• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: UK

ట్రంప్‌తో మరిన్ని కౌగిలింతల కోసం మోడీ తహతహలాడుతున్నారా !

11 Thursday Jun 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Donald trump, G7, G7 summit, G7 Summit in Camp David, G7 to G12


ఎం కోటేశ్వరరావు
ప్రధాని నరేంద్రమోడీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అంటే మోజు తీరలేదా ? మరిన్ని కౌగిలింతల కోసం తహతహలాడుతున్నారా ? అమెరికన్లకే మోజు తీరి రోజు రోజుకూ ట్రంప్‌ పలుకుబడి తగ్గిపోతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి, అదే నిజమైతే ఓడిపోయే ట్రంప్‌తో కలసి ఊరేగేందుకు మోడీని మన పాలకవర్గాలు అంగీకరిస్తాయా ? ఒక వేళ డెమోక్రాట్లు గెలిస్తే తమకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేసిన నరేంద్రమోడీతో ఎలా వ్యవహరిస్తారు ? ఏడు ధనిక దేశాల(జి7) బృందంలో చేరినంత మాత్రాన మనది ధనిక దేశంగా మారుతుందా ? ఆ బృందం ఏర్పడిన నాటి కంటే నేడు ప్రభావం తగ్గిన నేపధ్యంలో దానిలో చేరినంత మాత్రాన మనకు ఒరిగేదేమిటి? మన కంటే పెద్ద ఆర్ధిక వ్యవస్ధ కలిగిన చైనాను పక్కన పెట్టి డోనాల్డ్‌ ట్రంప్‌ మనమీద ఎందుకు శ్రద్ద చూపుతున్నాడు? ఆ బృందాన్ని చైనా వ్యతిరేక వేదికగా చేసేందుకు ట్రంప్‌ పూనుకున్నాడన్నది బహిరంగ రహస్యం, అలాంటి దానితో చేరి చైనాతో వ్యతిరేకతను కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా ?చేరినంత మాత్రాన మనకు ఒరిగేదేమిటి ? అటు జి7, ఇటు జి20 రెండింటిలో కొనసాగితే మిగిలిన దేశాల వైఖరి ఎలా ఉంటుంది ? ఇలాంటి ఎన్నో భట్టి విక్రమార్క ప్రశ్నలు మన ముందుకు వస్తున్నాయి.
1973లో తలెత్తిన చమురు సంక్షోభ పర్యవసానాలతో ఏం చెయ్యాలా అన్న ఆలోచన తలెత్తి అమెరికా చొరవతో పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ సమావేశానికి అమెరికా అధ్యక్షభవనంలోని గ్రంధాలయం వేదిక అయింది. దాంతో నాలుగు దేశాలను గ్రంధాలయ బృందం అని పిలిచారు. తరువాత జపాన్‌ను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. అలా అది జి5 అయింది. తరువాత ఇటలీ, కెనడాలను చేర్చుకున్న తరువాత జి7 అయింది.1977 నుంచి ఐరోపా యూనియన్‌ను శాశ్వత ఆహ్వానితురాలిగా చేర్చారు. సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత పూర్వపు రష్యా తిరిగి ఉనికిలోకి వచ్చింది.1998లో రష్యాను చేర్చుకోవటంతో జి8గా మారింది. 2014లో ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియాను రష్యా తనలో విలీనం చేసుకోవటంతో ఆ బృందం నుంచి దాన్ని తొలగించారు.
తిరిగి ఇప్పుడు ట్రంప్‌ ఏలుబడిలో రష్యాతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, భారత్‌లను చేర్చుకోవాలని జి11గా విస్తరించాలన్న ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. ఈ బృందంలో ప్రతి ఏటా ఒక దేశం అధ్యక్ష స్ధానంలో ఉంటుంది. ఆ దేశనేత ఎవరినైనా ఆ సమావేశాలకు అతిధులుగా ఆహ్వానించవచ్చు. గతేడాది ఫ్రాన్స్‌ అదే హౌదాతో, ఇప్పుడు ట్రంప్‌ మన ప్రధాని నరేంద్రమోడీని జి7 సమావేశాలకు ఆహ్వానించారు.(2006లో రష్యా సెంట్‌ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన సమావేశానికి మన ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఆహ్వానించారు. మన దేశం నుంచి ప్రధాని వెంట వెళ్లిన పాత్రికేయ బృందంలో ఈ రచయిత ఒకడు) 2005 నుంచి వరుసగా ఐదు సమావేశాలకు మన్మోహన్‌ సింగ్‌ను ఆహ్వానించారు. జి7ను విస్తరించాలన్న ఆలోచన ట్రంప్‌లో తలెత్తిన సరికొత్త ఆలోచన కాదు. అంతకు ముందు నుంచీ ఉన్నది. పెరుగుతున్న మన దేశ జిడిపి, మార్కెట్‌ను గమనంలో ఉంచుకొనే అంతకు ముందు లేని విధంగా మన్మోహన్‌ సింగ్‌ను, ఇప్పుడు మోడీని ఆహ్వానిస్తున్నారు.
డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనతో ప్రపంచ మీడియాలో జి7 విస్తరణ వెనుక ఉన్న రాజకీయాల గురించి చర్చ జరుగుతోంది. ఆహ్వానం అందుకున్న దేశాలు ట్రంప్‌ ఆతిధ్యం స్వీకరిస్తే ఏమిటి ? లేకుంటే ఎలా అని తర్జన భర్జన పడుతున్నాయి. ఈ బృంద ప్రస్తుత రూపానికి కాలదోషం పట్టిందని, దీన్ని మార్చాలని ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. ప్రపంచంలో ఇది సక్రమంగా ప్రాతినిధ్యం వహించటం లేదన్నాడు. ఈ బృంద సమావేశాలలో తీసుకొనే నిర్ణయాలను విధిగా అమలు జరపాలనే నిబంధనేదీ లేదు. ఒక నాడు ప్రపంచ జిడిపిలో అత్యధిక భాగానికి ప్రాతినిధ్యం వహించిన ఈ బృందం క్రమంగా ప్రాభవం కోల్పోయింది.
జి7 విస్తరణతో అమెరికాకు ఒరిగేదేమిటి అని సిఎన్‌బిసి టీవీ విశ్లేషణ చేసింది. మిగిలిన ఆరు దేశాలలో కూడా మనకేమిటి అని, ట్రంప్‌ ప్రతిపాదిత జి7 విస్తరణ కూటమిలో చేరితే దానితో తలెత్తే ముప్పు లాభాల గురించి ప్రతి దేశంలోనూ తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఉదాహరణకు ఆస్ట్రేలియాలో ముందుకు వచ్చిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. చైనాను కట్టడి చేసే లక్ష్యంతో జరుగుతున్న సమావేశంలో ప్రాధాన్యత లేని పాత్రధారిగా ఆస్ట్రేలియా హాజరైతే కలిగే ప్రయోజనం ఏమిటి? ఓటమి అంచుకు చేరుతున్న ఒక అధ్యక్షుడితో చేతులు కలపటం అవసరమా ? అమెరికా కనుసన్నలలో ఆస్ట్రేలియా పని చేస్తోందనే చైనా ప్రచారం మరింతగా పాదుకుపోతుంది. చైనా వ్యతిరేకతను విధిగా వ్యక్తం చేసే అమెరికా ఎన్నికల ప్రచారానికి ఆస్ట్రేలియా అండనిస్తోందనే భావం కలుగుతుంది.
ఏ దేశమైనా ఇదే ప్రాతిపదికన ఆలోచించాల్సి ఉంటుంది. నరేంద్రమోడీ ఎన్నో అడుగులు ముందుకు వేసి ఆబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అంటూ గతేడాది హూస్టన్‌లో జరిగిన హౌడీమోడీ కార్యక్రమంలో మోడీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది అమెరికా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, డెమోక్రాట్లకు వ్యతిరేకతను వ్యక్తం చేయటమే. ఆ సభలోనే ఆహ్వానం పలికి ఈ ఏడాది అహమ్మదాబాద్‌లో పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయటం దాని కొనసాగింపే. మోడీ సర్కార్‌ లేదా ఆయనకు సాయంగా ఉన్న విధాన నిర్ణేతలు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారా ? చైనాకు వ్యతిరేకంగా ఒక సంయుక్త సంఘటన ఏర్పాటు. చైనాతో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన ట్రంప్‌ కరోనా వైరస్‌ నుంచి తైవాన్‌, హాంకాంగ్‌ వరకు వివిధ అంశాలపై చైనాకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నాడు. ప్రతిదానిలో రాజకీయాలను చొప్పిస్తున్నాడు. వాణిజ్య ఒప్పందాలు, ఇరాన్‌ అణు ఒప్పందం, పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి ఏకపక్షంగా అమెరికా వైదొలగటం, ఆ నిర్ణయాలకు ట్రంప్‌ బాధ్యుడు కావటంతో గత రెండు జి7 వార్షిక సమావేశాలలో తీవ్ర సెగ తగిలింది. తనకు అనుకూలమైన దేశాలను జత చేసుకోవటం ద్వారా ట్రంప్‌ తన విమర్శకుల నోరు మూయించాలన్న ఎత్తుగడ కూటమి విస్తరణ పిలుపు వెనుక ఉంది. అమెరికా తరువాత ఈ బృందంలో పలుకుబడి కలిగిన జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజలా మెర్కెల్‌ ఈ ఏడాది అమెరికాలోని కాంప్‌డేవిడ్‌ సమావేశాలకు హాజరు కావాలని లాంఛనంగా ట్రంప్‌ స్వయంగా పలికిన ఆహ్వానాన్ని తిరస్కరించటాన్ని బట్టి విబేధాలు ఏ స్ధాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.రెండవది గతంలో రష్యాను బహిష్కరించి తిరిగి ఇప్పుడు ఏ ప్రాతిపదికన చేర్చుకోవాలని ట్రంప్‌ కోరుతున్నాడో తెలియని గందరగోళం బృందంలో తలెత్తింది. ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, రష్యాలను చేర్చుకొనేందుకు బ్రిటన్‌ విముఖంగా ఉంది.
ఏ దేశమైనా తన కార్పొరేట్‌ లేదా చైనా వంటి దేశాలైతే తన ప్రభుత్వ రంగానికి ఉపయోగపడేందుకు ఇలాంటి బృందాలను వినియోగించుకొనేందుకు ప్రయత్నిస్తాయి. మన బడా కార్పొరేట్‌ శక్తులు ముందుగా బలహీనమైన దేశాలలో ప్రవేశించాలని కోరుకుంటున్నాయి. అందుకుగాను భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం, అణుదేశాల క్లబ్బులో సభ్యత్వాన్ని కోరుతున్నాయనే అభిప్రాయం ఉంది. వీటి వెనుక మన దేశ భద్రతా కారణాలు కూడా ఇమిడి ఉన్నాయి. అయితే ఈ లక్ష్యాలను సాధించటం ఎలా, అందుకోసం చైనాను శత్రువుగా చేసుకోవాలా ? ఒక వేళ ఆ వైఖరితో ముందుకు పోతే అది సాధ్యం అవుతుందా అన్నవి పెద్ద ప్రశ్నలు.
ఈ నెలలో జరగాల్సిన సమావేశాన్ని సెప్టెంబరుకు వాయిదా వేయటం వెనుక ట్రంప్‌కు ఎదురైన తక్షణ సమస్యలేమిటన్నది ఆసక్తి కలిగిస్తున్నాయి. ఒకటి కరోనా వైరస్‌ తీవ్రత అమెరికాలో తగ్గే సూచనలు లేకపోవటం, ప్రపంచ నేతలు, ప్రతినిధి బృందాలు అమెరికా వచ్చేందుకు భయపడటం. తాను పాల్గొనేది లేనిదీ నిర్ధారించలేనని జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ప్రకటించటం ముఖ్యమైంది. సభ్యదేశాల నేతలందరూ హాజరు కావాల్సిందేనని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ పట్టుబట్టటం.జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ జి7 సమావేశాలకు హాజరుకాకపోవచ్చు అన్న వార్తల వెనుక తాము చైనా వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొనేందుకు సిద్దంగా లేమని, అమెరికా అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోవటానికి సిద్దంగా లేమని చెప్పటంగా అర్ధం చెబుతున్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఎవరి ప్రయోజనాలకు అనుగుణ్యంగా వారు ఎత్తులు పైఎత్తులు వేయటం సహజం. అయితే అమెరికా ప్రయోజనాలు, రాజకీయ ఎత్తుగడలకు మన దేశాన్ని పావుగా చేసుకొనేందుకు జరుపుతున్న యత్నాలు ప్రమాదకరమైనవి. అమెరికా ప్రయోజనాలు అంటే అర్ధం అక్కడి కార్పొరేట్ల ప్రయోజనాలే ప్రధానం.
డోనాల్డ్‌ ట్రంప్‌ ఆహ్వానం పలికిన ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా ప్రస్తుతం అమెరికా పాలేళ్ల వంటివి.భారత్‌, రష్యాలను ఆహ్వానించటం అంతర్జాతీయ రాజకీయాల్లో భాగం. చైనా వ్యతిరేకశక్తులను కూడగట్టటమే ప్రధాన లక్ష్యం అయితే దానిలో రష్యా భాగస్వామి అవుతుందా అన్నది ప్రశ్న. రెండు దేశాల మధ్య అనుమానాలు రేకెత్తించే ఎత్తుగడ కూడా ఉండవచ్చు. అనేక చోట్ల అమెరికాను నిలువరించటంలో రష్యా తనవంతు పాత్రను పోషిస్తున్నది. ఈ బృందంలో దాన్ని తిరిగి ఆహ్వానించటాన్ని కొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి కనుక తనకు ప్రయోజనమని ట్రంప్‌ భావిస్తూ ఉండాలి. ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నట్లు రష్యా అధినేత పుతిన్‌ ఇంతవరకు వెల్లడించలేదు. ఒక వేళ అంగీకరిస్తే కొన్ని దేశాల స్పందన ఎలా ఉంటుందో తెలియదు. రెండవది రష్యాను బుజ్జగించి అది ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలను చూపి తమతో భాగస్వామిగా చేసుకోవచ్చన్న దూరాలోచన కూడా ఉండవచ్చు. ఒక బలమైన ప్రత్యర్ధితో దెబ్బలాటకు దిగటం కంటే సర్దుబాటు చేసుకుంటే లాభం అనుకుంటే ఎత్తుగడలు మారిపోతాయి. కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న స్ధితిలో ఇలాంటి సభల కంటే దాన్ని ఎదుర్కొనేందుకే వాయిదా వేశానని చెప్పుకోవచ్చు. ట్రంప్‌ వాయిదా వేసిన సెప్టెంబరులో అయినా అసలు సమావేశాలు జరుగుతాయా అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఆ సమయంలో ఐక్యరాజ్య సమితి సమావేశాలు ఉన్నాయి. నవంబరులో అమెరికాలో ఎన్నికలు ఉన్నాయి, వాటిలో ఓటమి పాలైతే ట్రంప్‌ అసలు పాల్గొనే అవకాశాలే ఉండక పోవచ్చు.
రష్యాను తిరిగి కూటమిలోకి రావాలని ట్రంప్‌ ఆహ్వానించటం రష్యా-చైనా-అమెరికా మధ్య ఉన్న సమతూకాన్ని తీవ్రదశకు చేర్చుతాయి. అమెరికా యత్నం ఎదురుతన్నినా ఆశ్చర్యం లేదు. తన ఎన్నిక కోసం ట్రంప్‌ ఈ చర్యకు పాల్పడినట్లు కొందరు చూస్తున్నారు. ట్రంప్‌ ఆహ్వానాన్ని రష్యా పట్టించుకోకపోగా ఐరోపాయూనియన్‌, కెనడా, బ్రిటన్‌ వ్యతిరేకించాయి. ఇలాంటపుడు రష్యా హాజరయ్యే అవకాశాలు పరిమితం. అయితే క్రిమియా ప్రాంతాన్ని తనలో విలీనం చేసుకున్న తరువాత రష్యా అటు అమెరికా, ఇటు ఐరోపా యూనియన్‌ దేశాల నుంచి ఆంక్షలు, తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నది, ఒంటరి పాటు అయింది. అమెరికాతో విబేధాలు ఉన్నప్పటికీ దాన్నుంచి బయట పడేందుకు ఇదొక అవకాశం అని రష్యా భావిస్తే జి7 సమావేశాలకు హాజరు కావచ్చు. చైనా దీన్ని సానుకూలంగానే పరిగణించవచ్చు.
ప్రస్తుతం చైనాతో ఉన్న స్నేహ సంబంధాలపై వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం గానీ, ట్రంప్‌ ఆహ్వానాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అగత్యం గానీ ప్రస్తుతానికి రష్యాకు లేదని రష్యన్‌ పరిశీలకులు చెబుతున్నారు. ఇతర దేశాలతో పోల్చితే గత రెండు దశాబ్దాలలో రష్యా-చైనా సంబంధాలు సజావుగానే కొనసాగుతున్నాయి. సరిహద్దు సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమయ్యాయి.చైనా మీద అమెరికా తెస్తున్న వత్తిడి కారణంగా సంబంధాలు మరింతగా బలపడ్డాయని చెప్పవచ్చు. ఈ నేపధ్యంలో చైనా నుంచి రాయితీలను ఎక్కువగా పొందవచ్చని కూడా కొందరి అంచనా. ఆర్ధికంగా చూస్తే చైనాకు రష్యా అవసరం కంటే రష్యాకే చైనా అవసరం ఎక్కువగా ఉన్నందున ఒక వేళ అమెరికా-చైనా మధ్య ప్రచ్చన్న యుద్దమంటూ జరిగితే అమెరికాతో రష్యా కలిసే అవకాశాలు ఉండకపోవచ్చు. ఒక బూర్జువా రాజ్యంగా ఆ విబేధాలను తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు ప్రయత్నించవచ్చు.
జి7 దేశాలతో కలసి పని చేసేందుకు భారత్‌ ఎంతో సంతోషిస్తుందని అమెరికాలో మన రాయబారి తరంజిత్‌ సింగ్‌ సంధు ఒక వార్తా సంస్ధతో చెప్పారు.జూన్‌ రెండవ తేదీన ట్రంప్‌-నరేంద్రమోడీ మధ్య ఫోన్‌ చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సంతోషం, కౌగిలింతల వెనుక ఉన్న రహస్యం అందరికీ తెలిసిందే. వాటిలో ఒకటి 2017-18లో మన దేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న చమురు 9.6 మిలియన్‌ పీపాలైతే 2019లో 93.34 మిలియన్‌ పీపాలకు పెరిగింది. ఫిబ్రవరిలో ట్రంప్‌ గుజరాత్‌ పర్యటన సందర్భంగా మరింతగా చమురు దిగుమతి చేసుకోవాలని ఒప్పందానికి వచ్చారు. ఇదంతా సాంప్రదాయంగా మనం పశ్చిమాసియా నుంచి చేసుకుంటున్న దిగుమతులను నిలిపివేసిన పర్యవసానం. ప్రభుత్వ రంగ ఐఓసి ఏటా 24మిలియన్‌ పీపాల చమురును అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలని టెండర్లు పిలిచింది.
అమెరికా తరువాత రెండవ పెద్ద ఆర్ధిక శక్తిగా ఉన్న చైనా లేకుండా జి7 సాధించేదేమిటి? ఆ కూటమిలో చేరినంత మాత్రాన మన దేశానికి ఒరిగేదేమిటి అన్నది ప్రశ్న. జి7 కంటే జి20 దేశాలు ఒక కూటమిగా బలంగా ఉన్నాయని చెప్పవచ్చు. అమెరికా తప్ప మిగిలిన జి7 దేశాల కంటే చైనా ఆర్ధిక ప్రభావం ఎక్కువ అన్నది జగమెరిగిన సత్యం.అమెరికా ఏకపక్షంగా అంతర్జాతీయ సంస్ధలు, ఒప్పందాల నుంచి వైదొలగటం ప్రారంభించిన తరువాత మిగిలిన ఆరు దేశాలపై దాని ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తోంది.
డోనాల్డ్‌ ట్రంప్‌ ఎత్తుగడ మేరకు ఒక వేళ దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా జి7లో చేరినా అవి అమెరికాకు వంత పాత్ర తప్ప ఆర్ధికంగా, రాజకీయంగా ప్రపంచం మీద పెద్ద ప్రభావం చూపే స్ధితిలో లేవు. వర్తమాన బలాబలాల్లో అమెరికా నుంచి చైనా నుంచి రాయితీలు ఎక్కువగా పొందేందుకు భారత పాలకవర్గాలు ప్రయత్నిస్తాయి తప్ప పూర్తిగా అమెరికాకు లొంగిపోయే అవకాశం లేదన్నది ఒక అభిప్రాయం.మొత్తంగా చూసినపుడు తన ఎన్నిక నేపధ్యంలో ట్రంప్‌ జి7 విస్తరణను ఒక రాజకీయ ప్రదర్శనగా మార్చదలుచుకున్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు 2018 నుంచి చైనా నుంచి ఆర్ధిక రాయితీలు పొందేందుకే అమెరికా వాణిజ్య యుద్దం ప్రారంభించటం ఇతర వత్తిడులు అన్నది మిగతా దేశాలేవీ గ్రహించలేనంత అమాయకంగా లేవు. అందువలన అవి చైనా వ్యతిరేక కూటమిగా మారేందుకు ఎంత మేరకు ముందుకు వస్తాయి, వాటికి ఆ అవసరం ఏమిటన్నది ప్రశ్న.
ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకు వచ్చింది.ప్రస్తుతం మిగిలిన దేశాలలో ప్రస్తుతం జర్మనీ ఈ ఏడాది అధ్యక్ష స్ధానంలో ఉంది. సెప్టెంబరు నెలలో జర్మనీ నగరమైన లీప్‌జిగ్‌లో ఐరోపాయూనియన్‌-చైనా సమావేశం జరగాల్సి ఉంది. కరోనా కారణంగా దాన్ని వాయిదా వేశారు. డిసెంబరులోగా జరగవచ్చు.వైరస్‌ ప్రబలటానికి చైనాయే కారణమన్న అమెరికా ఆరోపణలను ఐరోపా దేశాలు కొన్ని నమ్ముతున్నాయి. అయినా కూటమిలోని జర్మనీ-ఫ్రాన్స్‌ దేశాలు చైనాతో సత్సంబంధాలనే కోరుకుంటున్నాయి. వైరస్‌ నేపధ్యంలో చైనాతో సంబంధాల గురించి ఐరోపా యూనియన్‌ దేశాలలో ఏకాభిప్రాయాన్ని సాధించటం కూడా ముఖ్యాంశమే. ఒకవైపు చైనా తమకు ఆర్ధికంగా ప్రత్యర్ధి అని భావిస్తున్నా మరోవైపు దానితో ఇప్పటికిప్పుడు శత్రువుగా భావించే స్ధితి లేదు. కమ్యూనిస్టు దేశమని మడిగట్టుకు కూర్చునేందుకు మెజారిటీ దేశాలు సిద్దంగా లేవు. రాజకీయంగా ఈ కూటమి అమెరికాకు పావుగా పని చేసేందుకు సిద్దం కాదని కూడా గతంలో వెల్లడైంది.
జార్జి ఫ్లాయిడ్‌ హత్యకు నిరసన ప్రతి రోజూ అధ్యక్ష భవనం ముందు నిరసన ప్రదర్శనలు, కరోనా వైరస్‌ అదుపులేకుండా కొనసాగుతుండటంతో జనంలో డోనాల్డ్‌ ట్రంప్‌ పలుకుబడి పడిపోతోందని సిఎఎన్‌ మీడియా సంస్ధ జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ ప్రత్యర్ధి జో బిడెన్‌కు ఆదరణ పెరుగుతోంది. కరోనా, ఆర్ధిక దిగజారుడుతో పాటు ఇప్పుడు ఎన్నికల్లో జాత్యహంకారం కూడా ముందుకు వచ్చింది. ఈ ఏడాది జనవరి తరువాత ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన వారు 38శాతానికి పడిపోవటం, వ్యతిరేకించే వారు 57శాతం ఉండటం సహజంగానే ట్రంప్‌కు ఎదురు దెబ్బను సూచిస్తున్నది. జో బిడెన్‌-ట్రంప్‌ మధ్య తేడా 14పాయింట్లు ఉంది. బిడెన్‌ను 55శాతం మంది, ట్రంప్‌ను 41శాతం సమర్దిస్తున్నారు.ఫ్లాయిడ్‌ హత్యపై పెల్లుబికిన నిరసన పట్ల ట్రంప్‌ వ్యవహరించిన తీరు ట్రంప్‌ ఏలుబడిలోని మాజీ రక్షణ మంత్రి జేమ్స్‌ మాటిస్‌ వంటి రిపబ్లికన్లకే నచ్చలేదు. ట్రంప్‌ స్పందన నిరసనలు తగ్గటానికి బదులు పెరిగేందుకు తోడ్పడినట్లు 65శాతం మంది అమెరికన్లు భావిస్తున్నారు. జాతి వివక్ష ఒక ప్రధాన సమస్యగా ముందుకు వచ్చినట్లు వెల్లడైంది. ఈ నేపధ్యంలో నరేంద్రమోడీ కలలు నెరవేరేనా, కల్లలవుతాయా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ అసహనం, బెదిరింపుల వెనుక అసలు కథేంటి !

