• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Economics

సుప్రీం కమిటీపై కందకు లేని అనుమానం కాషాయదళాలకెందుకు ? ఆర్‌ఎస్‌ఎస్‌ తీరుపై మద్దతుదార్ల మండిపాటు !

05 Sunday Mar 2023

Posted by raomk in BJP, CHINA, Communalism, Congress, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Adani Group, Adani-Hindenburg row, BJP, Narendra Modi Failures, RSS, Saffron gang, Supreme Court of India



ఎం కోటేశ్వరరావు


తప్పనిసరి పరిస్థితి ఏర్పడి తప్పు చేసినట్లు ఒక వేళ గౌతమ్‌ అదానీ అంగీకరించినా అతని మద్దతుదారులైన కాషాయదళాలు మాత్రం ఒప్పుకొనేట్లు కనిపించటం లేదు. అదానీ కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు హిండెన్‌బర్గ్‌ సంస్థ ఇచ్చిన నివేదిక సృష్టించిన సంచలనం, ఆ కంపెనీల వాటాల విలువ పతనం గురించి తెలిసిందే. ఆ నివేదిక ఆరోపణల మీద విచారణ జరపాలని సుప్రీం కోర్టు ఆరుగురితో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీం మాజీ న్యాయమూర్తి ఎఎం సప్రే చైర్మన్‌గా ఎస్‌బిఐ మాజీ చైర్మన్‌ ఓ ప్రకాష్‌ భట్‌, ఇన్ఫోసిస్‌ సహ ప్రారంభకుడు నందన్‌ నీలెకని, ప్రస్తుతం ఎన్‌బిఎఫ్‌ఐడి చైర్మన్‌గా, గతంలో ఐసిఐసిఐ, బ్రిక్స్‌ బాంకు, ఇన్ఫోసిస్‌ చైర్మన్‌గా పని చేసిన కెవి కామత్‌, ప్రముఖ లాయర్‌ సోమశేఖర సుందరేశన్‌, హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జెపి దేవధర్‌ సభ్యులుగా ఉన్నారు. దాన్ని తాము స్వాగతిస్తున్నామని నిజం వెల్లడౌతుందని అదానీ ఒక ప్రకటనలో స్పందించారు. కానీ కందకు లేని అనుమానం కత్తిపీటకు వచ్చినట్లు సుప్రీం కోర్టు కమిటీ తటస్థంగా వ్యవహరిస్తుందా అంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ నడిపే నేషనలిస్ట్‌ హబ్‌ అనే మీడియా పోర్టల్‌ ప్రశ్నించింది.సభ్యులుగా ఉన్నవారికి గతంలో ఆర్థికనేరాలకు పాల్పడినవారు కొందరితో ఉన్న సంబంధాలివి, మోడీని విమర్శించే సంస్థలతో కాంగ్రెస్‌తో సంబంధాలు అంటూ ఇలాంటి వారు తటస్థంగా ఉండి నివేదిక ఇస్తారా అన్న అనుమానాలను రేకెత్తించింది. దాని మీద ఇవ్వరు ఇవ్వరు అంటూ వెంటనే స్పందనలు.


