• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: UK

మీడియా కట్టుకథలు, పిట్టకతలను నమ్మని జనం !

03 Wednesday Aug 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, Latin America, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ 1 Comment

Tags

media bias, media credibility, Propaganda War, US imperialism, US MEDIA COCK AND BULL STORIES, US Media lies


ఎం కోటేశ్వరరావు


మొదటి ప్రపంచ యుద్ధానికి కారకులలో ఒకడు జర్మన్‌ చక్రవర్తి కైజర్‌ రెండవ విల్‌హెల్మ్‌.1917 ఫిబ్రవరిలో చైనాలో బ్రిటీష్‌ వారి పత్రిక నార్త్‌ చైనా డైలీ న్యూస్‌ ఒక వార్త ప్రచురించింది. కైజర్‌ సేనలు శవాల నుంచి గ్లిజరీన్ను తయారు చేస్తున్నారన్నది దాని సారాంశం. ఏప్రిల్‌ నాటికి లండన్‌ నుంచి వెలువడే టైమ్స్‌, డెయిలీ మెయిల్‌ పత్రికలు తమ ప్రతినిధులు శవాల నుంచి గ్లిజరీన్‌ తీస్తున్న ఫ్యాక్టరీలను చూసినట్లు వార్తలను ప్రచురించాయి. అదే నెలలో లండన్‌ నుంచి ప్రచురితమౌతున్న ఒక బెల్జియన్‌ పత్రిక శవాలకు సంబంధించిన వార్తను ప్రచురించింది. దానికి జర్మనీలో ప్రచురితమైన ఒక వార్త ఆధారం. జర్మన్‌ పత్రికలో గుర్రాలు, కంచరగాడిదల శవాలను కాల్చుతున్నట్లు విలేకరి పేర్కొన్నాడు. అది బ్రిటీష్‌ పత్రికల్లో మానవశవాలుగా మారింది. అలాంటిదేమీ లేదని జర్మనీ పేర్కొన్నప్పటికీ అప్పటికే జర్మనీ మీద కోపంతో ఉన్న జనం వార్తలను నిజమే అని నమ్మారు. గ్లిజరీన్‌ వార్తకు ఎలాంటి ఆధారం లేదని 1925లో బ్రిటన్‌ ప్రజాప్రతినిధుల సభలో ప్రభుత్వం పేర్కొన్నది. అదే ఏడాది కన్సర్వేటివ్‌ పార్టీ ఎంపీ జాన్‌ చార్టరీస్‌ అమెరికాలో పర్యటించినపుడు తానే ఈ వార్త సృష్టికర్తనని వెల్లడించాడు. అతగాడు పూర్వాశ్రమంలో ఇంటిలిజెన్స్‌ అధిపతిగా పని చేశాడు.1917లో బ్రిటన్‌ గూఢచార సంస్థ ఎం17 వివిధ పత్రికల్లో స్పెషల్‌ కరస్పాండెంట్లుగా పని చేసేందుకు 13 మంది అధికారులు, 25 మంది కిరాయి రాతగాళ్లను నియమించింది. వారిలో ఒకడు శవాల ఫ్యాక్టరీ కట్టుకధ గురించి అంగీకరించాడు.మొదటి ప్రపంచ యుద్దంలో బ్రిటన్‌ అనుసరించిన ఎత్తుగడలను తరువాత జర్మన్‌ నాజీ హిట్లర్‌ మరింతగా పెంచి నీవు నేర్పిన విద్య అన్నట్లుగా కట్టుకథలను ప్రచారంలో పెట్టించాడు. వాటికి మారు పేరుగా తన ప్రచారశాఖ మంత్రి గోబెల్స్‌ను ప్రపంచానికి అందించాడు.ఇప్పుడు గోబెల్స్‌ వారసులు తామరతంపరగా పెరిగారు.గత వంద సంవత్సరాలుగా మీడియా అబద్దాలు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరుగుతున్నాయి.


అభిప్రాయ సేకరణ సంస్థ గాలప్‌ తాజాగా విడుదల చేసిన జూలై మాస సర్వే ప్రకారం అమెరికాలో కేవలం పదకొండుశాతం మంది మాత్రమే టీవీ ఛానళ్ల వార్తలను నమ్ముతున్నారు.పత్రికలపై 16శాతం మందికి విశ్వాసం ఉంది.రెండవ ప్రపంచ యుద్దం, ఆ తరువాత అమెరికా జరిపిన యుద్దాల సందర్భంగా వాటిని సమర్ధించేందుకు అమెరికా సిఐఏ, దానితో చేతులు కలిపిన వివిధ దేశాల సంస్థలు వండి వార్చిన తప్పుడు వార్తలతో జనం విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభంలో కుహనా వార్తలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆయుధాలతో పాటు అంతేశక్తి వంతంగా ప్రచారదాడులు సాగుతున్నాయి. సిఐఏ స్థాపక అధికారుల్లో ఒకడైన ఫ్రాంక్‌ విస్నర్‌ ఒక సందర్భంగా మీడియా ఒక సంగీత వాద్యం వంటిదని చెప్పాడు. ప్రపంచంలోని ప్రధాన మీడియా సంస్థల కార్యాలయాల్లో సంగీత దర్శకుల మాదిరి సిఐఏ అధికారులు, గాత్ర,వాయిద్యకారులుగా ఇతరులు చేరతారు. తప్పుడు వార్తలను వీనుల విందుగా, కనులపసందుగా రూపొందిస్తారు. ఇటీవల బిజెపి తమ భావజాలం ఉన్నవారిని ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున మీడియాలో ప్రవేశపెట్టింది. ప్రతి పార్టీ అలాంటి వారిని ప్రవేశపెట్టటం లేదా అప్పటికే ఉన్నవారిని తమకు అనుకూలంగా మార్చుకోవటం చేస్తున్నది. ఇలాంటి వారంతా తమ అజెండాలకు అనుగుణంగా పాఠకులు, వీక్షకులకు వినిపిస్తారు, చూపిస్తారు. అమాయకులను నిందితులుగా, నిందితులను అమాయకులుగా మార్చివేస్తారు. వీరికి పోలీసు, గూఢచార ఏజన్సీల మద్దతు పూర్తిగా ఉంటుంది. ఎంపిక చేసుకున్నవారికి లీకులు అందిస్తారు. అందుకే ప్రస్తుతం ప్రపంచ మీడియాలో జర్నలిజానికి బదులు ప్రచారదాడి తిష్టవేసిందని అనేక మంది చెబుతున్నారు. ఇది యజమానులకు పెద్ద లాభసాటిగా ఉంది.


పాలకవర్గ దోపిడీ, సామ్రాజ్యవాద కాంక్ష, విస్తరణకు మీడియా తన వంతు పాత్ర నిర్వహిస్తోంది. అమెరికా-స్పానిష్‌ యుద్దాలలో 1898లో క్యూబా, పోర్టోరికో, ఫిలిఫ్పీన్సును వలసలుగా చేసుకున్నపుడు అమెరికాను మీడియా సమర్ధించింది. దీన్ని అప్పుడే ఎల్లో జర్నలిజం అని పిలిచారు. అంతెందుకు జపాన్‌పై రెండు అణుబాంబులు వేసిన దుర్మార్గాన్ని కూడా అధికభాగం అమెరికన్‌ మీడియా సమర్ధించింది.యుద్దాన్ని ముగించేందుకు అణుబాంబులు వేయకతప్పలేదని పేర్కొన్నాయి. హిరోషిమా నాశనంలో రేడియోయాక్టివిటీ లేదు అని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక శీర్షిక పెట్టి మరీ రాసింది.అణుదాడితో ప్రమాదకరమైన అణుధార్మికత ఏర్పడదన్న మిలిటరీ అధికారిని ఉటంకించింది. వియత్నాంపై దాడి చేసేందుకు అమెరికా టోంకిన్‌ గల్ఫ్‌ దాడిని సాకుగా చూపింది. ఆ కట్టుకథకు మీడియా ఎంతో ప్రాచుర్యమిచ్చింది. 1980 దశకంలో నికరాగువాలో అమెరికా సిఐఏ ఏజంట్లు, కాంట్రా కిరాయి మూకలు చేసిన చిత్రహింసలు, హత్యలు, దుర్మార్గాలను శాండినిస్టా విప్లవకారులకు అంటగట్టి పత్రికలు ప్రచారం చేశాయి.1990 దశకంలో కువైట్‌పై ఇరాక్‌ దాడి చేసింది. అప్పుడు ఇరాకీ సైనికులు కువైట్‌ ఆసుపత్రుల్లో ఇంకుబేటర్లలో ఉన్న పిల్లలను కిందపడవేసి చంపారని అమెరికా పత్రికలు రాశాయి. ఇలాంటి కట్టుకథలను సాకుగా చూపి ఇరాక్‌ మీద అమెరికా దాడి చేసింది. తరువాత సద్దామ్‌ హుసేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోగేసినట్లు ప్రచారం చేసి దురాక్రమణకు పూనుకోవటం సద్దామ్‌ను హత్యచేసిందీ తెలిసిందే. 2011లో లిబియాపై నాటో దాడిచేసినపుడు కూడా కట్టుకథలు రాశారు. మహిళలపై అత్యాచారాలు చేసేందుకు ఆ దేశ నేత గడాఫీ సైనికులకు వయగ్రా మాత్రలు ఇచ్చాడని రాశారు. సిరియాలో సిఐఏ మద్దతు ఉన్న సలాఫీ జీహాదీ తీవ్రవాదుల దుర్మార్గాలను ప్రభుత్వానికి ఆపాదించారు.ఈ తప్పుడు ప్రచారాన్ని పులిట్జర్‌ బహుమతి గ్రహీత జర్నలిస్టు సేమౌర్‌ హెర్ష్‌ బయట పెట్టినందుకు అమెరికన్‌ కార్పొరేట్‌ మీడియా అతని రచనలను ప్రచురించకుండా నిలిపివేసింది.


అమెరికా దౌత్యవేత్తలు, గూఢచారులను లక్ష్యంగా చేసుకొని క్యూబా, చైనా, రష్యాలు ఎలక్ట్రోమాగటిక్‌ తరంగాలతో దాడులు చేయటంతో వారందరికీ చెవుల్లో గింగుర్లు, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపించినట్లు దీనికి హవానా సిండ్రోమ్‌ అనిపేరు పెట్టి పత్రికలు రాశాయి. ఇది ఒక మానసిక జబ్బు తప్ప మరొకటేమీ కాదని కొందరు నిపుణులు చెప్పారు.నిజానికి అలాంటి అవకాశమే ఉంటే అనేక దేశాల్లో ఉన్న అమెరికన్లందరి మీద ఆప్ఘనిస్తాన్‌ వంటి చోట్ల వాటిని ఇప్పటికే ప్రయోగించి ఉండేవారు. వర్తమానంలో ఉక్రెయిన్‌ సంక్షోభంలో అమెరికా, ఐరోపా మీడియా అల్లిన కట్టుకథలకు లెక్కే లేదు.వీడియో గేమ్‌లను రష్యా దాడులుగా చూపారు.


అమెరికన్‌ మీడియా అనేక దేశాల్లో జరిగిన పరిణామాలను కూడా వక్రీకరించింది.ఇరాన్‌లో మహమ్మద్‌ మొసాద్‌ ప్రభుత్వం 1953లో బ్రిటీష్‌, అమెరికన్‌ చమురు కంపెనీలను జాతీయం చేసినపుడు సిఐఏ తప్పుడు ్పచారాలు చేసింది. 1973లో చిలీ అధ్యక్షుడు, సోషలిస్టు నేత సాల్వడోర్‌ అలెండీపై జరిగిన కుట్ర, తిరుగుబాటు, హత్యను ప్రజాగ్రహంగా వక్రీకరించి రాశారు.2019లో బొలీవియాలో ఎన్నికైన వామపక్ష నేత ఇవో మొరేల్స్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర జరిగింది.దాన్ని సమర్ధించేందుకు ఎన్నికల్లో మొరేల్స్‌ రిగ్గింగుకు పాల్పడినట్లు పత్రికలు రాశాయి. ఇలాంటి ఎన్నో ఉదంతాలు తమను తప్పుదారి పట్టించిన కారణంగానే అమెరికన్లు మీడియాను విశ్వసించటం లేదన్నది వాస్తవం. అంతే కాదు అమెరికన్లు తమ ప్రభుత్వాన్ని కూడా నమ్మటం లేదని జూన్‌ నెల గాలప్‌ పోల్‌ పేర్కొన్నది. ఎల్లవేళలా ప్రభుత్వం చేస్తున్నది సరైనదే అని నమ్ముతున్నవారు కేవలం రెండుశాతమే,ఎక్కువసార్లు మంచే చేస్తున్నదని నమ్మేవారు 19శాతమే ఉన్నారు. పార్లమెంటు మీద ఏడు,న్యాయవ్యవస్థపై 14, అధ్యక్ష వ్యవస్థపై 23, సుప్రీం కోర్టుపై 25,కార్పొరేట్లపై 14, పెద్ద టెక్నాలజీ కంపెనీలపై 26, పోలీసులపై 45శాతాల చొప్పున విశ్వాసం వెల్లడించినట్లు మరొక గాలప్‌ పోల్‌ పేర్కొన్నది.


ప్రపంచం మొత్తం మీద మీడియా విశ్వసనీయ తగ్గుతున్నది.ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన ఎడెల్‌మాన్‌ బారోమీటర్‌ విశ్లేషణ ప్రకారం 46శాతం మంది జర్నలిస్టులను నమ్మటం లేదని చెప్పారు.2021 నవంబరు నెలలో 28 దేశాల్లో 36వేల మందితో జరిపిన సంభాషణల్లో ఇది వెల్లడైంది.సమాజాలు చీలిపోవటానికి ఒక వనరుగా మీడియా ఉందని 46శాతం మంది చెప్పారు. కుహనా వార్తలు రాజకీయ ఆయుధాలుగా మారుతున్నట్లు 75శాతం మంది చెప్పారు. ఫేస్‌బుక్‌లో ఆరు రెట్లు అదనంగా కుహనా వార్తలు పుడుతున్నాయి.


మన దేశ మీడియాలో కొన్ని ఛానళ్లు సంచలన వార్తలకు పేరు మోసినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ డిజిటల్‌ న్యూస్‌ రిపోర్టు 2022 పేర్కొన్నది. దీని కోసం 2,035 మంది ఆంగ్ల పాఠకులను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. అందువలన ఇది మొత్తం అభిప్రాయంగా పరిగణించకూడదు. వారి అభిప్రాయాల ప్రకారం వార్తలను మొత్తం మీద నమ్ముతున్నట్లు చెప్పిన వారు మన దేశంలో 38శాతం మంది ఉన్నారు. సర్వే చేసిన 46 దేశాల్లో మనది 20వ స్థానంలో ఉంది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వార్తలను 75శాతం మంది, రేడియో 72, ది ప్రింట్‌ 61, రిపబ్లిక్‌ టీవి 57, ది వైర్‌ను 57శాతం మంది నమ్ముతున్నారు. వార్తల కోసం తాము ఆన్‌లైన్‌ మీడియా మీద ఆధారపడుతున్నట్లు 84శాతం మంది చెప్పగా ప్రింట్‌ మీడియా మీద 49, టీవీల మీద 59శాతం మంది ఆధారపడుతున్నట్లు వెల్లడించారు.టీవీ ఛానల్స్‌లో బహుళ ఆదరణ పొందినవిగా ఎన్‌డిటివీ, ఇండియా టుడే, బిబిసి ఉండగా పత్రికల్లో టైమ్స్‌ఆఫ్‌ ఇండియా, హిందూస్తాన్‌ టైమ్స్‌, హిందూ ఉన్నాయి. వార్తల కోసం యుట్యూబ్‌ చూస్తామని 53శాతం, వాట్సాప్‌ చూస్తామని 51శాతం చెప్పారు. క్లుప్తంగా కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.కేవలం 36శాతం మందే మీడియా మీద రాజకీయ ప్రభావం లేదని, 35శాతం మంది కార్పొరేట్ల ప్రభావం లేదని భావిస్తున్నారు. అమెరికాలో 30శాతం మంది వార్తల కోసం యాప్స్‌ మీద ఆధారపడుతుండగా భారత్‌లో 82శాతం ఉన్నారు.ఫేస్‌బుక్‌ను నమ్మేవారు 29-65శాతాలుగా ఉన్నారు. వర్గాల వారీ చీలికలు తెస్తున్న వాటిలో రిపబ్లిక్‌ టీవీ, జి న్యూస్‌ ముందున్నాయి. రిపబ్లిక్‌ టీవిని బిజెపి మద్దతుదార్లు 85శాతం మంది ఇతరులు 50శాతం నమ్ముతున్నారు, జి న్యూస్‌ను 85శాతం బిజెపి, 63శాతం ఇతరులు నమ్ముతున్నారు. మొత్తం మీద ఎన్‌డిటివీని 75శాతం మంది బిజెపి మద్దతుదార్లు, ఇతరులు 81శాతం మంది నమ్ముతున్నారు.


మనుషుల మధ్య సంబంధాలను కలిపేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా దోహదం చేసిందో అదే మానవులు అలవోకగా అబద్దాలు ఆడేందుకు,ప్రచారం, మోసం చేసేందుకు సైతం అవకాశం ఇచ్చిందన్నది కాదనలేని సత్యం. రాను రాను పత్రికలు, టీవీ ఛానళ్లతో కూడిన మీడియా మీద రానురాను జనాల్లో విశ్వాసం తగ్గుతున్నది. ప్రత్నామ్నాయంగా ముందుకు వచ్చిన సామాజిక మాధ్యమం కూడా ఇప్పుడు అదే దారిలో ఉంది. సంప్రదాయ మీడియా స్పందించినా లేకున్నా ప్రశ్నించేందుకు ఒక చిరునామా ఉంటుంది. సామాజిక మాధ్యమానికి అది కనిపించదు, పట్టుకోవటం సామాన్యులకు చాలా కష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దుమ్మెత్తి పోసుకుంటున్న టోరీ నేతలు రిషి సునాక్‌ – లిజ్‌ ట్రస్‌ : ఇలాగైతే లేబర్‌ పార్టీకి అవకాశమంటూ పెద్దల గగ్గోలు !

27 Wednesday Jul 2022

Posted by raomk in CHINA, Current Affairs, INTERNATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

anti china, Liz Truss, Rishi Sunak, Tory leadership contest, UK Conservative party, UK Labour party


ఎం కోటేశ్వరరావు


బ్రిటన్‌, ప్రపంచ భద్రతకు చైనా అతి పెద్ద ముప్పుగా ఉందని, స్వేచ్చా దేశాలు చైనా సాంకేతిక దాడిని ఎదుర్కొనేందుకు కొత్త కూటమి ఏర్పడాలని బ్రిటన్‌ కన్సర్వేటివ్‌(టోరీ) పార్టీ నేత రిషి సునాక్‌ అన్నాడు. ఇలా మాట్లాడటం బాధ్యతా రాహిత్యమని, దీని వలన వారి సమస్యలు పరిష్కారం కావని చైనా పేర్కొన్నది. బోరిస్‌ జాన్సన్‌ మంత్రివర్గంలో ఆర్ధిక మంత్రిగా పని చేసిన సునాక్‌ ఆర్ధిక విధానాలతో విబేధాల వలన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు చెబుతూ జూలై ఐదున రాజీనామా చేశాడు.తరువాత రెండు రోజులకే ప్రధాని జాన్సన్‌ కూడా రాజీనామా ప్రకటించాడు.దాంతో కన్సర్వేటివ్‌ పార్టీ పార్లమెంటరీ నేతగా(ప్రధాని పదవికి) తాను పోటీ చేయనున్నట్లు ఎనిమిదవ తేదీన వెల్లడించాడు.ఆ పరుగులో చివరికి సునాక్‌తో పాటు విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ మిగిలారు.కన్సర్వేటివ్‌ పార్టీ సభ్యులు పోస్టు బాలట్‌ ద్వారా ఒకరిని ఎన్నుకుంటారు. ఫలితం సెప్టెంబరు ఐదున ప్రకటిస్తారు. అప్పటి వరకు ఇరువురు నేతలు మద్దతుదార్లను ఆకర్షించేందుకు ముమ్మరంగా ప్రచారం చేస్తారు. దానిలో భాగంగా టీవీ చర్చలో ఇద్దరు నేతలు పరస్పరం చేసుకుంటున్నదాడులతో పార్టీ నష్టపడి వచ్చే ఎన్నికల్లో లేబర్‌ పార్టీకి అవకాశం ఇచ్చేట్లున్నారని కన్సర్వేటివ్‌ పార్టీ పెద్దలు గగ్గోలు పెడుతున్నారు. మాటలదాడులతో పరస్పరం గోతులు తీసుకుంటున్నారని వాపోతున్నారు. పన్నుల విధింపు, బ్రెక్సిట్‌, చైనా చివరికి తాము చదువుకున్న స్కూళ్లను కూడా వారి దాడులలో ప్రస్తావించారు. తొలి టీవీ చర్చలో ఎవరు బాగా మాట్లాడారన్న సర్వేలో సునాక్‌కు 39శాతం మంది, ట్రస్‌ను 38శాతం బలపరిచారు. కాగా టోరీ పార్టీ మద్దతుదార్లలో ట్రస్‌ను 47శాతం, సునాక్‌ను 38శాతం బలపరిచారు. దీన్ని బట్టి కొత్త ప్రధానిగా ట్రస్‌కే అవకాశాలు ఎక్కువని కొందరు సూత్రీకరించారు.


పార్లమెంటులో అధికార పార్టీ మెజారిటీ కోల్పోతే నూతన ప్రభుత్వం లేదా ఎన్నికలు జరుగుతాయి. బ్రిటన్‌లో కన్సర్వేటివ్‌ పార్టీలో తలెత్తిన అంతర్గత సంక్షోభంతో బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా ప్రకటించాడు. దాన్ని అవకాశంగా తీసుకొని ప్రతిపక్ష లేబర్‌ పార్టీ మొత్తం ప్రభుత్వం మీదనే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించగా అధికార పార్టీ దానికి పోటీగా విశ్వాస తీర్మానం పెట్టి పార్లమెంటులో నెగ్గింది. అందువలన సాంకేతికంగా బోరిస్‌ జాన్సన్‌ మీద మరో ఏడాది పాటు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు కానీ పార్టీ నేతగా విశ్వాసం కోల్పోయాడు. నూతన నేతను ఎన్నుకొనేందుకు నిర్ధిష్ట కాలపరిమితేమీ లేదు. కన్సర్వేటివ్‌ పార్టీలో 1922 కమిటీ అనేది ఒకటి ఉంది. పార్లమెంటులో వెనుక బెంచీలలో కూర్చునే వారితో దీన్ని ఏర్పాటు చేస్తారు. సాధారణంగా దీనికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. మెజారిటీ వచ్చినపుడు ప్రధాని పదవికి లేదా ప్రతిపక్షంగా ఉన్నపుడు ప్రతిపక్ష నేతను ఎంపిక చేసే ప్రక్రియలో దీని పాత్ర ఉంటుంది.గతంలో 2016 థెరెస్సా మే ఎన్నిక మూడువారాల్లోపే ముగిసింది. ఇప్పుడు ఇద్దరి కంటే ఎక్కువ మంది పోటీ పడినందున ఒక్కొక్కరిని తొలగించే ప్రక్రియతో ఆలశ్యమైంది. అక్టోబరులో కన్సర్వేటివ్‌ పార్టీ మహాసభ జరిగే లోగా ఎన్నిక జరగాలని 1922 కమిటీ నిర్ణయించిది.సెప్టెంబరు ఐదున ప్రకటించే విజేతను తదుపరి ప్రధానిగా ఎన్నుకుంటారు. అప్పటి వరకు బోరిస్‌ జాన్సన్‌ పదవిలో ఉంటారు, పార్టీ విశ్వాసం కోల్పోయినందున విధానపరంగా, ఇతర మౌలిక నిర్ణయాలేవీ తీసుకోరు.


