• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Left politics

ఫాసిస్టు వ్యతిరేక పోరాటం – ఫ్రెంచి ఎన్నికల్లో వామపక్షాలు నేర్పిన పాఠం ఏమిటి !

11 Thursday Jul 2024

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

emmanuel macron, French communist, French Elections 2024, French far right, National Rally (RN), New Popular Front(NFP)


ఎం కోటేశ్వరరావు


ఈ ఏడాది ప్రపంచంలో 50కి పైగా దేశాల్లో ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటి వరకు 25దేశాల్లో పాలకులు మారారు. ఆ పరంపరలో ఫ్రాన్స్‌, బ్రిటన్‌ చేరాయి. రెండు చోట్లా మధ్యంతర ఎన్నికలు జరిగాయి, అనూహ్య, ఉత్తేజం కలిగించే పరిణామాలు సంభవించాయి. అధ్యక్ష తరహా పాలన ఉన్న ఫ్రాన్సులో హంగ్‌ పార్లమెంటు ఏర్పడింది. నాలుగు కూటములు, అనేక స్వతంత్ర పార్టీలు పోటీ పడినా ఏ కూటమి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యలో సీట్లు తెచ్చుకోలేదు. పార్లమెంటులోని 577 స్థానాలకు గాను వామపక్షాల కూటమి 188సీట్లతో పెద్ద పక్షంగా అవతరించింది. ఫాసిస్టు శక్తుల ముప్పు తప్పింది. బ్రిటన్‌ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఘనవిజయం సాధించింది అనటం కంటే టోరీ(కన్సర్వేటివ్‌) పార్టీ చరిత్రలో తొలిసారిగా ఓటర్ల చేతిలో ఊచకోతకు గురైంది, అతి తక్కువ సీట్లు తెచ్చుకుంది. ఈ ఘనత భారతీయ మూలాలున్న రిషి సునాక్‌ ఏలుబడిలో జరిగింది. పార్లమెంటులోని 650 సీట్లకు గాను లేబర్‌ పార్టీ 411తో తిరుగులేని మెజారిటీ సాధించింది. ఫ్రెంచి పార్లమెంటు ఎన్నికల తొలిదశలో ఫాసిస్టు శక్తులది పైచేయిగా ఉండటమే కాదు,ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 289 సీట్ల కంటే ఎక్కువగా 297 స్థానాలలో ప్రధమ స్థానంలో ఉంది. పచ్చి మితవాద నేషనల్‌ రాలీ-ఆర్‌ఎన్‌ (గతంలో నేషనల్‌ ఫ్రంట్‌) ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో 31శాతం ఓట్లతో విసిరిన సవాలుతో అధ్యక్షుడు మక్రాన్‌ పార్లమెంటును రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు తెరతీశాడు. ఈ ఎన్నికల తొలిరౌండులో 33.21శాతం తెచ్చుకుంది.రెండవ రౌండ్‌లో 37.06శాతానికి పెంచుకుంది.వామపక్షాలతో కూడిన న్యూ పాపులర్‌ ఫ్రంట్‌(ఎన్‌ఎఫ్‌ఇ) తొలి దఫా 28.21శాతం తెచ్చుకోగా మలి దశలో 25.81శాతం పొందింది. అధికారపక్షమైన టుగెదర్‌ కూటమి 21.28 నుంచి 24.53శాతానికి పెంచుకుంది.


పార్లమెంటులోని 577 స్థానాలకు గాను జూన్‌ 30న జరిగిన ఎన్నికల్లో 76 నియోజకవర్గాలలో ఫలితాలు తేలాయి. ఆర్‌ఎన్‌ పార్టీ 37, వామపక్ష కూటమి 32, అధికార పక్షం రెండు స్థానాలు గెలుచుకున్నాయి. ఇతరులు ఐదు చోట్ల గెలిచారు. మిగిలిన స్థానాలకు ఏడవ తేదీన పోలింగ్‌ జరిగింది. త్రిముఖ పోటీ జరిగితే దేశ చరిత్రలో తొలిసారిగా పచ్చిమితవాదులు అధికారాన్ని కైవశం చేసుకుంటారని తేలింది. ఈ ముప్పును తప్పించేందుకు విధానపరంగా ఎన్ని విబేధాలు ఉన్నప్పటికీ వామపక్ష కూటమి, అధికార పార్టీ ఒక అవగాహనకు వచ్చాయి. అదేమంటే ఆర్‌ఎన్‌ పార్టీ ఆధిక్యత ఉన్న చోట రెండవ స్థానంలో ఉన్న అభ్యర్థికి అనుకూలంగా మూడవ అభ్యర్థి ఉపసంహరించుకొని మద్దతు ఇవ్వటంతో ఫాసిస్టు పార్టీ ఓట్ల రీత్యా పెద్దదిగా ఉన్నా సీట్లలో మూడవ స్థానానానికి పడిపోయింది. రెండవ దశలో సీట్ల సర్దుబాటు కారణంగా వామపక్ష కూటమి, అధికార కూటమి లబ్ది పొందాయి. వామపక్ష సంఘటనలో ఉన్న పార్టీలకు గతంలో 130 ఉండగా ఈ సారి 188, అధికార ఐక్యత కూటమికిి 245 నుంచి 161కి పడిపోగా ఆర్‌ఎన్‌ పార్టీ కూటమికి 89 నుంచి 142కు పెరిగాయి. ప్రస్తుతానికి ఆ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు ముప్పు తప్పినా ఓట్లపరంగా 37శాతానికి పెంచుకోవటం ప్రమాదకరపరిణామం. వామపక్ష కూటమి ఏర్పాటు చేసే ప్రభుత్వానికి అధికార ఐక్యత కూటమి మద్దతు ఇవ్వటం లేదా సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి కావటం తప్ప మరొక మార్గం లేదు. ఈ పరిణామంతో రానున్న రోజుల్లో అనేక అంశాలపై మక్రాన్‌ వైఖరిలో మార్పులు కూడా ఉంటాయని భావిస్తున్నారు.


ఫలితాల్లో ఫాసిస్టు పార్టీ అధికారానికి రాదనే తీరు కనిపించగానే పారిస్‌తో సహా దేశమంతటా జనం వీధుల్లోకి వచ్చారు. సంతోషం, ఆనందంతో కన్నీటి బాష్పాలు రాల్చారు.ఫలితాల మీద తొలి ప్రకటన వెలువడగానే ఎదురుగా ఉన్న వారు పరిచితులా, అపరిచితులా అన్నదానితో నిమిత్తం లేకుండా ఎవరుంటే వారిని వారిని హత్తుకున్న దృశ్యాలు కనిపించాయి. నిమిషాల తరబడి చప్పట్లు చరిచారు. ఫాసిస్టు శక్తులను ఓడించేందుకు పరస్పర విరుద్ద వైఖరులతో పని చేస్తున్న పార్టీలు ఐక్యమైనపుడు విబేధాలను పక్కన పెట్టి అదే జనం మద్దతు ఇచ్చి గెలిపించినపుడు ఇలాంటి దృశ్యాలు ఆశ్చర్యం కలిగించవు. ఐరోపా పార్లమెంటు, తొలిదశ ఎన్నికల్లో ఫాసిస్టు పార్టీ పెద్దదిగా అవతరించటంతో ఆందోళనకు గురైన అనేక మంది బరువు దించుకున్నారు. మరోవైపు ఫాసిస్టు పార్టీ అభిమానులు చిక్కినట్లే చిక్కి అధికారం దూరమైందన్నట్లుగా తీవ్ర ఆశాభంగం చెందారు.అయినా తమ కూటమి ప్రతిసారీ బలం పెంచుకుంటున్నదని సంతృప్తిని కూడా వెల్లడిస్తున్నారు. 2027లో అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉన్నందున ఏ కూటమి కూడా పార్లమెంటు ఎన్నికల సమయంలో ప్రకటించిన విధానాల నుంచి వైదొలిగే అవకాశాలు ఉండవు. ప్రజలిచ్చిన తీర్పుతో ఫ్రెంచి రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతాయా, మక్రాన్‌ సర్కార్‌కు కొత్త ప్రభుత్వం గుదిబండగా మారుతుందా ? విదేశీ, అంతర్గత విధానాలపై మక్రాన్‌తో వామపక్షాలు విబేధిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా అనేక సందేహాల మీద చర్చ ప్రారంభమైంది. ఫలితాలు వెలువడిన వెంటనే ప్రధాని గాబ్రియెల్‌ అతల్‌ రాజీనామా లేఖను పంపాడు. దాన్ని తాను ఆమోదించటం లేదని మక్రాన్‌ ప్రకటించాడు.ప్రభుత్వ ఏర్పాటుకు తొలి అవకాశాన్ని తమకే ఇవ్వాలని, ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్దంగా ఉన్నామని వామపక్ష కూటమి నేత జీన్‌ లక్‌ మెలెన్‌చోన్‌ ప్రకటించాడు. తాము గెలిస్తే హమస్‌ అణచివేత పేరుతో మారణకాండ సాగిస్తున్న ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చే వైఖరి ఉపసంహరించుకుంటామని, జనానికి ఉపశమనం కలిగించేందుకు భారీ మొత్తంలో ప్రభుత్వ ఖర్చు పెంచుతామని వామఫక్షాలు ఎన్నికల ప్రణాళికల్లో వాగ్దానం చేశాయి. వామపక్షాల తీరు తీవ్రంగా ఉందని, ప్రభుత్వ ఖర్చు పెంచేందుకు అవసరమైన నిధులు కొన్ని సంపద పన్ను, అధికాదాయం వచ్చేవారి మీద పన్ను పెంపుదల వంటి అంశాలను అమలు జరిపితే దేశం నాశనం అవుతుందని, ఇప్పటికే దేశం అప్పుల ఊబిలో ఉందని మక్రాన్‌ వ్యాఖ్యానించాడు.


అనూహ్యంగా పెద్ద కూటమిగా అవతరించిన వామపక్ష న్యూ పాపులర్‌ ఫ్రంట్‌(ఎన్‌ఎఫ్‌పి) గురించి అనేక మందిలో ఆసక్తి నెలకొన్నది, ఇది ఫాసిస్టు శక్తులను మట్టి కరిపించింది.ఐరోపాలో ఇలాంటి శక్తుల వ్యతిరేకులకు ఒక దారి చూపిందంటే అతిశయోక్తి కాదు. కొన్ని అంశాలపై తేడాలతో గతేడాది అక్టోబరులో వామపక్ష ఫ్రంట్‌ విడిపోయింది.ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో ఆర్‌ఎన్‌ పార్టీ పెద్దదిగా అవతరించటం, అధ్యక్షుడు మక్రాన్‌ పార్లమెంటు రద్దు చేయటంతో తలెత్తిన నూతన పరిస్థితుల్లో వామపక్షాలు తమ విబేధాలను పక్కన పెట్టి జూన్‌ 13న ఎన్‌ఎఫ్‌పి ఏర్పాటుకు అంగీకరించాయి. దీనికి ఒక చారిత్రక నేపధ్యం ఉంది. ఫాసిజానికి వ్యతిరేకంగా 1930దశకంలో పాపులర్‌ ఫ్రంట్‌ ఏర్పడింది, ఆ పేరుకు న్యూ(కొత్త) అని చేర్చారు నెల రోజుల్లోనే పెద్ద పక్షంగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దీనిలో నాలుగు పార్టీలు ఉన్నాయి. కూటమిలో 75 సీట్లు ఫ్రాన్స్‌ అన్‌బౌవ్‌డ్‌ -తలవంచని పార్టీ (ఎల్‌పిఐ)కు వచ్చాయి. ఇది సోషలిస్టు పార్టీ నుంచి విడిపోయిన వారితో ఏర్పడింది. భావజాలంలో కమ్యూనిస్టు పార్టీ కంటే తక్కువ సోషలిస్టు పార్టీ కంటే ఎక్కువ అంటే మధ్యస్థంగా ఉంటుందని విశ్లేషకులు వర్ణించారు. రెండవది 65 సీట్లు తెచ్చుకున్న సోషలిస్టు పార్టీ. దీన్ని సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీగా పేర్కొంటారు. మూడవ పక్షం ది ఇకోలజిస్ట్స్‌(ఎల్‌ఇ)-పర్యావరణ పార్టీ, దీనికి 33 స్థానాలు వచ్చాయి.నాలుగవది ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ. దీనికి తొమ్మిది స్థానాలు వచ్చాయి. సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాల సోషలిస్టు సమాజాలను కూల్చివేసిన తరువాత పార్టీ బలహీనపడినప్పటికీ ఇతర దేశాలలో కమ్యూనిస్టుల మాదిరి తన ఉనికిని కాపాడుకుంటున్నది. మరికొన్ని చిన్న పార్టీలు కూడా దీనిలో ఉన్నాయి. అధ్యక్షుడు మక్రాన్‌ విధానాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్న ఈ కూటమితో అతగాడి నాయకత్వంలోని మితవాద కూటమి కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా, బయట ఉండి మద్దతు ఇస్తుందా అన్నది స్పష్టం కాలేదు. ఫాసిస్టులకు వ్యతిరేకంగా రెండు కూటములు ఎన్నికల సర్దుబాటు చేసుకున్నాయి.


ముందే చెప్పుకున్నట్లు బ్రిటన్‌లో కూడా కొన్ని నెలల ముందే పార్లమెంటు ఎన్నికలు జరిగాయి.పద్నాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టోరీ(కన్సర్వేటివ్‌ పార్టీ)ని ఓటర్లు ఊచకోత కోశారని కొందరు వ్యాఖ్యానించారు. రిషి సునాక్‌ను నేతగా ఎన్నుకొని తప్పుచేశామని అనేక మంది టోరీలు తలలు పట్టుకుంటున్నారు.గడచిన వందేండ్లలో ఇంత తక్కువ సీట్లు ఎప్పుడూ రాలేదని అంటున్నారు. పొదుపు చర్యల పేరుతో అమలు జరిపిన విధానాలతో జనజీవితం అతలాకుతలం అయింది. అందుకనే ఈ సారి 650 స్థానాలకు గాను ఆ పార్టీకి 53 నుంచి 131 మధ్యలో సీట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌లో పేర్కొనగా 121 వచ్చాయి.గతంలో ఉన్నవాటిలో 251 స్థానాలను కోల్పోయారు. మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌,పన్నెండు మంది మంత్రులు మట్టికరిచారు.ఆశ్చర్యం ఏమిటంటే మూడవ పక్షమైన లిబరల్‌ పార్టీ ఈ ఎన్నికల్లో పదకొండు నుంచి 72 స్థానాలకు తన బలాన్ని పెంచుకుంది. టోరీ ప్రధానులుగా పనిచేసిన డేవిడ్‌ కామెరాన్‌, థెరెసా మే ప్రాతినిధ్యం వహించిన స్థానాలను ఈ పార్టీ కైవశం చేసుకుంది.ఈ ఎన్నికలు మరొక రికార్డును కూడా సృష్టించాయి. 1918 తరువాత రెండు ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్లు 57.4 శాతమే. లేబర్‌ పార్టీ 33.7శాతం ఓట్లతో 411 సీట్లు(63.2శాతం) తెచ్చుకోగా టోరీ 23.7శాతం ఓట్లు, 121 సీట్లు(18.6శాతం) తెచ్చుకున్నాయి. గ్రీన్స్‌ పార్టీకి 6.7శాతం ఓట్లు వచ్చినప్పటికీ కేవలం నాలుగు స్థానాలు(0.6శాతం) మాత్రమే వచ్చాయి. రిఫామ్‌(సంస్కరణ) యుకె పార్టీకి లిబరల్స్‌ కంటే ఎక్కువగా 14.3శాతం ఓట్లు వచ్చినా కేవలం 5(0.8శాతం) సీట్లు వచ్చాయి. డెమోక్రటిక్‌ యూనియనిస్టు పార్టీకి కూడా ఐదు సీట్లు వచ్చినా దానికి వచ్చిన ఓట్లు కేవలం 0.6శాతమే ఈ తీరును చూసిన కొందరు ఎన్నికల సంస్కరణలు అవసరమని సూచించారు.బ్రిటన్‌ పార్లమెంటు చరిత్రలో అధికారానికి వచ్చిన పార్టీ తక్కువ ఓట్లు తెచ్చుకోవటం ఒక రికార్డు, దాన్ని లేబర్‌ పార్టీ సొంతం చేసుకుంది.మూడు ప్రధాన పార్టీలకు 69.6 శాతం ఓట్లు 92.9 శాతం సీట్లు వచ్చాయి. చిన్న పార్టీలు ఓట్లు గణనీయంగా తెచ్చుకున్నట్లు ఈ గణాంకాలు వెల్లడించాయి. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి 7.4శాతం తగ్గి 59.9శాతం ఓట్లు పోలయ్యాయి. దీన్ని బట్టి ఓటర్లు ఎన్నికల పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదన్నది స్పష్టమైంది. లేబర్‌ పార్టీ గత ఎన్నికల కంటే కేవలం 1.7శాతం, లిబరల్‌ పార్టీ 0.6శాతం మాత్రమే అదనంగా తెచ్చుకోగా టోరీలు 19.9శాతం కోల్పోయారు.అధికారంలోకి లేబర్‌ పార్టీ వస్తుందా లేదా అన్నదాని కంటే టోరీ పార్టీని వదిలించుకోవాలని ఓటర్లు భావించినట్లు ఈ అంకెలు స్పష్టం చేశాయి.


లేబర్‌ పార్టీ పెద్ద విజయాన్ని సాధించగానే సమస్యలన్నీ పరిష్కారమైనట్లు భావించనవసరం లేదు. దాని ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి.ప్రతిపక్షంలో ఉండగా పౌరుల కోసం కడవల కొద్దీ కన్నీరు కార్చే లేబర్‌ పార్టీ నేతలు అధికారానికి వచ్చిన తరువాత జనాన్ని మరచిపోతారనే నానుడి ఉంది. గతంలో అది నిరూపితమైంది. దాని నేత కెయిర్‌ స్టామర్‌ కార్పొరేట్లకు అనుకూలమనే అభిప్రాయం ఉంది. దీనికి అనుగుణంగానే ఫలితాలు వెలువడిన తరువాత తొలిరోజు స్టాక్‌మార్కెట్‌ సూచీ0.86పెరిగిందన్నది ఒక అభిప్రాయం.ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో జిడిపి వృద్ది కేవలం 0.6శాతమే పెరగ్గా ధరలు రెండు పెరిగాయి. ఇతర అభివృద్ది చెందిన దేశాలతో పోలిస్తే కరోనాకు ముందున్న ఉత్పాదకత, పెట్టుబడి రేట్లు తక్కువగా ఉన్నాయి. 1980దశకంలో పెట్టుబడి రేటు 23శాతం ఉండగా రెండువేల సంవత్సరం నుంచి 17శాతానికి అటూ ఇటూగా ఉంది. అదే ఇతర జి7 దే శాలలో 20-25శాతంగా ఉంది.ఆదాయపన్నుతో సహా ఇతర పన్నులేవీ పెంచబోమని లేబర్‌ పార్టీ ఎన్నికల్లో చెప్పింది. పెంచకపోతే మరింత అప్పులపాలౌతామని, స్పష్టంగా వైఖరిని వివరించాలని టోరీల నేత రిషి సునాక్‌ పదే పదే లేబర్‌ పార్టీ నేతలను ప్ర శ్నించాడు. ప్రస్తుతం జిడిపితో పోలిస్తే 100శాతం అప్పుల్లో,ద్రవ్యలోటుతో బ్రిటన్‌ ఉంది.దాన్ని అధిగమించాలంటే జనాన్ని పన్నులతో బాదాలని టోరీలు చెబుతున్నారు. జనంలో వ్యతిరేకత కనిపించటంతో మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌ సర్కార్‌ పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నది. గత పద్నాలుగు సంవత్సరాలుగా ఏదో ఒక పేరుతో ప్రభుత్వ రంగ సిబ్బందికి వేతనాలను స్థంభింపచేశారు. కార్మిక సంఘాలన్నీ లేబర్‌ పార్టీ నిర్వహణలో ఉన్నందున వేతన సమస్య ప్రధానంగా ముందుకు రానుంది. దేశంలోని అతి పెద్ద థేమ్స్‌ నీటి కంపెనీ అప్పులపాలైంది.అయినా వాటాదార్లకు డివిడెండ్లు చెల్లిస్తున్నది. దివాలా తీసే స్థితిలో ఉన్నదాన్ని నిలబెట్టటం ఒక సమస్య. దీన్ని జాతీయం చేయవచ్చని, అందుకు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. జైళ్లన్నీ 99శాతం నిండి ఉన్నాయి.న్యాయవ్యవస్థ విఫలమైందనే విమర్శకూడా ఉంది. నేరాలను ఎలా తగ్గించాలనేదాని కంటే కొత్తగా జైళ్ల నిర్మాణం గురించి పాలకులు ఆలోచిస్తున్నారు.విశ్వవిద్యాలయాల నిర్వహణ ఖర్చు పెరిగింది, 2012తరువాత ట్యూషన్‌ ఫీజులను పెంచలేదు.విదేశాల నుంచి వచ్చే విద్యార్థులు కూడా తగ్గుతున్నారు.దీంతో వాటి రాబడి పడిపోతున్నది.బ్రిటన్‌ పెద్ద సమస్యల్లో ఇదొకటి. ఆరోగ్య రంగ బడ్జెట్‌లోటులో ఉంది.చికిత్సకు పట్టే వ్యవధి రోజు రోజుకూ పెరుగుతోంది, మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి.సేవలను మెరుగుపరచాల్సి ఉంది.టోరీల పొదుపు చర్యల కారణంగా స్థానిక సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. 2018 నుంచి ఇప్పటి వరకు ఎనిమిది సంస్థలు దివాలా ప్రకటించాయి.ప్రస్తుతం ప్రతి ఐదింటిలో ఒకటి అదే బాటలో ఉన్నది.ఈ పూర్వరంగంలో లేబర్‌ పార్టీ ముందు పెద్ద సవాలే ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా విద్యార్థి ఉద్యమం : నాటి వియత్నాం, నేటి పాలస్తీనాకు తేడా ఏమిటి !!

