన్‌ జాతీయులు తమ మీద పెత్తనం చేస్తున్నారని, తమకు స్వాతంత్య్రం ఇవ్వాలంటూ వేర్పాటు వాదాన్ని ముందుకు తెచ్చారు. కొన్ని ఉగ్రవాద చర్యలకు సైతం పాల్పడ్డారు. మనకు కాశ్మీర్‌ ఎలాంటి కీలక ప్రాంతమో చైనాకు అది అంత ముఖ్యమైనది. ఈ నేపధ్యంలో చైనా ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యల గురించి చిలవలు పలవలుగా చిత్రిస్తున్నారు. ముస్లింలను అణచివేసేందుకు తీసుకున్న నిర్ణయాల పత్రాలు బయట పడ్డాయని కొన్ని పత్రికలు కథలు రాశాయి.
చైనా లక్షణాలతో సోషలిజాన్ని నిర్మిస్తామని చైనా కమ్యూనిస్టు పార్టీ చెబుతున్నది. దీనిని కొంత మంది కమ్యూనిస్టులే అంగీకరించటం లేదు. ఆ పేరుతో అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్దను నిర్మిస్తున్నారనే ప్రచారం చేస్తున్నారు కూడా. నూరు పూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్నట్లుగా ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలను వారిని వ్యక్తం చేసుకోనివ్వటం తప్ప మరొక మార్గం లేదు. పెట్టుబడిదారీ విధానం అన్ని దేశాల్లో ఒకే మూసగా అభివృద్ది చెందలేదు. అలాగే సోషలిజాన్ని కూడా అభివృద్ధి చేయలేమని, ఏ దేశానికి ఆదేశ ప్రత్యేక పరిస్ధితులను గమనంలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు సోషలిజాన్ని నిర్మించే క్రమంలో దశల గురించి తెలియదు, చైనీయుల అవగాహన ప్రకారం అనేక ద శల్లో తమది ఒకటి అంటున్నారు. మొత్తంగా చూసినపుడు వారి దారి ఎటు అన్నదే ముఖ్యం.

Image result for china islamic
సోషలిజం గురించే ఇలా ఉన్నపుడు ఇక మతాల గురించి చెప్పాల్సిందేముంది. ఎంతో సున్నితమైన అంశం, శత్రువులు కాచుకొని ఉంటారు. ఒక లౌకిక వ్యవస్దలో మతం పట్ల ఎలా వ్యవహరించాలి అన్నది ఒక ముఖ్యాంశం, అది కూడా కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న చోట(మన దేశంలో మాదిరి ఒకటో అరో రాష్ట్రంలో అధికారం పొందటం కాదు) మరింత సంక్లిష్టం. సోషలిస్టు సమాజ లక్ష్యం కలిగిన ఏ వ్యవస్దలో అయినా మతం దాని నిర్మాణానికి దోహదం చేసేదిగా ఉండాలి తప్ప వ్యతిరేకించేదిగా ఉండకూడదు. మత విశ్వాసాలు వ్యక్తి, కుటుంబానికి పరిమితం కావాలి తప్ప నా మతం చెప్పినట్లుగా పాలన నడవాలంటే కుదరదు. మతాలే దానికి అనుగుణ్యంగా మారాల్సి ఉంటుంది.అనేక దేశాల్లో అలా మారినపుడు సోషలిస్టు దేశాల్లో కుదరదంటే ఎలా ?
చైనాలోని ఎనిమిది ముస్లిం తెగల పెద్దలతో ప్రభుత్వం సమావేశం జరిపి సోషలిజానికి తగిన విధంగా ఇస్లాం మారాల్సిన అవసరం గురించి వివరించింది, అందుకు గాను ఐదు సంవత్సరాలలో శీఘ్రగతిన తెలియచెప్పేందుకు తీసుకోవాల్సిన చర్యలను వారి ముందుంచింది. పశ్చిమ దేశాల మీడియా దీన్ని దొరకబుచ్చుకొని యుఘిర్‌లో ఉగ్రవాద నిర్మూలన చర్యలుగా కొందరు చిత్రీకరిస్తే మరి కొందరు ఆ పేరుతో మతాన్ని అణచివేసేందుకు పూనుకున్నట్లు రాశారు. అనేక దేశాల్లో మితవాద శక్తులు మత పెత్తనాన్ని తిరిగి పునరుద్దరించేందుకు, పాలకుల మీద వత్తిడి తెచ్చేందుకు ఇటీవలి కాలంలో తీవ్రంగా ప్రయత్నిస్తున్న అంశాన్ని మరచిపోకూడదు. మతపరమైన దేశాల్లో పరిస్ధితులు ఎంత దారుణంగా ఉన్నాయో చూసిన తరువాత ప్రతి లౌకిక దేశం తన జాగ్రత్తలు తాను తీసుకోనట్లయితే అనేక కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంటర్నెట్‌ ఎంత వేగంగా చొచ్చుకుపోతోందో దాన్ని వినియోగించుకొని మత శక్తులు అంతగా రెచ్చిపోవటాన్ని మనం చూస్తున్నాం. ఇదే పరిస్ధితి ప్రపంచమంతటా ఉంది. పోప్‌ జాన్‌ పాల్‌ 2 పోలెండ్‌లో సోషలిస్టు వ్యవస్ధ కూల్చివేతకు ఎలా చేతులు కలిపిందీ మనం చూశాము. వాటికన్‌ కేంద్రం ఉన్న ఇటలీ ఉప ప్రధాని మాటియో సల్వవినీ 2018 ప్రారంభంలో ఒక ప్రకటన చేశాడు.’ మన మీద దాడి జరుగుతోంది, మన సంస్కృతి, సమాజం, సంప్రదాయాలు, జీవన విధానానికి ముప్పు ఏర్పడింది.’ అని మాట్లాడితే ఒక మీడియా 2019లో మత యుద్ధాలు తిరిగి రానున్నాయని రాసింది. ఛాందసవాదం వెర్రి తలలు వేస్తోంది, అది మితవాద జాతీయ వాద భావనలను ముందుకు తెస్తోంది, హింసాకాండకు, సామాజిక అస్ధిరతకు కారణం అవుతోంది. ఈ అనుభవాలను ప్రతి దేశం తీసుకోవాలి, అవసరమైన చర్యలు తీసుకోవాలి. చైనా దీనికి మినహాయింపుగా ఉండజాలదు.
సోషలిజానికి అనుగుణ్యంగా ఒక్క ఇస్లామే కాదు, చైనాలోని అన్ని మతాలూ మారాలని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అందుకు అనుగుణ్యమైన చర్యలు తీసుకొంటోంది. ఏ మతానికి మినహాయింపు లేదు. మన దేశంలో కేంద్రంలో, అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న సంఘపరివార్‌ నేతల మాదిరి హిందూ మతానికి ఇతర మతాల నుంచి, లౌకిక వాదుల నుంచి ముప్పు వస్తోందని చెబుతన్నట్లుగా చైనాలో మెజారిటీ మతానికి ముప్పు వస్తోందని చెప్పటం లేదు. ఒక మైనారిటీ మతాన్నుంచి వస్తోందనే ముప్పును మరొక మెజారిటీ మతోన్మాదం అరికట్టలేదు, అది తన ఉన్మాదాన్ని జనం మీద రుద్దుతుంది. జనాన్ని అణచివేస్తుంది. 2018లో చైనా విడుదల చేసిన ఒక శ్వేత పత్ర సమాచారం ప్రకారం 20 కోట్ల మంది మతాన్ని నమ్మేవారున్నారు. ప్రభుత్వం వద్ద నమోదైన ప్రార్దనా స్ధలాలు 1,44,000 ఉన్నాయి. వాటిలో 3,80,000 మంది మత పరమైన క్రతువులు నిర్వహించే వారున్నారు. ఉగ్రవాద నిరోధ చర్యలు, మత పరమైన స్వేచ్చ పూర్తిగా భిన్నమైన అంశాలు. ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకోవటం, దాన్ని నివారించటం మత స్వేచ్చను అడ్డుకోవటం కాదు. మన దేశంలో సంఘపరివార్‌ చేస్తున్న ప్రచారం మాదిరి ముస్లింలు మొత్తం ఉగ్రవాదులే అని లేదా అందరూ ఉగ్రవాదులు కాదు గానీ ఉగ్రవాదులుగా ఉన్నవారందరూ ముస్లింలే అనే తప్పుడు ప్రచారాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ చేయటం లేదు.
ముస్లిం దేశాలు చైనా చర్యను ఎందుకు ఖండించటం లేదు ?
చైనాలో ఒక రాష్ట్రంలోని ముస్లింలను ఇంతగా హింస పెడుతుంటే ఒక్క ముస్లిం దేశమూ ఖండిచదు ఎందుకు అని కొందరు సామజిక మాధ్యమం, మీడియాలో అమాయకంగా అడుగుతున్నట్లు కనిపిస్తారు. వారే వాటికి సమాధానం కూడా చెబుతారు.చైనాతో ఉన్న ఆర్దిక సంబంధాలే కారణం అన్నది అది. మరి అమెరికా ఎందుకు అంతగా గొంతు చించుకుంటున్నది, చైనాతో అందరి కంటే ఎక్కువ వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నది, చైనా దగ్గర పెద్ద మొత్తంలో డాలర్లు అప్పుగా తెచ్చుకున్నదీ అమెరికాయే కదా ? చైనా రాజకీయంగా, ఆర్ధికంగా తనకు నచ్చినట్లు లంగలేదు కనుక బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నది అనుకోవాలా ?
చైనా పదిలక్షల మంది యుఘిర్‌ ముస్లింలను నిర్బంధ శిబిరాల్లో పెట్టింది. దీనికి పశ్చిమ దే శాలూ, వాటి మీడియా చూపే ఆధారాలు లేవు, దగ్గరుండి సరిగ్గా లెక్క పెట్టినట్లు రాస్తున్నారు. కోటి మంది ముస్లింలు ఉన్న ప్రాంతంలో పది లక్షల మందిని నిర్భందిస్తే మిగిలిన వారంతా ఈ పాటికి పొరుగు దేశాలకు శరణార్దులుగా వెళ్లి ఉండాల్సింది. కానీ సరిహద్దుల్లో ఉన్న ఏ ఒక్క ముస్లిం దేశం, మరొక దేశం గానీ తమ దేశానికి అలాంటి సమస్య ఉన్నట్లు ఇంతవరకు ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయలేదు. దాదాపు పదకొండువేల కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు కలిగిన ప్రాంతమది, తప్పించుకోకుండా కట్టడి చేయటం ఏ దేశానికైనా సాధ్యమేనా ? ఉపగ్రహ చిత్రాలంటూ పత్రికల్లో టీవీల్లో కొన్ని భవనాలను చూపుతారు, అవి ఏ భవనాలైనా కావచ్చు. చైనాలో జరుగుతున్నట్లు చెబుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి అమెరికా తప్ప మరొక దేశం ఏదీ చొరవ తీసుకొని ఫిర్యాదు చేసేందుకు ఇంతవరకు ముందుకు రాలేదు.

