• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Donald trump

సిరియాపై దాడులతో రెచ్చగొడుతున్నడోనాల్డ్‌ ట్రంప్‌ !

18 Wednesday Apr 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

chemical weapons, Donald trump, RUSSIA, Syria, UN and OPCW

Image result for syria attack

ఎం కోటేశ్వరరావు

‘ఒక బీరు కొని అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో కలసి తాగుతూ స్వయంగా నా అనుభవాలను పంచుకోవాలనుంది. సిరియా పౌరుల కోసం ఏదో ఒకటి చేసేందుకు ఆయన ప్రయత్నించంటం నాకు సంతోషంగా వుంది.’ గత నాలుగు సంవత్సరాలుగా అమెరికాలో ఆశ్రయం పొంది జర్నలిస్టు ముసుగులో సిరియాపై తప్పుడు ప్రచారం సాగిస్తున్న కాశీమ్‌ ఇద్‌ అనే ఒక ఐఎస్‌ఏజంట్‌ గతవారంలో సిరియాపై దాడుల తరువాత సిఎన్‌ఎన్‌ టీవీతో చేసిన వ్యాఖ్య. అమెరికా నాయకత్వంలో ఫ్రెంచ్‌, బ్రిటన్‌ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇతర కొన్ని దేశాలు జరిపిన దాడులతో ఐఎస్‌ ఏజంట్ల ఆనందం ఎలా వుందో ఇది తెలుపుతోంది. నేను సైతం తక్కువ తిన్నానా అంటూ నాలుగు సంవత్సరాల క్రితం బరాక్‌ ఒబామా తన వంతుగా ఒక దాడి జరిపితే, నీకంటే పెద్ద వెధవాయను నేను అంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ గతేడాది ఒకసారి ఇప్పుడు మరోసారి దాడులు జరిపించాడు. గతంలో ఐఎస్‌ తీవ్రవాదులను అణచే పేరుతో, ఇప్పుడు ప్రభుత్వమే తన పౌరులపై రసాయనిక ఆయుధాలను ప్రయోగిస్తోందనే ముసుగుతో దాడికి పాల్పడింది. చరిత్రలో ఇంత వరకు నాజీలు తప్ప ఎవరూ రసాయనిక ఆయుధాలతో సామూహిక హత్యలు చేసిన వుదంతాలు కానరావు. తమ దగ్గర ఎలాంటి రసాయన ఆయుధ కార్యక్రమం లేదు కనుక వత్తిడికి తలగ్గిన సిరియా ఏవైనా వుంటే వాటి నిర్మూలనకు అమెరికాతో ఒక ఒప్పందం కూడా చేసుకుంది. దాన్ని అమలు జరపకుండా, అంతర్జాతీయ న్యాయాన్ని వుల్లంఘించి ఎలాంటి చట్టబద్దత లేకుండా జరిపిన దాడి ఇది. అణు జలాంతర్గాములు, అణ్వాయుధాలను మోసుకుపోయే విమానవాహక యుద్ధ నౌకలతో మోహరించి 2003లో ఇరాక్‌ తరువాత జరిపిన పెద్ద దాడి ఇది.ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందాన్ని రద్దు చేసుకోబోతున్నారనే వార్తలు ఒకవైపు, రష్యాకు చెందిన ఒక డబుల్‌ ఏజంట్‌, అతని కూతురిపై విష ప్రయోగం జరిపిందనే సాకుతో అనేక మంది రష్యా రాయబార సిబ్బందిని ఐరోపా దేశాల నుంచి బహిష్కరించటం వంటి పరిణామాలను చూస్తే పశ్చిమ దేశాలు గిల్లి కజ్జాలకు పూనుకున్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది.

అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మిలిటీకరణ జరిగింది. ప్రయివేటు కార్పొరేట్‌ సంస్ధలే అక్కడ ఆయుధాలు తయారు చేస్తాయి. అందువలన వాటికి లాభాలు రావాలంటే ప్రపంచంలో ప్రతి రోజూ ఏదో ఒక మూల రావణకాష్టం మాదిరి య దానికి ఎక్కడో ఒక చోట యుద్ధాలు, దేశాల మధ్య వుద్రిక్తతలు వుంటే తప్ప జరుగుబాటు వుండదు. మిలిటరీ పరిశ్రమలను మేపేందుకు అమెరికా పాలకవర్గం ఇప్పటికే స్కూళ్ల ప్రయివేటీకరణ, నిధుల కోత, మౌలిక సౌకర్యాల తగ్గింపు, గృహ, వైద్య రంగాల నుంచి తప్పుకోవటం వంటిచర్యల ద్వారా జనజీవితాలను దిగజార్చటంతో పాటు నిరుద్యోగం, దారిద్య్రాన్ని పెంచుతోంది. రెండోవైపు అంతర్జాతీయంగా దాడులకు తలపడుతోంది. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలమని ప్రగల్భాలు పలికే పశ్చిమ దేశాలు జరిపిన ఈ దాడిని అనేక దేశాలు, సమాజాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పశ్చిమాసియాలో, తద్వారా ప్రపంచ యుద్ధానికి పశ్చిమ దేశాలు అర్రులు చాస్తున్నాయని అనేక మంది భయపడుతున్నారు.అంతర్గతంగా వైఫల్యాలబాటలో వున్న ట్రంప్‌ వాటిని పక్కదారి మళ్లించేందుకు, నవంబరులో జరగనున్న పార్లమెంట్‌ మధ్యంతర ఎన్నికలలో ఓట్లు పొందేందుకు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వచ్చాయి. సిరియా రసాయక ఆయుధాలను ప్రయోగించిందని ఆరోపించటం కాదు, అంతర్జాతీయ సంస్ధల ద్వారా దర్యాప్తు జరిపించాలి. దాని గురించి ఐక్యరాజ్యసమితిలో చర్చ జరపాలి. ఏ చర్య తీసుకున్నా దాని అనుమతితో, పర్యవేక్షణలో జరపాలి తప్ప అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ నేతలు ముగ్గురూ కూర్చొని సిరియాపై దాడులు చేయటానికి వారెవరు?

Image result for syria attack

సిరియా వద్ద వున్న రసాయనిక ఆయుధాల సామర్ధ్యాన్ని దెబ్బతీసే పేరుతో జరిపిన ఈ దాడులు ప్రపంచాన్ని భయపెట్టేందుకు తప్ప మరొకందుకు కాదు. నిజంగా ఎవరైనా రసాయనిక ఆయుధాలను తయారు చేస్తుంటే గత నాలుగైదు సంవత్సరాలుగా దాడులు చేస్తామని బెదిరిస్తున్న అమెరికా ప్రకటనల తరువాత కూడా జాగ్రత్తలు తీసుకోకుండా వుంటారా? వర్తమాన పరిస్ధితుల్లో ఏ దేశానికాదేశం తన రక్షణ కోసం అన్ని రకాల ఆయుధాల తయారీకి పూనుకోవటం బహిరంగ రహస్యం. వాటిలో ఒకటైన జీవ, రసాయన ఆయుధాల్లేని పెద్ద దేశాలేవీ లేవు. కొన్ని బహిర్గతమైతే కొన్ని రహస్యంగా చేస్తుంటాయంతే తేడా. గతంలో కుదిరిన ఒప్పందాల ప్రకారం సిరియా 1300 టన్నుల రసాయన ఆయుధాలను నాశనం చేసింది. అయినా సరే దాని దగ్గర ఇంకా ఎక్కడో వున్నాయన్నది పశ్చిమ దేశాల ఆరోపణ. ఐక్యరాజ్యసమితిలోని రసాయనాయుధాల నిషేధ సంస్ధ(ఒపిసిడబ్ల్యు) సిరియా రసాయన ఆయుధాలను ధ్వంసం చేసినందుకు గాను 2013లో నోబెల్‌ శాంతి బహుమతి కూడా పొందింది. మరుసటి ఏడాది సెప్టెంబరు నాటికి 96శాతం ఆయుధాలను నాశనం చేసినందున, తయారీ కేంద్రాల విధ్వంసానికి నిర్ణయించిందని , 2016జనవరిలో మొత్తాన్ని ధ్వంసం చేసినట్లు ఆ సంస్ధ ప్రకటించింది. నిజానికి అవన్నీ 1970దశకం నుంచి రూపొందించినవి. అలాంటపుడు తిరిగి ఏడాది కూడా గడవక ముందే సిరియా వద్ద రసాయనిక ఆయుధాలు గుట్టలు పడ్డాయని పశ్చిమ దేశాలు ప్రకటించాయంటే ఆధారం ఏమిటి? ప్రతి దేశంలోనూ పారిశ్రామిక అవసరాల కోసం వుపయోగించే క్లోరీన్‌ గాస్‌ను రసాయనికాయుధాల తయారీకి కూడా వుపయోగించవచ్చు. దీనిని చూపే సిరియాపై పశ్చిమ దేశాలు ఆరోపణలకు దిగాయి. తరువాత ఓపిసిడబ్ల్యు, ఐరోసా సంయుక్త దర్యాప్తు వ్యవస్ధను(జిమ్‌) ఏర్పాటు చేశాయి. ఆ జిమ్‌ కొత్తగా సిరియా రసాయనికాయుధాల గురించి ఒక నివేదిక సమర్పించింది. అది అమెరికా అనుకూల తొత్తు నివేదిక అని రష్యా గుర్తించేందుకు నిరాకరిస్తోంది. దాని ఆధారంగా ఎలాంటి చర్య తీసుకోకూడదని రష్యా ఐరాసలో వీటో చేసింది. అందువలన అమెరికా నాయకత్వంలోని కూటమి ఇప్పుడు ఏకపక్షంగా దాడులు చేసింది. ఆనక తీరికగా దర్యాప్తు అంటూ కబుర్లు చెబుతోంది.

అమెరికా రక్షణ మంత్రి జిమ్‌ మాటిస్‌ చెప్పినదాని ప్రకారం 105 దీర్ఘకాలిక శ్రేణి క్షిపణులను ప్రయోగించిన పెద్ద దాడి ఇది, ఒక్కసారికే ఇది పరిమితం అని చెప్పినప్పటికీ ప్రపంచ స్పందనను చూసేందుకు చేసిన ఒక ప్రయోగమని చెప్పవచ్చు. తన నూతన, నవీకరించిన ఆయుధాలు ఎలా పని చేస్తాయో పరీక్షించేందుకు గతంలో ఇరాక్‌ మొత్తాన్ని తన యుద్ద ప్రయోగశాలగా మార్చింది. ఇప్పుడు కూడా అదే చేస్తోంది. కొద్ది రోజుల క్రితం డోనాల్డ్‌ ట్రంప్‌ రష్యాను బెదిరిస్తూ చేసిన ఒక ట్వీట్‌లో కొత్తవి, చక్కని, చిన్నవైన క్షిపణులు వస్తున్నాయి కాచుకోండి అని పేర్కొన్నారు. సిరియా రాజధాని డమాస్కస్‌లోని జీవ, రసాయన ఆయుధాల రూపకల్పన, తయారీ, పరీక్షా కేంద్రం మీద, హామ్‌ అనే పట్టణంలోని రసాయనిక ఆయుధాల గోడవున్‌ మీద, మూడవ దాడి దానికి సమీపంలోనే వున్న ఒక బంకర్‌ మీద క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికన్లు చెబుతున్నారు. అమెరికన్లు చెబుతున్నదే వాస్తవమైతే ఆయుధ గోడవున్లపై బాంబులు వేస్తే అవి పేలి ఈ పాటికి ఎంతో ప్రాణ నష్టం జరిగి వుండాల్సింది. అలాంటి వార్తలేవీ రాలేదు కనుక సిరియా ప్రకటించినట్లు దాని వైమానిక సైనిక కేంద్రాలు, విమానాశ్రయాల మీద మాత్రమే దాడులు జరిగాయని అనుకోవాల్సి వస్తుంది.మరోవైపున ప్రయోగించిన 103లో 71క్షిపణులను సిరియా వైమానిక రక్షణ వ్యవస్ధలు కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. రష్యా వద్ద వున్న అధునాతన క్షిపణి విధ్వంసక వ్యవస్ధలు సిరియాలో ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి.

సిరియా ప్రభుత్వం రసాయనిక ఆయుధాలతో దాడులు జరుపుతోందంటూ ఒక పధకం ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా పశ్చిమ దేశాల మీడియా ప్రచారం చేస్తోంది. అలాంటి దాడులు జరిపింది సిరియా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు పశ్చిమ దేశాల సాయంతో దాడులు చేస్తున్న కిరాయి ఐఎస్‌ తీవ్రవాదులు తప్ప మరొకరు కాదని గతంలోనే వెల్లడైంది. ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే చివరికది నిజమై కూర్చుంటుందన్న నాజీ గోబెల్స్‌ సిద్ధాంతం ప్రకారం సిరియాపై రసాయనిక ఆయుధాల ప్రయోగ ప్రచారం జరుగుతోంది. 2003లో బుష్‌ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం ఇరాక్‌పై దాడులు చేసేందుకు చేసిన ప్రచారాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. ఆ దేశ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ ప్రత్యర్ధి దేశాలపై దాడులు చేసేందుకు మారణాయుధాలను గుట్టలుగా పోగేశాడంటూ పెద్ద ఎత్తున చేసిన ప్రచారాన్ని, ప్రభుత్వాన్ని కూల్చివేసి, అక్కడి చమురుబావులను స్వాధీనం చేసుకొని, సద్దాంను వురితీసిన తరువాత అలాంటి ఆయుధాలేమీ కనపడలేదని పశ్చిమ దేశాలే ప్రకటించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.

ఆసియా,ఐరోపా, ఆఫ్రికా ఖండాల సంగమ ప్రాంతం వంటి మధ్యప్రాచ్యం, పశ్చిమాసియా మిలిటరీ రీత్యా వ్యూహాత్మకం, చమురువంటి సహజ సంపదల నిలయమైన ఈ ప్రాంతంపై పట్టు నిలుపుకొనేందుకు చరిత్రలో ప్రతి సామ్రాజ్యవాదీ ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రపంచాన్ని తన గుప్పిటలో పెట్టుకోవాలని చూస్తున్న అమెరికా ఆలోచన నిరంతరం దీని చుట్టూతిరుగుతూనే వుంటుంది. అందుకు గాను గోతికాడ నక్కలా అవకాశాల కోసం వేచి చూస్తుంటుంది. ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ ప్రాంత దేశాల పాలకులపై పెల్లుబికిన అసంతృప్తితో 2010లో ట్యునీసియాలో ప్రారంభమై మధ్య ప్రాచ్యం, వుత్తర ఆఫ్రికాలోని పలు దేశాలకు విస్తరించిన ఆందోళనలను అరబ్‌ వసంతోదయంగా వర్ణించారు. ఆ సమయంలో పనిలో పనిగా అమెరికన్లు తమ అజెండాల్లో వున్న దేశాలలోని పాలకులను తొలగించేందుకు తమ తొత్తులు ఏజంట్లను ప్రయోగించి అక్కడ కూడా తిరుగుబాట్లు ప్రారంభమైనట్లు ఒక పెద్దకుట్రకు తెరతీశారు. దానిలో ఒకటి సిరియా. గోడల మీద ప్రభుత్వవ్యతిరేక నినాదాలు రాసిన విద్యార్దులను అరెస్టు చేసిందనే పేరుతో 2011 మార్చినెలలో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలకు తెరతీశారు.తొలుత అంతర్గత తిరుగుబాటుగా మీడియా చిత్రించింది. కొద్ది నెలల్లోనే వివిధ దేశాల నుంచి ఐఎస్‌ తీవ్రవాదులు, కిరాయి మూకలను సమీకరించి పశ్చిమ దేశాలు అడుతున్న నాటకంగా వెల్లడైంది. ప్రతిగా వారిని అణచివేసేందుకు సిరియా సర్కార్‌ పూనుకుంది. తాము కూడా ఐఎస్‌ తీవ్రవాదులను అణచివేసేందుకు సిద్ధమే, సిరియాకు సాయం చేస్తామంటూ సరికొత్త నాటాకానికి తెరతీసిన పశ్చిమ దేశాలు త్వరలోనే అక్కడి అసాద్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసే సత్తా ఐఎస్‌ తీవ్రవాదులకు లేదని గ్రహించించాయి. తీవ్రవాదులకు ఆయుధాలు ఇచ్చింది కూడా వారేనని తేలింది. అప్పటి నుంచి తీవ్రవాదుల పట్టులో వున్న ప్రాంతాలను స్వాధీనం చేసుకొనేందుకు రసాయనికి ఆయుధాలను ప్రయోగిస్తోందంటూ అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించాయి. నిజానికి వాటిని ప్రయోగించింది తిరుగుబాటుదారులే అని తేలింది.

2012 ఆగస్టు 20న నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఒక ప్రకటన చేస్తూ సిరియా సర్కార్‌ రసాయన ఆయుధాలను గనుక ప్రయోగిస్తే అమెరికా గీచిన ఎర్ర(హెచ్చరిక అనే బెదిరింపు) గీతను దాటినట్లుగానే భావించాల్సి వుంటుందని బెదిరించాడు.2014లో ఒబామా సిరియా మీద దాడులు చేయించాడు. అయితే ఐఎస్‌,ఆల్‌ఖైదా వుగ్రవాదుల మీద దాడి అంటూనే సిరియా సామర్ధాన్ని దెబ్బతీసేందుకు పెద్ద ప్రయత్నం చేసి బక్కబోర్లాపడ్డాడు. అప్పటి వరకు అంతర్జాతీయ వేదికల మీద రాజకీయ మద్దతు మాత్రమే తెలుపుతున్న రష్యా ప్రత్యక్షంగా 2015 సెప్టెంబరు నుంచి తన మిలిటరీ నిపుణులు, సామగ్రిని సిరియాకు తరలించి తిరుగుబాటుదార్లను అణచేందుకు తోడ్పడుతోంది. అప్పటి నుంచి సిరియాపై దాడులకు పెంటగన్‌ ఎదురు చూస్తోంది. అదే ఏడాది నవంబరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ఎన్నికైతే ఐఎస్‌పై దాడులకు సిరియాకు పదాతి దళాలను కూడా పంపేందుకు వెనుకాడను అని ప్రకటించాడు. ఎన్నిక తరువాత తిరిగి అదే ప్రకటన చేస్తూ రష్యాతో పోరును కూడా మనం ముగించాల్సి వుంది అని సిరియా అధ్య క్షుడు అసద్‌ను వుద్దేశించి వ్యాఖ్యానించాడు. గతేడాది ఏప్రిల్‌లో అమెరికా 59 తోమహాక్‌ క్రూయిజ్‌ క్షిపణులను సిరియాపై ప్రయోగిచింది. సిరియాను ఆక్రమించేందుకు అమెరికన్లు చేస్తున్న తప్పుడు ప్రచారం దాని బలహీనతలనే బయటపెడుతున్నది. నిజంగానే అసాద్‌ ప్రభుత్వం వద్ద రసాయన ఆయుధాలు వుంటే, ఇటీవల కూడా ప్రయోగించినట్లు అమెరికా చెప్పటం అంటే నాలుగు సంవత్సరాలలో జరిపిన మూడు దాడులు ఎలాంటి ప్రభావం చూపలేదన్నది స్పష్టం. అయితే తాజాగా మూడోసారి ఎందుకు జరిపినట్లు అన్నది ప్రశ్న. బ్రిటీష్‌ రక్షణ మంత్రి గవిన్‌ విలియమ్స్‌న్‌ బిబిసితో మాట్లాడుతూ తాము చేసిన దాడి అక్కడి అంతరుద్ద్యంలో జోక్యం లేదా పాలకుల మార్పు కోసం చేసింది కాదు, ఇది ఆప్రాంతంలో వుద్రిక్తతలు మరింతగా పెరగకుండా తీసుకున్న పరిమిత, లక్షిత దాడి అన్నారు. తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డికోసమన్న సమాధానమిది. ఈనెల ఏడవ తేదీన సిరియా మిలిటరీ ప్రయోగించిన క్లోరీన్‌, ఇతర గుర్తు తెలియని గ్యాస్‌ వల్ల అనేక మంది పౌరులు మరణించారన్న కట్టుకథను ఆధారం చేసుకొని పదమూడవ తేదీన దాడి జరిపారు. ముందే చెప్పుకున్నట్లు అమెరికాలో ఆయుధాలను తయారు చేసేది ప్రయివేటు సంస్ధలు. ఇప్పుడు ప్రయోగిస్తున్న తోమహాక్‌ క్షిపణులను రేథియాన్‌ అనే కాంట్రాక్టరు. అంటే వాడికి పని ఇవ్వాలనే ఒప్పందం వుంది గనుక ఏదో ఒక సాకుతో ఎక్కడో ఒకచోట వాటిని ప్రయోగించాలి. ఈక్షిపణికి అమర్చన బాంబు పేలబోయే ముందు గంటకు 900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి నిర్దేశిత లక్ష్యంపై బాంబు వేస్తుంది. నాలుగు దశాబ్దాలుగా ఈ రకం క్షిపణులను వినియోగిస్తున్నప్పటికీ నవీకరించిన తరువాత తొలిసారిగా 900కిలోల బాంబును తాజాదాడిలో దానికి అమర్చి ప్రయోగించారు. అయితే ఇవి ఎంత మేరకు నష్టం చేకూర్చుతున్నాయనేది సందేహమే. గతేడాది సిరియా వైమానిక స్ధావరంపై చేసిన దాడిలో అనేక విమానాలు, రన్‌వే ధ్వంసమైనట్లు అమెరికన్లు వీడియోలద్వారా ప్రపంచానికి చూపారు. అయితే మరుసటి రోజు నుంచే ఆ రన్‌వేను వుపయోగిస్తున్నట్లు బయటపడింది. అంటే అవి నకిలీ వీడియోలన్నది స్పష్టం. తాజా దాడులలో 71క్షిపణులను మధ్యలోనే కూల్చివేసినట్లు రష్యా చెబుతోంది. కొందరు నిపుణుల వాదనల ప్ర కారం ఖండాంతర క్షిపణుల కంటే అమెరికా ఇప్పుడు ప్రయోగించిన క్రూయిజ్‌ క్షిపణులు చాలా తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి కనుక మధ్యలోనే వాటిని కూల్చివేయటానికి అవకాశాలను కాదనలేము. వాటిని కూల్చివేయగల రష్యా ఎస్‌-400 వ్యవస్ధలున్నాయనే అనుమానం వుంటే వాటి పరిధిలోకి పైలట్లతో కూడిన విమానాలను దాడులకు పంపేందుకు అమెరికా దాని మిత్రపక్షాలు భయపడతాయి. ఈ దాడులను రష్యా, చైనాలు ఖండించాయి. ఈ దాడి జరగటం తమ నాయకుడు పుతిన్‌కు అవమానకరం అని రష్యా దౌత్యవేత్తలు వ్యాఖ్యానించినట్లు నిర్ధారణకాని వార్తలు వెల్లడించాయి. ఇవి పుతిన్‌ను రెచ్చగొట్టేందుకు అమెరికన్లు ప్రచారంలో పెట్టినవి కూడా కావచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గోడకు నిధులు – అక్రమవలసదార్లకు పౌరసత్వం : డోనాల్డ్‌ ట్రంప్‌ !

25 Thursday Jan 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Democratic party, Donald trump, Dreamers, Republican party, us government shutdown, US immigration deal

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాలో శుక్రవారం రాత్రి పన్నెండు గంటల నుంచి అక్కడి ప్రభుత్వం పనిచేయటం ఆగిపోయింది. మూడు రోజుల తరువాత ముగిసింది. దీనికంటే ముఖ్యవిషయం ఏమంటే డోనాల్డ్‌ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆ పెద్దమనిషి పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది గడచిన సందర్భంగా లక్షలాది మంది మహిళలు అమెరికా అంతటా పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు. ప్రభుత్వం మూతపడినందువలన ఎక్కువగా ప్రభావితమయ్యేది మిలిటరీ గనుక తెరిచేందుకు ముందుకు రావాలని మూతకు కారకులైన డెమోక్రాట్లకు అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్‌ చేశాడు. ఏడాది పాలనలో తన ఆర్ధిక విజయం, సంపదల సృష్టికి గాను పండుగ చేసుకొనేందుకు ఈ రోజు ప్రదర్శనలు మహిళలకు ఇది సరైన సమయం అంటూ ట్రంప్‌ వారిని రెచ్చగొట్టే విధంగా మరో ట్వీట్‌ద్వారా వ్యాఖ్యానించాడు. నిజానికి ప్రభుత్వ మూత అనేది పెద్ద్ద ప్రహసనం. డెమోక్రాట్లను బందీలుగా మార్చటంతో మరో మార్గం లేక దిగి వచ్చారని అధ్యక్షుడు ట్రంప్‌ తనదైన శైలిలో మూత ముగిసిన తరువాత ట్వీట్‌ చేశాడు. అధ్యక్షుడు తమతో తెరవెనుక ఒప్పందానికి వచ్చారని డెమోక్రాట్‌ సెనెటర్‌ ఒకరు వ్యాఖ్యానించారు. వలసదారుల సమస్యలపై తరువాత చర్చ జరిపేందుకు రిపబ్లికన్లు సమ్మతించారు గనుక డెమోక్రాట్లు మూత ఎత్తివేతకు అంగీకరించారని వార్తలు. అయితే అలాంటి చర్చ జరుగుతుందో లేదో హామీ లేదని, డెమోక్రాట్లు దేనిమీదా గట్టిగా నిలబడరని మరోసారి రుజువైందని అనేక విమర్శలు వచ్చాయి. రెండు రోజు తరువాత స్వయంగా ట్రంపే అసలు విషయాన్ని బయటపెట్టారు. అక్రమ వలసదారులను నిరోధించేందుకు మెక్సికో-అమెరికా సరిహద్దులలో నిర్మించతలపెట్టిన గోడ నిర్మాణానికి 25బిలియన్‌ డాలర్ల ఖర్చుకు బడ్జెట్‌లో డెమోక్రాట్లు ఆమోదం తెలిపితే పది పన్నెండు సంవత్సరాల వ్యవధిలో చిన్నవయస్సులో చట్టవిరుద్ధంగా అమెరికాకు వలస వచ్చిన వారికి పౌరసత్వం కల్పిస్తామని విలేకర్లతో చెప్పారు. ఇది సమస్యను మరోవైపు మళ్లించేయత్నం తప్ప పరిష్కారానికి చిత్తశుద్ది కనిపించటం లేదు.

