• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Donald trump

డోనాల్డ్‌ ట్రంప్‌ నోట మరో పచ్చి అబద్దం !

01 Tuesday Jan 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

another big lie from Donald Trump, Donald trump, donald trump motormouth, policing the world, U.S. Military Bases Worldwide, US World Police Cap

Image result for donald trump , us world police

ఎం కోటేశ్వరరావు

లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్న సామెత తెలిసిందే ! అమెరికా పాలకవర్గమూ అలాంటిదే ! వారికి యుద్ధమూ లాభమే, పోరు నిలిపివేతా లబ్ది చేకూర్చేదే అయితే దేనికైనా సిద్ధపడతారు ! అది ఆసియా ఖండమా, ఐరోపానా అన్నదానితో నిమిత్తం లేదు ! అందుకు డెమోక్రాట్లు- రిపబ్లికన్లూ అన్న తేడా లేదు ! అవసరమైతే పార్లమెంటులో రెండు పార్టీలు కలసి ఎవరు అధ్యక్షుడిగా వున్నా అడ్డుకుంటాయి లేదా మద్దతు ఇస్తాయి ! ఆ రెండు పార్టీల మధ్య తగాదా అధికారం దగ్గర తప్ప కార్పొరేట్ల ప్రయోజనాల గురించి కాదు. తమ లక్ష్యాన్ని చేరుకొనేందుకు అనుసరించాల్సిన ఎత్తుగడలు, అనుసరించాల్సిన మార్గాల మీద తప్ప లక్ష్యం మార్పు రద్దు గురించి కాదు. అమెరికా రాజకీయాలు, విధానాలను నిర్ణయించేది అక్కడి గుత్త సంస్ధలు తప్ప సామాన్యులు కాదు. రాజకీయ నేతలు వాటి తోలుబమ్మలే. అందుకే వారు ఎలా ఆడిస్తే అలా ఆడతారు. అమెరికా ఇప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. అన్నింటా అగ్రస్ధానం తమదే అనే దాని ఆటలు సాగటం లేదు. అదిరింపు, బెదిరింపు, బుజ్జగింపు, లాలింపు, తప్పదనుకుంటే రాజీ ఇదీ ఇప్పటి దాని స్ధితి. ఇలా చెప్పటం అంటే అమెరికా పని అయిపోయిందని కాదు. అగ్రరాజ్యానికి కూడా అనువుగాని పరిస్ధితులు ఎదురైనపుడు సింహం కూడా ఒకడుగు వెనక్కు వేయకత తప్పదు. ఏమిటా పరిస్ధితి, ఎందుకీ పరిణామాలు !

సిరియా నుంచి పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి సగం మంది సైనికులను వుపసంహరించనున్నట్లు ట్రంప్‌ సంచలన ప్రకటన, దానికి నిరసనగా దేశ రక్షణ మంత్రి జేమ్స్‌ మాటిస్‌ రాజీనామా, ఆ తరువాత మెక్సికో సరిహద్దులో గోడకు నిధుల కేటాయింపుపై పార్లమెంట్‌లో వ్యతిరేకత, అది ప్రభుత్వ స్ధంభనకు దారితీత, ఇది కొనసాగుతుండగానే ఆకస్మికంగా ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ నగరంలో తిష్టవేసిన అమెరికన్‌ దళాల వద్దకు వెళ్లి ఇంకేమాత్రం అమెరికా ప్రపంచ పోలీసుగా వుండబోదని ఒక ప్రకటన. ఇవన్నీ పక్షం రోజుల్లో వరుసగా జరిగిన పరిణామాలు. అమెరికా జాతీయంగా, అంతర్జాతీయంగా ఎదుర్కొంటున్న సంక్షోభం, సమస్యల తీవ్రతకు ప్రతిబింబాలు. ఒక వారంలో ఒకదాన్ని సంచలనాంశంగా మారిస్తే మరో వారంలో మరో అంశాన్ని ముందుకు తెస్తున్న ట్రంప్‌ తీరుతెన్నులు ప్రపంచానికి పజిల్‌గా వుంటున్నాయి. ఒక ప్రకటన చేయటం దాని మీద స్పందనలు ఎలా వుంటాయో చూడటం, దానికి అనుగుణ్యంగా తదుపరి చర్యలు. వీటిలో ప్రపంచ పోలీసుగా అమెరికా పాత్ర గురించి వివరంగా పరిశీలించుదాం. చరిత్రలో తొలి ప్రపంచ పోలీసుగా బ్రిటన్‌ వ్యవహరిస్తే తదుపరి ఆ పాత్రను అమెరికా పోషిస్తోంది. కర్రవున్నవాడిదే గొర్రె అన్నట్లుగా ప్రపంచంపై పెత్తనం కోసం తమకు తాముగా కర్రపెత్తనం చలాయించటం తప్ప ఈ దేశాలకు ఎవరూ ఆ బాధ్యతను అప్పగించలేదు. ఆ పాత్రలో తామింక వుండలేమని ట్రంప్‌ చెప్పటం వెనుక పరమార్ధం ఏమిటి?

రేపటి నుంచి మిమ్మల్ని తినబోనని పులి చెబితే మేకలు నమ్ముతాయా, ట్రంప్‌ మారుమనస్సు పుచ్చుకున్నాడా ? ఎందుకింత పెద్ద అబద్దం చెప్పాడు. అమెరికా సమాజానికి ఇది ఒక ప్రజాకర్షక అంశంగా తయారైంది. అందుకే ఇటీవలి కాలంలో ఎవరు అధికారంలో వున్నా అప్పుడప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడాల్సివస్తోంది. ప్రపంచ పోలీసు పాత్రలో వుండాలనుకోవటం లేదు అన్న మాటలు కాదు, కొనసాగింపు అంశం ముఖ్యం. ‘ భారం మొత్తం మేమే భరించటం సముచితం కాదు. మమ్మల్ని, నిస్సందేహమైన మా మిలిటరీని తమ రక్షణకు వుపయోగించుకోవాలని ఇతర దేశాలు చూడటాన్ని ఇంకేమాత్రం మేము కోరుకోవటం లేదు.’ అన్నాడు.ప్రస్తుత స్ధాయిలో అమెరికా మిలిటరీ ఖర్చు వెర్రి తప్ప మరొకటి కాదు, అదుపులేని ఆయుధపోటీగా మారినందున అర్ధవంతమైన ముగింపు పలకాలి, ఒక రోజు తాను, చైనా, రష్యా నాయకులు దీని గురించి చర్చ ప్రారంభించకతప్పదు అని గతంలో ట్రంప్‌ ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు.జనాభాలో సగం, జిడిపిలో పదోవంతు కలిగిన పొరుగుదేశం వుత్తర కారియానుంచి రక్షణ కోసం దక్షిణ కొరియాను అమెరికా ఎందుకు కాపాడాలి. అమెరికా కంటే రష్యాకు మరింతదగ్గరగా వుంది జర్మనీ, తూర్పు నుంచి (రష్యా) నుంచి వస్తున్న ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అది జిడిపిలో ఒక శాతం కూడా ఖర్చు చేయటం లేదు వాటికోసం అమెరికా ఎందుకు ఖర్చు చేయాలి అని కూడా ప్రశ్నించాడు. గత కొద్ది సంవత్సరాలుగా తమ మిలిటరీ రక్షణ పొందాలని చూసే దేశాలు అందుకయ్యే ఖర్చులో అధికభాగం భరించాలని అమెరికా సందర్భం వచ్చినపుడల్లా చెబుతోంది, వత్తిడి తెస్తోంది. దక్షిణ కొరియాలో ఏటా మూడున్నర బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసి తమ సైన్యాన్ని అక్కడ ఎందుకు కొనసాగించాలని ట్రంప్‌ గతేడాది ప్రశ్నించాడు. మూడవ ప్రపంచ యుద్ధం రాకుండా వుండాలంటే కొనసాగించక తప్పదని సిరియానుంచి సైనిక దళాల వుపసంహరణను వ్యతిరేకిస్తూ రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసిన మాటిస్‌ స్పష్టం చేశాడు. ఇస్లామిక్‌ తీవ్రవాదులను అణచే పేరుతో సిరియాలో ఏటా 15, ఆఫ్ఘనిస్తాన్‌లో 45 బిలియన్‌ డాలర్లను ఏటా అమెరికా ఖర్చు చేస్తోంది. ఇంత ఖర్చు చేసి సాధించేదేమిటి? అనే ప్రశ్నకు పాలకులు సూటిగా సమాధానం చెప్పే స్ధితిలో లేరు.

పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తల విశ్లేషణ, అవగాహన ప్రకారం ఒక దేశ రక్షణ ఖర్చు కంటే అప్పుల చెల్లింపు ఎక్కువైన దేశాలు కుప్పకూలిపోతాయి. గతంలో కమ్యూనిజాన్ని, తరువాత ఇస్లామిక్‌ తీవ్రవాదాన్ని అణచే పేరుతో లేదా వాటి నుంచి దేశాలను రక్షించే సాకుతో ప్రపంచ వ్యాపితంగా అమెరికా తన సేనలను మోహరించింది. ప్రత్యక్షంగా ఆయా దేశాల గడ్డమీద లేదా ఏ క్షణంలో అయినా జోక్యం చేసుకొనేందుకు వీలుగా సమీప ప్రాంతాలలో వేసిన తిష్టవలన గానీ 150 దేశాల్లో అమెరికా సైన్యాలు వున్నట్లు లెక్క. ప్రస్తుతం అమెరికా జాతీయ రుణ భారం 21లక్షల కోట్ల డాలర్లు.2012లో ఫెడరల్‌ లోటు బడ్జెట్‌ లక్ష కోట్లు దాటగా 2018లో 779 బిలియన్‌ డాలర్లుంది.2020 నాటికి ఐదుశాతం రక్షణతో సహా ప్రతి శాఖ కోత విధించాలని ట్రంప్‌ కోరాడు. రుణ చెల్లింపులు రక్షణ ఖర్చుకంటే ఎక్కువైన కారణంగానే రోమన్‌ సామ్రాజ్యం, సోవియట్‌ యూనియన్‌ దివాలా తీశాయని, అమెరికా ఇప్పుడు దానికి దగ్గరగా వస్తోందని హార్వర్లు ప్రొఫెసర్‌ నియాల్‌ ఫెర్గూసన్‌ హెచ్చరించాడు. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా సైనిక కేంద్రాలు వివిధ ప్రాంతాలు, సముద్రాలలో ఐరోపాలో 330, ఆసియాలో 210, మధ్య ప్రాచ్యంలో 73, లాటిన్‌ అమెరికాలో 71, పసిఫిక్‌లో 66, ఆఫ్రికాలో 24,కెనడా లేదా గ్రీన్‌లాండ్‌లో నాలుగు, అట్లాంటిక్‌లో రెండు చొప్పున మొత్తం 750 వున్నాయి.

ఇటీవల పార్లమెంట్‌ బడ్జెట్‌ కార్యాలయం(సిబిఓ) తెలిపిన సమాచారం ప్రకారం 2018లో జాతీయ అప్పు మీద చెల్లించిన వడ్డీ 371బిలియన్‌ డాలర్లు, ఇది రక్షణ బడ్జెట్‌లో సగం. ప్రస్తుత బడ్జెట్‌ పోకడలను బట్టి ఐదు సంవత్సరాలలో రక్షణ కంటే వడ్డీ చెల్లింపులకు కేటాయించాల్సిన మొత్తం పెరగనుంది. పది సంవత్సరాలలో వడ్డీ,సామాజిక భద్రత వంటి పధకాలకు పన్ను వసూళ్లలో 85శాతం ఖర్చు అవుతుందని, జిడిపిలో 2018లో 3.1శాతంగా వున్న రక్షణ బడ్జెట్‌ 2028నాటికి 2.6శాతానికి తగ్గనుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఐరోపాలోని ధనిక దేశాల రక్షణ ఖర్చు గణనీయంగా పెరగనుంది. వడ్డీ రేట్ల పెరుగుదల అంచనా కంటే వేగంగా వుంటే ఇంకా ముందే ఏడాదికి వడ్డీ చెల్లింపులు 900బిలియన్‌ డాలర్లకు చేరి రక్షణ ఖర్చును మించి పోవచ్చు. చైనా, ఐరోపా యూనియన్‌ దేశాల రక్షణ ఖర్చు జిడిపిలో రెండుశాతానికి చేరితే త్వరలోనే అమెరికాతో సమం కావచ్చు. ఇప్పుడున్న తీరు తెన్నులను బట్టి 2035నాటికి చైనా, ఐరోపా యూనియన్‌లు అమెరికాను అధిగమించనున్నాయి.

సామ్రాజ్యం అంటే వలసలు లేదా అధీన రాజ్యాలు కలిగి వుండటం అన్నది సాంప్రదాయ అర్ధం. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఆ పరిస్ధితి అంతరించింది కనుక ఇప్పుడు ప్రపంచవ్యాపితంగా ఎన్ని సైనిక కేంద్రాలు, ఎందరు సైనికులున్నారన్నది సామ్రాజ్యవాదానికి తాత్పర్యంగా చెప్పవచ్చు.దీనికి ముందే చెప్పుకున్న సైనిక కేంద్రాలే నిదర్శనం. చమురు రవాణా సక్రమంగా జరిగేందుకు నావల ప్రయాణించే మార్గాలు, పైపులైన్ల రక్షణ మొదలు అనేక వ్యూహాత్మక అవసరాలకు అమెరికా ఈ కేంద్రాలను, సైన్యాన్ని వినియోగిస్తున్నది. వీటికి ఏటా 156 బిలియన్‌ డాలర్లు ఖర్చు అవుతున్నది. సాంప్రదాయక సామ్రాజ్యవాదం అది బ్రిటన్‌ లేదా ఫ్రెంచి, డచ్‌, పోర్చుగీసు, స్పెయిన్‌ ఏదైనా కావచ్చు, వందల సంవత్సరాలు వలస దేశాలలో తిష్టవేసి ప్రధానంగా వాటిని తమ పరిశ్రమలకు ముడివస్తువులను సరఫరా చేసే దేశాలుగానూ, పారిశ్రామిక వస్తువులకు మార్కెట్లగానూ వినియోగించుకున్నాయి. కానీ అమెరికా సామ్రాజ్యవాదం వీటితో పాటు అంతకు ముందు లేని కమ్యూనిజం వ్యాప్తి నిరోధం, కమ్యూనిస్టు దేశాల అణచివేతను కూడా జోడించి వివిధ ప్రాంతాలలో కుట్రలకు తెరలేపింది, నియంతలను బలపరిచింది, యుద్ధాలను, వాటికి అవసరమైన ఆయుధాలను సరఫరా చేస్తూ ఆర్ధికంగా లబ్దిపొందుతున్నది. ఈ కారణంగానే మిలిటరీ పారిశ్రామిక కార్పొరేట్‌లు అవతరించాయి.వుదాహరణకు మనకందరకు తెలిసిన బోయింగ్‌ కంపెనీ ప్రయాణీకుల విమానాలతో పాటు యుద్ధ జెట్‌ విమానాలతో పాటు అనేక మారణాయుధాలను కూడా తయారు చేస్తున్నది. అవి నిత్యం పని చేస్తూ వుండాలంటే ప్రపంచంలో నిత్యం ఏదో ఒక మూల ఒక దేశం మరొక దేశంతో కొట్లాడుకోవాలి లేకపోతే అమెరికాయే ప్రత్యక్షంగా ఎక్కడో ఒక చోట దాడులకు తెగబడుతూ వుండాలి. రక్షణ ఒప్పందాలు, ముప్పు పేరుతో అనేక దేశాలను తన గుప్పెటలోకి తెచ్చుకొని నిరంత ఆయుధ విక్రయాలతో దోపిడీ సాగిస్తున్నది. అలాంటి దేశం తెల్లవారేసరి తాను ప్రపంచ పోలీసు పాత్రనుంచి తప్పుకోవాలను కుంటుందా ? తన ఆయుధ పరిశ్రమలను మూసివేసుకుంటుందా ? లాభాలను వదులుకుంటుందా ?

Image result for donald trump on us world police cartoons

విదేశాలలోని సైనిక స్ధావరాలలో అమెరికా లక్షన్నర మంది సైనికులను మోహరించింది. నిజానికి పాతికేండ్ల క్రితం ప్రచ్చన్న యుద్ధంలో విజయం సాధించామని, కమ్యూనిజం అంతరించిందని చెప్పిన అమెరికా విదేశాల్లోని సగం సైనిక కేంద్రాలనైనా తక్షణమే మూసి వుండాల్సింది. కానీ కేంద్రాల సంఖ్యతో పాటు సైనికులను మోహరించిన దేశాల సంఖ్య కూడా 40 నుంచి 80కి పెరిగింది.సహజంగానే ఖర్చు కూడా తడిచి మోపెడు అవుతుంది. ఈ ఖర్చు ఎంతో నిజానికి బయటి ప్రపంచానికి తెలియదు. విదేశీ స్ధావరాల వార్షిక ఖర్చు ఎంత అని పార్లమెంట్‌ కోరితే 21 లేదా 22 బిలియన్‌ డాలర్లని పేర్కొన్నారు. అయితే దీన్నెవరూ నమ్మటం లేదు, ఏడాదికి కనీసం 250 బిలియన్‌ డాలర్లని కొందరి అంచనా. పైకి చెప్పకపోయినప్పటికీ జపాన్‌లో 113, దక్షిణ కొరియాలోని 83 సైనిక కేంద్రాలు నిజానికి ఏక్షణంలో అయినా చైనా లేదా రష్యాతో యుద్ధానికి తలపడే సన్నద్దతతో గత ఏడు దశాబ్దాలుగా నిర్వహిస్తున్నారు. దీని వలన సామాన్యజనానికి భారం తప్ప వారికి ఒరుగుతున్నదేమీ లేదు. ఆయుధ పరిశ్రమలకు నిరంతరం లాభాలు వస్తున్నాయి.నిరంతరం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అమెరికా 33 అప్రజాస్వామిక దేశాలలో సైనిక కేంద్రాలను నడుపుతున్నదని ఒక మాజీ అధికారి పేర్కొన్నాడు. ఇవే కాదు సైనిక స్ధావరం వున్న ప్రతి దేశం అమెరికా ఆయుధాలు, వస్తువులకు అవి మార్కెట్లుగా వున్నాయని వేరే చెప్పాల్సిన పని లేదు. అందుకే ట్రంప్‌ మరో పచ్చి అబద్దం ఆడాడని చెప్పాల్సి వస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా డెమోక్రటిక్‌ పార్టీలో అణగారిన తరగతుల ముందంజ !

12 Monday Nov 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ 1 Comment

Tags

2018 US midterm elections, Democratic Socialists of America, Donald trump, US Democratic party, US Republican party

ఎం కోటేశ్వరరావు

నవంబరు ఆరవ తేదీన అమెరికా పార్లమెంట్‌కు జరిగిన మధ్యంతర ఎన్నికల ఫలితాలు సెనెట్‌ విషయంలో తప్ప ప్రజాప్రతినిధుల సభ(కాంగ్రెస్‌) విషయంలో సర్వేల విశ్లేషణకు దగ్గరగానే వచ్చాయి. ఎగువ సభ సెనెట్‌లో ఎలాగైనా సరే మెజారిటీ సాధించాలనే పట్టుదలతో కేంద్రీకరించిన అధ్యక్షుడు డ్రోనాల్డ్‌ ట్రంప్‌కు సభలోని వందకు గాను చావుదప్పి కన్నులట్టపోయి రిపబ్లికన్‌ పార్టీకి 51వచ్చాయి. డెమోక్రాట్లకు 44, స్వతంత్రులకు రెండు రాగా తిరిగి ఓట్ల లెక్కింపు జరుగుతున్న మరో మూడు స్ధానాల ఫలితాలను ఖరారు చేయాల్సి వుంది. ప్రజాప్రతినిధుల సభలో ట్రంప్‌ బక్కబోర్లా పడ్డారు, డెమోక్రటిక్‌ పార్టీకి మెజారిటీ వచ్చింది. ట్రంప్‌ పాలనపై ప్రజాభిప్రాయ సేకరణగా భావించబడిన ఈ ఎన్నికలలో దిగువ సభలోని మొత్తం 435 స్ధానాలకు గాను ఆ పార్టీకి 227, రిపబ్లికన్లకు 198 రాగా మరో పదింటి ఫలితాలను ప్రకటించాల్సి వుంది. ఈ ఫలితాలతో అమెరికాలో విప్లవాత్మక మార్పులేవో జరుగుతాయని కాదు గానీ డెమోక్రటిక్‌ పార్టీలో అంతర్గతంగా ప్రారంభమైన మధనానికి ఎంతో ప్రాధాన్యత వుంది. ఫలితం, పర్యవసానాల గురించి వామపక్ష,పురోగామి శక్తులు తరువాతేంటి అనే ఆలోచన చేస్తున్నాయి. రెండు సంవత్సరాల క్రితం అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధించగానే అనేక తరగతుల వారు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తమ సమస్యలపై వీధుల్లోకి వచ్చారు. అధికార పార్టీ అక్రమాలు, ప్రలోభాలను తట్టుకొని వుద్యమించిన వారి ఆకాంక్షలకు ప్రతిబింబంగా తాజా ఫలితాలు వచ్చాయని చెప్పవచ్చు.ఈ ఎన్నికల్లో కార్మికులు, మహిళలు, ఆఫ్రికన్‌ అమెరికన్లు, లాటినోలు, గిరిజనులు మొత్తంగా డెమోక్రాట్లు విజయం సాధించారు. అన్నీ తానై వ్యవహరించినందున రిపబ్లికన్ల ఓటమి అంటే అది వాస్తవానికి డోనాల్డ్‌ ట్రంప్‌కే వర్తిస్తుందని చెప్పవచ్చు. మన పదజాలంలో చెప్పాలంటే అమెరికాలోని సకల అణగారిన తరగతులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఓట్లు వేసి ట్రంప్‌కు చుక్కలు చూపించారు. గమనించాల్సిన ముఖ్యఅంశాలు ఇలా వున్నాయి.

అనేక దశాబ్దాల చరిత్ర చరిత్రలో తొలిసారిగా డెమోక్రటిక్‌ పార్టీలో అనేక మంది పురోగామి వాదులు(అమెరికా ప్రమాణాల ప్రకారం) ఎక్కువగా ఎన్నికయ్యారు. డోనాల్డ్‌ ట్రంప్‌, ఆ పెద్దమనిషి ప్రాతినిధ్యం వహిస్తున్న మితవాద రిపబ్లికన్‌ పార్టీ సాగించిన మహిళా వ్యతిరేక, శ్వేతజాతి మెజారిటీ నినాదాలకు చెంపపెట్టుగా అసాధారణ రీతిలో మహిళలు, రంగు వివక్షకు, జాతిపరంగా వివక్షకు గురయ్యేవారు, ఇతరులు డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. కరడు గట్టిన ఐదుగురు రిపబ్లికన్‌ గవర్నర్లను(మన ముఖ్యమంత్రులకు సమానం) ఓటర్లు ఇంటికి పంపారు. అతి పెద్ద రాష్ట్రమైన కాలిఫోర్నియాలో, ప్రపంచ ఆర్ధిక రాజధాని వంటి న్యూయార్క్‌ రాష్ట్రంలోనూ డెమోక్రాట్లదే పైచేయి. గవర్నర్లుగా వారే ఎన్నికయ్యారు. వర్గరీత్యా రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ పార్టీలు మౌలికంగా పెట్టుబడిదారీ విధాన ప్రతినిధులే. అందువలన అధికారంలోకి వచ్చిన తరువాత సహజంగానే ప్రజావ్యతిరేకతను వ్యతిరేకతను ఎదుర్కొంటారు. ఆ రీత్యా చూసినపుడు గతంలో ఒబామా ఎనిమిదేండ్లు అధికారంలో వున్న సమయంలో వివిధ రాష్ట్రాల చట్ట సభలలో వెయ్యి మంది వరకు డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన వారు మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ ట్రంప్‌ రెండు సంవత్సరాల ఏలుబడిలోనే 323 మంది రిపబ్లికన్లు ఇంటిదారి పట్టారు. గెలిచిన రాష్ట్రాల నియోజకవర్గాలలో పురోగామివాదుల నుంచి వంద చోట్ల మితవాదులవైపు మొగ్గగా 300చోట్ల తిరోగామి వాదులను ఓడించి పురోగామివాదుల వైపు ఓటర్లు నిలిచారు.కొన్ని చోట్ల పురోగామి అభ్యర్ధులు ఓటమి పాలైనా మొత్తం మీద ఆశక్తులతో నిండిన బృందాలు ఈ ఎన్నికలను తీవ్రంగా తీసుకోవటం మంచి పరిణామం. గతంలో ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన శివారు పట్టణాలలోని శ్వేతజాతి మహిళలు అనేక మంది ఈసారి రిపబ్లికన్లకు దూరమయ్యారు.గత రెండు సంవత్సరాలలో వివిధ సమస్యల మీద సాగించిన ఆందోళనల ఫలితాలు ఈ ఎన్నికల్లో ప్రతిబింబించాయి.ఎన్నికలకు ముందు కొన్ని చోట్ల కనీస వేతనాల పెంపుదల జరిగింది. నేరాలు చేశారనే సాకుతో ఫ్లోరిడా రాష్ట్రంలో ఓటు హక్కు తొలగించిన 14లక్షల మందికి ఈ ఎన్నికల్లో పునరుద్దరించారు.

