• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Political Parties

మే 3వరకు గృహ బందీ – జనానికి నరేంద్రమోడీ వట్టిస్తరి-మంచినీళ్లు !

14 Tuesday Apr 2020

Posted by raomk in BJP, Current Affairs, Economics, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

how narendra modi disappointed entire nation, lock down extension, Lock down extension up to May 3rd

PM Narendra Modi Extends Lockdown Until May 3, Other Key ...

ఎం కోటేశ్వరరావు
ప్రధాని నరేంద్రమోడీ కరోనా, గృహబందీ(లాక్‌డౌన్‌) మూడవ ప్రసంగంలో సప్తపది అనే పదాన్ని వినియోగించారు. ఏడు అంశాలను పేర్కొన్నారు కనుక ప్రాసకోసం ప్రయోగించారని సరిపెట్టుకోవాలా ? నిజానికి అది హిందువుల సంప్రదాయ వివాహ శుభ సందర్భంగా నిర్వహించే ఒక క్రతువు. వివాహంలో సూత్రధారణ తరువాత నవ వధువులు అగ్ని గుండం చుట్టూ ఏడు అడుగులు నడవటాన్ని సప్తపది అంటారు. అయితే విశ్వాసులు ఎంతో పవిత్రమైనదిగా భావించే ఈ క్రతువును పాటించిన వారు కాళ్లపారాణి ఆరక ముందే భార్యలను వదలివేసే భర్తలు, భర్తలను వదలివేసే భార్యలను మనం చూస్తున్నాం. దీనికి ఇంకా ఏమైనా అర్ధాలున్నాయేమో నాకు తెలియదు. వివాహం వేరు, కరోనా లేదా మరొక మహమ్మారి మీద పోరాడటం వేరు. రెండూ పరస్పర విరుద్దమైనవి. మోడీ ప్రసంగం విని, చూసిన వారికి పిడుక్కీ బియ్యానికి ఒకటే మంత్రం చదివినట్లుగా సప్త పది ప్రయోగం అనిపిస్తే అది వారి తప్పుకాదు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య పదివేలు దాటింది. ఈ నేపధ్యంలో అనేక మంది గృహబందీ వ్యవధిని పొడిగించాలని సూచించారు, అనేక రాష్ట్రాలు ఏప్రిల్‌ 30వరకు పొడిగించాలని ముందే నిర్ణయించి ప్రకటించాయి. దీనికి మోడీ గారు కొత్త ట్టిస్ట్‌ ఇచ్చి మండల దీక్షగా ( అయ్యప్ప, దానికి అనుకరణగా ఇతర దీక్షలు) ధ్వనింప చేస్తూ మే మూడవ తేదీ వరకు 19రోజులు పొడిగించారు. ఇవన్నీ పక్కన పెడదాం.దేశమంతా ఎంతగానో ఎదురు చూసిన మోడీ పలుకుల్లో కొత్తదనం ఏముంది ? జనం లేదా అనేక రంగాలు కోరుతున్న అంశాలను ఎక్కడైనా ప్రస్తావించారా ? ఏమి ప్రస్తావించారు అనేది ముఖ్యం. తెలుగులో ఒక లోకోక్తి లేదా సామెతల గురించి చాలా మంది వినే ఉంటారు. వాటిలో ఒకటి వట్టి మాటలకు కడుపులు నిండుతాయా ? రెండవది వట్టిస్తరి – మంచినీళ్లు. ఇంతకు మించి మోడీగారి ప్రసంగంలో మరొకటి కనిపించలేదు.
మొదటి రెండు ఉపన్యాసాలలో చప్పట్లు, దీపాల వెలిగింపు పిలుపు ఇచ్చారు. మూడవ దానిలో ఇప్పటికే జనమందరూ పాటిస్తున్న అంశాల సప్తపది సుభాషితం తప్ప ఎలాంటి కార్యక్రమం లేదు. దీని గురించి నెటిజన్లు వ్యంగ్యంగా స్పందించారు. కొందరు హాస్యాన్ని పండించేందుకు ప్రయత్నించారు. రెండో పిలుపు సందర్భంగా దీపాల వెలుగు పేరుతో దీపావళి జరుపుకున్నవారు ఇప్పుడు అలాంటి మరొక అవకాశం రాలేదే అని నిరాశపడి ఉంటారు. ఈనెల 20వరకు మరింత గట్టిగా గృహబందీ అమలు తరువాత ఏమి చేయాలనేది ఆ తరువాత నిర్ణయిస్తారు. ఆ తేదీ నాటికి కొత్త కేసులేవీ నమోదు కానట్లయి బందీ నిబంధనల సడలింపుకు సంబంధించి బుధవారం నాడు మార్గదర్శక సూత్రాలను విడుదల చేస్తామని మోడీ ప్రకటించారు.
సామాజిక మాధ్యమంలో వెల్లడైన ధోరణి చూస్తే తరువాత ఏమిటి అని అనేక మంది ప్రశ్నించారు.హిందీ సినిమాల్లో మాదిరి ప్రసంగంలో 80శాతం ఏమీ లేదన్నది ఒక వ్యాఖ్య. మిగతా కొన్ని ఇలా ఉన్నాయి. ఆయనెందుకు అలా మాట్లాడారు మనం ఏమన్నా నాలుగేండ్ల పిల్లలమా ? మోడీ చెప్పదలచుకున్న సందేశానికి 30నిమిషాలు అవసరం లేదు. ప్రసంగం మోడీకి రాజకీయంగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోమని మోడీ చెప్పటం మా ఛానల్‌ చందాదారులుగా చేరండి అని చెప్పిట్లుగా ఉంది. మోడీ ప్రసంగాన్ని ముందుకు జరిపే బటన్‌ ఇచ్చి ఉండాల్సింది. పావు గంటసేపు అబద్దాలు, చెత్త మాట్లాడారు. పావు గంటసేపు సరకులేకుండా మాట్లాడారు. వాస్తవాలను మరుగుపరచి మాటల జడివాన కురిపిస్తూ ఎలా మాట్లాడవచ్చో నేర్చుకున్నాను. వైద్యులు, వైద్య సిబ్బందికి పిపిఇ కిట్స్‌ ఏర్పాటు, దేశమంతటా కరోనా పరీక్షల పెంపు, పేదల సంరక్షణ, ఆరోగ్యవసతుల కల్పన, ఆర్ధిక వ్యవస్ద మరియు ఉపాధి పునరుద్దరణ, ఔషధాల కొరత, వలస కార్మికుల గురించి ప్రస్తావన లేకుండా చక్కగా ప్రసంగించారు.
నరేంద్రమోడీ ప్రసంగం గురించి ఇంతకంటే ఎక్కువ రాయనవసరం లేదు. పరీక్షా సమయాల్లో ముఖ్యమైన బాధ్యతల్లో ఉన్నవారు వ్యవహరించే తీరు తెన్నులను బట్టి జనం స్పందిస్తారు. పొగిడిన నోళ్లతోనే నవ్వుతారు. ఇక మోడీ గారి ‘సప్తపది’ గురించి చూస్తే 1.వృద్దుల సంరక్షణ, 2. ఇంట్లోనే ఉండండి, ఇంట్లో తయారు చేసిన ముఖతొడుగులు ధరించండి, 3.వ్యాధి నిరోధక చర్యలు తీసుకోండి.4,ఆరోగ్యసేతు యాప్‌ ఉపయోగించండి, 5. పేదలను ఆదుకోండి, ఆహారం అందించండి, 6. ఉద్యోగులను ఆదుకోండి, తొలగించవద్దు, 7. ఆరోగ్య సిబ్బంది, పోలీసు తదితర యంత్రాంగ సేవలను అభినందించండి. వీటిలో కొత్త అంశాలేమి ఉన్నాయి గనుక.

PM Modi's Covid Lockdown Address Not Up To Congress' Expectations ...
కేవలం నాలుగు గంటల వ్యవధి మాత్రమే ఇస్తూ గృహబందీని మే 25 నుంచి ప్రధాని మోడీ ప్రకటించారు. దాంతో అందరూ చెప్పలేని ఇబ్బందులు పడ్డారు. అయినా ఆరోగ్యం, ప్రాణాలే ముఖ్యం కనుక జనం సర్దుకున్నారు. ఈ 21 రోజుల్లో అనేక సామాజిక, ఆర్ధిక సమస్యలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి జనాన్ని, అసలే ఆర్ధిక ఇబ్బందులతో ఉన్న రాష్ట్రాలను ఆదుకోవటం గురించి ఎదురు చూసిన వారికి ప్రధాని ప్రసంగం తీవ్ర నిరాశపరచింది. ఇబ్బందులు పడుతున్నవారికి కావాల్సింది ప్రధాని మోడీ మాదిరి కార్చిన కడవల కొద్దీ కన్నీరు, సానుభూతి, జనం ముందు తలవంచటం కాదు. ఇప్పటికే సామాన్యులు, మధ్యతరగతి వారు తమ వంతు త్యాగాలు చేశారు. ఇంకేమాత్రం చేసే స్ధితిలో లేరు.
గతంలో వాజ్‌పేయి పాలించినా, కాంగ్రెస్‌ లేదా ఇతర పార్టీల ప్రధానుల ఏలుబడిలో ఉన్నా మన దేశంలో సంపద కొద్ది మంది దగ్గర పోగుపడే విధానాలే అనుసరించారు, ఇప్పుడు నరేంద్రమోడీ కూడా అదే చేస్తున్నారు.కరోనా కష్టాలను తెచ్చింది నిజం. కానీ ఇప్పుడు జనాన్ని ఆదుకొమ్మని చెబుతుంటే రాష్ట్రాల, దేశ ఆర్ధిక ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నవారికి ఇంతకాలం సంపదలు పోగేసుకున్న వారు గుర్తుకు రాకపోవటం ఆశ్చర్యంగా ఉంది. ఈ కష్ట కాలంలో వారేమి చేస్తున్నారు, పాలకులు వారి నుంచి వసూలు చేసేందుకు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు.2018లో ప్రతి రెండు రోజులకు ఒకరు డాలర్‌ బిలియనీర్‌గా మారారు. అంటే సంపద కోట్లు దాటటం. ప్రపంచ చరిత్రలో 2016 రెండవ త్రైమాసిక కాలం నుంచి 2018లో అదే సమయానికి ప్రపంచ సంపదల్లో 82శాతం ఒక శాతం మంది చేతిలో ఉన్నాయి. చరిత్రలో ఇంత పెరుగుదల ఎన్నడూ నమోదు కాలేదని ఆక్స్‌పామ్‌ సంస్ద తెలిపింది. 2006 నుంచి 2015వరకు జరిపిన పరిశీలన ప్రకారం సామాన్య కార్మికుల ఆదాయం ఏడాదికి సగటున రెండు శాతం పెరిగితే బిలియనీర్ల సంపద దానికి ఆరురెట్లు ఎక్కువగా పెరిగింది. మన దేశం విషయానికి వస్తే ఒకశాతం ధనికుల వద్ద 58శాతం పోగుపడింది. ఈ మధ్యకాలంలో ఈ పెరుగుదల ఇంకా ఎక్కువగా ఉంది. 2017 బడ్జెట్‌ వివరాల ప్రకారం మన దేశంలో ఒక శాతం ధనికులు 73శాతం కలిగి ఉంటే పేదలుగా ఉన్న 67కోట్ల మంది జనం సంపద కేవలం ఒకశాతమే పెరిగింది. బిలియనీర్ల పెరుగుదల ఆర్ధిక వ్యవస్ధ వైఫల్యం తప్ప అభివృద్ధి సూచిక కాదు. ఒక ప్రముఖ పరిశ్రమ సిఇఓ ఏడాదికి పొందుతున్న ఆదాయ స్దాయికి దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో కనీసవేతనాలకు పని చేసే కార్మికుడు చేరాలంటే 941 సంవత్సరాలు పడుతుంది.
కార్పొరేట్‌ సంస్ధలకు ఏటా లక్షల కోట్ల రూపాయలను వివిధ రూపాలలో ప్రభుత్వం కట్టబెడుతున్నది. వాటికి తోడు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కావాలని ఎగవేస్తుంటే ప్రభుత్వం వాటిని రద్దు చేస్తున్నది. కార్పొరేట్‌ కంపెనీలు సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్‌) కింద మూడు సంవత్సరాల నిఖర లాభాల సగటులో రెండుశాతం మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంది. కరోనా పూర్వరంగంలో కేంద్ర ప్రభుత్వం అత్యవసర పరిస్దితి అవసరాలకోసం పిఎం-కేర్‌ (ప్రధాని పౌరసహాయం మరియు ఉపశమన నిధి) నిధిని ఏర్పాటు చేసింది. కరోనా నివారణను అత్యవసర పరిస్ధితిగా పరిగణిస్తున్నారు. 2013 కంపెనీల చట్టం ప్రకారం ఈ నిధికి కంపెనీలు ఇచ్చే మొత్తాలను సిఎస్‌ఆర్‌ కింద ఖర్చు చేసినట్లుగానే పరిగణించి ఆ మేరకు మినహాయింపులు ఇస్తారు. అదే కంపెనీలు ముఖ్య మంత్రి సహాయ నిధికి ఇచ్చే మొత్తాలకు ఇది వర్తించదు. అయితే రాష్ట్రాలలో విపత్తు సహాయం లేదా అత్యవసర నిధికి కూడా ఈ మొత్తాలను ఇస్తే మినహాయింపు ఇస్తారు. ఇప్పుడు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తూ మీడియాలో ప్రచారం పొందుతున్న బడా కంపెనీలన్నీ ఆ సొమ్మును పిఎం కేర్‌కు బదలాయిస్తున్నాయా లేక నిజంగా విరాళాలు ఇస్తున్నాయా అన్నది తరువాత గానీ బయట పడదు. అనుకోని అవాంతరాలు వచ్చినపుడు కంపెనీలు సిఎస్‌ఆర్‌ నిధి నుంచి కార్మికులకు ఎక్స్‌గ్రేషియాగా చెల్లించే మొత్తాలను కూడా ఈ నిధిఖాతాలో రాయవచ్చు. కరోనా సమయంలో తాత్కాలిక, కాజువల్‌, రోజువారీ కార్మికులకు సాయం చేయవచ్చు. కంపెనీ నిఖర ఆస్ధుల విలువ ఐదు వందల కోట్లు లేదా వెయ్యి కోట్ల రూపాయల లావాదేవీలు జరిపే కంపెనీలు అంతకు ముందు సంవత్సరంలో నిఖరలాభం ఐదు కోట్లు ఉన్నవి సామాజిక బాధ్యత కింద రెండుశాతం మొత్తాలను ఖర్చు చేయాల్సి ఉంది.గడచిన ఐదు ఆర్ధిక సంవత్సరాలలో ఈ మేరకు కంపెనీలు 52వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు నివేదించాయి.
నరేంద్రమోడీ సర్కార్‌ ఈ కంపెనీలను విరాళంగా తీసుకున్న మొత్తాలను తన ప్రభుత్వం చేస్తున్న ఖర్చుగా చూపుతున్నది. నిజానికి ఇలాంటి సందర్భాలలో లక్షల కోట్ల రూపాయల రిజర్వు నిధుల నిల్వలున్న కార్పొరేట్‌ కంపెనీల నుంచి కొంత శాతం మొత్తాలను విధిగా ప్రభుత్వాలకు జమచేసేట్లు చర్యలు తీసుకోవాల్సి ఉంది. నిజానికి ఆ సొమ్ము కష్టపడి పనిచేసిన కార్మికులదీ, ప్రజలది తప్ప మరొకటి కాదు. అలాంటి ప్రత్యేక పధకాలను ప్రకటిస్తారని అనేక మంది ఎదురు చూశారు. ప్రధాని తన ప్రసంగంలో కొన్ని చెప్పకూడని మాటలు చెప్పారు. కనీసం ఒక్క కరోనా కేసు కూడా మన దేశంలో నమోదు కాక ముందే నివారణకు ఏర్పాట్లు చేసినట్లు మోడీ తన ప్రసంగంలో చెప్పారు. ఇది విమర్శించటానికి తగిన సందర్భం కాదు కానీ కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రధాని చెప్పిందే నిజమైతే విదేశాల నుంచి వచ్చిన వారిని పరీక్షించి క్వారంటైన్‌ ఎందుకు చేయలేదు ? విదేశాల నుంచి నిజాముద్దీన్‌ మర్కజ్‌ సమావేశాలకు రాదలచుకున్న వారి వీసాలను ఎందుకు రద్దు చేయలేదు, వచ్చిన వారిని పరీక్షించి క్వారంటైన్‌ ఎందుకు చేయలేదు, రోగులకు చికిత్స ఎందుకు చేయలేదు అన్న ప్రశ్నలకు ఎవరు జవాబులు చెప్పాలి. తొలి కేసు జనవరిలోనే నమోదైన విషయం అందరికీ తెలిసిందే మార్చి 22న జనతా కర్ఫ్యూ, 25 నుంచి గృహబందీ ప్రకటించారు.

Coronavirus India: PM Modi New Twitter Bio Pic After Address To ...
గత ఇరవై ఒక్క రోజులుగా రాష్ట్రాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కోట్లాది మంది వలస కార్మికులు అనేక చోట్ల చిక్కుకు పోయారు, వారు తమ ఇండ్లకు వెళ్లే అవకాశాలు ఈనెల 20వ తేదీవరకు ఉండవు. తరువాత ఉంటాయో లేదో తెలియదు. వారి అవసరాలను ఎవరు చూడాలి? వారుంటున్న ప్రాంతాలలో పారిశుధ్యం,తదితరాల పరిస్ధితి ఏమిటి? అందుకు కేంద్రం వద్ద ఉన్న పధకాలేమిటి ? రాష్ట్రాలు తమకున్న పరిమిత వనరులతో వారిని ఆదుకోగలవా ? పోనీ అప్పోసప్పో చేసి ఖర్చు చేస్తే కేంద్రం భరిస్తుందా ? అదనపు ఖర్చు భరిస్తున్న రాష్ట్రాలకు పరిస్ధితి తీవ్రతను బట్టి కేంద్రం నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదా ? అప్పులు తీసుకొనేందుకు అడ్డువస్తున్న నిబంధనలను కూడా కేంద్రం, రిజర్వుబ్యాంకు సవరించలేదనే అంశాల గురించి పట్టించుకోవనవసరం లేదా ? వైద్య పరికరాల సరఫరాను కేంద్రం పర్యవేక్షించాల్సిన అగత్యం లేదా ? చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను ఆదుకొనేందుకు కేంద్రం చేసే సాయం ఏమిటి ? కార్మికులను తొలగించవద్దని సలహా చెబితే సరిపోతుందా ? ఇలాంటి అనేక సమస్యలకు పరిష్కారం లేదా కనీసం ప్రస్తావన అయినా ఉంటుందనుకున్న వారిని ప్రధాని తీవ్ర నిరాశకు గురిచేయలేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా వైరస్‌ : కట్టడిలో కమ్యూనిస్టుల విజయం- జాడలేని మతాలు, యోగులు, యోగినులు !

11 Saturday Apr 2020

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, RUSSIA, UK, USA

≈ 1 Comment

Tags

catholic religion, COVID- 19 pandemic, Good friday 2020, Pope Francis

Coronavirus

ఎం కోటేశ్వరరావు
బ్రహ్మాండం బద్దలు కాలేదు, సముద్రాలు ఇంకి పోలేదు, ఇటు సూర్యుడు అటు పొడవ లేదు. కరోనా కారణంగా వందల సంవత్సరాలుగా పాటిస్తున్న గుడ్‌ఫ్రైడే క్రతువును పోప్‌ స్వయంగా పక్కన పెట్టాల్సి వచ్చింది. తన నివాసంలోనే తంతును పూర్తి చేశారు. అనేక దేశాల్లో ఇదే జరిగింది.ఎక్కడైతే ఏసు క్రీస్తును శిలువ వేశారని భక్తులు నమ్ముతారో జరూసలెంలోని ఆ ప్రాంతంలో నిర్మించిన హౌలీ పుల్చెర్‌ చర్చ్‌లో అతి కొద్ది మంది ప్రార్ధనలు చేశారు. ఫిలిప్పైన్స్‌లో ఊరేగింపునే రద్దు చేశారు. కొందరు సామాజిక దూరం నిబంధనలను ఉల్లంఘించి కొన్ని చోట్ల ప్రార్ధనలు చేశారు. అందువలన మత చాదస్తులు, ఉన్మాదులు ఎవరైనా ఉంటే వారికి ఈ సమాచారాన్ని చేరవెయ్యాలి, కళ్లారా చూసేందుకు దృశ్యాలను వారి ముందు ప్రదర్శించాలి. అయినా మారకపోతే అలాంటి వారిని కరోనా క్వారంటైన్‌ మాదిరి ఎక్కడైనా పెట్టి తాళం వెయ్యాలి. ఇది ఒక్క క్రైస్తవుల గురించే వ్యాఖ్య అనుకుంటే పొరపాటు ఏ మతం వారికైనా జరగాల్సింది ఇదే.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మతాల మూఢనమ్మకాల ఉక్కు గోడలను తుత్తునియలు చేస్తోంది. మతాలతో నిమిత్తం లేని దేవుడు, దేవతలు, దయ్యాలతో ప్రమేయం లేని కమ్యూనిస్టు చైనా కరోనాను కట్టడి చేసి సాధారణ జనజీవితాన్ని పునరుద్దరించింది. మరోవైపు దేవుడు,దేవతలు, దేవుడు, దేవుని కుమారుడు, దేవ దూతలు తమను రక్షిస్తారని కూర్చున్న మూర్ఖశిఖామణులను వారెవరూ కాపాడటం లేదు, దిక్కులేని చావు చస్తున్నారు, పూడ్చేందుకు కూడా ఎవరూ లేని వారిని అమెరికాలో గుట్టలుగా పడవేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామం మత పునరుద్దరణ, మతోన్మాదశక్తులకు ఊహించని ఎదురుదెబ్బ. మూఢనమ్మకాలను నల్లేరు మీద బండిలా ముందుకు తీసుకుపోవచ్చన్న అజెండాతో ముందుకు పోతున్నవారికి పెద్ద కుదుపు. ఊగిసలాటతో ఉన్న అనేక మందికి ఈ పరిణామం దేవుడు, దేవతలు, మతాలు వాటి మహిమల మీద నమ్మకాలను వమ్ము చేస్తుంది.
ప్రపంచంలో ఏదైనా ఒక ప్రధాన ఘటన జరిగిన తరువాత జ్యోతిష్కులు అదిగో చూడండి మేము ముందే చెప్పాము అంటూ ముందుకు వస్తారు. కొంత మంది తమ మెదళ్లలో ఉన్న అశాస్త్రీయ సరుక్కు ఇదిగో నాసా(అమెరికా నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) చెప్పింది అని ముద్ర తగిలిస్తారు. మరికొందరు మన పోతులూరి వీరబ్రహ్మం, ఫ్రెంచి జ్యోతిష్కుడు మైఖేల్‌ డే నోస్ట్రాడామస్‌ పేరు ఉపయోగించి 1551లో ఇలా రాశాడు అంటూ ప్రచారం చేస్తారు. వాటిలో ఒకటి ఇప్పుడు కరోనా మీద తిరుగుతోంది. దానిలో ఇలా ఉంది.” ఒక జంట సంవత్సరం(2020) ఉంటుంది. దాన్నుంచి ఒక రాణి (కరోనా) తూర్పు దిక్కు(చైనా) నుంచి వస్తుంది.ఏడు కొండలు ఉన్న ఒకదేశం(ఇటలీ) మీద ఒక చీకటి రాత్రి ఒక ప్లేగ్‌(వైరస్‌)ను చల్లుతుంది.అది జీవిత చరమాంకంలో ఉన్న పురుషులలో ప్రవేశించి మట్టి(మరణం)గా మారుస్తుంది. ప్రపంచాన్ని నాశనం చేస్తుంది.అది ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను అంతం చేస్తుంది”.

