• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Politics

చైనాతో వాణిజ్యలోటు తగ్గిందా ? వాస్తవాలేమిటి ?

20 Saturday Apr 2019

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Politics

≈ Leave a comment

Tags

China, India’s Trade, India’s Trade Deficit, India’s Trade Deficit With China

Image result for India’s Trade Deficit With China 2019

ఎం కోటేశ్వరరావు

‘చైనాతో వాణిజ్య లోటును రూ.69,500 కోట్లు తగ్గించిన భారత్‌,చైనాకు భారత్‌ ఎగుమతులు 31శాతం పెరుగుదల, భారత్‌కు చైనా దిగుమతులు ఎనిమిదిశాతం తగ్గుదల,ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో అంతిమంగా చైనాతో లోటు తగ్గుతున్నది’ ఇది ‘ నేషన్‌ విత్‌ నమో మోడీ ‘ పేరుతో బిజెపి అబద్దాల ఫ్యాక్టరీ నుంచి వెలువడిన మరో వుత్పత్తి. ఆంగ్లంలో వున్న ఈ పోస్టు సామాజిక మాధ్యమంలో గత కొద్ది రోజులుగా తిరుగుతున్నది.

దీనిలో రెండు అంశాలున్నాయి. ఒకటి బిజెపి వారు నిజంగా దీన్ని నమ్మితే వెర్రి పుల్లయ్యల కింద జమకట్టాలి. లేదూ వాస్తవాలన్నీ తెలిసి ఇలా ప్రచారం చేస్తున్నారంటే జనాన్ని మోసం చేసే ఘరానా పెద్దలు అయినా అయివుండాలి. బిజెపి వారు వెర్రి పుల్లయ్యలైతే కాదు. అసలు వాస్తవాలేమిటో ఇక్కడ చర్చిద్దాం, అంతిమంగా వారేమిటో పాఠకులే నిర్ణయించుకోవచ్చు.

కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం 2007-08 నుంచి 2016-17 మధ్య చైనాతో మన దేశ వాణిజ్య లోటు 16బిలియన్ల నుంచి 51బిలియన్‌ డాలర్లకు పెరిగింది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో అంటే 2018-19లో వుభయ దేశాల మధ్య వాణిజ్యలోటు పదిబిలియన్‌ డాలర్ల మేరకు తగ్గి 53బిలియన్ల వద్ద వుంది. నమో మోడీ ప్రచారంలో ఈ పదిబిలియన్‌ డాలర్లనే రూపాయల్లోకి మార్చి రూ 69,500 కోట్ల మేరకు తగ్గించినట్లు, ఇదొక విజయమన్నట్లు పేర్కొన్నారు. దీని అర్ధం ఏమిటి మన వాణిజ్యలోటు 63బిలియన్లకు పెరిగినదానిలో పది బిలియన్లు తగ్గించారు.

Image result for India’s Trade Deficit With China 2019

2014 మార్చి నాటికి అంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సమయానికి చైనాతో మన వాణిజ్యలోటు 36.2 బిలియన్‌ డాలర్లు. దీని కంటే తగ్గించటమో కనీసం అంతకు మించి పెరగకుండా వుండటమో చేస్తే నరేంద్రమోడీ ఘనుడని, ఆయన దగ్గర అల్లావుద్దీన్‌ అద్భుత దీపం వుందని అనుకోవచ్చు. వ్యాపార లావాదేవీలన్న తరువాత ఒక రోజు పెరగవచ్చు, మరో రోజు తరగవచ్చు. అంతిమంగా ఒక ఏడాది కాలంలో లేదా ఒక ప్రధాని పదవీకాలం ఐదేండ్లలో నష్టమా, లాభమా అని ఎవరైనా చూడాలి. ఆ రీత్యా చూసినపుడు ఐదేండ్లలో మన లోటు 36.2బిలియన్ల నుంచి 53కు పెరిగింది. 2008-09లో చైనాకు మన ఎగుమతులు 9.4 బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులుండగా 2011-12 నాటికి 18.1 బిలియన్లకు పెరిగింది. తరువాత2015-16 నాటికి తొమ్మిది, 2016-17 నాటికి 10.2కు, 2018-19లో ఏప్రిల్‌-నవంబరు మాసాలకు గాను 11.1బిలియన్‌ డాలర్లకు చేరాయి. 2018 ఆర్ధిక సంవత్సరంలో ఎగుమతులు 13.3 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. బిజెపి ప్రచార యంత్రాంగం 31శాతం ఎగుమతుల పెరుగుదల అన్నది దీని గురించే. ఇదే కాలంలో చైనా నుంచి తగ్గింది ఎనిమిదిశాతం కాదు,24.64 శాతం పెరిగి 76.38 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అంటే మన వాణిజ్య లోటు 63 బిలియన్ల కంటే ఎక్కువగా వుందని ఏ ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని అడిగినా చెపుతారు. ఆ మొత్తం ఈఏడాది మార్చినాటికి 53బిలియన్‌ డాలర్లకు తగ్గింది కనుక ఆ ఘనత మోడీ సర్కారుదే అని ప్రచారం చేస్తున్నారు. ఇక మార్చినెలతో ముగిసిన వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో పైన పేర్కొన్నట్లు ఏప్రిల్‌-నవంబరు మధ్య మన ఎగుమతులు 11.1 బిలియన్‌ డాలర్లు అయితే ఇదే సమయంలో చైనా నుంచి 2.66శాతం తగ్గి 48.35 బిలియన్‌ డాలర్లుగా వున్నాయి. (బిజినెస్‌ లైన్‌ జనవరి 4, 2019).

ఎకనమిక్‌ టైమ్స్‌ (జనవరి 22,2019) పేర్కొన్నదానిని బట్టి చైనా అధికారిక సమాచారం ప్రకారం 2018లో మన దేశం నుంచి చైనాకు జరిగిన ఎగుమతుల విలువ 18.84 బిలియన్‌ డాలర్లు. అంతకు ముందుతో పోల్చితే 17శాతం పెరిగింది. రెండు దేశాల మధ్య లావాదేవీల్లో మన వాణిజ్యలోటు ఇదే కాలంలో 51.72 బిలియన్ల నుంచి 57.86 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. మొత్తం మీద నరేంద్రమోడీది గోల్డెన్‌ లెగ్గా ఐరన్‌ లెగ్గా ? వాణిజ్య లోటు మోడీ అధికారానికి వచ్చిన సమయంలో వున్న 36.2 బిలియన్లకు తగ్గేదెపుడు ? అసలు సమస్య ఇది కదా !

చైనాకు మన ఎగుమతులు పెరగటం సంతోషించాల్సిందే.ఆ పెరుగుదలకు కారణం బిజెపి వారు ప్రచారం చేస్తున్నట్లు డ్రాగన్‌ మెడలు వంచి సాధించటం కాదు. అయితే దిగుమతులు పెంచాలని వత్తిడి చేస్తున్నది నిజం. అంతర్జాతీయ రాజకీయాల్లో భాగంగా చైనా సడలించిన నిబంధనలే ప్రధాన కారణం. ఇదే సమయంలో చైనా నుంచి మన దిగుమతులు తగ్గాయా ? దీని కధేమిటో చూద్దాం. 2019 ఏప్రిల్‌ 17వ తేదీన లైవ్‌ మింట్‌ పత్రిక వ్యాఖ్యాత ఒక విశ్లేషణ చేశారు. ఇటీవల చైనా తన వుత్పత్తులు కొన్నింటిని తన రేవుల నుంచి గాక హాంకాంగ్‌ రేవు ద్వారా ఎగుమతులు చేయటం ప్రారంభించిందని, చైనా-హాంకాంగ్‌ల నుంచి మన దేశం చేసుకున్న దిగుమతుల విలువను చూస్తే వాణిజ్యలోటు తగ్గిందేమీ లేదని పేర్కొన్నారు. ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక ఏప్రిల్‌ 15వ తేదీన మరొక కధనాన్ని అందించింది. దానిలో మింట్‌ పత్రిక వ్యాఖ్యాతను వుటంకించింది. (సాధారణంగా ఇలా జరగదు) దాని ఆధారంగా తాను సేకరించిన సరికొత్త సమాచారాన్ని పాఠకులకు అందించి మింట్‌ కథనాన్ని నిర్ధారించింది.

Related image

పెరుగుతున్న వాణిజ్యలోటును తగ్గించటానికి చర్యలు తీసుకోవాలని భారత్‌ నుంచి వస్తున్న వత్తిడిని తప్పించుకొనేందుకు చైనా కొత్త ఎత్తుగడలకు పాల్పడిందని పేర్కొన్నారు.’ వాణిజ్య మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం 2018లో చైనాతో వాణిజ్యలోటు 59.3 నుంచి 57.4 బిలియన్లకు తగ్గింది. ఇదే సమయంలో భారత్‌తో హాంకాంగ్‌ వాణిజ్యలోటు భారత్‌కు ఎగుమతులు పెరిగి 2.7బిలియన్‌ డాలర్లకు చేరింది.భారత్‌తో చైనా-హాంకాంగ్‌ వాణిజ్యాన్ని కలిపి చూస్తే భారత్‌లోటు 2018లో అంతకు ముందున్న 55.4 బిలియన్ల నుంచి 60.1 బిలియన్లకు పెరిగింది.2018లో చైనాకు భారత్‌ ఎగుమతులు 30.4శాతం పెరిగి 16.5 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇదే సమయంలో హాంకాంగ్‌కు భారత ఎగుమతులు 15 నుంచి 13.3 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. మొత్తంగా 900మిలియన్‌ డాలర్లు భారత్‌కు నష్టం. చైనా నుంచి భారత్‌ దిగుమతి చేసుకొనే సెల్‌ఫోన్‌ విడి భాగాలు 2018లో 34.1 శాతం తగ్గాయి. అయితే అదే విడిభాగాల దిగుమతి హాంకాంగ్‌ నుంచి 728శాతం పెరిగాయి.లాన్‌ అడాప్టర్లు చైనా నుంచి 32శాతం తగ్గితే హాంకాంగ్‌ నుంచి 173శాతం పెరిగాయి. ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్లను దిగుమతి చేసుకోవటం చైనా నుంచి పెరిగింది, అయితే హాంకాంగ్‌ నుంచి 6,017శాతం పెరిగాయి. వాణిజ్యమంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం 2017లో వుభయ దేశాల వాణిజ్య లావాదేవీల విలువ 84.44 బిలియన్‌ డాలర్లు. దీనిలో భారత్‌ లోటు 52 బి.డాలర్లు. 2018 ఆర్ధిక సంవత్సరంలో భారత్‌ ఎగుమతులు 31శాతం పెరిగి 13.3బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ఇదే సమయంలో దిగుమతులు 24.64శాతం పెరిగి లావాదేవీల మొత్తం 76.38 బి.డాలర్లుగా వుంది. వాణిజ్యలోటును 63 బిలియన్‌ డాలర్లకు చేరింది.’ అని ఎకనమిక్‌ టైమ్స్‌ పేర్కొన్నది.

మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ నెహ్రూ అనుసరించిన విధానాలే కారణమంటూ తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు బిజెపి పెద్ద ఎత్తున గోబెల్స్‌ ప్రచారం చేస్తోంది. చైనాతో సంబంధాల విషయానికి వస్తే బిజెపి దాని అనుబంధ లేద సోదర సంస్ధలన్నీ నిత్యం విషం చిమ్ముతుంటాయి. చైనా వస్తు బహిష్కరణలకు పిలుపులనిస్తుంటాయి. అవి ఎంతగా వ్యతిరేకిస్తున్నాయో అంతకంటే ఎక్కువగా వాటికి నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వ ఆధ్వర్యంలో దిగుమతులు పెరుగుతున్నాయి. మేకిన్‌ ఇండియా అంటూ చైనా ఇతర దేశాలతో పోటీ బడి ఎగుమతులు చేయాలని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు ఏమైనట్లు ? ఆ చైనా నుంచే దిగుమతులను ఏటేటా ఎందుకు పెంచుతున్నట్లు ? ఎందుకీ వంచన ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అసాంజే అరెస్టు వెనుక అసలు కథేంటి ?

17 Wednesday Apr 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Political Parties, Politics, UK, USA

≈ Leave a comment

Tags

Assange's Arrest, Assange's asylum, Julian Assange, Lenín Moreno, Rafael Correa, WikiLeaks

Image result for julian assange

ఎం కోటేశ్వరరావు

కాలిలో ముల్లు, చెప్పులో రాయి, చెవిలో జోరీగ, ఇల్లాలి పోరు ఇంతింత కాదయా విశ్వదాభిరామా అన్న వేమన పద్యం తెలిసిందే. వికీలీక్స్‌ అధిపతి జూలియన్‌ అసాంజే చెప్పులో రాయిగా మారాడని వర్ణించిన ఈక్వెడోర్‌ అధ్యక్షుడు లెనిన్‌ మోరెనో అన్నంతపనీ చేసి అసాంజేను వదిలించుకున్నాడు. దీనికి కారణాలేమిటి అన్నది ఆసక్తి రేపుతున్న అంశం. ప్రపంచంలో వెల్లడయ్యే వ్యతిరేకత, వత్తిడే అమెరికా నుంచి అసాంజే జీవితాన్ని కాపాడతాయి. ఆ జర్నలిస్టు జీవితాన్ని ఏదో ఒకసాకుతో జీవితాంతం జైలుపాలు చేయవచ్చు. ఈక్వెడోర్‌ చట్టాల ప్రకారం ఒక వ్యక్తికి ఆశ్రయం ఇచ్చిన తరువాత ప్రభుత్వం దానిని రద్దు చేయటానికి వీల్లేదు. బ్రిటన్‌లో బెయిల్‌ నిబంధనలను వుల్లంఘించిన వారు వేలాది మంది వున్నారు. వారందరినీ వదలి అసాంజేను అరెస్టు చేయటం వెనుక బ్రిటన్‌ మీద అమెరికా తెచ్చిన వత్తిడే అన్నది స్పష్టం.

లండన్‌లోని తమ రాయబార కార్యాలయంలో శరణార్దిగా వున్న అసాంజే తామిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసినందున లండన్‌ పోలీసులకు అప్పగించినట్లు తొలుత ప్రకటించిన మోరెనో, అతను తమ కార్యాలయాన్ని గూఢచార కార్యకలాపాలకు వినియోగించుకున్నాడని కొద్ది రోజుల తరువాత మరొక అభాండం వేశాడు. ఇతని తీరు చూస్తే మేకపిల్లను తినదలచుకున్న తోడేలు చెప్పిన సాకుల కధ గుర్తుకు రాకమానదు. ఆస్ట్రేలియన్‌ పౌరుడైన జూలియన్‌ అసాంజే 2006 వికీలీక్స్‌ స్దాపక సంపాదకుడిగా అనేక అంశాల మీద ముఖ్యంగా అమెరికాకు చెందిన లక్షలాది రహస్య పత్రాలను బహిర్గతం కావించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.2010లో అమెరికా అరెస్టు వారెంట్‌ జారీ చేయటమే కాదు, అతను దొరికితే తమకు అప్పగించాలని తనతో ఒప్పందం వున్న దేశాలన్నింటినీ కోరింది. ఆ వల నుంచి బయటపడిన అసాంజే 2012లో బ్రిటన్‌లో వుండగా ఈక్వెడోర్‌ రాజకీయ ఆశ్రయం కల్పించేందుకు అంగీకరించటంతో లండన్‌లోని రాయబార కార్యాలయంలో అప్పటి నుంచీ నివాసం వుంటున్నాడు. ఒక దేశ అనుమతి లేకుండా స్ధానిక లేదా బయటి ప్రభుత్వాలకు చెందిన పోలీసులు, ఇతర ఏజన్సీలేవీ ప్రవేశించటానికి లేదు. అయితే గత వారంలో ఈక్వెడోర్‌ అధ్యక్షుడు తాము అసాంజేను బయటికి పంపుతున్నామని తెలియచేసి మరీ లండన్‌ పోలీసులకు అప్పగించాడు. ఈ అసాధారణ చర్య మీద ప్రపంచవ్యాపితంగా తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నా పట్టించుకోవటం లేదు.

Image result for julian assange

లెనిన్‌ మోరెనో చర్య అంతర్జాతీయంగా ఈక్వెడోర్‌ ప్రతిష్టను దెబ్బతీసింది. తమ సార్వభౌమత్వాన్ని తామే దెబ్బతీసుకోవటంతో పాటు, శరణార్దిగా , తరువాత దేశ పౌరుడిగా మారిన అసాంజేను అప్పగించి అంతర్జాతీయ న్యాయ సూత్రాల వుల్లంఘనకు పాల్పడ్డాడు. లండన్‌ పోలీసులను తమ కార్యాలయంలోకి స్వయంగా ఆహ్వానించాడు. వామపక్ష వాది రాఫెల్‌ కొరెయా వారసుడిగా అధికారానికి వచ్చిన లెనిన్‌ ఇలా ప్రవర్తించటం ఏమిటని వామపక్ష వాదులకు, ఇతరులకు ఆశ్చర్యం కలిగించవచ్చు. రెండు సంవత్సరాల క్రితం అధికారానికి వచ్చిన అతగాడి కదలికలను గమనిస్తున్నవారికి ఏ క్షణంలో అయినా అసాంజేను అమెరికా రాక్షసికి అప్పగించవచ్చనే అభిప్రాయం ఎప్పటి నుంచో వుంది. అందుకు తగిన అవకాశం కోసం ఎదురు చూశాడు.

లాటిన్‌ అమెరికాలో గత రెండు దశాబ్దాలలో వామపక్షాలు అధికారానికి వచ్చిన దేశాలలో ఈక్వెడోర్‌ ఒకటి.ఈ ప్రభుత్వాలకు నాయకత్వం వహించిన పార్టీలలో చేరిన వారందరూ అన్ని అంశాల మీద ఏకాభిప్రాయం కలిగిన వారు కాదు. నియంతలు, మిలిటరీపాలకులు, ప్రజాస్వామ్య హక్కులు, కార్మికవర్గంపై దాడులను, అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యాన్ని వ్యతిరేకించే ఒక సాధారణ లక్షణమే ఈ పార్టీలలో చేరిన వ్యక్తులు, శక్తుల మధ్య అంగీకృతమైంది. నయావుదారవాద విధానాల కొనసాగింపు, పెట్టుబడిదారీ వ్యవస్ధను సమూలంగా తొలగించాలనిగాక సంస్కరించాలని కోరే వారి వరకు అందరూ ఈ పార్టీలలో వున్నారు. అందుకే ఎక్కడా నయా వుదారవాద విధానాలకు ప్రత్యామ్నాయం రూపొందించకుండా వాటినే కొనసాగిస్తూ జనానికి వుపశమన చర్యలు తీసుకుంటున్నారు. వాటికి పరిమితులు ఎదురైనపుడు ఆ విధానాల నుంచి కూడా వైదొలుగుతున్నారు. అందుకు తాజా వుదాహరణ ఈక్వెడోర్‌.

అక్కడ ప్రస్తుతం అధికారంలో వున్న పాయిస్‌ అలయన్స్‌. పయస్‌ అంటే స్పానిష్‌లో దేశం అని అర్ధం, ఆంగ్లంలో ప్రౌడ్‌ అండ్‌ సావరిన్‌ ఫాదర్లాండ్‌( గర్వించదగిన మరియు పితృభూమి) కూటమి. మధ్యేవాద-వామపక్ష ప్రజాస్వామిక సోషలిస్టు మరియు సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీగా దీని లక్షణాన్ని విశ్లేషకులు వర్ణించారు. ఈ కూటమికి నాయకుడిగా మూడుసార్లు అధ్య క్షపదవి చేపట్టిన రాఫెల్‌ కొరెయా అక్కడి నిబంధనల ప్రకారం మూడోసారి పోటీ చేసేందుకు వీలులేని కారణంగా తమ అభ్యర్ధిగా లెనిన్‌ మోరెనోను ప్రకటించాడు.(వామపక్ష వాది అయిన మోరెనో తండ్రి తన కుమారుడు లెనిన్‌ అంతటి వ్యక్తి కావాలనే ఆకాంక్షతో పేరులో లెనిన్‌ చేర్పాడు. ) అసాంజేను లండన్‌ పోలీసులకు అప్పగించిన లెనిన్‌ మోరెనో ఈక్వెడోరియన్‌ మరియు లాటిన్‌ అమెరికా చరిత్రలో పేరుమోసిన విద్రోహి అని అదే రాఫెల్‌ కొరెయా తీవ్రంగా స్పందించాడు. మోరెనో ఒక అవినీతి పరుడు, అతను చేసిన నేరాన్ని మానవాళి ఎన్నటికీ మరవదు అని ట్వీట్‌ చేశాడు.

అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే మోరెనో తన నిజస్వరూపాన్ని బయటపెట్టడం ప్రారంభించాడు. అచిర కాలంలోనే జనం నుంచి దూరమయ్యాడు. ప్రస్తుతం అతన్ని సమర్ధించేవారి సంఖ్య 17శాతానికి అటూఇటూగా మాత్రమే వుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. మార్చినెల చివరి వారంలో ప్రతిపక్ష ఎంపీ ఒకరు మోరెనో అవినీతిని వెల్లడించే పత్రాలను బహిర్గతం చేశాడు. వాటిలో వున్న వివరాల ప్రకారం పన్నుల ఎగవేతల స్వర్గం, బినామీ కంపెనీలకు నిలయమైన పనామాలో ఐఎన్‌ఏ పెట్టుబడుల కంపెనీ పేరుతో మొరెనో అక్రమాస్తులను కూడపెట్టాడు. అది సోదరుడు ఎడ్విన్‌ మోరెనో పేరు మీద వుంది. లెనిన్‌ మోరెనో కుమార్తెలు ఇరినా, క్రిస్టినా,కరీనా పేర్లు కలసి వుండేలా ఐఎన్‌ఏ కంపెనీ వుంది. అందుకు ఆదే పేరుతో అక్రమాల కుంభకోణాన్ని పిలుస్తున్నారు. దీని మీద వచ్చిన ఫిర్యాదులను ప్రాధమికంగా విచారించేందుకు ఏప్రిల్‌ నాలుగున తమ ముందుకు హాజరుకావాలని ప్రాసిక్యూటర్‌ జనరల్‌ కార్యాలయం దేశాధ్యక్షుడికి సమన్లు పంపింది. ఇదంతా తన ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు పన్నిన కుట్ర అని, మాజీ అధ్యక్షుడు రాఫెల్‌ కొరెయా ఏర్పాటు చేసిన రాజకీయ సంస్ధ సిటిజన్‌ రివల్యూషన్‌లో సభ్యుడిగా వున్న ఎంపీ ఇదంతా చేస్తున్నాడని మోరెనో ఆరోపించాడు. పాయిస్‌ అలయన్స్‌ అభ్యర్ధిగా ఎన్నికైన మోరెనో దానికే ద్రోహం చేశాడని, విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని కొరెయా విమర్శించారు. విచారణ నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు, అమెరికా అనుకూల శక్తులను తనవైపు తిప్పుకొనేందుకు అసాంజేను బలిపెట్టారన్నది ఒక కోణం.దానికి అనుగుణ్యంగానే మీడియా కేంద్రీకరణ అవినీతి నుంచి అసాంజే వైపు మళ్లింది.

గతంలో పాయిస్‌ అలయన్స్‌ నేత, మాజీ వుపాధ్యక్షుడైన జార్జి గ్లాస్‌ అవినీతి అక్రమాలపై విచారణ జరిపి 20017 ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఆ సమయంలో మోరెనో వుపాధ్యక్షుడిగా, రాఫెల్‌ కొరెయా అధ్యక్షుడిగా వున్నారు. తరువాతే మోరెనో అధ్య క్షుడయ్యాడు. ఆ వుదంతాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని తాను అవినీతి పరుల అంతం చూసే వ్యక్తినని జనం ముందుకు వెళ్లాడు. ఇప్పుడు ఐఎన్‌ఏ పత్రాలలో అతగాడే పెద్ద అవినీతి పరుడని బయటపడింది. తనను అధ్యక్షుడిని చేసిన రాఫెల్‌ కొరెయాను కూడా మోరెనో వదల్లేదు. 2012లో అధ్యక్షుడిగా వున్న సమయంలో ప్రతి పక్ష ఎంపీని కిడ్నాప్‌ చేయించారనే ఒక తప్పుడు కేసు బనాయించారు. ఆ కేసులో హాజరుకాకపోవటంతో కొరెయాను అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు గత ఏడాది జూలైలో ఆదేశించింది. ఆ సమయంలో బెల్జియం వాస్తవ్యురాలైన భార్యతో కొరెయా అక్కడే వుంటున్నారు. ఇప్పటికీ అక్కడే వున్నారు.అసాంజే అరెస్టు సందర్భంగా కొరెయా ఫేస్‌బుక్‌ పేజీని తొలగించారు. ఇతరుల వ్యక్తిగత వివరాలన్నీ వెల్లడించారనే తప్పుడు కారణాలు చూపారు.

తప్పంటూ ఒకసారి చేసినా వందసార్లు చేసినా ఒకటే అన్నట్లుగా లండన్‌ పోలీసులతో అసాంజేను అరెస్టు చేయించిన మోరెనా దేశంలో తన పోలీసులను ప్రయోగించి అసాంజే మద్దతుదార్లును అరెస్టు చేయించాడు. విదేశీయులను అరెస్టు చేసినపుడు ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు తెలియచేయాల్సి వుంది. దాన్ని కూడా పాటించలేదు. తమ ప్రభుత్వాన్ని అస్ధిర పరచేందుకు రష్యన్‌ హాకర్స్‌, వికీలీక్స్‌ సభ్యులు వున్నారని హోంమంత్రి ఆరోపించారు.ఈక్వెడోర్‌ మాజీ విదేశాంగ మంత్రి రికార్డో పాటినో ఒక ప్రకటన చేస్తూ నెంబరులేని ప్రభుత్వ ట్రక్కు ఒకటి భార్యతో కలసి ప్రయాణిస్తున్న తన కారును వెంటాడిదని పేర్కొన్నారు. అంతకు ముందు రోజు ఒక రేడియోలో మాట్లాడుతూ ఐఎంఎఫ్‌, అమెరికా పెత్తనంలో వున్న ఆర్ధిక సంస్ధల నుంచి రుణాల కోసం లొంగిపోయి అసాంజేను అప్పగించాడని రికార్డో పాటినో చెప్పారు.పాటినో కూడా తన ప్రభుత్వాన్ని అస్ధిర పరచేందుకు కుట్రచేసిన వారిలో ఒకరని మోరెనో ఆరోపించాడు.

