• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: UK

తైవాన్‌పై అమెరికా-చైనా తాజా వివాదం 2 : నాడు మావో జెడాంగ్‌ ఎందుకు వెనక్కు తగ్గారు – నేడు షీ జింపింగ్‌ ఎందుకు ముందుకు పోతున్నారు !

12 Friday Aug 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

china communist party, imperialism, Joe Biden, Mao Zedong, Taiwan independence, Taiwan Matters, US-China standoff over Taiwan, Xi Jinping

ఎం కోటేశ్వరరావు


” నూతన యుగంలో తైవాన్‌ సమస్య మరియు చైనా పునరేకీకరణ ” అనే పేరుతో ఆగస్టు పదవ తేదీన చైనా ఒక శ్వేత పత్రాన్ని ప్రకటించింది. తైవాన్‌ తనలో అంతర్భాగమే అని మరోసారి స్పష్టం చేసింది. ఒకే చైనా సూత్రానికి ఐరాస సాధారణ అసెంబ్లీ 2758వ తీర్మానం ద్వారా కల్పించిన చట్టబద్దతపై ఎలాంటి సందేహం లేదని, ప్రపంచమంతటా గుర్తింపు పొందిందని దానిలో పేర్కొన్నారు. శాంతియుతంగా పునరేకీకరణ జరగాలని, తప్పనిసరైతే బలప్రయోగం తప్పదని కూడా స్పష్టం చేశారు. ఒకే దేశం-రెండు వ్యవస్థలనే విధానం కింద తైవాన్‌కు హామీ ఇస్తున్నట్లు తెలిపింది. అమెరికా కాంగ్రెస్‌( పార్లమెంటు దిగువ సభ ) స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటన మరుసటి రోజు నుంచి తైవాన్‌ చుట్టూ ఐదు రోజుల పాటు (ఆగస్టు 4-7తేదీలు) మిలిటరీ విన్యాసాలు జరిపింది. తరువాత మరుసటి రోజు నుంచి చైనా నిరవధిక విన్యాసాలు కొనసాగిస్తున్నది.


ఏ దేశమైనా తన వద్ద ఉన్న ఆధునిక ఆయుధ సంపత్తిని మిలిటరీ విన్యాసాలలో రేఖా మాత్రంగానే వెల్లడిస్తుందన్నది తెలిసిందే. ఇప్పుడు తైవాన్ను ఎలా దిగ్బంధనం చేయగలదో ప్రపంచానికి ముఖ్యంగా అమెరికా, జపాన్‌లకు చైనా చూపుతున్నది. తొలుత నాలుగు రోజులు, తరువాత కొనసాగిస్తున్న నిర్ణీత గడువులేని డ్రిల్లు లక్ష్యం అదే అని షీ జింపింగ్‌ పరోక్షంగా వెల్లడించారు. ప్రస్తుతం ఉక్రెయిన్లో రష్యాను ఎదుర్కొనేందుకు అమెరికా తన వద్ద ఉన్న ఆధునిక ” హైమర్స్‌” క్షిపణి వ్యవస్థలను అంద చేసింది. దానికి ధీటుగా చైనా వద్ద ఉన్న ఎంఎల్‌ఆర్‌ వ్యవస్థలను తైవాన్‌ చుట్టూ జరిపిన డ్రిల్సులో ప్రయోగించినట్లు, ఈ పరిణామం తైవాన్‌పై అమెరికా ఆడుతున్న ఆట తీరునే మార్చి వేస్తుందని యురేసియన్‌ టైమ్స్‌ పత్రిక ఆగస్టు ఎనిమిదిన ప్రకటించింది.చేయాల్సిందంతా చేసి నెపాన్ని ఇతరుల మీద నెట్టినట్లుగా తాజా పరిణామాలపై జో బైడెన్‌ తీరు ఉన్నదని, ఇది మరింతగా రెచ్చగొట్టటమే అని చైనా వర్గాలు పేర్కొన్నాయి. తైవాన్‌కు సంబంధించి ఇంతకు మించి వారు చేసేదేమీ ఉండదు కానీ వారి తీరే ఆందోళన కలిగిస్తున్నదని బైడెన్‌ విలేకర్లతో అన్నాడు. చైనా స్పందనకు ప్రతిగా అమెరికా యుద్ధనౌకలను తరలిస్తుందని వార్తలు వచ్చినప్పటికీ అదేమీ లేదు. దాంతో ఉక్రెయిన్‌ మాదిరి తమను కూడా ముందుకు నెట్టి అమెరికా వెలుపలే ఉంటుందా అని అనేక మందిలో తలెత్తిన సందేహాల పూర్వరంగంలో అమెరికన్లు, తైవాన్‌ వేర్పాటు వాదులను సంతృప్తిపరచేందుకు బైడెన్‌ ఇలాంటి చౌకబారు ప్రకటనలు, జిమ్మిక్కులకు పాల్పడుతున్నట్లు భావిస్తున్నారు. తన ప్రమాణ స్వీకార ఉత్సవానికి తైవాన్‌ ప్రతినిధులను ఆహ్వానించిన తొలి అమెరికా నేతగా కూడా గతేడాది ఇలాంటి జిమ్మిక్కునే చేశాడు.


ఒకవైపు పార్లమెంటు ఎన్నికలు, మరోవైపు జో బైడెన్‌ పలుకుబడి గురించి వెలువడుతున్న సర్వేల వివరాలు డెమోక్రటిక్‌ పార్టీకి కంగారు పుట్టిస్తున్నాయి.ఆగస్టు పదిన స్టాటిస్టా ప్రకటించిన వివరాల ప్రకారం కేవలం పదిశాతం మంది అమెరికన్ల దృష్టిలో మాత్రమే జో బైడెన్‌ బలమైన నేత. మరో 25శాతం మంది కొంత మేరకు అని చెప్పగా నలభైమూడు శాతం చాలా బలహీనుడు, 23శాతం కాంత మేర బలహీనుడు అని వెల్లడైంది. మొత్తం మీద చూసినపుడు 66శాతం మంది బలహీనుడిగా భావిస్తున్నారు. ప్రపంచ చరిత్రను చూసినపుడు పాలకులు బలహీనపడినపుడు పిచ్చిపనులకు, జిమ్మిక్కులకు – ఎన్నికలు వచ్చినపుడు మన దేశంలో ఏదో ఒక ఉదంతం జరుగుతుందని జనం నమ్ముతున్నట్లుగా- పాల్పడతారని తేలింది. ఇప్పుడు జో బైడెన్‌ కూడా అదే స్థితిలో ఉన్నారన్నది కొందరి భావన. తైవాన్ను తురుపుముక్కగా వాడుతున్న అమెరికా రానున్న రోజుల్లో మరింతగా రెచ్చగొట్టవచ్చని, దానిలో భాగంగానే నేడు ఉక్రెయిన్‌ రేపు తైవాన్‌ అన్న ప్రచారం ప్రారంభించిందని అది ఎలా ఆలోచించినా, ఏమి చేసినా తాము దేనికైనా సిద్దంగా ఉన్నట్లు చైనా స్పష్టం చేయదలచుకుంది.తాజాగా మిలిటరీకి అందచేసినవాటితో సహా విన్యాసాల్లో భూ, సముద్ర, గగన తల అస్త్రాలన్నింటినీ బహిరంగంగానే చూపింది. మరికొన్నింటిని కూడా ప్రయోగించనుంది. బహుశా ఈ కారణంగానే తైవాన్‌ జలసంధిలోకి అమెరికా నౌకలు రాలేదన్నది కొందరి విశ్లేషణ. రానున్న రోజుల్లో తమ దళ నౌకలు చైనా ప్రాంతంలో స్వేచ్చా విహారం చేయవచ్చని అమెరికా పేర్కొన్నది. ఒక వేళ వచ్చినా దూర దూరంగా తిరగటం తప్ప చైనా విధించిన తాత్కాలిక ఆంక్షలు అమల్లో ఉన్నంతవరకు తైవాన్‌ ప్రాంతానికి చైనా విన్యాసాలు ముగిసిన తరువాతే తప్ప జరుగుతుండగా వచ్చే అవకాశం లేదు.


చైనా వైఖరిలో వచ్చిన ఈ మార్పు గురించి ఆలోచించాల్సి ఉంది. ఉక్రెయిన్‌ సంక్షోభం తరువాత చైనా-రష్యా బంధం మరింతగా బలపడిన పూర్వరంగంలో చైనా మీద మరింతగా కేంద్రీకరించాలని అమెరికా గూఢచార సంస్థలు తాజాగా ఒక నిర్ణయానికి వచ్చాయి. ఆల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థల మీద ఇప్పటికీ ప్రాధాన్యత ఉన్నప్పటికీ దాని కంటే చైనా మీద ఎక్కువగా వనరులు, నిధులను ఖర్చు చేయాలని అధికారులు స్పష్టం చేశారని వార్తలు. ఆఫ్ఘనిస్తాన్నుంచి అమెరికా తోకముడిచి ఏడాది గడచిన సందర్భంగా బైడెన్‌ నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయానికి వచ్చారు. చైనా గురించి ఇప్పటికే ఆలశ్యం చేసినట్లు కొందరు బైడెన్‌ సమీక్షపై స్పందించారు. అమెరికా తరహా జీవన విధానాన్ని చైనా దెబ్బతీస్తున్న మాదిరి ఉగ్రవాద సంస్థలు చేయలేవని డెమోక్రటిక్‌ పార్టీ ఎంపీ జాసన్‌ క్రో అన్నాడు. అవసరానికి మించి ఉగ్రవాదం మీద గత కొద్ది సంవత్సరాలుగా కేంద్రీకరించామన్నాడు. క్వాంటమ్‌ సైన్సు, కృత్రిమ మేథ,ఇతర సాంకేతిక పరిజ్ఞానాలపై చైనా లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసిందని దాని గురించి సమాచారం వెల్లడి కావటం లేదని అమెరికన్లు ఆందోళన చెందటమే తాజా కేంద్రీకరణకు కారణం. చైనా గురించి ఒకటి, చైనా సాంకేతిక పరిజ్ఞానం గురించి కేంద్రీకరించేందుకు రెండు పధకాలను గతేడాది సిఐఏ ప్రకటించింది.


అమెరికాకు ప్రజాస్వామ్యం అంటే అక్కడి ఆయుధపరిశ్రమలకు లాభసాటి లావాదేవీ మాత్రమే. ఇతర దేశాల మీద అమెరికా దాడులకు దిగటం తప్ప చరిత్రలో అమెరికా మీద అలాంటి దాడి ప్రయత్నాలు కూడా లేవు. 2022 ఆగస్టు నాటికి ప్రపంచంలోని 14దేశాల వద్ద 47 విమానవాహక యుద్ధ నౌకలు పని చేస్తున్నాయి. వాటిలో ఒక్కొక్కటి 80 విమానాలను మోసుకుపోగలిగిన పదకొండు అమెరికా వద్దే ఉన్నాయి. అయినప్పటికీ ఒక్కొక్కటి 13-14 బిలియన్‌ డాలర్ల విలువ చేసే పది కొత్త విమానవాహక నౌకల తయారీకి డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ ఆర్డరు పెట్టింది. ఇవి అణ్వాయుధాలు ప్రయోగించేందుకు వీలైనవి.ఇన్ని ఉన్నప్పటికీ లేని చిన్న దేశాలను తప్ప వాటితో చైనా, రష్యాలను అమెరికా బెదిరించలేదు. ఎందుకంటే అవి కూడా స్వంతంగా విమానవాహక నౌకలను రూపొందించగలిగినవే. వాటి వద్దా అణ్వాయుధాలు ఉన్నాయి.


అమెరికా పార్లమెంటు స్పీకర్‌ నాన్సీ పెలోసీ చైనా అభ్యంతరాలను ఖాతరు చేయకుండా తైవాన్‌ గడ్డ మీద అడుగు పెట్టి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. నిజానికి అమెరికా వ్యూహకర్తల ఎత్తుగడ అది. ముందే చెప్పుకున్నట్లు ప్రస్తుతం జనంలో పలుకుబడి లేని జో బైడెన్‌ వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు, ప్రపంచ రాజకీయాలను తాను శాసిస్తున్నట్లు ప్రదర్శించుకొనేందుకు ఈ అవకాశాన్ని ఎంచుకున్నారు. ఇక గతానికి సంబంధించి చూస్తే1949లో చైనా విముక్తి జరిగినప్పటికీ దాన్ని సుస్థిరం కావించుకొనేందుకు కమ్యూనిస్టులకు పది సంవత్సరాలు పట్టింది.అమెరికా ప్రభుత్వం బహిర్గతపరచిన కొన్ని పత్రాల్లో ఉన్న సమాచారం తైవాన్‌ విలీనం గురించి కొన్ని అంశాలను వెల్లడించింది. .1958లో తైవాన్‌ విలీనానికి పూనుకోవాలని మావో నిర్ణయించారు. దాన్ని గ్రహించిన అమెరికన్లు వెంటనే ఉన్నత సమావేశం జరిపి తైవాన్‌ రక్షణకు మిలిటరీని పంపుతామని ప్రకటించారు. వెంటనే సప్తమ నౌకా దళాన్ని దాడికి వీలైన దూరానికి నడిపించారు. ఒక వేళ మిలిటరీ తైవాన్ను కాపాడలేకపోతే అణ్వస్త్రాలను ప్రయోగించేందుకు అధ్యక్షుడు ఐసెన్‌ హౌవర్‌ అనుమతి ఇచ్చాడు. తైవాన్‌ పాలకుడు చాంగ్‌కై షేక్‌ను, తైవాన్ను ఎలాగైనా కాపాడటం అమెరికాకు ప్రాముఖ్యత కలిగిన అంశం. అందుకు పూనుకొని విఫలం కావటం ఆసియాలో పరువు తక్కువ, దాన్ని కాపాడుకొనేందుకు ఎంతకైనా తెగించాల్సిందేనని మిలిటరీ జనరల్స్‌ చెప్పారు. అప్పటికే అవసరం లేకున్నా జపాన్‌పై అణు దాడి జరిపిన అమెరికా కమ్యూనిజం విస్తరణను అడ్డుకొనేందుకు ఎంతకైనా తెగించేందుకు పూనుకుంది. తైవాన్‌కు సమీపంలోని ప్రధాన భూభాగంలో ఒక చిన్న మిలిటరీ కేంద్రం తప్ప చైనా వద్ద అప్పటికి అణుబాంబులు గానీ, విమానవాహక నౌకలుగానీ లేవు. ఆర్దికంగా పటిష్టత కూడా లేదు. సోవియట్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు.1959లో టిబెట్‌లో దలైలామా తిరుగుబాటు, అదే ఏడాది చైనా అణుకార్యక్రమానికి సహకరించేది లేదని సోవియట్‌ ప్రకటించింది. రెండు దేశాల పార్టీల మధ్య సైద్దాంతిక విబేధాలు తీవ్రమౌతున్న తరుణంలో అన్ని అంశాలను చూసినపుడు వెనక్కు తగ్గటమే మంచిదని నాటి చైనా నాయకత్వం భావించింది. తరువాత దేశాన్ని పటిష్టం గావించటం మీద శ్రద్ద పెట్టింది.


సోవియట్‌ మీద ఆధారపడకుండా స్వంత అణుకార్యక్రమానికి చైనా పూనుకుంది.1964 అక్టోబరు 16న తొలి అణుపరీక్ష జరిపింది. అంతే కాదు అప్పటికి చైనా వద్ద విమానవాహక నౌకలు కూడా లేవు. పాతబడిన ఒక నౌకను ఆస్ట్రేలియా రద్దు కింద అమ్ముతామని 1985లో ప్రకటించగా చైనా దానిని కొనుగోలు చేసింది. దానిలో కీలకమైన భాగాలన్నింటినీ తొలగించినందున పనికి రాదని అందరూ భావించారు. అయితే దాన్ని చైనా రద్దుకింద మార్చకుండా తన మిలిటరీకి శిక్షణకు, తాను సొంతంగా రూపొందించిన నౌకలకు నమూనాగా ఉపయోగించినట్లు తరువాత వెల్లడైంది.1995, 2000 సంవత్సరాల్లో రష్యా నుంచి రెండు నౌకలను కొనుగోలు చేసి వాటినీ రద్దు కింద మార్చకుండా చైనా నిపుణులు పరిశీలించారు. ఒక నౌకను విలాసవంతమైన టూరిస్టు హౌటల్‌గా, మరొక నౌకను ప్రదర్శనశాలగా మార్చారు. మకావు ప్రయివేటు కంపెనీ ద్వారా మరొక రష్యా నౌకను 1998లో కొనుగోలు చేసి దాన్ని 2007 నాటికి పరిమితంగా పునరుద్దరించినట్లు వార్తలు. తరువాత దాన్ని పూర్తి స్థాయిలో పునరుద్దరించి కొత్త పేరుతో 2012లో నౌకా దళంలో తొలి స్వంత నౌకగా ప్రవేశపెట్టారు.తరువాత పూర్తిగా స్వంత పరిజ్ఞానంతో రూపొందించిన నౌకను 2017లో ప్రారంభించారు. సరికొత్త నౌక మూడవ దానిని ఈ ఏడాది జూన్‌లో రంగంలోకి దించారు. నాలుగవ నౌక ఇప్పుడు నిర్మాణంలో ఉంది, 2030నాటికి మరో రెండు చేరవచ్చని భావిస్తున్నారు.


ప్రస్తుతం జరుపుతున్న మిలిటరీ డ్రిల్లును అమెరికా, ఇతర దేశాలు కూడా పరిశీలించి తమ ఎత్తుగడలను రూపొందించుకుంటాయని తెలియనంత ఆమాయకంగా నేడు చైనా లేదు. నిజమో కాదో చెప్పలేము గాని ఇప్పుడు చైనా గురించి అమెరికన్లకు ఒక భయం పట్టుకుంది. మెదడును అదుపు చేసే జీవ ఆయుధాలను రూపొందిస్తున్నట్లు అనుమానంతో మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ ప్రాజెక్టులో భాగస్వాములన్న అనుమానంతో అనేక కంపెనీలపై అమెరికా ఆంక్షలు పెట్టింది.ఇది ఒక ప్రచార ఎత్తుగడ, దాడిలో భాగం కూడా కావచ్చు. గతంలో ఐసెన్‌ హౌవర్‌ మాదిరే ఇప్పుడు జో బైడెన్‌ కూడా ఉక్రెయిన్‌ మాదిరి కాకుండా అవసరమైతే మిలిటరీని దింపుతామని ప్రకటించాడు. గతంలో మావో మాదిరి ఇప్పుడు షీ జింపింగ్‌ వెనక్కు తగ్గేందుకు సిద్దం కాదు. అన్ని రంగాల్లో ఢ అంటే ఢ అనేందుకు ధీటుగా దేశాన్ని రూపొందిస్తున్నాడు. సరిహద్దులో ఉన్న నాటో దేశాలే ఉక్రెయిన్‌కు మిలిటరీని పంపేందుకు సిద్దం కాలేదు. తైవాన్‌ అంశానికి వస్తే దానికి సమీపంలోని జపాన్‌ ఒకినావా దీవుల్లో, దక్షిణకొరియాలో ఉన్న అమెరికా మిలిటరీ తప్ప పన్నెండువేల కిలోమీటర్ల నుంచి అమెరికా తన సేనలను తీసుకురావాల్సి ఉంది. చైనాకు మద్దతుగా అణ్వాయుధాలు కలిగిన ఉత్తర కొరియా ఉంది. పక్కనే రష్యా కూడా తన వంతు పాత్ర పోషించనుంది. ఇప్పటికిప్పుడు చూస్తే మరోఅణుశక్తి దేశమైన పాకిస్తాన్‌ వివిధ కారణాలతో అమెరికా కంటే చైనాకు దగ్గరగా ఉంది. మరో దేశమైన ఇరాన్‌ కూడా చైనాకు దగ్గరగా ఉంది. మావో కాలంలో ఇలాంటి సానుకూల అంశాలు చైనాకు లేవు. అందుకే షీ జింపింగ్‌ బైడెన్‌తో భేటీలో నిప్పుతో చెలగాటాలాడవద్దని హెచ్చరించగలిగాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తైవాన్‌పై అమెరికా-చైనా తాజా వివాదం 1 : స్పీకర్‌ పెలోసీ పర్యటన అమెరికా బలమా ? చైనా బలహీనతా ?

08 Monday Aug 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, RUSSIA, UK, USA, WAR

≈ 1 Comment

Tags

China, China and Taiwan, Nancy Pelosi Taiwan trip, US-China standoff over Taiwan


ఎం కోటేశ్వరరావు


అమెరికా పార్లమెంటు ప్రజాప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ 2022 ఆగస్టు రెండవ తేదీ మంగళవారం రాత్రి 10.20కి తైవాన్‌ గడ్డమీద అడుగుపెట్టి రాత్రంగా ఒక హౌటల్లో బసచేసి తెల్లవారగానే తైవాన్‌ ఇచ్చిన విందారగించి పొద్దుగూకక ముందే వెళ్లిపోయారు. అంతకు ముందు సింగపూర్‌ నుంచి మలేసియా వెళ్లి చీకటి పడేవరకు అక్కడ ఉండి రాత్రి కాగానే తైవాన్‌లోని తైపీ చేరుకున్నారు. చివరి క్షణం వరకు అంతా దాగుడుమూతలే. అనేక దినాల మాదిరి చరిత్రలో ఈ రోజు కూడా ప్రముఖంగా మిగిలిపోనుంది. అమెరికా అధికార వరుసలో మూడవ స్థానంలో ఉన్న ఆమె పర్యటన తరువాత తలెత్తిన తక్షణ పరిస్థితులు, పర్యవసానాల గురించి ప్రపంచమంతా చర్చ జరుగుతోంది. బుధవారం నుంచి ఆదివారం వరకు తైవాన్‌ చుట్టూ ఆరు ప్రాంతాలలో చైనా మిలిటరీ విన్యాసాలు నిర్వహించింది. తైపే నగరం నుంచి పలు దేశాలకు విమానరాకపోకలు లేవు. తైవాన్‌ దీవి మీదుగా తిరిగే పలుదేశాల విమానాలను దారి మళ్లించి వేరే రూట్లలో నడిపారు. వాషింగ్టన్‌లోని చైనా రాబారిని పిలిపించి అమెరికా తన నిరసన తెలిపింది. దానికి ప్రతిగా చైనా కూడా స్పందించింది. ఈ పరిణామం ఎటు దారితీస్తుందన్నదన్నది ఇప్పుడే చెప్పలేము. సోమవారం నుంచి పచ్చ సముద్రంలో పదిహేనవ తేదీ వరకు, బోహై సముద్రంలో నెల రోజుల పాటు (కొరియా ద్వీపకల్పం-చైనా మధ్య) మిలిటరీ విన్యాసాలు నిర్వహించనున్నట్లు చైనా ప్రకటించింది. ఇవన్నీ బలవంతపు విలీనానికి జరిపే కసరత్తే అని తైవాన్‌ పాలకులు ఆరోపిస్తున్నారు. ఈ ఉదంతాన్ని అనేక కోణాల నుంచి చూడాల్సి ఉంది. కొంత మంది 1962 నాటి క్యూబన్‌ క్షిపణి సంక్షోభాన్ని గుర్తుకు తెచ్చారు. దానికీ దీనికి ఏమైనా సామ్యం ఉందా ?