31 Sunday May 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Donald Trump threats and intolerance on WHO, G7 summit, WHO Controversy, WTO


ఎం కోటేశ్వరరావు
ప్రపంచ ఆరోగ్య సంస్ధ : చైనా చేతిలో కీలుబమ్మగా మారింది.
ప్రపంచ వాణిజ్య సంస్ధ: దీన్ని రద్దు చేయాలి, మాకు ఉపయోగపడటం లేదు. చైనా ఆర్ధిక సామ్రాజ్యవాదిగా వ్యవహరిస్తోంది.
ప్రపంచ మానవ హక్కుల కమిషన్‌: తన స్వార్ధం తాను చూసుకొంటోంది, దొంగ ఏడ్పులు ఏడుస్తోంది.
అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు : దీన్ని మేము గుర్తించం, మా మీద విచారణ జరిపే అధికారం దానికి లేదు.
ఏడుదేశాల బృందం(జి7) : దీనికి కాలదోషం పట్టింది. ఈ బృందంలో భారత్‌, రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలను చేర్చాలి.
ఇలాంటి సాకులు చెబుతూ ఒక్కొక్క ప్రపంచ సంస్ధ నుంచి తాము తప్పుకుంటామని ప్రకటించటం లేదా బెదిరించటం ఇటీవలి కాలంలో అమెరికాకు మామూలైంది.దశాబ్దాల పాటు తామే అయి నడిపిన యాంకీలు ఇప్పుడు ఆ సంస్ధలనే తూలనాడుతున్నారు, బెదిరిస్తున్నారు ఎందుకు ? కరోనా వైరస్‌ను అవకాశంగా తీసుకొని ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి బయటపడేందుకు పూనుకుంది. చైనీయులను బూచిగా చూపుతోంది. ఇలా మరికొన్నింటి నుంచి కూడా తప్పుకొనేందుకు పూనుకుంది వాటన్నింటికీ కారణం ఏమిటి , కారకులు ఎవరు ?
ప్రపంచంలో మానవ హక్కులను కాపాడే ఏకైక దేశంగా ఫోజు పెట్టిన అమెరికా ఆచరణలో వాటిని హరించేదిగా మారింది. స్వేచ్చకు ప్రతి రూపంగా లిబర్టీ విగ్రహాన్ని పెట్టుకున్న వారు ఒక వైపు యాత్రీకుల నుంచి ఆదాయం పిండుకొనే వనరుగా మార్చుకున్నారు. మరోవైపు ప్రపంచంలో అనేక దేశాల పౌరుల స్వేచ్చా, స్వాతంత్య్రాలను హరించిన మిలిటరీ, ఇతర నియంతలను ఆ విగ్రం ముందు నిలబెట్టి అసలైన రక్షకులుగా ప్రపంచానికి చూపారు.
2018లో ప్రపంచ మానవహక్కుల సంస్ధ నుంచి అమెరికా వైదొలగింది. పాలస్తీనియన్ల సమస్య మీద ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఆ సంస్ధ పని చేస్తున్నట్లు ఆరోపించింది. నిజానికి పాలస్తీనియన్ల మాతృదేశాన్ని లేకుండా చేసి వారి ప్రాంతాలను ఆక్రమించి, బందీలుగా మార్చి, నిత్యం దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ యూదు దురహంకారులకు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్న ఏకైక దేశం అమెరికా. తాను చేసిన ఆరోపణలకు ఆమోద ముద్రవేయకపోవటం, తాను నందంటే నంది, పందంటే పంది అని వంతపాడేందుకు ఆ సంస్ధ నిరాకరించటమే అసలు కారణం. ఆ సంస్ధ నుంచి వైదొలిగిన అమెరికా సాధించిందేమీ లేదు, అమెరికా లేనంత మాత్రాన దాని కార్యకలాపాలు ఆగిపోలేదు. సిరియా, ఇరాక్‌, లిబియా, ఆఫ్ఘనిస్తాన్‌ వంటి చోట్ల అమెరికన్లు దాడులు,తిరుగుబాట్లను ప్రోత్సహించి, రెచ్చ గొట్టి, తామే స్వయంగా దాడులకు పాల్పడి మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన సత్యం దాస్తే దాగేది కాదు. ఆ నేరాలు ఏడాది కేడాది పెరుగుతున్నాయి గనుక తమను ఎక్కడ బోనులో నిలబెడతారో అనే భయంతో ఐక్యరాజ్యసమితి చొరవతో ఏర్పడిన అంతర్జాతీయ నేర కోర్టును గుర్తించేందుకు నిరాకరిస్తున్నారు.
అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టును ఏర్పాటు చేయాలని అనేక సంప్రదింపుల అనంతరం రోమ్‌ సమావేశంలో తీర్మానించారు.1998 జూలై 17న దాన్ని 120దేశాలు ఆమోదించగా, 21 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. వ్యతిరేకించిన ఏడు దేశాలలో అమెరికా, చైనా, లిబియా, ఇరాక్‌, ఇజ్రాయెల్‌, ఎమెన్‌, కతార్‌ ఉన్నాయి. అయితే 2000 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ ఒప్పందం మీద సంతకం చేశాడు. ఇలాంటి ఒప్పందాల మీద దేశాలు సంతకాలు చేస్తేనే చాలదు, వాటిని ఆయా దేశాల పార్లమెంట్‌లు ఆమోదించాలి. క్లింటన్‌ పార్లమెంట్‌కు నివేదించలేదు. రెండు సంవత్సరాల తరువాత ఐక్యరాజ్యసమితికి ఒక లేఖ రాస్తూ రోమ్‌ ఒప్పందానికి తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదంటూ నాటి అధ్యక్షుడు బుష్‌ స్పష్టం చేశారు. ఒకసారి అంగీకరిస్తే ఆయా దేశాల మీద వచ్చే ఆరోపణలు, విమర్శల మీద విచారణ జరపాల్సి ఉంటుంది. అమెరికా గనుక చేరి ఉంటే ఏదో ఒకసాకుతో అనేక దేశాలలో జోక్యం చేసుకుంటున్నదాని దుర్మార్గాలపై ఈ పాటికి ఎన్నో విచారణలు జరిగి ఉండేవి, దాని దుర్మార్గం మరింతగా లోకానికి బట్టబయలు అయి ఉండేది. అందుకే చేరేందుకు నిరాకరిస్తోంది. ఒక వైపు తాము సహకరిస్తామని చెబుతూనే నేరాలకు పాల్పడిన తమ సైనిక, గూఢచార ఇతర పౌరులను రక్షించుకొనేందుకు, కోర్టు కార్యకలాపాలను అడ్డుకొనేందుకు చేయాల్సిందంతా చేస్తోంది. మరికొన్ని అంతర్జాతీయ ఒప్పందాల నుంచి కూడా ఏకపక్షంగా వైదొలగింది. వాటిలో ఇరాన్‌తో కుదిరి అణు ఒప్పందం అన్నది తెలిసిందే. దాన్నుంచి వైదొలగిన తరువాత అమెరికా దాడులు, దానికి ఇరాన్‌ ప్రతిదాడుల సంగతి తెలిసిందే.
ప్రపంచ వాణిజ్య సంస్ధ ఏర్పాటులో అమెరికా ప్రముఖ పాత్ర పోషించింది. ప్రపంచీకరణను అమలు జరిపే సాధనంగా దాన్ని మార్చుకొని తన ప్రయోజనాలు సాధించుకోవాలని చూసింది.కొన్ని సంవత్సరాల తరువాత భారత్‌, చైనాలు ఇంకేమాత్రం అభివృద్ధి చెందుతున్న దేశాలు కాదని, ఆ పేరుతో వాటికి రాయితీలు కల్పించటం అక్రమం అని, తమకు సంస్ధలో ఉన్నందున ప్రయోజనాలేమీ లేవని, తమకు సైతం అదే హౌదా ఇవ్వాలని లేకుంటే తాము సంస్ధ నుంచి విడిపోతామని ట్రంప్‌ బెదిరింపులకు దిగాడు. వర్ధమాన దేశాలు పన్నులను తగ్గించేందుకు ఇచ్చిన వ్యవధి మేరకే భారత్‌, చైనాలు అవకాశాలను వినియోగించుకుంటున్నాయి తప్ప ఎవరి దయాదాక్షిణ్యమో కాదు. నిజానికి నిబంధనలను ఉల్లంఘించి లబ్ది పొందుతోంది అమెరికాయే. అనేక దేశాలపై కేసులు దాఖలు చేసి బెదిరింపులకు దిగింది. మన దేశం పత్తికి మద్దతు ధర ప్రకటించటాన్ని రాయితీ ఇవ్వటంగా చిత్రించి ప్రపంచ వాణిజ్య సంస్దలో మనకు వ్యతిరేకంగా కేసు దాఖలు చేసింది. బోయింగ్‌ విమాన కంపెనీకి పెద్ద ఎత్తున దొడ్డిదారిన రాయితీలు ఇస్తోంది. ఆ విమానాలను కొనాలని ఇతర దేశాలపై తన పలుకుబడిని వినియోగిస్తోంది. బోయింగ్‌కు పోటీగా ఐరోపా ధనిక దేశాలు ఎయిర్‌బస్‌కు మద్దతు ఇస్తున్నాయి. రెండూ పరస్పరం ఆరోపణ చేసుకొని దాఖలు చేసిన కేసు ఇంకా కొలిక్కి రాలేదు. పదహారేండ్ల నుంచి సాగుతున్న ఈ వివాదంలో ఐరోపా యూనియన్‌ను బెదిరించేందుకు అక్కడి నుంచి దిగుమతి చేసుకొనే విమానాలు, విడిభాగాలపై విధిస్తున్న పన్ను 10 నుంచి 15శాతానికి ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా పెంచింది.
ప్రపంచ ఆరోగ్య సంస్ధ విషయానికి వస్తే కరోనా వైరస్‌కు కారణం చైనాయే అని ప్రకటించాలన్నది అమెరికా వత్తిడి. దానికి ఆ సంస్ధ లొంగకపోవటంతో ట్రంప్‌ ఎదురుదాడి ప్రారంభించి చైనాతో కుమ్మక్కయిందని ఆరోపించాడు, ముందు నిధులు నిలిపివేస్తామని ప్రకటించి ఇప్పుడు ఏకంగా వైదొలుగుతామని బెదిరింపులకు దిగాడు. ఈ సంస్ధకు ఇచ్చే నిధులను ప్రపంచంలో ప్రజారోగ్యానికి చేసే ఖర్చుకు అంద చేస్తామని గొప్పలు చెప్పాడు. కరోనా వైరస్‌ ఎక్కడ నుంచి ప్రారంభమైందో దర్యాప్తు జరిపేందుకు చైనా సంస్థలను తమకు అప్పగించాలని అమెరికా ముందు డిమాండ్‌ చేసింది, అంతేకాదు, బాధిత దేశాలకు నష్టపరిహారం చెల్లించాలని కేసుల నాటకం ఆడించింది. చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్ధ సమావేశాల్లో తాము చెప్పిన పద్దతుల్లో దర్యాప్తు తీర్మానం చేయించాలని వత్తిడి తెచ్చింది. అయితే రాజకీయ కోణంతో జరిపే దర్యాప్తులకు బదులు వాస్తవం తెలుసుకొనేందుకు కరోనా సమస్య సమసిపోయిన తరువాత స్వతంత్ర సభ్యులతో దర్యాప్తు జరపవచ్చని దానికి తాము కూడా సహకరిస్తామని చైనా ప్రకటించింది. భారత్‌తో సహా 122 దేశాలు ఉమ్మడిగా ప్రవేశపెట్టిన తీర్మానంపై ఎలాంటి ఓటింగ్‌ లేకుండా ఏకగ్రీవంగా ఆమోదించటం అమెరికాకు మింగుడు పడలేదు. చైనా వ్యతిరేకిస్తుందని, దాన్ని సాకుగా తీసుకొని దాడి చేయాలని చూసిన ఆమెరికా దీంతో హతాశురాలైంది. ఇక లాభం లేదనుకొని తాము సంస్ధ నుంచి వైదొలుగుతామని ప్రకటించింది. సంస్కరణలు తేవటంలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ విఫలమైందని ట్రంప్‌ ఆరోపించాడు. అయితే అమెరికా కోరుతున్న సంస్కరణలు ఏమిటో స్పష్టత లేదని, బయట చర్చకు పెట్టలేదని, ఒక నెల వేచి చూస్తామని చెప్పిన ట్రంప్‌ వారం రోజులకే బెదిరింపులకు ఎందుకు దిగారో తెలియటం లేదని సంస్ధ ప్రధాన కార్యదర్శి టెడ్రోస్‌ చెప్పారు. ట్రంప్‌ నిర్ణయం ముందు చూపులేమి, అమెరికన్ల ప్రాణాలకు ముప్పు తేవటమే అని విమర్శలు వచ్చాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్ధ అసెంబ్లీ ఆమోదించిన ఒక చారిత్రాత్మక ప్రతిపాదన కూడా అమెరికా నిర్ణయాన్ని ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది.కరోనా వైరస్‌ నిరోధానికి తయారు చేసే వ్యాక్సిన్‌ ప్రజల వస్తువుగా ఉండాలి తప్ప ఒకటి రెండు సంస్ధలకు పేటెంట్‌ ఔషధంగా ఉండకూడదని కోస్టారికా చేసిన ప్రతిపాదనను అమెరికా, బ్రిటన్‌ తప్ప మిగిలిన దేశాలన్నీ అంగీకరించాయి. వాటిలో అమెరికా అనుయాయి దేశాలు అన్నీ ఉన్నాయి. ప్రపంచానికి మహమ్మారులుగా మారిన వ్యాధుల నివారణకు రూపొందించిన ఔషధాలు చౌకగా అందరికీ అందుబాటులో ఉండాలి తప్ప కొన్ని కంపెనీలకు లాభాలను తెచ్చిపెట్టేవిగా ఉండకూడదు. అదే జరిగితే ఏం జరుగుతుందో ఎయిడ్స్‌ ఔషధాల విషయంలో చూశాము.
తాము కూడా కరోనా వాక్సిన్‌ తయారీలో ఉన్నామని, అవి జయప్రదమైన తరువాత ప్రజల వస్తువుగా అందుబాటులో ఉంచుతామని చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ ప్రకటించారు. అంతే కాదు ప్రజల వస్తువుగా ఉంచే వాక్సిన్‌ తయారీ యత్నాలకు రానున్న రెండు సంవత్సరాలలో రెండు బిలియన్‌ డాలర్లు అందచేస్తామని కూడా చెప్పారు. ప్రస్తుతం ఎనిమిది సంస్ధలు వాక్సిన్‌ ఒకటి, రెండవ దశ పరీక్షలలో ఉన్నాయి. వాటిలో నాలుగు చైనాలో, రెండు అమెరికా, జర్మనీ, బ్రిటన్‌లో ఒక్కొక్కటీ ఉన్నాయి.
ఎయిడ్స్‌ ఔషధ పేటెంట్‌ పొందిన కంపెనీ ఏడాదికి ఒక్కో రోగి నుంచి పది నుంచి పదిహేనువేల డాలర్లు వసూలు చేసి విక్రయించింది. పదేండ్ల పాటు అంత ఖర్చు భరించలేని రోగులందరూ దుర్మరణం పాలయ్యారు.2004లో మన దేశ కంపెనీలు ఏడాదికి కేవలం 350 డాలర్లకే మందులను అందుబాటులో తెచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచానికి కావలసిన ఎయిడ్స్‌ ఔషధాలలో 80శాతం మన దగ్గర నుంచే సరఫరా అవుతున్నాయి. కాన్సర్‌ చికిత్సకు ఉపయోగించే నెక్సావార్‌ ఔషధంపై బేయర్‌ కంపెనీ పేటెంట్‌ హక్కు కలిగి ఉంది. నూట ఇరవై బిళ్లలను రెండు లక్షల ఎనభైవేల రూపాయలకు కొనుగోలు చేయాల్సి వచ్చేది. అలాంటిది మన దేశంలోని నాట్కో కంపెనీ జనరిక్‌ ఔషధాన్ని కేవలం రూ.8,800లకే అందుబాటులోకి తెచ్చింది. తాము ఈ ఔషధాన్ని భారత మార్కెట్‌కోసం తయారు చేయలేదని పెద్ద మొత్తం చెల్లించి కొనుగోలు చేయగల పశ్చిమదేశాల వారికి ఉద్దేశించింది అని నాట్కో కంపెనీపై కేసు దాఖలు చేసిన సందర్భంగా బేయర్‌ కంపెనీ సిఇఓ చెప్పాడు. అయితే ఆ కేసులో బేయర్‌ ఓడిపోయింది.
ఇప్పుడు కరోనా వాక్సిన్‌తో వ్యాపారం చేయాలన్నది అమెరికా, బ్రిటన్‌ ఆలోచన. అనేక వ్యాధులు పశ్చిమ దేశాలలో అంతగా రావు, అయినా పశ్చిమ దేశాల కంపెనీలు ఆ వ్యాధులకు ఔషధాలను ఎందుకు రూపొందిస్తున్నాయంటే రోగులను పీల్చి పిప్పి చేసేందుకే అన్నది స్పష్టం. ప్రపంచ ఆరోగ్య సంస్ధలో ఉంటూ ఇలాంటి చర్యలకు మద్దతు ఇస్తే అమెరికన్లు సభ్య సమాజం నుంచి మరింతగా వేరుపడతారు. ఇతర జబ్బులకు ఒకసారి పెట్టుబడి పెట్టి అభివృద్ది చేస్తే తరువాత రోజుల్లో పెద్ద మార్పుల అవసరం ఉండదు. కరోనా వైరస్‌ లేదా మరొక వైరస్‌ దేనికీ ఒకసారి తయారు చేసిన ఔషధం శాశ్వతంగా పనికి రాదు. వైరస్‌లో మార్పులు జరిగినపుడల్లా మార్చాల్సి ఉంటుంది. అన్నింటికీ మించి ఎయిడ్స్‌ కోరి తెచ్చుకొనే జబ్బు, కరోనా కోరకుండానే దాడి చేస్తుంది కనుక ప్రతి ఒక్కరూ భయంతో జీవించాల్సి ఉంటుంది, వాక్సిన్‌కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్దపడతారు.మహమ్మారులుగా మారినపుడు లక్షలు, కోట్ల మందికి సోకుతాయి. ఈ అవసరం, బలహీనతను సొమ్ము చేసుకోవాలని అమెరికా, బ్రిటన్‌ కార్పొరేట్‌ సంస్ధలు కాచుకు కూర్చున్నాయి. వాటి ఆకాంక్షలను ట్రంప్‌ వెల్లడిస్తున్నాడు.
ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) నుంచి అమెరికా వైదొలగాలన్న అంశం గత పదిహేను సంవత్సరాలుగా నలుగుతున్నదే. అధికార పార్టీకి చెందిన ఎంపీలు ఇటీవల ఈ సంస్ధను రద్దు చేయాలంటూ ఊగిపోయారు. అలాంటి అధికారం గనుక అమెరికాకు ఉంటే ఈ పాటికి ట్రంప్‌ ఎప్పుడో ఆ పని చేసి ఉండేవాడు. ఈ విషయంలో ప్రతిపక్ష డెమోక్రాట్లు కూడా తక్కువ తినలేదు.ఆ సంస్ధ నుంచి తప్పుకోవాలంటూ పార్లమెంట్‌లో ఆ పార్టీ సభ్యుడు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఒక వేళ ట్రంప్‌ అలాంటి పిచ్చిపని చేస్తే ముందు నష్ట పోయేది అమెరికా తప్ప మిగతా ప్రపంచం కాదు. అయితే తీర్మానం నెగ్గి వెంటనే అమెరికా బయటకు పోతుందని ఎవరూ భావించటం లేదు. అదే జరిగితే ప్రపంచ వాణిజ్యం మీద ఐరోపా యూనియన్‌, చైనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందరితో పాటు కూర్చునేందుకు తమకు స్ధలం ఉండదు అని అమెరికా వాణిజ్య మాజీ ప్రతినిధి వెండీ కట్లర్‌ చేసిన వ్యాఖ్య తీవ్రతకు నిదర్శనం.
గాట్‌లో, తరువాత దాని స్ధానంలో ఏర్పడిన ప్రపంచ వాణిజ్య సంస్ధలో స్ధాపక సభ్యురాలిగా చైనాకు స్ధానం కల్పించేందుకు అమెరికా, దాని మిత్ర రాజ్యాలు అనుమతించలేదు.ఏ వర్ధమాన దేశానికీ విధంచని షరతులను చైనాకు పెట్టి చివరకు చేర్చుకున్నారు.అప్పటి నుంచీ చైనా తమ దేశం నుంచి ఫ్యాక్టరీలు, సంస్ధలను తరలించుకుపోతున్నది, ఉద్యోగాలకు ఎసరు పెట్టింది, వాణిజ్యాన్ని దెబ్బతీసింది అంటూ అమెరికా సణగని రోజు లేదు.
అమెరికా ఒక్క ఐక్యరాజ్యసమితి సంస్ధల నుంచే కాదు. ఇతర వ్యవస్ధలను కూడా చిన్నాభిన్నం చేయాలని చూస్తోంది. బలహీనులనే కాదు బలవంతులను కూడా తన పాదాల చెంతకు తెచ్చుకొనేందుకు పూనుకుంది. చరిత్రలో జరిగిన అనేక ప్రాంతీయ, రెండు ప్రపంచ యుద్దాలకు సామ్రాజ్యవాదుల ఇలాంటి వైఖరే కారణమైంది.
జి7 దేశాల బృందానికి కాలదోషం పట్టిందని ప్రకటించటానికి ట్రంప్‌ ఎవరు ? దానిలో అమెరికాతో పాటు కెనడా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, ఇటలీ, జర్మనీ, జపాన్‌ ఉన్నాయి. మధ్యలో కొన్ని సంవత్సరాలు రష్యాను ఎనిమిదవ దేశంగా చేర్చుకొనేందుకు నిర్ణయించి క్రిమియా ప్రాంతాన్ని ఆక్రమించుకొందనే సాకుతో పక్కన పెట్టారు.ఈ ఏడాది జరిగే సమావేశానికి తిరిగి అధికారికంగా పిలవాలని నిర్ణయించారు. గత ఏడాది మనదేశంతో సహా తొమ్మిది దేశాలను అతిధులుగా ఆహ్వానించారు. ఆరు దేశాల బృందంగా ఏర్పడిన ఈ ఆర్ధిక కూటమిలో తరువాత ఏడవద దేశంగా కెనడాను చేర్చుకున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత ఐరోపా యూనియన్‌ శాశ్వత ఆహ్వానిత సంస్ధగా పిలుస్తున్నారు. నిజానికి ఇది ధనిక రాజ్యాలు తమ ప్రయోజనాలకోసం ఏర్పాటు చేసుకున్నది తప్ప ఐక్యరాజ్యసమితితో ఎలాంటి ప్రమేయం లేదు. ఈ ఏడాది జూన్‌ 10-12 తేదీలలో అమెరికా మేరీలాండ్‌ రాష్ట్రంలోని కాంప్‌డేవిడ్‌లో జరపాలని నిర్ణయించారు. అయితే కరోనా కారణంగా సమావేశాన్ని ఆన్‌లైన్‌ జరపనున్నట్లు మార్చి నెలలో తెలిపారు. ఇప్పుడు దాన్ని కూడా ఏకంగా సెప్టెంబరుకు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. అప్పటికి అమెరికా ఎన్నికలు దగ్గరపడతాయి కనుక తన లాభనష్టాలను బేరీజు వేసుకొని తదుపరి నిర్ణయం తీసుకోవచ్చు.
ఒకే గూటి పక్షులైన ఈ బృంద దేశాలతో కూడా అమెరికా సక్రమంగా వ్యవహరించటం లేదు. మిగతా దేశాలన్నీ తనకు అణగి మణగి ఉండాలని కోరుకుంటోంది. ఈ నేపధ్యంలో 2018లో కెనడాలోని మాంట్రియల్‌ నగరంలో జరిగిన సమావేశం రసాభాస అయింది. డోనాల్డ్‌ ట్రంప్‌తో మిగిలిన ఆరుగురు నేతలు పడిన ఇబ్బందులను గమనించిన జర్నలిస్టులు ఆ సమావేశాన్ని ” జి6ప్లస్‌ ఒన్‌ ” అని అపహాస్యం చేశారు. ఆ సమావేశం ఎలాంటి ప్రకటనను ఆమోదించకుండా ముగియటానికి అమెరికా, ట్రంపే కారణం అంటే అతిశయోక్తి కాదు. ఆ ఏడాదే చైనా, కెనడా , ఐరోపా యూనియన్‌ ఇతర అనేక దేశాలపై బస్తీమే సవాల్‌ అంటూ ట్రంప్‌ వాణిజ్య యుద్దం ప్రకటించటమే దీనికి కారణం. ఈ ఏడాది ఆతిధ్యం ఇస్తూ ఈ బృందం పనికిమాలినది అని వ్యాఖ్యానించటాన్ని బట్టి ట్రంప్‌ సంస్కారం ఏమిటో బయటపడింది. అదే నోటితో మన దేశంతో సహా మిగిలిన దేశాలతో దాన్ని విస్తృత పరచాలంటూ ఆదేశాల తరఫున మాట్లాడుతున్నట్లు ఫోజు పెట్టాడు. నిజానికి ఆ బృందంలో ఉన్నంత మాత్రాన ఏ దేశానికైనా పెద్దగా ఒరిగేదేమీ లేదు. దానితో నిమిత్తం లేకుండానే చైనా అంతర్జాతీయ వాణిజ్యంలో ఎంతగా ఎదిగిందో, ఆ బృందంలోని అమెరికా మినహా మిగిలిన దేశాలను దాటి ఎలా ముందుకు పోతోందో ఇప్పుడు కరోనా వైరస్‌ను అరికట్టటంలో సోషలిస్టు వ్యవస్ధ ప్రత్యేకతను ప్రపంచానికి చాటింది. ఒక్క జపాన్‌ మినహా మిగిలిన అన్ని జి7దేశాలూ కరోనాతో సతమతం అవుతున్నాయి. అమెరికా గురించి చెప్పనవసరం లేదు. ప్రపంచంలో ఇది రాస్తున్న సమయానికి నమోదైన 62లక్షల కేసుల్లో పద్దెనిమిది లక్షల కేసులను దాటి పోయింది. 2008లలో ధనిక దేశాలలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం నుంచి జి7లోని ఏ ఒక్కదేశమూ బయటపడకపోగా మరో సంక్షోభంలోకి కూరుకుపోతుండటాన్ని చూస్తున్నాము.
అమెరికా పాలకవర్గం, దాని ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అనుకుంటున్నది ఒకటి-జరుగుతున్నది మరొకటి కావటంతో తట్టుకోలేకపోతున్నాడు. ఏదో ఒక పిచ్చిపనో, ప్రకటనో, బెదిరింపులో చేస్తున్నాడు. వాటిలో ఒకటి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి అమెరికా తప్పుకుంటుందన్న అంశం. గతంలో ప్రపంచాన్ని బెదిరించేందుకు జపాన్‌పై అణుబాంబులు వేశారు. ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత బెదిరింపులు ఎక్కువయ్యాయి. ప్రపంచ సంస్ధల నుంచి తప్పుకుంటామనే రూపంలో అవి ముందుకు వస్తున్నాయి.అందుకుగాను ప్రతిదానికీ ఏదో ఒక సాకు చూపుతున్నారు.
రెండవ ప్రపంచ యుద్దం తరువాత తలెత్తిన పరిస్ధితుల్లో అమెరికా ఒక పెద్ద ఆర్ధికశక్తిగా ఎదిగింది. కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే బాధ్యతను నెత్తికి ఎత్తుకొని ప్రపంచలోని కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులన్నింటినీ కూడగట్టింది. ఆ ముసుగులో తన కార్పొరేట్‌ సంస్ధలకు ఆయా దేశాలను మార్కెట్‌గా చేసుకొనేందుకు, సహజవనరులను కొల్లగొట్టేందుకు ప్రయత్నించింది. తన మిలిటరీ,రాజకీయ వ్యూహాలను అమలు జరిపేందుకు కేంద్రాలుగా చేసుకున్నది. గడచిన ఏడున్నర దశాబ్దాలలో అమెరికా అనుసరించిన ఎత్తుగడలు దానికి ఎదురుతన్నాయి.ఈ కారణంగానే డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ సంస్ధలలో అమెరికా కొనసాగటం, వాటికి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం దండగ, తమ లక్ష్యాలకు ఉపయోగపడటం లేదని భావించటం, తప్పుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అమెరికాయే కాదు ఏదేశంలో అయినా పాలకవర్గాలకు తమ ప్రయోజనాలే ముఖ్యం తప్ప వ్యక్తులు కాదు. తాము నిర్దేశించిన అజెండాను అమలు జరపకపోతే ఒక బొమ్మ బదులు మరొక బొమ్మను గద్దెపై కూర్చోబెడతాయి. ఈ నేపధ్యంలోనే నవంబరు ఎన్నికలలో ట్రంప్‌ ఓడిపోయి మరొకరు వచ్చినా భాష, హావభావాలు, పిచ్చిమాటలు మారవచ్చు తప్ప ఇదే వైఖరి కొనసాగుతుంది.
ఇలాంటి వైఖరి అమెరికాకు ఉపయోగపడుతుందా ? ప్రపంచ సంస్ధలతో నిమిత్తం లేకుండా తనకున్న ఆర్ధిక, మిలిటరీ శక్తితో ప్రపంచాన్ని శాసించి తన అదుపులోకి తెచ్చుకోవాలని గత కొంత కాలంగా ప్రయత్నిస్తోంది. అది సాధ్యం కాదని దానికి అవగతం అవుతోంది. 2008లో పెట్టుబడిదారీ దేశాలలో వచ్చిన మాంద్యం తరువాత అనేక దేశాలు రక్షణాత్మక చర్యలు తీసుకోవటం, ప్రపంచ వాణిజ్య సంస్ధను పక్కన పెట్టి విడిగా ఒప్పందాలు చేసుకోవటం పెరుగుతోంది. గత ఏడాది నవంబరు వరకు వచ్చిన వార్తల ప్రకారం రక్షణాత్మక చర్యల్లో అమెరికా 790తో అగ్రస్ధానంలో ఉంది. మన దేశం ప్రపంచ వాణిజ్యంలో చాలా తక్కువశాతమే కలిగి ఉన్నప్పటికీ దాన్నయినా కాపాడుకొనేందుకు రక్షణాత్మక చర్యల్లో 566తో అమెరికా తరువాత రెండో స్ధానంలో ఉన్నాం. దేశాల వారీ జర్మనీ 390, బ్రిటన్‌ 357, ఫ్రాన్స్‌262, చైనా 256, కెనడా 199, ఆస్ట్రేలియా 174 చర్యలు తీసుకున్నాయి.2018 చివరిలో ప్రపంచ వాణిజ్యం మాంద్యంలోకి జారిపోయింది. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచం ఎలాంటి పర్యవసానాలను చూడాల్సి వస్తుందో అప్పుడే చెప్పలేము.
ఐక్యరాజ్యసమితికి ఉండే బలహీనతలు దానికి ఉన్నాయి. అంతకంటే మెరుగైన వ్యవస్ధను ఏర్పాటు చేసుకొనేంతవరకు దాన్ని కొనసాగించటం తప్ప మరొక మార్గం లేదు. ఉన్నదాన్నే కొనసాగించటానికి అంగీకరించని అమెరికన్లు దాన్ని బోనులో నిలబెట్టే అంతకంటే శక్తివంతమైన ప్రపంచ వ్యవస్ధ ఏర్పాటుకు అంగీకరిస్తారని ఆశపెట్టుకోనవసరం లేదు. గతంలో సామ్రాజ్యవాదులు ప్రపంచాన్ని పంచుకొనేందుకు, రక్షణాత్మక చర్యలు అమలు జరిపిన కారణంగానే ప్రపంచ యుద్దాలు వచ్చాయి. ట్రంప్‌ చేస్తున్న పిచ్చిపనులు నవంబరులో జరిగే ఎన్నికల్లో లబ్దిపొందేందుకు అన్నది ఒకటైతే రెండవది అమెరికా వైఖరిలో రోజు రోజుకూ పెరుగుతున్న అసహనానికి నిదర్శనం. ట్రంప్‌ ఓడిపోతారా, డెమోక్రాట్‌ జోబిడెన్‌ గెలుస్తారా అన్నది పక్కన పెడితే అగ్రస్దానం అమెరికాదే అన్న వైఖరిని మరింత ముందుకు తీసుకుపోతే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడే తెలియదు గానీ, తీవ్రంగా ఉంటాయని కచ్చితంగా చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా ”మందు” రెమిడెసివిర్‌ -కందకు లేని దురద కత్తి పీటలకా !