Image result for pope  china
తామే తుమ్మి తామే తధాస్తు అనుకున్నట్లుగా తాము పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కారణంగా నిర్బంధ శిబిరాలను పెద్ద సంఖ్యలో మూసివేసిందని కూడా పశ్చిమ దేశాల వారు ప్రచారం చేస్తున్నారు. ముందే చెప్పుకున్నట్లుగా దేశ వ్యవస్ధకు అనుగుణ్యంగా వ్యవహరించాల్సిన తీరుతెన్నులను వివరించేందుకు పిల్లలు, యువతకు ప్రభుత్వం కొన్ని పాఠశాలలను ఏర్పాటు చేసింది. వాటిలో ఉగ్రవాదం, దానికి దూరంగా ఉండాల్సిన అవసరం, బతికేందుకు అవసరమైన నైపుణ్యాలలో శిక్షణ వంటివి అన్నీ అక్కడ వున్నాయని చైనా అధికారులే చెబుతున్నారు. వాటిని శత్రువులు నిర్భంద శిబిరాలంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో నక్సల్స్‌గా మారి నేరాలు చేసిన వారిని పట్టిస్తే బహుమతులు ప్రకటించటం లేదా వారే లొంగిపోతే ప్రభుత్వాలు ఆర్దిక సాయం చేసి జనజీవన స్రవంతిలోకి తెచ్చే పధకాలను అమలు జరపటం తెలిసిందే. చైనా నిర్వహిస్తున్న అలాంటి పాఠశాలలను సందర్శించాలని అనేక దేశాల, దౌత్యవేత్తలు, జర్నలిస్టులను ఆహ్వానించింది. వారందరూ చైనా అనుకూలురు అని ఒక నింద. వాటిలో ఖురాన్‌ చదవ నివ్వటం లేదని, పంది మాంసం బలవంతంగా తినిపిస్తున్నారంటూ రంజుగా కథలు చెబుతున్నారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని సామాజిక, మానవతా పూర్వక, సాంస్కృతిక వ్యవహారాల కమిటీ ముందు గతేడాది అక్టోబరు 23 యుఘీర్స్‌పై జరుగుతున్నదాడులంటూ అమెరికా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి 23దేశాలు ఫిర్యాదు చేశాయి,54దేశాలు చైనా తీసుకున్న చర్యలను సమర్ధించాయి. ఇస్లామిక్‌ దేశాలు పాలస్తీనియన్లు, మయన్మార్‌లో రోహింగ్యాల మీద జరుగుతున్న దాడులను ఖండించాయి గానీ, యుఘీర్స్‌ పట్ల కేవలం ఆందోళన మాత్రమే వ్యక్తం చేశాయని అమెరికన్లు కస్సుబుస్సుమంటున్నారు. పాలస్తీనియన్ల మీద జరుగుతున్నదాడులను అమెరికా ఎప్పుడైనా ఖండించిందా, ఖండించకపోగా ఐరాసలో ఇజ్రాయెల్‌ను సమర్దిస్తున్నది. సిరియాపై దాడికి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు పంపిన ఆల్‌ఖైదా ఉగ్రవాద ముఠాలలో యుఘీర్‌లు దొరికిపోయారు. వారిని అక్కడకు పంపిందెవరు చైనా వారా అమెరికన్లా ? ఆప్ఘన్‌ తాలిబాన్ల ముఠాలలో అనేక మంది యుఘీర్లు పట్టుబడ్డారు, వారిని తాలిబాన్లలోకి పంపిందెవరు ? ఈ విషయాలు ముస్లిం దేశాలకు తెలియవా ?చైనాను ఏమని విమర్శిస్తాయి?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మంచి కోసం మాంద్యాన్ని భరించక తప్పదు : డోనాల్డ్‌ ట్రంప్‌

21 Wednesday Aug 2019

Posted by raomk in CHINA, Current Affairs, Economics, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

China, China–United States trade war, Donald trump, TRADE WAR, United States

China's President Xi Jinping (R) shakes hands with US President Donald Trump before a bilateral meeting on the sidelines of the G20 Summit in Osaka on June 29, 2019. (BRENDAN SMIALOWSKI/AFP/Getty Images)

ఎం కోటేశ్వరరావు

చైనాతో మెరుగైన వాణిజ్య ఒప్పందం కోసం రెండు నెలల మాంద్యం మూల్యం చెల్లించటానికి తాను అంగీకరిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం నాడు చెప్పారు. చైనా పట్ల దూకుడుగా అనుసరిస్తున్న వైఖరి స్వల్పకాలంలో బాధ పెట్టినా దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తుందని, రెండు నెలల పాటు మాంద్యాన్ని అమెరికా ఎదుర్కోగలదని అన్నారు. మాంద్యమనే భావన అసంగతం, చైనా మీద చర్య తప్పని సరి, స్వల్పకాలంపాటు మాంద్య మంచిదా కాదా అన్నది సమయాన్ని బట్టి వుంటుంది, మీరు మాంద్యం గురించి చెబుతున్నారు, మనం రెండు నెలల పాటు మాంద్యానికి గురవుతాం, ఎవరో ఒకరు చైనా మీద చర్య తీసుకోవాలి కదా అని విలేకర్లతో వ్యాఖ్యానించారు. మాంద్యానికి అమెరికా చాలా దూరంగా వుంది, ఫెడరల్‌ రిజర్వు ప్రామాణిక వడ్డీ రేట్లను తగ్గించాలని కూడా అన్నారు. తరువాత అధ్యక్ష ప్రతినిధి విలేకర్లతో మాట్లాడుతూ అమెరికా మాంద్యం వైపు వెళుతోందనటాన్ని అధ్యక్షుడు విశ్వసించటం లేదని, ఆయన విధానాల కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్ధ ఎంటో పటిష్టంగా వుందని అన్నారు.

అమెరికా – చైనా వాణిజ్య పోరు కారణంగా తలెత్తిన అనిశ్చితి కారణంగా 2021నాటికి 97లక్షల కోట్ల ప్రపంచ జిడిపి 585 బిలియన్‌ డాలర్ల మేరకు 0.6శాతం నష్టపోనుందని, ప్రపంచ జిడిపి బ్లూమ్‌బెర్గ్‌ ఆర్ధిక నివేదిక పేర్కొన్నది. ఈ పూర్వరంగంలోనే ప్రపంచ వత్తిడి లేదా పర్యవసానాలకు తమనే బాధ్యులుగా చేస్తారనే భయం, వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలను ప్రభావితం చేస్తుందనే అనే ఆలోచన తో గానీ చైనాతో వాణిజ్య పోరును ట్రంప్‌ కొంత కాలం పాటు వాయిదా వేశారు. బ్రిటన్‌, జర్మనీ, రష్యా,సింగపూర్‌, బ్రెజిల్‌తో సహా తొమ్మిది దేశాల ఆర్ధిక వ్యవస్ధలు మాంద్యపు అంచున లేదా మాంద్యంలోకి జారినట్లు భావిస్తున్నారు. తదుపురి వంతు 2021లో అమెరికాదే అని ఆర్ధిక వేత్తలు హెచ్చరించారు.

ఈ నేపధ్యంలో సెప్టెంబరు ఒకటి నుంచి చైనా వస్తువులపై పెంచదలచిన దిగుమతి పన్ను క్రిస్మస్‌ పండుగను నాశనం చేస్తుందనే హెచ్చరికలను సాకుగా చూపి డిసెంబరు 15 నాటికి డోనాల్డ్‌ ట్రంప్‌ వాయిదా వేసినట్లు వార్తలు వచ్చాయి. పండుగ అంటే బొమ్మలు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను కోట్లాది మంది అమెరికన్లు బహుమతులుగా ఇస్తారు. దిగుమతి పన్ను భారాన్ని వినియోగదారుల మీద మోపటం తప్ప మరొక మార్గం లేదని వాల్‌మార్ట్‌ తదితర దుకాణాల సంస్ధలు స్పష్టం చేశాయి. మరోవైపున చైనా నాయకత్వం కూడా తాము కూడా తగిన ప్రతీకార చర్యలు తీసుకుంటామని చెప్పటంతో తాను ప్రతిపాదించిన పన్నుల పెంపుదల క్రిస్మన్‌ కొనుగోళ్లకు సంబంధం లేనప్పటికీ వాటి మీద ప్రభావం పడుతుందంటున్నారు కనుక వాయిదా వేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించాడు. అదే నోటితో హాంకాంగ్‌లో జరుగుతున్న ఆందోళనకు వాణిజ్య యుద్ధానికి లంకె పెట్టేందుకు కూడా ప్రయత్నించిన ట్రంప్‌ రెచ్చగొట్టుడును మానుకోలేదు. హాంకాంగ్‌ పరిణామాలకు, వాణిజ్య యుద్ధానికి ఎలాంటి సంబంధం లేదని, ఇతరుల సలహాలు తమకు అవసరం లేదని చైనా ప్రకటించింది.

