• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: BJP

చట్టం కొందరికి చుట్టం కొందరికి దయ్యమైంది ఎందుకు ?

17 Tuesday May 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

AYUSH, BJP, doctored JNU videos, forgery, JNU, reporter

సత్య

    చట్టం ముందు అందరూ సమానులే కానీ కొందరు చట్టానికి చుట్టాలుగా వుంటారా ? న్యూఢిల్లీలో మేనెల రెండవ వారంలో పుష్పా శర్మ అనే జర్నలిస్టును పోలీసులు అరెస్టు చేశారు. ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నుంచి సమాచార హక్కు చట్టం కింద పొందిన సమాధానాన్ని ఫోర్జరీ చేశారని, దానిని పత్రికలో ప్రకటించి తప్పుడు సమాచారంతో మతాల మధ్య విబేధాలు రెచ్చగొట్టటానికి ప్రయత్నించారనే ఆరోపణలతో నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన యోగా దినం సందర్భంగా శిక్షకుల ఎంపికలో ఒక్క ముస్లింనుకూడా చేర్చలేదని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్ర కారమే అలా చేసినట్లు ఆయుష్‌ మంత్రిత్వశాఖ పేర్కొన్నట్లుగా తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించారన్నది పోలీసుల అభియోగం. అది నిజమే అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి ఎవరికీ అభ్యంతరం వుండదు.ఈ వుదంతంలో పోలీసులు వ్యవహరించిన తీరు అసాధారణంగా వుంది. ఆ వార్తను ప్రచురించిన పత్రిక ‘మిలీ గజెట్‌ ‘ అనే పత్రికకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. సమాచార హక్కు చట్టం కింద సమాచారం పొందినట్లు పేర్కొన్న సదరు శర్మను అనేక మార్లు పోలీసులు ప్రశ్నించారు. ఎలాంటి వారంటు లేకుండానే అరెస్టు చేసే బెయిలు రాని సెక్షన్‌ 153ఏ కింద కేసు బనాయించారు.

     కానీ ఇదే పోలీసులు ఫిబ్రవరి నెలలో జెఎన్‌యు వుదంతంలో తిమ్మిని బమ్మిని చేసి చేయని దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లుగా రూపొందించిన వీడియోలను పదే పదే ప్రసారం చేసిన జాతీయ టీవీ ఛానల్స్‌పై ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు.ఆ వీడియోల కారణంగా దేశమంతటా ప్రతిష్టాత్మక జెఎన్‌యు పరువు పోయింది, దానిలో చదువుకొనే విద్యార్ధులు దేశద్రోహులుగా దేశం ముందు ప్రదర్శితమయ్యారు. విద్యార్ధి సంఘనేత కన్నయ్య కుమార్‌తో సహా అనేక మందిపై దేశద్రోహ నేరం కేసులు మోపి అరెస్టులు చేశారు. ఢిల్లీ కోర్టుల వద్ద దేశ భక్తుల ముసుగులో వున్న లాయర్లు విద్యార్ధులు, ఆవార్తలను కవర్‌ చేయటానికి వచ్చిన జర్నలిస్టులపై దాడులకు పాల్పడ్డారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటాన్ని దేశమంతా చూసింది. భారత మాతాకీ జై అన్న నోళ్లతోనే విద్యార్ధుల అరెస్టులు అక్రమం అన్న మహిళా జర్నలిస్టులను మాన భంగం చేస్తామని బెదిరించారు. దేశమంతటా ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. అందుకు దోహదం చేసి వుద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు తోడ్పడిన వీడియో టేపులను తయారు చేసిన వారు, వాటిని ప్రసారం కోట్లాది మంది జనంలో విద్వేషాన్ని నింపిన సాంకేతిక నిపుణులు, జర్నలిస్టులు, టీవీ ఛానల్స్‌ యాజమాన్యాలు, ఆ తప్పుడు వీడియోల ఆధారంగా తప్పుడు కేసులు పెట్టిన పోలీసు యంత్రాంగంపై ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. అంతే కాదు వుమర్‌ ఖాలిద్‌ అనే విద్యార్ధికి వుగ్రవాద సంస్ధతో సంబంధాలు వున్నాయని తప్పుడు వార్తలను ప్రచురించిన పత్రికలు, ప్రసారం చేసిన టీవీలపై కూడా ఎలాంటి చర్యలు లేవు. తనతో పాటు అనిర్‌బన్‌ భట్టాచార్య అనే విద్యార్ధిపై ప్రచురించిన తప్పుడు వార్తల కారణంగా తాము కనిపిస్తే చంపే విధంగా జనంలో ఆగ్రహం వెల్లడైందని వారు స్వయంగా కోర్టుకు విన్నవించుకున్నారే. అంతటి తీవ్రమైన చర్యలు అక్రమాలుగా కేంద్ర ప్రభుత్వానికి కనిపించ లేదా ? ఒక జర్నలిస్టు పుష్పా శర్మ ఫోర్జరీ(రుజువు కావాల్సి వుంది) కారణంగా ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తే, మరో ఫోర్జరీ వీడియోల ద్వారా రాజకీయంగా లాభపడేందుకు అదే ప్రభుత్వం ప్రయత్నించింది. అందుకేనా వీడియో అక్రమాలపై చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంధ్రుల చెవిలో ‘ప్రత్యేక ‘పువ్వు – చంద్రన్న ముందున్న మార్గాలు

06 Friday May 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

Andhrapradesh, BJP, Chandrbabu, special status to Andhrapradesh, tdp

ఎం కోటేశ్వరరావు

    పేరు మోసిన అనేక కార్పొరేట్‌ ఆసుపత్రులు రోగి మరణించిన తరువాత కూడా సొమ్ము చేసుకొనేందుకు వెంటిలేటర్‌లు పెట్టి బంధువులను మోసం చేసిన మాదిరి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రత్యేక హోదా పరిస్థితి వుంది. తేడా ఏమంటే అక్కడ డబ్బు రాబట్టుకోవటం కోసం అయితే, ఇక్కడ జనం మద్దతు పోగొట్టుకోకుండా వుండటం కోసం. ప్రత్యేక హోదా ఇవ్వటం నిబంధనల రీత్యా సాధ్యం కాదని తెలిసినా నాడు కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఐదు కాదు పది అంటూ పెద్ద రాయితీని రాబట్టినట్లు బిజెపి పెద్ద నాటకం ఆడింది. తీరా బిల్లు విషయానికి వచ్చే సరికి అటు కాంగ్రెస్‌ దానిని దానిలో చేర్చలేదు, ఇటు బిజెపి, తెలుగుదేశం పార్టీ కూడా నోరు మెదపలేదు.ఇప్పుడు కాంగ్రెస్‌ మీద నెపం మోపి తప్పుకొనేందుకు చూస్తున్నాయి. మొత్తం మీద రెండు కళ్ల సిద్ధాంతంతో చంద్రబాబు, ప్రత్యేక హోదా రాయితీల నాటకంతో బిజెపి, అందరూ కోరుతున్నారు, కలిసి వస్తున్నారు కదా తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు కాంగ్రెస్‌ వారు వారందరితో కుమ్మక్కయి ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారు. నిబంధనలు అంగీకరించవని తెలియనంత అమాయకంగా ఈ పార్టీలలో తలలు పండిన పెద్దలు వున్నారా ?

     అటు కేంద్రం-ఇటు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో వున్న పార్టీలు రెండు సంవత్సరాల పాటు ఆశ పెట్టాయి. ఇంకెంత మాత్రమూ మోసం చేయలేవు.మరణించిన రోగిని వెంటిలేటర్‌పై పెట్టిన కార్పొరేట్‌ ఆసుపత్రి యాజమాన్యం అసలు విషయం చెప్పదు, చేయాల్సిందంతా చేస్తున్నాం అని మాత్రమే చెబుతుంది. రోగి బతికి బట్ట కట్టే ఆశ చచ్చి, అంతకు మించి వెంటిలేటర్‌ ఖర్చు భరించలేక బంధువులకు ఏం చేయాలో తెలియదు. ప్రస్తుతం ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి అలానే వుంది.

    పార్లమెంట్‌లో మంత్రి అరుణ్‌ జైట్లీ సీనియర్‌ లాయర్‌ కనుక కేసు గెలుస్తామని గానీ ఓడిపోతామని గాని చెప్పకుండా నర్మగర్బంగా అసలు కేసే లేదు అని చెప్పేశారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రులు, ఇతరులు అందరితో మాట్లాడుతున్నా అని చెబుతున్నారు. ఆయన మాట్లాడటం లేదని ఎవరూ అనటం లేదు. దేన్ని గురించి, ఏం మాట్లాడుతున్నారో జనానికి తెలియాలి కదా? కనీసం ఆయనను వెన్నంటి వుండే లేదా మేనేజిమెంట్‌లో వుండే మీడియా కూడా లీకుల కధనాలు కూడా ఇవ్వకపోవటంతో వాటికి అలవాటు పడిన వారు మత్తుకు బానిసలైన వారు గంజాయి దొరక్క పోతే ఎలా విలవిల్లాడి పోతారో అలా జుట్టు పీక్కుంటున్నారు.

    గతంలో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వున్నపుడు పరిస్థితి వేరు. కారణాలేమైనా కాంగ్రెస్‌ వ్యతిరేకత. ఇప్పుడు అలా కాదే. ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడి మాదిరి మీడియా సంస్ధలు అటు కేంద్రంలోని బిజెపి- ఇటు రాష్ట్రంలోని తెలుగు దేశం పార్టీ మధ్య వున్నాయి. ప్రత్యేక హోదా గురించి ఎవరికీ నొప్పి లేదా రాజకీయంగా నష్టం జరగకుండా తమ ప్రావీణ్యాన్ని వుపయోగించి ఏం రాస్తాయో, ఎలా చూపుతాయో తెలియదు. ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాల గడువు వుంది. చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో పుల్లుగా వాగ్దానాలు చేసి, రంగుల కలలను జనం ముందుంచారు. ఏ రంగంలో చూసినా ఎదురుగాలి తప్ప మరొకటి కనపడటం లేదు. గత ఎన్నికల ఫలితాల గురించి చంద్రబాబు అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. కేంద్రంలో తనపై ఆధారపడే ప్రభుత్వం వుంటుందని వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. రాజ్యసభలో తనకు తగినంత బలం లేదు కనుక బిజెపి కూడా వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీతో సంబంధాలను కొనసాగిస్తున్నది. మరొక మార్గం లేదు కనుక తెలుగుదేశం కూడా అధికారాన్ని పంచుకొని, తాను కూడా పంచి ఇచ్చింది.

    గత రెండు సంవత్సరాల అనుభవం చూస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేది పిడికెడు మట్టి, ముంతెడు నీళ్లు అని అమరావతి శంకుస్ధాపన సభలోనే ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తేల్చి చెప్పారు. అందుకే చంద్రబాబు ముందు చూపుతో శాశ్వత రాజధానిని పక్కన పెట్టి తాత్కాలిక రాజధానిని తెరమీదకు తెచ్చారు. ప్రత్యేక తరగతి హోదా రాదని చంద్రబాబుకు ఎప్పుడో అవగతం అయినా దానిని అంగీకరిస్తే రాజకీయంగా నష్టం కనుక. సాధ్యమైన మేరకు దాని ప్రస్తావన, దానిపై ఘర్షణ రాకుండా చూసుకుంటున్నారు.అసలు ప్రస్తావించకపోతే అదీ నష్టమే కను తద్దినం మాదిరి స్మరించారు. ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర పెద్దలు గత ఏడాది కాలంగా పరోక్షంగా చెబుతూ లీకులను వదులుతూనే వున్నారు. ఇక లాభం లేదని గత వారంలో చిన్న మంత్రుల ద్వారా పెద్ద విషయాన్ని చెప్పించారు.

    ఈ పూర్వరంగంలో గత వారం రోజులుగా చంద్రబాబుకు పాలుపోవటం లేదు. స్పందన ఎలా వుంటుందో తెలుసుకొనేందుకు కింది స్థాయి నాయకులతో విమర్శలు చేయిస్తున్నారు. బిజెపితో తెగతెంపులు చేసుకుంటే రాజకీయంగా ఒంటరి పాటు కావటంతో పాటు కేంద్రం నుంచి ప్రతి రోజూ అధికారికంగా తలనొప్పులే. సఖ్యంగా వున్న ఇపుడే వుదయం సాయంత్రం ఢిల్లీ ప్రభువుల దర్శనం చేసుకున్నా ఫలితం వుండటం లేదని తేలిపోయింది. ఇటు రాష్ట్రంలో చూస్తే రాజకీయంగా కలసి వచ్చే స్నేహితులు కనిపించటం లేదు. గత ఎన్నికలలో తోడ్పడిన సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ అదేదో సినిమాలో చెప్పినట్లు వీలైతే నాలుగు మాటలు, కాఫీ, ఆశకు పిసినారి తనం ఎందుకన్నట్లు వీలైతే ముఖ్యమంత్రి పదవి కోసం దారి వెతుక్కుంటున్నారు. కాంగ్రెస్‌ ఇప్పుడపుడే కోలుకొనే పరిస్థితి కనిపించటం లేదు. ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి మార్గం అగమ్యగోచరం. వైఎస్‌ కుటుంబంతో వున్న ఆర్ధిక లావాదేవీలు పరిష్కారం కాని వారు అవి తేలేంత వరకు అదే పార్టీలో కొనసాగవచ్చు.ఆ బాదర బందీ లేనివారు, తెలుగు దేశం పార్టీతో సర్దుబాటుకు వచ్చిన వారు ఇప్పటికే ఫిరాయించారు, రానున్న రోజుల్లో మరికొందరు రావచ్చు.

    తెలుగు దేశం పార్టీ పరిస్థితి కూడా అంత సజావుగా, వుత్సాహంతో, వుద్వేగంతో వురకలు వేసే పరిస్థితి వుండదు.కేంద్రంతో ముడిపడిన వ్యాపార లావాదేవీలు వున్నవారు దానితో వైరం తెచ్చుకొనేందుకు సుతరామూ అంగీకరించరు. రెండవది చంద్రబాబు నాయుడు అప్పుచేసి పప్పుకూడు అన్న పద్దతుల్లో రాజధాని అమరావతిని కూడా అప్పులతో నిర్మించేందుకు చూస్తున్నారు. అది సాధ్యం అవుతుందో లేదో ఇప్పుడే చెప్పలేము. ఇంతవరకు ఏ రాష్ట్ర రాజధాని నిర్మాణం కూడా అలా జరగలేదు.ఒక వేళ ఆ ప్రాంత భూములన్నీ తాకట్టు పెట్టి లేక భారీ రాయితీలు ఇచ్చో విదేశీ సంస్దల నుంచి అప్పు తెచ్చుకోవాలంటే కేంద్రం అనుమతులు తప్పనిసరి. లక్షల వుద్యోగాలు సృష్టించలేకపోయినా కనీసం రాజధాని నిర్మాణం చేయకుండా వచ్చే ఎన్నికలలో ఓటర్ల ముందుకు పోలేరు. చంద్రబాబు మరొకసారి విశ్వసనీయత సమస్యను ఎదుర్కోవటం స్పష్టంగా కనిపిస్తోంది.