దేశంలో ఇప్పుడు జరుగుతున్న తీరు తెన్నులను బట్టి జనం ప్రతిదాన్నీ అనుమానిస్తున్నపుడు ఏ కమిటీని వేసినా దానిలో ఉన్నవారిని అనుమానించటం సహజం. తానెలాంటి తప్పు చేయలేదని అదానీ తలకిందులుగా తపస్సు చేస్తున్నప్పటికీ, నరేంద్రమోడీ మద్దతుగా ఉన్నా, ఆర్‌ఎస్‌ఎస్‌ సర్టిఫికెట్‌ ఇచ్చినా పక్కన పెట్టేసి హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికను స్టాక్‌మార్కెట్లో మదుపుదార్లు నమ్మారు. తమ వాటాలను తెగనమ్ముకొన్నారు.నెల రోజులు దాటినా జరిగిన నష్టంలో మార్పు లేదు. అడ్డగోలుగా పెంచి పెద్దచేసినా, ఇబ్బందులు వచ్చినపుడు నరేంద్రమోడీ కూడా అదానీని కాపాడలేరని కూడా స్టాక్‌మార్కెట్‌ మదుపుదార్లలో ఉన్నట్లు ఈ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఇటువంటి స్థితిలో సంఘపరివార్‌ సంస్థ సుప్రీం కమిటీ మీద అనుమానాలను ఎందుకు రేకెత్తించినట్లు ? భీమకొరేగాం కేసులో మాదిరి దర్యాప్తు సంస్థే స్టాన్‌స్వామి, ఇతరుల కంప్యూటర్లలో తప్పుడు సమాచారాన్ని చొప్పించి దాన్నే సాక్ష్యంగా చూపేందుకు చూసిన దారుణం తెలిసిందే. అదానీ కంపెనీల్లో అలాంటిదానికి అవకాశం లేదు.వివరాలను ఇప్పటికే ధ్వంసం చేయగా మిగిలిన వాటి నుంచే అక్రమాలకు పాల్పడిందీ లేనిదీ కమిటీ నిర్ధారిస్తుంది. లేదూ ఒకదానికొకటి పొంతనలేని సమాచారం ఇస్తే దాన్ని కూడా సుప్రీం కోర్టుకు అందిస్తుంది. సెబీ కూడా దర్యాప్తు జరుపుతున్నది. ఒక నియంత్రణ సంస్థగా సెబీ తీరు తెన్నుల వైఫల్యం గురించి కూడా సుప్రీం కమిటీ విచారణ జరుపుతుంది. తమ కమిటీకి సహకరించాలని సెబీని సుప్రీం ఆదేశించింది. సుప్రీం కమిటీలో వెలుగుచూడనివి సెబీ నివేదికలో లేదా సెబీలో రానివి సుప్రీం కమిటీ నివేదికలో చోటు చేసుకోవచ్చు. ఆ రెండు నివేదికలూ బహిర్గతమైన తరువాత గతంలో దర్యాప్తు జరిపిన హిండెన్‌బర్గ్‌ లేదా ఆ రంగంలో నిపుణులైన వారు లేవనెత్తే అంశాలను కూడా సుప్రీం కోర్టు విచారిస్తుంది. ఇంత జరగాల్సి ఉండగా ఇంకా ఆలూలేదూ చూలూ లేదు కొడుకుపేరు సోమలింగమా అన్నట్లుగా సంఘపరివార్‌ మీడియా ఎందుకు అనుమానాలు రేకెత్తిస్తున్నట్లు ? హిండెన్‌బర్గ్‌ నివేదికలోని అంశాలన్నింటినీ సుప్రీం కోర్టు కమిటీ విచారించటం లేదు. మన దేశంలో తిమ్మినిబమ్మిని చేసినట్లు వచ్చిన ఆరోపణల మీదనే అది పరిశీలన జరుపుతుంది. విదేశాల్లోని డొల్లకంపెనీలు, నిధుల మళ్లింపు వంటి వాటి మీద ఏదైనా అనుమానం వచ్చే సమాచారం దొరికితే దాన్ని సుప్రీం కోర్టుకు నివేదించే అవకాశం ఉంటుంది.సుప్రీం కోర్టు విచారణ సందర్భంగా మీడియా ఎక్కువ చేసి రాస్తున్న వార్తల వలన స్టాక్‌ మార్కెట్‌ ప్రభావితమై మదుపర్లు నష్టపోతున్నందున అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదం గురించి వార్తలపై నిషేధం విధించాలన్న పిటీషన్‌దారుల్లో ఒకరైన ఎంఎల్‌ శర్మ వినతిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. సహేతుకమైన వాదనలు వినిపించండి తప్ప నిషేధాన్ని అడగవద్దని చెప్పింది.


