• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: China

చైనాతో వాణిజ్యలోటు తగ్గిందా ? వాస్తవాలేమిటి ?

20 Saturday Apr 2019

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Politics

≈ Leave a comment

Tags

China, India’s Trade, India’s Trade Deficit, India’s Trade Deficit With China

Image result for India’s Trade Deficit With China 2019

ఎం కోటేశ్వరరావు

‘చైనాతో వాణిజ్య లోటును రూ.69,500 కోట్లు తగ్గించిన భారత్‌,చైనాకు భారత్‌ ఎగుమతులు 31శాతం పెరుగుదల, భారత్‌కు చైనా దిగుమతులు ఎనిమిదిశాతం తగ్గుదల,ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో అంతిమంగా చైనాతో లోటు తగ్గుతున్నది’ ఇది ‘ నేషన్‌ విత్‌ నమో మోడీ ‘ పేరుతో బిజెపి అబద్దాల ఫ్యాక్టరీ నుంచి వెలువడిన మరో వుత్పత్తి. ఆంగ్లంలో వున్న ఈ పోస్టు సామాజిక మాధ్యమంలో గత కొద్ది రోజులుగా తిరుగుతున్నది.

దీనిలో రెండు అంశాలున్నాయి. ఒకటి బిజెపి వారు నిజంగా దీన్ని నమ్మితే వెర్రి పుల్లయ్యల కింద జమకట్టాలి. లేదూ వాస్తవాలన్నీ తెలిసి ఇలా ప్రచారం చేస్తున్నారంటే జనాన్ని మోసం చేసే ఘరానా పెద్దలు అయినా అయివుండాలి. బిజెపి వారు వెర్రి పుల్లయ్యలైతే కాదు. అసలు వాస్తవాలేమిటో ఇక్కడ చర్చిద్దాం, అంతిమంగా వారేమిటో పాఠకులే నిర్ణయించుకోవచ్చు.

కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం 2007-08 నుంచి 2016-17 మధ్య చైనాతో మన దేశ వాణిజ్య లోటు 16బిలియన్ల నుంచి 51బిలియన్‌ డాలర్లకు పెరిగింది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో అంటే 2018-19లో వుభయ దేశాల మధ్య వాణిజ్యలోటు పదిబిలియన్‌ డాలర్ల మేరకు తగ్గి 53బిలియన్ల వద్ద వుంది. నమో మోడీ ప్రచారంలో ఈ పదిబిలియన్‌ డాలర్లనే రూపాయల్లోకి మార్చి రూ 69,500 కోట్ల మేరకు తగ్గించినట్లు, ఇదొక విజయమన్నట్లు పేర్కొన్నారు. దీని అర్ధం ఏమిటి మన వాణిజ్యలోటు 63బిలియన్లకు పెరిగినదానిలో పది బిలియన్లు తగ్గించారు.

Image result for India’s Trade Deficit With China 2019

2014 మార్చి నాటికి అంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సమయానికి చైనాతో మన వాణిజ్యలోటు 36.2 బిలియన్‌ డాలర్లు. దీని కంటే తగ్గించటమో కనీసం అంతకు మించి పెరగకుండా వుండటమో చేస్తే నరేంద్రమోడీ ఘనుడని, ఆయన దగ్గర అల్లావుద్దీన్‌ అద్భుత దీపం వుందని అనుకోవచ్చు. వ్యాపార లావాదేవీలన్న తరువాత ఒక రోజు పెరగవచ్చు, మరో రోజు తరగవచ్చు. అంతిమంగా ఒక ఏడాది కాలంలో లేదా ఒక ప్రధాని పదవీకాలం ఐదేండ్లలో నష్టమా, లాభమా అని ఎవరైనా చూడాలి. ఆ రీత్యా చూసినపుడు ఐదేండ్లలో మన లోటు 36.2బిలియన్ల నుంచి 53కు పెరిగింది. 2008-09లో చైనాకు మన ఎగుమతులు 9.4 బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులుండగా 2011-12 నాటికి 18.1 బిలియన్లకు పెరిగింది. తరువాత2015-16 నాటికి తొమ్మిది, 2016-17 నాటికి 10.2కు, 2018-19లో ఏప్రిల్‌-నవంబరు మాసాలకు గాను 11.1బిలియన్‌ డాలర్లకు చేరాయి. 2018 ఆర్ధిక సంవత్సరంలో ఎగుమతులు 13.3 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. బిజెపి ప్రచార యంత్రాంగం 31శాతం ఎగుమతుల పెరుగుదల అన్నది దీని గురించే. ఇదే కాలంలో చైనా నుంచి తగ్గింది ఎనిమిదిశాతం కాదు,24.64 శాతం పెరిగి 76.38 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అంటే మన వాణిజ్య లోటు 63 బిలియన్ల కంటే ఎక్కువగా వుందని ఏ ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని అడిగినా చెపుతారు. ఆ మొత్తం ఈఏడాది మార్చినాటికి 53బిలియన్‌ డాలర్లకు తగ్గింది కనుక ఆ ఘనత మోడీ సర్కారుదే అని ప్రచారం చేస్తున్నారు. ఇక మార్చినెలతో ముగిసిన వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో పైన పేర్కొన్నట్లు ఏప్రిల్‌-నవంబరు మధ్య మన ఎగుమతులు 11.1 బిలియన్‌ డాలర్లు అయితే ఇదే సమయంలో చైనా నుంచి 2.66శాతం తగ్గి 48.35 బిలియన్‌ డాలర్లుగా వున్నాయి. (బిజినెస్‌ లైన్‌ జనవరి 4, 2019).

ఎకనమిక్‌ టైమ్స్‌ (జనవరి 22,2019) పేర్కొన్నదానిని బట్టి చైనా అధికారిక సమాచారం ప్రకారం 2018లో మన దేశం నుంచి చైనాకు జరిగిన ఎగుమతుల విలువ 18.84 బిలియన్‌ డాలర్లు. అంతకు ముందుతో పోల్చితే 17శాతం పెరిగింది. రెండు దేశాల మధ్య లావాదేవీల్లో మన వాణిజ్యలోటు ఇదే కాలంలో 51.72 బిలియన్ల నుంచి 57.86 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. మొత్తం మీద నరేంద్రమోడీది గోల్డెన్‌ లెగ్గా ఐరన్‌ లెగ్గా ? వాణిజ్య లోటు మోడీ అధికారానికి వచ్చిన సమయంలో వున్న 36.2 బిలియన్లకు తగ్గేదెపుడు ? అసలు సమస్య ఇది కదా !

చైనాకు మన ఎగుమతులు పెరగటం సంతోషించాల్సిందే.ఆ పెరుగుదలకు కారణం బిజెపి వారు ప్రచారం చేస్తున్నట్లు డ్రాగన్‌ మెడలు వంచి సాధించటం కాదు. అయితే దిగుమతులు పెంచాలని వత్తిడి చేస్తున్నది నిజం. అంతర్జాతీయ రాజకీయాల్లో భాగంగా చైనా సడలించిన నిబంధనలే ప్రధాన కారణం. ఇదే సమయంలో చైనా నుంచి మన దిగుమతులు తగ్గాయా ? దీని కధేమిటో చూద్దాం. 2019 ఏప్రిల్‌ 17వ తేదీన లైవ్‌ మింట్‌ పత్రిక వ్యాఖ్యాత ఒక విశ్లేషణ చేశారు. ఇటీవల చైనా తన వుత్పత్తులు కొన్నింటిని తన రేవుల నుంచి గాక హాంకాంగ్‌ రేవు ద్వారా ఎగుమతులు చేయటం ప్రారంభించిందని, చైనా-హాంకాంగ్‌ల నుంచి మన దేశం చేసుకున్న దిగుమతుల విలువను చూస్తే వాణిజ్యలోటు తగ్గిందేమీ లేదని పేర్కొన్నారు. ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక ఏప్రిల్‌ 15వ తేదీన మరొక కధనాన్ని అందించింది. దానిలో మింట్‌ పత్రిక వ్యాఖ్యాతను వుటంకించింది. (సాధారణంగా ఇలా జరగదు) దాని ఆధారంగా తాను సేకరించిన సరికొత్త సమాచారాన్ని పాఠకులకు అందించి మింట్‌ కథనాన్ని నిర్ధారించింది.

Related image

పెరుగుతున్న వాణిజ్యలోటును తగ్గించటానికి చర్యలు తీసుకోవాలని భారత్‌ నుంచి వస్తున్న వత్తిడిని తప్పించుకొనేందుకు చైనా కొత్త ఎత్తుగడలకు పాల్పడిందని పేర్కొన్నారు.’ వాణిజ్య మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం 2018లో చైనాతో వాణిజ్యలోటు 59.3 నుంచి 57.4 బిలియన్లకు తగ్గింది. ఇదే సమయంలో భారత్‌తో హాంకాంగ్‌ వాణిజ్యలోటు భారత్‌కు ఎగుమతులు పెరిగి 2.7బిలియన్‌ డాలర్లకు చేరింది.భారత్‌తో చైనా-హాంకాంగ్‌ వాణిజ్యాన్ని కలిపి చూస్తే భారత్‌లోటు 2018లో అంతకు ముందున్న 55.4 బిలియన్ల నుంచి 60.1 బిలియన్లకు పెరిగింది.2018లో చైనాకు భారత్‌ ఎగుమతులు 30.4శాతం పెరిగి 16.5 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇదే సమయంలో హాంకాంగ్‌కు భారత ఎగుమతులు 15 నుంచి 13.3 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. మొత్తంగా 900మిలియన్‌ డాలర్లు భారత్‌కు నష్టం. చైనా నుంచి భారత్‌ దిగుమతి చేసుకొనే సెల్‌ఫోన్‌ విడి భాగాలు 2018లో 34.1 శాతం తగ్గాయి. అయితే అదే విడిభాగాల దిగుమతి హాంకాంగ్‌ నుంచి 728శాతం పెరిగాయి.లాన్‌ అడాప్టర్లు చైనా నుంచి 32శాతం తగ్గితే హాంకాంగ్‌ నుంచి 173శాతం పెరిగాయి. ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్లను దిగుమతి చేసుకోవటం చైనా నుంచి పెరిగింది, అయితే హాంకాంగ్‌ నుంచి 6,017శాతం పెరిగాయి. వాణిజ్యమంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం 2017లో వుభయ దేశాల వాణిజ్య లావాదేవీల విలువ 84.44 బిలియన్‌ డాలర్లు. దీనిలో భారత్‌ లోటు 52 బి.డాలర్లు. 2018 ఆర్ధిక సంవత్సరంలో భారత్‌ ఎగుమతులు 31శాతం పెరిగి 13.3బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ఇదే సమయంలో దిగుమతులు 24.64శాతం పెరిగి లావాదేవీల మొత్తం 76.38 బి.డాలర్లుగా వుంది. వాణిజ్యలోటును 63 బిలియన్‌ డాలర్లకు చేరింది.’ అని ఎకనమిక్‌ టైమ్స్‌ పేర్కొన్నది.

మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ నెహ్రూ అనుసరించిన విధానాలే కారణమంటూ తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు బిజెపి పెద్ద ఎత్తున గోబెల్స్‌ ప్రచారం చేస్తోంది. చైనాతో సంబంధాల విషయానికి వస్తే బిజెపి దాని అనుబంధ లేద సోదర సంస్ధలన్నీ నిత్యం విషం చిమ్ముతుంటాయి. చైనా వస్తు బహిష్కరణలకు పిలుపులనిస్తుంటాయి. అవి ఎంతగా వ్యతిరేకిస్తున్నాయో అంతకంటే ఎక్కువగా వాటికి నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వ ఆధ్వర్యంలో దిగుమతులు పెరుగుతున్నాయి. మేకిన్‌ ఇండియా అంటూ చైనా ఇతర దేశాలతో పోటీ బడి ఎగుమతులు చేయాలని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు ఏమైనట్లు ? ఆ చైనా నుంచే దిగుమతులను ఏటేటా ఎందుకు పెంచుతున్నట్లు ? ఎందుకీ వంచన ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నెహ్రూపై అరుణ్‌ జెట్లీ వక్రీకరణలు – వాస్తవాలు !

15 Friday Mar 2019

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

China, Jaitley blames Nehru, original sinner, UNSC Seat

ఎం కోటేశ్వరరావు

భీష్ముడు మరణించిన తరువాత కౌరవ సేనాధిపతిగా ద్రోణుడు వచ్చాడు.కుమారుడు అశ్వద్ధామ అంటే ద్రోణుడికి చచ్చేంత ప్రేమ. ద్రోణుడిని ఓడించటం కష్టమని తెలిసిన శ్రీకృష్ణుడు అందుకు ఒక కుయుక్తిని ప్రయోగించాడు అదే ద్రోణుడిని నిర్వీర్యం చేయటం. అందుకు గాను అశ్వద్ధామ అనే పేరున్న ఏనుగును చంపమని భీముడికి చెప్పాడు. భీముడు ఆపని చేసి తాను అశ్వద్ధామను చంపినట్లు యుద్ధరంగంలో ప్రకటించాడు. దానిని నమ్మని ద్రోణుడు అబద్దం చెప్పడని పేరున్న ధర్మరాజు  దగ్గరకు వెళ్లి అశ్వద్ధామను చంపామని చెప్పారు నిజమేనా అని అడిగాడు. దానికి అవును అశ్వద్ధామను చంపారు అని బిగ్గరగా చెప్పి అయితే అది మనిషో ఏనుగో నాకు తెలియదు అని వినిపించీ వినిపించకుండా గొణిగాడు. దాంతో ద్రోణుడు కుప్పకూలాడు. తరువాత పాండవులు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశంలో లోక్‌సభ ఎన్నికల పోరు ప్రారంభమైంది. దీన్ని గెలిచేందుకు రాజకీయ పార్టీలు వేయని ఎత్తులు, చేయని మోసాలు లేవు. వాటిలో ఒకటి ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ గురువారం నాడు చేసిన పెద్ద వక్రీకరణ. ఇలాంటి సమయాలలో ఒక అబద్దం, వక్రీకరణను వదిలితే అది రేసు గుర్రంలా పరుగుతీస్తుంది, నిజం తాబేలు మాదిరి వేగంతో కూడా జనం దగ్గరకు వెళ్లదు.

జైషే మహమ్మద్‌ అధిపతి మసూద్‌ అజహర్‌ను ప్రపంచ వుగ్రవాదిగా ప్రకటించాలన్న తీర్మానాన్ని భద్రతామండలిలో చైనా  వీటో చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామం గురించి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానిస్తూ చైనాకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్రమోడీ నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదని, మోడీ బలహీనుడు, చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ అంటే భయం అన్నారు.  దాన్ని తిప్పి కొడుతూ కాశ్మీర్‌, చైనాల మీద అసలు పాపం చేసింది జవహర్‌లాల్‌ నెహ్రూ అని, భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత స్ధానం కల్పిస్తామంటే చైనా వంటి గొప్పదేశానికి ఇవ్వాలని నెహ్రూ చెప్పారని, అదే విషయాన్ని 1955లో ముఖ్య మంత్రులకు లేఖలో కూడా రాశారని జెట్లీ ఎదురుదాడి చేశారు. భద్రతా మండలిలో ఆంక్షల కమిటి ప్రతిపాదించిన 1267వ తీర్మాన ఫలితంతో ఆశాభంగం చెందామని మన విదేశాంగశాఖ తన తొలి స్పందనలో వ్యాఖ్యానించింది. తీర్మానాన్ని ప్రతిపాదించిన వారికి, మద్దతు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపింది. తీర్మానాన్ని వీటో చేసిన చైనా గురించి ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. చైనా ఈ తీర్మానాన్ని వీటో చేయటం ఇదే మొదటిసారి కాదు, ఇంతకు ముందు మూడుసార్లు అదే చేసింది. భారత్‌-పాకిస్ధాన్‌ విబేధాలు పరిష్కారం కావటానికి ఇలాంటి తీర్మానాలు దోహదం చేయవని, మసూద్‌ను వుగ్రవాదిగా ప్రకటించేందుకు తగినన్ని ఆధారాలు లేవని గతంలోనూ ఈ సందర్భంగానూ చైనా పేర్కొన్నది. చైనా వైఖరి గురించి తెలిసినప్పటికీ ఈ ఐదు సంవత్సరాలలో ఆ దేశంతో మన ఆర్ధిక, ప్రభుత్వ సంబంధాలు ఇంకా బలపడ్డాయి, వాణిజ్యం పెరిగింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ రిమోట్‌ కంట్రోలర్‌ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధలు ఏదో ఒక అవకాశాన్ని సాకుగా చూపి చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపునిస్తూనే వున్నాయి, అవి ఎంత వ్యతిరేకత వ్యక్తం చేస్తే అంతగా వాణిజ్యం పెరుగుతోందన్నది చేదు నిజం.

2013ా14లో చైనా నుంచి మన దిగుమతులు 51బిలియన్‌ డాలర్ల విలువ  కలవి కాగా ఎగుమతులు 14.82బిలియన్ల్‌, మన వాణిజ్యలోటు 36బిలియన్లు వుంది.2017ా18 తొలి తొమ్మిది నెలల కాలంలో మన ఎగుమతులు పది బిలియన్‌డాలర్లు కాగా చైనా నుంచి దిగుమతులు ఇదే కాలానికి 63బిలియన్‌ డాలర్లకు, వాణిజ్య లోటు 53బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ కాలంలోనే చైనా మూడుసార్లు భద్రతామండలిలో మసూద్‌ టెర్రరిస్టు తీర్మానాన్ని వీటో చేసింది. దీన్ని బట్టి నరేంద్రమోడీ సర్కార్‌ రాజకీయాలను, ఆర్ధిక లావాదేవీలను విడివిడిగా చూస్తున్నదన్నది స్పష్టం. రాజకీయంగా చైనాను ఏమీ అనలేని స్ధితిలో వున్న అరుణ్‌ జెట్లీ తన అక్కసును నెహ్రూ మీద తీర్చుకున్నారని, బిజెపి ప్రచార కమిటీ నేతగా  తమ క్యాడర్‌కు ఒక అస్త్రాన్ని అందించారన్నది స్పష్టం. అయితే ప్రతి అస్త్రం నిర్ధేశిత లక్ష్యాన్ని తాకుతుందా అంటే అనుమానమే. ఈ పూర్వరంగంలో నెహ్రూ గురించి చేసిన వాఖ్యల గురించి చూద్దాం.

మొదటిది. జైట్లీ చేసిన వక్రీకరణ కొత్తది కాదు. వాస్తవమూ కాదు. వివేక్‌ అగ్నిహోత్రి అనే ఒక సినిమా రంగానికి చెందిన కాషాయదళ వ్యక్తి 1965 యుద్ధంలో ఎదురుదాడి చేద్దామన్న తన మిత్రుడైన సైనికదళాల ప్రధాన అధికారి జనరల్‌ చౌదరిని రాజీనామా చేస్తావా తొలగించమంటావా అని నాటి ప్రధాని నెహ్రూ వత్తిడి చేశారని కొద్ది రోజుల క్రితం ట్వీట్‌ చేశాడు. జనరల్‌ చౌదరి 1966లో పదవీ విరమణ చేసిన ఏడు సంవత్సరా తరువాత పుట్టిన అగ్నిహోత్రి సదరు అధికారి తన స్నేహితుడని చెప్పుకుంటే కాషాయ మరుగుజ్జులు ఆ ట్వీట్‌ను గుడ్డిగా షేర్‌ చేశారు. అన్నింటి కంటే పచ్చి నిజం ఏమంటే జవహర్‌లాల్‌ నెహ్రూ 1964మేనెలలో మరణించారన్న కనీస పరిజ్ఞానం కూడా అతనికి లేదు. 1965 యుద్ద సమయంలో ప్రధానిగా లాల్‌బహదూర్‌ శాస్త్రి వున్నారు.

భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇస్తామంటే మాకు వద్దు చైనాకు ఇవ్వండి అని నెహ్రూ చెప్పారన్న అరుణ్‌జెట్లీ ట్వీట్‌ కూడా ఇలాంటిదే.  రెండవ ప్రపంచ యుద్ధం నాటికి చైనా ఒక స్వతంత్ర రాజ్యం. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లాంగ్‌ మార్చ్‌ పురోగతిలో వుంది. అనేక విజయాలను కమ్యూనిస్టులు సాధించారు. కొమింటాంగ్‌ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌ కూటమికి వ్యతిరేకంగా మిత్రరాజ్య కూటమిలో భాగంగా పాల్గన్నది.1939లో రెండవ ప్రపంచ యుద్దం ప్రారంభమైంది. దాన్ని నివారించటంలో నానాజాతి సమితి విఫలమైంది. ఈ పూర్వరంగంలో కొత్త ప్రపంచ వ్యవస్ధను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన అమెరికా విదేశాంగ శాఖ ఐక్యరాజ్యసమితి ఏర్పాటుకు 1941డిసెంబరు చివరిలో ఒక ముసాయిదాను తయారు చేస్తే దానికి సోవియట్‌ యూనియన్‌ కొన్ని సవరణలు చేసింది. అమెరికా, సోవియట్‌ యూనియన్‌, బ్రిటన్‌, చైనాలు దాని మీద సంతకాలు చేశాయి. ఆ సమయంలో ఫ్రాన్స్‌ హిట్లర్‌ మూకల దురాక్రమణలో వుంది. 1945 అక్టోబరు 24 ఐక్యరాజ్యసమితి వునికిలోకి వచ్చింది. ఆ తరువాత ఫ్రాన్స్‌ రిపబ్లిక్‌గా ఏర్పడిన తరువాత భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. రెండవ ప్రపంచ యుద్దంలో విజేతలుగా వున్నందున ఐదు దేశాలకు శాశ్వత భద్రతా మండలి సభ్యత్వంతో పాటు వీటో హక్కు కల్పించారు. తరువాత అవి అణుశక్తి దేశాలుగా కూడా మారాయి. అందువలన భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇస్తామంటే వద్దు చైనాకు ఇవ్వండి అని నెహ్రూ చెప్పారంటే జనం చెవుల్లో పూలు పెట్టటమే. అసలు ఆ సమయానికి మనకు స్వాతంత్య్రం రాలేదు, నెహ్రూ అసలు ప్రధాని కాలేదు.

అయితే నెహ్రూ మీద ఇలాంటి ప్రచారం ఎందుకు జరిగినట్లు? నిప్పులేకుండా పొగరాదు కదా అని ఎవరైనా అనుకోవచ్చు.దీని గురించి జరిగిన ప్రచారాల్లో ఎలాంటి వాస్తవం లేదని 1955లోనే పార్లమెంటులో ఒక ప్రశ్నకు నెహ్రూ సమాధానం చెప్పారు. అయినా అరుణ్‌ జెట్లీ అదే ఏడాది ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో నెహ్రూ స్వయంగా అంగీకరించారని ఆరోపించారు. దీని గురించి 2002లోనే ప్రముఖ పరిశోధకుడు ఏజి నూరాని తన విశ్లేషణను ప్రచురించి వాస్తవాలను తెలియచేశారు. అయినా నెహ్రూ వ్యతిరేక శక్తులు తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తూనే వున్నాయి. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందన్న గోబెల్స్‌ వారుసులు తప్ప మరొకరు వీటిని నమ్మరు. 2015లో ఆంటన్‌ హార్డన్‌ అనే ఒక పరిశోధకుడు రాసిన వ్యాసాన్ని విల్సన్‌ సెంటర్‌ ప్రచురించింది. దాన్ని 2016 ఆగస్టులో వైర్‌ వెబ్‌సైట్‌ తిరిగి ప్రచురించింది. ఐక్యరాజ్య సమితి ఏర్పాటైన రెండు సంవత్సరాలకు మనకు స్వాతంత్య్రం వచ్చింది, మూడు సంవత్సరాలకు చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. ఒక తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌(గతంలో ఫార్మోజా దీవి)కు కొమింటాంగ్‌ సేనలు చేరి అక్కడి నుంచి తామే చైనా అధికారంలో వున్నట్లు ప్రకటించుకున్నాయి. అప్పటికే వారి ప్రతినిధులు ఐక్యరాజ్య సమితిలో వున్నారు. అమెరికా వత్తిడితో దాన్నే అసలైన చైనాగా పరిగణించటం మినహా సోవియట్‌తో సహా మిగతా దేశాలకు మరొక మార్గం లేకపోయింది. భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాల సంఖ్యను విస్తరించాలంటే ఏకాభిప్రాయం అవసరం. కమ్యూనిస్టు చైనానే అసలైనా చైనా గుర్తించాలని సోవియట్‌ కోరినా అమెరికన్లు వీటో చేస్తే చెల్లదు. ఆ పరిస్ధితి 1971వరకు కొనసాగింది. తరువాత అమెరికా చొరవతో తైవాన్‌కు బదులు కమ్యూ నిస్టు చైనాను గుర్తించారు.

ఆ మధ్యకాలంలో జరిగిన రాజకీయాన్ని అర్ధం చేసుకుంటే తప్ప నెహ్రూ ఏమి చేశారన్నది మనకు అవగతం కాదు. మన దేశం స్వాతంత్య్రం పొందిన తరువాత తమ రాజకీయ పలుకుబడి కిందకు తెచ్చుకొనేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది. బెదిరించి లంగతీసుకోవాలన్న  దాని తప్పుడు ఎత్తుగడలు మన దేశాన్ని సోవియట్‌వైపు నెట్టాయి. 1948లో చైనాలో అధికారానికి వచ్చిన కమ్యూ నిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అమెరికా, బ్రిటన్‌ తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యాయి. అంతర్గతంగా తిరుగుబాట్లను రెచ్చగొట్టటం, బర్మా (ప్రస్తుత మయన్మార్‌) కేంద్రంగా కొమింటాంగ్‌ సైనికులు, ఇతర విద్రోహకులకు ఆయుధాలిచ్చి చైనాలో దాడులు చేయించటం వంటి వన్నీ దాదాపు పది సంవత్సరాలు సాగాయి. అప్పటికిగానీ మావో నాయకత్వంలోని కమ్యూనిస్టులు నిలదొక్కుకోలేకపోయారు.టిబెట్‌లోని 14వ దలైలామా ప్రభుత్వంతో ఒక అవగాహనకు వచ్చిన చైనా ప్రభుత్వం టిబెట్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించేందుకు అంగీకరించింది. ఒప్పందం మీద సంతకం చేసిన తరువాత సామ్రాజ్యవాదుల కుట్రల కారణంగా 1959లో తిరుగుబాటు చేసిన దలైలామా స్వాతంత్య్ర ప్రకటన చేశాడు. దాన్ని చైనా అణచివేయటంతో అరుణాచల్‌ ప్రదేశ్‌ గుండా పారి వచ్చి మన దేశంలో ఆశ్రయం పొంది ప్రవాస ప్ర భుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించాడు. ఇది ఒకటైతే కమ్యూనిస్టులు అధికారాన్ని సుస్ధిరం చేసుకున్న తరువాత ఎప్పటికైనా కమ్యూ నిస్టు చైనాను భద్రతా మండలిలో శాశ్వత సభ్యరాజ్యంగా గుర్తించక తప్పదని అమెరికన్లకు మొదటి నుంచి ఒక అంచనా వుంది. అయితే దాన్ని బయటపడనివ్వకుండా రాజకీయం చేశారు.