వాణిజ్య యుద్ధాలు మంచివి, వాటిలో విజయం సాధించటం తేలిక అని 2018 మార్చినెలలో ట్రంప్‌ చెప్పాడు. అయితే చైనాను వూబిలో దించబోయి ట్రంపే తన వూబిలో తానే పడ్డట్లు అనేక మంది విశ్లేషకులు పేర్కొన్నారు. చైనాతో వాణిజ్య యుద్దంలో ఎలా ఓటమి చెందనున్నారో వివరించారు. మీడియాలో వచ్చిన విశ్లేషణలు, వ్యాఖ్యల మేరకు దిగువ అంశాలు ట్రంప్‌ను ప్రభావితం చేశాయి. భద్రతా కారణాలతో చైనా టెలికాం కంపెనీ హువెయ్‌, దాని అనుబంధంగా వున్న 46కంపెనీలతో లావాదేవీలు జరపరాదన్న తమ అధినేత నిర్ణయాన్ని మరో 90 రోజుల పాటు నవంబరు 19 వరకు వాయిదా వేస్తున్నట్లు అమెరికా వాణిజ్య మంత్రి విల్‌బర్‌ రోస్‌ ప్రకటించాడు. అమెరికా కంపెనీలతో పాటు ఇతర దేశాలు కూడా హువెయ్‌ కంపెనీ పరికరాలను కొనుగోలు చేయరాదని అమెరికా ఆదేశించిన విషయం తెలిసిందే. అమెరికా విధించిన ఆంక్షలు హువెయ్‌ కంపెనీ పనితీరు మీద ఇప్పటి వరకు ఎలాంటి ప్రభావం చూపలేదు. ఈ ఏడాది తొలి ఆరుమాసాల్లో దాని ఆదాయం 23.2శాతం పెరిగినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు ఐదవ తరం(5జి) నెట్‌వర్క్‌ పరికరాల విషయమై ఇది 50వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. వాటిలో 28 ఐరోపాలోనే వున్నాయి. ఫిన్లండ్‌కు చెందిన నోకియా 43, స్వీడన్‌ కంపెనీ ఎరిక్సన్‌ 22 కాంట్రాక్టులు కుదుర్చుకుంది. మరోవైపు హువెయ్‌ పోటీదారు జడ్‌టియి 25వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రకటించింది.

మూడు వందల బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులపై ఆగస్టు ఒకటి నుంచి పన్ను విధిస్తామన్న ట్రంప్‌ తరువాత ఆ మొత్తాన్ని 160 బిలియన్లకు తగ్గించి సెప్టెంబరు ఒకటి నుంచి పన్ను వేస్తామని ప్రకటించాడు. క్రిస్మస్‌ పేరుతో ఇప్పుడు దాన్ని కూడా డిసెంబరు 15కు వాయిదా వేశాడు. అయితే కిందపడ్డా పైచేయి తనదే అని చెప్పుకొనేందుకు అమెరికా వ్యవసాయ వస్తువులను కొనుగోలు చేసేందుకు చైనా అంగీకరించిందని ట్రంప్‌ ఒక ట్వీట్‌ చేశాడు.అయితే అమెరికా రైతాంగం ఇబ్బందులు పడుతున్నదని రాయిటర్స్‌ ఒక వార్తను ఇచ్చింది. ఇటీవలి సంవత్సరాలలో రైతాంగానికి ఇస్తున్న రుణాలు 17.5శాతం తగ్గాయని, బకాయిల చెల్లింపునకు వత్తిడి, కొత్తగా రుణాలు నిలిపివేయటంతో అనేక మంది దివాలా చట్టాన్ని ఆశ్రయిస్తున్నట్లు తెలిపింది. చైనా, మెక్సికో దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే సోయా, ధాన్యం వంటి వుత్పత్తుల మీద పన్నుల విధించిన కారణంగా అక్కడి రైతాంగం ఇబ్బందులు పడుతున్నది. వారిని ఆదుకొనేందుకు కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అవి ఫలించలేదు. చైనా వుత్పత్తులపై పన్ను విధింపు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించగానే అమెరికా స్టాక్‌మార్కెట్‌ సంతోషపడింది. అయితే తాము కూడా ప్రతి చర్యలకు వెనుకాడబోమని చైనా వెల్లడించగానే డీలాపడటం అమెరికా బలహీనతకు సూచికగా విశ్లేషకులు పేర్కొన్నారు. ట్రంప్‌ వ్యూహం విఫలమౌతున్నదని బాహాటంగానే మీడియాలో వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.

ప్రస్తుతం ప్రపంచంలో అనేక దేశాలతో రోజు రోజుకూ చైనా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇదే సమయంలో అమెరికా ప్రతి వారి మీద బస్తీమే సవాల్‌ నాకు లొంగుతారా లేదా అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరిస్తారా లేదా అనే బెదిరింపులకు దిగుతున్నది. ఇది దాని ఆర్ధిక వ్యవస్ధతో పాటు రాజకీయ పలుకుబడిని కూడా దెబ్బతీస్తున్నదంటే అతిశయోక్తి కాదు. తమ చర్యల కారణంగానే చైనా అభివృద్ధి కూడా పడిపోయిందని ట్రంప్‌ చంకలు కొట్టుకోవచ్చు. నిజానికి అదొక చిన్న కారణమే తప్ప మరొకటి కాదు. అంతర్గతంగా తీసుకున్న చర్యలు అభివృద్ధి రేటు తగ్గటానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. తన వస్తువులను అమ్ముకొనేందుకు చైనా అవసరమైతే తన యువాన్‌ విలువను తగ్గించుకొనేందుకు సిద్ధంగా వుందన్న సూచనలు గతవారంలో వెలువడిన విషయం తెలిసిందే. అమెరికా తన డాలరు విలువను తగ్గించనట్లయితే ప్రపంచ మార్కెట్లో దాని వస్తువులను కొనుగోలు చేసే వారు వుండరు. తన కరెన్సీ విలువను తగ్గించుకుంటే ఇతర పర్యవసానాలు తీవ్రంగా వుంటాయని అమెరికా భయపడుతోంది. డాలరు విలువ తగ్గకుండా ప్రపంచ దేశాలను అదిరించి బెదిరించి తన వస్తువులను అంటగట్టాలని చూస్తోంది.

Image result for trade war us china

అమెరికాను ఒంటరిపాటు చేసేందుకు , మిత్రులను సంపాదించుకొనేందుకు చైనా తనదైన శైలిలో ముందుకు పోతోంది.2018 జనవరిలో చైనా తాను చేసుకొనే దిగుమతులపై సగటున ఎనిమిదిశాతం పన్ను విధించింది. అమెరికా ఎప్పుడైతే వాణిజ్య యుద్దానికి దిగిందో అమెరికా వస్తువులపై పన్ను మొత్తాన్ని 20.7శాతానికి పెంచి, మిగతా దేశాలపై సగటు పన్నును 6.7శాతానికి తగ్గించింది. అమెరికా నుంచి దిగుమతులను తగ్గించి ఇతర దేశాల నుంచి పెంచుకున్నదని, ఇతర దేశాలకు తన ఎగుమతులను పెంచిందని పీటర్సన్‌ ఇనిస్టిట్యూట్‌ పేర్కొన్నది. అమెరికా ఒక వైపు తన సోయా బీన్స్‌ నుంచి బోయింగ్‌ విమానాల వరకు ఏవేవి కొనాలో జాబితా ఇస్తోంది. అదే సమయంలో ప్రభుత్వ రంగం మీద ఎక్కువగా ఆధారపడుతున్న చైనా ఆర్ధిక విధానాన్ని మార్చాలని కూడా డిమాండ్‌ చేస్తోంది. భద్రత సాకుతో చైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరింప చేయకుండా చూసేందుకు ప్రయత్నిస్తోంది. చైనాతో వాణిజ్య యుద్ధానికి దిగావు సరే మిత్ర దేశాలైన మెక్సికో, ఐరోపా దేశాల మీద కూడా తొడగొట్టటం ఏమిటయ్యా బాబూ అని ట్రంప్‌ను చూసి కొందరు అమెరికా వాణిజ్యవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. మన బోయింగ్‌లు ఎక్కువగా కొనాలని చైనా మీద వత్తిడి తెస్తే తమ ఎయిర్‌బస్‌ల సంగతేమిటని ఐరోపా దేశాలు అమెరికాను ప్రశ్నించవా, చైనాతో సఖ్యతకు ప్రయత్నించవా అని చెబుతున్నా ట్రంప్‌ వినటం లేదు.

హాంకాంగ్‌లో నిరసన తెలుపుతున్న వారి మీద తియన్మెన్‌ తరహా అణచివేతను తాము వ్యతిరేకిస్తామని, హాంకాంగ్‌లో అణచివేత చర్యలు వాణిజ్య యుద్దం మీద ప్రభావం చూపుతాయని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించి వివాదాన్ని మరో కొత్త మలుపు తిప్పాడు. ఇది చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం తప్ప మరొకటి కాదు.ఇతర సమస్యల్లో కూడా జోక్యం చేసుకొంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. హాంకాంగ్‌ నిరసనలు చైనా అంతర్గత వ్యవహారం, దానికి వాణిజ్య యుద్ధానికి సంబంధం లేదు, తమకు ఇతరుల సలహాలు అవసరం లేదని చైనా విదేశాంగశాఖ స్పష్టం చేసింది. హాంకాంగ్‌ పరిణామాలకు, వాణిజ్య యుద్ధానికి ముడిపెడితే రెండు దేశాల మధ్య తదుపరి చర్చలకు అవకాశాలుండవని అనేక మంది హెచ్చరిస్తున్నారు. జూలై 30న షాంఘైలో జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం ఇవ్వకుండానే ముగిసిన విషయం తెలిసిందే.