ప్రతిపక్షాలు పార్లమెంటులో డిమాండ్‌చేసిన జెపిసికి మోడీ సర్కార్‌ అంగీకరించి ఉంటే సుప్రీం కోర్టు కమిటీ ఉందేదీ కాదు, దాని మీద నేషనలిస్ట్‌ హబ్‌కు సందేహాలు లేవనెత్తే అవకాశం వచ్చి ఉండేది కాదు. జెపిసి పక్షపాతంగా పని చేసే అవకాశమే లేదు. ఎందుకంటే దానిలో అత్యధికులు అదానీని కంటికి రెప్పలా కాపాడుతున్న బిజెపి లేదా మిత్రపక్షాల సభ్యులే ఉంటారు.అయినా మోడీ ఎందుకు నిరాకరించినట్లు ? ఏ పార్టీ మంది ఎందరని కాదు, ఎవరెందరున్నా అడిగిన సమాచారాన్ని కమిటీకి ఇవ్వాలి, లేకుంటే ఇవ్వలేదని సభ్యులు రాస్తారు. మెజారిటీ ఒక నివేదికను ఆమోదించినా,దానితో విబేధించేవారు కూడా మరొక నివేదికను ఇచ్చే హక్కు ఉంటుంది. ఆ రెండూ బహిరంగం చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎవరు అదానీని కాపాడేందుకు పూనుకున్నది, ఎవరు అక్రమాలను వెలికి తీసేందుకు చూసిందీ యావత్‌ ప్రపంచానికి తెలుస్తుంది. గతంలో నరేంద్రమోడీకి ఉందని చెప్పిన 56 అంగుళాల ఛాతీ ఇప్పుడు లేక కాదు, ఈ కారణంగానే భయపడ్డారు.


సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల మీద వత్తిడి తీసుకురారా, బెదిరించరా అంటే ఈ దేశంలో ఏదైనా జరిగే అవకాశం ఉంది. అదీ ప్రభుత్వం వైపు నుంచే ఉంటుంది. మన ప్రజాస్వామ్యానికి ముంచుకు వస్తున్న ముప్పు అదే ! తమ ముందు దాఖలైన కేసుల్లో సుప్రీం నోటీసులు ఇచ్చిన తరువాత గానీ కేంద్రం కదలలేదు.కమిటీ ఏర్పాటుకు అంగీకరిస్తూ తమ ప్రతిపాదనలను ఒక మూసివేసిన కవరులో పెట్టి సుప్రీం కోర్టుకు అందించింది. దాని అర్దం ఏమిటి ? మేము చెప్పిన వారితో చెప్పినపద్దతుల్లో విచారణ జరిపించాలని సుప్రీంను ప్రభుత్వం ఆదేశించటమే.పారదర్శక విచారణ జరగాలంటూ సదరు కవరును సుప్రీం కోర్టు తిరస్కరించింది. నిజానికి కేంద్రానికి అంతకంటే అవమానం మరొకటి లేదు, బహుశా ఈ పరిణామాన్ని ఊహించి ఉండరు. ఇంతకీ ఆ కవరులో నరేంద్రమోడీ సర్కార్‌ రాసిన అంశాలేమిటి అన్నది ఇప్పటి వరకు వెల్లడికాలేదు. ఇక అవకాశాలు లేవు.తరువాత అవి లీకైనా కేంద్రం తోసిపుచ్చే అవకాశం ఉంటుంది.


కొన్ని సందర్భాల్లో కేసుల స్వభావాన్ని బట్టి కోర్టులు ప్రభుత్వాలు, ఏజన్సీలను కోరిన సమాచారాన్ని సీల్డు కవర్‌లో అందించాలని అడుగుతాయి. అదానీ కంపెనీలదంతా బహిరంగం అయినపుడు విచారణ రహస్యంగా జరగాల్సిన అవసరం ఏముంది ? కమిటీ విచారణ అంశాలు, పరిధి గురించి పిటీషనర్లకు తెలియాల్సి ఉన్నందున ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ తిరస్కరించి ఒక కమిటీని తానే ఏర్పాటు చేసింది. గతేడాది నవంబరులో కేరళ టీవీ ఛానల్‌ మీడియా వన్‌ కేసులో కేంద్ర ప్రభుత్వ సీల్డుకర్‌ను సుప్రీం తిరస్కరించింది. కక్షిదారు వాటిని చూడకుండా అవకాశాన్ని నిరోధించటమే అవుతుందని పేర్కొన్నది. నిబంధనల ప్రకారం ఒక అంశాన్ని రహస్యమని భావించి సీల్డు కవర్‌లో ఉంచాలని ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తులు గనుక నిర్ణయిస్తే ప్రజా ప్రయోజనం పేరుతో దాన్ని చూసేందుకు, కాపీ కావాలని కోరేందుకు అవకాశం లేదు. మాజీ మంత్రి పి చిదంబరం అరెస్టయిపుడు బెయిలు కేసులో ఇడి సమర్పించిన సీల్డు కవర్‌ మీద ఆధారపడిన ఢిల్లీ హైకోర్టును 2019లో సుప్రీం కోర్టు తప్పు పట్టింది.తమ మనస్సులను సంతృప్తిపరచుకొనేందుకు న్యాయమూర్తులకు సీల్డు కవర్‌లోని అంశాలను చూసేందుకు అధికారం ఉన్నపుడు కోర్టు విచారణలో వాటిలో కనుగొన్న వాటిని నమోదు చేయకూడదని పేర్కొన్నది.రాఫెల్‌ విమానాల కొనుగోల వివరాలు రహస్యం అని ప్రభుత్వం చెప్పటాన్ని కోర్టు అంగీకరించింది.2జి స్పెక్ట్రం కేసులో కూడా అదే జరిగింది.


