• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Congress

వంచన, వాస్తవ దూరంగా కేంద్ర బడ్జెట్‌ !

13 Saturday Jul 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

5 Trillion Dollar Economy, India budget 2019-20, Nirmala Sitharaman

Image result for india budget 2019-20, nirmala

ఎం కోటేశ్వరరావు

2019-20 సంవత్సర పూర్తి బడ్జెట్‌ను జూలై ఐదున నూతన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు.ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయాన్ని సంఘపరివార్‌కు చెందిన వారు కుహనా మేథావుల కేంద్రంగా వర్ణిస్తారు. అయితే వారి అదృష్టమో దురదృష్టమోగానీ అదే విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తీరుకు మొత్తంగా మీడియా ప్రశంసలు కురింపించింది. అఫ్‌ కోర్స్‌ అది కార్పొరేట్లకు, ప్రయివేటీకరణకు పెద్ద పీట వేసినందువలన కూడా కావచ్చు. ఒక వ్యక్తి హావభావాలు, ప్రవర్తన తీరుతెన్నులు వ్యక్తిగతమైనవి తప్ప వేరు కాదు. సదరు వ్యక్తులు ఏ భావాలకు, విధానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, వాటి పర్యవసానాలు,ఫలాలు ఏమిటన్నదే సమాజం చూస్తుంది. అందువలన నిర్మలా సీతారామన్‌ ఒక ప్రభుత్వ ప్రతినిధిగా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు గనుక దానిలోని అంశాలపై విమర్శలు లేదా ప్రశంసలను వ్యక్తిగతంగా తీసుకోనవసరం లేదు.

ఐదేండ్ల క్రితం నాటి అర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు, నిర్మల బడ్జెట్‌కు సామ్యాలను చూపుతూ ఎన్ని నిమిషాలు, ఎన్నిపదాలు, ఏ అంశానికి ఎంత సమయం కేటాయించారు అనే పద్దతుల్లో విశ్లేషించిన వారు కూడా లేకపోలేదు.ఆ రీత్యా చూసినపుడు 16,489 పదాలను జైట్లీ రెండు గంటల ఏడు నిమిషాల 42 సెకండ్లలో పూర్తి చేస్తే నిర్మల 20,223 పదాలను రెండు గంటల తొమ్మిది నిమిషాల 13 సెకండ్లలోనే ముగించారంటే వాగ్ధాటితో తక్కువ సమయంలో ఎక్కువ పదాలను కుమ్మరించారన్నది స్పష్టం. బడ్జెట్‌ తీరు తెన్నులను చూసే ముందు నాలుగవ తేదీన ప్రవేశపెట్టిన ఆర్ధిక సర్వేను కూడా కలిపి విశ్లేషించటం సముచితంగా వుంటుంది.

గతానికి చెందిన అంకెల వివరాలు ఇచ్చినప్పటికీ వాటికి చెప్పే భాష్యం, వుగాది పంచాంగంలా ఆశాభావం వెలిబుచ్చే నివేదికలుగానే మన అర్ధిక సర్వేలు వుంటున్నాయి. బడ్జెట్‌ కూడా అంతే. భవిష్యత్‌ మాసాల్లో సంభవించే పరిణామాల మీద అంచనాల ప్రాతిపదికగానే బడ్జెట్‌ కేటాయింపుల ప్రతిపాదనలు వుంటాయి. అంచనాలు తప్పితే కోతలతో సవరణలను ఆమోదించటం మనం చూస్తున్నాం. ఏ పార్టీ ప్రభుత్వం వున్నా అదే చేస్తుంది. ఏడాదిన్నర క్రితం పార్లమెంటుకు సమర్పించిన సర్వే 2018-19లో వ ద్ధిరేటు ఏడునుంచి ఏడున్నర శాతందాకా ఉండనుందన్నా, వాస్తవంలో అది 6.8శాతానికే పరిమితమైంది. కాగా వర్తమాన సంవత్సరంలో ఏడు శాతం ఆశాభావం, అంచనా మాత్రమే. ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల కోట్ల డాలర్లకు ఆర్ధిక వ్యవస్ధను పెంచుతామని అందుకుగాను ప్రతి ఏటా కనీసం ఎనిమిది శాతం అభివృద్ది వుండాలని చెప్పిన వారు. ఆదిలోనే హంసపాదు అన్నట్లు అంచనాలోనే ఒకశాతాన్ని తగ్గించారు. అలాంటపుడు ఆశించిన లక్ష్యాన్ని ఎలా సాధిస్తారు ?

Image result for india budget 2019-20, nirmala

అంకెల్లోకి పోతే ఒక పట్టాన తేలే అవకాశం వుండదు. వాటిని ఎలాగైనా వినియోగించవచ్చు, భాష్యం చెప్పవచ్చు. అందువలన ఎవరి భాష్యం వాస్తవాలకు దగ్గరగా వుందన్నది జనం నిర్ణయించుకోవాల్సిందే.ఆర్ధిక సర్వే, బడ్జెట్‌ వుపన్యాసం రెండింటిలోనూ 2024-25 నాటికి అంటే ఐదు సంవత్సరాలలో మన ఆర్ధిక వ్యవస్ధను ఐదులక్షలకోట్ల డాలర్లకు పెంచాలన్నది లక్ష్యంగా చెప్పారు. తప్పులేదు, అందుకు గాను ఏటా 8శాతం అభివృద్ధి రేటు వుండాలని చెప్పారు. ప్రస్తుతం ఆర్ధిక మంత్రి చెప్పినదాని ప్రకారం మన జిడిపి 2.7లక్షల కోట్ల డాలర్లు వుంది.ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా ప్రభుత్వాలు, మంత్రులూ తమ పబ్బంతాము గడుపుకొని ఓట్లు కొల్లగొట్టేందుకు జిమ్మిక్కులు చేస్తున్నారు. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇనిస్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసిన దీపాంకర్‌ దాసుగుప్తా చెబుతున్న లెక్కల ప్రకారం ఐదు లక్షల కోట్ల డాలర్లకు జిడిపి పెరగాలంటే 2018-19 రేట్ల ప్రకారం ఐదేండ్లలో ఎనిమిది శాతం వృద్ధి రేటు బదులు 13శాతం వుంటేనే సాధ్యం అంటున్నారు. అదే 2011-12 ధరల ప్రకారం అయితే 19శాతం వంతున పెరిగితే నాలుగేండ్లలోనే ఆ లక్ష్యాన్ని సాధించవచ్చని, అదే ఎనిమిదిశాతం చొప్పున అయితే 2030-31వరకు ఆగాల్సి వుంటుందని పేర్కొన్నారు.

ప్రస్తుత మన పాలకులు చెబుతున్న లక్ష్యం సాధించటం గురించి ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేస్తే అసలు నీవు దేశభక్తుడవేనా అని ప్రశ్నిస్తారు. మన గురించి ఐఎంఎఫ్‌ ఏమి చెప్పిందో ఒకసారి చూద్దాం.2020 నుంచి 2024 సంవత్సరాలలో సగటున 7.59శాతం అభివృద్ధి రేటుతో మన జిడిపి 2.97లక్షల కోట్ల డాలర్ల నుంచి 4.30లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ఈ ఏడాది మార్చినెలతో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో మన అభివృద్ధి రేటు 6.8శాతమే. అది ఈ ఏడాది ఏడుశాతంగా వుంటుందని అంచనా వేస్తున్నారు. అలాంటపుడు ఎనిమిదిశాతం వుంటే గింటే ఐదులక్షల కోట్ల డాలర్లకు చేరతామని చెప్పటం ఏమిటి? అదేమన్నా ప్రామాణిక సంఖ్యా? అంతకు మించి సాధిస్తే జనం వద్దంటారా ? లేకపోతే మరేదైనా చేస్తారా ? ఐదు సంవత్సరాల క్రితం అచ్చేదిన్‌(మంచి రోజులను) తెస్తామని, గుజరాత్‌ అభివృద్ధి నమూనాను దేశమంతటికీ విస్తరిస్తామని, 2022నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని చెప్పినట్లుగానే మైండ్‌ గేమ్‌లో ఇదొక భాగం అనుకోవాలి.

ఆర్ధిక సర్వే రచయితలు అభివృద్ధి గురించి పలుసార్లు చైనాను వుదహరించారు. బ్రిటీష్‌ వారి ఆలోచనా ధోరణి నుంచి బయటపడాలని చెప్పారు. చైనా మాదిరి పురోగమించాలని కోరుకోవటం తప్పుకాదు. బ్రిటీష్‌ వారి నమూనా వారి దేశాన్నే ఇబ్బందుల్లోకి నెట్టింది గనుక మనకు వాంఛనీయమూ కాదు. ఇక్కడ కొన్ని విషయాలను మనం గమనంలో వుంచుకోవాలి. ఈ రోజు ప్రపంచంలో ఎలాంటి పెద్ద సంక్షోభాలు లేకుండా అభివృద్ధి చెందుతున్న దేశం ఏదైనా వుంటే అది చైనా ఒక్కటే. కొంత మంది విమర్శకులు అక్కడ కమ్యూనిస్టు పార్టీ పేరుతో పెట్టుబడిదారీ విధానాన్ని అమలు జరుపుతున్నారని ఆరోపిస్తారు. వారు చెప్పిందాన్ని కాసేపు అంగీకరిద్దాం.చైనా సంస్కరణలకు నాలుగు పదులు నిండాయి. ఈ కాలంలో అమెరికాతో సహా ధనిక దేశాలన్నీ ప్రతి పది సంవత్సరాలకు ఏదో ఒక ఆర్ధిక సంక్షోభం, మాంద్యం వంటి తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నాయి. ధనిక దేశాల్లో 2008లో ప్రారంభమైన సంక్షోభం పరిష్కారం గాకపోగా త్వరలో మరో సంక్షోభానికి తెరలేవనుందనే వార్తలు, హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఆ సంక్షోభ ప్రభావం మనమీద కూడా పడుతోంది. చైనా ఎన్నడూ ధనిక దేశాల మాదిరి సంక్షోభాలను ఎదుర్కొన్నదా అంటే లేదు. అభివృద్ధి రేటులో స్వల్పతగ్గుదల వుండవచ్చు గానీ ఇతర దేశాల మాదిరి నామ మాత్రం లేదా తిరోగమన దారి పట్టలేదు కదా ? ఎందుకనో ఎప్పుడైనా మనం ఆలోచించామా ?

మన దేశంలో కొంత మంది భలే చిత్రమైన వాదనలు చేస్తుంటారు, వాటిని నిజమని నమ్మేవారు కూడా లేకపోలేదు. వాటిలో కొన్ని పచ్చి అబద్దాలు కూడా వున్నాయి. వాటి తీరుతెన్నులు ఎలా వున్నాయో చూద్దాము. చైనా అభివృద్ధి చెందిన మాట నిజమేగానీ అది కమ్యూనిస్టు దేశమండీ, మనది ప్రజాస్వామ్యం, ఒక నిర్ణయం చేస్తే అక్కడ తప్పయినా ఒప్పయినా అమలు జరగాల్సిందే, మన దగ్గర అలా కాదు. చైనా భిన్నమైన దారుల్లో పయనిస్తున్నది, దాని తరువాత స్ధానం పొందేందుకు భారత్‌ ప్రయత్నించకూడదు, అది సాధ్యం కాదు.ఏక పార్టీ నిరంకుశ పాలనతో పాటు దశాబ్దాల తరబడి మౌలిక సంస్కరణల గురించి చేసిన ప్రచారంతో పాటు మెజారిటీగా వున్న హాన్‌ జాతీయులు, చైనా భాష మాట్లాడేవారిని సమీకరించారు. భారత్‌లో అటువంటి అవకాశం లేదు.బహుళపార్టీ వ్యవస్ధ వున్నది. సామాజిక పరంగా, భాషా పరంగా వందలాది మైనారిటీలను ఒక లక్ష్యం కోసం సమీకరించటం సాధ్యం కాదు. చైనాలో రైతులను భూముల నుంచి తరమివేశారు, మన దగ్గర అలా కుదరదు. నిరంకుశ పాలకులు వున్న అన్ని చోట్లా అభివృద్ధి జరుగుతుందని చెప్పలేము, క్యూబా, వుత్తర కొరియా, వెనెజులాల్లో వైఫల్యం చెందారు. మంచి నియంతలను కలిగి వుండటం చైనీయుల అదృష్టం. ఇంకా ఇలాంటి బుర్రతక్కువ ప్రచారాలు చాలా వున్నాయి. అలాంటపుడు మన అభివృద్ధి రేటు చైనా కంటే ఎక్కువ వుంది, త్వరలో మనం చైనాను అధిగమిస్తాము, ఎగుమతుల్లో చైనాతో పోటీపడతాము, దాన్ని వెనక్కు నెట్టి ముందుకు పోతాము అని చెప్పుకోవటం ఎందుకు అన్నది ప్రశ్న.

సోషలిస్టు, కమ్యూనిస్టు దేశాల్లో జనం ఆహారం తిని బతికితే ప్రజాస్వామ్య దేశాల్లో స్వేచ్చతో ప్రాణాలు నిలుపుకుంటారా? అక్కడ అభివృద్ధి చెందితే ఇక్కడ నిత్యదరిద్రంతో బతకాలా ? అసలు ఇలాంటి వాదనలు చేసే వారి సమస్య ఏమిటో మనకు అర్ధం కాదు. కమ్యూనిస్టులు ఏపనైనా మెడమీద కొడవలి, తలమీద సుత్తిపెట్టి చేస్తావా, చస్తావా అంటారన్నట్లుగా కొందరు చెబుతారు. పోనీ, మచ్చుకు అలా చేసి చైనాలో హెక్టారుకు1,751 కిలోల పత్తి పండిస్తే మనది ప్రజాస్వామ్యం గనుక 502కిలోలే పండిస్తారని అనుకుందాం. మరి బ్రెజిల్‌, టర్కీ, ఇజ్రాయెల్‌, ఆస్ట్రేలియా వంటి దేశాలన్నీ ప్రజాస్వామ్య వ్యవస్ధలున్నవేగా అక్కడ చైనా తరువాత అధికంగా 1,600-1700 కిలోల వరకు పండిస్తున్నారుగా దాన్నేమనాలి? పత్తి రైతులు మన దేశంలోనే ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలి? ఇలా ప్రశ్నించుకుంటూ పోతే గుడ్డి కమ్యూనిస్టు వ్యతిరేకత తప్ప సరైన సమాధానం వుండదు.

Image result for india budget 2019-20, nirmala

ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన దేశంలో భిన్న భాషలు, జాతులు, మతాలు, కులాలు, ఆచారాలు వున్న మాట నిజం. ఇలాంటి చోట హిందూత్వ పేరుతో మెజారిటీవాదాన్ని బలవంతంగా రుద్ద చూస్తున్నారు. ఇది జనాన్ని ఏకత్రాటి మీద నడిపించటానికి దోహదం చేస్తుందా ? ఫలానా వారి ఇంట్లో ఆవు మాంసం వుందనో, ఫలానా వారు ఆవులను వధించటానికే తరలిస్తున్నారనో సాకులు చూపి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని సామూహికంగా దాడులు, హత్యలు చేసే వారు గోరక్షకుల పేరుతో చలామణి అవుతున్నారు. వారికి పాలకపార్టీ అండదండలున్నాయి. ఒక్క వుదంతంలో కూడా ఇంతవరకు దుండగులకు శిక్షలు పడలేదు. అది అలా వుండగా కొత్తగా ఆకస్మికంగా కొందరు ప్రత్యక్షమై మైనారిటీ తరగతులకు చెందిన వారిని పట్టుకొని నీవు దొంగతనానికి వచ్చావు లేదా జైశ్రీరామ్‌ అంటావా లేదా అంటూ చావచితక కొట్టి పోతుంటే వారిని అడ్డుకొనే వారు లేరు. అలాంటి వారిని ఎవరైనా విమర్శిస్తే అదిగో చూడండి వీరు హిందూమతానికి, హిందూత్వకు వ్యతిరేకులు, మెజారిటీగా వున్న వారికి తమ దేవుడిని తలచుకొనే అవకాశం కూడా వుండకూడదా అంటూ విద్వేష ప్రచారాన్ని రెచ్చగొడుతున్న స్ధితిలో వారి ఏలుబడిలో చైనా మాదిరి దేశాన్ని అభివృద్ధి చేస్తామని ఎవరైనా చెబితే ఎలా నమ్మాలి?

ఏ దేశ పురోగమనానికైనా పరిశోధన, అభివృద్ధి కీలకం. వేల సంవత్సరాల నాడే మన వారు సముద్ర వాణిజ్యం చేశారని ఒకవైపు గొప్ప చెప్పుకుంటాం. మరోవైపు సముద్రం దాటి ప్రయాణిస్తే మ్లేచ్చులు అవుతారు, మైలపడతారు, ధర్మం చెడుతుంది, కులం నుంచి వెలి అంటూ గిరులు గీసి కూర్చోపెట్టిన కారణంగానే మనకు ఒక కొలంబస్‌ లేకుండా పోయాడు. మన పూర్వులు పెట్రోలు లేకుండానే విమానాలు నడిపారు, ఎందరు ఎక్కినా ఒకరికి ఖాళీ వుండేది, అసలు వేదాల్లోనే అన్నీ వున్నాయంటూ లొట్టలు వేసుకుంటూ గొప్పలు చెప్పుకోవటానికే మనకు సమయం చాల్లేదు. మిగతా దేశాల్లో ఇలాంటి పిచ్చి ముదరలేదు కనుకనే కొత్తవాటిని కనిపెట్టాలనే తపనతో ఎంతో ముందుకు పోయారు. దేశంలో జరిగిన ప్రతి అనర్ధానికి లేదా తమకు నచ్చని ప్రతి అంశానికి కారకుడు నెహ్రూ అంటూ బిజెపి నేతలు దాడిచేస్తుంటారు. వాదనకోసం సరే అందాం. గత ఐదు సంవత్సరాల్లో నరేంద్రమోడీ, అంతకు ముందు వాజ్‌పేయి పాలనా కాలంలో బిజెపి చేసిందేమిటి? చైనా గత కొద్ది సంవత్సరాలుగా పరిశోధన, అభివృద్ధికి తన జిడిపిలో రెండుశాతం మొత్తం ఖర్చు చేస్తున్నది. మనం 0.7శాతం దాటలేదు. ఐదు సంవత్సరాల క్రితం స్ధానికుల పేటెంట్‌ దరఖాస్తుల విషయంలో మనం 52వ స్ధానంలో వుంటే 2018లో అది 55కు దిగజారింది. ఇదే సమయంలో చైనా మూడు నుంచి ఒకటవ స్ధానానికి చేరుకుంది. ఆవు మూత్రంలో బంగారం వుందా, అవితాగితే కాన్సర్‌ నయమౌతుందా, ఆవు పేడలో ఏముంది, దాన్ని పూసుకుంటే సొగసుగా తయారవుతామా అనే దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. యధారాజా తధా పరిశోధకా అన్నట్లుగా తయారైంది పరిస్ధితి. కావాలంటే వేదాల్లో అన్నీ వున్నాయని చెప్పే సంస్కృత పండితులకు, అగ్రహారాలకు వాటి పరిశోధన అప్పగించి వాటిలో దాగి వున్నవాటిని వెలికి తీయమనండి. పైసా ఖర్చు కాదు. ఇప్పటికే ఐదేండ్ల కాలాన్ని వృధా చేశారు. దాని దారిన అది నడుస్తుంటే మిగతా అంశాల మీద ఇతరులను ప్రోత్సహించాలి, పోటీ పెట్టాలి తప్ప కాలు గడపదాట కుండా వేదకాలం గురించి చెప్పుకుంటే ప్రయోజనం ఏముంటుంది.

ఏ దేశంలోనూ ఇవ్వని విధంగా పరిశోధన పేరుతో చేసే ఖర్చులకు మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను మినహాయింపులు, ఇతర రాయితీలు ఇస్తున్నాయి. ప్రయివేటు సంస్ధలు ఆ రాయితీలను ఎలా స్వాహా చేయాలనే అంశం మీద పెడుతున్న శ్రద్ద పరిశోధన మీద లేదు. అందుకే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వుంది. దాంతో పన్ను మినహాయింపులను తగ్గించగానే ప్రయివేటు రంగం గగ్గోలు పెడుతోంది. మరో వైపున అన్ని బాధ్యతల నుంచీ తప్పుకుంటున్నట్లుగానే పరిశోధనా రంగం నుంచి కూడా ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయి.1996లో చైనా జిడిపిలో 0.56శాతం ఖర్చు చేయగా మన దేశం 0.63శాతం పెట్టింది. అదే 2015నాటికి చైనా 2.07శాతానికి పెంచగా మనది అదే 0.63దగ్గరే వుండిపోయింది.ఇదే కాలంలో ప్రపంచ సగటు 1.97 నుంచి 2.23శాతానికి పెరిగింది. మనం ప్రపంచ సగటుకు ఇంకా ఎంతో దూరంలో వున్నాం. ఇజ్రాయెల్‌ గరిష్టంగా 4.27శాతం ఖర్చు చేస్తోంది. పరిశోధనకు కూడా ప్రజాస్వామ్యమే అడ్డువస్తోందనుకోవాలా ? రాజకీయంగా ఎవరైనా అడ్డుపడుతున్నారా ?

Image result for india budget 2019-20, nirmala

దేశంలో పెట్టుబడుల విషయానికి వస్తే 2004జూన్‌ నుంచి 2019 మార్చి వరకు లభ్యమైన సమాచారం మేరకు జిడిపిలో ప్రతి మూడు మాసాల పెట్టుబడి సగటు 34.8శాతంగా వుంది. గరిష్టం 2011సెప్టెంబరులో 41.2శాతం కాగా కనిష్టం 2017 మార్చిలో 29.5శాతం వుంది. తాజా పరిస్ధితికి వస్తే గతేడాది చివరి మాసాల్లో 32.2శాతం వుండగా ఈ ఏడాది మార్చిలో 29.8శాతం వుంది. చైనాలో ఏడాదికి ఒకసారి వివరాలను వెల్లడిస్తారు. ఆ మేరకు 2018 డిసెంబరులో పెట్టుబడి జిడిపిలో 44.8శాతం వుంది. అంతకు ముందు ఏడాది 44.6 శాతం. 1952 డిసెంబరు నుంచి 2018 డిసెంబరు వరకు సగటు 36శాతం వుంది. 2011 డిసెంబరులో గరిష్టంగా 48 శాతం కాగా 1962లో కనిష్టంగా 15.1శాతం నమోదైంది.

నరేంద్రమోడీ 2.0 సర్కార్‌ ప్రయివేటు పెట్టుబడుల మీద పెద్ద ఎత్తున మరులుగొన్నట్లు కనిపిస్తోంది. మనదేశంలో ప్రయివేటు రంగ పెట్టుబడులు ప్రస్తుతం 14సంవత్సరాల కనిష్ట స్ధాయికి పడిపోయిన తరుణంలో వాటి గురించి జనానికి భ్రమలు కొల్పే విధంగా పారాయణం చేస్తున్నది. మంచి రోజులు తెస్తా మంచి రోజులు తెస్తా అని నరేంద్రమోడీ చెప్పటం తప్ప అలాంటి సూచనలు ఎండమావుల్లా కూడా కనిపించటం లేదు. 2018 డిసెంబరుతో ముగిసిన మూడు నెలల కాలంలో దేశంలో నూతన ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని చెప్పిన కంపెనీల విలువ లక్ష కోట్ల రూపాయలని సిఎంఐఇ(భారత ఆర్ధిక వ్యవస్ధ పర్యవేక్షణ కేంద్రం) పేర్కొన్నది. అయితే ఆ మొత్తం సెప్టెంబరుతో ముగిసిన మూడునెలలతో పోల్చితే 53శాతం, ఏడాదితో పోల్చితే 55శాతం తక్కువ అని తెలిపింది. ప్రయివేటు రంగం పధకాలు ఇదే కాలంలో 62,64శాతాల చొప్పున తగ్గాయి. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్ధల పధకాలు కూడా 37,41శాతాల చొప్పున పడిపోయాయి. ఇది 2004 తరువాత ఇది కనిష్టం. కొత్త పధకాలు రాకపోవటం ఒకటైతే అమల్లో వున్న ప్రాజెక్టులు నిలిచిపోవటం మరింత ఆందోళనకరం. మొత్తంగా 11శాతం వుంటే ప్రయివేటు రంగంలో ఇది 24శాతం వరకు వుంది. అనేక రాష్ట్రాలలో విద్యుత్‌ కోతలు ఎత్తివేత గురించి పాలకులు తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. విద్యుత్‌ వుత్పత్తి కేంద్రాల స్ధాపక సామర్ధ్యం పెరిగినంతగా విద్యుత్‌ వినియోగం పెరగకపోవటమే కొరతలేకపోవటానికి కారణం. ప్రయివేటీకరణలో భాగంగా విదేశాల నుంచి అప్పులు దొరుకుతున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లుగా తెచ్చి విద్యుత్‌ ప్రాజెక్టులు ప్రారంభించారు. నిలిచిపోయిన ప్రాజెక్టులలో 35.4శాతం విద్యుత్‌, 29.2శాతం వస్తూత్పత్తి రంగానికి చెందినవి. నిధులు, ఇంధనం, ముడిసరకుల కొరత, మార్కెట్‌ పరిస్ధితులు అనుకూలంగా లేకపోవటం దీనికి ప్రధాన కారణాలు. వీటిలో కూడా ఎక్కువ శాతం నిధుల కొరతే. ఇటువంటి స్ధితిలో ప్రయివేటు పెట్టుబడుల గురించి దేశ ప్రజల్లో ఆశలు రేపుతున్నారు. ఈ పేరుతో మరిన్ని ప్రజా, కార్మిక వ్యతిరేక సంస్కరణలను రుద్దే యత్నం తప్ప ఇది వేరు కాదు.

ఆశలు ఆకాశంలో ఎగురుతుంటే భూమ్మీద పరిస్ధితి ఎలా వుంది ? అన్నదాతలు సంక్షోభం ఎదుర్కొంటున్న వ్యవసాయ ప్రధాన దేశంలో రైతుల రాబడిని రెండింతలు చేసేందుకు 14.5శాతం మేర వ్యవసాయాభివ ద్ధి రేటు అవసరమని నిపుణులు చెబుతున్నారు. వానలు కురిసినప్పుడే రెండు శాతానికి పరిమితమైనప్పుడు, లోటు వర్షపాత సూచనలు కనిపిస్తున్న ఈ ఏడాది ఎలా పుంజుకోగలదో ఆర్థికవేత్తలే వివరించాలి! పెట్టుబడులు, పొదుపు, ఎగుమతులు, వ ద్ధి, ఉపాధి అవకాశాలు ఇతోధికమైతే భారత ఆర్థిక స్వస్థతకు తిరుగుండదని క ష్ణమూర్తి సుబ్రమణియన్‌ విరచిత సర్వే నమ్మకంగా చెబుతోంది. ప్రపంచ ధనిక దేశాలు వ ద్ధిపరమైన సవాళ్లను ఎదుర్కొంటుండగా, మరోవైపు వాణిజ్య యుద్ధమేఘాలు కలవరపరుస్తుండగా- మన వ ద్ధి ప్రస్థానం గతాన్ని అధిగమిస్తుందన్నది ప్రశ్న.