15 Wednesday May 2024

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Andi War protests, Donald trump, Israel genocide, Joe Biden, Pro-Palestinian protests, US Student Protests


ఎం కోటేశ్వరరావు


పాలస్తీనా ప్రాంతమైన గాజాలో ఇజ్రాయెల్‌ మిలిటరీ రాఫా, తదితర ప్రాంతాల్లో మారణకాండను తీవ్రం చేస్తోంది. చివరకు ఐరాస తరఫున పనిచేస్తున్న సహాయసిబ్బందిని కూడా వదలటం లేదు.సోమవారం జరిపిన దాడుల్లో ఐరాస తరఫున పనిచేస్తున్న వారిలో మనదేశానికి చెందిన వ్యక్తి మరణించాడు. రాఫాలోని ఐరోపా ఆసుపత్రికి ఒక వాహనంలో ఇతరులతో కలసి వెళుతుండగా ఇజ్రాయెల్‌ మిలిటరీ జరిపిన దాడిలో అతడు మరణించగా మిగిలిన వారికి గాయాలయ్యాయి.గతేడాది అక్టోబరు ఏడు నుంచి ఇప్పటి వరకు 35వేల మందికి పైగా మరణించారు. వారిలో 70శాతంపైగా పిల్లలు, మహిళలు ఉన్నారు.పాలస్తీనియన్ల ఊచకోత గురించి అణుమాత్రమైనా పట్టని అమెరికా, ఇతర పశ్చిమదేశాలు యూదు వ్యతిరేకత పెరుగుతోందని మాత్రం గుండెలు బాదుకుంటున్నాయి. ఆ సాకుతో ఇజ్రాయెల్‌ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాయి. కొద్ది వారాల క్రితం అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాలోనే ప్రారంభమైన ఉద్యమం ఇప్పుడు కెనడా, ఐరోపా ముఖ్యంగా బ్రిటన్‌కు విస్తరించింది.అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు ఈ ఆందోళనకు దూరంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ప్రభుత్వం తమను గుర్తించి వీసాలను రద్దు చేసినా, అమెరికా నుంచి వెనక్కు తిప్పిపంపినా నష్టపోతామనే భయమే దీనికి కారణంగా ఉన్నట్లు కొందరు చెప్పారు.రఫా మీద దాడులను అంగీకరించేది లేదన్నది అమెరికా ఉత్తుత్తి బెదిరింపు మాత్రమే అని తేలిపోయింది. మంగళవారం నాటికి అందిన సమాచారం మేరకు ఆ నగరం పరిసరాలలో ఉన్న 14 లక్షల మంది జనాభాలో సగం మంది దాడులను తప్పించుకొనేందుకు ఇతర ప్రాంతాలకు పారిపోయారు.


ప్రతి మతంలోనూ దురహంకారులు ఉంటారు. దానికి యూదు అతీతం కాదు.ఐరోపాలో ముందుకు తెచ్చిన యూదు వ్యతిరేకత వారిని అష్టకష్టాలపాలు చేసింది. లక్షలాది మంది ప్రాణాలు తీసింది. ఆ దుర్మార్గాన్ని యావత్‌ ప్రపంచం ఖండించింది. కానీ ఇప్పుడు అదే మత ప్రాతిపదికన ఏర్పడిన ఇజ్రాయెల్‌ పాలకుల అరబ్‌ లేదా ముస్లిం వ్యతిరేకతను అనేక పశ్చిమదేశాలు నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నాయి.పాలస్తీనా సాగిస్తున్న మారణకాండకు మద్దతు ఇస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించి మానవహక్కులను కాపాడాలని కోరుతున్నారే తప్ప యూదు వ్యతిరేకతను ముందుకు తీసుకురాలేదు. ఇజ్రాయెల్‌ పాలకులు యూదు దురహంకారులు తప్ప అక్కడ ఉన్న సామాన్య పౌరులందరూ అలాంటి వారే అనటం లేదు. ఐరాస తీర్మానం ప్రకారం పాలస్తీనా ఏర్పడకుండా అడ్డుకుంటున్నది అక్కడి పాలకులు, యూదు ఉన్మాదం తలకెక్కించిన మిలిటరీ, వారిని తమ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్న పశ్చిమదేశాలు తప్ప పౌరులు కాదు. పాలస్తీనాలోని గాజా, పశ్చిమగట్టు, తూర్పుజెరూసలెం ప్రాంతాలలోని పౌరులపై దశాబ్దాల తరబడి సాగిస్తున్న దమనకాండ గురించి తన పౌరులకు బోధ చేసేందుకు ఎన్నడూ ఒక చట్టం చేయని అమెరికా పార్లమెంటు దిగువసభ ఇటీవల ” యూదు వ్యతిరేక జాగృతి బిల్లు ” తెచ్చింది. దానికి 91 మంది వ్యతిరేకంగా ఓటు వేయగా 320 మంది మద్దతు తెలిపారు.యూదు వ్యతిరేకత అమెరికాలో ఉన్న యూదు విద్యార్థుల మీద ప్రభావం చూపుతుందని చట్టం ప్రకటించింది. దాన్ని సెనెట్‌ కూడా ఆమోదిస్తే అధ్యక్షుడి ఆమోదంతో చట్టంగా మారుతుంది. ఒకసారి అది ఉనికిలోకి వస్తే వివాదాస్పద యూదు వ్యతిరేక నిర్వచనాలతో విద్యార్థులు, ఇజ్రాయెల్‌ దమనకాండపై గళమెత్తే ఇతరులను అణచివేసే అవకాశం ఉంది. ఈ బిల్లును సెనెట్‌ ఆమోదించకూడదని అనేక మంది కోరుతున్నారు. విద్యార్థులు చేస్తున్నది మరొక యుద్ధ వ్యతిరేక ఉద్యమం కాగా దాన్ని యూదు వ్యతిరేకమైనదిగా పశ్చిమదేశాల మీడియా చిత్రించటం పాలకవర్గాల కనుసన్నలలో నడవటం తప్ప మరొకటి కాదు.


గతంలో వియత్నాంపై జరిపిన దురాక్రమణ, హత్యాకాండ, అత్యాచారాలకు నిరసనగా 1968లో అమెరికా యువత పెద్ద ఎత్తున నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. చివరకు బతుకుజీవుడా అంటూ అమెరికన్లు అక్కడి నుంచి పారిపోయి వచ్చారు. అక్కడ కనీసం 30లక్షల మంది అమాయక పౌరులను అమెరికన్లు హతమార్చారు. గతంలో వియత్నాంలో మాదిరి ఇప్పుడు 2024లో గాజాలో జరుగుతున్న మారణకాండలో అమెరికా ప్రత్యక్ష భాగస్వామి కాదు. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వటాన్ని వ్యతిరేకించటం అమెరికా యువతలో పెరిగిన చైతన్యానికి ఒక నిదర్శనం. గతంలో మాదిరి జరుగుతున్నవాటిని మూసి పెట్టటం ఇప్పుడు సాధ్యం కాదు. అమెరికాలో జరుగుతున్నదాని గురించి ఒక విశ్లేషకుడు ఒక సినిమా కథతో పోల్చాడు. మోర్ఫస్‌ అనే చిత్రంలో ఒక వ్యక్తి తన వద్దకు వచ్చిన ఆశ్రితుడికి ఎరుపు, నీల వర్ణపు రంగుల మాత్రలు ఇచ్చి ఏదో ఒకటి తీసుకోమంటాడు.ఎరుపు రంగుదాన్ని సేవించిన వారికి తమ చుట్టూ జరుగుతున్న భయంకర అంశాలన్నీ కనిపిస్తాయి. అదే నీలి రంగు మాత్ర వేసుకుంటే నిజంగా జరుగుతున్నదాన్ని మరిపింపచేస్తుంది. ఆ సినిమాలో ఆశ్రితుడు ఎర్ర రంగు మాత్ర తీసుకున్నట్లుగా ఇప్పుడు అమెరికా సమాజంలోని నవతరం కూడా అదే మాదిరి పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న అకృత్యాలను చూస్తున్నారని, వ్యతిరేకంగా స్పందిస్తున్నారని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా జరుగుతున్న చర్చలో ఒక్క ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వటమే కాదు తమ ప్రభుత్వం అనేక చోట్ల ఉగ్రవాద వ్యతిరేక చర్యల పేరుతో జరుపుతున్న దారుణాలను కూడా ఇప్పుడు విద్యార్థులు స్పష్టంగా చూస్తున్నారు.


అమెరికా జరుపుతున్న దారుణాలను ప్రపంచం చూస్తున్నప్పటికీ ఇటీవలి కాలంలో అమెరికన్లు వాటిని ఏ మేరకు గమనించారన్న చర్చ ఒకటి ఉంది. ఏదైనా శృతిమించితే వారు కూడా స్పందిస్తారని తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. పాలస్తీనా విముక్తి కోసం పోరాడుతున్నవారిని ఉగ్రవాదులని అమెరికా ఎప్పటి నుంచో చిత్రిస్తున్నది.ప్రతి దేశంలో సామ్రాజ్యవాదం, నిరంకుశపాలకులు చేసింది అదే. ఉగ్రవాదంపై పోరు పేరుతో అమెరికా సాగిస్తున్న చర్యలతో నిజానికి ఉగ్రవాదం పెరిగింది తప్ప తగ్గలేదు. అనేక మందిని ఉగ్రవాదులుగా మార్చిందంటే అతిశయోక్తి కాదు. బ్రౌన్‌ విశ్వవిద్యాలయం జరిపిన ఒక విశ్లేషణ ప్రకారం వివిధ దేశాలలో అమెరికా కారణంగా 45లక్షల మంది మరణించారు.వారిలో అమెరికా మిలిటరీ ప్రత్యక్షంగా తొమ్మిది లక్షల మందిని చంపివేసింది.కనీసం 3.8కోట్ల మంది తమ నెలవులు తప్పారు. ఎమెన్‌ అంతర్యుద్ధంలో అమెరికా మద్దతు, పధకం ప్రకారం జోక్యం చేసుకున్న సౌదీ అరేబియా కారణంగా దశాబ్ది కాలంలో 2.33లక్షల మంది మరణించారు.ఐరాస కార్యాలయం 2020లో చెప్పినదాని ప్రకారం వారిలో ఆహారం, ఆరోగ్యసేవలు, మౌలిక సదుపాయాల లేమి వంటి పరోక్ష కారణాలతో మరణించిన వారు 1.31లక్షల మంది ఉన్నారు. ఇటీవలి ప్రపంచ పరిణామాల్లో సౌదీ అరేబియా-ఇరాన్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఎమెన్‌లో జోక్యానికి స్వస్తిపలికింది. సద్దాం హుస్సేన్ను తమ పలుకుబడికిందకు తెచ్చుకొనేందుకు ఇరాక్‌పై అమెరికా అమలు జరిపిన ఆంక్షల కారణంగా ఐదు లక్షల మంది పిల్లలు మరణించారని అంచనా. ఇంకా ఇలాంటి అనేక దారుణాల్లో తమ నేతల, దేశ పాత్ర గురించి విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో గుడారాల్లో తిష్టవేసి నిరసన తెలుపుతున్న విద్యార్థులు అరచేతిలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని అధ్యయనం చేస్తున్నారు.


అమెరికా ప్రత్యక్షంగా పాల్గొనటమే కాదు, అనేక దేశాల పాలకులను ప్రోత్సహించి లక్షలాది మంది మరణాలకు బాధ్యురాలైంది.ప్రస్తుత బంగ్లాదేశ్‌ 1971కి ముందు పాకిస్తాన్‌లో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ తలెత్తిన ప్రభుత్వ వ్యతిరేకతను అణచివేసేందుకు పాక్‌ మిలిటరీ ఆపరేషన్‌ సెర్చ్‌లైట్‌ పేరుతో జరిపిన మారణకాండలో మూడు లక్షల మంది మరణించగా కోటి మంది తమ ప్రాంతాల నుంచి పారిపోవాల్సివచ్చింది.దానికి అమెరికా పూర్తి మద్దతు ఇచ్చింది.మనదేశం జోక్యం చేసుకొని పాక్‌ మిలిటరీని ఓడించి బంగ్లాదేశ్‌ విముక్తికి తోడ్పడింది. అంతకు కొద్ది సంవత్సరాల ముందు ఇండోనేషియాలో కమ్యూనిస్టులను అణచివేసేందుకు మిలిటరీ నియంత సుహార్తోను గద్దెమీద కూర్చోబెట్టి కనీసం పదిలక్షల మందిని ఊచకోత కోయించటంలో సిఐఏ ప్రధాన పాత్ర పోషించింది. రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా మిత్రపక్ష దేశాల మీద యుద్దం ప్రకటించిన హిట్లర్‌ వంటి వారిని తప్ప ప్రపంచంలో నియంతగా పేరు మోసిన ప్రతివాడినీ అమెరికా బలపరిచింది.హిట్లర్‌కు సైతం ఆయుధాలు అమ్మి తొలి రోజుల్లో మద్దతు ఇచ్చింది. రెండవ ప్రపంచ యుద్దంతో బ్రిటన్‌ ప్రపంచాధిపత్యం అంతరించి అమెరికా రంగంలోకి వచ్చింది.అప్పటి నుంచి సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాలతో సాగించిన ప్రచ్చన్న యుద్ధంలో తాము విజేతలం అని ప్రకటించుకొనే వరకు అంటే 1949 నుంచి 1989వరకు వివిధ దేశాలలో పాలకులను మార్చేందుకు అమెరికా 72 ప్రయత్నాలు చేయగా 29 సందర్భాలలో అమెరికా కుట్రలో భాగస్వాములైన వారు జయప్రదమయ్యారు. కూల్చిన వాటిలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఆరు ఉన్నాయని బోస్టన్‌ కాలేజీ రాజకీయ శాస్త్ర అధ్యాపకురాలు లిండ్సే ఓ రూర్‌కే పేర్కొన్నారు. ఒక వలసవాదిగా అమెరికా దుర్మార్గం చిన్నదేమీ కాదు. ఆసియాలోని ఫిలిప్పైన్స్‌ను ఆక్రమించకొని అక్కడ మొదటి ప్రపంచ యుద్ధానికి ముందే రెండు నుంచి ఆరులక్షల మందిని జాత్యహంకారం, ఇతర కారణాలతో అమెరికన్‌ పాలకులు హత్య చేశారని అంచనా.


1968లో వియత్నాంలో దురాక్రమణ, మారణకాండలకు వ్యతిరేకంగా విద్యార్థులు జరిపిన ఆందోళనకు, ఇప్పుడు గాజాలో జరుపుతున్న ఇజ్రాయెల్‌ మారణకాండకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి విద్యార్థిలోకం గళమెత్తటానికి గల పోలికలు చర్చలోకి వచ్చాయి. అప్పుడూ ఇప్పుడూ ఆందోళన కాలేజీ ప్రాంగణాల్లోనే ప్రారంభమైంది.నాడూ నేడు పోలీసులను పిలిపించి అణచివేతకు పాల్పడ్డారు.నవతరం-పాతవారి మధ్య కొన్ని సైద్దాంతిక విబేధాలు గతంలోనూ వర్తమానంలోనూ ఉన్నాయి. నిజానికి ఇవి పెద్ద అంశాలు కావు. ఫ్రెంచి వలస ప్రాంతంగా ఉన్న ఇండోచైనాను రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ ఆక్రమించింది. అది ఓడిన తరువాత తిరిగి ఫ్రాన్సు ఆక్రమించిన వియత్నాంలో విముక్తి పోరాటం కారణంగా 1954లో స్వాతంత్య్రం వచ్చింది. ఉత్తర, దక్షిణ వియత్నాంలుగా దాన్ని విభజించారు. ఫ్రెంచి పాలకులు తప్పుకున్న తరువాత దక్షిణ వియత్నాం కేంద్రంగా అమెరికా రంగంలోకి వచ్చి ఉత్తర వియత్నాంను ఆక్రమించేందుకు, దక్షిణ వియత్నాంలో విముక్తి పోరాటాన్ని అణచేందుకు చూసింది. స్వతంత్ర పాలస్తీనాను రెండవ ప్రపంచ యుద్దం తరువాత రెండుగా చీల్చి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేశారు. ఆ వెంటనే పాలస్తీనా ప్రాంతాలను పశ్చిమదేశాల మద్దతుతో అది అక్రమించి ఇప్పటి వరకు పాలస్తీనా స్వతంత్రదేశం ఏర్పడకుండా అడ్డుకుంటున్నది. నాడు వియత్నాంలో 5.36లక్షల మంది అమెరికన్‌ సైనికులు ఉన్నారు.నేడు ఇజ్రాయెల్‌లో కొద్ది మంది ఉన్నప్పటికీ వారు దాడులలో భాగస్వాములు కావటం లేదు. వియత్నాంలో దాదాపు అరవై వేల మంది అమెరికా సైనికులు మరణించారు, మూడు లక్షలకు పైగా గాయపడ్డారు. తమ సైనికుల ప్రాణనష్టం సాధారణ అమెరికన్లను కలచివేసింది. పాలస్తీనాలో ఒక్క అమెరికనూ చావలేదు, గాయపడలేదు. అయినప్పటికీ మానవత్వానికి ముప్పు తెచ్చిన కారణంగా విద్యార్థులు వీధుల్లోకి రావటం చైతన్యానికి నిదర్శనం.రాఫాలో దాడులను అడ్డుకోవటంలో విఫలమైన తమ ప్రభుత్వం మీద విద్యార్థులు మరింతగా వీధుల్లోకి వస్తారా , ఏం జరగనుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దొంగ డబ్బు కేసు : కేరళ బిజెపి నేతలను కాపాడుతున్న ఇడి !!

11 Saturday May 2024

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

APP, BJP, ED and IT, Kerala BJP, Kerala CPI(M), Kodakara Black Money Heist, Narendra Modi, RSS, The Enforcement Directorate


ఎం కోటేశ్వరరావు


కేేరళ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌, ఇతర బిజెపి నేతల ప్రమేయంపై ఆరోపణలు ఉన్న హవాలా కేసులో వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ రాష్ట్ర ఆమ్‌ఆద్మీ పార్టీ అధ్యక్షుడు వినోద్‌ మాథ్యూ విల్సన్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) ద్వారా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. కేసు ఇంకా దర్యాప్తులో ఉన్నందున దాన్ని అనుమతించవద్దని ఇడి న్యాయవాదులు కోర్టును కోరింది. ఆమ్‌ ఆద్మీనేత కోరికపై తీర్పును రిజర్వుచేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. దోపిడీ, దొంగతనం వంటి ఆరోపణలతో ఈ కేసులో దాఖలైన ప్రాధమిక ఎఫ్‌ఐఆర్‌ను ఇడి కోర్టుకు సమర్పించింది. 2021లో తాము జరిపిన ప్రాధమిక దర్యాప్తు గురించి కూడా కోర్టుకు తెలిపింది.ప్రాధమిక ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించిన అంశాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్టును 2023లో తెరిచి దర్యాప్తు చేస్తున్నట్లు ఇడి పేర్కొన్నది. ఇప్పటికే తాము అనేక మందిని ప్రశ్నించి వారు చెప్పిన అంశాలను నమోదు చేశామని, డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది అన్న అంశాలను దర్యాప్తు చేస్తున్నామని, సమగ్రంగా దర్యాప్తు జరిపి తరువాత నివేదిక సమర్పిస్తామని చెప్పింది. రాష్ట్ర పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలన్నింటి మీద తాము దర్యాప్తు జరపలేమని ఇడి వాదించింది. పిటీషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించిన అంశాలలో హవాలా మార్గం ద్వారా 2021 ఎన్నికల కోసం బిజెపికి సంబంధించిన వారు డబ్బుతెచ్చినట్లు రిపోర్టులో పేర్కొన్నారని, కానీ దీని గురించి ఇంకా దర్యాప్తు చేస్తున్నట్లు ఇడి పేర్కొన్నదని, మూడు సంవత్సరాల తరువాత కూడా ఎలాంటి చర్యలు లేవని హవాలా గొలుసు గురించి ఉపా చట్టం కింద ఇడి మరియు ఎన్‌ఐఏ దర్యాప్తు జరపాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ కోరింది.


వాద ప్రతివాదనల సందర్భంగా విచారణ జరిపిన విచారణ బెంచ్‌లోని న్యాయమూర్తి గోపీనాధ్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర్ర పోలీసు లేదా సిబిఐ వంటి సంస్థలు ఒక నేరంపై ఎఫ్‌ఐఆర్‌ సమర్పించిన తరువాత ఇడి పాత్ర ఏమిటని ప్రశ్నించారు.” సిబిఐ లేదా మరేదైనా కావచ్చు వాటి ఎఫ్‌ఐఆర్‌లను పక్కన పెట్టి దర్యాప్తు జరిపేందుకు వాటి మీద ఉన్న సంస్థ ఇడి కాదు. వారి పని రెండు అంశాలకే పరిమితం ఒకటి విదేశీ మారక ద్రవ్య యాజమాన్య చట్టం(ఫెమా) రెండవది మనీలాండరింగ్‌ నిరోధ చట్టం(పిఎంఎల్‌ఏ). ఒక కేసులో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లో అది గానీ ఇది గానీ ఉందా అన్నది, ఉంటే వాటిని ఉపయోగించటం తప్ప ఒక దర్యాప్తు సంస్థ మాదిరి దర్యాప్తు చేయటానికి ఇడి దర్యాప్తు సంస్థ కాదు.పిఎంఎల్‌ఏ కింద ఆస్తులను స్వాధీనం చేసుకోవటం లేదా పోయిన వాటిని స్వాధీనం చేసుకోవటానికి మించి సదరు చట్టంలో ఇంకా ఏమైనా ఉందా అన్నది కోర్టుకు చెప్పండి. మీరు ఉన్న దర్యాప్తు సంస్థలకు అతీతమైన ఉన్నత దర్యాప్తు సంస్థకాదు అని న్యాయమూర్తి అన్నారు.