     ఈ పూర్వరంగంలో ఏదో ఒక దారి లేదా సాకు వెతుక్కొని బిజెపి, కేంద్రంతో సర్దుకు పోదాం లెండి అన్నట్లు ఎన్నికల ముందు వరకు లొంగి పోవటం ఒక మార్గం. చంద్రబాబును అపర చాణక్యుడు అంటారు కనుక అప్పటి పరిస్థితిని బట్టి ఏదారి పట్టాలో నిర్ణయించుకోవటం ఒకటి.లేదూ తెగేదాకా లాగితే తెలుగు దేశం పార్టీ సంగతి తేల్చటానికి బిజెపి వెనుకాడదు. కాంగ్రెస్‌ బాటలోనే అది ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసేందుకు వెనుకాడదు అని ఇప్పటికే రుజువు చేసుకుంది. తెలుగు దేశం పార్టీ ఫిరాయింపు జనాలతో నిండి వుంది. అలాంటి వారికి మరొక జంప్‌ చేయటం కష్టం కాదు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడని నమ్మి ఆయనకు మద్దతు ఇచ్చాం.అది సాధ్యం కాదని తేలిపోయింది, రాష్ట్ర అభివృద్ధి కోసం బిజెపికి మద్దతు ఇస్తున్నాం అని చెప్పటానికి ఎలాంటి జంకూ గొంకూ వుండదు. తొలిసారి తప్పు చేసినపుడు సిగ్గు పడతారేమో గాని తరువాత అలవాటుగా మారిపోతుంది. అధికారానికి బానిసలుగా మారితే ఎంతకైనా తెగిస్తారు.

     చంద్రబాబు ముందున్న మరొక మార్గం జనానికి వాస్తవాలు చెప్పి విశ్వసనీయత కల్పించుకొని వారి మద్దతు పొందటానికి ప్రయత్నించటం. చంద్రబాబు చాణక్యంలో ఇంతవరకు అలాంటి అధ్యాయం లేదు. చిత్రం ఏమంటే ఏది జరిగినా చంద్రబాబు, తెలుగుదేశం బలహీనపడే పరిస్థితులను స్వయంగా సృష్టించుకున్నారు. రెండో మార్గాన్ని అనుసరించితే కనీసం కొంత మంది సానుభూతి అయినా పొందవచ్చు.

      రాష్ట్రంలో బిజెపి కూడా మునుపటి మాదిరి లేదు. కేంద్రంలో ఎవరి దయా దాక్షిణ్యాలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు తప్ప రాష్ట్రంలో బలపడటానికి దానికి మరొక మంచి అవకాశం లేదు, రాదు. ఇప్పటికే రెండు సంవత్సరాలు వృధా అయిందనే తొందర వారిలో కనిపిస్తోంది. ఆ పార్టీలో సాంప్రదాయ ఆర్‌ఎస్‌ఎస్‌ రక్త సంబంధీకులే కాకుండా, కొత్తగా కాంగ్రెస్‌ రక్తం కూడా కలిసింది. వుపయోగించుకోవటం, లాభం లేదనుకున్నపుడు వదలి వేసిన గత అనుభవాల రీత్యా చంద్రబాబు నాయుడు వారికి నమ్మదగిన స్నేహితుడు కాదు. అన్నింటికీ మించి మర్రి చెట్టు నీడన మరొక మొక్క ఎదగదు అన్నట్లు తెలుగు దేశం నీడలో బిజెపి పెరగటం అసాధ్యం అని రెండు సంవత్సరాల అనుభవం వారికి నేర్పింది. అందువలన తమకు లొంగిపోయి అధికారంలో మరింత వాటా పెడితే సరి లేకపోతే తెలుగుదేశం మూలాలను దెబ్బతీయటానికి ప్రయత్నించినా ఆశ్చర్యం లేదు. అధికారం ఎంతపని అయినా చేయిస్తుంది. మొత్తానికి ప్రత్యేక హోదా ప్రత్యేక రాజకీయ పరిస్థితులకు నాంది పలికింది. ఇది ఏ మలుపు తిరుగుతుందో, రాష్ట్ర రాజకీయాలను ఎటు మళ్లిస్తుందో , ఏ ప్రస్తానానికి దారితీస్తుందో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చంద్రబాబుకు ఓ అభిమాని బహిరంగ లేఖ

03 Tuesday May 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Modi, Narendra Modi, special status to Andhra pradesh, YS jagan

బాబు గారూ మీరు మెతక మనిషని ఎవరన్నారు ?

      చంద్రబాబు నాయుడు అంటే రాజకీయంలో అపర చాణుక్యుడు, సర్దార్‌ పటేల్‌ కంటే గట్టి పిండం, గ్రీకు వీరుడు హెర్క్యులస్‌ను మించిన బలశాలి అనుకుంటున్న మీ అభిమానులను ఒక్కసారిగా నాగలోకం నుంచి నక్కల మధ్య పడేశారు. సందేహ సముద్రంలో ముంచేశారు. నేను మెతక మనిషినేం కాదు, ధృడచిత్తంతో వున్నాను అని స్వయంగా మీరు చెప్పటంతో మా చిత్తాలు చిత్తడి అయిపోతున్నాయి. బాబు గారూ అసలు మీరు మెతక మనిషని ఎవరన్నారు ? మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ చేసుకుంటారు ? వైఎస్‌ రాజశేఖరరెడ్డితో పోటీ పడి వస్తున్నా మీ కోసం పేరుతో మీరు చేసిన పాదయాత్ర మెతక మనుషులకు సాధ్యమా ? బిజెపి, నరేంద్రమోడీ పట్ల ఒకసారి కఠినంగా మరోసారి మెతకగా వున్నట్లు మీపై విమర్శలు వస్తే వచ్చి వుండవచ్చుగాక, అవి రాజకీయాలు, నిరంతరం మీరు కలలు కనే రాష్ట్రం కోసం తప్ప మీ మెతక తనానికి నిదర్శనాలు ఎలా అవుతాయి ? మామ అని కూడా చూడకుండా ఎన్‌టి రామారావు పట్ల కూడా ఎంత కఠినంగా వ్యవహరించారో మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసిన మాకు మీరు మెతక మనుషులని అనుకోవటానికే ఏదోగా వుంది.

    అసలు మీకు ఏమైంది ? మీరు ఏనుగు వంటి వారు. ఒక వేళ ఎప్పుడైనా ఎవరైనా రాజకీయ ప్రత్యర్ధులు మీ వెనుక ఏదో అంటే మిమ్మల్ని సమర్ధించటంలో మీ మంత్రులు సరిగా వ్యవహరించనందుకు మందలించారని పత్రికల్లో వార్తలు వచ్చాయి గానీ మా వంటి అభిమానులు ఎక్కడైనా తగ్గినట్లు విన్నారా? మేం ఎన్నడైనా అంగీకరించామా? లేదే ! అటువంటిది నేను మెతక మనిషిని కాదు అని బేలగా, జాలిగా మీరు అనటం ఏమిటి బాబూ ! మేం ఏం కావాలి ? కష్టపడటం నా తప్పా అని మీరు అంటుంటే చివరికి మనప్రత్యర్ధి వైఎస్‌ఆర్‌సిపికి, జగన్‌కు సైతం ఇలాంటి పరిస్థితి రాకూడదురా బాబూ అన్నట్లు మా కడుపు తరుక్కు పోతోంది.

   మిమ్మల్ని (మనల్ని )నమ్ముకొని అనేక మంది తమ నియోజకవర్గాలను కూడా తెల్లారేసరికి సింగపూరో, మలేషియానో, జపానో, అమెరికాగానో మార్చేద్దామనే కదా వైసిపినుంచి ఎంఎల్‌సీలు, ఎంఎల్‌ఏలు, కాంగ్రెస్‌ నుంచి గాదె వెంకట రెడ్డి వంటి నేతలు సైతం పార్టీకిలోకి ప్రవాహాలుగా వస్తున్నారు.నేను మెతక మనిషిని కాదు అన్న మాట ఏ వుద్ధేశ్యంతో అన్నారో గానీ లేస్తే మనిషిని కాదు అన్న కుంటి మల్లయ్య సామెతను గుర్తుకు తెస్తోందని ప్రతిపక్ష పార్టీల వారు అంటుంటే అటు కాదనలేక ఇటు అవుననలేక మేం మెత్తపడక పడక తప్పటం లేదు. రెండు సంవత్సరాలు చూశాం కేంద్రంలో మంత్రి పదవులు అనుభవించటం తప్ప రాష్ట్రానికి ఏం పనులు జరిగాయి, ఏం పీకారు అంటుంటే వెర్రి మొహాలు వేసుకొని ఇంకా ఎంతకాలం సమర్ధించాలో అర్ధం కావటం లేదు. దీనికి తోడు పార్టీ అధికారానికి వస్తే గడ్డ పెరుగు ముక్కల మాదిరి తిందామని అనుకుంటుంటే ఎదుటి పార్టీల నుంచి ఎందరు వస్తే అంత మందినీ కలుపుకోండని, అంతా మనమంచికే అని చెబుతున్నారు. మీకేం బాబూ ! మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అవుతుంది. గత ఎన్నికలలో ఎంత ఖర్చు చేశామో మీకు తెలియనిది కాదు. ఇది ఎప్పుడూ వుండేదే . కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుపోతుంది. ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి, ఎన్నికల సమయంలో వున్న కార్యకర్తల కంటే తరువాత ఫిరాయించిన వారు ముద్దు , ఓడమల్లయ్య బోడి మల్లయ్య వంటి ఈ విషయాల గురించి తరువాత మరోసారి విన్నవించుకుంటా.

    మన రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధికారుల నుంచి ప్రధానికి సరైన సమాచారం అందుతోందా లేదా అనే సందేహాన్ని వ్యక్తం చేసినట్లు వార్తలు చదివాం. బాబు గారూ మీరు ఒక జాగ్రత్త తీసుకోవాలి. మీరు బాగానే చేస్తున్నా మంత్రులు, అధికారులు సక్రమంగా లేరని మన శ్రేయోభిలాషుల మాదిరి వుండే కొందరు జర్నలిస్టులు రాసిందానిని నిజమే అని గతంలో నమ్మారని ఇప్పుడూ అనుకుంటున్నారని వింటున్నాం. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమంటే అదే జర్నలిస్టులు ఇటు మిమ్మల్ని, అటు కేంద్రంలో అంతకంటే ప్రధాన మంత్రిని ఎక్కువగా సమర్ధిస్తున్నారు. అందువలన కేంద్ర అధికారులు ప్రధానికి సరిగా తెలియచేయటం లేదనే పాట మీ కోసం కాదేమో చూడండి. లేక ప్రధాని మీద మాట పడకుండా మిమ్మల్ని ‘సంతృప్తి ‘ పరుస్తున్నారా? బిజెపికి సంతృప్తి రాజకీయాలు గిట్టవని తెలుసు కదా ! జర జాగ్రత్త, జనం నమ్మేట్లు లేరు. ఆంధ్రప్రదేశ్‌ విషయంలో కేంద్ర మనోగతం ఏమిటో అర్ధం కావటం లేదు, కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారా లేక సమస్య తీవ్రత తెలియక పట్టించుకోవటం లేదా అన్నది అర్ధం చేసుకోలేకపోతున్నాం. వెళ్లి కలిసినపుడు బాగా మాట్లాడుతున్నారు, కాని ఫలితం రావటం లేదు అన్నారు.

   ముందు మన శాసన మండలి, అసెంబ్లీ తీర్మానాలు చేయటమేనా, అసలు వాటిని మన అధికారులు కేంద్రానికి పంపారా ? అన్న అనుమానం కలుగుతోంది. మరి పంపితే వాటికి వచ్చిన సమాధానాలు ఏమిటి , మన మంత్రులు, ఎంపీలు కలిసినపుడు ఏం చెప్పారు. మన అధికారులు వచ్చిన వర్తమానాలను పూర్తిగా చూపటం లేదా అన్న సందేహం తలెత్తుతోంది. పార్లమెంట్‌లో సమాధానాలు, ఇతర లోగుట్టు కధనాల పేరుతో రాసిన వార్తలు తప్ప మాకు నిజం తెలియటం లేదు. రాష్ట్రం పంపిన తీర్మానాలేమిటి ? వాటికి కేంద్రం నుంచి వస్తున్న సమాధానాలు ఏమిటో అధికారికంగా తెలియచేస్తే అభిమానులం మేం కూడా ఒక పట్టు పడతాం కదా? అదేం వుండటం లేదు. అసలూ మనకు కేంద్రంలో ఇద్దరు మంత్రులు, ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధులు కూడా వున్నారు. వారు రోజూ కేంద్రంతో సంప్రదించవచ్చు. మరి వారేమి చేస్తున్నట్లు ? మీరు అనేక సార్లు ప్రధాన మంత్రిని కలిశారు. మీకేమో గుజరాతీ, హిందీ రాదు, ఆయనకేమో తెలుగు రాదు. అందువలన అసలు మీరు ఏ భాషలో మాట్లాడుకున్నారు అన్న అనుమానం కలుగుతోంది. ఆవో బాబూ ఆవో మై హూనా కాఫీ, చాయ్‌ పానీ పీనేకే బాద్‌ తుమ్‌ ఏపి జావో, బాద్‌మే అచ్చే దిన్‌ ఆ రహా హయ్‌ అంటే మీరు మంచిగా మాట్లాడుతున్నట్లు అనుకుంటున్నారా ఏమిటి ? ఇలా అయితే మీరు మరో 30 సార్లు ఢిల్లీ వెళ్లినా ఇదే జరుగుతుందన్న నీరసం వస్తోంది మాకు. మీరు నిరాశగా మాట్లాడటం చూస్తుంటే ఏదో దాస్తున్నట్లు , చెప్పుకోలేని బాధ, కేంద్రంలో మీకు అవమానం జరిగిందేమో అన్న అనుమాన బీజం మాలో పడింది.

    కేంద్రంలో వున్న మన వెంకయ్య నాయుడు గారేమో తాను రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ ఒక సమస్య పరిష్కారమో, కొత్త పధకమో తెస్తున్నట్లు చెబుతారు.ప్రధాని ఆయన ఎంత చెబితే అంత అంటారు. మీరేమో ప్రధాన మంత్రి దృష్టిపెడితే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయంటున్నారు.అంటే మీరు ప్రధాని దృష్టిని, కనీసం తోటి వెంకయ్య నాయుడి దృష్టిని సైతం ఆంధ్రప్రదేశ్‌పై మళ్లించటంలో రెండు సంవత్సరాలుగా విఫలమయినట్లేనా అన్న వూహనే తట్టుకోలేకపోతున్నాము.

    ఇంతవరకు జరిగిందానిని బట్టి, అనేక రాష్ట్రాలలో జరుగుతున్నదానిని బట్టి మన వంటి వారిపై ఆధారపడే కంటే స్వంతంగా బలపడాలని, అందుకు గాను వచ్చే ఎన్నికల నాటికి బిజెపిని మరింత బలపరుచుకోవాలన్నది మోడీ లక్ష్యంగా కనిపిస్తోంది.ఎదుటి పార్టీ వారిని ఆకర్షించటం మాకూ చేతనవును అని అనేక రాష్ట్రాలలో చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది మీకు అర్ధం అయ్యేట్లు చేయాలని బిజెపి నేతలకు అర్ధం అయింది. ఈ విషయం మీకు అర్ధం అయినా మరొక దారి లేక బింకాలు పోతున్నారని జనం చెవులు కొరుక్కుంటున్నారు.

    బిజెపి రాష్ట్ర నేతలు కేంద్రం అన్ని విధాలుగా సాయం చేస్తున్నది అనే ప్రచారం క్రమంగా పెంచుతున్నారు. కేంద్రం సహకరించినా దానిని వినియోగించుకోవటంలో బాబు గారు విఫలమయ్యారు కనుక ఒక అవకాశం మాకే ఇవ్వండి అని వారు ముందుకు వస్తారా ? వస్తే మన పార్టీలో ఎందరు మిగులుతారు అన్నవి ప్రస్తుతానికి వూహా జనిత ప్రశ్నలే కావచ్చు కానీ, ప్రస్తుతం మన వంటి పార్టీల నేతలు డొల్లుపుచ్చకాయల వంటి వారు, ఎటైనా దొర్ల వచ్చు. ఇంతకు ముందు మన పార్టీలో కాంగ్రెస్‌ రక్తం ఎంత వ్యతిరేక రక్తం ఎంత అని కొలిచేవారు, ఇప్పుడు కాక్‌టెయిల్‌ మందు మాదిరి, ఏది ఎంతో తెలియటం లేదు.