చైనా తరువాత అతి పెద్ద దేశమైన భారత్‌కు  భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సి వుందంటూ చైనాను సాధారణ అసెంబ్లీకి పరిమితం చేసి ఐదవ శాశ్వత సభ్యురాలిగా భారత్‌కు మద్దతు ఇస్తామని అమెరికన్లు నెహ్రూకు రాయబేరం పంపారు. కమ్యూ నిస్టు చైనాను దెబ్బతీయటం, భారత్‌ను తమ శిబిరంలోకి చేర్చుకోవటం అనే ఒకే దెబ్బకు రెండు పిట్టలనే ఎత్తుగడ దీనిలో వుంది. తమకు శాశ్వత సభ్యదేశ హోదా అర్హత వుందని, అయితే చైనాను పక్కన పెట్టి తమకు దాన్ని ఇవ్వటం అంటే చైనా-తమ మధ్య విబేధాలను పెంచే ఎత్తుగడ తప్ప వేరు కాదని అందువలన దాన్ని మినహాయించి తమకు ఆ స్ధానాన్ని ఇస్తామనే ప్రతిపాదన తమకు అంగీకారం కాదని నెహ్రూ సర్కార్‌ నాడు అమెరికాకు చెప్పింది. ఇదే విషయాలను నెహ్రూ తన లేఖలో రాశారు. జెట్లీ వంటి వారు ఆ లేఖను పట్టుకొని రామునితోక పివరుండు ఇట్లనియే అన్నట్లు పదే పదే ప్రచారం చేస్తున్నారు. కాశ్మీర్‌ విషయంలోనూ అదే చేస్తున్నారు. నిజానికి భద్రతా మండలిని విస్తరించాలని, దానిలో వున్న ప్రజాస్వామ్య వ్యతిరేక అంశాలను సంస్కరించాలని అనేక మంది ఎప్పటి నుంచో కోరుతున్నారు. కానీ అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్సులు తమ ప్రయోజనాలు, అజెండాకు అనుగుణంగా ఆయా దేశాలను రెచ్చగొట్టటం, తాము ప్రతిపాదిస్తుంటే ఇతరులు అడ్డుకుంటున్నారని సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. అది మసూద్‌ అజార్‌ కావచ్చు మరొకటి కావచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాలుగు దశాబ్దాల చైనా సంస్కరణలు 2 : అమెరికాకు 69 ఏండ్లు , చైనాలో 18కే సాధ్యమైంది !

23 Sunday Dec 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

China, Forty years of China Reforms, Xi Jinping

Related image

ఎం కోటేశ్వరరావు

1929 మాంద్యం ప్రారంభంలో అమెరికా వాస్తవ జిడిపి 1.109 లక్షల కోట్ల డాలర్లు కాగా అది పన్నెండు లక్షల కోట్ల డాలర్లకు చేరేందుకు 69 ఏండ్లు తీసుకుంది. 2017లో 18లక్షల కోట్ల డాలర్లకు చేరటానికి చేరటానికి 88 సంవత్సరాలు పట్టింది. చైనా జిడిపి 1999లో 1.09లక్షల కోట్ల డాలర్లుగా వున్నది 2017లో 12లక్షల కోట్ల డాలర్లకు చేరటానికి కేవలం 18 సంవత్సరాలే పట్టింది. అమెరికా ఆర్ధిక చరిత్రలో కనిపించే అనేక ఎగుడుదిగుడులు అది ఎదుర్కొన్న సమస్యలకు నిదర్శనం, అటువంటి పరిస్ధితి చైనా విషయంలో కనపడదు.1952-2017 మధ్య అమెరికాలో తొమ్మిది సంవత్సరాలు అంతకు ముందున్న జిడిపి కంటే తగ్గగా చైనాలో అటువంటి పరిస్ధితి ఐదు సంవత్సరాలలోనే కనిపించింది. 1978 సంస్కరణల ప్రారంభం తరువాత తిరుగులేకుండా సాగింది. అదే అమెరికాలో 1978 తరువాత ఐదు సంవత్సరాలు తరుగుదల వుంది. వీటిని మొత్తంగా చూసినపుడు అభివృద్ధిరేటులో కొద్ది హెచ్చు తగ్గులు వుండవచ్చుగానీ సంస్కరణల తరువాత చైనా ఎలాంటి పెట్టుబడిదారీ సంక్షోభాలను ఎదుర్కోలేదు.

ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ వునికిలోకి వచ్చి కొందరి అవగాహన ప్రకారం ఐదు వందల సంవత్సరాలు దాటింది. అమెరికాలో 1817లో న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ ప్రారంభాన్ని అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రారంభంగా తీసుకుంటే దానికి రెండువందల సంవత్సరాలు నిండినట్లు. అంత అనుభవం వున్న అమెరికాను, సంస్కరణలు ప్రారంభించిన 50సంవత్సరాల నాటికి జిడిపిలో చైనా అధిగమించగలదని అంచనా వేస్తున్నారు. అయితే జనాభా రీత్యా తలసరి ఆదాయంలో మరికొన్ని దశాబ్దాల పాటు అమెరికాయే అగ్రస్ధానంలో కొనసాగుతుంది. రెండు వందల సంవత్సరాల సుదీర్ఘపెట్టుబడిదారీ విధాన అనుభం తరువాత కూడా ఇంకా అమెరికాలో స్వంత ఇల్లులేని వారు, అద్దె భరించలేక కారుల్లో కాపురాలు చేసే వారున్నారంటే, 140 కోట్ల జనాభా వున్న చైనాలో జనానికి కనీస ప్రాధమిక వసతులు కల్పించటానికి ఎంత వ్యవధి కావాలో చెప్పనవసరం లేదు. కొందరు చెబుతున్నట్లు చైనాలో నిజంగా పెట్టుబడిదారీ విధానమే అమలు జరిపితే ఆ వ్యవస్ధకు సహజంగా వుండే జబ్బులన్నీ రావాలి, రావటం లేదు. సంక్షోభాలు లేకుండా శరవేగంగా అభివృద్ధి చెందటం పెట్టుబడిదారీ వ్యవస్ధ లక్షణం కాదు. అయితే చైనాలో పెట్టుబడిదారీ విధాన లక్షణాలు లేవా అంటే వున్నాయి.స్టాక్‌ ఎక్సేంజ్‌, ప్రయివేటు పెట్టుబడులు, లాభాలు తీసుకోవటం, ప్రయివేటు కంపెనీలను విస్తరించుకోవటం, బిలియనీర్ల పెరుగుదల వంటివి దాని లక్షణాలే. బలమైన పెట్టుబడిదారులు పెరిగిన తరువాత వారు సోషలిస్టు వ్యవస్దను అనుమతిస్తారా అని కొంత మంది వ్యక్తం చేస్తున్న సందేహాలను తీర్చటం అంతసులభమూ కాదు. తమ జనాభా అవసరాలు తీరాలంటే కొంతకాలం ఆ విధమైన విధానాలు తప్పవని చైనా కమ్యూనిస్టు పార్టీ చెబుతోంది. అధికారికంగానే అది ఒకే దేశం-రెండు వ్యవస్ధల విధానాన్ని 2050వరకు అనుమతిస్తామని ఎన్నడో చెప్పింది. సోషలిజం అంటే దారిద్య్రాన్ని పంచుకోవటం కాదు. పెట్టుబడిదారులను ఆహ్వానించటం, అనుమతించే వైఖరి మీద సందేహాలు కొత్తగా తలెత్తినవి కాదు. నాలుగు దశాబ్దాల నాడే వాటి గురించి చైనా నాయకత్వం చెప్పింది. గాలి కోసం కిటికీలు తెరిచినపుడు చెడుగాలితో పాటు, క్రిమి కీటకాలూ ప్రవేశిస్తాయని తెలుసు, వాటిని ఎలా అదుపు చేయాలో కూడా తమ గమనంలో వున్నదని చెప్పారు. ఈ నేపధ్యంలో అక్కడ అనుసరించిన విధానాలు ఎలా అద్భుతాలను సృష్టించాయో చూద్దాం.

Related image

1980లో చైనా జిడిపి 305బిలియన్‌ డాలర్లు కాగా 2017నాటికి 12.7ట్రిలియన్‌లకు పెరిగింది.(ఒక ట్రిలియన్‌ లక్ష కోట్లు) నాడు కేవలం 21 బిలియన్‌ డాలర్ల విలువగల వుత్పత్తులను ఎగుమతి చేసిన చైనా 2017నాటికి 2.49లక్షల కోట్ల డాలర్లతో ప్రపంచంలోనే అతి పెద్ద ఎగుమతిదారుగా తయారైంది.1980-2016 మధ్య సగటు అభివృద్ధి రేటు 10.2శాతం.1980లో చైనాకు వచ్చిన విదేశీ పెట్టుబడులు దాదాపు లేవు, 2017లో 168 బిలియన్‌ డాలర్లు వచ్చాయి, 2016నాటికి ప్రపంచంలోని వివిధ దేశాలలో చైనా పెట్టుబడులు 216 బిలియన్‌ డాలర్లున్నాయి. ఈ కాలంలో చైనీయుల సగటు జీవిత కాలం 66 నుంచి 76 సంవత్సరాలకు పెరిగింది.22శాతంగా వున్న నిరక్షరాస్యులు 3.2శాతానికి తగ్గారు. చైనా కుటుంబాల వినియోగం 49 బిలియన్‌ డాలర్ల నుంచి 90రెట్లు పెరిగి 2016నాటికి 4.4లక్షల కోట్లకు చేరింది.

సిఐఏ వెల్లడించిన వివరాల ప్రకారం 2017లో చైనా 2.16లక్షల కోట్ల డాలర్ల విలువగల వస్తువులను ఎగుమతి చేస్తే మనం 299.3బిలియన్‌ డాలర్ల దగ్గర వున్నాం.2016లో మనం 1.15లక్షల కోట్ల యూనిట్ల విద్యుత్‌ వుత్పత్తి చేస్తే చైనాలో అది 6.14లక్షల కోట్ల యూనిట్లు. అంతర్జాతీయ ఆటోమొబైల్‌ సంస్ధ తెలిపిన వివరాల ప్రకారం 2016లో చైనా 244లక్షల కార్లు, 36లక్షల వాణిజ్య వాహనాలను తయారు చేస్తే మనం 36లక్షల కార్లు, 8.1లక్షల వాణిజ్య వాహనాలను వుత్పత్తి చేశాము. బ్రిక్స్‌ దేశాలలోని వంద అగ్రశ్రేణి కంపెనీలలో చైనాకు చెందినవి 87శాతం ఆదాయం, 85శాతం లాభాలను కలిగి వుండగా మనవి 4,3శాతాలుగా వున్నాయి. రైలు మార్గాల విషయంలో మనకూ చైనాకూ పెద్ద తేడా లేదు. అయితే అక్కడ 22వేల కిలోమీటర్ల హైస్పీడ్‌ రైలు మార్గం వుండగా మన దగ్గర అలాంటిది లేదు. పరిశోధన, అభివృద్దికి జిడిపిలో చైనా 2.1శాతం ఖర్చు చేస్తుండగా మన దగ్గర ఒకశాతానికిలోపుగానే వుంది.2016లో చైనాలో పదిలక్షల 34వేల పేటెంట్లకు దరఖాస్తు చేశారు. ప్రపంచం మొత్తం మీద ఇవి 42శాతం. మన దేశంలో దాఖలైనవి 45,057 మాత్రమే. మన దేశంలో రోజుకు 24కిలోమీటర్ల గ్రామీణ రహదారులను నిర్మిస్తుండగా చైనాలో 1994-2000 మధ్య రోజుకు 1,200 కిలోమీటర్లునిర్మించారు.

ఇవన్నీ సానుకూల అంశాలైతే సమాజంలో ఆర్ధిక అసమానతలు పెరగటం ప్రతికూల అంశం.సంస్కరణల ప్రారంభంలో జాతీయ సంపదలో జనాభాలో ఒకశాతంగా వున్న ధనికుల చేతిలో 6.4శాతంగా వున్న దేశ సంపద 2015లో 13.9శాతానికి పెరిగింది. ఏ దేశంలోనూ లేని విధంగా 620 మంది బిలియనీర్లు వున్నారు. పేదలలోని 50శాతం మంది చేతిలో వున్న 26.7శాతం సంపద 14.8శాతానికి తగ్గిపోయింది. దేశంలో కొన్ని ప్రాంతాలు బాగా అభివృద్ది చెందగా మరికొన్ని దూరంగా వున్నాయి. పట్టణ, గ్రామీణుల మధ్య వ్యత్యాసాలు కూడా వున్నాయి. నలభై సంవత్సరాలలో చైనా జనాభా 96 నుంచి 139 కోట్లకు పెరిగింది. అభివృద్ది క్రమంలో చైనా ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలలో పట్టణీకరణ ఒకటి. పట్టణ ప్రాంతాలలో ఆదాయం, సౌకర్యాలు మెరుగ్గా వుండటంతో సహజంగానే యువతీ యువకులు పట్టణ ప్రాంతాలవైపు మొగ్గుచూపుతారు.

Image result for Forty years China Reforms

గత నాలుగు దశాబ్దాలలో 17.9శాతంగా వున్న చైనా పట్టణ జనాభా 58.5శాతానికి పెరిగింది. సంఖ్య రీత్యా 17 కోట్ల నుంచి 81 కోట్లకు పెరిగింది. అక్కడ జరుగుతున్న అభివృద్దికి అనుగుణ్యంగా 1980లో 54.5లక్షల మంది పట్టణాలకు వలస వెళ్లగా 1990నాటికి 65.5లక్షలకు, 1995 నుంచి ఏటా రెండు కోట్ల మందికి చేరింది. ఇటువంటి మార్పు ప్రపంచంలో మరే దేశంలోనూ జరగలేదు. గ్రామాల నుంచి రోజూ పట్టణాలకు వచ్చిపోయే వారి సంఖ్య కూడా ఎక్కువే.2025 నాటికి పట్టణ జనాభా వంద కోట్లకు చేరుతుందని అంచనా. అందువలన చైనా ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ ఇంకా సాధించాల్సింది ఎంతో వుంది. ఈ కారణంగానే తమది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే చైనా నాయకత్వం చెబుతోంది. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణంతో పాటు అధిగమించాల్సిన సమస్యలు కూడా చైనా తరహాలోనే వున్నాయని వేరే చెప్పనవసరం లేవు. వెనుకబడిన ఆఫ్రికా ఖండంలోనూ, అభివృద్ధి చెందిన అమెరికా ఖండంలోనూ కార్మికవర్గం వున్నప్పటికీ సమస్యల తీరుతెన్నులు ఒకే విధంగా వుండవు. ఒకే విధమైన సోషలిస్టు నిర్మాణం కుదరదు. ప్రతి దేశానికి విప్లవం దాని తరహాలోనే వస్తుందన్నది శాస్త్రీయ మార్క్సిస్టు సూత్రం. అందువలన సోషలిస్టు సమాజ నిర్మాణ లక్షణాలు కూడా ప్రత్యేకంగానే వుంటాయి. అమెరికా 69 ఏండ్లలో సాధించినదానిని చైనా 18 సంవత్సరాల్లోనే అధిగమించింది.రెండు చోట్లా వున్నది పెట్టుబడిదారీ విధానమే అయితే అంత తేడా ఎందుకున్నట్లు ? భారత్‌ ఎందుకు విఫలమైనట్లు ? అధ్యయనం చేయాల్సిన అవసరం లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా – రష్యా మధ్యలో చైనా !

24 Wednesday Oct 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

China, Donald trump, INF Treaty, Intermediate-Range Nuclear Forces, RUSSIA, The 1987 INF Treaty

Related image

గోర్బచెవ్‌-రోనాల్డ్‌ రీగన్‌  ఒప్పందం

ఎం కోటేశ్వరరావు

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు మరో రెండు వారాలుండగా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ యావత్‌ ప్రపంచాన్ని ముఖ్యంగా ఐరోపాను ఆందోళనకు గురిచేసే ప్రకటన చేశాడు. మూడు దశాబ్దాల క్రితం నాటి సోవియట్‌తో కుదుర్చుకున్న ఆయుధ నియంత్రణ ఒప్పందం నుంచి వైదొలగనున్నట్లు ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించారు. దీని మీద ఐరోపాలో మొత్తం మీద వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇది రష్యా వ్యాఖ్యానించినట్లు బెదిరింపా లేక చెప్పినట్లు నిజంగానే వైదొలుగుతుందా అన్నది చూడాల్సి వుంది. ఐరోపాలో వెల్లడయ్యే స్పందన వ్యతిరేకంగా వుంటే తాత్కాలికంగా వెనక్కు తగ్గినా ఒప్పందం నుంచి వైదొలగటం ఖాయం అని చెప్పవచ్చు. ప్రపంచానికి ట్రంప్‌ పిచ్చివాడనిపించవచ్చుగానీ ఒక పధకం ప్రకారమే వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా సెనెట్‌్‌ ఆమోదించిన ఒప్పందాలను దాని అనుమతి లేకుండా రద్దు చేసేందుకు లేదా వాటి నుంచి వుపసంహరించుకుంటామని ప్రకటించేందుకు అధ్యక్షుడికి అనుమతి లేదు. అయినా ట్రంప్‌ ప్రకటన తక్షణ ప్రయోజనం ఎన్నికలలో ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ విజయం దిశగా పయనిస్తున్నదన్న వార్తల పూర్వరంగంలో అధికారపార్టీ రిపబ్లికన్లకు లబ్ది చేకూర్చటమే. ఎన్నికల్లో లబ్దికి ఈ సందర్భాన్ని వినియోగించుకోవటం ఒక ఎత్తుగడ కావచ్చుగాని అమెరికన్‌ సామ్రాజ్యవాదులు మరొక ప్రచ్చన్న యుద్ధానికి తెరలేపేందుకు ఎప్పటి నుంచో చేస్తున్న సన్నాహాలలో భాగమే ఇది. నిజంగానే ఒప్పందం నుంచి వైదొలిగితే ఆ చారిత్రాత్మక ఎదురుదెబ్బకు బాధ్యురాలు అమెరికానే అవుతుంది.

అసలీ ఒప్పందం ఏమిటి ? ఐరోపాలో ఆయుధాల మోహరింపును అక్కడి జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పూర్వరంగంలో మధ్య శ్రేణి అణు బలాల ఒప్పందం(ఐఎన్‌ఎఫ్‌) పేరుతో తమ వద్ద వున్న మధ్య,లఘు శ్రేణి క్షిపణులను తొలగించుకొనేందుకు 1987 డిసెంబరు ఎనిమిదిన గోర్బచెవ్‌-రోనాల్డ్‌ రీగన్‌ మధ్య కాలపరిమితి లేని ఒప్పందం కుదిరింది.మరుసటి ఏడాది జూన్‌ ఒకటి నుంచి అమలులోకి వచ్చింది. తరువాత సోవియట్‌ రద్దు కావటంతో దాని వారసురాలిగా రష్యా ఒప్పందంలోకి వచ్చింది. ఆ మేరకు 500 నుంచి వెయ్యి కిలోమీటర్ల వరకు వున్న లఘు, వెయ్యి నుంచి 5,500 కిలోమీటర్లకు వుండే మధ్య శ్రేణి అణు, సాంప్రదాయ క్షిపణులను రెండు దేశాలు తొలగించాల్సి వుంటుంది. సముద్రం నుంచి ప్రయోగించే క్షిపణులు ఈ ఒప్పంద పరిధిలో లేవు. ఒప్పందం ప్రకారం అమెరికా 846 సోవియట్‌ లేదా రష్యా 1,846 క్షిపణులను నాశనం చేశాయి. ఇవి ప్రధానంగా ఐరోపాలో యుద్ధానికి అనువుగా రూపొందించినవి కావటంతో వాటిని తొలగించటం ప్రాంతీయ భద్రతకు ఎంతో ముఖ్యమని ఐరోపా భావించింది.

ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఇంతవరకు అమలు వుల్లంఘన గురించి కొన్ని ఫిర్యాదులు రెండువైపుల నుంచీ వున్నప్పటికీ పెద్ద వివాదాలేమీ బయటి ప్రపంచానికి తెలియదు. ఆకస్మికంగా ఈనెల 20న తాము వైదొలగాలనుకుంటున్నట్లు ట్రంప్‌ ప్రకటన చేశాడు. ఈ ఒప్పందంతో చైనాకు ఎలాంటి ప్రమేయమూ లేదు, ఏ విధంగానూ భాగస్వామి కాదు. చిత్రం ఏమిటంటే తాము వైదొలగదలచుకుంటే అది అమెరికా తలనొప్పి అనుకోవచ్చు కానీ, ఈ సమస్యలోకి ట్రంప్‌ మహాశయుడు చైనాను లాగాడు.రష్యా మన దగ్గరకు రావాలి, చైనా మన దగ్గరకు రావాలి, అందరూ మన దగ్గరకు రావాలి. అందరం మంచిగా తయారవుదాం మనలో ఎవరమూ ఆ అయుధాలను తయారు చేయవద్దు అని చెబితే తప్ప మనం తయారు చేయాల్సిందే. కానీ రష్యా తయారు చేస్తూ, చైనా తయారు చేస్తూ వుంటే మనం ఒప్పందానికి కట్టుబడివుండాలంటే కుదరదు. రష్యా ఒప్పందానికి కట్టుబడి వుండటం లేదు కాబట్టి మనం కూడా కట్టుబడి వుండనవసరం లేదు. ఒప్పందాన్ని రద్దు చేసుకోబోతున్నాం అని ట్రంప్‌ ప్రకటించాడు. అంటే రష్యాతో ముడి పెట్టి చైనాను కూడా దెబ్బతీయాలనే లక్ష్యం ట్రంప్‌ ప్రకటన వెనుక వుందా ? ముగిసిందని ప్రకటించిన ప్రచ్చన్న యుద్ధాన్ని చైనా మీద ప్రారంభించదలచారా ? అంటే వెలువడుతున్న వ్యాఖ్యానాలను బట్టి అవుననే చెప్పాల్సి వుంది. ట్రంప్‌ ప్రత్యక్షంగా రష్యా, చైనాలను రంగంలోకి తెచ్చేందుకు పూనుకున్నప్పటికీ మరోవైపు ఐరోపా రాజ్యాలను మరింతగా తన అదుపులోకి తెచ్చుకొనే ప్రయత్నం కూడా లేకపోలేదు.

‘ ట్రంప్‌ ప్రచ్చన్న యుద్ధాన్ని పునరుద్ధరించవచ్చు , కానీ చైనా దాని గతిని మార్చగలదు’ అనే శీర్షికతో న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక ఒక వ్యాఖ్యానాన్ని ప్రకటించింది. బెదిరింపులు, అణ్వాయుధాలు పాతవయ్యాయి. కొద్ది రోజులుగా ఐరోపా, అమెరికాలో అనేక మంది నూతన ప్రచ్చన్న యుద్ధం ప్రారంభం అవుతున్నదని అనుకుంటున్నారు, నూతన గతులు దానికి తూట్లు పొడుస్తాయి ఎందుకంటే సంపద్వంతమైన, జాతీయవాద చైనా అవతరించిందని సదరు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా రష్యా, చైనాలతో గిల్లికజ్జాలు పెట్టుకొనేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎఎన్‌ఎఫ్‌ ఒప్పందాన్ని వుల్లంఘిస్తోందని తమ ఎన్నికలు, అంతర్గత వ్యవహారాల్లో రష్యా జోక్యం చేసుకొంటోందని గత రెండు సంవత్సరాలుగా అమెరికా ఒక పధకం ప్రకారం ఆరోపణలు చేస్తోంది. మరోవైపున పెట్టుబడులు, వాణిజ్యం, మేథోసంపత్తి హక్కు చౌర్యం, ఇతర పద్దతుల్లో అమెరికా ప్రజాభిప్రాయాన్ని మలచేందుకు చైనా ప్రయత్నిస్తోందని ట్రంప్‌ అండ్‌కో ప్రచారం చేస్తోంది.దాన్ని అడ్డుకొనే పేరుతో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ఆయుధపోటీకి కాలుదువ్వుతోంది.