These photos show how coronavirus fears left religious sites empty ...
దీన్ని సృష్టించిన వారు, దాన్ని గుడ్డిగా నమ్మేవారు, సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసే వారి గురించి చెప్పాలంటే ఏమాత్రం బుర్ర ఉపయోగించని వారే అన్నది స్పష్టం. నోస్ట్రోడామస్‌ ఒక జంట సంవత్సరం వస్తుంది, అది 2020 అని చెప్పటమే తెలివితక్కువ తనం. ప్రతి నూట ఒక్క సంవత్సరాలకు అలాంటి సంవత్సరాలు వస్తాయి. అవి నోస్ట్రోడామస్‌కు ముందు వచ్చాయి, తరువాత వస్తాయి. అతగాడు చెప్పింది 1551లో అంటున్నారు గనుక 1616,1717,1818,1919 వచ్చాయి. అవే కాదు మూడంకెల సంవత్సరాలు కూడా వచ్చాయి. మిగతా సంవత్సరాలలో ఈ సంవత్సరాలలో కూడా ప్రపంచాన్ని కుదిపివేసిన ఉదంతాలు ఎన్నో జరిగాయి. ఈ ప్రచార సృష్టి కర్తలకు బాక్టీరియాకు, వైరస్‌కు తేడా తెలియదు. అది ఇటలీలో ముసలి వారిని చంపేస్తుంది అన్నారు. ప్రపంచ వ్యాపితంగా అన్ని వయసుల వారినీ కబళిస్తోంది. ఇటలీతో పాటు అనేక ఐరోపా దేశాలలో విలయతాండవం చేస్తోంది. అన్నిదేశాల కంటే వ్యాధి అమెరికాలో ఎక్కువగా ఉంది.
గణేషా స్పీక్స్‌ డాట్‌ కామ్‌ పేరుతో జ్యోతిషాన్ని చెబుతున్నవారు మార్చి 30 తరువాత వైరస్‌ నుంచి కాస్త ఉపశమనం పొందుతారని పేర్కొన్నారు. ఇప్పుడు అనేక చోట్ల ఎంత వేగంగా విస్తరిస్తోందో, దేశ ఆర్ధిక వ్యవస్ధలు ఎలా అతలాకుతలం అవుతున్నాయో చూస్తున్నాము. ఇలాంటి చెత్త కబుర్లు చెప్పటంలో ఒక మతం అని లేదు. స్వాములు, బాబాలు, గురువులు, గురవమ్మలు, గంటల, దిన, వార పంచాంగాలు,రాసి ఫలాలను ప్రచురించి సొమ్ము చేసుకొనే మీడియా గురించి ఏం చెప్పాలి? హిందూ మహాసభ గోమూత్ర పార్టీలను ఏర్పాటు చేసింది, ఇంకే ముంది కొందరు బిజెపి నేతలూ అదే పాట అందుకున్నారు.
కరోనా వైరస్‌ మతశక్తులలో విబేధాలు తెచ్చినట్లు ప్రముఖ పత్రిక ”ఎకనోమిస్ట్‌ ” తాజాగా ఒక వార్తను ప్రచురించింది. గుడ్‌ ప్రైడే సందర్భంగా రోమ్‌లో ప్రతి ఏటా పోప్‌ భక్తులతో కలసి శిలువను మోస్తూ ఏసు క్రీస్తు జీవితంలోని పద్నాలుగు ఘట్టాలకు చిహ్నంగా (మహాభారత పర్వాలు, రామాయణ కాండల మాదిరి) 14చోట్ల ఆగుతూ నడుస్తారు. ఆ దారిలో వేలాది మంది అనుచరులు శిలువను ముద్దాడుతూ తమ భక్తిని ప్రదర్శిస్తారు. వాటన్నింటినీ పక్కన పెట్టారని, ఏ ఏదేశాల్లో ఏమి జరుగుతోంది ఆ పత్రిక ప్రకటించింది. తాను 51 సంవత్సరాలుగా బోధకుడిగా ఉన్నానని ఇప్పుడు జనాన్ని చర్చ్‌లకు రావద్దని చెప్పాల్సి రావటం తనకు ఎంత కష్టమో ఆలోచించాలని రష్యన్‌ ఆర్ధోడాక్స్‌ చర్చ్‌ ప్రధాన గురువు కిరిల్‌ ప్రకటించారు. అయితే కొందరు అమెరికన్‌ ఇవలాంజికల్స్‌ మూర్ఖంగా వ్యవహరించి కటకటాల పాలయ్యారు. ప్రార్ధన చేసి వైరస్‌ను నిర్మూలిస్తామంటూ జనాన్ని తరలించిన ఫ్లోరిడా బోధకుడు రోడ్నీ హౌవార్డ్‌ బ్రౌన్‌ వారిలో ఒకడు. మన తిరుపతి వేంకటేశ్వర స్వామి, ఇతర దేవాలయాల్లో మాదిరి భక్తులు లేకుండా తప్పనిసరి అనుకున్న మత క్రతువులను నిర్వహించవచ్చని ఫ్లోరిడా గవర్నర్‌ ప్రకటించాడు. గతంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నపుడు కూడా ఈస్టర్‌ పూజలను ఇలా పూర్తిగా అడ్డుకోలేదని తూర్పు ఐరోపా దేశాల్లో సామాన్యులు భావిస్తున్నారని ఎకనమిస్ట్‌ పేర్కొన్నది. యూదు మతంలో ఒక బహిరంగ మత క్రతువు నిర్వహించాలంటే కనీసం పది మంది హాజరు ఉండాలి, ఇప్పుడు సాధ్యం కాదు కానుక వాట్సాప్‌ లేదా మరొక పద్దతిలో పది మందిని చూపి దాన్ని పూర్తి చేస్తున్నారు.
ఇరాక్‌లో వైరస్‌ను వ్యాపింప చేసే వారు హంతకులతో సమానమని షియా మత పెద్ద గ్రాండ్‌ అయాతుల్లా అలీ అల్‌ సస్తానీ చేసిన వ్యాఖ్యలను ముక్తాదా అల్‌ సదర్‌ అనే మత పెద్ద వ్యతిరేకించాడు. నజఫ్‌ లోని ఇమామ్‌ అలీ మందిరాన్ని తెరవాల్సిందే అంటూ ప్రార్ధన ధర్నా చేశాడు. తలుపులు తెరిచిన తరువాత శవాలతో జనం దాని చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కొందరు మతఛాందుసులైన క్రైస్తవులు, స్వలింగ వివాహాలకు మద్దతు ఇస్తున్న కారణంగా కరోనా వైరస్‌ శిక్షిస్తున్నదని ముక్తాదా ముక్తాయింపులు ఇస్తున్నాడు. ఈనెల 23న రంజాన్‌ మాసం ప్రారంభం కానుంది. ఆ సందర్భంగా ఇస్లామిక్‌ దేశాలలో ఏమి చేస్తారన్నది చూడాల్సి ఉంది. ఇరాన్‌లో అన్ని మత ప్రదేశాలకు భక్తులు రావటాన్ని గతనెల 16న ప్రభుత్వం నిషేధించింది. అప్పటికే పరిస్ధితి చేయిదాటి పోయిందని లౌకికవాదులు విమర్శిస్తే, ఇది తగని చర్య అని మతోన్మాదులు విరుచుకుపడ్డారు. అయోధ్యలో రామనవమి ఉత్సవాలను పరిమితం చేయాలని అధికారులు ప్రయత్నిస్తే హిందూ సంస్ధల వారు అయిష్టంగానే అంగీకరించారని ఎకనమిస్ట్‌ పేర్కొన్నది.
కరోనా వైరస్‌ బతికి ఉన్నవారి మధ్య దూరం పెంచటమే కాదు, మరణించిన వారి అంత్యక్రియలకు సైతం పరిమితులు విధించింది. సంప్రదాయాలను పక్కన పెట్టమంది. క్రైస్తవులు, ముస్లింలు అనేక దేశాల్లో మరణించిన వారికి అంత్యక్రియలు జరిపేందుకు మూడు రోజులు తీసుకుంటారు. ఇప్పుడు మరణించిన రోజే ఆపని చేయాలని అధికారులు ఆదేశిస్తున్నారు. కొన్ని చోట్ల రోజుల తరబడి శవాలను ఇచ్చే పరిస్ధితి లేదు. కరోనా వ్యాధి గ్రస్తులు మరణించిన తరువాత వైరస్‌ ఉండదని వైద్యులు చెబుతున్నారు. అయినా సరే అలాంటి వారిని అనుమతించేది లేదని అనేక శ్మశానవాటికలు నిరాకరిస్తున్నాయి. హాజరయ్యేవారి సంఖ్యపై పరిమితులు పెడుతున్నాయి. కొన్ని చోట్ల గుమికూడకుండా సామాజిక దూరం పాటిస్తూ రెండు కిలోమీటర్ల దూరం పైగా నిలబడి శ్రద్దాంజలి ఘటించిన ఉదంతాలు కూడా ఉన్నాయి.
మత మూర్ఖశిఖామణులే కాదు కొన్ని ప్రభుత్వాలు కూడా జనం ముఖ్యంగా లక్షలాది మంది మహిళల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం వైరస్‌ వ్యాప్తికి అబార్షన్లే కారణమని అనటమే కాదు, అబార్షన్లను నిషేధించింది. అసలే ఉద్యోగాలు పోయి, ఆదాయం లేని అనేక మంది ఇదేమి అదనపు భారంరా బాబూ అని గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో అంతకు ముందు అప్పాయింట్‌మెంట్‌ ఇచ్చిన ఆసుపత్రులన్నీ వాటిని రద్దు చేశాయి. అతిక్రమించిన వారి మీద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో ఇతర రాష్ట్రాల్లో అత్యవసరంగా గర్భవిచ్చిత్తి చేసే ఆసుపత్రుల కోసం పరుగులు తీస్తున్నారు.
కరోనా వైరస్‌ కారణంగా ఇది రాస్తున్న సమయానికి వ్యాధిగ్రస్తులైన వారు 17లక్షల 16వేలు, మరణించిన వారు లక్షా మూడువేల 848మంది. ఒక్క అమెరికాలోనే 30శాతం మంది వ్యాధి బారిన పడ్డారు. మానవాళితో పాటు వారిని నడిపిస్తున్న మతాలు కూడా దీని ప్రభావానికి గురయ్యాయి. దీని దెబ్బకు మతాలు బోధకుల మీదనే విశ్వాసం సన్నగిల్లే పరిస్ధితి వచ్చిందంటే అతిశయోక్తి కాదు. గత చరిత్రను చూసినపుడు ప్రళయాలు సంభవించినపుడు, వర్తమాన కాలంలో ఆర్ధిక సంక్షోభాలు వచ్చినపుడు జనం మరింతగా మతాలు, దేవుళ్లవైపు చూశారని స్పష్టమైంది. సమాజాన్ని వెనుక్కుతీసుకుపోయే మతశక్తులు మత, క్రతువుల పునరుద్దరణకు చేసే సంఘటిత ప్రయత్నాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. వర్తమాన కాలంలో హిందూత్వ శక్తులు హిందూమతం కోసం ప్రయత్నిస్తుంటే తబ్లిగీ జమాత్‌ వంటి సంస్దలు ఇస్లామ్‌ పునరుద్దరణ ప్రయత్నంలో ఉన్నాయి. ఇలాగే ప్రతి మతంలోనూ తిరోగామి శక్తులు చెలరేగుతున్నాయి. మానవ ప్రవర్తన మీద మతాల ప్రభావం ఇప్పుడు పెరుగుతోందా తరుగుతోందా అనే చర్చ ఉండనే ఉంది. ఆర్ధిక పరిస్ధితులు బాగుంటే దేవుడ్ని పట్టించుకోరనే మాట తరచూ వినిపించటం అందరికీ తెలిసిందే.
1960 దశకంలో అమెరికాలో 40శాతం లోపే మతాన్ని నమ్మటం లేదా తమ జీవితాల మీద మత ప్రభావం ఉందని భావించగా న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై ఉగ్రవాదులు రెండు విమానాలతో దాడులు చేసిన తరువాత మతం మీద విశ్వాసం ఉండాలని భావించిన వారు 71శాతం ఉన్నట్లు గ్యాలప్‌ సర్వే పేర్కొన్నది.14వ శతాబ్దంలో ఐరోపాలో ప్లేగ్‌ వ్యాధి ప్రబలినపుడు జనజీవితంలో చేస్తున్న తప్పుల కారణంగానే శిక్షగా దేవుడు ప్లేగ్‌ను పంపాడని మత పెద్దలు చెప్పారు. హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడం చార్మినార్‌ గురించి అందరికీ తెలిసిందే. ప్లేగు వ్యాధితో జనం మరణించకుండా నివారణ ప్రార్ధనలు జరిపేందుకు నాటి రాజు కులీ కుతుబ్‌ షా 1591లో నిర్మించిన కట్టడం అది. ప్రపంచంలో అనేక చోట్ల అలాంటివి వెలిశాయి. తరువాత హైదరాబాదు సంస్ధానంలో ప్లేగు వచ్చినపుడు పాలకులు భారం దానిమీదే వేసి ఊరుకోలేదు.ఐరోపాలో ప్లేగు కోట్లాది మందిని బలితీసుకుంది. ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. ప్లేగు వ్యాధి పదే పదే రావటంతో జనాలకు మతం మీద నమ్మకం సన్నగిల్లింది. దేవుడు మంచి వాడే గానీ మత పెద్దలు కాదన్నట్లుగా ఆగ్రహం వారి మీదకు మళ్లింది. ఆ పరిణామం మత సంస్కరణ ఉద్యమానికి నాంది పలికింది.
కరోనా సందర్భంగా అక్కడా ఇక్కడ అని లేకుండా ప్రపంచ వ్యాపితంగా అన్ని మతాల ప్రార్ధనా మందిరాలను మూసుకోవాల్సి వచ్చింది. ఎవరైనా చాదస్తం, మూర్ఖత్వంతో వ్యవహరిస్తే ఆయా మతాల వారిలోనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మలేసియా, పాకిస్దాన్‌, భారత్‌లలో తబ్లిగీ జమాత్‌ సమావేశాలు కరోనా వైరస్‌ వ్యాప్తి కేంద్రాలుగా, వాటిలో పాల్గొన్నవారు వైరస్‌ను మోసుకు వచ్చిన వారిగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ తప్పు ఇస్లాం మతానిది కాదు, ఆ మతాన్ని పునరుద్దరించే పేరుతో పనిచేస్తున్న సంస్ధలు, వ్యక్తులు కరోనా వ్యాప్తి గురించి తెలిసి కూడా మూర్ఖంగా సమావేశాలు నిర్వహించటం నేరపూరిత వ్యవహారం. దాని మీద ఆ మతంలోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. మతాన్ని పునరుద్దరిస్తాం అంటే సరి పెట్టుకున్నంత మాత్రాన అసలుకే ఎసరు తెస్తే ఎలా అంగీకరిస్తాం అనే ఆగ్రహం ఆ మతంలోని వారి నుంచే వ్యక్తం అవుతోంది. సరే ఈ ఉదంతాలను కూడా మతోన్మాదాన్ని, ఇస్లాం వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకున్న వారి గురించి తెలిసిందే. వారికి సోకిన మత వైరస్‌ కరోనా కంటే ప్రమాదకరం.

In a test of faith, Christians mark Good Friday in isolation - The ...

మత శక్తులు వారు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా ఒకటే. ఇండోనేషియాలో మార్చి 19వ తేదీ నుంచి జరపతలపెట్టిన తబ్లిగీ జమాత్‌ ఐదు రోజుల ఆసియా వార్షిక మత సమావేశాలను రద్దు చేసుకోవాలని అక్కడి ప్రభుత్వం చెప్పినా నిర్వాహకులు పెడచెవిన పెట్టారు. ప్రభుత్వం కూడా గట్టిగా చెప్పలేకపోయింది. అల్లాకు తప్ప మరొకరెవరికీ భయపడాల్సిన పనిలేదని ప్రచారం చేశారు. సమావేశ రద్దు ప్రతిపాదన వెనుక నిషేధిత ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ ఉందని కూడా రెచ్చగొట్టారు. చావు పుట్టుకలన్నీ దేవుడు ముందే నిర్ణయిస్తాడని, కనుక కరోనా గురించి భయపడాల్సిన పనిలేదన్నారు. దానికి భయపడితే ఇస్లాం నుంచి వైదొలిగినట్లే అని రెచ్చగొట్టారు. మసీదు నిర్వాహకులు అల్లా కంటే సమావేశాలను వాయిదా వేయాల్సిందే అన్న రాష్ట్ర గవర్నర్‌ రిదవాన్‌ కమిల్‌కే ఎక్కువ భయపడ్డారని జనం భావించారు. అనుమతి లేకపోయినా భక్తులు ప్రారంభానికి ముందే వేలాది మంది చేరుకున్నారు. చివరికి అధికార యంత్రాంగం కరకుగా వ్యవహరించటంతో రద్దు చేసుకున్నారు.
సరిగ్గా ఇదే సమయంలో మన దేశంలో అయోధ్యలో శ్రీరామ నవమి ఉత్సవాలను ఎట్టి పరిస్ధితుల్లోనూ జరిపి తీరాల్సిందే అని రామాలయ ట్రస్టు సభ్యుడు మహంత పరమహంస పట్టుబట్టిన విషయం తెలిసిందే. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, భక్తుల మంచి చెడ్డలను రాముడే చూసుకుంటాడని వాదించారు.
ఇక మంత్రాలకు చింతకాయలను రాలుస్తాం అనే అన్ని మతాలకు చెందిన బాబాలు, యోగులు,యోగినులు దుకాణాలు మూసుకొని కరోనా దెబ్బకు ఎక్కడికి పోయారో తెలియదు. వారిని గుడ్డిగా నమ్మిన జనం కష్ట కాలంలో ఏమయ్యారు అని నిలదీయకుండా ఉంటారా ? అంత ధైర్యం చెయ్యకపోతే వారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కరోనా కథ ముగిసిన తరువాత వారంతా తిరిగి దుకాణాలు తెరుస్తారు, జనానికి ఎలాంటి సంజాయిషీ చెబుతారో చూద్దాం. అలాంటి వారందరి చేత తెల్లారగానే బోధలు చేయించే మీడియా పెద్దలు కూడా జనానికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిందే. ఈ సమయంలో అన్ని మతాల వారు ఇండ్లలో ఉండే ప్రార్ధనలు జరపండి అని చెప్పకతప్పటం లేదు. అదే పని సాధారణ సమయాల్లో సైతం ఎందుకు చేయకూడదు అని కొందరైనా ఆలోచించకుండా ఉంటారా ? దర్శనాల వేలం వెర్రి తగ్గుతుందా? అదే జరిగితే అత్యంత లాభదాయకంగా మారిన భక్తి వాణిజ్య కేంద్రాలు, వాటి నిర్వాహకుల ఆదాయాలు ఏమి అవుతాయి ? ప్రభుత్వాలకూ ఆదాయం పడిపోతుంది. గతంలో ప్రింటింగ్‌ ప్రెస్‌ మత ప్రచారంలో పెద్ద విప్లవాన్నే తెచ్చింది. మత గ్రంధాల ప్రచురణ, పంపకం ద్వారా భక్తి విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్‌ ఫోన్‌ వాడకం బాగా పెరిగి పోయిన ఈ రోజుల్లో ఫోన్‌ భక్తి వెల్లువ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇష్టదైవాన్ని ఫోన్లో చూస్తూనే బస్సులు, రైళ్లు, కార్యాలయాల్లో పూజలు ప్రారంభం కావచ్చు. ఇవన్నీ మత వాణిజ్యం, మతశక్తులకు మంచి సూచనలు కావు.

Chinese President Xi Says He Was Leading COVID-19 Since Jan. 7 | Time
ప్రపంచమే ఒక గ్రామంగా మారిపోయిందని ప్రతివారూ చెబుతారు. కానీ ఆ గ్రామంలోనే ప్రతి వారూ తమ కులం, మతాలకే పరిమితమైన గోడలతో గృహ సముదాయాలను నిర్మించుకోవటాన్ని మనం చూస్తున్నాము. ప్రతి కులం, ప్రతి మతం తమ పవిత్రతను కాపాడుకొనేందుకు ఎంతకైనా తెగించే ధోరణులు నానాటికీ పెరిగిపోతున్నాయి. పాలు తాగుతూ తననెవరూ చూడటం లేదు అనుకునే పిల్లుల మాదిరి ప్రతి వారూ తమ కుళ్లును మూసిపెడుతూ ఎదుటి వారి దాని మీద దాడి చేస్తున్నారు. అంతరించి పోతున్న మత, కుల మడులను పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నారు.గతంలో మతాల పేరుతో అధికారాన్ని నిలుపుకొనేందుకు రాజులు,రంగప్పలు చేస్తే ఇప్పుడు వారి వారసులుగా కొన్ని పార్టీలు పుట్టుకు వస్తున్నాయి. మృత భాషగా మారిపోయిన సంస్కృత శ్లోకాలను తమ పిల్లలకు నేర్పుతూ అనేక మంది ముఖ్యంగా విదేశాలలో ఉంటూ తెలియకుండానే హిందూ మత ఉద్దారకులుగా మారిపోతున్నవారిని చూస్తున్నాము. అదే పద్దతిలో ఏ మతానికి ఆ మతం వారు పడరాని పాట్లు పడుతున్నారు.
ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
అని రాయప్రోలు సుబ్బారావు గారు చెప్పారు. కానీ దానికి భిన్నంగా భారతీయులమని చెప్పుకోవాల్సింది పోయి ఫలానా కులం, ఫలానా మతం ప్రాంతాల వారీగా కొట్టుకు చస్తున్న ప్రవాస భారతీయలను చూసి సిగ్గుపడుతున్నాము. అయితే ఏ విత్తనాలు వేస్తే ఆ పండ్లు, కాయలే కాస్తాయి అన్నట్లుగా మన దేశంలో, రాష్ట్రాలలో కుల మతాల కంపుతో పెరిగిన మన వారు పరాయి ప్రాంతంలో కూడా దాన్నే వ్యాపింప చేయటంలో ఆశ్చర్యం ఏముంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌పై వేటు : వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి మరో పెద్ద తప్పిదం చేశారా ?

10 Friday Apr 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

AP Ordinance on SEC term, AP SEC Row, Nimmagadda Ramesh kumar, YS Jaganmohan reddy

Opinion - Who's Mr Right: CM or SEC?

ఎం కోటేశ్వరరావు
జగన్‌మోహరెడ్డి ఎరక్కపోయి మరింతగా ఇరుక్కు పోతున్నారా అనే శీర్షికతో మార్చినెల 22న ఒక విశ్లేషణ చేశాను. తాజాగా జరిగిన పరిణామాన్ని చూస్తే ఏం జరిగినా సరే మడమ తిప్పేది లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని నిర్ధారణ అయింది. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని మూడు సంవత్సరాలకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సును ఆర్డినెన్స్‌ ద్వారా గవర్నర్‌ అమలు చేశారు. గవర్నర్‌ ఆమోదం పొందిన తరువాత ప్రస్తుతం కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరొక ఉత్తరువు జారీ చేసింది. కొత్త కమిషనర్‌గా తుడా కార్యదర్శి ఎస్‌ రామసుందరరెడ్డి నియామకం కూడా జరిగిపోయింది. కరోనా లక్షణాలు బయట పడటానికి 14 రోజులు పడుతుందని వైద్యులు చెప్పారు. ఇప్పుడు కూడా అలాగే కరోనా మాటున రహస్యంగా జరిగింది బయట పడింది.
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి మరో పెద్ద తప్పిదం చేశారా లేక సలహాదారులు తప్పుదారి పట్టించారా ? ఏదైనా ఒకటే, వినేవారు చెవి అందిస్తే దానికి ఇంపైన మాటలతో కంపు చర్యలను కూడా ఎక్కిస్తారు. కమిషనర్‌ పదవీ కాలం తగ్గింపు, దాని కొనసాగింపుగా తొలగింపు చట్టబద్దమా, విరుద్దమా అన్న చర్చ ప్రారంభమైంది. తెలుగు ప్రాంతాల్లో ఒక లోకోక్తి ఉంది. కొడదామంటే కడుపుతో ఉంది-తిడదామా అంటే అక్క కూతురు అన్నట్లుగా సలహాదారులను ఏమీ చేయలేని స్ధితి ఉన్నట్లు కనిపిస్తోంది. ఏరి కోరి నియమించుకున్నవారాయే ఏ పేరుతో తొలగిస్తారు ? ఏది ఎలా జరిగినా అంతిమంగా ఫలితాన్ని అనుభవించేది జగన్మోహనరెడ్డి మాత్రమే. సలహాదారులకు పోయేదేమీ లేదు, వాళ్లు ఎన్ని తప్పుడు సలహాలు ఇచ్చినా తొలగించలేని నిస్సహాయ స్థితిలోకి ఇప్పటికే జారుకున్నారు. ఎవరినైనా తొలగిస్తే అది కూడా ఒక పెద్ద చర్చనీయాంశం అవుతుంది.
జగన్మోహనరెడ్డి పాలన మీద కేంద్రీకరించటం కంటే తనకు శాశ్వతంగా అధికారాన్ని కట్టబెడతాయని ఆశపడుతున్న నవరత్నాల అమలు, తన రాజకీయ ప్రత్యర్ధుల మీద, గత పాలనలో వారికి సహకరించిన ఉన్నతాధికారుల మీద కక్ష తీర్చుకొనేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఇప్పటికే అనేక విమర్శలు వచ్చాయి. వాటిని ఆరోపణలుగా భావించి వైసిపికి మద్దతు ఇస్తున్న వారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలం తగ్గింపు ఆర్డినెన్స్‌ ద్వారా దొడ్డి దారిన రమేష్‌ కుమార్‌ను తొలగించటంతో సిఎం కక్షపూరిత వైఖరిని నిర్ధారించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహనరెడ్డి ఏం చేసినా సమర్ధించే వీర భక్తులకు కొదవ లేదన్నది వేరే అంశం. వారు తమ దేవుళ్లను కాపాడలేరు అని ఇప్పటికే చంద్రబాబు నాయుడి విషయంలో రుజువైంది.
స్ధానిక ఎన్నికలను వాయిదా వేసిన కమిషనర్‌ నియామకంపై తమ ముఖ్య మంత్రి అనవసరంగా ప్రతిష్టకు పోయి దెబ్బతిన్నారని భావిస్తున్న వైసిపి నేతలు, కార్యకర్తలు ఇప్పుడు తొలగింపునకు అనుసరించిన పద్దతిని ఉన్నత న్యాయస్ధానాలు అంగీకరించకపోతే తాము ఏ ముఖంతో బయటకు రావలానే ఆందోళనకు గురవుతున్నారు. కరోనా కారణంగానే గతంలో ఎదురు దెబ్బలు తిన్న అనుభవం గమనంలో ఉంటే ఇప్పుడు ఆ కరోనా మరింత ఉధృతంగా ఉన్న సమయంలో ఇలాంటి చర్యను వైసిపి కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేరు.
ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలం, నియామకం గురించి స్వతంత్ర విధానాన్ని అనుసరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. అయితే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల వ్యవధికి రమేష్‌ కుమార్‌ను నియమించింది. అది ముగిసేలోగా ఏ కారణాలతో అయినా నియమిత వ్యక్తులు రాజీనామా చేస్తే లేదా అరవై అయిదు సంవత్సరాలు నిండి వైదొలగాల్సి వస్తే ఆ స్ధానంలో కొత్త వారిని నియమించటం వేరు. లేదా కమిషనర్‌ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చినపుడు తొలగించాలంటే ఒక హైకోర్టు న్యాయమూర్తిని ఏ పద్దతుల్లో తొలగించాలో అదే పద్దతిని పాటించాల్సి ఉంటుంది. పార్లమెంట్‌ ఆమోదం అవసరం. అందువల అది అంత తేలిక కాదు కనుక జగన్‌ సర్కార్‌ వేరే మార్గాన్ని ఎంచుకుంది. అది చట్టబద్దమా కాదా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. తన తొలగింపును సవాల్‌ చేస్తూ రమేష్‌ కుమార్‌ కోర్టుకు వెళతారా లేదా అన్నది తెలియదు. ప్రజాప్రయోజనాల రీత్యా ప్రభుత్వ చర్యను సవాలు చేస్తూ ఇతరులు ఎవరైనా కోర్టుకు వెళ్ల వచ్చన్నది ఒక వాదన.
కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్‌ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ విషయంలో సుప్రీం ముఖ్యమంత్రి అయిన తానా లేక ఎన్నికల కమిషనరా అని స్వయంగా జగన్‌మోహనరెడ్డే ప్రశ్నించటమే కాదు, సుప్రీం కోర్టుకు వెళ్లి మొట్టికాయలు తిని కమిషనర్‌ నిర్ణయమే సుప్రీం అని నిర్ధారించుకున్నారు.అయితే దాన్ని జీర్ణించుకోలేకపోయారు అన్నది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. దానికి ప్రతీకారం తీర్చుకుంటారని అందరూ భావించినా అది ఇలా, ఈ సమయంలో ఉంటుంది అని ఎవరూ ఊహించలేదు. కరోనా కారణంగా దృష్టి అంతా అటే వైపు ఉంది. దాన్ని అవకాశంగా తీసుకొని కక్ష తీర్చుకోవటానికి పూనుకుంటారని, ఈ సమయంలో కొత్త రాజకీయ వివాదాలకు తెరలేపుతారని ఎవరూ ఊహించలేదు.
అయితే వెనుకటి తేదీ నుంచి అమలు జరిగే నిర్ణయం చట్టబద్దమైతే ఏక్షణంలో అయినా తొలగించేందుకు అవకాశం ఉంది. కరోనా కష్ట కాలంలో ఆర్డినెన్స్‌ ద్వారా యావత్‌ రాజకీయ వర్గాలు విస్తుపోయేలా రాజకీయానికి పూనుకోనవసరం లేదు. గాలికిపోయేదాన్ని తలకెత్తుకోవాల్సిన అగత్యం అంతకంటే లేదు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత ఎలాగూ బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాలు జరపాల్సి ఉంటుంది. చర్చ లేకుండానే ఆమోదించే మద్దతు ఎలాగూ ఉన్నారు గనుక ఆ సమయంలోనే ఆర్డినెన్స్‌ ద్వారా చేసిన దాన్ని బిల్లుద్వారానే చేయవచ్చు.తొందరపడకుండా ప్రజాస్వామ్య బద్దంగానే చేశారనే విమర్శలు రాకుండా చూసుకోవచ్చు. కరోనా వ్యాప్తి తగ్గేవరకు స్దానిక సంస్ధల ఎన్నికలు ఎలాగూ జరగవు. ఈ లోగా కమిషనర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేదేమీ ఉండదు.
ఈ నేపధ్యంలో ఇలాంటి చర్యల ద్వారా జగన్మోహనరెడ్డి ఏమి సాధిస్తారు ? ఎలా లబ్ది పొందుతారన్నది ఒక అంశం. రమేష్‌ కుమార్‌ తొలగింపు విషయంలో కోర్టుకు వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వెళ్లకపోతే అదొక పెద్ద చర్చ అవుతుంది. తాను తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని కేంద్రానికి ఫిర్యాదు చేసిన రమేష్‌ కుమార్‌ తన వేటును సవాలు చేయకపోతే బెదిరింపులకు లొంగిపోయినట్లు కనిపించే అవకాశం ఉంది. ఆర్డినెన్స్‌ ద్వారా ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని సవరించారు. అది పూర్వపు తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను 2016 ఏప్రిల్‌ ఒకటవ తేదీన నియమించారు. ఒకసారి నియమించిన తరువాత సదరు వ్యక్తి పదవీకాలం పూర్తి అయిన తరువాతే కొత్త విధానం అమల్లోకి వస్తుందన్నది ఒక వాదన, కాదు వెనుకటి తేదీ నుంచి కూడా అమలు చేయవచ్చు అన్నది సర్కార్‌ అభిప్రాయంగా కనిపిస్తోంది. ఎన్నికల కమిషర్ల విషయంలో ఇలాంటి పరిస్ధితి గతంలో ఎన్నడూ ఎదురు కాలేదు. అయితే సమాచార కమిషనర్ల నియామకం, వారి హౌదాల విషయంలో ప్రభుత్వాలు చేసిన చేసిన మార్పులు కొత్తగా నియమించబోయేవారికి తప్ప ప్రభుత్వం కొత్త విధానాన్ని ఖరారు చేసే సమయానికి పదవుల్లో ఉన్న వారికి గత విధానాలే వర్తిస్తాయని సుప్రీం కోర్టు చెప్పింది. ఆ తీర్పు ప్రకారం అయితే జగన్‌మోహనరెడ్డికి మరో గట్టిదెబ్బ తగలనుంది. అది కార్యకర్తలు, నేతల్లో జగన్‌ పట్ల ఉన్న ఆరాధన స్ధానంలో చులకన భావం కలగటానికి నాంది అవుతుంది. ఇప్పటికే మడి కట్టుకొని ఉన్నవారు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.
ఉన్నత న్యాయ స్ధానాలు ఈ వివాదం తమ ముందుకు వస్తే ఏమి తీర్పు ఇస్తాయి అన్నది ఆసక్తికరం. ఇటీవల వెలువడిన కొన్ని తీర్పులను చూస్తే గత తీర్పులను అనుసరిస్తారనేదేమీ లేదు. చట్టానికి చేసే వ్యాఖ్యానాలు మారిపోతున్నాయి. ఒక వేళ వెనుకటి తేదీతో అమలు జరిపే ఆర్డినెన్స్‌ చెల్లదు అని తీర్పు వస్తే జగన్‌ పరువు మరింత పోతుంది. ఇప్పటికే కరోనా కారణంగా ఎన్నికల వాయిదాను రచ్చ చేసి పార్టీ కార్యకర్తలను ఇబ్బందుల్లోకి నెట్టారన్న భావం ఉంది. ఎన్నికల రద్దు నిర్ణయం తరువాత జరిగిన పరిణామాలను చూస్తే కమిషనర్‌ చర్యే సరైందన్నది స్పష్టం. అయితే అది ప్రభుత్వంతో సంప్రదించి చేసి ఉండాల్సింది అన్నది కూడా కమిషనర్‌ వైపు నుంచి జరిగిన లోపం అన్నది కూడా నిజమే.