అసాంజే అప్పగింతకు జరుగుతున్న ప్రయత్నాల గురించి రాఫెల్‌ కొరెయా ఈఏడాది ప్రారంభంలోనే ఒక హెచ్చరిక చేశారు. ఆశ్రయం పొందిన అసాంజే నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాడా లేదా అన్నది మదింపు జరుగుతోందని ఒక డాక్యుమెంట్‌ను ట్విటర్‌ద్వారా వెల్లడించారు. ఐఎంఎఫ్‌ నుంచి పొందే పది బిలియన్‌ డాలర్ల రుణానికి గాను ప్రతిగా అసాంజేను అమెరికాకు అప్పగించాలని, ఈక్వెడోర్‌ వర్షపు అడవులను కాలుష్యం గావించిన అమెరికా కార్పొరేట్‌ చమురు కంపెనీ చెవరాన్‌ నుంచి ఎలాంటి నష్టపరిహారం కోరకూడదని తదితర షరతులను ఐఎంఎఫ్‌ సూచించింది. ఐఎంఎఫ్‌లో 17.46శాతం వాటా కలిగిన అమెరికా గతంలో తమ డిమాండ్లను అంగీకరించకపోతే ప్రపంచబ్యాంకు,ఐఎంఎఫ్‌ వంటి సంస్ధల నుంచి తాము వైదొలగాల్సి వుంటుందని బెదిరించిన విషయం బహిరంగమే. ఐఎంఎఫ్‌ను సాంప్రదాయేతర ఆర్ధిక ఆయుధంగా వాడుకోవాలన్న అమెరికా మిలిటరీ సూచనలను వికీలీక్స్‌ బయట పెట్టింది. ప్రత్యర్ధులు అమెరికాకు లొంగితే రాయితీలు , వ్యతిరేకంగా వుంటే దెబ్బతీయాలని సూచించారు.

మోరెనా సర్కార్‌ అసాంజేను అప్పగించటమే కాదు, ఐఎంఎఫ్‌ ఇతర షరతులను కూడా వెంటనే అమలు జరిపింది.ఒప్పందంపై సంతకాలు చేయకముందే తమ చిత్తశుద్ధిని నిరూపించుకొనేందుకు లేదా అప్పుకు వుద్యోగుల తొలగింపుకు సంబంధం లేదని చెప్పుకొనేందుకు సంస్కరణల పేరుతో పదివేల మంది ప్రభుత్వ సిబ్బందిని ఇంటికి పంపింది. అంతేకాదు రెండున్న దశాబ్దాల క్రితం చెవరాన్‌ కంపెనీ కలుషితం చేసిన ప్రాంతాన్ని ప్రభుత్వ నిధులతో శుద్ది చేసేందుకు పూనుకొని కంపెనీకి ఖర్చు తప్పించింది. అధికారానికి రాగానే 2017లోనే క్విటో నగరంలో మోరెనో, అమెరికా ప్రత్యేక ప్రతినిధి రాబర్ట్‌ ములర్‌, ట్రంప్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ పాల్‌ మానాఫోర్ట్‌ సమావేశమయ్యారు.దానిలో అసాంజే అప్పగింతకు తగిన చర్యలు తీసుకుంటామని, దారి వెతుకుతామని మోరెనో హామీ ఇచ్చాడు. పొమ్మనకుండా పొగపెట్టినట్లుగా 2018లో లండన్‌ రాయబార కార్యాలయంలో అసాంజేకు ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని, భద్రతా సిబ్బందిని తొలగించారు. అమెరికాకు సంతోషం చేకూర్చేందుకు వెనిజులా నాయకత్వంలో ఏర్పడిన లాటిన్‌ అమెరికా దేశాల కూటమి నుంచి తాము వైదొలుగుతున్నట్లు గతేడాది ఆగస్టులో ప్రకటించారు. బ్రెజిల్‌ ఎన్నికల్లో గెలిచిన వామపక్ష వ్యతిరేకి జైర్‌ బోల్‌సోనారోకు అభినందనలు తెలిపాడు. తమ సహనం నశించిన తరువాతే అసాంజేను తీసుకుపోవాల్సిందిగా లండన్‌ పోలీసులను కోరినట్లు ఈనెల 11న మోరెనో ప్రకటించాడు.

Image result for julian assange

నయావుదారవాద విధానాల ప్రాతిపదికన సంక్షేమ రాజ్యాలను ఏర్పాటు చేయాలన్న లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తుల వైఫల్యాన్ని అవకాశంగా తీసుకొని అర్జెంటీనా, బ్రెజిల్‌ వంటి చోట్ల సామ్రాజ్యవాదులు ప్రజావ్యతిరేకులను తిరిగి ప్రతిష్ఠించగలిగారు.ఈక్వెడోర్‌లో వామపక్ష వేదికనే వుపయోగించుకొని నెగ్గిన మోరెనోను ఏకంగా తమ వాడిగా మార్చుకోవటం సరికొత్త పాఠాలను నేర్పుతోంది. అక్కడి వామపక్షాలలో సాగుతున్న మధనం ఇలాంటి హాలాహలాన్ని అధిగమించగలదనటంలో ఎలాంటి సందేహం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నందిగ్రామ్‌లో తిరిగి ఎగిరిన ఎర్రజెండా !

09 Tuesday Apr 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

CPI(M), Nandigram, West Bengal Lok sabha Elections 2019

Image result for nandigram, cpi(m)

ఎం కోటేశ్వరరావు

నందిగ్రామ్‌, పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలను ఒక మలుపు తిప్పిన పేరు, ప్రాంతం. భూసేకరణకు వ్యతిరేకంగా అక్కడ జరిగిన వుదంతాల కారణంగా అప్పటికే సిపిఎం పాలనపై వున్న అసంతృప్తిని సొమ్ము చేసుకున్న మమతాబెనర్జీ కమ్యూనిస్టులను గద్దె దింపి ముఖ్యమంత్రిగా మూడు సంవత్సరాల క్రితం రెండవ సారి కూడా గద్దెనెక్కిన విషయం తెలిసిందే. నందిగ్రామ్‌లో పన్నెండు సంవత్సరాల తరువాత గత ఆదివారం నాడు తిరిగి సిపిఎం తన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఆ ప్రాంతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ తమ పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేయటం, ఆక్రమించుకోవటం, కార్యకర్తలను నివాస ప్రాంతాల నుంచి వేలాది మందిని తరిమివేసినట్లు గతంలో పలుసార్లు సిపిఎం ప్రకటించిన విషయం తెలిసిందే. నందిగ్రామ్‌లోని సిపిఎం కార్యాలయం సుకుమార్‌ సేన్‌ గుప్తా భవనం గత పది సంవత్సరాలుగా మూతపడి వుంది. ఆదివారం నాడు కార్యాలయ ప్రారంభంతో పాటు తమ్లుక్‌ నియోజకవర్గ సిపిఎం అభ్యర్ధి ఇబ్రహీం ఆలీకి మద్దతుగా పెద్ద ప్రదర్శన కూడా చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీనేత రబిన్‌దేవ్‌ మాట్లాడుతూ ఒకనాడు వామపక్ష వ్యతిరేక ఆందోళనకు కేంద్రంగా వున్న చోట తిరిగి కార్యాలయాన్ని ప్రారంభించటానికి కారణం తృణమూల్‌ కాంగ్రెస్‌ దుష్పరిపాలనను గమనించిన జనం తిరిగి తమవైపు రావటమే కారణం అన్నారు.

అయితే తృణమూల్‌ వ్యతిరేకులందరూ తమ వైపు వచ్చిన కారణంగా ప్రతిపక్ష ఓట్లలో చీలిక తెచ్చేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ వారే సిపిఎంతో కుమ్మక్కై పార్టీ కార్యాలయ ప్రారంభానికి అవకాశమిచ్చారని బిజెపి జిల్లా అధ్యక్షుడు ప్రదీప్‌ దాస్‌ ఆరోపించారు. దీన్ని తృణమూల్‌ అభ్యర్ధి దివ్యేందు అధికారి తోసి పుచ్చారు. బిజెపి పగటి కలలు కంటున్నదన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు నాటి వామపక్ష ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌, మావోయిస్టు తదితర సిపిఎం వ్యతిరేకశక్తులన్నీ రైతులకు మద్దతు ఇచ్చి ఆందోళన చేయించాయి. ఆసందర్భంగా జరిగిన కాల్పుల్లో 14 మంది మరణించారు. ఆ తరువాత నోటిఫికేషన్‌ను రద్దు చేసినప్పటికీ ప్రతిపక్షాలు హింసాకాండను కొనసాగించాయి.

ఈ ఎన్నికల్లో సిపిఎం, కాంగ్రెస్‌ మధ్య పరస్పర పోటీ నివారించుకొనేందుకు జరిగిన చర్చలు విఫలం కావటంతో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. నందిగ్రామ్‌ ప్రాంతం వున్న తమ్లుక్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా మార్చిచివరి వారంలో బిజెపి నుంచి చేరిన లక్ష్మన్‌ సేథ్‌ను ప్రకటించారు. సేథ్‌ గతంలో సిపిఎం తరఫున మూడుసార్లు ఎంపీగా పని చేసి నందిగ్రామ్‌ వుదంతం తరువాత పార్టీ నుంచి వుద్వాసనకు గురయ్యాడు. తరువాత బిజెపిలో చేరాడు, ఈ ఎన్నికల్లో అభ్యర్ధిగా నిలిపేది లేదని ఆ పార్టీ స్పష్టం చేయటంతో కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్‌లో చేరాడు. రాష్ట్ర కాంగ్రెస్‌ అభ్యంతరాలను కూడా లెక్కచేయకుండా అధిష్టానవర్గం అభ్యర్ధిత్వాన్ని ప్రటించింది. తాను చెప్పిన అభ్యంతరాన్ని ఖాతరు చేయలేదని పార్టీ కార్యకర్తలు తగినన సమాధానం చెబుతారని అసెంబ్లీలో కాంగ్రెస్‌ పక్ష నాయకుడు అబ్దుల్‌ మన్నన్‌ వ్యాఖ్యానించారు. తాము చేయగలిందేమీ లేదని పిసిసి అధ్యక్షుడు సోమేన్‌ మిత్రా అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో నాలుగు పార్టీలు పోటీలో వున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌, బిజెపి, కాంగ్రెస్‌ మొత్తం 42 స్ధానాలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి.వామపక్ష సంఘటన కాంగ్రెస్‌ గెలిచిన నాలుగు స్ధానాలు మినహా 38 చోట్ల పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎన్నికల్లో వామపక్ష సంఘటన పుంజుకుంటుందా, బిజెపి తన స్ధానాలను సంఖ్యను పెంచుకుంటుందా అన్నది ప్రధాన చర్చ నీయాంశంగా వుంది. పార్టీలన్నీ చావో రేవో అన్నట్లు పోటీ పడుతున్నాయి.తృణమూల్‌ను పక్కకు నెట్టి వామపక్ష వ్యతిరేక శక్తిగా తాను ముందుకు రావాలని బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సంఘపరివార్‌ శక్తులు శ్రీరామనవమి, దుర్గాపూజ, వంటి మతపరమైన సందర్భాలన్నింటినీ వినియోగించుకొని ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టి హిందూ ఓటు బ్యాంకు ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నట్లు విమర్శలు వున్నాయి.

ఎన్నికల సందర్భంగా ప్రతి పార్టీ తన బలాన్ని ప్రదర్శించుకొనేందుకు పెద్ద బహిరంగ సభలను ఏర్పాటు చేస్తాయి. పశ్చిమ బెంగాల్‌లో కొల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ను అందుకు వేదికగా చేసుకుంటాయి. ఇప్పటి వరకు జరిగిన సభలను చూస్తే మోడీ పాల్గన్నది అత్యంత పేలవంగా వుంది, ఆ సభకోసం బిజెపి 32కోట్ల రూపాయలను ఖ ర్చు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ సభకు రెండులక్షల మంది వరకు రాగా ఫిబ్రవరి మూడున వామపక్షాలు జరిపిన సభకు పదిలక్షల వరకు జనం హాజరయ్యారు. ఈ సభ వామపక్షాలలో ఎంతో ఆత్మస్ధైర్యాన్ని నింపింది.

నరేంద్రమోడీ ఒక వలస పక్షి వంటి వారు, ఎన్నికలపుడే వస్తారు, కాగానే వెళ్లిపోతారు, మాకు కావాల్సింది నిజమైన చౌకీదారు తప్ప మోసగాడు కాదు అని మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో ధ్వజమెత్తుతున్నారు. తృణమూల్‌ శారద-నారద పార్టీ అని నరేంద్రమోడీ ఎద్దేవా చేశారు. అయితే శారద-నారద- హవాలా లీడర్లందరూ ఇప్పుడు బిజెపి అవతారమెత్తారని మమతా బెనర్జీ తిప్పికొడుతున్నారు.

Image result for after 12 years red flags again unfurled in nandigram

గత పార్లమెంట్‌,అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాయిజం గురించి మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీల వారిని నామినేషన్లు కూడా వేయనివ్వకుండా పంచాయతీలన్నీ ఏక గ్రీవం అయ్యేట్లు చూశారన్న విమర్శలు వున్నాయి. ఎన్నికలు జరిగిన చోట్ల రిగ్గింగ్‌ చేశారు. అవినీతి కేసులు వున్న తృణమూల్‌ ఎంపీలు, నేతలు దాడుల భయంతో బిజెపికి ఫిరాయించారు. ప్రస్తుత ఎన్నికల్లో తృణమూల్‌ వ్యతిరేక ఓట్లను పొందేందుకు వామపక్ష సంఘటన, బిజెపి, కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నాయి. వామపక్ష సంఘటనలో సిపిఎం 29, ఫార్వర్డ్‌బ్లాక్‌, సిపిఐ, ఆర్‌ఎస్‌పి మూడేసి సీట్లుకు పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్‌ గెలిచిన నాలుగు సీట్లకు వామపక్ష సంఘటన అభ్యర్ధులను ప్రకటించలేదు.కాంగ్రస్‌ స్పందనను బట్టి వాటి మీద కూడా తాము నిర్ణయం తీసుకుంటామని ప్రకటించాయి. మొత్తం ఏడు దశలో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల పరంగా చూస్తే తృణమూల్‌ కాంగ్రెస్‌ తరువాత వామపక్ష సంఘటనకే ఎక్కువ వున్నాయి. 2016లో వామపక్ష సంఘటన, కాంగ్రెస్‌ సర్దుబాట్లు చేసుకున్నాయి. అందువలన పొందిన ఓట్లు వాస్తవ బలాన్ని ప్రతిబింబించవు. ఆ సర్దుబాటును సిపిఎం కేంద్ర కమిటీ తప్పు పట్టింది. పార్టీ ఆమోదించిన విధానానికి వ్యతిరేకం అని పేర్కొన్నది.

2014లోక్‌ సభ ఎన్నికల్లో పార్టీల ఓట్లశాతం, సీట్లు

తృణమూల్‌    39.05     34

లెఫ్ట్‌ ఫ్రంట్‌     29.71     2

బిజెపి          17.02    2

కాంగ్రెస్‌         9.58      4

2016అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల ఓట్లశాతం సీట్లు

తృణమూల్‌   44.9    211

లెఫ్ట్‌ ఫ్రంట్‌    25 .8   30

సిపిఎం       19.8    26

సిపిఐ          1.5    1

ఆర్‌ఎస్‌పి       1.7    3

ఫార్వార్డ్‌బ్లాక్‌   2.8     2

బిజెపి        10.2    3

కాంగ్రెస్‌      12.3    44

ఇతరులు      0      4

Share this:

  • Tweet
  • More
Like Loading...

అద్వానీ వూడగొట్టిన నాగటి కర్రు ?

07 Sunday Apr 2019

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION

≈ Leave a comment

Tags

BJP, L K Adavani, Lal Krishna Advani's recent blog, LK Advani Comment, Narendra Modi, Rhul Gandhi on Advani, RSS

Image result for Adavani  an useless entity  In BJP

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ కార్మికులారా ఏకంకండి, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని మార్క్స్‌-ఎంగెల్స్‌లు తమ కమ్యూనిస్టు ప్రణాళికలో పిలుపు ఇచ్చారు. బిజెపి అగ్రనాయకుడు ఎల్‌కె అద్వానీ ఇప్పుడు వూడగొట్టిన నాగటి కర్రు. అది నాగలికి వుంటేనే దున్నటానికి పనికి వస్తుంది. ఒట్టి కర్రుతో పొలం దున్నలేరు. తాను ఏమి మాట్లాడినా తనకు ఇంతకు మించి పోయేదేమీ లేదన్నట్లుగా తొమ్మిది పదులు దాటిన బిజెపి కురువ ద్ధుడు ఎల్‌కె అద్వానీ నిర్ణయించుకున్నారు. ఇందుకు ఆయనను ఎవరైనా ప్రేరేపించారా ! బిజెపిలో అంత ధైర్యమూ లేదు, ఎవరికీ అంతసీన్‌ లేదు. అందుకే వుక్రోషంతో తన బ్లాగ్‌లో తన అంతరంగం ద్వారా నరేంద్రమోడీ తీరు తెన్నులపై పరోక్షంగా ధ్వజమెత్తారని కొందరి అభిప్రాయం.

తన బ్లాగ్‌లో అద్వానీ విప్పిన అంతరంగ ముఖ్యాంశాలు ఇలా వున్నాయి. బిజెపిలో వున్న మనమందరం పార్టీ వ్యవస్దాపక దినోత్సవం సందర్భంగా వెనుకా, ముందూ చూసుకోవటం, ఆత్మపరిశీలన చేసుకోవటం మంచిది అని చెప్పారు. పార్టీలోపలా, విశాలమైన దేశ వ్యవస్ధలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామిక సంప్రదాయాలను కాపాడు కోవటం బిజెపి ప్రమాణ చిహ్నంగా వుండాలి.మన ద ష్టిలో జాతీయ వాదం అంటే రాజకీయంగా మనతో ఏకీభవించని వారిని మనం ఎన్నడూ జాతి వ్యతిరేకులుగా పరిగణించలేదు, వ్యక్తిగతంగా రాజకీయ స్దాయిలో వ్యక్తులు ఎంచుకొనే స్వేచ్చకు బిజెపి కట్టుబడి వుంటుంది. ముందు దేశం, తరువాత పార్టీ,మన గురించి చివరిగా ఆలోచించాలన్న సూత్రం తనకు జీవిత మార్గదర్శిగా వుందని, జీవితాంతం దానికి కట్టుబడి వుంటానని అద్వానీ పేర్కొన్నారు.

బిజెపి నిజమైన స్వభావాన్ని అద్వానీ గారు పక్కాగా చెప్పారు. దేశం ముందు, పార్టీ తరువాత, వ్యక్తిగతం చివర వుండాలనే మార్గదర్శక మంత్రం బాగా తెలిసిందే. బిజెపి కార్యకర్తగా గర్వపడుతున్నాను మరియు ఎల్‌కె అద్వానీ వంటి గొప్పవారు దాన్ని మరింత బలపరిచారు అని ప్రధాని నరేంద్రమోడీ ట్విటర్‌ద్వారా వ్యాఖ్యానించారు. అద్వానీ ఎట్టకేలకు తన నోరు విప్పారు. ఆయనకు పోయేదేమీ లేదు అంటూ ఒక పత్రికలో వ్యాఖ్యానం మొదలైంది. అద్వానీకి నోరు విప్పటానికి ఐదేండ్లు పట్టింది, అసలు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నట్లు అని బిజెపి మిత్రపక్షం శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం ప్రశ్నించింది.

Image result for Advani , modi in different occasions

మామ తిట్టాడన్నదాని కంటే తోడల్లుడు కిసుక్కున నవ్వటం తగని పని అన్నట్లు అద్వానీ గురించి రాహుల్‌ గాంధీ చేసిన వాటి కంటే చౌకీదారు పంగనామాలు పెట్టుకున్న బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీని మరింత ఇరుకున పెడుతున్నాయని చెప్పవచ్చు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ ఎన్నికల సభలో మాట్లాడిన రాహులు ఇలా అన్నారు.’ బిజెపి హిందూయిజం గురించి మాట్లాడుతుంది, హిందుస్దాన్‌లో గురువు అధిపతి. పార్టీ గురుశిష్య సంబంధాల గురించి మాట్లాడుతుంది. మోడీ గురువు ఎవరు? అద్వానీ, అద్వానీని ప్రజాజీవన వేదిక మీది నుంచి తోసివేశారు’ అన్నారు. గురువును అవమానించటం హిందూ సంస్క తి కాదంటూ నరేంద్రమోడీని వుద్దేశించి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యా నించారు. హిందూ సంస్క తి గురించి మాట్లాడే హక్కు తమకే వుందని, పేటెంట్‌ తీసుకున్నామన్నట్లుగా చెప్పుకొంటుంది బిజెపి. అయితే ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లు హిందూత్వను హిందూత్వతోనే దెబ్బతీయాలి అన్నట్లుగా రాహుల్‌ గాంధీ మాట్లాడారా ? లేక తామూ హిందూ సంస్కృతి గురించి చెప్పగలమని రాహుల్‌ గాంధీ స్పష్టం చేసినట్లుగా వుంది. అదే హిందూ సంస్క తిలో గురువు తాను స్వయంగా శిక్షణ ఇచ్చిన ఒక శిష్యుడి కోసం తనను పరోక్షంగా గురువుగా భావించిన మరొక శిష్యుడి బొటనవేలిని కానుకగా కోరిన దారుణం కూడా తెలిసిందే. దాని మంచి చెడ్డలను మరోసారి చూడవచ్చు.

Image result for Advani , modi in different occasions

అసలు విషయం ఏమంటే బిజెపి వ్యవస్దాపక నేతలలో ఒకరైన ఎల్‌కె అద్వానీ పార్టీ ఆఫీసుకు రావద్దని చెప్పటం మినహా మిగిలిన అవమానాలన్నీ జరిగాయి. వాటన్నింటినీ దిగమింగుతూ ఏప్రిల్‌ ఆరున బిజెపి వ్యవస్దాపక దినోత్సవం సందర్భంగా ఎవరూ కోరకుండానే పార్టీ నాయకత్వం, కార్యకర్తలకు తన బ్లాగ్‌ ద్వారా అద్వానీ ఈనెల నాలుగు ఒక సందేశాన్ని పంపారు. గత ఐదు సంవత్సరాలలో ఒక బ్లాగ్‌ పోస్టు పెట్టటం ఇదే ప్రధమంట. నరేంద్రమోడీ మన్‌కీ బాత్‌ పేరుతో రేడియోలో ప్రతి నెలా తన అంతరంగాన్ని బయట పెడితే, అంతకు ముందే అద్వానీ తన ఇంటర్నెట్‌ బ్లాగ్‌లో తన అంతరంగాన్ని అభిప్రాయాల రూపంలో అప్పుడు రాస్తుండేవారు. ఏమి రాస్తే, ఏమి మాట్లాడితే ఎవరికేమి కోపం వస్తుందో అన్నట్లుగా గత ఐదేండ్లుగా బ్లాగులో రాయట మానుకున్నారు. గత ఐదు సంవత్సరాలుగా లోక్‌సభకు హాజరు కావటం, అలవెన్సులు తీసుకోవటం తప్ప ఒక్కసారి కూడా నోరు విప్పని సభ్యుల జాబితాలో ఆయన కూడా చేరిపోయారనే విమర్శలకు గురయ్యారు. ఐదు సంవత్సరాలలో ఆయన కేవలం 365పదాలను మాత్రమే మాట్లాడారని, అది కూడా 2014లో అని ఇండియా టుడే పత్రిక పేర్కొన్నది, బహుశా సభ్యుడిగా ప్రమాణ స్వీకారం అయి వుండవచ్చు.

ఆరు సార్లు గుజరాత్‌లోని గాంధీ నగర్‌ నుంచి ఎంపీగా వున్న అద్వానీని వయసు మీరిందనే సాకు చూపి ఈ సారి ఎన్నికల్లో సీటు కేటాయించకపోగా ఆయనే పోటీ చేయటం లేదని చెప్పారంటూ బిజెపి నేతల నుంచి మీడియాకు వుప్పందించారు. ఈ చర్య ఆయనను అవమానించటంగా మీడియా, ప్రతిపక్షాలు వర్ణించాయి తప్ప బిజెపి ప్రముఖులెవరూ నోరు విప్పలేదు. రాహుల్‌ గారూ మీ మాటలు మమ్మల్ని ఎంతగానో గాయపరిచాయి, అద్వానీ మాకు బిజెపిలో తండ్రితో సమానుడు . మీ వుపన్యాసాల్లో కాస్త ఔచిత్యం ప్రదర్శించండి’ అని సుష్మా స్వరాజ్‌ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

నిజానికి రాహులు గాంధీ ఇప్పుడు వ్యాఖ్యానించారు గానీ నరేంద్రమోడీ గురువుకు పంగనామాలు పెట్టారని ఐదు సంవత్సరాల క్రితమే జనానికి అర్దమైంది. అనుమానాస్పద స్దితిలో జరిగిన గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో చెలరేగిన మారణ కాండ సమయంలో నరేంద్రమోడీయే ముఖ్యమంత్రిగా వున్నారు. ఆయన వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు రావటంతో ప్రధానిగా వున్న వాజ్‌పేయి పదవి నుంచి తప్పుకోవాలని మోడీని ఆదేశించారని, అద్వానీ మద్దతుతో మోడీ తిరస్కరించి ముఖ్యమంత్రిగా కొనసాగారని, చేసేదేమీ లేక రాజధర్మం పాటించాలన్న వుద్బోధతో వాజ్‌పేయి సరిపెట్టారని అప్పుడే వార్తలు వచ్చాయి. నాడు అద్వానీ మద్దతు లేకపోతే నేడు ప్రధానిగా నరేంద్రమోడీని వూహించలేము.

