• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: COUNTRIES

ఇరాక్‌ ఎన్నికలు-కమ్యూనిస్టుల పునరుజ్జీవనం !

02 Saturday Jun 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RELIGION, USA

≈ Leave a comment

Tags

IRAQ ELECTIONS, Iraqi Communist Party, Muqtada al-Sadr, non-religious parties, Sadrist-Communist alliance, Sairoun Alliance, Shi’ite cleric Muqtada al-Sadr

టీచర్‌, మహిళా హక్కుల కార్యకర్త అయిన సుహాద్‌ అల్‌ ఖతీబ్‌ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధిగా నజఫ్‌ నియోజక వర్గం నుంచి ఎన్నికైన తొలి పార్లమెంట్‌ సభ్యురాలు

ఎం కోటేశ్వరరావు

ఇరాక్‌లో అంతరించి పోయిందనుకున్న కమ్యూనిస్టు పార్టీ పునరుజ్జీవనం పొందిందా? అవునంటే సహజంగానే కమ్యూనిస్టులకు వుత్సాహం కలిగించే అంశమైతే, వ్యతిరేకులకు దడపుట్టించే పరిణామమే. అన్నింటికీ మించి అసలు కమ్యూనిస్టులేమిటి ఒక మత నాయకుడి ఆధ్వర్యంలోని పార్టీతో జతకట్టటం ఏమిటి, అధికారంలో కూడా పాలుపంచుకొనేందుకు సిద్దపడటం ఏమిటి అని అనేక మంది ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతేనా, తాజా ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ తరఫున అదీ ఒక మహిళ, షియా ముస్లింల ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా పరిగణించబడే నజఫ్‌ పట్టణ నియోజకవర్గం నుంచి విజయం సాధించటమేమిటి? ముస్లిం ఛాందసులు కమ్యూనిజం మీద వ్యతిరేకత వదులుకున్నారా అని ఆశ్చర్యంతో తలమునకలు అవుతున్నవారు కూడా లేకపోలేదు. ఇంతకీ అసలక్కడేం జరిగింది. దాని గురించి పరిశీలకులేమంటున్నారు?

ఇరాక్‌ మరోసారి ప్రపంచ వార్తల్లోకి ఎక్కింది. గత నెల పన్నెండున అక్కడ జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో అల్‌ సదర్‌-కమ్యూనిస్టు పార్టీ కూటమి ‘సంస్కరణల కోసం పదండి మ ముందుకు ‘ అనే నినాదంతో అనూహ్యంగా పెద్ద కూటమిగా ఎన్నికైంది. తమతో కలసి వచ్చే పార్టీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు వారు పూనుకున్నట్లు వార్తలు వచ్చాయి. సంక్లిష్టమైన తీర్పు రావటంతో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రాజ్యాంగం అనుమతించిన మూడునెలల వ్యవధిలోగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందా అన్నది పెద్ద ప్రశ్నగా తయారైంది. కమ్యూనిస్టు పార్టీ ప్రాచుర్యంలోకి రావటం ఇష్టం లేని శక్తుల ప్రోద్బలంతో పార్టీ కార్యాలయం మీద బాంబు దాడి జరిగింది.ఎన్నికలకు ముందు ఇరాన్‌ మాజీ మంత్రి, సీనియర్‌ రాజకీయవేత్త అయిన అలీ అక్బర్‌ వెలాయతీ ఇరాక్‌ సందర్శనకు వచ్చి వుదారవాదులు, కమ్యూనిస్టులను ఇరాక్‌ పాలనకు తాము అనుమతించేది లేదని చేసిన ప్రకటన ఇరాన్‌ ప్రభుత్వ ఆలోచనా ధోరణికి ప్రతిబింబం. అమెరికా సరేసరి దాని గురించి చెప్పాల్సిన పని లేదు. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక అమెరికన్‌ సామ్రాజ్యవాదుల పెంపుడు చిలక. ‘పదండి ముందుకు’ పేరుతో ఎక్కువ స్ధానాలు సాధించిన కూటమి గురించి ఆ ఏముంది అవసాన దశలో వున్న కమ్యూనిస్టులు, సున్నీ వ్యాపారులు, ఆధ్యాత్మిక కార్యకర్తలతో కూడిన కూటమి అంటూ తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నించింది. ఆ కూటమిలో ఆల్‌ సదర్‌ పార్టీతో పాటు, కమ్యూనిస్టుపార్టీ, మార్పుకోసం యువజనోద్యమ పార్టీ, పురోగామి మరియు సంస్కరణల పార్టీ, ఇరాకీ రిపబ్లికన్‌ గ్రూప్‌, జస్టిస్‌ పార్టీ వంటివి వున్నాయి. జనంలో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతిరూపంగా ఇరాక్‌లో జరుగుతున్న సమీకరణలకు ప్రతిబింబం ఈ ఎన్నికలని చెప్పవచ్చు. ఈ ఎన్నికల పట్ల ఓటర్లు పెద్దగా ఆసక్తి కనపరచలేదు, దేశవ్యాపితంగా 44శాతం మంది పాల్గంటే బాగ్దాద్‌లో అది 33శాతమే వుంది. ఈ నగరంలో సాదరిస్టు కూటమి 23శాతం ఓట్లు తెచ్చుకుంది. మిగతా పార్టీలలో దేనీకీ పదిశాతానికి మించి రాలేదు. ఎన్నికలు ముగిసి ఫలితాలు ప్రకటించిన పదిహేను రోజుల తరువాత కొన్నివేల పోలింగ్‌ కేంద్రాలలో అక్రమాలు జరిగాయని అక్కడి ఓటింగ్‌ను రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. అందువలన అక్కడేం జరుగుతుందో ఫలితాన్ని ఎటువైపుగా తిప్పుతారో తెలియదు.

ఇరాన్‌ాఇరాక్‌ యుద్ధం, ఇరాక్‌పై అమెరికా నాయకత్వంలో సామ్రాజ్యవాద దేశాల దాడి, దురాక్రమణ తరువాత, సద్దామ్‌ హుస్సేన్‌ హత్య అనంతరం ప్రపంచ వార్తల్లో ఇరాక్‌ వాటా బాగా తగ్గిపోయింది. అలాంటిది తాజా ఎన్నికలతో పశ్చిమ ఆసియా, పాశ్చాత్య దేశాల మీడియాలో ఈ ఎన్నికలు ఒక కుదుపు మాదిరి ఇరాక్‌ పరిణామాలు ముందుకు వచ్చాయి. ఇవి టీకప్పులో తుపానులా సమసిపోతాయా లేక సరికొత్త పరిణామాలకు నాంది అవుతాయా అన్నది చూడాల్సి వుంది.

మక్తాడా ఆల్‌ సదర్‌

ఎన్నికలలో గెలిచిందెవరన్నది సాధారణ వార్త, అయితే ‘ఇరాక్‌ ఎన్నికలలో ఓడిందెవరు? ఇరాన్‌ మరియు అమెరికా’ అనే శీర్షికతో ఒక వ్యాఖ్యానం వెలువడింది. ఇది అసాధారణం. గతంలో ఇరాన్‌కు అనుకూలంగా, అమెరికాకు వ్యతిరేకంగా వున్న ఒక మతాధికారి ఇరాక్‌ను స్వాతంత్య్రం వైపుగా నడిపించాలని కోరుకుంటున్నారు అని సారాంశాన్ని రాశారు. సద్దాం హుస్సేన్‌ను హతమార్చిన తరువాత ఇరాక్‌ వ్యవహారాలపై పట్టు సాధించేందుకు 2003 నుంచి అమెరికాతో పాటు ఇరాన్‌కూడా చేయాల్సిందంతా చేసింది. ఆ రెండింటి మద్దతుదార్లను పక్కన పెట్టిన ఇరాకీ ఓటర్లు తమ అస్ధిత్వాన్ని, స్వాతంత్య్రాన్ని ప్రకటించుకోవాలనే ధోరణి వైపు మొగ్గుతున్నట్లు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇరాక్‌ పార్లమెంట్‌లో 329 స్ధానాలున్నాయి.వాటిలో షియా మతనాయకుడు మక్తాడా ఆల్‌ సదర్‌, కమ్యూనిస్టులతో కూడిన నాయకత్వంలోని రాజకీయ సంఘటన 54 స్ధానాలతో మొదటి స్ధానంలో వుంది. వీరిలో కమ్యూనిస్టులు ముగ్గురే అయినప్పటికీ రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన వుదంతంగా మారింది. ఇరాన్‌ అనుకూల షియా పార్టీల కూటమికి 47, అమెరికా అనుకూల ప్రధాని హైదర్‌ అల్‌ అబాదీ నాయకత్వంలోని కూటమికి 42 స్ధానాలు వచ్చాయి. మిగిలినవి అనేక చిన్న పార్టీలు, ప్రాంతీయ, మత, గిరిజన తెగలకు ప్రాతినిధ్యం వహించే వారికి దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 165 మంది మద్దతు కావాల్సి వుంది.కొన్ని పోలింగ్‌ కేంద్రాల ఓటింగ్‌ను రద్దు చేసి కొన్ని ఫలితాలను తారు మారు చేస్తారా, చేసినప్పటికీ బలాబలాల్లో పెద్ద మార్పు వుండే అవకాశం లేదు. సదర్‌ కూటమి లేకుండా ఇరాన్‌ అనుకూల ప్రభుత్వం ఏర్పడినా, సదర్‌ ప్రమేయంతో అమెరికా వ్యతిరేక కూటమి ప్రభుత్వం ఏర్పడినాఅమెరికాతో లడాయి తప్పుదు. రెండవది జరిగితే అది ఇరాన్‌ ప్రభావం, ప్రమేయాన్ని కూడా అంగీకరించే అవకాశం వుండదు.పశ్చిమాసియాలో కొత్త పరిణామాలకు దారితీస్తుంది. ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రభావం కలిగించే అనూహ్య పరిణామాలు జరిగినా ఆశ్చర్యం లేదు. అమెరికాతో సంబంధాలు బెడిసిన పూర్వరంగంలో తన అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇరాన్‌ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అదే జరిగితే అమెరికా చూస్తూ వూరుకుంటుందా? పశ్చిమాసియా రాజకీయాలలో అమెరికాతో జతకట్టిన సౌదీ అరేబియాలో ఆ ప్రాంతంలో ఇరాన్‌ పలుకుబడిని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. అది సదర్‌ కూటమికి మద్దతు ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏ ప్రభుత్వం ఏర్పడినా దాని సుస్ధిరత అన్నది ప్రశ్నార్ధకమే.

ఇరాక్‌, అక్కడి కమ్యూనిస్టు పార్టీ పరిణామాలను ఎలా అర్ధం చేసుకోవాలి? షియా తెగకు చెందిన మక్తాదర్‌ అల్‌ సదర్‌ నాయకత్వంలో ప్రారంభమైన ఇరాకీ జాతీయవాద వుద్యమం సున్నీ తెగవారిపై అమెరికా సైన్యం జరిపిన అత్యాచారాలకు వ్యతిరేకంగా సాయుధ చర్యలు కూడా జరిపింది. షియాల్లోని మితవాదులు,పేదలు కూడా ఇది ఇరాన్‌ అనుకూల వైఖరిగా పరిగణించారు. ఇప్పటివైఖరిని చూస్తే అమెరికా వ్యతిరేకత, ఇరాన్‌ వైఖరిని కూడా వ్యతిరేకించే ఒక జాతీయ రాజకీయ వుద్యమంగా అది మారింది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో సున్నీ అరబ్బులు కూడా నేడు గణనీయంగా సదర్‌కు మద్దతు ఇస్తున్నారని తాజా ఎన్నికలు వెల్లడించాయి. ఇరాక్‌ ప్రయోజనాలకే పెద్ద పీట, అమెరికా, ఇరాన్‌కు వ్యతిరేకం అనే నినాదంతో ఎన్నికలలో పోటీ చేశారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఇరాన్‌ పీడ వదిలింది, ఇరాక్‌ స్వేచ్చ పొందింది అని కూటమి మద్దతుదార్లు బాగ్దాద్‌ వీధుల్లో నినాదాలు చేశారు.

మత ప్రమేయం కలిగిన సదరిస్టులు, మతాన్ని అంగీకరించని కమ్యూనిస్టులు ఎందుకు కలిశారు అన్న ప్రశ్నలకు పరిశీలకులు చెబుతున్నదేమిటి? ముందు దేశంపై ఇరాన్‌ ప్రభావాన్ని అంతం చేయాలి అన్నది ఒకటి.దేశంలో అది ఇరాన్‌ లేదా అమెరికా అనుకూల ప్రభుత్వమైనా అవినీతిని పెంచి పోషించటంలో ఎలాంటి తేడా లేదు, అందువలన అవినీతి నిర్మూలనకు, అభివృద్ధికోసం పనిచేసేందుకన్నది మరొక కారణంగా చెబుతున్నారు. సదరిస్టులు షియా మతభావాలతో ప్రారంభమైనప్పటికీ షియా-సున్నీ తెగలలోని కార్మికులు, ఇతర పేదలను ఐక్యం చేయటంలో జయప్రదమయ్యారని పేదల వాణిగా మారారన్నది కొందరి అభిప్రాయం. కమ్యూనిస్టులు చేతులు కలపటానికి ఇదొక కారణంగా భావిస్తున్నారు. ప్రపంచమంతటా కమ్యూనిజానికి కాలం చెల్లిందన్న ప్రచారం బలంగా జరుగుతున్న కాలంలో, ముస్లింలు- కమ్యూనిజానికి చుక్కెదురు అని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మరొకవైపు జరుగుతున్న పూర్వరంగంలో ఇరాక్‌, ఇతర అరబ్బు దేశాలలో కమ్యూనిజానికి జనం ఆకర్షితులౌతారా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.

లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఛాతమ్‌ హౌస్‌ అనే ఒక సంస్ధలో పని చేస్తున్న డాక్టర్‌ నసైబా యూనిస్‌ ఒక మీడియా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు.’ సద్దామ్‌ హుస్సేన్‌ (2003) అనంతర కాల రాజకీయాలను తిరస్కరించే వారికి ఒక వాహనంగా ఇటీవలి కాలంలో కమ్యూనిస్టు పార్టీ తయారైంది. ప్రభుత్వాల అవినీతి, పేదల సంక్షేమాన్ని విస్మరణ కారణంగా అలసిపోయిన ఇరాకీలను ఒక విశాల సామాజిక న్యాయ అజెండాతో ఆకర్షించి మద్దతును కూడగట్టుకున్నది. కష్టజీవులకు సేవ చేయాలనే ఒక వుమ్మడి సైద్ధాంతికపరమైన కేంద్రీకరణ, యధాతధ స్ధితిని మార్చాలనే ఒక వుమ్మడి అభిప్రాయం సాదరిస్టులు మరియు కమ్యూనిస్టులకు వుంది. ఇదే సమయంలో నాయకత్వ స్ధాయిలలో వుదారవాదులైన సాదరిస్టులు వున్నప్పటికీ మత విలువలను రుద్దకుండా స్వేచ్చ, స్వాతంత్య్రాలకు సాదరిస్టులు ఎంత మేరకు కట్టుబడి వుంటారు ప్రత్యేకించి ఈ కూటమిలో కమ్యూనిస్టులు ఒక చిన్న భాగస్వామిగా గట్టిగా వున్నపుడు అన్న ఒక ఆతృత కూడా ఇరాకీ వామపక్ష శక్తులలో గణనీయంగా వుంది. మహిళల హక్కుల వంటి విషయాలలో పక్షపాతం లేని వైఖరిని, మద్దతును సాదరిస్టులు విస్తరించకపోవచ్చు ‘ అని నసీబా చెప్పారు.

జోయల్‌ వింగ్‌ అనే మరొక విశ్లేషకుడు ఇరాక్‌ కమ్యూనిస్టు పార్టీ గురించి ఇలా చెప్పారు.’ ఇరాక్‌ కమ్యూనిస్టు పార్టీ 1934లో ఏర్పడింది. సాంప్రదాయక మార్క్సిజం-లెనినిజాన్ని అనుసరిస్తుంది. సోవియట్‌ యూనియన్‌ వునికిలో వున్నపుడు దానికి అనుకూలంగా వుండేది. గతంలో మధ్యప్రాచ్యంలో కమ్యూనిస్టు పార్టీలు ఇతరులతో ప్రత్యేకించి అరబ్‌ ప్రాంతంలో విస్తరించిన పార్టీలైన నాజరైట్స్‌, బాతిస్టుల వంటివాటితో పోటీపడేవి. 1958 వరకు కమ్యూనిస్టులను రాజరికం నిరంతరం హింసించినప్పటికీ దేశంలోని కార్మికవర్గం, విద్యార్ధులలో కమ్యూనిస్టులు పునాదిని ఏర్పాటు చేసుకున్నారు. వారికి సైద్ధాంతిక మద్దతుదారులు వుండేవారు, వారిలో ప్రధానంగా జనరల్‌ అబ్దల్‌ కరీమ్‌ ఖాశిం తిరుగుబాటుద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరువాత 1968లో బాత్‌పార్టీ నాయకత్వంలో తిరుగుబాటు చేసి ఖాశిం ప్రభుత్వాన్ని కూలద్రోసి ఆయనను హత్య చేశారు. కమ్యూనిస్టుపార్టీని దాదాపు నాశనం చేశారు. తరువా వారు ఎక్కువ భాగం రహస్యంగా పని చేశారు. 2003 తరువాతనే పార్టీ చాలా పరిమితంగా పనిచేస్తూ బహిరంగ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.అయితే అది చాలా చిన్నది. వంతుల వారీ రాజకీయ అధికార పద్దతి, తెగలవారీ దామాషా పద్దతిలో పదవుల పంపిణీ విధానం, అవినీతికి వ్యతిరేకంగా పౌర సమాజ బృందాలు ఆందోళనకు వుపక్రమించినపుడు కమ్యూనిస్టు పార్టీ వారితో కలసి గత ఐదు సంవత్సరాలలో తిరిగి కమ్యూనిస్టు పార్టీ ప్రాచుర్యంలోకి వచ్చింది. అవినీతి వ్యతిరేక నిరసనల ద్వారా సాదరిస్టులతో కమ్యూనిస్టుపార్టీ జతకట్టింది. అదే మే నెలలో సాదరిస్టు కూటమిలో భాగంగా పోటీ చేసేందుకు దారి తీసింది. రక్షణ కల్పిస్తామని సాదరిస్టులు చెప్పటం, ఇరాకీ రాజకీయ ప్రముఖులలో చేరేందుకు ఒక దారిగా కమ్యూనిస్టులు ఈ నిర్ణయానికి వచ్చారు. అయినప్పటికీ కమ్యూనిస్టు శ్రేణులలో ఒక అనిశ్చితి వుంది. తమకు నచ్చని విధానాలను సాదరిస్టులు రుద్దుతారా అని అనేక మంది కమ్యూనిస్టు పార్టీ సభ్యులు ఆలోచిస్తున్నారు. సాదరిస్టు పార్టీ అధికారంలో చేరటాన్ని కమ్యూనిస్టులు జీర్ణించుకోవటం లేదు, ఒకవేళ అదే జరిగితే ఆ కూటమి నుంచి బయటపడాలని కొంత మంది ఆలోచిస్తున్నారు.’ అని జోయెల్‌ వింగ్‌ పేర్కొన్నారు.

‘ గత పదిహేను సంవత్సరాలుగా నడచిన ప్రభుత్వ వ్యవస్ధను తిరస్కరించటంలో, సంస్కరణ, అవినీతి, వంతుల వారీ అధికార స్వీకరణ విధానానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ప్రతిధ్వనించారు. అయితే ఇవి వైఖరులు తప్ప విధానాలు కాదు, వాస్తవ సంస్కరణల అజెండాలో అవెలా వాస్తవ రూపం దాల్చుతాయో తెలియదనుకోండి ‘ అని సింగపూర్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుడు ఫనర్‌ హదాద్‌ పేర్కొన్నారు. వంతుల వారీ పద్దతిలో అధికారాన్ని పంచుకోవటం కంటే ప్రతిపక్షంలోనే వుండటం మేలని ఎన్నికల ఫలితాల అనంతరం సాదర్‌ కూటమిలోని కొన్ని పార్టీల నేతలు పేర్కొన్నారు. టీచర్‌, మహిళా హక్కుల కార్యకర్త అయిన సుహాద్‌ అల్‌ ఖతీబ్‌ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధిగా అక్కడ ఎన్నికయ్యారు.

జాతీయవాది, కమ్యూనిస్టు అభిమాని అయిన మాజీ ప్రధాని జనరల్‌ అబ్దుల్‌ కరీమ్‌ ఖాశిం హయాంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారికోసం బాగ్దాద్‌ శివార్లలో విప్లవ నగర్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఆవాసం తరువాత కాలంలో సాదర్‌ నగరంగా మారింది. దాని జనాభా ప్రస్తుతం 35లక్షలు. బాగ్దాద్‌లో సగం. ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. 1999లో షియా మతనాయకుడు అయాతుల్లా మహమ్మద్‌ సాదిక్‌ అల్‌ సదర్‌ను హత్య చేసిన తరువాత ఆ నగరం సాదర్‌ సిటీగాను, ప్రస్తుతం సాదర్‌ పార్టీ కేంద్రంగా మారింది.ఆయన కుమారుడే ప్రస్తుతం సాదరిస్టు పార్టీ నేత మక్తాదా అల్‌ సదర్‌. సాదర్‌ పార్టీ నాయకత్వంలోని సాయుధ విభాగం అమెరికా సైన్యాన్ని ఎదిరించటంలో ఈ నగరాన్ని కేంద్రంగా చేసుకొని పోరాడిన చరిత్ర వుంది.

2003లో ఇరాక్‌ను ఆక్రమించినప్పటి నుంచి అమెరికా అధికారుల కనుసన్నలలో నడిచిన ప్రభుత్వాలు ప్రజల కనీస అవసరాలను పట్టించుకోలేదు. వివిధ సేవలను అందించటానికి ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లు అవినీతి అక్రమాలలో మునిగిపోయారు. 2010 వేసవిలో తీవ్ర ఎండలు, విద్యుత్‌ కోత కారణంగా జనం తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. దాంతో జనం నిరసనలకు దిగారు. 2011 వసంత గర్జన పేరుతో మధ్యప్రాచ్యంలో ప్రారంభమైన నిరసనలు ఇరాక్‌ను కూడా తాకాయి.ఇరాకీ వసంత గర్జన పేరుతో వుద్యోగాలు, విద్యుత్‌ తదితర డిమాండ్లపై పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి.ప్రభుత్వం అణచివేతకు దిగటంతో 45 మంది మరణించారు. అప్పటి నుంచి ప్రతి శుక్రవారం దేశమంతటా అనేక సమస్యలపై ప్రదర్శనలు జరగటం పరిపాటి అయింది. 2015 నుంచి మరింత సంఘటితంగా జరిగాయి. ఈ క్రమంలోనే సాదరిస్టులు, కమ్యూనిస్టులు దగ్గరయ్యారు. మత, తెగల ప్రాతిపదికన ప్రభుత్వంలో పదవుల పందేరాన్ని ఈ ప్రదర్శనల్లో నిరసించారు. ఇరాక్‌ పార్లమెంట్‌, ఇస్లామిక్‌ మత రాజ్యం ఒకే నాణెపు బమ్మా బరుసు వంటివని యువత బ్యానర్లు ప్రదర్శించేవారు.

సద్దామ్‌ హుస్సేన్‌ అమెరికాను వ్యతిరేకించి దాని కుట్రకు బలైన యోధుడిగా లోకం ముందు కనిపించేది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు కరడు గట్టిన కమ్యూనిస్టు, కార్మిక వ్యతిరేకత వుంది. అమెరికా సిఐఏతో చేతులు కలిపిన ఇరాక్‌ బాతిస్టు పార్టీనేతలు కమ్యూనిస్టు అనుకూల జనరల్‌ అబ్దుల్‌ కరీమ్‌ ఖాశిం ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ఆయనను హతమార్చి అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ కుట్రలో సద్దామ్‌ హుస్సేన్‌ ఒక ప్రముఖుడు. బాతిస్టు పార్టీ, సద్దామ్‌ హయాంలో కమ్యూనిస్టులను అణచివేశారు.కార్మిక సంఘాల ఏర్పాటును కూడా నిషేధించారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇరాక్‌ను తయారు చేయటంలో అమెరికా పాత్ర అందరికీ తెలిసిందే. ఆ రెండు దేశాలూ యుద్ధానికి తలపడిన సమయంలో అమెరికా సద్దామ్‌ హుసేన్‌కు మద్దతు ఇచ్చింది. ఆయుధాలు కూడా అందచేసింది. తరువాత సద్దాం వ్యతిరేకిగా మారటంతో అదే అమెరికా చివరకు ఇరాక్‌ను ఆక్రమించి హతం చేసింది. సద్దాం మరణం తరువాతే విదేశాలలో, స్వదేశంలో వున్న ఇరాకీ కమ్యూనిస్టులు బహిరంగ కార్యకలాపాలలోకి వచ్చారు.

ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సి వుంది. అమెరికా వ్యతిరేకిగా మారిన సద్దామ్‌ హుస్సేన్‌ను బయటి ప్రపంచంలోని కమ్యూనిస్టులు, వామపక్ష అభిమానులు గతంలో బలపరిచారు. ఇరాక్‌ దురాక్రమణను, సద్దాం వురిని కూడా నిరసించారు. సద్దామ్‌ అణచివేతకు గురైన ఇరాకీ కమ్యూనిస్టులు ఈ వైఖరిని ఆమోదించరనేది స్పష్టం. అలాగే ఇప్పుడు మన దేశంలో వున్న మతోన్మాదశక్తులు, అవి చెలరేగిపోతున్న పూర్వరంగంలో వాటికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న కమ్యూనిస్టులు, అభ్యుదయ వాదులకు ఇరాకీ కమ్యూనిస్టుల వైఖరి మింగుడుపడకపోవచ్చు. ముందే చెప్పుకున్నట్లు ఒక మత నాయకుడి ఆధ్వర్యంలోని పార్టీతో ఎలా కలుస్తారు అన్న ప్రశ్న తలెత్తుతుంది. మన దేశంలోని మతోన్మాదులు కమ్యూనిస్టులను శత్రువులుగా చూస్తున్నారు, కేరళ వంటి చోట్ల హతమార్చేందుకు వెనుకాడటం లేదు.ఇరాష్‌ షియా మతనాయకుడి ఆధ్వర్యంలోని పార్టీ సున్నీ తెగ ముస్లింల మద్దతు కూడా కూడగట్టుకున్నది. కమ్యూనిస్టుల విషయం తెలిసి కూడా అనేక పోరాటాలలో వారితో భుజం కలిపింది. అయితే అది శాశ్వతంగా అలాగే వుంటుందా? అధికారం వచ్చేంత వరకు కమ్యూనిస్టులను వుపయోగించుకొని తరువాత వ్యతిరేకిగా మారితే ఏమిటి అన్న సందేహాలు తలెత్తటం సహజం. తాము స్వయంగా అనేక ప్రపంచ అనుభవాలు చూసిన తరువాత ఇరాకీ కమ్యూనిస్టులు అంత గుడ్డిగా లేదా భ్రమలతో ఒక మత నేత సారధ్యంలోని పార్టీతో చేతులు కలుపుతారని అనుకోవాల్సిన అవసరం లేదు. పదండి ముందుకు పేరుతో ఏర్పాటు చేసిన కూటమి ఎన్నికల కార్యక్రమంలో మతపరమైన అంశాలు లేదా కమ్యూనిస్టులు చెప్పే సోషలిజం వంటి అంశాలేమీ లేవు. అవినీతి, అక్రమాలు, ప్రజా సమస్యలు, ఇరాన్‌, అమెరికా జోక్యానికి వ్యతిరేకమైన ఒక జాతీయవాద అజెండాతో వారు జనం ముందుకు వెళ్లారు. అనూహ్యంగా ఒక వేళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి అధికారానికి వచ్చి ఎన్నికల ప్రణాళికు భిన్నంగా ఏ పార్టీ వ్యవహరించినా మిగతా పార్టీలు వ్యతిరేకించి బయటకు వస్తాయి. కమ్యూనిస్టులు కూడా అదే చేస్తారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికన్‌ ధృతరాష్ట్ర కౌగిలి దిశగా దేశాన్ని నడిపిస్తున్న నరేంద్రమోడీ !

30 Wednesday May 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

american dhritarashtra embrace, dhritarashtra embrace, India Foreign Policy, India foreign policy under narendra modi, modi foreign policy

ఎం కోటేశ్వరరావు

నరేంద్రమోడీ ప్రధానిగా పదవిని స్వీకరించి నాలుగు సంవత్సరాలు గడిచింది. స్వదేశీ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్న రాష్ట్రపతి అంటూ ఒక జోక్‌ సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది. లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా మోడీ పదవీ స్వీకార ప్రమాణం చేసింది మొదలు ఇప్పటి వరకు విదేశీ ప్రయాణాల్లోనే ఎక్కువగా గడిపారనే పేరు తెచ్చుకున్నారు. మోజు తీరినపుడు, అసంతృప్తి కలిగినపుడు ఎప్పుడన్నా జనం ఈ విషయాల గురించి చర్చించి వుంటారేమోగానీ మన విదేశాంగ విధానం గురించి మాత్రం కచ్చితంగా చర్చకు రావటం లేదని చెప్పవచ్చు. అంతర్గత విధానాలు మన జన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో వర్తమాన ప్రపంచీకరణ యుగంలో విదేశాంగ విధానాల పర్యవసానం కూడా తీవ్రంగానే వుంటుంది. ఈ విషయం మనకు స్వాతంత్య్రానికి ముందు తెలిసినంతగా ఇప్పుడు తెలియటం లేదు. బ్రిటీష్‌ పాలకుల దేశీయ, విదేశాంగ విధానాలు మన దేశాన్ని ఎలా దోపిడీకి గురిచేశాయో నాడు స్వాతంత్య్ర సమరయోధులు నిత్య పారాయణం చేసేవారు. ఇప్పుడు కమ్యూనిస్టులు తప్ప మిగతా పార్టీలేవీ ఈ విషయాల గురించి నోరెత్తవు.

సోవియట్‌ యూనియన్‌ కూల్చివేత, మన దేశంలో సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టిన 1991 నుంచి మన దేశ విదేశాంగ విధానంలో పెద్ద మార్పులు వచ్చాయి. నాటి నుంచి నేటి వరకు చూస్తే అలీన విధానం నుంచి వైదొలగి అమెరికా బిగి కౌగిట్లోకి మరింతగా చేరువు కావటం ముఖ్యమైన మార్పు. గత పాతిక సంవత్సరాలలో కాంగ్రెస్‌, బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ఎవరు అధికారంలో వున్నప్పటికీ అదే కొనసాగుతోంది. యుపిఏ పాలనా కాలంలో అమెరికావైపు మొగ్గు, దానికి చిన్న భాగస్వామిగా చేరేందుకు పూనుకున్న కారణంగానే వామపక్షాలు మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వానికి మద్దతు వుపసంహరించిన విషయం తెలిసిందే. నరేంద్రమోడీ హయాంలో వాటిలో ఎలాంటి మార్పు లేదు, మరింత విస్తృతం, చేరువైంది. 2015లో బరాక్‌ ఒబామా మన దేశ పర్యటనకు వచ్చినపుడు సంయుక్త స్వప్న దర్శనం పేరుతో ఒక ప్రకటన చేశారు. దాని ప్రకారం ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా భూ, రాజకీయ వ్యూహంతో సమన్వయం చేసుకొనేందుకు మన దేశం అంగీకరించింది. సోషలిస్టు చైనా, వియత్నాం, లావోస్‌ వియత్నాంలను చక్రబంధంలో బిగించటంతో పాటు ఈ ప్రాంతంపై మొత్తంగా తన పట్టుబిగించుకోవటం అమెరికా లక్ష్యం. ఇప్పటికే జపాన్‌, ఆస్ట్రేలియాలతో అమెరికాకు ఒప్పందం వుంది. ఆ మూడింటితో సమన్వయం చేసుకుంటామని మోడీ సర్కార్‌ మరొక అడుగు ముందుకు వేసింది. అంతకు ముందు చేసుకున్న రక్షణ ఒప్పందాన్ని మరో పది సంవత్సరాలు పొడిగించింది. గతంలో ఏ ప్రభుత్వమూ అంగీకరించని విధంగా మన రేవులు, వైమానిక స్ధావరాలకు వచ్చి అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధ ఓడలు ఇంధనం నింపుకొనేందుకు, మరమ్మతులు చేయించుకొనేందుకు అంగీకరించింది. ఇది మన సార్వభౌమత్వాన్ని తక్కువ చేసుకోవటమే.

దశాబ్దాల తరబడి అనుసరిస్తున్న విధానాన్ని పక్కన పెట్టి ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద భావజాలానికి అనుగుణంగా ఇజ్రాయెల్‌ను సందర్శించిన తొలి భారత ప్రధానిగా నరేంద్రమోడీ చరిత్రకెక్కారు.పాలస్తీనా సందర్శనను తప్పించారు. వెనెజులా రాజధాని కారకాస్‌లో జరిగిన అలీన దేశాల సభకు వెళ్లకుండా అమెరికాను మెప్పించేందుకు ప్రయత్నించారు. ఇలా అమెరికా, ఇతర సామ్రాజ్యవాద దేశాలు, వాటి అడుగుజాడలలో నడిచే దేశాలతో బంధాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఇతర దేశాలకు ఇవ్వలేదు. వుదాహరణకు మన దేశం బ్రెజిల్‌,రష్యా,చైనా, దక్షిణాఫ్రికాతో కలసి బ్రిక్స్‌ కూటమిగా ఏర్పడింది. అదే విధంగా షాంఘై కూటమిలో పూర్తి సభ్యురాలిగా చేరింది. ఇవి ప్రాంతీయ, పరస్పర సహకారం, బహుళధృవ ప్రపంచ వ్యవస్ధ ఏర్పాటు వంటి అనేక లక్ష్యాలను కలిగి వున్నాయి. వాటన్నింటినీ వదలి పెట్టి కేవలం వుగ్రవాద సమస్య మీద మాత్రమే ఈ వేదికల మీద మోడీ సర్కార్‌ కేంద్రీకరిస్తున్నది. పోనీ వుగ్రవాదులను పెంచి పోషిస్తున్న అమెరికా నాయకత్వంలోని పశ్చిమ దేశాలను, సౌదీ వంటి రాజ్యాల వైఖరి, చర్యలను తప్పుపడుతున్నదా అంటే లేదు.

ఇరుగు పొరుగు దేశాలన్న తరువాత అనేక సమస్యలూ, సానుకూల అంశాలూ వుంటాయి.మన రక్షణ ఖర్చు తగ్గి ఆమేరకు అభివృద్ధి వైపు కేంద్రీకరించాలంటే సరిహద్దులలో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొని సానుకూల అంశాలను పెంచుకోవటం అవసరం. నరేంద్రమోడీ సర్కార్‌ వైఖరి ఆవిధంగా లేదు. పాకిస్ధాన్‌ మనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న మాట వాస్తవం. దానికి సూత్రధారి, తెరవెనుక పాత్రధారి అమెరికా అన్నది బహిరంగ రహస్యం. అలాంటి దేశంతో సఖ్యత, పాకిస్ధాన్‌తో వైరంలో అర్ధం లేదు. పాక్‌తో వైరాన్ని పెంచుకోవటం ద్వారా దేశంలో ముస్లిం వ్యతిరేకతను, జాతీయ దురహంకారాన్ని రెచ్చగొట్టి హిందూ ఓట్‌ బ్యాంకును ఏర్పరచుకోవాలనే యావ తప్ప మరొక లక్ష్యం కనిపించటం లేదు.పోనీ పాకిస్ధాన్‌ను సరిహద్దులలో అదుపు చేసిందా అంటే అదీ లేదు. ఎప్పుడు ఎక్కడ కాల్పులు జరుపుతారో, రెచ్చగొడతారో, వుగ్రవాదులను మన దేశంలో ప్రవేశపెడతారో, ఎక్కడ దాడులు చేయిస్తారో తెలియని స్ధితి. పక్కనే వున్న నేపాల్‌లో మధేషీ ఆందోళనకు మద్దతు తెలిపి ఆ దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకొని అక్కడి ప్రజానీకానికి, అన్ని రాజకీయపార్టీలను వ్యతిరేకం చేసుకున్నది. నరేంద్రమోడీ భజనలో భాగంగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ తప్పుడు వ్యాఖ్యలు చేసి చివరకు క్షమాపణ చెప్పారు. నరేంద్రమోడీ మే రెండవ వారంలో నేపాల్‌ పర్యటనలో భాగంగా జనక్‌పూర్‌( సీత జన్మించిన ప్రాంతం అని నమ్మకం)లో ఒక సభలో ప్రసంగించారు. దానికి వచ్చిన జనాన్ని భారతీయులని సుష్మా స్వరాజ్‌ పేర్కొన్నారు. అది నేపాల్‌ సార్వభౌమాధికారాన్ని కించపరచటమే.

డోక్లాం సమస్య భూటాన్‌ాచైనా తేల్చుకోవాల్సిన అంశం. ఆ ప్రాంతంలో చైనా మిలిటరీ కేంద్రీకరణ జరిగితే దాని గురించి చైనాతో చర్చలు జరిపి పరిష్కరించుకోవచ్చు. అందుకు విరుద్దంగా అక్కడ జోక్యం చేసుకోవటం ద్వారా సాధించిందేమీ లేకపోగా చైనాతో అనవసరంగా మరో సమస్యను తెచ్చుకున్నట్లయింది. ఒకనోటితో అధికారికంగా చైనాతో సంబంధాల మెరుగుదల గురించి చెబుతూ మరోనోటితో నిత్యం చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటంలో సంఘపరివార్‌ వ్యవస్ధలు నిమగ్నమయ్యాయి. దక్షిణ చైనా సముద్రం మీద ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నించటమంటే చైనాను చక్రబంధంలో బిగించటమే. దాని వ్యూహంలో మన దేశం భాగస్వామి కావటం అంటే మన ప్రయోజనాలను మనమే దెబ్బతీసుకున్నట్లు. మన మలబార్‌ తీరంలో అమెరికా, జపాన్‌తో కలసి మనం సైనిక విన్యాసాలు చేయటం దానిలో భాగమే. దానికి ప్రతీకారంగా అణుసరఫరా గ్రూపులో మనకు సభ్యత్వం రాకుండా చైనా అడ్డుపడుతోంది. అజార్‌ మసూద్‌ను వుగ్రవాదిగా ప్రకటించేందుకు ఐరాసలో చైనా అడ్డుపడటం కూడా చైనా పట్ల మనం అనుసరిస్తున్న వైఖరి పర్యవసానమే. చైనా మసూద్‌ పట్ల అనుసరించిన వైఖరికి ప్రతిగా చైనా వుగ్రవాదిగా ఇంటర్‌పోల్‌ ప్రకటించిన వాడిని మన దేశం ఆహ్వానించటం, టిబెట్‌ను చైనా అంతర్భాంగా గుర్తిస్తూనే మరోవైపు దానిని రెచ్చగొడుతూ దలైలామాను అరుణాచల్‌ ప్రదేశ్‌ పర్యటనకు అంగీకరించటం వంటి వన్నీ ప్రతీకార పర్యవసానాలే.యూరేషియాాఆఫ్రికన్‌ రైలు,రోడ్డు, సముద్ర రవాణా పధకానే ఒన్‌ బెల్ట్‌ ఒన్‌ రోడ్‌ ప్రాజెక్టుఅని పిలుస్తున్నారు. చైనా చొరవతో ప్రారంభమైన ఈ పధకంలో చేరేందుకు దాదాపు వంద దేశాలు సంతకాలు చేశాయి. చైనాాపాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ కూడా దానిలో భాగమే. దానిలో చేరటమా లేదా అన్నది నిర్ణయించుకోవటానికి భారత్‌కు హక్కుంది. చేరకపోతే మన దేశం వంటరి అవుతుంది.ఆ పధకాన్ని వ్యతిరేకించేందుకు మద్దతు పలికిన అమెరికా ఇటీవల బీజింగ్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశానికి ఒక ప్రతినిధి వర్గాన్ని పంపింది. మనం మాత్రం దూరంగా వుండటం ఎవరికి ప్రయోజనమో ఆలోచించుకోవాలి.

మన విదేశాంగ విధానంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రెండు రకాల ధోరణులు వున్నాయి. పూసల్లో దారంలా సామాన్య జన ప్రయోజనాల కంటే మన కార్పొరేట్‌ సంస్ధలకు లాభాలే ముఖ్యంగా దానిని అమలు జరుపుతూ వచ్చారు. ఆ క్రమంలో 1991కి ముందు మన జనానికి కూడా కొన్ని వుపయోగాలు జరిగాయి. పెట్టుబడిదారుల నాయకత్వంలో భూస్వామిక శక్తులు స్నేహితులుగా మన పాలకవర్గ పొందిక వుంది. అందువలన రెండు దోపిడీ తరగతుల ప్రయోజనాలు ఎప్పుడూ ఇమిడి వుంటాయి. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు మన దేశం వదలి వెళ్లిన వెంటనే ఆ స్ధానాన్ని ఆక్రమించేందుకు అమెరికా ప్రయత్నించింది. అప్పుడే విస్తరణకు ప్రయత్నిస్తున్న స్వదేశీ పెట్టుబడిదారులకు అది సమ్మతం కాదు. అదే సమయంలో రెడవ ప్రపంచ యుద్ధంలో ఎంతో నష్టపోయినప్పటికీ సోవియట్‌ యూనియన్‌ పారిశ్రామికంగా బాగా పుంజుకున్నది. రాజకీయంగా సామ్రాజ్యవాదుల కూటమిని సవాలు చేసేదిగా బలంగా తయారైంది. దీన్ని అవకాశంగా తీసుకొని లబ్దిపడేందుకు సోవియట్‌వైపు మొగ్గిన పాలకవర్గం ఎంతగానో లబ్దిపొందింది. తనవైపు నిలబడిన నిలబడిన భారత్‌ను నిలుపుకొనేందుకు సోవియట్‌ యూనియన్‌, తమ వైపు ఆకర్షించేందుకు అమెరికా కూటమి కూడా మన దేశంలో అనేక బడాపరిశ్రమలు, ఇతర సంస్ధల ఏర్పాటుకు పోటీ పడ్డాయి. సోవియట్‌ది పైచేయిగా వుంది. 1950-90 దశకం మధ్య మన కార్పొరేట్‌ సంస్ధలు మరింత విస్తరించి మరొక దేశంతో నిమిత్తం లేకుండా స్వంతంగా బడా పరిశ్రమలు ఏర్పాటు చేసే స్ధాయికి ఎదగటమే కాదు, మన కంటే చిన్న దేశాలలో తమ పెట్టుబడులను పెట్టేవిగా తయారయ్యాయి. సోవియట్‌ కూలిపోవటం, ఆ సమయానికి బలమైన దేశీయ గుత్తపెట్టుబడిదారీ వర్గం తయారు కావటంతో ప్రభుత్వ ప్రమేయం తగ్గి ఆర్ధిక రంగాన్ని మొత్తంగా తమకు అప్పగించాలనే డిమాండ్‌ చేయటంతో సంస్కరణల పేరుతో 1991లో విధానాల మార్పుకు శ్రీకారం చుట్టారు. ఇదే సమయంలో ప్రపంచ ఆర్ధిక శక్తిగా వున్న అమెరికా తదితర దేశాలతో జతకట్టి జూనియర్‌ భాగస్వాములుగా మారేందుకు కూడా పాలకవర్గం నిర్ణయించుకుంది. పర్యవసానంగా మన మార్కెట్‌ను తెరవాల్సివచ్చింది. తొలుతు సంయుక్త భాగస్వామ్య సంస్ధల రూపంలో ప్రవేశించిన విదేశీ సంస్ధలు క్రమంగా వాటి స్ధానంలో తమ వుత్పత్తులనే నేరుగా ప్రవేశపెట్టాయి. ఎలక్ట్రానిక్‌ రంగంలో 1990 దశకంలో మార్కెట్‌కు వచ్చిన స్వదేశీ బ్రాండ్‌ టీవీలు ఇప్పుడు మనకు ఒక్కటీ కనపడదు, ఆటోమొబైల్‌ రంగంలో కూడా అదే పరిస్ధితి స్వరాజ్‌-మజ్డా, మారుతీ-సుజుకి, హీరో-హోండా వంటి కంపెనీల ఒప్పందాలు ముగిసిన తరువాత అత్యధిక భాగం విదేశీ కంపెనీలు తమ వుత్పత్తులను స్వయంగా ఇక్కడే తయారు(విడిభాగాల కూర్పు) చేయటం, ఇక్కడి నుంచి ఎగుమతులు కూడా చేయటం ప్రారంభించాయి. బలమైన స్వదేశీ హీరో వంటి కంపెనీలు వాటితో పోటీ పడుతున్నాయి. ఇప్పుడు మన రిటెయిల్‌ రంగంలోకి ప్రవేశించేందుకు అమెజాన్‌, మెట్రో, వాల్‌మార్ట్‌ వంటి కంపెనీలు రంగంలోకి దిగాయి. ఎప్పుడైతే సామ్రాజ్యవాద దేశాల నుంచి పెట్టుబడులు రావటం ప్రారంభమైందో ప్రపంచ రాజకీయాలలో వాటి విధానాలను కూడా మన మీద రుద్దటం ప్రారంభించారు. వుదాహరణకు ఇజ్రాయెల్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా స్వతంత్ర పాలస్తీనా పునరుద్దరణకు మద్దతు ప్రకటించింది మన దేశం. ఇప్పటికీ అధికారికంగా దాని నుంచి వైదొలగనప్పటికీ ఆచరణలో నీరుగార్చటాన్ని చూస్తున్నాము. ఇజ్రాయెల్‌తో సంబంధాలు పెంచుకోవటమే దానికి నిదర్శనం.

మన కార్పొరేట్‌ రంగం అటు సోవియట్‌, ఇటు అమెరికా, ఐరోపా ధనిక దేశాలను వినియోగించుకొని లాభపడేందుకు గతంలో ప్రయత్నించినట్లుగానే ఇప్పుడు కూడా చేస్తోంది. విబేధాలను వినియోగించుకొని లాభపడేందుకు చూడటం గురించి వేరే చెప్పనవసరం లేదు.తనకు నష్టం కలిగిస్తుందనుకున్నపుడు అమెరికా వాంఛలకు వ్యతిరేకంగా వ్యవహరించటాన్ని కూడా చూడవచ్చు. చైనాతో అమెరికా వాణిజ్య యుద్ధం ప్రారంభించింది అనగానే అది మనకు ఎలా లాభమో దాన్నుంచి ఎలా లబ్ది పొందవచ్చో సూచిస్తూ వాణిజ్య వార్తల పత్రికల్లో అనేక మంది విశ్లేషణలు రాశారు. దాదాపు అన్ని దేశాలతో వాణిజ్య లావాదేవీలలో ఈరోజు చైనా మిగులును కలిగి వుంది. ఈ పరిస్ధితి ఎంతకాలం అన్నది ఒక ప్రశ్న. ఇటీవలి కాలంలో చూస్తే అన్ని దేశాలూ ముఖ్యంగా ధనిక దేశాలు చైనా పట్ల ముద్దులాట-దెబ్బలాటలు అడుతున్నాయి. అమెరికా బెదిరింపులు, అదే సమయంలో ఐరోపా దేశాల మౌనం దానిలో భాగమే. మన విషయానికి వస్తే ఏటేటా చైనాతో వాణిజ్యలోటు పెరిగిపోతోంది. గడిచిన పది సంవత్సరాలలో ఈ మొత్తం 16 నుంచి 51బిలియన్‌ డాలర్లకు పెరిగింది.నరేంద్రమోడీ హయాంలో గత నాలుగు సంవత్సరాలలో తగ్గుదల తప్ప పెరుగుదల లేదు. కారణం చైనాతో రాజకీయంగా వైరభావంతో వుండటం ఒకటి అని వేరే చెప్పనవసరం లేదు. గత కొద్ది కాలంగా మన ఎగుమతిదారుల లాబీవత్తిడి కారణంగా ఈ మధ్య నరేంద్రమోడీ ఎలాంటి అజెండా లేకుండానే చైనా పర్యటన జరిపి వచ్చారు. పైకి అలా కనిపించినప్పటికీ మన దిగుమతులు పెంచాలని కోరటమే అసలు లక్ష్యం. అందుకే చైనాపై రెచ్చగొట్టే వైఖరిని ఇటీవలి కాలంలో తగ్గించింది అని కూడా చెప్పాలి.

Image result for narendra modi foreign policy, china cartoons

ఇరాన్‌తో రాజకీయ వైరంలో భాగంగానే దానితో కుదిరిన అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగింది. అయితే దానికనుగుణ్యంగా మన దేశం కూడా ఇరాన్‌తో తెగతెంపులు చేసుకుంటే నష్టపోయేది మనమే. అసలే చమురు ధరలు పెరుగుతూ దడపుట్టిస్తున్న తరుణంలో రూపాయి వాణిజ్యానికి అంగీకరించిన ఇరాన్‌ను వదులుకుంటే ఇబ్బంది మనకే. అందుకే అణుఒప్పందం విషయంలో మన వైఖరి ఇరాన్‌కు అనుకూలంగానే వుంది. మొత్తం మీద చూసినపుడు అమెరికా వైపే మొగ్గుచూపుతున్నప్పటికీ అది తమ లాభాలకు ముప్పురానంత వరకే మన కార్పొరేట్‌ రంగం దానిని అనుమతిస్తుంది, మొదటికే మోసం వచ్చినపుడు ప్రతిఘటించటం తప్పనిసరి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా రాస్తున్న రైతాంగ తల రాత- మోడీ సర్కార్‌ అమలు చేస్తున్న సబ్సిడీ కోత !

28 Monday May 2018

Posted by raomk in BJP, Current Affairs, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, USA

≈ Leave a comment

Tags

Farm prices, farm subsidies, farmers fate, indian farmers, US writing the farmers fate, WTO

Image result for US writing the indian farmers fate

ఎం కోటేశ్వరరావు

అమెరికా ! ఎందరో యువతీ యువకులకు కలల ప్రపంచం. అమెరికా !! అక్కడి కార్పొరేట్లతో చేతులు కలిపి తెల్లవారే సరికి ధనవంతులై పోవాలని చూసే వాణిజ్య, పారిశ్రామికవేత్తలు. వారి ప్రయోజనాల కోసం చొంగకార్చుకుంటూ అమెరికా పాలకుల అడుగులకు మడుగులత్తే పాలకులు. నిజానికది అమెరికా కష్ట జీవులతో ప్రపంచ శ్రామికుల మూలుగులు పీల్చి తన కార్పొరేట్ల కడుపులు నింపేందుకు ఎంతకైనా తెగించే ఒక దుర్మార్గ వ్యవస్ధ వున్న దేశం. మన దేశం రైతాంగానికి అధిక మొత్తంలో మద్దతు ధరలు కల్పిస్తున్నారని, ఇది ప్రపంచ వాణిజ్య సంస్ధ ఆమోదించిన నియమావళికి విరుద్దమని ఈ అక్రమంపై విచారణ జరపాలని 2018 మే నెల మొదటి వారంలో అమెరికా ఫిర్యాదు చేసింది. రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తామన్న మాటలు కోటలు దాటి వూరంతటికీ వినిపించే విధంగా వాగ్దానాలు చేసిన నరేంద్రమోడీ సర్కార్‌ కాలు ఆచరణలో గడపదాట లేదు. ఇంతవరకు కనీసం ఆ చర్యను ఖండిస్తూ గట్టిగా ఒక ప్రకటన కూడా చేయలేదు.

