• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Donald trump

నరేంద్రమోడీ పరువును మురికి గంగలో కలిపిన జిగినీ దోస్త్‌ ట్రంప్‌ !

09 Thursday Apr 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Health, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

COVID-19, Donald trump, Donald trump Threat India, hydroxy chloroquine, Narendra Modi prestige

President Tump had supported the Narendra Modi government’s stand on hydroxychloroquine and praised India’s handling of the Covid-19 pandemic.

ఎం కోటేశ్వరరావు
నువ్వే నేను, నేనే నువ్వు, అన్ని విషయాల్లో ఒకే మాటగా ఒకే బాటలో నడుస్తామని చెప్పారు. మాది ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకొనే స్నేహం అన్నారు. కావాలంటే చూడండి అని కావిలించుకొని మరీ ప్రపంచానికి ప్రదర్శించారు. వారెవరో ఇంకా చెప్పాలా ! అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, మన ప్రధాని నరేంద్రమోడీ. అలాంటి ట్రంప్‌ మరో దోస్తును మాక్కావలసిన మందు పంపకపోతే సంగతి చూస్తా బిడ్డా ! అని బెదిరించాడు. అంతకోపమెందుకు అన్నా నీక్కావలసినవి పంపుతున్నా అంటూ వెంటనే మోడీగారు జావగారి పోయారు. తన అవసరం తీరగానే భారత్‌కు, మోడీకి కృతజ్ఞలు అంటూ ఒక ట్వీట్‌ను ట్రంప్‌ మనకు పారేశాడు. మరి ఇదేమి స్నేహమో, ఇదేమి సమానభాగస్వామ్యమో జనం ఆలోచించాలి. ఈ విషయాల మంచి చెడ్డల గురించి మాట్లాడితే కరోనా కష్ట కాలంలో ఇలాంటివా అని మోడీ భక్తులు చెలరేగి పోతారు. మామూలు రోజుల్లోనే సహించరని ఇప్పటికే తేలిపోయింది కనుక ఇప్పుడు చెప్పనవసరం లేదు. అమెరికన్ల ప్రాణాల మీదకు తెచ్చింది ట్రంప్‌. సాయం కావాల్సింది వారికి, ఎవరైనా మర్యాద పూర్వకంగా అడుగుతారు. బెెదిరించేవాళ్లను-వారికి లొంగిపోయే వారిని ఏమనాలి ? ఇది వ్యక్తుల సమస్య కాదు, దేశం పరువు. అసలు సిసలు దేశభక్తులం అని చెప్పుకొనే వారు ఇలా ప్రవర్తిస్తారా అని షాక్‌ అవుతున్నవారెందరో !
ప్రపంచ మీడియా అంతా అమెరికా బెదిరింపుకు భారత్‌ లొంగిపోయింది అని రాసింది. మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసి కిసుక్కున నవ్వినందుకు కోపం వచ్చింది అన్నట్లుగా మోడీ భక్తులకు ట్రంప్‌ అవమానించినందుకు, ప్రపంచ మీడియా అదే విషయాన్ని రాసినందుకు కోపం రాకపోవచ్చు గానీ మన దేశంలో ఎవరైనా దాని గురించి మాట్లాడితే, రాస్తే, విమర్శిస్తే ఎక్కడలేని ఆగ్రహం వస్తుంది. బానిస మనస్థత్వాన్ని ప్రదర్శించారని సామాజిక మాధ్యమంలో విమర్శలు వెల్లువెత్తాయి. ఎవరేమనుకుంటేనేం ట్రంప్‌ పొగడ్తల ముందు అన్నీ దిగదుడుపే ! నిన్నటిదాకా ప్రపంచ రాజకీయాల్లో సమాన భాగస్వామి అని ప్రకటించిన నరేంద్రమోడీని ట్రంప్‌ అవమానిస్తే అది మోడీకి కాదు, దేశానికే అవమానం. అలాంటిది దీన్ని రాజకీయం చేయవద్దు అని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అనటాన్ని ఏమనాలి, సాధారణంగా అయితే సిగ్గు చేటు అంటాం. ఈ మాట దేశద్రోహం కిందకు రాదు. రాజకీయం చేసింది, మర్యాద లేకుండా వ్యవహరించింది ట్రంప్‌ !

COVID-19: More Hydroxychloroquine Data From France
కరోనాకు ఇంతవరకు మందు లేదు. ఉన్న మందులు కరోనా సోకిన రోగులకు తలెత్తే ఇతర ఆరోగ్య సమస్యలకు చికిత్సకోసం తప్ప మరొకదానికి కాదు. మలేరియాకు బాగా పని చేసే హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ అనే ఔషధం కరోనా వ్యాధి గ్రస్తులకు ఉపశమనం కలిగిస్తుందని ఇంతవరకు ఎవరూ నిర్దారణగా చెప్పలేదు. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఫలానా మందు వేస్తే ఏమైనా సుగుణం వస్తుందేమో చూద్దాం అన్ని అందుబాటులో ఉన్న మందులను వాడుతున్నట్లుగా కొన్ని చోట్ల దీన్ని కూడా వాడారు. కొందరికి సుగుణం కనిపించిందని వైద్యులు చెప్పారు, కొందరికి అదే ప్రాణాల మీదకు తెచ్చిందని కొన్ని వార్తలు వచ్చాయి. ఈ మందును ప్రపంచంలో ఎవరైనా తయారు చేయవచ్చు, దీనికి లైసన్సు, పేటెంట్లతో పనిలేదు. అమెరికాలో కూడా ఇప్పటికే తయారు చేస్తూనే ఉన్నారు. అలాంటి దానికోసం ట్రంప్‌ ఇంత యాగీ ఎందుకు చేసినట్లు ? తన దోస్తు పరువు ఎందుకు తీసినట్లు ?
ట్రంప్‌ చర్య బెదరింపు, హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ ,ఇతర వైద్య పరమైన వాటిపై ఎగుమతి నిషేధాన్ని సడలించకపోతే ప్రతికూల చర్యలకు పాల్పడతాం అని చెప్పటం బలప్రదర్శన తప్ప మరొకటి కాదు. నిర్దారణగాని సదరు ఔషధం కనుక ఎగుమతి చేసినా ఇబ్బంది లేదు, కరోనా పోరులో అవసరమైన మిగతావాటిని కూడా బెదిరింపులకు లొంగి సరఫరా చేస్తే మన జనం సంగతి ఏమిటి అన్నది సమస్య? ఈ విషయాన్ని చర్చించనవసరం లేదా ? ట్రంప్‌ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఏకపక్షంగా చేయకపోతే ప్రతిపక్షాలను ఎందుకు సంప్రదించలేదు ?
సామాజిక మీడియాలో అతిశయోక్తులు ప్రచారం చేయటం, నరేంద్రమోడీకి లేని గొప్పతనాన్ని అంటగట్టటం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో కూడా కాషాయ తాలిబాన్లు వెంటనే విజృంభించారు. సరైన పేరు లేదు గానీ కాషాయ రంగులో ఉండే వైరస్‌ సోకిన కారణంగా మీడియాలో పని చేసే వారందరూ కమ్యూనిస్టులుగానూ, మోడీకి సంబంధించి నిజాలను చూపని వారుగా కనిపిస్తారు. ఒక సారి ఆ వైరస్‌ సోకిన వారికి మెదడు పూర్తిగా చెడిపోతుంది, దాంతో జీవితాంతం పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తారు. అది వ్యాధి లక్షణం. అలాంటి ఒక వ్యాధిగ్రస్తుడు లేదా గ్రస్తురాలు సామాజిక మాధ్యమం కోసం తయారు చేసిన పోస్టు ఇలా తిరుగుతోంది. ” కమ్మి కమీనే మీడియా కుళ్ళుతో చెప్పని, ఇంటర్నేషనల్‌ న్యూస్‌ టాపిక్స్‌ లో హాట్‌ గా మారిన వార్త ఇవాళ్టికి ఇదే. మోడీ చాలా టఫ్‌ గురూ…సూపర్‌ పవర్‌ అమెరికాకి హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ అత్యవసరం, భారత్‌ కు ఎగుమతి చేసే శక్తి ఉంది.ముందుగా డిమాండ్‌ చేశారు.మోదీజీ ముందు మా అవసరాలు తీరాలని సమాధానం. రెండోసారి బెదిరింపు.మోదీజీ నవ్వుతూ కుదరదని స్పష్టం..మూడోసారి ‘ ఓకే మీకేం కావాలో అడగండి ‘ఇదీ అడిగేపద్దతి..
1.) అమెరికన్‌ మార్కెట్లలోకి ప్రవేశించడానికి భారత్‌ ఫార్మా కంపెనీలకు అడ్డొస్తున్న నియమాలను సవరించాలి.. డన్‌…2) భారత్‌ ఫార్మా కంపెనీల మీద సహేతుకంగా లేని అమెరికన్‌ ఎఫ్‌డిఏ విధించిన అన్ని లెవీస్‌ ఎత్తివేయాలి… డన్‌. 3.) ఎఫ్‌డిఐ ఇకపై భారత్‌ ఫార్మా కంపెనీల మీద అనవసర పేటెంట్‌ హరాస్మెంట్‌ చేయకూడదు.. డన్‌ . భారత్‌ ప్రతిపాదించిన 3 ప్రధాన డిమాండ్స్‌ నూ..డన్‌..డన్‌..డన్‌ 24 గంటల సమయంలో ఒప్పుకున్న అమెరికా…నిజంగానే మోడీ చాలా టఫ్‌… కొరకరాని కొయ్య..? ఓవరాల్‌గా మన ఫార్మా కంపెనీలు అమెరికా వెళ్ళడానికి కావలిసిన అన్ని అనుమతులు మోడీ గారు దగ్గర ఉండి ఇప్పించారు. అలాగే అమెరికా అడిగిన హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ కూడా పంపించారు.” ఇదీ మొత్తం పోస్టు.
పాఠకులు గ్రహించాల్సింది ఏమంటే ప్రయివేటు మీడియాలో ఇవన్నీ చూపలేదు సరే, దూరదర్శన్‌, రేడియోలలో పని చేసేది కూడా కమ్యూనిస్టులేనా ? దీనికి సంబంధించి అధికారిక ప్రకటనలో ఏముంది ? అన్నింటికీ ఒప్పుకుంటున్నట్లు అమెరికా వైపు నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదే. మరి సామాజిక మాధ్యమానికి ఎలా అందినట్లు ? ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీ ఉత్పత్తి ! ఇంతకీ అసలు జరిగిందేమిటి ?
అమెరికా మనలను అడిగేనాటికే మన కేంద్ర ప్రభుత్వం మన అవసరాలను గమనంలో ఉంచుకొని ఔషధాలు, వైద్య పరికరాల ఎగుమతులపై నిషేధం విధించింది.ఈ మేరకు ఈనెల నాలుగవ తేదీ కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌ వెలువడింది. అది వెలువడిన కొద్ది గంటల్లోనే అమెరికా నుంచి ఔషధాలు కావాలని అడిగారు. ట్రంప్‌ స్వయంగా సంప్రదించాడు. నిషేధం కారణంగా కుదరదని చెప్పారు. అయితే నేను స్వయంగా ఫోనులో మోడీని అడిగినా ఔషధాలను పంపరా ? మీ సంగతి చూస్తా అంటూ ట్రంప్‌ సోమవారం నాడు బహిరంగంగానే బెదిరించాడు. ఒక రోజు కూడా గడవక ముందే మన సర్కార్‌ నిషేధాన్ని సడలించి పంపుతామని ప్రకటించింది. అంతే తప్ప మన కంపెనీలు నేరుగా అమెరికా మార్కెట్‌లోకి వెళ్లేందుకు దగ్గరుండి మరీ నరేంద్రమోడీ అనుమతులిప్పించారని చెప్పటం అతిశయోక్తి. కేంద్ర ప్రభుత్వ విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ విలేకర్లతో మాట్లాడుతూ మన మీద ఆధారపడుతున్న దేశాలకు ఔషధాలను పంపుతున్నామని, అమెరికాకు పంపటాన్ని రాజకీయం చేయవద్దని, ఊహాగానాలు వద్దని కోరాడు తప్ప అమెరికాతో పైన చెప్పినట్లుగా ఒప్పందం గురించి చెప్పలేదు, కాషాయ దళాలు ఆయన్ను కూడా కమ్యూనిస్టు అంటారేమో !
సామాజిక మాధ్యమంలో కాషాయ దళాలు చైనాయే మన సాయం కోరింది అని మరొక ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా తప్పుడు ప్రచారమే. ఇబ్బందులలో ఉన్నపుడు ఎంత గొప్పవారినైనా మీకేమైనా కావాలా అని అడుగుతాం. వారు కోరకుండానే మనకు తగిన సాయం చేస్తాం. అది మర్యాద, మన్నన. అలాంటి దాన్ని కూడా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారంటే వారి స్దాయి ఏమిటో అర్దం చేసుకోవచ్చు. లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్‌ రాత పూర్వక సమాధానమిస్తూ చైనాకు మన దేశం 15టన్నుల వైద్య సరఫరాలను ఫిబ్రవరి 26న ఒక ప్రత్యేక విమానంలో తీసుకుపోయి ఊహాన్‌లోని హుబెయ రాష్ట్ర ఛారిటీ ఫెడరేషన్‌కు అందచేశామని, వాటి విలువ 2.11 కోట్ల రూపాయలని, అంతకు ముందు ఎనిమిదవ తేదీన ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు గ్జీకి ఒక లేఖ రాస్తూ తమ సౌహార్ద్రతను తెలియచేస్తున్నామని, అవసరమైన సాయం చేయగలమని పేర్కొన్నట్లు ఆ సమాధానంలో తెలిపారు. పంపిన వాటిలో ఒక లక్ష సర్జికల్‌ మాస్కులు, ఐదులక్షల సర్జికల్‌ గ్లోవ్స్‌, 75 ఇన్‌ప్యూజన్‌ పంప్స్‌, 30 ఎంటరల్‌ ఫీడింగ్‌ పంప్స్‌, 21డిఫిబ్రిలేటర్లు, నాలుగువేల ఎన్‌95 మాస్కులు ఉన్నట్లు పేర్కొన్నారు. చైనా అవసరాలతో పోల్చినపుడు ఇవి ఎంత అన్నది సమస్య కాదు, తోటి దేశంగా తోడ్పాటు. అది ఎవరైనా చేస్తారు. దాన్ని గొప్పగా చెప్పుకోవటాన్ని ఏమనాలి ?
చైనాకు చేసిన ఈ సాయం గురించి గొప్పలు చెప్పుకుంటున్న వారికి తెలిసినా తెలియనట్లు నటించే విషయాలను జనం తెలుసుకోవాలి.చైనా, ఇతర దేశాల్లో ఎక్కడ దొరికితే అక్కడ మనకు కావాల్సిన వైద్య పరికరాలు, ఇతర సరఫరాలను కొనుగోలు చేసేందుకు మన దేశం నిర్ణయించిందని మార్చి 31న రాయిటర్స్‌ వార్తా సంస్ధ కథనాన్ని బిజినెస్‌ టుడే ప్రకటించింది.భారత్‌కు మూడు కోట్ల 80లక్షల ముఖతొడుగులు, 62లక్షల వ్యక్తిగత రక్షణ వైద్య పరికరాలు అవసరమని ఆ వార్తలో పేర్కొన్నారు. ఇదే సమయంలో కొన్ని చోట్ల వైద్యులకు ఇలాంటి పరికరాలు లేక రెయిన్‌కోట్లు వేసుకుంటున్నారని, గతిలేక హెల్మెట్లు పెట్టుకొని తమను తాము రక్షించుకుంటున్నారని వార్తలు వచ్చాయి. మనం చైనాకే ఎగుమతి చేసే స్దితిలో ఉన్నామని గొప్పలు చెప్పేవారు దీని గురించి ఏమి చెబుతారు ?
అమెరికన్ల పట్ల ట్రంప్‌ నిర్లక్ష్యం గురించి పదే పదే చెప్పుకోవటం నాగరికులకు సిగ్గు చేటు, వదిలేద్దాం. కరోనా చికిత్సకు హైడ్రోక్సి క్లోరోక్విన్‌ పని చేస్తుందని నిర్ధారణ కాలేదు, అయినా ఆ ఔషధం కోసం ట్రంప్‌ గత కొద్ది రోజులుగా ఇంటా బయటా ఎందుకు రచ్చ చేస్తున్నట్లు ? మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనాకు పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ మాదిరి వ్యవహారమేనా మరేదైనా ఉందా ? అమెరికా మీడియాలో భిన్న కథనాలు వెలువడ్డాయి. హైడ్రోక్సీ క్లోరోక్విన్‌తో కలిపి కొందరు వైద్యులు అజిత్రోమైసిన్‌ ఇస్తారు. దీన్ని జెడ్‌ పాక్‌ అంటారు. ఈ యాంటీబయోటిక్‌ బాక్టీరియాను తప్ప వైరస్‌ను నిర్మూలించదు. రెండు వారాల క్రితం ఫ్రెంచి వైద్యుల బృందం కొందరికి దీనితో చికిత్స చేశారు. ఆరు రోజుల తరువాత ఆరుగురికి పరీక్షలో నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. ఈ విషయం ఒక పత్రికలో ప్రచురితమైంది. అమెరికాలోని ఒక ప్రముఖ వైద్యుడు దీన్ని అందుకొని పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చాడు. దాన్నే సలహాగా ట్రంప్‌కు చెప్పాడు. అసలే నిర్లక్ష్యం చేసినట్లు ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్‌ ఈ ఔషధంతో అమెరికాలో వైరస్‌ను నిర్మూలించవచ్చని నమ్మినట్లు కనిపిస్తోంది. కానీ అదే ఫ్రెంచి వైద్యుల పర్యవేక్షణలో అదే ఔషధం తీసుకున్న మరో ముగ్గురిని ఆరురోజుల తరువాత పరిస్ధితి విషమించి ఐసియులో చేర్చారు. మరొకరికి చెడు ప్రభావం కనిపించటంతో జెడ్‌ పాక్‌ ఇవ్వటం నిలిపివేశారు. మరొక పేషెంట్‌ ఆరవ రోజున మరణించాడు. ఈ విషయాలను ట్రంప్‌కు వివరించిన వైద్యుడు గానీ, ట్రంప్‌గానీ పట్టించుకోలేదు. కేవలం ఒక ఆరుగురికి వచ్చిన ఫలితాన్ని బట్టి ఒక ఔషధాన్ని వైరస్‌ అనుమానితులు లేదా వ్యాధి గ్రస్తులకు ఇవ్వటం వైద్య చరిత్రలో అరుదు, ఎవరూ అంగీకరించరు. అయినా ట్రంప్‌ హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ చరిత్రను మార్చివేస్తుందంటూ గానాలాపనకు పూనుకున్నాడు. ఇది ఎంతో అద్భుతమైనది, ఎంతో అందమైనది, స్వర్గం నుంచి వచ్చిన బహుమతి అంటూ పిచ్చి ప్రేలాపనలు పేలాడు. దాన్లో భాగంగానే మన దేశాన్ని బెదిరించాడు. తాను కూడా స్వయంగా తీసుకోబోతున్నట్లు చెప్పాడు. వైరస్‌ గురించి దాదాపు అన్నీ పచ్చి అబద్దాలు చెప్పిన ట్రంప్‌ ఇప్పుడు క్లోరోక్విన్‌ గురించి ఎక్కువ చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీని వలన ఫలితం ఉండదనే అంశాన్ని కూడా గమనంలోకి తీసుకోవాలని చెప్పిన వారిని తీసుకొంటే మీకు పోయేదేమిటి అని నోరు మూయిస్తున్నాడు. ఎప్పుడైతే ట్రంప్‌ ఇలా మాట్లాడటం మొదలు పెట్టారో జనాలు తమకు ఉపయోగపడుతుందో లేదో తెలియకపోయినా అవసరం అయినపుడు ఉపయోగించుకోవచ్చని పెద్ద మొత్తంలో క్లోరోక్విన్‌ ఔషధాన్ని కొని నిల్వచేసుకుంటున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో అమెరికాలో కొరత ఏర్పడింది. అరిజోనా రాష్ట్రంలో చేపల తొట్లలో వేసే క్లోరోక్విన్‌ తీసుకొని భార్యాభర్తలు అస్వస్తతకు గురి కాగా భర్త మరణించాడు.
మరొక ఆసక్తికర విషయం ఏమంటే అమెరికాలో మలేరియాను ఎప్పుడో అరికట్టారు. పదమూడు రాష్ట్రాలలో మాత్రం అక్కడక్కడా చాలా సంవత్సరాల క్రితం కనిపించేది. అయితే ఇప్పటికీ మలేరియా కేసులు అమెరికా ఆసుపత్రుల్లో ఏటా రెండువేల మేరకు నమోదవుతున్నాయి. అవి కూడా విదేశాల నుంచి ముఖ్యంగా దక్షిణాసియా, సబ్‌ సహారా ఆఫ్రికా ప్రాంత దేశాల నుంచి వచ్చిన వారిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే క్లోరోక్విన్‌ మలేరియాతో పాటు లూపస్‌(ముఖచర్మరోగం)కు కూడా బాగా పని చేస్తుంది అందువలన దానికోసం అమెరికాలో కొన్ని కంపెనీలు తయారు చేస్తాయి. అమెరికాలో వ్యూహత్మక నిల్వల కోసం గతనెలలోనే నోవార్తిస్‌ సబ్సిడరీ శాండోజ్‌ కంపెని 2.9 కోట్ల డోసుల హైడ్రోక్సి క్లోరోక్విన్‌ సల్ఫేట్‌ను ప్రభుత్వానికి ఉచితంగా అందచేసింది. మరో కంపెనీ బేయర్‌ పదిలక్షల డోసులు ఉచితంగా అందచేసింది.
హైడ్రోక్సి క్లోరోక్విన్‌ గురించి ట్రంప్‌ హడావుడి చేయటం వెనుక స్వల్ప మొత్తాలలోనే అయినప్పటికీ ట్రంప్‌ కుటుంబ సభ్యులకు ఆర్ధిక ప్రయోజనాలున్నాయని ఆ కారణంగానే ట్రంప్‌, ఆయనకు చెందిన ఫాక్స్‌ న్యూస్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్లు వార్తలు వచ్చాయి. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికే వాటిని రాసింది. పాలక్వెనిల్‌ బ్రాండ్‌ పేరుతో హైడ్రోక్సి క్లోరోక్విన్‌ తయారు చేసే సనోఫి అనే కంపెనీ వాటాలలో ట్రంప్‌ కుటుంబ సభ్యుల మ్యుచ్యువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు ఉన్నాయని టైమ్స్‌ రాసింది. అయితే అవి వారి ఆస్తులతో పోల్చితే నామమాత్రమే అని వాటి వలన పెద్దగా వచ్చేదేమీ ఉండదని మరికొన్ని పత్రికలు రాశాయి.

Trump threatens payback for U.S. companies that move abroad | PBS ...
ఈ ఉదంతం మొత్తాన్ని చూస్తే ఒక అంశం స్పష్టం అవుతున్నది. ట్రంప్‌ అనుసరించిన నిర్లక్ష్యం కారణంగా నేడు అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్నది, ఎంత మందికి సోకుతుందో తెలియదు. కొద్ది రోజుల క్రితం వ్యాధి విస్తరణ తీరు తెన్నులను అరికట్టకపోతే లక్ష నుంచి రెండున్నర లక్షల మంది వరకు మరణించే అవకాశం ఉందని అంచనాలు వెలువడ్డాయి. ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ విజయం అనుమానమే. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీపడుతున్న సోషలిస్టు బెర్నీ శాండర్స్‌ పోటీ నుంచి తప్పుకున్నారు. జో బిడెన్‌ ఇప్పుడు ట్రంప్‌ ప్రత్యర్ధి అని తేలిపోయింది. అమెరికాలో ఔషధ తయారీ ఎంతో ఖర్చుతో కూడుకున్నది తప్ప అక్కడ తయారు చేయలేనిదేమీ కాదు. అంటే ట్రంప్‌ ఇక్కడ కూడా ఖర్చు – లాభం చూసుకున్నాడని అనుకోవాలి. ఎన్నికల్లో గెలుపు ఎత్తుగడల్లో భాగంగా ఎంతకైనా తెగిస్తానని, అమెరికన్ల కోసం ఏమైనా చేస్తానని ప్రదర్శించుకొనేందుకు మన దేశాన్ని బెదిరించినట్లు స్పష్టం కనిపిస్తోంది.
నరేంద్రమోడీ సర్కార్‌ బెదిరింపుల గురించి కనీస నిరసన కూడా తెలియచేయకుండా నాలుగు రోజుల క్రితం విధించిన నిషేధాన్ని ఎత్తివేసి అమెరికాకు ఔషధాన్ని పంపేందుకు నిర్ణయించింది, మరి ఆ 56 అంగుళాల ఛాతికి ఏమైందో, సమాన భాగస్వామ్యం ఎక్కడకు పోయిందో తెలియదు, మరీ ఇంత లొంగుబాటా ? ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తామని చెప్పుకొనే తమ నేత పరువు ప్రపంచ మీడియా వార్తలతో వారణాసిలోని మురికి గంగలో కలసిందని, దానికి ఆయన జిగినీ దోస్త్‌ ట్రంపేనని ఆయన భక్తులు గ్రహిస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

జనం చచ్చినా సరే -ఆర్ధిక వ్యవస్ధ ముఖ్యం అంటున్న ట్రంప్‌ !