ప్రజాప్రతినిధుల సభలో, వివిధ రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికలో గణనీయ విజయాలు సాధించిన డెమోక్రాట్లు సెనెట్‌లో ఎందుకు మెజారిటీ సాధించలేకపోయారు అన్నది సహజంగా తలెత్తే ప్రశ్న. సెనెట్‌ ఎన్నికలలో రిపబ్లికన్‌ అభ్యర్ధుల కంటే డెమోక్రాట్లకు కోటీ ఇరవై లక్షల ఓట్లు అదనంగా వచ్చాయి. సెనెట్‌ రాష్ట్రాల ప్రతినిధుల సభ. జనాభా ఎంత మంది అనేదానితో నిమిత్తం లేకుండా ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు చొప్పున యాభై రాష్ట్రాల నుంచి ఎన్నిక అవుతారు. యోమింగ్‌ రాష్ట్ర జనాభా ఆరులక్షలు లోపు, అదే కాలిఫోర్నియా జనాభా దానికి 60రెట్లు ఎక్కువ, అయినా రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరిద్దరిని మాత్రమే ఎన్నుకోవాల్సి వుంది. సాంప్రదాయకంగా గ్రామీణ ప్రాంతాలలో రిపబ్లికన్లవైపే ఓటర్లు మొగ్గు వుంటోంది. ఇది కూడా సెనెట్‌ ఎన్నికలపై ప్రభావం చూపుతోంది.ఈ విధానంలో రాష్ట్రాల సమాన ప్రాతినిధ్యం అనే ప్రజాస్వామిక అంశంతో పాటు, జనాభాతో నిమిత్తం లేని ప్రజాస్వామ్య వ్యతిరేక లక్షణం కూడా వుంది. ఇదొక్కటే కాదు, ఇంకా ఇలాంటివి వున్నాయి. ట్రంప్‌ గత ఎన్నికలలో ఎలక్ట్రొరల్‌ కాలేజ్‌లో మెజారిటీ తెచ్చుకొని అధ్యక్షుడు అయినప్పటికీ సాధారణ ఓటర్ల తీర్పు ప్రకారం ప్రత్యర్ధి హిల్లరీ క్లింటన్‌ కంటే 30లక్షల ఓట్లు తక్కువ వచ్చాయి. ప్రజాప్రతినిధుల ఓట్ల వివరాలను చూస్తే డెమోక్రాట్లకు ఏడు శాతం అధికంగా వచ్చాయి.

Image result for democratic winner alexandria

అలెగ్జాండ్రియా కాసియో కార్టెజ్‌

ప్రజాప్రతినిధుల సభకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగితే సెనెట్‌కు ప్రతి రెండు సంవత్సరాలకు మూడోవంతు సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఇది రాస్తున్న సమయానికి ఖరారైన ఫలితాల ప్రకారం డెమోక్రాట్లు గతంలో ప్రాతినిధ్యం వహించిన సీట్లలో రెండు చోట్ల ఓడిపోగా రిపబ్లికన్లు వున్న చోట్ల 29 గెలిచారు. సెనెట్‌లో రెండు చోట్ల డెమోక్రాట్లను రిపబ్లికన్లు ఓడించి (100కు 51) ఒక సీటు మెజారిటీ తెచ్చుకున్నారు.ఎన్నికలు జరిగిన 35 సీట్లలో డెమోక్రాట్లు 26చోట్ల రిపబ్లికన్లు తొమ్మిది చోట్ల గతంలో ప్రాతినిధ్యం వహించారు. తాము అధికారంలో రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాలను తమకు అనుకూలంగా రిపబ్లికన్లు పునర్విభజన చేశారని కూడా వెల్లడైంది.అయినా కొన్ని చోట్ల డెమోక్రాట్లు విజయం సాధించారు. 2020లో జరిగే ఎన్నికల నాటికి డెమోక్రాట్లు కూడా అదే ఎత్తుగడలను అనుసరించే అవకాశం వుంది. తాజా ఎన్నికల్లో కొన్ని చోట్ల రిపబ్లికన్లు కుంటి సాకులతో డెమోక్రాట్లకు పడే ఓటర్లను అడ్డుకున్నారు. దానికి సుప్రీం కోర్టు మద్దతు కూడా తోడైంది. అమెరికాలోని అడవులలో నివసించే గిరిజన ప్రాంతాలలో ఓటర్లకు పోస్టు బాక్సు నంబర్లే చిరునామాలుగా వుంటాయి. ఓటరు గుర్తింపు కార్డుకు, ఓటర్ల జాబితాలో పేర్లకు అన్నీ సరిపోలి వుండాలనే ఒక నిబంధన వుంది. పేర్లలో కామాలు, పులుస్టాప్‌లు, పేరులో మధ్యనామం సరిగా లేదు, వుచ్చారణ సరిగా లేదు అనే కుంటిసాకులను చూపి వేల ఓట్లను తిరస్కరించారు. వుత్తర డకోటా ప్రాంతంలో గిరిజన ప్రాంతాలలో వీధుల వివరాలు లేవనే సాకుతో వేలాది మంది ఓటర్లను తిరస్కరించారు. ఈ కారణం కూడా తోడై గతంలో ఆ నియోజకవర్గం నుంచి ఎన్నికైన డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిని ఈసారి ఓడిపోయారు.

Image result for democratic winner rashida

రషీదా లాయిబ్‌

అమెరికా చరిత్రలో తొలిసారిగా ఒక గవర్నర్‌ పదవికి నల్లజాతి మహిళ స్టాసీ అబ్రామ్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధిగా జార్జియా రాష్ట్రానికి ఎన్నికయ్యారు. పార్లమెంట్‌ చరిత్రలో తొలిసారిగా వందమందికి పైగా మహిళలు ఎన్నికవ్వటం ఒక విశేషం. ఎన్నికైన మహిళల్లో 29 ఏండ్ల పిన్న వయస్కురాలు అలెగ్జాండ్రియా కాసియో కార్టెజ్‌, ఆమె ఒక బార్‌లో వెయిట్రెస్‌( మద్యం, ఆహారపదార్దాల అందచేసే పని)గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. న్యూయార్క్‌ నగరంలోని బ్రాంక్స్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఆమె తాను డెమోక్రటిక్‌ సోషలిస్టునని స్వయంగా ప్రకటించుకున్న యువతి. సోమాలియా నుంచి నిర్వాసితురాలిగా అడుగుపెట్టి అమెరికా పౌరసత్వం పొంది మినియా పోలీసు నుంచి డెమోక్రటిక్‌ పార్టీ నుంచి ఎన్నికైన తొలి సోమాలి-అమెరికన్‌ మహిళ ఇహాన్‌ ఓమర్‌. మైనారిటీల సమస్యల మీద పని చేస్తూ ట్రంప్‌ సర్కార్‌ వలసదార్ల వ్యతిరేక వైఖరిని ఎండగట్టటంలో ముందున్నారు.డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధిగా మసాచుసెట్స్‌ నగరంలోని ఒక నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా తొలిసారిగా ఎన్నికయ్యారు అయనా ప్రెస్లే. అంతకు ముందు బోస్టన్‌ నగరపాలక సంస్ధ సభ్యురాలిగాను, పదహారు సంవత్సరాల పాటు పార్లమెంట్‌ కార్యాలయంలో పని చేశారు. డెమోక్రటిక్‌ సోషలిస్టుగా ప్రాచుర్యం పొందిన రషీదా లాయిబ్‌ పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం మహిళ. ఆమె పోటీ లేకుండా గెలిచారు. కాన్సాస్‌ నుంచి డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులుగా గిరిజన మహిళలు షారైస్‌ డేవిడ్స్‌, డెబ్రా హాలాండ్‌ కాన్సాన్‌, న్యూ మెక్సికో నుంచి ఎన్నికయ్యారు. ఇరవై తొమ్మిది సంవత్సరాల మరో పిన్న వయస్సురాలైన అబీ ఫిన్‌కెనౌర్‌ లోవా నియోజకవర్గం నుంచి ఎన్నికైన తొలి మహిళ, డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధి.

యాభై సంవత్సరాల క్రితం మధ్యంతర ఎన్నికల్లో 49శాతం పోలింగ్‌ కాగా తాజా ఎన్నికల్లో దానికి దగ్గరగా 47శాతానికి మించి పోలు కావటం ఓటర్లలో పెరిగిన ఆసక్తి, వుత్సాహానికి నిదర్శనం. కొన్ని చోట్ల 60శాతం వరకు నమోదైంది. ఎనిమిది సంవత్సరాల క్రితం 41శాతం, నాలుగు సంవత్సరాల నాడు 36.7శాతమే నమోదైంది. ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకతతో పాటు గెలిచిన అభ్యర్ధులను పరిశీలిస్తే పురోగామి వాదులను గెలిపించాలన్న తపన పలు తరగతుల ఓటర్లలో వుందనటానికి ఇది ఒక సూచిక. గత నాలుగు సంవత్సరాలలో అనేక ఓట్లను జాబితా నుంచి తొలగించటంతో అనేక మంది పట్టుదలగా ఓట్లు నమోదు చేయించుకొని పోలింగ్‌కు వచ్చారు. గుర్తింపు కార్డుమీద పూర్తి చిరునామా వుండాలన్న నిబంధన కొద్ది వారాల ముందే విధించటంతో గిరిజనులు పెద్ద ఎత్తున కొత్త గుర్తింపుకార్డులు అచ్చువేయించుకొనేందుకు రావటంతో తొక్కిసలాట పరిస్ధితి ఏర్పడింది. చాలా మంది సమగ్రగుర్తింపు కార్డు లేకపోవటంతో ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. అయినా నాలుగు సంవత్సరాలతో పోల్చితే గిరిజనులు రెట్టింపు మంది ఓటర్లుగా నమోదు చేయించుకున్నారు.

కార్మిక సంఘాలను, ఆందోళలను వ్యతిరేకించే రిపబ్లికన్లు ఓడించి పలువురు కార్మిక నేతలు ఎన్నికయ్యారు. వారిలో ఆండీ లెవిన్‌, రోజా డెలారో డి కాన్‌, బాబీ స్కాట్‌, జోహనా హేస్‌, కేంద్రా హారన్‌(తొలి గిరిజన మహిళ)ఎన్నికయ్యారు. అనేక మంది కార్మిక ప్రతినిధులు స్వల్పతేడాతో ఓడిపోయారు. ముఖ్యమైన విజయంగా విస్కాన్‌సిన్‌ రాష్ట్రంలో కార్మిక సంఘాలను తీవ్రంగా వ్యతిరేకించిన రిపబ్లికన్‌ గవర్నర్‌ను టోనీ ఎవర్స్‌ ఓడించారు. ఏడు సంవత్సరాల క్రితం రాష్ట్ర అసెంబ్లీని దాదాపు లక్ష మంది కార్మికులు ముట్టడించి నిరసన తెలపటానికి రిపబ్లికన్‌ గవర్నర్‌ వైఖరే కారణం. పార్లమెంట్‌, అసెంబ్లీలకు 743మందికార్మిక సంఘాల నేతలు ఎన్నికయ్యారు. మొత్తం శాసనసభ్యులలో దాదాపు పదో వంతు. మినెసోటా గవర్నర్‌గా టిమ్‌ వాల్జ్‌ (అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ టీచర్స్‌ నేత) ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలలో తాము 23.5లక్షల ఇండ్లకు వెళ్లామని, పని కేంద్రాలలో 50లక్షల కరపత్రాలు, కోటీ ఇరవైలక్షల ఇమెయిల్స్‌, 2,60,094 ఎస్‌ఎంఎస్‌లు, సామాజిక మీడియాలో 6.9కోట్ల పోస్టింగులతో ప్రచారం నిర్వహించినట్లు అమెరికా కార్మిక సంఘాల సమాఖ్య ఎఎఫ్‌ఎల్‌-సిఐఓ ప్రతినిధి తెలిపారు.

ఈ ఎన్నికలలో ప్రవాస భారతీయులు, వారి సంతతికి చెందిన వారు డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అనేక మంది చట్టసభలకు ఎన్నికయ్యారు. డాక్టర్‌ అమీ బెరా వరుసగా నాలుగవ సారి కాలిఫోర్నియా నుంచి ఎన్నికయ్యారు. ఇలినాయిస్‌ నుంచి రెండవ సారి రాజా కృష్ణమూర్తి, సిలికాన్‌ వాలీ నుంచి రో ఖన్నా, ప్రమీలా జయపాల్‌ సియాటిల్‌ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. వివిధ రాష్ట్రాల శాసనసభలకు విస్కాన్సిన్‌ నుంచి అటార్నీ జనరల్‌ స్ధానానికి జోష్‌ కౌల్‌, కెంటకీలో నీమా కులకర్ణి, అరిజోనా నుంచి అమిష్‌ షా, న్యూయార్క్‌ సెనేట్‌కు కెవిన్‌ ధామస్‌, వుత్తర కరోలినా సెనేట్‌కు మజతాబా మహమ్మద్‌, జయా చౌధురి డెమోక్రటిక్‌ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ఇంకా నీరజ్‌ అతానీ(ఓహియో), మంకా ధింగ్రా( వాషింగ్ట్‌న్‌), సబీకుమార్‌(టెనెసీ), ఆషా కార్లా(కాలిఫోర్నియా) కుమార్‌ భారవే(మేరీలాండ్‌), జూలీ మాథ్యూ, కెపి జార్జి(టెక్సాస్‌), షాలినీ (మసాచుసెట్స్‌) ఎన్నికయ్యారు.

సోషలిజం పట్ల ఓటర్లలో డెమోక్రటిక్‌ పార్టీలో వెల్లడౌతున్న సానుకూల వైఖరి, ఈ ఎన్నికలలో అణగారిన వర్గాలుగా వున్నవారు గణనీయంగా విజయం సాధించటంతో అమెరికాలోని వామపక్ష శక్తులలో తదుపురి ఏమిటి అన్న చర్చ మరింతగా పెరుగుతున్నది. మరింత విశాలంగా ఆలోచించాలి, పెద్ద ఎత్తున సమీకరించాలన్నది ఒక అభిప్రాయం. రిపబ్లికన్‌ పార్టీ లేదా ట్రంప్‌ మద్దతుదారులందరూ జాత్యంహకారులు, వలసకార్మికులకు, మహిళలకు వ్యతిరేకం కాదని అందువలన మితవాదులు కాని వారిని ఆకర్షించటం ఎలా అన్నది మధిస్తున్నారు. డెమోక్రటిక్‌ పార్టీలో పెట్టుబడిదారీవర్గాన్ని బలపరిచే శక్తులదే పైచేయి అయినప్పటికీ పార్టీలోని పురోగామిశక్తులలో సోషలిస్టు తిరుగుబాటు రాజుకుంటున్నది. కొంత కాలం క్రితం ఆ పార్టీలో సోషలిస్టులుగా వున్నవారు తమ వైఖరికి కట్టుబడి పోరాడాలా వద్దా అనే గుంజాటనలో వుండేవారు. అయితే 2008తలెత్తిన తీవ్ర మాంద్యం, వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ వుద్యమం, నల్లజాతీయుల జీవన్మరణ సమస్య, పర్యావరణ సమస్యలు తీవ్రతరం గావటం, సెనెటర్‌ బెర్నీ శాండర్స్‌ తాను సోషలిస్టును అని బహిరంగంగా ప్రకటించుకొని ప్రచారం చేయటం వంటి పరిణామాలతో ఇప్పుడు లక్షల మంది మేం కూడా సోషలిస్టులమే అని ప్రకటించుకున్నారు. ఈ పరిస్ధితుల్లో సోషలిస్టులేమి చేయవచ్చు అన్న చర్చ ప్రారంభమైంది.

బెర్నిశాండర్స్‌ వంటి కొంత మంది కార్మికవర్గం, సామాజిక వుద్యమాల గురించి మాట్లాడటం ఒక ముందడుగు. వారు అంతవరకే పరిమితం గాకుండా కార్మికుల ఆందోళనల దగ్గరకు వెళ్లేందుకు కూడా సిద్ధ పడుతున్నారు. ఒక విధంగా సోషల్‌ డెమోక్రాట్స్‌ మాదిరి వ్యవహరిస్తున్నారు. అంటే డెమోక్రటిక్‌ పార్టీ నాయకత్వంలోకి సోషల్‌ డెమోక్రాట్లను తీసుకు వచ్చి పురోగామి శక్తులను ఎన్నికలలో నిలబెట్టి కార్మికవర్గ సమస్యలను పరిష్కారించాలనే వైఖరికి అలాంటి వారు ప్రతినిధులు. అంటే పెట్టుబడిదారీ వ్యవస్ధను సంస్కరించగలమనే నమ్మకం వున్నవారు, సంస్కరిస్తే చాలు సమస్యలు పరిష్కారమౌతాయనే భ్రమలు కలిగిన వారు. మరో రెండు సంవత్సరాలలో జరిగే ఎన్నికలలో ఈ పరిస్ధితి బెర్నీశాండర్స్‌ అభ్యర్ధిత్వం మీద ఎలా పని చేస్తున్నందన్నది ప్రశ్న.

డెమోక్రటిక్‌ పార్టీని సంస్కరించటం జరిగేది కాదు, ఆ పార్టీలో డెమోక్రటిక్‌ సోషలిస్టులుగా వున్న అలెగ్జాండ్రా కాసియో కోర్టెజ్‌, రషీదా లాయిబ్‌ వంటి విజయం సాధించిన వారి మాదిరి గాకుండా సోషలిస్టులే ప్రత్యక్షంగా పోటీ పడాలన్నది మరొక వాదన. ఎన్నికైన పురోగామి వాదులు వర్గపోరాటాలను ప్రోత్సహించేందుకు ముందుగా సోషలిస్టు బృందంగా ఏర్పడే అవకాశాలున్నాయని కొందరి అంచనా. ఇప్పుడు ఎన్నికైన సోషలిస్టులు సమన్వయంతో పని చేస్తూ కార్మిక పోరాటాలు, పార్లమెంటరీ, పార్లమెంటేతర కార్యక్రమాలలో తమ ప్రత్యేకతను నిలబెట్టుకోవటం ద్వారా మరింత బలమైన శక్తిగా రూపొందేందుకు అవకాశం వుంటుందన్న సూచనలు కూడా వెల్లడయ్యాయి.

ఈ ఎన్నికలలో వామపక్ష అభ్యర్ధులు ఓటమి పొందినప్పటికీ వారు చేసిన డెమోక్రటిక్‌ సోషలిస్టు ప్రచారం, కార్యాచరణ వృధాకాదు. బెర్నీశాండర్స్‌ వంటి వారు చేసిన ప్రచారం, భావజాలం కార్మికవర్గ జీవితాలలో కొద్ది మార్పు చెందేందుకు దారితీసేదిగా వుంటుంది, అయితే అందరికీ ఆరోగ్యం, కాలేజీ విద్య వుచితం, విద్యార్ధి రుణాల రద్దు వంటి డిమాండ్లకు బహిరంగంగా మద్దతు ప్రకటించేందుకు కొందరు డెమోక్రాట్లను పురిగొల్పింది. రాష్ట్రాల అసెంబ్లీలలో తాము డెమోక్రటిక్‌ సోషలిస్టులం అని చెప్పుకున్న వారు కేవలం ముగ్గురే వుండగా ఈ సారి అలాంటి వారు పది మంది ఎన్నికయ్యారు.మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్యతో పోలిస్తే లెక్కలోకి తీసుకోవాల్సిన సంఖ్యగాక పోయినా సోషలిస్టులమని చెప్పుకొని పోటీ చేసే వారు ముందుకు రావటం గమనించాల్సిన అంశం. ఇలాంటి వారిని నిరుత్సాహపరిచేందుకు, దెబ్బతీసేందుకు డెమోక్రటిక్‌ పార్టీలోని మితవాదులు, సోషలిస్టు వ్యతిరేకులు అడుగడుగునా ప్రయత్నిస్తారని వేరే చెప్పనవసరం లేదు.

అమెరికాలో ఇప్పుడు రెండు రకాల సోషలిస్టులు, డెమోక్రటిక్‌ పార్టీలో అంతర్భాగంగా( గతంలో మన స్వాతంత్య్రవుద్యమ సమయంలో కాంగ్రెస్‌ సోషలిస్టుల మాదిరి) పని చేస్తున్న డెమోక్రటిక్‌ సోషలిస్టులు, విడిగా పని చేస్తున్న సోషలిస్టు శక్తులు, కమ్యూనిస్టు పార్టీగా పని చేస్తున్నవారు వున్నారు. ఈ శక్తుల మధ్య ఎలాంటి సంబంధం వుండాలో కూడా చర్చ ప్రారంభించారు. ఇప్పుడు ప్రజాప్రతినిధుల సభలో డెమోక్రటిక్‌ సోషలిస్టులుగా పక్కాగా ప్రకటించుకొని గెలిచిన ఇద్దరు మహిళలు వున్నారు.రానున్న రోజుల్లో డెమోక్రటిక్‌ పార్టీలో వున్న సోషలిస్టులతో మిగతావారందరూ కలసి ఒక ప్రత్యేక పార్టీగా ఏర్పడేందుకు, స్వతంత్ర వైఖరి, కార్యాచరణ, సిద్ధాంత ప్రచారానికి, జరుగుతున్న కార్మిక, వుద్యోగ, వుపాధ్యాయ, సామాజికోద్యమాలతో సమన్వయానికి సిద్ధంగావాలన్న ప్రతిపాదన ఒకటి వుంది. దీనిలో వుండే నష్టాలూ, లాభాల గురించి కూడా ఆలోచించాలని చెబుతున్నారు. అమెరికాలో ప్రారంభమైన ఈ మధనం అక్కడి రాజకీయాలలో గణనీయమైన మార్పులకు, అది మరింత పురోగమనం దిశగా వుంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. విప్లవాలు మనం కోరుకున్నట్లుగా, ఆశించినంత వేగంగా, ఊహించిన చోట రావు అని ఎలా చెబుతామో రావని కూడా చెప్పలేము !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా – రష్యా మధ్యలో చైనా !

24 Wednesday Oct 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

China, Donald trump, INF Treaty, Intermediate-Range Nuclear Forces, RUSSIA, The 1987 INF Treaty

Related image

గోర్బచెవ్‌-రోనాల్డ్‌ రీగన్‌  ఒప్పందం

ఎం కోటేశ్వరరావు

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు మరో రెండు వారాలుండగా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ యావత్‌ ప్రపంచాన్ని ముఖ్యంగా ఐరోపాను ఆందోళనకు గురిచేసే ప్రకటన చేశాడు. మూడు దశాబ్దాల క్రితం నాటి సోవియట్‌తో కుదుర్చుకున్న ఆయుధ నియంత్రణ ఒప్పందం నుంచి వైదొలగనున్నట్లు ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించారు. దీని మీద ఐరోపాలో మొత్తం మీద వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇది రష్యా వ్యాఖ్యానించినట్లు బెదిరింపా లేక చెప్పినట్లు నిజంగానే వైదొలుగుతుందా అన్నది చూడాల్సి వుంది. ఐరోపాలో వెల్లడయ్యే స్పందన వ్యతిరేకంగా వుంటే తాత్కాలికంగా వెనక్కు తగ్గినా ఒప్పందం నుంచి వైదొలగటం ఖాయం అని చెప్పవచ్చు. ప్రపంచానికి ట్రంప్‌ పిచ్చివాడనిపించవచ్చుగానీ ఒక పధకం ప్రకారమే వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా సెనెట్‌్‌ ఆమోదించిన ఒప్పందాలను దాని అనుమతి లేకుండా రద్దు చేసేందుకు లేదా వాటి నుంచి వుపసంహరించుకుంటామని ప్రకటించేందుకు అధ్యక్షుడికి అనుమతి లేదు. అయినా ట్రంప్‌ ప్రకటన తక్షణ ప్రయోజనం ఎన్నికలలో ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ విజయం దిశగా పయనిస్తున్నదన్న వార్తల పూర్వరంగంలో అధికారపార్టీ రిపబ్లికన్లకు లబ్ది చేకూర్చటమే. ఎన్నికల్లో లబ్దికి ఈ సందర్భాన్ని వినియోగించుకోవటం ఒక ఎత్తుగడ కావచ్చుగాని అమెరికన్‌ సామ్రాజ్యవాదులు మరొక ప్రచ్చన్న యుద్ధానికి తెరలేపేందుకు ఎప్పటి నుంచో చేస్తున్న సన్నాహాలలో భాగమే ఇది. నిజంగానే ఒప్పందం నుంచి వైదొలిగితే ఆ చారిత్రాత్మక ఎదురుదెబ్బకు బాధ్యురాలు అమెరికానే అవుతుంది.

అసలీ ఒప్పందం ఏమిటి ? ఐరోపాలో ఆయుధాల మోహరింపును అక్కడి జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పూర్వరంగంలో మధ్య శ్రేణి అణు బలాల ఒప్పందం(ఐఎన్‌ఎఫ్‌) పేరుతో తమ వద్ద వున్న మధ్య,లఘు శ్రేణి క్షిపణులను తొలగించుకొనేందుకు 1987 డిసెంబరు ఎనిమిదిన గోర్బచెవ్‌-రోనాల్డ్‌ రీగన్‌ మధ్య కాలపరిమితి లేని ఒప్పందం కుదిరింది.మరుసటి ఏడాది జూన్‌ ఒకటి నుంచి అమలులోకి వచ్చింది. తరువాత సోవియట్‌ రద్దు కావటంతో దాని వారసురాలిగా రష్యా ఒప్పందంలోకి వచ్చింది. ఆ మేరకు 500 నుంచి వెయ్యి కిలోమీటర్ల వరకు వున్న లఘు, వెయ్యి నుంచి 5,500 కిలోమీటర్లకు వుండే మధ్య శ్రేణి అణు, సాంప్రదాయ క్షిపణులను రెండు దేశాలు తొలగించాల్సి వుంటుంది. సముద్రం నుంచి ప్రయోగించే క్షిపణులు ఈ ఒప్పంద పరిధిలో లేవు. ఒప్పందం ప్రకారం అమెరికా 846 సోవియట్‌ లేదా రష్యా 1,846 క్షిపణులను నాశనం చేశాయి. ఇవి ప్రధానంగా ఐరోపాలో యుద్ధానికి అనువుగా రూపొందించినవి కావటంతో వాటిని తొలగించటం ప్రాంతీయ భద్రతకు ఎంతో ముఖ్యమని ఐరోపా భావించింది.

ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఇంతవరకు అమలు వుల్లంఘన గురించి కొన్ని ఫిర్యాదులు రెండువైపుల నుంచీ వున్నప్పటికీ పెద్ద వివాదాలేమీ బయటి ప్రపంచానికి తెలియదు. ఆకస్మికంగా ఈనెల 20న తాము వైదొలగాలనుకుంటున్నట్లు ట్రంప్‌ ప్రకటన చేశాడు. ఈ ఒప్పందంతో చైనాకు ఎలాంటి ప్రమేయమూ లేదు, ఏ విధంగానూ భాగస్వామి కాదు. చిత్రం ఏమిటంటే తాము వైదొలగదలచుకుంటే అది అమెరికా తలనొప్పి అనుకోవచ్చు కానీ, ఈ సమస్యలోకి ట్రంప్‌ మహాశయుడు చైనాను లాగాడు.రష్యా మన దగ్గరకు రావాలి, చైనా మన దగ్గరకు రావాలి, అందరూ మన దగ్గరకు రావాలి. అందరం మంచిగా తయారవుదాం మనలో ఎవరమూ ఆ అయుధాలను తయారు చేయవద్దు అని చెబితే తప్ప మనం తయారు చేయాల్సిందే. కానీ రష్యా తయారు చేస్తూ, చైనా తయారు చేస్తూ వుంటే మనం ఒప్పందానికి కట్టుబడివుండాలంటే కుదరదు. రష్యా ఒప్పందానికి కట్టుబడి వుండటం లేదు కాబట్టి మనం కూడా కట్టుబడి వుండనవసరం లేదు. ఒప్పందాన్ని రద్దు చేసుకోబోతున్నాం అని ట్రంప్‌ ప్రకటించాడు. అంటే రష్యాతో ముడి పెట్టి చైనాను కూడా దెబ్బతీయాలనే లక్ష్యం ట్రంప్‌ ప్రకటన వెనుక వుందా ? ముగిసిందని ప్రకటించిన ప్రచ్చన్న యుద్ధాన్ని చైనా మీద ప్రారంభించదలచారా ? అంటే వెలువడుతున్న వ్యాఖ్యానాలను బట్టి అవుననే చెప్పాల్సి వుంది. ట్రంప్‌ ప్రత్యక్షంగా రష్యా, చైనాలను రంగంలోకి తెచ్చేందుకు పూనుకున్నప్పటికీ మరోవైపు ఐరోపా రాజ్యాలను మరింతగా తన అదుపులోకి తెచ్చుకొనే ప్రయత్నం కూడా లేకపోలేదు.

‘ ట్రంప్‌ ప్రచ్చన్న యుద్ధాన్ని పునరుద్ధరించవచ్చు , కానీ చైనా దాని గతిని మార్చగలదు’ అనే శీర్షికతో న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక ఒక వ్యాఖ్యానాన్ని ప్రకటించింది. బెదిరింపులు, అణ్వాయుధాలు పాతవయ్యాయి. కొద్ది రోజులుగా ఐరోపా, అమెరికాలో అనేక మంది నూతన ప్రచ్చన్న యుద్ధం ప్రారంభం అవుతున్నదని అనుకుంటున్నారు, నూతన గతులు దానికి తూట్లు పొడుస్తాయి ఎందుకంటే సంపద్వంతమైన, జాతీయవాద చైనా అవతరించిందని సదరు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా రష్యా, చైనాలతో గిల్లికజ్జాలు పెట్టుకొనేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎఎన్‌ఎఫ్‌ ఒప్పందాన్ని వుల్లంఘిస్తోందని తమ ఎన్నికలు, అంతర్గత వ్యవహారాల్లో రష్యా జోక్యం చేసుకొంటోందని గత రెండు సంవత్సరాలుగా అమెరికా ఒక పధకం ప్రకారం ఆరోపణలు చేస్తోంది. మరోవైపున పెట్టుబడులు, వాణిజ్యం, మేథోసంపత్తి హక్కు చౌర్యం, ఇతర పద్దతుల్లో అమెరికా ప్రజాభిప్రాయాన్ని మలచేందుకు చైనా ప్రయత్నిస్తోందని ట్రంప్‌ అండ్‌కో ప్రచారం చేస్తోంది.దాన్ని అడ్డుకొనే పేరుతో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ఆయుధపోటీకి కాలుదువ్వుతోంది.

1987నాటి రష్యాాఅమెరికా ఆయుధ నియంత్రణ ఒప్పందంలో చైనా లేని కారణంగా అది స్వంత అణ్వాయుధ మరియు అన్ని శ్రేణుల సాంప్రదాయ క్షిపణులను తయారు చేసుకొనేందుకు అవకాశం ఇచ్చిందని అమెరికా వ్యూహకర్తలు వాదిస్తున్నారు. దాన్నే ట్రంప్‌ వెళ్లగక్కాడు.ఈ ఒప్పందంలో చైనా భాగస్వామి కానప్పటికీ దాని దగ్గర వున్న క్షిపణులలో 95శాతం మధ్యశ్రేణివే అని దక్షిణ కొరియాలో రాయబారిగా పని చేసిన అమెరికా పసిఫిక్‌ కమాండ్‌ అధిపతి హారీ హారిస్‌ ఒక నివేదికలో ఆరోపించాడు. ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందం ఐరోపా కేంద్రంగా చేసుకున్నదని అమెరికాాచైనా మిలిటరీ బలాబలాలను పరిగణనలోకి తీసుకోవలేదని, ఆ అంశం ఇటీవలి కాలంలో అమెరికా వ్యూహాత్మక లెక్కల్లో కేంద్ర స్ధానాన్ని ఆక్రమించిందని ఇటీవల కొందరు కొత్త వాదనలు లేవనెత్తారు. ఆసియాలో చైనా ఇతర దేశాలను బెదిరించేందుకు గాను సముద్రం, గగనతలం నుంచి ప్రయోగించే క్షిపణి వ్యవస్ధల కంటే భూతలం నుంచి ప్రయోగించే ఆయుధాల ఖర్చు అమెరికాకు కలసి వస్తుంది. అయితే మిత్రదేశాల అనుమతి లేకుండా చైనా లక్ష్యంగా పసిఫిక్‌ ప్రాంతం నుంచి క్షిపణులను ప్రయోగించే కేంద్రాలు పరిమితంగా వుండటం అమెరికాకు ఒక సమస్య. జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాలు అటువంటి వ్యవస్ధలను తమ భూభాగంపై నెలకొల్పేందుకు అంగీకరిస్తాయా అన్నది సందేహాస్పదమే. అలా చేయటం అంటే అమెరికా కోసం చైనాతో వైరం తెచ్చిపెట్టుకోవటమే.గత నాలుగు దశాబ్దాలుగా చైనా తన సంస్కరణలు, తన అభివృద్ధి తప్ప ఆయుధపోటీలో వున్నట్లు మనకు కనిపించదు.అలాంటి దానిని వాణిజ్యంలో తన షరతులను రుద్దటంలో విఫలమైన అమెరికా ఇప్పుడు మిలిటరీ రీత్యా ఆయుధపోటీకి దిగి చైనా దృష్టి మళ్లించాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికా అణ్వాయుధాలతో పోల్చితే చైనా ఎంతో వెనుకబడి వుంది, దానికి వాటి అవసరం కూడా కనిపించలేదు. కానీ ఇప్పుడు అమెరికా కవ్వింపులకు దిగుతుండటంతో ఎలా స్పందిస్తుందో చూడాల్సి వుంది.

ఇటీవలి కాలంలో అమెరికా అంతర్జాతీయ వ్యవస్ధ నుంచి ఏకపక్షంగా వైదొలుగుతున్నది. వాతావరణ మార్పులు, భూతాపం తదితర అంశాలున్న పారిస్‌ ఒప్పందం నుంచి, ఇరాన్‌తో అణు ఒప్పందం, అంతర్జాతీయ పోస్టల్‌ యూనియన్‌ నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అవన్నీ ఒక ఎత్తయితే ఇది అత్యంత ప్రమాదకర చర్యల, అంతర్జాతీయ భద్రత మీద ఎంతో పభావం చూపనుంది. మొత్తంగా చూసినపుడు ఇటీవలి కాలంలో అనేక ఒప్పందాలను తిరగదోడుతోంది, కొత్తవి కావాలని వత్తిడి తెస్తోంది. అమెరికాకు అగ్రస్ధానం లేదా సింహభాగం రాబట్టుకొనేందుకు పూనుకున్నట్లుగా కనిపిస్తోంది. తనకేమీ బాధ్యత లేనట్లుగా వ్యవహరిస్తోంది. ఇది అమెరికన్లకేగాక యావత్‌ మానవాళికి హానికలిగించే పోకడ అని చెప్పకతప్పదు. ఒక పరిశీలన ప్రకారం చాలా సంవత్సరాలుగా అమెరికా వుపరితల ఆధారిత లఘు, మధ్యశ్రేణి క్షిపణులను అభివృద్ది చేయలేదు. ఇటీవలనే అందుకు నిధులు కేటాయించింది. వుపరితలం నుంచి ప్రయోగించే క్షిపణులను మోహరించేందుకు ఏ ఐరోపా దేశం కూడా తమ భూ భాగాలను అనుమతించే అవకాశం లేదు. అయితే రష్యా దగ్గర అలాంటి ఆయుధాలు వున్నందున చాలా త్వరగా మోహరించే అవకాశాలున్నాయి. నిషేధిత శ్రేణిలో కొత్త క్షిపణులను రష్యా తయారు చేసిందని అయితే ఒప్పందం కారణంగా వాటి శ్రేణిని పెంచి ఖండాంతర క్షిపణిగా పేర్కొన్నదని అమెరికా అనుమానిస్తున్నది.

Image result for intermediate-range nuclear missile

తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసినప్పటి నుంచి రష్యాను చక్రబంధంలో బిగించేందుకు నాటో కూటమిని విస్తరించేందుకు అమెరికన్లు ప్రయత్నించి ఇప్పుడు రుమేనియా, పోలాండ్‌ వంటి చోట్ల రష్యా ముంగిటికి తమ ఆయుధాలను ఎక్కుపెట్టారు. దానికి ప్రతిగా అది కూడా తన జాగ్రత్తలను తాను తీసుకుంటున్నది.గురివిందగింజ మాదిరి తన చర్యల గురించి నోరెత్తని ట్రంప్‌ రష్యా మోహరింపులను సాకుగా చూపి ఒప్పందం నుంచి వైదొలుగుతాననటం ఒక సాకు మాత్రమే. మూడు దశాబ్దాలుగా ప్రశాంతంగా వున్న తమకు మరోసారి ఆయుధముప్పు తెచ్చిపెడుతున్నారనే అభిప్రాయం ఐరోపాలో వ్యక్తం అవుతోంది. రష్యాను అంకెకు తెచ్చేందుకు అమెరికా చేసే యత్నాలకు తాము మద్దతిస్తాం తప్ప ఒప్పందం నుంచి తప్పుకుంటామనే అమెరికా వైఖరిని ఐరోపా నాయకులు తప్పు పడుతున్నారు. నిరాయుధీకరణ ఒప్పందం ఐరోపా భద్రత అనే కట్టడానికి గత మూడు దశాబ్దాలుగా ఒక స్ధంభం మాదిరి వుంది, ప్రచ్చన్న యుద్ధాన్ని అంతం చేసేందుకు తోడ్పడింది అని ఐరోపా యూనియన్‌ విదేశాంగ విధాన విభాగ ప్రతినిధి ఫెడరేసియా మోఘెరిని ఒక రాత పూర్వక ప్రకటనలో పేర్కొన్నారు. ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందం కారణంగా దాదాపు అణు, సాంప్రదాయ ఆయుధాలున్న మూడువేల క్షిపణులను తొలగించి నాశనం చేశారు. ప్రపంచానికి నూతన ఆయుధపోటీ అవసరం లేదు, దాని వలన ఎవరికీ లాభం లేకపోగా మరింత అస్ధిరత్వాన్ని తెస్తుందని పేర్కొన్నారు. స్వీడిష్‌ మాజీ ప్రధాని కార్ల్‌ బిడిట్‌ అమెరికా చర్య రష్యాకు ఒక బహుమతి లాంటిది. ఐరోపాకు అణుముప్పును పెంచుతుంది. ఎందుకంటే అమెరికా ఆయుధపోటీలో చేరటంతో రష్యా పెద్ద సంఖ్యలో నూతన ఆయుధాలను మోహరిస్తుందన్నాడు. ఇబ్బందులు రష్యా క్షిపణుల పరిధిలో వున్న ఐరోపావారికి తప్ప అమెరికన్లకు కాదని జర్మనీ విదేశాంగ మంత్రి హెయికో మాస్‌ పేర్కొన్నారు.ట్రంప్‌ ప్రకటన విచారకరమని ఒప్పందానికి కట్టుబడే అంశాలను పరిష్కరించాలని రష్యాను కోరారు. తాము అమెరికా వైఖరిని సమర్ధిస్తామని బ్రిటన్‌ ప్రకటించింది. ఈ చర్య ఎక్కడికి దారితీస్తుందో వాష్టింగ్టన్‌లోని వారికి నిజంగా అర్ధం కావటం లేదా అని ఒప్పందంపై సంతకం చేసిన సోవియట్‌ మాజీ అధ్యక్షుడు గోర్బచెవ్‌ ప్రశ్నించాడు.ఒప్పందం నుంచి వైదొలగటం ప్రమాకర అడుగు అవుతుందని, తమను బ్లాక్‌ మెయిల్‌ చేయటమే అని, అయితే దాన్ని అంగీకరించేది లేదని రష్యా తక్షణ స్పందనలో పేర్కొన్నది.

ట్రంప్‌ చర్యను అమెరికాలోని కొందరు మేథావులే తప్పు పడుతున్నారు. దౌత్యపరంగా హ్రస్వదృష్టి, మధ్యంతర ఎన్నికలకు ముందు ట్రంప్‌కు రాజకీయంగా ప్రమాదకరం, ముప్పుతో కూడుకున్నదని వాషింగ్టన్‌లోని ఆయుధాల అదుపు అసోసియేషన్‌ డైరెక్టర్‌ డారిల్‌ కింబాల్‌ వ్యాఖ్యానించారు. ఒప్పంద వుల్లంఘనకు రష్యా పాల్పడుతున్నదనే ఆందోళన ఒకవైపు వుండగా దాన్నుంచి అమెరికా వుపసంహరణ ప్రకటన చేయటంతో వైఫల్య నిందను నెత్తిన వేసుకున్నట్లయిందని కింబాల్‌ వాపోయారు. వివాద పరిష్కారానికి దౌత్య అవకాశాలు ఆవిరి కాలేదని, ట్రంప్‌ పాలనా కాలంలో ఆయన సలహాదారు బోల్టన్‌ మాస్కో పర్యటన కేవలం మూడవదేనని కూడా కిబాల్‌ చెప్పారు. రుమేనియాలో ఆమెరికా మోహరించిన క్షిపణులను అడ్డుకొనే కేంద్రాలను రష్యన్‌ నిపుణులు, ఆమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్న రష్యా 9ఎం729 వ్యవస్ధలను అమెరికా నిపుణులు పరస్పరం తనిఖీ చేసేందుకు అవకాశాలున్నాయని తెలిపారు.

ట్రంప్‌ ప్రతినిధిగా మాస్కో పర్యటనలో వున్న బోల్టన్‌ విలేకర్లతో మాట్లాడుతూ ఒప్పందంలో పేర్కొన్న క్షిపణులు అనేక దేశాలు తయారు చేస్తున్నందున ప్రచ్చన్న యుద్ధకాలంలో కుదుర్చుకున్న ఒప్పందాలకు కాలదోషం పట్టిందని వ్యాఖ్యానించాడు. ట్రంప్‌, ఇతర అమెరికకా నిపుణులు కోరుతున్నట్లు అణ్వాయుధ క్షిపణుల నిషేధ ఒప్పందంలో చైనా చేరే అవకాశాలేమాత్రం లేవని కింబల్‌ వ్యాఖ్యానించారు. దాని దగ్గర వున్న అణ్వాయుధాలు తక్కువ, వారి దగ్గర లఘు, మధ్య శ్రేణి క్షిపణులు ఎక్కువగా వున్నాయి. నిజంగా వారు ఒప్పందంలో చేరితే అది అమెరికా, రష్యాలకు విజయం, చైనాకు నష్టం అన్నారు. అమెరికా నిజంగా ఒప్పందం నుంచి తప్పుకుంటుందా అన్న ప్రశ్నకు కింబల్‌ ఇలా స్పందించాడు. గత కొద్ది వారాలుగా ఒప్పందాన్ని ఏమి చేయాలని ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది.బోల్లన్‌ గనుకు చక్కగా వుండి వుంటే ఈ సమస్యను దీర్ఘకాలం నాన్చటం మంచిది కాదు, మీరు తదుపరి చర్యలు తీసుకోనట్లయితే మేము ఒప్పందం నుంచి వెనక్కు పోవచ్చు అని చెప్పేందుకు మాస్కో వెళ్లి వుండాల్సింది, కానీ గట్టిగా వ్యవహరించాలనే ప్రవత్తిగల ట్రంప్‌ ముందుగానే తుపాకిని ఎక్కు పెట్టి ఒప్పందాన్నుంచి వైదొలుగుతామని చెప్పాడు. రష్యా గురించి గట్టిగా మాట్లాడి రాజకీయంగా లబ్దిపొంద చూసేందుకు రాజకీయవేత్తలు ప్రయత్నిస్తున్నారని కొన్ని వర్గాలు పేర్కొన్నట్లు రష్యా వార్తా సంస్ధ నొవొస్తి పేర్కొన్నది.

ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందం రద్దయితే పర్యవసానాలేమిటి? మరోసారి ఆయుధ పోటీకి అమెరికా తెరలేపినట్లు అవుతుంది. అని వార్యంగా రష్యా, చైనా ఇతర దేశాలు అందుకోసం అమెరికా అంతగాకపోయినా అదనంగా ఖర్చు చేయాల్సి రావచ్చు. ఐరోపా గడ్డమీద ఆయుధాలు పెరుగుతాయి. అక్కడి దేశాలు తమ రక్షణ ఖర్చును గణనీయంగా పెంచుకోవాల్సి వుంటుంది, అదిగాకుండా అమెరికా ఆయుధాలకు అదనంగా చెల్లించాల్సిన పరిస్ధితి. వీటన్నింటి వలన ప్రయివేటు రంగంలోని అమెరికా మిలిటరీ పరిశ్రమలకు లాభాలు పెరుగుతాయి. తన రాజకీయ వైఖరికి అనేక అంశాల్లో అడ్డుపడుతున్న రష్యాపై అనేక ఆంక్షలను అమలు జరుపుతున్న అమెరికా రాబోయే రోజుల్లో మరింగా విస్తరించవచ్చు. ఒప్పందం నుంచి అమెరికా వైదులుగుతున్న కారణంగా నాటో కూటమి, ఐరోపా యూనియన్‌ దేశాల మధ్య విబేధాలు తలెత్తే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఐరోపా తన భద్రతను తాను చూసుకోగలదు అంటున్న దేశాలు అమెరికా తెచ్చి పెట్టిన కొత్త సమస్యమీద ఎలా స్పందిస్తాయో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

డాలరు విలువను అమెరికా ఎందుకు తగ్గించదు !

07 Friday Sep 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, USA

≈ Leave a comment

Tags

Currency Value, Donald trump, US Dollar

Image result for donald trump us currency

ఎం కోటేశ్వరరావు

రూపాయి విలువ పతనం మీద ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ వ్యాఖ్యానం చూసినపుడు మాయాబజార్‌ సినిమాలో శశిరేఖ రూపంలో వున్న ఘటోత్కజుడు వివాహ ప్రహసనంలో లక్ష్మణ కుమారుడి పాదాన్ని తొక్కినపుడు నొప్పి పెడుతున్నా ఏడవ లేక నవ్విన దృశ్యం గుర్తుకు రాకమానదు. ఆ సంగతి జనం చూసుకుంటారు వదిలేద్దాం ! గురువారం నాడు రూపాయి విలువ 72.11కి దిగజారి 71.99 వద్ద ముగిసింది. ( ఎన్ని రోజులు ఇలా జరుగుతుందో తెలియదుగానీ దాదాపు రోజూ జరుగుతున్నదానికి వరుసగా కొత్త రికార్డులంటూ రాసి రాసి చదువరులకు బోరు కొట్టించదలచుకోలేదు.) మన రూపాయి లేదా చైనా యువాన్‌ విలువ పతనమైతే ఎగుమతులు పెరుగుతాయి కదా అలాగే అమెరికా కూడా తన డాలరు విలువను తగ్గించుకొని ఎగుమతులు పెంచి వాణిజ్య లోటును ఎందుకు తగ్గించుకోకూడదు అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది.

2008లో ప్రారంభమైన తీవ్ర ఆర్ధిక మాంద్యం, చైనా నుంచి దిగుమతుల కారణంగా కోల్పోయిన వుద్యోగాలను తిరిగి కల్పించేందుకు డాలరు విలువ తగ్గించాలన్న వూహలతో అధికారానికి వచ్చాడు డోనాల్డ్‌ ట్రంప్‌. అయితే అది ఎంత నష్టదాయకమో వెంటనే తెలిసి వచ్చింది. రాబోయే రోజుల్లో ఏం జరిగి పరిణామాలు ఎలా వుంటాయో చెప్పలేము గాని ప్రపంచంలో ఇప్పుడొక వినూత్న పరిస్ధితి ఏర్పడిందని చెప్పక తప్పదు.

ప్రపంచంలో అమెరికా ఎంత పెద్ద ధనిక దేశమో దానికి అప్పులు కూడా అంత ఎక్కువగా వున్నాయి. మొత్తం అప్పు19.19లక్షల కోట్ల డాలర్లు.దానిలో విదేశీ అప్పు 5.35 లక్షల కోట్ల డాలర్లు వుంది. డాలరు విలువ తగ్గితే అప్పులు పెట్టిన వారందరూ గగ్గోలు పెడతారు. అప్పులిచ్చిన విదేశాలలో చైనా 1.1877లక్షల కోట్లతో ప్రధమ స్ధానంలో వుండగా జపాన్‌ 1.0435 లక్షల కోట్లు, ఐర్లండ్‌ 317.9 బిలియన్‌ డాలర్లతో మూడో స్ధానంలో వుంది. మన విదేశీ అప్పు 500 బిలియన్‌డాలర్లకు మించి వుంది. అయితేనే మనం కూడా అమెరికాకు 157 బిలియన్‌ డాలర్ల అప్పిచ్చి 11వ స్ధానంలో వున్నాం.(అరవై వేల జనాభాగల కేమాన్‌ దీవులు 242.9 బిలియన్లిచ్చి ఏడవ స్ధానంలో వుంది) అమెరికా అప్పు దాని జిడిపికి 106శాతం వుంది. 2017లో అప్పులకు చెల్లించిన వడ్డీ రేటు 2.26శాతం. కొందరు ఇంకా తక్కువ వడ్డీరేటుకే అప్పు ఇచ్చారు.

ఒక్కసారిగా డాలరు విలువ తగ్గితే వారంతా ఏం కావాలి. దివాలా తీయాలి, చలికాచుకొనేందుకు నోట్లను వుపయోగించాలి. తక్కువ వడ్డీకి ఇచ్చిన వారికి డాలరు విలువ పెరిగితే లాభం తప్ప తగ్గితే మిగిలేది బూడిదే. అందువలన దాని విలువలో స్వల్ప మార్పులను అనుమతించటం తప్ప అధికారంలో ఎవరున్నా విలువ పతనం కాకుండా చూస్తారు. ప్రస్తుతం మన దేశంతో లావాదేవీలలో అమెరికా 23బిలియన్‌డాలర్ల మేరకు వాణిజ్యలోటు కలిగి వుంది. దాన్ని పూడ్చుకోవాలంటే రానున్న మూడు సంవత్సరాలలో పది బిలియన్‌ డాలర్ల మేరకు అదనంగా తమ నుంచి దిగుమతులు చేసుకోవాలని అమెరికన్లు మన మీద వత్తిడి చేస్తున్నారు.(సెప్టెంబరు 6 హిందూ పతాక శీర్షిక) ఇదే విధానాన్ని చైనా, ఇతర దేశాల మీద కూడా రుద్దాలని చూస్తోంది. డాలరు విలువ తగ్గనుంది అనే వార్త వచ్చిందో డాలరు పెట్టుబడులన్నీ ఇతర మెరుగైన కరెన్సీలకు మారిపోతాయి. మన రూపాయి విలువ తగ్గటంతో డాలర్లు వెళ్లిపోతున్న విషయం తెలిసిందే. అందువలన విశ్వం అంతమౌతుందనుకున్నపుడే చివరి చర్యగా డాలరు విలువను తగ్గిస్తారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

మన రూపాయి విలువ తగ్గుతున్నమేరకు మనం దిగుమతి చేసుకొనే పెట్రోలు, ఇతర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. డాలరు విలువ తగ్గితే అమెరికాలో కూడా అదే జరుగుతుంది. రోజువారీ వాడే వస్తువులన్నీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కారణంగా ఆ వస్తువుల ధరలు పెరుగుతాయి. ఆ పరిణామం ఎగుమతి చేసే దేశాలకు కూడా మంచిది కాదు. డాలరు విలువ తగ్గితే వాటి కరెన్సీ విలువ పెరుగుతుంది. ఇప్పుడు అమెరికాకు నామమాత్రపు లేదా అసలేమీ వడ్డీ లేకుండా విదేశీ పెట్టుబడులు, రుణాలు వస్తున్నాయి, దాని కరెన్సీ విలువ తగ్గితే వడ్డీ రేట్లు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ధరలు పెరుగుతాయి. అమెరికాలో ఇప్పుడున్న వేతనాలతో చైనా, భారత్‌ మాదిరి చౌక ధరలకు వస్తువులను తయారు చేసి ఎగుమతులు చేయటం కష్టం. వేతనాలు తగ్గిస్తే సామాజిక సంక్షోభం తలెత్తుతుంది. డాలరు విలువ ఎక్కువగా వుంటే ఎగుమతులు గిట్టుబాటుగాక వుత్పత్తి పడిపోతుంది.

అన్నింటికంటే ముఖ్యంగా డాలరు ఇప్పుడు రిజర్వు కరెన్సీగా వుంది. అనేక దేశాలు, కార్పొరేట్‌ సంస్ధలు పెద్ద మొత్తంలో వాటిని నిల్వ చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ లావాదేవీలు, పెట్టుబడులకు వాటిని వినియోగిస్తాయి. రిజర్వు కరెన్సీ కలిగిన ఏ దేశమైనా చౌకగా ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. బ్రిటన్‌ ప్రాభవం కోల్పోవటంతో దాని పౌండ్‌ స్ధానంలో తన డాలరును అలాంటి కరెన్సీగా చేయాలని అమెరికా నిర్ణయించుకుని అమలు చేస్తోంది. సాంప్రదాయ వస్తూత్పత్తి పెట్టుబడిదారుల స్ధానంలో ద్రవ్యపెట్టుబడిదారులది ఎప్పుడు పైచేయి అయిందో అప్పటి నుంచి డాలరును ముందుకు తెచ్చారు. దీని వలన ఇతర దేశాల నుంచి పెట్టుబడులు, అప్పులు తీసుకోవటం ద్వారా అమెరికా తన లోటును పూడ్చుకొంటోంది. ద్రవ్యపెట్టుబడిదారుల ఆధీనంలోని బ్యాంకుల పలుకుబడి, లావాదేవీలు, లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. డాలరును ఆయుధంగా చేసుకొని అమెరికా కార్పొరేట్‌ సంస్ధలు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో, ఆయా దేశాలలో చొరబడటంతో పాటు ప్రపంచ మిలిటరీ వుద్రిక్తతలలో అమెరికా జోక్యం, ఎక్కడైనా లేకపోతే సృష్టించటం జరుగుతున్నది. వాటి ద్వారా కార్పొరేట్ల ఆయుధ పరిశ్రమలు మూడుపువ్వులు ఆరుకాయలుగా లాభాలు పొందుతున్నాయి. వాటికి దెబ్బ తగుల కుండా వుండాలంటే ఒక చోట వుద్రిక్తతలు సడలితే, ముగిస్తే మరొక చోట తలెత్తేట్లు చేస్తున్నారు. మిలిటరిజం, సామ్రాజ్యవాదం ఒకదానితో ఒకటి కలసి పెరుగుతున్నాయి. డాలరు విలువను తగ్గిస్తే ఇది సాధ్యం కాదు.

