• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Politics

అమెరికాలో ఏం జరుగుతోంది : ప్రపంచ కాపిటలిస్ట్‌ రాజధాని న్యూయార్క్‌లో సోషలిస్టు పిడుగు జోహరాన్‌ మమ్‌దానీ ! నరేంద్రమోడీ యుద్ధ నేరస్తుడన్న యువనేత !!

28 Saturday Jun 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Anti communist, Anti Communist Eevangelicals, Asian Arc of Democracy, communist, Democratic party, democratic socialist, Donald trump, Kangana ranaut, Left in the United States, Leftist Zohran Mamdani, Mira Nair, Narendra Modi, NYC Mayoral Candidate


ఎం కోటేశ్వరరావు


మానవాళి చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ, ఎక్కడా విప్లవాలు చెప్పిరాలేదు, వాటికి ముహూర్తాలు, వాస్తు వంటివి కూడా లేవు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా వస్తాయో కూడా తెలియదు.అన్నింటినీ మించి అంతిమంగా అడ్డుకోవటం ఎవరివల్లా కాదు. 2025 జూన్‌ 24వ తేదీ బుధవారం నాడు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ రాజధాని న్యూయార్క్‌ నగరంలో పిడుగుపాటు. విప్లవం అని వర్ణించటం అతిశయోక్తి అవుతుందిగానీ పెట్టుబడిదారులకు దడపుట్టించే పరిణామం జరిగింది. ఈ ఏడాది నవంబరు నాల్గవతేదీన జరిగే నగర మేయర్‌ ఎన్నికలో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా జోహ్రాన్‌ మమ్‌దానీ(33) ఎన్నిక యావత్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని కోరుతూ 11 మంది పోటీపడ్డారు. అయితే 93శాతం ఓట్లు లెక్కించిన సమయానికి న్యూయార్క్‌ రాష్ట్ర ఎంఎల్‌ఏ జొహ్రాన్‌కు 43.5, రెండవ స్థానంలో ఉన్న న్యూయార్క్‌ మాజీ గవర్నర్‌, ఒక కార్పొరేట్‌ సంస్థకు అధిపతి అయిన అండ్రూ కుమోకు 36.4శాతం, మూడో స్థానంలో ఉన్న అభ్యర్థికి 11.3, నాలుగో స్థానంలో ఉన్న వ్యక్తికి 4.1 మిగిలిన అందరికీ కలిపి 4.6శాతం ఓట్లు వచ్చాయి. కుమో తన ఓటమిని అంగీకరించాడు.గత 36 సంవత్సరాలలో ఇంత పెద్ద ఎత్తున డెమోక్రటిక్‌ పార్టీలో ఓటర్లు పాల్గ్గొనటం ఇదే ప్రధమం. ప్రస్తుత మేయర్‌గా డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ఎరిక్‌ ఆడమ్స్‌ ఉన్నాడు. బలాబలాలను బట్టి జోహ్రాన్‌ ఎన్నిక లాంఛన ప్రాయమే అని విశ్లేషకులు అంటున్నారు, అదే జరిగితే తొలి సోషలిస్టు మేయర్‌ అవుతాడు.


మన స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌ నాయకత్వ విధానాలను వ్యతిరేకించే వారు తమ పురోగామి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేశారు. దాని నేతలుగా ఉన్న ఇంఎంఎస్‌ నంబూద్రిపాద్‌, పుచ్చలపల్లి సుందరయ్య వంటి అనేక మంది తరువాత కమ్యూనిస్టులుగా మారారు. అదే మాదిరి అమెరికా డెమోక్రటిక్‌ పార్టీలో పురోగామి విధానాలను ముందుకు తెచ్చేవారు డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేశారు. వారిలో సెనెటర్‌ బెర్నీశాండర్స్‌ బహిరంగంగా తనను సోషలిస్టుగా ప్రకటించుకున్నాడు. అదే బాటలో జోహ్రాన్‌ మమ్‌దానీ వంటి యువకులు పెద్ద సంఖ్యలో సోషలిస్టులుగా మారారు.వీరందరినీ కమ్యూనిస్టులుగా అక్కడి మీడియా, రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ పార్టీలోని మితవాదులు ముద్రవేస్తున్నారు. జోహ్రాన్‌ ఒక కమ్యూనిస్టు పిచ్చోడని డోనాల్డ్‌ ట్రంప్‌ నోరుపారవేసుకున్నాడు.అమెరికా సమాజంలో ఒక మధనం జరుగుతున్నది. లక్షలాది మంది ఇటీవలి కాలంలో సోషలిస్టులం అని సగర్వంగా ప్రకటించుకుంటున్నారు. వారిని కమ్యూనిస్టులని ప్రచారం చేసినా ఎన్నికల్లో గెలిపిస్తున్నారు. ఇది అక్కడి కార్మికవర్గం మార్పును కోరుకుంటున్నదని, వామపక్షం వైపు మొగ్గేందుకు సిద్దంగా ఉన్నట్లు, ఒక సామాజిక సంక్షోభానికి ఒక సూచికగా చెప్పవచ్చు. దీని అర్ధం తెల్లవారేసరికల్లా అధికారానికి రాబోతున్నారని కాదు.

జోహ్రాన్‌ అభ్యర్థిగా ఎన్నికైనట్లు ఫలితాల తీరు వెల్లడిరచగానే జరిగిన పరిణామాలు మనదేశంలో జరిగిందాన్ని గుర్తుకు తెచ్చాయి. కొన్ని పార్టీల వారు గతంలో సిపిఎం నేత జ్యోతిబసును ప్రధాని పదవికి సూచించగానే బాంబేక్లబ్‌గా పిలిచే బడాకార్పొరేట్‌ ప్రతినిధులందరూ సమావేశమై ఎట్టి పరిస్థితిలోనూ కానివ్వరాదని తీర్మానించారు. న్యూయార్క్‌ నగరానికి ఒక వామపక్షవాది మేయర్‌ కాగానే అక్కడి పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోసే అవకాశం లేదు. అయినప్పటికీ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ప్రస్తుత మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ లేదా జోహ్రాన్‌తో పోటీ పడిన కుమోను స్వతంత్ర అభ్యర్ధిగా నిలపాలని, రిపబ్లికన్‌ పార్టీ పోటీ చేయకుండా మద్దతు ఇవ్వాలంటూ విజ్ఞాపనలతో పాటు 20 మిలియన్ల డాలర్లను వసూలు చేయాలని పిలుపు ఇచ్చారు. జోహ్రాన్‌ ముందంజ గురించి తెలియగానే స్టాక్‌మార్కెట్లో కొన్ని కంపెనీల వాటాల ధరలు పడిపోయాయంటే ఎలాంటి కుదుపో చెప్పనవరం లేదు. డెమోక్రటిక్‌ పార్టీ సంస్కరణవాదంలో భాగంగా కొన్ని పురోగామి నినాదాలను ఇవ్వవచ్చు, జాత్యహంకారాన్ని వ్యతిరేకించవచ్చు,రిపబ్లికన్లతో పోలిస్తే మితవాదులు తక్కువగా ఉండవచ్చు తప్ప అదేమీ పాలకవర్గాన్ని సమూలంగా మార్చేది కాదు. గాజా మారణకాండను పూర్తిగా సమర్ధించింది. మమ్దానీ ఇజ్రాయెల్‌ను గట్టిగా వ్యతిరేకించటమే కాదు, ఎన్ని విమర్శలు వచ్చినా పాలస్తీనా మద్దతుదారుగా ఉన్నాడు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు న్యూయార్క్‌ వస్తే అరెస్టు చేయించేందుకు వెనుకాడనని కూడా చెప్పాడు. అందుకనే ప్రత్యర్ధులు అతనికి యూదు వ్యతిరేకి అని ముద్రవేశారు. అయినప్పటికీ న్యూయార్క్‌లోని యూదులు పెద్ద సంఖ్యలో అతని అభ్యర్థిత్వానికి మద్దతుగా ఓటు చేశారని వార్తలు వచ్చాయి. నరేంద్రమోడీ న్యూయార్క్‌ వస్తే భేటీ అవుతారా అని విలేకర్లు ప్రచారం సందర్భంగా అడగ్గా డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులందరూ లేదని ముక్తకంఠంతో చెప్పారు. బెంజమిన్‌ నెతన్యాహు మాదిరి నరేంద్రమోడీ కూడా గుజరాత్‌లో మారణకాండకు బాధ్యుడైన ఒక యుద్ధ నేరగాడని జోహ్రాన్‌ చెప్పాడు.


జోహ్రాన్‌ తండ్రి మహమ్మద్‌ మమ్దానీ అమెరికాలో స్థిరపడిన గుజరాతీ మూలాలు ఉన్న ఉగాండా జాతీయుడు కాగా తల్లి ఒడిషాలో జన్మించిన పంజాబ్‌ హిందూ కుటుంబానికి చెందిన మీరా నాయర్‌(నయ్యర్‌ ) పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ సినిమా దర్శకురాలు, నిర్మాత. ఇజ్రాయెల్‌ హైఫా అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి గౌరవ అతిధిగా వచ్చిన ఆహ్వానాన్ని 2013లో ఆమె తిరస్కరించారు. పాలస్తీనా ఆక్రమణనుంచి వైదొలిగినపుడు, జాత్యంహంకారాన్ని వీడినపుడు మాత్రమే ఇజ్రాయెల్‌ గడ్డమీద అడుగుపెడతానని చెప్పారు. జోహ్రాన్‌ వాగ్దానాల విషయానికి వస్తే తనను ఎన్నుకుంటే న్యూయార్క్‌ నగరంలో అద్దెలను స్థంభింప చేస్తానని, పేదలకు ఇండ్లు నిర్మిస్తానని, లాభనష్టాలు లేని ప్రాతిపదిక నగరపాలక సంస్థ సూపర్‌మార్కెట్లను ఏర్పాటు చేస్తానని, 2030 నాటికి గంటకు 30 డాలర్ల కనీసవేతన అమలు జరిగేట్లు చూస్తానని, అందరికీ అందుబాటులో ఉండే శిశు సంరక్షణా కేంద్రాల ఏర్పాటు వంటి తన వాగ్దానాల అమలుకు అవసరమైన పదిబిలియన్‌ డాలర్ల సొమ్మును ధనికుల మీద అదనంగా పన్నులు వేసి సమీకరిస్తానని చెప్పాడు.వలసవచ్చిన కుటుంబాల వారికి రక్షణ కల్పిస్తానని జోహ్రాన్‌ వాగ్దానం చేశాడు. ఇతగాడిని డెమోక్రటిక్‌ పార్టీలోని కార్పొరేట్‌ అనుకూల శక్తులు ఏదో ఒక సంస్కరణవాది అని సరిపెట్టుకోలేదు, వర్గపోరాటాన్ని ప్రోత్సహించే విప్లవవాదిగా చూశారు. ఆ పార్టీలో చేయి తిరిగిన పెద్దలు, మితవాదులు, కార్మిక, కార్పొరేట్‌ శక్తులు ఏకమై అనేక తప్పుడు ప్రచారాలు చేశారు. ఒక చర్చలో కుమో అతనో కుర్రకుంక అనుభవం ఏముందన్నారు. దాంతో జోహ్రాన్‌ చీల్చి చెండాడు. తాను అవమానకరంగా గవర్నర్‌ పదవికి రాజీనామా చేయలేదని, మిలియన్ల డాలర్లను అక్రమంగా కొట్టేయలేదని, వైద్య సౌకర్యాలకు కోత పెట్టలేదని, పదమూడు మంది మహిళలు లైంగికవేధింపులకు పాల్పడినట్లు తన మీద ఎవరూ ఆరోపణలు చేయలేదని తానలాంటి పనులు చేయకపోవటానికి నేను మీరు కాదు అన్నింటికీ మించి నా పేరు మమ్దానీ అంటూ దులిపేశాడు. ఇతగాడికి మద్దతుగా 30వేల మంది వలంటీర్లుగా పని చేశారు.వలస కార్మికులకు వ్యతిరేకంగా ట్రంప్‌ సర్కార్‌ తీసుకున్న చర్యలకు ఎలాంటి ప్రతిఘటన ఎదురైందో చూశాము. ఆ తరువాత జూన్‌ 14న రాజులు లేరు అంటూ లక్షలాది మంది జనం వీధుల్లోకి వచ్చి ట్రంప్‌ వ్యతిరేక ప్రదర్శనలు చేశారు. ఈ రెండు పరిణామాల వెనుక ప్రధాన చోదకశక్తి కాదు డెమోక్రటిక్‌ పార్టీ కాదు, వివిధ ప్రజాసంఘాలు, సామాజిక ఉద్యమాలు, అదే మేయర్‌ అభ్యర్థి ఎన్నికలో కూడా ప్రతిబింబించింది.


జొహ్రాన్‌ పూర్తి పేరు జోహ్రాన్‌ క్వామే మమ్దానీ. తండ్రి మహమ్మద్‌ మమ్దానీ ఒక గుజరాతీ ముస్లిం కుటుంబంలో 1946లో ముంబైలో జన్మించాడు. తరువాత ఆఫ్రికాలోని ఉగాండాకు ఆ కుటుంబం వలస వెళ్లింది. ఉగాండాలో ఉండగా 1963లో అమెరికాలో విద్య స్కాలర్‌షిప్‌ రావటంతో అక్కడ చదువుకున్నాడు. తిరిగి ఉగండా వెళ్లి అక్కడ బోధనావృత్తిలో చేరాడు. సినిమా దర్శకురాలు మీరా నయర్‌ తన సినిమా ‘‘ మిస్సిసిపీ మసాలా ’’ కోసం ఉగాండాలో పరిశోధనకు వెళ్లినపుడు 1988లో అక్కడ పరిచయమైన మహమ్మద్‌ హిమ్దానీని ఆమె రెండవ వివాహంచేసుకున్నారు. వారికి అక్కడే 1991లో జోహ్రాన్‌ జన్మించాడు.ఘనా తొలి అధ్యక్షుడు క్వామే అంటే అపరిమిత అభిమానంతో తమ కుమారుడి పేరులో క్వామే చేర్చారు. ఆ కుటుంబం తరువాత కొంత కాలం దక్షిణాఫ్రికాలో కూడా ఉంది, తరువాత అమెరికా వచ్చింది.2018లో జోహ్రాన్‌కు అమెరికా పౌరసత్వం వచ్చింది.రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలలో 2020లో తొలిసారిగా న్యూయార్క్‌ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు,2024లో మూడవసారి ఎన్నికై ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నాడు. ఆచరణ సాధ్యంగాని వాగ్దానాలు చేసినట్లుగా జోహ్రాన్‌ ఎన్నికను జీర్జించుకోలేని అదే పార్టీకి చెందిన ప్రస్తుత న్యూయార్క్‌ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ ఉక్రోషం వెలిబుచ్చాడు. చివరికి అనుకున్నదంతా జరిగింది,జోహ్రాన్‌ మమ్దానీ వందశాతం కమ్యూనిస్టు పిచ్చోడు,డెమోక్రటిక్‌ అభ్యర్ధిగా విజయం విజయం సాధించాడు, మేయర్‌ అయ్యేదారిలో ఉన్నాడు అని ట్రంప్‌ తన సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టాడు. మన దగ్గర విప్లవకారులైన వామపక్షవాదులున్నారు,కానీ ఇతను భయంకరంగా ఉన్నాడు, అసహ్యంగా మాట్లాడుతున్నాడని కూడా ట్రంప్‌ రెచ్చిపోయాడు. జోహ్రాన్‌ ఎన్నికను అడ్డుకొనేందుకు కొందరు 1954నాటి కమ్యూనిస్టు వ్యతిరేక చట్టానికి దుమ్ముదులిపి పౌరసత్వాన్ని రద్దు చేసి ఉగాండాకు పంపే అవకాశాలను పరిశీలించాలని వత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు మీడియాలో విశ్లేషణలు మొదలయ్యాయి. ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.


ఈ ఏడాది జరిగే న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నిక అమెరికా చరిత్రలో ఒక ప్రత్యేక పేజీకి నాంది పలికింది. ఇటీవలి కాలంలో ఫాసిస్టు ధోరణులు పెరుగుతున్న పూర్వరంగంలో కార్మికవర్గం వామపక్ష అభ్యర్ధివైపు మొగ్గటం యావత్‌ పురోగామిశక్తులకు ఉత్సాహం ఇచ్చే పరిణామం. అమెరికాలో నిజమైన సోషలిస్టు శక్తుల పెరుగుదలకు తోడ్పడే పరిస్ధితి కనిపిస్తున్నది. డెమోక్రటిక్‌ సోషలిస్టులు ముందుకు తెస్తున్న సంస్కరణలనే మీడియా, శత్రువులు సోషలిజం, కమ్యూనిజం అని చిత్రిస్తున్నారు. వాటికి ఉండే పరిమితులను కార్మికవర్గం అర్ధం చేసుకున్న తరువాత శాస్త్రీయ సోషలిజం కోసం మరింత ముందుకు పోవటం తప్ప మరొక మార్గం లేదు. డెమోక్రటిక్‌ పార్టీ భవిష్యత్‌ను నిర్ణయించేది ఇప్పుడున్న నాయకత్వం కాదని దేశ కార్మికవర్గమేనని డెమోక్రటిక్‌ సోషలిస్టు సెనెటర్‌ బెర్నీశాండర్స్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు.కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ మను సింఘ్వి కూడా ధ్వజమెత్తాడు. జోహ్రాన్‌ నోరు తెరిస్తే పాకిస్తాన్‌ ప్రజాసంబంధాల బృందం ఆ రోజు సెలవు తీసుకోవచ్చు. భారత్‌కు అలాంటి మిత్రులు ఉంటే వేరే శత్రువులు అవసరం లేదన్నారు.భారత్‌ మూలాలున్న జోహ్రాన్‌ భారతీయుడి కంటే పాకిస్తానీగా ఎక్కువ హడావుడి చేస్తున్నాడని బిజెపి ఎంపీ కంగనా రనౌత్‌ వ్యాఖ్యానించారు. అతని హిందూ గుర్తింపు లేదా రక్తం సంగతి పక్కన పెడితే హిందూయిజాన్ని లేపేసేందుకు ఇప్పుడు సిద్దంగా ఉన్నట్లు ఆరోపించారు. అసలు ఉక్రోషం ఏమిటంటే నరేంద్రమోడీని యుద్ధ నేరస్తుడని వర్ణించటమే అనివేరే చెప్పనవసరం లేదు. కొసమెరుపు ఏమంటే ప్రపంచంలోనే పిన్నవయస్కురాలైన మేయర్‌గా తిరువనంతపురంలో ఎన్నికైన సిపిఎం నాయకురాలు 21ఏండ్ల ఆర్య రాజేంద్రన్‌.ఆమెను గతంలో అభినందిస్తూ జోహ్రాన్‌ చేసిన ట్వీట్‌ను ఉటంకిస్తూ ఒక కమ్యూనిస్టును అభిందించిన ఇతగాడు కూడా కమ్యూనిస్టే అంటూ విద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారు.అయితే ఏంటట ! ఆర్య రాజకీయ భావాలకు సిపిఎం కార్యకర్తలైన ఆమె తలిదండ్రులే కారకులైనట్లుగా జోహ్రాన్‌ వామపక్షవాది కావటం వెనుక కూడా తలిదండ్రులు భావజాలమే పని చేసింది.

 
.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా – చైనా ఒప్పందం : ఇరకాటంలో విశ్వగురువు, కల్లలైన భారత పారిశ్రామికవేత్తల కలలు !

25 Sunday May 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Politics, USA

≈ Leave a comment

Tags

BJP, China, Donald trump, India-US trade, India’s manufacturing hopes, Narendra Modi Failures, US-China Tariff deal, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

పరస్పరం లబ్ది పొందే విధంగా భారత్‌ మరియు అమెరికా మధ్య నిర్మాణాత్మకంగా వాణిజ్య చర్చలు జరుగుతున్నట్లు మన వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ నాలుగు రోజుల అమెరికా పర్యటన తరువాత శుక్రవారం నాడు ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. వెంటనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆపిల్‌ కంపెనీ భారత్‌లో గనుక ఉత్పత్తి కొనసాగిస్తే వాటి మీద 25శాతం పన్ను విధిస్తామని ప్రకటించాడు. ఒక రోజు ఆగి శామ్‌సంగ్‌ మీద కూడా అన్నాడు. అయినా సరే ఆ కంపెనీలు మనదేశంలో ఫోన్లు తయారీ చేస్తాయని చెబుతున్నారు. వెయ్యి డాలర్లకు యాపిల్‌ ఫోన్‌ తయారు చేస్తే 25శాతం చొప్పున 250 పన్ను చెల్లింపు, మరో 30డాలర్లు అసెంబ్లింగ్‌ ఖర్చు పోయినా అమెరికాలో తయారు చేసేదాని కంటే ఇంకా 280 డాలర్ల మేర లాభం ఉంటుంది గనుక ట్రంప్‌ను ఖాతరు చేయదని అంటున్నారు.మనం వాడుతున్న ఫోన్లలో ఒక్కో భాగం ఒక్కో దేశంలో తయారై వాటిని ఒక చోట చేర్చి మనం వాడే ఫోన్లుగా తయారు చేస్తారు. ఇది ఎక్కడ చౌక అయితే అక్కడికి ఏ కంపెనీ అయినా తరలిపోతుంది. అంటే ఆయా దేశాలు విడి భాగాలు నాణ్యం, చౌకగా తయారు చేయటాన్ని బట్టి వాటికి మార్కెట్‌ ఉంటుంది. అన్నీ ఒక దగ్గరకు చేర్చే ప్రక్రియసాధనాన్ని సరఫరా గొలుసు అంటున్నారు. పియూష్‌ గోయల్‌ అమెరికా వెళ్లటంతో ఆ పర్యటన మన దేశానికి శక్తినిస్తుందా ముప్పు తెస్తుందా అన్న సందేహాలు తలెత్తాయంటేనే అనుమానబీజం పడినట్లు. ఏం సాధిస్తారో చూద్దాం !