24 Tuesday Mar 2020

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Coronavirus outbreak in US, Donald trump, Trump on COVID 19, USA COVID 19

Image result for WE CANNOT LET THE CURE BE WORSE THAN THE PROBLEM ITSELF: Donald trump
ఎం కోటేశ్వరరావు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ! కరోనా వైరస్‌ తీవ్రతను పట్టించుకోని అగ్రరాజ్య అధిపతి !! చైనా, ఇటలీ తరువాత మూడో స్ధానంలోకి చేరిన అమెరికా !!! వారం రోజుల క్రితం అమెరికాలో కరోనా మరణాలు 85, మంగళవారం రాత్రికి 622కు చేరిక, కోలుకున్న వారు 361 మంది. ఇదే వ్యవధిలో పాజిటివ్‌ కేసులు 4,600 నుంచి 49,594కు పెరిగాయి. సగం కేసులు న్యూయార్క్‌ నగరంలోనే నమోదయ్యాయి. రెండు వందల ఇరవై ఎనిమిది సంవత్సరాల న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ చరిత్రలో తొలిసారిగా సోమవారం నాడు వాణిజ్య కేంద్రం మూసివేత. ఉద్దీపన పధకానికి సెనెట్‌లో ఎదురుదెబ్బ తగిలింది.దాంతో ఫెడరల్‌ రిజర్వు(రిజర్వుబ్యాంకు వంటిది) రంగంలోకి అప్పులు, ఇతర ఆస్ధులను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. దాంతో ఆసియాలోని స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఇది ఎంతకాలం పతనాన్ని ఆపుతుందన్నది ప్రశ్న.
ఒకవైపు గంట గంటకూ అమెరికాలో వైరస్‌ వ్యాప్తి పెరుగుతోంది. అయినా ” వ్యాధి తీవ్రత కంటే చికిత్స కఠినంగా ఉండకూడదు. పది హేను రోజుల తరువాత ఏ మార్గంలో మన పయనించాలనుకుంటున్నామో నిర్ణయిస్తాం ” అని ట్రంప్‌ ప్రకటించాడు. దీని అర్ధం ట్రంప్‌కు విలువైన మానవ ప్రాణాల కంటే కార్పొరేట్ల ప్రయోజనాలే ముఖ్యమని వేరే చెప్పనవసరం లేదు. సామాజికంగా జనం దూరం పాటించటం వలన కరోనా వైరస్‌ విస్తరణ తగ్గవచ్చు, కానీ ఆర్ధిక వ్యవస్ధ దెబ్బతింటోందనే భావం కార్పొరేట్ల నుంచి వెలువడుతోంది. ఈ నేపధ్యంలోనే సామాజికంగా దూరం పాటించాలన్న మార్గదర్శక సూత్రాలను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్‌ సూచన ప్రాయంగా తెలిపారు.బాధ్యతా రహితంగా ఏం మాట్లాడుతున్నాడో తెలియని ట్రంప్‌ తీరుతెన్నుల గురించి అడిగిన ఒక ప్రశ్నకు అంటువ్యాధుల జాతీయ సంస్ధ డైరెక్టర్‌ ఆంథోనీ ఫాసీ జవాబిస్తూ ”ట్రంప్‌ మాట్లాడుతుంటే ముందుకు దూకి ఆయనను పక్కకు తోసి మైకు లాక్కోలేను కదా ! మాట్లాడేదేదో మాట్లాడనివ్వండి, రెండవ సారి సరి చేస్తాం ” అని సైన్సు పత్రిక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.
కరోనా సాయం పేరుతో సామాన్యులకు బదులు ఎన్నికల సమయంలో తనకు అనుకూల కార్పొరేట్లకు జనం సొమ్మును కట్టబెట్టే యత్నాలను డెమోక్రాట్లు అడ్డుకున్న పూర్వరంగంలో ట్రంప్‌ ప్రేలాపనలివి. అమెరికా కంటే తీవ్రంగా ప్రభావితమైన చైనాలో వైరస్‌ వ్యాప్తి కారణంగా ఆర్ధిక వ్యవస్ధ తీవ్రంగా ప్రభావితం అవుతున్నా ఖర్చుకు వెనకాడకుండా అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలకూ, ట్రంప్‌ వైఖరికి ఎంత తేడా ఉందో చూడవచ్చు. అదే జనం పట్ల నిబద్దత ఉన్న కమ్యూనిస్టులకు, కార్పొరేట్ల సేవలో తరించే పెట్టుబడిదారీ ప్రతినిధులకు ఉన్న వ్యత్యాసం. అమెరికాలో వేగంగా వైరస్‌ విస్తరిస్తున్న పూర్వరంగంలో ఇప్పటికే పది కోట్ల మంది స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. మరోవైపు దానికి వ్యతిరేకంగా ట్రంప్‌ మాట్లాడుతున్నాడు. ఇటలీ అనుభవాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకున్నా ఇలా వ్యవహరిస్తాడా ?

Image result for coronavirus Donald trump cartoons
తక్కువ ఆదాయం ఉన్న అమెరికన్లకు ఒక్కొక్కరికి పన్నెండు వందల డాలర్ల నగదు అందచేతతో సహా రెండు లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన పధకానికి ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. అయితే ఆసుపత్రులు, నగరాలు, రాష్ట్రాలు, వైద్య సిబ్బందికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చని, ట్రంప్‌, ఆర్ధిక మంత్రి విచక్షణ మేరకు కార్పొరేట్లకు నిధులు పందారం చేసే ప్రతిపాదనను సెనెట్‌లో డెమోక్రాట్లు అడ్డుకున్నారు. అక్కడి నిబంధనల ప్రకారం ఇలాంటి పధకాలకు సెనెట్‌లోని వంద మంది సభ్యులకు గాను 60 మంది ఆమోదం అవసరం. ప్రతి పక్షం మద్దతు ఇస్తే తప్ప అది కుదరదు. నిరుద్యోగ భృతి చెల్లించాలని అభ్యర్ధిస్తూ వచ్చిన వినతులు గతవారంలో 20లక్షలకు పైగా వచ్చాయని, ఆర్ధిక పరిస్ధితి బాగోలేదనేందుకు ఇదొక సూచిక అని గోల్డ్‌మన్‌ సాచెస్‌ విశ్లేషకుడు చెప్పారు. రానున్న రోజుల్లో 1930దశకం నాటి మహామాంద్యం కంటే ఎక్కువగా నిరుద్యోగం 30శాతం మించవచ్చని కొందరు చెబుతున్నారు.
అమెరికా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఉద్దీపన పధకాన్ని డెమోక్రాట్లు అడ్డుకున్నట్లు కార్పొరేట్‌ అనుకూల అమెరికా మీడియా వార్తలను ఇచ్చింది. అధికార రిపబ్లికన్లు సామాన్యులకు బదులు కార్పొరేట్లకు ప్రజాధనాన్ని అప్పగించే ప్రతిపాదనలు చేసిన కారణంగానే డెమోక్రాట్లు వ్యతిరేకించారన్న విషయాన్ని దాచి పెట్టేందుకు మీడియా ప్రయత్నించింది. లక్ష కోట్ల డాలర్ల మేరకు ఉద్దీపన చర్యల గురించి చెబుతూ ఆమొత్తంలో 50వేల కోట్ల డాలర్లను కార్పొరేట్లకే కట్టబెట్టేందుకు ట్రంప్‌ పూనుకున్నాడు. దీన్ని ఆమోదించాలా వ్యతిరేకించాలా ? అది కూడా ట్రంప్‌, ఆర్ధిక మంత్రి ఎవరికి సిఫార్సు చేస్తే వారికి చెల్లించే ప్రతిపాదనలతో నిండి ఉంది. ఎన్నికలకు ముందు ఇలాంటి విచక్షణ అధికారంతో ఎవరు లబ్ది పొందుతారో, అందుకు ఎలాంటి పధకం వేశారో తెలుస్తూనే ఉంది. సెనెట్‌లోని వందమంది సభ్యుల్లో 60 మంది ఆమోదం అవసరం కనుక డెమోక్రాట్లు దాన్ని అడ్డుకున్నారు.
అమెరికా వ్యవస్ధ స్ధితి గురించి ప్రముఖ సామాజికవేత్త నోమ్‌ చోమ్‌స్కీ మాట్లాడుతూ ”ఆర్ధిక వ్యవస్ధ మరియు సామర్ధ్యం గురించి ఒక భావన ఉంది.రేపటికి అవసరమైన పడకలు ఉంటే మనకు చాలు, భవిష్యత్‌ కోసం సిద్దం కానవసరం లేదు. ఇలా భావించబట్టే ఆసుపత్రుల వ్యవస్ధ కుప్పకూలుతోంది. దక్షిణ కొరియాలో సాధారణ పరీక్షలను సులభంగా చేయించుకోవచ్చు, ఇక్కడ పొందలేము. కాబట్టి కరోనా వైరస్‌ను పనిచేసే సమాజంలో మాత్రమే అదుపు చేయగలం, ఇక్కడ చేతులు దాటిపోతోంది. మనం దానికి సిద్ధంగా లేము. మనమూ, మన నేతలూ గత నాలుగుదశాబ్దాలుగా బాగా చేస్తున్నదేమంటే మిగతా అంతా కుప్పకూలి పోతుంటే ధనికులు, కార్పొరేట్ల జేబులు నింపుతున్నాం.” అన్నారు.
భయంకరమైన ఈ సంక్షోభాన్ని సొమ్ము చేసుకొనేందుకు కార్పొరేట్లను అనుమతించే సమయం కాదిది అని డెమోక్రటిక్‌ పార్టీ నేత బెర్నీశాండర్స్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా కార్పొరేట్ల ఏజంట్లు(లాబీయిస్టులు) ఆయా పరిశ్రమలకు రాయితీల కోసం పైరవీలు చేస్తున్నారు. ప్రయివేటు అంతరిక్ష పరిశ్రమ ఐదు, విమానయానం 50, హౌటల్స్‌ 150బిలియన్‌ డాలర్లు కోరితే పారిశ్రామికవేత్తలు లక్షా40వేలు, అంతర్జాతీయ షాపింగ్‌ మాల్స్‌ వారు లక్ష కోట్ల డాలర్ల మేర రాయితీలు కావాలని కోరినట్లు శాండర్స్‌ తెలిపారు. జిమ్‌లు, షాపింగ్‌ మాల్స్‌ను దేశవ్యాపితంగా మూసివేసినప్పటికీ సభ్యత్వాల చెల్లింపు, ఫిట్‌నెస్‌ పరికరాలకు ముందస్తు పన్ను చెల్లింపు సొమ్మును వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలని ఆడిదాస్‌ కోరింది. ఒక వైపు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించి నిలిపివేస్తే అతిధి కార్మికులకు వీసాలు ఇచ్చేందుకు వెంటనే పార్లమెంట్‌ చర్యలు తీసుకోవాలని పందిమాంస కార్పొరేట్స్‌ కోరినట్లు వార్తలు వచ్చాయి. అత్యవసర ఆరోగ్య సేవలకోసం ఈ అసాధారణ సంక్షోభ సమయంలో పార్లమెంట్‌ అసాధారణ చర్యలకు ఉపక్రమించాలని శాండర్స్‌ కోరాడు.
మన దేశం విషయానికి వస్తే కరోనా వైరస్‌ వ్యాప్తి నేపధ్యంలో పార్లమెంట్‌ బడ్జెట్‌ను ముందుగానే ఆమోదించింది. ఇదే సమయంలో వైద్యులు, ఇతర సిబ్బంది సేవలను అభినందిస్తూ ప్రధాని నరేంద్రమోడీ జనతా కర్ఫ్యూ సందర్భంగా చప్పట్లు చరచాలని ఇచ్చిన పిలుపును అన్ని పార్టీల వారూ ఆమోదించారు, ఆచరించారు. అనేక రాష్ట్రాలు కరోనా కట్టడిలో భాగంగా జనాన్ని ఇండ్లకే పరిమితం చేస్తూ నిర్ణయించటంతో పాటు పేదలను ఆదుకొనేందుకు తమ శక్తికొద్దీ సాయాన్ని ప్రకటించాయి. అయితే కేంద్ర ప్రభుత్వం పరిశుభ్రతకు నిధులు ఇస్తామని చెప్పటం తప్ప పేదలను ఆదుకొనే నిర్దిష్ట చర్యలేవీ(ఇది రాస్తున్న సమయానికి) ప్రకటించలేదు. జనానికి ఉపశమనం కల్పించాల్సింది పోయి ఈ సమయంలోనే లీటరు పెట్రోలు, డీజిల్‌కు మూడేసి రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం పన్ను పెంచింది. మరో ఎనిమిది, పది రూపాయల వరకు పెంచుకొనేందుకు పార్లమెంట్‌ అనుమతి తీసుకుంది. లీటరుకు ఒక రూపాయి పన్ను పెంపుదల ద్వారా కేంద్రానికి ఏటా పద్నాలుగువేల కోట్ల రూపాయల ఆదాయం అదనంగా సమకూరుతుంది. గత ఆరు సంవత్సరాల కాలంలో మోడీ సర్కార్‌ పెట్రోలు మీద ఎక్సయిజ్‌ సుంకం రూ.9.48 నుంచి రూ. 22.98కి పెంచిన విషయం తెలిసిందే. అంటే జనం మీద ఏటా లక్షా 90 కోట్ల రూపాయల భారాన్ని అదనంగా మోపుతోంది. అయినా కరోనా సంక్షోభంలో కష్ట జీవులను ఆదుకొనేందుకు ముందుకు రావటం లేదు.
ఉద్దీపన చర్యల్లో భాగంగా రెండులక్షల కోట్ల రూపాయల పాకేజి ప్రకటించాలని పరిశ్రమలు, వాణిజ్య సంస్ధల వారు కేంద్రాన్ని కోరారు. జనధన్‌ బ్యాంకు ఖాతాలున్న వారికి ఐదు వేల రూపాయల నగదును బదిలీ చేయాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు. ఉద్యోగులు, కార్మికులు పనులకు వెళ్లలేని స్ధితిలో ఉంటే కనీసం 80శాతం వేతనం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.

Image result for coronavirus Donald trump cartoons
వివిధ దేశాలు తీసుకుంటున్న చర్యలు సామాన్య జనాన్ని ఆదుకొనేవిగా ఉండాలి తప్ప కార్పొరేట్లకు దోచిపెట్టేవిగా మారకూడదనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.ఈ సందర్భంగా ప్రభుత్వాలు తీసుకొనే చర్యలు విమర్శలకు అతీతంగా ఉంటాయని, కొన్ని కంపెనీల ప్రయోజనాలకు తోడ్పడకూడదని ఎవరైనా ఆశిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ జారీ చేసిన ఒక సర్క్యులర్‌ ఆ విధంగానే కనిపిస్తున్నది. రాఫెల్‌ విమానాల విషయంలో ప్రభుత్వ రంగ సంస్ధను విస్మరించి అంబానీలకు కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు కరోనా పరీక్షలకు ప్రభుత్వ సంస్ధ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవి) ఆమోదించిన అన్ని కిట్లను ఉపయోగించకుండా కేవలం అమెరికా, ఐరోపా యూనియన్‌ ఆమోదించిన వాటికే పరిమితం చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేయటాన్ని ఏమనాలి. పోనీ అవసరాలకు తగ్గట్లుగా అవి సరఫరా అవుతున్నాయా అంటే, లేదు. అలాంటి వాటిని ఉత్పత్తి చేసే సంస్ధ గుజరాత్‌లో ఒక్కటి మాత్రమే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఒకటి రెండు కంపెనీలు కిట్లతో లాభాలు పిండుకోవటాన్ని వెంటనే నివారించటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వైరస్‌ వ్యాపిస్తున్నా ఎన్నికల సభలు ఆపొద్దు : డోనాల్డ్‌ ట్రంప్‌ !

04 Wednesday Mar 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

coronavirus spreads, COVID-19, COVID-19 in US, Donald trump

Image result for Go ahead campaign rallies even as coronavirus spreads:Trump

ఎం కోటేశ్వరరావు
ఒక వైపు చైనాలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతున్నట్లు వార్తలు రాగా అమెరికాతో సహా అనేక దేశాల్లో అది విస్తరిస్తున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి. చైనా పౌరుల పట్ల తన బాధ్యతగా ఖర్చుకు వెనుకాడకుండా నివారణ, చికిత్స చర్యలు తీసుకుంటుండగా అమెరికాలో దానికి భిన్నంగా భారాన్ని జనం మీద మోపేందుకు పూనుకున్నట్లు ఇంతవరకు వచ్చిన వార్తలు సూచిస్తున్నాయి. ఇది వ్యాధికంటే జనాన్ని ఆర్ధికంగా దెబ్బతీసేదిగాను, ఆప్పుల పాలు చేసేదిగానూ ఉంది. సోమవారం నాటి వరకు ఆరుగురు మరణించగా 15 రాష్ట్రాలలో వందలాది మందికి సోకినట్లు వార్తలు వచ్చాయి. వ్యాధి నిర్దారణ పరీక్షలకు డబ్బు వసూలు చేయవద్దని న్యూయార్క్‌ గవర్నర్‌ బీమా కంపెనీలను కోరారు. వైరస్‌ విస్తరిస్తున్నా ప్రమాదం లేదని ఎన్నికల సభలను ఆపాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన అనుయాయులను కోరాడు. కావాలంటే డెమోక్రాట్లను చూడండి, వారు కొనసాగిస్తున్నారని కూడా సెలవిచ్చాడు.
ఊరంతటిదీ ఒక దారి అయితే ఉలిపికట్టెది ఒక దారి అన్నది ఒక సామెత. ప్రపంచ వ్యాపితంగా కోవిద్‌-19(కరోనా వైరస్‌)ను ఎలా అదుపులోకి తేవాలా అని చూస్తుంటే అమెరికాలో దాన్నుంచి లబ్ది పొందటం గురించి ఆలోచించే వారున్నట్లు కొన్ని ఔషధ కంపెనీల వాటాల ధరలు పెరగటం సూచిస్తున్నది. డిసెంబరు 31న చైనాలో తొలి వైరస్‌ కేసు బయటపడిన తరువాత అది ఎక్కడైనా కనిపించవచ్చు అన్న హెచ్చరికలు వెలువడ్డాయి. పాకిస్ధాన్‌ వంటి పేద దేశమంటే అర్ధం చేసుకోవచ్చు, అమెరికా వంటి ధనిక సమాజాలు ఎందుకు సిద్దం కాలేదు అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తాయి. అంచనా వేసిన దాని కంటే ఎక్కువగానే అక్కడ వ్యాపించవచ్చని ఆరోగ్య అధికారులు తాజాగా ప్రకటించారు. కోవిద్‌-19 కొత్తది కనుక చికిత్సకు వెంటనే సిద్ధపడలేదు అని చెప్పినా కొంత మేరకు అర్ధం చేసుకోవచ్చు. కానీ ప్రతి ఏటా సంభవించే ఫ్లూ(ఇది వైరస్‌తో వచ్చే జలుబు) గురించి తెలిసినా ఈ ఏడాది డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు అమెరికాలో మూడులక్షల పదివేల మందికి సోకి ఆసుపత్రుల పాలుకాగా 18వేల మంది మరణించారని వ్యాధుల నియంత్రణ మరియు నిరోధ కేంద్రం(సిడిసి) పేర్కొన్నది. కరోనా వైరస్‌ కూడా దీనికి తోడైతే అతలాకుతలంగాక తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కరోనా వైరస్‌ సోకినట్లు అనుమానించిన వారి ఆసుపత్రుల బిల్లులు చూస్తే అమెరికా పేదల పరిస్ధితి ఏమిటన్న చర్చ మొదలైంది. సాధారణ సమయాల్లో అమెరికాలో ప్రజారోగ్య భద్రతకు కేటాయింపులు తక్కువ అనే విమర్శ ఇప్పటికే ఉంది. ఇలాంటి మహమ్మారి తలెత్తినపుడు అయ్యే ఖర్చు గురించి చెప్పనవసరం లేదు. చైనా నుంచి అమెరికా పౌరుడు ఫ్రాంక్‌ యుసినిస్కీ, అతని మూడు సంవత్సరాల కుమార్తెను శాండియాగోలోని ఒక ఆసుపత్రిలో ఉంచి పరీక్షలు చేసి పరిశీలించి వ్యాధి సోకలేదని ఇంటికి పంపారు. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించిన సమాచారం మేరకు అతనికి 3,918 డాలర్ల బిల్లు వచ్చింది, దానిలో వారిని ఆసుపత్రికి తరలించి, తీసుకు వచ్చిన అంబులెన్స్‌ ఛార్జీ 2,600 డాలర్లు. అంత మొత్తం తాను చెల్లించే స్ధితిలో లేనని దాతలు తనకు సాయం చేయాలని గో ఫండ్‌ మీ అనే వెబ్‌సైట్‌లో అభ్యర్ధన పెట్టాడు. చైనా నుంచి రావటానికి అయ్యే ఛార్జీలను భరించాల్సి ఉంటుందని తనకు తనకు తెలుసునని, ఆసుపత్రికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని భావించానని యుసినిస్కీ వాపోయాడు. చైనాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో యజమాని తనకు వైద్యబీమా చేయించారని, అమెరికాలో బీమా లేదని అతను పేర్కొన్నాడు. అనేక మంది పేదలు అమెరికాలో బీమా చేయించుకోలేకపోవటం లేదా ఉన్నా పాక్షికంగా మాత్రమే సౌకర్యాలను కలిగి ఉంటున్నారు. ఈ ఉదంతం మీడియాలో వచ్చిన తరువాత పొరపాటున బిల్లు పంపామని ఆసుపత్రి యాజమాన్యం విలేకర్లకు చెప్పింది. అంబులెన్స్‌ కంపెనీ వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. విధిగా ఆసుపత్రుల్లో చేరి పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వాలు ఆదేశించినపుడు దానికయ్యే ఖర్చును ఎవరు భరించాలన్నది తెలియటం లేదని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ప్రజారోగ్య భద్రతా చర్యల్లో భాగంగా పౌరులు తమంతట తాము సంసర్గ నిషేధం(క్వారంటైన్‌) విధించుకోవాలని ప్రభుత్వాలు ఆదేశించవచ్చు. అయితే ఇది అసాధారణంగా జరుగుతుంది కనుక అందుకయ్యే ఖర్చు గురించి ఎలాంటి విధి విధానాలను రూపొందించలేదు కనుక బీమా కంపెనీలు బిల్లులు పంపుతున్నాయి.
మియామీ పౌరుడు ఓస్మెల్‌ మార్టినెజ్‌ చైనా వెళ్లి వచ్చిన తరువాత ఫ్లూ(జలుబు) చేయటంతో ఒక స్ధానిక ఆసుపత్రిలో పరీక్షలు చేయమని కోరాడు. సిటి స్కాన్‌ చేయాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పగా ఫ్లూ పరీక్ష మాత్రమే చేయించుకున్నాడు. దానికి గాను 3,270 డాలర్లకు గాను బీమా సొమ్ము పోను 1400 డాలర్లు చెల్లించాలని బిల్లు చేతిలో పెట్టటంతో దిమ్మ తిరిగి జలుబు ఎగిరిపోయింది. అనేక మంది ఇలాంటి బిల్లులను చూసి పరీక్షలు చేయించుకొనేందుకు భయపడుతున్నట్లు ప్రజారోగ్య నిపుణుడైన ఒక ప్రొఫెసర్‌ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఫ్లూ లేదా ఆ లక్షణాలు ఉండే కరోనా వైరస్‌ పరీక్షలు చేయించుకొంటే తాము అప్పుల పాలు కావలసిందే అని సామాన్య అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్‌ పరీక్షలు ఉచితం అయినా బీమా వర్తించని ఆసుపత్రిల రూము అద్దెలు, అంబులెన్సులు ఇతర ఖర్చులు తడిచి మోపెడు కానున్నాయి. అసలు బీమా రక్షణ లేని అమెరికన్లు 2.7కోట్ల మంది ఉన్నారు. సాధారణ ఫ్లూ, ఎ, బి వైరస్‌ పరీక్షలు, సిఎంపి రక్త పరీక్షలకు 1295 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అదే బీమా ఉంటే 587 డాలర్లు చెల్లిస్తే సరిపోతుంది.
గడచిన 24 గంటలలో 125 కొత్త కేసుల నమోదు, హుబెరులో 31 మంది మరణించినట్లు మంగళవారం నాడు చైనా ప్రకటించింది. జనవరి 21వ తేదీ తరువాత ఇంత తక్కువగా నమోదు కావటం ఇదే ప్రధమం. అక్కడ మొత్తం 80,151 మందికి సోకగా 2,943 మంది మరణించారు. డెబ్బరు దేశాలలో 90వేల మందికి సోకగా 3,116 మంది మరణించారు. ప్రస్తుతం దక్షిణకొరియా, ఇరాన్‌, ఇటలీలో ఎక్కువగా వ్యాపిస్తోంది. దక్షిణ కొరియాలో 5,186 మందికి సోకింది. అక్కడి ప్రభుత్వం వైరస్‌పై యుద్దం ప్రకటించింది. ఆర్ధికంగా ఉద్దీపన చర్యలకు 25బిలియన్‌ డాలర్లు ప్రకటించింది. దక్షిణ కొరియాలో స్ధానిక పౌరులు కానప్పటికీ ఆరోగ్య రక్షణ అక్కడ ఉచితంగా అందిస్తారు. ప్రపంచ వ్యాపితంగా ఉన్న తన సిబ్బంది ఇండ్ల నుంచే పని చేయాలని ట్విటర్‌ కోరింది. ఇటలీలో 2036 కేసులు నమోదయ్యాయి.