Did Jagan Mohan Reddy disappoints Congress party? | AP PCC ...
ఒక వేళ ప్రభుత్వ చర్యను ఉన్నత న్యాయస్ధానాలు సమర్ధిస్తే చూశారా మా తడాఖా అని జబ్బలు చరుచుకోవటం తప్ప వైసిపికి అదనంగా వచ్చే రాజకీయ ప్రయోజనం ఏమిటన్నది అయోమయం. అంతే కాదు అది కొత్త సమస్యలను ముందుకు తెస్తుంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టంలో జరిగిన దాడులు, బలవంతపు ఉపసంహరణలు, ఇతర అక్రమాల గురించి కొందరు ఉన్నతాధికారుల మీద చర్యలు తీసుకోవాలని ఉద్వాసనకు గురైన కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ సిఫార్సు చేశారు. ఆ అంశాలతో కూడిన ఒక లేఖ కేంద్రానికి కమిషనర్‌ నుంచి అందినట్ల్లు, అవసరమైనపుడు దాని గురించి రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరతామని కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి జి కిషన్‌ రెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. ఎలాంటి కోర్టు వివాదాలు లేకుండా లేదా కోర్టు అనుమతిస్తే కొత్త కమిషనర్‌ గత కమిషనర్‌ చేసిన సిఫార్సులను రద్దు చేస్తారా ? వచ్చిన ఫిర్యాదుల మీద ఏ చర్య తీసుకుంటారు ? కేంద్రానికి రాసిన వివాదాస్పద లేఖను కూడా ఉపసంహరించుకుంటారా ? అదే జరిగితే కేంద్రం ఏ వైఖరి తీసుకుంటుంది అన్న ప్రశ్నలు ముందుకు వస్తాయి.
ఈ అంశంపై స్పష్టత వచ్చే వరకు జగన్‌ సర్కార్‌ కరోనా, పేదలను ఆదుకోవటం గురించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ చిన్న పొరపాటు జరిగినా కక్ష తీర్చుకోవటం మీద ఉన్న శ్రద్ద కష్టకాలంలో ఉన్న జనాల మీద లేదనే తీవ్ర విమర్శ, జనాగ్రహానికి గురికావాల్సి ఉంటుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ పరువును మురికి గంగలో కలిపిన జిగినీ దోస్త్‌ ట్రంప్‌ !

09 Thursday Apr 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Health, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

COVID-19, Donald trump, Donald trump Threat India, hydroxy chloroquine, Narendra Modi prestige

President Tump had supported the Narendra Modi government’s stand on hydroxychloroquine and praised India’s handling of the Covid-19 pandemic.

ఎం కోటేశ్వరరావు
నువ్వే నేను, నేనే నువ్వు, అన్ని విషయాల్లో ఒకే మాటగా ఒకే బాటలో నడుస్తామని చెప్పారు. మాది ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకొనే స్నేహం అన్నారు. కావాలంటే చూడండి అని కావిలించుకొని మరీ ప్రపంచానికి ప్రదర్శించారు. వారెవరో ఇంకా చెప్పాలా ! అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, మన ప్రధాని నరేంద్రమోడీ. అలాంటి ట్రంప్‌ మరో దోస్తును మాక్కావలసిన మందు పంపకపోతే సంగతి చూస్తా బిడ్డా ! అని బెదిరించాడు. అంతకోపమెందుకు అన్నా నీక్కావలసినవి పంపుతున్నా అంటూ వెంటనే మోడీగారు జావగారి పోయారు. తన అవసరం తీరగానే భారత్‌కు, మోడీకి కృతజ్ఞలు అంటూ ఒక ట్వీట్‌ను ట్రంప్‌ మనకు పారేశాడు. మరి ఇదేమి స్నేహమో, ఇదేమి సమానభాగస్వామ్యమో జనం ఆలోచించాలి. ఈ విషయాల మంచి చెడ్డల గురించి మాట్లాడితే కరోనా కష్ట కాలంలో ఇలాంటివా అని మోడీ భక్తులు చెలరేగి పోతారు. మామూలు రోజుల్లోనే సహించరని ఇప్పటికే తేలిపోయింది కనుక ఇప్పుడు చెప్పనవసరం లేదు. అమెరికన్ల ప్రాణాల మీదకు తెచ్చింది ట్రంప్‌. సాయం కావాల్సింది వారికి, ఎవరైనా మర్యాద పూర్వకంగా అడుగుతారు. బెెదిరించేవాళ్లను-వారికి లొంగిపోయే వారిని ఏమనాలి ? ఇది వ్యక్తుల సమస్య కాదు, దేశం పరువు. అసలు సిసలు దేశభక్తులం అని చెప్పుకొనే వారు ఇలా ప్రవర్తిస్తారా అని షాక్‌ అవుతున్నవారెందరో !
ప్రపంచ మీడియా అంతా అమెరికా బెదిరింపుకు భారత్‌ లొంగిపోయింది అని రాసింది. మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసి కిసుక్కున నవ్వినందుకు కోపం వచ్చింది అన్నట్లుగా మోడీ భక్తులకు ట్రంప్‌ అవమానించినందుకు, ప్రపంచ మీడియా అదే విషయాన్ని రాసినందుకు కోపం రాకపోవచ్చు గానీ మన దేశంలో ఎవరైనా దాని గురించి మాట్లాడితే, రాస్తే, విమర్శిస్తే ఎక్కడలేని ఆగ్రహం వస్తుంది. బానిస మనస్థత్వాన్ని ప్రదర్శించారని సామాజిక మాధ్యమంలో విమర్శలు వెల్లువెత్తాయి. ఎవరేమనుకుంటేనేం ట్రంప్‌ పొగడ్తల ముందు అన్నీ దిగదుడుపే ! నిన్నటిదాకా ప్రపంచ రాజకీయాల్లో సమాన భాగస్వామి అని ప్రకటించిన నరేంద్రమోడీని ట్రంప్‌ అవమానిస్తే అది మోడీకి కాదు, దేశానికే అవమానం. అలాంటిది దీన్ని రాజకీయం చేయవద్దు అని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అనటాన్ని ఏమనాలి, సాధారణంగా అయితే సిగ్గు చేటు అంటాం. ఈ మాట దేశద్రోహం కిందకు రాదు. రాజకీయం చేసింది, మర్యాద లేకుండా వ్యవహరించింది ట్రంప్‌ !

COVID-19: More Hydroxychloroquine Data From France
కరోనాకు ఇంతవరకు మందు లేదు. ఉన్న మందులు కరోనా సోకిన రోగులకు తలెత్తే ఇతర ఆరోగ్య సమస్యలకు చికిత్సకోసం తప్ప మరొకదానికి కాదు. మలేరియాకు బాగా పని చేసే హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ అనే ఔషధం కరోనా వ్యాధి గ్రస్తులకు ఉపశమనం కలిగిస్తుందని ఇంతవరకు ఎవరూ నిర్దారణగా చెప్పలేదు. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఫలానా మందు వేస్తే ఏమైనా సుగుణం వస్తుందేమో చూద్దాం అన్ని అందుబాటులో ఉన్న మందులను వాడుతున్నట్లుగా కొన్ని చోట్ల దీన్ని కూడా వాడారు. కొందరికి సుగుణం కనిపించిందని వైద్యులు చెప్పారు, కొందరికి అదే ప్రాణాల మీదకు తెచ్చిందని కొన్ని వార్తలు వచ్చాయి. ఈ మందును ప్రపంచంలో ఎవరైనా తయారు చేయవచ్చు, దీనికి లైసన్సు, పేటెంట్లతో పనిలేదు. అమెరికాలో కూడా ఇప్పటికే తయారు చేస్తూనే ఉన్నారు. అలాంటి దానికోసం ట్రంప్‌ ఇంత యాగీ ఎందుకు చేసినట్లు ? తన దోస్తు పరువు ఎందుకు తీసినట్లు ?
ట్రంప్‌ చర్య బెదరింపు, హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ ,ఇతర వైద్య పరమైన వాటిపై ఎగుమతి నిషేధాన్ని సడలించకపోతే ప్రతికూల చర్యలకు పాల్పడతాం అని చెప్పటం బలప్రదర్శన తప్ప మరొకటి కాదు. నిర్దారణగాని సదరు ఔషధం కనుక ఎగుమతి చేసినా ఇబ్బంది లేదు, కరోనా పోరులో అవసరమైన మిగతావాటిని కూడా బెదిరింపులకు లొంగి సరఫరా చేస్తే మన జనం సంగతి ఏమిటి అన్నది సమస్య? ఈ విషయాన్ని చర్చించనవసరం లేదా ? ట్రంప్‌ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఏకపక్షంగా చేయకపోతే ప్రతిపక్షాలను ఎందుకు సంప్రదించలేదు ?
సామాజిక మీడియాలో అతిశయోక్తులు ప్రచారం చేయటం, నరేంద్రమోడీకి లేని గొప్పతనాన్ని అంటగట్టటం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో కూడా కాషాయ తాలిబాన్లు వెంటనే విజృంభించారు. సరైన పేరు లేదు గానీ కాషాయ రంగులో ఉండే వైరస్‌ సోకిన కారణంగా మీడియాలో పని చేసే వారందరూ కమ్యూనిస్టులుగానూ, మోడీకి సంబంధించి నిజాలను చూపని వారుగా కనిపిస్తారు. ఒక సారి ఆ వైరస్‌ సోకిన వారికి మెదడు పూర్తిగా చెడిపోతుంది, దాంతో జీవితాంతం పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తారు. అది వ్యాధి లక్షణం. అలాంటి ఒక వ్యాధిగ్రస్తుడు లేదా గ్రస్తురాలు సామాజిక మాధ్యమం కోసం తయారు చేసిన పోస్టు ఇలా తిరుగుతోంది. ” కమ్మి కమీనే మీడియా కుళ్ళుతో చెప్పని, ఇంటర్నేషనల్‌ న్యూస్‌ టాపిక్స్‌ లో హాట్‌ గా మారిన వార్త ఇవాళ్టికి ఇదే. మోడీ చాలా టఫ్‌ గురూ…సూపర్‌ పవర్‌ అమెరికాకి హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ అత్యవసరం, భారత్‌ కు ఎగుమతి చేసే శక్తి ఉంది.ముందుగా డిమాండ్‌ చేశారు.మోదీజీ ముందు మా అవసరాలు తీరాలని సమాధానం. రెండోసారి బెదిరింపు.మోదీజీ నవ్వుతూ కుదరదని స్పష్టం..మూడోసారి ‘ ఓకే మీకేం కావాలో అడగండి ‘ఇదీ అడిగేపద్దతి..
1.) అమెరికన్‌ మార్కెట్లలోకి ప్రవేశించడానికి భారత్‌ ఫార్మా కంపెనీలకు అడ్డొస్తున్న నియమాలను సవరించాలి.. డన్‌…2) భారత్‌ ఫార్మా కంపెనీల మీద సహేతుకంగా లేని అమెరికన్‌ ఎఫ్‌డిఏ విధించిన అన్ని లెవీస్‌ ఎత్తివేయాలి… డన్‌. 3.) ఎఫ్‌డిఐ ఇకపై భారత్‌ ఫార్మా కంపెనీల మీద అనవసర పేటెంట్‌ హరాస్మెంట్‌ చేయకూడదు.. డన్‌ . భారత్‌ ప్రతిపాదించిన 3 ప్రధాన డిమాండ్స్‌ నూ..డన్‌..డన్‌..డన్‌ 24 గంటల సమయంలో ఒప్పుకున్న అమెరికా…నిజంగానే మోడీ చాలా టఫ్‌… కొరకరాని కొయ్య..? ఓవరాల్‌గా మన ఫార్మా కంపెనీలు అమెరికా వెళ్ళడానికి కావలిసిన అన్ని అనుమతులు మోడీ గారు దగ్గర ఉండి ఇప్పించారు. అలాగే అమెరికా అడిగిన హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ కూడా పంపించారు.” ఇదీ మొత్తం పోస్టు.
పాఠకులు గ్రహించాల్సింది ఏమంటే ప్రయివేటు మీడియాలో ఇవన్నీ చూపలేదు సరే, దూరదర్శన్‌, రేడియోలలో పని చేసేది కూడా కమ్యూనిస్టులేనా ? దీనికి సంబంధించి అధికారిక ప్రకటనలో ఏముంది ? అన్నింటికీ ఒప్పుకుంటున్నట్లు అమెరికా వైపు నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదే. మరి సామాజిక మాధ్యమానికి ఎలా అందినట్లు ? ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీ ఉత్పత్తి ! ఇంతకీ అసలు జరిగిందేమిటి ?
అమెరికా మనలను అడిగేనాటికే మన కేంద్ర ప్రభుత్వం మన అవసరాలను గమనంలో ఉంచుకొని ఔషధాలు, వైద్య పరికరాల ఎగుమతులపై నిషేధం విధించింది.ఈ మేరకు ఈనెల నాలుగవ తేదీ కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌ వెలువడింది. అది వెలువడిన కొద్ది గంటల్లోనే అమెరికా నుంచి ఔషధాలు కావాలని అడిగారు. ట్రంప్‌ స్వయంగా సంప్రదించాడు. నిషేధం కారణంగా కుదరదని చెప్పారు. అయితే నేను స్వయంగా ఫోనులో మోడీని అడిగినా ఔషధాలను పంపరా ? మీ సంగతి చూస్తా అంటూ ట్రంప్‌ సోమవారం నాడు బహిరంగంగానే బెదిరించాడు. ఒక రోజు కూడా గడవక ముందే మన సర్కార్‌ నిషేధాన్ని సడలించి పంపుతామని ప్రకటించింది. అంతే తప్ప మన కంపెనీలు నేరుగా అమెరికా మార్కెట్‌లోకి వెళ్లేందుకు దగ్గరుండి మరీ నరేంద్రమోడీ అనుమతులిప్పించారని చెప్పటం అతిశయోక్తి. కేంద్ర ప్రభుత్వ విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ విలేకర్లతో మాట్లాడుతూ మన మీద ఆధారపడుతున్న దేశాలకు ఔషధాలను పంపుతున్నామని, అమెరికాకు పంపటాన్ని రాజకీయం చేయవద్దని, ఊహాగానాలు వద్దని కోరాడు తప్ప అమెరికాతో పైన చెప్పినట్లుగా ఒప్పందం గురించి చెప్పలేదు, కాషాయ దళాలు ఆయన్ను కూడా కమ్యూనిస్టు అంటారేమో !
సామాజిక మాధ్యమంలో కాషాయ దళాలు చైనాయే మన సాయం కోరింది అని మరొక ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా తప్పుడు ప్రచారమే. ఇబ్బందులలో ఉన్నపుడు ఎంత గొప్పవారినైనా మీకేమైనా కావాలా అని అడుగుతాం. వారు కోరకుండానే మనకు తగిన సాయం చేస్తాం. అది మర్యాద, మన్నన. అలాంటి దాన్ని కూడా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారంటే వారి స్దాయి ఏమిటో అర్దం చేసుకోవచ్చు. లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్‌ రాత పూర్వక సమాధానమిస్తూ చైనాకు మన దేశం 15టన్నుల వైద్య సరఫరాలను ఫిబ్రవరి 26న ఒక ప్రత్యేక విమానంలో తీసుకుపోయి ఊహాన్‌లోని హుబెయ రాష్ట్ర ఛారిటీ ఫెడరేషన్‌కు అందచేశామని, వాటి విలువ 2.11 కోట్ల రూపాయలని, అంతకు ముందు ఎనిమిదవ తేదీన ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు గ్జీకి ఒక లేఖ రాస్తూ తమ సౌహార్ద్రతను తెలియచేస్తున్నామని, అవసరమైన సాయం చేయగలమని పేర్కొన్నట్లు ఆ సమాధానంలో తెలిపారు. పంపిన వాటిలో ఒక లక్ష సర్జికల్‌ మాస్కులు, ఐదులక్షల సర్జికల్‌ గ్లోవ్స్‌, 75 ఇన్‌ప్యూజన్‌ పంప్స్‌, 30 ఎంటరల్‌ ఫీడింగ్‌ పంప్స్‌, 21డిఫిబ్రిలేటర్లు, నాలుగువేల ఎన్‌95 మాస్కులు ఉన్నట్లు పేర్కొన్నారు. చైనా అవసరాలతో పోల్చినపుడు ఇవి ఎంత అన్నది సమస్య కాదు, తోటి దేశంగా తోడ్పాటు. అది ఎవరైనా చేస్తారు. దాన్ని గొప్పగా చెప్పుకోవటాన్ని ఏమనాలి ?
చైనాకు చేసిన ఈ సాయం గురించి గొప్పలు చెప్పుకుంటున్న వారికి తెలిసినా తెలియనట్లు నటించే విషయాలను జనం తెలుసుకోవాలి.చైనా, ఇతర దేశాల్లో ఎక్కడ దొరికితే అక్కడ మనకు కావాల్సిన వైద్య పరికరాలు, ఇతర సరఫరాలను కొనుగోలు చేసేందుకు మన దేశం నిర్ణయించిందని మార్చి 31న రాయిటర్స్‌ వార్తా సంస్ధ కథనాన్ని బిజినెస్‌ టుడే ప్రకటించింది.భారత్‌కు మూడు కోట్ల 80లక్షల ముఖతొడుగులు, 62లక్షల వ్యక్తిగత రక్షణ వైద్య పరికరాలు అవసరమని ఆ వార్తలో పేర్కొన్నారు. ఇదే సమయంలో కొన్ని చోట్ల వైద్యులకు ఇలాంటి పరికరాలు లేక రెయిన్‌కోట్లు వేసుకుంటున్నారని, గతిలేక హెల్మెట్లు పెట్టుకొని తమను తాము రక్షించుకుంటున్నారని వార్తలు వచ్చాయి. మనం చైనాకే ఎగుమతి చేసే స్దితిలో ఉన్నామని గొప్పలు చెప్పేవారు దీని గురించి ఏమి చెబుతారు ?
అమెరికన్ల పట్ల ట్రంప్‌ నిర్లక్ష్యం గురించి పదే పదే చెప్పుకోవటం నాగరికులకు సిగ్గు చేటు, వదిలేద్దాం. కరోనా చికిత్సకు హైడ్రోక్సి క్లోరోక్విన్‌ పని చేస్తుందని నిర్ధారణ కాలేదు, అయినా ఆ ఔషధం కోసం ట్రంప్‌ గత కొద్ది రోజులుగా ఇంటా బయటా ఎందుకు రచ్చ చేస్తున్నట్లు ? మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనాకు పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ మాదిరి వ్యవహారమేనా మరేదైనా ఉందా ? అమెరికా మీడియాలో భిన్న కథనాలు వెలువడ్డాయి. హైడ్రోక్సీ క్లోరోక్విన్‌తో కలిపి కొందరు వైద్యులు అజిత్రోమైసిన్‌ ఇస్తారు. దీన్ని జెడ్‌ పాక్‌ అంటారు. ఈ యాంటీబయోటిక్‌ బాక్టీరియాను తప్ప వైరస్‌ను నిర్మూలించదు. రెండు వారాల క్రితం ఫ్రెంచి వైద్యుల బృందం కొందరికి దీనితో చికిత్స చేశారు. ఆరు రోజుల తరువాత ఆరుగురికి పరీక్షలో నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. ఈ విషయం ఒక పత్రికలో ప్రచురితమైంది. అమెరికాలోని ఒక ప్రముఖ వైద్యుడు దీన్ని అందుకొని పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చాడు. దాన్నే సలహాగా ట్రంప్‌కు చెప్పాడు. అసలే నిర్లక్ష్యం చేసినట్లు ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్‌ ఈ ఔషధంతో అమెరికాలో వైరస్‌ను నిర్మూలించవచ్చని నమ్మినట్లు కనిపిస్తోంది. కానీ అదే ఫ్రెంచి వైద్యుల పర్యవేక్షణలో అదే ఔషధం తీసుకున్న మరో ముగ్గురిని ఆరురోజుల తరువాత పరిస్ధితి విషమించి ఐసియులో చేర్చారు. మరొకరికి చెడు ప్రభావం కనిపించటంతో జెడ్‌ పాక్‌ ఇవ్వటం నిలిపివేశారు. మరొక పేషెంట్‌ ఆరవ రోజున మరణించాడు. ఈ విషయాలను ట్రంప్‌కు వివరించిన వైద్యుడు గానీ, ట్రంప్‌గానీ పట్టించుకోలేదు. కేవలం ఒక ఆరుగురికి వచ్చిన ఫలితాన్ని బట్టి ఒక ఔషధాన్ని వైరస్‌ అనుమానితులు లేదా వ్యాధి గ్రస్తులకు ఇవ్వటం వైద్య చరిత్రలో అరుదు, ఎవరూ అంగీకరించరు. అయినా ట్రంప్‌ హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ చరిత్రను మార్చివేస్తుందంటూ గానాలాపనకు పూనుకున్నాడు. ఇది ఎంతో అద్భుతమైనది, ఎంతో అందమైనది, స్వర్గం నుంచి వచ్చిన బహుమతి అంటూ పిచ్చి ప్రేలాపనలు పేలాడు. దాన్లో భాగంగానే మన దేశాన్ని బెదిరించాడు. తాను కూడా స్వయంగా తీసుకోబోతున్నట్లు చెప్పాడు. వైరస్‌ గురించి దాదాపు అన్నీ పచ్చి అబద్దాలు చెప్పిన ట్రంప్‌ ఇప్పుడు క్లోరోక్విన్‌ గురించి ఎక్కువ చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీని వలన ఫలితం ఉండదనే అంశాన్ని కూడా గమనంలోకి తీసుకోవాలని చెప్పిన వారిని తీసుకొంటే మీకు పోయేదేమిటి అని నోరు మూయిస్తున్నాడు. ఎప్పుడైతే ట్రంప్‌ ఇలా మాట్లాడటం మొదలు పెట్టారో జనాలు తమకు ఉపయోగపడుతుందో లేదో తెలియకపోయినా అవసరం అయినపుడు ఉపయోగించుకోవచ్చని పెద్ద మొత్తంలో క్లోరోక్విన్‌ ఔషధాన్ని కొని నిల్వచేసుకుంటున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో అమెరికాలో కొరత ఏర్పడింది. అరిజోనా రాష్ట్రంలో చేపల తొట్లలో వేసే క్లోరోక్విన్‌ తీసుకొని భార్యాభర్తలు అస్వస్తతకు గురి కాగా భర్త మరణించాడు.
మరొక ఆసక్తికర విషయం ఏమంటే అమెరికాలో మలేరియాను ఎప్పుడో అరికట్టారు. పదమూడు రాష్ట్రాలలో మాత్రం అక్కడక్కడా చాలా సంవత్సరాల క్రితం కనిపించేది. అయితే ఇప్పటికీ మలేరియా కేసులు అమెరికా ఆసుపత్రుల్లో ఏటా రెండువేల మేరకు నమోదవుతున్నాయి. అవి కూడా విదేశాల నుంచి ముఖ్యంగా దక్షిణాసియా, సబ్‌ సహారా ఆఫ్రికా ప్రాంత దేశాల నుంచి వచ్చిన వారిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే క్లోరోక్విన్‌ మలేరియాతో పాటు లూపస్‌(ముఖచర్మరోగం)కు కూడా బాగా పని చేస్తుంది అందువలన దానికోసం అమెరికాలో కొన్ని కంపెనీలు తయారు చేస్తాయి. అమెరికాలో వ్యూహత్మక నిల్వల కోసం గతనెలలోనే నోవార్తిస్‌ సబ్సిడరీ శాండోజ్‌ కంపెని 2.9 కోట్ల డోసుల హైడ్రోక్సి క్లోరోక్విన్‌ సల్ఫేట్‌ను ప్రభుత్వానికి ఉచితంగా అందచేసింది. మరో కంపెనీ బేయర్‌ పదిలక్షల డోసులు ఉచితంగా అందచేసింది.
హైడ్రోక్సి క్లోరోక్విన్‌ గురించి ట్రంప్‌ హడావుడి చేయటం వెనుక స్వల్ప మొత్తాలలోనే అయినప్పటికీ ట్రంప్‌ కుటుంబ సభ్యులకు ఆర్ధిక ప్రయోజనాలున్నాయని ఆ కారణంగానే ట్రంప్‌, ఆయనకు చెందిన ఫాక్స్‌ న్యూస్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్లు వార్తలు వచ్చాయి. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికే వాటిని రాసింది. పాలక్వెనిల్‌ బ్రాండ్‌ పేరుతో హైడ్రోక్సి క్లోరోక్విన్‌ తయారు చేసే సనోఫి అనే కంపెనీ వాటాలలో ట్రంప్‌ కుటుంబ సభ్యుల మ్యుచ్యువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు ఉన్నాయని టైమ్స్‌ రాసింది. అయితే అవి వారి ఆస్తులతో పోల్చితే నామమాత్రమే అని వాటి వలన పెద్దగా వచ్చేదేమీ ఉండదని మరికొన్ని పత్రికలు రాశాయి.