ప్రపంచంలో ఎక్కడా ఏ రోజూ, ఏక్షణం కూడా ప్రభుత్వ వ్యవస్ధలు మూతపడటం అనేది లేదు. అదొక మిధ్య అంటే అతిశయోక్తి కాదు. ట్రంప్‌ ఒక సామ్రాజ్యవాద ప్రతినిధి కనుక ఆ పెద్దమనిషి నోటి నుంచి ఆ భాషే వెలువడుతుంది. నిజానికి మూతపడిన రోజుల్లో పనికి దూరమైన ప్రభుత్వ వుద్యోగులు, కార్మికులు నష్టపోతారు, ఆమేరకు వారు చేసే ఖర్చు తగ్గుతుంది కనుక ఆమేరకు వ్యాపారలావాదేవీలు, వ్యాపారులకు లాభాలు తగ్గుతాయే తప్ప నష్టపోయేదేమీ వుండదు. సంక్షేమ పధకాలు నిలిచిపోతాయి. వుద్యానవనాలు, మ్యూజియంలు, ఇతర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దర్శనీయ స్ధలాలు మూతపడిన కారణంగా వచ్చే ఆదాయాన్ని కూడా నష్టంగా లెక్కవేస్తున్నారు. వాయిదా పడిన సేవలు తరువాత అయినా అందించేందుకు వీలుంటుంది కనుక వాటిని నష్టాలుగా చెప్పటం కొంతమేరకు అతిశయోక్తి అవుతుంది.

అసలు అమెరికా ప్రభుత్వం ఎందుకు మూతపడింది ? నాలుగు దశాబ్దాల క్రితం సవరించిన రాజ్యాంగం ప్రకారం బడ్జెట్‌ ప్రతిపాదనలను పార్లమెంట్‌లోని వుభయ సభలు నిర్ణీత మెజారిటీ ఓటుతో ఆమోదించాల్సి వుంది. సాధారణంగా మన పార్లమెంట్‌, అసెంబ్లీ సమావేశాలలో అలాంటి సందర్భాలు వచ్చినపుడు ఓటింగ్‌లో పాల్గనటం గురించి రాజకీయ పక్షాలు అవసరమైతే విప్‌లు జారీ చేస్తాయి. అమెరికాలో అలాంటి ఏర్పాట్ల గురించి, మన మాదిరి అక్కడ కూడా జరిగే అపహాస్యాలు, ప్రహసనాల లోతుల్లోకి పోలేదు కనుక వాటి గురించి పక్కన పెడదాం. పార్లమెంట్‌ ఎగువ సభసెనెట్‌లోని వంద స్ధానాలకు గాను రిపబ్లికన్లకు 51,డెమోక్రాట్లకు 47 మంది, ఇద్దరు స్వతంత్రులు వున్నారు. బడ్జెట్‌ ఆమోదానికి కనీసం 60మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రభుత్వఖర్చుల ఆమోదానికి శుక్రవారం నాడు (మన ఓట్‌ఆన్‌ అకౌంట్‌ మాదిరి) జరిగిన ఓటింగ్‌లో అనారోగ్యం కారణంగా రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ఒకరు గైర్హాజరు కాగా 50 మంది అనుకూలంగానూ 49 వ్యతిరేకంగానూ ఓటు చేశారు. ఐదుగురు అధికార పక్ష సభ్యులు ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఓటు చేయగా ఐదుగురు ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా తమ పార్టీ వైఖరికి విరుద్దంగా ఓటు చేశారు. దాంతో తగిన మద్దతు లేక బిల్లు వీగిపోయింది. నిధుల మంజూరు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి నిలిచిపోయింది. దీన్నే ప్రభుత్వ మూత అంటున్నారు. ఒప్పందం కుదిరిన తరువాత జరిగిన ఓటింగ్‌లో సెనెట్‌లో 81-18, దిగువ సభ కాంగ్రెస్‌లో 266-150 మెజారిటీతో ప్రతిష్టంభన ముగిసింది.

బడ్జెట్‌కు వుభయ సభల ఆమోదం, అదుపునకు సంబంధించి దశకలో నిబంధనలు సవరించిన తరువాత 1976 నుంచి ఇలాంటి మూతలు తాజా వుదంతంతో సహా పద్దెనిమిది సార్లు జరిగాయి. ఇవి ముగ్గురు రిపబ్లికన్లు, ముగ్గురు డెమోక్రాట్‌ పార్టీల అధ్యక్షుల హయాంలో జరిగాయి. పదకొండు సార్లు డెమోక్రాట్లు కారణంకాగా ఏడు రిపబ్లిక్‌ పార్టీ ఖాతాలో వున్నాయి. వీటిని స్ధూలంగా పరిశీలించినపుడు అత్యధిక సందర్భాలలో కార్మికవర్గానికి వ్యతిరేకమైన ప్రతిపాదనలను ముందుకు తెచ్చినపుడే జరిగాయని గమనించవచ్చు. రెండు పార్టీలు ఒకే వర్గానికి ప్రాతినిధ్యం వహించుతాయనే విషయంలో ఎలాంటి భ్రమలకు లోనుకానవసరం లేదు. వున్నంతలో ఏది తక్కువ హాని చేసే పార్టీ అని బేరీజు వేసుకొని మెజారిటీ కార్మికవర్గం,వలస కార్మికులు డెమోక్రటిక్‌ పార్టీ మద్దతుదారులుగా వుంటున్నందున వారిని నిలబెట్టుకొనేందుకు ఆ పార్టీ రిపబ్లికన్లతో పోల్చితే సంక్షేమ చర్యల గురించి ఎక్కువగా మాట్లాడుతోంది.

తాజా మూత విషయానికి వస్తే బాలలుగా వున్నపుడు అమెరికాకు అక్రమంగా తీసుకువచ్చి వారిచేత తక్కువ వేతనాలకు పని చేయించుకొని ఇప్పుడు పెరిగి పెద్దవారైన తరువాత మార్చినెలలో బయటకు గెంటివేయాలని ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమస్యపై వారి సంక్షేమం కోసం నిధుల కేటాయింపు సక్రమంగా లేదంటూ డెమోక్రాటిక్‌ పార్టీ సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అక్రమంగా వలస వచ్చిన వారి బెదిరింపులకు లంగకూడదంటూ రిపబ్లికన్లు పట్టుబట్టారు. ఈ వివాదంపై రెండు పార్టీల మధ్య రాజీకుదిరి తిరిగి ఓటింగ్‌ జరిపి ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే అప్పుడు ఖర్చులకు నిధులను వినియోగించవచ్చు. అది జరగపోతే ఇటు సూర్యుడు అటు పొడుస్తాడా అంటే అంతసీనేమీ వుండదని గత అనుభవాలు రుజువు చేశాయి. నిజంగా అది ప్రతిబంధకమై ముందుకు పోలేని స్ధితి వుంటే అది పునరావృతం కాకుండా సాధారణ మెజారిటీతో ఆమోదం పొందే విధంగా రెండవ మూత సంభవించకుండానే నిబంధనల సవరణ చేసి వుండేవారు. ప్రతిసారీ అత్యధిక సందర్భాల్లో ఏదో ఒక రాజకీయంలో భాగంగానే జరుగుతోంది. ఇప్పుడు అమెరికాకు వలస వచ్చిన వారి గురించి అధికార ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

1976లో తొలి మూత పడటానికి కారణం రిపబ్లికన్‌ పార్టీకి చెందిన అధ్యక్షుడు గెరాల్డ్‌ ఫోర్డ్‌( ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ యజమాని). కార్మికులు,విద్య,వైద్యం,సంక్షేమ పధకాలకు గాను 56బిలియన్‌ డాలర్ల మేరకోత విధిస్తూ వీటో జారీచేసినపుడు దానికి వ్యతిరేకంగా అదే ఏడాది అమలులోకి వచ్చిన బడ్జెట్‌ అదుపు చట్టాన్ని వినియోగించుకొని డెమోక్రాట్లు ఖర్చులను అడ్డుకున్నారు. అది ఎన్నికల సంవత్సరం అని గమనించాలి. ఆ ఏడాది జరిగిన ఎన్నికలలో అధికారానికి వచ్చిన డెమోక్రాట్‌ జిమ్మీకార్టర్‌ 1977లో అధికారానికి వచ్చిన తొలిఏడాదే మూడుసార్లు రిపబిక్లన్లు 12,8,8 రోజుల చొప్పున ప్రభుత్వాన్ని మూతవేయించారు. అబార్షన్లు చేయించుకున్నపుడు వైద్యసాయం చేసేందుకు నిధుల కేటాయిపునుఅ అసలు అబార్షన్లనే వ్యతిరేకించే రిపబ్లికన్లు అడ్డుకున్నారు. అవసరం లేని మిలిటరీ పరికరాల కొనుగోలుకు ప్రతిపాదన చేశారంటూ 37బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని కార్టర్‌ వీటో చేయటాన్ని వ్యతిరేకిస్తూ 26 రోజుల పాటు రిపబ్లికన్లు ప్రభుత్వాన్ని మూతవేయించారు.1979 ఎన్నికల సంవత్సరంలో పార్లమెంటు సభ్యులు మరియు వున్నతాధికారులకు 5.5శాతం వేతనాల పెంపు ప్రతిపాదనను, అబార్షన్లకు నిధులను రిపబ్లికన్లు అడ్డుకొని మరోసారి 11రోజుల పాటు మూతకు కారణమయ్యారు. తరువాత అధికారానికి వచ్చిన రిపబ్లికన్‌ రోనాల్డ్‌ రీగన్‌ తొలి నాలుగు సంవత్సరాల పదవీ కాలంలో ఆరుసార్లు (మొత్తం 12రోజులు) మూత వేయించి డెమోక్రాట్లు రికార్డు సృష్టించారు. తదుపరి నాలుగు సంవత్సరాల కాలంలో రెండుసార్లు, రెండురోజులు మూతపడవేయించి అత్యధిక మూతల అధ్యక్షుడిగా రికార్డులకెక్కించారు. తరువాత డెమోక్రాట్‌ బిల్‌క్లింటన్‌ హయాంలో మెజారిటీ దిగువసభలోని రిపబ్లికన్ల బిల్లును వీటోను చేయటంతో రిపబ్లికన్లు ప్రభుత్వాన్ని మూతవేయించారు. ఇది గరిష్టంగా 21రోజులు సాగి అత్యధిక ప్రతిష్టంభనగా నమోదైంది. చివరికి బిల్‌క్లింటనే రాజీపడి ప్రభుత్వ ఖర్చు తగ్గింపు, పన్నుల పెంపుదల ప్రతిపాదన ఆమోదానికి బాటవేశారు. తరువాత బరాక్‌ ఒబామా హయాంలో పేదలకు అందుబాటులోకి తెచ్చిన ఆరోగ్యబీమా చట్టాన్ని వ్యతిరేకించిన రిపబ్లికన్లు 2013లో 16రోజుల పాటు మూత వేయించారు. ఆ తరువాత తిరిగి మూతపడటం ఇదే ప్రధమం.

వారాంతంలో లేదా వరుసగా సెలవులు వున్నపుడు మూతపడిన సందర్భాలలో పెద్ద ప్రభావం చూపలేదుకనుక కొన్ని అసలు చర్చనీయాంశం కాలేదు, అసలు మూతపడినట్లే కొందరికి తెలియలేదు. ఎక్కువ రోజులు కొనసాగితే ప్రభుత్వ వుద్యోగులు, కార్మికులు పని లేకుండా ఇళ్లకు పోవటం లేదా తరువాత వేతనాలు తీసుకొనే ప్రాతిపదికన పని చేయటం ఇలాంటి సందర్భాలలో సర్వసాధారణం. మిలిటరీలో పనిచేసే పౌరవుద్యోగులకు కూడా ఇదే వ ర్తింస్తుంది. మిలిటరీ, గూఢచార, వుగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో వున్న సిబ్బందికి ఈ మూత వర్తించదు కనుక వారికి ఎలాంటి ఇబ్బంది వుండదు. అయితే ఈ సారి మిలిటరీ సిబ్బందికోసం ప్రసారాలు చేసే టీవీ నెట్‌వర్కు మూతపడినందున తమకు ఇబ్బంది కలిగిందని స్వదేశంలోనూ, విదేశాల్లో వున్న మిలిటరీ సిబ్బంది విమర్శలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి.కొన్ని కవాతులు, మిలిటరీలోకి తీసుకోవటం కొన్ని కార్యక్రమాలకు పరిమితంగా ఆటంకం కలుగుతుంది తప్ప అమెరికన్లు విదేశాల్లో జరిపే దాడులు, దుండగాలకు, పోలీసు, అత్యవసర సేవలుగా ప్రకటించిన వాటికి మాత్రం ఎలాంటి ఇబ్బంది వుండదు. గత నాలుగు సందర్భాలలో జరిగిన ఇలాంటి పరిణామాలను గమనంలో వుంచుకొనే అనేక తాత్కాలిక ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఐదు సంవత్సరాల క్రితం ఒబామా హయాంలో 16రోజుల మూత సమయంలో ఎనిమిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ వుద్యోగులను వేతనాలు లేకుండా ఇళ్లకు పంపివేశారు. అమెరికాలో పనిచేయకపోతే వేతనం ఇచ్చే విధానం లేని విషయం తెలిసినదే. ఇప్పుడు కూడా అలాంటిదే జరుగుతుంది. అందువలన ముందే చెప్పుకున్నట్లు జరిగే నష్టం కార్మికవర్గానికే.

నిజానికి మూసివేత సమస్యకు మూడు రోజుల వేతనం పోగొట్టుకున్న కార్మికులకు ఎలాంటి సంబంధం లేదు. ఆంబోతుల పోరులో లేగదూడల మాదిరి నష్టపోయారు. డోనాల్డ్‌ ట్రంపు చెప్పినట్లు అక్రమంగా వలస వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వాలంటే 25 బిలియన్ల డాలర్ల బడ్జెట్‌ కేటాయింపు అంటే అది మరోవిధంగా జనంపై భారమే. ట్రంపు ప్రతిపాదిత గోడను డెమోక్రాట్లు వ్యతిరేకిస్తున్నారు. అందువలన ప్రభుత్వ మూతను ఎత్తివేసి ఫిబ్రవరి 6వరకు బడ్జెట్‌ ఖర్చుల ఆమోదానికి గాను అధికార ప్రతిపక్షాలకు ఇరువురకూ ఇబ్బంది లేని రీతిలో కుదిరిన రాజీ అని చెప్పవచ్చు. అయితే ఏదన్నా నష్టం జరిగితే రిపబ్లికన్లకే అన్నది విశ్లేషకుల అభిప్రాయం. గోడ నిర్మాణానికి ఆమోదం తెలపటం అంటే డెమోక్రాట్లకూ ఇబ్బందే. నిజానికి అక్రమవలసదారులతో తక్కువ వేతనానికి పనిచేయించుకున్న కార్పొరేట్‌ కంపెనీల నుంచే అవసరం అనుకుంటే ఈ మొత్తాన్ని వసూలు చేయాలి. ఎందుకంటే వారి లాభాలకోసమే ఎవరు అధికారంలో వున్న అక్రమవలసలను ప్రోత్సహించిన విషయం జగద్విదితం.

జనవరి 20నాటికి డోనాల్డ్‌ ట్రంప్‌ పదవీకాలం ఏడాది పూర్తవుతుంది. దానికి ముందుగానే ఇటువంటిదేదో జరగనుందని కొన్ని సూచనలు వెలువడినా ప్రభుత్వ యంత్రాంగం అంత తీవ్రంగా తీసుకోలేదని వార్తలు వెలువడ్డాయి. జరిగిన నష్టం ఎంతో తరువాత వెల్లడి అవుతుంది. ప్రభుత్వం ఈ ఏడాది 4.1లక్షల కోట్ల డాలర్ల మేరకు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.దీనిలో సగానికిపైగా మిలిటరీకి ఇతర సంస్ధలకు కేటాయిస్తారు. మూడోవంతుకు అటూ ఇటూగా వున్న మొత్తానికి మాత్రమే పార్లమెంట్‌ ఆమోదం పొందాల్సి వుంటుంది. డెమోక్రాట్లు సృష్టించిన ఈ మూత, దానికి కారణమైన రిపబ్లికన్ల ప్రతిపాదనలు రెండూ ఈ ఏడాది నవంబరులో జరగనున్న పార్లమెంటు దిగువసభ ఎన్నికల దృష్టితోనే అన్నది గమనించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ మేథావా, మెంటలా ? ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు ?

11 Thursday Jan 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Donald trump, Donald trump one year rule, genius, insane, US failures

ఎం కోటేశ్వరరావు

అధ్యక్ష పదవికి ఎన్నికైన వెంటనే డోనాల్డ్‌ ట్రంప్‌ ఇలా చెప్పాడు.’ దివంగత మహానుభావుడు అబ్రహాం లింకన్‌ తప్ప ఇప్పటివరకు అధ్యక్షులుగా పనిచేసిన వారందరికంటే నేను మెరుగైన అధ్యక్షుడిగా వుండగలనని మీకు చెప్పగలను’ అన్నాడు. ఏడాది తరువాత ట్రంప్‌ మానసిక స్ధితిపై జాతీయ స్ధాయిలో చర్చ జరగకుండా చూడటం ఎలా అని అధ్యక్షభవనం మల్లగుల్లాలు పడుతూ తలలు పట్టుకుంటోందని అమెరికాలోని ప్రముఖ పత్రిక వాషింగ్టన్‌ పోస్టు ఒక వార్తకు శీర్షికగా పెట్టింది. ట్రంప్‌ పాలన ప్రారంభమై ఈనెల 20తో ఏడాది పూర్తి అవుతుంది. ఈ తరుణంలో ప్రపంచ అగ్రరాజ్య అధిపతి గురించి ఇలాంటి విశ్లేషణ రావటానికి కారణం ఏమిటి ?

‘రగలటం మరియు కోపావేశం’ పేరుతో ట్రంప్‌ ఎన్నికల ప్రచారం, గతేడాది కాలంలో అధ్యక్ష భవనంలో వ్యవహరించిన తీరు తెన్నులపై అంతరంగిక కధనాలతో మైఖేల్‌ వూల్ఫ్‌ అనే రచయిత ఒక పుస్తకం రాశాడు. దీనిపై స్పందిస్తూ తాను నిజంగానే తగిన శక్తి సామర్ధ్యాలు, స్ధిరమైన మేథావిగా వున్నానని ట్విటర్‌ ద్వారా స్పందించాడు. ముసలోడు దెబ్బలాటకు సిద్ధం అన్నట్లుగా వున్నప్పటికీ ఆయన సహాయకులు మాత్రం అటువంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారట. నిజానికి ట్రంప్‌ మానసిక స్ధితి గురించి ఎన్నికలకు ముందే చర్చ ప్రారంభమైంది. దాని గురించి ఇప్పుడు పుస్తకం కూడా వెలువడటంతో బహిరంగ చర్చకు నాంది పలికినట్లు కావటంతో అధ్యక్ష భవనం కూడా ఏదో ఒకటి చేయాల్సింది వుంది. చెత్త పుస్తకం రాసిన చెత్త రచయిత అని వ్యాఖ్యానించిన ట్రంప్‌ సలహాదారుడు తమనేత గొప్ప రాజకీయ మేథావి అని వర్ణించాడు. విమర్శకుల నోరు మూయించటం, ట్రంప్‌ గురించి పొగడ్తలకు దిగటం సహాకులకు మామూలే. కొందరు విమర్శకులు చెబుతున్నట్లు ట్రంప్‌ మానసిక స్ధితి నిజంగానే బాగా లేదా ?

అమెరికా అధ్యక్ష భవనంలో ఎవరు కొలువుతీరారన్నది పెద్దగా ప్రాముఖ్యత కలిగిన విషయం కాదు. వ్యక్తులుగా ప్రవర్తనలో మంచిచెడ్డలు విధానాలపై ప్రభావం పెద్దగా చూపవు.పాలకవర్గ ప్రయోజనాలకు అనుగుణ్యంగా జాతీయ, అంతర్జాతీయ విధానాలు వుంటాయి. ఎవర, ఏ పార్టీ నేత పీఠంపై వున్నా దోపిడీ, ప్రపంచాధిపత్యం, యుద్ధోన్మాదం కనిపిస్తూనే వుంటుంది. అయితే ఏడు పదులు దాటిన ట్రంప్‌ ముదిమది తప్పి వ్యవహరిస్తున్నట్లుగా కొన్ని సందర్భాలలో అనిపించటం లేదా ? ఒక సందర్భంలో జర్నలిస్టులను లేపేయాలని తన మనసులోని మాటను వెల్లడించిన ట్రంప్‌ మరో సందర్భంలో నకిలీ వార్తల గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అత్యంత విస్వసనీయతలేని, అవినీతి మీడియా అవార్డులను ఈ ఏడాదికి ప్రకటించబోతున్నట్లు చెప్పాడు. అదే ట్రంప్‌ తాజాగా మీడియా అంతిమంగా తనను బలపరచకతప్పదని లేకపోతే టిఆర్‌పి రేటింగ్‌ పడిపోతుందని ఎద్దేవా చేశాడు. ఇలాంటి ప్రవర్తన చూసినపుడు మతితప్పి వ్యవహరిస్తున్నట్లే అనిపించవచ్చుగానీ వాస్తవం కాదు. అమెరికా ఇంటా బయటా ఎదుర్కొంటున్న వైఫల్యాలు, తీవ్ర సమస్యల మధ్య నాయకత్వం ఎదుర్కొంటున్న తలనొప్పులను వ్యక్తీకరించటంలో సమతూకం తప్పటం తప్పటం తప్ప మరొకటి కాదు. అది స్ధానిక మీడియా కావచ్చు వుత్తర కొరియా అధ్యక్షుడి గురించి కావచ్చు, అన్నింటా అది కనిపిస్తుంది.