చైనా పెద్ద మొత్తంలో అమెరికాకు అప్పు ఇచ్చినందున డాలరు విలువ తగ్గితే ఎక్కువగా నష్టపోయేది కూడా ఆ దేశమే. చైనా కనుక తన అప్పును తగ్గించుకుంటే, మిగతా దేశాలు కూడా దాని బాటనే నడిస్తే తక్షణం డాలరు విలువ పతనం అవుతుంది. చైనా కొత్తగా డాలర్లను కొనుగోలును తగ్గించినా సమస్యలు తలెత్తుతాయి. మొత్తం మీద అమెరికా లేదా చైనా ఏ విపరీత చర్యకు పాల్పడినా రెండు దేశాలతో పాటు ప్రపంచం సంక్షోభంలో మునుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే తెలిసిగానీ లేక తెలియకగానీ ట్రంప్‌ దూకుడు మీద వున్నాడు. పిచ్చి పనులు చేస్తే ఫలితాలు, పర్యవసానాలను అనుభవిస్తాడు. మన రూపాయితో పోలిస్తే జపాన్‌ ఎన్‌ విలువ ఇంకా తక్కువ, శుక్రవారం నాడు ఒక డాలరుకు 110.6 ఎన్‌ల వద్ద వుంది. దీని కంటే చాలా ఎక్కువగా వుండే చైనా యువాన్‌ విలువను పెంచాలని అమెరికా డిమాండ్‌ చేస్తోందిగానీ జపాన్‌ గురించి ఇంతవరకు మాట్లాడలేదు. రాబోయే రోజుల్లో జపాన్‌తో వాణిజ్య సమస్య మీద కూడా కేంద్రీకరిస్తానని ట్రంప్‌ ప్రకటించటంతో డాలర్‌ విలువ స్వల్పంగా పతనమైనట్లు వార్తలు వెలువడ్డాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దక్షిణాఫ్రికా భూ సంస్కరణలకు అమెరికా వ్యతిరేకత!

29 Wednesday Aug 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Donald trump, land reforms, South Africa, South African land reforms

Image result for Donald trump against South Africa land reforms                   అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌                                   సిరిల్‌ రాంఫొసా

 ఎం. కోటేశ్వరరావు

‘దక్షిణాఫ్రికాలో భూ స్వాధీనాలు, పెద్ద ఎత్తున రైతాంగ హత్యలూ జరుగుతున్నాయి, వాటి గురించి సునిశితంగా అధ్యయనం చేయండి’ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన విదేశాంగ మంత్రి మైక్‌ పోంపియోను ఆగస్టు 22న ఆదేశించటంతో ఒక్కసారిగా దక్షిణాఫ్రికా భూసమస్య ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఒక సర్వసత్తాక దేశ అంతర్గత వ్యవహారాలలో, భూ సంస్కరణలకు వ్యతిరేకంగా ఇంత బహిరంగంగా జోక్యం చేసుకొనేందుకు పూనుకోవటం అమెరికా తెంపరి తనానికి నిదర్శనం. కొద్ది రోజుల క్రితం మితవాద మేథావి మరియన్‌ టపీ భూ స్వాధీనాలపై దక్షిణాఫ్రికాను హెచ్చరించండి అంటూ ట్రంప్‌ను కోరుతూ ఒక వ్యాసం రాశాడు. శ్వేతజాతి రైతులను చంపుతున్నారు, వారి భూములను లాక్కుంటున్నారు అంటూ అమెరికా మీడియాలో రెచ్చగొడుతున్నారు. భూ సంస్కరణలను వ్యతిరేకించే శ్వేతజాతీయులతో కూడిన ఆఫ్రీఫోరమ్‌ ప్రతినిధులు జూన్‌లో అమెరికా వచ్చి అనేక మందిని కలిశారు, మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ట్రంప్‌ చర్యను దక్షిణాఫ్రికాలో అనేక మంది తీవ్రంగా ఖండించారు. దేశ ఉపాధ్యక్షుడు మబుజా ఒక ప్రకటన చేస్తూ భూ సంస్కరణలు సామాజిక, జాతి విభజన ఫలితాలు కాదని స్పష్టం చేశారు.
భూ సమస్య ముందుకు రావటం గురించి పలు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కొందరు దీనిని రాబోయే ఎన్నికల గారడీగా భావిస్తున్నారు. భూ సంస్కరణలు జరగాలన్నది సాధారణ ఏకాభిప్రాయం. ఎలా అన్నదానిపై తేడాలున్నాయి. పాతికేండ్లుగా తేల్చుకోలేని స్ధితి. జాత్యహంకార, వలసపాలనలో భూముల నుంచి స్థానికులను వెళ్లగొట్టి వలస వచ్చిన శ్వేతజాతీయులు ఆక్రమించుకున్నారు. 1994లో శ్వేతజాతి దురహంకార పాలన అంతమై ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ నాయకత్వంలో త్రిపక్ష కూటమి అధికారానికి వచ్చేనాటికి తొమ్మిదిశాతం శ్వేత జాతీయుల చేతిలో 90శాతం భూమి కేంద్రీకృతమై ఉంది. భూ పంపిణీ అన్నది ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీ ప్రకటించిన ప్రధాన కార్యక్రమాలలో ఒకటి. స్ధానిక ఆఫ్రికన్లను కొన్ని ప్రాంతాలకు పరిమితం చేసిన శ్వేతజాతి ప్రభుత్వం 1913లో చేసిన ఒక చట్టం ప్రకారం నల్లజాతీయులైన ఆఫ్రికన్లు ‘శ్వేత దక్షిణాఫ్రికా’లో భూములు కొనుగోలు చేసేందుకు లేదా కౌలుకు తీసుకొనే అవకాశాన్ని కోల్పోయారు, భూముల నుంచి గెంటివేతకు గురయ్యారు.
దేశాధ్యక్షుడు సిరిల్‌ రాంఫొసా తాజాగా ఒక పత్రికకు భూసమస్యపై రాసిన వ్యాసం సారాంశం ఇలా వుంది. గ్రామీణాభివృద్ధి, భూ సంస్కరణల శాఖ జరిపిన భూ తనిఖీ లెక్కల ప్రకారం 90శాతం భూమి వ్యక్తులు, ట్రస్టులు, కంపెనీల చేతిలో ఉంది. పదిశాతం ప్రభుత్వానికి చెందినది. తొంభైశాతం భూమిలో వ్యక్తుల వద్ద 39, ట్రస్టులకు 31, కంపెనీలకు 25శాతం వుంది. వ్యవసాయ క్షేత్రాలు, భూములు కేవలం ఏడుశాతం యజమానుల చేతుల్లో ఉన్నాయి. ఈ ఏడుశాతంలో 72శాతం శ్వేతజాతీయులు, 15శాతం రంగు జాతీయులు (మన దేశంలో ఆంగ్లో ఇండియన్ల మాదిరి స్ధానిక ఆఫ్రికన్లు, శ్వేతజాతీయులు, భారత జాతీయుల సంకరంతో కలిగిన జనాభా), ఐదుశాతం భారతీయ సంతతి, నాలుగుశాతం ఆఫ్రికన్లు ఉన్నారు. ట్రంప్‌ ప్రకటన విషయానికి వస్తే ఉత్తర రాష్ట్రంలో ప్రయివేటు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదన్న వార్తల పూర్వరంగంలో వెలువడింది. ప్రభుత్వ రేటు ప్రకారం రెండు కోట్ల రాండ్‌లు తీసుకొని భూమిని స్వాధీనం చేయాలని స్థానిక అధికారులు ఒక యజమానిని కోరారు. అయితే తనకు 20కోట్ల రాండ్లు ఇవ్వాలని అతను తిరస్కరించటంతో చట్టనిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకొనేందుకు పూనుకున్నారు.
ముఫ్పైశాతం భూమిని ఐదేండ్లలో పంపిణీ చేయాలన్నది 1994లో తొలి ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో చేసిన వాగ్దానం. దానిలో ఇప్పటి వరకు పదిశాతం కూడా జరగలేదని 2014వరకు విధించిన గడువును 2024 వరకు పొడిగించనున్నట్టు వార్తలు వచ్చాయి. అంటే పాతికేండ్లలో చేసిందేమీ లేదన్నది చేదు నిజం. ఆఫ్రికన్లలో విపరీతంగా ఉన్న నిరుద్యోగం, పాతికేండ్లుగా అనుసరిస్తున్న నయావుదారవాద విధానాల వలన ఉపాధి అవకాశాలు పెరగకపోవటం వంటి అనేక కారణాలతో జనంలో అసంతృప్తి నానాటికీ పెరుగుతున్నది. అవినీతి, అక్రమాల కారణంగా ఏకంగా ఒక దేశాధ్యక్షుడు జాకబ్‌ జుమా కొద్ది నెలల క్రితం పదవి నుంచి తప్పుకోవాల్సి రావటం అక్కడి పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. జుమాను తొలగించకపోతే తాము సంకీర్ణ కూటమి నుంచి వైదొలుగుతామని కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించాల్సి వచ్చింది. అవినీతి విషయంలో పట్టుబట్టిన మాదిరి ఇతర ప్రజావ్యతిరేక విధానాలు లేదా భూ సంస్కరణల వంటి వాటి విషయంలో కమ్యూనిస్టు పార్టీ అలాంటి వత్తిడి పాలక కూటమి మీద తీసుకురాలేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే అంగీకృత విధానాల నుంచి కూటమి నాయకురాలైన ఏఎన్‌సీ దూరంగా వ్యవహరిస్తున్నందున వచ్చే ఎన్నికలలో తాము అవసరమైతే వంటరిగా బరిలోకి దిగుతామని కమ్యూనిస్టు నేతలు హెచ్చరించారు. ఒక వేళ అదే జరిగితే భూ సంస్కరణలు ఎన్నికల సమస్యగా మారే అవకాశం లేకపోలేదు. కూటమి ఐక్యంగానే ఉన్నప్పటికీ జనం నుంచి వస్తున్న వత్తిళ్లు, నిరుద్యోగం, సాధికారత వంటి అంశాల కారణంగా భూ సంస్కరణలను వ్యతిరేకించే వారు, అనుకూలించే వారుగా ఎన్నికలలో చీలిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు.
ఎలాంటి పరిహారం లేకుండా పరిమితులు దాటిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తిరిగి పంపిణీ చేసే విధంగా చట్ట సవరణ చేయనున్నట్టు అధ్యక్షుడు రాంఫొసానే ప్రకటించారు. 25వేల ఎకరాలకు పైబడి ఉన్న వారి నుంచి మాత్రమే పరిహారం చెల్లించకుండా భూములు తీసుకుంటామని ఏఎన్‌సీ అధ్యక్షుడు మంతాషే చేసిన ప్రకటన అనేక మందిలో చలనం కలిగించింది. పరిమితికి మించి వున్న భూములను అమ్ముకొనేందుకు ప్రయత్నించగా కొనే వారు కరువయ్యారు. దాంతో ప్రభుత్వ రేటుకు పదిహేను నుంచి ఇరవై రెట్లు అదనంగా ఇస్తేనే తాము భూములు వదులుకుంటామని కొందరు పట్టుబడుతున్నారు. భూములన్నీ శ్వేతజాతీయుల చేతిలో ఉండటంతో ప్రభుత్వ చర్యలు కూడా సహజంగానే వారికి వ్యతిరేకంగానే ఉంటాయి. దీంతో ఆ సమస్యకు రంగు పూసి జాతి వివక్షగా చిత్రించేందుకు పూనుకున్నారు. ట్రంప్‌ ట్వీట్‌ కూడా దానినే ప్రతిబింబించింది. స్వాభావికంగానే పెట్టుబడిదారీ వర్గం భూసంస్కరణలను సమర్ధిస్తుంది. దాని వస్తువులకు మార్కెట్‌ పెరగాలంటే జనం కొనుగోలు శక్తి పెరగాలి, అందుకుగాను భూ కేంద్రీకరణ ఒక ఆటంకం. ఒక వైపు కంపెనీ వ్యవసాయం లాభసాటి అంటూ ఆ వైపు ప్రోత్సహిస్తూనే మరోవైపు భూ పంపిణీని కూడా ప్రపంచబ్యాంకు సమర్ధించుతుండటం మిత్రవైరుధ్యానికి నిదర్శనం. విప్లవాత్మకంగా భూసంస్కరణలను అమలు జరిపే ఉద్దేశ్యం ఏఎన్‌సీ ప్రభుత్వానికి ఉంటే నిజానికి ఎప్పుడో పరిహారంతో నిమిత్తం లేకుండా సీలింగ్‌ దాటిన భూములను స్వాధీనం చేసుకొని రైతాంగానికి పంచి ఉండేది. కారణాలు ఏమైనా కొన్ని చర్యలు తీసుకోక తప్పక పోవటంతో భూస్వాముల ప్రతినిధులు పాతపడిన, పాచి పాటలు పాడటం ప్రారంభించారు. అనిశ్చిత పరిస్థితులు ఏర్పడటంతో అవి స్పష్టమయ్యే వరకు యజమానులు వ్యవసాయ పెట్టుబడులు పెట్టటం ఆలస్యం లేదా నిలిపివేస్తారు. దాని వలన ఈలోగా కార్మికుల వేతనాలు తగ్గిపోతాయి. పెట్టుబడి తగ్గితే ఆ మేరకు నిజ ఆదాయాలు, ఉత్పత్తి, దిగుబడులు పడిపోతాయి. మాంద్యం తలెత్తుతుంది. పెట్టుబడులు కలిగిన నిపుణులు, తెలివి తేటలు కలిగిన శ్వేతజాతీయులందరూ, తమ పరిజ్ఞానంతో సహా దేశం వదలి పోతారు. భూముల స్వాధీనం కారణంగా విదేశీ పెట్టుబడిదారులు తమ మదుపు మొత్తాలను వెనక్కు తీసుకుంటారు. అదింకెన్నటికీ తిరిగి రాదు. రాజకీయంగా చూస్తే భూ స్వాధీనం పాలక పార్టీకి మంచిదేమో గానీ ఆర్థిక విధానాల రీత్యా చాల చెడుచేస్తుంది. ఇలాంటి కబుర్లతో భయపెట్టాలన్నది వృధా ప్రయత్నమే. నష్ట పరిహారం లేకుండా భూ స్వాధీనం గురించి ఇంతవరకు చట్ట సవరణే చేయలేదు. చేస్తామని ప్రకటించగానే అప్పుడే భూములు లాగేసుకున్నట్టు, శ్వేతజాతి రైతులపై దాడులు, హత్యలు చేస్తున్నట్టు అంతర్జాతీయంగా నానా యాగీ చేస్తున్నారు.
దక్షిణాఫ్రికాలో వ్యవసాయ సమస్య కీలకమైనదే. అక్కడి జనాన్ని భూముల నుంచి వెళ్లగొట్టి వాటిని స్వాధీనం చేసుకున్నవారు పెట్టుబడిదారీ పద్ధతుల్లో వ్యవసాయం, గనుల తవ్వకం వంటి వాటిని అభివృద్ధి చేశారు. జనాన్ని దోపిడీ, అణచివేతలకు గురిచేశారు. వ్యవసాయ పంటల ఉత్పత్తి, సంపదసృష్టి, వన్యప్రాణి రక్షణ, కనీస సదుపాయాలతో జన నివాసాల ఏర్పాటు అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. జాత్యహంకార పాలన పోయింది తప్ప ఆ పాలనలో గట్టిపడిన ఆస్తి, యాజమాన్య సంబంధాలలో పెద్ద మార్పు రాలేదు. వాటి స్థానంలో నల్లజాతీయుల పెత్తనం అంటే తెల్లజాతి పెట్టుబడిదారుల స్థానంలో నల్లజాతి పెట్టుబడిదారులను పెంపొందించాలనే వైఖరులు కూడా అక్కడ కొన్ని తరగతుల్లో బలంగా ఉన్నాయి. 1994తరువాత వచ్చిన అవకాశాలను అందుకు వినియోగించుకోవాలని చూసే వారు ఉన్నారు. అనేక మంది ఇప్పటికే ఆ క్రమంలో బలంగా తయారయ్యారు. వారు శ్వేతజాతి పెత్తనాన్ని వ్యతిరేకిస్తారు తప్ప పెట్టుబడిదారీ విధానాన్ని, నయా వుదారవాద విధానాలను కాపాడేందుకు పూనుకుంటారు. గత 25ఏండ్లలో కార్మికవర్గంపై జరిగిన దాడులే అందుకు నిదర్శనం. పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలతో జాత్యహంకారాన్ని, సామాజిక అసమానతలను దూరం చేయటం, దోపిడీ, స్త్రీ పురుష వివక్షను రూపు మాపటం జరిగేది కాదు. తెల్లవారి స్ధానంలో నల్లవారు రావటం తప్ప జరిగేదేమీ ఉండదు.
దక్షిణాఫ్రికాలో భూసమస్యపై గత పాతికేండ్లలో స్ధూలంగా వెల్లడైన ధోరణుల గురించి చూద్దాం. మితవాదులైన శ్వేత జాతీయులు, ఇతరంగా స్వల్పంగా వున్న భూ కామందులు మొత్తంగా ఎలాంటి సంస్కరణలు జరగరాదని పట్టుబడుతున్నారు. లేదా భూములను వదులుకోవాల్సి వస్తే పెట్టుబడిదారీ మార్కెట్‌ రేటు ప్రకారం పరిహారం ఇచ్చి తీసుకోమంటున్నారు. నయా వుదారవాదులు అమ్మకందార్లు, కొనుగోలు దార్ల సూత్రాన్ని అమలు జరపమంటున్నారు. అంటే అది కూడా డబ్బున్నవారి యాజమాన్యంలోకే భూ బదిలీ తప్ప మరొక పురోగామి ఆలోచన కాదు. మరోవైపున భూ సంస్కరణలు ఎలా అమలు జరపాలన్న విషయంలో ఏకాభిప్రాయం లేదు. ఎలాంటి పరిహారం లేకుండా స్వాధీనం చేసుకోవాలి అన్నది ఒక వైఖరి. ఏ భూమిని స్వాధీనం చేసుకోవాలి దేనిని కూడదు అన్నది ఇంతవరకు తేల్చుకోలేదు. పట్టణ ప్రాంతాలలోని వ్యాపారులు తమ వ్యాపారాలకు గ్రామాలలో అనుబంధంగా కొన్ని వ్యవసాయ క్షేత్రాలను కలిగి ఉండటానికి అనుమతించాలని కోరుతున్నారు. భూస్వాములు కోరుతున్నట్టు మార్కెట్‌ రేట్లకు ప్రభుత్వం కొనుగోలు చేయటం అర్థం లేని విషయం. అవన్నీ కొన్ని తరాల కింద పేదల నుంచి ఎలాంటి పరిహారం లేకుండా స్వాధీనం చేసుకున్నవి, కూలీలుగా వారి శ్రమను దోచుకున్న వారి ఆధీనంలో ఉన్నవి. అన్నింటినీ మించి నయా వుదారవాద విధానాలలో భాగంగా ప్రభుత్వాలు ఉత్పాదక రంగాలలో పెట్టుబడులను పెట్టటం లేదు. దక్షిణాఫ్రికాలో భూ సంస్కరణలు అమలు జరిపి పేదలకు భూమిని ఇచ్చి సాగు చేయమంటే జరిగేది కాదు. ఇప్పటి వరకు వేలాది ఎకరాల క్షేత్రాలలో పెట్టుబడిదారీ పద్ధతులలో సాగును చూసిన అక్కడి పేదలు తమకు కేవలం భూమిని ఇస్తే ఏం చేసుకోవాలనే అనాసక్తత కూడా ఉందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అందువలన ప్రభుత్వం ఏ రూపంలో పెట్టుబడులు పెట్టాలి, ఆహార భద్రత ఎలా చేకూర్చాలి, రైతాంగానికి గిట్టుబాటు అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలేమిటి మొదలైన అనేక అంశాల మీద విధానపరమైన స్పష్టత వచ్చినపుడే సంస్కరణలు జయప్రదమౌతాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

టర్కీకి అమెరికా వెన్నుపోటు !

16 Thursday Aug 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Donald trump, NATO allies, Recep Tayyip Erdoğan, Turkey, Turkish lira, U.S.

Image result for U.S. is stabbing Turkey in the back

ఎం కోటేశ్వరరావు

ఇనకులమున జనియించిన నృపతులు ఈ దారుణము సహించెదరా, విను వీధిని శ్రేణులుగా నిలిచి విడ్డూరమును చూచెదరా, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ, విధి విధానమును తప్పించుటకు ఎవరు సాహసించెదరూ.. అంటూ కొసరాజు రాసిన పాటకు స్వరాలు సమకూర్చి స్వయంగా గానం చేసిన ఘంటసాల గీతాన్ని లవకుశ సినిమాలో చూసి కన్నీళ్లు కార్చేవారు ఇప్పటికీ వున్నారంటే అతిశయోక్తి కాదు. అది ఇతిహాస గాధ. ప్రపంచవ్యాపితంగా ఎందరినో కష్టాల పాలు చేసే, తప్పించటానికి అవకాశం వున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పలు దేశాల మీద ప్రారంభించిన వాణిజ్య లేదా ఆర్ధిక యుద్దమనే దారుణాన్ని సహించాలా, ఎలా అడ్డుకోవాలన్నది ఇప్పుడు ప్రపంచం ముందున్న వాస్తవం. అమెరికాను మనకు మంచి స్నేహదేశంగా చిత్రించేందుకు నిక్కర్ల నుంచి పాంట్స్‌కు మారిన వారు నానా తంటాలు పడుతున్నారు. అలాంటి మిత్రదేశం దెబ్బకు తొలిసారిగా మన రూపాయి గురువారం వారం నాడు ఒక దశలో ఒక డాలరుకు మారకం విలువ 70.32కి పడిపోయి సరికొత్త రికార్డును సృష్టించింది. ఒక్క మన దేశమే కాదు ప్రపంచాన్నంతటినీ ట్రంప్‌ ప్రమాదపు అంచుల వరకు తీసుకుపోతున్నాడు. మరి ఈ దారుణాన్ని ఎవరు అడ్డుకోవాలి? జనం శ్రేణులుగా నిలిచి విడ్డూరంగా చూడాలా ?

తమ ఎగుమతులపై పన్ను విధించి కరెన్సీ లీరాను దెబ్బతీసిన అమెరికాపై ప్రతీకారంగా అమెరికా కార్లపై 120శాతం, మద్యంపై 160, పొగాకు వుత్పత్తులపై 60శాతానికి దిగుమతి పన్నును టర్కీ పెంచింది. మరోవైపు 15బిలియన్‌ డాలర్ల మేరకు టర్కీలో పెట్టుబడులు పెడతామని కతార్‌ ప్రకటించటంతో లీరా కొద్దిగా కోలుకుంది.ఏడాది క్రితం సౌదీ అరేబియా నాయకత్వంలో నాలుగు అరబ్‌ దేశాలు కతార్‌పై వాణిజ్య, దౌత్యపరమైన ఆంక్షలను విధించాన్ని టర్కీ వ్యతిరేకించింది. ఇపుడు కతార్‌ ఈ విధంగా బదులు తీర్చుకుంది. టర్కీ అవసరాలలో 15బిలియన్‌ డాలర్లు చిన్న మొత్తమే అయినప్పటికీ అమెరికాకు వ్యతిరేకంగా సాధించిన నైతిక విజయమిది.

దశాబ్దాల తరబడి ఆంక్షలతో క్యూబాను అతలాకుతలం చేసిన అమెరికా తాత్కాలికంగా వెనక్కు తగ్గింది. గత కొద్ది సంవత్సరాలుగా వామపక్ష పాలనలో వున్న వెనెజులా, నయా పెట్టుబడిదారీ ఏలుబడిలో వున్న రష్యా, మతశక్తుల ఏలుబడిలో వున్న ఇరాన్‌, పొరుగునే వున్న మిత్రదేశాలు మెక్సికో, కెనడా, సోషలిస్టు దేశమైన చైనాపై ఆర్ధిక, వాణిజ్య దాడులను జరుపుతున్నది. ఐరోపా యూనియన్‌తో తాత్కాలిక రాజీకుదుర్చుకుంది. పాతికేండ్ల క్రితం సోవియట్‌ యూనియన్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలలోని సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత తమకిక ఎదురులేదని ప్రకటించుకున్న అమెరికా ఇప్పుడు బస్తీమే సవాల్‌ అంటూ తన, పరబేధం లేకుండా ఎందుకు కత్తులు దూస్తున్నది? పర్యవసానాలేమిటి? తాజాగా మన రూపాయి రికార్డు పతనానికి కారణం నాటో కూటమిలో కీలక సభ్యదేశమైన టర్కీపై అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ఆదేశాన్ని ఏ క్షణంలో అయినా పతనంలోకి నెట్టే అవకాశం వుందని విశ్లేషకులు చెబుతున్నారు.