పార్టీ నేత ఎన్నిక పోటీలో తొలుత రిషి సునాక్‌ ముందున్నట్లు ఓటింగ్‌ తీరు వెల్లడించింది. దాంతో అతనే నూతన ప్రధాని అవుతాడన్నట్లుగా మన దేశ మీడియా వార్తలు ఇచ్చింది. అయితే విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ దూసుకువచ్చి సవాలు విసరటంతో పోటీ రసవత్తరంగా మారింది. రిషి సునాక్‌ బ్రిటన్‌లో స్ధిరపడిన పంజాబీ కుటుంబంలో పుట్టాడు.నలభై రెండు సంవత్సరాల రిషి విద్యార్ధిగా ఉన్నపుడు మన దేశంలో ఇన్ఫోసిస్‌ అధినేత నారాయణ మూర్తి కుమార్తె అక్షితతో ఏర్పడిన పరిచయం 2009లో వివాహానికి దారి తీసింది. వారికి ఇద్దరు పిల్లలు. సనక్‌-అక్షితలు బ్రిటన్‌లోని సంపన్నుల్లో 2022లో 73 కోట్ల పౌండ్లతో 222వ స్థానంలో ఉన్నారు. భారతీయ సంతతికి చెందిన వారు అనేక దేశాల్లో ప్రముఖులుగా, దేశాధినేతలుగా కూడా పనిచేశారు. అమెరికాకు చెందిన ఇండియాస్పోరా అనే స్వచ్చంద సంస్థ 2021లో వెల్లడించిన సమాచారం ప్రకారం ప్రపంచంలో ఉన్న ఐదున్నర కోట్ల మంది ప్రవాస భారతీయ సంతతిలో పదిహేను దేశాల్లో 200 మంది వరకు వివిధ రంగాల్లో ప్రముఖులుగా ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో తొలి మహిళా ఉపాధ్యక్షరాలుగా ఉన్న కమలా హారిస్‌, అక్కడే లూసియానా రాష్ట్ర గవర్నర్‌గా పని చేసిన బాబీ జిందాల్‌, సౌత్‌ కరోలినా రాష్ట్ర గవర్నర్‌గా, ఐరాసలో అమెరికా రాయబారిగా పనిచేసిన నిమ్రతా నిక్కీ హేలీ, బ్రిటన్‌ హౌం మంత్రిగా ఉన్న ప్రీతి పటేల్‌,ప్రధాని పదవికి ఇప్పుడు పోటీ పడుతున్న రిషి సునాక్‌ వంటి వారు ఎందరో ఉన్నారు. వివిధ దేశాధినేతలుగా 30 మంది భారతీయ మూలాలు ఉన్నవారు పని చేశారు. వారిలో బ్రిటీష్‌ గుయానా అధ్యక్షుడిగా పనిచేసి చెడ్డీ జగన్‌ వంటి ఒకరిద్దరు వామపక్ష వాదులను మినహాయిస్తే మిగిలిన వారందరూ ఆయా దేశాల్లో పాలకవర్గాలకు ఇష్టులుగా, అనుకూలంగా పని చేసిన వారే అన్నది స్పష్టం.ప్రస్తుతం కెనడా, బ్రిటన్‌ వంటి చోట్లమంత్రులుగా ఉన్నవారు కూడా అదే తరగతికి చెందిన వారే. అమెరికాలో తొలిసారిగా ఆఫ్రో-అమెరికన్‌ సామాజిక తరగతికి చెందిన బరాక్‌ ఒబామా అధ్యక్షుడిగా పని చేసిన సంగతి తెలిసిందే. నల్లజాతీయుల పట్ల వివక్ష, దాడులు ఏమాత్రం తగ్గలేదు. అంతకు ముందు పాలకులు అనుసరించిన విధానాలనే తు.చ తప్పకుండా అనుసరించాడు. అందువలన ఇప్పుడు ఒక వేళ రిషి సునాక్‌ విజేతగా నిలిచి గడువు మేరకు 2025వరకు పదవిలో ఉన్నా ఇంతకు ముందు బోరిస్‌ జాన్సన్‌ అనుసరించిన విధానాల కొనసాగింపే తప్ప మౌలికమార్పులేమీ ఉండవు.


ప్రస్తుతం రిషి సునాక్‌ాలిజ్‌ ట్రస్‌ కన్సర్వేటివ్‌ పార్టీ మద్దతుదార్లకు తమ విధానాలను వివరించే పనిలో ఉన్నారు. బ్రిటన్‌తో సహా అమెరికా నుంచి భారత్‌ వరకు అనేక దేశాలను చైనా లక్ష్యంగా చేసుకున్నట్లు రుజువుందని, తాను అధికారానికి వచ్చిన తొలిరోజే బ్రిటన్‌లోని 30 చైనా కన్ఫ్యూసియస్‌ సంస్థలను మూసివేస్తానని, చైనా సైబర్‌ ముప్పును ఎదుర్కొనేందుకు ఒక కొత్త నాటో కూటమిని ఏర్పాటు చేస్తానని రిషి సునాక్‌ ప్రకటించాడు. బ్రిటన్‌ సాంకేేతిక పరిజ్ఞానాన్ని చైనా అపహరిస్తున్నదని, విశ్వవిద్యాలయాల్లోకి తన మద్దతుదార్లను చొప్పిస్తున్నదని, వారిని పంపివేస్తానని, రష్యా చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్‌ దురాక్రమణను ప్రోత్సహిస్తున్నదని ఆరోపించాడు. చైనా-బ్రిటన్‌ సంబంధాల అభివృద్ధి అంశంలో పోటీలో ఉన్న వారిలో సునాక్‌ ఒక్కరే స్పష్టమైన,ఆచరణాత్మకమైన వైఖరిని కలిగి ఉన్నారని ఇటీవల చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. దాన్ని పట్టుకొని చైనా, రష్యా పట్ల సునాక్‌ మెతకగా ఉంటారని లిజ్‌ ట్రస్‌ ఆరోపించినదానికి ప్రతిగా చైనా పట్ల కఠినంగా ఉంటానంటూ సునాక్‌ ఎదురుదాడి ప్రారంభించాడు. బ్రిటన్‌లో వ్యూహాత్మకంగా కీలకమైన సంస్థలను చైనా కొనుగోలు చేయటాన్ని అధ్యయనం చేస్తానని, నిషేధిస్తానని పేర్కొన్నాడు.తన స్వంత షింజియాంగ్‌, హాంకాంగ్‌ పౌరులను చిత్రహింసలపాలు చేస్తూ అణచివేస్తుదని,తన కరెన్సీ విలువ పెరగకుండా చూస్తూ ప్రపంచ ఆర్ధికరంగాన్ని తనకు అనుకూలంగా రిగ్గింగ్‌ చేస్తున్నదని అన్నాడు. గుడ్డిగా చైనాను సమర్ధిస్తూ పశ్చిమదేశాలన్నీ దానికి ఎర్ర తివాచీ పరిచాయని జరిగిందేదో జరిగింది, తాను అధికారానికి వచ్చిన తొలి రోజునుంచి ఆ వైఖరిని మార్చివేస్తానని అన్నాడు.


తన కంటే పోటీలో ముందున్న లిజ్‌ ట్రస్‌ను ఎదుర్కొనేందుకు కన్సర్వేటివ్‌ పార్టీలోని చైనా వ్యతిరేకులను సంతృప్తి పరచేందుకు సునాక్‌ యత్నించారన్నది స్పష్టం. మరోవైపు ట్రస్‌ కూడా చైనా మీదనే దాడిని కేంద్రీకరించింది. జి7 కూటమిని ” ఆర్ధిక నాటో ”గా మార్చాలని, అంతర్జాతీయ నిబంధనలను అమలు జరపని పక్షంలో చైనా మీద ఆంక్షలు ప్రకటించాలని చెప్పింది. దక్షిణ చైనా సముద్రాన్ని ఆక్రమిస్తున్నా, తైవాన్ను బెదిరిస్తున్నా, హాంకాంగ్‌లో ఉద్యమాన్ని అణచివేస్తున్నా, ఉఘీర్‌లపై మారణకాండ జరుపుతున్నా గత రెండు సంవత్సరాలలో చైనాతో ఆర్ధిక ఒప్పందాల కోసం ఆర్ధిక మంత్రిగా సునాక్‌ చూశారని, ఇప్పుడు కబుర్లు చెబుతున్న మీరు అప్పుడెక్కడ ఉన్నారని కన్సర్వేటివ్‌ పార్టీ నేత ఇయాన్‌ డంకన్‌ స్మిత్‌ ధ్వజమెత్తాడు. దేశంలో జీవన వ్యయం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపధ్యంలో తాను దుబారాకు దూరంగా ఉంటానని ప్రకటించిన సునాక్‌ ఓట్లకోసం జనం ముందుకు వస్తూ 450 పౌండ్ల విలువగల బూట్లు, మూడున్నరవేల పౌండ్ల ఖరీదైన సూటు ధరించి వస్తున్నారని, అదే తమనేత లిజీ ట్రస్‌ కేవలం నాలుగున్నర పౌండ్ల విలువ గల చెవిపోగులు ధరించి దేశంలో తిరుగుతున్నారని కన్సర్వేటివ్‌ పార్టీ సాంస్కృతిక శాఖ మంత్రి నాదిన్‌ డోరిస్‌ విమర్శించారు.


చైనా మీద ధ్వజమెత్తిన సునాక్‌ సరిగ్గా ఏడాది క్రితం మాట్లాడుతూ చైనాతో సన్నిహిత ఆర్ధిక సంబంధాలు పెట్టుకోవాలని ప్రబోధించాడు. 2021 జూలై ఒకటవ తేదీన మాన్షన్‌ హౌస్‌ వార్షిక విధాన ఉపన్యాసం చేస్తూ 55లక్షల కోట్ల విలువగల చైనా ఆర్ధిక సేవల మార్కెట్‌ గురించి ఐరోపా సమాఖ్య ఒప్పందానికి రావటంలో విఫలమైందని, బ్రిటన్‌ సంస్థలు దాన్ని దక్కించుకొనే లక్ష్యంతో పని చేయాలని సునాక్‌ ఉద్బోధించాడు. అమెరికా కంటే కూడా చైనా మీద ఎక్కువగా కేంద్రీకరించి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నాడు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వెలుపలికి వచ్చిన తరువాత 2021 జనవరి ఒకటి నుంచి సమాఖ్య షేర్‌ మార్కెట్‌ లావాదేవీల సేవలు లండన్‌ నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌, పారిస్‌, న్యూయార్క్‌ నగరాలకు తరలాయి.ఐరోపా సమాఖ్యతో ఎలాంటి ఒప్పందం లేకుండానే బ్రిటన్‌ బయటపడింది. సమాఖ్యతో పోలిస్తే భిన్నమైన షరతులను చైనా అంగీకరించే అవకాశం ఉన్నందున మన విలువలతో రాజీపడకుండా పరస్పరం లబ్ది పొందే విధంగా బ్రిటన్‌ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సునాక్‌ వాదించాడు.
కన్సర్వేటివ్‌ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు బ్రిటన్‌కు అనేక సవాళ్లను తెస్తున్నాయి. ఐరోపా సమాఖ్య నుంచి వెలుపలికి వచ్చిన తరువాత ఇతర దేశాలతో ఒప్పందాలకు పూనుకొని జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని చూస్తున్నది. కుంభకోణాలు, అవినీతి అక్రమాల కారణంగా రెండుగా చీలిన కన్సర్వేటివ్‌ పార్టీ అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. సునాక్‌, లిజ్‌ ట్రస్‌ ఇద్దరూ మంత్రులుగా ఉండి ఏం చేశారో చెప్పకుండా ఇప్పుడు చైనా పట్ల వైఖరి గురించి మాట్లాడుతున్నారు. అంతర్గత అంశాలపై ఏమి చెప్పినప్పటికీ విదేశాంగ విధానం గురించి చైనా మీద కేంద్రీకరించటం మద్దతుదార్లను తప్పుదారి పట్టించటం,చైనా వ్యతిరేకతతో సంతుష్టీకరించేందుకు పూనుకున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా మీద కోపం, కట్టడి పేరుతో మనం చేతులు కాల్చుకోవాలా ?

22 Friday Jul 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, China’s dominance, European Union, FTA, India-EU ties, Narendra Modi Failures, RSS, Trade talks


ఎం కోటేశ్వరరావు


” నవంబరులో షీ జింపింగ్‌తో భేటీకి ఐరోపా నేతలింకా తేల్చుకోలేదు – భారత్‌కు అవకాశాన్ని అందిపుచ్చుకొనే తరుణమిది ” తాజాగా ఒక విశ్లేషణకు పెట్టిన శీర్షిక ఇది. ” తొమ్మిది సంవత్సరాల తరువాత భారత్‌ – ఐరోపా సమాఖ్య వాణిజ్య చర్చల పునరుద్దరణ వెనుక ” అసాధారణ అత్యవసరం ” ముందుకు నెట్టి ఉండవచ్చు ” అన్నది మరొక విశ్లేషణ శీర్షిక. ఏం జరుగుతోంది ? ఒక వైపు ప్రపంచ వాణిజ్య సంస్థలో అన్ని దేశాలకూ సభ్యత్వం ఉంది. దాన్ని పక్కన పెట్టి స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది ? గతంలో మన దేశం కుదుర్చుకున్న ఒప్పందాల సారాంశాన్ని చెప్పాల్సి వస్తే సాఫ్టా( దక్షిణాసియా దేశాల స్వేచ్చా వాణిజ్య ఒప్పందం)తో మాత్రమే మన దేశం లబ్దిపొందింది. మిగతావాటితో మన ఎగుమతులు పెరిగిందేమీ లేకపోగా దిగుమతులు ఎక్కువగా జరిగాయి. అందువలన మరోసారి ఒప్పందాలతో చేతులు కాల్చుకొనేందుకు సిద్దపడుతున్నామా ? గతం కంటే నరేంద్రమోడీ హయాంలో దేశ పరిస్థితి మెరుగుపడిందంటూ మనకు అనుకూలంగా ఉందని చెబుతారా ? అదే నిజం అనుకుంటే మన దిగుమతులు ఎందుకు తగ్గలేదు, ఎగుమతులు ఎందుకు పెరగలేదు ? ఉనికిలో ఉన్న ఒప్పందాలనే ఉపయోగించుకోవచ్చు కదా !


కరోనా కారణంగా కొన్ని కుదుపులు, వృద్ధి రేటు తగ్గినప్పటికీ చైనా కడుపు నిండిన స్థితిలో ఉంది. కనుక మనల్ని లేదా మరొక దేశాన్ని చూసి పశ్చిమ దేశాలు చైనాను వదలి మనవెంటపడతాయని భ్రమించకూడదు. కఠినమైన కరోనా లాక్‌డౌన్‌ కారణంగా తొలి అంచనా 5.5శాతాన్ని అందుకోకపోవచ్చుగానీ జిడిపి పురోగమనం మూడు- నాలుగుశాతం మధ్య ఉంటుందని వార్తలు. అమెరికాతో సహా అనేక దేశాలు ఇప్పటికీ చైనా సరఫరాల మీద ఆధారపడుతున్నాయి. చైనాకు జలుబు చేస్తే మిగతా దేశాలు చీదాల్సిన పరిస్థితి ఏర్పడింది. హాంకాంగ్‌ ఎక్సేంజస్‌, క్లియరింగ్‌(హెచ్‌కెఇఎక్స్‌) సిఇఓ నికోలస్‌ అగుజిన్‌ ఇటీవల లోహాల గురించి జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ 45 -57శాతం ప్రపంచ లోహ వినియోగం చైనాలో జరుగుతోందని,2021 ప్రపంచ ఉత్పత్తిలో 35 నుంచి 55శాతం వరకు లోహాలను చైనాలో శుద్ది చేస్తున్నట్లు చెప్పారు. అందువల్లనే చైనాలో మందగిస్తే అది ప్రపంచానికి మాంద్యం, ద్రవ్యోల్బణానికి కారణం అవుతుందని అన్నారు.


పశ్చిమ దేశాలు మానవహక్కుల గురించి శుద్దులు చెబుతూ తమ దగ్గరకు వచ్చే సరికి వాటిని హరించే దేశాలు, వాటి నేతలతో చెట్టపట్టాలు వేసుకొనే మోసకారితనాన్ని చూస్తున్నాం. మన దేశంలోని కొన్ని శక్తులు వాటి బాటనే నడుస్తున్నాయి. సరిహద్దు వివాదాన్ని చూపి ఇప్పటికీ ఒక వైపు చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతూనే ఉన్నారు. మరో వైపు అక్కడి నుంచి దిగుమతుల్లో నరేంద్రమోడీ సర్కార్‌ రికార్డులను సృష్టిస్తున్నది. ఇది జనాన్ని మోసం చేయటం కాదా ? వరుసగా రెండవ సంవత్సరం కూడా వంద బిలియన్‌ డాలర్లకు పైగా లావాదేవీలు నమోదు కానున్నాయి. జనవరి నుంచి జూన్‌ ఆరు నెలల కాలంలో 67.08 బి.డాలర్లు జరిగింది. దీనిలో మన దిగుమతులు గతేడాది కంటే 34.5శాతం పెరిగి 57.51 బి.డాలర్లకు చేరాయి. మన ఎగుమతులు 35.3శాతం తగ్గినట్లు చైనా కస్టమ్స్‌ శాఖ ప్రకటించింది. మన వాణిజ్యలోటు 47.94 బి.డాలర్లు. గతేడాది 125బి.డాలర్ల లావాదేవీలు జరగ్గా తొలి ఆరునెలల తీరుతెన్నులను బట్టి చూస్తే అంతకంటే పెరగటం తప్ప తగ్గే పరిస్థితి కనిపించటం లేదు. గతేడాది మన ఎగుమతులు 28.14 బి.డాలర్లు కాగా చైనా నుంచి దిగుమతులు 97.52 బి.డాలర్లు. రెండు దేశాలూ లెక్కించే పద్దతిలో తేడాలు ఉన్నందున మన దేశం ప్రకటించే అంకెలు భిన్నంగా ఉండవచ్చు గానీ ధోరణి తెలుస్తున్నది. చైనా మొత్తం విదేశీ వస్తు వాణిజ్య ఆరునెలల్లో 2.94 లక్షల కోట్ల డాలర్లు.


” ప్రభుత్వం స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయదు ” అనే శీర్షికతో 2020 నవంబరు 17న ఒక వార్తను టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించింది. గతంలో చేసుకున్న ఒప్పందాలతో సబ్సిడీలతో కూడిన వస్తువులను మన దేశంలోకి అనుమతించారని, నష్టం జరిగిందని విదేశాంగ మంత్రి జై శంకర్‌ విమర్శించినట్లు, ఒప్పందాలను కుదుర్చుకోబోమని కూడా చెప్పినట్లు ఆ వార్తలో పేర్కొన్నారు. అదే ప్రభుత్వం ఇప్పుడు అలాంటి ఒప్పందాలకు ఉత్సాహపడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతలోనే మార్పుకు కారణం ఏమిటి ? చైనాను ఒక బూచిగా చూపే దేశాలతో ఇటీవలి కాలంలో మన దేశ సంబంధాలు పెరిగిన కారణంగానే చైనాను అడ్డుకొనేందుకు ఒక మార్గంగా వాణిజ్య ఒప్పందాల కోసం తొందర పడుతున్నట్లు కొందరు చెబుతున్నదాన్ని తోసిపుచ్చగలమా ? 2014-15లో మన వాణిజ్యలోటు 118.37 బిలియన్‌ డాలర్లు ఉండగా 2021-22కి అది 192 బి.డాలర్లకు పెరిగింది. వర్తమాన సంవత్సర తీరు తెన్నులను చూస్తే 250కి పెరగవచ్చు. మన దేశం కుదుర్చుకున్న ఒప్పందాలు మనకు లబ్దిచేకూర్చలేదనేందుకు ఇది ఒక సూచిక.కర్ర ఉన్నవాడిదే గొర్రె అన్నట్లుగా బలమైన దేశాలే లబ్ది పొందుతాయి. సాప్టా ఒప్పందంతో మనకు లబ్ది, వాణిజ్య మిగులు కలిగిందంటే దానిలో ఉన్న దేశాల్లో మనది బలమైనది కావటమే. ఆసియన్‌ దేశాలతో ఉన్న ఒప్పందాల కారణంగా 2009-10లో మన వాణిజ్యలోటు ఎనిమిది బిలియన్‌ డాలర్లుండగా 2018-19నాటికి అది 22 బి.డాలర్లకు పెరిగింది.


స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలతో మన జిడిపి ఐదు లక్షల కోట్ల డాలర్లకు సులభంగా చేరుతుందని కొందరు నరేంద్రమోడీ సర్కార్‌కు బిస్కెట్లు వేస్తున్నారు. వాటి వలన విదేశాల నుంచి సరకులను మన మార్కెట్లో గుమ్మరిస్తే ఇక్కడి పరిశ్రమలు, వ్యవసాయ రంగం దెబ్బతింటుంది. తనను మింగేస్తుందనే భయంతోనే అమెజాన్‌ కంపెనీ విస్తరణను అంబానీ అడ్డుకోవటాన్ని చూస్తున్నాము. జర్మనీ కంపెనీ మెట్రో కూడా తన బిజినెస్‌ను ఎవరికో ఒకరికి అమ్మేసి తనదారి తాను చూసుకోవాలని చూస్తోంది. అందువలన చైనా మీద కోపంతో ఇతర ధనికదేశాలతో ఒప్పందాలు చేసుకుంటే మన చేతులు మరింతగా కాలుతాయి. అందుకే ఆర్‌సిఇపిలో చేరేందుకు మనం వెనుకడుగువేశాము. మన దేశంలో చౌకగా శ్రమశక్తి లభిస్తుందని తెలిసినా, నిపుణులైన పనివారున్నారని ఎరిగినా ఐరోపా, అమెరికా నుంచి ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు రాలేదు, చైనా మాదిరి ఎగుమతి వస్తూత్పత్తి జరగటం లేదు.


ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కారణంగా చైనాతో ఐరోపా సమాఖ్య(ఇయు) సంబంధాలు సజావుగా లేవు గనుక ఇప్పుడు మనం చైనా స్థానాన్ని ఆక్రమించేందుకు అవకాశం వచ్చిందని చెబుతున్నారు. అమెరికా, ఐరోపాలకు కావాల్సింది చౌకగా వస్తువులను అందించటం, వారి ఉత్పత్తులకు మార్కెట్లను తెరవటం. ఆ పని ఎవరు చేస్తే వారికి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పటి వరకు అది మనవల్ల కాలేదు. ఐరోపా నేతలను నవంబరులో రావాలని ఆహ్వానించినట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదని చైనా విదేశాంగశాఖ పేర్కొన్నది.కరోనా కారణంగా గత మూడు సంవత్సరాలుగా రాకపోకలు లేవు. ఒకవైపు ఉక్రెయిన్‌ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగవచ్చని చెబుతుండగా దాని ప్రతికూల పర్యవసానాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. ఈ పూర్వరంగంలో అమెరికా కోసం ఆసియాలో చైనాతో కూడా లడాయి పెట్టుకొనేందుకు ఐరోపా సిద్దంగా లేదనే వార్తలు మరోవైపున వెలువడుతున్నాయి. చైనా నుంచి విదేశీ కంపెనీలన్నీ చైనా నుంచి వెలుపలికి పోతున్నట్లుగా జరిగిన ప్రచారం తెలిసిందే.ఇప్పుడు చైనాను బెదిరించేందుకు, రాయితీలు పొందేందుకు పూనుకోవచ్చు తప్ప విస్మరించే అవకాశం లేదు. గాల్వన్‌ ఉదంతం తరువాత మన దేశంలోని కొన్ని శక్తులు చేసిన హడావుడి తరువాత చైనా నుంచి రికార్డు స్థాయిలో మన దిగుమతుల గురించి తెలిసిందే. మరి ఐరోపా, అమెరికా చైనాను ఎలా వదులుకుంటాయి. ఇప్పటికీ వాటి పెట్టుబడులు చైనాలో పెద్ద మొత్తంలో ఉన్నాయి. చైనాకు వ్యతిరేకంగా మన దేశాన్ని నిలిపేందుకు అవి మరింతగా వివాదాన్ని ఎగదోయవచ్చు, వాణిజ్య ఆశలు చూపవచ్చు. ఎక్కడన్నా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా అవి తమలాభాల దగ్గర రాజీపడవు. ఇటీవలి కాలంలో ఐరోపా దేశాలు చైనా మీద దూకుడును తగ్గించాయి.


చైనా నుంచి ఆహ్వానాలు అందిందీ లేనిదీ ఇంతవరకు ఐరోపా దేశాలేవీ తిరస్కరించలేదు, నిర్ధారించలేదు. ఒకవేళ ఆహ్వానం వస్తే ఏమి చేయాలా అని పారిస్‌లో తర్జనభర్జనలు జరుగుతున్నట్లు వార్తలు. అక్టోబరులో చైనా కమ్యూనిస్టు పార్టీ సభల తరువాతనే భేటీ జరగవచ్చు.ఆహ్వానమే గనుక వస్తే తిరస్కరించటం కష్టమని ఐరోపా అధికారులు అంటున్నారు.ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో చైనా-ఇయు వాణిజ్య లావాదేవీల విలువ గతేడాది కంటే పదిశాతం పెరిగి 205బి.డాలర్లకు చేరాయి. 2018లో చైనా మీద అమెరికా వాణిజ్య యుద్దం ప్రారంభించినప్పటికీ, చైనా నుంచి దిగుమతులను నిలిపివేయలేదు. చైనా వస్తువులపై విధించిన దిగుమతి పన్నుల భారం అమెరికన్‌ వినియోగదారుల మీదనే పడుతోంది. చైనా దారికి వచ్చే వైఖరిలో లేదు, కొనసాగిస్తే జనం మీద భారం, తొలగిస్తే ప్రపంచ దృష్టిలో పలుచన అవుతామనే సందేహం అమెరికా నేతల్లో ఉంది.


వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మన వాణిజ్యలోటు 250 బిలియన్‌ డాలర్లకు లేదా జిడిపిలో 7.3శాతానికి చేరనున్నట్లు అంచనా. జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో గతేడాది లోటు 31.4బి.డాలర్లు కాగా ఈ ఏడాది 70.8కి పెరిగింది.మన దేశం ఆర్ధికంగా పెరిగితే చైనాను అరికట్టవచ్చని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఎవరు వద్దన్నారు, ఎవరు అడ్డుకున్నారు, ఎవరు ఇక్కడ కావాల్సింది మనం పెరగటమా చైనాను అరికట్టటమా ? మన ఎగుమతులకు చైనా ఏ విధంగానూ పోటీ కాదు. ఎనిమిదేండ్ల నుంచి నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా అన్నా ఆ బ్రాండ్‌ పేరును పక్కన పెట్టి తాజాగా ఆత్మనిర్భర్‌ అని మార్చినా మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా పెరుగుతున్నాయి. అమెరికా వాడి మాటలను నమ్మి చైనా ఆక్రమణకు వస్తోందనే అంచనాతో లడఖ్‌ ప్రాంతంలో కొండలను ఎక్కించిన మన మిలిటరీని ఇప్పుడు దించలేము, కొనసాగించలేని స్థితి. మన ప్రాంతాలను చైనా ఆక్రమించలేదని గాల్వన్‌ ఉదంతం తరువాత స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.గాల్వన్‌ తరువాత ఇప్పటి వరకు 278 చైనా యాప్‌లను మన దేశం నిషేధించింది. దాని వలన కొంత మన దేశంలో కొంత మందికి మానసిక తృప్తి తప్ప చైనాకు కలిగిన ఆర్ధిక నష్టం ఏమిటో ఎవరూ చెప్పరు. వాటిని నిషేధించినా మన దేశంలోని అనేక సంస్థలలో చైనా పెట్టుబడులు పెద్ద మొత్తంలో ఉన్న వాస్తవాన్ని మూసిపెడితే దాగదు. చైనా జిడిపిలో దాని విదేశీ వాణిజ్య వాటా 35శాతం ఉంది. అమెరికానే అది అన్ని రంగాలలో ముప్పు తిప్పులు పెడుతున్నది.

చైనాఅమెరికా ఇప్పటికీ అగ్రరాజ్యమే, కానీ దానికి ఉండే బలహీనతలు దానికి ఉన్నాయి. అమెరికన్లను నమ్మి దిగితే కుక్కతోక పట్టుకొని గోదావరిని ఈదినట్లే. మమ్మల్ని వెళ్లనివ్వండిరా బాబూ మీకు పుణ్యం ఉంటుంది అని తాలిబాన్ల కాళ్లు పట్టుకొని అమెరికా మిలిటరీ ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి పారిపోయిన తీరును కళ్లారా చూశాము. తరువాత ఉక్రెయిన్ను రెచ్చగొట్టి గోదాలోకి దించారు. కావాలంటే ఎన్ని ఆయుధాలనైనా అమ్ముతాం తప్ప మా సైనికులెవరూ యుద్దానికి రారు అంటూ అమెరికా, నాటో దేశాలు చేతులెత్తేసిన తీరునూ చూశాము. ఉక్రెయిన్‌ కాదు గానీ తైవాన్ను గనుక చైనా ఆక్రమిస్తే సైన్యాన్ని పంపుతామంటూ జో బైడెన్‌ ప్రగల్భాలు పలికాడు. వాటినెవరూ నమ్మటం లేదు. చైనా అంతర్భాగమే తైవాన్‌ అని అమెరికా అంగీకరించింది, దాన్ని ఎప్పుడు విలీనం చేసుకోవటం అన్నది చైనా అంతర్గత అంశం. విలీనం చేసుకుంటే అడ్డుకొనేశక్తి ఏ దేశానికీ లేదన్నది వాస్తవం., పాకిస్తాన్‌ మరొక దేశం ఏదైనా మన రక్షణ జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిందే.వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. మూడూ అణుశక్తి దేశాలే గనుక ఎవరిని ఎవరూ లొంగదీసుకోలేరు, ఎవరి మీద ఎవరూ విజయం సాధించలేరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా- పశ్చిమ దేశాలకు మానవహక్కులు ఒక సాకు-వంచన !

20 Wednesday Jul 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ 1 Comment

Tags

Human Rights, Joe Biden, Oil politics, Ukraine-Russia crisis, US imperialism, west pretence and hypocrisy


ఎం కోటేశ్వరరావు


ఎదుటివారికే చెప్పేటందుకే నీతులు. చరిత్రలో నీతి తప్పిన వారిని చూస్తే పశ్చిమ దేశాలకు మరొకటేదీ సాటి రాదు. మానవహక్కుల వంటి అంశాలను ఆయుధాలుగా చేసుకొని తమకు లొంగని వారి మీద దాడులు చేస్తుంటాయి. వాటికి భంగం కలిగించటంలో అవే ముందుంటాయి. ఒక నాడు సౌదీ అరేబియా రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్ను భ్రష్టుడు, అక్కడ మానవహక్కులు లేవు అని ధ్వజమెత్తిన అమెరికా అధినేత జో బైడెన్‌ ఇప్పుడు అతగాడినే కౌగలించుకున్నాడు. సౌదీ జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గీని సల్మానే టర్కీలో హత్య చేయించినట్లు చెప్పిన అమెరికా 2018 తరువాత ఆ దేశంతో దౌత్య సంబంధాలను కూడా తెంచుకుంది. తరువాత సౌదీ గానీ, రాజుగానీ మారిందేమీ లేదు. ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌లో 2018 అక్టోబరు రెండున ప్రవేశించిన ఖషోగ్గీని అక్కడే హత్య చేయటం వెనుక సౌదీ రాజు హస్తం ఉందని సిఐఏ ఒక నివేదికను బైడెన్‌కు అందచేసింది. జోబైడెన్‌ సౌదీ పర్యటనపై అమెరికా డెమోక్రటిక్‌ సోషలిస్టు బెర్నీశాండర్స్‌ మాట్లాడుతూ ” చూడండి, వందబిలియన్‌ డాలర్ల ఆస్తికలిగిన కుటుంబమది, అది ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తుంది, మహిళలను మూడో తరగతి పౌరులుగా చూస్తుంది.తన ప్రత్యర్ధులను జైలుపాలు చేస్తుంది, మట్టుపెట్టిస్తుంది.” అలాంటి దేశాన్ని సందర్శించి పాలకుడితో చెట్టపట్టాలు వేసుకుంటారా అని విమర్శించాడు. నాలుగు రోజుల మధ్య ప్రాచ్య పర్యటనలో జో బైడెన్‌ సాధించిందేమిటి అన్నది ఒక అంశమైతే తమకు అవసరమైతే గతంలో చెప్పిన మాటలను దిగమింగుతాడని స్పష్టమైంది. ఇదంతా ఎందుకు అంటే రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాల కోసమే.


అమెరికాలో ఇంథన ధరలు ఆకాశాన్నంటాయి.ద్రవ్యోల్బణం నాలుగుదశాబ్దాల గరిష్టాన్ని తాకింది. అవి పెరిగే కొద్దీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అధికారపార్టీకి ఆమేరకు ఓట్లు తగ్గేందుకు సెగతగలనుందనే వార్తలు. మరోవైపున పశ్చిమాసియాలో రష్యాకు మద్దతుదారుగా ఉన్న ఇరాన్ను కట్టడి చేసేందుకు, చమురు ఉత్పత్తి, సరఫరాలను పెంచి రష్యాను ఆర్ధికంగా, రాజకీయంగా దెబ్బతీసేందుకు బైడెన్‌ విఫల పరటన చేశాడని, ఖాళీ చేతులతో వెళ్లాడని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడున్నదాని కంటే అదనపు ఉత్పత్తికి ఎలాంటి హమీ లేదని, ఇప్పటికే రోజుకు పదమూడు మిలియన్‌ పీపాలకు పైగా ఉత్పత్తి చేస్తున్నట్లు సౌదీ రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ చెప్పాడు. అమెరికోసం చైనానో చైనా కోసం అమెరికానో వదులు కోవటం తమ విధానం కాదని, ప్రజలతో వారధి నిర్మిస్తామని సౌదీ విదేశాంగమంత్రి అదెల్‌ అల్‌ జుబైర్‌ చెప్పాడు. బైడెన్‌ పర్యటన తరువాత రష్యా అధినేత పుతిన్‌ ఇరాన్‌ వెళుతున్నాడు. బైడెన్‌తో భేటీ తరువాత సౌదీ రాజు సల్మాన్‌ మాట్లాడుతూ తమ భేటీలో జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గీ హత్య ప్రస్తావన గురించి చెబుతూ ” జరిగింది విచారకరం, అలాంటివి పునరావృతం కాకుండా చట్టపరంగా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ప్రపంచంలో అలాంటి ఉదంతాలు ఎక్కడైనా జరగవచ్చు. ఇరాక్‌లోని అబూ గ్రాయిబ్‌ జైల్లో ఖైదీలపై చిత్రహింసల వంటి అనేక తప్పిదాలకు అమెరికా పాల్పడలేదా” అని ఎదురు ప్రశ్నించాడు.


అమెరికా పధకంలో భాగంగా రష్యాతో వైరం పెంచుకున్న ఐరోపా దేశాలకు ఇంథన సరఫరాలు తగ్గాయి. వేసవి తరువాత చలికాలంలో వెచ్చదనానికి అవసరమైన చమురును ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా అని ఐరోపా చూస్తోంది. ఈ క్రమంలో ఐరోపా సమాఖ్య కూడా ప్రాణ, విత్త, మానభంగములందు ఆడితప్పవచ్చు అన్నట్లుగా మానవహక్కులను ఇంథనం కోసం కొంతకాలం పక్కన పెట్టేందుకు పూనుకుంది.ప్రజాస్వామ్యం లేదు, మానవ హక్కులు మృగ్యం అని ఏ దేశాల గురించైతే చెప్పారో ఇప్పుడు ఇంథనం కోసం వాటినే ఆశ్రయిస్తున్నారు.యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ పాలకుల నిరంకుశ చర్యల గురించి తెలిసిందే. అధ్యక్షుడు మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నిహయన్‌ పారిస్‌ పర్యటనకు వెళితే రాచమర్యాదలు జరిపారు.ఇంథన పధకాల్లో పెట్టుబడుల గురించి వారు చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య ముఖ్యమైన మిలిటరీ, వ్యూహాత్మకంగా గట్టి బంధం ఉందనేందుకు ఇది నిదర్శనమని, మానవహక్కుల సమస్యల కంటే ఇంథన భద్రతకు ఫ్రాన్స్‌ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని విశ్లేషకులు పేర్కొన్నారు. పశ్చిమ దేశాలన్నీ సిరియాపై అమలు జరుపుతున్న ఆంక్షలన్నింటినీ ఎమిరేట్స్‌ వ్యతిరేకించటమే కాదు, వాటిని ఎత్తివేయాలని కోరుతున్నా, అదేమీ తెలియనట్లు ఫ్రాన్స్‌ ఉంది.


తాము నిరంకుశ పాలకుడిగా వర్ణిస్తున్న అజర్‌బైజాన్‌ అధ్యక్షుడు ఇలహమ్‌ అలియెవుతో ఐరోపా సమాఖ్య(ఇయు) అధ్యక్షురాలు ఉర్సులా వాండెన్‌ లెయన్‌, ఇంథన కమిషనర్‌ కద్రి సిమ్సన్‌ అజర్‌బైజాన్‌ రాజధాని బాకులో చర్చలు జరిపారు. ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.సహకార మండలిని ఏర్పాటు చేశారు. వాటి ప్రకారం ఏటా 20బిలియన్‌ ఘనపుటడుగుల గాస్‌ను సరఫరా చేస్తారు. ఇప్పుడున్న సహజవాయు సరఫరా 2021లో 8.1బిసిఎంలను ఈ ఏడాది ఆఖరుకు 12బిసిఎంలకు పెంచుతారు. ఈ సంప్రదింపుల సందర్భంగా గతంలో ఇయు లేవనెత్తిన మానవహక్కుల అంశం ఏమైందని విలేకర్లు అడగ్గా తగు సమయంలో వాటిని లేవనెత్తుతామని, ఇప్పుడు కేవలం ఇంథన సహకారంపైనే కేంద్రీకరించినట్లు ఇయు అధికారులు సమర్ధించుకున్నారు. తమ గురించి మంచిగా చెప్పేందుకు ఐరోపా రాజకీయవేత్తలకు అజర్‌బైజాన్‌ అక్రమంగా ఐరోపా బాంకుల ద్వారా మూడుబిలియన్‌ డాలర్లు చెల్లించినట్లు జర్నలిస్టుల బృందం వెల్లడించింది.


ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుంచి రష్యా, చైనాలు మినహా ఇతర దేశాల గురించి గతంలో పశ్చిమ దేశాలు గతంలో ప్రస్తావించిన మానవహక్కుల అంశాలను పక్కన పెట్టేశారు.ప్రపంచవ్యాపితంగా ప్రజాస్వామ్యం, మానవహక్కుల ఉల్లంఘనల గురించి 2020-24 కార్యాచరణ ప్రణాళికను ఐరోపా సమాఖ్య ప్రకటించింది. నూతన ఇంథన విధానంలో వాటి ప్రస్తావన లేకుండా చేశారు. ఇది ఐరాస నిరంతర అభివృద్ధి లక్ష్యాలకు లోబడి రూపొందించిన న్యాయమైన, సమగ్ర ఇంథన విధానం అని సమర్ధించుకున్నారు. పర్యావరణ పరిరక్షణ గురించి నిత్యం కబుర్లు చెప్పే ఐరోపా అగ్రదేశాలు ఇప్పుడు దానికి హాని కలిగించే బొగ్గుతో విద్యుత్‌ ఉత్పత్తికి పూనుకున్నాయి. దానికి రష్యాను దోషిగా చూపుతున్నాయి. రష్యా కోరుతున్నట్లుగా దాని భద్రతకు హామీ కల్పిస్తే ఉక్రెయిన్‌పై మరుక్షణమే దాడులు ఆగుతాయి, ఐరోపాకు అవసరమైన ఇంథనం రష్యా నుంచి లభిస్తుంది. కానీ వాటికి కావాల్సింది అది కాదు, ఆధిపత్యం. అందుకోసం మానవహక్కులు మంటగలిసినా, పర్యావరణానికి భంగం కలిగినా అమెరికా కూటమి దేశాలకు పట్టదు. గాస్‌ సరఫరాలో ఆటంకాల కారణంగా జర్మనీలో కూడా బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి మరోసారి పెరుగుతోందని జర్మన్‌ ఛాన్సలర్‌ షఉల్జ్‌ చెప్పాడు.


ఒకవైపు రష్యాను దెబ్బతీసేందుకు తమతో సహకరించాలని జో బైడెన్‌ గతవారంలో సౌదీ అరేబియాను కోరాడు. కానీ అదే సౌదీ తన విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన(డీజిలుకు దీనికి కొద్ది తేడా ఉంటుంది) ఇంథనాన్ని రష్యా నుంచి పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకొంటోంది. దీనిలో కొంత భాగం తన రేవులకు వచ్చే ఓడలకు ఇంథనంగా కూడా ఆమ్ముతోంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నప్పటికీ ఉక్రెయిన్‌ వివాదం తరువాత దిగుమతులు పెరిగాయి. గతేడాది ఏప్రిల్‌-జూన్‌ మాసాల్లో 3,20,000 టన్నులు దిగుమతి చేసుకుంటే ఈ ఏడాది అదే కాలంలో 6,47,000 టన్నులకు పెరిగింది. గతేడాది మొత్తంగా పదిలక్షల 50 వేల టన్నులు దిగుమతి చేసుకుంది. దీని వలన చమురును శుద్ది చేసే ఖర్చు తగ్గుతుంది. తన చమురును అధిక ధరకు ఎగుమతి చేసుకోవచ్చు.మరో వైపు అమెరికా పెత్తనం చెల్లదు అనే సందేశాన్ని పంపవచ్చు. చమురు ఉత్పత్తిలో ఒపెక్‌, ఇతర దేశాల్లోని రష్యాతో ఇప్పటి వరకు సౌదీకి మంచి సంబంధాలే ఉన్నాయి.


ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్నదనే సాకుతో తనపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలకు ప్రతిగా రష్యా కూడా కొన్ని ప్రతిచర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. దానిలో కాస్పియన్‌ పైప్‌లైన్‌ కన్సార్టియ(సిపిసి) పైప్‌లైన్‌ మూసివేత ఒకటి. కజకస్తాన్‌ నుంచి రష్యా మీదుగా (నోవోరోస్సిక్‌ రేవు) నల్లసముద్రం వరకు ఈ లైన్‌ ఉంది. దీనిలో పశ్చిమ దేశాలు, ఆసియా, రష్యాకు చెందిన కంపెనీలు భాగస్వాములు. వివాదం తలెత్తిన తరువాత ఈ పైప్‌లైన్‌లో ఒక భాగస్వామి కజకస్తాన్‌ ఐరోపా దేశాలకు చమురు సరఫరాలను పెంచుతున్నట్లు ప్రకటించింది.దీంతో జూలై ఆరు నుంచి 30 రోజులపాటు కజకస్తాన్‌ చమురు సరఫరా నిలిపివేస్తామని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. మార్చినెలలో సంభవించిన తుపాను వలన ఏర్పడిన చమురు తెట్టు కారణాన్ని చూపినప్పటికీ ఐరోపా దేశాలను దెబ్బతీయాలన్నదే దీని వెనుక అసలు కారణం. ఈ లైన్‌ ద్వారా రోజుకు పదిలక్షల పీపాల సరఫరా జరుగుతోంది. దీనిపై ఆధారపడిన చెవరాన్‌, ఎక్సాన్‌ మోబిల్‌, షెల్‌, ఎని అనే పశ్చిమ దేశాల కంపెనీలు పెద్ద ఎత్తున నష్టపోతే అవి ప్రభుత్వాల మీద వత్తిడి పెంచుతాయి. ఇవి కజకస్తాన్‌లో చమురు వెలికితీస్తున్నాయి. ఉక్రెయిన్‌ వివాదం తరువాత ఈ కంపెనీలు కొన్ని రష్యాలో తవ్వకాలను నిలిపివేశాయి.ఒకనాడు భ్రష్టుడన్న సౌదీ రాజు సల్మాన్‌తో జో బైడెన్‌ దిగిన ఫొటో ఒక చర్చగా మారింది. మానవహక్కుల గురించి అమెరికా వంచనకు ఇది పక్కా నిదర్శనమని, వారికి అవసరం అనుకుంటే విలువల వలువలను నిస్సిగ్గుగా విప్పి పక్కన పెడతారంటూ వ్యాఖ్యలు వెలువడ్డాయి.ఐరోపా దేశాలూ దీనిలో తక్కువేమీ కాదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ సంక్షోభంపై అమెరికా కూటమి మల్లగుల్లాలు : అనుకున్నదొకటి అవుతున్నది మరొకటి !

