• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Current Affairs

మీ ఇంటికొస్తే మాకేమి ఇస్తారు, మా ఇంటి కొస్తూ మాకేమి తెస్తారంటే కుదరదు అమెరికా పెద్దన్నా !

22 Tuesday May 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

america first, anti china, CHINA TRADE, Donald trump, Indo-China trade, TRADE WAR, US-CHINA TRADE WAR

ఎం కోటేశ్వరరావు

వాణిజ్య యుద్ధంలో అమెరికా ముందు చైనా చేతులెత్తేసిందా? ఏమో ! చైనా మెడలు వంచి వాణిజ్య పోరులో అమెరికా విజయం సాధించిందా ? ఏమో చెప్పలేం గానీ తాత్కాలికంగా రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరింది. ‘చైనాతో యుద్దం వాయిదా పడింది, కానీ ట్రంప్‌ వ్యూహ గందరగోళం కొనసాగుతూనే వుంది’ . కార్పొరేట్ల పత్రిక ఫోర్బ్స్‌ ఒప్పందంపై రాసిన తక్షణ విశ్లేషణ శీర్షిక ఇది. ‘ చైనా ముఖ్యమైన ప్రయోజనాలను కాపాడుకుంది’ ఇది చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక విశ్లేషణకు పెట్టిన శీర్షిక. వివరాలేమీ తెలియకుండానే అమెరికాన్లకు చైనా లంగిపోయిందని సంతోష పడే వారికి చివరకు మిగిలేది నిరాశే అని గత చరిత్రను బట్టి చెప్పక తప్పదు.

ప్రపంచంలో స్వేచ్చా వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు అమెరికా నాయకత్వంలోని ధనిక దేశాలు వునికిలోకి తెచ్చినదే ప్రపంచవాణిజ్య సంస్థ(డబ్ల్యుటిఓ). అది ఒక పక్క వుండగానే మరోవైపు దానిలోని సభ్యదేశాలు వాణిజ్య యుద్ధాలకు తలపడటం అంటే దాని వైఫల్యాన్ని సూచిస్తున్నది. నిజానికి ప్రపంచీకరణ యుగంలో రెండు దేశాల మధ్య తలెత్తే వాణిజ్యపోరు, పరిష్కారం కూడా వాటికే పరిమితం కాదు. ప్రపంచంలో ప్రతి ధనిక దేశమూ చైనాతో వాణిజ్యంలో లోటుతోనే వుంది, కనుక ప్రతి దేశమూ దానిని తగ్గించుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూనే వుంటుంది. వాటిలో అమెరికా ఒకటి. దిగుమతి సుంకాల పెంపుతో ఎవరైనా చైనాను దెబ్బతీయాలని చూస్తే ఆ విబేధాన్ని వినియోగించుకొనేందుకు మిగతా దేశాలు కాచుకొని వుంటాయి, వున్నాయి. అందుకు పెద్ద వుదాహరణ మన దేశమే.

కాషాయ మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో నిత్యం చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతుంటారు. దేశభక్తి నిరూపణకు చైనా వ్యతిరేకతను ఒక ప్రమాణంగా ముందుకు తెస్తున్నారు. అయితే గతకొద్ది నెలలుగా ప్రధాని నరేంద్రమోడీ, విదేశాంగమంత్రి మొదలు, వున్నత అధికారయంత్రాంగం మొత్తం చైనాతో సయోధ్య దిశగా ముందుకు పోతున్నారంటే అతిశయోక్తి కాదు. పాత సామెత ప్రకారం వ్యాపారి వరదనబడి పోతున్నాడంటే ఏదో లాభం కనిపించబట్టే అని వేరే చెప్పనవసరం లేదు. కమ్యూనిస్టు వ్యతిరేకతలో అమెరికా కంటే సంఘపరివారం పేరుమోసిందేమీ కాదు. అలాంటి అమెరికానే చైనాతో కాళ్లబేరానికి వస్తున్నపుడు పరివార పెద్దలైన మోడీ, మరొకరు ఎంత? వారంతా కార్పొరేట్ల ప్రతినిధులు తప్ప మరొకరు కాదు. ఎడ్లెవిస్‌ అగ్రీవాల్యూ చైన్‌ లిమిటెడ్‌ కంపెనీ పరిశోధన విభాగ అధిపతి పెరెరాణా దేశాయ్‌ చైనా-అమెరికా వాణిజ్య పోరు గురించి ఇలా చెప్పారు.’ ఎగుమతుల ధరలు పోటాపోటీగా వున్నట్లయితే అయిల్‌ సీడ్స్‌ మీల్స్‌ అయిన సోయా, ఆవ, పత్తి మరియు మొక్కజన్న భారతీయ ఎగుమతిదార్లకు ఒక చిన్న వ్యవసాయ ఎగుమతి కిటికీ తెరుచుకుంటుంది. నూట ఆరు అమెరికా వుత్పత్తులపై చైనా 25శాతం వరకు కొత్త పన్నులు ప్రకటించింది, అంతకు ముందు 128 అమెరికా వుత్పత్తులపై పన్నులు పెంచింది. రెండు అతి పెద్ద దేశాలు ఒక వాణిజ్య యుద్ధంలోకి అడుగుపెట్టాయి.పదమూడు వందల చైనా వుత్పత్తులపై అమెరికా 25శాతం పన్నులు విధించింది.’ భారత పత్తి సంఘం అధ్యక్షుడు అతుల్‌ గణత్ర మాట్లాడుతూ ‘ అమెరికా తరువాత పత్తి ఎగుమతిలో స్థానం భారత్‌దే. చైనా 50మిలియన్‌ బేళ్ళ పత్తి దిగుమతి చేసుకుంటే దానిలో 40శాతం అమెరికా నుంచి వస్తోంది. ఆ పత్తిపై చైనా 25శాతం పన్ను విధిస్తోంది. మన పత్తిపై చైనాలో ఎలాంటి పన్నులు లేవు, అందువలన అమెరికా పత్తి కంటే మన సరకు చౌక అవుతుంది కనుక మనకు ఇది మనకు లాభదాయకం.’ సౌరాష్ట్ర జిన్నర్స్‌ అసోసియేషన్‌ ఆనంద్‌ పోపట్‌ మాట్లాడుతూ ఆస్ట్రేలియా, ఆఫ్రికన్‌ కాటన్‌ కంపెనీల కంటే మన పత్తి ధర చౌక, భారత సోయాబీన్‌పై వున్న ఆంక్షలను చైనా తొలగించినట్లయితే వారికి మనం సరఫరా చేయగల మరొక వస్తువు అవుతుంది. చైనాకు అవసరమైన 93.4 మిలియన్‌ టన్నులు సోయాలో ప్రస్తుతం అమెరికా 39శాతం సరఫరా చేస్తోంది.’ అన్నారు. చైనా పశు, కోళ్ల దాణాకు వుపయోగించే సోయాను మన దేశం నుంచి ఎగుమతి చేసేందుకు ఇప్పుడున్న ఆంక్షల ఎత్తివేతకు మన దేశవాణిజ్య శాఖ సంప్రదింపులు జరుపుతోంది.

గత నాలుగు సంవత్సరాలుగా నరేంద్రమోడీ సర్కార్‌ తన విజయాల గురించి ఎన్ని అతిశయోక్తులు చెబుతున్నప్పటికీ కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లుగా పరిస్ధితి వుంది. మన వాణిజ్యలోటు గతేడాది ఏప్రిల్‌లో 13.25బిలియన్‌ డాలర్లు వుండగా ఈ ఏడాది 13.72 బిలియన్లకు పెరిగింది. రోజు రోజుకూ చమురు ధరల పెరుగుదల కారణంగా ఇది మరింత విస్తరించటమే కాదు, మన దేశం నుంచి డాలర్లు తరలిపోవటం పెరుగుతుండటంతో విదేశీమారకద్రవ్య సమస్యకూడా తలెత్తే అవకాశం వుంది. ఎక్కడన్నా బావే కాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు మన మార్కెట్లో ప్రవేశించేందుకు మోడీని కౌగలించుకోవటం తప్ప వారి మార్కెట్లలో మనకు ప్రవేశం ఇవ్వటం లేదు. మన దేశ ధనికులు ఏ కారణం చేతో బంగారం, బంగారు ఆభరణాలు, ముత్యాలు, రంగురాళ్లు దిగుమతి చేసుకోవటం తగ్గించబట్టిగాని లేకపోతే వాణిజ్యలోటు మరింత పెరిగి వుండేది. గత ఏప్రిల్‌లో చమురు దిగుమతులకు 7.36బిలియన్‌ డాలర్లు మనం చెల్లించగా ఈ ఏడాది ఆ మొత్తం 10.41బిలియన్లకు పెరిగింది.

ప్రపంచంలో నేడు చైనా పెద్ద ఎగుమతిదారే కాదు, పెద్ద వినియోగదారుగా కూడా మారుతోంది. అక్కడి జనాభా కొనుగోలు శక్తి పెరుగుతున్న కారణంగా ఆ మార్కెట్‌ను వదులుకొనేందుకు ఏ ధనిక దేశమూ సిద్దంగా లేదు. అలాంటి దేశంతో మనం అనవసరంగా తగాదా పెట్టుకోవాల్సిన అవసరం ఏముందనే అభిప్రాయం మన కార్పొరేట్‌ రంగంలో క్రమంగా పెరుగుతోంది. సంఘపరివార్‌ చైనా వ్యతిరేక చిల్లర ప్రచారం ఎలా వున్నప్పటికీ ప్రభుత్వపరంగా అది కుదరదని స్పష్టం చేస్తున్న కారణంగానే ఇటీవలి కాలంలో డోక్లాం దగ్గర నుంచి అనేక సానుకూల వైఖరులను వెల్లడిస్తున్నది. చైనా ఆహార, ఔషధ నియంత్రణ శాఖ వద్ద పెండింగ్‌లో వున్న 254 వుత్పత్తుల నమోదుకు వేగంగా అనుమతులు తీసుకోవాలని మన ఫార్మారంగం మోడీ సర్కార్‌ మీద వత్తిడి తెస్తోంది.

తాను ఎగుమతి చేయటమే తప్ప దిగుమతులు చేసుకోవటం లేదన్న విమర్శలను పూర్వపక్షం చేసేందుకు లేదా ఎవరేమి ఎగుమతి చేయగలరో చూపండి అన్నట్లుగా ఈ ఏడాది నవంబరు నెలలో షాంఘై నగరంలో తొలిసారిగా చైనా దిగుమతుల ప్రదర్శన నిర్వహిస్తోంది. అంటే ప్రపంచ దేశాలన్నీ తమ వుత్పత్తులను అక్కడ ప్రదర్శించాల్సి వుంటుంది. రానున్న ఐదు సంవత్సరాలలో తాము పది లక్షల కోట్ల డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటామని చైనా చెబుతోంది. అందువలన ప్రతి దేశం తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రయత్నిస్తుంది. షాంఘై ప్రదర్శనలో చైనా తన విధానాన్ని, నిబంధనలను ప్రపంచానికి తెలియచేయనుంది. ఈ ప్రదర్శనలో మన దేశం నుంచి కనీసం వందమంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం వుంది. చైనా వస్తువుల దిగమతులు నిలిపివేసి దేశభక్తి నిరూపించుకోవాలని సంఘపరివార్‌ సంస్ధలు ఎంతగా గగ్గోలు పెట్టినా గత ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు మన దేశం చైనా నుంచి 69.4బిలియన్‌ డాలర్ల మేరకు వస్తువులను దిగుమతి చేసుకోగా ఇదే సమయంలో కేవలం 11.5బిలియన్ల మేరకు మాత్రమే ఎగుమతులు చేసింది. వాణిజ్య తేడా 58 బిలియన్‌ డాలర్లు. చైనాతో సరిహద్దు సమస్యతో పాటు వాణిజ్యపరంగా ఇలాంటి ఎన్నో ప్రాధాన్యత అంశాలున్నందున వారితో వైరం తెచ్చుకోవాలని ఏ కార్పొరేట్‌ సంస్ధా కోరుకోదు. పాలకులు ఎవరైనా అలాంటి పిచ్చిపనులకు పూనుకుంటే వైఖరి మార్చుకునే విధంగా తాను చేయాల్సింది చేస్తుంది. ఈ పూర్వరంగంలోనే ఎలాంటి ముందస్తు ఎజండా లేకుండా నరేంద్రమోడీ చైనా వెళ్లినప్పటికీ సానుకూలంగా వున్నామన్న సందేశం దానిలో ఇమిడి వుంది.

అమెరికాాచైనాల మధ్య వాణిజ్య పోరుకు స్వస్థిచెప్పి వాణిజ్యలోటు సమస్యను పరిష్కరించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. అయితే ఆచరణలో ఎవరి ప్రయోజనాలు వారికి వున్నాయి గనుక అమలు ప్రశ్న తలెత్తుతోంది. గతంలో కూడా ప్రతి అమెరికా అధ్యక్షుడూ ఏదో ఒక దశలో వాణిజ్యపోరు పేరుతో బెదిరింపులకు దిగిన వారే. ట్రంప్‌ వైఖరి మొరటుగా వుంది. తన పదవీకాలం పూర్తయ్యే నాటికి రెండు దేశాల మధ్య వున్న వాణిజ్యలోటులో 200బిలియన్‌ డాలర్లను తగ్గించాలని చెబుతున్నాడు. అయితే హడావుడి చేస్తోందని చైనీయులు చెబుతున్నారు. మేడిన్‌ చైనా 2025 పేరుతో చైనా తన వుత్పాదక పరిశ్రమను వున్నత స్ధాయికి పెంచుకొనేందుకు దీర్ఘకాలిక క్రీడను ప్రారంభించిందని, దానిని పడనివ్వకుండా చేయటంతో పాటు అమెరికా తాత్కాలిక ప్రయోజాలను కోరుతోందని, చైనా కీలక ప్రయోజనాలను ఎట్టి పరిస్ధితులలో ఫణంగా పెట్టదని పరిశోధకులు చెబుతున్నారు.

చైనాతో పూర్తి స్థాయి వాణిజ్య యుద్ధం తప్పిపోయిందని విజయోత్సవాలు చేసుకోవటం తప్ప సాధించిందేమిటో తెలియదని అమెరికాలో విమర్శకులు అంటున్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధతో కలవకుండా తన ప్రయోజాలకే పెద్ద పీట వేస్తున్న చైనాను ఒంటరి పాటు చేయటం లేదా అంకెకు తీసుకురావటం అన్న అసలు లక్ష్యాన్ని ట్రంప్‌ పట్టించుకోవటం లేదన్న విమర్శలు చెలరేగాయి. అసలు చైనాను ప్రపంచ వాణిజ్య సంస్ధలో అడుగుపెట్టనివ్వటమే అమెరికా చేసిన పెద్ద తప్పిదమని అమెరికా వాణిజ్య ప్రతినిధి ఒక నివేదికలో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఆర్ధిక వ్యవస్ధలో రాజ్య జోక్యం చేసుకోకుండా చైనాను కట్టడి చేయటమే అంతి మ లక్ష్యం అయితే అమెరికా వస్తువులను కొనుగోలు చేయించమని చైనాను కోరటం ప్రతికూలమౌతుందని కొందరు హెచ్చరిస్తున్నారు.

అమెరికా ఇప్పుడు ఒక్క చైనా మీదే కాదు మా వస్తువులు కొంటారా లేక మీ వస్తువుల మీద దిగుమతి పన్ను విధించమంటారా తేల్చుకోండని అన్ని దేశాలను బెదిరిస్తున్నది. వాటిలో జపాన్‌ ఒకటి. రాజకీయంగా చైనాకు వ్యతిరేకంగా దానిని కూడగడుతున్నప్పటికీ ఆర్ధిక విషయాల్లో జపాన్‌పై అమెరికా తన షరతులను రుద్దేందుకు పూనుకుంది. తమ వుక్కు, అల్యూమినియం వస్తువులపై 25,10 శాతం చొప్పున దిగుమతి పన్ను విధించేందుకు అమెరికా పూనుకుంటే తాము కూడా ప్రతి చర్యలకు దిగక తప్పదని ప్రపంచవాణిజ్య సంస్ధకు జపాన్‌ తెలియచేసింది. అమెరికా బెదిరింపులకు చైనా లంగకపోవటం జపాన్‌కు వూతమిచ్చి అమెరికాను హెచ్చరించేంత వరకు వెళ్లిందని పరిశీలకులు భావిస్తున్నారు. 1970,80 దశకాలలో అమెరికాను ఎదిరించే శక్తిలేని జపాన్‌ ప్లాజా ఒప్పందాన్ని అంగీకరించాల్సి వచ్చిందని పర్యవసానంగా జపాన్‌లో దీర్ఘకాల ఆర్ధిక తిరోగమనానికి దారి తీసిందని ఇప్పుడు అమెరికా గొంతెమ్మ కోర్కెలను చైనా అంగీకరించటం లేదని అందువలన చైనా నుంచి నేర్చుకోవాల్సి వుందని జపాన్‌ భావిస్తున్నది.

చిత్రం ఏమిటంటే ఐరోపాలో రష్యాకు వ్యతిరేకంగా అమెరికాతో చేతులు కలుపుతున్న అక్కడి ధనిక దేశాలు కూడా జపాన్‌ చర్యను చూసి అమెరికా దిగుమతి సుంకాలకు ప్రతిగా తాము కూడా అమెరికా వస్తువులపై అదనపు సుంకాలను విధించాల్సి వుంటుందని ఐరోపా యూనియన్‌ పేర్కొన్నది.అయితే ఈ హెచ్చరికలేవీ జపాన్‌-ఐరోపాయూనియన్‌- అమెరికా మధ్య వున్న రాజకీయ బంధాన్ని దెబ్బతీసేవిగా మారే అవకాశాలు ఇప్పటికైతే లేవు. మన దేశంపై అమెరికా వాణిజ్య యుద్దానికి దిగకపోయినప్పటికీ మన వ్యవసాయ మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు వత్తిడి తెస్తోంది. దానిలో భాగంగానే మన దేశంలో ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధరలను ఎక్కువగా నిర్ణయిస్తోందని, వ్యవసాయ, ఆహార రాయితీలను పరిమితికి ఇస్తోందని ప్రపంచ వాణిజ్య సంస్ధకు కొద్దివారాల క్రితం ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో వుక్కు, అల్యూమినియం దిగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలు మన దేశానికి కూడా వర్తిస్తాయని మన దేశం కూడా వాణిజ్య సంస్ధకు నోటీసు అందచేసింది. మొత్తం మీద చూసినపుడు మీ ఇంటికొస్తే మాకేమి ఇస్తారు, మా ఇంటికొస్తూ మాకేమి తెస్తారు అన్న రీతిలో అమెరికా ప్రవర్తిస్తోంది. అందువలన దాని వైఖరికి ప్రభావితులయ్యే ప్రతి ఒక్కరు ఏదో విధంగా సమన్వయం చేసుకొని పెద్దన్న వైఖరిని అడ్డుకోవటం అవసరం. ఈ దృష్ట్యా కూడా చైనాతో మన దేశం సఖ్యంగా వుండి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మరోమారు విజయం సాధించిన వెనెజులా సోషలిస్టు నికొలస్‌ మదురో !

21 Monday May 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Nicolás Maduro, Venezuela elections, Venezuela votes 2018, venezuelan chavista

ఎం కోటేశ్వరరావు

‘మేం ఇంతవరకు 92 ఎన్నికలను పర్యవేక్షించాం, వెనెజులా ఎన్నికల ప్రక్రియ ప్రపంచంలోనే వుత్తమమైనది అని నేను చెబుతా’ ఈ మాటలన్నది అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌. ఆదివారం నాడు జరిగిన ఆ దేశ ఎన్నికలలో ప్రస్తుత అధ్యక్షుడు నికొలస్‌ మదురో ఘనవిజయం సాధించారు. ఓట్ల లెక్కింపు పూర్తిగాక ముందే ఈ ఎన్నికలను తాము గుర్తించటం లేదని, అక్టోబరులో తిరిగి ఎన్నికలు జరపాలని ప్రతిపక్ష అభ్యర్ధులు ప్రకటించారు. పోలైన ఓట్ల 86లక్షల ఓట్లలో 92.6శాతం లెక్కింపు జరిగిన సమయానికి మదురోకు 58, సమీప అభ్యర్ధి హెన్రీ ఫాల్కన్‌కు 18లక్షలు వచ్చాయని ఎన్నికల సంఘం ప్రకటించింది.

అమెరికా, ఇతర పశ్చిమ దేశాల ఆంక్షలు, ప్రచారదాడి, వత్తిడి, ఆర్ధిక ఇబ్బందుల మధ్య జరిగిన ఈ ఎన్నికలలో పాలక సోషలిస్టు పార్టీ సాధించిన విజయానికి ఎంతో ప్రాధాన్యత వుంది. అనేక లాటిన్‌ అమెరికా దేశాలలో అమెరికా అనుకూల, మితవాద శక్తులు జనాన్ని తప్పుదారి పట్టించుతున్న తరుణంలో వెనెజులాలో వాటి ఆటలు సాగనివ్వలేదు. దాంతో తాము ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ఒకవైపు ప్రకటించిన ప్రతిపక్షాలు మరోవైపు స్వతంతత్రుల ముసుగులో అభ్యర్దులను నిలిపాయి. వారు ఓటమి తధ్యమని తేలగానే ఫలితాల ప్ర కటనకు ముందే ఎన్నికలలో అక్రమాలు జరిగాయంటూ కొత్త పల్లవి అందుకున్నారు. డిసెంబరులో జరగాల్సిన ఎన్నికలను ముందుగానే జరపటం అక్రమాలలో ఒకటని పేర్కొన్నారు. తాను విజయం సాధిస్తే దేశ కరెన్సీని అమెరికా డాలరుగా మార్చివేస్తానని ప్రకటించిన ప్రధాన ప్రత్యర్ధి హెన్రీ ఫాల్కన్‌ ఫలితాలను తాను గుర్తించనని పేర్కొంటూ చేసిన ప్రకటనలో ప్రతిపక్షంలోని కొంత మంది ఓటింగ్‌కు రాకపోవటం తన ఓటమికి కారణమని పేర్కొన్నాడు. పోలింగ్‌ కేంద్రాల సమీపంలో ఎర్ర కేంద్రాలను ఏర్పరచి ఓటర్లపై బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించాడు. నమోదైన ఓటర్లలో 46శాతం పోలింగ్‌కు వచ్చారు.

నికొలస్‌ మదురోపై పోటీ చేసిన వారిలో ప్రధాన ప్రత్యర్ధి న్యాయవాది అయిన హెన్రీ ఫాల్కన్‌ గతంలో ఛావెజ్‌ నాయకత్వంలోని సోషలిస్టు పార్టీలో లారా రాష్ట్ర గవర్నర్‌గా కూడా పనిచేశాడు. ఛావెజ్‌ బ్రతికి వుండగానే 2010లో పార్టీ నుంచి వెళ్లిపోయాడు. 2013 ఎన్నికలలో మదురో ప్రత్యర్ధి హెన్రిక్‌ కాప్రిల్స్‌ ప్రచార సారధిగా పని చేశాడు.ఈ ఎన్నికలలో ప్రతిపక్షం నుంచి విడిపోయి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేశాడు. ఎన్నికల బహిష్కరణ పనిచేయలేదు, అందుకే ఆ ప్రక్రియకు దూరంగా వుండదలచుకున్నాను. ఒక దేశం తరువాత మరొక దేశంలో బహిష్కరణ పిలుపులతో ప్రతిపక్షాలు ఎన్నికల రంగానికి దూరమై పాలకులు పటిష్టం కావటానికి అవకాశమిచ్చాయని న్యూయార్క్‌టైమ్స్‌ పత్రికలో రాసిన వ్యాసంతో ఫాల్కన్‌ పేర్కొన్నాడు. దేశ కరెన్సీ బలివర్‌ స్ధానంలో అమెరికా డాలర్‌ను ప్రవేశ పెట్టి దేశ ఆర్ధిక వ్యవస్ధను స్ధిరీకరించేందుకు పని చేస్తానని, ఐఎంఎఫ్‌ నుంచి సాయం పొందేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. మరొక ప్రత్యర్ధి క్రైస్తవ మత పాస్టర్‌ అయిన జేవియర్‌ బెర్టూసీ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని స్వతంత్రుడనని ప్రకటించుకున్నాడు. కరెన్సీ మార్పిడిపై నియంత్రణలను ఎత్తివేస్తానని, విదేశీ పెట్టుబడులను పెంచుతానని, ఛావెజ్‌ ప్రారంభించిన సామాజిక కార్యక్రమాలను కొనసాగిస్తానని వాగ్దానం చేశాడు. మరో అభ్యర్ధి రెనాల్డో క్విజాడా తను ఛావిస్టా(ఛావెజ్‌) వుద్యమాన్ని కొనసాగిస్తానని, అయితే మదురో ప్రభుత్వానికి వ్యతిరేకినని ప్రకటించుకున్నాడు. వీరికి వరుసగా 21.1, 10.8,0.4శాతాల చొప్పున ఓట్లు వచ్చాయి. మదురో 67.7శాతం పొందారు.