ప్రతి వ్యవస్థ తాము చెప్పినట్లు నడవాలని, తమ కనుసన్నలలో మెలగాలని దేశంలోని మితవాద శక్తులు కోరుకుంటున్నాయి.ఈ కారణంగానే తమకు నచ్చని తీర్పులు, పని తీరును అవి సహించలేకపోతున్నాయి. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలదా లేక కొంత మంది అధికారులదా నిర్ణయాధికారం అంటూ జడ్జీల కొలీజియం విధానంపై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. బిబిసి డాక్యుమెంటరీ నిషేధంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు ఇవ్వటాన్ని జీర్ణించుకోలేదు. దేశ వ్యతిరేకులకు సుప్రీం కోర్టు ఒక పనిముట్టుగా మారిందంటూ హిందూత్వ అనుకూల శక్తులు ధ్వజమెత్తాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక(హిందీ) పాంచజన్య సంపాదకీయంలో దీన్నే పేర్కొన్నది.సుప్రీం కోర్టు ప్రజలు చెల్లించిన పన్నులతో నడుస్తున్నది.భారత్‌కు అనుకూలమైన భారత చట్టాల ప్రకారం నడుచుకొనేందుకు మన ప్రయోజనాలకు అనుగుణంగా నడిచేందుకు ఏర్పాటు చేసినదే సుప్రీం కోర్టు.అలాంటి దానిని దేశ వ్యతిరేకులు ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారని పాంచజన్య మండిపడింది. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్‌ అదానీ ఎంత లబ్ది పొందితే చైనాకు అంత నష్టం అని పేర్కొన్నది. చౌకబారుతనం తప్ప ఆర్థికంగా అసలు చైనాకు భారత్‌కే పోలికలేదు, ఇంక అదానీ ఎంత ! అదానీ సంపదను సృష్టించాడు.భారత పురోగమనంలో భాగస్వాములైన వారి మీద దాడి చేయకూడదని సంస్థ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ పేర్కొన్నారు.


మితవాద శక్తులలో సహనం ఇప్పటికే నశించి మైనారిటీల మీద తెగబడుతున్న తీరుతెన్నులు తెలిసిందే.చివరికి అది ఆర్‌ఎస్‌ఎస్‌ మీదకు కూడా మళ్లుతున్నది. నయా ఇండియా అనే పత్రికలో శంకర్‌ సహారా అనే రచయిత ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి రాసిన వ్యాసంలో హిందువుల ప్రయోజనాలను రక్షించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ చేయాల్సినంత చేయటం లేదంటూ ధ్వజమెత్తారు.” లాఠీలను పంచుతూ హిందువుల్లో ఉన్న వీరత్వాన్ని పొగిడే సాహిత్యాన్ని ప్రచురిస్తూ ముస్లిం దురాక్రమణకు వ్యతిరేకంగా నేరుగా పోరాడాలంటూ సంఫ్‌ు పుట్టింది.పరిస్థితి ఇప్పటికీ అదే విధంగా ఉంది.వాస్తవానికి అంతకు ముందుకంటే మరింత దిగజారింది. ఇలా ఉండగా మూడోవంతు దేశంలో హిందువులు తగ్గారు.దేశాన్ని విభజించి రెండు హిందూ వ్యతిరేక దేశాలను ఏర్పాటు చేశారు. చివరికి మిగిలిన స్వదేశంలో కూడా హిందువులు చట్టపరంగా రెండవ తరగతి పౌరులుగా మారారు.విద్య,దేవాలయాలను వారి నుంచి లాగివేసుకున్నారు. ఇలాంటివి బ్రిటిష్‌ వారి ఏలుబడిలోనూ జరగలేదు.కానీ ఈ సమస్యల మీద పోరాటాలకు దూరంగా ఉండటమే కాదు సంఘపరివార్‌ నేతలు నోరు విప్పటం కూడా మానుకున్నారు.బాధ్యతల్లో ఉన్న సంఫ్‌ు నాయకులు, కార్యకర్తలూ వారి విధానాలు లేదా కార్యకలాపాలను అధికారికంగా ముందుకు తీసుకుపోవాలని కోరుకోవటం లేదు. దానికి బదులు (ఉదాహరణకు గోల్వాల్కర్‌, సుదర్శన్‌,మధోక్‌, వాజ్‌పాయి) ఏ సర్‌ సంఫ్‌ు సంచాలక్‌ లేదా అగ్రనేతల ప్రకటనలు, కార్యాచరణలనైనా వారి వ్యక్తిగత ఆలోచన లేదా ఆచరణ అంటున్నారు తప్ప సంఫ్‌ుకు చెందినవిగా చెప్పటం లేదు, మరి అలాంటపుడు సంఫ్‌ు భావజాలం, పని ఏమిటి ?” అని శంకర్‌ సహారా ప్రశ్నించారు.


పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్న దేశాల్లో దాన్ని కాపాడేందుకే న్యాయ,శాసన,కార్యనిర్వాహక వ్యవస్థలు ఉంటాయి. వాటి మౌలిక స్వభావం అదే. కానీ కొన్ని సందర్భాల్లో కోర్టులు ఇచ్చే తీర్పులు ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతుంటాయి. అంత మాత్రాన దేశంలో ఉన్న వ్యవస్థలకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పులుగా పరిగణించనవసరం లేదు. చట్టబద్దమైన పాలన జరపాలి, నిబంధనల మేరకు వ్యాపార,పరిశ్రమలు నడపాలి, ఇలా ప్రతి విభాగానికి కొన్ని నిబంధనలను పెట్టుబడిదారీ విధానాల్లో కూడా పెట్టుకుంటారు. వాటిని ఉల్లంఘిస్తే కోర్టులు తప్పు పట్టినంత మాత్రాన అది మౌలికంగా వ్యవస్థను తిరస్కరించినట్లు కాజాలదు. అనేక మంది పెట్టుబడిదారులు పోటీ పడినపుడు అధికారంలో ఉన్న పాలకులు లేదా అధికారులు కొందరికి అనుకూలంగా ఉంటున్నకారణంగానే అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరు వాటిని బయట పెడతారంటే కొందరు నిజాయితీపరులైన వారు లేదా పోటీలో నష్టపోకపోయినా అవకాశం పొందని వారు అన్నది తెలిసిందే. అందువలన తాము బలపరుస్తున్నవారికి వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు లేదా ఆదేశాలు జారీ చేస్తే వాటిని మితవాద శక్తులు వ్యతిరేకించటం అంటే తామనుకున్నదాన్ని పొందలేకపోవటం తప్ప అవి కోర్టులకు పూర్తిగా వ్యతిరేకం అనో కోర్టులు పురోగామి వైఖరితో ఉంటాయనో అర్ధం కాదు.కోర్టుల మీద భ్రమలను పెట్టుకోవాల్సిన అవసరం లేదు.


నయా ఇండియా పత్రికలో ఆర్‌ఎస్‌ఎస్‌పై శంకర్‌ సహారా మండిపాటు దాని మద్దతుదార్లలో గూడుకట్టుకొని ఉన్న అసహనాన్ని వెల్లడిస్తున్నది.జర్మనీ, అనేక దేశాల్లో హిట్లర్‌ మూకలు యూదుల పట్ల అనుసరించిన వైఖరిని మన దేశంలో ముస్లింలపట్ల ఇంకా పూర్తిగా ఎందుకు అనుసరించటం లేదన్న దుగ్గ సంఘపరివార్‌ శ్రేణుల్లో పెరుగుతున్నదని శంకర్‌ వాదనల తీరు వెల్లడిస్తున్నది. తమ అజెండాతో ముందుకు పోతే మొదటికే మోసం వస్తుందని తటపటాయిస్తున్నారు, మత విద్వేషాన్ని ఇంకా ఎక్కిస్తే తప్ప అమలు జరపటం సాధ్యం కాదని సంఘపరివార్‌ భావిస్తున్నది, అందుకే ఆ కార్యక్రమాన్ని మరింతగా వేగిరపరుస్తున్నది తప్ప వైదొలగలేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఓరి మాయలోడో ఓరి మందులోడో : మోదానీ సినిమాలో ఒక రైల్వే పోర్టర్‌ సంచలనం !!