06 Wednesday Jul 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

European Union, G7 summit 2022, NATO, Ukraine war, Ukraine-Russia crisis


ఎం కోటేశ్వరరావు


అమెరికా ఆధిపత్యంలోని నాటో కూటమి సృష్టించిన వివాదంలో ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన ప్రత్యేక సైనిక చర్య బుధవారం నాడు 133వ రోజులో ప్రవేశించించింది. డాన్‌బాస్‌లో కొంత మినహా మిగిలిన ప్రాంతం నుంచి ఉక్రెయిన్‌ మిలిటరీ, దానికి అనుబంధంగా ఉన్న కిరాయి నాజీ మూకలను రష్యా మిలిటరీ తరిమివేసింది. లుహానస్క్‌ ప్రాంతాన్ని విముక్తి చేసినందుకు అధ్యక్షుడు పుతిన్‌ అభినందనలు తెలిపారు. లుహానస్క్‌ వేగంగా పతనం కావటాన్ని చూస్తే రష్యా సేనల మధ్య మెరుగైన సమన్వయం ఉన్నట్లు కనిపిస్తోందని బ్రిటన్‌ రక్షణశాఖ పేర్కొన్నది. మరోవైపు తమ సేనలు వెనక్కు తగ్గటం, రష్యా దళాలను అడ్డుకోవటం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జలెనెస్కీ చెప్పాడు. డాన్‌టెస్క్‌ ప్రాంతం కూడా త్వరలో పతనం కానున్నట్లు వార్తలు. మూలనున్న ముసలమ్మలు, ఉయ్యాళ్లలో ఉన్న పసి పిల్లలు కూడా తుపాకులు పట్టి పుతిన్‌ సేనలను తరిమికొడుతున్నారన్న కథలు ఇప్పుడు ఎక్కడా వినిపించటం లేదు. ఒక వేళ చెప్పినా నాటో కూటమి దేశాల్లో జనం క్రమంగా చెవుల్లో పూలు తొలగించుకుంటున్నారు గనుక నమ్మని పరిస్థితి. కనుక ఆయాసపడినా ఫలితం ఉండదని గ్రహించి వాటిని తగ్గించారు.


గత నెలలో జర్మనీలో జి7, మాడ్రిడ్‌లో నాటో కూటమి సమావేశాలు జరిగాయి. రెండుచోట్లా రష్యాను ఎలా దెబ్బతీయాలి, కొత్త చోట్ల ఎలా చిచ్చు పెట్టాలన్న ఆలోచనల చుట్టూ చర్చలు, నిర్ణయాలు చోటు చేసుకున్నాయి. అంతర్గతంగా జరుగుతున్న మల్లగుల్లాల్లో మాత్రం ఉక్రెయిన్‌ సంక్షోభం నుంచి బయటపడేదెలా ? అనుకున్నదాని కంటే రష్యా మెరుగ్గా ఎలా ఉంది, నెలల తరబడి చేసిన కసరత్తు వృధాగా మారిందా? అన్న అంశాలున్నాయని వార్తలు. ఐరోపా సమాఖ్య(ఇయు) ఆర్ధిక పురోగతికి, దేశాల మధó్య ఆటంకాలను తొలగించుకొనేందుకు ఏర్పడింది.అలాంటి వేదికపై ఇప్పుడు మిలిటరీ అంశాల గురించి చర్చలు చోటు చేసుకుంటున్నాయి. నిరంతరం ప్రపంచంలో సామ్రాజ్యవాదులు రెండు రంగాల్లో యుద్ధాలు చేస్తున్నారు. ఒకటి ఆర్ధిక, రెండవది మిలిటరీ. రష్యా మీద ఆంక్షల రూపంలో అమెరికా, ఐరోపా సమాఖ్య తన నిర్ణయాలను ప్రపంచం మీద రుద్దాలని చూస్తున్నది. వందల కోట్ల డాలర్ల మేరకు ఆయుధాలను అందిస్తూ నాటో కూటమి ఉక్రెయినుకు వెన్నుదన్నుగా ఉంది.


వ్లదిమిర్‌ పుతిన్‌కు దగ్గరగా ఉన్నట్లు భావించిన వారిలో 1,100 మంది ఆస్తులను పశ్చిమ దేశాలు ఆర్థిక ఆంక్షల్లో భాగంగా స్థంభింప చేశాయి. ఐరోపా ద్రవ్యమార్కెట్లకు రష్యన్‌ బాంకులను దూరం చేశారు. రష్యా ఎగుమతులతో పాటు అది ఐరోపా నుంచి చేసుకొనే దిగుమతులపై ఆంక్షలు పెట్టారు.దాదాపు వంద బిలియన్‌ యురోల విలువగల వస్తువులను అడ్డుకున్నారు. దీన్ని ” ఎగుమతి నియంత్రణలను మిలిటరీకరించటం ”గా పిలుస్తున్నారు. ఆర్ధిక కూటమి నుంచి భద్రతా కూటమిగా స్వయంగా మార్పు చెందటంగా చెబుతూ ఇటీవలి కాలంలో ఆ దిశగా ఇయు చేసిన చట్టాలను ఉటంకిస్తున్నారు. అమెరికా ఆదేశాలను ఇయు సభ్య దేశాలపై రుద్దుతున్నది. పరిస్థితిని ఆసరా చేసుకొని అనేక అధికారాలను స్వంతం చేసుకుంది. అమెరికా తాను తీసుకున్న నిర్ణయాలను ముందుగా ఇయుకు చెప్పి తరువాత ఇతర దేశాలతో సంప్రదింపుల తతంగం జరుపుతున్నది. రష్యా మీద అమలు జరిపిన ఈ ఎత్తుగడను చైనాకు విస్తరించేందుకు పూనుకున్నారు.


గతేడాది నవంబరులో అమెరికా సిఐఏ డైరెక్టర్‌ బిల్‌ బర్న్‌ ఐరోపా సమాఖ్య ప్రధాన కార్యాలయం ఉన్న బ్రసెల్స్‌ వచ్చి రహస్య సమావేశాలు జరిపి ఉక్రెయిన్‌ మీద పెద్ద ఎత్తున దాడి చేసేందుకు పుతిన్‌ సిద్దం అవుతున్నాడు, ఏం చేద్దామని అడిగాడు. గత కొద్ది నెలలుగా పుతిన్‌ సన్నద్దం అవుతున్నాడు. మీరు కూడా భాగస్వాములవుతారు గనుక చలికాలంలో గాస్‌ అవసరం మీకుంటుంది. మిమ్మల్ని ఇరుకున పెట్టేందుకుగాను మీరు నిల్వ చేసుకొనేందుకు వీల్లేకుండా గాస్‌ సరఫరాలను తగ్గించాడని కూడా చెప్పాడు. మిలిటరీగా నాటో జోక్యం కుదిరేది కాదు గానీ, కావాలంటే 2014 క్రిమియా విలీనం తరువాత మీరు చేస్తున్న ఆర్ధిక దాడుల్లో మేము కూడా భాగస్వాములం అవుతామని ఇయు నేతలు అంగీకరించారు. ఐదు రకాలుగా ఆంక్షలు అమలు జరపాలని ముందే పధకం వేశారు. తరువాత కసరత్తు చేసి ఎలా అమలు జరుపుతున్నదీ తెలిసిందే. రష్యా సైనిక చర్య డాన్‌బాస్‌ ప్రాంతానికే పరిమితం అవుతుందని, మనకు పెద్దగా పని ఉండదని అనేక మంది భావించారు. ఏకంగా రాజధాని కీవ్‌ మీదనే దాడులు జరపటంతో అంతకు ముందే అనుకున్న దశలవారీ ఆంక్షలను వేగంగా వెంటనే ప్రకటించారు. అది కొన్ని దేశాలకు ఇబ్బందికరంగా మారింది. ఎయిర్‌ బస్‌ కంపెనీకి అవసరమైన టిటానియంను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటారు. దాంతో నాలక్కరుచుకొని అబ్బే వాటికి వర్తించవని సడలించారు. అలాగే కొన్ని దేశాలకు ఇంథన సరఫరాలకు మినహాయింపునిచ్చారు.


ఆంక్షల్లో ఉన్న లోపాలను ఆధారం చేసుకొని మూడవ పక్ష దేశాల నుంచి రష్యన్లు కంప్యూటర్లు, కార్ల విడిభాగాల వంటి వాటిని దిగుమతి చేసుకున్నారు. తమ నుంచి దిగుమతి చేసుకొనే వారు రూబుళ్లలోనే చెల్లించాలన్న ఎత్తుగడ కూడా కొంత మేరకు ఫలించింది.అన్నింటికీ మించి పశ్చిమ దేశాలు ఊహించని విధంగా లబ్ది పొందింది. ఇంథన ఉత్పత్తిని తగ్గించినప్పటికీ ఇప్పటి వరకు గతం కంటే ఎక్కువ ఆదాయం వస్తోంది. తమ ఆంక్షల ఫలితంగా రష్యాలో పదిశాతం ఉత్పత్తి తగ్గుతుందని, ఇరవై శాతం పెట్టుబడులు ఆగుతాయని, అవసరమైన విడి భాగాలకు కొరత ఏర్పడి ఆయుధ పరిశ్రమల మూత, చివరికి ట్రాక్టర్లకు సైతం కొరత, వీటన్నింటి ఫలితంగా ఆర్ధిక సంక్షోభం, రాజకీయంగా పుతిన్‌కు ఎసరు వస్తుందని రాసుకున్న నివేదికలన్నింటినీ పశ్చిమ దేశాలు ముందు వేసుకొని నాలుగు నెలలు గడిచినా అలా ఎందుకు జరగటం లేదని పదే పదే చదువు కుంటున్నాయి. మరోవైపున అమెరికాతో సహా పశ్చిమ దేశాల్లో ద్రవ్యోల్బణం, ఆర్ధిక దిగజారుడు మాంద్యానికి గురికానున్నట్లు వార్తలు. పెరుగుతున్న ఇంథన ధరలు ఐరోపాలోని అనేక దేశాల్లో దారిద్య్రం పెరగనుందని రష్యన్‌ మీడియా చెబుతోంది.


పశ్చిమ దేశాలు ఊహించని మరొక అంశం. రష్యా సరిహద్దులకు వెలుపల మాస్కో నుంచి 1,257 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న రిపబ్లిక్‌ కలినిన్‌గ్రాడ్‌. దీని జనాభా ఐదు లక్షలు. రష్యా నుంచి రోడ్డు మార్గంలో రావాలంటే ఒక వైపున లాత్వియా, లిథువేనియా మీదుగా, మరోవైపు నుంచైతే బెలారస్‌,లిథువేనియా మీదుగా రావాల్సి ఉంటుంది. నౌకా మార్గంలోనైతే బాల్టిక్‌ సముద్రం నుంచి చేరుకోవచ్చు.రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత జర్మనీ-సోవియట్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం జర్మనీ కలినిన్‌గ్రాడ్‌ ప్రాంతాన్ని సోవియట్‌కు అప్పగించింది. 1990దశకంలో సోవియట్‌ విడివడిన తరువాత అది రష్యా ఆధీనంలోకి వచ్చింది. ఉక్రెయిన్‌ వివాదం తలెత్తిన తరువాత ఈ ప్రాంతానికి రష్యా నుంచి సరఫరాలను అనుమతించాలా లేదా అన్నది సమస్యగా మారింది. ఉక్కు, అల్యూమినియం వంటివి ఆంక్షల జాబితాలో ఉన్నప్పటికీ వాటి రవాణాను పునరుద్దరించాలని ఐరోపా సమాఖ్య తాజాగా నిర్ణయించింది. జూన్‌ పదిహేడవ తేదీ నుంచి రైళ్ల ద్వారా నిర్మాణ సామాగ్రి, బొగ్గు,ఖనిజ రవాణాను లిథువేనియా నిలిపివేసింది. ఉక్రెయిన్‌ వివాదానికి ముందు ఎంత పరిమాణంలో సరఫరా ఉంటే అంతే అనుమతిస్తామని ఐరోపా సమాఖ్య చెబుతోంది. కలినిన్‌ గ్రాడ్‌ నుంచి ఇతర దేశాలకు సరఫరా కాకుండా అడ్డుకొనేందుకు ఈ షరతు విధిస్తున్నారు.లిథువేనియా వైఖరితో విబేధించిన జర్మనీ ఐరోపా సమాఖ్య ద్వారా తన నిర్ణయాన్ని అమలు చేయిస్తున్నదని వార్తలు వెలువడ్డాయి. రష్యా-ఉక్రెయిన్‌ వివాదంలో ఆంక్షలను జర్మనీ సమర్ధిస్తున్నప్పటికీ యుద్ధంలో నాటో భాగస్వామి కాకూడదని కోరుకుంటోంది. అనవసర వివాదాలతో రష్యాను మరింతగా రెచ్చగొట్టవద్దని కూడా చెబుతోంది. అయితే లిథువేనియా దీని గురించి రుసరుసలాడుతోంది. ఐరోపా కమిషన్‌లో రష్యా భయాన్ని నింపిందని, ఇది కొన్ని రైల్వే వాగన్ల అంశం కాదని, రష్యా బెదిరింపులకు లొంగినట్లు కనిపిస్తోందని, ఇది ఇంతటితో ఆగదని, ఐరోపాలో చీలికలు తెచ్చేందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుందని, తమ పరువు తీశారని, ఇప్పుడు నాటోలో భాగంగా లిథువేనియాలో ఉన్న జర్మన్‌ దళాలను ఉంచుతారా వెనక్కు తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉందని అక్కడి విశ్లేషకులు చిత్రిస్తున్నారు. చివరికి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాల్సి ఉంది.


జి7, నాటో సమావేశాల్లో ఆంక్షలను మరింతగా పెంచాలని సంకల్పం చెప్పుకున్నారు, ఉక్రెయినుకు ఆయుధ సరఫరాను పెంచాలని నిర్ణయించారు. ఇదే సమయంలో తమ పరువు కాపాడుకుంటూ వివాదాన్ని ఎలా ముగించాలా అనే ఆలోచన కూడా చేస్తున్నారు. తొలి రోజుల్లో ఉక్రెయిను గట్టిగా నిచినట్లు కనిపించినా దాని అడుగుజారుతున్నట్లు అంతర్గతంగా పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. మిలిటరీ, ఆర్ధిక లక్ష్యాలను దెబ్బతీస్తూ రష్యా అడుగులు వేస్తున్నది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే పశ్చిమ దేశాలు ఇచ్చిన అస్త్రాలతో ఉక్రెయిన్‌ ఆత్మరక్షణకు పాల్పడుతున్నది తప్ప రష్యా చేతికి చిక్కిన ప్రాంతాలను తిరిగి పొందే అవకాశం కనిపించటం లేదు. ఉక్రెయిన్‌తో పోలిస్తే ఆర్ధికంగా, ఆయుధపరంగా రష్యా పైచేయితో ఉంది. దాడులు మరికొంత కాలం ఇదే తీరుతో కొనసాగితే అంతర్గతంగా ఉక్రెయిన్‌ జనం స్పందన ప్రతికూలంగా మారవచ్చు.ఇరుగు పొరుగు దేశాలకు శరణార్ధులకు ఆశ్రయం కల్పించటం,ఆర్ధిక సాయం భారంగా మారవచ్చు.


సైనిక చర్య ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, ఇంకా ఎంత మేరకు ఉక్రెయిన్‌ ధ్వంసమౌతుందో అంచనా లేదు. ఇప్పటి వరకు జరిగినదాన్నుంచి పునర్‌నిర్మాణం జరగాలంటే 750బిలియన్‌ డాలర్లు అవసరమని, ఈ బాధ్యతను ప్రజాస్వామిక ప్రపంచమే చేపట్టాలని జెలెనెస్కీ డిమాండ్‌ చేస్తున్నాడు. ఉక్రెనియన్లలో అసంతృప్తి తలెత్తకుండా చూసేందుకు పునర్‌నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నట్లు హడావుడి చేస్తున్నారు. ఇప్పటి వరకు 6.84 బిలియన్‌ డాలర్ల ప్రతిపాదనలు వచ్చినట్లు ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్స్‌ ప్రకటించారు, ఎక్కడ 750 ఎక్కడ 6.84 బి.డాలర్లు ? స్విడ్జర్లాండ్‌లో జరిగిన రెండు రోజుల సమావేశంలో 40 దేశాలు, సంస్థలకు చెందిన వారు తాము భాగస్వాములం అవుతామని సంతకాలు చేశారు. ఈ సంక్షోభం పరోక్షంగా ప్రపంచమంతటినీ ప్రభావితం చేస్తోంది. పరిస్థితి ఇంకా దిగజారితే దాన్ని ఎగదోస్తున్న పశ్చిమదేశాల వైపు చూపే వేళ్ల సంఖ్య పెరుగుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యా, చైనాలపై దాడే 48వ జి7 శిఖరాగ్ర సభ లక్ష్యం !

30 Thursday Jun 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

48th G7 summit, G7 summit 2022, Joe Biden, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


జూన్‌ 26 నుంచి 28వ తేదీ వరకు జర్మనీలోని బవేరియా ఆల్ఫ్స్‌ ప్రాంతంలోని ఎలమౌ కాజిల్‌ రిసార్ట్‌లో 48వ జి7 శిఖరాగ్ర సమావేశం జరిగింది. ” ధర్మ బద్ధ ప్రపంచం వైపు పురోగమనం ” అనే ఇతివృత్తంతో దీన్ని నిర్వహించారు. ఈ సభ కొనసాగింపుగా 29-30 తేదీల్లో స్పెయిన్లోని మాడ్రిడ్‌ నగరంలో నాటో కూటమి సమావేశాలను ఏర్పాటు చేశారు. జి7 సమావేశానికి మన ప్రధాని నరేంద్రమోడీతో పాటు అర్జెంటీనా, దక్షిణ ఆఫ్రికా, ఇండోనేషియా, సెనెగల్‌ దేశాధినేతలను కూడా ఆహ్వానించారు. ఎడతెగని, ఎప్పుడూ ఉండే,ఎవరూ పాటించని పర్యావరణం, ఉగ్రవాద నిరోధం, ఆహార భద్రత వంటి అంశాల గురించి ఈ సమావేశంలో సుభాషితాలను పక్కన పెడితే రెండు కీలక అంశాల మీద అమెరికా పెత్తనంలోని ఈ కూటమి కేంద్రీకరించిందని చెప్పవచ్చు. అవి రష్యా మీద మరిన్ని ఆంక్షలు, చైనాను నిలువరించే పధకాలు. ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య ఐదవ నెలలో ప్రవేశించింది. ఇప్పటికే తూర్పున ఉన్న డాన్‌బాస్‌ ప్రాంతాన్ని, కీలక రేవులు, పారిశ్రామిక ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ మిలిటరీ, దానితో కలసి ప్రతిఘటిస్తున్న కిరాయి మూకలను ఆ ప్రాంతం నుంచి రష్యా తరిమివేసింది. కొత్త ప్రాంతాలకు దాడులను విస్తరించింది.చమురు ఎగుమతులపై విధించిన ఆంక్షలు పెద్దగా ప్రభావం చూపకపోవటంతో బంగారం కొనుగోళ్లను నిలిపివేయాలని జి7 కూటమి పిలుపునిచ్చింది. దీంతో పాటు మరిన్ని ఆయుధాలను పంపాలని నిర్ణయించింది.


నవంబరులో జరిగే పార్లమెంటు ఎన్నికలలో అధికార డెమోక్రటిక్‌ పార్టీకి దెబ్బతగుల నుందన్న వార్తల నేపధ్యంలో లబ్దిపొందేందుకు జో బైడెన్‌ ఈ సమావేశాలను వినియోగించుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఒక అంశం మాత్రమే అని చెప్పవచ్చు. ఉక్రెయిన్‌ మిలిటరీ అనేక ప్రాంతాల నుంచి వెనుదిరుగుతున్న పూర్వరంగంలో అనేక దేశాలు పునరాలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నందున నాటో కూటమి, ఇతర దేశాలను నిలువరించేందుకు అమెరికా పూనుకుంది. రష్యా నుంచి బంగారం దిగుమతులపై నిషేధం కేవలం ఒక ప్రచార అస్త్రం తప్ప రష్యా మీద పెద్దగా ప్రభావం పడదని విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది 15.5బిలియన్‌ డాలర్ల మేరకు అక్కడి నుంచి ఎగుమతులు జరిగాయి. ప్రపంచంలో పదిశాతం( 2021లో 333.4 టన్నులు) బంగారాన్ని ఉత్పత్తి చేస్తూ రష్యా రెండవ స్థానంలో ఉండగా 370 టన్నులతో చైనా ప్రధమ స్థానంలో ఉంది.రష్యా నుంచి దిగుమతులు చేసుకొనే దేశాల్లో మనది కూడా ఒకటి. దాని ఎగుమతులపై నిషేధం వలన చమురు ధరలు పెరిగినట్లుగానే బంగారం ధరలు, వాటితో పాటు ద్రవ్యోల్బణం కూడా పెరగవచ్చు. చమురును ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లుగానే బంగారానికి కూడా మార్కెట్లను రష్యా చూసుకుంటుందని చెబుతున్నారు.


తాము సృష్టించిన ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని మరింత ఎగదోసేందుకు తప్ప పరిష్కరించేందుకు జి7 సమావేశం ఎలాంటి చొరవ చూపలేదు. రానున్న ఐదు సంవత్సరాల కాలంలో లాభాలు వచ్చే పధకాలపై పెట్టుబడులకు 600బిలియన్‌ డాలర్లు సేకరించాలని ఈ సమావేశం పిలుపునిచ్చింది తప్ప అనేక దేశాల్లో తలెత్తిన ఆకలి మంటల గురించి ధనిక దేశాలు పట్టించుకోలేదు. ఆసాధారణ ప్రపంచ ఆకలి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని, ప్రపంచ ఆహార మార్కెట్‌ను స్థిరంగా ఉండేట్లు చూడాలని, ధరల ఒడిదుడుకులను నివారించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్రెస్‌ జి7 కూటమిని కోరారు. ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో 29శాతం వాటా కలిగిన ఉక్రెయిన్‌, రష్యాల నుంచి ఎగుమతుల పునరుద్దరణకు ప్రభావశీలమైన పరిష్కారాన్ని కనుగొనకపోతే ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. నేతలు తమ ప్రసంగాల్లో ఆహార భద్రత గురించి ప్రస్తావించటం తప్ప నిర్దిష్ట చర్యలు లేవు. ఉక్రెయిన్‌ రేవుల్లో నిలిచిన రవాణా పునరుద్దరణ, తమ దేశం నుంచి ఎరువులు, ఆహార ధాన్యాల ఎగుమతులకు విధించిన ఆంక్షల ఎత్తివేతతో పాటు సముద్రాల్లో ఉక్రెయిన్‌ ఏర్పాటు చేసిన మందుపాతరలను తొలగించాలని రష్యా డిమాండ్‌ చేస్తోంది.