అమెరికా ఆర్ధిక, రాజకీయ, మిలిటరీ ఎత్తుగడులలో ఎంతో కీలకమైనది ఐరోపా కేంద్రంగా వున్న నాటో కూటమి.దానిని మరింతగా విస్తరించేందుకు ఒకవైపు పూనుకున్న అమెరికా మరోవైపు కీలకమైన భాగస్వామి టర్కీతో సంబంధాలను దెబ్బతీసేందుకు పూనుకుంది. తమను వెన్నుపోటు పొడిచేందుకు అమెరికా చూస్తున్నదని టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయిప్‌ ఎర్డోగన్‌ తాజా పరిణామాలపై వ్యాఖ్యానించాడు.ఆర్ధిక యుద్ధాల తూటాలు, ఫిరంగి గుండ్లు, క్షిపణులను ప్రయోగించినప్పటికీ తాము వెనక్కు తగ్గేది లేదని హెచ్చరించాడు. టర్కీ కరెన్సీ లీరా పతనమైన కారణంగానే తాము పన్నులను పెంచినట్లు ట్రంప్‌ తన చర్యను సమర్ధించుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు లీరా 41శాతం పతనమైంది. దీంతో టర్కీలో విదేశీ వస్తువుల ధరలు పెరిగిపోయి డిమాండ్‌ తగ్గిపోయింది. వీటిని సాకుగా చూపి గతవారంలో టర్కీ నుంచి దిగుమతి అయ్యే వుక్కుపై 50, అల్యూమినియంపై 20శాతం చొప్పున సుంకాన్ని విధించటంతో టర్కీ కరెన్సీ లీరా, స్టాక్‌ మార్కెట్‌ మరింతగా పతనమయ్యాయి, ద్రవ్యోల్బణం 15శాతానికి పెరిగింది. ఇవన్నీ ఆర్ధిక సంక్షోభానికి దారితీయవచ్చని భావిస్తున్నారు.దీనికి మతాధికారి ఆండ్రూ బ్రూసన్‌ను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌ను కూడా ట్రంప్‌ సర్కార్‌ జోడించింది. టర్కీ యూరేసియా దేశం.ఐరోపాలో ఎక్కువ భాగం వుండటంతో అక్కడి ఏకైక ముస్లిం దేశంగా పరిగణిస్తారు. ఐరోపాలోని గ్రీస్‌, బల్గేరియా, యూరేసియాలోని జార్జియా, ఆర్మీనియా, అజర్‌బైజాన్‌, ఆసియాలోని ఇరాన్‌, ఇరాక్‌, సిరియాలు సరిహద్దుగా వుంది. ఈ ప్రాంతంలో అమెరికా తన ప్రయోజనాలకు పెద్ద పీట వేయటంతో విధిలేక కొన్ని సార్లు అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరించుతున్నది, తాజా వివాదానికి నేపధ్యమిదే. నిజానికి అమెరికా చేసుకొనే దిగుమతుల్లో టర్కీ నుంచి వుక్కు 4.2, అల్యూమినియం ఒకశాతం లోపే వున్నది. అందువలన వీటి కంటే రాజకీయకారణాలే ప్రస్తుతం వుభయ దేశాల మధ్య విబేధాల పెరుగులకు కారణాలుగా చెప్పవచ్చు.

2003లో జార్జి డబ్ల్యు బుష్‌ నాయకత్వంలో ఇరాక్‌పై అమెరికా దాడి చేసింది. అది మొదలు ఆ ప్రాంతంలో అమెరికా ప్రమేయంతో జరుగుతున్న పరిణామాలలో టర్కీకి సమస్యలు తలెత్తుతూనే వున్నాయి. టర్కీ, ఇరాన్‌, సిరియా సరిహద్దు ప్రాంతంలో కుర్దులు పెద్ద సంఖ్యలో వున్నారు. ఇజ్రాయెల్‌ మాదిరి తమకు ప్రత్యేకంగా కుర్దిస్దాన్‌ ఏర్పాటు చేయాలన్నది ఎప్పటి నుంచో వారి డిమాండ్లలో ఒకటి. అది జరిగితే ఆ ప్రాంత దేశాల స్వరూపమే మారిపోతుంది కనుక ఎవరూ అంగీకరించటం లేదు. పశ్చిమాసియా వివాదాలలో అమెరికన్లు కుర్దులకు మద్దతు తెలిపి వారిని పావులుగా వాడుకుంటున్నారు. సిరియాలో అసాద్‌ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఐఎస్‌ తిరుగుబాటుదార్లను ఎదుర్కోవటంలో కుర్దులది ప్రధాన పాత్ర. వారికి అమెరికా మద్దతు ఇస్తున్నది. ఇరాక్‌, టర్కీలలోని కుర్దులు తమకు ప్రత్యేకం దేశం కావాలంటూ చేస్తున్న సాయుధ చర్యలను అక్కడి ప్రభుత్వాలు అణచివేస్తున్నాయి.

రెండు సంవత్సరాల క్రితం టర్కీలో ఒక విఫల తిరుగుబాటు జరిగింది. దానికి కుర్దిస్ధాన్‌ వర్కర్స్‌ పార్టీ, దానితో సంబంధాలున్న అమెరికా మతాధికారి ఆండ్రూ బ్రున్‌సన్‌ సంధానకర్తగా వున్నాడని భావించిన టర్కీ ప్రభుత్వం అతగాడిని అరెస్టు చేసి విడుదలకు తిరస్కరించింది. ప్రస్తుతం అధికారంలో వున్న ఎకెపి పార్టీ సహకారంతో రెండు దశాబ్దాల క్రితం టర్కీలో గులెన్‌ పేరుతో ఒక ఇస్లామిక్‌ సంస్ధ వునికిలోకి వచ్చింది. ప్రభుత్వ అండదండలతో దానితో సంబంధం వున్న అనేక మంది ప్రభుత్వ యంత్రాంగంలోకి చొరబడ్డారు. అది ఎంతవరకు వచ్చిందంటే పోలీసు, న్యాయవ్యవస్ధలోని గులెన్‌ సభ్యులు, ఆ సంస్ధను పెంచి పోషించిన ఎకెపి పార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరు తలెత్తింది. చివరకు అధ్యక్షుడు ఎర్డోగన్‌పై తిరుగుబాటుకు ఆ సంస్ధ పురికొల్పింది. అయితే దానిని కఠినంగా అణచివేశారు. దానికి సహకరించాడంటూ అమెరికా మతాధికారిని అరెస్టు చేసి గులెన్‌ ఒక వుగ్రవాద సంస్ధ అని ప్రకటించింది.తిరుగుబాటును ప్రోత్సహించిన ఫతుల్లా గులెన్‌ అమెరికాలోని పెన్సిల్వేనియాలో వుంటున్నాడు. అతడిని తమకు అప్పగించాలన్న టర్కీ డిమాండ్‌ను అమెరికా తిరస్కరించింది. వుగ్రవాదం పట్ల అమెరికా మెతకగా వుందంటూ టర్కీ విమర్శించింది. అప్పటి నుంచి వుభయ దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేవు. ఒక దేశాన్ని లొంగదీసుకోవాలంటే దాని ఆర్ధిక మూలాలను దెబ్బతీయటం అమెరికా ఆయుధాల్లో ఒకటి. టర్కీ విషయంలో అదే జరుగుతోందా ? ఇటీవలి కాలంలో జరిగిన మరికొన్ని పరిణామాలు అమెరికాకు మింగుడు పడటం లేదు.

అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వుపసంహరించుకున్న అమెరికా ఇరాన్‌పై విధించిన ఆంక్షలను తాము ఖాతరు చేసేది లేదని టర్కీ ప్రకటించింది. ఇటీవలి కాలంలో అమెరికా ప్రత్యర్ధి అయిన రష్యాతో టర్కీ సంబంధాలు పెరుగుతున్నాయి. క్షిపణులను కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. అది అమెరికన్లను మరింత ఆగ్రహానికి గురిచేస్తున్నది. సిరియాలో రష్యా మద్దతు వున్న ప్రభుత్వానిది పైచేయిగా వుంది. రష్యా, ఇరాన్‌, టర్కీలే సిరియా పరిణామాలను నిర్దేశించేవని ఇప్పటికే తేలిపోయింది. అమెరికన్లకు అది పరాభవమే. చైనా చొరవతో ప్రారంభమైన సిల్క్‌ రోడ్‌తో పాటు చైనా, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం, తదితర చర్యలు సిరియా పునర్‌నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించటంతో పాటు ఇరాన్‌ స్ధిరపడటానికి దోహదం చేసేవిగా వున్నాయి. ఇది అమెరికన్లకు ఏమాత్రమూ అంగీకారం కాదు. సిరియా తదితర పరిణామాలలో అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్‌ నిలబడుతోంది. ఇరాన్‌తో వాణిజ్యాన్ని వదులుకొనేది లేదని చైనా స్పష్టం చేసింది. అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యా తన వెసులుబాటు కోసం ఇరాన్‌ వంటి దేశాలతో సంబంధాల మెరుగుదలకు చమురురంగంలో పెట్టుబడుల వంటివాటితో పూనుకుంది.

ఒక మతాధికారిని అడ్డం పెట్టుకొని టర్కీని తమ కాళ్లముందు పడేసుకోవాలని చూస్తోందని ఎర్డోగన్‌ మండిపడ్డారు. అమెరికా గనుక తన పద్దతులను మార్చుకోనట్లయితే తాము కొత్త స్నేహితులు, కలసి వచ్చే వారికోసం చూడాల్సి వస్తుందని న్యూయార్క్‌టైమ్స్‌ పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు. గత ఆరుదశాబ్దాల కాలంలో అమెరికాతో కలసి తాము ఎలాపని చేసిందీ ఏకరువు పెట్టి అవన్నీ మరచిపోయి తమతో వ్యవహరిస్తున్నారని, తమ పౌరుల ఆందోళనను అర్ధం చేసుకోవటం లేదని పేర్కొన్నాడు. తమ దేశంలో జరిగిన తిరుగుబాటు మీద సంతృప్తికరంగా అమెరికా స్పందించలేదని, తిరుగుబాటకు కారకుడైన వ్యక్తిని తమకు అప్పగించలేదని పేర్కొన్నాడు. ఒక మతాధికారి కోసం మీరు నాటోలోని మీ వ్యూహాత్మక భాగస్వామిని మార్చేందుకు చూస్తున్నారు, బెదిరింపులతో మా దేశాన్ని మీదారికి తెచ్చుకోలేరు, మీకు డాలర్లు వుంటే మాకు అల్లా వున్నాడు, మేము స్వాతంత్య్రంతో పోరాడతాము అని హెచ్చరించాడు.అమెరికా స్వయంగా వుగ్రవాద గ్రూపుగా ప్రకటించిన సిరియా మద్దతు వున్న పికెకె సంస్ధకు అమెరికా ఐదువేల ట్రక్కులు, రెండువేల విమానాల ద్వారా ఆయుధాలను అందచేసిందని, ఆ సంస్ధ చేతిలో 1984 నుంచీ వేలాది మంది తమ పౌరులు మరణించారని పేర్కొన్నాడు. అమెరికా వాణిజ్య యుద్దం ప్రారంభించిన నేపధ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఎర్డోగన్‌ ఫోన్లో సంభాషించాడు.

టర్కీ పాలకుల విషయానికి వస్తే అమెరికా అనుచిత కార్యకలాపాలన్నింటిలో భాగస్వాములయ్యారు.దేశంలో భిన్నాభిప్రాయాన్ని అణచివేయటంలో పేరు మోశారు. వ్యూహాత్మక స్ధానంలో వున్న కారణంగా అమెరికా, ఇతర పశ్చిమ ఐరోపా ధనిక దేశాల మాదిరి ప్రాంతీయ పరిణామాలలో పాత్రవహించాలని సహజంగానే కోరుకుంటారు. అమెరికా బలంగా వున్నపుడు ఎర్డోగన్‌ వంటి వారు ఎలా తలొగ్గుతారో బలహీనపడినపుడు దాని నుంచి లబ్ది పొందేందుకు కూడా అదే మాదిరి తలెత్తుతారు. టర్కీ తీరుతెన్నులు ఇప్పుడు అలాగే వున్నాయి. ఇప్పుడున్న స్ధితిలో మరో అధికార కేంద్రం పెరగటాన్ని అమెరికా అంగీకరించదు. టర్కీ నాటో సభ్యురాలు, రష్యా ఆ కూటమికి ప్రధమ శత్రువు, తోటి సభ్యురాలిపై అమెరికా కత్తి గట్టింది. సిరియాకు రష్యా పూర్తి మద్దతు ఇస్తున్నది. సిరియాపై గతంలో ఐఎస్‌ తీవ్రవాదులు దాడి చేసేందుకు టర్కీ ప్రాంతాన్ని అమెరికా వుపయోగించుకుంది. ఇప్పుడు మారిన పరిస్ధితులలో ఐఎస్‌ తీవ్రవాదులను ఎదుర్కొనేందుకు టర్కీలోని వైమానిక స్ధావరాన్ని నాటో వినియోగిస్తున్నది. అమెరికా తమపై కత్తి కట్టింది కనుక దాన్ని మూసివేయాలని కొందరు వత్తిడి తెస్తున్నారు. టర్కీ దిగుమతి చేసుకొనే చమురులో సగం ఇరాన్‌ నుంచే వస్తోంది. అమెరికా ఆంక్షలను టర్కీ తిరస్కరించింది. నాటో సభ్యురాలైనప్పటికీ రష్యా నుంచి టర్కీ క్షిపణులను కొనుగోలు చేస్తున్నది. ఇవన్నీ ఒక సంక్లిష్ట పరిస్ధితికి నిదర్శనం.ఐరోపా యూనియన్‌ తక్షణమే అమెరికాతో ఘర్షణకు దిగటానికి సిద్ధం కాదు కనుకనే పన్నుల విషయంలో తాత్కాలిక రాజీకి వచ్చింది. అమెరికాకు అనేక షరతులు విధించింది. ఐరోపా కార్పొరేట్ల ప్రయోజనాలకు దెబ్బతగలనంత వరకే ఈ రాజీ. అమెరికా వత్తిడికి తలొగ్గిన టర్కీ సర్కార్‌ మతాధికారి బ్రున్స్‌న్‌ను జైలు నుంచి గృహనిర్భంధానికి మార్చింది. తాజా వివాదంలో బ్రున్సన్‌ ఒక తురుపు ముక్క మాత్రమే. నల్ల సముద్రం, మధ్యప్రాచ్చం, పసిఫిక్‌ సముద్రాల మధ్య వున్న టర్కీ ప్రాధాన్యత గురించి అమెరికన్లకు తెలియదనుకోవటం పొరపాటు. అందువలన తెగేదాక లాగకపోవచ్చు. ఒకవేళ అదే జరిగితే ప్రపంచ రాజకీయాల పరిణామాలు మరో మలుపు తిరుగుతాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ అబద్దాలు, అదిరింపులు, బెదిరింపులతో నాటో భేఠీ !

14 Saturday Jul 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, Politics, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

Donald trump, lies, NATO, nato brussels summit 2018, scares, threats

Image result for nato brussels summit 2018

ఎం కోటేశ్వరరావు

గత కొద్ది నెలలుగా జరుగుతున్న పరిణామాలను చూస్తున్న వారికి ఒక మౌలిక ప్రశ్న తలెత్తుతోంది.అమెరికా పాలకవర్గం(దాని ప్రతినిధులు రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ పార్టీలనేతలు) ప్రపంచాన్ని ఏవైపు తీసుకుపోతున్నది? పర్యవసానాలు ఎలా వుంటాయి? ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకున్న డోనాల్డ్‌ ట్రంప్‌, వుత్తర కొరియాతో అణు సమస్యపై తొలిసారిగా ఒక ఒప్పందానికి వస్తున్నట్లు ప్రకటించాడు. ఇరాన్‌తో ఏ దేశమైనా లావాదేవీలు జరిపితే వాటి మీద కూడా తన కొరడా ఝళిపిస్తానని భారత్‌ వంటి దేశాలను బెదిరించాడు.కెనడాలో జరిగిన జి7 సమావేశంలో అన్నింటా తన అనుయాయిగా వున్న కెనడా, ఇతర మిత్ర దేశాల మీద విరుచుకుపడ్డాడు. చైనాతో పాటు కెనడా, మెక్సికో, ఐరోపా యూనియన్‌ మీద కూడా వాణిజ్య యుద్దం ప్రకటించాడు. తాజాగా ఈనెల 11,12 తేదీలలో జరిగిన నాటో కూటమి దేశాల సమావేశంలో మిలిటరీ ఖర్చు పెంచుతారా లేదా అంటూ బెదిరింపులకు దిగాడు. ఐరోపా యూనియన్‌లో అగ్రరాజ్యమైన జర్మనీపై విరుచుకుపడుతూ ఇంధనం కోసం రష్యా చేతిలో బందీ అయిందని మండిపడ్డాడు. నాటో ఖర్చు అంతటినీ అమెరికాయే భరిస్తోందంటూ అతిశయోక్తులు పలికి అపహాస్యం పాలయ్యాడు. అంతే కాదు దాదాపు అన్ని విషయాల్లో అమెరికాకు వత్తాసు పలుకుతూ, ఐరోపా యూనియన్‌లో అమెరికా ఏజంటు వంటిది అని పేరు తెచ్చుకున్న బ్రిటన్‌ను కూడా ట్రంప్‌ వదల్లేదు. ప్రధాని థెరెస్సా మే గురించి, బ్రెక్సిట్‌ గురించి నోరుపారవేసుకున్నాడు. దీంతో సోమవారం నాడు బ్రిటన్‌ పర్యటనలో లక్షలాది మంది నిరసన ఎదుర్కొన్నాడు. బ్రసెల్స్‌ నాటో సమావేశంలో నిజమైన బేధాభిప్రాయం దానికి నిధుల చెల్లింపు గురించే అని నాటో వర్గాలు వెల్లడించాయి. లోపల ఎన్ని బేధాభిప్రాయాలు వున్నా, ట్రంప్‌ ప్రవర్తనపై అసంతృప్తి వున్నా ఐరోపా నేతలు సంయమనం పాటించారు. తాత్కాలికంగా అయినా ట్రంప్‌ను సంతృపరచేందుకు ప్రయత్నించారు. ఈ పరిణామలన్నీ దేనికి సూచిక ?

ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ముఖ్యంగా సోవియట్‌ పూర్వపు రిపబ్లిక్‌లైన జార్జియా, వుక్రెయిన్లలో రష్యా మిలిటరీ జోక్యం ముగిసిందనుకున్న ప్రచ్చన్న యుద్ధం మరో రూపంలో ప్రారంభం అవుతుందా అన్న ప్రశ్నను రేకెత్తించాయి. రష్యాను ఒంటరిని చేయాలని నాటో అనే శిఖండిని ముందు పెట్టుకొని అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు ఎలా ప్రయత్నిస్తున్నాయో రష్యా కూడా నాటోలో రాజకీయ విబేధ విత్తనాలు నాటేందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. బ్రసెల్స్‌ సమావేశాల్లో వాటి గురించి స్వయంగా అమెరికాయే బయటపడటం విశేషం. రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికా, ఐరోపా దేశాలు 1949లో వుమ్మడి మిలిటరీ రక్షణ కూటమిగా వుత్తర అట్లాంటిక్‌ సంధి సంస్ధ(నాటో)గా ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటిలో 29దేశాలు వున్నాయి. నాటి సోవియట్‌ నుంచి రక్షించుకొనే పేరుతో ఏర్పడిన ఈ సంస్ధ 1991 అది రద్దయిన తరువాత కూడా కొనసాగటమే కాదు, దాని ఖర్చును రెట్టింపు చేయాలని తాజాగా బ్రసెల్స్‌లో జరిగిన సమావేశంలో డోనాల్డ్‌ ట్రంప్‌ సభ్యరాజ్యాలను డిమాండ్‌ చేశాడు. గత ఏడు దశాబ్దాలలో కమ్యూనిస్టు సోవియట్‌ లేదా తరువాత దాని వారసురాలిగా మారిన పెట్టుబడిదారీ రష్యా గానీ నాటో సభ్యరాజ్యాల మీద దాడి లేదా ప్రయత్నం కూడా చేయలేదు. అయినా సరే దాన్నింకా బలపరచాలని అమెరికా కోరటం వెనుక వున్న వుద్దేశ్యం ఏమిటి? ఎవరి నుంచి ముప్పు వస్తుస్తుందని ఐరోపా రాజ్యాలు భయపడుతున్నాయి?

1991లో సోవియట్‌ యూనియన్‌ను కూల్చివేశారు. అప్పటి వరకు దానికి వ్యతిరేకంగా పని చేసిన నాటో తదుపరి ప్రయాణం ఏదిశగా సాగాలి, అసలు కొనసాగటం అవసరమా అన్న దిశలో చర్చలు జరిగాయి. పశ్చిమ ఐరోపాతో పాటు తూర్పు ప్రాంతానికి కూడా రక్షణ ఛత్రాన్ని విస్తరింప చేయాలని నాటి బిల్‌క్లింటన్‌ సర్కార్‌ మొగ్గు చూపింది. ప్రపంచం మీద పెత్తనం కొనసాగించాలన్నదే అంతర్గత అంశం. సోవియట్‌ ముప్పు లేకపోయిన తరువాత ఐరోపా రక్షణకు అమెరికా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదని కొంత మంది అమెరికా రక్షణశాఖలో అభిప్రాయాలు వెల్లడయ్యాయి. నాటో విస్తరణ కూటమిని పలుచన చేస్తుందని బ్రిటన్‌, విస్తరణ నాటో ప్రభావాన్ని అవసరానికి మించి పెంచుతుందని ఫ్రాన్స్‌ భయం వ్య్తం చేసింది. చిత్రం ఏమిటంటే 69 సంవత్సరాల క్రితం నాటో ఏర్పాటు లక్ష్యం వేరు, ఆచరణలో దాన్ని వినియోగిస్తున్న తీరు వేరుగా వుంది. నాటో ఒప్పందం ప్రకారం ఐరోపా, వుత్తర అమెరికా ఖండంలోని సభ్య రాజ్యాలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటిపై ఎవరైనా దాడి చేస్తే అందరి మీద జరిగిన దాడిగా పరిగణించి ప్రతిఘటించాలి. ఇంతవరకు ఒక్కటంటే ఒక్కటి కూడా అటువంటి దాడి జరగలేదు. సరికదా నాటో దేశాల సరిహద్దుల వెలుపల నాటో సభ్య దేశాలే ఏదో ఒకసాకుతో మిలిటరీ జోక్యం చేసుకుంటున్నాయి. కొత్త భద్రతా సమస్యలు తలెత్తాయనే పేరుతో దాన్ని కొనసాగించేందుకు కొత్త సాకులు వెతుకుతున్నాయి.

Nato

1990దశకంలో నాటి యుగోస్లావియా జాతుల విబేధాలతో ముక్కలైంది. ఐక్యరాజ్యసమితి బోస్నియా, హెర్జెగోవినా మీద విమానాలు ఎగరకూడదని ఆంక్షలు విధించింది. దాన్ని అవకాశంగా తీసుకొని తొలిసారిగా నాటో దళాలు 1994లో నాలుగు బోస్నియా విమానాలను కూల్చివేశాయి. ఆ తరువాత కొసోవోలో శాంతి పరిరక్షణ పేరిట, మధ్యధరా సముద్రంలో భద్రతా గస్తీ, సోమాలియాలో ఆఫ్రికన్‌ దళాలకు మద్దతు, ఆఫ్ఘనిస్తాన్‌లో వుగ్రవాదానికి వ్యతిరేకంగా మద్దతు పేరుతో నాటో జోక్యం చేసుకుంది. ఇవన్నీ అమెరికా, ఐరోపా సామ్రాజ్యవాద ఎత్తుగడలు, లక్ష్యాలలో భాగంగానే జరిగాయి తప్ప ఐరోపాకు వచ్చిన ముప్పేమీ లేదు. ఇంతే కాదు ఐక్యరాజ్యసమితి లక్ష్యాలను నీరుగార్చి, దాని లక్ష్యాలను కూడా దెబ్బతీసే విధంగా నాటో రాజ్యాలు వ్యవహరిస్తున్నాయి. వుదాహరణకు లిబియా మీద 2011లో ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించింది. వాటిని అమలు జరిపే పేరుతో రంగంలోకి వచ్చిన అమెరికా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌ తరువాత కొద్ది రోజుల్లోనే ఆ బాధ్యతను నాటో కమాండ్‌కు అప్పగించాయి. టర్కీ ఆందోళన వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకోలేదు.లిబియాపై దాడులు చేసేందుకు జర్మనీ, పోలాండ్‌ తిరస్కరించాయి.