హ్యూగో ఛావెజ్‌ రాజకీయ వారసుడిగా 2013లో అధికారానికి వచ్చిన నికొలస్‌ మదురో గత ఆరు సంవత్సరాలుగా ఇంటా బయటా అనేక ఆటంకాలను ఎదుర్కొన్నాడు. ప్రధాన ఆదాయ వనరైన చమురు రేట్లు గణనీయంగా పడిపోవటంతో దేశం ఆర్ధికంగా అనేక ఇబ్బందులపాలైంది. చమురు ధరల పతనం కారణంగా జిడిపి 45శాతం పడిపోయిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ ప్రకటించింది. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకులైన వాణిజ్యవేత్తలు బ్లాక్‌మార్కెటింగ్‌ వంటి అక్రమాలకు పాల్పడి ప్రభుత్వంతో ప్రత్యక్ష ఘర్షణకు దిగారు. ద్రవ్యోల్బణం పెరుగుదల, అనేక వస్తువుల కొరత ఏర్పడింది. బ్యాలట్లు కావాలా బుల్లెట్లు కావాలా, మాతృభూమిగా వుండాలా వలస దేశంగా మారాలా, శాంతా లేక హింసా కాండా, స్వాతంత్య్రమా, పారతంత్య్రమా నిర్ణయించేది ఈ ఓటు అన్నట్లుగా తాము పరిగణించామని కార్మిక సంఘనేత అయిన ఒక బస్‌ డ్రైవర్‌ వ్యాఖ్యానించాడు. ఓటింగ్‌ ప్రారంభం కాగానే వెనెజులా ఎన్నికలు ఒక బూటకం అని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో ప్రకటించాడు. ముఫ్పై దేశాల నుంచి 150 మంది పరిశీలకులు వెనెజులా ఎన్నికల పర్యవేక్షణకు వచ్చారు. వారిలో ఒకరైన స్పెయిన్‌ మాజీ ప్రధాని జోస్‌ లూయిస్‌ రోడ్రిగజ్‌ జపాటెరో మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ మీద నాకెలాంటి సందేహాలు లేవు, ఆధునిక ఆటోమాటాక్‌ ఓటింగ్‌ పద్దతిని అనుసరిస్తున్నారు. జనం తమంతట తాము ఓటింగ్‌కు వస్తున్నారా లేదా తమ విచక్షణకు అనుగుణంగా ఓట్లు వేస్తున్నారా లేదా అని పరిశీలించటానికి వచ్చాం. మేం ఇప్పుడంతా చూశాం అని పేర్కొన్నారు. ఎటువంటి సంఘటనలు లేకుండా ఎన్నికలు జరిగాయని ఇతర ప్రతినిధులు కూడా వ్యాఖ్యానించారు.

అనేక మంది ముందుగా వూహించినట్లుగానే వెనెజులా ఎన్నికల ఫలితాలను తాము గుర్తించటం లేదని ప్రకటించటం ద్వారా లాటిన్‌ అమెరికాలో తన కుట్రలను కొనసాగించేందుకే అమెరికా నిర్ణయించుకున్నదని స్పష్టమైంది. అర్జెంటీనా రాజధాని బ్యూనోస్‌ ఎయిర్స్‌లో జి20విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గనేందుకు వచ్చిన అమెరికా డిప్యూటీ మంత్రి జాన్‌ సులివాన్‌ జర్నలిస్టులతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలను గుర్తించేది లేదని చెబుతూనే చమురుపై ఆంక్షలు విధించటం గురించి ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.

ఛావెజ్‌ హయాంలో, తరువాత మదురోకు వ్యతిరేకంగా పని చేసిన ప్రతిపక్ష పార్టీలు ఇటీవలి కాలంలో డెమోక్రటిక్‌ యూనిటీ రౌండ్‌ టేబుల్‌ పేరుతో ఒకటిగా వ్యవహరిస్తున్నాయి. ఎన్నికలలో పాల్గనాలా వద్దా అనే విషయంలో దానిలో రెండు అభిప్రాయాలు వెల్లడయ్యాయి. పోటీ చేస్తే మదురో పాలన చట్టబద్దమైనదే అని అంగీకరించినట్లు అవుతుందని కొందరు, మార్పుకోసం వచ్చిన అవకాశాన్ని పోటీ చేసి వినియోగించుకోవాలని కొందరు వాదించినా అంతిమంగా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు అది ప్రకటించింది. ఆ పార్టీకి చెందిన హెన్రిక్‌ కాప్రిల్స్‌ గతంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన కారణంగా పదిహేను సంవత్సరాలు ఎన్నికలలో పోటీ చేయటానికి అనర్హుడయ్యాడు. మరోనేత లియోపాల్డో లోపెజ్‌ పలుకేసులలో నిందితుడిగా వుండటంతో గృహనిర్బంధంలో వున్నాడు. ఈ పూర్వరంగంలో ఎన్నికలను బహిష్కరించాలనే నిర్ణయాన్ని హెన్రీ ఫాల్కన్‌ వ్యతిరేకించి బయటకు వచ్చి స్వతంత్రుడిగా పోటీ చేశాడు. బహిష్కరణ పిలుపు తన విజయాన్ని దెబ్బతీసిందని చెప్పుకున్నాడు.

తమ దేశంలో వున్న చమురు సంపదలను కొల్లగొట్టేందుకు, తమ సంక్షేమ చర్యలకు స్వస్తి పలికేందుకు అమెరికా ఒక అంతర్జాతీయ కుట్ర చేస్తోందని అధ్యక్షుడు మదురో ప్రచారం చేశారు. ఛావెజ్‌ నాయకత్వంలో సోషలిస్టు పార్టీ అధికారానికి వచ్చిన తరువాత వెనెజులా ఆర్ధిక వ్యవస్ధ దిగజారిపోయిందని అంతర్జాతీయ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. చమురు సంపదలతో వున్న ఆదేశం 1998లో ఛావెజ్‌ అధికారానికి రాకముందు తీవ్ర అసమానతలు, పట్టణాలలో దారిద్య్రం తాండవించిందని, దానికి ఐఎంఎఫ్‌ సూచించిన విధానాలే కారణమనే వాస్తవాలను దాచిపెడుతోంది. ఛావెజ్‌ అధికారంలోకి రాగానే ప్రభుత్వ చమురు సంస్ధను పటిష్టపరచి చమురు సంపదను దేశ అంటే ప్రజాప్రయోజనాల కోసం వినియోగించటం ప్రారంభించటంతో అప్పటి వరకు ఆ రంగాన్ని పీల్చిపిప్పి చేసి లాభపడిన అమెరికా, దేశీయ కార్పొరేట్‌ సంస్ధలు వ్యతిరేకతను పెంచుకున్నాయి. అప్పటి నుంచి ఏదో ఒక కుట్ర చేస్తూనే వున్నాయి.2002లో ఛావెజ్‌పై విఫల కుట్ర చేశారు. ఆయనకు అనుకూలంగా వున్న మిలిటరీ, కార్మికుల మద్దతుతో తిరిగి అధికారానికి వచ్చారు.

అమెరికా విధించిన ఆంక్షలు, సరకులు బ్లాక్‌మార్కెట్లోకి పోవటం, చట్టవిరుద్ధమైన కరెన్సీ చలామణిలోకి రావటం, చమురు ధరలు పతనం కావటంతో అక్కడి ప్రభుత్వానికి కొన్ని తీవ్ర సమస్యలు ఎదురయ్యాయి. ప్రజలలో కొంత అసంతృప్తి కూడా తలెత్తింది. గత పార్లమెంట్‌ ఎన్నికలలో ప్రతిపక్షాలకు మెజారిటీ సీట్లు వచ్చాయి. తరువాత మదురో తన స్ధానాన్ని పటిష్ట పరుచుకొనేందుకు చర్యలు తీసుకున్నారు. దాంతో గతేడాది దేశంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రతిపక్ష పార్టీలు, అంతర్జాతీయ ఏజన్సీలు పెద్ద కుట్ర చేశాయి. ప్రభుత్వ ఆస్ధులను విధ్వంసం చేయటం, అధికారపార్టీ మద్దతుదారులను సజీవ దహనం చేయటం, ఆయుధాలతో జనం మీద, భద్రతా సిబ్బందిపై దాడులకు దిగటం వంటి చర్యలకు పాల్పడ్డాయి. వాటిని సాకుగా చూపి వెంటనే ఎన్నికలు జరపాలని అమెరికా, తదితర దేశాలు పిలుపుల నిచ్చాయి. ప్రతిపక్ష డెమోక్రటిక్‌ యూనిటీ రౌండ్‌ టేబుల్‌ ప్రభుత్వంతో చర్చించి కుదుర్చుకున్న అవగాహన ప్రకారం డిసెంబరులో జరగాల్సిన ఎన్నికలను ఏప్రిల్‌లోనే జరపాల్సి వుంది. ఆమేరకు అనూహ్యంగా వెనెజులా ఎన్నికల సంఘం మధ్యంతర ఎన్నికల ప్రకటన చేయటంతో అది అక్రమం అంటూ అమెరికా, ప్రతిపక్షాలు మాట మార్చాయి. మదురో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజ్యాంగ పరిషత్‌ను తాము గుర్తించటం లేదని ప్రకటించాయి. ఒప్పందం నుంచి తాను వైదొలుగుతున్నట్లు రౌండ్‌ టేబుల్‌ ప్రకటించింది. ఇది జరిగిన రెండు రోజుల తరువాత వెనెజులా మిలిటరీ తిరుగుబాటు చేసి నియంత మదురోను అధికారం నుంచి కూలదోస్తే తాము మద్దతు ఇస్తామని అమెరికా రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ మార్కో రుబియో ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు. అదే వారంలో టెక్సాస్‌ విశ్వవిద్యాలయంలో మాట్లాడిన అప్పటి విదేశాంగశాఖ మంత్రి రెక్స్‌ టిల్లర్సన్‌ పాలకులు ఏమాత్రం ప్రజలకు సేవచేయలేనపుడు, పరిస్ధితులు దిగజారినపుడు లాటిన్‌ అమెరికాలో తరచుగా మార్పులను తెచ్చింది మిలిటరీయే అని చరిత్ర చెబుతోందని వ్యాఖ్యానించాడు. అంతెందుకు స్వయంగా డోనాల్డ్‌ ట్రంప్‌ వెనెజులా విషయంలో అవసరం అయితే మిలిటరీని వుపయోగించుకుంటా అని విలేకర్లతో చెప్పాడు. అంటే మిలిటరీ కుట్రలను నిస్సిగ్గుగా సమర్ధించటం తప్ప మరొకటికాదు.

లాటిన్‌ అమెరికాలో వామపక్ష ప్రభుత్వాలకు నిత్యం అమెరికా కుట్రలు, కూహకాల ముప్పు వెన్నాడుతూనే వుంటుంది. దోపిడీ వ్యవస్ధలను విధ్వంసం చేయకుండా వాటిని అలాగే కొనసాగనిస్తూ తమకున్న వెసులు బాటు మేరకు అమలు జరుపుతున్న సంక్షేమ చర్యలకు ప రిమితులు వచ్చినపుడు జనాలలో అసంతృప్తి తలెత్తటం, దానిని మితవాద శక్తులు వినియోగించుకోవటం ఇటీవలి కాలంలో చూశాము. అందువలన పెట్టుబడిదారీ వ్యవస్ధ సంస్కరణబాటను వదలి విప్లవాత్మక చర్యలు తీసుకొనేందుకు పూనుకుంటేనే లాటిన్‌ అమెరికా వామపక్షాలకు భవిష్యత్‌ వుంటుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కర్ణాటకలో బిజెపి రాజ్యాంగ బద్ద కుట్రను భగ్నం చేసిన సుప్రీం కోర్టు !

20 Sunday May 2018

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

BJP, bjp constitutional coup in karnataka, karnataka developments, karnataka votes 2018, Supreme Court

ఎం.కోటేశ్వరరావు

ఒక కట్టడాన్ని కొన్ని క్షణాల్లో కూల్చివేయగల సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. మాయాబజార్‌ వంటి సినిమాలలో తప్ప నిజజీవితంలో కొన్ని క్షణాలలో ఒక కట్టడనిర్మాణానికి అవసరమైన పరిజ్ఞానం మనకు ఇంకా రాలేదు. ప్రజాస్వామ్య కట్టడం పరిస్ధితి కూడా అలాగే వుంది. ఒక వేళ తమకు తగినన్ని సీట్లు రాని పక్షంలో ప్రలోభాలతో ఫిరాయించిన వారికి నష్టం జరగకుండా ఒక రాజ్యాంగ బద్ద కుట్రద్వారా అధికారానికి రావాలని కర్ణాటకలో కమలనాధులు ముందే కుట్రపన్నారా ? జరిగిన పరిణామాలను అవలోకనం చేసుకుంటే అవుననే తేలుతున్నది. మే పదిహేడవ తేదీన తాను ప్రమాణ స్వీకారం చేస్తానని బిజెపి నేత ఎడ్డియూరప్ప ముందే చెప్పటానికి ఆ కుట్రే కారణం అన్నది మరింత తేటతెల్లమైంది.

Image result for bjp constitutional coup in karnataka

మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని , ప్రజాతీర్పును అపహాస్యం, ఖూనీ చేయటంలో కాంగ్రెస్‌ పేరు మోసిన నేరస్ధురాలు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకాలం దానిని తీవ్రంగా విమర్శించి, వ్యతిరేకించిన బిజెపి తన దాకా వచ్చే సరికి అంతకంటే తక్కువ కాదని స్వయంగా వెల్లడించుకుంటోంది. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ ప్రలోభాలు, బెదిరింపులతో పాటు తన తెలివి తేటలన్నీంటినీ వినియోగించింది. తమది భిన్నమైన పార్టీ అని చెప్పుకున్న బిజెపి ఒక అడుగు ముందుకు వేసింది. మాయాబజార్‌ సినిమాలో మాకు తల్పం కాదు గిల్పం కావాలని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించి చావుదెబ్బలు తిన్నవారి మాదిరి కర్ణాటకలో బిజెపి అతి తెలివి తేటలను వుపయోగించి భంగపడింది.

కోర్టు ఇచ్చిన ప్రతి తీర్పు పురోగామి లేదా ప్రజాస్వామ్య బద్దం అని చెప్పలేము గానీ కర్ణాటక వుదంతంలో మాత్రం జస్టిస్‌ ఎకె సిక్రి, అశోక్‌ భూషన్‌, ఎస్‌ఏ బోబ్డేలతో కూడిన బెంచ్‌  చేసిన తాత్కాలిక నిర్ణయాన్ని మాత్రం అభినందించాల్సిందే. అదే కమలనాధుల కలలను కల్లలయ్యేట్లు చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన అటార్నీ జనరల్‌ కె.కె. వేణుగోపాల్‌ వినిపించిన వాదన నాటి కాంగ్రెస్‌ అత్యవసర పరిస్ధితిని గుర్తుకు తెచ్చింది. అత్యవసర పరిస్ధితి విధించి అనేక మంది సిపిఐ(ఎం) నేతలతో పాటు నాటికి ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ విభాగంగా వున్న జనసంఘం, ఇతర కాంగ్రెసేతర పార్టీల నేతలను అనేక మందిని అరెస్టు చేసి జైలుపాలు చేశారు.( సిపిఐ అత్యవసర పరిస్ధితిని సమర్ధించింది కనుక ఆ పార్టీ వారిని మినహాయించారు) అలా జైలుపాలైన ఒక నిర్బంధితుని అరెస్టు అక్రమం అంటూ ఒక హెబియస్‌ కార్పస్‌ పిటీషన్‌ సుప్రీం కోర్టులో దాఖలైంది. ఆ సమయంలో అటార్నీ జనరల్‌గా వున్న నిరేన్‌ డే చేసిన వాదనల సారాంశం ఇలా వుంది.

అత్యవసర పరిస్ధితి విధించిన కారణంగా పౌరులు కోర్టుకు వెళ్లే హక్కును నిలిపివేశారు. ఒక వేళ నిర్భంధం అక్రమం అయినప్పటికీ దాన్ని కోర్టులో ప్రశ్నించటానికి లేదు. అత్యవసర పరిస్ధితి నిబంధల లక్ష్యం, వుద్దేశ్యమూ కార్యనిర్వాహణ వ్యవస్ధకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టడం, రాష్ట్రపతి ఆదేశాలు మరియు చట్టానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి ప్రాధమికహక్కులను నిరాకరిస్తూ కార్యనిర్వాహకవ్యవస్ధ ఏదైనా ఒక చర్య తీసుకుంటే దాన్ని కోర్టులో సవాలు చేయటానికి లేదు. ఆ వాదన మీద జస్టిస్‌ హెఆర్‌ ఖన్నా స్పందిస్తూ ఆర్టికల్‌ 21లో ప్రాణం గురించి ప్రస్తావించారు, దానికి కూడా ఇదే వర్తిస్తుందా అని ప్రశ్నించగా చట్టవిరుద్దంగా ప్రాణాలు తీసినప్పటికీ కోర్టులేమీ చేయలేవని నిరేన్‌ డే వాదించారు. ఆ కేసును విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో మిగతా నలుగురూ అటార్నీ జనరల్‌ వాదనను సమర్ధిస్తూ తీర్పు చెప్పగా జస్టిస్‌ ఖన్నా వ్యతిరేకించారు.

Image result for bjp constitutional coup in karnataka

కర్ణాటక వుదంతంలో ఒక వ్యక్తి ప్రాణాల కంటే ఎక్కువ విలువ నిచ్చి ప్రాణాలు అర్పించటానికి సిద్దపడే ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేసినా కోర్టులకు ప్రశ్నించే హక్కు లేదని మోడీ సర్కార్‌ అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ వాదించారు. రాజ్యాంగం ప్రకారం అటార్నీ జనరల్‌ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, కానీ ఆయన అంతకంటే బిజెపి న్యాయవాది మాదిరి కోర్టులో వ్యవహరించారు. ఆ పార్టీ నేతలు చేసిన వాదననే కోర్టుకు వినిపించటమే అందుకు పక్కా నిదర్శనం. న్యాయమూర్తుల బెంచ్‌కు పూర్తి అంకెలు తెలియవు, నిన్న ప్రకటించిన మేరకు తప్ప మొత్తం తెలియదు అని వేణుగోపాల్‌ చెప్పగా మేము అంతకు మించి చూడలేము, మీకు మెజారిటీ వున్నదని అంకెలు చెప్పటం లేదు అని జస్టిస్‌ ఎకె సిక్రీ చెప్పారు. అసలు వాదన ఆ తరువాతే బయటకు వచ్చింది. కోర్టు స్పెక్యులేషన్‌లోకి పోకూడదు, ఎడ్డియూరప్పకు ఎంత మంది మద్దతు ఇస్తున్నారో ఎవరికీ తెలియదు. ప్రభుత్వ ఏర్పాటునకు ఎవరికి ఆహ్వానం వచ్చింది, బలనిరూపణ సమయంలో ఏ శాసనసభ్యుడు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నాడు అని తెలుసుకొనేందుకు సుప్రీం కోర్టు రాజకీయ పొదలోకి తొంగి చూడటానికి లేదు, ఎందుకంటే ఒక శాసనసభ్యుడిని ప్రమాణ స్వీకారం చేయక ముందే ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం చర్య తీసుకొనేందుకు అవకాశం వుందని ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఎక్కడా చెప్పలేదు. శాసన సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తరువాతే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తిస్తుంది.ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయటం సభలో బలనిరూపణ అంశానికి సంబంధించింది. అవన్నీ సభలోనే పరిష్కారం కావలసి వుంది. ఈ అంశంపై సుప్రీం కోర్టులో అసలు పిటీషన్‌ దాఖలు చేయటానికే లేదు. సభలో బలనిరూపణ వరకు పిటీషన్‌ దారులు వేచి చూడాలి. ఒక వ్యక్తి ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవటానికి లేదు. దాన్ని తరువాత సుప్రీం కోర్టు సమీక్షించవచ్చు. అని వేణుగోపాల్‌ వాదించారు. దీంతో అవాక్కయిన బెంచ్‌ ఇది అసంగత వాదన(మూర్ఖ అనే అర్ధం కూడా వుంది) దాని అర్ధం వారు ప్రమాణ స్వీకారం చేయక ముందే సూట్‌కేసుల మార్పిడి అంతా పూర్తవుతుందన్నది అర్ధమా అంటూ దాన్నే మాత్రం అనుమతించటానికి వీల్లేదని వ్యాఖ్యానించింది.

ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేసిన అభ్యర్ధి ఎన్నికైనట్లు ప్రకటించిన వెంటనే ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులోకి వస్తుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఒక వేళ ఏ ఎంఎల్‌ఏ లేదా ఎంపీ అయినా ప్రమాణ స్వీకారం చేయటానికి నిరాకరించినా, పార్టీ నిర్ణయాన్ని ఖాతరు చేయకపోయినా ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్త్తుందని పేర్కొన్నారు. అయితే ఎవరైనా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ప్రమాణ స్వీకారం చేయకుండా సభకు గైర్హాజరైనా సభలో ఆ సమయానికి వున్న సంఖ్యను బట్టి బలనిరూపణ జరుగుతుంది తప్ప ఆగదు, తరువాత అలాంటి సభ్యులపై చర్యతీసుకోవటం వేరే విషయం అని కొంత మంది భాష్యం చెబుతున్నారు. దీన్నే అటార్నీ జనరల్‌ కూడా వాదించారు. బిజెపి నేతలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనే పధకంతోనే కొంత మంది సభ్యులను సభకు హాజరు కాకుండా చూసేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి వీలుగాక భంగపడ్డారన్నది స్పష్టం అవుతోంది.

1967లో కాంగ్రెస్‌ అనేక వుత్తరాది రాష్ట్రాలలో ఓడిపోయినపుడు అధికారం కోసం అడ్డదారులు తొక్కింది. హర్యానాలో గయా లాల్‌ అనే స్వతంత్ర సభ్యుడు పక్షం రోజుల్లో మూడు సార్లు పార్టీ మారగా ఒక రోజు తొమ్మిది గంటల వ్యవధిలోనే ఒక ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయించడు. నాటి కాంగ్రెస్‌ నేతరావు బీరేంద్ర సింగ్‌ గయాలాల్‌ను ఛండీఘర్‌లో మీడియా ముందు ప్రదర్శిస్తూ గయారామ్‌ నౌ ఆయారామ్‌ ( పోయిన రాముడు ఇప్పుడు తిరిగి వచ్చాడు) అని చమత్కరించాడు.అప్పటి నుంచి పార్టీ ఫిరాయింపుదార్లను ఆయారామ్‌ గయారామ్‌ అని ఎద్దేవా చేస్తున్నారు. 1985లో కాంగ్రెస్‌కు పార్లమెంట్‌లో ఎన్నడూ లేనంత మెజారిటీ రావటంతో వారిని నిలబెట్టుకొనేందుకు, ముఠారాజకీయాలు చేయకుండా నిరోధించేందుకు రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టాన్ని తీసుకు వచ్చింది తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కాదు. ఇప్పుడు బిజెపి ఆ చట్టంలోని లసుగులను వుపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు పూనుకుంది. తాత్కాలిక స్పీకర్‌గా సభలోని సీనియర్‌ సభ్యుడిని నియమించటం ఒక సాంప్రదాయంగా వచ్చింది తప్ప నిబంధనలేమీ లేవు. గతంలో అలాంటి సాంప్రదాయాన్ని కొన్ని పార్టీలు వుల్లంఘించాయి. ఇప్పుడు ఆ జాబితాలో బిజెపి కూడా చోటు దక్కించుకుంది. అయితే తాత్కాలిక స్పీకర్‌ అయినప్పటికీ సభలో బలనిరూపణ సమయంలో స్పీకర్‌కు వుండే అధికారాలు వుంటాయి. అందువలన అవసరమైతే అందుకు వుపయోగించుకొనేందుకు బిజెపి తన సభ్యుడినే గవర్నర్‌ ద్వారా నియమింపచేసుకుంది.