28 Tuesday Apr 2020

Posted by raomk in CHINA, Current Affairs, Health, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, UK, USA

≈ Leave a comment

Tags

Remdesivir, remdesivir clinical trial, remdesivir clinical trial coronavirus facts and myths

Gilead says Remdesivir trial posted online prematurely was ...

ఎం కోటేశ్వరరావు
చైనాకు వ్యతిరేకంగా ఏ చెత్తను మార్కెట్లో పెట్టినా ఆమ్ముడవుతుందా ? కొన్ని మీడియా సంస్ధలు అలాంటి చెత్త వార్తలను అమ్మి సొమ్ము చేసుకొనేందుకు పూనుకున్నాయా ? ఏమో ! చైనా ” మందు ” జాగ్రత్త అనే శీర్షికతో ఒక ప్రముఖ తెలుగు పత్రిక సోమవారం నాడు ఒక వార్తను ప్రచురించింది. తప్పుడు వార్తలు రాసేందుకు, రాయించేందుకు కూడా ” సమగ్రశిక్షణ ” అవసరం అని కాస్త జాగ్రత్తగా చదివిన వారికి అర్ధం అవుతుంది. ఇంతకూ ఏమిటట?
జనవరి 20న కరోనా వ్యాప్తిపై ప్రకటన, తరువాతి రోజే రంగంలోకి ” వూహన్‌ లాబ్‌ ”, రెమ్‌డెసివిర్‌ ఔషధం పేటెంట్‌కు దరఖాస్తు. ఈ అంశాల మీద ఆ కథను అల్లారు. వైరస్‌ వ్యాప్తి గురించి ఆరు రోజుల పాటు బయటి ప్రపంచానికి తెలియకుండా చైనా ప్రభుత్వమే మోకాలడ్డిందని ఇంకా ఏవేవో రాసిన వాటిని పునశ్చరణ చేయనవసరం లేదు. దీనర్ధం ఏమంటే వైరస్‌ పరిశోధనలు చేస్తూ దాన్ని ఒక పధకం ప్రకారం బయటకు వదలిన చైనాలోని వూహాన్‌ వైరాలజీ సంస్ధ దాని నిరోధానికి అవసరమైన ఔషధాన్ని కూడా ముందే తయారు చేసి పెట్టుకుందని జనాల బుర్రలకు ఎక్కించే యత్నమే.
ఈ వార్తను లండన్‌ నుంచి ప్రచురితమయ్యే డెయిలీ మెయిల్‌ డాట్‌కామ్‌ 25వ తేదీ బిఎస్‌టి(బ్రిటీష్‌ సమ్మర్‌ టైమ్‌) రాత్రి పది గంటలకు ప్రచురించింది. దానికి మనం నాలుగున్నర గంటలను కలుపుకుంటే మన సమయం రాత్రి రెండున్నర అవుతుంది. ఆ వార్త లేదా ఏదైనా ఏజన్సీ వార్తను గానీ తీసుకొని పైన చెప్పిన కథను వండి వడ్డించి ఉండాలి. దాని సంగతి తరువాత చూద్దాం. ముందుకొన్ని విషయాలు ఇక్కడ చెప్పుకోక తప్పదు. చైనా గురించి మీడియాలో వచ్చేది, దాని వ్యతిరేక దేశాల నేతలు, శాస్త్రవేత్తలు చెప్పేదంతా నిజమే అని నమ్మేవారు నమ్మవచ్చు. అలా నమ్మకాన్ని ఖరారు చేసుకొనే ముందు భిన్న కథనాలు కూడా ఉన్నాయని, వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సవినయ వినతి. అవన్నీ ఎక్కడ కుదురుతాయి… మా వీనులకు విందు, చెవులకు ఇంపుగా ఉండేది, బుర్రకు కిక్కునిచ్చేదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాం అనే వారి నిజాయితీకి జోహార్లు.
కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి ప్రకటనలు బయటకు రాగానే చైనా గూఢచారులు కెనడా లాబ్‌ నుంచి అపహరించి వూహాన్‌ లాబ్‌ నుంచి బయటకు వదిలారు, చైనా ప్రమాదకర జీవ ఆయుధాలను తయారు చేస్తోంది అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నిజంగా బయటకు వదల దలచుకొంటే కెనడా లాబ్‌ నుంచే చైనా గూఢచారులు బయటకు పంప వచ్చు కదా ! దున్న ఈనిందంటే ముందు దూడను గాటన కట్టేయమన్నట్లుగా చాలా మంది నమ్మేశారు. నిజంగానే ఎవరైనా ఒక వైరస్‌ను బయటకు వదిలితే దానికి సరిహద్దులు,దేశాలు, రంగు బేధాల తేడాలుండవు, ఎక్కడ అనువుగా వుంటే అక్కడకు పాకి తన ప్రభావం చూపుతుందనే లోకజ్ఞానం ఈ సందర్భంగా పని చేసి ఉంటే ఇప్పుడు కరోనా ప్రళయ తాండవానికి కకావికలౌతున్న దేశాలన్నీ జాగ్రత్తలు తీసుకొని ఉండేవి. లక్షలాది ప్రాణాలను కాపాడేవి. కొంత మంది కావాలని కాదు గానీ ప్రమాదవశాత్తూ బయటకు వచ్చి ఉంటుందని సన్నాయి నొక్కులు నొక్కుతూ నమ్మింపచేసేందుకు ప్రయత్నించారు. ప్లేగు, మసూచిని కావాలని అంటించిన దేశాలను, రసాయన బాంబులు, గ్యాస్‌లో జనాన్ని మట్టు పెట్టిన దుర్మార్గాన్ని ప్రపంచం చూసింది. ఒక వైరస్‌ను సృష్టించి వదలిన దేశం గురించి చరిత్రలో నమోదు కాలేదు. కొన్ని అనుమానాలు వ్యక్తం అయినా ఎక్కడా రుజువు కాలేదు. ఒక కొత్త వైరస్‌ తొలుత ఎక్కడ బయటపడితే దాన్ని ఆదేశమే తయారు చేసింది అనే నిర్ధారణకు వచ్చేట్లయితే ఆ వరుసలో చైనా కంటే ముందు అనేక దేశాలు ఉన్నాయి. కరోనా వైరస్‌ గురించి ప్రపంచానికి ఇంతకు ముందే తెలుసు. తాజాగా తలెత్తిన కోవిడ్‌-19 వైరస్‌ కొత్తరకం అని కృత్రిమ సృష్టి కాదని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్ధ, అనేక మంది ఆ రంగంలో పని చేస్తున్నవారు ప్రకటించినా, కొందరు పని గట్టుకొని చేస్తున్న ప్రచారానికి మీడియా ఎలాటి విమర్శనాత్మక దృష్టి లేకుండా ఏకపక్షంగా ప్రాధాన్యత ఇస్తోంది.
రెండవ అంశం ఈ వైరస్‌ను అమెరికన్లే తయారు చేసి తమ దేశం మీద ప్రయోగించినట్లు అనుమానిస్తున్నట్లు చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఒక విమర్శ చేశాడు. అమెరికా మిలిటరీ దాన్ని తీసుకువచ్చినట్లు పేర్కొన్నాడు. అమెరికాలోని మేరీలాండ్‌లో ఉన్న ఫోర్ట్‌ డెట్‌రిక్‌ అమెరికా మిలిటరీ లాబ్‌ నుంచి వైరస్‌లు బయటకు రాకుండా నివారించేందుకు తగిన రక్షణ ఏర్పాట్లు లేనందున ఏడాది క్రితమే దాన్ని మూసివేశారని వెంటనే వార్తలు వచ్చాయి. అయితే తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేశారు తప్ప మూసివేయలేదని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ప్రకటించింది.
ఇక రెమిడెసివిర్‌ ఔషధం కధను చూద్దాం. కరోనా వైరస్‌ కొత్తది కాదు, గతంలోనే గుర్తించారు. దానిలో అనేక రకాలు ఉన్నాయి. తాజాగా తలెత్తినదానిని కోవిడ్‌-19 అని పేరు పెట్టారు. గతంలో తలెత్తిన కరోనా వైరస్‌, ఇతర వైరస్‌లకు వ్యాక్సిన్‌లు, ఔషధాలు తయారు చేసే సంస్ధలు ఎన్నో గతంలోనే పేటెంట్లకు దరఖాస్తులు చేశాయి. అంటే అవి ముందే మందులను తయారు చేసి వైరస్‌ను ఇప్పుడు సృష్టించాయని భావించాలా ? కుట్ర సిద్దాంతాలను పరిగణనలోకి తీసుకున్నట్లయితే కోవిడ్‌-19ను అమెరికానే సృష్టించిందని అనుకోవాలి? అది అలాంటి ప్రయత్నాలు చేయకపోతే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గిలీడ్‌ కంపెనీ నాలుగు సంవత్సరాల క్రితమే కరోనా వైరస్‌ చికిత్సకు రెమిడెసివిర్‌ను అనుమతించాలని పేటెంట్‌కు దరఖాస్తు ఎందుకు చేసినట్లు ? ప్రపంచ వ్యాపితంగా వినియోగించేందుకు నాలుగు సంవత్సరాల క్రితమే దరఖాస్తు చేసినట్లు గిలీడ్‌ కంపెన చెప్పినట్లు డెయిలీ మెయిల్‌ రాసింది. కోవిడ్‌-19కు అది పని చేస్తుందని తేలితే భవిష్యత్‌లో సరఫరా చేసేందుకు గాను ప్రస్తుతం చికిత్సలో దాని పని తీరును నిర్ధారించుకునే పనిలో ఉన్నామని గిలీడ్‌ చెబుతోంది. నిజానికి ఆ ఔషధాన్ని ఎబోలా వైరస్‌కోసం గిలీడ్‌ తయారు చేసింది. ఇది కరోనాకూ పని చేస్తుందేమో అని అది నిర్ధారించుకుంటోంది. అదే ఔషధం తయారీకి తమకు పేటెంట్‌ ఇవ్వాలని ఊహాన్‌ వైరాలజీ సంస్ధ జనవరి 21న దరఖాస్తు చేసిందట. అది నిజంగా కరోనా కోసమో కాదో తెలియదు, కరోనా కోసమే అయితే ఏ తరగతి కోసమో అంతకంటే తెలియదు, దరఖాస్తులోని వివరాలు ఏడాది తరువాత గానీ బయటకు రావు. అలాంటిది ముందే కరోనా మందుకు పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసినట్లు ఏ ఆధారాలతో రాస్తారు ? ఒక వేళ నిజంగానే రెమ్‌డెసివిర్‌కు చైనా సంస్ధ దరఖాస్తు చేస్తే అంతకు ముందే ఉన్న గిలీడ్‌ కంపెనీకి ఇవ్వకుండా చైనా సంస్ధకు ఎలా ఇస్తారు ? నిజంగా ఆ ఫార్ములాను ఎవరైనా తస్కరిస్తే మరొక పేరుతో దరఖాస్తు చేస్తారు తప్ప అదే పేరుతో ఎలా చేస్తారు ? మరీ అంత అమాయకంగా ఎవరైనా ఉంటారా ? ఎప్పుడో నాలుగేండ్ల క్రితం దరఖాస్తు చేసిన దానికే ఇంతవరకు అనుమతి రాకపోతే జనవరిలో చేసిన దానికి వెంటనే అనుమతి ఎలా వస్తుంది ? ఇదంతా చూస్తే కందకు లేని దురద కత్తిపీటకు అన్నట్లు గిలీడ్‌ కంపెనీ తాపీగా ఉన్నా జర్నలిస్టులు కొందరు గోక్కుంటున్నారు.
ఇక రెమ్‌డెసివవిర్‌ గత కొద్ది వారాలుగా వార్తల్లో ఉంది. ఆ ఔషధాన్ని తయారు చేశారు గానీ ఎక్కడా ఉత్పత్తి చేయటం లేదు. ఎబోలా కోసం తయారు చేసిన దానిని ఇప్పుడు కరోనాకు ఉపయోగపడుతుందేమో చూద్దాం అన్నట్లుగా గిలీడ్‌ కంపెనీ ఉంది.కోవిడ్‌-19 రోగులు 63 మంది మీద ప్రయోగిస్తే 36 మందికి కాస్త గుణం కనిపించిందని, ఇంకా ప్రయోగదశలోనే ఉందని, ప్రపంచంలో ఎక్కడా చికిత్సకు అనుమతించలేదని కంపెనీ సిఇఓ డేనియల్‌ ఓడే ఏప్రిల్‌ 10న ప్రకటించినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వార్త పేర్కొన్నది.ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఫలితాలు వెల్లడైన తరువాత వినియోగం గురించి పరిశీలిస్తామని భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్‌) శాస్త్రవేత్త రామన్‌ గంగా ఖేద్‌కర్‌ చెప్పారు. 2015లో ఇదే కంపెనీ తయారు చేసిన హెపటైటిస్‌ సి ఔషధం గురించి చేతులు కాల్చుకున్న ఐసిఎంఆర్‌ అంత రెమ్‌డెసివర్‌ గురించి ఆసక్తి ప్రదర్శించటం లేదని కూడా వార్తలు వచ్చాయి. పనికి వచ్చేట్లయితే జనరిక్‌ ఔషధం తయారు చేసేందుకు గిలీడ్‌ కంపెనీ స్వచ్చందంగా అనుమతిస్తే తయారు చేయవచ్చని కొందరు అంతకు ముందు ఆలోచన చేశారు. మరికొన్ని వార్తల ప్రకారం ఇదే ఔషధంపై చైనాలోని రెండు ఆసుపత్రులలో 28 మగ చిట్టెలుకల మీద ప్రయోగాలు జరపగా వాటిలో వీర్య కణాల సంఖ్య తగ్గినట్లు, అసహజత పెరిగినట్లు ప్రాధమిక పరశీలనల్లో వెల్లడైంది.దీని గురించి ఎలాంటి నిర్దారణలకు ఇంకా రాలేదని ఏప్రిల్‌ 23న ఒక వెబ్‌సైట్‌ పేర్కొన్నది. ఇలాగే అమెరికా, బ్రిటన్‌, మరికొన్ని దేశాలలో కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇది కోవిడ్‌-19కు పని చేయదని తేలినట్లు గిలీడ్‌ కంపెనీ గతశుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపిందని కూడా వార్తలు వచ్చాయి.
చైనా దరఖాస్తు గురించి తమకు తెలుసునని, అయితే వచ్చే ఏడాది ఆ వివరాలను ప్రచురించేంత వరకు దాని గురించి తామేమీ చెప్పలేమని గిలీడ్‌ చెప్పింది. ఎబోలాకు తయారు చేసిన తమ ఔషధం కరోనాకు పనికి వస్తుందా లేదా అన్న అధ్యయనాన్ని నిలిపివేసినట్లు కూడా పేర్కొన్నది. ఒక కంపెనీ తయారు చేసిన దాన్ని మరొక దేశంలో పేటెంట్‌ కోరినా మంజూరు కాదు.గిలీడ్‌ కంపెనీ తమ ప్రయోజనాలకు భంగం కలుగుతోందని ఫిర్యాదు అయినా చేసి ఉండేది, ఒక వేళ అదే నిజమైతే ఈ పాటికి డోనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశ కంపెనీ తయారు చేసిన దాన్ని చైనా తస్కరించిందని ఈ పాటికే నానా యాగీ చేసి ఉండేవాడు. బహుశా ఈ ఔషధ ప్రయోగాల గురించి చెప్పి ఉంటే అది నిజమని నమ్మి కొద్ది రోజుల్లో వాక్సిన్‌ తయారు చేయాలని రెండు నెలల క్రితం ట్రంప్‌ బహిరంగంగా విలేకర్ల సమావేశంలో చెప్పాడని అనుకోవాల్సి వస్తోంది. కోవిడ్‌ -19 చికిత్సకోసం అమెరికా, ఐరోపాల్లో వాక్సిన్ల పేటెంట్‌ గురించి నంబర్లతో సహా సామాజిక మాధ్యమంలో ప్రచారం జరుగుతోంది. ఎఎఫ్‌పి వార్తా సంస్ధ వాటి గురించి నిర్ధారణ చేసుకొని అవన్నీ నకిలీ అని తేల్చింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా వైరస్‌ : కట్టడిలో కమ్యూనిస్టుల విజయం- జాడలేని మతాలు, యోగులు, యోగినులు !

11 Saturday Apr 2020

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, RUSSIA, UK, USA

≈ 1 Comment

Tags

catholic religion, COVID- 19 pandemic, Good friday 2020, Pope Francis

Coronavirus

ఎం కోటేశ్వరరావు
బ్రహ్మాండం బద్దలు కాలేదు, సముద్రాలు ఇంకి పోలేదు, ఇటు సూర్యుడు అటు పొడవ లేదు. కరోనా కారణంగా వందల సంవత్సరాలుగా పాటిస్తున్న గుడ్‌ఫ్రైడే క్రతువును పోప్‌ స్వయంగా పక్కన పెట్టాల్సి వచ్చింది. తన నివాసంలోనే తంతును పూర్తి చేశారు. అనేక దేశాల్లో ఇదే జరిగింది.ఎక్కడైతే ఏసు క్రీస్తును శిలువ వేశారని భక్తులు నమ్ముతారో జరూసలెంలోని ఆ ప్రాంతంలో నిర్మించిన హౌలీ పుల్చెర్‌ చర్చ్‌లో అతి కొద్ది మంది ప్రార్ధనలు చేశారు. ఫిలిప్పైన్స్‌లో ఊరేగింపునే రద్దు చేశారు. కొందరు సామాజిక దూరం నిబంధనలను ఉల్లంఘించి కొన్ని చోట్ల ప్రార్ధనలు చేశారు. అందువలన మత చాదస్తులు, ఉన్మాదులు ఎవరైనా ఉంటే వారికి ఈ సమాచారాన్ని చేరవెయ్యాలి, కళ్లారా చూసేందుకు దృశ్యాలను వారి ముందు ప్రదర్శించాలి. అయినా మారకపోతే అలాంటి వారిని కరోనా క్వారంటైన్‌ మాదిరి ఎక్కడైనా పెట్టి తాళం వెయ్యాలి. ఇది ఒక్క క్రైస్తవుల గురించే వ్యాఖ్య అనుకుంటే పొరపాటు ఏ మతం వారికైనా జరగాల్సింది ఇదే.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మతాల మూఢనమ్మకాల ఉక్కు గోడలను తుత్తునియలు చేస్తోంది. మతాలతో నిమిత్తం లేని దేవుడు, దేవతలు, దయ్యాలతో ప్రమేయం లేని కమ్యూనిస్టు చైనా కరోనాను కట్టడి చేసి సాధారణ జనజీవితాన్ని పునరుద్దరించింది. మరోవైపు దేవుడు,దేవతలు, దేవుడు, దేవుని కుమారుడు, దేవ దూతలు తమను రక్షిస్తారని కూర్చున్న మూర్ఖశిఖామణులను వారెవరూ కాపాడటం లేదు, దిక్కులేని చావు చస్తున్నారు, పూడ్చేందుకు కూడా ఎవరూ లేని వారిని అమెరికాలో గుట్టలుగా పడవేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామం మత పునరుద్దరణ, మతోన్మాదశక్తులకు ఊహించని ఎదురుదెబ్బ. మూఢనమ్మకాలను నల్లేరు మీద బండిలా ముందుకు తీసుకుపోవచ్చన్న అజెండాతో ముందుకు పోతున్నవారికి పెద్ద కుదుపు. ఊగిసలాటతో ఉన్న అనేక మందికి ఈ పరిణామం దేవుడు, దేవతలు, మతాలు వాటి మహిమల మీద నమ్మకాలను వమ్ము చేస్తుంది.
ప్రపంచంలో ఏదైనా ఒక ప్రధాన ఘటన జరిగిన తరువాత జ్యోతిష్కులు అదిగో చూడండి మేము ముందే చెప్పాము అంటూ ముందుకు వస్తారు. కొంత మంది తమ మెదళ్లలో ఉన్న అశాస్త్రీయ సరుక్కు ఇదిగో నాసా(అమెరికా నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) చెప్పింది అని ముద్ర తగిలిస్తారు. మరికొందరు మన పోతులూరి వీరబ్రహ్మం, ఫ్రెంచి జ్యోతిష్కుడు మైఖేల్‌ డే నోస్ట్రాడామస్‌ పేరు ఉపయోగించి 1551లో ఇలా రాశాడు అంటూ ప్రచారం చేస్తారు. వాటిలో ఒకటి ఇప్పుడు కరోనా మీద తిరుగుతోంది. దానిలో ఇలా ఉంది.” ఒక జంట సంవత్సరం(2020) ఉంటుంది. దాన్నుంచి ఒక రాణి (కరోనా) తూర్పు దిక్కు(చైనా) నుంచి వస్తుంది.ఏడు కొండలు ఉన్న ఒకదేశం(ఇటలీ) మీద ఒక చీకటి రాత్రి ఒక ప్లేగ్‌(వైరస్‌)ను చల్లుతుంది.అది జీవిత చరమాంకంలో ఉన్న పురుషులలో ప్రవేశించి మట్టి(మరణం)గా మారుస్తుంది. ప్రపంచాన్ని నాశనం చేస్తుంది.అది ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను అంతం చేస్తుంది”.