ఇలాంటి హెచ్చరికలు అమెరికాలో చాలా కాలం నుంచి వినపడుతున్నా ట్రంప్‌ బింకాలు పోతున్నాడు. తనతో ఒప్పందానికి చైనా సిద్దంగా వుందని తాను సిద్దంగా లేనని, ముందు హాంకాంగ్‌ సమస్యను అదెలా పరిష్కరిస్తుందో చూస్తానంటూ ట్రంప్‌ వాచాలత్వాన్ని ప్రకటించాడు. మాంద్య భయాలేమీ లేవని, వాణిజ్య పోరుతో తమకేమీ నష్టం లేదని వైట్‌ హౌస్‌ యంత్రాంగం భావిస్తున్నదని రాయిటర్స్‌ పేర్కొన్నది. మాంద్య భయంతో గత బుధవారం నాడు అమెరికా స్టాక్‌ మార్కెట్‌ మూడుశాతం పతనమైంది. 2009 మాంద్య తరువాత అమెరికా ఫెడరల్‌ రిజర్వు, ఇతర 19దేశాల రిజర్వుబ్యాంకులు పెద్ద మొత్తంలో తమ వడ్డీరేట్లను తగ్గించాయి. ఈ అధ్యక్షుడు ప్రపంచ ఆర్ధిక వ్యవస్దనే మాంద్యంలోకి నెడుతున్నాడని డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులలో ఒకరైన బెటో ఒ రూర్కీ ఒక టీవీ ఛానల్‌లో పేర్కొన్నాడు.

Image result for DONALD Trump willing to trigger a two-month recession

విదేశాంగ విధానం అంటే న్యూయార్క్‌ రియలెస్టేట్‌లో పోటీదార్లను బెదిరించి తాను చేసుకున్న లాభదాయకమైన ఒప్పందాలు అనుకుంటున్నట్లుగా వుంది, రెండు దేశాల మధ్య సంబంధాలు అలా వుండవని తెలుసుకోవాలని ట్రంప్‌కు ఒక విశ్లేషకుడు సలహా ఇచ్చాడు. అదిరించి బెదిరించి చైనా నేత గ్జీ జింపింగ్‌ను దారికి తెచ్చుకుందామని చూస్తే కుదరదు.చైనా అమ్ముల పొదిలో అనేక అస్త్రాలున్నాయి. అమెరికా దాని దగ్గర తీసుకున్న 1.2లక్షల కోట్ల డాలర్ల రుణ పత్రాలు(బాండ్లు)న్నాయి. వాటిని గనుక అమ్మేస్తే అమెరికా పరిస్ధితి ఏమిటి? దాని దగ్గర ఎక్కడా దొరకని విలువైన ఖనిజం(మట్టి) వుంది, అన్నింటికీ మించి తన కరెన్సీ విలువను తగ్గించి నిలబడగల సత్తా వుందని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. అమెరికాలో చైనా ప్రత్యక్ష పెట్టుబడులు 2018లో 83శాతం తగ్గాయి. ఇప్పటికే వాణిజ్య యుద్దం అమెరికా వార్షిక వృద్ధి రేటును నాలుగు నుంచి రెండుశాతానికి దించింది. ప్రపంచం మరోసారి మాంద్యానికి దగ్గర అవుతోంది. ప్రపంచం దృష్టిలో స్వేచ్చా ప్రపంచపు రాజధాని వాషింగ్టన్‌ ఇప్పుడు బీజింగ్‌వైపు తిరిగింది. ఒక పోలీసు రాజ్యం బాధిత దేశంగా మారింది. స్వేచ్చా వాణిజ్యం గురించి వుదారవాద ప్రజాస్వామ్యాలకు కమ్యూనిస్టు నాయకత్వం ఇప్పుడు పాఠాలు చెబుతోంది అంటూ ఒక విశ్లేషకుడు వాపోవటం అమెరికా ఏ పరిస్ధితికి లోనైందో వెల్లడిస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా వృద్ధి రేటు పతనం ఎవరికి లాభం, ఎవరికి నష్టం ?

17 Wednesday Jul 2019

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

China, china’s economic growth, china’s economic growth slides, Donald trump, world Trade

Image result for china’s economic growth slides

ఎం కోటే శ్వరరావు

ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో 6.4శాతంగా వున్న తమ వృద్దిరేటు రెండవ త్రైమాసిక కాలంలో 6.2శాతానికి తగ్గిందని, ఇది గడచిన ఇరవై ఏడు సంవత్సరాలలో కనిష్టం అని చైనా ప్రకటించింది. ఈ పరిస్ధితి లాభమా నష్టమా అనే చర్చ ప్రపంచ వ్యాపితంగా మీడియాలో ప్రారంభమైంది. అనుకూల వార్తలను తప్ప ప్రతికూల, విమర్శనాత్మక వైఖరులను సహించే పరిస్ధితి దేశంలో రోజు రోజుకూ దిగజారుతోంది. ఎదుటి వారి బలహీనతలను వినియోగించుకొని లబ్ది పొందాలని చెప్పేవారిని దేశ భక్తులుగానూ, మంచి చెడ్డలను వివరించి వైఖరులు మార్చుకోవాలని కోరే వారిని దేశద్రోహులనేంతగా పరిస్ధితులు వున్నాయి. ఎదుటి వారి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవాలని ఎలా చూస్తామో ఎదుటి వారు కూడా అదే ప్రయత్నం చేస్తారనే చిన్న తర్కం తట్టకపోతే వచ్చే సమస్య ఇది. ప్రపంచ వ్యాపితంగా ప్రతి దేశం స్వేచ్చా వాణిజ్యం, విధానాల గురించి ఎన్ని కబుర్లు చెప్పినా ఎవరికి వారు రక్షణాత్మక చర్యలను ఎక్కువగా తీసుకుంటున్న రోజులివి. ప్రతికూలతలను మనం మూసిపెడితే ప్రపంచానికి తెలియకుండా పోతుందా? మంచి చెడ్డలను చర్చించిన వారు దేశద్రోహులు కాదు అసలైన దేశ భక్తులని ముందుగా చెప్పాలి.

తాము విధించిన పన్నుల కారణంగానే చైనా ఆర్ధిక వ్యవస్ధ పతనమైందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. తమ చర్యలు పన్నులు లేని దేశాలకు తరలిపోవాలని అనుకుంటున్న కార్పొరేట్‌ కంపెనీల నిర్ణయాలను ప్రభావితం చేయటమే కాదు, అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొనేలా చైనాపై వత్తిడిని పెంచుతున్నాయని కూడా ట్రంప్‌ పేర్కొన్నారు. వేలాది కంపెనీలు వెళ్లిపోతున్న కారణంగానే తమతో ఒప్పందం చేసుకోవాలని చైనా కోరుకుంటోందని, తమకు పెద్ద మొత్తంలో ఆదాయం వస్తోందని, రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుందని, విలువ తగ్గించటం ద్వారా ఆ మొత్తం చైనాయే చెల్లిస్తోందని కూడా ఆ పెద్దమనిషి చెప్పాడు. అయితే అమెరికా ఆర్ధికవేత్తలు ఇలాంటి వైఖరులను తోసిపుచ్చుతున్నారు. చైనా వుత్పత్తులపై విధించే దిగుమతి పన్ను కారణంగా ధరల పెరుగుదల వలన ఆ మొత్తాన్ని వినియోగదారులే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. రెండువందల బిలియన్‌ డాలర్ల విలువగల చైనా వుత్పత్తులపై అమెరికా 25శాతం పన్ను విధిస్తే, అరవై బిలియన్‌ డాలర్ల విలువగల అమెరికా వస్తువులపై చైనా కూడా అంతే మొత్తంలో పన్ను విధిస్తోంది. మరో 325 బిలియన్‌ డాలర్ల చైనా వస్తువులపై పది నుంచి 25శాతం మేర పన్ను విధిస్తామని ట్రంప్‌ బెదిరిస్తున్నాడు. ఇరుదేశాల వాణిజ్యంలో చైనాది పైచేయిగా వుంది. అమెరికా దిగుమతులు 540 బిలియన్‌ డాలర్లుండగా చైనా దిగుమతులు కేవలం 120 బిలియన్‌ డాలర్లు మాత్రమే. ఈ తేడాను తగ్గించేందుకు తమ వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలంటూ అమెరికా బలవంతం చేస్తోంది.