కర్ణాటక వుదంతం గవర్నర్ల విచక్షణ అధికార అంశంతో పాటు స్పీకర్ల అధికారాల గురించి కూడా చర్చ, సమస్యను మరోసారి ముందుకు తెచ్చింది. కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికైన బిజెపి ఎంపీలు ఎడ్డియూరప్ప, బిశ్రీరాములు బెంగళూరు నుంచి పంపిన రాజీనామాలను లోక్‌సభ స్పీకర్‌ వెంటనే ఆమోదించి అమలులోకి వచ్చినట్లు ప్రకటించారు. స్వయంగా నెలన్నర క్రితం అందచేసిన వైఎస్‌ఆర్‌సి సభ్యుల రాజీనామాలను మాత్రం ఇంతవరకు ఆమోదించలేదు. అంతే కాదు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్ర శాసనసభలలో పార్టీలు ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరిన సభ్యుల విషయాన్ని తేల్చకుండా స్పీకర్లు నానబెడుతున్నారు. ఫిరాయింపుదారులు మంత్రులు కూడా అయ్యారు. అదే విధంగా తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్‌ రెడ్డి రాజీనామా సమర్పించి కాంగ్రెస్‌లో చేరినా అసెంబ్లీ స్పీకర్‌ ఆ రాజీనామాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ పూర్వరంగంలో కర్ణాటక వుదంతాన్ని విచారణకు చేపట్టిన సుప్రీం కోర్టు ఈ విషయాల మీద కూడా స్పష్టత ఇవ్వటం అవసరం. గత ఏడు దశాబ్దాల చరిత్రను చూసినపుడు ప్రజాస్వామ్యం గురించి పెద్ద కబుర్లు చెప్పిన పార్టీలే దానికి తూట్లు పొడిచేందుకు ప్రయత్నించాయి. మరోవైపు పాలకవర్గ ప్రజాస్వామిక వ్యవస్ధల మీద నమ్మకం లేని కమ్యూనిస్టులు దానికి కట్టుబడి వుండటం కనిపిస్తుంది. వున్నత న్యాయస్ధానాలు ప్రజాసామ్యాన్ని బలపరిచేందుకు వీలుగా రాజ్యాంగానికి భాష్యం చెప్పటం, లోపాలను ఎత్తి చూపి సవరించేవిధంగా మార్గదర్శనం చేయాల్సి వుంది. దీనికి ఎన్నో పరిమితులు,ఆటంకాలు వున్నాయి. ఇది ఒక ఎత్తయితే ప్రజాకోర్టులో న్యాయమూర్తులైన ఓటర్లు ఫిరాయింపుదారులు, అవకాశవాదుల పట్ల ఎప్పుడైతే సరైన తీర్పు ఇచ్చేందుకు పూనుకుంటారో అప్పుడే స్వచ్చ రాజకీయాలవైపు పరిణామాలు మలుపు తిరుగుతాయి.ప్రజలకు ఎలాంటి ఆటంకాలు వుండవు, వున్నా వాటిని త్రోసి రాజని ముందుకు పోయే హక్కు, అవకాశం వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కర్ణాటక అంకెల ఆటలో బిజెపికి భంగపాటెందుకు కలిగింది !

19 Saturday May 2018

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ 1 Comment

Tags

BJP, Congress party, jds, karnataka votes 2018, karnataka votes facts, numbers game in karnataka, Yeddyurappa

Image result for Yeddyurappa

ఎం కోటేశ్వరరావు

కర్ణాటకలో అటు ప్రజా కోర్టులో ఇటు అసెంబ్లీ అంకెల ఆటలో బిజెపి భంగపడింది. కులం, ధన, పదవీ ప్రలోభాలు, బెదిరింపులు, బుజ్జగింపులతో తమకు లేని బలాన్ని తెచ్చుకొనేందుకు ప్రయత్నించటాన్ని యావత్‌ దేశం గమనించింది. దానిలో విఫలమై అవమానకరంగా రాజీనామా చేసిన తరువాత ఏ కోశానా లేని తమ నిజాయితీ గురించి తమకు తామే ఆ పార్టీ నేతలు కితాబునిచ్చుకుంటున్నారు. 117 సీట్లు, 56.8శాతం ఓట్లు తెచ్చుకున్న కూటమి కంటే ఓట్ల చీలిక కారణంగా 104 సీట్లు వచ్చినప్పటికీ వారికి వచ్చిన 36శాతం ఓట్లను దాచి పెద్ద పార్టీ అంటూ ఇంకా ఫోజు పెడుతున్నారు. వారెంతగా ఖంగుతిన్నారంటే బలనిరూపణకు సుప్రీం కోర్టు ఇచ్చిన అవకాశాన్ని వుపయోగించుకొని మరింత గబ్బుపట్టటం కంటే ముందే తప్పుకోవటం మంచిదని రాజీనామా చేయటం నష్ట నివారణ చర్యలో భాగం. తనకు అధికారం లేకపోయిన తరువాత ఇంకేంటి అన్నట్లుగా అసెంబ్లీలో ప్రసంగం ముగించి రాజీనామా ప్రకటించిన వెంటనే లేచి వెళ్లిపోయారు. జాతీయ గీతం గురించి పెద్ద సమస్య చేసిన ఆ పార్టీ ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో జాతీయగీతాలాపన ముగియ కుండానే లేచిపోవటం వారి నిజస్వరూపాన్ని వెల్లడి చేసింది. ఈ వుదంతంలో కాంగ్రెస్‌-జెడిఎస్‌ కూటమి విజయం సాధించింది అనటం కటే బిజెపి ఘోరంగా ఓడిపోయింది అని చెప్పాల్సి వుంటుంది.

తమ పార్టీ కార్యకర్తగా మాదిరి వ్యవహరించే వ్యక్తి రాజభవన్‌లో గవర్నర్‌గా వున్నందున విచక్షణాధికారం పేరుతో ముందు అధికార పీఠాన్ని సంపాదిస్తే తరువాత గతంలో మాదిరి ఏదో విధంగా దాన్ని నిలబెట్టుకోవచ్చని బిజెపి వేసిన ఎత్తుగడలు అనూహ్యంగా చిత్తయ్యాయి. తమకున్న బలానికి మరికొందరు మద్దతిస్తారని లేఖ ఇవ్వటం తప్ప ఎవరు, ఎలా ఇస్తారో ఎడ్డియూరప్ప చెప్పలేదు. మరోవైపు తమకు 117 మంది మద్దతు వుందని సంతకాలతో సహా కాంగ్రెస్‌-జెడిఎస్‌ లేఖ అందచేసినప్పటికీ గవర్నర్‌కు నమ్మకం కుదరలేదని తిరస్కరించటంతోనే కుట్రకు తెరలేచింది. లేఖలో వారం రోజుల గడువు అడిగితే గవర్నరు పదిహేను రోజులు ఇవ్వటం కూడా బిజెపి వ్యూహంలో తరువాత వచ్చిన ఆలోచన పర్యవసానమే.

బిజెపి పధక రూపకర్తలు ఎక్కడ పప్పులో కాలేశారు. కాంగ్రెస్‌ కోర్టుకు వెళ్లనున్నదని తెలిసి కోర్డు సమయం ముగిసిన తరువాత గవర్నర్‌ కార్యాలయం నుంచి లేఖ తెప్పించుకోవటం, తిరిగి కోర్టు తెరిచే లోపల ప్రమాణ స్వీకార తతంగాన్ని ముగించి కోర్టు ఆటంకాన్ని తప్పించుకోవచ్చనేంత వరకు వారు తెలివిగానే వ్యవహరించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా అర్ధరాత్రి తలుపు తట్టిన కాంగ్రెస్‌ నేతల వినతిని మన్నించి అప్పటి కప్పుడు విచారణ బెంచిని ఏర్పాటు చేసి తెల్లవార్లూ విచారణ జరపటాన్ని మాత్రం వారు వూహించలేదు. తమకు వున్న మెజారిటీ గురించి గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో పేర్కొనకపోవటంతో ధర్మాసనం బలనిరూపణకు ఒక రోజు మాత్రమే ఇవ్వటంతో తీరికగా చేపలకు గాలాలు విసురుదామనుకున్న కమలనాధుల ఎత్తులు చిత్తయ్యాయి. బిజెపి నుంచి వెళ్లిపోయి కాంగ్రెస్‌ తరఫున గెలిచిన ఏడుగురిని ఎలాగైనా తమవైపు తిప్పుకోవచ్చని కమలనాధులు భావించారు. అందుకే మీడియాకు అనధికారికంగా ఆ ఏడుగురు తమవైపే అన్న ధీమాతో వుప్పందించారు.

ఎంతకైనా తెగించే బిజెపి తీరుతెన్నుల గురించి జాగ్రత్తపడిన కాంగ్రెస్‌ాజెడిఎస్‌లు తమ సభ్యులను కాపాడుకొనేందుకు గట్టి చర్యలు తీసుకోవటంతో ఎడ్డి మడ్డి వ్యవహారం బెడిసి కొట్టింది. కర్ణాటకలో బిజెపి గతంలో అధికారం వెలగబెట్టినప్పటికీ ఇప్పుడే మొదటిసారి దక్షిణాదిన తమ పాదం మోపుతున్నామనే భ్రమ కలిగే విధంగా ఆ పార్టీ నేతలు ప్రయత్నించారు. దానికి మీడియాకూడా ఎలాంటి వెనుక ముందులు చూడకుండా నిజమే అన్నట్లు ప్రచారం చేసింది. ఇక్కడ బిజెపికి ఎదురైన సమస్యలేమిటి? 2008లో కాంగ్రెస్‌తో సంకీర్ణం నుంచి బయటకు వచ్చిన జెడిఎస్‌ను బిజెపి దగ్గరకు తీసి తనకు అధిక సీట్లు వున్నప్పటికీ జెడిఎస్‌ నేత హెచ్‌డి కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసింది. అయితే బిజెపితో స్నేహం ధృతరాష్ట్ర కౌగిలి వంటిదని జెడిఎస్‌కు త్వరలోనే అర్ధమై బిజెపి నుంచి దూరం జరిగింది. ఈ ఎన్నికలలో కూడా అదే విధంగా బిజెపి పెద్ద పార్టీగా, కాంగ్రెస్‌, జెడిఎస్‌లు రెండు, మూడు స్ధానాలలో నిలిచాయి. దక్షిణాదిలో తమ పార్టీ విస్తరణలో భాగంగా ఎట్టి పరిస్ధితిలోనూ తమ పార్టీనేతనే ముఖ్యమంత్రిగా చేయాలని బిజెపి ఎప్పుడో నిర్ణయించుకుంది. అవసరమైతే జెడిఎస్‌ను తమ జూనియర్‌ భాగస్వామిగానే వుంచుకోవాలనుకుంది. అందుకే ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో దేవెగౌడమీద ఎక్కడ లేని గౌరవం ఒలకపోశాడు. అవసరమైతే ఈ సారి కూడా ముఖ్యమంత్రిగా కుమారస్వామిని చేయాలని, ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తమ వారు లేకపోయినా ఇబ్బంది లేదు అని బిజెపి అనుకొని వుంటే పరిస్ధితులు భిన్నంగా వుండేవి. గతంలో కలిగిన అనుభవం దృష్టిలో వున్నప్పటికీ కాంగ్రెస్‌ వివేకం ప్రదర్శించి బేషరతుగా జెడిఎస్‌కు మద్దతు ప్రకటిస్తుందని బిజెపి వూహించలేకపోయింది. దాంతో ప్రలోభాల బాట పట్టింది, భంగపడింది.

మూడు పార్టీలలో అవకాశవాదులు, పదవీ వ్యామోహపరులకు కొదవేమీ లేదు . అధికారం ఎక్కడ వుంటే అక్కడకు చేరే వాతావరణం వున్న ఈ రోజుల్లో బిజెపి ప్రలోభాలకు కాంగ్రెస్‌,జెడిఎస్‌ కూటమిలోని ఎంఎల్‌ఏలు ఎందుకు ప్రభావితం కాలేదు అన్నది పెద్ద ప్రశ్న. ఇదే పరిస్ధితి ఒక ఏడాది ముందు వచ్చి వుంటే ప్రలోభాలు పని చేసి వుండేవన్నది పరిశీలకుల అభిప్రాయం. ఇప్పుడెందుకు పని చేయలేదు. కేంద్రంలో బిజెపి అన్ని రంగాలలో విఫలమైందని జనం గుర్తించటం ప్రారంభమైంది.గత లోక్‌సభ ఎన్నికలలో 17 సీట్లు, 43శాతం ఓట్లు, 130 అసెంబ్లీ నియోజకవర్గాలలో మెజారిటీ తెచ్చుకున్న బిజెపి ఈ సారి 104సీట్లకు, 36శాతం ఓట్లకే పరిమితం అయింది. అంటే నరేంద్రమోడీని చూసి జనం ఓట్లెయ్యరు అన్నది స్పష్టం. దీర్ఘకాలం ముఖ్య మంత్రిగా వున్న గుజరాత్‌లో నరేంద్రమోడీ చెమటోడ్చితిరిగినా చావు తప్పి కన్నులట్టపోయినట్లుగా బిజెపి బతికి బయటపడింది. వుత్తరాదిన ఆ పార్టీ గతంలో మాదిరి ఓట్లను అకర్షించే స్ధితిలో లేదని అనేక రాష్ట్రాల వుప ఎన్నికలలో బిజెపి ఓడిపోవటం స్పష్టం చేసింది. 2014లో బిజెపి స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన సీట్లు 282 తెచ్చుకున్నప్పటికీ దానికి వచ్చిన ఓట్లు 31.34 శాతమే, దాని మిత్రపక్షాలవి కలుపుకున్నా వచ్చినవి 38.5శాతమే. ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలిపోవటం కారణంగానే బిజెపి అన్ని సీట్లు తెచ్చుకుందన్నది స్పష్టం. ఈసారి బిజెపిని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ సర్దుబాటు చేసుకుంటాయన్న వాతావరణం రోజురోజుకూ బలపడుతోంది. పెద్ద రాష్ట్రమైన వుత్తర ప్రదేశ్‌లో వుప్పు-నిప్పుగా వుండే ఎస్‌పి, బిఎస్‌పి పార్టీలు రెండు లోక్‌సభ వుప ఎన్నికలలో ఐక్యంగా పోటీ ఇచ్చి బిజెపి అభ్యర్ధులను ఓడించాయి. గత నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్‌డిఏ నుంచి బయటకపోయినవి తప్ప కొత్తగా ఒక్క పార్టీ కూడా చేరే పరిస్ధితి లేదన్నది స్పష్టం కావటం. ఆరు నెలల్లో రాజస్ధాన్‌,మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘర్‌ల ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు నరేంద్రమోడీ సన్నద్దమౌతున్నారన్నది స్పష్టంగా కనిపించటం. మోడీ భవితవ్యమే ఎలావుంటుందో తెలియనపుడు బిజెపితో జట్టుకడితే ఆరునెలల్లో పరిస్ధితి తారుమారైతే తమ పరిస్ధితి ఏమిటన్న దూరాలోచన కూడా అవకాశ వాదులలో తలెత్తి వుండవచ్చు. అందువలన తాత్కాలికంగా ప్రలోభాలకు లంగకపోయినప్పటికీ అవకాశవాదులతో ఆ ముప్పు ఎప్పుడూ మెడమీద కత్తిలా వేలాడుతూనే వుంటుంది.

ఈ ఎన్నికలు బిజెపి అవకాశవాదం,అప్రజాస్వామిక చర్యలను ఎంతగానో బయట పెట్టాయి. అనేక మంది ఆ పార్టీ అభిమానులుగా వున్నవారు పరస్పర విరుద్దమైన వాదనలు చేయటాన్ని సమర్ధించుకోలేని స్ధితిలో పడ్డారు. మెజారిటీ కూటమిని కాదని, మెజారిటీ లేని పార్టీ పెద్దది అనే పేరుతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్‌ చర్యను సుప్రీం కోర్టులో సవాలు చేశారు. దాని మీద పదివారాల తరువాత విచారణకు చేపట్టనుంది. గతంలో వివిధ సందర్భాలలో ఇచ్చిన తీర్పులు వున్నప్పటికీ వాటికి తమదైన భాష్యాలు చెబుతూ గవర్నర్‌ విచక్షణాధికారాల పేరుతో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ అవకాశవాదానికి పాల్పడుతున్నది. దీని మీద కూడా మరింత స్పష్టత వచ్చే విధంగా సుప్రీం తీర్పు వుండవచ్చని అనేక మంది ఆశిస్తున్నారు. ఎన్నికల ముందు దుమ్మెత్తి పోసుకొని వ్యతిరేకంగా పోటీ చేసిన పార్టీలు తరువాత కూటమి కట్టటం ఏమిటని బిజెపి ఒక వాదనను ముందుకు తెచ్చింది, దాని గురించి ఢిల్లీ నుంచి గల్లీ నేతల వరకు గుండెలు బాదుకుంటున్నారు.

గోవా, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలలో ఎన్నికలలో తలపడిన పార్టీలు, స్వతంత్రులతో జతకట్టిన బిజెపి, అదే కర్ణాటకలో జరిగితే తప్పుపట్టటం ఏమిటన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. బీహార్‌లో నితీష్‌ కుమార్‌ నాయకత్వంలోని జెడియు, బిజెపి ఎంత హోరాహోరీగా పోటీ చేసింది, పరస్పరం ఎన్నిమాటల తూటాలను ప్రయోగించిందీ చూశాము. అలాంటి నితీష్‌ కుమార్‌కు మద్దతు ఇవ్వటానికి బిజెపికి, తీసుకోవటానికి నితీష్‌ కుమార్‌కు ఎలాంటి సమస్య ఎదురు కానపుడు కాంగ్రెస్‌-జెడిఎస్‌ను ఎందుకు తప్పుపడుతున్నట్లు ? ఇలాంటి విషయాలన్నీ అటు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలోనూ, సామాజిక మాధ్యమంలోనూ పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ఇంతకాలం కాంగ్రెస్‌ను విమర్శించిన బిజెపి ఆచరణలో అదేపని చేస్తున్నదనే అంశాన్ని ఈ సందర్భంగా అదనంగా మరికొంత మంది గ్రహించారు. ఇవన్నీ రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో బిజెపి ఏతర పార్టీలు తగిన జాగ్రత్తలు తీసుకొనేందుకు దాని అధికార దుర్వినియోగాన్ని ఎదుర్కొనేందుకు జాగరూకతతో వుండేందుకు ఈ వుదంతం తోడ్పడింది.

కొన్ని ప్రాంతీయ పార్టీల తీరు తెన్నులను కూడా ఇది వెల్లడి చేసింది. పొరుగునే వున్న రాష్ట్రానికి వెళ్లి జెడిఎస్‌కు మద్దతు ప్రకటించి వచ్చిన తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు లేదా టిఆర్‌ఎస్‌ అక్కడి పరిణామాలపై మౌనం దాల్చటం అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నది. లోపాయకారీగా బిజెపితో అవగాహన నిజమే అనేందుకు ఆస్కారం కలిగించింది.తాము మద్దతు ఇచ్చిన జెడిఎస్‌ నాయకుడే ముఖ్యమంత్రి అవుతున్నా టిఆర్‌ఎస్‌కు అది ఇబ్బంది కలిగించే అంశమే. ఎందుకంటే తెలంగాణాలో తమను సవాలు చేస్తున్నది కాంగ్రెస్‌ కావటం, ఆ పార్టీ మద్దతుతోనే కుమారస్వామి కర్ణాటక ముఖ్య మంత్రి కావటం టిఆర్‌ఎస్‌ వూహించిన పరిణామం కాదు. మరొక ఫ్రంటు అంటూ కెసిఆర్‌ చేస్తున్న యత్నాలకు ఇది చెప్పులో రాయిలా ఇబ్బంది పెట్టే అంశమే.

తమతో కలసి అధికారంలో భాగస్వాములౌతూనే వైఎస్‌ఆర్‌సిపితో కధనడుపుతున్న బిజెపితో తెలుగుదేశం పార్టీ తెగతెంపులు చేసుకొనేందుకు ప్రత్యేక రాష్ట్రహోదా కల్పనలో వాగ్దాన భంగాన్ని తెరమీదకు తెచ్చింది. కర్ణాటకలో ఒక వేళ బిజెపి గెలిస్తే తదుపరి తమను వేధిస్తారనే అనుమానం కలగటం లేదా అలాంటి సూచనలు కనపడటం వలనగానీ తెలుగుదేశం నేతలు కర్ణాటకలో కాంగ్రెస్‌, జెడిఎస్‌ను గెలిపించమని చెప్పలేదు గానీ బిజెపిని ఓడించమని ప్రచారం చేశారు. అంటే బిజెపి మీద ఎవరు గెలిచే సత్తా వుంటే వారిని గెలిపించమన్నదే దాని అంతరార్ధం. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య అంతరం మరింత పెరిగింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో ఏదో ఒక చీలిక, సంక్షోభానికి తెరలేపనున్నదనే వార్తలు గుప్పుమంటున్నాయి. వుక్రోషంతో బిజెపి అందుకు పాల్పడినా ఆశ్చర్యం లేదు. అయితే అలాంటిదేదో జరగాలని తెలుగుదేశం కూడా అంతరంగంలో కోరుకుంటున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదాపై బిజెపి ద్రోహం చేసిందనే ప్రచారం చేస్తున్న ఆ పార్టీనేతలపై కొత్త కేసులు పెట్టినా పాత కేసులను తిరగదోడినా తమపై వేధింపులకు పూనుకుందంటూ బాధిత ఫోజు పెట్టి జనం ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి. కర్ణాటకలో తమ గురించి గొప్పలు చెప్పుకుంటున్న బిజెపికి, ఇతర పార్టీలకు గత ఎన్నికలలో వచ్చిన ఓట్ల, సీట్ల వివరాలు ఇలా వున్నాయి.పార్టీల వారీ వచ్చిన ఓట్ల శాతం,బ్రాకెట్లలోని అంకెలు వచ్చిన సీట్ల సంఖ్య)

సంవత్సరం బిజెపి            కాంగ్రెస్‌          జెడి(ఎస్‌)    ఇతరులు

2004    28.33(79) 35.27(65)   20.77(58) 15.3(22)

2008    33.86(110) 35.13(80)  19.44(28) 11.57(6)

2013     19.90(40) 36.60(122)  20.20(40) 24.40(22)

2018      36.20(104) 38.00(78)  18.40(38) 7.40 (2)

లోక్‌సభ ఎన్నికలు కర్ణాటక ఓట్లు సీట్ల వివరాలు

2009 41.63(19) 37.5(6) 13.57(3) 5.20(0)

2014 43.00(17) 40.80(9) 11.00(2) 5.20(0)

నరేంద్రమోడీ, అమిత్‌ షా మాజిక్‌ లేనపుడు, అసలు వారెవరో కర్ణాటక ఓటర్లకు తెలియనపుడే 2009లోక్‌సభ ఎన్నికలలో గరిష్టంగా ఆ పార్టీకి 41.63శాతం ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలలో 43శాతం ఓట్లు వచ్చాయి. అది ఇప్పుడు 36.2శాతానికి పడిపోయింది. నరేంద్రమోడీ, అమిత్‌ షాపర్యటన కారణంగా బిజెపి పెరిగిన ఓటింగ్‌ శాతమేమీ లేదు, అలాగని రాహుల్‌ గాంధీ ప్రచారం కారణంగా కాంగ్రెస్‌కు తగ్గిందేమీ లేదు. 2014 పార్లమెంట్‌ ఎన్నికలలోనే ఎడ్డియూరప్ప, గాలి సోదరులు అండ్‌కో కలిసిన కారణంగా బిజెపి ఓటింగ్‌ 43శాతానికి పెరిగి ఈ అసెంబ్లీ ఎన్నికలలో 36.2శాతానికి తగ్గింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అనూహ్య మలుపులు తిరిగిన కర్ణాటక వుదంతం !

