• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Congress

ఎన్‌ఆర్‌సి : నరేంద్రమోడీని నిలువరించే సమయం ఆసన్నం !

30 Thursday Jan 2020

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

#CAA Protest, CAA, Narendra Modi, NPR, NRC, Shaheen Bagh, Shaheen Bagh protest

Image result for shaheen bagh"
స్వామినాధన్‌ ఎస్‌ అంక్లేసరియా అయ్యర్‌
జనవరి 26,రిపబ్లిక్‌ దినోత్సవం రోజున రాజ్యాంగం ప్రసిద్దికెక్కుతుంది. కానీ న్యూఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో డిసెంబరు 15నే ఆ ఉత్సవం ప్రారంభమైంది. పౌరసత్వ సవరణ చట్టానికి(సిఎఎ) వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా విద్యార్ధుల ప్రదర్శనను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రదర్శించిన క్రూరత్వానికి నిరసనగా ముస్లిం మహిళలు ఒక ముఖ్యమైన రోడ్డు మీద ధర్నా ప్రారంభించారు. అయితే అది వెంటనే తాము కూడా రాజ్యాంగానికి బద్దులమైన దేశభక్తులమే అని, దాన్ని ఉల్లంఘిస్తున్న అధికారంలోని వారికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని రక్షించుకుంటామంటూ ముస్లింల ఉద్రేకపూరితమైన దేశవ్యాపిత ఆందోళనకు మొగ్గ తొడిగింది.
షాహీన్‌బాగ్‌ను సందర్శించిన వారు ఐదువందల మంది మహిళలు ఎంతో కాలం నిలవలేరు లేదా పెద్ద ప్రభావం చూపలేరు అనుకోవచ్చు. వాస్తవానికి షాహీన్‌బాగ్‌ భారత్‌ను మార్చింది. ఒకనాడు నిర్నినిరోధక శక్తి అనుకున్న నరేంద్రమోడీని నిలువరించే సమయం ఆసన్నమైందంటోంది.
పార్లమెంట్‌లో సిఎఎ గురించి చర్చ జరిగినపుడు ప్రతిపక్ష పార్టీలు దానికి వ్యతిరేకంగా గట్టిగా అభ్యంతరం చెబితే తమను ఎక్కడ దేశవ్యతిరేకులు అంటారోనని పిరికిబారినట్లు కనిపించింది. కానీ తరువాత అనేక నగరాలలో విద్యార్ధుల నిరసనలు చెలరేగాయి. తొలుత షాహీన్‌బాగ్‌లో ముస్లిం మహిళల ప్రదర్శన తరువాత బిజెపి పాలిత రాష్ట్రాలన్నింటా ప్రారంభమయ్యాయి. సిఏఏ రాజ్యాంగవ్యతిరేకమని తిరస్కరిస్తూ గళం విప్పేందుకు ప్రతిపక్షాలను ఇది ఉద్యుక్తులను గావించింది. బిజెపియేతర పాలిత రాష్ట్రాలలో జాతీయ పౌర చిట్టా(ఎన్‌ఆర్‌సి)ను అమలు జరిపేందుకు తిరస్కరించేట్లు చేసింది. దీన్ని అమలు జరపబోమనే దాని అర్ధం సిఎఎ అమలు సాధ్యం కానిదని చెప్పటమే. ఇది షాహీన్‌బాగ్‌లోని మహిళలకు ఒక అపూర్వ విజయమే.
రిపబ్లిక్‌ దినోత్సవం రోజు కేరళలో 620కిలోమీటర్ల పొడవున నిర్వహించిన మానవహారంలో మిలియన్ల మంది పాల్గొన్నారు, కొల్‌కతాలో పదకొండు కిలోమీటర్ల హారాన్ని నిర్వహించారు. ఇంతటి ఉద్రేకపూరితమైన, విస్తృత నిరసనను గతంలో ఎన్నడూ ప్రభుత్వం ఎదుర్కోలేదు.హింసకు గురైన హిందువులకు హానిలేని పద్దతిలో సాయం చేసేందుకే సిఎఎ అని చెప్పుకోవటాన్ని ప్రపంచవ్యాపితంగా అపహాస్యం చేస్తూ కొట్టివేశారు. మానవ హక్కుల ఉల్లంఘనకు భారత్‌ పాల్పడిందని మీడియా, అమెరికా, ఐరోపా యూనియన్‌, ఆసియాలోని అగ్ర రాజకీయవేత్తల నిందకు దేశం గురైంది.
భారత్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని మలేసియా ప్రధాని విమర్శించినందుకు ఆ దేశం నుంచి పామ్‌ ఆయిల్‌ దిగుమతుల నిలిపివేత ద్వారా బిజెపి దెబ్బతీసింది. మిలియన్ల మంది భారత ముస్లింల వద్ద సరైన పత్రాలు లేవనే పేరుతో ఎన్‌ఆర్‌సి, సిఎఎ అనే పట్టకారులతో అదుపు చేయటం మరియు పౌరసత్వ రద్దుకు పూనుకున్నారని భావిస్తున్న విమర్శకులను ఒప్పించటానికి ఇది మార్గం కాదు.అసోంలో ఎన్‌ఆర్‌సి ప్రక్రియ పన్నెండులక్షల మంది హిందువులు, ఏడు లక్షల మంది ముస్లింలతో సహా 19లక్షల మంది దగ్గర సరైన పత్రాలు లేవని వెల్లడించింది. బంగ్లాదేశ్‌ నుంచి ”అక్రమంగా ప్రవేశించిన వారు మరియు చెదలు ”గా వర్ణించిన వారిని ఏరివేసేందుకు ఉద్దేశించిన ప్రక్రియలో ఆధారాలు లేని పేదలు దొరికిపోయారు. నమోదు తక్కువగా ఉండే దేశంలో ఇది సాధారణం.
అసోం అనుభవాన్ని బట్టి జాతీయ స్ధాయిలో ఎన్‌ఆర్‌సి ఖర్చు యాభైవేల కోట్ల రూపాయలు కాగలదు, ఎనిమిది కోట్ల మంది నమోదు పత్రాలు లేని వారిని తేల్చుతుంది. మిలియన్ల మంది ముస్లింలను ఖైదు చేయవచ్చనే ఆలోచనతో కొంతమంది రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు సభ్యులు ఉప్పొంగిపోవచ్చు, అది సరైనదే అనుకోవచ్చుగానీ ప్రపంచంలో దేశ గౌరవం మట్టి కొట్టుకుపోతుంది.


జరుగుతున్న ఆందోళన దేశ వ్యతిరేక విద్రోహం అని బిజెపి చిత్రిస్తున్నది. ఆ ప్రాంతానికి వెళ్లిన వారికి రాజ్యాంగ పీఠికలోని అంశాలను పెద్ద ఎత్తున ప్రదర్శించే బ్యానర్లు,చిత్రాలు, బోర్టులు కనిపిస్తాయి. దేశ భక్తియుతమైన జాతి పౌరులుగా వాటిని పరిరక్షిస్తామంటూ ముస్లింలు ” భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్య్రాన్ని చేకూర్చుటకు, వారందరిలో వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను, అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాత్వత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టా పూర్వకంగా తీర్మానించుకొని 26 నవంబరు 1949న మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకొన్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. ” అనే పీఠికను, రాజ్యాంగాన్ని పారాయణం చేయటం చూస్తారు.
ఈ 85పదాలను నిరసన కేంద్రాలలో కేవలం బ్యానర్ల మీద పెద్దగా ప్రదర్శించటమే కాదు, వాటిని ముద్రించిన దాదాపు పదిలక్షల టీషర్టులు పెద్ద ప్రయత్నం చేయకుండానే అమ్ముడు పోయాయి. షాహీన్‌ బాగ్‌ ఇస్లామిక్‌ తీవ్రవాదుల సొమ్ముతో ఏర్పడిన ఒక చిన్న పాకిస్ధాన్‌ అని బిజెపి ప్రతినిధి చిత్రించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్న ఉద్యమానికి పాకిస్ధాన్‌ నిధులు అందచేస్తున్నదని బిజెపి నిజంగానే అనుకుంటున్నదా ? ముస్లింలు నిబద్దులైన దేశభక్త భారతీయులని షాహిన్‌బాగ్‌ చెప్పటం లేదా ? మహాత్మా గాంధీ, బిఆర్‌ అంబేద్కర్‌, సుభాష్‌ చంద్రబోస్‌, భగత్‌ సింగ్‌, సరోజిని నాయుడు బోధనలకు కట్టుబడి లేదా ? షాహీన్‌బాగ్‌ వేదికమీద అలంకరించిన ఈ దిగ్గజాల పెద్ద చిత్రాలు మాట్లాడుతున్నాయి. మహిళలు వంతుల వారీగా ప్రతి రెండు మూడు గంటలకు వచ్చిపోతున్నారు, కాబట్టి గుడారం ఎప్పుడూ నిండుగా ఉంటోంది. ఆందోళన నిరంతరం కొనసాగనున్నట్లు సూచిస్తున్నది. ‘నేను భారత్‌ను ప్రేమిస్తున్నాను ‘ అని మహిళలు ధరించిన తల నాడాలు(హెడ్‌బాండ్స్‌) చెబుతున్నాయి, జాతీయ పతాకాలను ప్రదర్శిస్తున్నారు, జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. బిజెపి పర్యవేక్షణలో ఉన్న దేశ భక్తిని వారు అపహరించారు.
ప్యాసా సినిమాలో గురుదత్‌ పాటను తెలివిగా మలచి ఏర్పాటు చేసిన బ్యానర్‌ నాకు నచ్చింది. ” జిన్హే నాజ్‌ హై హింద్‌ పార్‌, ఓ కహా హై… కహా హై….కహా హై…( ఆ భారత స్వాభిమానాలు ఎక్కడ ? అవి ఎక్కడ ఉన్నాయి? అవి ఎక్కడ ఉన్నాయి? అవి ఎక్కడ ఉన్నాయి?) దానిని షాహిన్‌ బాగ్‌లో ఇలా రాశారు. జిన్హే నాజ్‌ హై హింద్‌ పార్‌, ఓ కహా హై…యహా హై…యహా హై….యహా హై….( ‘ ఆ భారత స్వాభిమానాలు ఎక్కడ ? అవి ఎక్కడ ఉన్నాయి? అవి ఇక్కడ ఉన్నాయి, అవి ఇక్కడ ఉన్నాయి, అవి ఇక్కడ ఉన్నాయి).

Image result for shaheen bagh"
ఇటీవలి కాలంలో అనేక తీర్పుల విషయానికి వస్తే సుప్రీం కోర్టు బిజెపి వైపు మొగ్గుతున్నట్లు కనిపించింది.రాజకీయ వాతావరణానికి కోర్టులు ప్రభావితమౌతాయని ప్రపంచ అనుభవం చూపుతోంది. 2019 సాధారణ ఎన్నికల్లో బిజెపి ఒక పెనుగాలి మాదిరి సులభంగా విజయం సాధించింది. ప్రతిపక్ష పార్టీలు తమ గాయాలను మాన్చుకుంటూ పార్లమెంట్‌లో సిఎఎను దాదాపు ప్రతిఘటించలేదు. కానీ ప్రతి పక్షాలు మరోసారి గళమెత్తటానికి విద్యార్ధులు, షాహిన్‌బాగ్‌ మహిళలు సాయం చేశారు. రాజ్యాంగ హక్కుల రక్షణ పట్ల తల ఒగ్గని సుప్రీం కోర్టు కూడా తన గళాన్ని విప్పుతుందని ఆశిస్తున్నాను.

గమనిక: స్వామినాధన్‌ ఎస్‌ అంక్లేసరియా అయ్యర్‌ ప్రముఖ జర్నలిస్టు. ఎకనమిక్‌ టైమ్స్‌, టైమ్స్‌ఆఫ్‌ ఇండియా కన్సల్టింగ్‌ ఎడిటర్‌గా పని చేశారు. ఆయన రాసిన ఈ వ్యాసం తొలుత ఎకనమిక్‌ టైమ్స్‌ వెబ్‌సైట్‌లో జనవరి 28వ తేదీన ప్రచురితమైనది,దానికి ఇది అనువాదం, శీర్షిక మార్చటమైనది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సిఎఎ వివాదం : హద్దులు దాటిన కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌

29 Sunday Dec 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

CAA, governor arif mohammad khan, Historian Irfan Habib, Indian constitution, Indian History Congress, Nathuram Godse

Image result for as a governor arif mohammad khan crossed his limits
ఎం కోటేశ్వరరావు
దేశంలో ఎవరు ‘అసహనంతో ప్రజాస్వామ్యవిరుద్దంగా ‘ ప్రవర్తిస్తున్నారో చూశారా అంటూ పొద్దున్నే ఒక పలకరింపు. కేరళలోని కన్నూరు విశ్వవిద్యాలయంలో శనివారం నాడు (ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌) భారత చరిత్ర కారుల 80వ మహాసభను ప్రారంభిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ చేసిన ప్రసంగం, దాని మీద వ్యక్తమైన నిరసన గురించి ఆ పరామర్శ. తర్కబద్దంగా సమాధానం చెబితే వినే ‘సహనం’ కనిపించకపోవటంతో మహాశయా మీరు చిన్నతనంలో చదువుకున్న కుక్క పని గాడిద చేస్తే….. కథను ఒక్కసారి చదువుకుంటే చాలు అని చెప్పి ముగించాల్సి వచ్చింది.
దేెశంలో గవర్నర్ల పాత్ర అంటే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది, రాష్ట్రాలలో రాజకీయ సంక్షోభాలు వచ్చినపుడు తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలే గుర్తుకు వస్తాయి. ఆ విషయంలో కాంగ్రెస్‌ ముందుంటే, దాన్ని అధిగమించేందుకు, కొత్త పుంతలు తొక్కేందుకు బిజెపి తహతహలాడుతోంది. మన రాజ్యాంగంలో గవర్నర్ల పాత్ర పరిమితం, వారు రాజకీయాలు చేయకూడదు, చేస్తున్నారు గనుక ఎవరైనా విమర్శిస్తే భరించాల్సిందే, గవర్నర్లంటే గౌరవం లేదా అంటే కుదరదు. ఇటీవలి కాలంలో మహారాష్ట్ర గవర్నర్‌ ప్రవర్తించిన తీరు తెన్నులను మరచి పోకముందే కేరళ గవర్నర్‌ తానూ తక్కువ తినలేదని, పదవి ఇచ్చిన వారి ఉప్పుతిన్నందున వారికి విధేయుడనై ఉన్నానని ప్రదర్శించుకొనేందుకు తాపత్రయ పడ్డారు అని చెప్పక తప్పదు.
గవర్నరు పదవిలో ఉన్న వారికి అధికారికంగా చట్ట సభల్లో ప్రభుత్వ అభిప్రాయాలు తప్ప వ్యక్తి గత అభిప్రాయాలు వ్యక్తం చేసే నిబంధనలు లేవు. బయట గవర్నర్లు గౌరవ అధ్యక్షులో మరొకటో అయిన సంస్దలు లేదా పర్యటనల్లో పరిమితమైన అంశాల మీద సందేశాలు, ప్రకటనలు చేయవచ్చు తప్ప. రాజకీయాల జోలికి పోకూడదు. అయితే చరిత్రకారుల మహాసభ లేదా మరొక సభ దేనినైనా ప్రారంభించాలని ఆహ్వానించినపుడు రావాలా లేదా అనేది గవర్నర్ల విచక్షణకు సంబంధించిన అంశం. అలా వచ్చినపుడు సాధారణంగా ముందుగా తయారు చేసుకున్న సంబంధిత అంశం మీదనే ప్రసంగిస్తారు. దానితో అందరూ ఏకీభవించాలని లేదు. కన్నూరులో జరిగింది అది కాదు. గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ తాను తయారు చేసుకు వచ్చిన ప్రసంగాన్ని పక్కన పెట్టి అంతకు ముందు వక్తలు సిఎఎ, కాశ్మీర్‌ పరిణామాలపై చేసిన ప్రస్తావనలు లేదా విమర్శలకు రాజకీయ సమాధానాలు చెప్పటం ప్రారంభించటంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఒక పార్టీ నాయకత్వంలో నడిచే ప్రభుత్వం చేసిన నిర్ణయాలు, చట్టాలను విమర్శించే హక్కు ఎవరికైనా ఉంది. వాటికి రాజకీయ పరమైన సమాధానం చెప్పాల్సింది మంత్రులు, పార్టీ నేతలు మాత్రమే. ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న అధికారులు చట్టంలోని అంశాల మీద వివరణ ఇస్తారు తప్ప రాజకీయ పరమైన విమర్శలకు సమాధానం చెప్పే అవకాశం లేదు. గవర్నర్లకూ లేదు.
తనను ప్రసంగించకుండా చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌, శ్రోతల నుంచీ కొందరు అడ్డుకున్నారని, గేలిచేశారని గవర్నర్‌ ఆరోపించారు. ఒక భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేయటాన్ని సహించలేకపోవటం అప్రజాస్వామికం అని కూడా వ్యాఖ్యానించారు. భౌతికంగా తనను నిరోధించేందుకు ఇర్ఫాన్‌ హబీబ్‌ ప్రయత్నించారని కూడా ట్వీట్ల ద్వారా తీవ్ర ఆరోపణ చేశారు. అయితే ఆ ట్వీట్లలోనే గవర్నరే జరిగిందేమిటో వివరించాల్సి వచ్చింది.” భారత చరిత్రకారుల మహాసభ ప్రారంభం ఎలాంటి వివాదాలను రేకెత్తించలేదు.అయితే కన్నూరు విశ్వవిద్యాలయంలో జరిగిన 80వ చరిత్రకారుల మహాసభలో సిఎఎ మీద ఇర్ఫాన్‌ హబీబ్‌ కొన్ని అంశాలను లేవనెత్తారు. వీటి గురించి గవర్నర్‌ జవాబు చెబుతున్న సమయంలో గవర్నర్‌ను భౌతికంగా నిరోధించేందుకు ఇర్ఫాన్‌ హబీబ్‌ తన స్ధానం నుంచి లేచారు. మౌలానా అబ్దుల్‌ కలామ్‌ పేరు ఉటంకించటానికి గవర్నర్‌కు ఉన్న హక్కును ఆయన ప్రశ్నించారు, చప్పట్లు కొడుతూ ఆయన గాడ్సే పేరును ప్రస్తావించాలని అన్నారు. అవాంఛనీయ ప్రవర్తనను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన గవర్నర్‌ ఎడిసి మరియు రక్షణ అధికారిని తోసివేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న ఒక వ్యక్తిగా తాను తనకంటే ముందు మాట్లాడిన వక్తలు పేర్కొన్న కొన్ని అంశాలపై మాత్రమే తాను స్పందించానని ” గవర్నర్‌ ట్వీట్లలో పేర్కొన్నారు.
కన్నూరు సభలో గవర్నర్‌ కంటే ముందు మాట్లాడిన వక్తలు పౌరసత్వ సవరణ చట్టం, ఇతర అంశాలపై విమర్శలు చేశారు. రాజ్యాంగంలోనే కొన్ని అంశాలపై లోపాలు ఉన్నాయనే అభిప్రాయం వెలిబుచ్చటం తప్పు కాదు, రాజ్యాంగ ఉల్లంఘన అంతకంటే కాదు, దానికి ముప్పు తలపెట్టినట్లు కాదు. ఇప్పటికి 104 రాజ్యాంగ సవరణలు చేశారు, రాబోయే రోజుల్లో ఇంకా చేయవచ్చు. చట్ట సభల్లో దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను మరొక పది సంవత్సరాల పాటు పొడిగిస్తూ, ఆంగ్లో ఇండియన్‌ల నామినేటెట్‌ సీట్లను రద్దు చేస్తూ 104 సవరణలో తీర్మానించారు. ఎవరైనా వీటిని కూడా విమర్శించవచ్చు.అలాంటపుడు పౌరసత్వ సవరణ చట్టాన్ని సవరించటాన్ని విమర్శించటం, రాజ్యాంగానికి వచ్చిన ముప్పుగా పరిగణించటం, దాన్ని కాపాడే బాధ్యతలో భాగంగా విమర్శలకు సమాధానం చెప్పబూనుకోవటమే అసలైన రాజ్యాంగ నిబంధనలకు విరుద్దం.
అదే వేదికపై ఉన్న సిపిఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు కెకె రాగేష్‌ గవర్నర్‌ కంటే ముందు మాట్లాడారు.” చరిత్రకారుల సభలో గవర్నర్‌ పూర్తిగా రాజకీయ ప్రసంగం చేశారు. ఆయన ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ వాదిలా మాట్లాడారు. ఎంపీ గారూ ఇది మీ కోసమే అంటూ నన్ను ఉద్దేశించి ప్రసంగాన్ని ప్రారంభించారు. నేనుకూడా ఇతర పెద్దలతో పాటే వేదిక మీద ఉన్నాను. ఇర్ఫాన్‌ హబీబ్‌ గవర్నర్‌ను తోసివేయలేదు, కనీసం తాకను కూడా తాకలేదు. మౌలానా అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌ మాటలను వక్రీకరించటానికి బదులు గాడ్సే చెప్పిందాన్ని ఉటంకించమని మాత్రమే కోరారు.” అని రాగేష్‌ చెప్పినట్లు మీడియా పేర్కొన్నది. అంతే కాదు సభలో ఉన్న ఒక ప్రతినిధి జరిగిన సంఘటన గురించి ” గవర్నర్‌ మౌలానా అజాద్‌, గాంధీ ఇతరుల పేర్లను పూర్తి అసందర్భంగా ప్రస్తావించారు, అదే సమయంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని కూడా పొగడటం ప్రారంభించారు. ఎవరైనా ఆయనకు ఏమి చెబుతారు, వారిని వక్రీకరిస్తూ మాట్లాడినపుడు తరువాత గాడ్సేను కూడా ప్రస్తావించాలని చెప్పారు. ఇది చరిత్రకారుల మహాసభ, పౌరసత్వ సవరణ చట్టం మీద సెమినార్‌ కాదు.” అని పేర్కొన్నట్లు ఇండియా టుడే వెల్లడించింది. ఖాన్‌ చెత్త మాట్లాడుతున్న సమయంలో మీరెందుకు అజాద్‌, గాంధీలను ఉదహరిస్తున్నారు గాడ్సే గురించి చెప్పండి అంటూ హబీబ్‌ అడ్డుకున్నారు అని అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ షిరీన్‌ మూస్వీ చెప్పారు.
గవర్నర్‌ ప్రసంగంశాలపై అనేక మంది ప్రతినిధులు, విద్యార్ధులు కూడా నిరసన తెలిపారు. వారిని ఉద్దేశించి ” మీకు నిరసన తెలిపే హక్కుంది, కానీ నన్ను నోరు మూయించలేరు. మీరు చర్చల ద్వారాన్ని మూయటం అంటే మీరు హింసా సంస్కృతిని ప్రోత్సహించటమే అని” వారితో గొంతు కలిపారు. నిరసనల మధ్య తన ప్రసంగాన్ని ముగించిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ తాను ముందే సిద్ధం చేసుకున్న ప్రసంగంతోనే వచ్చానని, అయితే తనకంటే ముందు మాట్లాడిన వక్తలు ఈ అంశాన్ని(సిఎఎ) ప్రస్తావించకుండా ఉంటే నేను మాట్లాడేవాడినే కాదు, మీరు ప్రస్తావించి రాజకీయ ప్రకటనలు చేశారు.రాజ్యాంగాన్ని సమర్ధించుతానని, రక్షించాలని నేను ప్రమాణం చేశాను. దానిలో భాగంగా నేను హబీబ్‌ లేవనెత్తిన అంశాలపై ప్రతిస్పందించాను. అయితే ఆయన నా ప్రసంగాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు” అని గవర్నర్‌ ఆరోపించారు.
ఈ ఉదంతంపై ఇద్దరు జర్నలిస్టులు చేసిన ట్వీట్లను గమనించాల్సిన అవసరం ఉంది. బిజెపి ఎంపీ యజమానిగా ఉన్న రిపబ్లిక్‌ టీవీతో సహా అనేక సంస్ధలలో పని చేసిన జర్నలిస్టు ఆదిత్య రాజ్‌ కౌల్‌ చేసిన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు.’ దిగ్భ్రాంతి కలిగిస్తోంది. కొంత మంది కుహనా ఉదారవాదులనబడే వారు ఇప్పుడు మాట్లాడే, భావప్రకటనా స్వేచ్చ హక్కులేదని అంటున్నారు. మౌలానా అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌ను ప్రస్తావిస్తూ సుప్రసిద్ద పండితుడైన కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ మాట్లాడుతున్న సమయంలో ఆయన్ను గేలిచేశారు” అని విమర్శించారు. దీనికి స్పందనగా ఎన్‌డిటీవీ జర్నలిస్టు గార్గి రావత్‌ ఒక ట్వీట్‌ చేస్తూ ” ఆశ్చర్యంగా ఉంది. గేలి చేయటాన్ని సమర్ధించటం లేదు. కానీ, అవకాశవాద మాజీ రాజకీయవేత్త అయిన గవర్నర్‌ అరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను మీరు ఒక పండితుడు అంటున్నారు, సుప్రసిద్ధ చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌ను కుహనా ఉదారవాదిగా పిలుస్తున్నారు” అని చురక అంటించారు.


ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను అవకాశవాది అనటం సరికాదని, నిజంగా అవకాశవాది అయితే షా బానో కేసులో సుప్రీం కోర్టు తీర్పును తిరస్కరించే నిర్ణయం తీసుకున్న రాజీవ్‌ గాంధీని ఎందుకు వ్యతిరేకిస్తారు, మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేస్తారని కొందరు మీడియా విశ్లేషకులు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఇర్ఫాన్‌ హబీబ్‌ అబద్దాలు చెబుతున్నట్లు ఆరోపణలు చేశారు. ఆయోధ్యలో ముస్లింలు రాజీపడేందుకు సిద్దపడినపుడు హబీబ్‌ ఇతరులు పడనీయలేదని ఆరోపించారు. అంతవరకు పరిమితం కాలేదు గార్గి కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు ముక్తార్‌ అబ్బాస్‌ అహమ్మద్‌ అన్సారీ మనవడిని వివాహం చేసుకుందని, ఆమె భర్త యూసుఫ్‌ అహమ్మద్‌ అన్సారీ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేశారని, ఆమె కాంగ్రెస్‌ అనుకూల జర్నలిస్టు అని అసందర్భ వ్యాఖ్యలు చేయటాన్ని బట్టి వారు కాషాయ దళసైనికులన్నది స్పష్టం.
ఇక ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ విషయానికి వస్తే షాబానో కేసు తీర్పును వమ్ము చేసేందుకు నిర్ణయించిన రాజీవ్‌ గాంధీ చర్యను వ్యతిరేకించిన మాట వాస్తవం.ఆచర్యను అనేక మంది పురోగామి వాదులు ప్రశంసించారు. అలీఘర్‌ ముస్లిం విద్యార్ధి సంఘనాయకుడిగా పని చేశారు. తొలుత బికెడి తరఫున పోటీ చేసి ఓడిపోయారు, తరువాత 26 ఏండ్ల వయస్సులోనే ఎంఎల్‌సి అయ్యారు. తరువాత కాంగ్రెస్‌లో చేరి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మంత్రిగా పని చేస్తూ రాజీనామా చేశారు. తరువాత జనతాదళ్‌ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. మరోసారి మంత్రిగా పని చేశారు. తరువాత ఆ పార్టీ నుంచి బిఎస్‌పిలో చేరి మరోసారి ఎంపీ అయ్యారు. తరువాత 2004లో బిజెపిలో చేరి ఎన్నికలలో ఓడిపోయారు. మూడు సంవత్సరాల తరువాత బిజెపికి రాజీనామా చేసినట్లు ప్రకటించినా ఆ పార్టీతో సంబంధాలను వదులు కోని కారణంగానే నరేంద్రమోడీ సర్కార్‌ కేరళ గవర్నర్‌గా నియమించింది. ఇన్ని పార్టీలు మారిన వ్యక్తిని అవకాశవాది అనాలో మరొక విధంగా పిలవాలో ఎవరికి వారే నిర్ణయించుకోవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ నియంత – ది న్యూయార్క్‌ర్‌ !

23 Monday Dec 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

CAA, India citizenship amendment act 2019, Narendra Modi an authoritarian, NRC

Image result for Narendra Modi authoritarian, protest keralaఎం కోటేశ్వరరావు
”భారత ఆర్ధిక సంస్కరణకు మంచి భవిష్యత్‌ నరేంద్రమోడీ అని నేను వాదించాను. ఇప్పుడు సంగతులు మారిపోయాయి.” అని చెప్పాడు ది టైమ్‌ జర్నలిస్టు ఇయాన్‌ బ్రెమర్‌. నరేంద్రమోడీ నియంతగా మారారు అని ది న్యూయార్క్‌ర్‌ అనే పత్రిక జర్నలిస్టు డెక్సటర్‌ ఫిల్‌కిన్స్‌ వ్యాఖ్యానించారు.
”వివాదాస్పద పౌర సత్వ బిల్లును ఆమోదించటంతో భారత్‌ అంతటా నిరసనలు చెలరేగాయి. దేశ లౌకిక రాజ్యాంగానికి పెద్ద ఒక పెద్ద సవాలుగా భారత్‌ తన 20కోట్ల ముస్లిం మైనారిటీలలో కొందరిని సులభంగా జైల్లో పెట్టటానికి, బయటకు పంపివేయటానికి సులభతరం గావించేందుకు పూనుకుంది.” అని ఈనెల 20న అమెరికాలోని ప్రముఖ పత్రిక టైమ్‌ విదేశీ వ్యవహారాల సంపాదకుడైన ఇయాన్‌ బ్రెమర్‌ రాసిన విశ్లేషణ, దాని సారాంశంగా రాసిన వాక్యాలను పైన చూశాము. వెంటనే మన దేశంలోని కాషాయతాలిబాన్లు దీని వెనుక పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వామపక్షాలు, కాంగ్రెస్‌ అని వెంటనే వాట్సాప్‌ యూనివర్సిటీ, అసహ్యంగా కనిపించే ఫేస్‌బుక్‌ వంటి వాటిలో దాడులు మొదలు పెడతారని వేరే చెప్పనవసరం లేదు. వాటిని గుడ్డిగా నమ్మే జనానికి మనం చెప్పాల్సిందేమంటే మగాను భావులారా అరచేతిని చూసుకొనేందుకు అద్దం అవసరం లేదు.
”తన ప్రజాస్వామ్యానికి ఉన్న పరిమితులను పరీక్షించుకొనేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నండగా తన పరిమితులు ఏమిటో ప్రపంచానికి చూపేందుకు భారత్‌ తీరిక లేకుండా ఉంది. పొరపాటు చేయవద్దు. మానవతా పూర్వక దృక్కోణంలో చూస్తే ప్రత్యేకించి దేశంలో దాదాపుగా ఉన్న 20కోట్ల మంది ముస్లింలకు భారత్‌లో ఇప్పుడు జరుగుతున్నది విషాదం. అయితే ఇది పనిచేస్తున్న, సంఘటితమైన ప్రజాస్వామ్యానికి, తన 140 కోట్ల మంది పౌరులకు అవసరమైన సేవలు, అవకాశాలను కల్పించగల ఆధునిక మరియు సంక్లిష్ట ఆర్ధిక వ్యవస్ధ ఉన్న భారత భవిష్యత్‌కు సైతం విషాదమే.”
పైన పేర్కొన్న విధంగా తన విశ్లేషణను ప్రారంభించిన బ్రెమర్‌ గతలోక్‌ సభ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు మే ఒకటవ తేదీ టైమ్‌ సంచికలో తాను నరేంద్రమోడీ గురించి ప్రశంసా పూర్వకంగా రాసిన అంశాలను ఉటంకించారు. గత కొద్ది నెలలుగా(అంటే రెండవ సారి మోడీ అధికారానికి వచ్చిన తరువాత) మరమ్మతులు చేయటానికి వీలులేని విధంగా ఆ ప్రతిమ దెబ్బతిన్నది అని వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల కారణంగా తమ పౌరులు భారత ప్రయాణాల గురించి జాగ్రత్తలు తీసుకోవాలని అమెరికాతో సహా అనేక పశ్చిమ దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. టైమ్‌ వంటి కార్పొరేట్‌ పత్రికలు ఇలా రాసిన తరువాత మన దేశంలో పెట్టుబడులు పెట్టేవారు వాటిని పట్టించుకోకుండా ఉంటారా, హెచ్చరికలుగా తీసుకోరా ? ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలకే పెట్టుబడిదారులు బారులు తీరతారు. బిజెపి మరియు నరేంద్రమోడీ మన దేశాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు, తాము చెప్పిన మంచి రోజులను తెచ్చేందుకు లేదా ఇంకా దిగజార్చేందుకు చూస్తున్నారో ఎవరికి వారు విశ్లేషించుకోవాలి.

Image result for Narendra Modi authoritarian
ఇయాన్‌ బ్రెయిన్‌ తన విశ్లేషణ ముగింపులో పేర్కొన్న అంశాలు ఇప్పటి వరకు బుర్రలకు పని పెట్టని వారికి ఎంతో ఉపయోగపడతాయి. వాటి సారాన్ని ఇలా చెప్పుకోవచ్చు.(అనుమానాలు ఉన్నవారు, ఆసక్తి కలిగిన వారికి వీలుగా లింక్‌ కూడా ఇస్తున్నాను)https://time.com/5753624/india-narendra-modi-nationalism/ ” భారత్‌ రాజకీయాల్లో స్ధిరపడిపోయిన వ్యక్తులతో విసిగిపోయిన కారణంగా అద్బుతమైన ప్రచారంతో 2014లో బిజెపి, నరేంద్రమోడీ అధికారానికి వచ్చారు. అధికారానికి వచ్చారు గనుక తన పెరుగుదలకు తోడ్పడిన హిందూ జాతీయ వాదం నుంచి పక్కకు తప్పుకొని పాలనా బాధ్యతలను స్వీకరిస్తారని కొంత మంది ఆశించారు. అయితే భారత ఆర్ధిక వ్యవస్ధ మందగించటం ప్రారంభమైన తరువాత 2019లో తన విజయం కోసం హిందూ జాతీయవాదం వైపు తిరిగారు. ఆర్ధిక అంశాలను నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వ విధానంలో జాతీయవాదం ప్రముఖపాత్రను తీసుకుంది. రాజ్యాంగబద్దంగా ఆదేశించిన లౌకిక ప్రజాస్వామ్యాన్ని ప్రత్యక్షంగా సవాలు చేయటం ప్రారంభించింది. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హౌదాను రద్దు చేసింది. ఒక ప్రజాస్వామిక వ్యవస్ధలో ఇంటర్నెట్‌ను సుదీర్ఘకాలం మూసివేసిన ప్రభుత్వంగా అంతర్జాతీయంగా పతాక శీర్షికలకు ఎక్కింది. జాతీయ పౌరుల నమోదు(ఎన్‌ఆర్‌సి) అమలును ముందుకు తెచ్చింది. ఈ కారణంగా అసోంలో దాదాపు 20లక్షల మంది తమ పౌరసత్వాన్ని కోల్పోయారు. తాజా నమోదులో పౌరసత్వం కోల్పోయిన వారిలో పన్నెండు లక్షల మంది హిందువులే ఉన్నట్లు తేలింది. ఇది ముస్లింలు కాని ఇరుగుపొరుగు దేశాల నుంచి వలస వచ్చిన వారికి పౌరసత్వం కల్పించాలనే చట్టాన్ని చేసేందుకు పురికొల్పింది. అక్రమంగా వలస వచ్చిన ముస్లింలను వెనక్కు పంపాలని బిజెపి డిమాండ్‌ చేసింది, బంగ్లాదేశ్‌ వారిని వెనక్కు తీసుకొనేందుకు అంగీకరించే అవకాశం లేదు.” అని బ్రెమర్‌ పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల సమయంలో బిజెపి ముందుకు తెచ్చిన అంశాల గురించి వామపక్షాలు ఎన్నో హెచ్చరికలు చేశాయి. ప్రస్తుతం బిజెపి పోకడలకు వ్యతిరేకంగా ఆందోళనలకు ముందుకు వచ్చిన వారితో సహా ఎక్కువ మంది వాటిని ఖాతరు చేయలేదు. ఎన్నికల ఫలితాలు రాకముందే అమెరికా టెలివిజన్‌ సిఎన్‌ఎన్‌ ప్రతినిధి గతంలో ఎన్నడూ లేని దానికంటే దేశాన్ని ఎన్నికలు మరింతగా విడదీశాయంటూ ఒక విశ్లేషణ రాశారు. బిజెపి, నరేంద్రమోడీ తీరుతెన్నులు, ప్రచార సరళిలో వచ్చిన మార్పును వర్ణిస్తూ 2014లో కొద్ది మందిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్న పరిమిత హిందూ జాతీయవాద శబ్దాలను ఇప్పుడు దేశమంతా వినిపించే లౌడ్‌ స్పీకర్లు అక్రమించాయని పేర్కొన్నారు( ఆంగ్లంలో- డాగ్‌ విజిల్‌ వస్‌ రిప్లేస్‌డ్‌ బై ఏ బుల్‌హారన్‌). ఎన్నికల ఫలితాల తరువాత నరేంద్రమోడీ విజయం భారతీయ ఆత్మకు చెడు అని లండన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక వ్యాఖ్యానించింది. ఎవరి మీద అయినా మరులు గొన్నపుడు మనం మంచి చెడ్డలు, ఎలాంటి వారమో కూడా పట్టించుకోము. ఎవరి హెచ్చరికలను పట్టించుకోము.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను అంతర్జాతీయ మీడియా ప్రముఖంగానే వార్తలుగా ఇస్తోంది. అవి పెడుతున్న శీర్షికలు వాటి అవగాహన, అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నాయి. ” పెల్లుబుకుతున్న ఆగ్రహం, హిందూ రాజ్యంగా మారేందుకు భారత్‌ దగ్గర అవుతోందా ?” అని అమెరికా నుంచి వెలువడే న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొన్నది. ముస్లింలను మినహాయించటం ద్వారా మౌలికంగా వివక్షా పూరితమైనదని, దాన్ని సమీక్షించాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్‌ చేసిన వ్యాఖ్యను ఉటంకించింది. దేని మీదా ఏకీభావానికి రాని ప్రతిపక్షాలు ఒక్కటయ్యాయని వ్యాఖ్యానించింది.
బ్రిటన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక మూడు వార్తలను ప్రచురించింది. వాటిలో ఒక దాని శీర్షిక ఇలా ఉంది.” భారత పౌరసత్వ చట్టం: తీవ్ర అణచివేత మోడీ వ్యతిరేకులను ఐక్యపరచవచ్చు” నిరసనల తీవ్రత గురించి వ్యాఖ్యానిస్తూ నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన ఆరు సంవత్సరాల తరువాత వెల్లడైన ముఖ్యమైన నిరసన అని పేర్కొన్నది.
నరేంద్రమోడీ చివరకు చాలా దూరం పోయారా అని న్యూయార్కర్‌ అనే పత్రిక విశ్లేషించింది.” ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న ప్రదర్శనలు రాజకీయాల్లో ఇప్పుడో తరువాతో నియంతలు చాలా దూరం ప్రయాణిస్తారు అని ఎంతగానో నమ్మిన పురాతన సిద్దాంతాన్ని క్రమబద్దీకరించాయి. ఈ ఉదంతంలో నియంత నరేంద్రమోడీ, భారత ప్రధాని ” అని పేర్కొన్నది.డెక్సటర్‌ ఫిల్‌కిన్స్‌ రాసిన విశ్లేషణలో ప్రధాని నాయకత్వం వహిస్తున్న హిందూ జాతీయవాద ప్రభుత్వం ఇరవై కోట్ల ముస్లింలను అంతర్గత శత్రువులుగా మలచింది అని వ్యాఖ్యానించారు.

Image result for Narendra Modi authoritarian
అంతర్జాతీయ మీడియాలో వెల్లడైన అభిప్రాయాలలో ఇవి కొన్ని మాత్రమే. భారత రాజకీయాలు ఏవైపు పయనిస్తున్నాయనే చర్చ మరోసారి ప్రపంచంలో ప్రారంభమైంది. మన దేశంలో సరేసరి. నరేంద్రమోడీ నియంతా, ఫాసిస్టా, మరొక ప్రమాదకారా ఏ తరగతికి చెందుతారు అన్న అంశంపై అనేక మందిలో ఏకీభావం ఉండకపోవచ్చు. మన విభేదాలను తరువాత చూద్దాం, ఈ అన్ని లక్షణాలు కలిగిన శక్తిని ముందు వ్యతిరేకిద్దాం అనే ఏకాభిప్రాయ క్రమం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఓట్ల రాజకీయంలో బిజెపి పోటీ పడి అది ముందుకు తెస్తున్న మతోన్మాదంతో రాజీపడుతున్న రాజకీయ పార్టీల పట్ల కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో హిందూ జాతీయవాదాన్ని ప్రత్యక్షంగా కాకపోయినా దానికి ప్రాతినిధ్యం వహించే నరేంద్రమోడీ సర్కార్‌ను బలపరిచేందుకు పోటీ పడుతున్న తెలుగుదేశం, వైసిపి వంటి పార్టీలు తమ వైఖరిని పునరాలోచించుకుంటాయా లేదా అన్నది ఇప్పుడు ఒక ప్రశ్న. వాటి వెనుక ఉన్న మైనారిటీ తరగతుల వారు ఆలోచనలో పడుతున్నారు. ఒక మెజారిటీ మతోన్మాద శక్తిని ఎదుర్కొనేందుకు మరొక మైనారిటీ మతోన్మాదశక్తి వెనుక సమీకరణ కావటం, బలపరచటం కూడా ప్రమాదకరమే. అలాంటి మొగ్గునే మెజారిటీ మతశక్తులు కోరుకుంటున్నాయి. ఆ ఊబిలో ఎప్పుడు దిగుతారా అని చూస్తున్నాయి. ఎందుకంటే దాన్ని చూపి మెజారిటీ మద్దతును కూడగట్టుకోవటం సులభం కనుక ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉన్న మైనారిటీలు జాగ్రత్తగా ఉండటం కూడా అవసరమే. లౌకిక, వామపక్ష భావాలవైపు సమీకృతమై ఉమ్మడిగా లౌకిక రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకొనేందుకు పూనుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సావర్కర్‌పై రాహుల్‌ వ్యాఖ్యతో బిజెపి రుసరుస !