చైనా ఆర్ధికవృద్ధి రేటు పడిపోవటం అమెరికాకు చెడు వార్త అని అసోసియేటెడ్‌ ప్రెస్‌ ఏజన్సీ విశ్లేషణ పేర్కొన్నది. దాని సారాంశం ఇలా వుంది. చైనా ఆర్ధిక మందగమనం వచ్చే ఏడాది కూడా కొనసాగవచ్చు. ఇది ప్రపంచవ్యాపిత పర్యవసానాలకు దారి తీస్తుంది.చిలీ రాగి మొదలు ఇండోనేషియా బొగ్గు వరకు చైనా ఫ్యాక్టరీలకు జరుగుతున్న ముడిసరకుల సరఫరాపై ప్రభావ చూపవచ్చు. దక్షిణాఫ్రికా వుత్పత్తిలో ఈ శతాబ్ది ప్రారంభంలో రెండుశాతం చైనాకు ఎగుమతి అవుతుండగా ప్రస్తుతం 15శాతానికి చేరాయి. కాంగో ఎగుమతుల్లో 45శాతం చైనాకే వున్నాయి. ఇలాంటి దేశాలన్నీ చైనా పెట్టుబడుల మీద ఆధారపడి వున్నాయి. పీటర్సన్‌ సంస్ధ వివరాల ప్రకారం ఏప్రిల్‌ నెలలో ఆస్ట్రేలియా ఎగుమతుల్లో 35, బ్రెజిల్‌ 30, దక్షిణకొరియా 24శాతం వుత్పత్తులు చైనాకు ఎగుమతి అవుతున్నాయి. మందగమనం కారణంగా చైనా అంతర్గత వినియోగం పడిపోతే ఈ దేశాలే కాదు చైనాలో వస్తువిక్రయాలు చేస్తున్న అమెరికన్‌ కంపెనీల ఆదాయం, లాభదాయకత, వాటాల విలువ మీద ప్రతికూల ప్రభావం పడుతుందని సిరాకాస్‌ విశ్వవిద్యాలయ ఆర్ధికవేత్త మేరీ లవ్లీ చెప్పారు. అంతిమంగా వాటాల ధరలు బలహీనమైతే అది అమెరికా వినియోగదారుల, ఆర్ధిక వ్యవస్ధపై వున్న విశ్వాసాన్నే దెబ్బతీస్తుందని కూడా ఆమె అన్నారు. చైనా ఆర్ధిక వ్యవస్ధ దిగజారిందని ట్రంప్‌ సంతోషంగా వుండవచ్చు గానీ ఇది జాగ్రత్తగా వుండాల్సిన పరిణామం అని ఆమె హెచ్చరించారు. ట్రంప్‌ ఒక్క చైనా మీదనే కాదు, ఇతర అనేక దేశాల మీద పన్నులు విధిస్తున్నారు. ఆ దేశాల వారు బదులు తీర్చుకుంటున్నందున మొత్తంగా ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులు దెబ్బతింటున్నాయి. వార్షిక అభివృద్ది లక్ష్యం 6నుంచి 6.5శాతం వుండే విధంగా వినియోగం పెంచేందుకు చైనా చర్యలు తీసుకుంటోంది.

చైనాలో జరిగే పరిణామం మన దేశం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ కూడా జరుగుతోంది.ఈ ఏడాది జనవరి 22 నాటి ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక విశ్లేషణ సారాంశం ఇలా వుంది. చైనా తొలిసారిగా వుత్పాదక కార్యకలాపాలు పడిపోయాయి. ఎగుమతులు, దిగుమతులూ తగ్గాయి. కొన్ని సంస్ధల సామర్ధ్య వినియోగం 40,50శాతం మధ్య వుంది. చైనాలో వస్తు డిమాండ్‌ పడిపోతే దాని ప్రభావం ప్రపంచవ్యాపితంగా వుంటుంది.ఈ శతాబ్ది ప్రారంభంలో ప్రపంచ ఆర్ధిక కార్యకలాపాల్లో చైనా వాటా ఏడుశాతం మాత్రమే వుండగా ఈ ఏడాది 19శాతానికి చేరనుంది. చైనా పరిశ్రమ అంతర్జాతీయ సరఫరా గొలుసుతో ముడిపడి వుంది. అనేక వస్తువుల ధరలను ప్రస్తుతం చైనా ఆర్ధిక వ్యవస్ధ నిర్ణయించే స్ధితిలో వుంది. ప్రపంచంలో వినియోగించే వుక్కు, రాగి, బొగ్గు, సిమెంట్‌లో సగం చైనాకు పోతోంది.అది కొనటం ఆపివేస్తే ధరలు పడిపోతాయి. డిమాండ్‌ పడిపోకుండా చూసేందుకు చైనా తక్షణ నిర్మాణ పధకాలను చేపట్టింది, పన్నులను తగ్గించింది. కొన్ని దిగుమతి పన్నులను తగ్గించింది.చిన్న సంస్ధలకు రుణాలను పెంచింది, బ్యాంకుల వద్ద నిల్వధనాన్ని తగ్గించింది.వడ్డీల తగ్గింపునకు చర్యలు తీసుకుంది. పెద్ద సంఖ్యలో వుద్యోగాలు రద్దు కాకుండా వుద్దీపన చర్యలు తీసుకుంది. ప్రస్తుతం భారత్‌ నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో చైనా వాటా 4.39శాతం.అక్కడి నుంచి 16శాతం వస్తువులను దిగుమతి చేసుకుంటున్న కారణంగా మన దేశం మీద ప్రభావం పెద్దగా పడకపోవచ్చు. అయితే చైనా కరెన్సీ యువాన్‌ బలహీనపడితే చైనా నుంచి దిగుమతులు చౌక అవుతాయి, దాంతో అక్కడి నుంచి వస్తువులను మన దేశంలో కుమ్మరిస్తారు. అది ఇక్కడి కంపెనీలను దెబ్బతీస్తుంది. చైనాకు ఎగుమతి చేసే ముడిసరకులు దెబ్బతింటాయి. చైనా కంపెనీలు భారత్‌కు వస్తాయి, ఇక్కడ వస్తువులను వుత్పత్తి చేస్తాయి, మౌలిక సదుపాయాల కల్పనలో చైనా సాయం తీసుకొని భారత్‌ లబ్ది పొందవచ్చు.

మరికొందరి విశ్లేషణల సారాంశం ఇలా వుంది. వాణిజ్య యుద్ధం కారణంగా కొంత మేరకు అమెరికా మార్కెట్‌ను చైనా కోల్పోవచ్చు. ఆ మేరకు మన దేశం ఆ స్ధానంలో ప్రవేశించవచ్చు అన్నది ఒక అభిప్రాయం. 2012-15 మధ్య కాలంలో ఎగుమతి మార్కెట్లో చైనా చొరబాటు 53-51శాతం మధ్య కదలాడగా దాటగా మన దేశం 27-28శాతం కలిగి వుంది. అమెరికా 48 నుంచి 43శాతానికి పడిపోయింది. 2016లో చైనా 42.57శాతానికి పడిపోగా మన దేశం 23.32కు, అమెరికా 37శాతానికి తగ్గిపోయింది. అంటే మూడు దేశాలకూ ఎగుమతుల అవకాశాలు తగ్గాయి. అయినా మన కంటే చైనా వాటా రెట్టింపుకు దగ్గరగా వుంది. పోయిన వాటాను పూడ్చుకొనేందుకు చైనా ఏం చేస్తుందనే అంశాన్ని పక్కన పెడితే మన దేశం మీద కూడా అమెరికా వాణిజ్య యుద్దం చేస్తోంది. చైనా స్ధానంలో మనం చొరబడాలంటే ఈ అంశం పరిష్కారం కావటం ఒకటి. చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వుత్పత్తుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగినవి వున్నాయి. వాటిని మనం తయారు చేసి ఎగుమతి చేయాలంటే అవసరమైన వుత్పాదక సామర్ధ్యాలను సమకూర్చుకోవటం తెల్లవారే సరికి జరిగే వ్యవహారం కాదు. 2016లో వుత్పాదక రంగంలో చైనా హైటెక్‌ వుత్పత్తుల ఎగుమతులు 25శాతం కాగా మన దేశంలో ఏడుశాతమే వున్నాయి. పన్ను ఒప్పందాలు చైనాకు 22 వుండగా మన దేశానికి రెండు మాత్రమే వున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో చొరబడాలంటే అందునా ప్రతి దేశం రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఇవి ఎంత ఎక్కువ వుంటే అంత ప్రయోజనం. ఇలాంటి తేడాలు అనేకం వున్న కారణంగా మన దేశం ఏ మేరకు లబ్దిపొందుతుంది అన్నది ప్రశ్న.

చైనా వారు ప్రకటించిన లెక్కలు దాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేంతగా లేవు, నేను గతవారం చైనాలో వున్నాను. వుత్పాదక రంగంలో మందగించిందనేది సాధారణ అభిప్రాయంగా వుంది. వేగంగా పెరుగుతున్న సేవా రంగం తిరిగి వెనుకటి స్ధాయికి తీసుకు వస్తుందనే అభిప్రాయమూ వుంది అని ఏలే విశ్వవిద్యాలయ సీనియర్‌ ఆర్ధికవేత్త స్టీఫెన్‌ రోచి చెప్పారు. మోర్గాన్‌ స్టాన్లే ఆసియా అధ్యక్షుడిగా 2007-12 మధ్య ఆయన చైనాలో వున్నారు. ప్రస్తుతం సాగుతున్న వాణిజ్య పోరు గురించి కూడా వారిలో ఎలాంటి ఆత్రత కూడా కనిపించలేదన్నారు. ఆర్ధిక మందగమన నేపధ్యంలో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవాలనే ధోరణిలో కూడా వారు లేరని, ఒక వేళ పోరు ముదిరితే దాన్ని అదుపు చేసే వ్యూహాలు కూడా వారి దగ్గర వున్నాయని చెప్పారు.

చైనా ఆర్ధికం మందగిస్తే ఏం జరుగుతుందనే అంశంపై పైన పేర్కొన్న అభిప్రాయాలతో అందరూ ఏకీభవించాలని లేదు.చర్చలో ముందుకు వస్తున్న అంశాలకు ప్రతీకగా వాటిని చూడాలి. ప్రతి దేశ ఆర్ధిక వ్యవస్ధ తాను ఎదుర్కొంటున్న సమస్యలకు తమదైన పరిష్కారాలను చూసుకోవాలి తప్ప అనుకరిస్తే ప్రయోజనం వుండదు. అనేక మంది పరిశీలకులు చెబుతున్నదాని ప్రకారం చైనా ప్రస్తుతం పెట్టుబడుల కంటే వస్తు వినియోగాన్ని పెంచే ఆర్ధిక నమూనా దిశగా ప్రయాణిస్తోంది. 2007-17 మధ్య కాలంలో చైనా గృహ వినియోగం అమెరికాతో పోలిస్తే 13శాతం నుంచి 34శాతానికి పెరిగింది. జిడిపిలో దాని వినియోగం గతేడాది 40శాతం వుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ అంచనా ప్రకారం 2017-23 మధ్య చైనా ఆర్ధిక వ్యవస్ధ 42శాతం చొప్పున(వార్షిక వృద్ధి 6.1శాతం), అమెరికా వ్యవస్ధ 13శాతం(వార్షిక వృద్ధి రెండుశాతం) పెరుగుతాయి. తరువాత వాటి వృద్ధి రేటు 8, 4శాతాల చొప్పున వుంటాయి.2026 నాటికి డాలర్లలో అమెరికా ఆర్ధిక వ్యవస్ధ స్ధాయికి చైనా చేరుకుంటుంది. 2027 నాటికి అమెరికా వినియోగంలో 74శాతం కలిగి వుంటుంది. తరువాత చైనా జిడిపి వృద్ధి రేటు ఆరుశాతం, అమెరికా రేటు నాలుగుశాతం వుంటుంది.