ప్రధాని పదవిపై ముందునుంచీ కన్నేసిన నరేంద్రమోడీ పార్టీలో కేంద్ర ఎన్నికల కమిటీ అధ్యక్ష పదవి కోసం 2013లోనే పావులు కదిపి విజయం సాధించారు. ఆయన పేరును పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రతిపాదించగానే అద్వానీ మౌనంగా వుండటం తప్ప మరేమీ చేయలేని స్దితిలో పడ్డారు. అద్వానీకి పదవి నిరాకరించితే సమస్యలు వస్తాయని వూహించి 75 సంవత్సరాలు దాటిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వకూడదని ఒక నిబంధను ముందుకు తెచ్చారు. దానికి అనుగుణంగా అద్వానీ, మురళీమనోహర జోషి వంటి వారితో మార్గదర్శక మండలి ఏర్పాటు చేసి సలహాలు తీసుకుంటామంటూ మండలి ఏర్పాటు గురించి ప్రకటించారు. అది ఐదేండ్లలో ఒక్కసారంటే ఒక్కసారిగా కూడా సమావేశం కాలేదు, నరేంద్రమోడీ సర్కార్‌ సలహా ఇమ్మని ఒక్కసారి కూడా కోరలేదు.ఇది పొమ్మన కుండా పొగపెట్టటమే అని అందరూ అప్పుడే వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాలని అన్ని అస్త్రాలను నరేంద్రమోడీ ప్రయోగిస్తున్న దశలో అధికారం కోసం ఏం చేసినా తప్పులేదనే ఒక అభిప్రాయాన్ని దిగువ స్దాయి కేడర్‌ వరకు బిజెపి ఎక్కించింది. దేశంలో హిందూత్వ, హిందూ మతాన్ని కాపాడాలంటే నరేంద్రమోడీ తప్ప మరొకరి వల్ల కాదనే అభిప్రాయాలు నిత్యం సామాజిక మాధ్యమంలో వెల్లడి అవుతున్నాయంటే దాని అర్దం అదే. అందువలన ప్రజాస్వామ్యం, ప్రజాస్వామిక విలువల గురించి బిజెపి కార్యకర్తలకు ఎంత మేరకు ఎక్కుతాయనేది ప్రశ్న. నరేంద్రమోడీ గోరక్షకులు హద్దులు మీరవద్దంటూ అనేక సుభాషితాలు పలికారు. అలా హద్దులు మీరి, హత్యలు చేసిన నిందితులు అనేక మంది వుత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న బిజెపి ఎన్నికల సభల్లో ముందువరుసల్లో కూర్చున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.అలాంటి వారికి విద్వేషం వద్దు ప్రేమే ముద్దు అంటే ఎక్కుతుందా ?

భిన్నాభి ప్రాయం చెప్పిన వారందరినీ దేశద్రోహులుగా సంఘపరివార్‌ సంస్ధలూ, వాటికి వంత పాడిన మీడియా గత ఐదు సంవత్సరాలుగా నిరంతరంచిత్రీకరిస్తోంది.గతంలో అనేక మంది ప్రభుత్వం తమకు ఇచ్చిన అవార్డులను వెనక్కు ఇచ్చేసి నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని దేశం ఇంకా మరచి పోలేదు. ఇప్పుడు చెప్పిన మాటలను అద్వానీ అప్పుడు చెప్పివుంటే వాటికి ఎంతో విలువ వుండేది. దేశంలో ప్రజాస్వామిక వ్యవస్ధలను, స్వతంత్ర అధికార వ్యవస్దలను నాశనం చేస్తున్నారన్న విమర్శలు తీవ్రంగా వెలువడిన సమయంలో అద్వానీ ఎందుకు నోరు విప్పలేకపోయారు, పార్లమెంటులో ఒక్కసారి కూడా నోరు విప్పే ధైర్యం ఎందుకు చేయలేకపోయారు. నక్కబోయిన తరువాత బక్కపూడ్చినట్లు ఇప్పుడు చెప్పారు అనే వారిని తప్పు పట్టలేము. తనకు తిరిగి సీటు ఇచ్చి వుంటే ఇలా మాట్లాడేవారా అనే వారు కూడా లేకపోలేదు. దేశమంతటికీ ముఖ్యంగా బిజెపికి ఎన్నికల, మరోసారి అధికార జ్వరం తీవ్ర స్దితికి చేరిన సమయంలో చెబితే ఎంత మంది వినిపించుకుంటారు అన్నది ప్రశ్న.

దేశంలో అత్యవసర పరిస్దితి విధించి నాలుగు దశాబ్దాలు పూర్తి అయిన సందర్భంగా 2015లో అద్వానీ మాట్లాడుతూ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని నలిపివేశే శక్తులు బలంగా వున్నాయని వ్యాఖ్యానించారు. గోరక్షణ పేరుతో పశువుల వ్యాపారులు, మైనారిటీల మీద దాడులు ప్రారంభమైన సమయ మది. దేశంలో హిందూత్వ పేరుతో రాజకీయాలు చేయటం ప్రారంభమైనపుడే ఇలాంటి వాటిన్నింటికీ బీజాలు పడ్డాయి. అవి పెరిగి పెద్ద వ క్షాలుగా ఎదగటానికి తోడ్పడిన వారిలో అద్వానీ పాత్ర లేదా అని ప్రశ్నించే వారు లేకపోలేదు.1980లో బిబిసితో మాట్లాడుతూ బిజెపిని హిందూ పార్టీ అని పిలవటం తప్పేమీ కాదు అన్నారు. తరువాత కొన్ని సంవత్సరాలకు దేశ లౌకిక విధానం హిందువుల ఆకాంక్షలపై సహేతుకంగాని ఆంక్షలు పెడుతున్నదని ఆరోపించారు. ఎవరైతే హిందువుల ప్రయోజనాలకోసం పోరాడతారో ఇక నుంచి వారే దేశాన్ని ఏలుతారు అన్నారు. కుహనా లౌకిక వాదం అనే పదాన్ని ప్రయోగించటం, ప్రాచుర్యంలోకి తేవటంలో అద్వానీ చేయాల్సిందంతా చేశారు.

Image result for Advani , modi in different occasions

అయితే అద్వానీకి అలా హితబోధ చేసే హక్కు లేదా అని ఎవరైనా అనవచ్చు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో అలాంటి వుద్బోధలు మోడీ, బిజెపికి హాని కలిగిస్తాయి కనుక అద్వానీ అయినా సరే అలా మాట్లాడటాన్ని సహించం అని హిందూత్వ పులినెక్కిన వారు హూంకరించవచ్చు. అద్వానీకి ఆ హక్కు, అవకాశం వుందని జనం అభిప్రాయ పడుతున్నారు. అయితే చరిత్ర నిర్దాక్షిణ్యమైనది. గాంధీని మోసిన రైలేే గాడ్సేను కూడా అనుమతించింది. అద్వానీ వుద్బోదధలను నమోదు చేసి సానుభూతి కలిగేట్లు చేసినట్లుగానే ఆయన విద్వేష పూరిత రాతలు, ప్రసంగాలను కూడా జనం ముందుంచి ఆయన మీద ద్వేషం, వ్యతిరేకతను కలిగేట్లు చేసింది.

ప్రస్తుతం మీడియాలో, జన వాడకంలో వున్న కుహనా లౌకిక వాదం అనే పదాన్ని వుపయోగించి హిందువుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారంటూ బహుళ ప్రచారం తెచ్చింది అద్వానీయే. ఆ పదం మరింత ముదిరి బిజెపి నేతలు,అనుచరులు లౌకికవాదులంటే దేశాన్ని ముక్కలు చేసే గాంగ్‌ అని నిందిస్తున్నది.1997 ఆగస్టులో బిజెపి టు డే అనే పత్రికలో అద్వానీ రాసిన దానిలో ఇలా వుంది.’ హిందుత్వ లేదా సాంస్క అతిక జాతీయ వాదం మతపరమైనది కాదు,(ముస్లింలు) రాముడు, క అష్ణుడు ఇతరులను జాతీయ సంస్క అతికి చిహ్నాలుగా అంగీకరించాలి మరియు అయోధ్యలో రామాలయానికి మద్దతు ఇవ్వాలి ఎందుకంటే రాముడు భారత సంస్క అతి మరియు నాగరికతకు చిహ్నం’ అని రాశారు. ఈ వైఖరితో విబేధించే భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే వారినే కదా ఇప్పుడు దేశద్రోహలు అని నిందిస్తున్నది. మరి ఇప్పుడు అదే అద్వానీ గతంలో తాను చెప్పిన దానికి భిన్నంగా బోధ చేస్తే బిజెపిలో వినే వారుంటారా ?

Image result for Advani , modi in different occasions

రధయాత్ర పేరుతో అద్వానీ దేశంలో ఎలాంటి రాజకీయాలకు తెరలేపారో, ఎంతటి మారణకాండకు ఆద్యుడయ్యారో తెలిసిందే. ఆయన కళ్ల ముందే బాబరీ మసీదు కూల్చివేత, దాన్ని ఆపేందుకు ఆయన ప్రయత్నించినట్లు ఎలాంటి దాఖలాలు లేవు. తనకు రాజకీయ భిక్షపెట్టిన అద్వానీని ప్రధాని నరేంద్రమోడీ విస్మరించారని, అవమానించారని అంటున్నారంటే వూరికే కాదు. 2008లో అద్వానీ తన ఆత్మకథను ప్రచురించారు.దానిలో ఇలా రాశారు.’ గోద్రాలో కరసేవకుల సామూహిక హత్యల అనంతరం గుజరాత్‌లో మతహింసాకాండ చెలరేగింది. ఆ దారుణమైన సంఘటన గురింఎతీ గుజరాత్‌ ప్రభుత్వాన్ని ప్రత్యేకించి ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తీవ్ర ఖండనలకు గురయ్యారు. మోడీని అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నారు. నా అభిప్రాయంలో జరిగిన దానికంటే ఎక్కువ పాపాన్ని మూటగట్టుకున్నారు.’ అలావెనకేసుకు వచ్చిన పెద్దమనిషి ఇప్పుడు మోడీ చేశారని చెబుతున్నదానిని ఎలా ఖండించగలరు, ప్రత్యక్షంగా మోడీని ఎలా విమర్శించగలరు.

దేశంలో 1990దశకలో తలెత్తిన మత హింసాకాండకు అద్వానీ రధయాత్ర ఎంతగానో దోహదం చేసింది. బాబరీ మసీదు కూల్చివేత కుట్రలో అద్వానీ, మురళీ మనోహర జోషి, వుమా భారతి(బిజెపి లేదా నరేంద్రమోడీ పక్కన పెట్టిన జాబితాలోని వారు) తదితరుల ప్రమేయం గురించి రోజువారీ విచారణ జరిపి 2019 ఏప్రిల్‌ 19లోగా రెండు సంవత్సరా వ్యవధిలో పూర్తి చేయాలని 2017లో సుప్రీం కోర్టు ఆదేశించింది.

బాబరీ మసీదుకు ముందు రామాలయం వుండేదని రుజువు అవుతుందని సంఘపరివార్‌ సంస్ధలు చెబుతుండేవి. అయితే క్రీస్తుపూర్వం పదకొండవ శతాబ్దిలో అయోధ్యలో మానవ ఆవాసాలు వున్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని రామాయణ స్ధల ప్రాజెక్టు నివేదికలో ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఎఎస్‌ఐ) తెలిపింది. దాంతో రామాలయ వాదుల నోట్లో వెలక్కాయపడింది. సరిగ్గా ఆ సమయంలో అద్వానీ వారిని ఆదుకున్నారు. రాముడు ఒక నమ్మకం దానికి సాక్ష్యాలు ఎలా వెతుకుతారంటూ అద్వానీ వాదించారు.అప్పటి నుంచి కోర్టులు విశ్వాసాల మీద తీర్పులు చెప్పలేవంటూ సంఘపరివార్‌ వాదించటం మొదలు పెట్టింది. అంటే కోర్టు తీర్పును తాము అంగీకరించేది లేదని చెప్పేందుకు వేసిన ప్రాతిపదిక ఇది. శబరిమల ఆలయంలో కూడా అదే వాదనలు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఆయోధ్యలో రామాలయ నిర్మాణమే తమ లక్ష్యం అని చెప్పేవారు. దానికి సాంస్కృతిక జాతీయవాదాన్ని పైన చేర్చింది అద్వానీ మహాశయుడే అన్నది తెలిసిందే.

మసీదు కూల్చివేత కేసులో అద్వానీని ప్రభుత్వ సకల వసతి గృహంలో నిర్భందించారు. ఆ సమయంలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికకు రాసిన వ్యాసాలలో డిసెంబరు ఆరు తన జీవితంలో విచారకరమైన రోజు అని పేర్కొన్నారు. ఇలా చెప్పటం మసీదును కూల్చివేసినందుకు క్షమాపణగా భావించవచ్చా అన్న ప్రశ్నకు కాదని సమాధానమిచ్చారు. తరువాత స్మృతులలో అద్వానీ మరొక కధనాన్ని వినిపించారు. బాబరీ మసీదు వద్ద చేరిన జనాన్ని అదుపు చేయటంలో విఫలమైనందుకు తాను విచారపడుతున్నానని,వ్యక్తిగతంగా తనకు పరువు నష్టమని, ఆ స్ధలంలోని కట్టడానికి ఎలాంటి నష్టం కలిగించకుండా నామ మాత్రంగా రామాలయ నిర్మాణ కార్యక్రమం చేపడతారని అనుకున్నానని పేర్కొన్నారు. కూల్చివేత పట్ల విచారం ప్రకటించినందుకు సంఘపరివార్‌లో, బయటి లౌకికవాదులు కూడా తనను విమర్శించారని, తన వ్యక్తిగత విశ్వసనీయత కరిగిపోయిందని చెప్పుకున్నారు.

Image result for Advani , modi in different occasions

అద్వానీ గళం అప్పుడేమైంది? భిన్నాభిప్రాయం కలిగినంత మాత్రాన వారిని జాతి వ్యతిరేకులు అనాల్సిన అవసరం లేదని అద్వానీ ఇప్పుడు అంటున్నారు. అసలు నోరు మూసుకోవటం కంటే ఎప్పుడో ఒకప్పుడు తెరవటం మంచిదే కదా అనే అరగ్లాసు సంతృప్తి జీవులుంటారు. ఫిబ్రవరి 14న పుల్వామా వుగ్రదాడి జరిగిన తరువాత మార్చిమూడవ తేదీన బీహార్‌లో మోడీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభకు రాని వారందరినీ పాకిస్దాన్‌కు మద్దతుదార్లుగా పరిగణిస్తామని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ సెలవిచ్చినపుడు మార్గదర్శక మండలి సభ్యుడిగా అద్వానీ నోరు మెదపలేదు. ఈ వైఖరితో విబేధించే భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే వారినే కదా ఇప్పుడు దేశద్రోహలు అని నిందిస్తున్నది. మరి ఇప్పుడు అదే అద్వానీ గతంలో తాను చెప్పిన దానికి భిన్నంగా బోధ చేస్తే బిజెపిలో వినే వారుంటారా ?

స్వాతంత్య్ర వుద్యమ సమయంలోనే కమ్యూనిస్టులు మహాత్మా గాంధీ వైఖరితో విబేధించారు, వ్యతిరేకించారు. తరువాత కాంగ్రెస్‌ ప్రజాస్వామ్య వ్యతిరేక పోకడలు, బిజెపి మత పోకడలు చూసి కనీసం గాంధీ చెప్పిన అంశాలకైనా కట్టుబడండని అదే కమ్యూనిస్టులు చెప్పారు. ఇప్పుడు కూడా అదే పరిస్దితి తలెత్తింది. దేశమంటే బిజెపి,బిజెపి అంటే దేశం, బిజెపిని విమర్శించటమంటే దేశాన్ని విమర్శించటమే అనే ఒక వున్మాద వాతావరణం దేశంలో నెలకొన్న స్దితిలో అద్వానీ మంచి మాటలు ఎందరికి ఎక్కుతాయన్నది ఒక ప్రశ్న. ప్రపంచ చరిత్రలో అనేక మంది నియంతలను చూశాము. రెండవ ప్రపంచ యుద్దానికి ముందు జర్మనీలో హిట్లర్‌ను చూసిన తరువాత వాడి కంటే పూర్వపు నియంతలే మెరుగు అనిపించాడు. బాబరీ మసీదును కూలదోస్తున్న సమయంలో స్వయంగా అక్కడే వున్న ఎల్‌కె అద్వానీ నాడు ఒక పెద్ద మతోన్మాది, పచ్చిమితవాదిగా కనిపించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు బిజెపిని విమర్శించిన తెలుగుదేశం వంటి పార్టీలు ఆ పార్టీకే కేంద్రంలో ఎందుకు మద్దతు ఇచ్చారని అడిగితే వాజ్‌పేయిని చూసి తప్ప బిజెపిని చూసి కాదని చెప్పుకున్న విషయాన్ని మరచి పోరాదు. ఇప్పుడు అలాంటి అద్వానీయే మెరుగని నరేంద్రమోడీ తీరుతెన్నులు జనం చేత అనిపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రతిపక్షాలు చెప్పింది వినకపోతే పాయే మీ అద్వానీ చెప్పింది అయినా పాటించమని జనం గళం విప్పాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వైనాడ్‌లో ‘అమూల్‌ బేబీ ‘ రాహుల్‌ గాంధీ పోటీ !

03 Wednesday Apr 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

CPI, CPI()M, Kerala, Naredra Modi, Rahul gandhi, Rahul gandhi Amul Baby, VS Achuthanandan, wayanad lok sabha

Image result for wayanad lok sabha assembly constituency map manorama

ఎం కోటేశ్వరరావు

దాదాపు రెండు నెలల పాటు  తర్జన భర్జన పడి ఎట్టకేలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కేరళలోని వైనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో అమేధీతో పాటు ఎన్నికల ఫోకస్‌ ఇక్కడ కూడా ప్రసరించనుంది. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటికీ నుంచీ రెండు సార్లు కాంగ్రెస్‌దే పై చేయిగా వుంది. వైనాడ్‌, కోజికోడ్‌, మలప్పురం జిల్లాల పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు దీనిలో వున్నాయి. ఈనెల 23న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. రాహుల్‌ గాంధీని ఓడించేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ లేదా సినీ నటుడు సురేష్‌ గోపీని పోటీకి దించవచ్చని మీడియాకు అనధికారికంగా వుప్పందించిన బిజెపి చివరకు బలహీనమైన భారత జన ధర్మ సేన అనే మిత్రపక్షానికి చెందిన వి.నటేశన్‌ను పోటీకి దింపింది. ఈ చర్య కమ్యూనిస్టులను ఓడించేందుగా, రాహుల్‌ గాంధీని గెలిపించేందుకా అన్న సందేహం ఓటర్లలో కలుగుతోంది. రాజకీయ పరిస్ధితులను అర్ధం చేసుకోవటంలో విఫలమైన కారణంగా గతంలో తాను రాహుల్‌ గాంధీని అమూల్‌ బేబీ అని వ్యాఖ్యానించానని, ఇప్పుడు వైనాడ్‌లో పోటీకి దిగి తన వ్యాఖ్యను మరోసారి నిజం చేశారని కేరళ మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం నేత విఎస్‌ అచ్యుతానందన్‌ వ్యాఖ్యానించారు. పరిస్ధితులను పిల్లచేష్టలు, ఆవేశంతో ఎదుర్కొంటారని నడి వయస్సు వచ్చినా పెద్ద మార్పేమీ లేదని అన్నారు. రాహుల్‌ను పోటీకి దింపటం ద్వారా కాంగ్రెస్‌ కూర్చున్న కొమ్మనే నరుక్కొనే రీతిలో వ్యవహరిస్తోందని, తప్పుదారి పట్టించే కాంగ్రెస్‌ నేతల మాటలను రాహుల్‌ అనుసరిస్తున్నారని చెప్పారు.

రాహుల్‌ గాంధీ పోటీకి నిర్ణయించుకోవటంతో కేరళ ఎన్నికల రంగం వేడెక్కిందనే చెప్పవచ్చు. ప్రధాని నరేంద్రమోడీ పచ్చి అబద్దాన్ని ప్రచారంలో పెట్టటంతో పాటు ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే స్ధాయికి దిగజారారు. ఈనెల ఒకటవ తేదీన మహారాష్ట్రలోని వార్దా ఎన్నికల సభలో మాట్లాడుతూ అమేథీలో హిందువుల ఆగ్రహానికి భయపడి మైనారిటీలు మెజారిటీగా వున్న నియోజకవర్గంలో పోటీ చేసేందుకు పోయారని ఎద్దేవా చేశారు. అక్కడ సగం మంది ఓటర్లు హిందువులున్నారు. వైనాడ్‌ ఎన్నిక అధికారంలో వున్న వామపక్ష ప్రజాతంత్ర కూటమి(ఎల్‌డిఎఫ్‌) ఐక్య ప్రజాతంత్ర కూటమి(యుడిఎఫ్‌), బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ కూటమికి ప్రతిష్టాత్మకంగా మారనుంది.గత పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడి పోటీ తీరు తెన్నులను ముందుగా చూద్దాం. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వైనాడ్‌ జిల్లాలోని మూడు నియోజకవర్గాలు, మలప్పురం జిల్లాలోని మూడు, కోజికోడ్‌ జిల్లాలోని ఒక నియోజకవర్గంతో ఇది ఏర్పడింది. ఇక్కడ రాహుల్‌ గాంధీ పోటీ చేసినందువలన కేరళతో పాటు దక్షిణాది రాష్ట్రాలన్నింటా కాంగ్రెస్‌కు వూపు వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. దీన్ని మరొక విధంగా చెప్పాలంటే ఆయన పోటీ చేయని రాష్ట్రాలలో కాంగ్రెస్‌ డీలాపడుతుంది. రాహుల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీలో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఒక్కటంటే ఒక్క చోట కూడా రాహుల్‌ గాంధీ తమ పార్టీ అభ్యర్ధిని గెలిపించుకోలేకపోయారు. అలాంటిది దేశంలో కాంగ్రెస్‌ను గెలిపిస్తారా అన్నది ప్రశ్న.

ముస్లిం మైనారిటీలు ఎక్కువగా వున్నారన్న అంచనాతో రాహుల్‌ గాంధీ పోటీలోకి దిగుతున్నారు.అది కూడా వాస్తవం కాదు. తాజా లెక్కల ప్రకారం ఈ నియోజకవర్గంలో 13,25,788 మంది ఓటర్లు వున్నారు. వీరిలో మహిళలు 6,70,002, పురుషులు 6,55,786 మంది వున్నారు. సామాజిక తరగతుల రీత్యా చూస్తే హిందువులు 49.48, ముస్లింలు 28.65, క్రైస్తవులు 21.34, ఇతరులు 0.53శాతం వున్నారు.

Image result for pp suneer cpi

వైనాడ్‌ నియోజకవర్గంలో ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధిగా సిపిఐ మలప్పురం జిల్లా కార్యదర్శి పిపి సునీర్‌ పోటీ చేస్తున్నారు.1968లో జన్మించారు. ఇప్పటికే ఒక విడత ప్రచారాన్ని ముగించి రెెండవ దశలో ప్రవేశించారు. ప్రజా మన్ననలను పొందిన సునీర్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌. భార్య, కుమారుడు, కుమార్తె వున్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ ద్వారా విద్యార్ధి వుద్యమాలు, యువజన రంగం, అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో 2004లో పొన్నాని లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఎల్‌డిఎఫ్‌ జిల్లా కన్వీనర్‌గా పని చేస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో తమ అవకాశాలను పెంచుకొనేందుకు రాహుల్‌ గాంధీని బరిలోకి దించి.గతంలో ఇందిరా గాంధీ, పివి నరసింహారావు, ఎన్‌టిఆర్‌, నరేంద్రమోడీ రెండు చోట్ల పోటీ చేసిన వుదంతాలు వున్నాయి. రాహుల్‌ గాంధీ ఒక్కసారి కూడా అధికార పీఠం ఎ్కకుండానే ఆ పనిచేస్తున్నారు. ఈ పోటీ తమకు బలాన్నిస్తుందని కాంగ్రెస్‌ చెబుతుంటే ఆ పార్టీ బలహీనతకు నిదర్శనమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అమేథీ నుంచి పారిపోయి వస్తున్నారని బిజెపి ఎద్దేవా చేసింది. గుజరాత్‌ నుంచి నరేంద్రమోడీ వారణాసిలో పోటీ చేస్తున్నారంటే అక్కడి నుంచి పారిపోయి వచ్చినట్లా అని కాంగ్రెస్‌ తిప్పికొట్టింది. రాహుల్‌ గాంధీ వైనాడ్‌లో పోటీ చేయటం అంటే కేరళలో ప్రధాన శత్రువుగా వామపక్షాలను ఎంచుకున్నట్లే అని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్‌ కరత్‌ వ్యాఖ్యానించారు.రాహుల్‌ను పోటీకి దించటమంటే వారి ప్రాధాన్యత కేరళలో వామపక్షాల మీద వ్యతిరేకత, బిజెపిని ఓడించాలన్న కాంగ్రెస్‌ జాతీయ విధానానికి వ్యతిరేకం, కేరళలో ప్రధాన శక్తి బిజెపి కాదు, ఎల్‌డిఎఫ్‌ అందువలన రాహుల్‌ను ఓడిస్తాం అన్నారు. ఈ చర్య కాంగ్రెస్‌లో తలెత్తిన విశ్వాసరాహిత్యాన్ని వెల్లడిస్తున్నదని, రాహుల్‌ గెలిస్తే ఏ సీటుకు ప్రాతినిధ్యం వహిస్తారో తెలుసుకోగోరుతున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియెరి బాలకృష్ణన్‌ అన్నారు.