15 Sunday Dec 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Not Rahul Savarkar, Rahul Jinnah, vd savarkar

Image result for rahul gandhi ramlila maidan

ఎం కోటేశ్వరరావు
మరోసారి కాషాయ పరివారం హిందుత్వ ప్రతీక విడి సావర్కర్‌ను దేశ భక్తుడిగా దేశం ముందుకు తెచ్చింది. నరేంద్రమోడీ పాలన దేశాన్ని మేకిన్‌ ఇండియాగా మార్చటానికి బదులు రేప్‌ ఇన్‌ ఇండియా(అత్యాచారాల భారత్‌)గా మార్చిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కొద్ది రోజుల క్రితం ఒక ఎన్నికల సభలో చేసిన వ్యాఖ్య దీనికి మూలం. రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ బిజెపి పార్లమెంట్‌లోపలా బయటా డిమాండ్‌ చేసింది. ఈ అంశంపై వివాదం చెలరేగటంతో పార్లమెంట్‌ పలుసార్లు వాయిదా పడింది. రాహుల్‌ వ్యాఖ్య దేశాన్ని, మహిళలను అవమానించటమే అని, అత్యాచారాలు చేయాల్సిందిగా ఆహ్వానం పలకటం వంటిదే అని బిజెపి ఎంపీలు ఆరోపించారు. సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలో దేశద్రోహంతో సమానమని అందుకు రాహుల్‌ను జైల్లో పెట్టాలని సంఘపరివార్‌కు చెందిన వారు డిమాండ్‌ చేశారు. రాహుల్‌ ఇటలీకి పోవాలన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దావ్‌ ధాకరే బహిరంగంగా రాహుల్‌ గాంధీని కొట్టాలని సావర్కర్‌ మనవడు కోరారు.
‘నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా గురించి మాట్లాడతారు, అయితే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అది అత్యాచారాల భారత్‌గా కనిపిస్తోంది’ అన్నది రాహుల్‌ గాంధీ వ్యాఖ్య. క్షమాపణ చెప్పాలని బిజెపి చేసిన డిమాండును న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారత్‌ను రక్షించండి అనే నినాదంతో కాంగ్రెస్‌ నిర్వహించిన సభలో రాహుల్‌ గాంధీ తిప్పి కొట్టారు. పదే పదే క్షమాపణలు చెప్పటానికి నేనేమీ రాహుల్‌ సావర్కర్‌ను కాదు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తనకు క్షమాభిక్ష పెడితే బ్రిటీష్‌ వారికి సేవచేసుకుంటానని అండమాన్‌ జైలు నుంచి విడి సావర్కర్‌ పదే పదే లేఖలు రాసి వేడుకున్న అంశాన్ని రాహుల్‌ గాంధీ తన వ్యాఖ్యద్వారా ప్రస్తావించారు. దీనిపై చెలరేగిన వివాదం కారణంగా సావర్కర్‌ దే శభక్తుడని నమ్ముతున్నవారికి సావర్కర్‌ అసలు రూపం ఏమిటో చూసేందుకు ఆసక్తి రేకెత్తించినందుకు బిజెపికి ‘అభినందనలు’ చెప్పాల్సిందే.
తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేది లేదంటూ రాహుల్‌ గాంధీ విమర్శలను తిప్పికొట్టారు. ఢిల్లీని అత్యాచారాల రాజధాని అని ప్రతిపక్షంలో ఉన్నపుడు అనేక సార్లు బిజెపి పేర్కొన్నదని, సాక్షాత్తూ నరేంద్రమోడీ 2014 ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్‌ను విడుదల చేశారు. గుక్కతిప్పుకోలేని బిజెపి నేతలు రాహుల్‌ గాంధీకి తగిన పేరు రాహుల్‌ జిన్నా అని వ్యాఖ్యానించారు. సిపాయి తిరుగుబాటుగా బ్రిటీష్‌ చరిత్రకారులు వర్ణించిన 1857 పరిణామాలను ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం అని ముందుగా వర్ణించిన సావర్కర్‌ గొప్ప దేశభక్తుడని కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా గతంలో చేసిన వ్యాఖ్యను ఈ సందర్భంగా మరోసారి పునరుద్ఘాటించారు.
1857 మే పదవ తేదీన బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా మీరట్‌లో ప్రారంభమైన మిలిటరీ తీరుగుబాటు తరువాత దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించింది.1858 జూన్‌ 20న గ్వాలియర్‌లో తిరుగుబాటుదార్లను అణచివేయటంతో వెనుకపట్టు పట్టింది. అయితే సిపాయిలపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే తమ పాలన అంతానికి నాంది అవుతుందని భయపడిన బ్రిటీష్‌ పాలకులు హత్యకేసులతో సంబంధం ఉన్నవారికి మినహా మిగిలిన తిరుగుబాటుదారులందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటించారు.1859 జూలై ఎనిమిది తిరుగుబాటు లాంఛనంగా ముగిసింది.
ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం గురించి నాటి పాలకుల కనుసన్నలలో నడిచే బ్రిటన్‌ పత్రికలు, అధికారిక ప్రకటనలు తప్ప ప్రపంచానికి ప్రత్యామ్నాయ వాస్తవ సమాచారం అందుబాటులో లేదు. అయినప్పటికీ తిరుగుబాటు ప్రారంభమైన 50 రోజుల్లోనే కారల్‌ మార్క్స్‌- ఫెడరిక్‌ ఎంగెల్స్‌ దాని స్వభావాన్ని పసిగట్టారు. తరువాత మరొక నెల రోజులకే భారత్‌లో జరిగిన అలజడి ఒక సిపాయి తిరుగుబాటు కాదు, ఒక జాతీయ తిరుగుబాటు, జాన్‌ బుల్‌ దానిని మిలిటరీ తిరుగుబాటుగా పరిగణించవచ్చుగానీ వాస్తవం ఏమంటే అది జాతీయ తిరుగుబాటు అని 1857 జూలై 28, 31 తేదీలలోనే కారల్‌ మార్క్సు వ్యాఖ్యానించారు. 1857 జూన్‌ 30న భారత్‌లోని పరిణామాలను మార్క్స్‌ ఇలా వర్ణించారు. ‘ ముస్లింలు, హిందువుల తమ ఉమ్మడి యజమానులకు వ్యతిరేకంగా ఐక్యమయ్యారు. తిరుగుబాటు కొన్ని ప్రాంతాలకే పరిమితం కాలేదు. ఆసియా దేశాలలో తలెత్తిన సాధారణ అసంతృప్తి కాలంలోనే ఇది జరిగింది.’ అని రాశారు.ఆ తిరుగుబాటును అణచివేయటంలో నాటి సంస్ధానాధీశులలో ఒకరైన సింధియా, ఇతర ప్యూడల్‌ శక్తుల పాత్ర గురించి కూడా మార్క్స్‌-ఎంగెల్స్‌ అనుమానించారు.
సిపాయిల తిరుగుబాటులో ప్రధమ భారత స్వాతంత్య్రం సంగ్రామ లక్షణాల గురించి మార్క్స్‌-ఎంగెల్స్‌ వ్యాఖ్యానించే నాటికి అసలు వి డి సావర్కర్‌ పుట్టనే లేదు. ఐదు ద శాబ్దాల తరువాత లండన్‌లో బారిష్టర్‌ చదవటానికి వెళ్లిన సమయంలో వారి రచనలు చదివి సావర్కర్‌ ఆ అభిప్రాయానికి వచ్చి వుండవచ్చు, వారి అవగాహన, అభిప్రాయాన్ని అంగీకరించారంటే అర్ధం చేసుకోవచ్చు గానీ అసలు ముందుగా వ్యాఖ్యా నించింది సావర్కరే అంటే చరిత్రను వక్రీకరించటమే. సావర్కర్‌ లండన్‌లో ఉన్న సమయంలో 1909లో మరాఠీలో సిపాయి తిరుగుబాటును ప్రధమ భారత స్వాతంత్య్రం సంగ్రామంగా వర్ణిస్తూ పుస్తకాన్ని రాశారు. దానికి మూలం లండన్‌లో విద్యార్ధి విప్లవకారులకు కేంద్రంగా ఉన్న ఇండియా హౌస్‌లో ఏర్పడిన పరిచయాలు, అధ్యయనమే అన్నది వేరే చెప్పనవసరం లేదు.
అభినవ్‌ భారత్‌ లేదా ఇండియా హౌస్‌లో సావర్కర్‌ పని చేసిన కాలంలో ఆయన పాత్ర గురించి ఎవరికీ పేచీ లేదు. బ్రిటీష్‌ వారి అరెస్టు నుంచి తప్పించుకొని ఫ్రెంచి వారికి చిక్కారు. వారు సావర్కర్‌ను బ్రిటీష్‌ వారికి అప్పగించారు.1910లో అరెస్టయిన కేసులో మరుసటి ఏడాది అండమాన్‌ జైలుకు తరలించిన తరువాత సావర్కర్‌ లొంగుబాటు అధ్యాయం ప్రారంభమైంది. 1911,13,17,20 సంవత్సరాలలో లేఖల మీద లేఖలు రాసి క్షమాభిక్ష కోసం ప్రాకులాడిన విషయం దాస్తే దాగదు. ఎలా కావాలంటే అలా బ్రిటీష్‌ వారికి అనుకూలంగా పని చేస్తానని రాశారు. 1923లో జైలు నుంచి విడుదల అయిన తరువాత ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా స్వాతంత్య్ర పోరాటానికి దూరమయ్యారు. అంతవరకైతే అదొక దారి క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించి బ్రిటీష్‌ వారికి తన విధేయతను చాటుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులు మిలిటరీలో చేరి బ్రిటీష్‌ వారికి తోడ్పడాలని ప్రచారం చేశారు. అదే ఏడాది హిందూ మహాసభ నాయకత్వాన్ని స్వీకరించి తొలిసారిగా హిందుత్వను ప్రతిపాదించి ద్విజాతి సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు. ముస్లిం ద్వేషిగా మారి చివరకు మహాత్మా గాంధీ హత్య కుట్రకేసులో ముద్దాయిగా మారిన విషయం తెలిసిందే. సాక్ష్యాలను సరిగా ప్రవేశ పెట్టని కారణంగా ఆ కేసునుంచి బయటపడ్డారు.
సావర్కర్‌తో పాటు అనేక మంది దే శభక్తులు అండమాన్‌ జైలు పాలయ్యారు. వారెవరూ బ్రిటీష్‌ వారి దయాదాక్షిణ్యాల కోసం పాకులాడలేదు. అనేక మంది తరువాత కమ్యూనిస్టులుగా మారారు. అయితే సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి లేఖలు రాసిన విషయం చాలా కాలం వరకు బయటకు రాలేదు. ఆయన 1966లో మరణించారు. 1975లో నాటి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ స్వాతంత్య్ర పోరాటంలో అండమాన్‌ జైలుకు వెళ్లినవారి గురించి ఒక పుస్తకం ప్రచురించాలని నిర్ణయించింది. దాన్ని ఆర్‌సి మజుందార్‌ అనే చరిత్రకారుడు రాశారు. ఆయన 1857 తిరుగుబాటును ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామంగా గుర్తించేందుకు నిరాకరించిన వ్యక్తి. సావర్కర్‌ అభిమానిగా ఆయన గొప్పతనాన్ని చిత్రించేందుకు ఎంతగా ప్రయత్నించినా బ్రిటీష్‌ వారికి రాసిన లొంగుబాటు లేఖలను దాచిపెట్టలేకపోయారు. అలాంటి సావర్కర్‌కు భారత రత్న బిరుదు ఇవ్వాలని కాషాయ దళాలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. మోడీ సర్కార్‌ అందుకు ఇప్పటి వరకు ‘ఆ సాహసానికి ‘పూనుకొనేందుకు జంకింది. అక్టోబరు నెలలో మహారాష్ట్ర ఎన్నికల సమయంలో తాము అధికారానికి వస్తే సావర్కర్‌కు భారత రత్న కోసం కృషి చేస్తామని బిజెపి-శివసేన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నాయి.

Image result for rahul gandhi ramlila maidan
రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలతో తలెత్తిన వివాదంలో శివసేన నేతలు సావర్కర్‌ దే శభక్తుడనే తమ పాత వైఖరిని పునరుద్ఘాటించారు. నాటకీయ పరిణామాల మధ్య శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్‌ మహారాష్ట్రలో సంకీర్ణ సర్కార్‌ భాగస్వాములుగా ఉన్నాయి. తాము గాంధీ, నెహ్రూలను గౌరవిస్తామని అలాగే కాంగ్రెస్‌ కూడా సావర్కర్‌ను గౌరవించాలని శివసేన నేత సంజయరౌత్‌ వ్యాఖ్యానించారు. ప్రతిఒక్కరూ ప్రతిదానినీ అంగీకరించలేరని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను కూడా అలాగే చూడాలంటూ ఎన్‌సిపి నేత ఛాగన్‌ భుజబల్‌ రాహుల్‌కు మద్దతు ప్రకటించారు. ఆవు మన మాతృమూర్తి కాదని సావర్కర్‌ అన్నారు, బిజెపి దానితో విబేధిస్తోంది, అదే మాదిరి పెద్ద వారి గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని చెప్పారు. దేశంలో ఈ వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉన్నప్పటికీ ఈ కారణంగా మహారాష్ట్ర సంకీర్ణ కూటమికి వచ్చే ముప్పు ఉండదని చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్‌సిఇపికి బిజెపి అనుకూలం, కమ్యూనిస్టుల వ్యతిరేకత – ఎవరు దేశ భక్తులు !

03 Sunday Nov 2019

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Politics

≈ Leave a comment

Tags

BJP on RCEP, CPI(M) on RCEP, RCEP, RCEP INDIA, RCEP Narendra Modi, Regional Comprehensive Economic Partnership (RCEP)

Image result for rcep
ఎం కోటేశ్వరరావు
‘ ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ‘ ఒప్పందం(ఆర్‌సిఇపి)లో మన దేశం సహేతుకమైన ప్రతిపాదనలను చేసిందని ప్రధాని నరేంద్రమోడీ బ్యాంకాక్‌ పోస్ట్‌ అనే థారులాండ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఒప్పందం అమల్లోకి వస్తే రాగల ప్రతికూల పర్యవసానాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు, వ్యాపారవేత్తలకు అవేమిటో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. గత నెల రోజులుగా దీని గురించి ఎంతో ఉత్కంఠనెలకొన్నది. ఒప్పందంతో ప్రభావితులయ్యే వారితో బిజెపి చర్చించినట్లు మీడియాలో వార్తలు రాయించుకోవటం తప్ప ఏమి చర్చించారు, సర్కార్‌కు ఏమి సూచించారో తెలియదు. మరోవైపు కేంద్రం ఏమి చెబుతుందా అని ఎదురు చూసిన వారికి ఎలాంటి సమాచారం అందించలేదు. ప్రభావితులయ్యే తరగతులతో అధికారిక చర్చ అసలే లేదు. సోమవారం నాడు సదరు ఒప్పందం మీద సంతకాలు జరగాల్సి ఉంది. ఒక వేళ మన దేశానికి అంగీకారం కానట్లయితే ప్రదాని నరేంద్రమోడీ బ్యాంకాక్‌ పర్యటన రద్దయి ఉండేది.ఆయన అక్కడకు చేరుకొని ఎర్రతివాచీ స్వాగతం పొందారు. రెండవ తేదీ నుంచి నాలుగవ తేదీ వరకు ఆసియన్‌ దేశాల శిఖరాగ్ర సభ, ఆర్‌సిఇపి శిఖరాగ్ర సమావేశం జరగనున్నాయి. అసాధారణ పరిణామాలు జరిగితే తప్ప సంతకాలు జరగటం ఖాయంగా కనిపిస్తోంది.
పారదర్శకత గురించి కొందరు ఎంత ఎక్కువగా చెబుతారో అంత ఎక్కువగా తెరవెనుక పనులు చేస్తారనేది అందరికీ తెలిసిన సత్యం. అలాంటి వారు చేసేది చెప్పరు-చెప్పింది చేయరు. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేస్తామని బిజెపి ఎన్నడూ చెప్పకుండా ఆ పని చేయటం అందుకు నిదర్శనం. ఆర్‌సిఇపి ఒప్పందం విషయంలో కూడా నరేంద్రమోడీ సర్కార్‌ అదే పని చేస్తోందా ? 2017లో మోడీ ఏర్పాటు చేసిన నీతి అయోగ్‌ పత్రం కూడా ఒప్పందం మీద హెచ్చరికలు చేసింది. వ్యతిరేకతను వ్యక్తం చేసింది. అలాంటి దాని గురించి పార్లమెంట్‌లో ఎలాంటి చర్చ జరపలేదు. నిజానికి ఈ ఒప్పందంలోని అంశాలు పెద్ద నోట్ల రద్దు వంటి రహస్యమైనవేమీ కాదు.ఏ ఏ అంశాలను అంగీకరిస్తే ఎలా నష్టం జరుగనుందో ఇప్పటికే చర్చ జరిగింది. ఏఏ వస్తువుల మీద మన దేశం పన్నులను ఎంతమేరకు తగ్గిస్తుంది, వేటిని మినహాయిస్తుంది అనేది వెల్లడి కావాల్సి ఉంది. వీటిి మీద ప్రభుత్వం తన వైఖరిని చెప్పలేదు, రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోలేదు. ఒప్పందాన్ని మన దేశం అంగీకరించరాదని కోరుతూ 250 రైతు సంఘాలతో కూడిన ఐక్యవేదిక ఆందోళనకు పిలుపు నిచ్చింది. సోమవారం నాడు ప్రదర్శనలు జరగనున్నాయి. సిపిఎం దీనికి మద్దతు ప్రకటించింది. సంతకాలు చేయరాదని డిమాండ్‌ చేసింది. ఆరెస్సస్‌ సంస్ధ స్వదేశీ జాగరణ మంచ్‌ కూడా దీన్ని వ్యతిరేకిస్తోంది. అయినా ఏ అంశాలను కేంద్రం అంగీకరించిందో, వేటిని వ్యతిరేకించిందో జనానికి ఇంతవరకు తెలియదు. అంగీకరించిన వాటితో ఎలా లబ్ది చేకూరనుందో, ఎలాంటి ప్రతికూల ప్రభావాలు పడతాయో, వాటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏమి చేయనుందో జనానికి చెప్పాలా లేదా ?

Image result for rcep
పదహారు దేశాలు, 360కోట్ల జనాభా వున్న ప్రాంతాలతో కూడిన ఈ ఒప్పందం ప్రపంచంలో అతి పెద్ద స్వేచ్చావాణిజ్య అవగాహనగా చరిత్రకెక్కనుంది.2012లో ప్రారంభమైన ఈ చర్చలు భారత్‌ సంతకం చేస్తే సోమవారం నాటితో మరో అధ్యాయానికి నాంది పలుకుతాయి. మన దేశానికి సంబంధించి రాష్ట్రాల పరిధిలోని వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్న ఈ ఒప్పందం గురించి కేంద్రం రాష్ట్రాలను సంప్రదించకపోవటం రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులను బాహాటంగా ఉల్లంఘించటంతప్ప మరేమీ కాదని ప్రముఖ ఆర్ధికవేత్త ప్రభాత్‌ పట్నాయక్‌ అన్నారు. ఒప్పందంపై సంతకం చేయటానికి బదులు దాన్ని బహిర్గత పరచాలని, రైతులతో సంప్రదింపులు జరపాలని రైతు సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ డిమాండ్‌ చేసింది.ఈ ఒప్పందం అమల్లోకి వస్తే కేరళ తోటల రైతాంగం అందరికంటే ఎక్కువగా నష్టపోనుంది. ఈ కారణంగానే అక్కడి ఎల్‌డిఎఫ్‌ సర్కార్‌ వ్యతిరేకత తెలిపింది. ఇప్పటికే వియత్నాం నుంచి శ్రీలంక ద్వారా వస్తున్న మిరియాల కారణంగా వాటి ధరలు దారుణంగా పడిపోయాయి. కొబ్బరి, రబ్బరు, పామ్‌ ఆయిల్‌, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు తదితర పంటలకు తీవ్రమైన పోటీ ఎదురు కానుంది. ఇప్పటి వరకు అనేక దేశాలు చివరికి ఐరోపా యూనియన్‌-అమెరికా మధ్య స్వేచ్చావాణిజ్య ఒప్పందాల నుంచి కూడా వ్యవసాయాన్ని మినహాయించారు.