17 Thursday May 2018

Posted by raomk in BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

BJP, Congress, jds, karnataka developments, karnataka politics, karnataka votes 2018, unexpected twist in karnataka developments

Image result for Karnataka government formation

ఎం కోటేశ్వరరావు

స్వతంత్ర భారత చరిత్రలో ఒక తీవ్రమైన అంశాన్ని దేశ అత్యున్నత న్యాయ స్ధానం అర్ధరాత్రి విచారణకు స్వీకరించి తెల్లవారు ఝామున ఒక తాత్కాలిక నిర్ణయాన్ని ప్రకటించి, తదుపరి విచారణ కొనసాగింపునకు నిర్ణయించటం బహుశా ఇదే ప్రధమం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ రాని స్ధితిలో 117 మంది బలంతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చిన కాంగ్రెస్‌-జెడిఎస్‌ను కాదని 104 స్ధానాలున్న బిజెపిని ఆహ్వానించటం చట్టవిరుద్ధమంటూ కాంగ్రెస్‌ సుప్రీం కోర్టు తలుపు తట్టింది, ఇది అనూహ్యమైన మలుపు. గతంలో కొన్ని కేసులలో వచ్చిన తీర్పులు, సంప్రదాయాల మార్గదర్శనం వున్నప్పటికీ గవర్నర్లు తమ విచక్షణ, వివేచనను వినియోగించిన తీరు పిచ్చివాడి చేతిలో రాయిలా ఎవరెలా వినియోగిస్తారో తెలియని స్ధితిని ముందుకు తెచ్చింది. గవర్నర్ల విచక్షణ అధికారాలకు కూడా నిర్ధిష్ట మార్గదర్శక సూత్రాలను ఏర్పాటు చేస్తూ రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం కనిపిస్తోంది. అందువలన ఈ కేసు తీర్పు లేదా నిర్ణయం పర్యవసానాలు రాజకీయ పార్టీలు, రాజ్యాంగ ప్రతినిధులుగా పరిరక్షకులుగా వుండాల్సిన గవర్నర్ల వ్యవస్ధ మీద, రాజ్యాంగానికి, గవర్నర్ల విచక్షణకు వున్న పరిమితుల మీద భాష్యం చెప్పి దానిని కాపాడాల్సిన న్యాయవ్యవస్ధ మీద ఎలా పడతాయో చూడాల్సి వుంది. ఏ వ్యవస్ధకూ దురుద్ధేశ్యాలను ఆపాదించటం లేదు గాని అవి పని చేస్తున్న తీరును విమర్శించే అవకాశం వుండటం ప్రజాస్వామ్య వ్యవస్ధ లక్షణం. అందుకు కోర్టు తీర్పులు కూడా మినహాయింపు కాకూడదు.

రాజ్యాంగానికి భాష్యం చెప్పాల్సిన వుదంతంలో ఈ కేసులో సీనియర్‌ న్యాయమూర్తులను వదలి జూనియర్లతో బెంచ్‌ ఏర్పాటు చేయటం కూడా ఇదే ప్రధమం. గవర్నర్‌ కార్యాలయం నుంచి అధికారికంగా వర్తమానం రాకముందే ముఖ్య మంత్రి ప్రమాణ స్వీకారం గురించి బిజెపి సామాజిక మాధ్యమంలో ప్రకటించటం కూడా ఇదే ప్రధమం. ప్రత్యర్ధులు కోర్టుకు వెళుతున్నారని తెలిసి దానికి అవకాశం లేకుండా చేసేందుకు సాధారణంగా కోర్టు సమయం ముగిసిన తరువాత గవర్నరు లేఖ రాయటం, మరుసటి రోజు కోర్టును తెరవక ముందే ప్రమాణ స్వీకారానికి పూనుకోవటం కూడా ఇదే ప్రధమం. ఇదంతా తెరవెనుక ఒక పధకం ప్రకారమే జరిగినట్లు కనిపిస్తోంది.

గవర్నర్‌ నిష్పాక్షితను ఎవరూ ప్రశ్నించకుండా వుండాలంటే రెండు పక్షాలు తమకే బలం వుందని చెబుతున్నపుడు, ఒక పక్షంలోని పేర్లు మరొక పక్షం జాబితాలో కనిపిస్తున్నపుడు గవర్నరు తన ముందు హాజరై సంఖ్యానిరూపణ చేసుకోమని ఎందుకు కోరలేదు. కర్ణాటక వుదంతం దేశ చరిత్రలో మరో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది.

తమకు మెజారిటీ మద్దతు వుందని చెప్పుకుంటున్న పార్టీ నేతను బుధవారం మధ్యాహ్నం లోగా జాబితాను సమర్పించాలని సుప్రీం కోర్టు కోరింది. బిజెపి నేతగా ఎన్నికైన ఎడ్డియూరప్ప గవర్నర్‌కు ముందు ఇచ్చిన జాబితాలో ఎన్నిపేర్లున్నాయి, బిజెపిగాకుండా ఇతర పార్టీలవి, ఇండిపెండెంట్లవి ఎన్ని వున్నాయన్నది ఆసక్తికర అంశం. ఒక లేఖ కాకుండా రెండు ఇచ్చారా అన్నది కొందరి సందేహం. మరోవైపు కాంగ్రెస్‌ -జెడిఎస్‌ అందచేసిన జాబితాలో 117 పేర్లు వున్నట్లు ఆ పార్టీనేతలు పేర్కొన్నారు.

ఇరు పక్షాలు ఇచ్చిన లేఖలు, జాబితాలను చూసిన గవర్నర్‌ తన ‘విచక్షణ ‘ అధికారాన్ని వినియోగించినట్లు కనిపిస్తోంది తప్ప జాబితాల్లో పేర్ల తకరారును నిర్ధారించుకొనేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. తమ మద్దతుదార్లందరినీ స్యయంగా గవర్నరు ముందు ప్రవేశపెడతామని కాంగ్రెస్‌-జెడిఎస్‌ చెప్పినప్పటికీ గవర్నర్‌ అంగీకరించలేదంటే, ముందే ఒక నిర్ణయానికి వచ్చారా అన్నది ఒక ప్రశ్న. ఎడ్డి యూరప్ప తన బల నిరూపణకు వారం రోజులు గడువు ఇమ్మని కోరినట్లు వార్తలు రాగా గవర్నరు పదిహేను రోజులు ఇచ్చారు. బల నిరూపణకు ఎడ్డి యూరప్ప గడువును కోరటం అంటే అధికారాన్ని అప్పగించమని కోరే సమయంలో తమకు పూర్తి మెజారిటీ లేదని అంగీకరిస్తూ, కొందరు మద్దతు ఇస్తామని చెప్పినందున గడువు ఇమ్మని కోరటం తప్ప మరొకటి కాదు. ఎన్నికల ఫలితాల నోటిఫికేషన్‌ తరువాత ఏ రాజకీయ పార్టీలోనూ నిబంధనలకు అనుగుణ్యంగా ఎలాంటి చీలికలు లేవు. అలాంటపుడు ఇతర పార్టీల వారు తమకు మద్దతు ఇస్తున్నారని చెబితే గవర్నర్‌ నమ్మటం ఏమిటి? ఎడ్డి యూరప్ప చెప్పారు, ఈ గవర్నర్‌ నమ్మారు అది అంతే అంటారా ?

గవర్నర్‌లు పాలకపార్టీల వారే గనుక వారు ఎక్కడ స్టాంపు వేయమంటే అక్కడ స్టాంపు వేస్తారని గతంలో కాంగ్రెసు, ఇపుడు బిజెపి నియమిత గవర్నర్లు నిరూపించారు. అనూహ్యంగా ఇప్పుడు బంతి కోర్టుకు వచ్చింది. గవర్నరు విచక్షణ అధికారాన్ని తాము ప్రశ్నించలేం, అందువలన దీనిలో ఎలాంటి జోక్యం చేసుకోం అని కేసును అంతటితో ముగిస్తే కధ వేరుగా వుండేది. గవర్నరు చర్యమీద, ఎడ్డి యూరప్ప ప్రమాణ స్వీకారం మీద స్టే ఇవ్వకుండా ఫిర్యాదును విచారించేందుకు పూనుకోవటం బహుశా బిజెపి వూహించి వుండదు.

అధికారాన్ని కోరిన రెండు పక్షాలు ఇచ్చిన జాబితాలను తమకు సమర్పించాలని కోర్టు కోరటం అంటే వాటిలోని నిజానిజాలను తేల్చేందుకు పూనుకోవటమే. ఇప్పటికే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక మిశ్రా తీరుతెన్నులపై సుప్రీం కోర్టు సీనియరు న్యాయమూర్తులే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు వారిని పక్కన పెట్టి ఈ కేసులో జూనియర్లతో బెంచిని ఏర్పాటు చేశారు. వారు ఇచ్చే తీర్పు కీలకం కానుంది.

గతంలో ఇదే ఎడ్డి యూరప్ప తనకు 110 సీట్లు వచ్చినపడు, కొంత మంది ఇండిపెండెంట్లను తన వైపుకు తిప్పుకోవటం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్ట వేటు పడకుండా ఇతర పార్టీల సభ్యులను సభకు హాజరు కాకుండా చేసి తన మెజారిటీని నిరూపించుకొని తరువాత వారిచేత రాజీనామా చేయించి తన సర్కారును కాపాడుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలలో ఫిరాయింపుదార్లను ఏకంగా మంత్రివర్గంలో చేర్చుకున్నప్పటికీ వారి మీద పిరాయింపు నిరోధక చట్టవేటు పడలేదు, వారి గురించి స్పీకర్లు ఎటూ తేల్చలేదు. అదే వ్యూహాన్ని కర్ణాటకలో కూడా అనుసరించేందుకు బిజెపి పూనుకుందా ? అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు ఇక్కడి పరిస్ధితికి తేడా వుంది. అక్కడ మెజారిటీ పక్షాలే ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. తమకు అదనపు బలం అవసరం లేకపోయినా ఏదో ఒకసాకుతో ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించాయి. కర్ణాటకలో పరిస్ధితి భిన్నం. గతంలో మాదిరే ఇతర పార్టీల సభ్యులను కొందరిని లోపాయకారీగా కూడగట్టుకొని గట్టెక్కాలన్నది బిజెపి ఎత్తుగడ. గత అనుభవాల రీత్యా కాంగ్రెస్‌-జెడిఎస్‌ ముందు చూపుతో తమ జాగ్రత్తలు తాము తీసుకున్నాయి. అయితే సభలో బలనిరూపణ సమయంలో పార్టీ విప్‌ను ధిక్కరించి వ్య తిరేకంగా ఓటు వేసే లేదా వేయకుండా వుండే అవకాశం వుంది.

ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి ముందే, బలపరీక్ష జరగక ముందే వివాదం కోర్టుకు వెళ్లింది. సభ ఇంకా ఏర్పడ లేదు, సభ్యులు ప్రమాణ స్వీకారమే చేయలేదు. కోర్టు విచారణ సమయానికి ఏ సభ్యుడూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించలేదు. ప్రమాణ స్వీకారంపై స్టే ఇవ్వకుండా కేసు విచారణ చేస్తామని కోర్టు చెప్పటం అంటే సదరు ప్రమాణ స్వీకారం తమ తీర్పుకు లోబడి వుండాలనటం తప్ప వేరు కాదు.

కోర్టు తీర్పు పర్యవసానాలు ఏమిటి? గత తీర్పుల ప్రకారం మెజారిటీ వున్న కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని గనుక తీర్పు వస్తే మన కోర్టుల మీద జనంలో మిగిలి వున్న కొద్దో గొప్పో నమ్మకం బలపడుతుంది. ఒక వేళ గవర్నర్‌ విచక్షణ అధికారాలలో తాము జోక్యం చేసుకోలేం అని ప్రకటిస్తే రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్ల వ్యవస్ధను గబ్బు పట్టించటాన్ని కోర్టులు కూడా ఏమీ చేయలేవు అని వాటి మీద వున్న విశ్వాసాన్ని జనం కోల్పోతారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్‌, విజిలెన్స్‌, సిబిఐ, ఇతర అనేక సంస్ధలు పాలకుల చేతుల్లో సాధనాలుగా మారాయనే విమర్శలు ఎదుర్కొంటున్న నేపధ్యంలో ఈ కేసు న్యాయవ్యవస్ధకు ఒక అగ్నిపరీక్ష వంటిదే ! ఎలాగైనా అధికారానికి అంటి పెట్టుకొని వుండేందుకు కాంగ్రెస్‌, జెడిఎస్‌ సభ్యులను ఆత్మసాక్షి ప్రబోధానుసారం ఓటు వేయమని కోరతానని ఎడ్డియూరప్ప ప్రకటించారు. గతంలో తమ పార్టీ ప్రతిపాదించిన రాష్ట్రపతి పదవి అభ్యర్ధిని ఓడించేందుకు ఇందిరా గాంధీ ఆత్మప్రబోధానుసారం ఓటు వేయమని పిలుపు నిచ్చి ఒక తప్పుడు సాంప్రదాయానికి తెరతీశారు. ఇప్పుడు అది చెల్లదు, పార్టీ ఫిరాయింపుల చట్ట ప్రకారం అలాంటి ఓటింగ్‌ చెల్లదని తెలిసినా ఎడ్డి యూరప్ప ఆ పిలుపు ఇవ్వటం తమకు బలం లేదని అంగీకరించటమే. ఆవు ఎక్కడ కట్టినా తమ దొడ్లో ఈనితే చాలు అనుకున్నట్లుగా ఏ పార్టీ తరఫున గెలిచినా తమకు మద్దతు ఇస్తే చాలు అన్నట్లుగా ప్రవర్తిస్తున్న బిజెపి డబ్బు, ఇతర ప్రలోభాలను ఎరచూపి, బెదిరింపులకు పాల్పడి రాజకీయంగా మరింతగా విమర్శల పాలు కావటం ఖాయం. అటు కేంద్రంలో నరేంద్రమోడీపై ఇప్పటికే వున్న మచ్చలకు తోడు ఇది మరొకటి తోడు కావటం తప్ప అదనంగా ఒరిగేదేమీ లేదు. ఈ వుదంతం చివరికి ఎలా పరిష్కారం అవుతుందో తెలియదు. ఒక వేళ కోర్టు తీర్పు ఎడ్డికి అనుకూలంగా వస్తే న్యాయవ్యవస్ధను కూడా బిజెపి ప్రభావితం చేసిందని జనం భావించే అవకాశం వుంది. అనూహ్యంగా ఎడ్డికి అవకాశం ఇవ్వటం రాజ్యాంగ విరుద్దమని తీర్పు ఇస్తే బిజెపికి అది పెద్ద భంగపాటు. ఏది జరిగినా మరికొద్ది నెలల్లో జరిగే రాజస్దాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ ఘడ్‌ ఎన్నికలపై దాని ప్రభావం పడుతుంది.

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇజ్రాయెల్‌, అమెరికా బరితెగింపు.. పాలస్తీనియన్లపై మారణకాండ!

16 Wednesday May 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Gaza Deaths, Israel, israel massacre, Nakba day, Palestinians, US embassy moves to Jerusalem

Image result for israel and us is responsible for gaza massacre
మాతృభూమి, దాస్య విముక్తి కంటే మరొకటి అవసరం లేదని పసితనం నుంచే ఎత్తిన జెండా దించబోమంటున్న పాలస్తీనా బాలలు

ఎం. కోటేశ్వరరావు

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌, దాని దుండగాలకు వెన్నుదన్నుగా అమెరికా మరోసారి పాలస్తీనియన్లపై దమనకాండకు పాల్పడ్డాయి. వాటి దుష్ట చరిత్రలో సోమవారం మరో చీకటి దినం. మధ్యవర్తి నంటూ ఒకవైపు ఫోజు పెడుతూనే నిస్సిగ్గుగా ఇజ్రాయెల్‌ వైపు నిలవటమే గాక దమనకాండపై దర్యాప్తు జరపాలన్న కనీస ప్రజాస్వామిక డిమాండ్‌ కూడా భద్రతామండలిలో ప్రవేశపెట్టేందుకు అమెరికా తిరస్కరించింది. పాలస్తీనియన్ల భూభాగమైన జెరూసలెంను ఆక్రమించేందుకు ఇజ్రాయెల్‌ రూపొందించిన పధకాన్ని అమలు జరిపేందుకు పూనుకుంది. దానికి నిరసన తెలిపిన నిరాయుధులైన సామాన్య ప్రజానీకంపై ఇజ్రాయెల్‌ మిలిటరీ జరిపిన మారణకాండలో ఎనిమిదినెలల పసిపాప సహా 60మంది మరణించగా 2,700మందికిపైగా గాయపడినట్టు వార్తలు వచ్చాయి. తూర్పు జెరూసలెం పట్టణానికి తమ ఇజ్రాయెల్‌ దౌత్యకార్యాలయాన్ని తరలిస్తామని రక్తపిపాసి డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించినప్పుడే ఈ మారణకాండకు బీజం పడింది. కాగా ఈ మారణకాండపై దర్యాప్తు జరపాలని కోరేందుకు మంగళవారం నాడు సమావేశమైన భద్రతా మండలిని అమెరికా అడ్డుకుంది. కువాయిట్‌ రూపొందించిన ఈ తీర్మానంలో సోమవారంనాటి దారుణంపై విచారణ జరపాలని కోరింది. జెరూసలెంలో రాయబార కార్యాలయాల ఏర్పాటు వద్దంటూ గతంలో చేసిన భద్రతా మండలి తీర్మానానికి అన్ని దేశాలు కట్టుబడి ఉండాలన్న విజ్ఞాపన కూడా దానిలో ఉంది. సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టరాదని అమెరికా అభ్యంతరం తెలిపింది. యూదులు, ముస్లింలు, క్రైస్తవులకు కూడా ఆరాధనా కేంద్రమైన జెరూసలెం పట్టణంపై అంతిమంగా ఒక నిర్ణయం తీసుకొనే వరకు ఎలాంటి వివాదాస్పద చర్యలకూ పాల్పడవద్దన్నది ప్రపంచ రాజ్యాల ఏకాభిప్రాయం. దానికి అమెరికా తూట్లు పొడిచింది. సోమవారంనాడు మరణించిన తమ సహచరుల అంత్యక్రియలకు పెద్ద ఎత్తున పాలస్తీనియన్లు హాజరై మరోమారు తమ నిరసన తెలిపారు.
ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు ఏర్పాటు కావాల్సిన స్వతంత్ర పాలస్తీనాకు తూర్పు జెరూసలెం పట్టణాన్ని తమ రాజధానిగా చేసుకోవాలన్నది పాలస్తీనియన్ల చిరకాల వాంఛ. సరిగ్గా 70ఏండ్ల క్రితం పాలస్తీనాను రెండుగా విభజించి యూదులు మెజారిటీ ఉన్న ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌గా ఏర్పాటు చేయాలన్నది ఐరాస తీర్మానం. ఇజ్రాయెల్‌ అయితే ఏర్పడింది. అంతవరకు ఉనికిలో ఉన్న పాలస్తీనా ఉనికిలో లేకుండా పోయింది. లక్షలాది మంది అరబ్బులు తమ నివాసాల నుంచి గెంటివేతకు గురై ఇప్పటికీ చుట్టుపక్కల దేశాలలో తలదాచుకుంటున్న అన్యాయం కొనసాగుతోంది. 1948కి ముందే ఒక పధకం ప్రకారం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలించిన యూదులు, సామ్రాజ్యవాద దేశాల ఆయుధాలు, అండదండలతో ఇజ్రాయెలీ సాయుధమూకలు పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకున్నాయి. వ్యతిరేకించిన లక్షలాదిమంది అరబ్బును వారి నివాస ప్రాంతాల నుంచి తరిమివేశాయి. పాలస్తీనా ప్రభుత్వం, పాలనకు తిలోదకాలిచ్చి మొత్తం ప్రాంతాన్ని ఒక నిర్బంధశిబిరంగా మార్చివేసింది. అప్పటి నుంచి పాలస్తీనా ప్రాంతాలను ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటూ జనాభారీత్యా వాటి రూపురేఖలనే మార్చి వేసి అవికూడా యూదు ప్రాంతాలేనంటూ వాటిని కూడా తమకు అప్పగించాల్సిందే అని చెబుతోంది. తమ పౌరులకు రక్షణ పేరుతో ఆక్రమిత ప్రాంతాలలో యూదుల శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసింది.
ఈ ఆక్రమణలో భాగంగానే 1948లో అరబ్బులు మెజారిటీ ఉన్న జెరూసలెం పట్టణ ఆక్రమణకు పూనుకుంది. ఆ క్రమంలో దాని రక్షణకు వచ్చిన జోర్డాన్‌ తూర్పు జెరూసలెం ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. పశ్చిమ జెరూసలెంను ఆక్రమించుకున్న ఇజ్రాయెల్‌ 1967లో ఇరుగుపొరుగు అరబ్బు దేశాలతో యుద్ధానికి తలపడి తూర్పు జెరూసలెంను కూడా ఆక్రమించుకుంది. 1980లో ఏకపక్షంగా తనకు తానే జెరూసలెం చట్టాన్ని చేసినట్టు ప్రకటించుకొని అధ్యక్ష, ప్రధాని నివాసం, పార్లమెంట్‌, సుప్రీం కోర్టు అనేక ప్రభుత్వ కార్యాలయాలను అక్కడికి తరలించి కబ్జాకు చట్టబద్దత కల్పించేందుకు పూనుకుంది. ఆ పట్టణం అవిభక్తమని మొత్తం తమదే అని ప్రకటించుకుంది. అయితే జెరూసలెం పాలస్తీనియులదే అని అంతర్జాతీయ సమాజం అనేక రూపాలలో ఇజ్రాయెల్‌ చర్యను ఖండించింది. దాని స్ధాయి నిర్ణయించేంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరింది. దానికి అనుగుణ్యంగానే ఇజ్రాయెల్‌ ప్రభుత్వాన్ని గుర్తించిన దేశాలన్నీ తమ రాయబార కార్యాలయాలను రాజధాని టెల్‌ అవీవ్‌లో ఏర్పాటు చేశాయి.

Image result for gaza massacre 2018

ఇజ్రాయెల్‌ దాడులలో పుట్టి దాడుల మధ్య పెరిగిన పాలస్తీనా బిడ్డలందరికీ బాష్పవాయువు ప్రయోగాన్ని అధిగమించేందుకు వుల్లిపాయ ముక్కుల వద్ద పెట్టుకోవాలని పాలతో పాటు తల్లి పసితనం నుంచే నేర్పిస్తుంది

      జెరూసలెం వివాదం కొనసాగుతుండగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తమ రాయబార కార్యాలయాన్ని ఆ నగరానికి తరలిస్తున్నట్టు ప్రకటించి సరికొత్త వివాదానికి తెరలేపాడు. ఆ ప్రకటన వెలువడినప్పుడే పాలస్తీనియన్లతో అనేకమంది నిరసన, వ్యతిరేకత వ్యక్తం చేశారు. మార్చి నెల నుంచి ప్రతి శుక్రవారం పాలస్తీనియన్లు నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. అప్పటి నుంచి ఆదివారంనాటి వరకు వివిధ సందర్భాలలో ఇజ్రాయెలీ భద్రతా సిబ్బంది జరిపిన దాడులలో కనీసం 84మంది పాలస్తీనియన్లు మరణించారు. అందువలన రాయబార కార్యాలయం ప్రారంభించే రోజు మరింత తీవ్రంగా, పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ఉంటాయని తెలిసినప్పటికీ ఎలాంటి చర్యతీసుకోకుండా సాగించిన ఈ మారణకాండను యావత్‌ ప్రపంచం ఖండించింది. ఆ రోజు మరో 60మంది మరణించారు. వ్యతిరేకతను ఖాతరు చేయకుండా సరిగ్గా 70ఏండ్ల క్రితం ఇజ్రాయెల్‌ ఏర్పడిన రోజునే జెరూసలెం కబ్జాను ఖరారు చేస్తూ అక్కడ సోమవారంనాడు రాయబార కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ట్రంప్‌ తన కుమార్తె, సలహాదారుగా వేసుకున్న ఆమె భర్త తదితరులను పంపించాడు. ఆ చర్యను నిరసిస్తూ పాలస్తీనా గాజా ప్రాంతంలోని అరబ్బు జాతీయులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అక్కడి సరిహద్దు కంచెను దాటి తమ భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించారని, హింసాకాండకు పాల్పడ్డారనే పేరుతో విచక్షణారహితంగా తొలిసారిగా డ్రోన్ల ద్వారా బాష్పవాయు ప్రయోగం, కాల్పులకు తెగబడటంతో 60మంది ప్రాణాలు కోల్పోవటంతో పాటు 2700 మంది గాయపడ్డారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.