These photos show how coronavirus fears left religious sites empty ...
దీన్ని సృష్టించిన వారు, దాన్ని గుడ్డిగా నమ్మేవారు, సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసే వారి గురించి చెప్పాలంటే ఏమాత్రం బుర్ర ఉపయోగించని వారే అన్నది స్పష్టం. నోస్ట్రోడామస్‌ ఒక జంట సంవత్సరం వస్తుంది, అది 2020 అని చెప్పటమే తెలివితక్కువ తనం. ప్రతి నూట ఒక్క సంవత్సరాలకు అలాంటి సంవత్సరాలు వస్తాయి. అవి నోస్ట్రోడామస్‌కు ముందు వచ్చాయి, తరువాత వస్తాయి. అతగాడు చెప్పింది 1551లో అంటున్నారు గనుక 1616,1717,1818,1919 వచ్చాయి. అవే కాదు మూడంకెల సంవత్సరాలు కూడా వచ్చాయి. మిగతా సంవత్సరాలలో ఈ సంవత్సరాలలో కూడా ప్రపంచాన్ని కుదిపివేసిన ఉదంతాలు ఎన్నో జరిగాయి. ఈ ప్రచార సృష్టి కర్తలకు బాక్టీరియాకు, వైరస్‌కు తేడా తెలియదు. అది ఇటలీలో ముసలి వారిని చంపేస్తుంది అన్నారు. ప్రపంచ వ్యాపితంగా అన్ని వయసుల వారినీ కబళిస్తోంది. ఇటలీతో పాటు అనేక ఐరోపా దేశాలలో విలయతాండవం చేస్తోంది. అన్నిదేశాల కంటే వ్యాధి అమెరికాలో ఎక్కువగా ఉంది.
గణేషా స్పీక్స్‌ డాట్‌ కామ్‌ పేరుతో జ్యోతిషాన్ని చెబుతున్నవారు మార్చి 30 తరువాత వైరస్‌ నుంచి కాస్త ఉపశమనం పొందుతారని పేర్కొన్నారు. ఇప్పుడు అనేక చోట్ల ఎంత వేగంగా విస్తరిస్తోందో, దేశ ఆర్ధిక వ్యవస్ధలు ఎలా అతలాకుతలం అవుతున్నాయో చూస్తున్నాము. ఇలాంటి చెత్త కబుర్లు చెప్పటంలో ఒక మతం అని లేదు. స్వాములు, బాబాలు, గురువులు, గురవమ్మలు, గంటల, దిన, వార పంచాంగాలు,రాసి ఫలాలను ప్రచురించి సొమ్ము చేసుకొనే మీడియా గురించి ఏం చెప్పాలి? హిందూ మహాసభ గోమూత్ర పార్టీలను ఏర్పాటు చేసింది, ఇంకే ముంది కొందరు బిజెపి నేతలూ అదే పాట అందుకున్నారు.
కరోనా వైరస్‌ మతశక్తులలో విబేధాలు తెచ్చినట్లు ప్రముఖ పత్రిక ”ఎకనోమిస్ట్‌ ” తాజాగా ఒక వార్తను ప్రచురించింది. గుడ్‌ ప్రైడే సందర్భంగా రోమ్‌లో ప్రతి ఏటా పోప్‌ భక్తులతో కలసి శిలువను మోస్తూ ఏసు క్రీస్తు జీవితంలోని పద్నాలుగు ఘట్టాలకు చిహ్నంగా (మహాభారత పర్వాలు, రామాయణ కాండల మాదిరి) 14చోట్ల ఆగుతూ నడుస్తారు. ఆ దారిలో వేలాది మంది అనుచరులు శిలువను ముద్దాడుతూ తమ భక్తిని ప్రదర్శిస్తారు. వాటన్నింటినీ పక్కన పెట్టారని, ఏ ఏదేశాల్లో ఏమి జరుగుతోంది ఆ పత్రిక ప్రకటించింది. తాను 51 సంవత్సరాలుగా బోధకుడిగా ఉన్నానని ఇప్పుడు జనాన్ని చర్చ్‌లకు రావద్దని చెప్పాల్సి రావటం తనకు ఎంత కష్టమో ఆలోచించాలని రష్యన్‌ ఆర్ధోడాక్స్‌ చర్చ్‌ ప్రధాన గురువు కిరిల్‌ ప్రకటించారు. అయితే కొందరు అమెరికన్‌ ఇవలాంజికల్స్‌ మూర్ఖంగా వ్యవహరించి కటకటాల పాలయ్యారు. ప్రార్ధన చేసి వైరస్‌ను నిర్మూలిస్తామంటూ జనాన్ని తరలించిన ఫ్లోరిడా బోధకుడు రోడ్నీ హౌవార్డ్‌ బ్రౌన్‌ వారిలో ఒకడు. మన తిరుపతి వేంకటేశ్వర స్వామి, ఇతర దేవాలయాల్లో మాదిరి భక్తులు లేకుండా తప్పనిసరి అనుకున్న మత క్రతువులను నిర్వహించవచ్చని ఫ్లోరిడా గవర్నర్‌ ప్రకటించాడు. గతంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నపుడు కూడా ఈస్టర్‌ పూజలను ఇలా పూర్తిగా అడ్డుకోలేదని తూర్పు ఐరోపా దేశాల్లో సామాన్యులు భావిస్తున్నారని ఎకనమిస్ట్‌ పేర్కొన్నది. యూదు మతంలో ఒక బహిరంగ మత క్రతువు నిర్వహించాలంటే కనీసం పది మంది హాజరు ఉండాలి, ఇప్పుడు సాధ్యం కాదు కానుక వాట్సాప్‌ లేదా మరొక పద్దతిలో పది మందిని చూపి దాన్ని పూర్తి చేస్తున్నారు.
ఇరాక్‌లో వైరస్‌ను వ్యాపింప చేసే వారు హంతకులతో సమానమని షియా మత పెద్ద గ్రాండ్‌ అయాతుల్లా అలీ అల్‌ సస్తానీ చేసిన వ్యాఖ్యలను ముక్తాదా అల్‌ సదర్‌ అనే మత పెద్ద వ్యతిరేకించాడు. నజఫ్‌ లోని ఇమామ్‌ అలీ మందిరాన్ని తెరవాల్సిందే అంటూ ప్రార్ధన ధర్నా చేశాడు. తలుపులు తెరిచిన తరువాత శవాలతో జనం దాని చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కొందరు మతఛాందుసులైన క్రైస్తవులు, స్వలింగ వివాహాలకు మద్దతు ఇస్తున్న కారణంగా కరోనా వైరస్‌ శిక్షిస్తున్నదని ముక్తాదా ముక్తాయింపులు ఇస్తున్నాడు. ఈనెల 23న రంజాన్‌ మాసం ప్రారంభం కానుంది. ఆ సందర్భంగా ఇస్లామిక్‌ దేశాలలో ఏమి చేస్తారన్నది చూడాల్సి ఉంది. ఇరాన్‌లో అన్ని మత ప్రదేశాలకు భక్తులు రావటాన్ని గతనెల 16న ప్రభుత్వం నిషేధించింది. అప్పటికే పరిస్ధితి చేయిదాటి పోయిందని లౌకికవాదులు విమర్శిస్తే, ఇది తగని చర్య అని మతోన్మాదులు విరుచుకుపడ్డారు. అయోధ్యలో రామనవమి ఉత్సవాలను పరిమితం చేయాలని అధికారులు ప్రయత్నిస్తే హిందూ సంస్ధల వారు అయిష్టంగానే అంగీకరించారని ఎకనమిస్ట్‌ పేర్కొన్నది.
కరోనా వైరస్‌ బతికి ఉన్నవారి మధ్య దూరం పెంచటమే కాదు, మరణించిన వారి అంత్యక్రియలకు సైతం పరిమితులు విధించింది. సంప్రదాయాలను పక్కన పెట్టమంది. క్రైస్తవులు, ముస్లింలు అనేక దేశాల్లో మరణించిన వారికి అంత్యక్రియలు జరిపేందుకు మూడు రోజులు తీసుకుంటారు. ఇప్పుడు మరణించిన రోజే ఆపని చేయాలని అధికారులు ఆదేశిస్తున్నారు. కొన్ని చోట్ల రోజుల తరబడి శవాలను ఇచ్చే పరిస్ధితి లేదు. కరోనా వ్యాధి గ్రస్తులు మరణించిన తరువాత వైరస్‌ ఉండదని వైద్యులు చెబుతున్నారు. అయినా సరే అలాంటి వారిని అనుమతించేది లేదని అనేక శ్మశానవాటికలు నిరాకరిస్తున్నాయి. హాజరయ్యేవారి సంఖ్యపై పరిమితులు పెడుతున్నాయి. కొన్ని చోట్ల గుమికూడకుండా సామాజిక దూరం పాటిస్తూ రెండు కిలోమీటర్ల దూరం పైగా నిలబడి శ్రద్దాంజలి ఘటించిన ఉదంతాలు కూడా ఉన్నాయి.
మత మూర్ఖశిఖామణులే కాదు కొన్ని ప్రభుత్వాలు కూడా జనం ముఖ్యంగా లక్షలాది మంది మహిళల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం వైరస్‌ వ్యాప్తికి అబార్షన్లే కారణమని అనటమే కాదు, అబార్షన్లను నిషేధించింది. అసలే ఉద్యోగాలు పోయి, ఆదాయం లేని అనేక మంది ఇదేమి అదనపు భారంరా బాబూ అని గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో అంతకు ముందు అప్పాయింట్‌మెంట్‌ ఇచ్చిన ఆసుపత్రులన్నీ వాటిని రద్దు చేశాయి. అతిక్రమించిన వారి మీద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో ఇతర రాష్ట్రాల్లో అత్యవసరంగా గర్భవిచ్చిత్తి చేసే ఆసుపత్రుల కోసం పరుగులు తీస్తున్నారు.
కరోనా వైరస్‌ కారణంగా ఇది రాస్తున్న సమయానికి వ్యాధిగ్రస్తులైన వారు 17లక్షల 16వేలు, మరణించిన వారు లక్షా మూడువేల 848మంది. ఒక్క అమెరికాలోనే 30శాతం మంది వ్యాధి బారిన పడ్డారు. మానవాళితో పాటు వారిని నడిపిస్తున్న మతాలు కూడా దీని ప్రభావానికి గురయ్యాయి. దీని దెబ్బకు మతాలు బోధకుల మీదనే విశ్వాసం సన్నగిల్లే పరిస్ధితి వచ్చిందంటే అతిశయోక్తి కాదు. గత చరిత్రను చూసినపుడు ప్రళయాలు సంభవించినపుడు, వర్తమాన కాలంలో ఆర్ధిక సంక్షోభాలు వచ్చినపుడు జనం మరింతగా మతాలు, దేవుళ్లవైపు చూశారని స్పష్టమైంది. సమాజాన్ని వెనుక్కుతీసుకుపోయే మతశక్తులు మత, క్రతువుల పునరుద్దరణకు చేసే సంఘటిత ప్రయత్నాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. వర్తమాన కాలంలో హిందూత్వ శక్తులు హిందూమతం కోసం ప్రయత్నిస్తుంటే తబ్లిగీ జమాత్‌ వంటి సంస్దలు ఇస్లామ్‌ పునరుద్దరణ ప్రయత్నంలో ఉన్నాయి. ఇలాగే ప్రతి మతంలోనూ తిరోగామి శక్తులు చెలరేగుతున్నాయి. మానవ ప్రవర్తన మీద మతాల ప్రభావం ఇప్పుడు పెరుగుతోందా తరుగుతోందా అనే చర్చ ఉండనే ఉంది. ఆర్ధిక పరిస్ధితులు బాగుంటే దేవుడ్ని పట్టించుకోరనే మాట తరచూ వినిపించటం అందరికీ తెలిసిందే.
1960 దశకంలో అమెరికాలో 40శాతం లోపే మతాన్ని నమ్మటం లేదా తమ జీవితాల మీద మత ప్రభావం ఉందని భావించగా న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై ఉగ్రవాదులు రెండు విమానాలతో దాడులు చేసిన తరువాత మతం మీద విశ్వాసం ఉండాలని భావించిన వారు 71శాతం ఉన్నట్లు గ్యాలప్‌ సర్వే పేర్కొన్నది.14వ శతాబ్దంలో ఐరోపాలో ప్లేగ్‌ వ్యాధి ప్రబలినపుడు జనజీవితంలో చేస్తున్న తప్పుల కారణంగానే శిక్షగా దేవుడు ప్లేగ్‌ను పంపాడని మత పెద్దలు చెప్పారు. హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడం చార్మినార్‌ గురించి అందరికీ తెలిసిందే. ప్లేగు వ్యాధితో జనం మరణించకుండా నివారణ ప్రార్ధనలు జరిపేందుకు నాటి రాజు కులీ కుతుబ్‌ షా 1591లో నిర్మించిన కట్టడం అది. ప్రపంచంలో అనేక చోట్ల అలాంటివి వెలిశాయి. తరువాత హైదరాబాదు సంస్ధానంలో ప్లేగు వచ్చినపుడు పాలకులు భారం దానిమీదే వేసి ఊరుకోలేదు.ఐరోపాలో ప్లేగు కోట్లాది మందిని బలితీసుకుంది. ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. ప్లేగు వ్యాధి పదే పదే రావటంతో జనాలకు మతం మీద నమ్మకం సన్నగిల్లింది. దేవుడు మంచి వాడే గానీ మత పెద్దలు కాదన్నట్లుగా ఆగ్రహం వారి మీదకు మళ్లింది. ఆ పరిణామం మత సంస్కరణ ఉద్యమానికి నాంది పలికింది.
కరోనా సందర్భంగా అక్కడా ఇక్కడ అని లేకుండా ప్రపంచ వ్యాపితంగా అన్ని మతాల ప్రార్ధనా మందిరాలను మూసుకోవాల్సి వచ్చింది. ఎవరైనా చాదస్తం, మూర్ఖత్వంతో వ్యవహరిస్తే ఆయా మతాల వారిలోనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మలేసియా, పాకిస్దాన్‌, భారత్‌లలో తబ్లిగీ జమాత్‌ సమావేశాలు కరోనా వైరస్‌ వ్యాప్తి కేంద్రాలుగా, వాటిలో పాల్గొన్నవారు వైరస్‌ను మోసుకు వచ్చిన వారిగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ తప్పు ఇస్లాం మతానిది కాదు, ఆ మతాన్ని పునరుద్దరించే పేరుతో పనిచేస్తున్న సంస్ధలు, వ్యక్తులు కరోనా వ్యాప్తి గురించి తెలిసి కూడా మూర్ఖంగా సమావేశాలు నిర్వహించటం నేరపూరిత వ్యవహారం. దాని మీద ఆ మతంలోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. మతాన్ని పునరుద్దరిస్తాం అంటే సరి పెట్టుకున్నంత మాత్రాన అసలుకే ఎసరు తెస్తే ఎలా అంగీకరిస్తాం అనే ఆగ్రహం ఆ మతంలోని వారి నుంచే వ్యక్తం అవుతోంది. సరే ఈ ఉదంతాలను కూడా మతోన్మాదాన్ని, ఇస్లాం వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకున్న వారి గురించి తెలిసిందే. వారికి సోకిన మత వైరస్‌ కరోనా కంటే ప్రమాదకరం.

In a test of faith, Christians mark Good Friday in isolation - The ...

మత శక్తులు వారు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా ఒకటే. ఇండోనేషియాలో మార్చి 19వ తేదీ నుంచి జరపతలపెట్టిన తబ్లిగీ జమాత్‌ ఐదు రోజుల ఆసియా వార్షిక మత సమావేశాలను రద్దు చేసుకోవాలని అక్కడి ప్రభుత్వం చెప్పినా నిర్వాహకులు పెడచెవిన పెట్టారు. ప్రభుత్వం కూడా గట్టిగా చెప్పలేకపోయింది. అల్లాకు తప్ప మరొకరెవరికీ భయపడాల్సిన పనిలేదని ప్రచారం చేశారు. సమావేశ రద్దు ప్రతిపాదన వెనుక నిషేధిత ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ ఉందని కూడా రెచ్చగొట్టారు. చావు పుట్టుకలన్నీ దేవుడు ముందే నిర్ణయిస్తాడని, కనుక కరోనా గురించి భయపడాల్సిన పనిలేదన్నారు. దానికి భయపడితే ఇస్లాం నుంచి వైదొలిగినట్లే అని రెచ్చగొట్టారు. మసీదు నిర్వాహకులు అల్లా కంటే సమావేశాలను వాయిదా వేయాల్సిందే అన్న రాష్ట్ర గవర్నర్‌ రిదవాన్‌ కమిల్‌కే ఎక్కువ భయపడ్డారని జనం భావించారు. అనుమతి లేకపోయినా భక్తులు ప్రారంభానికి ముందే వేలాది మంది చేరుకున్నారు. చివరికి అధికార యంత్రాంగం కరకుగా వ్యవహరించటంతో రద్దు చేసుకున్నారు.
సరిగ్గా ఇదే సమయంలో మన దేశంలో అయోధ్యలో శ్రీరామ నవమి ఉత్సవాలను ఎట్టి పరిస్ధితుల్లోనూ జరిపి తీరాల్సిందే అని రామాలయ ట్రస్టు సభ్యుడు మహంత పరమహంస పట్టుబట్టిన విషయం తెలిసిందే. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, భక్తుల మంచి చెడ్డలను రాముడే చూసుకుంటాడని వాదించారు.
ఇక మంత్రాలకు చింతకాయలను రాలుస్తాం అనే అన్ని మతాలకు చెందిన బాబాలు, యోగులు,యోగినులు దుకాణాలు మూసుకొని కరోనా దెబ్బకు ఎక్కడికి పోయారో తెలియదు. వారిని గుడ్డిగా నమ్మిన జనం కష్ట కాలంలో ఏమయ్యారు అని నిలదీయకుండా ఉంటారా ? అంత ధైర్యం చెయ్యకపోతే వారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కరోనా కథ ముగిసిన తరువాత వారంతా తిరిగి దుకాణాలు తెరుస్తారు, జనానికి ఎలాంటి సంజాయిషీ చెబుతారో చూద్దాం. అలాంటి వారందరి చేత తెల్లారగానే బోధలు చేయించే మీడియా పెద్దలు కూడా జనానికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిందే. ఈ సమయంలో అన్ని మతాల వారు ఇండ్లలో ఉండే ప్రార్ధనలు జరపండి అని చెప్పకతప్పటం లేదు. అదే పని సాధారణ సమయాల్లో సైతం ఎందుకు చేయకూడదు అని కొందరైనా ఆలోచించకుండా ఉంటారా ? దర్శనాల వేలం వెర్రి తగ్గుతుందా? అదే జరిగితే అత్యంత లాభదాయకంగా మారిన భక్తి వాణిజ్య కేంద్రాలు, వాటి నిర్వాహకుల ఆదాయాలు ఏమి అవుతాయి ? ప్రభుత్వాలకూ ఆదాయం పడిపోతుంది. గతంలో ప్రింటింగ్‌ ప్రెస్‌ మత ప్రచారంలో పెద్ద విప్లవాన్నే తెచ్చింది. మత గ్రంధాల ప్రచురణ, పంపకం ద్వారా భక్తి విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్‌ ఫోన్‌ వాడకం బాగా పెరిగి పోయిన ఈ రోజుల్లో ఫోన్‌ భక్తి వెల్లువ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇష్టదైవాన్ని ఫోన్లో చూస్తూనే బస్సులు, రైళ్లు, కార్యాలయాల్లో పూజలు ప్రారంభం కావచ్చు. ఇవన్నీ మత వాణిజ్యం, మతశక్తులకు మంచి సూచనలు కావు.

Chinese President Xi Says He Was Leading COVID-19 Since Jan. 7 | Time
ప్రపంచమే ఒక గ్రామంగా మారిపోయిందని ప్రతివారూ చెబుతారు. కానీ ఆ గ్రామంలోనే ప్రతి వారూ తమ కులం, మతాలకే పరిమితమైన గోడలతో గృహ సముదాయాలను నిర్మించుకోవటాన్ని మనం చూస్తున్నాము. ప్రతి కులం, ప్రతి మతం తమ పవిత్రతను కాపాడుకొనేందుకు ఎంతకైనా తెగించే ధోరణులు నానాటికీ పెరిగిపోతున్నాయి. పాలు తాగుతూ తననెవరూ చూడటం లేదు అనుకునే పిల్లుల మాదిరి ప్రతి వారూ తమ కుళ్లును మూసిపెడుతూ ఎదుటి వారి దాని మీద దాడి చేస్తున్నారు. అంతరించి పోతున్న మత, కుల మడులను పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నారు.గతంలో మతాల పేరుతో అధికారాన్ని నిలుపుకొనేందుకు రాజులు,రంగప్పలు చేస్తే ఇప్పుడు వారి వారసులుగా కొన్ని పార్టీలు పుట్టుకు వస్తున్నాయి. మృత భాషగా మారిపోయిన సంస్కృత శ్లోకాలను తమ పిల్లలకు నేర్పుతూ అనేక మంది ముఖ్యంగా విదేశాలలో ఉంటూ తెలియకుండానే హిందూ మత ఉద్దారకులుగా మారిపోతున్నవారిని చూస్తున్నాము. అదే పద్దతిలో ఏ మతానికి ఆ మతం వారు పడరాని పాట్లు పడుతున్నారు.
ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
అని రాయప్రోలు సుబ్బారావు గారు చెప్పారు. కానీ దానికి భిన్నంగా భారతీయులమని చెప్పుకోవాల్సింది పోయి ఫలానా కులం, ఫలానా మతం ప్రాంతాల వారీగా కొట్టుకు చస్తున్న ప్రవాస భారతీయలను చూసి సిగ్గుపడుతున్నాము. అయితే ఏ విత్తనాలు వేస్తే ఆ పండ్లు, కాయలే కాస్తాయి అన్నట్లుగా మన దేశంలో, రాష్ట్రాలలో కుల మతాల కంపుతో పెరిగిన మన వారు పరాయి ప్రాంతంలో కూడా దాన్నే వ్యాపింప చేయటంలో ఆశ్చర్యం ఏముంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఫేక్‌ న్యూస్‌ బాధితులు సీత-రాముడు- లక్ష్మణుడు !

04 Saturday Apr 2020

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, Health, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, Science, UK, USA

≈ Leave a comment

Tags

Conspiracy theory, Coronavirus fake news, fake news

Granlund cartoon: Fake news - News - Times Reporter - New ...

ఎం కోటేశ్వరరావు
తప్పుడు సమాచారం రెండో అంటు వ్యాధి అనే శీర్షికతో అమెరికా పత్రిక లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ కొద్ది వారాల క్రితం రాసింది. ఒకవైపు వైద్యులు, సిబ్బంది కరోనా వైరస్‌ మీద చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్నారు. మరోవైపు తప్పుడు సమాచార అంటు వ్యాధి ఎక్కడ చూసినా తాండవిస్తోంది. మహారాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి అతుల్‌ భత్‌ఖల్కకర్‌ ఏప్రిల్‌ ఒకటవ తేదీన (ఏప్రిల్‌ ఫూల్స్‌ డే అని గుర్తుండకపోయి వుండవచ్చు) ఒకట్వీట్‌ చేశారు.” కరోనా కోసం ఏర్పడిన ప్రత్యేక దళానికి(టాస్క్‌ఫోర్స్‌) నాయకుడిగా నరేంద్రమోడీ ఉండాలని అమెరికా, బ్రిటన్‌తో సహా పద్దెనిమిది దేశాలు కోరుతున్నాయి.భారత్‌కు ఎంత గర్వకారణమైన క్షణం ! మహానేతకు మనమందరం మద్దతు ఇవ్వాలి మరియు మనం కరోనా వ్యతిరేకపోరులో కచ్చితంగా విజయం సాధిస్తాం” అని దాన్లో పేర్కొన్నారు. మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బిరేన్‌ సింగ్‌(బిజెపి) సలహాదారు రజత్‌ సేథీ మరొక అడుగు ముందుకు వేసి ” కోవిడ్‌ 19 మహమ్మారిని ప్రపంచ వ్యాపితంగా నిరోధించేయత్నాలను సమన్వయం చేసేందుకు ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్‌ కేంద్ర స్ధానాన్ని తీసుకుంది. ప్రపంచ నేతలు ట్రంప్‌, బోరిస్‌ జాన్సన్‌, స్కాట్‌మోరిసన్‌ తదితరులు కరోనా వ్యాప్తి నిరోధ ప్రయత్నాలకు మన ప్రధాని మోడీ నాయకత్వం వహించాలని కోరుతున్నారు. ఇది నిజమైన రాజనీతిజ్ఞత ” అని పేర్కొన్నారు.
వైఆన్‌(వరల్డ్‌ ఈస్‌ ఒన్‌ న్యూస్‌) అనే వార్తా ఛానల్‌ మార్చినెల పదిహేనవ తేదీన ఒక వార్తను ప్రసారం చేసింది. ప్రధాని నరేంద్రమోడీ చొరవను ప్రపంచ నేతలు హర్షించారు. జి20ని అనుసంధానం చేయాలన్న ప్రధాని మోడీ పిలుపును ఆస్ట్రేలియా స్వాగతించింది” అని దానిలో పేర్కొన్నారు. న్యూఢిల్లీతో కలసి పని చేయాలని తాము కోరుకుంటున్నట్లు సార్క్‌ దేశాలు భారత చర్యను హర్షించాయి, సార్క్‌ దేశాల నేతలే కాదు ఇతరులు కూడా హర్షించారు అని కూడా ఆ టీవీలో తెలిపారు.అంతే తప్ప ఎక్కడా పద్దెనిమిది దేశాలు, బిజెపినేత, సిఎం సలహాదారు పేర్కొన్న పేర్లు, అంశాలేవీ ఆ వార్తలో లేవు అని ఆల్ట్‌ న్యూస్‌ పేర్కొన్నది. జి న్యూస్‌ ఛానల్‌ యాజమాన్యంలో నడిచే ఈ ఛానల్‌ జర్నలిస్టులు మోడీ ప్రతిష్టను పెంచేందుకు కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడిస్తే బిజెపి నేతలు ఇంకే ముంది నిర్ణయం జరిగిపోయింది భజన ప్రారంభించండి అన్నట్లుగా ప్రచారం మొదలు పెట్టారు. ఒక వేళ అలాంటి ప్రయత్నాలు చేయాల్సి వస్తే దానికి ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఉంది, ఐక్యరాజ్యసమితి ఉంది, ఒక దేశ నేతను ఎన్నుకోవటం అన్నది అతిశయోక్తి. అందునా కరోనాను పారదోలేందుకు దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలని చిట్కా చెప్పిన పెద్దమనిషిని నమ్ముకుంటే ప్రపంచజనాభా దిక్కులేని చావు చస్తుంది. తప్పుడు సమాచార అంటు వ్యాధి మీడియాలో పని చేస్తున్న వారికి సోకితే దాన్ని యావత్‌ సమాజానికి వ్యాపింప చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి తీరు తెన్నులను చూసి ఏ దశలో ఉందో తెలుసుకొనేందుకు మెడికల్‌ డాక్టర్లు కొన్ని లక్షణాలను ఖరారు చేశారు. తప్పుడు సమాచార అంటు వ్యాధి ఏ దశలో ఉందో జర్నలిజంలోని దిగ్గజాలు చెప్పాల్సి ఉంది.

Cartoonists in India battle fake news through their comic strips ...
ప్రిన్స్‌ చార్లెస్‌ కరోనా నుంచి కోలుకోవటానికి ఆయుర్వేద ఔషధాలు తోడ్పడ్డాయని, వేల సంవత్సరాల నుంచి పురాతన ఆచరణే దానికి కారణం అని కేంద్ర ఆయుష్‌ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ ప్రకటించారు. ఇది అవాస్తవం, బ్రిటన్‌లో ఉన్న జాతీయ వైద్య వ్యవస్ధ సూచించిన చికిత్సను తప్ప మరొకదాన్ని దేన్నీ వినియోగించలేదని చార్లెస్‌ కార్యాలయం ఒక ప్రకటనలో ఖండించింది. బెంగలూరులోని సౌఖ్య ఆయుర్వేద రిసార్ట్‌ యజమాని డాక్టర్‌ ఐజాక్‌ మత్తయ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. ప్రిన్స్‌ చార్లెస్‌కు సూచించిన ఆయుర్వేద, హౌమియోపతి చికిత్స ఫలించిందని చెప్పారు. వ్యవస్ధ పనితీరుకు ఇదొక ఉదాహరణ అని మంత్రి విలేకర్లకు చెప్పారు. కేంద్ర మంత్రులే తప్పుడు సమాచార అంటువ్యాధికి గురయ్యారు. ఒక డాక్టర్‌ నుంచి అలాంటి ఫోన్‌ నిజంగానే వచ్చిందనుకుందాం, ప్రిన్స్‌ చార్లెస్‌ కార్యాలయాన్ని సంప్రదించి దాన్ని నిర్ధారించుకోవాలి.అలాగాక వాట్సాప్‌ యూనివర్సిటీ పండితుల మాదిరి తప్పుడు సమచారాన్ని వ్యాపింప చేయటం ఏమిటి ?
మార్చినెలాఖరు వరకు ఒక అంచనా ప్రకారం కరోనా వైరస్‌ గురించి మూడువందల కోట్ల పోస్టులు, పదివేల కోట్ల సంభాషణలు నమోదైనట్లు అంచనా. ఒక అంశం మీద మానవాళి చరిత్రలో ఇంతగా భిన్న భాషలలో, అనేక వేదికల మీద దేన్నీ చర్చించి ఉండకపోవచ్చని, ఎలక్ట్రానిక్‌ సాధనాలపై ఇంతగా సమయాన్ని వెచ్చిస్తున్నందున నోమో ఫోబియా(ఫోన్‌ ఫోబియా-ఫోన్‌కు అతుక్కుపోవటం) ప్రమాదం కూడా పెరిగిందని సామాజిక మాధ్యమ నిపుణుడు డెనిజ్‌ ఉనరు చెప్పారు. పరిశుభ్రత సంబంధిత అంశాలను సామాజిక మాధ్యమంలో ఎక్కువగా అందుకున్న వారు ఇండ్లలో వాటికి అనవసర ప్రాధాన్యత ఇచ్చి అతిశుభ్రత వ్యాధికి, రసాయనాలతో కూడిన ఉత్పత్తుల ప్రభావాలకు గురయ్యే అవకాశాలున్నాయని కూడా డేనిజ్‌ హెచ్చరించారు. ముఖాలకు, చేతులకు తొడుగులు ఎక్కువగా వినియోగించటం, సామాజిక దూరాన్ని ఎక్కువగా పాటించటం వలన ఎదుటివారి మీద విశ్వాసాన్ని కోల్పోయేట్లు చేస్తుందని, భయంకర దృశ్యాలుండే సినిమా చూస్తున్న మాదిరి ప్రవర్తించవచ్చని, కరోనా వ్యాప్తి గురించి మితిమించిన ఆత్రత, కుంగుబాటు ఆలోచనలు కూడా జనాలకు ముప్పుగా పరిగణించవచ్చని డెనిజ్‌ హెచ్చరించాడు. వీటి బారిన పడకుండా ఉండాలంటే విశ్వసనీయ సమచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యంగా అధికారిక సంస్ధలు, వ్యవస్ధలు ఇచ్చే వాటి మీద ఆధారపడాలని, లేనట్లయితే తప్పుడు సమాచారంతో ఆందోళనకు గురయ్యే అవకాశం ఉందని సలహా ఇచ్చాడు.