Image result for rcep
దేశీయ ఉత్పత్తిదారుల సామర్ధ్యాలను పెంచకుండా ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తే ప్రతికూల ప్రభావాలు పడతాని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌(ఎస్‌బిఐ) పరిశోధన నివేదిక కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.2018-19లో ఆర్‌సిఇపిలోని పదకొండు దేశాలతో మనకు వాణిజ్య లోటు 107.28 బిలియన్‌ డాలర్లు ఉంది. ఇతర దేశాలతో కూడా కలిపి చూస్తే మొత్తంగా మన వాణిజ్య లోటు 184బిలియన్‌ డాలర్లు. ఆర్‌సిఇపి దేశాలకు మన ఎగుమతులు 21శాతం జరగ్గా మన దిగుమతులు ఈ దేశాల నుంచి 34శాతం వున్నాయి. మన వాణిజ్యం వ్యవసాయం, సంబంధిత ఉత్పత్తులు, దుస్తులు, ఆభరణాల వంటి వాటిలో మాత్రమే మిగులు ఉంది. మొత్తం వాణిజ్యంతో పోలిస్తే అది నామమాత్రమే. ఈ ఒప్పందంలో మన దేశం భాగస్వామి అయితే ఈ మిగులు కూడా హరించుకుపోయి లోటు ఇంకా పెరుగుతుందని ఎస్‌బిఐ నివేదిక చెప్పింది.
సంప్రదింపుల్లో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా విజయం సాధిస్తే మనం పాల ఉత్పత్తుల దిగుమతుల మీద పన్నులు తగ్గిస్తే అది మరింత నష్టదాయకమని కూడా ఎస్‌బిఐ హెచ్చరించింది. స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను మనం ఉపయోగించుకోవటం 25శాతానికి లోపుగానే ఉందని కూడా పేర్కొన్నది. అయితే ఒప్పందంలో భాగస్వామి కాకపోయినా మన దేశానికి నష్టమే అని ఎగుమతులు కష్టమౌతాయని కూడా తెలిపింది.
ఆర్ధికవేత్త సూర్జిత్‌ ఎస్‌ భల్లా నాయకత్వంలోని హైలెవెల్‌ అడ్వయిజరీ గ్రూప్‌(హెచ్‌ఎల్‌ఏజి) బృందం ఆర్‌సిఇపి ఒప్పందం మీద సంతకాలు చేయాలని సూచించింది. స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల గురించి నిరంతరం తెలియ చేస్తూ వాటిని ఉపయోగించుకోవాలని కోరింది. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వశాఖ కోరిక మేర తన సిఫార్సులు, ఇతర అంశాల గురించి ఈనివేదికను రూపొందించారు. అయితే ఇది అందచేసే సమయానికే మన అధికారులు, మంత్రులు బ్యాంకాక్‌ తరలివెళ్లారు. ఒప్పందం మీద సంతకాలకు ఒక సాకుగా దీన్ని ఉపయోగించుకోనున్నట్లు కనిపిస్తోంది.
1991లో ప్రారంభమైన నూతన ఆర్ధిక విధానాల కారణంగా మన వ్యవసాయ రంగంలో తలెత్తిన సంక్షోభం లక్షలాది మంది రైతుల బలవన్మరణాలకు కారణాలలో ప్రధానమైనది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రంగంలో తలెత్తిన సమస్యలు ఇంకా అపరిషతృంగానే ఉన్నాయి. రైతుల్లో మరింత ఆగ్రహం తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ యోజన పేరుతో ఏటా ఆరువేల రూపాయల నగదు సాయాన్ని అందచేస్తున్నది. ఇదేమీ శాశ్వత పధకం కాదు. ఆర్‌సిఇపి ఒప్పందం అమలులోకి వస్తే మన వ్యవసాయ రంగ సంక్షోభం మరింత తీవ్రం కావటం అనివార్యం.అది గ్రామీణ ప్రాంతాలలో కొనుగోలు శక్తిని మరింత తీవ్రంగా ప్రభావితం చేయనుంది.
ఈ ఒప్పందానికి తెరలేపింది కాంగ్రెస్‌ అయితే బిజెపి తెర దించనుంది. రెండు పార్టీలూ దీన్నుంచి రాజకీయ లబ్దిపొందేందుకు చూస్తున్నాయి. అధికారంలో ఉండగా ఒప్పందానికి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్‌ ఇప్పుడు వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంది. నవంబరు ఐదు నుంచి ప్రదర్శనలకు పిలుపు ఇచ్చింది. అప్పుడేం చేశారని బిజెపి ఎద్దేవా చేస్తోంది తప్ప తన వైఖరి ఏమిటో చెప్పదు. ప్రతిపక్షంలో ఉండగా, ఇప్పుడు కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ స్వదేశీ జాగరణ మంచ్‌ ఈ ఒప్పందానికి వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నది తప్ప బిజెపిని ఒప్పించలేకపోయింది. ఈ ఒప్పందాన్ని అందరూ వ్యతిరేకించటం లేదమ్మా అంటూ బిజెపి నేతలు ఇతరుల మీద నెపాన్ని నెడుతున్నారు. మరీ ఎక్కువ లొంగిపోవద్దబ్బా అని ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. మొత్తం మీద అసలు విషయం చెప్పకుండా గత నెల రోజులుగా కేంద్ర పాలకులు, అధికారపక్షం మీడియాకు లీకులతో కాలం గడిపింది.
ఇక మిగతా దేశాల విషయానికి వస్తే ఒక వేళ భారత్‌ సంతకం చేయకున్నా మనం ముందుకు పోవాల్సిందే అని మలేషియా ప్రధాని మహతిర్‌ మహమ్మద్‌ జూన్‌లోనే వ్యాఖ్యానించాడు. గణనీయంగా దిగుమతి పన్నులు ఉన్నప్పటికీ ఇప్పటికే ఇండోనేషియా, మలేషియాల నుంచి వస్తున్న పామాయిల్‌ మన దుకాణాల్లో నిండిపోతోంది. ఈ ఒప్పందంలో చేరితే పన్నులను రద్దు చేయాల్సి ఉంటుంది. వినియోగదారులకు తక్కువ ధరలకు లభించవచ్చు, వ్యాపారులకు లాభాల పంట పండవచ్చుగానీ మన రైతాంగ పరిస్ధితి, మన దేశం నుంచి తరలిపోయే డబ్బు సంగతేమిటి? న్యూజిలాండ్‌,ఆస్ట్రేలియాల నుంచి వచ్చే పాల ఉత్పత్తులతో పాల రైతాంగ పరిస్ధితి అగమ్యగోచరం. ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో పంట, ఉత్పత్తుల రైతాంగం ప్రభావితం అవుతారు. బిజెపి చెప్పే గోమాత పవిత్రత సంగతి ఎలా ఉన్నా ఆవుపాలతో రాజస్ధాన్‌లో ఇంకా అనేక ప్రాంతాలలో అనేక కుటుంబాలు తమ అవసరాలు తీర్చుకుంటున్నాయి. పది కోట్ల మంది రైతులకు పాల రాబడి ఒక వనరుగా ఉన్నట్లు అంచనా.
ఇప్పుడు నరేంద్రమోడీకి మరో పెద్ద సమస్య వచ్చింది. ఆయన అంతర్జాతీయ నాయకుడని, అనేక అంశాలను ప్రభావితం చేస్తున్నారని, పెద్ద ఆర్ధిక నిపుణుడన్నట్లుగా ఇంతకాలం ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రపంచ జనాభాలో సగానికి ప్రాతినిధ్యం వహించే దేశాల ఒప్పందంపై సంతకం చేయకపోతే ఆయన ప్రతిష్టకు దెబ్బ అని వ్యాఖ్యానిస్తున్నవారు లేకపోలేదు. చేస్తే దేశీయంగా రైతాంగం, ఇతర తరగతుల ప్రజానీకం నుంచి వేరుపడిపోతే అసలుకే మోసం వస్తుంది అన్నది చెప్పుకోలేని సంశయం. ఒప్పందం మీద సంతకం చేస్తే చైనా, ఇతర దేశాల నుంచి ఒక్క వ్యవసాయ ఉత్పత్తులే కాదు, అన్ని రకాల వస్తువులు వెల్లువలా మన మార్కెట్‌ను ముంచెత్తుతాయి. పోనీ ఈ ఒప్పందానికి దూరంగా అమెరికా, ఇతర ఐరోపా దేశాలతో చేతులు కలిపితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని చూస్తే అవన్నీ కూడా మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌- మాయింటి కొస్తే మాకేం తెస్తావ్‌ అనే రకాలు తప్ప మనకు సాయపడేవి కాదు. ఎగుమతి ఆధారిత అభివృద్ధి అనే ఒక దివాలా కోరు ఆర్ధిక విధానాన్ని అనుసరిస్తున్న (మేకిన్‌ ఇండియా అంటే అదే) మోడీ సర్కార్‌ ఈ ఒప్పందంలో చేరకపోతే మన ఎగుమతులు ఇంకా పడిపోయేందుకు దోహదం చేసినట్లు అవుతుంది. ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్ధను రూపొందిస్తా అని చెప్పిన గొప్పల గురించి జనం అడిగితే పరిస్ధితి ఏమిటి అనే మనో వ్యాధి పట్టుకుంది. ఒప్పందంలో చేరక ముందే మన ఆర్ధిక వృద్ధి రేటు ఐదు శాతానికి పడిపోయింది. ఇక విదేశాల నుంచి వస్తు దిగుమతులు మరింత పెరిగితే మన పరిశ్రమలు, వ్యవసాయం మూతపడుతుంది. ఇప్పటికే 8.5శాతానికి చేరిన నిరుద్యోగం మరింత పెరుగుతుంది.

Image result for bjp cpim
ఇప్పటి వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రేణులు చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకతను ఎంతగా రెచ్చగొట్టాలో అంతగా చేయాల్సింది చేశాయి. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ఆర్‌సిఇపిలో చైనాదే ప్రధాన పాత్ర. చైనా వస్తువులను బహిష్కరించండి అంటూ ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నది వారే. కనీసం చైనా నుంచి వచ్చే సగం వస్తువులనైనా అడ్డుకోవాలన్నది కొందరి వత్తిడి.అలాంటి చైనాతో కలసి ఒప్పందం చేసుకోవటం ఏమిటన్నది వారికి మింగుడుపడటం లేదు. ఈ విషయంలో నరేంద్రమోడీ తక్కువేమీ తినలేదు. వాణిజ్య, పారిశ్రామికవేత్తల వత్తిడికి లంగి తన కుర్చీని కాపాడుకొనేందుకు చైనాతో సయోధ్యకు ముందుకు పోక తప్పని స్ధితి.మన దేశంలోని కమ్యూనిస్టులు చైనా అనుకూలురనే ప్రచారం చేస్తున్నది కూడా కాషాయ దళాలే అన్నది తెలిసిందే. ఇప్పుడు ఆ కమ్యూనిస్టులు ఈ ఒప్పందంపై సంతకాలు చేయరాదని డిమాండ్‌ చేస్తున్నారు. బిజెపి దేశభక్తి, స్వదేశీ అనుమానంలో పడింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

విద్రోహిగా మారిన విడి సావర్కర్‌ భారత రత్నమా ?

20 Sunday Oct 2019

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

A militant turned british agent vd savarkar, Bharat Ratna ?, Saverkar Hindutva, vd savarkar

Image result for savarkar, chitragupta

ఎం కోటేశ్వరరావు
విజేతలే చరిత్రను రాశారు అని బ్రిటన్‌ మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ చెప్పాడు. ఇప్పుడు దేశంలో అదే జరుగుతోందా ? ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో తమకు విజయం చేకూర్చితే ఫలాన చర్యలు చేపడతామని ఎన్నికల ప్రణాళిక రూపంలో ఓటర్ల ముందుకు వస్తుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో తాము వినాయక దామోదర్‌ సావర్కర్‌కు (విడి సావర్కర్‌) భారత రత్న అవార్డు ఇప్పించేందుకు కృషి చేస్తామని బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించి పరోక్షంగా తన హిందూత్వ అజెండాకు ఆమోదం పొందేందుకు పూనుకుంది. పెన్సిలిన్‌ ఇంజక్షన్లు అందరి శరీరాలకు సరిపడవు. అందువలన పరీక్ష చేసేందుకు రోగికి పరిమిత మొత్తంలో ముందు ఎక్కించి వికటించిన లక్షణాలు కనిపించకపోతే నిర్ణీత డోనుసు అందించటాన్ని మనం చూశాము. ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ తన రాజకీయ విభాగం బిజెపి ద్వారా అటువంటి ప్రయోగానికే పూనుకుందని చెప్పవచ్చు. సావర్కర్‌ ఒక్కడి గురించి చెబితే తలెత్తే వ్యతిరేకతను నీరు గార్చేందుకు లేదా ఒక ఎత్తుగడగా మహారాష్ట్రకు చెందిన సంస్కర్తలు జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే పేర్ల సరసన సావర్కర్‌ను చేర్చారు. ఇది పూలే దంపతులను అవమానించటం తప్ప మరొకటి కాదు.
దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో మతోన్మాద శక్తులు తప్ప వామపక్ష భావజాలం నుంచి పెట్టుబడిదారీ వ్యవస్ధను కోరుకొనే వారి వరకు సామ్రాజ్యవాద వ్యతిరేకత ప్రాతిపదికగా పని చేశారు. దేశంలో ఉన్న సామాజిక పరిస్ధితుల్లో లౌకిక వాదం ఒక ఐక్యతా శక్తిగా పని చేసింది. అందువల్లనే మన చరిత్రను దానికి అనుగుణ్యంగానే చరిత్రకారులు రచించారు. అనేక మంది చరిత్రను మార్క్సిస్టు దృక్కోణంలో శాస్త్రీయంగా రూపొందించేందుకు ప్రయత్నించారు. వారిలో కమ్యూనిజంతో సంబంధం లేని వారు, కమ్యూనిస్టులు కాని వారు ఎందరో ఉన్నారు.

బిజెపి నయా భారత్‌ , నయా దేశ పిత, నయా భారత రత్నలు !
జర్మనీ చరిత్రకు వక్రభాష్యం చెప్పిన నాజీల మాదిరి మన దేశ చరిత్రను వక్రీకరించి మత కోణంలో జనాల మెదళ్లకు ఎక్కించేందుకు ప్రయత్నం జరుగుతోంది. దానికి గాను ప్రస్తుతం ఉన్న పుస్తకాలలో చరిత్రను వక్రీకరించారని, బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు, కమ్యూనిస్టు అవగాహన మేరకు రాసినది తప్ప మన ఘనమైన గత చరిత్రను ప్రతిబింబించటం లేదని నిరంతరం ప్రచార దాడి చేస్తున్నారు. ప్రతిదాన్నీ మత కోణంతో చూసే తిరోగమన శక్తులు మతకోణంతో చరిత్రను జనాల మెదళ్లకు ఎక్కించే ప్రయత్నం తీవ్రంగా జరుగుతోంది. దేశ చరిత్రలో తొలిసారిగా మతోన్మాద భావజాల ప్రాతిపదికగా పని చేసే వారు పార్లమెంటరీ వ్యవస్ధలోని నాలుగు ప్రధాన పదవులైన తొలిసారిగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్లుగా బాధ్యతల్లో ఉన్న సమయమిది. గతంలో అనేక రంగాలలో ఆశక్తులు ప్రవేశించినప్పటికీ పూర్తి ఆధిపత్యాన్ని కలిగిన సమయమిదే. అంటే ఆ శక్తులు విజయం సాధించాయి. వారి చర్యలు ఇప్పుడు విన్‌స్టన్‌ చర్చిల్‌ చరిత్ర గురించి చెప్పిన అంశాలను గుర్తుకు తెస్తున్నాయి.

జవహర్‌లాల్‌ నెహ్రూను ఆధునిక భారత నిర్మాతగా అనేక మంది పరిగణిస్తారు. అందువలన నరేంద్రమోడీ తాను నూతన భారత్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పుకోవటం ద్వారా నూతన భారత నిర్మాతగా చరిత్రకెక్కేందుకు చూస్తున్నారు. మహాత్మాగాంధీని జాతిపితగా పరిగణిస్తున్నంత కాలం మరొకరిని ఆ స్ధానంలో ఉంచలేరు. అందువల్లనే నరేంద్రమోడీని డోనాల్డ్‌ ట్రంప్‌ భారత దేశ పిత అని వర్ణించాడు. దేశంలో ఇప్పటి వరకు ప్రకటించిన భారత రత్నలో మతోన్మాదులు ఎవరూ లేరు. నయా భారత్‌ కనుక రాబోయే రోజుల్లో వారే నిజమైన జాతీయవాదులు, జాతి రత్నాలుగా చరిత్రకు ఎక్కనున్నారంటే అతిశయోక్తి కాదు.

విప్లవకారుడు-విద్రోహి -మతోన్మాది !

మన దేశ చరిత్రలో వి డి సావర్కర్‌ అత్యంత వివాదాస్పద వ్యక్తి. యువకుడిగా తీవ్రవాద జాతీయ వాద భావాలకు ఆకర్షితుడైన వారిలో ఒకరు. తరువాత లండన్‌లో న్యాయవిద్య చదివే సమయంలో అక్కడ స్వాతంత్య్ర భావాలతో పని చేసే వారితో ఏర్పడిన పరిచయాల ప్రభావంతో కొన్ని రచనలు కూడా చేశారు. 1857 ప్రధమ స్వాతంత్య్రపోరాటంలో హిందువులు-ముస్లింలు ఎలా కలసిపని చేశారో వివరిస్తూ మరాఠీలో ఒక పుస్తకం కూడా రాశారు. తీవ్రవాద భావాలతో స్వాతంత్య్రం కోసం పనిచేస్తున్న అనేక మంది మాదిరి బ్రిటీష్‌ పాలకులు కేసులు బనాయించి 50 సంవత్సరాల జైలు శిక్షవేసి సావర్కర్‌ను కూడా అండమాన్‌కు పంపారు. అప్పటి వరకు నిర్బంధం అంటే ఏమిటో తెలియని సావర్కర్‌ అండమాన్‌ వెళ్లిన వారు తిరిగి రారు అనే ప్రచారం, కొన్ని వుదంతాలను విని పిరికిబారి జైలు నుంచి బయట పడేందుకు గాను బ్రిటీష్‌ ప్రభుత్వానికి విధేయుడిగా వుంటానని అరడజను లేఖలు రాసి బయటపడటమే కాదు, బ్రిటీష్‌ వారికి ఎలా కావాలంటే అలా సేవ చేస్తానని రాసి ఇచ్చాడు. తరువాత దాన్ని తుచ తప్పకుండా అమలు జరిపాడు. దీనికి సంబంధించిన ఆధారాలు బయట పడిన తరువాత తమ నేత ఒక ఎత్తుగడగా ఆ లేఖలు రాసినట్లు సంఘపరివార్‌ నేతలు చెప్పటం ప్రారంభించారు. ఇదే సమయంలో మితవాద తిరోగమన హిందూత్వ ప్రచారకుడిగా మారిపోయాడు. బ్రిటీష్‌ వారిపై తిరుగుబాటు చేసేందుకు సుభాస్‌ చంద్రబోస్‌ భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేస్తే యువకులు బ్రిటీష్‌ సైన్యంలో చేరేందుకు సావర్కర్‌ తోడ్పడ్డారని, స్వాతంత్య్ర సమరాన్ని పక్కదారి పట్టించేందుకు హిందూత్వ భావజాలాన్ని ముందుకు తెచ్చారని విమర్శకులు పేర్కొన్నారు. చివరకు మహాత్మా గాంధీ హత్యకేసులో కూడా సావర్కర్‌ ఒక ముద్దాయని, సాంకేతిక కారణాలతో కేసునుంచి బయటపడ్డారని పరిశీలకులు పేర్కొన్నారు.

Image result for vd savarkar chitraguptaఇద్దరు దేశ భక్తులు – రెండు లేఖలు- ఎంత తేడా !
సంఘపరివార్‌ శక్తులు అటు భగత్‌ సింగ్‌ను ఇటు విడి సావర్కర్‌ను దేశ భక్తులుగానే పరిగణిస్తాయి. సావర్కర్‌ను తమ ఆరాధ్య దైవంగా పరిగణిస్తాయి. జైలు శిక్షకు గురైన సావర్కర్‌ అండమాన్‌ జైలు నుంచి తనను విడుదల చేస్తే బ్రిటీష్‌ వారికి నమ్మిన బంటుగా పని చేస్తానని లేఖ రాశాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదానికి బహుళ ప్రచారం తెచ్చిన భగత్‌ సింగ్‌ తనకు విధించిన ఉరిశిక్షను అమలు జరపాలని లేఖ రాశాడు. ఆ మేరకు తన ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించాడు. అదే సావర్కర్‌ విషయానికి వస్తే తనను జైలు నుంచి విడుదల చేసిన బ్రిటీష్‌ వారికి విధేయుడిగా మారిపోయి స్వాతంత్య్ర వుద్యమం నుంచి దూరం అయ్యాడు. హిందూత్వశక్తిగా మారాడు.

ద్విజాతి సిద్ధాంతం, పాక్‌ ఏర్పాటును కోరిన ముస్లింలీగ్‌తో అధికారం !

పాకిస్ధాన్‌ ఏర్పాటు గురించి మహమ్మదాలీ జిన్నా, ముస్లింలీగ్‌ నేతలు ప్రతిపాదన తీసుకు రావటానికి రెండు సంవత్సరాల ముందే హిందువులు, ముస్లింలు వేర్వేరు జాతులంటూ సావర్కర్‌ ద్విజాతి సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో కాంగ్రెస్‌ నేతలు అరెస్టయిన సమయంలో హిందూ మహాసభ నేతగా వున్న సావర్కర్‌ సింధు, బెంగాల్‌ రాష్ట్రాలలో ముస్లింలీగ్‌తో కలసి సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటుకు నాయకత్వం వహించారు. ఆచరణాత్మక రాజకీయాలంటూ ఆ చర్యలను సమర్ధించుకున్నారు.అంతే కాదు హిందువులందరూ బ్రిటీష్‌ మిలిటరీ చేరాలని దేశమంతటా ప్రచారం చేసిన ‘ అపర దేశ భక్తుడు ‘. హిందూ మహాసభ, ముస్లింలీగ్‌ రెండూ కూడా స్వాతంత్య్రవుద్యమానికి దూరంగా వున్నవే కావటం గమనించాల్సిన అంశం.1943లో సింధు రాష్ట్ర అసెంబ్లీ భారత్‌ నుంచి పాకిస్ధాన్‌ ఏర్పాటు చేయాలని తీర్మానించింది. అయినప్పటికీ హిందూమహాసభ నేతలు మంత్రి పదవుల్లోనే కొనసాగారు. తీరా భారత్‌ను విభజించిన తరువాత దానికి గాంధీయే కారకుడని అదే సావర్కర్‌ ద్వేషం పెంచుకున్నారు. 1948 ఫిబ్రవరి 27న జవహర్‌లాల్‌ నెహ్రూకు రాసిన లేఖలో గాంధీ హత్యలో సావర్కర్‌ పాత్ర గురించి ప్రస్తావించారు. హిందూమహాసభకు చెందిన మతపిచ్చిగల వారు నేరుగా సావర్కర్‌ నాయకత్వంలో చేసిన, అమలు జరిపిన కుట్రలో భాగంగానే బాపూ హత్య జరిగిందని పేర్కొన్నారు. కుట్ర గురించి విచారణ జరిపిన కపూర్‌ కమిషన్‌ కూడా పటేల్‌ వ్యాఖ్యలను నిర్ధారించింది.

Related image
సావర్కర్‌ ‘విలువల ‘ ప్రాతిపదికన జాతి నిర్మాణం-మోడీ !