అమెరికా,చైనా నేతలు పన్నుపోరుకు తెరతీసినపుడు మనదేశంలోని పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు గాలివాటు లాభాలే లాభాలు అని సంబరపడ్డారు. చైనా సరఫరా గొలుసు బద్దలవుతుందని, దాని స్థానంలో తాముంటామని అమెరికాతో వాణిజ్యంలో మరింత లబ్ది పొందుతామని కలలు కన్నారు. అయితే ఆ రెండు దేశాలు జెనీవా ఒప్పందం కుదుర్చుకోవటంతో కుదేలయ్యారు.దేశమంతా పహల్గాం దారుణం, తదనంతర పరిణామాలతో నిమగ్నం కావటంతో దీని గురించి మీడియా పెద్దగా పట్టించుకోలేదు. ఆశలు కల్పించటంలో అది కూడా తక్కువ తినలేదు గనుక తేలుకుట్టిన దొంగలా ఉంది. జెనీవా ఒప్పందం జనాల నిత్యజీవితంపై వెంటనే ప్రభావం చూపేది కానందున మన జనాలకూ పట్టలేదు. వాణిజ్యంలో మనదేశం అమెరికాకు ఎక్కువ ఎగుమతి చేస్తూ తక్కువ దిగుమతి చేసుకుంటోంది. రెండు దేశాలూ పరస్పరం పన్నులు లేకుండా ఒప్పందం చేసుకుంటాయనే ప్రచారం జరిగింది. దాని వలన అమెరికాకు ఎక్కువ లాభం తప్ప మనకు కాదు. దిగుమతుల ముప్పు లేకుండా అనేక వస్తువుల మీద పెద్ద మొత్తంలో పన్నులు వేస్తూ మన వాణిజ్య, పారిశ్రామిక సంస్థలకు ఒక రక్షణ గోడ కట్టాం. దాన్ని బద్దలు చేయాలని ట్రంప్‌ కోరుతున్నాడు. నరేంద్రమోడీ అందుకు అంగీకరించినా, నామమాత్రపు పన్నులు వేసినా మన కోళ్ల, పాడి పరిశ్రమలు, వ్యవసాయం వంటివి కుదేలు అవుతాయి. అక్టోబరులో అనుకున్నది జూలై రెండవ వారంలో ఒప్పందం కుదురుతుందనే వార్తలు వచ్చాయి గనుక అప్పటి వరకు వేచి చూద్దాం. రెండు ఆర్థిక అగ్రరాజ్యాలు ఒప్పందం కుదుర్చుకున్న తరువాత వస్త్రాలు,ఔషధ, ఎలక్ట్రానిక్స్‌ రంగాలలో మనదేశానికి ఉన్నట్లు భావిస్తున్న అవకాశాలు కుచించుకుపోయినందున వ్యూహాత్మక పునరాలోచన చేయాల్సి ఉందని పోలిసీ సర్కిల్స్‌ అనే మీడియా ‘‘ అమెరికాచైనా పన్నుల ఒప్పందం భారత ఉత్పత్తిదారుల ఆశలను కల్లలు చేసింది ’’ అనే పేరుతో చేసిన ఒక విశ్లేషణలో పేర్కొన్నారు.దాని సారాంశం ఇలా ఉంది. కొద్ది వారాలకు ముందు భారత ఎగుమతిదారులు ఉత్సాహంతో ఎగిరి గంతులు వేశారు, ఇప్పుడు నీరుగారిపోయారు. అమెరికా వస్తువుల మీద పది, చైనా వస్తువుల మీద 30శాతం పన్నుల విధింపుకు రెండు దేశాలు అంగీకరించాయి. దీంతో మన ఎగుమతిదార్ల లెక్కలు తారుమారయ్యాయి. అయితే మన వస్తువుల మీద విధిస్తున్న పదిశాతంతో పోలిస్తే చైనా సరకుల మీద 30శాతం ఉన్నందున మన ఎగుమతి అవకాశాలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయని కూడా కొందరు భావిస్తున్నారు. మన దేశం నుంచి ఎగుమతి చేస్తే 20శాతం పన్నులు తక్కువగా ఉంటాయి గనుక వైద్య పరికరాలను తయారు చేసే పరిశ్రమలు భారత్‌కు రావచ్చని భావిస్తున్నారు. అయితే ఇది అమెరికాతో మనదేశం జరుపుతున్న చర్చల ఫలితాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఐఫోన్లను భారత్‌లో తయారు చేసి అమెరికాకు ఎగుమతి చేస్తే 25శాతం పన్ను విధిస్తామని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.


చైనా ప్లస్‌ ఒకటి అనే విధానం కింద అనుసరించిన తీరు కూడా మిశ్రమ ఫలితాలే ఇచ్చాయి.వియత్నాం,థాయ్‌లాండ్‌, కంపూచియా వంటి దేశాలు ఎక్కువగా సంస్థలను ఆకర్షించటానికి కారణం అక్కడ మనకంటే ఖర్చులు తక్కువగా ఉండటం, సులభమైన విధానాలతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలే కారణం. ఆపిల్‌ ఫోన్ల తయారీలో తప్ప ఇతర రంగాలలో మనం పెద్దగా రాణించలేదు. జెనీవా ఒప్పందం తాత్కాలిక స్వభావం భవిష్యత్‌ అనిశ్చితిని ముందుకు తెచ్చింది.ఆఫ్రికా మార్కెట్‌లోకి ఇటీవల మన ఎగుమతిదార్లు చొచ్చుకుపోయారు, అయితే ఈ ఒప్పందం చైనాకు అనుకూలతను పునరుద్దరించింది. ఒప్పందంలో లేని అంశాలు భారత్‌కు అనుకూలమే అయినా అమెరికాతో కుదిరే వాణిజ్య ఒప్పందం మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచ ఉత్పత్తిదారుగా మారాలన్న లక్ష్యం అంత తేలిక కాదు. ఏప్రిల్‌ 25న ఇదే పొలిసీ సర్కిల్స్‌ చేసిన విశ్లేషణలో ఎంతో ఆశాభావం, అపరిమిత లాభాల గురించి చర్చించారు. చైనాపై ట్రంప్‌ ప్రకటించిన 145, 245శాతాల పన్నులు అమలు జరుగుతాయని అనేక మంది భావించారు.కౌంటర్‌ పాయింట్‌ రిసర్చ్‌ వేసిన అంచనా ప్రకారం 2026 నాటికి ప్రపంచ స్మార్ట్‌ ఫోన్ల తయారీలో చైనా వాటా 64 నుంచి 55కు, భారత్‌ 18 నుంచి 25లేదా 28శాతానికి పెంచుకుంటుందని పేర్కొన్నారు.ఆపిల్‌ కంపెనీ భారత్‌లో తన ఉత్పత్తి వాటాను 202627 నాటికి 20 నుంచి 35శాతానికి పెంచుకోనుందని కూడా పేర్కొన్నారు.(దీనికి పిఎల్‌ఐ స్కీము కింద ఇచ్చే రాయితీలు ప్రధాన కారణం, ఆ సొమ్ము అయిపోయిన తరువాత సంగతేమిటి ?) కానాలిస్‌ సమాచారం ప్రకారం 2024లో 79శాతం డెల్‌ లాప్‌టాప్‌లు చైనాలో ఉత్పత్తి కాగా వచ్చే ఏడాది నాటికి సగం ఉత్పత్తిని వియత్నాం నుంచి చేయాలని ఆ కంపెనీ, అదే విధంగా చైనాలో 85శాతం ఉన్న ఉత్పత్తిని హెచ్‌పి కంపెనీ తైవాన్‌, మెక్సికోలకు గణనీయంగా తరలించాలని చూస్తోంది.

చైనా ప్లస్‌ ఒకటి అనే విధానంలో వియత్నాం,థాయ్‌లాండ్‌, కంపూచియా, మలేసియాలతో పోలిస్తే మన దేశం పరిమితమైన విజయాన్ని సాధించిందని నీతి అయోగ్‌ పేర్కొన్నది. ఇనుము, ఉక్కు రంగంలో 2025 ఆర్థిక సంవత్సరం తొలి మూడు మాసాల్లో మన ఎగుమతులు 33శాతం తగ్గాయి, దీనికి చైనా సరఫరా ఎక్కువగా ఉండటంతో పాటు దిగుమతులు చేసుకొనే దేశాల్లో గిరాకీ కూడా తగ్గింది. చైనా వస్తువులపై 60శాతం పన్నులు ఉంటే భారత్‌ పోటీ పడే వీలు కలుగుతుందని కూడా నీతి అయోగ్‌ పేర్కొన్నది. కానీ ఇప్పుడు 30శాతం ఉన్నాయి, రానున్న రోజుల్లో తమ మీద భారం ఎక్కువ అనుకుంటే ట్రంప్‌ తగ్గించినా ఆశ్చర్యం లేదు. మన పరిస్థితి ఏమిటన్నది సమస్య.చైనా ఇప్పుడు మరింత లాభదాయకమైన వస్తు ఉత్పత్తి మీద కేంద్రీకరించింది. శ్రమశక్తి ఎక్కువగా ఉండే వాటిని క్రమంగా తగ్గిస్తున్నది. అయినా అలాంటి వాటిని అందిపుచ్చుకోవటంలో మనం వెనుకబడి ఉన్నాం. అప్పనంగా రావాలంటే ఏదీ మన దగ్గరకు రాదు. విషాదం ఏమిటంటే జిడిపిలో నాలుగో స్థానం, త్వరలో అమెరికా, చైనాలను అధిగమిస్తాం అన్న పోసుకోలు కబుర్లు చెబుతున్నారు. పదకొండు సంవత్సరాల మోడీ పాలన తరువాత అదీ నైపుణ్య వృద్ధి పేరుతో వేల కోట్లు ఖర్చు చేసిన తరువాత ప్రపంచంలో నైపుణ్య కార్మిక శక్తిలో 25వ స్థానంలో ఉన్నాం. అంటే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేని దుస్థితి. ఆపిల్‌ ఫోన్ల ఎగుమతి గురించి కేంద్ర పాలకులు పెద్దగా ప్రచారం చేస్తున్నారు. అమెరికాచైనా ఒప్పందం మన ఆశల మీద నీళ్లు చల్లిందని బిబిసి వ్యాఖ్య పేర్కొన్నది. ఇప్పుడు చైనా వస్తువుల మీద 30శాతం, మన వస్తువుల మీద 27 శాతం అమెరికా పన్ను విధిస్తున్నది. దీంతో చైనా నుంచి మన దేశానికి వస్తాయని చెప్పిన పరిశ్రమలు, కంపెనీలు, పెట్టుబడులు ఇప్పుడు వస్తాయా ? గత పదకొండు సంవత్సరాల నుంచి చెబుతున్న కబుర్లు ఆచరణలో కనిపించటం లేదు. చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలున్నాయని చెప్పేవారు కొనసాగిస్తూనే ఉన్నారు. వాటిని పాలకులు మన జనాలకు రంగుల కలగా చూపుతున్నారు. మోడీ విధానాలు దీర్ఘకాలంలో ఫలితాలు ఇస్తాయంటున్నారు. పదకొండు సంవత్సరాలలో మన పారిశ్రామిక ఉత్పత్తి జిడిపిలో 15శాతం చుట్టూ తిరుగుతున్నది తప్ప పెరగటం లేదు, పిఎల్‌ఐ పధకం పరిమితంగానే ప్రయోజనం కలిగించింది. నిజానికి యుపిఏ హయాంలో ఎక్కువగా ఉంది. కుండలో కూడు కదలకూడదు పిల్లోడు మాత్రం దుడ్డులా మారాలి అన్నట్లుగా మన వ్యవహారం ఉంది. ఇది నేను అంటున్నది కాదు. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా చెప్పిందే. పరిశోధన మరియు అభివృద్ధి రంగానికి జిడిపిలో మనదేశం 0.64శాతం ఖర్చు చేస్తుంటే చైనా 2.68, అమెరికా 3.5 శాతం చివరికి చైనాలోని ఒక్క హువెయి సంస్థ చేస్తున్న మొత్తం భారత్‌లో ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఖర్చు కంటే ఎక్కువ అన్నారు. పరిస్థితి ఇలా ఉంటే సాంకేతికంగా మనం వెనుకబడక ఎక్కడ ఉంటాం అని ప్రశ్నించారు.


రాజకీయంగా నరేంద్రమోడీ తన ప్రధాని పదవీ కాలంలో ఇంతటి విపత్కర పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదంటే అతిశయోక్తి కాదు. ఇంటా బయటా ఉన్న వంది మాగధుల కారణంగా విశ్వగురువుగా వర్ణితమైనందున ఇప్పుడు అదే ఇరకాటాన్ని తెచ్చింది. ఉదాహరణకు భారత్‌`పాకిస్తాన్‌ మధ్య తానే మధ్యవర్తిగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చానని ట్రంప్‌ ప్రకటించటాన్ని అంగీకరిస్తే గురు పీఠాన్ని స్వయంగా తక్కువ చేసుకున్నట్లు అవుతుంది. దాంతో పాకిస్తాన్‌ వైపు నుంచి వచ్చిన ప్రతిపాదనను అంగీకరించామని ప్రధమగణాలతో చెప్పించారు. అయినా ట్రంప్‌ పదే పదే అదే చెప్పాడు. చివరకు విధిలేక పాకిస్తాన్‌తో తలెత్తిన మిలిటరీ పరిస్థితి గురించి అమెరికా నేతలతో ఒప్పందానికి ముందు మాట్లాడినట్లు మన విదేశాంగశాఖ మెల్లగా అంగీకరించింది. పాక్‌పై మనదేపైచేయిగా ఉన్నపుడు ఏం సాధించి అంగీకరించారన్న ప్రశ్న మోడీని మరింత ఇరకాటంలో పెట్టింది. దుర్మార్గానికి పాల్పడిన వాడు ప్రాణభీతితో రాజీ అనగానే అంగీకరించాలా ? పాకిస్తాన్‌ ఉగ్రవాదులను అప్పగించలేదు, పట్టిస్తామని చెప్పలేదు, అసలు మద్దతు ఇచ్చినట్లు అంగకరించలేదు. ఈ విషయాలన్నీ అడుగుతారని పార్లమెంటు సమావేశం జరపటానికే నిరాకరించారు అపర ప్రజాస్వామికవాది. ప్రజాస్వామ్య దేవాలయం అని స్వయంగా వర్ణించి మొక్కిన పార్లమెంటులో మాట్లాడేందుకు భయపడుతున్నారని జనం అనుకుంటున్నారు. ఎంతటి విపత్కర స్థితి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎర్రపూల వనం : వ్లదిమిర్‌ పుతిన్‌, అల్పజనపాలన – రష్యన్‌ కమ్యూనిస్టుల ముందున్న సవాళ్లు !

05 Monday May 2025

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Anti communist, Donald trump, Russia Communists, stalin, Vietnam, Vladimir Putin, Xi Jinping

ఎం కోటేశ్వరరావు


ప్రకృతి ఉన్నంత వరకు ఎర్ర పూలు పూస్తూనే ఉంటాయి. దోపిడీ కొనసాగినంత కాలం కమ్యూనిస్టులు ఉద్భవిస్తూనే ఉంటారు.వైపరీత్యాలు సంభవించినపుడు ఎర్రపూల చెట్లు దెబ్బతిన్నట్లే కమ్యూనిస్టులూ అంతే. ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది.మారిన పరిస్థితులను బట్టి కమ్యూనిస్టులూ మారాలి అంటే దానర్దం మౌలిక లక్షణాన్ని వదులుకోవాలని కాదు, ఎత్తుగడలు, వ్యూహాలను మార్చుకోవాలి.అనేక దేశాల్లో కమ్యూనిస్టులు స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి సమస్యలను ఎదుర్కొంటున్నమాట నిజం. ఉద్యమాలు నల్లేరు మీద బండిలా సాగటం లేదు. ఉదాహరణకు రష్యన్‌ కమ్యూనిస్టులను చూద్దాం.ఒక వైపు ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం పేరుతో సామ్రాజ్యవాదులు ముందుకు తెచ్చిన ముప్పు, మరోవైపు దానికి వ్యతిరేకంగా గట్టిగా నిలిచిన బూర్జువావర్గ ప్రతినిధి పుతిన్‌.అతగాడి నాయకత్వంలో కార్మికవర్గాన్ని దోపిడీ చేస్తున్న అల్పజనపాలన. యుద్ధంతో ముందుకు వచ్చిన ఆర్థిక సమస్యలు, జాతీయవాదం. కమ్యూనిస్టులకు ఇది కత్తిమీద సాము.

ఓల్గాగ్రాడ్‌ విమానాశ్రయానికి స్టాలిన్‌ పేరు !
కమ్యూనిస్టులకు గాక ఏ ఎండకా ఆ గొడుగు పట్టే వారికి ఎందుకు వస్తాయి కష్టాలు. హిట్లర్‌ మూకలకు గోరీ కట్టిన ఓలాగ్రాడ్‌కు నాడు సోవియట్‌ను నడిపించిన ఉక్కుమనిషి స్టాలిన్‌ స్మారకంగా స్టాలిన్‌ గ్రాడ్‌ అని పేరు పెట్టారు. సోవియట్‌ను కూల్చివేసిన తరువాత తిరిగి పూర్వనామాన్ని తెచ్చారు.ఫాసిజం, నాజీలపై విజయం సాధించి 2025 మే 9న 80వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆ నగరానికి తిరిగి స్టాలిన్‌ పేరు పెట్టాలని రష్యన్‌ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ జెమిలియానిచెంకో, అగ్రనేత గెనడీ జుగనోవ్‌ అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్ను కోరారు. ఉక్రెయిన్‌ మీద యుద్ధం చేస్తున్న సైనికులకు మానవతాపూర్వక సాయంగా డ్రోన్లు, మోటారు సైకిళ్లను పంపిన సందర్భంగా జుగునోవ్‌ స్టాలిన్‌ గ్రాడ్‌లో ఉన్నాడు. తానెప్పుడూ ఆ నగరాన్ని అలాగే పిలుస్తానని, యావత్‌ దేశం అలాగే అంటున్నదని అన్నాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వారి గౌరవార్ధం గతవారం పుతిన్‌ పర్యటన సందర్భంగా ఓల్గాగ్రాడ్‌ విమానాశ్రయానికి స్టాలిన్‌ గ్రాడ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరును ప్రకటించాడు. అందువలన నగరం మొత్తానికి ఆ పేరు పెట్టాలని జుగనోవ్‌ అన్నాడు. గతంలో కొన్ని సంస్థలు స్టాలిన్‌ గ్రాడ్‌ అని తిరిగి పెట్టాలా లేదా అన్న సర్వే చేస్తే ఓల్గాగ్రాడ్‌ పౌరులు వ్యతిరేకించినట్లు తేలిందని చెప్పారు, నిజంగా అప్పుడు జనం అలా ఉన్నారా లేక పాలకులకు అనుగుణంగా సర్వేను చేశారా అన్నది చెప్పటం కష్టం. ఇప్పుడు పుతినే స్వయంగా విమానాశ్రయపేరు మార్చాడంటే జనాల్లో వ్యతిరేకత లేదన్నది స్పష్టం ఎందుకు అంటే ఫాసిస్టు వ్యతిరేక పోరాటానికి మారు పేరు స్టాలిన్‌, ఆ పేరును ఉచ్చరించకుండా దాని గురించి చెప్పలేరు.

అంతర్జాతీయ ఫాసిస్టు వ్యతిరేక వేదిక రెండవ సమావేశం గత నెలాఖరులో మాస్కోలో జరిగింది. ప్రపంచమంతటా ఫాసిజం తిరిగి తలెత్తుతున్న పూర్వరంగంలో దాన్ని ఎలా ఎదుర్కోవాలా అని 91దేశాల నుంచి హాజరైన 164 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాస్కో కమ్యూనిస్టు నాయకురాలు తాతిన్యా దెశియాతోవా మాట్లాడుతూ పాలకులు తమ సంపదలను పెంచుకోవటం తప్ప చేసిందేమీ లేదు. కాబట్టి ఇప్పుడు మేము గత కీర్తి కట్టడాలన్నింటినీ శుభ్రం చేస్తున్నాం, పాత సోవియట్‌ చిహ్నాలను పెడుతున్నాం, పాత పాటలను పాడుతున్నాం, గత విజయాల గురించి చెబుతున్నాం అని చెప్పింది. మూడవ తరానికి చెందిన కమ్యూనిస్టు అయిన ఆమె అమెరికా పత్రిక పీపుల్స్‌ వరల్డ్‌తో మాట్లాడినపుడు ఈ వ్యాఖ్యలు చేసింది. నిజానికి ఫాసిస్టు వ్యతిరేక వారసత్వం రష్యన్‌ పౌరులది తప్ప పుతిన్‌ లేదా అతగాడు ప్రాతినిధ్యం వహిస్తున్న పెట్టుబడిదారీ విధాన పాలకులది కాదు. బోరిస్‌ ఎల్సిన్‌ వినాశకర మరియు ప్రజల సంపద లూటీ పాలనతో పోలిస్తే పుతిన్‌ పాలనలో ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగైంది, అది ఎంతో కాలం నిలిచేట్లు కనిపించటం లేదని ఆమె చెప్పింది. యుద్ధం, సంబంధిత అంశాల్లో సోవియట్‌ పాత్ర, దాని గురించి జనంలో ఉన్న జ్ఞాపకాల గురించి పుతిన్‌ గ్రహించాడు గనుకనే గత కొద్ది సంవత్సరాలుగా వాటిలో కొన్నింటిని ఎంచుకొంటున్నాడు. విమానాశ్రయానికి స్టాలిన్‌ పేరు పెట్టటం దానిలో భాగమే. రెండవ ప్రపంచ యుద్ధ విజయం 80వ వార్షికోత్సం సందర్భంగా నాటి బ్యానర్లు, చిహ్నాలతో మాస్కోను అలంకరించారు.