Trump threatens payback for U.S. companies that move abroad | PBS ...
ఈ ఉదంతం మొత్తాన్ని చూస్తే ఒక అంశం స్పష్టం అవుతున్నది. ట్రంప్‌ అనుసరించిన నిర్లక్ష్యం కారణంగా నేడు అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్నది, ఎంత మందికి సోకుతుందో తెలియదు. కొద్ది రోజుల క్రితం వ్యాధి విస్తరణ తీరు తెన్నులను అరికట్టకపోతే లక్ష నుంచి రెండున్నర లక్షల మంది వరకు మరణించే అవకాశం ఉందని అంచనాలు వెలువడ్డాయి. ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ విజయం అనుమానమే. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీపడుతున్న సోషలిస్టు బెర్నీ శాండర్స్‌ పోటీ నుంచి తప్పుకున్నారు. జో బిడెన్‌ ఇప్పుడు ట్రంప్‌ ప్రత్యర్ధి అని తేలిపోయింది. అమెరికాలో ఔషధ తయారీ ఎంతో ఖర్చుతో కూడుకున్నది తప్ప అక్కడ తయారు చేయలేనిదేమీ కాదు. అంటే ట్రంప్‌ ఇక్కడ కూడా ఖర్చు – లాభం చూసుకున్నాడని అనుకోవాలి. ఎన్నికల్లో గెలుపు ఎత్తుగడల్లో భాగంగా ఎంతకైనా తెగిస్తానని, అమెరికన్ల కోసం ఏమైనా చేస్తానని ప్రదర్శించుకొనేందుకు మన దేశాన్ని బెదిరించినట్లు స్పష్టం కనిపిస్తోంది.
నరేంద్రమోడీ సర్కార్‌ బెదిరింపుల గురించి కనీస నిరసన కూడా తెలియచేయకుండా నాలుగు రోజుల క్రితం విధించిన నిషేధాన్ని ఎత్తివేసి అమెరికాకు ఔషధాన్ని పంపేందుకు నిర్ణయించింది, మరి ఆ 56 అంగుళాల ఛాతికి ఏమైందో, సమాన భాగస్వామ్యం ఎక్కడకు పోయిందో తెలియదు, మరీ ఇంత లొంగుబాటా ? ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తామని చెప్పుకొనే తమ నేత పరువు ప్రపంచ మీడియా వార్తలతో వారణాసిలోని మురికి గంగలో కలసిందని, దానికి ఆయన జిగినీ దోస్త్‌ ట్రంపేనని ఆయన భక్తులు గ్రహిస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనాపై నిర్లక్ష్యం : నరేంద్ర మోడీ-ఇమ్రాన్‌ ఖాన్‌ ఇద్దరూ ఇద్దరే !

07 Tuesday Apr 2020

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Coronavirus in India, Coronavirus in Pakistan, Coronavirus outbreak, Narendra Modi, PRIME MINISTER Imran Khan

How Narendra Modi should read Imran Khan

ఎం కోటేశ్వరరావు
అడుగడుగునా నిర్లక్ష్యం, ఎవరైనా ఎత్తి చూపితే ఈ క్లిష్ట సమయంలో రాజకీయాలేమిటని ఎదురు దాడి చేస్తారు. ఎవరూ ఏమీ చెప్పకపోతే, సద్విమర్శలు కూడా చేయకపోతే అధికార యంత్రాంగానికి, దాని మీద ఆధారపడిన పాలకులకు తెలిసేది ఎలా ? నిర్లక్ష్యంలో వారు వీరను తేడా లేదు, పాకిస్ధాన్‌తో తబ్లిగీ జమాత్‌ సమావేశాలను రద్దు చేయాలని చెప్పినా వినకుండా అక్కడ నిర్వహించారు. ఇక్కడ అలాంటి ఆదేశాలే ఇవ్వలేదు. రెండు చోట్లా జరిగిన సమావేశాలకు హాజరైన విదేశీయులు కరోనా వైరస్‌ను ఎలా అంటించి రెండు దేశాలను ఎలా ఇబ్బందుల పాలు చేశారో చూస్తున్నాము. మరి పాలకుల తీరు తెన్నులు ఎలా ఉన్నాయి ?
మార్చి 22న జనతా కర్ఫ్యూను పాటిస్తూ అదే రోజు సాయంత్రం ఐదు గంటల సమయంలో ఒకేసారి కరోనా మీద పోరు సల్పుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర విభాగాల వారు చేస్తున్న సేవలకు చప్పట్లు,గంటలను మోగించి అభినందనలు, కృతజ్ఞతలు తెలపాలని ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు యావత్‌ జాతి స్పందించింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమి చేసింది. వైద్యులు, సిబ్బంది విధి నిర్వహణలో వైరస్‌ అంటకుండా ధరించాల్సిన దుస్తులు, ఇతర రక్షణ పరికరాలతో కూడిన పిపిఇ కిట్ల తయారీకి మార్చి 24వ తేదీ వరకు మార్గదర్శక సూత్రాలనే ఖరారు చేయకుండా ఉన్నట్లు తెలుసా ?
పాకిస్ధాన్‌ మన ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర జనాభాకు సమానంగా జనసంఖ్య కలిగి ఉంది. అలాంటి చోట 4,004 కరోనా కేసులు,55మరణాలతో అక్కడి పరిస్ధితి ఉంది. మన దేశంలో 135 కోట్ల జనాభాలో 4,911కేసులు,137మరణాలు సంభవించాయి, దేశమంతటా లాక్‌డౌన్‌ ప్రకటించాము. ప్రపంచం జిడిపిలో మన పాలకులు దేశాన్ని ఐదవ స్ధానంలోకి తీసుకుపోయారు, పాకిస్ధాన్‌ విషయానికి వస్తే అది 42వ స్ధానంలో ఉంది. కరోనా పరీక్షల విషయానికి వస్తే అక్కడ ప్రతి పదిలక్షల మందికి 177 పరీక్షలు(ఏప్రిల్‌ 7నాటికి) చేస్తే అదే రోజుకు మన దేశంలో 102 చేశాము. మన పొరుగునే ఉన్న శ్రీలంకలో 176కేసులే ఉన్నా 152 మందికి, నేపాల్లో తొమ్మిది కేసులే ఉన్నా 52 మందికి పరీక్షలు చేశారు. మన దగ్గర డబ్బు లేక కాదు, జనాన్ని చావకుండా కాపాడాలనే శ్రద్ద ఏమేరకు ఉందో ఈ అంకెలు వెల్లడిస్తున్నాయి. ఎవరు ఏమిటన్నది కష్టకాలం వచ్చినపుడే తెలుస్తుంది. అందువలన మన జిడిపి అంత ఇంతా అంటూ గొప్పలు చెప్పుకోవటం తగ్గిస్తే మంచిదేమో? ఇది ఎవరినో విమర్శించటానికి కాదు, అణకువగా ఉండాలని చెప్పేందుకే.

Coronavirus
ఇక కరోనా నిరోధ విషయానికి వస్తే పాకిస్ధాన్‌లోని ఆప్ఘన్‌ సరిహద్దు రాష్ట్రమైన బెలుచిస్తాన్‌లో 202 కేసులు మాత్రమే ఉన్నాయి. అయినా అక్కడి వైద్యులు, సిబ్బంది కరోనా చికిత్సలో అవసరమైన రక్షణ దుస్తులు, పరికరాలను సరఫరా చేయటం లేదంటూ సోమవారం నాడు రాష్ట్ర రాజధాని క్వెట్టా నగరంలో వారు వీధులకు ఎక్కాల్సి వచ్చింది. వారిలో పన్నెండు మందిని పోలీసులు అరెస్టు చేశారని, అందరు పోలీసుల మాదిరే లాఠీలకు పని చెప్పారని వార్తలు. సమీపంలోని అసెంబ్లీ సభ్యులు వచ్చి జూనియర్‌ డాక్టర్లతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. పోలీసు చర్యకు నిరసనగా తాము ప్రభుత్వ ఆసుపత్రులలో విధులు బహిష్కరిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. డజన్ల మందిని అరెస్టు చేశాము తప్ప లాఠీ చార్చి చేయలేదని పోలీసులు సమర్ధించుకున్నారు. వీడియోలు అబద్దం చెప్పవు కదా ! ఇంతకూ వైద్యులు రోడ్డెందుకు ఎక్కారూ అంటే క్వెట్టా ఆసుపత్రిలో పదమూడు మంది వైద్యులకు కరోనా పాజిటివ్‌ అని నివేదికలు వచ్చాయి, కారణం వారికి తగిన రక్షణ(పిపిఇ) పరికరాలను సమకూర్చకపోవటమే.ఆ నివేదికలు రాకముందు తమకు రక్షణ పరికరాలను సమకూర్చాలని కోరుతూ ఆందోళనకు పిలుపు నిచ్చిన వైద్యులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సముదాయించటంతో మూడు రోజుల పాటు ఆందోళనను వాయిదా వేశారు. అయినా ఫలితం లేకపోవటంతో సోమవారం నాడు వీధులకు ఎక్కి లాఠీ దెబ్బలను రుచిచూశారు.
పాకిస్దాన్‌లో వైరస్‌ వ్యాపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. చైనా నుంచి నివారణ చర్యలు గ్రహించామని చెప్పటం తప్ప ఆచరణ లేదు. అక్కడ అనేక పట్టణాలను లాక్‌డౌన్‌ చేసిన విషయం తెలిసినా ప్రయాణ ఆంక్షలు కూడా విధించలేదు. అంతర్జాతీయ విమానాలను అనుమతించారు. ప్రయాణీకులను పరీక్షించలేదు, క్వారంటైన్‌ సౌకర్యాలను ఏర్పాటు చేయలేదు. తబ్లిగీ జమాత్‌ సభలకు ఇరాన్‌ సరిహద్దులో ఉన్న బెలూచీస్ధాన్‌ రాష్ట్ర పట్టణమైన టఫ్ట్‌న్‌ నుంచి ఇరాన్‌ వ్యాధి గ్రస్తులు వస్తున్నా నివారించలేకపోవటానికి ఇదే కారణం. అక్కడి క్వారంటైన్‌లో వైద్య సౌకర్యాలు లేవు, అక్కడి నుంచి వచ్చిన వారితోనే వ్యాధి వ్యాపించిందని సింధు అధికారులకు పూర్తిగా తెలుసు.తోటి ఇస్లామిక్‌ దేశాలైన టర్కీ, ఇరాన్‌ మసీదుల్లో సామూహిక ప్రార్ధనలను నిషేధించినా ఇమ్రాన్‌ ఖాన్‌కు పట్టలేదు. ఇటలీలో ఒక మత కార్యక్రమం, ఇతరంగా పెద్ద ఎత్తున జనం గుమికూడిన కార్యక్రమాల కారణంగానే అక్కడ వైరస్‌ ప్రబలిందని తెలిసినా పట్టించుకోలేదు. నిషేధం గురించి ఆలోచించకపోగా మసీదుల మూసివేత ఉండదని పంజాబ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడి ఉలేమాలకు హామీ ఇచ్చాడు. ఇప్పుడు పాకిస్ధాన్‌లోని నాలుగువేల కేసులలో సగం పంజాబ్‌లోనే ఉన్నాయి. షియా మత పెద్దలైతే తాము మత కూటములను కొనసాగిస్తామని, అక్కడ ప్రార్దనలు జరిపి వైరస్‌ను నివారిస్తామని, తమకు వైరస్‌ అంటదని మొండిగా వాదించినా పట్టించుకోలేదు. మార్చినెల 21న ఆల్‌ పాకిస్ధానీ సున్నీ మహాసభ లాహౌర్‌ సమావేశంలో సంస్ధ నేత మహమ్మద్‌ అష్రాఫ్‌ మాట్లాడుతూ దేవుడు తలచుకుంటే తప్ప ఎవరికీ వైరస్‌ సోకదని చెప్పాడు. అంతే కాదు తమ సంస్ద కారణంగా ఎవరికైనా వైరస్‌ సోకితే ప్రభుత్వం తనను ఉరి తీయవచ్చు అని చెప్పాడు.
అక్కడి మంత్రుల తీరు ఎంతటి ప్రహసన ప్రాయంగా ఉందంటే ఒక వైపు బహిరంగ సభలను నిషేధించామంటూనే అలాంటి ఒక సభలో పాక్‌ రక్షణ మంత్రి పెర్వెజ్‌ ఖట్టక్‌ మాట్లాడుతూ వైరస్‌ అదుపులోనే ఉందని చెప్పటం విశేషం. తలిదండ్రుల తప్పిదాల కారణంగా శిక్షగా దేవుడు వారికి వికలాంగులైన పిల్లలను ఇస్తున్నట్లుగానే దేవుడి శిక్షకు గురయ్యే వారికే వైరస్‌ సోకుతుందని పంజాబ్‌ రాష్ట్ర సమాచారశాఖ మంత్రి ఫయ్యాజుల్‌ హసన్‌ సెలవిచ్చాడు. ఖురాన్‌లో సామాజిక దూరం గురించి చెప్పలేదని, సామాజిక జీవితం అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడటం అని చెప్పిన మతపెద్దలు లేకపోలేదు.
మన దేశంలోని కొందరు పెద్దలు పాక్‌ నేతలకేమీ తీసిపోలేదు. ఆవు పేడ, మూత్రంతో కరోనా నివారణ అవుతుందని అసోం బిజెపి ఎంఎల్‌ఏ ఒకరు అసెంబ్లీలోనే చెప్పారు. న్యూఢిల్లీలో హిందూ మహాసభ పెద్దలు ఏర్పాటు చేసిన గోమూత్ర పార్టీకి రెండు వందల మంది హాజరై మూత్రం తాగుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ” నాసా పరిశోధనల ప్రకారం ఉష్ణ వాతావరణంలో కరోనా వైరస్‌ బతకదు. నూటముఫ్పై దీపాలను వెలిగిస్తే తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని ఐఐటి ప్రొఫెసర్‌ చెప్పారు. కాబట్టి కరోనా ఆదివారం రాత్రి 9.09కి కరోనా వైరస్‌ మరణిస్తుంది. ఇది మోడీ తిరుగులేని ఎత్తుగడ ” అనే పోస్టును బిజెపి ఐటి సెల్‌ పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమంలో వ్యాపింప చేసింది. కరోనా వైరస్‌ అయినా మరొకటి అయినా అయోధ్యలో రామనవమి ఉత్సవాలను ఆపటానికి వీల్లేదని రామ మందిరం ట్రస్టు సభ్యుడు మహంత పరమహంస చెప్పారు. ఆపితే కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. రాముడు విముక్తి పొందిన తరువాత వచ్చిన తొలి నవమి కనుక ఎంతో ప్రాముఖ్యత కలిగినదని, భక్తులకు ఎలాంటి హాని జరగకుండా రాముడు చూసుకుంటాడని, స్వాములందరూ సురక్షితంగా కార్యక్రమం జరిగేందుకు యజ్ఞం చేస్తారని చెప్పారు.(తరువాత కార్యక్రమాన్ని రద్దు చేశారు అది వేరే విషయం) పాక్‌ మతవాదులు- మన దేశ మతవాదులు సేమ్‌ టు సేమ్‌ తేడా ఏమంటే మతాలే వేరు. మూర్ఖత్వం ఒకటే !
పాకిస్ధాన్‌లో వైద్యులు వీధుల్లోకి ఎక్కారు. సోమవారం నాడు అరెస్టయి పోలీసుల లాకప్పులకు చేరిన వారు తమకు రక్షణ పరికరాలను అందచేస్తే తప్ప లాకప్పుల నుంచి బయటకు పోయేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. అక్కడి పరిస్దితికి అదొక మచ్చుతునక కాగా మన దేశంలో పరిస్ధితి ఏమిటి ? వైద్యులు, సిబ్బందికి అవసరమైన రక్షణ పరికరాల తయారీ గురించి తాము చేసిన ప్రతిపాదన మీద ఐదు వారాల పాటు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పిపిఇ తయారీదార్ల అసోసియేషన్‌ విమర్శించింది. ఈ వ్యవహారం గురించి ‘ది క్వింట్‌’ వెబ్‌ పత్రిక ఒక కధనాన్ని ప్రచురించింది. దానిలో వివరాల సారాంశం ఇలా ఉంది. వైద్యులు రెయిన్‌ కోట్లు, హెల్మెట్లు, ఇతర ప్రత్యామ్నాయాలను ధరిస్తున్నారని గతవారంలో అనేక వార్తలు వచ్చాయి. ఈ సంక్షోభ సమయంలో మోడీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు మీద అనేక ప్రశ్నలు తలెత్తాయి. కేంద్రం నుంచి స్పందన సకాలంలో రాని కారణంగా మనం ఐదు వారాల విలువైన సమయాన్ని కోల్పోయామని పిపిఇ తయారీదార్ల సంఘం నేత సంజీవ్‌ చెప్పారు. పిబ్రవరిలోనే తాము కేంద్ర ఆరోగ్యశాఖను సంప్రదించి పిపిఇ కిట్లను నిల్వచేసుకోవటం గురించి నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. తమకు మార్చి 21వరకు వర్తమానం రాలేదని ఫిబ్రవరి 21నాటికి గనుక కిట్ల గురించి స్పష్ట ఇచ్చి ఉంటే అవసరమైన మేరకు తయారు చేసి ఉంచేవారం అన్నారు. ఇవి మిగతా కిట్ల వంటివి కాదని, ఇలాంటి మహమ్మారులు తలెత్తినపుడు ఎలా, ఎన్నికావాలో ప్రభుత్వాలు చెబితే తప్ప తాము తయారు చేసేందుకు వీలు ఉండదని తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఉంటే పిబ్రవరి 15న నాటికి వచ్చి ఉండేదని అన్నారు. మార్చి 24న తమకు మార్గదర్శక సూత్రాలు అందాయని, అయితే అంతకు ముందే డిమాండ్‌ పెరిగిపోయిందని చెప్పారు. మార్చి ఐదు-ఎనిమిది తేదీలలో రాష్ట్ర ప్రభుత్వాలు, సైనిక, రైల్వే ఆసుపత్రుల నుంచి టెండర్లు వెలువడ్డాయని వెల్లడించారు.
జనవరి 31న అన్ని రకాల వైద్య రక్షణ పరికరాల ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అయితే వారం రోజుల తరువాత ఫిబ్రవరి ఎనిమిదిన సర్జికల్‌ మాస్క్‌లు, ఎన్‌బిఆర్‌ గ్లోవ్‌లు తప్ప మిగిలిన అన్ని గ్లోవ్స్‌ ఎగుమతికి అనుమతి ఇస్తూ ఉత్తరువులు జారీ చేశారు. ఫిబ్రవరి 27న ప్రపంచ ఆరోగ్య సంస్ధ మార్గదర్శక సూత్రాలను విడుదల చేస్తూ ప్రపంచంలో పిపిఇ కిట్లకు కొరత ఉందని ముఖ్యంగా మాస్కులు, గౌన్లు, గాగుల్స్‌, రెస్పిరేటర్ల కొరత ఉందని పేర్కొన్నది. మార్చి 18న కేంద్ర జౌళి శాఖ సమీక్షలో అన్ని రకాల పరికరాలకు కొరత ఉన్నట్లు మినిట్స్‌లో నమోదు చేసినట్లు రాయిటర్స్‌ వార్త తెలిపింది. ఆ మరుసటి రోజు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల వైద్యపరికరాలు, వాటి తయారీకి అవసరమైన ముడి పదార్దాల ఎగుమతులపై నిషేధం విధించింది. వైద్య పరికరాలు అవసరాలను బట్టే తయారు చేస్తారు లేదా ఇలాంటి మహమ్మారులు తలెత్తినపుడు అంచనాలకు అనుగుణంగా తయారు చేయాల్సి ఉంటుంది. మార్చి 24వ తేదీన పరికరాల తయారీ మార్గదర్శక సూత్రాలను విడుదల చేశారు. అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు మరుసటి రోజు నుంచి లాక్‌డౌన్‌ ప్రకటిస్తూ ప్రధాని మోడీ ప్రకటించారు. దాంతో పిపిఇ కిట్ల తయారీదారులు కూడా ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వం కోరిన విధంగా కొత్తవి తయారు చేయలేరు, తయారీదార్ల వద్ద ఉన్నవి ప్రమాణాలకు అనుగుణంగా లేవని కొనుగోలు చేయలేదు.
లాక్‌ డౌన్‌ లేనట్లయితే రోజుకు 25వేల పిపిఇ కిట్ల తయారీ సామర్ధ్యం ఉంది. పది రోజుల తరువాత కొద్ది మంది పనివారు కంపెనీలకు హాజరవుతున్నారు, కార్మికుల సమస్య ఉంది. ఒక కిట్‌ తయారు కావాలంటే దానికి జిప్‌లు, ఎలాస్టిక్‌ వంటి అనేక విడిభాగాలు అవసరం, వాటిని సరఫరా చేసే వారికి సైతం ఇబ్బంది ఉంది. వారికి అనుమతులు చాలా కష్టంగా ఉంది. ఎవరూ ఎవరిదీ వినిపించుకోని స్ధితి.
పశ్చిమబెంగాల్లో తమకు రెయిన్‌కోట్లు ఇచ్చారని వైద్యులు తెలిపారు. పాట్నామెడికల్‌ కాలేజీ వైద్యులు కూడా అదే చెప్పారు. హర్యానాలోని ఒక ఇఎస్‌ఐ ఆసుపత్రిలో హెల్మెట్‌ వాడుతున్నట్లు రాయిటర్స్‌ తెలిపింది. వైద్యపరికరాల తయారీదార్ల అసోసియేషన్‌లో 20 సంస్ధలున్నాయి. నెలకు ఐదులక్షల చొప్పున ఏడాదికి 62.5లక్షల తయారీ సామర్ధ్యం ఉంది, ప్రస్తుత అవసరాలకు అవి చాలా తక్కువ అని మార్చి 31న ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర మార్గదర్శక సూత్రాల ప్రకారం ముందు నమూనా కిట్‌ తయారు చేయాలి, దాన్ని ఆరోగ్యశాఖ ఆమోదించి అనుమతించిన తరువాతే తయారీ ప్రారంభించాలి. అంటే అప్పటి వరకు తయారీదార్లు ఎలాంటి ముడి సరకు లేదా విడి భాగాలను కొనుగోలు చేసేందుకు లేదు. ఇప్పటికీ ప్రభుత్వానికి ఎన్ని అవసరమో స్పష్టత లేదు.
మార్చినెల మూడవ తేదీన మూడులక్షల పిపిఇ కిట్స్‌ అవసరమని అంచనా, అది 18వ తేదీకి 7.25లక్షలకు, 24వ తేదీకి 10లక్షలకు పెరిగింది. వీటిని తయారు చేసేవి చిన్న చిన్న సంస్దలు, సకాలంలో ఆర్డర్లు ఇవ్వాల్సి ఉంటుంది. పెరిగిన ఖర్చులకు అనుగుణ్యంగా ధరలు పెంచితే డిమాండ్‌కు తగిన విధంగా ఇప్పటికీ తయారు చేసి ఇవ్వగలమని వారు చెబుతున్నారు. అయినా ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటికీ స్పష్టత లేదు.