సావర్కర్‌ విలువల ప్రాతిపదికనే జాతీయవాదంతో జాతి నిర్మాణం జరుగుతున్నదని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ఆర్టికల్‌ 370ని వ్యతిరేకించిన వారే వీర సావర్కర్‌ను కించపరుస్తూ ఇంతవరకు భారత రత్న అవార్డు ఇవ్వకుండా అడ్డుపడ్డారని కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు.సావర్కర్‌ భరతమాత నిజమైన పుత్రుడని గతంలో ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ వారు కొద్ది రోజులు పోతే మహాత్ముడిని హత్య చేసిన గాడ్సేకు సైతం భారత రత్న ఇస్తారని కాంగ్రెస్‌ నేతలు కొందరు వ్యాఖ్యానిస్తే సావర్కర్‌కు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చెప్పారు.1857లో జరిగిన తిరుగుబాటును ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామం అని తొలిసారిగా గుర్తించింది సావర్కర్‌ అని హౌమంత్రి అమిత్‌ షా ఒక సభలో చెప్పారు. కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ఇందిరా గాంధీ స్వయంగా సావర్కర్‌ను అనుసరించారని ఆయన సమీప బంధువు రంజీత్‌ చెప్పారు. సావర్కర్‌కు భారత రత్న ఇవ్వాలని బిజెపి చెప్పిన అంశం జనం ముందు వుంది. అది తప్పనుకుంటే జనం వ్యతిరేకంగా ఓటు వేస్తారని అన్నాడు.

కాంగ్రెస్‌ అవకాశవాదం !
వాజ్‌పేయి ప్రధానిగా వున్న సమయంలో సావర్కర్‌ చిత్రపటాన్ని పార్లమెంట్‌ హాలులో పెట్టాలన్న స్పీకర్‌ మనోహర్‌ జోషి ప్రతిపాదనను కాంగ్రెస్‌ వ్యతిరేకించలేదు. స్పీకర్ల ప్రతిపాదనలను ఎవరూ వ్యతిరేకించరని కొందరు కాంగ్రెస్‌ నేతలు వ్యాఖ్యానించారు. ఇందిరా గాంధీ సావర్కర్‌ స్మారక నిధికి 1970లో వ్యక్తిగతంగా పదకొండు వేల రూపాయల విరాళం ఇచ్చారని, ఆయన స్మారకంగా ఒక తపాలా బిళ్లను విడుదల చేశారని అయితే సోనియా గాంధీ సావర్కర్‌ను వ్యతిరేకిస్తున్నారని బిజెపి విమర్శలు కురిపించింది. బ్రిటీష్‌ పలకులకు సావర్కర్‌ క్షమాభిక్ష పెట్టమని లేఖలు రాసిన విషయం ఇందిరా గాంధీకి తెలిసి వుండకపోవుచ్చు, తెలిసిన తరువాత సోనియా గాంధీ ఎందుకు సమర్ధించాలి అనే అభిప్రాయాలు కూడా వెల్లడయ్యాయి.సావర్కర్‌కు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదు, అయితే ఆయన హిందూత్వను మాత్రం అంగీకరించం అని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చెప్పారు.

Image result for savarkar, chitraguptaImage result for savarkar, chitragupta
వీర సావర్కర్‌ బిరుదు వెనుక అసలు కధ !
సంఘపరివార్‌, బిజెపి వాటి అనుబంధ సంస్ధల కార్యకర్తలు, అభిమానులు సావర్కర్‌ను వీర బిరుదు తగిలించి పిలుస్తారు. ఆ బిరుదు ఎవరిచ్చారు, ఏ వీరత్వం కారణంగా వచ్చింది అంటే ఎవరూ సమాధానం చెప్పరు. వీర సావర్కర్‌ జీవితం పేరుతో ఒక పుస్తకం ప్రచురితమైంది.1926లో చిత్రగుప్త అనే గుప్త నామ రచయిత దానిలో సావర్కర్‌ వీరత్వం గురించి గొప్పగా రాశారు. 1966లో ఆయన మరణించిన రెండు దశాబ్దాల తరువాత 1987లో సావర్కర్‌ రచనల అధికారిక ముద్రణ సంస్ధ వీర సావర్కర్‌ ప్రకాశన్‌ ఆ పుస్తకాన్ని రెండోసారి ప్రచురించింది. చిత్రగుప్త అంటే మరెవరో కాదు స్వయంగా సావర్కరే అని దానికి ముందు మాట రాసిన రవీంద్ర రామదాస్‌ వెల్లడించారు. అంటే అది సావర్కర్‌ ఆత్మకధ అన్నది నిర్ధారణ అయింది. పుట్టుకతోనే సావర్కర్‌ హీరో అని తన గురించి తానే దానిలో రాసుకున్నారు.

Image result for vd savarkar chitragupta
అతిశయోక్తులు – అవాస్తవాలు !
‘ అతను తెలివి గలవ్యక్తి, అతను ధైర్యశాలి, అతను ఒక దేశ భక్తుడు, వర్తమాన ప్రభుత్వ వ్యవస్థ రూపంలో దాగి వున్న దుష్టశక్తిని నేను గుర్తించటానికి చాలా ముందే ఆయన గుర్తించారు.ఆయన ప్రేమించిన దేశం బాగుండాలని కోరుకున్నందుకు అండమాన్‌ వెళ్లాల్సి వచ్చింది. న్యాయమైన ప్రభుత్వంలో అయితే ఆయనొక ఉన్నతమైన పదవిలో వుండే వారు’ అని మహాత్మాగాందీ పేర్కొన్నట్లు చాలా కాలంగా సంఘపరివార్‌ ప్రచారంలో పెట్టింది. ఈ మాటలు 1921జూన్‌ 18వ తేదీ యంగ్‌ ఇండియా పత్రికలో రాసినట్లు బిజెపి తన చిత్రాలలో పెట్టింది. అయితే దీని మీద అనుమానం వచ్చిన ప్రతీక్‌ సిన్హా అనే గుజరాత్‌ జర్నలిస్టు పరిశీలించి అసలు ఆ తేదీతో యంగ్‌ ఇండియా సంచికే లేదని 1921 జూన్‌ ఒకటి, ఎనిమిది, పదిహేను, ఇరవై రెండు, ఇరవై తొమ్మిదవ తేదీలతో ఐదు సంచికలు వున్నట్లు పేర్కొన్నారు. తాను 15, 22వ తేదీ సంచికలను చూశానని తనకెక్కడా సావర్కర్‌ గురించి ప్రస్తావన గానీ, ))ఆ మాటలు కనపడలేదని తెలిపారు. మహాత్మాగాంధీకి ఆపాదించిన ఈ మాటల గురించి ఇంటర్నెట్‌లో గూగులమ్మను అడగ్గా రెండు ఫలితాలు కనిపించాయని అవి రెండూ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా హిందూత్వ ప్రచార సైట్లని సిన్హా పేర్కొన్నారు.

ఆవు దేవత కాదన్న సావర్కర్‌ !
గోమాత అంటూ గోరక్షకుల పేరుతో కొందరు చేసిన దాడులతో మన దేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా అడుగంటిన విషయం తెలిసిందే. అసలైన హిందూ హృదయ సామ్రాట్‌గా పరిగణించే సావర్కర్‌ ఆవు ఒక సాధారణ జంతువు తప్ప దేవత కాదని అన్నారు. అవి మానవులకు ఉపయోగపడతాయి గనుక వాటిని కాపాడుకోవాలి తప్ప దేవతలు కాదని రాశారు. పాలకు ప్రతీక ఆవు తప్ప హిందూ దేశానికి కాదని కూడా పేర్కొన్నారు.
‘స్వంత అభిప్రాయాలు కలిగి ఉండే హక్కు సావర్కర్‌కు ఉంది. ఆయన హేతువాదాన్ని నమ్మారు.మనోద్వేగాల కంటే వుపయోగితావాదానికి ప్రాముఖ్యత ఇచ్చారు. అయితే అదే సమయంలో గాంధీ కూడా ప్రజల మనోద్వేగాలను గౌరవించారు ‘ అని ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంత వేత్త ఎంజివైద్య వ్యాఖ్యానించారు.

అమిత్‌ షా అతియోక్తి !
1857లో జరిగిన ఉదంతాన్ని సిపాయిల తిరుగుబాటుగా బ్రిటీష్‌ పాలకులు ప్రచారం చేశారు. కొందరు చరిత్రకారులు కూడా అదే విధంగా చూశారు. అయితే ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం అని తొలిసారిగా సావర్కర్‌ వర్ణించినట్లు కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా చెప్పటం అతిశయోక్తి తప్ప మరొకటి కాదు.’ భారత్‌లో జరిగిన అలజడి ఒక సిపాయి తిరుగుబాటు కాదు, ఒక జాతీయ తిరుగుబాటు, జాన్‌ బుల్‌ దానిని మిలిటరీ తిరుగుబాటుగా పరిగణించవచ్చుగానీ వాస్తవం ఏమంటే అది జాతీయ తిరుగుబాటు ‘ అని 1857 జూలై 28, 31 తేదీలలో కారల్‌ మార్క్సు వ్యాఖ్యానించారు. అప్పటికి అసలు వి డి సావర్కర్‌ పుట్టనే లేదు. లండన్‌లో బారిష్టర్‌ చదవటానికి వెళ్లిన సమయంలో మార్క్స్‌ రచనలు చదివి సావర్కర్‌ ఆ అభిప్రాయానికి వచ్చి వుండవచ్చు.

హిందూత్వ-నాజీ పోలిక !
హిందూత్వ ఒక జీవన విధానం తప్ప మతానికి సంబంధించింది కాదని సంఘపరివార్‌ శక్తులు పదే పదే చెబుతారు, కొంత మంది అది నిజమే అనుకుంటున్నారు. యావత్‌ ప్రపంచం హిట్లర్‌ మూకలు, అనుయాయులను నాజీలు అని పిలిచే విషయం తెలిసిందే. అయితే హిట్లర్‌, ఆతగాడి అనుయాయులు ఎన్నడూ దాన్ని అంగీకరించలేదు, తమను జర్మన్‌ జాతీయ సోషలిస్టులుగా, తమది జాతీయ సోషలిజంగా వర్ణించుకున్నారు. మహారాష్ట్రలో బిజెపి, శివసేన హిందూత్వశక్తులుగా రంగంలో వున్నాయి. హిందూత్వకు సావర్కర్‌ ప్రతీకగా వున్నారు. స్వాతంత్య్రవుద్యమసమయంలో సావర్కర్‌ భావజాలాన్ని మరాఠాలు ఆమోదించలేదు. అయితే మారిన పరిస్ధితుల్లో అనేక దశాబ్దాలపాటు ఆయన అనుయాయులు చేసిన ప్రచారం కారణంగా అనేక మంది సావర్కర్‌ నిజమైన జాతీయవాది అని భావిస్తున్నారు. దీన్ని సొమ్ము చేసుకొనేందుకు ఆయనకు భారత రత్న ఇవ్వాలనే ప్రతిపాదనను బిజెపి ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు.
ముందు వక్రీకరణలతో గందరగోళాన్ని సృష్టించటం, మెల్లగా తమ అజెండాను ఎక్కించటాన్ని చూస్తున్నాము. ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే అదే నిజమై కూర్చుంటుందన్న గోబెల్స్‌ సూత్రాన్ని అమలు జరుపుతున్నారు. ఇదే సమయంలో మెజారిటీ హిందూ మతోన్మాదశక్తులను జాతీయవాదులుగా చిత్రించి అసలైన జాతీయవాదులు, లౌకికశక్తుల మీద దాడి చేస్తున్నారు. దానిలో భాగమే సావర్కర్‌కు భారత రత్న బిరుదు సాధన వాగ్దానం. అది అమలు జరిగితే తదుపరి గాంధీని హత్యచేసిన గాడ్సేను ముందుకు తెచ్చినా ఆశ్చర్యం లేదు. విజేతలే చరిత్రను రాయటం అంటే ఇదే. అందువలన ‘చరిత్రను విస్మరించిన తరానికి గతమూ, భవిష్యత్‌ రెండూ ఉండవు ‘ అని చెప్పిన రాబర్ట్‌ హెయిన్‌లిన్‌ మాటలను ఈ సందర్భంగా గుర్తుకు తేవాల్సి ఉంది. ఏది అసలైన చరిత్ర ? ఏది నకిలీ ? వాట్సాప్‌ యూనివర్సిటీ చరిత్ర పాఠాల పట్ల తస్మాత్‌ జాగ్రత్త ! అక్కడ వైద్య శాస్త్రం చదవకుండా వైద్యం చేసే నకిలీ వైద్యుల మాదిరి చరిత్ర తెలియని వారు సుప్రసిద్ధ చరిత్ర కారులుగా మనకు బోధిస్తారు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం- ఆర్ధిక నిందితులకు రాజకీయ ఆశ్రయం !

06 Sunday Oct 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Adani, Ambani, Ambani and Adani, crony capitalism in India, India crony capitalism, Narendra Modi

Image result for political patronage  for economic offenders, india

(ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం- ఆర్ధిక నేరస్ధులకు అవధుల్లేని అవకాశాలు ! విశ్లేషణ ముగింపు రెండవ భాగం)

ఎం కోటేశ్వరరావు

ఆర్ధిక నేరగాళ్ల గురించి కూడా మన దేశంలో రాజకీయాలు చేయటం ఒక విషాదం. ఒక పార్టీలో వుంటూ ఆర్ధిక నేరాల ఆరోపణలను ఎదుర్కొన్నవారు మరో పార్టీలో చేరగానే పునీతులౌతున్నారు. కేసులు మరుగునపడుతున్నాయి. దీనికి ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం తప్ప మరొక కారణం కనిపించటం లేదు. ఈ ఏడాది ఏప్రిల్‌ 17న ఎకనమిక్‌ టైమ్స్‌లో ఒక వార్త వచ్చింది. గత మూడు సంవత్సరాలలో మహారాష్ట్రలో ఆర్ధిక నేరాలకు పాల్పడిన వారి వివరాల గురించి సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన వివరాలను ఆ పత్రిక ఇచ్చింది. నూట ఎనభైకి పైగా కేసులు రాగా ఆర్ధిక నేరాల ముంబై పోలీసు విభాగం చేపట్టింది రెండు మాత్రమే. ఈ కేసులలో రూ. 19,317 కోట్ల మేరకు దుర్వినియోగం జరిగినట్లు అంచనా లేదా అనుమానం కాగా స్వాధీనం చేసుకున్న సొమ్ము రెండున్నర కోట్ల రూపాయలు మాత్రమే. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ వార్షిక నివేదిక ప్రకారం తీవ్ర అక్రమాల దర్యాప్తు కార్యాలయం(సిఎఫ్‌ఐఓ)కు 2017 డిసెంబరు నుంచి 2018 నవంబరు వరకు 33 కేసులను దర్యాప్తు చేయాలని ఆదేశించగా కేవలం ఐదు మాత్రమే పూర్తయ్యాయి. కొన్ని కేసులలో మూడు లేదా నాలుగు సంస్ధలు చేపడుతున్నందున సమయంతో పాటు డబ్బు వ ధా అవుతోంది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కేసును మూడు సంస్ధలు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును ముంచిన నీరవ్‌ మోడీ కేసును మూడు సంస్ధలు దర్యాప్తు చేస్తున్నాయి. భూషణ్‌ స్టీల్స్‌ అక్రమాల కేసులో ఎండీ నీరజ్‌ సింగాల్‌ అరెస్టును ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దర్యాప్తు సంస్ధ అనుసరించిన పద్దతుల్లో లోపాలు, ఇతర కొన్ని అక్రమాలు దీనికి కారణం.

2015 నేషనల్‌ క్రైమ్‌ రికార్డుల బ్యూరో సమాచారం ప్రకారం అంతకు ముందు పది సంవత్సరాలలో ఆర్ధిక నేరాలు రెట్టింపైనట్లు వెల్లడైంది.2006లో ప్రతి లక్ష మందికి 6.6 నమోదు కాగా 2015 నాటికి 11.9కి పెరిగాయి. రాజస్ధాన్‌లో 17.42 నుంచి 37.4కు, అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 12.01 వుంటే తెలంగాణాలో 24.6 నమోదయ్యాయి.ఆర్ధిక నేరాల పెరుగుదల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మీద, సులభతర వాణిజ్యం మీద ప్రతికూల ప్రభావం కలిగిస్తుందని అనేక మంది చెబుతున్నారు. అయితే లావాదేవీలు పెరిగినందున దానికి అనుగుణ్యంగానే నేరాలు కూడా పెరిగాయన్నది కొందరి అభిప్రాయం.ప్రతి స్ధాయిలో డబ్బు అందుబాటులో వుండటం నేరాల పెరుగుదలకు కారణం అని న్యాయవాదులు అంటున్నారు.

గత ఐదు సంవత్సరాలలో దేశం నుంచి 27 మంది ఆర్ధిక నేరగాండ్లు దేశం విడిచి పోయారని 2019 జనవరి నాలుగున కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్‌ శుక్లా లోక్‌సభకు ఒక రాతపూర్వక సమాధానంలో చెప్పారు. వీరిలో 20 మంది మీద రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ను కోరగా ఎనిమిది మీద నోటీసులు జారీ అయినట్లు తెలిపారు. 2018 జూలై 25వ తేదీన విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వికె సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం 2015 నుంచి ఆరుగురు మహిళలతో సహా 28 మంది ఆర్ధిక అవకతవకలు, నేరాలకు సంబంధించి చట్టపరమైన చర్యలను ప్రారంభించామని, వారంతా విదేశాల్లో వున్నట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు.

2018 మార్చి 23న ప్రభుత్వం రాజ్యసభకు తెలిపిన సమాచారం ప్రకారం నేరగాండ్ల అప్పగింతకు అప్పటి వరకు 48దేశాలతో ఒప్పందాలు, మరో మూడు దేశాలతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది. సిబిఐ 23, ఇడి 13 కేసులను దర్యాప్తు చేస్తుండగా విజయ మాల్య, మెహుల్‌ చోక్సి, నీరవ్‌ మోడీ, జతిన్‌ మెహతా, ఆషిష్‌ జోబన్‌ పుత్ర, చేతన్‌ జయంతిలాల్‌ సందేశరా, నితిన్‌ జయంతి లాల్‌ సందేశరా, దీప్తిబెన్‌ చేతన్‌ కుమార్‌ సందేశారా రెండు సంస్ధల దర్యాప్తులో నిందితులుగా వున్నారు. ఆర్ధిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారి జాబితాలో దిగువ పేర్లు వున్నాయి.

పుష్ప బైద్‌, అషిష్‌ జీబన్‌ పుత్ర, ప్రీతి అషిష్‌ జీబన్‌ పుత్ర, విజయమాల్య, సన్నీ కల్రా,సంజరు కల్రా, సుధీర్‌ కుమార్‌ కల్రా, ఆరతి కల్రా, వర్ష కల్రా, జతిన్‌ మెహతా, వుమేష్‌ పరేఖ్‌, కమలేష్‌ పరేఖ్‌, నిలేష్‌ పరేఖ్‌, ఏకలవ్య గార్గ్‌, వినరు మిట్టల్‌,చేతన్‌ జయంతిలాల్‌ సందేశరా, నితిన్‌ జయంతి లాల్‌ సందేశరా, దీప్తిబెన్‌ చేతన్‌ కుమార్‌ సందేశరా, నీరవ్‌ మోడీ, నీషాల్‌ మోడీ, సబయ సేథ్‌, రాజీవ్‌ గోయల్‌, అల్కా గోయల్‌, లలిత్‌ మోడీ, రితేష్‌ జైన్‌, హితేష్‌ నరేంద్రభారు పటేల్‌, మయూరీ బెన్‌ పటేల్‌.

గత ఐదు సంవత్సరాలలో విదేశాలకు పారిపోయిన ఆర్ధిక, ఇతర నేరగాండ్లు పద్దెనిమిది మందిని కేంద్ర ప్రభుత్వం దేశానికి రప్పించింది.1. అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలు కేసులో రాజీవ్‌ సక్సేనా(యుఏయి నుంచి)తో పాటు లాబీయిస్టు దీపక్‌ తల్వార్‌, ఇదే కేసులో మధ్యవర్తి పాత్ర వహించిన బ్రిటీష్‌ జాతీయుడు క్రిస్టియన్‌ మిచెల్‌, 2. మోసం, ఫోర్జరీ, నేరపూరిత కేసులలో ఇండోనేషియా నుంచి మహమ్మద్‌ యాహ్యా, అక్కడి నుంచే ఇదే కేసులలో వినరు మిట్టల్‌, 3. యుఏయి నుంచి వుగ్రవాద కార్యకలాపాల కేసులో మన్సూర్‌ లేదా ఫరూక్‌ టక్లా, 4. బ్యాంకు అక్రమాల కేసులో రుమేనియా జాతీయుడు ఎంఎం ఫరూక్‌ యాసిన్‌ను నికరాగువా నుంచి, 5. వుద్యోగాల పేరుతో టోకరా కేసులో అబూబకర్‌ కదిర్‌ లోనట్‌ అలెగ్జాండ్రును సింగపూర్‌ నుంచి,6. హత్య కేసులో బంగ్లాదేశ్‌ నుంచి అబ్దుల్‌ రౌత్‌ మర్చంట్‌ మహమ్మద్‌ సుల్తాన్‌, 7. హత్యాయత్నం కేసులో సింగపూర్‌ నుంచి కుమార్‌ క ష్ణ పిళ్లె, 8.భారత్‌కు వ్యతిరేకంగా వుగ్రవాద కేసులో యుఏయి నుంచి అబ్దుల్‌ వాహిద్‌ సిద్ది బాపాను, 9.హత్యాయత్నం కేసులో మారిషస్‌ నుంచి కళ్లం గంగిరెడ్డి, 10. వుగ్రవాద కేసులో అనూప్‌ చెటియా నుంచి బంగ్లాదేశ్‌ నుంచి, కిడ్నాప్‌, హత్య కేసుల్లో ఇండోనేషియా నుంచి చోటా రాజన్‌,11. హత్య కేసులో మొరాకో నుంచి బన్నాజే రాజా, 12. హత్య కేసులో థారులాండ్‌ నుంచి జగతార్‌ సింగ్‌ను మన దేశానికి రప్పించారు.