మన దేశంలో ప్రతి ఏటా ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలు ఏమాత్రం గిట్టుబాటు కావటం లేదని అందరూ అంగీకరిస్తున్నదే. రైతాంగంలో వున్న ఈ అసంతృప్తిని ఓట్ల రూపంలో మలుచుకొనేందుకు 2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి గత లోక్‌సభ ఎన్నికలలో వాగ్దానం చేసింది. ఆ దిశగా ఇంతవరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదు, గత నాలుగు సంవత్సరాలలో పరిస్ధితి మరింత దిగజారిందని అనేక రాష్ట్రాలలో ప్రారంభమైన రైతాంగ వుద్యమాలే అందుకు నిదర్శనం. మన దేశంలో అమలు జరుగుతున్న విధానాల గురించి పశ్చిమ దేశాలు ఏవిధంగా ఆలోచిస్తున్నాయి? ప్రపంచ వాణిజ్య సంస్ధకు ఫిర్యాదు చేసేంతగా అమెరికాను ప్రేరేపించేందుకు మన ప్రభుత్వం కొత్తగా తీసుకున్న చర్యలేమన్నా వున్నాయా?

ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యుటివో) వునికిలోకి వచ్చిన గత పద్దెనిమిది సంవత్సరాలుగా పశ్చిమ దేశాలు మన దేశ వ్యవసాయ ఆర్ధిక వ్యవస్ధలో ఎప్పుడు చొరబడదామా, లాభాలను ఎంత త్వరగా తరలించుకుపోదామా అని ఆతృతపడుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ సంస్కరణల గురించి కబుర్లు చెప్పటమే తప్ప సమూలంగా మార్చేందుకు అది ముందుకు రావటం లేదు, మేమొస్తే తెల్లవారేసరికల్లా చేయాల్సింది పూర్తి చేస్తామని దేశ, విదేశీ కార్పొరేట్‌ సంస్ధలకు బిజెపి అరచేతిలో వైకుంఠం చూపింది. ముద్దు చేసినపుడే చంకనెక్కేందుకు సరైన సమయం అన్నట్లుగా మోడీ సర్కార్‌ అధికారంలోకి రాగానే పశ్చిమ దేశాలు మరోసారి పెద్ద ఎత్తున తమ వాదనలను ముందుకు తెచ్చి ప్రభావితం చేసేందుకు ప్రయత్నించాయి. కొంత మేరకు జయప్రదం అయ్యాయి. అనేక మంది మంది మంత్రులు, ఇతరులు పశ్చిమ దేశాలు చేసిన వాదనలనే చిలుక పలుకుల్లా వల్లెవేశారు.

2014 ఆగస్టు చివరి వారంలో డిప్లొమాట్‌ అనే పత్రికలో డాన్‌ పియర్సన్‌ అనే రచయిత పశ్చిమ దేశాల ఆలోచనా సరళిని ప్రతిబింబిస్తూ ఒక పెద్ద విశ్లేషణ రాశారు.’ ప్రమాదకరమైన భారత ఆహార రాయితీలు’ అని దానికి పేరు పెట్టారు. దాని సారాంశం, అందుకు అనుగుణ్యంగా మోడీ సర్కార్‌ తీరు తెన్నులు ఎలా వున్నాయో చూద్దాం.

‘భారత వ్యవసాయ సబ్సిడీలు(రాయితీలు) ప్రపంచ రైతాంగానికి హాని కలిగించటంతో పాటు స్వంత ఆహార భద్రతకే ముప్పు తెస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధతో భారత్‌ ఇచ్చిన అంగీకారం మేరకు ఇప్పటికే వ్యవసాయ సబ్సిడీలు ఎంతో ఎక్కువగా వున్నాయి. ప్రపంచవ్యాపితంగా వ్యవసాయ వస్తువుల రేట్లు పడిపోతున్నాయి, ఆ రాయితీలు ఇతర దేశాల్లోని రైతులను నష్టపరుస్తాయి. దెబ్బకు దెబ్బ తీయాలనే విధంగా వారి ప్రభుత్వాలపై వుద్యుక్తులౌతారు. వ్యవసాయ వాణిజ్యం చేసే దేశాలు ఈ విషయాన్ని ప్రపంచవాణిజ్య సంస్ధ వివాదాల పరిష్కారానికి నివేదించాలి. భారత దుర్వినియోగానికి స్వస్తి పలకాలి. భారత్‌లో కృత్రిమంగా ఎక్కువ ధరలకు రైతుల నుంచి పంటలను కొనుగోలు చేస్తున్నారు. తరువాత కొంత భాగాన్ని ఐదులక్షల చౌకదుకాణాల ద్వారా 80కోట్ల మంది పేదలకు తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. వుద్దేశించిన వినియోగదారులకు 40శాతం ఆహారం చేరటం లేదని అంచనా. అనేక మంది ఇంకా ఆకలితో వుండగా ఆహార నష్టం జరగటం దుర్మార్గం. ఏటా 30లక్షల టన్నుల ఆహారాన్ని నేల మీద ప్లాస్టిక్‌ సంచులు కప్పినిలవ చేస్తున్నారు.భారత్‌ ఈ విధానాన్ని ఇంకా కొనసాగిస్తున్నది.

భారత వ్యవసాయ సబ్సిడీలు దాని స్వంత ఆర్ధిక వ్యవస్ధకే హాని కలిగిస్తున్నాయి. గోధుమ, వరి, చెరకు వంటి పంటల సాగుకు మరింత భూమి, నీటిని వినియోగించే విధంగా రైతాంగానికి రాయితీలు ఇస్తున్నారు. దీని వలన వినియోగదారులు కొనుగోలు చేయాలని కోరుకొనే ఇతర పంటలైన పండ్లు, కూరగాయలు తదితరాల వుత్పత్తి తగ్గుదలకు, అధికధరలకు దారితీస్తోంది. మౌలిక పంటల సాగును ప్రోత్సహించి ఆహార భద్రతను సాధించేందుకే ఇవన్నీ చేస్తున్నామని ముసుగులో భారత్‌ వీటిని సమర్ధించుకుంటోంది. ఇదే సాకుతో పంటలకు అధిక ధరలు ఇవ్వటాన్ని, దిగుమతులపై ఎక్కువ పన్నుల విధింపు, తదితర ఆటంకాలు కలిగించటాన్ని సమర్ధించుకుంటోంది. దిగుమతులపై ఆంక్షలు విధించటం ద్వారా సాయపడటం కంటే ఆహార భద్రత సరఫరాకు హాని ఎక్కువని అత్యధిక ఆర్ధికవేత్తలు అంగీకరిస్తారు. భారత్‌లో వార్షిక రుతుపవనాలు విఫలమైతే అది కరవుకు దారి తీసి పంటల వుత్పత్తి తగ్గుతుంది. కాబట్టి పూర్తిగా స్వంత వుత్పత్తి మీదే పూర్తిగా ఆధారపడితే సరఫరా షాక్‌లు తగిలే అవకాశం వుంది. అలాగాక పెద్దదైన, విస్తరించే గుణం వున్న ప్రపంచ మార్కెట్‌తో తన వ్యవసాయ ఆర్ధిక వ్యవస్ధను పూర్తిగా ముడివేయాలి.

కాబట్టి అమెరికా వంటి ధనిక దేశాలు ఏం కోరుకుంటున్నాయో రైతు సోదరులు, సమాజంలోని ఇతరులకు చెప్పనవసరం లేదు. 2011లో డిటిబి అసోసియేట్స్‌ అనే ఒక సంస్ధ చేసిన సర్వే ప్రకారం భారత్‌కు అనుమతించిన 37బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువగానే రాయితీలిస్తున్నట్లు తేలిందని, ఇది ప్రపంచ వస్తు మార్కెట్లను, వాటిపై ఆధారపడిన రైతాంగాన్ని దెబ్బతీస్తుందని సదరు విశ్లేషకుడు పేర్కొన్నాడు. ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలను భారత్‌ పాటించకపోతే ఇతర దేశాలు కూడా అదే విధానాన్ని అనుసరిస్తాయని బెదిరించిన ఈ పెద్దమనిషి అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కమిషన్‌లో పది సంవత్సరాలు పని చేశాడంటే ఎవరి అభిప్రాయాలను ప్రతిబింబించాడో చెప్పనవసరం లేదు.

రోగి కోరుకున్నదే వైద్యుడు ఇచ్చాడన్నది పాత లోకరీతి, బహుళజాతి గుత్త సంస్ధలు కోరుకుంటున్నవాటినే మన పాలకులు తీరుస్తున్నారన్నది నేటి రీతి. అది కాంగ్రెస్‌ అయినా బిజెపి అయినా ఒకటే. నరేంద్రమోడీ సర్కార్‌ బిజెపి సీనియర్‌ నాయకుడు శాంతకుమార్‌ అధ్యక్షతన ఒక వున్నత స్ధాయి కమిటీని ఏర్పాటు చేసింది. అది చేసిన సిఫార్సులను దేశీయ, విదేశీ కార్పొరేట్లన్నీ హర్షించాయంటే అవెలాంటివో చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఎఫ్‌సిఐ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు లోపభూయిష్టంగా వున్నాయి. రైతులందరికీ కనీస మద్దతు ధరల లబ్ది చేకూరటం లేదు, మరోవైపు వినియోగదారులు అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది.ఈ కమిటీ సిఫార్సుల ప్రకారం ఎఫ్‌సిఐ సేకరణను పరిమితం చేస్తారు. రాష్ట్రాల అవసరాలకు పోను మిగులు వున్న ధాన్యాన్నే అదీ ప్రభుత్వాల నుంచి కొనుగోలు చేస్తారు. అసలే రాష్ట్ర ఆర్ధిక వనరులు అంతంత మాత్రంగా వున్న స్ధితిలో ఇది రాష్ట్రాలపై భారం మోపటం, కేంద్రం తన బాధ్యతల నుంచి వైదొలగటం తప్ప వేరు కాదు. అన్ని రాష్ట్రాల నుంచి, రైతులందరి నుంచి కొనుగోలు చేసి లోటు రాష్ట్రాలకు సరఫరా చేయాల్సిన ఎఫ్‌సిఐ పాత్రను చిన్న కమతాలున్న రాష్ట్రాలకే పరిమితం చేయాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. ఏ రాష్ట్రమైనా తన రైతాంగానికి బోనస్‌ ఇచ్చేట్లయితే అలాంటి రాష్ట్రాల నుంచి మిగులు ధాన్యాన్ని కూడా ఎఫ్‌సిఐ కొనుగోలు చేయరాదని పేర్కొన్నది. ఇది రైతాంగానికి అన్యాయం చేయటమే.

రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తానని చెప్పిన నరేంద్రమోడీ సర్కార్‌ ఆచరణలో రైతాంగాన్ని ప్రయివేటు వ్యాపారులకు అప్పగించేందుకు చేయాల్సిందంతా చేస్తోంది. కనీస మద్దతు ధరలే తక్కువని రైతాంగం గగ్గోలు పెడుతుంటే వాటి కంటే మార్కెట్లో ధరలు తగ్గినపుడే ప్రభుత్వం జోక్యం చేసుకోవటం అంటే అంతకు మించి కొనుగోలు చేసేందుకు ప్రయివేటు వ్యాపారులు ముందుకు రారన్నది పత్తి విషయంలో చూశాము. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కొనుగోళ్లు ఎంఎస్‌పికే పరిమితం కావటం, రైతాంగం నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసిన వ్యాపారుల నుంచి మద్దతు ధరలకు కొనుగోలు చేసి వారికి లబ్ది చేకూర్చటం అందిరికీ తెలిసిందే. ఆహార భద్రతను జనాభాలో ఇప్పటి వరకు వున్న 67శాతం మందిని 40శాతానికి పరిమితం చేసేందుకు శాంతకుమార్‌ కమిటీ సిఫార్సు చేసింది.

ప్రపంచ ఆకలి సూచికలో మన దేశ స్ధానం గత నాలుగు సంవత్సరాలలో ఒకటో అరా పాయింటు దిగజారింది తప్ప మెరుగుపడలేదు, అయినప్పటికీ లబ్దిదారుల సంఖ్యను తగ్గించేందుకు ఈ కమిటీ సిఫార్సు చేయటం గమనించాల్సిన అంశం. ఆహార భద్రతలో రెండు అంశాలున్నాయి. రైతులకు అధిక ధరలు కావాలి, వినియోగదారులకు తక్కువకు ఇవ్వాలి అంటే ఎలా అన్న వాదనను ముందుకు తేవటం తెలిసిందే.గిట్టుబాటు ధరలు రాక ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల వుదంతాలు చూశాము గానీ, తమ వుత్పత్తులకు గిట్టుబాటు ధరరాక దివాలాతీసిన పారిశ్రామికవేత్తలను ఎక్కడా చూడలేదు. అలాగే ఆత్మహత్యల కారణాలలో నమోదైన వాటిలో ధరల పెరుగుదల అంశం ఎక్కడా కనపడదు. రైతులు పండించిన వాటికి గిట్టుబాటు ధర రాక, వినియోగదారుడిగా అధిక ధరలు చెల్లించి రెండు విధాలుగా నష్టపోతున్నాడు. వినియోగదారుడికి వస్తున్న నష్టం ఒక్కటే. అందువలన ప్రభుత్వాలు ఇరువురి ప్రయోజనాలను కాపాడాల్సిందే. అది దాని బాధ్యత.

Image result for US writing the indian farmers fate

ప్రభుత్వాల ద్రవ్యలోటు తగ్గాలంటే సమాజంలోని బలహీనవర్గాలకు ఇస్తున్న రాయితీలన్నింటికీ కోత పెట్టాలని ఎక్కువ మంది చెబుతారు. అదే సమయంలో వుపాధి కల్పించాలంటే పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు రాయితీలు ఇవ్వాలని కూడా ఆ వాదన చేసే వారే చెబుతారు. జరుగుతున్నదేమిటి? దేశంలో ఇస్తున్న రాయితీలన్నింటికీ కోత పెట్టారు. పెట్రోలు,డీజిల్‌ రాయితీ ఎత్తివేశారు. గ్యాస్‌, కిరోసిన్‌పై క్రమంగా ఎత్తివేస్తున్నారు. కాంప్లెక్స్‌ ఎరువులపై ధర నియంత్రణ ఎత్తివేశారు. వాటి మీద ఇచ్చే రాయితీలను తగ్గించటం లేదా ఒక పరిమితిదాట కుండా చూస్తున్నారు. ఎరువుల విషయం చూద్దాం. పౌష్టికాధార ప్రాతిపదికన రాయితీ విధానం(ఎన్‌బిఎస్‌) కింద నైట్రోజన్‌(ఎన్‌) కిలోకు 2011-12లో రు.27.15 ఇస్తే 2016-17కు రు.15.85కు తగ్గింది. ఇదే విధంగా ఫాస్ఫేట్‌ (పి)కు రు.32.34 నుంచి 13.24కు, పొటాష్‌(కె)కు రు.26.75 నుంచి 15.47కు తగ్గింది. ఇదే సమయంలో సల్ఫర్‌(ఎస్‌)కు రు.1.78 నుంచి 2.04కు పెరిగింది.(కేంద్ర ఎరువుల శాఖ 2016-17వార్షిక నివేదిక, పేజీ 41) యూరియా మీద రాయితీ కొనసాగుతున్నది, పెరుగుతున్నది. అన్నింటికీ ద్రవ్యోల్బణం ప్రాతిపదికన రేట్లు పెరుగుతున్నపుడు ఎరువుల రాయితీ మొత్తం కూడా ఆమేరకు పెరగాలి, కానీ అలా జరగటం లేదు. భారత ఫెర్టిలైజర్స్‌ అసోసియేషన్‌ సమాచారం మేరకు 2011-12 నుంచి 2014-15 మధ్య యూరియా మీద ఇస్తున్న రాయితీ 20,208 కోట్ల నుంచి 36వేల కోట్ల రూపాయలకు పెరిగింది. ఇదే సమయంలో ధరల నియంత్రణ ఎత్తివేసిన కాంప్లెక్‌ ఎరువులపై ఇస్తున్న రాయితీ రు.36,089 కోట్ల నుంచి 24,670 కోట్లకు పడిపోయింది. దిగుమతులతో సహా అన్ని రకాల ఎరువులకు ఇచ్చిన రాయితీలు వరుసగా నాలుగు సంవత్సరాలలో 70013,65613, 67971, 72970 కోట్ల వంతున వున్నాయి. ఈ ఏడాది మార్చినెలలో ప్రకటించిన బడ్జెట్‌ లెక్కల ప్రకారం 2017-18 సంవత్సరంలో ఇచ్చిన రాయితీల సవరించిన మొత్తం రు.64,973 కోట్లు కాగా దీనిలో 42,721 కోట్లు యూరియా వాటా, వర్తమాన సంవత్సరం అంటే 2018-19లో మొత్తం సబ్సిడీ రు.70,079 కోట్లకు పెంచగా దానిలో యూరియా నిమిత్తం 44,989 కోట్లుగా ప్రతిపాదించారు. అంటే మొత్తంగా ఎరువుల రాయితీ తగ్గుతున్నట్లా పెరుగుతున్నట్లా ?

ఒకటి రెండు సంవత్సరాలలో తప్ప జనానికి ఇచ్చే ఆహార, పెట్రోలియం వుత్పత్తుల, ఎరువుల సబ్సిడీ మొత్తం జిడిపిలో ఒకశాతానికి అటూ ఇటూగా వుంటున్నాయి. ఇదే సమయంలో కార్పొరేట్‌లకు ఇస్తున్న రాయితీలు ఐదు నుంచి ఎనిమిదిశాతం మధ్యన వుంటున్నాయి. ఐదుశాతం రాయితీలు ఇస్తున్నామని, వాటిని ఎత్తివేస్తే జిడిపిలో పన్ను 22శాతానికి పెరుగుతుందని ప్రధాని ఆర్ధిక సలహా మండలి అధ్యక్షుడు వివేక్‌ దేవరాయ్‌ 2017 డిసెంబరులో చెప్పారు. మన దేశంలో జిడిపిలో పన్ను 15శాతమే, అదే ఇతర బ్రిక్స్‌ దేశాలైన బ్రెజిల్‌లో 25.4, రష్యాలో 23,చైనాలో 18.9, దక్షిణాఫ్రికాలో 26శాతం కాగా అమెరికాలో 28, స్కాండినేవియన్‌ దేశాలలో 45-50శాతం మధ్య వున్నాయి. అందువలన రకరకాల ముసుగుల్లో విదేశాలకు, దేశీయ కార్పొరేట్‌ సంస్ధలకు తరలిపోతున్న లాభాలపై పన్ను రేటు పెంచి ఆ వచ్చిన మొత్తాన్ని అటు రైతాంగం, ఇటు వినియోగదారులకు రాయితీలు ఇస్తే ఎవరూ ఇబ్బంది పడకుండా వుంటారు. అలాంటి సంస్కరణలకు ఈ పాలకులు పూనుకుంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఫిట్‌నెస్‌ కాదు మోడీజీ, మౌనముద్ర సవాల్‌ స్వీకరించండి !

26 Saturday May 2018

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Anushka sarma, fitness challenge, Kohil's challenge, Narendra Modi, narendra modi fitness challenge, petrol price, Rahul gandhi

Image result for narendra modi fitness challenge

ఎం కోటేశ్వరరావు

అమెరికాలో ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి రేటు, వడ్డీ రేటు పెంచితే మన రూపాయి విలువ మరింత దిగజారుతుందా ? అవును, ఇదేమి లంకె అనుకుంటున్నారా ? చమురు ధరలు పెరిగితే దానిని వుత్పత్తి దేశాలకు ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం, ఆనందం. మనకు విషాదం, తారాజువ్వల్లా ధరల పెరుగుదల ! ఎంకిపెళ్లి సుబ్బి చావుకు రావటం అంటే ఇదేనా ! ప్రపంచ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల మన రూపాయి విలువ పతన కారణాలలో ఒకటని అనేక మంది చెబుతుంటే మన చమురు, సహజవాయు శాఖ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గారు మాత్రం దానికి రూపాయి విలువ పతనం అని మరొకదాన్ని జోడించి మన దేశంలో పెట్రోలియం, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయని సెలవిచ్చారు. చమురు ధరలు మన చేతుల్లో లేవు సరే మన రూపాయి విలువ కూడా మన అదుపులో లేదా ? పాపాయి వంటి రూపాయికి రక్షణ లేకుండా పోతోందని ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ గుండెలు బాదుకున్న విషయం మరచిపోయారా ?

పెట్రోలు ధరల గురించి ఈ రోజు రాసింది రేపటికి చద్దివార్త అవుతోంది. ధరలు మారిపోతున్నాయి. అందువలన ఈ రోజు ఎంత అన్నది వదిలేద్దాం. కొద్ది నెలల క్రితం గోల్డ్‌మన్‌ సాచస్‌ అనే సంస్ధ విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం అమెరికాలో ఆర్ధిక వ్యవస్ధ మెరుగుపడుతున్న కారణంగా(ఎలాంటిది, ఎంతనేది వేరే విషయం) నిరుద్యోగరేటు తగ్గుతోంది, పర్యవసానంగా 2018లో అక్కడ వడ్డీ రేట్లు నాలుగు సార్లు పెరిగే అవకాశం వుందన్నది ఒక అంశం. ఇదే జరిగితే బలహీనమైన ఆర్ధిక వ్యవస్ధలతో అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడి(డాలర్ల రూపంలో) అమెరికన్‌ మార్కెట్లకు తరలిపోతుంది. అటువంటి పరిస్ధితులలో మనది బలహీన ఆర్ధిక వ్యవస్ధ కానప్పటికీ దేశంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఎఫ్‌పిఐలు షేర్‌ మార్కెట్లో, అప్పు మార్కెట్లో పెట్టుబడులు పెడతారు. ఎక్కడ మోసం చేయటానికి జనం దొరుకుతారో అక్కడికి నవారు ఆట మోసగాండ్లు ఎప్పటికప్పుడు మకాంలు ఎలా మారుస్తారో అలాగే విదేశీ మదుపుదార్లు మన దేశంలో కంటే వాటిమీద ఎక్కడ ఎక్కువ రాబడి వస్తే అక్కడకు ఇక్కడ అమ్మేసి తరలిస్తారు. వారికేమీ దేశభక్తి, మన దేశం ఏమి అవుతుంది అనేదేమీ వుండదు. అలా పెట్టుబడులు తరలిపోయినపుడు వాటి మీద ఆధారపడి ప్రారంభించిన కొత్త ప్రాజెక్టులు, విస్తరణ ఆగిపోతుంది. నిరుద్యోగం పెరుగుతుంది. అమెరికాలో పరిస్ధితులు మెరుగుపడితే మన రూపాయి విలువ పతనం అవుతుంది, దిగజారితే డాలరు విలువ తగ్గి మన రూపాయి విలువ పెరుగుతుంది. అప్పుడు మనం కొనే చమురుకు చెల్లించాల్సిన డాలర్ల మొత్తం తగ్గుతుంది. అసలు చమురు రేట్లే పెరిగితే ఆ భారం ఇంకా పెరుగుతుందని చెప్పనవసరం లేదు.

అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే అక్కడ వున్న ప్రవాస భారతీయులు అక్కడే పెట్టుబడులు పెడతారు తప్ప మన దేశానికి డాలర్లను తరలించరు. మన వారికే దేశభక్తి లేనపుడు మిగతావారి గురించి చెప్పేదేముంది. అమెరికా ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది. అక్కడ వాటి వడ్డీ రేట్లు పెరిగితే మన దేశం కంటే అక్కడ ఎక్కువ వచ్చేట్లయితే ఇక్కడి అప్పును అయినకాడికి అమ్మేసి డాలర్లను తీసుకుపోతారు. దీని ప్రభావం మన స్టాక్‌ మార్కెట్‌ మీద కూడా పడుతుంది. మన దేశంలో పెట్టుబడులు కావాల్సిన వారు విదేశాల నుంచి తీసుకోవాలంటే ఎక్కువ రేటు చెల్లించాలి. గతంలో మన రూపాయి విలువ ఎక్కువగా వుండి డాలరు విలువ తక్కువగా వున్నపుడు అందిన కాడికి మన కంపెనీలు అప్పులు తీసుకువచ్చాయి. తరువాత డాలరు రేటు పెరగటం, మన రూపాయి పతనంతో ఆ కంపెనీలు తలకు మించిన రుణభారంతో దెబ్బతిన్నాయి.