March | 2020 | HENRY KOTULA
సాధారణ సమయాల్లోనే ఏ దేశానికి ఆదేశం ప్రత్యర్దులపై ప్రచారదాడికి అనేక అస్త్రాలను ప్రయోగిస్తోంది. అందువలన అవన్నీ వాస్తవాలే అనుకుంటే పప్పులో కాలేసినట్లే, మనకు తెలియకుండానే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిలో ఒకరిగా మారిపోతాము. తప్పుడు సమచారాన్ని వ్యాపింప చేయటంలో అగ్రస్ధానంలో ఉండే అమెరికా తాను తీసుకున్న గోతిలో తానే పడిందని జరిగిన పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్ధ చైనా పక్షపాతంతో వ్యవహరిస్తోందని స్వయంగా డోనాల్డ్‌ ట్రంపే చెప్పాడు. అందువలన అది చేసిన ప్రతి హెచ్చరికనూ పెడచెవిన పెట్టి నేడు అమెరికన్ల ప్రాణాల మీదకు తెచ్చాడన్నది రుజువైంది. దేవుడు నైవేద్యం తినడు అని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు.అలాగే పెద్ద ఎత్తున తాను నిధులు అందచేసే అనేక అంతర్జాతీయ సంస్ధలను తనకు అనుకూలంగా మలచుకొని చెప్పినట్లు చేయించుకుంటున్న అమెరికన్లకు ప్రతిదీ అలాగే కనిపించటం సహజం. చైనా నుంచి సర్వం కావాలి కానీ చైనా చెప్పే సమాచారాన్ని అమెరికా నమ్మదు. కనుకనే కరోనా మహమ్మారి గురించి చేసిన హెచ్చరికలను పట్టించుకోలేదు. అమెరికా అడుగుజాడల్లో నడుస్తున్న ట్రంప్‌ జిగినీ దోస్తుగా ఉన్న నరేంద్రమోడీ కూడా అదే మాదిరి నిర్లక్ష్యం వహించారని తరువాత జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయి.
ఫిబ్రవరి 15న కోవిడ్‌19 గురించి ఉన్న అపోహలు, ప్రచారాల గురించి మ్యూనిచ్‌ భద్రతా సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అడగహనోమ్‌ మాట్లాడుతూ తమ సంస్ధ, ప్రపంచవ్యాపితంగా ప్రభుత్వాలు కేవలం కరోనా మహమ్మారితోనే కాదు తప్పుడు సమాచార మహమ్మారితో కూడా పోరాడాల్సి వస్తోందని చెప్పాడు.వైరస్‌ కంటే తప్పుడు వార్తలు వేగంగా వ్యాపించటం ప్రమాదకరమని అన్నాడు. మార్చి11న కరోనా ప్రపంచ మహమ్మారిగా మారినట్లు డబ్ల్యుహెచ్‌ఓ అధికారికంగా ప్రకటించింది. నరేంద్రమోడీ వెంటనే స్పందించి ఉంటే తగ్లిబీ జమాతే నిజాముద్దీన్‌ మర్కజ్‌ను మూసివేయించి ఉండేవారు, లాక్‌డౌన్‌ను వెంటనే ప్రకటించి ఉండేవారు. మంత్రాల పఠనం, యాగాలు, గోమూత్రం, ఆవు పేడ చిట్కాల ప్రచారం కొంతమేరకైనా ఆగిపోయి ఉండేది.
కుట్ర సిద్దాంతాలు కూడా నకిలీ వార్తల తయారీలో భాగమే. వాటిలో భాగమే జీవ ఆయుధాల తయారీ వార్తలు. ప్రతిదేశమూ అలాంటి కుట్రసిద్దాంతాలకు ప్రాణప్రతిష్ట చేయటం, అలాంటి సిద్ధాంత కర్తలను మేపటం వలన కరోనా విషయంలో కూడా అవి ముందుకు వచ్చి జనాన్ని, పాలకులను కూడా గందరగోళ పరిచాయంటే అతిశయోక్తి కాదు. వ్యాక్సిన్లు తయారు చేసే వ్యాపారులు అవసరం లేకపోయినా వాటిని బలవంతంగా ప్రయోగించేందుకు అనుకూల ప్రచారం చేయించారని చెబుతున్నవారు కొందరు. దాని వ్యతిరేక లాబీ వ్యాక్సిన్ల వ్యతిరేక ప్రచారాన్ని చేసింది. భారత్‌, జపాన్‌, మరికొన్ని దేశాల్లో క్షయ నిరోధక బిసిజి వ్యాక్సిన్లు వేస్తున్న కారణంగానే కరోనా మరణాలు గణనీయంగా తక్కువగా ఉన్నాయని కొందరు చెబుతున్నారు.దీనికి ఆధారం లేదని మరొక వాదన అయితే , వందేళ్ల నాటి టిబి వైరస్‌ కరోనాను ఎలా నిరోధిస్తుందన్నది మరొక వాదన. క్షయ కేసులు, మరణాలు ప్రపంచంలో నాలుగోవంతు మన దేశంలోనే ఎందుకు ఉన్నాయన్నది ఈ సందర్భంగా అడగకూడని ప్రశ్న. కరోనా వైరస్‌ గురించి తప్పుడు ప్రచారం చేసిన లేదా జనాన్ని తప్పుదారి పట్టించిన వారిలో ప్రధముడు డోనాల్డ్‌ ట్రంప్‌ అని చెప్పాలి.
ఏప్రిల్‌ ఐదవ తేదీన దీపాల వెలుగును సంకల్పబల ప్రదర్శనకు అన్నది మోడీ గారి అభిప్రాయంగా తీసుకోవటానికి ఎవరికీ అభ్యంతరం ఉండనవసరం లేదు. అది జనతా కర్ఫ్యూ రోజు చప్పట్లతో ముగిసింది. అన్ని పార్టీలు పాటించాయి. సంకల్పాన్ని ఎన్నిసార్లు ప్రదర్శించాలి. ఈ తేదీని ఎంచుకోవటం గురించి అనేక మందిలో సంకల్పం సంగతి తరువాత బిజెపి రాజకీయ అజెండా ఉందనే అనుమానాలు తలెత్తాయి. జనతా పార్టీ నుంచి విడిపోయి బిజెపిగా అవతరించాలని నిర్ణయించిన రోజు ఇది, మరుసటి రోజు నుంచి అంటే 1980ఏప్రిల్‌ ఆరవ తేదీ నుంచి బిజెపి ఉనికిలోకి వచ్చి నాలుగు దశాబ్దాలు నిండుతున్న సందర్భాన్ని పాటించేందుకు దాన్ని ఎంచుకున్నారని కొందరి విమర్శ. తెరముందు కనిపించే బిజెపికి తెరవెనుక బిజెపికి తేడా ఉంటుందన్న విమర్శను ఇది రుజువు చేస్తోంది కదా !
రెండవది ప్రతి ఇంటిలో తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాలు దీపాలు వెలిగించాలన్నారు. దీన్ని కూడా సరిపెట్టుకుందాం. వెంటనే దానికి ఒక శాస్త్రీయ సిద్దాంతాన్ని జోడించేందుకు తయారయ్యారు. ” ప్రతి ఇంటిలో 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగిస్తే ప్రతి దీపం యొక్క వెలుగు ఆకాశం లోకి విడుదల అవుతుంది, ఇలా విడుదల అయిన అన్ని దీపాల వెలుగులు ఫోటాన్‌ శక్తులు గా మారుతాయి. అప్పుడు 9 ( నవ) గ్రహాలు అన్నీ ఒకదానితో ఒకటి కలిసి ప్రయాగ అనే కక్ష్య లోకి వస్తాయి, అలా రావడం వల్ల నవ గ్రహాలు అత్యంత శక్తివంతంగా తయారవుతాయి. అవి ప్రయాగ కక్ష్య లో తిరగడం వల్ల ఒకేసారి కొన్ని కోట్ల దీపాల వెలుగుల వల్ల 33 కోట్ల దేవతలు రాహుకేతువుల నుండి విముక్తులై ఆ ఫోటాన్‌ శక్తిని క్వాంటం శక్తిగా, ఆ క్వాంటం శక్తి ఆటమిక్‌ ఎనర్జీ గా మారుస్తారు. ఆ ఆటమిక్‌ ఎనర్జీ యే కరోనాను చంపుతుంది.” దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమన్నట్లుగా బుర్రలేని వారందరూ దీన్ని వాట్సప్‌, ఫేస్‌బుక్‌లో ప్రచారం చేస్తున్నారు.
అంత సులభంగా అటామిక్‌ ఎనర్జీ తయారుచేసుకునే అవకాశం ఉన్నపుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అల్లుడు భాగస్వామిగా ఉన్న అణుకంపెనీలతో ఒప్పందాలు చేసుకోవటం,వేల కోట్లు కట్టబెట్టటం ఎందుకు ? వాటితో వచ్చే ప్రమాదాల గురించి రోజూ భయంతో చావటం ఎందుకు ? నిజంగా దీపాల వెలుగుతో కరోనా చచ్చేట్లయితే రోజూ జనాలు వెలిగిస్తున్న దీపాలతో తయారయ్యే శక్తితో ఈ పాటికి అంతరించి ఉండాలి కదా ! ఒక్క వైరస్‌ ఏమిటి జనాన్ని పీడిస్తున్న ఈగలు, దోమలు కూడా ఎప్పుడో అంతరించి ఉండాల్సింది కదా ? రోజూ ప్రపంచ వ్యాపితంగా వెలిగించే దీపాల వెలుగుతో పని చేయకుండా నవ గ్రహాలు రోజూ ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? ఎందుకీపోసుకోలు కబుర్లు ?
కరోనా వైరస్‌ మరోసారి కుట్రసిద్దాంత పండితులకు, ఫేక్‌ న్యూస్‌ ఉత్పాదకులకు మంచి అవకాశాలను కల్పించింది. ఫేక్‌ న్యూస్‌, కుట్ర సిద్దాంతాలకు బలి అయ్యేవారిలో మెదడును సరిగా ఉపయోగించని వారే ఎక్కువగా ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. ఈ బలహీనతను గమనించే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, పాలకులు అందరూ వాటిని ఆయుధాలుగా చేసుకొని జనం మీద దాడి చేస్తున్నారు. కరోనా వైరస్‌ వయసు మీరిన, జబ్బులున్నవారి మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫేక్‌ న్యూస్‌, కుట్ర సిద్దాంతానికి వయస్సుతో పని లేదు. ఎవరి మెదడు పని చేయకుండా ఉందా అన్నదే గీటురాయి. వైరస్‌ మాదిరి వీటికిి ఎల్లలు, కులాలు, మతాలు, భాషా, రంగు బేధాలు లేవు. మెదళ్లను ఖరాబు చేయటమే కాదు, ఉన్మాదాన్ని పెంచుతాయి, ప్రాణాలు తీస్తాయి.

Court finds case against Lord Ram, Laxman 'beyond logic', squashes ...
రామాయణ, మహాభారతాలు, అనేక పురాణాల్లో ఫేక్‌ న్యూస్‌, మాయలు కోకొల్లలు. మాయలేడిని చూపి సీతను ప్రలోభపెట్టారు.రాముడి మాదిరి హా సీతా హా లక్ష్మణా అంటూ పారడీ చేసి సీతను గీత దాటించిన ఉదంతం తెలిసిందే. సీత గీత దాటకపోతే రామాయణం అన్ని మలుపులు తిరిగేదా ? ఫేక్‌ న్యూస్‌, మాయ లేడి బాధితులు సీత, రాముడు, లక్ష్మణుడు అన్నది స్పష్టం. మహాభారతంలో అశ్వద్ధామ హత: కుంజర: ఉదంతం తెలిసిందే. ఇలాంటివే చెప్పుకుంటే ఎన్నో. పాలకులకు ఇవి నిత్యకృత్యం. వర్తమాన కాలంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఇవి ఇంకా పెరిగాయి. ఇందుగల వందు లేవను సందేహము వలదు ఎందెందు చూసిన అందందు గలవు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చరిత్రలో జీవ ఆయుధాల నేరగాండ్లెవరు?

19 Wednesday Feb 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

#China biological weapons, Biological weapons, China a victim of Biological weapons, japan bacteria bombs

Image result for japan bacteria bombs

– ఎం. కోటేశ్వరరావు

చైనాలోని హుబెయ్ రాష్ట్రంలో కోవిద్‌-19(కరోనా) వైరస్‌ ప్రబలి వందల మందిని బలిగొనటం వెనుక ఉన్నది వికటించిన చైనా జీవ ఆయుధ ప్రయోగాలే అని పశ్చిమ దేశాల మీడియా కథలను అల్లింది. వాటిని పొల్లుపోకుండా దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమన్నట్టు తెలుగు మీడియా పునశ్చరణ కావించింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని ఈనెల 15న ఆసియా టైమ్స్‌ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. గతంలో కొన్ని దేశాల చరిత్రను చూసినప్పుడు అప్పటికే గుర్తించిన వైరస్‌లు, బాక్టీరియాలతో జీవ ఆయుధాలను తయారు చేసి జనం మీద ప్రయోగించాయి. కోవిద్‌-19 వైరస్‌ కొత్తది. గతంలో గుర్తించిన 2019 నోవల్‌ కరోనా వైరస్‌కూ దీనికీ సంబంధం లేదు. అందువలన కోవిద్‌-19తో జీవాయుధాలు తయారు చేస్తున్నారనటానికి ఎలాంటి ఆధారాల్లేవని, ప్రధాన వైద్య నిపుణులెవరూ వివాదాస్పద కథనాలను అంగీకరించటం లేదని ఆసియా టైమ్స్‌ కథన రచయిత పేర్కొన్నారు.

చరిత్రలో ఇంతవరకు ఏ దేశంలోనూ జరగని విధంగా కోట్లాది మందిని ఇండ్లకే పరిమితం కావాలని వ్యాధినిరోధక చర్యల్లో భాగంగా చైనా సర్కార్‌ జనానికి సలహాయిచ్చింది. అది కూడా కొందరు ప్రబుద్దులకు జనాన్ని బందీలు చేయటంగా కనిపించిందంటే వారి చైనా వ్యతిరేక పిచ్చి తారాస్ధాయికి చేరిందనుకోవాలి. ప్రపంచ దేశాలన్నీ వైరస్‌ తగ్గుముఖం పట్టేవరకు చైనా ప్రయాణాలు మానుకోవాలని సలహా ఇచ్చాయి, అంటే దీని అర్ధం సేచ్చగా తిరగటాన్ని కట్టడి చేయటంగానూ, నిరంకుశ చర్యలుగా భావించాలా ? కోవిడ్‌-19 వైరస్‌ చైనాలో ఉహాన్‌ పరిశోధనశాలల నుంచే వెలువడిందనటానికి ఆధారాలు ఇంకా దొరకలేదని చెబుతూనే రుజువు చేసుకోవాల్సిన బాధ్యత చైనా కమ్యూనిస్టు పార్టీ మీద ఉందని అమెరికా రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ టామ్‌ కాటన్‌ చేసిన బాధ్యతారహిత ప్రకటనను ఆధారం చేసుకొని మీడియా రచ్చ చేస్తోంది. ఇండ్ల నుంచి బయటకు వచ్చిన వారిని చైనా కమ్యూనిస్టు పార్టీ పోలీసులు కొడుతున్నారని కాటన్‌ ప్రబుద్దుడు ఆరోపించాడు. ఇలాంటి వారి ప్రకటనలను ఆధారం చేసుకొని మీడియా సంచలనాత్మక కథనాలను వండుతోంది.

జీవ ఆయుధాలు ప్రపంచంలో తయారు కావటం లేదా, ఏ ఏదేశాలకు సామర్థ్యం ఉంది, అసలు ఎప్పటి నుంచి వీటిని వినియోగిస్తున్నారు, ఎవరు వినియోగిస్తున్నారో చూద్దాం. యుద్ధోన్మాదులు, ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలని చూసిన వారు మాత్రమే వీటిని ఉపయోగించినట్టు చరిత్ర చెబుతోంది. కమ్యూనిస్టులు అలాంటి వారు కాదు కాబట్టి, సోషలిస్టు చైనాకు అలాంటి ఆయుధాలను తయారు చేయాల్సిన అవసరం లేదు. వైరస్‌, బాక్టీరియా, ఫంగస్‌, ఇతర కొన్ని రసాయనాలను జీవ ఆయుధాలుగా పరిగణిస్తున్నారు. వీటివలన మానవులు, పశువులే కాదు, మొక్కలు కూడా నాశనం అవుతాయి, అనారోగ్యపాలవుతాయి. అయితే వాటిని తయారు చేసే సత్తా చైనాకు లేదా అంటే లేదని ఎవరూ చెప్పజాలరు. మానవ కల్యాణం కోసం ఒక ప్రమాదకర వైరస్‌ను హతమార్చేందుకు మరొక వైరస్‌ను రూపొందించేందుకు ప్రతి దేశానికీ అవకాశం ఉంది. అయితే ఆ ముసుగులో ఆయుధాలు తయారు చేస్తున్నాయన్నదే అసలు సమస్య.

చరిత్రను తిరగేస్తే క్రీస్తు పూర్వం ఆరువందల సంవత్సరంలో క్రిసాను ముట్టడి సమయంలో రాజు సోలోన్‌ కటుక రోహిణీ అనే పుష్పాల నుంచి తీసిన రసాన్ని ప్రయోగించి విరేచనాలు, ఇతర వ్యాధులు కలిగించినట్టు చరిత్రలో ఉంది. 1155లో రాజు బార్బోసా ఇటలీలోని టోరోంటానాలోని మంచి నీటి బావుల్లో శవాలను పడవేసి కలుషితం కావించాడు. 1495లో ఫ్రెంచి సైనికులను హతమార్చేందుకు స్పెయిన్‌ రాజులు ఇటలీలోని నేపుల్స్‌లో కుష్టువ్యాధి గ్రస్తుల రక్తం కలిపిన వైన్‌ సరఫరా అయ్యేట్టు చూశారు.1675లో విషంతో కూడిన బుల్లెట్లను వినియోగించరాదని జర్మనీ-ఫ్రెంచి సైన్యం అంగీకారానికి వచ్చాయి. 1710లో రష్యన్‌ చక్రవర్తి స్వీడన్‌ పట్టణాలలో ప్లేగుతో మరణించిన శవాలను ఫిరంగులకు కట్టి పడవేయించాడు. 1763లో అమెరికాలోని గిరిజనులను దెబ్బతీసేందుకు బ్రిటిష్‌ పాలకులు అమ్మోరు పోసిన వ్యాధిగ్రస్తులు వాడిన దుప్పట్లు పంపిణీ చేశారు. నెపోలియన్‌ చక్రవర్తి 1797లో ఇటలీలోని మంటువాలో మలేరియా వ్యాధి వ్యాపింప చేసేందుకు మైదానాలను వరదలతో నింపించాడు. అంతర్యుద్ధ సమయంలో1863లో అమెరికాలోని బానిస వ్యవస్థను కోరుకొన్న తిరుగుబాటు రాష్ట్రాలు యూనియన్‌ సైనికులకు ఎల్లోఫీవర్‌, అమ్మోరు సోకిన రోగులు వాడిన వస్త్రాలను విక్రయించేట్టు చూశాయి.

1346లో జెనోయీస్‌-తార్తార్ల మధ్య నేటి ఉక్రెయిన్‌లో ఆధిపత్య పోరు సమయంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఓటమి దశలో ఉన్న తార్తార్లు ప్లేగువ్యాధి సోకిన, మరణించిన తమ వారిని ఫిరంగులకు కట్టి శత్రు ప్రాంతాల మీద పడేశారు. దాంతో జెనోయీస్‌ దళాలు వెనక్కు తగ్గాయి. ఈ పరిణామం గురించి గాబ్రియల్‌ డే ముసిస్‌ నమోదు చేశాడు. వెనక్కు తగ్గిన జెనోయీస్‌(ఇటాలియన్లు)లు తమతో పాటు ప్లేగు వ్యాధి కూడా తీసుకు వెళ్లారు. ప్లేగు వ్యాధిగ్రస్తులు, బహుశా దానిని వ్యాపింప చేసే ఎలుకలను కూడా తమ నౌకల్లో తీసుకుపోయి ఉంటారని పేర్కొన్నాడు. ఆ తరువాత అది ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలో మన దేశంతో సహా అనేక దేశాలకు వ్యాపించింది. రెండున్నర కోట్ల మంది ఐరోపాలో దానికి బలయ్యారు. హైదరాబాదు సంస్థానంలో ప్లేగు వ్యాధి పదే పదే వస్తుండటంతో దాన్ని నివారించేందుకు 1591లో చార్మినార్‌ను నాటి నిజాం రాజు కట్టించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ తరువాత కూడా వస్తుండటంతో పాలకులు అనేక నివారణ చర్యలను తీసుకోవటం వేరే విషయం.

మొదటి ప్రపంచ యుద్ధంలో గుర్రాలకు సెంబరోగం (చీమిడి కారటం) వచ్చే ఆంత్రాక్స్‌ పౌడర్‌ను జర్మనీ, ఫ్రెంచి గూఢచారులు ప్రయోగించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ సైన్యాలు రష్యా, ఇతర అనేక దేశాలలో ప్లేగ్‌, అంతరాక్స్‌ వంటి వ్యాధులను వ్యాపింపచేసేందుకు ప్రయత్నించారు. జీవ ఆయుధాల తయారీ, ప్రయోగాలు నిర్వహించారు. 1980-88 మధ్య ఇరాక్‌-ఇరాన్‌ యుద్ధంలో అమెరికా అందచేసిన శరీన్‌, ఇతర గ్యాస్‌లను ప్రయోగించినట్టు ఇరాక్‌పై విమర్శలు వచ్చాయి. తరువాత కాలంలో వాటి నిల్వలు ఇంకా ఇరాక్‌ వద్ద ఉన్నట్టు అనుమానించిన అమెరికా సద్దామ్‌ హుసేన్‌ మానవవినాశక ఆయుధాలను గుట్టలుగా నిల్వచేసినట్టు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇరాక్‌లో అమెరికన్లకు అలాంటివేమీ దొరకలేదని తరువాత వెల్లడైంది.

అమెరికాను ఆక్రమించుకొనే క్రమంలో గిరిజనుల నుంచి ఎదురైన ప్రతిఘటనను అణచివేసేందుకు బ్రిటిష్‌ పాలకులు పైన చెప్పుకున్నట్టు మసూచి(అమ్మోరు)వ్యాప్తిని ఒక ఆయుధంగా వాడుకున్న దుర్మార్గం గురించి చరిత్రలో నమోదైంది. అవి ఎలా పనిచేశాయో వివరిస్తూ సమాచారాన్ని బ్రిటిష్‌ సైనిక అధికారులు నమోదు చేశారు. పర్యవసానంగా దాదాపు రెండువందల సంవత్సరాల పాటు అమెరికాలో మసూచి వ్యాప్తి చెందింది. ఇలాంటి వాటిని పని గట్టుకొని వ్యాపింప చేశారా లేక సహజంగానే తలెత్తాయా అనేది నిర్ధారించటం ఇప్పటికీ అంతసులభంగా అంతుబట్టటం లేదని నిపుణులు చెబుతున్నారు.

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 22సంవత్సరాలకు 179 దేశాలు జీవ ఆయుధాల నియంత్రణకు ఒప్పందంపై సంతకం చేశాయి. ఎట్టి పరిస్ధితుల్లోనూ వాటి తయారీ, సేకరణ, నిల్వ, వినియోగించబోమని ఆ దేశాలు అంగీకారం తెలిపాయి. అయితే వైద్య అవసరాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఉదాహరణకు ఒక ప్రాణాంతక వైరస్‌ను హతమార్చేందుకు మరొక వైరస్‌ తయారీకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు జీవ ఆయుధాలు తయారు చేస్తున్నవారు కూడా ఆ ముసుగుతోనే చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. అనేక దేశాలు రసాయనిక ఆయుధాలు తయారు చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. వాటికీ జీవ ఆయుధాలకు పెద్ద తేడా ఉండదు. ఉదాహరణకు వియత్నాంను ఆక్రమించుకొనేందుకు అమెరికా జరిపిన దాడుల సమయంలో కలుపు మొక్కలను నాశనం చేసే పేరుతో ఆరెంజ్‌ ఏజంట్‌ అనే రసాయనాన్ని పెద్ద ఎత్తున వియత్నాంలో చల్లారు. యాభై సంవత్సరాలు గడిచిన తరువాత కూడా అనేక చోట్ల కలుపు మొక్కలే కాదు అసలు ఏ మొక్కా బతకని పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతాలలో పుట్టుకతో పిల్లల్లో లోపాలు, కాన్సర్‌, మధుమేహం వంటి వ్యాధులకు అమెరికా చిమ్మిన విషం కారణమని తేలింది. అణ్వాయుధాలను అత్యాధునికంగా ఎలా తయారు చేస్తున్నారో వైరస్‌లను కూడా ఏదో ఒక ముసుగులో అలాగే తయారు చేస్తున్నట్టు అనేక మంది అనుమానిస్తున్నారు.

మొదటి ప్రపంచ యుద్దంలో రష్యా, రుమేనియాల్లో కలరా, ప్లేగు, అంత్రాక్స్‌ను వ్యాపింప చేసేందుకు నౌకల్లో అవి సోకిన గుర్రాలు, ఇతర పశువులను ఎగుమతి చేసేందుకు జర్మనీ పధకం వేసిందని వార్తలు వచ్చాయి. అయితే దాని మీద విచారణ జరిపిన నానాజాతి సమితి కమిటీ జీవ ఆయుధాలను ఉపయోగించలేదు గానీ జర్మన్లు రసాయనిక ఆయుధాలు వాడినట్లు పేర్కొన్నది. తరువాత రసాయనిక ఆయుధాలను రూపొందించకూడదని కోరుతూ 1925లో జెనీవా ఒప్పందం చేసుకున్నారు. అనేక దేశాలు సంతకాలు చేసినా 1975వరకు అమెరికా భాగస్వామి అయ్యేందుకు మొరాయించింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కొరియాపై దాడి సమయంలో అమెరికా జీవ ఆయుధాలను ఉపయోగించిందనే విమర్శలు వచ్చాయి. అయితే తమ దగ్గర జీవ ఆయుధాలు ఉన్నాయి తప్ప వాటిని ఉపయోగించలేదని అమెరికన్లు బుకాయించారు.