అంతర్గతంగా గతేడాది కాలంలో ట్రంప్‌ సర్కార్‌ ఏ విధంగా వ్యవహరించిందో చూద్దాం. ట్రంప్‌ పదవీ బాధ్యతలు స్వీకరించక ముందే ఇండియానా పోలీసు ప్రాంతంలో జరిపిన పర్యటన గురించి పెద్ద ఎత్తున మీడియా ప్రచారం చేసింది. అక్కడి ఒక వుక్కు కర్మాగారంలో తాను పదకొండు వందల పర్మనెంటు వుద్యోగాలను రక్షించానని చెప్పుకున్న గొప్పలను అక్కడి కార్మికనేత అంతసీన్‌ లేదని, చాలా తక్కువ అని గాలితీశాడు. నా పరువు తీస్తావా అంటూ సదరు నేతపై ట్రంప్‌ ట్విటర్‌ దాడి చేశాడు. అదే పెద్దమనిషి ఏడాది తరువాత తానొక స్ధిరమైన మేథావినని డబ్బా కొట్టుకున్నాడు. ట్రంప్‌ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆయన పదవీ స్వీకారం జరిగిన వెంటనే జరిపిన భారీ మహిళా ప్రదర్శన తరువాత గతేడాది కాలంలో జరిగిన ప్రదర్శనల్లో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గంటున్నారు. మేకలకు తోడేళ్లను సంరక్షకులుగా నియమించినట్లు ఒక పెద్ద ఫాస్ట్‌ ఫుడ్‌ కంపెనీ యజమాని ఆండ్రూపుడెర్‌ను కార్మికశాఖ మంత్రిగా నియమించటంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావటంతో వుపసంహరించకతప్పలేదు. అనేక మంది పేదలకు కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఒబామా ఆరోగ్యసేవల పధకంగా పిలిచిన దానికి తూట్లు పొడిచేందుకు ట్రంప్‌ చేసిన యత్నాన్ని తాత్కాలికంగా అయినా కార్మికులు అడ్డుకోగలిగారు. ఒకవైపు కార్మికుల సంక్షేమ చర్యలను నీరు గార్చేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు రాబోయే పది సంవత్సరాల కాలంలో ధనికులు, కార్పొరేట్లకు లక్షన్నరకోట్ల డాలర్ల మేర పన్ను రాయితీలు ఇచ్చేందుకు చేసిన నిర్ణయాన్ని కార్మికులు అడ్డుకోలేకపోయారు. కార్మిక వ్యతిరేక చట్టాలకు అనుమతి, వుద్యోగ భద్రత రక్షణ, ఆరోగ్య రక్షణ వుపసంహరణ, ఆర్ధిక పరమైన రక్షణలకు మంగళం పాడే అనేక నిర్ణయాలకు అనుమతినిచ్చాడు. జాతీయ కార్మిక సంబంధాల బోర్డుతో సహా అనేక కమిటీలు, బోర్డులను కార్మిక వ్యతిరేకులతో నింపివేశారు.పర్యవసానంగా మూడు కార్మిక అనుకూల తీర్పులను తిరస్కరించారు. ట్రంప్‌ ప్రభుత్వ తీరుపై కార్మిక సంఘాలలో వున్న విబేధాలు కూడా ట్రంప్‌ కార్మిక వ్యతిరేకచర్యలను వేగవంతంగావిస్తున్నాయి.

ఒబామా సర్కార్‌ హయాంలోనే మంచివేతనాలతో కూడిన వుద్యోగాల సంఖ్య తగ్గి,వేతన మొత్తాలు తక్కువగా వుండే వుపాధి పెరుగుదల ప్రారంభమైంది. అది ట్రంప్‌ ఏడాది కాలంలో మరింతగా పెరిగింది. అందువలన నిరుద్యోగం తగ్గినట్లు కనిపించినా ఆరోగ్య సంరక్షణ, బార్లు, హోటళ్లలో పనిచేసే వారి సంఖ్య పెరిగింది. పర్యవసానంగా వేతన ఆదాయం తగ్గటంతో యూనియన్లలో చేరే కార్మికుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోతోంది. దీంతో రాష్ట్రాలలలో కార్మిక వ్యతిరేక చట్టాలకు ప్రతిఘటన కూడా తగ్గిపోయింది.

అంతర్జాతీయ వ్యవహారాలలో డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహారశైలి మిగతావారి కంటే భిన్నంగా కనిపించినప్పటికీ ఎక్కడన్నా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లు అమెరికా పాలకవర్గ మౌలిక ప్రయోజనాల విషయంలో మాత్రం ఎలాంటి రాజీలేకుండా మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌ మా ఇంటికొస్తే మాకేం తెస్తావ్‌ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. అయితే మీడియాతో వ్యవహరించేతీరులో, ట్విటర్‌ వ్యాఖ్యల విషయంలో అందరూ అనుకొంటున్నట్లుగా ఎవరేమనుకుంటే నాకేటి సిగ్గు అన్నట్లుగానే వుంది. అమెరికాలో పెరుగుతున్న ఆర్ధిక అంతరాలు, ఆర్ధికరంగంలో గత పది సంవత్సరాలుగా కొనసాగుతున్న సంక్షోభం, ఇరాక్‌, ఆఫ్ఘ్‌నిస్తాలో తగిలిన ఎదురు దెబ్బలు, చైనాతో పెరుగుతున్న వాణిజ్యలోటు, లాటిన్‌ అమెరికాలో ప్రతిఘటన వంటి అనేక కారణాలు అంతర్జాతీయ రంగంలో అమెరికాను గుక్కతిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. తన సంక్షోభాన్ని ఎక్కడో ఒక చోట యుద్ధంద్వారానో మరో విధంగానో ఇతరులపై రుద్ధేందుకు ట్రంప్‌ యంత్రాంగం కూడా చేయని యత్నం లేదు. వుత్తర కొరియా అణు,క్షిపణి పరీక్షలను సాకుగా చూపి కాలుదువ్వటం దానిలో భాగమే. ఈ పూర్వరంగంలో ట్రంప్‌ ప్రభుత్వ వైఖరి భారత వుపఖండంలో ఎలా వుందో చూడటం అవసరం.

పాకిస్ధాన్‌ వుగ్రవాదులకు మద్దతు ఇస్తున్న కారణంగా అందచేస్తున్న సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ట్రంప్‌ సర్కార్‌ గొప్పగా చెబుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల సృష్టిలో, మన దేశంలో పంజాబ్‌, కాశ్మీరుల్లో వుగ్రవాదులకు అవసరమైన శిక్షణ, ఆయుధాల అందచేతలో అమెరికా ప్రయోజనాలకు అనుగుణ్యంగా పాకిస్ధాన్‌ వ్యవహరించిన తీరు లోకవిదితం.ఇంతకాలం తాము చేసిన సాయాన్ని తీసుకొని తమకు అబద్దాలు చెప్పటం, మోసం చేయటం తప్ప పాకిస్ధాన్‌ మాకు చేసిందేమీ లేదని అమెరికా ఆరోపించింది. ఆఫ్ఘనిస్తాన్‌ యుద్ధంలో వైఫల్యాలకు అమెరికా తమను బలిపశువులుగా చేస్తోందని పాక్‌ రక్షణ మంత్రి ఖుర్రమ్‌ దస్తగిర్‌ ఖాన్‌ ప్రతి విమర్శ చేశాడు. ఇప్పుడు అమెరికా సాయం నిలిపివేసినందున తమకు వచ్చే నష్టమేమీ లేదని పాక్‌ తిప్పికొట్టింది. చైనా తరువాత అతి పెద్దదిగా వున్న భారత మార్కెట్‌ను చేజిక్కించుకొనేందుకు అమెరికా సామ,దాన,భేద,దండోపాయాలను అనుసరించింది. వుగ్రవాదులకు సాయం, ప్రోత్సాహం దానిలో భాగమే. ఇప్పటికీ అమెరికా మనపై వత్తిడి తెస్తూనే వుంది. వాణిజ్యం విషయంలో మన దేశంలోని కార్పొరేట్‌శక్తులు అటు సోవియట్‌ను ఇటు అమెరికా, ఇతర ఐరోపా ధనికదేశాలను వినియోగించుకొనేందుకు ప్రయత్నించిన అనుభవాలున్నాయి. సోవియట్‌ అంతరించిన తరువాత చైనాకు వ్యతిరేకంగా పాకిస్ధాన్‌, మన దేశాన్ని కూడా తన గుప్పెటలో వుంచుకొనేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది. అయితే దానికి భిన్నంగా జరిగిన పరిణామాలలో గత పాతిక సంవత్సరాలలో ఒక్కొక్క అడుగు మన దేశం అమెరికాకు దగ్గర అవటం, అదే సమయంలో చైనాకు పాకిస్ధాన్‌ దగ్గరయింది. దీంతో పాకిస్ధాన్‌కు సాయం నిలిపివేసి మన దేశానికి ఏదో మేలు చేస్తున్నట్లు ట్రంప్‌ ఫోజు పెడుతున్నాడు. నరేంద్రమోడీని, మన దేశాన్ని పొగుడుతూ మునగ చెట్టిక్కించటంతప్ప ఇంత వరకు ఏ ఒక్క విషయంలోనూ సానుకూల వైఖరిని అనుసరించలేదు. వీసాల విషయంలో లక్షలాది మంది భారత కార్మికులు, వుద్యోగులను భయకంపితులను గావించటంలో ఇప్పటివరకు అమెరికా అధ్య క్షులలో ట్రంప్‌ తరువాతే ఎవరైనా. ప్రపంచ రాజకీయాలలో మన దేశాన్ని జూనియర్‌ భాగస్వామిగా చేసుకొనేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ప్రపంచ వేదికమీద భారత్‌కు విశ్వసనీయమైన భాగస్వామి కావాలి…… ఆ భాగస్వామి అమెరికానే, అది నూరేళ్ల బంధం ‘ అని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్‌ టిలర్సన్‌ మనల్ని ఎక్కడికో తీసుకుపోయేందుకు ప్రయత్నించాడు. పెరుగుతున్న చైనా ప్రాభవాన్ని అడ్డుకొనేందుకు అమెరికా పెద్ద వ్యూహం పన్నింది. దానిలో మన దేశాన్ని నిలిపేందుకు పూనుకుంది. వాణిజ్యం విషయంలో మనపై అమెరికా తెస్తున్న వత్తిడిని దేశీయ కార్పొరేట్‌ శక్తులు ప్రతిఘటిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్ధలతో చేతులు కలిపి తాము కూడా లాభాలను పంచుకోవాలనుకుంటున్నాయి తప్ప తమ లాభాలను ఫణంగా పెట్టి అంతర్జాతీయ సంస్ధలకు లొంగిపోవాలని అవి కోరుకోవటం లేదు. అందువలన మన దేశం తనకు లొంగకపోతే మరోసారి పాకిస్ధాన్‌ను దగ్గరకు తీసుకొని మనపై దానిని ప్రయోగించినా ఆశ్చర్యం లేదు. పాకిస్ధాన్‌కు తాత్కాలికంగా సాయం నిలిపివేత ప్రచార ఆర్బాటం మనకు ఎర తప్ప చిత్తశుద్ధితో కాదు. పాక్‌తో పూర్తి సంబంధాలు తెగతెంపులు చేసుకొంటే అమెరికన్లకు ఎంత నష్టమో తెలియంది కాదు. అందువలన ట్రంప్‌ మెచ్చుకోళ్లకు మురిసిపోతే మనం వూబిలో దిగినట్లే. తనకు మాలిన ధర్మానికి పాల్పడినట్లు అమెరికా చరిత్రలో ఒక్కటంటే ఒక్క వుదంతం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ రాజకీయ గూండాయిజం-అమెరికాను విస్మరించిన ఆసియన్‌ నాయకత్వం !

14 Tuesday Nov 2017

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

asean summit, Donald trump, Donald trump asia tour, donald trump's act of political vandalism, US leadership

ఎం. కోటేశ్వరరావు

అమెరికా అధ్యక్షుడు ఆసియాను అవమానించారా? అవును, పన్నెండు మంది దేశాధినేతలు హాజరైన తూర్పు ఆసియా సభ ప్రారంభం కావటం రెండు గంటల పాటు ఆలస్యమైందంటూ చిందులు వేస్తూ సభను బహిష్కరించి విమానమెక్కి స్వదేశానికి చెక్కేయటం, వాషింగ్టన్‌ వెళ్లిన తరువాత తాను ఒక ప్రకటన చేస్తానని చెప్పటం అవమానం గాక మరేమిటి? ఆసియా పర్యటన చేస్తూ తూర్పు ఆసియా సభలో పాల్గనకపోతే ఆసియా పట్ల అమెరికన్లకు ఆసక్తి లేదనే విమర్శలు వస్తాయనే కారణంతో ఈకార్యక్రమాన్ని కూడా చివరిలో పర్యటనలో చేర్చారు.చివరికి ఆలస్యం సాకు చూపి సభను బహిష్కరించారు.నిర్ణీత సమయానికి 30 నిమిషాల ముందుగానే ట్రంప్‌ విమానం ఫిలిప్పైన్స్‌నుంచి బయలుదేరింది.

విమానంలో విలేకర్లతో మాట్లాడుతూ మధ్యాహ్నభోజన సమయంలో చివరిగా తాను చెప్పదలచుకున్న అభిప్రాయాలను చెప్పేశానని, తన బదులు విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్సన్‌ పాల్గంటారని తెలిపారు.మనం పడ్డ కష్టానికి మంచి ఫలితాలే రానున్నాయని, 300బిలియన్‌ డాలర్ల మేరకు పరికరాలు, ఇతరాలకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయని, త్వరలో లక్షకోట్ల డాలర్లకు పెరుగుతాయని చెప్పారు. తూర్పు ఆసియా సమ్మేళనంలో పాల్గనకపోవటం ట్రంప్‌ రాజకీయ గూండాయిజంగా మారుతుందని ప్రొఫెసర్‌ కార్ల్‌ థయర్‌ వ్యాఖ్యానించారు. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా అధికారం తగ్గిపోవటానికి,ఆసియన్‌ నేతలు ఆ స్ధానాన్ని భర్తీ చేయటానికి ఈ పర్యటన కీలకమైనదిగా చరిత్రకారులు ఈతేదీని నమోదు చేస్తారని మరో ప్రొఫెసర్‌ అనెలైస్‌ రైల్స్‌ వ్యాఖ్యానించారు. ట్రంప్‌ అధికారంలోకి రాగానే చేపట్టిన తొలి చర్యలలో భాగంగా పసిఫిక్‌ ఇరుసులో వున్న దేశాలతో వాణిజ్య ఒప్పందాన్ని వదలివేశారని, అమెరికా ప్రమేయం లేకుండా శనివారం నాడు ఆసియన్‌ నేతలు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆమె చెప్పారు. పెద్ద ఒప్పందాలు మన చేతులను కట్టివేస్తాయని, ఏ దేశానికి ఆదేశంతో ఒప్పందాలు చేసుకోవటంపై తాను కేంద్రీకరిస్తానని అదేరోజు ట్రంప్‌ ప్రకటించారు. ఫసిపిక్‌ భాగస్వామ్య దేశాల ఒప్పందాన్ని వమ్ము చేసే ట్రంప్‌ యంత్రాంగ యత్నాలను ఆసియన్‌ నాయకులు పట్టించుకోలేదని, తాము స్వంతంగా ముందుకు పోవాలని నిర్ణయించారని, ట్రంప్‌కు ఘనస్వాగతం చెప్పినప్పటికీ ఆయన అజెండాను మొత్తంగా పట్టించుకోలేదని రైల్స్‌ చెప్పారు.

అమెరికా అధ్యక్షుడేమిటి? ఇలా మాట్లాడుతున్నాడేమిటి అని అనేక మంది ముక్కుమీద వేలేసుకున్నారు. గత అధ్యక్షులందరినీ అధిగమించి డోనాల్డ్‌ ట్రంప్‌ పన్నెండు రోజుల గత రికార్డును బద్దలు కొట్టి 13రోజులతో కొత్త ఆసియా పర్యటన రికార్డును స్ధాపించాడు. నవంబరు ఐదున జపాన్‌తో మొదలై 14వ తేదీన ఫిలిప్పీన్స్‌లో ముగిసింది. మధ్యలో చైనా, దక్షిణ కొరియా, వియత్నాం పర్యటించారు. ఊరకరారు మహాత్ములు అన్నట్లు అమెరికా అధ్యక్షులు మన ప్రధాని నరేంద్రమోడీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మాదిరి ఏదో ఒక సాకుతో విదేశీ పర్యటనలు చేయరు. రాజకీయ, ఆర్ధిక, మిలిటరీ వంటి అనేక అంశాలుంటాయి. అయితే ఈ పర్యటనలో సాధించినదాని కంటే పొగొట్టుకున్న పరువే ఎక్కువగా వుందని చెప్పవచ్చు.

ఆతిధ్యం ఇచ్చేవారు పెట్టింది తిని, మర్యాదలను స్వీకరించటం సంస్కారం. కొంత మంది మా పిల్లలు అది తినరు తినరు అనిముందే చెప్పి ఇబ్బంది పెడతారు. అలవాటైన ఆహారం తప్ప కొత్తదానిని రుచిచూసేందుకు ఇచ్చగించని తరహా మనిషి ట్రంప్‌. ఇరవై ఏడు సంవత్సరాల క్రితం జపాన్‌ వచ్చిన ట్రంప్‌ అక్కడ వడ్డించిన చేపను చూసి అది వద్దంటూ బర్గర్‌ కావాలని మరీ మారాం చేసి తెప్పించుకుతిన్నాడంటూ ఈ సందర్భంగా వార్తలు వచ్చాయంటేనేే ట్రంప్‌కు పెద్ద అవమానం. ఆసియా పర్యటనలో డోనాల్డ్‌ ట్రంప్‌ ఆయా దేశాల వారు వడ్డించిందా లేక మరేం తింటారు అంటూ ఐరోపా, జపాన్‌ మీడియాలో కథనాలు రాశాయి. మా వృద్ధ ట్రంప్‌ బర్గర్‌ తప్ప మరొకటి తినడు అని అధికారులుప్పందించారేమో జపాన్‌ ప్రధాని షింజో అబే పర్యటన ప్రారంభంలోనే వారి సాంప్రదాయ వంటకాల బదులు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న బీఫ్‌తో తయారు చేసిన బర్గర్‌నే మధ్యాహ్న విందుగా వడ్డించే ఏర్పాటు చేయాల్సి వచ్చిందట.

ట్రంప్‌ అభిరుచులు, అలవాట్లు వ్యక్తిగతం. గొడ్డు, పంది మాంసంతో తయారు చేసే హాంబర్గర్‌లు ఎన్ని తిన్నా ప్రపంచానికేమీ ఇబ్బంది లేదు. ఆ పెద్దమనిషి పర్యటనలో ఆతిధ్యం ఇచ్చిన జపాన్‌ వారు పెట్టింది తినకపోవటం, దక్షిణ కొరియాలో పెట్టింది తినటం రెండూ వివాదాస్పదం కావటం విశేషం. జపాన్‌-దక్షిణ కొరియాల మధ్య వివాదాస్పదంగా వున్న దీవుల జలాల నుంచి తెప్పించిన రొయ్యలతో సహా దక్షిణ కొరియా వంటకాలు వడ్డించటం, వాటిని లట్టలు వేసుకుంటూ ట్రంప్‌ తినటం అంటే ఆ దీవులపై దక్షిణ కొరియా హక్కును అమెరికా గుర్తించినట్లే, ఇది జపాన్‌ వ్యతిరేకమైనది అని జపాన్‌ మీడియా వ్యాఖ్యానించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో కొరియాను ఆక్రమించిన జపాన్‌ తన సైనికుల కోసం దక్షిణ కొరియా యువతులను చెరపట్టి అప్పగించారు. అలాంటి వారిలో ఒకరైన 88 సంవత్సరాల లీ యాంగ్‌ సూ ట్రంప్‌ విందు ఆహ్వానితుల జాబితాలో ఒకరుగా ప్రకటించటం తమను నేరగాళ్లుగా పరిగణించటమే అని జపనీస్‌ ప్రభుత్వం భావించింది. దౌత్య పద్దతులలో అమెరికాకు ఆ మేరకు నిరసన తెలిపినట్లు, వుత్తర కొరియాకు వ్యతిరేకంగా అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా పని చేస్తున్న తరుణంలో ఇలాంటి పనులు తగవని పేర్కొన్నట్లు వెల్లడైంది. మీరు మా ఇంటికొచ్చినా, మేం మీ ఇంటికొచ్చినా మాకు కావాల్సిందే తేవాలి, పెట్టాలి అనే అమెరికా సామ్రాజ్యవాదంతోనే అసలు సమస్య. అందువలన ట్రంప్‌కు ఏం పెట్టారు, ఏ తిన్నారు అనేది కూడా రాజకీయాలు, ఆర్ధికాంశాలతో ముడి పడి వుంటాన్నాయన్నది గమనించాల్సి వుంది.

డెమోక్రటిక్‌ పార్టీ అధినేత బరాక్‌ ఒబామా హయాంలో ప్రారంభమైన ఆర్ధిక మాంద్యం ట్రంప్‌, తరువాత ఎందరు అధ్యక్షులు వచ్చిం తరువాత పరిష్కారం అవుతుందో వారికే తెలియని స్ధితి.రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యం మాదిరి ప్రపంచ మార్కెట్‌ను చాపచుట్టినట్లుగా తమ చంకన పెట్టుకోవాలని చూస్తున్న అమెరికన్‌ సామ్రాజ్యవాదుల పరిస్ధితి పీకసన్నం-బానకడుపులా వుంది. భవిష్యత్‌ పరిణామాలు ఎలా వుంటాయో జోస్యం చెప్పలేము గాని, గతం మాదిరి ఏకఛత్రాధిపత్యం వహించటం సాధ్యం కాని పరిస్థితి నేడు నెలకొంది. ఎక్కడన్నా బావే కాని వంగతోట దగ్గర మాత్రం కాదన్నట్లు సామ్రాజ్యవాదులు మొత్తంగా సోషలిస్టు, కమ్యూనిస్టు శక్తులు, దేశాలకు వ్యతిరేకత విషయంలో ఐక్యంగా వుంటున్నారు, ప్రపంచ మార్కెట్‌ను పంచుకోవటంలో విబేధాలను దాచుకోవటం లేదు.

ఐదు ఆసియా దేశాల పర్యటనలో తొలి పాదం మోపిన జపాన్‌లో ప్రధాని షింజో అబేతో గోల్ఫ్‌ ఆడటానికి వెళ్లబోయే ముందు యోకోటా వైమానికస్ధావరంలో అమెరికన్‌ సైనికులతో మాట్లాడారు. పరోక్షంగా వుత్తర కొరియాను వుద్దేశించి మాట్లాడుతూ అమెరికా సంకల్పాన్ని ఎవ్వరూ, ఏ నియంత, ఏ ప్రభుత్వమైనా తక్కువగా అంచనా వేయవద్దని హెచ్చరికలు జారీ చేశాడు. గతంలో తమను తక్కువ అంచనా వేసిన ఎవరికీ అది సంతోషకరంగా లేదు, మేము లంగలేదు, ఎలాంటి సడలింపులు లేవు అన్నాడు. తరువాత దక్షిణ కొరియా పార్లమెంట్‌ సభ్యుల నుద్ధేశించి మాట్లాడుతూ ట్రంప్‌ ఇదే మాదిరి హెచ్చరికలు జారీ చేయటమే కాదు, అణ్వాయుధ, ఖండాంతర క్షిపణి తయారీ కార్యక్రమాన్ని నిలిపివేయకపోతే మిలిటరీ చర్య తీసుకుంటామని సోషలిస్టు కొరియాపై బెదిరింపులకు దిగాడు.

రాజధాని టోకియోలో వుభయ దేశాల వాణిజ్యవేత్తల సమావేశంలో మాట్లాడుతూ జపాన్‌ అక్రమ వ్యాపార పద్దతులను అనుసరిస్తోందని ట్రంప్‌ విమర్శలు గుప్పించాడు.’ గత కొన్ని దశాబ్దాలుగా జపాన్‌ విజయం సాధిస్తోందని మీరు తెలుసుకోవాలి, ప్రస్తుతం జపాన్‌తో మా వ్యాపారం న్యాయబద్దంగా లేదు, మాకు మార్కెట్‌ను తెరవలేదు. మీరు ఇక్కడి నుంచి కార్లను షిప్పుల్లో రవాణా చేయటం కాదు, అమెరికాలో తయారు చేసేందుకు ప్రయత్నించండి, అలా అడగటం మొరటుగా వుందా’ అని ప్రశ్నించాడు. చైనా తరువాత అమెరికన్ల వాణిజ్యలోటు కార్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల దిగుమతుల కారణంగా జపాన్‌తోనే ఎక్కువగా వుంది. రాజకీయంగా అమెరికాతో వున్న బంధం కారణంగా జపాన్‌ ఆచితూచి వ్యవహరిస్తోంది. నిజానికి రెండు దేశాల మధ్య ఈ వాణిజ్య విబేధాలు కొత్తవి కాదు. అమెరికాలో అమ్ముడౌతున్న జపాన్‌ బ్రాండ్‌ కార్లలలో 75శాతం అమెరికాలోనే తయారు చేస్తున్నామని కార్ల తయారీ వాణిజ్య సంస్ధల అసోసియేషన్‌ తెలిపింది. పసిఫిక్‌ సముద్ర ప్రాంత దేశాల స్వేచ్చా వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం నుంచి వైదొలగాలని ట్రంప్‌ నిర్ణయించారు, కొనసాగాలని జపాన్‌ కోరుతోంది. రెండు దేశాల మధ్య పన్నుల విషయంలో విబేధాలు ఎడతెగటం లేదు. అమెరికన్‌ కార్ల అమ్మకాలపై జపాన్‌లో ఆంక్షలు ఎత్తివేయాలని, ఘనీభవింపచేసిన గొడ్డు మాంసం, వ్యవసాయ వుత్పత్తుల దిగుమతులపై పన్ను తగ్గించాలని అమెరికన్లు డిమాండ్‌ చేస్తున్నారు.