Image result for india budget 2019-20, nirmala

సోషలిస్టు చైనా గురించి ఇటీవలనే కొన్ని వార్తలు వచ్చాయి. అక్కడ కార్మికుల వేతనాలు పెరుగుతున్న కారణంగా అనేక మంది ప్రయివేటు పారిశ్రామికవేత్తలు తమ సంస్ధలను అక్కడి నుంచి తరలించేందుకు చూస్తున్నారని, భారత్‌ అనువుగా వుంటుందని భావిస్తున్నారన్నది వాటి సారాంశం. దీని అర్ధం ఏమిటి? తన ఎగుమతులను చౌకగా ప్రపంచానికి అందించేందుకు కార్మికుల శ్రమను ఫణంగా పెడుతోందన్న కొందరి వక్రీకరణలకు ఇది చెంపపెట్టు. ఆ స్ధాయిలో మన దేశంలో వేతనాలు లేవన్నది మన పాలకులకు అభిశంసన. ముందే చెప్పుకున్నట్లు ప్రపంచ ధనిక దేశాలు ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న కారణంగా దాని ఎగుమతులపై కొంత ప్రభావం పడినా ఆరుశాతం పైగా అభివృద్ధి రేటు కొనసాగించటానికి కారణం తన జనాల ఆదాయాలను పెంచి అంతర్గత వస్తు వినియోగాన్ని క్రమంగా పెంచుకుంటూ పోవటమే. కేవలం ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధలుగా మారిన లాటిన్‌ అమెరికా దేశాలు దెబ్బతినటానికి కార్మికవర్గ ఆదాయాలను పెంచకపోవటం ప్రధాన కారణం. వ ద్ధి, ఉపాధి చెట్టపట్టాలు కట్టి సాగితేనేగాని ప్రగతి సాధ్యం. రిజర్వ్‌బ్యాంక్‌ బాధ్యతలు చేపట్టకముందు ఏడేళ్లనాటి ఆర్థిక సర్వేలో రఘురాం రాజన్‌ ఉపాధి కల్పన ప్రభుత్వ తక్షణ కర్తవ్యమని ఉద్బోధించారు. రెండేళ్ల క్రితం తనవంతుగా ముఖ్య ఆర్థిక సలహాదారు హోదాలో అరవింద్‌ సుబ్రమణియన్‌ ‘ఉపాధి రహిత వ ద్ధి’పై ఆందోళన చెందినా- కార్యాచరణ లేదు. దేశంలో ఉపాధి అవకాశాల విస్తరణకు నూతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం దోహదపడగలదంటున్న తాజా సర్వే- ముఖ్యంగా సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ (ఎస్‌ఎమ్‌ఎస్‌ఈ)లకు మద్దతు ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మేకిన్‌ ఇండియా పిలుపు లక్ష్యానికి ఇది విరుద్దం. భారీ పరి శమలతో పెద్ద ఎత్తున వుత్పత్తి చేసి వుత్పాదక ఖర్చు తగ్గిస్తే తప్ప ఎగుమతుల్లో మనం పోటీ పడలేము. చిన్న, మధ్య తరహా సంస్దలకు అలాంటి వెసులుబాటు వుండదు.

ప్రయివేటు పెట్టుబడులతో పెద్ద ఎత్తున వుపాధి కల్పిస్తామని యువతకు భ్రమలు కల్పిస్తున్నారు. అభివృద్ధి రేటు గురించి డబ్బాకొట్టుకుంటున్న పాలకులు వుపాధి గురించి మాట్లాడటం లేదు. గతంలో వుపాధి రహిత అభివృద్ధి సంఘటిత రంగ సంస్ధలకే పరిమితం అయింది. ఇప్పుడు అది అసంఘటిత రంగానికి కూడా విస్తరించటం వుపాధి కల్పన మరింత క్లిష్టం కానుంది. దేశంలో పదిహేను సంవత్సరాలకు పైబడిన వారిలో పని చేస్తున్నవారు లేదా పనికోసం ఎదురుచూస్తున్నవారు గానీ 2012లో 55.5 శాతం మంది వుంటే 2018లో 49.7శాతానికి పడిపోయింది. అంటే నిరుద్యోగులు పెరిగారు.

ఉపాధి కల్పన, ఎగుమతుల పెంపుదల, ఆర్థికాభివ ద్ధి తదితరాలు పరస్పరం ముడివడిన అంశాలంటున్న సర్వే ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో రాబడి పెంపొందే అవకాశాలు ఉంటాయని ఒకవైపు చెబుతోంది. మరోవైపు వ్యవసాయంలో యంత్రాల వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇటీవలి కాలంలో అనేక ప్రాంతాలలో నాట్లు, కోత, నూర్పిడి పనులను యంత్రాలే చేస్తున్నాయి. వుపాధి రహిత అభివృద్దికి ఇది ఒక సూచిక. వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాల కారణంగా సేద్య రాబడి 20-25 శాతం మేర క్షీణిస్తుందన్న గత సర్వే మాటేమిటి అంటే సమాధానం లేదు. చిన్నా, పెద్ద అనేతేడా లేకుండా అన్ని రంగాల్లో రోబోలు ప్రవేశిస్తున్నాయి. ఆర్ధిక సర్వే చెబుతున్నదానికి భిన్నంగా నీతి ఆయోగ్‌ వ్యవసాయ శాస్త్రవేత్త రమేష్‌ చంద్‌ వాదన వుంది. గత ఐదు సంవత్సరాలుగా సగటు వర్షపాతం కంటే తక్కువ నమోదు అవుతోంది. ప్రస్తుత స్ధితిని చూస్తే ఆరో సంవత్సరం కూడా ఇదే స్ధితి కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అయినా వ్యవసాయ వృద్ధి రేటు 2.9శాతం తక్కువేమీ కాదు.కానీ వృద్ది రేటు ఐదుశాతం గనుక వుంటే పంటల ధరలు పడిపోయి రైతుల ఆదాయాలు 30 నుంచి 40శాతం వరకు పడిపోయే అవకాశం వుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని వూదరగొడుతున్న మోడీ సర్కార్‌ ప్రచారం ఒక వాగాడంబరమే తప్ప వాస్తవం కాదని కూడా రమేష్‌ తేటతెల్లం చేశారు. ఆదాయాలు రెట్టింపు కావాలంటే ఏడాదికి పదిశాతం వృద్దిరేటు అవసరం. తన అంచనా ప్రకారం గత మూడు సంవత్సరాలుగా ఆరుశాతానికి మించి లేదు. ఇప్పుడున్న ధరలకు పదిశాతం అదనంగా రైతులు పొందితే వారి ఆదాయం 16శాతం పెరుగుతుందని రమేష్‌ అంటారు. మరి ఆ పరిస్ధితి ఇప్పుడు వుందా ? ప్రతి పభుత్వ పథకానికి, కార్యక్రమానికి ‘గావ్‌, గరీబ్‌, కిసాన్‌’ కేంద్ర బిందువులని ఘనంగా చాటిన ఆర్థిక మంత్రి వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలకు ప్రత్యేకించింది బడ్జెట్‌లో అయిదు శాతమే! పెట్టుబడి లేని వ్యవసాయంపై ద ష్టి సారించామని, రైతుల రాబడి రెండింతలయ్యేందుకు అది దోహదపడుతుందన్న హామీ ఉత్తచేతులతో మూరలేసిన చందమే. ‘కిసాన్‌ సమ్మాన్‌’ అల్పసంతోషులను కొంత ఊరడిస్తున్నా, రైతుకు జీవన భద్రత కల్పించగల విశేష చొరవ ఈ బడ్జెట్‌ కసరత్తులోనూ కొరవడింది. రైతాంగంలో కేవలం ఆరు శాతానికే దక్కుతున్న కనీస మద్దతు ధరల పెరుగుదల ఎంత ప్రహసన ప్రాయంగా వుందో బడ్జెట్‌కు ముందు పెంచిన నామమాత్ర ధరలను చూస్తే తెలుస్తుంది.

దేశంలో పారిశుద్ధ్య సేవలు అంతంతమాత్రమేనని గత ఏడాది పార్లమెంటరీ స్థాయీసంఘం విమర్శించింది. వివిధ రాష్ట్రాల్లో రూ.14 వేలకోట్లకు పైగా స్వచ్ఛ నిధులు మురిగిపోతున్నాయని లెక్కచెప్పింది. ఆ ఊసెత్తని తాజా ఆర్థిక సర్వే స్వచ్ఛభారత్‌ నుంచి స్వస్థ భారత్‌ మీదుగా సుందర భారత్‌ వైపు నడుద్దామని పిలుపునిచ్చింది. బడ్జెట్‌ పరిమాణం 27 లక్షల 86 వేలకోట్ల రూపాయలకు ఎగబాకింది. నిరుటి బడ్జెట్‌ ప్రతిపాదనలకన్నా మూడు లక్షల 44 వేలకోట్ల రూపాయలు అధికం! ఆదాయపన్ను మినహాయింపుల గురించి ఎదురు చూసిన ప్రభుత్వ వుద్యోగుల ఆశాభంగం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నాలుగునెలల క్రితం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌ ప్రతిపాదనలనే తిరిగి వల్లించారు. నిజానికి వుద్యోగులకు మినహాయింపులు పెంచితే ఆ మేరకు మార్కెట్లో వినియోగం పెరిగి ఆర్ధిక వ్యవస్ధకు మేలు జరుగుతుంది. అధిక ఆదాయం వచ్చే వారి మీద సర్‌ఛార్చి పెంపుదల హర్షణీయమే అయినా అసమానతల తగ్గింపు రీత్యా చూస్తే ఇది సముద్రంలో కాకిరెట్ట వంటిదే. మరోవైపు బడా సంస్ధలకు ఇచ్చిన రాయితీలను చూస్తే 25శాతం ఆదాయపన్ను జాబితాలోకి వచ్చి సంస్ధల వార్షిక లావాదేవీల మొత్తాన్ని 250 నుంచి 400 కోట్లకు పెంచారు. పోనీ దీని వలన ఆర్ధిక వ్యవస్ధకు మేలు జరుగుతుందా అంటే చెప్పలేము. అనేక సంస్ధలు తమ లాభాలను, పన్ను రాయితీలను సరిహద్దులు దాటించి విదేశీ పెట్టుబడుల రూపంలో తెచ్చి వాటి మీద కూడా రాయితీలు పొందుతున్నారు.

మోదీ ప్రభుత్వం ‘సాగరమాల’ పేరిట రేవుల్ని నవీకరించి, నూతనంగా ప్రపంచ స్ధాయి నౌకాశ్రయాలు నిర్మించి, వాటన్నింటినీ అనుసంధానిస్తూ కోస్తా ఆర్థిక మండళ్లు నెలకొల్పుతామన్నా- జల మార్గాల గురించి చెప్పినా ఎక్కడి గొంగళి అక్కడే వున్నట్లుగా వుంది. ఇప్పుడు హైవేల గ్రిడ్‌ గురించి కబుర్లు చెబుతున్నారు. ‘గ్రామీణ సడక్‌ యోజన’ నిధులు ఖర్చు చేయలేదు. ఈ సారి మొత్తాన్ని పెంచలేదు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కేటాయింపులు తగ్గాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులను కుదించారు. ఇవన్నీ గ్రామీణుల ఆదాయాలను తగ్గించేవే తప్ప పెంచేవి కాదు. గత బడ్జెట్‌లో వివిధ పధకాలకు చేసిన కేటాయింపుల్లో దాదాపు లక్షా 50వేల కోట్ల రూపాయల మేర కోతలు పెట్టి లోటు అదుపులో వుందని నమ్మబలికారు. జనాన్ని మాయ చేయటం తప్ప వేరే కాదు. ప్రభుత్వ రంగ సంస్ధలలో పెట్టుబడుల వుపసంహరణ ద్వారా వచ్చిన నిధులను కొత్త పెట్టుబడిగా పెడితే ప్రయోజనం, అలాగాక వాటిని లోటును పూడ్చు కోవటానికి వినియోగిస్తున్నారు.

Image result for india budget 2019-20

రానున్న ఐదు సంవత్సరాలలో మౌలిక వసతుల కల్పనకు వందలక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని కొండంత రాగం తీసి బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం 3.38లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. మరోవైపు రైల్వే మౌలిక సదుపాయాల నిమిత్తమే 2030 సంవత్సరంలోగా రూ.50 లక్షల కోట్లు కావాలని చెప్పి కేటాయించిన మొత్తం 66వేల కోట్ల రూపాయలు మాత్రమే. తొలిసారి అధికారానికి వచ్చిన కొత్తలో తెల్లారి లేస్తే నరేంద్రమోడీ ఏదో ఒక దేశంలో వుండేవారు. ఎందుకయ్యా అంటే దేశానికి అవసరమైన విదేశీ పెట్టుబడులు తీసుకురావటానికి అని చెప్పారు. మరోవైపు తమ నేత కొత్తగా అప్పులు చేయటం లేదని, పాత అప్పులను తీర్చినట్లు మోడీ అనుయాయులు ఎన్నికల ముందు వూదరగొట్టారు. తాజా బడ్జెట్‌లో విదేశీ బాండ్ల ద్వారా రుణాలను సేకరిస్తామని చెబుతున్నారు. ఐదేండ్లుగా సాగించిన కౌగిలింతల దౌత్యం, విదేశీయులకు పరచిన ఎర్రతివాచీ మర్యాదలద్వారా ఏమి సాధించినట్లు? ఏమాటను, ఏ చేతనూ విశ్వసించే స్దితి కనిపించటం లేదు.

మరోవైపు జనాన్ని బాదేందుకు ఏ అవకాశాన్నీ వదలటం లేదు. వివాహ సమయంలో నూతన వధూ వరులకు అరుంధతి నక్షత్రాన్ని చూడమని చెబుతారు. వారికి అది కనిపిస్తుందో లేదో తెలియదు గానీ అమ్మాయి తండ్రికి అప్పులు స్పష్టంగా కళ్ల ముందుంటాయి. అలాగే ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆశాభావం వెలిబుచ్చినట్లు చమురు ధరలు తగ్గుతాయో లేదో గాని పెట్రోలు, డీజిల్‌ మీద ప్రకటించిన ఒక రూపాయి ప్రత్యేక సుంకం మాత్రం స్పష్టంగా ధరల పెరుగుదలకు దారి తీసింది. గత ఐదు సంవత్సరాలలో తగ్గిన చమురు ధరలను వినియోగదారులు లబ్ది పొందకుండా పన్నులను పెంచారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో చమురు ధరలు తగ్గుతాయని ఏ అంచనాతో చెబుతున్నారో తెలియదు గానీ ఆ పేరుతో జనానికి వడ్డించారు. ఇష్టమైనపుడు వుంగరాల వేళ్లతో మొట్టినా సరదాగానే వుంటుందంటారు. ఇది కూడా అంతేనా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఒకేసారి ఎన్నికలు- అసలు లక్ష్యం ఏమిటి ? సమర్ధనల బండారం !

20 Thursday Jun 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Uncategorized

≈ Leave a comment

Tags

Narendra Modi, one election, one nation, one nation one election

Image result for bjp motive behind one nation, one election call and it's nature

ఎం కోటేశ్వరరావు

ఒక దేశం, ఒకేసారి ఎన్నిక అ ంటే పార్లమెంట్‌, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు అనే ప్రతిపాదన గురించి నిర్ణీత గడువులోగా సూచనలు ఇచ్చే విధంగా త్వరలో ప్రధాని నరేంద్రమోడీ ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ 2019 జూన్‌ 19న జరిగిన అఖిల పక్ష సమావేశం అనంతరం ప్రకటించారు.నలభై పార్టీలకు ఆహ్వానం పంపగా 21 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఒకేసారి ఎన్నికల ప్రతిపాదనను సిపిఎం, సిపిఐ, ఎన్‌సిపి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, మజ్లిస్‌ పార్టీలు వ్యతిరేకించినట్లు వార్తలు రాగా ,అమలు ఎలా అని ప్రశ్నించారు తప్ప ఎవరూ ఆ భావనను వ్యతిరేకించలేదని రాజనాధ్‌ సింగ్‌ విలేకర్లతో చెప్పారు. ఈ అంశానికి సంబంధించి ప్రతిపాదన వెనుక వున్న వుద్దేశ్యాలేమిటి, వివిధ వాదనలు, వాటి బండారం గురించి చూద్దాం.భిన్న అభిప్రాయాలను వినటానికి మేము సిద్దంగా లేము, మా మనోభావాలు దెబ్బతింటాయి అనుకొనే వారు దీనిలో మిగతా భాగం చదవకుండా వదలి వేయటానికి స్వేచ్చ వుంది.

ముందుగా తెలుసుకోవాల్సింది ఈ ప్రతిపాదన సరికొత్తది కాదు, మూడున్నర దశాబ్దాలుగా ఏదో ఒక రూపంలో ముందుకు వస్తూ వెనక్కు పోతున్న అంశం.1983లో ఎన్నికల సంఘం దీని గురించి ప్రస్తావించింది.1999లో వాజ్‌పేయి సర్కార్‌ మరోసారి ముందుకు తెచ్చింది. తరువాత ఎల్‌కె అద్వానీ, ఇప్పుడు నరేంద్రమోడీ వంతుగా వచ్చింది. గతేడాది లా కమిషన్‌ సమర్పించిన నివేదికలో మిగతా అంశాలతో పాటు ప్రస్తుతం వున్న రాజ్యాంగ పరిధిలో జమిలి ఎన్నికలు జరపటానికి అవకాశం లేదని న్యాయశాఖకు నివేదించింది.అంతకు ముందు నీతి అయోగ్‌ కూడా దీని గురించి సూచనలు చేసింది. నరేంద్రమోడీ ఏర్పాటు చేయబోయే కమిటీ ఏమి చెబుతుందో చూద్దాం. బిజెపిని నడిపిస్తున్న సంఘపరివార్‌ తన అజెండాను మరింత ముందుకు తీసుకుపోవాలంటే ప్రస్తుతం వున్న రాజ్యాంగం అనువుగా లేదు. కొంత మేరకు ఆటంకంగా వుంది. అందువలన దాని లౌకిక మౌలిక స్వరూపాన్ని, స్వభావాన్ని సమూలంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలనే దుష్ట ఆలోచన వుంది. ఇప్పటికే ఆర్టికల్‌ 370కోసం రాజ్యాంగాన్ని మార్చాలనే దాని వైఖరి తెలిసిందే. అది జరగాలంటే నూతన రాజ్యాంగసభకు తప్ప పార్లమెంట్‌, సుప్రీం కోర్టులకు కూడా అలాంటి అవకాశం లేదనే అభిప్రాయంలను నిపుణులు ఇంతకు ముందే అభిప్రాయ పడ్డారు. రాజ్యాంగపరిషత్‌తో నిమిత్తం లేకుండా సదరు ఆర్టికల్‌ను సవరించాలంటే పార్లమెంట్‌ ఆమోదంతో పాటు జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీ ఆమోదం కూడా అవసరం. ఇప్పుడున్న పరిస్ధితుల్లో ఏ పార్టీ అధికారంలో వున్నప్పటికీ అలాంటి తీర్మానం శాసనసభలో ఆమోదం పొందే అవకాశం లేదు. అలా జరగాలంటే అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచటం, హిందువులు మెజారిటీగా వున్న ప్రాంతాలలో సీట్లను పెంచి, ముస్లింలు ఎక్కువగా వున్న చోట తగ్గించి మెజారిటీగా హిందువులు ఎన్నికయ్యేట్లు చూస్తేనే అలాంటి తీర్మానం ఆమోదం పొందే అవకాశం వుంది. కనుకనే బిజెపి ఆ రాష్ట్ర అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుదల, మార్పు గురించి ఆలోచనలు చేస్తున్నది. ప్రస్తుతం వున్న నిబంధనల ప్రకారం దేశంలో మిగతా చోట్ల ఐదు సంవత్సరాలు అయితే జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీ వ్యవధి ఆరు సంవత్సరాలు. నరేంద్రమోడీ ముందుకు తెచ్చిన ఒకేసారి ఎన్నికలకు తొలి రాజ్యాంగపరమైన అడ్డంకి ఇక్కడే మొదలౌతుంది. దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటం పోయి కొత్త వివాదాలను ముందుకు తేవటం అంటే అసలు సమస్యలనుంచి జనం దృష్టిని మళ్లించే ఎత్తుగడ దీనిలో వుందన్నది స్పష్టం.

1967వరకు అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. తరువాత దేశంలో ఎన్నికలు నిరంతరం జరుగుతున్న కారణంగా అభివృద్ధి కుంటుపడుతున్నది, పధకాలను అమలు జరపాలంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అడ్డువస్తున్నది. అందువలన ఒకేసారి ఎన్నికలు జరిపితే ఎన్నికల ఖర్చు తగ్గుతుంది. ఎన్నికలలో ఓటర్ల భాగస్వామ్యం పెరుగుతుంది. భద్రతా సిబ్బంది మీద వత్తిడిని తగ్గించవచ్చు. ప్రధానంగా ముందుకు తెస్తున్న వాదనలు ఇవి. 1999లో లా కమిషన్‌ జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసింది. ఒక వేళ అవిశ్వాస తీర్మానం పెడితే, దానితో పాటు ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి విశ్వాస తీర్మానాన్ని కూడా పెట్టాలని సూచించింది. అంటే ఒక ప్రభుత్వం పడిపోయినా చట్టసభలను రద్దు చేయకుండా ఏదో ఒక ప్రభుత్వాన్ని ఎన్నికచేసి కొనసాగించాల్సిందే.

2015లో పార్లమెంటరీ కమిటీ నివేదికలో జమిలి ఎన్నికలను సిపార్సు చేశారు. తరువాత నరేంద్రమోడీ సూచనల మేరకు 2019, 2021లో రెండు దశల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను జరపాలని నీతి అయోగ్‌ సూచించింది. కానీ దాని మీద రాజకీయ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు ముగిసి మోడీ మరింత మెజారిటీతో విజయం సాధించారు. దీంతో తిరిగి ఈ అంశాన్ని ముందుకు తెచ్చారు. గతంలో నీతి ఆయోగ్‌ ముందుకు తెచ్చిన సూత్రం ప్రకారం 2018,19లో జరగాల్సిన 12 అసెంబ్లీ ఎన్నికలను, లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి జరపాలి. మిగిలిన అసెంబ్లీలకు 2021లో జరపాలి. అంటే దీని ప్రకారం ఐదు సంవత్సరాలలో ఒకసారికి బదులు రెండు సార్లు జరుగుతాయి. మరొక సూచన ప్రకారం 2024 నుంచి ఒకేసారి జరపాలి. దీనికి గాను రాజ్యాంగ సవరణలు చేయాలి.

అభివృద్ధికి ఎన్నికలకు లంకె !

ఇది ఒక అసంబద్దమైన వాదన.1952తొలిసాధారణ ఎన్నికల నుంచి 1967వరకు కేరళ వంటి ఒకటి రెండు చోట్ల తప్ప ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ కాలంలో అధికారంలో వున్న కాంగ్రెస్‌ 1967 ఎన్నికలలో లోక్‌సభలో మెజారిటీ తెచ్చుకున్నప్పటికీ తొలిసారిగా తొమ్మిది రాష్ట్రాలలో అధికారాన్ని కోల్పోయింది. నాడు మొదలైన రాజకీయ సంక్షోభం మరో రెండు సంవత్సరాలలో కాంగ్రెస్‌లో చీలికకు, పర్యవసానంగా లోక్‌సభను ఏడాది ముందుగానే రద్దు చేసి 1971లో ఎన్నికలకు పోవటం, ఆ సందర్భంగా ఇందిరా గాంధీ ఎన్నికల అక్రమాలపై కోర్టు తీర్పు, దాన్ని వమ్ము చేసేందుకు రాజ్యాంగసవరణ, అత్యవసర పరిస్ధితి వంటి పరిణామాలన్నీ తెలిసిందే. నిజానికి పదిహేను సంవత్సరాల పాటు రాజకీయ స్ధిరత్వం వున్నా దేశంలో జరిగిన అభివృద్ధి ఏమిటి ? నిరుద్యోగం, ధరల పెరుగుదల, చెల్లింపుల సమస్య తలెత్తటం, ప్రపంచబ్యాంకు పెత్తనాన్ని అంగీకరించటం ఈ కాలంలో జరిగినవే. జయప్రకాష్‌ నారాయణకేమీ పనిపాటా లేక లేదా అధికారం కోసం ఆందోళనలు నిర్వహించలేదు. తరువాత వాజ్‌పేయి పాలనా కాలంలో ప్రభుత్వ స్ధిరత్వానికి ఎలాంటి ముప్పు లేదు, దేశం వెలిగిపోతోందంటూ బిజెపి ప్రచారం చేసుకుంది, అయినా ఆ పార్టీ ఓడిపోయింది. గత అయిదు సంవత్సరాలలో కూడా రాజకీయంగా ఎలాంటి అస్ధిర పరిస్ధితి లేదు, బిజెపి ఏ బిల్లుపెడితే ఆ బిల్లు, ఏ నిర్ణయం తీసుకుంటే అది అమలు జరిగింది. అయినా 1971 నాటి స్ధాయికి నిరుద్యోగం పెరిగింది. ఇద్దరు రిజర్వుబ్యాంకు గవర్నర్లు, ఒక ప్రధాన ఆర్ధిక సలహాదారు అర్ధంతరంగా రాజీనామా చేసి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అభివృద్ధి అంకెల గారడీ చేసి లేని అభివృద్ధిని వున్నట్లు చూపారని మాజీ ప్రధాన ఆర్ధిక సలహాదారు చెబుతుంటే, అభివృద్ధి అంకెలే నిజమైతే దానికి అనుగుణ్యంగా వుపాధి ఎందుకు లేదని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు లేదు. ఇలాంటి వాటి మీద చర్చ జరిగితే తమకు నష్టం కనుక వేరే అంశాలను జనం ముందు పెడుతున్నారనే అభిప్రాయం వుంది.

పోనీ ప్రపంచంలో అనేక దేశాలలో పార్లమెంట్‌, రాష్ట్రాల అసెంబ్లీలు,చివరికి స్ధానిక సంస్ధలకు కూడా ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న వుదంతాలు వున్నాయి. వాటి అభివృద్ధి సంగతేమిటి? ప్రతి ఏటా ఎక్కడో ఒకదగ్గర ఎన్నికలు జరుతున్నా, కేంద్రీకరణ పక్కదారి పడుతున్నా మన దేశ అభివృద్ధి ఏడుశాతంపైగా వుందని, చైనాను అధిగమించామని మన పాలకులు చెబుతున్నారు కదా ! అమెరికాలో అలాంటి పరిస్ధితి లేదు, ఐరోపా దేశాలలో లేదు, అనేక చోట్ల ప్రభుత్వాలు కూలిపోయినా, ఏదోఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి తప్ప చట్ట సభలు రద్దు కావటం లేదు. మరి అక్కడ ఒకటి నుంచి మూడుశాతంలోపే అభివృద్ధి రేటు ఎందుకు వుంటున్నట్లు? ధనిక దేశాలన్నీ సంక్షోభాలను ఎందుకు ఎదుర్కొంటున్నట్లు ? వాణిజ్య యుద్దాలకు ఎందుకు పాల్పడుతున్నట్లు ? అనేక దేశాలలో నియంతలు ఎన్నికలే లేకుండా , లేదూ జరిపినా తూతూ మంత్రంగా చేసి దశాబ్దాల తరబడి అధికారంలో పాతుకుపోయిన చోట్ల కూడా అభివృద్ధి ఆమడ దూరంలో వుండటాన్ని చూశాము. అభివృద్ధి అనుసరించే విధానాలను బట్టి తప్ప ఎన్నికలకు దానికి సంబంధం లేదు. ఎవరైనా వుంది అంటే పైన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.

ఖర్చు తగ్గింపు వాదన !