కేరళ అసెంబ్లీ 2021ఎన్నికల్లో అనూహ్య విజయం సాధిస్తామని, వీలైతే అధికార చక్రం తిప్పుతామని కేరళ బిజెపినేతలు ఢిల్లీ పెద్దలకు త్రిడి సినిమా చూపించారు. దాంతో పక్కనే ఉన్న కర్ణాటకలో అధికారంలో ఉన్న బిజెపి పెద్దలు కోరినంత నల్లధనాన్ని పంపారు. త్రిస్సూరు జిల్లాలో కొడక్కర పోలీస్‌ స్టేషన్‌లో ఏప్రిల్‌ ఏడవ తేదీన అంటే ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు ఒక క్రిమినల్‌ కేసు నమోదైంది. ఏప్రిల్‌ మూడవ తేదీన కోజికోడ్‌ నుంచి కొచ్చి వస్తున్న తన కారును కొడక్కర వంతెన మీద నిలిపి కొందరు దుండగులు పాతిక లక్షల రూపాయలను దోచుకొని, కారును కూడా అపహరించినట్లు షంజీర్‌ షంషుద్దీన్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పోలీసులు తీగలాగితే అది అంతర్జాతీయ లేదా కర్ణాటక నుంచి వచ్చిన హవాలా సొమ్ము అనే అనుమానం వచ్చింది. సొమ్ము పాతిక లక్షలు కాదు మూడున్నర కోట్లుగా తేలింది ఒక ఘటనలోనే ఇంత వుంటే ఎన్నికల్లో మొత్తంగా ఎంత తెచ్చి ఉంటారన్నది ఊహించుకోవాల్సిందే. రెండు స్ధానాల్లో పోటీ చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ హెలికాప్టర్లలో తిరిగారంటే ఏ స్ధాయిలో డబ్బు ఖర్చు చేసి ఉంటారో చెప్పనవసరం లేదు. దీనికి సంబంధించి త్రిస్సూర్‌ జిల్లాలో బిజెపిలో రెండు ముఠాల మధ్య వివాదం కత్తిపోట్ల వరకు వెళ్లింది. తరువాత ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రిషి పలపును పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ నేతలు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తొలుత ఆ సొమ్ముతో తమకెలాంటి సంబంధం లేదని బిజెపి నేతలు బుకాయించారు. ఇప్పటికే ఎన్నికల కోసం పార్టీకి వచ్చిన సొమ్ము పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు అందాయి. కొడక్కర ఉదంతం గురించి పార్టీ రాష్ట్రనేతలు రెండుగా చీలిపోయారు. పార్టీలోని కుమ్ములాటల కారణంగానే ఈ ఉదంతం బయటికి వచ్చిందన్నది స్పష్టం. సురేంద్రన్‌కు అనుకూలంగా లేని వారికి ఆకుల్లోనూ అయిన వారికి కంచాల్లోనూ వడ్డించారన్నది తీవ్ర ఆరోపణ. కొందరికి కోట్లలో ఇస్తే మరికొందరికి లక్షల్లోనే ఇచ్చారనే ఫిర్యాదులు కేంద్ర పార్టీకి పంపారు. ప్రచార బాధ్యతలను నిర్వహించింది ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు కావటం, కేంద్ర ప్రతినిధులు రాష్ట్రంలో తిష్టవేసినప్పటికీ ఈ పరిణామాలను గమనించలేదా లేక వారు కూడా కుమ్మక్కై నిధులను బొక్కారా అన్నది అప్పుడు జరిగిన చర్చ. ఇదిలా ఉండగా ఈ దొంగడబ్బు కేసులో సురేంద్రన్‌ ప్రకటనను నమోదు చేయనున్నట్లు అప్పుడు రాష్ట్ర పోలీసులు నిర్ణయించారు.ఈ మేరకు పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.అలపూజ జిల్లా బిజెపి నేత చెప్పిన అంశాల ప్రకారం నల్లధనాన్ని రాష్ట్రానికి తెచ్చిన వ్యక్తి ఎవరో బిజెపి రాష్ట్రనేతలకు తెలుసు, పంపిణీ గురించి కూడా తెలియచేశారని పేర్కొన్నారు.


ధర్మరంజన్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త దొంగడబ్బును ఎవరికి ఎంత, ఎలా పంపిణీ చేసిందీ పోలీసులకు చెప్పాడు. ఆ మేరకు అనేక మంది బిజెపి నేతలు, వారి బంధువులను పోలీసులు ప్రశ్నించారు. కోజికోడ్‌, కన్నూరు జిల్లాలకు చెందిన నేతలు ఎక్కువ మంది ఉన్నారు. అతను కరపత్రాల పంపిణీ బాధ్యతను చూస్తున్నందున ఒక హౌటల్లో రూము ఏర్పాటు చేశామని బిజెపి నేతలు బుకాయించారు. నిజానికి అది డబ్బు పంపిణీ కేంద్రంగా పని చేసినట్లు ఆరోపణ. అతను ఎప్పుడూ ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయలేదని తేలింది. కొడకరలో అతని కోసం కోజికోడ్‌ నుంచి వచ్చిన కారులో దొంగ సొమ్ము తప్ప ఎన్నికల సామగ్రి లేదు. ఈ కేసులో ఇద్దరు సహ నిందితులను పోలీసులకు ఫిర్యాదు అందక ముందే బిజెపి నేతలు పార్టీ ఆఫీసుకు పిలిపించి వారు విచారణ చేసినట్లు వెల్లడైంది. త్రిస్సూర్‌ జిల్లా బిజెపి అధ్యక్షుడు కెకె అనీష్‌ కుమార్‌ ఈ విషయాన్ని పోలీసుల ముందు అంగీరించారు.
ఈ కేసులో ఇడి వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉంది. ఢిల్లీ మద్యం కేసులో ఇడి అరెస్టు చేసిన నిందితులు చెప్పిన అంశాల ఆధారంగా ముఖ్యమంత్రి కేజరీవాల్‌, కల్వకుంట్ల కవిత తదితరులను అరెస్టు చేసి బెయిలు రాకుండా అడ్డుపడుతున్నది. అదే ఒక రాష్ట్ర పోలీసుశాఖ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నది. పట్టుబడిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది అన్న అంశం తేల్చటానికి మూడు సంవత్సరాలు దాటినా ఇంకా దర్యాప్తు జరుపుతూనే ఉన్నామని చెప్పటం అసమర్ధత లేదా ఆ కేసులో ప్రమేయం ఉన్న బిజెపి నేతలు, వారికి నిధులు ఇచ్చిన వారిని రక్షించేందుకు వీలైనంత వరకు కాలయాపన చేయటం తప్ప మరొకటి కాదు. ఇడి కొందరి పట్ల దయగల దేవత, మరికొందరి పట్ల వేధించే దయ్యం మాదిరిగా మారిందన్నది ఈ కేసులో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాధమిక ఆధారాలు, డబ్బు రవాణా చేసిన వారి వివరాలు ఉన్నప్పటికీ ఇంత చిన్న కేసును కూడా సంవత్సరాల తరబడి పరిష్కరించలేని దుస్థితిలో ఇడి ఉందా ?


బిజెపికి అనుకూలంగా ఇడి, ఐటి పని చేయటంలో భాగంగానే త్రిసూర్‌లో తమ పార్టీ బాంకు ఖాతాలను స్థంభింపచేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌ విమర్శించారు. సిపిఎం ఎన్నికల పనిని దెబ్బతీసేందుకే ఇలా చేశారని అన్నారు. పార్టీకి దేశవ్యాపితంగా ఒకే పాన్‌ నంబరు ఉందని, ఆదాయపన్ను సంబంధిత వివరాలను ఆ శాఖకు సమర్పించినప్పటికీ అక్రమంగా ఐటిశాఖ తనకు లేని అధికారాన్ని ఉపయోగించి ఖాతాను నిలిపివేసిందన్నారు.తమ ఖాతాలున్న బాంకు సిబ్బంది వేరే పాన్‌ నంబరు నమోదు చేసినకారణంగా అనవసర చర్చ ఎందుకని తాము మౌనంగా ఉన్నామని, తమ సిబ్బంది చేసిన తప్పిదాన్ని అంగీకరిస్తూ సదరు బాంకు తమకు ఒక లేఖ కూడా రాసిందని గోవిందన్‌ చెప్పారు. బాంకు తప్పిదం వెల్లడైన తరువాత కూడా తమ ఖాతాల స్థంభన కొనసాగించటం వేధింపు గాక ఏమిటని ప్రశ్నించారు. తప్పుడు పాన్‌ నంబరును ఆధారం చేసుకొని త్రిసూర్‌ జిల్లా పార్టీ కార్యదర్శిని విచారణ పేరుతో వేధించారని, పాన్‌ నంబరు గురించి వివరించినా పట్టించుకోలేదన్నారు.ఈ విచారణను మీడియా పెద్దఎత్తున సిపిఎంకు వ్యతిరేక ప్రచారానికి వాడుకుందని అన్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కుటుంబ సభ్యులతో కలసి విదేశీ పర్యటన చేయటాన్ని కాంగ్రెస్‌, బిజెపి నేతలు వివాదాస్పదం కావించారు. పర్యటన వివరాలను రహస్యంగా ఉంచారని, అందుకయ్యే ఖర్చును ఎవరు భరించాలో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. మిగతా రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా బిజెపిని మంచిచేసుకొనేందుకే విదేశాలకు వెళుతున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. పర్యటన పూర్తిగా కుటుంబపరమైందని, ఖర్చంతా వారే భరిస్తారని సిపిఎ స్పష్టం చేసింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పేరు మార్చం, ఎర్రజెండాను వదలం అన్నఆస్ట్రియా కమ్యూనిస్టులు !

28 Sunday Apr 2024

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ Leave a comment

Tags

Austria Communist Party, Communist history, Communist mayor of Graz Elke Kahr, Communist Party of Austria (KPÖ)


ఎం కోటేశ్వరరావు


సోవియట్‌ యూనియన్‌ పతనం కాగానే అనేక దేశాల్లో కమ్యూనిస్టులు కొందరు ఎర్ర జెండాలను పక్కన పడేశారు, మరికొన్ని చోట్ల పేర్లు మార్చుకున్నారు.కమ్యూనిస్టు గతానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదంటూ అదే పేరును కొనసాగించిన వాటిలో మధ్య ఐరోపాలోని ఆస్ట్రియన్‌ కమ్యూనిస్టు పార్టీ ఒకటి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీకి వస్తున్న ఆదరణను చూసి పేరు మార్చుకుంటే ఇంకా ఎక్కువ మద్దతు పెరుగుతుందేమో అన్న ఆశతో కొందరు మరోసారి ఆ ప్రస్తావనను చేసిన పూర్వరంగంలో అలాంటి మార్పు అవసరం లేదని పార్టీ చరిత్రకారుడు మాన్‌ఫ్రెడ్‌ మగ్రార్‌ తాజాగా జాకోబిన్‌ పత్రిక ఇంటర్వ్యూలో పునరుద్ఘాటించాడు. ఆటుపోట్లను ఎదుర్కొన్న వాటిలో ఆస్ట్రియన్‌ కమ్యూనిస్టు పార్టీ (కెపిఓ) ఒకటి.ఐరోపాలో మరోమారు కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడుతున్న నేపధ్యంలో ఎన్నికలలో ఆస్ట్రియన్‌ కమ్యూనిస్టులు పొందిన విజయాలను చూసిన తరువాత పార్టీ పేరు మార్చాలని కొందరు కోరారు.2021లో జరిగిన ఎన్నికలలో దేశంలో రెండవ పెద్ద పట్టణమైన గ్రాజ్‌ మేయర్‌గా పార్టీ నాయకురాలు ఎకె కాహర్‌ ఎన్నికయ్యారు.ఆమె 2023 ప్రపంచ ఉత్తమ మేయర్‌గా ఎన్నికైంది. తాజాగా నాలుగో పెద్ద నగరమైన సాల్జ్‌బర్గ్‌లో కమ్యూనిస్టు అభ్యర్ది కే మైఖేల్‌ డాంకల్‌ ఉప మేయర్‌గా గెలిచాడు. అక్కడి నిబంధనల ప్రకారం ప్రత్యక్ష ఎన్నికలలో 50శాతం పైగా ఓట్లు తెచ్చుకున్నవారు మేయర్‌గా, రెండోవారు ఉపమేయర్‌ అవుతారు. మార్చినెల పదిన జరిగిన ఎన్నికల్లో సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధికి 29.4, డాంకల్‌కు 28శాతం ఓట్లు వచ్చాయి. గెలుపుకు అవసరమైన 50శాతంపైగా ఓట్లను తెచ్చుకోవటంలో బహుముఖ పోటీలో ఎవరూ లేకపోవటంతో తొలి రెండు స్థానాల్లో ఉన్న వారి మధ్య మార్చి 24వ తేదీన తుది ఎన్నిక జరిగింది. దానిలో డాంకల్‌కు 36.9శాతం ఓట్లు వచ్చాయి. కమ్యూనిస్టు వ్యతిరేక పార్టీలు సోషల్‌ డెమోక్రటిక్‌ అభ్యర్దికి మద్దతు ఇవ్వటంతో 63.1శాతం ఓట్లతో మేయర్‌గా గెలిచాడు.ఆస్ట్రియా జనాభా 90లక్షలు.మితవాదశక్తులదే ఆధిపత్యం.అయినప్పటికీ కమ్యూనిస్టులకు మద్దతు పెరగటం ఒక మంచి పరిణామం.సాల్జ్‌బర్క్‌ రాష్ట్ర ఎన్నికలలో 2018లో కేవలం 0.4శాతం ఓట్లు తెచ్చుకున్న పార్టీ ఇటీవల 2023లో 11.7శాతానికి పెంచుకుంది. అదే సాల్జ్‌బర్గ్‌ నగరంలో చూస్తే 21.5శాతం వచ్చాయి. అక్కడ ఈ ఏడాది మున్సిపల్‌ ఎన్నికల్లో 28శాతానికి పెరిగాయి. రెండోదశ ముఖాముఖీ పోటీలో 36.9శాతం వచ్చాయి. అంతకు ముందు తొలిదఫా జరిగిన ఎన్నికల్లో నగర కౌన్సిల్లో అంతకు ముందు ఉన్న ఒక స్థానం నుంచి పదికి పెంచుకుంది. మేయర్‌గా గెలిచిన పార్టీకి వచ్చింది పదకొండు మాత్రమే. మరో రెండు చిన్న నగరాల్లో కమ్యూనిస్టులకు మూడు సీట్లు వచ్చాయి. ఆస్ట్రియాలో అందరికీ తెలిసిన పెద్దదైన వియన్నా నగరంతో సహా మొత్తం రాష్ట్ర రాజధానుల నగరాలు తొమ్మిది ఉన్నాయి. ఆస్ట్రియాలో ఇండ్లు పెద్ద సమస్యగా ఉన్నాయి. కమ్యూనిస్టులు దాని మీద ప్రధానంగా కేంద్రీకరించారు.ఈ ఏడాది జరిగే జాతీయ పార్లమెంటు ఎన్నికల్లో కనీసమైన ఐదుశాతానికి మించి ఓట్లు సాధించి 1959 తరువాత తొలిసారిగా ప్రాతినిధ్యం పొందేందుకు కమ్యూనిస్టులు కృషి చేస్తున్నారు.


ఈ క్రమంలోనే పేరు మార్చుకుంటే జనం ఆదరణ పెరుగుతుందనే సూచనలు ఎక్కువగా వస్తున్నాయి. కమ్యూనిస్టులంగానే ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేశామని తమ గురించి తెలిసే జనం తమకు ఓట్లు వేస్తున్నారని పార్టీ నేతలు స్పష్టం చేశారు.పార్టీ చరిత్రకారుడు మాన్‌ఫ్రెడ్‌ మగ్రార్‌ తాజాగా జాకోబిన్‌ పత్రిక ఇంటర్వ్యూలో చెప్పిన అంశాల సారాంశం ఇలా ఉంది. ఎన్నికల్లో కమ్యూనిస్టులకు ఆదరణ పెరగటాన్ని కార్పొరేట్‌ మీడియా తీవ్రంగా పరిగణిస్తున్నది. కమ్యూనిస్టులు నియంతలను ఆరాధిస్తారని, ఎన్నికైన కమ్యూనిస్టులు తమకు వచ్చే వేతనాలను విరాళాలుగా ఇవ్వటం జనాకర్షకం తప్ప మరొకటి కాదని, గతంలో జరిగిన కమ్యూనిస్టు అకృత్యాలను సమర్దిస్తారంటూ విష ప్రచారం చేస్తున్నది. గ్రాజ్‌ కమ్యూనిస్టు మేయర్‌ కాహర్‌ను 2022లో ఇంటర్వ్యూ చేసిన ఒక ప్రధాన పత్రిక సంపాదకుడు సగం సమయాన్ని బెలారస్‌, పుతిన్‌, టిటో,లెనిన్‌ల గురించి అడగటానికే వెచ్చించాడు.దాన్ని ప్రసారం చేసిన తరువాత వీక్షకుల నుంచి వెల్లడైన నిరసనతో క్షమాపణలు చెప్పటాన్ని మరచిపోలేము. అయినప్పటికీ తరువాత కూడా అదే ధోరణి కొనసాగుతోంది. గతంలో పార్టీ అనుసరించిన వైఖరిని ఎక్కడా దాచుకోవటం లేదు. నాజీ నియంతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు చేసిన త్యాగాలను దాచలేరు.అయితే రెండవ ప్రపంచ యుద్దం తరువాత సోవియట్‌ యూనియన్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలతో కమ్యూనిస్టు పార్టీ సంబంధాల కారణంగా ఆస్ట్రియన్‌ కమ్యూనిస్టు పార్టీ త్యాగాలు జనం దృష్టిలో మరుగునపడ్డాయి.సోషలిస్టు వ్యవస్థలున్న దేశాల్లో జరిగిన పరిణామాల పట్ల ముఖ్యంగా సోవియట్‌ యూనియన్‌ గురించి విమర్శనాత్మక వైఖరిని తీసుకోకపోవటం ఆస్ట్రియన్‌ కమ్యూనిస్టు పార్టీకి ఒక సమస్యగా మారింది. ప్రచ్చన్న యుద్ధకాలంలో జనం నుంచి దూరం చేసింది. కార్మిక, సామాజిక ఉద్యమాల్లో రోజువారీ పని చేయటం కూడా కష్టంగా మారింది.


1990 దశకం నుంచి (సోవియట్‌, ఇతర తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాల పతనం తరువాత) గతంలో అనుసరించిన వైఖరి మీద విమర్శనాత్మక సమీక్షలు జరిగాయి. దాని గురించి అన్ని అంశాలను పార్టీ ప్రచురించింది.వీటిని మితవాద శక్తులు, మీడియా పరిగణనలోకి తీసుకోకపోవటం అంటే వారికి బురద చల్లటం తప్ప వాటి పట్ల ఆసక్తి లేదు.పాత కమ్యూనిస్టు వ్యతిరేకత నుంచి బయటపడటం లేదు.ఇటీవలి ఎన్నికల విజయాల తరువాత పార్టీ గురించి ఆసక్తి వెల్లడిస్తున్న ”వామపక్ష ఉదారవాదులు ” కూడా పార్టీ ఆత్మవిమర్శను పరిగణనలోకి తీసుకోవటం లేదు. కమ్యూనిస్టు వ్యతిరేకత ప్రచ్చన్న యుద్దానికి ముందే అనేక మార్పులకు లోనైంది. ఇప్పుడు గ్రాజ్‌,సాల్జ్‌బర్గ్‌ నగరాల్లో 30శాతం జనం ” కమ్యూనిస్టు ” పేరు చూసి భయపడటం లేదని రుజువైంది. ఇప్పుడు ఆస్ట్రియన్‌ కమ్యూనిస్టు పార్టీ అనుసరిస్తున్న నిర్దిష్ట విధానాలు, అభ్యర్ధుల విశ్వసనీయతనే జనం చూస్తున్నారు. ప్రచ్చన్న యుద్ద కాలం నాటి కమ్యూనిస్టు వ్యతిరేక పడికట్టు పదాలు,దుర్భ్రమలు ఇప్పుడు లేవు. కమ్యూనిస్టులు జాతీయ పార్లమెంటులో అడుగుపెట్టిన తరువాత జర్నలిస్టులు, వ్యాఖ్యాతలు కూడా గుర్తించుతారు. అత్యంత కష్ట కాలంలోనే పార్టీపేరులో కమ్యూనిస్టు పదాన్ని తొలగించలేదు. గతంలో పార్టీలో కూడా అంతర్గతంగా పేరు మార్పు గురించి మాట్లాడిన వారు ఇప్పుడు మౌనంగా ఉన్నారు.చారిత్రక నేపధ్యం, అనేక అంశాలను చర్చించిన తరువాత పార్టీ పేరు మార్చాల్సిన అవసరం లేదని భావించుతున్నాము.కొన్ని సోషలిస్టు దేశాలతో కొన్ని సమస్యలున్నప్పటికీ పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం సోషలిజం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదన్న సానుకూల అభిప్రాయం జనంలో కూడా ఉంది, కమ్యూనిస్టులు దాన్నేమీ దాచటం లేదు అని మాన్‌ఫ్రెడ్‌ మగ్రార్‌ చెప్పాడు.