జపాన్‌ జీవ ఆయుధాల తయారీ బృందం నేత షిరోషి

రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ సామ్రాజ్యవాదులు ఆపరేషన్‌ చెర్రీ బ్లూసమ్స్‌ పేరుతో జీవ ఆయుధాలతో అమెరికా సహా అనేక దేశాల మీద దాడి చేయాలనే పథక రచన చేశారు. అందుకు ప్రత్యేక దళాన్నే ఏర్పాటు చేశారు. 1932 నుంచి 1942వరకు పరిశోధనలు చేసి రూపొందించారు. తొలుత ప్రయోగాల్లో భాగంగా తన ఆక్రమణలోని చైనాలోని హార్బిన్‌, కొరియా, మంచూరియా ప్రాంతంలో దాడి చేశారు. దానిలో కలరా, ప్లేగు, అంతరాక్స్‌, మసూచి వంటి ప్రమాదకర క్రిముల్ని వాడారు. 2002లో ఒక అంతర్జాతీయ సమావేశంలో జపాన్‌ మిలిటరీ జరిపిన బాక్టీరియా బాంబు దాడుల్లో మరణించిన వారు ఐదు లక్షల ఎనభైవేల మంది ఉన్నట్టు వక్తలు వెల్లడించారు. ఒక్క చైనాలోనే ప్లేగు, కలరా, ఆంత్రాక్స్‌ వంటి వాటితో నాలుగు లక్షలమంది మరణించారని అంచనా. అమెరికన్లు జపాన్‌ పెరల్‌ హార్బరు మీద దాడి చేసిన తరువాత పదిహేను కోట్ల ప్లేగు బాక్టీరియాను మోసుకుపోయే ఈగలు, ఎలుకలతో అమెరికా మీద దాడి చేయాలని జపాన్‌ ఏర్పాట్లు చేసుకుంది. అయితే కారణాలు ఏమైనా వాటిని మోసుకుపోయే బెలూన్‌ నిర్ణీత స్థలాన్ని చేరలేదు. తరువాత దాడి చేయాలనుకున్న తేదీకి కొద్ది వారాల ముందే జపాన్‌ లొంగిపోయింది. దాంతో పన్నాగం నెరవేరలేదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత జరిపిన విచారణలో జీవ ఆయుధాల తయారీ బృందం నేత షిరోషిని జపాన్‌ విడిచినా సోవియట్‌ విచారణలో 12మంది జపనీయులకు శిక్షలు తప్పలేదు.
జపాన్‌ జీవ ఆయుధాల తయారీకి 150 భవనాలను, ఐదు శివారు ప్రాంతాలను ఉపయోగించి మూడువేల మంది శాస్త్రవేత్తలతో పని చేయించారు. వాటి తయారీ సమయంలో కనీసం పదివేల మంది ఖైదీలపై వాటిని ప్రయోగించగా మరణించినట్టు తేలింది. వారిలో మూడువేల మంది కొరియా, చైనా, సోవియట్‌, మంగోలియా, అమెరికన్‌, బ్రిటిష్‌, ఆస్ట్రేలియన్‌ యుద్ద ఖైదీలు ఉన్నట్టు బయట పడింది. జపాన్‌ జీవ ఆయుధాల విషయం బయటపడిన తరువాత అమెరికా పెద్ద ఎత్తున 1942నుంచి వాటిని రూపొందించేందుకు పూనుకుంది. తాను పెద్ద ఎత్తున జీవ ఆయుధాలను తయారు చేసినట్టుగానే ఇతరులు కూడా తయారు చేసి తమ మీద ప్రయోగిస్తారని అమెరికా భయపడుతోంది.

ఇరాక్‌పై దాడి, దురాకక్రమణ సమయంలో 1990-91లో తన సైనికులను రసాయన ఆయుధాల నుంచి రక్షించుకొనేందుకు అవసరమైన ముఖతొడుగులు(మాస్క్‌) అందచేసింది. వాటిని ఎలా కనుగొనాలో శిక్షణ ఇచ్చింది. లక్షా 50వేల మంది సైనికులకు ఆంత్రాక్స్‌ నివారణ వాక్సిన్లు, వేసింది. ఆంత్రాక్స్‌ సోకినపుడు నివారణకు ఐదులక్షల మంది సైనికులకు ఒక నెలకు అవసరమైన ఔషధాల నిల్వల్ని అందుబాటులో ఉంచింది.
చరిత్రలో మానవాళి పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన సామ్రాజ్యవాదుల దుష్ట చరిత్రను మూసిపెడుతూ సోషలిజం, కమ్యూనిజం మీద ఉన్న వ్యతిరేకతను మరోసారి రెచ్చగొట్టేందుకు కార్పొరేట్‌ మీడియా చైనా జీవ ఆయుధాల తయారీ కథలను చెబుతున్నది.రెండవ ప్రపంచ యుద్దంలో జీవ ఆయుధాల దాడికి గురైన బాధిత దేశం చైనా అన్నది గుర్తు పెట్టుకోవాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దెబ్బకు దెబ్బ – ఓడకు ఓడ – అమెరికా వలలో బ్రిటన్‌ !

23 Tuesday Jul 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Britain, Grace 1, Iran Oil, Iran Tanker, Stena Impero, tit-for-tat ship seizures, UK Tanker., US Trap

Image result for Ship crisis: Britain falls into a dangerous US trap

ఎం కోటేశ్వరరావు

దెబ్బకు దెబ్బ, కంటికి కన్ను అందరికీ తెలిసిన ప్రతీకార చర్యలు. ఇప్పుడు గల్ఫ్‌లోని హార్ముజ్‌ జలసంధిలో అమెరికా-ఇరాన్‌ మధ్య ప్రతీకార చర్యలలో బ్రిటన్‌ ఓడకు ఓడ చేరింది.తమ ఓడను పట్టుకున్న బ్రిటన్‌ చర్యకు ప్రతిగా బ్రిటన్‌ ఓడను ఇరాన్‌ పట్టుకొని తన రేవుకు తరలించింది. అమెరికా పన్నిన వలలో తనకు మాలిన ధర్మాన్ని నెరవేర్చేందుకు ప్రయత్నించిన బ్రిటన్‌ ఇప్పుడు ఇరాన్‌తో కొత్త వైరాన్ని తెచ్చుకుంది, దాన్నుంచి పరువు దక్కించుకొని ఎలా బయపడుతుందన్నది ఆసక్తికరం. ఇరాన్‌ వ్యవహారంలో ఒంటరిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అమెరికా తనకు తోడుగా బ్రిటన్‌ వున్నట్లు ప్రపంచానికి చూపింది. ఇరాన్‌ అణు ఒప్పందంపై అమెరికా వైఖరిని తొలి నుంచి వ్యతిరేకిస్తున్న బ్రిటన్‌ ఇప్పుడు ఈ పిచ్చిపని ఎందుకు చేసిందని ఆంగ్లేయులు తలలు పట్టుకుంటున్నారు. అసలు ఎవరు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు, ఎలా జరిగిందన్నది తేలాలని కోరుతున్నారు. మరోవైపు బ్రిటన్‌ చర్యకు ఐరోపా యూనియన్‌(ఇయు) మద్దతు ప్రకటించలేదు. మౌనంగా వుంది. ఇరాన్‌ చర్యను మాట మాత్రంగా ఫ్రాన్స్‌, జర్మనీ తప్ప ఐరోపా యూనియన్‌ తప్పు పట్టలేదు, మౌనం దాల్చింది. అమెరికా-ఇరాన్‌ వివాదంలో బ్రిటన్‌ ముందుకు రావటం యాదృచ్చికమా ? వ్యూహాత్మకమా ? అమెరికా పన్నిన వలలో చిక్కుకుందా? పరిణామాలు ఎక్కడకు దారి తీస్తాయి? ఇది అనూహ్య పర్యవసానాలకు దారి తీస్తుందా ? తన తప్పిదాన్ని బ్రిటన్‌ గ్రహిస్తే టీ కప్పులో తుపానులా ముగుస్తుందా ! పరువు ప్రతిష్టలకు పోయి మరేదైనా చేస్తుందా ?

తాజా వుదంత నేపధ్యాన్ని క్లుప్తంగా చూద్దాం. జూన్‌ 13: తమ రెండు చమురు ఓడలపై ఇరాన్‌ దాడి చేసిందని అమెరికా ఆరోపణ, తప్పుడు ప్రచారం తప్ప అలాంటిదేమీలేదని ఇరాన్‌ ఖండన. జూన్‌ 20: తమ గగన తలాన్ని అతిక్రమించినందున అమెరికా మిలిటరీ డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్‌ ప్రకటన. ప్రతిదాడికి ఆదేశాలిచ్చిన ట్రంప్‌ 150 మంది పౌరుల ప్రాణాలు పోతాయని చెప్పటంతో చివరి నిమిషంలో వుపసంహరించుకున్నట్లు అమెరికా మీడియా ద్వారా వెల్లడి. జూలై 4: సరిగ్గా అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం రోజున సిరియాకు చమురు తీసుకు వెళుతోందని, ఇది ఇయు ఆంక్షలను వుల్లంఘించటమే అనే సాకుతో జిబ్రాల్టర్‌ ప్రభుత్వ కోరిక మేరకు బ్రిటన్‌ నౌకాదళం రంగంలోకి దిగి జిబ్రాల్టర్‌ జలసంధిలో పనామా పతాకంతో ప్రయాణిస్తున్న ఇరాన్‌ చమురు ఓడ గ్రేస్‌1ని పట్టుకుంది. దెబ్బకు దెబ్బగా బ్రిటీష్‌ చమురు ఓడలను పట్టుకుంటామని ఇరాన్‌ ప్రకటన. జూలై 10: వాణిజ్య నౌక బ్రిటీష్‌ హెరిటేజ్‌ను అడ్డుకోబోయిన మూడు ఇరాన్‌ పడవలకు దగ్గరగా వెళ్లిన బ్రిటన్‌ నావీ ఫ్రైగేట్‌ హెచ్‌ఎంఎస్‌ మాంట్‌రోజ్‌, హెచ్చరికలతో ఇరాన్‌ పడవలు వెళ్లిపోయాయని, ఎలాంటి కాల్పులు జరగలేదని బ్రిటన్‌ ప్రకటన. అయితే ఆ వుదంతానికి ఎలాంటి ఆధారాలు లేవు, అస్పష్టమైన ఫొటోల వెల్లడి. అలాంటిదేమీ లేదని ఇరాన్‌ ప్రకటన.ఈ నౌక తన ట్రాకర్‌ను ఒక రోజు ముందుగా నిలిపివేసింది. దానికి వెన్నుదన్నుగా బ్రిటీష్‌ యుద్ధ నౌక ఎందుకు వెళ్లింది అన్న ప్రశ్నకు సమాధానాలు లేవు. జూలై 11: గ్రేస్‌1 నౌక కెప్టెన్‌, ఇతర అధికారులను అరెస్టు చేసినట్లు జిబ్రాల్టర్‌ ప్రకటన. ఇయు ఆంక్షలను వుల్లంఘించారని ఆరోపణ. రెండు రోజుల తరువాత బెయిలు మీద అధికారుల విడుదల. ఆంక్షలను వుల్లంఘించబోమని ఇరాన్‌ హామీ ఇస్తే గ్రేస్‌1 టాంకర్‌ను వదులుతామని ఇరాన్‌ మంత్రికి బ్రిటన్‌ విదేశాంగ మంత్రి ప్రతిపాదన. జూలై 15:ఇరాన్‌ అణు ఒప్పందంపై బ్రసెల్స్‌లో ఇయు విదేశాంగ మంత్రుల సమావేశం. గల్ఫ్‌లో సైనిక చర్యకు చూస్తున్న ట్రంప్‌కు మద్దతు ఇచ్చేది లేదని బ్రిటన్‌ నేతల ప్రకటన. జూలై 16:తమ నౌక గ్రేస్‌1 నిర్బంధం అపహరణ తప్ప మరొకటి కాదని, దెబ్బకు దెబ్బ తీస్తామని ఇరాన్‌ అధ్యక్షుడి ప్రకటన.జూలై 17: యుఏయి నుంచి బయలు దేరిన పనామా పతాకం వున్న చమురు ఓడను హార్ముజ్‌ జలసంధిలో ఇరాన్‌ నిర్బంధించినట్లు అనుమానిస్తున్నట్లు అమెరికా అధికారుల వెల్లడి. ఇరాన్‌ జలాల్లో ప్రవేశించే ముందు మూడురోజుల క్రితమే ట్రాకర్‌ను ఆపివేసిన ఓడ. తమ దళాలు ఒక విదేశీ ఓడను, పన్నెండు మంది సిబ్బందిని పట్టుకున్నట్లు ఇరాన్‌ ప్రకటన. జూలై 18: తమ నౌక యుఎస్‌ బాక్సర్‌కు వెయ్యి గజాల సమీపానికి వచ్చిన ఇరాన్‌ డ్రోన్‌ను కూల్చివేసినట్లు ట్రంప్‌ ప్రకటన, అంత సీన్‌ లేదు, అదంతా వట్టిదే అని ప్రకటించిన ఇరాన్‌. జూలై 19: హార్ముజ్‌ జలసంధిలో ఇరాన్‌ రెండు నౌకలను నిర్బంధించినట్లు వార్తలు. వాటిలో ఒకటైన బ్రిటన్‌ స్టెనా ఇంపెరో అంతర్జాతీయ నౌకా నిబంధనలను వుల్లంఘించినందున అదుపులోకి తీసుకున్నట్లు ఇరాన్‌ ప్రకటన. లైబీరియా పతాకంతో వున్న మరొక నౌక మెస్‌డార్‌ను నిలువరించిన ఇరాన్‌ దళాలు తరువాత వారి ప్రయాణాన్ని అనుమతించినట్లు నౌక ఆపరేటర్‌ ప్రకటన.

Image result for iran oil tanker, gibraltar

ఇరాన్‌ అనే ఒక చిన్న దేశాన్ని దెబ్బతీసేందుకు అమెరికా అనే ప్రపంచ అగ్రరాజ్యం గత కొద్ది నెలలుగా గిల్లికజ్జాలు పెట్టుకొనేందుకు చేస్తున్న యత్నాలను ప్రపంచం చూస్తోంది.వాటిలో ఓడకు-ఓడ కొత్త అధ్యాయం. అట్లాంటిక్‌-మధ్యధరా సముద్రాలను కలిపే, ఐరోపా-ఆఫ్రికాలను విడదీసే జలసంధి పేరు జిబ్రాల్టర్‌. ఐరోపాలో స్పెయిన్‌, ఆఫ్రికాలో మొరాకో ఈ జలసంధికి ఎదురెదురుగా వుంటాయి. వాటి మధ్య దూరం కేవలం 14.3కిలోమీటర్లే. జిబ్రాల్టర్‌ 30వేల జనాభా వున్న బ్రిటీష్‌ పాలిత ప్రాంతం. అది స్పెయిన్‌దే అయినప్పటికీ ఆధిపత్యం కోసం ఐరోపాలో జరిగిన యుద్ధాలలో కీలకమైన ఈ ప్రాంతాన్ని 1713లో బ్రిటన్‌కు అప్పగించారు. ప్రస్తుతం అక్కడ బ్రిటన్‌ నౌకాదళ స్దావరం వుంది. ప్రపంచంలో సముద్రం ద్వారా జరిగే వాణిజ్య ఓడల రవాణాలో సగం ఇక్కడి నుంచి రాకపోకలు సాగించాల్సి వుంది. ఆ ప్రాంతాన్ని తమకు తిరిగి అప్పగించాలన్నది స్పెయిన్‌ డిమాండ్‌. అయితే ఇప్పటి వరకు రెండు ప్రజాభిప్రాయ సేకరణల్లో అక్కడి వారు స్పెయిన్‌లో విలీనం కావటానికి గానీ లేదా స్పెయిన్‌ సార్వభౌమత్వాన్ని అంగీకరించటానికి గానీ అంగీకరించలేదు. దాని వెనుక బ్రిటన్‌ హస్తం వుందని వేరే చెప్పనవసరం లేదు.

ఇక తాజా వివాద విషయానికి వస్తే ఈ వుదంతంలో నిబంధనలను వుల్లంఘించి బ్రిటన్‌ గిల్లి కజ్జాకు దిగినట్లు కనిపిస్తోంది. ఇరాన్‌ అణుకార్యక్రమాన్ని నియంత్రించేందుకు ఇరాన్‌, అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాన్ని ఇరాన్‌ వుల్లంఘిస్తోందంటూ ఏకపక్షంగా ఆరోపించి ఆ ఒప్పందం నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించిన అమెరికా వెంటనే ఇరాన్‌పై ఆంక్షలను తీవ్రతరం చేయటమే కాదు, యుద్ధానికి కాలుదువ్వుతోంది. చమురు అమ్మకాలను అడ్డుకుంటోంది. అమెరికా చర్యలను బ్రిటన్‌తో సహా ఇతర దేశాలేవీ ఆమోదించలేదు. ఇరాన్‌ నౌకను స్వాధీనం చేసుకోవటానికి ఒక రోజు ముందుగా జిబ్రాల్టర్‌ తన చట్టాన్ని సవరించుకుంది. ఆ మేరకు గ్రేస్‌1 చమురు నౌక(టాంకర్‌) ద్వారా ఐరోపా యూనియన్‌ ఆంక్షలను వుల్లంఘించి సిరియాలోని బానియాస్‌ చమురు శుద్ధి కేంద్రానికి చమురు సరఫరా చేస్తున్ననట్లు తమకు అనుమానంగా వుందని జిబ్రాల్టర్‌ చేసిన వినతి మేరకు బ్రిటన్‌ నౌకాదళం రంగంలోకి దిగింది. 2012 నాటి ఐరోపా యూనియన్‌ నిబంధన 36 మేరకు నౌకను స్వాధీనం చేసుకున్నట్లు జిబ్రాల్టర్‌ కోర్టు పేర్కొన్నది.

సిరియాకు చమురు సరఫరాలపై ఐరోపా యూనియన్‌ విధించిన ఆంక్షలు సభ్యదేశాలకు వర్తిస్తాయి తప్ప ఇరాన్‌కు వర్తించవు. ఎందుకంటే ఇరాన్‌ సభ్యరాజ్యం కాదు. నౌకలోని చమురు సిరియాకు కాదని ఇరాన్‌ ప్రకటించింది. అలాంటపుడు ఇరాన్‌ చమురు ఓడను కూడా ఐరోపా యూనియన్‌ మధ్యలో అడ్డుకోకూడదు. ఒకవేళ అడ్డుకున్నా ఇరాన్‌ ప్రకటన తరువాత వదలి వేయాలి. ఇక్కడ ఆంక్షలు విధించిన ఐరోపా యూనియన్‌ అసలు రంగంలోనే లేదు. అలాంటపుడు జిబ్రాల్టర్‌ జలసంధిలో ప్రయాణిస్తున్న నౌకను అడ్డుకోవటానికి బ్రిటన్‌కు ఎవరు అధికారమిచ్చారు? ఐరోపా యూనియన్‌ అలాంటి అధికారం ఇవ్వలేదు. సిరియా మీద ఐరోపాయూనియన్‌ ఆంక్షలను బ్రిటన్‌ అమలు జరుపుతోందా లేక ఇరాన్‌ మీద అమెరికా ఆంక్షలను బ్రిటన్‌ అమలు జరుపుతున్నట్లా ? ఒక వైపు తాను ఐరోపా యూనియన్‌ నుంచి వైదొలగాలని బ్రిటన్‌ నిర్ణయించుకుంది. దాంతో తలెత్తిన సంక్షోభంలో ప్రధానిగా వున్న థెరెసా మే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రత్యామ్నాయం ప్రభుత్వం ఇంకా ఏర్పడలేదు. ఈ తరుణంలో ఇరాన్‌ నౌకను స్వాధీనం చేసుకోవాలన్న నిర్ణయం ఎక్కడ జరిగిందన్నది ఒక ప్రశ్నగా ముందుకు వచ్చింది. అంతర్గతంగా ఏమి జరిగినా అమెరికా తరఫున బ్రిటన్‌ అడ్డగోలు చర్యలకు పాల్పడుతున్నట్లు స్పష్టం అవుతోంది.

మరోవైపు డోనాల్డ్‌ ట్రంప్‌ చర్యలు పరస్పర విరుద్ధంగా వున్నాయి. సౌదీ అరేబియాకు తాజాగా సైనికులతో పాటు ఎఫ్‌ 22 యుద్ధ విమానాలను, క్షిపణులను పంపాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు సెనెటర్‌ రాండ్‌ పాల్‌ను నియమించారు. బ్రిటన్‌-ఇరాన్‌ సంబంధాల చరిత్రను చూస్తే రెండు దేశాల మధ్య విశ్వాసం లేదు.1901లో బ్రిటన్‌ వ్యాపారి విలియం నాక్స్‌ డీ అర్సే పర్షియాగా మరో పేరున్న ఇరాన్‌లో చమురు అన్వేషణకు నాటి రాజుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దాని ప్రకారం అక్కడ దొరికే చమురు మొత్తం అతనిదే. లాభాల్లో 16శాతం మాత్రమే ఇరాన్‌కు దక్కుతుంది. కంపెనీ మీద రాజుకు ఎలాంటి ప్రమేయం వుండదు. ఆ విధంగా ది ఆంగ్లో పర్షియన్‌ ఆయిల్‌ కంపెనీ వునికిలోకి వచ్చింది. తరువాత బ్రిటన్‌ ప్రభుత్వం అక్కడ పెద్ద చమురు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసి వుత్పత్తులను బ్రిటన్‌కు తీసుకుపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత 1951లో కంపెనీని జాతీయం చేశారు, ఆస్ధులను స్వాధీనం చేసుకున్నారు. దానికి ప్రతిగా బ్రిటన్‌ తన చమురుశుద్ధి కర్మాగారాన్ని మూసివేసింది. ఇరాన్‌ బ్యాంకు ఖాతాలను స్ధంభింపచేసింది. అయితే 1953లో అమెరికా- బ్రిటన్‌ తమ తొత్తు అయిన షాను గద్దెపై కూర్చోపెట్టాయి. బ్రిటీష్‌ పెట్రోలియం(బిపి)కు తిరిగి చమురు క్షేత్రాలను కట్టబెట్టారు.1979లో అయాతుల్లా ఖొమైనీ నాయకత్వంలో తిరుగుబాటు జరిగే వరకు అదే కంపెనీ దోపిడీ కొనసాగింది. తరువాత మరోసారి చమురు పరిశ్రమను కంపెనీని జాతీయం చేశారు.

Image result for Ship crisis: Britain falls into a dangerous US trap

ఓడకు ఓడ వుదంతానికి ఇరాన్‌ మీద ఒంటి కాలిపై లేచే అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ సూత్రధారిగా వున్నట్లు కనిపిస్తున్నది. నౌకను పట్టుకోగానే బోల్టన్‌ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. అయితే ఇదంతా అతగాడి బృంద పధకం ప్రకారం జరిగిందని, ఆశ్చర్యం ఒక నటన అని తేలింది. అమెరికా వూబిలోకి తమ దేశాన్ని లాగారని ఆంగ్లేయులు అంటున్నారు. బ్రిటన్‌ స్వాధీనం చేసుకున్న ఇరాన్‌ నౌక పెద్దది కావటంతో అది సూయజ్‌ కాలువ గుండా ప్రయాణించే అవకాశం లేదు.దాంతో మధ్యధరా సముద్రంలో నుంచి జిబ్రాల్టర్‌ జల సంధిలో ప్రవేశించేందుకు గుడ్‌ హోప్‌ ఆగ్రాన్ని చుట్టి వచ్చింది. మరో 48 గంటల్లో ఇరాన్‌ నౌక జిబ్రాల్టర్‌ ప్రాంతానికి రానుండగా అమెరికా గూఢచార సంస్ధలు స్పెయిన్‌ నౌకదళానికి ఆ విషయాన్ని చేరవేశాయి. అయితే స్పెయిన్‌ మీద నమ్మకం లేని అమెరికన్లు బ్రిటన్‌కు సైతం తెలియచేశారు. వారు కోరుకున్నట్లుగానే బ్రిటన్‌ అడ్డగించింది. ఈ సైనిక చర్యకు ఎవరు వుత్తరువులు జారీ చేశారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అమెరికా వినతి మేరకు నౌకను పట్టుకుంది బ్రిటన్‌ తప్ప తమకు ఆ చర్యతో ఎలాంటి సంబంధం లేదని స్పెయిన్‌ విదేశాంగ మంత్రి జోసెఫ్‌ బోరెల్‌ ప్రకటించారు. ఐరోపా యూనియన్‌ విదేశీ వ్యవహారాల విభాగం ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఇరాన్‌ మీద దాడికి ఐరోపా ధనిక దేశాలు సుముఖంగా వుంటే ఈ పాటికి అమెరికా ఆ పని చేసి వుండేది. ఇప్పటి వరకు అలాంటి సూచనలేమీ లేకపోవటంతో ఏదో ఒక విధంగా ట్రంప్‌ గిల్లికజ్జాలతో కాలం గడుపుతున్నాడు, దానిలో భాగమే బ్రిటన్‌ నౌకా వుదంతం అని చెప్పవచ్చు. సోమవారం నాడు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఫాక్స్‌ న్యూస్‌ ఛానల్‌తో మాట్లాడుతూ బ్రిటన్‌ తన నౌకల రక్షణ బాధ్యతను తానే చూసుకోవాలని చెప్పటం మరో మలుపు. అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న వాటిని ఇరాన్‌ పట్టుకోవటం ఏమిటని ప్రశ్నిస్తూ అంతర్జాతీయ జలాల్లో ఆటంకం లేకుండా చూసుకోవటం ప్రపంచ బాధ్యత అని అన్ని దేశాలను రెచ్చగొట్టే వ్యాఖ్యాలు చేశాడు. ఈ పూర్వరంగంలో ఈ వుదంతానికి ముగింపు సుఖాంతం అవుతుందా ? కొత్త పరిణామాలకు నాంది పలుకుతుందా అని చూడాల్సి వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తీవ్ర విబేధాలను వెల్లడించిన జి 20 ఒసాకా సభ !

30 Sunday Jun 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

G20, G20 Osaka 2019, G20 Osaka 2019 summit

Image result for G20 Osaka 2019 summit revealed deep divides

ఎం కోటేశ్వరరావు

అనేక మంది వూహించినట్లు ఒసాకాలో జరిగిన జి 20 శిఖరాగ్ర సమావేశం స్పష్టమైన నిర్ణయాలు, నిర్ధిష్ట కార్యాచరణ లేకుండానే ముగిసిందని చెప్పాలి. ఆతిధ్యం ఇచ్చిన జపాన్‌ ప్రధాని మర్యాద పూర్వకంగా సభ విజయవంతమైందని చెప్పవచ్చు తప్ప ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం లేకుండా కేవలం ఆశాభావాలతో ముగిసింది. ప్రపంచీకరణ మరింత ముందుకు పోతున్న వర్తమానంలో అనేక అంతర్జాతీయ వేదికల సందర్భంగా జరిగిన పరిణామాలే పునరావృతం అయ్యాయి. నేను కూడా రాజుగారి గంగాళంలో పాలుపోయటానికే వచ్చాను గానీ నీతో ముఖ్యవిషయాలు మాట్లాడాలి పక్కకు రా అన్నట్లుగా ఒసాకాలో నేతల ద్వైపాక్షిక సమావేశాలకే ప్రాధాన్యత ఏర్పడిందన్నది స్పష్టం. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మిగతా దేశాల నేతలతో-మన ప్రధాని నరేంద్రమోడీతో సహా- జరిపిన సంప్రదింపులన్నీ మా యింటికొస్తే మీరేమి తెస్తారు, మీ ఇంటికొస్తే మాకేమి పెడతారు అన్న పద్దతుల్లో అమెరికా ప్రయోజనాల చుట్టూ చర్చలను తిప్పారు. మద్దులాట-దెబ్బలాట పద్దతిలో ఒక వైపు ట్రంప్‌తో భాయీ భాయీ అంటూనే మరో ఏకపక్ష వ్యవహారాలను సహించరాదని మిగతా దేశాల నేతలతో పరోక్షంగా అమెరికా వైఖరిని విమర్శించే ప్రకటన జారీలో మన ప్రధాని నరేంద్రమోడీ భాగస్వామి అయ్యారు.