22 Wednesday Feb 2023

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ Leave a comment

Tags

#Modani, BJP, Gautam Adani, George Soros, Hindenburg effect, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


లాహిరి లాహిరి లాహిరిలో ఓహౌ జగమే ఊగెనుగా ఊగెనుగా అంటూ సాగిపోతున్న నరేంద్రమోడీ నౌకకు నెల రోజుల్లో మూడు కుదుపులు. అదానీకి నాలుగు.అదానీ మాయలోకం సినిమా విడుదలై త్వరలో మాసోత్సవం జరుపుకోనుంది. కంపెనీల వాటాల ధరలనే కాదు, వికీపీడియా సమాచారాన్ని కూడా స్వంత మనుషులతో అనుకూలంగా మలుచుకున్నట్లు తాజాగా తేలింది. వికీపీడియా నడిపే సైన్‌ పోస్ట్‌ అనే పత్రిక అదానీ కిరాయి రాతగాళ్ల బండారాన్ని ఫిబ్రవరి 20వ తేదీన వెల్లడించింది. అనూహ్యమైన ఈ పరిణామాలు ప్రధాని నరేంద్రమోడీ,బిజెపిని ఇరకాటంలోకి నెట్టాయి. అర్ధంగాని అంశం ఏమంటే మొదటి మూడింటిని తప్పుడు ప్రచారం, ఆధారం లేని, పధకం ప్రకారం దేశం మీద, ప్రజాస్వామ్యం మీద దాడిగా, నరేంద్రమోడీ సర్కార్‌ను దెబ్బతీసేవిగా చిత్రిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.వికీపీడియా వెల్లడించిన అక్రమంతో తమకు సంబంధం లేదని తప్పించుకుంటారా ఏం చేస్తారో చూడాలి.వికీపీడియాలో అదానీ కంపెనీలు, కుటుంబానికి చెందిన వివరాలను దొంగ పేర్లతో అదానీ కంపెనీ సిబ్బంది, కిరాయి సంపాదకులు అదానీకి అనుకూలగా పోస్టులను దిద్దినట్లు తేలింది. సోషల్‌ మీడియాలో ఇలాంటి ఖాతాలను కోకొల్లలుగా తెరిచి ఉదాహరణకు కొందరు నరేంద్రమోడీ గొప్పతనాన్ని పొగిడితే మరికొందరు ఇతర పార్టీల నేతల మీద తప్పుడు ప్రచారాలకు దిగుతున్న సంగతి తెలిసిందే.


గుజరాత్‌ మారణకాండ మీద బిబిసి నిర్మించిన రెండు భాగాల డాక్యుమెంటరీ వివాదం ఇంకా సద్దుమణగలేదు. అదానీ కంపెనీ అక్రమాలంటూ హిండెన్‌బర్గ్‌ వెల్లడించిన నివేదిక, దానిమీద తలెత్తిన ప్రశ్నలకు విదేశీ మదుపుదార్లకు, స్వంత పార్లమెంటుకు నరేంద్రమోడీ సమాధానం చెప్పాలంటూ ప్రపంచ మదుపుదారు జార్జి సోరస్‌ ఒక అంతర్జాతీయ వేదిక మీద చేసిన వ్యాఖ్య సంచలనం కలిగించింది. ఆ సభలో ప్రపంచదేశాల ప్రతినిధులందరూ ఉన్నారు. చిత్రం ఏమంటే బిబిసి డాక్యుమెంటరీ గురించి స్పందించాల్సిందేమీ లేదని విదేశాంగశాఖ ప్రతినిధి చెప్పారు. సామాజిక మాధ్యమంలో వాటిని చూడకుండా లింకుల మీద మాత్రం నిషేధం విధించి తొలగించారు.హిండెన్‌బర్గ్‌ మీద అసలు నోరెత్తటానికే సిద్దపడలేదు. జార్జి సోరస్‌ ప్రకటన మీద మాత్రం అసలు ఎవడీ సోరస్‌, ఈ ముసలోడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, సమాధానం చెప్పాలని నరేంద్రమోడీనే అడుగుతాడా అన్నట్లుగా బిజెపి మంత్రులు, నేతలు స్పందిస్తున్నారు. జనవరి 25 నుంచి అదానీ కంపెనీల వాటాల విలువ పడిపోతూనే ఉంది. అధిక ధరల్లో వాటాలు కొనుగోలు చేసిన వారు ఎంత సొమ్ము పోగొట్టుకున్నారు అన్నది ఇంకా స్పష్టంగా చెప్పలేము. ఇది రాసినపుడు ఆ మొత్తం రు. పదకొండులక్షల కోట్లని వార్త. మొత్తంగా చూసిన కంపెనీల వాటాల విలువ సగానికి సగం పతనమైంది. దీంతో కంపెనీల మార్కెట్‌ విలువ 120 బిలియన్‌ డాలర్ల వరకు పతనమైనట్లు ఇండియా టుడే ఫిబ్రవరి 20న తెలిపింది. ఒక్కో సంస్థ ఒక్కో పద్దతిలో ఈ అంకెలను చెబుతున్నాయి. గతంలో గరిష్ట విలువ 147 బి.డాలర్లు కాగా ఇప్పుడు 47.9 బి.డాలర్లకు తగ్గినట్లు ఫోర్బ్స్‌ చెప్పగా 49.1 బి.డాలర్లని బ్లూమ్‌ బెర్గ్‌ పేర్కొన్నది. జనవరి 20న అదానీ టోటల్‌ గాస్‌ కంపెనీ వాటా ధర రు.3,618 ఉండగా నెల తరువాత రు.922కు తగ్గింది.