ప్రపంచంలో వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆరువందల బిలియన్‌ డాలర్లు సేకరించాలని జి7 కూటమి నిర్ణయింది. ఈ మొత్తం చైనాను అడ్డుకొనేందుకు అని ఎక్కడా చెప్పకపోయినా దాని బిఆర్‌ఐ పధకాన్ని అడ్డుకొనేందుకే అని మీడియా పేర్కొన్నది. ప్రపంచ మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల కోసం భాగస్వామ్యం(పిజిఐఐ) అనే పేరుతో ఒక పధకాన్ని అమలు జరపాలని గతేడాది లండన్‌ సమావేశంలోనే ఒక పధకాన్ని ఈ కూటమి ప్రకటించింది. ఇప్పుడు 2027నాటికి ఆరువందల బిలియన్లతో ఒక నిధిని ఏర్పాటు చేయాలని సంకల్పం చెప్పుకున్నారు. ఇది చైనా 2013 నుంచి అమలు చేస్తున్న బిఆర్‌ఐ పధకానికి పోటీగా పరిగణిస్తున్నారు. ఇదేదో దయా-ధర్మం కాదు దీనిలో పెట్టుబడులు పెట్టిన వారందరికీ అమెరికన్లతో సహా అందరికీ ఫలితాలు ఉండాల్సిందే అని స్పష్టం చేస్తున్నా అని జో బైడెన్‌ చెప్పారు.అభివృద్ధి చెందుతున్న దేశాలలో అవసరమైన మౌలిక, ఆధునిక వసతుల కల్పనకు 40లక్షల కోట్ల డాలర్లు అవసరమని అంచనా. తాము 200 బిలియన్‌ డాలర్లు ఇస్తామని అమెరికా చెబుతుండగా తాము 317బి.డాలర్లు సమకూర్చుతామని ఐరోపా సమ్యాఖ్య పేర్కొన్నది.


అసలు జి 7 అంటే ఏమిటన్న ప్రశ్న కొంతమందికైనా తలెత్తటం సహజం.అమెరికా,జపాన్‌, కెనడా, నెదర్లాండ్స్‌తో తలెత్తిన వివాదంలో ఆ దేశాలకు చమురు సరఫరాలపై నిషేధం విధిస్తున్నట్లు ఒపెక్‌ దేశాలు చేసిన ప్రకటన 1973లో చమురు సంక్షోభానికి దారి తీసింది. దాన్నుంచి బయడపడేందుకు ధనికదేశాల ఆలోచన నుంచి పుట్టిందే జి7. చమురు, విత్త సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ధనిక దేశాలు ఉమ్మడిగా చేసిన ఆలోచనకు ఒక రూపమే 1975లో ఏర్పడిన ఈ దేశాల బృందం. నాటి ఫ్రెంచి అధ్యక్షుడు వాలెరీ గిస్కార్డ్‌, జర్మన్‌ ఛాన్సలర్‌ హెల్మట్‌ స్మిత్‌ చొరవతో పారిస్‌లో అమెరికా,బ్రిటన్‌,ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ నేతలు తొలి సమావేశం జరిపారు.మరుసటి ఏడాది కెనడా, 1998లో రష్యా చేరింది. దాంతో అది జి8గా మారింది. 2014లో ఉక్రెయిన్‌ ఏలుబడిలో ఉన్న క్రిమియా ప్రాంతాన్ని రష్యా స్వాధీనం చేసుకోవటంతో ఆ బృందం నుంచి తొలగించిన తరువాత తిరిగి జి7గా మారింది.1981 నుంచి ఐరోపా సమాఖ్య(ఇయు)ను శాశ్వత ఆహ్వానిత సంస్థగా మార్చారు. ప్రతి సంవత్సరం ఒక సభ్యదేశ ఆతిధ్యంలో శిఖరాగ్ర సమావేశాలు జరుగుతాయి.సహజంగా ఆ దేశాధినేతలే ఏడాది పాటు అధ్యక్ష స్థానంలో ఉంటారు. ఈ బృందానికి ఒక కేంద్ర స్థానం లేదా శాశ్వత సిబ్బందిగానీ ఉండరు. ఇప్పటి వరకు గత ఎనిమిది సంవత్సరాల్లో నరేంద్రమోడీ మూడు సమావేశాల్లో పాల్గొన్నారు. అంతకు ముందు మన్మోహన్‌ సింగ్‌ పదేండ్ల కాలంలో ఐదు సార్లు అతిధిగా వెళ్లారు. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రపంచ రాజకీయాలు, ఆర్ధిక రంగంలో మన దేశానికి ఉన్న ప్రాధాన్యత రీత్యా మన దేశానికి ప్రతిదేశం ఆహ్వానం పలుకుతోంది. గత ఎనిమిదేండ్లలో మూడు సార్లు ఆహ్వానించటం నరేంద్రమోడీ ఘనత అన్నట్లు కొందరు చిత్రిస్తున్నారు.


ఉక్రెయిన్‌ సంక్షోభం తలెత్తిన తరువాత రష్యా సైనిక చర్యను ఖండించటమా లేదా అన్న అంశంపై ప్రపంచ దేశాలు మూడు శిబిరాలుగా మారాయి. ఒకటి అమెరికా బాటలో ఖండించే, రెండవది రష్యాను సమర్ధించే, మూడవది తటస్థంగా ఉండే దేశాలు. మనది, చైనా మూడవ తరగతిలో ఉన్నాయి. ఖండించని దేశాలన్నీ రష్యాను సమర్ధించినట్లేనని అమెరికా కూటమి చిత్రిస్తోంది. జర్మనీ సభకు భారత్‌ను ఆహ్వానించటం గురించి అమెరికా జాతీయ భద్రతా మండలి సమన్వయకర్త జాన్‌ కిర్బీ మాట్లాడుతూ లోతైన, భిన్నమైన అజెండా ఉన్న కారణంగానే భారత్‌ను ఆహ్వానించారు తప్ప రష్యా నుంచి వేరు చేసేందుకు కాదన్నారు. ఆహ్వానించాలా లేదా అని జర్మనీ మల్లగుల్లాలు పడినట్లు వార్తలు వచ్చాయి తప్ప నిజానికి అందుకే పిలుస్తున్నట్లు ఎవరూ ఎక్కడా చెప్పలేదు. కానీ అమెరికా ప్రతినిధి కడుపు ఉబ్బరాన్ని ఆపుకోలేక అంతరంగాన్ని మరో రూపంలో వెల్లడించాడు. ఇతివృత్తం ఒకటైతే నిజానికి అక్కడ జరిగిన ప్రధాన చర్చ అంతా చైనా, రష్యాలను దెబ్బతీయటం ఎలా అన్నదాని చుట్టూనే తిరిగింది. ఆర్ధిక స్థిరత్వం, మార్పు, ప్రపంచ ఆరోగ్యమెరుగుదల, ప్రపంచ పర్యావరణ రక్షణ, నిరంతర పెట్టుబడుల వంటి వన్నీ మాయపుచ్చే అంశాలే. ప్రపంచ చట్టబద్ద సంస్థలు చేసిన నిర్ణయాలు, లక్ష్యాలనే ఈ దేశాలు ఖాతరు చేయటం లేదు. తొలి రోజు సమావేశంలో రష్యా చమురు ధరలను ఎలా అదుపు చేయాలన్న అంశం మీద, ఉక్రెయినుకు మరిన్ని ఆయుధాలిచ్చి ఎలా నిలబెట్టాలా అన్నదాని మీద కేంద్రీకరించారు తప్ప తమతో సహా అనేక దేశాలను అతలాకుతలం చేస్తున్న ద్రవ్యోల్బణాన్ని పట్టించుకోలేదు. గోధుమలపై మన దేశం నిషేధం విధించినపుడు పశ్చిమ దేశాలు విమర్శించాయి, తరువాత దాన్ని పంచదారకు పొడిగించారు. మోడీ జర్మనీ వెళుతుండగా బియ్యం ఎగుమతులపై నిషేధ ఆలోచన ఉన్నట్లు వార్తలొచ్చాయి.


ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో మన ప్రధానులు తొమ్మిది సార్లు అతిధులుగా పాల్గొన్నారు.అతిధులుగా వెళ్లిన వారు ఎవరైనప్పటికీ ధర్మోపన్యాసాలు చేయటం, ఆతిధ్యాన్ని పుచ్చుకోవటం తప్ప అజెండాను నిర్ణయించే అవకాశం ఉండదు. హాజరైన దేశాధినేతలు, సంస్థల ప్రతినిధులతో తాను అభిప్రాయ మార్పిడి చేసుకుంటానని జర్మనీ వెళ్లే ముందు ప్రధాని నరేంద్రమోడీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కూటమి దేశాల నేతలు ఒక వైపు ఇలాంటి శిఖరాగ్ర సమావేశాల్లో గొప్ప ప్రకటనలు చేస్తూనే మరోవైపు తమ స్వంత అజెండాలతో వివిధ దేశాలతో వ్యవహరించటం తెలిసిందే. ఇతర దేశాల మీద దాడులు, ఆరోపణలు, తప్పుడు ప్రచారం చేయటంలో దాదాపు అన్నీ ఒక గూటి చిలుకలుగానే ఉంటాయి. ఉక్రెయిను సంక్షోభం గురించి ఈ బృందనేతలు మాట్లాడుతున్న సమయంలో మన ప్రధానిగా ఎవరున్నా మౌన ప్రేక్షుకుడిగా ఉండటం లేదా ఏదో ఒకమిషతో వెలుపలికి రావాల్సిందే తప్ప మన వైఖరిని వెల్లడించే లేదా సమర్ధించుకొనే అవకాశం ఉండదు. అమెరికా దేశాల శిఖరాగ్ర సమావేశానికి వెనెజులా, క్యూబాలను మినహాయించిన అమెరికా దుశ్చర్యను అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్‌ ఆ సమావేశంలో సభ్య హౌదాలో ఉతికి ఆరేశారు. అదే జి7 సమావేశంలో ఆహ్వానితుడిగా ఉన్నందున ఆ విధంగా మాట్లాడలేరు. ఎవరికైనా ఈ పరిమితులు ఉంటాయి. ఉక్రెయిను వివాదంలో మన దేశాన్ని తమవైపు తిప్పుకొనేందుకు అమెరికా కూటమి ఎప్పటికప్పడు గాలాలు వేస్తూనే ఉంటుంది.చైనాను బూచిగా చూపి మనలను తమవైపు తిప్పుకొనేందుకు చేయని యత్నం లేదు. వర్తమాన రాజకీయ అంశం ఉక్రెయిన్‌ వివాదంలో పశ్చిమ దేశాలతో చేతులు కలపకపోయినా మిగతా అంశాలలో మీతోనే ఉంటామనే సందేశాన్ని ఇప్పటికే నరేంద్రమోడీ సర్కార్‌ ఇచ్చింది. దాని కొనసాగింపుగానే ఈ సమావేశానికి హాజరైనట్లు చెప్పవచ్చు.


జర్మనీ జి7 సమావేశాల్లో నరేంద్రమోడీని అమెరికా అధినేత జో బైడెన్‌ పలుకరించిన తీరును మీడియా ప్రత్యేకంగా చూపింది. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌తో మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చి నరేంద్రమోడీ భుజం తట్టి మరీ జో బైడెన్‌ పలుకరించారు. ఇది నరేంద్రమోడీ ఘనతగా చిత్రిస్తున్నారు.మన దేశాన్ని తమ కూటమిలో చేర్చుకొనేందుకు ఎలాంటి గాలం వేస్తారో డోనాల్డ్‌ ట్రంప్‌ తీరు తెన్నులు వెల్లడించాయి.జి 7 కూటమి కాలం చెల్లిన దేశాలతో ఉంది, దాన్ని విస్తరించాలని ట్రంప్‌ ఒకసారి చెప్పాడు.ఆస్ట్రేలియా,భారత్‌, దక్షిణ కొరియా, రష్యాలతో విస్తరించాలని అందుకే 2020 సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పాడు. నరేంద్రమోడీకి ఫోన్‌ చేసి మరీ ఆహ్వానం పలికాడు. నిజమే అనుకొని మన దేశం జి7లో చేరినట్లుగానే కొందరు కలలు కన్నారు. అమెరికా తరువాత పెద్ద ఆర్ధికశక్తిగా ఉన్న చైనాను పక్కన పెట్టి ధనికదేశాల బృందాన్ని విస్తరించటం అంటే అది చైనాను కట్టడి చేసేందుకే అన్నది స్పష్టం. ఇప్పుడు జి7 సమావేశానికి వెళ్లి సాధించిందేమిటో నరేంద్రమోడీ దేశానికి చెప్పాల్సి ఉంటుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యా మీద ఆంక్షల పర్యవసానాలను ఊహించని పశ్చిమ దేశాలు !

08 Wednesday Jun 2022

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

100 days Ukraine crisis, Ukraine war, Ukraine-Russia crisis, US imperialism


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమై బుధవారం నాటికి 105వ రోజుకు చేరింది. అమెరికా, ఇతర నాటో దేశాలు ప్రపంచం మీద రుద్దిన సంక్షోభ పర్యవసానాలను ఉక్రెేనియన్లు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. పరోక్షంగా మన దేశంతో సహా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వందవ రోజు సందర్భంగా ఆ సంక్షోభం గురించి అనేక మంది పాఠాలు, గుణపాఠాలు అంటూ తమ వైఖరులను వెల్లడించారు. ఏ దాడి లేదా యుద్దంలోనైనా ముందుగా నిజాలు బలి అవుతాయి. వంద రోజులు దాటిన తరువాత కూడా ఉక్రెయిన్లో నిజంగా జరుగుతున్నదేమిటి? అమెరికా కూటమి దేశాలు చెబుతున్నట్లుగా రష్యాకు ఎదురు దెబ్బలు తగిలాయా ఏమిటి అన్నది స్పష్టంగా వెల్లడికావటం లేదు.అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కొన్ని అంశాలను చూద్దాం.


ఇరవై శాతం భూభాగం తమ పట్టునుంచి తప్పిందని స్వయంగా ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ ప్రకటించాడు. అది గత ఎనిమిది సంవత్సరాలుగా స్వాతంత్య్రం ప్రకటించుకున్న తిరుగుబాటుదారులది పైచేయిగా ఉన్న డాన్‌బాస్‌ ప్రాంతం. ఉక్రెయిన్‌ మిలిటరీ, దాని కనుసన్నలలో పని చేసే కిరాయి నాజీమూకలు ఒక వైపు, రష్యా మద్దతు ఉన్న తిరుగుబాటు దార్ల మధ్య అక్కడ అంతర్యుద్దం జరుగుతున్నది. రష్యా ప్రారంభించిన సైనిక చర్యలక్ష్యాలలో ఈ ప్రాంతంలోని నాజీ మూకలను అంతం చేయటం, నాటోలో చేరి తమ సరిహద్దులో అమెరికా, ఇతర దేశాల మిలిటరీ,ఆయుధాలను మోహరించేందుకు పూనుకున్న ఉక్రెయిన్‌ జీవనాడులను దెబ్బతీసి ఆ ప్రక్రియనుంచి వెనక్కు తగ్గేట్లు చేయటం ఉన్నాయి. ఈ ప్రక్రియ కొద్ది రోజుల్లోనే పూర్తవుతుందని వేసిన అంచనాలు తప్పాయి. పశ్చిమ దేశాలు అందించిన ఆధునిక ఆయుధాలే దానికి కారణం. నయా నాజీ మూకలు, మిలిటరీ దాడుల నుంచి డాన్‌బాస్‌ పౌరులను రక్షించాలన్న లక్ష్యం నెరవేరేందుకు వందరోజులు పట్టింది. ఇక్కడ గ్రహించాల్సిన అంశాలు రెండున్నాయి. ఒకనాడు రష్యాలో అంతర్భాగంగా ఉన్న క్రిమియా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొనేందుకు రష్యాను పురికొల్పిన కారణం కూడా ఉక్రెయినుకు నాటో తీర్ధం ఇవ్వాలన్న పశ్చిమ దేశాల ఎత్తుగడే.


క్రిమియాను తిరిగి స్వాధీనం చేసుకోవటం ఉక్రెయినుకు సాధ్యం కాలేదు, ఇప్పుడు తమ పట్టునుంచి జారిందని చెబుతున్న డాన్‌బాస్‌ ప్రాంతాన్ని కూడా నాటో కూటమి దేశాలు ఎన్ని ఆయుధాలు ఇచ్చినా తిరిగి ఉక్రెయిన్‌ ఆధిపత్యంలోకి వస్తుందా అన్నది అపూర్వచింతామణి ప్రశ్న.పూర్వపు సోవియట్‌ నుంచి విడిపోయి దేశంగా ఏర్పడిన వాటిలో జార్జియా ఒకటి. దీనిలో అబ్కాజియా, దక్షిణ ఒసెట్టి అనే ప్రాంతాలు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. వాటిని రష్యా గుర్తించటమే కాదు, అక్కడి ప్రభుత్వాలతో రక్షణ ఒప్పందాలను కూడా కుదుర్చుకొన్నది. జపాన్‌తో అమెరికా రక్షణ ఒప్పందం కుదుర్చుకొని అక్కడ తన సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసి మిలిటరీని ఎలా దించిందో అదే పద్దతిలో ఇక్కడ రష్యా కూడా ఆ రిపబ్లిక్కులకు రక్షణ కల్పిస్తోంది.ఈ రెండు ప్రాంతాలు జార్జియాలో ఇరవైశాతం కలిగి ఉండేవి. అందువలన డాన్‌బాస్‌ ప్రాంతం కూడా వచ్చే రోజుల్లో ఇదే మాదిరి స్వతంత్ర రాజ్యం లేదా రెండు రాజ్యాలుగా ఏర్పడి రష్యాతో మిలిటరీ రక్షణ ఒప్పందాలను కుదుర్చుకొని విడిగా కొనసాగవచ్చు.


ఉక్రెయిన్‌ సంక్షోభం నేర్పిన ఒక పాఠం ఏమంటే అమెరికాను నమ్ముకుంటే తన ఎత్తుగడలో భాగంగా ఒక దేశాన్ని మరొక దేశం మీదకు ఉసిగొల్పుతుంది తప్ప తన మిలిటరీని పంపి ప్రత్యక్షంగా రంగంలోకి దిగదు అన్నది స్పష్టమైంది. కొరియా, వియత్నాంలపై జరిపిన దాడులు, ఉగ్రవాదులను ఎదుర్కొనే పేరుతో ఆఫ్ఘనిస్తాన్‌లో జోక్యం చేసుకొన్ని తిన్న చావుదెబ్బలే దీనికి కారణం అని వేరే చెప్పనవసరం లేదు. సిరియా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కిరాయి మూకలను పశ్చిమదేశాలు సమీకరించినా అది సాధ్యం కాలేదు. ఉక్రెయిన్లో కూడా దాదాపు పాతిక వేలమందిని సమీకరించి జనం మీద దాడులు చేయించారు. మరియుపూల్‌ నగరంలోని ఉక్కు కర్మాగారాన్ని స్థావరంగా చేసుకొని మూడు నెలలపాటు రష్యన్లను ఎదిరించింది కూడా ఈ మూకలే. ఆ ఫ్యాక్టరీని ముట్టడించిన రష్యన్లు అక్కడి వారికి అవసరమైన సరఫరాలను అడ్డుకోవటంతో చివరికి వేలాది మంది లొంగిపోయిన సంగతి తెలిసిందే. నాలుగు కోట్ల నలభై లక్షల మంది జనాభాలో కోటీ నలభై లక్షల మంది విదేశాలకు శరణార్ధులుగా వెళ్లటం లేదా స్వదేశంలో నెలవులు తప్పటం గానీ జరిగింది. వారిని ఎంతకాలం అలా అనిశ్చితంగా పరాయిపంచల్లో కొనసాగిస్తారో తెలియటం లేదు. ఇరుగుపొరుగు దేశాలు వారిని దీర్ఘకాలం భరించటం అంతతేలిక కాదు. సంప్రదింపుల పేరుతో జెలెనెస్కీ నాటకం ఆడారు తప్ప చిత్తశుద్దిని ప్రదర్శించలేదు.తమకు నాటోలో చేరే ఉద్దేశ్యం లేదని చెప్పిన పెద్దమనిషి ఆ మాటమీద నిలిచి ఉంటే ఈ పాటికి సంక్షోభం సద్దుమణిగి ఉండేది. చావు దెబ్బలు తింటున్నా ఇంకా విదేశీఆయుధాలు తీసుకుంటూ మరింత నాశనానికి కారకుడు అవుతున్నాడు. పశ్చిమ దేశాలకు సమన్య పరిష్కారం కావటం సుతరామూ అంగీకారం కాదని తేలిపోయింది. రష్యన్‌ దాడుల్లో దెబ్బతిన్నవాటి పునరుద్దరణకు రుణాలిస్తామంటూ సంక్షోభం నుంచి కూడా లాభాలు పిండుకొనేందుకు పూనుకున్నారు.


ఈ వివాదాన్ని ఆసరా చేసుకొని రష్యాను బూచిగా చూపి ఐరోపాలో మరోసారి మిలిటరీ శక్తిగా మారేందుకు జర్మనీ పావులు కదుపుతున్నది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మిలిటరీ ఖర్చును తగ్గించి దాన్ని పరిశోధన-అభివృద్ధి, కార్పొరేట్లకు సబ్సిడీల వంటి వాటికి మళ్లించటంతో పారిశ్రామికంగా ఎదిగింది. ఇప్పుడు భారీ ఎత్తున మిలిటరీ ఖర్చుకు నిర్ణయించింది. ఆధునిక ఎఫ్‌35 రకం విమానాలను కొనుగోలు చేస్తానని ప్రకటించింది. ఐరోపాలో పెద్ద మిలిటరీ శక్తిగా ఎదిగేందుకే ఇది అన్నది చెప్పనవసరం లేదు. తటస్థదేశాలుగా ఉన్న స్వీడన్‌, ఫిన్లండ్‌తో పాటు డెన్మార్క్‌ కూడా నాటోలో చేరాలని నిర్ణయించింది. వీటి కదలికల వెనుక ఉన్న అసలు లక్ష్యాలు వెల్లడికావాల్సి ఉంది.