ముందుగా క్యూబన్‌ క్షిపణి ఉదంతాన్ని చూద్దాం. అంతర్గతంగా ముందు ఎలాంటి పరిణామాలు జరిగినప్పటికీ ఒక దశదాటిన తరువాత ఉపరితలంలో కనిపించేదాన్ని బట్టి నామకరణం చేసినట్లుగా దీనికి ఆ పేరు పెట్టారు.1953 నుంచి 1961వరకు అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన ఐసెన్‌ హౌవర్‌ ఐరోపాలోని నాటో కూటమి దేశాల్లో క్షిపణులు, ఆయుధాలను మోహరించి ఆ ప్రాంత దేశాలకు భరోసా కల్పించాలని, సోవియట్‌కు ధీటుగా ఉన్నామని ప్రపంచానికి చెప్పేందుకు సంకల్పించారు. ఈ క్రమంలోనే సోవియట్‌ వద్ద మధ్యంతర, దీర్ఘశ్రేణి ఖండాంతర క్షిపణులు ఉన్నట్లు 1957లో పసిగట్టిన అమెరికా తన ఉద్ద ఉన్నవాటిని ప్రదర్శించి ప్రపంచాన్ని భయపెట్టేందుకు, సోవియట్‌ను రెచ్చగొట్టేందుకు పూనుకుంది. టర్కీలో వాటిని మోహరించేందుకు పూనుకోగా అందుకు అంగీకరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని సోవియట్‌ హెచ్చరించింది. తొలుత తటపటాయించిన టర్కీ ఒత్తిడికి లొంగి1959 అక్టోబరు 25న అమెరికాతో ఒప్పందం చేసుకొని అంగీకరించింది. ఆ మేరకు 1962లో జూపిటర్‌ క్షిపణులను టర్కీలోని ఇమిర్‌ పట్టణంలో, టర్కీలో, థార్‌ క్షిపణులను బ్రిటన్‌లో మోహరించారు. 1959లో ఫిడెల్‌ కాస్ట్రో నాయకత్వంలోని పురోగామి వాదులు అమెరికా మద్దతు ఉన్న నియంత బాటిస్టా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారానికి వచ్చారు. అప్పటి నుంచి అమెరికాలో తిష్ట వేసిన కాస్ట్రో వ్యతిరేకులు సిఐఏ శిక్షణ, ఆయుధాలతో దాడి చేసి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు విఫలయత్నం చేశారు. 1961 ఏప్రిల్‌ 15న అమెరికా విమానాలు క్యూబా స్థావరాలపై దాడులు చేశాయి, 17వ తేదీన 1,500 విద్రోహులు దాడులకు దిగారు. పందొమ్మిదవ తేదీకల్లా వారందరినీ కాస్ట్రో ప్రభుత్వం బందీలుగా చేసింది. ఈ దాడిని అవకాశంగా తీసుకొని కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్నట్లుగా సోవియట్‌ తన క్షిపణులను 1962 సెప్టెంబరులో క్యూబాలో మోహరించింది. వ్యవసాయ నిపుణుల రూపంలో వెళ్లిన వారు అన్ని ఏర్పాట్లు చేసిన తరువాత గానీ అమెరికా పసిగట్టలేకపోయింది, అక్టోబరు 16న నాటి అధ్యక్షుడు కెన్నడీ సంక్షోభ నివారణకు పావులు కదిపాడు. అమెరికా దిగి వచ్చి టర్కీ, ఇటలీల్లోని తన క్షిపణులను తొలగిస్తామని అంగీకరించటంతో తమ అస్త్రాలను వెనక్కు తీసుకుంటామని సోవియట్‌ పేర్కొన్నది, అదే నెల 29వ తేదీకి ఉద్రిక్తతలు సడలాయి. తరువాత క్యూబాలో బందీలుగా ఉన్న తమ గూఢచారులు, కిరాయి మూకలను అమెరికా నష్టపరిహారం చెల్లించి మరీ విడిపించుకుంది. క్షిపణి ఒప్పందంలో అమెరికా లొంగిన సంగతి 1970వరకు వెల్లడికాలేదు.


నేటి తైవాన్‌ ఉదంతానికి నాటి క్యూబా పరిణామాలకు పోలికే లేదు. పెలోసి పర్యటన బహిరంగ రహస్యం. అధికారికంగా ప్రకటించే దమ్ము అమెరికాకు లేకపోయింది. ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక ద్వారా లీకు వార్తలతో వెల్లడించి బైడెన్‌తో సహా అందరూ తెలియదంటూనే చర్చించారు. చివరికి పెలోసీ సైతం విలేకర్లతో మాట్లాడుతూ తన విమానాన్ని కూల్చివేస్తారని మిలిటరీ అనుకొంటుండవచ్చు అని చెప్పారు. మీడియాలో కట్టుకథలను రాయించారు. బుధవారం నుంచి ఆదివారం వరకు జరిగిన చైనా మిలిటరీ విన్యాసాలను చూసిన తరువాత పెలోసీ విమానం తైవాన్‌ గడ్డమీద దిగకుండా చూడటం చైనాకు పెద్ద సమస్య కాదన్నది స్పష్టం. మలేసియా-తైవాన్‌ సమయాల ఒకటే. రెండు ప్రాంతాల ప్రయాణ వ్యవధి నాలుగున్నర గంటలు. ఒక దొంగ మాదిరి చీకటి మాటున ఆమె వచ్చారు.


విప్లవకాలం చివరి రోజుల్లో ఓటమి తప్పదని గ్రహించిన తరువాత చైనా మిలిటరీ, ఆయుధ సంపత్తినంతటినీ నాటి చాంగ్‌కైషేక్‌ ప్రభుత్వం అమెరికా, బ్రిటీష్‌ వారి సలహామేరకు తైవాన్‌ దీవికి తరలించింది.1949లో చైనా జనాభా 54 కోట్లు, తైవాన్‌ దీవి జనాభా 55 లక్షలు. నాటి బర్మా వైపు నుంచి దాడులు, టిబెట్‌లో తిరుగుబాట్లు, తైవాన్నుంచి దాడులు.యాభై నాలుగు కోట్ల మంది జనాభా ఉన్న ప్రధాన భూభాగంలో విప్లవ విజయాలను పటిష్టపరుచుకోవటం ముఖ్యమా తైవాన్‌ మీద కేంద్రీకరణకా అన్నపుడు మావో నాయకత్వం మొదటిదానికే ప్రాధాన్యత ఇచ్చింది. దీన్ని అవకాశంగా తీసుకొని పశ్చిమ దేశాలు తైవాన్‌ మిలటరీని మరింత పటిష్ట పరిచాయి. ఇదే సమయంలో సామ్రాజ్యవాదులు ఒక తప్పుడు అంచనాకు వచ్చారు. చైనాలో కమ్యూనిస్టులను అధికారం నుంచి తొలగించగలమనే భ్రమతో ఐరాసలో అప్పటికే శాశ్వత దేశంగా ఉన్న చైనా అసలైన ప్రతినిధి తైవాన్‌లోని కొమింటాంగ్‌ పార్టీ ప్రభుత్వాన్నే ఐరాసలో గుర్తించారు. అలాగాక తైవాన్ను ప్రత్యేక దేశంగా గుర్తిస్తే భద్రతా మండలిలో తమకు తోడుగా ఉండే తైవాన్‌కు ఒక శాశ్వత దేశ హౌదా రద్దవుతుంది. సోవియట్‌కు చైనా తోడవుతుందని అమెరికా ఆలోచించింది. కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గుర్తించేందుకు నిరాకరించింది.1945లో ఐరాస ఏర్పడినపుడు నాటి చైనాతో కదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి కమ్యూనిస్టుల ఆధీనంలో ఉన్న చైనాను గుర్తించటం చైనా సమగ్రతను ఉల్లంఘించటమేనంటూ ఐరాసలో 1949లో అమెరికా కూటమి ప్రవేశపెట్టిన తీర్మానానికి నాడున్న బలాబలాల్లో అనుకూలంగా 25 దేశాలు, సోవియట్‌కు అనుకూలంగా తొమ్మిది దేశాలు ఓటు చేయగా 24 దేశాలు తటస్థంగా ఉన్నాయి. ఆ తరువాత ఐరాసలో అమెరికా, బ్రిటన్‌లను వ్యతిరేకించే దేశాలు పెరిగి కమ్యూనిస్టు చైనాకు మద్దతు పెరిగింది.1961లో తొలిసారిగా ఐరాస సాధారణ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌లో మూడింట రెండువంతుల దేశాలు చైనాకు అనుకూలంగా ఓటు వేశాయి. తరువాత ప్రతి ఏటా తీర్మానాలను ఆమోదిస్తున్నా అమెరికా అడ్డుకున్నది.అసలు రెండు చైనాలు ఉనికిలో లేవని ఉన్నది కొమింటాంగ్‌ పార్టీ ప్రభుత్వంలోని చైనా అసలైనదని అమెరికా కూటమి వాదించగా, కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఉన్నదే అసలైన చైనా అని సోవియట్‌ కూటమి వాదించింది.తరువాత మారిన పరిస్థితుల్లో బ్రిటన్‌, ఫ్రాన్స్‌, కెనడా, టర్కీ వంటి అనేక పశ్చిమ దేశాలు కమ్యూనిస్టు చైనాను గుర్తించి సంబంధాలు పెట్టుకున్నాయి. తాను ఒంటరిపాటౌతున్నట్లు గమనించిన అమెరికా చివరకు దిగివచ్చి చైనా అంటే కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఉన్నదే అని గుర్తించేందుకు అంగీకరించింది. దీనికి మరొక ప్రధాన కారణం కూడా ఉంది. అంతకు ముందే ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో విబేధాలు, చైనా-సోవియట్‌ మధ్య విబేధాలు తీవ్రంగా ఉన్నాయి. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా సోవియట్‌కు వ్యతిరేకంగా చైనాను నిలబెట్టాలన్న ఎత్తుగడ కూడా అమెరికాను ముందుకు నెట్టింది.


భద్రతా మండలి చైనా శాశ్వత దేశ ప్రతినిధులుగా తైవాన్‌ ప్రభుత్వం నియమించిన వారిని అనుమతించటంపై 1971 జూలై 15 సమావేశంలో సోమాలియా అభ్యంతర పెట్టింది. దాన్ని నిర్ణయించాల్సింది భద్రతా మండలి కాదని అమెరికా అడ్డుకుంది.తరువాత సౌదీ అరేబియా ఒక ప్రతిపాదన తెచ్చింది. దాని ప్రకారం ఐరాస ఆధ్వర్యంలో తైవాన్‌లో మూడు అంశాల మీద ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. అంతవరకు ఐరాసలో తైవాన్‌కు సభ్యత్వాన్ని కొనసాగించాలి. ఒకటి తటస్థ దేశంగా ఉంటూ స్వతంత్ర దేశంగా కొనసాగటం, రెండు, పరిమిత అధికారాలతో ప్రజాచైనాతో సమాఖ్యగా ఉండటం, మూడు, స్వతంత్ర దేశంగా చైనాతో కాన్ఫెడరేషన్‌గా ఏర్పడటం. దీన్ని అమెరికా తిరస్కరించింది. మరోవైపున అమెరికా రహస్యంగా చైనాతో సంప్రదింపులకు దిగింది. పాకిస్తాన్‌ మీదుగా నిక్సన్‌ ప్రభుత్వ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న హెన్రీ కిసెంజరు చైనా వెళ్లి చర్చలు జరిపి చైనాను గుర్తించేందుకు అంగీకరించి వచ్చాడు. మరోవైపు ఐరాసలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి అమెరికా ఒక మెలిక పెట్టి వివాదానికి నాంది పలికింది. భద్రతా మండలిలో కమ్యూనిస్టు చైనాకు శాశ్వత ప్రాతినిధ్యం, సాధారణ అసెంబ్లీలో తైవాన్‌ ప్రతినిధి కొనసాగాలన్న దాని తీర్మానం వీగిపోయింది.చివరకు 1971 నవంబరు 23న భద్రతా మండలి, తరువాత సాధారణ అసెంబ్లీలో కమ్యూనిస్టు చైనాకు మద్దతుగా తీర్మానాలు ఆమోదించటంతో తైవాన్‌ వివాదానికి తెరపడింది. దాన్ని చైనాలో భాగంగా గుర్తించారు.


తరువాత అమెరికా రాజకీయం మొదలు పెట్టింది. ఐరాస తీర్మానానికి వక్రభాష్యం చెబుతూ తైవాన్‌ ప్రజలు పూర్తిగా ఆమోదించే వరకు బలవంతంగా విలీనం జరగరాదని చెప్పింది. తీర్మానంలో తైవాన్‌ గురించి స్పష్టంగా పేర్కొనలేదంటూ అనధికారికంగా తైవాన్‌ పాలకులతో సంబంధాలు పెట్టుకొన్నది.1997లో నాటి స్పీకర్‌ న్యూటన్‌ గింగరిచ్‌ పర్యటన గురించి పెలోసి రాక సందర్భంగా కొందరు విశ్లేషకులు వక్రీకరించారు. ఇప్పుడున్నంత బలంగా అప్పుడు చైనా లేదు కనుక అంగీకరించినట్లు చిత్రించారు. నిజానికి చైనా ఎన్నడూ తైవాన్‌పై రాజీపడలేదు. గింగరిచ్‌ అధికారికంగా బీజింగ్‌ పర్యటనకు వచ్చాడు. తైవాన్‌ వెళ్లి ఒక వేళ బలవంతంగా విలీనానికి చైనా పూనుకుంటే తైవాన్‌ రక్షణకు తాము వస్తామని గింగరిచ్‌ చెప్పాడు. అంతకు ముందు తెరవెనుక జరిగిన సంప్రదింపుల్లో ఒకే చైనా అన్నతమ వైఖరి గురించి ఎలాంటి భయాలుపెట్టుకోవద్దని, గింగరిచ్‌ తైవాన్‌ కూడా వెళ్లాలనుకుంటున్నారని అక్కడ తైవాన్‌ స్వాతంత్య్రం గురించి మాట్లాడరని, శాంతియుతంగా విలీనం జరగాలని తాము కోరుకుంటున్నామని, జోక్యం చేసుకోబోమని చెప్పిన అమెరికా మాట తప్పినట్లు నాడు చైనా ప్రకటించింది. ప్రభుత్వ విభాగాలన్నీ చైనా గురించి ఒకే వైఖరితో ఉండాలని స్పష్టం చేసింది. తమకు చెెప్పింది ఒకటి మాట్లాడింది ఒకటి కావటంతో తాము కొంత గందరగోళానికి గురైనట్లు చైనా ప్రతినిధి అన్నట్లు వార్తలు వచ్చాయి. గింగరిచ్‌ రిపబ్లికన్‌ పార్టీ నేత కాగా అప్పుడు అధికారంలో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన బిల్‌ క్లింటన్‌ ఉన్నాడు. ఇప్పుడు స్పీకర్‌, అధ్యక్షుడు ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు. నాడు గింగరిచ్‌ చైనా అనుమతితోనే తైవాన్‌ వెళ్లాడు. నేడు నాన్సీ పెలోసి పర్యటనలో అసలు బీజింగ్‌ సందర్శన అసలు భాగమే కాదు. అనుమతి లేకుండా, అనధికారికంగా తైవాన్‌ వెళతారని ముందే ప్రచారం జరిగింది కనుక అమెరికా నాటకం ఇప్పుడు మరింత స్పష్టం.


పెలోసీ రాకను చైనా ఎందుకు నివారించలేకపోయింది అని అనేక మంది అనుకుంటున్నారు. అందుకు పూనుకోవటం అంటే అమెరికా పన్నిన వలలో చిక్కుకోవటమే. తప్పా ఒప్పా అన్న అంశాన్ని పక్కన పెడితే గతంలో కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా అమెరికాకు ధీటుగా సోవియట్‌ స్పందించిన గతం తెలిసిన వారికి అలా అనిపించటం సహజం. స్పందించలేదు గనుక అది బలహీనత అని ఎవరైనా అంటే అది ఒక అభిప్రాయం మాత్రమే. ప్రపంచం మొత్తంలో సమసమాజం ఏర్పడాలని కమ్యూనిస్టులు కోరుకోవటం వేరు, దాన్ని ఒక తక్షణ అజండాగా తీసుకోవటం వేరు. మార్క్సిజం-లెనినిజాలను తమ దేశ పరిస్థితులకు అన్వయించుకొని ఏ దేశానికి ఆదేశం జాతీయ విముక్తిని పొందేందుకు పార్టీలు చూస్తున్నాయి.పరిస్థితులు అనుకూలించిన చోట విప్లవాన్ని సాధించి కొంత కాలం సోషలిస్టు సమాజ నిర్మాణంతో ముందుకు పోవటం తరువాత విఫలం కావటం చూశాము. అదే సమయంలో చైనా, వియత్నాం, క్యూబా వంటి దేశాలు గతం నుంచి అనుభవాలు నేర్చుకొని తమవైన పద్దతుల్లో సోషలిస్టు సమాజ నిర్మాణంతో ముందుకు పోతున్నాయి. ఇప్పుడు అసలు సోషలిస్టు దేశమంటూ ఏదీ లేదు అని సూత్రీకరించే అపర సూత్రధారులను కూడా చూస్తున్నాము. ఒక ఉదంతం పట్ల అనుసరించిన ఒక వైఖరి సరైనదా కాదా అన్నది చరిత్ర తేల్చాల్సిందే. అనేక పరిణామాల్లో చేతులు కాల్చుకున్న అమెరికా తన వైఫల్యాల జాబితా పెరిగిపోతున్న కొద్దీ అది మరింత రెచ్చగొడుతున్నది. అది దాని అజెండా, చైనా అజెండా వేరు. నూటనలభై కోట్ల మంది అవసరాలను తీర్చటం, గౌరవ ప్రదమైన జీవనాన్ని ఇవ్వటం ప్రధమ కర్తవ్యం.


అందుకోసం చైనా కమ్యూనిస్టు పార్టీ కొన్ని సంస్కరణలను ప్రవేశపెట్టింది. చైనా మార్కెట్‌ను విదేశాలకు తెరిచే ముందు నాటి నేత డెంగ్‌సియా పింగ్‌ ఒక మాట చెప్పాడు. కిటికి తెరిచినపుడు మంచి గాలితో పాటు ఈగలు, దోమల వంటివి కూడా వస్తాయని తెలుసు, వాటిని అరికట్టగలమని అన్నాడు.అంతే కాదు, వర్తమాన చరిత్రలో మరేదేశానికి లేని సమస్యలు చైనా ముందుకు వచ్చాయి. ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థ కేంద్రాలలో ఒకటిగా రూపొందిన హాంకాంగ్‌ బ్రిటీష్‌ వారి 99 సంవత్సరాల కౌలు గడువు తీరిన తరువాత చైనాలో విలీనం కావటం ఒకటి.అదే విధంగా పోర్చుగీసు వారి కౌలులో ఉన్న మకావో దీవులు ప్రపంచ పేరు మోసిన జూద కేంద్రాల్లో ఒకటిగా మారింది. అది కూడా చైనాలో విలీనం కావాల్సి ఉంది. తెల్లవారే సరికి వాటిని కలిపేయటం పెద్ద సమస్య కాదు. తమ ఆర్ధిక వృద్ధి కోసం ప్రపంచమంతటి నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్న చైనా తనలో విలీనం కానున్న ప్రాంతాల్లోని పెట్టుబడులను తిరస్కరించాల్సిన అవసరం లేదు. అందుకే 50 సంవత్సరాల పాటు విలీనానికి ముందున్న వ్యవస్థలనే కొనసాగిస్తామని చైనా ఒప్పందం చేసుకుంది. అక్కడి పెట్టుబడి సంస్థలకు భరోసానిచ్చింది. 1949 నాటికి అన్ని ప్రాంతాలను విలీనం చేసేందుకు సిద్దం అవుతున్నది. అప్పటి వరకు అమెరికా, ఇతర దేశాలూ రెచ్చగొడుతూనే ఉంటాయి. రష్యాను తమతో కలుపుకు పోవాలని చూసిన పశ్చిమ దేశాలు అది జరిగేది కాదని తేలటంతో దాన్ని దెబ్బతీసేందుకు ఎత్తులు వేశాయి. దాని పర్యవసానాలను పశ్చిమ దేశాలు ఊహించలేదు లేదా సరిగా అంచనాగట్టలేకపోయాయి.


రష్యా పొరుగునే ఉన్న జార్జియాలో అడుగుపెట్టేందుకు 1994 నుంచి నాటో పావులు కదిపింది. జార్జియాలో రష్యన్‌ భాష మాట్లాడే అబ్‌ఖాజియా, దక్షిణ ఒసెటీ ప్రాంతాలలో తలెత్తిన వేర్పాటువాద ఆందోళపకు మద్దతు ఇవ్వటమే కాదు, వాటిని స్వతంత్ర దేశాలుగా రష్యా మరికొన్ని దేశాలు గుర్తించాయి. దాంతో 2008లో జార్జియా-రష్యా మధ్య 12 రోజుల పాటు యుద్దం జరిగింది. రెండు చోట్లా రష్యా తన సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. నాటో అప్పటి నుంచి వెనక్కు తగ్గింది. తరువాత ఉక్రెయిన్లో పాగా వేసేందుకు నాటో పూనుకుంది. అది 2014లో క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా విలీనం చేసుకుంది. తాజాగా జరుగుతున్న ఉక్రెయిన్‌పై జరుగుతున్న సైనిక చర్య, డాన్‌బాస్‌ ప్రాంతంలోని రెండు ప్రాంతాలను దేశాలుగా గుర్తించటం, ఉక్రెయిన్‌ మిలిటరీ, కిరాయి మూకలను వెనక్కు కొట్టటం తెలిసిందే.దాన్నుంచి ఎలా బయట పడాలో తెలియని అమెరికా ఇప్పుడు తైవాన్ను ముందుకు తేవాలని చూస్తున్నది. తెగేదాకా లాగితే దాని విలీన ప్రక్రియ మరింత వేగవంతం కావచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

” లిటిల్‌ బోయి ” ” ఫాట్‌మాన్‌ ” కంటే మరింత ముప్పుగా మారిన అమెరికా, నాటో కూటమి !

05 Friday Aug 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, Latin America, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Atomic bombings of Hiroshima and Nagasaki, NATO, Ukraine-Russia crisis, US imperialism, world Peace


ఎం కోటేశ్వరరావు

ఆగస్టు నెల వస్తుందంటే ప్రపంచ శాంతి ప్రియులకు గుర్తుకు వచ్చేది హిరోషిమా-నాగసాకీలపై అమెరికా జరిపిన దుర్మార్గ అణుబాంబుల దాడి.1945 ఆగస్టు ఆరున హిరోషిమా, తొమ్మిదిన నాగసాకి నగరాలపై అవసరం లేకున్నా రెండవ ప్రపంచ యుద్దం దాదాపుగా ముగిసిన తరువాత బాంబులు వేసి తన దగ్గర ఎంతటి ప్రమాదకర మారణాయుధాలున్నాయో, అవెలా విధ్వంసం సృష్టిస్తాయో చూడండని భయపెడుతూ ప్రపంచానికి సవాలు విసిరింది. ఆ తరువాతే దానికి ధీటుగా ఉండేందుకు సోవియట్‌, బ్రిటన్‌,ఫ్రాన్స్‌, చైనా అణ్వస్త్రాలను తయారు చేశాయి. ఇప్పుడు భారత్‌, పాకిస్తాన్‌, ఇజ్రాయెల్‌, ఉత్తర కొరియాల వద్దకూడా ఉన్నాయి. మరొక భావన ప్రకారం ఏ దేశంలోనైతే అణువిద్యుత్‌ కేంద్రాలు ఉన్నాయో అవన్నీ ఏ క్షణంలోనైనా బాంబులు తయారు చేసే స్థితిలో ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటైన ఇరాన్‌ అణ్వస్త్రాల తయారీ కార్యక్రమం చేపట్టిన కారణంగానే దాన్ని విరమింప చేసేందుకు అమెరికా తదితర దేశాలు పూనుకోవటం, ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవటం వంటి పరిణామాలన్నీ తెలిసిందే. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఇప్పుడు 1945 నాటి అణు బాంబుల కంటే ఇంకా ఎంతో విధ్వంసాన్ని సృష్టించగలిగినవి, కొన్ని వేల బాంబులు తయారై సిద్దంగా ఉన్నాయి.అవేగాక ఇతర మారణాయుధాలు గుట్టలుగా పేర్చుకొని సిద్దంగా పెట్టుకున్నారు. అమెరికా తాను తయారు చేసిన ప్రతి కొత్త ఆయుధం ఎలా పని చేస్తుందో చూసేందుకు అది సృష్టిస్తున్న యుద్దాలలో జనం మీద ప్రయోగించి చూస్తున్నది. ఇప్పుడు ఐరోపాలోని ఉక్రెయిన్ను అందుకు ప్రయోగశాలగా చేసుకుంది.