గతేడాది అమెరికా ఎన్నికల ప్రచారంలో చైనా శత్రువు అని చెప్పిన ట్రంప్‌ చైనా పర్యటనలో పొగడ్తలు కురిపించాడు. గ్రేట్‌ హాల్‌లో మాట్లాడుతూ రెండు పెద్ద దేశాల మధ్య పెద్ద వాణిజ్యంలో తమకు న్యాయం జరగలేదని అయితే దానికిి చైనా తప్పేమీ లేదని, తమ గత అధ్యక్షులు అనుసరించిన విధానాలే కారణమని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ పర్యటన సందర్భంగా 25వేల కోట్ల డాలర్ల మేరకు ఆర్ధికలావాదేవీలపై రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ట్రంప్‌ పర్యటన లేకపోయినా రెండు దేశాల మధ్య అది జరిగి వుండేదని పరిశీలకులు వ్యాఖ్యానించారు.

చైనాతో వాణిజ్యం గురించి ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ఆసియా పర్యటనలో ఇంతవరకు చేసిన పెద్ద తప్పిదం, సిగ్గు చేటు, అమెరికా, ఆ ప్రాంత కార్మికులకు ఇది భయంకర వర్తమానం, డెమోక్రాట్లకు ఇది మాంస విందు అవుతుంది అని అమెరికాలోని చైనా అధ్యయనాల సంస్ధ నిపుణుడు ఎలీ రాట్నర్‌ వ్యాఖ్యానించాడు. చైనాతో వాణిజ్యలోటుకు తమ గతపాలకులదే బాధ్యత అని చైనాలో చెప్పిన ట్రంప్‌ తరువాత అపెక్‌ సమావేశంలో నాలుకను మరోవైపు తిప్పాడు.చైనా పేరు ప్రస్తావించకుండా ఈ ప్రాంత దేశాలు అనుచిత వ్యాపార పద్దతులు అనుసరిస్తున్నాయని, ఇక ముందు తమతో అలా కుదరదు అన్నాడు. దుర్విధి అనే నరకంలో పడకుండా తప్పించేందుకు అమెరికన్లు మతి తప్పిన ముసలి ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని తమపై చేసిన వ్యాఖ్యలపై వుత్తర కొరియా వ్యాఖ్యానించింది. ఈ పర్యటనలో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు నిజంగానే దాన్ని నిర్ధారిస్తున్నాయి. వుత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ అన్‌ కొవ్వుబలిసిన పొట్టోడంటూ అవమానకరవ్యాఖ్యలు చేసిన నోటితోనే కొద్ది గంటల తరువాత భవిష్యత్‌లో ఇరువురం స్నేహితులుగా వుండవచ్చు అన్నాడు. వియత్నాంలో మానవహక్కులకు భంగం కలిగిస్తున్నారని దుమ్మెత్తి పోసిన ట్రంప్‌ తాజా పర్యటనలో ప్రపంచంలోని గొప్ప అద్భుతాలలో వియత్నాం ఒకటి అని పేర్కొన్నాడు. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకోలేదని అధ్యక్షుడు పుతిన్‌ చెప్పిన మాటలను నేను నమ్ముతున్నాను అని గతంలో చెప్పిన ట్రంప్‌ ఇప్పుడు మాట మార్చాడు. రిపబ్లికన్‌ పార్టీకి(ట్రంప్‌కు) అనుకూలంగా రష్యన్లు జోక్యం చేసుకున్నారని సిఐఏ నివేదించిన విషయం తెలిసిందే. అమెరికా గూఢచార, దర్యాప్తు సంస్ధల నివేదికలను నేను విశ్వసిస్తానా లేదా అన్నది సమస్యకాదు, వాటికినేను కట్టుబడి వున్నాను, ప్రత్యేకించి ప్రస్తుతం పని చేస్తున్న సంస్ధలు మంచివారిని కలిగి వున్నాయి అని చెప్పాడు. ట్రంప్‌ పర్యటన అన్నింటిలో అమెరికాకు ప్రధమ స్ధానం అన్నలక్ష్యంతో సాగిందా లేక ఆ స్ధానంలో చైనాను ప్రవేశ పెట్టేందుకు వచ్చారా అన్నది అర్ధం కావటం లేదన్న వ్యాఖ్య కూడా వెలువడింది.ఆసియా పర్యటనలో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక అనేక మంది పరిశీలకులు తలలు పట్టుకుంటున్నారు.అనేక మందికి ఆశించిన కిక్కు రాలేదు. తన తీరుతెన్నులను తప్పుపడితే ట్రంప్‌కు కోపం, పొగిడితే జనాల్లో పలుచన. కార్పొరేట్‌ మీడియాకు ఇరకాటమే మరి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మాస్కోలో వైఫల్యం-బీజింగ్‌లో విజయం !

14 Tuesday Nov 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

100 years Bolshevik Revolution, Anti communist, Bolshevik Revolution, china communist party, communist, Donald trump, Socialism

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం-వర్తమానం-4

ఎం కోటేశ్వరరావు

నవంబరు ఏడవ తేదీ సందర్భంగా వంద సంవత్సరాల బోల్షివిక్‌ విప్లవం గురించి ముందుగానే మొదలైన చర్చ తరువాత కూడా ప్రపంచ మీడియాలో సాగుతోంది. నూరు పూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్నట్లుగా బోల్షివిక్‌ విప్లవం గురించి వెలువడే వ్యతిరేక,సానుకూల అంశాలన్నింటిపై మధనం జరగవలసిందే. పాత, కొత్త తరాలు వాటి మంచి చెడ్డలను గ్రహించాలి. సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారీ విధానాలదే పైచేయిగా వున్నప్పటికీ ప్రస్తుతం వాటికి ప్రాతినిధ్యం వహించే దేశాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. తమ సంక్షోభాన్ని ఎలా పరిష్కరించుకోవాలో వాటికి దిక్కు తోచటం లేదు. మొత్తంగా చూసినపుడు సోషలిస్టు దేశాలు-పెట్టుబడిదారీ దేశాల మధ్య వైరుధ్యమే ప్రధానంగా కనిపిస్తున్నది. అదే సమయంలో పెట్టుబడిదారీ దేశాలు తమ సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో వాటి మధ్య విబేధాలు కూడా కొనసాగుతూనే వున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) వునికిలోకి రాక ముందు 1949 నుంచి 1994 వరకు ఏడు వాణిజ్యం, పన్నులపై సాధారణ ఒప్పందాలు జరిగాయి. 2001లో ప్రారంభమైన దోహా దఫా చర్చలు 16సంవత్సరాలు గడిచినా కొనసాగుతూనే వున్నాయి. సాగదీతలో ఇప్పటికి ఇదే ఒక రికార్డు అయితే ఇంకెంతకాలానికి ఒప్పందం కుదురుతుందో తెలియదు. అమెరికా-ఐరోపాయూనియన్‌ల మధ్య తలెత్తిన విబేధాలే దీనికి కారణం. ఎవరిదారి వారు చూసుకొనే క్రమంలో ఆయా దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకొనేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో సోషలిస్టు దేశాలను ఒకవైపు దెబ్బతీయాలని చూస్తూనే మరోవైపు వాటితో సఖ్యతగా వుండే ద్వంద్వ వైఖరిని ధనిక దేశాలు అనుసరిస్తున్నాయి. రెండో వెసులుబాటు గతంలో సోవియట్‌ యూనియన్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలకు వుండేది కాదు.

ఒక సైద్ధాంతిక ప్రత్యర్ధిగా భావించే చైనాను ఎదుర్కొనే క్రమంలో ప్రజాస్వామిక దేశాలు తమ వైఫల్యాలను గుర్తించాల్సి వుందని ఐరిష్‌ టైమ్స్‌ వాఖ్యాత మార్టిన్‌ వూల్ఫ్‌ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యాన సారాంశం ఇలా వుంది. నాటి రష్యానేతల కంటే చైనా గ్జీ మరింత జాగ్రత్తగా వున్నారు, చైనా లక్షణాలతో కూడిన సోషలిజం నూతన యుగంలోకి ప్రవేశించిందని ఎంతో ధృడంగా చెప్పారు. తమ స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకుంటూనే అభివృద్ధిని వేగవంతం చేయాలని కోరుకొనే ఇతర దేశాలకు చైనా కొత్త అవకాశాలను కల్పిస్తోంది. లెనినిస్టు రాజకీయ వ్యవస్ధ చరిత్ర అవశేషాలనుంచి వుద్భవించింది కాదు, ఇంకా అదొక నమూనాగా వుంది. సోవియట్‌ పారిశ్రామికీకరణ నాజీ సైన్యాలను ఓడించటానికి తోడ్పడింది. సోవియట్‌ కమ్యూనిస్టుపార్టీ, ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అదే పెద్ద అసాధారణ రాజకీయ పరిణామం. ఇదిలా వుండగా అత్యంత ముఖ్యమైన ఆర్ధిక పరిణామం దారిద్య్రం నుంచి మధ్యతరగతి ఆర్ధిక స్ధాయికి చైనా ఎదుగుదల. అందుకే గ్జీ చైనాను ఒక నమూనాగా చెప్పగలుగుతున్నారు. మాస్కోలో విఫలమైన వ్యవస్ధ బీజింగ్‌లో ఎలా విజయవంతం అయిందన్నది ఇంకా తెలియాల్సి వుంది. రెండింటికి మధ్య వున్న పెద్ద తేడా ఏమంటే మావో తరువాత లెనినిస్టు రాజకీయ వ్యవస్ధను అట్టేపెట్టిన డెంగ్‌ సియావో పింగ్‌ సూక్ష్మబుద్ధితో కూడిన నిర్ణయాలు. అన్నింటికీ మించి ఆర్ధిక వ్యవస్ధను బయటివారికి తెరుస్తూనేే పార్టీ ఆధిపత్యపాత్రను కొనసాగించటం. చైనీయులు వర్ణించే జూన్‌ నాలుగవ తేదీ సంఘటన,పశ్చిమ దేశాలు 1989 మారణకాండగా పిలిచిన వుదంతం సందర్భంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు పార్టీ అదుపు గురించి ఎంత పట్టుదలగా వున్నారో తెలియచేశాయి. ఆర్ధిక సంస్కరణల కొనసాగింపులో ఎన్నడూ తడబడలేదు. ఫలితాలు అద్భుతంగా వచ్చాయి.

Image result for 1991 soviet coup,lenin statue

సోవియట్‌ యూనియన్‌ కూడా అటువంటి బాటనే అనుసరించి వుండాల్సింది అనే చర్చ ప్రారంభమై వుండాల్సింది కానీ జరగలేదు. దీని ఫలితంగా శతాబ్దం క్రితం జరిగిన అక్టోబరు విప్లవాన్ని ఎలా గుర్తించాలి అనేది నేటి రష్యాకు తెలియకుండా పోయింది. లెనినిజం, మార్కెట్‌తో చైనా బంధపు పర్యవసానాలేమిటి? చైనా నిజంగానే పశ్చిమ దేశాల నుంచి ఆర్ధికశాస్త్రాన్ని నేర్చుకుంది.అయితే ఆధునిక పశ్చిమదేశాల రాజకీయాలను తిరస్కరించింది.చైనా అభివృద్ధి చెందే కొద్దీ లెనినిస్టు రాజకీయాలు, మార్కెట్‌ అర్ధికవిధానాల జమిలి వైఖరి పని చేస్తుందా? అంటే మనకు తెలియదనే సమాధానం చెప్పాలి. ఈ వ్యవస్ధ ఇప్పటి వరకు అద్భుతంగా పనిచేసింది. దీర్ఘకాలంలో పార్టీ మీద ఒక వ్యక్తి ఆధిపత్యం, చైనా మీద ఒక పార్టీ ఆధిపత్యం నిలబడదు. ఇదంతా దీర్ఘకాలంలో జరిగేది, తక్షణ స్ధితి సుస్పష్టం. ఏక వ్యక్తి నియంత్రించే లెనినిస్టు నిరంకుశపాలనలో చైనా ఒక ఆర్ధిక అగ్రరాజ్యంగా ఎదుగుతోంది. ఎదుగుతున్న ఈశక్తి మిగతా ప్రపంచమంతా శాంతియుతంగా సహకరించటం తప్ప మరొక అవకాశం లేదు. వుదారవాద ప్రజాస్వామ్యంలో విశ్వాసం వున్నవారందరూ ఆర్ధిక చైనాను మాత్రమే కాదు ప్రముఖ సైద్ధాంతిక ప్రత్యర్ధిగా కూడా గుర్తించాల్సిన అవసరం వుంది.ఒకటి, నిష్కారణంగా చైనాతో ప్రతికూల సంబంధాలను పెంచుకోకుండా పశ్చిమ దేశాలు తమ సాంకేతిక, అర్ధిక వున్నతిని కొనసాగించాలి. చైనా మన వ్యాపార భాగస్వామే తప్ప స్నేహితురాలు కాదు. రెండవది ఎంతో ముఖ్యమైనది, ఈరోజు మాదిరి దుర్బలంగా వున్న పశ్చిమ దేశాలు దశాబ్దాలుగా కాకపోయినప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా తమ ఆర్ధిక యాజమాన్యం మరియు రాజకీయాలు సంతృప్తికరంగా లేవన్న వాస్తవాన్ని గుర్తించి, నేర్చుకోవాలి. పశ్చిమ దేశాలు తమ ద్రవ్యవ్యవస్ధను ఎటూ కదలని తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయే విధంగా వదలివేశాయి.తమ భవిష్యత్‌కు చేసే ఖర్చు విషయంలో గుచ్చి గుచ్చి వ్యవహరించాయి. ముఖ్యంగా ఆర్ధికవిజేతలు-పరాజితుల మధ్య ప్రమాదకరమైన అఘాతం పెరగటాన్ని అమెరికా అనుమతించింది. తన రాజకీయాలలో అబద్దాలు, విద్వేషానికి తావిచ్చింది.

ఇంకా మరికొన్ని విషయాలు తన విశ్లేషణలో పేర్కొన్న మార్టిన్‌ వూల్ప్‌ కమ్యూనిజం పట్ల సానుకూల వైఖరి కలిగినవాడేమీ కాదు. చైనా సోషలిజం కూలిపోతుందని జోస్యం చెప్పాడు. విధిలేని పరిస్ధితుల్లో అవకాశం వచ్చేంత వరకు చైనాతో మంచిగా వుండి సమయంరాగానే దెబ్బతీయాలని పరోక్షంగా సూచించాడు. చైనా వ్యాపార భాగస్వామి తప్ప స్నేహితురాలు కాదనటంలో అంతరంగమిదే. సంక్షోభాన్నుంచి బయటపడేందుకు,లాభాల కోసం పెట్టుబడిదారీ వర్గం సోషలిస్టు దేశాలతో సఖ్యంగా వుండటం అన్నది 1980 దశకం తరువాతి ముఖ్యపరిణామం. అమెరికా, జపాన్‌, ఐరోపా ధనిక దేశాలన్నీ గత కొద్ది దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానమిదే.

తాజా తొలి ఆసియా పర్యటనలో డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా, వియత్నాంల అభివృద్ధి గురించి పొగిడారు.చైనాతో వాణిజ్యలోటుకు తమ గత అధ్యక్షులు అనుసరించిన విధానాలే కారణమని చెప్పారు.మార్టిన్‌ చెప్పినట్లు ఆర్ధిక అవసరాల కోసం అలా చెప్పాడు తప్ప సైద్ధాంతికంగా కమ్యూనిస్టు వ్యతిరేక చర్యతోనే ఆ దేశాల పర్యటనకు శ్రీకారం చుట్టటం ట్రంప్‌ వర్గనైజం. బోల్షివిక్‌ విప్లవానికి వందేండ్ల సందర్భంగా నవంబరు ఏడును ‘కమ్యూనిజం బాధితుల జాతీయ దినం ‘గా ప్రకటించి మరీ వచ్చాడు. వాస్తవానికి రోసెన్‌బర్గ్‌ దంపతులను వురితీయటంతో సహా అనేక మందిని వెంటాడి వేధించిన దుష్ట చరిత్ర వారిదే.కమ్యూనిజం గతించిందని, దానిని పాతిపెట్టామని, అంతిమ విజయం సాధించామని చెప్పుకున్న పాతికేండ్ల తరువాత కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు ఇంకా భయపడుతున్నాయి.పోరులో ఒక రంగంలో ఓడిపోవచ్చు, అంతమాత్రాన యుద్ధం ఓడిపోయినట్లు కాదు. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌ అనేక రంగాలలో విజేతగా వున్నాడు, సోవియట్‌ గడ్డపై జరిగిన నిర్ణయాత్మకపోరులో కమ్యూనిస్టుల చేతిలో ఓటమిపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. అదే విధంగా బోల్షివిక్‌ విప్లవాన్ని వమ్ముచేసినంత మాత్రాన దోపిడీ వర్గం అంతిమ విజయం సాధించినట్లు సంబరపడితే అది కార్మికవర్గాన్ని మరింతగా కర్తవ్యోన్ముఖులుగా మారుస్తుంది.

అక్టోబరు విప్లవం జయప్రదం అయిన తరువాత సోవియట్‌ను దెబ్బతీయటానికి పశ్చిమ దేశాలు చేయని యత్నం లేదు. అంతర్గతంగా సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించే శక్తుల విచ్చిన్న కార్యకలాపాలకు తోడు, బయట రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యేవరకు ఇరుగుపొరుగు దేశాలతో సోవియట్‌ సంబంధాలు సజావుగా లేవు. ఏడు సంవత్సరాల తరువాత 1924లో మాత్రమే బ్రిటన్‌ సోషలిస్టు రష్యాను గుర్తించింది. ప్రతి దేశంతో ఏదో ఒక సమస్య, సహాయ నిరాకరణ. వీటన్నింటినీ తట్టుకొని స్టాలిన్‌ నాయకత్వంలో సోవియట్‌ బలపడింది.

సోషలిస్టు చైనాకు సైతం పాతిక సంవత్సరాల పాటు ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. ఐక్యరాజ్యసమితిలో గుర్తించకుండా అడ్డుకున్నారు. ఇటువంటి స్ధితి చరిత్రలో మరేదేశానికీ వచ్చి వుండదు. మార్టిన్‌ పేర్కొన్నట్లు చైనాలో కమ్యూనిస్టు పార్టీ తన పట్టును పెంచుకున్న తరువాత డెంగ్‌ హయాంలో చేపట్టిన సంస్కరణలు, ఇతర రాజకీయ నిర్ణయాలు నేటి చైనా అవతరణకు దోహదం చేశాయి. చైనాలో సోషలిస్టు వ్యవస్ధను కూలదోసేందుకు జరిగిన ప్రయత్నాన్ని నిర్ణయాత్మకంగా ఎదుర్కొనటానికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వ పాత్ర,దానికి జనామోదం లభించటానికి ఎంతో ముందు చూపుతో డెంగ్‌ నాయకత్వంలోని కమ్యూనిస్టుపార్టీ ప్రారంభించిన సంస్కరణలతో తమ జీవితాలు మెరుగుపడుతున్నాయని జనం గ్రహించటం కూడా ఒక ప్రధానకారణం.చైనా కమ్యూనిస్టుపార్టీ నాయకత్వంలోని ప్రజా మిలిటరీ తియన్మెన్‌ స్క్వేర్‌ కుట్రను మొగ్గలోనే తుంచి వేసింది. బహుశా దానిని గమనించే అమెరికా, ఇతరసామ్రాజ్యవాదులు సోవియట్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలలో కుట్రను ముందుకు, మరింత వేగంగా అమలు జరిపినట్లు కనిపిస్తోంది.తియన్మెన్‌ స్క్వేర్‌ ప్రదర్శనలుగా ప్రపంచానికి తెలిసిన ఘటనలు 1989 ఏప్రిల్‌ 15న ప్రారంభమై జూన్‌ నాలుగు వరకు జరిగాయి. తూర్పు ఐరోపాలో అదే ఏడాది నవంబరులో తూర్పు జర్మనీలో, తరువాత సోవియట్‌లో మొదలయ్యాయి. దానిని గుర్తించి అక్కడి కమ్యూనిస్టుపార్టీలు చైనా పార్టీ మాదిరి తమ పాత్రలను మలుచుకొని వుంటే చరిత్ర మరోవిధంగా వుండేది. !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెద్ద అమెరికాను వణికిస్తున్న చిన్న ఉత్తర కొరియా!

20 Wednesday Sep 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Donald trump, he North Korea, Kim Jong-un, nuclear and missile tests, Rocket man, United Nations

 
 ఎం కోటేశ్వరరావు

     ఐక్యరాజ్య సమితి సమావేశాలలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డు ట్రంప్‌ మంగళవారం నాడు వుత్తర కొరియాను మరోసారి బెదిరించాడు. అణ్వాయుధ, ఖండాంతర క్షిపణి ప్రయోగాల నుంచి వెనక్కు తగ్గనట్లయితే కొరియాను పూర్తిగా నాశనం చేయటం తప్ప మరొక మార్గం లేదని మాట్లాడాడు. గత నలుగురు అమెరికా అధ్యక్షులు విఫలమైన తీరు, అమెరికా వైపు నుంచి చేసిన పిచ్చిపనులు ముది మది తప్పిన ఈ మనిషికి తెలిసినట్లు లేదు. గత కొద్ది వారాలుగా ఉత్తర కొరియా అమెరికా సంబంధాలు మీడియాలో ప్రముఖంగా చోటు చేసుకుంటున్నాయి. స్టాక్‌ మార్కెట్లు ఉద్ధాన, పతనాలకు గురవుతున్నాయి. ఒక చిన్న ఉత్తర కొరియా అంత పెద్ద అమెరికా, జపాన్‌లను, ప్రపంచ స్టాక్‌ మార్కెట్‌ను ఎందుకు, ఎలా వణికిస్తోంది అని బుద్ధిజీవులు ఆలోచిస్తున్నారు. రెండున్నర కోట్ల జనాభాతో వున్న ఈ సోషలిస్టు దేశం గురించి మీడియాలో సానుకూలమైన వార్త ఒక్కటీ రావటం లేదు, దాన్నొక బూచిగా చూపుతున్నారు. దీపావళి సందర్భంగా ఎదురు బెదురు కుర్రకారు పోటా పోటీగా తారాజువ్వలను వదిలినట్టుగా ఉత్తర కొరియా, అమెరికా మద్దతుతో దక్షిణ కొరియా క్షిపణులను ప్రయోగిస్తున్నాయి. విత్తు ముందా చెట్టు ముందా అన్న తెగని చర్చలోకి పోకుండా చూస్తే ఇరు దేశాలూ సమాన స్ధాయిలోనే వదులుతున్నాయి. మీడియాలో మాత్రం ఏకపక్షంగా వార్తలు వస్తాయి. ఐరాస ఆంక్షలు విధించిన తరువాత ఇంతవరకు ఆరు అణు పరీక్షలు జరపగా వాటిలో 33ఏండ్ల కిమ్‌ జోంగ్‌ అన్‌ అధికారంలోకి వచ్చిన 2016 జూన్‌ నుంచి నాలుగు, 75 హ్రస్వ, దీర్ఘశ్రేణి క్షిపణి ప్రయోగాలు జరిపింది. కొన్ని జపాన్‌ మీదుగా ప్రయాణించి అమెరికా ప్రధాన భూ భాగానికి దగ్గరలోని లక్ష్యాలను తాకాయని వార్తలు వచ్చాయి. ఇవి పరీక్షలే కాదు, అవసరమైతే నిజంగానే ప్రయోగిస్తాం అని ఉత్తర కొరియా చెబుతోంది.

ఉత్తర కొరియా ప్రయోగాలను అవును అంటే దాన్ని అణురాజ్యంగా అంగీకరించినట్టు, కాదు అంటే తన రక్షణ ఛత్రం కింద వున్న జపాన్‌, దక్షిణ కొరియాల అనుమానాలను తీర్చలేక వాటికోసం కొరియా ద్వీపకల్ప ప్రాంతంలో అమెరికన్లు బలప్రదర్శనలకు దిగి విమర్శలపాలు అవుతున్న స్ధితి. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గాలంటే దక్షిణ కొరియా నుంచి అమెరికా తన సైన్యాలను ఉపసంహరించి ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం ఉభయ కొరియాల విలీనానికి వీలు కల్పించాల్సి వుంది. అందుకు అమెరికన్లు సిద్ధం కాదు. చైనా, రష్యా, ఉత్తర కొరియాలను ఎప్పుడైనా దెబ్బతీయాలి లేదా తన దారికి తెచ్చుకోవాలనే లక్ష్యంతో అమెరికన్లు దక్షిణ కొరియాలో క్షిపణి వ్యవస్థ ఏర్పాటు చేశారు. జపాన్‌తో కలసి నిత్యం యుద్ధ విన్యాసాలకు దిగుతున్నారు. దానిని చూసి ఉత్తర కొరియా తన జాగ్రత్తలను తాను తీసుకొంటోంది. అణు కార్యక్రమం నుంచి వైదొలిగేందుకు చేసుకున్న పలు ఒప్పందాలకు అమెరికా తూట్లు పొడిచిన కారణంగా ఉత్తర కొరియా తన ప్రయోగాలను పునరుద్ధరించింది. పూర్తి స్ధాయి అణుదేశంగా మారేందుకు ఉత్తర కొరియా ముందుకు పోతోందన్నది స్పష్టం. దాన్ని ఆ బాట నుంచి మళ్లించాలంటే రెచ్చగొట్టటం కంటే ప్రపంచ దేశాలు ముఖ్యంగా అమెరికా, చైనా, రష్యా, జపాన్‌ ఒక గట్టి నిర్ణయం తీసుకొని అమలు జరపాల్సి వుంది. గత శుక్రవారం నాడు స్వయంగా కిమ్‌ జోంగ్‌ అన్‌ పర్యవేక్షణలో ఒక క్షిపణి పరీక్ష జరిపినట్టు ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించింది. అది 770 కిలోమీటర్ల ఎత్తున 3,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించి లక్ష్యాన్ని చేరుకుంది. తమ అంతిమ లక్ష్యం అమెరికాతో వ్యూహాత్మక సమానత్వాన్ని సాధించేందుకు, ఉత్తర కొరియాపై సైనిక ప్రయోగం వంటి మాటలు అమెరికా నేతలు మాట్లాడకుండా వుండేందుకు ఈ ప్రయోగాలను జరుపుతున్నట్టు కిమ్‌ వ్యాఖ్యానించారు.