తమ ఆంక్షలతో రష్యా ఆర్ధికవ్యవస్థ కుప్పకూలి జనం పుతిన్‌ మీద తిరగబడతారని పశ్చిమ దేశాలు వేసిన అంచనాలు, పెట్టుకున్న ఆశలు ఫలించలేదు. మాస్కో స్టాక్‌ మార్కెట్‌ మూతపడింది. రష్యన్‌ కరెన్సీ విలువ తొలి వారాల్లో సగానికి సగం పతనమైనా తిరిగి సైనికచర్యపూర్వపు స్థితికి చేరుకుంది. తమతో కాళ్లబేరానికి వస్తాడని భావించిన పుతిన్‌లో అలాంటి సూచనలేమీ లేవు. దాదాపు 300 బిలియన్‌ డాలర్ల మేర విదేశీమారక ద్రవ్యాన్ని పశ్చిమ దేశాలు స్థంభింప చేశాయి. ఎగుమతులపై నిషేధం విధించి ఆధునిక పరికరాలు, యంత్రసామగ్రి, పరిజ్ఞానం అందకుండా కట్టడి చేశారు.అమెరికా, ఐరోపా దేశాలు చమురు దిగుమతులను నిలిపివేసినా రష్యా ఇప్పటివరకు నిలదొక్కుకుంది. తన ఎగుమతులకు వేరే మార్కెట్లను చూసుకుంది. అమెరికా వడ్డీరేట్లను పెంచుతుంటే రష్యా తగ్గిస్తున్నది. మార్చి నెలలో భారత్‌కు చమురు సరఫరా చేసే దేశాల్లో రష్యా పదవస్థానంలో ఉంటే అది ఏప్రిల్‌ నెలలో నాల్గోస్థానానికి ఎదిగింది. మరో ఆరునెలల పాటు చమురు కొనుగోలుకు మన దేశ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నట్లు తాజా వార్తలు తెలిపాయి. మరోవైపు చైనా కూడా పెద్ద ఎత్తున చమురుతో పాటు ఇతర దిగుమతులను పెంచింది. రష్యా ఆర్థికవ్యస్థ నిలదొక్కుకొనేందుకు ఇదొక ప్రధాన కారణం. కొన్ని ఐరోపా దేశాలు కూడా ఆంక్షలను పక్కన పెట్టి అక్కడి నుంచి చమురు, గాస్‌ దిగుమతి చేసుకుంటున్నాయి. రష్యా వద్ద బంగారం, విదేశీకరెన్సీ గానీ 640 బిలియన్‌ డాలర్ల మేరకు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే విధించిన ఆంక్షలను అది తట్టుకోగలుగుతోందని చెప్పవచ్చు.


రష్యా మీద పశ్చిమ దేశాల ఆంక్షలు అంటే తమ కాళ్లను తామే తొక్కుకుంటున్నట్లని కొందరు వర్ణిస్తున్నారు. రష్యా నుంచి నిలిపివేసిన ఇంథనాన్ని ఇతర దేశాల నుంచి పొందాలంటే ఐరోపా దేశాలకు వెంటనే కుదిరేది కాదు.తమ నుంచి దిగుమతులు చేసుకోవాలంటే రూబుళ్లలోనే చెల్లించాలని లేకుంటే తామే నిలిపివేస్తామని పుతిన్‌ షరతులు విధించాడు. పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా చమురు ధరలు పెరగటం వలన ఎగుమతుల కారణంగా విదేశీ మారకద్రవ్యం పెద్ద ఎత్తున చెలామణిలోకి రావటం కూడా రూబుల్‌కు సానుకూల అంశంగా మారింది. రూబుల్‌ విలువ పెరగకుండా చూసేందుకు రష్యా రిజర్వుబాంకు వడ్డీ రేట్లను తగ్గించాల్సి వచ్చింది. తమ నుంచి దిగుమతులను నిలిపివేయటం అంటే ఐరోపా ఆర్ధిక ఆత్మహత్య చేసుకోవటమే అని పుతిన్‌ ఎద్దేవాచేశాడు. ఇంధన ధరలు,ద్రవ్యోల్బణం పెరుగుతాయని అన్నాడు. అయితే రష్యా ఇబ్బందులను ఎదుర్కొంటోందని కూడా చెబుతున్నారు. సైనిక చర్యకు ముందు బడ్జెట్‌లో చమురు ఎగుమతుల ఆదాయం 30శాతం ఉంటే ఇప్పుడు 65శాతానికి పెరిగిందంటున్నారు.
పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు రష్యాకు వరంగా మారాయి. మార్చి రెండవ తేదీన ముడి చమురు ధర 60 డాలర్లవరకు ఉంటే తరువాత 110 డాలర్లు దాటింది. అందువలన రష్యా తన ఖాతాదార్లకు పెరిగిన ధరమీద పెద్ద మొత్తంలో రాయితీ ఇచ్చినా గతంతో పోల్చుకుంటే నష్టం లేదు, మన వంటి దేశాలకు ఎంతగానో కలసి వస్తుంది.రష్యా మీద వత్తిడి తెచ్చేందుకు ఆంక్షల మార్గాన్ని ఎంచుకున్న పశ్చిమ దేశాలు వాటి వలన ఇతర దేశాలకు, చివరికి తమకూ కలిగే ప్రతికూల పర్యవసానాలను ఊహించలేకపోయాయి. కొన్ని ఐరోపా దేశాల వత్తిడికి లొంగి కొంత మేరకు చమురు దిగుమతులకు అనుమతించారు. వందరోజుల తరువాత అనేక దేశాల్లో తలెత్తిన పరిస్థితి అక్కడి పాలకులకు సమస్యలు తెస్తున్నది. 2014కు ముందు రష్యా ఆహారాన్ని దిగుమతి చేసుకోగా ఇప్పుడు ఎగుమతిదారుగా మారింది. అక్కడి నుంచి రవాణాపై ఆంక్షలున్న కారణంగా ప్రపంచంలో సరఫరా తగ్గి ఇప్పుడు ధరలు పెరిగాయి.


వంద రోజుల సైనిక చర్య తరువాత జరగనున్నదేమిటి అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. డాన్‌బాస్‌ ప్రాంతంపై పూర్తి పట్టు సాధించినందున ఇక ముందు రష్యా తూర్పు నుంచి భారీ దాడులకు సిద్దం అవుతుంది. ఉక్రేనియన్లు ఇంకేమాత్రం దాడులను తట్టుకోలేని స్థితిలోకి వెళుతున్నారు. తమకు ఇంకా ఆయుధాలు ఇమ్మని జెలెనెస్కీ కోరితే ముందు ముందు జనాగ్రహాన్ని ఎదుర్కోవచ్చు. ప్రస్తుత పోరులో ఉక్రెయిన్‌ గెలుస్తుందనే నమ్మకం రోజు రోజుకూ పశ్చిమ దేశాల్లో సడలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇరవైశాతం ప్రాంతం మీద తమ పట్టులేదని జెలెనెస్కీ ప్రకటించిన తరువాత ఆ భావన ఇంకా పెరుగుతోంది. ఇప్పుడు పశ్చిమ దేశాలకు ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని కొనసాగించాలా లేదా అన్న ప్రశ్న ఎదురుకానుంది. అమెరికా, ఐరోపా దేశాల్లో ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ధనికదేశాల్లో మాంద్యం తలెత్తవచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అలాంటపుడు రష్యామీద పోరు కొనసాగించి సాధించేదేమిటి అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా, రష్యాలను బూచిగా చూపేందుకే బైడెన్‌ ఆసియా పర్యటన !

26 Thursday May 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, Joe Biden Asia tour, Narendra Modi, Quad, Quadrilateral Security Dialogue, Taiwan Matters, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


వార్తలద్వారా ఎలా రెచ్చగొట్టవచ్చో ఒక మంచి ఉదాహరణను చూద్దాం.” ప్రధాని మోడీ పాల్గొన్న చతుష్టయ సమావేశానికి దగ్గరగా చైనా, రష్యా యుద్ద విమానాలు : జపాన్‌ మంత్రి ” అన్నది ఒక వార్త శీర్షిక. జపాన్‌ రాజధాని టోకియోలో జరిగిన ఆ సమావేశంలో అమెరికా,జపాన్‌,ఆస్ట్రేలియా దేశాధినేతలు కూడా ఉన్నారు. నరేంద్రమోడీ ఉన్నందున అనే అర్ధం వచ్చేట్లు శీర్షిక పెట్టటం చైనా, రష్యాలతో మన దేశానికి తంపులు పెట్టే లేదా పెంచే వ్యవహారం తప్ప మరొకటి కాదు. చతుష్టయ దేశాలను హెచ్చరించేందుకే ఈ చర్య అని మన దేశంలో కొన్ని పత్రికల సంపాదకీయాలు రాయటం సరేసరి.ఇది తీవ్ర ఆందోళన కలిగించేది అని జపాన్‌ రక్షణ మంత్రి నోబు కిషి గుండెలు బాదుకున్నాడు. ఇలా జపాన్‌ సరిహద్దుల వరకు చైనా-రష్యా విమానాలు రావటం గతేడాది నవంబరు నుంచి నాలుగవసారి అని కూడా కిషి చెప్పాడు. మరి అప్పుడే సమావేశాలు జరిగినట్లు ? ఎవరిని హెచ్చరించేందుకు వచ్చినట్లు ?వాటిలో నరేంద్రమోడీ గారు లేరు కదా ! మా మంత్రిగారు ఏం చెప్పారన్నది వేరే గానీ ఆ విమానాలు తమ గగనతలాన్ని అతిక్రమించలేదని జపాన్‌ రక్షణ మంత్రిత్వశాఖ చెప్పినట్లు ఎఎఫ్‌పి వార్తా సంస్ద పేర్కొన్నది. జపాన్‌ సముద్రం మీద రెండు చైనా విమానాలతో జత కలసిన మరో రెండు రష్యా విమానాలు తూర్పు చైనా సముద్రం నుంచి పసిఫిక్‌ సముద్రం వైపు వెళ్లినట్లు జపాన్‌ మంత్రి చెప్పాడు. గూఢచార సమాచారాన్ని సేకరించేందుకు రష్యా విమానం ఒకటి కూడా జపాన్‌ వైపు వచ్చినట్లు, ఈ చర్యలు రెచ్చగొట్టేందుకే అని ఆరోపించాడు. అంతర్జాతీయ నిబంధనలను పాటించి మరొక దేశ గగనతలాన్ని అతిక్రమించకుండా విమానాలు తిరగటం సర్వసాధారణం.


ఇలా తమ విమానాలు సంయుక్తంగా తిరగటం నిరంతర గస్తీలో భాగమే అని చైనా, రష్యా పేర్కొన్నాయి.వార్షిక మిలిటరీ సహకార ఒప్పందంలో భాగంగా తిరిగినట్లు చైనా రక్షణశాఖ నిర్ధారించింది.టోకియో చతుష్టయ సమావేశాల సందర్భంగా తన రెచ్చగొట్టుడు చర్యలను సమర్దించుకొనేందుకు జపాన్‌ ఇలాంటి ఆరోపణలను చేస్తోందని చైనా పేర్కొన్నది. అమెరికా, జపాన్‌ రెచ్చగొడుతున్న తరుణంలో రెండు యుద్ద నౌకలను జపాన్‌ సమీపంలోని రెండు జలసంధులకు చైనా పంపింది. పశ్చిమ పసిఫిక్‌ సముద్రంలోని చైనా విమానవాహక నౌక నుంచి గత ఇరవై రోజుల్లో కనీసం మూడువందల సార్లు విమానాలు చక్కర్లు కొట్టినట్లు, తైవాన్‌ విషయంలో జోక్యం చేసుకుంటే తమ సత్తా ఏమిటో చూపేందుకే ఇలా చేసినట్లు వార్తలు వచ్చాయి.


జపాన్‌ పార్లమెంటు వెలుపల చతుష్టయ సమావేశాలు జరిగే చోట ఏర్పాటు చేసిన బానర్లు, పోస్టర్లలో ” హాంకాంగ్‌ స్వాతంత్య్రం, విప్లవం, ఉఘిర్‌లో మారణకాండను ఆపండి ” అని రాయటం చైనాను రెచ్చగొట్టటమే అన్నది స్పష్టం. ఇక జపాన్‌ సంగతికొస్తే 2021లో ఇరుగు పొరుగు దేశాలు తన గగనతలాన్ని అతిక్రమిస్తున్నాయనే అనుమానంతో తానే రికార్డు స్ధాయిలో ఎగబడి పట్టుకొనేందుకు ప్రయత్నించటం లేదా తానే గస్తీ తిరగటం వంటి పనులు చేసింది.ఇది ఆప్రాంతంలో తలెత్తిన తీవ్ర పరిస్ధితికి అద్దం పడుతోంది. ఇదంతా చతుష్టయం పేరుతో చైనా వ్యతిరేక కూటమి చర్యలు ముమ్మరం అయిన తరువాతే అన్నది స్పష్టం. 2020లో 279లో సార్లు , 2021లో 1,004 సార్లు జపాన్‌ విమానాలు తిరిగాయి. అంతకు ముందు 2016లో గరిష్టంగా 1,168సార్లు వెంటపడినట్లు అధికారికంగా వెల్లడించారు. దానికి 2012లో జపాన్‌ జనావాసం లేని మూడు దీవులను ప్రయివేటు వారినుంచి కొనుగోలు చేసింది, అవి తమవని చైనా చెప్పటంతో వాటి చుట్టూ జపాన్‌ తన విమానాలను గస్తీ తిప్పింది. దక్షిణ, తూర్పు చైనా సముద్రాల్లో చైనా చర్యలు ఆందోళన కలిగిస్తున్నట్లు చైనా తన శ్వేతపత్రంలో ఆరోపించింది.

యధాతధ స్ధితిని బలవంతంగా మార్చేందుకు పూనుకుంటే సహించేది లేదని ఏ దేశం పేరు పెట్టకుండా టోకియో చతుష్టయ సమావేశం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నప్పటికీ అది చైనా, రష్యాల గురించే అన్నది స్పష్టం. పేరుకు తమది మిలిటరీ కూటమి కాదంటూనే ఆ దిశగా దాన్ని మార్చేందుకు పూనుకున్నారు.దానికి విరుగుడుగా చైనా కూడా జాగ్రత్తపడుతోంది.దానిలో భాగంగానే తన మిలిటరీని పటిష్టపరుస్తోంది.దక్షిణ పసిఫిక్‌ ప్రాంతంలోని అనేక చిన్న దేశాలతో సంబంధాలను పటిష్టపరుచుకుంటోంది. 2017వరకు ఒక భావనగానే ఉన్న ఈ కూటమి గడచిన రెండు సంవత్సరాలలో నాలుగు సార్లు సమావేశం కావటం గమనించాల్సిన అంశం. ఆ తరువాతే లడఖ్‌లోని గాల్వన్‌ లోయ ఉదంతం జరిగినట్లు అంతర్జాతీయ పరిశీలకులు చెప్పారు. ఆస్ట్రేలియా-చైనా మధ్య వాణిజ్యపోరు మొదలైంది. సోలోమన్‌ దీవుల ప్రభుత్వంతో చైనా కుదుర్చుకున్న భద్రతా ఒప్పందం తమకు వ్యతిరేకంగానే అని ఆస్ట్రేలియా ఆరోపిస్తోంది. చైనా నావలు ఆ దీవుల్లో లంగరువేసేందుకు వీలుకలుగుతుందని అంటోంది.దీనికి ప్రతిగా బ్రిటన్‌, అమెరికాతో కలసి అకుస్‌ పేరుతో మిలిటరీ ఒప్పందం చేసుకుంది. బ్రిటన్‌ నుంచి అణుశక్తితో నడిచే జలాంతర్గాముల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. దాదాపు శతాబ్దికాలంగా జపాన్‌-చైనా మధ్య వివాదాస్పదంగా ఉన్న కొన్ని దీవుల అంశమై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఒకవైపు తైవాన్‌ దీవిని చైనా అంతర్భాగంగా గుర్తిస్తున్నామని చెబుతూనే దాన్ని సైనికంగా బలపరిచేందుకు అమెరికా పూనుకుంది.ఒక వేళ చైనా గనుక బలవంతంగా విలీనం చేసుకోవాలని పూనుకుంటే తాము మిలిటరీతో రక్షణ కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆసియా పర్యటనలో బెదిరించిన అంశం తెలిసిందే.


చతుర్ముఖ భద్రతా మాటామంతీ( ద క్వాడ్రిలేటరల్‌ సెక్యూరిటీ డైలాగ్‌) పేరుతో 2007లో జపాన్‌ చొరవతో భారత్‌,ఆస్ట్రేలియా, అమెరికా చర్చలు ప్రారంభించాయి. దీన్నే క్వాడ్‌(చతుష్టయం) అంటున్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను ఎదుర్కోవటమే దీని లక్ష్యం. అదే ఏడాది ఆస్ట్రేలియా వెనక్కు తగ్గటంతో ఆ కూటమి ముందుకు సాగలేదు.2017లో మనీలాలో జరిగిన ఆసియన్‌ కూటమి సమావేశాల సందర్భంగా ఈ కూటమిని పునరుద్దరించాలని నాలుగు దేశాలు నిర్ణయించాయి.ఆ ప్రాంతంలో నౌకలను అడ్డుకున్న ఉదంతం ఒక్కటీ లేకున్నా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని తూర్పు, దక్షిణ చైనా సముద్రాల్లో స్వేచ్చగా నౌకా రవాణా ఉండే పరిస్ధితి కల్పించాలనే పేరుతో ఒక అజెండాను ముందుకు తెచ్చాయి.పైకి ఏమి చెప్పినా చైనాను అడ్డుకోవటమే అసలు ఎత్తుగడ. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం గురించే తమ కేంద్రీకరణ అని చెప్పిన చతుష్టయ కూటమి క్రమంగా ఇతర అంశాల మీద కూడా దృష్టి సారిస్తోంది.టోకియో భేటీతో పాటు ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్‌ సంక్షోభం గురించి చర్చించింది.
ఉక్రెయిన్‌ మీద రష్యా దాడి చేసినపుడు వివిధ కారణాలతో మిలిటరీతో ఆదుకోలేదు, తైవాన్‌ విషయంలో కూడా చైనా దాడి చేస్తే అలాగే ఉంటారా లేక రక్షణకు వస్తారా అని టోకియోలో విలేకరి అడిగిన ప్రశ్నకు వెంటనే జో బైడెన్‌ అవసరమైతే తైవాన్‌లో మిలిటరీతో ఎదుర్కొంటామని చెప్పాడు. ఒకే చైనా విధానాన్ని అమెరికా అంగీకరించింది నిజం, ఆ మేరకు ఒప్పందంపై సంతకాలు కూడా చేశాము. దానిలో ఎలాంటి మార్పూ లేదు. కానీ తైవాన్ను బలవంతంగా స్వాధీనం చేసుకోవటం సబబు కాదు. అందుకు పూనుకుంటే మిలిటరీతో ఎదుర్కొంటాం అన్నాడు. బలప్రయోగం చేసే హక్కు చైనాకు లేదన్నాడు. బలవంతంగా ఆక్రమించేందుకు చైనా పూనుకుంటుందని తాను అనుకోవటం లేదని, అది ప్రపంచం ఎంత గట్టిగా స్పందస్తుంది అనేదానిపై ఆధారపడి ఉంటుందని, దురాక్రమణకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నాడు. అంతకు ముందు జపాన్‌ ప్రధాని కిషిడాతో కలసి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడైనా ఏకపక్షంగా యధాతధ స్ధితిని మార్చేందుకు ఎవరైనా పూనుకుంటే సహించేది లేదని, రష్యా దాడి ప్రపంచ వ్యవస్ధ పునాదులను కదలించిందని బైడెన్‌ అన్నాడు.

బైడెన్‌ ప్రకటనల మీద చైనా తీవ్రంగా స్పందించింది. ఏదో అనుకోకుండా మాట్లాడినట్లుగా తాజా స్పందనను పరిగణించలేమని, అంగీకరించిన ఒకే చైనా విధానం నుంచి వెనక్కు తగ్గుతున్నదనేందుకు సూచిక, మరొక అడుగు ముందుకు వేసినట్లు చైనా భావిస్తోంది. ఉక్రెయిన్‌ ముసుగులో తైవాన్‌ స్వాతంత్య్రం గురించి అమెరికా, జపాన్‌ తమ పధకాలతో ముందుకు పోతే వాటిని గట్టిగా ఎదుర్కొంటామని స్పష్టం చేసింది. ఉక్రెయిన్లో మాదిరి బలప్రయోగంతో ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో కూడా ఏకపక్షంగా యధాతధ స్దితిని మార్చితే చూస్తూ ఊరుకోబోమని జపాన్‌ ప్రధాని కిషిదా కూడా చెప్పటాన్ని చైనా పరిశీలకులు గుర్తు చేశారు. తైవాన్‌ తమ అంతర్గత అంశమని, దానిలో విదేశీ శక్తుల జోక్యాన్ని అనుమతించబోమని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ విలేకర్లతో స్పష్టం చేశాడు. అమెరికా సైనికులను తైవాన్‌కు తరలించనప్పటికీ ఏదో ఒకముసుగులో ఆయుధాలను పెద్ద ఎత్తున అందచేస్తున్నది. అందువలన సైనికులను పంపటం ఒక్కటే మిలిటరీ జోక్యం కాదని ఆయుధాల అందచేత కూడా మిలిటరీ జోక్యమే అని చైనా పరిగణిస్తున్నప్పటికీ సంయమనం పాటిస్తున్నది. చైనా మీదకు పోవాలని బైడెన్‌ కోరుకున్నట్లయితే చైనా-అమెరికా సంబంధాలు టైటానిక్‌ ఓడ మంచుకొండను ఢకొీన్నపుడు జరిగిన మాదిరే జరుగుతుందని చైనా పరిశీలకులు వర్ణించారు. ఉక్రెయిన్‌ అంశాన్ని తైవాన్‌ సమస్యతో కలిపి చూపటం వెనుక తైవాన్‌ దీవిపై చైనా సార్వభౌమత్వాన్ని తిరస్కరించే ఎత్తుగడ ఉంది.అంతేకాదు తైవాన్ను చూపుతూ ఆసియా పసిఫిక్‌ ప్రాంతానికి చైనా ముప్పు ఉందని ఈ ప్రాంత దేశాలను నమ్మించటం,తప్పుదారి పట్టించటం కూడా తెలిసిందే.


జో బైడెన్‌ ఆసియా పర్యటనను మొత్తంగా చూసినట్లయితే ప్రధానంగా రెండు లక్ష్యాలతో సాగినట్లు చెప్పవచ్చు. గత రెండు దశాబ్దాలలో తొలిసారిగా ఆసియా పర్యటన జరిపిన అమెరికా నేతలందరూ చైనాను సందర్శించారు. తొలిసారిగా జోబైడెన్‌ చైనాలో అడుగుపెట్టలేదు. ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యం (ఆర్‌సిఇపి) పేరుతో ఏర్పడిన అతి పెద్ద ఆర్ధిక కూటమిలో అమెరికా లేదు. దానికి పోటీగా ఇండో పసిఫిక్‌ ఎకనమిక్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఐపిఇఎఫ్‌) పేరుతో కొత్త కూటమిని ఉనికిలోకి తెచ్చి ఆ ప్రాంత దేశాలను ఆకర్షించటం, తద్వారా తనపెత్తనాన్ని నిలుపుకొనేందుకు పూనుకోవటం. దీని వలన మనకు కలిగే లబ్ది ఏమిటో తెలియకుండానే మన దేశం సిద్దం సుమతీ అన్నది. ఆర్‌సిఇపిలోని మరికొన్ని దేశాలు కూడా దీనిలో చేరుతున్నట్లు ప్రకటించాయి.ఈ కూటమిలో అమెరికా మార్కెట్లో ప్రవేశించే అవకాశాలు పరిమితమని ఇప్పటికే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇది కూడా చైనాను దూరంగా పెట్టే ఎత్తుగడే. రెండవదాని కొస్తే ఉక్రెయిన్‌ విషయంలో తాము మిలిటరీని పంపేది లేదని అమెరికా చెప్పటంతో దాన్ని నమ్ముకుంటే అంతే సంగతులని అనేక దేశాలు భావిస్తున్నాయి. ఇది అమెరికాకు రాజకీయంగా ఎంతో నష్టం కలిగించింది. తన ప్రయోజనాలకోసం రెచ్చగొట్టి ముందుకు తోసి తాను తప్పుకుంటుందనే భావం ఎల్లెడలా కలిగింది. దాన్ని పోగొట్టేందుకు, మద్దతుదార్లలో విశ్వాసాన్ని కల్పించేందుకు తైవాన్‌ అంశంలో తాము సైనికంగా జోక్యం చేసుకుంటామని బైడెన్‌ చెప్పాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?