PM Narendra Modi writes to Imran Khan, underlines good relations ...
ఒక వైపు దేశం నుంచి వైద్య పరికరాల ఎగుమతిని మార్చి 19 నుంచి నిషేధించినా 31 మన దేశం నుంచి 90 టన్నుల వైద్య రక్షణ ఉత్పత్తులు సెర్బియాకు ఎలా పంపారు అన్నది ప్రశ్న. దీని గురించి తనకు తెలియదని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ చెప్పటం విశేషం. తొంభై టన్నుల రెండవ కార్గోవిమానం ఆదివారం నాడు భారత్‌ నుంచి బెల్‌గ్రేడ్‌(సెర్బియా)లో దిగినట్లు యుఎన్‌డిపి ట్వీట్‌ చేసింది. దీని గురించి అడిగిన వివరణకు ఆరోగ్యశాఖ నుంచి వివరణ కోరినట్లు క్వింట్‌ పత్రిక తెలిపింది.
ఆసుపత్రులు రాష్ట్రాల పరిధిలోకి వస్తాయని, ఏవైనా లోపాలుంటే రాష్ట్ర ప్రభుత్వాలదే తప్ప నరేంద్రమోడీ సర్కార్‌ మీద విమర్శలు చేయటం ఏమిటని బిజెపి మరుగుజ్జులు గంతులు వేస్తున్నారు. వారే మరో వైపు కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు ఏర్పడిన అంతర్జాతీయ కమిటీకి మోడీని సారధ్యం వహించాలని ప్రపంచ నేతలు కోరినట్లు ప్రచారం చేస్తారు. రాష్ట్రాలను సమన్వయం చేయాల్సిన బాధ్యత కేంద్రానిది అనే విషయాన్ని దాచి రాష్ట్రాలపై నెపం మోపేందుకు ప్రయత్నించటం దారుణం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఫేక్‌ న్యూస్‌ బాధితులు సీత-రాముడు- లక్ష్మణుడు !

04 Saturday Apr 2020

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, Health, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, Science, UK, USA

≈ Leave a comment

Tags

Conspiracy theory, Coronavirus fake news, fake news

Granlund cartoon: Fake news - News - Times Reporter - New ...

ఎం కోటేశ్వరరావు
తప్పుడు సమాచారం రెండో అంటు వ్యాధి అనే శీర్షికతో అమెరికా పత్రిక లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ కొద్ది వారాల క్రితం రాసింది. ఒకవైపు వైద్యులు, సిబ్బంది కరోనా వైరస్‌ మీద చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్నారు. మరోవైపు తప్పుడు సమాచార అంటు వ్యాధి ఎక్కడ చూసినా తాండవిస్తోంది. మహారాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి అతుల్‌ భత్‌ఖల్కకర్‌ ఏప్రిల్‌ ఒకటవ తేదీన (ఏప్రిల్‌ ఫూల్స్‌ డే అని గుర్తుండకపోయి వుండవచ్చు) ఒకట్వీట్‌ చేశారు.” కరోనా కోసం ఏర్పడిన ప్రత్యేక దళానికి(టాస్క్‌ఫోర్స్‌) నాయకుడిగా నరేంద్రమోడీ ఉండాలని అమెరికా, బ్రిటన్‌తో సహా పద్దెనిమిది దేశాలు కోరుతున్నాయి.భారత్‌కు ఎంత గర్వకారణమైన క్షణం ! మహానేతకు మనమందరం మద్దతు ఇవ్వాలి మరియు మనం కరోనా వ్యతిరేకపోరులో కచ్చితంగా విజయం సాధిస్తాం” అని దాన్లో పేర్కొన్నారు. మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బిరేన్‌ సింగ్‌(బిజెపి) సలహాదారు రజత్‌ సేథీ మరొక అడుగు ముందుకు వేసి ” కోవిడ్‌ 19 మహమ్మారిని ప్రపంచ వ్యాపితంగా నిరోధించేయత్నాలను సమన్వయం చేసేందుకు ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్‌ కేంద్ర స్ధానాన్ని తీసుకుంది. ప్రపంచ నేతలు ట్రంప్‌, బోరిస్‌ జాన్సన్‌, స్కాట్‌మోరిసన్‌ తదితరులు కరోనా వ్యాప్తి నిరోధ ప్రయత్నాలకు మన ప్రధాని మోడీ నాయకత్వం వహించాలని కోరుతున్నారు. ఇది నిజమైన రాజనీతిజ్ఞత ” అని పేర్కొన్నారు.
వైఆన్‌(వరల్డ్‌ ఈస్‌ ఒన్‌ న్యూస్‌) అనే వార్తా ఛానల్‌ మార్చినెల పదిహేనవ తేదీన ఒక వార్తను ప్రసారం చేసింది. ప్రధాని నరేంద్రమోడీ చొరవను ప్రపంచ నేతలు హర్షించారు. జి20ని అనుసంధానం చేయాలన్న ప్రధాని మోడీ పిలుపును ఆస్ట్రేలియా స్వాగతించింది” అని దానిలో పేర్కొన్నారు. న్యూఢిల్లీతో కలసి పని చేయాలని తాము కోరుకుంటున్నట్లు సార్క్‌ దేశాలు భారత చర్యను హర్షించాయి, సార్క్‌ దేశాల నేతలే కాదు ఇతరులు కూడా హర్షించారు అని కూడా ఆ టీవీలో తెలిపారు.అంతే తప్ప ఎక్కడా పద్దెనిమిది దేశాలు, బిజెపినేత, సిఎం సలహాదారు పేర్కొన్న పేర్లు, అంశాలేవీ ఆ వార్తలో లేవు అని ఆల్ట్‌ న్యూస్‌ పేర్కొన్నది. జి న్యూస్‌ ఛానల్‌ యాజమాన్యంలో నడిచే ఈ ఛానల్‌ జర్నలిస్టులు మోడీ ప్రతిష్టను పెంచేందుకు కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడిస్తే బిజెపి నేతలు ఇంకే ముంది నిర్ణయం జరిగిపోయింది భజన ప్రారంభించండి అన్నట్లుగా ప్రచారం మొదలు పెట్టారు. ఒక వేళ అలాంటి ప్రయత్నాలు చేయాల్సి వస్తే దానికి ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఉంది, ఐక్యరాజ్యసమితి ఉంది, ఒక దేశ నేతను ఎన్నుకోవటం అన్నది అతిశయోక్తి. అందునా కరోనాను పారదోలేందుకు దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలని చిట్కా చెప్పిన పెద్దమనిషిని నమ్ముకుంటే ప్రపంచజనాభా దిక్కులేని చావు చస్తుంది. తప్పుడు సమాచార అంటు వ్యాధి మీడియాలో పని చేస్తున్న వారికి సోకితే దాన్ని యావత్‌ సమాజానికి వ్యాపింప చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి తీరు తెన్నులను చూసి ఏ దశలో ఉందో తెలుసుకొనేందుకు మెడికల్‌ డాక్టర్లు కొన్ని లక్షణాలను ఖరారు చేశారు. తప్పుడు సమాచార అంటు వ్యాధి ఏ దశలో ఉందో జర్నలిజంలోని దిగ్గజాలు చెప్పాల్సి ఉంది.

Cartoonists in India battle fake news through their comic strips ...
ప్రిన్స్‌ చార్లెస్‌ కరోనా నుంచి కోలుకోవటానికి ఆయుర్వేద ఔషధాలు తోడ్పడ్డాయని, వేల సంవత్సరాల నుంచి పురాతన ఆచరణే దానికి కారణం అని కేంద్ర ఆయుష్‌ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ ప్రకటించారు. ఇది అవాస్తవం, బ్రిటన్‌లో ఉన్న జాతీయ వైద్య వ్యవస్ధ సూచించిన చికిత్సను తప్ప మరొకదాన్ని దేన్నీ వినియోగించలేదని చార్లెస్‌ కార్యాలయం ఒక ప్రకటనలో ఖండించింది. బెంగలూరులోని సౌఖ్య ఆయుర్వేద రిసార్ట్‌ యజమాని డాక్టర్‌ ఐజాక్‌ మత్తయ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. ప్రిన్స్‌ చార్లెస్‌కు సూచించిన ఆయుర్వేద, హౌమియోపతి చికిత్స ఫలించిందని చెప్పారు. వ్యవస్ధ పనితీరుకు ఇదొక ఉదాహరణ అని మంత్రి విలేకర్లకు చెప్పారు. కేంద్ర మంత్రులే తప్పుడు సమాచార అంటువ్యాధికి గురయ్యారు. ఒక డాక్టర్‌ నుంచి అలాంటి ఫోన్‌ నిజంగానే వచ్చిందనుకుందాం, ప్రిన్స్‌ చార్లెస్‌ కార్యాలయాన్ని సంప్రదించి దాన్ని నిర్ధారించుకోవాలి.అలాగాక వాట్సాప్‌ యూనివర్సిటీ పండితుల మాదిరి తప్పుడు సమచారాన్ని వ్యాపింప చేయటం ఏమిటి ?
మార్చినెలాఖరు వరకు ఒక అంచనా ప్రకారం కరోనా వైరస్‌ గురించి మూడువందల కోట్ల పోస్టులు, పదివేల కోట్ల సంభాషణలు నమోదైనట్లు అంచనా. ఒక అంశం మీద మానవాళి చరిత్రలో ఇంతగా భిన్న భాషలలో, అనేక వేదికల మీద దేన్నీ చర్చించి ఉండకపోవచ్చని, ఎలక్ట్రానిక్‌ సాధనాలపై ఇంతగా సమయాన్ని వెచ్చిస్తున్నందున నోమో ఫోబియా(ఫోన్‌ ఫోబియా-ఫోన్‌కు అతుక్కుపోవటం) ప్రమాదం కూడా పెరిగిందని సామాజిక మాధ్యమ నిపుణుడు డెనిజ్‌ ఉనరు చెప్పారు. పరిశుభ్రత సంబంధిత అంశాలను సామాజిక మాధ్యమంలో ఎక్కువగా అందుకున్న వారు ఇండ్లలో వాటికి అనవసర ప్రాధాన్యత ఇచ్చి అతిశుభ్రత వ్యాధికి, రసాయనాలతో కూడిన ఉత్పత్తుల ప్రభావాలకు గురయ్యే అవకాశాలున్నాయని కూడా డేనిజ్‌ హెచ్చరించారు. ముఖాలకు, చేతులకు తొడుగులు ఎక్కువగా వినియోగించటం, సామాజిక దూరాన్ని ఎక్కువగా పాటించటం వలన ఎదుటివారి మీద విశ్వాసాన్ని కోల్పోయేట్లు చేస్తుందని, భయంకర దృశ్యాలుండే సినిమా చూస్తున్న మాదిరి ప్రవర్తించవచ్చని, కరోనా వ్యాప్తి గురించి మితిమించిన ఆత్రత, కుంగుబాటు ఆలోచనలు కూడా జనాలకు ముప్పుగా పరిగణించవచ్చని డెనిజ్‌ హెచ్చరించాడు. వీటి బారిన పడకుండా ఉండాలంటే విశ్వసనీయ సమచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యంగా అధికారిక సంస్ధలు, వ్యవస్ధలు ఇచ్చే వాటి మీద ఆధారపడాలని, లేనట్లయితే తప్పుడు సమాచారంతో ఆందోళనకు గురయ్యే అవకాశం ఉందని సలహా ఇచ్చాడు.

March | 2020 | HENRY KOTULA
సాధారణ సమయాల్లోనే ఏ దేశానికి ఆదేశం ప్రత్యర్దులపై ప్రచారదాడికి అనేక అస్త్రాలను ప్రయోగిస్తోంది. అందువలన అవన్నీ వాస్తవాలే అనుకుంటే పప్పులో కాలేసినట్లే, మనకు తెలియకుండానే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిలో ఒకరిగా మారిపోతాము. తప్పుడు సమచారాన్ని వ్యాపింప చేయటంలో అగ్రస్ధానంలో ఉండే అమెరికా తాను తీసుకున్న గోతిలో తానే పడిందని జరిగిన పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్ధ చైనా పక్షపాతంతో వ్యవహరిస్తోందని స్వయంగా డోనాల్డ్‌ ట్రంపే చెప్పాడు. అందువలన అది చేసిన ప్రతి హెచ్చరికనూ పెడచెవిన పెట్టి నేడు అమెరికన్ల ప్రాణాల మీదకు తెచ్చాడన్నది రుజువైంది. దేవుడు నైవేద్యం తినడు అని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు.అలాగే పెద్ద ఎత్తున తాను నిధులు అందచేసే అనేక అంతర్జాతీయ సంస్ధలను తనకు అనుకూలంగా మలచుకొని చెప్పినట్లు చేయించుకుంటున్న అమెరికన్లకు ప్రతిదీ అలాగే కనిపించటం సహజం. చైనా నుంచి సర్వం కావాలి కానీ చైనా చెప్పే సమాచారాన్ని అమెరికా నమ్మదు. కనుకనే కరోనా మహమ్మారి గురించి చేసిన హెచ్చరికలను పట్టించుకోలేదు. అమెరికా అడుగుజాడల్లో నడుస్తున్న ట్రంప్‌ జిగినీ దోస్తుగా ఉన్న నరేంద్రమోడీ కూడా అదే మాదిరి నిర్లక్ష్యం వహించారని తరువాత జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయి.
ఫిబ్రవరి 15న కోవిడ్‌19 గురించి ఉన్న అపోహలు, ప్రచారాల గురించి మ్యూనిచ్‌ భద్రతా సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అడగహనోమ్‌ మాట్లాడుతూ తమ సంస్ధ, ప్రపంచవ్యాపితంగా ప్రభుత్వాలు కేవలం కరోనా మహమ్మారితోనే కాదు తప్పుడు సమాచార మహమ్మారితో కూడా పోరాడాల్సి వస్తోందని చెప్పాడు.వైరస్‌ కంటే తప్పుడు వార్తలు వేగంగా వ్యాపించటం ప్రమాదకరమని అన్నాడు. మార్చి11న కరోనా ప్రపంచ మహమ్మారిగా మారినట్లు డబ్ల్యుహెచ్‌ఓ అధికారికంగా ప్రకటించింది. నరేంద్రమోడీ వెంటనే స్పందించి ఉంటే తగ్లిబీ జమాతే నిజాముద్దీన్‌ మర్కజ్‌ను మూసివేయించి ఉండేవారు, లాక్‌డౌన్‌ను వెంటనే ప్రకటించి ఉండేవారు. మంత్రాల పఠనం, యాగాలు, గోమూత్రం, ఆవు పేడ చిట్కాల ప్రచారం కొంతమేరకైనా ఆగిపోయి ఉండేది.
కుట్ర సిద్దాంతాలు కూడా నకిలీ వార్తల తయారీలో భాగమే. వాటిలో భాగమే జీవ ఆయుధాల తయారీ వార్తలు. ప్రతిదేశమూ అలాంటి కుట్రసిద్దాంతాలకు ప్రాణప్రతిష్ట చేయటం, అలాంటి సిద్ధాంత కర్తలను మేపటం వలన కరోనా విషయంలో కూడా అవి ముందుకు వచ్చి జనాన్ని, పాలకులను కూడా గందరగోళ పరిచాయంటే అతిశయోక్తి కాదు. వ్యాక్సిన్లు తయారు చేసే వ్యాపారులు అవసరం లేకపోయినా వాటిని బలవంతంగా ప్రయోగించేందుకు అనుకూల ప్రచారం చేయించారని చెబుతున్నవారు కొందరు. దాని వ్యతిరేక లాబీ వ్యాక్సిన్ల వ్యతిరేక ప్రచారాన్ని చేసింది. భారత్‌, జపాన్‌, మరికొన్ని దేశాల్లో క్షయ నిరోధక బిసిజి వ్యాక్సిన్లు వేస్తున్న కారణంగానే కరోనా మరణాలు గణనీయంగా తక్కువగా ఉన్నాయని కొందరు చెబుతున్నారు.దీనికి ఆధారం లేదని మరొక వాదన అయితే , వందేళ్ల నాటి టిబి వైరస్‌ కరోనాను ఎలా నిరోధిస్తుందన్నది మరొక వాదన. క్షయ కేసులు, మరణాలు ప్రపంచంలో నాలుగోవంతు మన దేశంలోనే ఎందుకు ఉన్నాయన్నది ఈ సందర్భంగా అడగకూడని ప్రశ్న. కరోనా వైరస్‌ గురించి తప్పుడు ప్రచారం చేసిన లేదా జనాన్ని తప్పుదారి పట్టించిన వారిలో ప్రధముడు డోనాల్డ్‌ ట్రంప్‌ అని చెప్పాలి.
ఏప్రిల్‌ ఐదవ తేదీన దీపాల వెలుగును సంకల్పబల ప్రదర్శనకు అన్నది మోడీ గారి అభిప్రాయంగా తీసుకోవటానికి ఎవరికీ అభ్యంతరం ఉండనవసరం లేదు. అది జనతా కర్ఫ్యూ రోజు చప్పట్లతో ముగిసింది. అన్ని పార్టీలు పాటించాయి. సంకల్పాన్ని ఎన్నిసార్లు ప్రదర్శించాలి. ఈ తేదీని ఎంచుకోవటం గురించి అనేక మందిలో సంకల్పం సంగతి తరువాత బిజెపి రాజకీయ అజెండా ఉందనే అనుమానాలు తలెత్తాయి. జనతా పార్టీ నుంచి విడిపోయి బిజెపిగా అవతరించాలని నిర్ణయించిన రోజు ఇది, మరుసటి రోజు నుంచి అంటే 1980ఏప్రిల్‌ ఆరవ తేదీ నుంచి బిజెపి ఉనికిలోకి వచ్చి నాలుగు దశాబ్దాలు నిండుతున్న సందర్భాన్ని పాటించేందుకు దాన్ని ఎంచుకున్నారని కొందరి విమర్శ. తెరముందు కనిపించే బిజెపికి తెరవెనుక బిజెపికి తేడా ఉంటుందన్న విమర్శను ఇది రుజువు చేస్తోంది కదా !
రెండవది ప్రతి ఇంటిలో తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాలు దీపాలు వెలిగించాలన్నారు. దీన్ని కూడా సరిపెట్టుకుందాం. వెంటనే దానికి ఒక శాస్త్రీయ సిద్దాంతాన్ని జోడించేందుకు తయారయ్యారు. ” ప్రతి ఇంటిలో 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగిస్తే ప్రతి దీపం యొక్క వెలుగు ఆకాశం లోకి విడుదల అవుతుంది, ఇలా విడుదల అయిన అన్ని దీపాల వెలుగులు ఫోటాన్‌ శక్తులు గా మారుతాయి. అప్పుడు 9 ( నవ) గ్రహాలు అన్నీ ఒకదానితో ఒకటి కలిసి ప్రయాగ అనే కక్ష్య లోకి వస్తాయి, అలా రావడం వల్ల నవ గ్రహాలు అత్యంత శక్తివంతంగా తయారవుతాయి. అవి ప్రయాగ కక్ష్య లో తిరగడం వల్ల ఒకేసారి కొన్ని కోట్ల దీపాల వెలుగుల వల్ల 33 కోట్ల దేవతలు రాహుకేతువుల నుండి విముక్తులై ఆ ఫోటాన్‌ శక్తిని క్వాంటం శక్తిగా, ఆ క్వాంటం శక్తి ఆటమిక్‌ ఎనర్జీ గా మారుస్తారు. ఆ ఆటమిక్‌ ఎనర్జీ యే కరోనాను చంపుతుంది.” దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమన్నట్లుగా బుర్రలేని వారందరూ దీన్ని వాట్సప్‌, ఫేస్‌బుక్‌లో ప్రచారం చేస్తున్నారు.
అంత సులభంగా అటామిక్‌ ఎనర్జీ తయారుచేసుకునే అవకాశం ఉన్నపుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అల్లుడు భాగస్వామిగా ఉన్న అణుకంపెనీలతో ఒప్పందాలు చేసుకోవటం,వేల కోట్లు కట్టబెట్టటం ఎందుకు ? వాటితో వచ్చే ప్రమాదాల గురించి రోజూ భయంతో చావటం ఎందుకు ? నిజంగా దీపాల వెలుగుతో కరోనా చచ్చేట్లయితే రోజూ జనాలు వెలిగిస్తున్న దీపాలతో తయారయ్యే శక్తితో ఈ పాటికి అంతరించి ఉండాలి కదా ! ఒక్క వైరస్‌ ఏమిటి జనాన్ని పీడిస్తున్న ఈగలు, దోమలు కూడా ఎప్పుడో అంతరించి ఉండాల్సింది కదా ? రోజూ ప్రపంచ వ్యాపితంగా వెలిగించే దీపాల వెలుగుతో పని చేయకుండా నవ గ్రహాలు రోజూ ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? ఎందుకీపోసుకోలు కబుర్లు ?
కరోనా వైరస్‌ మరోసారి కుట్రసిద్దాంత పండితులకు, ఫేక్‌ న్యూస్‌ ఉత్పాదకులకు మంచి అవకాశాలను కల్పించింది. ఫేక్‌ న్యూస్‌, కుట్ర సిద్దాంతాలకు బలి అయ్యేవారిలో మెదడును సరిగా ఉపయోగించని వారే ఎక్కువగా ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. ఈ బలహీనతను గమనించే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, పాలకులు అందరూ వాటిని ఆయుధాలుగా చేసుకొని జనం మీద దాడి చేస్తున్నారు. కరోనా వైరస్‌ వయసు మీరిన, జబ్బులున్నవారి మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫేక్‌ న్యూస్‌, కుట్ర సిద్దాంతానికి వయస్సుతో పని లేదు. ఎవరి మెదడు పని చేయకుండా ఉందా అన్నదే గీటురాయి. వైరస్‌ మాదిరి వీటికిి ఎల్లలు, కులాలు, మతాలు, భాషా, రంగు బేధాలు లేవు. మెదళ్లను ఖరాబు చేయటమే కాదు, ఉన్మాదాన్ని పెంచుతాయి, ప్రాణాలు తీస్తాయి.

Court finds case against Lord Ram, Laxman 'beyond logic', squashes ...
రామాయణ, మహాభారతాలు, అనేక పురాణాల్లో ఫేక్‌ న్యూస్‌, మాయలు కోకొల్లలు. మాయలేడిని చూపి సీతను ప్రలోభపెట్టారు.రాముడి మాదిరి హా సీతా హా లక్ష్మణా అంటూ పారడీ చేసి సీతను గీత దాటించిన ఉదంతం తెలిసిందే. సీత గీత దాటకపోతే రామాయణం అన్ని మలుపులు తిరిగేదా ? ఫేక్‌ న్యూస్‌, మాయ లేడి బాధితులు సీత, రాముడు, లక్ష్మణుడు అన్నది స్పష్టం. మహాభారతంలో అశ్వద్ధామ హత: కుంజర: ఉదంతం తెలిసిందే. ఇలాంటివే చెప్పుకుంటే ఎన్నో. పాలకులకు ఇవి నిత్యకృత్యం. వర్తమాన కాలంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఇవి ఇంకా పెరిగాయి. ఇందుగల వందు లేవను సందేహము వలదు ఎందెందు చూసిన అందందు గలవు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా వైరస్‌-నిజాముద్దీన్‌ మర్కజ్‌- తిలాపాపం తలా పిడికెడు !

02 Thursday Apr 2020

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ 1 Comment

Tags

Arvind Kejriwal, Coronavirus outbreak, Naredra Modi, Nizamuddin Markaz, Tablighi Jamaat, Yogi Adityanath

Find the liar: Read what Narendra Modi and Arvind Kejriwal have ...