ఉత్తర కొరియా ఇటువంటి తీవ్ర చర్య తీసుకోవటానికి కారణం ఎవరు? అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)లో అది భాగస్వామి. రెండవ ప్రపంచ యుద్ధం నాటి నుంచి ఉభయ కొరియాల విలీనానికి అడ్డుపడుతూ దక్షిణ కొరియాలో తిష్టవేసింది అమెరికా. నిత్యం ఉత్తర కొరియాపై కవ్వింపులు, అక్కడి నాయకత్వానికి వ్యతిరేకంగా కుట్రలు సాగించింది. చైనా, ఇండో చైనాలోని వియత్నాం, కంపూచియా, లావోస్‌ తదితర దేశాలకు వ్యతిరేకంగా దక్షిణ కొరియాలో అమెరికా తన అణ్వాయుధాలను మోహరించింది. ఈ పూర్వరంగంలో ఉత్తర కొరియా అణు రియాక్టర్ల నిర్మాణానికి నాటి సోవియట్‌ యూనియన్‌ సహకరించింది. ఆ క్రమంలో 1985లో ఉత్తర కొరియా ఎన్‌పీటీపై సంతకం చేసింది. దక్షిణ కొరియా నుంచి అమెరికా అణ్వాయుధాలను వుపసంహరించాలని ఒక షరతు పెట్టింది. అయితే ఆ పని చేయకపోగా ఉత్తర కొరియా అందచేసిన సమచారాన్ని విశ్వసించటం లేదని ప్రత్యేక తనిఖీలకు అనుమతించాలని అంతర్జాతీయ అణుశక్తి సంస్ధ ద్వారా అమెరికా వత్తిడి చేసింది. అందుకు అంగీకరించకపోవటంతో ఐరాసకు ఫిర్యాదు చేశారు. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ పూర్వరంగంలో 1994లో తాను ఎన్‌పీటీ నుంచి వైదొలగాలనుకుంటున్నట్టు ఉత్తర కొరియా ప్రకటించింది. అమెరికా చేసుకున్న ఒప్పందం ప్రకారం కొరియా అణు కార్యక్రమం నిలిపివేస్తే దానికి ప్రతిగా ఆర్ధికసాయం చేయాలి. అయితే దీనికి అమెరికన్లు 2002లో తూట్లు పొడిచారు. కథ మళ్లీ మొదటికి రావటంతో ఈ సారి అమెరికా, ఉభయ కొరియాలు, చైనా, రష్యా, జపాన్‌ కలసి చర్చించి 2005లో ఒప్పందం చేసుకున్నాయి. దాన్ని కూడా అమెరికా 2009లో ఉల్లంఘించింది. దాంతో తాము మరోసారి చర్చలకు వచ్చేది లేదని, అమెరికా చిత్తశుద్ధి ప్రదర్శించటం లేదని ఉత్తర కొరియా ప్రకటించింది. అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
తాజా క్షిపణి పరీక్షలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రత్యక్ష చర్యలకు పూనుకోవాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారు. అలాంటి ఉడత ఊపులకు బెదిరేది లేదని కొరియా మరో క్షిపణి పరీక్ష జరిపింది. అమెరికా ప్రత్యక్ష చర్యల ప్రకటనలు మాని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా, రష్యా హితవు పలికాయి. ఐరాసలో రష్యా రాయబారి వాసిలీ నెబెన్‌జరు మాట్లాడుతూ భద్రతా మండలి విధించిన ఆంక్షలకు మించి అదనపు చర్యలకు తాము సుముఖం కాదని స్పష్టం చేశారు. ‘అమెరికా, ఇతర భాగస్వాములను మేము కోరేదేమంటే భద్రతా మండలి తీర్మానంలో అవకాశం కల్పించిన రాజకీయ, దౌత్యపరమైన పరిష్కారాలను ముందు అమలు జరపాలి, వాటిని అమలు జరపకపోవటం అంటే తీర్మానానికి అనుకూలంగా వ్యవహరించటం లేదని మేము పరిగణించాల్సి వుంటుంది’ అని చెప్పారు. కొరియాతో తిరిగి ముఖాముఖి చర్చలు జరపాలన్న చైనా, రష్యా ప్రతిపాదనను గతంలో అమెరికా తిరస్కరించింది. అమెరికాలోని చైనా రాయబారి కురు టీయంకారు మాట్లాడుతూ గతం కంటే అమెరికాయే ఇప్పుడు ఎంతో చేయాల్సి వుంది. మరిన్ని బెదిరింపులకు పాల్పడకుండా నిగ్రహంతో వుండాలి. చర్చలు, సంప్రదింపులకు ప్రభావవంతమైన మార్గాలను వెతికేందుకు వారు ఎంతో చేయాల్సి వుంది’ అన్నారు.
గత కొన్నేండ్లుగా ఉత్తర కొరియా గురించి జరిగిన ప్రచారాలలో అక్కడ జనం ఆకలితో మాడిపోతున్నారు, కరవు తాండవిస్తోంది, వస్తు కొరత తీవ్రంగా వుంది. అభివృద్ధి లేదు. నిరంకుశత్వం రాజ్యమేలుతోంది. జనంలో అసంతృప్తి పెరుగుతోంది. ఇలా ఉంటోంది. నిజంగా అక్కడ అలాంటి పరిస్థితే ఉంటే దశాబ్దాల తరబడి జనం తిరుగుబాటు చేయకుండా వుంటారా? ఐరాస తాజాగా విధించిన ఆంక్షల ఫలితంగా చమురు, గ్యాస్‌ ఎగుమతులు పరిమితం అవుతాయి. అక్కడి నుంచి వస్త్రాల వంటి వస్తువుల దిగుమతులు తగ్గిపోతాయి. నిజానికి ఇలాంటి పరిస్ధితిని ఉత్తర కొరియా ఏదో ఒక రూపంలో గత కొద్ది దశాబ్దాలుగా ఎదుర్కొంటోంది. ఆ దేశమంటే ఏమాత్రం సానుకూల వైఖరి లేదా సోషలిజం అంటే అభిమానం లేని కొందరు వ్యాఖ్యాతలు ఏమంటున్నారో చూద్దాం.
సిల్వియా మెర్లెర్‌ ఐరోపా కమిషన్‌ విశ్లేషకురాలు, జర్నలిస్టు. ఆమె ఒక వ్యాసంలో వివిధ అభిప్రాయాలను ఉటంకించారు. వాటిలో కొన్నింటిని చూద్దాం. ‘ఎకనమిస్ట్‌’ పత్రిక వాదన ఇలా వుంది. ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ మీద పశ్చిమ దేశాల ఆంక్షలు పెద్దగా పని చేయలేదు. ఏటా ఒకటి-ఐదు శాతం మధ్య అది అభివృద్ధి సాధించి వుండవచ్చు. అక్కడి నుంచి బొగ్గు ఎగుమతులను నిలిపివేయాలని ఐరాస ప్రయత్నించింది. అక్కడి నుంచి 99శాతం బొగ్గు దిగుమతి చేసుకొనే చైనా వాటిని నిలిపివేస్తానని ప్రకటించింది. అయితే కొరియా బొగ్గు ఓడలు చైనా రేవులకు వెళుతూనే వున్నాయి. డెయిలీ ఎన్‌కె అనే పత్రిక ప్రచురించిన వార్తల ప్రకారం అధికారికంగా 387 మార్కెట్లను మంజూరు చేయగా వాటిలో ఆరు లక్షల దుకాణాలలో విక్రయాలు సాగుతున్నాయి. యాభైలక్షల మంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వాటిపై ఆధారపడి వున్నారు. కొత్తగా మధ్యతరగతి పెరుగుతోంది. ఆదాయ అసమానతలు తీవ్రం అవుతున్నాయి. ఈ వార్తకు ముందు రాసిన ముందు మాటలో స్టెఫాన్‌ హగ్గడ్‌ ఇలా వ్యాఖ్యానించారు. ‘ఆర్థిక ఆంక్షలు వారిని దెబ్బతీస్తున్నాయి. 2002 అణు సంక్షోభం తలెత్తిన తరువాత జపాన్‌, దక్షిణ కొరియా ఇతర దేశాలతో వాణిజ్యం దాదాపు సున్నా స్థాయికి చేరింది. మొత్తం చైనా పైనే ఆధారపడుతోంది. ఇటువంటి స్థితిలో 2017 ఆగస్టులో భద్రతా మండలి ఆంక్షలను చైనా ఆమోదించే విధంగా అమెరికా చేయగలిగింది.
అమెరికా కొరియా సంస్ధకు చెందిన హెన్రీ ఫెరాన్‌ 38 నార్త్‌ బ్లాగ్‌ అనే వెబ్‌సైట్‌కు రాసిన వ్యాసంలో ‘ప్రస్తుతం అమలు జరుగుతున్న ఆర్థిక ఆంక్షలు ఎలాంటి ప్రభావం చూపటం లేదని అక్కడ జరుగుతున్న నిర్మాణాలు, ఆహారధాన్యాల ఉత్పత్తి, విదేశీ వాణిజ్యం వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. దీనికి పలువురు పలు కారణాలను విశ్వసిస్తున్నప్పటికీ ముఖ్యమైన ఒక అంశం ఏమంటే కొరియా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించగలిగే సామర్థ్యం దానికి వుండటమే.’ 2016లో కొరియా వాణిజ్యంలో చైనా వాటా 64 నుంచి 88కి పెరిగింది. దక్షిణ కొరియా వాటా 30 నుంచి 5కు తగ్గింది. రెచ్చగొట్టే చర్యల నుంచి ఉత్తర కొరియా వెనక్కు తగ్గదు అనుకుంటే ఆంక్షలు ఏమౌతాయన్నది ప్రశ్న అని మరొకరు పేర్కొన్నారు. దీనిని బట్టి సాంకేతికంగా ఐరాస ఆంక్షలను సమర్ధించినప్పటికీ ఉత్తర కొరియాకు చైనా, రష్యా అండదండల కారణంగానే అది నెట్టుకొస్తోందన్నది స్పష్టం. అణ్వాయుధాలు పలు దేశాల వద్ద వున్న కారణంగా వాటితో యుద్ధానికి ఎవరూ తలపడే లేదా, వాటిని చూసి లొంగిపోయే అవకాశాలు లేవు. ఈ కారణంగానే అనేకమంది ఉత్తర కొరియాతో సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలే తప్ప ఆయుధ ప్రయోగం వలన ఫలితం లేదని అంటున్నారు. అమెరికన్లకు ఈ మంచి మాటలు తలకెక్కుతాయా?

కొరియాపై యుద్దానికి దిగితే జరిగే నష్టం గురించి అమెరికా రక్షణ మంత్రి జేమ్సు మాటిస్‌ అనూహ్యమైన విషాదం చోటు చేసుకుంటుందని చెప్పాడు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ తదితర ప్రాంతాలను లక్ష్య ంగా చేసుకొని వుత్తర కొరియా 8000 ఫిరంగులను ఎక్కు పెట్టి వుంచింది. ఒక వేళ అమెరికా దాడులను ప్రారంభించి క్షిపణులను వదిలితే అవి ఆకాశంలో ప్రయాణించి వుత్తర కొరియాను చేరే లోపలే ఆ ఫిరంగులు తమపని కానిస్తాయి.తొలి కొద్ది గంటలలోనే లక్షల మంది దక్షిణ కొరియన్లు మరణిస్తారు. అక్కడ వున్న లక్షా 30వేల మంది అమెరికన్లు కూడా నాశనం అవుతారు.

రెండవ ప్రపంచ యుద్దం తరువాత, 1953లో వుత్తర కొరియాపై యుద్ధానికి దిగిన అమెరికా వైఖరి అప్పటి నుంచి ఇప్పటి వరకు వుత్తర కొరియాను ఏ మాత్రం భయపెట్టక పోగా చివరికి అమెరికు సమీపంలోకి క్షిపణులను వదిలేంతగా కొరియా ఆయుధ సామర్ద్యాన్ని సముపార్జించుకుంది.తన అత్యంత ఆధునిక ఆయుధాల ప్రయోగశాలలుగా ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లను వుపయోగించుకున్న అమెరికాకు అక్కడ తీవ్రనష్టాలు, ఎదురుదెబ్బలే తప్ప విజయాలు దక్కలేదు. అలాంటిది అమెరికాతో ఢీ అంటే ఢీ అనేంతగా ఎదిగిన చైనా పక్కన వుండగా వుత్తర కొరియాపై దాడి చేసి నాశనం చేస్తామని ట్రంప్‌ చెబితే నమ్మేవారెవరైనా వుంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

రెండు విగ్రహాలుా-రెండు దేశాలుా- భావజాలం ఒక్కటే !

21 Monday Aug 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Ambedkar, Charlottesville, Donald trump, garagaparru, garagaparru ambedkar, Hinduthwa, Nazism, racism, Racist, Robert E. Lee, white supremacy

ఎం కోటేశ్వరరావు

విగ్రహాలు మాట్లాడతాయా ! ఏం వినాయకుడి విగ్రహం పాలు తాగిందంటే నమ్మినపుడు మాట్లాడతాయంటే ఎందుకు నమ్మరు ? ఒక దేవుడు లేక దేవత, దేవదూత, దేవుని బిడ్డ, ఇలా వివిధ మతాలకు ప్రతీకలుగా మన ముందున్న వారు పాలు తాగటం, కన్నీరు, రక్తాలను కార్చటం వంటి మహిమల గురించి ప్రచారం చేయటానికి ఈ సందర్భాన్ని వినియోగించుకోవటం లేదు. మేకిన్‌ ఇండియా పిలుపులతో స్టార్టప్‌ కంపెనీలు ఏర్పాటు చేసిన వారు, ఇప్పటికే అలాంటి పరిశ్రమలలో దిగ్గజాలుగా వున్న వారు తమ ప్రచార, ప్రబోధ సైనికులకు నైపుణ్య శిక్షణ ఇస్తూ పుష్కలంగా దేశం మీదకు వదులుతున్నారు. ఆ కంపెనీలకు ఎలాంటి సంక్షోభం వుండదు, లేఆఫ్‌లు, మూసివేతలు వుండవు. ఏ సందులో చూసినా వారు మనకు దర్శనమిస్తారు.

విగ్రహాలు మాట్లాడవు గానీ మాట్లాడిస్తున్నాయి, ప్రశ్నించేట్లు చేస్తున్నాయి, వుద్యమాలకు పురికొల్పుతున్నాయి, రచ్చ, రగడలు సృష్టిస్తున్నాయి, రాజకీయ, ప్రతిరాజకీయాలు చేయిస్తున్నాయి,కదనాలను రెచ్చగొడుతున్నాయి, కత్తులు దూయిస్తున్నాయి. కన్నీళ్లు పెట్టిస్తున్నాయి, కష్టాల పాలు చేస్తున్నాయి. వాగ్దానాలను కుమ్మరింప చేస్తున్నాయి. ఏటికేడాది ఎంత ఎత్తు పెంచితే అంతగా లాభాలను కురిపిస్తున్నాయి. శ్రీశ్రీ అన్నట్లు ముందు దగా వెనుక దగా కుడిఎడమల దగా. విగ్రహాల రాజకీయాలను జనం అర్ధం చేసుకోలేకపోతే ఇంకా ఏం జరుగుతాయో తెలియదు.

పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో అంబేద్కర్‌ విగ్రహ ప్రతిష్ట ఎంతటి సమస్యను సృష్టించిందో మనకు తెలిసిందే. పెత్తందారులకు ఆగ్రహం కలగకుండా వుండేందుకు, వారి మద్దతు కోసం చివరి వరకు పని చేసిన తెలుగుదేశం పాలకులు తాము చేసిన తప్పిదానికి, దళితులను ఇబ్బంది పెట్టి నష్టపరిచినందుకు గాను పెత్తందారుల లేదా పాలకపార్టీ లేదా వారి అడుగులకు మడుగులత్తిన దళిత నేతల నుంచి సామూహిక జరిమానాలు వసూలు చేసి సాంఘిక బహిష్కరణకు గురైన వారికి నష్టపరిహారం చెల్లించి వుంటే అలాంటి ఆలోచనలున్న మిగతా వారికి హెచ్చరికగా వుండేది. అమెరికా వర్జీనియా రాష్ట్రంలోని చార్లెటోసివిలే పట్టణంలో శ్వేతజాతీయులు, వారి దురహంకారాన్ని వ్యతిరేకిస్తున్న వారి మధ్య జరిగిన వివాదంలో ఒక నల్లజాతి మహిళ మరణించింది. ఇప్పుడు అనేక నగరాలు, ప్రాంతాలలో విగ్రహాలు, చిహ్నాల తొలగింపుపై అనుకూల, వ్యతిరేక ఆందోళనలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి.గరగపర్రులో బహిరంగ ప్రదేశంలో ఇతర విగ్రహాల పక్కనే అంబేద్కర్‌ను వుంచటాన్ని అంతరించిపోతున్న ఫ్యూడల్‌ భావజాల శక్తులు వ్యతిరేకించాయి.(వీరిలో రోజువారీ ఏదో ఒక పని చేస్తే తప్ప గడవని దళితేతరులు కూడా వుండటం విచారకరం.) అంబేద్కర్‌ దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక. తరతరాలుగా తమ దయాదాక్షిణ్యాలతో బతికిన వారు ఆత్మగౌరవాన్ని అంబేద్కర్‌ విగ్రహ ప్రతిష్ట రూపంలో ప్రదర్శించటాన్ని సహించలేని పెత్తందారీ శక్తుల ప్రభావానికి లోనైన వారు దళితుల మీద కత్తి గట్టి చివరికి తమకు తెలియకుండానే సాంఘిక బహిష్కరణ నేరానికి కూడా ఒడిగట్టారు.

అమెరికా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో బానిసత్వాన్ని కొనసాగించాలని తిరుగుబాటు చేసిన శ్వేతజాతి దురహంకారులు, దోపిడీ శక్తుల ప్రతినిధి రాబర్ట్‌ ఇ లీ. అతగాడి లేదా అంతర్యుద్ధంలో అతని నాయకత్వంలో పని చేసిన వారి విగ్రహాలు, చిహ్నాలను బహిరంగ ప్రదేశాల నుంచి తొలగించాలని జాత్యంహంకార వ్యతిరేక శక్తులు వుద్యమిస్తున్నాయి. వాటిని కాన్ఫెడరేట్‌ చిహ్నాలు అని పిలుస్తున్నారు. విద్య, వుద్యోగాలలో రిజర్వేషన్లు అంబేద్కర్‌ చలవే అని దళితులు, దళిత సంఘాలు ప్రచారం చేస్తుండటం, రిజర్వేషన్లే తమ అవకాశాలను దెబ్బతీస్తున్నాయని వాటికి అర్హత లేని కులాల వారిలో అసంతృప్తి పెరుగుతున్న నేపధ్యంలో అనేక చోట్ల అంబేద్కర్‌ విగ్రహాలను పెట్టటం ఎక్కువకావటంతో పాటు వాటికి వ్యతిరేకత, అవమానపరిచే శక్తులు కూడా చెలరేగుతున్నాయి.

అమెరికాను ఆక్రమించిన ఐరోపా శ్వేతజాతి వలస వాదులు తమ గనులు, వనులలో పని చేసేందుకు ఆఫ్రికా ఖండం నుంచి బలవంతంగా బానిసలుగా అక్కడి వారిని తీసుకు వచ్చిన దుర్మార్గం గురించి తెలిసిందే. అమెరికా ఖండాలను ముందుగా ఆక్రమించిన స్పెయిన్‌, పోర్చుగీసు జాతుల వారసులు హిస్పానిక్‌ లేదా లాటినోలుగా పిలవబడుతున్న వారు 13,17శాతం చొప్పున జనాభాలో వున్నారు. పెట్టుబడిదారీ అర్ధశాస్త్రవేత్త థామస్‌ పికెట్టీ చెప్పినట్లు అమెరికాలో ఆర్ధిక అసమానతలు విపరీతంగా పెరగటం, గత శతాబ్దిలో సంభవించిన ఆర్ధిక సంక్షోభాలు, వర్తమాన శతాబ్దిలో 2008లో ప్రారంభమైన తీవ్ర ఆర్ధిక సమస్యల కారణంగా అమెరికాలోని పేద, మధ్యతరగతుల జీవితాలు దిగజారుతున్నాయి. ఈ పరిస్ధితిని మిగతా దేశాలలో మాదిరి అమెరికాలో కూడా మితవాద శక్తులు వుపయోగించుకుంటున్నాయి. గత వారసత్వంగా వచ్చిన శ్వేత జాత్యంహంకారం ఇటీవలి కాలంలో పెరుగుతోంది.అలాంటి శక్తులు వాటికి ప్రతీకలైన వారిని ఆరాధించటం, అనుకరించటం పెరుగుతోంది.మన దేశంలో త్వరలో ముస్లింల జనాభా మెజారిటీగా మారనుందని హిందుత్వ శక్తులు ప్రచారం చేస్తున్న మాదిరే అమెరికాలో ప్రస్తుతం 77 శాతంగా వున్న శ్వేతజాతీయులు 2042నాటికి మైనారిటీలుగా మారనున్నారనే ప్రచార ఈ నేపధ్యంలో అక్కడి పరిణామాలను చూడాల్సి వుంది.

ముస్లింలు ఈద్‌ రోజున రోడ్లపై నమాజు చేయటాన్ని నేను ప్రశ్నించలేనపుడు పోలీసు స్టేషన్లలో కృష్ణాష్టమి వేడుకులను నిలిపివేయాలని నేనెలా చెప్పగలను అని యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ చేసిన వ్యాఖ్యల మాదిరే చార్లెటోసివిలే పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా శ్వేత దురహంకారుల చర్యను సమర్ధిస్తూ మాట్లాడారు.దీంతో దేశవ్యాపితంగా అనేక చోట్ల నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. బోస్టన్‌ నగరంలో నలభైవేల మందితో జరిగినది అలాంటి వాటిలో ఒకటి. చార్లెటిసివిలే పరిణామాలను చూసిన తరువాత బానిసత్వ పరిరక్షకుల తరఫున పని చేసిన వారి విగ్రహాలు, చిహ్నాలు తొలగించాలని చేసిన నిర్ణయాలను సత్వరం అమలు జరిపేందుకు పలు చోట్ల చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ తాజా పరిణామానికి నాంది ఏమిటి? అంటరాని తనాన్ని సమర్ధించే మనుస్మృతిని దగ్దం చేసి వ్యతిరేకత తెలిపేందుకు 1927 డిసెంబరు 25న వేలాది మందితో ఆ పుస్తక ప్రతులను దగ్దం చేసేందుకు నాయకత్వం వహించిన అంబేద్కర్‌ గురించి తెలిసిందే. అలాగే అమెరికాలో బానిసత్వ చిహ్నాలను అనుమతించకూడదని ఎప్పటి నుంచో అభ్యుదయ వాదులు డిమాండ్‌ చేస్తున్నారు. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలలోని సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత కమ్యూనిస్టు వ్యతిరేకులు లెనిన్‌, స్టాలిన్‌ విగ్రహాలతో పాటు సోషలిస్టు చిహ్నాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. అమెరికన్లు ఇరాక్‌ను ఆక్రమించి తమను వ్యతిరేకించే శక్తులకు ప్రతినిధిగా వున్న సద్దాం హుస్సేన్‌ను వురితీసి, ఆయన విగ్రహాలను కూల్చివేయటాన్ని మనమందరం చూశాం. ఇలాంటివన్నీ భావజాల పోరులో భాగం.సమాజంలో అనేక వైరుధ్యాలు, డిమాండ్లు వుంటాయి. వాటిలో ఏది ఎప్పుడు, ఎలా ముందుకు వస్తుందో వూహించలేము.