రెండవ ప్రపంచ యుద్ద చివరి సంవత్సరం 1945 మే ఎనిమిదవ తేదీన జర్మనీ లొంగిపోయింది. తరువాత ప్రధాన శత్రువుగా ఉన్న జపాన్‌పై భారీఎత్తున దాడి చేసేందుకు మిత్రరాజ్యాలు పూనుకున్నాయి. అప్పటికి అమెరికా తలపెట్టిన అణుబాంబుల తయారీ చివరి దశకు వచ్చింది. జూలై నాటికి ప్లూటోనియంతో తయారుచేసిన ” ఫాట్‌ మాన్‌ ” యురేనియంతో రూపొందించిన ” లిటిల్‌ బోయి ” సిద్దంగా ఉన్నాయి.జపాన్నుంచి స్వాధీనం చేసుకున్న సమీపంలోని మరియానా దీవుల్లో ఒకటైన టినియన్‌లో అమెరికా వాటిని ఉంచింది. జపాన్‌ బేషరతుగా లొంగిపోవాలని 1945 జూలై 26న పోట్స్‌డామ్‌ ప్రకటనలో మిత్రదేశాలు అల్టిమేటం ఇచ్చాయి. అయితే దానికి ముందే అమెరికా-బ్రిటన్‌ కూడబలుక్కొని నాగసాకి, హిరోషిమా,కొకురా, నిజిగటా పట్టణాలపై అణుబాంబులు వేయాలని నిర్ణయించాయి. ఆగస్టు ఆరున హిరోషిమాపై లిటిల్‌బోయి, తొమ్మిదిన నాగసాకిపై ఫాట్‌మాన్‌ బాంబులు వేశారు. లొంగేది లేదని జపాన్‌ బింకంగా ప్రకటించినప్పటికీ అప్పటికే అది చావుదెబ్బలు తిన్నందున మరికొద్ది రోజుల్లో పతనమై ఉండేది. బాంబులు వేసిన రోజు, తరువాత హిరోషిమాలో లక్షా 29వేల మంది, నాగసాకిలో రెండు లక్షల 26వేల మంది మరణించారు.తరువాత అణుధూళితో మరికొన్ని వేల మంది మరణం, రోగాలపాలైనారు.


అణ్వాయుధాల ముప్పును చూసిన తరువాత వాటిని మరొకసారి వినియోగించరాదనే డిమాండ్‌ను ప్రపంచ శాంతి ఉద్యమం ముందుకు తెచ్చింది. ఎవరైనా తమ మీద ప్రయోగించకపోతే తాముగా ముందు ఉపయోగించబోమని (ఎన్‌ఎఫ్‌యు పాలసీ) అణుశక్తి దేశాలు స్వచ్చందంగా ప్రకటన చేసి కట్టుబడి ఉండాలన్నదే దాని సారం.ఇదేగాక అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని భద్రతామండలిలోని ఐదు శాశ్వత, అణుశక్తి దేశాలు ముందుకు తెచ్చాయి.1964లో అణ్వాయుధాలను సమకూర్చుకున్న చైనా ఏ సమయంలోనూ, ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ముందుగా ఉపయోగించబోమని తొలిసారిగా చేసిన ప్రకటనకు ఇప్పటికీ కట్టుబడి ఉంది. దీనిపై ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికాను డిమాండ్‌ చేయగా అది తిరస్కరించింది. రష్యా – చైనా పరస్పరం వాటిని ఉపయోగించరాదని ఒప్పందం చేసుకున్నాయి.


మన దేశం 1974లోనే తొలి అణుపరీక్ష జరిపినప్పటికీ, 1998లో రెండవసారి పోఖ్రాన్‌ పరీక్షల తరువాత మాత్రమే తమ మీద ఎవరూ అణుదాడికి దిగకపోతే తాముగా ముందు ప్రయోగించబోమని 1999లో ప్రకటించింది. అదే ఇప్పటికీ కొనసాగుతోంది. పరిస్థితులను బట్టి ఆ వైఖరిని సవరించుకోవాల్సి రావచ్చని 2019లో రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ చెప్పినప్పటికీ పాత విధానమే కొనసాగుతోంది.తమ మీద, తమ మిత్ర దేశాల మీద ఎవరైనా దాడి చేస్తే తప్ప తాము ఉయోగించబోమని అమెరికా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌ చెబుతున్నాయి, గతంలో సోవియట్‌, తరువాత రష్యా కూడా అదే చెప్పింది. సోవియట్‌ గనుక దురాక్రమణకు పాల్పడితే అణ్వాయుధాలను వాడతామని నాటో కూటమి చెప్పింది.అమెరికా, బ్రిటన్‌,ఫ్రాన్స్‌ దానిలో భాగస్వాములే.1999లో నాటో పదహారవ సమావేశంలో ఎన్‌ఎఫ్‌యు విధానాన్ని ఆమోదించాలని జర్మనీ చేసిన ప్రతిపాదనను సమావేశం తిరస్కరించింది. అణుయుద్దంలో విజేతలెవరూ ఉండరు, ఎన్నడూ పోరుకు పూనుకోవద్దంటూ ఎన్‌పిటి దేశాలు 2022లో ఒక ప్రకటన చేశాయి. ఎన్‌పిటి వివక్షతో కూడుకున్నదంటూ దాని మీద సంతకం చేసేందుకు మన దేశం తిరస్కరించింది.తమకు ఎన్‌ఎఫ్‌యు విధానం లేదని పాకిస్తాన్‌ చెబుతుండగా తమ దగ్గర అణ్వాయుధాలు ఉన్నదీ లేనిదీ ఇజ్రాయెల్‌ నిర్దారించటం లేదు. తాముగా ముందు దాడికి దిగబోమని ఎవరైనా చేస్తే ప్రతిదాడి చేస్తామని ఉత్తర కొరియా చెప్పింది. ఉక్రెయిన్‌ వివాదంలో అవసరమైతే అణుదాడి చేస్తామని పుతిన్‌ హెచ్చరించినప్పటికీ అలాంటిదేమీ జరగలేదు.


అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌ వంటి దేశాలకు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట నిరంతరం ఉద్రిక్తతలు, యుద్దాలు లేకపోతే నిదురపట్టదు. ఒక దగ్గర ముగిస్తే మరోచోట ప్రారంభిస్తారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అవమానకరంగా వెన్ను చూపిన పశ్చిమ దేశాలు ఉక్రెయిన్లో అగ్గిరాజేశాయి. రష్యా బలహీనంగా ఉన్నపుడు తమతో కలుపుకుపోయి చైనాకు వ్యతిరేకంగా నిలబెట్టాలని చూసిన ధనిక దేశాల జి7 కూటమిని విస్తరించి జి8గా మార్చాయి. ఇదే సమయంలో ఎప్పుడైనా తమకు సవాలుగా మారవచ్చని భావించిన ఆ కూటమి నాటో విస్తరణ పేరుతో జార్జియా, ఉక్రెయిన్ను చేర్చుకొని రష్యా ముంగిట ఆయుధాలను మోహరించాలని చూశాయి. రష్యా దాన్ని గ్రహించి ప్రతి వ్యూహంతో ఒక వైపు చైనాతో ఉన్న స్వల్ప వివాదాలను పరిష్కరించుకుంది. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్లో అధికారంలో ఉన్న రష్యా అనుకూల ప్రభుత్వాన్ని కూలదోసి తమ తొత్తులను ప్రతిష్టించాయి.రష్యా తన సరిహద్దులో ఉండి నాటోలో చేరాలని చూసిన జార్జియాలో రెండు ప్రాంతాల్లో తలెత్తిన స్వాతంత్య్ర ఉద్యమాలకు మద్దతు ఇచ్చి వాటిని దేశాలుగా గుర్తించింది.ఉక్రెయిన్లోని డాన్‌బాస్‌ ప్రాంతంలో ఉన్న మెజారిటీ రష్యన్లు తాము విడిపోయి స్వతంత్ర దేశాలుగా అవతరిస్తామని ప్రారంభించిన తిరుగుబాటుకు మద్దతు తెలిపింది. గతంలో తన భూభాగంగా ఉండి తరువాత ఉక్రెయిన్లో కొనసాగిన క్రిమియా ప్రాంతాన్ని 2014లో రష్యా విలీనం చేసుకుంది. అక్కడ తన సేనలను మోహరించింది. ఈ ఉదంతాన్ని సాకుగా చూపి జి8 బృందం నుంచి రష్యాను బహిష్కరించారు. అప్పటి నుంచి నాటో కూటమి దేశాలు ఉక్రెయినుకు భారీ ఎత్తున ఆయుధాలు సరఫరా చేసి రష్యాను రెచ్చగొట్టాయి.ఐరోపా సమాఖ్య, నాటోలో చేర్చుకొని మిలిటరీని కూడా తరలించాలని చూశాయి. ఇది తమ దేశ భద్రతకు ముప్పు అని, ఉక్రెయిన్ను తమ కూటమిలో చేర్చుకోవద్దని అనేక వేదికల మీద రష్యా చేసిన వినతులను పట్టించుకోలేదు. దీంతో విధిలేని స్థితిలో 2022 ఫిబ్రవరి 24న రష్యా ప్రత్యేక సైనిక చర్యను ప్రారంభించింది. డాన్‌బాస్‌ ప్రాంతంపై దాడులు చేస్తున్న మిలిటరీ, కిరాయి మూకల నుంచి విముక్తి చేయటంతో పాటు ఉక్రెయిన్‌ సైనిక పాటవాన్ని దెబ్బతీస్తామని, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొనేది లేదని ప్రకటించింది. ఆ మేరకు భారీ ఎత్తున ప్రాణ నష్టం జరగకుండా ఆచితూచి దాడులు చేస్తున్నది.


ఈ వివాదంలో రెండు వైపులా మరణించిన సైనికులు, పౌరుల సంఖ్య గురించి కచ్చితమైన వివరాలు ఇంతవరకు లేవు. ఇరుపక్షాలు చెబుతున్నవాటిని విశ్వసించలేము.కిరాయి మూకలు లేవని తొలుత ఉక్రెయిన్‌ చెప్పింది. తరువాత అజోవ్‌ ప్రాంతంలోని ఉక్కు ఫ్యాక్టరీ నుంచి దాడులకు దిగిన వేలాది మంది కిరాయి మూకలు రష్యన్లకు బందీలుగా చిక్కాయి. ఒక వేళ రష్యా దాడులకు దిగితే తాము అన్ని విధాలుగా సాయం చేస్తామని చెప్పి ఉక్రెయిన్ను వివాదంలోకి దించిన పశ్చిమ దేశాలు తాము ఎన్ని కావాలంటే అన్ని అస్త్రాలను అందిస్తాం తప్ప మిలిటరీని పంపం, వైమానిక దాడులు జరపం అని చెప్పాయి. తొలి రోజుల్లో ఉక్రెయిన్‌ ప్రతిఘటన, రష్యాను దెబ్బతీస్తున్న తీరు తెన్నులంటూ ప్రపంచాన్ని, తమ ప్రజానీకాన్ని నమ్మింప చూసిన పశ్చిమ దేశాల మీడియా, వాటిని నమ్మి మన జనానికి అందించిన మన మీడియాలో ఇప్పుడు అలాంటి ” కతలు ” కనిపించవు, వినిపించటం లేదు.


పశ్చిమ దేశాలు సృష్టించిన ఈ సంక్షోభానికి ఉక్రేనియన్లు బలిఅవుతున్నారు. జూలై నాలుగు నాటి ఐరాస సమాచారం ప్రకారం 50లక్షల మంది వివిధ దేశాల్లో తలదాచుకున్నారు. మరో 70లక్షల మంది స్వదేశంలోనే నెలవులు తప్పారు.రష్యాదాడుల కారణంగా ఐరోపాలోని ఇతర దేశాలకు వెళ్లిన 35లక్షల మంది తప్ప ఉక్రెయిన్‌ మిలిటరీ, కిరాయి మూకల దాడులతో 14లక్షల మంది రష్యాలో తలదాచుకుంటున్నారనే అంశం మనకు మీడియాలో కనిపించదు. మన దేశ ఆర్ధిక వ్యవస్థ వృద్ది రేటు కరోనాకు ముందే నాలుగుశాతానికి పడిపోయింది. దీనికి పాలకులు అనుసరించిన విధానాలే కారణం. కానీ ఇటీవల వంటనూనెల ధరలు ఆకాశానికి అంటటానికి,కొరతకు ఉక్రెయిన్‌ కొంత కారణమైతే ఇక్కడి వ్యాపారుల మీద ప్రభుత్వాలకు వెన్నుదన్నుగా ఉండటం ఒక ప్రధాన కారణం. పామోలిన్‌, సన్‌ఫ్లవర్‌ అంటే దిగుమతులు చేసుకుంటున్నాం, మరి వేరుశనగనూనె ఎందుకు కనిపించటం లేదు ? శ్రీలంక ఆందోళనలు, ఏడాదికిపైగా సాగిన రైతుల ఉద్యమ నేపధ్యంలో మరోదారి లేక చమురు ధరలు పెరిగినందున ఎరువుల ధరలను రైతులపై మోపకుండా కేంద్రం సబ్సిడీ రూపంలో భరిస్తున్నది, చమురుపై విధించిన పన్నులను కొంత మేరకు తగ్గించటంతో పాటు ఏప్రిల్‌ ఆరు నుంచి చమురు ధరలను నరేంద్రమోడీ సర్కార్‌ స్థంభింప చేసింది తప్ప ఇతర వస్తువుల ధరల పెరుగుదల నుంచి జనాలకు ఎందుకు ఎలాంటి వెసులుబాటు కల్పించలేదు.

రష్యా నుంచి ఎరువులు, గోధుమలు, ఇంథన సరఫరాలు నిలిచిపోవటంతో అనేక దేశాలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వీటన్నింటికీ ప్రపంచ పెత్తనంపై అమెరికా, దాని మిత్రదేశాల కాంక్ష తప్ప మరొకటి లేదు. ఐరోపా సమాఖ్య,నాటోలో చేరేది లేదని ఉక్రెయిన్‌ అంగీకరిస్తే దాని సార్వభౌత్వానికి, రక్షణకు హామీ ఇస్తామని రష్యా చెబుతున్నప్పటికీ పశ్చిమ దేశాలు పడనివ్వటం లేదు. ఆంక్షలతో రష్యాను దెబ్బతీసేందుకే పూనుకున్నాయి. ఇప్పటి వరకు పశ్చిమ దేశాలు అనుకున్నట్లుగా జరగలేదు. అనిశ్చితి కారణంగా చమురు ధరలు పెరగటంతో అది రష్యాకు వరంగా మారి రాబడిని పెంచింది. మన దేశం, చైనా తదితర దేశాలకు రాయితీలకు చమురు అమ్ముతున్నది. కానీ ప్రపంచమంతా ఇబ్బంది పడుతున్నది.


ఉక్రెయిన్‌ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేము.పశ్చిమ దేశాల చేతిలో ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ కీలుబొమ్మగా మారాడు. రష్యా నుంచి ఇంథన కొనుగోళ్లను నిలిపివేసిన ఐరోపా దేశాల మీద దాని ప్రతికూల పర్యవసానాలు ఇప్పుడే కనిపిస్తున్నాయి.రష్యా మీద కూడా దీని ప్రభావం ఉంది, అయితే ముందుగానే ఊహించినందున ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులకు గురి కాలేదు. ఉక్రెయిన్‌ ఆర్ధిక వ్యవస్థ 2022లో 45శాతం, రష్యాలో 8-10శాతం వరకు తిరోగమనంలో ఉంటుందని అంచనా. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం గతేడాది ప్రపంచ వృద్ది రేటు 6.1శాతం కాగా వర్తమాన సంవత్సరంలో అది 2.6, 2023లో రెండు శాతానికి తగ్గుతుందని తాజా అంచనా. ఐరోపా, అమెరికాల్లో వచ్చే ఏడాది వృద్ది రేటు సున్నా అంటున్నారు. 1970 నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వృద్ది రేటు రెండుసార్లు రెండుశాతానికి పడిపోయింది. ధనిక దేశాల వృద్ది రేటు పడిపోతే మన వంటి దేశాల ఎగుమతుల మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. అయినప్పటికీ ఉక్రెయిన్‌ వివాదాన్ని పరిష్కరించేందుకు పశ్చిమ దేశాలు ముందుకు రావటం లేదు.


రెండవ ప్రపంచ యుద్దం తరువాత సోవియట్‌ నుంచి ఐరోపాకు ముప్పు ఉంటుందనే పేరుతో బ్రిటన్‌తో చేతులు కలిపిన అమెరికా నాటో కూటమిని ఏర్పాటు చేసి పగ్గాలు తన చేతిలో ఉంచుకుంది.నాటో తొలి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన బ్రిటీష్‌ జనరల్‌ హేస్టింగ్‌ ఇస్మే మాటల్లో ” ఐరోపాకు దూరంగా రష్యా (సోవియట్‌ )ను నెట్టటం, అమెరికాను లోనికి రప్పించటం,జర్మనీ పలుకుబడిని తగ్గించటం ” అన్నాడు.ఐరోపాలో శాంతి-స్థిరత్వాలకు అది దోహదం చేస్తుందని ప్రపంచాన్ని నమ్మించారు. ఆ సోవియట్‌ ఇప్పుడు ఉనికిలో లేదు, ఐరోపాకు ముప్పూ లేనప్పటికీ గత మూడు దశాబ్దాలుగా దాన్ని కొనసాగించటమే కాదు, విస్తరిస్తున్నారు. అది ఇప్పుడు అమెరికాను వ్యతిరేకించే దేశాలకు ముప్పుగా మారింది.అమెరికా అణుదాడికి గురైన జపాన్‌ ఇప్పుడు అదే అమెరికాతో చేతులు కలిపింది. చైనా మీద కాలుదువ్వుతోంది. సోవియట్‌ విచ్చిన్నం తరువాత నాటోను కానసాగిస్తున్నారు. నాటో పరిధి వెలుపల మిలిటరీ చర్యలకు వినియోగిస్తున్నారు. వాటికి మానవతాపూర్వక దాడులని పేరు పెట్టారు.1994లో బోస్నియాలో నాటో విమానాలు తొలిసారిగా దాడులు చేసి సెర్బియా విమానాన్ని కూల్చాయి.1999లో సెర్బియా మీద 78రోజులు దాడులు చేసింది. ఉగ్రవాదంపై పోరు పేరుతో ఇరాక్‌పై దురాక్రమణను నాటో సమర్ధించింది, తరువాత ఆప్ఘనిస్తాన్‌ దురాక్రమణ, లిబియాపై దాడుల్లో భాగస్వామిగా మారింది.లిబియానేత గడాఫీని హత్య చేసి తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1991లో సోవియట్‌ విడిపోయి నపుడు నాటోను విస్తరించబోమని రష్యాకు ఇచ్చిన హామీని ఉల్లంఘించి తూర్పు ఐరోపాలో ఉన్న అనేక దేశాలను చేర్చుకోవటమే తాజా పరిణామాలకు మూలం.తటస్థ దేశాలుగా ఉన్న ఫిన్లండ్‌, స్వీడన్‌లను చేర్చుకొనేందుకు నిర్ణయించిది. అంటే రష్యా సరిహద్దులో తిష్టకు తెరలేపింది. లాటిన్‌ అమెరికాలో కూడా నాటో అడుగుపెట్టేందుకు పూనుకుంది. మొత్తం ప్రపంచానికి ముప్పు తలపెట్టింది.


నాటోను ఆసియాకు విస్తరించేందుకు పావులు కదుపుతున్నారు. ఇక్కడ కొత్త కూటమి ఏర్పాటు, దానిని నాటోకు అనుసంధానించే ఎత్తుగడ ఉంది.ఇదంతా చైనాను కట్టడి చేసేందుకే.ప్రపంచంలోని 80 దేశాల్లో అమెరికాకు 800 మిలిటరీ కేంద్రాలున్నాయి. వాటిలో నాలుగు వందలు చైనా చుట్టూ ఉన్నాయంటే అమెరికా కేంద్రీకరణ దానిమీద ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. చైనా పెద్ద ఎత్తున ప్రపంచాన్ని ఆక్రమించేందుకు పూనుకుందన్న ప్రచారం మరోవైపు అదే అమెరికా సాగిస్తోంది. ఒక చిన్న దేశం సింగపూర్‌కే ప్రపంచంలో నాలుగు సైనిక కేంద్రాలున్నాయి. ప్రపంచంలోనే పెద్ద దేశమైన చైనా తన చుట్టూ అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా తదితరదేశాలు పట్టుబిగిస్తున్నా అలాంటి కేంద్రాల ఏర్పాటుకు పూనుకోలేదు. దానికి కంపూచియాలో ఒక నౌకా కేంద్రం, తజకిస్తాన్‌లో ఒక మిలిటరీ పోస్టు, జిబౌటీలో అనేక దేశాల సైనిక కేంద్రాల సరసన దానికి ఒక చిన్న కేంద్రం ఉంది. ఎక్కడైనా స్వేచ్చగా తిరిగే హక్కు తమకు ఉందంటూ అమెరికా నగరమైన న్యూయార్క్‌ ఇతర సముద్రతీర నగరాల వైపు ఏ విదేశీ మిలిటరీ నౌకలు తిరగటం ఎన్నడూ కనిపించదు. కానీ చైనా చుట్టూ అమెరికా, దాని మిత్రదేశా నౌకలు నిరంతరం తిరుగుతూనే దర్శనమిస్తాయి, ఎందుకని ? దేశమంటే మట్టికాదోయి మనుషులోయి అన్న మహాకవి గురజాడ స్ఫూర్తితో విశ్వమానవాళికోసం హిరోషిమా, నాగసాకి దినం సందర్భంగా ప్రపంచంలోని శాంతి ప్రియులందరూ అమెరికా దాని మిత్ర దేశాల యుద్దోన్మాదాన్ని ఖండించాలి, నిరసించాలి. ప్రపంచాన్ని కాపాడాలి. శాంతి ఉద్యమాల్లో భాగస్వాములు కావాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మీడియా కట్టుకథలు, పిట్టకతలను నమ్మని జనం !