1987నాటి రష్యాాఅమెరికా ఆయుధ నియంత్రణ ఒప్పందంలో చైనా లేని కారణంగా అది స్వంత అణ్వాయుధ మరియు అన్ని శ్రేణుల సాంప్రదాయ క్షిపణులను తయారు చేసుకొనేందుకు అవకాశం ఇచ్చిందని అమెరికా వ్యూహకర్తలు వాదిస్తున్నారు. దాన్నే ట్రంప్‌ వెళ్లగక్కాడు.ఈ ఒప్పందంలో చైనా భాగస్వామి కానప్పటికీ దాని దగ్గర వున్న క్షిపణులలో 95శాతం మధ్యశ్రేణివే అని దక్షిణ కొరియాలో రాయబారిగా పని చేసిన అమెరికా పసిఫిక్‌ కమాండ్‌ అధిపతి హారీ హారిస్‌ ఒక నివేదికలో ఆరోపించాడు. ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందం ఐరోపా కేంద్రంగా చేసుకున్నదని అమెరికాాచైనా మిలిటరీ బలాబలాలను పరిగణనలోకి తీసుకోవలేదని, ఆ అంశం ఇటీవలి కాలంలో అమెరికా వ్యూహాత్మక లెక్కల్లో కేంద్ర స్ధానాన్ని ఆక్రమించిందని ఇటీవల కొందరు కొత్త వాదనలు లేవనెత్తారు. ఆసియాలో చైనా ఇతర దేశాలను బెదిరించేందుకు గాను సముద్రం, గగనతలం నుంచి ప్రయోగించే క్షిపణి వ్యవస్ధల కంటే భూతలం నుంచి ప్రయోగించే ఆయుధాల ఖర్చు అమెరికాకు కలసి వస్తుంది. అయితే మిత్రదేశాల అనుమతి లేకుండా చైనా లక్ష్యంగా పసిఫిక్‌ ప్రాంతం నుంచి క్షిపణులను ప్రయోగించే కేంద్రాలు పరిమితంగా వుండటం అమెరికాకు ఒక సమస్య. జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాలు అటువంటి వ్యవస్ధలను తమ భూభాగంపై నెలకొల్పేందుకు అంగీకరిస్తాయా అన్నది సందేహాస్పదమే. అలా చేయటం అంటే అమెరికా కోసం చైనాతో వైరం తెచ్చిపెట్టుకోవటమే.గత నాలుగు దశాబ్దాలుగా చైనా తన సంస్కరణలు, తన అభివృద్ధి తప్ప ఆయుధపోటీలో వున్నట్లు మనకు కనిపించదు.అలాంటి దానిని వాణిజ్యంలో తన షరతులను రుద్దటంలో విఫలమైన అమెరికా ఇప్పుడు మిలిటరీ రీత్యా ఆయుధపోటీకి దిగి చైనా దృష్టి మళ్లించాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికా అణ్వాయుధాలతో పోల్చితే చైనా ఎంతో వెనుకబడి వుంది, దానికి వాటి అవసరం కూడా కనిపించలేదు. కానీ ఇప్పుడు అమెరికా కవ్వింపులకు దిగుతుండటంతో ఎలా స్పందిస్తుందో చూడాల్సి వుంది.

ఇటీవలి కాలంలో అమెరికా అంతర్జాతీయ వ్యవస్ధ నుంచి ఏకపక్షంగా వైదొలుగుతున్నది. వాతావరణ మార్పులు, భూతాపం తదితర అంశాలున్న పారిస్‌ ఒప్పందం నుంచి, ఇరాన్‌తో అణు ఒప్పందం, అంతర్జాతీయ పోస్టల్‌ యూనియన్‌ నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అవన్నీ ఒక ఎత్తయితే ఇది అత్యంత ప్రమాదకర చర్యల, అంతర్జాతీయ భద్రత మీద ఎంతో పభావం చూపనుంది. మొత్తంగా చూసినపుడు ఇటీవలి కాలంలో అనేక ఒప్పందాలను తిరగదోడుతోంది, కొత్తవి కావాలని వత్తిడి తెస్తోంది. అమెరికాకు అగ్రస్ధానం లేదా సింహభాగం రాబట్టుకొనేందుకు పూనుకున్నట్లుగా కనిపిస్తోంది. తనకేమీ బాధ్యత లేనట్లుగా వ్యవహరిస్తోంది. ఇది అమెరికన్లకేగాక యావత్‌ మానవాళికి హానికలిగించే పోకడ అని చెప్పకతప్పదు. ఒక పరిశీలన ప్రకారం చాలా సంవత్సరాలుగా అమెరికా వుపరితల ఆధారిత లఘు, మధ్యశ్రేణి క్షిపణులను అభివృద్ది చేయలేదు. ఇటీవలనే అందుకు నిధులు కేటాయించింది. వుపరితలం నుంచి ప్రయోగించే క్షిపణులను మోహరించేందుకు ఏ ఐరోపా దేశం కూడా తమ భూ భాగాలను అనుమతించే అవకాశం లేదు. అయితే రష్యా దగ్గర అలాంటి ఆయుధాలు వున్నందున చాలా త్వరగా మోహరించే అవకాశాలున్నాయి. నిషేధిత శ్రేణిలో కొత్త క్షిపణులను రష్యా తయారు చేసిందని అయితే ఒప్పందం కారణంగా వాటి శ్రేణిని పెంచి ఖండాంతర క్షిపణిగా పేర్కొన్నదని అమెరికా అనుమానిస్తున్నది.

Image result for intermediate-range nuclear missile

తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసినప్పటి నుంచి రష్యాను చక్రబంధంలో బిగించేందుకు నాటో కూటమిని విస్తరించేందుకు అమెరికన్లు ప్రయత్నించి ఇప్పుడు రుమేనియా, పోలాండ్‌ వంటి చోట్ల రష్యా ముంగిటికి తమ ఆయుధాలను ఎక్కుపెట్టారు. దానికి ప్రతిగా అది కూడా తన జాగ్రత్తలను తాను తీసుకుంటున్నది.గురివిందగింజ మాదిరి తన చర్యల గురించి నోరెత్తని ట్రంప్‌ రష్యా మోహరింపులను సాకుగా చూపి ఒప్పందం నుంచి వైదొలుగుతాననటం ఒక సాకు మాత్రమే. మూడు దశాబ్దాలుగా ప్రశాంతంగా వున్న తమకు మరోసారి ఆయుధముప్పు తెచ్చిపెడుతున్నారనే అభిప్రాయం ఐరోపాలో వ్యక్తం అవుతోంది. రష్యాను అంకెకు తెచ్చేందుకు అమెరికా చేసే యత్నాలకు తాము మద్దతిస్తాం తప్ప ఒప్పందం నుంచి తప్పుకుంటామనే అమెరికా వైఖరిని ఐరోపా నాయకులు తప్పు పడుతున్నారు. నిరాయుధీకరణ ఒప్పందం ఐరోపా భద్రత అనే కట్టడానికి గత మూడు దశాబ్దాలుగా ఒక స్ధంభం మాదిరి వుంది, ప్రచ్చన్న యుద్ధాన్ని అంతం చేసేందుకు తోడ్పడింది అని ఐరోపా యూనియన్‌ విదేశాంగ విధాన విభాగ ప్రతినిధి ఫెడరేసియా మోఘెరిని ఒక రాత పూర్వక ప్రకటనలో పేర్కొన్నారు. ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందం కారణంగా దాదాపు అణు, సాంప్రదాయ ఆయుధాలున్న మూడువేల క్షిపణులను తొలగించి నాశనం చేశారు. ప్రపంచానికి నూతన ఆయుధపోటీ అవసరం లేదు, దాని వలన ఎవరికీ లాభం లేకపోగా మరింత అస్ధిరత్వాన్ని తెస్తుందని పేర్కొన్నారు. స్వీడిష్‌ మాజీ ప్రధాని కార్ల్‌ బిడిట్‌ అమెరికా చర్య రష్యాకు ఒక బహుమతి లాంటిది. ఐరోపాకు అణుముప్పును పెంచుతుంది. ఎందుకంటే అమెరికా ఆయుధపోటీలో చేరటంతో రష్యా పెద్ద సంఖ్యలో నూతన ఆయుధాలను మోహరిస్తుందన్నాడు. ఇబ్బందులు రష్యా క్షిపణుల పరిధిలో వున్న ఐరోపావారికి తప్ప అమెరికన్లకు కాదని జర్మనీ విదేశాంగ మంత్రి హెయికో మాస్‌ పేర్కొన్నారు.ట్రంప్‌ ప్రకటన విచారకరమని ఒప్పందానికి కట్టుబడే అంశాలను పరిష్కరించాలని రష్యాను కోరారు. తాము అమెరికా వైఖరిని సమర్ధిస్తామని బ్రిటన్‌ ప్రకటించింది. ఈ చర్య ఎక్కడికి దారితీస్తుందో వాష్టింగ్టన్‌లోని వారికి నిజంగా అర్ధం కావటం లేదా అని ఒప్పందంపై సంతకం చేసిన సోవియట్‌ మాజీ అధ్యక్షుడు గోర్బచెవ్‌ ప్రశ్నించాడు.ఒప్పందం నుంచి వైదొలగటం ప్రమాకర అడుగు అవుతుందని, తమను బ్లాక్‌ మెయిల్‌ చేయటమే అని, అయితే దాన్ని అంగీకరించేది లేదని రష్యా తక్షణ స్పందనలో పేర్కొన్నది.

ట్రంప్‌ చర్యను అమెరికాలోని కొందరు మేథావులే తప్పు పడుతున్నారు. దౌత్యపరంగా హ్రస్వదృష్టి, మధ్యంతర ఎన్నికలకు ముందు ట్రంప్‌కు రాజకీయంగా ప్రమాదకరం, ముప్పుతో కూడుకున్నదని వాషింగ్టన్‌లోని ఆయుధాల అదుపు అసోసియేషన్‌ డైరెక్టర్‌ డారిల్‌ కింబాల్‌ వ్యాఖ్యానించారు. ఒప్పంద వుల్లంఘనకు రష్యా పాల్పడుతున్నదనే ఆందోళన ఒకవైపు వుండగా దాన్నుంచి అమెరికా వుపసంహరణ ప్రకటన చేయటంతో వైఫల్య నిందను నెత్తిన వేసుకున్నట్లయిందని కింబాల్‌ వాపోయారు. వివాద పరిష్కారానికి దౌత్య అవకాశాలు ఆవిరి కాలేదని, ట్రంప్‌ పాలనా కాలంలో ఆయన సలహాదారు బోల్టన్‌ మాస్కో పర్యటన కేవలం మూడవదేనని కూడా కిబాల్‌ చెప్పారు. రుమేనియాలో ఆమెరికా మోహరించిన క్షిపణులను అడ్డుకొనే కేంద్రాలను రష్యన్‌ నిపుణులు, ఆమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్న రష్యా 9ఎం729 వ్యవస్ధలను అమెరికా నిపుణులు పరస్పరం తనిఖీ చేసేందుకు అవకాశాలున్నాయని తెలిపారు.

ట్రంప్‌ ప్రతినిధిగా మాస్కో పర్యటనలో వున్న బోల్టన్‌ విలేకర్లతో మాట్లాడుతూ ఒప్పందంలో పేర్కొన్న క్షిపణులు అనేక దేశాలు తయారు చేస్తున్నందున ప్రచ్చన్న యుద్ధకాలంలో కుదుర్చుకున్న ఒప్పందాలకు కాలదోషం పట్టిందని వ్యాఖ్యానించాడు. ట్రంప్‌, ఇతర అమెరికకా నిపుణులు కోరుతున్నట్లు అణ్వాయుధ క్షిపణుల నిషేధ ఒప్పందంలో చైనా చేరే అవకాశాలేమాత్రం లేవని కింబల్‌ వ్యాఖ్యానించారు. దాని దగ్గర వున్న అణ్వాయుధాలు తక్కువ, వారి దగ్గర లఘు, మధ్య శ్రేణి క్షిపణులు ఎక్కువగా వున్నాయి. నిజంగా వారు ఒప్పందంలో చేరితే అది అమెరికా, రష్యాలకు విజయం, చైనాకు నష్టం అన్నారు. అమెరికా నిజంగా ఒప్పందం నుంచి తప్పుకుంటుందా అన్న ప్రశ్నకు కింబల్‌ ఇలా స్పందించాడు. గత కొద్ది వారాలుగా ఒప్పందాన్ని ఏమి చేయాలని ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది.బోల్లన్‌ గనుకు చక్కగా వుండి వుంటే ఈ సమస్యను దీర్ఘకాలం నాన్చటం మంచిది కాదు, మీరు తదుపరి చర్యలు తీసుకోనట్లయితే మేము ఒప్పందం నుంచి వెనక్కు పోవచ్చు అని చెప్పేందుకు మాస్కో వెళ్లి వుండాల్సింది, కానీ గట్టిగా వ్యవహరించాలనే ప్రవత్తిగల ట్రంప్‌ ముందుగానే తుపాకిని ఎక్కు పెట్టి ఒప్పందాన్నుంచి వైదొలుగుతామని చెప్పాడు. రష్యా గురించి గట్టిగా మాట్లాడి రాజకీయంగా లబ్దిపొంద చూసేందుకు రాజకీయవేత్తలు ప్రయత్నిస్తున్నారని కొన్ని వర్గాలు పేర్కొన్నట్లు రష్యా వార్తా సంస్ధ నొవొస్తి పేర్కొన్నది.

ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందం రద్దయితే పర్యవసానాలేమిటి? మరోసారి ఆయుధ పోటీకి అమెరికా తెరలేపినట్లు అవుతుంది. అని వార్యంగా రష్యా, చైనా ఇతర దేశాలు అందుకోసం అమెరికా అంతగాకపోయినా అదనంగా ఖర్చు చేయాల్సి రావచ్చు. ఐరోపా గడ్డమీద ఆయుధాలు పెరుగుతాయి. అక్కడి దేశాలు తమ రక్షణ ఖర్చును గణనీయంగా పెంచుకోవాల్సి వుంటుంది, అదిగాకుండా అమెరికా ఆయుధాలకు అదనంగా చెల్లించాల్సిన పరిస్ధితి. వీటన్నింటి వలన ప్రయివేటు రంగంలోని అమెరికా మిలిటరీ పరిశ్రమలకు లాభాలు పెరుగుతాయి. తన రాజకీయ వైఖరికి అనేక అంశాల్లో అడ్డుపడుతున్న రష్యాపై అనేక ఆంక్షలను అమలు జరుపుతున్న అమెరికా రాబోయే రోజుల్లో మరింగా విస్తరించవచ్చు. ఒప్పందం నుంచి అమెరికా వైదులుగుతున్న కారణంగా నాటో కూటమి, ఐరోపా యూనియన్‌ దేశాల మధ్య విబేధాలు తలెత్తే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఐరోపా తన భద్రతను తాను చూసుకోగలదు అంటున్న దేశాలు అమెరికా తెచ్చి పెట్టిన కొత్త సమస్యమీద ఎలా స్పందిస్తాయో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

సోషలిజంపై చిత్త భ్రమణ తంత్ర విద్య ప్రయోగం !

06 Monday Nov 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

100 years Bolshevik Revolution, Bolshevik Revolution, CAPITALISM, capitalist crisis, China, communist, Communist Revolution, Mind Games, new American socialism

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం- వర్తమానం -2

ఎం కోటేశ్వరరావు

ప్రపంచంలో కొన్ని సోషలిస్టు వ్యవస్ధలకు తగిలిన తీవ్ర ఎదురుదెబ్బలు ఎంతో ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇదే సమయంలో విద్య, సమాచార వ్యవస్ధ కొత్త పుంతలు తొక్కి అరచేతిలోకి అందుబాటులోకి రావటం వంటి పరిణామాలతో కమ్యూనిస్టు సిద్ధాంతంపై దాడి కగతం కంటే తీవ్రంగా జరుగుతోంది. కొత్త ఎత్తుగడలు అనుసరించటాన్ని అన్ని రంగాలలో చూడవచ్చు. గతంలో మాదిరి కమ్యూనిజాన్ని నేరుగా వ్యతిరేకిస్తే లాభం వుండదని గత వంద సంవత్సరాల అనుభవాలు దోపిడీ వర్గానికి నేర్పాయి. అంటే దొంగ దెబ్బలకు పూనుకున్నాయి, దీంతో కమ్యూనిస్టుల పనిని మరింత సంక్లిష్టం గావించాయని చెప్పాలి. శత్రువును చంపదలచుకుంటే ప్రత్యక్ష పోరాటంలో ఎంతో కష్టపడాలి, అదే తీపి మాటలతో వెన్నుపోటు పొడిచి అంతం చేయటం ఎంతో సులభం. ఈ కుటిల నీతిని కమ్యూనిస్టు వ్యతిరేకులు బాగా ప్రయోగిస్తున్నారు. ఈ నేపధ్యంలో నవతరం సోషలిజం-కమ్యూనిజం వైపు ఆకర్షితులు కావటం గతం మాదిరి సులభం కాదు. అయితే దోపిడీ వ్యవస్ధ ఎప్పటికపుడు తనకు తెలియకుండానే యువతరాన్ని ఆవైపు నెడుతోంది. పీడితులు కూడా తమ ఆయుధాలను సన్నద్దం చేసుకోవటం అనివార్యం.

అమెరికాలోని కమ్యూనిజం బాధితుల స్మారక ఫౌండేషన్‌ అనే సంస్ధ తన వార్షిక నివేదికలో భాగంగా యు గవ్‌ అంటే మీ ప్రభుత్వం అనే ఒక పరిశోధనా సంస్ధతో కలసి అక్టోబరు చివరి వారంలో ఒక సర్వే నివేదికను విడుదల చేసింది. ఒక కమ్యూనిస్టు వ్యతిరేక సంస్ధ ప్రమేయంతో ఇలాంటి నివేదికల తయారీకి రూపొందించే ప్రశ్నావళి స్వభావం,లక్ష్యం ఎలా వుంటుందో తెలిసిందే. వెన్నుపోటు ఎత్తుగడలో ఇదొక భాగం. ఈ సర్వే సెప్టెంబరు 28 అక్టోబరు 5 మధ్య జరిగింది. అమెరికా ప్రధాన మీడియా అంతటా ఆ సమయంలో అమెరికా దృష్టిలో ధూర్త దేశంగా వున్న సోషలిస్టు-కమ్యూనిస్టు వుత్తర కొరియా జపాన్‌ మీదుగా, అమెరికా తీరంలోని దీవులలో కూడా పడే ఖండాంతర క్షిపణి ప్రయోగాలను జరిపిందని, అమెరికన్లకు ముప్పు తెచ్చిందంటూ ముమ్మరంగా ప్రచార దాడి జరిపిన సమయమది. సర్వేపై దాని ప్రభావం పడకుండా ఎలా వుంటుంది. అందువలన దానికి వుండే పరిమితులను గమనంలో వుంచుకోవాలి. ఈ నివేదికలో కొన్ని అసంబద్దతలు, తర్కానికి నిలబడని అంశాలున్నాయి.

ప్రపంచానికి కమ్యూనిజం ఇప్పటికీ ఒక సమస్యగానే వుందని నమ్ముతున్న అమెరికన్లు 75శాతం వున్నారని, గతేడాది కంటే ఐదుశాతం ఎక్కువంటూ సర్వే తొలి అంశంగా ఆ నివేదిక ప్రారంభమైంది. ప్రతి పదిమందిలో ఏడుగురు అమెరికన్లకు కమ్యూనిజం అంటే ఏమిటో తెలియకపోవటం లేదా తప్పుగా గుర్తించారట. ఇదే సమయంలో నూతన సహస్రాబ్ది యువతరంగా పరిగణించబడేవారిలో సోషలిజం పట్ల సానుకూలత పెరుగుతోంది. జనాభా మొత్తంగా చూసినపుడు 63శాతం పెట్టుబడిదారీ, నాలుగు శాతం ఫాసిస్టు దేశంలో జీవించాలన్న అభిలాషను వ్యక్తం చేయగా సోషలిస్టు-కమ్యూనిస్టు దేశంలో నివశించాలన్న కోర్కె 37 శాతం మందిలో వ్యక్తమైంది. ఇదే సహస్రాబ్ది యువతలో 49, 51శాతం వున్నారు. ప్రస్తుతం అమెరికా జనాభాలో సహస్రాబ్దితరంగా పరిగణించబడేవారు ఎక్కువగా వున్నారు. నివేదిక మొత్తంలో కమ్యూనిస్టు వ్యతిరేకతనే ప్రధానంగా చూపినప్పటికీ ఈ ఒక్క అంశంపై కమ్యూనిస్టు వ్యతిరేకులు కలవర పడుతున్నారు. గతంలో విదేశాలలో పెరుగుతున్న సోషలిస్టు అభిమానులను చూసి భయపడిన అమెరికన్‌ కమ్యూనిస్టు వ్యతిరేకులు ఇప్పుడు తమ యువతను చూసి తామే భయపడుతున్నారన్నమాట. ఎంతలో ఎంత మార్పు? సహస్రాబ్ది యువతలో ఇటువంటి భావాలు ఏర్పడటానికి కారణం 53శాతం మంది అమెరికా ఆర్ధిక వ్యవస్ధ తమకు వ్యతిరేకంగా పనిచేస్తోందని అభిప్రాయం పడటం కావచ్చని సర్వే రచయితలు వ్యాఖ్యానించారు.

‘ ప్రస్తుతం అమెరికాలో సహస్రాబ్ది తరం అతి పెద్ద సమూహంగా వుంది. ఆందోళన కలిగించే కొన్ని ధోరణులు తీవ్ర ఆందోళన కలిగించటాన్ని చూస్తున్నాం. సహస్రాబ్ది యువత పెట్టుబడిదారీ విధానం నుంచి సోషలిజం వైపు మళ్లటం పెరుగుతోంది, చివరికి కమ్యూనిజం కూడా ఆచరణీయ ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు’ అని కమ్యూనిజం బాధితుల స్మార ఫౌండేషన్‌ డైరెక్టర్‌ మరియోన్‌ స్మిత్‌ వ్యాఖ్యానించాడు.ఇదే సమయంలో 1946-64 మధ్య పుట్టిన వారు ఎక్కువగా పెట్టుబడిదారీ విధానానికి,26శాతం మందే సోషలిజానికి మద్దతు ఇస్తున్నారు. అమెరికాలో స్టాలిన్‌ను ప్రతి ఐదుగురిలో ఒకరు హీరోగా భావిస్తుండగా, లెనిన్‌, వుత్తరకొరియా ప్రస్తుత అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ అన్‌లను అభిమానించే వారు ప్రతి నలుగురిలో ఒకరు వున్నారని తేలింది. సోషలిజం, కమ్యూనిజాలకు తేడాతో పాటు అసలు వాటి గురించి తెలియని కారణం, కమ్యూనిస్టు పాలిత దేశాలలో చంపివేయబడిన జనం గురించి తక్కువ అంచనా వేయటం వల్లనే యువత ఈ బాటలో వున్నారని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి పత్రికలు ‘ఎర్ర శతాబ్దం’ పేరుతో రాసిన సానుకూల వ్యాసాలు కూడా కమ్యూనిజం వెనుక వున్న నిజాన్ని పట్టించుకోకుండా చేశాయని కూడా వుక్రోషం వెలిబుచ్చాడు.’ సోషలిజం, కమ్యూనిజాల విషయంలో అమెరికన్‌ సమాజంలో చారిత్రక పాండిత్యం ఎంత తక్కువగా వుందో అలజడి వైపు తిప్పుతున్న ఈ పరిణామం వెలుగులోకి తెస్తోంది.వంద సంవత్సరాల క్రితం జరిగిన బోల్షివిక్‌ విప్లవం తరువాత కమ్యూనిజం కారణంగా జరిగిన మారణహోమం, వినాశనం, దుఖం గురించి విద్యార్ధులకు బోధించటంలో వ్యవస్ధ వైఫల్యం గురించి కూడా ఇది వెల్లడించింది.’ అని కూడా మరియోన్‌ స్మిత్‌ వ్యాఖ్యానించాడు.

కమ్యూనిస్టుల పాలనలో రోమన్‌ కాధలిక్‌ మతగురువులతో సహా చంపిన వారి సంఖ్య పది లక్షలలోపే అని సర్వేలో పాల్గన్నవారిలో పదిశాతం, 1-250లక్షలని 21, 250-500లక్షలని 15, 500-750లక్షలని 12, 750-1000లక్షలని 11, పది కోట్లకు పైగా అని31శాతం చొప్పున నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నిజానికి ఈ అంకెలకు ఎలాంటి ఆధారాలు లేవు. గోబెల్స్‌ ప్రచారంలో భాగంగా వీటిని తిప్పుతున్నారు. ఈ అతిశయోక్తులను మొత్తంగా 69శాతం మంది తక్కువ చేసి చూశారు. సహస్రాబ్ధి యువతలో గతేడాది మాదిరే తప్ప మార్పు లేదు. గత కొద్ది కాలంగా ముఖ్యంగా 2008లో ప్రారంభమైన తీవ్ర ఆర్ధిక మాంద్యం తరువాత అమెరికన్‌ యువతలో సోషలిజం, కమ్యూనిజం గురించి సానుకూల వైఖరి వ్యక్తమౌతోంది. అందువలన వారిని గందరగోళంలో పడేయటానికి ఇలాంటి సర్వేలతో ఒకవైపు వారిలో తలెత్తిన మార్పును చెబుతూనే మరోవైపు వెనక్కు లాగేందుకు చేస్తున్న ప్రయత్నాలు మనం చూడవచ్చు. అయితే ఇవి ఎంతవరకు ఫలిస్తాయి? అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపటం, బకెట్లతో సముద్రనీటిని తోడటం ఎలా సాధ్యం కాదో భావజాల వ్యాప్తిని, అసంతృప్తిని అణచివేయటం, పక్కదారి పట్టించటం కూడా అలాంటిదే.

సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం నిజానికి ఒక ప్రయోగం. దాని ఫలితాలు ప్రపంచానికి తెలియవు. అందువలన నిర్మాణంలో ఏవైనా లోపాలుంటే వాటిని స్నేహపూర్వకంగా లేదా సైద్ధాంతికంగా చెప్పటం వేరు. గతంలో సోవియట్‌ యూనియన్‌ను సోషల్‌ సామ్రాజ్యవాదంగా వర్ణించిన నక్సల్స్‌ తాము కూడా కమ్యూనిస్టులమే అని చెప్పుకున్నారు. అలాగే ఇప్పుడు చైనా అనుసరిస్తున్న విధానాలపై కూడా కొంతమంది అదే రకమైన దాడి చేస్తున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు సామ్రాజ్యవాదులుగా మారినవి వున్నాయి. అదే విధంగా పెట్టుబడిదారీ పంధాలో పయనిస్తూ అభివృద్ధిలో బాగా వెనుకబడిన దేశాలూ వున్నాయి. అటువంటి దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలు వస్తే ఎంతకాలం అనేది ఎవరూ చెప్పలేకపోవచ్చుగాని కొంత కాలం అదే మాదిరి తేడాలు లేకుండా ఎలా వుంటాయి? చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ధ అనేది బూటకం, పేరుకే కమ్యూనిస్టు పార్టీ, అక్కడ ఆర్ధిక అంతరాలు చాలా ఎక్కువగా వున్నాయి, ప్రభుత్వ పెట్టుబడిదారీ వ్యవస్ధను అభివృద్ధి చేస్తున్నారు. ఇలా దాడి జరుగుతోంది. ఇక్కడ సోషలిజం పట్ల కారుస్తున్న మొసలి కన్నీరును కడవలతో కొలవజాలం. నిజమైన సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణ జరగటం లేదని తీవ్ర విచార ప్రదర్శన. ఇదంతా కమ్యూనిస్టు వ్యతిరేకులు, కమ్యూనిస్టులం అని చెప్పుకొనే వారు కూడా కొందరు చేస్తున్నారు. ఇదంతా సమాజంలోని ఒక భాగం లేదా వ్యక్తులను మానసికంగా తిమ్మినిబమ్మిని చేసి ఇబ్బందులకు గురిచేసే చిత్త భ్రమణ తంత్ర విద్యలో భాగమే.