ఎన్నికల ఖర్చు తగ్గించాలనటంలో ఎలాంటి విబేధం లేదు, అయితే ఏ ఖర్చు అన్నది అసలు సమస్య. ఈ ఏడాది జరిగిన ఎన్నికల ఖర్చు 60వేల కోట్ల వరకు వుంటుందని, దానిలో ఎక్కువ భాగం బిజెపి చేసిందన్నది జగమెరిగిన సత్యం. దాన్ని తగ్గించటం ఎలా అన్నది చర్చిస్తే అర్ధం వుంటుంది. దాన్ని మరుగుపరచి అధికారిక ఖర్చు తగ్గింపు గురించి జనం దృష్టిని పక్కదారి మళ్లిస్తున్నారు. ఒక పోలింగ్‌ బూత్‌లోనే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే కలసి వచ్చేది భద్రతా సిబ్బంది, కొంత మేర రవాణా ఖర్చు తప్ప మిగిలినవేవీ తగ్గవు. ఓటింగ్‌ యంత్రాలు, వాటి నిర్వహణకు ఎన్నికల సిబ్బందిలో తగ్గేదేమీ వుండదు. ఒక రాష్ట్రంలో ఒక రోజు ఎన్నికలు జరిపే పరిస్ధితి లేదు, రాను రాను ప్రతి ఎన్నికకూ భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచాల్సి వస్తోంది. దానికి కారణం ఎన్నికలు ఎప్పుడూ జరగటం కాదు. శాంతిభద్రతల సమస్యలు, ఓట్ల రిగ్గింగు, గూండాయిజం వంటి ఆవాంఛనీయ ధోరణులు పెరగటం. అలాంటపుడు ఒకేసారి జరిగితే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయా? ఓట్ల కొనుగోలు, మద్యం, మాదక ద్రవ్యాలు, బహుమతుల వంటి ఇతర ప్రలోభాలను తగ్గించటం ఎలా అన్నది అసలు సమస్య. వామపక్షాలు తప్ప మిగిలిన పార్టీలన్నీ ఒకటో అరో తప్ప రిజర్వుడు నియోజకవర్గాలలో కూడా డబ్బు ఖర్చుపెట్టగల వారినే అభ్యర్ధులుగా నిలుపుతున్న తరువాత వారు గెలుపుకోసం డబ్బు ఖర్చు చేయకుండా ఎలా వుంటారు. ఎన్నికల తరువాత పెట్టిన పెట్టుబడికి వడ్డీతో సహా వసూలు చేసుకోవటమే కాదు, వచ్చే ఎన్నికలకు సైతం అవసరమైన నిధులను సంపాదించుకొనేందుకు చూస్తున్న స్ధితి.ఆంధ్రప్రదేశ్‌కు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఎవరైనా తక్కువ ఖర్చు చేశారా, ఓట్ల కొనుగోలు, అమ్మకాల ధరలేమైనా తగ్గాయా ? ఏ ఎన్నికలలో పోటీ చేసే వారు ఆ ఎన్నికలకే వుంటారు. ఎంపీ, ఎంఎల్‌ఏలుగా ఒకేసారి ఒకరే పోటీ చేయరు. ఈ ఎన్నికల బరిలోకి దిగిన వారు స్ధానిక సంస్దల వైపు రారు. ఎవరి స్ధాయిలో వారి కొనుగోళ్లు, ప్రలోభాలు వుంటాయని తెలంగాణాలో ఆరు నెలల వ్యవధిలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్‌, గ్రామీణ స్ధానిక సంస్ధ ఎన్నికలు రుజువు చేశాయి. కాళేశ్వరం పనులేమీ ఆగలేదు, ఆరు నెలలకు ముందు వుద్యోగఖాళీలనేమీ నింపలేదు, ఎన్నికలు జరిగిన ఆరునెలల్లో కూడా అదే పరిస్దితి. అందువలన అభివృద్ధి ఆగటం అంటే ఏమిటి? ఈ వాదన చివరకు అసలు ఎన్నికలే లేకపోతే అంతా సాఫీగా సాగుతుంది, ఓట్ల ఖర్చు వుండదు, అంతా అభివృద్ధికే మళ్లిస్తారన్న వాదనలనూ ముందుకు తెచ్చేవారు వుంటారు.

అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడతాయి !

ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా అన్ని అభివృద్ధి పధకాలు ఆగిపోతాయి. ఇదొక పచ్చి అవాస్తవం. చట్టసభల పదవీ కాలం అరవై నెలలు అనుకుంటే ఎన్నికల నిర్వహణ జరిగేది గరిష్టంగా ఒక నెల, రెండు నెలలు. ఈ కాలంలో అభివృద్ధి ఆగిపోతుందా? అసలు అభివృద్ధి అంటే ఏమిటి? కేంద్రంలో లేదా రాష్ట్రాలలో ఎన్నికలు వస్తున్నాయంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాక ముందే పధకాలను ప్రకటిస్తున్నారు, నిబంధనావళి అమల్లోకి వచ్చిన తరువాత కొత్త పధకాలు ప్రకటించకూడదు, ఓటర్లను ప్రభావితం చేసే వాగ్దానాలను ఎన్నికల ప్రణాళిక రూపంలో ఎలాగూ చేయవచ్చు. అంతే తప్ప పాతవాటిని అమలు నిలిపివేయాలన్న నిబంధనలేవీ లేవు. సంక్షేమ పెన్షన్లు, వుద్యోగుల జీతభత్యాలు ఆగవు.మహా అయితే కరువు భత్యం వంటివి వాయిదా పడతాయి. రోజూ ఎన్నికలైతే అధికారులు పనులేమి చేస్తారు అన్నది మరొక వాదన. ఎన్నికలు లేనపుడు అధికారులు ముమ్మరంగా పనులు చేస్తున్నట్లయితే లక్షలాది ఫైళ్లు ఎందుకు గుట్టలుగా పేరుకుపోతున్నట్లు ? కోర్టులలో కేసుల విచారణకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఆటంకం కాదు, అయినా ఏండ్లతరబడి ఎందుకు సాగుతున్నట్లు ? మంత్రుల పని కుంటుపడుతుంది, ఇంతకంటే హాస్యాస్పద వాదన మరొకటి లేదు.

స్ధిరత్వం కావాలి !

ఎన్నికైన చట్ట సభలు స్ధిరంగా పని చేయాలి. రద్దు కాగూడదు. కొన్ని దేశాలలో ప్రభుత్వం పడిపోతే మరొక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు తప్ప సభలను రద్దు చేసి మాటి మాటికి ఎన్నికలకు పోరు. అసలు ప్రభుత్వాలు పడిపోవాల్సిన అవసరం ఏమి వచ్చింది? అవినీతి, అక్రమాలకు పాల్పడితేనో, ప్రజావ్యతిరేక చర్యలకు జనం నిరసన తెలిపితేనో ఏదో ఒక బలమైన కారణం వుంటే తప్ప ప్రభుత్వాలు పతనం కావు. తూచ్‌ ఈ రోజు ఈ ఆట, రేపు ఇంకొక ఆట ఆడుకుందామని చెప్పటానికి ఎంపీలు, ఎంఎల్‌ఏలు ఏమైనా పసిపిల్లలా ! స్దిరత్వం పేరుతో ఒక ప్రభుత్వం కూలినా మనకేమీ ఢోకా లేదు మరొక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం లెమ్మని ప్రజాప్రతినిధులు రెచ్చిపోయే పరిస్ధితిని జనం మీద రుద్దాలని చూస్తున్నారా ? తమకు వాగ్దానం చేసిన విధంగా లేదా తాము ఆశించిన విధంగా తమ ప్రజాప్రతినిధి పని చేయటం లేదని వెనక్కు పిలిపించాలని కోరే హక్కు ఓటర్లకు ఇస్తారా అంటే దాని ప్రస్తావనే లేదు.

Sitaram Yechury news

బిజెపి ఎందుకు జమిలి ఎన్నికలను కోరుతోంది ?

లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగినపుడు ఓటర్లు ఏదో ఒక పార్టీనే ఎన్నుకున్నట్లు గత ఎన్నికల ఫలితాల విశ్లేషణ వుంది. అందువలన అది తమకు అనుకూలంగా వుంటుందని బిజెపి భావిస్తోంది. గతంలో ఆ పార్టీ కొన్ని చోట్ల బలంగా వున్నప్పటికీ దేశవ్యాపితంగా లేదు, ఇప్పుడు దేశవ్యాపితంగా పెద్ద పార్టీగా ఎదిగింది కనుక తమకు అనుకూలం కనుక ఎలాగైనా ఆ విధానాన్ని అనుసరించాలనే ఆతృత ఇప్పుడు దానిలో కనిపిస్తున్నది. 2014 ఎన్నికల్లో ఢిల్లీలో బిజెపికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన ఓటర్లు వెంటనే తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని చావు దెబ్బతీసి ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా తీర్పు చెప్పారు. అలాంటి పరిస్ధితి రాకుండా చూడాలని కోరుకుంటోంది. గత ఎన్నికల్లో రెచ్చగొట్టిన మాదిరి మతభావాలు, విద్వేష ప్రచారం, వుపయోగించుకొనేందుకు పుల్వామా, కార్గిల్‌ వంటివి ప్రతి సంవత్సరం, ప్రతి సందర్భంలోనూ రావు. రెండవది విద్వేష ప్రచారాన్ని ప్రతి సంవత్సరం ప్రతి రాష్ట్రంలో రెచ్చగొట్టటం ప్రారంభిస్తే అది ఎల్లకాలమూ, అన్నివేళలా ఆశించిన ఫలితాలు రావు. ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలు, ఒకే పార్టీ, ఒకే నాయకుడు, ఒకే మతం, అది కూడా హిందూమతం ఇలా అజెండాను అమలు జరపవచ్చు. ప్రస్తుతం అన్ని పార్టీల కంటే అది ఆర్ధికంగా, ఇతరత్రా బలంగా వుంది కనుక ఒకేసారి ఎన్నికలు జరిపితే మిగతా వాటి కంటే ముందుండవచ్చు. ఇలా దాని కారణాలు దానికి వున్నాయి.

జమిలి ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసింది ఎవరు ?

పార్లమెంట్‌, అసెంబ్లీలకు ఒకేసారి జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసింది కాంగ్రెస్‌ పార్టీ అని బిజెపి నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దానికి గాను 1959లో కేరళలో కమ్యూనిస్టు నేత నంబూద్రిపాద్‌ ప్రభుత్వాన్ని రద్దు చేయటాన్ని చూపుతున్నారు. దానిలో కాదనాల్సిందేమీ లేదు. అయితే ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. రెండోవైపు కూడా చూడాలి. నేటి బిజెపి పూర్వ రూపం జనసంఘం. నంబూద్రిపాద్‌ ప్రభుత్వాన్ని కూల్చివేయటంలో కాంగ్రెస్‌,ఆర్‌ఎస్‌ఎస్‌ దాని రాజకీయ విభాగం జనసంఘం, కేరళలోని మెజారిటీ, మైనారిటీ మతశక్తులు, మీడియా, వీటన్నింటినీ సమన్వయ పరచిన అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ, అమెరికా రాయబారులు తమ వంతు పాత్రను పోషించారు. ఇదంతా విమోచన సమరం పేరుతో సాగించారు. దానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎత్తుగడలు ఎవరు రూపొందించారో అన్నింటినీ పాట్రిక్‌ మోయిన్‌ హన్‌ అక్షర బద్దం చేశారు. ఆ పధకంలో భాగంగా జనసంఘం నేత వాజ్‌పేయి కొట్టాయం వచ్చి మళయాల మనోరమ పత్రిక అధిపతి మామెన్‌ మాప్పిలై అధ్యక్షతన జరిగిన సభలో కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేశారు. 1959 జూలై 31న ఆర్టికల్‌ 356ను తొలిసారిగా వుపయోగించి నంబూద్రిపాద్‌ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆగస్టు ఒకటం తేదీన విజయ దినం పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఘంతో సహా కమ్యూనిస్టు వ్యతిరేకులందరూ సంబరాలు చేసుకున్నారు.

ప్రభుత్వాన్ని రద్దు చేసిన తరువాత అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తూ పార్లమెంట్‌లో తీర్మానాన్ని ప్రవేశపెట్టినపుడు జనసంఘం నేతగా వాజ్‌పేయి బలపరుస్తూ ఏం మాట్లాడారో చూడండి.’ కేరళ జనం అభినందనలకు అర్హులు, భవిష్యత్‌లో కూడా వారు కమ్యూనిస్టు పార్టీకి తగిన జవాబు చెబుతారని ఆశిస్తున్నాను.నేను కాంగ్రెస్‌ను విమర్శించే వాడినే అయినప్పటికీ కాంగ్రెస్‌ నాయకత్వంలోని 13 రాష్ట్రాలలో ఏం జరిగిందో చెప్పటానికి నేను వెనుకాడను, ఎక్కడా సెల్‌ కోర్టులను ఏర్పాటు చేయలేదు(కమ్యూనిస్టు పార్టీ శాఖల కోర్టులని వాజ్‌పేయి భావం), పద్నాలుగు సంవత్సరాల యువకులు వారి ఇండ్ల నుంచి బయటకు రాకుండా నిషేధించలేదు. కమ్యూనిస్టులను వివాహం చేసుకోవాలని ఏ తలిదండ్రులూ తమ బిడ్డలకు చెప్పలేదు, సెల్‌ కోర్టులను దిక్కరించిన వారిని ఎక్కడా కత్తిపోట్లకు గురిచేయలేదు. ఈ మాటలు చెబుతూ నేను తీర్మానాన్ని బలపరుస్తున్నాను ‘ అన్నారు. తరువాత జనతా పార్టీలో విభాగమైన వాజ్‌పేయి తదితరులు అదే ఆర్టికల్‌ను వుపయోగించి కాంగ్రెస్‌ ప్రభుత్వాలను రద్దు చేయటం గురించి వేరే చెప్పనవసరం లేదు.

కేరళలో కమ్యూనిస్టుల గురించిన తప్పుడు ప్రచారం ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో తరచుగా కనిపిస్తున్నట్లుగా కమ్యూనిస్టు గ్రామాల్లో మరొక పార్టీని బతకనివ్వరని, వ్యతిరేకించేవారిని చంపివేస్తారనే ప్రచారం 1950దశకంలోనే ప్రారంభమైంది. వాజ్‌పేయి అంతటి వ్యక్తే దాన్ని పార్లమెంట్‌ వేదికగా కొనసాగించిన తరువాత ఆయన వారసులుగా చెప్పుకొనే అంతర్జాల పోకిరీల గురించి చెప్పాల్సిన పనిలేదు. లవ్‌ జీహాద్‌ పేరుతో ఇప్పుడు ముస్లింలపై తప్పుడు ప్రచారం చేసినట్లుగానే గతంలో కమ్యూనిస్టుల మీద కూడా ఇలాంటి నిందా ప్రచారం జరిగినట్లు వాజ్‌పేయి వుపన్యాసమే సాక్షి.

Image result for one nation, one election

రాజ్యాంగ నిబంధనలు, స్ఫూర్తికి వ్యతిరేకమైన ఈ ప్రతిపాదనలను వామపక్షాలు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాయి. కాన్ని ప్రాంతీయ పార్టీలు వాటి పర్యవసానాలు, తెరవెనుక లక్ష్యాలను గుర్తించలేక సమర్దిస్తున్నాయి. ఎన్నికల్లో కండబలం, ధనబలం, అధికార దుర్వినియోగాన్ని గణనీయంగా అరికట్టేందుకు ఇప్పుడున్న మార్గం దామాషా పద్దతిలో ఎన్నికల నిర్వహణ చేపట్టటమే. ఎవరైనా ఫిరాయింపులను ప్రోత్సహించినా, పాల్పడినా వారి సభ్యత్వం రద్దయి, ఆ పార్టీ జాబితాలో వున్న ఇతరులతో ఆ స్ధానాన్ని పూర్తి చేసే విధంగా సంస్కరణలు చేపట్టాలి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, ఎంతమందికి అవకాశం వస్తుందో ముందుగా తెలియదు కనుక అభ్యర్ధులు డబ్బు ఖర్చు చేసే పరిస్ధితి వుండదు. ఎవరైనా వ్యక్తులుగా పోటీ చేయదలచుకుంటే, నియోజకవర్గాలు ఎలాగూ వుంటాయి కనుక వాటిలో పోటీ చేసి సత్తా వుంటే తగిన ఓట్లు తెచ్చుకొని ఎన్నిక కావచ్చు. అందువలన ఇలాంటి ఆచరణ సాధ్యమైన విధానాల గురించి చర్చిస్తే వుపయోగం. అందుకు బిజెపితో సహా ఎన్ని పార్టీలు సిద్ధం అన్నది ప్రశ్నార్దకం.ఎందుకంటే ప్రతి పార్టీ డబ్బు, రెచ్చగొట్టటం వంటి పద్దతుల్లో గెలవటం సులభం అనుకుంటున్నందున ప్రతి ఓటు తన ప్రతినిధిని చట్టసభలకు పంపే న్యాయం జరిగే ఇలాంటి ప్రజాస్వామ్యబద్దమైన సంస్కరణలకు అనుకూలంగా వున్న పార్టీలను ప్రోత్సహించటంతో పాటు పౌర సమాజమే ముందకు వచ్చి, అడ్డుపడుతున్న వారిని నిలదీయాల్సిన అవసరం వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బుద్ధి లేని జనాకర్షక, జాతీయ వాదులు !

31 Friday May 2019

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, UK, USA

≈ Leave a comment

Tags

Europe Far-Right, European Commission President Jean-Claude Juncker, Hindu Fundamentalism, Hindu Supremacists, india's saffron brigade, Populists, saffron nationalists, Stupid Nationalists

Image result for eu far right

ఎం కోటేశ్వరరావు

జాతీయ వాదులకు బుద్ధి లేదు, వారి దేశాలను ప్రేమిస్తారు, విదేశీయులను ద్వేషిస్తారు అని ఐరోపా కమిషన్‌ అధ్యక్షుడు జీన్‌ క్లాడ్‌ జుంకర్‌ ఐరోపా పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఘాటుగా వ్యాఖ్యానించారు. మే చివరి వారంలో జరిగిన ఆ ఎన్నికల ఫలితాల సరళి ప్రకారం జాతీయవాదులు లేదా పచ్చి మితవాదులు సంపూర్ణ మెజారిటీ వైపుగాక పోయినా గతం కంటే ఎక్కువ స్ధానాలు సంపాదించారు. మన దేశంలో రెండు భావజాలాల మధ్య జరిగిన పోటీగా ఎన్నికలు జరిగాయని, బిజెపి పేరు పెట్టి చెప్పకపోయినా జాతీయవాదులు విజయం సాధించారని ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యాఖ్యానించింది. మన కాషాయ బ్రాండ్‌ జాతీయవాదులు విదేశీయులకు బదులు మైనారిటీలు, మైనారిటీ మతాలను, కమ్యూనిజాన్ని ద్వేషిస్తున్నారు. తమకే అగ్రస్ధానం అన్నది అమెరికా జాతీయవాదం. దానికోసం అనేక దేశాలలో జోక్యం చేసుకొని యుద్దం చేస్తున్నది, చైనా వంటి దేశాలతో వాణిజ్య యుద్ధాలకు పాల్పడుతోంది. మన వంటి దేశాలను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నది. అవి దాని జాతీయవాదంలో భాగం. ఆఫ్రో-అమెరికన్‌లను ద్వేషించటం అమెరికాలోని మెజారిటీ శ్వేతజాతీయ వాదం. మన స్వాతంత్య్రవుద్యమలో బ్రిటీష్‌ పాలకులను వ్యతిరేకించటం, వారి పాలనకు సహాయ నిరాకరణ, విదేశీ వస్తు బహిష్కరణ వంటివి మన మహత్తర జాతీయవాదంలో భాగం. బ్రిటీష్‌ వారికి సలాం కొట్టిన సావర్కర్‌ను కీర్తించటం, గాంధీని చంపిన గాడ్సేను వెనకేసుకు రావటం కూడా నేడు తామే అసలు సిసలు జాతీయ వాదులమని చెప్పుకొనే కుహనా శక్తులు చేస్తున్నపని. పాకిస్ధాన్‌ను, చైనా వస్తువుల దిగుమతులను వ్యతిరేకించటం, అమెరికా ఆంక్షలను ప్రశ్నించకుండా ఆమోదించటం మన కాషాయ వాదుల జాతీయ వాదం. అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యావాదుల దాడులను ప్రతిఘటించటం చైనా జాతీయవాదం. వీటిన్నింటినీ ఒక దగ్గర చేర్చి ఏ జాతీయవాదాన్ని ఎంచుకోవాలి, ఏది పురోగామి, ఏది తిరోగామి అనే ఎంపిక క్లిష్టంగా వుంటుంది. ఒక దగ్గర జాతీయవాదులకు బుద్ధిలేదని తిడుతుంటే, మరొక దగ్గర జాతీయవాదుల విజయాన్ని కీర్తిస్తున్నారు. అమెరికా జాతీయ వాదానికి మన కాషాయవాదులు మినహా ప్రపంచవ్యాపితంగా వ్యతిరేకతం వ్యక్తం అవుతోంది. ఏమిటీ వైపరీత్యం ? అసలు జాతీయ వాదం అంటే ఏమిటి?

ప్రపంచ వ్యాపితంగా ముఖ్యంగా ఐరోపాలో ప్రజాకర్షక, జాతీయవాదులు -వీరందరినీ మితవాదులు అనవచ్చు. వీరి వైఖరి ఆయాదేశాల పరిస్ధితులను బట్టి మారుతూ వుంటుంది గాని మౌలిక లక్షణం మితవాదం, అది ముదిరితే పచ్చి మితవాదం, మతవాదం, ఇంకా నయా ఫాసిజం, నాజీజం. ఎందుకీ పరిస్ధితి తలెత్తింది అన్నది అభ్యుదయవాదులు, మౌలికంగా పెట్టుబడిదారీ వ్యవస్ధను సమర్ధించే సాధారణ లౌకికవాదుల ముందున్న ప్రశ్న. ఐరోపానే తీసుకుందాం. వలస కార్మికుల సమస్యపై జాతీయ వాద రాజకీయవేత్తల వైఖరి ఐరోపా ఐక్యతకే స్పష్టమైన ముప్పును ముందుకు తెచ్చింది అని జుంకర్‌ చెప్పారు. ‘ ఈ ప్రజాకర్షకులు, జాతీయ వాదులు, బుద్దిలేని జాతీయవాదులు తమ దేశాలను ప్రేమిస్తారు, సుదూరాల నుంచి వచ్చే వారిని వారు ఇష్టపడరు మన కంటే దుర్భర పరిస్ధితుల్లో వున్న వారికి మనం మద్దతుగా వ్యవహరించాలి’ అని జుంకర్‌ చెప్పారు. ఐరోపాలో, అమెరికాలో ఒకనాడు పాలకులే వలసలను ప్రోత్సహించారు. ఇప్పటికీ ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే వారు ప్రాతినిధ్యం వహించే కార్పొరేట్‌ శక్తులకు వలస కార్మికుల వలన లాభాలు ఎక్కువగా వుంటాయి కనుక. గతకొద్ధి దశాబ్దాలుగా వుపాధి రహిత అభివృద్ధి జరుగుతోంది కనుక ధనిక దేశాలలో నిరుద్యోగం, వేతనాల పతనం, ఎగుమతుల అభివృద్ధి పేరుతో వేతనాల కోత, ప్రజాధనం ఎగుమతుల రాయితీలకు మళ్లించటంతో సంక్షేమ పధకాలకు కోతలతో సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఆ అసంతృప్తిని సొమ్ము చేసుకొనేందుకు మితవాదులు, జాతీయవాదులు, జాత్యంహకార వాదులు పెరుగుతున్నారు. అది తమకు నష్టదాయకమని కార్పొరేట్‌లు భావిస్తున్న కారణంగానే వారి ప్రతినిధి జుంకర్‌ మండిపడుతున్నారు. ఇది పాలకశక్తుల మధ్య అధికారం కోసం జరిగే పోరులో జాతీయవాదులు, జనాకర్షకవాదులది దగ్గర దారి. నరేంద్రమోడీ భారత్‌లో పెద్ద (సామాజిక) విభజన వాది అని టైమ్‌ పత్రిక వర్ణించిన విషయం తెలిసిందే. ముస్లింలు, క్రైస్తవులు మన కళ్ల ముందే పుట్టి పెరిగిన వారిని హిందూత్వ జాతీయ వాదులు ఎలా చూస్తున్నారో వివరించాల్సిన అవసరం లేదు. వారు ఈ దేశానికి విధేయులుగా లేరనే ప్రచారం, జాతీయవాదులుగా నిరూపించుకోవాలని పదే పదే అనటం తెలిసిందే. ఐరోపా దేశాలలో కూడా జాత్యహంకారులు, శ్వేతజాతి వాదులు మైనారిటీలను, విదేశాల నుంచి వలస వచ్చిన వారికి దేశం పట్ల విధేయత వుండదని ఇలాగే అవమానిస్తారు.

Related image

ఐరోపా అంతటా ఇటీవలి కాలంలో మితవాదం పెరుగుతోంది, ఇదే సమయంలో సోషల్‌ డెమోక్రసీ తరుగుతోంది. మన దేశంలో కూడా జరిగింది అదే. కాంగ్రెస్‌ పార్టీ పతనానికి సూచిక అది. లౌకికశక్తుల మీద మిత, మతవాద శక్తులు పైచేయి సాధించాయి. నాజీ హిట్లర్‌ తరువాత జర్మనీలో ఏడు దశాబ్దాల పాటు ఐరోపా తరహా ప్రజాస్వామ్యమే వుంది తప్ప మితవాద శక్తులు తలెత్తలేదు. అలాంటి చోట ఎఎఫ్‌డి( జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీ) అనే పచ్చి మితవాద పార్టీ మూడవ శక్తిగా వునికిలోకి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్దంలో దెబ్బతిన్న ఐరోపా తిరిగి తమకు పోటీగా బలపడకూడదని అమెరికా భావించింది. ఒంటరిగా వుంటే ఏనుగు వంటి అమెరికాను ఎదిరించి ప్రపంచ మార్కెట్లో తమ వాటాను తాము కాపాడుకోలేమని గ్రహించిన యూరోపియన్‌ కార్పొరేట్‌ శక్తుల ఆలోచన ప్రకారమే ఐరోపా యూనియన్‌ వునికిలోకి వచ్చింది. ఐరోపా బొగ్గు, వుక్కు కమ్యూనిటీతో 1951లో ప్రారంభమై ఏడుదశాబ్దాలుగా సరిహద్దుల చెరిపివేత వరకు వచ్చిన ఐరోపా యూనియన్‌ మీద ఇప్పుడు అనేక దేశాలలో వ్యతిరేకత పెరుగుతోంది. ఎవరి కాపురం వారు పెట్టుకుందాం, ఎవరి గొడవ వారు చూసుకుందామనే ధోరణులు పెరిగాయి. దాని పర్యవసానమే ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు రావాలన్న బ్రిటన్‌ నిర్ణయం.

పిల్లి నల్లదా తెల్లదా అని కాదు అసలు అది ఎలుకలను పట్టగలదా లేదా అన్నది అసలు సమస్య అన్నట్లుగా ఐక్య ఐరోపా లేదా ప్రపంచీకరణ ఏ పేరు పెట్టినా ఐరోపాలో అమలు జరిగింది పెట్టుబడిదారీ విధానమే. అది ఇప్పుడు మరోసారి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటటోంది. కమ్యూనిజం వైఫల్యం చెందింది అన్నది దాని వ్యతిరేకుల మాట. ఇప్పుడు పెట్టుబడిదారీ వైఫల్యం చెందింది అన్నది దాని అనుకూలురు చెబుతున్నమాట. ఈ ఏడు దశాబ్దాల్లో చూస్తే కార్మికవర్గం సాధించుకున్న లేదా పాలకులు వుదారంగా ఇచ్చిన అనేక సంక్షేమ పధకాలకు కోతపడుతోంది. వేతనాలు పెరగటం లేదు. వుపాధి సమస్యలు ముందుకు వస్తున్నాయి. యూరోపియన్లు వందల సంవత్సరాల పాటు ప్రపంచంలోని మూల మూలకు వలసలు పోయి అక్కడి సంపదలను స్వంతం చేసుకున్న చేసుకున్నారు. అసలు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాలే అలా ఏర్పడ్డాయి. స్దానికులను మైనారిటీలుగా మార్చి వారి మీద పెత్తనం చేసిన, ఇప్పటికీ చేస్తున్న చరిత్ర మన కళ్ల ముందు వుంది. మరి అలాంటి దేశాలలో ఇప్పుడు ఇతరం ఖండాల నుంచి వలస వస్తున్న వారినే కాదు, ఐరోపాలోనే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వస్తున్న తోటి వారినే అనుమతించకూడదన్న సంకుచిత భావాలు తలెత్తటానికి, పెరిగి పెద్దవి కావటానికి అనువైన పరిస్ధితులు ఏర్పడ్డాయి. అమెరికాలో కూడా అంతే పొరుగుదేశమైన మెక్సికో నుంచి వలసలు రాకుండా ట్రంప్‌ మహాశయుడు ఏకంగా సరిహద్దులో గోడ కడతానంటున్నాడు. బెర్లిన్‌ గోడను బద్దలు చేసినందుకు సంతోషం వెలిబుచ్చిన పెద్దలు వారే ఇప్పుడు కొత్త గోడలు కడుతున్నారు.