ఎం కోటేశ్వరరావు
మీడియా ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఉన్మాదం తలకెక్కిన మాదిరి కొందరు యాంకర్ల అరుపులు కేకలలో వినిపిస్తున్న పదాలు నిజాముద్దీన్‌ మర్కజ్‌, తబ్లిగీ జమాత్‌ గురించి చెప్పనవసరం లేదు. వార్తలను వార్తలుగా ఇవ్వటంలో తప్పులేదు. యాంకర్లు మరొకరు ఎవరైనా సమస్యను సమస్యగా చర్చించటం, ఎలాంటి మొహమాటాల్లేకుండా మాట్లాడటం వేరు. ఆ పరిధులను మించటమే సమస్య. కరోనా బాధితుల సంఖ్య పదిలక్షలను ఏక్షణంలో అయినా దాటి పోనుంది. రాస్తున్న సమయానికి వున్న సంఖ్య పాఠకులు చదివే సమయానికి మారిపోతోంది. మన దేశంలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే అవి ఇతర దేశాలతో పోలిస్తే ఇంకా అదుపులోనే ఉన్నాయి గానీ, పరిస్ధితి ఇలాగే ఉంటుందా అన్నది పెద్ద ప్రశ్న.
అసలేం జరిగింది, నిజాముద్దీన్‌ కార్యక్రమం ఏమిటి ? 1857లో ప్రధమ భారత స్వాతంత్య్రం సంగ్రామం, దాన్నే సిపాయిల తిరుగుబాటు అని కూడా పిలుస్తాము. అది జరిగి దాన్ని అణచివేసిన పది సంవత్సరాల తరువాత బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా హిందూ-ముస్లింలు ఐక్యంగా పోరాడాలంటూ కొంత మంది ఇస్లాం పండితులు నిర్ణయించారు. దీనిలో రెండు భావాలకు ప్రాతినిధ్యం వహించే వారు ఉన్నారు. ఆంగ్లేయుల పాలన ముస్లిం సమాజాన్ని దిగజార్చేదిగా ఉంది, మత సాంప్రదాయాలు మట్టికొట్టుకుపోగూడదు కనుక ఆ పాలనను వ్యతిరేకించి వాటిని పునరుద్దరించాలనే వారు ఒక తెగ. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో హిందూ-ముస్లిం ఐక్యతకోసం పని చేయాలనే వారు రెండవ తెగ. ఈ రెండు భావజాలాల వారూ కలసి 1867లో దారుల్‌ ఉలుమ్‌ దేవ్‌బంద్‌లో బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పని చేయాలని నిర్ణయించారు. ఆ ఉద్యమంలో భాగమైన కొందరు రాజకీయాల్లో పాల్గొనకుండా లక్ష్యా లను సాధించలేమని భావించి జమాతే ఉలేమా హింద్‌ అనే పార్టీని 1919లో ఏర్పాటు చేసి దేశ విభజన ప్రతిపాదనను వ్యతిరేకించారు. కొందరు దాన్నుంచి బయటకు వచ్చి విభజనకు అనుకూలంగా మారిపోయారు. ఇస్లామ్‌ను పునరుద్దరించాలని భావించే వారు 1927లో తబిలిగీ జమాత్‌ను ఏర్పాటు చేశారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి, రష్యాలో విప్లవం జయప్రదమై తొలి సోషలిస్టు దేశం ఏర్పడిన తరువాత ప్రపంచంలో అనేక చోట్ల అవాంఛనీయ ధోరణులు ప్రబలిన కాలం. మితవాద, ఫాసిస్టు ధోరణులు, మత పునరుద్దరణ, శుద్ధి, ఇతర మతాలకు చెందిన వారిని తిరిగి హిందూ మతంలోకి చేర్చాలనే ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూమహాసభ వంటి మతశక్తులు తలెత్తటానికి అనువైన కాలం అది. ఆ పరంపరలోదే తబ్లిగీ జమాత్‌. ఇస్లామ్‌పు పరిరక్షించేందుకు ఆరు సూత్రాలను ముందుకు తెచ్చిన తబిలిగీ జమాత్‌ వాటిని ప్రచారం చేసేందుకు ప్రచారకులకు శిక్షణ, పాటించే వారికి బోధన నిమిత్తం అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసేది. ఆ సంస్ధ క్రమంగా అనేక దేశాలకు విస్తరించింది. సమావేశాలు ప్రాంతీయ, అంతర్జాతీయ స్వరూపాన్ని సంతరించుకున్నాయి. దానిలో భాగంగానే మార్చి 13-15 తేదీలలో నిజాముద్దీన్‌ సమావేశాలు జరిగాయి. వేలాది మంది వాటిలో పాల్గొన్నారు.
కరోనా వైరస్‌ అనేక రకాలుగా వ్యాపిస్తోంది. లక్షల మందికి వ్యాపించటానికి దారితీసిన వాటిలో ఏ కారణంతో ఎన్ని అని విశ్లేషించటం ఇప్పుడు సాధ్యం కాదు, దాని కంటే ముందు వ్యాప్తిని అరికట్టి విలువైన ప్రాణాలను ఎలా కాపాడటం అన్నదే ముఖ్యం. అయితే అందరూ అదే కర్తవ్య నిర్వహణలో ఉంటే పేచీ లేదు, కానీ ఇప్పుడు కూడా కొందరు అవాంఛనీయ చర్యలకు పాల్పడుతున్నారు. మత విద్వేషాన్ని నూరిపోస్తున్నారు. ఇది కరోనా కంటే ప్రమాదకరమైనది. దాన్ని అదుపు చేయటం సాధ్యమే అని ఎక్కడైతో పుట్టిందో ఆ చైనాలో నిరూపించారు. మిగతా వైరస్‌ల మాదిరే కొంత కాలం తరువాత కరోనా కూడా ప్రభావాన్ని కోల్పోతుంది, కానీ ఈ సందర్భంగా వ్యాపింప చేసే జాతి, మత విద్వేష కరోనా అనేక మందిలో శాశ్వతంగా తిష్టవేస్తుంది. అది చేసే నష్టం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మన దేశంలో ఇప్పటికే మెజారిటీ-మైనారిటీ మత విద్వేషం తాండవం చేస్తోంది. కరోనాతో అది విలయతాండవంగా మారాలని కొందరు కోరుకుంటున్నారు. ఇది మన దేశం, సమాజానికి ఏమాత్రం మంచిది కాదు.
అనేక దేశాలలో కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న పూర్వరంగంలో ప్రభుత్వాలు అనేక ఆంక్షలను విధించాయి. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో జనం గుమి కూడటాన్ని అనేక చోట్ల నిషేధించారు. ఈ నేపధ్యంలో నిజాముద్దీన్‌ సమావేశం ఎలా జరిగింది? ఎందుకు అనుమతించారు ? ఎవరు దీనికి బాధ్యులు ? కరోనా గురించి తెలిసిన తరువాత ఇలాంటి సమావేశాలను నిర్వాహకులు ఎలా ఏర్పాటు చేశారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నివారించలేకపోయాయి, అసలు ఆ దిశగా ప్రయత్నాలు జరిగాయా అన్నది చర్చ. మార్చినెల 22న జనతా కర్ఫ్యూ, వెంటనే మరుసటి రోజు నుంచి గృహబందీ పిలుపులతో నిజాముద్దీన్‌ మర్కజ్‌లో ఉండిపోయిన వందలాది మంది గురించి అక్కడ దాక్కున్నారని కొందరు ప్రచారం చేస్తే, బయటకు పోయే వీల్లేక, ప్రయాణ సాధనాలు లేక అక్కడే ఉండిపోయారని ఆ సంస్ధ చెబుతోంది. అంతే కాదు, తాము ప్రతిపాదించిన మేరకు వాహనాలకు అనుమతి ఇస్తే వారందరినీ స్వస్ధలాలకు తరలిస్తామని ఢిల్లీ పోలీసు యంత్రాంగానికి దరఖాస్తు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని, ఈ విషయాలన్నింటినీ అధికార యంత్రాంగం నివేదించని కారణంగానే ముఖ్య మంత్రి కేజరీవాల్‌ అవాంఛనీయ చర్యలకు ఆదేశించారని సంస్ధ ఒక ప్రకటనలో తెలిపింది. ఎట్టకేలకు నిజాముద్దీన్‌లో గుమికూడి జనబందీ కారణంగా చిక్కుకు పోయిన వారిని అక్కడి నుంచి తరలించారు. ఈ సమావేశాల్లో పొల్గొని స్వస్ధలాలకు వెళ్లిన చోటల్లా అనేక కరోనా కేసులు వారి నుంచి వెలుగు చూస్తున్నాయి. ఇదే సమయంలో ఆ సమావేశాలతో నిమిత్తం లేని వారిలో కూడా కేసులు బయటపడుతున్నాయి.
మతపరమైన కార్యక్రమాలలో పెద్ద ఎత్తున జనం గుమికూడటం, కొన్ని చోట్ల ప్రార్ధనా స్ధలాలకు ప్రతి రోజూ వేల సంఖ్యలో రావటం మన దేశంలో సర్వసాధారణం. దీనికి ఏ మతమూ,సంస్ధా మినహాయింపు కాదు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ అంటే అంతర్జాతీయ సంస్ధ తబ్లిగీ జమాత్‌ ప్రధాన కేంద్రం నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గన్నవారి ద్వారా కరోనా వైరస్‌ పెద్ద ఎత్తున వ్యాప్తి చెందినట్లు నిర్ధారణ కావటంతో ఆ సంస్ధ నిర్వాకాన్ని విమర్శించటం, చట్టం అనుమతిస్తే నిర్వాహకులపై కేసులు పెట్టటం కూడా నూటికి నూరుపాళ్లూ సమర్దనీయమే. 1992లో బాబరీ మసీదు కూల్చివేతలో పాల్గొన్నవారు, అందుకు ప్రేరేపించిన వారిమీద కేసులు పెట్టారు, వారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ ఉదంతం ఎందరి ప్రాణాలు తీసిందో తెలిసిందే. అలాగే కరోనా విషయాల్లో నిబంధనలను ఉల్లంఘిస్తే జమాత్‌ సంస్ద నిర్వాహకుల మీద కూడా కేసులు పెట్టవచ్చు. వారేమీ అతీతులు కాదు. అలాంటి కేసులు పెడితే జమాత్‌ను అనుసరించే,అభిమానించే వారు బాధపడటం లేదా నిరసన తెలపాల్సిన అవసరం లేదు. మిగతా మతాల వారు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించటం లేదా అని సమర్ధించుకోవాల్సిన అగత్యం అంతకంటే లేదు. ఎవరో తొడ కోసుకున్నారని మనం మెడ కోసుకుంటామా ?
బాబరీ మసీదు లేదా రామజన్మభూమి పేరుతో సాగించిన కార్యక్రమాలకు, అవాంఛనీయ, నేరపూరిత ఘటనలకు విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌ వంటి సంస్ధలు వాటి మాతృక సంఘపరివార్‌ తప్ప యావత్‌ హిందూ సమాజం లేదా హిందువులు కాదు. అలాగే జమాత్‌ సంస్ధ చేసిన పనికి యావత్‌ ముస్లిం సామాజిక తరగతిని ముద్దాయిగా నిలబెట్టే ప్రయత్నం తగని పని, గర్హనీయం. మన దేశంలో అనేక మతపరమైన కార్య క్రమాల సందర్భంగా తొక్కిసలాటలు,ప్రమాదాలు జరిగి పెద్ద ఎత్తున మరణాలు సంభవించటం, అంటు వ్యాధులు రావటం కొత్తదేమీ కాదు.కానీ వాటిని ఆయా మతాలకు లేదా మతాలను అనుసరించే యావత్‌ ప్రజానీకానికి ఆపాదించలేదు. ఇప్పుడు కూడా తప్పు ఎక్కడ జరిగిందో చూడాలి, తప్పు పట్టాలి. కరోనా సందర్భంగా సామాజిక దూరం పాటించినట్లే జనం మత విద్వేష భావనలకు కూడా దూరంగా ఉండాలి.

Markaz Nizamuddin Ke Maujooda Halaat Or Media Ki Haqiqat - YouTube
నిజాముద్దీన్‌ పరిణామాలను రెండుగా చూడాలి. జనతా కర్ఫ్యూ-గృహబందీ(లాక్‌డౌన్‌), జమాత్‌ సమావేశాలకు ముందు, గృహబందీ తరువాత ఏం జరిగిందో పరిశీలించాల్సి ఉంది. ‘ ది వైర్‌ ‘ వెబ్‌ పోర్టల్‌ వ్యవస్ధాపక సంపాదకుల్లో ఒకరైన సిద్దార్ద వరదరాజన్‌ చేసిన ట్వీట్లు రాజకీయ ఉద్దేశ్యాలతో కూడినవని ఆరోపిస్తూ ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు తాజాగా కేసు చేశారు. మార్చి 25 నుంచి ఏప్రిల్‌ రెండవ తేదీ వరకు అయోధ్యలో రామనవమి ఉత్సవాలు ముందు అనుకున్న విధంగానే యథావిధిగా జరపాలని ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ నిర్దేశించినట్లు, కరోనా వైరస్‌ నుంచి భక్తులను శ్రీరాముడు కాపాడతాడని చెప్పినట్లుగా ఆయన చేసిన ట్వీట్లు అభ్యంతరంగా ఉన్నాయన్నది ఆరోపణ. ఈ కేసు రాజకీయ కోణంలో బనాయించారని వరదరాజన్‌ వ్యాఖ్యానించారు.
కరోనా వైరస్‌ భయం ఉన్నప్పటికీ ఆయోధ్య శ్రీరామనవమి ఉత్సవాలను యథావిధిగా జరపనున్నట్లు డెక్కన్‌ హెరాల్డ్‌ పత్రిక మార్చి17న ఒక వార్తను ప్రచురించింది. (తరువాత రెండు రోజులకు ప్రభుత్వం రద్దు చేసింది) రెండు సంవత్సరాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హిందువుల ఆగ్రహాన్ని తప్పించుకొనేందుకు ఉత్సవాలను జరిపేందుకే ప్రభుత్వం పచ్చజెండా ఊపిందన్నది ఆ వార్త ప్రారంభంలోనే ఉంది. దానిలో ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్‌ పేరు పెట్టలేదు తప్ప అంతటి ప్రాధాన్యత కలిగిన కార్యక్రమం గురించి ముఖ్యమంత్రితో చెప్పకుండా అధికార యంత్రాంగం ముందుకు పోతుందని ఎవరైనా ఊహిచగలరా ? అంత పెద్ద సంఖ్యలో జనం గుమికూడే సమయంలో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందును ఉత్సవాన్ని రద్దు చేయాలని జిల్లా వైద్యాధికారి ప్రభుత్వాన్ని కోరారు. అంతపెద్ద సంఖ్యలో వచ్చే వారిని పరీక్షించే అవకాశం లేదని కూడా అధికారి ఘనశ్యామ్‌ సింగ్‌ చెప్పినట్లు ఆ వార్తలో ఉటంకించారు. అయితే రామాలయ ట్రస్టు అధిపతి మహంత్‌ పరమహంస మేళాను ఆపటం కుదరదని, కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపడతాయని రాముడు స్వేచ్చ పొందిన తొలి సంవత్సరంలో ఉత్సవాలు జరపటం ఎంతో ముఖ్యమని, భక్తులకు హాని జరగకుండా రాముడు చూసుకుంటాడని కూడా చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొన్నది. ఇదే విషయాన్ని సిద్దార్ద వరదరాజన్‌ కూడా చెప్పారు. అయితే ఆయన ట్వీట్లలో భక్తులకు హాని జరగకుండా రాముడు చూసుకుంటాడని యోగి అయోధ్య నాధ్‌ చెప్పినట్లుగా ఉందని ఆ మాటలు చెప్పింది మహంత పరమహంస అని వరదరాజన్‌ తన ట్వీట్‌ను సవరించుకున్నారు. మేళాను ఉపసంహరించకున్న తరువాత, గృహబందీ అమలు జరుగుతున్న సమయంలో మార్గదర్శక సూత్రాలను ఉల్లంఘించి మార్చి 25న ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాధ్‌ రామనవమి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనటాన్ని వరదరాజన్‌ తప్పు పట్టారు. దానిలో ఎంత మంది పాల్గొన్నారన్నది ఇక్కడ సమస్య కాదు. ఒక ముఖ్య మంత్రి ఒక కార్యక్రమంలో పొల్గొన్నారంటే కనీసం ఎంత మంది ఉంటారో అందరికీ తెలిసిందే.
నిజాముద్దీన్‌ మర్కజ్‌ సభలు జరుగుతున్న సమయంలో దేశంలోని దేవాలయం లేదా చర్చి. మసీదుల్లో ఎక్కడా భక్తులు గుమికూడటం గురించి ఎలాంటి ఆంక్షలు లేవు.అభ్యంతరాలు పెట్టిన వారు లేరు. అంతకు ముందే హౌలీ వేడుకలు జరిగాయి. కరోనా కారణంగా ఒంటి మిట్ట రామాలయంలో రామనవమి ఉత్సవాలను రద్దు చేసిన ప్రకటన వెలువడిన తరువాత కొందరు స్వాములు దానికి వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొడుతూ ఎలాంటి ప్రసంగాలు చేశారో సామాజిక మాధ్యమంలో వీడియోలను లక్షలాది మంది తిలకించారు. ఒక మత పెద్దల్లో ఓట్ల రాజకీయం లేదా ఉన్మాదం, మూఢనమ్మకాలు ఇలా ఉన్న తరుణంలో మరోమతం తక్కువ తింటుందని ఎవరైనా అనుకుంటారా ? రాముడు రక్షిస్తాడని ఒక మత పెద్ద చెబితే మా అల్లా మాత్రం తక్కువ తిన్నాడా, రక్షించకుండా వదలి వేస్తాడా అని మరో మతం వారు గుమికూడారని అనుకోవాల్సి వస్తోంది. భక్తి తారా స్ధాయికి ఎక్కిన తరువాత ఏ మతంవారికైనా ఇతరులు చెప్పేది, చుట్టుపక్కల జరిగేది ఏమీ పట్టదు. దానికి వెనుకబాటుతనం, మూర్ఖత్వం ఏ పేరైనా పెట్టవచ్చు.
ఇక తబ్లిగీ జమాత్‌ విషయానికి వస్తే ఇదొక వివాదాస్పద మత సంస్ధ. ఉగ్రవాదులతో సంబంధాలు ఉండటం లేదా ఉగ్రవాదులు దీని ముసుగులో పని చేస్తున్నారనే అభిప్రాయాలు, సమాచారం ఎప్పటి నుంచో ఉంది.గతంలో జరిగిన దీని కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో జనం గుమికూడిన ఉదంతాలు కేంద్రానికి, రాష్ట్రానికి తెలియనిదేమీ కాదు. దాని ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉందని, వివిధ దేశాల నుంచి ప్రతి ఏటా కార్యక్రమాలకు వస్తుంటారన్నది కూడా బహిరంగ రహస్యమే. వచ్చే వారు యాత్రీకుల వీసాలతో రావటం కూడా కొత్త విషయం కాదు. ఈ కార్యక్రమాల కోసమే అని వీసా తీసుకుంటే దానికే పరిమితమై వెనుదిరిగి పోవాల్సి వస్తుంది కనుక యాత్రీకుల పేరుతో తీసుకొని ముందు వెనుక ఇతర ప్రాంతాలను కూడా సందర్శించి వెళ్లటం సర్వసాధారణం. అందువలన ఈ సమావేశాలకు వచ్చిన వారు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించారని చెప్పటం బాధ్యత నుంచి తప్పుకొనే వ్యవహారమే. వచ్చిన వారిలో కరోనా వ్యాధిగ్రస్తులు మాత్రమే ఉన్నారు గనుక సరిపోయింది, అదే ఉగ్రవాదులు యాత్రీకుల పేరుతో వచ్చి అవాంఛనీయ ఘటనలకు పాల్పడి ఉంటే ఇలాంటి సమర్ధనకే పూనుకొనే వారా ? మరి తబ్లిగీ జమాత్‌కు బాధ్యత లేదా ?
మలేసియాలో ఇదే సంస్ధ ఫిబ్రవరి 27 నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు కౌలాలంపూర్‌ పట్టణంలో నిర్వహించిన కార్య క్రమాలకు విదేశీ, స్వదేశీ జనం పదహారు వేల మంది హాజరయ్యారు. అయితే ఆ వచ్చిన వారికి వైరస్‌ సోకినట్లు మార్చినెల మొదటి వారంలోనే వెల్లడైంది. దీంతో తగ్లిబీ జమాత్‌కు హాజరైన ఐదువేల మందికి వ్యాధి సోకినట్లుగా ఒక అంచనాకు వచ్చి వారిని వెతికి పరీక్షలు చేయటం పదకొండవ తేదీ నుంచి ప్రారంభమైంది. ఈ విషయాలన్నీ మలేసియా మీడియాలో వచ్చాయి. ఇవన్నీ మలేసియాలో మన రాయబార కార్యా లయం లేదా అక్కడి పరిణామాలను పర్యవేక్షించే విభాగానికి తెలియకుండా పోతాయని అనుకోలేము. తెలియలేదు అంటే అవి తమపని తాము చేయటం లేదని చెప్పాల్సి ఉంటుంది. లేదా తెలిస్తే వెంటనే కేంద్రాన్ని అప్రమత్తం చేసి ఢిల్లీ తబ్లిగీ కార్య క్రమాన్ని నిలిపివేయించటం లేదా దానికి హాజరయ్యే మలేసియా, ఇతర దేశాలకు చెందిన వారిని అయినా నిలిపివేయకపోవటానికి లేదా పరీక్షించకపోవటానికి బాధ్యత ఎవరిది ? అప్పటికే ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చిన వారిని అనుమానంతో పరీక్షలు చేయటం ప్రారంభమైంది, కొన్ని కేసులు బయటపడినపుడు ఈ కనీస చర్యను జమాత్‌ సభకు హాజరైన వారి విషయంలో ఎందుకు తీసుకోలేదు. మీడియా ఈ విషయాలన్నీ విస్మరించి మన దేశంలో వైరస్‌ను వ్యాపింప చేసేందుకు ముస్లింలు కుట్ర పన్నారనే సిద్దాంతాన్ని బలపరిచే విధంగా వ్యాఖ్యానాలు చేయటం, కార్య క్రమాలను నిర్వహించటం ఏమిటి ? సోషల్‌ మీడియాలో సరేసరి, ముస్లింలు, క్రైస్తవులు కరోనా వ్యాప్తికి కారకులు అనే ప్రచారాలతో రెచ్చిపోతున్నారు.
నిజాముద్దీన్‌ మర్కజ్‌లో బోధనా, శిక్షణాకార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. మూడు రోజుల నుంచి 40రోజలు, మూడు నెలలు, కొందరు ఏడాది పాటు మకాం వేస్తుంటారు. ఇవిగాక ఏడాది కొకసారి మూడు రోజుల పాటు వార్షిక సభలు జరుగుతుంటాయి. అలాంటిదే మార్చినెల 13-15 తేదీలలో జరిగింది. ఈ కార్యక్రమాల్లో పాల్గన్నవారు సమీప లేదా ఇతర రాష్ట్రాల్లోని మసీదులను సందర్శించి వారు కూడా బోధనలు చేసి పోతుంటారు. తెలంగాణాలోని కరీం నగర్‌ జిల్లాకు వచ్చిన ఇండోనేషియన్లు, గృహబందీ కారణంగా ఇతర రాష్ట్రాలోని కొన్ని మసీదుల్లో ఉండిపోయిన వారు అలాంటి వారే.
ఇక్కడ మరొక అంశాన్ని కూడా చూడాల్సి ఉంది. ఢిల్లీ ప్రభుత్వం రెండు వందలకు మించి జనం ఎక్కడా గుమికూడదని మార్చి 13న ఆదేశాలు జారీ చేసింది. దాన్ని నిజాముద్దీన్‌ మర్కజ్‌ ఎందుకు పట్టించుకోలేదు? అప్పటికే జనం రావటం ప్రారంభమైది అంటే మరుసటి రోజు నుంచి అయినా రద్దు చేయవచ్చు, కానీ ఆపని చేయలేదు. పోనీ తాను జారీ చేసిన ఉత్తరువును అమలు జరిపేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించలేదు ? మార్చి16న కేజరీవాల్‌ సర్కార్‌ మరొక ఆదేశం జారీ చేస్తూ 50 మందికి మించి గుమికూడటాన్ని నిషేధించింది. పోనీ దాన్ని అమలు జరిపినా మర్కజ్‌లో అన్ని వందల మంది ఉండేందుకు ఆస్కారం ఉండేది కాదు దాన్నెందుకు అమలు జరపలేదు? జమాత్‌ సమావేశాలకు వచ్చిన విదేశీయుల గురించి కేంద్ర హౌంశాఖ మార్చి21న తెలియచేసింది. అది కూడా కరీంనగర్‌లో ఇండోనేషియన్ల గురించి బయటపడిన తరువాత అని చెబుతున్నారు. అంటే అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది.
మీడియా విషయానికి వస్తే నిజాముద్దీన్‌ వ్యవహారంలో ఆ సంస్ధ మార్చి 31న జారీ చేసిన మీడియా ప్రకటనను ఎందరు పరిగణలోకి తీసుకున్నారు. దానిలోని అంశాలతో ఏకీభవించాలా లేదా అనేది వేరే విషయం వారి వాదనను కూడా పాఠకులు, వీక్షకుల ముందు ఉంచాలా లేదా ? చైనాలో తొలి కరోనా కేసులు బయటపడిన తరువాత మన దేశంలో దాదాపు నెలన్నర పాటు ఎలాంటి నిర్ధిష్ట చర్యలనూ తీసుకోలేదనే అంశాన్ని మీడియా పట్టించుకుందా ? దేశంలో ఒక నిర్లక్ష్యపూరిత వాతావరణం ఉన్నది వాస్తవం కాదా ? కరోనా కారణంగా స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి చర్య మీద ఆంధ్రప్రదేశ్‌ పాలకపార్టీ, ప్రభుత్వం చేసిన యాగీ దేనికి నిదర్శనం ? పారాసిటమాల్‌ వేసుకుంటే, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే చాలు అని ముఖ్య మంత్రులే చెప్పిన తరువాత జనం తీవ్రఅంశంగా ఎలా పరిగణిస్తారు ? గృహబందీని తప్పించుకొని అరాచకంగా జనం వీధుల్లోకి వస్తున్నారని మీడియాలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆకస్మికంగా ఎలాంటి ముందస్తు చర్యలు లేకుండా ప్రకటించిన ఈ చర్య ఒక్కసారిగా జనంలో క్రమశిక్షణ ఎలా తీసుకువస్తుంది? గోమూత్రం తాగితే కరోనా అంటదు,ఆవు పేడ పూసుకుంటే, ఇది తింటే సోకదు అని అనేక మంది ముందుకు తెచ్చిన ప్రచారాలను ఎండగట్టి శాస్త్రీయ అంశాలను జనం ముందుకు తెచ్చిన మీడియా సంస్దలెన్ని ! ప్రచారంలో ఉన్న కుట్ర సిద్దాంతాలకు తమదైన ముద్రవేసుకొని ప్రచారం చేయటం తప్ప వాటి మీద ఉన్న రెండో కోణాన్ని వివరించే వారికి అవకాశం కల్పించిన వారెందరు ?
కుట్ర సిద్ధాంతం గురించి ప్రచారం చేసే వారికి, వాటిని నమ్మేవారికి వివేచన, తర్కం ఉండనవసరం లేదా ? ఇదే మీడియా పెద్దలు గతంలో చైనా గురించి చేసిన ప్రచారాలేమిటి ? అక్కడి క్రైస్తవుల చర్చీలను ప్రభుత్వం కూల్చివేసిందని, ప్రార్ధనలను చేసుకోనివ్వటం లేదని, ముస్లింలు ఎక్కువగా ఉన్న గ్జిన్‌జియాంగ్‌ స్వయం పాలిత రాష్ట్రంలోని ముస్లింలందరినీ నిర్బంధ శిబిరాల్లో పెట్టారని చెడరాసి, ఆధారాల్లేని చిత్రాలను చూపిందే చూపారు కదా ! అది నిజమని ముస్లిం లేదా క్రైస్తవ జీహాదీలు నమ్మితే చైనాకు వ్యతిరేకంగా పని చేయాలి కదా ! ఇప్పుడు కరోనా వ్యాప్తి చెంది మరణాలు సంభవించి అతలాకుతలం అవుతున్న దేశాలన్నీ క్రైస్తవులు, ముస్లింలతో కూడిన అమెరికా, ఐరోపా, ఇరాన్‌, టర్కీలే కదా ? ఆ చైనాలో పుట్టిన వైరస్‌ను అంటించుకొని ప్రపంచానికంతటికీ వ్యాపింపచేస్తే వారికొచ్చేదేమిటి ? జీహాదీలు అదే కార్యక్రమంలో ఉంటే తోటి అరబ్బు ముస్లింలను ఇజ్రాయెల్‌ యూదు దురహంకారులు పెడుతున్న హింసలు, దాడులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో ముందుగా వ్యాపింప చేయాలి. లేదా తొత్తులుగా మారిన కొన్ని మినహా యావత్‌ ఇస్లామిక్‌ దేశాలు శ త్రువుగా భావిస్తున్న అమెరికాలో ఆ పని చేయాలి. పాకిస్ధాన్‌ తరఫున మన దేశంలో ఆపని చేస్తున్నారంటే నివారించటంలో వైఫల్యం ఎవరిది ?

Delhi Police video shows cops urged Nizamuddin markaz members to ...
కుట్ర సిద్ధాంతాలను తలకెత్తుకొని ప్రచారం చేసే వారికి విచక్షణ ఉండదు. లేదూ జీహాదీలు మన దేశాన్ని దెబ్బతీసేందుకు కరోనాను ఆయుధంగా చేసుకున్నారని కొద్దిసేపు కొందరి మానసిక తృప్తికోసం అంగీకరిద్దాం. నిత్యం లేస్తే జీహాదీల గురించి ప్రచారం చేస్తున్నది బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌. దాని నేతలే కేంద్రంలో మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. ఆ జీహాదీలన దెబ్బతీసేందుకే కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేశామని, ఆర్టికల్‌ 370 ఎత్తివేశామని చెబుతున్నారు. తబ్లిగీ జమాత్‌కు హాజరైన విదేశీయుల్లో చైనా వారు ఉన్నారని ఎవరూ చెప్పటం లేదు. మిగతా దేశాల వారు కరోనా ఎక్కడ ఎవరి నుంచి అంటించుకొని మన దేశంలో వ్యాపింప చేసేందుకు వచ్చినట్లు ? ఒక వేళ వస్తే కేంద్రం, మన గూఢచార సంస్ధలు, పర్యవేక్షణ ఏజన్సీలు ఏమి చేస్తున్నట్లు ? ప్రపంచంలోని ముస్లిం దేశాలన్నీ మనకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయని చెప్పదలచుకున్నారా ? ఒక వేళ అదే నిజమైతే మన కేంద్ర పాలకుల దౌత్యం ఘోరంగా విఫలమైనట్లే కదా ? పాకిస్ధాన్‌ను ఒంటరి చేయటంలో జయప్రదం అయ్యా మని చెప్పటం మన జనాన్ని మోసం చేయటమేనా ? దానికి మద్దతుగా ఇతర ఇస్లామిక్‌ దేశాలను ఆవైపు నెట్టారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నమో భజనలు, వాట్సప్‌ పుకార్లు, అమెరికా కుట్రలను ఆపలేకపోయిన కరోనా !