Image result for gaza massacre 2018

కలేజా, కాంక్ష వుండాలే గాని కాళ్లు లేకపోతేనేం మాతృభూమి కోసం నేను సైతం అంటూ వడిశలతో ప్రతిఘటిస్తున్న పాలస్తీనా యువకుడు

     పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్‌ భద్రత, పోలీసు బలగాలు, యూదు దురహంకారులు దాడులు చేయటం, అవమానించటం, ఆర్థికంగా దెబ్బతీయటం నిత్యకృత్యం. ఇటీవలి కాలంలో ఒకే రోజు ఇంతమంది అరబ్బులు మరణించటం, గాయపడటం ఎప్పుడూ జరగలేదు. సోమవారం నాటి మారణకాండకు నిరసనగా మంగళవారం నాడు పలుచోట్ల నిరసన వ్యక్తమైంది. దక్షిణాఫ్రికా, టర్కీ నిరసనగా ఇజ్రాయెల్‌ నుంచి తమ రాయబారులను వెనక్కు రప్పించాయి. ఇజ్రాయెల్‌ రాయబారిని పిలిపించి ఐర్లండ్‌ తన నిరసన తెలిపింది. అనేక దేశాలు అభ్యంతరం తెలిపాయి. దీని గురించి భద్రతామండలి సమావేశం కానుంది. కొద్ది రోజుల క్రితం ఇరాన్‌తో కుదిరిన అణుఒప్పందాన్నుంచి ఏకపక్షంగా వైదొలుగుతున్నట్టు అమెరికా ప్రకటించింది. అది జరిగిన వెంటనే సిరియాలోని ఇరాన్‌ మిలిటరీ కేంద్రాలపై ఇజ్రాయెల్‌ దాడి చేసింది. దానికి ప్రతిగా ఇరాన్‌ కూడా ప్రతిదాడులు చేసింది. రాయబార కార్యాలయ ఏర్పాటు చర్య కూడా ఇరాన్‌, సిరియా, తదితర పశ్చిమాసియా అరబ్బు, ముస్లిం దేశాలను రెచ్చగొట్టటం, అక్కడ మండుతున్న ఆరని అగ్నిని మరింత ఎగదొయ్యటం తప్ప మరొకటి కాదు. ఇజ్రాయల్‌లో జరిగిన అనేక అవినీతి అక్రమాల గురించి జనాన్ని పక్కదారి పట్టించేందుకు పాలకపార్టీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. గాజా నది పశ్చిమ గట్టు, తూర్పు జెరూసలెం, సిరియా నుంచి ఆక్రమించుకున్న గోలన్‌ గుట్టలలో గత ఐదు దశాబ్దాలలో యూదుల నివాసాలను లక్షా 60వేల నుంచి ఆరులక్షలకు పెంచింది. గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్‌ సైన్యాన్ని ఉపసంహరించి నామమాత్ర పాలస్తీనా స్వయంపాలిత ప్రభుత్వానికి అప్పగించినప్పటికీ దాన్నొక బహిరంగ జైలుగా మార్చివేసింది. దాన్నుంచి బయటకు పోవాలన్నా, ఎవరైనా లోపలికి రావాలన్నా ఇజ్రాయెల్‌ అనుమతి తీసుకోవాల్సిందే. పాలస్తీనా విముక్తి ఉద్యమంలో గాజాకు ఒక ప్రత్యేకత ఉంది. అన్ని రకాల ఉద్యమాలు, పీఎల్‌ఓ అధినేత యాసర్‌ అరాఫత్‌ ఇక్కడ పుట్టిన వ్యక్తే. తిరుగుబాటు, అన్యాయాన్ని ప్రతిఘటించటం ఆ గడ్డలోనే ఉంది. తాజా పరిస్థితికి వస్తే అనేక పార్టీలు, సంస్థలు వాటి అనుబంధాలకు అతీతంగా ఒక ప్రజా ఉద్యమంగా గత కొద్ది వారాలుగా జెరూసలెం పాలస్తీనియన్లదే అని ఎలుగెత్తి చాటుతూ ప్రదర్శనలు చేస్తున్నారు.
తన దురాక్రమణకు ఆమోద ముద్రవేయించుకొనేందుకు తమతో దౌత్య సంబంధాలున్న దేశాలన్నీ తమ రాయబార కార్యాలయాలను జెరూసలెంకు తరలించాలని ప్రధాని నెతన్యాహు పిలుపునిచ్చాడు. జెరూసలెం మాత్రమే యూదులకు రాజధాని అని ప్రకటించాడు. ఆ దురహంకారికి తాన తందాన అంటూ ట్రంప్‌ అక్కడ రాయబార కార్యాలయ ప్రారంభం సందర్భంగా ముస్లిం వ్యతిరేక మతాధికారి రాబర్ట్‌ జఫ్‌రెస్‌తో ప్రార్ధనలు చేయించి అరబ్బులను మరింతగా రెచ్చగొట్టారు. పశ్చిమాసియాలో తన ఆర్థిక, రాజకీయ వ్యూహాన్ని అమలు జరిపేందుకు ఇజ్రాయెల్‌ను ఒక గూండాగా అమెరికా వినియోగించుకొంటోంది. దానికి అవసరమైన అధునాతన ఆయుధాలను అందించటంతో పాటు భద్రతా మండలిలో అన్ని విధాలుగా ఆదుకుంటోంది. అనేక వందల తీర్మానాలను ఇప్పటి వరకు వీటో చేసింది. ఏటా నాలుగు బిలియన్‌ డాలర్ల వంతున ఇప్పటి వరకు 135 బిలియన్‌ డాలర్లు సాయం పేరుతో యూదు దురహంకారులకు అందచేసింది. రెండు అంటే పాలస్తీనా, ఇజ్రాయెల్‌ దేశాలను ఏర్పాటు చేయాలన్న తీర్మానానికి తాము కట్టుబడి ఉన్నామని చెబుతూనే అయితే దానికి రెండు దేశాల ఆమోదమూ లభిస్తేనే అనే షరతు విధిస్తోంది. పాలస్తీనియన్ల నుంచి తమకు రక్షణ కల్పించాలని, అందుకు అవసరమైన భూభాగాలను అదనంగా అప్పగించటంతో పాటు ఇరుగు పొరుగు దేశాల నుంచి రక్షణ హామీలు కావాలంటూ ఆచరణ సాధ్యంగాని డిమాండ్లను ముందుకు తెస్తూ ఇజ్రాయెల్‌ పాలకులు పాలస్తీనా ఏర్పాటు అడ్డుకుంటున్నారు. చాలా కాలం పాటు తటస్ధంగా వున్నట్టు నాటకమాడిన అమెరికా ట్రంప్‌ హయాంలో దానికి స్వస్తి పలికి బహిరంగంగా తాము యూదు దురహంకారులవైపే ఉన్నట్టు తాజా చర్యతో లోకానికి చాటింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కర్ణాటక అంకెలు చెబుతున్న నిజాలు- అబద్దాలు చెబుతున్న బిజెపి నేతలు !

15 Tuesday May 2018

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP leaders lies, Karnataka Legislative Assembly election 2018, karnataka votes 2018, karnataka votes facts

ఎం కోటేశ్వరరావు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అధికారం ఎవరికి అన్న బంతి గవర్నరు కోర్టులో వుంది. ఆ కోర్టును నియంత్రించేది బిజెపి కేంద్ర నాయకత్వం అన్నది అనధికార నిజం. గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గోవా గవర్నరు చేసిందాని ప్రకారం కాంగ్రెస్‌-జెడిఎస్‌ కూటమి మెజారిటీని గుర్తించి ప్రభుత్వ ఏర్పాటకు ఆహ్వానిస్తారా లేక అతి పెద్ద పార్టీకి ముందు అవకాశం ఇవ్వటం సబబు అంటూ బిజెపిని గద్దెనెక్కిస్తారా అన్నది చూడాల్సి వుంది. గోవా సాంప్రదాయాన్ని అనుసరిస్తే బిజెపి ప్రతిపక్షంలో కూర్చోవాలి. లేదూ బిజెపిని ఆహ్వానించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించి బేరసారాలకు, ఇతర ప్రలోభాలకు తెరలేపుతారా ? అదే జరిగితే మరోసారి బిజెపి రాజకీయంగా గబ్బుపట్టటం ఖాయం.

ఇక బిజెపికి వచ్చిన సీట్ల గురించి ఎవరేమన్నారు? ఇది బిజెపికి చారిత్రాత్మక విజయం: చత్తీస్‌ఘర్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో మా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా మరోసారి చరిత్రను సృష్టించారు: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఇది ఎంతవరకు నిజం ? 2004,08,13,18లో జరిగిన ఎన్నికల అంకెలేమి చెబుతున్నాయో ముందు చూద్దాం.పార్టీల వారీ వచ్చిన ఓట్ల శాతం,బ్రాకెట్లలోని అంకెలు వచ్చిన సీట్ల సంఖ్య)

సంవత్సరం      బిజెపి        కాంగ్రెస్‌          జెడి(ఎస్‌)  ఇతరులు

2004     28.33(79)   35.27(65)   20.77(58)   15.3(22)

2008    33.86(110)   35.13(80)   19.44(28)  11.57(6)

2013    19.90(40)    36.60(122)   20.20(40) 24.40(22)

2018    36.20(104)  38.00(78)     18.40(38) 7.40 (2)

లోక్‌సభ ఎన్నికలు కర్ణాటక ఓట్లు సీట్ల వివరాలు

2009    41.63(19)     37.5(6)       13.57(3) 5.20(0)

2014    43.00(17)    40.80(9)      11.00(2) 5.20(0)

పై అంకెలను చూసినపుడు కర్ణాటకలో తాజా ఎన్నికలలో బిజెపి బలం, పెరిగిందో తగ్గిందో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. నరేంద్రమోడీ, అమిత్‌ షా మాజిక్‌ లేనపుడు, అసలు వారెవరో కర్ణాటక ఓటర్లకు తెలియనపుడే 2009లో గరిష్టంగా ఆ పార్టీకి 41.63శాతం ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలలో 43శాతం ఓట్లు వచ్చాయి. అది ఇప్పుడు 36.2శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ ఓటింగ్‌లో పెద్ద మార్పులేమీ లేకుండా కొనసాగటాన్ని చూడవచ్చు.జెడిఎస్‌ బలం కూడా, అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు ఒకే విధంగానూ, పార్లమెంట్‌ ఎన్నికలలోనూ ఒకే విధంగా వుండటాన్ని చూడవచ్చు. నరేంద్రమోడీ, అమిత్‌ షాపర్యటన కారణంగా బిజెపి పెరిగిన ఓటింగ్‌ శాతమేమీ లేదు, అలాగని రాహుల్‌ గాంధీ ప్రచారం కారణంగా కాంగ్రెస్‌కు తగ్గిందేమీ లేదు. 2014 పార్లమెంట్‌ ఎన్నికలలోనే ఎడ్డియూరప్ప, గాలి అండ్‌కో కలిసిన కారణంగా బిజెపి ఓటింగ్‌ 43శాతానికి పెరిగి ఈ అసెంబ్లీ ఎన్నికలలో 36.2శాతానికి తగ్గిందన్నది రాజకీయాల్లో ఓనమాలు వచ్చిన వారికి కూడా తెలిసిందే.తొలిసారిగా దక్షిణాదికి ముఖద్వారంగా వున్న కర్ణాటక పాగా వేశామన్నట్లుగా బిజెపి నేతలు చిత్రిస్తున్నారు. దానికి గతంలోనే గరిష్టంగా 110 స్ధానాలు వచ్చి అధికారం వెలగబెట్టి గబ్బుపట్టిన విషయాన్ని మరుగుపరుస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కొరియా శాంతి ఒప్పందం అమలే పెద్ద సమస్య !

04 Friday May 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

inter-Korean agreements, inter-Korean summit, korea peace agreement, North Korean leader Kim Jong-un, Panmunjeom Declaration, South Korean President Moon Jae-in

ఎం కోటేశ్వరరావు

‘ప్రపంచం ద అష్టిలో ఆ రెండు దేశాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది’ అన్నట్లు కనిపించే ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య వారం రోజుల క్రితం ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. దాని పర్యవసానాల గురించి పండితులు చర్చలు చేస్తుండగానే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ అన్‌ భేటీ గురించి వార్తలు వచ్చాయి. ఎప్పుడు ఎక్కడ అన్నది ఇంకా ఖరారు కాలేదు. ఉభయ కొరియాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం అమలు జరగటానికి ముందు అనేక అంశాలపై స్పష్టత రావాల్సి వుంది. రెండు దేశాలను అణు రహితంగా మార్చడం, రెండు దేశాల మధ్య వున్న శత్రుపూరిత కార్యకలపాలకు స్వస్తి పలకడం, ప్రచార దాడులను నిలిపివేసి రెండు దేశాల మధ్య వున్న మిలిటరీ రహిత ప్రాంతాన్ని శాంతి మండలంగా మార్చడం, సరిహద్దు ప్రాంతంలో ఆయుధాల సంఖ్య తగ్గింపు, అమెరికా, చైనాల ప్రమేయంతో చర్చలను ముందుకు తీసుకు పోవటం, కొరియా యుద్ధ సమయం లో విడిపోయిన కుటుంబాలను దగ్గరకు చేర్చటం, సరిహద్దు ప్రాంతంలో రోడ్లు, రైలు మార్గాల నవీకరణ, ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడలతో సహా అన్ని క్రీడలలో సంయుక్త జట్లతో పాల్గనటంపై ఒప్పందం కుదిరింది. 1953లో ఎక్కడైతే కొరియా యుద్ధ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందో, తాత్కాలిక సరిహద్దుగా గుర్తించిన చోట, దక్షిణ కొరియా వైపున వున్న మిలిటరీ రహిత ప్రాంతమైన పాముంజోమ్‌లోని ‘శాంతి నివాసం’లో ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ అన్‌, దక్షిణ కొరియా నేత మూన్‌ జె ఇన్‌ భేటీలో ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ ఒప్పందం కుదరడం ఒక చారిత్రక సంఘటన. అయినప్పటికీ అమలు లోకి రావటం అంత తేలిక కాదని తరువాత వెలువడిన వార్తలు సూచిస్తున్నాయి. దక్షిణ కొరియాలో 1953 నుంచీ తిష్ట వేసిన అమెరికా సేనలను ఉపసంహరించాలన్నది ఉత్తర కొరియా ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్‌. ఒప్పంద సమయంలో దాని ప్రస్తావన లేనప్పటికీ ఆ డిమాండును అది వదులుకుంటుండా అన్నది ప్రశ్న. తమ రక్షణకు హామీ వుంటే అణ్వాయుధాలతో తమకు పని లేదని, అమెరికా సైనికుల ఉపసంహరణను కూడా పెద్దగా పట్టుపట్టబోమని పరోక్షంగా సూచించినట్లు నిర్దారణ కాని వార్తలు వచ్చాయి. అయితే శాంతి ఒప్పందా లకు, తమ దేశంలో వున్న 29 వేల అమెరికన్‌ సైనికుల ఉపసంహరణకు సంబంధం లేదని దక్షిణ కొరియా అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌-కిమ్‌ మధ్య జరగబోయే భేటీ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.దక్షిణ కొరియాలో అమెరికన్‌ సైనికుల సంఖ్య తగ్గింపు గురించి పరిశీలించాలని అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఆలోచనలు గతంలో కూడా జిమ్మీ కార్టర్‌ నుంచి అనేక మంది చేయకపోలేదు. ప్రపంచంలో అనేక చోట్ల పరాజయమే తప్ప విజయాలు లేనపుడు అమెరికా సైనికులను విదేశాలలో వుంచి పెద్ద మొత్తంలో ఎందుకు ఖర్చు చేయాలన్న చర్చ అమెరికాలో చాలా కాలం నుంచి వుంది. దక్షిణ కొరియాలో తిష్టవేసిన సైన్యానికి అయ్యే ఖర్చు తగినంత అమెరికాకు తిరిగి రావటం లేదు. ఆ సైనికులు జపాన్‌కు రక్షణగా వున్నారు తప్ప మరొకటి కాదు. ఇరవైతొమ్మిది వేల మంది సైనికులు పక్కనే వున్నా అమెరికా నుంచి అణ్వస్త్రాలను తెచ్చి దక్షిణ కొరియాలో మోహరించినా, గువాం ప్రాంతంలో బాంబర్లు, పసిఫిక్‌ సముద్రంలో జలాంతర్గాములను మోహరించినా వుత్తర కొరియా అణు, క్షిపణి పరీక్షలను నివారించలేకపోయాయి. వుత్తర కొరియన్లు ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. చేతి చమురు వదలి, పరువు పోగొట్టుకోవటం ఎందుకని కొందరు అమెరికన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాదితో ముగిసే దక్షిణ కొరియాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సైనికులకు ఏడాదికి అయ్యే ఖర్చు 80కోట్ల డాలర్లలో సగమే దక్షిణ కొరియా చెల్లిస్తోంది. మొత్తం ఖర్చు భరించాలని అమెరికా డిమాండ్‌ చేస్తోంది. వారు వున్నా ప్రయోజనం లేనపుడు అంత ఖర్చు తామెందుకు చెల్లించాలన్న ప్రశ్న దక్షిణ కొరియాలోనూ వస్తోంది. వుభయ కొరియాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుకున్న తరువాత అమెరికా సైన్యాల తిష్టను సమర్ధించుకోవటం కష్టం అవుతుందని దక్షిణ కారియా ప్రభుత్వ సలహాదారు మూన్‌ చంగ్‌ ఇన్‌ స్వయంగా చెప్పారు. గతంతో పోలిస్తే దక్షిణ కొరియా సైన్యం కూడా పటిష్టంగా తయారైంది. వుత్తర కొరియా విషయానికి వస్తే అమెరికన్‌ సైనికుల వుపసంహరణ డిమాండ్‌ గురించి తాము పట్టుపట్టకపోవచ్చని కిమ్‌ జోంగ్‌ అన్‌ దక్షిణ కారియా అధికారులతో సూచన ప్రాయంగా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇవన్నీ ఎత్తుగడలలో భాగం.

ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం 1991వరకు వున్నది ఒకటే, రెండు కొరియాలు లేవు.1948లో ఐక్యరాజ్యసమితి దక్షిణ కొరియాను పరిశీలక హోదాలో గుర్తించింది. వుత్తర కొరియాను గుర్తించ నిరాకరించింది. 1950లో దక్షిణ కొరియాపై వుత్తర కొరియా దాడి చేసిందనే ఫిర్యాదు రావటంతో భద్రతా మండలి వుత్తర కొరియాపై చర్య తీసుకోవాలని తీర్మా నించింది. ఆ తీర్మానాన్ని నాటి సోవియట్‌ యూనియన్‌ వీటో చేయలేదు. దాంతో అమెరికా నాయకత్వంలో వుత్తర కొరియాపై దాడి జరిగింది. ఆ దాడిని చైనా సహకారంతో వుత్తర కొరియా తిప్పి కొట్టి తన భూభాగాన్ని నిలుపు కొన్నది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. 1971 వరకు ఐక్యరాజ్యసమితిలో చైనా అంటే నేటి తైవాన్‌ ప్రతినిధిగా వుంది. ఆ ఏడాది చైనాను గుర్తించిన తరువాత తైవాన్‌ సభ్యత్వాన్ని రద్దు చేశారు. కొరియా విషయంలో భిన్నంగా జరిగింది. అది ఐరాస ఏర్పాటు సమయానికి స్వతంత్ర దేశంగా లేదు. 1971లో కమ్యూనిస్టు చైనాకు గుర్తింపు వచ్చిన తరువాత వుత్తర కొరియాకు పరిశీలక హోదా కల్పించారు. తరువాత రెండు దేశాలూ తాము శాంతియుత పద్దతుల్లో విలీనానికి చర్యలు తీసుకుంటామని సంయుక్తంగా ప్ర కటించాయి. తరువాత రెండు దేశాలకు 1991లో శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. విలీస సమస్య పరిష్కారం కాలేదు. నేటి వరకు వరకు వుభయులు ప్రకటనలైతే చేస్తున్నారు గానీ ముందుకు సాగటం లేదు. అందువల్లనే ఆచరణలో మనకు కనిపిస్తున్నది ఒకే దేశం, రెండు వ్యవస్ధలు. వుత్తర కొరియా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణంలో వున్న రెండున్నర కోట్ల జనాభా వున్న దేశం. దీర్ఘకాలం పాటు సైనిక నియంతల పాలనలో తరువాత సైనికాధికారుల కనుసన్నలలో పనిచేసే పౌర పాలకులతో పని చేస్తున్న ఐదు కోట్లకు పైగా జనాభాతో పెట్టుబడిదారీ వ్యవస్ధలో వున్న దేశం దక్షిణ కొరియా.

ప్రపంచం దృష్టి సారించే విధంగా వుభయ దేశాల మధ్య వురుములు మెరుపులతో పాటు పెద్దగా సంప్రదింపుల వాతావరణం కూడా కనపడలేదు. కానీ రెండు దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నట్లు తాపీగా ప్రకటించి ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. అదీ ఎక్కడా 1953లో ఎక్కడైతే కొరియా యుద్ధ కాల్పుల విరమణ ఒప్పందం కుదరిందో, తాత్కాలిక సరిహద్దుగా గుర్తించిన చోట, దక్షిణ కొరియా వైపున వున్న మిలిటరీ రహిత ప్రాంతమైన పాముంజోమ్‌లోని ‘శాంతి నివాసం’లో వుత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ అన్‌, దక్షిణ కొరియా నేత మూన్‌ జె ఇన్‌ భేటీలో ఒప్పందంపై సంతకాలు చేశారు.

రెండు దేశాలను అణురహితంగా మార్చటం, రెండు దేశాల మధ్య వున్న శత్రుపూరిత కార్యకలపాలకు స్వస్ధి పలకటం, ప్రచార దాడులను నిలిపివేసి రెండు దేశాల మధ్య వున్న మిలిటరీ రహిత ప్రాంతాన్ని శాంతి మండలంగా మార్చాలి, సరిహద్దు ప్రాంతంలో ఆయుధాల సంఖ్య తగ్గింపు, అమెరికా, చైనాల ప్రమేయంతో చర్చలను ముందుకు తీసుకుపోవటం, కొరియా యుద్ద సమయంలో విడిపోయిన కుటుంబాలను దగ్గరకు చేర్చటం, సరిహద్దు ప్రాంతంలో రోడ్లు, రైలు మార్గాల నవీకరణ, ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడలతో సహా అన్ని క్రీడలలో సంయుక్త జట్లతో పాల్గనటంపై ఒప్పందం కుదిరింది.

వివాహానికి ముందే విడాకుల గురించి చర్చించే ప్రబుద్ధుల మాదిరి రెండు దేశాల మధ్య సంబంధాల మెరుగుదల గురించి వూహాగానాలు చేసే పశ్చిమ దేశాల మీడియా కుదిరిన ఒప్పందాంశాలపై కూడా మరుక్షణం నుంచే వుత్తర కొరియాపై చిత్తశుద్ధిపై రచ్చ ప్రారంభించింది. గతంలో కుదిరిన కొన్ని ఒప్పందాల నుంచి వుత్తర కొరియా వెనక్కు తగ్గిన మాట వాస్తవం. దానికంటే ముందు మరో ఒప్పంద భాగస్వామి అమెరికా వాగ్దానభంగం చేయటమే కాదు, వుత్తర కొరియాను రెచ్చగొట్టిన పర్యవసానమే అది. కొరియా ద్వీపకల్పంలో చిచ్చు పెట్టింది, పిర్ర గిల్లి జోలపాడుతోంది, దక్షిణ కొరియాను తన చేతిలో పావుగా చేసుకొని వుత్తర కొరియాకే కాదు, పక్కనే వున్న సోషలిస్టు చైనాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతోంది అమెరికాయే.