ఎటు తిరిగి ఎటు చూసినా పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యమే కనిపిస్తోంది. అందుకు సాంప్రదాయ పార్టీలే కారణం అంటే కాదనలేని స్ధితిలో అవి పడ్డాయి. దాన్ని అవకాశంగా తీసుకొని చూడండి అల్లావుద్దీన్‌ అద్బుతదీపం మాదిరి అద్బుతాలు చేస్తామని చెప్పేశక్తులు ముందుకు వస్తే ఒకసారి చూస్తే పోలా అని ఎవరికి వారు అనుకుంటున్నారు. వారికి ఫాస్ట్‌ ఫుడ్‌ లేదా ఎటిఎం మాదిరి వెంటనే కోరుకున్నది కావాలి. ఇన్నేండ్లుగా మేము నమ్మిన పార్టీలు నట్టేట ముంచాయి. వాటి మీద ఏమాత్రం నమ్మకం లేదు. వారు చేయలేనిదానిని మేము చేస్తామని కొత్తగా రంగంలోకి వచ్చిన వారు చెబుతున్నారు. వారు మితవాదులా అతివాదులా అన్నది మాకనవసరం, పని చేసే వారు, ఫలితాలు ఇచ్చేవారు కావాలి. వారికీ ఒక అవకాశం ఇచ్చి చూస్తాం, మితవాదులు వస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు అంటున్నారు, అలాంటిదేదైనా వస్తే అప్పుడు చూసుకుందాం అనే ధోరణులు ఐరోపా అంతటా ప్రబలుతున్నాయి. ఈ పూర్వరంగంలోనే అనేక పార్టీలు ఇలా పుట్టి అలా ఓట్లు పొంది దేశాల రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. సాంప్రదాయ పార్టీలు మట్టి కరుస్తున్నాయి. బ్రిటన్‌లో మూడు నెలల క్రితం పుట్టిన పార్టీ ఐరోపా పార్లమెంట్‌ ఎన్నికల్లో 32శాతం ఓట్లు తెచ్చుకొని బస్తీమే సవాల్‌ అంటోంది. మన దేశంలో కూడా జరుగుతోంది అదే. కాంగ్రెస్‌ అవినీతిని అక్రమాలను కూకటి వేళ్లతో పెకలించి వేస్తామన్నది బిజెపి లేదా కాషాయ జాతీయవాదుల వాగ్దానం. యాభై ఏండ్లలో కాంగ్రెస్‌ చేయలేనిదానిని ఐదు సంవత్సరాలలో తాము చేశామని జనాన్ని నమ్మింప చూసిన యత్నాన్ని చూశాము.

నూటయాభై సంవత్సరాల క్రితం ఫెర్డినాండ్‌ లాసలే కమ్యూనిస్టు లీగ్‌లో సభ్యుడిగా వున్నప్పటికీ మార్క్స్‌, ఎంగెల్స్‌ ఆయనతో తీవ్రంగా విబేధించారు.చివరికి ఆ పెద్ద మనిషి కమ్యూనిస్టు వ్యతిరేక బిస్మార్క్‌తో చేతులు కలిపిన వైనం తెలిసిందే. అయితే ఐరోపాలో కమ్యూనిజాన్ని ఎదుర్కొనే క్రమంలో సంస్కరణ వాదలక్షణాలుండే సోషల్‌ డెమోక్రసీని ముందుకు తెచ్చిన ఆద్యుడిగా లాసాలేను చెబుతారు. నిజమైన రాజ్యాంగబద్దమైన రాజ్యంలో నిజమైన పాలకుడు ఓటరే అనే లాసాలే ప్రవచనాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అది వాస్తవం కాదని పాలకవర్గాలకు తెలిసినా, చాలా మంది ప్రజాస్వామిక వాదులు అది నిజమని నిజంగానే నమ్మారు. అయితే నూటయాభై సంవత్సరాల తరువాత వారికి ఆభ్రమలు తొలిగిపోతున్నాయన్నవి విశ్లేషకుల అభిప్రాయం. ఓటర్ల పేరుతో తీర్పులను హైజాక్‌ చేస్తున్నారు. తమకు ఎవరు ప్రయోజనకారులో, ఎవరు హాని చేస్తారో కూడా తెలియని స్ధితికి నేడు ఓటర్లు లోనై వున్నారు.

Image result for jean-claude juncker eu president

సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధల కూల్చివేతకు ముందే ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమంలో ముందుకు వచ్చిన సైద్ధాంతిక సమస్యలతో పార్టీలు విడిపోయాయి. ఆ తరువాత ఆ వ్యవస్దలు కనుమరుగు కావటంతో అనేక మందిలో విశ్వాసం సన్నగిల్లింది. నీరు గారిపోయారు, అనేక పార్టీలు కనుమరుగై బూర్జువా పార్టీల అవతారమెత్తాయి. ఒక విధమైన శూన్యం ఏర్పడింది. పెట్టుబడిదారీ విధాన వైఫల్యాలను ఎండగట్టి జన విశ్వాసాన్ని చూరగొనే స్ధితిలో మిగిలి వున్న కమ్యూనిస్టులు లేకపోవటంతో దిగజారుతున్న ఆర్ధిక పరిస్ధితులను అవకాశంగా తీసుకొని మరోసారి మితవాద, జాతీయవాద శక్తులు మోరలెత్తుతున్నాయి. అనేక మంది ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు.

1857లో మన దేశంలో తలెత్తిన ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామానికి అనేక పరిమితులు వుండవచ్చు గానీ, ఒక ప్రయత్నం జరిగింది. దాన్ని తీవ్రంగా అణచివేసిన తరువాత నాలుగు దశాబ్దాలపాటు ఎలాంటి వుద్యమాలూ రాలేదు. తరువాత కూడా బ్రిటీష్‌ వారిని పరిమిత హక్కుల కోసం ప్రాధేపడే కాంగ్రెస్‌తో ప్రారంభమైన వుద్యమంలో తరువాత ఎన్నిమార్పులు, ఎన్ని ఆలోచనలు తలెత్తిందీ చూశాము. అలాగే ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమం, భారత వామపక్ష, కమ్యూనిస్టు వుద్యమం కూడా అలాంటి పరిస్ధితినే ఎదుర్కొంటోంది. తిరిగి పుంజుకోవటం అనివార్యం. అయితే అనేక మందికి ఆ విషయంలో విశ్వాసం లేదు. ఇక్కడ ఒకటే సమస్య. పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యాల గురించి చెప్పనవసరం లేదు. చైనా సోషలిస్టు వ్యవస్ధ గురించి కొందరికి కొన్ని అనుమానాలు వున్నాయి. అది కూడా పెట్టుబడిదారీ వ్యవస్దే అన్నది కొందరి భావన. అలా భావించే వారు ఎవరికి వారు ఆలోచించాల్సిన అంశాలు రెండు. ఒకటి పెట్టుబడిదారీ వ్యవస్ధకు దోపిడీలేని మరొక ప్రత్యామ్నాయం కమ్యూనిజం తప్ప మరొకటి ఎక్కడైనా కనిపిస్తోందా? చైనా సోషలిస్టు వ్యవస్ధ కానట్లయితే దాన్ని కూల్చివేసేందుకు అమెరికా ఎందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు ? అక్కడ మిగతా పెట్టుబడిదారీ దేశాల మాదిరి సంక్షోభాలు ఎందుకు రావటం లేదు? అంతవేగంగా పురోగమించటానికి చైనా వెనుక వున్న శక్తి కమ్యూనిస్టు పార్టీ గాకపోతే మరేమిటి ? జర్మన్‌ జాతీయ వాదం హిట్లర్‌ను, ఇటలీ జాతీయ వాదం ముస్సోలినీ, అమెరికన్‌ జాతీయ వాదం ప్రపంచాన్ని నిరంతరం యుద్ధాలతో నింపే యుద్దోన్మాదులను తయారు చేసింది. మన దేశంలో కాషాయ జాతీయ వాదం ఎవరిని తయారు చేయనున్నది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత, రామాయణాల పేరుతో మత రాజకీయాలు !

09 Thursday May 2019

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Literature., NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP, communalism, CPI(M), Hindu Supremacists, mahabharata, pragya thakur, ramayana, SITARAM YECHURY, violence

Image result for communal politics with mahabharata, ramayana epics

ఎం కోటేశ్వరరావు

కొన్ని సంఘటనలను, ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలను వక్రీకరించటం ఆ పేరుతో తమ అజెండాను అమలు జరపటం సంఘపరివార్‌ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికల్లో దేవుళ్లు, దేవతల పేర్లను ప్రస్తావించి ఓట్లడగటం నిబంధనల వుల్లంఘన కిందికి వస్తుంది. కానీ ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాలు, వారి అనుచర గణాలు ఈ ఎన్నికల్లో ఎన్ని సార్లు ఆ పేరుతో ప్రతిపక్షాలపై దాడి చేశాయో, రెచ్చగొట్టేవిధంగా మాట్లాడాయో చూస్తున్నాము. జై శ్రీరామ్‌ అని భారత్‌లో గాక పాకిస్ధాన్‌లో అంటామా అని అమిత్‌ షా, బెంగాల్లో జై శ్రీరామ్‌ అనటమే నేరమైంది, మా వాళ్లను జైల్లో పెడుతున్నారని నరేంద్రమోడీ నానా యాగీ చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యను ఆధారం చేసుకొని టీ అమ్మే వారు ప్రధాని కాకూడదా అంటూ తెగ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ సారి అదేమిటో మోసగాండ్లలో చాలా మంది పేర్ల చివర మోడీ అనే వుంది అని రాహుల్‌ గాంధీ చేసిన విమర్శను పట్టుకొని నన్ను అంటే అనండిగానీ నా వెనుక బడిన మోడీ కులం మొత్తాన్ని దొంగలంటారా అని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో కులాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు జై శ్రీరాం నినాదం చేస్తే జైల్లో పెడతారా అనే యాగీ కూడా బెంగాల్లో, ఇతర చోట్ల ఓట్ల వేటలో భాగమే. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రచారానికి వెళుతుండగా భద్రతా ఏర్పాట్లను దాటి ముగ్గురు యువకులు ముందుకు వచ్చి మమతా బెనర్జీ కారు ముందు జై శ్రీరాం అంటూ నినాదాలు చేసి ఆమెను అడ్డుకోబోయారు. రెచ్చి పోయిన ఆమె వెంటనే కారు దిగి ఇప్పుడు రండి అంటూ కేకలు వేశారు. ఆ యువకులు పారిపోయారు. తరువాత పోలీసులు వారిని పట్టుకొని పోలీస్‌ స్టేషన్‌లో విచారించి వదలి వేశారని మీడియా వార్తలు వచ్చాయి. ఈ వుదంతాన్ని సాకుగా చేసుకొని రాముడిని వీధుల్లోకి తెచ్చి ఓటర్లను రెచ్చగొట్టేందుకు బిజెపి పెద్దలు పూనుకున్నారు. కేరళలో కూడా అయ్యప్ప స్వామి పేరుతో నినాదాలు చేస్తూ హింసాకాండకు పాల్పడిన వారి మీద కేసులు పెడితే భక్తులను అడ్డుకున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారు. భక్తి ఒక ముసుగు, దేవుడి పేరు ఒక సాకు తప్ప ఇంకేమైనా వుందా ?

మధ్య ప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి మాట్లాడుతూ అక్కడ పోటీ చేస్తున్న మాలెగావ్‌ పేలుళ్ల నిందితురాలు, బిజెపి అభ్యర్ధి ప్రజ్ఞ సింగ్‌ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యల మీద స్పందించారు. హిందువులకు హింస మీద విశ్వాసం లేదు అని ఆమె మాట్లాడటం గురించి సీతారామ్‌ స్పందించారు. ఈ దేశంలో ఎందరో చక్రవర్తులు, రాజులు యుద్ధాలు చేశారు.రామాయణం, మహాభారతాలు కూడా ఎన్నో యుద్ధాలు, హింసతో నిండి వున్నాయి. ఒక ప్రచారకురాలిగా మీరు ఇతిహాసాల గురించి చెబుతారు. అయినా హిందువులు హింసకు పాల్పడరని అంటారు. దీనికి వెనుక వున్న తర్కం ఏమిటి ? హిందువులు హింసకు పాల్పడరనేది ఒక అవాస్తవం, దానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. తొలి దశ ఎన్నికలు అయిపోయాయి. తిరిగి వారి అసలైన అజెండా 370, 35ఏ ఆర్టికల్స్‌ రద్దు, వివాదాస్పద స్ధలంలో రామమందిర నిర్మాణం, వుమ్మది పౌర స్కృతి వంటి అంశాలకు వారు తిరిగి వచ్చారు. మూడవ దశ ఎన్నికల తరువాత భోపాల్‌లో ప్రజ్ఞా ఠాకూర్‌ను అభ్యర్ధిగా నిలబెట్టటం ప్రజలలో మనోభావాలను రెచ్చగొట్టే చర్య తప్ప మరొకటి కాదు. ఇదీ సీతారామ్‌ ఏచూరి వుపన్యాసంలో ఒక అంశం సారాంశం.

Image result for mahabharata, ramayana , violence

దీనిలో రామాయణ,భారతాల ప్రస్తావనను మాత్రమే ముందుకు తెచ్చి మతధోరణులును రెచ్చగొట్టేందుకు తద్వారా మిగిలిన దశల్లో ఓట్ల లబ్ది పొందేందుకు పూనుకున్నారు. ఏచూరి చేసిన విమర్శలో రెండో భాగానికి సమాధానం లేదు. హింసాత్మక ప్రవృత్తి కలిగిన వారు అన్ని మతాల్లో వుంటారని తాను చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్రమోడీ వక్రీకరిస్తున్నారని ఏచూరి పేర్కొన్నారు.’ ఒక వుగ్రవాద కేసులో నిందితురాలిగా వున్న వ్యక్తిని అభ్యర్ధిగా బిజెపి నియమించిన అంశం మీద భోపాల్‌లో నేను చెప్పిన దానిని ఆయనకు అలవాటైన పద్దతుల్లో వక్రీకరించారు. వుగ్రవాదానికి మతం వుండదు, హింసాత్మక ప్రవృత్తి వున్న వారు అన్ని సామాజిక తరగతుల్లో వుంటారు. ఇతిహాసాలైన రామాయణ, మహాభారాతాల్లో కూడా అలాంటి వ్యక్తులు మనకు కనిపిస్తారు. మతపరమైన విభజనను మరింత పెంచేందుకు మోడీ అసత్యాలు చెబుతున్నారు’ అని ట్వీట్‌ చేశారు. ఏచూరి భోపాల్‌ వ్యాఖ్యలు హిందూమతాన్ని కించపరిచేవిగా వున్నాయని, మనోభావాలను దెబ్బతీశాయని ఇంకా ఏవేవో చేశాయని చెబుతూ కార్పొరేట్‌ రామ్‌దేవ్‌ బాబా, ఇంకా చిల్లర మల్లర ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి వ్యక్తులు కొన్ని చోట్ల పోలీసు కేసులు దాఖలు చేశారు. సంఘపరివార్‌ ఎత్తుగడల్లో కేసులు దాఖలు చేసి కోర్టుల చుట్టూతిప్పే చౌకబారు చర్య ఒకటి. అయితే ఆ కేసులు నిలుస్తాయా లేదా, వాటికి ఎవరూ భయపడక పోయినప్పటికీ మీడియాలో ప్రచారం పొందవచ్చని, వివాదాలు జనం నోళ్లలో నానుతూ వుండాలనేది వారి లక్ష్యం. వారికి శివసేన తాళం, పక్కవాయిద్యాలుగా పని చేస్తున్నది.

Image result for mahabharata, ramayana , violence

ఈ సందర్భంగా తమ రాజకీయాలేవో తాము చెప్పుకోకుండా అనవసరంగా సీతారామ్‌ ఏచూరి వ్యాఖ్యలు చేశారంటూ కొందరు కపటంతో కూడిన సలహాలు ఇస్తున్నారు. అంటే తాము చెప్పిందే వేదం, పాడిందే పాట అంటూ కొంత మంది వక్రీకరణలకు, విద్వేష ప్రచారానికి పూనుకుంటే నోరు మూసుకొని కూర్చోవాలా? ప్రపంచంలో ఎక్కడా ఇలా కూర్చోలేదు, అది అసలు మానవ స్వభావానికే విరుద్దం. ఒక రాయికి, నోరు లేని పశువుకు, మనిషికి ఇంక తేడా ఏముంది. అనవసరంగా వ్యాఖ్యలు చేశారని కాదు, ఆయన అన్నదాంట్లో వున్న అసందర్భం, అసమంజసం ఏమిటన్నది చెప్పకుండా చేయకుండా వుంటే బాగుండేది , మనోభావాలను దెబ్బతీయటం, ఓట్లు పొగొట్టుకోవటం ఎందుకు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇది చచ్చిన చేపల బాట తప్ప బతికిన చేపల ఎదురీత కాదు. భిన్న అభిప్రాయం అనేది భారతీయ సంస్కృతిలో భాగం. దానికి వేల సంవత్సరాల నాడే చార్వాకులు లేదా లోకాయతులు నాంది పలికారు. వారిని భౌతికంగా నాశనం చేస,ి వారు రాసిన గ్రంధాలను ధ్వంసం చేసిన వుగ్రవాద చరిత్ర నాటి మత పెద్దలది, వారికి మద్దతు ఇచ్చిన రాజరికాలది. అయినా సరే ప్రతి తరంలోనూ ఛాందసాన్ని, మతోన్మాదాన్ని వ్యతిరేకించే శక్తులు పుట్టుకు వస్తూనే వున్నాయి. భావజాలాన్ని అంతం చేయటం ఎవరి వల్లా కాదన్నది చరిత్ర చెప్పిన సత్యం.పురోగామి భావజాలానికిి ప్రతీకలుగా వున్నవారిలో ఏచూరి ఒకరు. గతంలోఎందరో రామాయణ, మహాభారతాలను విమర్శనాత్మకంగా చూడలేదా ? చోళరాజు కుళోత్తుంగుడు శైవమతాభిమాని. వైష్ణవులను ఇతరులను సహించని కారణంగానే రామానుజుడు పన్నెండు సంవత్సరాల పాటు అజ్ఞాతవాసం లేదా హోయసల రాజుల ఆశ్రయం పొందాడని చరిత్రలో లేదా ? అశోక చక్రవర్తి కళింగ యుద్ధంలో జరిగిన మారణకాండను చూసిన తరువాత మారు మనసు పుచ్చుకొని బౌద్ధమతాన్ని అవలంభించాడన్న చరిత్ర చెబుతున్నదేమిటి? కుళోత్తుంగుడు, అశోక చక్రవర్తి, లేదా శైవ, వైష్ణవ మతాభిమానులైన చక్రవర్తులకు వేదాలు, పురాణాలు, భారత, రామాయణాలు తెలియవా, వారు వాటిని చదివిన తరువాతనే కదా శైవ, వైష్ణవ మత యుద్దాలకు, ప్రార్ధనా మందిరాల విధ్వంసకాండ, కూల్చివేతలకు, మారణకాండకు పాల్పడింది. మరి వాటిలోని మంచి నుంచి వారేమి నేర్చుకున్నట్లు ? అలాంటి మారణకాండకు పాల్పడకుండా వారిని ఆ గ్రంధాల భావజాలం నిలువరించలేదే. ఒకనాడు ఒకరిని ఒకరు అంతం చేసుకోవాలని చూసిన వారు నేడు హిందూ మతం పేరుతో వారు శైవులైనా, వైష్ణవులైనా రాజీపడి ఇతర మతాల మీద దాడికి పూనుకుంటున్నారు.

Image result for mahabharata, ramayana , violence

ఇతిహాసాలైనా, పురాణాలు, వేదాలు, భగవద్గీత వంటి హిందూ మత గ్రంధాలైనా, ఇతర మతాలకు చెందిన బైబిల్‌ పాత మరియు కొత్త నిబంధనలు, ఖురాన్‌, సిక్కుల గురుగ్రంధమైనా మరొకటి అయినా ఎవరినీ వుగ్రవాదులుగా మారమని, ఇతరులను అంతం చేయమని చెప్పలేదు. వాటిని చదివినవారందరూ వుగ్రవాదులుగా మారి వుంటే ఈ పాటికి ప్రపంచంలో ఏ ఒక్కడూ మిగిలి వుండేవారు కాదు. ప్రపంచంలో అత్యధికంగా 230 కోట్ల మంది క్రైస్తవులు, 180 కోట్ల మంది ముస్లింలు, 115 కోట్ల మంది హిందువులు, అసలు ఏ మతం లేని వారు 120 కోట్ల మంది వున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వారు చెప్పేదాని ప్రకారం ఖురాన్‌ హింసను ప్రేరేపిస్తున్నదని చెప్పేదే వాస్తవం అయితే ప్రపంచంలో 180 కోట్ల మంది వుగ్రవాదులుగా మారి వుండాలి. ఐఎస్‌ వుగ్రవాదులు ముస్లింలే, వారు చంపుతున్నదీ సిరియా,ఎమెన్‌ వంటి ఇస్లామిక్‌ దేశాల్లోని జనాన్నే కాదా ? సౌదీ అరేబియా ముస్లిం దేశం మరొక ముస్లిం దేశం ఎమెన్‌ మీద యుద్దం చేస్తున్నది, ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికాతో సహకరిస్తున్నది. అలా చేయమని ఖురాన్‌ చెప్పిందా ? అమెరికాను, ఐరోపా దేశాలను పరిపాలించింది క్రైస్తవులే, ప్రపంచాన్ని ఆక్రమించుకున్నది క్రైస్తవ దేశాలకు చెందిన వారే. అనేక ప్రాంతీయ యుద్ధాలకు, రెండు ప్రపంచ యుద్దాలకు కారకులైన హిట్లర్‌, ముస్సోలినీ వంటి వారందరూ క్రైస్తవులే. యుద్ధాలు చేయమని, జనాన్ని చంపమని బైబిల్‌ బోధించిందా? అదే అయితే ఇతర మతాలకు చెందిన దేశాల మీద వారికి వారే ఎందుకు యుద్ధాలు చేసుకున్నట్లు ? ఈ రోజు ప్రపంచంలో దాదాపు 40దేశాలలో జోక్యం చేసుకుంటున్న అమెరికన్లు మత రీత్యా క్రైస్తవులే. బరాక్‌ ఒబామా అయినా, డోనాల్డ్‌ ట్రంప్‌ అయినా ఆ విధానంలో మార్పు లేదు. భారత, రామాయణాలు, భగవద్గీత, పురాణాలను చదివిన నరేంద్రమోడీ మరి నరహంతక చర్యలకు పాల్పడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ను కౌగిలింతలతో స్నేహం చేయమని ఆ గ్రంధాల్లో చెప్పాయా? ఆ దారుణాలను ఎందుకు ఖండించరు, అలాంటి శక్తులకు దూరంగా ఎందుకు వుండరు ? ముస్లింలు, క్రైస్తవులను ద్వేషించమని, వారి మీద విద్వేషాన్ని రెచ్చగొట్టమని భారత రామాయణాలు చెప్పలేదే, మరి వాటిపేరుతో హిందూత్వశక్తులు చెలరేగిపోతుంటే ఆ దేవుళ్లు,దేవతలు ఎందుకు జోక్యం చేసుకోవటం లేదు.

Image result for mahabharata, ramayana , violence

తాను బాబరీ మసీదు పైకి ఎక్కానని, దాని కూల్చివేతలో భాగస్వామి అయ్యానని, దేవుడు తనకు ఇచ్చిన అవకాశమదని, మరోసారి దొరికితే తిరిగి పాల్గొంటానని స్వయంగా టీవీ ఇంటర్య్యూలో ప్రజ్ఞ చెప్పటం అంటే బాబరీ మసీదు కూల్చివేత నేరాన్ని అంగీకరించటమే. సాంకేతికంగా కేసుల్లో నిందితులుగా వున్నప్పటికీ బహిరంగంగా అంగీకరించిన వారిని నేరస్తులు అనే జనం అంటారు. తనకు ఆరోగ్యం బాగోలేదని, ఇతరుల సాయం వుంటే తప్ప నడవలేనంటూ కాన్సర్‌ చికిత్సకోసం బెయిలు ఇవ్వాలని కోరిన ఆమె ఎవరి సాయంతో పని లేకుండా ఎన్నికల ప్రచారం అంటూ భోపాల్‌ వీధుల్లో తిరిగి రెచ్చగొడుతున్నారు. ఎన్నికల కమిషన్‌ నిషేధం విధిస్తే గుళ్లు, గోపురాలు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఇదేమంటే పూజలు చేసుకోనివ్వరా అంటూ మనోభావాలను రెచ్చగొడుతున్న ఆమెను అబ్దాలకోరు అనాలా, నిజం చెప్పని మనిషిగా భావించాలా ? వుగ్రవాద కేసులో ఆమె జైల్లో వున్నారు. నిందితులు ముస్లింలు, క్రైస్తవులు అయితే వారికి ఆ మతాలను తగిలించి వుగ్రవాదులు అని మీడియా రాస్తున్నది, చూపుతున్నది. ఆ లెక్కన ప్రజ్ఞను హిందూ వుగ్రవాది, హిందూ వుగ్రవాదం అనాలా లేదా ? అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో వుగ్రవాద చర్యలకు పాల్పడిన శ్వేతజాతీయులకు శిక్షపడకుండా లేదా నామమాత్రంగా వేసే విధంగా ముందే పోలీసులు మతిస్ధిమితం లేని వ్యక్తి అని చెబుతారు. మీడియా కూడా జీహుజూర్‌ అంటూ అలాగే రాస్తున్నట్లుగా ప్రజ్ఞను కూడా మతిలేని స్దితిలో వున్నట్లు పేర్కొనాలా ? ఇలాంటి ఆమె దేశ సంస్కృతికి ప్రతీక అని నరేంద్రమోడీ అభివర్ణించటాన్ని ఏమనాలి? మహోన్నతమైన దేశ సంస్కృతి గురించి గర్వపడుతున్నవారి మనోభావాలు గాయపడ్డాయా లేదా? లేకపోతే ఇలాంటి వారే ప్రతీకలైతే మన సంస్కృతి కూడా అలాంటిదేనా అని ఎవరైనా అనుకుంటే తప్పు ఎవరిది?