Image result for rahul gandhi wayanad

కాంగ్రెస్‌కు బలమున్న స్ధానంగా వున్న వైనాడ్‌లో తమ అభ్యర్ధులను నిలిపేందుకు కాంగ్రెస్‌లోని ప్రధాన ముఠా నాయకులందరూ ప్రయత్నించారన్నది కొద్ది రోజులుగా వచ్చిన మీడియా వార్తలు తెలిపాయి. రాహుల్‌ గాంధీ ఒక దశలో విముఖంగా వుండటంతో కోజికోడ్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు టి సిద్దికిని అభ్యర్ధిగా ప్రకటించారు. పార్టీలో ‘ఎ’ వర్గనాయకుడిగా పేరున్న మాజీ ముఖ్యమంత్రి వూమెన్‌ చాందీ సిద్దికీ పేరును ప్రతిపాదించగా ‘ఐ ‘ గ్రూప్‌ నాయకుడిగా వున్న రమేష్‌ చెన్నితల షానిమోల్‌ వుస్మాన్‌, వివి ప్రకాష్‌ పేర్లను ప్రతిపాదించారు. దక్షిణాది రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, కర్ణాటక, తమిళనాడు, కేరళకు చెందిన లక్షలాది కార్యకర్తలు రాహుల్‌ పోటీ చేయాలని కోరినట్లు కాంగ్రెస్‌ ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా వర్ణించారు.

వైనాడ్‌లో రాహుల్‌ గాంధీని పోటీకి దించినా, దించకపోయినా అక్కడ ప్రధాన పోటీ సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌, కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ మధ్యనే జరుగుతుంది. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలన్న సుప్రీం కోర్టు తీర్పును తొలుత స్వాగతించి తరువాత ఓటు బ్యాంకు రాజకీయాలకు వుపయోగించుకోవాలని చూసిన కాంగ్రెస్‌, బిజెపిలో భక్తుల మనోభావాల పేరుతో ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే తమకు ఓటింగ్‌ శాతం పెరగనుందని బిజెపి ఆశపడుతోంది. కాంగ్రెస్‌కూడా ఆ ఓట్లమీదనే కన్నేసింది. అయితే రాజకీయంగా ఎప్పటి నుంచో సమీకరణ అయిన కేరళ ఓటర్లు ఎంత మేరకు మొగ్గుతారన్నది ప్రశ్న.

వైనాడ్‌లో రాహుల్‌ గాంధీ ప్రవేశంతో బిజెపికి ఒక విధంగా ఇరకాటం అని చెప్పవచ్చు. ఆ నియోజకవర్గ ఓటింగ్‌ తీరుతెన్నులే ఆ పార్టీని ఇరకాటంలోకి నెడుతున్నాయని చెప్పవచ్చు. గత ఎన్నికలలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చిందీ వివరాలను పట్టికలో చూడవచ్చు. గత లోక్‌సభ ఎన్నికలలో 80వేల ఓట్లు తెచ్చుకున్న బిజెపి రెండు సంవత్సరాల తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఏడు నియోజకవర్గాలలో 93,641 ఓట్లు తెచ్చుకుంది. నాలుగు సీట్లలో విజయం సాధించిన ఎల్‌డిఎఫ్‌కు 4,55,019 ఓట్లు వస్తే మూడు సీట్లకే పరిమితమైన కాంగ్రెస్‌కు 4,73, 434 ఓట్లు వచ్చాయి. 2014లోక్‌ సభ ఎన్నికలలో సిపిఐ అభ్యర్ధి కంటే కాంగ్రెస్‌కు 20వేలు మాత్రమే. దాదాపు అదే తేడా అసెంబ్లీ ఎన్నికలలో 17,600కు పడిపోయింది.

Image result for Amul Baby Rahul Gandhi in Wayanad Fray

కేరళలో బిజెపి పైకి ఏమి చెప్పినప్పటికీ పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులను కూడగడుతున్నది. దేశవ్యాపితంగా ముక్త కాంగ్రెస్‌ పేరుతో ఆపార్టీని మట్టికరిపిస్తానని చెబుతున్నది. వైనాడ్‌లో రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్నందున బిజెపి ప్రధాన లక్ష్యం ఏమిటన్నది ప్రశ్న. అంతకు ముందు ఆ స్దానాన్ని దాని మిత్రపక్షానికి కేటాయించింది. ఇప్పుడు రాహుల్‌ ఖరారు కావటంతో ఆ స్ధానాన్ని తాము తీసుకొని ప్రముఖ అభ్యర్ధిని దించే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. నిర్మలా సీతారామన్‌ లేదా సినీ నటుడు సురేష్‌ గోపి కావచ్చని మీడియా పేర్కొన్నది. చివరకు తోక ముడిచి మిత్రపక్ష అభ్యర్ధినే ఖరారు చేసింది. గతంలో అనేక చోట్ల బిజెపి బలహీనమైన వారిని పోటీ పెట్టి కమ్యూనిస్టులను ఓడించేందుకు కాంగ్రెస్‌కు సహకరించింది. ఈ సారి అదే జరుగు తుందా లేక రాహుల్‌ గాంధీని ఓడించేందుకు తన ఓట్లను తమ అభ్యర్ధికే వేయిస్తుందా అన్నది దాని ముందున్న ప్రశ్న. శబరిమల ఆలయం పేరుతో చేసిన ఆందోళనతో కాంగ్రెస్‌, బిజెపి రెండూ లబ్ది పొంద చూస్తున్నాయి. అదే జరిగితే బిజెపి ఏ మాత్రం ఓట్లు పెంచుకున్నా అవి కాంగ్రెస్‌కు సంబంధించినవి తప్ప వామపక్షాల నుంచి పోయేవి కాదన్నది స్పష్టం. ఒకవేళ అదే జరిగితే బొటాబొటీ మెజారిటీ వున్న స్ధితిలో అక్కడ రాహుల్‌ గాంధీ ఓడిపోవటం ఖాయం. ఇప్పుడున్న రాజకీయ పరిస్ధితిలో ఒక వేళ రాహుల్‌కు ఓటు వేసి గెలిపించినా ఆయన అమేథీని ఎంచుకుంటారు, వైనాడ్‌ను వదిలి వేస్తారు, ఆ మాత్రానికి ఎందుకు వేయటం, వుప ఎన్నికలకు పోవటం ఎందుకని తటస్ధ ఓటర్లు ఆలోచించవచ్చు. మరొక వూహ ప్రకారమైతే రాహుల్‌ గాంధీని నిజంగా బిజెపి ఓడించాలనుకుంటే ప్రధాన ప్రత్యర్ధి సిపిఐకి ఓటు వేయటం ద్వారానే ఆపని చేయగలగుతుంది. మరొక మార్గం లేదు. కమ్యూనిస్టు వ్యతిరేకతను బాగా రెచ్చగొట్టిన స్ధితిలో అది జరుగుతుందా అన్నది సందేహమే. అందువలన ఏ రీత్యా చూసినప్పటికీ వైనాడ్‌ ఎన్నిక ఫలితాలు దేశం దృష్టిని ఆకర్షిస్తాయని చెప్పవచ్చు.

2014 వైనాడ్‌ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల ఓట్లు,

కాంగ్రెస్‌ 3,77,035 41.20

సిపిఐ 3,56,165 38.92

బిజెపి 80,752 8.82

ఇండి 37,123 4.60

ఎస్‌డిపిఐ 14,327 1.57

డబ్ల్యుపిఐ 12,645 1.38

ఆప్‌ 10,684 1.17

2009 వైనాడ్‌ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల ఓట్లు

కాంగ్రెస్‌ 4,10,703 41.20

సిపిఐ 2,57,264 31.23

ఎన్‌సిపి 99,663 12.10

బిజెపి 31,687 3.85

2016లో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల ఓట్లశాతం, సీట్లు

సిపిఎం 26.7 58

సిపిఐ 8.2 19

ఎల్‌డిఎఫ్‌ ఇండి 2.4 4

జెడిఎస్‌ 1.5 3

ఎన్‌సిపి 1.2 2

కాంగ్రెస్‌ 23.8 22

ముస్లింలీగ్‌ 7.4 18

బిజెపి 10.6 1

కెసిఎం 4 6

బిడిజెఎస్‌ 4 0

Share this:

  • Tweet
  • More
Like Loading...

జాతీయ వాదం అంటే నాడు వుత్తేజం, నేడు వున్మాదం !

10 Sunday Mar 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Social Inclusion, Uncategorized

≈ Leave a comment

Tags

370 article, Aricle 370 myths and facts, article 35A, Hindutva nationalism, Kashmir problem, nationalism then and now, nationalism then inspiration now frenzy

Image result for nationalism india

ఎం కోటేశ్వరరావు

అడవారి మాటలకు అర్ధాలే వేరులే అని సినీ కవి చెప్పిన సందర్భం ఏదైనా కావచ్చు, మహిళలకు ఆ లక్షణాన్ని ఆపాదించటం గౌరవం ఇచ్చే వర్ణన కాదు. అయితే అలా అన్నవారి మీద మహిళలు వుడుక్కున్నారేమోగాని ఎక్కడా దాడులు జరిపినట్లు తెలియదు. ఇప్పుడు దేశంలో అనేక పదాలకు అర్దాలనే మార్చివేస్తున్నారు.కాదన్నవారిని వాదనల్లో ఖండించటం ఒక పద్దతి, భౌతిక దాడులకు తెగబడటమే ప్రమాదకరం. యుద్దం వద్దు అనటం, ఇరుగుపొరుగు దేశాలతో సామరస్యం కోరుకోవటం దేశద్రోహం, యుద్ధం కోరుకోవటం, రెచ్చగొట్టటం దేశభక్తి. పరమతం వారి మీద ద్వేషం వెలిబుచ్చటం దేశభక్తి, ప్రేమించకపోతే మానే వారి మానాన వారిని వుండనివ్వమనటం దేశద్రోహం. హిందుత్వమే ఇండియా, ఇండియా అంటే హిందుత్వమే కాదన్నవారి సంగతి చూస్తాం అనే బెదిరింపులు. ఒక నాడు జాతీయ వాది అంటే వుత్తేజానికి మారుపేరు. నేడు జాతీయ వాది అంటే వున్మాదానికి చిరునామా ! 1947ఆగస్టు 15 ముందు, తరువాతకు ఎంత తేడా ! కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించిన ఆర్టికల్‌ 370ని వ్యతిరేకించిన వారు జాతీయవాదులు, సమర్ధించిన వారు దేశద్రోహులు. అంటే ఎప్పటి నుంచో వున్న ప్రత్యేక రక్షణలు, సంస్కృతి పరిరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు కోరి మన దేశంలో విలీనానికి కారకుడైన షేక్‌ అబ్దుల్లా ఇప్పటి నిర్వచనం ప్రకారం దేశద్రోహి. కాశ్మీర్‌ విలీనాన్ని వ్యతిరేకించి, స్వతంత్రరాజ్యంగా వుంటామని ప్రకటించిన నాటి కాశ్మీర్‌ రాజు హరిసింగ్‌(తరువాత తప్పనిసరై అంగీకరించటం వేరే విషయం), ఆయనకు మద్దతు తెలిపిన ఆర్‌ఎస్‌ఎస్‌ వారు దేశభక్తులు. చరిత్ర తెలియకపోతే కొత్త తరాలు ఇదే నిజమనుకొనే ప్రమాదం వుంది.

భారత్‌ విభజనకు నిర్ణయం జరిగిపోయింది. ఆ సమయానికి జమ్మూ కాశ్మీర్‌ బ్రిటీష్‌ వారి సార్వభౌమత్వానికి లోబడిన ఒక స్వయంప్రతిపత్తి కలిగిన ఒక సంస్ధానం.షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్‌ కాన్ఫరెన్సు పార్టీ కాశ్మీర్‌ సంస్ధానం భారత్‌లో విలీనం కావాలని కోరింది. రాజు హరిసింగ్‌ స్వతంత్రంగా వుంటామని ప్రకటించాడు. 1947 నవంబరులో ఏర్పడిన ఆల్‌జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ ప్రజాపరిషత్‌ పార్టీ ( అంతకు ముందు ఆల్‌జమ్ము అండ్‌ కాశ్మీర్‌ రాజ్య హిందూ సభ పేరుతో పని చేశారు) రాజు హరిసింగ్‌ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి తాము మద్దతుగా వుంటామని ప్రకటించింది. అంటే కాశ్మీరు వేర్పాటు వాదానికి సై అన్నట్లే కదా ! ఈ పార్టీని ఏర్పాటు చేసిన అపర దేశభక్తులు ఎవరంటే ఇంకెవరు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత బలరాజ్‌ మధోక్‌ మహాశయుడే. అదే ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన జనసంఘ్‌తో అది వారే వీరుగా కలసి పని చేసింది, చివరకు 1963లో విలీనమైంది. నాటి కాంగ్రెస్‌ నాయకత్వం మన దేశంలో కాశ్మీర్‌ విలీనానికి అనుకూలంగా వున్న షేక్‌ అబ్దుల్లాతో మాట్లాడటం అంటే అబ్దుల్లా ఆ రాష్ట్రంలో అధికారానికి రావటమే కనుక అది ఆమోదంగాని ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఘం మొదటి నుంచి కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్‌ను రాజ్యాంగంలో చేర్చటానికి మొదటి నుంచి వ్యతిరేకించింది తప్ప వేరే ఇతర కారణాలేమీ లేవు. ఆర్‌ఎస్‌ఎస్‌ షేక్‌ అబ్దుల్లాను వ్యతిరేకించటం వెనుక ముస్లిం విద్వేషంతో పాటు అది భూస్వాముల పక్షంలో వుండటం కూడా ఒక కారణం. కాశ్మీర్‌ సంస్ధానంలో భూస్వాములలో అత్యధికులు హిందువులే. షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్‌ కాన్ఫరెన్సు భూసంస్కరణలు అమలు జరపాలని కూడా కోరింది. అదేగనుక అధికారంలోకి వస్తే తమ భూములు ఎక్కడ పోతాయోనని భూస్వాములకు ప్రాతినిధ్యం వహించే కాశ్మీర్‌ ప్రజాపరిషత్‌ స్వతంత్రరాజ్యంగా వుంటామని చెప్పిన రాజు హరిసింగ్‌కు మద్దతు ఇచ్చింది. పాకిస్దాన్‌ గిరిజనుల ముసుగులో కాశ్మీర్‌ ఆక్రమణకు ఎప్పుడైతే పూనుకుందో అప్పుడు విధిలేని స్ధితిలో రాజు హరిసింగ్‌ కేంద్ర ప్రభుత్వ సాయం కోరాడు. దానికి అనుగుణంగానే ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా తన వైఖరి మార్చుకుంది. అయితే భారత్‌లో పూర్తిగా విలీనం కావటానికి మద్దతు ఇస్తాం తప్ప కమ్యూనిస్టులు ఎక్కువగా వున్న షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలోని డోగ్రా(హిందువులు) వ్యతిరేక ప్రభుత్వానికి తాము వ్యతిరేకమని ఆర్‌ఎస్‌ఎస్‌ నేత బలరాజ్‌ మధోక్‌ అన్నాడు. దానికి అనుగుణ్యంగానే షేక్‌ అబ్దుల్లా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 1949లో కాశ్మీర్‌ ప్రజాపరిషత్‌ ఆందోళనలు చేపట్టింది.ఎలాంటి షరతలు లేకుండా కాశ్మీరును దేశంలో విలీనం చేయాలని కోరింది. 1951లో ఏర్పాటయిన జనసంఘ్‌కు కాశ్మీరులో ప్ర జాపరిషత్‌ అనుబంధం అయింది. దాని డిమాండ్‌ మేరకు జనసంఘం కూడా కాశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని ప్రారంభం నుంచీ వ్యతిరేకించింది. దాని వారసురాలు బిజెపి కనుక అదే డిమాండ్‌ను వదలకుండా పట్టుకుంది. 1963వరకు కాశ్మీర్‌లో జనసంఘం శాఖను ఏర్పాటు చేయలేదు. కాశ్మీర్‌ ప్రజాపరిషత్‌ పేరుతోనే కధ నడిపించారు.

కాశ్మీర్‌కు ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తే ఏమౌతుంది అని ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం, దాని ప్రచారాన్ని వెనుకా ముందు ఆలోచించకుండా బుర్రకు ఎక్కించుకున్న అమాయకంగా ప్రశ్నిస్తారు. వారికి ఒకటే సూటి ప్రశ్న వుంటే జరిగే నష్టం ఏమిటి, వున్నందువలన దేశానికి జరిగిన ఇప్పటి వరకు జరిగిన నష్టం ఏమిటి అంటే వారివద్ద కుంటిసాకులు తప్ప సరైన సమాధానం లేదు. రాజ్యాంగంలో కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక ఆర్టికల్స్‌, రక్షణలు కేవలం కాశ్మీర్‌కు మాత్రమే వున్నాయా ?

కాశ్మీర్‌కు వర్తించే ఆర్టికల్‌ 35ఏ అమలును సవాలు చేస్తూ చారు వాలి ఖన్నా అనే మహిళ పిటీషన్‌ దాఖలు చేశారు. తాను రాష్ట్ర నివాసినే అయినప్పటికీ తన పిల్లలు జమ్మూకాశ్మీరులో ఇల్లు కొనుక్కోవటానికి అవకాశం లేదని, ఇది కాశ్మీర్‌ మహిళల పట్ల వివక్ష కాదా అన్నది ఆమె ప్రశ్న. కాశ్మీరీ పండిట్‌ అయిన చారు వాలి ఖన్నా సుప్రీం కోర్టులో న్యాయవాది.కాశ్మీరేతర వ్యక్తిని వివాహం చేసుకొని ఢిల్లీలో స్ధిరపడ్డారు. తాను కాశ్మీరులోనే జన్మించినప్పటికి ఇప్పుడు అక్కడ ఇల్లు కొనుక్కోవటానికి రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతర పెట్టిందని ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14కు విరుద్దమని వాదిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో అమలులో వున్న ఆర్టికల్‌ 35ఏ ప్రకారం శాశ్వత నివాసుల జాబితాలో వున్నవారే ప్రభుత్వ వుద్యోగాలు చేయటానికి, ప్రభుత్వ లేదా ప్రభుత్వ సాయం పొందే విద్యా సంస్ధలలో చేరటానికి, భూమి, ఇతర ఆస్ధులను కొనుగోలు చేయటానికి అర్హులు. 1954రాష్ట్రపతి వుత్తరువుల ద్వారా ఇతరులకు హక్కులను నిషేధించారు. శాశ్వత నివాసి అయిన కాశ్మీరీ మహిళ వేరే రాష్ట్రానికి చెందిన పురుషుడిని వివాహం చేసుకుంటే ఆమె శాశ్వత నివాస అర్హత రద్దవుతుంది. కాశ్మీరీ పురుషుడిని వేరే రాష్ట్ర మహిళ వివాహం చేసుకుంటే ఆమెకు శాశ్వత నివాసి అర్హత వస్తుంది. మాజీ ముఖ్య మంత్రి ఫరూక్‌ అబ్దులా, ఆయన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లా కాశ్మీరేతరులను వివాహం చేసుకున్నారు. వారి భార్యలకు శాశ ్వత నివాస అర్హత వచ్చింది. అదే ఫరూక్‌ అబ్దుల్లా కుమార్తె సారా అబ్దుల్లా కాంగ్రెస్‌ నేత రాజస్ధాన్‌కు చెందిన సచిన్‌ పైలట్‌ను వివాహం చేసుకొని అర్హతను కోల్పోయారు.

చారు వాలీ ఖన్నా, మరికొందరు ఇతరులు దాఖలు చేసిన పిటీషన్లను అన్నింటినీ కలిపి సుప్రీం కోర్టు విచారిస్తున్నది. 35ఏ ఆర్టికల్‌ను సమర్ధిస్తున్న వారు మహిళా వ్యతిరేకులని, వివక్షను సమర్ధిస్తున్నారంటూ సంఘపరివార్‌ సంస్ధలకు చెందిన వారు దాడి చేస్తున్నారు. ఈశక్తులకు నిజంగా మహిళా హక్కుల పట్ల అంతశ్రద్దే వుంటే చట్టసభలో మహిళకు మూడోవంతు రిజర్వేషన్ల గురించి గత ఐదు సంవత్సరాలలో ఎందుకు చర్యలు తీసుకోలేదు. అర్టికల్‌ 35ఏ సెక్షన్‌ రద్దు చేస్తామని బిజెపి వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఇలాంటి ఆంక్షలు, రక్షణలు అనేక రాష్ట్రాలలో వున్న అంశాన్ని వీరు విస్మరిస్తున్నారు. ఒక రాజకీయ అజెండాతో కేవలం ఈ అంశాన్నే ముందుకు తెస్తున్నారు. వుదాహరణకు 1-70 చట్టం పేరుతో వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆమోదించినదాని ప్రకారం ప్రస్తుతం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో షెడ్యూలు గిరిజన ప్రాంతాలుగా ప్రకటించిన చోట్ల గిరిజనేతరులు భూములు, ఇతర స్ధిర ఆస్ధులు కొనుగోలు చేయటానికి లేదు. చట్టం రాకముందు వున్న ఆస్ధులను అమ్ముకోవాలంటే గిరిజనులకు మాత్రమే విక్రయించాలి. ఆప్రాంతాలలోని గిరిజన యువతులు బయటి వారిని వివాహం చేసుకుంటే వారికి ఇతరులకు వర్తించే హక్కులు వర్తిస్తాయి. కానీ గిరిజన యువతులను వివాహం చేసుకున్న గిరిజనేతరులకు ఆ ప్రాంతాలలో అలాంటి హక్కులుండవు. ఇలాంటి పరిమితులే హిమచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, నాగాలాండ్‌ వంటి రాష్ట్రాలలో వున్నాయి. వాటి గురించి బిజెపి, సంఘపరివార్‌ మాట్లాడదేం. ఇదే విధంగా ప్రభుత్వ వుద్యోగాలు కూడా రాష్ట్రానికి సంబంధించిన వాటికి స్ధానికులే అర్హులు లేదా వారికి స్ధానికత అర్హత వచ్చిన తరువాతే అర్హులు అవుతారు.

హైదరాబాద్‌ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేయబోయే ముందు హైదరాబాద్‌ రాష్ట్రానికి చెందిన వారు తమ ప్రాంతానికి రక్షణ కల్పించాలని కోరలేదా, ఆ మేరకు కల్పించిన విషయం తెలిసినదే.తమ ప్రాంతం వారు వెనుకబడి వున్నందున ముందున్న ఆంధ్రప్రాంతం వారు వుద్యోగాలను ఎక్కువగా పొందే అవకాశం వున్నందున రక్షణ కల్పించాలని కోరారు. దానికి అనుగుణంగా ముల్కీ నిబంధనలు వర్తిస్తాయని 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు అయినపుడు చెప్పారు. ముల్కీ నిబంధనల ప్రకారం పన్నెండు సంవత్సరాలు తెలంగాణాలో నివాసం వుంటే వారు స్ధానికులుగా మారిపోతారు. ఆ మేరకు 1968 నాటికి ముల్కీ నిబంధనలు రద్దయ్యే పరిస్ధితి ఏర్పడింది. తమ వారికి జరగాల్సిన న్యాయం జరగలేదని, ముల్కి నిబంధనలు రద్దవుతున్నందున న్యాయం జరగదంటూ తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే ఆందోళన ప్రారంభమైంది. ముల్కీ నిబంధనలు చెల్లుతాయని కోర్టు తీర్పు వచ్చిన తరువాత స్వంత రాష్ట్రంలో పరాయివారిగా వుండటమేమిటి ప్రత్యేక ఆంధ్రను ఏర్పాటు చేయాలంటూ 1972లో జై ఆంధ్ర ఆందోళన ప్రారంభమైంది. ప్రస్తుతం వుపరాష్ట్రపతిగా వున్న వెంకయ్య నాయుడు దాని నాయకులలో ఒకరు, రాజకీయ జీవితం దానితోనే ప్రారంభించారనే విషయం విదితమే. వుమ్మడి రాష్ట్రంలో స్ధానికులకు న్యాయం చేకూర్చేందుకు రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రపతి వుత్తరువులతో ఆర్టికల్‌ 371డి ప్రకారం వుమ్మ డి రాష్ట్రంలో రక్షణ కల్పించి జోనల్‌ వ్యవస్ధను ఏర్పాటు చేశారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత స్ధానికత సమస్య మరో రూపంలో ముందుకు వచ్చింది. జోనల్‌ వ్యవస్ధను రద్దు చేయాలనే ఆలోచన చేశారు. అంతకు ముందు ఆంధ్రప్రాంతం వారు తమ అవకాశాలను కొట్టివేస్తున్నారని చేసిన వాదన తెలంగాణాలో మరో రూపంలో ముందుకు వచ్చింది. అభివృద్ధి చెందిన హైదరాబాదు,వరంగల్‌,నల్లగొండ, ఖమ్మం జిల్లాల వారు వెనుకబడిన ప్రాంతాలలోని వుద్యోగావకాశాలను తన్నుకుపోయే అవకాశం వుందనే వాదనలు బయలు దేరటంతో జోనల్‌ వ్యవస్ధను కొనసాగించక తప్పలేదు.