సోవియట్‌ను కూల్చివేసి మూడున్నర దశాబ్దాలు కావస్తున్నది, ఆ సమయంలో తెలిసీ తెలియని వయస్సులో ఉన్నవారికీ, తరువాత పుట్టిన వారికి గతం గురించి తెలియదు. వర్తమానంలో బతుకు ఎలా సాగించాలా అన్నది తప్ప ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించే తీరిక కూడా ఉండటం లేదు. పరిస్థితి ఉన్నది ఉన్నట్లుగా ఉంటే చాలన్నట్లుగా కొందరి ఆలోచన ఉంది. అయితే 2022లో ప్రారంభమైన ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్య తరువాత పరిస్థితిలో మార్పు ప్రారంభమైంది. సామ్రాజ్యవాదుల కుటిల యత్నాలు,వారికి మద్దతు ఇస్తున్న పాలకులు రష్యా సరిహద్దులోని తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతాలలో రష్యన్‌ జాతి పౌరులను అణచివేస్తున్న తీరుతెన్నులను గ్రహించిన కమ్యూనిస్టు పార్టీ యుద్ధ ప్రయత్నాలకు మద్దతు ఇచ్చింది. మూడు సంవత్సరాలు గడిచింది, వేలాది మంది మరణించారు, ఆర్ధికంగా దేశం సమస్యలను ఎదుర్కొంటున్నది, మిలిటరీ చర్య ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఇలాంటి తరుణంలో ఏ వైఖరి తీసుకోవాలన్నది కమ్యూనిస్టులకు పెద్ద సమస్య. ఉక్రెయిన్‌ పోరులో రెండు లక్షణాలు ఉన్నాయి, ఒకటి సామ్రాజ్యవాద పోరు, రెండవది జాతీయ అంశం. నాటో కూటమి నాయకత్వంలోని సామ్రాజ్యవాదులు, రష్యాలోని పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహించే శక్తుల మధ్య ఈ యుద్ధం నడుస్తున్నది.అయితే ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలోని రష్యన్‌ జాతి పౌరులు అక్కడి నాజీల చేతిలో అణచివేతను ఎదుర్కొంటున్నారు. వారికి కమ్యూనిస్టులు, ఇతర వామపక్ష శక్తులు నాయకత్వం వహిస్తున్నాయి. రష్యన్‌ మిలిటరీ ఆప్రాంతంలోకి వెళ్లిన తరువాత పోరాడుతున్న ఆ శక్తులు ఎన్నికలలో పాల్గొనేందుకు పుతిన్‌ అనుమతించటం లేదనే వార్తలు వచ్చాయి.ఈ సమస్య ఉన్నప్పటికీ ఉక్రెయిన్ను నాజీకరణ కావించకుండా చూడటం, నాటో విస్తరణను అడ్డుకోవటం, అణచివేతకు గురవుతున్నవారిని రక్షించటం మౌలిక అంశాలుగా ఉన్నట్లు అనేక మంది భావిస్తున్నారు. అయితే కమ్యూనిస్టులకు పుతిన్‌ మీద, పాలకవర్గం మీద ఎలాంటి భ్రమలు లేవు. పాలకవర్గంలో ఉన్న విబేధాలు, వైరుధ్యాల కారణంగా గతంలో ప్రైవేటీకరించిన 10.8బిలియన్‌ డాలర్ల విలువగల కంపెనీలను గత మూడు సంవత్సరాలలో పుతిన్‌ సర్కార్‌ జాతీయం చేసింది. అయితే వాటిని ప్రజల ఆస్తిగానే ఉంచుతారా లేక తిరిగి తమకు అనుకూలమైన వారికి కట్టబెడతారా అన్న సందేహాలు ఉన్నాయి. ప్రైవేటీకరణను తీవ్రంగావిస్తామని పాలకపార్టీ నేతలు మార్చి నెలలో ప్రకటించారు. దాన్ని అడ్డుకొనేందుకు కమ్యూనిస్టులు సిద్దం అవుతున్నారు.


ప్రపంచ విప్లవ ధృతార వియత్నాం !
అమెరికా సామ్రాజ్యవాదులపై దక్షిణ వియత్నాంలో విజయం సాధించి రెండు ప్రాంతాల ఏకీకరణకు 50వసంతాలు నిండాయి, 1975 ఏప్రిల్‌ 30వ తేదీని విజయదినంగా పరిగణిస్తున్నారు. ఈ పరిణామం యావత్‌ లాటిన్‌ అమెరికా దేశాలకు, యావత్‌ ప్రపంచానికి ఇప్పటికీ ఒక ధృవతారగానే ఉందని అర్జెంటీనా కమ్యూనిస్టు పార్టీ ఈ సందర్భంగా పేర్కొన్నది. అమెరికా సామ్రాజ్యవాదంపై విజయం సాధించిన తరువాత గత ఐదు దశాబ్దాలలో వియత్నాం ఎంతో పురోగతి సాధించిందని ఉరుగ్వే కమ్యూనిస్టు పార్టీ శ్లాఘించింది. గతంలో సోషలిస్టు దేశాలైనప్పటికీ పరస్పర అనుమానాలు, ఇతర కారణాలతో చైనా, వియత్నాం మధ్య సాయుధ దాడులు జరిగాయి. అయితే తరువాత రెండు దేశాల కమ్యూనిస్టు పార్టీలు తమ వైఖరులను సవరించుకొని తిరిగి దగ్గరయ్యాయి, కొన్ని దీవుల గురించి ఇప్పటికీ కొన్ని సమస్యలున్నా .తాజాగా రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడిరది. షీ జింపింగ్‌ వియత్నాం సందర్శించారు. ఒక ఏడాది కాలంలోనే గణనీయ ఫలితాలు వచ్చాయని ఏప్రిల్‌ 28న చైనా రాయబారి ప్రకటించారు. తొలిసారిగా విదేశాంగ, జాతీయ రక్షణ, ప్రజాభద్రత మంత్రుల స్థాయిలో ఇరుదేశాలు 3 ప్లస్‌ 3 పేరుతో సంప్రదింపులకు ప్రపంచంలో తొలిసారిగా నిర్ణయించిన దేశాలుగా చైనా, వియత్నాం దౌత్య చరిత్రకు ఎక్కాయి. యువకుల్లో విప్లవ చరిత్ర గురించి అవగాహన కలిగించేందుకు రెడ్‌ కల్చర్‌, రెడ్‌ జర్నీలను ప్రోత్సహించాలని నిర్ణయించారు.రెండు దేశాల వాణిజ్య లావాదేవీలు గతేడాది 260 బిలియన్‌ డాలర్లు దాటాయి.

సోషలిస్టు వ్యవస్థల కూల్చివేతలో పోప్‌ ప్రమేయం !
పోప్‌ ఫ్రాన్సిస్‌ అస్తమయం తరువాత కొత్త పోప్‌ ఎంపిక గురించి విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ సందర్భంగా గతంలో పనిచేసిన పోప్‌లు, అమెరికా అధ్యక్ష భవనంతో వారి సంబంధాలు, రాజకీయాలు, కుట్రలు ముఖ్యంగా కమ్యూనిజం, సోషలిస్టు సమాజాలకు వ్యతిరేకంగా జరిపిన కుట్రల గురించి కూడా ప్రస్తావనలు వెలువడ్డాయి.1989లో బెర్లిన్‌ గోడ కూల్చివేత,1991లో సోవియట్‌ కూల్చివేతకు ముందు ప్రచ్చన్న యుద్ధ సమయంలో రెండవ పోప్‌ జాన్‌ పాల్‌, అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌ సమావేశం వైట్‌ హౌస్‌లో 1982లో జరిగింది. వారిద్దరి మీద హత్యా ప్రయత్నాలు జరిగిన ఏడాది తరువాత వారి ఏకాంత భేటీ జరిగింది.అక్కడే సోషలిస్టు సమాజాల కూల్చివేతకు కుట్రకు తెరలేపినట్లు గతంలోనే విమర్శలు వచ్చాయి.ఇద్దరూ కమ్యూనిస్టు వ్యతిరేకులే. రెండవ పోప్‌ జాన్‌ పాల్‌ జన్మస్థలమైన పోలాండ్‌లో లెచ్‌వాలేసాను ముందుకు తెచ్చి సాలిడారీ ఉద్యమం పేరుతో కుట్రకు తెరతీశారు.తమ పని గడచిన తరువాత లెచ్‌వాలేసాను చరిత్ర చెత్తబుట్టలోకి నెట్టారు. మనదేశంలో కమ్యూనిస్టులమని చెప్పుకున్న కొందరు ఆ సోషలిస్టు వ్యతిరేక సాలిడారిటీ పేరుతో ఊరేగారు. లెచ్‌వాలేసా సాలిడారిటీతో తమకు ఎలాంటి సంబంధం లేదని పోప్‌, రీగన్‌ ఇద్దరూ అప్పుడు ఠలాయించారు. అయితే వారి ప్రమేయం గురించి 2004లో ఏపి వార్తా సంస్థ వెల్లడిరచింది.1989లో పోలాండ్‌ ఎన్నికల్లో సాలిడారిటీ గెలిచింది, తూర్పు ఐరోపాలో సోషలిస్టు వ్యవస్థల కూల్చివేతకు నాంది పలికింది. సోవియట్‌ కమ్యూనిజాన్ని పతనం గావించేందుకు పోప్‌, రీగన్‌ కలసి పని చేశారని రిపబ్లికన్‌ పార్టీ మాజీ గవర్నర్‌ అయిన స్కాట్‌ వాకర్‌ 2020లో వాషింగ్టన్‌ పోస్టు పత్రికలో రాసినదానిలో పేర్కొన్నాడు. చరిత్రలో ఒక అమెరికా అధ్యక్షుడిగా ఉడ్రో విల్సన్‌ మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి, తొలి సోషలిస్టు రాజ్యం ఏర్పడిన తరువాత 1919లో పదిహేనవ పోప్‌ బెనెడిక్ట్‌ను కలసి వాటికన్‌తో సంబంధాలను ఏర్పరచుకున్నాడు.1959లో అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌ హోవర్‌ ఇరవై మూడవ పోప్‌ జాన్‌తో భేటీ జరిగినప్పటి నుంచి పోప్‌లు, అమెరికా అధ్యక్షుల కలయికలు క్రమంగా జరుగుతున్నాయి.ఇప్పటి వరకు 32 సమావేశాలు జరిగినట్లు ఫాక్స్‌ న్యూస్‌ పేర్కొన్నది.1979వరకు అధ్యక్షులే వాటికన్‌ వెళ్లేవారు, ఆ తరువాత నుంచి పోప్‌లు అధ్యక్ష భవనానికి వస్తున్నారు.


శ్రీలంక మేడేకు భారత, చైనా కమ్యూనిస్టులు ! తైవాన్‌లో చైనా వ్యతిరేక ప్రదర్శనలు !
శ్రీలంక రాజధాని కొలంబోలో అధికార నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌(ఎన్‌పిపి), దానికి ప్రధాన చోదకశక్తిగా ఉన్న జనతా విముక్తి పెరుమన పార్టీ నిర్వహించిన మేడే ప్రదర్శనలకు భారత్‌, చైనా కమ్యూనిస్టు పార్టీల నేతలు హాజరయ్యారు. దేశ అధ్యక్షుడు అనుర కుమార దిశన్నాయకే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌లో కమ్యూనిస్టు వ్యతిరేకతను మరోసారి రెచ్చగొడుతున్నారు.దానిలో భాగంగా గత నెలలో ఒక యూట్యూబర్‌ పేరుతో కమ్యూనిజాన్ని అడ్డుకోవటం, తైవాన్‌ రక్షణ నినాదాలతో కెటాగలాన్‌ ప్రాంతంలో 50వేల మందితో ప్రదర్శన చేశారు. మాతృదేశంలో విలీనం కావాలని కోరుతున్న ప్రజా ప్రతినిధులను వెనక్కు పిలవాలంటూ దరఖాస్తుల దాఖలుకు పూనుకున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కులగణనపై నీ వ్యాఖ్యయే నీరజాక్షా : బీహార్‌ ఓట్ల కోసం అర్బన్‌ నక్సల్‌గా మారిన ప్రధాని నరేంద్రమోడీ !

03 Saturday May 2025

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Politics, RELIGION, Uncategorized

≈ 1 Comment

Tags

Bihar elections, BJP, Caste census, Have Modi, Modi govt’s U-turn on caste census, Narendra Modi Failures, Nitish Kumar, RSS, Urban naxals


ఎం కోటేశ్వరరావు


ఒక సినిమాలో రాజకీయ నేతలు కుడి జేబులో ఒకటి, ఎడమదానిలో మరో ప్రకటన పెట్టుకు తిరగటం గురించి పరుచూరి బ్రదర్స్‌ చెప్పారు. ఇప్పుడు విశ్వగురువు నరేంద్రమోడీ ఆ కోవలో చేరిపోయారు. చరిత్రలో ఎప్పుడో జరిగినదానికి వక్రీకరణలు తెలిసిందే, మన కళ్ల ముందు జరిగిన వాటిని కూడా బిజెపి నేతలు ఎలా మార్చి వేస్తున్నారో కులగణనకు కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయంపై సమర్ధన స్పందన వెల్లడిస్తున్నది.జనం మరీ అంత బుర్రలేని వారిగా కనిపిస్తున్నారా ! కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వార్తగా ఇచ్చిన తరువాత ఈ అంశంపై ఆకస్మికంగా మాట మార్చింది అంటూ కొన్ని మీడియా సంస్థలు విశ్లేషణలు వెలువరిస్తున్నాయి. వార్తను సంతోష పడే బిజెపి మద్దతుదారులు ఇప్పుడు ఇవెందుకు అని చిరాకు పడుతున్నారు. ఇప్పటికీ కొందరు స్వతంత్రంగా ఆలోచించే జర్నలిస్టులు ఉన్నందుకు మండిపడుతున్నారు,విమర్శనాత్మకంగా చూడకుండా పాకేజ్‌లతో మొత్తం గోడీ మీడియాగా ఎందుకు మారలేదని చిందులు వేస్తున్నారు. అవును మరి హిట్లర్‌ బాటలో నడుస్తున్న కాషాయ దళాల ప్రజాస్వామ్యంలో నందంటే నంది కాదు పందంటే పంది అనాలి కదా ! లేకపోతే వీపులు పగులుతాయి మరి !!


కులగణన చేయాలని కోరే వారు ప్రత్యేకించి కాంగ్రెస్‌ పేదల అనుభూతులతో ఆటలాడుకుంటున్నదని, కులం పేరుతో విడదీస్తున్నదని ప్రధాని నరేంద్రమోడీ ధ్వజమెత్తారు.(2023 అక్టోబరు 2, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా) గతంలో వారు దేశాన్ని చీల్చారని ఇప్పుడు కూడా అదే చేస్తున్నారన్నారు. మధ్య ప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు బీహార్‌ కుల సర్వే వివరాల విడుదల సందర్భంగా మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు బీహార్‌ ఎన్నికల్లో ఓట్లు అవసరం గనుక కులగణనకు అంగీకరిస్తూ కాబినెట్‌లో తీర్మానించారు. ఆకలేస్తే తినేందుకు ఏదీ దొరకనపుడు మొరటు పనిని తెలుగులో మర్యాద పూర్వకంగా దుప్పి భోజనం అనటాన్ని బిజెపి ఓట్ల ఆకలి గుర్తుకు తెచ్చింది.బీహార్‌ సర్వే ఫలితాలు అవాస్తవమని, పేదల కంటినీరు తుడిచే ఎత్తుగడ అని బిజెపి వర్ణించింది. అంతేనా ప్రతిపక్ష పార్టీలు కుల గణన చేయాలని కోరటం అర్బన్‌ నక్సల్స్‌ ఆలోచనలకు ఒక సూచిక అని 2024లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే అర్బన్‌ నక్సల్‌గా అధికారికంగానే మారినట్లు కాదా ? ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఒక్కటిగా ఉంటేనే ఐక్యంగా ఉంటాం అని చెప్పారు, అంటే ఇప్పుడు కులాల వారీ విడతీసేందుకు పూనుకున్నారా ? విశ్వగురువు గనుక రాత్రి ఒక సుభాషితం పగలు ఒకటి వల్లిస్తారా ! మోడీ తరువాత వారసుల్లో ఒకరని భావిస్తున్న ఉత్తర ప్రదేశ్‌ సిఎం యోగి ఆదిత్యనాధ్‌ కులంపేరుతో విడతీస్తే హత్య చేసినట్లే అన్నారు. ఓటు బాంకు రాజకీయాలకు మేం వ్యతిరేకం అని సుద్దులు చెప్పే బిజెపి బుద్ది ఇప్పుడు అదే ఓట్ల కోసం అర్రులు చాస్తున్నదని, విధిలేకనే దిగివచ్చిందని జనం భావిస్తున్నారు. నేషనల్‌ ఫ్రంట్‌ నేతగా ప్రధాని విపి సింగ్‌ వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లకు మండల్‌ కమిషన్‌ సిఫార్సు చేస్తే దానికి పోటీ కమండల్‌గా అద్వానీ రామ్‌ రథయాత్ర చేపట్టారనే విమర్శలు అప్పుడే వచ్చాయి. ఓబిసిలో వర్గీకరణకు మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్‌ చేసిన సిఫార్సులను పక్కన పెట్టి రోహిణీ కమిషన్‌ వేశారు, అది సమర్పించిన నివేదికను రెండేండ్లు కావస్తున్నా ఇంతవరకు బయటపెట్టలేదు. అలాంటి పాలకులు ఇప్పుడు బిసిల మీద ఎక్కడలేని ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారు. కుల గణన చేస్తే హిందూ సమాజం విడిపోతుందని చెప్పటమే అసలు హిమాలయమంత అబద్దం, సాకు. ఇప్పుడు ఒక్కటిగా ఉందా ? ఎన్ని రకాలుగా విడిపోయి ఉందో జనాలకు తెలియదా, గ్రామాల్లో గోడలతో విభజిస్తున్నారు, చివరకు చచ్చిన తరువాత శ్మశానాల్లో కూడా మతాలు, కులాలవారీ లేవా ? ఇంకా కులం ఎక్కడ, మతం ఎక్కడా అనిపడక కుర్చీల్లో కూర్చొని వాదించేవారు కనిపిస్తారు. ఇంత అభివృద్ది, విద్య తరువాత కూడా సమాజంలో కులాంతర వివాహాలు కేవలం ఐదుశాతమే అని చెప్పాలంటే సిగ్గుపడాలి. ఏ నియోజకవర్గంలో ఏ కులం, మతం, ప్రాంతం వారు ఎందరున్నారో ఎన్నికలపుడు అందరికీ తెలిసిందే కదా ?


కులగణనను గతంలో కాంగ్రెస్‌ కూడా వ్యతిరేకించిన మాట నిజం. నిజానికి బిజెపి దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం కూడా వ్యతిరేకమే. రెండిరటికీ కారణాలు వేర్వేరు. బిజెపికి 2014లో సంపూర్ణ అధికారం వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు సముఖత చూపలేదు. ఇప్పుడు సామాజిక న్యాయం కోసం చేశామని చెబుతున్నవారు తమ పార్టీ నేత వాజ్‌పాయ్‌ హయాంలోనే 2001 జనగణన జరిగిందని, అప్పుడే ఎందుకు చేయలేదో చెప్పాలి. కుల గణన జరిగితే రిజర్వేషన్లు, వర్గీకరణ డిమాండ్లతో పాటు, బిజెపి నాయకత్వంలో ఉన్న కొన్ని కులాల వారి ఆధిపత్యానికి గండిపడుతుంది గనుకనే ఆ పార్టీ సుముఖంగా లేదు. కొన్ని పదవుల్లో కొందరికి అవకాశం కల్పించినప్పటికీ సంఘపరివార్‌ సంస్థలలో పునాది ఆధిపత్య కులాలదే. కొన్ని సంక్షేమ పధకాలు అమలు జరపవచ్చు, రాజకీయ సాధికారత అప్పగించటానికిసిద్దపడుతుందా అన్నదే సమస్య. మోడీ సామాజిక తరగతి ఓబిసి అయినప్పటికీ గత పదకొండు సంవత్సరాల్లో వారికి ఒరగబెట్టిందేమీ లేదు, ఆర్థికంగా పరిస్థితి మెరుగుపరచిందీ లేదు. బిజెపి మతం కార్డుతో రాజకీయం చేస్తున్నదానికి విరుగుడుగా కాంగ్రెస్‌ ఇప్పుడు కులగణన ముందుకు తెచ్చింది. దానికంటే ముందు బిసి సంఘాలు ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చాయి. దీనికి మూలం అస్థిత్వ భావజాలం విస్తరించిన కారణంగా దేశంలో అత్యధికులుగా ఉన్న వెనుకబడిన తరగతుల వారు మేమెంత మందిమో మాకంత వాటా పేరుతో రాజకీయ ప్రాతినిధ్యం కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేయటమే. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో రాజ్యాంగం అన్ని కులాలను సమంగానే చూస్తున్నప్పటికీ ఆచరణలో మనువాదం ప్రకారం పైనున్న ప్రతివారూ దిగువన ఉన్న వారిని తక్కువగా చూస్తున్నారు. వివాహాలు, కలసి భోజనం చేసేందుకు కూడా అంగీకరించటం లేదు. దాడులు చేసి చంపేస్తున్నారు. అంబేద్కర్‌ కుల నిర్మూలన జరగాలని కోరుకున్న నాటికీ ఇప్పటికీ చివరికి వివక్షకు గురవుతున్న దళితుల్లోనూ కుల ధోరణులు మరింత పెరిగాయి.ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి తాజాగా అందరికీ ఒకే దేవాలయం, ఒకే బావి, ఒకే స్మశానం ఉండాలని చెప్పారు గానీ కులం, మతం విద్వేషాలు పోవాలని కోరలేదు.