ప్రజ్ఞ ఇంకా నిందితురాలే తప్ప నేరం రుజువు కాలేదు కదా , ఆమె తన మతం గురించి మాత్రమే చెప్పింది కదా ? ఇలాంటి వాదనలను బిజెపి వారు తెస్తున్నారు. ఇది పచ్చి అవకాశవాదం, తర్కానికి కట్టుబడనిది. అదే ఇతర మతాలకు చెందిన వారైతే కేసులు నమోదు చేసిన వెంటనే నేరస్తులనే ముద్రవేస్తున్నారు. నిర్ధారించేస్తున్నారు.అయినా కేసుల్లో ఇరుక్కొన్న వివాదాస్పదులైన వారు తప్ప మరొకరు బిజెపికి దొరకలేదా ? ఇదే పార్టీ పెద్దలు గతంలో ఆశారాంబాపు, డేరా బాబా గుర్మీత్‌ సింగ్‌ వంటి కరడు గట్టిన నేరస్ధులందరినీ నేరం రుజువు కాలేదు కదా అని సమర్ధించారు. వారి ఆశీర్వాదాలు పొందారు, వారితో తమకు ఓట్లు వేయించాలని సిఫార్సులు చేయించుకున్నారు. వారికి శిక్షలు పడిన తరువాత ఏ బిజెపి నేత అయినా వ్యక్తిగతంగా లేదా పార్టీ పరంగా అలాంటి వారిని సమర్ధించినందుకు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారా? లేదే ? రేపు ప్రజ్ఞ నేరం రుజువైతే ఏమిటి?

Image result for pragya thakur

హిందువుల మీద సీతారాం ఏచూరి ఇలాంటి దాడులు చేయటం వల్లే కమ్యూనిస్టులు వున్న పలుకుబడి కూడా కోల్పోతున్నారు. అనే శాపనార్ధం ఒకటి. భారత, రామాయణాల్లో వున్న సంఘటనలు, పాత్రల మీద విమర్శలు లేదా వ్యాఖ్యలు చేసింది కమ్యూనిస్టులొక్కరే కాదే, ఎన్‌టిరామారావు సినిమాల్లో ఎన్ని డైలాగులు వున్నాయో తెలియదా, మరి అలాంటి వ్యక్తి పార్టీ పెట్టిన ఆరునెలల్లోనే అధికారానికి వచ్చారు. దానికేమంటారు? ఆ మాటకు వస్తే కాంగ్రెస్‌ నేతలెవరూ భారత, రామాయణాలను విమర్శించలేదు, వాటికి కట్టుబడే వున్నారు. మరి ఆ పార్టీ నేడు ఒక పెద్ద ప్రాంతీయ పార్టీగా ఎందుకు దిగజారినట్లు ? దాన్నుంచి దేశాన్ని విముక్తి చేస్తానని బిజెపి ఎందుకు చెబుతున్నట్లు ? నిజానికి సంఘపరివార్‌ లేదా ప్రజ్ఞ వంటి వారి శాపాలకే అంత శక్తి వుంటే రామాయణ విషవృక్షం అనే గ్రంధం రాసిన రంగనాయకమ్మ దశాబ్దాల తరువాత కూడా అదే వుత్సాహంతో ఇంకా రాస్తూనే వున్నారే. ప్రజ్ఞ చెప్పినట్ల హేమంత కర్కరే మాదిరి ప్రాణాలు తీయకపోయినా కనీసం ఆమె కలాన్ని పని చేయకుండా చేయలేకపోయిన నోటి తుత్తర సరుకని అనుకోవాలి. ఎందరో సాధ్వులుగా దేశమంతా తిరుగుతున్నవారు, పీఠాలు పెట్టుకున్నవారు వున్నారు. ఆశారాం బాపు, డేరా బాబాలు ఎందరో మానవతుల శీలాలను హరించారు,హత్యలు చేశారు. శీలం, ఏకత గురించి కబుర్లు చెప్పే ఇలాంటి సాధ్వులు ఒక్కడంటే ఒక్కడినీ శపించలేదేం. ప్రాణాలు తీయకపోయినా జీవచ్ఛవాలుగా మార్చి మరొకడు అలాంటి పనికి పాల్పడకుండా చేయవచ్చు కదా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మసీదుల్లో, రైళ్లలో అమాయకుల ప్రాణాలు తీసే తీవ్రవాద చర్యలు గాక తామక తంపరగా తయారవుతున్న తోటి యోగులతో కలసి దుష్టసంహారం కోసం శాపాలు పెట్టమనండి.

చివరిగా భారత, రామాయణాల గురించి ఒక్క మాట. ఒక్క భారతం ఏమిటి ఏ పురాణం చూసినా ముగింపు ఏమిటి దుష్ట సంహారం పేరుతో హింసాకాండలేగా. అసలు యుద్ధమే సమర్దనీయం కాదు. ధర్మ యుద్దమని కొన్నింటికి పేరు. నిజానికి ధర్మ యుద్దమైతే రెండువైపులా వారు గాక అధర్మంవైపు వారే మరణించాలి కదా ? మహా భారత యుద్ధంలో ఏడు అక్షౌహిణులు పాండవుల తరఫున పదకొండు అక్షౌహిణులు కౌరవుల తరఫున పాల్గొన్నాయి. ఒక వ్యాఖ్యానం ప్రకారం 18 అక్షౌహిణుల్లో 47,23,920 సైనికులు, గుర్రాలు, ఏనుగులు, రధాలు వున్నాయి. మరొక కధనం ప్రకారం కురు పాండవ యుద్దంలో మరణించిన వారి సంఖ్య 166 కోట్ల 20వేల మంది అని, బతికిన వారు 2,40,165 మంది అని యుధిష్టరుడు (ధర్మరాజు) చెబుతాడు. అంటే ఇంత మందిని బలిపెట్టినది ధర్మ యుద్దం ఎలా అవుతుంది. వంద మంది కౌరవ సోదరులను హతమార్చి వుంటే సరిపోయేదానికి ఇంత మందిని బలిపెట్టాలా ? మరొక కధనం ప్రకారం బతికింది పన్నెండు మందే అని ఎక్కడో చదివాను. ఇక రామాయణం. ఇది చెబుతున్నదేమిటి? రాముడు వాలిని చెట్టుచాటు నుంచి బాణం వేసి చంపాడు. అంటే చంపదలచుకున్నవాడిని ఎలాగైనా అంతం చేయవచ్చు అన్ననీతిని బోధించినట్లే కదా, నేడు జరుగుతున్న నేరాలన్నీ దాదాపు ఇలాంటివే కదా. ధర్మ యుద్దం అంటే ఒక తేదీ, స్ధలం నిర్ణయించుకొని ముఖాముఖీ తలపడటం ఎక్కడైనా జరుగుతోందా? రామ రావణ యుద్దంలో ఎందరు మరణించిందీ స్పష్టంగా తెలియదు. కానీ రావణుడి ఆయువు పట్టు విభీషణుడి ద్వారా తెలుసుకొని రాముడు చంపాడు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే కదా. ప్రత్యర్ది పార్టీల ఆర్ధిక ఆయువు పట్టు ఎక్కడుందో తెలుసుకొని ప్రభుత్వ సంస్ధల ద్వారా దాడులు చేయించి లేదా బెదిరించీ రాజకీయాల్లో ఫిరాయింపులు లేదా నాశనం చేయటం చూస్తున్నదే కదా. ఇలా చెప్పుకుంటే చాలా వున్నాయి. అందువలన భిన్న అభిప్రాయాలు, భిన్న స్వరాలు విప్పనివ్వండి, జనాన్ని తెలుసుకోనివ్వండి. పిచ్చిబియ్యాలకు,శాపాలకు భయపడే రోజులు కావివి అని గుర్తించండి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఓటర్లకు స్వేచ్చే బెంగాల్‌ ఎన్నికల అసలు సమస్య !

30 Tuesday Apr 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Congress, CPI(M), INC, Mamatha Benarjee, Trinamool Congress, West Bengal election

ఎం కోటేశ్వరరావు

దేశంలో ఇప్పటికి నాలుగు దశల ఎన్నికలు జరిగాయి. మరో మూడు దశలకు సిద్ధం అవుతున్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పశ్చిమబెంగాల్లో నాలుగు దశల్లోనూ హింసాత్మక ఘటనలు జరిగాయి. ఓటర్లను అనేక చోట్ల అధికార తృణమూల్‌ అడ్డుకున్నట్లు వార్తలు వచ్చాయి. త్రిపురలో తొలి దశలో పోలింగ్‌ జరిగిన నియోజకవర్గంలో వందలాది పోలింగ్‌ కేంద్రాలలో సిపిఎం ఏజంట్లను రాకుండా బిజెపి గూండాలు అడ్డుకున్నారు, రిగ్గింగుకు పాల్పడ్డారు. రెండవ నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిస్ధితి దిగజారటంతో ఎన్నికల కమిషన్‌ మొత్తం నియోజకవర్గ పోలింగ్‌నే మరొక రోజుకు వాయిదా వేయాల్సి వచ్చింది. ఒకరి అప్రజాస్వామిక చర్యల గురించి ఒకరు రోజూ తీవ్ర విమర్శలు చేసుకుంటున్న బిజెపి, తృణమూల్‌ రెండూ ఒకే విధమైన చర్యలకు పాల్పడుతున్నాయి. దేశంలో బిజెపిని విమర్శించే పార్టీలు త్రిపుర గురించి మాట్లాడలేదు. అలాగే మమతాబెనర్జీని తమతో కలుపుకొని కేంద్రంలో రాబోయే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలని చూస్తున్న ప్రాంతీయ పార్టీలు పశ్చిమబెంగాల్లో ప్రజాస్వామ్య ఖూనీ గురించి నోరెత్తటం లేదు. గతంలో సిపిఎ పాలనలో సైంటిఫిక్‌ రిగ్గింగ్‌ అంటూ అన్‌సైంటిఫిక్‌ వాదనలు, ప్రచారం చేసిన వారు ఇప్పుడు పల్లెత్తు మాట్లాడటం లేదంటే నాడు పని గట్టుకొని ప్రచారం చేసిన వారు తప్ప నిజమైన ప్రజాస్వామిక వాదులు కాదన్నది స్పష్టం. ఓటర్లను పోలింగ్‌ బూత్‌లకు రానివ్వలేదన్న విమర్శలు, ఆరోపణలు వామపక్ష ప్రభుత్వ హయాంలో రాలేదు.

పశ్చిమ బెంగాల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడుతుంది అన్నది ఇప్పుడు ప్రధానం కాదు. అసలు తమ ఓటు తాము వేసుకొనే స్చేచ్చను ఓటర్లకు ఇస్తారా అన్నది అసలు సమస్య. ఒక విధంగా చెప్పాలంటే ఓటర్లు-త ణమూల్‌ కండబలం మధ్య పోటీగా వుంది. మూడు దశల పోలింగ్‌లో వెల్లువెత్తిన ఆరోపణలు మిగిలిన నాలుగు దశల గురించి ఆందోళన కలిగిస్తున్నాయి. అభ్యర్ధులను ప్రచారం చేసుకోనివ్వరు,(స్ధానిక సంస్ధల్లో అయితే అసలు నామినేషన్లనే వేయనివ్వలేదు) అనుమానం వచ్చిన ఓటర్లను బూత్‌లకు రానివ్వరు, వచ్చిన వారు అధికార త ణమూల్‌కు ఓటేయలేదని అనుమానం వస్తే చావచితక కొడతారు అన్న విమర్శలు వచ్చాయి. అయినా రాజకీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి. చిత్రం ఏమిటంటే ఎవరికి ఓటు వేసినా ఒకే పార్టీకి పడేవిధంగా, జాబితాలో వున్న వారి కంటే ఎక్కువ ఓట్లు నమోదవుతున్నాయని, ఇలా రకరకాలుగా ఎన్నికల ఓటింగ్‌ యంత్రాల మీద విమర్శలు చేస్తున్న వారు పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే మాట్లాడటం లేదన్న విమర్శలున్నాయి. ఈ పూర్వరంగంలో అక్కడ ఏ పార్టీ ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నా, ఓటర్లను కదిలించినా, వాస్తవాలను వివరించినా ఫలితం ఏమిటి, అసలు ఎన్నికలను బహిష్కరిస్తే పోలా అనే వారు వుండవచ్చు. అలా వూరందరికీ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన మావోయిస్టులు మమతాబెనర్జీ అధికారానికి రావటానికి దోహదం చేసిన వారిలో వున్నారంటే వులిక్కిపడాల్సిన పనిలేదు. ఇప్పుడు వారే వైఖరి తీసుకున్నారో తెలియదు. ఏ పిలుపు ఇచ్చినా పట్టించుకొనే వారు వుండరు.

అత్యవసర పరిస్ధితికి ముందు 1971లో కాంగ్రెస్‌ పార్టీ పశ్చిమబెంగాల్‌ ఎన్నికలను ఒక ప్రహసనంగా మార్చివేసింది. తాము విజయం సాధిస్తామన్న నియోజకవర్గాలలో మినహా మిగిలిన అన్నిచోట్లా సామూహిక రిగ్గింగ్‌కు పాల్పడింది. ఆ నాడు కూడా ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ నోరు మెదపలేదు. కమ్యూనిస్టులనే కదా తొక్కేసింది అన్నట్లుగా వున్నాయి. తరువాత అదే కాంగ్రెస్‌ సిపిఎంతో పాటు మిగతా ప్రతిపక్ష పార్టీల(సిపిఐ ఆ నాడు కాంగ్రెస్‌కు పూర్తిగా మద్దతు ఇస్తున్న కారణంగా దాన్ని మినహా) నేతలందరినీ అత్యవసర పరిస్ధితి పేరుతో జైల్లో పెట్టింది. ఇప్పుడు మమతాబెనర్జీ అకృత్యాలను విమర్శించని పార్టీలు కమ్యూనిస్టు సిద్ధాంతాలతో ఏకీభవించకపోవచ్చుగానీ, ప్రజాస్వామిక ప్రక్రియకు తలపెట్టిన హాని గురించి ఎందుకు పట్టించుకోవు? అవి కూడా తమకు ప్రాబల్యం వున్న ప్రాంతాలలో అలాంటి పనులు చేసిన చరిత్ర కలిగినవే, వర్గ రీత్యా ఒకే తానులో ముక్కలు కనుకే అలా వ్యవహరిస్తున్నాయి.

పైన పేర్కొన్న పరిమితుల పూర్వరంగంలో అక్కడి ఎన్నికల తీరు తెన్నులను చూద్దాం. రాష్ట్రమంతటా అలాంటి పరిస్ధితి వున్నప్పటికీ అనేక చోట్ల తృణమూల్‌ను వ్యతిరేకించే శక్తులు కూడా వున్నాయి. కనుకనే వామపక్షాలు, ఇతరులకు ఆ మేరకైనా ఓట్లు వస్తున్నాయి. దేశమంతటినీ గతంలో ఆకర్షించిన నియోజకవర్గాలలో జాదవ్‌పూర్‌ ఒకటి.లోక్‌సభ స్పీకర్‌గా పని చేసిన సోమనాధ్‌ చటర్జీని ఓడించి మమతాబెనర్జీ జెయింట్‌ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ త ణమూల్‌ అభ్యర్ధిగా సినీ నటి మిమి చక్రవర్తి పోటీ చేస్తుండగా సిపిఎం తరఫున కొల్‌కతా మాజీ మేయర్‌ వికాస్‌ రంజన్‌ భట్టాచార్య, ఇటీవల త ణమూల్‌ నుంచి వుద్వాసనకు గురైన మాజీ ఎంపీ అనుపమ్‌ హజ్రా బిజెపి తరఫున పోటీ చేస్తున్నారు. కొల్‌కతా నగరంలో కొంత భాగం, గ్రామీణ ప్రాంతాలతో నిండి వున్న ఈ నియోజకవర్గంలోని జాదవ్‌ పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 2011లో మినహా 1967 నుంచి సిపిఎం అభ్యర్దులే ఎన్నిక అవుతున్నారు. ప్రస్తుతం అక్కడ సిపిఎం నే సుజన్‌ చక్రవర్తి ఎంఎల్‌ఏగా వున్నారు. త ణమూల్‌-సిపిఎం మధ్య హోరాహోరీ పోటీ జరుగుతోందనే అభిప్రాయం వెల్లడైంది. లాయర్‌ అయిన భట్టాచార్య నియోజకవర్గంలో అనేక కేసులలో ముఖ్యంగా వివిధ చిట్‌ఫండ్‌ మోసాల కేసుల్లో వందలాది మంది తరఫున ఎలాంటి ప్రతిఫలం తీసుకోకుండా వాదించి వారి సొమ్మును వెనక్కు ఇప్పించిన వుదంతాలు వున్నాయి. పోటీ తీవ్రంగా వున్నప్పటికీ రోజు రోజుకూ సులభం అవుతోందని భట్టాచార్య అంటున్నారు. రాజకీయాలకు కొత్త, ఏమీ తెలియని సినీనటి మిమి గురించి అనేక మంది పెదవి విరుస్తున్నారు. సిపిఎం అభ్యర్ధి మంచి వాడైనప్పటికీ తగిన సంస్దాగత పట్టులేదని కొందరు అభిప్రాయపడ్డారు. 2011 ఎన్నికల్లో ఓటమి తరువాత సిపిఎంకు ఈ పరిస్ధితి ఏర్పడింది. మార్పు కోసం ఓటు వేయాలని జనానికి వున్నప్పటికీ త ణమూల్‌ గూండాలు వారిని అనుమతించే అవకాశాలు లేవని ఓటర్లు భయపడుతున్నారని వికాస్‌ రంజన్‌ భట్టాచార్య అన్నారు.

మీరు ఈ నియోజకవర్గానికి చెందిన వారు కదా అన్న ప్రశ్నలకు బిజెపి అభ్యర్ధి హజ్రా మాట్లాడుతూ టిఎంసి అభ్యర్ధిని మిమి చక్రవర్తి ఎక్కడో జల్పాయిగురికి చెందిన వారు, ఆమెకూడా వెలుపలి వ్యక్తే కదా, అయినా నియోజకవర్గ ఓటర్లు బిజెపితోనే వున్నారు. త ణమూల్‌ నేరగాండ్లు, సంఘవ్యతిరేకశక్తులకు నిలయంగా మారినందునే తాను బిజెపిలో చేరానని, వారు నాపై బురద చల్లుతున్నారని అన్నారు. ఈ నియోజకవర్గంలోని భంగోర్‌ అసెంబ్లీ స్ధానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అబ్దుల్‌ రజాక్‌ మొల్లా ప్రస్తుతం మమతా మంత్రి వర్గ సభ్యుడు. గత రెండు సంవత్సరాలలో కావలసినంత చెడ్డపేరు తెచ్చుకున్నాడీ మాజీ సిపిఎం నేత. ప్రస్తుతం త ణమూల్‌ అభ్యర్ధి తరఫున ప్రచారంలో ఎక్కడా కనిపించటం లేదని మీడియా వార్తలు తెలుపుతున్నాయి. చివరి దశలో పోలింగ్‌కు ఇంకా సమయం వుంది కనుక తరువాత రంగంలోకి వచ్చేది లేనిదీ తెలియదు. సింగూరులో పరిశ్రమలకు భూమి సేకరించటాన్ని వ్యతిరేకించిన త ణమూల్‌కు భంగోర్‌లో నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు అదే పరిస్ధితి ఎదురైంది. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను వ్యతిరేకించిన వారిపై 2017లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. స్ధానిక త ణమూల్‌ ఎంఎల్‌ఏగా గతంలో పనిచేసిన అరబుల్‌ ఇస్లాం తన అనుచరులతో బెదిరించి భూములు స్వాధీనం చేసుకున్నాడు. త ణమూల్‌ గూండాయిజానికి పేరుమోసిన ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో వచ్చిన భారీ మెజారిటీ త ణమూల్‌ గెలుపును నిర్ధేశించింది. ఇప్పుడు అలాంటి అవకాశం లేదన్నది ఒక అభిప్రాయం.

ఒక్క జాదవ్‌పూరే కాదు, ఏ నియోజకవర్గంలోనూ ఓటర్ల అభీష్టం మేరకు ఓట్లు వేసుకొనే స్వేచ్చాపూరిత వాతావరణం లేదన్నది సర్వత్రా వెల్లడౌతున్న అభిప్రాయం. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు త ణమూల్‌ ధన, కండబలాన్ని వుపయోగించి తన స్ధానాన్ని నిలుపుకోవాలని చూస్తోంది. ఇప్పుడేఇపుపడే కింది స్ధాయి క్యాడర్‌, సానుభూతి పరుల్లో భయం వదులుతున్న స్ధితిలో సిపిఎం, మొత్తంగా వామపక్ష సంఘటన తిరిగి తన మద్దతుదార్లను కూడగట్టుకొని పోయిన స్ధానాలను తిరిగి సంపాదించుకొనేందుకు ప్రయత్నిస్తోంది. పన్నెండు సంవత్సరాల తరువాత నందిగ్రామ్‌లో సిపిఎం తన కార్యాలయాన్ని తిరిగి ఈ ఎన్నికల సందర్భంగా ప్రారంభించింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ పట్ల జనంలో తొలుగుతున్న భ్రమలు, ప్రతిఘటనకు ఇదొక సూచిక అయినప్పటికీ ఇంకా దాని గూండాయిజం ఏమాత్రం తగ్గలేదన్నది నాలుగు దశల ఎన్నికలు నిరూపించాయి. తాము ఇరవైకి పైగా స్ధానాలు సంపాదించగలమనే వూహల్లో బిజెపి నేతలు వున్నారు. గతంలో తాను సాధించిన వాటిని అయినా నిలబెట్టుకొని పరువు కాపాడుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నది. త ణమూల్‌ కాంగ్రెస్‌-బిజెపి పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నప్పటికీ వాటి మధ్య అంతర్గత ఒప్పందం వుందన్నది వామపక్షాల విమర్శ. త ణమూల్‌, బిజెపిని ఓడించాలంటే ప్రతిపక్షాలు గెలిచిన సీట్లలో పరస్పరం పోటీ నివారించుకోవాలని, ఆమేరకు కాంగ్రెస్‌ గెలిచిన సీట్లలో తాము పోటీ చేయబోమని, తమ స్ధానాల్లో అదే విధంగా స్పందించాలని సిపిఎం ప్రతిపాదించింది. అయితే కాంగ్రెస్‌ అందుకు అంగీకరించకుండా సిపిఎం గెలిచిన స్ధానాల్లో పోటీకి దిగింది. అయినప్పటికీ తన చిత్తశుద్ధిని నిరూపించుకొనేందుకు కాంగ్రెస్‌ పోటీ చేస్తున్న స్ధానాలలో వామపక్ష సంఘటన పోటీ చేయకుండా 42కుగాను 38 చోట్లకే పరిమితం అయింది.

మాల్డా అంటే కాంగ్రెస్‌ కంచుకోట. ఏబిఏ ఘనీఖాన్‌ చౌదరి పాతికేండ్లకు పైగా ఎంపీగా వున్నారు. తరువాత ఆయన వారసులే ఎన్నిక అవుతున్నారు. 2006లో ఆయన మరణించినప్పటికీ ఇప్పటికీ ఆయనే వేస్తున్నట్లుగా ఓటర్ల వైఖరి వుంటుంది. ఘనీఖాన్‌ చౌదరి సోదరుడు మాల్డా దక్షిణంలో తిరిగి పోటీచేస్తుండగా సిపిఎం తన అభ్యర్ధిని పోటీకి నిలపలేదు. మాల్డా వుత్తరం నుంచి గెలిచిన ఘనీఖాన్‌ మేనకోడలు జనవరిలో కాంగ్రెస్‌ నుంచి త ణమూల్‌కు ఫిరాయించారు. బిజెపిని ఓడించాలంటే త ణమూల్‌ పార్టీ అవసరమని దానిలో చేరినట్లు చెప్పుకున్నారు. ఆమెపై ఘనీఖాన్‌ కుటుంబం నుంచే మరొకరు రంగంలో వున్నారు.

ముర్షిదాబాద్‌ జిల్లాలో ముర్షిదాబాద్‌, జాంగీపూర్‌ నియోజకవర్గాలున్నాయి. జాంగీపూర్‌లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రెండుసార్లు, తరువాత ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ రెండుసార్లు ఎన్నికయ్యారు. గత రెండు ఎన్నికలలో అభిజిత్‌ మెజారిటీ 2012లో 2,536, 2014లో 8,161 మాత్రమే. రెండు సార్లూ సిపిఎం అభ్యర్ధి రెండవ స్ధానంలో వచ్చారు.ఈ సారి కూడా పోటీ ఆ రెండు పార్టీల మధ్యే జరుగుతోంది. ఈ నియోకవర్గంలో సిపిఎం 1977-1999 మధ్య ఏడుసార్లు గెలిచింది. మరోనియోజకవర్గం ముర్షిదాబాద్‌, సిపిఎం సిటింగ్‌ అభ్యర్ధి బద్రుద్దోజా ఖాన్‌ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలుచుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ ప్రముఖుడైన హుమాయున్‌ కబీర్‌ బిజెపిలో చేరి ఆ పార్టీ అభ్యర్ధి అయ్యాడు. ఇక్కడ కాంగ్రెస్‌, త ణమూల్‌ పోటీ చేస్తున్నాయి. మరో నియోజకవర్గం బెరహంపూర్‌ ఇక్కడ ప్రస్తుత కాంగ్రెస్‌ సభ్యుడు అధిర్‌ రంజన్‌కు సిపిఎం మద్దతు ఇస్తున్నది. అధిర్‌ అనుచరుడిగా వున్న అపూర్వ సర్కార్‌ కాంగ్రెస్‌ నుంచి త ణమూల్‌లో చేరి అభ్యర్ధి అయ్యారు.

బిజెపి మతతత్వ రాజకీయాల ప్రయోగ కేంద్రంగా మారిన అసన్‌సోల్‌,దుర్గాపూర్‌, బర్ద్వాన్‌ ప్రాంతంలో బిజెపి అసన్‌సోల్‌ నియోజకవర్గంలో విజయం సాధించింది. గతంలో ఎన్నడూ శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతుల పేర్లతో ప్రదర్శనలు జరిపి బలపడింది. త ణమూల్‌ కాంగ్రెస్‌లోని ముఠాతగాదాల కారణంగా ఒక వర్గం మద్దతు ఇచ్చిన కారణంగానే ఇక్కడ బిజెపి అభ్యర్ధి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా వున్న బాబూలాల్‌ సుప్రియో విజయం సాధించారు. ఈసారి రెండు వర్గాల మధ్య రాజీగా సినీ నటి మున్‌మున్‌ సేన్‌ రంగ ప్రవేశం చేశారు. బిజెపి మరో నియోజకవర్గం డార్జిలింగ్‌. ఇక్కడ ఎస్‌ఎస్‌ ఆహ్లూవాలియా ఆ పార్టీ తరఫున గెలిచారు. ఇక్కడ కూడా మత ప్రాతిపదికన చీల్చేందుకు బిజెపి ప్రయత్నించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో 17.02శాతం ఓట్లు తెచ్చుకున్న బిజెపి తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పదిశాతానికి పడిపోయింది. అయినప్పటికీ తానే త ణమూల్‌కు ప్రత్యామ్నాయం అని సగం సీట్లు గెలుస్తామని మీడియా ప్రచారదన్నుతో చెబుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల ఓట్ల శాతం సీట్లు

త ణమూల్‌ కాంగ్రెస్‌ 39.05      34

వామపక్ష సంఘటన 29.71       2

బిజెపి                17.02       2

కాంగ్రెస్‌                9.58       4

2016 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీల ఓట్ల శాతం, సీట్లు

త ణమూల్‌    44.9          211

సిపిఎం        19.8            26

కాంగ్రెస్‌        12.3           44

బిజెపి         10.2            3

ఫార్వర్డ్‌బ్లాక్‌    2.8             2

సిపిఐ          1.5           1

ఆర్‌ఎస్‌పి      1.7           3

జెఎంఎం       0.5           3

ఇండి ్        0             1

Share this:

  • Tweet
  • More
Like Loading...

సామాన్యులే కాదు, కార్పొరేట్ల సంపాదనా తగ్గింది!