ఈ లెక్కలు కొంత గజిబిజిగా అనిపించవచ్చు. ఈ నేపధ్యంలో మన దేశం ఎంచుకున్న మార్గం ఏమిటన్నది చూడాల్సి వుంది. ప్రపంచ బ్యాంకు విశ్లేషణ ప్రకారం మన దేశ అభివృద్ధి అత్యధికంగా అంతర్గత డిమాండ్‌ కారణంగా జరిగింది, ఎగుమతుల అభివృద్ధి నెమ్మదిగా వుంది. కనుక కొత్త ప్రభుత్వం ఎగుమతి ఆధారిత అభివృద్ది ప్రాతిపదికగా చూడాలని సలహాయిచ్చింది. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) అంచనా ప్రకారం 2018లో ప్రపంచ వాణిజ్య వృద్ది రేటు 3.9శాతం కాగా 2019లో 3.7శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. వుత్పత్తి కూడా 3.5 నుంచి 3.3శాతానికి తగ్గనున్నట్లు తెలిపింది. ప్రపంచం వాణిజ్యం తగ్గితే అది కొన్ని దేశాల మీదనే ప్రతికూల ప్రభావం చూపదు. చివరికి దుస్తుల ఎగుమతి విషయాల్లో కూడా మన దేశం బంగ్లాదేశ్‌, వియత్నాం వంటి దేశాలతో పోటీ పడలేకపోతోంది. భారత్‌లో అంతర్గత డిమాండ్‌ ఎక్కువగా వున్న కారణంగా దిగుమతులు రెండంకెల స్ధాయికి చేరుతున్నాయని, డిమాండ్‌ను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రపంచ బ్యాంకు సూచించింది.జిడిపిలో సాధారణంగా 30శాతం మేరకు ఎగుమతులు చేయాల్సి వుండగా ఇప్పుడు పదిశాతం మేరకే వుందని, రానున్న రోజుల్లో ఎగుమతులు పెంచాలని కోరింది.

Related image

తాజాగా కేంద్రం ప్రకటించిన ఆర్ధిక సర్వే, బడ్జెట్‌లోనూ ప్రయివేటు పెట్టుబడుల ద్వారా అభివృద్ది తద్వారా ఎగుమతుల గురించి వక్కాణించారు.గత ఐదు సంవత్సరాలలో మొత్తంగా చూస్తే ఎగుమతులు పడిపోవటంతో పాటు పారిశ్రామిక మరియు వస్తుతయారీ అభివృద్ది కూడా మందగించింది. వినియోగ వస్తువుల డిమాండ్‌ కూడా పడిపోయింది. దీనికి ఒక ప్రధాన కారణం వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టకపోవటం, ఇతర కారణాలతో తలెత్తిన సంక్షోభం అన్నది అందరూ చెబుతున్నదే. ఒక్క సేవారంగంలో తప్ప ఇతర రంగాలలో తీవ్ర సమస్యలున్నప్పటికీ మనం మాత్రం వేగంగా అభివృద్ది చెందుతున్న దేశమనే తోక తగిలించుకుంటూనే వున్నాం. లేకపోతే రాజకీయంగా చెప్పుకొనేందుకేమీ వుండదు. దేశాన్ని ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధగా మార్చాలనే తపనతో మేకిన్‌ ఇండియా అనో మరొక పిలుపో ఇచ్చినా దాని వలన ఫలితాలేమీ రాలేదు. గతంలో తూర్పు ఆసియా దేశాలు, కొన్ని లాటిన్‌ అమెరికా దేశాలు ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధలతో ఒక వెలుగు వెలిగిన మాట నిజం.నాటికీ నేటికీ ఎంతో తేడా వుంది. ప్రస్తుతం ధనికదేశాలు ఎదుర్కొంటున్న మాంద్యం, ప్రతి దేశం అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలు అలాంటి అభివృద్దికి అనేక ఆటంకాలు కలిగిస్తున్నాయి. అన్నింటినీ మించి గతంలో ఆసియన్‌ దేశాలు అభివృద్ధి చెందిన సమయంలో దిగ్గజ చైనా రంగంలో లేదు. అక్కడి నుంచి దిగుమతులను అడ్డుకొనేందుకు మన దేశంతో సహా ప్రతిదేశమూ ప్రతి రోజూ ప్రయత్నిస్తున్నది. అనేక సందర్భాలలో మన వుత్పత్తులు తగినంత నాణ్యత లేవనే సాకుతో ఐరోపా, అమెరికా తిరస్కరించిన వుదంతాల గురించి వస్తున్న వార్తల గురించి తెలిసిందే.అమెరికా మన దేశం మీద కూడా వాణిజ్యపోరు సాగిస్తున్నది, మనం కూడా మన ఎలక్ట్రానిక్‌పరిశ్రమ రక్షణ కోసం కొన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. వ్యవసాయరంగంలో అలాంటి చర్యలను మరింతగా తీసుకోవాల్సి వుంది.

వేగంగా అభివృద్ధి చెందటం గురించి ప్రతి ఒక్కరూ చైనాను పదే పదే చెబుతుంటారు.అక్కడి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం అనుసరించిన సమతుల విధానం దాని విజయానికి కారణం. వుత్పాదకత పెంపుదలతో పాటు అక్కడి జన జీవితాలను ఎంతో మెరుగుపరచటం, అందుకు అవసరమైన విధంగా వేతనాలు, ఇతర ప్రోత్సాహకాల రూపంలో ఆదాయాలు కూడా పెరిగాయి. ఈ రెండో కోణాన్ని అనేక మంది చూడటం లేదు. 2008లో ప్రపంచ ధనిక దేశాల్లో తలెత్తి ఇప్పటికీ ఏదో ఒక రూపంలో కొనసాగుతున్న ఆర్ధిక మాంద్యంతో తన విధానంలోని బలహీనతను చైనా నాయకత్వం గుర్తించింది. దాన్ని సరిచేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగానే అంతర్గత వినిమయాన్ని పెంచి తగ్గిన ఎగుమతుల సమస్యను కొంత మేరకు అధిగమించింది. ఎంతగా తగ్గినా ఆరుశాతం పైగా ఆర్ధిక వృద్ది రేటు చైనాలో కొనసాగుతోంది. ఇప్పటికే దాని దగ్గర పెద్ద మొత్తంలో డాలర్లు పోగుపడి వున్నాయి కనుక తన ఆర్ధిక వ్యవస్ధను తిరిగి పరుగు పెట్టించేందుకు అవసరమైన వుద్దీపన పధకాలను చేపట్టగల సత్తా వుంది. అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఠలాయిస్తే ఇతర మార్కెట్లను సంపాదించగల శక్తి వుంది. మన దేశంలో బ్యాంకులు నిరర్ధక ఆస్తులతో, పెట్టుబడుల కొరతతో సతమతమౌతున్నాయి. అంతర్గత డిమాండ్‌ను పెంచటంతో పాటు వుపాధి కల్పనలో లోటు రాకుండా చూసుకొనేందుకు చైనాలో ప్రయివేటు రంగానికి రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఒక బ్యాంకును ఏర్పాటు చేస్తున్నారు. ధనికదేశాలతో వాణిజ్య పోరును ఎదుర్కొంటూనే సవ్యసాచిలా చైనా నాయకత్వం అనేక చర్యలు తీసుకొంటున్నది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఫలితం లేదు. మన విధానాల లోపాల్ని ముందుగా సవరించుకోవాలి. వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు మన సర్కార్‌ చెబుతున్న తప్పుడు లెక్కలను ప్రశ్నించిన వారిని దేశ ద్రోహులుగా చూస్తున్నారు. ఈ పూర్వరంగంలో అసలు మనం చెప్పే అభివృద్ది ఇతర లెక్కలను విశ్వసించి ప్రయివేటు పెట్టుబడిదారులు ముందుకు వస్తారా అన్నదే అసలు సమస్య !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా వత్తిడికి లొంగిన అపర జాతీయవాది నరేంద్రమోడీ !

25 Thursday Apr 2019

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

China, Donald Trump diktats, INDIA, iran, Iran Oil, Narendra Modi, US SANCTIONS

Image result for narendra modi surrendered to donald trump diktats

ఎం కోటేశ్వరరావు

ఇరాన్‌, అమెరికా మధ్య రెండు ఖండాలు, పన్నెండు వేల కిలోమీటర్ల దూరం వుంది. అమెరికాతో పోల్చితే ఇరాన్‌ సైనిక శక్తి లేదా ఆయుధాలు ఒక రోజు యుద్ధానికి కూడా సరిపోవు. అలాంటి దేశం తమకు, పశ్చిమాసియాకు ముప్పుగా పరిణమిస్తోందని, అందువలన మేనెల రెండవ తేదీ తరువాత దాని దగ్గర వున్న ముడి చమురును కొన్నవారి తాట తీస్తా అంటూ అమెరికా హెచ్చరించింది. ఆ మాత్రానికే మన దేశ పాలకులకు బట్టలు తడుస్తున్నాయి. అంతవరకు ఎందుకు లెండి, కొనుగోళ్లను బాగా తగ్గించాం, ఇక ముందు పూర్తిగా నిలిపివేస్తాం, ఇప్పటికే ప్రత్యామ్నాయం చూసుకొన్నాం అని చేతులేత్తేశాం. అంతమాట అన్నావు కదా ఇప్పుడు చెబుతున్నాం ఇంతకు ముందు కొన్నదాని కంటే ఎక్కువ కొనుగోలు చేస్తాం, ఏమి చేస్తావో చేసుకో చూస్తాం అని చైనా తాపీగా జవాబు చెప్పింది. హెచ్చరికలు అందుకున్న దేశాలలో జపాన్‌, దక్షిణ కొరియా ఎలాగూ అమెరికా అడుగులకు మడుగులత్తుతాయి, అటూ ఇటూ తేల్చుకోలేక టర్కీ మల్లగుల్లాలు పడుతోంది. అమెరికా ప్రకటన కొత్తదేమీ కాదు గతంలోనే చేసినప్పటికీ ఏదో మీరు మిత్రదేశాలు కనుక కొద్ది నెలలు ఆంక్షలను సడలిస్తున్నాం, ఆలోగా తేల్చుకోండి అని గతేడాది చివరిలో చెప్పింది. ఇప్పుడు తాజాగా మే రెండవ తేదీతో గడువు ముగుస్తుంది అని ప్రకటించేసింది.

రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. అది గల్లీ, ఢిల్లీ, వాషింగ్టన్‌ ఏదైనా కావచ్చు. అమెరికా చివరి క్షణంలో మరోసారి గడువు పెంచుతుందా? ఎందుకంటే మన దేశంతో సహా ప్రభావితమయ్యే దేశాలన్నీ బహిరంగంగానో, తడిక రాయబారాలో చేస్తున్నాయి. వారం రోజుల గడువుంది. అమెరికా అంటే డాలర్లు. ప్రతిదానిలో తనకెన్ని డాలర్ల లాభమా అని చూసుకుంటుంది. అందుకే ఏది జరిగినా ఆశ్చర్యం లేదు. కొద్ది రోజులుగా అమెరికన్ల ప్రకటనలను బట్టి ఇరాన్‌తో రానున్న రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరించనున్నదనే భావం కలుగుతోంది కనుక, దాని పూర్వరంగం, పర్యవసానాల గురించి చూద్దాం.

ఇరాన్‌ మీద ఎందుకీ ఆంక్షలు ?

ప్రపంచంలో ఏకీభావం లేని అంశాలలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధ ఒప్పందం(ఎన్‌పిటి) ఒకటి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాలకు ఈ ఒప్పందం వర్తించదు, మిగతా దేశాలు మాత్రం అణ్వస్త్రాలను తయారు చేయకూడదనేది అప్రజాస్వామిక, అవి లేని దేశాలను బెదిరించే వైఖరి తప్ప మరొకటి కాదు. అందుకే మన దేశం వంటివి ఆ ఒప్పందం మీద సంతకాలు చేయకుండా ఆత్మ రక్షణకు అణ్వాయుధాలను తయారు చేసుకొనే హక్కును అట్టిపెట్టుకున్నాయి. ఇరాన్‌ 1970లోనే ఆ ఒప్పందంపై సంతకం చేసింది. అలాంటి దేశాల అణుకార్యక్రమం శాంతియుత ప్రయోజనాలకు అనువైనదిగా వుండాలి తప్ప ఆయుధాలు తయారు చేయకూడదు. ఇరాన్‌ ఆ నిబంధనలను వుల్లంఘిస్తున్నదనే ఆరోపణల పూర్వరంగంలో చాలా సంవత్సరాల సంప్రదింపుల తరువాత 2015లో ఇరాన్‌-భద్రతా మండలిలోని శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌,ఫ్రాన్స్‌ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం ఇరాన్‌ అణుకేంద్రాలు, కార్యక్రమం అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ(ఐఏఇఏ) పర్యవేక్షణలోకి తేవాలి. దానికి ప్రతిగా అంతకు ముందు అమెరికన్లు స్దంభింపచేసిన ఇరాన్‌ ఆస్ధులను విడుదల చేయాలి, ఆంక్షలను ఎత్తివేయాలి. అయితే ఒప్పందంలోని మిగతా దేశాలతో నిమిత్తం లేకుండా కుంటి సాకులతో 2018లో అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అప్పటి నుంచి ఆంక్షలను మరింత కఠినతరం గావించేందుకు, అందుకు ఇతర దేశాలను కూడా తనకు మద్దతు ఇచ్చేందుకు వాటి మీద చమురు ఆయుధంతో వత్తిళ్లు, బెదిరింపులకు పూనుకుంది. ఇరాన్‌ చమురు సొమ్ముతో పశ్చిమాసియాలో గత నాలుగు దశాబ్దాలుగా అస్ధిర పరిస్ధితులకు కారణం అవుతోందని, అందువలన ఆ సొమ్ముదానికి అందకుండా చేయాలని అమెరికా చెబుతోంది. అదే సరైనది అనుకుంటే ప్రపంచవ్యాపితంగా అనేక ప్రాంతాలలో అస్ధిర పరిస్ధితులకు కారణం అమెరికా, మరి దాని మీద ప్రపంచమంతా ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదా ?

కమ్యూనిస్టు అంటే ప్రతిఘటన, ప్రజాస్వామ్యం అంటే లొంగిపోవటమా !

కొంత మంది దృష్టిలో చైనా కమ్యూనిస్టు నియంతృత్వదేశం. అమెరికా అపర ప్రజాస్వామిక దేశం. అయితే సదరు దేశ పాలకులు కమ్యూనిస్టు చైనాతో పాటు తోటి ప్రజాస్వామిక, మిత్ర దేశాలుగా పరిగణించే భారత్‌, జపాన్‌, దక్షిణ కొరియా, టర్కీ మీద బెదిరింపులకు పాల్పడుతున్నారు. కమ్యూనిస్టు చైనా మాత్రమే అవి మాదగ్గర పనిచేయవు అని చెప్పింది. వీర జాతీయవాదులమని చెప్పుకొనే బిజెపి నాయకత్వంలోని మన ప్రభుత్వం మాత్రం అమెరికా గుడ్లురుమగానే సలాం కొట్టి వేరే దేశాల నుంచి అధిక ధరలకు చమురు కొనుగోలుకు పూనుకుంది. ఎంతకు కొంటే అంత వసూలు చేయాలనే విధానం అమలవుతోంది గనుక డోనాల్డ్‌ ట్రంప్‌-నరేంద్రమోడీ కౌగిలింతలు, కలయికలకు ఎలాంటి అంతరాయం వుండదు, జేబుల్లో డబ్బులు పోగొట్టుకొనేది వినియోగదారులే. పెట్రోలు, డీజిలు ధరలు పెరిగినా, వాటి ప్రభావం పరోక్షంగా పడినా అనుభవించేంది జనాభాలో నూటికి 80శాతంగా వున్న బడుగు, బలహీనవర్గాలే అన్నది తెలిసిందే. ట్రంప్‌ సంతోషం లేదా అమెరికా రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాలకోసం పేద, మధ్యతరగతి వారిని బలిపెడతారా ? దీన్ని దేశభక్తి అనాలా లేక మరొకటని వర్ణించాలా?

ప్రపంచంలో మన దేశంతో సహా అనేక దేశాలలో అణ్వాయుధాలున్నాయన్నది బహిరంగ రహస్యం. ఒక వాదన ప్రకారం ఏ దేశంలో అణువిద్యుత్‌ కేంద్రం వుంటే ఆ దేశం దగ్గర అణ్వాయుధాలు తయారు చేసేందుకు అవసరమైన పరిజ్ఞానం, అణుశక్తి వున్నట్లే లెక్క. అణ్వాయుధాలున్న మిగతా దేశాలన్నీ తాముగా ముందుగా ప్రయోగించబోమని ప్రకటించాయి, మరోసారి ప్రయోగించబోమని అమెరికా ఇంతవరకు చెప్పలేదు. అందువలన దాని బెదిరింపులకు లేదా ఇతరత్రా ప్రమాదాలు వున్న ప్రతి దేశం అణ్వాయుధాలను సమకూర్చుకొనేందుకు ప్రయత్నిస్తోంది. మనం ఆపని చేసినపుడు మన మిత్ర దేశం అదే పని చేస్తే తప్పేమిటి అన్నది ఆలోచించాలి. అయినప్పటికీ తాను అణ్వాయుధాలు తయారు చేయనని ఇరాన్‌ ఒప్పందాన్ని అంగీకరించినా వుల్లంఘిస్తోందని ఆధారాలు లేని ఆరోపణలతో అమెరికా పేచీలకు దిగుతోంది. మనం ఎందుకు సమర్ధించాలి? ఒప్పందంలో భాగస్వాములైన మిగతా దేశాలకు లేని అభ్యంతరాలు అమెరికాకు ఎందుకు ?

ఇరాన్‌ మీద ఆంక్షలు అమలు జరిగితే పర్యవసానాలు ఏమిటి ?