ఇప్పుడు బిజెపి ఎందుకు కులగణనకు అంగీకరించింది ? ఆయారాం గయారాం పాత మాట. నితీష్‌ ఆయా నితీష్‌ గయా అన్నది కొత్త మాట, కూటముల ఫిరాయింపులకు బ్రాండ్‌ అంబాసిడర్‌ బీహార్‌లో ఎదురీదుతున్నట్లు అర్ధమైంది, తన కులగణన సర్వే గురించి చెప్పుకోవాలంటే సిగ్గుపడే స్థితి.అన్నింటికీ మించి మోడీ సర్కార్‌ నిలిచేందుకు రెండు పంగటి కర్రలలో ఒకటి నితీష్‌. అదువలన గతంలో మోడీ కులగణన గురించి ఎంత ఠలాయించినా ఇప్పుడు కుదరదు, నితీష్‌తో పాటు బిజెపి మునగటం ఖాయం. కనుక నితీష్‌ కూడా కులగణనకు అంగీకరిస్తారా లేదా అని పట్టుబట్టినట్లు కనిపిస్తోంది. అందుకే తక్షణ ప్రయోజనంగా బీహార్‌ ఓట్ల కోసం అన్నది స్పష్టం. అయితే ఆ ఎన్నికల నాటికి గణన జరగదు, ఒక ప్రచార అస్త్రంగా మాత్రమే ఉంటుంది. మతం కార్డుతో నూటికి 80శాతంగా ఉన్న హిందువుల ఓట్లు తమకే పడతాయని ఆశించిన వారికి అంత సీన్‌ లేదని, హిందువులు అంత అమాయకంగా బిజెపి వెంటనడవరని, చివరికి అయోధ్యలో ఆ పార్టీని ఓడిరచిన తీరు, మోడీకి గణనీయంగా మెజారిటీ పడిపోవటం, గత ఎన్నికల కంటే ఓట్లు, సీట్లు తగ్గటంతో దిగజారుడు మొదలైనట్లు గ్రహించారు. కులగణన కార్డు ఎంత కాలం పని చేస్తే అంతవరకు ఉపయోగించుకోవాలని నిర్ణయించారని వేరే చెప్పనవసరం లేదు. సంఘపరివార్‌ సంస్థలలో బిసిలు పెద్ద సంఖ్యలో ఉన్నారు,హిందూత్వ భావజాలాన్ని వారిలో గణనీయంగా ఎక్కించామనే విశ్వాసం ఆర్‌ఎస్‌ఎస్‌లో కలిగి ఉండాలి, 2013 నుంచి నరేంద్రమోడీని ఓబిసిగా చూపుతూ తమది బిసిల పార్టీ అని బిజెపి ఊదరగొడుతున్న సంగతి తెలిసిందే. అందువలన గణన జరిగినా తమ ఓట్లు పదిలంగా ఉంటాయనే అంచనాకు వచ్చి ఉండాలి, ఈ నిర్ణయానికి ముందు ప్రధానితో మోహన్‌భగవత్‌ భేటీ కూడా దాని గురించి చర్చించటానికే అన్నది వేరే చెప్పనవసరం లేదు. అయితే వారి అంచనా ప్రకారమే జరుగుతుందా ?


లెక్కతేలినంత మాత్రాన ఒరిగేది, జరిగేది ఏమిటి ? ఎవరెంత అన్న వివాదానికి తెరపడుతుంది. కొత్త డిమాండ్లు ముందుకు వస్తాయి, వాటికి రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. ఇప్పటికే దళితులు, గిరిజనుల సంఖ్య ఎంతో తెలిసిందే.201112 జాతీయ నమూనా సర్వే ప్రకారం, 201516 కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం చూసినా జనరల్‌ తరగతులతో పోలిస్తే ఎస్‌సి,ఎస్‌టి,ఓబిసిలు చేస్తున్న ఖర్చు చాలా తక్కువ.జనరల్‌ తరగతుల్లో దారిద్య్రం 15.6శాతం ఉంటే గిరిజనుల్లో 50.6, దళితుల్లో 33.3, ఓబిసీల్లో 27.2శాతాల చొప్పున దారిద్య్రంలో ఉన్నట్లు తేలింది. విద్య, ఉద్యోగాలు, చట్టసభలు, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఉపశమనం తప్ప అసమానతలు, దారిద్య్రాన్ని తగ్గించే సాధనాలు కాదని తేలిపోయింది. ముస్లింలలో కూడా దారిద్య్రం ఎక్కువగానే ఉంది. కులగణన తరువాత ఈ పరిస్థితిని మార్చేందుకు పథకాలేమైనా ఉంటే ఉపయోగం, లేకుంటే ఎప్పటికాలు ఇట్టిట్టే ! దాని గురించి ఎలాంటి ప్రకటన లేదు. దళితుల వర్గీకరణ న్యాయసమ్మతమే అయినప్పటికీ ఒకే తరగతిగా ఉన్నపుడు లబ్ది పొందిన సామాజిక తరగతులు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాయి. అదే విధంగా ఓబిసి వర్గీకరణ డిమాండ్‌ కూడా ఉంది, దాన్ని చేసేందుకు మోడీ సర్కార్‌కు చెమటలు పడుతున్నాయి. రోహిణీ కమిషన్‌ వేసి అనేకసార్లు గడువు పొడిగించి నివేదిక రాకుండా చూసినప్పటికీ 2023 ఆగస్టులో ఇచ్చిన నివేదికను ఇంతవరకు బహిర్గత పరచలేదు.


బ్రిటీష్‌ పాలనా కాలంలో 1881 నుంచి 1931వరకు కులగణన జరిగింది.అణగారిన తరగతుల ఉద్దరణకు గాక విభజించి పాలించు అనే ఎత్తుగడతో ఆ లెక్కలను తీసిందన్నది స్పష్టం. దాని పర్యవసానాలలో ముస్లింలను వేరుగా సంఘటిత పరచేందుకు ముస్లిం లీగ్‌ ఆవిర్భావం ఒకటి. మద్రాస్‌ ప్రావిన్స్‌లో కులాల వారీ కోటాల నిర్ణయానికి దారితీసింది.దేశంలో దళితుల కోసం ద్విసభ్య నియోజకవర్గాలూ, తరువాత రిజర్వేషన్లూ దాని ఫలితమే. కులగణన జరిగితే సామాజిక విభజనకు దారి తీస్తుందని,అణగారిన తరగతులకు సంక్షేమ పథకాలను అమలు జరిపి ఉద్దరించాలనే వైఖరితో దళితులు, గిరిజనులకు తప్ప 1951 నుంచి నెహ్రూ సర్కార్‌ కులగణన నిలిపివేసింది.అయితే నాటి నుంచి నేటి వరకు చూస్తే అలాంటి ఉద్దరణ జరగకపోగా కొంత మంది దగ్గర సంపద పోగుపడటం, ముఖ్యంగా 1990 దశకం నుంచి ప్రారంభమైన నూతన ఆర్థిక విధానాల అమలు తరువాత కనిపిస్తున్నది. గత పదేండ్లలో దాని తీవ్రత మరింత పెరిగింది. అందుకే తిరిగి కులగణన, రాజకీయ, ఆర్థిక సాధికారత సామాజిక న్యాయ డిమాండ్లు ముందుకు వచ్చాయి.1931 తరువాత జరిగిన మార్పుల్లో వివిధ తరగతుల జనాభా పొందికలో అనేక మార్పులు వచ్చాయి. మొత్తంగా జనాభా పెరుగుదల తగ్గినప్పటికీ ఇతరులతో పోల్చినపుడు భూమి, ఆస్థి కేంద్రీకృతమైన వారిలో సంతానోత్పత్తి గణనీయంగా తగ్గింది. ఇప్పుడు బిసిల జనాభా 52శాతమని చెబుతున్నవన్నీ అంచనా లేదా 1931 లెక్కల ప్రాతిపదికన చెబుతున్నవి మాత్రమే.వచ్చే జనాభా గణనలో లెక్కలు తేలిన తరువాత తలెత్తే కొత్త సమస్యలను ఇప్పుడే ఊహించటం, వ్యాఖ్యానించటం తొందరపాటు అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎర్రపూల వనం : మావో లిటిల్‌ రెడ్‌ బుక్‌ అట్ట రంగు నీలం ! అయితేనేం, అంశాలు కమ్యూనిజమే కదా !!

16 Sunday Mar 2025

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Political Parties, RELIGION, USA

≈ 1 Comment

Tags

Anti Communist Eevangelicals, Donald trump, first Little Red Book, Mao Zedong, Mao Zedong thought, Mao Zedong’s first Little Red Book, US anti China Propaganda, US anti communism, Yoon Suk-yeol’


ఎం కోటేశ్వరరావు


పిల్లి నల్లదా తెల్లదా అన్నది కాదు, అది ఎలుకల్ని వేటాడుతుందా లేదా అన్నదే చూడాలన్నది ఒక చైనా సామెత. కమ్యూనిస్టులు ముద్రించే సాహిత్యం అంటే ఎర్రటి అట్టలుంటాయని చాలా మంది అనుకుంటారు, అది పాక్షికంగా వాస్తవం కూడా. పోలీసులు నక్సలైట్లను బూటకపు ఎన్‌కౌంటర్లలో హత్య చేసినపుడు వారి దగ్గర స్వాధీనం చేసుకున్నట్లు చెప్పిన వస్తువుల్లో ఎర్ర అట్టలతో ముద్రించిన పుస్తకాలను కూడా చూపేవారు. నిజానికి ఎర్ర అట్టలతో పుస్తకాలు ముద్రించిన వారిలో ఎందరు చివరి వరకూ కమ్యూనిస్టులుగా ఉన్నారు ? గాడి తప్పి జెండాను పక్కన పడేయటం, ఉద్యమాన్ని నాశనం చేయటం, ద్రోహం చేసిన వారి చరిత్రలు తెలిసినవే. సాంస్కృతిక విప్లవం పేరుతో అమలు జరిపిన కార్యక్రమానికి ముందు మావో జెడాంగ్‌ ఆలోచనలతో కూర్చిన ఒక పుస్తకాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ 1964లో ప్రచురించింది. దాన్నే లిటిల్‌ రెడ్‌ బుక్‌ అని పిలిచారు. ఆ పుస్తకపు తొలి ముద్రణ అట్ట నీలి రంగులో ఉంది.తరువాత అది ఎర్ర అట్టతో వందకోట్లకు పైగా ముద్రణలు పొందిందని చెబుతారు. తొలి నీలి రంగు ప్రతి అరుదైనదిగా మారింది. ఈ ప్రతిని ఏప్రిల్‌లో న్యూయార్క్‌లో జరిగే అంతర్జాతీయ ప్రాచీన పుస్తక ప్రదర్శనలో ప్రదర్శించటమే గాక వేలంలో దాని ధరగా పదిలక్షల పౌండ్లు నిర్ణయించారు. విప్లవంలో చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వ పాత్ర గురించి మావో చెప్పిన అంశాలతో ఈ పుస్తకం ప్రారంభమౌతుంది. 1964 ముద్రణకు ముందు చైనా ప్రజా విముక్తి సైన్యాన్ని ఉద్దేశించి మావో చెప్పిన అంశాలతో సంకలనం జరిగింది. తరువాత అనేక మార్పులు, చేర్పులతో మరింత స్పష్టత,క్లుప్తతతో రూపొందించారు. ఈ పుస్తక ముద్రణ తరువాత 1966లో వివాదాస్పద సాంస్కృతిక విప్లవ కార్యక్రమాన్ని అమలు చేశారు. అప్పుడు ఎర్ర అట్టతో మరోసారి మార్పులు చేసిన ఈ గ్రంధం అనేక ముద్రణలు పొందింది. జస్టిన్‌ ష్కిల్లర్‌ అనే అమెరికన్‌ రెండు దశాబ్దాలకు పైగా వివిధ దేశాల నుంచి అపురూప పుస్తకాలను సేకరించాడు. 1990 దశకం ప్రారంభంలో ష్కిల్లర్‌ చైనా వెళ్లాడు. ఆ సమయానికి 1963నాటి ముద్రణ ప్రతులను సంస్థలు, వ్యక్తులు పక్కన పడేశారని ఆ తరుణంలో ఆ ప్రతిని సంపాదించినట్లు పుస్తకాల అమ్మకాలను పర్యవేక్షిస్తున్న లండన్‌కు చెందిన అపురూప పుస్తకాల డీలర్‌ మాట్‌ విల్స్‌ చెప్పాడు. ఈ ప్రదర్శన`అమ్మకంలో అనేక తొలి , అంతర్జాతీయ ముద్రణల అపురూప ప్రతులను ప్రదర్శిస్తారు.


మావో ఆలోచనా విధానంలో కొన్ని అంశాలను తరువాత చైనా కమ్యూనిస్టు పార్టీ పక్కన పెట్టినప్పటికీ కమ్యూనిస్టు పార్టీ పాత్ర, విప్లవ అనుభవాల గురించి మావో చెప్పిన అనేక అంశాలు ఇప్పటికీ చైనా కమ్యూనిస్టులకు, అంతర్జాతీయంగా మార్గదర్శకంగానే ఉన్నాయి. మరణానంతరం మావో పాత్రను తగ్గించటం లేదా విస్మరించటం వంటి తప్పిదాలకు కమ్యూనిస్టు పార్టీ పాల్పడలేదు.ప్రతి ఒక్కరూ ధనవంతులౌతారని ఊహించుకోవటానికే భయం వేస్తున్నదని ఆ పుస్తకంలో ఒక సందర్భంగా మావో చెప్పారు. ఆరుదశాబ్దాల తరువాత చైనా ఆ దిశగా ప్రయాణిస్తుందని, అసాధ్యం అనుకున్నదానిని తాను మార్గదర్శకత్వం వహించిన కమ్యూనిస్టు పార్టీ సుసాధ్యం చేసే బాటలో పయనిస్తుందని మావో ఊహించి ఉండరు. లిటిల్‌ రెడ్‌ బుక్‌ ప్రతిని ఎవరు స్వంతం చేసుకుంటారో, విక్రేతలు ఆశిస్తున్నట్లుగా పదిలక్షల పౌండ్లకా తక్కువ ఎక్కువలకు అమ్ముడు పోతుందా అన్నది వేరే అంశం. మావో జీవితాంతం వ్యతిరేకించిన ధనికస్వామ్యపు ప్రతినిధులు, భాగస్వాములే దాన్ని సొంతం చేసుకుంటారు. వారికి అది ఒక అలంకరణ వస్తువు మాత్రమే. కమ్యూనిస్టులు, కష్ట జీవులు అంత ధరకు కొనుగోలు చేయరు గానీ దానిలో ఉన్న అంశాలను మాత్రం సొంతం చేసుకుంటారు, ఆచరించేందుకు చూస్తారు, భవిష్యత్‌ తరాలకు అందిస్తారు.

సైప్రస్‌లో మరో కమ్యూనిస్టు పార్టీ !
ప్రాణం ఉన్నంత వరకు జీవి బతుకుపోరాటం చేస్తూనే ఉంటుంది. అలాగే సజీవంగా ఉన్న ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో నిరంతరం మధనం జరుగుతూనే ఉంటుంది. సైప్రస్‌లో కొందరు 2024 సైప్రస్‌ కమ్యూనిస్టు ఇనీషియేటివ్‌(సిసిఐ) పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. సైప్రస్‌ కమ్యూనిస్టు పార్టీ అకెల్‌(ప్రోగ్రెసివ్‌ పార్టీ ఆఫ్‌ వర్కింగ్‌ పీపుల్‌) కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు క్రిస్టోస్‌ కౌర్టెల్లారిస్‌ దీనికి నాయకత్వం వహిస్తున్నాడు. క్రిస్టోస్‌ తాత అకెల్‌ ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు. తాము ఎన్నికల్లో పాల్గ్గొనటం కంటే సంస్థాగతంగా పటిష్టం కావటానికి ప్రాధాన్యత ఇస్తామని, కమ్యూనిస్టు పార్టీ లేని లోటును పూడుస్తామని తాజాగా ఆ పార్టీనేత ఒకరు చెప్పారు.అకెల్‌ పార్టీ సైప్రస్‌ పార్లమెంటులోని 56 స్థానాలకు గాను 15 సీట్లతో, 21శాతం ఓట్లతో రెండవ స్థానంలో ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని సిసిఐ చెప్పుకుంది.

దక్షిణ కొరియాలో కమ్యూనిస్టు వ్యతిరేకత`క్రైస్తవ సువార్తకులు !
దక్షిణ కొరియాలో సైనిక పాలన ప్రకటించి తీవ్ర వ్యతిరేకత వెల్లడి కావటంతో కొద్ది గంటల్లోనే రద్దు చేసిన అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ మీద కోర్టు తీర్పు వెలువడనుండగా అతగాడికి మద్దతుగా, వ్యతిరేకంగా శనివారం నాడు లక్షల మంది రాజధాని సియోల్‌ పట్టణంలో ప్రదర్శనలు జరిపారు. వ్యతిరేకంగా పదిలక్షల మంది, అనుకూలంగా మూడున్నరలక్షల మంది పాల్గ్గొన్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. కమ్యూనిస్టు ముప్పు నుంచి తప్పించేందుకే తాను మిలిటరీ పాలన విధించానని యూన్‌ సమర్ధించుకున్నప్పటికీ గద్దె దిగాల్సిందేనని పార్లమెంటు గతేడాది డిసెంబరులో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించింది, దాన్ని ధిక్కరించటంతో అరెస్టు కూడా చేశారు. మార్చినెల ఏడవ తేదీన అరెస్టు వారంటును కోర్టు రద్దు చేయటంతో జైలు నుంచి విడుదల చేశారు, యూన్‌ పార్లమెంటు చర్యను కోర్టులో సవాలు చేశాడు. అక్కడి చట్ట ప్రకారం తిరుగుబాటు చేసిన వారికి ఉరిశిక్ష, జీవిత ఖైదు విధించవచ్చు, తప్పుచేయలేదంటే అధ్యక్షుడు గనుక తిరిగి పదవిలో కూర్చో పెట్టవచ్చు. తీర్పు సమయం దగ్గరపడిన కొద్దీ దేశంలో అనుకూల, వ్యతిరేక వర్గాలు సమీకరణలకు పూనుకున్నాయి. యూన్‌ తరఫున అక్కడి క్రైస్తవ ఇవాంజెలికల్స్‌ రంగంలోకి దిగారు. తమ అధ్యక్షుడిని తిరిగి గద్దె మీద ప్రతిష్టించాలని డిమాండ్‌ చేస్తున్నారు.దేశమంతటా ఈ మేరకు ప్రదర్శనలు చేస్తూ కమ్యూనిజం ముప్పు ఉన్నందున రక్షకుడిగా యూన్‌ ఉండాల్సిందేనంటూ ఉపన్యాసాలు చేస్తున్నారు.దేవుడు రచించిన మంచి పధకంలో భాగంగానే యూన్‌ చర్యలు తీసుకున్నాడంటూ బోధలు, ప్రార్ధనలు చేస్తున్నారు. చివరి వరకు పోరాడాల్సిందేనంటూ యూన్‌కు మద్దతు తెలుపుతున్నారు.దేశంలోని క్రైస్తవులు రెండు పక్షాలుగా చీలిపోయారు. మూడిరట రెండు వంతుల మంది సీనియర్‌ పాస్టర్లు యూన్‌ తొలగింపును సమర్ధిస్తున్నట్లు సర్వే వెల్లడిరచింది.అమెరికాలో ఎవాంజెలికల్స్‌ డోనాల్డ్‌ ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నట్లే దక్షిణ కొరియాలో కూడా యూన్‌కు మద్దతు ఇస్తున్నారు. ఉత్తర కొరియా, చైనా ఏజంట్లు, మద్దతుదార్లు దక్షిణ కొరియా ప్రభుత్వంలో చొరబడినట్లు, వారందరినీ రూపుమాపాల్సిందేనని వారు సాధారణ జనాన్ని రెచ్చగొడుతున్నారు.యూన్‌ తిరిగి అధికారానికి రాకపోతే చైనా, ఉత్తర కొరియా అనుకూల పార్లమెంటు సభ్యులు దేశాన్ని చైనాకు సామంత దేశంగా, సోషలిస్టు రాజ్యంగా మార్చుతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 1950దశకంలో ఉత్తర కొరియాపై అమెరికా దాడి చేసినపుడు దాన్ని పవిత్ర యుద్ధంగా దక్షిణ కొరియాలోని చర్చి వర్ణించి అమెరికాకు మద్దతు పలికింది. ఇటీవలి పరిణామాల గురించి యూట్యూబర్లు పెద్ద ఎత్తున రంగంలోకి కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారు, వారి వెనుక ఎవరు ఉన్నదీ అర్ధం చేసుకోవటం కష్టం కాదు.

అమెరికాను వెన్నాడుతున్న చైనా కమ్యూనిస్టు భయం !
కమ్యూనిజాన్ని ఏడు నిలువుల లోతున పాతి పెట్టామని, విజయం సాధించామని మూడు దశాబ్దాల క్రితం ప్రకటించుకున్న అమెరికాను ‘‘ కమ్యూనిస్టు భూతం ’’ ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇటీవల అమెరికా జాతీయ భద్రతకు చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి ఎలా ముప్పు వచ్చిందో చెప్పాలంటూ పార్లమెంటరీ కమిటీ కొన్ని ప్రశ్నలను సంధించింది. చైనా వాంఛలేమిటి, సైబర్‌, అంతర్గత భద్రతకు దాన్నుంచి ముప్పు ఎలా ఉంది, చైనా వివిధ దేశాల నుంచి ఎలా ముప్పు కలిగిస్తోందో చెప్పాలని కోరింది. దానికి గాను ఆ కమిటీ ముందు వివరించిన అంశాల సారం ఇలా ఉంది. చైనా కమ్యూనిస్టు పార్టీ జాతీయవాదంతో పని చేస్తోంది. సామ్రాజ్యవాదుల చేతిలో దశాబ్దం పాటు పొందిన అవమానాలకు బదులు తీర్చుకోవాలని చూస్తోంది.అమెరికా నాయకత్వంలోని ప్రపంచ వ్యవస్థను అధిగమించాలన్న పెద్ద పథకంతో ఉంది.సాంకేతికంగా, ఆర్థికంగా, మిలిటరీ పరంగా కూడా అధిగమించే, ఓడిరచే సత్తాను సమకూర్చుకోవాలని చూస్తోంది. పశ్చిమార్ధగోళంలో మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చూస్తోంది.భూ, సముద్ర, ఆకాశంలో కూడా మిలటరీ రీత్యాపై చేయిగా మారాలనుకుంటున్నది.


అంతర్జాతీయ సంస్థలలో నాయకత్వ పాత్రకోసం,పశ్చిమ దేశాల కూటమిని చీల్చాలని చూస్తోంది. అమెరికా వ్యక్తిగత సమాచారాన్ని పొందటం ద్వారా గూఢచార అవసరాలను తీర్చుకోవాలని, లక్ష కోట్ల మేథోసంపత్తి సంపదను కొట్టేసేందుకు వివిధ కంపెనీలు, అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో చొరబడాలని, ఉన్నత అధికారుల వివరాలను సేకరించాలని, యుద్ధ సమయాలలో గగనతలంలో పోరు సాగించేందుకు అవసరమైన ఏర్పాట్లకోసం ప్రయత్నిస్తున్నది. చైనా నుంచి పని చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ఉత్పత్తులను అమెరికా ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయటాన్ని నిషేధించాలి.అమెరికా వ్యవస్థలు, కంపెనీలు ఎలా పనిచేస్తున్నదీ తెలుసుకొనేందుకు చైనా ప్రయత్నించటాన్ని అనుమతించకూడదు. అమెరికా వ్యవస్థలలో వినియోగించేందుకు చైనా కంపెనీల పరికరాలను నిషేధించాలి.అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న ఫెంటానిల్‌ తయారీకి చైనా ప్రభుత్వం కంపెనీలకు రాయితీలు ఇస్తున్నది.రహస్యంగా పనిచేస్తున్న చైనా బాంకులు ఫెంటానిల్‌ సరఫరాదార్లకు తోడ్పడుతూ వచ్చిన లాభాలను స్వంతం చేసుకుంటున్నాయి. ఇలాంటి సంస్థలు, వ్యక్తులపై అమెరికా ఆంక్షలు విధించాలి.నగదు చేతులు మారకుండా అవసరమైన మేరకు చట్టాలను సవరించాలి.