28 Saturday Mar 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Coronavirus, COVID- 19 pandemic

AAO Alert: Coronavirus Update for Ophthalmologists – Eyewire News

ఎం కోటేశ్వరరావు
కరోనా ! యావత్‌ ప్రపంచాన్ని భయపెడుతోంది అనుకుంటున్నారు అందరూ !! నిజమా !!! చూస్తే అలా లేదు మరి. కరోనాకు ముందు-కరోనా తరువాత అని వేరు చేసి చూస్తే కరోనా విలయతాండవం తప్ప మిగిలినవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఏదీ ఆగలేదు !
కాలరెగరేసిన చైనాలో కరోనా తోక ముడిచింది !! నిర్లక్ష్యం వహించిన ఇటలీలో విలయతాండవం చేస్తోంది !!! నాలుగు వందల వెంటిలేటర్లు పంపుతామని అన్నారు అవేమి చాలతాయి 30వేలైనా కావాలి అని న్యూయార్క్‌ రాష్ట్ర గవర్నర్‌ చేసిన వ్యాఖ్య మీద రాష్ట్రాలలో కరోనా పాజిటివ్‌ కేసుల గురించి ఎక్కువ చేసి చెబుతున్నారు అంటూ ట్రంప్‌ మహాశయుడు ఫాక్స్‌ న్యూస్‌తో నోరుపారవేసుకున్నాడంటే పౌరుల ప్రాణాల పట్ల నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం ఇంకా కొనసాగుతూనే ఉంది.
కరోనాను అదుపు చేసి ఊహాన్‌ నగరంలో సాధారణ జనజీవనానికి, మామూలు ప్రయాణాలకు చైనా తెరతీయగా తమకేమీ కాదులే, తమనేమీ చేయదులే అని నిర్లక్ష్యం చేసిన అనేక దేశాలలో తలుపులు మూస్తున్నారు. తలలోని మెదడు మోకాల్లోకి వచ్చిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడిలో అమెరికన్లను కాటు వేసేందుకు కోరలు చాస్తోంది, ఇది రాస్తున్న సమయానికి అగ్రస్ధానానికి చేరిన అమెరికాలో కరోనా కేసులు 104,205, మరణాలు 1,701గా ఉన్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనని జనం గంగవెర్రులెత్తుతున్నారు. దాంతో చివరకు …. తుడుచుకొనే టాయిలెట్‌ పేపర్లకోసం కూడా జనాలు ఎగబడుతున్నారు. దెబ్బలాటలకు సైతం దిగుతున్నట్లు వార్తలు. ఇంకేముంది ఒక చోట బకెట్‌ బీరు కొంటే ఒక టాయిలెట్‌ పేపర్‌ ఉండ(రోల్‌) ఉచితం అని ప్రకటించగానే బీరు మొత్తం అమ్ముడు పోయిందట.(వెనెజులా గురించి చెత్త రాసిన ”చూష్కోరా” రచయిత దీని గురించి ఏమంటారో తెలియదు). ఇదే సమయంలో అక్కడ ఎన్ని తుపాకులు కావాలంటే అన్ని పుష్కలంగా అమ్ముతూ లాభాలు పోగేసుకుంటున్నారు. దేశాలన్నీ జనబందీ లేదా గృహబందీలను పాటిస్తుంటే రేపో ఎప్పుడో మనం తిరిగి పనిలోకి పోవాల్సి ఉంటుందని చెబుతున్న ట్రంప్‌ ముది మది తప్పిన స్ధితిలో ఉన్నట్లే కదా !
కత్తులకు, తుపాకుల తూటాలకు, ఎంతో మహత్యం కలిగిందని ప్రచారం చేస్తున్న స్వదేశీ ఆవు మూత్రం, పేడకు, వేద మంత్రాలకు, పూజలు, పునస్కారాలకు, చర్చీలు, మసీదుల్లో ప్రార్ధనలకు లొంగేది కాదని జనానికి చెప్పటం కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. కరోనా వ్యాప్తితో సహా ఏ దుర్మార్గమూ ఆగటం లేదు. కరోనాను అందరం ఐక్యంగా ఎదుర్కొందాం అని చెప్పేది బూటకం. అనేక దేశాల మీద అమెరికా విధించిన దుర్మార్గపూరితమైన ఆంక్షల్లో ఏ ఒక్కదాన్నీ ఎత్తివేయలేదు. జనాన్ని మరింతగా బలిపెట్టేందుకు సిద్దపడుతున్నారు.
కరోనా వ్యాప్తి పూర్వరంగంలో తమ దేశ ఆరోగ్య వ్యవస్ధ పటిష్టతకు అత్యవసర రుణం ఐదు బిలియన్‌ డాలర్లు కావాలంటూ వెనెజులా చేసిన వినతిని ఐఎంఎఫ్‌ తిరస్కరించింది. ఎవరు అధికారంలో ఉన్నారో గుర్తించే విషయంలో సభ్యదేశాలకు స్పష్టత లేనందున దేశ అధ్యక్షుడు మదురో వినతిని పరిగణనలోకి తీసుకోవటం లేదని పేర్కొన్నది. అమెరికా ఆడిస్తున్న ఆటలో పావుగా మారకపోతే తన సభ్యదేశాలలో మదురోను వెనెజులా నేతగా గుర్తించిన రాజ్యాలను ఐఎంఎఫ్‌ ఎందుకు విస్మరించినట్లు ? ప్రపంచమంతా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతుంటే వెనెజులా మీద ఆంక్షలకు అమెరికా పూనుకోవటం కనీస మానవత్వ స్ఫూర్తికి వ్యతిరేకమని చైనా వ్యాఖ్యానించింది.
మరోవైపు అదే మదురో మాదక ద్రవ్యాల అక్రమరవాణాదారులతో చేతులు కలిపాడంటూ అమెరికాలో ఒక తప్పుడు కేసును తాజాగా బనాయించారు. ఇప్పటికే ఉన్న ఆంక్షలను మరింతగా అమలు జరిపి మదురో సర్కార్‌ను కూల్చివేసేందుకే ఈ యత్నం. అమెరికాకు అవసరమైన వైద్య సరఫరాల కోసం రష్యాను తప్ప ఇతర దేశాలను సంప్రదించాలంటూ అమెరికా విదేశాంగశాఖ రాయబారులను ఆదేశించింది.
ఒక వైపు తమను కరోనా కబళిస్తున్నా నిద్రపోతున్న ట్రంప్‌ సర్కార్‌ నిర్వాకాన్ని కప్పిపుచ్చేందుకు చైనా మీద ఆరోపణలను కొనసాగిస్తూనే ఉంది. అనేక దేశాలలో అది పెట్టిన చిచ్చు ఇంకా రాజుకుంటూనే ఉంది, ఎక్కడా దాడులు ఆగలేదు. ఇది దుష్ట రాజకీయం తప్ప జనాన్ని ఆదుకొనే వారు చేయాల్సిన పనేనా ? బాధితులైన అమెరికా జనం మీద ఎవరికీ కోపం ఉండాల్సినపనిలేదు గానీ ట్రంప్‌ బాధ్యతా రాహిత్యం, దుర్మార్గాలను ముక్త కంఠంతో ఖండించాల్సిందే. నైతికంగా అతగాడికి అధికారంలో ఉండే అర్హత ఏమాత్రం లేదు.
దేశాన్ని ఆర్ధికంగా దిగజార్చటం, నిరుద్యోగం పెరగటం అచ్చే దిన్‌కు బదులు జనాలకు చచ్చే దిన్‌ తెచ్చిన పూర్వరంగంలో ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమంలో నరేంద్రమోడీ భజన తగ్గింది. అయితే జనతా కర్ఫ్యూ, జనం ఇండ్లకే పరిమితం(లాక్‌డౌన్‌) కావటం నరేంద్రమోడీ మెదడులోంచి వచ్చిన తెలివితేటలు, మహత్తర ఆలోచనలంటూ తిరిగి భజన ప్రారంభమైంది. ఆయనకు ధన్యవాదాలు తెలిపేందుకు నమో జ్యోతి పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలట. చైనాలో రెండు నెలల పాటు జనబందీ అమలు జరిగిన తరువాత ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా అనివార్యమే అయినా ఆకస్మికంగా దేశవ్యాపిత కర్ఫ్యూను ప్రకటించి ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారో చూశాము. చైనాలో ఎలా అమలు జరిపారో కనీసంగా అధ్యయనం చేసినా ఇలా జరిగి ఉండేది కాదు. వలస కార్మికులు స్వస్ధలాలకు వెళ్లే ఏర్పాట్లు లేక కంటెయినర్లలో బిక్కు బిక్కు మంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్లినట్లు వచ్చిన వార్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు చూపు లేమికి, నిర్లక్ష్యానికి నిదర్శనం. విదేశాల్లో ఉన్నవారికోసం విమానాలు పంపిన వారికి స్వదేశంలో వలసపోయిన వారిని స్వస్ధలాలకు పంపే బాధ్యతను ఎందుకు తీసుకోరు ?
యావత్‌ సమాజం కష్టకాలంలో ఉన్నపుడు పాలకులు చేసిన సాయానికి వంకలు పెట్టటం ఏమిటి అని అనేక మందికి అనిపించవచ్చు. మన దేశంలో కష్టకాలానికి కరోనా తోడైంది. ఈ సమయంలోనే లీటరు డీజిల్‌, పెట్రోలుకు మూడేసి రూపాయల పన్ను పెంచారు. మరో ఎనిమిది లేదా పది రూపాయలను పెంచేందుకు పార్లమెంటులో ముందస్తు అనుమతి తీసుకున్నారు. ఇది కష్టకాలం అని జనం మీద కనికరం చూపాలని దయగల పాలకులకు అనిపించలేదు. అంతకు ముందు వేళ్ల మీద లెక్కించదగిన ధనికులకు 7.78లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేసిన చేతులతో 130కోట్ల మందికి లక్షా 75వేల కోట్ల రూపాయల పాకేజి ప్రకటించి తమ భుజాలను తామే చరుచుకుంటున్నారు. ఈ మొత్తంలో గత ఏడాదే ప్రకటించిన మూడు వాయిదాల ఆరువేల రూపాయల రైతు సాయంలో ఒకవిడత రెండువేల రూపాయలు కూడా ఇమిడి ఉన్నాయి. ఏటా 70వేల కోట్లు ఇందుకు అవసరమని గతంలో చెప్పినదాన్ని బట్టి మూడో వంతు ఇరవై వేలను మినహాయిస్తే కరోనా సాయం మరింత తగ్గినట్లే . అది వాస్తవం అయితే రెండు వేల రూపాయలను కరోనా సందర్భంగా రైతులకు చేస్తున్న సాయమని మభ్యపెడుతూనే ఉన్నారు.కంపెనీల యజమానులకు అందచేసే మొత్తాలను (పిఎఫ్‌ వాటా చెల్లింపు) కూడా జనం ఖాతాలో రాస్తున్నారు. బహుశా ఇది వేద గణితం అయి ఉండాలి. గతంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా బదులు ప్రత్యేక పాకేజి అని చెప్పారు. తీరా చూస్తే కేంద్ర పధకాలన్నింటినీ కలిపి చెప్పారు తప్ప అదనపు సాయం ఏమీ లేదు. ఇప్పుడు కరోనా సాయంలో కూడా కేంద్ర పధకాలు ఏమైనా కలిసి ఉన్నాయా అన్నది చూడాల్సి ఉంది.
డెమోక్రాట్ల వత్తిడితో అల్పాదాయవర్గాల వారికి ఈ ఏడాది చివరి వరకు నెలనెలా పెద్ద వారికి ఒక్కొక్కరికి పన్నెండువందల డాలర్లు, పిల్లలకు ఐదువందల డాలర్లు చెల్లించేందుకు ట్రంప్‌ సర్కార్‌ అంగీకరించాల్సి వచ్చింది.(డాలరుకు 75 రూపాయలు) ఆయన జిగినీ దోస్తు నరేంద్రమోడీ మాత్రం జనధన్‌ ఖాతాలున్న మహిళకు మూడు నెలల పాటు నెలకు ఐదు వందల రూపాయలు జమచేస్తామని చెప్పి తమలో తామే ఉబ్బితబ్బిబ్బు అవుతూ టాంటాం వేసుకుంటున్నారు. అమెరికా, ఇతర దాని తొత్తు దేశాల ఆంక్షలు, అష్టదిగ్బంధం కారణంగా ఇబ్బందులు పడుతున్న వెనెజులా ఆరునెలల పాటు జనానికి ఉపశమన చర్యలను ప్రకటించింది. మన ఆర్ధిక వ్యవస్ధను ఐదో స్ధానానికి చేర్చామని ఊరూవాడా ప్రచారం చేసిన పెద్దలు తీరా జనానికి సాయం విషయంలో ఎక్కడ ఉన్నారు. ప్రపంచ రాజకీయాల్లో నరేంద్రమోడీ తమ సహభాగస్వామి అని ట్రంప్‌నుంచి పొగడ్తలు అందుకున్నారు. అలాంటి ట్రంప్‌ 150లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్రకటిస్తే ఆ పెద్దమనిషి భాగస్వామి 1.75లక్షల కోట్లు మాత్రమే ప్రకటించారు. వ్యాధిని వారాల తరబడి నిర్లక్ష్యం చేసిన, సముద్రంలో కాకిరెట్ట మాదిరి సాయం ప్రకటించిన నాయకత్వానికి నీరాజనాలా ? సిగ్గు చేటు ! కేంద్రంలో నరేంద్రమోడీ లేదా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు తమ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. కేరళ ముందుగా మేలుకున్నట్లు అందరూ అంగీకరిస్తారు, కానీ అక్కడ అధికార సిపిఎం నేతలు మన తెలుగు రాష్ట్రాల్లో మాదిరి అక్కడి సిఎంను పొగడ్తలతో ముంచెత్తటం లేదు. పొగడ్తలు, భజనలతో అభిమానం సంపాదించుకొనేందుకు అలవాటు పడిన నేతలకు సమయం సందర్భం గురించి సృహ ఉండదని ఇప్పుడు రుజువు చేస్తున్నారు.
ఒక వైపు కరోనా మరణమృదంగాన్ని వాయిస్తుంటే ఇటలీలోని కార్పొరేట్‌ల యజమానులు చట్టాల్లోని లోపాలను వినియోగించుకొని లబ్ది పొందేందుకు ప్రయత్నించటం కంటే దుర్మార్గం మరొకటి లేదు. ఆరోగ్య సంబంధ సంస్ధలు మినహా మిగిలిన వాటన్నింటినీ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ అత్యవసర సేవల చట్టంలోని నిబంధనల లోపాలను వినియోగించుకొని ఆయుధ కంపెనీల యజమానులు ఫ్యాక్టరీలను మూసివేసేందుకు తిరస్కరిస్తున్నారు.దీనికి నిరసనగా కార్మికులు సమ్మెకు పిలుపు ఇవ్వాల్సి వచ్చింది.

Cartoons: Coronavirus outbreak classified as pandemic
గతంలో బ్రెజిల్‌ వామపక్ష ప్రభుత్వం క్యూబా వైద్యులను రప్పించి పెద్ద ఎత్తున వైద్య, ఆరోగ్యసేవలను అందించింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న మితవాద బోల్‌సోనోరో సర్కార్‌ క్యూబా మీద వ్యతిరేకతతో ఆదేశ వైద్యులను వెనక్కు పంపింది. మరి కొంత మందిని దేశంలో ఉండేందుకు          అనుమతించినప్పటికీ వారి సేవలను వినియోగించుకోవటం నిలిపివేసింది. . ఇప్పుడు కరోనా వ్యాప్తి కారణంగా అదే క్యూబా వైద్యులు తమకు సేవలు అందించాలని, క్యూబా వెళ్లిన వారు తిరిగి రావాలని బోల్‌సోనోరో సర్కార్‌ వేడుకున్నది.ఐదువేల మంది క్యూబన్‌ వైద్యులను ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో వినియోగించనున్నట్లు ఆరోగ్య మంత్రి జావో గబ్బార్డో ప్రకటించాడు.ఎన్నికల ప్రచారంలో క్యూబా వైద్యులను వ్యతిరేకించటం ఒక ప్రచార అంశంగా బోలోసోనారో ముందుకు తెచ్చారు. క్యూబా నుంచి వచ్చిన పదివేల మంది వైద్యులు బ్రెజిల్‌లో గెరిల్లా దళాలను ఏర్పాటు చేసేందుకు వచ్చారని, వారు నిజంగా వైద్యులు కాదని తాను అధికారంలోకి రాగానే వారిని వెనక్కు పంపినట్లు ప్రకటించాడు. క్యూబన్‌ వైద్యుల మీద తప్పుడు ప్రచారం చేసినందుకు బోలోసోనారో క్షమాపణ చెప్పాలని లూలా నాయకత్వంలోని వర్కర్స్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.
వాట్సప్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో కాషాయ దళాల ప్రచారం ముమ్మరంగా సాగుతూనే ఉంది. ఇటలీకి వచ్చిన క్యూబా వైద్యుల బృందం ఫొటోను మార్ఫింగ్‌ చేసి ఆర్‌ఎస్‌ఎస్‌ సేవా దళం అని చిత్రించింది వాటిలో ఒకటి. మూఢనమ్మకాలను పుంఖాను పుంఖాలుగా ముందుకు తెస్తున్నారు. కాషాయ దళాలతో పాటు ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టు వ్యతిరేకుల ప్రచారానికి కరోనా కలసి వచ్చింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జగన్‌ మోహనరెడ్డి ఎరక్కపోయి మరింతగా ఊబిలో ఇరుక్కుంటున్నారా ?

22 Sunday Mar 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

AP local body election 2020, AP SEC letter to MHA, CM YS Jagan

Image result for is ys jagan mohan reddy foolishly entered in a mire

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి యావత్‌ సమాజం ఆందోళన పడుతోంది. దానితో నిమిత్తం లేకుండా రాజకీయాలు చేయటంలో కొన్ని రాజకీయ పార్టీలు, నేతలు మునిగిపోయారు. మధ్యప్రదేశ్‌లో కమలం వైరస్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కబళించింది. అధికార దాహం వైరస్‌ సోకిన 22 మంది కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలు అసెంబ్లీ సభ్యత్వం కోల్పోయిన తరువాత కమల తీర్ధం పుచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో స్దానిక సంస్దల ఎన్నికల వైరస్‌ సోకిన వారి వింత లేదా విపరీత ప్రవర్తన చూశాము. అదింకా కొనసాగుతూనే ఉంది. తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలినా ఎదురుదాడులు చేయటం కొనసాగుతూనే ఉంది. మంత్రులు వివాదాస్పదవ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.
గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిణామాలను చూస్తే అసలైన అధికారం ఎవరిదో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నపుడు ఎన్నికల కమిషనరే సుప్రీం అని చెప్పింది. అంటే మిగతా సమయాల్లోనే ముఖ్యమంత్రి సర్వాధికారి అన్నది దాని అర్ధం. సర్వాధికారి ఎవరు అన్న ప్రశ్నను స్వయంగా లేవనెత్తిన జగన్‌మోహన్‌రెడ్డికి ఆ విషయం అర్ధమైందని అనుకోవాలి. ఈ విషయంలో తనను తానే కించపరచుకున్నారు. ముఖ్యమంత్రి అనుగ్రహం పొందాలనుకొనే పెద్దలు ఇంకా ఆ ప్రయత్నాలను మానుకోలేదు. ప్రయోజనం సంగతి పక్కన పెడితే ఈ ఉదంతం తరువాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆరోగ్య వైద్యశాఖ మంత్రి ఎవరో కనీసం రాష్ట్ర ప్రజలకు, బయటి వారికీ తెలిసింది.
తాజాగా శనివారం నాడు రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ మీడియాతో మాట్లాడిన విషయాలను చూస్తే సుప్రీం కోర్టు తీర్పు స్పూర్తిని గ్రహించినట్లు లేదు.రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై ధ్వజమెత్తారు. స్వతంత్ర భారత చరిత్రలో ఒక ముఖ్య మంత్రి తన అధికారాలేమిటో, ఎన్నికల కమిషనర్‌ అధికారం ఏమిటో తెలియదని స్వయంగా వెల్లడించుకున్నారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రీ ఇలా వ్యవహరించలేదు. అంతటితో ఆగకుండా సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు. బహుశా ఏ ముఖ్య మంత్రికీ లేనంత మంది సలహాదారులు ఉన్నప్పటికీ ఇది జరిగిందంటే సలహాదారుల సరకేమిటో బయటపడిందా లేదా ఎవరి మాటా వినరు అనే గత విమర్శలను జగన్మోహనరెడ్డి నిర్ధారించారా ? ఇది ఒక విపరీతమైతే తనకు, తన కుటుంబానికీ భద్రత లేదంటూ ఒక రాష్ట్ర ఎన్నికల అధికారి కేంద్రానికి ఫిర్యాదు చేయటం, తాను పొరుగు రాష్ట్రం నుంచి పని చేసేందుకు అవసరమైన రక్షణ కల్పించాలని కోరటం కూడా ఒక విపరీత పరిణామం, దేశ చరిత్రలో తొలిసారి.
బుగ్గన రాజేంద్రనాధ్‌ గారు ఎన్నికల కమిషనర్‌ను అనేక ప్రశ్నలు అడిగారు. కమిషనర్‌కు అధికారాలతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయని విస్మరించకూడదు అన్నారు, సమంజసమే. కోవిడ్‌ నియంత్రణ చర్యలు, గురించి సిఎస్‌ను ఎందుకు సంప్రదించలేదు అని బల్ల చరిచి మరీ ప్రశ్నించారు. తీసుకున్న చర్యలు గురించి సిఎస్‌ లేదా ఆరోగ్యశాఖ అధికారులు ఒక కాపీ రూపంలో అయినా అధికారికంగా ఎన్నికల కమిషనర్‌కు పంపారా లేదా ఒక వేళ పంపితే ఇక సంప్రదించాల్సిన అవసరం ఏముందో మంత్రిగారు చెప్పాలి. అసలు సమీక్షలే చేయలేదన్న విమర్శలు, ఆరోపణలను తగిన ఆధారాలతో ఆయన ఖండించి ఉండాల్సింది.