03 Wednesday Aug 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, Latin America, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ 1 Comment

Tags

media bias, media credibility, Propaganda War, US imperialism, US MEDIA COCK AND BULL STORIES, US Media lies


ఎం కోటేశ్వరరావు


మొదటి ప్రపంచ యుద్ధానికి కారకులలో ఒకడు జర్మన్‌ చక్రవర్తి కైజర్‌ రెండవ విల్‌హెల్మ్‌.1917 ఫిబ్రవరిలో చైనాలో బ్రిటీష్‌ వారి పత్రిక నార్త్‌ చైనా డైలీ న్యూస్‌ ఒక వార్త ప్రచురించింది. కైజర్‌ సేనలు శవాల నుంచి గ్లిజరీన్ను తయారు చేస్తున్నారన్నది దాని సారాంశం. ఏప్రిల్‌ నాటికి లండన్‌ నుంచి వెలువడే టైమ్స్‌, డెయిలీ మెయిల్‌ పత్రికలు తమ ప్రతినిధులు శవాల నుంచి గ్లిజరీన్‌ తీస్తున్న ఫ్యాక్టరీలను చూసినట్లు వార్తలను ప్రచురించాయి. అదే నెలలో లండన్‌ నుంచి ప్రచురితమౌతున్న ఒక బెల్జియన్‌ పత్రిక శవాలకు సంబంధించిన వార్తను ప్రచురించింది. దానికి జర్మనీలో ప్రచురితమైన ఒక వార్త ఆధారం. జర్మన్‌ పత్రికలో గుర్రాలు, కంచరగాడిదల శవాలను కాల్చుతున్నట్లు విలేకరి పేర్కొన్నాడు. అది బ్రిటీష్‌ పత్రికల్లో మానవశవాలుగా మారింది. అలాంటిదేమీ లేదని జర్మనీ పేర్కొన్నప్పటికీ అప్పటికే జర్మనీ మీద కోపంతో ఉన్న జనం వార్తలను నిజమే అని నమ్మారు. గ్లిజరీన్‌ వార్తకు ఎలాంటి ఆధారం లేదని 1925లో బ్రిటన్‌ ప్రజాప్రతినిధుల సభలో ప్రభుత్వం పేర్కొన్నది. అదే ఏడాది కన్సర్వేటివ్‌ పార్టీ ఎంపీ జాన్‌ చార్టరీస్‌ అమెరికాలో పర్యటించినపుడు తానే ఈ వార్త సృష్టికర్తనని వెల్లడించాడు. అతగాడు పూర్వాశ్రమంలో ఇంటిలిజెన్స్‌ అధిపతిగా పని చేశాడు.1917లో బ్రిటన్‌ గూఢచార సంస్థ ఎం17 వివిధ పత్రికల్లో స్పెషల్‌ కరస్పాండెంట్లుగా పని చేసేందుకు 13 మంది అధికారులు, 25 మంది కిరాయి రాతగాళ్లను నియమించింది. వారిలో ఒకడు శవాల ఫ్యాక్టరీ కట్టుకధ గురించి అంగీకరించాడు.మొదటి ప్రపంచ యుద్దంలో బ్రిటన్‌ అనుసరించిన ఎత్తుగడలను తరువాత జర్మన్‌ నాజీ హిట్లర్‌ మరింతగా పెంచి నీవు నేర్పిన విద్య అన్నట్లుగా కట్టుకథలను ప్రచారంలో పెట్టించాడు. వాటికి మారు పేరుగా తన ప్రచారశాఖ మంత్రి గోబెల్స్‌ను ప్రపంచానికి అందించాడు.ఇప్పుడు గోబెల్స్‌ వారసులు తామరతంపరగా పెరిగారు.గత వంద సంవత్సరాలుగా మీడియా అబద్దాలు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరుగుతున్నాయి.


అభిప్రాయ సేకరణ సంస్థ గాలప్‌ తాజాగా విడుదల చేసిన జూలై మాస సర్వే ప్రకారం అమెరికాలో కేవలం పదకొండుశాతం మంది మాత్రమే టీవీ ఛానళ్ల వార్తలను నమ్ముతున్నారు.పత్రికలపై 16శాతం మందికి విశ్వాసం ఉంది.రెండవ ప్రపంచ యుద్దం, ఆ తరువాత అమెరికా జరిపిన యుద్దాల సందర్భంగా వాటిని సమర్ధించేందుకు అమెరికా సిఐఏ, దానితో చేతులు కలిపిన వివిధ దేశాల సంస్థలు వండి వార్చిన తప్పుడు వార్తలతో జనం విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభంలో కుహనా వార్తలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆయుధాలతో పాటు అంతేశక్తి వంతంగా ప్రచారదాడులు సాగుతున్నాయి. సిఐఏ స్థాపక అధికారుల్లో ఒకడైన ఫ్రాంక్‌ విస్నర్‌ ఒక సందర్భంగా మీడియా ఒక సంగీత వాద్యం వంటిదని చెప్పాడు. ప్రపంచంలోని ప్రధాన మీడియా సంస్థల కార్యాలయాల్లో సంగీత దర్శకుల మాదిరి సిఐఏ అధికారులు, గాత్ర,వాయిద్యకారులుగా ఇతరులు చేరతారు. తప్పుడు వార్తలను వీనుల విందుగా, కనులపసందుగా రూపొందిస్తారు. ఇటీవల బిజెపి తమ భావజాలం ఉన్నవారిని ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున మీడియాలో ప్రవేశపెట్టింది. ప్రతి పార్టీ అలాంటి వారిని ప్రవేశపెట్టటం లేదా అప్పటికే ఉన్నవారిని తమకు అనుకూలంగా మార్చుకోవటం చేస్తున్నది. ఇలాంటి వారంతా తమ అజెండాలకు అనుగుణంగా పాఠకులు, వీక్షకులకు వినిపిస్తారు, చూపిస్తారు. అమాయకులను నిందితులుగా, నిందితులను అమాయకులుగా మార్చివేస్తారు. వీరికి పోలీసు, గూఢచార ఏజన్సీల మద్దతు పూర్తిగా ఉంటుంది. ఎంపిక చేసుకున్నవారికి లీకులు అందిస్తారు. అందుకే ప్రస్తుతం ప్రపంచ మీడియాలో జర్నలిజానికి బదులు ప్రచారదాడి తిష్టవేసిందని అనేక మంది చెబుతున్నారు. ఇది యజమానులకు పెద్ద లాభసాటిగా ఉంది.


పాలకవర్గ దోపిడీ, సామ్రాజ్యవాద కాంక్ష, విస్తరణకు మీడియా తన వంతు పాత్ర నిర్వహిస్తోంది. అమెరికా-స్పానిష్‌ యుద్దాలలో 1898లో క్యూబా, పోర్టోరికో, ఫిలిఫ్పీన్సును వలసలుగా చేసుకున్నపుడు అమెరికాను మీడియా సమర్ధించింది. దీన్ని అప్పుడే ఎల్లో జర్నలిజం అని పిలిచారు. అంతెందుకు జపాన్‌పై రెండు అణుబాంబులు వేసిన దుర్మార్గాన్ని కూడా అధికభాగం అమెరికన్‌ మీడియా సమర్ధించింది.యుద్దాన్ని ముగించేందుకు అణుబాంబులు వేయకతప్పలేదని పేర్కొన్నాయి. హిరోషిమా నాశనంలో రేడియోయాక్టివిటీ లేదు అని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక శీర్షిక పెట్టి మరీ రాసింది.అణుదాడితో ప్రమాదకరమైన అణుధార్మికత ఏర్పడదన్న మిలిటరీ అధికారిని ఉటంకించింది. వియత్నాంపై దాడి చేసేందుకు అమెరికా టోంకిన్‌ గల్ఫ్‌ దాడిని సాకుగా చూపింది. ఆ కట్టుకథకు మీడియా ఎంతో ప్రాచుర్యమిచ్చింది. 1980 దశకంలో నికరాగువాలో అమెరికా సిఐఏ ఏజంట్లు, కాంట్రా కిరాయి మూకలు చేసిన చిత్రహింసలు, హత్యలు, దుర్మార్గాలను శాండినిస్టా విప్లవకారులకు అంటగట్టి పత్రికలు ప్రచారం చేశాయి.1990 దశకంలో కువైట్‌పై ఇరాక్‌ దాడి చేసింది. అప్పుడు ఇరాకీ సైనికులు కువైట్‌ ఆసుపత్రుల్లో ఇంకుబేటర్లలో ఉన్న పిల్లలను కిందపడవేసి చంపారని అమెరికా పత్రికలు రాశాయి. ఇలాంటి కట్టుకథలను సాకుగా చూపి ఇరాక్‌ మీద అమెరికా దాడి చేసింది. తరువాత సద్దామ్‌ హుసేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోగేసినట్లు ప్రచారం చేసి దురాక్రమణకు పూనుకోవటం సద్దామ్‌ను హత్యచేసిందీ తెలిసిందే. 2011లో లిబియాపై నాటో దాడిచేసినపుడు కూడా కట్టుకథలు రాశారు. మహిళలపై అత్యాచారాలు చేసేందుకు ఆ దేశ నేత గడాఫీ సైనికులకు వయగ్రా మాత్రలు ఇచ్చాడని రాశారు. సిరియాలో సిఐఏ మద్దతు ఉన్న సలాఫీ జీహాదీ తీవ్రవాదుల దుర్మార్గాలను ప్రభుత్వానికి ఆపాదించారు.ఈ తప్పుడు ప్రచారాన్ని పులిట్జర్‌ బహుమతి గ్రహీత జర్నలిస్టు సేమౌర్‌ హెర్ష్‌ బయట పెట్టినందుకు అమెరికన్‌ కార్పొరేట్‌ మీడియా అతని రచనలను ప్రచురించకుండా నిలిపివేసింది.


అమెరికా దౌత్యవేత్తలు, గూఢచారులను లక్ష్యంగా చేసుకొని క్యూబా, చైనా, రష్యాలు ఎలక్ట్రోమాగటిక్‌ తరంగాలతో దాడులు చేయటంతో వారందరికీ చెవుల్లో గింగుర్లు, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపించినట్లు దీనికి హవానా సిండ్రోమ్‌ అనిపేరు పెట్టి పత్రికలు రాశాయి. ఇది ఒక మానసిక జబ్బు తప్ప మరొకటేమీ కాదని కొందరు నిపుణులు చెప్పారు.నిజానికి అలాంటి అవకాశమే ఉంటే అనేక దేశాల్లో ఉన్న అమెరికన్లందరి మీద ఆప్ఘనిస్తాన్‌ వంటి చోట్ల వాటిని ఇప్పటికే ప్రయోగించి ఉండేవారు. వర్తమానంలో ఉక్రెయిన్‌ సంక్షోభంలో అమెరికా, ఐరోపా మీడియా అల్లిన కట్టుకథలకు లెక్కే లేదు.వీడియో గేమ్‌లను రష్యా దాడులుగా చూపారు.


అమెరికన్‌ మీడియా అనేక దేశాల్లో జరిగిన పరిణామాలను కూడా వక్రీకరించింది.ఇరాన్‌లో మహమ్మద్‌ మొసాద్‌ ప్రభుత్వం 1953లో బ్రిటీష్‌, అమెరికన్‌ చమురు కంపెనీలను జాతీయం చేసినపుడు సిఐఏ తప్పుడు ్పచారాలు చేసింది. 1973లో చిలీ అధ్యక్షుడు, సోషలిస్టు నేత సాల్వడోర్‌ అలెండీపై జరిగిన కుట్ర, తిరుగుబాటు, హత్యను ప్రజాగ్రహంగా వక్రీకరించి రాశారు.2019లో బొలీవియాలో ఎన్నికైన వామపక్ష నేత ఇవో మొరేల్స్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర జరిగింది.దాన్ని సమర్ధించేందుకు ఎన్నికల్లో మొరేల్స్‌ రిగ్గింగుకు పాల్పడినట్లు పత్రికలు రాశాయి. ఇలాంటి ఎన్నో ఉదంతాలు తమను తప్పుదారి పట్టించిన కారణంగానే అమెరికన్లు మీడియాను విశ్వసించటం లేదన్నది వాస్తవం. అంతే కాదు అమెరికన్లు తమ ప్రభుత్వాన్ని కూడా నమ్మటం లేదని జూన్‌ నెల గాలప్‌ పోల్‌ పేర్కొన్నది. ఎల్లవేళలా ప్రభుత్వం చేస్తున్నది సరైనదే అని నమ్ముతున్నవారు కేవలం రెండుశాతమే,ఎక్కువసార్లు మంచే చేస్తున్నదని నమ్మేవారు 19శాతమే ఉన్నారు. పార్లమెంటు మీద ఏడు,న్యాయవ్యవస్థపై 14, అధ్యక్ష వ్యవస్థపై 23, సుప్రీం కోర్టుపై 25,కార్పొరేట్లపై 14, పెద్ద టెక్నాలజీ కంపెనీలపై 26, పోలీసులపై 45శాతాల చొప్పున విశ్వాసం వెల్లడించినట్లు మరొక గాలప్‌ పోల్‌ పేర్కొన్నది.


ప్రపంచం మొత్తం మీద మీడియా విశ్వసనీయ తగ్గుతున్నది.ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన ఎడెల్‌మాన్‌ బారోమీటర్‌ విశ్లేషణ ప్రకారం 46శాతం మంది జర్నలిస్టులను నమ్మటం లేదని చెప్పారు.2021 నవంబరు నెలలో 28 దేశాల్లో 36వేల మందితో జరిపిన సంభాషణల్లో ఇది వెల్లడైంది.సమాజాలు చీలిపోవటానికి ఒక వనరుగా మీడియా ఉందని 46శాతం మంది చెప్పారు. కుహనా వార్తలు రాజకీయ ఆయుధాలుగా మారుతున్నట్లు 75శాతం మంది చెప్పారు. ఫేస్‌బుక్‌లో ఆరు రెట్లు అదనంగా కుహనా వార్తలు పుడుతున్నాయి.


మన దేశ మీడియాలో కొన్ని ఛానళ్లు సంచలన వార్తలకు పేరు మోసినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ డిజిటల్‌ న్యూస్‌ రిపోర్టు 2022 పేర్కొన్నది. దీని కోసం 2,035 మంది ఆంగ్ల పాఠకులను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. అందువలన ఇది మొత్తం అభిప్రాయంగా పరిగణించకూడదు. వారి అభిప్రాయాల ప్రకారం వార్తలను మొత్తం మీద నమ్ముతున్నట్లు చెప్పిన వారు మన దేశంలో 38శాతం మంది ఉన్నారు. సర్వే చేసిన 46 దేశాల్లో మనది 20వ స్థానంలో ఉంది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వార్తలను 75శాతం మంది, రేడియో 72, ది ప్రింట్‌ 61, రిపబ్లిక్‌ టీవి 57, ది వైర్‌ను 57శాతం మంది నమ్ముతున్నారు. వార్తల కోసం తాము ఆన్‌లైన్‌ మీడియా మీద ఆధారపడుతున్నట్లు 84శాతం మంది చెప్పగా ప్రింట్‌ మీడియా మీద 49, టీవీల మీద 59శాతం మంది ఆధారపడుతున్నట్లు వెల్లడించారు.టీవీ ఛానల్స్‌లో బహుళ ఆదరణ పొందినవిగా ఎన్‌డిటివీ, ఇండియా టుడే, బిబిసి ఉండగా పత్రికల్లో టైమ్స్‌ఆఫ్‌ ఇండియా, హిందూస్తాన్‌ టైమ్స్‌, హిందూ ఉన్నాయి. వార్తల కోసం యుట్యూబ్‌ చూస్తామని 53శాతం, వాట్సాప్‌ చూస్తామని 51శాతం చెప్పారు. క్లుప్తంగా కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.కేవలం 36శాతం మందే మీడియా మీద రాజకీయ ప్రభావం లేదని, 35శాతం మంది కార్పొరేట్ల ప్రభావం లేదని భావిస్తున్నారు. అమెరికాలో 30శాతం మంది వార్తల కోసం యాప్స్‌ మీద ఆధారపడుతుండగా భారత్‌లో 82శాతం ఉన్నారు.ఫేస్‌బుక్‌ను నమ్మేవారు 29-65శాతాలుగా ఉన్నారు. వర్గాల వారీ చీలికలు తెస్తున్న వాటిలో రిపబ్లిక్‌ టీవీ, జి న్యూస్‌ ముందున్నాయి. రిపబ్లిక్‌ టీవిని బిజెపి మద్దతుదార్లు 85శాతం మంది ఇతరులు 50శాతం నమ్ముతున్నారు, జి న్యూస్‌ను 85శాతం బిజెపి, 63శాతం ఇతరులు నమ్ముతున్నారు. మొత్తం మీద ఎన్‌డిటివీని 75శాతం మంది బిజెపి మద్దతుదార్లు, ఇతరులు 81శాతం మంది నమ్ముతున్నారు.


మనుషుల మధ్య సంబంధాలను కలిపేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా దోహదం చేసిందో అదే మానవులు అలవోకగా అబద్దాలు ఆడేందుకు,ప్రచారం, మోసం చేసేందుకు సైతం అవకాశం ఇచ్చిందన్నది కాదనలేని సత్యం. రాను రాను పత్రికలు, టీవీ ఛానళ్లతో కూడిన మీడియా మీద రానురాను జనాల్లో విశ్వాసం తగ్గుతున్నది. ప్రత్నామ్నాయంగా ముందుకు వచ్చిన సామాజిక మాధ్యమం కూడా ఇప్పుడు అదే దారిలో ఉంది. సంప్రదాయ మీడియా స్పందించినా లేకున్నా ప్రశ్నించేందుకు ఒక చిరునామా ఉంటుంది. సామాజిక మాధ్యమానికి అది కనిపించదు, పట్టుకోవటం సామాన్యులకు చాలా కష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దుమ్మెత్తి పోసుకుంటున్న టోరీ నేతలు రిషి సునాక్‌ – లిజ్‌ ట్రస్‌ : ఇలాగైతే లేబర్‌ పార్టీకి అవకాశమంటూ పెద్దల గగ్గోలు !

27 Wednesday Jul 2022

Posted by raomk in CHINA, Current Affairs, INTERNATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

anti china, Liz Truss, Rishi Sunak, Tory leadership contest, UK Conservative party, UK Labour party


ఎం కోటేశ్వరరావు


బ్రిటన్‌, ప్రపంచ భద్రతకు చైనా అతి పెద్ద ముప్పుగా ఉందని, స్వేచ్చా దేశాలు చైనా సాంకేతిక దాడిని ఎదుర్కొనేందుకు కొత్త కూటమి ఏర్పడాలని బ్రిటన్‌ కన్సర్వేటివ్‌(టోరీ) పార్టీ నేత రిషి సునాక్‌ అన్నాడు. ఇలా మాట్లాడటం బాధ్యతా రాహిత్యమని, దీని వలన వారి సమస్యలు పరిష్కారం కావని చైనా పేర్కొన్నది. బోరిస్‌ జాన్సన్‌ మంత్రివర్గంలో ఆర్ధిక మంత్రిగా పని చేసిన సునాక్‌ ఆర్ధిక విధానాలతో విబేధాల వలన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు చెబుతూ జూలై ఐదున రాజీనామా చేశాడు.తరువాత రెండు రోజులకే ప్రధాని జాన్సన్‌ కూడా రాజీనామా ప్రకటించాడు.దాంతో కన్సర్వేటివ్‌ పార్టీ పార్లమెంటరీ నేతగా(ప్రధాని పదవికి) తాను పోటీ చేయనున్నట్లు ఎనిమిదవ తేదీన వెల్లడించాడు.ఆ పరుగులో చివరికి సునాక్‌తో పాటు విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ మిగిలారు.కన్సర్వేటివ్‌ పార్టీ సభ్యులు పోస్టు బాలట్‌ ద్వారా ఒకరిని ఎన్నుకుంటారు. ఫలితం సెప్టెంబరు ఐదున ప్రకటిస్తారు. అప్పటి వరకు ఇరువురు నేతలు మద్దతుదార్లను ఆకర్షించేందుకు ముమ్మరంగా ప్రచారం చేస్తారు. దానిలో భాగంగా టీవీ చర్చలో ఇద్దరు నేతలు పరస్పరం చేసుకుంటున్నదాడులతో పార్టీ నష్టపడి వచ్చే ఎన్నికల్లో లేబర్‌ పార్టీకి అవకాశం ఇచ్చేట్లున్నారని కన్సర్వేటివ్‌ పార్టీ పెద్దలు గగ్గోలు పెడుతున్నారు. మాటలదాడులతో పరస్పరం గోతులు తీసుకుంటున్నారని వాపోతున్నారు. పన్నుల విధింపు, బ్రెక్సిట్‌, చైనా చివరికి తాము చదువుకున్న స్కూళ్లను కూడా వారి దాడులలో ప్రస్తావించారు. తొలి టీవీ చర్చలో ఎవరు బాగా మాట్లాడారన్న సర్వేలో సునాక్‌కు 39శాతం మంది, ట్రస్‌ను 38శాతం బలపరిచారు. కాగా టోరీ పార్టీ మద్దతుదార్లలో ట్రస్‌ను 47శాతం, సునాక్‌ను 38శాతం బలపరిచారు. దీన్ని బట్టి కొత్త ప్రధానిగా ట్రస్‌కే అవకాశాలు ఎక్కువని కొందరు సూత్రీకరించారు.


పార్లమెంటులో అధికార పార్టీ మెజారిటీ కోల్పోతే నూతన ప్రభుత్వం లేదా ఎన్నికలు జరుగుతాయి. బ్రిటన్‌లో కన్సర్వేటివ్‌ పార్టీలో తలెత్తిన అంతర్గత సంక్షోభంతో బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా ప్రకటించాడు. దాన్ని అవకాశంగా తీసుకొని ప్రతిపక్ష లేబర్‌ పార్టీ మొత్తం ప్రభుత్వం మీదనే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించగా అధికార పార్టీ దానికి పోటీగా విశ్వాస తీర్మానం పెట్టి పార్లమెంటులో నెగ్గింది. అందువలన సాంకేతికంగా బోరిస్‌ జాన్సన్‌ మీద మరో ఏడాది పాటు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు కానీ పార్టీ నేతగా విశ్వాసం కోల్పోయాడు. నూతన నేతను ఎన్నుకొనేందుకు నిర్ధిష్ట కాలపరిమితేమీ లేదు. కన్సర్వేటివ్‌ పార్టీలో 1922 కమిటీ అనేది ఒకటి ఉంది. పార్లమెంటులో వెనుక బెంచీలలో కూర్చునే వారితో దీన్ని ఏర్పాటు చేస్తారు. సాధారణంగా దీనికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. మెజారిటీ వచ్చినపుడు ప్రధాని పదవికి లేదా ప్రతిపక్షంగా ఉన్నపుడు ప్రతిపక్ష నేతను ఎంపిక చేసే ప్రక్రియలో దీని పాత్ర ఉంటుంది.గతంలో 2016 థెరెస్సా మే ఎన్నిక మూడువారాల్లోపే ముగిసింది. ఇప్పుడు ఇద్దరి కంటే ఎక్కువ మంది పోటీ పడినందున ఒక్కొక్కరిని తొలగించే ప్రక్రియతో ఆలశ్యమైంది. అక్టోబరులో కన్సర్వేటివ్‌ పార్టీ మహాసభ జరిగే లోగా ఎన్నిక జరగాలని 1922 కమిటీ నిర్ణయించిది.సెప్టెంబరు ఐదున ప్రకటించే విజేతను తదుపరి ప్రధానిగా ఎన్నుకుంటారు. అప్పటి వరకు బోరిస్‌ జాన్సన్‌ పదవిలో ఉంటారు, పార్టీ విశ్వాసం కోల్పోయినందున విధానపరంగా, ఇతర మౌలిక నిర్ణయాలేవీ తీసుకోరు.