చార్లెటెసివిలే నగర పాలక సంస్ధ కాన్ఫెడరేట్‌ చిహ్నాలను తొలగించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక తీర్మానం చేసింది. దానికి అనుగుణ్యంగా రాబర్ట్‌ లీ పార్కు పేరును ‘దాస్య విమోచన పార్కు’ గా మార్చాలని దానిలోని జనరల్‌ రాబర్ట్‌ ఇ లీ విగ్రహాన్ని, నగరంలోని ఇతర చిహ్నాలను కూల్చివేసేందుకు వుపక్రమించింది. దానికి నిరసనగా శ్వేతజాతి దురహంకారులు కోర్టులో కేసు దాఖలు చేశారు. మే 13వ తేదీన కొంత మంది విగ్రహాల కూల్చివేతకు నిరసనగా కొందరు నగరంలో ప్రదర్శన చేశారు. జూన్‌ ఐదున నగర మేయర్‌ పార్కు పేరు మార్పును అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 11న శ్వేతజాతీయులు వర్జీనియా విశ్వవిద్యాలయంలో దివిటీలతో నిరసన ప్రదర్శన చేశారు. శ్వేతజాతీయుల జీవిత సమస్య, మమ్మల్ని తొలగించలేరు, ఇతర నాజీ నాజీనినాదాలు చేశారు.పోలీసులు వచ్చి ఆ ప్రదర్శనకు అనుమతి లేదని అడ్డుకున్నారు. శ్వేతజాతీయులకు వ్యతిరేకంగా ఇతరులు పోటీ ప్రదర్శన చేయటంతో వారితో గొడవ పడ్డారు. మరుసటి రోజు ‘మితవాదులు ఏకం కావాలి’ అనే నినాదంతో చార్లొటెసివిలే నగరంలో మధ్యాహ్నం ప్రదర్శనకు శ్వేతజాతీయులు పిలుపునిచ్చారు. అయితే వుదయాన్నే పలుచోట్ల ప్రదర్శనను వ్యతిరేకించేవారు ప్రదర్శకులను అడ్డుకున్నారు.పోలీసులతో సహా కొందరికి గాయాలయ్యాయి. ప్రదర్శనలను నిషేధించినట్లు పోలీసులు తెలిపారు. వర్జీనియా గవర్నర్‌ అత్యవసర పరిస్ధితిని ప్రకటించారు. అదే రోజు మధ్యాహ్నం శ్వేతజాతీయులకు వ్యతిరేకంగా ప్రదర్శన చేస్తున్నవారిపై ఒక శ్వేతజాతీయుడు కారునడపటంతో ఒక మహిళ మరణించగా 19 మంది గాయపడ్డారు. రెచ్చగొట్టే ప్రదర్శనలకు పిలుపు ఇచ్చి ఒకరి మరణానికి, అనేక మంది గాయాలకు కారకులైన శ్వేత జాతీయులతో పాటు వారిని వ్యతిరేకించిన వారు కూడా హింసాకాండకు కారకులే అని అధ్యక్షుడు ట్రంప్‌ ట్వీట్‌ చేసి మరింత రెచ్చగొట్టారు. హింసాకాండను అదుపు చేసేందుకు వినియోగిస్తున్న హెలికాప్టర్‌ కూలి ఇద్దరు పోలీసులు మరణించారు. మరణించిన మహిళకు సంతాపంగా, శ్వేతజాతీయుల హింసాకాండకు వ్యతిరేకంగా 12వ తేదీ నుంచి దేశంలో అనేక చోట్ల ప్రదర్శనలు జరుగుతున్నాయి. కొన్ని విగ్రహాలను కూల్చివేశారు.

ఈ పరిణామాలకు 2015లోజరిగిన వుదంతం ఒక కారణంగా కొందరు విశ్లేషిస్తున్నారు. స్వయంగా తాను శ్వేత జాతి దురహంకారినని ప్రకటించుకున్న డైలాన్‌ రూఫ్‌ 2015జూన్‌ 17న దక్షిణ కరోలినాలోని చార్లెస్టన్‌ అనే పట్టణంలో నల్లజాతీయులు ఎక్కువగా వుండే ఒక చర్చిలోకి వెళ్లి తుపాకితో కాల్పులు జరిపి తొమ్మిది ప్రాణాలను బలిగొన్నాడు.కాల్పులు జరిపిన తరువాత కాన్ఫెడరేట్‌ పతాకం పట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చాడు. వాటిని చూసిన జనం దక్షిణ కరోలినా రాజధానిలో ఎగురుతున్న కాన్ఫెడరేట్‌ పతాకాన్ని తొలగించాలని డిమాండ్‌ చేశారు. అధికారయుతంగా తొలగించేందుకు అంగీకరించే లోపే కొంత మంది దానిని తీసివేశారు. పతాకంతో పాటు కాన్ఫెడరేట్‌ విగ్రహాలు, చిహ్నాలను కూడా తొలగించాలనే డిమాండ్‌ దేశవ్యాపితంగా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ముందుకు వచ్చింది. కాన్ఫెడరేట్స్‌ బానిసత్వం కొనసాగాలని పని చేయటం, శ్వేతజాతి దురహంకారానికి ప్రాతినిధ్యం వహించినందున వారి గౌరవార్ధం ఏర్పాటు చేసిన విగ్రహాలు, చిహ్నాలను గౌరవించి పరిరక్షించాల్సిన అవసరం లేదనే వాదనలు ముందుకు వచ్చాయి.

చార్లెటోసెవిలే వుదంతం తరువాత అధ్యక్షుడు ట్రంప్‌ తన అవివేకాన్ని, అహంకారాన్ని మరోసారి బయట పెట్టుకున్నాడు. శ్వేతజాతీయులకే అధ్యక్షుడు అన్నట్లుగా వ్యవహరించాడు. పరిస్ధితిని మరింత సంక్లిష్టంగా మార్చివేశాడు. అన్ని వైపుల నుంచి ఘర్షణలు జరిగాయని తొలుత ట్వీట్‌ చేశాడు. తరువాత ‘ఈ వారంలో రాబర్ట్‌ ఇ లీ, మరోవారం స్టోన్‌ వాల్‌ జాక్సన్‌ అంటారు, తరువాత జార్జి వాషింగ్టన్‌ వంతు వస్తుంది, మీరే ఆలోచించండి దీనికి అంతం ఎక్కడ ‘ అని ప్రశ్నించాడు. తరువాత కాన్ఫెడరేట్‌ చిహ్నాలను కూల్చివేయటం బుద్దితక్కువతనం అని మరో ట్వీట్‌ చేశాడు.

దక్షిణ కరోలినా రాష్ట్రం అధికారికంగా కాన్ఫెడరేట్‌ పతాకాన్ని తొలగించిన తరువాత అనేక రాష్ట్రాలు, నగరాలలో అలాంటి చర్యలనే చేపట్టారు. ఒక సర్వే ప్రకారం దేశంలోని 1500బహిరంగ స్ధలాలలో కాన్ఫెడరేట్‌ చిహ్నాలు వున్నట్లు తేలింది. ఇంకా ఎక్కువే వుండవచ్చు కూడా. అమెరికాలో సాగిన అంతర్యుద్దంలో కాన్ఫెడరేట్స్‌ యూనియన్‌కు (అమెరికా సంయుక్త రాష్ట్రాలకు) వ్యతిరేకంగా బానిసత్వం కొనసాగాలని కోరుకొనే శక్తులవైపు నిలిచారు. అందువలన వారిని అమెరికన్‌ దేశభక్తులుగా పరిగణించకూడదని జాత్యంహకారం, బానిసత్వ వ్యతిరేకులు డిమాండ్‌ చేస్తున్నారు.

మన స్వాతంత్య్ర వుద్యమంలో దేశ ప్రజలకు వ్యతిరేకంగా బ్రిటీషు వారి సేవలో మునిగిన కాషాయ, హిందూత్వ శక్తులు దేశవ్యాపితంగా స్వాతంత్య్రవుద్యమం, చరిత్రకారులు విస్మరించిన కొందరిని సమరయోధులుగా చిత్రించేందుకు ప్రయత్నించటం, హిందువులు మైనారిటీలుగా మారే ప్రమాదం వుందని ప్రచారం చేయటం, మనువాదం మనుగడ సాగించేందుకు చేయాల్సిందంతా చేస్తున్నాయి. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయన్నట్లుగా డోనాల్డ్‌ ట్రంప్‌- నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహించేశక్తుల మధ్య సైద్ధాంతిక బంధం కూడా వుండటం చిత్రంగా వుంది కదూ !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రతి వారికి ఒక రోజు అవకాశం వస్తుందన్నపుడు కమ్యూనిస్టులకు ఎందుకు రాదు ?

04 Thursday May 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Latin America, Left politics, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Anti communist, communist, Donald trump, mayday, pope, Pope Francis

Image result for anti communist

ఎం కోటేశ్వరరావు

మొన్ననే మహాకవి శ్రీశ్రీ జయంతి జరుపుకున్నాం. అనేక అంశాలను విస్మరిస్తున్నట్లుగానే ఆయన చేసిన రచనలను కూడా చదవటం తగ్గిపోతోంది. ఆయన రచనలలో ఒకదానిలో ఎంత వున్నతమైన సందేశం దాగి వుందో చూడండి.

కుక్క పిల్లా / అగ్గిపుల్లా/ సబ్బు బిళ్లా

హీనంగాచూడకుదేన్నీ/కవిత్వమేనోయ్‌ అన్నీ

రొట్టె ముక్కా/అరటి తొక్కా/బల్లచెక్కా

నీ వైపే చూస్తుంటాయ్‌/ తమ లోతు కనుక్కో మంటాయ్‌

ఇక శంకర్‌ దాదా ఎంబిబిఎస్‌ భాషలో చెప్పాలంటే ప్రతి కుక్కకూ ఒక రోజు వస్తుంది. రోజులన్నీ ఒకే విధంగా వుండవు. అంటే ప్రతి వారికీ ఏదో ఒక రోజు తామేమిటో నిరూపించుకొనే అవకాశం వస్తుంది. దానికి కమ్యూనిస్టులు మినహాయింపు ఎలా అవుతారు ? ఎరుపంటే భయం భయంగా చూసే అనేక మందికి ఈ చిన్న లాజిక్కు ఎందుకు అర్ధం కాదో తెలియదు. సినిమా వారు బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన పదాలలో ‘గీకటం లేదా గోకటం ‘ ఒకటి. ఇష్టం వున్న వారు ఆ పని చేస్తే కథ సుఖాంతం అవుతుంది. లేకపోతే ఏం జరిగేదీ మనం రోజూ చూస్తున్నదే. బెంగాల్‌లో కమ్యూనిస్టులు అధికారాన్ని కోల్పోయిన చాలా సంవత్సరాల తరువాత ఈ మధ్య ఒక కుటుంబం తమ అమ్మాయికి కమ్యూనిస్టు రాజకీయాలు వున్న వరుడు కావాలని ఒక ప్రకటనలో కోరినట్లు వార్తలు వచ్చాయి. అంటే కమ్యూనిస్టు అబ్బాయి చాలా మంచోడు ( సమాజ దుష్ట ప్రభావం పడో, మరొకటో జరిగో మిగతావారి మాదిరి భార్యలను వేధించే వారు లేరని కాదు) అన్నది వారి అనుభవం. చాలా మంది దృష్టిలో కమ్యూనిస్టులు ఈ కాలానికి పనికిరాని మంచి వారు. వారి వలన ముప్పు లేదని ప్రపంచ కమ్యూనిస్టు వ్యతిరేక అధిపతి అమెరికా పాలకులే పాతికేండ్ల క్రితం ప్రకటించారు. అలాంటపుడు వారి మానాన వారిని వదిలేయాలి కదా !

ఆ పని చేయకుండా అనవసరంగా కొంత మంది వ్యతిరేకులు కమ్యూనిస్టులను గోకుతున్నారు. అమెరికాలోని సియాటిల్‌ మరికొన్ని చోట్ల మేడే రోజున కమ్యూనిస్టు వ్యతిరేకులు ప్రదర్శనలు జరటం, ఆ సందర్భంగా మీడియా నిండా చెడరాయటం, చూపటం దానిలో భాగమే. వామపక్షం, సోషలిజం, కమ్యూనిజం భావజాలానికి దూరంగా వున్న యువతలో కూడా ఇదేమిటి అన్న ఆసక్తి కలిగించి కొంత మందిని అయినా ఆ వైపు నెడుతున్నందుకు అలాంటి వారిని సహజంగానే కమ్యూనిస్టులు అభినందిస్తారు. అలా వచ్చిన వారు మరింత గట్టిగా తయారు కావటం తెలిసిందే.

మే ఒకటవ తేదీన ప్రపంచ వ్యాపితంగా కార్మికదినాన్ని పాటించారు. ఈ సందర్బంగా ఇష్టం వున్న, లేని మీడియా పెద్దలు కూడా ఆరోజు గురించి చెప్పక తప్పలేదు. ‘అమెరికన్‌ స్పెక్టేటర్‌ ‘ అనే ఒక పత్రికలో ‘ డియర్‌ కామ్రేడ్‌ ఏ ట్రంప్‌డ్‌ అప్‌ మే డే ‘ అనే శీర్షికతో ఒక వ్యాసాన్ని రాశారు. దీనిలో రెండు అర్ధాలున్నాయి. ప్రియమైన కామ్రేడ్‌ మేడే నగారా వూరించిన ‘ట్రంప్‌ ‘ అని ఒకటైతే ప్రియమైన కామ్రేడ్‌ మే డే నగరా అన్నది మరొకటి. ‘ విధిగా కూలదోయాల్సిన జారు చక్రవర్తి మాదిరి మన అధ్యక్షుడిని చూస్తున్నారు’ అంటూ వుక్రోషంతో తొలి వ్యాక్యంతో ఆ వ్యాసాన్ని ప్రారంభించారు. (అమెరికాలో సామాన్య జనం అధ్యక్ష ఎన్నిక సందర్భంగా నిజంగా అమెరికా అభినవ జారు చక్రవర్తిగా భావించే మెజారిటీ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అయితే అక్కడున్న అప్రజాస్వామిక ఎన్నికల విధానం వలన ప్రత్యక్ష ఓట్లకు బదులు ఎలక్టొరల్‌ కాలేజీలో ట్రంప్‌ను బలపరిచేవారు మెజారిటీ తెచ్చుకొని అతగాడిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.)https://spectator.org/a-trumped-up-may-day/ దీనిని జోష్‌ డెక్‌, పాల్‌ కెంగర్‌ అనే ఇద్దరు రాశారు. దీనిలో కమ్యూనిస్టు వ్యతిరేకతకు, వుక్రోషం, వ్యంగ్యానికి, ఆరోపణలకు కొదవ లేదు. డ్రడ్జ్‌ రిపోర్ట్‌ అనే బహుళాదరణ గల వెబ్‌ సైట్‌లో గతంలో తామెన్నడూ చూడని ఒక ప్రత్యేక అంశం అమెరికా కమ్యూనిస్టు పార్టీ వెబ్‌ పత్రిక పీపుల్స్‌ వరల్డ్‌లో ప్రచురితమైన ఒక వ్యాసపు లింక్‌ను చూశామని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదే మంటే అమెరికా కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ విభాగపు కార్యదర్శి ఎమిలీ షెపర్స్‌ క్యూబా కమ్యూనిస్టు పార్టీ పత్రిక గ్రాన్మాకు ఇచ్చిన ఇంటర్వ్యూ. దానిలో http://www.peoplesworld.org/article/communist-party-membership-numbers-climbing-in-the-trump-era/ అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికైన తరువాత కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం గురించి అభ్యర్ధనలు పెద్ద ఎత్తున పెరిగాయని, అయితే అమెరికా అంతటా ఇప్పటికీ మెకార్ధీ కాలం నాటి భూతం(కమ్యూనిస్టు వ్యతిరేక) ఇప్పటికీ కనిపిస్తున్నప్పటికీ కమ్యూనిస్టు భావజాల గురించి ఆసక్తి పెరుగుతోందని చెప్పటాన్ని వారు నొక్కి వక్కాణించారు. వారు కమ్యూనిస్టు పార్టీతో పాటు డిఎస్‌ఏ అనే ఒక వామపక్ష పార్టీ గురించి కూడా తమ వ్యాసంలో వ్యాఖ్యానించారు. వాటిని పునరావృతం చేయాల్సిన అవసరం లేదు. ఆసక్తి కలిగిన వారు పైన ఇచ్చిన లింక్‌ ద్వారా చదువు కోవచ్చు. అయితే వ్యాసాన్ని ముగిస్తూ వారు చెప్పిన మాటలను మననం చేసుకోవటం అవసరం.

Image result for anti communist

‘ అందరికీ కొంత ప్రత్యేకమైనది వుంది ప్రియమైన కామ్రేడ్‌, అది నిజమైన కమ్యూనిస్టు పూలు, పండ్లతో నిండి వున్న కల్పవృక్షం’. దేశ వ్యాపితంగా మేడేను నిర్వహించటం ద్వారా వలస వచ్చిన వారు, మహిళలు, కార్మికులు, నల్లజాతి జీవన్మరణ వుద్యమం, పర్యావరణవేత్తలు, మరియు ట్రంప్‌ ముప్పు ఎదుర్కొంటున్న అందరూ ఐక్యం కావటానికి మంచి అవకాశమని జాకోబిన్‌ పత్రిక రచయిత్రి కష్మా సావంత్‌ వివరించినట్లుగా పెద్ద బృందాలైన ప్లానెడ్‌ పేరెంట్‌ హుడ్‌ ( ఏంజెలా డేవిస్‌ సహ అధ్యక్షురాలితో పాటు మహిళా ప్రదర్శన నిర్వహించినవారు) వంటి పెద్ద బృందాల మద్దతు పొందటం ద్వారా మేడే ట్రంప్‌ వ్యతిరేక ప్రతిఘటనలో అది అంతర్బాగం అవుతుందనే ఆశాభావాన్ని సావంత్‌ వ్యక్తం చేశారు. విస్తృతమైన వామపక్షం -దీనిలో డెమోక్రటిక్‌ పార్టీ వుంటుందని చెప్పనవసరం లేదు- అణచివేత, దోపిడీ, వివక్ష రూపాలు, వ్యవస్ధల గురించి వాటికి గురైన శక్తులు తరచుగా పరస్పరం తమ అనుభవాలను కలబోసుకుంటూ వుమ్మడి సామాజిక అస్తిత్వాన్ని పంచుకొనే నూతన అవగాహనను(ఇంటర్‌ సెక్షనాలిటీ) అనుసరించటం ఇటీవల వామపక్ష శక్తుల మధ్య ప్రారంభమైంది. దీనిని ప్రముఖంగా ప్రస్తావించటం ద్వారా పలు బాధిత బృందాలను కలుపుకొంటూ వారి అణచివేతకు మూలం ట్రంప్‌ మరియు రిపబ్లికన్‌ పార్టీ అని స్పష్టం చేయటం ద్వారా కొత్త ప్రాంతాలకు విస్తరించటం , కొత్త వారిని ఆకర్షించటం సమరశీల వామపక్ష లక్ష్యంగా వుంది. ఈ 2017 మేడే ఒక పెద్ద ప్రచారం, ఐక్యతను పెంపొందించే అవకాశం.ఈ ఏడాది అంతర్జాతీయ మేడేను పాటించటానికి ఒక ప్రత్యేకత వుంది. ఇది రష్యన్‌ విప్లవ శతవార్షిక సందర్బం.’

ఇలా చెబుతూనే చివరికి తమ వుక్రోషాన్ని కూడా ఎలా వెలిబుచ్చారో చూడండి.’ బోల్షివిక్‌లు తమ చారిత్రాత్మక హింస, అణచివేత ప్రారంభించిన వంద సంవత్సరాల తరువాత కూడా నూతన అధ్యక్షుడికి వ్యతిరేకంగా ‘భిన్నత్వం, ఏకీకరణ,’ప్రతిఘటన పేరుతో పెద్ద సంఖ్యలో అమెరికన్‌ వామపక్ష వాదులు తమకు తెలియకుండానే లెనిన్‌ చెప్పినట్లు ప్రయోజనకరమైన బుద్ధి హీనుల( యూజ్‌ఫుల్‌ ఇడియట్స్‌) మాదిరి ఒక అణచివేత భావజాలానికి విశ్వాసపాత్రులుగా మారుతున్నారు.’ ముందే చెప్పినట్లు ‘పీపుల్స్‌ వరల్డ్‌ ‘లోని కమ్యూనిస్టు ఇంటర్వ్యూను గోకటం ద్వారా స్పెక్టేటర్‌ పత్రిక తన పాఠకులందరికీ దాని మీద ఆసక్తి రేకెత్తించింది. అంతకు ముందు వినని వారు తప్పకుండా ఏం చెప్పారో, లెనిన్‌ ఆ పదాన్ని ఏ సందర్భంగా వాడారో, దాని మీద ఈ వ్యాస రచయితలు ఎందుకు విరుచుకుపడుతున్నారో అనే వుత్సుకత కలుగుతుంది. వానపడుతున్నా కదలని…… మాదిరి ఏమీ పట్టని వారికి ఇది వర్తించదని మనవి.

అమెరికన్‌ మేథావులు తాజాగా మార్క్సిజం లెనినిజం పట్ల ఆకర్షితులు కావటంపై కొందరు వుక్రోషం వెలి బుచ్చటం అర్దం చేసుకోగలిగినదే. పెట్టుబడిదారీ విధానం ఎందుకు విఫలం అవుతున్నదో, ఆర్ధిక అసమానతలు ఎందుకు పెరుగుతున్నాయో ఆ విధాన సమర్ద పండితులు చెప్పలేకపోతున్నారు. సోషలిస్టు, కమ్యూనిస్టు సమాజాల విశ్లేషకులు వాటికి కారణాలు చెబుతున్నపుడు యువతరం, మేథావులు ఆకర్షించటం సహజం. లెనిన్‌ వుపయోగించిన పదాన్ని అసందర్బంగా వుపయోగించటం రెచ్చగొట్టటం తప్ప మరొకటి కాదు. అందువల పై వ్యాస కర్తలు పేర్కొన్న గ్రాన్మా పత్రికలో అమెరికా కమ్యూనిస్టు నేత ఏం చెప్పారో చూద్దాం. సెర్గియో అలెగ్జాండరో గోమెజ్‌ స్పానిష్‌ భాషలో వున్న ఇంటర్యూను ఆంగ్లంలో సంక్షిప్తీకరించారు. దానిని గ్రాన్మాతో పాటు పీపుల్స్‌ వరల్డ్‌ వెబ్‌సైట్‌లో కూడా ప్రచురించారు. ‘ అమెరికాలో అంతర్ధానం అయ్యేందుకు తిరస్కరిస్తున్న కమ్యూనిజం ‘ అనే శీర్షికతో గ్రాన్మా ప్రచురించింది. http://en.granma.cu/mundo/2017-04-17/communism-refuses-to-disappear-in-the-united-states

‘డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత గతంలో ఎన్నడూ లేని దాని కంటే అమెరికన్‌ కమ్యూనిస్టు పార్టీకి సభ్యత్వ అభ్యర్దనలు అందుతున్నాయి. 1919లో వారి పార్టీ ఏర్పడినప్పటికీ 1917లో అక్టోబర్‌ విప్లవం సంభవించినపుడు తొలిసారిగా మార్క్సిస్టు భావజాలంతో సంఘటితమైన వారిలో అమెరికన్‌ పౌరులు కూడా వున్నారు, త్వరలో శత వార్షికోత్సవం జరుపుకోనున్నారు. పార్టీ ఏర్పాటయిన నాటి నుంచి రెండు యుద్దాల మధ్యకాలం, ప్రచ్చన్న యుద్ద అణచివేతలో, దీనిలో వాస్తవంగా రహస్య సంస్దగా పని చేయాల్సి వచ్చింది. ముఫ్పై కోట్ల మంది జనం వున్న దేశంలో ప్రస్తుతం ఐదువేల మంది సభ్యులు వున్నారు. మెకార్ధీ కాలం నాటి భూతం అమెరికా అంతటా ఇప్పటికీ వున్నప్పటికీ కమ్యూనిస్టు భావజాలం పట్ల అమెరికాలో ఆసక్తి పెరుగుతోంది.