పలుచోట్ల రివల్యూషనరీ కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు !
దశాబ్దాల తర్జనభర్జనల తరువాత అనేక దేశాలలో రివల్యూషనరీ కమ్యూనిస్టు పేరుతో మరో కొత్త పార్టీ అవతరించింది.దాని విధానాలు, సిద్దాంత వైఖరులు ఎలా ఉండేది ఇంకా వెల్లడి కావాల్సి ఉన్నప్పటికీ కమ్యూనిజానికి కాలం చెల్లిందని ప్రచారం చేస్తున్న రోజుల్లో మరో పార్టీ ఉనికిలోకి రావటం చిన్న విషయమేమీ కాదు. ఈ పార్టీ గురించి పత్రికల్లో రాజకీయ, మీడియా వర్గాల్లో గందరగోళం, ఆగ్రహం వెల్లడైంది. కమ్యూనిస్టు పార్టీని ఆహ్వానిస్తే అనుమానించాలిగాని పాలకవర్గాలు వ్యతిరేకించాయంటే మంచిదే. ”అంతర్జాతీయ మార్క్సిస్టు ధోరణులు” (ఐఎండి) అనే సంస్థకు చెందిన వారు వివిధ దేశాలలో పార్టీ శాఖలను ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు.త్వరలో ప్రధమ మహాసభలు జరిపేందుకు నిర్ణయించారు. లెనిన్‌ బోధనలను తాము అధ్యయనం చేస్తున్నామని, వాటి ఆధారంగా విధానాలు, వైఖరులు నిర్ణయించకుంటామని చెబుతున్నారు. మీరు కమ్యూనిస్టా ? మనకు విప్లవం కావాలి అనే పేరుతో ఐఎండి నలభై దేశాలలో ఇంటర్నెట్‌ ద్వారా ప్రచారం చేసి యువతరాన్ని ఆకర్షించేందుకు ప్రయత్నించింది. ఫ్రాజర్‌ సంస్థ బ్రిటన్‌,అమెరికా,ఆస్ట్రేలియా,కెనడాలలో ఒక సర్వే నిర్వహించిందని, ఆయా దేశాలలోని 18-34 సంవత్సరాల యువతను ప్రశ్నించగా వరుసగా 29,20,18,13శాతాల చొప్పున సరైన ఆర్థిక వ్యవస్థ కమ్యూనిజంలో ఉంటుందని భావించినట్లు వెల్లడైందని, ఇతర దేశాల్లో సర్వే చేసినా ఇదే మాదిరి ఉంటుందని, అన్ని ఖండాలలో మిలియన్ల మంది కమ్యూనిస్టులు ఉన్నట్లు దీని అర్ధమని ఐఎండి పేర్కొన్నది.కమ్యూనిస్టు భావజాలాన్ని అంగీకరించటంతో సరిపోదని కారల్‌ మార్క్స్‌ చెప్పినట్లు పెట్టుబడిదారీ విధానాన్ని తొలగించి కమ్యూనిస్టు వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఒక పార్టీ అవసరమన్న అవగాహన మేరకు అలాంటి పార్టీని అనేక దేశాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఐఎండి పేర్కొన్నది.


సోషలిస్టు దేశాల్లో మత స్వేచ్చ !
సోషలిస్టు దేశాలు మతాన్ని అణచివేస్తాయన్నది ప్రపంచంలో ఒక తప్పుడు ప్రచారం. కమ్యూనిస్టులు ఏ దేశంలోనూ ఒక చర్చి, మసీదు, గుడిని కూల్చివేసిన చరిత్ర లేదు. మతాలకు చెందిన అనేక చారిత్రక కట్టడాలను ప్రతి చోటా పరిరక్షించుతున్నారు తప్ప పడగొట్టటం లేదు.దోపిడీ వర్గాలు మతాన్ని ఒక మత్తు మందుగా మార్చి జనాన్ని చైతన్య రహితంగా ఉంచుతాయని కమ్యూనిస్టులు నమ్ముతారు. ప్రచారం చేస్తారు, కమ్యూనిస్టులుగా ఉన్నవారు మతాలకు దూరంగా ఉండాలని చెబుతారు తప్ప జనం మీద బలవంతం చేయరు. శాస్త్రీయ ఆలోచనలను పెంపొందిస్తారు. పార్టీలో సభ్యులుగా చేర్చుకొనే అర్హతల్లో మతాన్ని పాటిస్తున్నారా లేదా అనేది ఉండదు. ఒకసారి పార్టీలో చేరిన తరువాత భౌతిక వాదులుగా వారిని మార్చేందుకు చూస్తారు. ఎక్కడైనా అలాంటిది జరగటం లేదంటే స్థానిక నాయకత్వాల లోపం తప్ప మరొకటి కాదు. కమ్యూనిస్టుల మీద ఉన్న అనేక తప్పుడు ప్రచారాలు, అపోహలను తొలగించుకుంటూ మత సంస్థలు కమ్యూనిస్టు దేశాలతో సంబంధాల కోసం చూస్తున్నాయి. తాజాగా వాటికన్‌ పెద్దలు సోషలిస్టు వియత్నాంతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకొనేందుకు పూనుకున్నారు. మత సంస్థల మీద అనేక నియంత్రణలు ఉన్న దేశాల్లో వియత్నాం ఒకటి. రాజ్యాన్ని కూలదోసే ఒక సాధనంగా మతాన్ని, మతావలంబలకును మార్చేందుకు, జనం మధ్య విభజనలు తెచ్చేందుకు చేసే యత్నాలను ఏ దేశమూ అంగీకరించదు.


వియత్నాం జనాభాలో ఆరుశాతం మంది కాథలిక్కులు ఉన్నారు. అక్కడ మతాన్ని అవలంభిస్తున్నట్లు చెప్పుకున్న మొత్తం జనాభా పన్నెండుశాతం ఉన్నట్లు 2019లెక్కలు వెల్లడించాయి. వాటికన్‌ విదేశాంగ మంత్రి ఆర్చిబిషప్‌ పాల్‌ రిచర్డ్‌ గలాఘర్‌ నాయకత్వంలో ఒక బృందం ఏప్రిల్‌లో ఆరు రోజుల పాటు పర్యటించింది. ఈ ఏడాది పోప్‌ ఫ్రాన్సిస్‌ కూడా పర్యటనకు వస్తారన్న వార్తల పూర్వరంగంలో వారు వచ్చారు. వియత్నాంలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా క్రైస్తవమత పెద్దలు జపాన్‌, ఫ్రాన్స్‌, అమెరికాతో కలసి నిర్వహించిన ప్రజా వ్యతిరేక పాత్ర తెలిసిందే. ఈ కారణంగా వాటికన్‌ ప్రతినిధులను దశాబ్దాలుగా అక్కడికి అనుమతించటం లేదు. గతేడాది ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేసిన తరువాత వాటికన్‌ ప్రతినిధులు వచ్చారు.దశాబ్దాల తరువాత గత డిసెంబరులో వియత్నాంలో వాటికన్‌ తన శాశ్వత ప్రతినిధిని నియమించింది.ఈ ఏడాది జనవరిలో పోప్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. మత సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహించుకోవాలంటే ప్రభుత్వం దగ్గర నమోదు చేయించుకొని అనుమతి పొందాలని 2018లో ప్రభుత్వం ఒక చట్టం చేసింది. మత సంస్థల ముసుగులో విదేశాలు జోక్యం చేసుకొనే అవకాశం ఉన్న కారణంగా నిబంధనలను పటిష్టం గావించింది.
గ్రీకు కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి దిమిత్రిస్‌ కౌట్‌సౌంపస్‌ నాయకత్వంలో ఒక ప్రతినిధి వర్గం అమెరికాలోని ఆర్చిబిషప్‌ ఎపిడోఫరోస్‌ను ఏప్రిల్‌ 26న కలుసుకున్నారు. గ్రీకు అమెరికన్ల గురించి, గ్రీసులోని చర్చికి సంబంధించిన అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి.మతాధికారి అయిన కౌట్‌సౌంపస్‌ తాత 1944లో నాజీల ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడిన తీరును, ఆ వారసత్వ కొనసాగింపుగా గ్రీకు దేశం కోసం పని చేయాలని అర్చిబిషప్‌ అభిలషించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కేరళ రాజకీయం : నరేంద్రమోడీ, రాహుల్‌ గాంధీ దిగజారుడు – పినరయి విజయన్‌ హుందాతనం !!

18 Thursday Apr 2024

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, STATES NEWS

≈ Leave a comment

Tags

#Kerala CPI(M), #Pinarayi Vijayan, BJP, Kerala LDF, Kerala UDF, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


ఇతర ముఖ్యమంత్రులను వేటాడుతున్నట్లుగా బిజెపి కేరళ సిఎం పినరయి విజయన్‌ వెంట ఎందుకు పడటం లేదంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వయనాడు నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా ప్రశ్నించారు. కాషాయ పార్టీని విమర్శించే దమ్ము సిపిఎంకు ఉందా అంటూ మాట్లాడారు.ఎల్‌డిఎఫ్‌-బిజెపి కుమ్మక్కై తమను దెబ్బతీసేందుకు చూస్తున్నాయని కాంగ్రెస్‌ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఎల్‌డిఎఫ్‌-యుడిఎఫ్‌ మధ్య సంకుల సమరం సాగుతున్న కేరళలో గతంలో మాదిరి తమకు సీట్లు రావని భావిస్తున్న కాంగ్రెస్‌ ముందుగానే సాకులు వెతుకుతున్నట్లు ఈ ప్రచారం వెల్లడిస్తున్నది.నిజానికి సిపిఎంను దెబ్బతీసేందుకు గతంలో కాంగ్రెస్‌-బిజెపి అనేక చోట్ల కుమ్మక్కైన చరిత్ర ఆ పార్టీలకు ఉందని సిపిఎం అనేక సార్లు చెప్పింది. తమను విమర్శిస్తున్నంత తీవ్రంగా బిజెపిని వామపక్షాలు విమర్శించటం లేదని యుడిఎఫ్‌ ఆరోపిస్తోంది. ఇద్దరు మాజీ సిఎంల బిడ్డలు బిజెపిలో చేరి కాంగ్రెస్‌ను సవాలు చేస్తుంటే, అనేక మంది అటువైపు తొంగి చూస్తుంటే వారికి సమాధానం చెప్పలేని స్థానిక కాంగ్రెస్‌ నేతలు, రాహుల్‌ గాంధీ బిజెపిని వదలి సిపిఎం మీద ఎందుకు విరుచుకుపడుతున్నట్లు ? బిజెపి అభ్యర్ధిగా తన కుమారుడు పోటీ చేస్తున్నచోట కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారానికి వెళ్లటానికి మాజీ సిఎం ఎకె ఆంటోని ఆరోగ్యం బాగులేదని సాకు చెప్పారు. బిజెపిని గట్టిగా విమర్శిస్తే ఎవరి మీద ఏ ఇడి,ఐటి, సిబిఐని వదులుతారో అని కాంగ్రెస్‌ నేతలు భయపడుతున్నారు.మాజీ సిఎం కరుణాకరన్‌ కుమార్తె పద్మజ ఆ కారణంగానే బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే.


” ఎవరైనా బిజెపిని విమర్శిస్తే వారు సిబిఐ, ఇడి,సభ్యత్వాల రద్దు, ఆస్తుల స్వాధీనాలతో ఎదురుదాడి చేస్తారని నాకు తెలుసు.ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే కేరళ సిఎం మీద బిజెపి ఎందుకు దాడి చేయటం లేదు. ఎందుకు ఆయన సంపదలను స్వాధీనం చేసుకోలేదు, ఎందుకు సిఎం పదవిని లాగివేయలేదు, కోర్టు కేసులు ఎందుకు పెట్టలేదు, ఇడి ద్వారా ఎందుకు ప్రశ్నించలేదు, ఇప్పటికే ఇద్దరు సిఎంలు జైల్లో ఉన్నతరువాత కూడా ఎందుకు అలా చేయలేదు ” అని బిజెపిని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. మతి తప్పి రాజకీయంగా దిగజారి మాట్లాడటం తప్ప మరొకటి కాదన్నది స్పష్టం.” ఇరవై నాలుగు గంటలూ తనను విమర్శిస్తున్న కేరళ ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్న, ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న బిజెపిని ఎందుకు విమర్శించటం లేదు, కొద్ది సమయమైనా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌, నరేంద్రమోడీని విమర్శించాలి కదా ” అని రాహుల్‌ ప్రశ్నించారు.రాహుల్‌ గాంధీ ఈ స్థాయికి దిగజారి ఎందుకు మాట్లాడారన్నది ప్రశ్న.పినరయి విజయన్‌ మీద తప్పుడు కేసులు పెట్టాలని మోడీకి సలహా ఇస్తున్నట్లుగా ఉంది తప్ప మరొకటి కాదు.


కేరళ ఎన్నికలలో సిఏఏ, ఉమ్మడి పౌరస్మృతి అంశాల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్‌ సిఏఏ అంశాన్ని ఎన్నికల ప్రణాళికలో చేర్చేందుకు తిరస్కరించింది. ఈ రెండు అంశాలను ఎందుకు విస్మరిస్తున్నదని గురువారం నాడు మలప్పురం విలేకర్ల సమావేశంలో, అంతకు ముందు కూడా సిఎం పినరయి విజయన్‌ విమర్శించారు. సిఏఏ గురించి కాంగ్రెస్‌ న్యాయపత్రలో ప్రస్తావన లేదని చివరికి దీన్ని అమెరికా కూడా విమర్శించినా కాంగ్రెస్‌ మౌనంగా ఉందన్నారు. బిజెపిని సిపిఎం గట్టిగా విమర్శించటం లేదన్న కాంగ్రెస్‌ ఆరోపణ గురించి మాట్లాడుతూ ఈ అంశంలో తమకు కాంగ్రెస్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదన్నారు. సిఏఏ వ్యతిరేక నిరసనల్లో ఎంత మంది కాంగ్రెస్‌ వారి మీద కేసులు నమోదయ్యాయో రాహుల్‌ గాంధీ చెప్పగలరా అని విజయన్‌ సవాల్‌ విసిరారు. సిఏఏకు వ్యతిరేకంగా ప్రతిపక్షంతో కలసి కేరళ ప్రభుత్వం నిరసన తలపెడితే చివరిక్షణంలో కాంగ్రెస్‌ వెనక్కు తగ్గిందని, బహుశా అగ్రనేతల నుంచి వచ్చిన ఆదేశాల వల్ల కావచ్చని సిఎం అన్నారు.( జమ్మూలోని కథువాలో ఎనిమిదేండ్ల బాలిక మీద అత్యాచారం హత్య చేసిన ఉదంతం దేశంలో తీవ్ర సంచలన కలిగించిన సంగతి తెలిసిందే.) కథువా ఉదంతంలో నిందితులకు మద్దతుగా ప్రదర్శనలు చేసినవారిలో ఒకడైన బిజెపి నేత చౌదరి లాల్‌ సింగ్‌ను స్వయంగా రాహుల్‌ గాంధీ గత నెలలో కాంగ్రెస్‌లోకి ఆహ్వానించి ఇప్పుడు ఉధంపూర్‌ లోక్‌సభ అభ్యర్ధిగా నిలిపారని విజయన్‌ విమర్శించారు. సంఘపరివార్‌ను వ్యతిరేకించటంలో కాంగ్రెస్‌ గట్టి వైఖరి తీసుకోవటం లేదన్నారు. ఎన్నికల బాండ్ల కుంభకోణంలో బిజెపి ప్రధాన భాగస్వామిగా కాంగ్రెస్‌ రు.1,952 కోట్లు తీసుకొన్నదని అలాంటి పార్టీ నేత రాహుల్‌ గాంధీ ఇప్పుడు ఎన్నికల బాండ్ల గురించి లూటీ అంటూ కబుర్లు చెబుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌ విమర్శించారు.వాటికి వ్యతిరేకంగా సిపిఎం కేసు వేసిన అంశాన్ని గుర్తు చేశారు.


ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కుమార్తె వీణ నిర్వహిస్తున్న ఒక కంపెనీ అక్రమాలకు పాల్పడినట్లు ఒక కేసు నమోదైంది.దానిలో నిజానిజాలను ఆరోపించిన వారు వెల్లడించాలి, దాన్ని కోర్టు విచారించి తీర్పు చెప్పాలి. కానీ ఈ లోగానే దీన్ని రాజకీయం చేసేందుకు కాంగ్రెస్‌,బిజెపి చూస్తున్నాయి. మీడియా కూడా విజయన్‌న్ను రెచ్చగొట్టేందుకు చేయని యత్నం లేదు.” ఎన్నికల సమయం గనుక సిఎంను ఇబ్బంది పెట్టటం, మౌనంగా ఉండేట్లు చూడటం నరేంద్రమోడీ ఎత్తుగడ. కానీ సిఎం సవాలుగా తీసుకున్నారు.తన మీద నిర్దాక్షిణ్యంగా దాడి చేస్తారని పినరయికి తెలుసు. కానీ పార్టీకోసం ఆయన సహించారు ” అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడొకరు చెప్పినట్లు మళయాల మనోరమ పత్రిక రాసింది. తన కుమార్తె కంపెనీ మీద వచ్చిన ఆరోపణల గురించి త్రిసూరులో జరిపిన విలేకర్ల సమావేశంలో విజయన్‌ ఇచ్చిన సమాధానాలు విమర్శకుల నోటికి తాళం వేయటమే కాదు, ఆయన హుందాతనాన్ని వెల్లడిస్తున్నాయి.” ఒక కంపెనీ నుంచి సేవలు పొందినందుకు మరొక కంపెనీ ఇచ్చిన ఫీజు అంశమది. దాన్లో రహస్యమేమీ లేదు. అదంతా బాంకు ఖాతాల ద్వారానే జరిగింది.కంపెనీ దాఖలు చేసిన ఆదాయపన్ను పత్రాల్లో కూడా అది ప్రతిబింబించింది. దేశంలో కొత్త అంశమేమంటే పారదర్శకంగా జరిగిన లావాదేవీలను కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవచ్చని నూతన సంప్రదాయాన్ని ప్రవేశ పెట్టారు. దాని గురించి ఇంతకు మించి చెప్పాల్సిందేమీ లేదు ” అన్నారు. కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఆరోపణలు, చెప్పుకున్న గొప్పలను విలేకర్లు ప్రస్తావించగా వాటికి ఇచ్చిన సమాధానాలను చూద్దాం.


నరేంద్రమోడీ: డిపాజిటర్ల (కరువన్నూరు సహకార బాంకు) డబ్బు తిరిగి ఇచ్చినట్లు సిఎం అవాస్తవం చెబుతున్నారు.బాంకు నుంచి స్వాధీనం చేసుకున్న రు. 90 కోట్ల మొత్తాన్ని డిపాజిటర్లకు తిరిగి ఇవ్వటానికి అవకాశం ఉందా లేదా అని నేను ఇప్పటికే మాట్లాడాను.
విజయన్‌ : కరువన్నూరు డిపాజిటర్లకు రు.117 కోట్ల వరకు చెల్లించారు.డిపాజిటర్లు కోరితే ఇంకా ఇవ్వటానికి బాంకు సిద్ధంగా ఉంది.బిజెపి కోరుకుంటున్నట్లుగా బాంకు కుప్పకూలిపోలేదు.అది సాధారణ లావాదేవీలు నడుపుతున్నది.
నరేంద్రమోడీ : త్రిసూరు జిల్లా సిపిఎం కార్యదర్శికి వంద కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి.
విజయన్‌: స్థానిక శాఖల నుంచి జిల్లా కమిటీ కార్యాలయం వరకు జిల్లా అంతటా స్థలాలు, ఆఫీసులు ఉన్నాయి.వాటినే సిపిఎం జిల్లా కార్యదర్శి ఆస్తులని ప్రధాని చెప్పారు. ఇలాంటి అభాండాలు సిపిఎం వంటి పార్టీని దెబ్బతీయలేవు.
నరేంద్రమోడీ : సిపిఎం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది.
విజయన్‌: గత పది సంవత్సరాలలో బిజెపి నాయకత్వంలోని కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి.తాజా అంశానికి వస్తే ఎన్నికల బాండ్ల కుంభకోణం. దీనికి అనేక కోణాలు ఉన్నాయి.ఇంత పెద్ద అవినీతి అసాధారణ రాజకీయ సంస్కృతిలో భాగం.
నరేంద్రమోడీ : పేదలకు మూడు కోట్ల ఇళ్లు మోడీ హామీ.
విజయన్‌ : 2022 నాటికి ప్రతి ఒక్కరికీ ఇండ్లు ఇస్తామని 2019 ఎన్నికల ప్రణాళికలో బిజెపి చెప్పింది. ఈ హామీ ఏమైంది ? 2024 ప్రణాళికలో దీని గురించి మౌనం దాల్చారు. ఇక్కడ కేరళ పని తీరును చూడవచ్చు. ఇల్లులేని వారు ఎవరూ ఉండకూడదు అన్న లక్ష్యాన్ని చేరుకొనేందుకు దగ్గరగా ఉన్నాం. ఇప్పటికే 4.56 లక్షల ఇండ్లు పూర్తయ్యాయి. మరో 1.52లక్షల ఇళ్ల పని పురోగతిలో ఉంది.
నరేంద్రమోడీ : సాధించిన విజయాలుగా చెప్పుకొనేందుకు ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం దగ్గర ఏమీ లేదు. కేంద్ర పధకాలనే తన గొప్పలుగా చెప్పుకొంటోంది.
విజయన్‌ : గృహ నిర్మాణంలో కేంద్ర పాత్ర ఏమిటో విశ్లేషిద్దాం.పిఎంఏవై(గ్రామీణ) పధకం కింద 33,517 ఇళ్లకు ఒక్కోదానికి రు.72,000 మంజూరు చేసింది.పిఎంఏవై(పట్టణ) పధకం కింద ఒక్కోదానికి రు.1.5లక్షల చొప్పున 83,261 ఇళ్లకు మంజూరు చేసింది. కేరళ లైఫ్‌ మిషన్‌ పధకం కింద ఇప్పటికి దాదాపు ఐదు లక్షల ఇండ్లకు గాను రు.17,490 కోట్లు ఖర్చు చేశాము. వీటిలో కేంద్రం నుంచి వచ్చింది కేవలం రు.2,081 కోట్లు, మొత్తంలో కేవలం 11.9శాతం మాత్రమే.