పార్టీ నేత ఎన్నిక పోటీలో తొలుత రిషి సునాక్‌ ముందున్నట్లు ఓటింగ్‌ తీరు వెల్లడించింది. దాంతో అతనే నూతన ప్రధాని అవుతాడన్నట్లుగా మన దేశ మీడియా వార్తలు ఇచ్చింది. అయితే విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ దూసుకువచ్చి సవాలు విసరటంతో పోటీ రసవత్తరంగా మారింది. రిషి సునాక్‌ బ్రిటన్‌లో స్ధిరపడిన పంజాబీ కుటుంబంలో పుట్టాడు.నలభై రెండు సంవత్సరాల రిషి విద్యార్ధిగా ఉన్నపుడు మన దేశంలో ఇన్ఫోసిస్‌ అధినేత నారాయణ మూర్తి కుమార్తె అక్షితతో ఏర్పడిన పరిచయం 2009లో వివాహానికి దారి తీసింది. వారికి ఇద్దరు పిల్లలు. సనక్‌-అక్షితలు బ్రిటన్‌లోని సంపన్నుల్లో 2022లో 73 కోట్ల పౌండ్లతో 222వ స్థానంలో ఉన్నారు. భారతీయ సంతతికి చెందిన వారు అనేక దేశాల్లో ప్రముఖులుగా, దేశాధినేతలుగా కూడా పనిచేశారు. అమెరికాకు చెందిన ఇండియాస్పోరా అనే స్వచ్చంద సంస్థ 2021లో వెల్లడించిన సమాచారం ప్రకారం ప్రపంచంలో ఉన్న ఐదున్నర కోట్ల మంది ప్రవాస భారతీయ సంతతిలో పదిహేను దేశాల్లో 200 మంది వరకు వివిధ రంగాల్లో ప్రముఖులుగా ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో తొలి మహిళా ఉపాధ్యక్షరాలుగా ఉన్న కమలా హారిస్‌, అక్కడే లూసియానా రాష్ట్ర గవర్నర్‌గా పని చేసిన బాబీ జిందాల్‌, సౌత్‌ కరోలినా రాష్ట్ర గవర్నర్‌గా, ఐరాసలో అమెరికా రాయబారిగా పనిచేసిన నిమ్రతా నిక్కీ హేలీ, బ్రిటన్‌ హౌం మంత్రిగా ఉన్న ప్రీతి పటేల్‌,ప్రధాని పదవికి ఇప్పుడు పోటీ పడుతున్న రిషి సునాక్‌ వంటి వారు ఎందరో ఉన్నారు. వివిధ దేశాధినేతలుగా 30 మంది భారతీయ మూలాలు ఉన్నవారు పని చేశారు. వారిలో బ్రిటీష్‌ గుయానా అధ్యక్షుడిగా పనిచేసి చెడ్డీ జగన్‌ వంటి ఒకరిద్దరు వామపక్ష వాదులను మినహాయిస్తే మిగిలిన వారందరూ ఆయా దేశాల్లో పాలకవర్గాలకు ఇష్టులుగా, అనుకూలంగా పని చేసిన వారే అన్నది స్పష్టం.ప్రస్తుతం కెనడా, బ్రిటన్‌ వంటి చోట్లమంత్రులుగా ఉన్నవారు కూడా అదే తరగతికి చెందిన వారే. అమెరికాలో తొలిసారిగా ఆఫ్రో-అమెరికన్‌ సామాజిక తరగతికి చెందిన బరాక్‌ ఒబామా అధ్యక్షుడిగా పని చేసిన సంగతి తెలిసిందే. నల్లజాతీయుల పట్ల వివక్ష, దాడులు ఏమాత్రం తగ్గలేదు. అంతకు ముందు పాలకులు అనుసరించిన విధానాలనే తు.చ తప్పకుండా అనుసరించాడు. అందువలన ఇప్పుడు ఒక వేళ రిషి సునాక్‌ విజేతగా నిలిచి గడువు మేరకు 2025వరకు పదవిలో ఉన్నా ఇంతకు ముందు బోరిస్‌ జాన్సన్‌ అనుసరించిన విధానాల కొనసాగింపే తప్ప మౌలికమార్పులేమీ ఉండవు.


ప్రస్తుతం రిషి సునాక్‌ాలిజ్‌ ట్రస్‌ కన్సర్వేటివ్‌ పార్టీ మద్దతుదార్లకు తమ విధానాలను వివరించే పనిలో ఉన్నారు. బ్రిటన్‌తో సహా అమెరికా నుంచి భారత్‌ వరకు అనేక దేశాలను చైనా లక్ష్యంగా చేసుకున్నట్లు రుజువుందని, తాను అధికారానికి వచ్చిన తొలిరోజే బ్రిటన్‌లోని 30 చైనా కన్ఫ్యూసియస్‌ సంస్థలను మూసివేస్తానని, చైనా సైబర్‌ ముప్పును ఎదుర్కొనేందుకు ఒక కొత్త నాటో కూటమిని ఏర్పాటు చేస్తానని రిషి సునాక్‌ ప్రకటించాడు. బ్రిటన్‌ సాంకేేతిక పరిజ్ఞానాన్ని చైనా అపహరిస్తున్నదని, విశ్వవిద్యాలయాల్లోకి తన మద్దతుదార్లను చొప్పిస్తున్నదని, వారిని పంపివేస్తానని, రష్యా చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్‌ దురాక్రమణను ప్రోత్సహిస్తున్నదని ఆరోపించాడు. చైనా-బ్రిటన్‌ సంబంధాల అభివృద్ధి అంశంలో పోటీలో ఉన్న వారిలో సునాక్‌ ఒక్కరే స్పష్టమైన,ఆచరణాత్మకమైన వైఖరిని కలిగి ఉన్నారని ఇటీవల చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. దాన్ని పట్టుకొని చైనా, రష్యా పట్ల సునాక్‌ మెతకగా ఉంటారని లిజ్‌ ట్రస్‌ ఆరోపించినదానికి ప్రతిగా చైనా పట్ల కఠినంగా ఉంటానంటూ సునాక్‌ ఎదురుదాడి ప్రారంభించాడు. బ్రిటన్‌లో వ్యూహాత్మకంగా కీలకమైన సంస్థలను చైనా కొనుగోలు చేయటాన్ని అధ్యయనం చేస్తానని, నిషేధిస్తానని పేర్కొన్నాడు.తన స్వంత షింజియాంగ్‌, హాంకాంగ్‌ పౌరులను చిత్రహింసలపాలు చేస్తూ అణచివేస్తుదని,తన కరెన్సీ విలువ పెరగకుండా చూస్తూ ప్రపంచ ఆర్ధికరంగాన్ని తనకు అనుకూలంగా రిగ్గింగ్‌ చేస్తున్నదని అన్నాడు. గుడ్డిగా చైనాను సమర్ధిస్తూ పశ్చిమదేశాలన్నీ దానికి ఎర్ర తివాచీ పరిచాయని జరిగిందేదో జరిగింది, తాను అధికారానికి వచ్చిన తొలి రోజునుంచి ఆ వైఖరిని మార్చివేస్తానని అన్నాడు.


తన కంటే పోటీలో ముందున్న లిజ్‌ ట్రస్‌ను ఎదుర్కొనేందుకు కన్సర్వేటివ్‌ పార్టీలోని చైనా వ్యతిరేకులను సంతృప్తి పరచేందుకు సునాక్‌ యత్నించారన్నది స్పష్టం. మరోవైపు ట్రస్‌ కూడా చైనా మీదనే దాడిని కేంద్రీకరించింది. జి7 కూటమిని ” ఆర్ధిక నాటో ”గా మార్చాలని, అంతర్జాతీయ నిబంధనలను అమలు జరపని పక్షంలో చైనా మీద ఆంక్షలు ప్రకటించాలని చెప్పింది. దక్షిణ చైనా సముద్రాన్ని ఆక్రమిస్తున్నా, తైవాన్ను బెదిరిస్తున్నా, హాంకాంగ్‌లో ఉద్యమాన్ని అణచివేస్తున్నా, ఉఘీర్‌లపై మారణకాండ జరుపుతున్నా గత రెండు సంవత్సరాలలో చైనాతో ఆర్ధిక ఒప్పందాల కోసం ఆర్ధిక మంత్రిగా సునాక్‌ చూశారని, ఇప్పుడు కబుర్లు చెబుతున్న మీరు అప్పుడెక్కడ ఉన్నారని కన్సర్వేటివ్‌ పార్టీ నేత ఇయాన్‌ డంకన్‌ స్మిత్‌ ధ్వజమెత్తాడు. దేశంలో జీవన వ్యయం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపధ్యంలో తాను దుబారాకు దూరంగా ఉంటానని ప్రకటించిన సునాక్‌ ఓట్లకోసం జనం ముందుకు వస్తూ 450 పౌండ్ల విలువగల బూట్లు, మూడున్నరవేల పౌండ్ల ఖరీదైన సూటు ధరించి వస్తున్నారని, అదే తమనేత లిజీ ట్రస్‌ కేవలం నాలుగున్నర పౌండ్ల విలువ గల చెవిపోగులు ధరించి దేశంలో తిరుగుతున్నారని కన్సర్వేటివ్‌ పార్టీ సాంస్కృతిక శాఖ మంత్రి నాదిన్‌ డోరిస్‌ విమర్శించారు.


చైనా మీద ధ్వజమెత్తిన సునాక్‌ సరిగ్గా ఏడాది క్రితం మాట్లాడుతూ చైనాతో సన్నిహిత ఆర్ధిక సంబంధాలు పెట్టుకోవాలని ప్రబోధించాడు. 2021 జూలై ఒకటవ తేదీన మాన్షన్‌ హౌస్‌ వార్షిక విధాన ఉపన్యాసం చేస్తూ 55లక్షల కోట్ల విలువగల చైనా ఆర్ధిక సేవల మార్కెట్‌ గురించి ఐరోపా సమాఖ్య ఒప్పందానికి రావటంలో విఫలమైందని, బ్రిటన్‌ సంస్థలు దాన్ని దక్కించుకొనే లక్ష్యంతో పని చేయాలని సునాక్‌ ఉద్బోధించాడు. అమెరికా కంటే కూడా చైనా మీద ఎక్కువగా కేంద్రీకరించి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నాడు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వెలుపలికి వచ్చిన తరువాత 2021 జనవరి ఒకటి నుంచి సమాఖ్య షేర్‌ మార్కెట్‌ లావాదేవీల సేవలు లండన్‌ నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌, పారిస్‌, న్యూయార్క్‌ నగరాలకు తరలాయి.ఐరోపా సమాఖ్యతో ఎలాంటి ఒప్పందం లేకుండానే బ్రిటన్‌ బయటపడింది. సమాఖ్యతో పోలిస్తే భిన్నమైన షరతులను చైనా అంగీకరించే అవకాశం ఉన్నందున మన విలువలతో రాజీపడకుండా పరస్పరం లబ్ది పొందే విధంగా బ్రిటన్‌ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సునాక్‌ వాదించాడు.
కన్సర్వేటివ్‌ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు బ్రిటన్‌కు అనేక సవాళ్లను తెస్తున్నాయి. ఐరోపా సమాఖ్య నుంచి వెలుపలికి వచ్చిన తరువాత ఇతర దేశాలతో ఒప్పందాలకు పూనుకొని జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని చూస్తున్నది. కుంభకోణాలు, అవినీతి అక్రమాల కారణంగా రెండుగా చీలిన కన్సర్వేటివ్‌ పార్టీ అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. సునాక్‌, లిజ్‌ ట్రస్‌ ఇద్దరూ మంత్రులుగా ఉండి ఏం చేశారో చెప్పకుండా ఇప్పుడు చైనా పట్ల వైఖరి గురించి మాట్లాడుతున్నారు. అంతర్గత అంశాలపై ఏమి చెప్పినప్పటికీ విదేశాంగ విధానం గురించి చైనా మీద కేంద్రీకరించటం మద్దతుదార్లను తప్పుదారి పట్టించటం,చైనా వ్యతిరేకతతో సంతుష్టీకరించేందుకు పూనుకున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా మీద కోపం, కట్టడి పేరుతో మనం చేతులు కాల్చుకోవాలా ?

22 Friday Jul 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, China’s dominance, European Union, FTA, India-EU ties, Narendra Modi Failures, RSS, Trade talks


ఎం కోటేశ్వరరావు


” నవంబరులో షీ జింపింగ్‌తో భేటీకి ఐరోపా నేతలింకా తేల్చుకోలేదు – భారత్‌కు అవకాశాన్ని అందిపుచ్చుకొనే తరుణమిది ” తాజాగా ఒక విశ్లేషణకు పెట్టిన శీర్షిక ఇది. ” తొమ్మిది సంవత్సరాల తరువాత భారత్‌ – ఐరోపా సమాఖ్య వాణిజ్య చర్చల పునరుద్దరణ వెనుక ” అసాధారణ అత్యవసరం ” ముందుకు నెట్టి ఉండవచ్చు ” అన్నది మరొక విశ్లేషణ శీర్షిక. ఏం జరుగుతోంది ? ఒక వైపు ప్రపంచ వాణిజ్య సంస్థలో అన్ని దేశాలకూ సభ్యత్వం ఉంది. దాన్ని పక్కన పెట్టి స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది ? గతంలో మన దేశం కుదుర్చుకున్న ఒప్పందాల సారాంశాన్ని చెప్పాల్సి వస్తే సాఫ్టా( దక్షిణాసియా దేశాల స్వేచ్చా వాణిజ్య ఒప్పందం)తో మాత్రమే మన దేశం లబ్దిపొందింది. మిగతావాటితో మన ఎగుమతులు పెరిగిందేమీ లేకపోగా దిగుమతులు ఎక్కువగా జరిగాయి. అందువలన మరోసారి ఒప్పందాలతో చేతులు కాల్చుకొనేందుకు సిద్దపడుతున్నామా ? గతం కంటే నరేంద్రమోడీ హయాంలో దేశ పరిస్థితి మెరుగుపడిందంటూ మనకు అనుకూలంగా ఉందని చెబుతారా ? అదే నిజం అనుకుంటే మన దిగుమతులు ఎందుకు తగ్గలేదు, ఎగుమతులు ఎందుకు పెరగలేదు ? ఉనికిలో ఉన్న ఒప్పందాలనే ఉపయోగించుకోవచ్చు కదా !


కరోనా కారణంగా కొన్ని కుదుపులు, వృద్ధి రేటు తగ్గినప్పటికీ చైనా కడుపు నిండిన స్థితిలో ఉంది. కనుక మనల్ని లేదా మరొక దేశాన్ని చూసి పశ్చిమ దేశాలు చైనాను వదలి మనవెంటపడతాయని భ్రమించకూడదు. కఠినమైన కరోనా లాక్‌డౌన్‌ కారణంగా తొలి అంచనా 5.5శాతాన్ని అందుకోకపోవచ్చుగానీ జిడిపి పురోగమనం మూడు- నాలుగుశాతం మధ్య ఉంటుందని వార్తలు. అమెరికాతో సహా అనేక దేశాలు ఇప్పటికీ చైనా సరఫరాల మీద ఆధారపడుతున్నాయి. చైనాకు జలుబు చేస్తే మిగతా దేశాలు చీదాల్సిన పరిస్థితి ఏర్పడింది. హాంకాంగ్‌ ఎక్సేంజస్‌, క్లియరింగ్‌(హెచ్‌కెఇఎక్స్‌) సిఇఓ నికోలస్‌ అగుజిన్‌ ఇటీవల లోహాల గురించి జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ 45 -57శాతం ప్రపంచ లోహ వినియోగం చైనాలో జరుగుతోందని,2021 ప్రపంచ ఉత్పత్తిలో 35 నుంచి 55శాతం వరకు లోహాలను చైనాలో శుద్ది చేస్తున్నట్లు చెప్పారు. అందువల్లనే చైనాలో మందగిస్తే అది ప్రపంచానికి మాంద్యం, ద్రవ్యోల్బణానికి కారణం అవుతుందని అన్నారు.


పశ్చిమ దేశాలు మానవహక్కుల గురించి శుద్దులు చెబుతూ తమ దగ్గరకు వచ్చే సరికి వాటిని హరించే దేశాలు, వాటి నేతలతో చెట్టపట్టాలు వేసుకొనే మోసకారితనాన్ని చూస్తున్నాం. మన దేశంలోని కొన్ని శక్తులు వాటి బాటనే నడుస్తున్నాయి. సరిహద్దు వివాదాన్ని చూపి ఇప్పటికీ ఒక వైపు చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతూనే ఉన్నారు. మరో వైపు అక్కడి నుంచి దిగుమతుల్లో నరేంద్రమోడీ సర్కార్‌ రికార్డులను సృష్టిస్తున్నది. ఇది జనాన్ని మోసం చేయటం కాదా ? వరుసగా రెండవ సంవత్సరం కూడా వంద బిలియన్‌ డాలర్లకు పైగా లావాదేవీలు నమోదు కానున్నాయి. జనవరి నుంచి జూన్‌ ఆరు నెలల కాలంలో 67.08 బి.డాలర్లు జరిగింది. దీనిలో మన దిగుమతులు గతేడాది కంటే 34.5శాతం పెరిగి 57.51 బి.డాలర్లకు చేరాయి. మన ఎగుమతులు 35.3శాతం తగ్గినట్లు చైనా కస్టమ్స్‌ శాఖ ప్రకటించింది. మన వాణిజ్యలోటు 47.94 బి.డాలర్లు. గతేడాది 125బి.డాలర్ల లావాదేవీలు జరగ్గా తొలి ఆరునెలల తీరుతెన్నులను బట్టి చూస్తే అంతకంటే పెరగటం తప్ప తగ్గే పరిస్థితి కనిపించటం లేదు. గతేడాది మన ఎగుమతులు 28.14 బి.డాలర్లు కాగా చైనా నుంచి దిగుమతులు 97.52 బి.డాలర్లు. రెండు దేశాలూ లెక్కించే పద్దతిలో తేడాలు ఉన్నందున మన దేశం ప్రకటించే అంకెలు భిన్నంగా ఉండవచ్చు గానీ ధోరణి తెలుస్తున్నది. చైనా మొత్తం విదేశీ వస్తు వాణిజ్య ఆరునెలల్లో 2.94 లక్షల కోట్ల డాలర్లు.


” ప్రభుత్వం స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయదు ” అనే శీర్షికతో 2020 నవంబరు 17న ఒక వార్తను టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించింది. గతంలో చేసుకున్న ఒప్పందాలతో సబ్సిడీలతో కూడిన వస్తువులను మన దేశంలోకి అనుమతించారని, నష్టం జరిగిందని విదేశాంగ మంత్రి జై శంకర్‌ విమర్శించినట్లు, ఒప్పందాలను కుదుర్చుకోబోమని కూడా చెప్పినట్లు ఆ వార్తలో పేర్కొన్నారు. అదే ప్రభుత్వం ఇప్పుడు అలాంటి ఒప్పందాలకు ఉత్సాహపడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతలోనే మార్పుకు కారణం ఏమిటి ? చైనాను ఒక బూచిగా చూపే దేశాలతో ఇటీవలి కాలంలో మన దేశ సంబంధాలు పెరిగిన కారణంగానే చైనాను అడ్డుకొనేందుకు ఒక మార్గంగా వాణిజ్య ఒప్పందాల కోసం తొందర పడుతున్నట్లు కొందరు చెబుతున్నదాన్ని తోసిపుచ్చగలమా ? 2014-15లో మన వాణిజ్యలోటు 118.37 బిలియన్‌ డాలర్లు ఉండగా 2021-22కి అది 192 బి.డాలర్లకు పెరిగింది. వర్తమాన సంవత్సర తీరు తెన్నులను చూస్తే 250కి పెరగవచ్చు. మన దేశం కుదుర్చుకున్న ఒప్పందాలు మనకు లబ్దిచేకూర్చలేదనేందుకు ఇది ఒక సూచిక.కర్ర ఉన్నవాడిదే గొర్రె అన్నట్లుగా బలమైన దేశాలే లబ్ది పొందుతాయి. సాప్టా ఒప్పందంతో మనకు లబ్ది, వాణిజ్య మిగులు కలిగిందంటే దానిలో ఉన్న దేశాల్లో మనది బలమైనది కావటమే. ఆసియన్‌ దేశాలతో ఉన్న ఒప్పందాల కారణంగా 2009-10లో మన వాణిజ్యలోటు ఎనిమిది బిలియన్‌ డాలర్లుండగా 2018-19నాటికి అది 22 బి.డాలర్లకు పెరిగింది.


స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలతో మన జిడిపి ఐదు లక్షల కోట్ల డాలర్లకు సులభంగా చేరుతుందని కొందరు నరేంద్రమోడీ సర్కార్‌కు బిస్కెట్లు వేస్తున్నారు. వాటి వలన విదేశాల నుంచి సరకులను మన మార్కెట్లో గుమ్మరిస్తే ఇక్కడి పరిశ్రమలు, వ్యవసాయ రంగం దెబ్బతింటుంది. తనను మింగేస్తుందనే భయంతోనే అమెజాన్‌ కంపెనీ విస్తరణను అంబానీ అడ్డుకోవటాన్ని చూస్తున్నాము. జర్మనీ కంపెనీ మెట్రో కూడా తన బిజినెస్‌ను ఎవరికో ఒకరికి అమ్మేసి తనదారి తాను చూసుకోవాలని చూస్తోంది. అందువలన చైనా మీద కోపంతో ఇతర ధనికదేశాలతో ఒప్పందాలు చేసుకుంటే మన చేతులు మరింతగా కాలుతాయి. అందుకే ఆర్‌సిఇపిలో చేరేందుకు మనం వెనుకడుగువేశాము. మన దేశంలో చౌకగా శ్రమశక్తి లభిస్తుందని తెలిసినా, నిపుణులైన పనివారున్నారని ఎరిగినా ఐరోపా, అమెరికా నుంచి ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు రాలేదు, చైనా మాదిరి ఎగుమతి వస్తూత్పత్తి జరగటం లేదు.


ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కారణంగా చైనాతో ఐరోపా సమాఖ్య(ఇయు) సంబంధాలు సజావుగా లేవు గనుక ఇప్పుడు మనం చైనా స్థానాన్ని ఆక్రమించేందుకు అవకాశం వచ్చిందని చెబుతున్నారు. అమెరికా, ఐరోపాలకు కావాల్సింది చౌకగా వస్తువులను అందించటం, వారి ఉత్పత్తులకు మార్కెట్లను తెరవటం. ఆ పని ఎవరు చేస్తే వారికి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పటి వరకు అది మనవల్ల కాలేదు. ఐరోపా నేతలను నవంబరులో రావాలని ఆహ్వానించినట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదని చైనా విదేశాంగశాఖ పేర్కొన్నది.కరోనా కారణంగా గత మూడు సంవత్సరాలుగా రాకపోకలు లేవు. ఒకవైపు ఉక్రెయిన్‌ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగవచ్చని చెబుతుండగా దాని ప్రతికూల పర్యవసానాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. ఈ పూర్వరంగంలో అమెరికా కోసం ఆసియాలో చైనాతో కూడా లడాయి పెట్టుకొనేందుకు ఐరోపా సిద్దంగా లేదనే వార్తలు మరోవైపున వెలువడుతున్నాయి. చైనా నుంచి విదేశీ కంపెనీలన్నీ చైనా నుంచి వెలుపలికి పోతున్నట్లుగా జరిగిన ప్రచారం తెలిసిందే.ఇప్పుడు చైనాను బెదిరించేందుకు, రాయితీలు పొందేందుకు పూనుకోవచ్చు తప్ప విస్మరించే అవకాశం లేదు. గాల్వన్‌ ఉదంతం తరువాత మన దేశంలోని కొన్ని శక్తులు చేసిన హడావుడి తరువాత చైనా నుంచి రికార్డు స్థాయిలో మన దిగుమతుల గురించి తెలిసిందే. మరి ఐరోపా, అమెరికా చైనాను ఎలా వదులుకుంటాయి. ఇప్పటికీ వాటి పెట్టుబడులు చైనాలో పెద్ద మొత్తంలో ఉన్నాయి. చైనాకు వ్యతిరేకంగా మన దేశాన్ని నిలిపేందుకు అవి మరింతగా వివాదాన్ని ఎగదోయవచ్చు, వాణిజ్య ఆశలు చూపవచ్చు. ఎక్కడన్నా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా అవి తమలాభాల దగ్గర రాజీపడవు. ఇటీవలి కాలంలో ఐరోపా దేశాలు చైనా మీద దూకుడును తగ్గించాయి.


చైనా నుంచి ఆహ్వానాలు అందిందీ లేనిదీ ఇంతవరకు ఐరోపా దేశాలేవీ తిరస్కరించలేదు, నిర్ధారించలేదు. ఒకవేళ ఆహ్వానం వస్తే ఏమి చేయాలా అని పారిస్‌లో తర్జనభర్జనలు జరుగుతున్నట్లు వార్తలు. అక్టోబరులో చైనా కమ్యూనిస్టు పార్టీ సభల తరువాతనే భేటీ జరగవచ్చు.ఆహ్వానమే గనుక వస్తే తిరస్కరించటం కష్టమని ఐరోపా అధికారులు అంటున్నారు.ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో చైనా-ఇయు వాణిజ్య లావాదేవీల విలువ గతేడాది కంటే పదిశాతం పెరిగి 205బి.డాలర్లకు చేరాయి. 2018లో చైనా మీద అమెరికా వాణిజ్య యుద్దం ప్రారంభించినప్పటికీ, చైనా నుంచి దిగుమతులను నిలిపివేయలేదు. చైనా వస్తువులపై విధించిన దిగుమతి పన్నుల భారం అమెరికన్‌ వినియోగదారుల మీదనే పడుతోంది. చైనా దారికి వచ్చే వైఖరిలో లేదు, కొనసాగిస్తే జనం మీద భారం, తొలగిస్తే ప్రపంచ దృష్టిలో పలుచన అవుతామనే సందేహం అమెరికా నేతల్లో ఉంది.


వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మన వాణిజ్యలోటు 250 బిలియన్‌ డాలర్లకు లేదా జిడిపిలో 7.3శాతానికి చేరనున్నట్లు అంచనా. జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో గతేడాది లోటు 31.4బి.డాలర్లు కాగా ఈ ఏడాది 70.8కి పెరిగింది.మన దేశం ఆర్ధికంగా పెరిగితే చైనాను అరికట్టవచ్చని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఎవరు వద్దన్నారు, ఎవరు అడ్డుకున్నారు, ఎవరు ఇక్కడ కావాల్సింది మనం పెరగటమా చైనాను అరికట్టటమా ? మన ఎగుమతులకు చైనా ఏ విధంగానూ పోటీ కాదు. ఎనిమిదేండ్ల నుంచి నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా అన్నా ఆ బ్రాండ్‌ పేరును పక్కన పెట్టి తాజాగా ఆత్మనిర్భర్‌ అని మార్చినా మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా పెరుగుతున్నాయి. అమెరికా వాడి మాటలను నమ్మి చైనా ఆక్రమణకు వస్తోందనే అంచనాతో లడఖ్‌ ప్రాంతంలో కొండలను ఎక్కించిన మన మిలిటరీని ఇప్పుడు దించలేము, కొనసాగించలేని స్థితి. మన ప్రాంతాలను చైనా ఆక్రమించలేదని గాల్వన్‌ ఉదంతం తరువాత స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.గాల్వన్‌ తరువాత ఇప్పటి వరకు 278 చైనా యాప్‌లను మన దేశం నిషేధించింది. దాని వలన కొంత మన దేశంలో కొంత మందికి మానసిక తృప్తి తప్ప చైనాకు కలిగిన ఆర్ధిక నష్టం ఏమిటో ఎవరూ చెప్పరు. వాటిని నిషేధించినా మన దేశంలోని అనేక సంస్థలలో చైనా పెట్టుబడులు పెద్ద మొత్తంలో ఉన్న వాస్తవాన్ని మూసిపెడితే దాగదు. చైనా జిడిపిలో దాని విదేశీ వాణిజ్య వాటా 35శాతం ఉంది. అమెరికానే అది అన్ని రంగాలలో ముప్పు తిప్పులు పెడుతున్నది.

చైనాఅమెరికా ఇప్పటికీ అగ్రరాజ్యమే, కానీ దానికి ఉండే బలహీనతలు దానికి ఉన్నాయి. అమెరికన్లను నమ్మి దిగితే కుక్కతోక పట్టుకొని గోదావరిని ఈదినట్లే. మమ్మల్ని వెళ్లనివ్వండిరా బాబూ మీకు పుణ్యం ఉంటుంది అని తాలిబాన్ల కాళ్లు పట్టుకొని అమెరికా మిలిటరీ ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి పారిపోయిన తీరును కళ్లారా చూశాము. తరువాత ఉక్రెయిన్ను రెచ్చగొట్టి గోదాలోకి దించారు. కావాలంటే ఎన్ని ఆయుధాలనైనా అమ్ముతాం తప్ప మా సైనికులెవరూ యుద్దానికి రారు అంటూ అమెరికా, నాటో దేశాలు చేతులెత్తేసిన తీరునూ చూశాము. ఉక్రెయిన్‌ కాదు గానీ తైవాన్ను గనుక చైనా ఆక్రమిస్తే సైన్యాన్ని పంపుతామంటూ జో బైడెన్‌ ప్రగల్భాలు పలికాడు. వాటినెవరూ నమ్మటం లేదు. చైనా అంతర్భాగమే తైవాన్‌ అని అమెరికా అంగీకరించింది, దాన్ని ఎప్పుడు విలీనం చేసుకోవటం అన్నది చైనా అంతర్గత అంశం. విలీనం చేసుకుంటే అడ్డుకొనేశక్తి ఏ దేశానికీ లేదన్నది వాస్తవం., పాకిస్తాన్‌ మరొక దేశం ఏదైనా మన రక్షణ జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిందే.వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. మూడూ అణుశక్తి దేశాలే గనుక ఎవరిని ఎవరూ లొంగదీసుకోలేరు, ఎవరి మీద ఎవరూ విజయం సాధించలేరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా- పశ్చిమ దేశాలకు మానవహక్కులు ఒక సాకు-వంచన !

20 Wednesday Jul 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ 1 Comment

Tags

Human Rights, Joe Biden, Oil politics, Ukraine-Russia crisis, US imperialism, west pretence and hypocrisy


ఎం కోటేశ్వరరావు


ఎదుటివారికే చెప్పేటందుకే నీతులు. చరిత్రలో నీతి తప్పిన వారిని చూస్తే పశ్చిమ దేశాలకు మరొకటేదీ సాటి రాదు. మానవహక్కుల వంటి అంశాలను ఆయుధాలుగా చేసుకొని తమకు లొంగని వారి మీద దాడులు చేస్తుంటాయి. వాటికి భంగం కలిగించటంలో అవే ముందుంటాయి. ఒక నాడు సౌదీ అరేబియా రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్ను భ్రష్టుడు, అక్కడ మానవహక్కులు లేవు అని ధ్వజమెత్తిన అమెరికా అధినేత జో బైడెన్‌ ఇప్పుడు అతగాడినే కౌగలించుకున్నాడు. సౌదీ జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గీని సల్మానే టర్కీలో హత్య చేయించినట్లు చెప్పిన అమెరికా 2018 తరువాత ఆ దేశంతో దౌత్య సంబంధాలను కూడా తెంచుకుంది. తరువాత సౌదీ గానీ, రాజుగానీ మారిందేమీ లేదు. ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌లో 2018 అక్టోబరు రెండున ప్రవేశించిన ఖషోగ్గీని అక్కడే హత్య చేయటం వెనుక సౌదీ రాజు హస్తం ఉందని సిఐఏ ఒక నివేదికను బైడెన్‌కు అందచేసింది. జోబైడెన్‌ సౌదీ పర్యటనపై అమెరికా డెమోక్రటిక్‌ సోషలిస్టు బెర్నీశాండర్స్‌ మాట్లాడుతూ ” చూడండి, వందబిలియన్‌ డాలర్ల ఆస్తికలిగిన కుటుంబమది, అది ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తుంది, మహిళలను మూడో తరగతి పౌరులుగా చూస్తుంది.తన ప్రత్యర్ధులను జైలుపాలు చేస్తుంది, మట్టుపెట్టిస్తుంది.” అలాంటి దేశాన్ని సందర్శించి పాలకుడితో చెట్టపట్టాలు వేసుకుంటారా అని విమర్శించాడు. నాలుగు రోజుల మధ్య ప్రాచ్య పర్యటనలో జో బైడెన్‌ సాధించిందేమిటి అన్నది ఒక అంశమైతే తమకు అవసరమైతే గతంలో చెప్పిన మాటలను దిగమింగుతాడని స్పష్టమైంది. ఇదంతా ఎందుకు అంటే రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాల కోసమే.


అమెరికాలో ఇంథన ధరలు ఆకాశాన్నంటాయి.ద్రవ్యోల్బణం నాలుగుదశాబ్దాల గరిష్టాన్ని తాకింది. అవి పెరిగే కొద్దీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అధికారపార్టీకి ఆమేరకు ఓట్లు తగ్గేందుకు సెగతగలనుందనే వార్తలు. మరోవైపున పశ్చిమాసియాలో రష్యాకు మద్దతుదారుగా ఉన్న ఇరాన్ను కట్టడి చేసేందుకు, చమురు ఉత్పత్తి, సరఫరాలను పెంచి రష్యాను ఆర్ధికంగా, రాజకీయంగా దెబ్బతీసేందుకు బైడెన్‌ విఫల పరటన చేశాడని, ఖాళీ చేతులతో వెళ్లాడని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడున్నదాని కంటే అదనపు ఉత్పత్తికి ఎలాంటి హమీ లేదని, ఇప్పటికే రోజుకు పదమూడు మిలియన్‌ పీపాలకు పైగా ఉత్పత్తి చేస్తున్నట్లు సౌదీ రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ చెప్పాడు. అమెరికోసం చైనానో చైనా కోసం అమెరికానో వదులు కోవటం తమ విధానం కాదని, ప్రజలతో వారధి నిర్మిస్తామని సౌదీ విదేశాంగమంత్రి అదెల్‌ అల్‌ జుబైర్‌ చెప్పాడు. బైడెన్‌ పర్యటన తరువాత రష్యా అధినేత పుతిన్‌ ఇరాన్‌ వెళుతున్నాడు. బైడెన్‌తో భేటీ తరువాత సౌదీ రాజు సల్మాన్‌ మాట్లాడుతూ తమ భేటీలో జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గీ హత్య ప్రస్తావన గురించి చెబుతూ ” జరిగింది విచారకరం, అలాంటివి పునరావృతం కాకుండా చట్టపరంగా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ప్రపంచంలో అలాంటి ఉదంతాలు ఎక్కడైనా జరగవచ్చు. ఇరాక్‌లోని అబూ గ్రాయిబ్‌ జైల్లో ఖైదీలపై చిత్రహింసల వంటి అనేక తప్పిదాలకు అమెరికా పాల్పడలేదా” అని ఎదురు ప్రశ్నించాడు.


అమెరికా పధకంలో భాగంగా రష్యాతో వైరం పెంచుకున్న ఐరోపా దేశాలకు ఇంథన సరఫరాలు తగ్గాయి. వేసవి తరువాత చలికాలంలో వెచ్చదనానికి అవసరమైన చమురును ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా అని ఐరోపా చూస్తోంది. ఈ క్రమంలో ఐరోపా సమాఖ్య కూడా ప్రాణ, విత్త, మానభంగములందు ఆడితప్పవచ్చు అన్నట్లుగా మానవహక్కులను ఇంథనం కోసం కొంతకాలం పక్కన పెట్టేందుకు పూనుకుంది.ప్రజాస్వామ్యం లేదు, మానవ హక్కులు మృగ్యం అని ఏ దేశాల గురించైతే చెప్పారో ఇప్పుడు ఇంథనం కోసం వాటినే ఆశ్రయిస్తున్నారు.యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ పాలకుల నిరంకుశ చర్యల గురించి తెలిసిందే. అధ్యక్షుడు మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నిహయన్‌ పారిస్‌ పర్యటనకు వెళితే రాచమర్యాదలు జరిపారు.ఇంథన పధకాల్లో పెట్టుబడుల గురించి వారు చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య ముఖ్యమైన మిలిటరీ, వ్యూహాత్మకంగా గట్టి బంధం ఉందనేందుకు ఇది నిదర్శనమని, మానవహక్కుల సమస్యల కంటే ఇంథన భద్రతకు ఫ్రాన్స్‌ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని విశ్లేషకులు పేర్కొన్నారు. పశ్చిమ దేశాలన్నీ సిరియాపై అమలు జరుపుతున్న ఆంక్షలన్నింటినీ ఎమిరేట్స్‌ వ్యతిరేకించటమే కాదు, వాటిని ఎత్తివేయాలని కోరుతున్నా, అదేమీ తెలియనట్లు ఫ్రాన్స్‌ ఉంది.


తాము నిరంకుశ పాలకుడిగా వర్ణిస్తున్న అజర్‌బైజాన్‌ అధ్యక్షుడు ఇలహమ్‌ అలియెవుతో ఐరోపా సమాఖ్య(ఇయు) అధ్యక్షురాలు ఉర్సులా వాండెన్‌ లెయన్‌, ఇంథన కమిషనర్‌ కద్రి సిమ్సన్‌ అజర్‌బైజాన్‌ రాజధాని బాకులో చర్చలు జరిపారు. ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.సహకార మండలిని ఏర్పాటు చేశారు. వాటి ప్రకారం ఏటా 20బిలియన్‌ ఘనపుటడుగుల గాస్‌ను సరఫరా చేస్తారు. ఇప్పుడున్న సహజవాయు సరఫరా 2021లో 8.1బిసిఎంలను ఈ ఏడాది ఆఖరుకు 12బిసిఎంలకు పెంచుతారు. ఈ సంప్రదింపుల సందర్భంగా గతంలో ఇయు లేవనెత్తిన మానవహక్కుల అంశం ఏమైందని విలేకర్లు అడగ్గా తగు సమయంలో వాటిని లేవనెత్తుతామని, ఇప్పుడు కేవలం ఇంథన సహకారంపైనే కేంద్రీకరించినట్లు ఇయు అధికారులు సమర్ధించుకున్నారు. తమ గురించి మంచిగా చెప్పేందుకు ఐరోపా రాజకీయవేత్తలకు అజర్‌బైజాన్‌ అక్రమంగా ఐరోపా బాంకుల ద్వారా మూడుబిలియన్‌ డాలర్లు చెల్లించినట్లు జర్నలిస్టుల బృందం వెల్లడించింది.


ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుంచి రష్యా, చైనాలు మినహా ఇతర దేశాల గురించి గతంలో పశ్చిమ దేశాలు గతంలో ప్రస్తావించిన మానవహక్కుల అంశాలను పక్కన పెట్టేశారు.ప్రపంచవ్యాపితంగా ప్రజాస్వామ్యం, మానవహక్కుల ఉల్లంఘనల గురించి 2020-24 కార్యాచరణ ప్రణాళికను ఐరోపా సమాఖ్య ప్రకటించింది. నూతన ఇంథన విధానంలో వాటి ప్రస్తావన లేకుండా చేశారు. ఇది ఐరాస నిరంతర అభివృద్ధి లక్ష్యాలకు లోబడి రూపొందించిన న్యాయమైన, సమగ్ర ఇంథన విధానం అని సమర్ధించుకున్నారు. పర్యావరణ పరిరక్షణ గురించి నిత్యం కబుర్లు చెప్పే ఐరోపా అగ్రదేశాలు ఇప్పుడు దానికి హాని కలిగించే బొగ్గుతో విద్యుత్‌ ఉత్పత్తికి పూనుకున్నాయి. దానికి రష్యాను దోషిగా చూపుతున్నాయి. రష్యా కోరుతున్నట్లుగా దాని భద్రతకు హామీ కల్పిస్తే ఉక్రెయిన్‌పై మరుక్షణమే దాడులు ఆగుతాయి, ఐరోపాకు అవసరమైన ఇంథనం రష్యా నుంచి లభిస్తుంది. కానీ వాటికి కావాల్సింది అది కాదు, ఆధిపత్యం. అందుకోసం మానవహక్కులు మంటగలిసినా, పర్యావరణానికి భంగం కలిగినా అమెరికా కూటమి దేశాలకు పట్టదు. గాస్‌ సరఫరాలో ఆటంకాల కారణంగా జర్మనీలో కూడా బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి మరోసారి పెరుగుతోందని జర్మన్‌ ఛాన్సలర్‌ షఉల్జ్‌ చెప్పాడు.


ఒకవైపు రష్యాను దెబ్బతీసేందుకు తమతో సహకరించాలని జో బైడెన్‌ గతవారంలో సౌదీ అరేబియాను కోరాడు. కానీ అదే సౌదీ తన విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన(డీజిలుకు దీనికి కొద్ది తేడా ఉంటుంది) ఇంథనాన్ని రష్యా నుంచి పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకొంటోంది. దీనిలో కొంత భాగం తన రేవులకు వచ్చే ఓడలకు ఇంథనంగా కూడా ఆమ్ముతోంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నప్పటికీ ఉక్రెయిన్‌ వివాదం తరువాత దిగుమతులు పెరిగాయి. గతేడాది ఏప్రిల్‌-జూన్‌ మాసాల్లో 3,20,000 టన్నులు దిగుమతి చేసుకుంటే ఈ ఏడాది అదే కాలంలో 6,47,000 టన్నులకు పెరిగింది. గతేడాది మొత్తంగా పదిలక్షల 50 వేల టన్నులు దిగుమతి చేసుకుంది. దీని వలన చమురును శుద్ది చేసే ఖర్చు తగ్గుతుంది. తన చమురును అధిక ధరకు ఎగుమతి చేసుకోవచ్చు.మరో వైపు అమెరికా పెత్తనం చెల్లదు అనే సందేశాన్ని పంపవచ్చు. చమురు ఉత్పత్తిలో ఒపెక్‌, ఇతర దేశాల్లోని రష్యాతో ఇప్పటి వరకు సౌదీకి మంచి సంబంధాలే ఉన్నాయి.


ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్నదనే సాకుతో తనపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలకు ప్రతిగా రష్యా కూడా కొన్ని ప్రతిచర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. దానిలో కాస్పియన్‌ పైప్‌లైన్‌ కన్సార్టియ(సిపిసి) పైప్‌లైన్‌ మూసివేత ఒకటి. కజకస్తాన్‌ నుంచి రష్యా మీదుగా (నోవోరోస్సిక్‌ రేవు) నల్లసముద్రం వరకు ఈ లైన్‌ ఉంది. దీనిలో పశ్చిమ దేశాలు, ఆసియా, రష్యాకు చెందిన కంపెనీలు భాగస్వాములు. వివాదం తలెత్తిన తరువాత ఈ పైప్‌లైన్‌లో ఒక భాగస్వామి కజకస్తాన్‌ ఐరోపా దేశాలకు చమురు సరఫరాలను పెంచుతున్నట్లు ప్రకటించింది.దీంతో జూలై ఆరు నుంచి 30 రోజులపాటు కజకస్తాన్‌ చమురు సరఫరా నిలిపివేస్తామని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. మార్చినెలలో సంభవించిన తుపాను వలన ఏర్పడిన చమురు తెట్టు కారణాన్ని చూపినప్పటికీ ఐరోపా దేశాలను దెబ్బతీయాలన్నదే దీని వెనుక అసలు కారణం. ఈ లైన్‌ ద్వారా రోజుకు పదిలక్షల పీపాల సరఫరా జరుగుతోంది. దీనిపై ఆధారపడిన చెవరాన్‌, ఎక్సాన్‌ మోబిల్‌, షెల్‌, ఎని అనే పశ్చిమ దేశాల కంపెనీలు పెద్ద ఎత్తున నష్టపోతే అవి ప్రభుత్వాల మీద వత్తిడి పెంచుతాయి. ఇవి కజకస్తాన్‌లో చమురు వెలికితీస్తున్నాయి. ఉక్రెయిన్‌ వివాదం తరువాత ఈ కంపెనీలు కొన్ని రష్యాలో తవ్వకాలను నిలిపివేశాయి.ఒకనాడు భ్రష్టుడన్న సౌదీ రాజు సల్మాన్‌తో జో బైడెన్‌ దిగిన ఫొటో ఒక చర్చగా మారింది. మానవహక్కుల గురించి అమెరికా వంచనకు ఇది పక్కా నిదర్శనమని, వారికి అవసరం అనుకుంటే విలువల వలువలను నిస్సిగ్గుగా విప్పి పక్కన పెడతారంటూ వ్యాఖ్యలు వెలువడ్డాయి.ఐరోపా దేశాలూ దీనిలో తక్కువేమీ కాదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ సంక్షోభంపై అమెరికా కూటమి మల్లగుల్లాలు : అనుకున్నదొకటి అవుతున్నది మరొకటి !

06 Wednesday Jul 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

European Union, G7 summit 2022, NATO, Ukraine war, Ukraine-Russia crisis


ఎం కోటేశ్వరరావు


అమెరికా ఆధిపత్యంలోని నాటో కూటమి సృష్టించిన వివాదంలో ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన ప్రత్యేక సైనిక చర్య బుధవారం నాడు 133వ రోజులో ప్రవేశించించింది. డాన్‌బాస్‌లో కొంత మినహా మిగిలిన ప్రాంతం నుంచి ఉక్రెయిన్‌ మిలిటరీ, దానికి అనుబంధంగా ఉన్న కిరాయి నాజీ మూకలను రష్యా మిలిటరీ తరిమివేసింది. లుహానస్క్‌ ప్రాంతాన్ని విముక్తి చేసినందుకు అధ్యక్షుడు పుతిన్‌ అభినందనలు తెలిపారు. లుహానస్క్‌ వేగంగా పతనం కావటాన్ని చూస్తే రష్యా సేనల మధ్య మెరుగైన సమన్వయం ఉన్నట్లు కనిపిస్తోందని బ్రిటన్‌ రక్షణశాఖ పేర్కొన్నది. మరోవైపు తమ సేనలు వెనక్కు తగ్గటం, రష్యా దళాలను అడ్డుకోవటం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జలెనెస్కీ చెప్పాడు. డాన్‌టెస్క్‌ ప్రాంతం కూడా త్వరలో పతనం కానున్నట్లు వార్తలు. మూలనున్న ముసలమ్మలు, ఉయ్యాళ్లలో ఉన్న పసి పిల్లలు కూడా తుపాకులు పట్టి పుతిన్‌ సేనలను తరిమికొడుతున్నారన్న కథలు ఇప్పుడు ఎక్కడా వినిపించటం లేదు. ఒక వేళ చెప్పినా నాటో కూటమి దేశాల్లో జనం క్రమంగా చెవుల్లో పూలు తొలగించుకుంటున్నారు గనుక నమ్మని పరిస్థితి. కనుక ఆయాసపడినా ఫలితం ఉండదని గ్రహించి వాటిని తగ్గించారు.


గత నెలలో జర్మనీలో జి7, మాడ్రిడ్‌లో నాటో కూటమి సమావేశాలు జరిగాయి. రెండుచోట్లా రష్యాను ఎలా దెబ్బతీయాలి, కొత్త చోట్ల ఎలా చిచ్చు పెట్టాలన్న ఆలోచనల చుట్టూ చర్చలు, నిర్ణయాలు చోటు చేసుకున్నాయి. అంతర్గతంగా జరుగుతున్న మల్లగుల్లాల్లో మాత్రం ఉక్రెయిన్‌ సంక్షోభం నుంచి బయటపడేదెలా ? అనుకున్నదాని కంటే రష్యా మెరుగ్గా ఎలా ఉంది, నెలల తరబడి చేసిన కసరత్తు వృధాగా మారిందా? అన్న అంశాలున్నాయని వార్తలు. ఐరోపా సమాఖ్య(ఇయు) ఆర్ధిక పురోగతికి, దేశాల మధó్య ఆటంకాలను తొలగించుకొనేందుకు ఏర్పడింది.అలాంటి వేదికపై ఇప్పుడు మిలిటరీ అంశాల గురించి చర్చలు చోటు చేసుకుంటున్నాయి. నిరంతరం ప్రపంచంలో సామ్రాజ్యవాదులు రెండు రంగాల్లో యుద్ధాలు చేస్తున్నారు. ఒకటి ఆర్ధిక, రెండవది మిలిటరీ. రష్యా మీద ఆంక్షల రూపంలో అమెరికా, ఐరోపా సమాఖ్య తన నిర్ణయాలను ప్రపంచం మీద రుద్దాలని చూస్తున్నది. వందల కోట్ల డాలర్ల మేరకు ఆయుధాలను అందిస్తూ నాటో కూటమి ఉక్రెయినుకు వెన్నుదన్నుగా ఉంది.