   చివరగా ఒక్క మాట. అధికారంలో లేనపుడు అభిమానుల సూచనలు పట్టించుకుంటారని, అధికారం వచ్చిన తరువాత ఇతరుల మాటలు వింటారని మీ గురించి గిట్టని వారూ, గిట్టే వారు కూడా చెబుతుంటారు. ఈ సంవత్సరం కూడా నవ నిర్మాణ దీక్ష చేపడతామని ప్రకటించారు.ఏదో తొలి ఏడాది దీక్ష అంటే అర్ధం వుంది, ప్రతి ఏడాదీ దీక్షలేమిటంటే ఏం చెప్పాలి. ప్రతిపక్ష నాయకులు దీక్షలు చేయటం అంటే అర్ధం వుంది. అధికారంలో వున్నవారు దీక్షలు చేస్తే చాలా బాగోదు. బరువు తగ్గటానికైతే ఓకే. ప్రత్యేక తరగతి రాష్ట్ర హోదా, రైల్వే జోన్‌, లోటు బడ్జెట్‌ పూడ్చేందుకు సాయం వంటి వాటిపై దీక్ష చేస్తేనన్నా ప్రధాని రాష్ట్రం వైపు దృష్టి పెడతారేమో చూడండి బాబు గారూ.ప్రావిడెంట్‌ ఫండ్‌ వుపసంహరణ, వడ్డీ తగ్గింపుపై కార్మికుల తడాఖాను చూసిన తరువాతే ప్రధాని వాటిపై దృష్టి సారించారు.వెనక్కు తగ్గారు. కేసుపోయినా మన ప్లీడరు గట్టిగా వాదించాడు అని వచ్చే ఎన్నికలలో మేమంతా చెప్పుకోవటానికి దారులు వెతుక్కోవటం మంచిదేమో చూడండి మరి.

    వుంటా బాబూ ! రెండు సంవత్సరాల నుంచి మన రాష్ట్రం, మన అమరావతి , మన ఇటుకలు, మన మట్టి, మన నీరు అంటూ వుత్సాహంతో, వుద్వేగంతో ఎంతో అభిమానంతో ఎదురు చూసిన మా వాడు జాబు గురించి హైదరాబాదో, బెంగలూరో పోవాలంటున్నాడు. దాని సంగతేదో చూడాల, మన అమరావతిలో జాబులు వచ్చినపుడు వాడిని ఇక్కడికే రప్పిస్తాలే, అప్పటి దాకా వుంచుకోలేకం కదా ! ఎంతైనా పెళ్లి కావాల్సిన పిల్లాడు కదా !

మీ అభిమాని

ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ- చంద్రబాబు ప్రత్యేక హోదా రాజకీయ క్రీడలో అమాయక ఆంధ్రులు

01 Sunday May 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Narendra Modi, pavan kalyan, special status, YS jagan, ysrcp

ఎం కోటేశ్వరరావు

   మూడు ఆకర్షణలు-ఆరు ఫిరాయింపులుగా లాహిరి లాహిరిలో ఓ హో జగ(నే)మే వూగెనుగా వూగెనుగా అంటూ ఆనందంతో తేలియాడుతున్నపుడు అంతరాయం కలిగిస్తే ఎవరికైనా ఎలా వుంటుంది? వున్న రెండు కళ్లలో ఒకదానిని పొడుస్తున్నా ఎంతో సహనంగా అదీ మనమంచికే అన్నట్లు ,తాపీగా కుమారుడు లోకేష్‌కు అధికార పదవిని ఎలా, ఎపుడు కట్టబెట్టాలా అని చూస్తున్న చంద్రబాబుకు మధ్యలో అంతరాయం కలిగిస్తే చిరుకోపం కూడా రాకుండా వుంటుందా ? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక తరగతి రాష్ట్రహోదా గురించి మరిచి పొమ్మని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి స్పష్టం చేసిన తరువాత ‘ ఏ మాటలవి ‘ అలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది అంటూ తమలపాకుతో చంద్రబాబు నాయుడు చిరుకోపం ప్రకటించారు. మామ వాగ్దానం నెరవేర్చనందుకు కాదు, తోడల్లుడు కిసుక్కు మన్నందుకు అన్నట్లు ఇంతకాలం ఏమీ చేయకపోగా దాని గురించి మరిచిపోండి అన్న నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని వదలి కేసుల కోసం తప్ప ఏనాడైనా జగన్‌ రాష్ట్రం కోసం ఢిల్లీ వెళ్లారా అని చంద్రబాబు ఆగ్రహించారు. జగన్‌ తన కేసుల కోసమే తిరుగుతున్నారనుకుందాం. అందులో తప్పేముంది? కేంద్రంలో వున్న చంద్రబాబు మిత్ర పక్షం, స్వయంగా తెలుగు దేశం మంత్రులు కాబినెట్‌లో వున్నారు. అందువలన జగన్‌ ఢిల్లీ వచ్చి తన కేసుల గురించి ఏం పైరవీలు చేసుకుంటున్నారో, వాటిని తామెలా ఎదుర్కొంటున్నారో చెబితే వుపయోగం. కేవలం తిరుగుతున్నారంటే అర్ధం లేదు.

      నిజమే చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పినట్లు రెండు సంవత్సరాలు కూడా గడవక ముందే 30 సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చినా అసలే ఆర్ధికంగా ఇబ్బందుల్లో వున్న రాష్ట్రంపై అదనపు భారం మోపే దారి ఖర్చులు దండగతప్ప అదనంగా సాధించిందేమిటి అన్నది అసలు ప్రశ్న. పదహారు వేల కోట్ల రూపాయల లోటుకు కేవలం 2,800 కోట్లు మాత్రమే కేంద్రం సాయంగా అందించిందని చంద్రబాబు స్వయంగా చెప్పారు. అంటే ఆ మిగతా మొత్తం కూడా రాదన్నది స్పష్టం. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి అలా పదే పదే ఢిల్లీ తిరగటం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాట్టు పెట్టిన గత పాలకులు, పాలనను గుర్తు చేయటం లేదా ?వారికీ వీరికీ వున్న తేడా ఏమిటి ? తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు నాయుడు లేదా జాతీయ ప్రధాన కార్యదర్శి లోక్‌ష్‌ గానీ వీటికి సమాధానాలు చెప్పాలి. అలాగాకుండా రోజంతా జగన్‌ భజన చేస్తూ వుంటే సామాన్య జనానికే కాదు, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులకు కూడా విసుగు పుడుతుంది. 1978లో జనతా పార్టీ ఎంఎల్‌ఏలను కాంగ్రెస్‌ పూర్తిగా తనలో చేర్చుకున్నట్లుగా మరికొద్ది రోజుల్లో మిగిలిన వైఎస్‌ఆర్‌సిపి ఎంఎల్‌ఏలను కూడా ‘అభివృద్ధి’ ముసుగులో తెలుగుదేశంలోకి ఆకర్షిస్తారు.ఆ తరువాత చెప్పుకోవటానికి ఏమీ వుండదు.

    రాష్ట్ర తాత్కాలిక రాజధాని నిర్మాణంలో ఇటుక ఇటుకనూ పేరుస్తూ నిమగ్నమైన చంద్రబాబుకు కేంద్రంపై ఆగ్రహం కలిగించటానికి తప్పితే తెలంగాణాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ ఎంపీ కెవిపి రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి ప్రయివేటు బిల్లుపెట్టటం ఏమిటి ? పెట్టెను పో దాని మీద చర్చ జరగనీయటం ఏమిటి? జరిగెను పో ఆంధ్రకు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేరుస్తుంది, కావాలంటే ఇంకా అదనంగా కూడా ఏం కావాలంటే అది చేస్తాం అని లాలీపప్‌ సమాధానం చెప్పటం గాక వాటి గురించి మరిచి పోండి అని కేంద్ర మంత్రి కట్టెవిరిచినట్లు మాట్లాడటం ఏమిటి ? మోడీ బాబా నోరు విప్పకుండా శిష్యులతో ఇలాంటి ప్రకటనలు చేయించటం కావాలని చంద్రబాబుకు ఇబ్బంది కలిగించటం కాదా ?

   తానొవ్వ, ఇతరులను నొప్పించక సజావుగా సాగిపోవాలనుకుంటున్న తనకు మధ్య మధ్యలో తలనొప్పి కలిగిస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్ల చంద్రబాబు నాయుడికి తీయని కోపం వస్తోందా? అది శ్రీకృష్ణుడి మీద సత్యభామకు వచ్చినటువంటిదేనా ? తాను ఏం చెప్పినా, ఏం చేసినా ప్రశ్నించేవారు వుండకూడదు, అలా వుండాలంటే చంద్రబాబుకు ప్రతిపక్షం లేకుండా పోవాలి, అది జరగాలంటే అన్ని పార్టీల వారూ తన పార్టీలో చేరి నోర్మూసుకోవాలి.అందుకే ఇతర పార్టీల వారికి గాలం.లొంగని వామపక్ష పార్టీల వారిపై కేసులు, దమనకాండ, దాడులు.

    ప్రత్యేక రాష్ట్ర హోదా చర్చ తలెత్తినపుడల్లా ఇబ్బంది పడుతున్నవారిలో చంద్రబాబుతో పాటు పవన్‌ కల్యాణ్‌ ఒకరు. కాంగ్రెస్‌ మాదిరి తప్పు చేయవద్దని బిజెపికి సలహా ఇస్తూ ట్వీటర్‌లో తన అభిప్రాయం వెల్లడించారు. బిజెపిలో చేరిన కామెడీ హీరో శివాజీ వంటి వారికి కూడా కోపం వస్తోంది.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా రాదని నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడికీ తెలిసినంతగా మరొకరికెవ్వరికీ తెలియదు.

    ప్రత్యేక తరగతి రాష్ట్ర హోదా పొందాలంటే అందుకు ఎలాంటి పరిస్థితులు వుండాలో అసలు ప్రత్యేక రాష్ట్ర లేదా ఆంధ్రప్రదేశ్‌ విభజన అంశం ఎజండాలో లేక ముందే నిర్ణయించారు. అననుకూల పరిస్ధితులు వున్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించి, పన్నుల రాయితీలు కల్పించాలని ఐదవ ఆర్ధిక సంఘం చేసిన సిఫార్సుల మేరకు 1969తో జమ్ము-కాశ్మీర్‌, అస్సాం, నాగాలండ్‌ను ఈ తరగతిలో చేర్చారు. తరువాత అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరం, మణిపూర్‌, మేఘాలయ, త్రిపుర, సిక్కిం, హిమచల ప్రదేశ్‌, వుత్తరా ఖండ్‌కు కూడా దానిని వర్తింప చేశారు. 1. కొండలూ,లోయలతో సంచరించటానికి కష్టంగా వుండే ప్రాంతాలు, 2. జనాభా సాంద్రత తక్కువ లేదా గణనీయ సంఖ్యలో గిరిజనులు వుండటం, 3. పొరుగు దేశాల సరిహద్దులతో వుండి వ్యూహాత్మక ప్రాంతాలలో వుండటం, 4.ఆర్ధిక, మౌలిక వసతుల విషయంలో వెనుకబడి వుండటం, 5. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు గిట్టుబాటు కాకపోవటం వంటి లక్షణాలున్న రాష్ట్రాలకు జాతీయ అభివృద్ధి మండలి(ఎన్‌డిసి) ఆమోదం మేరకు ఈ హోదా కల్పిస్తారు.

    ఈ హోదాను పొందిన రాష్ట్రాలకు నిధులు ఎలా కేటాయించాలన్నదానిపై కూడా మార్గదర్శక సూత్రాలు వున్నాయి. ప్రణాళికా సంఘం సాయాన్ని మూడు తరగతులుగా విభజించింది. 1.సాధారణ కేంద్ర సాయం(ఎన్‌సిఏ), 2. అదనపు కేంద్ర సాయం(ఎసిఏ) 3.ప్రత్యేక కేంద్ర సాయం(ఎస్‌సిఏ). కేంద్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్రాలకు కేటాయించే సాధారణ కేంద్ర సాయం 100 అనుకుంటే ప్రత్యేక తరగతి రాష్ట్రాలకు 30, మిగతా వాటికి 70 అందచేస్తారు.ప్రత్యేక రాష్ట్రాలకు కేటాయించే నిధుల కేటాయింపునకు ప్రత్యేక నిబంధనలు వుంటాయి. సాధారణ సాయం ఈ రాష్ట్రాలకు 90శాతం గ్రాంటు, పదిశాతం రుణంగా వుంటుంది. అదే సాధారణ రాష్ట్రాలకు 30,70 శాతాలుగా వుంటుంది. సాధారణ రాష్ట్రాలకు కేటాయించే నిధులలో నిధులు 100 అనుకుంటే వాటిలో జనాభా మాషాకు 60, తలసరి ఆదాయాన్ని బట్టి 25, ఆర్ధిక వ్యవస్ధ పనితీరును బట్టి, ప్రత్యేక సమస్యలుంటే ఏడున్నర శాతం చొప్పున కేటాయిస్తారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు కేటాయింపుల విషయంలో ప్రత్యేక ప్రాతిపదికలేమీ లేవు. మొత్తం కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే నిధులలో 2010-11 లెక్కల ప్రకారం సాధారణ కేంద్ర సాయం కేవలం ఐదుశాతం మాత్రమే వుంది. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలలో కొండ ప్రాంతాలు, గిరిజన వుప ప్రణాళికలు, సరిహద్దు వుండేట్లయితే ఆ రాష్ట్రాలు ప్రత్యేక సాయం అందుకుంటాయి. ఈ సదుపాయాలు కాకుండా ఈ రాష్ట్రాలు కేంద్రం నిర్ణయించిన విధంగా ఎక్సయిజ్‌, కస్టమ్స్‌, ఆదాయపన్ను, కార్పొరేట్‌ పన్ను రాయితీలు పొందుతాయి. విదేశీ నిధులతో ఏర్పాటయ్యే పధకాలు, కేంద్ర ప్రభుత్వ పధకాల సాయం కూడా పొందుతాయి.

      నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత ప్రణాళికా సంఘం స్ధానంలో నీతి ఆయోగ్‌ వునికిలోకి వచ్చింది. అదింకా పూర్తిగా కుదుట పడలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం తెలివిగా నీతి ఆయోగ్‌కు బాధ్యతను అప్పగించింది. అది ఇంకా పరిశీలిస్తూనే వుంది. పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశ పెట్టిన సందర్బంగా నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మౌఖికంగా హామీ ఇచ్చింది తప్ప ప్రత్యేక హోదా కల్పించే విషయాన్ని బిల్లులో చేర్చలేదు. దీనిని బిజెపి లేదా తెలుగు దేశం పార్టీలు అప్పుడు మౌనంగా వుండి ఇప్పుడు కాంగ్రెస్‌ మీద నెపం వేస్తున్నాయి. నిజానికి వాటికి చిత్త శుద్ధి వుంటే ఇప్పుడైనా విభజన చట్టానికి సవరణలు చేయవచ్చు. అయితే విభజన కారణంగా ప్రత్యేక హోదాలు కల్పించేట్లయితే అనేక కొత్త సమస్యలు వస్తాయి. వాటితో నిమిత్తం లేకుండానే ఒడిషా వంటి రాష్ట్రాలు తమకు ప్రత్యేక హోదా కల్పించమని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపాయి. నిజానికి ఈ విషయాలు విభజన బిల్లు సమయంలో కాంగ్రెస్‌, బిజెపిల పెద్దలతో పాటు తెలుగు దేశం నేతలకు కూడా తెలియనివి కావు. అప్పుడు మాకు తెలియ లేదన్నా లేదా తెలుసన్నా జనంలో అభాసుపాలు కావాల్సి వస్తుంది కనుక రాజకీయంగా కాంగ్రెస్‌ మీద నెపం వేస్తున్నారు. దానికి వాస్తవాలు చెప్పుకోలేని పరిస్థితి. తెలంగాణా రాష్ట్రం ఇచ్చింది తామే అనుకున్నా ఇక్కడా జనం ఓడించారు, రాష్ట్రాన్ని చీల్చారనే కోపంతో ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా దానికి శాసనసభలో అసలు ప్రాతినిధ్యమే లేకుండా చేశారు. మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్‌ జనాన్ని ఈ పార్టీలన్నీ బకరాలుగా చేసి వాడుకున్నాయి, ఇప్పుడు రాజకీయంతో ఆడుకుంటున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీకి నోటి తుత్తర సుబ్రమణ్యస్వామి వరమా ! శాపమా !