ముల్కీ నిబంధనలను నైజాం నవాబు 1919లో అమలులోకి తెచ్చారు. దాని ప్రకారం నాటి హైదరాబాదు సంస్ధానంలో స్ధానికులకు రక్షణ కల్పించటమే లక్ష్యం. వుర్దూలో ముల్క్‌ అంటే ఒక దేశం. ఆ దేశ పౌరులు ముల్కీలు అవుతారు. సంస్ధానం వెలుపల నుంచి వచ్చేవారి కారణంగా స్ధానికుల్లో తలెత్తిన అసంతృప్తిని తగ్గించేందుకు నవాబు ఈ ఏర్పాటు చేశాడు. ఎవరైనా హైదరాబాదు సంస్ధానంలో 15సంవత్సరాల ప్రభుత్వ సేవ పూర్తి చేస్తే వారికి జన్మి ంచేవారికి పుట్టుకతోనే సంస్ధాన పౌరసత్వం వస్తుంది. లేదా ఎవరైనా 15సంవత్సరాలు నివశించి వుంటే వారు కూడా స్ధానికులు అవుతారు. ముల్కీ అయిన వ్యక్తిని వివాహం చేసుకొంటే ఆమెకూడా ముల్కీ అవుతుంది. పదిహేను హైదరాబాదులో నివాసం వున్న వారు పర్మనెంటు ముల్కీ కావాలంటే తన స్వస్ధాలకు తిరిగి వెళ్లాలనే వాంఛను వదులు కొంటున్నట్లు అఫిడవిట్‌ కూడా ఇవ్వాల్సి వుంది. అప్పుడే ముల్కీ సర్టిఫికెట్‌ ఇచ్చేవారు. అలాంటి ముల్కీ నిబంధనలు చెల్లుబాటవుతాయని సుప్రీం కోర్టు 1972లో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఇదే మాదిరి 1927కాశ్మీర్‌ రాజు హరిసింగ్‌ స్ధానికులకు రక్షణ కల్పిస్తూ చేసిన చట్టాన్ని కొనసాగింపుగా భారత్‌లో విలీనం అయిన తరువాత కొనసాగించాలన్నది సంప్రదింపుల్లో అంగీకరించారు. నాడు హరిసింగ్‌ ఆస్దానంలో కాశ్మీరీ పండిట్లు, డోగ్రాలదే ఆధిపత్యం. తమకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితో పోటీని నివారించేందుకు రాజు చేత 35ఏలో వున్న నిబంధనలను చట్టంగా చేయించారు. అప్పుడు అంగీకరించిన పండిట్లు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు ? నైజాం నవాబు ముల్కీ నిబంధనలను సమర్ధించిన సుప్రీం కోర్టు అదే పద్దతుల్లో కాశ్మీర్‌ రాజు కల్పించిన రక్షణలను ఏ ప్రాతిపదికన రద్దు చేస్తుంది.

ఇలాంటి వాటిని రద్దు చేస్తే పోలా అనే వారికి ఒక ప్రశ్న. చేయాల్సి వస్తే ఒక్క కాశ్మీర్‌ అంశాలనే ఎందుకు రద్దు చేయాలి? వుద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కూడా అలాంటివే. పదేండ్లకోసం చేసిన వాటిని వాటి లక్ష్యం ఇంకానెరవేరలేదనే కారణంగా ఇంకా కొనసాగిస్తున్నాము కదా, వీటిని కూడా అలాగే ఎందుకు పరిగణించకూడదు. చిత్తశుద్ధి వుంటే ఇలాంటి వాటన్నింటినీ కలిపి ఒక చర్చ పెడితే, వాటిమీద ఏకాభిప్రాయం వస్తే రాజ్యాంగ బద్దంగానే చేయవచ్చు. అలా జరగటం లేదే ! ఇప్పుడున్న పరిస్ధితుల్లో అది సాధ్యం అవుతుందా? వుదాహరణకు 1975 మే 16వరకు ప్రస్తుతం మన రాష్ట్రాలలో ఒకటిగా వున్న సిక్కిం ఒక రాజ్యంగా మన రక్షణలో వుంది. అక్కడి జనం రాజరికాన్ని కాదని మన దేశంలో విలీనం కావాలని కోరుకున్నారు. అందుకు అంగీకరించాము. దానికి ఒక షరతు ఏమంటే అప్పటి వరకు సిక్కింలో వున్న ప్రత్యేక రక్షణలను తరువాత కూడా కొనసాగించాలి. వాటిని ఆర్టికల్‌ 371ఎఫ్‌లో చేర్చి రాజ్యాంగాన్ని సవరించారు. ఇప్పుడు కళ్లు తెరిచిన వారు వాటిని అంగీకరించం, రద్దు చేయాలంటే ఎలా? దేశం సమగ్రంగా వుంటుందా ? ఆర్టికల్‌ 370ని సవరించి ఇప్పటికే నీరుగార్చారన్న విమర్శలున్నాయి. దానిని మరింతగా నీరుగార్చటం అంటే కాశ్మీరీల్లో అనుమానాలు, అభద్రతా భావాన్ని మరింత పెంచటమే. దాన్ని రద్దు చేసే అవకాశం లేదని తెలిసి కూడా బిజెపి నిరంతరం వ్యతిరేకంగా ప్రచారం చేయటం రెచ్చగొట్టే వ్యవహారం తప్ప మరొకటి కాదు. ఈ అర్టికల్‌ను రద్దు చేయాలన్న ఆలోచన తమకు ఇప్పుడు లేదని ఎందుకంటే పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ లేదని రాజ్యసభలో ఒక ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పింది. నిజానికి అంత మెజారిటీ వున్నప్పటికీ ఏ పార్టీ ప్రభుత్వానికి అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే దాన్ని రాజ్యాంగంలో చేర్చాలని చెప్పింది రాజ్యాంగ పరిషత్‌. అది ఇప్పుడు లేదు. అందువల్లనే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసింది. అందుకోసం అసలు రాజ్యాంగాన్నే రద్దు చేసి కొత్త రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేస్తే అన్న వూహాజనిత ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేరు. అటు వంటి పనికి బిజెపితో సహా ఏ పార్టీ పూనుకొనే అవకాశం లేదు.

Image result for nationalism india

కాశ్మీర్‌ గురించి అనేక వక్రీకరణలు ప్రచారంలో వున్నాయి. వాటిలో కొన్నింటి తీరుతెన్నులను చూద్దాం.

ద్వంద్వ పౌరసత్వం: ఇది వాస్తవం కాదు, ముందే చెప్పుకున్నట్లు 35ఏ నిబంధనల ప్రకారం ఆ రాష్ట్రానికి చెందిన కొన్ని ప్రత్యేక రక్షణల కోసం శాశ్వత నివాసులు అని కొన్ని నిబంధనలు ఏర్పాటు చేశారు తప్ప అది పౌరసత్వం కాదు.వారు కూడా భారత పాస్‌పోర్టులనే కలిగి వుంటారు.

ప్రత్యేక రాజ్యాంగం: ఇది పాక్షిక సత్యం, ఆ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక చట్టాలు చేసుకోవటానికి ఆర్టికల్‌ 370 అనుమతించింది. అందువలన రక్షణ, విదేశీవ్యవహారాలు, సమాచార రంగాలను వర్తింప చేయటానికి ఆ రాష్ట్ర అనుమతి అవసరం లేదు. మిగిలిన అంశాలను వర్తింప చేయాలంటే రాష్ట్రశాసనసభ అనుమతి అవసరం. మన రాజ్యాంగంలో రాష్ట్రాలు, కేంద్ర అధికారాలతో పాటు వుమ్మడి జాబితా కూడా వున్న విషయం తెలిసిందే. రాష్ట్రాల అధికారాలకు సంబంధించి దేనికది ప్రత్యేక చట్టాలు చేసుకొనేందుకు ఏరాష్ట్రానికి అయినా హక్కుంది. వుమ్మడి అంశాలపై రాష్ట్రాల ఆమోదం అవసరం అన్న విషయం తెలిసిందే.

ప్రత్యేక, రాజ్యాంగం, జెండా : నిజమే, ఆర్టికల్‌ 370 ప్రకారం ప్రత్యేక రాజ్యాంగాన్నే ఏర్పాటు చేసుకొనే హక్కు దానికి వుంది.అది భారత రాజ్యాంగపరిధిలోనే వుంటుంది. ఆ రాష్ట్ర శాసనసభ కాలపరిమితి ఆరు సంవత్సరాలు, 1972లో ప్రత్యేక జండాను అధికారికంగానే ఏర్పాటు చేశారు. దేశంలో అనధికారికంగా సిక్కిం, కర్ణాటలకు ప్రత్యేక జండాలు వున్నాయి. ఒక దేశంలో వుంటూ ప్రత్యేక రాజ్యాంగాలను కలిగి వుండటమంటే అర్ధం స్వతంత్ర దేశాలని కాదు. బ్రిటీష్‌ వారి కౌలు గడువు ముగిసిన తరువాత తిరిగి చైనాలో విలీనమైన హాంకాంగ్‌కు ప్రత్యేక రాజ్యాంగాన్ని అనుమతించారు. అలాగే పోర్చుగీసు కౌలు గడువు ముగిసిన తరువాత చైనాలో విలీనమైన మకావో దీవులకు కూడా ప్రత్యేక పాలనా మండలి వుంది. చైనాలో విలీనమైనా చైనా చట్టాలు అక్కడ వర్తించవు. మన దేశంలో సిక్కిం విలీన సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఏ రాష్ట్రంలోనూ లేని ప్రత్యేక రక్షణలు కల్పించారు. అక్కడ అసెంబ్లీలో 32 స్ధానాలున్నప్పటికీ ప్రాదేశికంగా 32వ నియోజకవర్గం లేదు. సంఘ పేరుతో వున్న దానిలో సిక్కింలోని బౌద్ధ ఆరామాలలో వున్న సాధువులు దాని ప్రతినిధిని ఎన్నుకుంటారు. ఆర్టికల్‌ 371ఎఫ్‌ ప్రకారం భుటియా, లెపాచా వంటి గిరిజన సామాజిక తరగతులకు అసెంబ్లీలో ప్రత్యేక సీట్లను కేటాయించారు. ఏ తరగతికి కేటాయించిన సీట్లలో వారే పోటీ చేయాల్సి వుంటుంది. మిగతా రాష్ట్రాలలో ఎక్కడా ఫలానా సామాజిక తరగతికి మాత్రమే ఆయా సీట్లలో పోటీకి అర్హత అనేది లేదు. వుదాహరణకు షెడ్యూలు కులాలు, తరగతులకు ఇన్ని సీట్లు, ఏఏ సీట్లు అనేది నిర్ణయం అవుతుంది తప్ప, వాటిలో ఏ కులం వారు పోటీ చేయాలనే అంశం లేదు.

జాతీయ చిహ్నాలను అవమానించటం నేరం కాదు: ఇదొక అవాస్తవం, 1971లో పార్లమెంట్‌ చేసిన చట్ట ప్రకారం జాతీయ చిహ్నాలైన జెండా, జాతీయ గీతం, రాజ్యాంగాన్ని దేశంలో, దేశం వెలుపల భారతీయ పౌరులు అవమానించటం నేరపూరితం. ఏ దైనా ఒక చట్టం కాశ్మీర్‌కు వర్తించనట్లయితే దాని పీఠికలోనే ముందుగా జమ్మూ కాశ్మీర్‌ మినహా అని వుంటుంది. పైన పేర్కొన్న చట్టానికి అలాంటిది లేదు. అలాగే సుప్రీం కోర్టు, కాగ్‌ పరిధి ఆ రాష్ట్రానికి వర్తించదు అనేది కూడా వాస్తవం కాదు.

బయటి వారు భూములు కొనుగోలు చేయకూడదు : ఇంతకు ముందే చెప్పినట్లు దేశంలో అనేక చోట్ల అలాంటి ఆంక్షలు వున్నాయి.1846లో జమ్మూకు చెందిన డోగ్రా రాజు గులాబ్‌ సింగ్‌ బ్రిటీష్‌ వారితో చేసుకున్న అమృతసర్‌ ఒప్పందం ప్రకారం అక్కడి భూమిని బయటి వారెవరూ కొనుగోలు చేయకూడు. భారత్‌లో విలీన సమయంలో అంతకు ముందు ఆ ప్రాంతాలలో వున్న చట్టాలను కొనసాగించాలన్నది షరతు. ఆ మేరకు ఇప్పుడు కూడా బయటి వారెవరూ భూములు కొనుగోలు చేయటానికి లేదు.

బయటి పెట్టుబడులను 370 ఆర్టికల్‌ అడ్డుకుంటున్నది: 1927 ఏప్రిల్‌26న కాశ్మీర్‌ రాజు జారీ చేసిన నోటిఫికేషన్‌లో రాష్ట్రానికి ఆర్ధిక లబ్ది చేకూరేట్లయితే దీనికి మినహాయింపు వుంటుందని పేర్కొనటం పెట్టుబడులకు అవకాశం కల్పించటమే కదా ! భూముల కొనుగోలుకు సంబంధించి అసోంలోని కొండ ప్రాంతాల్లో నిషేధాలు వున్నాయి. నాగాలాండ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చిన ఆర్టికల్‌ 371ఏ, అరుణాచల్‌ ప్రదేశ్‌కు ఇచ్చిన 371హెచ్‌, సిక్కింకు 371ఎఫ్‌, మిజోరాంకు 371జి ప్రకారం ప్రత్యేక హోదా రక్షణలు వున్నాయి. బిజెపి వాటన్నింటినీ ప్రస్తావించకుండా కాశ్మీర్‌నే ఎందుకు ముందుకు తెస్తున్నది. ముస్లింలు మెజారిటీ వున్నారనా ?

పాకీస్తానీని వివాహం చేసుకుంటే : కాశ్మీరీ శాశ్వత నివాసి అయిన ఒక యువతి వేరే రాష్ట్రానికి చెందిన వారిని వివాహం చేసుకుంటే శాశ్వత నివాస హక్కు రద్దవుతుంది, అదే పాకిస్తానీని చేసుకుంటే కాదు అన్నది ఒక తప్పుడు ప్రచారం. భారత రాజ్యాంగం ప్రకారం ద్వంద్వ పౌరసత్వం లేదు. పాక్‌ యువకుడు కాశ్మీర్‌ లేదా ఇతర భారత రాష్ట్రాల యువతులను వివాహం చేసుకుంటే వారికి పాక్‌ సౌత్వం వస్తుంది తప్ప పాక్‌ యువకులకు మన పౌరసత్వం రాదు. చట్టంలో శాశ్వత నివాసి అన్న పదానికి స్త్రీ, పురుష తేడా లేదు. అయితే పాలనాపరమైన నిబంధనల ప్రకారం మహిళలకు వివాహమయ్యేంత వరకు వుంటుంది. కాశ్మీరీనే వివాహం చేసుకుంటే శాశ్వతనివాస హోదా కొనసాగుతుంది.అదే వేరే రాష్ట్రాల వారిని చేసుకుంటే రద్దవుతుంది. అయితే 2004లో అలా రద్దు కావటానికి ఎలాంటి చట్టబద్దత లేదని హైకోర్టు తీర్పు చెప్పింది. దాన్ని చెల్లకుండా చేసేందుకు కాశ్మీర్‌ అసెంబ్లీ అదే ఏడాది ఒక బిల్లును ఆమోదించింది. అయితే వివిధ కారణాలతో అది ఇంకా చట్ట రూపం దాల్చలేదు.

కాశ్మీర్‌ మహిళలు షరియత్‌ చట్టం కింద వున్నారు: ఇది వాస్తవం కాదు, కాశ్మీరీ ముస్లిం మహిళలే కాదు దేశంలోని యావత్తు మహిళలు ఆయా మతాల వ్యక్తిగత చట్టాల కిందనే వున్నారు.

హిందు, సిక్కు మైనారిటీలకు రిజర్వేషన్‌ లేదు:2011 జనాభా లెక్కల ప్రకారం కాశ్మీర్‌లో 68.31శాతం ముస్లింలు, 28.43శాతం హిందువులు ఇతరులందరూ 3.26శాతం వున్నారు. హిందువులను మైనారిటీలుగా ఎక్కడా గుర్తించలేదు.2005 రాష్ట్ర రిజర్వేషన్‌ చట్టం ప్రకారం వెనుబడిన ప్రాంతాల(తరగతులు కాదు) వారికి 20, షెడ్యూలు తరగతులకు 10, షెడ్యూలు కులాలకు 8, మాజీ సైనికులకు 6, వికలాంగులు 3, వాస్తవాధీన రేఖ సమీపంలో వుండే వారికి 3, వెనుకబడిన తరగతులకు 2 శాతం చొప్పున రిజర్వేషన్లు వున్నాయి. మత ప్రాతికన ముస్లింలకు రిజర్వేషన్లు వద్దంటున్న వారు కాశ్మీర్‌లో హిందువులు, సిక్కులకు మత ప్రాతిపదికన రిజర్వేషన్‌ లేదనటం గమనించాల్సిన అంశం. దేశంలో ఎక్కడా లేని విధంగా వెనుకబడిన ప్రాంతాల వారికి అంటే కుల మత ప్రసక్తి లేకుండా రిజర్వేషన్‌ కలిగించటం ఇక్కడ మాత్రమే వుంది.

మన మాపుల్లో చూపుతున్న ప్రాంతాలన్నీ మన ఆధీనంలో లేవు. కాశ్మీర్‌లోని కొంత భాగం పాకిస్ధాన్‌ ఆక్రమణలో వుంది, మరికొంత ప్రాంతం చైనా కింద వుంది. అరుణాచల్‌ తమదే అని చైనా అంటున్నది. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాల్సి వుంది. ఇప్పుడున్న ఆర్టికల్‌ 370ను తొలగిస్తే తలెత్తే చట్టపరమైన సమస్యలు, సంక్లిష్టతల గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు. పౌరసత్వ సవరణ బిల్లు అసోం, ఇతర ఈశాన్య రాష్ట్రాలలో తీవ్ర ఆందోళనలకు కారణమైన విషయం తెలిసిందే. అది అసోం ఒప్పందాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. అందువలన గతంలో ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలను విస్మరించి కేవలం ఓట్ల దృష్టితో బిజెపి తన నిర్ణయాన్ని రుద్దేవందుకు పూనుకుంది. వ్యతిరేకతను గమనించి ఆ బిల్లును మురిగిపోయేట్లు చేసింది. అందువలన కాశ్మీర్‌తో సహా ఈ పూర్వరంగంలో ఇప్పటి పీటముడులను విప్పటమే ఒక సమస్యగా మన ముందున్నపుడు వాటిని మరింతగా బిగిసేట్లు, కొత్త ముడులు వేసేందుకు ప్రయత్నించటం నిజమైన దేశభక్తులు, జాతీయ వాదులు చేయాల్సిన పని కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా డెమోక్రాట్‌ అధ్యక్ష అభ్యర్ధి బరిలో శాండర్స్‌ !

07 Thursday Mar 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, Political Parties, Politics, USA

≈ Leave a comment

Tags

'Socialist' Bernie Sanders, 2020 US Elections, Berni sanders, Bernie Sanders 2020, Bernie Sanders To Run As A Democrat

ఎం కోటేశ్వరరావు

2020లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు అవకాశమివ్వాల్సిందిగా కోరుతూ డెమోక్రటిక్‌ పార్టీ నేత బెర్నీ శాండర్స్‌ తన జన్మస్ధలం న్యూయార్క్‌ నగరంలోని బ్రూక్లిన్‌లో మార్చినెల రెండవ తేదీన ఎన్నికల ప్రచారాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. పోలాండ్‌ నుంచి వలస వచ్చిన కుటుంబంలో జన్మించిన శాండర్స్‌ చిన్నతనంలో ఎలాంటి ఇబ్బందులను అనుభవించిందీ నేటి దిగువతరగతివారితో పోల్చుకొని గతాన్ని గుర్తు చేసుకున్నారు. మీ అందరి మద్దతుతో నేను పార్టీ అభ్యర్ధిత్వపోటీలో విజయం సాధించటమే కాదు ఆధునిక అమెరికా చరిత్రలో అత్యంత ప్రమాదకార అధ్యక్షుడు డోనాల్ట్‌ ట్రంప్‌ను కూడా ఓడించబోతున్నామని చెప్పాడు. ఆకాశ హర్మ్యాలు, జూదశాలలు, క్లబ్బులు నిర్మించేందుకు మిలియన్ల కొద్దీ డబ్బు ఇచ్చే తండ్రి నాకు లేడు, మూడు సంవత్సరాల వయస్సులో ఏడాదికి రెండులక్షల డాలర్లు ఇచ్చే కుటుంబం నుంచి నేను రాలేదు అంటూ ట్రంప్‌ను వుద్దేశించి వ్యాఖ్యానించారు. మీ అండతో ఈ దేశాన్ని మార్చబోతున్నాం, అంతిమంగా కేవలం ఒకశాతం మంది కోసం కాకుండాఆ మనందరికోసం పని చేసే ప్రభుత్వం మరియు ఆర్ధిక వ్యవస్దను సృష్టించబోతున్నామని పెద్ద ఎత్తున తరలి వచ్చిన యువతనుద్దేశించి చెప్పారు.

పార్టీ అభ్యర్దిగా ప్రచారం ప్రారంభించిన మూడు రోజుల తరువాత తాను డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్దిగా మాత్రమే పోటీ చేస్తానంటూ శాండర్స్‌ ఒక ప్రమాణ పత్రం మీద సంతకం చేశారు. గత ఎన్నికలలో హిల్లరీ క్లింటన్‌తో పోటీ బడిన శాండర్స్‌ ఒక వేళ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం దక్కకపోతే మూడవ పక్ష లేదా స్వతంత్ర అభ్యర్ధిగా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతారంటూ ఆయన ప్రత్యర్దులు ప్రచారం చేశారు. అలాంటిదేమీ లేకపోగా హిల్లరీ క్లింటన్‌కు మద్దతుగా ఎన్నికలలో ప్రచారం చేశారు. అయితే 2024 జరిగే వెర్‌మౌంట్‌ సెనెటర్‌ ఎన్నికలలో తాను స్వతంత్ర అభ్యర్దిగా బరిలో వుంటానని ప్రకటించటంతో అధ్యక్ష ఎన్నికలలో పోటీ పడేవారు పార్టీ సభ్యులై వుండాలని, పార్టీ అభ్యర్ధిగా మాత్రమే పోటీ చేస్తాననే ప్రమాణం చేయాలనే నిబంధనను గట్టిగా అమలు జరపాలని పార్టీలో ఆయన ప్రత్యర్ధులు వత్తిడి చేశారు. ఆ మేరకు తాజాగా శాండర్స్‌ ప్రమాణం చేశారు. రాష్ట్రాలలో పార్టీ ప్రతినిధులతో నిమిత్తం లేకుండా 1984లో ప్రవేశ పెట్టిన సూపర్‌ డెలిగేట్స్‌ అంటే పార్టీలో సీనియారిటీ,చేసిన సేవ, నిధుల వసూలులో పెద్ద చేయిగా వుండటం వంటి అంశాల ప్రాతిపదికన కొంత మందిని ప్రత్యేక ప్రతినిధులుగా కేంద్ర పార్టీ ఎంపిక చేస్తుంది. వారు అంతిమంగా పార్టీ అభ్యర్ధిని ఎంచుకొనే ప్రక్రియలో తమకు ఇష్టమైన వారికి ఓటు వేయవచ్చు అనే అవకాశం కల్పించారు. సహజంగా అలాంటి ప్రత్యేక ప్రతినిధులు తమను ఎంపిక చేసిన కమిటీ ఎటు మొగ్గితే అటే ఓటు వేస్తారన్నది గత అనుభవం, 2016 ఎన్నికలలో కూడా పార్టీ హిల్లరీ క్లింటన్‌ వైపు మొగ్గటంతో రాష్ట్రాలలో ఎంత మెజారిటీ తెచ్చుకున్నప్పటికీ బెర్నీ శాండర్స్‌ చివరికి ఈ ప్రత్యేక ప్రతినిధుల కారణంగా ఓడిపోయారు. ఈ అనుభవంతో అభ్యర్ధి ఎన్నికలో వారి ప్రమేయాన్ని తొలగించాలని శాండర్స్‌, తదితరులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తాజా ఎన్నికలలో వారి ప్రమేయాన్ని తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అది ఎంతవరకు అన్నది ఇప్పుడే చెప్పలేము. అయితే నైతికంగా ఇది శాండర్స్‌ సాధించిన విజయం.

తొలిసారిగా డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ప్రజాప్రతినిధుల సభ కాంగ్రెస్‌ సభ్యుడిగా 1990లో ఎన్నికయ్యారు. తరువాత వెర్‌మౌంట్‌ రాష్ట్రం నుంచి స్వతంత్ర సెనెటర్‌గా 2006 నుంచి కొనసాగుతున్నారు. పార్లమెంట్‌లో ఆయన డెమోక్రటిక్‌ పార్టీతోనే కలసి వ్యవహరిస్తారు. 2016లో జరిగిన ఎన్నికలలో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అభ్యర్ధిత్వం కోసం హిల్లరీ క్లింటన్‌తో పోటీ పడ్డారు. ఒకప్పుడు వామపక్ష వాదిని అని చెప్పుకొనే పరిస్ధితులు లేని అమెరికాలో తాను సోషలిస్టును అని పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నానని బహిరంగంగా చెప్పుకొన్న శాండర్స్‌ వర్తమాన అమెరికా రాజకీయాలలో ఒక సంచలనానికి నాంది పలికారు. లక్షలాది మంది యువతీ యువకులు తాము కూడా సోషలిస్టులమే అంటూ గత ఎన్నికలలో ఆయనకు పెద్ద ఎత్తున బాసటగా నిలిచినప్పటికీ కార్పొరేట్‌లాబీ ఆయన అభ్యర్ధిత్వాన్ని అడ్డుకుంది. అయినప్పటికీ రెట్టించిన వుత్సాహంతో 77 సంవత్సరాల శాండర్స్‌ తిరిగి పోటీకి ముందుకు వచ్చారు. అందరికీ ఆరోగ్యం, గంటకు కనీసవేతనం 15డాలర్ల వంటి నినాదాలను ముందుకు తెచ్చారు. నేడు డెమోక్రటిక్‌ పార్టీలో ఆయనను వద్దనే వారు కూడా ఆ నినాదాలను వ్యతిరేకించే స్థితి లేదంటే డెమోక్రటిక్‌ పార్టీ మీద ఎంతటి ప్రభావం కలిగించారో చెప్పవచ్చు. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడనున్నట్లు ప్రచారంలో వున్న వారిలో కమలా హారిస్‌, కోరీ బుకర్‌, ఎలిజబెత్‌ వారెన్‌ వంటి వారు కూడా అందరికీ ఆరోగ్యం అనే బిల్లును 2017లో ప్రతిపాదించిన వారిలో వున్నారు.