వ్లదిమిర్‌ పుతిన్‌కు దగ్గరగా ఉన్నట్లు భావించిన వారిలో 1,100 మంది ఆస్తులను పశ్చిమ దేశాలు ఆర్థిక ఆంక్షల్లో భాగంగా స్థంభింప చేశాయి. ఐరోపా ద్రవ్యమార్కెట్లకు రష్యన్‌ బాంకులను దూరం చేశారు. రష్యా ఎగుమతులతో పాటు అది ఐరోపా నుంచి చేసుకొనే దిగుమతులపై ఆంక్షలు పెట్టారు.దాదాపు వంద బిలియన్‌ యురోల విలువగల వస్తువులను అడ్డుకున్నారు. దీన్ని ” ఎగుమతి నియంత్రణలను మిలిటరీకరించటం ”గా పిలుస్తున్నారు. ఆర్ధిక కూటమి నుంచి భద్రతా కూటమిగా స్వయంగా మార్పు చెందటంగా చెబుతూ ఇటీవలి కాలంలో ఆ దిశగా ఇయు చేసిన చట్టాలను ఉటంకిస్తున్నారు. అమెరికా ఆదేశాలను ఇయు సభ్య దేశాలపై రుద్దుతున్నది. పరిస్థితిని ఆసరా చేసుకొని అనేక అధికారాలను స్వంతం చేసుకుంది. అమెరికా తాను తీసుకున్న నిర్ణయాలను ముందుగా ఇయుకు చెప్పి తరువాత ఇతర దేశాలతో సంప్రదింపుల తతంగం జరుపుతున్నది. రష్యా మీద అమలు జరిపిన ఈ ఎత్తుగడను చైనాకు విస్తరించేందుకు పూనుకున్నారు.


గతేడాది నవంబరులో అమెరికా సిఐఏ డైరెక్టర్‌ బిల్‌ బర్న్‌ ఐరోపా సమాఖ్య ప్రధాన కార్యాలయం ఉన్న బ్రసెల్స్‌ వచ్చి రహస్య సమావేశాలు జరిపి ఉక్రెయిన్‌ మీద పెద్ద ఎత్తున దాడి చేసేందుకు పుతిన్‌ సిద్దం అవుతున్నాడు, ఏం చేద్దామని అడిగాడు. గత కొద్ది నెలలుగా పుతిన్‌ సన్నద్దం అవుతున్నాడు. మీరు కూడా భాగస్వాములవుతారు గనుక చలికాలంలో గాస్‌ అవసరం మీకుంటుంది. మిమ్మల్ని ఇరుకున పెట్టేందుకుగాను మీరు నిల్వ చేసుకొనేందుకు వీల్లేకుండా గాస్‌ సరఫరాలను తగ్గించాడని కూడా చెప్పాడు. మిలిటరీగా నాటో జోక్యం కుదిరేది కాదు గానీ, కావాలంటే 2014 క్రిమియా విలీనం తరువాత మీరు చేస్తున్న ఆర్ధిక దాడుల్లో మేము కూడా భాగస్వాములం అవుతామని ఇయు నేతలు అంగీకరించారు. ఐదు రకాలుగా ఆంక్షలు అమలు జరపాలని ముందే పధకం వేశారు. తరువాత కసరత్తు చేసి ఎలా అమలు జరుపుతున్నదీ తెలిసిందే. రష్యా సైనిక చర్య డాన్‌బాస్‌ ప్రాంతానికే పరిమితం అవుతుందని, మనకు పెద్దగా పని ఉండదని అనేక మంది భావించారు. ఏకంగా రాజధాని కీవ్‌ మీదనే దాడులు జరపటంతో అంతకు ముందే అనుకున్న దశలవారీ ఆంక్షలను వేగంగా వెంటనే ప్రకటించారు. అది కొన్ని దేశాలకు ఇబ్బందికరంగా మారింది. ఎయిర్‌ బస్‌ కంపెనీకి అవసరమైన టిటానియంను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటారు. దాంతో నాలక్కరుచుకొని అబ్బే వాటికి వర్తించవని సడలించారు. అలాగే కొన్ని దేశాలకు ఇంథన సరఫరాలకు మినహాయింపునిచ్చారు.


ఆంక్షల్లో ఉన్న లోపాలను ఆధారం చేసుకొని మూడవ పక్ష దేశాల నుంచి రష్యన్లు కంప్యూటర్లు, కార్ల విడిభాగాల వంటి వాటిని దిగుమతి చేసుకున్నారు. తమ నుంచి దిగుమతి చేసుకొనే వారు రూబుళ్లలోనే చెల్లించాలన్న ఎత్తుగడ కూడా కొంత మేరకు ఫలించింది.అన్నింటికీ మించి పశ్చిమ దేశాలు ఊహించని విధంగా లబ్ది పొందింది. ఇంథన ఉత్పత్తిని తగ్గించినప్పటికీ ఇప్పటి వరకు గతం కంటే ఎక్కువ ఆదాయం వస్తోంది. తమ ఆంక్షల ఫలితంగా రష్యాలో పదిశాతం ఉత్పత్తి తగ్గుతుందని, ఇరవై శాతం పెట్టుబడులు ఆగుతాయని, అవసరమైన విడి భాగాలకు కొరత ఏర్పడి ఆయుధ పరిశ్రమల మూత, చివరికి ట్రాక్టర్లకు సైతం కొరత, వీటన్నింటి ఫలితంగా ఆర్ధిక సంక్షోభం, రాజకీయంగా పుతిన్‌కు ఎసరు వస్తుందని రాసుకున్న నివేదికలన్నింటినీ పశ్చిమ దేశాలు ముందు వేసుకొని నాలుగు నెలలు గడిచినా అలా ఎందుకు జరగటం లేదని పదే పదే చదువు కుంటున్నాయి. మరోవైపున అమెరికాతో సహా పశ్చిమ దేశాల్లో ద్రవ్యోల్బణం, ఆర్ధిక దిగజారుడు మాంద్యానికి గురికానున్నట్లు వార్తలు. పెరుగుతున్న ఇంథన ధరలు ఐరోపాలోని అనేక దేశాల్లో దారిద్య్రం పెరగనుందని రష్యన్‌ మీడియా చెబుతోంది.


పశ్చిమ దేశాలు ఊహించని మరొక అంశం. రష్యా సరిహద్దులకు వెలుపల మాస్కో నుంచి 1,257 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న రిపబ్లిక్‌ కలినిన్‌గ్రాడ్‌. దీని జనాభా ఐదు లక్షలు. రష్యా నుంచి రోడ్డు మార్గంలో రావాలంటే ఒక వైపున లాత్వియా, లిథువేనియా మీదుగా, మరోవైపు నుంచైతే బెలారస్‌,లిథువేనియా మీదుగా రావాల్సి ఉంటుంది. నౌకా మార్గంలోనైతే బాల్టిక్‌ సముద్రం నుంచి చేరుకోవచ్చు.రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత జర్మనీ-సోవియట్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం జర్మనీ కలినిన్‌గ్రాడ్‌ ప్రాంతాన్ని సోవియట్‌కు అప్పగించింది. 1990దశకంలో సోవియట్‌ విడివడిన తరువాత అది రష్యా ఆధీనంలోకి వచ్చింది. ఉక్రెయిన్‌ వివాదం తలెత్తిన తరువాత ఈ ప్రాంతానికి రష్యా నుంచి సరఫరాలను అనుమతించాలా లేదా అన్నది సమస్యగా మారింది. ఉక్కు, అల్యూమినియం వంటివి ఆంక్షల జాబితాలో ఉన్నప్పటికీ వాటి రవాణాను పునరుద్దరించాలని ఐరోపా సమాఖ్య తాజాగా నిర్ణయించింది. జూన్‌ పదిహేడవ తేదీ నుంచి రైళ్ల ద్వారా నిర్మాణ సామాగ్రి, బొగ్గు,ఖనిజ రవాణాను లిథువేనియా నిలిపివేసింది. ఉక్రెయిన్‌ వివాదానికి ముందు ఎంత పరిమాణంలో సరఫరా ఉంటే అంతే అనుమతిస్తామని ఐరోపా సమాఖ్య చెబుతోంది. కలినిన్‌ గ్రాడ్‌ నుంచి ఇతర దేశాలకు సరఫరా కాకుండా అడ్డుకొనేందుకు ఈ షరతు విధిస్తున్నారు.లిథువేనియా వైఖరితో విబేధించిన జర్మనీ ఐరోపా సమాఖ్య ద్వారా తన నిర్ణయాన్ని అమలు చేయిస్తున్నదని వార్తలు వెలువడ్డాయి. రష్యా-ఉక్రెయిన్‌ వివాదంలో ఆంక్షలను జర్మనీ సమర్ధిస్తున్నప్పటికీ యుద్ధంలో నాటో భాగస్వామి కాకూడదని కోరుకుంటోంది. అనవసర వివాదాలతో రష్యాను మరింతగా రెచ్చగొట్టవద్దని కూడా చెబుతోంది. అయితే లిథువేనియా దీని గురించి రుసరుసలాడుతోంది. ఐరోపా కమిషన్‌లో రష్యా భయాన్ని నింపిందని, ఇది కొన్ని రైల్వే వాగన్ల అంశం కాదని, రష్యా బెదిరింపులకు లొంగినట్లు కనిపిస్తోందని, ఇది ఇంతటితో ఆగదని, ఐరోపాలో చీలికలు తెచ్చేందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుందని, తమ పరువు తీశారని, ఇప్పుడు నాటోలో భాగంగా లిథువేనియాలో ఉన్న జర్మన్‌ దళాలను ఉంచుతారా వెనక్కు తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉందని అక్కడి విశ్లేషకులు చిత్రిస్తున్నారు. చివరికి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాల్సి ఉంది.


జి7, నాటో సమావేశాల్లో ఆంక్షలను మరింతగా పెంచాలని సంకల్పం చెప్పుకున్నారు, ఉక్రెయినుకు ఆయుధ సరఫరాను పెంచాలని నిర్ణయించారు. ఇదే సమయంలో తమ పరువు కాపాడుకుంటూ వివాదాన్ని ఎలా ముగించాలా అనే ఆలోచన కూడా చేస్తున్నారు. తొలి రోజుల్లో ఉక్రెయిను గట్టిగా నిచినట్లు కనిపించినా దాని అడుగుజారుతున్నట్లు అంతర్గతంగా పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. మిలిటరీ, ఆర్ధిక లక్ష్యాలను దెబ్బతీస్తూ రష్యా అడుగులు వేస్తున్నది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే పశ్చిమ దేశాలు ఇచ్చిన అస్త్రాలతో ఉక్రెయిన్‌ ఆత్మరక్షణకు పాల్పడుతున్నది తప్ప రష్యా చేతికి చిక్కిన ప్రాంతాలను తిరిగి పొందే అవకాశం కనిపించటం లేదు. ఉక్రెయిన్‌తో పోలిస్తే ఆర్ధికంగా, ఆయుధపరంగా రష్యా పైచేయితో ఉంది. దాడులు మరికొంత కాలం ఇదే తీరుతో కొనసాగితే అంతర్గతంగా ఉక్రెయిన్‌ జనం స్పందన ప్రతికూలంగా మారవచ్చు.ఇరుగు పొరుగు దేశాలకు శరణార్ధులకు ఆశ్రయం కల్పించటం,ఆర్ధిక సాయం భారంగా మారవచ్చు.


సైనిక చర్య ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, ఇంకా ఎంత మేరకు ఉక్రెయిన్‌ ధ్వంసమౌతుందో అంచనా లేదు. ఇప్పటి వరకు జరిగినదాన్నుంచి పునర్‌నిర్మాణం జరగాలంటే 750బిలియన్‌ డాలర్లు అవసరమని, ఈ బాధ్యతను ప్రజాస్వామిక ప్రపంచమే చేపట్టాలని జెలెనెస్కీ డిమాండ్‌ చేస్తున్నాడు. ఉక్రెనియన్లలో అసంతృప్తి తలెత్తకుండా చూసేందుకు పునర్‌నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నట్లు హడావుడి చేస్తున్నారు. ఇప్పటి వరకు 6.84 బిలియన్‌ డాలర్ల ప్రతిపాదనలు వచ్చినట్లు ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్స్‌ ప్రకటించారు, ఎక్కడ 750 ఎక్కడ 6.84 బి.డాలర్లు ? స్విడ్జర్లాండ్‌లో జరిగిన రెండు రోజుల సమావేశంలో 40 దేశాలు, సంస్థలకు చెందిన వారు తాము భాగస్వాములం అవుతామని సంతకాలు చేశారు. ఈ సంక్షోభం పరోక్షంగా ప్రపంచమంతటినీ ప్రభావితం చేస్తోంది. పరిస్థితి ఇంకా దిగజారితే దాన్ని ఎగదోస్తున్న పశ్చిమదేశాల వైపు చూపే వేళ్ల సంఖ్య పెరుగుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యా, చైనాలపై దాడే 48వ జి7 శిఖరాగ్ర సభ లక్ష్యం !

30 Thursday Jun 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

48th G7 summit, G7 summit 2022, Joe Biden, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


జూన్‌ 26 నుంచి 28వ తేదీ వరకు జర్మనీలోని బవేరియా ఆల్ఫ్స్‌ ప్రాంతంలోని ఎలమౌ కాజిల్‌ రిసార్ట్‌లో 48వ జి7 శిఖరాగ్ర సమావేశం జరిగింది. ” ధర్మ బద్ధ ప్రపంచం వైపు పురోగమనం ” అనే ఇతివృత్తంతో దీన్ని నిర్వహించారు. ఈ సభ కొనసాగింపుగా 29-30 తేదీల్లో స్పెయిన్లోని మాడ్రిడ్‌ నగరంలో నాటో కూటమి సమావేశాలను ఏర్పాటు చేశారు. జి7 సమావేశానికి మన ప్రధాని నరేంద్రమోడీతో పాటు అర్జెంటీనా, దక్షిణ ఆఫ్రికా, ఇండోనేషియా, సెనెగల్‌ దేశాధినేతలను కూడా ఆహ్వానించారు. ఎడతెగని, ఎప్పుడూ ఉండే,ఎవరూ పాటించని పర్యావరణం, ఉగ్రవాద నిరోధం, ఆహార భద్రత వంటి అంశాల గురించి ఈ సమావేశంలో సుభాషితాలను పక్కన పెడితే రెండు కీలక అంశాల మీద అమెరికా పెత్తనంలోని ఈ కూటమి కేంద్రీకరించిందని చెప్పవచ్చు. అవి రష్యా మీద మరిన్ని ఆంక్షలు, చైనాను నిలువరించే పధకాలు. ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య ఐదవ నెలలో ప్రవేశించింది. ఇప్పటికే తూర్పున ఉన్న డాన్‌బాస్‌ ప్రాంతాన్ని, కీలక రేవులు, పారిశ్రామిక ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ మిలిటరీ, దానితో కలసి ప్రతిఘటిస్తున్న కిరాయి మూకలను ఆ ప్రాంతం నుంచి రష్యా తరిమివేసింది. కొత్త ప్రాంతాలకు దాడులను విస్తరించింది.చమురు ఎగుమతులపై విధించిన ఆంక్షలు పెద్దగా ప్రభావం చూపకపోవటంతో బంగారం కొనుగోళ్లను నిలిపివేయాలని జి7 కూటమి పిలుపునిచ్చింది. దీంతో పాటు మరిన్ని ఆయుధాలను పంపాలని నిర్ణయించింది.


నవంబరులో జరిగే పార్లమెంటు ఎన్నికలలో అధికార డెమోక్రటిక్‌ పార్టీకి దెబ్బతగుల నుందన్న వార్తల నేపధ్యంలో లబ్దిపొందేందుకు జో బైడెన్‌ ఈ సమావేశాలను వినియోగించుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఒక అంశం మాత్రమే అని చెప్పవచ్చు. ఉక్రెయిన్‌ మిలిటరీ అనేక ప్రాంతాల నుంచి వెనుదిరుగుతున్న పూర్వరంగంలో అనేక దేశాలు పునరాలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నందున నాటో కూటమి, ఇతర దేశాలను నిలువరించేందుకు అమెరికా పూనుకుంది. రష్యా నుంచి బంగారం దిగుమతులపై నిషేధం కేవలం ఒక ప్రచార అస్త్రం తప్ప రష్యా మీద పెద్దగా ప్రభావం పడదని విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది 15.5బిలియన్‌ డాలర్ల మేరకు అక్కడి నుంచి ఎగుమతులు జరిగాయి. ప్రపంచంలో పదిశాతం( 2021లో 333.4 టన్నులు) బంగారాన్ని ఉత్పత్తి చేస్తూ రష్యా రెండవ స్థానంలో ఉండగా 370 టన్నులతో చైనా ప్రధమ స్థానంలో ఉంది.రష్యా నుంచి దిగుమతులు చేసుకొనే దేశాల్లో మనది కూడా ఒకటి. దాని ఎగుమతులపై నిషేధం వలన చమురు ధరలు పెరిగినట్లుగానే బంగారం ధరలు, వాటితో పాటు ద్రవ్యోల్బణం కూడా పెరగవచ్చు. చమురును ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లుగానే బంగారానికి కూడా మార్కెట్లను రష్యా చూసుకుంటుందని చెబుతున్నారు.


తాము సృష్టించిన ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని మరింత ఎగదోసేందుకు తప్ప పరిష్కరించేందుకు జి7 సమావేశం ఎలాంటి చొరవ చూపలేదు. రానున్న ఐదు సంవత్సరాల కాలంలో లాభాలు వచ్చే పధకాలపై పెట్టుబడులకు 600బిలియన్‌ డాలర్లు సేకరించాలని ఈ సమావేశం పిలుపునిచ్చింది తప్ప అనేక దేశాల్లో తలెత్తిన ఆకలి మంటల గురించి ధనిక దేశాలు పట్టించుకోలేదు. ఆసాధారణ ప్రపంచ ఆకలి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని, ప్రపంచ ఆహార మార్కెట్‌ను స్థిరంగా ఉండేట్లు చూడాలని, ధరల ఒడిదుడుకులను నివారించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్రెస్‌ జి7 కూటమిని కోరారు. ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో 29శాతం వాటా కలిగిన ఉక్రెయిన్‌, రష్యాల నుంచి ఎగుమతుల పునరుద్దరణకు ప్రభావశీలమైన పరిష్కారాన్ని కనుగొనకపోతే ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. నేతలు తమ ప్రసంగాల్లో ఆహార భద్రత గురించి ప్రస్తావించటం తప్ప నిర్దిష్ట చర్యలు లేవు. ఉక్రెయిన్‌ రేవుల్లో నిలిచిన రవాణా పునరుద్దరణ, తమ దేశం నుంచి ఎరువులు, ఆహార ధాన్యాల ఎగుమతులకు విధించిన ఆంక్షల ఎత్తివేతతో పాటు సముద్రాల్లో ఉక్రెయిన్‌ ఏర్పాటు చేసిన మందుపాతరలను తొలగించాలని రష్యా డిమాండ్‌ చేస్తోంది.


ప్రపంచంలో వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆరువందల బిలియన్‌ డాలర్లు సేకరించాలని జి7 కూటమి నిర్ణయింది. ఈ మొత్తం చైనాను అడ్డుకొనేందుకు అని ఎక్కడా చెప్పకపోయినా దాని బిఆర్‌ఐ పధకాన్ని అడ్డుకొనేందుకే అని మీడియా పేర్కొన్నది. ప్రపంచ మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల కోసం భాగస్వామ్యం(పిజిఐఐ) అనే పేరుతో ఒక పధకాన్ని అమలు జరపాలని గతేడాది లండన్‌ సమావేశంలోనే ఒక పధకాన్ని ఈ కూటమి ప్రకటించింది. ఇప్పుడు 2027నాటికి ఆరువందల బిలియన్లతో ఒక నిధిని ఏర్పాటు చేయాలని సంకల్పం చెప్పుకున్నారు. ఇది చైనా 2013 నుంచి అమలు చేస్తున్న బిఆర్‌ఐ పధకానికి పోటీగా పరిగణిస్తున్నారు. ఇదేదో దయా-ధర్మం కాదు దీనిలో పెట్టుబడులు పెట్టిన వారందరికీ అమెరికన్లతో సహా అందరికీ ఫలితాలు ఉండాల్సిందే అని స్పష్టం చేస్తున్నా అని జో బైడెన్‌ చెప్పారు.అభివృద్ధి చెందుతున్న దేశాలలో అవసరమైన మౌలిక, ఆధునిక వసతుల కల్పనకు 40లక్షల కోట్ల డాలర్లు అవసరమని అంచనా. తాము 200 బిలియన్‌ డాలర్లు ఇస్తామని అమెరికా చెబుతుండగా తాము 317బి.డాలర్లు సమకూర్చుతామని ఐరోపా సమ్యాఖ్య పేర్కొన్నది.


అసలు జి 7 అంటే ఏమిటన్న ప్రశ్న కొంతమందికైనా తలెత్తటం సహజం.అమెరికా,జపాన్‌, కెనడా, నెదర్లాండ్స్‌తో తలెత్తిన వివాదంలో ఆ దేశాలకు చమురు సరఫరాలపై నిషేధం విధిస్తున్నట్లు ఒపెక్‌ దేశాలు చేసిన ప్రకటన 1973లో చమురు సంక్షోభానికి దారి తీసింది. దాన్నుంచి బయడపడేందుకు ధనికదేశాల ఆలోచన నుంచి పుట్టిందే జి7. చమురు, విత్త సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ధనిక దేశాలు ఉమ్మడిగా చేసిన ఆలోచనకు ఒక రూపమే 1975లో ఏర్పడిన ఈ దేశాల బృందం. నాటి ఫ్రెంచి అధ్యక్షుడు వాలెరీ గిస్కార్డ్‌, జర్మన్‌ ఛాన్సలర్‌ హెల్మట్‌ స్మిత్‌ చొరవతో పారిస్‌లో అమెరికా,బ్రిటన్‌,ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ నేతలు తొలి సమావేశం జరిపారు.మరుసటి ఏడాది కెనడా, 1998లో రష్యా చేరింది. దాంతో అది జి8గా మారింది. 2014లో ఉక్రెయిన్‌ ఏలుబడిలో ఉన్న క్రిమియా ప్రాంతాన్ని రష్యా స్వాధీనం చేసుకోవటంతో ఆ బృందం నుంచి తొలగించిన తరువాత తిరిగి జి7గా మారింది.1981 నుంచి ఐరోపా సమాఖ్య(ఇయు)ను శాశ్వత ఆహ్వానిత సంస్థగా మార్చారు. ప్రతి సంవత్సరం ఒక సభ్యదేశ ఆతిధ్యంలో శిఖరాగ్ర సమావేశాలు జరుగుతాయి.సహజంగా ఆ దేశాధినేతలే ఏడాది పాటు అధ్యక్ష స్థానంలో ఉంటారు. ఈ బృందానికి ఒక కేంద్ర స్థానం లేదా శాశ్వత సిబ్బందిగానీ ఉండరు. ఇప్పటి వరకు గత ఎనిమిది సంవత్సరాల్లో నరేంద్రమోడీ మూడు సమావేశాల్లో పాల్గొన్నారు. అంతకు ముందు మన్మోహన్‌ సింగ్‌ పదేండ్ల కాలంలో ఐదు సార్లు అతిధిగా వెళ్లారు. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రపంచ రాజకీయాలు, ఆర్ధిక రంగంలో మన దేశానికి ఉన్న ప్రాధాన్యత రీత్యా మన దేశానికి ప్రతిదేశం ఆహ్వానం పలుకుతోంది. గత ఎనిమిదేండ్లలో మూడు సార్లు ఆహ్వానించటం నరేంద్రమోడీ ఘనత అన్నట్లు కొందరు చిత్రిస్తున్నారు.