Image result for Go ahead campaign rallies even as coronavirus spreads:Trump
అమెరికాలో కరోనా వైరస్‌ వార్తలు రాగానే కొన్ని కంపెనీలు తాము పరీక్ష కిట్‌లను విక్రయించనున్నట్లు ప్రకటించాయి. అలాంటి వాటిలో ఒకటి కో డయాగస్టిక్స్‌, కిట్లను విక్రయించనున్నట్లు ప్రకటించగానే దాని వాటాల ధర 59శాతం పెరిగాయి. ఫైజర్‌ కంపెనీల వాటాల ధరలు ఒక్కరోజే పదమూడుశాతం ఎగబాకాయి. వాటాలను కొనేందుకు మదుపుదారులు ఎగబడటం తప్పా ఒప్పా అనే అంశాన్ని పక్కనపెడితే కార్పొరేట్‌ కంపెనీలు వ్యాధులతో జరిపే వ్యాపారాల్లో లాభాలు ఎలా ఉంటాయో కూడా ఇది వెల్లడిస్తున్నది.
2009లో స్వైన్‌ ఫ్లూ(హెచ్‌1ఎన్‌1) విస్తరించిన సమయంలో ఒక్క అమెరికాలోనే 5.9కోట్ల మందికి సోకగా పన్నెండువేల మంది మరణించారు, ప్రపంచ వ్యాపితంగా మూడులక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. కరోనా గురించి నిర్ధారణ కాగానే చైనా తీసుకున్న అసాధారణ నివారణ చర్యలను, స్వైన్‌ ఫ్లూ వచ్చినపుడు అమెరికా తీరును ఒక్కసారి పోల్చి చూడటం అవసరం. వెయ్యి , పదహారు వందల పడకల రెండు ఆసుపత్రులను పది రోజుల వ్యవధిలో చైనా నిర్మించిన తీరు, ఏడుకోట్ల మంది జనాన్ని ఇండ్లకే పరిమితం చేసిన నిర్ణయం కనీవినీ ఎరుగనివి. అమెరికన్‌ వైరస్‌గా అమెరికన్లే పిలుచుకున్న స్వైన్‌ ఫ్లూ విస్తరణ సందర్భంగా నివారణ చర్యలు తీసుకొనేందుకు ఆరునెలల సమయం తీసుకుంది. ఎలాంటి ప్రయాణ ఆంక్షలు, సంసర్గ నిషేధాలు, సరిహద్దుల్లో తనిఖీలు లేవు. అది మహమ్మారిగా మారి 214 ప్రాంతాలు, దేశాలకు విస్తరించింది. ఇప్పుడు చైనాను నిందిస్తున్న మాదిరి అప్పుడు స్వైన్‌ ఫ్లూ అమెరికాయే కారణమని ఎవరూ నిందించలేదు. సోషలిస్టు చైనా నాయకత్వానికి, లాభాలు తప్ప మరొకటి పట్టని పెట్టుబడిదారీ వ్యవస్ధకు ఉన్న తేడా ఇది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ -ట్రంప్‌ ఉల్లాసాన్ని దెబ్బతీసిన ఢిల్లీ ‘పధకం’ !

01 Sunday Mar 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, USA

≈ Leave a comment

Tags

Delhi violence, Donald trump, Donald Trump India tour, Narendra Modi

Image result for delhi planned violence spoils modi-trump party

ఎం కోటేశ్వరరావు
నరేంద్రమోడీ అనుకున్నదొకటీ, అయింది ఒకటి. కొన్ని సందర్భాలలో ఎవరి పథకాలు, ఎత్తుగడలు వారినే దెబ్బతీస్తాయి. మోడీ ఆహ్వానం మేరకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబ సమేతంగా రెండు రోజుల పర్యటన జరిపి వెళ్లారు. ఆ పెద్దమనిషి ఢిల్లీలో ఉండగానే జరిపించిన, జరిగిన ఘటనలతో కాషాయ దళాల ముసుగు మరింతగా తొలిగింది, చాలా దగ్గరగా అనేక మంది వారిని చూడగలిగారు. దొంగకే తాళాలు ఇస్తే దొంగతనాలు ఆగిపోతాయని అనేక మంది భ్రమపడినట్లే మతోన్మాదులకే అధికారమిస్తే మత ఘర్షణలు జరగకుండా ప్రశాంతంగా బతకవచ్చు అనుకున్నవారికి కూడా ఢిల్లీ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మత ఘర్షణల చరిత్రను చూసినపుడు అవి ఎన్నడూ వాటంతట అవి పుట్టలేదు, ఎక్కడో ఒక దగ్గర రూపొందించిన పథకాలతోనే జరిగాయి. లేదా ఎక్కడైనా అనుకోకుండా జరిగిన ఘటనలను ఉపయోగించుకొనేందుకు సిద్దంగా ఉన్న వారు చెలరేగిపోయినపుడు తలెత్తాయి.
ఢిల్లీ ఎన్నికలకు ముందునుంచీ బిజెపి నేతల రెచ్చగొట్టుడు తీరు తెన్నులు, వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో అని అనేక మంది భయపడ్డారు. దానికి అనుగుణ్యంగానే అనేక మంది అనుమానిస్తున్నట్లుగా ఉత్తర ప్రదేశ్‌ నుంచి వచ్చిన అపర ‘జాతీయ వాదులు లేదా దేశ భక్తులు ‘ ఈశాన్య, తూర్పు ఢిల్లీలో జరిపిన హింసాకాండను చూశాము. దాన్ని ప్రతిఘటించే క్రమంలో కూడా కొందరు బలై ఉంటారు. హింసాకాండ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తి మురళీధర్‌ను రాత్రికి రాత్రే ఢిల్లీ హైకోర్టు నుంచి బదిలీ చేసిన తీరుతో హింసాత్మక శక్తులను రక్షించేందుకు కేంద్ర పాలకులు ఎంతకైనా తెగిస్తారని అనేక మందికి ఎవరూ చెప్పకుండానే అర్ధం అయింది. దీన్నుంచి తేరుకోక ముందే శుక్రవారం నాడు రికార్డు స్ధాయిలో స్టాక్‌ మార్కెట్‌ పతనం, వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మూడవ త్రైమాసిక అభివృద్ధి అంచనా 4.7శాతంగా ఉన్నట్లు ప్రభుత్వమే ప్రకటించింది. డోనాల్డ్‌ ట్రంప్‌ నుంచి పొందిన ప్రశంసలతో కొద్ది రోజులు కాలక్షేపం చేద్దామని సంబరపడిన మోడీ పరివారాన్ని వెంట వెంటనే జరిగిన ఈ ఘటనలన్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ పరిణామాలు దేశాన్ని ఎటు తీసుకుపోనున్నాయో, ఆర్ధిక సమస్యల నుంచి ఎలా బయటపడతామో తెలియని అయోమయంలో దేశం ఉంది.
సామాజిక మాధ్యమంలో కాషాయ దళాలు భారతమాతాకి జై అనే పేరుతో వ్యాపింప చేస్తున్న ఒక పోస్టులోని అంశాలు ఇలా ఉన్నాయి.” బీజేపీ దేశం కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.ఇప్పటి వరకు కొన్ని నిర్ణయాలు మాత్రమే తీసుకున్నాము, 1. జిఎస్‌టి,2.ట్రిపుల్‌ తలాఖ్‌ రద్దు 3. రామ మందిర్‌ 4.370ఆర్టికల్‌ రద్దు-5.( సిఎఎ)పౌరసత్వ సవరణ చట్టం,నోట్ల రద్దు.6. బినామీ చట్టం 7.కార్పొరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడం,8.త్రివిధ దళాల అధిపతి నియామకం (సీడీఎస్‌),ఇవన్నీ కేవలం సాంపిల్స్‌,మాత్రమే. ఇప్పటి నుంచి అసలు కథ . ఇండియా యాక్షన్‌ ప్లాన్‌ 2020. రాబోయే రోజులో ఇంకా చాలా ఉన్నాయి.1. ఎన్‌ఆర్‌సి,2. యుసిసి(ఉమ్మడి పౌరస్మృతి), 3.ఆక్రమిత కాశ్మీర్‌,4. కుటుంబ నియంత్రణ చట్టం,5. జమిలి ఎన్నికలు,6. మత మార్పిడి నిరోధక చట్టం. ఇలా చాలా చాలా చేస్తాము, చేస్తూనే ఉంటాము .. దేశ క్షేమమే మా లక్ష్యం..దేశం కోసం, దేశ శ్రేయస్సు కోసం, సనాతన భారతీయత ధర్మ పరి రక్షణ కోసం చేయవలసినది చేస్తాము .. తనకు ….సంపదన మీద ఆశ లేదు …. అవినీతి సంపాదన పోతుందీ అన్న బెంగా లేదు, తన ప్రాణం మీద ప్రీతీ లేదు,ఉన్నది ఒకటే, ఇదీ..మన దేశం… నా దేశం.అంతే..ఉంటే ఉంటాం పోతే పోతాం..దేశానికి మేలు చేసే పోతాం.”
పైన పేర్కొన్న అంశాలలో ఏ ఒక్కటీ దిగజారుతున్న దేశ ఆర్ధిక స్ధితిని మెరుగుపరచేది కాదు, ఉపాధిని పెంచేది కాదు, ఉద్యోగాలు ఇచ్చేదీ, ధరలు తగ్గించేదీ కాదు. వివాదాస్పద అంశాలతో సామాజికంగా అశాంతిని, విభజనను మరింతగా పెంచే భావోద్వేగ అంశాలు తప్ప దేశ ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపరచే చర్యలేవీ వాటిలో లేవు. గత ఆరు సంవత్సరాలలో కూడా చేసింది ఇదే. దేశ వృద్ధి రేటు గరిష్టంగా ఉన్న ఏడున్నరశాతం నుంచి ఏడేండ్ల కనిష్టానికి( ఐదుశాతానికి ) దిగజారింది. సామాజికంగా పరస్పరం అపనమ్మకాలు, విద్వేషాలు పెరిగాయి. అయినా ఇప్పటి వరకు నమూనా మాత్రమే, అసలైన అజెండా ముందుంది అంటూ కాషాయ దళాలు దేశాన్ని మరింతగా ఇబ్బందుల పాలు చేసే అజెండాను అమలు జరుపుతామని రెచ్చిపోతున్నాయి. భావోద్వేగాలు పరిస్ధితిని మరింత దిగజార్చుతాయి తప్ప మెరుగుపరచే అంశాలేమీ వాటిలో ఉండవు.
పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) దేశంలో చిచ్చు రేపింది. దీని వలన ఎవరికీ పౌరసత్వం పోదు కదా ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అంటూ కాషాయ దళాలు అమాయకంగా అడుగుతున్నాయి. దానివలన పౌరసత్వం పోతుందని ఎవరూ చెప్పటం లేదు. ఎన్‌ఆర్‌సి పేరుతో పౌరసత్వాన్ని నిరూపించుకొనేందుకు అవసరమైన పత్రాలు సమర్పించాలన్న అంశంతో అసలు ఆందోళన ప్రారంభమైంది.సిఎఎ తరువాత ఎన్‌ఆర్‌సి అని చెప్పింది బిజెపి వారే. సిఎఎ ద్వారా ఎందరికి పౌరసత్వం కల్పించనున్నారో చెప్పండని బిజెపి వారిని ఎవరినైనా అడిగితే వారి దగ్గర సమాధానం లేదు. పౌరసత్వం ఒకరు ఇచ్చేది కాదు, విదేశీయులకు ఏ గడ్డమీద అయినా పిల్లలు పుడితే అక్కడి పౌరులు కావటం అనేక దేశాలలో జన్మతహ: ఇస్తున్న హక్కు. మన దేశంలో పుట్టిన వారినే ఆధారాలు చూపమని అడుగుతున్నారు. ఈ విపరీత పోకడ ప్రపంచంలో ఎక్కడా లేదు. గత 70సంవత్సరాలుగా పౌరసత్వం రాని లక్షలు, కోట్లాది మందికి మందికి పౌరసత్వం ఇవ్వనున్నామని కాషాయ దళాలు చెప్పటం మోసకారితనమే.
తాము మత ప్రాతిపదికన దాడులకు గురయ్యామంటూ మన దేశ పౌరసత్వాన్ని కోరుకున్న విదేశీయుల సంఖ్య కేవలం 31,313 మంది మాత్రమే అని వారిలో హిందువులు 25,447, సిక్కులు 5,807, క్రైస్తవులు 55, బౌద్దులు ఇద్దరు మాత్రమే అని ఇంటెలిజెన్స్‌ బ్యూరో గతేడాది వెల్లడించింది. వీరందరూ నిజంగా మత పరమైన దాడులకు గురయ్యారా లేక మన దేశం రావటానికి ఆ మార్గం అయితే సులువుగా వుంటుందని ఆ కారణాలు చెబుతున్నారో అన్నది కూడా అనుమానమే. అంటే సిఎఎ ద్వారా లబ్ది పొందేది వీరు మాత్రమే. సిఎఎ దీనికి మాత్రమే పరిమితం అయితే సమస్య లేదు, దాని కొనసాగింపుగా జాతీయ పౌరసత్వ జాబితా తయారు చేస్తామని దానిలో పౌరసత్వాన్ని నిరూపించుకొనే పత్రాలు ఇవ్వాలని చెప్పటమే అసలు అందోళనకు మూలం. నిజానికి సిఎఎ ద్వారా పొరుగుదేశాల్లో ఉన్న హిందువులు, ఇతర ముస్లిమేతర మైనారిటీల మీద దాడులకు, ఆయా దేశాల నుంచి తరిమి వేయాలని అక్కడి మతోన్మాదులను ప్రోత్సహించటమే. ఇక్కడి మతోన్మాదులను మైనారిటీల మీదకు ఉసిగొల్పే దుష్ట ఆలోచనే. ఒక వేళ ఎక్కడైనా అలాంటి దాడులు జరిగితే ఆయా ప్రభుత్వాల మీద వత్తిడి తెచ్చి వాటిని ఆపాలి తప్ప మతం పేరుతో రాజకీయాలు చేయటం, ముస్లింలపై ద్వేషాన్ని రెచ్చగొట్టటం అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను అమలు జరపటమే. దానికోసం దేశాన్ని బలిపెట్టాలా ?

Image result for delhi violence
ఎన్‌ఆర్‌సి, ఎన్‌ఆర్‌పిలను వ్యతిరేకిస్తున్నది ఒక్క ముస్లింలే కాదు, హిందువులతో సహా అన్ని మతాల వారు వ్యతిరేకిస్తున్నారు. వారిలో ఎన్‌ఆర్‌సితో తమను ఇబ్బందులు పెట్టాలన్న ఎత్తుగడ ఉందని భయపడుతున్న ముస్లింలు గత కొద్ది నెలలుగా బహిరంగంగానే ఆందోళన చేస్తున్నారు. బిజెపి అజెండాలో తొలి దాడి ముస్లింల మీద ఉంది కనుక వారు ముందుగా మేలుకొని వీధుల్లోకి వచ్చారు తప్ప ఆధారాలు సమర్పించలేని కోట్లాది మంది ఇతర సామాజిక తరగతుల్లో కూడా అలాంటి ఆందోళన లేకపోలేదు. దేశ విభజన సమయంలో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అనేక మంది మారిపోయారు గనుక వెంటనే ఒక పౌరజాబితాను తయారు చేయాల్సి వచ్చింది. తరువాత బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన వారి సమస్య కారణంగా అసోంలో జాబితాను తయారు చేయాల్సి వచ్చింది తప్ప మిగతా దేశానికి అవసరం ఏమిటి? అక్రమంగా వచ్చే వారిని నిరోధిస్తున్నారు లేదా శరణార్ధులుగా వచ్చే వారికి పౌరసత్వం ఇవ్వాలా లేదా లేక వారిని పౌరసత్వం లేని పౌరులుగా గుర్తించి అనుమతించాలా అనేందుకు ఇప్పటికే చట్టాలు ఉన్నాయి. అలాగాక తలిదండ్రులు, తాతలతో సహా పుట్టిన ఆధారాలు సమర్పించి పౌరులని నిరూపించుకోవాల్సిన బాధ్యత మనకు లేదు. కానీ పౌరజాబితా తయారీని అమలు జరపాలని ఆందోళన చేస్తున్నవారెవరు ? దాని వెనుక ఉన్న లక్ష్యం ఏమిటి? ఎన్‌ఆర్‌సి, ఎన్‌ఆర్‌పి అమలు జరపాలనటానికి, జై శ్రీరామ్‌ నినాదాలతో పనేముంది ? ఈశాన్య ఢిల్లీలో జై శ్రీరాం పేరుతో చెలరేగిపోవటం, సిఎఎ వ్యతిరేక ఆందోళనను మత ఘర్షణలుగా మార్చటం వెనుక ఉన్నది ఎవరు ? వారు కూడా షాహిన్‌బాగ్‌ లేదా మరొక చోటో కూర్చొని శాంతియుత ఆందోళన చేసేందుకు అవకాశం ఉంది కదా ? లేదూ సిఎఎ వ్యతిరేకుల కుట్రే ఇది అని చెబుతున్న బిజెపి పెద్దలే ఢిల్లీ చుట్టుపట్ల ఉన్న రాష్ట్రాలన్నింటా అధికారంలో ఉన్నారు. వారి పోలీసు, గూఢచార, కేంద్ర గూఢచార వ్యవస్ధలన్నీ ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? అందునా ట్రంప్‌ పర్యటనకు వస్తున్నపుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా ? అయినా స్వేచ్చగా అల్లరి మూకలు చెలరేగటం, ఢిల్లీ పోలీసులు ప్రేక్షకపాత్ర వహించటాన్ని బట్టి సిఎఎ, ఎన్‌ఆర్‌సి వ్యతిరేకులు, ప్రతిపక్షాల మీద నిందమోపే ఒక కుట్రలో భాగంగానే ఢిల్లీ పరిణామాలు జరిగాయని అందరూ అనుకుంటున్నారు. అమెరికా సిఐఏ, ఇజ్రాయెల్‌ మొసాద్‌ల నుంచి నేర్చుకున్న ఇలాంటి చావు తెలివి తేటలను ప్రయోగించి చూస్తున్నారు. ఒక ఆప్‌ కౌన్సిలర్‌ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అతను నిజంగా అల్లర్లను ప్రేరేపించాడా లేక రాజకీయంగా ఆప్‌ను దెబ్బతీసేందుకు తప్పుడు కేసు బనాయించారా అన్నది చెప్పలేము. పేలని తుపాకులు, కమ్యూనిస్టు సాహిత్యాన్ని పక్కన పడవేసి బూటకపు ఎన్‌కౌంటర్లు చేయటం లేదా విప్లవ సాహిత్యం పేరుతో కేసులు నమోదు చేయటాన్ని చూస్తున్న మనకు పోలీసులు ఎంతకైనా తెగిస్తారన్నది తెలిసిందే.
గతేడాది అక్టోబరు రెండవ వారంలో చైనా అధిపతి గ్జీ జింపింగ్‌ మహాబలిపురం పర్యటనకు వచ్చారు, ఫిబ్రవరి చివరి వారంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా వచ్చారు. ఇద్దరినీ నరేంద్రమోడీ ఆహ్వానించారు. వారి పర్యటనల్లో ఎంత వ్యత్యాసం ఉందో మనం గమనించాము. గ్జీ పర్యటన సాదాసీదాగా సాగింది, ట్రంప్‌ పరస్పర పొగడ్తలు, కౌగిలింతలు, అదిరింపులు, బెదిరింపులను యావత్‌ ప్రపంచం చూసింది. ఈ పర్యటనల్లో ఉన్న తేడాలు ఏమిటి ? అమెరికాతో మన వాణిజ్యం మిగులులో ఉంది. చైనాతో లోటులో ఉంది. మనకు గతంలో ఇస్తున్న రాయితీలను ఎత్తివేసింది అమెరికా, మనలను అభివృద్ది చెందిన దేశంగా పరిగణించి మరికొన్ని రాయితీలను రద్దు చేసింది. మనం ప్రతిగా విధించిన పన్నులను చూపి మన మీద బెదిరింపులకు దిగింది. తమ వస్తువుల మీద పన్నులు తగ్గించాలని, ఎక్కువగా కొనుగోలు చేయాలంటూ ట్రంప్‌ వత్తిడి తెచ్చారు, మిలిటరీ హెలికాప్టర్ల ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో తమ దగ్గర నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతులను మరింతగా పెంచాలని, కోళ్ల ఉత్పత్తులు, పాల ఉత్పత్తులను ఎక్కువగా కొనుగోలు చేయకపోతే ఆలోచించాల్సి వస్తుందని బెదిరింపులతో కూడిన హెచ్చరికలు చేసి వెళ్లారు. అదే జింపింగ్‌ విషయానికి వస్తే నిర్దిష్ట అజెండా లేకుండానే వచ్చారు. రాబోయే రోజుల్లో మా వస్తువులను మరింతగా కొనుగోలు చేయాలంటూ నరేంద్రమోడీ సర్కార్‌ సాధారణపద్దతుల్లోనే కోరింది తప్ప వత్తిడి, డిమాండ్ల రూపంలో వ్యవహరించలేదు. చైనా నేత బెదిరింపులకు దిగలేదు.
2018-19లో అమెరికాతో మన వాణిజ్య మిగులు 16.85 బిలియన్‌ డాలర్లు, తరువాత సంవత్సరంలో కూడా అదే ధోరణి కొనసాగింది. నిజానికి అమెరికాతో మన మిగులు నరేంద్రమోడీ సర్కార్‌ సాధించిన ఘనత కాదు. అంతకు ముందు మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో కూడా మన దేశం మిగుల్లోనే ఉంది. కొద్ది పాటి హెచ్చు తగ్గులు తప్ప దాదాపు గత ఆరు ఏడు సంవత్సరాలుగా ఒకే మోస్తరులో ఉంది. ఇదే సమయంలో సంఘపరివార్‌ చైనాను ఎంతగా ద్వేషిస్తుందో దాని నేతగా ఉన్న నరేంద్రమోడీ హయాంలో వాణిజ్యంతో పాటు లోటు కూడా గణనీయంగా పెరిగిందన్నది చాలా మంది జీర్ణించుకోలేని అంశం. 2012లో మన దేశ వాణిజ్య లోటు చైనాతో 39.4 బిలియన్‌ డాలర్లు ఉంటే గతేడాది 74 బిలియన్‌ డాలర్లకు చేరింది.
ఈ కారణంగానే మన వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేయాలని మనం చైనాను డిమాండ్‌ చేస్తుంటే తమ వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేయాలని అమెరికా మనలను డిమాండ్‌ చేస్తోంది. అమెరికా నుంచి కొన్ని వస్తువులను కొనుగోలు మన మీద అధిక భారం పడుతుంది. కోళ్లు, పాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే వాటి మీద అమెరికా ఇచ్చే రాయితీలు, తక్కువ ధరల కారణంగా మన కోళ్ల, పాడిపరిశ్రమ మీద ఆధారపడిన దాదాపు పది కోట్ల మంది రైతాంగం, కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. ఈ రంగాలలో మనం సాధించిన స్వయం పోషకత్వం పోయి పరాయి దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది. అందుకే ఎవరు అధికారంలో ఉన్నా ఈ రంగాలలో అమెరికా లేదా మరొక దేశ వస్తువుల దిగుమతుల అనుమతికి జంకుతున్నారు తప్ప నేతల గొప్పతనం లేదా ట్రంప్‌ చెప్పినట్లు మోడీ కఠినంగా వ్యవహరించటమూ కాదు. ఇదే నరేంద్రమోడీ గారు కొన్ని విషయాల్లో బాంచన్‌ దొరా మీరు అనుకున్నట్లే చేస్తా అని ఎలా లొంగిపోతున్నారో మరోచోట చూద్దాం.
ఇక డోనాల్డ్‌ ట్రంప్‌ను ఆహ్వానించి నరేంద్రమోడీ తన పలుకుబడితో భారత్‌కు ఎంతో మేలు చేకూర్చుతారని ఎందరో ఆశించారు. అదే విధంగా ఎన్నికల సంవత్సరంలో తమ ట్రంప్‌ ప్రతి దేశంతోనూ గీచి గీచి బేరాలాడి లేదా బెదిరించి తమ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తారని అమెరికన్లు కూడా ఆశించారు. అక్కడ కార్పొరేట్లు ఆశలు పెట్టుకుంటే దిగజారుతున్న దేశ ఆర్ధిక పరిస్ధితిని మోడీ చక్కదిద్ది తమ జీవితాలను మరింతగా దిగజారకుండా చూస్తారా అని సామాన్యులు ప్రధానంగా ఇక్కడ ఎదురు చూశారు. జరిగిన పరిణామాలను బట్టి అక్కడ ట్రంప్‌, ఇక్కడ నరేంద్రమోడీ కూడా నిరాశపరిచారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తేడా అల్లా అక్కడ కొన్ని కార్పొరేట్లు తాత్కాలికంగా నిరాశచెందితే ఇక్కడ సామాన్యులు ఆశాభంగం పొంది ఇక మన బతుకులింతే అనే నిర్వేదానికి గురవుతున్నారు.
ట్రంప్‌ పర్యటన సమయంలోనే ఒక వార్త వెలువడింది. ట్రంప్‌ భజనలో మీడియాలో దానికి అంత ప్రాచుర్యం రాలేదని చెప్పాలి. ఇటీవలి వాణిజ్య లావాదేవీలలో మన వాణిజ్యం చైనాను అధిగమించి అమెరికాతో ఎక్కువ జరిగింది అన్నది వార్త సారాంశం. చైనా వ్యతిరేకులకు ఇది వీనుల వింపైన సంగీతం వంటిదే. అదే దేశభక్తి అని భావించేవారు కూడా లేకపోలేదు. ఇక్కడ ప్రశ్న ఏ దేశంతో అయినా వాణిజ్యం జరిపేది కార్పొరేట్‌ సంస్ధలే, సామాన్యులు కాదు అన్నది పచ్చినిజం. ఎవరి కోసం తొలి రోజు గుజరాత్‌ పర్యటనలో ట్రంప్‌-నరేంద్రమోడీ ఆరుసార్లు కౌగలించుకున్నట్లు ? నాటకంలో ప్రతి పాత్రధారి తన పాత్రను రక్తి కట్టించేందుకు ప్రయత్నించారు అని సమీక్షకులు రాస్తారు.ఈ కౌగిలింతల పర్వం కూడా అదే. దేశం కోసమే ఇదంతా అన్నట్లుగా ఎవరికి వారు నటించారని చెప్పవచ్చు. ఎన్నికల్లో మరోసారి విజయం కోసం ట్రంప్‌ తాపత్రయ పడుతుంటే రెండవ సారి గెలిచి రాజకీయంతో సహా అన్ని రంగాలలో వైఫల్యాలను ఎదుర్కొంటున్న నరేంద్రమోడీ తన పరపతి ఎలాంటిదో ఒక అగ్రరాజ్యనేత నోట వినిపించాలని తహతహలాడారు. ఆర్ధిక పరిస్ధితి, ఢిల్లీ పరిణామాలతో ట్రంప్‌ పొగడ్తలను నెమరు వేసుకొని ఆనందించే అవకాశం లేకుండా పోయింది. ట్రంప్‌ నోట కాశ్మీర్‌, సిఎఎ వంటి అంశాలపై ఎక్కడ ప్రతికూల వ్యాఖ్యలు వస్తాయో, రాకుండా చూడు గోమాతా అన్నట్లుగా బిజెపి నేతలు ఉగ్గపట్టుకు కూర్చున్నారు. భవిష్యత్‌లో మరింత పెద్ద అవసరానికి లేదా ప్రయోజనానికి తురుపు ముక్కగా ప్రయోగించుదాం అన్నట్లుగా విలేకర్లు అడిగినా ట్రంప్‌ తప్పించుకోవటానికి అర్దం ఇదే.