Image result for US youth, socialism

బ్రెజిల్‌కు చెందిన లూయీస్‌ కార్లోస్‌ బ్రెస్సెర్‌ పెరీరా అనే సామాజిక, ఆర్ధికవేత్త పెట్టుబడిదారీ విధానంలో ఐదు నమూనాలు వున్నాయని విశ్లేషించారు. ఆయనతో ఏకీభవించాలనేమీ లేదు. ధనిక దేశాలలో వుదారవాద ప్రజాస్వామిక లేదా ఆంగ్లో-శాగ్జన్‌ నమూనా, సామాజిక లేదా ఐరోపా, అంతర్జన్య లేదా జపాన్‌, వర్ధమాన దేశాలలో వుదారవాద ఆధారిత నమూనాలు ఆసియాలో ఒక విధంగా, బ్రెజిల్‌తో సహా ఇతర దేశాల నమూనాలు భిన్నంగా వుంటాయని ఆయన చెప్పారు. ఇదే సూత్రం సోషలిస్టు దేశాలకు మాత్రం ఎందుకు వర్తించదు? అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో కార్మికవర్గ నాయకత్వాన విప్లవాలు జయప్రదమౌతాయని మార్క్స్‌-ఎంగెల్స్‌ అంచనా వేశారు. ఆ తరువాత బోల్షివిప్లవానికి ముందు సైద్ధాంతిక చర్చ తప్ప సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం గురించి తప్ప నమూనా, విప్లవ మార్గం గురించి పెద్ద సమస్యలు ముందుకు రాలేదు. బోల్షివిక్‌ విప్లవం తరువాతే ఆచరణలో అనేక సమస్యలు ముందుకు వచ్చాయి. వాటన్నింటినీ తెల్లవారే సరికి పరిష్కారిస్తామని, పరిష్కారమౌతాయని గానీ ఏ కమ్యూనిస్టూ చెప్పజాలరు. వాటిని కూడా దోపిడీ శక్తులు తమ కమ్యూనిస్టు వ్యతిరేక భావజాల అమ్ముల పొదిలో చేర్చుకున్నాయి. పద్దతులను కూడా మార్చుకున్నాయి. గతంలో మాదిరి సోవియట్‌ను వ్యతిరేకించినట్లుగా నేడు చైనాతో ప్రత్యక్ష ఘర్షణకు దిగేందుకు ముందుకు రావటం లేదు. ఎందుకంటే గతంలో సోవియట్‌ తయారీ వస్తువులతో పాశ్చాత్య దేశాల మార్కెట్లను నింపలేదు, అందుకు విరుద్ధంగా ఇప్పుడు ఎక్కడ చూసినా మేడిన్‌ చైనా దర్శనమిస్తోంది.అయితే అదే సమయంలో సోవియట్‌ను తొక్కివేసేందుకు, కూల్చివేసేందుకు చేసిన కుట్రలకు ఏమాత్రం తీసిపోకుండా చైనాకు వ్యతిరేకంగా చేయాల్సినవి చేస్తున్నాయని మర్చిపోరాదు. అధికారికంగా సంబంధాలు, అనధికారికంగా చైనా, కమ్యూనిస్టుపార్టీ, కమ్యూనిజం మీద విషపూరిత దాడి జరుగుతోంది.

గత వంద సంవత్సరాలలో ఫాసిస్టు శక్తులను అణచివేయటంలో కమ్యూనిస్టులు ఎంతటి త్యాగాలకు పాల్పడతారో, ఎలా సన్నద్దమౌతారో లోకానికి తెలియ చెప్పటంలో సోవియట్‌ యూనియన్‌ జయప్రదమైంది. సోషలిజాన్ని కాపాడుకుంటూ అచిర కాలంలోనే ఒక నూతన అభివృద్ది నమూనాను ప్రపంచం ముందుంచటంలో చైనా జయప్రదమైంది. చైనాలో సమస్యలేమీ లేవా అంటే కిటికీ తెరిచినపుడు మంచి గాలితో పాటు ఈగలు, దోమల వంటివి కూడా జరబడతాయని వాటిని అదుపు చేయాల్సి వుంటుందని కూడా తమకు తెలుసునని సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌ చెప్పారు. సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామని ఇప్పుడు అధికారికంగా వారే చెబుతున్నపుడు లేవని ఎవరంటారు? అన్ని పెట్టుబడిదారీ దేశాలూ ఒకే విధంగా అభివృద్ధి ఎందుకు చెందలేదు, అన్ని ఖండాలలో ఒకేసారి పారిశ్రామిక విప్లవం ఎందుకు రాలేదు అన్న ప్రశ్నలకు సమాధానంలోనే సోషలిజానికి కూడా జవాబు దొరుకుతుంది.

చైనాలో వున్నది పెట్టుబడిదారీ విధానం అనే వాదనలతో విబేధిస్తున్నవారు ముందుకు తెస్తున్న అంశాలేమిటో చూద్దాం.పెట్టుబడిదారీ పాలనా విధానంలో అప్రయత్న పూర్వకమైన సంబంధాలతో వస్తూత్పత్తి లాభాల కోసం జరుగుతుంది.లాభాల రేటు పెట్టుబడుల వర్తులాను నిర్దేశించటంతో పాటు ఆర్ధిక సంక్షోభ ఆవర్తనాలను కూడా వుత్పత్తి చేస్తుంది. ఇది చైనాకు ఇంతవరకు వర్తించలేదు. ప్రణాళిక, ప్రభుత్వరంగంలో వుత్పత్తిపై యాజమాన్య పద్దతే ఇప్పటికీ ఆధిపత్యం వహిస్తోంది. కమ్యూనిస్టు పార్టీ అధికార పునాదివేళ్లు ప్రజాయాజమాన్యంలోనే వున్నాయి.పెట్టుబడిదారీ తరహా వుత్పత్తి పద్దతి లేకుండానే చైనా ఆర్ధికంగా ఎదుగుదలను సాధించింది. కీలకమైన 102 ప్రభుత్వ రంగ సంస్దల విలువ ఏడున్నరలక్షల కోట్ల డాలర్లు. వీటిని ప్రయివేటీకరిస్తారని ఎవరైనా ఆశపడుతుంటే అలాంటిదేమీ వుండదని పరోక్షంగా హెచ్చరిస్తూ ప్రధానమైన ప్రజాయాజమాన్య స్ధితి, ప్రభుత్వ రంగ ఆర్ధిక వ్యవస్ధ నాయకత్వ పాత్రపై ఎలాంటి డోలాయమానం వుండదని అధ్యక్షుడు గీ జింగ్‌ పింగ్‌ గతేడాది స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల వారు గత మూడున్నర దశాబ్దాలుగా చైనా ఆ బాటను వీడి స్వేచ్చా మార్కెట్‌,ప్రయివేటు రంగం నాయకత్వ పాత్ర వహించాలని కోరుతూనే వున్నారు.లాభాపేక్షలేని ప్రణాళికా బద్దమైన ప్రభుత్వరంగ పాత్ర నాయకత్వంలో తలెత్తే సమస్యలను పెద్దవిగా చూపుతూ వాటిని అవకాశంగా మార్చుకోవాలని కంటున్న కలలు ఇంతవరకు కల్లలుగానే మిగిలిపోయాయి. సామాజిక-ఆర్ధిక అంశాల రూపకల్పన, జయప్రదంగా అమలు చేయటంపై నిజానికి చైనా కమ్యూనిస్టుపార్టీ ఒక పెద్ద ప్రయోగమే చేస్తున్నది.

2008లో పెట్టుబడిదారీ ధనిక దేశాలలో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం తరువాత కూడా చైనా అభివృద్ధి రేటు ఏడుశాతం కొనసాగుతున్నది. తమ తరువాత సంక్షోభంలోకి కూరుకుపోవటం చైనా వంతు అని చెప్పిన వారి జోస్యం వాస్తవం కాదని తేలిపోయింది. కొన్ని వడిదుడుకులు తప్ప గత పదిసంవత్సరాలుగా సజావుగా పురోగమిస్తోంది. ఇది కమ్యూనిస్టుపార్టీ, సోషలిస్టు వ్యవస్ధ ప్రత్యేకత. ఇప్పుడు పెట్టుబడిదారీ ధనిక దేశాలలోని యువతను ఆకర్షించే అంశం ఇది. ఏ స్టోర్‌లో చూసినా చైనా వస్తువులే, పశ్చిమ దేశాల వుద్యోగాలను హరించి చైనా తన వారికి పని కలిపిస్తున్నదన్న వార్తలు ఏదో ఒక రూపంలో వారిని చేరుతూనే వున్నాయి. ఈ నేపధ్యంలో పిల్లి నల్లదా తెల్లదా అని కాదు ఎలుకలను పడుతుందా లేదా అనేదే గీటు రాయి అనుకుంటే ఇప్పటి వరకు పెట్టుబడిదారీ విధానం ఒరగబెట్టిందేమీ లేదు, రాబోయే రోజుల్లో ఏదో చేస్తుందనే ఆశ కనిపించటం లేదు, అందువలన సోషలిజమే మెరుగు, దాన్ని ఎందుకు వ్యతిరేకించాలి అన్న ఆలోచన తలెత్తుతోంది. సోషలిస్టు భావన వునికిలోకి వచ్చిన తరువాత సాధించిన పెద్ద విజయాలలో ఇదొకటి అంటే అతిశయోక్తి కాదు. అందుకే పెట్టుబడిదారీ సిద్ధాంత వేత్తలు సోషలిస్టు వ్యవస్ధల వైఫల్యాలను బూతద్దంలో పెట్టి చూపటం,అవాస్తవాలను ప్రచారం చేసి సోషలిజం గురించి చిత్త భ్రమణ తంత్ర విద్యను( మైండ్‌ గేమ్‌ ఆడటం) ప్రయోగించి తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు తప్ప పెట్టుబడిదారీ విధానం ఎలా మెరుగైనదో దానికి పోతుగడ్డ అంటున్న అమెరికా యువతకు చెప్పలేకపోతున్నారు. అదే పెద్ద బలహీనత. దీన్ని దెబ్బకొట్టి యువతను సోషలిజం వైపు మళ్లించటమే కమ్యూనిస్టుల ముందున్న పెద్ద సవాలు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మెరుగైన అవకాశాలు-తీవ్ర సవాళ్ల మధ్య చైనా: గీ జింపింగ్‌

18 Wednesday Oct 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

China, chinese communist party, chinese communist party congress 2017, Xi Jinping

బుధవారం నాడు మహాసభను ప్రారంభిస్తున్న గీ జింపింగ్‌

చైనా కమ్యూనిస్టుపార్టీ 19వ మహాసభ ప్రారంభం

ఎం కోటేశ్వరరావు

ప్రియమైన పాఠకులు ఈ వ్యాసం చదవటం ప్రారంభించే సమయానికి ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరొక చారిత్రక అధ్యాయానికి చైనాలో తెరలేచింది. వారం రోజుల పాటు జరిగే చైనా కమ్యూనిస్టుపార్టీ 19వ మహాసభ బుధవారం నాడు ప్రారంభమైంది. బీజింగ్‌లోని తియన్మెస్‌ స్క్వేర్‌లోని గ్రేట్‌ హాల్‌లో మహాసభ ప్రారంభం వుపన్యాసంలో రానున్న ఐదు సంవత్సరాల కార్యాచరణకు సంబంధించిన అంశాలను పార్టీ ప్రధాన కార్యదర్శి గీ జింపింగ్‌ ఆవిష్కరించారు.’ ప్రస్తుతం చైనా, ప్రపంచం కూడా తీవ్ర మరియు సంక్లిష మార్పుల మధ్య వుంది. వ్యూహాత్మక అభివృద్ధి అవకాశాల విషయంలో చైనా ఇప్పటికీ ఒక ముఖ్యమైన యుగంలోనే వుంది. అవకాశాలు మెరుగ్గా వున్నాయి, అదే సమయంలో తీవ్రమైన సవాళ్లు కూడా వున్నాయి.’ అని జింపింగ్‌ చెప్పారు.

ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహసభల గురించి అటు శత్రువులు, ఇటు స్నేహితులలోనూ సహజంగానే ఎంతో ఆసక్తి తలెత్తుతుంది. గతంలో జరిగిన మహాసభలకు ముందు ప్రపంచ మీడియాలో ఎన్నో కట్టుకథలు, పిట్టకథలు రాసేవారు. ఈ సారి కమ్యూనిస్టు వ్యతిరేక మీడియా తన పాఠకులు, వీక్షకులకు అటువంటి వినోదాన్ని చాలా పరిమితం చేసి ఎందరినో నిరాశపరిచింది.

పురాతన చరిత్రలో ఎన్నో వైవిధ్యాలను నమోదు చేసిన చైనా వర్తమానంలో కూడా అదే బాటలో నడుస్తోంది. పెట్టుబడిదారీ దేశాలు, వ్యవస్ధలతో ఆర్ధిక సంబంధాలు కలిగి వున్న కారణంగా కొన్ని ఆటుపోట్లు ఎదురవుతున్నప్పటికీ ఏడాదికేడాది ఎన్నో విజయాలు సాధిస్తూ చైనా సోషలిస్టు వ్యవస్థ ముందుకు పోతున్నది. పెట్టుబడిదారీ వ్యవస్ధకు పట్టిన జబ్బులు ఎప్పుడు వదులుతాయో, పక్షవాతం ఎన్నటికి నయమౌతుందో తెలియని స్ధితిలో చైనా గురించి అవాస్తవాలు రాసే మీడియా విశ్వసనీయత నానాటికీ పడిపోవటం వంటి కారణాలతో ఈ సభల సందర్భంగా వాటి జోలికి పోలేదా ? పది సంవత్సరాల క్రితం ప్రపంచ పెట్టుబడిదారీ కేంద్రం అమెరికాలో ప్రారంభమైన సంక్షోభానికి త్వరలో పదేండ్లు నిండబోతున్నాయి. తమతో పాటే చైనా కూడా మునిగిపోతుందని పిచ్చి కలలు కన్న వారిని చైనా కమ్యూనిస్టులు కొరడాతో కొట్టి లేపి మా విజయాలు చూడండి అని చూపుతున్న కారణంగానే 19వ మహాసభ సందర్భంగా వారు ఒళ్లు దగ్గర పెట్టుకున్నారా ?

కమ్యూనిస్టు పార్టీల మహాసభలు రెండు విధాలుగా జరుగుతాయి. అధికారంలో వున్న కమ్యూనిస్టు పార్టీలు సైద్దాంతిక సమస్యలతో పాటు తమ దేశ ఆర్ధిక వ్యవస్ధ, జనజీవన పరిస్ధితులను ఎలా మెరుగుపరచాలో సభలలో చర్చించి లక్ష్యాలను నిర్ణయించుకుంటాయి. ప్రస్తుతానికి చైనా కమ్యూనిస్టు పార్టీ ముందు పెద్ద సైద్ధాంతిక సవాళ్లు లేవనే చెప్పాలి. అమెరికా నాయకత్వంలో సామ్రాజ్యవాదుల కుట్రలను వమ్ము చేసి, ప్రపంచ దేశాలతో సఖ్యత పెంచుకొని తన జనాభా జీవన ప్రమాణాలను మెరుగుపరచి వర్తమానం నుంచి మరో సోషలిస్టు దశకు ఎలా చేరటమా అన్నదే వారి ముందున్న పెద్ద సవాలు . అధికారంలో లేని కమ్యూనిస్టు పార్టీలు జరిపే సభలలో సైద్ధాంతిక, రాజకీయ ఎత్తుగడల పంధా, జనజీవన పరిస్థితుల మెరుగుదలకు చేపట్టాల్సిన పోరాటాల వంటి సమస్యలు ప్రధాన అజెండాగా వుంటాయి.

2012లో జరిగిన 18వ మహాసభ తరువాత చైనా సాధించిన అభివృద్ధి గురించి జాతీయ గణాంకాల సంస్థ వివరాలను గత వారంలో విడుదల చేసింది. 2013ా16 సంవత్సరాల మధ్య ప్రపంచ సగటు వృద్ధి రేటు 2.6, అభివృద్ధి చెందుతున్న దేశాలలో 4 వుంటే చైనాలో 7.2శాతం వుంది.ఈ ఏడాది తొలి త్రైమాసిక వృద్ధి రేటు 6.9శాతం. గతేడాది ప్రపంచ జిడిపి విలువలో చైనా వాటా 14.8శాతం(11.2లక్షల కోట్ల డాలర్లు).గత నాలుగు సంవత్సరాలలో 3.4శాతం పెరిగింది. ఇదే కాలంలో ప్రపంచ పురోభివృద్ధికి చైనా 30శాతం వాటా అందించింది.ఇది అమెరికా, జపాన్‌, యూరోజోన్‌ దేశాల మొత్తం కంటే ఎక్కువ. జిడిపిలో సేవారంగం వాటా 45.3 నుంచి 51.6కు పెరిగింది. పట్టణాలలో పని చేసే గ్రామీణుల వార్షిక పెరుగుదల రేటు 1.8శాతం. పట్టణాలలో శాశ్వతనివాసితుల శాతం 52.57 నుంచి 57.35కు పెరిగింది. ఏటా కోటీ 30లక్షల కొత్త వుద్యోగాలు కల్పిస్తున్నప్పటికీ 31 పెద్ద నగరాలలో నిరుద్యోగులు ఐదుశాతం వున్నారు.పరిశోధన మరియు అభివృద్ధికి చేస్తున్న ఖర్చు 1.91నుంచి 2.11శాతానికి పెరిగింది. పేటెంట్‌ దరఖాస్తుల స్వీకరణ 69శాతం, మంజూరు 39.7శాతం పెరిగింది.కొత్త కంపెనీల నమోదు పెరుగుదల 30శాతం. జనం ఖర్చు చేయగలిగిన తలసరి ఆదాయం 7,311యువాన్ల నుంచి 23,821కి పెరిగింది.వార్షిక పెరుగుదల రేటు 7.4శాతం. అది గ్రామీణుల విషయంలో 10.7శాతం వుంది.

1921లో షాంఘై నగరంలో చైనా కమ్యూనిస్టు పార్టీ తొలి మహాసభ జరిగింది.మావో సేటుంగ్‌తో సహా కేవలం 13 మంది మాత్రమే ప్రతినిధులు ఆ సభకు హాజరయ్యారు. దేశంలోని ఇతర ప్రాంతాలలో కొన్ని డజన్ల మంది కార్యకర్తలు, నాయకులు మాత్రమే అసమయానికి వున్నారు.వారి నాయకత్వంలో కమ్యూనిస్టుపార్టీ 28 సంవత్సరాల తరువాత అనూహ్యరీతిలో చైనాలో అధికారాన్ని స్వీకరిస్తుందని వారు ఆ సమయంలో వూహించి వుండరు. ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమ చరిత్రలో చైనాకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. అక్కడి భౌతిక పరిస్ధితులకు అనుగుణ్యంగానే ‘చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ధ’ నిర్మాణం చేపట్టాలని 1982లో పన్నెండవ మహాసభ నిర్ణయించింది. బీజింగ్‌లో జరుగుతున్న 19వ సభకు 8.9కోట్ల మంది సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ దేశమంతటి నుంచీ ఎన్నికైన 2,287 మంది ప్రతినిధులు హాజరుకావాల్సివుంది. ఈ సభలో ఇరవై అయిదు మందితో పొలిట్‌బ్యూరో, ఏడుగురితో పొలిట్‌బ్యూరో స్టాండింగ్‌ కమిటీ, 205 మందిని కేంద్రకమిటీ సభ్యులుగా మరి కొందరిని ప్రత్యామ్నాయ కమిటీ సభ్యులుగా ఎన్నుకుంటారు. కేంద్రకమిటీ పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటుంది.

గతమహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గ్జీ జింపింగ్‌(64) తిరిగి ఆ బాధ్యతకు ఎన్నికయ్యే అవకాశాలున్నాయని, పార్టీలో అంతర్గతంగా ఎలాంటి నాయకత్వ సమస్యలేదని, స్టాండింగ్‌ కమిటీలోని ఏడుగురిలో ఐదుగురు బాధ్యతల నుంచి తప్పుకొంటారని కొందరు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీ మహాసభలలో చర్చించబోయే అంశాలను ముందుగానే గత మహాసభలో ఎన్నికైన కేంద్రకమిటీ ఖరారు చేస్తుంది.రాబోయే మహాసభ వరకు ఏమి చెయ్యాలో ముసాయిదా నివేదికలను రూపొందిస్తుంది. ఒక వేళ కేంద్రకమిటీలో తీవ్రమైన భిన్నాభిప్రాయాలుంటే పార్టీ అత్యున్నత విధాయక పార్టీ మహాసభకు నివేదిస్తుంది. అంగీకారమైతే వాటిని నివేదికలు లేదా తీర్మానాలలో చేర్చుతారు, లేదా సవరణ ప్రతిపాదనలను ఓటింగ్‌కు పెట్టి అంతిమ నిర్ణయం చేస్తారు.

ఈ మహాసభ సమయంలో పిట్టకథలేమీ లేవంటే అసలేమీ లేవని కాదు. అవి లేకపోతే మీడియాకు కిక్కు వుండదు కదా. బహిరంగంగా మాట్లాడే అసమ్మతి వాదులను మహాసభ సమయంలో బీజింగ్‌ వదలి వెళ్లమన్నారని, విదేశీ జర్నలిస్టులతో మాట్లాడవద్దన్నారని రాశారు. అధికారిక వార్తా సంస్ధ నుంచి వచ్చే కథనాలను తప్ప వేరే పుకార్లను వ్యాపింపచేయవద్దని, చోటివ్వవద్దని మీడియా సంస్ధలకు జారీ చేసిన రహస్య సెన్సార్‌ నిబంధనలలో పేర్కొన్నారని ఒక పత్రిక రాసింది. ఇవెంత హాస్యాస్పదమో వేరే చెప్పనవసరం లేదు. ఇవే నోళ్లు గతంలో అసమ్మతి వాదులను జైలు పాలు చేశాయని చెప్పి ఇప్పుడు నగరం విడిచి వెళ్లమని చెప్పాయని చెబుతున్నాయి. అధికార మీడియా సంస్దలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా రహస్య సెన్సార్‌ నిబంధనలు అని చెప్పటం కట్టుకధగాక మరేమిటి? గత నాలుగు దశాబ్దాలుగా చెబుతున్న ఒక పిట్టకధ చైనీయులు చెప్పే అంకెలను నమ్మకూడదు. ఎవరు నమ్మమన్నారు? వివిధ దేశాలతో వాణిజ్య మిగులు కారణంగా ఏ దేశం వద్ద లేనన్ని డాలర్లు పోగుపడ్డాయా లేదా? చివరకు అమెరికాయే వారి నుంచి అప్పుతీసుకొంటోందా లేదా? అన్ని దేశాల నుంచి పెట్టుబడిదారులు అక్కడికి వెళ్లి పరిశ్రమలు, వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతున్నారా లేదా ?

ప్రపంచ ధనిక దేశాలలో కొనసాగుతున్న సంక్షోభాన్ని ఇతర దేశాలపై నెట్టేందుకు, ఇతర దేశాల మార్కెట్లను ఆక్రమించుకొని ఇబ్బందుల నుంచి తాము బయట పడాలని పెట్టుబడిదారీ వర్గం చేయని ప్రయత్నం లేదు. వారికి కంటగింపుగా వున్న తమను వేయి కళ్లతో చూస్తున్నాయని చైనా నాయకత్వానికి తెలియంది కాదు. గత మూడు దశాబ్దాలుగా విపరీత వేగంతో జరిగిన అభివృద్ది వారికి కొత్త సమస్యలను తెచ్చింది. ఆర్ధికరీత్యా తమతో సంబంధాలు కలిగి వున్నప్పటికీ సోషలిస్టు వ్యవస్థను కూల్చేందుకు, మిలిటరీ రీత్యా దెబ్బతీసేందుకు పశ్చిమ దేశాలు నిత్యం ప్రయత్నిస్తున్నాయన్నది బహిరంగ రహస్యం. వీటిని ఎదుర్కొంటూనే, అంతర్గతంగా సామాజికంగా తలెత్తుతున్న సమస్యల నుంచి తమ వ్యవస్ధను మెరుగుపరుచుకోవటం అనే ద్వంద్వ సవాళ్లను ప్రస్తుతం చైనా నాయకత్వం ఎదుర్కొంటున్నది. అదే సమయంలో పెట్టుబడిదారీ ప్రపంచంలో వున్న వైరుధ్యాలను ప్రస్తుతానికి అది వుపయోగించుకోగలుగుతోంది. ఈ రోజు చైనా సాధిస్తున్న పురోగతి, దాని నుంచి ఇతర పెట్టుబడిదారీ దేశాల మాదిరి లబ్ది పొందకుండా మనకు మనమే గిరిగీసుకోవద్దని ఆస్ట్రేలియా-చైనా వాణిజ్య మండలి మాజీ సిఇవో లారీ పెర్సీ ‘ఆస్ట్రేలియన్‌’ పత్రికలో చైనా కమ్యూనిస్టుపార్టీ మహాసభ సందర్భంగా రాసిన వ్యాసంలో సలహా ఇచ్చారు. నలభై అయిదు సంవత్సరాల క్రితం 1971లో ఆస్ట్రేలియా ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నాయకుడు విట్‌లామన్‌ చైనా సందర్శించారు. అది జరిగిన మూడు రోజుల తరువాత అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్‌ రహస్యంగా చైనా వెళ్లి నిక్సన్‌ పర్యటనకు ఏర్పాట్లు చేసి వచ్చాడు. ఆ పర్యటనను నాడు అధికారంలో వున్న ఆస్ట్రేలియా సంకీర్ణ కూటమి దాన్ని బుద్దిలేని వ్యవహారంగా చూసిందని ఆ వుదంతాన్ని పేర్కొంటూ అమెరికాయే చైనాతో సంబంధాలు పెట్టుకొని లబ్ది పొందుతున్నపుడు మనం కూడా చైనా నుంచి ఎందుకు లబ్ది పొందకూడదని ఆయన ప్రశ్నించారు. నిజానికి ఇది ఒక్క ఆస్ట్రేలియా కార్పొరేట్ల వైఖరే కాదు. గత పది సంవత్సరాలుగా ఆర్ధిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న మన దేశంతో సహా అన్ని పెట్టుబడిదారీ దేశాల కార్పొరేట్ల ఆలోచనకు అది ప్రతిబింబం. అందువలనే బయట వున్న ఆర్‌ఎస్‌ఎస్‌ గాంగ్‌ చైనా వ్యతిరేక ప్రచారం చేసి ఇంతకాలం తాము తయారు చేసిన కమ్యూనిస్టు వ్యతిరేకులను సంతృప్తి పరుస్తుంటే అధికారంలో వున్న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు చైనాతో వాణిజ్యం, పెట్టుబడులతో కార్పొరేట్ల సేవలో తరిస్తున్నారు. ఇది వారి ద్వంద్వ స్వభావం అనేకంటే మోసకారి తనం అనాలి.