28 Thursday Apr 2016

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Loose cannons, Modi, Narendra Modi, Subramanya swamy, Swamy

ఎం కోటేశ్వరరావు

    రాజ్యసభకు నామినేటెడ్‌ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ప్రధాని నరేంద్రమోడీకి వుపయోగపడతారా? సమస్యలను కొని తెస్తారా అన్న చర్చ జరుగుతోంది. పూవు పుట్టగానే పరిమళిస్తుంది ! తలిదండ్రులు తమకు బిడ్డలు పుట్టినపుడు కంటే వారు ప్రయోజకులైనపుడు ఎక్కువ సంతోషిస్తారు !! పది సంవత్సరాల తరువాత పార్లమెంట్‌లో అడుగు పెట్టి నోరు విప్పిన 15 సెకన్లలోనే రాజ్యసభ వాయిదా పడిందంటే ఆయన నోరు ఎంతటి ప్రతిభావంతమైనదో వేరే చెప్పనవసరం లేదు. అఫ్‌కోర్సు ఆయన మాటలను రికార్డులనుంచి తొలగించారనుకోండి. సభా కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్నందున జనానికి ఆ సమాచారం చేరిపోతుంది, మాట్లాడిన వారి ప్రయోజనం నెరవేరుతుంది. ఆ తరువాత అధికారిక రికార్డులలో వుంటేనేం లేకుంటేనేం ! సభ వాయిదా పడటం, కార్యకలాపాలు కుంటుపడటం, సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరగకుండా చూడటం అదేగా పాలకపార్టీ వ్యూహం. నరేంద్రమోడీ నాయకత్వం అదే కోరుకొంటోందా ?

     సుబ్రమణ్య స్వామి రాజకీయంగా జనసంఘంలో పుట్టి దీపంలా వెలిగి, తరువాత జనతా పార్టీలో నాగలి పట్టిన రైతు అవతారమెత్తి, తరువాత దానిని బిజెపిలో విలీనం చేసి కమలం పువ్వుతో పరిమళిస్తున్నారు. తాజాగా నామినేటెడ్‌ కోటాలో రాజ్యసభలో అడుగు పెట్టి తనకు రాజకీయ జన్మనిచ్చిన ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆనందం కలిగిస్తున్నారు. అచ్చ తెలుగులో నోటి తుత్తర గాడిగా పిలిపించుకొంటూ నిత్యం ముస్లింలపై విరుచుకుపడే ఈ తమిళ బ్రాహ్మణుడు కుటుంబ విషయాలలో అందుకు భిన్నమైన వ్యక్తి అన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.

     సంఘపరివార్‌ సంస్థలలో శిక్షణ పొందిన వారి పరిభాషలో చెప్పాలంటే స్వయంగా ‘లవ్‌ జీహాదీ’. పార్సీ మతస్థులను ‘సంతృప్తి పరచటానికి’ ఆ మతానికి చెందిన రుక్సానాను చదువుకునే సమయంలో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ముస్లింలను ‘సంతృప్తి పరచటానికి’ తన ఒక కుమార్తెను ఒక ముస్లింకు ఇచ్చి వివాహం చేశాడు.’హిందువులను సంతృప్తి పరచటానికి ‘ మరో కుమార్తెను విశాఖ పట్టణానికి చెందిన ప్రముఖ రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి ఇఏఎస్‌ శర్మ కుమారుడు, ప్రొఫెసర్‌ అయిన సంజయ శర్మతో వివాహం చేశారు . అయినా సరే నిత్యం తోటి లవ్‌ జీహాదీలతో కలసి ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే ఈ పెద్దమనిషిని హిందూ తాలిబాన్‌ అంటే అతికినట్లు సరిపోతుందేమో.

     అంతకు ముందు జనసంఘం, జనతా పార్టీ ఎంపీ. కేంద్రమంత్రిగా పని చేసిన ఆయనను తాజాగా బిజెపి రాజ్యసభకు నామినేట్‌ చేసింది. బిజెపి సభ్యుడైన స్వామి సాంకేతికగా ప్రస్తుతం రాజ్యసభలో స్వతంత్రుడు. అలాంటి వారు ఏదో ఒక పార్టీని ఎంచుకోవచ్చు. ఈ స్వామి స్వభావం, పార్టీలోని నాయకులతో వున్న వైరుధ్యాలను బట్టి ఏం చేస్తారో చూడాల్సి వుంది. ఇలాంటి వారిని పిల్లిని చంకన పెట్టుకు వచ్చే వారు అనికూడా అంటారు.

    సంఘపరివార్‌ విధేయుడిగా తనను తాను రుజువు చేసుకున్న స్వామి హార్వర్డ్‌ ఆర్ధిక శాస్త్రవేత్త. ఎవరికి వుపయోగపడతారన్నది వేరే విషయం. ఆయన బదులు ఒక న్యాయవాది అయిన అరుణ్‌ జెట్లీని ఆర్ధిక మంత్రిగా తీసుకున్నపుడు స్వామిని ఎందుకు విస్మరించారని గతంలో చర్చ జరిగింది.డెబ్బయి ఆరు సంవత్సరాల సదరు స్వామి బిజెపికి నష్టం చేస్తాడా, లాభం చేకూరుస్తాడా? అసలు ఆయనను రాజ్యసభకు ఎందుకు ఎంచుకున్నారు అన్నది ఇప్పుడు చర్చ కావటం కూడా స్వామి ప్రత్యేకతల్లో ఒకటి. జెట్లీ -స్వామి వుప్పునిప్పులా , ఒక గదిలో ఎవరో ఒకరు మాత్రమే వుంటారని చెబుతారు. అలాంటిది ఇప్పుడు రాజ్యసభలో జెట్లీ నాయకత్వంలో స్వామి పనిచేయాల్సి వస్తోంది. తాను నల్లధనాన్ని వెలికి తెచ్చేందుకు ఆరు అంశాలతో కూడిన లేఖను ప్రభుత్వానికి రాశానని, ఆర్ధిక మంత్రి తీసుకున్న చర్యలను చూస్తే నల్లధనం వెనక్కు రాదని ఆరునెలల క్రితం జైట్లీపై ధ్వజమెత్తిన స్వామి, తనకు బాధ్యతలు ఇస్తే ఆరునెలల్లో ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తానని అయితే మనకు ఒక ఆర్ధిక మంత్రి ఇప్పటికే వుండి పోయారే అని వ్యంగ్యంగా అన్నారు. తన జనతా పార్టీని బిజెపిలో విలీనం చేసేందుకు జైట్లీ అడ్డు పడ్డారని, తరువాత 2014 ఎన్నికలలో న్యూఢిల్లీ నుంచి పోటీ చేసేందుకు సీటు రాకుండా చేశారని స్వామి మండిపడుతూ వుంటారు.

    ఇవన్నీ బహిరంగ రహస్యాలే. అయినా స్వామిని నామినేట్‌ చేయటానికి నరేంద్రమోడీ ఎందుకు సుముఖత చూపారన్నది ప్రశ్న. బిజెపిలో అరుణ్‌ జైట్లీ వృద్ధ నేత ఎల్‌కె అద్వానీ శిష్యుడు అన్నది బహిరంగ రహస్యం. అంటే నరేంద్రమోడీకి వ్యతిరేకం కాకపోయినా అనుకూలం కాదు.మోడీకి తగినంత ఆంగ్ల పరిజ్ఞానం లేని కారణంగా ఎవరైనా విదేశీయలు, ఇతర ప్రముఖులు వచ్చినపుడు అంతా అరుణ్‌జెట్లీ మాట్లాడతారని చెబుతారు. రెండవది తనకు వ్యతిరేకంగా పార్టీలో, ప్రభుత్వంలో మరొక అధికార కేంద్రం ఏర్పడకుండా చూసుకోవాలని నిరంతరం మోడీ చూస్తుంటారని వార్తలు. సుబ్రమణ్యస్వామి పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రత్యేక అభిమానం చూపే వారు వున్నారని మోడీకి తెలుసు. అందువలన అటు వారిని సంతృప్తి పరచటానికి, ఇటు జైట్లీను అదుపులో వుంచటానికి సుబ్రమణ్యస్వామి తగిన వ్యక్తని భావించారని విశ్లేషణ.ఇదే కోవకు చెందిన వారు ఇంకా అరుణ్‌ శౌరీ, రామ్‌జత్మలానీ, యశ్వంత సిన్హా వంటి వారు ఇంకా వున్నారు. వారందరికీ కూడా పునరావాసం కల్పిస్తారా ? వారి నోరు మూయించకపోతే బిజెపిని విమర్శించటానికి ప్రతిపక్షాలు అవసరం లేదని ఇంతకు ముందే వారు తమ సత్తా ఏమిటో వెల్లడించుకున్నారు.

    సాధారణంగా చాలా మంది రాజకీయ నాయకులు అనేక విషయాలను ఆఫ్‌ ద రికార్డు అని చెప్పి మరీ విలేకర్లకు ఎంతో వినోదంతో పాటు అనేక వాస్తవాలు చెబుతారు. సుబ్రమణ్యస్వామి సాఫ్ట్‌వేర్‌లో ఆఫ్‌ ద రికార్డు లేదు, దేన్నీ దాచుకోరు. తనకు ఆర్ధిక మంత్రి పదవి, బ్రిక్స్‌ బ్యాంకు గవర్నర్‌ పదవి, జెఎన్‌యు వైస్‌ ఛాన్సలర్‌ పదవి ఇస్తామని వాగ్దానం చేశారని స్వయంగా చెప్పారు. పేరు మోసిన కోర్టు పక్షిగా ప్రాచుర్యంలోకి వచ్చిన సుబ్రమణ్యస్వామి ఎప్పుడో ఎవరూ దొరకనపుడు తన మీదే ఒక కేసు వేసుకున్నా ఆశ్చర్యం లేదని జోక్స్‌ వెలువడ్డాయి.

    రాజ్యసభలో తొలిసారిగా నోరు విప్పి అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణంలో సోనియా గాంధీ పాత్ర గురించి మాట్లాడి సభ వాయిదాకు కారకుడైన స్వామి తన చర్యకు ఏ మాత్రం విచార పడలేదట.నేనేదో మంచి బాలుడిని అనా నన్ను రాజ్యసభకు నామినేట్‌ చేసింది అని తోటి సభ్యుడితో వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కేసులో కాంగ్రెస్‌ ముఖ్యంగా సోనియా గాంధీపై దాడి చేస్తున్న స్వామిని భీష్ముడిపై దాడికి శిఖండిని వినియోగించినట్లే రాజ్యసభలో బలంగా వున్న కాంగ్రెస్‌పై దాడికి సుబ్రమణ్యస్వామిని ఆయుధంగా వాడుకోవాలని బిజెపిలోని ఒక బలమైన తరగతి కోరుకుందట. ఇలాంటివారితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు వడ్డీతో సహా చెల్లిస్తాం, కేవలం మాపై దాడి కోసమే రాజ్యసభకు నామినేట్‌ చేశారు. అని కాంగ్రెస్‌ ఎంపి ఒకరు వ్యాఖ్యానించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పత్తి పంటపై కెసిఆర్‌ది తద్దినపు తంతా ?

27 Wednesday Apr 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Others, Prices

≈ Leave a comment

Tags

alternative crops, cotton, cotton cultivation, cotton subsidies, KCR, WTO

ఎం కోటేశ్వరరావు

     తెలంగాణా రాష్ట్ర ముఖ్య మంత్రి కె. చంద్రశేఖరరావు ఏప్రిల్‌ 24వ తేదీన ఒక ప్రకటన చేశారు. ఒక విధంగా అది సాధారణం కాదు. రానున్న రోజుల్లో పత్తి పంట తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం వుంది కనుక రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సలహాయిచ్చారు. పత్తి ఎగుమతి సుంకాన్ని పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, నైరోబీలో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్ధ సమావేశంలో పత్తి ఎగుమతులపై రాయితీలను రద్దు చేసే నిర్ణయంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా సంతకం చేశారని, అందువలన రానున్న రోజులలో పత్తి సంక్షోభం తీవ్రం కానుందన్నది ముఖ్య మంత్రి ప్రకటన సారాంశం.

    అసలేమీ పట్టించుకోకపోవటం కంటే ఆలస్యంగా అయినా మేలుకోవటం మంచిదే కదా అనే బి పాజిటివ్‌ (ప్రతిదీ మన మంచికే ) అనే దృక్పధానికి అనుగుణంగా వుందనుకుంటే కెసిఆర్‌ ప్రకటన ఓకే. మిగతా ముఖ్యమంత్రులు ఈ మేరకైనా మొక్కుబడి తీర్చుకున్నారో లేదో తెలియదు. బహుశా కేసిఆర్‌ ముఖ్య మంత్రి కాక ముందు ఒక్క తెలంగాణా రాష్ట్ర సాధన తప్ప మరొక విషయాన్ని పట్టించుకొని వుండరు. రాష్ట్రం వచ్చిన తరువాత మిగతా విషయాలన్నీ చూసుకుందామనుకొని లేదా చేసుకొందామని అనుకొని వుండవచ్చు. అధికారానికి వచ్చిన రెండు సంవత్సరాల తరువాత పత్తి రైతులను హెచ్చరించటం గుడ్డిలో మెల్ల. ఎనిమిది సంవత్సరాల వ్యవధిలో అంటే 2018 నాటికి భారత్‌ ఎగుమతులపై ఇచ్చే సబ్సిడీని క్రమంగా తగ్గించాలని, ఈ లోగా సబ్సిడీని పెంచరాదని ప్రపంచ వాణిజ్య సంస్ధ 2010లోనే భారత్‌ను కోరింది. అంటే పత్తి,పత్తి వుత్పత్తుల ఎగుమతులపై సబ్సిడీని కూడా ఎత్తివేయాల్సి వుంటుంది.

     అమెరికా అంటే వామపక్షాలు మినహా మన రాజకీయ పార్టీల నేతలకు అది సైకిలైనా, కారయినా, హస్తం, కమలం పువ్వయినా మరొకరికైనా మహా ప్రీతి. కొన్ని దేశాల వారు తొడకోసు కుంటే మనవారు మెడ కోసుకుంటారని యుపిఏ పాలనా కాలంలో అన్ని పార్టీల వారు కలసి అమెరికాతో ఒప్పందాలపై సై అంటూ పార్లమెంట్‌లో మైనారిటీ యుపిఏ ప్రభుత్వాన్ని గట్టెక్కించి మద్దతు పలికారు. అదే అమెరికా మన పత్తి సబ్సిడీలను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా వత్తిడి తెస్తోన్న విషయాన్ని కూడా కెసిఆర్‌ తన ప్రకటనలో ఎందుకు పేర్కొనలేదో తెలియదు. బహుశా రాష్ట్రానికి అమెరికా నుంచి వచ్చే పెట్టుబడుల కోసం వ్యూహాత్మకంగా మౌనం దాల్చి వుంటారని మనం అనుకోవాలి.