ఈ సమావేశాల సందర్భంగా వివిధ దేశాల మధ్య వున్న వివాదాలను కూడా పలువురు నేతలు ప్రస్తావించారు. నిజానికి వాటిని వేరే సందర్భాలలో చర్చించేందుకు అవకాశం వున్నప్పటికీ జి 20ని వేదిక చేసుకోవటాన్ని బట్టి ఎవరూ ఏ విషయంలోనూ వెనక్కు తగ్గే ధోరణిలో లేరన్నది స్పష్టమైంది.నాటోలో సభ్యరాజ్యమైన టర్కీ తన మిలిటరీ అవసరాల కోసం రష్యా తయారీ ఎస్‌-400 క్షిపణులను కొనుగోలు చేయటాన్ని ఈ సందర్భంగా ట్రంప్‌ ప్రస్తావించారు. కొనుగోలుతో ముందుకు పోతే ఆంక్షలు విధిస్తామని అమెరికా బెదిరించిన విషయం తెలిసిందే.తమ వ్యవహారాల్లో రష్యా బాధ్యతారహిత, అస్ధిర కార్యకలాపాలకు దూరంగా వుండాలని బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే చెప్పారు. గతేడాది శాలిస్బరీలో సెర్గీ స్కిరిపాల్‌ మీద విషపూరిత దాడికి పాల్పడిన ఇద్దరు రష్యన్లను తమకు అప్పగించాలని పుతిన్‌తో జరిపిన భేటీలో కోరినట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశాల సందర్భంగా హాంకాంగ్‌ అంశాన్ని లేవనెత్త కూడదని తాము కోరుకుంటున్నట్లు చైనా అధ్యక్షుడు జింపింగ్‌ చెప్పారు. అయినప్పటికీ జపాన్‌ ప్రధాని షింజో అబె దాన్ని ప్రస్తావించారు. హాంకాంగ్‌ స్వాతంత్య్రాన్ని పరిరక్షించాలని కోరారు.

పందొమ్మిది దేశాలు, ఐరోపా యూనియన్‌ సభ్యురాలిగా వున్న జి20 పద్నాలుగవ శిఖరాగ్ర సమావేశం జపాన్‌లోని ఒసాకాలో ఈనెల 28,29 తేదీలలో జరిగింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో 80శాతం వుత్పత్తి, మూడింట రెండువంతుల జనాభాను కలిగివున్న దేశాలకు ప్రాతినిధ్యం వహించే ఈ బృంద సమావేశం జపాన్‌లో జరగటం ఇదే తొలిసారి. ఒకవైపు వాణిజ్య యుద్ధాలు, మరోవైపు ఇరాన్‌ మీద భౌతిక దాడులు జరుపుతామని అమెరికా బెదిరింపులకు పాల్పడిన నేపధ్యంలో ఈ సమావేశం జరిగింది. ఇతర అనేక అంశాల గురించి దేశాల నేతలు ప్రస్తావించి చర్చించినప్పటికీ ఈ సమావేశాల అజెండాలో అగ్రస్ధానం వాణిజ్య యుద్ధం ఆక్రమించింది. భారత్‌ మార్కెట్లో మరింతగా ప్రవేశించేందుకు డోనాల్డ్‌ ట్రంప్‌ అనేక వలపు బాణాలు విసిరారు. అమెరికాతో దోస్తీకి నరేంద్రమోడీ తహతహలాడుతున్నప్పటికీ అంతర్జాతీయ పరిస్ధితి, దేశీయంగా పారిశ్రామిక, వాణిజ్యవేత్తల ప్రయోజనాలు ఇమిడి వున్నందున మోడీకి ఇష్టం వుందా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా ట్రంప్‌కు దూరంగా వుండాల్సి వచ్చినట్లు కనిపిస్తోంది. స్వేచ్చా, న్యాయమైన, వివక్షలేని, పారదర్శక, స్ధిరమైన వాణిజ్యం, పెట్టుబడుల వాతావరణాన్ని కల్పించేందుకు సభ్యదేశాలు పని చేయాలని సమావేశం జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచ వాంఛలకు విరుద్దంగా పర్యావరణ పరిరక్షణపై కుదిరిన పారిస్‌ ఒప్పందం నుంచి వైదొలగాలన్న తన నిర్ణయంతో మార్పు లేదని అమెరికా స్పష్టం చేయటంతో ఈ అంశంపై పడిన పీఠముడి విడిపోలేదు. పర్యావరణానికి హానిచేసే విషవాయువుల విడుదలను తగ్గించాలన్నది ఆ ఒప్పంద సారం. దాన్ని తాము అమలు జరిపితే తమ కార్మికుల, పన్ను చెల్లింపుదార్ల ప్రయోజనాలకు హాని కలుగుతుందంటూ అమెరికా ఆ ఒప్పందంతో తనకు సంబంధం లేదంటోంది.

తన పంతం నెగ్గించుకోవాలని, తన కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడాలని అమెరికా ఎంత ప్రయత్నించినప్పటికీ దాని ఆటలు సాగలేదనే చెప్పాలి. చైనాలోని హువెయ్‌ టెలికాం కంపెనీ వుత్పత్తులు ఇంతకాలం తన భద్రతకు ముప్పు అని ప్రకటించి వాటిని కొనుగోలు చేయరాదని ఇతర దేశాలను కూడా బెదిరించిన ట్రంప్‌ ఆ కంపెనీకి అమెరికన్లు విడిభాగాలను విక్రయించవచ్చు అని ఒసాకాలో ట్రంప్‌ ప్రకటించటం విశేషం. ఇదే విధంగా తాము ఇప్పటి వరకు 300 బిలియన్‌ డాలర్ల విలువగల చైనా వుత్పత్తులపై విధించిన పన్ను మినహా ప్రస్తుతానికి అదనంగా పన్నుపెంచటం లేదని కూడా చెప్పారు. అయితే ఇది డిసెంబరులో చేసిన ప్రకటన పునశ్చరణ తప్ప కొత్తదేమీ కాదు. చైనాతో తమ సంబంధాలు వూహించినదాని కంటే మెరుగ్గా వున్నాయని, రెండు దేశాలు తిరిగి పట్టాలు ఎక్కాయని, చైనా నేత గ్జీ జింపింగ్‌తో చాలా చాలా మంచి సమావేశం జరిగిందని ట్రంప్‌ విలేకర్లతో అన్నాడు. వుద్రిక్తతలను గమనంలో వుంచుకొని ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను ముందుకు తీసుకుపోవాలని సమావేశంలో నేతలు అంగీకరించినట్లు జపాన్‌ ప్రధాని షింజో అబే శిఖరాగ్ర సభ ముగింపు సమావేశంలో ప్రకటించారు.

ఒసాకా సమావేశాల్లో వుమ్మడిగా అజెండా అంశాలను చర్చించటంతో పాటు అనేక దేశాల నేతల మధ్య ద్విపక్ష సమావేశాలు చోటు చేసుకున్నాయి. ముదిరి వాణిజ్య యుద్ద నేపధ్యంలో ట్రంప్‌, గ్జీ జింపింగ్‌ మధ్య అలాంటి సమావేశం గురించి ప్రపంచం మొత్తం ఆసక్తితో ఎదురు చూసింది.వారు భేటీ అయ్యే ముందు మీడియాకు విడివిడిగా ప్రకటనలు చేశారు. 1970దశకంలో అమెరికాాచైనా మధ్య సంబంధాలు ఒక టేబుల్‌ టెన్నిస్‌ క్రీడతో ప్రారంభమయ్యాయని, ఒక చిన్న బంతి తరువాత కాలంలో ప్రపంచ పరిణామాలను ముందుకు తీసుకుపోవటంలో ఎంతో పెద్ద పాత్రపోషించిందని జింపింగ్‌ గత చరిత్రను గుర్తు చేశారు. గత నాలుగు దశాబ్దాల్లో అంతర్జాతీయ పరిస్ధితులు, వుభయ దేశాల సంబంధాల్లో ఎంతో మార్పు జరిగినా సహకారం ద్వారా రెండు దేశాలు లబ్ది పొందటం, ఘర్షణతో నష్టపడ్డాయన్న మౌలిక వాస్తవంలో మార్పులేదని అన్నారు.

Image result for G20 Osaka 2019 summit revealed deep divides

ఒసాకాలో ట్రంప్‌, జింపింగ్‌ ఏమి చెప్పినప్పటికీ వాణిజ్య యుద్దం విషయంలో ఎవరూ వెనక్కి తగ్గినట్లు కనిపించటం లేదని కొందరు విశ్లేషిస్తున్నారు. ప్రతి వారూ వాణిజ్యం గురించి మాట్లాడుతూ మనం తప్పు చేయకూడదని చెబుతున్నారు. వాటిని విన్నవారికి ఏదో ఒక పరిష్కారానికి వస్తారన్న ఆశకలుగుతుంది, కానీ వారి నడక తీరు చూస్తే మరింత ప్రతికూలంగా సాగుతున్నట్లు కనిపిస్తోందనే చెప్పవచ్చు. మరో 350బిలియన్‌ డాలర్ల వుత్పత్తుల మీద పన్నులు విధించాల్సి వున్నప్పటికీ ప్రస్తుతానికి ఆ పని చేయటం లేదని ట్రంప్‌ చెప్పారు. అయితే ఒసాకా నుంచి వాషింగ్టన్‌ చేరేలోగా ట్రంప్‌ వైఖరిలో మార్పు రాదని చెప్పలేము. ఎప్పుడు ఏమి మాట్లాడతారో, ఏం చేస్తారో వూహించలేము. రెండు దేశాల మధ్య చర్చలు నిలిచిపోయి మరింత సంక్లిష్టం అవుతుందా అన్నట్లుగా తయారైన అంశం తెలిసిందే. అదే జరిగితే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ అతలాకుతలం అయ్యే అవకాశం వుందని భయపడిన వారంతా ఈ సమావేశాల్లో రెండు దేశాల వైఖరి ఎలా వుంటుందా అని ఎంతో ఆసక్తితో ఎదురు చూశారు.

అగ్రరాజ్యాల మధ్య తలెత్తిన పోటీ నివారణకు గాను ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ)ను ఏర్పాటు చేసినప్పటికీ ఏ దేశానికి ఆదేశం రక్షణాత్మక విధానాలను చేపట్టటంతో దానితో నిమిత్తం లేకుండానే, సంస్ధ స్ఫూర్తికి విరుద్దంగా దాని వెలుపల దేశాలు ఒప్పందాలు కుదుర్చుకోవటం ఎక్కువైంది. దీంతో రక్షణాత్మక చర్యలను నిరోధించేందుకు సంస్కరణలు అవసరమనే అజెండా ముందుకు వచ్చింది. అవును నిజమే, సంస్కరణలు తేవాల్సిందే అనే అభిప్రాయం ఒసాకాలో కూడా వెల్లడైనప్పటికీ పిల్లి మెడలో గంట కట్టేదెవరన్నట్లుగా పరిస్ధితి తయారైందని చెప్పవచ్చు. బ్యూనోస్‌ ఎయిర్స్‌లో జరిగిన గత సమావేశంలో రక్షణాత్మక చర్యలకు దూరంగా వుండాలని అమెరికా కోరింది. అయితే ఆచరణలో ఈ కాలంలో చూస్తే అమెరికన్లు బస్తీమే సవాల్‌ అంటూ అనేక దేశాల మీద పన్నులు విధించి తమ షరతులకు అంగీకరించే విధంగా వత్తిళ్లకు పూనుకున్న విషయం తెలిసిందే. ఆంబోతుల వంటి అమెరికా-చైనాలు ముందుగా ఒక అంగీకారం, అవగాహనకు వస్తే తమ పని సులభం అవుతుందని అనేక దేశాలు భావిస్తున్నాయి. ఈ రెండింటి మధ్య వివాదం పరిష్కారం కావాలని తాము ఆశిస్తున్నట్లు ఎగుమతి ఆధారిత ఆర్దిక వ్యవస్ధ వున్న జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఒసాకాలో ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ అంశాల గురించి తాను ట్రంప్‌తో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. అమెరికన్లు ఒకవైపు జర్మనీ, రెండోవైపు చైనాతో కూడా లడాయి పడుతున్న విషయం తెలిసిందే.ప్రపంచ వాణిజ్య సంస్ధలో సంస్కరణలు అవసరమని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. బ్రిక్స్‌ దేశాలైన బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా నేతల సమావేశంలో మోడీ మాట్లాడుతూ ఏకపక్ష నిర్ణయాలు, వివాదాలతో ప్రపంచ వ్యవస్ధ నడుస్తోందని, ఈ పూర్వరంగంలో డబ్ల్యుటిఓను సంస్కరించాలని అన్నారు.

Image result for G20 Osaka 2019 summit revealed deep divides

ఏకపక్ష నిర్ణయాలను ఎదుర్కోవాలని ఈ సమావేశాల సందర్భంగా చైనా అధ్యక్షుడు జింపింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, భారత ప్రధాని నరేంద్రమోడీ ఒక సంయుక్త ప్రకటన చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ముగ్గురు నేతల సమావేశ అనంతరం ఈ ప్రకటన వెలువడింది.దీనిలో అమెరికా పేరు ప్రస్తావన లేనప్పటికీ దాని గురించే అన్నది స్పష్టం. అంతర్జాతీయ చట్టాల మీద ఆధారపడాలని, జాతీయ సార్వభౌమత్వాలను గౌరవించాలని, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ సమావేశాల్లో పర్యావరణ సమస్యల మీద ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. ఎవరి వైఖరికి వారు కట్టుబడి వున్నారు.అయితే పర్యావరణాన్ని కాపాడాలనే సాధారణ తీర్మానాన్ని ఒక తంతుగా ఆమోదించారు. విడిగా మాట్లాడినపుడు కొన్ని దేశాల వారు పారిస్‌ ఒప్పందానికి కట్టుబడి వుండాలని కోరారు. ఈ అంశంపై తయారు చేసిన ప్రకటనలో ఎక్కడా 2015నాటి పారిస్‌ ఒప్పందం గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవటంతో తాము సంతకం చేయటం లేదని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ ప్రకటించారు. పారిస్‌ ఒప్పందం నుంచి వైదొలగిన అమెరికా, జపాన్‌ కూడా దాని ప్రస్తాన ఒసాకా ప్రకటనలో వుండరాదని పట్టుబట్టాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హాంకాంగ్‌ ఆందోళన వెనుక అసలు కధ ఏమిటి ?

19 Wednesday Jun 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

Carrie Lam, china communist party, HONG KONG, Hong Kong Extradition Bill, Hong kong protests, Umbrella Movement

Image result for Hong kong protests

ఎం కోటేశ్వరరావు

హాంకాంగ్‌ ఈ మధ్య ప్రపంచ వార్తల్లోకి వచ్చిన ప్రాంతం. అక్కడ ప్రస్తుతం జరుగుతున్న ఆందోళన వార్తలను చదివేవారికి అదొక ప్రత్యేక దేశం అనే భ్రమ కలిగే అవకాశం వుంది. ఎందుకంటే అక్కడ నేరాలకు పాల్పడిన వారిని విచారించేందుకు చైనా ప్రధాన భూభాగానికి పంపేందుకు హాంకాంగ్‌ పాలనా వ్యవస్ధ ఒక బిల్లును ఆమోదించేందుకు గత కొన్ని నెలలుగా అవసరమైన చర్యలను చేపట్టింది. ఇంకేముంది మా స్వేచ్చకు ముప్పు వచ్చింది అని బిల్లును వ్యతిరేకించిన వారు ఆందోళనకు దిగారు.నిజమే అన్యాయం అంటూ అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు వారికి మద్దతు పలికాయి. జనంలో తలెత్తిన వుద్రేకాలను తగ్గించేందుకు బిల్లును తాత్కాలికంగా పక్కన పెట్టి చర్చలు జరుపుతామని ప్రత్యేక పాలనా అధికారి ప్రకటించిన తరువాత కూడా ఆందోళనలు ఆగలేదు, ప్రత్యేక స్వయం ప్రతిపత్తి, స్వాతంత్య్రం అంటూ డిమాండ్లను ముందుకు తెస్తున్నారు. పోలీసులను రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యగా మార్చేందుకు కొట్లాటలకు దిగుతున్నారు. దీన్ని బట్టి నేరస్ధుల అప్పగింత కంటే మించిన అంశాలు ఈ ఆందోళన వెనుక వున్నాయన్నది స్పష్టం.గత మూడు దశాబ్దాలుగా హాంకాంగ్‌ను అడ్డం పెట్టుకొని విదేశాలు చైనా మీద వత్తిళ్లు తెస్తున్నాయంటే అతిశయోక్తికాదు. హాంకాంగ్‌ న్యాయవ్యవస్ధలో వున్న లోపాలను సరి చేసేందుకు, నేరాలకు సంబంధించి పరస్పరం సహకరించుకొనేందుకు గాను నేరస్ధుల అప్పగింతతో సహా మరికొన్ని అంశాలను దానిలో పొందుపరిచారు.నేరగాండ్లను ఒక్క చైనా ప్రధాన భూభాగానికే కాదు, తైవాన్‌కు సైతం అప్పగించేందుకు కూడా దానిలో నిబంధనలను పొందుపరిచారు. ఆందోళనల పూర్వరంగంలో బిల్లును వాయిదా వేయటం, చర్చలు జరుపుతామన్న ప్రకటనను చైనా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ‘స్వేచ్చ కోసం జరిగే ప్రపంచ యుద్ధంలో ముందు పీఠీన జరిగే పోరులో హాంకాంగ్‌ ‘అనే శీర్షికతో అమెరికాకు చెందిన టైమ్‌ పత్రిక ఒక ముఖచిత్ర కధనాన్ని ప్రచురించింది.

ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పోరుకు నాయకులెవరూ లేరని, దానంతట అదే తలెత్తిన విద్యార్ధులు, యువకుల వుద్యమం అని ప్రపంచ మీడియాలో కథనాలను వండి వారుస్తున్నారు. జూన్‌ పన్నెండవ తేదీ ప్రదర్శనల గురించి టైమ్‌ కధనం ఇలా ప్రారంభం అయింది. గుమికూడిన గుంపులు కేవలం ఒక గాలివానను తట్టుకొనేందుకు అవసరమైన ఏర్పాట్లతోనే రాలేదు, అలాంటిదొకటి వస్తుందని వారు లెక్కవేసుకుంటున్నారు. వర్షం ప్రారంభం కాగానే ‘గా యావ్‌ ‘ అంటూ గొడుగులు పట్టుకున్నవారందరూ ఒక్కసారిగా కేకలు వేశారు.( దాని అర్ధం అగ్నికి ఆజ్యం పోయండి అని) కొద్ది గంటల్లోనే వచ్చిన అనేక గుడారాలతో తాత్కాలిక రక్షణ శిబిరాలు తయారయ్యాయి. పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించినా, పెప్పర్‌ స్ప్రే చల్లినా తప్పించుకొనేందుకు ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. ఇలాంటి ఆందోళన అసంఘటితమైనదని, ఎవరూ వెనుక లేరని లోకాన్ని నమ్మింప చూస్తున్నారు. తొంభై తొమ్మిదిసంవత్సరాల పాటు బ్రిటీష్‌ వారి పాలనలో ఎలాంటి హక్కులూ లేనపుడు అక్కడి వారికి స్వేచ్చ, స్వాతంత్య్రాలు కావాలని అనిపించలేదు. ఎలాంటి ప్రజావుద్యమాలూ జరపలేదు. ఆకస్మికంగా చైనాలో విలీనమైన తరువాత వాటికోసం వారు ఆందోళన ప్రారంభించారని ప్రపంచానికి చెబుతున్నారు.

హాంకాంగ్‌ చైనాలో అంతర్భాగమే అయినప్పటికీ ఒక ప్రత్యేక పాలిత ప్రాంతం. తొంభై తొమ్మిది సంవత్సరాల బ్రిటీష్‌ వారి కౌలు గడువు ముగిసిన తరువాత 1997లో అది చైనాలో విలీనమైంది. అయితే అది ఒక అంతర్జాతీయ ఓడరేవుగా, పెద్ద వాణిజ్య కేంద్రంగా అప్పటికే అభివృద్ధి చెంది వున్న కారణంగా, దాని తరువాత పోర్చుగీసు నుంచి అదే మాదిరి కౌలు గడువు తీరిన తరువాత చైనాలో విలీనం అయ్యే మకావో దీవులు, అప్పటికే తిరుగుబాటు రాష్ట్రంగా వున్న తైవాన్‌ సమస్యలను దృష్టిలో వుంచుకున్న చైనా కమ్యూనిస్టు పార్టీ ఎన్నో తర్జన భర్జనల తరువాత ఒక వైఖరిని తీసుకుంది. ఒకే దేశం-రెండు వ్యవస్ధలు అని దాన్ని పిలిచారు. హాంకాంగ్‌ వాణిజ్య ప్రాంతంగా అభివృద్ధి చెందితే, మకావో పెద్ద జూదకేంద్రంగా వలసపాలనలో మారింది. అందువలన అక్కడ వున్న ప్రత్యేక పరిస్ధితులు, పెట్టుబడులు, ఇతర సామాజిక అంశాలను గమనంలో వుంచుకొని 2050 వరకు అక్కడ వున్న పెట్టుబడిదారీ వ్యవస్ధను కొనసాగనిస్తామని, ఇతర దేశాల సంస్ధలతో మాదిరి అక్కడి కార్పొరేట్లు ప్రధాన భూభాగంలో పెట్టుబడులు పెట్టవచ్చని, వాటికి హామీ ఇస్తామని పాలక కమ్యూనిస్టు పార్టీ ఒక ఒప్పందం ద్వారా భరోసా ఇచ్చింది. విలీనాన్ని చైనా ఆక్రమణగా వక్రీకరిస్తున్నారు. ఆ గడువు మరో 30దశాబ్దాలలో ముగిసి చైనా సమాజంలో పూర్తిగా అంతర్భాగం కావాల్సివుంది. గడువు దగ్గర పడుతున్నకొద్దీ సాఫీగా హాంకాంగ్‌ను ఆవైపు నడిపేందుకు చైనా ప్రయత్నిస్తుండగా వేర్పాటు ధోరణులను రెచ్చగొట్టేందుకు, పరిస్ధితులను సంక్లిష్టం గావించేందుకు విలీన వ్యతిరేకశక్తులు, వారికి మద్దతు ఇస్తున్న అమెరికా, తదితర పశ్చిమ దేశాలు కూడా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపధ్యాన్ని అర్ధం చేసుకుంటేనే అక్కడి పరిణామాలు అర్ధం అవుతాయి.

బ్రిటీష్‌ పాలకులు హాంకాంగ్‌ను తమ వలసగా చేసుకున్న తరువాత ఏ రకమైన ప్రజాస్వామిక వ్యవస్ధనూ అమలు జరిపేందుకు వారెలాంటి ప్రయత్నమూ చేయలేదు. నామ మాత్ర పాలనా మండళ్లను ఏర్పాటు చేశారు, అదీ ధనికులకు మాత్రమే పరిమితంగా ఓటింగ్‌ హక్కు ఇచ్చారు, నామినేటెడ్‌ బోర్డులను ఏర్పాటు చేశారు. 1948లో చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు, చాంగ్‌ కైషేక్‌, అతని నాయకత్వంలోని మిలిటరీ, బ్రిటన్‌, ఇతర సామ్రాజ్యవాద దేశాల మద్దతుతో తైవాన్‌కు పారిపోయి దాన్ని స్ధావరంగా చేసుకొని చైనా పేరుతో అక్కడి నుంచి పాలన ప్రారంభించారు.ఐరాస కూడా 1970వరకు దానినే అసలైన చైనాగా గుర్తించింది. 1950 దశకంలో బ్రిటీష్‌ వారు హాంకాంగ్‌లో ప్రజాస్వామిక వ్యవస్ధను ఏర్పాటు చేస్తామంటూ ఒక ప్రతిపాదన చేశారు. ఆ ప్రాంతాన్ని మరొక తైవాన్‌ మాదిరి తిరుగుబాటు ప్రాంతంగా చేయాలనే ఎత్తుగడ దాని వెనుక వుంది. అందుకే చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించి గడువు మీరే వరకు ఒక వలస ప్రాంతంగానే వుంచాలి తప్ప మరొకవిధంగా చేయకూడదని స్పష్టం చేసింది. దాంతో వెనక్కు తగ్గిన బ్రిటీష్‌ వారు, 1997గడువు దగ్గరపడే కొద్ది స్వయంప్రతిపత్తి, ప్రజాస్వామిక వ్యవస్దల ఏర్పాటుకు తాము మద్దతు ఇస్తామని ప్రకటించి అసమ్మతికి బీజాలు నాటారు. చైనాలో విలీనమైన తరువాత కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రత్యేక పాలనా మండలికి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరుపుతూ అందరికీ ఓటు హక్కు కలిగించింది. పైకి ఏమి చెప్పినప్పటికీ చైనాలో విలీనాన్ని వ్యతిరేకించే వారు, అనుకూలించేవారిగా చీలిపోయి పోటీ చేయటం ప్రారంభించారు. ప్రస్తుతం చైనాలో విలీనానికి మొగ్గుచూపే వారు పాలకమండలిలో మెజారిటీగా వున్నారు.

తాజా ఆందోళన వెనుక అమెరికా, మరికొన్ని దేశాలు వున్నాయన్నది చైనా అభిప్రాయం. బిల్లును సమర్ధించేవారు నడుపుతున్న వెబ్‌సైట్‌ మీద దాడి జరిపిన వారి మూలాలు అమెరికాలో కనిపించాయి.మార్చినెలలో ఈ బిల్లును హాంకాంగ్‌ పాలక మండలికి సమర్పించిన వెంటనే స్పందించిన తొలి విదేశం అమెరికాయే. ఒక వేళ బిల్లును ఆమోదించినట్లయితే హాంకాంగ్‌కు కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయాల రద్దు గురించి ఆలోచించాల్సి వుంటుందని అమెరికా ప్రజాప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ బెదిరించారు. బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా కూడా అదేబాటలో నడిచాయి. జపాన్‌లో త్వరలో జరిగే జి20 సమావేశాల్లో తమ అధ్యక్షుడు ఈ అంశాన్ని లేవనెత్తుతారని అమెరికా విదేశాంగ మంత్రి మంత్రి మైక్‌ పాంపియో ప్రకటించారు. బిల్లును వక్రీకరిస్తూ హాంకాంగ్‌ అంతటా అనేక కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. విద్యార్ధులు, ఇతరులను రెచ్చగొట్టేవిధంగా వాటి రాతలున్నాయి. ఈ బిల్లును గనుక ఆమోదిస్తే నిరుద్యోగం పెరుగుతుందని, మతాన్ని అణచివేస్తారని, ఇతర దేశాలకు వీసాలతో నిమిత్తం లేకుండా వెళ్లే అవకాశాలు రద్దవుతాయంటూ వాటిలో పేర్కొన్నారు. నిజానికి అలాంటి అంశాలే బిల్లులో లేవు. ఆ బిల్లు చట్టంగా మారితే నేరస్ధులకే కాదు, సామాన్య పౌరులకూ తరువాత పొడిగిస్తారు, నగరంలో ప్రవేశించే వారందరూ అనుమతి పాస్‌లు తీసుకోవాల్సి వుంటుంది. అందువలన మరోసారి నేను ఇక్కడకు రావాలా లేదా అని ఆలోచించుకోవాల్సి వస్తుంది అని అమెరికా మాజీ దౌత్యవేత్త సీన్‌ కింగ్‌ వంటి వారు తప్పుడు ప్రచారాలు చేశారు. వుఘీర్స్‌లో కమ్యూనిస్టు పార్టీ ఆదేశాలను పాటించని వారిని పదిలక్షల మందిని నిర్బంధించారు, టిబెట్‌ బౌద్ధ వారసత్వాన్ని లేకుండా చేస్తున్నారంటూ జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నించారు.