Image result for delhi planned violence spoils modi-trump party
మీ ప్రధాని నరేంద్రమోడీ ఎంతో గట్టిగా వ్యవహరిస్తారబ్బా అని ట్రంప్‌ పొగిడారు. ఇది మోడీని ఉబ్బవేయటానికి చెప్పిన మాటలు మాత్రమే. ఏ దేశంతో స్నేహం చేసినా మన దేశ ప్రయోజనాలను సదా గమనంలో ఉంచుకోవాలి.ఎదుటి వారి పొగడ్తల కోసం మనల్ని మనం మరిచిపోకూడదు. అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఐరోపా యూనియన్‌ కలసి ఇరాన్‌తో ఒక అణు ఒప్పందాన్ని చేసుకున్నాయి. దాన్నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అంతేకాదు, ఇరాన్‌తో వాణిజ్యలావాదేవీలు జరిపే దేశాల మీద ఆంక్షలు పెట్టింది. చిత్రం ఏమిటంటే ఒప్పందంలోని ఏ ఒక్కదేశ మూ అమెరికా వైఖరిని సమర్ధించలేదు, ఆంక్షలను ఖాతరు చేయలేదు. కానీ అమెరికాతో మనం సమాన భాగస్వాములుగా ఉన్నాం, ఎంతో కఠినంగా వ్యవహరిస్తాం, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తాం అని గొప్పలు చెప్పుకుంటున్న మోడీ సర్కార్‌ మాత్రం ఆంక్షలను అమలు జరిపేందుకు అమెరికాకు సాగిల పడింది. మన రూపాయలు ప్రపంచ మార్కెట్లో దేనికీ పనికి రావు, అయినా ఎప్పటి నుంచో ఉన్న స్నేహం కారణంగా వాటిని తీసుకొని చమురు విక్రయిస్తున్న ఇరాన్‌ దగ్గర కొనుగోలు చేయటం నిలిపివేసి అమెరికా నుంచి తెచ్చుకుంటున్నాం. అమెరికా నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేనపుడు కరాచీ రేవుతో పని లేకుండా ఇరాన్‌లోని చాబహార్‌ రేవును అభివృద్ధి చేయటం ద్వారా మన వాణిజ్య లావాదేవీలు నిర్వహించుకోవాలని నరేంద్రమోడీ సర్కార్‌ అక్కడ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది. అమెరికా బెదిరింపుల కారణంగా ఇప్పుడు ఆ పధకాన్ని పక్కన పడేసింది. ఇరాన్‌-అమెరికా మధ్య పంచాయతీ తలెత్తటం ఏమిటి? అమెరికాకు కోపం రాగానే మన ప్రయోజనాలకోసం నిర్మించే రేవును మధ్యలో వదలి వేసి రావటం ఏమిటి ? ఈ పరిణామం మన దేశం అమెరికాకు లొంగిపోవటాన్ని సూచిస్తున్నదా? లేక స్వతంత్ర వైఖరి, సమాన భాగస్వామిగా మన దేశ ప్రతిష్ట,మాన మర్యాదలను నిలబెట్టేదిగా ఉందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీని దేశపితగా అంగీకరించకపోతే భారతీయులు కాదా ?

29 Sunday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

BJP motor mouths, Donald trump, father of the country, Father of the Nation, Mahatama Gandhi, Narendra Modi, Nathuram Godse

Image result for PM As “Father Of India”

(నరేంద్రమోడీ సమాజ ఐక్యతకు ప్రతీకా లేక విభజన దళపతా ! అన్న విశ్లేషణ ముగింపు రెండవ భాగం)

ఎం కోటేశ్వరరావు

ప్రముఖ నేతలు మనసా, వాచా, కర్మణా జీవితాలను జాతికి అంకితం చేసిన వారిని కొన్ని దేశాలలో జాతిపితలుగా వర్ణించి గౌరవించటం మనం చూస్తున్నాం. రాజకీయంగా విబేధించే వారు కూడా వారి వ్యక్తిత్వాలను గౌరవిస్తారు. స్పెయిన్‌ వంటి చోట్ల రాజకుటుంబానికి పాలనా పరంగా ఎలాంటి బాధ్యతలు, హక్కులు లేనప్పటికీ రాజును దేశ ఐక్యతా చిహ్నంగా పరిగణిస్తారు. థాయ్‌లాండ్‌లో కూడా రాజుకు అటువంటి గౌరవమే వుంది.

కొన్ని దేశాలలో దేశ స్ధాపకులుగా కొందరిని గౌరవిస్తారు. అయితే కొంత మంది తమకు తామే జాతిపితలుగా ప్రకటించుకున్నవారు కూడా లేకపోలేదు. వారంతా నియంతలు, ఇతర అవాంఛనీయ శక్తులకు ప్రాతినిధ్యం వహించిన వారిగానే వున్నారు. ప్రపంచ సమాజం వారిని గుర్తించ లేదు. టోగో అనే దేశంలో గనాసింగ్‌బె యడేమా తను జాతిపిత, పెద్ద అన్న, ప్రజల మార్గదర్శకుడు అనే బిరుదులతో పిలిపించుకున్నాడు. జైరే నియంత మొబుటు సెసె సెకో జాతి పిత, దేవదూత, వుదయించే సూర్యుడు వంటి పేర్లను తగిలించుకున్నాడు.

కొన్ని సందర్భాలలో ముఖ్యంగా నియంతల కాలంలో జాతి పిత వివాదాలకు కారణమైంది. బంగ్లాదేశ్‌ విముక్తి పోరాట నేత ముజబుర్‌ రహ్మాన్‌ అని అందరికీ తెలిసిందే. పాకిస్దాన్‌ నుంచి విముక్తి పొందిన అనంతరం 1972లో రాజ్యాంగంలో ఆయనను జాతిపిత అని చేర్చారు.2004 అధికారానికి వచ్చిన బిఎన్‌పి దాన్ని రాజ్యాంగం నుంచి తొలగించింది. దాని మీద నిరసనలు వ్యక్తమయ్యాయి.

నరేంద్రమోడీని భారత దేశ పిత అని పిలిచారు తప్ప జాతిపిత అనలేదు కదా అని కొందరు వాదిస్తున్నారు. చరిత్రలో బ్రిటీష్‌ వారు ఆక్రమించుకోక ముందు ఇప్పుడు మనం అమెరికాగా పిలుస్తున్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనే ఒక దేశం లేదు. కొలంబస్‌ అమెరికాను కనుగొన్న తరువాత వివిధ ఐరోపా దేశాల నుంచి వలస వచ్చిన వారు 13వలస ప్రాంతాలను ఏర్పాటు చేశారు. 1760దశకంలో అక్కడి జనాభా కేవలం 25లక్షల మాత్రమే. బ్రిటీష్‌-ఫ్రెంచి వారి యుద్ధాలను చూసి, వాటి పర్యవసానాలతో ప్రభావితమైన ఆ కాలనీలకు చెందిన ప్రముఖుల ఆధ్వర్యంలో బ్రిటీష్‌ వారి వలసపాలనను వ్యతిరేకించి అమెరికా అనే దేశాన్ని ఏర్పాటు చేశారు. వారిని అమెరికా దేశ స్ధాపక పితలుగా పరిగణిస్తున్నారు. వారిలో ఎనిమిది మంది పేర్లు కనిపిస్తాయి. జార్జి వాషింగ్టన్‌, అలెగ్జాండర్‌ హామిల్టన్‌, బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌, జాన్‌ ఆడమ్స్‌, శామ్యూల్‌ ఆడమ్స్‌, థామస్‌ జఫర్సన్‌, జేమ్స్‌ మాడిసన్‌, జాన్‌లే అనే నేతలను అమెరికా స్ధాపక పితలుగా పరిగణిస్తారు. వారిలో అగ్రగణ్యుడు జార్జి వాషింగ్టన్‌ దేశ తొలి అధ్యక్షుడయ్యాడు. అమెరికా దేశ పిత ఎవరు అన్నా జాతిపిత ఎవరు అన్నా ఆయన పేరే వస్తుంది.

ఈ పూర్వరంగంలో డోనాల్డ్‌ ట్రంప్‌ జాతిపిత-దేశ పిత ఒకటే అనే అర్ధంలో నరేంద్రమోడీని అలా పిలిచారా అన్నది ఒక అంశం. ఒక వేళ దేశపిత అనాలంటే బ్రిటీష్‌ వారు రాక ముందే భారతదేశం వుంది. పోలీసు చర్య ద్వారా హైదరాబాద్‌ సంస్ధానాన్ని విలీనం చేసిన ఖ్యాతిని కేవలం సర్దార్‌ పటేల్‌కే ఆపాదిస్తున్న బిజెపి వాదన మేరకు, లేదా కాశ్మీర్‌ను మన దేశంలో విలీనం చేసేందుకు సైన్యాన్ని నడిపించిన జవహర్‌లాల్‌ నెహ్రూను, భారత రక్షిత స్వతంత్ర దేశంగా వున్న సిక్కింను మన దేశంలో విలీనం చేసేందుకు చర్యలు తీసుకున్న ఇందిరా గాంధీని దేశపితలు, దేశమాత అంటే ఒక మేరకు అర్ధం చేసుకోవచ్చు నరేంద్రమోడీ ఎలా అవుతారు ? ‘ చీలికలు పేలికలు అయింది. ఎంతో గొడవ జరిగేది, ఆయన దాన్నంతా ఒక దగ్గరకు చేర్చారు. ఒక తండ్రి మాదిరిగా ఆయన ఒకటిగా చేశారు.’ అని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు అర్ధం ఏముంది. కాశ్మీర్‌కు వున్న ప్రత్యేక రక్షణలు తొలగించటాన్ని , దానికి కూడా దేశంలో మాదిరి చట్టాలు వర్తింపచేశామని మోడీ చెప్పుకోవటాన్ని బట్టి అలా అన్నారా ? ఒక వేళ అదే ప్రాతిపదిక అయితే అనేక రాష్ట్రాలకు వున్న ప్రత్యేక రక్షణలు, చట్టాల మాటేమిటి?

మన దేశానికి వస్తే ఎవరినీ జాతిపితగా గుర్తించేందుకు రాజ్యాంగంలో అవకాశం లేదు. రాజకీయంగా గాంధీతో విబేధించినప్పటికీ సుభాస్‌ చంద్రబోస్‌ తొలిసారిగా 1944లో సింగపూర్‌ రేడియోలో ప్రసంగిస్తూ జాతిపిత అని సంబోధించాడు. అయితే మరుసటి ఏడాదే గాంధీని హతమార్చేందుకు గాడ్సే తొలి విఫల హత్యాయత్నం చేసినట్లు తరువాత వెల్లడి అయింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత జాతిపితగా పరిగణించి మన కరెన్సీ నోట్లపై ఆయన చిత్రాలను ముద్రించి గౌరవిస్తున్న విషయం తెలిసిందే. మహాత్మా గాంధీని జాతిపితగా బిజెపి గుర్తించదు. ఆయన మీద విమర్శ చేస్తే జనం అంగీకరించరన్న భయం కారణంగా పైకి మాట్లాడటం లేదు గానీ ఏదో ఒక రూపంలో ఆ పార్టీ వారు దాచుకోలేకపోతున్నారు.

గాంధీ పాకిస్తాన్‌కు జాతి పిత అని బిజెపి మధ్యప్రదేశ్‌ నేత అనిల్‌ సౌమిత్ర నోరు పారవేసుకున్నాడు.మహాత్మా గాంధీ జాతిపితే అయితే అది పాకిస్ధాన్‌కు. ఆయన వంటి వారు భారత్‌లో కోట్లాది మంది పుత్రులున్నారు. కొందరు పనికి వచ్చే వారైతే మరికొందరు పనికిమాలిన వారు’ అని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. ఇదేమిటయ్యా నేతా అని విలేకర్లు ప్రశ్నిస్తే భారత జాతిపితగా గౌరవం ఎవరికి వుందో ఎవరికీ తెలియదు లేదా వూరూపేరూ లేనివారు. కాబట్టి మహాత్మాగాంధీ జాతిపిత కావచ్చు కానీ అది పాకిస్ధాన్‌కు, ఇక్కడ పుట్టిన ప్రతివారూ భారత మాత పుత్రులమని గర్విస్తారు’ అన్నాడు. అంతే కాదు, ఆ పోస్టును తొలగించటానికి కూడా అంగీకరించలేదు. ఎవరూ 24గంటలూ పార్టీ ప్రతినిధులుగానే వుండలేరు. అలాంటి వారి అభిప్రాయాలన్నీ ఎల్లవేళలా పార్టీ వైఖరిగా వుండాల్సిన అవసరం లేదు అని కూడా అన్నాడు. అంటే అది తన వ్యక్తిగత అభిప్రాయమని చిత్రించే యత్నం అని వేరే చెప్పనవసరం లేదు.

ఈ సౌమిత్రకు వుత్తేజం సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌. ఆమె భోపాల్‌ బిజెపి అభ్యర్ధినిగా రంగంలో వుండి ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగా అగర్‌-మాళ్వా ప్రాంతంలో ప్రచార సభల్లో విలేకర్లతో మాట్లాడుతూ ‘ నాధూరామ్‌ గాడ్సే ఒక దేశభక్తుడు. ఆయన ఎన్నటికీ దేశభక్తుడిగానే వుంటారు. కొందరు ఆయన్ను వుగ్రవాది అని పిలుస్తారు. ఈ ఎన్నికల్లో అలాంటి వారికి తగిన విధంగా బుద్ది చెబుతారు’ అని వ్యాఖ్యానించిన మరుసటి రోజు సౌమిత్ర రెచ్చిపోయాడు. తరువాత బిజెపి నుంచి వత్తిడితో ప్రజ్ఞ క్షమాపణ చెప్పారు. యథా ప్రకారమే తన వ్యాఖ్యలను వక్రీకరించారని కూడా సెలవిచ్చారు. ఆరోగ్యం బాగోలేదని తరువాత కొద్ది రోజులు ఎన్నికల ప్రచారానికి దూరంగా వున్నారని చెప్పారు గానీ వచ్చే ఓట్లకు ఏమైనా గండిపడుతుందేమో అని పార్టీయే ఆమెను దూరం పెట్టింది. నరేంద్రమోడీ ఆమె వ్యాఖ్యలపై ఆమెను క్షమించటానికి నేను అశక్తుడను అని చెప్పి నష్టాన్ని తగ్గించే యత్నం చేశారు.గాడ్సే స్వతంత్ర భారత తొలి వుగ్రవాది అని సినీ హీరో కమల్‌ హసన్‌ చేసిన వ్యాఖ్యకు సమాధానంగానే ప్రజ్ఞ తన మన్‌కీ బాత్‌ను వెల్లడించారు.

ఆమె, మరో ఇద్దరు ఎంపీలు కూడా వారి వ్యక్తిగత స్ధాయిలో చేసిన వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని అమిత్‌ షా చెప్పటం విశేషం. గాడ్సే ఒకరిని చంపాడు, కసబ్‌ 72 మందిని, రాజీవ్‌ గాంధీ 17వేల మందిని చంపాడు. వీటిలో ఎవరిది పెద్ద క్రూరత్వమో మీరే నిర్ణయించండి అని కర్ణాటక బిజెపి ఎంపీ నళిన్‌ కుమార్‌ కటీల్‌ కూడా ఇదేసమయంలో ట్వీట్‌ చేశాడు. అతని మీదా ఎలాంటి చర్య లేదు. ఇతగాడు రెండు సార్లు బిజెపి ఎంపీగా పనిచేసి మూడవ సారి గత ఎన్నికల్లో గెలిచాడు.కేంద్రమంత్రిగా వున్న అనంత కుమార్‌ తక్కువ తినలేదు.’ ఏడు దశాబ్దాల తరువాత దృష్టి మారిన వాతావరణంలో నేటి తరం శిక్షకు గురైన ఒక వ్యక్తిని గురించి చర్చిస్తున్నారంటే గాడ్సే గనుక బతికి వుంటే ఇప్పుడు జరుగుతున్న చర్చను చూసి సంతోషపడి వుండేవాడు.’ అని ట్వీట్‌ చేశారు.

ముంబయ్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌గా వున్న ఐఏఎస్‌ అధికారిణి నిధి చౌధరి చేసిన ఒక ట్వీట్‌లో దేశంలో వున్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలన్నింటినీ కూల్చివేయండి,కరెన్సీ నోట్లపై వున్న ఆయన చిత్రాలను చెరిపివేయండి, నాధూరామ్‌ గాడ్సేకు కృతజ్ఞలు అని పేర్కొన్నారు. తరువాత దాన్ని వుపసంహరించుకున్నారు. ఆమెపై చర్య తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఆ వ్యాఖ్యలను తాను వ్యంగ్యంగా చేశాను తప్ప మరొకటి కాదని సంజాయిషీ ఇచ్చుకున్నారు. ఇటీవలి కాలంలో ముఖ్యంగా జనవరి నుంచి సామాజిక మాధ్యమంలో మహాత్మాగాంధీ మీద ప్రతికూల వ్యాఖ్యలు బాగా కనిపిస్తున్నాయని, గాంధీ వాటిని చూడకుండా చేసినందుకు గాడ్సేకు కృతజ్ఞలు అనే అర్ధంలో తాను ట్వీట్‌ చేసినట్లు మీడియాకు వివరించారు.

నరేంద్రమోడీని జాతి పిత లేదా ప్రపంచ పిత అని పిలవటానికి సంఘపరివార్‌ నీడలో వున్నవారిలో వున్న ఆతృత ఎలా వుందో అంగీకరించని వారు భారతీయులు ఎలా అవుతారు అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ అని ప్రశ్నించటం ఒక సూచిక. అనేక మంది అలా పిలిచేందుకు వుబలాటపడుతున్నారు. నరేంద్రమోడీ 69వ పుట్టిన రోజు సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ సతీమణి అమృత శుభా కాంక్షలు చెబుతూ నరేంద్రమోడీని జాతి పిత అని సంబోధించారు. ఈ సందర్భంగా ఆమె విడుదల చేసిన వీడియోను కొన్ని వేల మంత్రి ఆమోదించారు. దాని మీద సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలు కూడా వెల్లడయ్యాయి. నరేంద్రమోడీ సన్నిహితుడు గుజరాత్‌ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన విష్ణు పాండ్య గుజరాత్‌ సమాచార్‌ టీవీ చర్చలో పాల్గొంటూ గాంధీ మాదిరే గాడ్సే కూడా దేశభక్తుడే అని సెలవిచ్చారు. మహాత్మాగాంధీని జాతిపితగా గుర్తించే వారు ఆర్‌ఎస్‌ఎస్‌లో ఎక్కడైనా ఒకరో అరో వుంటారేమోగానీ గాడ్సేను దేశభక్తుడు కాదని చెప్పేవారెవరూ మనకు కనిపించరు. నేను గాంధీని ఎందుకు చంపాను అంటూ కోర్టులో గాడ్సే చేసిన వాదనను పెద్ద ఎత్తున ప్రచురించి పంపిణీ చేసేది, చదివించేది కూడా వారే అంటే అతిశయోక్తి కాదు.

Image result for narendra modi and gandhi

చరఖా తిప్పినంత మాత్రాన గాంధీలు, శాంతి మంత్రం జపించినంత మాత్రాన బుద్దులు అయిపోరు. కానీ అలాంటి ప్రయత్నాలను దేశం చూసింది. ఖాదీ వుద్యోగ సంస్ధ కాలెండర్‌ కోసం నరేంద్రమోడీ చరఖా ముందు కూర్చొని ఫొటోకు పోజిచ్చారు. మహాత్మా గాంధీ సామాన్యులను ప్రతిబింబిస్తూ కొల్లాయి కట్టి తిరిగారు. నరేంద్రమోడీ ధరించే దుస్తులు ఎంత ఖరీదైనవో, ఎంత దర్జాగా వుంటాయో రోజుకు రెండు మూడు మార్లు మారుస్తారని చదివాము. గాంధీ ఆశ్రమంలో తన మరుగుదొడ్డి తానే శుభ్రం చేసుకున్నారు. పారిశుధ్యకార్మికులను విముక్తి చేయాలని కోరుకున్నారు. కానీ కుంభమేళా సందర్భంగా ఐదుగురు పారిశుధ్యకార్మికుల కాళ్లు కడిగి నరేంద్రమోడీ మీడియా ఫొటోలకు ఫోజిచ్చారు. అంతమాత్రాన గాంధీ అయిపోతారా ? గాంధీ ఒక వ్యవస్ధకు ప్రతిరూపం అయితే నరేంద్రమోడీ కంపెనీల ప్రచారకర్తగా తయారయ్యారు. గాంధీ కంటే ప్రధాని మంచి బ్రాండ్‌ అని హర్యానా బిజెపి మంత్రి వ్యాఖ్యానించిన విషయం మరచిపోరాదు. జియో, పేటియంల ప్రచారకర్తగా జాతికి కనిపించిన విషయం మరచిపోగలమా ? గాంధీ సామాన్యులకు ప్రతిబింబంగా అంగవస్త్రంతో బతికారు, మరి మోడీ ఖరీదైన దుస్తులను రోజుకు రెండు మూడుసార్లు మారుస్తారని చదివాము. గాంధీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశాన్ని నడిపారు. నరేంద్రమోడీ సామ్రాజ్యవాదుల పాదాల దగ్గరకు దేశాన్ని నడిపిస్తున్నారు.

ఇరాన్‌-అమెరికా మధ్య పంచాయితీ వుంది. అందుకని దాని దగ్గర చమురు కొనవద్దని మన దేశాన్ని ట్రంప్‌ ఆదేశిస్తే తలొగ్గటాన్ని సామ్రాజ్యవాదుల పాదాల చెంతకు మనం చేరటం కాదా ? గాంధీ 150వ జయంతి సందర్భంగా బిజెపి వారు గాంధీ ఆర్ధిక సిద్దాంతాల గురించి కూడా ప్రచారం చేస్తారట. దానికి పూర్తి విరుద్దమైన పాలన ఐదేండ్లు సాగించారు. బిజెపి ఏలుబడిలోకి రాక ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ స్వదేశీ జాగరణ మంచ్‌ పేరుతో ఒక సంస్ధను ఏర్పాటు చేసింది. మొత్తం మార్కెట్‌ను విదేశాలకు అప్పగిస్తుంటే మరి ఆ సంస్ధ ఏమైందో, దాని దేశభక్తి ఎటుపోయిందో తెలియదు. ఇలా చెప్పుకుంటే ఎన్నో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ సమాజ ఐక్యతకు ప్రతీకా లేక విభజన దళపతా !

29 Sunday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Donald trump, father of the country, Howdy Modi, is narendra modi india's divider in chief or unifier, Narendra Modi, narendra modi father of the country, narendra modi india's divider in chief, narendra modi india's unifier in chief

Image result for modi unifier

నరేంద్రమోడీ సమాజ ఐక్యతకు ప్రతీకా లేక విభజన దళపతా !

మొదటి భాగం

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ చరిత్రలో రాజులు, రంగప్పలే కాదు, ప్రజాస్వామిక వ్యవస్ధలని చెప్పుకొనే చోట కూడా అధికారంలో వున్న వారికి లేని ప్రతిష్టను చేకూర్చే ప్రయత్నాల గురించి చెప్పనవసరం లేదు. వాటి వెనుక వ్యక్తిగత ప్రయోజనాలే కాదు తమను ఆశ్రయించుకున్న వారికి అవకాశాల కోసం కూడా పాత పద్దతులైన సామ, దాన, బేధ, దండోపాయాలే కాదు అన్ని రకాల అవాంఛనీయ చర్యలకు పాల్పడటం చూస్తున్నాము.

అమెరికాలోని హూస్టన్‌ నగరంలో సెప్టెంబరు 22న జరిగిన ప్రవాస భారతీయుల హౌడీ మోడీ (మోడీ గారూ ఎలా వున్నారు) సభలో మన ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు నరేంద్రమోడీ ఒకరిని ఒకరు పొగుడుకున్న తీరు చూసిన తరువాత నరేంద్రమోడీ ప్రతిష్ట పెంచేందుకు ప్రయత్నం జరుగుతోందా అని ఎవరైనా అనుకుంటే వారు సరిగానే ఆలోచిస్తున్నట్లు లెక్క. కొందరికి ఆ ధోరణులు కనిపిస్తున్నాయి, మరి కొందరు నరేంద్రమోడీ అందుకు అర్హులే అని కీర్తిస్తున్నారు. అన్నింటినీ బేరీజు వేసుకొని ఎవరి అంచనా సరైనదో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.

హిందూ హృదయ సామ్రాట్‌ అని కొందరు నరేంద్రమోడీని కీర్తిస్తే, ఆయన హిందూ ఏమి ఖర్మ ఏకంగా భారత హృదయ సామ్రాట్‌ అని మరికొందరు ప్రస్తుతించారు. భారత విభజన దళపతి అని లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాక ముందు ఒక అంతర్జాతీయ పత్రిక ముఖచిత్ర కధనాన్ని ప్రచురించిది. అదే పత్రిక ఎన్నికల తరువాత దశాబ్దాల కాలంలో ఏ ప్రధానీ నరేంద్రమోడీ మాదిరి దేశాన్ని ఐక్యం చేయలేదు అని మరొక వ్యాసాన్ని ప్రచురించింది. కాలం నరేంద్రమోడీని ఐక్యతా దళపతిగా నిరూపించింది అని ఫలితాలు వెలువడిన తరువాత బిజెపి నేత సంబిత్‌ పాత్ర వంటి వారు వర్ణించారు. ఇప్పుడు అది మరింత వేగం పుంజుకొని ముందుకు పోతున్నట్లు కనిపిస్తోంది. ఏదీ వూరికే రాదు అన్న విషయం తెలిసిందే. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అన్నట్లుగా మోడీ- ట్రంప్‌ వ్యవహరించారా ?