12 Friday Apr 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Commoners, India elections 2019, India Inc's earnings, Modi era

ఎం కోటేశ్వరరావు

నరేంద్రమోడీ తొలి రోజుల్లో విమానాల్లో విహరించి గత ప్రధానుల రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను నెలకొల్పారు. విదేశాల వారికి మన పేదరికం లేదా పిసినారితనం ఎక్కడ కనపడుతోందో అని దేశ గౌరవాన్ని నిలిపేందుకు ప్రతిపక్షాల విమర్శలను కూడా దిగమించి ఖరీదైన సూట్లు వేసుకొని విదేశాల్లో తిరిగారు, విదేశీ అతిధులు వచ్చినపుడు వారితో సమంగా వ్యవహరించారు. ఇవన్నీ పెట్టుబడుల ఆకర్షణ, మేకిన్‌ ఇండియా పిలుపులో భాగంగా విదేశీయులు మన దగ్గర వస్తువులన తయారు చేయించుకొనేందుకు ఎగబడే విధంగా చేయటం కోసమే అని బిజెపి నేతలందరూ సమర్ధించారు. ఐదేండ్ల పాలన తరువాత అంతర్జాతీయ వార్తా సంస్ధ రాయిటర్స్‌ సరిగ్గా ఎన్నికలకు ఒక రోజు ముందు ఒక వార్తను విడుదల చేసింది.

అసాధ్యం అనుకున్న వాటిని అయిదేండ్లలో సుసాధ్యం చేశానని ఎన్నికల ప్రచారంలో వూరూ వాడా ప్రచారం చేస్తున్నారు. తాను తీసుకున్న చర్యలన్నీ దేశంలో వర్తక,వాణిజ్యాలు, పరిశ్రమల అభివృద్ధి కోసమే అని తద్వారా వుపాధి పెరుగుతుందని నరేంద్రమోడీ నాయకత్వం చెబితే జనం ఎలాంటి శషభిషలు లేకుండా నమ్మారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో జనం రోజుల తరబడి తమ సొమ్మును తామే తీసుకొనేందుకు బ్యాంకుల ముందు రోజుల తరబడి నిలబడి ప్రదర్శించిన దేశ భక్తిని చూశాము. రాష్ట్రాల అమ్మకపు పన్ను అధికారాన్ని తొలగించి జిఎస్‌టి అంటే దానికీ సై అన్నారు. అయితే రాయిటర్స్‌ వార్త సారాంశం ఏమంటే మోడీ ప్రభుత్వం తీసుకున్న వాణిజ్య అనుకూల అజెండా ఎక్కువ కార్పొరేట్‌ సంస్ధల లాభాల పెరుగుదల ప్రతిబింబించటంలో విఫలమైంది. అయినా మదుపుదారుల్లో ఇంకా ఆశచావలేదు. వడ్డీ రేట్లు గణనీయంగా పడిపోయాయి. చిన్న మదుపుదార్లకు అవకాశాలు తగ్గిపోయాయి. స్టాక్‌ మార్కెట్‌లో మదుపు చేసేందుకు ముందుకు వస్తున్నారు, మాడీ మార్కెట్లను వుత్సాహంతో వుంచారు అని అలాట్‌ మెంట్‌ కాపిటల్‌ అధికారి కృష్‌ సుబ్రమణ్యం చెప్పారు.

మోడీ తిరిగి ప్రధానిగా వస్తారనే ఆశలతో విదేశీ మదుపుదారులు వుత్సాహంతో వున్నారు.గతేడాది జనవరి-మార్చినెలల్లో 4.4బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెడితే ఈ ఏడాది ఆ మొత్తం 6.7బిలియన్లకు పెరిగింది. మోడీ అధికారం చేపట్టినప్పటి నుంచి నిఫ్టీ 63శాతం పెరిగితే ఈ ఏడాది ఇంతవరకు ఏడు శాతం పెరిగింది. స్వల్ప మెజారిటీతో బిజెపి తిరిగి అధికారానికి వస్తుందని ఇటీవలి సర్వేలు పేర్కొన్నాయి. ఒక వేళ మోడీ తిరిగి రాకపోతే కొంత మేర నీరసం ఆవహిస్తుందని యుబిఎస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ ఛోఛోరియా అన్నారు. ఆర్జన లేకుండానే స్టాక్‌ మార్కెట్‌ పెరిగింది. స్టాక్‌ మార్కెట్‌లో నమోదైన 399 కంపెనీల వివరాలను విశ్లేషించినపుడు మన్మోహన్‌ సింగ్‌ ఐదేండ్ల పాలనలో ఒక ఏడాది పడిపోతే మోడీ హయాంలో ఐదేండ్లలో నాలుగేండ్లు పడిపోయాయి.

రీఫినిటివ్‌ అనే సంస్ధ సేకరించిన సమచారాన్ని విశ్లేషిస్తే గత ప్రభుత్వ హయాంలో ఏటా 11.94% ఆర్జన పెరగ్గా మోడీ హయాంలో అది 3.72%కు పడిపోయింది.పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి వలన దేశ ఆర్ధిక వ్యవస్ధ పెరుగుదలను దెబ్బతీసిందని విశ్లేషకులు పేర్కొన్నారు.2018లో నిప్టీ 500 సూచిక కంపెనీల లాభం జిడిపిలో 2.8శాతం వుందని అది గత పదిహేను సంవత్సరాలలో కనిష్టమని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ నివేదిక తెలిపింది. 2014లో మోడీ అధికారంలోకి రాగానే భారత ఆర్ధిక రూపురేఖలనే మార్చివేస్తారన్న ఆశాభావం వుండేది, అయితే ఆశించిన వేగంగా అభివృద్ధి లేకపోయినప్పటికీ సంస్కరణలు తమకు ప్రయోజనం చేకూర్చుతాయని పెట్టుబడిదారులు ఇంకా ఆశాభావంతో వున్నారు. 2016లో పెద్ద నోట్ల రద్దు కారణంగా సాంప్రదాయకంగా రియలెస్టేట్‌, బంగారం కొనుగోళ్లకు బదులు మదుపుదారులు స్టాక్‌ మార్కెట్‌కు మళ్లారు. మోడీ హయాంలో నిఫ్టీ 75శాతం పెరిగింది. అయితే అంతకు ముందు కాంగ్రెస్‌ నాయకత్వంలోని ప్రభుత్వాల హయాంలో ప్రతి ఐదేండ్లకు ఆ పెరుగుదల వందశాతం చొప్పున వుంది. అంటే మోడీ పాలన ఈ విషయంలో కూడా వెనుకపడే వుంది.

గతం కంటే ఆర్జన తక్కువగా వున్నప్పటికీ స్టాక్‌ మార్కెట్‌ సూచిక పెరిగింది అంటే దాని అర్ధం కంపెనీల విలువలు ఎక్కువగా వుండటమే. స్టాక్‌ మార్కెట్‌ పరిభాషలో నిఫ్టీ 500 సూచిక కంపెనీలలో సగటు పియి గత ఐదు సంవత్సరాలలో 18 వుంది. అదే అంతకు ముందు ప్రభుత్వ హయాంలో 14.22 మాత్రమే. దీన్ని సులభంగా అర్ధం చేసుకోవాలంటే ఇలా చెప్పుకోవచ్చు.ఎవరైనా ఒక కంపెనీ నుంచి ఒక రూపాయి ఆర్జించాలనుకుంటే గత ఐదు సంవత్సరాలలో 18 రూపాయలు పెట్టుబడి పెట్టారు. అదే అంతకు ముందు రూ. 14.22 మాత్రమే పెట్టారు. ఏది లాభమో వేరే చెప్పనవసరం లేదు.

ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు విషయంలో ఐఎంఎఫ్‌ ప్రపంచంతో పాటు మన దేశ అంచనాను తగ్గించటం ఎన్నికల ముందు బిజెపికి ఒక ఎదురుదెబ్బ అనవచ్చు.పాకిస్ధాన్‌ అభివృద్ధి రేటును తగ్గించటం కొన్ని రాజకీయ పక్షాలకు వూరట కలిగిస్తే, ఇదే సమయంలో చైనా వృద్ధి రేటు పెంచటం మింగుడు పడని విషయం అనవచ్చు. మన విషయానికి వస్తే 2019-20లో 7.5 అని గతంలో చెప్పిన జోశ్యాన్ని 7.3%కు తగ్గించింది. వచ్చే ఏడాది మాత్రం 7.5శాతం తగ్గదట. మన రిజర్వుబ్యాంకు, ఏడిబి 7.2 అని, ఫిచ్‌ అనే రేటింగ్‌ సంస్ధ 6.8, ప్రపంచ బ్యాంకు 7.5శాతంగా తమ అంచనాలను పేర్కొన్నాయి. సరే నరేంద్రమోడీ సర్కార్‌ ప్రారంభించిన లెక్కల సవరింపు చివరికి ఎంత అని తేలుస్తుందో తెలియదు. ప్రపంచంలో 70శాతం ఆర్ధిక వ్యవస్ధలు మందగమనాన్ని సూచిస్తున్నాయని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్ధిక వేత్త మన దేశానికి చెందిన గీతా గోపీనాధ్‌ పేర్కొన్నారు.2020 తరువాత అభివృద్ధి 3.5శాతం దగ్గర స్ధిరపడనుందని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి అంకెలను పరిగణనలోకి తీసుకున్నపుడు ఎక్కువ అభివృద్ధి వున్న చోట నిరుద్యోగం తగ్గాలి, తక్కువ వున్న చోట పెరగాలి. ఆ రీత్యాచూసినపుడు మనది చైనా కంటే ఎక్కువ అభివృద్ధి రేటుతో ముందుకు పోతోంది. కానీ మన దగ్గర రికార్డు స్దాయిలో నిరుద్యోగం వున్నట్లు అంకెలు చెబుతున్నాయి. ఫిబ్రవరి నెలలో గరిష్ట స్ధాయిలో 7.2%కి పెరిగింది. మార్చినెలలో 6.7కు తగ్గింది. పన్నెండు నెలల సగటును ఏడాదికి తీసుకుంటారు, ఆవిధంగా గత ఏడాది 6.1శాతం 45ఏండ్ల రికార్డును తాకింది. అభివృద్ధి రేటు తగ్గనున్నందున నిరుద్యోగం మరింత పెరగనుంది.

మన ఆర్ధిక వ్యవస్ధలో కార్మిక భాగస్వామ్య రేటు ఫిబ్రవరి కంటే మార్చినెలలో 42.7 నుంచి 42.6కు పడిపోయింది. పట్టణ ప్రాంతాలలో పని చేస్తున్న వారి సంఖ్య 129 మిలియన్ల నుంచి 127కు పడిపోయింది.2016 తరువాత పట్టణ కార్మిక వర్గ భాగస్వామ్యం 40.5శాతానికి తొలిసారిగా పడిపోయింది. ఇంతవరకు 2018 నవంబరులో హీనస్ధాయిలో 37.3శాతంగా నమోదైంది.నిరుద్యోగశాతం 7.9గా వుంది. మార్చినెలలో పదిలక్షల వుద్యోగాలు పెరిగితే పదిలక్షల మంది పురుష వుద్యోగులు ఇంటిదారి పట్టారు. పట్టణ ప్రాంతాల్లో మహిళా వుపాధి కూడా తగ్గిపోయింది.

అభివృద్ధి రేటు ఎక్కువ వున్నపుడు వుద్యోగాలేమైనట్లు అని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ప్రశ్నించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం పాకిస్ధాన్‌లో జిడిపి వృద్ధి రేటు 2.9శాతానికి తగ్గనుంది. గత ఏడాది 5.2శాతం వుంది. అభివృద్ధి రేటు తగ్గనున్న కారణంగా ప్రస్తుతం వున్న 6.1శాతం నిరుద్యోగం 6.2శాతానికి పెరగనుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. దాయాది దేశం కంటే మన అభివృద్ధి అంకెలు ఎంతో మెరుగ్గా వున్నా నిరుద్యోగం విషయంలో మనం దానికి దగ్గరగా లేదా ఎక్కువగా వుండటం ఏమిటన్నది ప్రశ్న.

ఇక మన దేశంలో అనేక మంది అభివృద్ధి విషయంలో చైనా కంటే మనం ముందున్నామని పోల్చుకుంటారు. కానీ మిగతా విషయాలకు వచ్చే సరికి అబ్బే అది కమ్యూనిస్టు నియంతృత్వం మనది అతి పెద్ద ప్రజాస్వామ్యం, దానికి దీనికి పోలిక పెట్టకూడదంటారు. ఈ ఏడాది దాని అభివృద్ధి 6.2 నుంచి 6.3శాతానికి పెరగనుందని ఐఎంఎఫ్‌ నివేదిక పేర్కొన్నది. డిసెంబరులో 4.9శాతంగా వున్న నిరుద్యోగ రేటు జనవరిలో 5.3శాతానికి పెరిగింది. అభివృద్ధి రేటు పెరగనున్నందున నిరుద్యోగశాతం తగ్గనుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నందిగ్రామ్‌లో తిరిగి ఎగిరిన ఎర్రజెండా !

09 Tuesday Apr 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

CPI(M), Nandigram, West Bengal Lok sabha Elections 2019

Image result for nandigram, cpi(m)

ఎం కోటేశ్వరరావు

నందిగ్రామ్‌, పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలను ఒక మలుపు తిప్పిన పేరు, ప్రాంతం. భూసేకరణకు వ్యతిరేకంగా అక్కడ జరిగిన వుదంతాల కారణంగా అప్పటికే సిపిఎం పాలనపై వున్న అసంతృప్తిని సొమ్ము చేసుకున్న మమతాబెనర్జీ కమ్యూనిస్టులను గద్దె దింపి ముఖ్యమంత్రిగా మూడు సంవత్సరాల క్రితం రెండవ సారి కూడా గద్దెనెక్కిన విషయం తెలిసిందే. నందిగ్రామ్‌లో పన్నెండు సంవత్సరాల తరువాత గత ఆదివారం నాడు తిరిగి సిపిఎం తన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఆ ప్రాంతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ తమ పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేయటం, ఆక్రమించుకోవటం, కార్యకర్తలను నివాస ప్రాంతాల నుంచి వేలాది మందిని తరిమివేసినట్లు గతంలో పలుసార్లు సిపిఎం ప్రకటించిన విషయం తెలిసిందే. నందిగ్రామ్‌లోని సిపిఎం కార్యాలయం సుకుమార్‌ సేన్‌ గుప్తా భవనం గత పది సంవత్సరాలుగా మూతపడి వుంది. ఆదివారం నాడు కార్యాలయ ప్రారంభంతో పాటు తమ్లుక్‌ నియోజకవర్గ సిపిఎం అభ్యర్ధి ఇబ్రహీం ఆలీకి మద్దతుగా పెద్ద ప్రదర్శన కూడా చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీనేత రబిన్‌దేవ్‌ మాట్లాడుతూ ఒకనాడు వామపక్ష వ్యతిరేక ఆందోళనకు కేంద్రంగా వున్న చోట తిరిగి కార్యాలయాన్ని ప్రారంభించటానికి కారణం తృణమూల్‌ కాంగ్రెస్‌ దుష్పరిపాలనను గమనించిన జనం తిరిగి తమవైపు రావటమే కారణం అన్నారు.

అయితే తృణమూల్‌ వ్యతిరేకులందరూ తమ వైపు వచ్చిన కారణంగా ప్రతిపక్ష ఓట్లలో చీలిక తెచ్చేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ వారే సిపిఎంతో కుమ్మక్కై పార్టీ కార్యాలయ ప్రారంభానికి అవకాశమిచ్చారని బిజెపి జిల్లా అధ్యక్షుడు ప్రదీప్‌ దాస్‌ ఆరోపించారు. దీన్ని తృణమూల్‌ అభ్యర్ధి దివ్యేందు అధికారి తోసి పుచ్చారు. బిజెపి పగటి కలలు కంటున్నదన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు నాటి వామపక్ష ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌, మావోయిస్టు తదితర సిపిఎం వ్యతిరేకశక్తులన్నీ రైతులకు మద్దతు ఇచ్చి ఆందోళన చేయించాయి. ఆసందర్భంగా జరిగిన కాల్పుల్లో 14 మంది మరణించారు. ఆ తరువాత నోటిఫికేషన్‌ను రద్దు చేసినప్పటికీ ప్రతిపక్షాలు హింసాకాండను కొనసాగించాయి.

ఈ ఎన్నికల్లో సిపిఎం, కాంగ్రెస్‌ మధ్య పరస్పర పోటీ నివారించుకొనేందుకు జరిగిన చర్చలు విఫలం కావటంతో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. నందిగ్రామ్‌ ప్రాంతం వున్న తమ్లుక్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా మార్చిచివరి వారంలో బిజెపి నుంచి చేరిన లక్ష్మన్‌ సేథ్‌ను ప్రకటించారు. సేథ్‌ గతంలో సిపిఎం తరఫున మూడుసార్లు ఎంపీగా పని చేసి నందిగ్రామ్‌ వుదంతం తరువాత పార్టీ నుంచి వుద్వాసనకు గురయ్యాడు. తరువాత బిజెపిలో చేరాడు, ఈ ఎన్నికల్లో అభ్యర్ధిగా నిలిపేది లేదని ఆ పార్టీ స్పష్టం చేయటంతో కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్‌లో చేరాడు. రాష్ట్ర కాంగ్రెస్‌ అభ్యంతరాలను కూడా లెక్కచేయకుండా అధిష్టానవర్గం అభ్యర్ధిత్వాన్ని ప్రటించింది. తాను చెప్పిన అభ్యంతరాన్ని ఖాతరు చేయలేదని పార్టీ కార్యకర్తలు తగినన సమాధానం చెబుతారని అసెంబ్లీలో కాంగ్రెస్‌ పక్ష నాయకుడు అబ్దుల్‌ మన్నన్‌ వ్యాఖ్యానించారు. తాము చేయగలిందేమీ లేదని పిసిసి అధ్యక్షుడు సోమేన్‌ మిత్రా అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో నాలుగు పార్టీలు పోటీలో వున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌, బిజెపి, కాంగ్రెస్‌ మొత్తం 42 స్ధానాలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి.వామపక్ష సంఘటన కాంగ్రెస్‌ గెలిచిన నాలుగు స్ధానాలు మినహా 38 చోట్ల పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎన్నికల్లో వామపక్ష సంఘటన పుంజుకుంటుందా, బిజెపి తన స్ధానాలను సంఖ్యను పెంచుకుంటుందా అన్నది ప్రధాన చర్చ నీయాంశంగా వుంది. పార్టీలన్నీ చావో రేవో అన్నట్లు పోటీ పడుతున్నాయి.తృణమూల్‌ను పక్కకు నెట్టి వామపక్ష వ్యతిరేక శక్తిగా తాను ముందుకు రావాలని బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సంఘపరివార్‌ శక్తులు శ్రీరామనవమి, దుర్గాపూజ, వంటి మతపరమైన సందర్భాలన్నింటినీ వినియోగించుకొని ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టి హిందూ ఓటు బ్యాంకు ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నట్లు విమర్శలు వున్నాయి.

ఎన్నికల సందర్భంగా ప్రతి పార్టీ తన బలాన్ని ప్రదర్శించుకొనేందుకు పెద్ద బహిరంగ సభలను ఏర్పాటు చేస్తాయి. పశ్చిమ బెంగాల్‌లో కొల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ను అందుకు వేదికగా చేసుకుంటాయి. ఇప్పటి వరకు జరిగిన సభలను చూస్తే మోడీ పాల్గన్నది అత్యంత పేలవంగా వుంది, ఆ సభకోసం బిజెపి 32కోట్ల రూపాయలను ఖ ర్చు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ సభకు రెండులక్షల మంది వరకు రాగా ఫిబ్రవరి మూడున వామపక్షాలు జరిపిన సభకు పదిలక్షల వరకు జనం హాజరయ్యారు. ఈ సభ వామపక్షాలలో ఎంతో ఆత్మస్ధైర్యాన్ని నింపింది.

నరేంద్రమోడీ ఒక వలస పక్షి వంటి వారు, ఎన్నికలపుడే వస్తారు, కాగానే వెళ్లిపోతారు, మాకు కావాల్సింది నిజమైన చౌకీదారు తప్ప మోసగాడు కాదు అని మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో ధ్వజమెత్తుతున్నారు. తృణమూల్‌ శారద-నారద పార్టీ అని నరేంద్రమోడీ ఎద్దేవా చేశారు. అయితే శారద-నారద- హవాలా లీడర్లందరూ ఇప్పుడు బిజెపి అవతారమెత్తారని మమతా బెనర్జీ తిప్పికొడుతున్నారు.

Image result for after 12 years red flags again unfurled in nandigram

గత పార్లమెంట్‌,అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాయిజం గురించి మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీల వారిని నామినేషన్లు కూడా వేయనివ్వకుండా పంచాయతీలన్నీ ఏక గ్రీవం అయ్యేట్లు చూశారన్న విమర్శలు వున్నాయి. ఎన్నికలు జరిగిన చోట్ల రిగ్గింగ్‌ చేశారు. అవినీతి కేసులు వున్న తృణమూల్‌ ఎంపీలు, నేతలు దాడుల భయంతో బిజెపికి ఫిరాయించారు. ప్రస్తుత ఎన్నికల్లో తృణమూల్‌ వ్యతిరేక ఓట్లను పొందేందుకు వామపక్ష సంఘటన, బిజెపి, కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నాయి. వామపక్ష సంఘటనలో సిపిఎం 29, ఫార్వర్డ్‌బ్లాక్‌, సిపిఐ, ఆర్‌ఎస్‌పి మూడేసి సీట్లుకు పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్‌ గెలిచిన నాలుగు సీట్లకు వామపక్ష సంఘటన అభ్యర్ధులను ప్రకటించలేదు.కాంగ్రస్‌ స్పందనను బట్టి వాటి మీద కూడా తాము నిర్ణయం తీసుకుంటామని ప్రకటించాయి. మొత్తం ఏడు దశలో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల పరంగా చూస్తే తృణమూల్‌ కాంగ్రెస్‌ తరువాత వామపక్ష సంఘటనకే ఎక్కువ వున్నాయి. 2016లో వామపక్ష సంఘటన, కాంగ్రెస్‌ సర్దుబాట్లు చేసుకున్నాయి. అందువలన పొందిన ఓట్లు వాస్తవ బలాన్ని ప్రతిబింబించవు. ఆ సర్దుబాటును సిపిఎం కేంద్ర కమిటీ తప్పు పట్టింది. పార్టీ ఆమోదించిన విధానానికి వ్యతిరేకం అని పేర్కొన్నది.

2014లోక్‌ సభ ఎన్నికల్లో పార్టీల ఓట్లశాతం, సీట్లు

తృణమూల్‌    39.05     34

లెఫ్ట్‌ ఫ్రంట్‌     29.71     2

బిజెపి          17.02    2

కాంగ్రెస్‌         9.58      4

2016అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల ఓట్లశాతం సీట్లు

తృణమూల్‌   44.9    211

లెఫ్ట్‌ ఫ్రంట్‌    25 .8   30

సిపిఎం       19.8    26

సిపిఐ          1.5    1

ఆర్‌ఎస్‌పి       1.7    3

ఫార్వార్డ్‌బ్లాక్‌   2.8     2

బిజెపి        10.2    3

కాంగ్రెస్‌      12.3    44

ఇతరులు      0      4

Share this:

  • Tweet
  • More
Like Loading...

అద్వానీ వూడగొట్టిన నాగటి కర్రు ?

07 Sunday Apr 2019

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION

≈ Leave a comment

Tags

BJP, L K Adavani, Lal Krishna Advani's recent blog, LK Advani Comment, Narendra Modi, Rhul Gandhi on Advani, RSS

Image result for Adavani  an useless entity  In BJP

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ కార్మికులారా ఏకంకండి, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని మార్క్స్‌-ఎంగెల్స్‌లు తమ కమ్యూనిస్టు ప్రణాళికలో పిలుపు ఇచ్చారు. బిజెపి అగ్రనాయకుడు ఎల్‌కె అద్వానీ ఇప్పుడు వూడగొట్టిన నాగటి కర్రు. అది నాగలికి వుంటేనే దున్నటానికి పనికి వస్తుంది. ఒట్టి కర్రుతో పొలం దున్నలేరు. తాను ఏమి మాట్లాడినా తనకు ఇంతకు మించి పోయేదేమీ లేదన్నట్లుగా తొమ్మిది పదులు దాటిన బిజెపి కురువ ద్ధుడు ఎల్‌కె అద్వానీ నిర్ణయించుకున్నారు. ఇందుకు ఆయనను ఎవరైనా ప్రేరేపించారా ! బిజెపిలో అంత ధైర్యమూ లేదు, ఎవరికీ అంతసీన్‌ లేదు. అందుకే వుక్రోషంతో తన బ్లాగ్‌లో తన అంతరంగం ద్వారా నరేంద్రమోడీ తీరు తెన్నులపై పరోక్షంగా ధ్వజమెత్తారని కొందరి అభిప్రాయం.

తన బ్లాగ్‌లో అద్వానీ విప్పిన అంతరంగ ముఖ్యాంశాలు ఇలా వున్నాయి. బిజెపిలో వున్న మనమందరం పార్టీ వ్యవస్దాపక దినోత్సవం సందర్భంగా వెనుకా, ముందూ చూసుకోవటం, ఆత్మపరిశీలన చేసుకోవటం మంచిది అని చెప్పారు. పార్టీలోపలా, విశాలమైన దేశ వ్యవస్ధలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామిక సంప్రదాయాలను కాపాడు కోవటం బిజెపి ప్రమాణ చిహ్నంగా వుండాలి.మన ద ష్టిలో జాతీయ వాదం అంటే రాజకీయంగా మనతో ఏకీభవించని వారిని మనం ఎన్నడూ జాతి వ్యతిరేకులుగా పరిగణించలేదు, వ్యక్తిగతంగా రాజకీయ స్దాయిలో వ్యక్తులు ఎంచుకొనే స్వేచ్చకు బిజెపి కట్టుబడి వుంటుంది. ముందు దేశం, తరువాత పార్టీ,మన గురించి చివరిగా ఆలోచించాలన్న సూత్రం తనకు జీవిత మార్గదర్శిగా వుందని, జీవితాంతం దానికి కట్టుబడి వుంటానని అద్వానీ పేర్కొన్నారు.

బిజెపి నిజమైన స్వభావాన్ని అద్వానీ గారు పక్కాగా చెప్పారు. దేశం ముందు, పార్టీ తరువాత, వ్యక్తిగతం చివర వుండాలనే మార్గదర్శక మంత్రం బాగా తెలిసిందే. బిజెపి కార్యకర్తగా గర్వపడుతున్నాను మరియు ఎల్‌కె అద్వానీ వంటి గొప్పవారు దాన్ని మరింత బలపరిచారు అని ప్రధాని నరేంద్రమోడీ ట్విటర్‌ద్వారా వ్యాఖ్యానించారు. అద్వానీ ఎట్టకేలకు తన నోరు విప్పారు. ఆయనకు పోయేదేమీ లేదు అంటూ ఒక పత్రికలో వ్యాఖ్యానం మొదలైంది. అద్వానీకి నోరు విప్పటానికి ఐదేండ్లు పట్టింది, అసలు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నట్లు అని బిజెపి మిత్రపక్షం శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం ప్రశ్నించింది.

Image result for Advani , modi in different occasions

మామ తిట్టాడన్నదాని కంటే తోడల్లుడు కిసుక్కున నవ్వటం తగని పని అన్నట్లు అద్వానీ గురించి రాహుల్‌ గాంధీ చేసిన వాటి కంటే చౌకీదారు పంగనామాలు పెట్టుకున్న బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీని మరింత ఇరుకున పెడుతున్నాయని చెప్పవచ్చు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ ఎన్నికల సభలో మాట్లాడిన రాహులు ఇలా అన్నారు.’ బిజెపి హిందూయిజం గురించి మాట్లాడుతుంది, హిందుస్దాన్‌లో గురువు అధిపతి. పార్టీ గురుశిష్య సంబంధాల గురించి మాట్లాడుతుంది. మోడీ గురువు ఎవరు? అద్వానీ, అద్వానీని ప్రజాజీవన వేదిక మీది నుంచి తోసివేశారు’ అన్నారు. గురువును అవమానించటం హిందూ సంస్క తి కాదంటూ నరేంద్రమోడీని వుద్దేశించి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యా నించారు. హిందూ సంస్క తి గురించి మాట్లాడే హక్కు తమకే వుందని, పేటెంట్‌ తీసుకున్నామన్నట్లుగా చెప్పుకొంటుంది బిజెపి. అయితే ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లు హిందూత్వను హిందూత్వతోనే దెబ్బతీయాలి అన్నట్లుగా రాహుల్‌ గాంధీ మాట్లాడారా ? లేక తామూ హిందూ సంస్కృతి గురించి చెప్పగలమని రాహుల్‌ గాంధీ స్పష్టం చేసినట్లుగా వుంది. అదే హిందూ సంస్క తిలో గురువు తాను స్వయంగా శిక్షణ ఇచ్చిన ఒక శిష్యుడి కోసం తనను పరోక్షంగా గురువుగా భావించిన మరొక శిష్యుడి బొటనవేలిని కానుకగా కోరిన దారుణం కూడా తెలిసిందే. దాని మంచి చెడ్డలను మరోసారి చూడవచ్చు.