ఐరోపాలోని మ్యూనిచ్‌ నగరంలో జరిగిన సమావేశంలో జార్జి సోరస్‌ మాట్లాడుతూ అదానీపై తలెత్తిన ప్రశ్నలకు మోడీ సమాధానం చెప్పాలని అన్నాడు.నలభై రెండు నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో అదానీ-మోడీ బంధంతో పాటు ఇతర అనేక అంశాలను ప్రస్తావించాడు.” మోడీ, వాణిజ్య దిగ్గజం అదానీ సన్నిహితులు.వారి విధి విడదీయ లేనిది.వాటాలను తిమ్మిని బమ్మిని చేసినట్లు అదానీ మీద ఆరోపణలు రావటంతో అవి పేక మేడల్లా కుప్పకూలాయి.మోడీ దీనిమీద మౌనంగా ఉన్నారు. కానీ అతను విదేశీ మదుపుదార్లకు పార్లమెంటు సమాధానం చెప్పాలి.ఈ పరిణామంతో భారత కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్రమోడీకి ఉన్న గట్టి పట్టు గణనీయంగా బలహీనపడుతుంది. సంస్థాపరమైన సంస్కరణలకు ద్వారాలను తెరుస్తుంది.నేను అమాయకుడిని కావచ్చు, కానీ భారత్‌లో ప్రజాస్వామ్య పునరుద్దరణ జరుగుతుందని భావిస్తున్నా ” అన్నాడు. ప్రపంచ ఆధిపత్యం కోసం రెండు రకాల పాలనా వ్యవస్థలు పోటీ పడుతున్నాయి. గుట్టుగా ఉండే దేశాల కంటే బహిరంగ మైనవి నైతికంగా ఉన్నతంగా ఉంటాయని వాటి మధ్య తేడాలను వివరిస్తూ భారత్‌ ఒక ఆసక్తికలిగించే అంశమన్నాడు. అది ప్రజాస్వామికమే గాని దాని నేత నరేంద్రమోడీ ప్రజాస్వామికవాది కాదన్నాడు.భారత్‌ క్వాడ్‌(చతుష్టయ) సభ్యురాలు, అదే సమయంలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకొని సొమ్ము చేసుకుంటున్నది అన్నాడు. ఈ మాటలు బిజెపి నేతలకు ఆగ్రహం తెప్పించాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అగ్గిమీద గుగ్గిలం మాదిరి మండిపడ్డారు. ఇది నరేంద్రమోడీ మీదనే కాదు భారత ప్రజాస్వామిక వ్యవస్థ మీద కూడా దాడి అంటూ దీన్ని అందరూ ఒకే కంఠంతో ఖండించాలని అన్నారు. అదానీ లేదా అతని కంపెనీల గురించి దేశంలో గగ్గోలు తలెత్తితే పార్లమెంటులో చేసిన ప్రసంగంలో నరేంద్రమోడీ ఒక్కసారి కూడా ఆ ప్రస్తావన లేకుండా మాట్లాడిన సంగతి తెలిసిందే. అలాంటి నేత గురించి అందరూ కలసి ఖండించాలని చెప్పటానికి ఎవరికైనా నోరెలా వస్తుంది. అదానీ కంపెనీల వాస్తవాల నిర్ధారణకు పార్లమెంటరీ కమిటీని మాత్రమే వేయాలని ప్రతిపక్షాలు కోరాయి. దానికి కూడా నోరు రాలేదు.