పార్లమెంటరీ కమిటీ ముందు ఈ అంశాలన్నింటినీ చెప్పిన తరువాత రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ బైరన్‌ డోనాల్డ్స్‌ అమెరికా మద్దతు ఇస్తున్న తైవాన్‌ చట్టం పేరుతో ఒక బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టాడు. తైవాన్‌ స్వాతంత్య్రానికి మద్దతు ఇవ్వాలని, అమెరికా పత్రాల్లో చైనీస్‌ తైపే అనే పదాలకు బదులు తైవాన్‌ అని సవరించాలని, ఆ మేరకు అన్ని వెబ్‌సైట్లలో మార్చాలని ప్రతిపాదించాడు. అమెరికాకు వ్యూహ్మాక భాగస్వామిగా తైవాన్‌ ఉండాలని బైరన్‌ చెప్పాడు. ప్రపంచ వేదికల మీద చైనా తన ప్రభావాన్ని పెంచుకొనేందుకు చూస్తున్నదని అన్నాడు.డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత మరోసారి చైనా మీద వాణిజ్య యుద్ధం ప్రారంభించిన తరువాత ఇలాంటి రెచ్చగొట్టే అంశాలను పార్లమెంటులో ప్రతిపాదించటం ఆశ్చర్యం కలిగించటం లేదు. ఇంకా ఇలాంటివి ఎన్నింటిని చూడాల్సి వస్తుందో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా సాయం అసలు కథేంటి ? మోడీ సర్కార్‌ ఎందుకు మౌనంగా ఉన్నట్లు ?

22 Saturday Feb 2025

Posted by raomk in Africa, BJP, CHINA, Congress, COUNTRIES, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, USA

≈ Leave a comment

Tags

BJP, China, Donald trump, Joe Biden, Narendra Modi Failures, RSS, sangh parivar, USAID

ఎం కోటేశ్వరరావు


మన ఎన్నికలలో ఓటర్లు ఎక్కువగా పాల్గొనేందుకు ప్రోత్సాహ చర్యలు తీసుకొనేందుకు అమెరికా ప్రభుత్వ ఆధ్వర్యాన నడిచే ఏజన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ (యూఎస్‌ఎయిడ్‌) సంస్థ 21 మిలియన్‌ డాలర్లు (రు.182 కోట్లు) మంజూరు చేసింది. దీన్ని జో బైడెన్‌ సర్కార్‌ కేటాయిస్తే డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ ఆ నిర్ణయాన్ని 90 రోజుల పాటు స్థంభింపచేస్తూ జనవరి 20న ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశాడు. నిజానికి ఈ మొత్తాన్నే కాదు, ప్రపంచమంతటా వివిధ దేశాలకు ఇస్తున్న మొత్తాలపై ఈ నిర్ణయం జరిగింది. భారత్‌ దగ్గర చాలా డబ్బుంది, అక్కడ ఓటర్లను ప్రోత్సహించేందుకు మనమెందుకు డబ్బివ్వాలంటూ ట్రంప్‌ ఇటీవల వ్యాఖ్యానించాడు. ఈ సొమ్మును గతంలో ఇచ్చారా, రాబోయే రోజుల్లో ఖర్చుచేసేందుకు మంజూరు చేశారా, విడుదల చేశారా లేదా అన్నది స్పష్టం కావాల్సి ఉంది. బిజెపి నేతలు అమిత్‌ మాలవీయ, రాజీవ్‌ చంద్రశేఖర్‌ల స్పందన చూస్తే ఈ మొత్తం ఖర్చు చేసినట్లుగా అర్ధం అవుతున్నది. ‘‘ ఓటర్లు బారులు తీరేందుకు 21 మిలియన్‌ డాలర్లా ? ఇది కచ్చితంగా భారత్‌ ఎన్నికల ప్రక్రియలో విదేశీ జోక్యమే. దీన్నుంచి ఎవరు లబ్ది పొందారు ? అధికారపక్షమైతే కచ్చితంగా కాదు ’’ అని అమిత్‌ మాలవీయ చెప్పారు. రాజుగారి చిన్న భార్య అందగత్తె అంటే పెద్ద భార్య అనాకారి అనేకదా అన్నట్లుగా అధికారంలో ఉన్న బిజెపి గాకపోతే కాంగ్రెస్‌ లబ్దిపొందినట్లు ఆరోపించటమే కదా ? ఈ మాత్రం అర్ధం చేసుకోలేనంత అమాయకంగా మన జనాలు ఉన్నారా ?ప్రజాస్వామ్యాలను బలహీనపరచటం, జోక్యం చేసుకోవాటానికి ఇది నిదర్శనం అని మాజీ కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ప్రకటించారు.ఒక వైపు ప్రజాస్వామిక విలువల గురించి చర్చ చేస్తూ మరోవైపు నిర్లజ్జగా ప్రజాస్వామిక దేశాలను బలహీనపరిచేందుకు పూనుకోవటం దిగ్భ్రాంతి కలిగిస్తున్నదన్నారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. శుక్రవారం నాడు విదేశాంగశాఖ ప్రతినిధి మాట్లాడుతూ తామీ సమాచారాన్ని చూశామని, సహజంగానే ఇది ఎంతో ఆందోళన కలిగిస్తుంది, భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం గురించి ఆందోళనకు దారి తీసింది. సంబంధిత శాఖలు, ఏజన్సీలు దీని గురించి చూస్తున్నాయి, ఈ దశలో బహిరంగంగా ప్రకటించటం తొందరపాటు అవుతుంది,తరువాత చెబుతాము అన్నారు.

నిజానికి ఇంత స్వల్ప మొత్తంతో ప్రభావితమై ఒక రాష్ట్రం లేదా దేశంలో ఓటర్లు కుప్పలు తెప్పలుగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేస్తారా ? ఒక్కో ఎంపీ అభ్యర్థి వంద కోట్లు, ఎంఎల్‌ఏ పాతిక కోట్ల వరకు ఖర్చు పెడుతుంటేనే మాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు, వేరేవారికి ఎక్కువ ఇచ్చారంటూ నిరసనలతో అందరూ రావటం లేదు. ఏ మూలన చీమ చిటుక్కుమన్నా పసిగట్టే అమెరికన్లకు ఇంత చిన్న విషయం తెలియదా ? తామిచ్చే 182 కోట్లతో ఓటర్లు బారులు తీరతారా ? సాక్షాత్తూ అమెరికా ప్రభుత్వం వెల్లడిరచిన ఈ అంశం మీడియాలో చర్చకు దారితీసింది. వాస్తవాలను వెల్లడిరచేవరకు ఇది చర్చలో ఉంటుంది. సూది కోసం సోదికి పోతే పాత బాగోతాలన్నీ బయటపడినట్లు ఈ వ్యవహారంలో ఎంత పాత్ర ఉందో తెలియదు గానీ అమెరికాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీణా రెడ్డి అనే ఆమె 2021 ఆగస్టు నుంచి 2024 జూలై వరకు అమెరికా సాయ ఏజన్సీ భారత డైరెక్టర్‌గా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఎవరినో గెలిపించేందుకు ప్రయత్నించారని తాను ఊహిస్తున్నట్లు ట్రంప్‌ ఒక సాధారణ వ్యాఖ్య చేశాడు. 2014కు ముందు పెద్ద మొత్తంలో అమెరికా సాయం వచ్చిందని, తాము అధికారంలోకి వచ్చాక నామమాత్రమని బిజెపి పెద్దలు చెబుతున్నారు. అదే నిజమైతే ఆ సొమ్మును మోడీ గెలుపుకోసం వినియోగించినట్లు ఎందుకు భావించకూడదు ? ఒక వేళ కాంగ్రెస్‌ కోసం ఖర్చు చేసి ఉంటే పదేండ్ల నుంచి బిజెపి పాలకులు నిజాల నిగ్గుతేల్చకుండా ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నట్లు ? బిజెపి మాజీ ఎంపీ మహేష్‌ జత్మలానీ వీణా రెడ్డి గురించి ఒక ట్వీట్‌ చేశారు. ఎన్నికలు ముగిసిన తరువాత ఆమె అమెరికా వెళ్లారని ఇక్కడ ఉంటే దర్యాప్తు సంస్థలు ఈ సొమ్ము గురించి ప్రశ్నించి ఉండేవారన్నారు. తప్పించుకుపోయారన్న అర్ధం దీని వెనుక ఉంది. అమెరికాలో ఉంటే మాత్రం మన కేంద్ర ప్రభుత్వానికి అడిగే అవకాశం లేదా ? యూఎస్‌ఎయిడ్‌ ప్రభుత్వ సంస్థ, అందువలన నేరుగా మన ప్రభుత్వమే వివరాలు ఇవ్వాలని ఈ పాటికే ఎందుకు అడగలేదు ? జనానికి చెవుల్లో కమలంపూలు పెడుతున్నట్లుగా ఉంది. అమెరికా ప్రభుత్వ సమాచారాన్ని ఉటంకించిన ఇండియా టుడే వార్త ప్రకారం వీణా రెడ్డి హయాంలో మన దేశానికి అమెరికా సాయం రు.720 కోట్ల నుంచి 2022లో రు.2,500 కోట్లకు పెరిగినట్లు, 2023లో రు.1,515 కోట్లు, 2024లో రు.1,304 కోట్లు వచ్చాయి. ఈ సొమ్మును దేనికి ఖర్చు చేశారో నిగ్గుతేల్చాల్సింది పోయి, కాంగ్రెస్‌ మీద మరొక పార్టీ మీద నిందలు వేస్తే కుదరుతుందా ? ఓటర్లను పెద్ద ఎత్తున రప్పించేందుకు ఇచ్చినట్లు చెబుతున్న 21మిలియన్‌ డాలర్లు(రు.182 కోట్లు) అమెరికా కేంద్రంగా పని చేస్తున్న కన్సార్టియం ఫర్‌ ఎలక్షన్స్‌ అండ్‌ పొలిటికల్‌ ప్రోసెస్‌ స్ట్రెంతనింగ్‌`సిఇపిపిఎస్‌( ఎన్నికలు, రాజకీయ క్రమాన్ని పటిష్ట పరిచేందుకు ఏర్పడిన సహవ్యవస్థ)కు కేటాయించారు. ఇది అమెరికాలో ఉన్న ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ఎలక్ట్రొరల్‌ సిస్టమ్స్‌, ఇంటర్నేషనల్‌ రిపబ్లికన్‌ ఇనిస్టిట్యూట్‌, నేషనల్‌ డెమోక్రటిక్‌ ఇనిస్టిట్యూట్‌ అనే సంస్థలతో కూడిన కూటమి. ఎలన్‌ మస్క్‌ నిర్వహిస్తున్న ప్రభుత్వ సామర్ధ్య శాఖ(డోజె) వెల్లడిరచిన సమాచారమే ఇది.

సాయం పేరుతో ఎంత ఖర్చు చేస్తే అంతగా ఆర్థికంగా, రాజకీయంగా అమెరికా లబ్ది పొందింది తప్ప ఊరికే ఒక్క డాలరు కూడా వెచ్చించలేదు.అమెరికా సాయ సంస్థ 1949లో అధ్యక్షుడు ట్రూమన్‌ హయాం నుంచి తరువాత కాలంలో అనేక మార్పులు, చేర్పులతో సహా అనేక దేశాలకు నిధులు కేటాయిస్తున్నది. వాటిని కమ్యూనిస్టు వ్యతిరేక, తనను వ్యతిరేకించే దేశాలకు వ్యతిరేకంగా ప్రచారం, కుట్రలు, పాలకులు, ప్రభుత్వాలను కూలదోయటం, అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ఆకట్టుకొనేందుకు, ఉగ్రవాదులతో సహా ఎన్‌జిఓలు, మరొక పేరుతో ప్రపంచ మంతటా తన తొత్తులను, విద్రోహులను సమకూర్చుకోవటం దానిపని. అందుకోసం ప్రపంచమంతటా పదివేల మంది సిబ్బంది, ఏటా వందబిలియన్‌ డాలర్ల వరకు బడ్జెట్‌తో నడుస్తున్నది. గూఢచార సంస్థ సిఐఏతో అనుసంధానించుకొని ప్రజాస్వామిక సంస్కరణలు, అభివృద్ధి పేరుతో కథనడిపిస్తున్నది. మన దేశం, చైనాకు వ్యతిరేకంగా కుట్రలు చేసేందుకు 2004లో మిలీనియం ఛాలెంజ్‌ కార్పొరేషన్‌ (ఎంసిసి) ఏర్పాటు చేసి శ్రీలంక, నేపాల్‌ దేశాలను దానిలో చేరాలని వత్తిడి చేసింది. మొత్తం 29 దేశాలతో 2019 నాటికి 37 ఒప్పందాలు చేసుకుంది. 1990కి ముందు సోవియట్‌ యూనియన్‌తో ప్రచ్చన్న యుద్ధం సాగించిన కాలంలో దాని పనితీరు ఒక విధంగా ఉంటే తరువాత కొన్ని మార్పులు చేసుకుంది. అవి ఏవైనప్పటికీ ప్రపంచంలో మార్కెట్‌ సంస్కరణలతో సహా అమెరికా ప్రయోజనాలకు అనుగుణమైనవి, రాజకీయంగా వ్యతిరేకించేవారిని లక్ష్యంగా చేసుకున్నవే. తమ మిలిటరీ, రాజకీయ ఎత్తుగడలో భాగంగా ముందుకు తెచ్చిన క్వాడ్‌ కూటమిలో చేరాలని బంగ్లాదేశ్‌పై అమెరికా వత్తిడి తెచ్చింది. చిట్టగాంగ్‌ ప్రాంతంలోని సెయింట్‌ మార్టిన్‌ దీవిని తమకు కౌలుకు ఇవ్వాలని, అక్కడ మిలిటరీ కేంద్రం ఏర్పాటు చేస్తామని చేసిన ప్రతిపాదనను షేక్‌ హసీనా వ్యతిరేకించారు. ఆ కారణంగానే ప్రభుత్వాన్ని కూల్చివేసి, ఆమెను దేశం నుంచి తరిమివేసిన శక్తుల వెనుక ‘‘ అమెరికా సాయం ’’ ఉందని వార్తలు వచ్చాయి. నిజానికి ఆ కేంద్రాన్ని చైనాను దెబ్బతీయాలని చెప్పినప్పటికీ అది మన దేశానికీ ముప్పు తలపెట్టేదే.


ప్రజాస్వామ్యం, స్వేచ్చా మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ పేరుతో రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్తాన్‌ దురాక్రమణకు అమెరికా దాదాపు రెండులక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. దీనిలో అభివృద్ధి కోసం చేసిన ఖర్చు కేవలం 3,240 కోట్ల డాలర్లు మాత్రమే ఉంది. చివరకు తాలిబాన్లకు సలాం గొట్టి అన్నింటినీ వదలివేసి 2021 అమెరికా సేనలు అక్కడి నుంచి పారిపోయాయి. తమ సాయం ఆకలి, దారిద్య్ర నిర్మూలన, విద్య, వైద్యం వంటి వాటికి ఖర్చు చేస్తున్నట్లు అమెరికా చెబుతుంది. ఇరవై ఏండ్ల దురాక్రమణ తరువాత అక్కడ చూస్తే సర్వనాశనం. ముఫ్పైవేల మంది పౌరులతో సహా 1.74లక్షల మంది ఆప్ఘన్‌లు మరణించారు, 30లక్షల మంది పిల్లలు బడికి దూరం, 1.89 కోట్ల మంది తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొన్నారు.తాలిబాన్లతో సాగించిన పోరులో భయానక చర్యలెన్నో. 950 కోట్ల డాలర్ల మేర ఆఫ్ఘన్‌ జాతీయ సంపదలను దోచుకున్నారు. ఇలాంటి ఉదాహరణలను ఎన్నో చెప్పవచ్చు. మన దేశంలో కాశ్మీరు, పంజాబ్‌, ఈశాన్య రాష్ట్రాల వేర్పాటు వాదులు, ఉగ్రవాదుల వెనుక అమెరికా సాయ హస్తం గురించి చెప్పుకోనవసరం లేదు. హాంకాంగ్‌ స్వాతంత్య్రం పేరుతో గతంలో విద్యార్థులను రెచ్చగొట్టి రోడ్లెక్కించటం వెనుక, చైనాలో అంతర్భాగంగా ఐరాస గుర్తించిన తైవాన్‌ స్వాతంత్య్ర నినాదం, టిబెట్‌ వేర్పాటు వాదుల వెనుక అమెరికా హస్తం, సాయం బహిరంగ రహస్యమే.


అమెరికా మేథో సంస్థ కౌన్సిల్‌ ఆన్‌ ఫారిన్‌ రిలేషన్స్‌(సిఎఫ్‌ఆర్‌) ఫిబ్రవరి ఏడవ తేదీన రాసిన విశ్లేషణలో ప్రతి ఏటా అమెరికా సాయం ఎలా ఉంటుందో వెల్లడిరచింది. 2023 సంవత్సరంలో ప్రపంచవ్యాపితంగా 7,200 కోట్ల డాలర్లను అందించగా దానిలో 61శాతం యుఎస్‌ఎయిడ్‌ ద్వారా పంపిణీ జరిగింది. దీని ద్వారా జరుగుతున్నట్లు చెబుతున్న సాయంలో ఒక డాలరులోని వంద సెంట్లకు గాను 10 నుంచి 30 మాత్రమే అవసరమైన వారికి అందుతున్నదని ఇటీవల సిబిఎస్‌ మీడియాతో అమెరికా ఎంపీ బ్రియాన్‌ మాస్ట్‌ చెప్పాడు. చైనా తప్పుడు ప్రభావాన్ని ఎదుర్కొనే పేరుతో 2024 సెప్టెంబరులో 32.5 కోట్ల డాలర్లను అమెరికా పార్లమెంటు మంజూరు చేసింది.2023 నుంచి 2027వరకు ఇదే కార్యక్రమాలకు మొత్తం 162.5 కోట్ల డాలర్లను ఖర్చు చేసేందుకు నిర్ణయించారు. ఇంత మొత్తాన్ని ఎవరి పర్యవేక్షణలో ఎలా ఖర్చు చేస్తారో వెల్లడిరచలేదు గానీ యుఎస్‌ఎయిడ్‌ ప్రతినిధే ఉంటాడు. ఎందుకు ? ఎలా అంటే 2021లో జింబాబ్వే బడా పత్రిక హెరాల్డ్‌ అసలు విషయాన్ని వెల్లడిరచింది. ఆఫ్రికా ఖండంలో చైనా పెట్టుబడుల గురించి తప్పుడు వార్తలను ఎలా వండాలో స్థానిక విలేకర్లకు శిక్షణ ఇచ్చేందుకు అమెరికా నిధులు అందచేసిందట. మన దేశంలో కొన్ని పత్రికలు, టీవీలలో వస్తున్న కథనాలు, విశ్లేషణల వెనుక అమెరికా సాయం ఉందంటే తప్పు పట్టాలా ?

అమెరికా సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించగానే కొంత మంది సరికొత్త పల్లవి అందుకున్నారు. ఇప్పటికే బిఆర్‌ఐ పథకాలతో అనేక దేశాలలో చైనా పాగా వేస్తున్నదని, ఇప్పుడు అమెరికా సాయం ఆగిపోతే అది మరింతగా విస్తరించి అనేక దేశాలను అదుపులోకి తీసుకుంటుందనే పాటపాడుతున్నారు. ఇది రెండు అంశాలను తేటతెల్లం చేస్తున్నది. ఒకటి ఇన్ని దశాబ్దాలుగా సాయం పేరుతో అమెరికా తన ఆధిపత్యం కోసం ప్రయత్నించిందని నిర్ధారించటం, మరొకటి చైనా ఆధిపత్యం పెరుగుతుందనే భయాన్ని రెచ్చగొట్టటం. ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌ జోక్యాన్ని నివారించే పేరుతో తాలిబాన్లను తయారు చేయటం, తరువాత ఏకుమేకైన వారి మీదే పోరు సాగించిన అమెరికా మాదిరి ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడైనా చైనా వ్యవహరించిందా ? రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత రెండు కొరియాలు ఐక్యం కావాల్సి ఉండగా దాన్ని పడనీయకుండా దక్షిణ కొరియాలో అమెరికా మిలిటరీ తిష్టవేసి కొనసాగిస్తున్నది. ఆ మాదిరి చైనా ఎక్కడైనా కేంద్రాలను ఏర్పాటు చేసిందా ? అమెరికా సాయం పేరుతో మన దేశంలో సాగించిన తప్పుడు పనులను బహిర్గతం చేసేందుకు మోడీ సర్కార్‌ ముందుకు వస్తుందా ? వాటిలో సంఘపరివార్‌ సంస్థలేమైనా ఉంటే అసలు రంగు బయటపడుతుందని భయపడి మూసి పెడుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మరణశయ్య మీద ఉన్న కన్నతల్లిని కూడా చూడనివ్వని ‘‘హిందూత్వ కర్కశత్వం ’’ క్షమా సావంత్‌కు వీసా నిరాకరించిన మోడీ సర్కార్‌ !