తిరుగుతున్న చక్రం మీద కూర్చున్న ఈగ చక్రాన్ని తానే తిప్పుతున్నట్లు భావిస్తుందట. నరేంద్రమోడీ సర్కార్‌ గత నాలుగు సంవత్సరాలలో మూడు సంవత్సరాలు విజయగీతాలాపన చేశారు. నాలుగోఏడాది పూర్తయ్యే సరికి గొంతు బొంగురు పోతోంది.యుపిఏ హయాంలో 2012-13 సంవత్సరాలలో చమురు పీపాధర 150 డాలర్ల వరకు పోయింది. సరే అప్పుడు పెట్రోలు లీటరు రు.70కి అటూ ఇటూగా వున్నపుడు ఇంత ఘోరమా అంటూ బిజెపి పెద్దలందరూ వీధులలో నిరసనలతో హోరెత్తించారు. అలాంటి ధరలు కాస్తా నరేంద్రమోడీ అధికారానికి వచ్చాక ఒక దశలో కనిష్టంగా 33 డాలర్లకు పడిపోయాయి. అయినా పెట్రోలు రు.60కి మించి తగ్గలేదు. చమురు ఆదాయం మీద ఆధారపడిన అనేక దేశాలు అల్లాడుతుంటే మన దేశం ఎంతో లబ్ది పొందింది. అది సామాన్య జనానికి కాకుండా కార్పొరేట్లకు అన్నది తిరుగులేని నిజం. తగ్గిన చమురు భారాన్ని జనానికి బదలాయించకుండా వచ్చిన లాభాన్ని ద్రవ్యలోటు పూడ్చేందుకు వినియోగించి లోటును తగ్గించిన ఘనత మాదే అని గొప్పలు చెప్పుకున్నారు. ఇదే సమయంలో కార్పొరేట్లకు పెరిగాయి తప్ప రాయితీలు ఏమాత్రం తగ్గలేదు. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం మరియు సహజవాయు శాఖ వార్షిక నివేదికల ప్రకారం ముడి చమురు దిగుమతులు, పీపా సగటు ధరలు ఇలా వున్నాయి.

సంవత్సరం    మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు    ధర డాలర్లలో        దిగుమతి ఖర్చు రు.కోట్లు

2011-12         171.729               111.89                ======

2012-13         184.795              107.97           7,84,562

2013-14         189.238            105.52            8,64,875

2014-15         189.43                84.16            6,87,416

2015-16         202.85                46.17             4,16,579

2016-17        213.93                47.56              4,70,159

2017-18        217.08                53.59             3,42,673

2017-18 సంవత్సరంలో 217 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు దిగుమతి అంచనా కాగా మూడు లక్షల 42వేల 673 కోట్లు ఏప్రిల్‌-నవంబరు మాసాలలో దిగుమతి చేసుకున్న మొత్తానికి చెల్లించిన సొమ్ము. ఈ అంకెలు నరేంద్రమోడీ సర్కార్‌పై చమురు దిగుమతుల బిల్లు భారాన్ని ఎంతగా తగ్గించాయో చెబుతున్నాయి. ఇంత భారం తగ్గినప్పటికీ దాన్ని వినియోగదారులకు బదలాయించకపోగా మోడీ ప్రభుత్వం వినియోగదారులపై అదనంగా ఎంత భారం మోపిందో చూద్దాం.

2013-14లో(నరేంద్రమోడీ 2014 మే 26న పదవిలోకి వచ్చారు) యుపిఏ సర్కార్‌ పెట్రోలు, డీజిల్‌, ఇతర పెట్రోలియం వుత్పత్తుల మీద విధించిన పన్నుల ద్వారా కేంద్రానికి వచ్చిన ఆదాయం 88,600 కోట్ల రూపాయలు. ఈ మొత్తం మోడీ హయాంలో వరుసగా నాలుగు సంవత్సరాలలో 1,05,653, 1,85,598, 2,53,254, 2,01,592, 2,57,850లకు పెరిగింది. ఈ అంకెలలో 2017-18 సంవత్సరానికి చూపిన 2,01,592 కోట్ల రూపాయలు ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు మాత్రమే. అంటే మిగిలిన మూడు నెలలకు సగటున మరో 67వేల కోట్ల రూపాయలను వేసుకుంటే 2,68,790 కోట్లుగా వుంటుంది.ఈ లెక్కన నాలుగేండ్లలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల సబ్సిడీని వుపసంహరించిందో, ఎన్నిలక్షల కోట్ల భారం మోపిందో అర్ధం చేసుకోవటం కష్టం కాదు.

పిఎంఓ రిపోర్డు కార్డు పేరుతో అచ్చు కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ అనే భ్రమ కలిగించే ఒక బిజెపి ప్రచార వెబ్‌సైట్‌ వుంది. దాని మీద ప్రధాని బొమ్మ, మూడు సింహాలు, జాతీయ జెండా కూడా వుంటాయి. దాని మీద సామాన్యులకు అర్ధం కాకుండా అనధికారికం అనే ఒక పదం వుంటుంది. అయితే దాని ఫేస్‌బుక్‌ పేజీ చూస్తే కాని అది అనధికారికం, వలంటీర్లు నిర్వహిస్తున్నది అని తెలుస్తుంది. వలంటీర్లంటే కిరాయి బాపతు అని వేరే చెప్పనవసరం లేదు. మోడీ సర్కార్‌కు పెట్రోలు మంటల సెగ తగులుతుండటంతో ఆ గ్యాంగు ఒక పట్టికను తయారు చేసి జనం మీదకు వదిలింది.

2009-13 సంవత్సరాల మధ్య, తరువాత 2018వరకు ముంబైలో పెట్రోలు ధరలంటూ ఒక పట్టిక ఇచ్చింది. వాటిని ఎలా నిర్ధారించారో తెలియదు, వదలివేద్దాం. యుపిఏ ఐదేండ్ల కాలంలో పెట్రోలియం వుత్పత్తుల మీద ఇచ్చిన సబ్సిడీ దాని పట్టిక ప్రకారం 5,67,449 కోట్లు, తరువాత మోడీ నాలుగు సంవత్సరాల కాలంలో ఇచ్చిన మొత్తం 1,33,663 కోట్లుగా తెలిపింది. యుపిఏ హయాంలో ఇచ్చిన సబ్సిడీ నుంచి మోడీ ఏలుబడి సబ్సిడీ మొత్తాన్ని తీసి వేసి యుపిఏ కాంగ్రెస్‌ లూటీ చేసిన 4,43,308 కోట్ల రూపాయల మొత్తం ఏమైందో ఆశ్చర్యంగా వుందంటూ ఒక వ్యాఖ్యను జోడించారు. లూటీ మొత్తమంటూ పేర్కొన్నది కూడికలు తీసివేతలు కూడా సరిగా రాని వారు వేసిన అంకె. ఆ మొత్తం వినియోగదారులకు దక్కింది అని వేరే చెప్పనవసరం లేదు. ఇక్కడ మోడీగారిని అడగాల్సింది, జనానికి తెలియాల్సిందేమంటే ఆ పట్టిక ప్రకారం సబ్సిడీలో విధించిన కోత 4,33,786 కోట్లు, పెంచిన పన్నులతో వసూలు చేసిన మొత్తం 8లక్షల 20వేల కోట్లకు అటూగా వుంది. అంతకు ముందు మాదిరి పన్ను రేటు అలాగే వుందనుకుంటే అది ఏడాదికి ఒక లక్ష కోట్ల రూపాయలనుకుంటే మోడీ సర్కార్‌ జనం మీద మరో నాలుగు లక్షల కోట్ల భారం మోపినట్లే ? దీనికి కోతపెట్టిన సబ్సిడీని కూడా కలుపుకుంటే ఏడాదికి రెండులక్షల కోట్ల మేరకు జనం మీద భారం మోపినట్లే . జనం ఆశ్చర్యపోవాల్సిందీ, నిలదీయాల్సిందీ ఇంత భారం మోపి సాధించిన ప్రగతి ఏమిటీ అని?

నాలుగు సంవత్సరాల క్రితం అమెరికాలో ఒక వ్యాధి మీద పరిశోధనకు అవసరమైన నిధుల సేకరణకు కొంత మంది ఒక బకెట్‌లో నీళ్లు, మంచు ముక్కలు కలుపుకొని తల మీద పోసుకొని ఇతరులు కూడా అలాగే చేయాలని సవాలు విసిరారు. జనం వేలం వెర్రిగా ఆపని చేశారు. సరే తరువాత అది ఎంత అపహాస్యమైందో ఎన్ని జోకులు పేలాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు నరేంద్రమోడీ గారిని జనం చమురు గురించి, ఇతర వాగ్దానాల గురించి నిలదీస్తుంటే వాటికి ఎక్కడా సమాధానాలు చెప్పటం లేదు. ఇప్పుడు మరోవేలం వెర్రిగా మారుతున్న ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను పట్టుకొని జనాలు తామేం చేస్తున్నదీ ఫొటోలు పెడుతున్నారు.దాన్లో భాగంగా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ తన భార్య అనుష్కశర్మతో పాటు ప్రధాని నరేంద్రమోడీకి కూడా ఫిట్‌నెస్‌ సవాలు విసిరాడు. వయసులో వున్న కోహ్లీ నాలుగు కాలాలపాటు క్రికెట్‌ ఆడి, నాలుగు వాణిజ్య ప్రకటనలు చేసి నాలుగు డబ్బులు వెనకేసుకోవాలంటే ఫిట్‌నెస్‌ అవసరం. ఆయన భార్య అనుష్కశర్మ సినిమా హీరోయిన్‌, ఆమెదీ అదే పరిస్ధితి, అందులోనూ వారిద్దరికీ ఈ మధ్యే వివాహం కూడా అయింది.ఫిట్‌నెస్‌ గురించి వారిద్దరూ ఒకరికొకరు సవాలు విసురుకున్నారంటే అందం, అర్ధం వుంది. మరి ఈ వయస్సులో నరేంద్రమోడీకి ఎందుకు ! ఒకవైపు దేశంలో మీరు ప్రధాని పదవికి అన్‌ఫిట్‌ (తగరు) అనే అభిప్రాయం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇటువంటి స్ధితిలో ప్రతిపక్షాలు విసురుతున్న అనేక సవాళ్ల గురించి పట్టించుకోకుండా దేశం తగులబడుతుంటే ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తి మాదిరి నేను కూడా శారీరక ఫిట్‌నెస్‌ సవాలును స్వీకరిస్తా అంటూ క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో సై అనటం నరేంద్రమోడీకి తగని పని. నీరోకూ ఆయనకు పెద్ద తేడా కనపడటం లేదు. దేశమంతటా చమురు ధరల గురించి చర్చ చేస్తుంటే చమురు సవాలును స్వీకరించాలని రాహుల్‌ గాంధీ విసిరిన సవాలు గురించి మౌన ముద్రదాల్చారు. సామాజిక మీడియాలో దాని మీద పేలుతున్న జోకులెన్నో సరేసరి. నిజానికి ఇప్పుడు నరేంద్రమోడీ ముందున్నది మరోసారి ప్రధాని పదవికి అర్హత వుందా అన్నది పెద్ద సవాల్‌. ఏ ప్రధాన సమస్య గురించి నోరు విప్పని మోడీ వాటి గురించి మాట్లాడాలి.

మన దేశంలో కేంద్రంలో ఎవరు అధికారానికి వచ్చినా ఒకే చెప్పుల్లో కాళ్లు దూర్చుతున్నారు, ఒకే బాటలో నడుస్తున్నారు. అది పదేండ్ల మన్మోహన్‌ సింగ్‌ పాలన కావచ్చు, నాలుగేండ్ల నరేంద్రమోడీ ఏలుబడి కావచ్చు. ప్రపంచీకరణ యుగంలో మనం ఒంటరిగా వుండలేమన్నది నిజం. కిటికీ మూసుకుంటే గాలి ఆడక వుక్కిరి అవుతాం. తెరిస్తే ఈగలు, దోమలతో పాటు ఇప్పుడు కొత్తగా గబ్బిలాల వైరస్‌ కూడా ప్రవేశించే ప్రమాదం వుంది. ఇప్పటికే దేశంలో అంతకు మించి ముప్పు తెచ్చే మతోన్మాద వైరస్‌ ప్రమాదకరంగా విస్తరిస్తోంది. దీనికి దివాళాకోరు ఆర్ధిక విధానాల కారణంగా ఆర్ధిక దిగజారుడు తోడైంది. వీటిని జంటగా ఎదుర్కోవటం పెద్ద సవాల్‌. దేశం ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మీ ఇంటికొస్తే మాకేమి ఇస్తారు, మా ఇంటి కొస్తూ మాకేమి తెస్తారంటే కుదరదు అమెరికా పెద్దన్నా !

22 Tuesday May 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

america first, anti china, CHINA TRADE, Donald trump, Indo-China trade, TRADE WAR, US-CHINA TRADE WAR

ఎం కోటేశ్వరరావు

వాణిజ్య యుద్ధంలో అమెరికా ముందు చైనా చేతులెత్తేసిందా? ఏమో ! చైనా మెడలు వంచి వాణిజ్య పోరులో అమెరికా విజయం సాధించిందా ? ఏమో చెప్పలేం గానీ తాత్కాలికంగా రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరింది. ‘చైనాతో యుద్దం వాయిదా పడింది, కానీ ట్రంప్‌ వ్యూహ గందరగోళం కొనసాగుతూనే వుంది’ . కార్పొరేట్ల పత్రిక ఫోర్బ్స్‌ ఒప్పందంపై రాసిన తక్షణ విశ్లేషణ శీర్షిక ఇది. ‘ చైనా ముఖ్యమైన ప్రయోజనాలను కాపాడుకుంది’ ఇది చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక విశ్లేషణకు పెట్టిన శీర్షిక. వివరాలేమీ తెలియకుండానే అమెరికాన్లకు చైనా లంగిపోయిందని సంతోష పడే వారికి చివరకు మిగిలేది నిరాశే అని గత చరిత్రను బట్టి చెప్పక తప్పదు.

ప్రపంచంలో స్వేచ్చా వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు అమెరికా నాయకత్వంలోని ధనిక దేశాలు వునికిలోకి తెచ్చినదే ప్రపంచవాణిజ్య సంస్థ(డబ్ల్యుటిఓ). అది ఒక పక్క వుండగానే మరోవైపు దానిలోని సభ్యదేశాలు వాణిజ్య యుద్ధాలకు తలపడటం అంటే దాని వైఫల్యాన్ని సూచిస్తున్నది. నిజానికి ప్రపంచీకరణ యుగంలో రెండు దేశాల మధ్య తలెత్తే వాణిజ్యపోరు, పరిష్కారం కూడా వాటికే పరిమితం కాదు. ప్రపంచంలో ప్రతి ధనిక దేశమూ చైనాతో వాణిజ్యంలో లోటుతోనే వుంది, కనుక ప్రతి దేశమూ దానిని తగ్గించుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూనే వుంటుంది. వాటిలో అమెరికా ఒకటి. దిగుమతి సుంకాల పెంపుతో ఎవరైనా చైనాను దెబ్బతీయాలని చూస్తే ఆ విబేధాన్ని వినియోగించుకొనేందుకు మిగతా దేశాలు కాచుకొని వుంటాయి, వున్నాయి. అందుకు పెద్ద వుదాహరణ మన దేశమే.

కాషాయ మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో నిత్యం చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతుంటారు. దేశభక్తి నిరూపణకు చైనా వ్యతిరేకతను ఒక ప్రమాణంగా ముందుకు తెస్తున్నారు. అయితే గతకొద్ది నెలలుగా ప్రధాని నరేంద్రమోడీ, విదేశాంగమంత్రి మొదలు, వున్నత అధికారయంత్రాంగం మొత్తం చైనాతో సయోధ్య దిశగా ముందుకు పోతున్నారంటే అతిశయోక్తి కాదు. పాత సామెత ప్రకారం వ్యాపారి వరదనబడి పోతున్నాడంటే ఏదో లాభం కనిపించబట్టే అని వేరే చెప్పనవసరం లేదు. కమ్యూనిస్టు వ్యతిరేకతలో అమెరికా కంటే సంఘపరివారం పేరుమోసిందేమీ కాదు. అలాంటి అమెరికానే చైనాతో కాళ్లబేరానికి వస్తున్నపుడు పరివార పెద్దలైన మోడీ, మరొకరు ఎంత? వారంతా కార్పొరేట్ల ప్రతినిధులు తప్ప మరొకరు కాదు. ఎడ్లెవిస్‌ అగ్రీవాల్యూ చైన్‌ లిమిటెడ్‌ కంపెనీ పరిశోధన విభాగ అధిపతి పెరెరాణా దేశాయ్‌ చైనా-అమెరికా వాణిజ్య పోరు గురించి ఇలా చెప్పారు.’ ఎగుమతుల ధరలు పోటాపోటీగా వున్నట్లయితే అయిల్‌ సీడ్స్‌ మీల్స్‌ అయిన సోయా, ఆవ, పత్తి మరియు మొక్కజన్న భారతీయ ఎగుమతిదార్లకు ఒక చిన్న వ్యవసాయ ఎగుమతి కిటికీ తెరుచుకుంటుంది. నూట ఆరు అమెరికా వుత్పత్తులపై చైనా 25శాతం వరకు కొత్త పన్నులు ప్రకటించింది, అంతకు ముందు 128 అమెరికా వుత్పత్తులపై పన్నులు పెంచింది. రెండు అతి పెద్ద దేశాలు ఒక వాణిజ్య యుద్ధంలోకి అడుగుపెట్టాయి.పదమూడు వందల చైనా వుత్పత్తులపై అమెరికా 25శాతం పన్నులు విధించింది.’ భారత పత్తి సంఘం అధ్యక్షుడు అతుల్‌ గణత్ర మాట్లాడుతూ ‘ అమెరికా తరువాత పత్తి ఎగుమతిలో స్థానం భారత్‌దే. చైనా 50మిలియన్‌ బేళ్ళ పత్తి దిగుమతి చేసుకుంటే దానిలో 40శాతం అమెరికా నుంచి వస్తోంది. ఆ పత్తిపై చైనా 25శాతం పన్ను విధిస్తోంది. మన పత్తిపై చైనాలో ఎలాంటి పన్నులు లేవు, అందువలన అమెరికా పత్తి కంటే మన సరకు చౌక అవుతుంది కనుక మనకు ఇది మనకు లాభదాయకం.’ సౌరాష్ట్ర జిన్నర్స్‌ అసోసియేషన్‌ ఆనంద్‌ పోపట్‌ మాట్లాడుతూ ఆస్ట్రేలియా, ఆఫ్రికన్‌ కాటన్‌ కంపెనీల కంటే మన పత్తి ధర చౌక, భారత సోయాబీన్‌పై వున్న ఆంక్షలను చైనా తొలగించినట్లయితే వారికి మనం సరఫరా చేయగల మరొక వస్తువు అవుతుంది. చైనాకు అవసరమైన 93.4 మిలియన్‌ టన్నులు సోయాలో ప్రస్తుతం అమెరికా 39శాతం సరఫరా చేస్తోంది.’ అన్నారు. చైనా పశు, కోళ్ల దాణాకు వుపయోగించే సోయాను మన దేశం నుంచి ఎగుమతి చేసేందుకు ఇప్పుడున్న ఆంక్షల ఎత్తివేతకు మన దేశవాణిజ్య శాఖ సంప్రదింపులు జరుపుతోంది.

గత నాలుగు సంవత్సరాలుగా నరేంద్రమోడీ సర్కార్‌ తన విజయాల గురించి ఎన్ని అతిశయోక్తులు చెబుతున్నప్పటికీ కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లుగా పరిస్ధితి వుంది. మన వాణిజ్యలోటు గతేడాది ఏప్రిల్‌లో 13.25బిలియన్‌ డాలర్లు వుండగా ఈ ఏడాది 13.72 బిలియన్లకు పెరిగింది. రోజు రోజుకూ చమురు ధరల పెరుగుదల కారణంగా ఇది మరింత విస్తరించటమే కాదు, మన దేశం నుంచి డాలర్లు తరలిపోవటం పెరుగుతుండటంతో విదేశీమారకద్రవ్య సమస్యకూడా తలెత్తే అవకాశం వుంది. ఎక్కడన్నా బావే కాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు మన మార్కెట్లో ప్రవేశించేందుకు మోడీని కౌగలించుకోవటం తప్ప వారి మార్కెట్లలో మనకు ప్రవేశం ఇవ్వటం లేదు. మన దేశ ధనికులు ఏ కారణం చేతో బంగారం, బంగారు ఆభరణాలు, ముత్యాలు, రంగురాళ్లు దిగుమతి చేసుకోవటం తగ్గించబట్టిగాని లేకపోతే వాణిజ్యలోటు మరింత పెరిగి వుండేది. గత ఏప్రిల్‌లో చమురు దిగుమతులకు 7.36బిలియన్‌ డాలర్లు మనం చెల్లించగా ఈ ఏడాది ఆ మొత్తం 10.41బిలియన్లకు పెరిగింది.

ప్రపంచంలో నేడు చైనా పెద్ద ఎగుమతిదారే కాదు, పెద్ద వినియోగదారుగా కూడా మారుతోంది. అక్కడి జనాభా కొనుగోలు శక్తి పెరుగుతున్న కారణంగా ఆ మార్కెట్‌ను వదులుకొనేందుకు ఏ ధనిక దేశమూ సిద్దంగా లేదు. అలాంటి దేశంతో మనం అనవసరంగా తగాదా పెట్టుకోవాల్సిన అవసరం ఏముందనే అభిప్రాయం మన కార్పొరేట్‌ రంగంలో క్రమంగా పెరుగుతోంది. సంఘపరివార్‌ చైనా వ్యతిరేక చిల్లర ప్రచారం ఎలా వున్నప్పటికీ ప్రభుత్వపరంగా అది కుదరదని స్పష్టం చేస్తున్న కారణంగానే ఇటీవలి కాలంలో డోక్లాం దగ్గర నుంచి అనేక సానుకూల వైఖరులను వెల్లడిస్తున్నది. చైనా ఆహార, ఔషధ నియంత్రణ శాఖ వద్ద పెండింగ్‌లో వున్న 254 వుత్పత్తుల నమోదుకు వేగంగా అనుమతులు తీసుకోవాలని మన ఫార్మారంగం మోడీ సర్కార్‌ మీద వత్తిడి తెస్తోంది.

తాను ఎగుమతి చేయటమే తప్ప దిగుమతులు చేసుకోవటం లేదన్న విమర్శలను పూర్వపక్షం చేసేందుకు లేదా ఎవరేమి ఎగుమతి చేయగలరో చూపండి అన్నట్లుగా ఈ ఏడాది నవంబరు నెలలో షాంఘై నగరంలో తొలిసారిగా చైనా దిగుమతుల ప్రదర్శన నిర్వహిస్తోంది. అంటే ప్రపంచ దేశాలన్నీ తమ వుత్పత్తులను అక్కడ ప్రదర్శించాల్సి వుంటుంది. రానున్న ఐదు సంవత్సరాలలో తాము పది లక్షల కోట్ల డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటామని చైనా చెబుతోంది. అందువలన ప్రతి దేశం తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రయత్నిస్తుంది. షాంఘై ప్రదర్శనలో చైనా తన విధానాన్ని, నిబంధనలను ప్రపంచానికి తెలియచేయనుంది. ఈ ప్రదర్శనలో మన దేశం నుంచి కనీసం వందమంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం వుంది. చైనా వస్తువుల దిగమతులు నిలిపివేసి దేశభక్తి నిరూపించుకోవాలని సంఘపరివార్‌ సంస్ధలు ఎంతగా గగ్గోలు పెట్టినా గత ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు మన దేశం చైనా నుంచి 69.4బిలియన్‌ డాలర్ల మేరకు వస్తువులను దిగుమతి చేసుకోగా ఇదే సమయంలో కేవలం 11.5బిలియన్ల మేరకు మాత్రమే ఎగుమతులు చేసింది. వాణిజ్య తేడా 58 బిలియన్‌ డాలర్లు. చైనాతో సరిహద్దు సమస్యతో పాటు వాణిజ్యపరంగా ఇలాంటి ఎన్నో ప్రాధాన్యత అంశాలున్నందున వారితో వైరం తెచ్చుకోవాలని ఏ కార్పొరేట్‌ సంస్ధా కోరుకోదు. పాలకులు ఎవరైనా అలాంటి పిచ్చిపనులకు పూనుకుంటే వైఖరి మార్చుకునే విధంగా తాను చేయాల్సింది చేస్తుంది. ఈ పూర్వరంగంలోనే ఎలాంటి ముందస్తు ఎజండా లేకుండా నరేంద్రమోడీ చైనా వెళ్లినప్పటికీ సానుకూలంగా వున్నామన్న సందేశం దానిలో ఇమిడి వుంది.

అమెరికాాచైనాల మధ్య వాణిజ్య పోరుకు స్వస్థిచెప్పి వాణిజ్యలోటు సమస్యను పరిష్కరించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. అయితే ఆచరణలో ఎవరి ప్రయోజనాలు వారికి వున్నాయి గనుక అమలు ప్రశ్న తలెత్తుతోంది. గతంలో కూడా ప్రతి అమెరికా అధ్యక్షుడూ ఏదో ఒక దశలో వాణిజ్యపోరు పేరుతో బెదిరింపులకు దిగిన వారే. ట్రంప్‌ వైఖరి మొరటుగా వుంది. తన పదవీకాలం పూర్తయ్యే నాటికి రెండు దేశాల మధ్య వున్న వాణిజ్యలోటులో 200బిలియన్‌ డాలర్లను తగ్గించాలని చెబుతున్నాడు. అయితే హడావుడి చేస్తోందని చైనీయులు చెబుతున్నారు. మేడిన్‌ చైనా 2025 పేరుతో చైనా తన వుత్పాదక పరిశ్రమను వున్నత స్ధాయికి పెంచుకొనేందుకు దీర్ఘకాలిక క్రీడను ప్రారంభించిందని, దానిని పడనివ్వకుండా చేయటంతో పాటు అమెరికా తాత్కాలిక ప్రయోజాలను కోరుతోందని, చైనా కీలక ప్రయోజనాలను ఎట్టి పరిస్ధితులలో ఫణంగా పెట్టదని పరిశోధకులు చెబుతున్నారు.