కేరళ లోక్‌సభ ఎన్నికలు ఈనెల 26న జరగనున్నాయి.దేశమంతటా ముస్లింలు, క్రైస్తవుల మీద విద్వేషాన్ని రెచ్చగొడుతున్న కాషాయ దళాలు కేరళలో క్రైస్తవుల ఓట్ల కోసం చర్చీల చుట్టూ తిరుగుతున్నాయి.లవ్‌ జీహాద్‌ పేరుతో ముస్లింల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు చూస్తున్నాయి. 2019లో జరిగిన ఎన్నికలలో శబరిమల వివాదం మీద కమ్యూనిస్టు వ్యతిరేకతను పెద్ద ఎత్తున రెచ్చగొట్టారు.వ్రతం చెడ్డా భంగపడ్డారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్‌ కూటమికి 48.48శాతం, 96,29,030 ఓట్లు, 19 సీట్లు వచ్చాయి. ఎల్‌డిఎఫ్‌ కూటమికి 36.29శాతం, 71,56,387 ఓట్లు, ఒక సీటు వచ్చింది. బిజెపి కూటమికి 15.64శాతం, 31,71,792 ఓట్లు వచ్చాయి. తరువాత 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌కు 1,05,55, 516 ఓట్లు(45.43శాతం), కాంగ్రెస్‌ కూటమికి 81,96,813 ఓట్లు(39.47శాతం) రాగా బిజెపి కూటమి ఓట్లు 23,54,468(12.41శాతం) వచ్చాయి. నరేంద్రమోడీ రెండవసారి మరింత బలంగా అధికారానికి వచ్చారని, తమ బలం పెరిగిందని, అసెంబ్లీ ఎన్నికల్లో 35 సీట్లతో కింగ్‌ మేకర్‌గా మారి తాము అధికారానికి వస్తున్నట్లు బిజెపి ప్రచారం చేసుకుంది. అంతకు ముందు ఉన్న ఒక్కసీటూ పోయింది. 2016 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 2.55శాతం, 2019 పార్లమెంటు ఎన్నికలతో పోల్చితే 3.23శాతం ఓట్లు కోల్పోయింది. ఈ సారి మరోసారి ఓటర్లను మభ్య పెట్టేందుకు పూనుకుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కుక్క కాటుకు చెప్పుదెబ్బ : కేరళ స్టోరీకి పోటీగా మణిపూర్‌ చిత్రం !

14 Sunday Apr 2024

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, CPI(M), kerala 2024 loksabha elections, Kerala BJP vote Share, Kerala LDF, Kerala UDF, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


కేరళలో ఈనెల 26న జరిగే లోక్‌సభ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో సాధించిన విజయం కొనసాగింపుగా పైచేయి సాధించాలని సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ చూస్తుండగా 2019 పార్లమెంటు ఎన్నికలలో వచ్చిన సీట్లను నిలుపుకోవాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడిఎఫ్‌ కూటమి ప్రయత్నిస్తోంది. ఏదో ఒక సీటు సాధించి రాష్ట్రంలో తమకూ స్థానం ఉందని పరువు నిలుపుకొనేందుకు బిజెపి చూస్తోంది. జనసంఘం తరువాత బిజెపిగా ఉన్న పార్టీకి గతంలో ఒకసారి ఒక అసెంబ్లీ స్థానం రావటం తప్ప కేరళ నుంచి పార్లమెంటులో ప్రాతినిధ్యం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభ ద్వారా కేరళ బిజెపి నేతలు ఇద్దరికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఒక స్థానాన్ని కూడా కోల్పోయింది. ఈ ఎన్నికలలో అనూహ్యంగా కేరళ స్టోరీ పేరుతో వచ్చిన ఒక సినిమాను సంఘపరివార్‌ ప్రోద్బలంతో క్రైస్తవ మతాధికారులు ప్రదర్శిస్తున్నారు. లవ్‌ జీహాద్‌ పేరుతో కాషాయ దళాలు ముందుకు తెచ్చిన కుట్ర సిద్దాంతంతో కూడా కూడిన ఊహాజనిత చిత్రమే అది.ముస్లిం యువకులు హిందూ, క్రైస్తవ మతాలకు చెందిన యువతులకు వలపు వలవేసి మతమార్పిడికి చూస్తున్నారన్నదే ఆ చిత్ర కథ. ఇటీవల బిజెపి వైపు మొగ్గిన కొందరు క్రైస్తవ మతపెద్దలు తమ మతానికి చెందిన యువతులను హెచ్చరించే పేరుతో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. దీన్ని దూరదర్శన్‌లో కూడా ఇటీవల ప్రదర్శించారు. దీంతో ఎంత మంది బిజెపికి ఓటు వేస్తారో తెలియదు. దీనివెనుక ఉన్నవారు ఊహించని విధంగా అదే క్రైస్తవ మతానికి చెందిన వారు మణిపూర్‌లో క్రైస్తవ గిరిజనుల మీద జరుగుతున్న దాడులు, అత్యాచారాల ఉదంతాలతో రూపొందించిన ” అణచివేతకు గురైనవారి ఆక్రందన ”( క్రై ఆఫ్‌ ద అప్రెస్‌డ్‌) పేరుతో రూపొందించిన ఒక డాక్యుమెంటరీని పోటీగా ప్రదర్శిస్తున్నారు. కేరళలో 18శాతం మంది క్రైస్తవమతాన్ని అవలంభించే జనం ఉన్నారు. ముస్లింలు 26.6శాతం ఉన్నారు. మణిపూర్‌లో కుకీ తదితర గిరిజనుల మీద దాడులు జరుగుతున్నప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ ఒక్కసారి కూడా ఆ రాష్ట్రాన్ని సందర్శించి బాధితులకు ఊరటగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అక్కడ అధికారంలో ఉన్న బిజెపి హిందూమతానికి చెందిన మెయితీలకు మద్దతుగా ఉందనే విమర్శలు ఉన్నాయి.


కమ్యూనిజం, కమ్యూనిస్టు పార్టీ మీద తప్పుడు ప్రచారం చేసి కేరళలో మెజారిటీ క్రైస్తవుల ఓట్లు పొందటంలో గతంలో కాంగ్రెస్‌ ఎత్తుగడలు పారాయి. తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. అనేక చోట్ల కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు బిజెపి కూడా రంగంలోకి దిగి వారిని సంతుష్టీకరించేందుకు చర్చీల చుట్టూ చక్కర్లు కొడుతున్నది.కేరళ స్టోరీ చిత్రాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నది. అర్‌ఎస్‌ఎస్‌ అజెండాలో భాగంగానే అధికారాన్ని దుర్వినియోగం చేసి దూరదర్శన్‌లో కేరళ స్టోరీ చిత్రాన్ని ప్రదర్శించినట్లు సిపిఎం, కాంగ్రెస్‌ రెండూ విమర్శించాయి.తమకేమీ సంబంధం లేదని బిజెపి బుకాయించింది. ఓట్ల కోసం కమలనాధులు దేనికైనా సిద్దపడుతున్నారు. కేరళలో 2019లో ఇరవై స్థానాలకు గాను కేవలం ఒక్కచోటే సిపిఎం గెలిచింది. ఈ సారి పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి.శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలన్న సుప్రీం కోర్టు తీర్పును ఎల్‌డిఎఫ్‌ సమర్ధించింది. దానికి తోడు కేంద్రంలో రెండవసారి నరేంద్రమోడీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే సమర్ధవంతంగా ఎదుర్కోగలిగింది కాంగ్రెస్‌ మాత్రమే అని జనం నమ్మటం, వయనాడు నుంచి పోటీ చేస్తున్న రాహుల్‌ గాంధీ గెలిస్తే ప్రధాని అవుతారన్న ప్రచారం కాంగ్రెస్‌ గెలుపుకు దోహదం చేశాయి. తరువాత 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శబరిమల వివాదం ఎలాంటి ప్రభావం చూపలేదు. కేంద్రంలో బిజెపికి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమిలో సిపిఎం, సిపిఐ కూడా భాగస్వాములుగా ఉండటంతో ఎవరు గెలిచినా బిజెపిని వ్యతిరేకించే వారే గనుక గతంలో మాదిరి బిజెపిని గట్టిగా వ్యతిరేకించే ముస్లింలు కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపే అవకాశం లేదని, ఎవరు గట్టిగా నిలబడతారని భావించే వారికి ఓటు వేయనున్నారని సాధారణంగా కమ్యూనిస్టులను వ్యతిరేకించే ప్రముఖ పత్రిక మళయాళ మనోరమ ఒక సమీక్షలో పేర్కొన్నది.


ముందే చెప్పినట్లు 2019లో జరిగిన ఎన్నికలలో శబరిమల వివాదం మీద కమ్యూనిస్టు వ్యతిరేకతను పెద్ద ఎత్తున రెచ్చగొట్టారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్‌ కూటమికి (48.48శాతం) 96,29,030 ఓట్లు, 19 సీట్లు వచ్చాయి. ఎల్‌డిఎఫ్‌ కూటమికి (36.29శాతం) 71,56,387 ఓట్లు, ఒక సీటు వచ్చింది. బిజెపి కూటమికి (15.64శాతం) 31,71,792 ఓట్లు వచ్చాయి. తరువాత రెండు సంవత్సరాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌కు 1,05,55, 516 ఓట్లు(45.43శాతం), కాంగ్రెస్‌ కూటమికి 81,96,813 ఓట్లు(39.47శాతం) రాగా బిజెపి కూటమి ఓట్లు 23,54,468(12.41శాతం) వచ్చాయి. నరేంద్రమోడీ రెండవసారి మరింత బలంగా అధికారానికి వచ్చారని, తమ బలం పెరిగిందని, అసెంబ్లీ ఎన్నికల్లో 35 సీట్లతో తాము అధికారానికి వస్తున్నట్లు బిజెపి ప్రచారం చేసుకుంది. అంతకు ముందు ఉన్న ఒక్క సీటూ పోయింది. 2016 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 2.55శాతం, 2019 పార్లమెంటు ఎన్నికలతో పోల్చితే 3.23శాతం ఓట్లు కోల్పోయింది. ఇప్పుడు ఐదు సీట్లు తెచ్చుకుంటామని, పదేండ్లలో రాష్ట్రంలో అధికారానికి వస్తామని బిజెపి నేత ప్రకాష్‌ జవదేకర్‌ చెబుతున్నారు. గతంలో నరేంద్రమోడీ పలుకుబడి, శబరిమల వివాదంపై రెచ్చగొట్టుడు దానికేమీ లాభించలేదు.


శైలజా టీచర్‌పై ముగ్గురు శైలజల పోటీ ! సిఏఏ ప్రస్తావనకు భయపడిన కాంగ్రెస్‌ !!
కేరళ లోక్‌సభ ఎన్నికలు మొత్తంగా ఆసక్తి కలిగిస్తున్నప్పటికీ సిపిఎం అభ్యర్ధిగా వడకర స్థానం నుంచి పోటీ చేస్తున్న ప్రస్తుత ఎంఎల్‌ఏ కె కె శైలజ టీచర్‌ మీద అదే పేరు గలిగిన ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున పాలక్కాడ్‌ ఎంఎల్‌ఏ షఫీ పరంబి రంగంలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు చోట్ల ఎల్‌డిఎఫ్‌ ప్రతినిధులు గెలిచారు. కన్నూరు లోక్‌సభ పరిధిలోని మట్టనూర్‌ అసెంబ్లీ నుంచి కెకె శైలజ రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 61వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. తాము అధికారంలోకి వస్తే వివాదాస్పద సిఏఏ(చట్టం)ను రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళికలో దాని ఊసెత్తలేదు. ప్రశ్నించిన విలేకర్లతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సతీశన్‌ ఇంకేదైనా ప్రశ్న ఉండే అడగండని సమాధానాన్ని దాటవేశారు. పిసిసి తాత్కాలిక అధ్యక్షుడు ఎంఎం హసన్‌ మాట్లాడుతూ మేము అ చట్టాన్ని రద్దు చేయాలని ఆసక్తితో ఉన్నాం అయితే సిపిఎంను మెప్పించేందుకు దాన్ని మానిఫెస్టోలో చేర్చాల్సిన అవసరం లేదు. మార్క్సిస్టులు చెప్పినట్లు మానిఫెస్టోను రాయాల్సిన అవసరం లేదన్నారు.


కుక్కలా మొరుగుతున్నారని తండ్రిని తూలనాడిన కొడుకు !
పత్తానంతిట్ట నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కుమారుడు ఓడిపోవటం ఖాయమని, అక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ గెలుస్తుందని కేరళ మాజీ సిఎం ఏకె ఆంటోనీ చెప్పారు.కుటుంబం-రాజకీయాలు వేరు వేరని తాను తొలి నుంచి చెబుతున్నానని తన పిల్లల గురించి ఎక్కువగా అడగవద్దని అన్నారు. కాంగ్రెస్‌ నేతల పిల్లలు బిజెపిలో చేరటం తప్పిదమన్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా పత్తానంతిట్ట ప్రచారానికి వెళ్లటం లేదని అన్నారు. కేరళలో శబరిమల సమస్య ముగియటంతో బిజెపి స్వర్ణయుగం ముగిసిందని అన్నారు. తన తండ్రి చేసిన వ్యాఖ్యలపై కుమారుడు అనిల్‌ ఆంటోనీ స్పందిస్తూ గాంధీ కుటుంబం కోసం నిలబడుతున్నవారిని చూసి విచారిస్తున్నానని, కాలం చెల్లిన నేతలు మాత్రమే కాంగ్రెస్‌లో ఉన్నారని, చంద్రుడిని చూసి కుక్కలు మొరిగినట్లుగా ఈ నేతలు ప్రవర్తిస్తున్నారని అన్నారు. తండ్రి పట్ల అనిల్‌ అంటోనీ కాస్త మర్యాదను చూపాలని తిరువనంతపురం కాంగ్రెస్‌ అభ్యర్ధి శశిధరూర్‌ సలహా ఇచ్చారు. బిజెపి నేతల భాషతో తాను పోటీపడలేనన్నారు.


బిజెపి ప్రచార తీరు ఇదా !
వయనాడ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పోటీ చేస్తుండగా ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధిగా సిపిఐ జాతీయ మహిళానేత అన్నీ రాజా బరిలో ఉన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు.తాను గెలిస్తే నియోజకవర్గంలోని సుల్తాన్‌ బాతరీ పేరును గణపతి వట్టం అని మారుస్తానని ప్రచారం చేస్తున్నారు. టిప్పు సుల్తాన్‌ ఈ ప్రాంతంలోని ఒక పాడుపడిన జైన ఆలయంలో తన ఫిరంగులను ఉంచి బ్రిటీష్‌ వారి మీద యుద్ధం చేశాడు. దాంతో బ్రిటీష్‌ వారు ఆ ప్రాంతాన్ని సుల్తాన్‌ బ్యాటరీ అని పిలిచారని తరువాత అదే సుల్తాన్‌ బాతరీగా మారిందని చెబుతున్నారు. అక్కడ ఒక చిన్న గణపతి ఆలయం ఉందని, అందువలన గణపతి వట్టం అని కూడా పిలిచారని కొందరు చెబుతారు. ఇది టిప్పు సుల్తాన్‌ ప్రాంతం కాదు గనుక గణపతివట్టంగా పేరు మార్చాలని బిజెపి నేత చెప్పారు. ఎన్నికల్లో చెప్పుకొనేందుకు ఏమీలేక బిజెపి జోకులు పేలుస్తోందని కాంగ్రెస్‌ నేతలు కొందరు అపహాస్యం చేశారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం : చైనా పేర్లు ఎందుకు మార్చుతున్నది, అమెరికా ఆడుతున్న నాటకం ఏమిటి ?

13 Saturday Apr 2024

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, Left politics, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, USA, WAR

≈ Leave a comment

Tags

#Anti China, #India-China border, Aksai Chin, Arunachal pradesh, BJP, China, Chinese Names, Indo-China, Indo-China standoff, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


ఇరుగు పొరుగుదేశాలతో వివాదాలు ఉన్నపుడు అధికారంలో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది.బిజెపి నేతలు, వారిని నడిపించే సంఘపరివార్‌ సంస్థలకు చెందిన వారు నిరంతరం తమకు అనుకూలంగా ఏదో ఒక వివాదాన్ని ముందుకు తీసుకువస్తున్నారు. ఉదాహరణకు గతంలో భారత్‌-శ్రీలంక మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కచ్చాతీవు దీవిని శ్రీలంకకు అప్పగించారు. దాన్ని డిఎంకె, కాంగ్రెస్‌ మీద వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు బిజెపి ఎన్నికల సందర్భంగా ముందుకు తెచ్చింది. ఆ దీవిని వెనక్కు తీసుకొనేందుకు పదేండ్ల పాటు అధికారంలో ఉన్న నరేంద్రమోడీ ఏమైనా చేశారా ? పోనీ ఇప్పుడేదైనా కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారా అంటే అదీ లేదు. ఇదే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత ఎవరివో నిర్ధారణగాని ప్రాంతాలపై బంగ్లాదేశ్‌తో ఒప్పందం చేసుకున్నారు. 2015లో కుదుర్చుకున్న అవగాహన మేరకు 17,160 ఎకరాల విస్తీర్ణం ఉన్న లంకలు, ప్రాంతాలను బంగ్లాదేశ్‌కు అప్పగించి,7,110 ఎకరాలను మనదేశం తీసుకున్నది. దీని గురించి మాత్రం బిజెపి, మోడీ మాట్లాడరు. కచ్చాతీవు గురించి తమను విమర్శించినందుకు కాంగ్రెస్‌ ఈ అంశాన్ని ప్రస్తావించి ఈ నిర్వాకం సంగతేమిటని నిలదీసింది. ఈ రెండు ఉదంతాలు చెబుతున్న పాఠమేమిటి ? ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఇరుగు పొరుగుదేశాలతో ఇచ్చిపుచ్చుకొనే పద్దతిలో వివాదాలను పరిష్కారం చేసుకోవాలనే కదా ?


ఇక మరొక పొరుగుదేశమైన చైనా వ్యతిరేకతను కాషాయదళాలు రెచ్చగొడుతూనే ఉన్నప్పటికీ కీలక సమయాల్లో నరేంద్రమోడీ ఆచితూచి మాట్లాడుతున్నారు.కొత్తగా మన భూభాగాన్ని చైనా ఆక్రమించలేదు అని గాల్వన్‌ ఉదంత సమయంలో చేసిన ప్రకటన వాటిలో ఒకటి. తాజాగా అమెరికా పత్రిక న్యూస్‌వీక్‌తో మాట్లాడిన అంశాలు ఆలోచింపచేసేవిగా ఉన్నట్లు చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌ పేర్కొన్నది. రెండు దేశాల మధ్య సంబంధాల గురించి నరేంద్రమోడీ మృదుస్వరంతో మాట్లాడినట్లుందని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ ప్రారంభవాక్యాలతోనే తన విశ్లేషణ ప్రారంభించింది.మోడీ అశక్తత, పిరికితనం కనిపించిందని, గాల్వన్‌ ఉదంతంలో ప్రాణాలు అర్పించిన వారికి అవమానకరంగా ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్ణించింది. ఇంతకీ నరేంద్రమోడీ ఏం చెప్పారు ? సరిహద్దుల్లో దీర్ఘకాలంగా సాగుతున్న పరిస్థితి మీద తక్షణమే మాట్లాడుకోవాల్సి ఉందని, తద్వారా రెండు దేశాల మధ్య ఉన్న అసాధారణతను వెనక్కు నెట్టవచ్చని, స్థిరమైన,శాంతియుత సంబంధాలు కేవలం రెండు దేశాలకే కాదు మొత్తం ప్రాంతానికి ముఖ్యమని నరేంద్రమోడీ చెప్పారు. దౌత్య రంగం, మిలిటరీ అధికారులు అప్పుడప్పుడూ రెండు దేశాల మధ్య సంబంధాల గురించి చేసిన వ్యాఖ్యలు కొన్నిసార్లు మృదువుగా కొన్ని సార్లు కఠినంగా ఉన్నాయని, అయితే మోడీ నేరుగా చెప్పిన మాటలు ప్రత్యేకించి స్పష్టమైన వైఖరి వెల్లడించటం అసాధారణం, సమయాన్ని జాగ్రత్తగా ఎంచుకున్నారని, సానుకూల సంకేతాలు పంపారని గ్లోబల్‌టైమ్స్‌ పేర్కొన్నది. భారత్‌-చైనా సంబంధాలను బలహీనపరచాలని చూస్తున్న అమెరికాలో కొందరికి మోడీ మాటలు అంత వినసొంపుగా ఉండకపోవచ్చని కూడా చైనా పత్రిక పేర్కొన్నది.రెండు దేశాలను ఘర్షణ దిశగా తీసుకుపోవాలని అమెరికా చూస్తున్నదని కూడా చెప్పింది.