Image result for is ys jagan mohan reddy foolishly entered in a mire
కోవిడ్‌ను నివారించే సందర్భంలో ఎన్నికల నియమావళి (కోడ్‌) వల్ల ప్రభుత్వ పరిపాలన, నిర్ణయాలకు ఇబ్బంది ఏర్పడదా? అని అమాయకంగా ప్రశ్నించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి జగన్‌ ప్రభుత్వానికి మాత్రమే వర్తించేదిగా ప్రత్యేకంగా ఏమైనా రూపొందించారా ? కాదని మంత్రికి తెలియదా? ఒక వేళ ఇబ్బంది అనుకుంటే కమిషనర్‌ను సంప్రదించే అవకాశాన్ని ఎందుకు వినియోగించకోలేదో చెప్పాలి. ఎన్నికల వాయిదా నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళుతుందని తెలిసి రమేష్‌కుమార్‌ కేవియట్‌ను ఎందుకు వేయించారు? ఇదేమైనా వ్యక్తిగత తగాదానా? అని ప్రశ్నించిన మంత్రిగారికి రమేష్‌ కుమార్‌ వ్యక్తిగా కాదు, ఎన్నికల కమిషనర్‌గా వెళ్లారని తెలియదా ? జగన్‌మోహనరెడ్డి గారు అధికారాల గురించి ఒక వ్యక్తిగా ప్రశ్నించారా లేక ముఖ్య మంత్రిగా ప్రశ్నించారా, అదే విధంగా ఏ హౌదాతో సుప్రీం కోర్టు తలుపు తట్టారు అన్నది మంత్రిగారు చెప్పాలి మరి !
‘జ్వరం వస్తే పారాసెటిమాల్‌ కాక ఇంకేం వాడతారు? ఎవరైనా డాక్టర్లను అడగండి ఏం చెబుతారో! మీడియా పవర్‌ ఉందని చెప్పి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దుష్ప్రచారం చేస్తారా?’ అని ఎల్లో మీడియాపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు అని ఒక పత్రిక రాసింది.
కోవిడ్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను సీఎం అరగంటకు పైగా వివరిస్తే అదంతా వదిలి ఎల్లో మీడియా సీఎం పారాసెటిమాల్‌పై మాట్లాడిన మాటలను ప్రసారం చేసిందని మంత్రి ఆరోపించారు. కోవిద్‌ నియంత్రణ లేదా నివారణ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్ద లేదా తీవ్రంగా ప్రభావితమైన చైనా చర్యలను ప్రమాణంగా తీసుకోవాలి, ముఖ్యమంత్రి వాటినే చెప్పాలి లేదా వాటిని చెప్పి అవి పనికిమాలిన విషయాలని కొట్టివేసి పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ గురించి చెప్పి ఉండాల్సింది. వాటితో వైరస్‌ నివారణ అంత సులభమైతే మంత్రిగారే చెప్పినట్లు అరగంటకు పైగా వివరించాల్సిన పనేముంది?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కేంద్ర హౌంశాఖకు రాసినట్టు చెబుతున్న లేఖను ఎవరు స ష్టించినా, పంపినా క్రిమినల్‌ కేసులు ఎదుర్కోక తప్పదని వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కేంద్ర హౌంశాఖ కార్యదర్శికి రాసినట్లుగా ప్రచారం జరుగుతున్న లేఖ వెనుక పెద్ద కుట్ర ఉందని, దీనిపై క్షుణ్ణంగా విచారించాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. దానిలో అనేక అంశాలను ఆరోపించారు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి. ఆ లేఖ రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి కాకుండా టీడీపీ కార్యాలయం నుంచి ప్రత్యేకంగా చంద్రబాబుకు సన్నిహితులైన ఐదుగురు పాత్రికేయుల ద్వారా మిగతా మీడియాకు చేరినట్లు మాకు విశ్వసనీయ సమాచారం అందింది.
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ప్రభుత్వ వ్యతిరేక మీడియాకు, ప్రతిపక్షాల ఊహాగానాలకు ఎందుకు అవకాశం ఇచ్చారు? బయటకు వచ్చిన లేఖపై ఔననో కాదనో వివరణ ఇవ్వకుండా ఎందుకు మౌనంగా ఉండిపోయారు? అనే అనుమానాలను నిగ్గు తేల్చాలి. సుప్రీంకోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తరఫున ఎందుకు కేవియట్‌ వేశారు? టీడీపీ, ఆ పార్టీ అనుకూల పత్రికలు, చానళ్లు నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను ఎందుకు నెత్తికి ఎత్తుకుంటున్నాయి?
ఈ ప్రశ్నలు వేసినవారు తరువాత ఏమైందో జనానికి చెప్పాలి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. లేఖను రమేష్‌ కుమార్‌గారే రాశారన్నది తేలిపోయింది, విజయసాయి రెడ్డిగారన్నట్లు ఆయన మీద క్రిమినల్‌ కేసు పెడతారా ?
అధికారపార్టీ నేతలు పోలీసుల దర్యాప్తును కోరబోయే ముందు తమ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తున్నదో ఎందుకు తెలుసుకోలేదు ? లేఖ గురించి అధికారికంగానే కేంద్ర హౌంశాఖను సంప్రదించి నిర్ధారణ చేసుకొనేందుకు ఎందుకు ప్రయత్నించలేదు ? ఆ పని చేయకుండా ఎందుకు కాలక్షేపం చేశారు? పోనీ తరువాత ఆ లేఖ ఎన్నికల కమిషన్‌ కార్యాలయం నుంచే వచ్చిందని కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటించారు. దాని మీద వైసిపి, రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించటమెందుకు ? ఆ లేఖలోని అంశాలేమిటో బహిర్గతం అయినందున రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఖండిస్తూ లేదా వివరణ ఇస్తూ రాసిన లేదా రాయనున్న లేఖను కూడా బహిర్గతం చేస్తే జనాలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎన్నికల కమిషనర్‌ కొందరు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. దానిని రాష్ట్ర ప్రభుత్వం అమలు జరుపుతుందా లేదా అన్నది కూడా నోరువిప్పి చెప్పాలి. ఎన్నికల కమిషనర్‌ ఎందుకు నోరు విప్పలేదు అని ప్రశ్నిస్తున్నారు. వైసిపి నేతల అక్రమాలు, దౌర్జన్యాలపై కూడా స్పందించటం లేదని విమర్శలు తలెత్తినపుడు కూడా స్పందించలేదు. అప్పుడు వైసిపి నేతలు చిద్విలాసాన్ని ప్రదర్శించారు. ఎన్నికల కమిషనర్‌ను నియమించింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కదా అని కూడా గుర్తు చేసిన వారు లేకపోలేదు.
ఇక ఎన్నికల కమిషనర్‌ లేఖ గురించి బిజెపి నేత జివిఎల్‌ నరసింహారావు చేసిన వాదనలు చిత్రంగా ఉన్నాయి. కేంద్ర హౌంశాఖకు రోజూ అనేక లేఖలు వస్తుంటాయి. వాటి గురించి ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే ఆ శాఖ స్పందిస్తుంది అన్నారు. అది కొంత మేరకు వాస్తవమే కావచ్చు. ఇక్కడ ఒక రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ మీద ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి తీవ్ర విమర్శలు చేసిన పూర్వరంగంలో ఎన్నికల కమిషనర్‌ పేరుతో ఒక లేఖ మీడియా, సామాజిక మాధ్యమంలో సంచలనం సృష్టించింది. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం గవర్నర్‌ను కలిసి విచారణ జరపాలని కోరింది. ఇంత జరుగుతున్నా రాజకీయంగాక పోతే కేంద్ర హౌంశాఖ మౌనంగా ఉండటంలో అర్ధం ఏమిటి ? సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు వెంటనే అసాధారణ రీతిలో స్పందించిన వారు అదే విషయాన్ని బహిరంగంగా చెప్పలేరా ? అందినట్లు కిషన్‌ రెడ్డి వెల్లడించిన తరువాత లేఖలోని అంశాల గురించి రాష్ట్రాన్ని వివరణ అడుగుతుందా, తదుపరి చర్యలు ఏమిటి ? ఇవన్నీ ప్రస్తుతానికి ఎదురు చూస్తున్న ప్రశ్నలు.
ఎన్నికల కమిషనర్‌ లేఖ ఎలా బయటకు వచ్చింది అన్న ప్రశ్నకు పెద్దగా బుర్రబద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు. గతంలో అనేక అంశాలు బయటకు వచ్చినట్లుగానే ఇదీ వచ్చింది. వైసిపి పెద్దలు పేర్కొనే ఎల్లో మీడియాలో అంతా చూసినట్లుగా, ఆధారాలతో రాసినట్లుగానే జగన్‌గారి సాక్షి పత్రిక, ఛానల్‌లోనూ అలాంటి వార్తలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. అందువలన ఈ ఉదంతంలో జర్నలిస్టుల మీద చర్యలు తీసుకోవాలని కోరటం గర్హనీయం. ఎవరి మీడియాలో పని చేసినా వారు నిమిత్త మాత్రులు. ముఖ్య మంత్రి జగన్మోహన్‌ రెడ్డి నిర్వహించిన తొలి, వివాదాస్పద పత్రికా సమావేశంలో కొందరు జర్నలిస్టుల పట్ల అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరు అభ్యంతరకరం. ఎంత మంది వస్తారో అంచనా వేయలేని, తగిన ఏర్పాట్లు చేయలేని దుస్ధితిలో ఉన్నట్లు వెల్లడి అయింది. ఒక వేళ తగినంత స్ధలం లేకపోతే ముందు వచ్చిన వారిని కూర్చోనిచ్చి మిగతావారికి ఖాళీ లేకపోతే ఏమి చేయాలో వారికే వదలి వేయాలి తప్ప కొందరికి ప్రవేశం లేదని ప్రకటించటం తగనిపని, గర్హనీయం. కొందరు రావటం ఇష్టం లేకపోతే ఆహ్వానించిన వారు మాత్రమే రావాలని ప్రత్యేకంగా ఎంపిక చేసిన వారికే ఆహ్వానాలు పంపటం ఒక పద్దతి, వచ్చిన వారిని అవమానించటం ఏమిటి ?
ఎన్నికల కమిషనర్‌ లేఖపై తెలుగుదేశం పార్టీ రాజకీయం సంగతి ఏమిటి అన్నది చూద్దాం. ఆ పార్టీ గవర్నర్‌ను కలిసి చర్య తీసుకోవాలని కోరింది. ఆ లేఖను తాను రాసిందీ లేనిదీ కమిషనర్‌ నిర్ధారించకుండానే అది వాస్తవమే అన్నట్లుగా అది వ్యవహరించింది. లేఖలోని అంశాల ఆధారంగా ఆర్టికల్‌ 356ను ప్రయోగించి రాష్ట్ర ప్రభుత్వం మీద చర్య తీసుకోవాలని ఆ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. ఇది అప్రజాస్వామికం. కొన్ని ప్రాంతాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తినంత మాత్రాన ఆ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా రద్దు చేస్తారు ?

Image result for is ys jagan mohan reddy foolishly entered in a mire

స్ధానిక సంస్ధల ఎన్నికల విషయంలో అనుకున్నది ఒకటి అయింది ఒకటి కావటంతో వైసిపి నాయకత్వం తట్టుకోలేకపోయింది. ఆ ఉద్రేకం లేదా ఉక్రోషంలో ముఖ్యమంత్రి జగన్‌మోపాన్‌రెడ్డి వ్యవహరించిన తీరు అభ్యంతర కరం. తరువాత స్పీకర్‌తో సహా పార్టీ భజన దళం మరింతగా రెచ్చిపోయింది. వెంట వెంటనే వరుసగా జరిగిన పరిణామాలను మొత్తంగా చూస్తే పార్టీ శ్రేణులను ముఖ్యమంత్రి ఇబ్బందుల్లోకి నెట్టారు. రాజకీయ పర్యవసానాలను ఎరక్కపోయి తానే ఇరుక్కున్నారు. కరోనా వైరస్‌ అధికార పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది, అదే వైరస్‌ తాత్కాలికంగా అయినా రాజకీయంగా మరింత నష్టపోకుండా చూస్తోంది. గత తొమ్మిది నెలలుగా జరిగిన పరిణామాలు ఒక ఎత్తయితే, ఎన్నికల కమిషనర్‌ ప్రమేయం ఉన్న ఉదంతం ఒక ఎత్తు. ఇది వీరాభిమానులను అభిమానుల స్ధాయికి తగ్గించింది. పైకి చెప్పకపోయినా ప్రయివేటు సంభాషణల్లో నెత్తీ నోరు కొట్టుకుంటున్నారు. ఇతరులు చెప్పిందాన్ని వినకపోగా తానుగా తెలుసుకోలేని స్ధితిలో తమ నేత ఉన్నట్లు భావిస్తున్నారు. అది వైసినేతగా ఉన్నపుడు జనానికి దానితో పని లేదు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక కుదరదని చెప్పాల్సి వస్తోంది. ఇదే స్ధితి మరికొంత కాలం సాగితే…..అభిమానం కూడా వేసవి కాలంలో మంచులా కరిగిపోతుంది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

రూపాయి విలువ పతనం- మోడీ నాడేమి చెప్పారు నేడేమి చేస్తున్నారు !

16 Monday Mar 2020

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

fall in the value of the rupee, India inflation, Indian Rupee, Narendra modi on Rupee fall

Image result for what narendra modi said then and is doing now on rupee fall cartoons

ఎం కోటేశ్వరరావు
రూపాయికి కరోనా వైరస్‌ సోకిందా ?  పతనాన్ని అరికట్టటంలో నరేంద్రమోడీ సర్కార్‌ ఘోరంగా విఫలమైందా ? మోడినోమిక్స్‌ గురించి గతంలో పొగిడిన వారు ఇప్పుడు నోరు మెదపరేం ? గతంలో రూపాయి పతనాన్ని ఎద్దేవా చేసిన వారు ఇప్పుడు ఏమంటారు ? ఇలా ఎన్నో ప్రశ్నలు కేంద్ర పాలకులను చుట్టుముడుతున్నాయి. ఒక్కరూ నోరు విప్పరేం. పోనీ రూపాయి, దిగజారుతున్న ఆర్ధిక వ్యవస్ధ గురించి నోరు విప్పరు. కానీ సిఎఎ,ఎన్‌పిఆర్‌, ఎన్‌సిఆర్‌ వంటి అనేక వివాదాస్పద విషయాల మీద మడమ తిప్పేది లేదు, మాట మార్చేది లేదు అంటూ నోరు వేసుకొని పడిపోతున్నారే !
రూపాయిని కాపాడుకొనేందుకు రిజర్వుబ్యాంకు రంగంలోకి దిగింది. రానున్న రోజుల్లో రెండు బిలియన్‌ డాలర్లను విక్రయించనున్నట్లు గురువారం నాడు ప్రకటించింది. దాంతో రూపాయి శుక్రవారం నాడు కాస్త కోలుకుంది. సోమవారం నాడు మార్కెట్‌లు ప్రారంభం కాగానే మరోసారి పతనమైంది. రోగం ఒకటైతే మోడీ సర్కార్‌ మందు మరొకటి వేస్తోందా ?
చైనాలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతుండగా అనేక దేశాల్లో విస్తరిస్తోంది. ఇదే సమయంలో అనేక దేశాల్లో స్టాక్‌ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. గురువారం నాడు రికార్డు స్దాయిలో పతనమైన స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం నాడు కోలుకుంది.ఒక్క రోజులో కరోనా వైరస్‌ తగ్గిందీ లేదు, కొత్తగా పెరిగిందీ లేదు. సోమవారం నాడు తిరిగి భారీ స్ధాయిలో పతనమైంది. అసలేమి జరుగుతోంది ? ఏమి జరగబోతోంది ? ప్రభుత్వం చెప్పదు, చెప్పిన మేథావులకు దేశ వ్యతిరేకులనో, కమ్యూనిస్టులనో మరొకటో ముద్ర వేస్తున్నారు. కమ్యూనిస్టులు, వామపక్ష వాదులు కాని మేథావులకు మన దేశం గొడ్డుపోయిందా ? లేదే, మరి వారెందుకు చెప్పటం లేదు, చెప్పినా మీడియా జనం ముందుకు తేవటం లేదా ?
ఈ పూర్వరంగంలో మన రూపాయి రక్షణ గురించి చూద్దాం. రూపాయి పతనమైతే ఎగుమతిదారులు సంతోషపడతారు, దిగుమతిదారులు ఆగ్రహిస్తారు. రూపాయి విలువ పెరిగితే దిగుమతిదారులు సంతోషిస్తారు, ఎగుమతిదారులు కన్నెర్ర చేస్తారు. మధ్యలో జనం సంగతేమిటి ? 1961లో వంద రూపాయలకు వచ్చే వస్తువులను నేడు కొనాలంటే రూ.7,557 కావాలి మరి ! లేదూ దీన్నే మరొక విధంగా చెప్పాలంటే 59 సంవత్సరాల క్రితం వంద రూపాయలుంటే దాని నిజ విలువ ఇప్పుడు రూ.1.40కి దిగజారింది. ఈ లెక్క ఎలా వచ్చిందంటారా ఎలిమెంటరీ స్కూలు పిల్లలకు చెప్పినా లెక్కవేసి పెడతారు. ప్రతి ఏటా ప్రభుత్వం వినిమయదారుల ధరల సూచీని ప్రకటిస్తుంది.             అందువలన ఒక సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. వర్తమాన సంవత్సర వినిమయదారుల సూచీని సదరు ప్రామాణి సంవత్సర సూచీతో భాగహారం చేయగా వచ్చే మొత్తాన్ని వందతో హెచ్చ వేయండి. మీకు ఫలితం వస్తుంది.1961 వినిమయదారుల ధరల సూచి 2.57, 2020 సూచీ 194.25. వీటితో పైన చెప్పిన పద్దతిలో భాగహారం చేస్తే 75.58 వస్తుంది. దీన్ని ద్రవ్యోల్బణ రేటు అంటారు. దీన్ని వందతో హెచ్చవేయాలి. ఇది ప్రతి సంవత్సరం ఒకే విధంగా ఉండదు. ఉదాహరణకు 1961 తరువాత గరిష్ట ద్రవ్యోల్బణం 1974లో 28.6, అంతకు ముందు సంవత్సరం రెండవ రికార్డు 16.94. (ఈ కారణంగానే ఆ రెండు సంవత్సరాలలో దేశంలో అనేక చోట్ల ధరల పెరుగుదల వ్యతిరేక ఆందోళనలు తలెత్తాయి) నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు 2013లో ద్రవ్యోల్బణం 10.91. తరువాత క్రమంగా 6.35 నుంచి 2017లో 2.49గా ఉంది. దీన్ని మోడీ సర్కార్‌, బిజెపి పెద్ద ఎత్తున తమ విజయంగా,మోడీ ప్రతిభగా ప్రచారం చేసుకున్నాయి. మరుసటి ఏడాది నుంచి క్రమంగా పెరుగుతూ 2019లో 7.66కు చేరింది, ఈ ఏడాది ఇంకా ఖరారు కాలేదు. దీన్ని ఎలా చెప్పాలి ? 2019లో రూ.7,019కి వచ్చిన సరకుల ధర 2020లో రూ.7,557 అవుతుంది. ఇటీవలి కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే ద్రవ్యోల్బణం తిరోగమనంలో పయనించింది. 1976లో అది గరిష్టంగా మైనస్‌ 7.63, అందువలన 1975లో రూ.312 రూపాయలకు వచ్చిన సరకులు 1976లో రూ.288కే వచ్చాయి.

Image result for what narendra modi said then and is doing now on rupee fall cartoons
రూపాయి విలువ గురించి బిజెపి, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ పెద్ద రాజకీయం చేశారు. ‘ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు, రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి పతనం కేవలం యుపిఏ పాలకుల అవినీతి వల్లనే. అది పారిశ్రామిక ప్రగతి, ఎగుమతి, దిగుమతులపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తోంది ‘ అని ముఖ్య మంత్రిగా నరేంద్రమోడీ ఈ మాటలు అన్నారు. అదేమి చిత్రమో, గానీ యుపిఏ నాటి కంటే నేడు మరింత దిగజారినా ప్రధానిగా మోడీ నోటి వెంట ఒక్క మాటా రాదు. ఆ పెద్దమనిషి భక్తులకూ నోట మాట పడిపోయింది. గోమాత శాపమా ?
ఎక్సేంజ్‌ రేట్‌ హిస్టరీ ఆఫ్‌ ఇండియన్‌ రూపి అని గూగుల్‌ తల్లిని వేడుకుంటే కరుణించి అందచేసే సమచారంలో వికీపీడియాను చూస్తే వాస్తవాలు తెలుస్తాయి. కళ్లుండీ చూడలేని నమో భక్తుల గురించి జాలిపడదాం. అడ్డంగా వాదిస్తే వాస్తవాలతో పని పడదాం. గత పది సంవత్సరాలలో డాలర్‌తో రూపాయి విలువ వార్షిక సగటు విలువ ఎలా ఉందో దిగువ చూడండి.
ఏడాది రూపాయి విలువ
2004-05    44.93
2005-06    44.27
2006-07    45.28
2007-08    40.24
2008-09    45.91
2009-10    47.41
2010-11    45.57
2011-12    47.92
2012-13    53.21
2013-14    60.50
2014-15    61.14
2015-16    65.46
2016-17    67.07
2017-18    64.45
2018-19    69.92
2019-20 సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు సగటున రూపాయి విలువ 70.40. ఈ ఏడాది గత కొద్ది రోజులుగా పడిపోతూ 2018 అక్టోబరు రెండు నాటి రికార్డు పతనం 74.48కి దగ్గరగా 74.44 వరకు దిగజారింది. ఈ పతనానికి కారణాలేమీ చెప్పలేదు గనుక దీనికి కూడా మోడీ సర్కార్‌ అవినీతే కారణం అనుకోవాలి మరి. ఈ రికార్డు పతనంతో నిమిత్తం లేకుండానే పారిశ్రామిక ప్రగతి, ఎగుమతులు దిగజారాయి. ఇంతగా దిగజారింది కనుకనే రిజర్వుబ్యాంకు డాలర్లను విక్రయించేందుకు పూనుకుంది.
రూపాయి పతనమైతే మన సరకుల ధరలు విదేశాల్లో తగ్గి ఎగుమతులు పెరుగుతాయి కదా ! అలాంటపుడు దాన్ని నివారించేందుకు రిజర్వు బ్యాంకు ఎందుకు పూనుకున్నట్లు ? అసలు విషయం ఏమంటే మన సరకులకు విదేశాల్లో డిమాండ్‌ లేదు. పోనీ నరేంద్రమోడీ విమానాల్లో తిరిగి వెళ్లిన ప్రతి చోటా, మన దేశానికి వచ్చిన ప్రతి విదేశీ నేతను కౌగలింతలతో ముంచెత్తినా వారి నుంచి తాను ప్రశంసలు, పొగడ్తలు పొందటం తప్ప ఎగుమతి మార్కెట్‌ అవకాశాలను కల్పించలేకపోయారు. మన కరెన్సీ పతనాన్ని ఇంకా కొనసాగనిస్తే మనం దిగుమతి చేసుకొనే చమురు, ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయి. అది జనం మీద, ఆర్దిక వ్యవస్ధ మీద మరింత భారం మోపుతుంది. ఇప్పటికే రాష్ట్రాలను ఒక్కొక్కటిగా కోల్పోతున్న స్ధితిలో త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలను కాపాడుకొనేందుకు బిజెపి పాట్లు పడుతోంది.
మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చిన నరేంద్రమోడీ మన దేశంలో సరకులను తయారు చేసి చౌకగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు రూపాయి విలువను కావాలనే పతనం గావిస్తున్నారా ? ఎగుమతి ఆధారిత విధానాలను అనుసరించే దేశాలన్నీ తమ కరెన్సీ విలువలను తగ్గించిన చరిత్ర వుంది. 1990 దశకంలో మన దేశం చెల్లింపుల సంక్షోభం ఎదుర్కొన్న కారణంగా మన ఎగుమతులను పెంచాలనే ఒక దివాళాకోరు ఆలోచనతో నాటి సర్కార్‌ ప్రపంచ బ్యాంకులో పని చేసిన మన్మోహన్‌ సింగ్‌ను ఆర్ధిక మంత్రిగా తీసుకొన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచబ్యాంకు ఆదేశాలతో ఈ పెద్ద మనిషి ఒక్కసారిగా నాలుగు రోజుల్లో రూపాయి విలువను తొమ్మిదిశాతం వరకు తగ్గించారు. అంతకు ముందు దేశ చరిత్రలో అలాంటి వుదంతం జరగలేదు.
మన దేశాన్ని కేవలం ముడి సరకులు ఎగుమతి దేశంగా వుంచాలని, పారిశ్రామికంగా అభివృద్ది కాకుండా వుంచేందుకు నాటి బ్రిటీష్‌ పాలకులు రూపాయి విలువను ఎక్కువగా వుంచారన్న అభిప్రాయం వుంది. యుపిఏ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు బిజెపి రూపాయి విలువ పతనాన్ని దేశానికి అవమానంగా చిత్రించింది. తాను అధికారంలోకి వచ్చిన తరువాత అదే పార్టీ ఇప్పుడు రూపాయి పతనమౌతోంటే గుడ్లప్పగించి చూస్తోంది. నోట మాట రావటం లేదు.
నిరుద్యోగ యువతను తప్పుదారి పట్టించేందుకు మేకిన్‌ ఇండియా నినాదంతో ప్రధాని నరేంద్రమోడీ కాలం గడుపుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ మన దేశం వచ్చి ఇక్కడ మన కార్మికుల చేత వస్తువులను తయారు చేయించుకొని ఎగుమతి చేసుకోవాలన్నది ఈ నినాదం వెనుక వున్న లక్ష్యం. ఇన్నేళ్లుగా మనం ఎందుకు విఫలమయ్యాము. ధనిక దేశాలన్నీ ఆర్ధిక మాంద్యంతో వుండగా ఇప్పుడున్న పరిశ్రమల వుత్పత్తులకే దిక్కు లేకపోతే కొత్తగా ఎవరు ప్రారంభిస్తారు అన్నది ప్రశ్న. అందువలన మన ఆర్ధిక విధానాన్ని మన అవసరాలకు తగినట్లు సమూలంగా మార్చుకొని అంతర్గతంగా వస్తువినియోగానికి డిమాండ్‌ పెంచుకుంటేనే ఏ రంగమైనా అభివృద్ది చెందుతుంది. మన యువతకు వుపాధి దొరుకుతుంది.
విదేశాలకు తక్కువ ధరలకు ఎగుమతులు చేయటానికి మన వనరులన్నీంటినీ వుపయోగిస్తే మన వస్తువులు కొన్న వాడికి తప్ప మనకు లాభం ఏమిటి? ఏ కారణం చేత అయినా కొనే వారు ఎత్తుబడితే మన వస్తువులను ఎవరికి అమ్ముకోవాలి? ఇప్పుడు అమెరికా, ఐరోపా ధనిక దేశాలలో వస్తువులు కొనే వారు లేకనే మన వస్తువులు ఎగుమతి కావటం లేదని అందరూ చెబుతున్నదే. అలాంటపుడు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టి మన నరేంద్రమోడీ గారికి మేకిన్‌ ఇండియా పేరు తెచ్చేందుకు ఎవరు ముందుకు వస్తారు అన్నదే సమస్య?
నరేంద్రమోడీ గారి మేకినిండియా పిలుపును జయప్రదం చేయటం కోసం రూపాయి విలువను మరింత పతనం గావిస్తే మనం దిగుమతి చేసుకొనే ఎరువులు, పురుగు మందులు, పెట్రోలియం వుత్పత్తుల వంటి వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. గుజరాత్‌ నమూనా అంటే ఇదేనా ?
వక్రీకరణలతో జనాన్ని మోసం చేయలేరు, భక్తులు మోడీని అసలు గట్టెక్కించలేరు. రూపాయి పతనాలు గతంలో జరగలేదని ఎవరూ చెప్పటం లేదు. దాన్నొక సమస్యగా చేసింది నరేంద్రమోడీ ‘ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు,రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు ‘ అన్న మోడీని మీ ఏలుబడిలో సంగతేమిటని అడిగే హక్కు అందరికీ వుంది. ఆయన భక్తులు లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేసే కిరాయి జనం వున్నారు. యుపిఏ పాలనలో 2013 ఆగస్టు 2న రూపాయి 68.85కు పడిపోయి అప్పటికి కొత్త రికార్డు సృష్టించింది. ఆ తరువాత మోడీ అధికారానికి వచ్చే నాటికి 2014 మే 26నాటికి రు.58.42కు పెరిగింది. అప్పటి నుంచి తాజాగా 74.34కు పతనం అయింది.

Image

అప్పుడు ప్రతిపక్ష నేతగా వున్న కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు.’పూర్తిగా ఆర్ధిక వ్యవస్ధ దుర్నిర్వహణ’ కారణంగా రూపాయి పతనం అవుతున్నదన్నారు. ‘ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) మరియు విదేశీ సంస్ధాగత పెట్టుబడుల (ఎఫ్‌ఐఐ)తో ఆర్ధిక వ్యవస్ధను నిర్వహించే యుపిఏ విధాన కారణంగానే ఇలా జరుగుతున్నదని చెప్పారు.అమెరికా ఫెడరల్‌ రిజర్వు వుద్దీపన పధకాన్ని వుపసంహరించిన కారణంగా మన దేశం నుంచి డబ్బు తరలి పోయినందున రూపాయి విలువ పడిపోయిందని ” లాయర్‌గారు వాదించారు. ‘యుపిఏ ఏర్పడినపుడు డాలరకు రూపాయి విలువ రాహుల్‌ గాంధీ వయస్సుతో సమంగా వుంది. ఈ రోజు సోనియా గాంధీ వయస్సుకు దగ్గర అవుతున్నది.అది మన్మోహన్‌ సింగ్‌ వయస్సుకు దగ్గర అవుతుందేమోనని భయంగా వుంది ‘ అని కూడా రవిశంకర ప్రసాద్‌ చమత్కరించారు. అదేమో గానీ నరేంద్రమోడీ వయస్సును మించి పోయింది. దాన్నయినా అదుపు చేయాలి, మోడీ గారిని అయినా అదుపులో పెట్టాలి, లేకపోతే మన్మోహన్‌ సింగ్‌ వయస్సుకు దగ్గరగా రూపాయిని తీసుకుపోయే అవకాశం కనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d