చైనా కమ్యూనిస్టు పార్టీ విజయాల వెనుక ఎంతో పకడ్పందీగా పధకం రూపొందించటం, ఆచరణ గురించి కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా అంగీకరిస్తారు. బ్రిటీష్‌ వారి కౌలుకింద వున్న హాంకాంగ్‌ ప్రపంచంలో అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ కేంద్రాలలో ఒకటిగా మారింది. తిరుగుబాటు రాష్ట్రంగా వున్న తైవాన్‌ కూడా అదేమాదిరి అభివృద్ధి చెందింది. వాటితో పోల్చుకుంటే ప్రధాన భూభాగం ఎంతో వెనుక బడి వుంది. కౌలు గడువు తీరి హాంకాంగ్‌ చైనాలో విలీనమైంది. అక్కడ వున్న పెట్టుబడుల అవసరం చైనాకు వుంది. అందువలననే సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణానికి భంగం కలగకుండానే ఒకే దేశం-రెండు వ్యవస్ధల విధానం కింద 2050వరకు హాంకాంగ్‌ ఆర్ధిక వ్యవస్ధలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని ఒక ఒప్పందం చేసుకొని అక్కడి పెట్టుబడిదారులకు స్పష్టమైన హామీనిచ్చింది.

చైనాలో సంస్కరణలు మొత్తం మీద ఎంతో అభివృద్దికి దోహదం చేసినప్పటికీ ఆదాయ, ప్రాంతాల మధ్య అసమాన అభివృద్ధి అసమానతలు, అవినీతి పెరుగుదల వంటి సమస్యలతో పాటు, సామాజికంగా మత ప్రభావం పెరుగుదల వంటి కొత్త సమస్యలను చైనా ఎదుర్కొంటోంది. వాటిని తక్కువగా చూడనవసరం లేదు. వాటిని పరిష్కరించటంలో చైనా నూతన నాయకత్వం ఎలాంటి చర్యలను చేపడుతుందన్నదే ఆసక్తికరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పిల్లి నల్లదా తెల్లదా అని కాదు ఎలుకలను పడుతుందో లేదో చూడాలి !

14 Monday Aug 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Politics, Uncategorized

≈ Leave a comment

Tags

anti china, Anti communist, China, cow sciences, economic reforms, INDIA, india china comparison, India Independence Day

ఎం కోటేశ్వరరావు

దేశంలో ప్రస్తుతం ఒక ప్రమాదకరమైన వాతావరణం రోజురోజుకూ విస్తరిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వానికి ప్రతీక మన గత చరిత్ర. గత ఘనతను చెత్తబుట్టలోకి నెట్టి మా శంఖంలోంచి వచ్చిందే పవిత్ర తీర్ధం, మేం చెప్పేదే అసలైన చరిత్ర,అదే వేదం, మేమే నిజమైన దేశభక్తులం, మాతో విబేధించేవారందరూ దేశ ద్రోహులే అనే అసహన, నిరంకుశ ధోరణులు వైరస్‌ మాదిరి వేగంగా విస్తరిస్తున్నాయి. ఒక సమాజం పరిణితి చెందటానికి ఏమి చెయ్యాలి, ఎంత వ్యవధి పడుతుందన్నది ఒక పెద్ద ప్రశ్న. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంతకాలంగా పాలకులు అనుసరించిన విధానాలు తీవ్ర అసంతృప్తి కలిగించాయి. దానిని అవకాశంగా తీసుకొని స్వాతంత్య్రం, హక్కులకోసం జరిగిన పోరులో భాగస్వాములు కాని భావజాల వారసులు వాటికే ఎసరు తెస్తున్నా జనం మౌనముద్రదాల్చటం నిజంగా ఆందోళనకరమే.

71వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొనే సందర్భంగా అసంతృప్తికి ఆజ్యం పోస్తున్న ప్రధానమైన వాటిలో ఒకటైన అభివృద్ధి సమస్య గురించి అవలోకించటం సముచితంగా వుంటుంది. అసలు అభివృద్ధి అంటే ఏమిటి ? భారతీయ పురాణాలు, ఇతిహాసాలు, జనంలో ప్రచారంలో వున్న సాహిత్య సారం ఏమిటి? వసుధైక కుటుంబం, సర్వేజనా సుఖినో భవంతు కదా? వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు, ప్రతి నాగరిక సమాజం అలాంటి ఆకాంక్షలనేే వ్యక్తం చేసింది. అయినా ఒక రాజ్యాన్ని మరొక రాజ్యం, బలవంతులు బలహీనులను దోపిడీ చేసేందుకు జరిపిన మారణహోమమే సమస్త మానవజాతి గత చరిత్ర. మంచిని కోరుకుంటే అమలు జరిగేది కాదు, దోపిడీని అరికట్టి కొత్త వ్యవస్దను నిర్మించటమే మార్గమని సోషలిజం, కమ్యూనిజం అనే ఒక నూతన భావనను కారల్‌మార్క్స్‌-ఎంగెల్స్‌ ముందుకు తెచ్చారు. వసుధైక కుటుంబం, సర్వేజనా సుఖినో భవంతు అనే మార్గంలో మన ప్రయాణం ఎంత వరకు సాగింది? గడ్డం, టోపీ పెట్టుకున్నావు, నువ్వు ముస్లిం, గొడ్డు మాంసం తింటావ్‌,దేశద్రోహివి నిన్ను చంపేస్తా అన్న వున్మాదం వరకు అని న్యూఢిల్లీ రైలు వుదంతంలో చూశాం కదా ! గుప్తుల స్వర్ణయుగం అనో మరొకటో చెప్పి మా తాతలు నేతులు తాగారు కావాలంటే మా మూతులు వాసన చూడండి అంటే ప్రయోజనం వుంటుందా? మన పూర్వీకులు ప్రపంచానికి ఎంత ఇచ్చారో ప్రపంచం నుంచి కూడా అవసరమైంది పుచ్చుకున్నారని గ్రహించాలి.

అలెగ్జాండర్‌ మన దేశాన్ని ఆక్రమించుకొనేందుకు చేసిన ప్రయత్నం సఫలమై వుంటే, మన దేశంలో పుట్టిన బౌద్ధాన్ని మన పాలకులే నాశనం చేయకుండా వుంటే, మనువాదంతో మన చుట్టూమనం, ఇతరుల చుట్టూ గిరులు గీసి వుండకపోతే మన చరిత్ర మరోవిధంగా వుండేది. తురుష్కులు, ఆఫ్ఘన్‌్‌ దేశాల పాలకుల దండయాత్రలను ఎదుర్కోవటంలో జరిగిన వైఫల్యమే, తరువాత కాలంలో ఐరోపా దేశాల విషయంలో కూడా పునరావృతమై వాటిలో అగ్రశక్తిగా వున్న బ్రిటన్‌ ఆధీనంలోకి మన దేశం వెళ్లిపోయింది.

పొరుగునే వున్న చైనా పరిణామాలు మనకు భిన్నంగా జరిగాయి. హాంకాంగ్‌ను బ్రిటీష్‌వారికి అప్పగించినా అక్కడి క్వింగ్‌ రాజరికం ప్రధాన భూ భాగ ఆక్రమణకు బ్రిటీష్‌ వారికి అవకాశమివ్వలేదు. ఆ రాచరికానికి, బ్రిటీష్‌, ఇతర సామ్రాజ్యవాదుల కుట్రలకు వ్యతిరేకంగా జాతీయవాదులు పోరాడి రాజరికాన్ని అంతమొందించి 1912లో రిపబ్లిక్‌ను ఏర్పాటు చేసుకున్నారు. రాచరిక శక్తులు వాటితో కుమ్మక్కయిన యుద్ధ ప్రభువులు బీజింగ్‌లోని కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని ప్రశ్నించి తిరుగుబాటు చేశారు. వారిని అదుపులోకి తెచ్చేందుకు సన్‌యెట్‌సేన్‌ నాయకత్వంలోని కొమింటాంగ్‌ పార్టీ కమ్యూనిస్టులతో కలసి ఒక జాతీయ సైన్యాన్ని తయారు చేసి యుద్ద ప్రభువులను అణచివేసేందుకు దశాబ్దాల పాటు సాయుధ చర్యలను జరపాల్సి వచ్చింది.ఆ క్రమంలో అదే కొమింటాంగ్‌ పార్టీలోని మితవాదులు కమ్యూనిస్టులను అణచేందుకు పూనుకోవటంతో రెండు శక్తుల మధ్య జరిగిన అంతర్యుద్ధమే కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన ప్రఖ్యాత లాంగ్‌ మార్చ్‌.ఆ క్రమంలోనే 90 ఏండ్ల క్రితం కమ్యూనిస్టు పార్టీ ప్రజావిముక్తి సైన్యాన్ని ఏర్పరచింది.

అంతర్యుద్ధాన్ని అవకాశంగా తీసుకొని జపాన్‌ సామ్రాజ్యవాదులు చైనాను ఆక్రమించుకున్నారు. దానికి వ్యతిరేకంగా మరోసారి కొమింటాంగ్‌-కమ్యూనిస్టులు చేతులు కలిపారు. ఒకవైపు జపాన్‌తో పోరాడుతూనే బలపడుతున్న కమ్యూనిస్టుపార్టీని దెబ్బతీసేందుకు కొమింటాంగ్‌ మితవాదులు మరోసారి కమ్యూనిస్టులను అణచేందుకు ప్రయత్నించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి జపాన్‌ ఓటమితో పాటు కొమింటాగ్‌ సేనలను కూడా కమ్యూనిస్టులు అదుపులోకి తెచ్చారు. 1949 నాటికి అది సంపూర్ణమైంది. అంటే నిజమైన స్వాతంత్య్రం, సమగ్ర చైనా అప్పటికికాని రూపొందలేదు.

మనకంటే రెండు సంవత్సరాలు వెనుక విముక్తమైన చైనాతో పోల్చుకుంటే స్వాతంత్య్రం నాటికి మన పరిస్థితి ఎంతో మెరుగు. తమ అవసరాలకోసమే అయినప్పటికీ బ్రిటీష్‌ వారు మన దేశంలో పరిశ్రమలను ప్రోత్సహించారు, ఆనకట్టలను నిర్మించారు. చైనాకు నల్లమందును దిగుమతి చేసి అక్కడి జనాన్ని నల్లమందు భాయిలుగా మార్చారు. క్వింగ్‌ రాజరికశక్తులు, యుద్ద ప్రభువులు తమ అధికారాన్ని కాపాడుకొనేందుకు ప్రయత్నించారు తప్ప దేశాభివృద్ధి గురించి పట్టించుకోలేదు. కమ్యూనిస్టుల విప్లవానికి ముందు మూడున్నర దశాబ్దాలు జరిగిన, తరువాత పదిహేను సంవత్సరాల పాటు అంటే మొత్తం ఐదు దశాబ్దాలకు పైగా చైనాలో పరిస్ధితులు తిరుగుబాట్లు, కుట్రలతోనే కూడి వున్నాయి, అసలు ఐక్యరాజ్యసమితిలో దానికి 1971వరకు సభ్యత్వం, గుర్తింపే లేదు. పెట్టుబడులు, ఆధునిక పరిజ్ఞానం అందకుండా సామ్రాజ్యవాదులు అడ్డుకున్నారు. మనపరిస్ధితి అది కాదు. సోవియట్‌ సాయం పొంది అనేక పరిశ్రమలు, రక్షణ వుత్పత్తులను పొందాం. చివరకు ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగాలలో సాధిస్తున్న విజయాల వెనుక సోవియట్‌ సాయం ఎంతో వుంది.నాటి నుంచి నేటి వరకు ఒక్క జనాభాలో మాత్రమే మనం చైనాతో పోటీలో వున్నాం.మరో పది సంవత్సరాలలో చైనీయులు అమెరికానే అధిగమించనున్నారని కొందరు అంచనా వేస్తున్న సమయంలో సమవుజ్జీకాని దానితో మన దేశాన్ని పోల్చుకోవటం వృధా ప్రయాసే అవుతుంది.

వర్తమానానికి వస్తే అనేక ఆటంకాలను ఎదుర్కొని చైనా ఆర్ధికంగా బలపడి రెండో స్ధానంలో వున్న జపాన్‌ను వెనక్కు నెట్టి అమెరికా తరువాత పెద్ద శక్తిగా తయారైంది. కొందరు మన దేశం త్వరలో చైనాను అధిగమించే విధంగా పురోగమిస్తోంది అని చెబుతున్నారు. మనం చైనా, ఐరోపా, అమెరికాతోనే పోటీపడి ముందుకు పోతే అంతకంటే కావాల్సింది ఏముంది? పోటీపడాలనే అభ్యుదయవాదులు కోరుకుంటున్నారు.

విధానాలపై ప్రశ్నలు వేసుకొనే ముందు రెండు దేశాలలో వున్న తాజా పరిస్ధితులను ఒక్కసారి చూద్దాం. 1952లో ప్రపంచ జిడిపిలో రెండు దేశాల వాటా దాదాపు సమానం. ఈరోజు మనమెక్కడ, వారెక్కడ ? మనకు ఆరు దేశాలతో సరిహద్దులుంటే చైనాకు 14తో 22వేల కిలోమీటర్లకు పైబడిన భూ సరిహద్దులున్నాయి. ఇలాంటిది ప్రపంచంలో మరొక దేశం లేదు. సముద్రతీరం మనది ఏడువేల కిలోమీటర్లయితే వారికి 14,500 అందువలన దౌత్యపరంగా, సమస్యలతో పాటు మనకంటే రక్షణ ఖర్చూ, దౌత్య అనుభవమూ ఎక్కువే. వ్యవసాయ భూమి మన దేశంలో 64.5శాతం, దానిలో సాగుకు యోగ్యమైంది 52.8శాతం వుంటే చైనాలో అవి 54.7,11.3 శాతాలుగా మాత్రమే వున్నాయి. ప్రపంచ సాగు భూమి వాటా చైనాలో ఏడు శాతం వుంటే జనాభా 21శాతం వుంది. అయినా అక్కడ ఆహార ధాన్యాలకు కొరత లేదు.అమెరికా, జపాన్‌, ఐరోపా ధనిక దేశాలు వందల సంవత్సరాలలో సాధించిన అభివృద్దిని చైనా కొన్ని పదుల సంవత్సరాలలోనే అందుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు సాధించిన చైనాను చూసి మన దేశం కూడా ఎలా ముందుకు పోవాలా అని చూడకుండా మనది ప్రజాస్వామ్యం, వారిది కమ్యూనిస్టు నియంతృత్వం అని పోసుకోలు కబుర్లు చెబితే కుదరదు. వాస్తవాలేమిటని యువత ఆలోచించాల్సిన అవసరం లేదా ?

1987లో ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో చైనా వాటా 1.6శాతం కాగా అది 2012 నాటికి 11.47శాతానికి చేరింది. 1964లోనే 3.1శాతంగా వున్న మన వాటా 1992 నాటికి ఒకశాతానికి పడిపోయింది. ప్రపంచబ్యాంకు తాజా సమాచారం ప్రకారం అమెరికా జిడిపి వాటా 24.32, చైనా 14.84,జపాన్‌ 5.91 శాతాలతో వుండగా మన దేశం 2.83 శాతం దగ్గర వుంది. అంటే జపాన్‌, మన కంటే పెద్దవిగా జపాన్‌ తరువాత వున్న జర్మనీ,బ్రిటన్‌, ఫ్రాన్స్‌లను కూడా దాటి త్వరలో చైనాను అధిగమించే దిశగా నరేంద్రమోడీ నాయకత్వంలో మనం పయనిస్తున్నామనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దానికి తందాన అంటే దేశభక్తులు, మోసపూరిత ప్రచారం, వాస్తవ విరుద్ధం అంటే దేశద్రోహులా ? అయితే మనదేశంలో ఎలాంటి అభివృద్ధి జరగటం లేదా ? అది కార్పొరేట్లను, బిలియనీర్లను పెంచుతున్నది తప్ప సామాన్యులకు మేలు చేయటం లేదనేదే విమర్శ. వుపాధి రహిత అభివృద్ది సంపదలు ధనికుల వద్ద పోగుపడటానికి దారితీస్తుంది తప్ప జనానికి మేలు చేయదు.

స్వాతంత్య్రం తరువాత మన దేశంభూస్వాములతో రాజీపడిన పెట్టుబడిదారీ విధానంలో అభివృద్ధి చెందే బాటను ఎంచుకుంది.దానితోనే సమసమాజాన్ని స్ధాపిస్తామని పాలకవర్గం నమ్మబలికింది. మరోవైపు చైనా కమ్యూనిస్టుపార్టీ సోషలిస్టు వ్యవస్ధతో సమసమాజాన్ని ఏర్పాటు చేయాలనే బాటను ఎంచుకుంది. ఇక్కడే అనేక మంది గందరగోళపడుతున్నారు. వందల సంవత్సరాల పాటు, భూస్వామిక, పెట్టుబడిదారీ వ్యవస్ధలలో వున్న దేశాలు ఒక్క గంతువేసి తెల్లవారేసరికి సోషలిస్టు సమాజాన్ని ఏర్పాటు చేస్తాయని ఎవరూ చెప్పలేదు. చరిత్రను గమనిస్తే ఫ్యూడల్‌ వ్యవస్ధను కూలదోసి పెట్టుబడిదారీ విధానం నేటి వున్నత స్ధితికి చేరుకోవటానికి వందల సంవత్సరాలు పట్టింది. పెట్టుబడిదారీ విధానం నుంచి సోషలిజం వైపు నడుస్తున్న ప్రాధమిక సంధిదశ ఇది.

నిర్దేశిత నమూనాలేవీ లేవు కనుక తన అనుభవాల ఆధారంగా చైనా కమ్యూనిస్టు పార్టీ తనదైన ప్రత్యేక తరహా( దానినే చైనా లక్షణాలతో కూడిన అంటున్నారు) సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేస్తున్నట్లు ప్రకటించింది. భిన్న దశలలో వున్న దేశాలలో ఒకే విధంగా సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం సాధ్యం కాదన్నది స్పష్టం. 1949 నుంచి 1978 వరకు తన బాటను సమీక్షించుకున్న చైనా కమ్యూనిస్టుపార్టీ దానికి భిన్నంగా కొన్ని సంస్కరణలు అవసరమని భావించింది. 1978లో చైనా సంస్కరణలను ప్రవేశ పెట్టింది. అంతకు ముందు అక్కడ అభివృద్ధి లేదా? ఆరుశాతానికి అటూఇటూగా వుండేది. అంతమంది జనానికి పని కల్పించాలన్నా, వారి జీవితాలను మెరుగుపరచాలన్నా ఆ వృద్ధి రేటు, ఆదాయాలు చాలవని కమ్యూనిస్టుపార్టీ గుర్తించింది.ఆ సంస్కరణలు కొన్ని కొత్త సమస్యలను సృష్టించినప్పటికీ మొత్తం మీద జనజీవితాలను ఎంతగానో మెరుగుపరిచాయి. ఇదే సమయంలో కొత్త ధనిక తరగతిని కూడా సృష్టించాయి. మొత్తం మీద మొగ్గు ఎటుఅంటే జనజీవితాల మెరుగుదల, దారిద్య్రనిర్మూలన వైపే అన్నది స్పష్టం.మిలీనియం అభివృద్ధి లక్ష్యాలను గడువు కంటే ముందుగా చైనా చేరుకుంది. ఆ విషయాన్ని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌, ప్రపంచ ఆర్ధిక వేదిక వంటి సంస్ధలన్నీ తమ నివేదికలలో పుంఖాను పుంఖాలుగా పేర్కొన్నాయి.

1978 నుంచి చైనా సంస్కరణలు విఫలమౌతాయని అనేక మంది చెప్పిన జోశ్యాలన్నీ ఇప్పటివరకు విఫలమయ్యాయి. చైనా ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం అమలు జరుపుతున్నదని చెప్పటమే ఒక వక్రీకరణ. అసలు అక్కడ పెట్టుబడిదారీ విధానమే వుందని చెప్పేవారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ మూలస్ధంభాల వంటి అమెరికా, ఐరోపా ధనిక దేశాలలో 2008లో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం లేదా మాంద్యం చైనా వేగాన్ని కొంత మేరకు తగ్గించింది తప్ప సంక్షోభంలోకి ఎందుకు నెట్టలేదు? ఈ కాలంలోనే అది జపాన్‌ను వెనక్కు నెట్టి రెండవ దేశంగా ముందుకు రావటం ఎలా సాధ్యం? నిజాయితీగా ఆలోచించేవారికి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకటం కష్టం కాదు.

తనకున్న అపార మానవవనరును ఆర్ధిక శక్తిగా మార్చేందుకు చైనా విదేశాల నుంచి పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తన షరతుల మీద ఆమోదించింది. పెట్టుబడిదారీ వ్యవస్ధలో అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా వున్న హాంకాంగ్‌, మకావో దీవుల కౌలు గడువు ముగిసిన సందర్భంగా అక్కడి పెట్టుబడులు తరలి పోకుండా చూసేందుకు, అవి ప్రధాన చైనాలో కొనసాగేందుకు ఒకే దేశం- రెండు వ్యవస్ధలు అనే విధానాన్ని 2050వరకు అమలు జరుపుతామని ప్రకటించింది. అంటే ప్రధాన భూభాగంలో చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ద, హాంకాంగ్‌, మకావుల్లో నెలకొన్న పెట్టుబడిదారీ వ్యవస్దలను కూడా కొనసాగనిస్తామని స్పష్టం చేసింది. హాంకాంగ్‌లో డాలర్లు, చైనాలో యువాన్‌ కరెన్సీ. ఇదొక ప్రయోగం. ఈ కారణంగా హాంకాంగ్‌ కేంద్రంగా వున్న అనేక కంపెనీలు ఎలాంటి భయం లేకుండా చైనాలో పెట్టుబడులు పెడుతున్నాయి. దాని వలన చైనాతో పాటు ఆ కంపెనీలు కూడా లాభపడుతున్నాయి. సంస్కరణల ప్రారంభంలో వాటికి ఆద్యుడైన డెంగ్‌ సియావో పింగ్‌ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. గాలికోసం కిటికీ తెరిచినపుడు మంచిగాలితో పాటు దోమలూ, ఈగలు కూడా వస్తాయి, వాటిని ఎలా అదుపు చేయాలో మాకు తెలుసు అన్నారు.

ప్రపంచ ధనిక దేశాలలో కొనసాగుతున్న మాంద్యం కారణంగా చైనా వస్తువులకు కొంత డిమాండ్‌ తగ్గినమాట వాస్తవం. ఆ కారణంగా అక్కడ లేఆఫ్‌లు జరిగినట్లు వార్తలు లేవు. ఎందుకని ? విదేశీ ఎగుమతులు తగ్గినదానికంటే స్వదేశీ వినియోగం ఎక్కువగా పెరుగుతోంది. 2008లో చైనా కార్మికుడి వార్షిక సగటు వేతనం 29,229 యువాన్లు వుంటే 2016లో అది 67,596కు చేరిన కారణంగా అంతర్గత వినియోగం పెరిగింది. అందుకే చైనా ముందుకు పోతోంది. ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మన మాదిరి కార్పొరేట్‌ సంస్ధలకు రాయితీలు ఇవ్వటం గాక జనానికి మరలిస్తున్నకారణంగానే వారి వస్తువినియోగం పెరుగుతున్నది. చైనా విజయ రహస్యం అదే. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో పేదరిక సమస్య వుందని చైనాయే స్వయంగా చెబుతోంది.

చైనాలో ఏటేటా వేతనాలు పెరుగుతున్నందున ఇంకేమాత్రం అక్కడ చౌకగా వుత్పత్తి చేయటం సాధ్యం కాదని అనేక కార్పొరేట్‌ సంస్ధలు అంతకంటే శ్రమశక్తి చౌకగా దొరికే చోట్లను వెతుకుతున్నాయి. ఈ పూర్వరంగంలోనే మేకిన్‌ ఇండియా పేరుతో మన దేశంలోకి విదేశీ పెట్టుబడులను నరేంద్రమోడీ ఆహ్వానిస్తున్నారు. వాటికి ఎలాంటి కార్మిక చట్టాలు వర్తించకుండా రక్షణ కల్పించేందుకు పూనుకున్నారని వేరే చెప్పనవసరం లేదు. ఇటువంటి విధానాలు అనుసరించటమంటే ఏమిటి ? గతంలో బ్రిటీష్‌ వాడు మన దేశంలోని రాజుల, రంగప్పల అనుమతి కోరి మన దేశంలో వ్యాపారం ప్రారంభించాడు. ఎర్రతివాచీ పరచి చక్కగా ఏర్పాట్లు చేస్తాము వచ్చి మా కార్మికుల శ్రమను దోచుకుపోండని విదేశీయులను మనమే ఆహ్వానిస్తున్నాము.