22 Sunday May 2022

Posted by raomk in Current Affairs, Health, History, INTERNATIONAL NEWS, Opinion, Science, UK, Uncategorized, USA

≈ 1 Comment

Tags

BILL GATES, Monkeypox, Monkeypox Conspiracy Theory, Monkeypox goes global, Monkeypox Vaccines, Smallpox


ఎం కోటేశ్వరరావు


ఒకనాడు కేవలం ఆఫ్రికా ఖండానికే పరిమితం అనుకున్న మంకీపాక్స్‌ వైరస్‌ ఇప్పుడు ప్రపంచాన్ని ఆవరించనుందా ? కరోనా మాదిరి మహమ్మారిగా మారనుందా ? నివృత్తి జరిగేంతవరకు అనేక అనుమానాలు, సందేహాలు వెలువడుతూనే ఉంటాయి. తెలుగు నాట మసూచి, పెద్ద అమ్మోరు, స్ఫోటకంగా పిలిచిన వైరస్‌కు ఇది సోదరి. ప్రస్తుతానికి అలాంటి తీవ్ర హెచ్చరికలు వెలువడలేదుగానీ కరోనా నేపధ్యంలో అనేక వార్తలు భయపెడుతున్నాయి. ఇది పాక్స్‌ జాతికి చెందిన వైరస్‌గా కోతుల్లో గుర్తించినందుకు దానికి మంకీపాక్స్‌ అని పేరు పెట్టారు. ఇది మసూచికి సంబంధించిందైనప్పటికీ అంతటి ప్రమాదకారి కాదని కొందరు అంటున్నా ,అప్పుడే నిర్దారించలేమని మరికొందరు హెచ్చరిస్తున్నారు.వరియోలా మేజర్‌, వరియోలా మైనర్‌గా పిలిచిన వైరస్‌లు మసూచి కారకాలు, ఇది గతశతాబ్దిలో 30 కోట్ల మందిని, అంతకు ముందు మరో ఇరవై కోట్ల మందిని బలితీసుకుందని అంచనా.పదహారవ శతాబ్దిలో బ్రిటన్‌లో దీన్ని స్మాల్‌పాక్స్‌ అని పిలిచారు.1980లో ప్రపంచంలో పూర్తిగా నిర్మూలించినట్లు ప్రకటించి ఈ వైరస్‌ ఇప్పుడు అమెరికా, రష్యాల్లోని రెండు పరిశోధనా సంస్ధలలో మాత్రమే ఉంది.


ఐరోపా, ఉత్తర అమెరికా, ఆసియా ఖండాల్లోని 14 దేశాల్లో మే నెల మూడవ వారం వరకు 120 నిర్దారణ లేదా అనుమానాస్పద కేసులు నమోదైనాయి. ఒక ప్రాంతంలోని జనాభాతో మరొక ప్రాంత జనాభాకు సంబంధలేనప్పటికీ ఇన్ని చోట్ల వ్యాప్తి చెందటం ఆసక్తి కలిగిస్తున్నదని ఆఫ్రికాలోని కాంగోలో పదేండ్ల క్రితం ఈ వైరస్‌ మీద పరిశోధన చేసిన అమెరికా శాస్త్రవేత్త అనే రిమోయిన్‌ చెప్పారు. ఇది మసూచి సంబంధిత వైరస్‌ కనుక కరోనా మాదిరి వ్యాప్తి చెందదని మరోశాస్త్రవేత్త జే హూపర్‌ అన్నారు. ఇది సోకిన వ్యక్తులు దగ్గినపుడు అతి సమీపంలోని వారికి మాత్రమే సోకే అవకాశం ఉందన్నారు. ఇది సోకిన వారు ఎలాంటి చికిత్సలేకుండానే కొన్ని వారాల తరువాత ఎక్కువ మంది కోలుకుంటారని కూడా హూపర్‌ అంటున్నారు. ఇది ప్రాధమిక దశలో ఉన్నందున ఇప్పటికిప్పుడే నిర్ధారణగా దేన్నీ చెప్పలేమని మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని మరో వైరాలజిస్టు గుస్తావ్‌ పాలాసియో చెప్పారు. ఆఫ్రికా దేశాల్లో ఇది కనిపించినప్పటికీ ఐరోపా, అమెరికాల్లో వ్యాప్తి చెందటానికి ఉన్న సంబంధం ఇంకా తెలియలేదు.ప్రస్తుతానికి మన దేశంలో ఈ వైరస్‌ దాఖల్లాలేవు. సోకిన దేశాల నుంచి వచ్చిన వారి మీద నిఘావేసి, లక్షణాలున్నవారి నుంచి రక్త నమూనాలను సేకరించాలని ఆదేశించారు.స్త్రీ-పురుషుల సంపర్కం ద్వారా మంకీపాక్స్‌ వ్యాపించదని భావించిన ఈ వైరస్‌ ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్చుకొనేట్లు చేసింది. బ్రిటన్‌లో వెలువడిన కేసులలో ఎక్కువ మంది స్వలింగ, ద్విలింగ సంపర్క పురుషుల్లో కనిపించింది.


సంబంధం లేని దేశాల జనాభాలో ఇది కనిపించటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మసూచి(స్మాల్‌పాక్స్‌)ను పూర్తిగా నిర్మూలించినందున దాని సోదరి మంకీపాక్స్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇంతకాలంగా భావిస్తున్నారు. బలహీనం, రోగనిరోధకశక్తి తక్కువగా ఉండేవారిలో మంకీపాక్స్‌ సోకవచ్చని భావిస్తున్నారు.కాంగోలో కనిపించిన తరువాత 39 ఏండ్లకు 2017 నుంచి నైజీరియాలో రెండువందల నిర్ధారిత, ఐదు వందల అనుమానాస్పద కేసులు నమోదయ్యాయి. 2003లో ఘనా నుంచి దిగుమతి చేసుకున్న ఎలుకల నుంచి అమెరికాలోని ఇల్లినాయిస్‌ కుక్కలకు తరువాత 70 మంది మనుషులకు సోకింది. తాజాగా వివిధ దేశాల్లో కనపడిన కేసుల వెనుక బిల్‌గేట్స్‌ హస్తం ఉందంటూ కొన్ని కుట్ర సిద్దాంతాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. వాక్సిన్ల తయారీలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్న బిల్‌గేట్స్‌ వాటిని అమ్ముకొనేందుకు వైరస్‌లను కూడా సృష్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏడాది క్రితం ఒక సభలో మాట్లాడిన బిల్‌గేట్స్‌ త్వరలో మరో పెద్ద మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని, దీని కోసం ప్రపంచ ఆరోగ్య సంస్ద కొత్త సంస్దను ఏర్పాటు చేయాలని, జీవాయుధాలుగా వైరస్‌లను ఉగ్రవాదులు వినియోగించవచ్చని హెచ్చరించాడు. ఆ మాటలకు ఇప్పుడు జరుగుతున్న వాటికి సంబంధం కలిపి వార్తలు వెలువడుతున్నాయి. అంతకు ముందు కూడా గేట్స్‌ ఇలాగే మాట్లాడిన ఉదంతాలున్నాయి. గతవారంలో పెద్ద మొత్తంలో మంకీపాక్స్‌ వాక్సిన్ను అమెరికా కొనుగోలు చేయటం వాటికి ఊతమిస్తున్నాయి.


బ్రిటన్‌లో తొలికేసు నైజీరియా వెళ్లి వచ్చిన పురుషుడిది కాగా తరువాత వారికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేదు. అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఒకరికి నిర్దారణైంది. అతను ఇటీవలే కెనడా వెళ్లి వచ్చినట్లు తేలింది. దాంతో 119మిలియన్‌ డాలర్ల విలువగల మంకీపాక్స్‌ వాక్సిన్లు సరఫరా చేయాలని అమెరికా సర్కార్‌ కోరిందని బవేరియన్‌ నోర్డిక్‌ కంపెనీ ప్రకటించింది. అంతకు ముందే ఇచ్చిన ఆర్డర్‌తో కలిపితే 299 మిలియన్‌ డాలర్లని, కోటీ30లక్షల డోసులమేర కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. వీటిని 2024,25లో సరఫరా చేస్తారు. మంకీపాక్స్‌ సోకినవారిలో నూటికి పది మంది మరణించినట్లు గత సమాచారం వెల్లడిస్తున్నది.
మంకీపాక్స్‌ను పరిశోధనకు తెచ్చిన కోతుల్లో 1958లో కనిపించింది.మానవుల్లో తొలికేసు 1970లో నమోదైంది. ఇది వివిధ పద్దతుల్లో , రకరకాలుగా సోకే అవకాశం ఉంది. వైరస్‌ ఉన్న జంతువు మనిషిని కరచినా, దాని రక్తం, స్రవించిన ద్రవాలను ముట్టుకున్నా, ఈకలను తాకినా రావచ్చు. ఎలుకలు, ఉడుతలు, వైరస్‌ సోకిన జంతుమాంసాన్ని సరిగా ఉడికించకుండా తిన్నా ఈ వైరస్‌ సోకుతుంది. సంభోగం ద్వారా కూడ సంక్రమించవచ్చు. మనుషుల్లో జ్వరం, కండరాల నొప్పి,దద్దుర్లు, గాయాలుకావటం, చలి వంటి లక్షణాలుంటాయి. సాధారణంగా వైరస్‌ సోకిన తరువాత ఐదు నుంచి 21 రోజుల్లో లక్షణాలు కనిపించవచ్చు.


2003 అక్టోబరు 29న న్యూసైంటిస్టు డాట్‌కామ్‌లో డెబోరా మెకంజీ అనే విశ్లేషకుడు ” అమెరికా వృద్ధి చేసిన ప్రాణాంతక వైరస్‌లు ” అనే పేరుతో రాశారు. అమెరికా ప్రభుత్వ నిధులతో పరిశోధనలు చేసిన ఒక శాస్త్రవేత్త మసూచి వైరస్‌ నుంచి జన్యుమార్పిడితో ప్రమాదకర మౌస్‌పాక్స్‌ను తయారు చేసినట్లు పేర్కొన్నారు.యాంటీ వైరల్‌ వాక్సిన్లు ఇచ్చినప్పటికీ ఇది సోకిన ఎలుకలు మరణించాయి. తరువాత కౌపాక్స్‌(ఆవు) వైరస్‌ను కూడా రూపొందించారు. ఇలా రూపొందించిన వాటిని ప్రమాదకారులుగా మార్చేందుకు కూడా వీలుంది. మానవుల్లో కూడా వైరస్‌ను ప్రవేశపెట్టేవిధంగా మార్చ వచ్చని 2003నాటి ఆర్టికల్‌లో హెచ్చరించారు. లాభాల కోసం ఎంతకైనా తెగించే అమెరికన్లు దేనికైనా పాల్పడతారని చరిత్ర రుజువు చేసింది.


ఐరోపాలో స్మాల్‌పాక్స్‌, మంకీపాక్స్‌, కౌపాక్స్‌ చికిత్సకు ” టెకోవిరిమాట్‌” అనే ఔషధాన్ని అనుమతించారు.దాన్ని టిపాక్స్‌ పేరుతో విక్రయిస్తున్నారు. అమెరికాలో స్మాల్‌పాక్స్‌కు మాత్రమే అనుమతించారు.తాజాగా వ్యాపిస్తున్న మంకీపాక్స్‌ పాతదేనా కొత్త రకమా అన్నది ఇంకా నిర్దారణ కాలేదు. అనేక దేశాల్లో కనిపించిన తీరును చూస్తే వేగంగా వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని అర్ధం కరోనా మాదిరి వేగంగా విస్తరిస్తుందని కాదని కూడా అంటున్నారు.


మంకీపాక్స్‌ మరోరూపంలో వచ్చిన మసూచికం అని కొందరు చెబుతున్నారు.1999లో పరిశోధనా సంస్దల్లో ఉన్న మసూచి వైరన్‌సు నాశనం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధ సూచించింది. ప్రస్తుతం ఆ సంస్ద వద్ద ఐదులక్షల డోసుల వాక్సిన్‌ ఉండగా ఇతర దేశాల్లో 60నుంచి 70 మిలియన్ల డోసులు ఉందని, అనేక నిల్వలు సక్రమంగా లేవని చెబుతున్నారు. అమెరికాలో 50 నుంచి వంద లక్షల మందికి వేసేందుకు సరిపడా ఉందని అంచనా.1980నాటికి వరియోలా వైరస్‌ 76 పరిశోధనా సంస్ధల్లో ఉంది. వైరస్‌ను నాశనం చేయాలన్న సూచన మేరకు తమ 74 కేంద్రాలు నాశనం చేయటం లేదా తమ వద్ద ఉన్న నిల్వలను ప్రపంచ ఆరోగ్య సంస్ధకు అంద చేశాయి. అమెరికాలోని అట్లాంటాలో సిడిసి, రష్యాలోని కోల్ట్‌సోవో వైరాలజీ సంస్ధలో మాత్రమే ఉంది. కొందరి అనుమానం ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్ధకు తెలియ కుండా కొన్ని చోట్ల దాచారని, జీవాయుధంగా వాడేందుకుగాను కొత్త వైరస్‌ సృష్టికోసమే ఇలా చేశారనే ఆరోపణలున్నాయి గాని, నిర్ధారణ కాలేదు.


. ప్రపంచంలో వైరస్‌తో జీవాయుధాలను తయారు చేసి యుద్దాలలో వినియోగించే అంశాల గురించి కొందరు నిపుణులు వెలిబుచ్చిన అభిప్రాయాలను, అనేక అంశాలను పేర్కొంటూ చైనా మిలిటరీ వైద్యుడు గ్జు డెహౌంగ్‌ 2015లో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అదేమీ రహస్యం కాదు, అమెజాన్‌ ద్వారా ప్రపంచమంతా కొనుగోలు చేసింది. చైనాలో 2002,04 సంవత్సరాలలో బయటపడిన సార్స్‌ మహమ్మారి విదేశాల నుంచి అసహజ పద్దతిలో జన్యుమార్పిడి జరిగి వచ్చిన వైరస్‌ (ఇది కూడా కరోనా వైరస్‌ రకాలలో ఒకటి) అని చైనా పుస్తకంలో అభిప్రాయపడ్డారు. చైనాకు వ్యతిరేకంగా విదేశాల్లో ఉగ్రవాదుల జీవ ఆయుధాల తయారీని కూడా కాదనలేమని సంపాదకుడు గ్జు పేర్కొన్నారు. ప్రపంచంలో జీవ ఆయుధాల ప్రయోగాలు, యుద్దంలో వాటి వినియోగం గురించి కూడా దానిలో చర్చించారు. 1941లోనే అమెరికా జీవ ఆయుధాల పరిశోధన ప్రారంభించిందని, తరువాత వాటి తయారీకి ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసిందని, 1940-45 సంవత్సరాల మధ్య జపాన్‌ జీవ ఆయుధాలను ఉపయోగించి తూర్పు చైనాలోని ఝెజియాంగ్‌, హునాన్‌ రాష్ట్రంలో ప్రయోగించి ప్లేగు వ్యాధి వ్యాపింప చేసిందని కూడా రచయిత దానిలో పేర్కొన్నారు.


బిల్‌ మరియు మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సారధి, మైక్రోసాఫ్ట్‌కు మారు పేరు అయిన బిల్‌ గేట్స్‌ చావులను కూడా సొమ్ము చేసుకొనేందుకు పూనుకున్నాడు. కరోనా వాక్సిన్‌ తయారీ వివరాలను భారత్‌కు మరొక దేశానికి ఇవ్వకూడదని ఆ పెద్దమనిషి చెప్పిన సంగతిని మరచిపోలేము. భద్రతా కారణాల రీత్యా ఇవ్వటం కుదరదన్నాడు. ఒకవేళ ఎక్కడైనా అలా ఇస్తే అది తమ సాయం మరియు నైపుణ్యం ఫలితమే అన్నాడు. 2015లో బిల్‌ గేట్స్‌ టెడ్‌ టాక్‌ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ రానున్న దశాబ్దంలో ఒక పెద్ద మహమ్మారి రానున్నదని, అది ఐదు కోట్ల మందిని బలితీసుకున్న 1918నాటి మహమ్మారి మాదిరి ఉంటుందని, ఆరునెలల్లో మూడు కోట్ల మందిని చంపి వేస్తుందని చెప్పాడు. దాన్ని యుద్దం మాదిరి ఎదుర్కొనేందుకు ప్రపంచం తీవ్ర ప్రయత్నాలు చేయాలన్నాడు. బిల్‌ గేట్స్‌ మాటలను బట్టి గేట్స్‌ అప్పటికే మైక్రోచిప్‌ ద్వారా నియంత్రించే ఒక మహమ్మారి వైరస్‌ను ప్రయోగశాలలో రూపొందించి ఉన్నారని కొంత మంది అప్పుడే చెప్పారు. అవి బుద్దిలేని మాటలని తమ ఫౌండేషన్‌ ద్వారా వాక్సిన్లను కొనుగోలు చేస్తున్నామని అందువలన మహమ్మారుల ప్రమాదం గురించి హెచ్చరించేందుకే తాను చెప్పానన్నాడు.నియంత్రణలతో సురక్షితమైన వాక్సిన్లను తయారు చేయాలి గనుక భారత్‌ వంటి అభివద్ది చెందుతున్న దేశాలకు తయారీ విధానం గురించి చెప్పకూడదని ఒక ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్‌ చెప్పాడు.


ప్రపంచంలోని 25 దేశాలలో అమెరికన్లు బయో ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు. మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, ఆగేయ ఆసియా, మాజీ సోవియట్‌ రిపబ్లికులలో అవి ఉన్నాయి. ఒక్క ఉక్రెయిన్‌లోనే 16 ఉన్నాయంటే అమెరికా కుట్రలను అర్ధం చేసుకోవచ్చు. అమెరికాలోని మేరీలాండ్‌లోని ఫ్రెడరిక్‌ అనే ప్రాంతంలో ఫోర్డ్‌ డెట్రిక్‌ ప్రయోగశాలలో ఎబోలా వంటి వ్యాధుల కారకాల గురించి పరిశోధనలు చేశారు. దాని మీద వార్తలు రావటంతో 2019లో మూసివేశారు. గత రెండు దశాబ్దాలలో ఇంటా బయటా ఉన్న అమెరికన్‌ ప్రయోగశాలలో అనేక వందల ఉదంతాలలో ప్రమాదాలు జరిగి ప్రమాదకరమైన వైరస్‌, బాక్టీరియాలు బయటపడినట్లు యుఎస్‌ఏ టుడే పేర్కొన్నది అమెరికాలో ఇలాంటి సమస్యలున్న కారణంగా ఇతర దేశాలలో అసలు విషయాలను దాచి పరిశోధనలు నిర్వహిస్తున్నారు.


మానవ కల్యాణం కోసం ఒక ప్రమాదకర వైరస్‌ను హతమార్చేందుకు మరొక వైరస్‌ను రూపొందించేందుకు ప్రతి దేశానికీ అవకాశం, హక్కు ఉంది. అయితే ఆ ముసుగులో ఆయుధాలు తయారు చేసే దేశాలు మిగతా వాటి మీద బురద జల్లుతున్నాయి. చరిత్రను తిరగేస్తే క్రీస్తు పూర్వం ఆరువందల సంవత్సరంలో క్రిసాను ముట్టడి సమయంలో రాజు సోలోన్‌ కటుక రోహిణీ అనే పుష్పాల నుంచి తీసిన రసాన్ని ప్రయోగించి విరేచనాలు, ఇతర వ్యాధులు కలిగించినట్టు చరిత్రలో ఉంది. 1155లో రాజు బార్బోసా ఇటలీలోని టోరోంటానాలోని మంచి నీటి బావుల్లో శవాలను పడవేసి కలుషితం కావించాడు. 1495లో ఫ్రెంచి సైనికులను హతమార్చేందుకు స్పెయిన్‌ రాజులు ఇటలీలోని నేపుల్స్‌లో కుష్టువ్యాధి గ్రస్తుల రక్తం కలిపిన వైన్‌ సరఫరా అయ్యేట్టు చూశారు.1675లో విషంతో కూడిన బుల్లెట్లను వినియోగించరాదని జర్మనీ-ఫ్రెంచి సైన్యం అంగీకారానికి వచ్చాయి. 1710లో రష్యన్‌ చక్రవర్తి ప్లేగుతో మరణించిన శవాలను ఫిరంగులకు కట్టి స్వీడన్‌ పట్టణాలలో పడవేయించాడు. 1763లో అమెరికాలోని గిరిజనులను దెబ్బతీసేందుకు బ్రిటిష్‌ పాలకులు మసూచి వ్యాధిగ్రస్తులు వాడిన దుప్పట్లు పంపిణీ చేశారు.పర్యవసానంగా దాదాపు రెండువందల సంవత్సరాల పాటు అమెరికాలో మసూచి వ్యాప్తి చెందింది. నెపోలియన్‌ చక్రవర్తి 1797లో ఇటలీలోని మంటువాలో మలేరియా వ్యాధి వ్యాపింప చేసేందుకు మైదానాలను వరదలతో నింపించాడు. అంతర్యుద్ధ సమయంలో1863లో అమెరికాలోని బానిస వ్యవస్థను కోరుకొన్న తిరుగుబాటు రాష్ట్రాలు యూనియన్‌ సైనికులకు ఎల్లోఫీవర్‌, అమ్మోరు సోకిన రోగులు వాడిన వస్త్రాలను విక్రయించేట్టు చూశాయి.