ఎమిలీ షెపర్స్‌ వృత్తి రీత్యా మానవశాస్త్రవేత్త, దక్షిణాఫ్రికాలో జన్మించారు. జాత్యహంకార వ్యవస్దను తప్పించుకొనేందుకు ఆయన తలిదండ్రులు అమెరికాకు వలస వచ్చారు. ఎమిలీ 1987లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యారు. అయితే మార్క్సిస్టు భావజాలం ఆయన చిన్నతనంలోనే మేరీ లాండ్‌, చికాగో సమీపంలోనిఒక పోర్టారికో నివాస ప్రాంతంలోనే అబ్బింది. ‘ కమ్యూనిస్టు పరిభాషలో చెప్పాలంటే అమెరికాలో ఏ రీత్యా చూసినా విప్లవానికి ముందుండే పరిస్ధితి లేనప్పటికీ ప్రపంచ వ్యాపితంగా పెట్టుబడిదారీ విధానం అంత్య దశలో వున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచ ద్రవ్య సంక్షోభం అనేక మందిని ప్రభావితం చేసింది. వామపక్షాలుగా చెప్పాలంటే తలిదండ్రుల కంటే వారి పిల్లలు అత్యంత హీన స్ధితిలో వున్నారు. దేశంలోని మెజారిటీ పౌరులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను ఇటీవలి డెమోక్రటిక్‌ లేదా రిపబ్లికన్‌ పార్టీల ప్రభుత్వాలు పరిష్కరించగలిగిన స్ధితిలో లేవు. జనంలో వున్న అసంతృప్తి అన్ని వేళలా సరైన పురోగమన బాట పట్టదు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికలలో సైద్ధాంతిక పరమైన తిమ్మినిబమ్మిని కారణంగా ఒక మితవాద వైఖరికి దారితీసింది. మా స్వంత రాష్ట్రమైన వర్జీనియా కేవలం ధనవంతమైనదే కాదు, ఎందరో తెల్లవారైన పేదలు కూడా వున్నారు. వారంతా ట్రంప్‌కు ఓటు వేసేందుకు ముందుకు వచ్చారు. బొగ్గు తవ్వకం ఆప్రాంతంలో ప్రధాన వుపాధి వనరు. ఇటీవలి సంవత్సరాలలో వేలాది మంది కార్మికులను పనుల నుంచి తొలగించారు. రిపబ్లికన్లు దీనంతటికీ బరాక్‌ ఒబామా పర్యావరణ విధానాలు కారణమని ప్రచారం చేశారు.

డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి ఎన్నిక ప్రచారం సందర్బంగా మిలియన్ల మంది యువత బెర్నిశాండర్స్‌ పురోగామి భావజాలం వైపు సమీకృతమయ్యారు.శాండర్స్‌ కనుక ట్రంప్‌ ప్రత్యర్ధి అయి వుంటే ఆయన గెలిచి వుండేవారు.ఈ నేపధ్యంలోనే షెపర్స్‌ ప్రస్తావించిన ‘కుహనా వర్గ చైతన్యం ‘ మరియు తిమ్మిని బమ్మిని చేయటాన్ని వ్యతిరేకించటానికి వామపక్షం ఇవ్వాల్సిన ప్రాధాన్యతను అమెరికా కమ్యూనిస్టు పార్టీ ఎత్తి చూపింది.’ మీడియాను కార్పొరేషన్లు అదుపు చేసిన స్ధితిలో స్ధానిక న్యూస్‌ ఛానల్స్‌లో ప్రసార బోధకులు ప్రపంచం అంతం కావటం గురించి చెబుతున్నపుడు ఇది చాలా కష్టం ‘అని షెపర్స్‌ చెప్పారు. అందుకే అన్ని రకాల పద్దతులలో సాధ్యమైనంత మేరకు తన భావజాలాన్ని జనంతో పంచుకోవటానికి, వారిని చైతన్యవంతులను చేయటాన్ని కమ్యూనిస్టు పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది అన్నారు. ఆ రీత్యానే కమ్యూనిస్టు పార్టీ వెబ్‌సైట్‌లో కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమం, పార్టీలో ఎలా చేరాలనే సమాచారాన్ని పొందుపరిచారు. అయినప్పటికీ కార్మికుల హక్కులను రక్షించుకుంటూ వారి అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా కార్మికులు, కార్మిక సంఘాలను సంఘటితపరచటం ఒక పెద్ద సవాలే అన్నారు.

అమెరికా కమ్యూనిస్టు పార్టీ పాలస్తీనాను సమర్ధిస్తుంది మరియు అమెరికా మిలిటిరిజాన్ని వ్యతిరేకిస్తుంది. అనేక సంవత్సరాలుగా క్యూబా విప్లవాన్ని మరియు ఇటీవల బొలివేరియన్‌ రిపబ్లిక్‌ వెనెజులాను సమర్ధిస్తున్నది. క్యూబాతో సాధారణ సంబంధాలను పునరుద్దరించుకోవాలని అమెరికా ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం చేసిన ప్రకటనను కమ్యూనిస్టు స్వాగతించింది.’2014 డిసెంబరు 17వ తేదీ మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది,అయితే అది మంచి వార్త. కొన్ని విషయాలలో ముందుకు పోయినప్పటికీ ఒబామా తాను చేయగలిగినదంతా చేయలేదు’ అని షెపర్స్‌ చెప్పారు. అయినప్పటికీ క్యూబాపై దిగ్బంధనాన్ని ఎత్తివేయాలనేందుకు పార్లమెంట్‌లోని డెమోక్రటిక్‌ మరియు రిపబ్లికన్‌ పార్టీలు రెండింటిలోనూ పెరుగుతోంది.’దీనికి మానవతాపూర్వకమైన మనోభావాలతో కొందరు ఇతరులు ఆర్ధిక ప్రయోజనాలకోసం ఇద్దరూ దిగ్బంధం విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. దిగ్బంధనాన్ని కొనసాగించాలని కోరుతున్న ఏకైక తరగతులెవరంటే ప్రత్యేకించి ఫ్లోరిడాలోని క్యూబన్‌-అమెరికన్లు మాత్రమే ‘ అన్నారు. రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొల్పుకోవాలని తాజా సర్వేలో మెజారిటీ అమెరికన్‌ పౌరులు వెల్లడించారు. ట్రంప్‌ ఏం చేస్తాడో మాకు తెలియదు, జనం మాట వింటారా సిద్ధాంతవేత్తల మాట వింటారో తెలియదు. అయితే మొత్తంగా చెప్పాలంటే అమెరికన్‌ కమ్యూనిస్టులు ఆశాభావంతో వున్నారు ‘ అని చెప్పారు.

Image result for pope francis communist

మే డే రోజునే ‘పోప్‌ ఫ్రాన్సిస్‌ కమ్యూనిస్టు గురువు’ అనే శీర్షికతో స్పెక్టేకర్‌ పత్రికే మరో వ్యాసాన్ని కూడా ప్రచురించింది. ‘ రాజకీయ పోప్‌ ‘ అనే పేరుతో జార్జి న్యూమర్‌ రాసిన పుస్తకంలోని కొన్ని భాగాలను దానిలో వుటంకించారు.https://spectator.org/pope-franciss-communist-mentor/ ‘ పోప్‌ నోటి నుంచి వెలువడిన స్వచ్చమైన మార్క్సిజం ఇది ‘ అని రేడియో వ్యాఖ్యాత రష్‌ లింబా, ‘ లెనిన్‌ గారి పోప్‌ ‘ అని మరో వ్యాఖ్యాత మైఖేల్‌ శావేజ్‌ నోరు పారవేసుకున్నారు. వాటి గురించి ఇటాలియన్‌ మీడియాతో మాట్లాడిన సందర్భంగా పోప్‌ తోసి పుచ్చారు.’ నా జీవితంలో నేను ఎందరో మంచి వారైన మార్క్సిస్టులను కలుసుకున్నాను. అందువలన అలాంటి మాటలకు నేను బాధపడటం లేదు’ అన్నారు. మొదటి-రెండవ ప్రపంచ యుద్ధ మధ్యకాలం 1922-39 మధ్య పని చేసిన పోప్‌ పదకొండవ పయస్‌ కమ్యూనిస్టు వ్యతిక ప్రకటన చేశారు.’ ఒకే సారి మంచి కాథలిక్‌గానూ నిజమైన సోషలిస్టుగానూ ఎవరూ వుండలేరు’ అని పయస్‌ ప్రకటిస్తే దానికి విరుద్దంగా ఈ రోజు పోప్‌ ఫ్రాన్సిస్‌ చెబుతున్నది వింటే ‘ ఒక మంచి కాథలిక్‌ సోషలిజం వ్యతిరేకిగా వుండజాలరు అని ఎవరైనా అర్ధం చేసుకుంటారు అని సదరు రచయిత వ్యాఖ్యానించారు.

‘పోప్‌ రెండవ జాన్‌ పాల్‌ మరియు పోప్‌ 16వ బెండిక్ట్‌ శిలువతో అసహజంగా ప్రవర్తించారా వారు దానిని తమ మోకాళ్ల ముందు వుంచుకొని వుండవచ్చు, పోప్‌ ఫ్రాన్సిస్‌ అలా కాదు. సుత్తీ కొడవలి చిహ్నంగా వున్న శిలువను ఎంతో సాదరంగా స్వీకరించారు. విమానంలో రోమ్‌కు తిరిగి వస్తూ విలేకర్లతో మాట్లాడుతూ ‘ఈ పనిని నేను అర్ధం చేసుకోగలను, నా వరకు ఇదేమీ ఒక అపరాధం కాదు’ అన్నారు. పోప్‌ పర్యటన తరువాత నాకు ఒక పోప్‌ వున్నారనే భావన నాకు ఇప్పుడు కలిగింది. ఇంతకు ముందు నాకు ఆభావన కలగలేదు ‘ అని బొలీవియా అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ అన్నారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.ఈ రెండు వ్యాసాలలోని అంశాలను చూసినపుడు సోషలిజం, కమ్యూనిజంపై అటు రాజకీయంగానూ ఇటు మతపరంగానూ దాడి ఎలా జరుగుతోందో, పేదలకు మంచి జరగాలి, దోపిడీ వుండకూడదని చెప్పిన జీసస్‌ తొలి కమ్యూనిస్టు అని చెప్పిన పోప్‌ ఫ్రాన్సిస్‌ వంటి వారి మీద ఎలా వ్యతిరేకత రెచ్చగొడుతున్నారో చూడవచ్చు. పాడిందే పాడరా పాచి పళ్ల పాటగాడా అన్నట్లుగా కమ్యూనిస్టు మానిఫెస్టోను రాయక ముందే ప్రారంభమైన కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం కమ్యూనిస్టు భావజాల ప్రచారం, ప్రభావం, విస్తరణను అడ్డుకోలేకపోయింది. ఇంకా ఆ తుప్పు పట్టిన ఆయుధంతోనే ఈ ఇంటర్నెట్‌ యుగంలో కూడా ప్రయత్నిస్తున్నారు.

నాజీజం మాదిరి ఎందుకు కమ్యూనిజాన్ని ద్వేషించటం లేదు అనే శీర్షికతో ఒక వ్యాఖ్యాత మరో పత్రికలో రాశాడు. http://www.theblaze.com/news/2017/05/01/watch-why-isnt-communism-as-hated-as-nazism/ . దానిలో ఏం చెప్పినప్పటికీ నాజీజం అన్నది లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్నదని, అంతర్జాతీయ న్యాయస్ధానంలో అందుకు బాధ్యులైన వారిని విచారించిన విషయం దాస్తే దాగేది కాదు. కమ్యూనిజం గురించి జరిపిన వ్యతిరేక ప్రచారం అక్కడ అంత మందిని చంపారు ఇక్కడ ఇంత మందిని చంపారు అంటూ తప్పుడు లెక్కలు, కట్టుకధలు ప్రచారం చేయటం తప్ప రుజువులను జనం ముందుంచలేకపోయారు. సిద్ధాంత పరంగా కమ్యూనిజాన్ని వ్యతిరేకించే వారందరూ కమ్యూనిస్టులు హంతకులు అనే కట్టుకధలను నమ్మరు. తెలంగాణా సాయుధ పోరాటంలో ప్రాణత్యాగాలు చేసింది కమ్యూనిస్టులు అనేది కళ్ల ముందున్న వాస్తవం. ఆ సందర్భంగా కమ్యూనిస్టు గెరిల్లాల చేతిలో హతమైన వారందరూ దోపిడీదారులు, వారికి ఏజంట్లుగా, గూండాలుగా, జనంపై దాడులు చేసిన పోలీసులు, రజాకార్లు తప్ప సామాన్యులను కమ్యూనిస్టులు చంపలేదనే విషయం జనానికి తెలుసు. అందుకే కమ్యూనిస్టులపై నాటి నిజాం, కాంగ్రెస్‌, నెహ్రూ ప్రభుత్వం, మీడియా చేసిన ప్రచారాన్ని తోసిరాజని తొలి ఎన్నికలలో వుద్యమం జరిగిన, దాని ప్రభావం వున్న ప్రాంతాలన్నింటా కమ్యూనిస్టులనే జనం గెలిపించారు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలలో కమ్యూనిస్టుల గురించి చేసిన తప్పుడు ప్రచారం ఎల్లకాలం జనాన్ని మోసం చేయలేదు. చైనాలో నానాటికీ దారిద్య్రం తగ్గుతోందని ప్రపంచబ్యాంకే చెబుతోంది, అదే సమయంలో అమెరికాలో దారిద్య్రంలోకి చేరే వారి సంఖ్య పెరుగుతోంది. సోషలిస్టు దేశమైన చైనా ఎన్నో విజయాలు సాధిస్తున్నపుడు అదే మాదిరి మన దేశంలో కూడా సోషలిస్టు వ్యవస్ధను నెలకొల్పుకుంటే నిరుద్యోగం, దారిద్య్రాల నుంచి బయటపడవచ్చు కదా అన్న ఆలోచన రాకుండా అమెరికా, ఇతర పశ్చిమ దేశాల యువత మెదళ్లను ఎవరైనా ఎలా కట్టడి చేయగలరు?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాడు బెర్లిన్‌ గోడ బద్దలు-నేడు మెక్సికో గోడ నిర్మాణం !

30 Monday Jan 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Anti Muslim, ban on refugees, Berlin wall, Donald trump, Mexico wall, Muslim, Trump’s visa ban

Image result for Then who supported the dismantle of the Berlin wall now constructing Mexico wall

ఎం కోటేశ్వరరావు

    అధికారంలో వున్న వారి మాటలకు అర్ధాలే వేరు ! పెద్ద పెద్ద జలాశయాలకు పడే గండ్లు తొలుత చిన్నవిగానే వుంటాయి, తరువాత పూడ్చలేని విధంగా తయారవుతాయి. అమెరికా అధ్య్ష పీఠంపై కూర్చున్న డోనాల్డ్‌ ట్రంప్‌ ఏ రోజు ఏం మాట్లాడతారో, ఏ పిచ్చి పనులు చేస్తారో తెలియని స్ధితి. ఆతగాడి చర్యలు ఎటు దారితీస్తాయో వెంటనే వూహించటం కష్టం. పాలకవర్గాలు తాము ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని జనం మీదో, మరొక దేశం మీదో నెట్టాలని నిర్ణయించుకుంటే రెచ్చగొట్టుడు, పిచ్చిపనులు చేయటం గత చరిత్ర అనుభవం. ప్రస్తుతానికి రెండు దృశ్యాలను వూహించ వచ్చు. ఒకటి, ఎన్నికలలో అనేక వాగ్దానాలు చేసిన ట్రంప్‌ తనకు ఓటు వేసిన జనాన్ని సంతృప్తి పరచాలంటే ఏదో ఒకటి చేస్తున్నట్లు నటించటం అవసరం కనుక ఆ స్క్రిప్టులో భాగంగా ఇలా చేస్తుండి వుండాలి. రెండవది, ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ తీవ్ర వడిదుడుకులను ఎదుర్కొంటోంది, దానికి పెద్ద దిక్కుగా వున్న అమెరికా తన స్ధాయికి తగిన రీతిలో సమస్యలను ఎదుర్కొంటోంది. అందువలన తన బలాన్ని వుపయోగించి ప్రపంచాన్ని తన చెప్పుచేతల్లో, తన పెరటి దొడ్డిగా మార్చుకొనేందుకు పూనుకొని వుండి వుంటే ట్రంప్‌ను ఒక పావుగా వుపయోగించి తన జూదాన్ని అయినా ప్రారంభించి వుండాలి. ఏది అనేది కొద్ది వ్యవధిలోనే తేలిపోతుంది. ఏడు ముస్లిం దేశాల నుంచి వచ్చే వారిపై ప్రయాణ నిషేధం విధిస్తూ ట్రంప్‌ శుక్రవారం నాడు ఒక వుత్తరువును జారీ చేశాడు. శనివారం నాడు ఆ దేశాల నుంచి వచ్చిన వారు అమెరికా గడ్డపై అడుగుపెట్టకుండా అధికారులు అడ్డగించటంతో వచ్చిన వారు పలు విమానాశ్రయాల్లో నిరసనలకు దిగారు. వారం రోజుల పాటు ఆ వుత్తరువులను నిలిపివేయాలని శనివారం నాడు (జనవరి 28న) న్యూయార్క్‌ కోర్టు ఆ నిషేధాన్ని ఆదేశాలు జారీ చేసింది. మరికొన్ని రాష్ట్రాల కోర్టులు కూడా ఇదే మాదిరి ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. అమెరికా పౌర హక్కుల యూనియన్‌ (ఎసిఎల్‌యు) న్యూయార్క్‌లోని కెనడీ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు ఇరాకీ ప్రయాణీకుల తరఫున కోర్టుకు వెళ్లినప్పటికీ తాను జారీ చేసిన వుత్తరువు అమెరికా అంతటికీ వర్తిస్తుందని పేర్కొన్నది. కొంత మంది ట్రంప్‌కు ఇది తొలి ఎదురు దెబ్బ అని వ్యాఖ్యానించారు. ట్రంప్‌ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ‘మన దేశానికి బలమైన సరిహద్దులు మరియు తీవ్రమైన నిఘా వుండాలి. ఇప్పుడు ఐరోపా, ప్రపంచమంతటా వాస్తవంగా ఏం జరుగుతోందో చూడండి-భయం కరమైన గందర గోళం ‘ అంటూ ఆదివారం వుదయం ట్వీట్‌ ద్వారా వ్యాఖ్యానించాడు. అంతకు ముందు ఏడు దేశాల ప్రయాణీకులపై ఆంక్షలు విధించాను తప్ప ముస్లింల మీద విధించిన నిషేధం కాదంటూ ఎప్పటి నుంచో మన దేశం గట్టి నిఘా వేసి వుండాల్సింది, రాబోయే రోజులలో ఆ పని చేయబోతున్నాం అంటూ ఐఎస్‌ను ఓడించేందుకు 30రోజుల్లోగా ఒక పక్కా ప్రణాళికను తయారు చేయాలని ట్రంప్‌ ఆదేశించాడు.

Image result for mexico wall

     అమెరికా అధ్యక్ష పీఠంపై ఎవరు కూర్చున్నా నడిపేది అక్కడి బడా కార్పొరేట్లు తప్ప మరొకరు కాదు. నూతన అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహారం చూస్తుంటే తలతిక్క రాజు పనుల మాదిరి కనిపిస్తున్నాయి. ఎన్నికల సందర్బంగా ఏమి చెప్పినా కార్పొరేట్లకు ఇబ్బంది లేదు, ఓట్ల కోసం పడే పాట్లుగా వినోదం చూస్తారు. అధికారానికి వచ్చిన తరువాత ఎలా వ్యవహరిస్తారనేదే వారికి ముఖ్యం. ఆ రీత్యా చూసినపుడు ట్రంప్‌ పిచ్చి ప్రకటనలు ఎత్తుగడగా కేవలం జనాన్ని మభ్యపెట్టటానికేనా అని కూడా అనుమానించాల్సి వుంటుంది. తమ వస్తువులు, పెట్టుబడులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎక్కడ బడితే అక్కడ ప్రవేశించటానికి ఎక్కడ ఎలా తిరిగినా మా దొడ్లో ఈనితే చాలు అన్నట్లుగా ఏ దేశంలో తిరిగినా చివరకు తమ దొడ్లలో లాభాలను పదిల పరుచుకోవటానికే కార్పొరేట్లు సరిహద్దులు, ఆటంకాలు లేని ప్రపంచీకరణ భావనను ముందుకు తెచ్చారు. ఐరోపా యూనియన్‌ పేరుతో ఇప్పటికే ఐరోపా ధనిక దేశాలు అనేక చర్యలు తీసుకున్నాయి. ఇంకా ముందుకు పోవటం ఎలా అన్నది దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ స్ధితిలో అసలు సరిహద్దులు లేని దేశం ఒక దేశమా అంటూ ట్రంప్‌ ఐరోపా యూనియన్‌, ప్రపంచం ముందు ఒక కొత్త సవాలును విసిరారు.

    తెనాలి రామకృష్ణ సినిమాలో తాను నియోగినని, ఎలా కావాలంటే అలా వినియోగించుకోవచ్చని రామకృష్ణ పాత్రధారి చేత చెప్పించారు. ( ప్రాసకోసం వుపయోగించారు తప్ప నియోగులు అలాంటి వారని నేను అనుకోవటం లేదు ) పెట్టుబడిదారులు మాత్రం అలాంటి వారే. తమకు అవసరాలకు అనుగుణ్యంగా మాట్లాడటం వారికి వెన్నతో పెట్టిన విద్య. వారు తమకు అవసరం అనుకుంటే వున్న చోట గోడలు పడగొడతారు, లేని చోట కొత్త గోడలు కడతారు. పాతిక సంవత్సరాల క్రితం కమ్యూనిజాన్ని కూల్చివేశామని ప్రకటించిన అమెరికా పాలకులు దానికి చిహ్నంగా బద్దలు కొట్టించిన బెర్లిన్‌ గోడను చూపారు. దాని శిధిలాల ముక్కలను ఇండ్లకు తీసుకుపోయి విజయ చిహ్నాలుగా అలంకరించుకున్నారు. గత 70 సంవత్సరాలుగా పాలస్తీనా రాజ్యం ఏర్పడకుండా అడ్డుకోవటమే గాక, దాని భూభాగాలను క్రమంగా ఆక్రమిస్తూ, జనం రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ ఇజ్రాయెల్‌ నిర్మిస్తున్న గోడలను అమెరికా సమర్ధిస్తోంది. అల్లుడికి బుద్ది చెప్పి మామ అదే తప్పుడు పని చేసినట్లు ఇప్పుడు అదే అమెరికన్లు స్వయంగా మిగతా వారి కంటే పెద్ద గోడను నిర్మించేందుకు పూనుకున్నారు. నాడు తూర్పు జర్మనీని బలవంతంగా పశ్చిమ జర్మనీలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా ఆ పని చేస్తే ఇప్పుడు తమ సమాజంలో తలెత్తిన అసంతృప్తిని పక్కదారి పట్టించేందుకు మెక్సికో సరిహద్దులలో గోడ నిర్మాణానికి పూనుకున్నారు. నిజంగా ఆ పనిచేస్తారో లేదో తెలియదుగానీ గోడ నిర్మాణానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వుత్తరువులపై సంతకాలు చేశారు. అందుకు అవసరమయ్యే నిధులను పార్లమెంట్‌ మంజూరు చేసి, చట్టపరంగా ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకపోతే గోడ నిర్మాణం ఏప్రిల్‌ తరువాత ప్రారంభమౌతుంది.

Image result for mexico wall cartoon

    మెక్సికో గోడ నిర్మిస్తే ఎవరికి లాభం-ఎవరికి నష్టం అన్న చర్చ గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతోంది.ఇప్పుడు ఇంకా పెరిగింది. నిజానికి ఇది కేవలం ఒక గోడ నిర్మాణానికే పరిమితం కాదు.దానితో అమెరికా సమస్యలు పరిష్కారం కావు. ప్రపంచ మంతా ఎల్లలు లేని ఒక కుగ్రామం అని అందరూ ఒకవైపు చెబుతూనే ఏదో ఒక కారణం చూపి గోడలు లేదా కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. అలాంటివి వివిధ దేశాల మధ్య 45 గోడలు, కంచెలు వున్నాయి. వాటికి కారణాలుగా చెప్పిన సమస్యలు ఎక్కడా పరిష్కారం కాలేదు. ట్రంప్‌ చెబుతున్నదాని ప్రకారం అమెరికన్లకు ప్రధమ ప్రాధాన్యత ఇచ్చి వుద్యోగాలు కల్పించాలంటే విదేశాల నుంచి ముఖ్యంగా చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాల నుంచి వస్తున్న దిగుమతులపై పన్ను విధించి తద్వారా స్ధానికంగా వుత్పత్తిని ప్రోత్సహించి నిరుద్యోగ, ఆర్ధిక సంక్షోభ సమస్యను పరిష్కరించాలనే దగ్గర దారి ప్రయత్నమిది. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో-మా ఇంటికి మీ ఇల్లూ అంతే దూరం అన్నట్లుగా మిగిలిన దేశాలు అమెరికా పెద్దన్న పెత్తనానికి తలవంచుతాయంటే అంతకంటే పిచ్చి వూహ మరొకటి వుండదు.