ఈ మధ్యకాలంలో కొందరు చైనా వ్యతిరేకులు చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపులు ఇస్తున్నారు. తద్వారా అందరూ దేశ భక్తిని నిరూపించుకోవాలని చెబుతున్నారు. మన దేశాన్ని ఆక్రమించి మన సంపదల మూల్గులు పీల్చుతున్న బ్రిటీష్‌ వారిని తరిమివేసేందుకు సాగిన స్వాతంత్య్ర వుద్యమంలో విదేశీ వస్తుబహిష్కరణ అన్నది ఒక ఆయుధం. ఆ వుద్యమానికి దూరంగా వుండి బ్రిటీష్‌ వారితో చేతులు కలిపిన ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర హిందూత్వ సంస్ధలకు చెందిన వారే ఇప్పుడు చైనా వస్తువు బహిష్కరణకు విఫల పిలుపులు ఇస్తున్నారు. మన దేశంతో సహా ప్రపంచంలో తయారయ్యే కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, అవి పని చేసే వ్యవస్ధలలో చైనా వస్తువులు లేదా చైనాలో తయారైన విడిభాగాలు లేనిదెక్కడ? అందువలన ముందుగా వారు తమ సెల్‌ఫోన్లు, కంప్యూటర్లను తగులబెట్టి మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చిన నరేంద్రమోడీగారి ఫ్యాక్టరీలలో తయారైన నిఖార్సయిన స్వదేశీ వస్తువులను వాడి చూపమని అడగాలి.

చౌకబారు రాజకీయం కాకపోతే ఒక్క చైనాయేం ఖర్మ అన్ని రకాల విదేశీ వస్తువులను బహిష్కరించి వాటిని మన దేశంలోనే తయారు చేసుకోవటానికి ఎవరు అడ్డుపడుతున్నారు?. అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ సమాచారం ప్రకారం 2016లో చైనా 2011 బిలియన్‌ డాలర్లు, హాంకాంగ్‌ 487 బిలియన్‌ డాలర్ల మేరకు ఎగుమతులు చేసింది. ఒకే చైనాగా లెక్కవేస్తే 2497 బిలియన్‌ డాలర్లు. దానిలో మనం దిగుమతి చేసుకొనేది కేవలం 58 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులనే. వాటి దిగుమతులను నిలిపివేస్తే చైనా దారికి వస్తుందని చెబితే అమాయకులు తప్ప ఎవరు నమ్ముతారు.

చివరిగా మన సంస్కరణల విజయవంతం గురించి ముచ్చటించుకోకపోతే అసంపూర్ణం అవుతుంది. కాంగ్రెస్‌ పాలనలో సంస్కరణలు విఫలమయ్యాయని, అభివృద్ధి ఏదైనా వుంటే అది వుపాధిరహితంగా జరిగి కార్పొరేట్లకే ప్రయోజనం జరిగిందన్నది స్పష్టం. నరేంద్రమోడీ సర్కార్‌ ఆ విఫల విధానాల కొనసాగింపు తప్ప కొత్తదనం ఏముంది? గతనెలలో ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక సహకార కూటమి(ఆర్‌సిఇపి) సమావేశాలు హైదరాబాదులో జరిగాయి.దానిలో చైనా భాగస్వామి. వాటిలోని కొన్ని అంశాలు మన దేశ పౌరుల ప్రయోజనాలకు హానికలిగిస్తాయని వామపక్ష, ఇతర అభ్యుదయ భావాలు కలిగిన వారు వ్యతిరేకత, నిరసన తెలిపారు తప్ప కాషాయ దళాల జాడలేదెందుకని? ఏదేశమైనా పరిశోధన, అభివృద్ధికి తగిన మొత్తాలను ఖర్చు చేయకుండా అభివృద్ధి చెందజాలదు. మనం 2015 తలసరి 39.37, చైనా 298.56 డాలర్లు ఖర్చు చేశాయి. ఇంత తక్కువ ఖర్చు చేయమని ఏ ప్రజాస్వామిక వాది చెప్పాడు. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు ఒక ఎత్తయితే నరేంద్రమోడీ సర్కార్‌ వాటిని కొత్త పుంతలు తొక్కించింది. ఆవు పేడలో ఏం దాగుంది, మూత్రంలో ఏమున్నాయో పరిశోధించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అసలే కేటాయింపు తక్కువ, దాన్ని ఆవు సైన్సు మీదకు మళ్లింపా ! ఇలాంటి పరిశోధనలతో చైనాను అధిగమిస్తామా ! ప్రపంచం నవ్విపోతుంది. చైనా గాకపోతే మరొక మంచి విధానాన్ని అమలు జరపండి ! పిల్లి నల్లదా తెల్లదా అని కాదు, ఎలుకలను పడుతుందా లేదా అన్నది చూడాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా- భూటాన్‌ మధ్య వివాదంలో భారత్‌ !

08 Saturday Jul 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

anti china, Bhutan, Chicken neck, China, Indo-China, Indo-China standoff, Nathu La

ఎం కోటేశ్వరరావు

వర్తమాన ప్రపంచంలో జరిగే యుద్ధాలలో జనాలకు నష్టాలు, కష్టాలే తప్ప విజయాలు ఎక్కడా కనిపించటం లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో అంత పెద్ద అమెరికా పెద్ద సంఖ్యలో సైన్యాన్ని ఆయుధాలు కుమ్మరించి కూడా తాను పెంచి పెద్ద చేసిన తాలిబాన్లు చివరకు ఏకు మేకైనట్లుగా మారటంతో వారిని అణచలేక అలసిపోయి వెనుదిరిగి వచ్చింది. రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లు తోటి తోడేలు రాజ్యాలైన బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి అనేక దేశాలను కూడా ఏదో రూపంలో ఆ యుద్ధంలో దించి వాటి చేత కూడా భారీగా ఖర్చు చేయించిన విషయం తెలిసిందే. క్యూబా, వుత్తర కొరియా, వియత్నాం ఇలా ఏ చిన్న దేశం కూడా అమెరికా సైనిక పాటవాన్ని చూసి భయపడలేదు, భవిష్యత్‌లో భయపడవు. తాజాగా వుత్తర కొరియా పరీక్షించిన ఖండాంతర క్షిపణిని నిజంగా గురి పెడితే వేల కిలోమీటర్ల దూరంలోని అమెరికాలోని ఒక ప్రాంతంలో కావాల్సినంత విధ్వంసం సృష్టించగలదని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మీకు మా వూరెంత దూరమో మాకు మీ వూరూ అంతే దూరం అన్నది వుత్తర కొరియా ప్రయోగ సందేశం. ఇటు వంటి పరిస్ధితులలో ఇక్కడి కోడి కూస్తే అక్కడకు, అక్కడి కోడి కూత ఇక్కడకు వినిపించే దూరంలో వున్న చైనా-మన దేశం మధ్య తలెత్తిన వివాదం ఎంత వరకు దారితీస్తుందన్నది దేశంలో ఒక పెద్ద చర్చగా వుంది. నిజానికి ఇది చైనా-భూటాన్‌ మధ్యలో భారత్‌ దూరటం అంటే సముచితంగా వుంటుంది.అందుకు గాను http://thebhutanese.bt/understanding-the-doklam-border-issue/  ది భూటానీస్‌ పత్రిక సంపాదకుడు టెన్సింగ్‌ లామ్‌సాంగ్‌ రాసిన పై వ్యాఖ్య పూర్తి పాఠాన్ని ఆసక్తి వున్నవారు చదువుకోవచ్చు.

తాజా వివాదంపై చైనా-భారత మీడియా వార్తల తీరు తెన్నులు, సామాజిక మీడియాలో వుభయ దేశాల మధ్య మైత్రిని గాక శతృత్వాన్ని కోరుకొనే వారి పోస్టులు, వ్యాఖ్యలను కాసేపు పక్కన పెట్టి వివాద పూర్వరంగాన్ని చూడటం అవసరం. సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరేవారు దేశద్రోహులు కాదు, అవకాశం వచ్చినపుడు అమీ తుమీ తేల్చుకోవాలని చెప్పే వారు దేశ భక్తులు అంతకంటే కారు. మన సైనికుల ప్రాణాలు, వారి కుటుంబాల వేదన, రోదనలు, యుద్ధాలు జరిగితే మన జనంపై పడే భారాల వంటి అనేక విషయాలను ఆలోచించాల్సి వుంటుంది. దీని అర్ధం మన జాగ్రత్తలు మనం తీసుకోవద్దని, వివాదం లేని మన భూభాగాన్ని పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవద్దని కాదు. వివాదాలు లేని రోజుల్లో కూడా మన రక్షణ యంత్రాంగం నిరంతరం అదే పనిలో నిమగ్నమై వుంటుంది.

అనేక వుదంతాలను చూసిన తరువాత యుద్ధాలు వద్దు, శాంతి కావాలి, ఆయుధాలకు తగలేసే ఖర్చును అభివృద్ధికి వినియోగించాలి అన్న భావం ప్రపంచ వ్యాపితంగా ఏదో ఒక మూల రోజూ వినిపిస్తూనే వుంది. అదే విధంగా చంపు, కొట్టు, నరుకు అనే వున్మాదం తలకెక్కిన వారు కూడా గణనీయంగా వున్నారు గనుకే హిట్లర్‌ వంటి నరహంతకులు తయారవుతున్నారు. ఆ కారణంగానే లాభాల కోసం పని చేసే ప్రపంచ యుద్ధ పరిశ్రమలలో ఎలాంటి సంక్షోభం కనిపించటం లేదు. వాటికోసం అమెరికా సామ్రాజ్యవాదులు ప్రపంచంలో ఏదో ఒకచోట నిత్యం యుద్ధాలను కొనసాగిస్తూనే వున్నారు. తిరుగుబాట్లను రెచ్చగొడుతూ అటు తీవ్రవాదులు-ప్రభుత్వాలకు కూడా ఆయుధాలు విక్రయిస్తూ లాభాలు పోగేసుకుంటున్నారు. ఆయుధ వుత్పత్తి సంస్ధలలో అత్యధికం సామ్రాజ్యవాదుల వెన్నుదన్ను వున్న కార్పొరేట్ల చేతులలో వున్నాయని వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు మన దేశంలో వున్న పరిస్ధితులలో చైనా లేదా పాకిస్ధాన్‌తో యుద్ధం, యూదు మత దురహంకారి అయిన ఇజ్రాయెల్‌తో సంబంధాలు వద్దు అని చెప్పేవారిని దేశ ద్రోహులుగా చిత్రిస్తారని, వెంటాడి వేధిస్తారని తెలుసు. నేనయితే రక్తం ఏరులై పారాలని, యుద్ధం కావాలని కోరుకొనే పని పాటలు లేని దేశ భక్తుడిని కాదు. మీడియాలో రాస్తున్న వార్తలలో తమకు అనుకూలంగా వున్న వాటిని చూసి ఆవేశం తెచ్చుకొనే రకాన్ని అంతకంటే కాదు. సామాజిక మీడియాలో వీరావేశం ప్రదర్శించేవారందరూ సరిహద్దులకు కాదు కదా ఫేస్బుక్‌ దాటి బయట కాలు పెట్టరు. యుద్ధానికి ముందు సమాధి అయ్యేది నిజం. ఏదేశానికి ఆదేశ పాలకులు, అధికార యంత్రాంగం తమకు అనుకూలమైన సమాచారాన్ని, టీకాతాత్పర్యాలను మాత్రమే జనం ముందుంచుతుంది.

వుదాహరణకు జూన్‌ 19న వాతావరణం సరిగా లేని కారణంగా మన దేశంలోని సిక్కిం నుంచి బయలు దేరాల్సిన మానస సరోవర యాత్రికులు నిలిచిపోయారని తొలి వార్తలు వచ్చాయి. తరువాత 23న రోడ్డు మార్గం సరిగా లేని కారణంగా చైనా వారు నాథూలా కనుమ గేట్లు తెరవలేదని, తరువాత యాత్రికులను వారు అనుమతించటం లేదని వార్తలు వచ్చాయి. ఎందుకిలా జరిగిందో తెలియదని మన విదేశాంగశాఖ అధికారులు వ్యాఖ్యానించారు. అసలు విషయాన్ని చైనా లేదా మన ప్రభుత్వం గానీ 30వ తేదీ వరకు వెల్లడించలేదు. తన ఆధీనంలో వున్న డోక్లాం ప్రాంతంలోని డోక్లాలో చైనా రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించింది. అది తమ ప్రాంతమని భూటాన్‌ వాదిస్తోంది. అయితే అది చైనా ఆధీనంలో వుంది. రోడ్డు నిర్మాణంపై భూటాన్‌ అభ్యంతరాలను చైనా ఖాతరు చేయలేదు. దాంతో భూటాన్‌ అధికారులు మన దేశానికి నివేదించారు. భూటాన్‌తో మనకు రక్షణ ఒప్పందం వుంది కనుక వివాదాస్పద భూటాన్‌ ప్రాంతాన్ని రక్షించే పేరుతో మన సేనలు డోక్లాం ప్రాంతంలో వ్రవేశించి చైనా సిబ్బంది వేస్తున్న రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్నాయి. దానికి ప్రతిగా మానస సరోవర యాత్రను చైనా నిరాకరించింది. నాథులా కనుమ మానస సరోవరానికి దగ్గరి దారి, దీనిని రెండు సంవత్సరాల క్రితం చైనా అనుమతించింది. సరిహద్దులలోని ఇరు దేశాల సైనికుల మధ్య తలెత్తిన వివాదం దృష్ట్యా భద్రతాపరమైన కారణాలతో ఈ మార్గాన్ని మూసివేశామని, ఇతర మార్గాల ద్వారా అనుమతిస్తున్నామని చైనా ప్రకటించింది. తమ భూ భాగంలో తాము నిర్మించుకుంటున్న రోడ్డును భారత బలగాలు అడ్డుకోవటమేగాక, బంకర్లు కూడా నిర్మించాయని, తమ ప్రాంతంలో తిష్ట వేశాయని చైనా ప్రకటించింది. చైనా సైనికులే మన భూ భాగంలో ప్రవేశించి మప బంకర్లను కూల్చివేశారని మన దేశంలోని మీడియా వార్తలను అందించింది.

భారత్‌-చైనా- భూటాన్‌ సరిహద్దు మూడు ప్రాంతాల కూడలి కోడి మెడ ఆకారంలో వుంటుంది. ఆ ప్రాంతంలోని సిక్కిం దగ్గరి సరిహద్దుతో మనకూ చైనాకు వివాదాలు లేవు. అయితే భూటాన్‌- చైనాల మధ్య ప్రాంతాల విభజనపై ఆ రెండు దేశాల మధ్య వివాదం వుంది. ప్రస్తుతం మన సేనలు ప్రవేశించినట్లు చెబుతున్న ప్రాంతం తనదని భూటాన్‌ వాదిస్తుండగా తమ ఆధీనంలో వున్న తమ ప్రాంతమని చైనా చెబుతున్నది. దానిని భూటాన్‌ గుర్తించలేదు. ఈ వివాదానికి సంబంధించి భూటానీస్‌ పత్రిక సంపాదకుడు రాసిన వ్యాఖ్య సారాంశం ఇలా వుంది.’ సరిహద్దు గురించి అంతిమ పరిష్కారం జరిగే వరకు యథాతధ స్ధితితో పాటు ఆ ప్రాంతంలో శాంతి, సామరస్యాలను పాటించాలని 1988,1998లో వుభయ(చైనా-భూటాన్‌) దేశాలు చేసుకున్న రాతపూర్వక ఒప్పందాలను భూటాన్‌ ప్రాంతంలో రోడ్డు నిర్మించటం ద్వారా చైనా అతిక్రమించిందని భూటాన్‌ విదేశాంగశాఖ జూన్‌ 29న ప్రకటించింది. భూటాన్‌ సైనిక శిబిరం వున్న జొంపెలిరీ వైపునకు దారితీసే విధంగా డోక్లా ప్రాంతంలో చైనా జూన్‌ 16న రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించింది. ఢిల్లీలో వున్న భూటాన్‌ రాయబారి ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయానికి దీనిపై అభ్యంతరం తెలిపారు. ఈ పరిణామాల గురించి ఎప్పటికప్పుడు భారత్‌కు భూటాన్‌ తెలియచేస్తున్నది. డోక్లా సాధారణ ప్రాంతంలో వున్న భారత సైన్యం భూటాన్‌ ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని రోడ్డు నిర్మాణం జరుపుతున్న చైనా సిబ్బంది వద్దకు వెళ్లి నిర్మాణం నిలిపివేసి యథాతధ స్ధితిని కొనసాగించాలని కోరింది. ఆ నిర్మాణం యథాతధ స్దితిలో గమనించదగిన మార్పునకు దారితీయటమే గాక భారత్‌ రక్షణకు తీవ్రమైన పర్యవసానాలు ఎదురవుతాయని చైనాకు తెలియచేసింది. 2012లో భారత్‌-చైనాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మూడు దేశాల కూడలి సరిహద్దులపై వుభయ దేశాలతో పాటూ మూడవ పక్ష దేశాలతో కూడా సంప్రదించి ఖరారు చేసుకోవాల్సి వుండగా ఈ అవగానకు విరుద్దంగా చైనా రోడ్డు నిర్మాణం చేపట్టిందని భారత్‌ అభ్యంతరం తెలిపింది. ఆ ప్రాంతం తమదే అంటూ చైనా తన చర్యను సమర్ధించుకుంది.

సంఘటన జరిగిన ప్రాంతం గురించి గందరగోళం వున్నట్లు కనిపిస్తోంది. అది మూడు దేశాల కూడలి. కొన్ని కిలోమీటర్ల పరిధిలోనే మూడు దేశాలు కలుసుకోగలిగిన ఇరుకైన ప్రాంతం. ఎవరికి వారు తమ దైన పేరుతో దానిని సాధారణ ప్రాంతంగా పిలుస్తున్నారు. సంఘటన జరిగిన డోక్లాంలో పెద్ద ప్రాంతం భూటాన్‌దే. సామాజిక మీడియాను అనుసరిస్తున్న కొందరు భూటానీయులు మరో వివాదాస్పదమైన ఫూటెగాంగ్‌ ప్రాంత రోడ్డుపై వివాదం జరిగినట్లు గందరగోళపరుస్తున్నారు. దానికి ఒకవైపు చైనా మరోవైపు భూటాన్‌ అవుట్‌పోస్టులున్నాయి. అక్కడెలాంటి సంఘటన జరగలేదు.డోక్లాం ప్రాంతంలో నిర్మిస్తున్న రోడ్డును నిలిపివేయాలని భూటాన్‌ సైన్యం చేసిన ప్రయత్నానికి చైనా నిరాకరించింది. తరువాత ఆ ప్రాంతానికి వచ్చిన భారతీయ సైన్యం రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేసింది. దానికి ప్రతిగా తరువాత వచ్చిన చైనా సైన్యం ఇరుకుగా వున్న ఆప్రాంతంలో భారత సైనికులు నిర్మించిన చిన్న మిలిటరీ అవుట్‌పోస్టులను ధ్వంసం చేసింది.

చైనా విషయానికి వస్తే చుంబీ లోయలోని యాడోంగ్‌ పట్టణం వరకు పెద్ద రోడ్డు నిర్మాణం జరిపింది. భూటాన్‌, భారతవైపు అనేక రోడ్ల నిర్మాణానికి పూనుకుంది. అయినప్పటికీ ముఖ్యంగా భారత్‌కు కోడి మెడ కూడలి ప్రాంతంవైపు దక్షిణదిశగా నిర్మించే రోడ్డు దాని భద్రతకు హాని కలిగిస్తుందని భావిస్తోంది. ఆ ప్రాంతం దాని ఏడు ఈశాన్య రాష్ట్రాలను కలుపుతుంది.వాటిలో కొన్నింటిలో తీవ్రవాద సమస్యలున్నాయి. చుంబీలోయలో చైనా ప్రాంతం వున్నప్పటికీ ఇరుకుగా వుండటంతో చైనాకు స్ట్రాటజిక్‌ షోల్డర్స్‌ (భుజంతో కాచుకొనే, మార్చుకొనే వీలు) లేవు. అందుకే అది భూటాన్‌కు చెందిన 269 చదరపు కిలోమీటర్ల ప్రాంతం కావాలని, దానిలో సులభంగా మసల వచ్చని చైనా భావిస్తోంది. అదే జరిగితే తనకు పెద్ద ముప్పని భారత్‌ భావిస్తోంది. భూటాన్‌ విషయానికి వస్తే ఏ ప్రాంతాన్ని కోల్పోవటానికి, చొరబాట్లను అంగీకరించటానికి సిద్దంగా లేదు. వ్యూహాత్మక ప్రాధాన్యత రీత్యా 1996లో చైనా ఒకప్యాకేజ్‌ను ప్రతిపాదించింది. దాని ప్రకారం డోక్లాంలో తనకు 269 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని వదిలితే భూటాన్‌ వుత్తర ప్రాంతంలో తమదిగా వున్న 495 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని భూటాన్‌కు బదలాయిస్తామని చైనా ప్రతిపాదించింది.

భూటాన్‌-చైనా సరిహద్దు వివాదం 1959లో చైనా సైన్యం టిబెట్‌, భూటాన్‌లో ప్రవేశించి తదుపరి భూటాన్‌ వుత్తర సరిహద్దులను మూసివేసినప్పటి నుంచి ప్రారంభమైంది. అప్పటి పరిణామాలలో భారత్‌కు భూటాన్‌ చేరువైంది. భూటాన్‌-టిబెట్‌ మధ్య పారేనీటి వాలును బట్టి సరిహద్దులనిర్ణయం జరగాలన్న సాంప్రదాయ పద్దతిని చైనా అంగీకరించటం లేదు. తొలుత సరిహద్దు సమస్యను భారత్‌తో సంప్రదించి, దాని ద్వారా చైనాతో భూటాన్‌ చర్చలు జరిపింది. 1984 నుంచి చైనాతో నేరుగా భూటానే చర్చలను ప్రారంభించింది. అప్పటి నుంచి 2016 వరకు 24సార్లు వుభయ దేశాల మధ్య చర్చలు జరిగాయి.’

చైనా నిర్మిస్తున్న రోడ్డు భూటాన్‌ -చైనా మధ్య వున్న వివాదాస్పద ప్రాంతమైనప్పటికీ మూడు దేశాల సరిహద్దు కూడలికి దగ్గరగా రోడ్డు వున్నందున, అది మిలిటరీ రీత్యా కీలక ప్రాంతమైనందున మన దేశం ఆందోళన వెలిబుచ్చటం సహేతుకమే. అలాంటి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సి వుంది. భూటాన్‌ తరఫున మన సైన్యం రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవటమే మన దేశం-చైనా మధ్య వివాదానికి కారణంగా కనిపిస్తోంది. రెండు దేశాల ప్రతినిధులు పరిమితులకు మించి చేసిన వ్యాఖ్యలు దానిని మరింత పెంచాయి. తమ భూ భాగం నుంచి భారత సైనికులు వైదొలిగితేనే తాము చర్చలు జరుపుతామని చైనా షరతు విధించింది.

గత కొంత కాలంగా చైనా పట్ల మనం, దానికి ప్రతిగా చైనా మనపట్ల అనుసరిస్తున్న వైఖరి రెండు దేశాల మధ్య పరస్పర అనుమానాలను పెంచుతున్నది. మనకు ప్రత్యక్షంగా సంబంధంలేని దక్షిణ చైనా సముద్ర వివాదం వంటి విషయాలలో కూడా మన దేశం అనుసరిస్తున్న వైఖరి చైనాకు మింగుడు పడటం లేదు. అందుకే అది మన దేశానికి సంబంధించిన కొన్ని విషయాలలో వేరే విధంగా స్పందిస్తున్నది. తమ చుట్టూ అమెరికన్లు బిగిస్తున్న మిలిటరీ వ్యూహానికి ప్రతిగా స్వయం రక్షణ చర్యలలో భాగంగా చైనా కూడా తనదైన పద్దతులలో ముందుకు పోతున్నది. ఈ పూర్వరంగంలోనే తాజా సమస్యను చూడాల్సి వుంది. ప్రపంచంలో ఏ దేశానికి ఆదేశం తన ఆర్ధిక ప్రయోజనాలను కాపాడుకొనేందుకు అనేక చర్యలను తీసుకొంటోంది. వాటిలో రాజకీయ కోణాన్ని చొప్పిస్తేనే సమస్యలు సంక్లిష్టంగా మారతాయి.