తమ సభ్యదేశంపై జరిగిన దాడిని వుమ్మడిగా ఎదుర్కోవాలనే సూత్రాన్ని 2001లో ఆప్ఘనిస్తాన్‌లో నాటో ముందుకు తెచ్చింది. వుగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే పేరుతో అక్కడ జోక్యం చేసుకుంది అమెరికా.అమెరికా సేనల మీద దాడులు జరిపింది ఆల్‌ఖైదా వుగ్రవాదులు. దానికి నాటో సూత్రానికి లంకెపెట్టి అమెరికా నాయకత్వంలోని దళాలు అక్కడి ప్రభుత్వానికి సాయం చేసే పేరుతో తిష్టవేశాయి. రెండు సంవత్సరాల తరువాత ఆ బాధ్యతను నాటో స్వీకరించింది.అయితే కొన్ని దేశాలు జాతీయ కారణాలు చూపి ఆ దాడులకు తమ సైన్యాన్ని పంపలేదు. నాటో, దాని భాగస్వామ్య దేశాల పేరుతో 50కిపైగా దేశాల నుంచి లక్షా 30వేల మంది సైన్యాన్ని దించి 2014వరకు దాడులు చేశారు. వాటిలో వుగ్రవాదుల చేతుల్లో మరణించిన వారిలో చురుకుగా పాల్గన్న అమెరికా, బ్రిటన్‌, కెనడా, నెదర్లాండ్స్‌ వంటి దేశాలవారే అధికులు. ఆ తరువాత గత నాలుగు సంవత్సరాలుగా అక్కడి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పేరుతో 16వేల మంది నాటో సైనికులు అక్కడ కొనసాగుతుండగా వారిలో సగం మంది అమెరికన్లే. అదే ఆల్‌ఖైదా వుగ్రవాదులకు అమెరికాతో పాటు ఐరోపా పశ్చిమ దేశాలన్నీ అన్ని రకాలుగా మద్దతు ఇచ్చి సిరియాలో వున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయించటాన్ని గమనించాలి. వాటికి వ్యతిరేకంగా అక్కడ రష్యా సేనలు సిరియాకు మద్దతు ఇస్తున్నాయి. నాటో విస్తరణ ఐరోపాకే పరిమితం చేయలేదు. రష్యాను చుట్టుముట్టేందుకు ఆసియాలోని అజర్‌బైజాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ తదితర దేశాలకు సైతం ఏదో ఒకసాకుతో విస్తరించేందుకు పూనుకున్నారు. దీని వెనుక రష్యాను దిగ్బంధనం చేయటంతో పాటు ఇరాన్‌ సరిహద్దుల వరకు నాటో పేరుతో అమెరికా దళాలను రప్పించే ఎత్తుగడ వుంది. అజర్‌బైజాన్‌ సరిహద్దులో ఇరాన్‌ వుంది. 1990దశకంలో జర్మనీ ఏకీకరణ సమయంలో నాటోను తూర్పు దిశగా విస్తరించబోమని అమెరికా ఇచ్చిన హామీలకు భిన్నంగా తూర్పుకే కాదు, చివరకు ఆసియాకు సైతం వస్తున్నది. అందువలన నాటో ఏర్పడిన లక్ష్యాలకు, ఇప్పుడు చేస్తున్నదానికి వున్న ఏకైక లక్ష్యం ఏమిటంటే అప్పుడూ ఇప్పుడూ ఈ ప్రాంతంపై అమెరికా పెత్తనాన్ని విస్తరించటమే. నాటోను కొనసాగించితే దీర్ఘకాలంలో ప్రమాదముంటుంది, అదే తూర్పుదిశగా వేగంగా విస్తరింపచేస్తే రష్యాను నయా సామ్రాజ్యవాద దేశంగా మార్చటానికి దారితీస్తుందని 1994లో అమెరికా విదేశాంగ మంత్రి వారెన్‌ క్రిస్టోఫర్‌ హెచ్చరించారు. అయితే రష్యా, నాటో వైపు నుంచి కూడా పరిస్ధితిని దిగజార్చకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వుక్రెయిన్‌ తూరుప్రాంతంలోని క్రిమియాను రష్యా తనలో విలీనం చేసుకుంది. జార్జియాలో కూడా జోక్యం చేసుకొని తన పలుకుబడిని పెంచుకుంటున్నది . వాటిని చూపి ఐరోపాకు ముప్పుతొలగలేదని అమెరికా చెబుతున్నది. రష్యాపై ఆంక్షలను విధిస్తున్నది. వాటిని కొన్ని ఐరోపా దేశాలు సమర్ధిస్తున్నాయి. 2014 నుంచి రష్యాతో పౌర, మిలిటరీ సహకారాన్ని నాటో నిలిపివేసింది. తూర్పు ఐరోపాలో బాల్టిక్‌ సముద్ర ప్రాంతంలో మిలిటరీ కార్యకలాపాలను పెంచింది. ఈ రెండు దేశాలను నాటోలో చేర్చుకుంటే పర్యవసానాలు తీవ్రంగా వుంటాయని రష్యా హెచ్చరిస్తున్నది. ఈ కారణంగానే ఆ దేశాలను నాటోలో చేర్చుకొనేందుకు కూటమి దేశాలు తొందరపడటం లేదు. వాటిని ఈపాటికి చేర్చుకొని వుంటే పరిణామాలు, పర్యవసానాలు వేరే విధంగా వుండి వుండేవి. అయితే రష్యా మద్దతు వున్న తిరుగుబాటదార్లను అదుపు చేసే పేరుతో వుక్రెయిన్‌కు అత్యంత అధునాత ఆయుధాలను అమెరికా విక్రయిస్తున్నది. క్రిమియాను విలీనం చేసుకున్న తరువాత అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ చేసిన వుపన్యాసంలో నాటో కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ అనేకసార్లు వారు మాతో అబద్దాలు చెప్పారు, మాకు తెలియకుండా నిర్ణయాలు తీసుకున్నారు, తూర్పు దిశగా నాటో విస్తరణ జరిగింది, మా సరిహద్దులలో మిలిటరీ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు, ఒక్క ముక్కలో చెప్పాలంటే మమల్ని అదుపు చేయాలనే పశ్చిమదేశాల విధానంతో పద్దెనిమిది, పందొమ్మిది, ఇరవయశతాబ్దాలలో నడిచాయి, నేడు కూడా కొనసాగిస్తున్నాయి.’ అన్నారు.

తమదేశంతో సహా రష్యా విదేశాల ఎన్నికలలో జోక్యం చేసుకుంటున్నది, నూతన అణ్వాయుధాలను తయారు చేస్తున్నది. ఐరోపాలోని వ్యవస్ధలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నది, ఐరోపా రక్షణలో అమెరికా విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నది అని అమెరికా ఆరోపిస్తున్నది. ఐరోపాలో తాను ఏర్పాటు చేస్తున్న పరిమిత క్షిపణి రక్షణ వ్యవస్ధలు ఇరాన్‌ దాడిని ఎదుర్కొనేందుకు అని అమెరికా చెబుతున్నది. ఈ మాటలను ఎవరూ నమ్మరని వేరే చెప్పనవసరం లేదు. క్రిమియాలో రష్యా జోక్యాన్ని సాకుగా చూపుతూ తటస్ధ దేశాలుగా వున్న ఫిన్లండ్‌, స్వీడన్‌లను కూడా నాటో చేర్చుకొనేందుకు పావులు కదుపుతున్నారు. ఇదే సమయంలో రష్యా నుంచి ఆధునిక క్షిపణి వ్యవస్ధలను సమకూర్చుకొనేందుకు టర్కీ పాలకులు ప్రయత్నించటానికి నాటోలోని మిగతా దేశాలు అభ్యంతర పెడుతున్నాయి.

ఈ పూర్వరంగంలో జూలై 11,12 తేదీలలో బ్రసెల్స్‌లో నాటో కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశాలలో ట్రంప్‌ వ్యవహరించిన తీరు అపహాస్యం పాలైంది. బ్రసెల్స్‌ సమావేశం విజయవంతమైందని ట్రంప్‌ ప్రకటించాడు. సభ్యదేశాల నేతలతో తన సంబంధాలు ఎంతో బాగున్నాయని మరీ మరీ చెప్పాడు. అయితే జరిగిన పరిణామాలు అలా కనిపించటం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్‌-రుమేనియా అధ్యక్షుడు క్లాస్‌ లోహానిస్‌ భేఠీ వార్తల సేకరణ వుందంటూ ప్రధాన వార్తా కేంద్రం నుంచి వెళ్లిపోయిన రుమేనియా విలేకర్లు వెంటనే తిరిగి వచ్చి సమావేశం రద్దయినట్లు తెలిపారు. అంతే కాదు అజర్‌బైజాన్‌, వుక్రెయిన్‌, జార్జియానేతలతో వుందన్న సమావేశాల పరిస్ధితీ అదే అయింది.

గతంలో సభ్యరాజ్యాల స్ధూల జాతీయాదాయం(జిడిపి)లో రెండుశాతం మొత్తాన్ని 2024నాటికి రక్షణకు కేటాయించాలని నాటో నిర్ణయించింది.దాన్ని వచ్చే జనవరి నాటికే అమలు చేయాలని, తరువాత నాలుగుశాతానికి పెంచాలని ట్రంప్‌ పట్టుపట్టాడు. అతగాడితో ఇప్పుడు గొడవెందుకు సరే అలాగే చేద్దాం లెమ్మన్నట్లుగా సభ్యదేశాల స్పందన వుంది. ఈ సమావేశాలలో అమెరికా ఆయుధ కంపెనీల ప్రతినిధిగా ట్రంప్‌ విశ్వరూపం కనిపించింది అంటే అతిశయోక్తి కాదు. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ‘నేను అధికారానికి రాక ముందు ఆయుధాల గురించి విన్నాను గానీ పదవిలోకి వచ్చాక నేను నిజంగా తెలుసుకున్నాను. ఇతరులు తయారు చేసే వాటి కంటే మావి ఎంతో మెరుగైనవి, మీరు మాకంపెనీలు లాక్‌హీడ్‌, బోయింగ్‌, గ్రమ్మన్‌ వంటి వాటిని చూడండి, ఎలాంటి మెటీరియల్‌ను వాడుతున్నామో, ఎంతో నాణ్యమైన పరికరాలను తయారు చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ మా పరికరాలను కొనుగోలు చేయాలని కోరుకుంటున్నారు. వారెంతో మంచి పని చేస్తున్నారు, వారందరికీ చేయగలరా? కాబట్టి వాటిలో కొన్ని దేశాలకు సాయపడుతున్నాం, మంచి పరికరాలను కొనుగోలు చేయగలుగుతున్నారు.’ ఇలా ఒక కంపెనీ ప్రతినిధి తప్ప ఒక దేశాధినేత చెప్పే మాటలుకావు. ఈ సమావేశాలలో ట్రంప్‌ తన అజెండాకు ఆమోదముద్ర వేయించుకున్నాడా లేదా అన్న చర్చ జరుగుతోంది.

సమావేశాల ప్రారంభంలోనే ట్రంప్‌ జర్మనీపై దాడికి దిగాడు. ఇంధనం కోసం ఎక్కువగా ఆధారపడి తనంతట తానే రష్యాకు బందీ అయిందని, నాటో రక్షణ నిమిత్తం చెల్లింపులలో విఫలమైందని ఆరోపించాడు. చమురుకైతే బిలియన్లకు బిలియన్లు చెల్లిస్తారు గానీ నాటో విషయంలో ముందుకు రారు అని వ్యాఖ్యానించాడు. ‘ జర్మనీని రష్యా పూర్తిగా అదుపు చేస్తోంది. ఈ దేశాలు(నాటో కూటమి) కేటాయింపులు పెంచాలి, దశాబ్దకాలంలో కాదు, వెంటనే కేటాయించాలి.జర్మనీ ధనిక దేశం, వారు కొద్దికొద్దిగా 2030నాటికి పెంచుతామంటున్నారు. వారు తక్షణమే, రేపే పెంచితే మాకెలాంటి సమస్య వుండదు.(విలేకర్ల సమావేశంలో పక్కనే వున్న నాటో ప్రధాన కార్యదర్శి స్టోల్టెన్‌ బర్గ్‌తో మాట్లాడుతూ) ప్రతి ఏటా గ్యాస్‌ కోసం జర్మన్లు బిలియన్లకొద్దీ డాలర్లు రష్యాకు చెల్లిస్తుంటారు, కానీ రష్యా నుంచి రక్షించాలని మమ్మల్ని కోరతారు, ఇది సరైంది కాదని నేను అనుకుంటున్నాను. రష్యా చేతిలో జర్మనీ బందీ అయింది, తన ఇంధనంలో 70శాతాన్ని రష్యా నుంచి పొందుతోంది.’ అన్నాడు.

రష్యా నుంచి బాల్టిక్‌ సముద్ర ప్రాంత దేశాలన్నింటికీ గ్యాస్‌ను సరఫరా చేసే పదకొండు బిలియన్‌ డాలర్ల పైప్‌లైన్‌కు జర్మనీ మద్దతు తెలిపింది. ఈ వైఖరి ఇతర ఐరోపా దేశాలకు నచ్చలేదు. ‘ ఇది ప్రయివేటు వాణిజ్య పధకం, దీనికి జర్మన్లు చెల్లించిన పన్నుల నుంచి ఎలాంటి కేటాయింపులు లేవని జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ స్పష్టం చేశారు.జర్మనీ రక్షణ మంత్రి అర్సులా వాండెర్‌ లేయాన్‌ మాట్లాడుతూ మాకు రష్యాతో అనేక సమస్యలున్నాయనటంలో ఎలాంటి సందేహం వుండనవసరం లేదు. మరోవైపు దేశాలు లేదా కూటములు మరియు వ్యతిరేకులతో కూడా సమాచార సంబంధాలను కొనసాగించాల్సి వుంది.’ అన్నారు. రష్యన్‌ గ్యాస్‌ మీద ఆధారపడటాన్ని తగ్గించాలనే అంశంపై నాటోలోని ఐరోపా దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదని స్టోల్టెన్‌ బర్గ్‌ కూడా చెప్పారు.

తొలి రోజే అనేక మంది దేశాధినేతలతో ప్రయివేటుగా చర్చలు జరపటంతో రెండో రోజు అజెండా అంశాలపై ఎవరూ భిన్నాభిప్రాయం వెల్లడించలేదు. మిగతా దేశాధినేతలందరూ వుదయం తొమ్మిది గంటలలోపే సమావేశానికి హాజరైనప్పటికీ ట్రంప్‌ కావాలనే ఆలస్యంగా వచ్చారని విమర్శలు వచ్చాయి. జార్జియా, ఆప్ఘనిస్తాన్‌ల గురించి చర్చించే అజెండా వున్నప్పటికీ అదేమీ పట్టనట్లుగా యూరోపియన్ల రక్షణ ఖర్చు గురించి మాట్లాడటం మొదలెట్టారు. వచ్చే ఏడాది జనవరిలోగా ఖర్చుల కేటాయింపు పెంచనట్లయితే అమెరికా తనదారి తాను చూసుకుంటుందని వ్యాఖ్యానించగానే సమావేశంలో వున్నవారంతా అవాక్కయ్యారు. ట్రంప్‌ మాటల గురించి ఎవరూ విబేధించలేదు గానీ వాటికి మాత్రం భిన్న భాష్యాలు వెల్లడయ్యాయి. దీని అర్ధం అమెరికాతో ఘర్షణ పడటానికి ప్రస్తుతానికి ఎవరూ సిద్ధంగా లేరన్నది స్పష్టం.

రక్షణ ఖర్చు పెంచని పక్షంలో తాము నాటో నుంచి వైదొలుగుతామని ట్రంప్‌ బెదిరించినట్లుగా రాయిటర్స్‌ పేర్కొన్నది. ట్రంప్‌ మాటలకు అర్ధం అదని తాను భావించటం లేదని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ పేర్కొన్నాడు. ట్రంప్‌ వ్యాఖ్యలతో సమావేశ గదిలో విస్మయం వ్యక్తం కావటంతో నాటో జనరల్‌ సెక్రటరీ వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి అక్కడే వున్న ఆఫ్ఘనిస్తాన్‌, అజర్‌బైజాన్‌ ప్రతినిధులతో మీరు నాటో సభ్యులు కానందున బయటకు వెళ్లండని చెప్పారు. తరువాత సమావేశంలో ఎవరూ ఎలాంటి కొత్త ప్రతిపాదనలూ చేయలేదు, ఐరోపా నాయకులందరూ అంతకు ముందు ప్రకటించిన మీడియా సమావేశాలను రద్దు చేసుకొని నేరుగా విమానాశ్రయాలకు వెళ్లిపోయారు. మీడియా సమావేశ కార్యక్రమం లేనప్పటికీ షెడ్యూలు మార్చుకొని ట్రంప్‌ 35నిమిషాలు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశం జయప్రదమైందని, ఇతర నేతలతో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పుకున్నారు. ట్రంప్‌తో ఎలాంటి వుద్రిక్తత ఏర్పడలేదని, ట్రంప్‌ ముక్కుసూటిగా మాట్లాడి వుండవచ్చు,కేటాయింపు పెంచుతామని సభ్యులు వాగ్దానం చేశారని నాటో ప్రధాన కార్యదర్శి అన్నారు.

రష్యా నుంచి ముప్పు వస్తోందనే పేరుతో నాటో కూటమి గతేడాది 900బిలియన్‌ అంటే దాదాపు లక్షకోట్ల డాలర్లను ఖర్చు చేశాయి. వీటిలో అధికభాగం అమెరికా ఖర్చు చేసిన మాట నిజమే. కానీ అదే రీతిలో ఆ సొమ్ములో అధిక భాగం తిరిగి అమెరికన్‌ సైన్యం, అమెరికన్‌ ఆయుధ కంపెనీలకే చేరుతుందనే విషయం చెప్పనవసరం లేదు. ఇదే సమయంలో రష్యా చేసిన ఖర్చు కేవలం 66 బిలియన్‌ డాలర్లు మాత్రమే. అవసరం లేకపోయినా విస్తరణ పేరుతో నాటో మిలిటరీని రష్యా ముంగిటకు తీసుకుపోతున్న అమెరికా ఎత్తుగడలే నేడు ఐరోపాలో వుద్రిక్తతలకు కారణం అవుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఐరోపాకు లేని ముప్పును చూపుతూ అమెరికా మిలిటరీ కార్పొరేట్‌లు ఐరోపా దేశాలను అదిరించి బెదిరించి తమ ఆయుధాలను, వినిమయ వస్తువులను అంటగట్టేందుకు చూడటం తప్ప ట్రంప్‌ చర్యల్లో మరొకటి కనిపించటం లేదు.

ఐరోపా రాజ్యాలు అమెరికాతో ప్రత్యక్ష ఘర్షణకు సిద్ధం కాదు. అందుకే ఒకవైపు దానితో మిత్రత్వాన్ని నెరపుతూనే తమ ప్రయోజనాలను తాము చూసుకుంటున్నాయని చెప్పవచ్చు. వుదాహరణకు అనేక అంశాలలో అమెరికా వైఖరిని ఐరోపాయూనియన్‌ ఏకీభవించటం లేదు. వుక్రెయిన్‌లో భాగంగా వున్న క్రిమియాను అక్కడి పౌరుల ఆకాంక్షలకు అనుగుణ్యంగా రష్యా తనలో విలీనం చేసుకున్నది.ఆ చర్యను జర్మనీ విమర్శించినప్పటికీ తనకు అవసరమైన చమురు అవసరాలకోసం రష్యన్‌ చమురు కంపెనీ గాజ్‌పోమ్‌తో జర్మనీ 11 బిలియన్‌ డాలర్లతో ఒకపైప్‌లైన్‌ నిర్మాణంపై 2015లో ఒప్పందం చేసుకుంది. దాని గురించే ట్రంప్‌ బ్రసెల్స్‌లో జర్మనీపై విరుచుకుపడ్డాడు. నాటో రక్షణ ఖర్చును తమకు ఇవ్వాలని అమెరికా పట్టుబడుతున్నది, అయితే ఐరోపా దేశాలు ఆ ఖర్చుతో తమ ఏర్పాట్లను తాము చేసుకుంటున్నాయి, ఆ మొత్తాలను కూడా నాటో ఖర్చులో భాగంగానే చూపుతున్నాయి. నాటో సమావేశాలకు ముందు ట్రంప్‌ చేసిన ట్వీట్లు, వ్యాఖ్యలను గమనించటం అవసరం. నాటోలోని అనేక దేశాలు తమను రక్షించాలని కోరుకుంటాయి, అవి అంగీకరించిన మేరకు జిడిపిలో రెండుశాతం ఖర్చుచేయకపోవటమే కాదు, ఏండ్ల తరబడి వుపేక్షిస్తున్నాయి, అవి పాతబకాయిలను కూడా చెల్లిస్తాయా?అని ట్వీట్‌ చేశాడు. బ్రసెల్స్‌ బయలు దేరే ముందు ‘ఐరోపాలో మా రైతులు, కార్మికులు, కంపెనీలు వ్యాపారం చేయటాన్ని ఐరోపా యూనియన్‌ అసాధ్యం గావిస్తున్నది, మరోవైపు నాటో ద్వారా మేము సంతోషంగా వారిని రక్షించాలని కోరుకుంటారు, దానికి నాజూకు చెల్లింపులు చేస్తారు, ఇలా ఎలా పని జరుగుతుంది.’ అన్న ట్రంప్‌ వచ్చీ రావటంతోనే జర్మనీపై విరుచుకు పడ్డారు. రష్యా చేతిలో జర్మనీ బందీ అయింది అన్న ట్రంప్‌తో తాను ఏకీభవించటం లేదని ఫ్రెంచి అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ పేర్కొన్నారు. తమను మాస్కో గానీ వాషింగ్టన్‌గానీ అదుపు చేయటం లేదని జర్మన్‌ అధికారులు తిప్పికొట్టారు.

తాను ఎక్కడ వున్నా అమెరికన్ల గురించే ఆలోచిస్తూ వుంటానని చెప్పేందుకు ట్రంప్‌ ప్రయత్నించాడు.’నేను ఇప్పుడు బ్రసెల్స్‌లో వున్నప్పటికీ మన రైతుల గురించే ఎల్లవేళలా ఆలోచిస్తున్నాను. 2012 నుంచి నా ఎన్నిక నాటికి సోయాబీన్స్‌ ధర సగం పడిపోయింది, గత పదిహేను సంవత్సరాలుగా రైతులకు తక్కువగా చెల్లిస్తున్నారు. ఇతర దేశాల వాణిజ్య ఆటంకాలు మరియు పన్నులతో వారి వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయి. నేను గతం కంటే మెరుగ్గా ఈ సమస్యలను లేవనెత్తుతాను, అయితే అది అంతత్వరగా ముందుకు పోదు. మన రైతులందరికీ సమాన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాను, మనం విజయం సాధిస్తాము ‘ ఇలా సాగింది.

నాటో కొనసాగాల్సిన అవసరం గురించి సంస్ధ ప్రధాన కార్యదర్శి జేన్స్‌ స్టోలటెన్‌బర్గ్‌ మాట్లాడుతూ ‘ బలమైన నాటో ఐరోపా, అమెరికాకు మంచిది. విడిపోవటం కంటే కలసి వుంటే ధృడంగా వుంటామని రెండు ప్రపంచ యుద్ధాలు, ప్రచ్చన్న యుద్ధం మాకు నేర్పాయి.ఐరోపాలో అమెరికా మిలిటరీ,కెనడా వునికి ఐరోపాకు మాత్రమే కాదు వుత్తర అమెరికా మరియు ప్రత్యేకించి అమెరికా(యుఎస్‌)కు మంచిది, ఎందుకంటే అమెరికా ఒక ప్రపంచ శక్తిగా ఎదగటానికి అది తోడ్పడుతుంది. బాల్టిక్‌ సముద్ర గ్యాస్‌ పైప్‌లైన్‌కు జర్మనీ మద్దతు ఇవ్వాలా లేదా అనేది నిర్ణయించాల్సింది నాటో సభ్యదేశాలు కాదు, అది ఒక జాతీయ నిర్ణయం.’

నాటో తొలిరోజు సమావేశ ప్రారంభానికి ముందు వుదయపు అల్పాహార విందు సందర్భంగా ట్రంప్‌ వ్యాఖ్యలు విస్మయాన్ని కలిగించాయి. నాటో ప్రధాన కార్యదర్శి స్టోల్టెన్‌బర్గ్‌తో నాటో ఖర్చులో అత్యధిక భాగం తమ దేశమే భరిస్తోందని వ్యాఖ్యానించాడు. జర్మనీ ఒకశాతం కంటే కొద్దిగా ఎక్కుగా చెల్లిస్తోంది. అదే అమెరికా జిడిపిలో 4.2శాతం చెల్లిస్తోంది. ఇది సరైంది కాదు, మేము జర్మనీని రక్షిస్తున్నాము, మేము ఫ్రాన్స్‌ను రక్షిస్తున్నాము, మేము ప్రతి ఒక్కరినీ రక్షిస్తున్నాము. దానికి ఇంకా మేము ఎంతో చెల్లిస్తున్నాము. విందు అనంతరం ట్రంప్‌ వైఖరిని స్టోల్టెన్‌ బర్గ్‌ అపహాస్యం చేశాడు. వుదయపు అల్పాహార విందు బాగుంది…. దీనికి అమెరికాయే బిల్లు చెల్లించింది అని వ్యాఖ్యానించాడు. ట్రంప్‌ అధ్యక్షుడు అయిన తరువాత ఐరోపాలో మిలిటరీ వునికి నిమిత్తం 40శాతం నిధులు పెంచాడు. అమెరికా సైన్యాలు ఎక్కువగా వున్నాయి, గతం కంటే విన్యాసాలు, మౌలిక సదుపాయాల నిమిత్తం పెట్టుబడులు కూడా పెరిగాయి’ అన్నాడు.

Image result for nato brussels summit 2018

గతంలో అంగీకరించిన మేరకు నాటో నిర్వహణకు పూర్తిగా నిధులు చెల్లిస్తున్నది అమెరికా, బ్రిటన్‌, పోలాండ్‌, గ్రీస్‌, ఎస్తోనియా మాత్రమే. తాను హాజరైన తొలి సమావేశనాటి కంటే సభ్య దేశాలు చెల్లిస్తున్న మొత్తం గణనీయంగా తగ్గిపోయిందంటూ ట్రంప్‌ అవాస్తవం చెప్పారంటూ పొలిటీ ఫాక్ట్‌ అనే వెబ్‌సైట్‌ పేర్కొన్నది. 2014లో ఐరోపా దేశాలు, కెనడా చెల్లించిన మొత్తం 254బిలియన్‌ డాలర్లు 2017 నాటికి 275కు పెరిగినట్లు పేర్కొన్నది. నాటో ఖర్చులో 70 నుంచి 90శాతం వరకు అమెరికా చెల్లిస్తున్నదని చెప్పటం అవాస్తవమని తెలిపింది. నాటోకు ఎంత ఖర్చు చేయాలనేది ఎక్కడా నిర్ధారించలేదు. సంస్ధ వుమ్మడి నిధిలో అమెరికా 22శాతం చెల్లిస్తున్నది. సభ్యదేశాల రక్షణ బడ్జెట్‌ ఎంతో నాటో సేకరిస్తుంది, వాటి మొత్తాలను కలిపి చూసుకున్నపుడు అమెరికా రక్షణ కోసం 70శాతం ఖర్చు చేస్తున్నది. అమెరికా ప్రపంచ మిలిటరీ శక్తి గనుక అంతవుంది, ఐరోపా సభ్యదేశాలు అలాంటివి కాదు. తమ రైతాంగానికి ఐరోపా యూనియన్‌ తలుపులను మూసింది అని ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. అమెరికా కంటే ఐరోపా యూనియన్‌ సగటున చూసినపుడు కొద్దిగా ఎక్కువ పన్నులు విధిస్తున్నది. 30శాతం వ్యవసాయ వుత్పత్తులపై ఇరువైపులా పన్నులు లేకుండా ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయి. ఫలితంగా 28 సభ్యరాజ్యాలు, ఐరోపా యూనియన్‌ 2017లో అమెరికాకు వ్య వసాయ వుత్పత్తులలో ఐదవ పెద్ద ఎగుమతిదారుగా మారింది. అమెరికా తాను ఎగుమతి చేసుకున్నవాటి కంటే దిగుమతులు ఎక్కువ చేసుకుంది.