    గతేడాది అక్టోబరు 29న కేంద్ర ప్రభుత్వం వస్త్రాలతో సహా వాణిజ్య వుత్పత్తుల ఎగుమతులపై ఇస్తున్న రాయితీలను పొడిగిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. అందుకు గాను కేటాయింపులను 18 నుంచి 21వేల కోట్ల రూపాయలకు పెంచినట్లు తెలిపింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత మన ఎగుమతులు దిగజారటం తప్ప పెరగని పూర్వరంగంలో ఈ చర్య తీసుకున్నారు. దీనిపై అమెరికాకు కోపం వచ్చింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో తలసరి ఆదాయం వెయ్యి డాలర్ల కంటే తక్కువ వున్నపుడు, ఆ దేశం నుంచి అన్ని రకాల వస్త్ర ఎగుమతులు వరుసగా ప్రపంచ వాణిజ్యంలో 3.25శాతం దాటితే ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధల ప్రకారం ఎగుమతి రాయితీలను రద్దు చేయాలన్న ఒక నిబంధనను అమెరికా వెలికి తీసి ఆ మేరకు ప్రపంచ వాణిజ్య సంస్ధకు ఫిర్యాదు చేసింది.ఆ తరువాతే నైరోబీలో జరిగిన సమావేశంలో కెసిఆర్‌ చెప్పినట్లు నిర్మలా సీతారామన్‌ సంతకం చేశారు. నిజానికి ఇది జరగబోతోందని గతేడాది జనవరిలోనే అధికార వర్గాలను వుటంకిస్తూ వార్తలు వచ్చాయి.(http://www.financialexpress.com/article/economy/textile-export-subsidy-under-wto-scanner/25566/

     ఇప్పుడు రైతులను హెచ్చరించిన ముఖ్య మంత్రి ఏడాది కాలంగా, కేంద్రం సంతకం చేసినపుడు ఎందుకు మౌనంగా వున్నట్లు ? ఇలాంటి సమస్యలపై టిఆర్‌ఎస్‌ పార్టీ లేదా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటి? ఇలా ఒక్కొక్క పంట సాగును మానివేస్తూ పోతూ వుంటే అప్పుడు కెసిఆర్‌ అండ్‌ కో ప్రభుత్వం ముందు పరిష్కరించాల్సిన సమస్యలే వుండవు, పోనీ ప్రత్యామ్నాయంగా మిగిలే పంటలేమి వుంటాయి? రైతులు ఏమైనా ఫరవాలేదనా ? అని ఎవరైనా అంటే వారు తెలంగాణా అభివృద్ధి వ్యతిరేకి అన్న ముద్ర సిద్ధంగా వుంటుంది కదా !

    కనీస మద్దతు ధరకంటే తక్కువ రైతాంగం అమ్ముకుంటున్నపుడు వారిని ఆదుకొనేందుకు చర్యలు తీసుకొని వుండుంటే అరే బయ్‌ ఇంక మనం చేయగలిగింది లేదు, వేరే పంటలు వేసుకోండి అంటే అర్ధం వుండి వుండేది. అదేమీ చేసినట్లు కనిపించటం లేదే ! మచ్చుకు గతేడాది నవంబరు మొదటి వారంలో పత్తి ధరలను చూసినపుడు అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇటు తెలంగాణాలోనూ పెద్ద తేడాలేమీ లేవు. అంతకు ముందు కంటే తక్కువ లేదా స్ధిరంగా వున్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. రైతాంగ ఆత్మహత్యలు ఎక్కడ ఎక్కువ ఎక్కువ తక్కువ అన్న చర్చలోకి పోనవసరం లేదు. ఒక అన్నదాత బలవన్మరణానికి పాల్పడినా అది పాలకుల విధానాల వైఫల్యం తప్ప మరొకటి కాదు.

   పత్తి పంట తమను అప్పుల వూబి నుంచి బయట పడవేస్తుందనే ఆశతో రైతాంగం సాగు చేస్తున్నారు. వారిని దాని నుంచి మళ్లించాలనుకోవటం తప్పుకాదు. మరికొద్ది వారాలలో సాగుకు సిద్ధం అవుతున్న తరుణంలో కేవలం ఒక ప్రకటనతో సరిపెట్టాల్సిన అంశంగా ప్రభుత్వం భావిస్తోందా ? గతేడాది పంట మొత్తం రైతుల చేతి నుంచి బయటకు పోయిన తరువాత అంతకు ముందుతో పోల్చితే పత్తి ధరలు పెరిగాయి. అందుకు అంతర్జాతీయ పరిస్థితులు కూడా తోడయ్యాయి. రైతాంగాన్ని మానసికంగా సిద్దం చేయాలంటే వారితో ప్రత్యక్షంగా చర్చించాలి, వున్న అనుమానాలను నివృత్తి చేయాలి. ప్రపంచ వాణిజ్య సంస్ధ, కేంద్ర ప్రభుత్వం, తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి మధనం జరపాలి. వేరే ప్రాంతాల మేథావులు తప్పుదారి పట్టిస్తారనుకుంటే తెలంగాణాలో కావాల్సినంత మంది వున్నారు. వారికే పరిమితం చేయవచ్చు. పత్తి విత్తనాల ధరల గురించి జరిగినంత చర్చ ప్రత్యామ్నాయ పంటల గురించి లేదంటే అతిశయోక్తి కాదేమో !

    ప్రత్యామ్నాయ పంటల గురించి ప్రతి ఏటా వ్యవసాయ ముద్రించే కరపత్రాలు, ఇతర ప్రచార సామగ్రి మొక్కుబడిగా వుంటోంది తప్ప రైతులను ఏమాత్రం ప్రభావితం చేయటం లేదు. రైతులు ప్రత్యామ్నాయంవైపు చూడాలంటే పత్తి కంటే అవి ఆకర్షణీయంగా వుండాలి. కనీసం తొలి సంవత్సరాలలో అయినా ప్రోత్సాహకాలు, మార్కెటింగ్‌ హామీ వుండాలి. ప్రభుత్వాలు తమ బాధ్యతల నుంచి ఒక్కొక్కటిగా వైదొలుగుతున్న స్ధితిలో కేవలం ప్రకటనలు నమ్మి ముందుకు వస్తారా ? ఇప్పటికైనా పత్తి గురించి ఒక సమగ్రమైన శ్వేత పత్రాన్ని ప్రకటించి దానిని రాజకీయాలకు అతీతంగా చర్చించి రైతాంగం ముందుకు వెళ్లటం సముచితంగా వుంటుంది. లేకుంటే తద్దినపు తంతుగానే భావించాల్సి వుంటుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీత్వ-మనువాదుల మనోగతం ఏమిటి ?

22 Friday Apr 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

BJP, Hinduthwa, manuvadam, manuvadis, Modi Critics, moditva manuvadi's, Narendra Modi Failures, narendra modi's ruling, RSS, RSS game

ఎం కోటేశ్వరరావు

    రెండు సంవత్సరాల నరేంద్రమోడీ పాలన వుత్సవాలు త్వరలో జరగబోతున్నాయి. తొలి ఏడాది మాదిరి ఈ సారి హడావుడి వుంటుందా ? లేక వైఫల్యాల మనోవైకల్యంతో సాదాసీదాగా వుంటుందా? మోడీని దేవదూతగా వర్ణించిన వెంకయ్య నాయుడి వంటి వారు సాదాసీదాగా జరగనిస్తారా ? వదిలేయండి ఎలా అయితేనేం, దేశానికి జరిగిందేమిటి? సామాన్యులకు ఒరిగిందేమిటన్నదే ముఖ్యం ! గత ఎన్నికలలో గుజరాత్‌ మోడల్‌ పాలన అనే ఎండమావులను చూసి భ్రమలు పెంచుకున్నవారు కొందరైతే, అంతకు ముందు గుజరాత్‌ మారణకాండతో వుత్సాహం పొంది హిందూత్వకు పెద్ద పీట వేస్తారని చూస్తున్న మనువాదులు ఎలాగూ వున్నారు. రెండు సంవత్సరాల సంబరాల సందర్భంగా వారేమనుకుంటున్నారు ?

   ‘ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం త్వరలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. రాజకీయాలలో ఒక వారమే దీర్ఘకాలం అనుకుంటే ప్రభుత్వం ఎటు వైపు పయనిస్తోందో చెప్పటానికి రెండు సంవత్సరాలు చాలు. గాలిలో గడ్డి పరకలు దిశను తెలియచేసినట్లే తన విధానాలు, కార్యక్రమాల గురించి సమర్ధనీయం కాని ఆశాభావం, అదృష్టాన్ని నమ్ముకొనే విపరీత వ్యామోహంతో వున్నట్లు కనిపిస్తోంది.’ ఈ మాటలు స్వరాజ్య అనే మితవాదుల పత్రికలో మురళీ ధరన్‌ అనే కాలమిస్టు రాసినవి.ఆ పత్రిక నరేంద్రమోడీ, హిందూత్వవాదుల అనధికార వాణిగా వుంది. అలాంటి దీనిలో ఇలాంటి వ్యాసం ప్రచురించటం ఏమిటి అని ఆశ్చర్య పోయిన వారు కూడా వున్నారు. నిజానికి ఇది మోడీకి వ్యతిరేకంగా రాసినది కాదు, ఆయనను హెచ్చరిస్తూ ఇష్టం లేకున్నా వెళ్ల బోసుకున్న ఆవేదన. బిజెపి, నరేంద్రమోడీని రాజకీయంగా, విధాన పరంగా వ్యతిరేకించే వారే కాదు, సమర్ధించేవారిలో కూడా ‘అసంతృప్తి’ ఎలా పెరుగుతోందో ఈ వ్యాసంపై వెలువడిన అభిప్రాయాలు మోడీ-మనువాదుల మనోగతాన్ని వెల్లడిస్తున్నాయి. వాటిలో కొన్నింటి సారాంశాన్ని చూద్దాం.

    అమెరికన్లు అంతరిక్షంలో చంద్రుడి వద్దకు వెళ్లాలని అనుకున్నపుడు వారిదగ్గర సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఏమీ లేదు, కాని వారు ఆ మేరకు కలకన్నారు,జనాన్ని ఆ వైపుగా నడిపించి సాధించారు.మన చేతుల్లో చేయాల్సిన పని చాలా వుంది.ఇప్పటికీ రోడ్ల మీద చెత్తవేయటాన్ని చూస్తున్నాం, దీని గురించి మోడీ పెద్దగా చేయగలిగిందేమీ లేదు. దిశను నిర్ధేశించటమే ఆయన బాధ్యత.మోడీ దగ్గర పెద్ద సైన్యం వుంది వారు ఎంతగానో కష్టపడాల్సి వుంది. సమస్య ఏమంటే వారంతా ఆయన చుట్టూ కుర్చుంటున్నారు తప్ప చేస్తున్నది తక్కువ. నాకు తెలిసినంత వరకు నరేంద్రమోడీ మంత్రివర్గంలో పని చేస్తున్న అధికారులందరూ పధకాలను విజయవంతం చేసేందుకు పూర్తి స్థాయిలో పని చేస్తున్నారు.నరేంద్రమోడీ నిర్దిష్ట కాలంలో ఫలితాలు రావాలని కోరుకొనే నేత, ఆయన మంత్రులందరూ కష్టపడి పని చేస్తున్నారు. 2017 నుంచి నిర్మలా సీతారామన్‌, ప్రకాష్‌ జవదేకర్‌, పియూష్‌ గోయల్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, మీనాక్షి లేఖి, స్మృతి ఇరానీ లను టీవీ చర్చలకు పంపటం నరేంద్రమోడీకి మంచి వ్యూహంగా వుంటుంది.తద్వారా సాధించిన మంచి గురించి చైతన్యాన్ని కలిగించవచ్చు.

    నిజంగా మంచిని సాధిస్తే జనానికి తెలుస్తుంది, జరిగినట్లు భావిస్తారు, సాధించిన వాటి గురించి చెప్పటానికి డజను మందిని పంపనవసరం లేదు. ఫలితాలే స్వయంగా వెల్లడిస్తాయి.

    మీడియా, ప్రతిపక్షాలు దెబ్బతీసే పనిలో వున్నపుడు మనం అలాంటి పనులు చేయాల్సి వుంటుంది.

  యుపిఏ పాలనా కాలంలో ప్రతివారం లూటీ జరిగినా ఎన్నికల ఫలితాలలో మోడీ వచ్చేంతవరకు అది కాంగ్రెస్‌ను ప్రభావితం చేయలేదు. మీడియా మద్దతు లేకుండా తాము చేసిన దానిని ప్రజలకు చెప్పుకోగలమని బిజెపి నాయకులు అనుకుంటే భ్రమలో వున్నట్లే. కనీసం వామపక్షాలకు మద్దతు ఇచ్చే నెట్‌వర్క్‌ను అయినా ధ్వంసం చేయాలి. వారు వాటితో బతగ్గలగటమే కాదు వృద్ధి చెందుతున్నారు.

    కేవలం విద్యుత్‌, మౌలిక సదుపాయాలు, రైల్వేలు, అవినీతి రహిత పాలన కారణంగానే ప్రధాని మోడీ వచ్చే ఎన్నికలలో గెలుస్తారు.

   మోడీ పాలనాయంత్రాంగం అత్యంత ముఖ్యమైన సమస్యలను కూడా పట్టించుకోవటం లేదు.భారత్‌లో హిందువుల పట్ల వివక్ష చూపుతున్నారు. మైనారిటీలతో సమంగా హిందువుల దేవాలయాలను స్వాధీనం చేసుకోవటం గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.ఆయన ఓటర్లందరూ హిందువులే, వారిని విస్మరిస్తున్నారు.

   మోడీ హిందూ హృదయ సామ్రాట్‌గా వుండాలని అంగీకరిస్తా. మన హిందువులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తారని నేను ఇంకా వేచి చూస్తున్నా.

   హిందువులను విస్మరించటం లేదు. కానీ దేవాలయ ట్రస్టులు డబ్బును వెనక్కి తీసుకోవటం అంత సులభం కాదు, అది 1949లోనో ఎప్పుడో జరిగింది. అందరూ ఇంతకాలం ఎందుకు నోర్మూసుకున్నారు.

   సమస్య రాష్ట్ర ప్రభుత్వాలతో వుంది. ప్రధాన రాజకీయాలు, పధకాల అమలు రాష్ట్ర స్థాయిలోనే జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు చౌకబారు స్థానిక రాజకీయాల మీద తప్ప పధకాల అమలు మీద ఎప్పుడో తప్ప శ్రద్ధ పెట్టటం లేదు. మోడీ లేదా బిజెపి తన సమయం, డబ్బును పశ్చిమబెంగాల్‌, కేరళ వంటి ప్రయోజనం లేని రాష్ట్రాల మీద వెచ్చించే కంటే తమ పాలనలో వున్న వాటిమీద పెట్టటం మంచిది. మోడీ గుజరాత్‌లో చేసిన మాదిరి ఆ రాష్ట్రాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి 2019 ఎన్నికలలో ఆ విజయాలను ముందుకు తేవటం మంచిది.

    వారి స్వంత రాష్ట్రాలపైనే పూర్తిగా కేంద్రీకరించటం మంచిది. చివరికి చత్తీస్‌ఘర్‌ కూడా మారిపోతే ఇతర రాష్ట్రాలలోని జనం వాటిని చూసి ఈర్ష్య పడతారు, ఇతర పార్టీలను అపహాస్యం చేస్తారు.