వీరుగాక ఆర్ధిక నేరాలకు పాల్పడిన మరికొందరిని దేశం విడిచి పోకుండా చూడాలని కార్పొరేట్‌ మంత్రిత్వ వ్యవహారాల శాఖ 20 మంది పేర్లతో ఒక జాబితాను తయారు చేసి ఐబికి అదచేసింది. వారిలో జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌, అనిత గోయల్‌, దీపక్‌ కొచార్‌, వీడియోకాన్‌ ఎండీ వేణుగోపాల్‌ ధూత్‌ తదితరుల పేర్లు వున్నట్లు వెల్లడైంది. నరేష్‌ గోయల్‌, అనితా గోయల్‌ దుబారు మీదుగా లండన్‌ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ముంబ్‌ విమానాశ్రయంలో వారిని నిలిపివేసిన విషయం తెలిసిందే.

ఆర్ధిక నేరాలకు పాల్పడి దేశం వదలి పారిపోయే వారి గురించి విచారణకు వున్న చట్టాలు పటిష్టంగా లేనందున కొత్తగా 2018లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్నే చేయాల్సి వచ్చింది. విజయ మల్య అనే పెద్ద మనిషి 18-20 సంచులు తీసుకొని పారిపోతుంటే నిఘాసంస్ధల సిబ్బంది విమానాశ్రయంలో గుడ్లప్పగించి చూశారు. ఆయన కదలికల మీద కన్నేసి వుండమన్నారు తప్ప అరెస్టు చేయాలనే ఆదేశాలు లేవని వారు చెప్పిన విషయం తెలిసిందే. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును ముంచిన నీరవ్‌ మోడీ విషయంలో కూడా అదే జరిగింది. కొత్త చట్టం ప్రకారం వంద కోట్ల రూపాయలకు పైబడి అక్రమాలకు పాల్పడి పారిపోయిన వారిని ఒక ప్రత్యేక కోర్టులో విచారిస్తారు. విచారణ సమయంలో నిందితుల ఆస్ధులను స్వాధీనం చేసుకోవచ్చు. పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా మాట్లాడిన సభ్యులు దాదాపు రెండులక్షల నలభైవేల కోట్ల రూపాయల మేరకు అక్రమాలకు పాల్పడినట్లు,పారిపోయిన నిందితులు 39 అని చెప్పారు.గతేడాది పార్లమెంట్‌కు ప్రభుత్వం చెప్పినదాని ప్రకారం 31 మంది దేశం వదలి పారిపోయారు. అలాంటి నిందితులను మనకు అప్పగించటానికి వీలుగా కేవలం 57దేశాలతో మాత్రమే ఒప్పందాలున్నాయి. అనేక మంది నిందితులు అవి లేని దేశాలకు పారిపోయారు.

ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధ సజావుగా వుందా లేక ఇబ్బందుల్లో వుందా అన చెప్పటానికి బ్యాంకుల్లో పేరుకు పోతున్న నిరర్ధక ఆస్ధులు ఒక సూచిక. మన దేశంలో ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు పెరుగుతున్నాయి. ఏటా లక్షల కోట్ల రూపాయల బకాయిలను పారు బాకీలుగా పక్కన పెడుతున్నారు. వాటిని వసూలు చేస్తామని మరోవైపు చెబుతుంటారు. అలాంటి బాకీలను పరిష్కరించుకోవటంలో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. 2019 మార్చి నాటికి 8.06లక్షల కోట్ల రూపాయల నిరర్ధక ఆస్తులున్నాయి. మూడు నెలల గడువు తీరినా కనీస మొత్తం చెల్లించని వాటిని, రుణం తీర్చటం కోసం రుణం తీసుకున్న మొత్తాలను నిరర్ధక ఆస్ధులుగా పరిగణిస్తున్నారు. గతంలో వాటిని రావాల్సిన బకాయిలుగా చూపే వారు. ఇప్పుడు ప్రతి ఏటా రద్దు చేసిన వాటిని మినహాయించి చూపుతూ నిరర్ధక ఆస్ధుల మొత్తం తగ్గుతున్నట్లు చిత్రిస్తున్నారు. అలా చేయకపోతే బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టేవారు ముందుకు రావటం లేదు.ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ అందించిన సమాచారం ప్రకారం 2018 ఆర్ధిక సంవత్సరంలో 1.28లక్షల కోట్లు,2019లో 1.77లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్ధక ఆస్ధులను రద్దు చేశారు. ఈ చర్యలు ఆర్ధిక నేరస్ధులను ఆదుకోవటం కాదా ?

Image result for India crony capitalism cartoons

ప్రతి ఆర్ధిక విధానంలోనూ లబ్ది పొందేవారు వుంటారు. పాతికేండ్ల సంస్కరణల ఫలితాల గురించి ఆర్ధిక వ్యవహారాల ప్రముఖ జర్నలిస్టు స్వామినాధన్‌ ఎస్‌ అంక్లేసరియా అయ్యర్‌ 2016లో రాసిన విశ్లేషణను కాటో సంస్ధ ప్రచురించింది. దానిలో వున్న అంశాలతో ఏకీభవించటం లేదా విబేధించటం వేరే విషయం. ఆర్ధిక నేరాలు అనే ఈ విశ్లేషణతో ముడిపడిన దానిలోని కొన్ని అంశాల సారం ఇలా వుంది.

Image result for India crony capitalism: political patronage

” 1991 తరువాత అంతకు ముందు రాజకీయ సంబంధాలున్న కొన్ని కుటుంబాల ప్రాబల్యం అంతరించి కొత్తవారు ఎదిగారు. కొత్తగా వాణిజ్య రంగంలోకి వచ్చిన(ముఖ్యంగా రియలెస్టేట్‌, మౌలిక సదుపాయాల రంగం) వారిని ఆశ్రిత పెట్టుబడిదారులు అని పిలిచారు. వారికి బలమైన రాజకీయ సంబంధాలు తప్పనిసరిగా వుంటాయి. వారింకా సురక్షితమైన గుత్త సంస్ధలుగా మారలేదు, వాటిలో అనేక మంది(డిఎల్‌ఎఫ్‌, యూనిటెక్‌, లాంకో, ఐవిఆర్‌సిఎల్‌) దారుణంగా విఫలమయ్యారు. భారత్‌లో లంచాలను రాజకీయ నేతల బలవంతపు వసూలు అని పిలుస్తారు, ఎందుకంటే లంచాలు కొన్ని సందర్భాలలో అనిశ్చితంగానూ కొన్ని సార్లు ప్రతికూల ఆపదగా వుంటాయి. ఆర్ధిక సరళీకరణ మరియు పోటీ కొన్ని సందర్భాలలో పేరుగాంచిన పాత కంపెనీలను దివాలా తీయించాయి.(హిందుస్ధాన్‌ మోటార్స్‌, ప్రీమియర్‌ ఆటోమొబైల్స్‌, జెకె సింథటిక్స్‌, డిసిఎం) తీవ్రమైన పోటీని తగినంత సౌష్టవంగా వుంటేనే మనుగడ సాగించగలవని సూచించాయి.1991లో సెన్సెక్స్‌లో వున్న 30 కంపెనీలలో రెండు దశాబ్దాల తరువాత కేవలం తొమ్మిదే మిగిలాయి.కొత్త కంపెనీల గురించి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘ ఈ కంపెనీలు ధనికుల సంతానం కాదు, సరళీకరణ సంతానం ‘ అన్నారు. గత పాతికేండ్లలో పాతపద్దతిలోని లైసన్సులు, అదుపులు రద్దయ్యాయిగానీ కొత్తవి, అధికార యంత్రాంగపు ఆటంకాలు వచ్చాయి. పర్యావరణం, అడవులు, గిరిజన హక్కులు, భూమి, కొత్త అవకాశాలైన చిల్లరవర్తకం, టెలికాం, ఇంటర్నెట్‌ సంబంధిత కార్యకలాపాల్లో వీటిని చూడవచ్చు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తగినంతగా సరళీకరించటంలో ఘోరంగా విఫలమయ్యాయి. దాంతో వాణిజ్య, పారిశ్రామికవేత్తలు అవినీతి, ఫైళ్లను పక్కన పడేయటం గురించి తీవ్రంగా ఫిర్యాదులు చేస్తున్నారు.

భారత్‌లో నేరగాండ్లు రాజకీయాల్లో భాగస్వాములౌతున్నారు, తరచుగా కాబినెట్‌ మంత్రులు అవుతున్నారు.దీంతో వారి మీద వున్న ఆరోపణలను పరిశీలించకుండా చేసుకోగలుగుతున్నారు. ఏడిఆర్‌ విశ్లేషణ ప్రకారం 2014లో ఎన్నికైన 543 మంది లోక్‌సభ సభ్యులలో 186 మంది మీద నేరపూరిత కేసులు పెండింగ్‌లో వున్నాయి. 2009లో ఎన్నికైన వారిలో 158 మంది మీద వున్నాయి. 2014లో ఎన్నికైన వారిలో 112 మంది మీద హత్య, కిడ్నాప్‌, మహిళల మీద నేరాల వంటి తీవ్ర కేసులు వున్నాయి. ఏ పార్టీ కూడా పరిశుద్దంగా లేదు. అన్ని పార్టీల్లో నేరగాండ్లు పుష్కలంగా వున్నారు. అలాంటి వారు ప్రతిపార్టీకి డబ్బు,కండబలం, ప్రాపకాలను సమకూర్చుతారు.

 

Image result for India crony capitalism cartoons

దేశాల్లో జిడిపితో పాటు అవినీతి పెరుగుతోంది. భారత గత పాతిక సంవత్సరాల అనుభవం దీనికి మినహాయింపు కాదు. వ్యభిచార కేంద్రాన్ని నిర్వహించే ఒక మహిళ ప్రచారంలో పెట్టిన ఫొటోల కారణంగా సెక్స్‌ కుంభకోణంలో ఒక రాష్ట్ర గవర్నర్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. నగంగా వున్న ముగ్గురు యువతులు ఆ గవర్నర్‌తో వున్నారు. వ్యభిచార కేంద్ర నిర్వాహకురాలికి ఒక గని అనుమతి ఇప్పిస్తానన్న వాగ్దానాన్ని గవర్నర్‌ నిలబెట్టుకోలేకపోయాడు. ప్రతీకారంగా ఆమె ఫొటోలను బయటపెట్టింది.మొదట వచ్చిన వారికి తొలి కేటాయింపు( వాస్తవానికి గడువు గురించి ముందుగానే స్నేహితులకు తెలియచేసి లబ్ది చేకూర్చారు) పద్దతిలో స్పెక్ట్రమ్‌ కేటాయింపుల వలన ఖజానాకు 1.76లక్షల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని, వేలం వేయకుండా మంత్రిత్వశాఖ విచక్షణతో బొగ్గు గనులు కేటాయించిన కారణంగా 1.86లక్షల కోట్ల నష్టం వచ్చిందని కాగ్‌ నివేదిక పేర్కొన్నది. ఆర్ధిక సంస్కరణలు పెద్ద ఎత్తున అవినీతికి ఆస్కారమిచ్చాయని విమర్శకులు అంటారు. సమగ్రంగా సరళీకరణ గావించిన రంగాలలో అవినీతి అద శ్యమైంది. 1991కి ముందు పారిశ్రామిక, దిగుమతి లైసన్సులు, విదేశీమారకద్య్రవ్య కేటాయింపులు, రుణాల వంటి వాటికి లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. సంస్కరణల తరువాత అవన్నీ సులభంగా లభ్యమౌతున్నాయి. పన్నుల తగ్గింపు కారణంగా స్మగ్లింగ్‌ దాదాపు అంతమైంది. అయితే అన్ని సహజవనరుల, టెలి కమ్యూనికేషన్స్‌ స్ప్రెక్ట్రమ్‌ విలువలను భారీగా పెంచిన కారణంగా వాటి కేటాయింపుల్లో ముడుపులకు అవకాశం కలిగింది. గతంలో ప్రభుత్వ రంగానికి మాత్రమే కేటాయించబడిన రంగాలలో ప్రయివేటు రంగ భాగస్వామ్యానికి తెరిచారు. ప్రభుత్వ-ప్రయివేటు రంగ భాగస్వామ్యం తరచుగా ఆశ్రిత పెట్టుబడిదారుల కారణంగా నష్టం కలిగిస్తోంది. సరళీకరణ తరువాత అనేక రంగాల్లో అవినీతి పోయిందని అయితే కొన్నింటిలో ఎక్కడైతే ఎక్కువగా నియంత్రణలు, అవినీతి ఎక్కువగా వుంటాయో సహజవనరులు, రియలెస్టేట్‌ రంగాల్లో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో అవినీతి మరింత పెరిగింది. ఇటీవలి కాలంలో కొన్ని రంగాలలోని విస్త త అవినీతి పూర్తిగా సరళీకరించిన రంగాల్లో మెరుగుదలను మరుగున పడవేస్తున్నది.” నయా వుదారవాద లేదా సరళీకరణ విధానాలను పూర్తిగా సమర్ధించే అంక్లేసరియా అయ్యర్‌ వంటి వారే అవినీతి గురించి చెప్పకతప్పలేదు. అందరికీ కనిపిస్తున్న అవినీతి సమర్ధకులకు ఒక పట్టాన కనిపించదు. సరళీకరణ విధానం అంటే ప్రజల సంపదను కొంత మందికి కట్టబెట్టటం. ఈ క్రమంలో రాజకీయ-వ్యాపారవేత్తలు లేదా కలగలసిన వారు ప్రజాధనంతో నడిచే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటం, ఎగవేయటం అనే అక్రమాలు సర్వసాధారణంగా మారాయి. తెల్లవారే సరికి ధనవంతుడి వయ్యావా లేదా అన్నదే గీటు రాయి, ఎలా అయ్యారన్నది అనవసరం అన్న విలువలే నేడు సమాజాన్ని నడిపిస్తున్నాయి. అలాంటపుడు అక్రమాలకు కొదవేముంటుంది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం- ఆర్ధిక నేరస్ధులకు అవధుల్లేని అవకాశాలు !

06 Sunday Oct 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

crony capitalism, crony capitalism BJP, crony capitalism in India, crony capitalism INC

Image result for crony capitalism in indiaమొదటి భాగం

ఎం కోటేశ్వరరావు

లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్నది పాత సామెత. లాభం వుంటేనే రాజకీయనేతలు, వ్యాపారులు కూడా వరద, కరవు ప్రాంతాలకు పోతారు అన్నది సరికొత్త నానుడి. ప్రస్తుతం లాభం, వ్యాపారం, రాజకీయాలను, వాటికోసం పని చేసే వారిని విడదీసి చూడలేని స్ధితి. తొలి పార్లమెంట్‌లో లక్షాధికారులైన ఎంపీలు ఎందరున్నారు అని వెతకటానికి ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు కోట్లకు పడగలెత్తని, వ్యాపారులు కాని ఎంపీలు ఎందరున్నారు అని తెలుసుకొనేందుకు బూతద్దాలతో చూడాల్సి వస్తోంది.
రాజకీయం-వ్యాపారానికి వున్న సంబంధాలను మన దేశంలో రెండుగా చూడాల్సి వుంది. ఇది పరాయి దేశాల వలసలుగా, అక్రమణలుగా మారిన అన్ని దేశాలలో పూసల్లో దారంలా కనిపిస్తుందని చెప్పవచ్చు. స్వాతంత్య్రానికి ముందు పరాయి పాలకులను పారద్రోలేందుకు సమాజంలోని పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో సహా అన్ని తరగతుల వారూ పాల్గొన్నారు. ఏ తరగతి అజెండా వారికి వున్నప్పటికీ వాటిని ముందుకు తీసుకుపోవాలంటే పరాయిపాలకులు ఆటంకంగా వున్నారన్న ఏకైక కారణమే వారిని ఒక వేదిక మీదకు తెచ్చింది. అందువల్లనే జాతీయ వాదంలో రెండు పార్శ్వాలున్నాయి. ఒకటి దోపిడీకి గురయ్యే కష్టజీవులు తాము దోపిడీ నుంచి విముక్తి కావాలని కోరుకున్నారు. రెండవది స్వదేశీ పారిశ్రామిక, వాణిజ్య శక్తులు బలపడి తాము స్వంతంగా వ్యవహరించగలం అనుకున్న తరువాత విదేశీ కంపెనీలతో పోటీకి వ్యతిరేకంగా జాతీయవాదాన్ని ముందుకు తేవటం. స్వాతంత్య్రం రాకముందు మన దేశంలో బ్రిటీష్‌ కంపెనీల ప్రయోజనాలకు పెద్దపీట వేసే విధంగా అక్కడి పెట్టుబడిదారులు విధానాలను నిర్దేశించారు. తరువాత మన దేశంలో పెట్టుబడిదారులు, ఫ్యూడల్‌ వ్యవస్ధ ఇంకా బలంగా వున్న వున్నందున పెట్టుబడిదారులు, భూస్వామ్య తరగతులను కలుపుకొని తమ అజెండాను అమలు జరిపారు. తమ పెట్టుబడులు, వ్యాపారాలకు పోటీ రాకుండా చూసేందుకు అప్పటికే ఒక స్ధాయికి చేరిన వారు లైసన్స్‌ పద్దతిని ముందుకు తీసుకు వచ్చారు. భూస్వాముల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఆ వ్యవస్ధను కాపాడేందుకు చేయాల్సిందంతా చేశారు. భూ సంస్కరణల చట్టాలను ఆలశ్యం చేయటం, చేసిన వాటిని నీరుగార్చటం దానిలో భాగమే.
స్వాతంత్య్రం తరువాత ఎవరైనా పరిశ్రమలు, వ్యాపారాలను ఏర్పాటు చేయాలంటే లైసన్సులు అవసరం. వాటికోసం పారిశ్రామిక, వ్యాపారవేత్తలు అధికారంలో వున్న రాజకీయ నేతలను ఆశ్రయించటంతో అవినీతి ప్రారంభమైంది. తమ పనులు జరిపించుకొనేందుకు కొందరు రాజకీయనేతలను లాబీయిస్టులుగా మార్చుకోవటం లేదా అలాంటి వారిని రాజకీయాల్లోకి ప్రోత్సహించి నిధులిచ్చి గెలిపించుకోవటం చేసే వారు. 1991కి ముందే వ్యాపారులు రాజకీయ ప్రవేశం చేయటం, రాజకీయాల్లో వున్న వారు వ్యాపారాల్లో ప్రవేశించటం ప్రారంభమైనా ఆ తరువాత అది మరింత వేగం పుంజుకుంది. నూతన ఆర్ధిక విధానాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్ధలను తెగనమ్మటం, పారిశ్రామిక, వాణిజ్య, సేవా రంగాల నుంచి ప్రభుత్వం వైదొలగాలనే విధానపర నిర్ణయాల తరువాత అది జనానికి మరింత స్పష్టంగా కనిపించింది. దాన్నే నీకది, నాకిది అని అందరూ కుమ్మక్కై పంచుకోవటంగా చూస్తున్నాము. ఇది వాటంగా వున్న తరువాత పార్టీలు లేవు, సిద్ధాంతాలు లేవు. బెల్లం ఎక్కడ వుంటే అక్కడకు చీమలు చేరినట్లు ఎక్కడ అధికారం వుంటే అక్కడకు చేరటం, దానికి కార్యకర్తల అభీష్టమనో, నియోజకవర్గ అభివృద్ధి అనో చెప్పే వారు. ఇప్పుడు వాటి జాబితాలోకి దేశ ప్రయోజనాల కోసం అని కొత్త పదాన్ని చేర్చారు. కమ్యూనిస్టు పార్టీలు తప్ప మిగిలిన పార్టీలు వేటికీ అంటూ సొంటూ, నీతి, అవినీతి తేడా లేదు.

Image result for crony capitalism in india
సంపదలను పోగేసుకొనేందుకు ఎంతకైనా తెగించే వ్యాపారులు, రాజకీయవేత్తలు, వారికి సహకరించే వున్నత అధికారగణం ఒక దగ్గర చేరినపుడు నీకిది, నాకది, వారికది అని పంచుకుంటారు. దీన్నే క్రోనీ కాపిటలిజం లేదా ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అంటున్నాము. మీడియా రంగంలో సైతం ఏ పత్రిక, ఏ ఛానల్‌ చరిత్ర చూసినా ఏమున్నది కొత్తదనం, సమస్తం వ్యాపారమయం అన్నట్లుగా ఇలాంటి వ్యాపార-రాజకీయవేత్తలు వాటి వెనుక వుంటారు. వార్తలను అందించి జనానికి సేవ చేద్దామని కాదు, అది కూడా తమ రాజకీయ లాభం కోసమే అన్నది తెలిసిందే. గత ప్రభుత్వం తమ ఆశ్రితులకు బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్ధల నుంచి అపరిమితంగా రుణాలిప్పించి అక్రమాలకు పాల్పడిందన్నది ప్రస్తుత పాలకుల తీవ్ర ఆరోపణ. చిత్రం ఏమిటంటే అలాంటి అక్రమార్కుల మీద ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి అన్నది అంతగా ఎవరూ అడగటం లేదు. గతంలో వారు ఇచ్చిన రుణాలలో లక్షల కోట్లను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తున్నది.

ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం దేశం మీద ఎలా ప్రభావం చూపుతుందో రిజర్వుబ్యాంకు గవర్నర్‌గా పని చేస్తున్న సమయంలో 2014 ఆగస్టు 11న లలిత్‌ దోషి స్మారక వుపన్యాసంలో రఘురామ్‌ రాజన్‌ హెచ్చరించారు. దీని వుచ్చునుంచి బయట పడాలంటే పౌర సేవలను పటిష్టం చేయటం ఒక మార్గం అన్నారు. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం పారదర్శకత, పోటీని దెబ్బతీసి చివరకు ఆర్ధిక పురోగతిని మందగింప చేస్తుందని అన్నారు.(అంటే లైసన్స్‌ రాజ్యాన్ని మరోరూపంలో ముందుకు తెస్తుంది) ” వుపాధి, పౌర సేవలను పొందేందుకు పేదలు, నోరు లేని వారికి రాజకీయ నేతల అవసరం వుంది. కుటిల రాజకీయవేత్తకు అందుకు గాను నిధులు, ఇతర అవసరాల కోసం వాణిజ్యవేత్తల ప్రాపకం అవసరం. అవినీతి పరులైన వాణిజ్యవేత్తలు పౌర వనరులు, కాంట్రాక్టులను చౌకగా పొందాలంటే కుటిల రాజకీయవేత్తల మద్దతు అవసరం. రాజకీయవేత్తలకు పేదలు, నోరులేని వారి ఓట్లు అవసరం. ఇలా ప్రతి ఒక్కరూ ఇతరుల మీద ఆధారపడే బంధంతో ఒక వలయంలో వున్నారు. అది యథాతధ స్ధితిని పటిష్టపరుస్తుంది….ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం రాజ్యాధికారం గల కొందరు ధనిక పెద్దలను సృష్టిస్తుంది, అది అభివృద్ధిని మందగింప చేస్తుంది” అన్నారు.

Image result for crony capitalism in india

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇతర అవసరాలకు మళ్లించి తిరిగి చెల్లించగల శక్తి వుండి కూడా ఎగవేసే వారిని బుద్ది పూర్వక ఎగవేతదారులు అంటున్నాము. 2015 మార్చి నెల నుంచి 2019 మార్చినెలతో ముగిసిన ఆర్ధిక సంవత్సరం వరకు బుద్ధి పూర్వకంగా రుణాలు ఎగవేసిన వారి సంఖ్య 5,349 నుంచి 8,582కు పెరిగిందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జూన్‌ 25న లోక్‌సభకు రాతపూర్వక సమాధానంలో చెప్పారు. అంటే ఐదేండ్లలో 60శాతం పెరిగారు. వీరిలో 6,251కేసులలో తనఖా వున్న ఆస్ధుల మీద చర్యలు ప్రారంభించారు, 8,121కేసులలో రుణ వసూలు దావాలు వేశారు, 2,915 కేసులలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎగవేసిన వారి నుంచి 7,600 కోట్ల రూపాయలను వసూలు చేశారు. బ్యాంకులకు ఇలాంటి బాపతు చెల్లించాల్సిన సొమ్మునే నిరర్ధక ఆస్తులంటున్నాము. ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఆ మొత్తం 8.06లక్షల కోట్ల రూపాయలు. 2016-19 ఆర్ధిక సంవత్సరాల మధ్య బ్యాంకులు వసూలు చేసిన సొమ్ము 3.59లక్షల కోట్లు పోను ఇంకా రావాల్సింది పైన పేర్కొన్న మొత్తం. యాభై కోట్ల రూపాయలు, అంతకు మించి రుణాలు తీసుకొని ఎగవేసిన వారి ఫొటోలను బ్యాంకుల్లో ప్రదర్శించాలని(పోలీస్‌ స్టేషన్లలో పాత నేరస్దులు, కేడీ గాండ్ల మాదిరి) ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులను కోరింది. వారి కోసం గాలింపునకు నోటీసులు జారీ చేయాలని కూడా కోరింది. వారి పాస్‌పోర్టుల సర్టిఫైడ్‌ కాపీలను సంపాదించాలని సూచించింది.

Image result for crony capitalism in india

సాధారణ పెట్టుబడిదారీ విధానంలో పరిశ్రమలు, వ్యాపారం వర్ధిల్లాలి అంటే నష్టభయం వుంటుంది. కానీ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంలో లాభాలను ఎలా సంపాదించాలో వ్యాపారులు-అధికారంలో వున్న రాజకీయవేత్తలు, వారికి సహకరించే వున్నతాధికారులు కుమ్మక్కై ముందుగానే నిర్ధారించుకొని అందుకు అనుగుణ్యం పావులు కదుపుతారు. దీనిలో మరొకరితో పోటీ వుండదు. కావాల్సిన అనుమతులు, ప్రభుత్వ నిధులు, పన్నుల రాయితీలు ఇతర అన్ని రకాల సౌకర్యాలను అధికారంలో వున్న పెద్దలు సమకూర్చుతారు. దానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఇలాంటి వారు మన కళ్ల ముందే అనూహ్యంగా అపార సంపదలను పోగేసుకుంటారు. దీనికి అనువైన అవకాశాలను నయావుదారవాద విధానాలు కల్పించాయి. తెలంగాణాలో ప్రాజక్టుల రీ డిజైనింగ్‌ పేరుతో చేసిన పనుల మీద తలెత్తిన అవినీతి ఆరోపణలు, ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు పనుల అప్పగింత, టెండర్ల విధానం. రెండు చోట్లా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల వివాదాలు వీటి పర్యవసానమే.
మిలిటరీ, సరిహద్దులు, కరెన్సీ, పోలీసుల వంటి విభాగాలు మినహా మిగిలిన అన్ని రంగాల నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలి, ప్రయివేటు రంగానికి, విదేశీ కంపెనీలకు గేట్లు బార్లా తెరవాలని సంస్కరణల పేరుతో ఎప్పుడైతే నిర్ణయించారో అప్పటి నుంచి ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం మూడు పూవులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. ఏ దోపిడీ విధానమైనా దానికి అవినీతి తోడుగా వుంటుంది. ఈ కారణంగానే దేశంలో నేడు ఏ పెద్ద కంపెనీ ఏ అక్రమానికి పాల్పడింది, దాని వెనుక ఏ రాజకీయనేతలున్నారో అనే వార్తలు వెలువడుతున్నాయి. అధికార అండచూసుకొని బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్ధల నుంచి ఇచ్చిన మేరకు అప్పులు, ప్రభుత్వం నుంచి రాయితీలు దండుకో, నిధులను దేశం దాటించు, వాటినే విదేశీ పెట్టుబడుల రూపంలో తిరిగి తీసుకురా లేదా ఇతర బినామీ కంపెనీలకు మళ్లించు, సంస్ధలను దివాలా తీయించు. కేసులు పెడతారా విదేశాలకు పారిపో లేదా దొరికిపోతావా పోయేదేముంది పైసాకు కొరగాని పరువు తప్ప కూడబెట్టుకున్న ఆస్ధులేవీ పోగొట్టుకున్నవారెవరూ లేరుగా ! ఇదే కదా పై నుంచి కింది వరకు నేడు దేశంలో వున్న ఆలోచనా సరళి.
Image result for crony capitalism in india
మన దేశంలో నయా వుదారవాదం 1980దశకంలోనే ప్రారంభమైనా 1991లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం తరువాత సంస్కరణల పేరుతో గత విధానాలకు తిలోదకాలివ్వటం పెద్ద ఎత్తున ప్రారంభమైంది. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయట పడటానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకుల నుంచి రుణాలు, నిధులు ఎప్పుడైతే తీసుకున్నామో వాటికి విధించిన షరతుల్లో భాగంగా విదేశీ వస్తువులపై ఆంక్షలను ఎత్తివేసి ఆ కంపెనీలకు మార్కెట్‌ను తెరిచే, ప్రయివేటు రంగానికి అన్ని బాధ్యతలు, అవకాశాలను ఇచ్చే నయా వుదారవాద విధానాలు ప్రారంభమయ్యాయి. వీటిని కాంగ్రెస్‌ ప్రారంభించినా తరువాత అధికారానికి వచ్చిన బిజెపి నాయకత్వం కూడా పూర్తిగా, మరింత ఎక్కువగా అమలు జరిపింది, జరుపుతోంది. అంతకు ముందు వివిధ కారణాలతో అప్పులపాలైన రైతులు కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడినా, 1991లో నూతన విధానాలు అమలులోకి వచ్చిన తరువాత వ్యవసాయ రంగంలో సంక్షోభం తలెత్తి రోజూ ఏదో ఒక మూలన రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కాకమ్మ కథలు కాదు – సుదర్శన చక్రాలు, సమ్మోహనాస్త్రాలకు సమయమిదే !

21 Saturday Sep 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, Literature., NATIONAL NEWS, Opinion, Others, STATES NEWS, Telangana, Uncategorized

≈ Leave a comment

Tags

BJP on Uranium, cock and bull stories, puranic weapons, saffron talibans, TRS government, Uranium

Image result for puranic weapons

ఎం కోటేశ్వరరావు

కుక్క పిల్లా, అగ్గిపుల్లా, సబ్బు బిళ్లా కాదేదీ కవితకనర్హం అన్నాడు మహా కవి శ్రీశ్రీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో , దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ప్రతిదానినీ రాజకీయం చేస్తున్నారు, రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. అసలు సిసలు దేశభక్తులం మేమే అని చెప్పుకొనే వారి గురించి ఇక చెప్పనవసరం లేదు. మహాభారతంలో ఒక కధ వుంది. ద్రోణాచార్యుడు తన శిష్యుల కేంద్రీకరణ సరిగా వుందో లేదో పరీక్షించేందుకు ఒక రోజు పరీక్ష పెట్టాడు. ముందు కుమారుడు అశ్వధ్దామను పిలిచి చెట్టుమీద ఒక పక్షి వుంది,నీకేమి కనిపిస్తోంది అని అడగాడు. నాకు చెట్టు, దాని మీద పిట్ట, మీ పాదాలు కనిపిస్తున్నాయి అన్నాడు అశ్వధ్దామ. ఓకే, నీ బాణం కింద పెట్టు అని దుర్యోధనుడిని పిలిచి అదే ప్రశ్న అడిగాడు. గురువు గారూ నాకు చెట్టుమీద కొమ్మలు, వాటి మీద కూర్చున్న పిట్ట కనిపిస్తోంది, కొట్టమంటరా అన్నాడు, వద్దు వద్దు నీ ఆయుధాన్ని కింద పెట్టు అన్నారు. తరువాత వంతు అర్జునుడిది. నాకు పిట్ట తప్ప మరేమీ కనిపించటం లేదు అన్నాడు, అంతేనా అన్నాడు ద్రోణాచార్య. అంతే సర్‌ అన్నాడు అర్జునుడు. బిజెపి ఒక కంటికి అధికారమనే పిట్టమాత్రమే కనిపిస్తోంది. రెండో కంటికి యురేనియం వంటి సమస్యల మీద గుడ్డి సమర్దనకు అనేకం కనిపిస్తున్నాయి.

యురేనియం తవ్వకాలు, సర్వే గురించి సంప్రదాయ, సామాజిక మాధ్యమం రెండింటిలోనూ ఇప్పుడు చర్చ జరుగుతోంది. అనేక మంది సినీ ప్రముఖులు ముందుకు వచ్చి వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అవసరమైతే ఆందోళనలో పాల్గొంటామని ప్రకటిస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు పిల్లి మొగ్గలు వేస్తున్నాయి.. ముందేమి మాట్లాడుతున్నాయో వెనకేమి అంటున్నాయో చూడటం లేదు. తవ్వకాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రకటించారు మరోవైపున శాసన మండలిలో మాట్లాడిన కెటిఆర్‌ యురేనియం అవసరాన్ని గురించి నొక్కి చెప్పారు. బిజెపి నేతలు తమ వైఖరి ఏమిటో చెప్పకుండా గతంలో సర్వే, తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, మేము (కేంద్రం) తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు, కనుగొనేందుకు మాత్రమే, అయినా అది పనికి వస్తుందో లేదో తెలియదు అంటూ ఏవేవో చెబుతూ తాము తవ్వకాలకు అనుకూలమో కాదో చెప్పటం లేదు. యురేనియం అవసరం అంటూ పరోక్షంగా సర్వే, తవ్వకాలను సమర్ధిస్తున్నది.ఈ చర్చలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి కూడా భాగస్వామి అయ్యారు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు ఆయన యురేనియం కంటే బొగ్గుతవ్వకమే ఎక్కువ ప్రమాదకరం అని చెప్పారు. ప్రమాదకరమైన వాటిన్నింటినీ ఆపివేయాలి, ఎవరు తవ్వమన్నారు. మరోవైపున సంఘపరివార్‌ శ్రేణులు సామాజిక మాధ్యమంలో యురేనియం తవ్వకం ఒక దేశభక్తి, దేశరక్షణ చర్యగా, పనిలో పనిగా కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి. సామాజిక మాధ్యమంలో వారు వ్యాపింప చేస్తున్న ఒక సమాచారం దిగువ విధంగా వుంది. వూరూ పేరు లేకుండా ప్రచారం చేయటం అలాంటి వారి పద్దతి గనుక దానిలో వున్న భాష, భావాన్ని బట్టి అది వారి ప్రచారమే అని చెప్పాల్సి వస్తోంది.

Image result for sammohana astra

” యూరేనియం..ఇప్పుడు ఇదొక తర్కం..పర్యావరణం ఎంత ముఖ్యమో..దేశానికీ అణువిద్యుత్తు, అణ్వాయుధాల సమృద్ధి, అణ్వస్త్ర ప్రయోగశాల కార్యాచరణ కూడ అంతే ముఖ్యమన్న విషయ విజ్ఞానం మనం అర్ధంచేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది..ప్రస్తుతం కేవలం రీసెర్చ్‌ స్థాయిలో ఉన్న ఈ అంశం పై ఇంతగా ఆందోళన అనవసరం.జంతు జీవాలు మృగ్యం అయిపోతై, పురాతన కట్టడాలు ధ్వంసం అయిపోతై, అక్కడ నివాసితుల జీవితాలు నాశనం అయిపోతై, వింతరోగాలు ప్రబలిపోతాయి అంటూ కమ్మీస్‌ చేస్తున్న ప్రచారం కేవలం చైనా ఎజండా మాత్రమే.నిజానికి అది కమ్మీల విషప్రచారం మాత్రమే. 30000 ఎకరాల విస్తీర్ణంలో వున్న నల్లమల అడవుల్లో కేవలం 1000 ఎకరాల భూభాగంలో మాత్రమే ఈ రీసెర్చ్‌ జరగబోతోంది.రీసెర్చ్‌ ముగిసిన తర్వాత యురేనియం అందుబాటు స్థాయిని అధ్యయనం చేశాక యురేనియం ప్రాసెసింగ్‌ జరగాలి.అప్పుడు రేడియేషన్‌ విడుదల అవుతుంది.విడుదలయ్యే రేడియేషన్‌ వలన పై చెప్పబడిన ఏ ఒక్క విభాగము భారీ విపత్తుకు లోను కాకుండా తగు చర్యలు పటిష్టంగా తీసుకుంటుంది. కేంద్రంలో ఉన్నది ఆషామాషీ ప్రభుత్వమో.అభాధ్యతతో కూడిన ఆలోచనలతో సాగే యంత్రాంగమో, కాసుల కోసం క్షుద్ర ప్రయోగాలు ఆవిష్కరించే నీచ సంస్కృతికి నిలయమో కాదు.అనునిత్యం దేశహితమే తన మతంగా,130 కోట్ల భారతీయులే తన కుటుంబం అంటూ సాగుతున్న రాజర్షి నమో సారథ్యంలో దూసుకెళ్తున్న భారత్‌.. మేము విశ్వగురు భారత్‌ సంతతి అని భావితరాలు సగర్వంగా చాటుకునే స్థాయిని ఆవిష్కరిస్తున్న ప్రయాణం..అది

యురేనియం ఐనా,త్రిపుల్‌ తలాక్‌ ఐనా, ఆర్టికల్‌ 370, జి ఎస్‌ టి,నోట్ల రద్దైనా, జమిలి ఎన్నికలయినా, మరో అంశమైనా దేశంకోసం,దేశప్రతిష్ఠ కోసం, భావి భారతీయుల ఉజ్వల భవిష్యత్తుకోసం,ప్రపంచపటంలో భారతావనిని అగ్రగామిగా నిలపడంకోసం చేసే ప్రయత్నాలే.చైనాలో దోమ కుడితే ఇక్కడ గోక్కునే కమ్మీలు.అణ్వస్త్ర విభాగంలో భారత్‌ ఎక్కడ తమను మించిపోతుందో అనే చైనా భయాందోళనల మధ్య పుట్టుకొచ్చిన కుట్రలో భాగమే ఈ యాంటి యూరేనియం స్లొగన్స్‌, మావోయిస్టుల గంజాయి సాగుకు ఆటంకం, వాళ్ళ ఆయుధసేకరణకు అవసరమయ్యే ఆదాయవనరులకు గండి పడతాయి.ఇలాంటి అనేక అంశాలు ఈ కమ్మీలను పట్టిపీడిస్తున్నాయి.ఈ కమ్మీల ట్రాప్లో పడకుండా ప్రజలు అప్రమత్తంగా వుండాలి.నాణానికి రెండువైపులా అధ్యయనం చేయాలి.పర్యావరణాన్ని కాపాడుకుంటూ,అవసరమైన యురేనియం సమృద్ధిని పెంచుకుంటూ చైనా, పాకిస్తాన్‌ వంటి శత్రుదేశాల ఆగడాలను తరిమికొట్టే అణ్వస్త్ర ఆయుధ సంపత్తిని గణనీయంగా పెంచుకుని దేేశరక్షణ ప్రాముఖ్యతను గుర్తించి గౌరవించవలసిన బాధ్యత మనదే అనే ఆలోచన ప్రతి భారతీయ గుండెల్లో మారుమ్రోగాలి.జై భారత్‌. ”

ఇది కాషాయ తాలిబాన్ల వాదన తప్ప మరొకటి కాదు. మాకు సంబంధం లేదు అని వారు స్పష్టం చేస్తే అప్పుడు ఆలోచిద్దాం. అణు యుద్దం జరిగితే విజయం సంగతి తరువాత అసలు మానవాళిలో మిగిలేది ఎంత మంది, ఒకరూ అరా మిగిలినా వారు చేసేది ఏమిటి అన్నది సమస్య. అణుబాంబులు హిందువులను, ఆవులను వదలి, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర జంతుజాలాల మీదనే ప్రభావం చూపుతాయి అనుకుంటున్నట్లు కనిపిస్తోంది ! హిరోషిమా, నాగసాకి నగరాల్లో జరిగిన విధ్వంసాన్ని చూస్తే కాషాయ దళానికి తప్ప ప్రపంచానికి అంతటికీ వాటి ముప్పు ఏమిటో అర్ధం అయింది. అందుకే ఇప్పటికే ఒకసారి ప్రయోగించిన అమెరికా తప్ప తమంతట తాముగా ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోమని మనతో సహా ప్రతి దేశం ప్రతిన పూనింది. ఈ విషయంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రేరణ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ . అతగాడి ప్రేలాపనలను అవకాశంగా మార్చుకొని తమలోని యుద్దోన్మాదాన్ని బయట పెట్టుకొంటున్నారు. ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోమనే దేశవైఖరిని తాము పునరాలోచించుకోవాల్సి వుంటుందని మన రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ చెప్పటాన్ని ఏమనాలి? ఆయనకు ఇమ్రాన్‌ఖాన్‌కు తేడా ఏముంది?

అణువిద్యుత్‌ కేంద్రం కలిగిన ప్రతి దేశమూ అణ్వాయుధాలను తయారు చేసి పరిక్షించకపోయినా ఏ క్షణంలో అయినా వాటిని తయారు చేయగలిగిన పరిజ్ఞానాన్ని సమకూర్చుకున్నాయనేది బహిరంగ రహస్యం. ఇక కాషాయ దళాల వున్మాదం గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. మొదటి ప్రపంచ యుద్దం తరువాత జర్మనీకి ఏ కమ్యూనిస్టు లేదా పెట్టుబడిదారీ దేశం నుంచీ ముప్పు లేకపోయినా దేశాన్ని సమున్నతంగా నిలుపుతానంటూ జాతీయోన్మాదాన్ని, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన హిట్లర్‌ గురించి అంతకంటే చెప్పాల్సిన పనిలేదు. వాడి వారసులే కాషాయ తాలిబాన్లు. ప్రతి దేశమూ తన రక్షణకు చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ తప్పు పట్టరు, అందుకు అవసరమైన ఆయుధాలను కలిగి వుండటమూ అభ్యంతరం కాదు. అయితే అణ్వాయుధాలు ఏ దేశాన్నీ రక్షించలేవు. అందుకోసం జనాన్ని, పర్యావరణాన్ని ఫణంగా పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. విద్యుత్‌ కోసం అనే వాదనలో కూడా అర్ధం లేదు. అనేక ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. చెర్నోబిల్‌, పుకుషిమా ప్రమాదాలు జరిగిన తరువాత ఇంకా అణువిద్యుత్‌ గురించి మాట్లాడేవారిని ఏమనాలో అర్దం కాదు.

ఇక్కడ కాషాయ దళాలను జనం ఒక ప్రశ్న అడగాలి. మీరు చెబుతున్నట్లు కాసేపు యురేనియం తవ్వకాల వ్యతిరేక నినాదం చైనా కోసమే కమ్యూనిస్టులు చేస్తున్నారనే అనుకుందాం. మీరెందుకు విదేశాలను అనుకరించి యురేనియంతో ఆయుధాలు తయారు చేయాలని ఆరాటపడుతున్నారు. అసలు సిసలు అభినవ స్వదేశీ దేశభక్తులు కదా ! వేదాల్లోనే అన్నీ వున్నాయి, భారతీయ పురాతన విజ్ఞానం అంతా సంస్కృత గ్రంధాల్లో వుంది అని ప్రచారం చేస్తున్నది మీరు. ఈ గోబెల్స్‌ ప్రచారం ఎంతగా పెరిగిపోయిందంటే దీన్ని ప్రశ్నించేవారి పరిస్ధితి ఇప్పుడు నూరు కాకుల్లో ఒక్క కోకిల మాదిరి తయారైంది. అమెరికా,ఆస్ట్రేలియా, అనేక ఐరోపా దేశాలకు వెళ్లి వుద్యోగాలు, విదేశీ సంస్ధల్లో పరిశోధనలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నవారు కూడా ఎవరేమనుకుంటే నాకేటి సిగ్గు అన్నట్లుగా వేదాల్లో అన్నీ వున్నాయష అనే అగ్రహారీకుల కబుర్ల్లే వల్లిస్తున్నారు.