ఇటీవలి వరకు సోషలిజం అంటే ఆసక్తి చూపని వారు అమెరికాలో పెట్టుబడిదారీ విధాన వైఫల్యాలను చూసి పునరాలోచన పడుతున్న స్ధితిలో బెర్నీ శాండర్స్‌ వంటి వారు ముందుకు తెస్తున్న డెమోక్రటిక్‌ సోషలిజం, ప్రజలు చెల్లించే పన్నులు కార్పొరేట్లకు కాదు, అందరికీ వుపయోగించాలి, ఎలాంటి నియంత్రణలు లేని పెట్టుబడిదారీ వ్యవస్ధ చెడ్డది వంటి అంశాలు యువతను బాగా ఆకర్షిస్తున్నాయి. సోషలిజం భావన తమకు ఎంతో వుత్తేజం కలిగిస్తున్నదని, డెమోక్రటిక్‌ సోషలిస్టు భావనలు డెమోక్రటిక్‌ పార్టీకి కొత్త రూపునిస్తున్నాయని పలువురు ఆ పార్టీ వెలుపల వున్న వారు కూడా భావిస్తున్నారు.

Image result for bernie sanders

అమెరికా ఎన్నికలలో ప్రత్యర్ధుల మీద తప్పుడు ప్రచారం చేయటం సర్వసాధారణం. సోషల్‌ మీడియా దీనికి ప్రధాన వేదికగా వుంది. ఈ ఎన్నికలలో కూడా తాను తిరిగి రంగంలో వుంటానని శాండర్స్‌ ప్రకటించిన తరువాత అటువంటి ప్రచారం ప్రారంభమైంది.వాటిలో ఒకదాని సారాంశం ఇలా వుంది. శాండర్స్‌ ఒక్క వ్యాపారాన్ని కూడా ప్రారంభించలేదు, కొత్తగా కనుగొన్నదేమీ లేదు, స్ధిరమైన వుద్యోగం లేదు, 25సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా వుండి ఒక్క బిల్లునూ ప్రతిపాదించలేదు.ఎన్నిక అవటానికి ముందు ప్రభుత్వ భృతిమీద ఆధారపడ్డాడు. 74ఏండ్ల వృద్ధుడు ఆరోగ్య సంరక్షణ, ఆర్ధిక వ్యవస్ధలను సరిచేస్తానంటున్నాడు, అధ్యక్షుడు కావాలనుకుంటున్నాడు. అతని హీరో కారల్‌ మార్క్స్‌ మాదిరి సాధించేదేమీ వుండదు. దీనిలో పేర్కొన్న మొదటి రెండు అంశాలు వాస్తవమే. శాండర్స్‌ అమెరికన్‌ పీపుల్స్‌ హిస్టారికల్‌ సొసైటీ పేరుతో ఒక ప్రభుత్వేతర సంస్ధను స్ధాపించి తక్కువ ఖర్చుతో వెర్‌మౌంట్‌, న్యూ ఇంగ్లండ్‌ ప్రాంతాల గురించి అక్కడి జనం, జరుగుతున్న పరిణామాల మీద లఘు చిత్రాలు నిర్మించాడు. దాన్ని వాణిజ్యంగా ఎవరూ భావించటం లేదు. వాణిజ్యం కలిగి వుండి యజమానులుగా వున్నవారే పోటీ చేయాలని రాజ్యాంగంలో లేదు. ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో ఎన్నికకు ముందు వాణిజ్యవేత్తలుగా వున్నది డోనాల్డ్‌ ట్రంప్‌తో సహా ఏడుగురు మాత్రమే.2017లో ఆయన ఆస్ధి విలువ 20లక్షల డాలర్లు.చికాగో విశ్వవిద్యాలయం నుంచి 1964లో డిగ్రీ తీసుకున్న తరువాత 1981లో బర్లింగ్టన్‌ మేయర్‌ అయ్యేంత వరకు అనేక చిన్న చిన్న వుద్యోగాలు చేశాడు. ఒక మానసిక చికిత్సాలయంలో సహాయకుడు, కార్పెంటర్‌, కిండర్‌గార్డెన్‌ టీచర్‌, పత్రికలకు వ్యాసాలు రాయటం వంటి పాక్షిక పనులు చేశాడు. ప్రజాప్రతినిధిగా ఒక్క బిల్లును కూడా ప్రతిపాదించలేదనటం కూడా సత్యదూరమే. శాండర్స్‌ ప్రతిపాదించిన ఏడు బిల్లులు ఆమోదం పొందినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. ఇలాంటి సాధారణ జీవితం గడిపిన నేపధ్యం కలిగి వున్న కారణంగానే అనేక మంది దిగువతరగతి జనం ఆయన మద్దతుదార్లుగా వున్నారు. శాండర్స్‌ ఆస్ధుల గురించి ఆధారం లేని వార్తలు అనేకం వ్యాపింప చేస్తున్నారు.

గత కొద్ది సంవత్సరాలుగా అమెరికాలో పెట్టుబడిదారీ విధానం, సోషలిజం గురించి మధనం జరుగుతోంది. పెట్టుబడిదారీ వ్యవస్ధలో పెరుగుతున్న అసమానతలు చివరకు ఆ వ్యవస్దనే మార్చివేసేందుకు దారితీస్తాయని పెట్టుబడిదారీ ఆర్ధికవేత్త ధామస్‌ పికెట్టీ హెచ్చరించిన తరువాత ఈ చర్చ ఇంకా ఎక్కువైంది. సోషలిజం వైపు మొగ్గు చూపుతున్న యువత రోజు రోజుకూ పెరుగుతోందన్నది ఇటీవలి కాలంలో అనేక సర్వేలు వెల్లడించాయి.అయితే మొత్తంగా అమెరికన్లు ఇప్పటికీ మెజారిటీ పెట్టుబడిదారీ విధానం వైపు మొగ్గు చూపుతున్నారు. యువతలో వచ్చిన మార్పు పాలకవర్గాలకు ఆందోళన కలిగిస్తోంది. యువత ఎందుకు సోషలిజం వైపు మొగ్గుచూపుతున్నారన్న ప్రశ్నకు సోవియట్‌ యూనియన్‌ తరహా సోషలిజం గురించి వారికి తెలియదని, బెర్నీ శాండర్స్‌ ముందుకు తెచ్చిన డెమోక్రటిక్‌ సోషలిజం భావన ఆకర్షిస్తున్నదని సర్వే నిపుణులు చెబుతున్నారు.సర్వేల్లో వెల్లడౌతున్న ధోరణులను చూసి బెంబేలెత్తుతున్న కార్పొరేట్‌ మీడియా వాటిని వక్రీకరించేందుకు చేయని ప్రయత్నం లేదు. సోషలిస్టు అని పిలిపించుకోవటం ఎంతో మత్తెక్కిస్తున్నదని యువత అంగీకరిస్తున్నదంటూ ఇటీవల న్యూయార్క్‌ మాగజైన్‌ ఒక వ్యాఖ్యానాన్ని ప్రచురించింది. షిమన్‌ వాన్‌ జుయలెన్‌ వుడ్‌ రాసిన ఆ వ్యాసంలో డేటింగ్‌ కోరుకుంటున్న సోషలిస్టు యువత తమకలలకు తగిన మరొక సోషలిస్టును ఎంచుకొనేందుకు ఇప్పుడు సలహాలు తీసుకోవచ్చని, బ్రూక్లిన్‌లో ఇదొక కొత్త మార్గంగా మారిందని పేర్కొన్నారు. ఇందుకు తగిన విధంగా రెడ్‌ యెంటా పేరుతో ఒక యాప్‌ను కూడా తయారు చేశారు. దానిలో తమ రాజకీయ అభిప్రాయాలకు తగిన వారిని ఎంచుకొనే వీలు వున్నది. ఇటీవలి వరకు సోషలిజం అంటే ఎరుపు భయాన్ని కలిగించే విషం, అసంగతం, చరిత్ర చెత్తబుట్టలో వేసినటువంటి, కానీ 2016లో బెర్నీ శాండర్స్‌ అభ్యర్ధిత్వం అమెరికాలో డెమోక్రటిక్‌ సోషలిస్టులకు కొత్త ప్రజాదరణను తెచ్చింది. దేశవ్యాపితంగా 250 స్దానిక బృందాలలో 55వేల మంది సభ్యులున్నారు. న్యూయార్క్‌ డెమోక్రాట్‌ అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌ అసాధారణ రీతిలో పార్లమెంటుకు ఎన్నికయ్యారని దానిలో పేర్కొన్నారు. యువతలో ప్రారంభమైన చర్చ సాధారణంగా మారుతున్నదని పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకతను పెంచుతున్నదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 6.2కోట్ల మంది మిలినియల్‌ యువత ఓటర్లుగా వున్నారు. వీరిలో పెరుగుతున్న సోషలిస్టు అనుకూల భావనలు సహజంగానే పెట్టుబడిదారీ వర్గానికి కంగారు పుట్టిస్తాయి.

Image result for bernie sanders 2020

అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయాల్సి వుంది. డెన్మార్క్‌, ఫిన్లండ్‌, స్వీడన్‌ వంటి నోర్డిక్‌ దేశాలు అమెరికాతో పోల్చితే మెరుగైన సామాజిక భద్రతా పధకాలతో మెరుగ్గా వున్నాయి. కొంత మంది వాటిని కూడా సోషలిస్టు వ్యవస్ధలుగా వర్ణించేవారు లేకపోలేదు. అందువలన కొందరు అమెరికా యువత అలాంటి సోషలిజమైనా మెరుగేకదా అనే వైఖరితో కూడా వున్నారని చెబుతున్నారు.అవన్నీ చిన్న దేశాలని అలాంటిది అమెరికాలో సాధ్యం కాదని చెబుతుంటే ఎందుకు కాదనే ఎదురు ప్రశ్నలు వస్తున్నాయి, సోషలిజం గురించి మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. తాజా గాలప్‌ సర్వే ప్రకారం డెమోక్రటిక్‌ పార్టీలో 57శాతం మంది సోషలిజం పట్ల సానుకూల వైఖరితో వున్నారని తేలింది. నిజమైన సోషలిజం అంటే సోవియట్‌యూనియన్‌, క్యూబా, వెనెజులాల్లో వుందని అక్కడ విఫలం చెందింది కనుక సోషలిస్టు భావన జోలికి పోవద్దని కొందరు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగానే డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా వెనెజులాను ప్రస్తావించి అమెరికాలో సోషలిజానికి తావులేదని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఒకవైపు సోషలిజం గురించి వక్రీకరిస్తున్నప్పటికీ అమెరికా యువతలో మొగ్గు నానాటికీ పెరుగుతున్నది, దానికి ప్రధాన కారణం అక్కడి పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యం, జనంపై మోపుతున్న భారాలు నానాటికీ పెరగటమే.అందువల్లనే పెట్టుబడిదారీ విధానం వైఫల్యం చెందిందనే అభిప్రాయాలు ఎక్కువగా వెల్లడవుతున్నాయి.

రాబోయే ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం గురించి మీడియా సర్వేలు కేంద్రీకరించాయి.దానిలో బెర్నీ శాండర్స్‌ను అడ్డుకొనేందుకు ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం కనిపిస్తోంది. 45శాతం మంది సోషలిస్టు అభ్యర్దిని కోరుకుంటున్నారని 55శాతం మంది ఆరోగ్య రంగంలో ప్రధాన మార్పు లేదా ఆర్దిక అవకాశాలు కల్పించేవారు కావాలని, 42శాతం మంది చిన్న మార్పులు, పెద్ద ఖర్చు లేకుండా పరిమిత మార్పులు తెచ్చేవారు కావాలని, 40శాతం మంది ట్రంప్‌ను ఓడించేవారు చాలని కోరుకుంటున్నట్లు ఒక సర్వే వెల్లడించింది. అమెరికన్లు ఇప్పుడు మూడు పూటలా తింటున్నారని, సోషలిజంలో అంతకంటే అదనంగా వచ్చేదేమిటని ఒక ప్రచారం. ప్రజాస్వామ్య అమెరికాలో ఎలాంటి కరవులు రాలేదని, గత శతాబ్దిలో సంభవించి పది పెద్ద కరవుల్లో ఆరు సోషలిస్టు దేశాల్లోనే వచ్చాయని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సోషలిజంలో భావ ప్రకటనా స్వేచ్చ వుండదనే పాతబడిన రోత ప్రచారం సరేసరి.

వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే లోపు అమెరికాలో మరోసారి సోషలిజం గురించి వక్రీకరణ ప్రచారం పెద్ద ఎత్తున జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్దితుల్లో పెట్టుబడిదారీ విధాన వైఫల్యాలు, సంక్షోభం నుంచి తేరుకోలేని తీరులో సోషలిజం గురించి అమెరికా యువతలో సోషలిజం గురించి మరింతగా చర్చ జరగటం తప్ప మరొక మార్గం లేదు. దాని మీద వ్యతిరేకతను, వక్రీకరణలను ఎంతగా ప్రచారం చేస్తే అంతగా దాని మంచి చెడ్డలు, వాస్తవాల గురించి చర్చ జరుగుతుంది. అది సోషలిజానికి మేలు చేస్తుంది. నూరు పూవులు పూయనివ్వండి-వేయి ఆలోచనలను వికసించనివ్వండి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వెనెజులా సాకుతో సోషలిజంపై ట్రంప్‌ దాడి – అమెరికాలో పెద్ద చర్చ !

21 Thursday Feb 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

46th President of Venezuela, Donald Trump attack on socialism, Donald Trump on Socialism, Juan Guaidó, Nicolás Maduro, Nicolás Maduro Moros, Socialists United of Venezuela (PSUV), Venezuela

Image result for donald trump attack on socialism

ఎం కోటేశ్వరరావు

వెనెజులాలో నికొలస్‌ మదురోను అంగీకరించం, ఈ విషయంలో వెనక్కు పోయేది లేదు, ప్రజాస్వామ్యం మినహా సోషలిజాన్ని మనం అంగీకరించేదిలేదు, మిలిటరీ జోక్యంతో సహా అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం, మదురో క్యూబా తొత్తు అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిప్పులు చెరుగుతూ పిడుగులు కురిపించాడని ఒక పత్రిక సోమవారం నాటి ప్రసంగాన్ని వర్ణించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో స్ధిరపడిన వెనెజులా సంతతి, వలస పౌరుల నుద్దేశించి ట్రంప్‌ మాట్లాడారు. మదురోను వదలి వేసి పార్లమెంట్‌ నేత జువాన్‌ గువైడోకు మద్దతివ్వాలని పౌరులు, మిలిటరీని కోరాడు. అక్కడ సోషలిస్టు ప్రభుత్వం వున్న కారణంగానే పదిలక్షల శాతం ద్రవ్యోల్బణం, ఆకలితాండవిస్తున్నదని, ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలున్న దేశం దారిద్య్రంలో చిక్కుకున్నదని, కొలంబియాద్వారా పంపదలచిన ఆహార సాయాన్ని మిలిటరీ అడ్డుకుంటున్నదని ఆరోపించాడు. ఫ్లోరిడాలోని మియామీ అంతర్జాతీయ విశ్వవిద్యాలయలో భార్య, కుమార్తెతో సహా పాల్గన్న సభలో మదురో ప్రభుత్వంపై బెదిరింపులు, సోషలిస్టు వ్యతిరేక చిందులు వేస్తూ వూగిపోయాడు. వెనెజులా స్వయంప్రకటిత అధ్యక్షుడు గువైడో రాజకీయ భవిష్యత్‌, సోషలిజానికి వ్యతిరేకతను ట్రంప్‌ ఫ్లోరిడా పర్యటనలో వక్కాణించాడు. సోషలిజం, కమ్యూనిజాల భయానక చర్యలను ప్రత్యక్షంగా భరించిన వారు వాటికి వ్యతిరేకంగా ధైర్యంగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి మరియు ప్రతి ఒక్క రాజకీయ ఖైదీకి, వ్యతిరేకత ప్రకటించిన ప్రతి ఒక్కరికి తాము ఘన స్వాగతం పలుకుతామన్నాడు. అమెరికా యువతలో పెరుగుతున్న సోషలిస్టు భావాల వ్యాప్తిని అరికట్టేందుకు వెనెజులాను బలిచేయాలన్న కుట్ర కోణాన్ని తోసిపుచ్చలేము.

జనవరి 23న గువైడో వెనెజులా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నప్పటి నుంచి చట్టబద్దంగా ఎన్నికైన అధ్యక్షుడు నికోలస్‌ మదురోను అధ్యక్షుడిగా గుర్తించేందుకు నిరాకరించటమేగాక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అమెరికా చేయని ప్రయత్నం లేదు.సాయం ముసుగులో మదురో వ్యతిరేకులకు ఆయుధాలను చేరవేస్తున్న వాహనాలను కొలంబియా సరిహద్దులో వెనెజులా మిలిటరీ పట్టుకున్న విషయం తెలిసినదే. రోనాల్డ్‌ రీగన్‌ 37 సంవత్సరాల క్రితం మార్క్సిజం, లెనినిజం చరిత్ర బూడిద కుప్పలో కలసినట్లు నోరుపారవేసుకున్నాడు. ఫిబ్రవరి ఐదున అనూహ్యంగా అమెరికన్‌ పార్లమెంట్‌ వుభయసభలనుద్ధేశించి చేసిన ప్రసంగంలో వెనెజులా పరిణామాలను ప్రస్తావించి సోషలిజంపై దండెత్తి అమెరికాలో అనుమతించేది లేదన్నాడు. పదమూడు రోజుల తరువాత మరోసారి మియామీలో అదేపని చేశాడు. గత నెల రోజుల్లో అమెరికా-వెనెజులా పరిణామాలను చూసినట్లయితే ట్రంప్‌ స్వయంగా చెప్పినట్లు మిలిటరీ జోక్యానికి ఆఖరి అస్త్రంగా తగిన అవకాశం, సాకుకోసం అమెరికా చూస్తున్నది.

ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిని వినియోగించుకొని అమెరికన్లు గనుక వెనెజులాపై సైనిక చర్యకు వుపక్రమిస్తే శాశ్వత సభ్యరాజ్యాలైన చైనా, రష్యా వీటో ఆయుధాన్ని ప్రయోగిస్తాయి. మదురో ప్రభుత్వాన్ని అమెరికాతో అంటగాకే కొన్ని మినహా ఆ రెండు దేశాలతో పాటు మన దేశంతో సహా అన్నీ గుర్తించాయి. ప్రపంచ రాజకీయాలు, ఆర్ధిక పరిణామాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. రష్యన్‌ క్షిపణులు, ఎయిర్‌ క్రాఫ్ట్‌ , ఇతర ఆయుధాలను కొనుగోలు చేసి దానికి బదులుగా చౌకధరకు వెనెజులా చమురు సరఫరా చేస్తోంది. అమెరికా బెదిరింపులను సహించేది లేదంటూ రష్యాతో కలసి సైనిక విన్యాసాలు చేస్తోంది. అవసరమైతే తమ జెట్‌ బాంబర్లు, యుద్ధనావలు బాసటగా నిలుస్తాయంటూ ఇటీవలి కాలంలో తరచుగా వెనెజులా తీరాలు, విమానాశ్రయాలకు రష్యా నౌకలు, జెట్‌లు వచ్చి ఆగివెళుతున్నాయి. గత పది సంవత్సరాలలో చైనా 70బిలియన్‌ డాలర్ల మేరకు వివిధ వెనెజులా పధకాలలో పెట్టుబడులు పెట్టింది. లాటిన్‌ అమెరికాలో ప్రధాన రాజకీయ మద్దతుదారుగా క్యూబా వుంది. అమెరికా కుట్రలను ఎదుర్కోవటంలో, చిత్తు చేయటంలో ఎంతో అనుభవం గడించిన క్యూబన్లు భద్రతా, మిలిటరీ సలహాదారులను సరఫరా చేయటమే గాక తమకు అందిన సమాచారాన్ని మదురో సర్కార్‌కు అందిస్తోంది. తన వద్ద వున్న వైద్యులు, నర్సులు, ఇంజనీర్లవంటి నిపుణులను పదిహేను వేల మందిని పంపింది. దీనికి ప్రతిగా చౌకధరలకు వెనెజులా చమురు సరఫరా చేస్తోంది.

చమురు విక్రయాలను అడ్డుకొంటూ అనేక సమస్యలను సృష్టిస్తున్న అమెరికా చర్యల కారణంగా వెనెజులాలో అనేక వస్తువులకు కొరత ఏర్పడింది. దీన్ని సాకుగా చూపి సోషలిస్టు మదురో పాలన కారణంగానే ఇలాంటి పరిస్ధితి అంటూ సోషలిజానికి లంకెపెట్టి డోనాల్డ్‌ ట్రంప్‌ ఒక పధకం ప్రకారం పెద్ద ఎత్తున సోషలిస్టు వ్యతిరేక ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. దానిలో భాగమే అమెరికా ఎన్నడూ సోషలిస్టు దేశంగా వుండబోదన్న ప్రకటనకు పార్లమెంట్‌ వుభయసభల ప్రసంగాన్ని ఎంచుకున్నాడు. అప్పటి నుంచి అమెరికా మీడియాలో సోషలిజం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సహజంగానే వక్రీకరణలు చోటు చేసుకుంటాయని వేరే చెప్పనవసరం లేదు. అమెరికా జనానికి ఇప్పటి వరకు అక్కడి మీడియా ద్వారా సోషలిజం గురించి వక్రీకరణలు, వైఫల్యం చెందినదిగానే సమాచారాన్ని మెదళ్లకు ఎక్కించారు. ఇప్పుడు సోషలిజం గురించి వివరించటానికి, పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి చెప్పేవారికి మీడియాలో కాస్తయినా చోటివ్వకతప్పటం లేదు. అందువలన యువతరంలో సోషలిజం మీద ఆసక్తిని పెంచటానికి ఇది దోహదం చేసే అవకాశం వున్నందున ఒక విధంగా సానుకూల పరిణామంగా చెప్పవచ్చు. మారిన పరిస్ధితుల్లో అమెరికాలో పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి చర్చ మొదలు కావటం విశేషం. నిజానికి నాలుగైదు వందల సంవత్సరాల పెట్టుబడిదారీ వ్యవస్ధ చరిత్రలో ఆ వర్గానికి చెందిన వారి నోటే దాని వైఫల్యం గురించి పదే పదే వినిపిస్తోంది. ఈ పూర్వరంగంలో సోషలిజంపై ట్రంప్‌ దాడి గురించి రాసిన విశ్లేషణలకు పెట్టిన కొన్ని శీర్షికలు ఇలా వున్నాయి.’ సోషలిజంపై ట్రంప్‌ దాడి పెట్టుబడిదారీ విధానానికి సాయపడదు : చికాగో ట్రిబ్యూన్‌ ‘ ‘ భయ పడాలనా? భయపడవద్దనా-డెమోక్రాట్‌ గజెట్‌’ ‘

చికాగో ట్రిబ్యూన్‌ విశ్లేషణలో కొన్ని అంశాల సారాంశం ఇలా వుంది. అమెరికాలో సోషలిజానికి ఎన్నడూ ఆదరణ లేదు, ఇరవయ్యవ శతాబ్దంలో పశ్చిమ దేశాలలో సోషలిస్టు పార్టీలు గణనీయమైన ఆదరణ పొందాయి, ఇక్కడ కొద్ది మందికే పరిమితమైంది.1932లో మహా మాంద్యం సమయంలో సోషలిస్టు పార్టీ అధ్యక్ష అభ్యర్ధి ఇక్కడ కేవలం రెండుశాతం ఓట్లు మాత్రమే పొందారు. అయితే ఆలశ్యంగా అవకాశాలు మెరుగయ్యాయి.2016లో డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి ఎన్నికలలో బెర్నీశాండర్స్‌ 13 రాష్ట్రాలు, బృందాలలో మద్దతు సంపాదించారు.గతేడాది అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఇద్దరూ సోషలిస్టులమనే ముద్రను గర్వంగా తగిలించుకున్నారు.ఇప్పుడు అధ్య క్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అనే ప్రముఖ రాజకీయవేత్తను ంచి సోషలిస్టులు ఒక శక్తిని పొందారు. ‘ మన దేశం సోషలిజాన్ని అనుసరించాలనే కొత్త పిలుపులు మనల్ని మేలుకొల్పాయి. అమెరికా ఎన్నడూ సోషలిస్టు దేశంగా వుండదని ఈ రాత్రి మన సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తున్నా ‘ అని ట్రంప్‌ చెప్పారు. ఇంతకంటే మెరుగ్గా పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధించేవారు అవసరం. సోషలిజంపై దాడి చేయటం ద్వారా ఓటర్లలో ప్రత్యేకించి యువ ఓటర్లలో ట్రంప్‌ చిన్నబోయారు. వామపక్షానికి పెద్ద బహుమతి ఇది, పెట్టుబడిదారీ విధాన అభిమానులకు సంకట స్ధితి కలిగించుతుంది. డెమోక్రాట్లు వుదారవాదులుగా మారటానికి వారేమీ కారల్‌ మార్క్స్‌తోవలో నడవటం లేదు. వారిలో కొందరికి ఆర్ధికాంశాల గ్రహణ శక్తి పట్టుతప్పింది, దాని ఇబ్బంది కలిగించే వాస్తవాలు జుగుప్స కలిగించటం ఒక పాక్షిక కారణం. స్వేచ్చామార్కెట్‌ను సమర్ధించే ఆ పార్టీ నేతలు కొన్ని సామాజిసమస్యలను పరిష్కరించలేకపోవటం కూడా ఒక కారణం. ఆచరణాత్మక పరిష్కారాలకు సిద్ధపడకుండా మితవాదులు మరింత కఠినమైన భావజాలానికి కట్టుబడి వుండటం కూడా పాక్షికంగా అందుకు తోడ్పడింది. బరాక్‌ ఒబామా ప్రతిపాదించిన ఆరోగ్య సంరక్షణ పధకానికి ఒక రిపబ్లికన్‌ కూడా ఓటువేయలేదు, అదొక సోషలిస్టు చర్యగా చూశారు.