17 Monday Feb 2025

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Religious Intolarence, USA, Women

≈ Leave a comment

Tags

BJP, caste discrimination in US, Hindu Fundamentalism, hindutva, Kshama Sawant, Narendra Modi Failures, RSS, VHP

ఎం కోటేశ్వరరావు

తాను అందరి మాదిరి జీవ సంబంధంగా పుట్టలేని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. రాగద్వేషాలు లేని కర్మయోగి, విశ్వగురువు అని అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు. ఆయన కన్నతల్లి వృద్ధాప్యంలో ఉన్నపుడు, చివరి రోజు వరకు చూసేందుకు అనేక సార్లు వెళ్లారు, సేవ చేశారని వార్తలు చదివాం, చిత్రాలను చూశాం. కానీ అలాంటి మరో తల్లిని చూసేందుకు ఆమె కుమార్తెకు వీసా నిరాకరించిన అదే పెద్దమనిషి తీరును ఎలా చూడాలి. ఎందుకు అలా చేశారు ? భారతీయ సంప్రదాయం, నైతికత అయితే కాదు, మరి రాజకీయ కక్షా ? అది అంత అమానవీయంగా ఉంటుందా ? అనేక వ్యాధులతో దినదిన గండగా నేడో రేపో అన్నట్లుగా గడుపుతున్న 82 ఏండ్ల కన్నతల్లిని చూసేందుకు ఒక కుమార్తెకు వీసా ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం నిరాకరించింది. ఆమె వీసా సమస్య గురించి విదేశాంగ మంత్రి జై శంకర్‌కు పూర్తిగా తెలుసు.జూన్‌ 26 నుంచి జూలై 15 మధ్య బెంగలూరు వచ్చేందుకు తనను అనుమతించాలని ఆమె జై శంకర్‌కు 2024 జూన్‌ 13న ఒక లేఖ రాశారు. రెండు సంవత్సరాల నుంచి తన తల్లి చికిత్స పొందుతున్నదని, దానికి సంబంధించిన వైద్యుల వివరణను కూడా జత చేసినా కనీసం లేఖ అందినట్లుగానీ, అనుమతి గురించి గానీ ఎలాంటి సమాధానం మంత్రి నుంచి రాలేదని ఆమె పేర్కొన్నారు. తాను కేవలం తల్లిని చూడటానికి మాత్రమే వస్తున్నట్లు, ఇతర కారణాలేమీ లేవని కూడా స్పష్టం చేసినప్పటికీ పట్టించుకోలేదు. విశ్వగురువు, అపరమానవతావాదిగా ప్రశంసలు పొందిన నరేంద్రమోడీ నాయకత్వంలోని అధికారులు ఒకసారి కాదు ఏడాదిలో ఏకంగా మూడు సార్లు తిరస్కరించారు. దీని గురించి అమెరికా మీడియాలో వార్తలు వచ్చిన తరువాత కూడా స్పందించలేదంటే కచ్చితంగా కావాలనే నిరాకరిస్తున్నట్లు భావించాల్సి వస్తోంది.

ఈ ఏడాది జనవరి తొమ్మిదిన ఆన్‌లైన్‌ ద్వారా క్షమ, ఆమె భర్త వీసా దరఖాస్తులను సమర్పించగా దాదాపు నెల రోజుల పాటు దరఖాస్తును తొక్కి పట్టి ఏ కారణం చెప్పకుండా మానసిక ఆందోళనకు గురిచేశారు. చివరికి భర్త కాల్విన్‌ ప్రీస్ట్‌కు మంజూరు చేసి క్షమకు తిరస్కరించారు. బెంగలూరులో ఉంటున్న తల్లి వసుంధరా రామానుజమ్‌ను పరామర్శించే నిమిత్తం ఇండియన్‌అమెరికన్‌ మహిళ క్షమా సావంత్‌(51) గతేడాది మే నెల నుంచి మూడు సార్లు దరఖాస్తు చేశారు. అమెరికాలోని మన దౌత్య కార్యాలయాలు అత్యవసర వీసా నిరాకరించాయి.తీవ్ర నేరారారోపణలతో జైళ్లలో ఉన్న నిందితులకు, శిక్షలు పడిన వారికి కూడా ఇలాంటి కారణాలతో పరిమిత బెయిలు మంజూరు చేసిన ఉదంతాలు మనకు తెలిసిందే. క్షమ సావంత్‌ నేరస్థురాలు కాదు, మన దేశ ఉగ్రవాద లేదా మరొక నిషేధిత జాబితాలో ఆమె పేరు లేదు. ఎలాంటి కేసులు లేవు. కానీ కారణాలు చూపకుండానే మీరు తిరస్కరణ జాబితాలో ఉన్నారంటూ అమెరికా వాషింగ్టన్‌ రాష్ట్రంలోని సియాటిల్‌ నగరంలో భారత కాన్సులేట్‌ దౌత్య కార్యాలయం 2025 ఫిబ్రవరి మొదటి వారంలో వీసా నిరాకరించింది. కారణం ఏమిటో చెప్పాలంటూ గట్టిగా అడిగినందుకు, చెప్పాల్సిన పని లేదని, కార్యాలయంలో అక్రమంగా ప్రవేశించారంటూ పోలీసులను పిలిపించింది. భర్త కాల్విన్‌ ప్రీస్ట్‌కు వీసా మంజూరు చేసి తనకు నిరాకరించటానికి నరేంద్రమోడీ విధానాలను వ్యతిరేకించే రాజకీయ కారణాలు తప్ప మరొకటి కాదని ఆమె ఎక్స్‌లో పేర్కొన్నారు.

మోడీ సర్కార్‌ తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సిఏఏ), జాతీయ పౌరనమోదు (ఎన్‌ఆర్‌సి)లను ఖండిస్తూ ఆమె ప్రాతినిధ్యం వహించిన సియాటిల్‌ నగరపాలక సంస్థలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కులవివక్షకు వ్యతిరేకంగా 2023లో అదే సంస్థలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదం పొందారు. కొన్ని కులాల వారి పట్ల వివక్ష చూపకూడదంటూ అమెరికా చరిత్రలో అధికారికంగా ఒక నగరంలో తీర్మానించటం ఇదే ప్రధమం.ఈ పరిణామం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించటమే గాక భారత్‌లో ఉన్న వివక్ష గురించి చర్చకు దారితీసింది. ఆమె సోషలిస్టు ప్రత్నామ్నాయం అనే సంస్థలో సభ్యురాలు. వీసా నిరాకరించిన కారణం చెప్పనందుకు తాను, తన భర్త , మద్దతుదారులతో కలిసి శాంతియుత పద్దతిలో ధర్నా చేశామని, వివరణ ఇచ్చేందుకు వారు తిరస్కరించారు, తెలుసుకోకుండా కదిలేది లేదని మేము తిరస్కరించటంతో వారు పోలీసులను పిలుస్తామని బెదిరించారంటూ ఆమె ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన మీద, మద్దతుదారులపై కూడా చేయి చేసుకున్నట్లు ఆ తెలిపారు. తనకు వీసా ఇవ్వకపోవటానికి నరేంద్రమోడీ ప్రభుత్వ తిరస్కరణ జాబితాలో పేరుండటమే అని ఒక అధికారి తనతో చెప్పినట్లు కూడా ఆమె మరో పోస్టులో పేర్కొన్నారు. వారాల తరబడి ఎలాంటి స్పందన లేకపోగా ఫోన్‌ ద్వారా సంప్రదించినా సమాధానం లేదన్నారు. వాషింగ్టన్‌ రాష్ట్రంలోని అతి పెద్ద నగరమైన సియాటిల్‌ సిటీ కౌన్సిల్లో సిఏఏ, ఎన్‌ఆర్‌సిలకు వ్యతిరేకంగా తాను తీర్మానాలు ప్రవేశ పెట్టటమే దీనికి కారణమని కూడా క్షమ పేర్కొన్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వ విధానాల పట్ల విమర్శనాత్మక వైఖరిని వెల్లడిరచిన స్వీడన్‌లో ఉన్న భారతీయ ప్రొఫెసర్‌ అశోక్‌ సవాయిన్‌, బ్రిటన్‌లో ఉన్న రచయిత నితాషా కౌల్‌కు సైతం ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. విదేశాల్లో ఉంటూ తమ ప్రభుత్వాన్ని విమర్శించటం ఏమిటన్న దురహంకారం, కక్ష తప్ప దీనిలో మరోటి కనిపించటం లేదు.

క్షమ సావంత్‌ మహారాష్ట్రలోని పూనాలో ఒక తమిళ కుటుంబంలో జన్మించారు. తల్లి స్కూల్‌ పిన్సిపల్‌గా పని చేశారు. క్షమ 13 ఏండ్ల వయస్సులో ఇంజనీరైన తండ్రి ఒక ప్రమాదంలో మరణించారు. ముంబైలో ఆమె చదువుకొని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరయ్యారు.1996లో అమెరికా వెళ్లిన తరువాత అర్థశాస్త్రంలో పిహెచ్‌డి చేసి కొంతకాలం ప్రొఫెసర్‌గా పని చేశారు. అక్కడే ఆమె 2006లో వామపక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు.అంతకు ముందు ఆమెకు రాజకీయాలతో సంబంధం లేదు. 2012లో వాషింగ్టన్‌ ప్రజాప్రతినిధుల సభకు పోటీచేసి ఓడిపోయారు. తరువాత సియాటిల్‌ నగరపాలక సంస్థ ఎన్నికల్లో గెలిచి 2014 నుంచి 2024వరకు ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో కులవివక్ష వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదింప చేయించటంతో పాటు కనీసం వేతనం గంటకు 15 డాలర్ల చట్టాన్ని అమలు జరిపించటంలో కూడా ఆమె పట్టుబట్టారు. కుల వివక్షకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదింప చేసేందుకు ఆమె కృషి చేయటాన్ని, సిఎఎ, ఎన్‌ఆర్‌సి చట్టాలను ఖండిస్తూ తీర్మానాలను చేయించటాన్ని అమెరికాలోని హిందూత్వశక్తులు జీర్ణించుకోలేకపోయాయి.


కుల వివక్ష వ్యతిరేక తీర్మానం చేయించటంలో కీలక పాత్ర పోషించటాన్ని హిందూ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వీసా తిరస్కరణ వెనుక ఈ అంశం ఉందా అన్న ప్రశ్నకు ఇంతకు మించి బిజెపి ప్రభుత్వ రాజకీయ నిర్ణయం వెనుక మరొక కారణం కనిపించటం లేదు అన్నారు. నేను ఒక సోషలిస్టును, పదేండ్ల పాటు కార్మికవర్గ ప్రతినిధిగా సియాటిల్‌ కౌన్సిల్లో ఉన్నాను, ఆ సమయంలో నేను ప్రజా ఉద్యమ నిర్మాణానికి, కనీసవేతనం గంటకు 15డాలర్లకు పెంచాలని కోరుతూ నా పదవిని వినియోగించాను. ఇప్పుడది 20.76 డాలర్లకు పెరిగింది. అమెరికాలో ఇది గరిష్టం. పేదల గృహ నిర్మాణాలకు కార్పొరేట్‌ సంస్థలు వాటా చెల్లించాలని కూడా నేను పని చేశాను.2020 ఫిబ్రవరిలో సిఏఏ, ఎన్‌ఆర్‌సి చట్టాలను ఖండిస్తూ సియాటిల్‌ కౌన్సిల్లో పెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ శాన్‌ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ కార్యాలయం నాకు ఒక లేఖ పంపింది. అమెరికాలోని హిందూత్వ శక్తులు, మోడీ మద్దతుదార్లనుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నాం.2023 ఫిబ్రవరిలో కులవివక్షపై చారిత్రాత్మక నిషేధాన్ని ప్రకటించటంలో విజయం సాధించాం. మాకు విశ్వహిందూ పరిషత్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లడైంది. మితవాద హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌, ఉత్తర అమెరికా హిందువుల సంఘటన మాకు వ్యతిరేకంగా పని చేశాయి. అందువలన మోడీ ప్రభుత్వం, అమెరికాలోని దాని మద్దతుదార్లు మాకు వ్యతిరేకంగా ఉన్నారనటంలో ఎలాంటి సందేహం లేదు. వారందరికీ నా రాజకీయ అభిప్రాయాలు ఏమిటో తెలుసు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు అనుమతించకపోవటం అమానుషం, ఏ రకమైన ప్రభుత్వమిది. నా వీసా తిరస్కరణ వెనుక రాజకీయ కారణాలు లేవని మోడీ సర్కార్‌ చెప్పుకోవాలంటే వీసా మంజూరు చేసి నిరూపించుకోవచ్చని క్షమ పేర్కొన్నారు.

అమెరికాకు వెళ్లిన వారు అందరూ అని కాదు గానీ ఎక్కువ మంది తమతో పాటు కులతత్వాన్ని, కులవివక్షను కూడా తీసుకుపోయారు. ఈ మధ్య దానికి మతాన్ని కూడా తోడు చేశారు. మన దేశంలో మత ప్రాతిక మీద పని చేసే సంస్థలన్నింటికీ అమెరికా శాఖలు ఉన్నాయి. దక్షిణాసియా నుంచి వచ్చిన దళితులు, ఇతర అణచివేతకు గురైన కులాల వారు అమెరికాలో కూడా దాన్ని తప్పించుకోలేకపోతున్నారు.కార్నెగీ ఎండోమెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ అనే సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం విద్యాపరంగా మూడిరట ఒక వంతు, పని స్థలాల్లో , మూడిరట రెండువంతుల మంది వివక్షను ఎదుర్కొన్నట్లు తేలింది. తక్కువగా చూడటం, సూటిపోటి మాటలు, లైంగిక వేధింపుల గురించి 30 మంది దళిత మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు తమ అనుభవాలను బహిరంగ లేఖ రూపంలో వెల్లడిరచారు. సిస్కో సిస్టమ్స్‌ కంపెనీలో అగ్రవర్ణాలుగా భావించబడుతున్నవారు తనకు రావాల్సిన ఉద్యోగోన్నతి, వేతన పెంపుదలను ఎలా అడ్డుకుంటున్నారో వెల్లడిస్తూ దాఖలు చేసిన కేసును ఒక దళత సామాజిక తరగతికి చెందిన ఇంజనీరు గెలిచారు. ఆ తరువాత వందలాది మంది తాము ఎదుర్కొన్న వివక్ష గురించి గళం విప్పారు. ఈ పూర్వరంగంలోనే క్షమ సావంత్‌ సియాటిల్‌ సిటీ కౌన్సిలర్‌గా వివక్షకు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదింప చేయించారు. లేని సమస్య ఉన్నట్లు, అతిగా చేసి పరువు తీస్తున్నారంటూ హిందూత్వ సంస్థలు, అగ్రకుల నాయకత్వంలోని సంస్థలు ఆమె మీద ధ్వజమెత్తాయి. సియాటిల్‌ కౌన్సిల్లో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన వారు ఎక్కువ మంది కౌన్సిలర్లు ఉన్నారు. వారు తొలుత తీర్మానానికి మద్దతు ఇవ్వలేదు. మితవాదులు ముందుకు తెచ్చిన వాదనలనే వారు వల్లించారు. చివరి వరకు ఏదో విధంగా అడ్డుకోవాలని చూశారు. అయితే వారి మీద వచ్చిన వత్తిడి కారణంగా ఒకరు తప్ప మిగతావారందరూ ఓటు వేయటంతో తీర్మానం నెగ్గింది.

క్షమా సావంత్‌ అలుపెరగని పోరాట యోధురాలిగా ఉన్నారు.కార్మికవర్గాన్ని దోచుకుంటున్న ధనికులు, వారికి మద్దతు ఇస్తున్న అధికార రిపబ్లిక్‌, ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీల వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి 22న సియాటిల్‌ నగరంలో ఒక సభను ఆమె నాయకత్వంలో పని చేస్తున్న వర్కర్స్‌ స్ట్రైక్‌ బాక్‌ సంస్థ నిర్వహిస్తున్నది. డెమోక్రటిక్‌ సోషలిస్టుగా ఉన్న బెర్నీ శాండర్స్‌ కూడా అందరికీ అందుబాటులో వైద్యం వంటి అంశాలలో జో బైడెన్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదించారని కూడా ఆమె విమర్శించారు. ఆ రెండు పార్టీలకు ప్రత్నామ్నాయంగా మరొక పార్టీ నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని గతంలో ప్రకటించారు. దళితుల సమస్యల మీద ఆ సామాజిక తరగతికి చెందిన వారు మాత్రమే సక్రమంగా స్పందించగలరని వారు మాత్రమే పోరాటాలకు నాయకత్వం వహించాలని చెబుతున్న వారు క్షమ పోరాటం, ఆమె ఎదుర్కొంటున్న వేధింపులను చూసిన తరువాత తమ సంకుచిత వైఖరిని మార్చుకోవాలని సూచించటం తప్పుకాదేమో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మనుస్మృతిపై మద్రాస్‌ హైకోర్టు తీర్పు : హిందూత్వ మనువాదుల మనోభావాలకు చెంపపెట్టు !

14 Tuesday Jan 2025

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, Left politics, Literature., NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION, Women

≈ Leave a comment

Tags

BHU, BJP, Hinduthwa, Madras HC, Manusmriti, RSS, VCK

ఎం కోటేశ్వరరావు


ఉన్నది ఉన్నట్లు చెప్పినా తమ మనోభావాలను దెబ్బతీశారంటూ దెబ్బలాటలకు దిగుతున్న రోజులివి.తరతరాలుగా జరుగుతున్నదే. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని నాటి క్రైస్తవ మతగ్రంధాలు, జ్యోతిష గ్రంధాలు చెప్పినది వాస్తవం కాదని సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నదని నిరూపించిన ఖగోళశాస్త్రజ్ఞుడు నికోలస్‌ కోపర్నికస్‌పై ఐదు వందల సంవత్సరాల క్రితమే నాటి క్రైస్తవ మతవాదులు దాడి చేశారు, మూర్ఖుడని నిందించారు. చరిత్రలో ఏ మతవాదీ నిజాన్ని అంగీకరించిన దాఖలా లేదు. మన దేశంలో హిందూత్వ, ఇస్లామిక్‌, క్రైస్తవ మతవాదులు దానికి అతీతులు కాదు. అలాంటి వారికి 2025జనవరి మొదటి వారంలో మద్రాస్‌ హైకోర్టు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చింది. తమిళనాడులో విడుతలై చిరుతాయిగల్‌ కచ్చి(విసికె) అనే పార్టీ ఎంపీ తిరుమవలన్‌. అతని మీద 2020లో ఒక ప్రైవేటు కేసు నమోదైంది.అదేమిటంటే పెరియార్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌లో ఫిర్యాదుదారు ఒక కార్యక్రమాన్ని చూశారు. తిరుమవలన్‌ మరొక వ్యక్తితో కలసి హిందూ మహిళల గురించి బహిరంగంగా చెప్పిన మాటలు వారి స్థాయిని దిగజార్చేవిగా ఉన్నాయని, వారి గురించి ఒక తప్పుడు కథనాన్ని చెప్పారని, వాటిని విని ఒక హిందువుగా అవమానకరంగా భావించానని, తన మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నందున తగిన చర్యలు తీసుకొని శిక్షించాలన్నది కేసు సారం. ఆ కేసులో పసలేదని దాన్ని కొట్టివేయాలంటూ తిరుమవలన్‌ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. దాని మీద విచారణ జరిపిన న్యాయమూర్తి పి.వేలుమురుగన్‌ కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. కరోనా సమయంలో పెరియార్‌ మరియు భారత రాజకీయాలు అనే అంశంపై యూరోపియన్‌ పెరియార్‌ అంబేద్కర్‌ కామ్రేడ్స్‌ ఫెడరేషన్‌ నిర్వహించిన అంతర్జాతీయ అంతర్జాల సమావేశంలో తిరుమవలన్‌ ప్రసంగించారు. దానిలో మనుస్మృతిలో ఉన్న కొన్ని అంశాలను ప్రస్తావించారు. అవి తమ మనోభావాలను దెబ్బతీశాయన్నది కేసు. అయితే తిరుమలన్‌ మనుస్మృతిలో ఉన్న అంశాలను ప్రస్తావించి వాటికి అర్ధం చెప్పారు తానుగా కొత్తగా చెప్పిందేమీ లేనందున ఎలాంటి చర్య తీసుకోవనవసరం లేదంటూ న్యాయమూర్తి కేసును కొట్టివేశారు. తిరోగామి భావజాలం గురించి గతంలోనే అనేక మంది చీల్చి చెండాడారు.వాటిని పునశ్చరణ చేయవచ్చు, మరింతగా వివరించవచ్చు. అంతే కాదు ఈ తీర్పుతో ఒకటి స్పష్టమైంది. ఎవరినీ కొట్టావద్దు తిట్టావద్దు, పురాతన సంస్మృత గ్రంధాల్లో ఉన్న వాటి అసలు అర్ధాలను చెబుతూ వాటిని జనంలోకి మరింతగా తీసుకువెళితే చాలు. ముంజేతిని చూసుకొనేందుకు అద్దాలు అవసరం లేదు.


ఇదే అంశంపై మద్రాస్‌ హైకోర్టులో దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని 2020 నవంబరులో జస్టిస్‌ ఎం సత్యనారాయణన్‌, జస్టిస్‌ ఆర్‌ హేమలత డివిజన్‌ బెంచి కొట్టివేసింది.ఎస్‌ కాశీరామలింగం దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో బిజెపి నేత, న్యాయవాది ఆర్‌సి పాల్‌ కనకరాజ్‌ వాదించారు.ఉనికిలో లేని మనుస్మృతిని నిషేధించాలని పార్లమెంటు సభ్యుడు కోరుతూ చేసిన ప్రసంగం అశాంతికి, వివిధ తరగతులను రెచ్చగొట్టటానికి దోహదం చేసినందున సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని కోర్టును కోరారు. ప్రసంగం చేయటమే గాక దాన్ని నిషేధించాలని కూడా డిమాండ్‌ చేశారన్నారు. మనుస్మృతి రాజ్యాంగబద్దమైనదేమీ కాదని, అందువలన దాన్ని ఫలాన విధంగానే చదవాలనే నిబంధనేమీ లేదని, రెండువేల సంవత్సరాల నాటి గ్రంధానికి భాష్యాలు చెప్పవచ్చని అందువలన ఎంపీపై చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు తీర్పు చెప్పింది.దానిలో చెప్పిన నైతిక నియమావళి రాజ్యాంగబద్దం కాదని, వాటిని అమలు జరపలేమని న్యాయమూర్తులు పేర్కొన్నారు.వాద ప్రతివాదనల సందర్భంగా తమ పిటీషన్ను ఉపసంహరించుకొని రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన అంశాలతో మరొక పిటీషన్‌ దాఖలు చేసేందుకు అనుమతించాలని న్యాయవాది పాల్‌ కనకరాజ్‌ కోర్టును కోరారు.చివరికి పిల్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ అంశం మీదే జిల్లా కోర్టులో ఒక ప్రైవేట్‌ కేసును దాఖలు చేశారు.దాన్ని ఈ నెలలో హైకోర్టు కొట్టివేసింది.