దలైలామా చైనాపై తిరుగుబాటు చేసి మన దేశానికి వచ్చి ఇక్కడ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి టిబెట్‌పై చైనా అధికారాన్ని సవాలు చేస్తున్నాడు. టిబెట్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగంగా మన దేశం గుర్తిస్తూనే దలైలామాకు ఆశ్రయం కల్పించటం, చైనా వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించటాన్ని చైనా అభ్యంతర పెడుతున్నది. తమ టిబెట్టులోని దక్షిణ ప్రాంత మంటూ మన ఆధీనంలో వున్న అరుణాచల్‌ ప్రదేశ్‌ను గుర్తించేందుకు చైనా నిరాకరిస్తున్నది. అక్కడ పర్యటించటానికి దలైలామాను అనుమతించవద్దని అభ్యంతరం చెప్పింది. అరుణాచల్‌ మన భూ భాగమని దానిలో ఎవరు పర్యటించాలో వద్దో చెప్పే అధికారం చైనాకు లేదంటూ మన సార్వభౌమత్వాన్ని వెల్లడించే చర్యలో భాగంగా మన ప్రభుత్వం దలైలామా పర్యటనకు ఏర్పాట్లు చేసింది. అంతే కాదు దాని రక్షణకు అవసరమైతే సత్వరం సైన్యాన్ని, ఇతర సామాగ్రిని తరలించేందుకు వీలుగా అరుణాచల్‌ తూర్పు ప్రాంతానికి వెళ్లేందుకు మన ప్రభుత్వం పొడవైన వంతెనను కూడా నిర్మించింది. ఇది చైనా సరిహద్దులకు చేరువలో వుంది. అదే విధంగా రైలు మార్గ నిర్మాణానికి కూడా తలపెట్టింది. చైనా కూడా మన సరిహద్దులకు దగ్గరగా సైనిక రవాణాకు వీలు కల్పించే ఒక ముఖ్యమైన రైలు మార్గాన్ని టిటెట్‌లో నిర్మించిన విషయం బహిరంగమే. అందువలన ఎవరి రక్షణ చర్యలు వారు తీసుకోవటం ప్రపంచమంతటా జరుగుతున్నదే. వుదాహరణకు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయాలని మన దేశంపై పశ్చిమ దేశాలు ఎప్పటి నుంచో వత్తిడి చేస్తున్నాయి. ప్రపంచశాంతి కావాలని మన దేశంలో కోరుకొనే శక్తులు కూడా ఆ ఒప్పందంపై సంతకం మన దేశం చేయవద్దనే చెబుతున్నాయి. మన సార్వభౌమత్వ రక్షణకు అణ్వాయుధాలను తయారు చేసుకొనే హక్కును మనం అట్టిపెట్టుకోవాలని తప్ప ఆయుధాలు తయారు చేసి అమెరికా మాదిరి మిగతా దేశాల మీద ప్రయోగించాలని కాదు. అణుయుద్దమే వస్తే ఏ ఒక్కదేశమూ మిగలదు. మిగతా దేశాలు కూడా అణ్వాయుధాలు తయారు చేశాయి గనుకనే అమెరికా ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యవహరిస్తోంది.

చైనాతో సంబంధాల విషయాన్ని కూడా మన ప్రయోజనాలను కాపాడుకొంటూ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకుంటూ ముందుకు పోవటం ప్రయోజనదాయకమని గత అనుభవాలు నిరూపించాయి.1962లో రెండు దేశాల మధ్య జరిగిన యుద్దం సందర్భంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలనే వైఖరిని వెల్లడించినందుకు నాటి ప్రభుత్వం వుమ్మడి కమ్యూనిస్టుపార్టీ నుంచి ఆతరువాత సిపిఎంగా కొత్త పార్టీని ఏర్పాటు చేసిన నాయకత్వాన్ని నాటి ప్రభుత్వం అరెస్టు చేసింది. సిపిఎంను చైనా అనుకూల పార్టీగా ముద్రవేశాయి. ఇప్పటికీ రాజకీయ ఓనమాలు తెలియని వారు అదే విధంగా నిందలు వేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ తదితర సంస్ధలు దేశభక్తి పేరుతో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టాయి. తరువాత జరిగిన పరిణామాలలో సిపిఎం నాయకత్వం చెప్పినట్లు వుభయ దేశాలు సరిహద్దు సమస్యపై సామరస్యపూర్వక చర్చలను ప్రారంభించటంతో పాటు సంబంధాలను మెరుగుపరచుకోవటం చూశాము. చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వాజ్‌పేయి జనతాపార్టీ హయాంలో విదేశాంగ మంత్రిగా, తరువాత ప్రధానిగా పని చేసినప్పటికీ చైనాతో సంబంధాల మెరుగుదలకే కృషి చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ అదే ఆర్‌ఎస్‌ఎస్‌ చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతూనే వుంది. ఇప్పుడూ దాని శ్రేణులు అదే చేస్తున్నాయి. తాజా వివాదాన్ని కూడా పరస్పర విశ్వాసం పాదుకొల్పే చర్యలతో పరిష్కరించుకోవటం తప్ప ఆయుధాలతో పరిష్కారమయ్యేది కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

విస్మరించజాలని కమ్యూనిస్టు ప్రణాళిక, కమ్యూనిస్టు పార్టీల ప్రాధాన్యత

09 Thursday Mar 2017

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Political Parties, RUSSIA, USA

≈ 1 Comment

Tags

China, china communist party, communist manifesto, Engels, Marx, Marx and Engels, Narendra Modi, Xi Jinping

Image result for one cannot deny the importance of the communist manifesto

ఎం కోటేశ్వరరావు

ఏ తర్కానికైనా దానికి ఒక న్యాయబద్దమైన ముగింపు వుంటుంది. తర్కంలో పాల్గొనేవారు తమకు అనుకూలమైనంత వరకే స్వీకరించి ఎదుటి వారికి సరైన సమాధానం చెప్పకపోతే చివరకు ఆ తర్కం అసంబద్దంగా ముగుస్తుంది. వుదాహరణకు కమ్యూనిజానికి కాలం చెల్లింది, అది పనికిరాదు అంటారు. అదే నిజమైతే ప్రపంచవ్యాపితంగా కమ్యూనిజం గురించి అనుకూలంగానో వ్యతిరేకంగానో ఎందుకు చర్చ జరుగుతోంది?

కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ రచించిన కమ్యూనిస్టు ప్రణాళిక తొలి ముద్రణ జరిగి ఫిబ్రవరి 21 నాటికి 170 సంవత్సరాలు పూర్తి అయింది.అమెరికాలో ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత పుస్తక దుకాణాలలో ఆఫ్రో-అమెరికన్ల గురించి రాసిన న్యూ జిమ్‌ క్రో గ్రంధం తరువాత కమ్యూనిస్టు మానిఫెస్టో గురించి పాఠకులు అడుగుతున్నారని అమెరికాలోని సింపోజియం బుక్స్‌ యజమాని చెప్పారు. జనం కమ్యూనిస్టుమానిఫెస్టో గురించి ఎందుకు అడుగుతున్నట్లు ? అంటే కమ్యూనిస్టు సిద్దాంతం పనికిరాదని చెబుతున్నమాటలను జనం పూర్తిగా విశ్వసించటం లేదన్నమాట. 2008లో ధనిక దేశాలలో సంక్షోభం ప్రారంభమైన తరువాత అనేక మంది కమ్యూనిస్టు మానిఫెస్టో దుమ్ముదులుపుతున్నారు. ప్రఖ్యాత అమెరికన్‌ ఆర్ధికవేత్త రాబర్ట్‌ ఎల్‌ హెయిల్‌బ్రోనర్‌ ఒక సందర్భంలో ‘మనం మార్క్స్‌వైపు చూస్తున్నామంటే ఆయన సర్వజ్ఞుడని కాదు, ఎందుకంటే ఆయన్నుంచి మనం తప్పించుకోలేం’ అన్నారు. పాలకవర్గాలు తమ అస్ధిత్వానికి ముప్పు ఏర్పడినపుడు అంతకు ముందు ఏం చెప్పినప్పటికీ దాన్నుంచి తప్పించుకొనేందుకు ఒక మహా సంఘటనగా ఏర్పడతాయి. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాల కూల్చివేతకు ఐరోపా, అమెరికాలోని కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులు, పోప్‌ ఒక కూటమిగా ఏర్పడటం ప్రపంచ చరిత్రలో ఒక ప్రధాన ఘటన కాదా? అంటే ఈ రెండు ఖండాలలోని అధికార శక్తులు కమ్యూనిజం తమను సవాలు చేసే ఒక శక్తి అని గుర్తించినట్లే కదా ? చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు జరిగిన కుట్రలో బౌద్ద దలైలామా ఒక పావుగా వుపయోగపడ్డారా లేదా ? అందుకే ఎవరెన్ని చెప్పినా కమ్యూనిస్టు మానిఫెస్టో, కాపిటల్‌ గ్రంధాలు ఇప్పటికీ కొత్త తరాలకు ఆసక్తి కలిగిస్తూనే వున్నాయి. ఇక్కడొక ప్రశ్న తలెత్త వచ్చు. తమకు ముప్పు తెచ్చే పుస్తకాలను అమెజాన్‌ వంటి బహుళజాతి కార్పొరేషన్లు ఎందుకు విక్రయిస్తున్నాయి, గూగుల్‌ వంటి కంపెనీలు ఆ సాహిత్యాన్ని ఆన్‌లైన్‌లో ఎందుకు అనుమతిస్తున్నాయని ఎవరైనా అడగవచ్చు. మార్క్సు రైనిష్‌ జీటుంగ్‌ పత్రికలో నాటి రష్యన్‌ జారు ఒకటవ నికోలస్‌ను విమర్శిస్తూ వ్యాసం రాయటంతో ఆ పత్రికపై నిషేధం విధించాలని ప్రష్యన్‌ ప్రభుత్వాన్ని కోరగా ఆ పని చేశారు. కమ్యూనిస్టు మానిఫెస్టో, కాపిటల్‌ తొలి ముద్రణలు పొందినపుడు వాటి వల్ల ముప్పు వస్తుందని నాటి పాలకవర్గాలు భావించలేదు కనుకనే ముద్రణ, విక్రయాలకు అనుమతిచ్చాయి, ఇప్పుడు ముప్పులేదని పైకి చెబుతున్న కారణంగా, దాని కంటే ఆ పుస్తకాలకు గిరాకీ వున్నందున వాటిపై కూడా లాభం సంపాదించేందుకు ఇప్పుడు అనుమతిస్తున్నారు. ఎంతకాలం అనుమతిస్తారో చూడాల్సిందే.

Image result for marx engels

చైనా కంటే భారత్‌ ఎందుకు వెనుకబడింది అంటే అది నిరంకుశ దేశం, మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అని టక్కున సమాధానం చెబుతారు.అమెరికాతో పోలిస్తే 1917కు ముందు రష్యా కూడా నిరంకుశ జార్‌ పాలనలోనే మగ్గింది. మరి అదెందుకు వెనుకబడిపోయింది. ప్రపంచానికి ప్రజాస్వామ్యాన్ని నేర్పినట్లు చెప్పుకొనే రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని కలిగి వున్న బ్రిటన్‌ ఈ రోజు అమెరికా అనుచర దేశంగా ఎందుకు మారిపోయింది? నిరంకుశ దేశాలన్నీ చైనా మాదిరి అంతగాకపోయినా వాటి స్ధాయిలో అయినా ఎందుకు పురోగమించటం లేదు అంటే సరైన సమాధానం వుండదు. మన దేశం త్వరలో చైనాను అధిగమించనుంది అని చెబుతున్నారు. అంతకంటే కావాల్సిందేముంది? మన వారందరూ అమెరికా వెళ్లి ఆ దేశాన్ని ప్రధమ స్ధానంలో వుంచుతున్నారని మన చంద్రబాబు వంటి వారు చెబుతున్నారు. అందువలన అభివృద్దిలో చైనాతోయేం ఖర్మ అమెరికాతోనే పోటీ పడాలి. కానీ మనం ఎక్కడున్నాం, సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని కూడా తయారు చేసుకోలేక చైనాకు ఆర్డర్‌ ఇచ్చాము. అదే నోటితో మేకిన్‌ ఇండియా అని పిలుపులు ఇస్తాము. మన ముందు ఏం మాట్లాడినా మన వెనుక ప్రపంచం నవ్వదా ?

Image result for xi jinping

చైనా విజయానికి కమ్యూనిస్టు పార్టీ ఎలా మార్గదర్శకత్వం వహించింది అనే పేరుతో అమెరికాకు చెందిన న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఒక వ్యాసాన్ని ప్రచురించింది. అదేమీ మ్యూనిస్టు అనుకూల పత్రిక కాదు. సెబాస్టియన్‌ హెయిల్‌మాన్‌(51) అనే ఒక జర్మన్‌ బెర్లిన్‌లోని మెర్కాటర్‌ ఇసిస్టిట్యూట్‌ ఆఫ్‌ చైనీస్‌ స్టడీస్‌ సంస్ధ స్ధాపక అధ్యక్షుడు. ట్రయర్‌ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ ప్రొఫెసర్‌.ఆయనతో ఇంటర్వూ చేసి న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించింది. హెయిల్‌ మన్‌ రాసిన చైనా రాజకీయ వ్యవస్ధ అనే అంగ్ల అనువాదాన్ని ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి నవీకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు చైనాలో జరుగుతున్న మార్పులను పాఠకులకు అందించేందుకు దానిని ఆన్‌లైన్‌లో పెట్టారు. చైనా పురోభివృద్ధిలో చైనా కమ్యూనిస్టు పార్టీ పాత్ర గురించి ఆయనెంతో లోతుగా పరిశోధించారు. ఇది కమ్యూనిజం విజయం కాదా? మనమెంతో తెలివిగలవారమని, చైనీయులు నల్లమందు భాయీలని ఎద్దేవా చేసిన రోజులను మనం మరిచిపోయామా ? అలాంటి వారిని ఎంతో తెలివిగలవారిగా మార్చిందెవరు ? కమ్యూనిస్టులు కాదా ? ప్రజాస్వామ్య వ్యవస్ధ మనలను అలా ఎందుకు మార్చలేకపోయింది ?

     మన దేశంలో అధికారంలో ఏ పార్టీ వున్నా తన కాడర్‌పై ఆధారపడటం అన్నది ఆత్మవంచన చేసుకొనేవారు తప్ప మిగిలిన వారందరూ అంగీకరిస్తున్న సత్యం. పార్టీ కార్యకర్తలకు నామినేటెడ్‌ పదవులను ఇచ్చి రాజకీయ నిరుద్యోగం పోగొట్టి వుపాధి కల్పించటం, ఆ పదవులను స్ధాయిని బట్టి పెద్ద ఎత్తున అక్రమంగా పోగేసుకోవటానికి వినియోగించటం తెలిసిందే. అది చైనాలో లేదా అంటే అక్కడా వుందని కమ్యూనిస్టుపార్టీయే స్వయంగా చెప్పి అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్నది. ఎన్నో వేల మందిపై వేటు వేశారు. మన దేశంలో ఏ పార్టీ అయినా అవినీతికి పాల్పడిన వారిని ఒక్కరినంటే ఒక్కరిని తొలగించి, శిక్షించిన వుదంతం వుందా ? ఎందుకు లేదు? ప్రజాస్వామ్యం నుకనా ?

     మన వంటి దేశాలలో విధాన నిర్ణయాలు, చట్టాలు చేసేది చట్టసభలు. వాటిని అమలు జరిపేది వుద్యోగ యంత్రాంగం. చైనాలో చట్టసభలు తమపని తాము చేస్తే వాటిని అమలు చేసే బాధ్యత పార్టీ కార్యకర్తలపై పెట్టటమే అక్కడి విజయ రహస్యం అన్నది హెయిల్‌మన్‌ అధ్యయన సారంశాలలో ఒకటి. వుదాహరణకు మన ప్రధాని నరేంద్రమోడీ సర్వరోగ నివారిణి జిందాతిలిస్మాత్‌ అన్నట్లుగా నల్లధనం నుంచి అవినీతి, వుగ్రవాదం, పన్నుల ఎగవేత, నగదు రహిత లావాదేవీల వంటి అనేక చర్యలకు గాను ఒకే మాత్ర అన్నట్లుగా పెద్ద నోట్ల రద్దును ప్రకటించి అమలు చేశారు. ఆ సందర్భంగా బిజెపి ప్రజాప్రతినిధులు, నాయకులందరూ తమ బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలను పార్టీ నాయకత్వానికి అందచేయాలని ఆదేశించినట్లు మన ప్రజాస్వామిక మీడియాలో వార్తలు చదివాము. ఆ లెక్కల్లో ఎలాంటి అక్రమాలు లేవని అయినా ప్రకటించాలి కదా ? అసలు దాని గురించి ఎందుకు మాట్లాడరు ? అన్నింటికీ మించి రిజర్వుబ్యాంకు దగ్గరకు వచ్చిన రద్దయిన నోట్లెన్ని? ఎంత నల్లధనం బయటపడిందీ ఎందుకు ప్రకటించలేదు. ప్రజాస్వామిక వ్యవస్ధలలో ఇలాంటి వన్నీ రహస్యమా ?

చైనాలో కూడా బయటి నుంచి వచ్చిన పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అవినీతి కూడా దిగుమతి అయి కొందరు అవినీతిపరులుగా మారారు. వారిపై అక్కడి అధ్యక్షుడు గ్జీ జింగ్‌ పింగ్‌ కూడా చర్యలు తీసుకున్నారు. రోజూ ఏదో ఒక మూల నుంచి అవినీతి పరులపై చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు చదువుతూనే వున్నాము కదా? మన దేశంలో అలాంటి వార్తలు ఎందుకు రావటం లేదు. చెన్నయ్‌లో కోట్ల కొలది కొత్త నోట్లు పోగేసిన బడా కాంట్రాక్టర్‌ వుదంతంలో ఎందరు బ్యాంకు వున్నతాధికారులపై చర్యతీసుకున్నారో ఎవరైనా ప్రకటించారా ?

చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఎంతో పట్టువిడుపులతో చట్టాలు చేయబోయే ముందు అనేక అంశాలపై ప్రయోగాలు చేసిన తరువాతే చట్టాలు చేయటం కూడా విజయ రహస్యమని జర్మన్‌ ప్రొఫెసర్‌ అంటున్నారు. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం అన్నది 1917కు ముందు తెలియదు. సోవియట్‌ ఒక ప్రయోగం. అక్కడ వచ్చిన ఫలితాలను అధ్యయనం చేసిన తరువాత చైనా తనదైన పంధాను ఎంచుకున్నది. భూ సంస్కరణల విషయంలో అది కనిపిస్తుంది. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణానికి ఒక మూస అనేది వుండదని గ్రహించిన తరువాత చైనాలో సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌సియావో పింగ్‌, తరువాత నేతలుగా వున్న వారు అనేక ప్రయోగాలకు తెరతీశారు. మంచి గాలికోసం కిటికీలు తెరిస్తే దాంతో పాటు ఈగలు, దోమలు కూడా ప్రవేశించవచ్చు, అయితే వాటిని ఎలా అరికట్టాలో మాకు తెలుసు అని డెంగ్‌ అన్నారంటే ఒక ప్రయోగానికి శ్రీకారం చుట్టటమే. దానికి తోడు సత్వర ఫలితాలు రావాలంటే ప్రయోగాలను కూడా వికేంద్రీకరించాలని భావించారు, అది అవినీతికి తెరతీసిందని గ్రహించిన తరువాత ప్రస్తుత అధ్యక్షుడు గ్జీ జింగ్‌ పింగ్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కేంద్ర స్ధానం నుంచి పధకాలకు రూపకల్పన చేస్తున్నారు. దీని ఫలితాలను చూసిన తరువాత మార్పులు చేర్పులు చేయటం అనివార్యం. చైనా విజయ రహస్యం ఇదే. సోషలిజం, కమ్యూనిజం వాటిని అమలు చేసే వ్యవస్ధల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఎదురుదెబ్బలు తిన్న పూర్వపు సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాల గురించిగానీ లేదా ప్రస్తుతం సోషలిస్టు వ్యవస్ధల నిర్మాణంలో నిమగ్నమైన చైనా, వియత్నాం, క్యూబా, లావోస్‌, కంపూచియా ప్రయోగాల గురించి తమ తమ దృక్కోణాల నుంచి అనేక మంది విశ్లేషణలు చేస్తున్నారు. వాటిని యథాతధంగా స్వీకరించటం లేదా తిరస్కరించటం గాకుండా అధ్యయనం చేయటం అవసరం. మావో మరణం తరువాత ఇంక చైనా పని అయిపోయినట్లే అని అనేక మంది వ్యాఖ్యానాలు చేశారు. తరువాత డెంగ్‌ను గురించి కూడా అదే విధంగా మాట్లాడారు. కానీ చైనా, వియత్నాం, క్యూబా వంటి దేశాలలో వున్న కమ్యూనిస్టు పార్టీలకు ఒక ప్రత్యేక చరిత్ర, అంకిత భావం గల కార్యకర్తల గురించి వారు విస్మరించారు. నాయకులు మరణించిన తరువాత కమ్యూనిజానికి భవిష్యత్‌ లేదని చెప్పటం వ్యతిరేకుల ప్రచారదాడిలో అస్త్రాలు తప్ప మరొకటి కాదని అనేక దేశాల అనుభవాలు నిరూపించాయి. రామాయణం గురించి చెప్పేవారు రాక్షసుడిగా చిత్రించినప్పటికీ రావణుడిని , మహాభారతంలో ధుర్యోధనుడిని, హిట్లర్‌ను పొగిడేవారు వాడి పీచమణిన స్టాలిన్‌ గురించి, గాడ్సేసు దేవుడిగా కొలిచే ‘జాతీయవాదులు’ మహాత్మాగాంధీని పక్కన పెట్టి ముందుకు పోలేరు. అలాగే ప్రఖ్యాత అమెరికన్‌ ఆర్ధికవేత్త రాబర్ట్‌ ఎల్‌ హెయిల్‌బ్రోనర్‌ ‘మార్క్స్‌ నుంచి మనం తప్పించుకోలేం’ అని చెప్పినట్లుగానే వర్తమానంలో అపూర్వ విజయాలు సాధించిన, సాధిస్తున్న చైనా గురించి అధ్యయనం చేయకుండా కమ్యూనిస్టు వ్యతిరేకులతో సహా ఎవరూ తప్పించుకోలేరు.

భూమి పొరలలో వుండి నిరంతరం తొలిచే లక్షణం గల చుంచెలుక మనం వూహించని చోట బయటకు వచ్చి కనిపిస్తుంది. అలాగే దోపిడీ శక్తులను వ్యతిరేకించే శక్తులు కూడా నిరంతరం పని చేస్తూనే వుంటాయి. అవి ఎక్కడ, ఎలా కనిపిస్తాయనేది ఎవరూ చెప్పజాలరు. రూపం మారవచ్చు తప్ప మౌలిక లక్షణం మారదు. కమ్యూనిస్టు మానిఫెస్టో కూడా అలాంటిదే. రెండు రెళ్లు నాలుగు అన్నది మారనట్లే దోపిడీ వున్నంత కాలం దానిని కొనసాగించేందుకు ఎవరెంతగా ప్రయత్నించినా, దానిని నాశనం చేసేందుకు పిలుపు ఇచ్చిన కమ్యూనిస్టు మానిఫెస్టో ఏదో రూపంలో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే వుంటుంది. ఇదే కమ్యూనిస్టుల తర్కానికి మూలం, ముగింపు కూడా.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా ప్రపంచీకరణ హీరోగా మారిందా ?

21 Saturday Jan 2017

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

China, Chinese President, Donald trump, globalisation, Oxfam, WEF, World Economic Forum 2017, Xi Jinping

Image result for IS really China became Globalisation Hero

ఎం కోటేశ్వరరావు

   అమెరికా, బ్రిటన్‌ వేరే అజండాలతో ముందుకు పోతుంటే దవోస్‌ నిర్వాహకులు చైనా కమ్యూనిస్టుపార్టీ అనే కొత్త హీరోను ముందుకు తెచ్చారు అంటూ ప్రపంచ ధనికుల పత్రిక ఫోర్బ్స్‌ శీర్షిక పెట్టింది. వర్తమాన పరిస్థితులలో ఇలా రాసినందుకు ప్రపంచంలోని కమ్యూనిస్టులు, వామపక్ష శక్తులు గర్వపడాలా లేక ప్రపంచ ధనికుల వేదికలో హీరోగా మారినందుకు లేదా మార్చినందుకు చైనా సోషలిజం గురించి అనుమానించాలా అన్న సందేహం ఎవరికైనా కలగటం సహజం. ప్రపంచ ఆర్ధిక వేదిక సమావేశాలలో పాల్గొన్న తొలి చైనా అధ్యక్షుడిగా చరిత్రకెక్కిన గ్జీ జిన్‌పింగ్‌ ప్రపంచీకరణను గట్టిగా సమర్ధించినట్లు వార్తలలో వ్యాఖ్యలు వెలువడ్డాయి. వీటిని చూసిన తరువాత చూశారా మేం ఎప్పటి నుంచో చెబుతున్నాం, చైనాలో పభుత్వ పెట్టుబడిదారీ విధానం తప్ప సోషలిజం, కమ్యూనిజం లేదు పాడు లేదు అని చెబుతున్నవారు మరింతగా రెచ్చి పోవచ్చు. రాబోయే రోజులలో చైనా కంటే మన దేశ అభివృద్ధి రేటు ఎక్కువగా వుంటుందని, అమెరికా తరువాత రెండో స్ధానంలో వున్న ‘మందుభాయీలను’ వెనక్కు నెట్టి ఆ స్ధానాన్ని ఆక్రమించాలని, పెద్ద నోట్ల రద్దు ద్వారా ప్రపంచంలో ఏ దేశాధినేత చేయని సాహసం చేశారని వంది మాగధుల పొగడ్తలు అందుకుంటున్న మన ప్రధాని నరేంద్రమోడీ ఈ సమావేశాల వైపు కన్నెత్తి చూడలేదు. మోడీగారు స్వదేశంలో కంటే విదేశాలలో ఎక్కువగా ఎందుకు వుంటున్నారన్న విమర్శకు విదేశీ పెట్టుబడుల సాధనకు అని సిద్దం చేసుకున్న సమాధానం చెప్పారు. దవోస్‌ అంటే ప్రపంచ పెట్టుబడిదారులందరూ చేరే కేంద్రం. అలాంటి కేంద్రాన్ని సందర్శిస్తే అన్ని దేశాల పెట్టుబడిదారులను అక్కడే కలుసుకోవచ్చని నరేంద్రమోడీకి తట్టలేదా లేదా చెప్పిన వారు లేరా ? కనీసం చంద్రబాబును చూసైనా నేర్చుకోవచ్చు. చంద్రబాబూ ఆ సమావేశాలకు పోయి నేనూ వెళితే నా గొప్పేముంటుంది అనుకున్నారా ? సరే చంద్రబాబు నాయుడు తన పరివారంతో అత్యంత ఖరీదైన ఈ జాతరకు క్రమం తప్పకుండా వెళ్ళటం పెద్దలతో కలిసిన ఫొటోలు, ప్రకటనలు గుప్పించటం, తడిచి మోపెడు ఖర్చును జనంపై రుద్దటం గత ఆనవాయితీ, షరా మామూలే అనుకోండి. రాజుల సొమ్ము రాళ్లపాలైందన్న సామెతను తిరగరాసుకుంటే ఆంధ్రుల సొమ్ము చంద్రబాబు పరివార విదేశీ యాత్రలపాలు అని చెప్పాల్సి వుంటుంది. గతంలో చేసిన యాత్రలు, దిగిన ఫొటోలు, అయిన ఖర్చులు, పొందిన హామీలు, సాధించిన పెట్టుబడులపై శ్వేత పత్రం సమర్పిస్తే అసలు బండారం బయట పడుతుంది.