భయపడాలనా ? భయపడకూడదనా అనే శీర్షికతో డెమోక్రాట్‌ గజెట్‌ వ్యాఖ్యను మంచి మనుషులు లేదా మంచి భావజాలం మీద బురద చల్లటానికి ప్రత్యేకించి ముద్రలు వేస్తారు, వాటిని తాను ద్వేషిస్తానంటూ రచయిత దానిని ప్రారంభించాడు. ఈ రోజు అమెరికా రాజకీయాల్లో కొంత మంది డెమోక్రాట్లు అవలంభించిన దాని ముద్ర సోషలిజం. వుదారవాదులను చూసి మితవాదులు భయపడేందుకు అదే పదాన్ని రిపబ్లికన్‌ పార్టీ వుపయోగిస్తోందని చెబుతూ మధ్యలో సోషలిజం, కమ్యూనిజం గురించి తన అభిప్రాయాలను వెల్లడించిన తరువాత ముగింపులో చెప్పిన అంశాలు అమెరికా సమాజంలో జరుగుతున్న సోషలిజం-పెట్టుబడిదారీ విధానాల మంచి చెడ్డల మధన పూర్వరంగంలో ఎంతో ముఖ్యమైనవి.వివిధ సర్వేలు తేల్చిన సారం ఏమంటే ఈ భూమ్మీద సంతోషంగా వున్న జనం నివశిస్తున్న దేశాలు ఏవంటే సోషలిస్టు ప్రజాస్వామిక వ్యవస్ధలు కలిగినవే. కొన్ని ప్రభుత్వ విధానాలు మరియు కార్యక్రమాలు నాణ్యమైన జీవితానికి అవసరమైన లబ్దికి హామీ ఇచ్చేవి, అంటే అందుబాటులో ఆరోగ్య రక్షణ, వ్యక్తిగతంగా తగినంత సెలవు దొరకటం, అందుబాటులో గృహవసతి, స్వచ్చమైన పర్యావరణం వంటివి. అయితే ప్రజాప్రాతినిధ్య ప్రజాస్వామిక వ్యవస్ధలలో కోరుకున్నంత వ్యక్తిగత ఆస్ధి లేదా సంపదలను ఎంచుకోవటానికి స్వేచ్చ వుంటుంది. ఈ దేశాలు మౌలికంగా పెట్టుబడిదారీ విధానం మరియు సోషలిజంతో మిళితమై ఎంతో ప్రభావంతంగా మరియు ఆకర్షణీయంగా వుంటాయి. మనం సోషలిజం గురించి భయపడనవసరం లేదు. దాని కొన్ని సంకల్పాలతో మానవాళి లబ్ది పొందిందని మనసారా మనం గుర్తించాలి. ఆ తరువాత ఆ భావజాలాన్ని మన స్వంత దేశంలో వృద్ధి పొందించటానికి మనం పూనుకోవాలి.

Image result for a big debate on socialism in US

న్యూయార్క్‌టైమ్స్‌, లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌, వాషింగ్టన్‌ పోస్టు వంటి బడా కార్పొరేట్ల పత్రికలు ఈ చర్చను విస్మరించలేకపోయాయి. స్ధలాభావం రీత్యా అన్నింటి సారం అందించటం సాధ్యం కాదు. గత కొద్ది సంవత్సరాలుగా అమెరికాలో జరుగుతున్న సోషలిస్టు మధనం గురించి శత్రువులు ముందే గ్రహించారు. ప్రపంచమంతటా కారల్‌మార్క్సు 200వ జయంతిని జరుపుకుంటున్న సమయంలో ఆయన భావజాలాన్ని అరికట్టే బాధ్యతను తలకెత్తుకున్నామని చెప్పుకొనే అమెరికా సర్కార్‌ 2018 అక్టోబరు 23న సోషలిజం ఎంత ఖర్చుతో కూడుకున్నదో వివరిస్తూ ఒక పెద్ద పత్రాన్ని విడుదల చేసింది. అమెరికా గనుక సోషలిస్టు విధానాలను అమలు జరిపితే భవిష్యత్‌లో సంభవించబోయే నష్టాలను దానిలో ప్రస్తావించారంటే సోషలిజాన్ని కోరుకుంటున్న యువతను సూటిగా వ్యతిరేకించకుండా మరోమార్గంలో వారి మెదళ్లను చెడగొట్టే ప్రయత్నం తప్ప వేరు కాదు. వెనెజులాలో ప్రస్తుతం అధికారంలో వున్న వామపక్ష శక్తులు తప్ప అక్కడ అమలు జరుపుతున్నది కొన్ని సంక్షేమ పధకాలతో కూడిన ప్రజాపాలన తప్ప శాస్త్రీయ సోషలిస్టు సమాజ నిర్మాణం కాదు. అలాగే ఐరోపాలో నోర్డిక్‌ దేశాలుగా వున్న డెన్మార్క్‌, స్వీడన్‌, ఫిన్లండ్‌, ఐస్‌లాండ్‌, నార్వేలలో వున్న మెరుగైన సంక్షేమ పధకాలను చూపి నిజమైన సోషలిస్టు దేశాలుగా చిత్రిస్తూ ఆ పత్రంలో చర్చించారు. వెనెజులా సోషలిస్టు పధకాలను అమెరికాలో అమలు జరిపితే దీర్ఘకాలంలో కనీసం 40శాతం జిడిపి తగ్గిపోతుందని ఆ పత్రంలో పేర్కొన్నారు.నోర్డిక్‌ దేశాల విధానాలను అనుసరిస్తే అమెరికాలో జిడిపి కనీసం 19శాతం తగ్గిపోతుందని ఏడాదికి రెండు నుంచి ఐదువేల డాలర్లు అదనంగా పన్ను విధించాల్సి వుంటుందని, అమెరికాతో పోల్చితే ఈ దేశాల్లో జీవన ప్రమాణాలు పదిహేనుశాతం తక్కువగా వున్నాయని పేర్కొన్నారు. అమెరికాలోని సోషలిస్టులు కోరుతున్న విధంగా ఆరోగ్యఖర్చునున నోర్డిక్‌ దేశాలలో మాదిరి పూర్తిగా ప్రభుత్వమే భరిస్తే 2022నాటికి జిడిపి తొమ్మిదిశాతం తగ్గిపోతుందని పేర్కొన్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపటం ఎలా సాధ్యం కాదో వక్రీకరణలతో సోషలిజం గురించి తెలుసుకోకుండా జనాన్ని నివారించటం కూడా అంతే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

తాత్కాలిక బడ్జెట్‌ -ఓట్లకోసం నరేంద్రమోడీ వేసిన వల !

13 Wednesday Feb 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Pensioners, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Direct Benefit Transfer (DBT), India Interim budget 2019-20, India's first budget, kisan samman, Narendra Modi, subsidies

Image result for india Interim budget 2019-20 cartoons

ఎం కోటేశ్వరరావు

స్వతంత్ర భారత చరిత్రలో ఎవరు అంగీకరించినా లేకున్నా నరేంద్రమోడీ తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్నారని చెప్పక తప్పదు. ప్రపంచంలో ప్రజలెన్నుకున్న ఏ ప్రధానీ లేదా అధ్యక్షుడు ఒక్కసారంటే ఒక్కసారి కూడా విలేకర్లకు ప్రశ్నించే అవకాశం వుండే మీడియా గోష్టిలో మాట్లాడకుండా పదవీ కాలాన్ని ముగించినట్లు ఇంతవరకు వినలేదు. అలాంటి అసాధారణ రికార్డును మోడీ నెలకొల్పబోతున్నారు. మంచోడు మంచోడు అనుకుంటే మంచమంతా ఖరాబు చేశాడన్న సామెత మాదిరి తొలి రోజుల్లో ఎందరో అభిమానించిన మోడీ వున్న వ్యవస్ధలను మెరుగుపరచకపోగా అన్ని వ్యవస్ధలను దెబ్బతీశారనే విమర్శలకు గురయ్యారు. వాటిలో తాజాది కేంద్ర బడ్జెట్‌. సాంప్రదాయాలు, ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్దంగా తాత్కాలిక బడ్జెట్‌ ప్రసంగంలో వెనుకటి తేదీ నుంచి అమలులోకి వచ్చే పధకాల ప్రకటన. రాజకీయాలతో నిమిత్తం లేని వారికి ఇది కాస్త ఇబ్బందిగా వుంది. మోడీ రాజకీయ వ్యతిరేకులకు ఇది విమర్శనాస్త్రమైతే అనుకూల రాజకీయులకు ఇది ప్రతిపక్షాలపై బ్రహ్మాస్త్రంలా కనిపించటం సహజం. మొత్తంగా మీడియాలో వచ్చిన శీర్షిలు, వ్యాఖ్యల సారాంశం ఏమంటే అది ఎన్నికలను దృష్టిలో వుంచుకొని రూపొందించింది. ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రవేశపెట్టి చర్చలేమీ లేకుండానే పదకొండవ తేదీన బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

ప్రపంచ బడ్జెట్‌ చరిత్రలో ముఖ్యంగా ప్రజలెన్నుకున్న పాలకుల ఏలుబడిలో పదవీకాలం ముగిసే సమయానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి వస్తే తాత్కాలిక ఏర్పాట్లను వుపయోగించుకుంటారు.ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం వచ్చే వరకు రెండు నెలల కాలానికి అవసరమైన ఖర్చుల కోసం ఖజానా నుంచి డబ్బుతీసుకొనేందుకు అనుమతి తీసుకోవటాన్నే ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ అంటారు. ఎన్నికల్లో అంతకు ముందు పార్టీయే గెలిచినా లేదా కొత్త పార్టీ వచ్చినా తన విధానాలకు అనుగుణుంగా బడ్జెట్‌ రూపకల్పన చేసేందుకు వీలు కల్పించటం ఒక మంచి సాంప్రదాయం. మాకు అలాంటి సత్సాంప్రదాయలేమీ పట్టవు, బడ్జెట్‌ను ఫలానా విధంగా పెట్టాలనే నిబంధనలేమైనా వున్నాయా అని అడ్డగోలు వాదనకు దిగితే సమాధానం లేదు.

ఈ సాంప్రదాయానికి తిలోదకాలిచ్చి నరేంద్రమోడీ సర్కార్‌ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టి చెడు సాంప్రదాయానికి తెరలేపింది. మూజువాణి ఓటుతో ఆమోదించి ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలను రాబోయే ప్రభుత్వం తిరగదోడవచ్చు లేదా పూర్తిబడ్జెట్‌గా ఆమోదించాల్సి వుంటుంది. దీని మంచి చెడ్డల గురించి చెప్పుకోబోయే ముందు అసలు బడ్జెట్‌ గురించి కొన్ని అంశాలను తెలుసుకుందాం. బడ్జెట్‌ అనే మాట పాత ఫ్రెంచి వాడుక బౌగెట్టి నుంచి వచ్చింది. దాని అర్ధం చిన్న సంచి లేదా పర్సు. అయితే ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో పదహారవశతాబ్దిలో వాడుకనుబట్టి పండితులు చెప్పినదాని ప్రకారం ఒకరి దగ్గర వున్న సంచి లేదా పర్సును తెరవటం అంటే ఒక రహస్యం లేదా సందేహపూరితమైనది కూడా కావచ్చు. బడ్జెట్‌ అంటే మన వ్యాపార, వాణిజ్యవేత్తలు మనజనంలో బడ్జెట్‌ రాక ముందే కొనండి అంటూ ప్రచారం చేసినదాని ప్రకారం వివిధ వస్తువుల మీద పన్నుల పెంపు లేదా తగ్గింపు వ్యవహారం.నిజానికి బడ్జెట్‌ అంటే ప్రభుత్వ వార్షిక రాబడి, ఖర్చుల ప్రకటన. బ్రిటన్‌లో 1734 జరగాల్సిన ఎన్నికలలో లబ్ది పొందేందుకు భూమిశిస్తుగా వసూలు చేస్తున్న మొత్తంలో ఒక పౌండుకు ఒక షిల్లింగ్‌ (అంటే పౌండులో 20వ వంతు) తగ్గించి భూస్వాముల మద్దతు పొందాలని ప్రతిపాదించాడు. అందుకు గాను ముందుగానే వుప్పు మీద పన్ను విధించాడు. భూస్వాములకు ఇచ్చే రాయితీల మొత్తానికి వుప్పు పన్ను చాలదని తేలటంతో 1733లో ప్రధాన మంత్రిగా వున్న రాబర్ట్‌ వాల్‌పోల్‌ మద్యం, పొగాకు మీద కొత్తగా పన్నులు వేయాలని ప్రతిపాదించాడు. ఆ వివరాలను ఒక కరపత్రంగా ప్రచురించి సమర్ధించుకున్నాడు. అయితే ఆ ప్రకటనకు ముందుగానే వాల్‌పోల్‌ కొత్త పన్నులు వేయనున్నారనే వూహాగానాలు వచ్చి వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. అధికారికంగా ప్రకటించిన తరువాత వాటిని వ్యతిరేకించిన ప్రతిపక్ష సభ్యుడొకరు బడ్జెట్‌ బహిర్గతమైంది లేదా ఒక కరపత్రానికి సమాధానం పేరుతో మరొక కరపత్రాన్ని రాసి వాల్‌పోల్‌ ప్రతిపాదనలను ఖండించాడు. జనంలో ఎప్పటి నుంచో నానుతున్న ఒక పెద్ద రహస్యం బహిర్గతమైంది, పాత పన్నులనే కొత్త రూపంలో వసూలు చేయటం తప్ప మరేమీ కాదన్నది దాని సారం. దేశంలో తీవ్ర వ్యతిరేకత రావటంతో కొత్త పన్నుల ప్రతిపాదనను వాల్‌పోల్‌ వుపసంహరించుకున్నాడు. తరువాత 1764లో నాటి మంత్రి బడ్జెట్‌ పదాన్ని వుపయోగిస్తూ రెండు గంటలనలభై అయిదు నిమిషాల సేపు ప్రసంగించి దేశ ఆర్ధిక పరిస్దితిని వివరించి వలస దేశాలపై పన్నులతో సహా అనేక ప్రతిపాదనలు చేశాడు. దాన్ని తొలి బడ్జెట్‌గా కొందరు పరిగణిస్తున్నారు.

మనం బ్రిటీష్‌ వారి వలస దేశంగా వున్నాం కనుక మన దేశ తొలి బడ్జెట్‌ను 1860 ఏప్రిల్‌ ఏడున ఈస్టిండియా కంపెనీ తొలిసారిగా బడ్జెట్‌ను జేమ్స్‌ విల్సన్‌ ప్రవేశపెట్టారు. ఏప్రిల్‌లోనే ఎందుకు ప్రవేశపెట్టారు అంటే బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవం వూపందుకోక ముందు భూమి మీద వచ్చేదే ప్రధాన మైన ఆదాయం. అది ఏప్రిల్‌ నాటికి ఒక స్పష్టమౌతుంది కనుక, ఏప్రిల్‌లో బడ్జెట్‌ను రూపొందించారని రాశారు. సదరు విల్సన్‌ ఎకానమిస్ట్‌ పత్రికను, స్టాండర్డ్‌ అండ్‌ ఛార్టర్డ్‌ బ్యాంక్‌ను స్దాపించిన ఒక ఆర్దికవేత్త. మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిసారిగా ఏడున్నర నెలలకు గాను మధ్యంతర బడ్జెట్‌ను 1947 నవంబరు 26న ఆర్‌కె షణ్ముగం చెట్టి ప్రవేశపెట్టారు. తరువాత మన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 112 ప్రకారం ప్రతి ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి మరుసటి ఏడాది మార్చి 31వరకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దేశ తొలి సంపూర్ణ బడ్జెట్‌ మరుసటి ఏడాది నుంచి అమల్లోకి వచ్చింది. అయితే దేశమంతటికీ వర్తింపచేసిన సమగ్ర బడ్జెట్‌ 1949-50 నుంచి అమల్లోకి వచ్చింది.

బడ్జెట్‌ వివరాలను ఎంతో రహస్యంగా పరిగణించేవారు. వివరాలు ఏమాత్రం వెల్లడైనా తీవ్రపర్యవసానాలుంటాయని భావించారు. వివరాలను రూపొందించే బృందానికి నాయకత్వం వహించే అధికారి తప్ప చివరకు ఆర్దిక మంత్రి కూడా వాటిని కలిగి వుండేందుకు వీలు లేదు. తొలి రోజుల్లో 1950వరకు బడ్జెట్‌ పత్రాలను రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో ముద్రించేవారు. తరువాత ఆర్దిక మంత్రిత్వశాఖ కార్యాలయ ప్రాంగణంలో 1980వరకు, అప్పటి నుంచి వెలుపల ప్రభుత్వ ప్రచురణాలయంలో ముద్రిస్తున్నారు. బడ్జెట్‌ ప్రవేశానికి ముందు హల్వా తయారీని ఆర్ధిక మంత్రి ప్రారంభిస్తారు. అంటే బడ్జెట్‌ పత్రాల ముద్రణ ప్రారంభసూచిక. ఆప్రక్రియలో నిమగ్నమైన వారెవరినీ ముగిసే వరకు బయటకు వెళ్లకుండా చేస్తారు. ఆ ప్రాంగణంలో ఆర్ధిక మంత్రి కూడా సెల్‌ఫోన్‌ కలిగి వుండటానికి వీలు లేదు. మన దేశంలో తొలి బడ్జెట్‌ కాగితాలను ఒక బ్రీఫ్‌ కేసులో తెచ్చారు. అప్పటి నుంచి అదే సాంప్రదాయం కొనసాగుతోంది.

గతంలో బడ్జెట్‌లోకొన్ని ముఖ్యాంశాలు పుకార్ల రూపంలో వెల్లడయ్యేవి. వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు ముందుగానే వుప్పందేది.కొన్ని సంవత్సరాల తరువాత మోపదలచిన భారాలన్నింటినీ ముందుగానే మోపి బడ్జెట్లలో మాత్రం భారం మోపలేదని ప్రచారం చేసుకొనే విధంగా పాలకపార్టీలు తయారయ్యాయి. రాను రాను బడ్జెట్లు ఒక తంతుగా మారాయి. ఇప్పుడు జిఎస్‌టి వచ్చిన తరువాత దేని మీద పన్ను ఎంతో ముందుగానే నిర్ధారణ చేస్తున్నందున పన్నుల ప్రసక్తి వుండదు. జిఎస్‌టి కౌన్సిల్‌ సమీక్షలు జరిపి కొన్నింటి మీద పన్ను తగ్గించటం తెలిసిందే. ఇప్పుడు బడ్టెట్‌లు ఆదాయ, కార్పొరేట్‌, ఇతర కొన్ని పన్నుల సవరణ, పధకాల ప్రకటనకే పరిమితం అయ్యాయి. గతంలో రైల్వే బడ్జెట్‌ విడిగా వుండేది. కొన్ని సంస్ధానాలలో భారత ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా రైలు మార్గాలుండేవి గనుక రైల్వే బోర్టు ద్వారా ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. రెండు సంవత్సరాల క్రితం దాన్ని కూడా సాధారణ బడ్జెట్లోనే విలీనం చేశారు. సాధారణంగా బడ్జెట్లను ఆర్దిక మంత్రులే ప్రవేశపెడతారు. గతంలో ప్రధానిగా వున్న ఇందిరా గాంధీ వద్దే ఆర్ధికశాఖ కూడా వుండటంతో ఒకసారి ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. గతంలో ఫిబ్రవరి చివరి పని దినం రోజు ప్రవేశపెట్టేవారు ఇప్పుడు మొదటి రోజుకు మార్చారు.రాత్రంతా పని చేసిన సిబ్బందికి విశ్రాంతి నిచ్చేందుకు వీలుగా 1924 నుంచి సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశ పెట్టారు. దీనిని 2001 నుంచి వుదయం పదకొండు గంటలకు మార్చారు. స్వాతంత్య్రం తరువాత 25 మంది ఆర్దిక మంత్రులుగా పని చేశారు. గరిష్టంగా మొరార్జీదేశాయ్‌ పదిసార్లు, రెండవ స్ధానంలో పి చిదంబరం ఎనిమిదిసార్లు బడ్జెట్లను ప్రవేశపెట్టారు.1991లో మన్మోహన్‌ సింగ్‌ సుదీర్ఘంగా 18,650 పదాలతో ప్రసంగించగా 1977లో కేవలం 800 పదాలతో హెచ్‌ఎం పటేల్‌ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. తాజాగా పియూష్‌ గోయల్‌ వంద నిమిషాల సేపు ప్రసంగించి ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌ ఎలాంటిదో పాఠకులే నిర్ణయించుకోవచ్చు. సాంప్రదయాన్ని వుల్లంఘించి చేసిన ఈ పనిని ఎలాంటి జంకు గొంకు లేకుండా సమర్ధించుకోవటం మోడీ సర్కార్‌కే చెల్లింది.

ఫిబ్రవరి పదకొండవ తేదీన రాఫెల్‌ ఒప్పందంపై ప్రతిపక్షాల నిరసనల మధ్య మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించిన బడ్జెట్‌ను పియుష్‌ గోయల్‌ సమర్దించుకున్నారు. తాత్కాలిక బడ్జెట్‌ కనుక తాము కొత్త పధకాలేవీ ప్రకటించలేదని, పూర్తి స్దాయి బడ్జెట్‌ను తరువాత ప్రవేశపెడతాం, దానిలో మరిన్ని ప్రకటనలుంటాయి, అవి వచ్చే సంవత్సరానికి చెందినవని అన్నారు. బడ్జెట్‌ ప్రసంగంలో గోయల్‌ కొత్తదనమేమీ లేనట్లయితే గంటసేపు ప్రసంగంలో ఏమి చెప్పినట్లు ? ప్రధాని కిసాన్‌ పధకం కింద రెండేసి వేల రూపాయల చొప్పున చిన్న రైతాంగానికి డిసెంబరు నుంచి ఏడాదికి మూడుసార్లుగా మొత్తం ఆరువేలు చెల్లించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసినదే. ఇదిగాక అసంఘటిత రంగంలోని కార్మికులకు ఫిబ్రవరి 15 నుంచి పెన్షన్‌ పధకాన్ని కూడా ప్రకటించారు. ఇవి ఈ ఆర్దిక సంవత్సరం నుంచే అమలులోకి వస్తాయి కనుక సాంకేతికంగా వచ్చే ఏడాది నుంచి అమలు అయ్యే పధకాలుగా పరిగణించకూడదని గోయల్‌ వాదించారు. తమ నాయకుడు ఎంతో తెలివిగా మాట్లాడారని బిజెపి అభిమానులు పొంగిపోయేందుకు తప్ప బుర్రవున్నవారికి చిరాకు తెప్పిస్తాయి. ఆ పధకాలను ఎవరూ వ్యతిరేకించరు. బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా ముందే ప్రకటించినా ఎవరూ తప్పు పట్టరు. డిసెంబరు నుంచి అమల్లోకి వచ్చే పధకాన్ని ఫిబ్రవరి ఒకటిన ప్రకటించటం అంటే ఎన్నికల ఆపదమొక్కులని వేరే చెప్పనవసరం లేదు. కొత్త పధకాలని చెప్పుకుంటే ప్రవేశపెట్టింది తాత్కాలిక బడ్జెట్‌కిందికి రాదు, వచ్చే ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలుకు ఎన్నికల నిబంధనావళి అడ్డువస్తుంది కనుక బిజెపి సర్కార్‌ ఈ చర్యకు పాల్పడింది. అయినా గట్టెక్కుతారా అంటే పోగాలము దాపురించినపుడు ఇలాంటివేవీ గతంలో ఏ పాలకపార్టీని రక్షించిన దాఖలా లేదు.

Image result for india Interim budget 2019-20 cartoons

మోడీ సర్కార్‌ చివరి బడ్జెట్‌ను ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌గా పరిగణించటానికి లేదు. పూర్తి బడ్జెట్‌ కాదని సర్కారే చెప్పింది కనుక దీన్ని త్రిశంకు స్వర్గ స్దితి బడ్జెట్‌ అనుకోవాలి. విమర్శించటానికి, సమర్ధించటానికి ఏమీ లేదు. అయితే కొన్ని అంశాలను విశ్లేషించాల్సి వుంది. ఐదు ఎకరాలు, అంతకంటే తక్కువ భూమిగల కుటుంబానికి రూ.6000 ఇవ్వనున్నట్లు ప్రకటించారు.దీనికయ్యే వ్యయంలో రాష్ట్రాలు 40శాతం భరించాలని కేంద్రం కోరనున్నదని అసలు ఆర్థిక మంత్రిగావున్న అరుణ్‌ జైట్లీ చెప్పారు. వాస్తవంలో ఈ పథకానికి నిధుల కేటాయింపు చేసి వున్నట్టయితే జైట్లీ అలా ప్రకటించి ఉండేవారు కాదు. అంటే బడ్జెట్‌లో చూపిన అంకెలు మోసపూరితమైనవన్నమాట.ఈ పథకం కేవలం భూమిని కలిగివున్నవారికే వర్తిస్తుంది. భూమిలేని వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు కూడా ఈ పథకంలో చోటులేదు. 2018-19 సంవత్సరానికి చెందిన సవరించిన బడ్జెట్‌లో సీజీఎస్‌టీ 5.04లక్షల కోట్లు(ఇది అసలు బడ్జెట్‌లో చూపిన దానికి 1లక్ష కోట్లు తక్కువ) వస్తుందని అంచనా వేయగా వాస్తవంలో ఈ పన్ను ఈ మాత్రం కూడా వసూలు కాదని స్వతంత్ర పరిశోధకులు తేల్చారు. ఏప్రిల్‌-జనవరి మధ్యకాలంలో ఈ పన్ను ద్వారా వచ్చిన ఆదాయం సగటున నెలకు 37,635కోట్లు. వార్షికంగా చూసినప్పుడు ఈ మొత్తం 3.77లక్షల కోట్లు ఉంటుందని అంచనా. అంటే సంవత్సర కాలంలో వచ్చే ఆదాయం మొత్తం 4.52లక్షల కోట్లకు మించదు. ఇది సవరించిన అంచనా కంటే కూడా 52,000కోట్లు తక్కువ.