ఎవరైనా ఒకరిని అసాధారణ వ్యక్తులతోనో, అసాధారణ రీతినో ఏ కారణంతో అయినా పొగిడితే వారేదో అలా అన్నారు గానీ నాకంత లేదు అని వినమ్రంగా చెప్పుకుంటారు. మన ప్రధాని నరేంద్రమోడీ నుంచి అలాంటి వినమ్రత ఆశించే వారిని ఆయన హతాశులను గావించారు. ఒక్క విషయం స్పష్టమైంది.దేశద్రోహం, నువ్వు భారతీయుడివా కాదా అని నిర్ధారించేందుకు ప్రమాణాలుగా సంఘపరివార్‌, దాని రాజకీయ సంస్ధ బిజెపి తయారుచేసిన నిఘంటువులోకి మరొక అంశం తోడైంది. అదే ‘భారత దేశ పిత’ నరేంద్ర దామోదరదాస్‌ మోడీ.

మన రాజ్యాంగంలో ఎవరినీ అధికారికంగా జాతిపితగా లేదా భారత దేశ పితగా పరిగణించేందుకు అవకాశం లేదు. అయినా యావత్‌ సమాజం జాతిపితగా పరిగణిస్తున్న మహాత్మా గాంధీని గుర్తించేందుకు, నరేంద్రమోడీని భారత దేశ పితగా పరిగణించకపోవటాన్ని అంగీకరించేందుకు బిజెపి, సంఘపరివార్‌కు చెందిన వారు సిద్దంగా లేరు.

ఇప్పటికే జాతిపిత గాంధీని చంపిన విడి సావర్కర్‌ అసలైన దేశభక్తుడు అని చెబుతున్న వారు రేపు గాంధీ జాతి పిత ఏమిటి అసలైన జాతిపిత సావర్కర్‌, ఆయన వారసుడు నరేంద్రమోడీ భారత దేశ పితి అని చెప్పేందుకు ఎంతో సమయం పట్టదా అనిపిస్తోంది. కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ తన మనసులో వున్న విషయాన్ని దాచుకోకుండా చెప్పినందుకు ఒక విధంగా ఆయనకు ‘అభినందనలు’ చెప్పకతప్పదు. భారత దేశ పితగా నరేంద్రమోడీని అంగీకరించని వారు భారతీయులు ఎలా అవుతారన్నదే ఆయన ప్రశ్న.

‘ ప్రధాని వ్యక్తిత్వం,చొరవ కారణంగా ఈ రోజు విదేశాల్లో వున్న వారు గర్వపడుతున్నారు. ఎవరైనా ఒకరి గురించి అమెరికా దాని అధ్యక్షుడి నుంచి ఒక నిష్పాక్షిక మరియు ధైర్యవంతమైన ప్రకటన వచ్చిందంటే ఏదైనా పార్టీతో అతని రాజకీయ అనుబంధాలు లేదా భావజాలంతో నిమిత్తం లేకుండా ప్రతి భారతీయుడు గర్వపడాలని నేను భావిస్తున్నాను.ఒక అమెరికా అధ్యక్షుడు అలాంటి పదాలతో ప్రశంసలు కురిపించటం ఒక భారత ప్రధాని గురించే కాదు ఇతర ఏ ఒక్క ప్రపంచ నేత గురించి చేయలేదు. దీనికి ఎవరైనా గర్వపడకపోతే, తరువాత వారు తమను తాము భారతీయులుగా పరిగణించుకోకపోవచ్చు’ అని జితేంద్ర సింగ్‌ వ్యాఖ్యానించారు. జాతిపిత ఒకరే వుంటారు అన్న కాంగ్రెస్‌ వ్యాఖ్య గురించి అడగ్గా దాని గురించి ట్రంప్‌తో కాంగ్రెస్‌ను వాదించమనండి అన్నారు. దీన్ని చూసిన తరువాత జర్మన్‌ భావజాలానికి వ్యతిరేకం అనేపేరుతో ప్రఖ్యాత రచయితల పుస్తకాలను దగ్దం చేసిన నాజీల చర్య గుర్తుకు వస్తోంది.

హిట్లర్‌ పుట్టటానికి వంద సంవత్సరాల ముందే హెన్రిచ్‌ హైనే అనే రచయిత ” ఎక్కడైతే పుస్తకాలను తగులబెడతారో (భావజాలం లేదా విజ్ఞానం) అక్కడ మానవులను కూడా సజీవదహనం చేస్తారు ” అని ప్రకటించాడు. 1933 మే 10ప తేదీ రాత్రి బెర్లిన్‌ నగరంలో నాజీలు, విశ్వవిద్యాలయాల విద్యార్ధులు పెద్ద సంఖ్యలో కూడి 20వేల పుస్తకాలను దగ్దం చేశారు. వాటిలో కమ్యూనిస్టు రచయితలు కారల్‌ మార్క్స్‌, ఫెడరిక్‌ ఎంగెల్స్‌, ఆల్బర్‌ ఐనిస్టీన్‌, ఎర్నెస్ట్‌ హెమింగ్వే, జాక్‌లండన్‌, హెచ్‌జి వెల్స్‌ వంటి ఎందరో కమ్యూనిస్టేతర, పురోగామి రచయితల పుస్తకాలు వాటిలో వున్నాయి. నరేంద్రమోడీని భారత దేశ పితగా అంగీకరించని వారు భారతీయులు ఎలా అవుతారు అని ప్రశ్నించినట్లుగానే హిట్లర్‌, నాజీ భావజాలానికి వ్యతిరేకమైన రచనలన్నీ జర్మన్‌ వ్యతిరేకమైనవే అన్న వున్మాదానికి లోనైన వారు దీనికి పాల్పడ్డారు. ఇప్పటికే మన దేశంలో జెఎన్‌యు, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వంటివి భారతీయతకు వ్యతిరేకులు, దేశద్రోహులతో చేతులు కలిపే వారితో నిండి వున్నాయనే ప్రచారాన్ని చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ రోజు దేశంలో జాతిపిత మహాత్మా గాంధీ కోరుకున్న, ఆశించిన రీతిగా పరిస్ధితులు లేవు. తమ విధానాలను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా, విదేశీతొత్తులుగా చిత్రిస్తున్నారు. పరమత, పురోగామి భావజాలాలు, వాటిని కలిగి వున్నవారి మీద ద్వేషం, ఆవుల రక్షణ పేరుతో హత్యాకాండ, అసహనం,రాజ్యాంగ వ్యవస్ధలను దిగజార్చటం వంటి పరిణామాలను సమర్ధించేవారు, ముందుకు తీసుకుపోయే వారు తమకు ఒక ప్రతీక కావాలనుకుంటున్న వారు నరేంద్రమోడీని ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది.

ఇదంతా అమెరికా అధ్యక్షుడు మాననీయ మహోదయ ఎప్పుడేం మాట్లాడతాదో తెలియని తలతిక్క మనిషిగా పేరు మోసిన (నిజానికి అది వాస్తవం కాదు, తమకు హాని కలిగించే వారిని అమెరికా కార్పొరేట్‌ రంగం తమ ప్రతినిధిగా కొనసాగనివ్వదు.) డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రశంసాపూర్వకమైన వ్యాఖ్యలే కారణం. మన ప్రధానిని ‘భారత దేశ పిత’ గా వర్ణించటంతో వచ్చింది అనుకొనే వారికి కాదు మహానుభావులారా మన దేశంలో అనేక మంది మనసులో వున్న మాటనే వెల్లడించాడు అని చెప్పాల్సి వస్తోంది. హూస్టన్‌ సభ తరువాత న్యూయార్క్‌ నగరంలో ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా డోనాల్డ్‌ ట్రంప్‌, నరేంద్రమోడీ మరోసారి భేటీ అయ్యారు. పరస్పర పొగడ్తలు కిక్కు ఇవ్వలేదని అనుకున్నారేమో తెలియదు. ఇద్దరూ విలేకర్లతో మాట్లాడారు.’ హూస్టన్‌ సభకు డోనాల్డ్‌ ట్రంప్‌ హాజరైనందుకు ధన్యవాదాలు. అమెరికా అధ్యక్షుడు మంచి స్నేహితుడు’ అని మోడీ చెప్పారు. అంతగొప్ప స్నేహితుడు కాశ్మీర్‌ గురించి మధ్యవర్తిత్వం వహించమని మోడీ తనను అంతర్గత సమావేశంలో అడిగారు అని పచ్చి అబద్దం చెప్పి ఎంతో కాలం గడవ లేదు. స్నేహితుల మధ్య బయటి ప్రపంచానికి వెల్లడి కాని అనేక అంశాలు దొర్లుతాయి. బహుశా వారి స్నేహం చెడకుండా వుండేందుకే మోడీ దాని మీద నోరు విప్పలేదు అనుకోవాలి. అలాంటి అబద్దాల కోరు ట్రంప్‌ మోడీని భారత దేశ పిత అనటం కూడా మరొక అబద్దం లేదా అతిశయోక్తి కావచ్చు కదా ! అంతగా మంచి స్నేహితుడు అని మోడీ స్పందించిన తరువాత ట్రంప్‌ బదులు తీర్చుకోకపోతే భారత జాతికే అవమానం కదా !

బొల్లు బొల్లరా వెంకన్నా అంటే మా గురించి గొప్ప చెప్పుకోవటం కాదు గానీ బాబయ్యా మా అయ్యగారి తోటలో మిరియాలు తాటికాయలంత వుంటాయండయ్యా అన్నట్లుగా ట్రంప్‌ స్పందించారు. ‘ అంతకు ముందు భారత్‌ నాకు గుర్తుంది. అంతబాగా తెలియదు గానీ నాకు గుర్తుంది, అది చీలికలు పేలికలు అయింది. ఎంతో గొడవ జరిగేది, ఆయన దాన్నంతా ఒక దగ్గరకు చేర్చారు. ఒక తండ్రి మాదిరిగా ఆయన ఒకటిగా చేశారు. మనం ఆయన్ను భారత దేశ పితగా పిలవవచ్చు, ఆయనొక అసాధారణ మంచిపని చేశారు అనుకుంటున్నా’ అని డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Image result for narendra modi india's divider in chief

వివిధ రాజ్యాలుగా వున్న భారతావనిని పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకొని దోపిడీని యధేశ్చగా కొనసాగించేందుకు దేశమంతటా కొన్ని సంస్ధానాలను కొనసాగించేందుకు అనుమతించినా వాటిని కూడా తమకు లోబడి వుండేట్లు చేసుకొని దేశాన్ని ఒక్కటిగా చేసింది బ్రిటీష్‌ వారే.అయినంత మాత్రాన వారిని దేశాన్ని ఆక్రమించుకున్నవారిగా తప్ప ఆధునిక భారత నిర్మాతలుగా చరిత్ర పరిగణించలేదు.

స్వాతంత్య్రం వచ్చిన తరువాత వందల సంఖ్యలో వున్న చిన్నా, పెద్ద సంస్దానాలను విలీనానికి భారత ప్రధానిగా నెహ్రూ కృషి చేశారు. కాశ్మీర్‌ సంస్ధానాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు ఏకంగా సైన్యాన్నే నడిపించారు. పోర్చుగీసు పాలనలో వున్న గోవాను భారత్‌లో విలీనం చేసేందుకు అదే నెహ్రూ సైన్యాన్ని నడిపించిన చరిత్ర తెలిసిందే. ఫ్రాన్స్‌ ఆధీనంలో వున్న నేటి పుదుచ్చేరి ప్రాంతాలను భారత్‌లో విలీనం చేసింది కూడా ఆయన హయాంలోనే. సంఘపరివార్‌ గొప్పగా చిత్రించే సర్దార్‌ పటేల్‌ కారణంగానే హైదరాబాదు సంస్దానం దేశంలో విలీనం అయింది అని చేసే వాదనను కాసేపు అంగీకరిద్దాం. భారత రక్షణలో స్వతంత్ర రాజ్యంగా వున్న సిక్కిం మన దేశంలో విలీనం అయింది ఇందిరా గాంధీ ఏలుబడిలో, అలాంటి ఏ చరిత్రా లేని నరేంద్రమోడీ భారత్‌ను ఐక్యం చేశారనే పేరుతో భారత దేశ పిత అని పిలిస్తే పై ముగ్గురిని కూడా భారత దేశ పితలు, మాత అని పిలవాల్సి వుంటుంది. ఒక వేళ జమ్మూ కాశ్మీర్‌కు రాజ్యాంగమే కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తి, హక్కులను రద్దు చేయటమే దేశాన్ని ఐక్యం చేయటమే అయితే, గిరిజన ప్రాంతాలకు, అనేక రాష్ట్రాలకు కల్పించిన ప్రత్యేక హక్కులు, రక్షణల కొనసాగింపు మాటేమిటి అన్న ప్రశ్న తలెత్తుతుంది. అందువలన భారత చరిత్ర తెలియని ట్రంప్‌ చేసే ప్రకటనలు, వర్ణణలకు విలువేమిటి అన్నది సమస్య.

Image result for narendra modi india's divider in chief

ట్రంప్‌కు గత చరిత్ర తెలియదు లేదా తెలిసినా కావాలని తన ప్రయోజనం కోసం నరేంద్రమోడీని ఆకాశానికి ఎత్తారనుకోవాల్సి వుంటుంది. నరేంద్రమోడీ ‘భారత విభజన దళపతి’ అని అమెరికాకు చెందిన టైమ్స్‌ పత్రిక ఈ ఏడాది మేనెలలో తన ముఖచిత్ర కధనానికి శీర్షిక పెట్టింది. అదే పత్రిక లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మరొక అడుగు ముందుకు వేసి గత దశాబ్దాలలో ఏ ప్రధానీ చేయని విధంగా నరేంద్రమోడీ ఐక్యతా దళపతిగా వ్యవహరించారు అని మరొక కధనాన్ని ప్రచురించింది. వాటి లోని అంశాలను మరోసారి వివరించుకోవచ్చు. బ్రిటన్‌, ఇతర అనేక దేశాల నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాల గురించి ఏమి వ్యాఖ్యానించిందో దిగువ కొన్ని వ్యాక్యాలను చూడండి.

”భారతీయ ఆత్మకు చెడు !

ఒక వైపు కుహనా వార్తలతో కాలక్షేపం చేస్తూ వాణిజ్య వేత్తల అనుకూల అజెండా అమలు జరుపుతూ మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే మరో ప్రజాకర్షక నినాదాల నేత ప్రపంచానికి అవసరం లేదు.2017లో జరిపిన ఒక సర్వేలో రష్యాలో వ్లదిమిర్‌ పుతిన్‌తో సహా ఏ దేశంలోనూ లేని విధంగా నిరంకుశమైన పాలన చేసేందుకు ఒక బలమైన నేత కావాలని భారత్‌లో 55శాతం మంది కోరుకోవటాన్ని చూసిన తరువాత ఈ విజయం చూసి మాకేమీ ఆశ్చర్యం కలగలేదు. స్వాతంత్య్ర భారత అత్యంత విలువైన లక్షణమైన బహుళపార్టీ ప్రజాస్వామ్యానికి నరేంద్రమోడీ ముప్పుగా పరిణమించారు.” అని పేర్కొన్నది.

బ్రిటీష్‌ వారి పాలనకు చరమ గీతం పాడేందుకు సాగిన మహోద్యమానికి నాయకత్వం వహించింది గాంధీ. ఆయన అనుసరించిన కొన్ని వుద్యమ పద్దతులు, కొన్ని అంశాల మీద ఆయన వైఖరులను మ్యూనిస్టులు, ఇతరులు కూడా విబేధించారు గానీ గాంధీ దేశభక్తి, చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేదు. కానీ నరేంద్రమోడీ, ఆయన మాతృ సంస్ధ సంఘపరివార్‌ ఆరాధించే, ఆయన వారసులం అని చెప్పుకొనే సదరు వినాయక దామోదర్‌ సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి లొంగిపోయి సేవ చేస్తానని చెప్పిన వ్యక్తి. సంఘపరివార్‌కు చెందిన వారి చరిత్ర భారత సమాజాన్ని మతప్రాతికన విడదీసే, పరమత ద్వేషులుగా వుంది తప్ప ట్రంప్‌ చెప్పినట్లు ఐక్యపరిచేదిగా లేదు. అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా టైమ్‌ పత్రిక మాదిరి ఇదే ట్రంప్‌ లేదా మరొక అమెరికా అధ్యక్షుడు తన అభిప్రాయాలను భిన్నంగా వెల్లడించవచ్చు. అందువలన ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకొనే లేదా మెప్పించుకొనే వారు కాదు, వ్యక్తుల ఆచరణే గీటురాయిగా వుండాలి.

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

మంచి కోసం మాంద్యాన్ని భరించక తప్పదు : డోనాల్డ్‌ ట్రంప్‌

21 Wednesday Aug 2019

Posted by raomk in CHINA, Current Affairs, Economics, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

China, China–United States trade war, Donald trump, TRADE WAR, United States

China's President Xi Jinping (R) shakes hands with US President Donald Trump before a bilateral meeting on the sidelines of the G20 Summit in Osaka on June 29, 2019. (BRENDAN SMIALOWSKI/AFP/Getty Images)

ఎం కోటేశ్వరరావు

చైనాతో మెరుగైన వాణిజ్య ఒప్పందం కోసం రెండు నెలల మాంద్యం మూల్యం చెల్లించటానికి తాను అంగీకరిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం నాడు చెప్పారు. చైనా పట్ల దూకుడుగా అనుసరిస్తున్న వైఖరి స్వల్పకాలంలో బాధ పెట్టినా దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తుందని, రెండు నెలల పాటు మాంద్యాన్ని అమెరికా ఎదుర్కోగలదని అన్నారు. మాంద్యమనే భావన అసంగతం, చైనా మీద చర్య తప్పని సరి, స్వల్పకాలంపాటు మాంద్య మంచిదా కాదా అన్నది సమయాన్ని బట్టి వుంటుంది, మీరు మాంద్యం గురించి చెబుతున్నారు, మనం రెండు నెలల పాటు మాంద్యానికి గురవుతాం, ఎవరో ఒకరు చైనా మీద చర్య తీసుకోవాలి కదా అని విలేకర్లతో వ్యాఖ్యానించారు. మాంద్యానికి అమెరికా చాలా దూరంగా వుంది, ఫెడరల్‌ రిజర్వు ప్రామాణిక వడ్డీ రేట్లను తగ్గించాలని కూడా అన్నారు. తరువాత అధ్యక్ష ప్రతినిధి విలేకర్లతో మాట్లాడుతూ అమెరికా మాంద్యం వైపు వెళుతోందనటాన్ని అధ్యక్షుడు విశ్వసించటం లేదని, ఆయన విధానాల కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్ధ ఎంటో పటిష్టంగా వుందని అన్నారు.

అమెరికా – చైనా వాణిజ్య పోరు కారణంగా తలెత్తిన అనిశ్చితి కారణంగా 2021నాటికి 97లక్షల కోట్ల ప్రపంచ జిడిపి 585 బిలియన్‌ డాలర్ల మేరకు 0.6శాతం నష్టపోనుందని, ప్రపంచ జిడిపి బ్లూమ్‌బెర్గ్‌ ఆర్ధిక నివేదిక పేర్కొన్నది. ఈ పూర్వరంగంలోనే ప్రపంచ వత్తిడి లేదా పర్యవసానాలకు తమనే బాధ్యులుగా చేస్తారనే భయం, వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలను ప్రభావితం చేస్తుందనే అనే ఆలోచన తో గానీ చైనాతో వాణిజ్య పోరును ట్రంప్‌ కొంత కాలం పాటు వాయిదా వేశారు. బ్రిటన్‌, జర్మనీ, రష్యా,సింగపూర్‌, బ్రెజిల్‌తో సహా తొమ్మిది దేశాల ఆర్ధిక వ్యవస్ధలు మాంద్యపు అంచున లేదా మాంద్యంలోకి జారినట్లు భావిస్తున్నారు. తదుపురి వంతు 2021లో అమెరికాదే అని ఆర్ధిక వేత్తలు హెచ్చరించారు.

ఈ నేపధ్యంలో సెప్టెంబరు ఒకటి నుంచి చైనా వస్తువులపై పెంచదలచిన దిగుమతి పన్ను క్రిస్మస్‌ పండుగను నాశనం చేస్తుందనే హెచ్చరికలను సాకుగా చూపి డిసెంబరు 15 నాటికి డోనాల్డ్‌ ట్రంప్‌ వాయిదా వేసినట్లు వార్తలు వచ్చాయి. పండుగ అంటే బొమ్మలు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను కోట్లాది మంది అమెరికన్లు బహుమతులుగా ఇస్తారు. దిగుమతి పన్ను భారాన్ని వినియోగదారుల మీద మోపటం తప్ప మరొక మార్గం లేదని వాల్‌మార్ట్‌ తదితర దుకాణాల సంస్ధలు స్పష్టం చేశాయి. మరోవైపున చైనా నాయకత్వం కూడా తాము కూడా తగిన ప్రతీకార చర్యలు తీసుకుంటామని చెప్పటంతో తాను ప్రతిపాదించిన పన్నుల పెంపుదల క్రిస్మన్‌ కొనుగోళ్లకు సంబంధం లేనప్పటికీ వాటి మీద ప్రభావం పడుతుందంటున్నారు కనుక వాయిదా వేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించాడు. అదే నోటితో హాంకాంగ్‌లో జరుగుతున్న ఆందోళనకు వాణిజ్య యుద్ధానికి లంకె పెట్టేందుకు కూడా ప్రయత్నించిన ట్రంప్‌ రెచ్చగొట్టుడును మానుకోలేదు. హాంకాంగ్‌ పరిణామాలకు, వాణిజ్య యుద్ధానికి ఎలాంటి సంబంధం లేదని, ఇతరుల సలహాలు తమకు అవసరం లేదని చైనా ప్రకటించింది.

వాణిజ్య యుద్ధాలు మంచివి, వాటిలో విజయం సాధించటం తేలిక అని 2018 మార్చినెలలో ట్రంప్‌ చెప్పాడు. అయితే చైనాను వూబిలో దించబోయి ట్రంపే తన వూబిలో తానే పడ్డట్లు అనేక మంది విశ్లేషకులు పేర్కొన్నారు. చైనాతో వాణిజ్య యుద్దంలో ఎలా ఓటమి చెందనున్నారో వివరించారు. మీడియాలో వచ్చిన విశ్లేషణలు, వ్యాఖ్యల మేరకు దిగువ అంశాలు ట్రంప్‌ను ప్రభావితం చేశాయి. భద్రతా కారణాలతో చైనా టెలికాం కంపెనీ హువెయ్‌, దాని అనుబంధంగా వున్న 46కంపెనీలతో లావాదేవీలు జరపరాదన్న తమ అధినేత నిర్ణయాన్ని మరో 90 రోజుల పాటు నవంబరు 19 వరకు వాయిదా వేస్తున్నట్లు అమెరికా వాణిజ్య మంత్రి విల్‌బర్‌ రోస్‌ ప్రకటించాడు. అమెరికా కంపెనీలతో పాటు ఇతర దేశాలు కూడా హువెయ్‌ కంపెనీ పరికరాలను కొనుగోలు చేయరాదని అమెరికా ఆదేశించిన విషయం తెలిసిందే. అమెరికా విధించిన ఆంక్షలు హువెయ్‌ కంపెనీ పనితీరు మీద ఇప్పటి వరకు ఎలాంటి ప్రభావం చూపలేదు. ఈ ఏడాది తొలి ఆరుమాసాల్లో దాని ఆదాయం 23.2శాతం పెరిగినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు ఐదవ తరం(5జి) నెట్‌వర్క్‌ పరికరాల విషయమై ఇది 50వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. వాటిలో 28 ఐరోపాలోనే వున్నాయి. ఫిన్లండ్‌కు చెందిన నోకియా 43, స్వీడన్‌ కంపెనీ ఎరిక్సన్‌ 22 కాంట్రాక్టులు కుదుర్చుకుంది. మరోవైపు హువెయ్‌ పోటీదారు జడ్‌టియి 25వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రకటించింది.

మూడు వందల బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులపై ఆగస్టు ఒకటి నుంచి పన్ను విధిస్తామన్న ట్రంప్‌ తరువాత ఆ మొత్తాన్ని 160 బిలియన్లకు తగ్గించి సెప్టెంబరు ఒకటి నుంచి పన్ను వేస్తామని ప్రకటించాడు. క్రిస్మస్‌ పేరుతో ఇప్పుడు దాన్ని కూడా డిసెంబరు 15కు వాయిదా వేశాడు. అయితే కిందపడ్డా పైచేయి తనదే అని చెప్పుకొనేందుకు అమెరికా వ్యవసాయ వస్తువులను కొనుగోలు చేసేందుకు చైనా అంగీకరించిందని ట్రంప్‌ ఒక ట్వీట్‌ చేశాడు.అయితే అమెరికా రైతాంగం ఇబ్బందులు పడుతున్నదని రాయిటర్స్‌ ఒక వార్తను ఇచ్చింది. ఇటీవలి సంవత్సరాలలో రైతాంగానికి ఇస్తున్న రుణాలు 17.5శాతం తగ్గాయని, బకాయిల చెల్లింపునకు వత్తిడి, కొత్తగా రుణాలు నిలిపివేయటంతో అనేక మంది దివాలా చట్టాన్ని ఆశ్రయిస్తున్నట్లు తెలిపింది. చైనా, మెక్సికో దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే సోయా, ధాన్యం వంటి వుత్పత్తుల మీద పన్నుల విధించిన కారణంగా అక్కడి రైతాంగం ఇబ్బందులు పడుతున్నది. వారిని ఆదుకొనేందుకు కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అవి ఫలించలేదు. చైనా వుత్పత్తులపై పన్ను విధింపు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించగానే అమెరికా స్టాక్‌మార్కెట్‌ సంతోషపడింది. అయితే తాము కూడా ప్రతి చర్యలకు వెనుకాడబోమని చైనా వెల్లడించగానే డీలాపడటం అమెరికా బలహీనతకు సూచికగా విశ్లేషకులు పేర్కొన్నారు. ట్రంప్‌ వ్యూహం విఫలమౌతున్నదని బాహాటంగానే మీడియాలో వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.