వుత్తర కొరియా విశ్వసనీయతపై సందేహాలు లేవనెత్తుతున్న పశ్చిమ దేశాలు మరో నూతన ఒప్పందాన్ని ఎందుకు ప్రోత్సహించినట్లు? ఇది సమాధానం లేని ప్రశ్న. పశ్చిమ దేశాల కుట్రలు, కుయుక్తుల గురించి తెలిసీ వుత్తర కొరియా ఎందుకు ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. రెండు దేశాల వెనుక పనిచేసిన వత్తిడులేమిటి? ఈ రీత్యా చూసుకున్నపుడు వుభయులకూ ఇది అవసరమే. ఎవరి ఎత్తుగడలు వారికి, ఎవరి ప్రయోజనాలు వారికీ వున్నాయి.

వేల సంవత్సరాల పాటు ఒకే దేశంగా కొనసాగిన కొరియాను కే దేశంగా 1910లో జపాన్‌ ఆక్రమించింది. దానికి వ్యతిరేకంగా కొరియన్లు పెద్ద ఎత్తున వుద్యమాలు నడిపారు. రెండవ ప్రపంచ యుద్దం ముగిసే సమయంలో 1945 ఆగస్టు తొమ్మిదిన యాల్టా సమావేశంలో కుదిరిన ఒప్పందం మేరకు జపాన్‌పై నాటి సోవియట్‌ యూనియన్‌ యుద్ధం ప్రకటించింది. అయితే కొరియాలో అప్పటికే కమ్యూనిస్టులు విముక్తి పోరాటాలలో ముందుండటంతో విముక్తి జరిగిన తరువాత కొరియా సోవియట్‌ ప్రభావంలోకి వెళుతుందనే భయంతో 38వ అక్షాంశ రేఖ వరకు మాత్రమే సోవియట్‌ సైన్యాలు పరిమితం కావాలని మిగతా ప్రాంతాన్ని తమకు వదలాలని అమెరికా కోరింది. వారం రోజులలోపే అమెరికా సేనలు ప్రవేశించక ముందే జపాన్‌ చేతులేత్తేసింది. మరో పది రోజుల తరువాత ఎర్ర సైన్యం వుత్తర కొరియాలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఇరవై రోజులకు అమెరికా సేనలు వచ్చాయి. తమకు అనుకూలంగా వుంటే మిలిటరీ ప్రభుత్వాన్ని దక్షిణ కొరియాలో ఏర్పాటు చేశాయి.

Image result for korea missile

జపాన్‌ తప్పుకున్న తరువాత రెండవ ప్రపంచ యుద్ధ మిత్రరాజ్యాల పర్యవేక్షణలో కొంతకాలం కొరియాలో పాలన సాగించాలని కొందరు ప్రతిపాదించారు. అయితే దేశభక్తులు తమకు వెంటనే స్వాతంత్య్రం కావాలని డిమాండ్‌ చేశారు. దీంతో సోవియట్‌ యూనియన్‌ కమ్యూనిస్టులను, పోటీగా స్వాతంత్య్రపోరాట సమయంలో పశ్చిమ దేశాలకు పారిపోయిన, జపాన్‌తో చేతులు కలిపిన ద్రోహులను, కమ్యూనిస్టు వ్యతిరేకులను అమెరికన్లు చేరదీశారు.

అమెరికా ప్రోద్బలంతో కొరియాపై తాత్కాలిక కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్యసమితి చేసిన ప్రతిపాదనను సోవియట్‌ యూనియన్‌ తిరస్కరించింది. తరువాత అమెరికన్లు దక్షిణ కొరియాలో ఎన్నికల తతంగం జరిపి మిలిటరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారాన్ని దానికి బదలాయించారు. వుత్తర కొరియా ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. దాంతో సోవియట్‌ సేనలు అక్కడి నుంచి వెనక్కు వెళ్లిపోయాయి. అయితే దక్షిణ కొరియా మిలిటరీకి శిక్షణ ఇచ్చే నెపంతో అమెరికా సేనలు అక్కడే తిష్టవేశాయి. కొరియాను ఒకే దేశంగా పరిగణిస్తూ రెండు ప్రభుత్వాలు మొత్తం కొరియాకు తామే ప్రతినిధులమని ప్రకటించుకున్నాయి. విభజన తాత్కాలికమే అని రెండు ప్రాంతాల విలీనానికి కట్టుబడి వున్నట్లు పేర్కొన్నాయి. ఎవరికి వారు పైచేయి సాధించి దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొనేందుకు ప్రయత్నించారు.ఈ క్రమంలోనే 1950 జూన్‌ 25న రెండు ప్రాంతాల మిలిటరీ మధ్య ఘర్షణ తలెత్తింది. దక్షిణ కొరియాలోని ప్రభుత్వానికి రక్షణ కల్పించే పేరుతో భద్రతా మండలిలో అమెరికా ఒక తీర్మానం చేయించటం, ఐరాస సేనల పేరుతో వుత్తర కొరియాపై దాడికి దిగాయి. కొద్ధి కాలం తరువాత వుత్తర కొరియాకు మద్దతుగా చైనా రంగంలోకి వచ్చింది. అమెరికా నాయకత్వంలోని సేనలను తరిమి కొట్టింది. చివరకు 1953 జూలై 27న వుభయ ప్రాంతాల మధ్య పూర్వపు సరిహద్దులను పునరుద్దరిస్తూ 38వ అక్షాంశ రేఖ పరిసరాలను మిలిటరీ రహిత ప్రాంతంగా గుర్తిస్తూ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు

ఈ ఒప్పందం కాల్పుల విరమణకే పరిమితమైంది తప్ప తదుపరి శాంతి ఒప్పందం కుదరలేదు.దాన్ని కూడా దక్షిణ కొరియా పాలకులు ఆమోదించి సంతకాలు చేయలేదు, చివరకు కట్టుబడి వుంటామని మాత్రమే ప్రకటించారు.దాంతో తాము కూడా కట్టుబడటం లేదని వుత్తర కొరియా ప్రకటించింది. అందువలన ఇప్పటికీ సాంకేతికంగా కాల్పుల విరమణ జరిగింది తప్ప సాంకేతికంగా యుద్ధం ముగిసినట్లు కాదు.

కొరియా యుద్దం, దేశ విభజన కొరియన్లను అనేక కష్ట నష్టాలపాలు చేసింది. ఏడున్నరలక్షల మంది తమ కుటుంబ సభ్యులకు దూరమయ్యారు. ఎదురుగా కనిపిస్తున్నా ఒకరి నొకరు కలుసుకోలేని దుస్ధితి. రెండు ప్రాంతాల మధ్య నిత్యం వుద్రిక్తతలు, ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఆందోళన,భయం వెన్నాడుతూ వుంటుంది. వుభయ ప్రాంతాలను వేరు పరచి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా ఒకే దేశం, ఒకే ప్రజగా ప్రపంచం ముందు తలెత్తుకు నిలబడాలన్న తపన ఇంకా మెజారిటీ జనంలో వుందని అనేక సర్వేలు వెల్లడించాయి. గత ఐదు ద శాబ్దాలలో వుభయుల మధ్య విబేధాలను పెంచే అనేక వుదంతాలు జరిగాయి. వాటి వెనుక అమెరికా ప్రచ్చన్న హస్తం వుంది. కొరియా ప్రాంతంలో తిష్ట వేయాలంటే అమెరికన్లకు ఒక దేశం అవసరం. అది దక్షిణకొరియాగా వుండాలన్నది దాని వాంఛ అందుకే విలీనానికి ఇంకా సమయం రాలేదు, దక్షిణ కొరియన్లలో భయం తొలగలేదంటూ కుంటి సాకులు చెబుతున్నది. నిజానికి రెండు ప్రాంతాలు విలీనమైతే జనాభా రీత్యా చూసుకుంటే రెండున్నర కోట్ల మంది వుత్తర కొరియన్లతో పోలిస్తే ఐదుకోట్లమందికి పైగా వున్న దక్షిణ కొరియన్లే నిర్ణయాత్మక పాత్ర వహిస్తారు. అందువలన వారు భయపడుతున్నారని చెప్పటంలో అర్ధం లేదు. దక్షిణ కొరియాలో అమెరికా సైనిక తిష్ట వుత్తర కొరియన్లనే భయపెడుతున్నది, ఎందుకంటే 1950దశకంలో వారిపై దాడి చేసింది అమెరికన్లు, వారి కనుసన్నలలో పనిచేసే దక్షిణ కొరియా మిలిటరీ తప్ప మరొకటి కాదు.

Image result for north korea  arms show

అమెరికా ఈ వైఖరి కారణంగానే వుత్తర కొరియా తన రక్షణ చర్యల్లో భాగం ఆధునిక క్షిపణులు, అణు కార్యక్రమాలను చేపట్టాల్సి వచ్చింది. ప్రపంచంలో అణు రియాక్టర్లను కలిగిన ఏ దేశమైనా అణ్వాయుధాలను తయారు చేయటానికి అవసరమైన ముడి సరకును కలిగి వున్నట్లే. అందువలన దక్షిణ కొరియా అధికారికంగా ప్రకటించలేదు తప్ప దాని దగ్గర అణ్వాయుధాలు లేవని చెప్పలేము. వుత్తర కొరియా అణుక్షిపణుల కార్యక్రమాన్ని ప్రారంభించటంతో 2003 నుంచి అమెరికా, చైనా,జపాన్‌, రష్యా, వుభయ కొరియాల( ఆరు దేశాల) మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. 2006ల వుత్తర కొరియా తొలి అణుపరీక్ష జరిపింది.

తాజా ఒప్పందానికి దారితీసిన నేపధ్యాన్ని చూస్తే వుభయుల మీద పరిస్ధితులు, పర్యవసానాలు వత్తిడి తెచ్చాయనే చెప్పాలి. తమ వనరులను మిలిటరీ అవసరాలకు ఖర్చు చేయటం వుత్తర కొరియాకు ఎల్లవేళలా సాధ్యం కాదు. అది వాంఛనీయం కూడా కాదు. చైనా ఎంతగా సాయం చేసినప్పటికీ అమెరికా విధించిన అధికారిక, అనధికారిక ఆంక్షలు వుత్తర కొరియాను ఇబ్బంది పెట్టేవే. అందువలన కాస్త వూపిరి పీల్చుకోవాలంటే దక్షిణ కొరియాతో సామరస్యక పూర్వక ఒప్పందం దానికి కూడా అవసరమే.

వుత్తర కొరియా అణు పరీక్షలు, అణ్వాయుధాలను మోసుకుపోగల దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగాల ద్వారా అమెరికా,జపాన్లపై తాము బాంబుల వర్షం కురిపించగలమని వారు చేసిన హెచ్చరిక అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా వాసులను అనిశ్చితి, భయాందోళనలకు గురిచేసింది. అమెరికా ఎన్ని బెదిరింపులు చేసినా వుత్తర కొరియా వెనక్కు తగ్గదని తేలిపోవటంతో ఏదో ఒక విధంగా రాజీ ఒప్పందం చేయించట ద్వారా తమ జనాల్లో వున్న భయాన్ని పొగొట్టేందుకు అమెరికా, జపాన్‌ పాలకులు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ధనిక దేశాలలో గత పది సంవత్సరాలుగా తలెత్తి కొనసాగుతున్న ఆర్ధిక సంక్షోభం దక్షిణ కొరియాను కూడా తాకింది. అది అక్కడి కార్మికవర్గంలో అసంతృప్తికి దారితీస్తోంది. దీనికి తోడు నిత్యం వుత్తర కొరియా నుంచి ఏం జరుగుతుందో తెలియని స్ధితి దక్షిణ కారియా పాలకవర్గం వత్తిడి కలిగిస్తోంది. వుత్తర కొరియాకు తోటి సోషలిస్టు దేశ ంగా ఎన్ని విధాలుగా సాయం చేస్తున్నప్పటికీ అంతర్జాతీయ వేదికల మీద కొన్ని సందర్భాలలో చైనా కూడా గట్టిగా మాట్లాడలేని స్ధితి వుంది. ఈ విధంగా కొరియా రాజకీయాలతో ప్రమేయం వున్న అన్ని దేశాలకు అనుకూల, ప్రతికూల వత్తిళ్లు వున్నాయి. ఈ కారణంగానే వుభయ కొరియాల మధ్య ఒప్పందానికి తెరవెనుక వుండి అన్ని దేశాలూ సంతకాలు చేయటానికి సహకరించాయనే చెప్పవచ్చు. ఈ పూర్వరంగంలోనే

2015 జనవరి ఒకటిన వుత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ అన్‌ దక్షిణ కారియాతో వున్నత స్ధాయి చర్చలకు సుముఖత వ్యక్తం చేశారు.అదే ఏడాది ఆగస్టులో సరిహద్దులలో సంభవించిన కొన్ని సంఘటనలు వుద్రిక్తతలను కలిగించినా సర్దుబాటు చేసుకున్నారు. శాంతి చర్చలకు సంసిద్ధతతో పాటు వుత్తర కొరియా తన అణుపరీక్షలను కూడా కొనసాగిస్తూనే వస్తోంది. 2016లోఅరవైఎనిమిద వార్షికోత్సవం సందర్భంగా ఆరవ పరీక్ష జరిపింది.కిమ్‌ జోంగ్‌ ఇన్‌ను హత్య చేసేందుకు తమ వద్ద పధకం వుందని దక్షిణ కొరియా బెదిరించింది.ఈ ఏడాది మార్చి ఆరున కిమ్‌ దక్షి ణకొరియా రాయబారులతో సమావేశమై సియోల్‌ శీతాకాల ఒలింపిక్స్‌ గురించి చర్చించారు.2017 మేనెలలో అధికారానికి వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ వుత్తర కొరియా సయోధ్య కు సై అన్నాడు.2018 నూతన సంవత్సర సందేశంల సియోల్‌ శీతాకాల ఒలింపిక్స్‌కు జట్టును పంపేందుకు కిమ్‌జోంగ్‌ అన్‌ సంసిద్ధత ప్రకటించారు.

రెండు సంవత్సరాల తరువాత ముఖాముఖీ చర్చలకు తెరలేచింది. సియోల్‌ శీతాకాల ఒలింపిక్స్‌కు ఐస్‌ హాకీలో వుమ్మడి జట్టును, అధ్లెట్లను పంపటంతో పాటు రెండు ప్రాంతాల క్రీడాకారులు ఒకటిగానే పరేడ్‌లో పాల్గన్నారు. ఈ పోటీలకు అసాధారణ రీతిలో వుత్తర కొరియా పార్లమెంట్‌ అధ్యక్షుడి నాయకత్వంలో పెద్ద ప్రతినిధి బృందం తరలి వచ్చింది. ఈ సందర్బంగానే తమ దేశాన్ని సందర్శించాలని దక్షిణ కొరియా అధ్యక్షుడికి ఆహ్వానం అందచేశారు. ఈ పరిణామం తరువాత వుభయ దేశాల అధికారులు వుమ్మడిగా 2021 ఆసియా శీతాకాల ఆటల నిర్వహణ గురించి ప్రతిపాదనలు చేశారు. మార్చినెలలో దక్షిణకారియా ప్రతినిధి బృందం పోంగ్‌యాంగ్‌లో వుత్తర కొరియా అధ్య క్షుడు కిమ్‌ను కలసింది. తరువాత అదే బృందం వాషింగ్టన్‌ వెళ్లి కిమ్‌తో భేటీ కావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు ఆహ్వానం అందచేసింది.

ఏప్రిల్‌ ఒకటవ తేదీన దక్షిణ కారియా పాప్‌ స్టార్స్‌ పోంగ్‌యాంగ్‌ వెళ్లి వసంతం వస్తోందంటూ ఒక సంగీత కచేరి నిర్వహించింది. దానికి కిమ్‌ హాజరయ్యారు. ఈలోగా పరస్పర ప్రచార దాడులు ఆగిపోయాయి.ఏప్రిల్‌ 27న వుభయ దేశాల నేతల శిఖరాగ్ర సమావేశం జరిగింది, ఒప్పందం కుదిరింది. కొరియా యుద్దం 1953 తరువాత తొలిసారిగా వుత్తర కొరియా నేత దక్షిణ కొరియాలో అడుగు పెట్టటం ఇదే ప్రధమం. ఎక్కడైతే నాడు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందో అక్కడే ఈ భేటీ జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని శాంతి ఒప్పందంగా మార్చాలన్న ఆకాంక్ష ఇరువురిలో వ్యక్తమైంది. ఒంటిచేతితో చప్పట్లు రావు, చేతులు కలపాలి, చేతలు జరగాలి.అలాగే కుదిరిన ఒప్పందాన్ని ఇరు పక్షాలు, వారి వెనుక వున్న మద్దతుదార్లు చిత్తశుద్దితో వుంటేనే ఆచరణలోకి వస్తుంది. ఎవరు ద్రోహం చేసినా అది ఒక్క కారియా ద్వీపకల్పానికే కాదు, యావత్తు ప్రపంచానికి నష్టదాయకం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వేదాలను ప్రశ్నించిన మహాకవి వేమన కూడా జాతి వ్యతిరేకి, కమ్యూనిస్టేనా ?

02 Wednesday May 2018

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, Literature., Opinion, RELIGION

≈ 1 Comment

Tags

ANTI NATIONAL, communal forces, communalism, communist, everything lies in veda’s only, Religious Fundamentalists, vedas, Vemana

ఎం కోటేశ్వరరావు

వేదాల్లో అన్నీ వుంటే మన వారెందుకు విదేశాలకు పరుగులు తీస్తున్నట్లు అన్న శీర్షికతో నేను రాసిన వ్యాసంపై సామాజిక మాధ్యమంలోని ఫేస్బుక్‌లో సంస్కారయుతంగా స్పందించిన వారందరికీ ఒక దండం, అనాగరికంగా స్పందించిన వారికి వంద దండాలు. చర్చలో లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు స్పందించటం కనీస ధర్మంగా భావిస్తున్నా.

‘వేదాలు ఎందరు చాడుతున్నారు కమ్మీ’

జ: దీనిలో చాడు ను వాడు గా అనుకున్నా కమ్మీ అనే తిట్టు తప్ప ప్రశ్న అర్ధం కాలేదు.

‘ అబ్బే అన్నీ దాస్‌ కాపిటల్‌ లోనే ఉన్నాయి పోయి చదువుకోండి.’

జ: అంత వుక్రోషం వద్దులే మిత్రమా ! ప్రపంచంలో వేదాలు చదువుతున్న వారి కంటే దాస్‌ కాపిటల్‌ చదివేవారే ఎక్కువ . గత పది సంవత్సరాలుగా ధనిక దేశాలలో వచ్చిన సంక్షోభం తరువాత మరీ ఎక్కువగా చదువుతున్నారని వార్తలు. ప్రపంచంలో దాస్‌ కాపిటల్‌ చదివి తిరుగుబాట్లు చేశారు. వేదాలు చదివిన వారు అగ్రహారాలకే పరిమితం అయ్యారు , వాటిని కూడా సంస్కరించుకోలేకపోయారు అన్నది అంగీకరించక తప్పదు మరి. ఇదే సమయంలో ఒక కాలపు సాహిత్యంగా చరిత్రలో వేదాలకు స్ధానం వుంది.

‘రిజర్వేషన్‌ వల్ల రా కమ్మి. నీ వయసు కి విలువ ఇవ్వాలంపియట్లేదు’

జ: రిజర్వేషన్ల వ్యతిరేకత కనిపిస్తోంది. వేదాలు- మనువాదం రెండింటినీ విడదీయలేము. ప్రపంచంలో ఎక్కడా లేని రిజర్వేషన్ల విధానం రావటానికి జనాభాలో ఐదో వంతుగా వున్న దళిత, గిరిజనులను వేల సంవత్సరాలుగా అంటరాని వారిగా చూసినందువల్లనే ఇవి వచ్చాయి. ఆ దురాచారాన్ని రూపు మాపి వారిని కూడా తోటి మానవులుగా గుర్తించినపుడు రిజర్వేషన్లు వుండవు. కానీ ఇప్పుడు ఆధునిక మనువాదులు అంటరాని తనం వుండాలి, రిజర్వేషన్లు పోవాలి అంటున్నారు. ఇక నా వయస్సు, ఫేస్‌బుక్‌లో నేనే వివరాలు పెట్టాను, అందరికీ ఆధైర్యం వుండదు, అనేక మంది ఫేక్స్‌ వున్నారు. గురువు అద్వానీకే శిష్యుడు నరేంద్రమోడీ ఇచ్చిన విలువేమిటో చూశాము. వాదన, విషయంలో వున్నదానిని బట్టి విలువ ఇవ్వండి చాలు. కొంత మంది కుర్రవాళ్లు పేర్లకీ పుకార్లకీ నిబద్ధులు, తాతగారి నాన్నగారి భావాలకు దాసులు. నేనైతే ఆ టైప్‌ కాదు. వయసుతో పని ఏముంది మనసులోనే అంతా వుంది అని నమ్ముతా.

‘కమ్మీలకు స్వంత సిద్దాంతాల్లేక విదేశాలనుంచి ఎందుకు దిగుమతి చేసికొన్నారు?స్వంతంగా సిద్దాంతాలే తయారుచేసికోలేని అనామకులా కమ్మీలు?కాస్తైనా జ్ఞానంలేని మూర్ఖులైన కమ్మీలను ప్రజలెలా ఆదరిస్తారు?

జ: వసుధైక కుటుంబం అనే భావనలో నమ్మకం వున్న వాడిని. మన రాజ్యాంగంతో సహా అనేక అంశాలను విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాము. ఇస్లాం, క్రైస్తవ మతాలను నిత్యం దుమ్మెత్తి పోసే వారు వారి దీనార్లు, డాలర్లు, ఇతర వస్తువులను తెచ్చుకోవటానికి, ఆ దేశాలకు వెళ్లి మరుగుదొడ్లు కడగటం నుంచి కంప్యూటర్ల వరకు ఏ పని అయినా చేయటానికి, కూలి డబ్బులు తెచ్చుకోవటానికి కోట్లాది మంది సిగ్గుపడటం లేదు. ఏం తెచ్చారో, ఎంత తెచ్చారో ఇంతవరకు తెలియకపోయినా నిత్యం నరేంద్రమోడీ విదేశాల నుంచి ఏదో ఒకటి తీసుకురావటానికే కేగా అందమైన సూట్లు వేసుకొని పైలా పచ్చీసుగా తిరుగుతోంది. భారతీయతకు ప్రతిబింబంగా కొందరు భావించే పిలక, పంచకట్టుతో ఎందుకు వెళ్లటం లేదు. ఇన్ని జరుగుతున్నపుడు, వాటికి అభ్యంతరం లేనపుడు కమ్యూనిస్టులు ఒక సిద్ధాంతాన్ని తమకు వర్తింప చేసుకుంటే తప్పేమిటట? బౌద్దం, ఇస్లాం, క్రైస్తవం, హిందూ మతం ఒక చోట పుట్టి అనేక దేశాలకు విస్తరించింది. కమ్యూనిజం కూడా అంతే .వాటికి లేని అంటూ సొంటూ కమ్యూనిజానికికే ఎందుకు?

‘ మీ బతుకులు ఈ దేశ గొప్పదనం తక్కువ చేయడానికే. పంది బురద మెచ్చు, పన్నీరుమెచ్చునా విశ్వదాభిరామ…’

జ: నాకు తెలిసినంత వరకు ఏ కమ్యూనిస్టూ ఈ దేశ గొప్పతనాన్ని తక్కువ చేయలేదు. అలా చేసినట్లు ఒక్క వుదంతం వున్నా చూపాలని చేసిన సవాలుకు ఇంతవరకు ఎవరూ బదులివ్వలేదు. అనేక మతాలు వచ్చాయి, పెరిగాయి, తరిగాయి. మధ్య యుగాల నాటి మాదిరి భీకర మత యుద్ధాలు మహత్తరమైన భారత గడ్డమీద జరగలేదు గాని మత యుద్ధాలు మనకు కొత్త గాదు. శైవులు-వైష్ణవుల మధ్య పరిమితంగా అయినా యుద్ధాలు జరిగాయి. జైన, బౌద్ధ మతాలను, హేతువాద, భౌతిక వాదులైన చార్వాకులను హిందూ మతంగా చెప్పుకొనే వారు అణచివేచిన చరిత్ర వుంది. ఇప్పుడు క్రైస్తవం, ఇస్లాం మతాలకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్న మెజారిటీ మతోన్మాదులు, దానికి స్పందిస్తున్న మైనారిటీ మతోన్మాదులు దొందూ దొందే. పందులు పన్నీరు మెచ్చకపోయినా నష్టం లేదు. మతోన్మాదులు ఎందరు మగువల కన్నీరు ఒలికించటానికి నీ పేరుతో ప్రయత్నిస్తున్నారో వీలైతే వారిని ఆపేట్లు చూడు రామా అని కమ్యూనిస్టులు కాని వారెందరో మొక్కుకుంటున్నారు.