చైనాతో పూర్తి స్థాయి వాణిజ్య యుద్ధం తప్పిపోయిందని విజయోత్సవాలు చేసుకోవటం తప్ప సాధించిందేమిటో తెలియదని అమెరికాలో విమర్శకులు అంటున్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధతో కలవకుండా తన ప్రయోజాలకే పెద్ద పీట వేస్తున్న చైనాను ఒంటరి పాటు చేయటం లేదా అంకెకు తీసుకురావటం అన్న అసలు లక్ష్యాన్ని ట్రంప్‌ పట్టించుకోవటం లేదన్న విమర్శలు చెలరేగాయి. అసలు చైనాను ప్రపంచ వాణిజ్య సంస్ధలో అడుగుపెట్టనివ్వటమే అమెరికా చేసిన పెద్ద తప్పిదమని అమెరికా వాణిజ్య ప్రతినిధి ఒక నివేదికలో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఆర్ధిక వ్యవస్ధలో రాజ్య జోక్యం చేసుకోకుండా చైనాను కట్టడి చేయటమే అంతి మ లక్ష్యం అయితే అమెరికా వస్తువులను కొనుగోలు చేయించమని చైనాను కోరటం ప్రతికూలమౌతుందని కొందరు హెచ్చరిస్తున్నారు.

అమెరికా ఇప్పుడు ఒక్క చైనా మీదే కాదు మా వస్తువులు కొంటారా లేక మీ వస్తువుల మీద దిగుమతి పన్ను విధించమంటారా తేల్చుకోండని అన్ని దేశాలను బెదిరిస్తున్నది. వాటిలో జపాన్‌ ఒకటి. రాజకీయంగా చైనాకు వ్యతిరేకంగా దానిని కూడగడుతున్నప్పటికీ ఆర్ధిక విషయాల్లో జపాన్‌పై అమెరికా తన షరతులను రుద్దేందుకు పూనుకుంది. తమ వుక్కు, అల్యూమినియం వస్తువులపై 25,10 శాతం చొప్పున దిగుమతి పన్ను విధించేందుకు అమెరికా పూనుకుంటే తాము కూడా ప్రతి చర్యలకు దిగక తప్పదని ప్రపంచవాణిజ్య సంస్ధకు జపాన్‌ తెలియచేసింది. అమెరికా బెదిరింపులకు చైనా లంగకపోవటం జపాన్‌కు వూతమిచ్చి అమెరికాను హెచ్చరించేంత వరకు వెళ్లిందని పరిశీలకులు భావిస్తున్నారు. 1970,80 దశకాలలో అమెరికాను ఎదిరించే శక్తిలేని జపాన్‌ ప్లాజా ఒప్పందాన్ని అంగీకరించాల్సి వచ్చిందని పర్యవసానంగా జపాన్‌లో దీర్ఘకాల ఆర్ధిక తిరోగమనానికి దారి తీసిందని ఇప్పుడు అమెరికా గొంతెమ్మ కోర్కెలను చైనా అంగీకరించటం లేదని అందువలన చైనా నుంచి నేర్చుకోవాల్సి వుందని జపాన్‌ భావిస్తున్నది.

చిత్రం ఏమిటంటే ఐరోపాలో రష్యాకు వ్యతిరేకంగా అమెరికాతో చేతులు కలుపుతున్న అక్కడి ధనిక దేశాలు కూడా జపాన్‌ చర్యను చూసి అమెరికా దిగుమతి సుంకాలకు ప్రతిగా తాము కూడా అమెరికా వస్తువులపై అదనపు సుంకాలను విధించాల్సి వుంటుందని ఐరోపా యూనియన్‌ పేర్కొన్నది.అయితే ఈ హెచ్చరికలేవీ జపాన్‌-ఐరోపాయూనియన్‌- అమెరికా మధ్య వున్న రాజకీయ బంధాన్ని దెబ్బతీసేవిగా మారే అవకాశాలు ఇప్పటికైతే లేవు. మన దేశంపై అమెరికా వాణిజ్య యుద్దానికి దిగకపోయినప్పటికీ మన వ్యవసాయ మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు వత్తిడి తెస్తోంది. దానిలో భాగంగానే మన దేశంలో ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధరలను ఎక్కువగా నిర్ణయిస్తోందని, వ్యవసాయ, ఆహార రాయితీలను పరిమితికి ఇస్తోందని ప్రపంచ వాణిజ్య సంస్ధకు కొద్దివారాల క్రితం ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో వుక్కు, అల్యూమినియం దిగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలు మన దేశానికి కూడా వర్తిస్తాయని మన దేశం కూడా వాణిజ్య సంస్ధకు నోటీసు అందచేసింది. మొత్తం మీద చూసినపుడు మీ ఇంటికొస్తే మాకేమి ఇస్తారు, మా ఇంటికొస్తూ మాకేమి తెస్తారు అన్న రీతిలో అమెరికా ప్రవర్తిస్తోంది. అందువలన దాని వైఖరికి ప్రభావితులయ్యే ప్రతి ఒక్కరు ఏదో విధంగా సమన్వయం చేసుకొని పెద్దన్న వైఖరిని అడ్డుకోవటం అవసరం. ఈ దృష్ట్యా కూడా చైనాతో మన దేశం సఖ్యంగా వుండి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మరోమారు విజయం సాధించిన వెనెజులా సోషలిస్టు నికొలస్‌ మదురో !

21 Monday May 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Nicolás Maduro, Venezuela elections, Venezuela votes 2018, venezuelan chavista

ఎం కోటేశ్వరరావు

‘మేం ఇంతవరకు 92 ఎన్నికలను పర్యవేక్షించాం, వెనెజులా ఎన్నికల ప్రక్రియ ప్రపంచంలోనే వుత్తమమైనది అని నేను చెబుతా’ ఈ మాటలన్నది అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌. ఆదివారం నాడు జరిగిన ఆ దేశ ఎన్నికలలో ప్రస్తుత అధ్యక్షుడు నికొలస్‌ మదురో ఘనవిజయం సాధించారు. ఓట్ల లెక్కింపు పూర్తిగాక ముందే ఈ ఎన్నికలను తాము గుర్తించటం లేదని, అక్టోబరులో తిరిగి ఎన్నికలు జరపాలని ప్రతిపక్ష అభ్యర్ధులు ప్రకటించారు. పోలైన ఓట్ల 86లక్షల ఓట్లలో 92.6శాతం లెక్కింపు జరిగిన సమయానికి మదురోకు 58, సమీప అభ్యర్ధి హెన్రీ ఫాల్కన్‌కు 18లక్షలు వచ్చాయని ఎన్నికల సంఘం ప్రకటించింది.

అమెరికా, ఇతర పశ్చిమ దేశాల ఆంక్షలు, ప్రచారదాడి, వత్తిడి, ఆర్ధిక ఇబ్బందుల మధ్య జరిగిన ఈ ఎన్నికలలో పాలక సోషలిస్టు పార్టీ సాధించిన విజయానికి ఎంతో ప్రాధాన్యత వుంది. అనేక లాటిన్‌ అమెరికా దేశాలలో అమెరికా అనుకూల, మితవాద శక్తులు జనాన్ని తప్పుదారి పట్టించుతున్న తరుణంలో వెనెజులాలో వాటి ఆటలు సాగనివ్వలేదు. దాంతో తాము ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ఒకవైపు ప్రకటించిన ప్రతిపక్షాలు మరోవైపు స్వతంతత్రుల ముసుగులో అభ్యర్దులను నిలిపాయి. వారు ఓటమి తధ్యమని తేలగానే ఫలితాల ప్ర కటనకు ముందే ఎన్నికలలో అక్రమాలు జరిగాయంటూ కొత్త పల్లవి అందుకున్నారు. డిసెంబరులో జరగాల్సిన ఎన్నికలను ముందుగానే జరపటం అక్రమాలలో ఒకటని పేర్కొన్నారు. తాను విజయం సాధిస్తే దేశ కరెన్సీని అమెరికా డాలరుగా మార్చివేస్తానని ప్రకటించిన ప్రధాన ప్రత్యర్ధి హెన్రీ ఫాల్కన్‌ ఫలితాలను తాను గుర్తించనని పేర్కొంటూ చేసిన ప్రకటనలో ప్రతిపక్షంలోని కొంత మంది ఓటింగ్‌కు రాకపోవటం తన ఓటమికి కారణమని పేర్కొన్నాడు. పోలింగ్‌ కేంద్రాల సమీపంలో ఎర్ర కేంద్రాలను ఏర్పరచి ఓటర్లపై బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించాడు. నమోదైన ఓటర్లలో 46శాతం పోలింగ్‌కు వచ్చారు.

నికొలస్‌ మదురోపై పోటీ చేసిన వారిలో ప్రధాన ప్రత్యర్ధి న్యాయవాది అయిన హెన్రీ ఫాల్కన్‌ గతంలో ఛావెజ్‌ నాయకత్వంలోని సోషలిస్టు పార్టీలో లారా రాష్ట్ర గవర్నర్‌గా కూడా పనిచేశాడు. ఛావెజ్‌ బ్రతికి వుండగానే 2010లో పార్టీ నుంచి వెళ్లిపోయాడు. 2013 ఎన్నికలలో మదురో ప్రత్యర్ధి హెన్రిక్‌ కాప్రిల్స్‌ ప్రచార సారధిగా పని చేశాడు.ఈ ఎన్నికలలో ప్రతిపక్షం నుంచి విడిపోయి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేశాడు. ఎన్నికల బహిష్కరణ పనిచేయలేదు, అందుకే ఆ ప్రక్రియకు దూరంగా వుండదలచుకున్నాను. ఒక దేశం తరువాత మరొక దేశంలో బహిష్కరణ పిలుపులతో ప్రతిపక్షాలు ఎన్నికల రంగానికి దూరమై పాలకులు పటిష్టం కావటానికి అవకాశమిచ్చాయని న్యూయార్క్‌టైమ్స్‌ పత్రికలో రాసిన వ్యాసంతో ఫాల్కన్‌ పేర్కొన్నాడు. దేశ కరెన్సీ బలివర్‌ స్ధానంలో అమెరికా డాలర్‌ను ప్రవేశ పెట్టి దేశ ఆర్ధిక వ్యవస్ధను స్ధిరీకరించేందుకు పని చేస్తానని, ఐఎంఎఫ్‌ నుంచి సాయం పొందేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. మరొక ప్రత్యర్ధి క్రైస్తవ మత పాస్టర్‌ అయిన జేవియర్‌ బెర్టూసీ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని స్వతంత్రుడనని ప్రకటించుకున్నాడు. కరెన్సీ మార్పిడిపై నియంత్రణలను ఎత్తివేస్తానని, విదేశీ పెట్టుబడులను పెంచుతానని, ఛావెజ్‌ ప్రారంభించిన సామాజిక కార్యక్రమాలను కొనసాగిస్తానని వాగ్దానం చేశాడు. మరో అభ్యర్ధి రెనాల్డో క్విజాడా తను ఛావిస్టా(ఛావెజ్‌) వుద్యమాన్ని కొనసాగిస్తానని, అయితే మదురో ప్రభుత్వానికి వ్యతిరేకినని ప్రకటించుకున్నాడు. వీరికి వరుసగా 21.1, 10.8,0.4శాతాల చొప్పున ఓట్లు వచ్చాయి. మదురో 67.7శాతం పొందారు.

హ్యూగో ఛావెజ్‌ రాజకీయ వారసుడిగా 2013లో అధికారానికి వచ్చిన నికొలస్‌ మదురో గత ఆరు సంవత్సరాలుగా ఇంటా బయటా అనేక ఆటంకాలను ఎదుర్కొన్నాడు. ప్రధాన ఆదాయ వనరైన చమురు రేట్లు గణనీయంగా పడిపోవటంతో దేశం ఆర్ధికంగా అనేక ఇబ్బందులపాలైంది. చమురు ధరల పతనం కారణంగా జిడిపి 45శాతం పడిపోయిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ ప్రకటించింది. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకులైన వాణిజ్యవేత్తలు బ్లాక్‌మార్కెటింగ్‌ వంటి అక్రమాలకు పాల్పడి ప్రభుత్వంతో ప్రత్యక్ష ఘర్షణకు దిగారు. ద్రవ్యోల్బణం పెరుగుదల, అనేక వస్తువుల కొరత ఏర్పడింది. బ్యాలట్లు కావాలా బుల్లెట్లు కావాలా, మాతృభూమిగా వుండాలా వలస దేశంగా మారాలా, శాంతా లేక హింసా కాండా, స్వాతంత్య్రమా, పారతంత్య్రమా నిర్ణయించేది ఈ ఓటు అన్నట్లుగా తాము పరిగణించామని కార్మిక సంఘనేత అయిన ఒక బస్‌ డ్రైవర్‌ వ్యాఖ్యానించాడు. ఓటింగ్‌ ప్రారంభం కాగానే వెనెజులా ఎన్నికలు ఒక బూటకం అని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో ప్రకటించాడు. ముఫ్పై దేశాల నుంచి 150 మంది పరిశీలకులు వెనెజులా ఎన్నికల పర్యవేక్షణకు వచ్చారు. వారిలో ఒకరైన స్పెయిన్‌ మాజీ ప్రధాని జోస్‌ లూయిస్‌ రోడ్రిగజ్‌ జపాటెరో మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ మీద నాకెలాంటి సందేహాలు లేవు, ఆధునిక ఆటోమాటాక్‌ ఓటింగ్‌ పద్దతిని అనుసరిస్తున్నారు. జనం తమంతట తాము ఓటింగ్‌కు వస్తున్నారా లేదా తమ విచక్షణకు అనుగుణంగా ఓట్లు వేస్తున్నారా లేదా అని పరిశీలించటానికి వచ్చాం. మేం ఇప్పుడంతా చూశాం అని పేర్కొన్నారు. ఎటువంటి సంఘటనలు లేకుండా ఎన్నికలు జరిగాయని ఇతర ప్రతినిధులు కూడా వ్యాఖ్యానించారు.

అనేక మంది ముందుగా వూహించినట్లుగానే వెనెజులా ఎన్నికల ఫలితాలను తాము గుర్తించటం లేదని ప్రకటించటం ద్వారా లాటిన్‌ అమెరికాలో తన కుట్రలను కొనసాగించేందుకే అమెరికా నిర్ణయించుకున్నదని స్పష్టమైంది. అర్జెంటీనా రాజధాని బ్యూనోస్‌ ఎయిర్స్‌లో జి20విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గనేందుకు వచ్చిన అమెరికా డిప్యూటీ మంత్రి జాన్‌ సులివాన్‌ జర్నలిస్టులతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలను గుర్తించేది లేదని చెబుతూనే చమురుపై ఆంక్షలు విధించటం గురించి ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.

ఛావెజ్‌ హయాంలో, తరువాత మదురోకు వ్యతిరేకంగా పని చేసిన ప్రతిపక్ష పార్టీలు ఇటీవలి కాలంలో డెమోక్రటిక్‌ యూనిటీ రౌండ్‌ టేబుల్‌ పేరుతో ఒకటిగా వ్యవహరిస్తున్నాయి. ఎన్నికలలో పాల్గనాలా వద్దా అనే విషయంలో దానిలో రెండు అభిప్రాయాలు వెల్లడయ్యాయి. పోటీ చేస్తే మదురో పాలన చట్టబద్దమైనదే అని అంగీకరించినట్లు అవుతుందని కొందరు, మార్పుకోసం వచ్చిన అవకాశాన్ని పోటీ చేసి వినియోగించుకోవాలని కొందరు వాదించినా అంతిమంగా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు అది ప్రకటించింది. ఆ పార్టీకి చెందిన హెన్రిక్‌ కాప్రిల్స్‌ గతంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన కారణంగా పదిహేను సంవత్సరాలు ఎన్నికలలో పోటీ చేయటానికి అనర్హుడయ్యాడు. మరోనేత లియోపాల్డో లోపెజ్‌ పలుకేసులలో నిందితుడిగా వుండటంతో గృహనిర్బంధంలో వున్నాడు. ఈ పూర్వరంగంలో ఎన్నికలను బహిష్కరించాలనే నిర్ణయాన్ని హెన్రీ ఫాల్కన్‌ వ్యతిరేకించి బయటకు వచ్చి స్వతంత్రుడిగా పోటీ చేశాడు. బహిష్కరణ పిలుపు తన విజయాన్ని దెబ్బతీసిందని చెప్పుకున్నాడు.

తమ దేశంలో వున్న చమురు సంపదలను కొల్లగొట్టేందుకు, తమ సంక్షేమ చర్యలకు స్వస్తి పలికేందుకు అమెరికా ఒక అంతర్జాతీయ కుట్ర చేస్తోందని అధ్యక్షుడు మదురో ప్రచారం చేశారు. ఛావెజ్‌ నాయకత్వంలో సోషలిస్టు పార్టీ అధికారానికి వచ్చిన తరువాత వెనెజులా ఆర్ధిక వ్యవస్ధ దిగజారిపోయిందని అంతర్జాతీయ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. చమురు సంపదలతో వున్న ఆదేశం 1998లో ఛావెజ్‌ అధికారానికి రాకముందు తీవ్ర అసమానతలు, పట్టణాలలో దారిద్య్రం తాండవించిందని, దానికి ఐఎంఎఫ్‌ సూచించిన విధానాలే కారణమనే వాస్తవాలను దాచిపెడుతోంది. ఛావెజ్‌ అధికారంలోకి రాగానే ప్రభుత్వ చమురు సంస్ధను పటిష్టపరచి చమురు సంపదను దేశ అంటే ప్రజాప్రయోజనాల కోసం వినియోగించటం ప్రారంభించటంతో అప్పటి వరకు ఆ రంగాన్ని పీల్చిపిప్పి చేసి లాభపడిన అమెరికా, దేశీయ కార్పొరేట్‌ సంస్ధలు వ్యతిరేకతను పెంచుకున్నాయి. అప్పటి నుంచి ఏదో ఒక కుట్ర చేస్తూనే వున్నాయి.2002లో ఛావెజ్‌పై విఫల కుట్ర చేశారు. ఆయనకు అనుకూలంగా వున్న మిలిటరీ, కార్మికుల మద్దతుతో తిరిగి అధికారానికి వచ్చారు.

అమెరికా విధించిన ఆంక్షలు, సరకులు బ్లాక్‌మార్కెట్లోకి పోవటం, చట్టవిరుద్ధమైన కరెన్సీ చలామణిలోకి రావటం, చమురు ధరలు పతనం కావటంతో అక్కడి ప్రభుత్వానికి కొన్ని తీవ్ర సమస్యలు ఎదురయ్యాయి. ప్రజలలో కొంత అసంతృప్తి కూడా తలెత్తింది. గత పార్లమెంట్‌ ఎన్నికలలో ప్రతిపక్షాలకు మెజారిటీ సీట్లు వచ్చాయి. తరువాత మదురో తన స్ధానాన్ని పటిష్ట పరుచుకొనేందుకు చర్యలు తీసుకున్నారు. దాంతో గతేడాది దేశంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రతిపక్ష పార్టీలు, అంతర్జాతీయ ఏజన్సీలు పెద్ద కుట్ర చేశాయి. ప్రభుత్వ ఆస్ధులను విధ్వంసం చేయటం, అధికారపార్టీ మద్దతుదారులను సజీవ దహనం చేయటం, ఆయుధాలతో జనం మీద, భద్రతా సిబ్బందిపై దాడులకు దిగటం వంటి చర్యలకు పాల్పడ్డాయి. వాటిని సాకుగా చూపి వెంటనే ఎన్నికలు జరపాలని అమెరికా, తదితర దేశాలు పిలుపుల నిచ్చాయి. ప్రతిపక్ష డెమోక్రటిక్‌ యూనిటీ రౌండ్‌ టేబుల్‌ ప్రభుత్వంతో చర్చించి కుదుర్చుకున్న అవగాహన ప్రకారం డిసెంబరులో జరగాల్సిన ఎన్నికలను ఏప్రిల్‌లోనే జరపాల్సి వుంది. ఆమేరకు అనూహ్యంగా వెనెజులా ఎన్నికల సంఘం మధ్యంతర ఎన్నికల ప్రకటన చేయటంతో అది అక్రమం అంటూ అమెరికా, ప్రతిపక్షాలు మాట మార్చాయి. మదురో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజ్యాంగ పరిషత్‌ను తాము గుర్తించటం లేదని ప్రకటించాయి. ఒప్పందం నుంచి తాను వైదొలుగుతున్నట్లు రౌండ్‌ టేబుల్‌ ప్రకటించింది. ఇది జరిగిన రెండు రోజుల తరువాత వెనెజులా మిలిటరీ తిరుగుబాటు చేసి నియంత మదురోను అధికారం నుంచి కూలదోస్తే తాము మద్దతు ఇస్తామని అమెరికా రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ మార్కో రుబియో ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు. అదే వారంలో టెక్సాస్‌ విశ్వవిద్యాలయంలో మాట్లాడిన అప్పటి విదేశాంగశాఖ మంత్రి రెక్స్‌ టిల్లర్సన్‌ పాలకులు ఏమాత్రం ప్రజలకు సేవచేయలేనపుడు, పరిస్ధితులు దిగజారినపుడు లాటిన్‌ అమెరికాలో తరచుగా మార్పులను తెచ్చింది మిలిటరీయే అని చరిత్ర చెబుతోందని వ్యాఖ్యానించాడు. అంతెందుకు స్వయంగా డోనాల్డ్‌ ట్రంప్‌ వెనెజులా విషయంలో అవసరం అయితే మిలిటరీని వుపయోగించుకుంటా అని విలేకర్లతో చెప్పాడు. అంటే మిలిటరీ కుట్రలను నిస్సిగ్గుగా సమర్ధించటం తప్ప మరొకటికాదు.

లాటిన్‌ అమెరికాలో వామపక్ష ప్రభుత్వాలకు నిత్యం అమెరికా కుట్రలు, కూహకాల ముప్పు వెన్నాడుతూనే వుంటుంది. దోపిడీ వ్యవస్ధలను విధ్వంసం చేయకుండా వాటిని అలాగే కొనసాగనిస్తూ తమకున్న వెసులు బాటు మేరకు అమలు జరుపుతున్న సంక్షేమ చర్యలకు ప రిమితులు వచ్చినపుడు జనాలలో అసంతృప్తి తలెత్తటం, దానిని మితవాద శక్తులు వినియోగించుకోవటం ఇటీవలి కాలంలో చూశాము. అందువలన పెట్టుబడిదారీ వ్యవస్ధ సంస్కరణబాటను వదలి విప్లవాత్మక చర్యలు తీసుకొనేందుకు పూనుకుంటేనే లాటిన్‌ అమెరికా వామపక్షాలకు భవిష్యత్‌ వుంటుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇజ్రాయెల్‌, అమెరికా బరితెగింపు.. పాలస్తీనియన్లపై మారణకాండ!