అరుణాచల్‌ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలకు చైనా లిపిలో-టిబెటన్‌ పేర్లు ఖరారు చేస్తూ మూడవ జాబితాను ఇటీవల చైనా విడుదల చేసింది.అరుణాచల్‌ను టిబెట్‌లోని జాంగ్‌నాన్‌ ప్రాంతంగా చైనా పరిగణిస్తున్నది. ఒక దగ్గర స్విచ్‌ వేస్తే మరోదగ్గర లైటు వెలిగినట్లుగా అంతర్జాతీయ రాజకీయాల్లో దాదాపు అన్ని సందర్భాల్లో లైటు వెలగటమే కనిపిస్తుంది గానీ స్విచ్‌ ఎక్కడుంది, ఎవరు, ఎందుకు వేశారన్నది అంతగా తెలియదు. జపాన్‌ తదితర దేశాల ప్రతినిధులు పరిశీలకులుగా అమెరికా, ఇతరదేశాలతో కలసి పశ్చిమబెంగాల్లోని కలైకుండ వైమానిక స్థావరంలో ఏప్రిల్‌ 11-23వ తేదీలలో మనదేశం వైమానిక యుద్ధ విన్యాసాలు జరపటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు హెచ్చరిస్తూ అరుణాచల్‌ ప్రదేశ్‌లో పేర్ల జాబితాను చైనా విడుదల చేసిందని డిప్లొమాట్‌ పత్రిక సంపాదకులలో ఒకరైన సుధా రామచంద్రన్‌ పేర్కొన్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లో అంతర్భాగమని చైనా వాదిస్తున్నది. అందువల్లనే సందర్భం వచ్చినపుడల్లా తమ ప్రాంతమే అని చైనా బహిరంగంగా చెబుతున్నది.ఇప్పుడు జరుగుతున్న విన్యాసాలను చైనా తీవ్రంగా పరిగణిస్తున్నదని అంతర్జాతీయ మీడియాలో విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రపంచంలో ఆధునిక యుద్ద విమానాలు, ఇతర వ్యవస్థలను రప్పించి తరంగశక్తి తొలి దశ పేరుతో ఆగస్టులో మరోసారి తొలిసారిగా విన్యాసాలు జరపనున్నారు. ఈ విన్యాసాలలో చైనా, రష్యాలను వ్యతిరేకించేదేశాలే భాగస్వాములుగా ఉన్నాయి.అమెరికా, జర్మనీ,ఫ్రాన్స్‌,ఆస్ట్రేలియా తదితర దేశాల వైమానిక దళాలు పాల్గొంటాయి. సహజంగానే ఇలాంటి విన్యాసాలు తనను ఉద్దేశించి జరుపుతున్నట్లు భావించే ఏ దేశమైనా తనదైన శైలిలో స్పందిస్తుంది.


చైనా తాజాగా ప్రకటించిన 30 పేర్ల గురించి గతంలో మాదిరే మనదేశం స్పందించింది.మన ప్రాంతాలకు మరొక దేశం తన పేర్లు పెట్టుకున్నంత మాత్రాన వారి ప్రాంతాలవుతాయా, వాస్తవాలను మారుస్తాయా అంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది.మనదేశంలో మీడియా మరోసారి తీవ్రంగా స్పందించింది. రేటింగ్స్‌ను పెంచుకొనేందుకు టీవీ ఛానళ్లు చూశాయి.రెండవ సారి 2017లో పేర్లు పెట్టిన వాటిలో రెండు నివాసిత ప్రాంతాలు, ఐదు పర్వతాలు, రెండు నదులు, మరో రెండు ప్రాంతాలు ఉన్నాయి. మరో 15 ప్రాంతాలకు 2021లో చైనా పేర్లు పెట్టింది.తమవి అని చెప్పుకుంటున్న వివాదాస్పద ప్రాంతాలకు ఏ దేశమైనా తన పేర్లు పెట్టుకోవటం కొత్తదేమీ కాదు. ప్రస్తుతం చైనా ఏలుబడిలో ఉన్న ఆక్సారు చిన్‌ ప్రాంతం ఉంది. అది మనదే అని మన ప్రభుత్వం చెబుతుంది. దాన్ని లడఖ్‌ ప్రాంతంలోని లే జిల్లాగా పిలుస్తారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ మీద ఉన్న వివాదం కూడా అలాంటిదే. దాన్ని చైనా వారు జింగ్‌నాన్‌ అనే పేరుతో వ్యవహరిస్తారు.మన పురాణాల్లో మానస సరోవరంగా పిలిచే సరస్సు చైనాలోని టిబెట్‌లో ఉంది. అక్కడ దాని పేరు మాపాంగ్‌ యంగ్‌.


రెండు దేశాల మధ్య లడఖ్‌, అరుణాచల్‌ ప్రాంతాలపై వివాదం ఉంది. దాన్ని బ్రిటీష్‌ వారు సృష్టించారు.మన దేశం బ్రిటీష్‌ వారి నుంచి 1947లో స్వాతంత్య్రం పొందింది. మనదేశం మాదిరి చైనాను బ్రిటన్‌ పూర్తిగా ఆక్రమించలేకపోయింది. వివిధ ప్రాంతాలలోని యుద్ధ ప్రభువులు బలంగా ఉండటంతో అమెరికాతో సహా ఐరోపా దేశాలన్నీ తమకు కావాల్సిన వాణిజ్యం మీద వివిధ ఒప్పందాలను చేసుకున్నాయి తప్ప వారి పాలనను రుద్దలేకపోయాయి. అయితే చైనా వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. నదులు, రేవులు, వాణిజ్యాలపై అనేక హక్కులను పొందారు. హంకాంగ్‌ దీవులను 99 సంవత్సరాలకు బ్రిటీష్‌ వారు కౌలుకు తీసుకున్నారు. అలాగే మకావో దీవులను పోర్సుగీసు వారు కౌలుకు తీసుకున్నారు. పేరుకు దేశం క్వింగ్‌ రాజరిక పాలనలో ఉన్నప్పటికీ దేశం మొత్తం మీద అదుపులేదు. యుద్ద ప్రభువులు పెత్తనం చెలాయించేవారు. వారి మధ్య ఉన్న విబేధాలను విదేశాలు ఉపయోగించుకున్నాయి. ఈ నేపధ్యంలో ఎనిమిది దేశాల కూటమి క్వింగ్‌ వంశ రాజు మీద అనేక ఒప్పందాలను రుద్దింది.దేశాన్ని కుక్కలు చింపిన విస్తరిమాదిరి చేశారు. దాంతో దేశభక్తులు రాజరికాన్ని కూలదోసి రిపబ్లిక్‌ను ఏర్పాటు చేసేందుకు ఉద్యమం సాగించిన ఫలితంగా 1911లో చైనా రాజరికం నుంచి రిపబ్లిక్‌గా మారింది. మనకు జాతిపితగా మహాత్మాగాంధీ ఎలాగో చైనాలో సన్‌ ఏట్‌ సేన్‌ దానికి నాయకత్వం వహించాడు. అధికారం వచ్చిన తరువాత యుద్ధ ప్రభువులు కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని అంగీకరించకుండా తిరుగుబాటు, కుట్రలకు పాల్పడ్డారు.1949లో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాతే ఒకే ప్రభుత్వ ఏలుబడిలోకి చైనా వచ్చింది. సామంత రాజ్యంగా ఉన్న టిబెట్‌ను రెచ్చగొట్టి స్వతంత్రదేశంగా మార్చి తమ స్థావరంగా చేసుకోవాలని చూసిన బ్రిటన్‌, తరువాత అమెరికా జరిపిన కుట్రల కారణంగా టిబెట్‌ పాలకుడిగా ఉన్న దలైలామా తిరుగుబాటు,మనదేశానికి పారిపోయి రావటం తెలిసిందే.


మన ప్రభుత్వ సాయంతో హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ప్రవాసంలో ఉన్న 88 సంవత్సరాల పద్నాలుగవ దలైలామా అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రాంతం టిబెట్‌లో అంతర్భాగమే అని 2003లో చెప్పాడు. తరువాత వైఖరి మార్చుకున్నాడు.బ్రిటీష్‌ అధికారి మెక్‌మోహన్‌ గీసిన సరిహద్దు రేఖ ప్రకారం భారత్‌లో అంతర్భాగమే అని మాట మార్చాడు. మెక్‌మోహన్‌ రేఖను సరిహద్దుగా 1914లోనే బ్రిటన్‌-టిబెట్‌ గుర్తించాయనే వాదనను ముందుకు తెచ్చాడు. అయితే ఆ ఒప్పందాన్ని చైనా ప్రభుత్వం అంగీకరిస్తేనే అమల్లోకి వస్తుందనే అంశం ఉంది. సదరు ఒప్పందాన్ని చైనా గుర్తించలేదు. ఒక సామంత ప్రాంతానికి విదేశాలతో ఒప్పందం చేసుకొనే హక్కులేదు.ఆక్సారుచిన్‌ ప్రాంతాన్ని కూడా బ్రిటీష్‌ అధికారులు నిర్దిష్టంగా గుర్తించకపోవటంతో అది కూడా వివాదాస్పద ప్రాంతంగా మారింది. వారి గీతలు ఎలా ఉన్నప్పటికీ స్వాతంత్య్రం వచ్చేనాటికి అరుణాచల్‌ప్రదేశ్‌ మన పాలనలో, ఆక్సారుచిన్‌ చైనా ఏలుబడిలో ఉంది. మనం దీని గురించి అడిగితే వారు దాని సంగతేమిటని ప్రస్తావిస్తున్నారు.1962లో రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చినపుడు చైనా సైన్యాలు అరుణాచల్‌ను దాటి నేటి అసోంలోని తేజ్‌పూర్‌ వరకు వచ్చాయి. తరువాత వెనక్కుపోయి, వాస్తవాధీనరేఖకు అవతల గతంలో మాదిరే ఉన్నాయి. తమ మీద తిరుగుబాటు చేసిన దలైలామాకు మనదేశం ఆశ్రయం ఇవ్వటాన్ని చైనా వ్యతిరేకిస్తున్నది.2017లో దలైలామా అరుణాచల్‌ ప్రదేశ్‌లో వారం రోజుల పర్యటనను చైనా వ్యతిరేకించింది. అతడిని ఆపకపోతే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని చైనా పత్రికల్లో వార్తలు వచ్చాయి. దలైలామా పర్యటన తరువాత తొలిసారిగా కొన్ని ప్రాంతాలకు తమ పేర్లను చైనా ప్రకటించింది. ఆ తరువాతే 73రోజుల పాటు డోక్లామ్‌ ప్రతిష్ఠంభన కొనసాగింది.తరువాత 2021లో మరోసారి కొన్ని ప్రాంతాలకు పేర్లు ప్రకటించింది.


టిబెట్‌ను చైనా అంతర్భాగమని మనదేశం గుర్తించింది, కానీ అదే సమయంలో మానవతాకారణాలను సాకుగా చూపి తిరుగుబాటు చేసిన దలైలామాకు ఆశ్రయం కల్పించటం,ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతించింది. రెండు దేశాల మధ్య తెగని వివాదాల్లో ఇదొకటి.తమ వ్యతిరేకశక్తులకు భారత్‌ ఆశ్రయమిస్తున్నదని చైనా విమర్శిస్తున్నది.చైనాతో ఉన్న వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అవిభక్త కమ్యూనిస్టు పార్టీలో ఉన్ననేతలు(తరువాత వారు సిపిఎంగా ఏర్పడ్డారు) కొందరు 1962లో కోరినందుకు వారిని దేశద్రోహులుగా, చైనా ఏజంట్లుగా చిత్రించి జైలుపాలు చేశారు. తరువాత అదే కాంగ్రెస్‌ పాలకులు చైనాతో వివాదాన్ని కొనసాగిస్తూనే సాధారణ సంబంధాలను నెలకొల్పుకున్నారు.వర్తమానంలో నరేంద్రమోడీ గత ప్రధానులెవరూ కలవనన్ని సార్లు చైనా నేతలతో భేటీలు జరిపి రికార్డు సృష్టించారు.గాల్వన్‌లోయ ఉదంతాలకు ముందు ఇరుదేశాల నేతలు కలసి ఉయ్యాలలూగటాన్ని ఊహాన్‌, మహాబలిపురం నగరాల్లో చూశాము.ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వెనుక భారత్‌ భుజం మీద తుపాకి పెట్టి అమెరికన్లు తమను కాల్చాలని చూస్తున్నట్లు చైనా అనుమానిస్తుండటం ఒక కారణం. అరుణాచల్‌ భారత్‌లో అంతర్భాగంగా తాము గుర్తిస్తున్నట్లు 2024 మార్చినెల తొమ్మిదవ తేదీన అమెరికా ఒక ప్రకటన చేసింది. వివాదాన్ని పెంచటానికి గాకపోతే ఇరుదేశాలకు సంబంధించిన అంశాల మీద దానికి సంబంధం ఏమిటి ? పాక్‌ ఆక్రమిత కాశ్మీరును భారత్‌ అంతర్భాగంగా గుర్తిస్తున్నట్లు అమెరికా ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. ఎందుకని ? అదే అమెరికా ఆడుతున్న రాజకీయం,అలా ప్రకటిస్తే పాకిస్తాన్‌ ఎక్కడ చైనాకు మరింత దగ్గర అవుతుందేమో అన్నదే దాని భయం.మన స్వతంత్ర విదేశాంగ విధానం ప్రకారం వివాదాలను పరిష్కరించుకోవాలి తప్ప అమెరికా వలలో చిక్కుకొని కొత్త సమస్యలు తెచ్చుకోవద్దన్నదే అనేక మంది చెబుతున్నమాట.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కేరళ రాజకీయం : అన్న కాంగ్రెస్‌, ఇడి భయంతో చెల్లి బిజెపి ! సిపిఎం వైపు ముస్లిం ఓటర్ల మొగ్గు !!

10 Sunday Mar 2024

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, Left politics, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION

≈ Leave a comment

Tags

#Kerala Election scene, #Kerala Politics, BJP, CPI()M, Kerala CPI(M), Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


కేరళలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రసవత్తర రాజకీయం మొదలైంది. కాంగ్రెస్‌ గతంలో సాధించిన సీట్లను నిలుపుకోవాలని చూస్తున్నది. సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని కొనసాగించి లోక్‌సభ సీట్లును గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఓట్ల కోసం కమలనాధులు దేనికైనా సిద్దపడుతున్నారు. కేరళలో 2019లో ఇరవై స్థానాలకు గాను కేవలం ఒక్కచోటే సిపిఎం గెలిచింది. ఈ సారి పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. గత ఎన్నికలకు ముందు శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలన్న సుప్రీం కోర్టు తీర్పును ఎల్‌డిఎఫ్‌ సమర్ధించింది. ఇప్పటికీ దానికి కట్టుబడి ఉంది, సుప్రీం కోర్టులో పునర్విచారణ జరుగుతోంది. దానికి తోడు కేంద్రంలో రెండవసారి నరేంద్రమోడీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే సమర్ధవంతంగా ఎదుర్కోగలిగింది కాంగ్రెస్‌ మాత్రమే అని జనం నమ్మటం కాంగ్రెస్‌ గెలుపుకు దోహదం చేశాయి. తరువాత జరిగిన ఎన్నికల్లో, ఇప్పుడు శబరిమల వివాదం ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదని తేలిపోయింది. కేంద్రంలో బిజెపికి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమిలో సిపిఎం, సిపిఐ కూడా భాగస్వాములుగా ఉండటంతో ఎవరు గెలిచినా బిజెపిని వ్యతిరేకించే వారే గనుక గతంలో మాదిరి బిజెపిని గట్టిగా వ్యతిరేకించే ముస్లింలు కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపే అవకాశం లేదని సాధారణంగా కమ్యూనిస్టులను వ్యతిరేకించే ప్రముఖ పత్రిక మళయాళ మనోరమ తాజాగా ఒక సమీక్షలో పేర్కొన్నది. దానిలోని కొన్ని ముఖ్య అంశాల సారం దిగువ విధంగా ఉంది.


గత ఎన్నికల అనంతరం సిఎస్‌డిఎస్‌ జరిపిన సర్వేలో మూడింట రెండువంతుల మంది ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటువేసినట్లు వెల్లడైంది. గతం కంటే నరేంద్రమోడీ అధికారంలోకి రాగూడదన్న భావన ముస్లింలలో పెరిగినప్పటికీ గుడ్డిగా కాంగ్రెస్‌వైపు మొగ్గే ధోరణిలో లేరు. మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌ఘర్‌ వంటి చోట్ల బిజెపి కంటే కాంగ్రెస్‌ ఎక్కువ హిందూత్వను అనుసరించటం ముస్లిం సామాజిక తరగతిని ఆశాభంగానికి గురి చేసింది. రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కాబోవటం లేదని చెప్పేందుకు కాంగ్రెస్‌ ఆలశ్యం చేయటం కూడా వారిని తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. కాంగ్రెస్‌ మీద తొలుగుతున్న భ్రమలతో పాటు విశ్వసనీయమైన ప్రత్యామ్నాయంగా సిపిఎంను చూస్తున్నారు. ” కాంగ్రెస్‌ నేతలు బిజెపిలో చేరే అవకాశం కోసం వేచి చూస్తున్నారు.వారు ఉన్నత రాజకీయ లక్ష్యాలనేమీ ప్రకటించటం లేదు.వారికి కేవలం అధికారం మాత్రమే ప్రధానంగా ఉంది ” అని రచయిత, ఒక పరిశోధనా సంస్థ అధ్యక్షుడు ముజిబ్‌ రహమాన్‌ కినలూర్‌ చెప్పారు. ” అలాంటి వలస కేరళలో కూడా కనిపిస్తోంది.ఎకె ఆంటోని కుమారుడు అనిల్‌ అంటోని, ఇప్పుడు కరుణాకరన్‌ కుమార్తె పద్మజ బిజెపిలో చేరారు.ఎవరైనా కాంగ్రెస్‌ ఎంపీని నమ్మాలంటే ఎంతో కష్టంగా మారుతోంది” అని కూడా ముజిబ్‌ చెప్పారు. ”బిజెపిని ఎదుర్కొనే అవకాశం సిపిఎంకు లేదని మాకు తెలుసు, కానీ కాంగ్రెస్‌కు ఉంది.ఇప్పుడు రెండు పార్టీలూ ఇండియా కూటమిలో ఉన్నాయి. అందువలన ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధిని ఎంచుకుంటే తేడా ఏముంటుంది.” అని ఇస్లామిక్‌ పండితుడు, రచయిత అష్రాఫ్‌ కడక్కల్‌ ప్రశ్నించారు.” ఈ సారి ప్రతి ముస్లిం ఒక అభ్యర్ధి లౌకిక వైఖరినే చూస్తారు.పార్లమెంటులో గట్టిగా లౌకికవాదాన్ని ఎవరు గట్టిగా రక్షణకు నిలబడతారు, ఉదాహరణకు జాన్‌ బ్రిట్టాస్‌(సిపిఎం రాజ్యసభ సభ్యుడు) వంటి వారిని ఎంచుకుంటారు ” అని కూడా చెప్పారు.లౌకివాద పరీక్షలో కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌, ఆర్‌ఎస్‌పి ఎంపీ ఎన్‌కే ప్రేమ చంద్రన్‌ ఫెయిల్‌ అయ్యారు. హమస్‌ను ఉగ్రవాద సంస్థ అని శశిధరూర్‌ వర్ణించారు.పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్‌ మారణకాండను గట్టిగా ఖండించలేదు. దీంతో పాలస్తీనా సంఘీభావ సభల్లో పాల్గొనే వారి జాబితా నుంచి ముస్లిం సంస్థలు శశిధరూర్‌ పేరును తొలగించాయి. ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం కావటంతో ప్రేమచంద్రన్‌పై అపనమ్మకం ఏర్పడింది.


శుక్రవారాల్లో నమాజు తరువాత మసీదుల్లో చేసే ప్రసంగాల్లో ఎల్‌డిఎఫ్‌ను విమర్శించాలని ముస్లింలీగు కోరుతున్నది. మసీదుల్లో రాజకీయ విమర్శలు చేయకూడదని సమస్త కేరళ జమాయతుల్లా చెప్పింది.ముస్లిం లీగ్‌ చేస్తున్న రాజకీయాలు సమస్తలోని ఒక వర్గాన్ని ఆశాభంగానికి గురిచేశాయి.వారు ఈసారి ఎల్‌డిఎఫ్‌ను ఎంచుకోవచ్చు.లీగ్‌ నేతల తీరుతెన్నులను విమర్శించినందుకే పార్టీ నేత కెఎస్‌ హంసను బహిష్కరించారు. ఇప్పుడు సిపిఎం తన అభ్యర్ధిగా హంసను పొన్నాని బరిలో నిలిపింది.అయోధ్యలో రామాలయ నిర్మాణం గురించి నిరసన తెలపాల్సిన అవసరం లేదని, అక్కడ మసీదు నిర్మాణం కూడా చేయనున్నందున లౌకికవాదం మరింత బలపడుతుందని ముస్లింలీగ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సాదిక్‌ అలీ తంగల్‌ చేసిన వ్యాఖ్యలను లీగ్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.జ్ఞానవాపి మసీదు కూడా కావాలని సంఘపరివార్‌ కోరుతున్నందున అలా ఎలా మాట్లాడతారని సమస్త నేత ప్రశ్నించారు.తిరువాన్కూర్‌ సెంట్రల్‌ ప్రాంతంలో 2016 ఎల్‌డిఎఫ్‌కు ముస్లింలు 25శాతం మంది మద్దతు ఇవ్వగా 2021లో అది 50శాతానికి పెరిగింది.ఎక్కడైతే బిజెపి పోటీ ఇస్తుందని అనుకుంటారో అక్కడ ఓడించేవారిని చూసి ఎంచుకుంటారు.