‘విదేశాలకు పరుగులు తీయాలని కూడా వేదాల్లోనే ఉందట’

జ: అన్నీ వున్నాయష అన్నపడు పరుగుల గురించి ఎందుకుండదు

‘ వీళ్ళు వీళ్ళ పిచ్చ…వేదాలని ప్రశ్నిస్తే కమ్మీలు అంటారు,వాళ్లంటే అంత భయమేంటో, వాళ్ళ పేరే కలవరిస్తారు.’

జ: ఇది తరతరాలుగా వస్తున్న భయం, గంగిరెద్దుల్లా తలాడించటం, మన్ను దిన్న పాముల్లా జనం పడి వుండాలని కోరుకొనే వారికి ప్రశ్నించే ఒక్కడు కనపడినా భయమే. వేద ప్రామాణ్యాన్ని ప్రశ్నించటం ఈ రోజు కాదు, వాటిని రాసిన నాటి నుంచీ ఎవరో ఒకరు ప్రశ్నిస్తూనే వున్నారు. ఒక్క వేదాలే కాదు, గీత, ఖురాన్‌, బైబిల్‌ వంటి ఏ మత గ్రంధమైనా, మరొకటైనా సమాజ పురోగతికి ఆటంకం కలిగించే ప్రతిదాన్నీ జనం ప్రశ్నిస్తారు. అలాంటి వారిని అణచివేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. దోపిడీ వర్గాన్ని సమర్ధించే వారే నాడు నేడు ఈ అణచివేతకు పాల్పడుతున్నారు.

‘ఎవడైనా సరుకున్నవాడినే రమ్మంటారు’

‘ వారికి నేర్పడానికి నాసా లో హిందువులేఎక్కువ ‘

జ: సరకున్నవాడినే ఎవరైనా రమ్మంటారన్నది కొంత వరకు నిజమే. తమకు అవసరమైన వాళ్లను కూడా రమ్మంటారు అని కూడా తెలుసుకోవాలి. అమెరికా, ఐరోపా వారు వస్తువులు తయారు చేసుకోలేకనా చివరకు …..తుడుచుకొనే కాగితంతో సహా చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్నది. కాదు, వ్యాపారికి లాభం కావాలి. చైనాలో తయారయ్యేందుకు అయ్యే ఖర్చు కంటే అమెరికాలో ఎక్కువ చెల్లించాలి. అందుకే ఎక్కడ శ్రమశక్తి తక్కువుంటే అక్కడి నుంచి దిగుమతులు చేసుకుంటున్నారు. అలాగే వైద్యులు, శాస్త్రవేత్తలు, కంప్యూటర్‌ ఇంజనీర్లు. అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలు వారిని తయారు చేసుకోలేక కాదు. ఒక వైద్యుడు తయారు కావాలంటే అమెరికాలో అయ్యే ఖర్చు కంటే ఇండియాలో తక్కువ. మిగతావారు కూడా అంతే. మన దేశంలో వున్నన్ని జబ్బుల గురించి అమెరికా, ఐరోపాలో తెలుసుకోవాలంటే కుదరదు, అక్కడన్ని లేవు గనుక. అందుకే విదేశాల నుంచి రమ్ముంటున్నారు తప్ప మన మీద ప్రేమ వుండి కాదు, మనమే గొప్పవారం అని కాదు. ప్రపంచంలో విదేశాలలో నివసించే చైనా జాతీయులు ఐదు కోట్ల మంది అయితే మన వారు మూడు కోట్లకు పైబడి వున్నారు. అమెరికాలో కూడా భారతీయుల కంటే చైనీయులే ఎక్కువ. అందువలన మన గురించి చెప్పుకోవచ్చు తప్ప అతిశయోక్తులు చెప్ప కూడదు. నాసాలో పని చేస్తున్న మన సైంటిస్టులందరూ హిందువులే అని చెప్పటం అతిశయోక్తి. అంటే హిందువులందరూ మన దేశ పరిశోధనలను వదలి పెట్టి అమెరికన్లకు వూడిగం చేస్తున్నారను కోవాలి. ఇదేమీ దేశభక్తి ?

‘ఎప్పుడూ పక్కదేశం బానిసలుగా బతికేవారికి ఆత్మవిశ్వాసం లోపించి మనలో ఏమీ లేదు అనుకునే పర్సనాలిటీ డిసార్డర్‌, ఇన్ఫిరియారిటి కాంప్లెక్స్‌తో బ్రతికే మానసిక రోగులు మన కమ్యూనిస్టులు. ముందు మీ పూర్వీకుల ఘనతను తెలుసుకుని,ఎవరైనా సైకాలజిస్ట్‌ దగ్గర కౌన్సిలింగ్‌ తీసుకోండి.

జ: కమ్యూనిస్టులు ఏ దేశం వారినైనా వారు దోపిడీ చేసేవారా, దోపిడీకి గురయ్యే వారా అని మాత్రమే చూస్తారు తప్ప మతం, కుల ప్రాతిపదికన చూడరు. పక్కన వున్న వాడికి ఒక కన్ను పోవాలనుకుంటే మనకు రెండూ పోతాయి. సమాజంలో కొంత మంది కంటే తాము గొప్ప వారమనే సుపీరియారిటీ రోగాన్ని పెంచిన మనువాదం మొత్తంగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధను ప్రోత్సహించి, నిర్మించి సమాజానికి చేసిన హాని అంతా ఇంతా కాదు. మహిళలను అణచివేసింది, వారికి విద్య, వివేకం లేకుండా చేసింది. పంచముల పేరుతో నాలుగోవంతు, ఇతర వృత్తుల పేరుతో మరి కొ ందరిని ఈ దేశం మాది అనుకొనే స్ధితి లేకుండా చేసింది. ఎందరు హిందూ రాజులు పాలించినా వేల సంవత్సరాలు అదే స్ధితి కొనసాగింది. అందువలన, విదేశీయులు, హూణులు, తరుష్కులు, యూరోపియన్లు ఎవరు దేశం మీద దాడులు చేసినా, మొత్తాన్ని ఆక్రమించుకున్నా మన బతుకులు మారేదేమీ వుండదని ఏం జరిగితే మనకెందుకు లెమ్మని మెజారిటీ జనం ప్రేక్షక పాత్ర పోషించబట్టే దేశం వందల సంవత్సరాలు పరాధీనమైంది. ఎక్కడ ఏమాత్రం గౌరవం, ఆదరణ, సాటి మనిషిగా గుర్తింపు వుంటుందని భావించినా అనేక మంది మతమార్పిడులకు సిద్దపడటానికి కూడా కారణమదే. ఇప్పటికీ అదే స్ధితి. అందుకు అంబేద్కరే ప్రత్యక్ష నిదర్శనం. అందువలన మన గత ఘనత గురించి మరీ ఎక్కువగా చెప్పుకొనే మానసిక రోగులకే ముందు కౌన్సిలింగ్‌ ఇప్పించాలి. బుర్రలను మరమ్మతు చేయాలి.

ౖ’వేదాలలలో అన్ని ఉన్నాయి విదేశీయులు వఛ్చి అన్ని వేదిలేసేం ఇప్పటి అమెరికా వైద్యం కన్నా మంచి వైద్యం మన దగ్గర ఉండేది ఎంసెట్‌ రాంక్‌ వఛ్చినవాడు ఎం బి బి ఎస్‌ చదువుతాడుకాని ఆయుర్వేదం చదవడుకదా జెర్మనీ వాడు మానవేదాలని ఉపయోగించుకుని ఆయుధాలు మందులు చేసుకుంటున్నాడు మన రాజమండ్రి ఆయనని అక్కడకి తీసుకునివెళ్ళి మరి ఆయుధాల విద్య నేర్చుకున్నారు మనకి మాత్రం అలుసు మన పూర్వులగురించి తెలియదు తెలుసుకోము విదేశీయులంటే మోజు అన్ని ఉన్న విజ్ఞానం మనది

జ: ఇలాంటి నమ్మకాలు వున్న వారు రెండు తరగతులు.లోతైన అధ్యయనం, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు, ఎక్కడ అనే ప్రశ్నలు వేయకుండా గుడ్డిగా నమ్మి ప్ర చారం చేసేవారు. కావాలని దురహంకారాన్ని రెచ్చగొట్టే వారు. ఈ దేశంలో ఇప్పుడు కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాలలో వున్నది వేదాలలో అన్నీ వునాయష అని నమ్మే తిరోగమన భావజాలం వున్న వారే. దేశీయ వైద్యాన్ని అభివృద్ధి చేయటానికి వారికి ఎవరు అడ్డుపడ్డారు. కార్పొరేట్‌ ప్రయివేటు వైద్య విద్య, చికిత్సను ప్రోత్సహిస్తున్నారు. మన రాజమండ్రి ఆయనని తీసుకొనివెళ్లి జర్మన్లు ఆయుధాల విద్య నేర్చుకున్నారని చెప్పటం అమాయకత్వం తప్ప మరొకటి కాదు.

‘చదువుకున్నా చదువుకు సరైన ఉపాదిలభించక ఉపాధిని పొందడమే జీవిత లక్ష్యం

వేదాలలో …. నిర్వేదం ఉంది కాబట్టి

అవి శుద్ద దండగా అని నిరూపించడానికి……….

ఇప్పుడు అభివ ద్ధిలో ఉన్న దేశాలు కొన్ని ఒకప్పుడు భారతదేశానికి వచ్చి బాగు పడిపోయినవి.

డబ్బు కోసం తెల్లోని తొత్తులాయ్‌ మతం మరి సలాం కొట్టి గులాం గిరి చేసారు

వాడు వచ్చి మనని దోచి మన వేదాలను బూడిద చేసి మన దేవాలయాలను కూలగొట్టి

మన దేశం లో మనకే రాజు గామారి న తరవాత మనం ఇప్పుడు వాణి దెగ్గర గులాం చేయక ఎం చేస్తారు

అదే మన వేదాలను మన దెగ్గర భద్ర పరిస్తే ఈ పరిస్థితి ఉండేదా.

వేదాలు చదివిన ఘనాపాఠిలను చూసి వాళ్ళు ఏ కొత్త టెక్నా జీని ఆవిష్కరించలేక పోతున్నారని వారే విదేశీయ ఉత్పత్తుల కొరకు ఆరాటపడి పోతున్నారని నిర్ధారించుకొని విదేశాలకు పరుగులు పెడుతున్నారు. ఏ దేశంలో లేని ఖనిజ సంపద వనరులు కలిగిన మన మాత  భూమిని భారతదేశాన్ని కాలదన్ని విదేశీ మోజుతో వెళ్ళిపోతున్నారు.

వేదాల్లో అన్నీ ఉంటే వేదాలు చదివిన వేద పండితులు ప్రపంచానికి అవసరమైన ఆవిష్కరణలు చేసి భారత ప్రతిష్టను ప్రపంచ దేశాల్లో ఎగరవేసేవారు. ప్రపంచ ప్రజలు .. ఇది భారత వేద పండితులచే కనిపెట్టబడినదని చెప్పుకొనే కనీసం ఒక వస్తువైనా ఉందా

జ: నా వ్యాసంలోను వీటి గురించి కొంత చర్చించి నందున కొన్నింటిపై వ్యాఖ్య అవసరం లేదని భావిస్తున్నాను. చివరగా ఒక మిత్రుడు ప్రశ్న వేదిక వేదాల గురించి వేమన ఎలా స్పందించిందీ చూడండి అంటూ రెండు పద్యాలు పంపారు.

వేద విద్యలెల్ల వేశ్యల వంటివి

భ్రమలు పెట్టి తేట పడగ నీవు

గుప్త విద్య యొకటె కులకాంత వంటిది

విశ్వదాభిరామ వినుర వేమ.

వేన వేలు చేరి వెర్రి కుక్కల వలె

అర్ధ హీన వేద మరచు చుంద్రు

కంఠ శోష కంటె కలిగెడి ఫలమేమి

విశ్వదాభిరామ వినుర వేమ!

మహాకవి వేమన హేతువాద భావజాలాన్ని అనుసరించే, ముందుకు తీసుకుపోయే అనేక మందిపై మతోన్మాదశక్తులు దాడులు చేస్తున్నాయి, ప్రాణాలు కూడా తీస్తున్నాయి. జనంలో ప్రతికూల స్పందన వస్తుందని భయపడిపోయి గానీ వేమనను కూడా కమ్యూనిస్టు , జాతి, హిందూ వ్యతిరేకి అని వున్మాదులు తిట్టి పోసే రోజులు వచ్చినా ఆశ్చర్యం లేదు. భిన్నాభిప్రాయాన్ని అణచివేయాలని చూస్తున్న శక్తుల పట్ల ఎవరు వుపేక్షించినా వారు తమంతట తమ నోటిని మూసుకోవటమే. తరువాత తెరవాలన్నా తెరవనీయరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వేదాల్లోనే అన్నీ వుంటే మన వారెందుకు విదేశాలకు పరుగులు తీస్తున్నట్లు ?

30 Monday Apr 2018

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, Literature., NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

If everything lies in veda’s only, Indian science, vedas

ఎం కోటేశ్వరరావు

వేదాల్లోనే అన్నీ వున్నాయష అని ముందుగా ఏ మహానుభావుడు సెలవిచ్చాడో నాకైతే వివరాలు దొరకలేదు గానీ తెలుగు జాతి నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు తన మహత్తర రచన కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్లతో వేదాల్లోనే అన్నీ వున్నాయష అనిపించి దాన్ని గ్రంధస్ధం చేశారు. అది నిజమే అంటూ నేడు వున్నత చదువులు చదివిన వారెందరో అతని కంటే ఘనులు అన్నట్లు ఆధునిక అగ్నిహోత్రావధానులుగా తయారయ్యారు. శనివారం నాడు మధ్య ప్రదేశ్‌లోని వుజ్జయిని పట్టణంలో జరిగిన గురుకుల సంస్ధల సమావేశంలో గురుకుల వ్యవస్ధను పునరుద్ధరించాలని, వాటికి తగిన విధంగా బోధనాంశాలను మార్చాలని, సైన్సు మరింత ముందుకు పోవాలంటే వేదాలను కూడా అధ్యయనం చేయవలసిన అవసరం వుందని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ సూచించారు. తల మీద ఒకవైపు పిలక, మరొక వైపు ఆధునిక క్రాఫ్‌ చేయించుకోవాలన్నట్లుగా వుంది. కుర్రకారు తేల్చుకోవాలి. గురుకుల, ఆధునిక విద్యలను అనుసంధానించేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ సెలవిచ్చారు. ఇప్పటికే ఆవు పేడ, మూత్రంలో ఏముందో చూడాలంటూ శాస్త్రవేత్తలను వాటిలో ముంచేందుకు పూనుకున్నారు. ఇలాంటి తిరోగామి శక్తులను ఇంకా అధికారంలో కొనసాగనిస్తే ఎలాంటి విపరీత ప్రయోగాలు చేయటానికైనా వెనుదీయరు. తస్మాత్‌ జాగ్రత్త.

వేదాలను బట్టీయం వేసి ఘనపాఠీలు, చదివిన వారు పండితులయ్యారు తప్ప ఒక్కరూ శాస్త్రవేత్త ఎందుకు కాలేదో మోహన్‌ భగవత్‌ చెబుతారా అని ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో ఒక చర్చను ప్రతిపాదించాను. ఒక గ్రూపులో భారతీయ సంప్రదాయాలను కాపాడుతున్నామని నిజంగా నమ్ముతున్న భగవత్‌ అభిమానులంతా పచ్చిబూతులతో ప్రతిస్పందించటం చూసి భరతమాతా చివరకు నీకు ఎంత దుర్గతి పట్టింది ఇలాంటి నీ బిడ్డలను సరిదిద్దుకుంటావో, లేక బూతులు తప్ప మరొకటిరాని ఈ సంతును ఇలాగే వదలి వేస్తావో నువ్వే నిర్ణయించుకోవాలమ్మా అని చెప్పాను. వదిలేస్తే తరువాత బూతులు నీవంతే నమ్మా అని కూడా చెప్పాను. (అదేమిటి నీకు భరత మాత కనిపించిందా అని కొందరు నన్నడిగినపుడు మిగతా వారికి నిత్యం ప్రత్యక్షం అవుతున్నపుడు నాకు అప్పుడపుడన్నా కనపడదా అని జవాబిచ్చాననుకోండి. ) చర్చలో వెల్లడైన అభిప్రాయాలను చూస్తే గుడ్డి అనుసరణ, నమ్మకం తప్ప ఎందుకు ఏమిటి ఎలా ఎప్పుడు ఎవరు అనే ప్రశ్నలను వారు తమ దగ్గరకు రానివ్వరని తేలింది. నిజంగా వారిని చూస్తే జాలేసింది, ఎంతైనా వారు కూడా మనుషుల్లానే వున్నారు కదా అనిపించింది. అదే సమయంలో వారి బూతులు గుర్తుకు తెచ్చుకుంటే జాలి స్ధానంలో ఆగ్రహం కలిగింది. బూతులను ప్రస్తావించటం సంస్కారంకాదు కనుక అలాంటి పోస్టులను, వాటిలోని బూతులను మినహాయించి సారాంశం ఇస్తున్నాను.

వేదాల రిసెర్చే ఘనాపాఠీ అంటే, శాస్త్రవేత్త అంటెనే ఘనాపాఠీ, ఎందుకు కావాలి ఎవరి మార్గం వారిది, మీరెందుకు కాలేదు శాస్త్రవేత్తగా, ఆ వేదాలను ఆ పండిత పామరులను రీసెర్చ్‌ చేసినవారు శాస్త్రజ్ఞులు అయ్యారు, అట్లా బట్టీ పట్టక పోతే మీలాంటి వారు వాటిని ఎప్పుడో అంతం చేసేసి ఉండేవారు. ఇప్పటికైనా ఏదైనా కొద్దిగా ఉందీ అంటే అది బట్టీ కొట్టడం వలననే. ఆ స్వరాలు లో కొద్దిగా మార్పు వచ్చినా అర్థం మారిపోతుంది. అది బట్టీ కొట్టేది అందుకే, మొత్తం ప్రపంచానికి అందించిందే హిందువులు. టెక్నాలజీని అప్పుడు హిరణ్యకశిపుడు దొంగలించాడు. ఇప్పుడు ఈ హిరణ్యకసిపుళ్ళు దొంగిలించారు అందుకే వాళ్ళను రాక్షసులూ అంటారు, ఇప్పటికి వాళ్ళు కొన్నిటిని తెలుసుకోలేకఉన్నారు తెలుకోలేరు హిందువులు వాళ్లకు తెలనివ్వరు ఎందుకంటే ప్రక తి ని నాశనము చేవాళ్లకు ఇవ్వకూడదు సమయం వచ్చినప్పుడు వాటిని ఎలా ప్రయోగించాలో అపుడు ప్రయోగించడం జరుగుతుంది చివరిగా ఒక్కవిషయం ఏఏ దేశాలు అయితే మనదేశానికి వచ్చాయో ఇపుడు ఆదేశాలు నెంబర్‌ 1 స్తానం లో ఉన్నాయి స్వామి వివేకానంద, ఎంతో మంది మేధావులు,, శాస్త్రవేత్తలు జన్మించిన దేశం ,భారతదేశం.. నీకు తెలవదు,ఎందుకంటే నీకు మెదడు లేదు..ఓసారి చరిత్ర చూడు, భారతదేశం అనగానే ఒక సంస్క తీ, సంప్రదాయాలు, ఆచారాలు, ఆద్యాత్మిక భావాలు కలిగిన దేశంగా ప్రపంచం చూస్తుంది. విజ్ఞానము, సాంకేతిక విజ్ఞానం అంతగాలేని దేశంగా చూస్తారు, ప్రపంచమే కాదు మనదేశ ప్రజలకు కూడా తెలియదు. ఐతే ఈ మధ్య కాలాలలో ప్రపంచం కూడా ప్రాచీన భారతదేశం గొప్ప విజ్ఞానము, సాంకేతిక విజ్ఞానం ఉందని మనదేశ ప్రజలు, విదేశీయులు గుర్తిస్తున్నారు. భారతదేశంలో ఎన్నో ప్రాచీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి వాటిలో ఎంతోమంది దేశ విదేశీయులు విధ్యనభ్యసించేవారు. అవన్నీ ఇప్పుడు చరిత్రగా మిగిలిపోయాయి. భారతదేశం అనగానే ఒక సంస్క తీ, సంప్రదాయాలు, ఆచారాలు, ఆద్యాత్మిక భావాలు ప్రాచీన భారతదేశ విజ్ఞానము, సాంకేతిక విజ్ఞానం వాటిలో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు వారు ఏకాలనికి చెందిన వారు అనే విషయం అంతగా లేదు అది తెలుసుకోవడం ఎంతో అవసరం. 1 శుశ్రుత క్రీ.పూ 600 వైద్య శాస్త్రం, 2 చరక క్రీ.పూ 300 వైద్య శాస్త్రం.

3. బౌదాయన్‌ క్రీ.పూ 8-7 గణిత శాస్త్ర వేత్త.4 కన్నడ (ఆళుక్యుడు) క్రీ.పూ 8-7 ఖగోళ మరియి గణిత శాస్త్రవేత్త. 5. నాగార్జున క్రీ.శ 150-250 ఖనిజ శాస్త్రవేత్త.

ఇంతవరకూ సైన్సు వేదం లో తెలిపిన దానిలో 10% కూడా కనుక్కోలేదు. అక్షర సత్యం, సున్నా 0 లేకపోతే కంప్యూటరైజేషన్‌ అనేది ఉంది ఉండేది కాదని తెలుసుగా, హిందువుల మీద ఏడ్చి ఏడ్చి ఏప్పుడో పోయేట్టున్నావు లే, నువ్వు నమ్మే నీ దొంగ మతం..పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వెంట్రుకతో సమానం..