2016లో హాంకాంగ్‌ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆరుగురు చైనా వ్యతిరేకులు, హాంకాంగ్‌ వేర్పాటు వాద సభ్యులు ఒక వేదికగా చేసుకున్నారు. హాంకాంగ్‌ చైనా కాదు అని ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. హాంకాంగ్‌ దేశానికే తాము విధేయులమై వుంటామని ప్రమాణస్వీకారాన్ని అపహాస్యం చేశారు. చైనాను అవమానపరిచారు. దాన్నొక వుపన్యాస వేదికగా మార్చివేశారు. వారి ప్రమాణ స్వీకారం చెల్లదని అధికారులు ప్రకటించారు. అయితే వారి ప్రవర్తన సరిదిద్దుకొనేందుకు అవకాశం ఇస్తూ మరోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఇచ్చారు. వారు దాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ తాము చేసింది తప్పుకాదంటూ సమర్ధించుకున్నారు. ఈ వివాదం కోర్టుకు వెళ్లింది. అక్కడి న్యాయమూర్తి వేర్పాటు వాదులకు వూతమిచ్చే విధంగా తీర్పు చెప్పారు. అంతకు ముందు హాంకాంగ్‌ కేంద్రంగా వున్న పుస్తక ప్రచురణకర్తల అరెస్టును వివాదం చేశారు. హాంకాంగ్‌ మరియు బ్రిటీష్‌ పౌరసత్వం వున్న ఇద్దరు చైనీయులు పుస్తక ప్రచురణ పేరుతో చైనా వ్యతిరేకతను, అశ్లీలంతో సహా అన్ని రకాల అరాజకత్వాన్ని రెచ్చగొట్టే విధంగా సాగిన రచనలను అక్రమంగా ముద్రించి పంపిణీ చేశారు. వారు సరైన పత్రాలు లేకుండా చైనాలో ప్రవేశించి అధికారులకు దొరికిపోయారు, అలాంటి వారే మరో ముగ్గురిని చైనా నిర్బంధించింది. ఈ విషయాలు వెలుగులోకి వచ్చిన తరువాత బ్రిటన్‌తో సహా ఇతర చైనా వ్యతిరేకులు మానవహక్కులు, స్వేచ్చ అంశాలను ముందుకు తెచ్చారు తప్ప వారి చైనా వ్యతిరేకచర్యలను మరుగుపరిచారు. వారిని చైనా అధికారులే అపహరించారని ఆరోపించారు. ఐదుగురిలో ఒకడు తమ పౌరుడేనని చైనా ప్రకటించింది. వారు హాంకాంగ్‌ తిరిగి వచ్చిన తరువాత అంతకు ముందు చేసిన ప్రకటనకు భిన్నంగా తమ చేత చైనాలో బలవంతంగా నేరాన్ని అంగీకరింప చేయించారంటూ మీడియా ముందు ప్రకటించి చైనా వ్యతిరేకతను వెల్లడించుకున్నాడు. ఈ పూర్వరంగంలోనే ఇలాంటి వారిని చైనాలో విచారించేందుకు వీలుగా అప్పగింత బిల్లు వచ్చిందని గమనించాలి. ఎక్కడ నేరం చేస్తే అక్కడే విచారించాలనే పేరుతో ఇలాంటి నేరస్ధులను రక్షించేందుకు చైనా వ్యతిరేకులు ప్రయత్నిస్తున్నారు. పుస్తక ప్రచురణ కర్తలు స్ధానిక అంశాల మీద పుస్తకాలు ప్రచురించి అక్రమాలకు పాల్పడితే అక్కడే విచారించాలని అంటే అర్ధం వుంది. సమంజసం కావచ్చు, చైనాలో హాంకాంగ్‌ అంతర్భాగం అయినపుడు సదరు చైనా సర్కార్‌ను కూల్చివేయాలని, కమ్యూనిస్టు పార్టీని అంతం చేయాలని అక్కడ మానవహక్కులు లేవని దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినపుడు, స్దానిక చట్టాలు పటిష్టంగా లేనపుడు ఏమి చెయ్యాలన్నది సమస్య.

రాజకీయ పరమైన ఈ సమస్యలు ఇలా వుండగా 2018 ఫిబ్రవరిలో జరిగిన ఒక నేరం బిల్లు రూపకల్పనలకు నాంది పలికిందని చెప్పవచ్చు. హాంకాంగ్‌కు చెందిన ఒక యువకుడు తన స్నేహితురాలితో కలసి తైవాన్‌ వెళ్లి అక్కడ ఆమెను హత్య చేసి హాంకాంగ్‌ తిరిగి వచ్చాడు. చిన్న చిన్న నేరాలకు జైలు పాలయ్యాడు. ప్రస్తుతం వున్న చట్టాల ప్రకారం హాంకాంగ్‌ వెలుపల జరిపిన నేరాలకు గాను నిందితులను హాంకాంగ్‌లో విచారణ జరపటానికి లేదు. అందువలన అతని మీద విచారణ జరపాలంటే తైవాన్‌కు పంపాలి. ఈ పూర్వరంగంలో ఈ బిల్లును రూపొందించారు.

Image result for Hong kong protests

ఈ బిల్లు మీద తలెత్తిన వ్యతిరేకతను, దాని వెనుక వున్న శక్తుల ఎత్తుగడలను గమనించిన చైనా, హాంకాంగ్‌ అధికారులు ఎంతో సంయమనంతో వ్యవహరించారు. ఎంతగా రెచ్చగొట్టి హింసాపూరితంగా మార్చాలని చూసినా దానికి వీలులేకుండా చూశారు. ఆందోళనలో పాల్గొన్నవారి సంఖ్య గురించి బయటి మీడియా చిలవలు పలవలుగా వర్ణించింది. అంత సీను లేకపోయినా గణనీయ సంఖ్యలో పాల్గొనటాన్ని గమనించిన చైనా నాయకత్వం తాత్కాలికంగా బిల్లును వాయిదా వేయాలని సలహా ఇచ్చింది. వాయిదా కాదు, పూర్తిగా రద్దు చేయాలనే ఆందోళన ఇప్పుడు సాగుతోంది. ప్రస్తుతం చైనాను లొంగదీసుకొనేందుకు అమెరికన్లు వాణిజ్య యుద్దాన్ని తీవ్రతరం చేయటంతో పాటు అనుకోకుండా వచ్చిన హాంకాంగ్‌ బిల్లును కూడా వుపయోగించుకొనేందుకు పూనుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నవారు ఈ ఏడాది మార్చినెలలో అమెరికాను సందర్శించి మద్దతు కోరారు. దాని పర్యవసానమే అమెరికా జోక్యం, బెదిరింపులు అన్నది స్పష్టం. అమెరికా లేదా మరొక దేశం గానీ నేటి చైనా గురించి తక్కువ అంచనా వేస్తున్నారు. హాంకాంగ్‌ను బ్రిటీష్‌ వారికి కౌలుకు ఇచ్చిన నాటి స్ధితిలో చైనా వుందనుకుంటే పప్పులో కాలేసినట్లే అని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. సున్నితమైన ఈ సమస్యను చైనా నాయకత్వం ఎంతో జాగ్రత్తగా చూస్తోంది. ఒక్క ఈ విషయంలోనే కాదు, ఇతర అంశాలలో కూడా దీనిని గమనించవచ్చు.

మన దేశంలో పోలీసు చర్యతో సంస్ధానాలను విలీనం చేసినట్లుగా, రష్యా పాలకులు క్రిమియాను స్వాధీనం చేసుకున్నట్లుగా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ను మిలిటరీ చర్యద్వారా చైనాలో విలీనం చేయటం పెద్ద సమస్య కాదు. దాని వెనుక వున్న సామ్రాజ్యవాదుల హస్తం, ఇతర అంశాలను గమనంలో వుంచుకోవటంతో పాటు ఆయా ప్రాంతాలలోని జన అంగీకారం, మద్దతు ముఖ్యం. విశృంఖలమైన పెట్టుబడిదారీ వ్యవస్ధలో పెరిగిన వారు ఒక క్రమశిక్షణకు వెంటనే సిద్ధం కావటం చిన్న విషయం కాదు. అందువలన బలప్రయోగం మార్గం కాదనే చైైతన్యాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రదర్శిస్తోంది. తైవాన్‌, హాంకాంగ్‌, మకావోల్లో సామ్రాజ్యవాదుల కుట్రలను తిప్పికొట్టేందుకు వ్యవధి పట్టవచ్చుగాని, వాటి కుట్రలకు వమ్ము చేసి ఆ ప్రాంతాలను కాపాడుకోవటం అనివార్యం !

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

బుద్ధి లేని జనాకర్షక, జాతీయ వాదులు !

31 Friday May 2019

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, UK, USA

≈ Leave a comment

Tags

Europe Far-Right, European Commission President Jean-Claude Juncker, Hindu Fundamentalism, Hindu Supremacists, india's saffron brigade, Populists, saffron nationalists, Stupid Nationalists

Image result for eu far right

ఎం కోటేశ్వరరావు

జాతీయ వాదులకు బుద్ధి లేదు, వారి దేశాలను ప్రేమిస్తారు, విదేశీయులను ద్వేషిస్తారు అని ఐరోపా కమిషన్‌ అధ్యక్షుడు జీన్‌ క్లాడ్‌ జుంకర్‌ ఐరోపా పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఘాటుగా వ్యాఖ్యానించారు. మే చివరి వారంలో జరిగిన ఆ ఎన్నికల ఫలితాల సరళి ప్రకారం జాతీయవాదులు లేదా పచ్చి మితవాదులు సంపూర్ణ మెజారిటీ వైపుగాక పోయినా గతం కంటే ఎక్కువ స్ధానాలు సంపాదించారు. మన దేశంలో రెండు భావజాలాల మధ్య జరిగిన పోటీగా ఎన్నికలు జరిగాయని, బిజెపి పేరు పెట్టి చెప్పకపోయినా జాతీయవాదులు విజయం సాధించారని ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యాఖ్యానించింది. మన కాషాయ బ్రాండ్‌ జాతీయవాదులు విదేశీయులకు బదులు మైనారిటీలు, మైనారిటీ మతాలను, కమ్యూనిజాన్ని ద్వేషిస్తున్నారు. తమకే అగ్రస్ధానం అన్నది అమెరికా జాతీయవాదం. దానికోసం అనేక దేశాలలో జోక్యం చేసుకొని యుద్దం చేస్తున్నది, చైనా వంటి దేశాలతో వాణిజ్య యుద్ధాలకు పాల్పడుతోంది. మన వంటి దేశాలను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నది. అవి దాని జాతీయవాదంలో భాగం. ఆఫ్రో-అమెరికన్‌లను ద్వేషించటం అమెరికాలోని మెజారిటీ శ్వేతజాతీయ వాదం. మన స్వాతంత్య్రవుద్యమలో బ్రిటీష్‌ పాలకులను వ్యతిరేకించటం, వారి పాలనకు సహాయ నిరాకరణ, విదేశీ వస్తు బహిష్కరణ వంటివి మన మహత్తర జాతీయవాదంలో భాగం. బ్రిటీష్‌ వారికి సలాం కొట్టిన సావర్కర్‌ను కీర్తించటం, గాంధీని చంపిన గాడ్సేను వెనకేసుకు రావటం కూడా నేడు తామే అసలు సిసలు జాతీయ వాదులమని చెప్పుకొనే కుహనా శక్తులు చేస్తున్నపని. పాకిస్ధాన్‌ను, చైనా వస్తువుల దిగుమతులను వ్యతిరేకించటం, అమెరికా ఆంక్షలను ప్రశ్నించకుండా ఆమోదించటం మన కాషాయ వాదుల జాతీయ వాదం. అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యావాదుల దాడులను ప్రతిఘటించటం చైనా జాతీయవాదం. వీటిన్నింటినీ ఒక దగ్గర చేర్చి ఏ జాతీయవాదాన్ని ఎంచుకోవాలి, ఏది పురోగామి, ఏది తిరోగామి అనే ఎంపిక క్లిష్టంగా వుంటుంది. ఒక దగ్గర జాతీయవాదులకు బుద్ధిలేదని తిడుతుంటే, మరొక దగ్గర జాతీయవాదుల విజయాన్ని కీర్తిస్తున్నారు. అమెరికా జాతీయ వాదానికి మన కాషాయవాదులు మినహా ప్రపంచవ్యాపితంగా వ్యతిరేకతం వ్యక్తం అవుతోంది. ఏమిటీ వైపరీత్యం ? అసలు జాతీయ వాదం అంటే ఏమిటి?

ప్రపంచ వ్యాపితంగా ముఖ్యంగా ఐరోపాలో ప్రజాకర్షక, జాతీయవాదులు -వీరందరినీ మితవాదులు అనవచ్చు. వీరి వైఖరి ఆయాదేశాల పరిస్ధితులను బట్టి మారుతూ వుంటుంది గాని మౌలిక లక్షణం మితవాదం, అది ముదిరితే పచ్చి మితవాదం, మతవాదం, ఇంకా నయా ఫాసిజం, నాజీజం. ఎందుకీ పరిస్ధితి తలెత్తింది అన్నది అభ్యుదయవాదులు, మౌలికంగా పెట్టుబడిదారీ వ్యవస్ధను సమర్ధించే సాధారణ లౌకికవాదుల ముందున్న ప్రశ్న. ఐరోపానే తీసుకుందాం. వలస కార్మికుల సమస్యపై జాతీయ వాద రాజకీయవేత్తల వైఖరి ఐరోపా ఐక్యతకే స్పష్టమైన ముప్పును ముందుకు తెచ్చింది అని జుంకర్‌ చెప్పారు. ‘ ఈ ప్రజాకర్షకులు, జాతీయ వాదులు, బుద్దిలేని జాతీయవాదులు తమ దేశాలను ప్రేమిస్తారు, సుదూరాల నుంచి వచ్చే వారిని వారు ఇష్టపడరు మన కంటే దుర్భర పరిస్ధితుల్లో వున్న వారికి మనం మద్దతుగా వ్యవహరించాలి’ అని జుంకర్‌ చెప్పారు. ఐరోపాలో, అమెరికాలో ఒకనాడు పాలకులే వలసలను ప్రోత్సహించారు. ఇప్పటికీ ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే వారు ప్రాతినిధ్యం వహించే కార్పొరేట్‌ శక్తులకు వలస కార్మికుల వలన లాభాలు ఎక్కువగా వుంటాయి కనుక. గతకొద్ధి దశాబ్దాలుగా వుపాధి రహిత అభివృద్ధి జరుగుతోంది కనుక ధనిక దేశాలలో నిరుద్యోగం, వేతనాల పతనం, ఎగుమతుల అభివృద్ధి పేరుతో వేతనాల కోత, ప్రజాధనం ఎగుమతుల రాయితీలకు మళ్లించటంతో సంక్షేమ పధకాలకు కోతలతో సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఆ అసంతృప్తిని సొమ్ము చేసుకొనేందుకు మితవాదులు, జాతీయవాదులు, జాత్యంహకార వాదులు పెరుగుతున్నారు. అది తమకు నష్టదాయకమని కార్పొరేట్‌లు భావిస్తున్న కారణంగానే వారి ప్రతినిధి జుంకర్‌ మండిపడుతున్నారు. ఇది పాలకశక్తుల మధ్య అధికారం కోసం జరిగే పోరులో జాతీయవాదులు, జనాకర్షకవాదులది దగ్గర దారి. నరేంద్రమోడీ భారత్‌లో పెద్ద (సామాజిక) విభజన వాది అని టైమ్‌ పత్రిక వర్ణించిన విషయం తెలిసిందే. ముస్లింలు, క్రైస్తవులు మన కళ్ల ముందే పుట్టి పెరిగిన వారిని హిందూత్వ జాతీయ వాదులు ఎలా చూస్తున్నారో వివరించాల్సిన అవసరం లేదు. వారు ఈ దేశానికి విధేయులుగా లేరనే ప్రచారం, జాతీయవాదులుగా నిరూపించుకోవాలని పదే పదే అనటం తెలిసిందే. ఐరోపా దేశాలలో కూడా జాత్యహంకారులు, శ్వేతజాతి వాదులు మైనారిటీలను, విదేశాల నుంచి వలస వచ్చిన వారికి దేశం పట్ల విధేయత వుండదని ఇలాగే అవమానిస్తారు.

Related image

ఐరోపా అంతటా ఇటీవలి కాలంలో మితవాదం పెరుగుతోంది, ఇదే సమయంలో సోషల్‌ డెమోక్రసీ తరుగుతోంది. మన దేశంలో కూడా జరిగింది అదే. కాంగ్రెస్‌ పార్టీ పతనానికి సూచిక అది. లౌకికశక్తుల మీద మిత, మతవాద శక్తులు పైచేయి సాధించాయి. నాజీ హిట్లర్‌ తరువాత జర్మనీలో ఏడు దశాబ్దాల పాటు ఐరోపా తరహా ప్రజాస్వామ్యమే వుంది తప్ప మితవాద శక్తులు తలెత్తలేదు. అలాంటి చోట ఎఎఫ్‌డి( జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీ) అనే పచ్చి మితవాద పార్టీ మూడవ శక్తిగా వునికిలోకి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్దంలో దెబ్బతిన్న ఐరోపా తిరిగి తమకు పోటీగా బలపడకూడదని అమెరికా భావించింది. ఒంటరిగా వుంటే ఏనుగు వంటి అమెరికాను ఎదిరించి ప్రపంచ మార్కెట్లో తమ వాటాను తాము కాపాడుకోలేమని గ్రహించిన యూరోపియన్‌ కార్పొరేట్‌ శక్తుల ఆలోచన ప్రకారమే ఐరోపా యూనియన్‌ వునికిలోకి వచ్చింది. ఐరోపా బొగ్గు, వుక్కు కమ్యూనిటీతో 1951లో ప్రారంభమై ఏడుదశాబ్దాలుగా సరిహద్దుల చెరిపివేత వరకు వచ్చిన ఐరోపా యూనియన్‌ మీద ఇప్పుడు అనేక దేశాలలో వ్యతిరేకత పెరుగుతోంది. ఎవరి కాపురం వారు పెట్టుకుందాం, ఎవరి గొడవ వారు చూసుకుందామనే ధోరణులు పెరిగాయి. దాని పర్యవసానమే ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు రావాలన్న బ్రిటన్‌ నిర్ణయం.

పిల్లి నల్లదా తెల్లదా అని కాదు అసలు అది ఎలుకలను పట్టగలదా లేదా అన్నది అసలు సమస్య అన్నట్లుగా ఐక్య ఐరోపా లేదా ప్రపంచీకరణ ఏ పేరు పెట్టినా ఐరోపాలో అమలు జరిగింది పెట్టుబడిదారీ విధానమే. అది ఇప్పుడు మరోసారి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటటోంది. కమ్యూనిజం వైఫల్యం చెందింది అన్నది దాని వ్యతిరేకుల మాట. ఇప్పుడు పెట్టుబడిదారీ వైఫల్యం చెందింది అన్నది దాని అనుకూలురు చెబుతున్నమాట. ఈ ఏడు దశాబ్దాల్లో చూస్తే కార్మికవర్గం సాధించుకున్న లేదా పాలకులు వుదారంగా ఇచ్చిన అనేక సంక్షేమ పధకాలకు కోతపడుతోంది. వేతనాలు పెరగటం లేదు. వుపాధి సమస్యలు ముందుకు వస్తున్నాయి. యూరోపియన్లు వందల సంవత్సరాల పాటు ప్రపంచంలోని మూల మూలకు వలసలు పోయి అక్కడి సంపదలను స్వంతం చేసుకున్న చేసుకున్నారు. అసలు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాలే అలా ఏర్పడ్డాయి. స్దానికులను మైనారిటీలుగా మార్చి వారి మీద పెత్తనం చేసిన, ఇప్పటికీ చేస్తున్న చరిత్ర మన కళ్ల ముందు వుంది. మరి అలాంటి దేశాలలో ఇప్పుడు ఇతరం ఖండాల నుంచి వలస వస్తున్న వారినే కాదు, ఐరోపాలోనే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వస్తున్న తోటి వారినే అనుమతించకూడదన్న సంకుచిత భావాలు తలెత్తటానికి, పెరిగి పెద్దవి కావటానికి అనువైన పరిస్ధితులు ఏర్పడ్డాయి. అమెరికాలో కూడా అంతే పొరుగుదేశమైన మెక్సికో నుంచి వలసలు రాకుండా ట్రంప్‌ మహాశయుడు ఏకంగా సరిహద్దులో గోడ కడతానంటున్నాడు. బెర్లిన్‌ గోడను బద్దలు చేసినందుకు సంతోషం వెలిబుచ్చిన పెద్దలు వారే ఇప్పుడు కొత్త గోడలు కడుతున్నారు.

ఎటు తిరిగి ఎటు చూసినా పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యమే కనిపిస్తోంది. అందుకు సాంప్రదాయ పార్టీలే కారణం అంటే కాదనలేని స్ధితిలో అవి పడ్డాయి. దాన్ని అవకాశంగా తీసుకొని చూడండి అల్లావుద్దీన్‌ అద్బుతదీపం మాదిరి అద్బుతాలు చేస్తామని చెప్పేశక్తులు ముందుకు వస్తే ఒకసారి చూస్తే పోలా అని ఎవరికి వారు అనుకుంటున్నారు. వారికి ఫాస్ట్‌ ఫుడ్‌ లేదా ఎటిఎం మాదిరి వెంటనే కోరుకున్నది కావాలి. ఇన్నేండ్లుగా మేము నమ్మిన పార్టీలు నట్టేట ముంచాయి. వాటి మీద ఏమాత్రం నమ్మకం లేదు. వారు చేయలేనిదానిని మేము చేస్తామని కొత్తగా రంగంలోకి వచ్చిన వారు చెబుతున్నారు. వారు మితవాదులా అతివాదులా అన్నది మాకనవసరం, పని చేసే వారు, ఫలితాలు ఇచ్చేవారు కావాలి. వారికీ ఒక అవకాశం ఇచ్చి చూస్తాం, మితవాదులు వస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు అంటున్నారు, అలాంటిదేదైనా వస్తే అప్పుడు చూసుకుందాం అనే ధోరణులు ఐరోపా అంతటా ప్రబలుతున్నాయి. ఈ పూర్వరంగంలోనే అనేక పార్టీలు ఇలా పుట్టి అలా ఓట్లు పొంది దేశాల రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. సాంప్రదాయ పార్టీలు మట్టి కరుస్తున్నాయి. బ్రిటన్‌లో మూడు నెలల క్రితం పుట్టిన పార్టీ ఐరోపా పార్లమెంట్‌ ఎన్నికల్లో 32శాతం ఓట్లు తెచ్చుకొని బస్తీమే సవాల్‌ అంటోంది. మన దేశంలో కూడా జరుగుతోంది అదే. కాంగ్రెస్‌ అవినీతిని అక్రమాలను కూకటి వేళ్లతో పెకలించి వేస్తామన్నది బిజెపి లేదా కాషాయ జాతీయవాదుల వాగ్దానం. యాభై ఏండ్లలో కాంగ్రెస్‌ చేయలేనిదానిని ఐదు సంవత్సరాలలో తాము చేశామని జనాన్ని నమ్మింప చూసిన యత్నాన్ని చూశాము.

నూటయాభై సంవత్సరాల క్రితం ఫెర్డినాండ్‌ లాసలే కమ్యూనిస్టు లీగ్‌లో సభ్యుడిగా వున్నప్పటికీ మార్క్స్‌, ఎంగెల్స్‌ ఆయనతో తీవ్రంగా విబేధించారు.చివరికి ఆ పెద్ద మనిషి కమ్యూనిస్టు వ్యతిరేక బిస్మార్క్‌తో చేతులు కలిపిన వైనం తెలిసిందే. అయితే ఐరోపాలో కమ్యూనిజాన్ని ఎదుర్కొనే క్రమంలో సంస్కరణ వాదలక్షణాలుండే సోషల్‌ డెమోక్రసీని ముందుకు తెచ్చిన ఆద్యుడిగా లాసాలేను చెబుతారు. నిజమైన రాజ్యాంగబద్దమైన రాజ్యంలో నిజమైన పాలకుడు ఓటరే అనే లాసాలే ప్రవచనాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అది వాస్తవం కాదని పాలకవర్గాలకు తెలిసినా, చాలా మంది ప్రజాస్వామిక వాదులు అది నిజమని నిజంగానే నమ్మారు. అయితే నూటయాభై సంవత్సరాల తరువాత వారికి ఆభ్రమలు తొలిగిపోతున్నాయన్నవి విశ్లేషకుల అభిప్రాయం. ఓటర్ల పేరుతో తీర్పులను హైజాక్‌ చేస్తున్నారు. తమకు ఎవరు ప్రయోజనకారులో, ఎవరు హాని చేస్తారో కూడా తెలియని స్ధితికి నేడు ఓటర్లు లోనై వున్నారు.

Image result for jean-claude juncker eu president

సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధల కూల్చివేతకు ముందే ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమంలో ముందుకు వచ్చిన సైద్ధాంతిక సమస్యలతో పార్టీలు విడిపోయాయి. ఆ తరువాత ఆ వ్యవస్దలు కనుమరుగు కావటంతో అనేక మందిలో విశ్వాసం సన్నగిల్లింది. నీరు గారిపోయారు, అనేక పార్టీలు కనుమరుగై బూర్జువా పార్టీల అవతారమెత్తాయి. ఒక విధమైన శూన్యం ఏర్పడింది. పెట్టుబడిదారీ విధాన వైఫల్యాలను ఎండగట్టి జన విశ్వాసాన్ని చూరగొనే స్ధితిలో మిగిలి వున్న కమ్యూనిస్టులు లేకపోవటంతో దిగజారుతున్న ఆర్ధిక పరిస్ధితులను అవకాశంగా తీసుకొని మరోసారి మితవాద, జాతీయవాద శక్తులు మోరలెత్తుతున్నాయి. అనేక మంది ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు.

1857లో మన దేశంలో తలెత్తిన ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామానికి అనేక పరిమితులు వుండవచ్చు గానీ, ఒక ప్రయత్నం జరిగింది. దాన్ని తీవ్రంగా అణచివేసిన తరువాత నాలుగు దశాబ్దాలపాటు ఎలాంటి వుద్యమాలూ రాలేదు. తరువాత కూడా బ్రిటీష్‌ వారిని పరిమిత హక్కుల కోసం ప్రాధేపడే కాంగ్రెస్‌తో ప్రారంభమైన వుద్యమంలో తరువాత ఎన్నిమార్పులు, ఎన్ని ఆలోచనలు తలెత్తిందీ చూశాము. అలాగే ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమం, భారత వామపక్ష, కమ్యూనిస్టు వుద్యమం కూడా అలాంటి పరిస్ధితినే ఎదుర్కొంటోంది. తిరిగి పుంజుకోవటం అనివార్యం. అయితే అనేక మందికి ఆ విషయంలో విశ్వాసం లేదు. ఇక్కడ ఒకటే సమస్య. పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యాల గురించి చెప్పనవసరం లేదు. చైనా సోషలిస్టు వ్యవస్ధ గురించి కొందరికి కొన్ని అనుమానాలు వున్నాయి. అది కూడా పెట్టుబడిదారీ వ్యవస్దే అన్నది కొందరి భావన. అలా భావించే వారు ఎవరికి వారు ఆలోచించాల్సిన అంశాలు రెండు. ఒకటి పెట్టుబడిదారీ వ్యవస్ధకు దోపిడీలేని మరొక ప్రత్యామ్నాయం కమ్యూనిజం తప్ప మరొకటి ఎక్కడైనా కనిపిస్తోందా? చైనా సోషలిస్టు వ్యవస్ధ కానట్లయితే దాన్ని కూల్చివేసేందుకు అమెరికా ఎందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు ? అక్కడ మిగతా పెట్టుబడిదారీ దేశాల మాదిరి సంక్షోభాలు ఎందుకు రావటం లేదు? అంతవేగంగా పురోగమించటానికి చైనా వెనుక వున్న శక్తి కమ్యూనిస్టు పార్టీ గాకపోతే మరేమిటి ? జర్మన్‌ జాతీయ వాదం హిట్లర్‌ను, ఇటలీ జాతీయ వాదం ముస్సోలినీ, అమెరికన్‌ జాతీయ వాదం ప్రపంచాన్ని నిరంతరం యుద్ధాలతో నింపే యుద్దోన్మాదులను తయారు చేసింది. మన దేశంలో కాషాయ జాతీయ వాదం ఎవరిని తయారు చేయనున్నది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d