1346లో జెనోయీస్‌-తార్తార్ల మధ్య నేటి ఉక్రెయిన్‌లో ఆధిపత్య పోరు సమయంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఓటమి దశలో ఉన్న తార్తార్లు ప్లేగువ్యాధి సోకిన, మరణించిన తమ వారిని ఫిరంగులకు కట్టి శత్రు ప్రాంతాల మీద పడేశారు. దాంతో జెనోయీస్‌ దళాలు వెనక్కు తగ్గాయి. ఈ పరిణామం గురించి గాబ్రియల్‌ డే ముసిస్‌ నమోదు చేశాడు. వెనక్కు తగ్గిన జెనోయీస్‌(ఇటాలియన్లు)లు తమతో పాటు ప్లేగు వ్యాధి కూడా తీసుకు వెళ్లారు. ప్లేగు వ్యాధిగ్రస్తులు, బహుశా దానిని వ్యాపింప చేసే ఎలుకలను కూడా తమ నౌకల్లో తీసుకుపోయి ఉంటారని పేర్కొన్నాడు. ఆ తరువాత అది ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలో మన దేశంతో సహా అనేక దేశాలకు వ్యాపించింది. రెండున్నర కోట్ల మంది ఐరోపాలో దానికి బలయ్యారు. హైదరాబాదు సంస్థానంలో ప్లేగు వ్యాధి పదే పదే వస్తుండటంతో దాన్ని నివారించేందుకు 1591లో చార్మినార్‌ను నాటి నిజాం రాజు కట్టించిన విషయం తెలిసిందే.


మొదటి ప్రపంచ యుద్ధంలో గుర్రాలకు సెంబరోగం (చీమిడి కారటం) వచ్చే ఆంత్రాక్స్‌ పౌడర్‌ను జర్మనీ, ఫ్రెంచి గూఢచారులు ప్రయోగించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ సైన్యాలు రష్యా, ఇతర అనేక దేశాలలో ప్లేగ్‌, అంతరాక్స్‌ వంటి వ్యాధులను వ్యాపింపచేసేందుకు ప్రయత్నించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 22సంవత్సరాలకు 179 దేశాలు జీవ ఆయుధాల నియంత్రణకు ఒప్పందంపై సంతకం చేశాయి. ఎట్టి పరిస్ధితుల్లోనూ వాటి తయారీ, సేకరణ, నిల్వ, వినియోగించబోమని ఆ దేశాలు అంగీకారం తెలిపాయి. అయితే వైద్య అవసరాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఇప్పుడు జీవ ఆయుధాలు తయారు చేస్తున్నవారు కూడా ఆ ముసుగుతోనే చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. రసాయనిక, జీవ ఆయుధాలకు పెద్ద తేడా ఉండదు. ఉదాహరణకు వియత్నాంను ఆక్రమించుకొనేందుకు అమెరికా జరిపిన దాడుల సమయంలో కలుపు మొక్కలను నాశనం చేసే పేరుతో ఆరెంజ్‌ ఏజంట్‌ అనే రసాయనాన్ని పెద్ద ఎత్తున వియత్నాంలో చల్లారు. యాభై సంవత్సరాలు గడిచిన తరువాత కూడా అనేక చోట్ల కలుపు మొక్కలే కాదు అసలు ఏ మొక్కా బతకని పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతాలలో పుట్టుకతో పిల్లల్లో లోపాలు, కాన్సర్‌, మధుమేహం వంటి వ్యాధులకు అమెరికా చిమ్మిన విషం కారణమని తేలింది.


మొదటి ప్రపంచ యుద్దం మీద విచారణ జరిపిన నానాజాతి సమితి కమిటీ జీవ ఆయుధాలను ఉపయోగించలేదు గానీ జర్మన్లు రసాయనిక ఆయుధాలు వాడినట్లు పేర్కొన్నది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ సామ్రాజ్యవాదులు ఆపరేషన్‌ చెర్రీ బ్లూసమ్స్‌ పేరుతో జీవ ఆయుధాలతో అమెరికా సహా అనేక దేశాల మీద దాడి చేయాలనే పథక రచన చేశారు. తన ఆక్రమణలోని చైనాలోని హార్బిన్‌, కొరియా, మంచూరియా ప్రాంతంలో దాడి చేశారు. దానిలో కలరా, ప్లేగు, అంతరాక్స్‌, మసూచి వంటి ప్రమాదకర క్రిముల్ని వాడారు. 2002లో ఒక అంతర్జాతీయ సమావేశంలో జపాన్‌ మిలిటరీ జరిపిన బాక్టీరియా బాంబు దాడుల్లో మరణించిన వారు ఐదు లక్షల ఎనభైవేల మంది ఉన్నట్టు వక్తలు వెల్లడించారు. ఒక్క చైనాలోనే ప్లేగు, కలరా, ఆంత్రాక్స్‌ వంటి వాటితో నాలుగు లక్షలమంది మరణించారని అంచనా.


జపాన్‌ జీవ ఆయుధాల తయారీకి 150 భవనాలను, ఐదు శివారు ప్రాంతాలను ఉపయోగించి మూడువేల మంది శాస్త్రవేత్తలతో పని చేయించారు. వాటి తయారీ సమయంలో కనీసం పదివేల మంది ఖైదీలపై వాటిని ప్రయోగించగా మరణించినట్టు తేలింది. వారిలో మూడువేల మంది కొరియా, చైనా, సోవియట్‌, మంగోలియా, అమెరికన్‌, బ్రిటిష్‌, ఆస్ట్రేలియన్‌ యుద్ద ఖైదీలు ఉన్నట్టు బయట పడింది. జపాన్‌ జీవ ఆయుధాల విషయం బయటపడిన తరువాత అమెరికా పెద్ద ఎత్తున 1942నుంచి వాటిని రూపొందించేందుకు పూనుకుంది. తాను పెద్ద ఎత్తున జీవ ఆయుధాలను తయారు చేసినట్టుగానే ఇతరులు కూడా తయారు చేసి తమ మీద ప్రయోగిస్తారని అమెరికా భయపడుతోంది. దీనిలో భాగంగానే అనేక కుట్ర సిద్దాంతాలను అమెరికన్లు ప్రచారంలో పెట్టారు.ఏమైనా గత చరిత్రను బట్టి మంకీపాక్సు గురించి అమెరికా, పైన పేర్కొన్న ఇతర దేశాల గురించి వెలువడిన ప్రతి సమాచారాన్ని అనుమానంతో చూడాల్సిందే. తమ దేశాల్లో ఎందుకు విస్తరిస్తున్నదో అవి ప్రపంచానికి చెప్పాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !

18 Wednesday May 2022

Posted by raomk in CHINA, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Britain IRD, fake news, Indonesian Communist Party (PKI)., Propaganda War, UK black propaganda


ఎం కోటేశ్వరరావు


భారీ ఆయుధాలు కావాలని ఉక్రెయిన్‌ కోరుకుంటున్నదనటం పశ్చిమ దేశాల ప్రచారంలో భాగమని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు నోమ్‌ చోమ్‌ స్కీ చెప్పారు. ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ పదే పదే రాజకీయ పరిష్కారం కావాలని చెప్పటం, నాటో సభ్యత్వ కోరికను వదులుకుంటామని, తటస్ధంగా ఉంటామని చెప్పిన అంశాలు అమెరికా-బ్రిటన్‌ ప్రచార వ్యవస్ధ నుంచి మనకు ఎక్కడా వినిపించవు అని చోమ్‌ స్కీ అన్నారు. ఉక్రెయిన్‌-రష్యా వివాదాన్ని పరిష్కరించేందుకు తోడ్పడే విధంగా పశ్చిమ దేశాల నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదా ప్రతిపాదనలు గానీ లేవు. దానికి బదులు తమ దగ్గర ఉన్న ఆధునిక ఆయుధాలను అందించి సొమ్ము చేసుకోవాలనే దుష్ట ఆలోచనను కనపడకుండా చేసేందుకు రష్యా గురించి అనేక తప్పుడు ప్రచారాలను వ్యాపింప చేస్తున్న అంశం తెలిసిందే.
అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు భౌతికదాడుల్లో పాల్గొనటమే కాదు, వాటితో పాటు తప్పుడు ప్రచారదాడులు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాయి. అందుకోసం భారీ ఖర్చు, నిపుణులతో కూడిన ప్రత్యేక విభాగాలను కూడా ఏర్పాటు చేస్తాయి. వీటిని ఆదర్శంగా తీసుకొని అదే తరహాలో మన దేశంలో అనేక సంస్ధలు ప్రత్యేకించి- సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన వివిధ సంస్ధలు, పలు ముస్లిం సంస్ధలకు చెందిన వారు పరస్పరం రెచ్చగొట్టేందుకు వాట్సాప్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నారనే విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. మెజారిటీ, మైనారిటీ మతోన్మాద ప్రచారం అనేక మంది మెదళ్లను విద్వేషానికి, భౌతికదాడులకు అనువైనదిగా మారుస్తున్నది.


కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ముస్లింలను సమీకరించటం, కమ్యూనిజం, పూర్వపు సోవియట్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు, చైనా-సోవియట్‌ మధ్య విబేధాలను పెంచటంతో సహా పలు ఎత్తుగడలతో బ్రిటన్‌ విదేశాంగశాఖ ఏర్పాటు చేసిన ఇన్ఫర్మేషన్‌ రిసర్చ్‌ డిపార్ట్‌మెంట్‌(ఐఆర్‌డి) విభాగం సాగించిన దుర్మార్గాలకు సంబంధించిన పత్రాలను ఇటీవల బహిర్గతం చేశారు. వాటి నుంచి పరిశోధకులు తవ్వినకొద్దీ అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి, గతవారంలో కొన్నింటిని విశ్లేషకులు వెల్లడించారు. 1960దశకంలో ఇండోనేషియాలో లక్షలాది మంది కమ్యూనిస్టులు, సానుభూతి పరులను ఊచకోత కోసేందుకు అక్కడి ముస్లిం మతోన్మాదులను రెచ్చగొట్టటంలో బ్రిటన్‌ ఐఆర్‌డి ప్రచార అంశాలు ప్రధానంగా దోహదం చేసినట్లు తేలింది. అధ్యక్షుడు సుకర్ణో, విదేశాంగ మంత్రి సుబాంద్రియో కమ్యూనిస్టుల పట్ల సానుకూలంగా ఉండటంతో పాటు బ్రిటీష్‌ వారు రూపొందించిన మలేషియా ఫెడరేషన్‌ ప్రతిపాదనను తిరస్కరించారు. వారిని కొనసాగనిస్తే ఇండోనేషియా కూడా సోషలిస్టు దేశంగా మారుతుందనే అంచనాతో అమెరికా, బ్రిటన్‌ కుట్ర చేసి తిరుగుబాటుకు మిలిటరీని ప్రోత్సహించాయి. దాన్ని సమర్ధించుకొనేందుకు అనువుగా తప్పుడు ప్రచారం సాగించాయి. సుకర్నో, సుబాంద్రియోలను, చైనా జాతీయులను బతకనిస్తే కమ్యూనిస్టు చైనా ఏ క్షణంలోనైనా ఇండోనేషియాను ఆక్రమిస్తుందని, మిలిటరీతో పాటు దేశంలోని కమ్యూనిస్టు వ్యతిరేకులను, మతశక్తులను రెచ్చగొట్టేందుకు వందలాది కరపత్రాలను పంపిణీ చేశారు.


సిఐఏ, బ్రిటీష్‌ ఎం16 ఏజంట్లు రూపొందించిన కుట్రలో భాగంగా ఆరుగురు మిలిటరీ అధికారులను కిడ్నాప్‌ చేసి వారిని హత్యగావించి ఆ పని చేసింది కమ్యూనిస్టులే అని ప్రచారం చేసి దాడులకు రంగాన్ని సిద్దం చేశారు. కమ్యూనిస్టుల మీద చర్యలు తీసుకుంటే అమాయక చైనీయులు కొందరు ఇబ్బందిపడినప్పటికీ, వారే కారకులని గుర్తించినందున అంతం చేయకతప్పదని రేడియో ప్రసారాలు, ఆ కరపత్రాల్లో రెచ్చగొట్టారు.ప్రవాసంలో ఉన్న జాతీయవాదులైన ఇండోనేషియన్ల పేరుతో సింగపూర్‌లో తిష్టవేసిన ఐఆర్‌డి నిపుణులు రాసిన సమాచారాన్ని ప్రచారంలో పెట్టారు.1965 అక్టోబరులో ఊచకోతలను ప్రారంభించే ముందు కమ్యూనిస్టులను అంతమొందించాలని ప్రేరేపించారు. ఈ దుర్మార్గంలో తమ పాత్ర లేదని బ్రిటన్‌ దశాబ్దాల తరబడి చెప్పుకున్నది, నాటి పత్రాలు వెల్లడి కావటంతో దాని దుర్మార్గం నిర్ధారితమైంది. కమ్యూనిస్టుల నుంచి దేశాన్ని కాపాడేపేరుతో మిలిటరీ అధికారి సుహార్తో అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు.అధ్యక్షుడు సుకర్ణోను బందీగా పట్టుకొని సుకర్ణో పేరుతోనే ఊచకోతకు పాల్పడ్డాడు. తరువాత 1967లో తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకొని 32 సంవత్సరాలు నిరంకుశపాలన సాగించాడు.


రెండవ ప్రపంచ యుద్దం తరువాత కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం కోసం 1948లో నాటి లేబర్‌ పార్టీ ప్రభుత్వం ఐఆర్‌డిని ఏర్పాటు చేసింది. అరబ్బు ప్రాంతం, ఆఫ్రికా, ఆసియాల మీద ప్రధానంగా ఇది కేంద్రీకరించింది.తప్పుడు వార్తలు,నకిలీ పత్రాలను ప్రచారంలో పెట్టటం వంటి పలు రూపాల్లో అది ప్రచారదాడులు చేసింది. తన ప్రచారాన్ని ఆకర్ణణీయంగా మార్చేందుకు యూదు వ్యతిరేకతను రెచ్చగొట్టటం, జాత్యహంకారం, ముస్లిం మనోభావాల వంటి వాటినన్నింటినీ అది ఉపయోగించుకుంది. ఐఆర్‌డి ఏజంట్లు తెరవెనుక ఉండి స్వతంత్ర సంస్ధల పేరుతో కొన్నింటిని సృష్టించి ఆ పేరుతో తాము రూపొందించిన తప్పుడు సమాచారాన్ని మీడియా, పశ్చిమ దేశాల ప్రభుత్వాలకు, అనేక సంస్ధలకు అందచేసేవారు. తాము బురద జల్లదలచుకున్న దేశాలు, సంస్ధల పేరుతో వాటిని రూపొందించేవారు. సోవియట్‌ వార్తా సంస్ధ నొవొస్తి విడుదల చేయాల్సిన సమాచారాన్ని ఫోర్జరీ చేసి పదకొండుసార్లు ఐఆర్‌డి ప్రచారంలో పెట్టినట్లు తేలింది. వాటిలో ఒకటి ఈజిప్టుకు మిలిటరీ సాయాన్ని వక్రీకరించటం. 1967లో ఇజ్రాయెల్‌తో ఈజిప్టు జరిపిన ఆరు రోజుల యుద్దంలో చేసిన సాయం వృధా అయినట్లు సోవియట్‌ నుంచి వెలువడిన వార్త పేర్కొన్నట్లు ప్రచారం చేశారు. ఇంతేకాదు అరబ్బు దేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న ముస్లిం బ్రదర్‌హుడ్‌ సంస్ద పేరుతో కూడా నకిలీవార్తలను సృష్టించారు. ఈజిప్షియన్లను తిరోగామి ముస్లిం మూఢనమ్మకాలను పాటించేవారుగా చిత్రించి చెడు మాటలు మాట్లేడే నాస్తికులు, సోవియట్లు ప్రచారం చేస్తున్నారని బురదజల్లుతూ ముస్లిం బ్రదర్‌హుడ్‌ పేరుతో ప్రచారంలో పెట్టారు.ఇజ్రాయెల్‌తో పోరులో అరబ్బుల ఓటమికి విశ్వాసం లేకపోవటమే కారణమంటూ ఆ సంస్ధ పేరుతో రెచ్చగొట్టారు. యూదులకు మాతృదేశం పేరుతో ఇజ్రాయెల్‌ సృష్టికి బాటలు వేసిన, కుట్రలు చేసిన వారిలో బ్రిటన్‌ది ప్రధాన పాత్ర అన్న సంగతి తెలిసిందే. ఐఆర్‌డి తాను రూపొందించిన నకిలీవార్తలను నిజమని భావించేేందుకు, ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించే వారే వాటిని ప్రచారంలో పెట్టినట్లు నమ్మించేందుకు ఈజిప్షియన్లు నేరుగా యూదుల మీద ఎందుకు దాడులకు దిగటం లేదని రెచ్చగొడుతూ రాసేవారు.


ఆఫ్రికా దేశాల్లో సోవియట్‌ వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు సోవియట్‌ అనుకూల సంస్దల పేర్లతోనే ప్రచారం చేశారు. ఆఫ్రికన్లు అనాగరికులని ప్రపంచ ప్రజాతంత్ర యువజన సమాఖ్య వర్ణించినట్లు ఒక వార్తను ఐఆర్‌డి ప్రచారంలో పెట్టింది.సోవియట్‌ విశ్వవిద్యాలయాల్లో చేరిన ఆఫ్రికన్‌ విద్యార్ధులకు చదువు సంధ్యలు రావని తూలనాడినట్లుగా కూడా ప్రచారం చేసింది. ఈ తప్పుడు ప్రచార సంస్ధను ఉపయోగించటంలో లేబర్‌, కన్సర్వేటివ్‌ పార్టీలు దేనికి ఏదీ తీసిపోలేదు. సోవియట్‌కు చేరువ అవుతున్న ఆఫ్రికా దేశమైన ఘనా సంగతి చూడాలని 1964లో కన్సర్వేటివ్‌ ప్రధాని అలెక్‌ డగ్లస్‌ ఆదేశించాడు. కొద్ది నెలల తరువాత చైనా – ఆఫ్రికన్ల మధ్య జాతులపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టాలని లేబర్‌ పార్టీ ప్రభుత్వ విదేశాంగ మంత్రి పాట్రిక్‌ గార్డన్‌ వాకర్‌ కోరాడు. 1977లో ఈ సంస్దను రద్దుచేసినట్లు ప్రకటించారు. మరొక పేరుతో అదే ప్రచారదాడులను కొనసాగిస్తున్నారు. తప్పుడు సమచారాన్ని ఎదుర్కొనేందుకు కొత్త సంస్దను ఏర్పాటు చేస్తున్నట్లు 2022 ఫిబ్రవరిలో బ్రిటన్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ ప్రకటించారు. ఆమె ప్రకటన తరువాత అదే నెలలో ఉక్రెయిన్‌పై రష్యా సైనికచర్య ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ పరిణామం గురించి పశ్చిమదేశాల సంస్ధలు ఎన్ని అసత్యాలను ప్రచారం చేస్తున్నదీ తెలిసిందే. వాటిలో బ్రిటన్‌ ఒక ప్రధాన పాత్రధారి.


సోవియట్‌ ప్రచారాన్ని అడ్డుకొనే పేరుతో అమెరికా , బ్రిటన్‌ తదితర సామ్రాజ్యవాద దేశాలు జరిపిన దుర్మార్గాలు, ప్రచారదాడి గురించి ప్రపంచానికి తెలిసింది స్వల్పమే. ఐఆర్‌డి సంస్ధలో 360 మంది పని చేశారు.వారి పని కమ్యూనిజం, సోవియట్‌ ముప్పు గురించి కల్పిత నివేదికలను తయారు చేసి వివిధ ప్రభుత్వాలకు, ఎంపిక చేసిన జర్నలిస్టులు, మేథావులకు పంపటం. వాటికి విశ్వసనీయత కల్పించేందుకు బ్రిటన్‌ గూఢచార, భద్రతా సంస్దలు అందచేసిన అంశాలను కూడా జోడించి స్వతంఐత్ర సంస్దల పేరుతో వాటిని పంపేవారు. అ సంస్ధలు కూడా ఐఆర్‌డి ఏర్పాటు చేసినవే. వాటిలో 1964లో ఏర్పాటు చేసిన ” కమ్యూనిస్టు అనుబంధ సంఘాల గురించి శోధించే అంతర్జాతీయ కమిటీ ” ఒకటి. ఇది మరొక సంస్దను ఏర్పాటు చేసింది. దాని పేరు విశ్వాసుల సభ (లీగ్‌ ఆఫ్‌ బిలీవర్స్‌). దీని పనేమిటంటే రష్యన్లకు దేవుడి మీద విశ్వాసం లేదు, అరబ్బుల ఓటమికి దేవుడి మీద సరైన విశ్వాసం లేకపోవటమే అంటూ పచ్చి మతోన్మాదాన్ని ప్రచారంలో పెట్టటం, అలాంటి వారి మన్నన పొందటం లక్ష్యంగా ఉండేది. అది ప్రచారంలో పెట్టినదానిలో ఒక అంశం ఇలా ఉంది.” ఈ తరుణంలో అరబ్‌ జాతి ఇంతగా ఎందుకు విచారంలో ఉంది ?విపత్తుకు గురైంది ? ధైర్యవంతులైన అరబ్బు శక్తులు జరిపిన జీహాద్‌లో దుష్ట యూదుల చేతిలో ఎందుకు ఓడిపోయారు ? సమాధానాలు కనుగొనటం సులభమే ! మనం గతంలో అనుసరించిన సరైన మార్గం నుంచి వైదొలుగుతున్నాము. మతం ఒక సామాజిక జబ్బు అని భావించే కమ్యూనిస్టులు-నాస్తికులు మనకు సూచించిన మార్గంలో మనం వెళుతున్నాము.” అని పేర్కొన్నారు, అంటే కమ్యూనిస్టులు, సోషలిస్టు దేశాలకు దూరంగా ఉండాలని ముస్లింలను రెచ్చగొట్టటమే ఇది. ఇలాంటి రాతల్లో ఇజ్రాయెల్‌ మీద వ్యతిరేకతను చొప్పిస్తారు. వాటిని చూసి సామాన్య అరబ్బులు సహజంగానే తమ హితం కోరేవారు చెబుతున్నట్లుగా భావించేవారు.


ఐఆర్‌డి సంస్ధ ఒక్క కమ్యూనిస్టుల మీదనే కాదు బ్రిటన్‌ ప్రయోజనాలు ఉన్న ప్రతి చోటా జోక్యం చేసుకుంది.ప్రస్తుతం జింబాబ్వేగా పిలుస్తున్న దేశం ఒకనాడు బ్రిటీష్‌ వలస ప్రాంతం. 1965లో ఇయాన్‌ స్మిత్‌ రొడీషియా పేరుతో స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. స్మిత్‌ను వ్యతిరేకించే వారి పేరుతో ఐఆర్‌డి ఒక నకిలీ గ్రూపును ఏర్పాటు చేసింది. తాజా పరిస్ధితిని చూస్తే గతంలో సాగించిన మాదిరే ఇప్పుడూ ప్రచారం చేస్తున్నారు. చైనాలో ముస్లింలను అణచివేస్తున్నారని రోజూ వినిపిస్తున్న కట్టుకథలు అలాంటివే. రుణాల పేరుతో చైనా బలహీన దేశాలను ఆక్రమిస్తున్నదన్నదీ దానిలో భాగమే. కనుక వాట్సాప్‌, టీవీ, పత్రికల్లో వచ్చే వాటిని గుడ్డిగా నిజమని భావించరాదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d