Image result for wef 2017

    ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు స్విడ్జర్లాండ్‌లోని దవోస్‌లో ప్రపంచ ఆర్ధిక వేదిక వార్షిక సమావేశాలు జరిగాయి. ‘ ప్రతి స్పందక మరియు జవాబుదారీ నాయకత్వం ‘ అనే ఇతివృత్తంతో ఈ సమావేశాలను నిర్వహించారు. ప్రస్తుతం ప్రపంచంలో అమలు జరుగుతున్న విధానాల పర్యవసానాల గురించి నేతలు ప్రతిస్పందించటం లేదని, జవాబుదారీయుతంగా వ్యవహరించ కుండా ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటున్నారనే విమర్శలు నానాటికీ పెరుగుతున్న నేపధ్యంలో ఈ ఇతివృత్తాన్ని ఎంచుకున్నారని భావించాలి. ప్రపంచీకరణను మరింత ముందుకు తీసుకు పోయే క్రమంలో ఎదురువుతున్న సమస్యలను పరిష్కరించుకొనేందుకు ప్రపంచ బడా కార్పొరేట్‌ సంస్ధలు ఏర్పాటు చేసుకున్న వేదిక ఇది. కాల క్రమంలో కొన్ని మార్పులకు లోనైనప్పటికీ మౌలిక లక్ష్యం మారలేదు. ఏటా కనీసం ఐదువందల కోట్ల డాలర్లకు పైబడి లావాదేవీలు నిర్వహించే బడా కంపెనీలకు మాత్రమే దీనిలో సభ్యత్వం ఇస్తారు. ఎగ్జిబిషన్లలో ప్రవేశం పొందాలంటే ప్రవేశ రుసుం మాదిరి దీని సమావేశాలకు హాజరుకావాలంటే 68వేల స్విస్‌ ఫ్రాంక్‌లు (ఒక ఫ్రాంక్‌ మన రు 67.75 సమానం) అంటే 46లక్షల రూపాయలు చెల్లించాలి. ఇక ఎగ్జిబిషన్‌లోకి వెళ్లిన తరువాత జెయింట్‌ వీల్‌, రంగుల రాట్నం, ఫొటో తీయించుకోవటం ఇలా ప్రతిదానికి ఒక్కో రేటు చెల్లించాలి. దవోస్‌ సమావేశాలలో అలా అన్ని విభాగాలలో ప్రవేశం పొందాలంటే ఆరులక్షల ఫ్రాంకులు అంటే 40 కోట్ల 64లక్షల రూపాయలు చెల్లించాలి. అంత మొత్తం చెల్లించిన కంపెనీ సిఇఓ తనతో పాటు నలుగురిని తీసుకు వెళ్ల వచ్చు. అదనంగా తలకు 18వేల స్విస్‌ ఫ్రాంకులు చెల్లించాలి. చంద్రబాబు అండ్‌కోకు అప్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిధులు లేదా ఆయన ద్వారా లబ్ది పొంద చూసే ఏ అనిల్‌ అంబానీయో, మరొక బడా కార్పొరేట్‌ కంపెనీయో ఆ ఖర్చులను భరించాల్సి వుంటుంది.

    దవోస్‌ వేదిక ప్రపంచీకరణను మరింత ముందుకు తీసుకుపోవాలని చూస్తుంటే ప్రపంచీకరణను వ్యతిరేకించే శక్తులు ఆ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆ విధానాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయటం, నిరసనలు తెలపటం, పోటీ సమావేశాలు పెట్టటం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. కేవలం ఎనిమిదిమంది చేతులలో ప్రపంచంలోని 360 కోట్ల మంది పేదల దగ్గరున్న వాటికి సమానమైన సంపదలు కేంద్రీకృతమయ్యాయని ఆక్స్‌ఫామ్‌ సంస్ధ వెల్లడించటం దీనిలో భాగమే. అటువంటి అంతరాలు పెంచే ప్రపంచీకరణను కమ్యూనిస్టు చైనా వ్యతిరేకించాలి కదా ? ఆ పని చేయకుండా జిన్‌పింగ్‌ అలా మాట్లాడటం ఏమిటి ? అన్న ప్రశ్న వెంటనే వస్తుంది.

    ఐరోపా యూనియన్‌లో చేరితో ప్రయోజనం జరుగుతుందని అనుకున్నాము. అటువంటిదేమీ కనిపించటం లేదు కనుక బయటికి పోయి, విడిగా మా లావాదేవీలు మేము నిర్వహించుకుంటాం అంటూ జరిపిన ప్రజాభిప్రాయ సేకరణే బ్రెక్సిట్‌ అన్నది తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలిచిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో, ఎన్నికలు ముగిసిన తరువాత మెక్సికో, చైనా తదితర దేశాల నుంచి చేసుకొనే దిగుమతులపై పది నుంచి 50శాతం వరకు పన్ను విధిస్తామని, అమెరికా వుద్యోగాలను బయటికి పంపే కంపెనీలపై చర్య తీసుకుంటామని ఇంకా అనేక రక్షణ చర్యలు తీసుకోవటం తద్వారా వుద్యోగాలు కల్పిస్తానంటూ ఎన్నికల సందర్భంగా అమెరికా వూరూ వాడా అంతా తిరిగి చెప్పారు. ఇంకా అనేక ధనిక దేశాలలో అలాంటి మాటలు మాట్లాడేవారి వైపే మొగ్గేందుకు జనం సిద్ధ పడుతున్నారన్నది పరిణామాల విశ్లేషణ.( ప్రపంచ సంస్ధలకు మన మార్కెట్‌ తెరిచిన మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని ముఖ్యమైన యుపిఏ ప్రభుత్వ విధానాలన్నింటినీ, రూపాయి విలువ పతనాన్ని బిజెపి పదేళ్లపాటు వ్యతిరేకించి జనంలో వున్న అసంతృప్తిని సొమ్ము చేసుకున్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు అంతకంటే దారుణంగా ఆ విధానాలనే మరింతగా అమలు జరుపుతోంది, దానికి తగిన మూల్యం చెల్లిస్తుంది అది వేరే విషయం. ) నిజానికి ఇవన్నీ ప్రపంచ ధనిక దేశాలు ఇంతకాలం నుంచి చెబుతున్న ప్రపంచీకరణ , ప్రపంచ వాణిజ్య సంస్ధ, దాని తరఫున జరుగుతున్న చర్చల ప్రక్రియకు విరుద్దం.

    పెట్టుబడిదారీవర్గం, సామ్రాజ్యవాదులు వాణిజ్యం పేరుతో ప్రపంచం మీద వలసవాదాన్ని రుద్ధి ఎవరి బలం కొద్దీ వారు ప్రపంచాన్ని ముక్కలుగా చేసి పంచుకున్నారన్నది గత చరిత్ర. దానికి ప్రతిఘటన ఎదురుకావటం, చివరకు యుద్ధాలతో సామ్రాజ్యవాదులు చావు దెబ్బలు తిని తోక ముడిచారు. ఆ తరువాత తమ దోపిడీని కొనసొగించేందుకు రూపొందించిన నయా వలస లేదా నూతన దోపిడీ పద్దతులలో భాగమే ప్రపంచీకరణ. ఇది కమ్యూనిస్టులు కోరుకున్నది లేదా ముందుకు తెచ్చిన అవగాహన కాదు. ప్రపంచ కార్మికులారా ఏకం కండు అన్న పిలుపు దోపిడీ సమాజాన్ని కూలదోయటానికి, సమసమాజాన్ని నిర్మించటానికి తప్ప దోపిడీకి కాదు.

    బ్రిటీష్‌ వారి స్ధానంలో ప్రపంచ సామ్రాజ్యవాదుల, పెట్టుబడిదారుల నాయకురాలిగా ముందుకు వచ్చిన అమెరికా ఒకవైపు ప్రపంచీకరణ పేరుతో మార్కెట్లను ఆక్రమించుకోవటంతో పాటు మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలలో ఆవిర్బవించిన నూతన సోషలిస్టు రాజ్యాలను, వాటికి మార్గదర్శనం చేస్తున్న కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని దెబ్బతీయటం అనే లక్ష్యాన్ని కూడా ఎంచుకున్నారు. దానిలో భాగంగానే సోషలిస్టు దేశాలను దెబ్బతీయటానికి, వాటికి ఆధునిక పరిజ్ఞానం, అవసరమైన పెట్టుబడులు అందకుండా చేసి సోషలిజం విఫలమైంది, పెట్టుబడిదారీ విధానమే దిక్కు అని చెప్పేందుకు గతంలో పెట్టుబడిదారీ దేశాలు అనేక చర్యలు, ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.దానిలో భాగంగానే అమెరికన్లు దశాబ్దాల తరబడి క్యూబాను అష్టదిగ్బంధనం కావించారు. ఈ పూర్వరంగంలోనే చైనాతో సహా మిగిలిన సోషలిస్టు దేశాలు సోషలిస్టు సంస్కరణలకు తెరతీశాయి. వీటిపై కమ్యూనిస్టుపార్టీలు, లేదా వామపక్ష మేథావులలో కొన్ని భిన్నాభిప్రాయాలు లేకపోలేదు. ఫోర్బ్స్‌ వంటి పత్రికలు చైనా అధ్యక్షుడి ప్రసంగానికి ప్రపంచీకరణను సమర్ధించే హీరోగా వర్ణిస్తే చైనాలో అంతర్భాగంగా వుంటూ పెట్టుబడిదారీ వ్యవస్ధను కలిగి వున్న హాంకాంగ్‌ మీడియా విలన్‌గా పేర్కొన్న విషయాన్ని గమనించాలి.

   చైనా సంస్కరణలతో నిమిత్తం లేకుండానే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోనే నూతన పరిస్థితులలో మార్కెట్లను స్వాధీనం చేసుకొనేందుకు నూతన ఎత్తుగడలతో సామ్రాజ్యవాదులు నాంది పలికారు. దాని పర్యవసానమే బ్రెట్టన్‌ వుడ్‌ కవలలుగా పిలుస్తున్న ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్ధ. అవి రెండూ అంతర్జాతీయ ద్రవ్య విధానాన్ని రూపొందించాయి. ఆ విధానంలో అంతర్భాగంగా వుండే వాణిజ్యం సాఫీగా సాగేందుకు, పెట్టుబడులకు రక్షణ కల్పించటంతో పాటు వాణిజ్య సరళీకరణకు గాను వివిధ దేశాలు అప్పటి వరకు అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలను సడలించేందుకు వాణిజ్యం, పన్నులపై సాధారణ ఒప్పందం( జనరల్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ టారిఫ్‌ (గాట్‌)పై 23 దేశాలు జెనీవాలో ఏడు నెలలపాటు చర్చలు జరిపి 1947 అక్టోబరు 30న సంతకాలు చేశాయి. తరువాత దాని అమలులో తలెత్తే సమస్యల పరిష్కారానికి చర్చలు ఎవరు ప్రారంభిస్తే లేదా ఎక్కడ ప్రారంభమైతే ఆ దఫా చర్చలు అని పిలిచేవారు. అలా ఫ్రాన్స్‌లోని అనెసీలో రెండవ దఫా చర్చలు 1949లో 34 దేశాలతో ప్రారంభమై ఐదు నెలల్లో ఐదువేల సరకులపై పన్నుల తగ్గింపునకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నారు. 1950 టొరొక్వే(బ్రిటన్‌) ఎనిమిదినెలలు, 1956 జనీవా-2 ఐదునెలలు, 1960 దిలియాన్‌(అమెరికా మంత్రి) 11నెలలు, 1964 కెన్నడీ(అమెరికా అధ్యక్షుడు) 37నెలలు, 1973 టోక్యో 74నెలలు, 1986 వురుగ్వే 87నెలల చర్చల తరువాత ఒప్పందాలు కుదిరాయి. ఆ తరువాత ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యుటివో) వునికిలోకి వచ్చింది. దాని ఆధ్వర్యంలో 2001లో ప్రారంభమైన దోహా చర్చలు 16 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. ఎప్పుడు వస్తాయో తెలియని స్ధితి. దీనికి కారకులు ఎవరు? మీ ఇంటి కొస్తే మాకేం పెడతావ్‌, మా ఇంటి కొస్తూ మాకేం తెస్తావ్‌ అంటున్న ధనిక దేశాల అత్యాశ, పెట్టుబడిదారీ వ్యవస్ధలో పెరుగుతున్న సంక్షోభమే అన్నది కొందరి అభిప్రాయం.

   గాట్‌ ఒప్పందం చేసుకున్న తొలి 23 దేశాలలో చైనా ఒకటి అయినప్పటికీ ఆ ఒప్పందంపై సంతకాలు చేసిన ఏడాదికి చైనాలో కమ్యూనిస్టుల నాయకత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వాన్ని 1970దశకం వరకు ఐక్యరాజ్యసమితి గుర్తించలేదు. అందువలన ప్రపంచ వాణిజ్య చర్చలలో అది భాగస్వామి కాలేదు. 1978లో చైనా సంస్కరణలకు తెరతీసి విదేశీ పెట్టుబడులు, సంస్థల ప్రవేశానికి వీలు కల్పించిన తరువాత 1986లో పరిశీలక హోదాతో అనుమతించారు. తరువాత మిగతా ఏ దేశానికీ లేని విధంగా కఠినమైన షరతులు విధించి 2001లో ప్రపంచ వాణిజ్య సంస్ధలో చైనాకు పూర్తి సభ్వత్వం ఇచ్చారు.ఈ పూర్వరంగంలో చైనా అధ్యక్షుడి మాటలను పరిశీలించాల్సి వుంటుంది.

     పిల్లి నల్లదా తెల్లదా అని కాదు చూడాల్సింది అది ఎలుకలను పడుతుందా లేదా అన్నది కీలకం అన్న చైనా సామెత మాదిరి తమ దేశంలోని 95 కోట్ల మంది జనాభా(1978)కు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తమదైన లక్షణాలతో కూడిన సోషలిస్టు సంస్కరణలను ప్రవేశపెడుతున్నట్లు చైనా కమ్యూనిస్టుపార్టీ ప్రకటించింది. అప్పటికే మార్కెట్లకోసం అర్రులు చాస్తున్న అమెరికా, తదితర పెట్టుబడిదారీ దేశాలు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూనే, అక్కడి సోషలిస్టు వ్యవస్ధను కూడా దెబ్బతీయాలని నిర్ణయించుకున్నాయి. అందుకు చైనా సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌సియావో పింగ్‌ ఒక మాట చెప్పారు. మంచి గాలి, వెలుతురు కోసం కిటికీలను తెరుస్తాము. వాటితో పాటు ఈగలు, దోమలు కూడా వస్తాయి. అయితే వాటిని ఎలా అదుపు చేయాలో మాకు తెలుసు అన్నారు. దానికి అనుగుణ్యంగా తియన్‌మెన్‌ స్క్వేర్‌ పేరుతో జరిగిన కుట్రను చైనా ప్రభుత్వం వమ్ము చేసింది.

   బ్రిటీష్‌ వారు తమ లాభాల కోసం వేసుకున్న రైళ్లలో వారిని దేశం నుంచి పంపివేసేందుకు స్వాతంత్య్ర పోరాటం సాగించిన మహాత్మాగాంధీకూడా ప్రయాణించారు. అవే రైళ్లు గాంధీతో పాటు ఆయన ప్రాణాలు తీసిన హిందూ మతోన్మాది గాడ్సేను కూడా మోశాయన్నదీ తెలిసిందే. అనుకున్నదొక్కటీ అయ్యింది ఒక్కటీ అన్నట్లుగా ప్రపంచీకరణను ధనిక దేశాలు ఒకందుకు ప్రారంభిస్తే దాని ద్వారా వచ్చిన నూతన అవకాశాన్ని చైనా, వియత్నాం సోషలిస్టు దేశాలు తమ జనాభా జీవన ప్రమాణాలు పెంచేందుకు వుపయోగించుకున్నాయి. ప్రపంచీకరణ విధానాల ద్వారా తమకు అందుబాటులోకి వచ్చిన చైనా మార్కెట్‌లో లాభాలు పిండుకోవాలని ప్రపంచ ధనిక దేశాలు ఆశించాయి. తమ దగ్గర వున్న అపార శ్రమశక్తిని, ప్రజానుకూల యాజమాన్య పద్దతులను పెట్టుబడిగా పెట్టి జనం కోసం పని చేయాలని కమ్యూనిస్టులు భావించారు. నలభై సంవత్సరాల లావాదేవీలు లేదా అనుభవాన్ని మదింపు చేస్తే తేలిందేమిటి? పశ్చిమ దేశాల ఎగుమతి మార్కెట్‌పై ఆధారపడిన చైనా అదిరిపోయే అభివృద్ది రేటుతో ముందుకు పోయింది. దాని నుంచి దిగుమతులు చేసుకున్న పశ్చిమ దేశాల కార్పొరేట్‌ శక్తులు లాభాలు ఆర్జించాయి. అందుకే మన దేశంలోని కార్పొరేట్‌ శక్తులు కూడా చైనా నుంచి లబ్దిపొందాలని చూస్తున్నాయి. అందుకే వాటికి ప్రాతినిధ్యం వహించే కాంగ్రెస్‌, బిజెపి వంటి జాతీయ పార్టీలతో పాటు చంద్రబాబు, కెసిఆర్‌ వంటి ప్రాంతీయ పార్టీల నేతలు కూడా చైనా మోజుతో యాత్రలు చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీతో అధికారిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. అమెరికా నుంచి అరువుతెచ్చుకున్న పద్దతులతో ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వం ఒకవైపు జనంలో కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకతలను రెచ్చగొడుతూనే మరోవైపు అధికారికంగా ఆ మడి బట్టలను విప్పి గట్టున పెట్టి చైనాతో సంబంధాలను కొనసాగించక తప్పనివిధంగా కార్పొరేట్లు దాని మెడలను వంచాయి.

   పెట్టుబడిదారీ విధాన పంధాను అనుసరిస్తున్న దేశాల పాలకవర్గాలు ప్రపంచీకరణ పేరుతో కార్పొరేట్లను మాత్రమే పెంచి తమ కార్మికవర్గానికి హాని చేసే విధానాలు అనుసరిస్తున్నాయి. లాటిన్‌ అమెరికా దేశాల అనుభవం అదే. అందుకే అక్కడ ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలను వ్యతిరేకించిన శక్తుల వెనుక జనం సమీకృతమయ్యారు. కొన్ని మినహాయింపులతో సోషలిస్టు విధానాలను అనుసరిస్తున్న చైనా అదే ప్రపంచీకరణను తన కార్మిక వర్గ జీవన ప్రమాణాల మెరుగుదలకు వుపయోగిస్తున్నది. అందుకే ధనిక దేశాలలో తలెత్తిన సంక్షోభ ప్రభావం పడి కొంత మేర అభివృద్ధి వేగం తగ్గింది తప్ప సంక్షోభంలో పడలేదు. అయినప్పటికీ కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. చైనాలో బిలియనీర్లు ఎలా అభివృద్ధి చెందుతున్నారు? కార్మికవర్గాన్ని దోపిడీ చేయకుండా అది ఎలా సాధ్యం అవుతుంది? వారు చైనా సోషలిస్టు వ్యవస్ధలను కొనసాగనిస్తారా? మరో సందర్భంలో వాటి గురించి చర్చించవచ్చు.ప్రపంచీకరణ పేరుతో మన వంటి దేశాలలో జనంపై రుద్దుతున్న భారాలకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక వర్గం పోరాటాలు చేయాల్సిందే. దానిలో ఎలాంటి రాజీ వుండనవసరం లేదు. చైనాలో కమ్యూనిస్టులు అధికారంలో వున్నారు. ప్రపంచీకరణ ఫలితాలను జనాలకు అందిస్తున్నారు. ఒకే దేశం రెండు వ్యవస్ధల పేరుతో 2050 వరకు హాంకాంగ్‌, మకావో ప్రాంతాలలో పెట్టుబడిదారీ వ్యవస్ధను కొనసాగనిస్తామని వాటి విలీనం సందర్భంగా ఒప్పందం చేసుకున్నారు కనుక, సంస్కరణలలో భాగంగా పరిమితంగా అయినా ప్రయివేటు పెట్టుబడులను అనుమతించింది కనుక వారు కూడా లబ్ది పొందుతూ వుండవచ్చు. ఆ విధానాల వలన తలెత్తే సమస్యలతో రాబోయే రోజులలో ఏం చేస్తారన్నది చైనీయుల అంతర్గత వ్యవహారం.

   చైనా అధ్యక్షుడు దవోస్‌ సమావేశంలో రక్షణాత్మక చర్యల గురించి చెప్పిన అంశాలు తన వరకు వచ్చేసరికి అమలు జరపటం లేదని చైనాలో అంతర్భాగమైనా పెట్టుబడిదారీ వ్యవస్ధను కలిగి వున్న హాంకాంగ్‌ నుంచి వెలువడే పత్రికలు, అక్కడి పెట్టుబడిదారీ మేథావులు జన్‌పింగ్‌ను ఒక విలన్‌గా వర్ణిస్తున్నారు. తమ దేశానికి చెందిన సంస్ధలను విదేశాలలో పెట్టుబడులకు ప్రోత్సహిస్తున్న చైనా ప్రభుత్వం స్వదేశంలో విదేశీ పెట్టుబడులపై అనేక ఆంక్షలను విధిస్తున్నదని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందచేస్తూ స్ధానిక కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలనే షరతులు పెడుతున్నదని వారు విమర్శిస్తున్నారు.

   దవోస్‌ సమావేశాలలో చైనా అధ్యక్షుడు ప్రపంచీకరణపై సిద్ధాంత చర్చ చేయలేదు. ప్రస్తుతం అమలులో వున్న దానికి భిన్నంగా రక్షణాత్మక చర్యలలో భాగంగా ఎవరైనా వాణిజ్య యుద్ధానికి తలపడితే విజేతలంటూ ఎవరూ వుండరన్నది ప్రధాన హెచ్చరిక. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడే విధంగా లావాదేవీలను నిర్వహిస్తున్నాయి. ఆకస్మికంగా వాటిలో మార్పులు చేస్తే అన్ని దేశాలూ నష్టపోతాయి. అంటే బయట గాలీ, వెలుతురు వుంటే ఎవరైనా అవి లేని ఒక గదిలోకి వెళ్లి తలుపులు మూస్తే ఎలా వుంటుందో రక్షణాత్మక చర్యలకు ఎవరు పాల్పడినా అలాగే వుంటుందని గ్జీ హితవు చెప్పారు. ద్రవ్య పెట్టుబడి అధిక లాభాల కోసం వెంటపడటం, ఏ మాత్రం క్రమబద్దీకరణ లేకపోవటం వల్లే ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు మూలం అన్నారు. తాము ప్రపంచీకరణకు కట్టుబడి వున్నామని, మరింతగా క్రమబద్దీకరణకు ప్రయత్నిస్తున్నామని, పెట్టుబడులు పెట్టేవారికి మెరుగైన సమాన అవకాశాలు కల్పిస్తామని అన్నారు. తమది కమ్యూనిస్టు నమూనా అంటూ అందరికీ సరిపోయే ఒకే పద్దతి లేదన్నారు. సముద్రం మధ్యలో తుపానులొస్తే వెనక్కు తిరిగిపోయే అలవాటును ప్రోత్సహించకూడదని చెప్పారు.

   అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పినట్లు అమెరికా ప్రయోజనాలకే పెద్ద పీట అంటూ రక్షణాత్మక చర్యలు చేపడితే అమెరికా-చైనా రెండూ నష్టపోతాయని, అందువలన మాటలు తప్ప రెండు దేశాలూ రాజీపడతాయని ఐరోపాలోని వారు భావిస్తున్నారు. చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ వాణిజ్య యుద్ధ పర్యవసానాల గురించి హెచ్చరించింది. చైనా తనకు కావాల్సిన వ్యవసాయ వుత్పత్తులను పెద్ద మొత్తంలో అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటే, చైనా నుంచి అమెరికన్లు దుస్తులు, బొమ్మలు, ఇతర వస్తువులను దిగుమతి చేసుకొని లబ్ది పొందుతోంది. అమెరికాలో చైనా వాణిజ్యం, ఇతర ఆర్ధిక లావాదేవీల కారణంగా 26లక్షల వుద్యోగాలు కల్పిస్తున్నదని, అమెరికా జిడిపికి 1.2శాతం సమకూర్చిందని 2015 నివేదికలో అమెరికా-చైనా వాణిజ్య మండలి నివేదిక పేర్కొన్నది. చైనా నుంచి వస్తు దిగుమతుల కారణంగా అమెరికాలోని ప్రతి కుటుంబానికి సగటున ఏడాదికి 850 డాలర్లు ఆదాఅవుతున్నాయని ఒక విశ్లేషణ తెలిపింది. అన్నింటి కంటే అనేక అమెరికన్‌ కంపెనీలు చైనాలో ఫ్యాక్టరీలను పెట్టి తమకు అవసరమైన వస్తువులను చౌకగా తయారు చేసుకొని తిరిగి తమ దేశానికే దిగుమతి చేసుకుంటున్నాయి. అందువలన ట్రంప్‌ చెప్పినట్లు చైనా నుంచి వచ్చే వాటిపై దిగుమతి సుంకం విధిస్తే నష్టపోయే వాటిలో అమెరికన్‌ కంపెనీలు కూడా వుంటాయని గ్లోబల్‌ టైమ్స్‌ విశ్లేషకులు హెచ్చరించారు. అదే విషయాన్ని దవోస్‌లో చైనా అధ్యక్షుడు గ్జీ జింగ్‌పింగ్‌ సామెతలతో, తమలపాకులతో కొట్టినట్లుగా చెప్పారు. దానిని గ్రహించకుండా ట్రంప్‌ వాణిజ్య యుద్ధానికి దిగితే అది మన దేశంతో సహా ప్రపంచమంతటికీ తీరని నష్టాలకు దారి తీస్తుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d