16 Wednesday May 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Gaza Deaths, Israel, israel massacre, Nakba day, Palestinians, US embassy moves to Jerusalem

Image result for israel and us is responsible for gaza massacre
మాతృభూమి, దాస్య విముక్తి కంటే మరొకటి అవసరం లేదని పసితనం నుంచే ఎత్తిన జెండా దించబోమంటున్న పాలస్తీనా బాలలు

ఎం. కోటేశ్వరరావు

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌, దాని దుండగాలకు వెన్నుదన్నుగా అమెరికా మరోసారి పాలస్తీనియన్లపై దమనకాండకు పాల్పడ్డాయి. వాటి దుష్ట చరిత్రలో సోమవారం మరో చీకటి దినం. మధ్యవర్తి నంటూ ఒకవైపు ఫోజు పెడుతూనే నిస్సిగ్గుగా ఇజ్రాయెల్‌ వైపు నిలవటమే గాక దమనకాండపై దర్యాప్తు జరపాలన్న కనీస ప్రజాస్వామిక డిమాండ్‌ కూడా భద్రతామండలిలో ప్రవేశపెట్టేందుకు అమెరికా తిరస్కరించింది. పాలస్తీనియన్ల భూభాగమైన జెరూసలెంను ఆక్రమించేందుకు ఇజ్రాయెల్‌ రూపొందించిన పధకాన్ని అమలు జరిపేందుకు పూనుకుంది. దానికి నిరసన తెలిపిన నిరాయుధులైన సామాన్య ప్రజానీకంపై ఇజ్రాయెల్‌ మిలిటరీ జరిపిన మారణకాండలో ఎనిమిదినెలల పసిపాప సహా 60మంది మరణించగా 2,700మందికిపైగా గాయపడినట్టు వార్తలు వచ్చాయి. తూర్పు జెరూసలెం పట్టణానికి తమ ఇజ్రాయెల్‌ దౌత్యకార్యాలయాన్ని తరలిస్తామని రక్తపిపాసి డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించినప్పుడే ఈ మారణకాండకు బీజం పడింది. కాగా ఈ మారణకాండపై దర్యాప్తు జరపాలని కోరేందుకు మంగళవారం నాడు సమావేశమైన భద్రతా మండలిని అమెరికా అడ్డుకుంది. కువాయిట్‌ రూపొందించిన ఈ తీర్మానంలో సోమవారంనాటి దారుణంపై విచారణ జరపాలని కోరింది. జెరూసలెంలో రాయబార కార్యాలయాల ఏర్పాటు వద్దంటూ గతంలో చేసిన భద్రతా మండలి తీర్మానానికి అన్ని దేశాలు కట్టుబడి ఉండాలన్న విజ్ఞాపన కూడా దానిలో ఉంది. సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టరాదని అమెరికా అభ్యంతరం తెలిపింది. యూదులు, ముస్లింలు, క్రైస్తవులకు కూడా ఆరాధనా కేంద్రమైన జెరూసలెం పట్టణంపై అంతిమంగా ఒక నిర్ణయం తీసుకొనే వరకు ఎలాంటి వివాదాస్పద చర్యలకూ పాల్పడవద్దన్నది ప్రపంచ రాజ్యాల ఏకాభిప్రాయం. దానికి అమెరికా తూట్లు పొడిచింది. సోమవారంనాడు మరణించిన తమ సహచరుల అంత్యక్రియలకు పెద్ద ఎత్తున పాలస్తీనియన్లు హాజరై మరోమారు తమ నిరసన తెలిపారు.
ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు ఏర్పాటు కావాల్సిన స్వతంత్ర పాలస్తీనాకు తూర్పు జెరూసలెం పట్టణాన్ని తమ రాజధానిగా చేసుకోవాలన్నది పాలస్తీనియన్ల చిరకాల వాంఛ. సరిగ్గా 70ఏండ్ల క్రితం పాలస్తీనాను రెండుగా విభజించి యూదులు మెజారిటీ ఉన్న ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌గా ఏర్పాటు చేయాలన్నది ఐరాస తీర్మానం. ఇజ్రాయెల్‌ అయితే ఏర్పడింది. అంతవరకు ఉనికిలో ఉన్న పాలస్తీనా ఉనికిలో లేకుండా పోయింది. లక్షలాది మంది అరబ్బులు తమ నివాసాల నుంచి గెంటివేతకు గురై ఇప్పటికీ చుట్టుపక్కల దేశాలలో తలదాచుకుంటున్న అన్యాయం కొనసాగుతోంది. 1948కి ముందే ఒక పధకం ప్రకారం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలించిన యూదులు, సామ్రాజ్యవాద దేశాల ఆయుధాలు, అండదండలతో ఇజ్రాయెలీ సాయుధమూకలు పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకున్నాయి. వ్యతిరేకించిన లక్షలాదిమంది అరబ్బును వారి నివాస ప్రాంతాల నుంచి తరిమివేశాయి. పాలస్తీనా ప్రభుత్వం, పాలనకు తిలోదకాలిచ్చి మొత్తం ప్రాంతాన్ని ఒక నిర్బంధశిబిరంగా మార్చివేసింది. అప్పటి నుంచి పాలస్తీనా ప్రాంతాలను ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటూ జనాభారీత్యా వాటి రూపురేఖలనే మార్చి వేసి అవికూడా యూదు ప్రాంతాలేనంటూ వాటిని కూడా తమకు అప్పగించాల్సిందే అని చెబుతోంది. తమ పౌరులకు రక్షణ పేరుతో ఆక్రమిత ప్రాంతాలలో యూదుల శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసింది.
ఈ ఆక్రమణలో భాగంగానే 1948లో అరబ్బులు మెజారిటీ ఉన్న జెరూసలెం పట్టణ ఆక్రమణకు పూనుకుంది. ఆ క్రమంలో దాని రక్షణకు వచ్చిన జోర్డాన్‌ తూర్పు జెరూసలెం ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. పశ్చిమ జెరూసలెంను ఆక్రమించుకున్న ఇజ్రాయెల్‌ 1967లో ఇరుగుపొరుగు అరబ్బు దేశాలతో యుద్ధానికి తలపడి తూర్పు జెరూసలెంను కూడా ఆక్రమించుకుంది. 1980లో ఏకపక్షంగా తనకు తానే జెరూసలెం చట్టాన్ని చేసినట్టు ప్రకటించుకొని అధ్యక్ష, ప్రధాని నివాసం, పార్లమెంట్‌, సుప్రీం కోర్టు అనేక ప్రభుత్వ కార్యాలయాలను అక్కడికి తరలించి కబ్జాకు చట్టబద్దత కల్పించేందుకు పూనుకుంది. ఆ పట్టణం అవిభక్తమని మొత్తం తమదే అని ప్రకటించుకుంది. అయితే జెరూసలెం పాలస్తీనియులదే అని అంతర్జాతీయ సమాజం అనేక రూపాలలో ఇజ్రాయెల్‌ చర్యను ఖండించింది. దాని స్ధాయి నిర్ణయించేంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరింది. దానికి అనుగుణ్యంగానే ఇజ్రాయెల్‌ ప్రభుత్వాన్ని గుర్తించిన దేశాలన్నీ తమ రాయబార కార్యాలయాలను రాజధాని టెల్‌ అవీవ్‌లో ఏర్పాటు చేశాయి.

Image result for gaza massacre 2018

ఇజ్రాయెల్‌ దాడులలో పుట్టి దాడుల మధ్య పెరిగిన పాలస్తీనా బిడ్డలందరికీ బాష్పవాయువు ప్రయోగాన్ని అధిగమించేందుకు వుల్లిపాయ ముక్కుల వద్ద పెట్టుకోవాలని పాలతో పాటు తల్లి పసితనం నుంచే నేర్పిస్తుంది

      జెరూసలెం వివాదం కొనసాగుతుండగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తమ రాయబార కార్యాలయాన్ని ఆ నగరానికి తరలిస్తున్నట్టు ప్రకటించి సరికొత్త వివాదానికి తెరలేపాడు. ఆ ప్రకటన వెలువడినప్పుడే పాలస్తీనియన్లతో అనేకమంది నిరసన, వ్యతిరేకత వ్యక్తం చేశారు. మార్చి నెల నుంచి ప్రతి శుక్రవారం పాలస్తీనియన్లు నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. అప్పటి నుంచి ఆదివారంనాటి వరకు వివిధ సందర్భాలలో ఇజ్రాయెలీ భద్రతా సిబ్బంది జరిపిన దాడులలో కనీసం 84మంది పాలస్తీనియన్లు మరణించారు. అందువలన రాయబార కార్యాలయం ప్రారంభించే రోజు మరింత తీవ్రంగా, పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ఉంటాయని తెలిసినప్పటికీ ఎలాంటి చర్యతీసుకోకుండా సాగించిన ఈ మారణకాండను యావత్‌ ప్రపంచం ఖండించింది. ఆ రోజు మరో 60మంది మరణించారు. వ్యతిరేకతను ఖాతరు చేయకుండా సరిగ్గా 70ఏండ్ల క్రితం ఇజ్రాయెల్‌ ఏర్పడిన రోజునే జెరూసలెం కబ్జాను ఖరారు చేస్తూ అక్కడ సోమవారంనాడు రాయబార కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ట్రంప్‌ తన కుమార్తె, సలహాదారుగా వేసుకున్న ఆమె భర్త తదితరులను పంపించాడు. ఆ చర్యను నిరసిస్తూ పాలస్తీనా గాజా ప్రాంతంలోని అరబ్బు జాతీయులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అక్కడి సరిహద్దు కంచెను దాటి తమ భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించారని, హింసాకాండకు పాల్పడ్డారనే పేరుతో విచక్షణారహితంగా తొలిసారిగా డ్రోన్ల ద్వారా బాష్పవాయు ప్రయోగం, కాల్పులకు తెగబడటంతో 60మంది ప్రాణాలు కోల్పోవటంతో పాటు 2700 మంది గాయపడ్డారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.

Image result for gaza massacre 2018

కలేజా, కాంక్ష వుండాలే గాని కాళ్లు లేకపోతేనేం మాతృభూమి కోసం నేను సైతం అంటూ వడిశలతో ప్రతిఘటిస్తున్న పాలస్తీనా యువకుడు

     పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్‌ భద్రత, పోలీసు బలగాలు, యూదు దురహంకారులు దాడులు చేయటం, అవమానించటం, ఆర్థికంగా దెబ్బతీయటం నిత్యకృత్యం. ఇటీవలి కాలంలో ఒకే రోజు ఇంతమంది అరబ్బులు మరణించటం, గాయపడటం ఎప్పుడూ జరగలేదు. సోమవారం నాటి మారణకాండకు నిరసనగా మంగళవారం నాడు పలుచోట్ల నిరసన వ్యక్తమైంది. దక్షిణాఫ్రికా, టర్కీ నిరసనగా ఇజ్రాయెల్‌ నుంచి తమ రాయబారులను వెనక్కు రప్పించాయి. ఇజ్రాయెల్‌ రాయబారిని పిలిపించి ఐర్లండ్‌ తన నిరసన తెలిపింది. అనేక దేశాలు అభ్యంతరం తెలిపాయి. దీని గురించి భద్రతామండలి సమావేశం కానుంది. కొద్ది రోజుల క్రితం ఇరాన్‌తో కుదిరిన అణుఒప్పందాన్నుంచి ఏకపక్షంగా వైదొలుగుతున్నట్టు అమెరికా ప్రకటించింది. అది జరిగిన వెంటనే సిరియాలోని ఇరాన్‌ మిలిటరీ కేంద్రాలపై ఇజ్రాయెల్‌ దాడి చేసింది. దానికి ప్రతిగా ఇరాన్‌ కూడా ప్రతిదాడులు చేసింది. రాయబార కార్యాలయ ఏర్పాటు చర్య కూడా ఇరాన్‌, సిరియా, తదితర పశ్చిమాసియా అరబ్బు, ముస్లిం దేశాలను రెచ్చగొట్టటం, అక్కడ మండుతున్న ఆరని అగ్నిని మరింత ఎగదొయ్యటం తప్ప మరొకటి కాదు. ఇజ్రాయల్‌లో జరిగిన అనేక అవినీతి అక్రమాల గురించి జనాన్ని పక్కదారి పట్టించేందుకు పాలకపార్టీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. గాజా నది పశ్చిమ గట్టు, తూర్పు జెరూసలెం, సిరియా నుంచి ఆక్రమించుకున్న గోలన్‌ గుట్టలలో గత ఐదు దశాబ్దాలలో యూదుల నివాసాలను లక్షా 60వేల నుంచి ఆరులక్షలకు పెంచింది. గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్‌ సైన్యాన్ని ఉపసంహరించి నామమాత్ర పాలస్తీనా స్వయంపాలిత ప్రభుత్వానికి అప్పగించినప్పటికీ దాన్నొక బహిరంగ జైలుగా మార్చివేసింది. దాన్నుంచి బయటకు పోవాలన్నా, ఎవరైనా లోపలికి రావాలన్నా ఇజ్రాయెల్‌ అనుమతి తీసుకోవాల్సిందే. పాలస్తీనా విముక్తి ఉద్యమంలో గాజాకు ఒక ప్రత్యేకత ఉంది. అన్ని రకాల ఉద్యమాలు, పీఎల్‌ఓ అధినేత యాసర్‌ అరాఫత్‌ ఇక్కడ పుట్టిన వ్యక్తే. తిరుగుబాటు, అన్యాయాన్ని ప్రతిఘటించటం ఆ గడ్డలోనే ఉంది. తాజా పరిస్థితికి వస్తే అనేక పార్టీలు, సంస్థలు వాటి అనుబంధాలకు అతీతంగా ఒక ప్రజా ఉద్యమంగా గత కొద్ది వారాలుగా జెరూసలెం పాలస్తీనియన్లదే అని ఎలుగెత్తి చాటుతూ ప్రదర్శనలు చేస్తున్నారు.
తన దురాక్రమణకు ఆమోద ముద్రవేయించుకొనేందుకు తమతో దౌత్య సంబంధాలున్న దేశాలన్నీ తమ రాయబార కార్యాలయాలను జెరూసలెంకు తరలించాలని ప్రధాని నెతన్యాహు పిలుపునిచ్చాడు. జెరూసలెం మాత్రమే యూదులకు రాజధాని అని ప్రకటించాడు. ఆ దురహంకారికి తాన తందాన అంటూ ట్రంప్‌ అక్కడ రాయబార కార్యాలయ ప్రారంభం సందర్భంగా ముస్లిం వ్యతిరేక మతాధికారి రాబర్ట్‌ జఫ్‌రెస్‌తో ప్రార్ధనలు చేయించి అరబ్బులను మరింతగా రెచ్చగొట్టారు. పశ్చిమాసియాలో తన ఆర్థిక, రాజకీయ వ్యూహాన్ని అమలు జరిపేందుకు ఇజ్రాయెల్‌ను ఒక గూండాగా అమెరికా వినియోగించుకొంటోంది. దానికి అవసరమైన అధునాతన ఆయుధాలను అందించటంతో పాటు భద్రతా మండలిలో అన్ని విధాలుగా ఆదుకుంటోంది. అనేక వందల తీర్మానాలను ఇప్పటి వరకు వీటో చేసింది. ఏటా నాలుగు బిలియన్‌ డాలర్ల వంతున ఇప్పటి వరకు 135 బిలియన్‌ డాలర్లు సాయం పేరుతో యూదు దురహంకారులకు అందచేసింది. రెండు అంటే పాలస్తీనా, ఇజ్రాయెల్‌ దేశాలను ఏర్పాటు చేయాలన్న తీర్మానానికి తాము కట్టుబడి ఉన్నామని చెబుతూనే అయితే దానికి రెండు దేశాల ఆమోదమూ లభిస్తేనే అనే షరతు విధిస్తోంది. పాలస్తీనియన్ల నుంచి తమకు రక్షణ కల్పించాలని, అందుకు అవసరమైన భూభాగాలను అదనంగా అప్పగించటంతో పాటు ఇరుగు పొరుగు దేశాల నుంచి రక్షణ హామీలు కావాలంటూ ఆచరణ సాధ్యంగాని డిమాండ్లను ముందుకు తెస్తూ ఇజ్రాయెల్‌ పాలకులు పాలస్తీనా ఏర్పాటు అడ్డుకుంటున్నారు. చాలా కాలం పాటు తటస్ధంగా వున్నట్టు నాటకమాడిన అమెరికా ట్రంప్‌ హయాంలో దానికి స్వస్తి పలికి బహిరంగంగా తాము యూదు దురహంకారులవైపే ఉన్నట్టు తాజా చర్యతో లోకానికి చాటింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కొరియా శాంతి ఒప్పందం అమలే పెద్ద సమస్య !

04 Friday May 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

inter-Korean agreements, inter-Korean summit, korea peace agreement, North Korean leader Kim Jong-un, Panmunjeom Declaration, South Korean President Moon Jae-in

ఎం కోటేశ్వరరావు

‘ప్రపంచం ద అష్టిలో ఆ రెండు దేశాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది’ అన్నట్లు కనిపించే ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య వారం రోజుల క్రితం ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. దాని పర్యవసానాల గురించి పండితులు చర్చలు చేస్తుండగానే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ అన్‌ భేటీ గురించి వార్తలు వచ్చాయి. ఎప్పుడు ఎక్కడ అన్నది ఇంకా ఖరారు కాలేదు. ఉభయ కొరియాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం అమలు జరగటానికి ముందు అనేక అంశాలపై స్పష్టత రావాల్సి వుంది. రెండు దేశాలను అణు రహితంగా మార్చడం, రెండు దేశాల మధ్య వున్న శత్రుపూరిత కార్యకలపాలకు స్వస్తి పలకడం, ప్రచార దాడులను నిలిపివేసి రెండు దేశాల మధ్య వున్న మిలిటరీ రహిత ప్రాంతాన్ని శాంతి మండలంగా మార్చడం, సరిహద్దు ప్రాంతంలో ఆయుధాల సంఖ్య తగ్గింపు, అమెరికా, చైనాల ప్రమేయంతో చర్చలను ముందుకు తీసుకు పోవటం, కొరియా యుద్ధ సమయం లో విడిపోయిన కుటుంబాలను దగ్గరకు చేర్చటం, సరిహద్దు ప్రాంతంలో రోడ్లు, రైలు మార్గాల నవీకరణ, ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడలతో సహా అన్ని క్రీడలలో సంయుక్త జట్లతో పాల్గనటంపై ఒప్పందం కుదిరింది. 1953లో ఎక్కడైతే కొరియా యుద్ధ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందో, తాత్కాలిక సరిహద్దుగా గుర్తించిన చోట, దక్షిణ కొరియా వైపున వున్న మిలిటరీ రహిత ప్రాంతమైన పాముంజోమ్‌లోని ‘శాంతి నివాసం’లో ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ అన్‌, దక్షిణ కొరియా నేత మూన్‌ జె ఇన్‌ భేటీలో ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ ఒప్పందం కుదరడం ఒక చారిత్రక సంఘటన. అయినప్పటికీ అమలు లోకి రావటం అంత తేలిక కాదని తరువాత వెలువడిన వార్తలు సూచిస్తున్నాయి. దక్షిణ కొరియాలో 1953 నుంచీ తిష్ట వేసిన అమెరికా సేనలను ఉపసంహరించాలన్నది ఉత్తర కొరియా ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్‌. ఒప్పంద సమయంలో దాని ప్రస్తావన లేనప్పటికీ ఆ డిమాండును అది వదులుకుంటుండా అన్నది ప్రశ్న. తమ రక్షణకు హామీ వుంటే అణ్వాయుధాలతో తమకు పని లేదని, అమెరికా సైనికుల ఉపసంహరణను కూడా పెద్దగా పట్టుపట్టబోమని పరోక్షంగా సూచించినట్లు నిర్దారణ కాని వార్తలు వచ్చాయి. అయితే శాంతి ఒప్పందా లకు, తమ దేశంలో వున్న 29 వేల అమెరికన్‌ సైనికుల ఉపసంహరణకు సంబంధం లేదని దక్షిణ కొరియా అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌-కిమ్‌ మధ్య జరగబోయే భేటీ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.దక్షిణ కొరియాలో అమెరికన్‌ సైనికుల సంఖ్య తగ్గింపు గురించి పరిశీలించాలని అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఆలోచనలు గతంలో కూడా జిమ్మీ కార్టర్‌ నుంచి అనేక మంది చేయకపోలేదు. ప్రపంచంలో అనేక చోట్ల పరాజయమే తప్ప విజయాలు లేనపుడు అమెరికా సైనికులను విదేశాలలో వుంచి పెద్ద మొత్తంలో ఎందుకు ఖర్చు చేయాలన్న చర్చ అమెరికాలో చాలా కాలం నుంచి వుంది. దక్షిణ కొరియాలో తిష్టవేసిన సైన్యానికి అయ్యే ఖర్చు తగినంత అమెరికాకు తిరిగి రావటం లేదు. ఆ సైనికులు జపాన్‌కు రక్షణగా వున్నారు తప్ప మరొకటి కాదు. ఇరవైతొమ్మిది వేల మంది సైనికులు పక్కనే వున్నా అమెరికా నుంచి అణ్వస్త్రాలను తెచ్చి దక్షిణ కొరియాలో మోహరించినా, గువాం ప్రాంతంలో బాంబర్లు, పసిఫిక్‌ సముద్రంలో జలాంతర్గాములను మోహరించినా వుత్తర కొరియా అణు, క్షిపణి పరీక్షలను నివారించలేకపోయాయి. వుత్తర కొరియన్లు ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. చేతి చమురు వదలి, పరువు పోగొట్టుకోవటం ఎందుకని కొందరు అమెరికన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాదితో ముగిసే దక్షిణ కొరియాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సైనికులకు ఏడాదికి అయ్యే ఖర్చు 80కోట్ల డాలర్లలో సగమే దక్షిణ కొరియా చెల్లిస్తోంది. మొత్తం ఖర్చు భరించాలని అమెరికా డిమాండ్‌ చేస్తోంది. వారు వున్నా ప్రయోజనం లేనపుడు అంత ఖర్చు తామెందుకు చెల్లించాలన్న ప్రశ్న దక్షిణ కొరియాలోనూ వస్తోంది. వుభయ కొరియాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుకున్న తరువాత అమెరికా సైన్యాల తిష్టను సమర్ధించుకోవటం కష్టం అవుతుందని దక్షిణ కారియా ప్రభుత్వ సలహాదారు మూన్‌ చంగ్‌ ఇన్‌ స్వయంగా చెప్పారు. గతంతో పోలిస్తే దక్షిణ కొరియా సైన్యం కూడా పటిష్టంగా తయారైంది. వుత్తర కొరియా విషయానికి వస్తే అమెరికన్‌ సైనికుల వుపసంహరణ డిమాండ్‌ గురించి తాము పట్టుపట్టకపోవచ్చని కిమ్‌ జోంగ్‌ అన్‌ దక్షిణ కారియా అధికారులతో సూచన ప్రాయంగా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇవన్నీ ఎత్తుగడలలో భాగం.

ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం 1991వరకు వున్నది ఒకటే, రెండు కొరియాలు లేవు.1948లో ఐక్యరాజ్యసమితి దక్షిణ కొరియాను పరిశీలక హోదాలో గుర్తించింది. వుత్తర కొరియాను గుర్తించ నిరాకరించింది. 1950లో దక్షిణ కొరియాపై వుత్తర కొరియా దాడి చేసిందనే ఫిర్యాదు రావటంతో భద్రతా మండలి వుత్తర కొరియాపై చర్య తీసుకోవాలని తీర్మా నించింది. ఆ తీర్మానాన్ని నాటి సోవియట్‌ యూనియన్‌ వీటో చేయలేదు. దాంతో అమెరికా నాయకత్వంలో వుత్తర కొరియాపై దాడి జరిగింది. ఆ దాడిని చైనా సహకారంతో వుత్తర కొరియా తిప్పి కొట్టి తన భూభాగాన్ని నిలుపు కొన్నది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. 1971 వరకు ఐక్యరాజ్యసమితిలో చైనా అంటే నేటి తైవాన్‌ ప్రతినిధిగా వుంది. ఆ ఏడాది చైనాను గుర్తించిన తరువాత తైవాన్‌ సభ్యత్వాన్ని రద్దు చేశారు. కొరియా విషయంలో భిన్నంగా జరిగింది. అది ఐరాస ఏర్పాటు సమయానికి స్వతంత్ర దేశంగా లేదు. 1971లో కమ్యూనిస్టు చైనాకు గుర్తింపు వచ్చిన తరువాత వుత్తర కొరియాకు పరిశీలక హోదా కల్పించారు. తరువాత రెండు దేశాలూ తాము శాంతియుత పద్దతుల్లో విలీనానికి చర్యలు తీసుకుంటామని సంయుక్తంగా ప్ర కటించాయి. తరువాత రెండు దేశాలకు 1991లో శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. విలీస సమస్య పరిష్కారం కాలేదు. నేటి వరకు వరకు వుభయులు ప్రకటనలైతే చేస్తున్నారు గానీ ముందుకు సాగటం లేదు. అందువల్లనే ఆచరణలో మనకు కనిపిస్తున్నది ఒకే దేశం, రెండు వ్యవస్ధలు. వుత్తర కొరియా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణంలో వున్న రెండున్నర కోట్ల జనాభా వున్న దేశం. దీర్ఘకాలం పాటు సైనిక నియంతల పాలనలో తరువాత సైనికాధికారుల కనుసన్నలలో పనిచేసే పౌర పాలకులతో పని చేస్తున్న ఐదు కోట్లకు పైగా జనాభాతో పెట్టుబడిదారీ వ్యవస్ధలో వున్న దేశం దక్షిణ కొరియా.

ప్రపంచం దృష్టి సారించే విధంగా వుభయ దేశాల మధ్య వురుములు మెరుపులతో పాటు పెద్దగా సంప్రదింపుల వాతావరణం కూడా కనపడలేదు. కానీ రెండు దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నట్లు తాపీగా ప్రకటించి ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. అదీ ఎక్కడా 1953లో ఎక్కడైతే కొరియా యుద్ధ కాల్పుల విరమణ ఒప్పందం కుదరిందో, తాత్కాలిక సరిహద్దుగా గుర్తించిన చోట, దక్షిణ కొరియా వైపున వున్న మిలిటరీ రహిత ప్రాంతమైన పాముంజోమ్‌లోని ‘శాంతి నివాసం’లో వుత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ అన్‌, దక్షిణ కొరియా నేత మూన్‌ జె ఇన్‌ భేటీలో ఒప్పందంపై సంతకాలు చేశారు.

రెండు దేశాలను అణురహితంగా మార్చటం, రెండు దేశాల మధ్య వున్న శత్రుపూరిత కార్యకలపాలకు స్వస్ధి పలకటం, ప్రచార దాడులను నిలిపివేసి రెండు దేశాల మధ్య వున్న మిలిటరీ రహిత ప్రాంతాన్ని శాంతి మండలంగా మార్చాలి, సరిహద్దు ప్రాంతంలో ఆయుధాల సంఖ్య తగ్గింపు, అమెరికా, చైనాల ప్రమేయంతో చర్చలను ముందుకు తీసుకుపోవటం, కొరియా యుద్ద సమయంలో విడిపోయిన కుటుంబాలను దగ్గరకు చేర్చటం, సరిహద్దు ప్రాంతంలో రోడ్లు, రైలు మార్గాల నవీకరణ, ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడలతో సహా అన్ని క్రీడలలో సంయుక్త జట్లతో పాల్గనటంపై ఒప్పందం కుదిరింది.

వివాహానికి ముందే విడాకుల గురించి చర్చించే ప్రబుద్ధుల మాదిరి రెండు దేశాల మధ్య సంబంధాల మెరుగుదల గురించి వూహాగానాలు చేసే పశ్చిమ దేశాల మీడియా కుదిరిన ఒప్పందాంశాలపై కూడా మరుక్షణం నుంచే వుత్తర కొరియాపై చిత్తశుద్ధిపై రచ్చ ప్రారంభించింది. గతంలో కుదిరిన కొన్ని ఒప్పందాల నుంచి వుత్తర కొరియా వెనక్కు తగ్గిన మాట వాస్తవం. దానికంటే ముందు మరో ఒప్పంద భాగస్వామి అమెరికా వాగ్దానభంగం చేయటమే కాదు, వుత్తర కొరియాను రెచ్చగొట్టిన పర్యవసానమే అది. కొరియా ద్వీపకల్పంలో చిచ్చు పెట్టింది, పిర్ర గిల్లి జోలపాడుతోంది, దక్షిణ కొరియాను తన చేతిలో పావుగా చేసుకొని వుత్తర కొరియాకే కాదు, పక్కనే వున్న సోషలిస్టు చైనాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతోంది అమెరికాయే.