కాంగ్రెస్‌ నేత బొమ్మతో బిజెపి ప్రచారం !
కేరళలో జగమెరిగిన కాంగ్రెస్‌ నేత, మాజీ సిఎం కరుణాకరన్‌. ఆయన కుమార్తె పద్మజ ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరగానే బిజెపి పెద్దలు కాషాయ జెండాపై కరుణాకరన్‌ బొమ్మను ముద్రించి ప్రచారానికి దిగారు. తన తండ్రి కాంగ్రెస్‌ ఆస్తి అని త్రిసూర్‌ లోకసభ కాంగ్రెస్‌ అభ్యర్ధి కె మురళీధరన్‌ ప్రకటించారు. నిలంబూర్‌లో నరేంద్రమోడీ, కరుణాకరన్‌, పద్మజ బొమ్మలతో ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని కాంగ్రెస్‌ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి చర్య తీసుకోకపోవటంతో వారు వాటిని చించివేశారు. రాష్ట్రంలో మొత్తం 20లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్‌ పోటీ చేస్తున్న 16చోట్ల అభ్యర్ధులను ఖరారు చేసింది. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కె కరుణాకరన్‌, ఎకె ఆంటోనీ. ఇద్దరూ కాంగ్రెస్‌ ప్రముఖులే. గతంలో ఆంటోని కుమారుడు అనిల్‌ అంటోని బిజెపిలో చేరగా,ప్రస్తుతం ఆ పార్టీ తరఫున పత్తానంతిట్ట లోక్‌సభ బరిలో దిగారు. అక్కడ సిపిఎం నేత థామస్‌ ఐజాక్‌ పోటీ చేస్తున్నారు. పద్మజ వేణుగోపాల్‌ వయనాడ్‌లో రాహుల్‌ గాంధీ మీద ఆమె పోటీ చేయనున్నట్లు నిర్దారణగాని వార్తలు వచ్చాయి. దేశవ్యాపితంగా ఈ పోటీని సంచలనాత్మకం కావించేందుకు బిజెపి ఇలాంటి ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆమె సోదరుడు, ప్రస్తుతం వడకర ఎంపీగా ఉన్న మురళీధరన్‌ త్రిసూర్‌ నుంచి పోటీ చేస్తున్నట్లు ఆకస్మికంగా మార్పును ప్రకటించారు.
కాంగ్రెస్‌ నేతలు బిజెపిలో చేరటంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందించారు. ఈ రోజు కాంగ్రెస్‌లో ఉన్న నేతలు రేపుదానిలో ఉంటారన్న గ్యారంటీ ఏముందని ప్రశ్నించారు. బిజెపిలో చేరతానని గతంలో పిసిసి అధ్యక్షుడు సుధాకరన్‌ స్వయంగా చెప్పారు. ఇద్దరు ప్రముఖుల పిల్లలు బిజెపిలో చేరారు. ఇంకా ఎంత మంది చేరతారో తెలియదు. కాంగ్రెస్‌ తరఫున ఎంపీలుగా గెలిచినప్పటికీ వారు పార్టీలో కొనసాగుతారన్న ఎలాంటి హామీ లేదన్నారు.ఇంకా ఎంత మంది కాంగ్రెస్‌ నుంచి బిజెపిలో చేరతారో మీరే చూస్తారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌ విలేకర్లతో అన్నారు. అనేక మంది ఆ పార్టీ నుంచి వెళ్లిపోయారని, మొత్తంగా బిజెపిలో చేరరన్న గ్యారంటీ ఏముందన్నారు. ఇప్పటి వరకు దాదాపు రెండు వందల మంది మాజీ ఎంపీలు, ఎంఎల్‌ఏలు, ముగ్గురు పిసిసి అధ్యక్షులు బిజెపిలో చేరారని చెప్పారు.


సురేష్‌ గోపికి కోపమొచ్చింది ! ఓట్ల కోసం ఎన్ని తిప్పలో !!
ఈ సారి ఎలాగైనా విజయం సాధిస్తాననే ధీమాతో త్రిసూర్‌లో పోటీకి దిగిన సినీనటుడు సురేష్‌ గోపికి శనివారం నాడు కోపమొచ్చింది. ఒక గిరిజన కాలనీలో ప్రచారానికి వచ్చిన గోపికి కొంత మంది మహిళా వలంటీర్లు తప్ప ఓటర్లు కనిపించలేదు.దాంతో కారుదిగకుండానే వలంటీర్లు కూడా తగినంత మంది లేనపుడు ఇక్కడ పోటీ చేయటం ఎందుకు తిరువనంతపురం వెళ్లి అక్కడ కేంద్రమంత్రి చంద్రశేఖర్‌కు ప్రచారం చేస్తా అంటూ మండిపడినట్లు మీడియా పేర్కొన్నది. ఇంకా నామినేషన్‌ కూడా దాఖలు చేయలేదు గుర్తుపెట్టుకోండి అంటూ ఆగ్రహించారు. దాంతో కార్యకర్తలు ఇక ముందు ఇలా జరగకుండా చూస్తామంటూ క్షమాపణలు చెప్పారట. అక్కడ సోదరుడికి వ్యతిరేకంగా చెల్లి పద్మజ బిజెపి తరఫున ప్రచారం చేయనున్నట్లు వార్తలు. బిజెపిని మూడవ స్థానంలోకి నెడతామని మురళీధరన్‌, కాంగ్రెస్‌నే ఆ చోటులో ఉంచుతామని సురేష్‌ గోపి ప్రకటించారు. ఓట్ల కోసం ఈ పెద్దమనిషి నానా తిప్పలు పడుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీతో సహా అనేక మంది ప్రముఖుల సమక్షంలో తన కుమార్తె వివాహాన్ని గురువాయూర్‌ శ్రీకృష్ణ దేవాలయంలో నిర్వహించారు. దానికి రెండు రోజుల ముందు త్రిసూర్‌లోని ఒక చర్చిలో మేరీమాతకు ఒక బంగారు కిరీటాన్ని కానుకగా సమర్పించుకున్నారు. అయితే అది బంగారు పూత పూసిన రాగిదనే విమర్శలు రావటంతో వివాదాస్పదమైంది. దానిలో బంగారం ఎంత ఉందో పరీక్షించి చెప్పాలని చర్చి అధికారులను కాంగ్రెస్‌ కోరింది. ఐదు సవర్ల బంగారంతో దాన్ని చేసినట్లు కంసాలి చెప్పారు. తాను ఇచ్చినదానిలో సగం బంగారాన్ని కంసాలి తనకు తిరిగి ఇచ్చారని, 18కారట్ల బంగారంతో కిరీటాన్ని తయారు చేసినట్లు, తాను గెలిస్తే మరో పదిలక్షల విలువగల బంగారాన్ని మేరి మాతకు కానుకగా ఇస్తానని సురేష్‌ గోపి వివరణ ఇచ్చారు. ఎల్‌డిఎఫ్‌ తరఫున సిపిఐ అక్కడ పోటీ చేస్తున్నది.అక్కడ టిఎన్‌ ప్రతాన్‌ తమ అభ్యర్ధి అని కాంగ్రెస్‌ ఎన్నో రోజుల ముందుగానే అనధికారికంగా ప్రకటించింది. దాంతో గోడరాతలతో పాటు మూడున్నరలక్ష వాల్‌పోస్టర్లను కూడా ప్రతాపన్‌ ముద్రించారు. ఇప్పుడు అవన్నీ వృధా అయ్యాయి.


ఇడి దెబ్బకు బిజెపిలోకి ఫిరాయింపు !
పద్మజా వేణుగోపాల్‌ కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించి బిజెపిలో చేరటానికి కారణం ఆమె భర్త డాక్టర్‌ వేణుగోపాల్‌ను ఇడి అధికారులు ప్రశ్నించటమేఅని కాంగ్రెస్‌ నాయకురాలు బిందు కృష్జ చెప్పారు. ఆమె ఎప్పటి నుంచో తమతో మాట్లాడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ అన్నారు. తన సోదరితో అన్ని బంధాలను తెంచుకున్నానని, ఆమె చేరికతో బిజెపికి ఒక్క పైసా కూడా ఉపయోగం ఉండదని మురళీధరన్‌ మీడియాతో చెప్పారు.తన తండ్రి ఆత్మ ఆమెను క్షమించదన్నారు.ఆమె ఫిరాయింపు వెనుక తమ కుటుంబంతో ఎప్పటి నుంచో పరిచయం ఉన్న మాజీ డిజిపి లోక్‌నాధ్‌ బెహరా ఉన్నారని, అతను ప్రధాని నరేంద్రమోడీ, పినరయి విజయన్‌కూ సన్నిహితుడే అన్నారు. పత్తానం తిట్టలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ నేత ఎకె ఆంటోని కుమారుడు అనిల్‌ అంటోని ఓట్లకోసం శివరాత్రి నాడు శివాలయానికి వెళ్లి ప్రసాదం తీసుకున్నారు. తన పార్టీ జనపక్షంను బిజెపిలో విలీనం చేసిన పిసి జార్జి ఆ సీటును ఆశించి భంగపడ్డారు.కేరళ రాజకీయాల గురించి అనిల్‌ ఆంటోనికి అనుభవం లేదని అక్కడ ఓడిపోతారని ప్రకటించారు. దాంతో బిజెపి నాయకత్వం నష్టనివారణకు పూనుకొని అనిల్‌తో కలిపి శివాలయానికి పంపింది. అక్కడ జార్జి స్వయంగా అనిల్‌ నుదుట తిలకాన్ని దిద్దిన వీడియో వైరల్‌గా మారింది. పోటీకి దిగాలన్న తన కలను సిఎం పినరయి విజయన్‌, బిజెపి మిత్రపక్షం బిడిజెఎస్‌ నేత తుషార్‌ వెల్లపల్లి వమ్ముచేశారని పిసి జార్జి ఆరోపించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాపై నిరంతర వక్రీకరణలతో కొందరికి అదో ” తుత్తి ” !

21 Thursday Dec 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, USA

≈ Leave a comment

Tags

#Anti China, #media lies on China, anti china, China economy, China exports, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


సంస్కరణల బాట పట్టిన 1978 నుంచీ చైనాలో జరుగుతున్న పరిణామాల గురించి ప్రతికూలంగా స్పందించకపోతే ప్రపంచ మీడియాకు రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. రాసేవారి బుర్ర ఎంతో పదునుగా ఉంటోంది గనుకనే పదే పదే కొత్త కొత్త ”కత”లతో జనం ముందుకు వస్తున్నారు.యుద్ధాలలో అమాయకులు బలౌతున్నట్లే వర్తమాన ప్రచార దాడులలో అనేక మంది మెదళ్లకు గాయాలై సరిగా పనిచేయటం లేదు. ఆ ప్రచారం వారికి ఒక సినిమాలో చెప్పినట్లు అదో తుత్తి (తృప్తి) నిస్తోంది. కరోనా నిరోధానికి విపరీత కట్టుబాట్లతో చైనా కుప్పకూలిపోయిందని చెప్పి కొందరు సంతోషించారు. నమ్మినవారిని వెర్రి వెంగళప్పలను చేశారు. ప్రపంచ వాణిజ్య సంస్థ నమోదు చేసిన సమాచారాన్ని విశ్లేషిస్తే ప్రపంచ వస్తువుల ఎగుమతుల విలువ 2022లో 25లక్షల కోట్ల డాలర్లు. దానిలో కేవలం పదకొండు పెద్ద ఎగుమతి దేశాల వాటా 12.8లక్షల కోట్లు. మిగతా దేశాలన్నింటిదీ 12.1లక్షల కోట్లే. కరోనా నుంచి పూర్తిగా బయటపడ్డామని, దేశాన్ని తిరిగి అభివృద్ది పట్టాల మీద ఎక్కించామని మన కేంద్ర ప్రభుత్వం, బిజెపి ఎంతగా చెప్పుకున్నా తొలి పదకొండు దేశాల జాబితాలో లేదు.చివరికి పదో స్థానంలో ఉన్న హాంకాంగ్‌(చైనా) ప్రాంత ఎగుమతులు 609.9 బి.డాలర్లు కాగా మనవి 453.5 బి.డాలర్లు మాత్రమే. ప్రధమ స్థానంలో ఉన్న చైనా 3.6లక్షల కోట్ల డాలర్ల మేర ఎగుమతి చేసింది. అంటే 14.4 శాతం వాటా కలిగి ఉంది. తరువాత ఉన్న అమెరికా 8.4శాతం కలిగి ఉంది.2009 నుంచి చైనా తన ప్రధమ స్థానాన్ని కొనసాగిస్తూనే ఉంది. దాన్ని అధిగమించి తెల్లవారేసరికి మన దేశాన్ని ముందుకు తీసుకుపోతామని నరేంద్రమోడీ అండ్‌కో చెబుతుంటే జనం నిజమే అని నమ్ముతున్నారు.


ఇటీవలి కాలంలో తమ విదేశీ వాణిజ్యం తిరిగి పట్టాలకు ఎక్కటం ప్రారంభమైందని చైనా ప్రకటించింది.ఆగస్టు నుంచి తిరోగమనంలో ఉన్నది గతేడాది నవంబరుతో పోలిస్తే ఈ ఏడాది 1.2శాతం పెరిగిందని అధికారులు ప్రకటించారు. అమెరికాకు గత పద్నాలుగు నెలలుగా తగ్గుముఖం పట్టిన ఎగుమతులు కూడా 9.6శాతం అధికంగా ఉన్నాయి. చైనా చెప్పిన అంకెలను ఎప్పుడూ నమ్మని నిత్యశంకితులు, తమకు అనుకూలం అనుకున్నవాటిని మాత్రమే చెప్పేవారు ఉంటారన్నది తెలిసిందే. ఎవరు నమ్మినా నమ్మకున్నా చైనాకు పోయేదీ, ఇతర దేశాలకు వచ్చేదేమీ లేదు.డిసెంబరు పద్నాలుగవ తేదీన ఎకానమిస్ట్‌ పత్రిక ” తన ఎగుమతి విజయాన్ని చైనా తక్కువ చేసి చూపుతోందా ” అంటూ ఒక విశ్లేషణను ప్రచురించింది. గడచిన రెండు దశాబ్దాలలో తన వాణిజ్య మిగులును సబ్సిడీలుగా ఇచ్చి ఎగుమతులతో ఇతర దేశాల్లో ఉపాధిని హరించిందని, ఇప్పుడు విద్యుత్‌ కార్లను వేగంగా ఉత్పత్తి చేసిన తన వాణిజ్య భాగస్వాములను ఆందోళనకు గురి చేస్తోందని కూడా దానిలో పేర్కొన్నారు. చైనా వాణిజ్య మిగులు ఇప్పుడు 312బిలియన్‌ డాలర్లుగా ఉందని చైనా విదేశీ మారక ద్రవ్య యంత్రాంగం(సేఫ్‌) పేర్కొన్న అంకెలు నిజమేనా అన్న సందేహాన్ని వెలిబుచ్చారు. అమెరికా విదేశీ సంబంధాల మండలికి చెందిన బ్రాడ్‌ సెట్సర్‌, ఆర్థిక వ్యవహారాల వ్యాఖ్యాత మాథ్యూ కెలిన్‌ అభిప్రాయాలను దానిలో ఉటంకించారు. ప్రస్తుతం ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చూసినపుడు చైనా మిగులు ఎక్కువగా ఉన్నప్పటికీ నాటకీయంగా తక్కువ చేసి చూపుతున్నారని, విదేశీ ఆస్తుల నుంచి వచ్చిన రాబడి, ఎగుమతులను తక్కువగా చూపుతున్నారని వారు పేర్కొన్నారు. ప్రకటించిన మిగులు కంటే రెండువందల బిలియన్‌ డాలర్లు ఎక్కువగా ఉంటాయని సెట్సర్‌ చెప్పాడు.చైనా నుంచి లెక్కల్లో చూపకుండా విదేశాలకు తరలుతున్న పెట్టుబడులను దాచి పెట్టేందుకు చూస్తున్న కారణంగానే తక్కువ చేసి చూపుతున్నారని వారు ఆరోపించారు. తక్కువ-ఎక్కువ ఏది చెప్పినా ఇతరులకు నష్టం ఏమిటి ? గడచిన ఆరు నెలల్లో తొలిసారిగా చైనా ఎగుమతులు పెరిగినందున అక్కడి ఫ్యాక్టరీలకు ఎంతో ఉపశమనం కలిగించిందని రాయిటర్స్‌ పేర్కొన్నది. ధరలు తగ్గించిన కారణంగా ఎగుమతులు పెరిగాయని, ఇలా ఎంతకాలం కొనసాగిస్తారని కొందరు అనుమానాలు వెల్లడించారు. ఎక్కువగా ఎగుమతులు ఎలక్ట్రానిక్‌ యంత్రాలు, కార్లు ఉన్నాయని, ఐరోపా, రష్యాలో ఉన్న గిరాకీ కారణంగా ఎగుమతులు ఇంకా పెరగవచ్చని భావిస్తున్నారు. విదేశీ వాణిజ్యలోటు ఉన్న మన దేశమే ఎగుమతి ప్రోత్సాహకాల పేరుతో ఎగుమతిదార్లకు రెండు లక్షల కోట్లు పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. ఆ వచ్చే రాయితీల మేరకు మన దేశంలోని వారు కూడా వస్తువుల ధరలను తగ్గించి దిగుమతిదార్లను ఆకర్షిస్తారు. వ్రతం చెడ్డా మనకు ఫలం దక్కటం లేదు.


చైనా జిడిపి వృద్ధి రేటు 2024లో 4.8 నుంచి 4.4శాతానికి తగ్గుతుందని ప్రపంచబ్యాంకు తాజాగా పేర్కొన్నది. అక్కడి ఆర్థిక వ్యవస్థ బాగు చేయలేనంత దుస్థితిలో లేదని అమెరికాలోని నార్త్‌ వెస్ట్రన్‌ యూనివర్సిటీ ఫ్రొఫెసర్‌ నాన్సీ క్వియాన్‌ చెప్పారు.ఓయిసిడి దేశాలైన స్వీడెన్‌, స్పెయిన్‌, ఇటలీ వంటి వాటితో పోలిస్తే యువతీ యువకుల్లో నిరుద్యోగం పెరుగుదల చైనాలో తక్కువ అని ఆమె అన్నారు. ఇటీవలి దశాబ్దాలలో సాధించిన ప్రగతితో పోల్చిచూస్తే తాజాగా చిన్నపోయినట్లు కనిపించవచ్చు తప్ప మరింకేమీ కాదని చెప్పారు.చైనా వాణిజ్య మిగులు పెరిగితే విదేశాల్లో ప్రతిగా రక్షణాత్మక చర్యలు పెరిగే అవకాశం ఉందని బాకోని విశ్వవిద్యాలయానికి చెందిన డేనియల్‌ గ్రోస్‌ చెప్పాడు. చైనా అనుసరిస్తున్న విధానాల కారణంగానే అక్కడ రియలెస్టేట్‌ బుడగ ఎప్పటి నుంచో తయారవుతున్నదని ఇప్పుడు పేలిందని కొందరు చెబుతున్నారు. దానిలో భాగంగానే ఎవర్‌గ్రాండే కంపెనీ చెల్లింపుల సంక్షోభంతో అమెరికాలో దివాలా రక్షణ కోరింది. దీన్ని చూసి ఇంకే ముంది చైనా మొత్తం దివాలా తీయనుందని ఊదరగొట్టారు. ఒక నిర్మాణ కంపెనీ చేతులెత్తేస్తే దానిలో లాభాల కోసం పెట్టుబడులు పెట్టిన వారు దెబ్బతింటారు. దాని దగ్గర ఉన్న భూములు, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు ఎక్కడకూ పోవు. ప్రభుత్వం లేదా మరొక సంస్థ వాటిని పూర్తి చేస్తుంది. చైనా సంస్కరణల్లో భాగంగా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించారు..అక్రమాలకు పాల్పడితే బాధ్యులైన వారు కటకటాలపాలు కావాల్సిందే.దేశాన్ని ముందుకు తీసుకుపోయేందుకు చైనా నిపుణులు అనేక ప్రయోగాలు చేశారు. పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న పూర్వరంగంలో నిర్మాణ రంగంలో భారీ పెట్టుబడులను చైనా ప్రోత్సహించింది. ఇప్పుడు తలెత్తిన సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకుంటున్నది. 2010లో అక్కడ ఇళ్లు కొనే వయస్సులో ఉన్న జనాభా 20 కోట్ల మంది ఉంటే అది 2020నాటికి 22 కోట్లకు చేరి అప్పటి నుంచి తగ్గుతున్నది. ఎవర్‌ గ్రాండే సమస్యలు కూడా ప్రారంభం అప్పుడే.2030 నాటికి పదిహేను కోట్లకు తగ్గి తరువాత 2040 నాటికి 16 కోట్లకు పెరుగుతుందన్నది ఒక అంచనా కాగా 12 కోట్లకు తగ్గవచ్చన్నది మరొక అభిప్రాయం. ఒక కుటుంబంలో ఇల్లు కొంటే అది తరువాత తరాలకూ ఉంటుంది, అందువలన గిరాకీ ఎప్పుడూ ఒకేమాదిరి ఉండదు.