ప్రస్తుతం ప్రపంచంలో అనేక దేశాలతో రోజు రోజుకూ చైనా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇదే సమయంలో అమెరికా ప్రతి వారి మీద బస్తీమే సవాల్‌ నాకు లొంగుతారా లేదా అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరిస్తారా లేదా అనే బెదిరింపులకు దిగుతున్నది. ఇది దాని ఆర్ధిక వ్యవస్ధతో పాటు రాజకీయ పలుకుబడిని కూడా దెబ్బతీస్తున్నదంటే అతిశయోక్తి కాదు. తమ చర్యల కారణంగానే చైనా అభివృద్ధి కూడా పడిపోయిందని ట్రంప్‌ చంకలు కొట్టుకోవచ్చు. నిజానికి అదొక చిన్న కారణమే తప్ప మరొకటి కాదు. అంతర్గతంగా తీసుకున్న చర్యలు అభివృద్ధి రేటు తగ్గటానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. తన వస్తువులను అమ్ముకొనేందుకు చైనా అవసరమైతే తన యువాన్‌ విలువను తగ్గించుకొనేందుకు సిద్ధంగా వుందన్న సూచనలు గతవారంలో వెలువడిన విషయం తెలిసిందే. అమెరికా తన డాలరు విలువను తగ్గించనట్లయితే ప్రపంచ మార్కెట్లో దాని వస్తువులను కొనుగోలు చేసే వారు వుండరు. తన కరెన్సీ విలువను తగ్గించుకుంటే ఇతర పర్యవసానాలు తీవ్రంగా వుంటాయని అమెరికా భయపడుతోంది. డాలరు విలువ తగ్గకుండా ప్రపంచ దేశాలను అదిరించి బెదిరించి తన వస్తువులను అంటగట్టాలని చూస్తోంది.

Image result for trade war us china

అమెరికాను ఒంటరిపాటు చేసేందుకు , మిత్రులను సంపాదించుకొనేందుకు చైనా తనదైన శైలిలో ముందుకు పోతోంది.2018 జనవరిలో చైనా తాను చేసుకొనే దిగుమతులపై సగటున ఎనిమిదిశాతం పన్ను విధించింది. అమెరికా ఎప్పుడైతే వాణిజ్య యుద్దానికి దిగిందో అమెరికా వస్తువులపై పన్ను మొత్తాన్ని 20.7శాతానికి పెంచి, మిగతా దేశాలపై సగటు పన్నును 6.7శాతానికి తగ్గించింది. అమెరికా నుంచి దిగుమతులను తగ్గించి ఇతర దేశాల నుంచి పెంచుకున్నదని, ఇతర దేశాలకు తన ఎగుమతులను పెంచిందని పీటర్సన్‌ ఇనిస్టిట్యూట్‌ పేర్కొన్నది. అమెరికా ఒక వైపు తన సోయా బీన్స్‌ నుంచి బోయింగ్‌ విమానాల వరకు ఏవేవి కొనాలో జాబితా ఇస్తోంది. అదే సమయంలో ప్రభుత్వ రంగం మీద ఎక్కువగా ఆధారపడుతున్న చైనా ఆర్ధిక విధానాన్ని మార్చాలని కూడా డిమాండ్‌ చేస్తోంది. భద్రత సాకుతో చైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరింప చేయకుండా చూసేందుకు ప్రయత్నిస్తోంది. చైనాతో వాణిజ్య యుద్ధానికి దిగావు సరే మిత్ర దేశాలైన మెక్సికో, ఐరోపా దేశాల మీద కూడా తొడగొట్టటం ఏమిటయ్యా బాబూ అని ట్రంప్‌ను చూసి కొందరు అమెరికా వాణిజ్యవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. మన బోయింగ్‌లు ఎక్కువగా కొనాలని చైనా మీద వత్తిడి తెస్తే తమ ఎయిర్‌బస్‌ల సంగతేమిటని ఐరోపా దేశాలు అమెరికాను ప్రశ్నించవా, చైనాతో సఖ్యతకు ప్రయత్నించవా అని చెబుతున్నా ట్రంప్‌ వినటం లేదు.

హాంకాంగ్‌లో నిరసన తెలుపుతున్న వారి మీద తియన్మెన్‌ తరహా అణచివేతను తాము వ్యతిరేకిస్తామని, హాంకాంగ్‌లో అణచివేత చర్యలు వాణిజ్య యుద్దం మీద ప్రభావం చూపుతాయని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించి వివాదాన్ని మరో కొత్త మలుపు తిప్పాడు. ఇది చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం తప్ప మరొకటి కాదు.ఇతర సమస్యల్లో కూడా జోక్యం చేసుకొంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. హాంకాంగ్‌ నిరసనలు చైనా అంతర్గత వ్యవహారం, దానికి వాణిజ్య యుద్ధానికి సంబంధం లేదు, తమకు ఇతరుల సలహాలు అవసరం లేదని చైనా విదేశాంగశాఖ స్పష్టం చేసింది. హాంకాంగ్‌ పరిణామాలకు, వాణిజ్య యుద్ధానికి ముడిపెడితే రెండు దేశాల మధ్య తదుపరి చర్చలకు అవకాశాలుండవని అనేక మంది హెచ్చరిస్తున్నారు. జూలై 30న షాంఘైలో జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం ఇవ్వకుండానే ముగిసిన విషయం తెలిసిందే.

ఇలాంటి హెచ్చరికలు అమెరికాలో చాలా కాలం నుంచి వినపడుతున్నా ట్రంప్‌ బింకాలు పోతున్నాడు. తనతో ఒప్పందానికి చైనా సిద్దంగా వుందని తాను సిద్దంగా లేనని, ముందు హాంకాంగ్‌ సమస్యను అదెలా పరిష్కరిస్తుందో చూస్తానంటూ ట్రంప్‌ వాచాలత్వాన్ని ప్రకటించాడు. మాంద్య భయాలేమీ లేవని, వాణిజ్య పోరుతో తమకేమీ నష్టం లేదని వైట్‌ హౌస్‌ యంత్రాంగం భావిస్తున్నదని రాయిటర్స్‌ పేర్కొన్నది. మాంద్య భయంతో గత బుధవారం నాడు అమెరికా స్టాక్‌ మార్కెట్‌ మూడుశాతం పతనమైంది. 2009 మాంద్య తరువాత అమెరికా ఫెడరల్‌ రిజర్వు, ఇతర 19దేశాల రిజర్వుబ్యాంకులు పెద్ద మొత్తంలో తమ వడ్డీరేట్లను తగ్గించాయి. ఈ అధ్యక్షుడు ప్రపంచ ఆర్ధిక వ్యవస్దనే మాంద్యంలోకి నెడుతున్నాడని డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులలో ఒకరైన బెటో ఒ రూర్కీ ఒక టీవీ ఛానల్‌లో పేర్కొన్నాడు.

Image result for DONALD Trump willing to trigger a two-month recession

విదేశాంగ విధానం అంటే న్యూయార్క్‌ రియలెస్టేట్‌లో పోటీదార్లను బెదిరించి తాను చేసుకున్న లాభదాయకమైన ఒప్పందాలు అనుకుంటున్నట్లుగా వుంది, రెండు దేశాల మధ్య సంబంధాలు అలా వుండవని తెలుసుకోవాలని ట్రంప్‌కు ఒక విశ్లేషకుడు సలహా ఇచ్చాడు. అదిరించి బెదిరించి చైనా నేత గ్జీ జింపింగ్‌ను దారికి తెచ్చుకుందామని చూస్తే కుదరదు.చైనా అమ్ముల పొదిలో అనేక అస్త్రాలున్నాయి. అమెరికా దాని దగ్గర తీసుకున్న 1.2లక్షల కోట్ల డాలర్ల రుణ పత్రాలు(బాండ్లు)న్నాయి. వాటిని గనుక అమ్మేస్తే అమెరికా పరిస్ధితి ఏమిటి? దాని దగ్గర ఎక్కడా దొరకని విలువైన ఖనిజం(మట్టి) వుంది, అన్నింటికీ మించి తన కరెన్సీ విలువను తగ్గించి నిలబడగల సత్తా వుందని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. అమెరికాలో చైనా ప్రత్యక్ష పెట్టుబడులు 2018లో 83శాతం తగ్గాయి. ఇప్పటికే వాణిజ్య యుద్దం అమెరికా వార్షిక వృద్ధి రేటును నాలుగు నుంచి రెండుశాతానికి దించింది. ప్రపంచం మరోసారి మాంద్యానికి దగ్గర అవుతోంది. ప్రపంచం దృష్టిలో స్వేచ్చా ప్రపంచపు రాజధాని వాషింగ్టన్‌ ఇప్పుడు బీజింగ్‌వైపు తిరిగింది. ఒక పోలీసు రాజ్యం బాధిత దేశంగా మారింది. స్వేచ్చా వాణిజ్యం గురించి వుదారవాద ప్రజాస్వామ్యాలకు కమ్యూనిస్టు నాయకత్వం ఇప్పుడు పాఠాలు చెబుతోంది అంటూ ఒక విశ్లేషకుడు వాపోవటం అమెరికా ఏ పరిస్ధితికి లోనైందో వెల్లడిస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా వృద్ధి రేటు పతనం ఎవరికి లాభం, ఎవరికి నష్టం ?

17 Wednesday Jul 2019

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

China, china’s economic growth, china’s economic growth slides, Donald trump, world Trade

Image result for china’s economic growth slides

ఎం కోటే శ్వరరావు

ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో 6.4శాతంగా వున్న తమ వృద్దిరేటు రెండవ త్రైమాసిక కాలంలో 6.2శాతానికి తగ్గిందని, ఇది గడచిన ఇరవై ఏడు సంవత్సరాలలో కనిష్టం అని చైనా ప్రకటించింది. ఈ పరిస్ధితి లాభమా నష్టమా అనే చర్చ ప్రపంచ వ్యాపితంగా మీడియాలో ప్రారంభమైంది. అనుకూల వార్తలను తప్ప ప్రతికూల, విమర్శనాత్మక వైఖరులను సహించే పరిస్ధితి దేశంలో రోజు రోజుకూ దిగజారుతోంది. ఎదుటి వారి బలహీనతలను వినియోగించుకొని లబ్ది పొందాలని చెప్పేవారిని దేశ భక్తులుగానూ, మంచి చెడ్డలను వివరించి వైఖరులు మార్చుకోవాలని కోరే వారిని దేశద్రోహులనేంతగా పరిస్ధితులు వున్నాయి. ఎదుటి వారి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవాలని ఎలా చూస్తామో ఎదుటి వారు కూడా అదే ప్రయత్నం చేస్తారనే చిన్న తర్కం తట్టకపోతే వచ్చే సమస్య ఇది. ప్రపంచ వ్యాపితంగా ప్రతి దేశం స్వేచ్చా వాణిజ్యం, విధానాల గురించి ఎన్ని కబుర్లు చెప్పినా ఎవరికి వారు రక్షణాత్మక చర్యలను ఎక్కువగా తీసుకుంటున్న రోజులివి. ప్రతికూలతలను మనం మూసిపెడితే ప్రపంచానికి తెలియకుండా పోతుందా? మంచి చెడ్డలను చర్చించిన వారు దేశద్రోహులు కాదు అసలైన దేశ భక్తులని ముందుగా చెప్పాలి.

తాము విధించిన పన్నుల కారణంగానే చైనా ఆర్ధిక వ్యవస్ధ పతనమైందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. తమ చర్యలు పన్నులు లేని దేశాలకు తరలిపోవాలని అనుకుంటున్న కార్పొరేట్‌ కంపెనీల నిర్ణయాలను ప్రభావితం చేయటమే కాదు, అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొనేలా చైనాపై వత్తిడిని పెంచుతున్నాయని కూడా ట్రంప్‌ పేర్కొన్నారు. వేలాది కంపెనీలు వెళ్లిపోతున్న కారణంగానే తమతో ఒప్పందం చేసుకోవాలని చైనా కోరుకుంటోందని, తమకు పెద్ద మొత్తంలో ఆదాయం వస్తోందని, రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుందని, విలువ తగ్గించటం ద్వారా ఆ మొత్తం చైనాయే చెల్లిస్తోందని కూడా ఆ పెద్దమనిషి చెప్పాడు. అయితే అమెరికా ఆర్ధికవేత్తలు ఇలాంటి వైఖరులను తోసిపుచ్చుతున్నారు. చైనా వుత్పత్తులపై విధించే దిగుమతి పన్ను కారణంగా ధరల పెరుగుదల వలన ఆ మొత్తాన్ని వినియోగదారులే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. రెండువందల బిలియన్‌ డాలర్ల విలువగల చైనా వుత్పత్తులపై అమెరికా 25శాతం పన్ను విధిస్తే, అరవై బిలియన్‌ డాలర్ల విలువగల అమెరికా వస్తువులపై చైనా కూడా అంతే మొత్తంలో పన్ను విధిస్తోంది. మరో 325 బిలియన్‌ డాలర్ల చైనా వస్తువులపై పది నుంచి 25శాతం మేర పన్ను విధిస్తామని ట్రంప్‌ బెదిరిస్తున్నాడు. ఇరుదేశాల వాణిజ్యంలో చైనాది పైచేయిగా వుంది. అమెరికా దిగుమతులు 540 బిలియన్‌ డాలర్లుండగా చైనా దిగుమతులు కేవలం 120 బిలియన్‌ డాలర్లు మాత్రమే. ఈ తేడాను తగ్గించేందుకు తమ వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలంటూ అమెరికా బలవంతం చేస్తోంది.

చైనా ఆర్ధికవృద్ధి రేటు పడిపోవటం అమెరికాకు చెడు వార్త అని అసోసియేటెడ్‌ ప్రెస్‌ ఏజన్సీ విశ్లేషణ పేర్కొన్నది. దాని సారాంశం ఇలా వుంది. చైనా ఆర్ధిక మందగమనం వచ్చే ఏడాది కూడా కొనసాగవచ్చు. ఇది ప్రపంచవ్యాపిత పర్యవసానాలకు దారి తీస్తుంది.చిలీ రాగి మొదలు ఇండోనేషియా బొగ్గు వరకు చైనా ఫ్యాక్టరీలకు జరుగుతున్న ముడిసరకుల సరఫరాపై ప్రభావ చూపవచ్చు. దక్షిణాఫ్రికా వుత్పత్తిలో ఈ శతాబ్ది ప్రారంభంలో రెండుశాతం చైనాకు ఎగుమతి అవుతుండగా ప్రస్తుతం 15శాతానికి చేరాయి. కాంగో ఎగుమతుల్లో 45శాతం చైనాకే వున్నాయి. ఇలాంటి దేశాలన్నీ చైనా పెట్టుబడుల మీద ఆధారపడి వున్నాయి. పీటర్సన్‌ సంస్ధ వివరాల ప్రకారం ఏప్రిల్‌ నెలలో ఆస్ట్రేలియా ఎగుమతుల్లో 35, బ్రెజిల్‌ 30, దక్షిణకొరియా 24శాతం వుత్పత్తులు చైనాకు ఎగుమతి అవుతున్నాయి. మందగమనం కారణంగా చైనా అంతర్గత వినియోగం పడిపోతే ఈ దేశాలే కాదు చైనాలో వస్తువిక్రయాలు చేస్తున్న అమెరికన్‌ కంపెనీల ఆదాయం, లాభదాయకత, వాటాల విలువ మీద ప్రతికూల ప్రభావం పడుతుందని సిరాకాస్‌ విశ్వవిద్యాలయ ఆర్ధికవేత్త మేరీ లవ్లీ చెప్పారు. అంతిమంగా వాటాల ధరలు బలహీనమైతే అది అమెరికా వినియోగదారుల, ఆర్ధిక వ్యవస్ధపై వున్న విశ్వాసాన్నే దెబ్బతీస్తుందని కూడా ఆమె అన్నారు. చైనా ఆర్ధిక వ్యవస్ధ దిగజారిందని ట్రంప్‌ సంతోషంగా వుండవచ్చు గానీ ఇది జాగ్రత్తగా వుండాల్సిన పరిణామం అని ఆమె హెచ్చరించారు. ట్రంప్‌ ఒక్క చైనా మీదనే కాదు, ఇతర అనేక దేశాల మీద పన్నులు విధిస్తున్నారు. ఆ దేశాల వారు బదులు తీర్చుకుంటున్నందున మొత్తంగా ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులు దెబ్బతింటున్నాయి. వార్షిక అభివృద్ది లక్ష్యం 6నుంచి 6.5శాతం వుండే విధంగా వినియోగం పెంచేందుకు చైనా చర్యలు తీసుకుంటోంది.

చైనాలో జరిగే పరిణామం మన దేశం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ కూడా జరుగుతోంది.ఈ ఏడాది జనవరి 22 నాటి ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక విశ్లేషణ సారాంశం ఇలా వుంది. చైనా తొలిసారిగా వుత్పాదక కార్యకలాపాలు పడిపోయాయి. ఎగుమతులు, దిగుమతులూ తగ్గాయి. కొన్ని సంస్ధల సామర్ధ్య వినియోగం 40,50శాతం మధ్య వుంది. చైనాలో వస్తు డిమాండ్‌ పడిపోతే దాని ప్రభావం ప్రపంచవ్యాపితంగా వుంటుంది.ఈ శతాబ్ది ప్రారంభంలో ప్రపంచ ఆర్ధిక కార్యకలాపాల్లో చైనా వాటా ఏడుశాతం మాత్రమే వుండగా ఈ ఏడాది 19శాతానికి చేరనుంది. చైనా పరిశ్రమ అంతర్జాతీయ సరఫరా గొలుసుతో ముడిపడి వుంది. అనేక వస్తువుల ధరలను ప్రస్తుతం చైనా ఆర్ధిక వ్యవస్ధ నిర్ణయించే స్ధితిలో వుంది. ప్రపంచంలో వినియోగించే వుక్కు, రాగి, బొగ్గు, సిమెంట్‌లో సగం చైనాకు పోతోంది.అది కొనటం ఆపివేస్తే ధరలు పడిపోతాయి. డిమాండ్‌ పడిపోకుండా చూసేందుకు చైనా తక్షణ నిర్మాణ పధకాలను చేపట్టింది, పన్నులను తగ్గించింది. కొన్ని దిగుమతి పన్నులను తగ్గించింది.చిన్న సంస్ధలకు రుణాలను పెంచింది, బ్యాంకుల వద్ద నిల్వధనాన్ని తగ్గించింది.వడ్డీల తగ్గింపునకు చర్యలు తీసుకుంది. పెద్ద సంఖ్యలో వుద్యోగాలు రద్దు కాకుండా వుద్దీపన చర్యలు తీసుకుంది. ప్రస్తుతం భారత్‌ నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో చైనా వాటా 4.39శాతం.అక్కడి నుంచి 16శాతం వస్తువులను దిగుమతి చేసుకుంటున్న కారణంగా మన దేశం మీద ప్రభావం పెద్దగా పడకపోవచ్చు. అయితే చైనా కరెన్సీ యువాన్‌ బలహీనపడితే చైనా నుంచి దిగుమతులు చౌక అవుతాయి, దాంతో అక్కడి నుంచి వస్తువులను మన దేశంలో కుమ్మరిస్తారు. అది ఇక్కడి కంపెనీలను దెబ్బతీస్తుంది. చైనాకు ఎగుమతి చేసే ముడిసరకులు దెబ్బతింటాయి. చైనా కంపెనీలు భారత్‌కు వస్తాయి, ఇక్కడ వస్తువులను వుత్పత్తి చేస్తాయి, మౌలిక సదుపాయాల కల్పనలో చైనా సాయం తీసుకొని భారత్‌ లబ్ది పొందవచ్చు.

మరికొందరి విశ్లేషణల సారాంశం ఇలా వుంది. వాణిజ్య యుద్ధం కారణంగా కొంత మేరకు అమెరికా మార్కెట్‌ను చైనా కోల్పోవచ్చు. ఆ మేరకు మన దేశం ఆ స్ధానంలో ప్రవేశించవచ్చు అన్నది ఒక అభిప్రాయం. 2012-15 మధ్య కాలంలో ఎగుమతి మార్కెట్లో చైనా చొరబాటు 53-51శాతం మధ్య కదలాడగా దాటగా మన దేశం 27-28శాతం కలిగి వుంది. అమెరికా 48 నుంచి 43శాతానికి పడిపోయింది. 2016లో చైనా 42.57శాతానికి పడిపోగా మన దేశం 23.32కు, అమెరికా 37శాతానికి తగ్గిపోయింది. అంటే మూడు దేశాలకూ ఎగుమతుల అవకాశాలు తగ్గాయి. అయినా మన కంటే చైనా వాటా రెట్టింపుకు దగ్గరగా వుంది. పోయిన వాటాను పూడ్చుకొనేందుకు చైనా ఏం చేస్తుందనే అంశాన్ని పక్కన పెడితే మన దేశం మీద కూడా అమెరికా వాణిజ్య యుద్దం చేస్తోంది. చైనా స్ధానంలో మనం చొరబడాలంటే ఈ అంశం పరిష్కారం కావటం ఒకటి. చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వుత్పత్తుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగినవి వున్నాయి. వాటిని మనం తయారు చేసి ఎగుమతి చేయాలంటే అవసరమైన వుత్పాదక సామర్ధ్యాలను సమకూర్చుకోవటం తెల్లవారే సరికి జరిగే వ్యవహారం కాదు. 2016లో వుత్పాదక రంగంలో చైనా హైటెక్‌ వుత్పత్తుల ఎగుమతులు 25శాతం కాగా మన దేశంలో ఏడుశాతమే వున్నాయి. పన్ను ఒప్పందాలు చైనాకు 22 వుండగా మన దేశానికి రెండు మాత్రమే వున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో చొరబడాలంటే అందునా ప్రతి దేశం రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఇవి ఎంత ఎక్కువ వుంటే అంత ప్రయోజనం. ఇలాంటి తేడాలు అనేకం వున్న కారణంగా మన దేశం ఏ మేరకు లబ్దిపొందుతుంది అన్నది ప్రశ్న.

చైనా వారు ప్రకటించిన లెక్కలు దాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేంతగా లేవు, నేను గతవారం చైనాలో వున్నాను. వుత్పాదక రంగంలో మందగించిందనేది సాధారణ అభిప్రాయంగా వుంది. వేగంగా పెరుగుతున్న సేవా రంగం తిరిగి వెనుకటి స్ధాయికి తీసుకు వస్తుందనే అభిప్రాయమూ వుంది అని ఏలే విశ్వవిద్యాలయ సీనియర్‌ ఆర్ధికవేత్త స్టీఫెన్‌ రోచి చెప్పారు. మోర్గాన్‌ స్టాన్లే ఆసియా అధ్యక్షుడిగా 2007-12 మధ్య ఆయన చైనాలో వున్నారు. ప్రస్తుతం సాగుతున్న వాణిజ్య పోరు గురించి కూడా వారిలో ఎలాంటి ఆత్రత కూడా కనిపించలేదన్నారు. ఆర్ధిక మందగమన నేపధ్యంలో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవాలనే ధోరణిలో కూడా వారు లేరని, ఒక వేళ పోరు ముదిరితే దాన్ని అదుపు చేసే వ్యూహాలు కూడా వారి దగ్గర వున్నాయని చెప్పారు.

చైనా ఆర్ధికం మందగిస్తే ఏం జరుగుతుందనే అంశంపై పైన పేర్కొన్న అభిప్రాయాలతో అందరూ ఏకీభవించాలని లేదు.చర్చలో ముందుకు వస్తున్న అంశాలకు ప్రతీకగా వాటిని చూడాలి. ప్రతి దేశ ఆర్ధిక వ్యవస్ధ తాను ఎదుర్కొంటున్న సమస్యలకు తమదైన పరిష్కారాలను చూసుకోవాలి తప్ప అనుకరిస్తే ప్రయోజనం వుండదు. అనేక మంది పరిశీలకులు చెబుతున్నదాని ప్రకారం చైనా ప్రస్తుతం పెట్టుబడుల కంటే వస్తు వినియోగాన్ని పెంచే ఆర్ధిక నమూనా దిశగా ప్రయాణిస్తోంది. 2007-17 మధ్య కాలంలో చైనా గృహ వినియోగం అమెరికాతో పోలిస్తే 13శాతం నుంచి 34శాతానికి పెరిగింది. జిడిపిలో దాని వినియోగం గతేడాది 40శాతం వుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ అంచనా ప్రకారం 2017-23 మధ్య చైనా ఆర్ధిక వ్యవస్ధ 42శాతం చొప్పున(వార్షిక వృద్ధి 6.1శాతం), అమెరికా వ్యవస్ధ 13శాతం(వార్షిక వృద్ధి రెండుశాతం) పెరుగుతాయి. తరువాత వాటి వృద్ధి రేటు 8, 4శాతాల చొప్పున వుంటాయి.2026 నాటికి డాలర్లలో అమెరికా ఆర్ధిక వ్యవస్ధ స్ధాయికి చైనా చేరుకుంటుంది. 2027 నాటికి అమెరికా వినియోగంలో 74శాతం కలిగి వుంటుంది. తరువాత చైనా జిడిపి వృద్ధి రేటు ఆరుశాతం, అమెరికా రేటు నాలుగుశాతం వుంటుంది.

ఈ లెక్కలు కొంత గజిబిజిగా అనిపించవచ్చు. ఈ నేపధ్యంలో మన దేశం ఎంచుకున్న మార్గం ఏమిటన్నది చూడాల్సి వుంది. ప్రపంచ బ్యాంకు విశ్లేషణ ప్రకారం మన దేశ అభివృద్ధి అత్యధికంగా అంతర్గత డిమాండ్‌ కారణంగా జరిగింది, ఎగుమతుల అభివృద్ధి నెమ్మదిగా వుంది. కనుక కొత్త ప్రభుత్వం ఎగుమతి ఆధారిత అభివృద్ది ప్రాతిపదికగా చూడాలని సలహాయిచ్చింది. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) అంచనా ప్రకారం 2018లో ప్రపంచ వాణిజ్య వృద్ది రేటు 3.9శాతం కాగా 2019లో 3.7శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. వుత్పత్తి కూడా 3.5 నుంచి 3.3శాతానికి తగ్గనున్నట్లు తెలిపింది. ప్రపంచం వాణిజ్యం తగ్గితే అది కొన్ని దేశాల మీదనే ప్రతికూల ప్రభావం చూపదు. చివరికి దుస్తుల ఎగుమతి విషయాల్లో కూడా మన దేశం బంగ్లాదేశ్‌, వియత్నాం వంటి దేశాలతో పోటీ పడలేకపోతోంది. భారత్‌లో అంతర్గత డిమాండ్‌ ఎక్కువగా వున్న కారణంగా దిగుమతులు రెండంకెల స్ధాయికి చేరుతున్నాయని, డిమాండ్‌ను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రపంచ బ్యాంకు సూచించింది.జిడిపిలో సాధారణంగా 30శాతం మేరకు ఎగుమతులు చేయాల్సి వుండగా ఇప్పుడు పదిశాతం మేరకే వుందని, రానున్న రోజుల్లో ఎగుమతులు పెంచాలని కోరింది.