వుత్తర కొరియా విశ్వసనీయతపై సందేహాలు లేవనెత్తుతున్న పశ్చిమ దేశాలు మరో నూతన ఒప్పందాన్ని ఎందుకు ప్రోత్సహించినట్లు? ఇది సమాధానం లేని ప్రశ్న. పశ్చిమ దేశాల కుట్రలు, కుయుక్తుల గురించి తెలిసీ వుత్తర కొరియా ఎందుకు ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. రెండు దేశాల వెనుక పనిచేసిన వత్తిడులేమిటి? ఈ రీత్యా చూసుకున్నపుడు వుభయులకూ ఇది అవసరమే. ఎవరి ఎత్తుగడలు వారికి, ఎవరి ప్రయోజనాలు వారికీ వున్నాయి.

వేల సంవత్సరాల పాటు ఒకే దేశంగా కొనసాగిన కొరియాను కే దేశంగా 1910లో జపాన్‌ ఆక్రమించింది. దానికి వ్యతిరేకంగా కొరియన్లు పెద్ద ఎత్తున వుద్యమాలు నడిపారు. రెండవ ప్రపంచ యుద్దం ముగిసే సమయంలో 1945 ఆగస్టు తొమ్మిదిన యాల్టా సమావేశంలో కుదిరిన ఒప్పందం మేరకు జపాన్‌పై నాటి సోవియట్‌ యూనియన్‌ యుద్ధం ప్రకటించింది. అయితే కొరియాలో అప్పటికే కమ్యూనిస్టులు విముక్తి పోరాటాలలో ముందుండటంతో విముక్తి జరిగిన తరువాత కొరియా సోవియట్‌ ప్రభావంలోకి వెళుతుందనే భయంతో 38వ అక్షాంశ రేఖ వరకు మాత్రమే సోవియట్‌ సైన్యాలు పరిమితం కావాలని మిగతా ప్రాంతాన్ని తమకు వదలాలని అమెరికా కోరింది. వారం రోజులలోపే అమెరికా సేనలు ప్రవేశించక ముందే జపాన్‌ చేతులేత్తేసింది. మరో పది రోజుల తరువాత ఎర్ర సైన్యం వుత్తర కొరియాలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఇరవై రోజులకు అమెరికా సేనలు వచ్చాయి. తమకు అనుకూలంగా వుంటే మిలిటరీ ప్రభుత్వాన్ని దక్షిణ కొరియాలో ఏర్పాటు చేశాయి.

Image result for korea missile

జపాన్‌ తప్పుకున్న తరువాత రెండవ ప్రపంచ యుద్ధ మిత్రరాజ్యాల పర్యవేక్షణలో కొంతకాలం కొరియాలో పాలన సాగించాలని కొందరు ప్రతిపాదించారు. అయితే దేశభక్తులు తమకు వెంటనే స్వాతంత్య్రం కావాలని డిమాండ్‌ చేశారు. దీంతో సోవియట్‌ యూనియన్‌ కమ్యూనిస్టులను, పోటీగా స్వాతంత్య్రపోరాట సమయంలో పశ్చిమ దేశాలకు పారిపోయిన, జపాన్‌తో చేతులు కలిపిన ద్రోహులను, కమ్యూనిస్టు వ్యతిరేకులను అమెరికన్లు చేరదీశారు.

అమెరికా ప్రోద్బలంతో కొరియాపై తాత్కాలిక కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్యసమితి చేసిన ప్రతిపాదనను సోవియట్‌ యూనియన్‌ తిరస్కరించింది. తరువాత అమెరికన్లు దక్షిణ కొరియాలో ఎన్నికల తతంగం జరిపి మిలిటరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారాన్ని దానికి బదలాయించారు. వుత్తర కొరియా ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. దాంతో సోవియట్‌ సేనలు అక్కడి నుంచి వెనక్కు వెళ్లిపోయాయి. అయితే దక్షిణ కొరియా మిలిటరీకి శిక్షణ ఇచ్చే నెపంతో అమెరికా సేనలు అక్కడే తిష్టవేశాయి. కొరియాను ఒకే దేశంగా పరిగణిస్తూ రెండు ప్రభుత్వాలు మొత్తం కొరియాకు తామే ప్రతినిధులమని ప్రకటించుకున్నాయి. విభజన తాత్కాలికమే అని రెండు ప్రాంతాల విలీనానికి కట్టుబడి వున్నట్లు పేర్కొన్నాయి. ఎవరికి వారు పైచేయి సాధించి దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొనేందుకు ప్రయత్నించారు.ఈ క్రమంలోనే 1950 జూన్‌ 25న రెండు ప్రాంతాల మిలిటరీ మధ్య ఘర్షణ తలెత్తింది. దక్షిణ కొరియాలోని ప్రభుత్వానికి రక్షణ కల్పించే పేరుతో భద్రతా మండలిలో అమెరికా ఒక తీర్మానం చేయించటం, ఐరాస సేనల పేరుతో వుత్తర కొరియాపై దాడికి దిగాయి. కొద్ధి కాలం తరువాత వుత్తర కొరియాకు మద్దతుగా చైనా రంగంలోకి వచ్చింది. అమెరికా నాయకత్వంలోని సేనలను తరిమి కొట్టింది. చివరకు 1953 జూలై 27న వుభయ ప్రాంతాల మధ్య పూర్వపు సరిహద్దులను పునరుద్దరిస్తూ 38వ అక్షాంశ రేఖ పరిసరాలను మిలిటరీ రహిత ప్రాంతంగా గుర్తిస్తూ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు

ఈ ఒప్పందం కాల్పుల విరమణకే పరిమితమైంది తప్ప తదుపరి శాంతి ఒప్పందం కుదరలేదు.దాన్ని కూడా దక్షిణ కొరియా పాలకులు ఆమోదించి సంతకాలు చేయలేదు, చివరకు కట్టుబడి వుంటామని మాత్రమే ప్రకటించారు.దాంతో తాము కూడా కట్టుబడటం లేదని వుత్తర కొరియా ప్రకటించింది. అందువలన ఇప్పటికీ సాంకేతికంగా కాల్పుల విరమణ జరిగింది తప్ప సాంకేతికంగా యుద్ధం ముగిసినట్లు కాదు.

కొరియా యుద్దం, దేశ విభజన కొరియన్లను అనేక కష్ట నష్టాలపాలు చేసింది. ఏడున్నరలక్షల మంది తమ కుటుంబ సభ్యులకు దూరమయ్యారు. ఎదురుగా కనిపిస్తున్నా ఒకరి నొకరు కలుసుకోలేని దుస్ధితి. రెండు ప్రాంతాల మధ్య నిత్యం వుద్రిక్తతలు, ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఆందోళన,భయం వెన్నాడుతూ వుంటుంది. వుభయ ప్రాంతాలను వేరు పరచి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా ఒకే దేశం, ఒకే ప్రజగా ప్రపంచం ముందు తలెత్తుకు నిలబడాలన్న తపన ఇంకా మెజారిటీ జనంలో వుందని అనేక సర్వేలు వెల్లడించాయి. గత ఐదు ద శాబ్దాలలో వుభయుల మధ్య విబేధాలను పెంచే అనేక వుదంతాలు జరిగాయి. వాటి వెనుక అమెరికా ప్రచ్చన్న హస్తం వుంది. కొరియా ప్రాంతంలో తిష్ట వేయాలంటే అమెరికన్లకు ఒక దేశం అవసరం. అది దక్షిణకొరియాగా వుండాలన్నది దాని వాంఛ అందుకే విలీనానికి ఇంకా సమయం రాలేదు, దక్షిణ కొరియన్లలో భయం తొలగలేదంటూ కుంటి సాకులు చెబుతున్నది. నిజానికి రెండు ప్రాంతాలు విలీనమైతే జనాభా రీత్యా చూసుకుంటే రెండున్నర కోట్ల మంది వుత్తర కొరియన్లతో పోలిస్తే ఐదుకోట్లమందికి పైగా వున్న దక్షిణ కొరియన్లే నిర్ణయాత్మక పాత్ర వహిస్తారు. అందువలన వారు భయపడుతున్నారని చెప్పటంలో అర్ధం లేదు. దక్షిణ కొరియాలో అమెరికా సైనిక తిష్ట వుత్తర కొరియన్లనే భయపెడుతున్నది, ఎందుకంటే 1950దశకంలో వారిపై దాడి చేసింది అమెరికన్లు, వారి కనుసన్నలలో పనిచేసే దక్షిణ కొరియా మిలిటరీ తప్ప మరొకటి కాదు.

Image result for north korea  arms show

అమెరికా ఈ వైఖరి కారణంగానే వుత్తర కొరియా తన రక్షణ చర్యల్లో భాగం ఆధునిక క్షిపణులు, అణు కార్యక్రమాలను చేపట్టాల్సి వచ్చింది. ప్రపంచంలో అణు రియాక్టర్లను కలిగిన ఏ దేశమైనా అణ్వాయుధాలను తయారు చేయటానికి అవసరమైన ముడి సరకును కలిగి వున్నట్లే. అందువలన దక్షిణ కొరియా అధికారికంగా ప్రకటించలేదు తప్ప దాని దగ్గర అణ్వాయుధాలు లేవని చెప్పలేము. వుత్తర కొరియా అణుక్షిపణుల కార్యక్రమాన్ని ప్రారంభించటంతో 2003 నుంచి అమెరికా, చైనా,జపాన్‌, రష్యా, వుభయ కొరియాల( ఆరు దేశాల) మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. 2006ల వుత్తర కొరియా తొలి అణుపరీక్ష జరిపింది.

తాజా ఒప్పందానికి దారితీసిన నేపధ్యాన్ని చూస్తే వుభయుల మీద పరిస్ధితులు, పర్యవసానాలు వత్తిడి తెచ్చాయనే చెప్పాలి. తమ వనరులను మిలిటరీ అవసరాలకు ఖర్చు చేయటం వుత్తర కొరియాకు ఎల్లవేళలా సాధ్యం కాదు. అది వాంఛనీయం కూడా కాదు. చైనా ఎంతగా సాయం చేసినప్పటికీ అమెరికా విధించిన అధికారిక, అనధికారిక ఆంక్షలు వుత్తర కొరియాను ఇబ్బంది పెట్టేవే. అందువలన కాస్త వూపిరి పీల్చుకోవాలంటే దక్షిణ కొరియాతో సామరస్యక పూర్వక ఒప్పందం దానికి కూడా అవసరమే.

వుత్తర కొరియా అణు పరీక్షలు, అణ్వాయుధాలను మోసుకుపోగల దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగాల ద్వారా అమెరికా,జపాన్లపై తాము బాంబుల వర్షం కురిపించగలమని వారు చేసిన హెచ్చరిక అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా వాసులను అనిశ్చితి, భయాందోళనలకు గురిచేసింది. అమెరికా ఎన్ని బెదిరింపులు చేసినా వుత్తర కొరియా వెనక్కు తగ్గదని తేలిపోవటంతో ఏదో ఒక విధంగా రాజీ ఒప్పందం చేయించట ద్వారా తమ జనాల్లో వున్న భయాన్ని పొగొట్టేందుకు అమెరికా, జపాన్‌ పాలకులు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ధనిక దేశాలలో గత పది సంవత్సరాలుగా తలెత్తి కొనసాగుతున్న ఆర్ధిక సంక్షోభం దక్షిణ కొరియాను కూడా తాకింది. అది అక్కడి కార్మికవర్గంలో అసంతృప్తికి దారితీస్తోంది. దీనికి తోడు నిత్యం వుత్తర కొరియా నుంచి ఏం జరుగుతుందో తెలియని స్ధితి దక్షిణ కారియా పాలకవర్గం వత్తిడి కలిగిస్తోంది. వుత్తర కొరియాకు తోటి సోషలిస్టు దేశ ంగా ఎన్ని విధాలుగా సాయం చేస్తున్నప్పటికీ అంతర్జాతీయ వేదికల మీద కొన్ని సందర్భాలలో చైనా కూడా గట్టిగా మాట్లాడలేని స్ధితి వుంది. ఈ విధంగా కొరియా రాజకీయాలతో ప్రమేయం వున్న అన్ని దేశాలకు అనుకూల, ప్రతికూల వత్తిళ్లు వున్నాయి. ఈ కారణంగానే వుభయ కొరియాల మధ్య ఒప్పందానికి తెరవెనుక వుండి అన్ని దేశాలూ సంతకాలు చేయటానికి సహకరించాయనే చెప్పవచ్చు. ఈ పూర్వరంగంలోనే

2015 జనవరి ఒకటిన వుత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ అన్‌ దక్షిణ కారియాతో వున్నత స్ధాయి చర్చలకు సుముఖత వ్యక్తం చేశారు.అదే ఏడాది ఆగస్టులో సరిహద్దులలో సంభవించిన కొన్ని సంఘటనలు వుద్రిక్తతలను కలిగించినా సర్దుబాటు చేసుకున్నారు. శాంతి చర్చలకు సంసిద్ధతతో పాటు వుత్తర కొరియా తన అణుపరీక్షలను కూడా కొనసాగిస్తూనే వస్తోంది. 2016లోఅరవైఎనిమిద వార్షికోత్సవం సందర్భంగా ఆరవ పరీక్ష జరిపింది.కిమ్‌ జోంగ్‌ ఇన్‌ను హత్య చేసేందుకు తమ వద్ద పధకం వుందని దక్షిణ కొరియా బెదిరించింది.ఈ ఏడాది మార్చి ఆరున కిమ్‌ దక్షి ణకొరియా రాయబారులతో సమావేశమై సియోల్‌ శీతాకాల ఒలింపిక్స్‌ గురించి చర్చించారు.2017 మేనెలలో అధికారానికి వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ వుత్తర కొరియా సయోధ్య కు సై అన్నాడు.2018 నూతన సంవత్సర సందేశంల సియోల్‌ శీతాకాల ఒలింపిక్స్‌కు జట్టును పంపేందుకు కిమ్‌జోంగ్‌ అన్‌ సంసిద్ధత ప్రకటించారు.

రెండు సంవత్సరాల తరువాత ముఖాముఖీ చర్చలకు తెరలేచింది. సియోల్‌ శీతాకాల ఒలింపిక్స్‌కు ఐస్‌ హాకీలో వుమ్మడి జట్టును, అధ్లెట్లను పంపటంతో పాటు రెండు ప్రాంతాల క్రీడాకారులు ఒకటిగానే పరేడ్‌లో పాల్గన్నారు. ఈ పోటీలకు అసాధారణ రీతిలో వుత్తర కొరియా పార్లమెంట్‌ అధ్యక్షుడి నాయకత్వంలో పెద్ద ప్రతినిధి బృందం తరలి వచ్చింది. ఈ సందర్బంగానే తమ దేశాన్ని సందర్శించాలని దక్షిణ కొరియా అధ్యక్షుడికి ఆహ్వానం అందచేశారు. ఈ పరిణామం తరువాత వుభయ దేశాల అధికారులు వుమ్మడిగా 2021 ఆసియా శీతాకాల ఆటల నిర్వహణ గురించి ప్రతిపాదనలు చేశారు. మార్చినెలలో దక్షిణకారియా ప్రతినిధి బృందం పోంగ్‌యాంగ్‌లో వుత్తర కొరియా అధ్య క్షుడు కిమ్‌ను కలసింది. తరువాత అదే బృందం వాషింగ్టన్‌ వెళ్లి కిమ్‌తో భేటీ కావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు ఆహ్వానం అందచేసింది.

ఏప్రిల్‌ ఒకటవ తేదీన దక్షిణ కారియా పాప్‌ స్టార్స్‌ పోంగ్‌యాంగ్‌ వెళ్లి వసంతం వస్తోందంటూ ఒక సంగీత కచేరి నిర్వహించింది. దానికి కిమ్‌ హాజరయ్యారు. ఈలోగా పరస్పర ప్రచార దాడులు ఆగిపోయాయి.ఏప్రిల్‌ 27న వుభయ దేశాల నేతల శిఖరాగ్ర సమావేశం జరిగింది, ఒప్పందం కుదిరింది. కొరియా యుద్దం 1953 తరువాత తొలిసారిగా వుత్తర కొరియా నేత దక్షిణ కొరియాలో అడుగు పెట్టటం ఇదే ప్రధమం. ఎక్కడైతే నాడు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందో అక్కడే ఈ భేటీ జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని శాంతి ఒప్పందంగా మార్చాలన్న ఆకాంక్ష ఇరువురిలో వ్యక్తమైంది. ఒంటిచేతితో చప్పట్లు రావు, చేతులు కలపాలి, చేతలు జరగాలి.అలాగే కుదిరిన ఒప్పందాన్ని ఇరు పక్షాలు, వారి వెనుక వున్న మద్దతుదార్లు చిత్తశుద్దితో వుంటేనే ఆచరణలోకి వస్తుంది. ఎవరు ద్రోహం చేసినా అది ఒక్క కారియా ద్వీపకల్పానికే కాదు, యావత్తు ప్రపంచానికి నష్టదాయకం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సిరియాపై దాడులతో రెచ్చగొడుతున్నడోనాల్డ్‌ ట్రంప్‌ !

18 Wednesday Apr 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

chemical weapons, Donald trump, RUSSIA, Syria, UN and OPCW

Image result for syria attack

ఎం కోటేశ్వరరావు

‘ఒక బీరు కొని అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో కలసి తాగుతూ స్వయంగా నా అనుభవాలను పంచుకోవాలనుంది. సిరియా పౌరుల కోసం ఏదో ఒకటి చేసేందుకు ఆయన ప్రయత్నించంటం నాకు సంతోషంగా వుంది.’ గత నాలుగు సంవత్సరాలుగా అమెరికాలో ఆశ్రయం పొంది జర్నలిస్టు ముసుగులో సిరియాపై తప్పుడు ప్రచారం సాగిస్తున్న కాశీమ్‌ ఇద్‌ అనే ఒక ఐఎస్‌ఏజంట్‌ గతవారంలో సిరియాపై దాడుల తరువాత సిఎన్‌ఎన్‌ టీవీతో చేసిన వ్యాఖ్య. అమెరికా నాయకత్వంలో ఫ్రెంచ్‌, బ్రిటన్‌ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇతర కొన్ని దేశాలు జరిపిన దాడులతో ఐఎస్‌ ఏజంట్ల ఆనందం ఎలా వుందో ఇది తెలుపుతోంది. నేను సైతం తక్కువ తిన్నానా అంటూ నాలుగు సంవత్సరాల క్రితం బరాక్‌ ఒబామా తన వంతుగా ఒక దాడి జరిపితే, నీకంటే పెద్ద వెధవాయను నేను అంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ గతేడాది ఒకసారి ఇప్పుడు మరోసారి దాడులు జరిపించాడు. గతంలో ఐఎస్‌ తీవ్రవాదులను అణచే పేరుతో, ఇప్పుడు ప్రభుత్వమే తన పౌరులపై రసాయనిక ఆయుధాలను ప్రయోగిస్తోందనే ముసుగుతో దాడికి పాల్పడింది. చరిత్రలో ఇంత వరకు నాజీలు తప్ప ఎవరూ రసాయనిక ఆయుధాలతో సామూహిక హత్యలు చేసిన వుదంతాలు కానరావు. తమ దగ్గర ఎలాంటి రసాయన ఆయుధ కార్యక్రమం లేదు కనుక వత్తిడికి తలగ్గిన సిరియా ఏవైనా వుంటే వాటి నిర్మూలనకు అమెరికాతో ఒక ఒప్పందం కూడా చేసుకుంది. దాన్ని అమలు జరపకుండా, అంతర్జాతీయ న్యాయాన్ని వుల్లంఘించి ఎలాంటి చట్టబద్దత లేకుండా జరిపిన దాడి ఇది. అణు జలాంతర్గాములు, అణ్వాయుధాలను మోసుకుపోయే విమానవాహక యుద్ధ నౌకలతో మోహరించి 2003లో ఇరాక్‌ తరువాత జరిపిన పెద్ద దాడి ఇది.ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందాన్ని రద్దు చేసుకోబోతున్నారనే వార్తలు ఒకవైపు, రష్యాకు చెందిన ఒక డబుల్‌ ఏజంట్‌, అతని కూతురిపై విష ప్రయోగం జరిపిందనే సాకుతో అనేక మంది రష్యా రాయబార సిబ్బందిని ఐరోపా దేశాల నుంచి బహిష్కరించటం వంటి పరిణామాలను చూస్తే పశ్చిమ దేశాలు గిల్లి కజ్జాలకు పూనుకున్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది.

అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మిలిటీకరణ జరిగింది. ప్రయివేటు కార్పొరేట్‌ సంస్ధలే అక్కడ ఆయుధాలు తయారు చేస్తాయి. అందువలన వాటికి లాభాలు రావాలంటే ప్రపంచంలో ప్రతి రోజూ ఏదో ఒక మూల రావణకాష్టం మాదిరి య దానికి ఎక్కడో ఒక చోట యుద్ధాలు, దేశాల మధ్య వుద్రిక్తతలు వుంటే తప్ప జరుగుబాటు వుండదు. మిలిటరీ పరిశ్రమలను మేపేందుకు అమెరికా పాలకవర్గం ఇప్పటికే స్కూళ్ల ప్రయివేటీకరణ, నిధుల కోత, మౌలిక సౌకర్యాల తగ్గింపు, గృహ, వైద్య రంగాల నుంచి తప్పుకోవటం వంటిచర్యల ద్వారా జనజీవితాలను దిగజార్చటంతో పాటు నిరుద్యోగం, దారిద్య్రాన్ని పెంచుతోంది. రెండోవైపు అంతర్జాతీయంగా దాడులకు తలపడుతోంది. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలమని ప్రగల్భాలు పలికే పశ్చిమ దేశాలు జరిపిన ఈ దాడిని అనేక దేశాలు, సమాజాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పశ్చిమాసియాలో, తద్వారా ప్రపంచ యుద్ధానికి పశ్చిమ దేశాలు అర్రులు చాస్తున్నాయని అనేక మంది భయపడుతున్నారు.అంతర్గతంగా వైఫల్యాలబాటలో వున్న ట్రంప్‌ వాటిని పక్కదారి మళ్లించేందుకు, నవంబరులో జరగనున్న పార్లమెంట్‌ మధ్యంతర ఎన్నికలలో ఓట్లు పొందేందుకు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వచ్చాయి. సిరియా రసాయక ఆయుధాలను ప్రయోగించిందని ఆరోపించటం కాదు, అంతర్జాతీయ సంస్ధల ద్వారా దర్యాప్తు జరిపించాలి. దాని గురించి ఐక్యరాజ్యసమితిలో చర్చ జరపాలి. ఏ చర్య తీసుకున్నా దాని అనుమతితో, పర్యవేక్షణలో జరపాలి తప్ప అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ నేతలు ముగ్గురూ కూర్చొని సిరియాపై దాడులు చేయటానికి వారెవరు?

Image result for syria attack

సిరియా వద్ద వున్న రసాయనిక ఆయుధాల సామర్ధ్యాన్ని దెబ్బతీసే పేరుతో జరిపిన ఈ దాడులు ప్రపంచాన్ని భయపెట్టేందుకు తప్ప మరొకందుకు కాదు. నిజంగా ఎవరైనా రసాయనిక ఆయుధాలను తయారు చేస్తుంటే గత నాలుగైదు సంవత్సరాలుగా దాడులు చేస్తామని బెదిరిస్తున్న అమెరికా ప్రకటనల తరువాత కూడా జాగ్రత్తలు తీసుకోకుండా వుంటారా? వర్తమాన పరిస్ధితుల్లో ఏ దేశానికాదేశం తన రక్షణ కోసం అన్ని రకాల ఆయుధాల తయారీకి పూనుకోవటం బహిరంగ రహస్యం. వాటిలో ఒకటైన జీవ, రసాయన ఆయుధాల్లేని పెద్ద దేశాలేవీ లేవు. కొన్ని బహిర్గతమైతే కొన్ని రహస్యంగా చేస్తుంటాయంతే తేడా. గతంలో కుదిరిన ఒప్పందాల ప్రకారం సిరియా 1300 టన్నుల రసాయన ఆయుధాలను నాశనం చేసింది. అయినా సరే దాని దగ్గర ఇంకా ఎక్కడో వున్నాయన్నది పశ్చిమ దేశాల ఆరోపణ. ఐక్యరాజ్యసమితిలోని రసాయనాయుధాల నిషేధ సంస్ధ(ఒపిసిడబ్ల్యు) సిరియా రసాయన ఆయుధాలను ధ్వంసం చేసినందుకు గాను 2013లో నోబెల్‌ శాంతి బహుమతి కూడా పొందింది. మరుసటి ఏడాది సెప్టెంబరు నాటికి 96శాతం ఆయుధాలను నాశనం చేసినందున, తయారీ కేంద్రాల విధ్వంసానికి నిర్ణయించిందని , 2016జనవరిలో మొత్తాన్ని ధ్వంసం చేసినట్లు ఆ సంస్ధ ప్రకటించింది. నిజానికి అవన్నీ 1970దశకం నుంచి రూపొందించినవి. అలాంటపుడు తిరిగి ఏడాది కూడా గడవక ముందే సిరియా వద్ద రసాయనిక ఆయుధాలు గుట్టలు పడ్డాయని పశ్చిమ దేశాలు ప్రకటించాయంటే ఆధారం ఏమిటి? ప్రతి దేశంలోనూ పారిశ్రామిక అవసరాల కోసం వుపయోగించే క్లోరీన్‌ గాస్‌ను రసాయనికాయుధాల తయారీకి కూడా వుపయోగించవచ్చు. దీనిని చూపే సిరియాపై పశ్చిమ దేశాలు ఆరోపణలకు దిగాయి. తరువాత ఓపిసిడబ్ల్యు, ఐరోసా సంయుక్త దర్యాప్తు వ్యవస్ధను(జిమ్‌) ఏర్పాటు చేశాయి. ఆ జిమ్‌ కొత్తగా సిరియా రసాయనికాయుధాల గురించి ఒక నివేదిక సమర్పించింది. అది అమెరికా అనుకూల తొత్తు నివేదిక అని రష్యా గుర్తించేందుకు నిరాకరిస్తోంది. దాని ఆధారంగా ఎలాంటి చర్య తీసుకోకూడదని రష్యా ఐరాసలో వీటో చేసింది. అందువలన అమెరికా నాయకత్వంలోని కూటమి ఇప్పుడు ఏకపక్షంగా దాడులు చేసింది. ఆనక తీరికగా దర్యాప్తు అంటూ కబుర్లు చెబుతోంది.