అలాగే ఒక బిడ్డ విధానం. అది ప్రతికూల సమస్యలను ముందుకు తెచ్చినట్లు గ్రహించగానే దాన్ని ఎత్తివేశారు. సంస్కరణల ప్రారంభంలో జనాభా ఎక్కువగా ఉండటం, వారికి అవసరమైన ఆహారధాన్యాలు పండించేందుకు సాగు భూమి తక్కువగా ఉండటంతో కుటుంబనియంత్రణకు పూనుకున్నారు. మనదేశంతో పోలిస్తే 1980లో తలసరి సాగు భూమి అక్కడ 40శాతమే. అది వాస్తవం కాదని, అంతకంటే ఎక్కువగా ఉందని తరువాత సర్వేల్లో తేలింది. 2022లో మనదేశ సాగుభూమిలో 77శాతమే చైనాలో ఉంది.కానీ అక్కడి ధాన్య ఉత్పత్తి మనకంటే రెండు రెట్లు ఎక్కువగా ఉంది.చైనాలో భూమిని ”ము ” ప్రమాణంలో కొలుస్తారు(ఒక ము మన పదహారు సెంట్లకు సమానం).ఒక ము విస్తీర్ణంలో 1980లో 196కిలోల తృణధాన్యాలు పండితే 2021నాటికి 421 కిలోలకు పెరిగింది. అందువలన సాగు భూమిని బట్టి జనాభా ఉండాలన్న అవగాహన తప్పని తేలింది. అయినప్పటికీ చైనా ఇప్పటికీ తన ఉత్పత్తిలో ఐదో వంతుకు సమంగా దిగుమతులు చేసుకుంటున్నది. ప్రస్తుతం ఉన్న 195 కోట్ల ” ము ”లకు తోడు మరో 85 కోట్ల ము లను సాగులోకి తేవచ్చని చైనా సైన్సు అకాడమీ అధ్యయనంలో తేలింది. దీనికి తోడు రెండువందల కోట్ల ము ల ఎడారిలో కూడా సాగు చేసేందుకు ఉన్న అవకాశాలను ఇప్పటికే పరీక్షిస్తున్నారు. ఆరువందల కోట్ల ము ల గడ్డి భూములలో మాంసం, పాల ఉత్పత్తి పెంచేందుకు చూస్తున్నారు.


చైనా ఆర్థిక వృద్ధి గురించి ప్రపంచ బాంకు ప్రధాన ఆర్థికవేత్తగా పని చేసిన డేవిడ్‌ దావోకుయి లీ, చైనా ఆర్థికవేత్త జస్టిన్‌ ఇఫు లిన్‌ వంటి వారు చెప్పిన అంచనాలు తప్పాయి. వారు చెప్పిందేమిటి ? 2025వరకు ఎనిమిది, అప్పటి నుంచి 2050వరకు ఆరుశాతం చొప్పున ఆర్థిక వృద్ధి ఉంటుందని, అమెరికాకు మూడు రెట్లు అవుతుందన్నారు. కానీ జరిగిందేమిటి ? 2011లో 9.6శాతంగా ఉన్న వృద్ధి రేటు 2019నాటికి ఆరుకు, తరువాత 4.5శాతానికి తగ్గింది. యువ నిరుద్యోగుల పెరుగుదల గురించి వార్తలు రావటంతో ఇంకే ముంది చైనా ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోతున్నదంటూ వాటికి ప్రతికూల భాష్యాలు వెలువడటంతో ప్రభుత్వం నెలవారీ సమాచార విడుదల నిలిపివేసింది. నిజానికి కూలిపోవాల్సి వస్తే ఐఎంఎఫ్‌ చెప్పినట్లుగా 2024లో అమెరికాలో ఈ ఏడాది 1.6, వచ్చే ఏడాది 1.1, అలాగే బ్రిటన్‌లో మైనస్‌ 0.3 – 1, జర్మనీలో మైనస్‌ 0.1 -1.1 శాతాలుగా ఉంటాయని చెప్పగా చైనాలో అవి 5.2-4.5శాతాలుగా ఉన్నాయి. అందువలన ఓయిసిడి దేశాలలో ఏండ్ల తరబడి 20శాతంగా ఉన్న యువ నిరుద్యోగంతో పోలిస్తే చైనా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. అన్ని దేశాల్లో పరిస్థితులు మారుతున్నాయి. మన దేశంలో ఒకనాడు బిఏ, బికాం, బిఎస్‌సి వంటి డిగ్రీలకు ఎంతో విలువ, తరువాత ఇంజనీరింగ్‌, ఇప్పుడు అదే ఇంజనీర్ల పరిస్థితి ఏమిటో, ఉపాధి దొరికిన వారికి ఇస్తున్న వేతనాలెంతో చూస్తున్నాము. నిరుద్యోగ సమస్యను పాలకుల దృష్టికి తెచ్చేందుకే తాము లోక్‌సభలో పొగబాంబులు వేసినట్లు దాడికి పాల్పడిన యువకులు చెప్పినట్లు వార్తలు. అదే నిజమైతే మనదేశంలో పరిస్థితి గురించి ఆలోచించాలి. ఐదు సంవత్సరాల నాటి కంటే నేడు యువ నిరుద్యోగుల సంఖ్య ఎక్కువ అన్నది వాస్తవం, సరైన లెక్కలు లేవు, ఉన్నవాటిని ప్రకటించకుండా మూసిపెడుతున్నారు గనుక వాస్తవాలు తెలియటం లేదు. ప్రస్తుతం చైనా ఉపాధి ఎక్కువగా ఉండే పరిశ్రమల నుంచి ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం ఉండే సంస్థలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సర్దుబాటుకు కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం చైనా మీద అనేక దేశాలు వాణిజ్య యుద్ధం ప్రకటించి అమలు జరుపుతున్నాయి. అలాంటి పరిస్థితి మనకు గానీ, అమెరికా, ఐరోపా దేశాలకు లేదు.చైనా ఎదుర్కొంటున్న సవాళ్లు లేవు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కమ్యూనిస్టుగా ఎలన్‌ మస్క్‌ కుమార్తె, కసితో భావజాలాన్ని అడ్డుకొనేందుకే ట్విటర్‌ కొనుగోలు !

09 Saturday Sep 2023

Posted by raomk in BJP, CHINA, Communalism, COUNTRIES, Current Affairs, Europe, Germany, imperialism, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ 2 Comments

Tags

Anti China Propaganda, Anti communist, BJP, China, communist, Elon Musk, Elon Musk daughter, Karl Marx, RSS


ఎం కోటేశ్వరరావు


కమ్యూనిజం భావజాల వ్యాప్తిని అరికట్టేందుకు తొలుత ఐరోపాను ఆవరించిన భూతంగా నిందించారు. కారల్‌ మార్క్స్‌ను జర్మనీ, బెల్జియంల నుంచి వెళ్లగొట్టారు. తొలి సోషలిస్టు రాజ్యం ఏర్పడిన తరువాత కమ్యూనిజం విస్తరణను అడ్డుకొనేందుకు అమెరికా ఇతర ధనిక దేశాలు ప్రచ్చన్న యుద్ద్ధం సాగించాయి. అనేక దేశాల్లో కుట్రలు చేశాయి. అలెండీ వంటి వారిని హత్య చేశాయి. మిలిటరీ నియంతలను గద్దెలపై కూర్చో పెట్టాయి. సైనిక కూటములను ఏర్పాటు చేశాయి. వియత్నాం, లావోస్‌, కంపూచియా, ఉత్తర కొరియాలపై భౌతిక దాడులకు పాల్పడి భంగపడ్డాయి. విధిలేని స్థితిలో వియత్నాం నుంచి అమెరికన్లు బతుకు జీవుడా అంటూ పారిపోయారు.కమ్యూనిజం అంతమే తమ పంతం అని ప్రకటించిన అమెరికా గడ్డమీదే ప్రపంచ ధనికుడైన ఎలన్‌ మస్క్‌ కుమార్తె కమ్యూనిస్టుగా మారింది. అక్కడే లక్షలాది మంది యువత నేడు అక్కడ అవును మేము సోషలిస్టులం, కమ్యూనిస్టులం అంటూ ముందుకు వస్తున్నారు.


తన కుమార్తె కమ్యూనిస్టుగా మారిందన్న ఉక్రోషం, కమ్యూనిస్టు భావజాల ప్రచారానికి ఒక వేదికగా ఉన్నందున నిరోధించేందుకు ఏకంగా సామాజిక మాధ్యమం ట్విటర్‌నే కొనుగోలు చేసినట్లు త్వరలో వెలువడనున్న ఎలన్‌ మస్క్‌ జీవిత చరిత్రలో వెల్లడించారు. ఎలన్‌ మస్క్‌ 2000 నుంచి 2016వరకు మూడు వివాహాలు చేసుకొని ముగ్గురికీ విడాకులు ఇచ్చాడు, తరువాత 2018 నుంచి 2021వరకు ఒకామెతో సహజీవనం చేశాడు. ఇప్పుడెలా ఊరేగుతున్నాడో తెలవదు. పది మంది పిల్లల్ని కన్నాడు. వారిలో ఒకడైన గ్జేవియర్‌ అలెగ్జాండర్క్‌ మస్క్‌ 2004లో పుట్టాడు. 2022 జూన్‌లో కాలిఫోర్నియా కోర్టుకు సమర్పించిన ఒక వినతిలో తన పేరును వివియన్‌ జెనా విల్సన్‌ అని మార్చుకొనేందుకు అంగీకరించాలని, తాను యువతిగా లింగమార్పిడి చేయించుకున్నట్లు పేర్కొన్నాడు. తన తండ్రి ఎలన్‌ మస్క్‌తో గానీ, అతని ఆస్తిపాస్తులతో గాని తనకు ఎలాంటి సంబంధం లేదని క్రటించాడు.2021లో లింగమార్పిడి జరిగింది.


తన కుమారుడు లింగ మార్పిడి చేయించున్నదాని కంటే స్కూల్లో వామపక్ష భావజాలానికి ప్రభావితుడు కావటం ఎలన్‌ మస్క్‌కు ఆగ్రహం తెప్పించింది. పచ్చి మితవాది అయిన మస్క్‌ తన కుమార్తెను కమ్యూనిస్టుగా వర్ణించాడు.కాలిఫోర్నియాలోని ఒక స్కూల్లో ఏడాదికి 50వేల డాలర్ల ఫీజు చెల్లించి చదివిస్తుండగా కమ్యూనిస్టు భావజాల వైరస్‌కు గురైందని, తన పట్ల కుమార్తె వైఖరి మారటానికి కొంత వరకు క్రాస్‌రోడ్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సు స్కూలు పురోగామి విధానాలు కూడా కారణమని ఆరోపించాడు. తన కుమార్తె సోషలిజాన్ని అధిగమించి ధనవంతులందరూ దుష్టులని భావించే పూర్తి స్థాయి కమ్యూనిస్టుగా మారిందని చెప్పాడు. తొలి రోజుల్లో ఉదారవాద భావాలతో కొడుకు లేదా కుమార్తె ఉన్నట్లు సరిపెట్టుకున్న తరువాత తెగతెంపులు చేసుకున్నాడు. అంతే కాదు, దీనంతటికీ కమ్యూనిస్టు భావజాల ప్రచారానికి వేదికగా ఉపయోగపడుతున్న ట్విటర్‌ కూడా తన బిడ్డ వంటి అనేక మందిని కమ్యూనిస్టులుగా మార్చుతున్నదని, ట్విటర్‌ వేదికగా ఆ భావజాలం రోజు రోజుకు పెరుగుతున్నదని భావించాడు.అది ప్రజాస్వామ్యం, స్వేచ్చా భావ ప్రకటనకు ముప్పుగా మారిందని, దాని విధానాలను మార్చేందుకు ఏకంగా 44 బిలియన్‌ డాలర్లతో ఆ సంస్థను కొనుగోలు చేశాడు. అంటే పురోగామి భావాలను అడ్డుకొని మితవాద ప్రచారానికి దాన్ని వేదికగా మార్చనున్నాడన్నది స్పష్టం. దానికి అనుగుణంగానే గత యాజమాన్యం రద్దు చేసిన డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి పచ్చి మితవాదుల ఖాతాలన్నింటినీ పునరుద్దరించాడు. ట్విటర్‌ పేరు ఎక్స్‌గా మార్చాడు. వాల్టర్‌ ఇసాక్‌సన్‌ రాసిన ఎలన్‌ మస్క్‌ జీవిత చరిత్రను సెప్టెంబరు 12న మార్కెట్‌కు విడుదల చేయనున్నారు. దాని గురించి ఆసక్తి కలిగించేందుకు కొన్ని భాగాలను మీడియాకు విడుదల చేశారు.


ఎలన్‌ మస్క్‌ వంటి కమ్యూనిస్టు వ్యతిరేక మితవాద భావజాలం ఉన్న వారు అమెరికాలో తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. ఒక బంతిని ఎదురుగా ఉన్న గోడవైపు ఎంత గట్టిగా విసిరితే అంతే వేగంతో తిరిగి మనవైపు వస్తుంది. భావజాలం కూడా అంతే. దేన్నయినా అణచివేయాలని చూస్తే అంతేవేగంతో విస్తరిస్తుంది. కొత్త రాతియుగం నుంచి చైనా నేత షీ జింపింగ్‌ వరకు కమ్యూనిజం చరిత్ర పేరుతో జర్నలిస్టు పాల్‌ మాసన్‌ రాస్తున్న పుస్తకం 2026లో విడుదల కానుంది. ఒక భావం, ఒక ఉద్యమం, ఒక పాలన వరకు ఎలా పరిణమించిందీ దానిలో ఉంటుందని చెబుతున్నారు. పురాతన, మధ్యయుగాలలో సంభవించిన తిరుగుబాట్ల నుంచి కమ్యూనిస్టులు ఈ భావ చరిత్రను గుర్తించారు. పందొమ్మిదవ శతాబ్ది పెట్టుబడిదారీ వ్యతిరేక ఉద్యమాల పెరుగుదలతోనే ఈ కధ ముగియలేదు అన్నాడు పాల్‌ మాసన్‌. ” పశ్చిమ దేశాల ప్రజాస్వామ్యాలు గిడసబారాయి, తమ మీద తమకే విశ్వాసం లేకుండా ఉన్నాయి. వాతావరణం గురించి పెరుగుతున్న ఆందోళన విప్లవాత్మక ఆర్థిక సమాధానాలను డిమాండ్‌ చేస్తున్నది. ప్రపంచ పేద దేశాల్లోని కోట్లాది మంది జనం దృష్టిలో చైనా ముందుకు తెచ్చిన అధికారతత్వ(ఇది రచయిత పదజాలం కాదు), రాజ్య నేతృత్వంలోని అభివృద్ధి ప్రత్నామ్నాయ నమూనాగా చూస్తున్నారు. ఇరవై సంవత్సరాల క్రితం కమ్యూనిజం అంతాన్ని చూశామని అనుకున్నాం.. ఈ రోజు ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీయే.ప్రపంచంలో అత్యంత విజయవంతమైన ఆర్థిక వ్యవస్థగా ఉంది. కావున ప్రచ్చన్న యుద్ధంలో భావజాల విజేతలు సెలవు తీసుకుంటూ రాసిన ఉద్గ్రంధాలన్నిటినీ భిన్నమైన చరిత్రగా చూడాల్సిన అవసరం ఉన్నదని భావిస్తున్నాను. ఇప్పటికీ అనేక మంది ఆర్థిక పురోగతి సాధనకు స్వేచ్చకోసం ఎందుకు సిద్దం అవుతున్నారో అర్ధం చేసుకోవటానికి తోడ్పడుతుంది.” అని పాల్‌ మాసన్‌ చెప్పాడు.


అమెరికా స్కూళ్లలో విద్యార్ధులు కమ్యూనిస్టులుగా మారుతున్నారని గుండెలు బాదుకుంటున్నది ఒక్క ఎలన్‌ మస్క్‌ మాత్రమే కాదు. అనేక మంది మితవాద రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు కూడా కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకతతో ఊగిపోతున్నారు.అమెరికా స్కూళ్లు, విశ్వవిద్యాలయాలు చైనా సంస్థలతో పరిశోధనా ప్రాజక్టులలో భాగస్వాములు కావటాన్ని నిషేధించాలని సెనెటర్‌ జేమ్స్‌ లాంక్‌ఫోర్డ్‌ డిమాండ్‌ చేశాడు. అంతర్జాతీయంగానే కాదు, అమెరికా గడ్డ మీద కూడా దేశాన్ని చైనా సవాలు చేస్తున్నదని, విద్యా సంస్థలలో పాతుకుపోతున్నదని ఒక ప్రకటనలో తాజాగా ఆరోపించాడు. అమెరికా పరిశోధనలను తస్కరిస్తున్నదని, రాజకీయంగా విద్యార్థులు, బోధకులు, వారి కుటుంబాల మీద ప్రభావం చూపుతున్నదని చెప్పుకున్నాడు. అమెరికాలో తన ప్రతిష్టను పెంచేందుకు అనేక పధకాలను రూపొందించిందని, వాటి ద్వారా గూఢచర్యం జరుపుతున్నదని ఆరోపించాడు. ఆగస్టు 27న చైనాతో పరిశోధన ఒప్పందం ముగిసినప్పటికీ జో బైడెన్‌ సర్కార్‌ మరో ఆరునెలలు పొడిగించిందని వాపోయాడు.
కమ్యూనిస్టు వ్యతిరేక ఉన్మాదం అమెరికా పక్కనే ఉన్న మెక్సికోకు కూడా పాకింది. పాఠ్యపుస్తకాలకు కమ్యూనిస్టు వైరస్‌ సోకిందంటూ కొన్ని చోట్ల క్రైస్తవ మత బృందాలు తలిదండ్రుల పేరుతో కొందరిని సమీకరించి పుస్తకాలను తగులబెట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ పుస్తకాల్లో లైంగిక విజ్ఞానం, లింగసమానత్వం వంటి అంశాలు ఉన్నాయన్నది వారి ఆరోపణ. వాటి పంపిణీ నిలిపివేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఆ పుస్తకాల్లో మార్క్సిస్టు-కమ్యూనిస్టు సిద్దాంతాలను చేర్చారని ఆరోపించారు. ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టిపారవేసింది. పాఠ్య అంశాలను టీచర్లు, నిపుణులు రూపొందించినట్లు పేర్కొన్నది.


అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర శాసనసభలో రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధి మరియ ఎలివిరా సాలాజార్‌ ఒక బిల్లును ప్రవేశపెట్టారు.దానిలో కమ్యూనిజం, నిరంకుశత్వాలను ఒకే గాటన కడుతూ వాటివలన సంభవించే నష్టాలను విద్యార్ధులకుచెప్పాలని పేర్కొన్నారు. అమెరికా యువత కమ్యూనిస్టుల పాలనలో జరిగిన నేరాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.కమ్యూనిజం బాధితుల ఫౌండేషన్‌కు పాఠాలను రూపొందించే బాధ్యత అప్పగించాలని ప్రతిపాదించారు. గతంలో కూడా సాలాజార్‌ ఇదే బిల్లును ప్రవేశపెట్టగా దాన్ని చర్చించక ముందే మురిగిపోయింది. ఈ బిల్లును ప్రతిపాదించినపుడు అధికారంలో డెమోక్రాట్లు ఉన్నారు. ఇప్పుడు రిపబ్లికన్లు ఉన్నందున తిరిగి ప్రవేశపెట్టారు.క్యూబా, కొరియా, వియత్నాం తదితర దేశాల నుంచి పారిపోయి వచ్చిన కమ్యూనిస్టువ్యతిరేకులు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు.


కమ్యూనిస్టు వ్యతిరేక వైరస్‌ ఒక్క అమెరికా, ఐరోపాల్లోనే కాదు మనదేశంలో కూడా ఉంది. ఇటీవల మహారాష్ట్రలోని నాగపూర్‌ విశ్వవిద్యాలయం ఎంఎ చరిత్ర విద్యార్ధుల సిలబస్‌లో అధ్యయనం చేయాల్సిన అంశాల్లో బిజెపి, రామజన్మభూమిని చేర్చింది. కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించింది. నూతన విద్యా విధానంలో భాగంగా సిలబస్‌లో మార్పులు చేర్పులు చేసినట్లు అధికారులు చెప్పారు. ఇదే విశ్వవిద్యాలయం గతంలో బిఏ విద్యార్ధులకు ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి పాఠాన్ని సిలబస్‌లో చేర్చింది. కమ్యూనిస్టు ఉద్యమం, పార్టీల గురించి నేర్చుకోవాలి, తెలుసుకోవాలనే ఆసక్తి కలగాలేగానీ పాఠ్యపుస్తకాలు, ట్విటర్‌, ఫేస్‌బుక్‌లతో పనేముంది. అవేవీ లేనపుడు ప్రపంచమంతా వ్యాప్తి చెందలేదా ? కమ్యూనిస్టు సిద్దాంతాలకు సంబంధించిన పుస్తకాలను బ్రిటీష్‌వారు, ఇతర సామ్రాజ్యవాదులు,అనేక దేశాల్లో ప్రభుత్వాలు నిషేధించినపుడు జనం వాటిని సంపాదించుకోలేదా అధ్యయనం చేయలేదా ? ఈ చరిత్ర తెలిసి కూడా ఇలాంటి పిచ్చిపనులు చేస్తున్నారు. చరిత్రలో యంత్ర విధ్వంసకుల గురించి చదివాము. ఐరోపాలో చేనేత రంగంలో మరమగ్గాలు వచ్చినపుడు తమ వృత్తిని అవి దెబ్బతీస్తున్నాయని ఆగ్రహించిన కార్మికులు వాటిని ధ్వంసం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని భావించి కొన్ని చోట్ల ఆపని చేశారు. సమస్య యంత్రాలది కాదు, వాటిని ధ్వంసం చేస్తే యాంత్రీకరణ ఆగదు. అదే విధంగా భూస్వాములను అంతం చేస్తే భూస్వామిక వ్యవస్థ రద్దవుతుందని నమ్మి ఆ పని చేసిన వారి సంగతి తెలిసిందే. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్నది ఎంత వాస్తవమో నిషేధాలద్వారా ఒక భావజాల వ్యాప్తిని అడ్డుకోవటం కూడా సాధ్యం కాదన్నది కూడా అంతే నిజం.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d