విష్ణుమూర్తి సుదర్శన చక్రం అనే అస్త్రం నియంత్రిత క్షిపణి మాదిరి వ్యవహరించి లక్ష్యంగా చేసుకున్న శత్రువులను మాత్రమే హతమార్చి తిరిగి వస్తుందని కదా చెబుతారు. అంటే అది అణ్వాయుధాల కంటే అధునాతనం, సురక్షితమైనది. అమాయకుల జోలికిపోదు, సంస్కృత పండితులు, ఆర్‌ఎస్‌ఎస్‌ స్వదేశీ జాగరణ మంచ్‌ వారు, ఇతరులు కలసి మేకిన్‌ ఇండియా కింద స్వదేశీ సుదర్శన చక్రాలను తయారు చేయవచ్చు కదా ! విదేశీ అణ్వాయుధాలెందుకు, వాటికోసం యురేనియమో మరొకటో తవ్వినపుడు ప్రమాదకరమైన కిరణాలను విడుదల చేయటం ఎందుకు ? వాటితో క్యాన్సర్‌, ఇతర భయంకర జబ్బులు రావటం ఎందుకు? అన్నీ కాలుష్యం కావాల్సిన పనేముంది? సుదర్శన అస్త్రం, ఇతర మరికొన్ని పురాణ అస్త్రాలు హింసాత్మకమైనవి మనది శాంతిభూమి కదా ఎవరైనా అనవచ్చు. పురాణాలలో సమ్మోహనాస్త్రాలు కూడా వున్నాయి. వాటిని తయారు చేసి మనకు నిత్యం తలనొప్పిగా వున్న పాక్‌ పాలకుల మీద, వారు పంపే తీవ్రవాదుల మీద దేశంలో వున్న వుగ్రవాద మావోయిస్టులు, ఇతర తీవ్రవాదుల మీద ప్రయోగిస్తే మంచివారిగా మారిపోతారు కదా ! అప్పుడు వారికి డబ్బు అందకుండా చూసేందుకు మరోసారి నోట్ల రద్దు అనే పిచ్చిపని, సర్జికల్‌ స్ట్రైక్స్‌ అవసరం వుండదు, వాటితో శతృవులను హతమార్చామని చెప్పుకోపని లేదు, ప్రతిపక్షాలకు రుజువులు చూపమని అడిగే అవకాశం వుండదు. అన్నింటికీ మించి మన శాస్త్ర పరిశోధనా కేంద్రాలన్నింటినీ మూసివేసి లేదా వాటిలో పని చేస్తున్న శాస్త్రవేత్తలను కట్టగట్టి ఇంటికి పంపి వేదాలు, సంస్కృత పండితులు, బవిరి గడ్డాల యోగులు, యోగినులతో నింపి వేస్తే ఎంతో ఖర్చు కలసి వస్తుంది. కారుచౌకగా కావాల్సిన అస్త్రాలను తయారు చేయించవచ్చు. వందల కోట్లు పెట్టి కిరస్తానీ దేశాల నుంచి రాఫెల్‌ విమానాలు, ఇతర ఆయుధాలను కొనుగోలు చేయాల్సిన అవసరం వుండదు. అందుకు అవసరమైన విదేశీ డాలర్లతో అసలే పని వుండదు. ఇది కలి యుగం గనుక అస్త్రాల తయారీ కాస్త ఆలశ్యం అవుతుంది అనుకుంటే ప్రజ్ఞా సింగ్‌ వంటి సాధ్వులను రంగంలోకి దించి శత్రువుల మీద శాపాలు పెట్టించండి. వారి నోటి దూల తీరి శత్రువుల పీడ విరగడ అవుతుంది. వందల కోట్లు ఖర్చు చేసి ఇస్రో ప్రయోగాలు చేయటం ఎందుకు, వేదగణితంతో లెక్కలు, డిజైన్లు వేసి వుంటే ఈ పాటికి చంద్రుడి మీన వారు రియెలెస్టేట్‌ ప్రారంభించి ఎంతో లబ్ది చేకూర్చి పెట్టి వుండేవారు. చంద్రయాన్‌ రెండవ ప్రయోగం విఫలమైందని మన ప్రధాని శాస్త్రవేత్తల మీద విసుక్కున్నారని వార్తలు వచ్చి వుండేవి కాదు, దాన్ని దాచుకునేందుకు తరువాత వారిని అక్కున జేర్చుకొని ఓదార్పుల దృశ్యాలు చూసే ఖర్మ మనకు తప్పేది.

Image result for puranic weapons

కొన్ని పురాణ అస్త్రాలు రక్షణ, శత్రు సంహారానికి సంబంధించినవి. వాటిలో సమ్మోహనాస్త్రం అయితే బహుళ ప్రయోజనకారి. నరేంద్రమోడీ గత ఐదు సంవత్సరాలలో ఎన్ని విదేశాలు తిరిగినా, ఎంత మంది విదేశీ నేతలను కౌగిలించుకున్నా మన దేశానికి పెద్దగా పెట్టుబడులు వచ్చింది లేదు. పరిశ్రమలు, వాణిజ్యాలు పెరిగి వుంటే నిరుద్యోగం నాలుగున్నర దశాబ్దాల నాటి రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులను స్దాపించేది కాదు. మన గడ్డమీద నుంచే సమ్మోహనాస్త్రాలను ప్రయోగించినా, విదేశాలకు వెళ్లినపుడు కొన్నింటిని వెంటబెట్టుకు వెళ్లి ప్రయోగించినా సినిమాల్లో మాదిరి గింగిరాలు తిరుక్కుంటూ అన్ని దేశాల వారూ ఈ పాటికి ఇక్కడ పడి వుండేవారు. ఇంకచాలు బాబోయ్‌ అనేవరకు మనకు కావాల్సినవన్నీ తెచ్చి పడవేశేవారు. అందువలన ఇప్పటికీ మించిపోయింది లేదు. పెద్ద నోట్లను, ఆర్టికల్‌ 370 రద్దు చేసినా వుగ్రవాద సమస్య పోలేదు, మొత్తం కాశ్మీర్‌లో ఆగస్టు ఐదు నుంచి విధించిన కర్ఫ్యూను ఇంతవరకు తొలగించలేదు. దేశం ఆర్దిక మాంద్యం నుంచి గట్టెక్కాలంటే నిర్మలమ్మ గారు ఎన్ని వుద్దీపన పధకాలు ప్రకటించినా ప్రయోజనం వుందనే ఆశ లేదు. కనుక రక్షణ కోసం, సుదర్శన చక్రాలు, పెట్టుబడులు, ఎగుమతుల కోసం సమ్మోహన అస్త్రాలు తయారు చేసేందుకు పూనుకొని కాషాయ దళాలు తమ దేశభక్తిని నిరూపించుకోవాలి. ప్రపంచానికి భారత సత్తా చాటాలి. కాకమ్మ కబుర్లు కాదు కార్యాచరణ ముఖ్యం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

నీ ‘దేశ భక్తి, జాతీయవాదం ‘ భారం భరించలేకున్నాం గురూ !

25 Sunday Aug 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, BJP patriotism and nationalism, Naredra Modi, nationalism, patriotism, Rupee Fall

Image result for bjp patriotism and nationalism cartoons

మిత్రమా

వుద్యోగ రీత్యా నువ్వూ నేనూ చాలా దూరంగా వున్నాం. ఈ మధ్య కాలంలో ప్రత్యక్షంగా కలిసే సందర్భం రాలేదు. అయితే నీ గురించి స్నేహితుల ద్వారా వింటూనే వున్నాను. నీ పేరుకు ముందు చాయ్‌ వాలా, చౌకీదార్‌ అని పెట్టుకున్నావని నవ్వులాటల మధ్య మన స్నేహితులు చెబుతుంటే తత్వంబాగా తలకెక్కింది గామోసు అనుకున్నాను. బహుశా ఇప్పుడు నువ్వు 370 అనో కాశ్మీరీ కన్య అనో పేరుకు ముందు తగిలించుకొని కిక్‌లో వుండి వుంటావు. ఈ మధ్య నువ్వు విదేశీ కిన్లే నీరు బదులు పక్కా దేశీ గోమూత్రం తాగుతూ, చివరికి పతంజలి సబ్బులను కూడా వాడటం మాని ఆవు పేడ ఒంటికి పూసుకుంటూ స్నానం చేస్తున్నావని, ఆఫీసులోనూ బయటా వాట్సాప్‌ విశ్వవిద్యాలయంలో సంస్కృత గ్రంధాల్లో దాగున్న టెక్నాలజీని వెలికి తీసేందుకు మరొక పీజీ చేస్తున్నావని, విదేశీ వాట్సాప్‌ తప్ప ఇతర వాటిని పట్టించుకోవటం లేదని, మిస్స్‌డ్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎఎస్‌లను చూడటం మానేశావని, మన వాళ్లు చెప్పారు. అందుకే ఈ వాట్సాప్‌ మెసేజ్‌ పెడుతున్నా.

Image result for bjp patriotism and nationalism cartoons

ఆ మధ్యమన ప్రధాని నరేంద్రమోడీ గారూ, వారి పార్టీ నేతలూ కాంగ్రెస్‌ 50 ఏండ్లలో సాధించలేని వాటిని మేము ఐదేండ్లలో సాధించాం అని వూరూ వాడా ప్రచారం చెశారు. ఇప్పుడు 70 ఏండ్లుగా చేయలేని దానిని 70 రోజుల్లో చేశాం అన్నారు. మనం చదువుకొనే రోజుల్లో అమ్మాయిలను ఆకర్షించేందుకు ప్రాసకోసం నువ్వు తెగ తిప్పలు పడి నగుబాట్లు పాలైన సందర్భాలు గుర్తుకు వచ్చాయి. అదేమిటో నీతి ఆయోగ్‌ వుపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ సరిగ్గా ఈ సమయంలోనే 70 సంవత్సరాలలో ఎన్నడూ తలెత్తని అసాధారణ పరిస్ధితి ఏర్పడింది అని వ్యాఖ్యానించారు. ఆ వాక్‌ ప్రభావం లేదా మహత్తు ఏమిటో గానీ నరేంద్రమోడీ అలా అన్నారో లేదో మరోసారి రూపాయి విలువ ఇలా 72రూపాయల అంచుదాకా పడిపోయింది. నరేంద్రమోడీ ఇప్పుడు కొత్తగా ఆకర్షించాల్సిన వారెవరూ లేకపోయినా పాపం ప్రాస కోసం కష్టపడుతున్నట్లుంది.

ఆరు సంవత్సరాల క్రితం అంటే 2013లో రూపాయి విలువ పతనంతో ధరలు పెరుగుతాయని మిగతా వారంతా ఆందోళన పడుతుంటే నువ్వు బిజెపి నేతలు రూపాయి పాపాయి గురించి చేసిన వ్యాఖ్యలను పదే పదే చెప్పి మాకు నవ్వు రాకపోయినా మా బదులు కూడా నవ్వే వాడివి గుర్తుందా ? ‘నేనూ పాలనలోనే వున్నాను(ముఖ్యమంత్రిగా) ఇంత వేగంగా రూపాయి విలువ పడిపోకూడదని నాకు తెలుసు, ఈ విధంగా పతనం కావటానికి కారణం ఏమై వుంటుంది. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి, సమాధానం కావాలని దేశం డిమాండ్‌ చేస్తోంది.(2012)రూపాయి ఈ రోజు ఆసుపత్రిలో వుంది, జీవన పోరాటం చేస్తోంది.(2013) అని మన్మోహన్‌ సింగ్‌ గురించి నరేంద్రమోడీ అన్నారు. సుష్మా స్వరాజ్‌ , అరుణ్‌ జైట్లీ మరణించి ఏ లోకాలకు పోయారో పాపం. ‘ రూపాయి విలువ ఎంత వేగంగా పతనమైందంటే గత రాత్రి టీవీ చూస్తూ భయపడి టీవి కట్టేశాను’ అని సుష్మ అన్నారు. రూపాయి విలువ పతనం భయానకంగా వుంది, ప్రధాని నుంచి స్పందన రావాలని డిమాండ్‌ చేస్తున్నా అన్నారు అరుణ్‌ జైట్లీ. ఇప్పటి కేంద్ర మంత్రి, అప్పటి ప్రతిపక్ష బిజెపి నేత రవిశంకర్‌ ప్రసాద్‌ ‘ యుపిఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినపుడు రూపాయి విలువ(డాలరుతో మారకం) రాహుల్‌ గాంధీ వయసంత( 43 )వుంది, ఇప్పుడు సోనియగాంధీ వయస్సు(67) దగ్గరగా వుంది, త్వరలో మన్మోహన్‌ సింగ్‌ వయస్సు(80)ను తాకుతుంది ‘ అన్న ప్రకటన చదివి అప్పటికే నరేంద్రమోడీ బిజెపి ప్రధాని అభ్యర్ధి అని వచ్చిన వార్తలను దృష్టిలో పెట్టుకొని మా మోడీ వస్తే చూడండి రూపాయి విలువను రాహుల్‌ గాంధీ వయసంత చేస్తా అని గంతులు వేయటం గుర్తుందా ? దాని సంగతేమోగానీ ఇప్పుడు మోడీ గారి వయస్సు(68)ను దాటి నాలుగు అంగలు వేసింది. అది ఎక్కడ ఆగుతుందో తెలియదు. ఇప్పుడు కూడా నువ్వు ఇంకా నవ్వుతూనే వున్నావా ?

Image result for bjp patriotism and nationalism are two cost to bear cartoons

జనానికి మతిమరుపు లేదా మోహంలో వున్నపుడు ఏమి చెప్పినా తలకు ఎక్కించుకోరు, ఎదురు మాట్లాడరు అని డిగ్రీలో మన లెక్చరర్‌ పదే పదే చెప్పేవారు గుర్తుందా ? గతేడాది గరిష్టంగా రికార్డు స్ధాయిలో ఒక రోజు రూపాయి విలువ 74.48కి పడిపోయింది. ఆజ్‌తక్‌ టీవీ యాంకర్‌ రూపాయి విలువ పతనం వార్త సందర్భంగా ‘ కాలం మారింది. నరేంద్రమోడీ ప్రధాని అయ్యారు. ఇప్పుడు రూపాయి విలువ పతనం అవుతోంది. ఆయనేమీ చెప్పటం లేదు’ అన్నారు. అంతేనా ఆర్ధికశాఖ నుంచి విద్యుత్‌ శాఖకు మార్చి నా స్ధాయి తగ్గించారు, నా పరువు తీశారు, నేను వుద్యోగం మానుకుంటా ఆమోదించండి అని ప్రకటించిన సుభాష్‌ చంద్ర గార్గ్‌ గతేడాది ఆర్ధికశాఖ అధికారిగా స్పందిస్తూ ఏమన్నారో తెలుసా ‘ ఈ పతనానికి కారణం లేదు. మీరు ఆందోళన చెందుతున్నారు. ఇతర కరెన్సీల విలువలు కూడా పతనమౌతున్నపుడు రూపాయి 80కి పడిపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ‘ అని సెలవిచ్చారు.

మాకు అర్ధశాస్త్రవేత్తలకు కొదవ లేదు చూడండి అంటూ నువ్వు పదే పదే వుటంకించే బిజెపి నేత సుబ్రమణ్య స్వామి 2018 సెప్టెంబరులో 74రూపాయలకు రూపాయి విలువ పడిపోయినపుడు సరికొత్త కారణాన్ని ఆవిష్కరించారు. నల్ల ధనం దేశం నుంచి బయటకు పోతున్న కారణంగా రూపాయి విలువ పడిపోతున్నదని 2018 సెప్టెంబరు 23న గోవాలో జరిగిన ఒక సభలో చెప్పారు. అమెరికా డాలరుతో మన రూపాయి విలువ పతనానికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు నల్లధనం దేశం నుంచి బయటకు పోతున్నది, రూపాయల సరఫరా ఎక్కువైనపుడు విలువ పతనం అనివార్యం. ‘ అన్నారు. యుపిఏ హయాంలో రూపాయి విలువ పతనం భయానకం అన్న అరుణ్‌ జైట్లీ ఆర్ధిక మంత్రిగా మాట్లాడుతూ ‘ ప్రపంచలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్ధ గనుక మనం భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు ‘ అన్నారు.

ఇలాంటి నాయకులు ఏది చెబితే దాన్నే ప్రమాణంగా భావించి స్వంత బుర్రను వాడకుండా వాటినే పట్టుకొని వాదించే ఓ మూర్ఖ శిఖామణీ (ఇది మన మిత్రులు నీకు పెట్టిన పేరు ) రూపాయి విలువ ఎంత పతనం అయితే అంతగా నల్లధనం తగ్గినట్లా ? ఆ లెక్కన దేశంలో నల్లధనం పెద్ద ఎత్తున పేరుకు పోయిందని దాన్ని బయటకు తీస్తామని చెప్పిన బిజెపి నేత నరేంద్రమోడీ జనాన్ని మోసం చేసినట్లు అనుకోవాలా, సుబ్రమణ్య స్వామి లాంటి వారు జనానికి చెవుల్లో పూలు పెడుతున్నారా ? స్వాతంత్య్రం వచ్చినపుడు రూపాయి విలువ 4.16 అంటే సుబ్రమణ్య స్వామి తర్కం ప్రకారం ఆ రోజు నల్లధనం బాగా వున్నట్లు, అది క్రమంగా తగ్గుతూ వున్న కారణంగా 2004లో 45.32కు పడిపోయింది. నల్లధనాన్ని వెలికి తీసే పేరుతో నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు చేసిన ఏడాది విలువ 66.46 అంటే అప్పటికి ఇంకా నల్లధనం తగ్గిపోయింది లేదా బయటకు పోయింది. నోట్లను రద్దు చేసి జనాన్ని ఇబ్బంది పెట్టటం తప్ప నరేంద్రమోడీ ఘనత ఏముంది ? 2018లో 70.09కి చేరింది. అంటే పెద్ద నోట్ల రద్దు తరువాత నల్లధనం ఇంకా వున్నట్లే, ఇప్పుడు 72రూపాయలకు చేరింది కనుక నోట్ల రద్దు తరువాత నల్లధనం ఇంకా పెరిగినట్లే కదా ! బిజెపి వారు ఎది చెబితే అదే దేశ భక్తి, అదే జాతీయవాదం, అదే ఆర్ధశాస్త్రం. దాన్ని నమ్మిన ఆమోదించిన వారు దేశభక్తులు, కాని వారు దేశద్రోహులు. నాడు బ్రిటీష్‌ వారి దృష్టిలో భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌గురు వంటి వారందరూ దేశ ద్రోహులే. ఇప్పుడు బిజెపి చెప్పేదాన్ని అంగీకరించని వారందరూ దేశ ద్రోహులే.

బిజెపి మార్కు దేశ భక్త మిత్రమా 2004 నుంచి వార్షిక రూపాయి విలువలు ఎలా వున్నాయో, నరేంద్రమోడీ పాలనలో ఎలా పతనం అయ్యాయో దిగువ ఇస్తున్నాను. ఆధారంగా లింక్‌ కూడా ఇస్తున్నాను. https://www.bookmyforex.com/blog/1-usd-to-inr-in-1947-2019/ సంవత్సరాల వారీ డాలరుతో రూపాయి విలువ ఇలా వుంది. యుపిఏ పాలన-ఎన్‌డిఏ పాలనలో రూపాయి విలువ పతనం ఒక్క రూపాయే అన్న ఒక ఫేక్‌ న్యూస్‌ను నువ్వునాకు షేర్‌ చేశావు.

సంవత్సరం రూపాయి విలువ

2004   45.32

2005   44.10

2006   45.31

2007    41.35

2008    43.51

2009    48.41

2010    45.73

2011    46.67

2012     53.44

2013     56.57

2014     62.33

2015     62.97

2016     66.46

2017     67.79

2018    70.09

నరేంద్రమోడీ నిజం చెప్పినా జనం నమ్మని రోజులు రాబోతున్నాయి. యుపిఏ పదేండ్ల కాలంలో రూపాయి విలువ ఏడాది సగటు 47.04గా వుంది. అదే నరేంద్రమోడీ హయాంలో 65.93కు పతనమైంది. అయినా నరేంద్రమోడీ కాలంలోనే రూపాయి పటిష్టంగా వుందని అడ్డగోలుగా వాదించే వారికి ఈ వాస్తవం రుచించదు. దీని అర్ధం యుపిఏ పాలన బాగుందని కాదు, మన్మోహన్‌ సింగ్‌కు కితాబు ఇవ్వటమూ కాదు. యుపిఏ, ఎన్‌డిఏ రెండూ అనుసరించినవి ఒకే దివాలా కోరు ఆర్ధిక విధానాలే, ఒకదానికి ఒకటి కొనసాగింపు మాత్రమే. మిత్రమా రూపాయి విలువ పతనమై అంతర్జాతీయ మార్కెట్లో మన వస్తువులు చౌక అయినా ఎగుమతులు పెరక్కపోగా తగ్గాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే చమురు వంటి వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి జనం నడ్డి విరుస్తున్నాయి. అందుకే దేశభక్తి, జాతీయవాదంతో మీ వంటి వారి నిర్వాకం భరించలేనిదిగా తయారైంది గురూ అని చెబుతున్నా. ఇలా చెప్పిన వారిని మీరు దేశద్రోహులు అనే అంటారు. అలా పిలిపించుకోవటానికి నేను సిగ్గు పడను.

ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d