బహుశా ఆ తమిళనాడు పిటీషనర్‌ మనుస్మృతిలో ఏమి రాసి ఉందో చదివి, అర్ధం చేసుకొని ఉంటే నిజంగానే సిగ్గుపడి ఆ కేసు దాఖలు చేసి ఉండేవారు. ఆ గ్రంధాన్ని పరమపవిత్రంగా పూజించేవారు ఉన్నారు.మద్రాస్‌ హైకోర్టు తీర్పు మరో ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది. కర్ణాటకలో మైసూరు విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్‌, ప్రముఖ రచయిత, హేతువాది కెఎస్‌. భగవాన్‌. రామాయణం ఉత్తరకాండలో ఉన్న వాటిని గురించి చెప్పినందుకు హిందూత్వవాదులు అంతుచూస్తామని బెదిరించారు. గత కొద్ది సంవత్సరాలుగా ఆయన ఈ అంశాలను చెబుతున్నారు. ఉత్తరకాండలో ఉన్నదాని ప్రకారం రాముడు పదకొండువేల సంవత్సరాలు పాలించలేదని, పదకొండు ఏళ్లు మాత్రమే రాజుగా ఉన్నట్లు, అడవుల్లో తాను మద్యం తాగుతూ సీతాదేవిని కూడా తాగమని కోరినట్లు, కొందరు రామరాజ్యం తెస్తామని చెబుతున్నారని, రాముడు ఆదర్శప్రాయుడేమీ కాదని భగవాన్‌ చెప్పిన అంశాలు తమ మనోభావాలను గాయపరచినట్లు కొందరు ప్రైవేటు కేసును దాఖలు చేశారు. సీతాదేవిని అడవుల పాల్జేసి పట్టించుకోని, శూద్రుడైన శంబుకుణ్ని వధించిన రాముడిని ఎలా సమర్ధిస్తారని భగవాన్‌ ప్రశ్నించారు.‘‘ ప్రొఫెసర్‌ కల్‌బుర్గి, గోవింద్‌ పన్సారే, నరేంద్ర దబోల్కర్‌లను హత్యచేసినవారు ఇప్పుడు నన్ను కూడా చంపుతామని బెదిరిస్తున్నారు, వారికి నేను చెప్పదలచుకున్నది ఒక్కటే, మీరు మా మీద దాడి చేయవచ్చు, ముక్కలుగా నరకవచ్చు కానీ మారచనలు సజీవంగానే ఉంటాయి. వారు నన్ను చంపవచ్చు తప్ప నా వైఖరిని మార్చలేరు ’’ అని భగవాన్‌ స్పష్టం చేశారు. ఈ వివాదం తరువాత కొంత మంది అసలు ఉత్తరకాండను వాల్మీకి రాయలేదని, తరువాత కొందరు దాన్ని చేర్చారని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రామాయణాలు అనేకం ఉన్నాయి. దేన్ని సాధికారికంగా తీసుకోవాలో చెప్పినవారెవరూ లేదు. ఎవరికీ అలాంటి సాధికారత లేదు.ఎవరైనా పుచ్చుకుంటే దానితో అంగీకరించాలని కూడా లేదు.


మనుస్మృతిలో రాసినవి, వాటి ఆచరణ చూసి తన మనోభావాలు తీవ్రంగా గాయపడిన కారణంగానే బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ వంద సంవత్సరాల క్రితమే దాన్ని తగులబెట్టి నిరసన వెల్లడిరచారు. సదరు మనువాదాన్ని మరింతగా ముందుకు తీసుకుపోవాలని, అది లేకుండా రచించిన రాజ్యాంగాన్ని విమర్శిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక సంపాదకీయాలు రాసింది. ఆ చర్య మనోభావాలను దెబ్బతీయటమే కాదు, రాజ్యాంగాన్ని వ్యతిరేకించటం నేరం.నక్సలైట్స్‌గా పరిగణించే వారు రాజ్యాంగాన్ని ఆమోదించం అని చెబుతారు, వారికీ ఆర్‌ఎస్‌ఎస్‌ వారికీ పెద్ద తేడా లేనట్లే కదా ? వారు అడవుల్లో చెబితే కాషాయ దళాలు జనారణ్యంలో ఆపని చేశాయి. రాజ్యాంగ నిర్మాతలు పక్కన పెట్టిన మనుస్మృతిని తమ న్యాయశాస్త్ర విద్యార్ధులకు పాఠ్యాంశంగా పెట్టాలని ఢల్లీి విశ్వవిద్యాలయం నిర్ణయించింది. కోర్టులలో అమలు చేసే శిక్షాస్మృతులను పాఠాలుగా చెప్పాలి, శిక్షణ ఇవ్వాలి తప్ప ఇలాంటి చర్యలతో అధికారికంగా మనువాదులను తయారు చేసే వ్యవహరం తప్ప మరొకటి కాదు. ఇలాంటి బలవంతాలు చేసే శక్తులు ఒక వైపు రెచ్చిపోతుంటే మరోవైపు దాన్ని వ్యతిరేకించేవారు కూడా ఎప్పటికప్పుడు తయారవుతారు. నూతన ఆర్థిక విధానాల పేరుతో కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన సంస్కరణలు దేశంలో ఆర్థిక అసమానతలను మరింతగా పెంచి, కార్పొరేట్‌ జలగలకు జనాలను అప్పచెప్పాయి. వాటిని మరింత వేగంగా అమలు జరుపుతున్న బిజెపి నూతన విద్యావిధానం పేరుతో తన కాషాయ అజెండాను దేశం మీద రుద్దేందుకు పూనుకుంది. దానిలో భాగమే సిలబస్‌లో మనువాదాన్ని చేర్చటం. మరింతగా మనువాదులను న్యాయవ్యవస్థలో చేర్చేందుకు వేసిన పథకమిది. సమాజంలో సగం మందిగా ఉన్న మహిళలకు విద్య, సమానహక్కులు, సాధికారతను పూర్తిగా వ్యతిరేకించే తిరోగమన భావాలను బలవంతంగా అధ్యయనం చేయించేందుకు చూస్తున్నారు. అంతేకాదు, శూద్రులు,దళితులుగా ఉన్న 85శాతం మంది గురించి కూడా దాన్నిండా వ్యతిరేకతలే, మొత్తంగా మన రాజ్యాంగానికి, దానికి స్ఫూర్తికి వ్యతిరేకమైనది.


ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో భగత్‌ సింగ్‌ స్టూడెంట్స్‌ మోర్చా(బిఎస్‌ఎం)కు చెందిన వారు డిసెంబరు 25న మనుస్మృతి గ్రంధంపై ఒక చర్చ నిర్వహించారు, తరువాత తగులబెట్టేందుకు నిర్ణయించారు. ఆ సందర్భంగా ముగ్గురు విద్యార్ధినులతో సహా 13 మందిని పోలీసులు అరెస్టు చేసి కేసు పెట్టారు. పదిహేడు రోజుల తరువాత వారు బెయిలు మీద జనవరి 11న విడుదలయ్యారు. ఈ విశ్వవిద్యాలయంలో మనుస్మృతిపై పరిశోధన చేసే వారికి ఫెలోషిప్‌ ఇస్తున్నారు. దాని గురించి చర్చించేవారిని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా మన నేతన్నలను దెబ్బతీసిన విదేశీ వస్త్రదహనం ఒక పోరాట రూపంగా ఉన్న సంగతి తెలిసిందే. అదే విధంగా దిష్టిబొమ్మల దహనం కూడా. సమాజంలో స్త్రీలు, మెజారిటీ కులాల వారిపట్ల వివక్ష, దురాచారాలను ప్రోత్సహించే మనుస్మృతికి వ్యతిరేకంగా ఒక నిరనస రూపంగా దాన్ని దహనాన్ని అంబేద్కర్‌ ఎంచుకున్నారు.తొలిసారిగా 1927లో స్వయంగా ఆపని చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా డిసెంబరు 25ను మనుస్మృతి దహన దినంగా పాటిస్తున్నారు. ఎక్కడో అక్కడ అది కొనసాగుతూనే ఉంది. బెనారస్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులు హింసాకాండకు, దాడులకు పాల్పడ్డారంటూ తప్పుడు కేసులు పెట్టారు.కస్టడీలో పోలీసులు వారిని కొట్టారు, దుస్తులు చించివేశారు, బెదిరించారు. ఉగ్రవాద వ్యతిరేక దళ పోలీసులు వారిని విచారించటాన్ని బట్టి ఎలాంటి నేరాలు మోపారో, ఉత్తర ప్రదేశ్‌లో ఎలాంటి రాజ్యం నడుస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు.పదేండ్ల వరకు శిక్షలు పడే సెక్షన్లతో నేరాలను మోపారు. తాము భగత్‌ సింగ్‌బాబా సాహెబ్‌ వారసులమని హిందూత్వ శక్తులు తమను అణచేందుకు చూస్తున్నాయని బిఎస్‌ఎం నేతలు చెప్పారు.

ఒక్క మనుస్మృతే కాదు అనేక పురాణాలు, ఇతర గ్రంధాలు, వెంకటేశ్వరసుప్రభాతం వంటి వాటిలో ఉన్న అశ్లీలత, బూతు గురించి అనేక మంది గతంలోనే రాశారు. అందువలన వాటన్నింటినీ నేటి తరాలకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం కూడా ఉంది.ఉదాహరణకు సుప్రభాతంలో ఇలా ఉంది.

కమలాకుచ చూచుక కుంకుమతో

నియతారుని తాతుల నీలతనో

కమలాయతలోచన లోకపతే

దీనికి అర్ధం ఏమిటంటే లక్ష్మీదేవి చనుమొనలయందున్న కుంకుమ పూవు రంగువలన అంతటా ఎర్రగా చేయబడిన రంగుగల వాడా అని హేతువాది వెనిగళ్ల సుబ్బారావు వివరణ ఇచ్చారు.దీన్ని చదివి ఎవరైనా మా మనోభావాలను దెబ్బతీసిందని కేసులు వేస్తే కుదరదు. ఫలానాదే నిర్థిష్ట అర్ధం అని నిర్ధారణ ఉంటే దాన్నే ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఇంకా ఇలాంటివి మరికొన్ని ఉన్నాయి. ఉత్తర కాండలో సీతా రాముల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పినందుకు వివాదం రేపటాన్ని కూడా చూశాము. మనోభావాల పేరుతో ఉన్మాదాన్ని, ఉద్రేకాలను రెచ్చగొట్టటం, దాడులకు పూనుకోవటం తగని పని. మేము చెప్పిందే భాష్యం ఇతరులెవరూ చెప్పటానికి వీల్లేదు అంటే కుదరదు.మద్రాసు హైకోర్టు కేసులో మనోభావం గాయపడిరదని చెప్పుకున్న వ్యక్తి హాజరై మనుస్మృతిలో చెప్పిన దానికి పవిత్రమైన అర్ధం ఇదని చెప్పలేదు, అసలు కోర్టుకే రాలేదని మీడియాలో వార్తలు వచ్చాయి. ఎవరైనా మూడవ పక్షంగా చేరి అసలు అర్ధం చెప్పారా అంటే అది కూడా లేదు. మనుస్మృతిని పాటిస్తున్నామని లేదా పాటించాలని చెప్పేవారి కుటుంబాలలో మహిళలను దానిలో చెప్పినట్లుగానే ఉంచుతున్నారా ? ఉంటున్నారా ? దాని మీద ప్రమాణం చేసి చెప్పమనండి. ఇస్లామిక్‌ షరియాలో కూడా అలాంటివే ఉన్నాయి. వర్తమానానికి వర్తించవు. చిత్రం ఏమిటంటే షరియాను విమర్శించేవారు దానికి ఏమాత్రం తగ్గని, కొన్ని విషయాల్లో అంతకంటే ఎక్కువ తిరోగమన సూత్రాలు ఉన్న మనుస్మృతిని మాత్రం పవిత్రమైనది, మార్పులేని సనాతనమైనదిగా పరిరక్షించాలని కోరటమే కాదు, అమలు జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు.అసలు సనాతనం అంటే ఏమిటో చెప్పలేని వారు కూడా వీర సనాతన్‌ అంటూ ముసుగులు వేసుకొని వీరంగం వేస్తున్నారు. అంబేద్కర్‌ కంటే ముందుగా సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే(182790) మనుస్మృతిని సవాలు చేశారు. దానిపేరుతో బ్రాహ్మణులు అనుసరిస్తున్న పద్దతులను వ్యతిరేకించారు, దళితులు, ఇతరుల దుస్థితిని వెలుగులోకి తెచ్చారు.నూతన తరాలు భావజాల పోరులో భాగంగా పూలే, అంబేద్కర్‌ చెప్పిన వాటిని మరింతగా జనంలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడు ధన్యజీవి ! దేవదూత అన్న నోటితోనే మానవుడిని అని చెప్పుకున్న నరేంద్రమోడీ !!

11 Saturday Jan 2025

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION

≈ Leave a comment

Tags

BJP, Modi as God, Modi's Podcast, Narendra Modi Failures, non-biological, RSS

ఎం కోటేశ్వరరావు


ఇంతకీ నరేంద్రమోడీ ఎవరు ? లోక్‌సభ ఎన్నికలకు ముందు చెప్పినట్లు మహత్తర లక్ష్యం కోసం దేవుడు పంపిన దూత అనుకోవాలా ? తాజాగా చెప్పినట్లు మానవుడినే కానీ దేవుడిని కాదు, తప్పులు చేసి ఉంటా అనే మాటలు నమ్మాలా ? మోడీ గురించి తెలిసిన వారు ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగు ధన్యుడు అనుకుంటారు. ఇక తేల్చుకోవాల్సింది భక్తులే ! అప్పుడు దేవుడు ఎందుకు పంపాడని చెప్పారో ఇప్పుడు మానవుడినే అని ఎందుకు అన్నారో మోడీ ఎలాగూ నోరు విప్పరు గనుక ఆయన ప్రధమ గణాలు వివరించాలి. ఈ కాలంలో మోడీ నెరవేర్చిన లేదా మిగిలిపోయిన మహత్తర లక్ష్యం ఏమిటో ఎవరికైనా తెలుసా ? జరోధా అనే సంస్థ తరఫున నిఖిల్‌ కామత్‌ 2025 జనవరిలో మోడీతో నిర్వహించిన పాడ్‌కాస్ట్‌ ( ఒక జర్నలిస్టు జరిపే ముఖాముఖీ`ప్రశ్నలు ముందే ఇవ్వాలి, ఇంటర్య్వూ సమయంలో మోడీని ఇబ్బందికరమైన కొత్త ప్రశ్నలు అడగకూడదు అనే షరతులు వర్తిస్తాయి)లో అనేక అంశాలను వివరించారు. తనకు దేశమే ప్రధమ లక్ష్యం అన్నారు. గుజరాత్‌ సిఎంగా పని చేస్తున్నపుడే మరో ఇరవై సంవత్సరాల పాటు పనిచేసే బృందాన్ని తాను తయారు చేశానని, ఇప్పుడు కూడా చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఆ బృందంలో ఎవరున్నారో వెల్లడిరచలేదు, వ్యక్తుల పేర్లు చెబితే అనేక మంది ఇతరులకు అన్యాయం చేసినట్లు అవుతుందని చెప్పుకున్నారు. దీన్ని బట్టి ఆ బృందం ఒక బ్రహ్మపదార్ధం అనాల్సి ఉంటుంది.ప్రతివారినీ తన ఖాతాలో వేసుకోవచ్చు. మరికొన్ని సుభాషితాలు, స్వంత గొప్పలు ఇలా ఉన్నాయి. తప్పులు సహజం కానీ దురుద్ధేశ్యాలతో చేయలేదు, నేనూ తప్పులు చేసి ఉంటాను, నేను మనిషిని దేవుడిని కాదు. నేను ఒక విలక్షణమైన రాజకీయవేత్తను కాదు.నేను ఎన్నికల సమయంలో రాజకీయ ప్రసంగాలు చేయాల్సి ఉంటుంది. అది నాకు తప్పనిసరి, నాకది ఇష్టం లేదు గానీ చేయాల్సి ఉంటుంది. పాడ్‌కాస్ట్‌ ఇలా సాగింది. మహాత్మా గాంధీ, సావర్కర్‌ మార్గాలు వేరైనా ఇద్దరూ స్వాతంత్య్రం కోసమే పోరాడారంటూ ఇద్దరూ ఒకటే అన్నట్లుగా చిత్రించారు. జైలు నుంచి విడుదల చేస్తే బ్రిటీష్‌ వారికి సేవ చేసుకుంటానని, స్వాతంత్య్ర ఉద్యమానికి దూరంగా ఉంటానంటూ ప్రేమ లేఖలు రాసిన సావర్కర్‌ను గాంధీతో పోల్చటం చరిత్ర వక్రీకరణ తప్ప మరొకటి కాదు.

ఎనిమిది నెలల క్రితం తన జన్మ జీవ సంబంధమైనది కాదని (2024 లోక్‌సభ ఎన్నికల చివరి దశ) లో నరేంద్రమోడీ చెప్పుకున్నారు, ఇప్పుడు మానవుడిని అని చెప్పుకోవటం నష్ట నివారణ చర్య అని స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్‌ నేత జయరామ్‌ రమేష్‌ వ్యాఖ్యానించారు. భూమ్మీద తన ఉనికి కేవలం జీవ సంబంధమైనది కాదని, తన తల్లి మరణించిన తరువాత తనను దేవుడు భూలోకంలోకి ఒక లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు పంపాడని తనకున్న శక్తులను చూసిన తరువాత తానీ మాటలు చెప్పగలుగుతున్నట్లు మోడీ చెప్పిన సంగతి తెలిసిందే. ‘‘ నా తల్లి బతికి ఉన్నంత వరకు నేను కూడా జీవసంబంధంగానే జన్మించానని అనుకున్నాను. కానీ తరువాత అనుభవాలను చూస్తే పరమాత్ముడు ఒక లక్ష్యం కోసం పంపాడని నేను నమ్మాను, ఆ లక్ష్యం నెరవేరిన తరువాత మరోసారి నాతో పని ఉండదు. అందువల్లనే నేను పూర్తిగా దేవుడి కోసం అంకితమయ్యాను, నేను ఒక సాధనాన్ని తప్ప మరొకటి కాదు ’’ అంటూ అదానీ యాజమాన్యంలోని ఎన్‌డిటివితో మోడీ చెప్పారు.( ఆ లక్ష్యం ఏమిటో, ఎంత వరకు వచ్చింది, పూర్తి చేసిందీ లేనిదీ చెప్పలేదు) ఒక సామాన్యుడు ఇలాంటి మాటలు మాట్లాడితే అలాంటి వారిని నేరుగా మానసిక వైద్యుడి వద్దకు తీసుకు వెళతారు అంటూ అప్పుడు రాహుల్‌ గాంధీ అపహాస్యం చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా మోడీ మారు మాట్లాడలేదు. అంతకు కొద్ది రోజుల ముందు తననెవరూ దెబ్బతీయలేరని, తాను మూడు, ఐదు చివరికి ఏడు ఎన్నికలైనా సరే గెలుస్తూనే ఉంటానని చెప్పుకున్నారు.తనకు ఓటు వేయటం అంటే పుణ్యం చేసుకోవటమే అని కూడా చెప్పారు. మోడీ చుట్టూ ఉన్నవారు కూడా ఆయనను ఆకాశానికి ఎత్తిన తీరు చూశాము. ఎంతగా అంటే పూరీ జగన్నాధుడు కూడా నరేంద్రమోడీ భక్తుడేనని ఒడిషాకు చెందిన బిజెపి నేత సంబిత్‌ పాత్ర వర్ణించి తరువాత నోరు జారినట్లు చెప్పుకున్న సంగతి తెలిసిందే.

చరిత్రలో అవతార పురుషులమని ప్రదర్శించుకున్నవారందరూ ఇలాగే ఒక లక్ష్యం కోసం ఉద్భవించినట్లు చెప్పుకున్నవారే. దైవదూతను అన్న నోటితోనే అదానీ, అంబానీలు రాహుల్‌ గాంధీకి టెంపోల నిండుగా నోట్ల కట్టలు పంపారని తుచ్చ మానవుల మాదిరి మోడీ ఎన్నికల సమయంలో ఆరోపణ చేసిన సంగతిని గుర్తుకు తెచ్చుకోవాలి. అంటే ఆ పారిశ్రామిక, వాణిజ్యవేత్తల వద్ద లెక్కల్లో చూపని నల్లధనం పెద్ద ఎత్తున ఉందని చెప్పటమే. బహుశా ఆ వ్యాఖ్యల తరువాత తన స్నేహితుల గురించి మాట్లాడిరది తప్పని తెలిసిందో లేక వారి నుంచి హెచ్చరికలు వచ్చాయో తెలియదు గానీ తరువాత మరోసారి ప్రస్తావించలేదు. అంతే కాదు ప్రతిపక్షపార్టీల నేతలందరూ ముజ్రా పనులు చేస్తున్నారంటూ దిగువ స్థాయి విమర్శలు కూడా చేశారు.(ఉత్తరాదిన వేశ్యలతో కులీనులు చేసే గానాబజానాలను ముజ్రా అంటారు). తనకు ఇల్లూ, సంసార బంధాలు లేవు, దేశం కోసమే పుట్టినట్లు నరేంద్రమోడీ చెప్పుకుంటారు, భక్తులు కూడా అదే చెబుతారు. గుజరాత్‌ రాజధాని గాంధీ నగర్‌లో ధనికులు నివసించే ప్రాంతంలో తనకు ఒక ఇంటి స్థలం ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్న అంశాన్ని కారవాన్‌ పత్రిక వెల్లడిరచింది. ముఖ్యమంత్రిగా ఉండగా తన పేరున తానే మంజూరు చేసుకున్న స్థలమది. దాని మీద వివాదం చెలరేగటం, కోర్టులకు ఎక్కటంతో సదరు స్థలాన్ని పార్టీకి ఇస్తానని మోడీ చెప్పారు. ఏ బంధాలు లేని తాను స్థలం తీసుకోవటం ఎందుకు, తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేయకుండా పార్టీకి ఇస్తానని చెప్పటం ఏమిటి ? ఈ స్థలం ఉన్న అంశం గురించి మసిబూసి మారేడు కాయ చేసే ప్రయత్నం జరిగిందనే ఆరోపణ ఉంది.