    ఒంటి చేత్తో దేశాన్ని ముందుకు తీసుకుపోయేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు. సమయాన్ని వృధా చేస్తూ ముందుగా వ్యవస్ధలను నిర్మించి తరువాత పధకాలను ప్రారంభించాలని అనుకుంటే ఫలితాలు సంపూర్తిగా వుండకపోవచ్చు. మార్కెట్లోను, జనంలోనూ ఆశాభావాన్ని కలిగించటానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. స్వంత ప్రభుత్వంలో ప్రతిభలేమిని ఆయన ఎదుర్కొంటున్నారు, కానీ ఆయన ప్రతి పధకానికి వున్న ఆటంకాలను తొలగించగలరు.ఆయన పద్దతి కొద్దిగా తేడాగా వుండవచ్చు కానీ కాంగ్రెస్‌కు ఇచ్చిన మాదిరి ఆయనకు మరింత సమయాన్ని ఇవ్వాలి. భారత ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తున్నది. అంతర్గతంగా తన ప్రభుత్వంలో జోక్యం చేసుకోవటంపై మోడీ జయప్రదంగా పోరాడారు. ఇది పశ్చిమ దేశాలకు కోపకారణమైంది. వారి, మన మీడియా కూడా ఆయనకు వ్యతిరేకంగా కత్తులు దూస్తున్నది.ఆయనను వూపిరి సలుపుకోనివ్వండి.

   ప్రకటించటంతో పాటు పధకాల అమలుపై కూడా శ్రద్ధ పెడితే అవి పని చేస్తాయి. దిగువ స్ధాయిలో అటువంటి ప్రయత్నాలకు కొన్ని సమస్యలు ఎదురౌతాయి, ముందుకు పోతే వాటిని సరిచేసుకోవచ్చు.వాటిని అమలు జరిపితేనే పురోగతి వుంటుంది, చరిత్రను చూస్తే సన్నాహాలు లేకుండా ప్రారంభిస్తే పనిచేయవని చాలా మంది చెప్పటం జరుగుతూనే వుంటుంది.మోడీ అందుకు మార్గం చూపారు.మోడీ ప్రచారం కారణంగా విజయం సాధిస్తారు. విజయం దానంత అదే రాదు.

    బిజెపి వారు (ఆర్‌ఎస్‌ఎస్‌, విహెచ్‌పి తదితరులతో సహా) నిజానికి భిన్నమైన వారేమీ కాదు. వాగాడంబర నినాదాలు తదుపరి చర్యలు, ఫలితాలు వుండటం లేదు.టీవీలలో జనాన్ని మెప్పించే ఒప్పించే మేథావంతులు కొద్ది మందే వున్నారు. ప్రచారాన్ని ప్రారంభించటం వాటిని చివరిదాకా పూర్తి చేయకుండా వదలి వేయటం లేదా ప్రతి వుదంతంలోనూ వెనక్కి తగ్గటం గురించి అనేక వుదాహరణలు చెప్పుకోవచ్చు.

1. ఘర్‌ వాపసీ: దానిని ప్రారంభించారు తరువాత వదలివేశారు. గత రెండు సంవత్సరాలుగా తిరిగి అది వినపడటం లేదు.

2.జెఎన్‌యు వుదంతం: కన్నయ్య ఇతరుల గురించి ఎంతో మాట్లాడారు, వారేమో చేయదలచుకున్నది చేస్తూనే వున్నారు.

3. భారత మాతాకీ జై : పసలేని నినాదం, నిట్‌లో భారత అనుకూల విద్యార్ధులను రక్షించటానికి కూడా బిజెపి ముందుకు రాలేకపోయింది. ఒక నినాదంపై పిల్లచేష్టమాదిరి చర్చలు తెలివి తక్కువ వారిగా చేస్తున్నాయి తప్ప దేశభక్తులుగా కాదు.

4. గొడ్డు మాంస నిషేధం: గేదెలు, ఆవులు మేకలు,ఎద్దులు, కోళ్లు, పందులను వధించవచ్చు గానీ ఆవులను మాత్రం కాదు, ఏమిటీ తర్కం. గోవాలో బిజెపి ప్రభుత్వం గొడ్డు మాంసాన్ని అనుమతించవచ్చా, ఏమిటీ అసంబద్ధ ద్వంద్వ ప్రమాణాలు.

5.అనుపమ ఖేర్‌ : అతనికి ఏమైంది. కేంద్రం, రాష్ట్రంలోనూ రెండు చోట్లా బిజెపి అధికారంలో వున్న తన స్వంత దేశంలో శ్రీనగర్‌లో కనీసం ప్రవేశించనివ్వకుడా వెనక్కి తిప్పి పంపారు.

6.వెర్రి వారిగా పిలువబడే బిజెపి వారు:అసహ్యంగా మాట్లాడేవారి గురించి ఏం చేశారు ?

7. వుమ్మడి పౌర స్మృతి: ముస్లిం మహిళలకు బిజెపి ప్రభుత్వ మద్దతు ఎక్కడ ?

8. పాకిస్ధాన్‌పై విధానం: పాకిస్థాన్‌ ఏ టు ఇ ని నాకటం తప్ప బిజెపి చేసిందేముంది. ప్రతిఘటన ఎక్కడ ? పఠాన్‌ కోట్‌ వైమానికి స్ధావరంపై వారు చేసిన దాడి గురించి దర్యాప్తు చేయటానికి ఐఎస్‌ఐని ఆహ్వానించటం కంటే దారుణం ఇంకేముంటుంది? ముందే చెప్పినట్లు ఇలా చెప్పుకుంటూ పోతే జాబితాకు అంతు లేదు. బిజెపి,మోడీలపై జనం పెట్టుకున్న ఆశలు వేగంగా అంతరిస్తున్నాయి. ఈ బుద్దిలేని గుంపుతో పోలిస్తే 2019 రాహుల్‌ గాంధీ ఒక గొప్ప రాజకీయవేత్తగా కనిపిస్తారేమో ఎవరికి తెలుసు !!

(ఈ వ్యాఖ్యల గురించి ఎవరికైనా అనుమానం వుంటే మురళీధరన్‌ వ్యాసం పూర్తిగా చదువుకొనేందుకు, దానిపై వెలువడిన అభిప్రాయాలను తెలుసుకొనేందుకు ఈ లింక్‌ను చూడవచ్చు)

http://swarajyamag.com/politics/to-retain-power-in-2019-the-bjp-must-eschew-its-fascination-for-micawberism

Share this:

  • Tweet
  • More
Like Loading...

‘గుడ్డి వాళ్ల రాజ్యంలో ఒంటి కన్నువాడే మహరాజు’

20 Wednesday Apr 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

'In the land of the blind the one-eyed man is king', Modi Sarkar, Narendra Modi Failures, Raghu ram rajan, RBI, Rbi governer

ఎం కోటేశ్వరరావు

    నిజం చెబితే నిష్ఠూరమాడతారు. నిష్టూర మంటే నిజానికి మీరు మాట్లాడింది చాలా బాగో లేదు అని మర్యాదగా కోపగించుకోవటమే. మన రిజర్వుబ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వ్యాఖ్యలపై మన తెలుగింటి ఆడపడుచు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అదే చేశారు. ఇంతకీ రిజర్వుబ్యాంకు రాముడు అన్నదేమిటి ? గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటి కన్ను వాడే మహారాజు అన్న సామెతను వుపయోగించి మన ఆర్ధిక వ్యవస్ధ గురించి గొప్పలు చెప్పుకుంటున్నవారి గాలి తీశారని కొందరు అంటుంటే, కాదు మన స్ధితి గురించి వినమ్రంగా తనదైన శైలిలో చెప్పారు తప్ప అది ప్రభుత్వానికో , మోడీకో వ్యతిరేకం కాదని మరికొందరు భాష్యం చెబుతున్నారు. వరుస వైఫల్యాలు సంభవిస్తున్న పూర్వరంగంలో రాజన్‌ వ్యాఖ్య సహజంగానే మోడీ భక్తులకు ఆగ్రహం తెప్పిస్తుంది. ‘2019లో బిజెపి తిరిగి అధికారాన్ని పొందాలంటే అదృష్టం పట్ల వ్యామోహాన్ని వదులు కోవాలి’ అనే శీర్షికతో ‘మేం మితవాదులం ‘ అని సగర్వంగా చెప్పుకొనే మోడీ భక్తుడైన ఎస్‌ మురళీధరన్‌ అనే వ్యాసకర్త ‘స్వరాజ్య’ పత్రికలో ఈనెల 19న రాశారు. రఘురామ్‌ రాజన్‌ వ్యాఖ్యలకు మురళీనాదానికి సంబంధం వుందా ?

    ‘మోడీ ప్రభుత్వం పతాక పధకాలుగా ప్రారంభించిన పంటల బీమా పధకం, ఇ మండి(ఎలక్ట్రానిక్‌ మార్కెట్‌ యార్డులు), మేక్‌ ఇన్‌ ఇండియా వంటి ఇతర పధకాలకు దాదాపు ఎలాంటి సన్నాహాలు లేకుండా మొదలు పెట్టారు. చివరకు అవి విఫలం కావటానికే ఎక్కువ అవకాశాలున్నాయంటే ఆశ్చర్యపడనవసరం లేదు. మన ఎన్నికల అవనికలో పునశ్చరణగా జరుగుతున్నట్లుగా చంద్రుడు, చుక్కలను తీసుకు వచ్చి చేతుల్లో పెడతామని చెప్పటం ద్వారా 2019 ఎన్నికలలో బిజెపి ప్రభుత్వ వ్యతిరేకతను తెచ్చుకోవచ్చు’. ఇవి ఏ ప్రతిపక్ష పార్టీనో మరొకరో కాదు స్వయంగా మురళీధరన్‌ రాసిన మాటలు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చి ఇంకా రెండు సంవత్సరాలు పూర్తి కాక ముందే మరో మూడు సంవత్సరాల తరువాత జరిగే ఎన్నికలలో సంభవించబోయే పరిణామాల గురించి ఆయన భక్తులు హెచ్చరికలు జారీ చేస్తున్నారంటే రఘరామ్‌ రాజన్‌ మాట్లాడినదానిలో తప్పేమన్నా వుందా ? నిర్మలా సీతారామన్‌ వంటి మోడీ సైనికులకు మండ కుండా వుంటుందా ?

   మామ తిట్టినందుకు కాక తోడల్లుడు తొంగి చూసినందుకు కోపం వచ్చిందన్న కొత్త సామెతను ప్రచారంలో పెడదాం. మురళీధరన్‌ మోడీ ప్రభుత్వానికి మామ అనుకుందాం. సదరు మామ చెప్పిన అంశాల సారం ఇలా వుంది. ‘ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం త్వరలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. రాజకీయాలలో ఒక వారమే దీర్ఘకాలం అనుకుంటే ప్రభుత్వం ఎటు వైపు పయనిస్తోందో చెప్పటానికి రెండు సంవత్సరాలు చాలు. గాలిలో గడ్డి పరకలు దిశను తెలియచేసినట్లే తన విధానాలు, కార్యక్రమాల గురించి సమర్ధనీయం కాని ఆశాభావం, అదృష్టాన్ని నమ్ముకొనే విపరీత వ్యామోహంతో వున్నట్లు కనిపిస్తోంది.

   ఎలక్ట్రానిక్‌ వ్యవసాయ మార్కెట్లనే చూద్దాం. అది మంచి ఆలోచనే కానీ మనం దానికి అనువుగా వున్నామా ? ఒక వస్తువును దుకాణానికి చేర్చాలంటే మార్కెటింగ్‌ వ్యక్తులకు తొడతొక్కిడిగా వుంటుంది, అంతకంటే ముందు అదే పరిస్ధితి వుత్పాదక కేంద్రాలలో వుంటుంది.అలాగే మౌలిక సదుపాయాలు లేకుండా ఏ ప్రభుత్వమూ పధకాలను ప్రారంభించకూడదు. మన దేశంలో 15శాతానికే ఇంటర్నెట్‌ అందుబాటులో వుంది. వంద కోట్ల సెల్‌ఫోన్లు వున్నాయనుకుంటే ఇరవై కోట్ల మందే స్మార్ట్‌ ఫోన్లను వాడుతున్నారు. ఇది సానూకూల చిత్రం.

   వ్యవసాయ వుత్పత్తులకు ఒక సమీకృత మార్కెట్‌ అంటే వుత్పత్తి జరిగే చోట శీతల గిడ్డంగులతో పాటు వాటిని అవసరమైన చోటికి చేరవేయటానికి శీతల సదుపాయం వున్న రవాణా వాహనాలు కావాలి. ఇవేమీ లేకుండానే మరొక ప్రారంభానికి నాంది పలికారా ? పంటల బీమా పధకం కూడా ఇలాగే ప్రారంభించారు. వ్యవసాయ రంగంలోని అన్ని అనర్ధాలకు సబ్సిడీతో కూడిన పంటల బీమా పధకం సర్వరోగనివారిణి కాదనే వైపు మోడీ ప్రభుత్వం ఆలోచించలేదు. మాయలాడిని చూసి మోసపోయిన ప్రేమికుడి మాదిరి బీమా సొమ్మును నిరాకరిస్తే రైతు ఆగ్రహోదగ్రుడు అవుతాడు.

    తాను అధికారానికి వచ్చిన వందరోజుల్లో విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షల వంతున వేస్తానని బాధ్యతా రహితంగా 2014 ఎన్నికలలో మోడీ వాగ్దానం చేయటంతో ఈ ధోరణి ప్రారంభమైంది. అది ఎన్నికలలో ఓటర్లను ఆకర్షించేందుకు చెప్పిన మాట అని తెలిసినప్పటికీ రంధ్రాన్షేషణ చేసే టీవీ యాంకర్ల మొదలు వాక్చాతుర్యం గల ప్రతిపక్షాల వరకు మోడీ ప్రభుత్వం వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని నానాయాగీ చేస్తున్నారు. మేకిన్‌ ఇండియా నినాదం కూడా ఇలాంటిదే. గత రెండు సంవత్సరాలలో వచ్చిన ఎఫ్‌డిఐలో ఎక్కువ భాగం వుత్పాదకేతర ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ వాణిజ్యరంగంలోకే వచ్చింది.   విదేశాంగ విధానంలో కూడా అదృష్టాన్ని నమ్ముకొనే వ్యామోహంతో వున్నారు. వాజ్‌పేయి ఎన్నో కలలతో లాహోర్‌కు బస్సులో వెళితే మోడీ దాన్ని అధిగమించి దిగజారి పాకిస్థాన్‌ ప్రధాని కుటుంబ కార్యక్రమానికి ఎలాంటి ఆహ్వానం లేకుండానే ఆకస్మికంగా వెళ్లారు.’ ఇదే విమర్శను ఏ సిపిమ్మో, కాంగ్రెసో చేసి వుంటే స హించలేక ఈ పాటికి సంఘపరివార్‌ మీడియా సైన్యం రెచ్చిపోయి నానా యాగీ చేసి వుండేది.