Image result for Advani , modi in different occasions

అసలు విషయం ఏమంటే బిజెపి వ్యవస్దాపక నేతలలో ఒకరైన ఎల్‌కె అద్వానీ పార్టీ ఆఫీసుకు రావద్దని చెప్పటం మినహా మిగిలిన అవమానాలన్నీ జరిగాయి. వాటన్నింటినీ దిగమింగుతూ ఏప్రిల్‌ ఆరున బిజెపి వ్యవస్దాపక దినోత్సవం సందర్భంగా ఎవరూ కోరకుండానే పార్టీ నాయకత్వం, కార్యకర్తలకు తన బ్లాగ్‌ ద్వారా అద్వానీ ఈనెల నాలుగు ఒక సందేశాన్ని పంపారు. గత ఐదు సంవత్సరాలలో ఒక బ్లాగ్‌ పోస్టు పెట్టటం ఇదే ప్రధమంట. నరేంద్రమోడీ మన్‌కీ బాత్‌ పేరుతో రేడియోలో ప్రతి నెలా తన అంతరంగాన్ని బయట పెడితే, అంతకు ముందే అద్వానీ తన ఇంటర్నెట్‌ బ్లాగ్‌లో తన అంతరంగాన్ని అభిప్రాయాల రూపంలో అప్పుడు రాస్తుండేవారు. ఏమి రాస్తే, ఏమి మాట్లాడితే ఎవరికేమి కోపం వస్తుందో అన్నట్లుగా గత ఐదేండ్లుగా బ్లాగులో రాయట మానుకున్నారు. గత ఐదు సంవత్సరాలుగా లోక్‌సభకు హాజరు కావటం, అలవెన్సులు తీసుకోవటం తప్ప ఒక్కసారి కూడా నోరు విప్పని సభ్యుల జాబితాలో ఆయన కూడా చేరిపోయారనే విమర్శలకు గురయ్యారు. ఐదు సంవత్సరాలలో ఆయన కేవలం 365పదాలను మాత్రమే మాట్లాడారని, అది కూడా 2014లో అని ఇండియా టుడే పత్రిక పేర్కొన్నది, బహుశా సభ్యుడిగా ప్రమాణ స్వీకారం అయి వుండవచ్చు.

ఆరు సార్లు గుజరాత్‌లోని గాంధీ నగర్‌ నుంచి ఎంపీగా వున్న అద్వానీని వయసు మీరిందనే సాకు చూపి ఈ సారి ఎన్నికల్లో సీటు కేటాయించకపోగా ఆయనే పోటీ చేయటం లేదని చెప్పారంటూ బిజెపి నేతల నుంచి మీడియాకు వుప్పందించారు. ఈ చర్య ఆయనను అవమానించటంగా మీడియా, ప్రతిపక్షాలు వర్ణించాయి తప్ప బిజెపి ప్రముఖులెవరూ నోరు విప్పలేదు. రాహుల్‌ గారూ మీ మాటలు మమ్మల్ని ఎంతగానో గాయపరిచాయి, అద్వానీ మాకు బిజెపిలో తండ్రితో సమానుడు . మీ వుపన్యాసాల్లో కాస్త ఔచిత్యం ప్రదర్శించండి’ అని సుష్మా స్వరాజ్‌ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

నిజానికి రాహులు గాంధీ ఇప్పుడు వ్యాఖ్యానించారు గానీ నరేంద్రమోడీ గురువుకు పంగనామాలు పెట్టారని ఐదు సంవత్సరాల క్రితమే జనానికి అర్దమైంది. అనుమానాస్పద స్దితిలో జరిగిన గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో చెలరేగిన మారణ కాండ సమయంలో నరేంద్రమోడీయే ముఖ్యమంత్రిగా వున్నారు. ఆయన వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు రావటంతో ప్రధానిగా వున్న వాజ్‌పేయి పదవి నుంచి తప్పుకోవాలని మోడీని ఆదేశించారని, అద్వానీ మద్దతుతో మోడీ తిరస్కరించి ముఖ్యమంత్రిగా కొనసాగారని, చేసేదేమీ లేక రాజధర్మం పాటించాలన్న వుద్బోధతో వాజ్‌పేయి సరిపెట్టారని అప్పుడే వార్తలు వచ్చాయి. నాడు అద్వానీ మద్దతు లేకపోతే నేడు ప్రధానిగా నరేంద్రమోడీని వూహించలేము.

ప్రధాని పదవిపై ముందునుంచీ కన్నేసిన నరేంద్రమోడీ పార్టీలో కేంద్ర ఎన్నికల కమిటీ అధ్యక్ష పదవి కోసం 2013లోనే పావులు కదిపి విజయం సాధించారు. ఆయన పేరును పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రతిపాదించగానే అద్వానీ మౌనంగా వుండటం తప్ప మరేమీ చేయలేని స్దితిలో పడ్డారు. అద్వానీకి పదవి నిరాకరించితే సమస్యలు వస్తాయని వూహించి 75 సంవత్సరాలు దాటిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వకూడదని ఒక నిబంధను ముందుకు తెచ్చారు. దానికి అనుగుణంగా అద్వానీ, మురళీమనోహర జోషి వంటి వారితో మార్గదర్శక మండలి ఏర్పాటు చేసి సలహాలు తీసుకుంటామంటూ మండలి ఏర్పాటు గురించి ప్రకటించారు. అది ఐదేండ్లలో ఒక్కసారంటే ఒక్కసారిగా కూడా సమావేశం కాలేదు, నరేంద్రమోడీ సర్కార్‌ సలహా ఇమ్మని ఒక్కసారి కూడా కోరలేదు.ఇది పొమ్మన కుండా పొగపెట్టటమే అని అందరూ అప్పుడే వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాలని అన్ని అస్త్రాలను నరేంద్రమోడీ ప్రయోగిస్తున్న దశలో అధికారం కోసం ఏం చేసినా తప్పులేదనే ఒక అభిప్రాయాన్ని దిగువ స్దాయి కేడర్‌ వరకు బిజెపి ఎక్కించింది. దేశంలో హిందూత్వ, హిందూ మతాన్ని కాపాడాలంటే నరేంద్రమోడీ తప్ప మరొకరి వల్ల కాదనే అభిప్రాయాలు నిత్యం సామాజిక మాధ్యమంలో వెల్లడి అవుతున్నాయంటే దాని అర్దం అదే. అందువలన ప్రజాస్వామ్యం, ప్రజాస్వామిక విలువల గురించి బిజెపి కార్యకర్తలకు ఎంత మేరకు ఎక్కుతాయనేది ప్రశ్న. నరేంద్రమోడీ గోరక్షకులు హద్దులు మీరవద్దంటూ అనేక సుభాషితాలు పలికారు. అలా హద్దులు మీరి, హత్యలు చేసిన నిందితులు అనేక మంది వుత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న బిజెపి ఎన్నికల సభల్లో ముందువరుసల్లో కూర్చున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.అలాంటి వారికి విద్వేషం వద్దు ప్రేమే ముద్దు అంటే ఎక్కుతుందా ?

భిన్నాభి ప్రాయం చెప్పిన వారందరినీ దేశద్రోహులుగా సంఘపరివార్‌ సంస్ధలూ, వాటికి వంత పాడిన మీడియా గత ఐదు సంవత్సరాలుగా నిరంతరంచిత్రీకరిస్తోంది.గతంలో అనేక మంది ప్రభుత్వం తమకు ఇచ్చిన అవార్డులను వెనక్కు ఇచ్చేసి నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని దేశం ఇంకా మరచి పోలేదు. ఇప్పుడు చెప్పిన మాటలను అద్వానీ అప్పుడు చెప్పివుంటే వాటికి ఎంతో విలువ వుండేది. దేశంలో ప్రజాస్వామిక వ్యవస్ధలను, స్వతంత్ర అధికార వ్యవస్దలను నాశనం చేస్తున్నారన్న విమర్శలు తీవ్రంగా వెలువడిన సమయంలో అద్వానీ ఎందుకు నోరు విప్పలేకపోయారు, పార్లమెంటులో ఒక్కసారి కూడా నోరు విప్పే ధైర్యం ఎందుకు చేయలేకపోయారు. నక్కబోయిన తరువాత బక్కపూడ్చినట్లు ఇప్పుడు చెప్పారు అనే వారిని తప్పు పట్టలేము. తనకు తిరిగి సీటు ఇచ్చి వుంటే ఇలా మాట్లాడేవారా అనే వారు కూడా లేకపోలేదు. దేశమంతటికీ ముఖ్యంగా బిజెపికి ఎన్నికల, మరోసారి అధికార జ్వరం తీవ్ర స్దితికి చేరిన సమయంలో చెబితే ఎంత మంది వినిపించుకుంటారు అన్నది ప్రశ్న.

దేశంలో అత్యవసర పరిస్దితి విధించి నాలుగు దశాబ్దాలు పూర్తి అయిన సందర్భంగా 2015లో అద్వానీ మాట్లాడుతూ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని నలిపివేశే శక్తులు బలంగా వున్నాయని వ్యాఖ్యానించారు. గోరక్షణ పేరుతో పశువుల వ్యాపారులు, మైనారిటీల మీద దాడులు ప్రారంభమైన సమయ మది. దేశంలో హిందూత్వ పేరుతో రాజకీయాలు చేయటం ప్రారంభమైనపుడే ఇలాంటి వాటిన్నింటికీ బీజాలు పడ్డాయి. అవి పెరిగి పెద్ద వ క్షాలుగా ఎదగటానికి తోడ్పడిన వారిలో అద్వానీ పాత్ర లేదా అని ప్రశ్నించే వారు లేకపోలేదు.1980లో బిబిసితో మాట్లాడుతూ బిజెపిని హిందూ పార్టీ అని పిలవటం తప్పేమీ కాదు అన్నారు. తరువాత కొన్ని సంవత్సరాలకు దేశ లౌకిక విధానం హిందువుల ఆకాంక్షలపై సహేతుకంగాని ఆంక్షలు పెడుతున్నదని ఆరోపించారు. ఎవరైతే హిందువుల ప్రయోజనాలకోసం పోరాడతారో ఇక నుంచి వారే దేశాన్ని ఏలుతారు అన్నారు. కుహనా లౌకిక వాదం అనే పదాన్ని ప్రయోగించటం, ప్రాచుర్యంలోకి తేవటంలో అద్వానీ చేయాల్సిందంతా చేశారు.

Image result for Advani , modi in different occasions

అయితే అద్వానీకి అలా హితబోధ చేసే హక్కు లేదా అని ఎవరైనా అనవచ్చు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో అలాంటి వుద్బోధలు మోడీ, బిజెపికి హాని కలిగిస్తాయి కనుక అద్వానీ అయినా సరే అలా మాట్లాడటాన్ని సహించం అని హిందూత్వ పులినెక్కిన వారు హూంకరించవచ్చు. అద్వానీకి ఆ హక్కు, అవకాశం వుందని జనం అభిప్రాయ పడుతున్నారు. అయితే చరిత్ర నిర్దాక్షిణ్యమైనది. గాంధీని మోసిన రైలేే గాడ్సేను కూడా అనుమతించింది. అద్వానీ వుద్బోదధలను నమోదు చేసి సానుభూతి కలిగేట్లు చేసినట్లుగానే ఆయన విద్వేష పూరిత రాతలు, ప్రసంగాలను కూడా జనం ముందుంచి ఆయన మీద ద్వేషం, వ్యతిరేకతను కలిగేట్లు చేసింది.

ప్రస్తుతం మీడియాలో, జన వాడకంలో వున్న కుహనా లౌకిక వాదం అనే పదాన్ని వుపయోగించి హిందువుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారంటూ బహుళ ప్రచారం తెచ్చింది అద్వానీయే. ఆ పదం మరింత ముదిరి బిజెపి నేతలు,అనుచరులు లౌకికవాదులంటే దేశాన్ని ముక్కలు చేసే గాంగ్‌ అని నిందిస్తున్నది.1997 ఆగస్టులో బిజెపి టు డే అనే పత్రికలో అద్వానీ రాసిన దానిలో ఇలా వుంది.’ హిందుత్వ లేదా సాంస్క అతిక జాతీయ వాదం మతపరమైనది కాదు,(ముస్లింలు) రాముడు, క అష్ణుడు ఇతరులను జాతీయ సంస్క అతికి చిహ్నాలుగా అంగీకరించాలి మరియు అయోధ్యలో రామాలయానికి మద్దతు ఇవ్వాలి ఎందుకంటే రాముడు భారత సంస్క అతి మరియు నాగరికతకు చిహ్నం’ అని రాశారు. ఈ వైఖరితో విబేధించే భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే వారినే కదా ఇప్పుడు దేశద్రోహలు అని నిందిస్తున్నది. మరి ఇప్పుడు అదే అద్వానీ గతంలో తాను చెప్పిన దానికి భిన్నంగా బోధ చేస్తే బిజెపిలో వినే వారుంటారా ?

Image result for Advani , modi in different occasions

రధయాత్ర పేరుతో అద్వానీ దేశంలో ఎలాంటి రాజకీయాలకు తెరలేపారో, ఎంతటి మారణకాండకు ఆద్యుడయ్యారో తెలిసిందే. ఆయన కళ్ల ముందే బాబరీ మసీదు కూల్చివేత, దాన్ని ఆపేందుకు ఆయన ప్రయత్నించినట్లు ఎలాంటి దాఖలాలు లేవు. తనకు రాజకీయ భిక్షపెట్టిన అద్వానీని ప్రధాని నరేంద్రమోడీ విస్మరించారని, అవమానించారని అంటున్నారంటే వూరికే కాదు. 2008లో అద్వానీ తన ఆత్మకథను ప్రచురించారు.దానిలో ఇలా రాశారు.’ గోద్రాలో కరసేవకుల సామూహిక హత్యల అనంతరం గుజరాత్‌లో మతహింసాకాండ చెలరేగింది. ఆ దారుణమైన సంఘటన గురింఎతీ గుజరాత్‌ ప్రభుత్వాన్ని ప్రత్యేకించి ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తీవ్ర ఖండనలకు గురయ్యారు. మోడీని అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నారు. నా అభిప్రాయంలో జరిగిన దానికంటే ఎక్కువ పాపాన్ని మూటగట్టుకున్నారు.’ అలావెనకేసుకు వచ్చిన పెద్దమనిషి ఇప్పుడు మోడీ చేశారని చెబుతున్నదానిని ఎలా ఖండించగలరు, ప్రత్యక్షంగా మోడీని ఎలా విమర్శించగలరు.

దేశంలో 1990దశకలో తలెత్తిన మత హింసాకాండకు అద్వానీ రధయాత్ర ఎంతగానో దోహదం చేసింది. బాబరీ మసీదు కూల్చివేత కుట్రలో అద్వానీ, మురళీ మనోహర జోషి, వుమా భారతి(బిజెపి లేదా నరేంద్రమోడీ పక్కన పెట్టిన జాబితాలోని వారు) తదితరుల ప్రమేయం గురించి రోజువారీ విచారణ జరిపి 2019 ఏప్రిల్‌ 19లోగా రెండు సంవత్సరా వ్యవధిలో పూర్తి చేయాలని 2017లో సుప్రీం కోర్టు ఆదేశించింది.

బాబరీ మసీదుకు ముందు రామాలయం వుండేదని రుజువు అవుతుందని సంఘపరివార్‌ సంస్ధలు చెబుతుండేవి. అయితే క్రీస్తుపూర్వం పదకొండవ శతాబ్దిలో అయోధ్యలో మానవ ఆవాసాలు వున్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని రామాయణ స్ధల ప్రాజెక్టు నివేదికలో ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఎఎస్‌ఐ) తెలిపింది. దాంతో రామాలయ వాదుల నోట్లో వెలక్కాయపడింది. సరిగ్గా ఆ సమయంలో అద్వానీ వారిని ఆదుకున్నారు. రాముడు ఒక నమ్మకం దానికి సాక్ష్యాలు ఎలా వెతుకుతారంటూ అద్వానీ వాదించారు.అప్పటి నుంచి కోర్టులు విశ్వాసాల మీద తీర్పులు చెప్పలేవంటూ సంఘపరివార్‌ వాదించటం మొదలు పెట్టింది. అంటే కోర్టు తీర్పును తాము అంగీకరించేది లేదని చెప్పేందుకు వేసిన ప్రాతిపదిక ఇది. శబరిమల ఆలయంలో కూడా అదే వాదనలు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఆయోధ్యలో రామాలయ నిర్మాణమే తమ లక్ష్యం అని చెప్పేవారు. దానికి సాంస్కృతిక జాతీయవాదాన్ని పైన చేర్చింది అద్వానీ మహాశయుడే అన్నది తెలిసిందే.

మసీదు కూల్చివేత కేసులో అద్వానీని ప్రభుత్వ సకల వసతి గృహంలో నిర్భందించారు. ఆ సమయంలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికకు రాసిన వ్యాసాలలో డిసెంబరు ఆరు తన జీవితంలో విచారకరమైన రోజు అని పేర్కొన్నారు. ఇలా చెప్పటం మసీదును కూల్చివేసినందుకు క్షమాపణగా భావించవచ్చా అన్న ప్రశ్నకు కాదని సమాధానమిచ్చారు. తరువాత స్మృతులలో అద్వానీ మరొక కధనాన్ని వినిపించారు. బాబరీ మసీదు వద్ద చేరిన జనాన్ని అదుపు చేయటంలో విఫలమైనందుకు తాను విచారపడుతున్నానని,వ్యక్తిగతంగా తనకు పరువు నష్టమని, ఆ స్ధలంలోని కట్టడానికి ఎలాంటి నష్టం కలిగించకుండా నామ మాత్రంగా రామాలయ నిర్మాణ కార్యక్రమం చేపడతారని అనుకున్నానని పేర్కొన్నారు. కూల్చివేత పట్ల విచారం ప్రకటించినందుకు సంఘపరివార్‌లో, బయటి లౌకికవాదులు కూడా తనను విమర్శించారని, తన వ్యక్తిగత విశ్వసనీయత కరిగిపోయిందని చెప్పుకున్నారు.

Image result for Advani , modi in different occasions

అద్వానీ గళం అప్పుడేమైంది? భిన్నాభిప్రాయం కలిగినంత మాత్రాన వారిని జాతి వ్యతిరేకులు అనాల్సిన అవసరం లేదని అద్వానీ ఇప్పుడు అంటున్నారు. అసలు నోరు మూసుకోవటం కంటే ఎప్పుడో ఒకప్పుడు తెరవటం మంచిదే కదా అనే అరగ్లాసు సంతృప్తి జీవులుంటారు. ఫిబ్రవరి 14న పుల్వామా వుగ్రదాడి జరిగిన తరువాత మార్చిమూడవ తేదీన బీహార్‌లో మోడీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభకు రాని వారందరినీ పాకిస్దాన్‌కు మద్దతుదార్లుగా పరిగణిస్తామని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ సెలవిచ్చినపుడు మార్గదర్శక మండలి సభ్యుడిగా అద్వానీ నోరు మెదపలేదు. ఈ వైఖరితో విబేధించే భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే వారినే కదా ఇప్పుడు దేశద్రోహలు అని నిందిస్తున్నది. మరి ఇప్పుడు అదే అద్వానీ గతంలో తాను చెప్పిన దానికి భిన్నంగా బోధ చేస్తే బిజెపిలో వినే వారుంటారా ?

స్వాతంత్య్ర వుద్యమ సమయంలోనే కమ్యూనిస్టులు మహాత్మా గాంధీ వైఖరితో విబేధించారు, వ్యతిరేకించారు. తరువాత కాంగ్రెస్‌ ప్రజాస్వామ్య వ్యతిరేక పోకడలు, బిజెపి మత పోకడలు చూసి కనీసం గాంధీ చెప్పిన అంశాలకైనా కట్టుబడండని అదే కమ్యూనిస్టులు చెప్పారు. ఇప్పుడు కూడా అదే పరిస్దితి తలెత్తింది. దేశమంటే బిజెపి,బిజెపి అంటే దేశం, బిజెపిని విమర్శించటమంటే దేశాన్ని విమర్శించటమే అనే ఒక వున్మాద వాతావరణం దేశంలో నెలకొన్న స్దితిలో అద్వానీ మంచి మాటలు ఎందరికి ఎక్కుతాయన్నది ఒక ప్రశ్న. ప్రపంచ చరిత్రలో అనేక మంది నియంతలను చూశాము. రెండవ ప్రపంచ యుద్దానికి ముందు జర్మనీలో హిట్లర్‌ను చూసిన తరువాత వాడి కంటే పూర్వపు నియంతలే మెరుగు అనిపించాడు. బాబరీ మసీదును కూలదోస్తున్న సమయంలో స్వయంగా అక్కడే వున్న ఎల్‌కె అద్వానీ నాడు ఒక పెద్ద మతోన్మాది, పచ్చిమితవాదిగా కనిపించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు బిజెపిని విమర్శించిన తెలుగుదేశం వంటి పార్టీలు ఆ పార్టీకే కేంద్రంలో ఎందుకు మద్దతు ఇచ్చారని అడిగితే వాజ్‌పేయిని చూసి తప్ప బిజెపిని చూసి కాదని చెప్పుకున్న విషయాన్ని మరచి పోరాదు. ఇప్పుడు అలాంటి అద్వానీయే మెరుగని నరేంద్రమోడీ తీరుతెన్నులు జనం చేత అనిపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రతిపక్షాలు చెప్పింది వినకపోతే పాయే మీ అద్వానీ చెప్పింది అయినా పాటించమని జనం గళం విప్పాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

యువతకు ముందుంది మరింత కష్ట కాలం !

04 Thursday Apr 2019

Posted by raomk in Congress, Current Affairs, Economics, employees, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

gloomy jobs scenario in india, jobs for machines in india, jobs scenario in india, Machines Vs humans

Image result for gloomy jobs scenario in india

ఎం కోటేశ్వరరావు

కాంగ్రెస్‌ ప్రకటించిన ఎన్నికల ప్రణాళికను నమ్మి జనం ఓటేసి గెలిపిస్తే తరువాత దాని అమలు విషయానికి వస్తే జుమ్లా (ఏదో అవసరానికి అలా చెబుతాం) అవుతుందా ? ఏమో ! నరేంద్రమోడీ వాగ్దానం చేసిన మేరకు నల్లధనాన్ని వెలికి తీసి ఆ మొత్తం నుంచి ప్రతి ఒక్కరికి వేస్తామన్న పదిహేను లక్షల రూపాయల సొమ్ము తమ బ్యాంకు ఖాతాల్లో ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూసే అమాయకులు ఇంకా వున్నారు కదా ! ఎన్నికల సమయంలో చేసే వాగ్దానాలకు అచరణకూ పొంతన వుండదని ఏడు దశాబ్దాల అనుభవం చెబుతోంది. రానున్న పది సంవత్సరాలలో దేశంలో నిరుద్యోగ సమస్య మరింత తీవ్రం కానుంది. అందువలన యువత, వారి భవిష్యత్‌ను కోరే వారు ఆలోచించి తమ ప్రతినిధులను ఎన్నుకోవాల్సి వుంది.

తాము అధికారంలోకి రాగానే 2020 నాటికి నాలుగు లక్షల కేంద్ర వుద్యోగాలను భర్తీ చేస్తామని ఇవిగాక రాష్ట్రాలలో వున్న మరొక ఇరవై లక్షల వుద్యోగాల భర్తీకి కూడా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్‌ పేర్కొన్నది. ఇవి గాక ఏటా 22లక్షల కొత్త వుద్యోగాల కల్పన కూడా చేస్తామని చెప్పారు. స్ధానిక సంస్దలలో పదిలక్షల సేవామిత్రల ఏర్పాటు గురించి కూడా వాగ్దానం వుంది. 2013 మార్చినెల నాటికి ఆరులక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ వుద్యోగ ఖాళీలు వుండగా 2014 మార్చి ఒకటి నాటికి అవి 4లక్షల 21వేల వుద్యోగాలు ఖాళీగా వుండగా గత ఐదు సంవత్సరాలలో కూడా దాదాపు అదే స్దాయిలో ఖాళీలు వున్నాయి.గత ఏడాది పార్లమెంటులో వివిధ సందర్భాలలో అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలను క్రోడీకరించగా కేంద్ర, రాష్ట్రాలలో, ప్రభుత్వ రంగ సంస్ధలలో మొత్తం 24లక్షల మేరకు ఖాళీలు వున్నాయి. విద్యా రంగంలో పదిలక్షలు, పోలీసుశాఖల్లో 5.4, రైల్వేల్లో 2.5, రక్షణ రంగంలో 1.2లక్షలు, పారా మిలిటరీలో 61వేలు ఖాళీలు వున్నాయి. కేంద్ర ప్రభుత్వశాఖలలో మంజూరైన పోస్టుల సంఖ్య 36,33,935 కాగా వున్న సిబ్బంది 32,21,183 మాత్రమే.

కేంద్ర ప్రభుత్వరంగ సంస్ధలలో (సిపిఎస్‌ఇ) 2013-14లో 13.49లక్షల మంది సిబ్బంది వున్నట్లు నమోదు కాగా మోడీ అధికారానికి వచ్చాక 2016-17 నాటికి ఆ సంఖ్య 11.31లక్షలకు పడిపోయిందని తాజా ప్రభుత్వ రంగ సంస్దల సర్వే వెల్లడించింది. ఈ అంకెలు చెబుతున్న వాస్తవాలేమిటి? ఖాళీగా వున్న కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగసంస్దల వుద్యోగాల గురించి కాంగ్రెస్‌ ఏమీ చెప్పలేదు. మన్మోహన్‌ సింగ్‌ హయాంలో కూడా నాలుగు లక్షల ఖాళీలు వున్నాయి. పదేండ్లు అధికారంలో వున్నపుడు చేయలేని పనిని రేపు వస్తే గిస్తే ఎలా చేస్తారో చెప్పాలా లేదా ?

India-automation-jobs-layoffs

దేశంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు, వునికిలో వున్నవాటి నవీకరణ వలన మనుషుల కంటే యంత్రాలకే ఎక్కువగా వుపాధి దొరుకుతోంది. విల్స్‌ టవర్‌ వాట్సన్‌ కంపెనీ ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం పశ్చిమ భారత్‌లో అంటే మహారాష్ట్ర, గుజరాత్‌ వస్త్ర,నూలు మిల్లుల్లో కార్మికుల కంటే యంత్రాలే ఎక్కువగా వుండబోతున్నాయి. కార్ల తయారీలో నలుగురు కార్మికులు చేసే పనిని ఒక రోబో చేస్తోంది.ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ప్రస్తుతం 13శాతం పనిని యంత్రాలు చేస్తుండగా రానున్న మూడు సంవత్సరాలలో అది 23శాతానికి పెరగనుంది. అదే మన దేశంలో 14 నుంచి 30శాతానికి పెరగనుంది. అందువలన అనంతపురంలో కియో కార్ల పరిశ్రమ గురించి చంద్రబాబు నాయుడు ఎన్ని కబుర్లు చెప్పినా వుద్యోగాలు రోబోట్లకు తప్ప అనంతపురం జనానికి కాదు.ఈ పరిశ్రమను తమ రాష్ట్రానికి తీసుకురాలేదని తెలంగాణా యువత నిరాశ చెందనవసరం లేదు.