తాను చేస్తున్న అప్పులను ప్రభుత్వరంగ సంస్థలపైన రుద్దటం, రిజర్వ్‌బ్యాంకు, ఇతర జాతీయ బ్యాంకుల నగదు నిల్వలను డివిడెండ్‌ ఆదాయం పేరుతో వాడటం వంటి అడ్డగోలు చర్యలు ఆర్ధిక క్రమశిక్షణ వుల్లంఘనకు ప్రతిబింబాలు. ఇప్పటికే జిడిపి వృద్ధి రేటు లెక్కలను గందరగోళపరచి ఎక్కువ అభివృద్ది జరిగినట్లు చూపటం, వుపాధి అవకాశాలు తగ్గిన విషయాన్ని అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో నష్టం అని గ్రహించి లెక్కలను ఇంకా ఖరారు చేయలేదని ఒక మాట, సరిగా లెక్కలు తయారు కాలేదని ఇంకో మాట చెబుతున్నారు. పకోడీ బండి పెట్టుకున్నా వుపాధి కల్పించటమే అని ప్రధాని స్వయంగా చెప్పినందున గత నాలుగు సంవత్సరాలలో ఎందరు పకోడీ బండ్లవంటివి ఎన్ని పెట్టుకున్నారో లెక్కలు వేసిన తరువాత వాటిని కూడా వుపాధికల్పన అంకెల్లో చూపి చెబుతారనుకోవాల్సి వస్తోంది.

పన్నుల ద్వారా 2018-19 సంవత్సరానికి చెందిన సవరించిన అంచనాల ప్రకారం చూపిన 6.71లక్షల కోట్ల ఆదాయం వాస్తవరూపం ధరించే అవకాశంలేదు. దీనినే తిరిగి 2019-20 సంవత్సర బడ్జెట్‌ అంచనాలో పెద్ద ఎత్తున 7.6లక్షల కోట్లుగా చూపారు. ఇంతకుముందు చూపినవిధంగా సీజీఎస్‌టీ ద్వారా వచ్చే ఆదాయం 2018-19 సంవత్సరానికి 4.52లక్షల కోట్లకు మాత్రమే చేరే అవకాశం ఉంది. దీనినే 2019-20 సంవత్సర బడ్జెట్‌ అంచనాలో 6.10లక్షల కోట్లకు పెరుగుతుందని చూపారు. ఆదాయంవైపు చూపుతున్న అంచనాలలో వున్న బూటకమే సహజంగా వ్యయంవైపు కూడా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. 2019-20 సంవత్సర బడ్జెట్‌లో పేదల సమస్యలపట్ల ఏమాత్రం ఆసక్తి చూపలేదు. జాతీయ ఉపాధిహామీ పథకానికి చేసిన కేటాయింపులు 2018-19 సంవత్సరంలో కంటే వర్తమాన బడ్జెట్‌లో 1000కోట్లు తక్కువ. ఈ పథకంపట్ల కేంద్రానికున్న చిన్నచూపుకు ఇది సూచిక.

Image result for Interim budget-a narendra modi's trap to catch votes

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధిలో రాష్ట్ర ప్రభుత్వాలు 40శాతం భరించాలని జైట్లీ చేసిన ప్రకటనకు ప్రాధాన్యత వుంది. వ్యవసాయం రాష్ట్రాల అధికార పరిధిలోనిది. దీనికి కేంద్రం నిధులు ఇవ్వకూడదనేమీ లేదు. ఇంతవరకు ఇలా ఏకపక్షంగా ఇతర అంశాలు వేటికీ రాష్ట్రాల వాటాను తేల్చకుండా పధకాలను రూపొందించలేదు. దీని మీద రాష్ట్రాల అభిప్రాయం తీసుకోలేదు. అందువలన దీన్ని కొనసాగిస్తారా అని కూడా సందేహించక తప్పదు. ఎన్నికల ముందు ప్రచారానికి ఉపయోగపడటానికి దీనిని రూపొందించినట్టుగాఉంది. ఒకవేళ ఎన్నికల తరువాత ఎన్‌డీఏ తిరిగి అధికారంలోకివస్తే రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించటంలేదనే నిందమోపి ఈ పథకాన్ని ఎత్తేయవచ్చు. లేదూ ప్రతిపక్షంలో కూర్చుంటే అది కొనసాగకపోతే చూశారా రైతులకు అన్యాయం చేస్తున్నారని దాడి చేయవచ్చు. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో నగదు బదిలీ కోసం 20000కోట్లు ఖర్చు పెట్టాలి. అయితే ఎన్నికలు సమీపిస్తున్నందున ఎలాగోలా ఈ మొత్తాన్ని సమకూర్చటం కష్టమేమీ కాదు. తరువాత ఏమిటనేది అసలు ప్రశ్న. దేశంలో భూమి యాజమాన్యాలకు సంబంధించిన రికార్డుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. సరైన గణాంకాలు లేనందున లబ్దిదారుల ఎంపిక అంత తేలిక కాదు.

మధ్యతరగతి వారికి ఆదాయ పన్నులో వార్షికంగా 5లక్షలవరకు రాయితీలు ప్రకటించటం ఓట్ల కోసమే. స్లాబులు మార్పు గురించి ప్రకటించకుండా రాయితీ ఇవ్వటం ఒకసారి వ్యవహారం కూడా కావచ్చు. దీనివలన వారికి ఎంత లబ్ది ఎంత అన్నది ప్రశ్న. బడ్జెట్‌లో అసంఘటిత కార్మికుల కోసం పించను పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ పథకం ఇప్పటికేవున్న వ అద్ధులకు ఉపపయోగపడదు. ఈ పధకంలో 29ఏండ్లు నిండిన వ్యక్తి తనకు 60ఏండ్లు వచ్చేదాకా నెలకు రూ.100 జమ చేస్తే ఆ తరువాత అతనికి నెలకు రూ.3000 పింఛను వస్తుంది. 60వ ఏటవరకూ ఒక కార్మికుడు కట్టే మొత్తాన్ని 8శాతం కాంపౌండ్‌ వడ్డీతో లెక్కగట్టినప్పుడు రూ.1,50,000 అవుతుంది. పురుషుల జీవిత పరిమాణం 65ఏండ్లుగా ఉన్నప్పుడు 60ఏండ్ల తరువాత అతను అందుకోబోయే పింఛను అతని చేసిన పొదుపు నుంచే వస్తుంది. కాబట్టి ఈ కాంట్రిబ్యూటరీ పథకంలో ప్రభుత్వ పాత్ర నామమాత్రమే.గత ఐదు సంవత్సరాలలో ఎంత మందికి వుపాధి కల్పించారో లెక్కలే తేల్చలేని పాలకులు 50-60కోట్ల మంది అసంఘటిత కార్మికులున్నారని అంచనా కాగా వారందరికీ ఖాతాలు తెరవటం వూహకు అందని అంశం. తాత్కాలిక బడ్జెట్‌ను మొత్తంగా చూసినపుడు ఓటర్లకు వేసిన పెద్ద వల. దీనికి జనం చిక్కుతారా అన్నది ప్రశ్న !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికాను వెన్నాడుతున్న సోషలిస్టు భూతం !

07 Thursday Feb 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

A specter is haunting US, American youth prefer socialism to capitalism, Donald Trump on Socialism, Failure of Capitalism, focus on Socialism, Socialism, the specter of socialism

ఎం కోటేశ్వరరావు

‘ఐరోపాను ఒక భూతం వెన్నాడుతోంది ! ఆ భూతం కమ్యూనిజం !! పాత ఐరోపాలోని అధికార కేంద్రాలైన పోప్‌, జార్‌, మెట్టర్‌నిచ్‌ (నాటి ఆస్ట్రియా విదేశాంగ మంత్రి), గుయిజోట్‌(ఫ్రెంచి 17వ ప్రధాని) , ఫ్రెంచి తీవ్రవాదులు, జర్మన్‌ పోలీసు గూఢచారులు ఆ దయ్యాన్ని వదిలించుకొనేందుకు ఒక పవిత్ర కూటమిగా తయారయ్యారు.’ 1848లో ప్రచురితమైన కమ్యూనిస్టు మానిఫెస్టోను కారల్‌మార్క్స్‌-ఎంగెల్స్‌లు పై మాటలతో ప్రారంభించారు. ఈనెల ఐదవ తేదీ రాత్రి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తమ పార్లమెంట్‌ వుభయ సభల నుద్ధేశించి చేసిన రెండవ ప్రసంగాన్ని చూస్తే సోషలిజం అనే భూతం ట్రంప్‌ను అంటే అమెరికా పాలకవర్గాన్ని వెన్నాడుతోందని స్పష్టమైంది. అనేక మంది అమెరికా అధ్యక్షులు, సోషలిజం, కమ్యూనిజాలకు వ్యతిరేకంగా నానా చెత్త మాట్లాడారు. కొంత మంది విశ్లేషకుల సమాచారం ప్రకారం తొలిసారిగా ఒక అమెరికా అధ్యక్షుడు పార్లమెంట్‌లో సోషలిజం గురించి ప్రకటన చేయటం ఇదే ప్రధమం. బహుశా ఈ కారణంగానే కావచ్చు ఒక మీడియా సంస్ధ ‘సోషలిజం విజేత ‘ అని వుపశీర్షిక పెట్టింది. ట్రంప్‌ అనూహ్యంగా చేసిన ప్రస్తావనతో అనేక మంది మీడియా పండితులు దానికి భాష్యాలు చెప్పటం ప్రారంభించారు. ఇంతకీ ట్రంప మహాశయుడు చెప్పిందేమిటి?

Image result for A specter is haunting US , the specter of socialism

‘ ఇక్కడ, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో, మన దేశం సోషలిజాన్ని స్వీకరించాలన్న కొత్త పిలుపులు మనలను జాగరూకులను చేశాయి. అమెరికా స్వేచ్చ, స్వాతంత్య్రాలతో స్ధాపించబడింది తప్ప ప్రభుత్వ బలవంతం, ఆధిపత్యం, అదుపులతో కాదు. మనం స్వేచ్చతో జన్మించాం, స్వేచ్చగానే వుంటాం. అమెరికా ఎన్నడూ సోషలిస్టు రాజ్యంగా వుండేదిలేనే సంకల్పాన్ని ఈ రాత్రి పునరుద్ఘాటిస్తున్నా.’ ఎవరు అవునన్నా కాదన్నా ఎలా గింజుకున్నా 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలు అనూహ్యరీతిలో సోషలిజాన్ని అజెండాగా చేశాయి. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా తనకు మద్దతు ఇవ్వాలంటూ పోటీలోకి వచ్చిన సెనెటర్‌ బెర్నీశాండర్స్‌ సోషలిస్టునని స్వయంగా ప్రకటించుకొని మరీ గోదాలోకి దిగాడు. గతేడాది జరిగిన మధ్యంతర ఎన్నికలలో డెమొక్రటిక్‌ సోషలిస్టు పార్టీ అభ్యర్ధులిరువురు సోషలిస్టులమని చెప్పుకొని మరీ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులుగా అమెరికన్‌ కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు.

చరిత్ర పునరావృతం అవుతుంది అంటే అర్ధం కొత్త రూపంలో అని తప్ప గతంలో జరిగిన మాదిరే అని కాదు. గతంలోప్రపంచ పెట్టుబడిదారీ కేంద్రంగా ఐరోపా వుంది గనుక అక్కడ ప్రారంభమైంది. ఇప్పుడు దాని కేంద్రం అమెరికాకు మారినందున అక్కడ నాంది పలికిందని చెప్పవచ్చు. నాడు ఐరోపాలో కమ్యూనిస్టు భావజాలం ప్రాచుర్యం పొందిన సమయంలో పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి దానిని వ్యతిరేకిస్తున్న వారే చెప్పారు. ఇప్పుడు పెట్టుబడిదారీ విధానాన్ని సమర్దిస్తున్న వారే అది వైఫల్యం చెందిందని, పని చేయటం లేదని బాహాటంగా చెప్పటం విశేషం. అమెరికాలో మీరు పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధిస్తున్నారా, సోషలిజాన్ని సమర్ధిస్తున్నారా అంటూ ఇప్పుడు జరుగుతున్న సర్వేలవంటివి కమ్యూనిస్టు మానిఫెస్టో వెలువడిన సమయంలో లేవు. గత కొద్ది సంవత్సరాలుగా పెట్టుబడిదారీ వ్యవస్ధకు కట్టుబడి వున్న సంస్ధల సర్వేలు చెబుతున్నదేమిటి? అమెరికాలో పెట్టుబడిదారీ విధానం వైఫల్యం చెందుతున్నదని, సోషలిజం కావాలని చెబుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. అందువలన అటు డెమోక్రటిక్‌ పార్టీ ఇటు రిపబ్లికన్‌ పార్టీలో కూడా కింది నుంచి వస్తున్న వత్తిడితో ట్రంప్‌ సోషలిజం గురించి భయపడటంలో ఆశ్చర్యం లేదు. అమెరికా ఎన్నడూ సోషలిస్టు దేశంగా వుండబోదని ప్రకటించిన సమయంలో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన మితవాది అయిన పార్లమెంట్‌ దిగువ సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ సహజంగానే చప్పట్లతో తబ్బిబ్బు అయ్యారు. పురోగామి సెనెటర్‌గా ముద్ర పడిన ఎలిజబెత్‌ వారెన్‌ తన స్దానం నుంచి లేచి మరీ సోషలిజం మీద ప్రకటించిన ట్రంప్‌ ప్రకటించిన యుద్ధానికి చప్పట్లు చరిచారు.

Image result for A specter is haunting US , the specter of socialism

మరుసటి రోజు వుదయం అమెరికా విత్త మంత్రి స్టీవ్‌ నుచిన్‌ విలేకర్లతో మాట్లాడుతూ కేంద్రీకృత ప్రణాళికాబద్ద ఆర్ధిక వ్యవస్ధ మీద రిపబ్లికన్లకు నమ్మకం లేదని సోషలిజానికి మరలేది లేదని చెప్పాడు. నిజానికి ట్రంప్‌ సోషలిజం గురించి మాట్లాడటం వెనుక అమెరికన్లను తప్పుదారి పట్టించే ఎత్తుగడ వుంది. వెనెజులాలో సైనిక జోక్యానికి ఐదువేల మంది సైనికులను పక్కనే వున్న కొలంబియాలో మోహరించిన ట్రంప్‌ ఒక సాకుకోసం చూస్తున్నాడు. సోషలిజం కారణంగానే వెనెజులాలో పరిస్ధితులు దిగజారాయని అరోపించిన వెంటనే అమెరికా సోషలిజం గురించి ట్రంప్‌ ప్రస్తావించాడు. నిజానికి అక్కడ ఆర్ధిక పరిస్దితి దిగజారటానికి అమెరికా, ఐరోపా ధనిక దేశాల ఆంక్షలు, దిగ్బంధనమే ప్రధాన కారణం. ముందే చెప్పుకున్నట్లు రోజు రోజుకూ పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యాల గురించి జనం ప్రస్తావిస్తున్నారు. నిజానికి 80శాతం మంది అమెరికన్లు పని చేస్తే తప్ప గడవని స్ధితిలో వున్నారు. నిజవేతనాలు నాలుగు దశాబ్దాల నాటి కంటే తక్కువగా వున్నాయి. మెడికల్‌ బిల్లులు అనేక మందిని దివాలా తీయిస్తున్నాయి. విద్యార్దుల అప్పుల సంగతి సరేసరి. కోట్లాది మంది వుద్యోగ విరమణ తరువాత తమ పరిస్ధితి ఏమిటనే ఆందోళనలో వున్నారు. వెనెజులాను సాకుగా చూపి సోషలిజం మీద సైద్ధాంతిక దాడి చేస్తే అమెరికాలో పెరుగుతున్న ప్రాచుర్యాన్ని అరికట్టవచ్చని ట్రంప్‌ భావిస్తే అంతకంటే అమాయకత్వం మరొకటి వుండదు. ఇప్పుడు మరింతగా అమెరికాలో సోషలిజం గురించి చర్చ జరగటం అనివార్యం. మీడియాలో గత రెండు రోజులుగా వెలువడుతున్న విశ్లేషణలే అందుకు నిదర్శనం. ‘ అమెరికాలో సోషలిజం ఒకనాడు సమాజ ప్రధాన స్రవంతికి దూరమైన సిద్దాంతం. ట్రంప్‌ ప్రసంగానికి ముందే అది స్పష్టంగా మారుతోంది. అమెరికా సోషలిస్టు యువత ప్రమాదం గురించి భయపడుతున్న తగరగతులతో ఫాక్స్‌ న్యూస్‌ నడుస్తోంది. అయితే పార్లమెంట్‌ వుభయ సభల్లో జరిగిన దాడి తరువాత సోషలిజం సమయం వచ్చినట్లు అనుకోవచ్చు. అదిప్పుడు ప్రధాన స్రవంతి భావజాలం అధ్యక్షుడి ఆగ్రహానికి గురికావలసినదే. ఒక శత్రువు కలకు అంతగా తోడ్పడేందుకు ఎవరు సాహసిస్తారు ?’ అని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు.

సోషలిజంపై పార్లమెంట్‌లో ట్రంప్‌ దాడికి వారం రోజుల ముందు వెలువడిన ఒక సర్వే వివరాలు ట్రంప్‌ను భయపెట్టి వుంటాయి. సహస్రాబ్ది తరంతో(1981-1996 మధ్య పుట్టిన వారు) పాటు అనంతర జడ్‌ లేదా యూట్యూబ్‌ తరం(1996 తరువాత పుట్టినవారు) కూడా సోషలిజంవైపు ఎక్కువగా మొగ్గుతున్నారని దానిలో తేలాయి.పదింట ముగ్గురే ట్రంప్‌ సరిగా పని చేస్తున్నారని కూడా వెల్లడైంది. 2010లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరింతగా ప్రయత్నించాలని సహస్రాబ్దితరంలో 53శాతం పేర్కొనగా ఇప్పుడు రెండుతరాల్లో అలా అభిప్రాయపడుతున్నవారు 64,70శాతం మంది వున్నారు. ముప్పై అయిదు సంవత్సరాల లోపు యువత సోషలిజం పట్ల ఎక్కువ మంది సానుకూలంగా వున్నారు. సర్వేల పేరుతో పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యాలను కప్పి పుచ్చే ప్రయత్నం ఒకవైపు జరుగుతోందని కూడా చెప్పువచ్చు. తాజా సర్వే ప్రకారం 18-24 మధ్య వయస్సు వారిలో 76శాతం, 25-44 వయస్సు వారిలో 60శాతం ప్రస్తుత ఆర్ధిక వ్యవస్ధ న్యాయంగా లేదని, ధనికులకే అనుకూలంగా వుందని అభిప్రాయపడుతున్నారని తేలింది.

అమెరికాలో సోషలిజం ఇంతగా ప్రాచుర్యం పొందటానికి కారణం ఏమిటంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే 2008లో తలెత్తిన ప్రపంచ సంక్షోభం అని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు.ఆ సంక్షోభం ఆర్దిక బాధను కలిగించటమే కాదు సామాజిక వ్యవస్ధను కూడా దెబ్బతీసింది.2016లో బ్రూకింగ్స్‌ ఇనిస్టిట్యూట్‌ పేర్కొన్నదాని ప్రకారం 70లక్షల మంది అంటే 12శాతం పురుషులు పని చేయటం లేదని పేర్కొన్నది.1970దశ కంలో స్వేచ్చా వాణిజ్యం ఒక విధానంగా అమెరికాలో, ప్రపంచంలో ముందుకు వచ్చింది.2000 సంవత్సరంలో చైనా ప్రపంచ వాణిజ్య సంస్ధలో ప్రవేశించిన తరువాత అమెరికాలో 34లక్షల వుద్యోగాలు నష్టపోయినట్లు ఎకనమిక్‌ పాలసీ ఇనిస్టిట్యూట్‌ అంచనా వేసింది. తరువాత నాలుగేండ్లకు వుత్తర అమెరికా స్వేచ్చావాణిజ్య ఒప్పందం (నాఫ్టా) వలన మరొక పదిలక్షల వుద్యోగాలు పోయినట్లు పేర్కొన్నది. వీటికి తోడు ఈ కాలంలో మరింత యాంత్రీకరణ జరగటంతో ఒకప్పుడు పాఠశాల విద్య చదువుకున్న వారికి కూడా మంచి వుద్యోగాలు దొరికిన అమెరికాలో నైపుణ్యం లేని, తక్కువ వేతనాలు లభించే వుద్యోగాలన్నింటినీ రోబోట్లు, ఇతర కృత్రిమ మేధ యంత్రాలు భర్తీ చేశాయి. దాంతో మరిన్ని లక్షల వుద్యోగాలు హరీమన్నాయి. మధ్యతరగతి అంతరించేదిశగా పరిణామాలున్నాయి. పర్మనెంటు స్ధానంలో తాత్కాలిక లేదా కాంట్రాక్టు వుద్యోగాలు గణనీయంగా పెరిగాయి. మానవ శ్రమ స్ధానంలో యంత్రాలను ఎంత ఎక్కువగా ప్రవేశపెడితే పెట్టుబడి పోగుపడటంతో పాటు లాభాలు పెరుగుతాయి. మరోవైపున కాంట్రాక్టు లేదా తాత్కాలిక కార్మికుల వేతనాలు పడిపోతాయి. ఇది ఆరోగ్య సంరక్షణ, పెన్షన్లు, కార్మిక భద్రత వంటి కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ పరిణామాలన్నింటినీ పెట్టుబడిదారీ విధాన వైఫల్యంగానూ, అది పనిచేయకపోవటంగానూ నూతన తరం చూస్తున్నది.

Image result for A specter is haunting USA , socialism

అమెరికా అంతా సజావుగా వుందని ఒకవైపు చెబుతూనే అసంతృప్తిని చల్లార్చేందుకు గత రెండు సంవత్సరాల కాలంలో ట్రంప్‌ చేయని యత్నం లేదు. అమెరికా వస్తువులను దిగుమతి చేసుకొనే విధంగా చైనాపై వత్తిడి తెస్తూ వాణిజ్య యుద్ధానికి దిగాడు. విదేశాల నుంచి వలసలు వచ్చేవారితో స్వదేశీ కార్మికులకు వుపాధి సమస్యతో పాటు వేతనాలు పడిపోతున్నాయంటూ వలసను ఆపేందుకు మెక్సికో సరిహద్దులో గోడ కట్టాలని ప్రచారం చేస్తున్నాడు. నాఫ్టా ఒప్పందం బదులు మరొక కొత్త ఒప్పందంతో అమెరికాలో వుపాధి అవకాశాలను పెంచుతానని నమ్మబలుకుతున్నాడు. 2008 నుంచి అంతకు ముందున్న పాలకులు కూడా ఇలాంటి ప్రయత్నాలే చేసినా విఫలమయ్యారు. అమెరికాలో పెట్టుబడిదారీ విధానం పని చేయటానికి ప్రపంచంలో ఎక్కడా లేని అవకాశాలున్నాయి. అయితే ఆ వ్యవస్ధ సరిగా పనిచేయటం లేదని అసంతృప్తి చెందుతున్న యువతరమే కాదు, పెద్ద పెద్ద పెట్టుబడిదారులే చెప్పటం గతంలో ఎన్నడూ వినలేదు. అమెరికాలో బ్రిడ్జివాటర్‌ అనే పెట్టుబడుల కంపెనీ అధిపతి రే డాలియో ‘ పెట్టుబడిదారీ వ్యవస్ధ మెజారిటీ పౌరులకోసం పని చేయటం లేదు. అది ఒక వాస్తవం’ అని గతేడాది నవంబరు నెలలో లాస్‌ ఏంజల్స్‌ నగరంలో జరిగిన సభకు పంపిన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ‘నేడు జనాభాలోని ఒకశాతం ఎగువ వారిలో వున్న సంపద విలువ జనాభాలో 90శాతంగా వున్నవారితో సమంగా వుంది. 1930దశకంలో జరిగిన మాదిరే పరిస్ధితి వుంది. అత్యవసరం అయితే 40శాతం మంది పెద్దల చేతుల్లో నాలుగు వందల డాలర్లు వుండటం లేదు. ఈ పరిస్దితి మీకు ధ్రవణత గురించి ఒక అవగాహన కలిగిస్తుంది, అదే నిజమైన ప్రపంచం, అదొక సమస్య కూడా.’ అన్నారు. అయితే వాస్తవ సమస్య పెట్టుబడిదారీ విధానంతో కాదని సహజసిద్దమైన ముక్తాయింపు ఇచ్చారనుకోండి. జనంలో పెరుగుతున్న అసంతృప్తిని జోకొట్టేందుకు ధనవంతులు చేసే ఎదురుదాడి ఇది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d