ఇంకా వేదాలు పండితులు అవసరం లేదు, అంతేలే అన్యమతాల వారి ఎంగిలి మెతుకులు కోసం ఆశపడి

ఈ రకమైన పనులు చేస్తున్నారు, హిందూ ధర్మం మీద ఎంత విషం చిమ్మినా కానీ, మన మన్నెం కోటేశ్వరరావు వలన మంచే జరుగుతోంది. అతను రెచ్చగొట్టడం వలన హిందువులు ఏకమౌతున్నారు, తిక్కల ప్రశ్న. పిహెచ్‌డి చేసిన ప్రతివాడు సైంటిస్ట్‌ ఎందుకు కావడంలేదు… ప్రొఫెసర్‌లుగా ఎందుకు మారుతున్నారు.. ఇదీ అంతే, భారత్‌ను ఏలుతున్న సమయంలో ఫ్రెంచి, బ్రిటీష్‌ పాలకులు మనవేదాలను తీసుకెళ్లి అధ్యనం చేసి వాటిఆధారంగా ప్రయోగాలు చేసి విధ్యుత్‌,రేడియో,విమానం లాంటి అనేక వస్తువులను రూపొందించారనేది కాదనలేని యదార్థం. శాస్త్రవేత్తలు కాలేదని వారు చెప్పారు అల్జెబ్రా ట్రిగ్నోమెట్రీ లాంటివి చాలా కనుక్కున్నారు మేము లీలావతి భస్కర్‌ అని ఆల్జీబ్రాలో శ్లోకాలని చదివేము ఆ రోజుల్లో ఈ దేశం గురించి వాళ్లకి తెలియదు వాళ్ళగురించి మనకి తెలియదు వాళ్ళ మ్యాగజిన్‌ లో ప్రచురించకపోతే విజ్ణాన శాస్త్రమే లేదంటే ఏళ్ళ అగస్త్యుడి కా లంలోనే విమానం ఎలానడపాలి అన్నవిషయం ఉండేది నలందా విశ్వవిద్యాలయంలో కొన్ని వేల గ్రంధాలు కాల్చేసేరు మనం మనల్ని కించపరుచుకునే దుస్థితి దాపురించింది. ఆర్యభట్టు, వరాహమిహిరుడు, భాస్కరాచార్యుడు ఎవర్రా…… కళ్లు దొబ్బాయా. ఆధ్యాత్మిక ప్రపంచం లో సైన్స్‌ అనేది ఒక చిన్న ముక్కమాత్రమే.అధ్యాత్మికవేత్త అనే సముద్రం ముందు సైంటిస్ట్‌ అనే పిల్ల కాలువ పరవళ్లు తొక్కుతూ సముద్రం లో కలవాల్సిందే.పాచీనకాలంలో భారత దేశమే విజ్ఞాన భాండాగారం,నీకు ఇప్పుడు బ్రాహ్మణులు మాత్రమే కనిపెట్టినవి కావాలా,లేక భారతీయులు అయినా పర్వలేదా, ఎర్ర పకోడీ గాళ్లరా మీరు భారతీయులేన లేదా?? మీరు శాస్త్రజ్ఞులు కాదనుకొనేవారికి తెలిసిన శాస్త్రాలు మీరు శాస్త్రజ్ఞులనుకొనేవారిలో ఎంతమందికి ఎన్ని తెలుసు, అసలు శాస్త్రం అంటే ఏమిటి ? శాస్త్రవేత్త

వేత్త అనగా ఎవరు? ముందు దీనిని తెలుసుకొని ప్రశ్న వేయండి. మన పుష్పక విమానం ఫార్ములాతోనే రైట్‌ సోదరులు విమానం రూపకల్పనకు పూనుకొంది. స్ధూలంగా ఇదీ ధోరణి. వీటన్నింటినీ ఎప్పటి నుంచో మెదళ్లకు ఎక్కించుకొని ఒక పిచ్చిలో మునిగి తేలుతున్నట్లు కనిపిస్తోంది. అందువలన దాన్ని పోగొట్టాలంటే కొన్ని ఆసుపత్రులు చాలవు. పెద్దఎత్తున చర్చల కౌన్సిలింగ్‌ చేయకపోతే రాబోయే తరాలను కూడా చెడగొడతారు, మన దేశాన్ని మరింతగా వెనక్కు నెడతారు, నగుబాట్ల పాలు చేస్తారు.

తమకు నచ్చని, తెలియని అంశాన్ని ఎవరైనా చర్చకు పెడితే బూతులు తిట్టి నోరు మూయించేందుకు ప్రయత్నించటం ఒక చౌకబారు ఎత్తుగడ. తాలిబాన్లు వారికి ఆదర్శం. విమర్శకుల నోరు మూయించటానికి మేకిన్‌ ఇండియా చౌకబారు తయారీ. చిత్రం ఏమిటంటే ఆ బూతుల్లో కూడా వైవిధ్యం వుండదు. వారి భావ దారిద్య్రానికి నిదర్శనం ఇది. వారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రాణాలనే తృణప్రాయంగా అర్పించటానికి సిద్దపడిన వారికి బూతులు, అవమానాలు ఒక లెక్క కాదు. తిట్టినంత మాత్రాన విమర్శలు ఆగిపోయేట్లయితే ఈ పాటికి అది ఎప్పుడో జరిగి వుండేది. ఇంతకు మించి ఏమి తిడతారు, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేదేముంది అని అనేక మంది ఇప్పటికే రాటు తేలారు. ఇప్పటి వరకు తమను వ్యతిరేకించిన వారినే తిడుతున్నారు. ఇప్పుడు నువ్వు హిందువు కాదా, నువ్వు ముస్లిం కాదా, నువ్వు క్రైస్తవుడికాదా అని రెచ్చగొడుతున్నారు.బూతులు తిట్టకపోవటం సంస్కారం, తిట్టే వారిని అడ్డుకోకపోతే రాబోయే రోజుల్లో మాతో కలసి ఎందుకు తిట్టటం లేదని మౌనంగా వున్నవారి మీద కూడా తెగబడతారని గ్రహించటం మంచిది.

ఇక వేదాలలో అన్నీ వున్నాయష అంటూ ఇంకా టెక్నాలజీని బయటకు తీయని దేశ ద్రోహుల గురించి చూద్దాం. వేదాలను వెక్కిరించే వారిని వెధవలని ఒక పత్రిక సంపాదకుడిగా పనిచేసిన ఒక కాషాయ తాలిబాన్‌ నిందించాడు. విమర్శ రూపాలలో వెక్కిరింత ఒకటి. విమర్శకులను వెధవలు అనటం సరైనదే అయితే గుడ్డిగా సమర్ధించే వారు కూడా విమర్శకులకు బంధువులే.

వేదాలను వెక్కిరించే లేదా విమర్శించే వారు వుద్భవించటానికి కారకులు ఎవరు ? వేదాల్లోనే అన్నీ వున్నాయష అని చెప్పిన వెధవలే. 1760లో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం ప్రపంచాన్ని పెద్ద మలుపు తిప్పింది. వివిధ దేశాలలోని వారు ఒకరిని చూసి మరొకరు సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు పోటీ పడ్డారు. అందుకు విరుద్ధంగా మన దేశంలో మన కంటే గొప్ప మేధావులు ప్రపంచంలో లేరని, ఎవరైనా కొత్త వస్తువును కనుగొంటే అవన్నీ మన వేదాల్లో, పురాణాల్లో ఎప్పుడో వున్నాయని తమ జబ్బలను తామే చరుచుకున్నారు. పారిశ్రామిక విప్లవాన్ని మరో మలుపు తిప్పిన పరిణామం 1900 శతాబ్ది ప్రారంభ దశకంలో రైట్‌ సోదరులు కనిపెట్టిన విమానం. ఆవిరి యంత్రాన్ని కనిపెట్టినపుడే మన వేద పారంగతులు, విజ్ఞానవేత్తలు మేల్కొని వుంటే అరే మన పురాణాల్లో వున్న పుష్పక విమానాలను పునరుద్దరించేందుకు పూనుకొని వుండేవారు. నిజంగా ఆ పని చేసి వుంటే మనకు ఎన్ని ప్రయోజనాలు సమకూరి వుండేవో.

ప్రపంచంలో అసలు పెట్రోలుతో పనిలేని విమానాలను మనమే తయారు చేసి మేకిన్‌ ఇండియా అని గొప్పగా చెప్పుకొని మనువాదులు చెబుతున్నట్లు కాలర్‌ చొక్కాలు వేసుకోవటం భారతీయం కాదు గనుక పిలకలు ఎగరేసి వుండేవారం. మన పుష్పక విమాన , కీలు గుర్రాలు, ఎగిరే కార్పెట్ల టెక్నాలజీని బయట పెట్టి వుంటే కార్లు, స్కూటర్లు, లారీల వంటి వాటితో పని వుండేది కాదు, అన్నింటికీ మించి ముస్లిం దేశాల నుంచి చమురు కొనుక్కోనే ఖర్మ పట్టేది కాదు, ఇప్పుడు వారి దగ్గర చమురు కొని, దానికి చెల్లించాల్సిన డాలర్ల కోసం కిరస్తానీ దేశాలను దేబిరించే దుర్గతి పట్టించింది కచ్చితంగా మన వేద విజ్ఞానాన్ని బయటికి తీసేందుకు ముందుకు రాని వెధవలే అన్నది స్పష్టం.

వేదాలను ప్రామాణిక సూత్రాల ప్రకారం సక్రమంగా చదవకపోతే వ్యతిరేక ఫలితాలు వస్తాయని సెలవిచ్చారు. మన దేశంలో కొన్ని భాషాలలో కొన్ని పదాలు పలకవు. వుదాహరణకు బెంగాలీలకు వ, బ మాదిరి. ఇలా ప్రతి భాషకు వున్నాయి. దీని ప్రకారం వుచ్చారణ సరిగా లేకపోతే ఫలితాలు వ్యతిరేకంగా వుంటాయనుకోవాలి. మరి దీన్ని పరిష్కరించటం ఎలా అందువలన ఇప్పటికీ మించి పోయిందేమీ లేదు. డార్విన్‌, న్యూటన్‌ల సిద్ధాంతాలు, సూత్రాలు వద్దూ, వేదాలే ముద్దు అనే పాలకులే నేడు గద్దెల మీద వున్నారు. ఇప్పటికే మేకిన్‌ ఇండియా జయప్రదానికి ఆవుపేడ, మూత్రాలలో ఏముందో కనుగొనేందుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి పరిశోధనలు చేయిస్తున్నారు. వేదాలలో వున్న టెక్నాలజీని అందరికీ అర్ధం అయ్యేలా ఘనాపాఠీలకే పేటెంట్‌ హక్కులిచ్చి చమురుతో పైలెట్లు, డ్రైవర్లతో పనిలేని విమానాలు, కార్లు,ఇతర వాహనాలను తయారు చేయించండి, విమర్శకుల లేదా వెక్కిరించే వారి నోరు మూయించండి. అదేమీ లేకుండా ఎవడో కిరస్తానీవాడు కనిపెట్టిన ఫేస్‌బుక్‌లో సొల్లు కబుర్లు చెబితే లేదా విమర్శి ంచేవారిని తిడితేనో ప్రయోజనం వుండదు. అంతులేని మన టెక్నాలజీని బయటకు తీసి దేశాన్ని ముందుకు నడిపించకపోతే అలాంటి వారిని దేశద్రోహులుగా పరిగణిస్తారని మనవి.

మన సాంకేతిక పరిజ్ఞానం నిక్షిప్తమై వున్న అనేక సంస్కృత గ్రంధాలను ఇస్లామిక్‌, క్రైస్తవులు నాశనం చేశారని ఒక నోటితో చెబుతూ దానిలోని విజ్ఞానాన్ని దొంగిలించారని మరో నోటితో చెబుతారు. వినేవారు నోట్లో వేలేసుకొని చెవులప్పగిస్తున్నారు. దేన్నయినా ఎందుకు అని ప్రశ్నించిన సమాజమే ముందుకు పోతుంది. ఎందుకు అని నువ్వు పెద్ద ప్రశ్నిస్తున్నావు మన పూర్వీకుల కంటే నువ్వు గొప్పవాడివా మానాన్నకు మాతాత చెప్పారు, మానాన్న నాకు చెప్పారు, నేను నీకు చెబుతున్నాను , నోరు మూసుకొని చెప్పింది చెయ్యి అంటూ తరతరాలుగా జిజ్ఞాసను అణచివేసిన ఆధిపత్య సమాజం మనది. అది వేదాలు, పురాణాలు, వుపనిషత్తులు, హిందూ ధర్మం ఏదైనా కావచ్చు. దేన్నీ ప్రశ్నించకుండా అణచివేశారు.

పురాతన కాలంలోనే అంటే క్రైస్తవం,ఇస్లామ్‌ మతాలు పుట్టక ముందే మన దేశంపై విదేశీయులు దండయాత్రలు చేశారు. క్రీస్తుపూర్వం 326లో అలెగ్జాండర్‌, క్రీపూ 200ల తరువాత శకులు, యవనులు, పహ్లవులు, క్రీస్తుశం 50లో కుషాణులు, క్రీశ 400లలో హూణులు దండయాత్రలు చేశారు. వారు మన వేద విజ్ఞానాన్ని నాశనం చేశారని ఎవరూ చెప్పలేదు. అలెగ్జాండర్‌ దాడి సమయంలోనే మన దేశానికి ప్రమాదం వుందని అర్ధమైంది. మరొకరు దాడికి పూనుకోకుండా ఎవరైనా ఏం చేయాలి, అందులోనూ దేశభక్తులు, అలెగ్జాండర్‌ నుంచి హూణుల వరకు మధ్యకాలం ఏడు వందల సంవత్సరాలలో ఏ ఒక్క సమయంలోనూ మన వేద విజ్ఞానులు విమానాలు లేదా అస్త్రాలను బయటకు తీసి సంధించి దురాక్రమణదారులను తరిమివేసి వుంటే తరువాత ముస్లింలు, క్రిస్టియన్లు దాడులు చేసి వుండేవారు కాదు. మహమ్మద్‌ ఘజనీ , ఘోరీలు అన్ని సార్లు దండయాత్రలు చేసి హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తుంటే మన అస్త్రాలను బయటకు తీయకుండా మన హిందూ ధర్మ పరిరక్షకులు ఏ గుడ్డి గుర్రానికి పండ్లుతోముతూ కూర్చున్నట్లు ?

మన నలంద విశ్వవిద్యాలయాన్ని ముస్లింలు తగుల బెట్టి మన విజ్ఞాన గ్రంధాలన్నింటినీ తగుల బెట్టారన్నది ఒక ప్రచారం. అనేక మంది చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం తగులబెట్టింది వాస్తవం. ఎవరు తగులబెట్టారు ? పాట్నా హిందుస్తాన్‌ టైమ్స్‌ 2014 సెప్టెంబరు ఒకటిన రాసిన దాని ప్రకారం క్రీస్తుశకం 455-467 మధ్య స్కంధగుప్తుని కాలంలో మిహిరకులుడనే హూణ రాజు నాయకత్వంలో విశ్వవిద్యాలయాన్ని నాశనం చేశారు. తరువాత గౌడాస్‌ నాయకత్వంలో ఏడవ శతాబ్ది ప్రారంభంలో మరోసారి నాశనం చేశారు. దాన్ని తరువాత హర్షవర్ధనుడనే రాజు పునరుద్దరించాడు.1193లో భక్తియార్‌ ఖిల్జీ సేనలు మరోసారి నాశనం చేసిన తరువాత దాని పునరుద్దరణ జరగలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుదారులు నడిపే పయనీర్‌ పత్రిక 2014 సెప్టెంబరు 20న రాసినదానిలో 1193లో టర్కీ సైన్యం దాడి చేసి విశ్వవిద్యాలయాన్ని తగుల పెట్టినట్లు పేర్కొన్నారు.

కొంత మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఖిల్జీ దాడుల నాటికే నలంద విశ్వవిద్యాలయం శిధిలమైంది. బౌద్ధంలో హీనయాన, మహాయాన శాఖల మధ్య వైరమే దీనికి కారణం అన్నది వారి వాదన. ఖిల్జీ సేనలు దాడి చేసింది నలంద జిల్లాలోనే వేరొక చోట వున్న మహావీర ఓదాంతపురి (నేటి బీహార్‌ షరీఫ్‌) కోటపై అన్నది ఒక అభిప్రాయం, నాటి చారిత్రక రచనల్లో అసలు నలంద ప్రస్తావన లేదని చెబుతున్నారు. డిల్లీ నుంచి బెంగాల్‌ వెళ్లే ప్రధాన మార్గంలో నలంద లేదని కూడా వాదించేవారున్నారు. చరిత్రకారులు ఎవరి భాష్యం వారు చెబుతున్నపుడు వాటి అధ్యయనానికి పరిమితం కావాలే తప్ప నిర్ధారణలకు రాకూడదు. ఇక్కడ సమస్య నలంద అనేది బౌద్ధ క్షేత్రం, బౌద్ధ విశ్వవిద్యాలయం అనేది నిర్వివాదం. బౌద్దులు వేద ప్రామాణ్యాన్ని నిరాకరించారు. అందువలన అక్కడున్నది వారి సాహిత్యం తప్ప వేద సంబంధిత సాహిత్యం ఎంత మాత్రమూ కాదు. ఒక వేళ వేద సాహిత్యమే నాశనం అయింది అనుకుంటే తరువాత ఎన్నో వందల సంవత్సరాల తరువాత వచ్చిన యూరోపియన్లు దొంగిలించటానికి అక్కడ ఏముంటుంది? వేదాలు, ఎంతో సాంకేతిక నైపుణ్యం వున్న సాహిత్యం సంస్కృతంలో వుందని చెబుతున్నవారు నలంద వంటి బౌద్ద విశ్వవిద్యాలయం మాదరి దేశంలో ఎక్కడా వేద విశ్వవిద్యాలయం ఎందుకు ఏర్పాటు చేయలేదు అన్నది ప్రశ్న.

వేదాలను బ్రహ్మ సృష్టించాడని చెబుతారు, అలాంటి వాటిని మానవ మాత్రులు నాశనం చేయటం ఏమిటి? శృతి, అనుశృతుల ద్వారా వేదాలు, వుపనిషత్తులు, పురాణాలను పరంపరగా తరువాతి తరాలకు అందించారు, అందువలన వాటిని భౌతికంగా నాశనం చేశారని చెప్పటం చెవుల్లో పూలు పెట్టటమే. చతుర్వేదాలు, పంచమ వేదంగా మహాభారతాన్ని చెప్పుకుంటున్నాం తప్ప నాశనం చేశారని, లేదా దొంగిలించారని చెబుతున్న వేదాల గురించి ఇంతవరకు ఎవరూ ఎందుకు చెప్పటం లేదు. పోనీ కాన్నింటినీ నాశనం చేశారని అనుకుందాం, అవన్నీ పోయిన తరువాత కూడా మన వారు వేదాల్లో అన్నీ వున్నాయష అన్నారు తప్ప కొన్నే వున్నాయష అన లేదు. అందువలన కొన్ని నాశనం చేశారని చెప్పటం ఇటీవలి కట్టుకధలు తప్ప మరొకటి కాదు. ముస్లిం పాలకులు మన దేశం మీద దండ యాత్రలు చేసినపుడు మన విజ్ఞానాన్నినాశనం చేశారని ఒక కధ, ఎవరైనా విజ్ఞానాన్ని గ్రహించి తాము వుపయోగించుకుంటారు. నిజంగానే వారు మన టెక్నాలజీని చోరీ చేసి వుంటే ముస్లిం దేశాలు నేడు సాంకేతిక పరంగా ఎంతో ముందుండాలి, దానికి బదులు పశ్చిమ దేశాల మీద ఎందుకు ఆధారపడుతున్నట్లు ? బ్రిటీష్‌, ఫ్రెంచి వారు అపహరించారంటారు. వారు మన దేశానికి రాకపూర్వమే ఐరోపాలో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది కదా, దాంతో పెరిగిన వుత్పత్తి అయిన వస్తువులను అమ్ముకొనేందుకే కదా మన దేశం వచ్చింది. మరి వారికి ఆ టెక్నాలజీ ఎలా వచ్చినట్లు ? సున్నా కనిపెట్టింది భారతీయులంటారు, ఎవరు నిర్ధారించారు? మూడువేల సంవత్సరాలకు పూర్వమే ఈజిప్టులో దాని ప్రస్తావన వున్నట్లు, నేటి సున్నాకు రూపమిచ్చింది చైనీయులని చరిత్ర వుంది. మనది కూడా పురాతన సమాజాలలో ఒకటి కనుక సున్నా గురించి పురాతన ప్రస్తావనలు మనకూ వున్నాయి. వేదాల్లో అన్నీ వున్నాయని చెప్పిన తరువాత ప్రతి దానిని మన ఖాతాలో వేసుకుంటే ప్రపంచం నవ్విపోతుంది. అంతెందుకు విదేశీ విడి భాగాలు లేకుండా మనం ఫోన్‌, కారు, టీవీ వంటి వాటిల్లో ఒక్కదానినైనా స్వంతంగా తయారు చేస్తున్నామా ? మనకు వున్న కీలకపేటెంట్లు ఎన్ని? చివరికి పెద్ద విగ్రహం తయారు చేసుకొనేందుకు కూడా చైనా వద్దకు పరుగెడుతున్నామే ఎంత సిగ్గు చేటు ?

క్రీస్తుకు పూర్వమే వున్న చరకుడు, ఆర్యభట్టు, శుశ్రుతుడు అంటూ ఒక జాబితాను వల్లె వేస్తున్నారు. వారితో ఎవరికి పేచీ వుంది ? వారి పరిజ్ఞానం ఎంత అన్న మీమాంస ఎప్పుడూ వుంటుంది. అతిశయోక్తులు జోడిస్తేనే వెక్కిరింతలు వస్తాయి. వినాయకుడికి ఏనుగు తలను అతికించిన గొప్ప శస్త్ర నిపుణులున్నారని చెబుతారా ? మనిషికి మనిషి తలదొరక్కపోతే దానికి సమబరువుతో వుంటే మరో కుక్కో, నక్క తలో అంటించాలిగాని మోయలేని ఏనుగు తలను అంటించే మొరటు వారా నాటి వైద్యులు. మహాభారత కాలంలోనే ఇంటర్నెట్‌ వుందని ఒక ముఖ్యమంత్రి ప్రవచిస్తాడా ? అదే నిజమైతే ముస్లింలు, అంతకు ముందు ఇతరుల దండయాత్రల గురించి ఎందుకు హెచ్చరించలేదు, తలలో మెదడు వుండి చెబుతున్న మాటలేనా ? పురాతన సమాజాలలో ఒకటైన మన దేశంలో కొన్ని రంగాలలో పని చేసిన ప్రముఖులను గుర్తించటానికి, వారి ఘనతను పొగటానికి ఎవరికీ ఇబ్బంది లేదు. వారందరూ వేదాలనుంచే ప్రావీణ్యం పొందారని చెబుతుంటేనే సవాలక్ష ప్రశ్నలు వస్తున్నాయి. వారికీ వేదాలకు సంబంధం వుండి వుండదు. ఒక వేళ వుంటే అదే వేదాల నుంచి తరువాతి తరాలు మరింత నైపుణ్యంతో వైద్యం, ఇతర శాస్త్రాలను ఎందుకు మెరుగుపరచలేకపోయారు? వేదాలతో సంబంధం లేకపోయినా వారి అనుచరులు తరువాత ఎందుకు నిపుణులుగా రాణించలేకపోయారు అన్నది పరిశోధించాల్సిన అంశం. వేదాలలో ఏముంది, అది పనికి వచ్చేదా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఒక సాహిత్యంగా చూసినపుడు వాటిని కంఠోపాఠం చేసి తరతరాలకు అందించినందుకు ఘనపాఠీలను అభినందించాల్సిందే. అదే సమయంలో వారి చాదస్తాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. అణకువ, ఆసక్తి, తపన వున్న సమాజమే ఎప్పుడైనా ముందుకు పోతుంది. అహంకారం, గర్వం వుంటే ఎక్కడో అక్కడ బొక్కబోర్లా పడి ముక్కు బద్దలు చేసుకుంటాం. సాయంత్రం కాగానే సత్రాలకు చేరుకొని గంజాయి దమ్ముకొట్టి మనం తెల్లవారిన తరువాత అది చేయాలి, ఇది చేయాలి అని ప్రగల్భాలు పలికి తెల్లవారి మత్తుదిగగానే ఎవరి కర్రాబుర్రా పట్టుకుని అడుక్కొనేందుకు పోయే సోమరిపోతుల మాదిరి కబుర్లు కాదు కావాల్సింది. వేదాల్లోనే అన్నీ వున్నాయని చెబుతున్న వారు విదేశాలకు ఎందుకు పరుగులు తీస్తున్నట్లు ? తమ బిడ్డలకు శ్లోకాలు నేర్పించటం ఒక దేశభక్తిగా అనేక మంది ప్రదర్శించుకుంటున్నారు. డాలర్ల కక్కుర్తి తప్ప దేశభక్తి ఏమైనా వుందా ?

ఇక గురుకులాల వ్యవస్ధను పునరుద్ధరించాలని మోహన్‌ భగవత్‌ చెబుతున్నారు. మదర్సాలనుంచి తాలిబాన్లు వస్తున్నారని నిత్యం ప్రచార దాడులు చేస్తున్న వారే వాటికి పోటీగా గురుకులాలను ఏర్పరచాలని అంటున్నారు. అంటే మైనారిటీ తాలిబాన్లతో పాటు మెజారిటీ తాలిబాన్లను తయారు చేసి సమాజాన్ని మధ్యయుగాల నాటికి తీసుకు పోయి రక్తపుటేరులు పారిద్దామనా ? ఏమిటీ వున్మాదం ? దీన్ని నాగరిక సమాజం సహించాలా ? ఆర్‌ఎస్‌ఎస్‌ను సమర్ధిస్తున్న వారిలో తమ బిడ్డలను గురుకులాల్లో చేర్పించటానికి ఎందరు ముందుకు రాగలరో చెప్పగలరా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d