నరేంద్రమోడీ గురించి ఉన్నతంగా చిత్రించేందుకు ప్రశాంత కిషోర్‌ వంటి నిపుణులెందరో పని చేశారన్నది బహిరంగ రహస్యం. దానికి గోడీ మీడియా ఎంతగానో సహకరించిందని అనేక మంది విమర్శలు చేసింది కూడా వాస్తవమే.2019లో ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోడీ పేరుతో ఒక ప్రచార సినిమా కూడా తీశారు. వాస్తవాల ఆధారంగా తీసినట్లు చెప్పిన ఆ సినిమాలో వక్రీకరణలు, అవాస్తవాలెన్నో, అన్నింటినీ త్యజించి దేశం కోసమే మోడీ పాటుపడుతున్నట్లు చిత్రించారు.ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా పనిచేసిన నరేంద్రమోడీ బాల్యంలో ఒక చేత్తో టీ అమ్ముతూ మరో చేత్తో జాతీయ జండాను పట్టుకున్నట్లు, దానికి వందనం చేసినట్లు చూపారు. వాస్తవం ఏమంటే అదే ఆర్‌ఎస్‌ఎస్‌ స్వాతంత్య్రం వచ్చిన తరువాత 52 సంవత్సరాల పాటు జాతీయ జండాను ఎగురవేయటానికి నిరాకరించింది, బాల్యంలోనే జాతీయ భావాలతో పెరిగినట్లు సినిమాలో చూపిన మోడీ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌లో భాగస్వామే.శ్రీనగర్‌ లాల్‌ చౌక్‌లో ఆర్మీ పహారాలో బిజెపి నేత మురళీ మనోహర జోషి జాతీయపతాకాన్ని ఎగురవేశారు. కానీ ఈ చిత్రంలో నరేంద్రమోడీ ఆ పని చేశారని చిత్రించటం కళ్ల ముందే చరిత్రను వక్రీకరించటం తప్ప మరొకటి కాదు. దేశ చరిత్రలో ఏ ప్రధానీ చేయని విధంగా గుళ్లు గోపురాలు తిరిగి, ధ్యానం పేరుతో ఫొటో ప్రదర్శనలు, అయోధ్యలో రామాలయ ప్రారంభం సందర్భంగా అన్నీ తానై చేసిన హడావుడి, బాలరాముడి చిత్రంతో నరేంద్రమోడీ బొమ్మ పెట్టి వేసిన పోస్టర్లు, ఫ్లెక్సీలు, వాటన్నింటికీ పరాకాష్టగా అసలు తనది జీవసంబంధ జన్మ కాదని చెప్పుకొనేంత వరకు వెళ్లింది. ఇప్పుడు తాను మానవుడనే అని, తప్పులు చేయటం సహజం అని చెప్పుకోవటం కూడా తన గురించి తాను గొప్పగా చెప్పుకోవటంలో భాగమే అన్నది స్పష్టం.మాట మార్చి తాను మానవమాత్రుడనని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది ? అయోధ్యలో బిజెపి ఓడిపోవటం, వారణాసిలో తన మెజారిటీ భారీగా పడిపోవటం, లోక్‌సభలో ఒక పార్టీగా బిజెపికి సంపూర్ణ మెజారిటీని తీసుకురావటంలో వైఫల్యం, గతంకంటే ఓట్లు కూడా తగ్గటం, దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారుడు, ఎటు చూసినా వైఫల్యాలే కనిపిస్తుండగా తాను దైవాంశ సంభూతుడనని, తన శక్తి గురించి చెప్పుకొనే అవకాశాలు ఆవిరయ్యాయి. వీటి గురించి ఎవరు ఎక్కడ ప్రశ్నిస్తారో అని గ్రహించి తాను కూడా మానవ మాత్రుడనేనని, వైఫల్యాలు సహజమేనని చెప్పుకొనేందుకు చూసినట్లు కనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎత్తిన ఎర్ర జెండా దించం – అమెరికాకు ఏనాటికీ తల వంచం : అరవై ఆరేండ్ల క్యూబా సోషలిస్టు విప్లవం !

01 Wednesday Jan 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Che Guevara, Cuba Communist Party, Cuban Ration Book, Donald trump, Fidel Castro, Joe Biden, Sixty five years Socialist Cuba

ఎం కోటేశ్వరరావు

క్యూబా సోషలిస్టు విప్లవం 66వ ఏడాదిలో ప్రవేశించింది.1953 జూలై 26న నియంత బాటిస్టా పాలనకు వ్యతిరేకంగా ప్రారంభమైన తిరుగుబాటు 1959 జనవరి ఒకటిన విప్లవోద్యమ నేత ఫిడెల్‌ కాస్ట్రో అధికారానికి రావటంతో ముగిసింది. ఐదు సంవత్సరాల ఐదు నెలల ఐదవ రోజు 1958 డిసెంబరు 31న బాటిస్టా ప్రభుత్వాన్ని కూల్చివేశారు. విప్లవాన్ని మొగ్గలోనే తుంచి వేసేందుకు వెంటనే అమెరికా ఆర్థిక దిగ్బంధనాన్ని ప్రారంభించి, క్రమంగా తీవ్రతరం కావించింది. నాటి నుంచి నేటి వరకు అక్కడ ఎనుగు పార్టీ(రిపబ్లికన్‌)గాడిద పార్టీ(డెమోక్రటిక్‌) ఎవరు అధికారంలో ఉన్నా మానవాళి చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ దిగ్బంధనం కొనసాగుతూనే ఉంది. అమెరికాకు క్యూబా కూతవేటు దూరంలో ఉంది. రెండు దేశాల సమీప భూభాగాల మధ్య దూరం కేవలం 90 మైళ్లు లేదా 145 కిలోమీటర్లు మాత్రమే. కరీబియన్‌ సముద్ర మెక్సికో అఖాతం, అట్లాంటిక్‌ మహాసముద్రం కలిసే ప్రాంతంలో ఉన్న కోటీ 12లక్షల జనాభాతో ప్రధాన భూభాగానికి అనుబంధంగా 4,195 చిన్నా, పెద్ద దీవులు ఉన్న దేశం. నవరంధ్రాలు మూసివేసి ప్రాణాలు తీసినట్లుగా అన్ని రకాల దిగ్బంధాలతో అక్కడి జనాన్ని మాడిస్తే వారు తిరుగుబాటు చేసి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసి తమ ఒడిలో కూర్చుంటారని 65 ఏండ్లుగా అమెరికా చూస్తున్నది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్యానికి తలొగ్గకుండా ఆత్మగౌరవంతో పితృదేశమా ( కొన్ని దేశాలు పితృసామిక వ్యవస్థను అనుసరించి అలా పిలుచుకుంటాయి.దేశ భక్తిలో ఎలాంటి తేడా ఉండదు) లేక మరణమా అన్న ఆశయంతో ముందుకు సాగుతున్నది.


క్యూబా విప్లవానికి ఒక ప్రత్యేకత ఉంది. కమ్యూనిస్టుల నాయకత్వాన విముక్తి పోరాటాలు జరగటం అధికారానికి రావటం సాధారణంగా జరిగింది. అదే క్యూబాలో అధికారానికి వచ్చిన తరువాత కాస్ట్రో తదితర విప్లవకారులు కమ్యూనిస్టులుగా మారారు.1952లో ఎన్నికల ద్వారా పాలకులను ఎన్నుకోవటాన్ని సహించని మిలిటరీ జనరల్‌ ఫల్లునేసియో బాటిస్టా కుట్రద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దాన్ని వ్యతిరేకించిన ప్రజాస్వామికవాదుల్లో కాస్ట్రో ఒకరు. కొంత మంది కోర్టులో సవాలు చేసి బాటిస్టాను గద్దె దింపాలని చూసి విఫలమయ్యారు.తరువాత 1953 జూలై 26న సోదరుడు రావుల్‌తో కలసి కాస్ట్రో తదితరులు మంకాడా మిలిటరీ బారక్స్‌ మీద విఫల దాడి చేశారు. దాంతో వారందరినీ అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అక్కడే జూలై 26 ఉద్యమం పేరుతో సంఘటితమయ్యారు. కేసు విచారణ సందర్భంగా కోర్టులో రెండు గంటల పాటు కాస్ట్రో తిరుగుబాటు కారణాలను వివరించి దేశమంతటా ప్రాచుర్యం పొందారు.పౌరుల్లో వచ్చిన సానుభూతిని చూసిన తరువాత తిరుగుబాటు చేసిన వారిని విడుదల చేసి ప్రజామద్దతు పొందాలని బాటిస్టా క్షమాభిక్ష ప్రకటించాడు. విప్లవకారులు మెక్సికో, తదితర దేశాలకు ప్రవాసం వెళ్లి 1956లో తిరిగి గ్రాన్మా అనేక నౌకలో తిరిగి వచ్చారు.(తరువాత కాలంలో ఆ నౌక పేరుతోనే పత్రిక నడుపుతున్నారు) మెక్సికోలో పరిచయమైన చే గువేరా కూడా వారితో వచ్చాడు. బాటిస్టా మిలిటరీ వారిని ఎదుర్కోవటంతో సియెరా మెస్ట్రా అనే ప్రాంతానికి వెళ్లి అక్కడ బాటిస్టాను వ్యతిరేకించే పాపులర్‌ సోషలిస్టు పార్టీ వంటి వారందరినీ కూడా గట్టి దాడులకు దిగారు.చివరికి 1958 డిసెంబరు 31న విజయం సాధించటంతో బాటిస్టా దేశం వదలి పారిపోయాడు.1959జనవరి ఒకటిన కాస్ట్రో అధికారానికి వచ్చాడు.జూలై 26 ఉద్యమం పేరుతో ఉన్న వారు కీలక పాత్ర పోషించారు. తరువాత మార్క్సిజంలెనినిజాన్ని ఆమోదించి 1965 అక్టోబరులో క్యూబా కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారు.అయితే విప్లవంలో కీలక ఘట్టమైన జూలై 26వ తేదీని విప్లవ దినంగా పరిగణించారు.

మేం వైద్యులను ఎగుమతి చేస్తాం తప్ప బాంబులను కాదని అర్జెంటీనా రాజధాని బ్యూనోస్‌ఎయిర్స్‌ నగరంలో 2003లో క్యూబా అధినేత ఫిడెల్‌ కాస్ట్రో చెప్పాడు.మా దేశం ఇతర దేశాల పౌరుల మీద బాంబులు వేయదు లేదా నగరాల మీద బాంబులు వేసేందుకు వేలాది విమానాలను పంపదు. మాకు అణు, రసాయన లేదా జీవ ఆయుధాలు లేవు. ప్రాణాలను రక్షించేందుకు లక్షలాది మంది వైద్యులను మా దేశంలో తయారు చేశాము. మనుషులను చంపే బాక్టీరియా, వైరస్‌, ఇతర పదార్ధాలను సృష్టించేందుకు శాస్త్రవేత్తలు, వైద్యులను తయారు చేయాలనే అవగాహనకు భిన్నంగా మేము పని చేస్తున్నాము అని కాస్ట్రో ఆ సభలో చెప్పాడు. హవానా నగరంలో నిర్వహిస్తున్న లాటిన్‌ అమెరికా మెడికాలేజీ 25వ వార్షికోత్సవాన్ని నవంబరు నెలలో నిర్వహించారు. ‘‘జీవిత సంరక్షకులుమెరుగైన ప్రపంచ సృష్టికర్తలు ’’ అనే ఇతివృత్తంతో ఒక సదస్సును ఏర్పాటు చేశారు. సామాన్య జనం కోసం వైద్యం చేయాలనే లక్ష్యంతో అనేక దేశాల నుంచి విద్యార్థులు అక్కడ చేరుతున్నారు. కరీబియన్‌ ప్రాంతంలోని దేశాలకు తరచూ వస్తున్న హరికేన్‌ల వలన జరుగుతున్న అపార నష్టాన్ని చూసిన తరువాత అలాంటి సమయాల్లో వైద్యుల అవసరాన్ని గుర్తించి ఈ కాలేజీని ప్రారంభించారు. మొత్తం లాటిన్‌ అమెరికా, కొందరు ఆఫ్రికా, అమెరికా నుంచి కూడా వచ్చి చేరుతున్నారు.


గత పాతికేండ్లలో 120దేశాలకు చెందిన వారు 31,180 మంది వైద్యులుగా తయారు కాగా ప్రస్తుతం 1,800 మంది విద్యార్ధులున్నారు. హవానాకు పశ్చిమంగా ఉన్న నౌకా కేంద్రాన్ని కాలేజీగా మార్చారు. మొదటి రెండు సంవత్సరాలు అక్కడ ఆసుపత్రులతో అవసరం లేని బోధన చేస్తారు. నాలుగు సంవత్సరాల పాటు క్యూబాలోని బోధనా ఆసుపత్రులలో శిక్షణ ఇస్తారు. ఈ కాలేజీ విద్యార్థి, ప్రస్తుతం హొండూరాస్‌లో శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రిగా పని చేస్తున్న లూథర్‌ కాస్టిలో హారీ పాతికేండ్ల వార్షికోత్సవంలో మాట్లాడుతూ అసాధ్యాలకు వ్యతిరేకంగా పోరాడినపుడే సుసాధ్యాలతో లబ్దిపొందుతామని, ప్రతి ఒక్కరూ క్యూబా విప్లవ రాయబారిగా పని చేస్తూ ప్రపంచంలో అతి గొప్ప శాస్త్రీయ సంస్థను ఏర్పాటు చేయాలని ఆకాంక్షించాడు.హరికేన్‌ కారణంగా చేపడుతున్న సహాయ చర్యల కారణంగా ఈ ఉత్సవానికి హాజరు కాలేకపోయిన క్యూబా అధ్యక్షుడు మిగుయెల్‌ డియాజ్‌ కానెల్‌ సందేశాన్ని పంపారు. మీ మీ దేశాలలో జీవితాల, ఆరోగ్య సంరక్షకులుగా తయారైన మిమ్మల్ని చూసి ఫిడెల్‌ కాస్ట్రో బతికి ఉంటే ఎంతో సంతోషించేవారన్నాడు. మూడంచెల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో భాగంగా 69 వైద్య ప్రత్యేక చికిత్స కేంద్రాలు, 149 ఆసుపత్రులు, 451పాలిక్లినిక్‌లు, 11,315 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో నాలుగు లక్షల మంది సిబ్బంది పని చేస్తున్నారు. ప్రతివెయ్యి మందికి మొత్తం 80వేల మందిఒక వైద్యుడు లేదా వైద్యురాలు ఉన్నారు. పదమూడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, 2,767 వైద్య పరిశోధనా ప్రాజెక్టులు, 82క్లినికల్‌ ప్రయోగాలు నడుస్తున్నాయి. నూటఅరవై దేశాలలో ఆరులక్షల మంది క్యూబన్లు వైద్య సేవలు అందిస్తున్నారు.


క్యూబా సర్కార్‌ జనానికి అందిస్తున్న సబ్సిడీ ఆహార పధకాన్ని అదిగో రద్దు చేస్తున్నారు ఇదిగో రద్దు చేస్తున్నారంటూ గత రెండు దశాబ్దాలుగా అమెరికా, దాని ఉప్పు తింటున్న మీడియా కథనాలు రాస్తూనే ఉంది. కొన్ని సందర్భాలలో దుర్వినియోగం జరిగినపుడు పథకాన్ని సవరించటం గురించి మాట్లాడారు తప్ప ఎత్తివేత గురించి కాదు. ఉదాహరణకు ప్రతినెలా 18 ఏండ్లు దాటిన వారికి ఆహార వస్తువులతో పాటు 80 సిగిరెట్లు కూడా నామమాత్ర ధరలకు సరఫరా చేసే వారు. కొందరు పొగతాగని వారు వాటిని తీసుకొని బహిరంగ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకొనే వారు. ఇలాంటి వాటిని అరికట్టాలను కోవటం సబ్సిడీ ఎత్తివేత కిందకు రాదు. సోవియట్‌, ఇతర తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాలు కూలిపోయిన తరువాత క్యూబా అనేక తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నమాట నిజం. అవి ఉనికిలో ఉన్నపుడు కూడా ఉన్నదేదో కలసి తింటాం లేకుంటే కాళ్లు ముడుకు పడుకుంటాం తప్ప అమెరికా ముందు చేయిచాచం అని ఫిడెల్‌ కాస్ట్రో దశాబ్దాల క్రితమే చెప్పారు. దానిలో భాగంగానే ఆహార సబ్సిడీ`పంపిణీ పధకాన్ని ప్రారంభించారు. దాన్నే రేషన్‌ బుక్‌ అని పిలుస్తున్నారు. ప్రతి ఏటా ఒక పుస్తక రూపంలో కూపన్లు ఇస్తే దుకాణాల్లో వాటితో సరకులు తీసుకుంటారు.1962 నుంచి ఈ పథకం అమల్లో ఉంది.ప్రతి ఒక్కరికీ ప్రతినెలా బియ్యం, బీన్స్‌, బంగాళాదుంప, అరటికాయలు, బఠాణీ గింజలు, కాఫీ, వంటనూనె, గుడ్లు, మాంసం, కోడి మాంసం, పిల్లలకు పాలు సరఫరా చేస్తున్నారు.2010వరకు సబ్సిడీ ధరలకు సిగిరెట్లు కూడా సరఫరా చేశారు.ఈ మధ్య పోషకాహార లేమివలన క్యూబాలో మరణాల రేటు 2022 నుంచి 2023కు 74.42శాతానికి పెరిగిందంటూ కొన్ని పత్రికలు పతాక శీర్షికలతో వార్తలను ఇచ్చాయి.అక్కడ సంభవిస్తున్న మరణాలకు కారణాలలో పోషకాహార లేమి 20వదిగా ఉంది. ఇంతకూ పైన పేర్కొన్న సంవత్సరాలలో మరణించిన వారి సంఖ్య 43 నుంచి 75కు పెరిగింది(74.42శాతం). కోటి మంది జనాభా, అష్టకష్టాలు పడుతూ,80శాతం ఆహారాన్ని దిగుమతి చేసుకుంటున్న అక్కడ మరణాలు అవి. ప్రపంచానికి ఆహారాన్ని అందచేసే స్థితిలో ఉన్నామని మన ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన మన దేశంలో 140 కోట్ల జనాభాలో పోషకాహార లేమి కారణంగా ఎందరు మరణిస్తున్నారో తెలుసా ! హిండ్‌రైజ్‌ డాట్‌ ఓఆర్‌జి సమాచారం ప్రకారం మనదేశంలో రోజుకు ఏడువేల మంది మరణిస్తున్నారు. ఐదేండ్లలోపు వయస్సున్న పిల్లల మరణాలలో 69శాతం పోషకాహార లేమి కారణమని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా సుప్రీం కోర్టుకు 2022లో తెలిపింది. ఒక సోషలిస్టు వ్యవస్థకు అంతకంటే మెరుగైనది సర్వేజనా సుఖినో భవంతు సమాజం ఉంది అనుకుంటున్న మన వ్యవస్థకు ఉన్న అంతరం ఏమిటో వేరే చెప్పాలా ?


మన దేశంలో ఆహార భద్రతా చట్టం అమల్లో ఉంది. దానిలో భాగంగా 80 కోట్ల మందికి గతంలో సబ్సిడీ బియ్యం లేదా గోధుమలు ఇవ్వగా ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నారు. అయినా మనదేశం 2024 ప్రపంచ ఆకలి సూచిక 127దేశాలలో 105వదిగా ఉంది. పదేండ్ల అచ్చేదిన్‌లో ఆకలి తీవ్రంగా ఉన్న దేశాల సరసన మనదేశాన్ని ఉంచిన ఘనత విశ్వగురువు నరేంద్రమోడీకి దక్కింది. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం 171దేశాల జాబితాలో మన దేశంలో పోషకాహార లోపం ఉన్నవారు 2011లో 18.35 కోట్ల మంది ఉంటే, 2023లో 19.46 కోట్ల మందికి పెరిగారు. నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువ. పోషకాహార లేమి నామమాత్రంగా ఉన్నప్పటికీ ఆయా దేశాలలో 2.5శాతం మంది ఉన్నట్లు లెక్కిస్తారు. అలాంటి దేశాల జాబితాలో చైనా, క్యూబా ఇంకా అనేక దేశాలు ఉన్నాయి. మనదేశంలో పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ దాన్ని గుర్తించటానికి మోడీ సర్కార్‌ ససేమిరా అంటున్నది.క్యూబా ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారటానికి, ఇతర సమస్యలకు కారణం అమెరికా విధించిన ఆర్థిక దిగ్బంధనమే. ఆంక్షలను తొలగించాలని ప్రతి ఏటా ఐరాసలో తీర్మానం పెట్టటం, అమెరికా, దాని తొత్తు ఇజ్రాయెల్‌ వ్యతిరేకించటం మిగిలిన దేశాలన్నీ సమర్థించటం తెలిసిందే. అయితే ఐరాస సాధారణ అసెంబ్లీ తీర్మానాలకు పూచికపుల్ల పాటి విలువ కూడా లేదు. వాటిని దిక్కరించిన దేశాలను చేసేదేమీ లేదు. అమెరికా దిగ్బంధనం వలన ప్రపంచంలో మరోదేశమేదీ క్యూబా మాదిరి నష్టపోవటం లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది ? ప్రపంచ మంతటా కమ్యూనిజాన్ని అరికడతానంటూ బయలు దేరిన అమెరికన్లకు తమ పెరటితోట వంటి క్యూబాలో కమ్యూనిస్టులు అధికారంలో ఉండటం అవమానకరంగా మారింది. గతంలో డోనాల్డ్‌ ట్రంప్‌ అమలు జరిపిన కఠిన ఆంక్షలను సడలిస్తానని జో బైడెన్‌ ప్రకటించినప్పటికీ అలాంటదేమీ జరగలేదు, పదవీ కాలం ముగియనుంది, తిరిగి ట్రంప్‌ గద్దె నెక్కనున్నాడు. అమెరికా దిగ్బంధనం కారణంగా ప్రతి నెలా క్యూబా 42 కోట్ల డాలర్లు నష్టపోతున్నదని అంచనా, ఎన్నాళ్లీ దుర్మార్గం !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d