Related image

తాజాగా కేంద్రం ప్రకటించిన ఆర్ధిక సర్వే, బడ్జెట్‌లోనూ ప్రయివేటు పెట్టుబడుల ద్వారా అభివృద్ది తద్వారా ఎగుమతుల గురించి వక్కాణించారు.గత ఐదు సంవత్సరాలలో మొత్తంగా చూస్తే ఎగుమతులు పడిపోవటంతో పాటు పారిశ్రామిక మరియు వస్తుతయారీ అభివృద్ది కూడా మందగించింది. వినియోగ వస్తువుల డిమాండ్‌ కూడా పడిపోయింది. దీనికి ఒక ప్రధాన కారణం వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టకపోవటం, ఇతర కారణాలతో తలెత్తిన సంక్షోభం అన్నది అందరూ చెబుతున్నదే. ఒక్క సేవారంగంలో తప్ప ఇతర రంగాలలో తీవ్ర సమస్యలున్నప్పటికీ మనం మాత్రం వేగంగా అభివృద్ది చెందుతున్న దేశమనే తోక తగిలించుకుంటూనే వున్నాం. లేకపోతే రాజకీయంగా చెప్పుకొనేందుకేమీ వుండదు. దేశాన్ని ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధగా మార్చాలనే తపనతో మేకిన్‌ ఇండియా అనో మరొక పిలుపో ఇచ్చినా దాని వలన ఫలితాలేమీ రాలేదు. గతంలో తూర్పు ఆసియా దేశాలు, కొన్ని లాటిన్‌ అమెరికా దేశాలు ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధలతో ఒక వెలుగు వెలిగిన మాట నిజం.నాటికీ నేటికీ ఎంతో తేడా వుంది. ప్రస్తుతం ధనికదేశాలు ఎదుర్కొంటున్న మాంద్యం, ప్రతి దేశం అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలు అలాంటి అభివృద్దికి అనేక ఆటంకాలు కలిగిస్తున్నాయి. అన్నింటినీ మించి గతంలో ఆసియన్‌ దేశాలు అభివృద్ధి చెందిన సమయంలో దిగ్గజ చైనా రంగంలో లేదు. అక్కడి నుంచి దిగుమతులను అడ్డుకొనేందుకు మన దేశంతో సహా ప్రతిదేశమూ ప్రతి రోజూ ప్రయత్నిస్తున్నది. అనేక సందర్భాలలో మన వుత్పత్తులు తగినంత నాణ్యత లేవనే సాకుతో ఐరోపా, అమెరికా తిరస్కరించిన వుదంతాల గురించి వస్తున్న వార్తల గురించి తెలిసిందే.అమెరికా మన దేశం మీద కూడా వాణిజ్యపోరు సాగిస్తున్నది, మనం కూడా మన ఎలక్ట్రానిక్‌పరిశ్రమ రక్షణ కోసం కొన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. వ్యవసాయరంగంలో అలాంటి చర్యలను మరింతగా తీసుకోవాల్సి వుంది.

వేగంగా అభివృద్ధి చెందటం గురించి ప్రతి ఒక్కరూ చైనాను పదే పదే చెబుతుంటారు.అక్కడి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం అనుసరించిన సమతుల విధానం దాని విజయానికి కారణం. వుత్పాదకత పెంపుదలతో పాటు అక్కడి జన జీవితాలను ఎంతో మెరుగుపరచటం, అందుకు అవసరమైన విధంగా వేతనాలు, ఇతర ప్రోత్సాహకాల రూపంలో ఆదాయాలు కూడా పెరిగాయి. ఈ రెండో కోణాన్ని అనేక మంది చూడటం లేదు. 2008లో ప్రపంచ ధనిక దేశాల్లో తలెత్తి ఇప్పటికీ ఏదో ఒక రూపంలో కొనసాగుతున్న ఆర్ధిక మాంద్యంతో తన విధానంలోని బలహీనతను చైనా నాయకత్వం గుర్తించింది. దాన్ని సరిచేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగానే అంతర్గత వినిమయాన్ని పెంచి తగ్గిన ఎగుమతుల సమస్యను కొంత మేరకు అధిగమించింది. ఎంతగా తగ్గినా ఆరుశాతం పైగా ఆర్ధిక వృద్ది రేటు చైనాలో కొనసాగుతోంది. ఇప్పటికే దాని దగ్గర పెద్ద మొత్తంలో డాలర్లు పోగుపడి వున్నాయి కనుక తన ఆర్ధిక వ్యవస్ధను తిరిగి పరుగు పెట్టించేందుకు అవసరమైన వుద్దీపన పధకాలను చేపట్టగల సత్తా వుంది. అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఠలాయిస్తే ఇతర మార్కెట్లను సంపాదించగల శక్తి వుంది. మన దేశంలో బ్యాంకులు నిరర్ధక ఆస్తులతో, పెట్టుబడుల కొరతతో సతమతమౌతున్నాయి. అంతర్గత డిమాండ్‌ను పెంచటంతో పాటు వుపాధి కల్పనలో లోటు రాకుండా చూసుకొనేందుకు చైనాలో ప్రయివేటు రంగానికి రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఒక బ్యాంకును ఏర్పాటు చేస్తున్నారు. ధనికదేశాలతో వాణిజ్య పోరును ఎదుర్కొంటూనే సవ్యసాచిలా చైనా నాయకత్వం అనేక చర్యలు తీసుకొంటున్నది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఫలితం లేదు. మన విధానాల లోపాల్ని ముందుగా సవరించుకోవాలి. వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు మన సర్కార్‌ చెబుతున్న తప్పుడు లెక్కలను ప్రశ్నించిన వారిని దేశ ద్రోహులుగా చూస్తున్నారు. ఈ పూర్వరంగంలో అసలు మనం చెప్పే అభివృద్ది ఇతర లెక్కలను విశ్వసించి ప్రయివేటు పెట్టుబడిదారులు ముందుకు వస్తారా అన్నదే అసలు సమస్య !

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ కంటే చైనానే ఎక్కువగా నమ్ముతున్న అమెరికన్‌ యువత !

12 Wednesday Jun 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Communist China, Donald trump, RED MAY, US youth distrust Trump, US Youth Trusting communist China

Image result for College kids' distrust for Trump over communist China

ఎం కోటేశ్వరరావు

‘డోనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం మేథావులకు తీవ్ర వ్యతిరేకి, చాలా వ్యతిరేకి, విశ్వవిద్యాలయాల వంటి వాటిని వుదారవాద ప్రచార యంత్రాలుగా పిలుస్తున్నారు. కాబట్టి అది జాత్యంహంకారి మాత్రమే కాదు, మేథావుల మీద దాడి వంటిది కూడా అని భావిస్తా ‘ ఇది ఒక విద్యార్ధి అభిప్రాయం. ‘ నావరకైతే చైనా ప్రభుత్వం నిజాయితీ కలిగినదా లేనిదా అనే గుర్తింపు ఎంత వుందో తెలియదు, కానీ ట్రంప్‌ సర్కార్‌ నిజాయితీలేనిదని మాత్రం నాకు కచ్చితంగా తెలుసు, కనుక అతన్ని నేను నమ్మను, అందువలన నేను నా స్వతంత్ర పరిశోధన చేస్తాను ‘ అనేది మరొక విద్యార్ధిని చెప్పిన మాట. అమెరికా సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న అనేక చర్చలలో ఇదొకటిగా చెప్పవచ్చు. ఈ ధోరణి గురించి ఒక కమ్యూనిస్టు వ్యతిరేక వెబ్‌సైట్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక క్లుప్త వ్యాఖ్యానాన్ని ప్రచురించింది.

పూర్వరంగం ఏమిటంటే అమెరికా విశ్వవిద్యాలయాల్లో దాదాపు వంద చోట్ల చైనా ప్రభుత్వం లేదా సంస్ధల నుంచి పొందే నిధులతో నడిచే కన్‌ఫ్యూసియస్‌ కేంద్రాలు నడుస్తున్నాయి. వాటిని మూసివేయాలని కోరుతూ 2014లో కొంతమంది ప్రొఫెసర్లు ఒక నివేదికను విడుదల చేశారు. గత సంవత్సరం సెనెట్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీ ముందు ఎఫ్‌బిఐ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ రే మాట్లాడుతూ కన్‌ఫ్యూసియస్‌ సంస్ధల కార్యకలాపాల మీద దర్యాప్తు జరుపుతున్నామని, వాటిని నిఘానిమిత్తం వినియోగిస్తున్నట్లు గూఢచారులు హెచ్చరించారని పేర్కొన్నారు. ముఖ్యంగా పదమూడు విశ్వవిద్యాలయాల్లోని కేంద్రాల గురించి పెంటగన్‌(అమెరికా రక్షణశాఖ కార్యాలయం) చేసిన పరిశోధనలో ఆందోళన వ్యక్తం చేసినట్లు వాషింగ్టన్‌ ఫ్రీ బీకన్‌ అనే పత్రం పేర్కొన్నది. ఈ అధ్యయన కేంద్రాలు అమెరికా జాతీయ భద్రతకు ముప్పు అని సిఐఏ పేర్కొన్నది. అమెరికా-చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య పోరు నేపధ్యంతో పాటు విశ్వవిద్యాలయాల సంస్కరణల గురించి అధ్యయనం చేస్తున్న ఒక మితవాద బృందానికి చెందిన మీడియా డైరెక్టర్‌ కాబోట్‌ ఫిలిప్స్‌ ఇటీవల మేరీలాండ్‌ విశ్వవిద్యాలయ సందర్శన చేశారు. అక్కడ మీరు కన్‌ఫ్యూసియస్‌ కేంద్రాలను నడిపే చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్నా లేక కాపిటలిస్టు డోనాల్డ్‌ట్రంప్‌లో ఎవరిని ఎక్కువగా నమ్ముతారు అని ప్రశ్నించగా విద్యార్ధులు చెప్పిన సమాధానాలను పైన చూశారు. కనీసం ఒక విషయంలో అయినా ట్రంప్‌ కంటే చైనా చెప్పేదాన్నే నమ్ముతామన్నది వారి భావం అని తేలిందని, దీన్ని గమనించే అమెరికా గూఢచారశాఖ గేరు మార్చిందని సదరు వెబ్‌సైట్‌ వ్యాఖ్యాత పేర్కొన్నారు. దానిలో భాగంగానే దేవుడిని నమ్మని, అణచివేత వ్యవస్ధ కలిగిన, విఫలమైన చైనా గురించి ఆందోళన కలిగించే, తీవ్ర, కరోఠ సత్యాలను జనానికి అందిస్తున్నట్లు కూడా తెలిపారు.

కన్‌ఫ్యూసియస్‌ సంస్ధ మరియు పురోగామి విద్యావ్యవస్ధ కారణంగా విద్యార్ధులు సోషలిజం, కమ్యూనిజాల మరియు ప్రపంచ హేతువాద భావాల ఛాంపియన్లుగా తయారవుతున్నారు, అది చివరికి అమెరికా వ్యతిరేక మరియు సామాజిక న్యాయ పోరాట యోధులనే నూతన జాతిని తయారు చేస్తున్నది, ఈ రోజుల్లో కాలేజీ విద్యార్ధులు డోనాల్డ్‌ ట్రంప్‌ మరియు అతని ప్రభుత్వ యంత్రాంగానికి వ్యతిరేకమైన ధోరణులకు దగ్గర అవుతున్నారు. అనేక మంది విద్యార్ధులు ట్రంప్‌ సర్కార్‌ కంటే చైనా కమ్యూనిస్టు ప్రభుత్వానే ఎక్కువగా నమ్ముతున్నారనే విస్తుగొలిపే అంశాన్ని ఎవరైనా చూడవచ్చు అని బ్లేజ్‌ అనే ఒక స్ధానిక పత్రిక పేర్కొన్న అంశాన్ని వెబ్‌సైట్‌ విశ్లేషణ వుటంకించింది.అనేక అంశాలపై ట్రంప్‌ ప్రభుత్వం,అమెరికా గూఢచార సంస్ధలు చెబుతున్న దాని కంటే చైనా ప్రభుత్వం చెబుతున్నవాటికే మద్దతు పలుకుతామన్నది సాధారణంగా వెల్లడైన సమాధానం కావటంతో సదరు కాబోట్‌ ఫిలిప్స్‌ బుర్ర దిరిగి చైనాలో మానవహక్కులు లేవని, మతవిశ్వాసాల కారణంగా మిలియన్ల మందిని అణచివేస్తున్నారంటూ ఆ విద్యార్ధులకు చెప్పి ఇప్పుడు చెప్పండి చైనా గురించి అని అడిగాడు. వెంటనే ఒక విద్యార్ధి చైనాను నమ్ముతున్నానని నేను చెప్పలేదు అనగా, మేథావులకు ట్రంప్‌ వ్యతిరేకం అని వ్యాఖ్యానించిన విద్యార్ధిని ఒక్క క్షణం ఆలోచించి నేను కచ్చితంగా చెప్పలేను అన్నది, మరొకరు ఇది చాల కష్టమైన ప్రశ్న, దానికి సమాధానం ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు, అది నూటికి నూరుశాతం కరెక్టని చెప్పలేను అన్నారు. చైనా భాష, సంస్కృతిని, కన్‌ఫ్యూసియస్‌ భావజాలాన్ని పెంపొందించే పేరుతో కమ్యూనిస్టు పార్టీ ప్రచార కేంద్రాలుగా వినియోగించుకుంటున్నారని కాబోట్‌ ఫిలిప్స్‌ ఆరోపించాడు. గత పన్నెండు సంవత్సరాలుగా నడుస్తున్న ఈ కేంద్రాలలో మొత్తం 35వేల మంది విద్యను అభ్యసించారు. అక్కడ జరిగే కార్యక్రమాలలో తొమ్మిది లక్షల 20వేల మంది పాల్గొన్నారని 2018లో నార్త్‌ కరోలినా కేంద్రం వార్షిక నివేదికలో పేర్కొన్నారు.

అమెరికా సమాజం తమ నాయకత్వాన్ని విశ్వసించటం లేదన్నది స్పష్టం, అయితే ఇదే సమయంలో ఇతర దేశాలు, చైనా వంటి వాటి గురించి ఏకపక్ష సమాచారం మాత్రమే యువతరానికి అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికా పాలకవర్గం పూనుకుంది అన్నది కూడా సుస్పష్టం.చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వ అణచివేత గురించి యువతకు వివరిస్తే వారి వైఖరి మారుతుందని ఫిలిప్స్‌ చెప్పటాన్ని బట్టి రానున్న రోజుల్లో మరో మారు పెద్ద ఎత్తున చైనా, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి తెరతీయనున్నారు.

‘ రెడ్‌ మే ‘ పేరుతో అమెరికాలోని సియాటెల్‌ నగరంలో 2017 నుంచి ప్రతి ఏటా మే మాసమంతా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ‘ పెట్టుబడిదారీ విధానం నుంచి కొన్ని రోజులు సెలవు ‘ పేరుతో ఇవి జరుగుతున్నాయి. బహిరంగ స్ధలాల్లో జరిగే ఈ కార్యక్రమాలకు ఎవరైనా హాజరుకావచ్చు. విద్యాసంస్ధలు లేదా సభల్లో చెప్పేదానికి అతీతంగా ఇక్కడ అవగాహన చేసుకోవటానికి అవకాశం వుంటుందని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ విద్యార్ధుల పత్రిక ది డైలీ పేర్కొన్నది. అలాంటి ఒక కార్యక్రమంలో ఒక ఆంగ్ల ప్రొఫెసర్‌ పాల్గొని మానవాళి విముక్తికి మార్క్సిస్టు భావజాలాన్ని వినియోగించటాన్ని పొగిడినట్లు ఆ పత్రిక పేర్కొన్నది. అలీస్‌ వెయిన్‌బౌమ్‌ అనే ప్రొఫెసర్‌ మాట్లాడుతూ ‘ ఇండ్లలో భోజనం చేసే సమయంలో దొర్లే మాటల్లో సోషలిజం లేదా కమ్యూనిజం అనేవి చెడ్డ పదాలు, ఇలాంటి కార్యక్రమాలలో పొల్గ్గొన్నపుడు వ్యక్తులు ప్రత్యేకించి కాలేజీ విద్యార్ధులు వామపక్ష భావజాలం మీద వున్న నిందల గురించి ప్రభావితం అయ్యే అవకాశం వుంది. రెడ్‌ మే కార్యక్రమాలు ఒక రాజకీయ సిద్ధాంతం మీద ఒకే వైఖరికి కట్టుబడి వుండటం లేదు, ప్రస్తుత మన పరిస్ధితి గురించి ఎల్లలు లేని చర్చలకు అవకాశం ఇస్తున్నాయి. అనేక మంది పండితులు ఈ భావజాలాలను వర్తమాన పరిస్ధితులకు వర్తింప చేస్తూ ఆలోచిస్తున్నారు. వారిలో పండితులే కాదు, కార్యకర్తలుగా పని చేసే పండితులు కూడా ఈ విద్వత్సభలో వున్నారు. ఈ సంస్ధ పరిధిలకు మించి వారంతా పని చేస్తున్నారు, మానవాళి విముక్తికి వివిధ మార్గాలలో భాగంగా మార్క్సిస్టు భావజాలాన్ని కూడా ఒక మార్గంగా వినియోగిస్తున్నారు.’ అని చెప్పారు. ఆమె స్త్రీవాదం, నల్లజాతీయుల అధ్యయనం, మార్క్సిస్టు సిద్దాంతం, అట్లాంటిక్‌ ప్రాంత వర్తమాన సాహిత్యం, సంస్కృతి, పునరుత్పత్తి సంస్కృతి, రాజకీయాల వంటి అంశాల మీద బోధన చేస్తున్నారు. ఆమె పుట్టుక శ్వేతజాతిలో అయినప్పటికీ జాత్యహంకార సమస్యల గురించి రచనలు చేశారు.

రెడ్‌ మే కార్యక్రమాలకు హాజరైన మైక్‌ కార్లసన్‌ ఇలా చెప్పాడు.’ దీనికి సంబంధించి ఒక గొప్ప విషయం ఏమంటే వామపక్ష భావజాలంలో ఒకదానికొకటి విడిగా వుండే అనేక అంశాలు వున్నాయి. ఎవరైనా వచ్చి భిన్నమైన ఆలోచనలను ఇక్కడ వ్యక్తీకరించవచ్చు, ఇతరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. అది తమ స్వంత విషయం కావచ్చు లేదా ఒక ప్రాజెక్టు ఏదైనా కావచ్చు అన్నాడు. ‘కమ్యూనిస్టు పరిధి వెలుపల (కమింగ్‌ అవుట్‌ కమ్యూనిస్టు)’ అనే అంశమీద చర్చలో అతను పాల్గొన్నాడు.ఈ కార్యక్రమాలలో మార్క్సిస్టు సిద్ధాంతాల నుంచి కార్పొరేట్‌లు సోషలిజానికి ఎలా పునాది వేస్తున్నాయి అనే అంశాల వరకు అనేక చర్చలు జరుగుతాయి. తమ కార్యక్రమాలు వివిధ ఆలోచనలకు ఎదురవుతున్న సవాళ్లు, అభివృద్ధి చేయటం తప్ప హాజరైన వారి బుర్రల్లో బలవంతంగా ఎక్కించటం లేదా వున్న వాటిని తొలగించటం కాదని రెడ్‌మే కార్యక్రమాల ప్రారంభ నిర్వాహకులలో ఒకరైన ఫిలిప్‌ హోల్‌స్టెట్టర్‌ అన్నారు. ఏడాదికి ఒక నెల పెట్టుబడిదారీ విధానం నుంచి సెలవు తీసుకుందాం, ఒక నెల పాటు కమ్యూనిస్టుగా వుందాం, భిన్నంగా ఆలోచిద్దాం, మిమ్మల్ని ఎవరూ మార్చేందుకు ప్రయత్నించరు అన్నారు.

Image result for communist China

కమ్యూనిజం గురించి అమెరికన్లను భయపెట్టేందుకు అక్కడి పాలకవర్గం అనుసరించని తప్పుడు ఎత్తుగడలు, ప్రచారాలు లేవు. అవే ఇప్పుడు వారి నోళ్లు మూతపడేట్లు చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ విశ్లేషణ ప్రారంభంలోనే అమెరికా యువత ట్రంప్‌ ప్రభుత్వ మాటలు, చేతలను విశ్వసించటం లేదు అని చెప్పుకున్నాము, అంటే విశ్వసనీయత సమస్యను ఎదుర్కొంటున్నది. ‘దశాబ్దాల తరబడి చైనా గురించి అబద్దాలు చెప్పిన వారు మనకు ఇప్పుడు ఏదోఒకటి చెప్పాలి’ అనే శీర్షికతో అమెరికాకు చెందిన అట్లాంటిక్‌ పత్రిక తాజాగా ఒక విశ్లేషణను ప్రచురించింది. తియన్మెన్‌ స్క్వేర్‌ ఘటనలకు మూడు దశాబ్దాలు నిండిన సందర్భంగా దాన్ని రాశారు.

తరతరాలుగా చైనా గురించి రాజకీయ పండితులు, ఆర్ధికవేత్తలు చేసిన విశ్లేషణలు, చెప్పిన జోశ్యాలను చైనా ఎలా వమ్ము చేసిందో, అవెలా తప్పో, చైనా సాధించిన విజయాలను పేర్కొంటూ ఆ విశ్లేషణ సాగింది. దానిలో పేర్కొన్న అంశాల సారాంశం ఇలా వుంది.కమ్యూనిజం అంటే ఎక్కడైనా ఒకటే అని అమెరికా విదేశాంగ విధానంలో పేర్కొన్నారు. ఆచరణలో వేర్వేరు అని సోవియట్‌, చైనాల అనుభవం తెలిపింది. నిక్సన్‌ చైనాతో సాధారణ సంబంధాలను నెలకొల్పుకొనే వరకు రెండు దేశాలను ఒకే శత్రుశిబిరంలో వుంచారు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత చైనా కంటే సహజవనరులు ఎక్కువగా వున్న ఆఫ్రికన్‌ దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని అమెరికా ఆర్ధికవేత్త జోశ్యం చెప్పారు. ఆ విషయంలో పప్పులో కాలేశారు. 1960లో కాంగోలో తలసరి జిడిపి 220 డాలర్లు వుండేది, అది నైజీరియా, చైనాలకు రెట్టింపు.2017నాటికి చైనా తలసరి జిడిపి 9000 డాలర్లకు అంటే నైజీరియా జిడిపికి నాలుగు రెట్లు, కాంగోకు 19రెట్లు ఎక్కువ. చైనా 1978లో నవీకరణ కార్యక్రమం చేపట్టిన తరువాత మానవజాతి చరిత్రలో అత్యంత వేగమైన అభివృద్ధిని నిలకడగా సాధించటమేగాక 85కోట్ల మందిని దారిద్య్రం నుంచి బయటపడవేసింది.

ఆసియన్‌ టైగర్లని చెప్పిన జపాన్‌, తైవాన్‌, దక్షిణ కొరియా తదితర దేశాల మాదిరి అభివృద్ధి సాధించిన తరువాత మరింత ప్రజాస్వామికంగా తయారవుతుందని చెప్పారు. అది కూడా జరగలేదు.1989 నుంచి 1991 మధ్య కమ్యూనిస్టు దేశాలలో ప్రజాస్వామిక గాలి వీచింది, ప్రచ్చన్న యుద్దం ముగిసింది, కొంత మంది అయితే చరిత్ర ముగిసింది అని చెప్పారు.(ఇక్కడ ప్రజాస్వామ్యం అంటే సోషలిజాన్ని వదులు కోవటం, చరిత్ర ముగిసింది అంటే కమ్యూనిస్టు చరిత్ర అని అర్ధం) అయితే అది తూర్పు ఐరోపాలో, ఇతర చోట్ల జరిగింది తప్ప చైనాలో కాదు. దీర్ఘకాలం అభివృద్ధితో పాటు పార్టీ అదుపు కూడా కొనసాగింది.చైనాను ప్రపంచ వాణిజ్య సంస్ధలో చేర్చితే అది కూడా పశ్చిమ దేశాల పెట్టుబడిదారీ ప్రజాస్వామిక వ్యవస్ధల మాదిరి తయారవుతుందనే భావన 1989 నుంచి డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ ప్రభుత్వాలలో వుంది. అది కూడా జరగలేదు. చరిత్రలో అతి పెద్ద సంపద బదిలీ జరిగింది అని జాతీయ భద్రతా సంస్ధ డైరెక్టర్‌ జనరల్‌ కెయిత్‌ అలెగ్జాండర్‌ 2012లోనే చెప్పారు. చైనా గురించి ఎంతో మంది ఎందుకిలా చెప్పారంటే విధాననిర్ణేతలు, మేథావులు సాధారణ సూత్రీకరణలు చెప్పారు కానీ చైనా పురాతన కాలంలోనూ నూతన ఆవిష్కరణలు చేసింది, ఆధునిక కాలంలోనూ దారిద్య్రం నుంచి బయటపడి ఒక ఆధునిక దేశంగా మారింది.1949 తరువాత కమ్యూనిస్టు నాయకత్వంలో ఒక గ్రామీణ దేశంగా వున్నదానిని ప్రపంచంలో అత్యంత ఆధునిక నిఘావేసే దేశాలతో సమంగా తయారైంది.