    నరేంద్రమోడీ సర్కార్‌ సాధించిన విజయాలలో వాణిజ్య లోటు తగ్గింపు గురించి చెప్పుకొంటోంది. లోటు తగ్గిన మాట నిజం. మోడీ అధికారానికి వచ్చిన వెంటనే మేకిన్‌ ఇండియా నినాదమిచ్చారు. కానీ అప్పటి నుంచి మన దేశంలో తయారైన సరకులు ఎగుమతులు తగ్గిపోయాయి. వరుసగా గత పదహారు నెలలుగా తగ్గుతున్నట్లు తాజాగా ప్రభుత్వమే ప్రకటించింది.మరో ఏడాది పాటు ఇలాగే వుండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.ఈ వివరాలు వెల్లడి అయిన సమయంలోనే గత తొమ్మిది నెలల్లో తొలిసారిగా మార్చినెలలో చైనా ఎగుమతులు పెరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో మన దిగుమతుల ఖర్చు కూడా తగ్గింది. దీనిలో మోడీ ఘనత వుందా? ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు గణనీయంగా తగ్గిన కారణంగా మన బిల్లుతగ్గింది తప్ప మరొకటి కాదు. ప్రపంచ మార్కెట్లో తగ్గిన మేరకు వినియోగదారులకు తగ్గించారా అంటే లేదు పన్నులు పెంచి జనాన్ని బాదుతున్నారు. చైనా ఈ రోజు ప్రపంచంలో అమెరికా తరువాత రెండవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధ. మన దేశంలోని కొందరు త్వరలో దానిని అధిగమించబోతున్నట్లు చెబుతున్నారు. ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా 12శాతం కాగా మనది 1.7 మాత్రమే. దీనిని 2020 నాటికి ఐదుశాతానికి పెంచాలని అనుకుంటున్నట్లు నరేంద్రమోడీ చెబుతున్నారు.అంటే మరో నాలుగు సంవత్సరాలలో మన ఎగుమతులు మూడు రెట్లు పెరగాలి. అందుకే మురళీధరన్‌ చెప్పినట్లు వాస్తవాలకు దూరంగా నరేంద్రమోడీ సర్కార్‌ అదృష్టంపై వ్యామోహం పెంచుకొని ఎదురు చూస్తున్నది.

     రిజర్వు బ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ గతవారంలో వాషింగ్టన్‌ నగర పర్యటన సందర్భగా మార్కెట్‌ వాచ్‌ సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో భారత్‌ ఆశాజనక కేంద్రంగా వుందని ఐఎంఎఫ్‌తో సహా అనేక సంస్ధలు వర్ణించిన విషయాన్ని విలేకరి ప్రస్తావించి దాని రహస్యం ఏమిటని అడిగారు. దానిపై రాజన్‌ స్పందిస్తూ ‘ మేము సంతృప్తి చెందాల్సిన కేంద్రానికి చేరాలంటే మేము ఇంకా ప్రయాణించాల్సి వుంది.గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటి కన్నువాడే మహారాజు అని మేము చెబుతూ వుంటాం, మేము దానికి అతి దగ్గరలో వున్నాం’ అన్నారు. చైనాతో పోలిక గురించి అడగ్గా సంస్కరణల ప్రారంభంలో చైనా కంటే భారత్‌ పదేళ్లు వెనుక వుంది. రెండు ఆర్ధిక వ్యవస్థలలోనూ ఆ తేడా కనిపిస్తుంది.మేము వారితో పోలిస్తే నాలుగు నుంచి ఐదోవంతు మధ్య వున్నాం, మేం కొన్ని సరైన చర్యలు తీసుకుంటే కొంత కాలానికి వారిని మేము చేరుకోగలం అన్నారు. వారు ఇప్పుడున్న స్ధాయికి చేరుకోవటానికి వారు అనుసరించిన మంచి విధానాలు అసాధారణమైనవి, కాబట్టి మేం కూడా మంచి విధానాలను రూపొందించి వారి మాదిరే అమలు జరపాల్సి వుంది. ఇతరులు నడిచిన బాటను మేం అనుసరించాలని లేదు, దాని అర్ధం బాగా కష్టపడాల్సి వుంది’ అన్నారు.

    రాజన్‌ చేసిన వ్యాఖ్యలను అన్వయించటాన్ని బట్టి ఏ విధంగా అయినా వుపయోగించవచ్చు. రిజర్వుబ్యాంకు గవర్నర్‌గా వున్న వ్యక్తి మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఆలా వ్యాఖ్యానించి వుంటారని అనుకోలేము. సాధించిన దానికి సంతృప్తి చెందటం లేదనే సానుకూల అర్ధంలో కూడా కావచ్చు. అనేక సందర్బాలలో నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడించిన రాజన్‌ ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురౌతున్నట్లు వార్తలు వచ్చాయి.గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటి కన్ను వాడే మహారాజు అన్న వ్యాఖ్యలపై కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ అతిగా స్పందించినట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షాలు అలాంటి వాటిని వుపయోగించుకోవటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ కేంద్ర మంత్రి ఆ విధంగా స్పందించటం అంటే ప్రభుత్వ వైఫల్యాలపై వస్తున్న విమర్శలను తట్టుకొనే సహనం కోల్పోతున్నారనటానికి సూచన ఇది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చిన్న, సన్న కారు రైతాంగాన్ని భూమికి దూరం చేసే యత్నాలు

19 Tuesday Apr 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, Latin America

≈ Leave a comment

Tags

Agriculture, Brazil’s peasant internationalism, farmland privatization, La Via Campesina, Narendra Modi, Niti Aayog, peasant internationalism, peasants

Poster from the campaign “O Grito dos Excluídos” (“The Scream of the Excluded”). Some rights reserved.

ఏప్రిల్‌ 17 అంతర్జాతీయ భూ పోరాట దీక్షా దిన ప్రాధాన్యత

ఎం కోటేశ్వరరావు

    చెదురుమదురుగా వున్న చిన్న భూ కమతాలను ఒకటిగా చేయాల్సిన అవసరం వుందని నరేంద్రమోడీ సర్కార్‌ ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌ వుపాధ్యక్షుడు అరవింద్‌ పంగారియా చెప్పారు. సోమవారం నాడు జమ్మూలోని కాశ్మీర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ స్నాతకోపన్యాసంలో భూ కమతాలను పెద్దవిగా రూపొందించాల్సిన అవసరం గురించి చెప్పారు. ఇది జరగాలంటే రైతులు భూములను అమ్ముకొని ఇతర పనులను చూసుకోవాలి, అయితే భూమి కలిగి వుంటే రక్షణ వుంటుందని భావిస్తున్న కారణంగా వారు విక్రయానికి ముందుకు రారు, అందువలన యజమానులకు భూములపై చట్టపరమైన రక్షణ కల్పించి వాటిని కౌలుకు ఇచ్చే విధంగా చట్టాలను సవరించాల్సిన అవసరం వుందని పంగారియా చెప్పారు. ఈ మేరకు కేంద్రం ఒక నమూనా బిల్లును రూపొందించిందని దానిని రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణ్యంగా మార్చుకొని చట్ట సవరణ చేయవచ్చని చెప్పారు. ఇది జరిగితే చిందరవందరగా వున్న కమతాలను కౌలుకు తీసుకొని పెద్దవిగా రూపొందించటం సులభం అవుతుందని తెలిపారు. దేశంలో2011-12 సమాచారాన్ని బట్టి భూమిపై 49శాతం కార్మికవర్గం ఆధారపడుతున్నదని, జిడిపిలో వ్యవసాయ వాటా 15శాతం మాత్రమే వుందని, వ్యవసాయ రంగం ఏటా ఐదు శాతం వృద్ధి చెందినా రాబోయే రోజులలో జిడిపి వాటా తగ్గనుందని కూడా ఆయన చెప్పారు.

     పంగారియా మాటలు, కౌలు రైతు నమూనా బిల్లును బట్టి రైతాంగం నుంచి ముఖ్యంగా చిన్న రైతాంగం నుంచి ఏదో ఒక రూపంలో భూములను విడిపించి ధనిక, కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించటాన్ని వేగవంతం చేయాలన్నది నరేంద్రమోడీ ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. నిజానికి ఇది అంతర్జాతీయ వ్యవసాయ వాణిజ్య కార్పొరేట్‌ సంస్ధలు, ద్రవ్య పెట్టుబడిదారుల వత్తిడి మేరకు వాటి ప్రతినిధులుగా వున్న ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధలు ఎప్పటి నుంచో సూచిస్తున్న విధానం. మన దేశంలో భూమి కోసం జరిగిన మహత్తర పోరాటాలు, ప్రాణత్యాగాల పూర్వరంగం, భూస్వామ్య విధానాన్ని రద్దు చేస్తే తప్ప పెట్టుబడిదారీ విధానం వృద్ధి చెందదన్న సాంప్రదాయ అవగాహన మేరకు ఒకవైపు భూస్వాములతో రాజీ పడుతూనే కాంగ్రెస్‌ ప్రభుత్వాలు భూసంస్కరణల చట్టాలను చేయకతప్పలేదు. ముందే చెప్పుకున్నట్లు భూస్వాములతో రాజీ కారణంగా ఆ చట్టాలను నీరు గార్చారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ వంటి పార్టీలు అసలు భూ సంస్కరణల గురించి మాట్లాడటానికే సిద్ధం కానందున ఆ చట్టాలను అమలు జరిపే ప్రసక్తే వుండదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాపితంగా నయా వుదారవాద విధానాలు అమలులోకి వచ్చిన కారణంగా సిపిఎం వంటి కమ్యూనిస్టు, ఇతర వామపక్ష పార్టీలు తప్ప కాంగ్రెస్‌తో సహా అన్ని పాలకవర్గ పార్టీలు భూముల నుంచి రైతాంగాన్ని తొలగించేందుకు కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు దారులు వెతుకుతున్నాయి. మన దేశంలోని సంక్లిష్ట పరిస్ధితులు, ముందే చెప్పుకున్నట్లు గ్రామీణ ప్రాంతాలలో భూ దాహం కారణంగా వారు అనుకున్నది వెంటనే సాధ్యం కావటం లేదు. పొమ్మనకుండా పొగ పెట్టినట్లు చిన్న,సన్నకారు రైతాంగానికి వ్యవసాయం గిట్టుబాటు కాకుండా చేసి వారు భూములను వదులుకొనేట్లు చేస్తున్నారు. దానిలో భాగంగానే వ్యవసాయం రంగంలో ప్రభుత్వ పెట్టుబడులను పెట్టటం మానివేశారు. ఎరువులు, డీజిల్‌ వంటి వాటికి ఇస్తున్న రాయితీలు,సబ్సిడీలను ఎత్తివేశారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీల కార్యకలాపాలను నిర్వీర్యం చేస్తున్నారు. ధాన్య సేకరణ వంటి బాధ్యతల నుంచి ప్రభుత్వం క్రమంగా తప్పుకొంటోంది. వాటి స్ధానంలో స్వయం సహాయక బృందాలను ప్రోత్సహిస్తోంది.ఇవన్నీ భూముల నుంచి రైతాంగాన్ని తప్పించేందుకు, కార్పొరేట్లకు కట్టపెట్టేందుకు చేస్తున్న ప్రయతాలు.

     అటువంటి యత్నాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలను సమీక్షించేందుకు ఈ నెల 17న అంతర్జాతీయ రైతాంగ పోరాటాల దీక్షా దినం పాటించబడింది.ఈ సందర్బంగా అనేక దేశాలలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ఏప్రిల్‌ 17న బ్రెజిల్‌లో భూమికోసం, భుక్తి కోసం శిరమెత్తిన రైతాంగంపై కార్పొరేట్లకు వత్తాసుగా రంగంలోకి దిగిన మిలిటరీ,పోలీసులు భూమిలేని పేదల వుద్యమ సంస్ధ(ఎంఎస్‌టి) సభ్యులు, మద్దతుదార్లపై జరిపిన కాల్పులలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు, ఎందరో గాయపడ్డారు.ఈ హత్యాకాండ జరిగిన సమయంలోనే మెక్సికోలోని లాక్సాకాలాలో వివిధ దేశాల రైతు సంఘాల ప్రతినిధుల రెండవ అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే అంతర్జాతీయ రైతుపోరాటాల దినం పాటించాలని నిర్ణయించారు. ఆ రోజు బ్రెజిల్‌లో హత్యాకాండకు పాల్పడిన వారికి ఇంత వరకు ఎలాంటి శిక్షలు పడలేదు. ప్రతి ఏటా అప్పటి నుంచి ఆ రోజును రైతాంగ పోరాటాల దీక్షా దినంగా పాటిస్తున్నారు.

    ప్రపంచ పెట్టుబడిదారీ వర్గ లాభాల రేటును కాపాడేందుకు దాని ప్రతినిధులైన ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ రూపొందించిన అజెండా, విధానాల మేరకుముందుకు తెచ్చిన సరికొత్త విధానాలకే ముద్దుగా సంస్కరణలు అని పేరు పెట్టారు. వాటినే నయా వుదారవాదం అని ప్రపంచీకరణ అని రకరకాలుగా పిలుస్తున్నారు. పేరులోనేమున్నది పెన్నిది అన్నట్లుగా ఏం చెప్పినా కార్పొరేట్ల లాభాల సంరక్షణే వీటి ప్రధాన లక్షణం, ధ్యేయం. తమ లాభాల కోసమే పెట్టుబడిదారీ వర్గం తమ పెరుగుదలకు అడ్డంగా వున్న ఫ్యూడల్‌ విధానాన్ని బద్దలు కొట్టింది. భూసంస్కరణలను ప్రోత్సహించింది. అదే పెట్టుబడిదారీ వర్గం బహుళజాతి గుత్త సంస్థలు(కార్పొరేట్‌లు)గా మారి ప్రపంచ మార్కెట్లపై పెత్తనం చేస్తున్నాయి. వాటి కన్ను ఇప్పుడు పరిశ్రమలు, వాణిజ్యంతో పాటు వ్యవసాయంపై పడింది.ఈ రంగాన్ని కూడా కార్పొరేటీకరణ చేయటం ద్వారా దాని నుంచి కూడా లాభాలు పిండాలని చూస్తోంది. దానిలో భాగంగా రైతులను భూములనుంచి వెళ్లగొట్టి కార్పొరేట్‌ భూస్వాములను తయారు చేసేందుకు పూనుకుంది. ఈ ప్రయోగాలకు ముందుగా లాటిన్‌ అమెరికాను ఎంచుకుంది.

    గుండు సూది నుంచి వూరంత ఓడల నిర్మాణాల మొదలు, వాటిని విక్రయించే వాణిజ్య సంస్ధలుగానూ, వాటికి అవసరమైన ముడి సరకులు అందించే, వ్యవసాయానికి అవసరమైన విత్తనాల నుంచి, పురుగుమందులవరకు తయారీ, సరఫరా, చివరకు వ్యవసాయ వుత్పత్తుల కొనుగోలు చేసి వాటిని ఆహారంగా మార్చి విక్రయించటం వరకు కార్పొరేట్‌ కంపెనీలు వివిధ అవతారాలు ఎత్తుతున్నాయి. అందువలన వర్తమానంలో పోరాటాలు కూడా వివిధ తరగతుల కార్మికులు, రైతులు, వినియోగదారులు అందరూ ఐక్యంగా తమను ప్రభావితం చేస్తున్న కార్పొరేట్లకు, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో శత్రువు ప్రత్యక్షంగా కనపడే వాడు, ఇప్పుడు అలా కాదు. వ్యవసాయ రంగంలో పారిశ్రామిక పెట్టుబడిదారులతో పాటు ద్రవ్య పెట్టుబడిదారులు కూడా ప్రవేశిస్తున్నారు. ఎక్కడో అమెరికాలో వుండి అనకాపల్లి బెల్లం మార్కెట్‌ను, మదనపల్లిలోని టమోటా, కర్నూలు వుల్లిపాయల, నిజామాబాద్‌ పసుపు మార్కెట్‌లను కూడా అదుపు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.ఈ సంక్లిష్ట,నూతన పరిస్ధితులను అర్ధం చేసుకోవటానికి, కార్యాచరణకు పూనుకోవటానికి నూతన పద్దతులు, రూపాలను ఎంచుకోవాల్సి వస్తుంది. ఎక్కడైతే నయావుదారవాద విధానాల ప్రయోగం మొదలయిందో అక్కడే వికటించి ప్రతిఘటన కూడా ప్రారంభమైంది. అందుకనే నయావుదారవాద విధానాలకు వ్యతిరేేక వేదికగా లాటిన్‌ అమెరికా తయారైంది. వుద్యమాలు, వాటి రూపాలు అన్నింటిలోనూ నూతన విధానాలు, పద్దతులు వునికిలోకి వస్తున్నాయి. రాబోయే రోజులలో ఇంకా వస్తాయి.భూమి హక్కుతో పాటు ఆహార హక్కును కూడా కార్పొరేట్‌లు హరించేందుకు పూనుకున్నాయి. భూములను కబళిస్తున్న కార్పొరేట్‌ సంస్ధల బకాసురులకు వ్యతిరేకంగా నేడు భూ పోరాటం చేయటం అంటే ఒక్క రైతులే కాదు, సదరు కార్పొరేట్‌ కంపెనీ వలన ప్రభావితమయ్యే తరగతులందరూ కలిసి వస్తేనే అవి సంపూర్ణం అవుతాయి. అంటే రైతులతో పాటు వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు, మధ్యతరగతి వుద్యోగులు, వినియోగదారులూ భాగస్వామలు కావాల్సి వుంది.