ఒక దేశం మీద ఆంక్షలు అమలు జరిపినంత మాత్రాన అది అణ్యాయుధ కార్యక్రమాన్ని వదలివేస్తుందన్న గ్యారంటీ లేదు. ఇరాన్‌తో పోలిస్తే పాకిస్ధాన్‌ చాలా పేద దేశం. అదే అణ్వాయుధాలు,క్షిపణులు తయారు చేయగలిగినపడు ఇరాన్‌కు ఎందుకు సాధ్యం కాదు? గతంలో అణు పరీక్షలు జరిపినపుడు మన దేశం మీద కూడా అమెరికా ఆంక్షలు అమలు జరిపింది. అయినా ఖాతరు చేయకుండా ముందుకు పోయాము.క్షిపణులు తయారు చేశాము, వాటిని జయప్రదంగా ప్రయోగించాము. తాజాగా ఐదున్నరవేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించిన క్షిపణులను మధ్యలోనే కూల్చివేసే ఆయుధాన్ని కూడా జయప్రదంగా ప్రయోగించాము. అయితే దాన్నింకా ఎంతో మెరుగుపరచాల్సి వుందనుకోండి. అదేమీ పెద్ద సమస్య కాదు. ఇలాంటి మన దేశం మన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కించపరిచే విధంగా అమెరికా ఆంక్షలకు లంగిపోయి వేరే దేశాల నుంచి చమురు కొనుగోలు చేయటం ఏమిటి? మనం వెనిజులా నుంచి కూడా చమురు కొంటున్నాం. ఆదేశం మీద కూడా అమెరికా ఆంక్షలు పెట్టింది. దాన్నుంచి కూడా కొనుగోలు ఆపేయాల్సిందే అంటే ఆపటమేనా, రేపు సౌదీ అరేబియాతో తగదా వచ్చి దాన్నుంచి కూడా కొనుగోలు చేయవద్దంటే మన పరిస్ధితి ఏమిటి ? మన అవసరాలకు 80శాతం విదేశాల మీద ఆధారపడుతున్న స్ధితిలో చమురు దేశాలతో మిత్రత్వం నెరపాలి తప్ప అమెరికా కోసం శతృత్వాన్ని కొని తెచ్చుకోవటం ఎందుకు? అమెరికాకు లంగిపోవటమే మన విధానమా, దానితో సాధించేదేమిటి? మన యువతీ యువకులకు వీసాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటి వరకు మన ఎగుమతులకు ఇచ్చిన దిగుమతి పన్ను మినహాయింపులను రద్దు చేశారు.

వినియోగదారుల మీద పడే భారం ఎంత !

అమెరికా ఆడుతున్న రాజకీయాల కారణంగా అంతర్జాతీయ చమురు మార్కెట్‌ ప్రభావితం అవుతోంది. ధరలు పెరుగుతున్నాయి, 2018 నవంబరు రెండవ తేదీన భారత్‌ాఇరాన్‌ ప్రభుత్వాలు కుదుర్చుకున్న అవగాహన ప్రకారం అంతకు ముందున్న ఏర్పాట్ల ప్రకారం నలభై అయిదు శాతం రూపాయల్లో, 55శాతం యూరోల్లో ఇరాన్‌ చమురుకు చెల్లించాలన్న ఒప్పందాన్ని సవరించి సగం మొత్తం రూపాయల్లో చెల్లించేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ అవగానకు వచ్చిందని రాయిటర్స్‌ సంస్ధ తెలిపింది. గతంలో అమెరికా ఆంక్షలున్నప్పటికీ ఇరాన్‌కు మన దేశం వ్యవసాయ వుత్పత్తులు, ఆహారం, ఔషధాలు, వైద్యపరికరాలను ఎగుమతులు చేయవచ్చు. ఇప్పుడు రూపాయల్లో చెల్లించే అవకాశం లేదు. ఇరాన్‌కు వెళ్లే ఎగుమతులూ నిలిచిపోతాయి. మరోవైపు మార్కెట్లో డాలర్లను కొనుగోలు చేసి మొత్తం చమురు కొనుగోలు చేయాలి. ఇది మన విదేశీమారక నిల్వలు, రూపాయి విలువ మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. అన్నింటికీ మించి అమెరికా చర్యల వలన చమురు ధరలు పెరుగుతాయి. ఇరాన్‌ పట్ల కఠిన వైఖరి అవలంభించనుందనే అంచనాల పూర్వరంగంలో గత రెండు నెలలుగా చమురు ధరలు పెరుగుతున్నాయి. నవంబరు తరువాత అమెరికాలో ఒక గ్యాలన్‌ (3.78 లీటర్లు)కు మూడు డాలర్ల మేర ఇప్పుడే ధరలు పెరిగాయి. తొమ్మిది వారాలుగా గ్యాస్‌ ధరలు కూడా పెరుగుతూనే వున్నాయి.అక్కడి జనానికి ఆదాయం వుంది కనుక వారికి ఒక లెక్కకాదు. మనం దిగుమతి చేసుకొనే చమురు డిసెంబరు నెలలో సగటున ఒక పీపా ధర 57.77 డాలర్లు వుండగా మార్చినెలలో అది 66.74డాలర్లకు పెరిగింది. మార్చి ఎనిమిదవ తేదీన మన రూపాయల్లో 3,922 వుండగా ఇప్పుడు 4,620కి అటూఇటూగా వుంది. ఇంకా పెరగవచ్చని వార్తలు వస్తున్నాయి. పీపా ధర ఒక డాలరు పెరిగితే మన వినియోగదారుల మీద మనం దిగుమతి చేసుకొనే చమురు ఖర్చు పదకొండువేల కోట్ల రూపాయలు పెరుగుతుందని అంచనా.

మన ప్రత్యామ్నాయ వనరులంటే ఏమిటి ?

మే నెల రెండు నుంచి ఆంక్షల మీద మినహాయింపులు రద్దు చేస్తామని, వుల్లంఘించిన వారి మీద చర్యలు తీసుకుంటామని అమెరికా ప్రకటించగానే మన అధికారులు దాని వలన మనకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగాయని ప్రకటించారు. అమెరికా సంగతి తెలిసిన మన అధికారులు చమురు ధరలు తక్కువగా వున్నపుడు సాధారణంగా ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకున్నదానికంటే ఎక్కువగా దిగుమతులు చేసుకొని మంగళూరు తదితర చోట్ల పెద్ద ఎత్తున నిలవ చేశారు. అది కొద్ది రోజులు లేదా వారాలు వినియోగదారుల మీద భారం మోపకుండా చూడవచ్చు. అయితే ఇదంతా ఎన్నికలను దృష్టిలో వుంచుకొని ఆ సమయంలో ధరలు పెరగకుండా చూసేందుకు చేసిన ఏర్పాటన్నది కొందరి అభిప్రాయం. అందుకే మే 19వ తేదీ చివరి దశ పోలింగ్‌ ముగిసిన తరువాత పెద్ద మొత్తంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచుతారని, అప్పటి వరకు పెంచవద్దని మౌఖికంగా ఆదేశాలు జారీచేసినట్లు చెబుతున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదేమాదిరి జరిగింది. ఇదొక అంశమైతే ఇటీవలి వరకు అమెరికా తన అవసరాల కోసం చమురు దిగుమతి చేసుకొనేది. ఇప్పుడు తన భూభాగం మీద వున్న షేల్‌ ఆయిల్‌ను తీయటం ప్రారంభించిన తరువాత అది ఎగుమతి దేశంగా మారింది. దానిలో భాగంగానే అది మన దేశానికి గత రెండు సంవత్సరాలుగా చమురు ఎగుమతి చేస్తోంది. పశ్చిమాసియా చమురు నిల్వలు, వాణిజ్యం మీద పట్టుపెంచుకోవటం, క్రమంగా తన షేల్‌ అయిల్‌ వుత్పత్తి పెంచుతూ ఆమేరకు ప్రపంచ మార్కెట్‌ను ఆక్రమించుకోవాలన్నది దాని తాజా ఆలోచన. ఇరాన్‌పై ఆంక్షలు, ఇతర దేశాలను బెదిరించటం దీనిలో భాగమేనా అన్నది ఆలోచించాలి.తన చమురుకు మార్కెట్‌ను పెంచుకోవటంతో పాటు ధరలు ధరలు పెరగటం కూడా దానికి అవసరమే.ఇదే జరిగితే అన్నిదేశాలూ దానికి దాసోహం అనాల్సిందేనా ?

Related image

ఇరాన్‌ నిజంగా ఒప్పందాన్ని వుల్లంఘిస్తోందా ?

అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకే వుపయోగించాలన్న షరతులను ఇరాన్‌ వుల్లంఘిస్తోందా అన్న ప్రశ్నకు లేదని అంతర్జాతీయ అణుఇంధన సంస్ధ(ఐఎఇఏ) అధిపతి యుకియా అమానో చెప్పారు.అణు ఒప్పందానికి భిన్నంగా కార్యకలాపాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి రాలేదని, అయితే తాము జాగ్రత్తగా పర్యవేక్షించాలని అన్నారు. ఇరాక్‌ అధిపతి సద్దాం హుస్సేన్‌ మానవాళిని అంతం చేసేందుకు అవసరమైన పెద్ద మొత్తంలో మారణాయుధాలను గుట్టలుగా పేర్చాడని అమెరికా ప్రచారం చేయటమే కాదు, ఇరాక్‌పై దాడి చేసి సద్దాంను హత్య చేసిన విషయం కూడా తెలిసిందే. లిబియాలో కల్నల్‌ గడాఫీ మీద కూడా అలాంటి ఆరోపణలే చేసి హతమార్చిన విషయమూ తెలిసిందే. ఇప్పటికే ఆంక్షల కారణంగా 2018 మేనెల నుంచి పదిబిలియన్‌ డాలర్ల మేరకు ఇరాన్‌ నష్టపోయింది. దాని కరెన్సీ రియాల్‌ మూడింట రెండువంతుల విలువను కోల్పోయింది.అనేక బహుళజాతి గుత్త సంస్ధలు తమ పెట్టుబడులను వుపసంహరించుకున్నాయి. ఫిబ్రవరిలో వరదలు వచ్చినపుడు అవసరమైన ఔషధాలను కూడా సరఫరా చేయకుండా అమెరికన్లు ఆంక్షలు విధించారని ట్రంప్‌ తమ మీద జరుపుతున్నది ఆర్ధిక యుద్ధం కాదు, వుగ్రవాదం అని ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావేద్‌ జరీఫ్‌ విమర్శించారు.

మన దేశం అమెరికాతో మరొక దేశం దేనితో స్నేహాన్ని వదులు కోవాల్సిన అవసరం లేదు. అలాగే అమెరికా కోసం ఇతర దేశాలతో తగాదా తెచ్చుకోవనవసరమూ లేదు. ఒక దేశ వత్తిడికి లంగిపోవటమంటే అప్రదిష్టను మూటగట్టుకోవటమే. చివరికి అది స్వాతంత్య్రానికి ముప్పుతెచ్చినా ఆశ్చర్యం లేదు.అందుకే తస్మాత్‌ జాగ్రత్త !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d