గతంలో రెండుశాతం వరకు ఖర్చు చేయాలని అనుకున్నారు, ఇప్పుడు దాన్ని విధిగా చేయాలని ట్రంప్‌ అన్నాడు. రక్షణ నిమిత్తం జిడిపిలో రెండుశాతం ఖర్చు చేయాలని 2006లో అంగీకరించిన మాట వాస్తవం. అయితే అంత మొత్తాన్ని విధిగా ఖర్చు చేయాలనే అంగీకారమేదీ లేదు. ఈ వారంలో ఆ మేరకు నిర్ణయం జరిగిందేమో తెలియదు. రెండుశాతం మొత్తం కేటాయింపులను 2024 నాటికి క్రమంగా పెంచుకుంటూ పోవాలని 2014లో మార్గదర్శక సూత్రాలను ఆమోదించారు. ఆ మేరకు వ్యవహరించినవి ఐదు దేశాలు మాత్రమే. బ్రసెల్స్‌ సమావేశాల తరువాత ట్రంప్‌ బ్రిటన్‌ పర్యటన జరిపారు. సోమవారం నాడు హెల్సింకీలో ట్రంప్‌-పుతిన్‌ భేఠీ జరగనుంది. ఆ తరువాత నాటో, ట్రంప్‌ పర్యటన వివరాల సమాచారం వెల్లడయ్యే అవకాశం వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంక్షలతో భారత్‌కు వుచ్చు బిగిస్తున్న అమెరికా !

04 Wednesday Jul 2018

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

direct and indirect sanctions, Donald trump, Donald trump trade war, NATO, TRADE WAR, us encircling india, US SANCTIONS, US-CHINA TRADE WAR

Image result for nikki haley,modi meet

ఐరాసలో అమెరికా రాయబారి నికీ హాలే, ప్రధాని నరేంద్రమోడీ

ఎం కోటేశ్వరరావు

జూలై ఆరు, ప్రపంచమంతా ఎదురు చూస్తున్న రోజు ! చైనాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పూరించిన వాణిజ్య సమర భేరి దాడులకు నాంది పలికే గడువు అది. సామరస్యపూర్వకంగా పరిష్కారం కానట్లయితే ఆ దినం నుంచి చైనా వస్తువులపై ప్రకటించిన పన్ను పెంపుదల అమలులోకి వస్తుంది. కొద్ది రోజుల క్రితం వరకు నిజంగా వాణిజ్య యుద్ధం జరుగుతుందా? సర్దుబాటు చేసుకుంటారా అన్న పద్దతిలో సాగిన విశ్లేషణలు ఇప్పుడు నిజంగానే జరుగుతుందని, జరిగితే ఎంత విలువ వుంటుంది? ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మీద చూపే ప్రభావాలు ఎలా వుంటాయనే వైపు మళ్లాయి. ఒక లక్ష బిలియన్‌ డాలర్ల వరకు వుంటుందని ఒక అంచనా. వాణిజ్య యుద్ధం వ్యాపారలావాదేవీలకు మాత్రమే పరిమితం కాదు. అనేక రంగాలను అది ప్రభావితం చేస్తుంది.

గత కొద్ది రోజులుగా ట్రంప్‌ చేస్తున్న ప్రకటనలు, చర్యలు కేవలం వాణిజ్య యుద్ధానికే పరిమితం కాలేదు. అవి ప్రపంచ దేశాల సమీకరణలను వేగవంతం చేస్తున్నాయా ? వాటి స్వభావమేమిటి ? పర్యవసానాలు ఎలా వుంటాయన్నది ప్రపంచమంతా వుగ్గపట్టుకొని ఆసక్తితో చూస్తున్నది. ఇరాన్‌పై విధించిన ఆంక్షలను మా మిత్ర దేశాలు కూడా పాటించాల్సిందే, లేకుంటే వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం, ఎవరికీ మినహాయింపులు లేవు అని ట్రంప్‌ చేసిన ప్రకటనతో నరేంద్రమోడీ సర్కార్‌ ఏం చేయాలో తోచక కాళ్లు తొక్కుకుంటున్నది. చిన్నది కావచ్చుగానీ ఐరోపా యూనియన్‌ కూడా చైనా మాదిరి చెడ్డదే. చూడు మక్రాన్‌ మనిద్దరికీ చైనా సమస్య వుంది కనుక కలసి పని చేద్దాం, చైనా కంటే ఐరోపా యూనియన్‌ అధ్వాన్నంగా వుంది, నాఫ్టా ఎంత చెడ్డదో నాటో కూడా అలాంటిదే, అది అమెరికాకు భరించరాని ప్రియంగా వుంది. ఇవన్నీ ట్రంప్‌ బహిరంగంగా చేసినవీ, అంతర్గత సంభాషణల్లో వెల్లడించిన అభిప్రాయాలుగా మీడియాలో తిరుగుతున్నవి. ప్రపంచ దేశాల మీద అమెరికా ఒక్క వాణిజ్యయుద్ధానికే పరిమితం కాలేదు, ఇతర రంగాలలో కూడా తన పెత్తనాన్ని, భారాలను రుద్దేందుకు పూనుకుంది అన్నది స్పష్టం. నాటో కూటమికి అయ్యే ఖర్చును సభ్య దేశాలన్నీ భరిస్తాయో లేదో చెప్పాలంటూ ఐరోపా దేశాలకు జూన్‌ నెలలో ట్రంప్‌ లేఖలు రాశాడు.

కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే మన విదేశాంగ విధానాన్ని నిర్దేశించేది మన ప్రభుత్వమా లేక డోనాల్డ్‌ ట్రంపా అన్న అనుమానం తలెత్తక మానదు. నరేంద్రమోడీ సర్కార్‌ పులిలా గాండ్రించి చివరికి పిల్లిలా మ్యావ్‌ మ్యావ్‌ మంటూ తోకముడుస్తోంది. ఇరాన్‌తో కుదిరిన అంతర్జాతీయ అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. ఆంక్షలను అమలు జరుపుతామని ప్రకటించింది. ఆ సమయంలో మన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ స్పందిస్తూ ఏకపక్షంగా అమెరికా ప్రకటించిన ఆంక్షలను భారత్‌ పరిగణనలోకి తీసుకోదని ఐక్యరాజ్య సమితి వాటినే గుర్తిస్తుందని ప్రకటించారు. అలాంటిది నెల రోజులు కూడా గడవక ముందే నరేంద్రమోడీ సర్కార్‌ వైఖరిలో మార్పు వచ్చింది, అదీ ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారీ నికీహాలే ఢిల్లీ పర్యటన మరుసటి రోజే కావటం గమనించాల్సిన అంశం. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలు నవంబరు నాలుగవ తేదీని అమలులోకి వస్తాయి. అప్పటికి ఇరాన్‌ నుంచి గణనీయంగా దిగుమతులను తగ్గించుకోవటం లేదా పూర్తిగా మానుకోవాలని చమురుశుద్ధి కర్మాగారాలకు మన చమురు మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. అదే జరిగితే మన దేశం దిగుమతి చేసుకొనే చమురు ధరలు గణనీయంగా పెరుగుతాయన్నది చమురు రంగ విశ్లేషకుల అభిప్రాయం.ఇరాన్‌తో చమురులావాదేవీలకు స్వస్తి పలుకుతున్నట్లు స్టేట్‌ బ్యాంక్‌ ప్రకటించింది. ఇరాన్‌ చమురుతో ప్రయాణించే నౌకలు లేదా దానిని శుద్ధి చేసే కర్మాగారాలకు బీమా వర్తింప చేయబోమని ఆ కంపెనీలు ప్రకటించేఆలోచనలో వున్నాయి. ఇరాన్‌ మనకు కొన్ని రాయితీలు ఇస్తున్నది. వాటిని వదులుకొని ఇతర దేశాల దగ్గర కొనటం అంటే అమెరికాను సంతృప్తిపరచటమే కాదు, అందుకోసం మన జనం మీద భారాలు మోపేందుకు మోడీ సర్కార్‌ పూనుకుంది. ఇరాన్‌కు రూపాయిల చెల్లింపులతో మోడీ పెద్ద విజయం సాధించినట్లు ఆయన భక్తులు ప్రచారం చేశారు. ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తే రూపాయల బదులు ఇతర దేశాలకు చెల్లించేందుకు మనం డాలర్లను మరింతగా సమకూర్చుకోవటం అంటే మన కరెన్సీ విలువ మరింత పతనం కావటమే. గతంలో ఇరాన్‌పై ఆంక్షలు విధించిన సమయంలో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మన దేశానికి ఆంక్షలను మినహాయించాడు. అలాంటివేమీ కుదరవని ట్రంప్‌ ప్రకటించాడు. మన దేశాన్ని తన ఆదేశాలను పాటించే పాలేరు అనుకుంటున్నాడా ? జవాబుదారీతనంతో వ్యవహరించే ఏ దేశమైనా ఇతరుల బెదిరింపులను అనుమతించని బాధ్యతతో వ్యవహరించాల్సి వుంటుంది. అమెరికా వత్తిడికి మోడీ సర్కార్‌ తీసుకున్న చర్యతో పాటు దీర్ఘకాలంగా ఇరాన్‌తో వున్న సంబంధాలు ప్రమాదంలో పడటమేగాక అంతర్జాతీయంగా మన పరువు ఎక్కడ కలుస్తుందో తెలియదు. మన బలహీన దౌత్యానికి ఇది సూచిక. ఇరాన్‌ ఎగుమతి చేసే చమురులో సగాన్ని చైనా, భారత్‌, టర్కీ దిగుమతి చేసుకుంటున్నాయి.అమెరికా ఏకపక్ష ఆంక్షలను తాము ఆమోదించేది లేదని మిగిలిన రెండు దేశాలు ప్రకటించాయి.

అనేక దేశాల మధ్య తంపులు పెట్టి, రెచ్చగొట్టి అటూ ఇటూ ఆయుధాలు అమ్ముకొని లబ్దిపొందే ఎత్తుగడను అమెరికా ఎప్పటి నుంచో అనుసరిస్తోంది. మన దేశం-పాకిస్ధాన్‌ విషయంలో అదే చేసి పాకిస్ధాన్‌కు పెద్ద ఆయుధ అమ్మకందారుగా మారింది. సోవియట్‌ యూనియన్‌ కూల్చివేత తరువాత మన పాలకులు అమెరికాకు దగ్గర కావటంతో ఇప్పుడు పాక్‌ కంటే పెద్ద బడ్జెట్‌ వున్న మనం ఆత్మీయులుగా కనపడటం గురించి చెప్పనవసరం లేదు. దశాబ్దాల తరబడి సోవియట్‌ ఆయుధాల మీద ఆధారపడిన మనం వెనువెంటనే అమెరికా ఆయుధాలతో మన మిలిటరీని సాయుధం చేసే అవకాశం లేదు కనుక ఇప్పటికీ ఆ లావాదేవీలు కొనసాగుతున్నాయి. రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణులు కొనుగోలు చేసినట్లయితే భారత్‌ మీద ఆంక్షలు విధిస్తామని అమెరికా బెదిరించింది. మన వాయుసేన దాదాపు ఐదింటిని కొనుగోలు చేసే ఒప్పందం ఖరారు దశలో వుంది. ఈనెల ఆరున భారత్‌-అమెరికా మధ్య రక్షణ, భద్రతా సంబంధాలను మెరుగుపరచుకొనేందుకు విదేశాంగ, రక్షణశాఖల మంత్రుల తొలి సమావేశం జరగాల్సి వుండగా కొద్ది రోజుల ముందు అనివార్య కారణాల వలన దానిని రద్దు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పోంపియో ఏకపక్షంగా మన మంత్రి సుష్మా స్వరాజ్‌కు తెలియ చేశారు. ఇరాన్‌తో సంబంధాల గురించి భారత్‌ పునరాలోచించుకోవాలని జూన్‌ 27న ఐరాసలో అమెరికా రాయబారి నికీ హాలే మన ప్రధాని నరేంద్రమోడీని కలసి కోరిన సమయంలోనే ఈ సమావేశ రద్దును తెలిపారు.

దీనికి ముందుగా జూన్‌ 19న అమెరికా అంతర్గతంగా తన చట్టాలకు ఆమోదించిన సవరణల ప్రకారం రష్యా నుంచి మనం ఆయుధాలు కొనుగోలు చేస్తే గతంలో వున్న అమెరికా ఆంక్షల మినహాయింపు రద్దు అవుతుంది. మన అవసరాలకు అమెరికాలో తయారైన పేట్రియాట్‌ పిఏసి-3 క్షిపణి 70కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాన్ని చేరుతుంది. అదే రష్యా ఎస్‌ 400 క్షిపణి నాలుగు వందల కిలోమీటర్ల లక్ష్యం కలిగినదిగా వుండటంలో నలభైవేల కోట్ల రూపాయలతో ఐదు క్షిపణి వ్యవస్ధలను కొనుగోలు చేయాలని మన రక్షణశాఖ నిర్ణయించింది. దీన్ని దెబ్బతీసేందుకు ఆంక్షలు విధించేందుకు అమెరికా బెదిరింపులకు పూనుకోవటంతో పాటు సమావేశాన్ని రద్దు చేసింది. ఇవేగాదు రష్యా నుంచి మరొక 12బిలియన్‌ డాలర్ల విలువగల ఇతర ఆయుధాల కొనుగోలుపై కూడా ఆంక్షలు విధించే అవకాశం వుండటంతో అమెరికా ఇలాంటి బెదిరింపులకు పూనుకున్నట్లుగా భావిస్తున్నారు.

అమెరికాకే అగ్రతాంబూలం అన్న పద్దతిలో వ్యవహరిస్తున్న ట్రంప్‌ వైఖరి నుంచి తమను కాచుకొనేందుకు గాను ఐక్యంగా వ్యవహరించాలని, ప్రపంచ వ్యవస్ధను నిలబెట్టాలని చైనా, ఐరోపా యూనియన్‌ నిర్ణయించాయి. ప్రపంచ స్వేచ్చా వాణిజ్య వ్యవస్ధ ఏర్పాటుకు తాము సహకరించామని దానిని కాపాడుకోవాల్సిన అవసరం వుందని ఐరోపా యూనియన్‌ నేతలు చెబుతున్నారు. సోవియట్‌ యూనియన్‌ ప్రారంభంలో రష్యన్‌ కమ్యూనిస్టులకు వాల్‌స్ట్రీట్‌ పెట్టుబడిదారులు రహస్యంగా సాయం చేశారని, 2000 సంవత్సరంలో ప్రపంచ వాణిజ్య సంస్ధలో చైనా ప్ర వేశానికి అమెరికా సెనేట్‌ అత్యధిక మెజారిటీతో ఆమోదం తెలిపిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అమెరికా తన వైఖరి మార్చుకుంటే తామెందుకు అనుసరించాలని పరోక్షంగా పశ్నిస్తున్నారు. అదే కమ్యూనిస్టు చైనాతో కలసి తమ ప్రయోజనాలను రక్షించుకోవాలని వుద్బోధిస్తున్నారు. ఈ నెలలో బీజింగ్‌లో చైనా-ఐరోపా యూనియన్‌ సమావేశంలో ఒక ప్రకటన వెలువడుతుందని వార్తలు వచ్చాయి.

ఒకవైపు ఐరోపా యూనియన్‌ దేశాలపై వాణిజ్య ఆంక్షలను ప్రకటించిన ట్రంప్‌ మరోవైపు నాటో కూటమి ఖర్చులో సింహభాగాన్ని మీరు భరిస్తారో లేదో చెప్పాలని వత్తిడి తెస్తున్నాడు.త్వరలో బ్రసెల్స్‌ సమావేశంలోగా ఏదో ఒకటి తేల్చాలంటున్నాడు. ఏప్రిల్‌లో మీ పర్యటన సందర్బంగా మనం మాట్లాడుకున్నట్లుగా కొన్ని దేశాలు వాగ్దానం చేసిన మాదిరి నిధులు కేటాయించటం లేదని జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌కు రాసిన లేఖలో ట్రంప్‌ పేర్కొన్నాడు. ఐరోపా రక్షణకు మేము పెద్ద మొత్తంలో వనరులను కేటాయించటం ఇంకేమాత్రం సాధ్యం కాదని, మా దేశంలో అసంతృప్తి పెరుగుతున్నదని కూడా పేర్కొన్నాడు. నాలుగు సంవత్సరాల నాడు వేల్స్‌ సమావేశంలో ప్రతి దేశం జిడిపిలో రెండుశాతం మొత్తాన్ని దేశభద్రతకు ఖర్చు చేయాలని అంగీకరించిన మేరకు అమలు జరపటం లేదన్నది అమెరికా ఫిర్యాదు. మిగతా దేశాలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటాయని అలాంటిది మీరు కూడా చేయాల్సిన మేరకు ఖర్చు చేయటం లేదని జర్మనీని కూడా విమర్శించాడు. విదేశాలలో అమెరికన్‌ సైనికులు ప్రాణాలు అర్పించటం లేదా తీవ్రంగా గాయపడే త్యాగాలు చేస్తున్నపుూ వుమ్మడి రక్షణ భారాన్ని కొన్ని దేశాలు ఎందుకు పంచుకోవటం లేదు అని అమెరికా పౌరులు అడుగుతుంటే సమర్ధించుకోవటం ఇంకేమాత్రం సాధ్యం కావటం లేదని కూడా ట్రంప్‌ పేర్కొన్నాడు. దక్షిణ కొరియాలో సైన్యం గురించి కూడా ఇదే వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే.

ట్రంప్‌ లేఖలపై ఐరోపాలో విమర్శలు వచ్చాయి.’ నాటో అంటే ఒక క్లబ్‌ అని, దానికి మీరు బకాయి చెల్లించకపోతే పర్యవసానాలు అనుభవిస్తారు లేదా సోమరులైన ఈ ఐరోపా వారందరూ సెలవులు గడపటానికి వచ్చి కూర్చున్నారని, వారందరినీ అమెరికా రక్షిస్తోందనే భావనలోనే ఇంకా ట్రంప్‌ వున్నట్లుగా కనిపిస్తోంది’ అని అమెరికా రక్షణశాఖ మాజీ అధికారి డెరెక్‌ చోలెట్‌ వ్యాఖ్యానించారు. ‘ వాణిజ్యం మీద దూకుడుగా వున్న ట్రంప్‌ వ్యాఖ్యలను ఎలా అమలు చేస్తారు, భద్రతా విషయాలలో కూడా అలాగే చేస్తారా అని ఐరోపావారు చూస్తున్నారు అని కూడా అన్నారు.

అమెరికా మొరటుగా వాణిజ్య యుద్ధానికి పూనుకుంటే అనేక దేశాలతో ఇదే విధంగా ఇతర రంగాలలో కూడా తన పెత్తందారీ, బలప్రయోగానికి పాల్పడే అవకాశాలున్నాయి. అయితే వాణిజ్య యుద్ధం జరిగితే తమకు సంభవించే లాభనష్టాల గురించి అమెరికాలో తర్జన భర్జన జరుగుతోంది. లాభం అనుకుంటే ట్రంప్‌ ముందుకు పోతాడు. వాణిజ్య యుద్ధంలో గెలిచే అవకా శాలు లేవని బలంగా వినిపిస్తున్న పూర్వరంగంలో ఏదో ఒకసాకుతో వెనక్కు తగ్గే అవకాశాలూ లేకపోలేదు. సంక్షోభం, సమస్యలు ముదిరితే పర్యవసానాలను అంచనా వేయటం కష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వుత్తర కొరియాతో ఒప్పందం ఓకే, ఇరాన్‌ మాటేమిటి ట్రంప్‌ !

13 Wednesday Jun 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

denuke deal with north korea, Donald trump, iran, Kim Jong-un, kim-trump meet, North Korean leader Kim Jong-un, nuclear threat

ఎం కోటేశ్వరరావు

తాతా మనవల వంటి డోనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌ జోంగ్‌ అన్‌ అనూహ్య భేటీ ముగిసింది. విశ్లేషకులందరూ ఎవరిది పైచేయి, ఎవరు తామనుకున్నది సాధించారు అనే మల్లగుల్లాల్లో తలమునకలై వున్నారు. ఎవరేం చెప్పినా ఒక చిన్న దేశమైన వుత్తర కొరియా ప్రపంచానికి ఒక పెద్ద సందేశం ఇచ్చింది. బలవంతమైన సర్పం చలిచీమల చేతుల్లో హతమౌతుందన్నది పాత అనుభవం అయితే ఒళ్లంతా అణుబాంబులు కట్టుకొని తిరిగే ప్రపంచంలోనే బలవంతుడైన అమెరికాను అదుపులోకి తెచ్చుకోవాలంటే ఒక్క అణుబాంబు, దానిని అమెరికా గడ్డ మీదకు ప్రయోగించగలిగిన క్షిపణి వుంటే చాలని వుత్తర కొరియా నిరూపించిందని చెప్పక తప్పదు. ప్రపంచ మానవాళిని వందసార్లు చంపటానికి అవసరమైనన్ని మారణాయుధాలు మా దగ్గర వున్నాయని ప్రపంచాన్ని భయపెడుతున్నది అమెరికా. పిచ్చిపట్టిన అమెరికా అధ్య క్షుడెవరైనా అణుమీట ఒకసారి నొక్కితేనే ప్రపంచం భస్మీపటలం అవుతుంది, రెండోసారికే ఏమీ వుండదు, ఇంక వందసార్లకు అవకాశం ఎక్కడుంటుంది. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే వారికి బాగా అర్ధం అయిన విషయం ఏమంటే తమ దేశం నుంచి బయలుదేరిన అణ్వస్త్రం మారణహోమం సృష్టించకముందే ఇతర దేశాలలో వున్న అణుమీటలు కూడా పని చేసి అన్ని వైపుల నుంచి అమెరికాను చుట్టుముడతాయని, అన్నీ ఒకేసారి అందరినీ హతమారుస్తాయని తెలుసు.

‘ఇప్పుడే విమానం దిగాను, సుదీర్ఘ ప్రయాణం, అయితే నేను పదవీ బాధ్యతలు స్వీకరించేనాటితో పోలిస్తే ఇప్పుడు మరింత సురక్షితం అని ప్రతి ఒక్కరు భావించవచ్చు. కిమ్‌ జోంగ్‌ అన్‌తో భేటీ చాలా ఆసక్తికరంగా ఎంతో సానుకూల అనుభవంతో జరిగింది. వుత్తర కొరియాకు మంచి భవిష్యత్‌ వుంది. నేను అధికారాన్ని స్వీకరించబోయే ముందు మనం వుత్తర కొరియాతో యుద్ధానికి దిగబోతున్నామని జనం అనుకుంటున్నారు. వుత్తర కొరియా మనకు అతి పెద్ద ప్రమాదకర సమస్య అని బరాక్‌ ఒబామా చెప్పాడు, అలాంటిదింకేమీ లేదు ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోండి అని సింగపూర్‌ నుంచి అమెరికా గడ్డపై కాలు పెట్టగానే ట్రంప్‌ ట్వీట్‌ చేశాడు. అంటే అమెరికన్లలో ఎంత భయం గూడు కట్టుకొని వుందో, దానిని పోగొట్టటం అక్కడి ప్రభుత్వానికి ఎంత అవసరమో ఇవి విదితం చేయటం లేదా ?

కొరియాలో యుద్ధవిన్యాసాలు ఆపుతామని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. వచ్చే ఏడాది 716బిలియన్‌ డాలర్ల మేరకు మిలిటరీ ఖర్చు చేయాలని ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయించింది. కిమ్‌తో భేటీ అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ కొరియా ప్రాంతంలో యుద్ధ విన్యాసాలు నిలిపివేస్తామని చెప్పాడు. అంతటితో ఆగలేదు, మా గువామ్‌ దీవి నుంచి విమానాలను తీసుకు వచ్చి దక్షిణ కొరియాలో విన్యాసాలు చేయించి తిరిగి ఆ దీవికి తీసుకుపోవాలంటే మాకు చాలా ఖర్చు అవుతోంది, సింహభాగం మేమే భరించాల్సి వస్తోంది అని వ్యాఖ్యానించి ఇంటా బయటా నవ్వుల పాలయ్యాడు. అడుసుతొక్కనేల కాలు కడగనేల. ఎవరు విన్యాసాలు చేయమన్నారు, ఎవరికోసం చేస్తున్నారు, ఖర్చు భరించటం చేతకానపుడు కొనసాగించటం ఎందుకు? అసలు యుద్ధ విన్యాసాలు ఆపమని వుత్తర కొరియా అసలు అడిగిందా? మా ప్రాంతం నుంచి తుండు తుపాకీ మొత్తంగా సర్దుకొని మీ దేశానికి వెళ్లిపోయి మా రెడు దేశాలను ఐక్యం చేసేందుకు అడ్డుతొలగండి అని డిమాండ్‌ చేస్తోంది తప్ప, విన్యాసాలకే పరిమితం కావటం లేదు. జపాన్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా సాయుధపోరాటం ప్రారంభించి, తరువాత అమెరికాతో యుద్దంతో చేసి, గత ఆరున్నర దశాబ్దాలుగా అణ్యాయుధాల మోహరింపులు, యుద్ద విన్యాసాలు, బెదిరింపుల మధ్య పెరిగిన వుత్తర కొరియన్లను యుద్ద విన్యాసాలు ఏమాత్రం భయపెట్టలేదని రుజువైంది. గాలికిపోయే పేల పిండి కృష్ణార్పణం అన్నట్లు ప్రయోజనం లేని విన్యాసాలు నిలిపివేస్తామని చెప్పినంత మాత్రాన కొరియా సమస్య పరిష్కారం కాదు.

కొరియా ద్వీపకల్పంలో అమెరికా తిష్ట ఎందుకు వేసిందో కమ్యూనిస్టులు చెబితే, ఆ వారు అంతకు మించి ఏమి చెబుతారులే అని చాలా మంది పట్టించుకోరు. సింగపూర్‌లో ట్రంప్‌ ప్రకటన తరువాత అమెరికాలోని స్వంత రిపబ్లికన్‌ పార్టీ నేతలే వ్యతిరేకించారు. తమ నేత తెలివి తక్కువ ప్రకటన చేశాడని పార్టీ ఎంపీ లిండ్‌సే గ్రాహమ్‌ వ్యాఖ్యానించాడు. చేస్తున్న ఖర్చు వూరికే పోవటం లేదని అసలు కొరియాలో దళాల తిష్ట చైనాకు హెచ్చరిక అంటూ కొనసాగించాలని కోరాడు. అంటే దుష్టఆలోచన మనసులో పెట్టుకొని గడ్డికొస్తావా పిల్లా అన్నట్లుగా దక్షిణ కొరియా రక్షణ పేరుతో ఇంతకాలం అమెరికా చేస్తున్న యుద్ధ విన్యాసాలు, బలగాల మోహరింపు చైనాకు వ్యతిరేకం అని గ్రాహమ్‌ చెప్పకనే చెప్పాడు. సమగ్రమైన ఒప్పందం మీద సంతకం చేశామని ట్రంప్‌ చెప్పాడు. గతంలో వుత్తర కొరియాతో కుదిరిన ఒప్పందాలతో పోలిస్తే ఇది ఒక స్పష్టత లేని, ఎలాగైనా భాష్యం చెప్పటానికి, చర్చకు దారితీసేదిగా వుందనే అభిప్రాయం అమెరికాలో వెల్లడైంది. ఎవరూ వ్యతిరేకించటం లేదు గానీ సంతోషించటానికి ఏముంది అని పెదవి విరుస్తున్నారు.2005లో కుదిరిన ఒప్పందంలో మరోనాలుగు ప్రాంతీయ దేశాలు కూడా భాగస్వాములు ఇప్పుడు వాటి ప్రస్తావన లేదు.