Image result for communist China

అమెరికా, చైనా నేతలకు మౌలికమైన తేడాలున్నాయి. అమెరికన్ల విషయానికి వస్తే జ్ఞాపకాలు స్వల్పకాలంలోనే అంతరిస్తాయి, కేంద్రీకరణలో నిలకడ వుండదు, ఒక సంక్షోభం నుంచి మరోసంక్షోభానికి ఎదురు చూస్తున్నట్లు వుంటుంది. వాషింగ్ట్‌న్‌లో బడ్జెట్‌ను ఆమోదించటం, దాని మీద కేంద్రీకరించటమే ఒక వీరోచిత చర్యగా చూస్తారు. అదే చైనా విషయానికి వస్తే దీనికి భిన్నంగా జ్ఞాపకాలు దీర్ఘకాలం వుంటాయి, కేంద్రీకరణ నిరంతరం కొనసాగుతుంది. ప్రభుత్వ పధకాలు దీర్ఘకాలానికి రూపొందిస్తారు.కృత్రిమ మేధస్సు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాలు చైనాలో సంవత్సరాల తరబడి పని చేస్తాయి. చైనా మిలిటరీ నవీకరణ 1990దశకంలో ప్రారంభమైంది.ఒక విమానవాహక యుద్ద నౌకను తయారు చేయటానికి చైనాకు ఎంత కాలం పడుతుందని ఒక నౌకాదళ అధికారిని అడిగితే సమీప భవిష్యత్‌లో అని చెప్పారు. దాని అర్ధం 2050 కొంత కాలం ముందు అని, ఆ జోశ్యం కూడా తప్పింది.(1985లో ఆస్ట్రేలియా పాతబడిన ఒక యుద్ద నౌకను తుక్కు కింద మార్చేందుకు చైనాకు విక్రయించింది. అలాంటి వాటిలో అన్ని కీలక విభాగాలను పునరుద్దరించటానికి వీల్లేని విధంగా పనికి రాకుండా చేసి ఇస్తారు. చైనా దానిని అలాగే వుంచి ఏ భాగానికి ఆభాగాన్ని విడదీసి తన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల పరిశీలనకు అప్పగించింది. దాన్నే తన ప్రయోగాలకు వాడుకుంది. తరువాత రష్యా నుంచి మరో మూడు పాత యుద్ద నౌకలను కొనుగోలు చేసింది. వాటిని తుక్కు కింద మార్చకుండా ఒక దానిని విలాస హోటల్‌గానూ, మరొక దానిని సందర్శకులకు ఇతివృత్త పార్కుగా మార్చింది. మూడోదానికి మరమ్మతులు చేసి 2012లో తన తొలి విమాన వాహక యుద్ధ నౌకగా మిలిటరీకి అప్పగించింది. 2030 నాటికి అందుబాటులోకి వచ్చే దశలవారీ కనీసం అరడజను నౌకలను నిర్మిస్తోంది.) అమెరికా ప్రపంచ నాయకత్వం అనేది నడుస్తున్న చరిత్ర, అదే చైనా విషయానికి వస్తే 1840దశకం నాటి నల్లమందు యుద్ధాలకు ముందు అదొక పెద్ద శక్తి. వందసంవత్సరాల అవమానాల తరువాత తిరిగి అది ఒక శక్తిగా తయారవుతోంది. అనేక విధాలుగా అసాధారణంగా అది పెరుగుతోంది. చైనా గురించి చేసిన సాధారణ సూత్రీకరణలు, జోశ్యాల గురించి వివరించిన దాని కంటే ఎంతో అస్పష్టంగా వున్నాయి.

ఇండోచైనా, ఆగ్నేయ ఆసియాలో వియత్నాంపై భ్రాంతి పూర్వకమైన అంచనా కారణంగా అమెరికా 58వేల మంది సైనికులను బలి ఇచ్చుకోవాల్సి వచ్చిందంటూ ఒక విశ్లేషకుడు తాజాగా రాశాడు.1965 జూన్‌ తొమ్మిదిన అమెరికా అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ వియత్నాం మీదకు సైన్యాన్ని పంపుతున్నట్లు ప్రకటించిన రోజును గుర్తు చేస్తూ అమెరికా నాయకత్వ అంచనాలు ఎలా తప్పాయో, దానికి ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చిందో ఆ విశ్లేషణలో పేర్కొన్నారు. అమెరికా సైనికుల మరణాల గురించి తప్ప వారు వియత్నాంలో చేసిన దారుణాలు, మారణ కాండ ప్రస్తావన లేదు. వియత్నాం మన చేతుల నుంచి పోతే కంబోడియా పోతుంది, థాయ్‌లాండ్‌ పోతుంది, మలేసియా పోతుంది, ఇండోనేషియా పోతుంది, ఫిలిప్పినోస్‌ పోతుంది అంటూ సెనెటర్‌ గాలే మెక్‌గీ చెప్పారు. ఇలాంటి భ్రాంతికి అధ్యక్షుడు ఐసెన్‌ హోవర్‌ గురయ్యాడు. వుత్తర వియత్నాం కమ్యూనిస్టు దేశంగా వున్నందున దాన్ని అరికట్టి దక్షిణ వియత్నాంను కమ్యూనిస్టు ప్రభావంలోకి పోకుండా చూడాలనే ఎత్తుగడతో ముందుకు తెచ్చిన వున్మాదమది. వియత్నాంను అదుపు చేయకపోతే తమ దేశాలు కూడా కమ్యూనిజంలోకి పోతాయని భయపడి వియత్నాంపై యుద్ధానికి జత కలుస్తాయని అమెరికా భావించింది. అయితే దానికి విరుద్దంగా జరిగిందని, అమెరికా మాత్రం 58వేల మంది సైనికులను బలిపెట్టాల్సి వచ్చిందన్నది విశ్లేషకుడి సారాంశం.

Image result for College kids' distrust  Trump

ప్రపంచ పరిణామాల గురించి తమ నేతలు, విధాన నిర్ణేతలు చేసిన అనేక వూహాగానాలు, సిద్ధాంతాలు విఫలమయ్యాయని చెప్పే వారు అమెరికాలోనే పెరగటం ఇటీవలి కాలంలో వూపందుకుంటున్న పరిణామం. అందుకే యుద్ధాలకు పాల్పడినప్పటికీ తమ సైనికులను అక్కడికి పంపకూడదని, ఒక ప్రాణం పోయినా సమాజంలో తీవ్ర ప్రతికూలత ఎదురవుతుందని సామ్రాజ్యవాదులు భయపడుతున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా యుద్ధాలు చేయాలని చూస్తున్నారు. అమెరికా నేతల గురించి యువతలో నమ్మకం లేకపోవటం, మీడియాలో ఇలాంటి చర్చ జరగటానికి సంబంధం వుంది. ఏది ముందు, ఏది వెనుక అనే చర్చ కంటే జరుగుతున్న పరిణామాలు పురోగామి శక్తులకు ఎంతో విశ్వాసాన్ని కలిగించేవి అనటంలో సందేహం లేదు. రానున్న రోజుల్లో ఇవి ఏ రూపం తీసుకుంటాయని జోశ్యం చెప్పలేము గాని సోషలిజం, కమ్యూనిజాల మీద విశ్వాసం తగ్గుతున్న రోజుల్లో ఇవి ఆశారేఖలు అనటం నిస్సందేహం. అమెరికా విశ్వవిద్యాలయాల్లో వున్న పురోగామి, వామపక్ష ప్రభావాన్ని చూసిన కారణంగానే మన దేశంలోని కాషాయ దళాలు జెఎన్‌యు, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం వంటివాటి మీద తప్పుడు ప్రచారాలు చేయటంతో పాటు వామపక్ష భావజాలాన్ని అడ్డుకొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని గ్రహించాలి. పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యం చెందుతున్న పూర్వరంగంలో అమెరికా సామ్రాజ్యవాదులకే వామపక్ష భావజాల వ్యాప్తిని అరికట్టటం సాధ్యం కాలేదు. అలాంటిది మన దేశంలో కాషాయదళాల వల్ల అవుతుందా ? అమెరికాలో కమ్యూనిస్టులం అని చెప్పుకొని పని చేసే పరిస్ధితుల్లేని రోజుల నుంచి అవును మేం సోషలిస్టులం, కమ్యూనిస్టులం అని చెప్పుకొనే వారు రోజు రోజుకూ పెరుగుతున్నారు.ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో కమ్యూనిస్టులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగలవచ్చు. వివిధ కారణాలతో తాత్కాలికంగా కమ్యూనిస్టులకు ఓటు వేయకపోవచ్చుగానీ అమెరికా సమాజంలో మాదిరి మన దేశంలోని కష్టజీవుల్లో కమ్యూనిస్టు వ్యతిరేకత లేదు. వారి త్యాగాలను మరచిపోలేదు. జనంలో పోయిన పునాదిని తిరిగి పొందటం ఎలా అన్నదే అభ్యుదయవాదులు, కమ్యూనిస్టుల ముందున్న సవాలు ! చచ్చిన చేపలు ఏటి వాలున కొట్టుకుపోతాయి, బతికి వున్న చేపలు ఎదురీదుతాయి. కమ్యూనిస్టులూ అంతే !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

గోలన్‌ గుట్టలకు ట్రంప్‌ గుర్తింపు భారత్‌కు ఆందోళన కరం !

04 Thursday Apr 2019

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Donald trump, Golan Heights, Israel, Syria

Image result for golan heights

ఎం కోటేశ్వరరావు

మేక పిల్లను తినదలచుకున్న తోడేలు కథ తెలిసిందే. సరిగ్గా అలాంటి సాకులతోనే అరబ్బుల ప్రాంతాలను ఆక్రమించుకొనేందుకు పూనుకున్న యూదు దురహంకార ఇజ్రాయెల్‌కు అమెరికా తాన తందాన అంటోంది. అది ఆక్రమించుకున్న సిరియాకు చెందిన గోలన్‌ గుట్టల ప్రాంతం ఇజ్రాయెల్‌దే అని ప్రకటించింది. ప్రపంచం యావత్తు వ్యతిరేకిస్తున్నా దాని అడ్డగోలు వాదనలను సమర్ధిస్తోంది. పశ్చిమాసియా సంక్షోభాన్ని మరింత పొడిగింపు, సంక్లిష్టం చేయటమే కాదు, ప్రపంచంలో పలుచోట్ల కొత్త సమస్యలు, సంఘర్షణలు తలెత్తటానికి నాంది పలికింది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఏర్పడిన ప్రపంచ వ్యవస్ధ ఐక్యరాజ్యసమితి ఈ ధోరణిని అడ్డుకోవటంలో విఫలమైంది. ఇది మానవాళి శాంతికే ముప్పు. అనేక ప్రాంతీయ ఒప్పందాల వుల్లంఘన మొదటి ప్రపంచ యుద్ధానికి నాంది పలికితే, నానాజాతి సమితి వైఫల్యం రెండవ ప్రపంచ యుద్ధానికి బాటలు వేసింది. ఇప్పుడు ఐక్యరాజ్యసమితి కూడా వైఫల్య పరంపరలో వుంది. ఇది ఏ పర్యవసానాలకు దారి తీస్తుందో ?

పాలస్తీనా అరబ్బులకు చెందాల్సిన జెరూసలెం పట్టణాన్ని ఇజ్రాయెల్‌ రాజధానిగా గత ఏడాది గుర్తించిన అమెరికా తన రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు 1967 దురాక్రమణ యుద్ధంలో ఆక్రమించుకున్న సిరియా భూ భాగం గోలన్‌ గుట్టలు ఇజ్రాయెల్‌ అంతర్భాగంగా తాను గుర్తిస్తున్నట్లు గత వారంలో నిర్ణయించింది. ఈ చర్యను ఐక్యరాజ్యసమితి, ఐరోపా యూనియన్‌, తాజాగా అరబ్‌ లీగ్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా సరే అమెరికా వైఖరిలో మార్పు లేదు. ఇప్పుడు ఆ నిర్ణయం ఎందుకు చేసింది అంటే ఇజ్రాయెల్లో జరగనున్న ఎన్నికల్లో అధికార పక్షానికి ఓట్లు వేయించటం తక్షణ ప్రయోజనం తప్ప పశ్చిమాసియా వివాదాన్ని కొనసాగించే ఎత్తుగడలో భాగమే ఇది. ట్యునిస్‌లో ఆదివారం నాడు జరిగిన లీగ్‌ వార్షిక సమావేశంలో కొన్ని అంశాల మీద ఏకాభిప్రాయానికి రానప్పటికీ గోలన్‌ హైట్స్‌ సిరియా అంతర్భామనే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

1947 నవంబరులో ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానం మేరకు బ్రిటీష్‌ వలసగా వున్న పాలస్తీనా దేశాన్ని రెండు మ్కులుగా చేశారు. అప్పటికే ముందస్తు కుట్రకు తెరలేపిన ఇజ్రాయెల్‌ సాయుధదళం బ్రిటన్‌, అమెరికా తదితర పశ్చిమ దేశాల మద్దతుతో పాలస్తీనాకు మిగిల్చిన ప్రాంతాలను ఆక్రమించుకొనేందుకు దాడులకు పూనుకుంది. దానికి ప్రతిగా పరిసర ప్రాంతాలలో వున్న అరబ్‌ దేశాలన్నీ వాటి రక్షణకు నడుంకట్టాయి. దీనిని 1948 ఇజ్రాయెల్‌-అరబ్బు యుద్దంగా పిలుస్తున్నారు. అదే ఇజ్రాయెల్‌ 1967లో మరోసారి పశ్చిమ దేశాల అండతో మరికొన్ని ప్రాంతాల ఆక్రమణకు పూనుకుంది. ఈ సారి పక్కనే వున్న సిరియా దక్షిణ ప్రాంతం గోలన్‌ గ్టులను చేజిక్కించుకుంది.1974 కాల్పుల విరమణ ఒప్పందం కుదరింది. ఆ ప్రాంతం ఐక్యరాజ్యసమితి శాంతి సేనల ఆధీనంలోకి వచ్చింది.1981లో ఆ ప్రాంతాన్ని తనలో విలీనం చేసుకుంటున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది, అయినప్పటికీ ఐరాస శాంతి సేనలు అక్కడ కొనసాగుతున్నాయి. నాటి ఇజ్రాయెల్‌ నిర్ణయాన్ని తాము అధికారికంగా గుర్తిస్తున్నట్లు గత సోమవారం నాడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. ఐరాస శాంతి సేనలు అక్కడ కొనసాగటానికి దీనికి సంబంధం లేదని, అవి అక్కడే వుండవచ్చని అమెరికా నమ్మబలుకుతోంది. 1974నుంచి ప్రతి ఆరునెలలకు ఒకసారి గోలన్‌ గుట్టలలో శాంతి పరిరక్షక దళాల కొనసాగింపు నిర్ణయం తీసుకుంటున్నారు. జూన్‌ 30వ తేదీతో తాజా ఆరునెలల గడువు ముగుస్తుంది. అమెరికా నిర్ణయ నేపధ్యంలో మరోసారి పొడిగింపు వుంటుందా, అమెరికా అందుకు సహకరిస్తుందా అన్నది సందేహాస్పదంగా మారింది.

గోలన్‌ గుట్టలను ఆక్రమించుకున్న ఇజ్రాయెల్‌ ఆ ప్రాంతాన్ని తనలో విలీనం చేసుకున్నట్లు చేసిన ప్రకటన అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు, ఐరాస నిబంధనలకు విరుద్దం కనుక చెల్లదని 1981లోనే భద్రతా మండలి తీర్మానించింది. దానికి అమెరికా తూట్లు పొడిచినందున వెంటనే చర్చించాలన్న సిరియా కోరిక మేరకు గత వారంలో భద్రతా మండలి అత్యవసర సమావేశం జరిపింది. అమెరికా తప్ప అన్ని దేశాలు ఖండించాయి. ఐక్యరాజ్యసమితి శాంతి సేనలు వున్న ప్రాంతానికి పక్కనే నిత్యం సిరియా సాయుధ దళాలు కొనసాగుతున్నాయని, అది 1974 ఒప్పందానికి వ్యతిరేకమని అమెరికా వాదించింది. సిరియా సరిహద్దులో హిజబుల్లా సాయుధులు కూడా వున్నారనే వార్తలు వుద్రిక్తతలు పెరగటానికి దోహదం చేస్తున్నాయని కూడా ఆరోపించింది. మొత్తం మీద శాంతి నెలకొన్న గోలన్‌ గుట్టలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరేందుకు ఇటీవలి పరిణామాలను సాకుగా తీసుకోవద్దని, ఆ సమస్య విషయంలో భద్రతా మండలి, ఐరాస సాధారణ అసెంబ్లీ తీర్మానాల్లో ఎలాంటి మార్పు లేదని, కట్టుబడి వుంటాయని ఐరాస వుప ప్రధాన కార్యదర్శులలో ఒకరైన రోజ్‌ మేరీ డికార్లో స్పష్టం చేశారు. ఆత్మరక్షణకు తాము చేసిన యుద్దంలో విజయం సాధించామని, దురాక్రమణలను నిరోధించేందుకు చేసే యుద్దాలు, కొన్ని ప్రాంతాలను కలిగి వుండటం అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్దం కాదని, అమెరికా తమ నిర్ణయాన్ని సమర్ధించటం తప్పు కాదని ఇజ్రాయెల్‌ వాదించింది.అయితే ఈ వైఖరిని ఇజ్రాయెల్‌, అమెరికా నిపుణులతో సహా ప్రపంచవ్యాపితంగా అందరూ తప్పు పట్టారు.

ఇజ్రాయెల్‌ ఏర్పాటుకు కొన్ని దశాబ్దాలకు ముందే యూదు దురహంకారులు యూదు రాజ్య పున:స్ధాపన ప్రతిపాదనలు చేశారు. వాటి ప్రకారం పాలస్తీనా ప్రాంతాలేగాక బైబిల్‌లో పేర్కొన్న అన్ని ప్రాంతాలతో కూడిన ఇజ్రాయెల్‌ ఏర్పడాలి. వాటిలో గోలన్‌ గుట్టలు వున్న దక్షిణ సిరియా ప్రాంతం కూడా వుండాలని ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. దానిలో భాగంగా ఆక్రమించుకున్నారే తప్ప సిరియా నుంచి ఇజ్రాయెల్‌కు ఎలాంటి ముప్పు లేదు. బెన్‌ గురియన్‌ అనే యూదు దురహంకారి 1918లో రూపొందించిన ఒక పధకంలో తొలి దశలో ఏ ప్రాంతాలను, తరువాత వేటిని ఆక్రమించుకోవాలన్నది బహిరంగంగా పేర్కొన్నాడు. దాని ప్రకారమే సిరియా సరిహద్దులో ఇజ్రాయెల్‌ గిల్లికజ్జాలు పెట్టుకుంది. చివరికి 1967లో ఆక్రమించుకుంది. అయితే సిరియాలో పశ్చిమ దేశాల అనుకూల ప్రభుత్వాలు వున్న సమయంలో గోలన్‌ గుట్టలను సిరియాకు వదలి, జోర్డాన్‌ నది, టిబ్రెయాస్‌ సరస్సులో ఇజ్రాయెల్‌కు నీటి వాటా ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకోవాలని ప్రయత్నించారు. అయితే గుట్టలతో పాటు నీరు కూడా తమకు కావాల్సిందేనని,దాని గురించి చర్చలు కూడా లేవని ఇజ్రాయెల్‌ అడ్డగోలుగా వాదించింది. ఆ తరువాత వివాదాన్ని కొనసాగించేందుకు, నీటిని మళ్లించేందుకు నిరంతరం రెచ్చగొట్టే చర్యలకుపూనుకుంది. సిరియా నుంచి ఇజ్రాయెల్‌కు ముప్పు వుందనేది ఒక సాకు మాత్రమే. ఇటీవల సిరియా ప్రభుత్వాన్ని కూల్చేందుకు పశ్చిమ దేశాల మద్దతుతో చెలరేగుతున్న ఐఎస్‌ మూకలకు ఇజ్రాయెల్‌ అన్ని విధాలుగా సహకరిస్తోంది.

Image result for golan heights

1973 యుద్దం తరువాత మిలిటరీ బలంతో గోలన్‌ గుట్టలను తిరిగి పొందలేమని, సంప్రదింపులే మార్గమని సిరియా నిర్ణయించుకుంది. ఇటీవలి కాలంలో సిరియా-ఇరాక్‌ సంబంధాలు బలపడటం, రాజకీయంగా సిరియన్లు రష్యాకు దగ్గర కావటంతో అమెరికన్లు రెచ్చిపోయి గోలన్‌ గుట్టలు ఇజ్రాయెల్‌వే అని గుర్తించిందని చెప్పవచ్చు. సిరియాతో అరబ్‌ లీగ్‌ సంబంధాలు సజావుగా లేకున్నా అరబ్‌ పౌరుల మనోభావాల కారణంగా ఆదివారం నాడు ట్యునీసియా రాజధాని ట్యునిస్‌లో జరిగిన శిఖరాగ్రసమావేశం అమెరికా చర్యను ఖండించాల్సి వచ్చింది. దీనికి అమెరికా అనుంగు దేశం సౌదీ అరేబియా చొరవ తీసుకోవటం విశేషం. రాజు సల్మాన్‌ స్వయంగా అమెరికా వైఖరిని ఖండించారు. తూర్పు జెరూసలెం పట్టణం పాలస్తీనా రాజధాని అన్న తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని అన్నారు. అయితే పనిలో పనిగా దీనికి ఆ ప్రాంతంలో ఇరాన్‌ జోక్యమే కారణమని దాని మీద ఒక రాయి వేశాడు.

యాభై రెండు సంవత్సరాల క్రితం 1,250చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వున్న గోలన్‌ గుట్టలను ఇజ్రాయెల్‌ ఆక్రమించుకుంది. రెండు పట్టణాలు, 340 గ్రామాల నుంచి సిరియన్‌ అరబ్బులను ఇజ్రాయెలీ మిలిటరీ తరిమి వేసింది ఆ సమయంలో లక్షా 28వేల మంది సిరియన్‌ పౌరులు వున్నారు. ఇజ్రాయెల్‌ ఆక్రమణలోకి పోగానే వారంతా తమ ఆస్ధులు, ఇండ్లను వదలి సిరియా ఇతర ప్రాంతాలకు తరలి పోయారు. ఆరువేల మంది డ్రజే అనే మతశాఖకు చెందిన వారిని మాత్రమే అక్కడ వుండేందుకు ఇజ్రాయెల్‌ అనుమతించింది. వారు ఇజ్రాయెల్‌కు అనుకూలురు. 1981లో ఆ ప్రాంతాన్ని తన అంతర్భాగంగా ప్రకటించుకున్న ఇజ్రాయెల్‌ అక్కడి వారికి తమ పౌరసత్వం ఇస్తామని ప్రకటించింది. అది చెల్లదని ఐరాస పేర్కొన్నది. 1967లో సిరియాకు వెళ్లిన వారి వారసుల సంఖ్య ఇప్పుడు ఐదులక్షలకు పెరిగింది. వారంతా తమ స్వస్ధాలలకు రావాలని కోరుకుంటున్నారు.

Image result for golan heights

అమెరికా చర్యను దాని నాయకత్వంలోని నాటో కూటమి దేశాలు కూడా అంగీకరించటం లేదు. ఇది అంతర్జాతీయ న్యాయాన్ని వుల్లంఘించటమే, ఆ ప్రాంతంలో వుద్రిక్తతలను పెంచుతుందని ఫ్రెంచి అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మక్రాన్‌ వ్యాఖ్యానించాడు. అమెరికా చర్య ఆ ప్రాంత సమస్యకు ఒక పరిష్కారం కాదని ఐరోపా యూనియన్‌ విదేశీ వ్యవహారాల అధికారి మోఘెరినీ అన్నాడు. గోలన్‌ గుట్టల ఆవలి సిరియా నుంచి ఇరాన్‌ సేనలు తమ మీదకు క్షిపణులు ప్రయోగిస్తున్నాయని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తోంది. దానికి డోనాల్డ్‌ ట్రంప్‌ వంత పాడుతూ ఇరాన్‌తో పాటు అనేక వుగ్రవాద బృందాలు కూడా ఆ ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌పై దాడులకు వుపయోగించుకుంటున్నాయన్నాడు. అమెరికా వైఖరి ఇలాంటి అన్ని సమస్యల పట్ల ఒకే విధంగా లేదు. దాని ప్రయోజనాలకే పెద్ద పీట వేసింది. దాని సమర్దన ఒక్క గోలన్‌ గుట్టలకే పరిమితం అవుతుందని అనుకోరాదు. మన దేశాన్ని మరింత ఇరుకున పెట్టేందుకు రేపు తన ఆధీనంలోని ఆక్రమిత కాశ్మీర్‌ను పాకిస్ధాన్‌ తన అంతర్భాగంగా ప్రకటించుకొంటే అమెరికా దానికి మద్దతు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. అన్నింటికీ మించి బలమైన దేశాలు తమ సరిహద్దుల రక్షణలను సాకుగా చూపి బలహీనమైన ఇరుగు పొరుగుదేశాల భూ భాగాలను ఆక్రమించుకొనే అవకాశాలు పెరుగుతాయి. గతంలో ఇరాక్‌ అధినేత పొరుగునే వున్న కువాయిట్‌ తమ ప్రాంతంలోని చమురును అక్రమంగా తోడుకుంటోందని, దొంగతనం చేస్తోందని ఆరోపించి సైన్యాన్ని పంపి ఏడు నెలల పాటు ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. అదే ఇరాక్‌లో అమెరికా జోక్యానికి నాంది పలికింది. అదే అమెరికా మరో వైపు రష్యా ఆక్రమణలోని క్రిమియా ప్రాంతం విషయంలో వ్యతిరేకతను వ్యక్తం చేయటం రాజకీయం మాత్రమే. తమ భద్రతకు క్రిమియా అవసరమని రష్యా వాదిస్తున్న విషయం తెలిసినదే. ఏదో ఒక సాకుతో ఒక దేశ ప్రాంతాన్ని మరొకటి ఆక్రమించుకోవటం, దాడులను సమర్ధించే అమెరికా వైఖరి ప్రపంచానికే ముప్పు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d