ఉక్రెయిన్‌ సంక్షోభం తలెత్తిన తరువాత రష్యా సైనిక చర్యను ఖండించటమా లేదా అన్న అంశంపై ప్రపంచ దేశాలు మూడు శిబిరాలుగా మారాయి. ఒకటి అమెరికా బాటలో ఖండించే, రెండవది రష్యాను సమర్ధించే, మూడవది తటస్థంగా ఉండే దేశాలు. మనది, చైనా మూడవ తరగతిలో ఉన్నాయి. ఖండించని దేశాలన్నీ రష్యాను సమర్ధించినట్లేనని అమెరికా కూటమి చిత్రిస్తోంది. జర్మనీ సభకు భారత్‌ను ఆహ్వానించటం గురించి అమెరికా జాతీయ భద్రతా మండలి సమన్వయకర్త జాన్‌ కిర్బీ మాట్లాడుతూ లోతైన, భిన్నమైన అజెండా ఉన్న కారణంగానే భారత్‌ను ఆహ్వానించారు తప్ప రష్యా నుంచి వేరు చేసేందుకు కాదన్నారు. ఆహ్వానించాలా లేదా అని జర్మనీ మల్లగుల్లాలు పడినట్లు వార్తలు వచ్చాయి తప్ప నిజానికి అందుకే పిలుస్తున్నట్లు ఎవరూ ఎక్కడా చెప్పలేదు. కానీ అమెరికా ప్రతినిధి కడుపు ఉబ్బరాన్ని ఆపుకోలేక అంతరంగాన్ని మరో రూపంలో వెల్లడించాడు. ఇతివృత్తం ఒకటైతే నిజానికి అక్కడ జరిగిన ప్రధాన చర్చ అంతా చైనా, రష్యాలను దెబ్బతీయటం ఎలా అన్నదాని చుట్టూనే తిరిగింది. ఆర్ధిక స్థిరత్వం, మార్పు, ప్రపంచ ఆరోగ్యమెరుగుదల, ప్రపంచ పర్యావరణ రక్షణ, నిరంతర పెట్టుబడుల వంటి వన్నీ మాయపుచ్చే అంశాలే. ప్రపంచ చట్టబద్ద సంస్థలు చేసిన నిర్ణయాలు, లక్ష్యాలనే ఈ దేశాలు ఖాతరు చేయటం లేదు. తొలి రోజు సమావేశంలో రష్యా చమురు ధరలను ఎలా అదుపు చేయాలన్న అంశం మీద, ఉక్రెయినుకు మరిన్ని ఆయుధాలిచ్చి ఎలా నిలబెట్టాలా అన్నదాని మీద కేంద్రీకరించారు తప్ప తమతో సహా అనేక దేశాలను అతలాకుతలం చేస్తున్న ద్రవ్యోల్బణాన్ని పట్టించుకోలేదు. గోధుమలపై మన దేశం నిషేధం విధించినపుడు పశ్చిమ దేశాలు విమర్శించాయి, తరువాత దాన్ని పంచదారకు పొడిగించారు. మోడీ జర్మనీ వెళుతుండగా బియ్యం ఎగుమతులపై నిషేధ ఆలోచన ఉన్నట్లు వార్తలొచ్చాయి.


ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో మన ప్రధానులు తొమ్మిది సార్లు అతిధులుగా పాల్గొన్నారు.అతిధులుగా వెళ్లిన వారు ఎవరైనప్పటికీ ధర్మోపన్యాసాలు చేయటం, ఆతిధ్యాన్ని పుచ్చుకోవటం తప్ప అజెండాను నిర్ణయించే అవకాశం ఉండదు. హాజరైన దేశాధినేతలు, సంస్థల ప్రతినిధులతో తాను అభిప్రాయ మార్పిడి చేసుకుంటానని జర్మనీ వెళ్లే ముందు ప్రధాని నరేంద్రమోడీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కూటమి దేశాల నేతలు ఒక వైపు ఇలాంటి శిఖరాగ్ర సమావేశాల్లో గొప్ప ప్రకటనలు చేస్తూనే మరోవైపు తమ స్వంత అజెండాలతో వివిధ దేశాలతో వ్యవహరించటం తెలిసిందే. ఇతర దేశాల మీద దాడులు, ఆరోపణలు, తప్పుడు ప్రచారం చేయటంలో దాదాపు అన్నీ ఒక గూటి చిలుకలుగానే ఉంటాయి. ఉక్రెయిను సంక్షోభం గురించి ఈ బృందనేతలు మాట్లాడుతున్న సమయంలో మన ప్రధానిగా ఎవరున్నా మౌన ప్రేక్షుకుడిగా ఉండటం లేదా ఏదో ఒకమిషతో వెలుపలికి రావాల్సిందే తప్ప మన వైఖరిని వెల్లడించే లేదా సమర్ధించుకొనే అవకాశం ఉండదు. అమెరికా దేశాల శిఖరాగ్ర సమావేశానికి వెనెజులా, క్యూబాలను మినహాయించిన అమెరికా దుశ్చర్యను అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్‌ ఆ సమావేశంలో సభ్య హౌదాలో ఉతికి ఆరేశారు. అదే జి7 సమావేశంలో ఆహ్వానితుడిగా ఉన్నందున ఆ విధంగా మాట్లాడలేరు. ఎవరికైనా ఈ పరిమితులు ఉంటాయి. ఉక్రెయిను వివాదంలో మన దేశాన్ని తమవైపు తిప్పుకొనేందుకు అమెరికా కూటమి ఎప్పటికప్పడు గాలాలు వేస్తూనే ఉంటుంది.చైనాను బూచిగా చూపి మనలను తమవైపు తిప్పుకొనేందుకు చేయని యత్నం లేదు. వర్తమాన రాజకీయ అంశం ఉక్రెయిన్‌ వివాదంలో పశ్చిమ దేశాలతో చేతులు కలపకపోయినా మిగతా అంశాలలో మీతోనే ఉంటామనే సందేశాన్ని ఇప్పటికే నరేంద్రమోడీ సర్కార్‌ ఇచ్చింది. దాని కొనసాగింపుగానే ఈ సమావేశానికి హాజరైనట్లు చెప్పవచ్చు.


జర్మనీ జి7 సమావేశాల్లో నరేంద్రమోడీని అమెరికా అధినేత జో బైడెన్‌ పలుకరించిన తీరును మీడియా ప్రత్యేకంగా చూపింది. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌తో మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చి నరేంద్రమోడీ భుజం తట్టి మరీ జో బైడెన్‌ పలుకరించారు. ఇది నరేంద్రమోడీ ఘనతగా చిత్రిస్తున్నారు.మన దేశాన్ని తమ కూటమిలో చేర్చుకొనేందుకు ఎలాంటి గాలం వేస్తారో డోనాల్డ్‌ ట్రంప్‌ తీరు తెన్నులు వెల్లడించాయి.జి 7 కూటమి కాలం చెల్లిన దేశాలతో ఉంది, దాన్ని విస్తరించాలని ట్రంప్‌ ఒకసారి చెప్పాడు.ఆస్ట్రేలియా,భారత్‌, దక్షిణ కొరియా, రష్యాలతో విస్తరించాలని అందుకే 2020 సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పాడు. నరేంద్రమోడీకి ఫోన్‌ చేసి మరీ ఆహ్వానం పలికాడు. నిజమే అనుకొని మన దేశం జి7లో చేరినట్లుగానే కొందరు కలలు కన్నారు. అమెరికా తరువాత పెద్ద ఆర్ధికశక్తిగా ఉన్న చైనాను పక్కన పెట్టి ధనికదేశాల బృందాన్ని విస్తరించటం అంటే అది చైనాను కట్టడి చేసేందుకే అన్నది స్పష్టం. ఇప్పుడు జి7 సమావేశానికి వెళ్లి సాధించిందేమిటో నరేంద్రమోడీ దేశానికి చెప్పాల్సి ఉంటుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యా మీద ఆంక్షల పర్యవసానాలను ఊహించని పశ్చిమ దేశాలు !

08 Wednesday Jun 2022

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

100 days Ukraine crisis, Ukraine war, Ukraine-Russia crisis, US imperialism


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమై బుధవారం నాటికి 105వ రోజుకు చేరింది. అమెరికా, ఇతర నాటో దేశాలు ప్రపంచం మీద రుద్దిన సంక్షోభ పర్యవసానాలను ఉక్రెేనియన్లు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. పరోక్షంగా మన దేశంతో సహా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వందవ రోజు సందర్భంగా ఆ సంక్షోభం గురించి అనేక మంది పాఠాలు, గుణపాఠాలు అంటూ తమ వైఖరులను వెల్లడించారు. ఏ దాడి లేదా యుద్దంలోనైనా ముందుగా నిజాలు బలి అవుతాయి. వంద రోజులు దాటిన తరువాత కూడా ఉక్రెయిన్లో నిజంగా జరుగుతున్నదేమిటి? అమెరికా కూటమి దేశాలు చెబుతున్నట్లుగా రష్యాకు ఎదురు దెబ్బలు తగిలాయా ఏమిటి అన్నది స్పష్టంగా వెల్లడికావటం లేదు.అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కొన్ని అంశాలను చూద్దాం.


ఇరవై శాతం భూభాగం తమ పట్టునుంచి తప్పిందని స్వయంగా ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ ప్రకటించాడు. అది గత ఎనిమిది సంవత్సరాలుగా స్వాతంత్య్రం ప్రకటించుకున్న తిరుగుబాటుదారులది పైచేయిగా ఉన్న డాన్‌బాస్‌ ప్రాంతం. ఉక్రెయిన్‌ మిలిటరీ, దాని కనుసన్నలలో పని చేసే కిరాయి నాజీమూకలు ఒక వైపు, రష్యా మద్దతు ఉన్న తిరుగుబాటు దార్ల మధ్య అక్కడ అంతర్యుద్దం జరుగుతున్నది. రష్యా ప్రారంభించిన సైనిక చర్యలక్ష్యాలలో ఈ ప్రాంతంలోని నాజీ మూకలను అంతం చేయటం, నాటోలో చేరి తమ సరిహద్దులో అమెరికా, ఇతర దేశాల మిలిటరీ,ఆయుధాలను మోహరించేందుకు పూనుకున్న ఉక్రెయిన్‌ జీవనాడులను దెబ్బతీసి ఆ ప్రక్రియనుంచి వెనక్కు తగ్గేట్లు చేయటం ఉన్నాయి. ఈ ప్రక్రియ కొద్ది రోజుల్లోనే పూర్తవుతుందని వేసిన అంచనాలు తప్పాయి. పశ్చిమ దేశాలు అందించిన ఆధునిక ఆయుధాలే దానికి కారణం. నయా నాజీ మూకలు, మిలిటరీ దాడుల నుంచి డాన్‌బాస్‌ పౌరులను రక్షించాలన్న లక్ష్యం నెరవేరేందుకు వందరోజులు పట్టింది. ఇక్కడ గ్రహించాల్సిన అంశాలు రెండున్నాయి. ఒకనాడు రష్యాలో అంతర్భాగంగా ఉన్న క్రిమియా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొనేందుకు రష్యాను పురికొల్పిన కారణం కూడా ఉక్రెయినుకు నాటో తీర్ధం ఇవ్వాలన్న పశ్చిమ దేశాల ఎత్తుగడే.


క్రిమియాను తిరిగి స్వాధీనం చేసుకోవటం ఉక్రెయినుకు సాధ్యం కాలేదు, ఇప్పుడు తమ పట్టునుంచి జారిందని చెబుతున్న డాన్‌బాస్‌ ప్రాంతాన్ని కూడా నాటో కూటమి దేశాలు ఎన్ని ఆయుధాలు ఇచ్చినా తిరిగి ఉక్రెయిన్‌ ఆధిపత్యంలోకి వస్తుందా అన్నది అపూర్వచింతామణి ప్రశ్న.పూర్వపు సోవియట్‌ నుంచి విడిపోయి దేశంగా ఏర్పడిన వాటిలో జార్జియా ఒకటి. దీనిలో అబ్కాజియా, దక్షిణ ఒసెట్టి అనే ప్రాంతాలు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. వాటిని రష్యా గుర్తించటమే కాదు, అక్కడి ప్రభుత్వాలతో రక్షణ ఒప్పందాలను కూడా కుదుర్చుకొన్నది. జపాన్‌తో అమెరికా రక్షణ ఒప్పందం కుదుర్చుకొని అక్కడ తన సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసి మిలిటరీని ఎలా దించిందో అదే పద్దతిలో ఇక్కడ రష్యా కూడా ఆ రిపబ్లిక్కులకు రక్షణ కల్పిస్తోంది.ఈ రెండు ప్రాంతాలు జార్జియాలో ఇరవైశాతం కలిగి ఉండేవి. అందువలన డాన్‌బాస్‌ ప్రాంతం కూడా వచ్చే రోజుల్లో ఇదే మాదిరి స్వతంత్ర రాజ్యం లేదా రెండు రాజ్యాలుగా ఏర్పడి రష్యాతో మిలిటరీ రక్షణ ఒప్పందాలను కుదుర్చుకొని విడిగా కొనసాగవచ్చు.


ఉక్రెయిన్‌ సంక్షోభం నేర్పిన ఒక పాఠం ఏమంటే అమెరికాను నమ్ముకుంటే తన ఎత్తుగడలో భాగంగా ఒక దేశాన్ని మరొక దేశం మీదకు ఉసిగొల్పుతుంది తప్ప తన మిలిటరీని పంపి ప్రత్యక్షంగా రంగంలోకి దిగదు అన్నది స్పష్టమైంది. కొరియా, వియత్నాంలపై జరిపిన దాడులు, ఉగ్రవాదులను ఎదుర్కొనే పేరుతో ఆఫ్ఘనిస్తాన్‌లో జోక్యం చేసుకొన్ని తిన్న చావుదెబ్బలే దీనికి కారణం అని వేరే చెప్పనవసరం లేదు. సిరియా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కిరాయి మూకలను పశ్చిమదేశాలు సమీకరించినా అది సాధ్యం కాలేదు. ఉక్రెయిన్లో కూడా దాదాపు పాతిక వేలమందిని సమీకరించి జనం మీద దాడులు చేయించారు. మరియుపూల్‌ నగరంలోని ఉక్కు కర్మాగారాన్ని స్థావరంగా చేసుకొని మూడు నెలలపాటు రష్యన్లను ఎదిరించింది కూడా ఈ మూకలే. ఆ ఫ్యాక్టరీని ముట్టడించిన రష్యన్లు అక్కడి వారికి అవసరమైన సరఫరాలను అడ్డుకోవటంతో చివరికి వేలాది మంది లొంగిపోయిన సంగతి తెలిసిందే. నాలుగు కోట్ల నలభై లక్షల మంది జనాభాలో కోటీ నలభై లక్షల మంది విదేశాలకు శరణార్ధులుగా వెళ్లటం లేదా స్వదేశంలో నెలవులు తప్పటం గానీ జరిగింది. వారిని ఎంతకాలం అలా అనిశ్చితంగా పరాయిపంచల్లో కొనసాగిస్తారో తెలియటం లేదు. ఇరుగుపొరుగు దేశాలు వారిని దీర్ఘకాలం భరించటం అంతతేలిక కాదు. సంప్రదింపుల పేరుతో జెలెనెస్కీ నాటకం ఆడారు తప్ప చిత్తశుద్దిని ప్రదర్శించలేదు.తమకు నాటోలో చేరే ఉద్దేశ్యం లేదని చెప్పిన పెద్దమనిషి ఆ మాటమీద నిలిచి ఉంటే ఈ పాటికి సంక్షోభం సద్దుమణిగి ఉండేది. చావు దెబ్బలు తింటున్నా ఇంకా విదేశీఆయుధాలు తీసుకుంటూ మరింత నాశనానికి కారకుడు అవుతున్నాడు. పశ్చిమ దేశాలకు సమన్య పరిష్కారం కావటం సుతరామూ అంగీకారం కాదని తేలిపోయింది. రష్యన్‌ దాడుల్లో దెబ్బతిన్నవాటి పునరుద్దరణకు రుణాలిస్తామంటూ సంక్షోభం నుంచి కూడా లాభాలు పిండుకొనేందుకు పూనుకున్నారు.


ఈ వివాదాన్ని ఆసరా చేసుకొని రష్యాను బూచిగా చూపి ఐరోపాలో మరోసారి మిలిటరీ శక్తిగా మారేందుకు జర్మనీ పావులు కదుపుతున్నది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మిలిటరీ ఖర్చును తగ్గించి దాన్ని పరిశోధన-అభివృద్ధి, కార్పొరేట్లకు సబ్సిడీల వంటి వాటికి మళ్లించటంతో పారిశ్రామికంగా ఎదిగింది. ఇప్పుడు భారీ ఎత్తున మిలిటరీ ఖర్చుకు నిర్ణయించింది. ఆధునిక ఎఫ్‌35 రకం విమానాలను కొనుగోలు చేస్తానని ప్రకటించింది. ఐరోపాలో పెద్ద మిలిటరీ శక్తిగా ఎదిగేందుకే ఇది అన్నది చెప్పనవసరం లేదు. తటస్థదేశాలుగా ఉన్న స్వీడన్‌, ఫిన్లండ్‌తో పాటు డెన్మార్క్‌ కూడా నాటోలో చేరాలని నిర్ణయించింది. వీటి కదలికల వెనుక ఉన్న అసలు లక్ష్యాలు వెల్లడికావాల్సి ఉంది.


తమ ఆంక్షలతో రష్యా ఆర్ధికవ్యవస్థ కుప్పకూలి జనం పుతిన్‌ మీద తిరగబడతారని పశ్చిమ దేశాలు వేసిన అంచనాలు, పెట్టుకున్న ఆశలు ఫలించలేదు. మాస్కో స్టాక్‌ మార్కెట్‌ మూతపడింది. రష్యన్‌ కరెన్సీ విలువ తొలి వారాల్లో సగానికి సగం పతనమైనా తిరిగి సైనికచర్యపూర్వపు స్థితికి చేరుకుంది. తమతో కాళ్లబేరానికి వస్తాడని భావించిన పుతిన్‌లో అలాంటి సూచనలేమీ లేవు. దాదాపు 300 బిలియన్‌ డాలర్ల మేర విదేశీమారక ద్రవ్యాన్ని పశ్చిమ దేశాలు స్థంభింప చేశాయి. ఎగుమతులపై నిషేధం విధించి ఆధునిక పరికరాలు, యంత్రసామగ్రి, పరిజ్ఞానం అందకుండా కట్టడి చేశారు.అమెరికా, ఐరోపా దేశాలు చమురు దిగుమతులను నిలిపివేసినా రష్యా ఇప్పటివరకు నిలదొక్కుకుంది. తన ఎగుమతులకు వేరే మార్కెట్లను చూసుకుంది. అమెరికా వడ్డీరేట్లను పెంచుతుంటే రష్యా తగ్గిస్తున్నది. మార్చి నెలలో భారత్‌కు చమురు సరఫరా చేసే దేశాల్లో రష్యా పదవస్థానంలో ఉంటే అది ఏప్రిల్‌ నెలలో నాల్గోస్థానానికి ఎదిగింది. మరో ఆరునెలల పాటు చమురు కొనుగోలుకు మన దేశ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నట్లు తాజా వార్తలు తెలిపాయి. మరోవైపు చైనా కూడా పెద్ద ఎత్తున చమురుతో పాటు ఇతర దిగుమతులను పెంచింది. రష్యా ఆర్థికవ్యస్థ నిలదొక్కుకొనేందుకు ఇదొక ప్రధాన కారణం. కొన్ని ఐరోపా దేశాలు కూడా ఆంక్షలను పక్కన పెట్టి అక్కడి నుంచి చమురు, గాస్‌ దిగుమతి చేసుకుంటున్నాయి. రష్యా వద్ద బంగారం, విదేశీకరెన్సీ గానీ 640 బిలియన్‌ డాలర్ల మేరకు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే విధించిన ఆంక్షలను అది తట్టుకోగలుగుతోందని చెప్పవచ్చు.


రష్యా మీద పశ్చిమ దేశాల ఆంక్షలు అంటే తమ కాళ్లను తామే తొక్కుకుంటున్నట్లని కొందరు వర్ణిస్తున్నారు. రష్యా నుంచి నిలిపివేసిన ఇంథనాన్ని ఇతర దేశాల నుంచి పొందాలంటే ఐరోపా దేశాలకు వెంటనే కుదిరేది కాదు.తమ నుంచి దిగుమతులు చేసుకోవాలంటే రూబుళ్లలోనే చెల్లించాలని లేకుంటే తామే నిలిపివేస్తామని పుతిన్‌ షరతులు విధించాడు. పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా చమురు ధరలు పెరగటం వలన ఎగుమతుల కారణంగా విదేశీ మారకద్రవ్యం పెద్ద ఎత్తున చెలామణిలోకి రావటం కూడా రూబుల్‌కు సానుకూల అంశంగా మారింది. రూబుల్‌ విలువ పెరగకుండా చూసేందుకు రష్యా రిజర్వుబాంకు వడ్డీ రేట్లను తగ్గించాల్సి వచ్చింది. తమ నుంచి దిగుమతులను నిలిపివేయటం అంటే ఐరోపా ఆర్ధిక ఆత్మహత్య చేసుకోవటమే అని పుతిన్‌ ఎద్దేవాచేశాడు. ఇంధన ధరలు,ద్రవ్యోల్బణం పెరుగుతాయని అన్నాడు. అయితే రష్యా ఇబ్బందులను ఎదుర్కొంటోందని కూడా చెబుతున్నారు. సైనిక చర్యకు ముందు బడ్జెట్‌లో చమురు ఎగుమతుల ఆదాయం 30శాతం ఉంటే ఇప్పుడు 65శాతానికి పెరిగిందంటున్నారు.
పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు రష్యాకు వరంగా మారాయి. మార్చి రెండవ తేదీన ముడి చమురు ధర 60 డాలర్లవరకు ఉంటే తరువాత 110 డాలర్లు దాటింది. అందువలన రష్యా తన ఖాతాదార్లకు పెరిగిన ధరమీద పెద్ద మొత్తంలో రాయితీ ఇచ్చినా గతంతో పోల్చుకుంటే నష్టం లేదు, మన వంటి దేశాలకు ఎంతగానో కలసి వస్తుంది.రష్యా మీద వత్తిడి తెచ్చేందుకు ఆంక్షల మార్గాన్ని ఎంచుకున్న పశ్చిమ దేశాలు వాటి వలన ఇతర దేశాలకు, చివరికి తమకూ కలిగే ప్రతికూల పర్యవసానాలను ఊహించలేకపోయాయి. కొన్ని ఐరోపా దేశాల వత్తిడికి లొంగి కొంత మేరకు చమురు దిగుమతులకు అనుమతించారు. వందరోజుల తరువాత అనేక దేశాల్లో తలెత్తిన పరిస్థితి అక్కడి పాలకులకు సమస్యలు తెస్తున్నది. 2014కు ముందు రష్యా ఆహారాన్ని దిగుమతి చేసుకోగా ఇప్పుడు ఎగుమతిదారుగా మారింది. అక్కడి నుంచి రవాణాపై ఆంక్షలున్న కారణంగా ప్రపంచంలో సరఫరా తగ్గి ఇప్పుడు ధరలు పెరిగాయి.


వంద రోజుల సైనిక చర్య తరువాత జరగనున్నదేమిటి అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. డాన్‌బాస్‌ ప్రాంతంపై పూర్తి పట్టు సాధించినందున ఇక ముందు రష్యా తూర్పు నుంచి భారీ దాడులకు సిద్దం అవుతుంది. ఉక్రేనియన్లు ఇంకేమాత్రం దాడులను తట్టుకోలేని స్థితిలోకి వెళుతున్నారు. తమకు ఇంకా ఆయుధాలు ఇమ్మని జెలెనెస్కీ కోరితే ముందు ముందు జనాగ్రహాన్ని ఎదుర్కోవచ్చు. ప్రస్తుత పోరులో ఉక్రెయిన్‌ గెలుస్తుందనే నమ్మకం రోజు రోజుకూ పశ్చిమ దేశాల్లో సడలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇరవైశాతం ప్రాంతం మీద తమ పట్టులేదని జెలెనెస్కీ ప్రకటించిన తరువాత ఆ భావన ఇంకా పెరుగుతోంది. ఇప్పుడు పశ్చిమ దేశాలకు ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని కొనసాగించాలా లేదా అన్న ప్రశ్న ఎదురుకానుంది. అమెరికా, ఐరోపా దేశాల్లో ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ధనికదేశాల్లో మాంద్యం తలెత్తవచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అలాంటపుడు రష్యామీద పోరు కొనసాగించి సాధించేదేమిటి అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d