    గత కొద్ది దశాబ్దాలుగా అనుసరించిన స్వేచ్ఛా వ్యవసాయ వాణిజ్య విధానాలు సామాన్య రైతు వుత్పత్తి ఖర్చులకంటే తక్కువకు వ్యవసాయ వుత్పత్తుల ధరలను నెట్టి గిట్టుబాటు కాకుండా చేస్తున్నాయి.ఒకే రకమైన పంటల సాగు క్రమంగా పెరుగుతోంది. వాటికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఎరువులు,పురుగు మందుల ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. పర్యవసానంగా చిన్న రైతులు వ్యవసాయం నుంచి తప్పుకుంటున్నారు. 1935లో అమెరికాలో 70లక్షల కమతాలు వుండగా నేడు 21లక్షలకు తగ్గిపోయాయి. రానున్న పది-ఇరవై సంవత్సరాలలో 40 కోట్ల ఎకరాల మేరకు చేతులు మారవచ్చని అంచనా. అమెరికాలో 30లక్షల మంది వ్యవసాయ కార్మికులు తక్కువ వేతనాలు, మానవ హక్కులకు నోచుకోకుండా గడుపుతున్నారు. అమెరికాలో మరొక ముఖ్యాంశాన్ని కూడా చూడాల్సి వుంది. మన దేశంలో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వారి మాదిరే అమెరికాలో రెడ్‌ ఇండియన్లు, లాటినోలు, ఆసియన్‌ అమెరికన్లు, ఆఫ్రో అమెరికన్ల వంటి వారందరూ కేవలం ఏడు శాతం భూమి కలిగి వుండగా తెల్లజాతీయులు 93శాతం భూమి కలిగి వున్నారు.

     భూ కేంద్రీకరణ ఒక్క అమెరికాలోనే కాదు ఐరోపాలోనూ జరుగుతోంది. అక్కడ వంద హెక్టార్లు, అంతకు పైబడినవి కోటీ 20లక్షల కమతాలున్నట్లు అంచనా. అవి మొత్తం కమతాలలో కేవలం మూడు శాతమే అయినా అక్కడి భూమిలో సగం వాటిలోనే వుంది. జర్మనీలో 1966-67లో 12,46,000 కమతాలుండగా 2010 నాటికి 2,99,100కు పడిపోయాయి. వీటిలో కూడా రెండు హెక్టార్లకు లోపు వున్నవి 1990లో 1,23,670 వుండగా 2007 నాటికి 20,110కి తగ్గాయి. యాభై హెక్టార్లు అంతకంటే ఎక్కువ వున్న కమతాలలోని భూమి 1990లో 92లక్షల హెక్టార్లు వుండగా 2007 నాటికి కోటీ 26లక్షల హెక్టార్లకు పెరిగింది. సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత తూర్పు ఐరోపా దేశాలు ఐరోపా యూనియన్‌లో చేరినందున రైతాంగం దివాలా తీసింది. పశ్చిమ ధనిక దేశాల నుంచి భారీ సబ్సిడీలతో కూడిన వ్యవసాయ వుత్పత్తులు వరదలా తూర్పు దేశాలను ముంచెత్తాయి. దానికి తోడు ఐరోపా యూనియన్‌ అందచేసే సబ్సిడీలను పొందేందుకు చిన్న రైతులు అనర్హులు అన్న నిబంధన కారణంగా వారంతా గిట్టుబాటు గాక భూములను అమ్ముకున్నారు. ఈ పరిస్ధితిని స్పెక్యులేటర్లు, కార్పొరేట్‌ మదుపుదార్లు సొమ్ము చేసుకున్నారు.

    ఐరోపా వుమ్మడి వ్యవసాయ విధానం పేరుతో అందచేసిన సబ్సిడీలు పెద్ద రైతాంగమే దక్కించుకుంటోంది.ఇటలీలోని 0.29శాతం కమతాలు 2011లో అందచేసిన మొత్తం రాయితీలలో 18శాతం మొత్తాన్ని దక్కించుకున్నాయి. వాటిలో 0.000 శాతం(150 కమతాలు) అన్ని రకాల సబ్సిడీలలో ఆరుశాతాన్ని దక్కించుకున్నాయి. స్పెయిన్‌లో 75శాతం సబ్సిడీలను 16శాతం, హంగరీలో 72శాతం మొత్తాలను 8.6 శాతం పెద్ద కమతాల రైతులు దక్కించుకున్నారు. ఈ పరిణామాలను చూసిన తరువాత ప్రస్తుతం ప్రతి హెక్టారుకు ఇంత అనే పద్దతిలో సబ్సిడీలు ఇచ్చేందుకు నిబంధనలను సవరిస్తున్నారు. భూమి మాత్రమే కాదు కార్పొరేట్లు సముద్రాలను కూడా కబళిస్తున్నారు.చేపలు పట్టుకొనే హక్కును వేలం వేయటంతో బడా బ్యాంకులు, కార్పొరేట్లు రంగంలోకి దిగి చిన్నచిన్న మత్స్యకారులను వెనక్కు నెట్టివేస్తున్నాయి.

   లా వియా కంపేసినా (స్పానిష్‌) అంటే రైతు మార్గం పేరుతో 1993లో ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులతో ఏర్పడిన అంతర్జాతీయ సంస్ధ ప్రతి ఏటా ఏప్రిల్‌ 17న రైతాంగ పోరాటాలను సమీక్షిస్తున్నది. భూమికోసం, భూ రక్షణ పోరాటంలో భవిష్యత్‌లో మరొక ప్రాణం పోరాదన్నది దాని నినాదం. ప్రస్తుతం 73 దేశాలు, 164 జాతులకు చెందిన సంస్దలు , ఎన్‌జీవోలు ఈ వుద్యమంలో భాగస్వాములుగా వున్నాయి. ఏటేటా మరింతగా విస్తరించటంతో పాటు మరిన్ని పోరాటాలకు వేదికగా ఈ వుద్యమం మారుతున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మాండ్యలో మతశక్తులకు శృంగ భంగం

17 Sunday Apr 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Bhajarangdal, BJP, karnataka, love jihad, Mandya, RSS, RSS game, VHP

లవ్‌జీహాద్‌ ముసుగులో రాజకీయం చేస్తున్న బిజెపి, సంఘపరివార్‌

ఎం కోటేశ్వరరావు

    లవ్‌ జీహాద్‌ పేరుతో సంఘపరివార్‌ శక్తులు సమాజంలో మతపరమైన చీలికలు తెచ్చేందుకు, మెజారిటీ మత ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయనే విమర్శలు చాలా కాలంగా వినపడుతున్న విషయం తెలిసిందే. లవ్‌ జీహాద్‌ అంటే హిందూ మతానికి చెందిన బాలికలను వివాహం పేరుతో ముస్లిం యువకులు ఆకర్షించి వారిని మతమార్పిడి చేస్తున్నారనే ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటకలోని మైసూరు సమీపంలోని మాండ్యకు చెందిన రెండు కుటుంబాలు తమ బిడ్డలకు మతాంతర వివాహం చేయటాన్ని సహించలేని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ మత శక్తులు, వక్కలిగ కులశక్తులు శనివారం నాడు జిల్లా బంద్‌కు ఇచ్చిన పిలుపును జనం పట్టించుకోలేదు. మాండ్య పట్టణానికి చెందిన అషిత(28), ఆమె చిన్ననాటి నుంచి స్నేహితుడు, పొరుగున వున్న షకీల్‌ (28) వివాహం సందర్బంగా ఆదివారం సాయంత్రం ఏడున్నరకు మైసూరులో విందు ఏర్పాటు చేశారు. ఇది తెలిసిన సంఘపరివార్‌ శక్తులు మాండ్యలో అషిత నివాసం ముందు వివాహ వ్యతిరేక ప్రదర్శన చేశారు. అందుకు ఆమె కుటుంబ సభ్యులు తిరస్కరించటంతో శనివారం నాడు లవ్‌ జీహాద్‌కు వ్యతిరేకం అనే పేరుతో మాండ్య జిల్లా బంద్‌కు పిలుపునిచ్చి అభాసు పాలయ్యారు.ఈ వివాహానికి వామపక్ష పార్టీలు మద్దతు ఇస్తూ మత, కుల శక్తుల వైఖరిని ఖండించాయి. వధూవరుల, తలిదండ్రులు రక్షణ కల్పించమని ఎలాంటి వినతి చేయనప్పటికీ తామే ముందు జాగ్రత్త చర్యగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    భజరంగదళ్‌, బిజెపి కార్యకర్తలు పోలీసు డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయం ముందు ధర్నా కూడా చేశారు.వారి గురించి పట్టించుకోని ఇరు కుటుంబాల వారు వివాహ ఏర్పాట్లు కొనసాగించారు. శుక్రవారం నాడు పసుపు, శనివారం నాడు మెహందీ క్రతువులను నిర్వహించారు. వధువు తండ్రి, పిల్లల డాక్టర్‌ నరేంద్రబాబు పత్రికలవారితో మాట్లాడుతూ ‘నేను పూర్తిగా లౌకిక వాదిని. దేవుడు అంటే ఒక శక్తి(బలం) అని నమ్మేవాడిని, ఆచారాల పట్ల నాకు విశ్వాసం లేదు. వివాహంలో హిందూ లేదా ముస్లిం సంప్రదాయాలను పాటించటం లేదు. దేవుడి ముందు ఒక కార్యక్రమం వుంటుంది. తరువాత మైసూరులో విందు ఏర్పాటు చేశాము ‘ అని చెప్పారు. ‘వరుడు షకీల్‌ తండ్రి ముక్తార్‌ అహ్మద్‌, నేను 50 సంవత్సరాలుగా స్నేహితులం. మా ఇంటి సమీపంలోనే ముక్తార్‌ వ్యాపారం చేస్తాడు. నా కంటే ముక్తార్‌ రెండు సంవత్సరాలు పెద్ద అయినప్పటికీ మేం ఇద్దరం కలిసే స్కూలుకు వెళ్లాము. నా కుమార్తె అషిత, ముక్తార్‌ రెండవ కుమారుడు షకీల్‌ చిన్నతనం నుంచి స్నేహితులు, పియుసి నుంచి ఎంబియే వరకు కలిసే చదువుకున్నారు. హెచ్‌ ఆర్‌లో ఎంబిఏ చదివిన తరువాత అషిత ఎంఎస్‌ చేయటం కోసం ఇంగ్లండ్‌ వెళ్లింది. షకీల్‌ కూడా మార్కెటింగ్‌లో ఎంబియే చదివాడు. మాండ్యలోనే వుంటూ తన తండ్రి చేస్తున్న బియ్యం, బెల్లం వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు, డక్కన్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ అనే సంస్ధకు యజమానిగా వున్నాడు. తనకు వివాహం చేసుకోవాలని లేదని మా కుమార్తె చాలా కాలంగా చెబుతోంది. అయితే తరువాత తాను షకీల్‌ను వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. మేమందరం సంతోషంగా అంగీకరించాం. మా వైపు మరియు షకీల్‌ తరఫు బంధువులు కూడా సంతోషంగా వున్నారు. ఎలాంటి వ్యతిరేకత ఎదురైనా వివాహం ఆగదు. వివాహం అంటే రెండు హృదయాల కలయిక దానిని నెవరూ వేరు చేయలేరు.’అని కూడా అషిత తండ్రి చెప్పారు.

   ఈ వివాహాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించిన భజరంగ దళ్‌ నేత సిటి మంజునాధ మాట్లాడుతూ ఈ వివాహం పట్ల తమకు అభ్యంతరం లేదని అయితే తాము లవ్‌ జీహాద్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నామని, అషిత మతం మార్చేందుకుగాను ఆమెకు ఖురాన్‌ నేర్పుతున్నారని ఆరోపించాడు. తాము మత మార్పిడులకు వ్యతిరేకం తప్ప వివాహానికి కాదన్నాడు. గత కొద్ది సంవత్సరాలుగా అనేక మంది వక్కలిగ కులపు అమ్మాయిలు లవ్‌జీహాద్‌కు గురయ్యారని ఆరోపించాడు. అషిత ఇప్పటికే మతంతో పాటు పేరు కూడా మార్చుకుందని తమకు తెలిసిందని, అబ్బాయే ఎందుకు మతం మార్చుకోకూడదు లేదా వివాహం తరువాత ఎవరి మతాన్ని వారు ఎందుకు అనుసరించకూడదని మాత్రమే తాము చెబుతున్నామన్నారు.

    ఇది వ్యక్తిగత వ్యవహారాలను మతపరంగా నియంత్రించేందుకు పూనుకోవటం తప్ప మరొకటి కాదు. మేజర్లయిన స్త్రీ,పురుషులు తమ వివాహం, మతం కలిగి వుండటం లేదా లేకుండా వుండటం అన్నది వారి వ్యక్తిగత వ్యహారం తప్ప బిజెపి, సంఘపరివార్‌ చెప్పినట్లు నడవాలనటం నిరంకుశ ధోరణులకు ప్రతిబింబం తప్ప మరొకటి కాదు. దీన్ని సహిస్తే ఇలాంటి శక్తులు మరింతగా పేట్రేగి పోతాయి. దేశంలోని అనేక ప్రాంతాలలో హిందూ మతానికే చెందినప్పటికీ దళితులు, వెనుకబడిన తరగతులకు చెందిన యువకులను అగ్రవర్ణాలవారని చెప్పుకొనే కుటుంబాల యువతులను వివాహం చేసుకుంటే వారిని హత్య చేయటానికి కూడా వెనుకాడని వుదంతాలు మన కళ్ల ముందే జరుగుతున్నాయి. అందువలన భజరంగదళ వంటి కాషాయతాలిబాన్లు ముస్లిం లేదా క్రైస్తవ మతాల వారినే కాదు, హిందూ మతంలో కులాంతర వివాహాలను కూడా వ్యతిరేకిస్తున్నారు. అంటే మనువాద వ్యవస్ధను సజీవంగా వుంచాలని ప్రయత్నిస్తున్నారని వేరే చెప్పనవసరం లేదు.జనాన్ని మతపరంగా చీల్చి తమ పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నించే ఇలాంటి శక్తులను వ్యతిరేకించి ధైర్యంగా తమ బిడ్డలకు మతాంతర వివాహం చేస్తున్న అషిత,షకీల్‌ తలిదండ్రులు ఎంతైనా అభినందనీయులు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • బ్రెక్సిట్ సంక్షోభం ` పదేండ్లలో బ్రిటన్‌లో ఏడో ప్రధాని !
  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బ్రెక్సిట్ సంక్షోభం ` పదేండ్లలో బ్రిటన్‌లో ఏడో ప్రధాని !
  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బ్రెక్సిట్ సంక్షోభం ` పదేండ్లలో బ్రిటన్‌లో ఏడో ప్రధాని !
  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d