పశ్చిమ దేశాలతో పోల్చితే మన దేశంలో ప్రస్తుతం యువతరం ఎక్కువ శాతం వున్నారు. ఈ కారణంగా రానున్న దశాబ్దిలో వుద్యోగాలు లేదా వుపాధి అవసరమైన వారు లేబర్‌ మార్కెట్‌లో 13.8కోట్ల మంది తోడు కానున్నారు. దేశంలో వున్న శ్రామిక శక్తిలో కేవలం 18.5శాతమే ఇంటర్‌ లేదా అంతకు మించిన విద్యతో నైపుణ్యం కలిగిన కార్మికులు వున్నారు. యాంత్రీకరణ కారణంగా దిగువ తరగతి కార్మికులే ఎక్కువగా వుద్యోగాలను కోల్పోతారని సర్వేలు తేల్చాయి. రాజకీయ పార్టీలు, నాయకులు వుపాధి గురించి ఎన్ని కబర్లు చెప్పినప్పటికీ రానున్న పది సంవత్సరాలలో యాంత్రీకరణ మరింత పెరిగి నిరుద్యోగ సమస్య మరింత తీవ్రం కానున్నదని నిపుణులు చెబుతున్నారు. దీన్నే మరొక విధంగా చెప్పాలంటే వుపాధి రహిత అభివృద్ది, వేతన వృద్ధి లేని వుపాధి పెరుగుతుంది. ఈ పరిణామం కొత్త సమస్యలకు దారి తీస్తుంది. ఇదొక విష వలయం.

కేంద్ర ప్రభుత్వ వుద్యోగులకు కనీస వేతనంగా నెలకు 18వేలు వుండాలని ఏడవ వేతన సంఘం సిఫార్సు చేసింది. ఇప్పుడు ఖాళీగా వున్న నాలుగులక్షల ఖాళీలను నింపితే ఏడాదికి అయ్యే ఖర్చు పదివేల కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. వేతనం పెరిగితే ఈ మొత్తం కూడా పెరుగుతుంది. కాంగ్రెస్‌ ప్రకటించిన నుయంతమ్‌ ఆయ యోజన(న్యాయ్‌) లేదా కనీస ఆదాయ పధకం కింద ఏటా ఇరవై శాతం పేదలు ఐదు కోట్ల కుటుంబాలకు 72వేల రూపాయలు నేరుగా బ్యాంకుల్లో వేస్తామని చెబుతున్నారు. అందుకు గాను తొలి ఏడాది 3.6లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, మరుసటి ఏడాది ఇంకా పెరుగుతాయని చెబుతున్నారు. సార్వత్రిక కనీస ఆదాయ పధకం గురించి 2016-17 ఆర్ధిక సర్వేలో నాటి ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణ్యం ప్రతిపాదించారు. దాని అమల్లో వున్న సమస్యల గురించి ఆయనే చెప్పారు. ప్రస్తుతం వున్న దారిద్ర నిర్మూలన పధకాలను రద్దు చేసి దాన్ని అమలు జరపకపో అదనపు భారం అవుతుందన్నారు. అందువలన కాంగ్రెస్‌ గానీ ఇలాంటి వాటి గురించే చెబుతున్న ఇతర పార్టీలుగానీ ముందుగా ఆ విషయాన్ని స్పష్టం చేయాలి. వున్న పధకాలను కొనసాగిస్తూనే దీన్ని అమలు జరుపుతారా లేక వాటిని రద్దు చేసి ఈ కొత్త పధకాన్ని పెడతారా ? రెండవదే అయితే పేదలకు నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం వుండదు. లేదూ రెండూ అమలు జరుపుతామంటే అందుకు అవసరమైన వనరులను ఎలా సమకూర్చుతారో వివరించాలి. ఇండియా రేటింగ్స్‌ సంస్ధ ప్రధాన ఆర్దికవేత్త దేవేంద్రకుమార్‌ పంత్‌ రెండూ ఒకేసారి అమలు సాధ్యం కాదని ఆర్ధికంగా ఎంతో వత్తిడి పెరుగుతుందన్నారు. విద్యమీద జిడిపిలో ఖర్చును ఆరుశాతానికి పెంచుతామన్నారు. గతంలో మోడీ సర్కార్‌ మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ చెప్పిన మేరకు విద్యకు 4.6శాతం అంటే 8.76లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ చెప్పినదాని ప్రకారం ప్రతి ఏడాది మరొక 2.66లక్ష కోట్ల రూపాయలు కావాలి, ఏటా 11.4లక్షల కోట్ల రూపాయలు అవసరం.

ఆరోగ్య సంరక్షణ ఖర్చు జిడిపిలో మూడు శాతానికి పెంచుతామన్నది ఒకటి. ఇప్పుడు 1.3శాతంగా వున్న ఖర్చుకు ఏటా 2.47లక్షల కోట్ల రూపాయలు అవుతున్నాయి. మూడుశాతానికి పెంచితే 5.71లక్షల కోట్లు కావాలి. ఇలా కాంగ్రెస్‌ చేసిన వాగ్దానాలను అమలు జరపాలంటే ఏటా కనీసం పదిలక్షల కోట్లరూపాయలు అవసరం అని అంచనా వేస్తున్నారు.2018-19 బడ్జెట్‌ 24.57లక్షల కోట్ల రూపాయలు, 2023-24 నాటికి 45లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. వాగ్దానాల అమలుకు అదనపు నిధులు ఎలా సమకూర్చుకుంటారో చెప్పలేదు. మరోవైపున జిఎస్‌టిని తగ్గిస్తామని వాగ్దానం చేసింది. జనానికి తగిన ఆదాయం లేనందున ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. దాని అర్ధం జిఎస్‌టి వసూళ్ల మీద పడుతుంది.

గతంలో రైల్వేకు వున్న మాదిరి రైతాంగానికి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిస్తామని కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది. ప్రతి తరగతి తనకు ప్రత్యేక బడ్జెట్‌ కోరుతున్న నేపధ్యంలో ఇది చెప్పటానికి ఆకర్షణీయంగా వుంటుంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దళితులు, గిరిజనులకు వుప ప్రణాళికలు వున్నాయి. అయినా వారి స్ధితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుందని గమనించాలి. రైతాంగానికి అలాంటి ప్రణాళిక ఆచరణ సాధ్యమా ? వ్యవసాయం ఏమాత్రం గిట్టుబాటు కావటం లేదు. రైతాంగం బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నూటికి 76 మంద సాగుదార్లు వ్యవసాయం మానుకొని అంతకంటే మెరుగైన వుపాధికి మరలాలని కోరుతున్నట్లు గతేడాది సిఎస్‌డిఎస్‌ సర్వేలో వెల్లడైంది. ఆ సర్వే తరువాత దేశంలో వ్యవసాయ సంక్షోభం ఇంకా పెరిగింది. రైతుల్లో 62శాతం మందికి కనీస మద్దతు ధరల గురించి అవగాహన లేదని, వాటి గురించి తెలిసిన వారిలో 64శాతం మంది మద్దతు ధరలు సంతృప్తికరం లేవని చెప్పారు.

జాతీయ గ్రామీణ వుపాధి హామీ పధకం కింద పని దినాలను 100 నుంచి 150కి పెంచుతామని కాంగ్రెస్‌ ప్రకటించింది. దేశంలో రైతాంగ సంఖ్య తగ్గిపోతుండగా వ్యవసాయ కార్మికుల సంఖ్య పెరుగుతున్నదని 2011 జనాభా వివరాలు తెలిపాయి. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుదల కారణంగా వ్యవసాయ కార్మికుల పని దినాలు తగ్గిపోతున్న పూర్వరంగలో ఆ మేరకు వారికి పని చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద వుంది. కనుక అది సమర్ధనీయమే.

2001లో దేశంలో రైతులు 12,73,12,851 మంది వుండగా 2011 నాటికి 11,87,00,000కు తగ్గిపోయారు. ఇదే సమయంలో వ్యవసాయ కార్మికుల సంఖ్య 10,67,75,330 నుంచి 14,43,00,000కు పెరిగారు. దేశంలో పారిశ్రామికీకరణ పెరుగుదల కారణంగా అనేక చేతి వృత్తులు నశించి వాటిలో వున్న వారు వ్యవసాయ కార్మికులుగా మారుతున్న విషయం తెలిసిందే. కేంద్రం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరల ప్రాతిపదిక ఆశాస్త్రీయంగా వుంటోంది. వ్యవసాయ ఖర్చులను పూర్తిగా పరిగణనలోకీ తీసుకోవటం లేదు. అన్ని పంటలకు ప్రకటించటం లేదు పోనీ ప్రకటించిన మేరకైనా అమలు జరిపే యంత్రాంగం రాష్ట్రాలలో లేదు. తెలంగాణాలో గతం కంటే ఎర్రజన్నలు, పసుపు ధరలు గణనీయంగా పడిపోవటం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అచేతనంగా వుండటంతో రైతాంగం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. చివరకు చేసేదేమీ లేక నిజామాబాద్‌ ఎన్నికల బరిలో 178 మంది రైతులు నామినేషన్లు వేసి కొత్త రూపంలో నిరసన తెలుపుతున్నారు. తమిళనాట రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో అక్కడి అన్నాడిఎంకె, కేంద్ర సర్కార్‌ విఫలం కావటంతో వారణాసిలో నరేంద్రమోడీ మీద పోటీ చేసేందుకు వంద మంది రైతులు నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. చివరి దశలో ఎన్నికలు జరగనున్నందున నామినేషన్లకు ఇంకా గడువు వుంది.

నిజామాబాద్‌ రైతులు రాష్ట్ర ప్రభుత్వం అందచేసిన రైతు బంధు నగదు తీసుకున్నా, పడిపోయిన ధరలతో పోల్చితే ఆ మొత్తం ఏమాత్రం చాలకనే ఆందోళనలకు దిగారు. అందువలన వివిధ పార్టీలు ఇప్పుడు ప్రకటిస్తున్న నగదు బదిలీ పధకాలు సంక్షోభాన్ని, సమస్యలను పరిష్కరించేవి కాదు, ఇప్పుడున్న వాటితో పాటు అమలు జరిపితే కాస్త వుపశమనం మాత్రమే దొరుకుతుంది.

Image result for jobs scenario in india

దేశ ఆర్ధిక వ్యవస్ధను మెరుగుపరుస్తామని కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది. ప్రస్తుతం మన దేశం ప్రపంచంలో జిడిపి రీత్యా ఐదవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా వుంది. ఏడుశాతానికి అటూ ఇటూగా అభివృద్ధి చెందుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అభివృద్ధి వున్నా దానికి అనుగుణంగా వుపాధి ఎందుకు పెరగటం లేదని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వేసిన ప్రశ్నకు ఇంతవరకు ఎవరూ సమాధానం చెప్పలేదు. పారిశ్రామిక, సేవారంగాలలో యాంత్రీకరణ, ఐటి కారణంగా ఆయా సంస్ధల ఆదాయాలు, లాభాలు పెరగటం తప్ప వుద్యోగాల వుపాధి తగ్గిపోతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వైనాడ్‌లో ‘అమూల్‌ బేబీ ‘ రాహుల్‌ గాంధీ పోటీ !

03 Wednesday Apr 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

CPI, CPI()M, Kerala, Naredra Modi, Rahul gandhi, Rahul gandhi Amul Baby, VS Achuthanandan, wayanad lok sabha

Image result for wayanad lok sabha assembly constituency map manorama

ఎం కోటేశ్వరరావు

దాదాపు రెండు నెలల పాటు  తర్జన భర్జన పడి ఎట్టకేలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కేరళలోని వైనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో అమేధీతో పాటు ఎన్నికల ఫోకస్‌ ఇక్కడ కూడా ప్రసరించనుంది. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటికీ నుంచీ రెండు సార్లు కాంగ్రెస్‌దే పై చేయిగా వుంది. వైనాడ్‌, కోజికోడ్‌, మలప్పురం జిల్లాల పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు దీనిలో వున్నాయి. ఈనెల 23న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. రాహుల్‌ గాంధీని ఓడించేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ లేదా సినీ నటుడు సురేష్‌ గోపీని పోటీకి దించవచ్చని మీడియాకు అనధికారికంగా వుప్పందించిన బిజెపి చివరకు బలహీనమైన భారత జన ధర్మ సేన అనే మిత్రపక్షానికి చెందిన వి.నటేశన్‌ను పోటీకి దింపింది. ఈ చర్య కమ్యూనిస్టులను ఓడించేందుగా, రాహుల్‌ గాంధీని గెలిపించేందుకా అన్న సందేహం ఓటర్లలో కలుగుతోంది. రాజకీయ పరిస్ధితులను అర్ధం చేసుకోవటంలో విఫలమైన కారణంగా గతంలో తాను రాహుల్‌ గాంధీని అమూల్‌ బేబీ అని వ్యాఖ్యానించానని, ఇప్పుడు వైనాడ్‌లో పోటీకి దిగి తన వ్యాఖ్యను మరోసారి నిజం చేశారని కేరళ మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం నేత విఎస్‌ అచ్యుతానందన్‌ వ్యాఖ్యానించారు. పరిస్ధితులను పిల్లచేష్టలు, ఆవేశంతో ఎదుర్కొంటారని నడి వయస్సు వచ్చినా పెద్ద మార్పేమీ లేదని అన్నారు. రాహుల్‌ను పోటీకి దింపటం ద్వారా కాంగ్రెస్‌ కూర్చున్న కొమ్మనే నరుక్కొనే రీతిలో వ్యవహరిస్తోందని, తప్పుదారి పట్టించే కాంగ్రెస్‌ నేతల మాటలను రాహుల్‌ అనుసరిస్తున్నారని చెప్పారు.

రాహుల్‌ గాంధీ పోటీకి నిర్ణయించుకోవటంతో కేరళ ఎన్నికల రంగం వేడెక్కిందనే చెప్పవచ్చు. ప్రధాని నరేంద్రమోడీ పచ్చి అబద్దాన్ని ప్రచారంలో పెట్టటంతో పాటు ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే స్ధాయికి దిగజారారు. ఈనెల ఒకటవ తేదీన మహారాష్ట్రలోని వార్దా ఎన్నికల సభలో మాట్లాడుతూ అమేథీలో హిందువుల ఆగ్రహానికి భయపడి మైనారిటీలు మెజారిటీగా వున్న నియోజకవర్గంలో పోటీ చేసేందుకు పోయారని ఎద్దేవా చేశారు. అక్కడ సగం మంది ఓటర్లు హిందువులున్నారు. వైనాడ్‌ ఎన్నిక అధికారంలో వున్న వామపక్ష ప్రజాతంత్ర కూటమి(ఎల్‌డిఎఫ్‌) ఐక్య ప్రజాతంత్ర కూటమి(యుడిఎఫ్‌), బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ కూటమికి ప్రతిష్టాత్మకంగా మారనుంది.గత పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడి పోటీ తీరు తెన్నులను ముందుగా చూద్దాం. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వైనాడ్‌ జిల్లాలోని మూడు నియోజకవర్గాలు, మలప్పురం జిల్లాలోని మూడు, కోజికోడ్‌ జిల్లాలోని ఒక నియోజకవర్గంతో ఇది ఏర్పడింది. ఇక్కడ రాహుల్‌ గాంధీ పోటీ చేసినందువలన కేరళతో పాటు దక్షిణాది రాష్ట్రాలన్నింటా కాంగ్రెస్‌కు వూపు వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. దీన్ని మరొక విధంగా చెప్పాలంటే ఆయన పోటీ చేయని రాష్ట్రాలలో కాంగ్రెస్‌ డీలాపడుతుంది. రాహుల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీలో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఒక్కటంటే ఒక్క చోట కూడా రాహుల్‌ గాంధీ తమ పార్టీ అభ్యర్ధిని గెలిపించుకోలేకపోయారు. అలాంటిది దేశంలో కాంగ్రెస్‌ను గెలిపిస్తారా అన్నది ప్రశ్న.

ముస్లిం మైనారిటీలు ఎక్కువగా వున్నారన్న అంచనాతో రాహుల్‌ గాంధీ పోటీలోకి దిగుతున్నారు.అది కూడా వాస్తవం కాదు. తాజా లెక్కల ప్రకారం ఈ నియోజకవర్గంలో 13,25,788 మంది ఓటర్లు వున్నారు. వీరిలో మహిళలు 6,70,002, పురుషులు 6,55,786 మంది వున్నారు. సామాజిక తరగతుల రీత్యా చూస్తే హిందువులు 49.48, ముస్లింలు 28.65, క్రైస్తవులు 21.34, ఇతరులు 0.53శాతం వున్నారు.

Image result for pp suneer cpi

వైనాడ్‌ నియోజకవర్గంలో ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధిగా సిపిఐ మలప్పురం జిల్లా కార్యదర్శి పిపి సునీర్‌ పోటీ చేస్తున్నారు.1968లో జన్మించారు. ఇప్పటికే ఒక విడత ప్రచారాన్ని ముగించి రెెండవ దశలో ప్రవేశించారు. ప్రజా మన్ననలను పొందిన సునీర్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌. భార్య, కుమారుడు, కుమార్తె వున్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ ద్వారా విద్యార్ధి వుద్యమాలు, యువజన రంగం, అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో 2004లో పొన్నాని లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఎల్‌డిఎఫ్‌ జిల్లా కన్వీనర్‌గా పని చేస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో తమ అవకాశాలను పెంచుకొనేందుకు రాహుల్‌ గాంధీని బరిలోకి దించి.గతంలో ఇందిరా గాంధీ, పివి నరసింహారావు, ఎన్‌టిఆర్‌, నరేంద్రమోడీ రెండు చోట్ల పోటీ చేసిన వుదంతాలు వున్నాయి. రాహుల్‌ గాంధీ ఒక్కసారి కూడా అధికార పీఠం ఎ్కకుండానే ఆ పనిచేస్తున్నారు. ఈ పోటీ తమకు బలాన్నిస్తుందని కాంగ్రెస్‌ చెబుతుంటే ఆ పార్టీ బలహీనతకు నిదర్శనమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అమేథీ నుంచి పారిపోయి వస్తున్నారని బిజెపి ఎద్దేవా చేసింది. గుజరాత్‌ నుంచి నరేంద్రమోడీ వారణాసిలో పోటీ చేస్తున్నారంటే అక్కడి నుంచి పారిపోయి వచ్చినట్లా అని కాంగ్రెస్‌ తిప్పికొట్టింది. రాహుల్‌ గాంధీ వైనాడ్‌లో పోటీ చేయటం అంటే కేరళలో ప్రధాన శత్రువుగా వామపక్షాలను ఎంచుకున్నట్లే అని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్‌ కరత్‌ వ్యాఖ్యానించారు.రాహుల్‌ను పోటీకి దించటమంటే వారి ప్రాధాన్యత కేరళలో వామపక్షాల మీద వ్యతిరేకత, బిజెపిని ఓడించాలన్న కాంగ్రెస్‌ జాతీయ విధానానికి వ్యతిరేకం, కేరళలో ప్రధాన శక్తి బిజెపి కాదు, ఎల్‌డిఎఫ్‌ అందువలన రాహుల్‌ను ఓడిస్తాం అన్నారు. ఈ చర్య కాంగ్రెస్‌లో తలెత్తిన విశ్వాసరాహిత్యాన్ని వెల్లడిస్తున్నదని, రాహుల్‌ గెలిస్తే ఏ సీటుకు ప్రాతినిధ్యం వహిస్తారో తెలుసుకోగోరుతున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియెరి బాలకృష్ణన్‌ అన్నారు.

Image result for rahul gandhi wayanad

కాంగ్రెస్‌కు బలమున్న స్ధానంగా వున్న వైనాడ్‌లో తమ అభ్యర్ధులను నిలిపేందుకు కాంగ్రెస్‌లోని ప్రధాన ముఠా నాయకులందరూ ప్రయత్నించారన్నది కొద్ది రోజులుగా వచ్చిన మీడియా వార్తలు తెలిపాయి. రాహుల్‌ గాంధీ ఒక దశలో విముఖంగా వుండటంతో కోజికోడ్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు టి సిద్దికిని అభ్యర్ధిగా ప్రకటించారు. పార్టీలో ‘ఎ’ వర్గనాయకుడిగా పేరున్న మాజీ ముఖ్యమంత్రి వూమెన్‌ చాందీ సిద్దికీ పేరును ప్రతిపాదించగా ‘ఐ ‘ గ్రూప్‌ నాయకుడిగా వున్న రమేష్‌ చెన్నితల షానిమోల్‌ వుస్మాన్‌, వివి ప్రకాష్‌ పేర్లను ప్రతిపాదించారు. దక్షిణాది రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, కర్ణాటక, తమిళనాడు, కేరళకు చెందిన లక్షలాది కార్యకర్తలు రాహుల్‌ పోటీ చేయాలని కోరినట్లు కాంగ్రెస్‌ ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా వర్ణించారు.

వైనాడ్‌లో రాహుల్‌ గాంధీని పోటీకి దించినా, దించకపోయినా అక్కడ ప్రధాన పోటీ సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌, కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ మధ్యనే జరుగుతుంది. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలన్న సుప్రీం కోర్టు తీర్పును తొలుత స్వాగతించి తరువాత ఓటు బ్యాంకు రాజకీయాలకు వుపయోగించుకోవాలని చూసిన కాంగ్రెస్‌, బిజెపిలో భక్తుల మనోభావాల పేరుతో ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే తమకు ఓటింగ్‌ శాతం పెరగనుందని బిజెపి ఆశపడుతోంది. కాంగ్రెస్‌కూడా ఆ ఓట్లమీదనే కన్నేసింది. అయితే రాజకీయంగా ఎప్పటి నుంచో సమీకరణ అయిన కేరళ ఓటర్లు ఎంత మేరకు మొగ్గుతారన్నది ప్రశ్న.

వైనాడ్‌లో రాహుల్‌ గాంధీ ప్రవేశంతో బిజెపికి ఒక విధంగా ఇరకాటం అని చెప్పవచ్చు. ఆ నియోజకవర్గ ఓటింగ్‌ తీరుతెన్నులే ఆ పార్టీని ఇరకాటంలోకి నెడుతున్నాయని చెప్పవచ్చు. గత ఎన్నికలలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చిందీ వివరాలను పట్టికలో చూడవచ్చు. గత లోక్‌సభ ఎన్నికలలో 80వేల ఓట్లు తెచ్చుకున్న బిజెపి రెండు సంవత్సరాల తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఏడు నియోజకవర్గాలలో 93,641 ఓట్లు తెచ్చుకుంది. నాలుగు సీట్లలో విజయం సాధించిన ఎల్‌డిఎఫ్‌కు 4,55,019 ఓట్లు వస్తే మూడు సీట్లకే పరిమితమైన కాంగ్రెస్‌కు 4,73, 434 ఓట్లు వచ్చాయి. 2014లోక్‌ సభ ఎన్నికలలో సిపిఐ అభ్యర్ధి కంటే కాంగ్రెస్‌కు 20వేలు మాత్రమే. దాదాపు అదే తేడా అసెంబ్లీ ఎన్నికలలో 17,600కు పడిపోయింది.

Image result for Amul Baby Rahul Gandhi in Wayanad Fray

కేరళలో బిజెపి పైకి ఏమి చెప్పినప్పటికీ పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులను కూడగడుతున్నది. దేశవ్యాపితంగా ముక్త కాంగ్రెస్‌ పేరుతో ఆపార్టీని మట్టికరిపిస్తానని చెబుతున్నది. వైనాడ్‌లో రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్నందున బిజెపి ప్రధాన లక్ష్యం ఏమిటన్నది ప్రశ్న. అంతకు ముందు ఆ స్దానాన్ని దాని మిత్రపక్షానికి కేటాయించింది. ఇప్పుడు రాహుల్‌ ఖరారు కావటంతో ఆ స్ధానాన్ని తాము తీసుకొని ప్రముఖ అభ్యర్ధిని దించే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. నిర్మలా సీతారామన్‌ లేదా సినీ నటుడు సురేష్‌ గోపి కావచ్చని మీడియా పేర్కొన్నది. చివరకు తోక ముడిచి మిత్రపక్ష అభ్యర్ధినే ఖరారు చేసింది. గతంలో అనేక చోట్ల బిజెపి బలహీనమైన వారిని పోటీ పెట్టి కమ్యూనిస్టులను ఓడించేందుకు కాంగ్రెస్‌కు సహకరించింది. ఈ సారి అదే జరుగు తుందా లేక రాహుల్‌ గాంధీని ఓడించేందుకు తన ఓట్లను తమ అభ్యర్ధికే వేయిస్తుందా అన్నది దాని ముందున్న ప్రశ్న. శబరిమల ఆలయం పేరుతో చేసిన ఆందోళనతో కాంగ్రెస్‌, బిజెపి రెండూ లబ్ది పొంద చూస్తున్నాయి. అదే జరిగితే బిజెపి ఏ మాత్రం ఓట్లు పెంచుకున్నా అవి కాంగ్రెస్‌కు సంబంధించినవి తప్ప వామపక్షాల నుంచి పోయేవి కాదన్నది స్పష్టం. ఒకవేళ అదే జరిగితే బొటాబొటీ మెజారిటీ వున్న స్ధితిలో అక్కడ రాహుల్‌ గాంధీ ఓడిపోవటం ఖాయం. ఇప్పుడున్న రాజకీయ పరిస్ధితిలో ఒక వేళ రాహుల్‌కు ఓటు వేసి గెలిపించినా ఆయన అమేథీని ఎంచుకుంటారు, వైనాడ్‌ను వదిలి వేస్తారు, ఆ మాత్రానికి ఎందుకు వేయటం, వుప ఎన్నికలకు పోవటం ఎందుకని తటస్ధ ఓటర్లు ఆలోచించవచ్చు. మరొక వూహ ప్రకారమైతే రాహుల్‌ గాంధీని నిజంగా బిజెపి ఓడించాలనుకుంటే ప్రధాన ప్రత్యర్ధి సిపిఐకి ఓటు వేయటం ద్వారానే ఆపని చేయగలగుతుంది. మరొక మార్గం లేదు. కమ్యూనిస్టు వ్యతిరేకతను బాగా రెచ్చగొట్టిన స్ధితిలో అది జరుగుతుందా అన్నది సందేహమే. అందువలన ఏ రీత్యా చూసినప్పటికీ వైనాడ్‌ ఎన్నిక ఫలితాలు దేశం దృష్టిని ఆకర్షిస్తాయని చెప్పవచ్చు.

2014 వైనాడ్‌ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల ఓట్లు,

కాంగ్రెస్‌ 3,77,035 41.20

సిపిఐ 3,56,165 38.92

బిజెపి 80,752 8.82

ఇండి 37,123 4.60

ఎస్‌డిపిఐ 14,327 1.57

డబ్ల్యుపిఐ 12,645 1.38

ఆప్‌ 10,684 1.17

2009 వైనాడ్‌ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల ఓట్లు

కాంగ్రెస్‌ 4,10,703 41.20

సిపిఐ 2,57,264 31.23

ఎన్‌సిపి 99,663 12.10

బిజెపి 31,687 3.85

2016లో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల ఓట్లశాతం, సీట్లు

సిపిఎం 26.7 58

సిపిఐ 8.2 19

ఎల్‌డిఎఫ్‌ ఇండి 2.4 4

జెడిఎస్‌ 1.5 3

ఎన్‌సిపి 1.2 2

కాంగ్రెస్‌ 23.8 22

ముస్లింలీగ్‌ 7.4 18

బిజెపి 10.6 1

కెసిఎం 4 6

బిడిజెఎస్‌ 4 0

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d