     అమెరికా-మెక్సికో సంబంధాలలో రెండు అంశాలున్నాయి. ఒకటి అమెరికా చెబుతున్నట్లు మెక్సికో నుంచి బతకటానికి వచ్చే వారు అడ్డదారుల నుంచి అమెరికాలో ప్రవేశించటం. 1994లో అమెరికా-మెక్సికో-కెనడాలు వుత్తర అమెరికా స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(నాఫ్టా) కుదుర్చుకున్నాయి. ఆ సమయంలో అమెరికా నుంచి మెక్సికో దిగుమతులు ఎక్కువగా వున్నాయి. వాటిని మరింతగా పెంచేందుకు ఆ ఒప్పందం వుపయోగపడుతుందని అమెరికా కార్పొరేట్‌ శక్తులు ముందుగా అంచనా వేశాయి. అయితే ఆ తరువాత అందుకు విరుద్దంగా జరిగింది. 1995-2016 మధ్య మెక్సికో నుంచి అమెరికా దిగుమతులు 65 నుంచి 295 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ఇదే సమయంలో అమెరికా నుంచి మెక్సికోకు ఎగుమతులు 68 నుంచి 235 బిలియన్‌ డాలర్లుగా వున్నాయి. అంటే నాఫ్టా ఒప్పందం వలన మెక్సికో లాభపడింది. ఈ అంకెలను చూపి నాఫ్టా ఒప్పందం ఏకపక్షంగా జరిగిందంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌ మా ఇంటికొస్తూ మాకేం తెస్తావ్‌ అన్నట్లు వ్యవహరించే పెద్దన్న అమాయకంగా ఒప్పందంపై సంతకం చేశారంటే ఎవరైనా నమ్ముతారా ?

   కార్పొరేట్‌ శక్తులకు కావాల్సింది లాభం. అది స్వంత దేశంలోని కార్మికులకు పని కల్పించి సంపాదించిందా, పొరుగుదేశంలోని కార్మికుల నుంచి పిండుకున్నదా అన్నది వారికనవసరం.ఆ క్రమంలో మెక్సికో నుంచి దిగుమతులు చేసుకోవటమే వారికి లాభసాటిగా మారిందన్నది అసలు విషయం. అదే చైనా, మెక్సికో, మిగతా పేద, వర్ధమాన దేశాల అనుభవం. అత్యంత పేద దేశాలలో ఒకటైన బంగ్లాదేశ్‌లో ప్రపంచంలోని ధనిక దేశాల వాణిజ్య, పారిశ్రామిక సంస్ధలన్నీ తమ దుస్తుల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. నిజానికి బంగ్లాదేశ్‌ వినియోగం కోసమైతే అన్ని అవసరం లేదు. అక్కడ తయారయ్యేవన్నీ ఎగుమతుల కోసమే. మెక్సికో సుంచి వలసల వలన అక్కడ సమస్య తలెత్తిందనుకుందాం, మరి ఐరోపా ధనిక దేశాల సంక్షోభ సమస్య మాటేమిటి ? అమెరికాలో ఆర్ధిక సమస్యలు తలెత్తి జనానికి అవసరమైన వుద్యోగాలు దొరకక పోవటానికి విదేశాల నుంచి అక్రమంగా వలస వస్తున్నవారే కారణమని అక్కడ వున్న రెండు పార్టీల వారూ చాలా కాలంగా ప్రచారం చేస్తున్నారు. అదొక ఎన్నికల సమస్యగా మారింది. ఎవరు ఆ సమస్య గురించి తక్కువ మాట్లాడితే వారు జనంలో పలుచనయ్యే స్థితి. అందువలననే ఎన్నికలకు ముందు, తరువాత హడావుడి చేయటం తరువాత ఏదో చేశామనిపించి జనాన్ని జోకొడుతున్నారు. ధనిక దేశాలలో 2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభ పర్యవసానాలు ఆ సమస్యను తాజా ఎన్నికలలో మరింత ఎక్కువగా ముందుకు తెచ్చాయి. ప్రతిపక్షంలో వున్న రిపబ్లికన్‌ పార్టీ తాము అధికారానికి వస్తే తెల్లవారే సరికి అల్లావుద్దీన్‌ అద్బుతదీపం మాదిరి పరిష్కరిస్తామని ప్రచారం చేసింది.

     నిఘా వేయటంలో ఎంతో ఆధునిక పరిజ్ఞానం వున్న అమెరికాకు అక్రమ వలసలను అరికట్టటం ఒక సమస్య కానే కాదు. మెక్సికో ద్వారా వివిధ లాటిన్‌ అమెరికా దేశాల నుంచి అమెరికాలో ప్రవేశించి అధికారికంగా నమోదు కాని కార్మికులుగా పని చేయటం ఎప్పటి నుంచో జరుగుతోంది. ప్రభుత్వాలు కూడా చూసీచూడనట్లు వదలి వేస్తున్నాయి. ఎందుకంటే చట్టబద్దమైన కార్మికులతో పాటు వీరు కూడా పన్నులు చెల్లిస్తారు. సామాజిక భద్రతా పధకాలు, పెన్షన్‌ వంటి వాటిని వారికి చెల్లించనవసరం లేదు. వలస వచ్చిన వారు తక్కువ వేతనానికి పని చేస్తారు. యజమానులకు అది అదనపు లాభం. స్ధానికులతో పని చేయించుకొనే యజమానులు ఎక్కువ వేతనాలను చెల్లించటంతో పాటు వారి సామాజిక భద్రతా పధకాలకు తమ వాటా చెల్లించాల్సి వుంటుంది. ఇది వారి లాభాలను, పోటీ శక్తిని తగ్గిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పని చేసేందుకు ఎక్కువగా వీరిని వినియోగిస్తున్నారు. ఇప్పుడు ట్రంప్‌ చెబుతున్నట్లు వారి రాకను నిరోధించేందుకు నిఘా పెంచినా, అడ్డుకునేందుకు పెద్ద గోడను నిర్మిస్తే ఏం జరుగుతుంది?

   వలసలు ఆగిపోయి కొంతమేరకు స్ధానికులకు వుద్యోగ అవకాశాలు మెరుగుపడవచ్చు. ఇదే సమయంలో లాభాలకంటే నష్టాలే ఎక్కువ అన్నది ఎక్కువగా వినిపిస్తోంది.ప్రపంచ మార్కెట్‌లో ఎదురవుతున్న పోటీని తట్టుకోవాలంటే ఇప్పటికే అమెరికాలో వుత్పాదక ఖర్చులు ఎక్కువగా వున్నాయనే కారణంతో అమెరికా పెట్టుబడిదారులు కొత్తగా పెట్టే వాటితో పాటు పాత పరిశ్రమలను కూడా వేతన రేట్లు తక్కువగా వుండే దేశాలకు తరలించారు. ఆధునిక పరిజ్ఞానం ఇమిడి వుండే కొన్ని వస్తువులకు సంబంధించిన భాగాలు అమెరికాలో తయారు చేసి వాటిని ఇతర దేశాలకు తరలించి అక్కడ తయారైన వస్తువులను తిరిగి అమెరికాకు దిగుమతి చేసుకుంటున్నారు. ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. వుదాహరణకు జపాన్‌కు చెందిన మన దేశంలోని మారుతీ సుజుకీ ఇండియా కంపెనీలో తయారయ్యే కార్లను జపాన్‌తో సహా మరో వంద దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గతేడాడి సెప్టెంబరు నాటికి పదిహేను లక్షల కార్లను ఎగుమతి చేశారు. అలాగే మెక్సికో నుంచి జరుగుతున్నాయి.

   ట్రంప్‌ చెబుతున్నట్లు గోడ నిర్మాణానికి లేదా దిగుమతుల నిరోధానికి 20శాతమో అంతకంటే ఎక్కువో దిగుమతి పన్ను విధిస్తే అది ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలకు విరుద్దమే గాక అమెరికాకే నష్టం. మెక్సికో నుంచి ఏటా 300 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులను అమెరికా దిగుమతి చేసుకొంటోంది. వీటిలో 40శాతం వరకు అమెరికా నుంచి విడి భాగాలను మెక్సికో పంపి అక్కడి నుంచి పూర్తిగా తయారైన వస్తువులు తిరిగి అమెరికాకు వచ్చేవి వున్నాయి. వాటి మీద, అలాగే పూర్తిగా మెక్సికో నుంచి వచ్చే వాటిమీద ఎంత పన్ను విధిస్తే, అవి దిగుమతి చేసుకోవటం అనివార్యం అయితే ఆ మేరకు భారం అమెరికా వినియోగదారులపైనే పడుతుంది. ఇది చైనా, కెనడా, ఇతర దేశాలకు కూడా వర్తిస్తుంది. దీని వలన తలెత్తే సమస్యలను అధిగ మించాలంటే మెక్సికో, ఇతర దేశాలు కూడా అమెరికా వస్తువులపై దిగుమతి పన్ను విధించటం వంటి చర్యలకు పాల్పడతాయి.అంటే అది వాణిజ్య యుద్ధంగా మారుతుంది. మెక్సికోతో వాణిజ్యంపై ఆధారపడి అమెరికాలో 60లక్షల మంది వుపాధి పొందుతున్నారు. ఒక వేళ మెక్సికోలో వాటి తయారీని నిలిపివేస్తే అమెరికాలోనే వాటిని తయారు చేస్తే కొంత మంది వుపాధి పోవటం, వినియోగదారులపై అదనపు భారం పడటం అనివార్యం. ఇలాంటి ఎన్నో సమస్యలున్న కారణంగానే అలాంటి పిచ్చిపనులు చేస్తే విజేతలంటూ వుండరు, అటూ ఇటూ నష్టపోతారని చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌ దవోస్‌ సమావేశంలో హెచ్చరించారు. అమెరికా కార్పొరేట్లు ట్రంప్‌ ప్రకటనల లాభ నష్టాలను బేరీజు వేసుకొని తమకు లాభం వచ్చే మార్గాన్నే ఎంచుకుంటారు. అందుకు ఏం చేస్తారో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అసాధారణ ప్రపంచ వ్యాపిత నిరసనల మధ్య అందలమెక్కిన డోనాల్డ్‌ ట్రంప్‌

23 Monday Jan 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Donald trump, protest, WomensMarch against Donald Trump

ఎం కోటేశ్వరరావు

    1860లో అమెరికా రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఎన్నికైన తొలి అధ్యక్షుడిగా అబ్రహాం లింకన్‌ చరిత్ర సృష్టించాడు. ఆయన బానిసత్వాన్ని వ్యతిరేకించాడు. వైట్‌ హౌస్‌లో ఆయన ఆశీనుడు కావటాన్ని సహించలేని దక్షిణాది రాష్ట్రాలలోని బానిసల యజమానులు ప్రత్యేక దేశ ఏర్పాటును ప్రకటించి అంతర్యుద్ధానికి కారకులయ్యారు. రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత తిరుగుబాటుదార్లు లొంగిపోయి అంతర్యుద్ధం ముగిసింది అనుకుంటున్న తరుణంలో బానిసత్వాన్ని సమర్ధించే ఒక వ్యక్తి చేతిలో హత్యకు గురయ్యాడు. ఆదే రిపబ్లికన్‌ పార్టీ తరఫున తాజాగా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డోనాల్డ్‌ ట్రంప్‌ పదవీస్వీకారం చేస్తున్న సమయంలో అమెరికాతో సహా అన్ని ఖండాలలో నిరసన ఎదుర్కొన్న వ్యక్తిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. వదరుబోతులకు అమెరికా సమాజం పెట్టింది పేరు. ఇంతవరకు అలాంటి వారెవరూ అధ్యక్ష స్ధానంలో కూర్చోలేదు. డోనాల్ట్‌ ట్రంప్‌తో అది కూడా జరిగిపోయింది. మహిళలు, కార్మికులకు, సామాన్య జనానికి, ముస్లింలకు వ్యతిరేక వ్యాఖ్యలు చేసి ఒక ఫాసిస్టుగా ముద్రపడి ప్రపంచ వ్యాపితంగా నిరసనలకు కారకుడయ్యాడు. అమెరికా వంటి దేశాలలో సాధారణ నిరసన ప్రదర్శనలంటే బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకొని కొన్ని వందల మంది వీధులలోకి రావటం తప్ప సంఖ్య ఎక్కువగా వుండదు. యుద్ధవ్యతిరేక వుద్యమం వంటి సందర్భాలలోనే లక్షల సంఖ్యలో హాజరైన వుదంతాలు వున్నాయి. అలాంటిది ఇప్పుడు ఆ స్ధాయిలో ముఖ్యంగా మహిళలు లక్షల మంది వీధులలోకి వచ్చి అనేక నగరాలలో ప్రదర్శనలు జరిపారు. ఒక వ్యక్తి ఎన్నికలలో అక్రమాలకు పాల్పడి దేశాధినేత ఎన్నికైనట్లు ప్రకటించగానే అనేక దేశాలలో నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తటం తెలిసిందే. డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా అక్రమాలకు పాల్పడినట్లు విమర్శలు వున్నప్పటికీ అమెరికన్‌ సమాజం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన చేసిన ప్రసంగాలు, తీరు తెన్నులను చూసి ఎన్నికల ఫలితాలు ప్రకటించగానే నిరసనలు వ్యక్తం చేశారు. అంతకంటే పెద్ద స్ధాయిలో ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాపితంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావటం బహుశా ఆధునిక ప్రపంచ చరిత్రలో అమెరికా అధిపతి డోనాల్డ్‌ ట్రంప్‌తోనే ప్రారంభమై వుండాలి.ట్రంప్‌ తన పదవీకాలంలో ఎలా ప్రవర్తిసాడు, ఏవిధంగా ముగుస్తుందన్నది ఆసక్తికరం.

Image result for donald trump oath taking

   ప్రజాస్వామ్యం అంటే అమెరికాలో మాత్రమే వుంటుందన్నది కొందరి ప్రగాఢ నమ్మకం. అర్హత కలిగిన ఓటర్లలో కేవలం 25శాతం మాత్రమే ట్రంప్‌కు ఓటు చేశారు. జనం వేసిన ఓట్లు ట్రంప్‌ కంటే ఆయన ప్రధాన ప్రత్యర్ధిగా వున్న హిల్లరీ క్లింటన్‌కు 28లక్షలు అదనంగా వచ్చాయి. కానీ అధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్ట్రరల్‌ కాలేజీలో ఎక్కువ స్ధానాలు రావటంతో ట్రంప్‌ గెలిచాడు.ఇదీ అక్కడి ప్రజాస్వామ్యం తీరు. ప్రపంచీకరణ గురించి ఇంతకాలం సుద్దులు చెప్పిన వారు ఇప్పుడు అమెరికా తరువాతే మిగతా దేశాలు (అమెరికా ఫస్ట్‌ ) అని ట్రంప్‌ మాట్లాడుతుంటే ఏం చేయాలో దిక్కుతోచని స్ధితిలో పడిపోయారు. అలాంటి పెద్ద మనిషి ప్రమాణ స్వీకారం చేస్తుంటే అసాధారణరీతిలో తెలుగు మీడియా వార్తలు ఇచ్చిన తీరు ప్రమాదకర పోకడలను తెలియ చేస్తోంది.ఫాసిస్టులు జనం కోసం కబుర్లు చెప్పి ఆచరణలో కొద్ది మంది తమ చుట్టూ వుండే కుటుంబాలు, బినామీలు, కార్పొరేట్లు, విధేయులకు ఆచరణలో వుపయోగపడతారు. ఎన్నికల ప్రచారంలో అమెరికన్ల వుద్యోగాలు, వుపాధి వంటి అంశాల గురించి, ఇతర దేశాల నుంచి అమెరికాకు వలసలు వచ్చిన వారు స్ధానికుల వుపాధిని దెబ్బతీస్తున్నారని, ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతులపై పెద్ద మొత్తంలో పన్నులు, బయటి వారికి వుపాధి కల్పించే స్ధానిక పెట్టుబడిదారులపై చర్యలు తీసుకుంటామని ట్రంప్‌ చెప్పటం జనం ఓట్ల కోసమే. ఇప్పుడు అధికారం స్వీకరించారు గనుక కార్పొరేట్లు, విధేయులు, కుటుంబ సేవ ప్రారంభిస్తారు. అత్యంత ధనికులు, పేరు మోసిన కార్మిక వ్యతిరేకులు, జాత్యహంకారులతో కూడిన పచ్చి మితవాద ప్రముఖులందరినీ తన మంత్రులుగా, సలహాదారులుగా నియమించుకొని నాంది పలికారు. ఎన్నికల ప్రచారంలో మెక్సికో, చైనా నుంచి వలసలు వచ్చిన వారి గురించి, ముస్లింలు, మీడియా, కార్మిక సంఘాల గురించి అవాకులు చెవాకులు పేలిన ట్రంప్‌ పదవీబాధ్యతల స్వీకారం సందర్భంగా వాటిని ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా పరోక్షపద్దతులలో తన మద్దతుదారులకు అర్ధమయ్యే రీతిలో మాట్లాడి సంతృప్తి పరచారు. అమెరికా వస్తువులనే కొనాలి, అమెరికన్లకే వుద్యోగాలివ్వాలని పిలుపునిచ్చారు. ట్రంప్‌ తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఒక పెద్ద రియలెస్టేట్‌ వ్యాపారి. తాజమహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరని శ్రీశ్రీ చెప్పినట్లుగా విదేశాల నుంచి వలస వచ్చి అమెరికా రికార్డులలో నమోదు కాకుండా తక్కువ వేతనాలకు పని చేసిన వారినే తాను నిర్మించిన అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, కార్యాలయాల నిర్మాణానికి వుపయోగించుకున్నాడన్నది జగమెరిగిన సత్యం. ఇక తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన వారందరూ ధరించిన కొత్త సూట్లు, కోట్లు, టైలు ఒకటేమిటి సర్వం కారు చౌకగా విదేశీ కార్మికులు తయారు చేస్తే ట్రంప్‌ స్వంత కంపెనీలు దిగుమతి చేసుకున్న సరుకే. ఇలాంటి వ్యక్తిని అమెరికన్లు ఎందుకు ఎన్నుకున్నారన్న ప్రశ్న తలెత్తటం సహజం. సంక్షోభంలో వున్న సమయంలో కార్పొరేట్‌ మీడియా పచ్చి మితవాదులను ఆకాశానికి ఎత్తుతుంది, ఓటర్లను ప్రభావితం చేస్తుంది, కార్పొరేట్‌ శక్తులు కూడా తమ ప్రయోజనాలను నిర్ధాక్షిణ్యంగా కాపాడేవారిని ఎంచుకుంటాయి. ప్రపంచ మంతా ఫాసిస్టు హిట్లర్‌ను వ్యతిరేకిస్తే 1940 అధ్యక్ష ఎన్నికలలో హిట్లర్‌ అనుకూల లిండ్‌ బెర్గ్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకొని ఫ్రాంక్లిన్‌ డి రూజ్‌వెల్ట్‌ను ఓడించారు. అందువలన వివిధ కారణాలతో జనం కూడా కొన్నిసార్లు పొరపాట్లు చేస్తుంటారు. గత 20 సంవత్సరాలుగా అమెరికా సమాజంలో ముఖ్యంగా రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదార్లుగా వున్న వారిలో నియతృత్వ ధోరణులు పెరుగుతున్నాయని పరిశోధనలు వెల్లడించాయి. శ్వేత జాతీయల పార్టీగా అది తయారైంది. గత ఎన్నికలలో ట్రంప్‌కు తోడ్పడిన అంశాలలో అదొకటిగా పరిశీలకులు చెబుతున్నారు.

Protesters at the Women's March in Washington

   ట్రంప్‌ పదవీ బాధ్యతల స్వీకారం సందర్భంగా ప్రపంచవ్యాపితంగా ఆరువందల నగరాలలో లక్షలాది మంది ప్రదర్శనలు చేసినట్లు ఒక వార్తా సంస్ధ కథనం. అమెరికాలో జరిగిన ప్రదర్శనలలో ఎంత మంది పాల్గొన్నారనేదానిపై తమ స్వంత లెక్కలు వేయలేదని, ప్రభుత్వ శాఖలు వేసిన అంచనాలను అందచేస్తున్నామని సిఎన్‌ఎన్‌ పేర్కొన్నది. వాషింగ్టన్‌ నగరంలో అతి పెద్ద ప్రదర్శన జరిగింది. అత్తమీద కోపం దుత్త మీద చూపారన్న సామెత మాదిరి తనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్న జనంపై విమర్శలకు దిగితే మరింతగా తన పరువు పోయే అవకాశం వున్నందున ఆ కోపాన్ని మీడియాపై ప్రదర్శించినట్లుగా వుంది. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రమాణాస్వీకారోత్సవంతో పోల్చి తన కార్యక్రమానికి జనం తక్కువగా వచ్చారని, కొన్ని ప్రాంతాలు ఖాళీగా వున్నాయని మీడియా రాయటం, చూపటంపై మరుసటి రోజు ట్రంప్‌ మండి పడ్డారు. సిఐఏ కార్యాలయ సందర్శన సందర్శన సందర్భంగా మాట్లాడుతూ భూమ్మీద నిజాయితీ లేని మనుషులు ఎవరంటే జర్నలిస్టులే అంటూ తన ప్రమాణ స్వీకారోత్సవానికి పది, పదిహేను లక్షల మంది వచ్చినట్లుగా తనకు కనిపించిందని ట్రంప్‌ చెప్పారు. అయితే వాషింగ్టన్‌ మెట్రో రైళ్లలో ప్రయాణించిన వారి గురించి నమోదైన వివరాల ప్రకారం ఐదులక్షలకు పైగా వుండగా బరాక్‌ ఒబామా తొలిసారి ప్రమాణస్వీకారం సందర్భంగా పదకొండు లక్షలు, రెండవ సారి ఎనిమిది లక్షల వరకు ప్రయాణించినట్లు నమోదైంది. ఒక పత్రిక ట్రంప్‌ సభకు రెండున్నరలక్షల వరకు వచ్చినట్లు పేర్కొన్నది.దానిపై ట్రంప్‌ వ్యాఖ్యానిస్తూ అది అబద్దం తప్ప తప్పుకాదు, అంతకంటే ఎక్కువే వచ్చారు అన్నారు. ప్రమాణ స్వీకార సభకంటే నిరసన ప్రదర్శనకు ఎక్కువ మంది రావటం, మీడియాలో ప్రచారం రావటం ట్రంప్‌ ఆగ్రహానికి అసలు కారణం. ట్రంప్‌ అనుగ్రహం పొందే యత్నంలో భాగంగా అధ్యక్ష భవన సిబ్బంది అధిపతి రెయిన్స్‌ ప్రైబస్‌ కూడా మీడియాపై దండెత్తారు. ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ట్రంప్‌ను చట్ట విరుద్ధ అధ్యక్షుడిగా చిత్రించే మానసిక స్ధితికి మీడియా గురైందని దాన్ని చూస్తూ వూరుకోబోమని, ప్రతిరోజు చీల్చి చెండాడుతామని బెదిరింపులకు దిగారు. బరాక్‌ ఒబామా 2009 ప్రమాణ స్వీకార ఫొటోలను చూస్తే ట్రంప్‌ కార్యక్రమానికే ఎక్కువ మంది వచ్చినట్లు చూడవచ్చన్నారు. ట్రంప్‌ పత్రికా కార్యదర్శి సియాన్‌ స్పైసర్‌ మాట్లాడుతూ ఏడు లక్షల 20వేల మంది ప్రమాణ స్వీకారనికి వచ్చారంటూనే ఎవరి దగ్గరా లెక్కలు లేవన్నారు. స్పైసర్‌ లెక్కను అగ్రశ్రేణి మీడియా సంస్ధలు తప్పుడు లెక్కలుగా వర్ణించాయి. స్పైసర్‌ రుజువు చేయదగిన అవాస్తవాలు చెబుతున్నారని ఒక చర్చా కార్యక్రమంలో యాంకర్‌ చెప్పటంతో ట్రంప్‌ సహాయకురాలు కెలీయానే కాన్వే తమ ప త్రికా కార్యదర్శిని అలా సంబోధిస్తే మీడియాతో సంబంధాల గురించి పునరాలోచించాల్సి వుంటుందని హెచ్చరించారు. వచ్చిన జనం నిజంగా ఎంత మందో లెక్క వేయటానికి అవకాశం లేదని ఆమె వ్యాఖ్యానించటంతో ఒక జర్నలిస్టు నవ్వాడు. దానికామె స్పందిస్తూ మీరు నన్ను చూసి నవ్వవచ్చు, మమ్మల్ని మీడియా ఎలా చూస్తున్నదో చెప్పటానికి మీ నవ్వే చిహ్నం అని వుడుక్కున్నారు. ఇలాంటి ట్రంప్‌, పరివార చర్యలు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్నది వెండి తెరపై చూడాల్సిందే.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d