వుత్తర కొరియా అణు సమస్య పరిష్కారం అంటే అది సమగ్రమైంది కాదు.దీనిలో రెండు అంశాలున్నాయి. వుత్తర కొరియా అణు కార్యక్రమం నిలిపివేత అంటే ఆయుధాల తయారీ తప్ప శాంతియుత ప్రయోజనాల కార్యక్రమాన్ని నిలిపి వేయటానికి ఏ దేశమైనా అంగీకరిస్తుందా? దక్షిణ కొరియా, జపాన్‌లో అమెరికా మోహరించిన అణ్వాయుధఛత్రం, ఇతర ప్రమాదకర క్షిపణులు, సైన్యం మాటేమిటి? వీటి గురించి సింగపూర్‌లో ఎలాంటి చర్చ జరగలేదు, ఒప్పందమూ కుదరలేదు. సమస్యల పరిష్కారానికి ఒక సూత్రప్రాయ అంగీకారం మాత్రమే కుదిరింది కనుక ప్రపంచమంతా ఈ పరిణామాన్ని సహజంగానే హర్షిస్తోంది. వుత్తర కొరియా పూర్తిగా అణుకార్యక్రమాన్ని నిలిపివేయాలంటే దానికి జరిగే నష్టాన్ని ఎలా భరిస్తారు, ఎవరు భరిస్తారు, ఇప్పటి వరకు విధించిన ఆంక్షలను ఎలా, ఎంతకాలంలో తొలగిస్తారు, దానికి హామీ ఏమిటి అనేక అనేక అంశాలు పరిష్కారం కావాల్సి వుంది. వీటిపై గతంలో అంగీకరించిన ఒప్పంద నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగిన మచ్చ వుంది. ఒకవైపు వుత్తర కొరియాతో చర్చలు జరుపుతూనే అణు సమస్యపై ఇరాన్‌తో కుదిరిన ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలగింది. అన్ని ప్రధాన దేశాలతో వాణిజ్యలోటు కలిగి వున్న అమెరికా అదిరించి బెదిరించి తన వుత్పత్తులను ఆయా దేశాలకు ఎగుమతులు చేయాలని చూస్తున్నది. ఈ క్రమంలో దానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిఘటన ఎదురవుతున్నది. వుత్తర కొరియాను అదుపు చేసే పేరుతో ఇంతకాలం పెద్ద మొత్తంలో అమెరికా నిధులు ఖర్చు చేసింది. అనుకున్నట్లుగా ఒప్పందం అమలు జరిగితే ఇప్పుడు సైనిక విన్యాసాలకు బదులు వుత్తర కొరియా రక్షణ గురించి ఖర్చు చేయాల్సిన పరిస్ధితి వస్తుంది. దాన్ని ఎవరి మీద రుద్దుతుంది? ఇలాంటి అనేక సమస్యలు పరిష్కారం కావాల్సి వుంది.

Image result for denuke deal with north korea

ఒప్పందాల విషయంలో గతంలో అమెరికా ఇతర దేశాల నిర్వాకం చూసిన తరువాత వుత్తర కొరియా తన రక్షణకు మరింత జాగ్రత్త పడుతుంది. వుదాహరణకు 30దేశాలు నిధులు అందచేసే కొరియా ద్వీపకల్ప ఇంధన అభివృద్ధి సంస్ధ(కెడో) ద్వారా 250 కోట్ల డాలర్లు వెచ్చింది ఒక అణుఇంధన రియాక్టర్‌ను నిర్మించారు. దానికి అమెరికా 50కోట్ల డాలర్ల విలువగల తేలిక జల ఇంధనాన్ని సమకూర్చేందుకు ఖర్చు చేసింది. చివరికి దాన్ని 2006లో మూసివేశారు. అయితే దానికి రెండువందల కోట్ల డాలర్లను సమకూర్చాయి. ఆమొత్తం సొమ్ము దానిని నిర్మించిన ఐరోపా యూనియన్‌, దక్షిణ కొరియా, జపాన్‌ కంపెనీలకే తిరిగి చేరింది తప్ప వుత్తర కొరియాకు ఒరిగిందేమీ లేదు. ఒప్పందం విఫలం కావటంతో వుత్తర కారియా అప్పటి వరకు అంతర్జాతీయ అణుశక్తి సంస్ధ పర్యవేక్షణలో వుంచిన ప్లూటోనియం రాడ్ల సీళ్లను తొలగించి తిరిగి అణ్వాయుధాల తయారీ కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి అమెరికాదే పూర్తి బాధ్యత.

ప్రాంతీయ రాజకీయాలు, దేశాలలో జోక్యం చేసుకోవటంలో అమెరికాను మించిన వారు ఇప్పుడు లేరు. వుదాహరణకు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌ను తొత్తుగా చేసుకొని అమెరికా పాల్పడని జోక్యం లేదు. చివరకు ఐఎస్‌ తీవ్రవాదులను కూడా తయారు చేసి కిరాయికి ప్రయోగిస్తోంది. అలాంటి అమెరికా ఇతర దేశాల వ్యవహారాల్లో ఇరాన్‌ జోక్యం చేసుకొంటోందనే నెపంతో దానితో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది. ఇప్పుడు వుత్తర కొరియా నుంచి ప్రమాదం లేదు, హాయిగా నిదురపొండి అని తన జనానికి చెప్పిన ట్రంప్‌ ఇప్పుడు ఇరాన్‌ గురించి ఏమి చెబుతారు? కొద్ది రోజుల తరువాత వుత్తర కొరియాతో కుదుర్చుకున్న ఒప్పందానికి కూడా తూ నా బడ్డుబాలు అని చెప్పరన్న గ్యారంటీ ఏముంది? అందుకే అమెరికా అడుతోంది రాజకీయం తప్ప మరొకటి కాదు అని చెప్పాల్సి వస్తోంది. వుత్తర కొరియాలో నిర్బంధించిన అమెరికన్ల విడుదల కొరకు ఆదేశం ఎలాంటి మొత్తాన్ని డిమాండ్‌ చేయలేదు. ఇరాన్‌లో బందీలైన అమెరికన్లను విడిపించుకొనేందుకు 40కోట్ల యూరోలను విమానంలో తరలించి, దానిలోనే బందీలను వెనక్కు తీసుకువచ్చారు. అయితే ఆ సొమ్మును ఒప్పందం ప్రకారం సరఫరా చేయని మిలిటరీ పరికరాల కోసమని అమెరికా చెప్పుకొన్నది. అలాంటి మొత్తం అయితే ఇంకా 200 కోట్ల డాలర్ల వరకు అమెరికా చెల్లించాల్సి వుంది. ఇవన్నీ చూసినపుడు అమెరికా ఆడుతున్నది రాజకీయం తప్ప ప్రపంచశాంతి సమస్యపై దానికి చిత్తశుద్ధి లేదన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మీ ఇంటికొస్తే మాకేమి ఇస్తారు, మా ఇంటి కొస్తూ మాకేమి తెస్తారంటే కుదరదు అమెరికా పెద్దన్నా !

22 Tuesday May 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

america first, anti china, CHINA TRADE, Donald trump, Indo-China trade, TRADE WAR, US-CHINA TRADE WAR

ఎం కోటేశ్వరరావు

వాణిజ్య యుద్ధంలో అమెరికా ముందు చైనా చేతులెత్తేసిందా? ఏమో ! చైనా మెడలు వంచి వాణిజ్య పోరులో అమెరికా విజయం సాధించిందా ? ఏమో చెప్పలేం గానీ తాత్కాలికంగా రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరింది. ‘చైనాతో యుద్దం వాయిదా పడింది, కానీ ట్రంప్‌ వ్యూహ గందరగోళం కొనసాగుతూనే వుంది’ . కార్పొరేట్ల పత్రిక ఫోర్బ్స్‌ ఒప్పందంపై రాసిన తక్షణ విశ్లేషణ శీర్షిక ఇది. ‘ చైనా ముఖ్యమైన ప్రయోజనాలను కాపాడుకుంది’ ఇది చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక విశ్లేషణకు పెట్టిన శీర్షిక. వివరాలేమీ తెలియకుండానే అమెరికాన్లకు చైనా లంగిపోయిందని సంతోష పడే వారికి చివరకు మిగిలేది నిరాశే అని గత చరిత్రను బట్టి చెప్పక తప్పదు.

ప్రపంచంలో స్వేచ్చా వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు అమెరికా నాయకత్వంలోని ధనిక దేశాలు వునికిలోకి తెచ్చినదే ప్రపంచవాణిజ్య సంస్థ(డబ్ల్యుటిఓ). అది ఒక పక్క వుండగానే మరోవైపు దానిలోని సభ్యదేశాలు వాణిజ్య యుద్ధాలకు తలపడటం అంటే దాని వైఫల్యాన్ని సూచిస్తున్నది. నిజానికి ప్రపంచీకరణ యుగంలో రెండు దేశాల మధ్య తలెత్తే వాణిజ్యపోరు, పరిష్కారం కూడా వాటికే పరిమితం కాదు. ప్రపంచంలో ప్రతి ధనిక దేశమూ చైనాతో వాణిజ్యంలో లోటుతోనే వుంది, కనుక ప్రతి దేశమూ దానిని తగ్గించుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూనే వుంటుంది. వాటిలో అమెరికా ఒకటి. దిగుమతి సుంకాల పెంపుతో ఎవరైనా చైనాను దెబ్బతీయాలని చూస్తే ఆ విబేధాన్ని వినియోగించుకొనేందుకు మిగతా దేశాలు కాచుకొని వుంటాయి, వున్నాయి. అందుకు పెద్ద వుదాహరణ మన దేశమే.

కాషాయ మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో నిత్యం చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతుంటారు. దేశభక్తి నిరూపణకు చైనా వ్యతిరేకతను ఒక ప్రమాణంగా ముందుకు తెస్తున్నారు. అయితే గతకొద్ది నెలలుగా ప్రధాని నరేంద్రమోడీ, విదేశాంగమంత్రి మొదలు, వున్నత అధికారయంత్రాంగం మొత్తం చైనాతో సయోధ్య దిశగా ముందుకు పోతున్నారంటే అతిశయోక్తి కాదు. పాత సామెత ప్రకారం వ్యాపారి వరదనబడి పోతున్నాడంటే ఏదో లాభం కనిపించబట్టే అని వేరే చెప్పనవసరం లేదు. కమ్యూనిస్టు వ్యతిరేకతలో అమెరికా కంటే సంఘపరివారం పేరుమోసిందేమీ కాదు. అలాంటి అమెరికానే చైనాతో కాళ్లబేరానికి వస్తున్నపుడు పరివార పెద్దలైన మోడీ, మరొకరు ఎంత? వారంతా కార్పొరేట్ల ప్రతినిధులు తప్ప మరొకరు కాదు. ఎడ్లెవిస్‌ అగ్రీవాల్యూ చైన్‌ లిమిటెడ్‌ కంపెనీ పరిశోధన విభాగ అధిపతి పెరెరాణా దేశాయ్‌ చైనా-అమెరికా వాణిజ్య పోరు గురించి ఇలా చెప్పారు.’ ఎగుమతుల ధరలు పోటాపోటీగా వున్నట్లయితే అయిల్‌ సీడ్స్‌ మీల్స్‌ అయిన సోయా, ఆవ, పత్తి మరియు మొక్కజన్న భారతీయ ఎగుమతిదార్లకు ఒక చిన్న వ్యవసాయ ఎగుమతి కిటికీ తెరుచుకుంటుంది. నూట ఆరు అమెరికా వుత్పత్తులపై చైనా 25శాతం వరకు కొత్త పన్నులు ప్రకటించింది, అంతకు ముందు 128 అమెరికా వుత్పత్తులపై పన్నులు పెంచింది. రెండు అతి పెద్ద దేశాలు ఒక వాణిజ్య యుద్ధంలోకి అడుగుపెట్టాయి.పదమూడు వందల చైనా వుత్పత్తులపై అమెరికా 25శాతం పన్నులు విధించింది.’ భారత పత్తి సంఘం అధ్యక్షుడు అతుల్‌ గణత్ర మాట్లాడుతూ ‘ అమెరికా తరువాత పత్తి ఎగుమతిలో స్థానం భారత్‌దే. చైనా 50మిలియన్‌ బేళ్ళ పత్తి దిగుమతి చేసుకుంటే దానిలో 40శాతం అమెరికా నుంచి వస్తోంది. ఆ పత్తిపై చైనా 25శాతం పన్ను విధిస్తోంది. మన పత్తిపై చైనాలో ఎలాంటి పన్నులు లేవు, అందువలన అమెరికా పత్తి కంటే మన సరకు చౌక అవుతుంది కనుక మనకు ఇది మనకు లాభదాయకం.’ సౌరాష్ట్ర జిన్నర్స్‌ అసోసియేషన్‌ ఆనంద్‌ పోపట్‌ మాట్లాడుతూ ఆస్ట్రేలియా, ఆఫ్రికన్‌ కాటన్‌ కంపెనీల కంటే మన పత్తి ధర చౌక, భారత సోయాబీన్‌పై వున్న ఆంక్షలను చైనా తొలగించినట్లయితే వారికి మనం సరఫరా చేయగల మరొక వస్తువు అవుతుంది. చైనాకు అవసరమైన 93.4 మిలియన్‌ టన్నులు సోయాలో ప్రస్తుతం అమెరికా 39శాతం సరఫరా చేస్తోంది.’ అన్నారు. చైనా పశు, కోళ్ల దాణాకు వుపయోగించే సోయాను మన దేశం నుంచి ఎగుమతి చేసేందుకు ఇప్పుడున్న ఆంక్షల ఎత్తివేతకు మన దేశవాణిజ్య శాఖ సంప్రదింపులు జరుపుతోంది.

గత నాలుగు సంవత్సరాలుగా నరేంద్రమోడీ సర్కార్‌ తన విజయాల గురించి ఎన్ని అతిశయోక్తులు చెబుతున్నప్పటికీ కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లుగా పరిస్ధితి వుంది. మన వాణిజ్యలోటు గతేడాది ఏప్రిల్‌లో 13.25బిలియన్‌ డాలర్లు వుండగా ఈ ఏడాది 13.72 బిలియన్లకు పెరిగింది. రోజు రోజుకూ చమురు ధరల పెరుగుదల కారణంగా ఇది మరింత విస్తరించటమే కాదు, మన దేశం నుంచి డాలర్లు తరలిపోవటం పెరుగుతుండటంతో విదేశీమారకద్రవ్య సమస్యకూడా తలెత్తే అవకాశం వుంది. ఎక్కడన్నా బావే కాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు మన మార్కెట్లో ప్రవేశించేందుకు మోడీని కౌగలించుకోవటం తప్ప వారి మార్కెట్లలో మనకు ప్రవేశం ఇవ్వటం లేదు. మన దేశ ధనికులు ఏ కారణం చేతో బంగారం, బంగారు ఆభరణాలు, ముత్యాలు, రంగురాళ్లు దిగుమతి చేసుకోవటం తగ్గించబట్టిగాని లేకపోతే వాణిజ్యలోటు మరింత పెరిగి వుండేది. గత ఏప్రిల్‌లో చమురు దిగుమతులకు 7.36బిలియన్‌ డాలర్లు మనం చెల్లించగా ఈ ఏడాది ఆ మొత్తం 10.41బిలియన్లకు పెరిగింది.

ప్రపంచంలో నేడు చైనా పెద్ద ఎగుమతిదారే కాదు, పెద్ద వినియోగదారుగా కూడా మారుతోంది. అక్కడి జనాభా కొనుగోలు శక్తి పెరుగుతున్న కారణంగా ఆ మార్కెట్‌ను వదులుకొనేందుకు ఏ ధనిక దేశమూ సిద్దంగా లేదు. అలాంటి దేశంతో మనం అనవసరంగా తగాదా పెట్టుకోవాల్సిన అవసరం ఏముందనే అభిప్రాయం మన కార్పొరేట్‌ రంగంలో క్రమంగా పెరుగుతోంది. సంఘపరివార్‌ చైనా వ్యతిరేక చిల్లర ప్రచారం ఎలా వున్నప్పటికీ ప్రభుత్వపరంగా అది కుదరదని స్పష్టం చేస్తున్న కారణంగానే ఇటీవలి కాలంలో డోక్లాం దగ్గర నుంచి అనేక సానుకూల వైఖరులను వెల్లడిస్తున్నది. చైనా ఆహార, ఔషధ నియంత్రణ శాఖ వద్ద పెండింగ్‌లో వున్న 254 వుత్పత్తుల నమోదుకు వేగంగా అనుమతులు తీసుకోవాలని మన ఫార్మారంగం మోడీ సర్కార్‌ మీద వత్తిడి తెస్తోంది.

తాను ఎగుమతి చేయటమే తప్ప దిగుమతులు చేసుకోవటం లేదన్న విమర్శలను పూర్వపక్షం చేసేందుకు లేదా ఎవరేమి ఎగుమతి చేయగలరో చూపండి అన్నట్లుగా ఈ ఏడాది నవంబరు నెలలో షాంఘై నగరంలో తొలిసారిగా చైనా దిగుమతుల ప్రదర్శన నిర్వహిస్తోంది. అంటే ప్రపంచ దేశాలన్నీ తమ వుత్పత్తులను అక్కడ ప్రదర్శించాల్సి వుంటుంది. రానున్న ఐదు సంవత్సరాలలో తాము పది లక్షల కోట్ల డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటామని చైనా చెబుతోంది. అందువలన ప్రతి దేశం తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రయత్నిస్తుంది. షాంఘై ప్రదర్శనలో చైనా తన విధానాన్ని, నిబంధనలను ప్రపంచానికి తెలియచేయనుంది. ఈ ప్రదర్శనలో మన దేశం నుంచి కనీసం వందమంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం వుంది. చైనా వస్తువుల దిగమతులు నిలిపివేసి దేశభక్తి నిరూపించుకోవాలని సంఘపరివార్‌ సంస్ధలు ఎంతగా గగ్గోలు పెట్టినా గత ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు మన దేశం చైనా నుంచి 69.4బిలియన్‌ డాలర్ల మేరకు వస్తువులను దిగుమతి చేసుకోగా ఇదే సమయంలో కేవలం 11.5బిలియన్ల మేరకు మాత్రమే ఎగుమతులు చేసింది. వాణిజ్య తేడా 58 బిలియన్‌ డాలర్లు. చైనాతో సరిహద్దు సమస్యతో పాటు వాణిజ్యపరంగా ఇలాంటి ఎన్నో ప్రాధాన్యత అంశాలున్నందున వారితో వైరం తెచ్చుకోవాలని ఏ కార్పొరేట్‌ సంస్ధా కోరుకోదు. పాలకులు ఎవరైనా అలాంటి పిచ్చిపనులకు పూనుకుంటే వైఖరి మార్చుకునే విధంగా తాను చేయాల్సింది చేస్తుంది. ఈ పూర్వరంగంలోనే ఎలాంటి ముందస్తు ఎజండా లేకుండా నరేంద్రమోడీ చైనా వెళ్లినప్పటికీ సానుకూలంగా వున్నామన్న సందేశం దానిలో ఇమిడి వుంది.

అమెరికాాచైనాల మధ్య వాణిజ్య పోరుకు స్వస్థిచెప్పి వాణిజ్యలోటు సమస్యను పరిష్కరించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. అయితే ఆచరణలో ఎవరి ప్రయోజనాలు వారికి వున్నాయి గనుక అమలు ప్రశ్న తలెత్తుతోంది. గతంలో కూడా ప్రతి అమెరికా అధ్యక్షుడూ ఏదో ఒక దశలో వాణిజ్యపోరు పేరుతో బెదిరింపులకు దిగిన వారే. ట్రంప్‌ వైఖరి మొరటుగా వుంది. తన పదవీకాలం పూర్తయ్యే నాటికి రెండు దేశాల మధ్య వున్న వాణిజ్యలోటులో 200బిలియన్‌ డాలర్లను తగ్గించాలని చెబుతున్నాడు. అయితే హడావుడి చేస్తోందని చైనీయులు చెబుతున్నారు. మేడిన్‌ చైనా 2025 పేరుతో చైనా తన వుత్పాదక పరిశ్రమను వున్నత స్ధాయికి పెంచుకొనేందుకు దీర్ఘకాలిక క్రీడను ప్రారంభించిందని, దానిని పడనివ్వకుండా చేయటంతో పాటు అమెరికా తాత్కాలిక ప్రయోజాలను కోరుతోందని, చైనా కీలక ప్రయోజనాలను ఎట్టి పరిస్ధితులలో ఫణంగా పెట్టదని పరిశోధకులు చెబుతున్నారు.

చైనాతో పూర్తి స్థాయి వాణిజ్య యుద్ధం తప్పిపోయిందని విజయోత్సవాలు చేసుకోవటం తప్ప సాధించిందేమిటో తెలియదని అమెరికాలో విమర్శకులు అంటున్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధతో కలవకుండా తన ప్రయోజాలకే పెద్ద పీట వేస్తున్న చైనాను ఒంటరి పాటు చేయటం లేదా అంకెకు తీసుకురావటం అన్న అసలు లక్ష్యాన్ని ట్రంప్‌ పట్టించుకోవటం లేదన్న విమర్శలు చెలరేగాయి. అసలు చైనాను ప్రపంచ వాణిజ్య సంస్ధలో అడుగుపెట్టనివ్వటమే అమెరికా చేసిన పెద్ద తప్పిదమని అమెరికా వాణిజ్య ప్రతినిధి ఒక నివేదికలో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఆర్ధిక వ్యవస్ధలో రాజ్య జోక్యం చేసుకోకుండా చైనాను కట్టడి చేయటమే అంతి మ లక్ష్యం అయితే అమెరికా వస్తువులను కొనుగోలు చేయించమని చైనాను కోరటం ప్రతికూలమౌతుందని కొందరు హెచ్చరిస్తున్నారు.

అమెరికా ఇప్పుడు ఒక్క చైనా మీదే కాదు మా వస్తువులు కొంటారా లేక మీ వస్తువుల మీద దిగుమతి పన్ను విధించమంటారా తేల్చుకోండని అన్ని దేశాలను బెదిరిస్తున్నది. వాటిలో జపాన్‌ ఒకటి. రాజకీయంగా చైనాకు వ్యతిరేకంగా దానిని కూడగడుతున్నప్పటికీ ఆర్ధిక విషయాల్లో జపాన్‌పై అమెరికా తన షరతులను రుద్దేందుకు పూనుకుంది. తమ వుక్కు, అల్యూమినియం వస్తువులపై 25,10 శాతం చొప్పున దిగుమతి పన్ను విధించేందుకు అమెరికా పూనుకుంటే తాము కూడా ప్రతి చర్యలకు దిగక తప్పదని ప్రపంచవాణిజ్య సంస్ధకు జపాన్‌ తెలియచేసింది. అమెరికా బెదిరింపులకు చైనా లంగకపోవటం జపాన్‌కు వూతమిచ్చి అమెరికాను హెచ్చరించేంత వరకు వెళ్లిందని పరిశీలకులు భావిస్తున్నారు. 1970,80 దశకాలలో అమెరికాను ఎదిరించే శక్తిలేని జపాన్‌ ప్లాజా ఒప్పందాన్ని అంగీకరించాల్సి వచ్చిందని పర్యవసానంగా జపాన్‌లో దీర్ఘకాల ఆర్ధిక తిరోగమనానికి దారి తీసిందని ఇప్పుడు అమెరికా గొంతెమ్మ కోర్కెలను చైనా అంగీకరించటం లేదని అందువలన చైనా నుంచి నేర్చుకోవాల్సి వుందని జపాన్‌ భావిస్తున్నది.

చిత్రం ఏమిటంటే ఐరోపాలో రష్యాకు వ్యతిరేకంగా అమెరికాతో చేతులు కలుపుతున్న అక్కడి ధనిక దేశాలు కూడా జపాన్‌ చర్యను చూసి అమెరికా దిగుమతి సుంకాలకు ప్రతిగా తాము కూడా అమెరికా వస్తువులపై అదనపు సుంకాలను విధించాల్సి వుంటుందని ఐరోపా యూనియన్‌ పేర్కొన్నది.అయితే ఈ హెచ్చరికలేవీ జపాన్‌-ఐరోపాయూనియన్‌- అమెరికా మధ్య వున్న రాజకీయ బంధాన్ని దెబ్బతీసేవిగా మారే అవకాశాలు ఇప్పటికైతే లేవు. మన దేశంపై అమెరికా వాణిజ్య యుద్దానికి దిగకపోయినప్పటికీ మన వ్యవసాయ మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు వత్తిడి తెస్తోంది. దానిలో భాగంగానే మన దేశంలో ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధరలను ఎక్కువగా నిర్ణయిస్తోందని, వ్యవసాయ, ఆహార రాయితీలను పరిమితికి ఇస్తోందని ప్రపంచ వాణిజ్య సంస్ధకు కొద్దివారాల క్రితం ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో వుక్కు, అల్యూమినియం దిగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలు మన దేశానికి కూడా వర్తిస్తాయని మన దేశం కూడా వాణిజ్య సంస్ధకు నోటీసు అందచేసింది. మొత్తం మీద చూసినపుడు మీ ఇంటికొస్తే మాకేమి ఇస్తారు, మా ఇంటికొస్తూ మాకేమి తెస్తారు అన్న రీతిలో అమెరికా ప్రవర్తిస్తోంది. అందువలన దాని వైఖరికి ప్రభావితులయ్యే ప్రతి ఒక్కరు ఏదో విధంగా సమన్వయం చేసుకొని పెద్దన్న వైఖరిని అడ్డుకోవటం అవసరం. ఈ దృష్ట్యా కూడా చైనాతో మన దేశం సఖ్యంగా వుండి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d