అమెరికా రక్షణ మంత్రి జిమ్‌ మాటిస్‌ చెప్పినదాని ప్రకారం 105 దీర్ఘకాలిక శ్రేణి క్షిపణులను ప్రయోగించిన పెద్ద దాడి ఇది, ఒక్కసారికే ఇది పరిమితం అని చెప్పినప్పటికీ ప్రపంచ స్పందనను చూసేందుకు చేసిన ఒక ప్రయోగమని చెప్పవచ్చు. తన నూతన, నవీకరించిన ఆయుధాలు ఎలా పని చేస్తాయో పరీక్షించేందుకు గతంలో ఇరాక్‌ మొత్తాన్ని తన యుద్ద ప్రయోగశాలగా మార్చింది. ఇప్పుడు కూడా అదే చేస్తోంది. కొద్ది రోజుల క్రితం డోనాల్డ్‌ ట్రంప్‌ రష్యాను బెదిరిస్తూ చేసిన ఒక ట్వీట్‌లో కొత్తవి, చక్కని, చిన్నవైన క్షిపణులు వస్తున్నాయి కాచుకోండి అని పేర్కొన్నారు. సిరియా రాజధాని డమాస్కస్‌లోని జీవ, రసాయన ఆయుధాల రూపకల్పన, తయారీ, పరీక్షా కేంద్రం మీద, హామ్‌ అనే పట్టణంలోని రసాయనిక ఆయుధాల గోడవున్‌ మీద, మూడవ దాడి దానికి సమీపంలోనే వున్న ఒక బంకర్‌ మీద క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికన్లు చెబుతున్నారు. అమెరికన్లు చెబుతున్నదే వాస్తవమైతే ఆయుధ గోడవున్లపై బాంబులు వేస్తే అవి పేలి ఈ పాటికి ఎంతో ప్రాణ నష్టం జరిగి వుండాల్సింది. అలాంటి వార్తలేవీ రాలేదు కనుక సిరియా ప్రకటించినట్లు దాని వైమానిక సైనిక కేంద్రాలు, విమానాశ్రయాల మీద మాత్రమే దాడులు జరిగాయని అనుకోవాల్సి వస్తుంది.మరోవైపున ప్రయోగించిన 103లో 71క్షిపణులను సిరియా వైమానిక రక్షణ వ్యవస్ధలు కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. రష్యా వద్ద వున్న అధునాతన క్షిపణి విధ్వంసక వ్యవస్ధలు సిరియాలో ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి.

సిరియా ప్రభుత్వం రసాయనిక ఆయుధాలతో దాడులు జరుపుతోందంటూ ఒక పధకం ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా పశ్చిమ దేశాల మీడియా ప్రచారం చేస్తోంది. అలాంటి దాడులు జరిపింది సిరియా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు పశ్చిమ దేశాల సాయంతో దాడులు చేస్తున్న కిరాయి ఐఎస్‌ తీవ్రవాదులు తప్ప మరొకరు కాదని గతంలోనే వెల్లడైంది. ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే చివరికది నిజమై కూర్చుంటుందన్న నాజీ గోబెల్స్‌ సిద్ధాంతం ప్రకారం సిరియాపై రసాయనిక ఆయుధాల ప్రయోగ ప్రచారం జరుగుతోంది. 2003లో బుష్‌ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం ఇరాక్‌పై దాడులు చేసేందుకు చేసిన ప్రచారాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. ఆ దేశ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ ప్రత్యర్ధి దేశాలపై దాడులు చేసేందుకు మారణాయుధాలను గుట్టలుగా పోగేశాడంటూ పెద్ద ఎత్తున చేసిన ప్రచారాన్ని, ప్రభుత్వాన్ని కూల్చివేసి, అక్కడి చమురుబావులను స్వాధీనం చేసుకొని, సద్దాంను వురితీసిన తరువాత అలాంటి ఆయుధాలేమీ కనపడలేదని పశ్చిమ దేశాలే ప్రకటించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.

ఆసియా,ఐరోపా, ఆఫ్రికా ఖండాల సంగమ ప్రాంతం వంటి మధ్యప్రాచ్యం, పశ్చిమాసియా మిలిటరీ రీత్యా వ్యూహాత్మకం, చమురువంటి సహజ సంపదల నిలయమైన ఈ ప్రాంతంపై పట్టు నిలుపుకొనేందుకు చరిత్రలో ప్రతి సామ్రాజ్యవాదీ ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రపంచాన్ని తన గుప్పిటలో పెట్టుకోవాలని చూస్తున్న అమెరికా ఆలోచన నిరంతరం దీని చుట్టూతిరుగుతూనే వుంటుంది. అందుకు గాను గోతికాడ నక్కలా అవకాశాల కోసం వేచి చూస్తుంటుంది. ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ ప్రాంత దేశాల పాలకులపై పెల్లుబికిన అసంతృప్తితో 2010లో ట్యునీసియాలో ప్రారంభమై మధ్య ప్రాచ్యం, వుత్తర ఆఫ్రికాలోని పలు దేశాలకు విస్తరించిన ఆందోళనలను అరబ్‌ వసంతోదయంగా వర్ణించారు. ఆ సమయంలో పనిలో పనిగా అమెరికన్లు తమ అజెండాల్లో వున్న దేశాలలోని పాలకులను తొలగించేందుకు తమ తొత్తులు ఏజంట్లను ప్రయోగించి అక్కడ కూడా తిరుగుబాట్లు ప్రారంభమైనట్లు ఒక పెద్దకుట్రకు తెరతీశారు. దానిలో ఒకటి సిరియా. గోడల మీద ప్రభుత్వవ్యతిరేక నినాదాలు రాసిన విద్యార్దులను అరెస్టు చేసిందనే పేరుతో 2011 మార్చినెలలో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలకు తెరతీశారు.తొలుత అంతర్గత తిరుగుబాటుగా మీడియా చిత్రించింది. కొద్ది నెలల్లోనే వివిధ దేశాల నుంచి ఐఎస్‌ తీవ్రవాదులు, కిరాయి మూకలను సమీకరించి పశ్చిమ దేశాలు అడుతున్న నాటకంగా వెల్లడైంది. ప్రతిగా వారిని అణచివేసేందుకు సిరియా సర్కార్‌ పూనుకుంది. తాము కూడా ఐఎస్‌ తీవ్రవాదులను అణచివేసేందుకు సిద్ధమే, సిరియాకు సాయం చేస్తామంటూ సరికొత్త నాటాకానికి తెరతీసిన పశ్చిమ దేశాలు త్వరలోనే అక్కడి అసాద్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసే సత్తా ఐఎస్‌ తీవ్రవాదులకు లేదని గ్రహించించాయి. తీవ్రవాదులకు ఆయుధాలు ఇచ్చింది కూడా వారేనని తేలింది. అప్పటి నుంచి తీవ్రవాదుల పట్టులో వున్న ప్రాంతాలను స్వాధీనం చేసుకొనేందుకు రసాయనికి ఆయుధాలను ప్రయోగిస్తోందంటూ అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించాయి. నిజానికి వాటిని ప్రయోగించింది తిరుగుబాటుదారులే అని తేలింది.

2012 ఆగస్టు 20న నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఒక ప్రకటన చేస్తూ సిరియా సర్కార్‌ రసాయన ఆయుధాలను గనుక ప్రయోగిస్తే అమెరికా గీచిన ఎర్ర(హెచ్చరిక అనే బెదిరింపు) గీతను దాటినట్లుగానే భావించాల్సి వుంటుందని బెదిరించాడు.2014లో ఒబామా సిరియా మీద దాడులు చేయించాడు. అయితే ఐఎస్‌,ఆల్‌ఖైదా వుగ్రవాదుల మీద దాడి అంటూనే సిరియా సామర్ధాన్ని దెబ్బతీసేందుకు పెద్ద ప్రయత్నం చేసి బక్కబోర్లాపడ్డాడు. అప్పటి వరకు అంతర్జాతీయ వేదికల మీద రాజకీయ మద్దతు మాత్రమే తెలుపుతున్న రష్యా ప్రత్యక్షంగా 2015 సెప్టెంబరు నుంచి తన మిలిటరీ నిపుణులు, సామగ్రిని సిరియాకు తరలించి తిరుగుబాటుదార్లను అణచేందుకు తోడ్పడుతోంది. అప్పటి నుంచి సిరియాపై దాడులకు పెంటగన్‌ ఎదురు చూస్తోంది. అదే ఏడాది నవంబరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ఎన్నికైతే ఐఎస్‌పై దాడులకు సిరియాకు పదాతి దళాలను కూడా పంపేందుకు వెనుకాడను అని ప్రకటించాడు. ఎన్నిక తరువాత తిరిగి అదే ప్రకటన చేస్తూ రష్యాతో పోరును కూడా మనం ముగించాల్సి వుంది అని సిరియా అధ్య క్షుడు అసద్‌ను వుద్దేశించి వ్యాఖ్యానించాడు. గతేడాది ఏప్రిల్‌లో అమెరికా 59 తోమహాక్‌ క్రూయిజ్‌ క్షిపణులను సిరియాపై ప్రయోగిచింది. సిరియాను ఆక్రమించేందుకు అమెరికన్లు చేస్తున్న తప్పుడు ప్రచారం దాని బలహీనతలనే బయటపెడుతున్నది. నిజంగానే అసాద్‌ ప్రభుత్వం వద్ద రసాయన ఆయుధాలు వుంటే, ఇటీవల కూడా ప్రయోగించినట్లు అమెరికా చెప్పటం అంటే నాలుగు సంవత్సరాలలో జరిపిన మూడు దాడులు ఎలాంటి ప్రభావం చూపలేదన్నది స్పష్టం. అయితే తాజాగా మూడోసారి ఎందుకు జరిపినట్లు అన్నది ప్రశ్న. బ్రిటీష్‌ రక్షణ మంత్రి గవిన్‌ విలియమ్స్‌న్‌ బిబిసితో మాట్లాడుతూ తాము చేసిన దాడి అక్కడి అంతరుద్ద్యంలో జోక్యం లేదా పాలకుల మార్పు కోసం చేసింది కాదు, ఇది ఆప్రాంతంలో వుద్రిక్తతలు మరింతగా పెరగకుండా తీసుకున్న పరిమిత, లక్షిత దాడి అన్నారు. తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డికోసమన్న సమాధానమిది. ఈనెల ఏడవ తేదీన సిరియా మిలిటరీ ప్రయోగించిన క్లోరీన్‌, ఇతర గుర్తు తెలియని గ్యాస్‌ వల్ల అనేక మంది పౌరులు మరణించారన్న కట్టుకథను ఆధారం చేసుకొని పదమూడవ తేదీన దాడి జరిపారు. ముందే చెప్పుకున్నట్లు అమెరికాలో ఆయుధాలను తయారు చేసేది ప్రయివేటు సంస్ధలు. ఇప్పుడు ప్రయోగిస్తున్న తోమహాక్‌ క్షిపణులను రేథియాన్‌ అనే కాంట్రాక్టరు. అంటే వాడికి పని ఇవ్వాలనే ఒప్పందం వుంది గనుక ఏదో ఒక సాకుతో ఎక్కడో ఒకచోట వాటిని ప్రయోగించాలి. ఈక్షిపణికి అమర్చన బాంబు పేలబోయే ముందు గంటకు 900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి నిర్దేశిత లక్ష్యంపై బాంబు వేస్తుంది. నాలుగు దశాబ్దాలుగా ఈ రకం క్షిపణులను వినియోగిస్తున్నప్పటికీ నవీకరించిన తరువాత తొలిసారిగా 900కిలోల బాంబును తాజాదాడిలో దానికి అమర్చి ప్రయోగించారు. అయితే ఇవి ఎంత మేరకు నష్టం చేకూర్చుతున్నాయనేది సందేహమే. గతేడాది సిరియా వైమానిక స్ధావరంపై చేసిన దాడిలో అనేక విమానాలు, రన్‌వే ధ్వంసమైనట్లు అమెరికన్లు వీడియోలద్వారా ప్రపంచానికి చూపారు. అయితే మరుసటి రోజు నుంచే ఆ రన్‌వేను వుపయోగిస్తున్నట్లు బయటపడింది. అంటే అవి నకిలీ వీడియోలన్నది స్పష్టం. తాజా దాడులలో 71క్షిపణులను మధ్యలోనే కూల్చివేసినట్లు రష్యా చెబుతోంది. కొందరు నిపుణుల వాదనల ప్ర కారం ఖండాంతర క్షిపణుల కంటే అమెరికా ఇప్పుడు ప్రయోగించిన క్రూయిజ్‌ క్షిపణులు చాలా తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి కనుక మధ్యలోనే వాటిని కూల్చివేయటానికి అవకాశాలను కాదనలేము. వాటిని కూల్చివేయగల రష్యా ఎస్‌-400 వ్యవస్ధలున్నాయనే అనుమానం వుంటే వాటి పరిధిలోకి పైలట్లతో కూడిన విమానాలను దాడులకు పంపేందుకు అమెరికా దాని మిత్రపక్షాలు భయపడతాయి. ఈ దాడులను రష్యా, చైనాలు ఖండించాయి. ఈ దాడి జరగటం తమ నాయకుడు పుతిన్‌కు అవమానకరం అని రష్యా దౌత్యవేత్తలు వ్యాఖ్యానించినట్లు నిర్ధారణకాని వార్తలు వెల్లడించాయి. ఇవి పుతిన్‌ను రెచ్చగొట్టేందుకు అమెరికన్లు ప్రచారంలో పెట్టినవి కూడా కావచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బ్రెజిల్లో లూలా అభ్యర్ధిత్వాన్ని అడ్డుకొనే రాజ్యాంగబద్ద కుట్ర !

11 Wednesday Apr 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Opinion, USA

≈ Leave a comment

Tags

Brazil, Brazil elections, judiciary conspiracy, lula da silva, Presidential Candidacy

ఎం కోటేశ్వరరావు

లూలాగా ప్రపంచానికి సుపరిచితమైన బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు లూలా డ సిల్వా ప్రస్తుతం జైలులో ఖైదీ. ఒక కేసులో తొమ్మిదిన్నర సంవత్సరాల శిక్ష అనుభవిస్తున్నారు అనేకంటే ఒక పెద్ద కుట్రలో భాగంగా జైలు పాలు చేశారనటం సముచితంగా వుంటుంది. ఆయనేమీ పదవిని అడ్డుపెట్టుకొని వేల కోట్లను వెనకేసుకోలేదు. విదేశీబ్యాంకుల్లో దాచుకోలేదు, వాటినే తిరిగి బినామీ పెట్టుబడులుగా పెట్టలేదు. లూలాపై మోపిన నేరం ఏమిటి? గతంలో అంటే 2003-11 మధ్య అధ్యక్షుడిగా వున్న సమయంలో ఆయన అప్పుడపుడు వచ్చిపోయారని చెబుతున్న ఇంటికి ఒక కంపెనీతో మరమ్మతులు చేయించాడట. అందుకుగాను దానికి ప్రభుత్వరంగ చమురు సంస్ధలో లాభదాయకమైన కాంట్రాక్టులు ఇప్పించాడట. ఇంటి మరమ్మతుల విలువ పన్నెండులక్షల డాలర్లని, దాన్ని వుచితంగా చేయించాడు గనక అంత మొత్తం లంచం తీసుకోవటంతో సమానమే అని గతేడాది జూలై 12న కోర్టు తీర్పు చెప్పింది. ఇదంతా తనపై మోపిన రాజకీయ కుట్ర అంటూ ఆ తీర్పును సవాలు చేస్తూ మరో కోర్టుకు వెళ్లిన లూలాకు అక్కడ తొమ్మిదిన్నర సంవత్సరాల శిక్షను పన్నెండుకు పెంచి ఖరారు చేశారు. దాంతో శనివారం నాడు ఆయన  జైలుకు వెళ్లారు.

లాటిన్‌ అమెరికా దేశాల నుంచి సవాళ్లను ఎదుర్కొంటున్న అమెరికా అక్కడి వామపక్ష, ప్రజాతంత్రశక్తులను దెబ్బతీసేందుకు నిరంతరం కుట్రలు పన్నుతోందని వేరే చెప్పనవసరం లేదు. ఏ వంకా దొరకని వారు డొంకను చూపి ఏడ్చారన్నది ఒక సామెత.(గ్రామాలను కలిపే కాలి, బండ్లబాటను డొంకలని పిలుస్తారు) లూలాను బదనాం చేసేందుకు చీకట్లో బాణాలు వేసినట్లుగా అమెరికా సిఐఏ, ఇతర సంస్ధల మద్దతు వున్న రాజకీయ ప్రత్యర్ధులు అనేక ఆరోపణలు చేశారు. ఆయన పాలనా కాలంలో కొందరు అధికారులు లేదా అధికార పార్టీకి చెందిన వారు అవినీతికి పాల్పడలేదనీ చెప్పలేము. లూలా వాటిని వుపేక్షించారని చేస్తున్న ఆరోపణలో ఒకటో అరశాతమో నిజం వుంటే వుండవచ్చు. కానీ లూలాపై చేసిన ఇంటి మరమ్మతు ఆరోపణలో పసలేనప్పటికీ ఈ ఏడాది జరగనున్న ఎన్నికలలో అధ్యక్షపదవికి పోటీ చేయకుండా అనర్హుని గావించేందుకు చేసిన కుట్రలో భాగమే శిక్ష అన్నది స్పష్టం.

లాటిన్‌ అమెరికాలో ఎదురవుతున్న వామపక్ష సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికా ఇటీవలి కాలంలో సరికొత్త కుట్రలకు తెరతీసింది.గతంలో మిలిటరీ నియంతలు, వారికి మద్దతుగా మితవాదశక్తులను రంగంలోకి తెచ్చింది. ఇప్పుడు వారి కాలంలో నియమితులైన న్యాయాధికారులతో రాజ్యాంగబద్ద కుట్రలను అమలు జరుపుతోంది. పార్లమెంట్లలో వామపక్ష శక్తులకు మెజారిటీ లేకపోవటం వాటిని అమలు జరపటం సులభమౌతోంది. ఈ ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికలలో లూలాను అభ్యర్ధిగా ప్రకటించారు. ఆయన విజయం ఖాయం అనే వాతావరణం ఏర్పడటంతో పాతకేసులను రంగంలోకి తెచ్చారన్నది స్పష్టం.లాటిన్‌ అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన 72సంవత్సరాల లూలా పాలనా కాలంలో దారిద్య్రనిర్మూలనకు తీసుకున్న చర్యలు నాలుగు కోట్ల మంది జీవితాలను మెరుగుపరిచాయి. పార్లమెంటులో మెజారిటీ వున్న మితవాదశక్తులు కుట్ర చేసి 2016లో లూలా నాయకత్వంలోని వర్కర్స్‌ పార్టీకి చెందిన అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌ను పదవి నుంచి తొలగించారు.

తోడేలుామేకపిల్ల కథలో మాదిరి దిల్మా రౌసెఫ్‌ను పదవీచ్యుతురాలిని చేసేందుకు చూపిన కారణం కూడా ఎంతో హాస్యాస్పదమైనదే. అదే ప్రాతిపదిక అయితే ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ఎన్నికైన వారి మీద అభియోగం మోపి పదవి నుంచి దించేయవచ్చు. 2014 ఎన్నికలలో దిల్మా రౌసెఫ్‌ను గెలిపించేందుకు బడ్జెట్‌ అంకెలను తారుమారు చేశారని, దిగజారిపోతున్న దేశ ఆర్ధిక వ్యవస్ధ వాస్తవ పరిస్ధితిని మరుగుపరచేందుకు ప్రభుత్వబ్యాంకుల నుంచి నిధులను వుపయోగించారంటూ పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానంతో ఆమెను తొలగించారు. ప్రస్తుత అధ్యక్షుడు మైఖేల్‌ టెమర్‌పై అనేక అవినీతి విమర్శలు రావటమే కాదు, 50లక్షల డాలర్లు లంచం తీసుకున్నట్లు గతేడాది ఒక కేసు దాఖలైంది. అయితే సుప్రీం కోర్టు దానిపై విచారణ జరపకుండా, అభిశంసన తీర్మానం పెట్టకుండా పార్లమెంటులోని టెమర్‌ అనుయాయులు అడ్డుపడటాన్ని చూస్తే లూలాపై ఎలాంటి నిర్ధిష్ట ఆరోపణ లేనప్పటికీ విచారణ తతంగం జరిపి శిక్ష విధించటం రాజకీయ ప్రేరేపితంగాక మరేమిటి?లూలా ఎలాంటి నేరానికి పాల్పడని రాజకీయ ఖైదీ మాత్రమేనని ఆయన లాయర్‌ జానిమ్‌ వ్యాఖ్యానించారు. అయన నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు అందుబాటులో వున్న అన్ని చట్టబద్దమైన అవకాశాలను వుపయోగిస్తామన్నారు. లూలా నివశించారని చెబుతున్న అపార్ట్‌మెంట్‌కు ఆయనేనాడూ యజమాని కాదని, దాన్ని అద్దెకు తీసుకోవటంలో అక్రమాలకు పాల్పడినట్లు ఎలాంటి రుజువు లేదని అన్నారు.రాజకీయ కారణాలతో లూలాను జైలు పాలు చేయటంలో కుట్రదారులు సఫలమయ్యారు. అయితే అదే సమయంలో ఆయనకు నోబెల్‌ శాంతి బహమతి అవార్డుకు నామినేట్‌ చేసేందుకు మద్దతు తెలపాలన్న నోబెల్‌ బహుమతి గ్రహీత ఆడాల్ఫో పెరెజ్‌ ఎస్కివిల్‌ పిటీషన్‌పై పెద్ద ఎత్తున స్పందన వెల్లడైంది. లక్షన్నర సంతకాలు చేయించాలని లక్ష్యంగా పెట్టుకోగా సోమవారం నాటికి లక్షా ఎనభైవేలు దాటాయి. తమ నేతను జైలు పాలు చేసినప్పటికీ అక్టోబరులో జరిగే ఎన్నికలలో ఆయనే తమ అభ్యర్ధి అని వర్కర్స్‌ పార్టీ అధ్యక్షుడు గ్లెస్సీ హాఫ్‌మన్‌ ప్రకటించారు. వర్కర్స్‌ పార్టీ కేంద్ర నాయకత్వం తమ నేత జైలులో వున్న కర్టీబా నుంచే పని చేస్తుందని, ఆయనను విడుదల చేయించేందుకు వున్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని హాఫ్‌మన్‌ చెప్పారు.

బ్రిక్స్‌ కూటమి(బ్రెజిల్‌,రష్యా,ఇండియా,చైనా, దక్షిణాఫ్రికా)లో ఒక ముఖ్యపాత్రపోషించటమేగాక లాటిన్‌ అమెరికాలో అధికార కేంద్రంగా వున్న బ్రెజిల్‌ వామపక్ష వుద్యమాలకు సైతం పట్టుగొమ్మగా వుంది. అందుకే అమెరికా ఈ ప్రాంతంలో ప్రత్యేకించి ఈ దేశంలో మితవాదులు,క్రైస్తవమతవాదులు, అవినీతి శక్తులతో చేతులు కలిపి లూలా నాయకత్వంలోని వర్కర్స్‌పార్టీని అధికారంలోకి రాకుండా చేసేందుకు చేయాల్సిందంతా చేస్తోంది. గతంలో నియంతపాలన రుద్దిన మిలిటరీని తిరిగి రంగంలోకి తెచ్చేందుకు సైతం వెనకాడటం లేదని జరిగిన పరిణామాలు సూచిస్తున్నాయి. దిల్మా రౌసెఫ్‌ను గద్దె దింపటంలో పార్లమెంట్‌ సభ్యులుగా వున్న మాజీ సైనికాధికారులున్నారు. నగరాల్లోని మురికి వాడల్లో తిష్టవేసిన మాఫియా, గూండా గ్యాంగులను ఏరివేసే పేరుతో మిలిటరీని కూడా దించి తమ ప్రత్యర్ధులుగా వున్న వారిని హతమారుస్తున్నారు. లూలాపై సుప్రీం కోర్టు తీర్పు వెలువడక ముందు సైనిక కమాండర్‌ ఒకడు బహిరంగ ప్రకటన చేస్తూ శిక్షల నుంచి మినహాయించటానికి స్వస్తి పలకాలని కోరటం ద్వారా లూలాను జైల్లో చూడాలన్న తన కోరికను బయటపెట్టాడు. శనివారం రాత్రి పోలీసులకు లంగిపోయిన లూలాను కర్టిబా జైలుకు తరలించేందుకు పోలీసులు విమానాన్ని సిద్ధం చేశారు. చెత్తను కిటికీ నుంచి అవతలకు పడవేయండి అంటూ పైలట్లతో మిలిటరీ రేడియోలో చేసిన వ్యాఖ్యలు రికార్డయ్యాయి. అవి లూలాను వుద్ధేశించి చేసినవే అన్నది వేరే చెప్పనవసరం లేదు. యాభైలక్షల డాలర్లు లంచం తీసుకున్న టెమర్‌ అధ్య క్ష స్ధానంలో కొనసాగుతుంటే ఇంటి మరమ్మతుల పేరుతో అవినీతికి పాల్పడ్డారంటూ ఆధారంలేని ఆరోపణలకు గురైన వామపక్ష మాజీ అధ్యక్షుడు జైలు పాలయ్యారు. ఇదీ నేడు బ్రెజిల్‌లో వున్న పరిస్ధితి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d