భారత్‌తో సహా ప్రపంచంలోని ప్రజాస్వామిక వ్యవస్థలలో జోక్యం చేసుకొనేందుకు జార్జి సోరస్‌ ఒక బిలియన్‌ డాలర్లు పక్కన పెట్టాడని (మన కరెన్సీలో రు.8,200 కోట్లు), మన దేశంలో తాను ఎంపిక చేసిన వారు ప్రభుత్వనేతలుగా ఉండాలని కోరుకున్నట్లు స్మృతి ఇరానీ ఆరోపించారు. ఆమె చెప్పినట్లు ఆ మొత్తాన్ని ఒకవేళ ఇక్కడే ఖర్చు చేసినప్పటికీ కుప్పకూలేంత బలహీనంగా మోడీ సర్కార్‌ ఉన్నదా ? అంత మొత్తానికి బిజెపి ఎంపీలందరూ అమ్ముడుపోతారా ? కేంద్ర సమాచార, ప్రసార శాఖ సలహాదారు కాంచన్‌ గుప్తా దీని గురించి స్పందిస్తూ పాలకుల మార్పు కావాలని కోరుతున్న శక్తులవెనుక ఉన్నదెవరో తేలిపోయిందన్నారు.వారికి జార్జి సోరస్‌ నడిపే ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్‌ నుంచి నిధులు అందచేస్తున్నట్లు ఆరోపించారు. భారత్‌కు అనేక మంది శత్రువులుండగా వారందరినీ సోరస్‌ నడిపిస్తున్నాడని ఆరోపించారు.భారత్‌లో ప్రజాస్వామ్యం బలంగా ఉందని 2024 ఇంకా ఎంతో దూరం లేదని మరోసారి ఆశాభంగం చెందక తప్పదని అన్నారు. మోడీ గురించి సోరస్‌ చేసిన వ్యాఖ్యలపై మన విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ స్పందిస్తూ ఒక ముసలోడు, ధనికుడు, మొండిమనిషి న్యూయార్క్‌లో కూర్చొని ప్రపంచమంతా ఇంకా తాను చెప్పినట్లు నడస్తున్నదని అనుకుంటున్న మనిషి అన్నారు. అతని గురించి చెప్పాల్సి వస్తే ముసలోడు, ధనికుడు, మొండిమనిషి, దీన్నే మరోవిధంగా చెప్పాలంటే ప్రమాదకారి కూడా అన్నారు.తాను అభిమానించిన వారు గెలిస్తే సోరస్‌ వంటి వారికి అది మంచిది లేకపోతే ప్రజాస్వామ్యం లోపభూయిష్ట మంటాడు అన్నారు.రైతుల ఆందోళన, సిఎఎ,ఎన్‌ఆర్‌సిలపై సాగిన ఆందోళనల వెనుక సోరస్‌ హస్తం ఉన్నట్లు బిజెపి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.


తొంభై రెండు సంవత్సరాల జార్జి సోరస్‌ గురించి ఆరోపణలు కొత్తవేమీ కాదు, అవి నరేంద్రమోడీతో ప్రారంభం కాలేదు. ఎక్కడా ఏ దేశమూ అతని మీద ఉన్న ఆరోపణలను విచారించి రుజువు చేసి జైల్లో పెట్టలేదు. ఇప్పుడు బిజెపి నేతల ఆయాసపడటం తప్ప చేసేదేమీ లేదు.తాను నివశిస్తున్న అమెరికా అధినేతల గురించే బహిరంగంగా సవాలు చేశాడు. 2003 నవంబరు 11వ తేదీ వాషింగ్టన్‌ పోస్టు పత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవిత కేంద్రీకరణ అధ్యక్షుడు జార్జి డబ్ల్యు బుష్‌ను పదవి నుంచి తొలగించటమని, అది తనకు జీవన్మరణ సమస్య అన్నారు. బుష్‌ను ఓడిస్తానని ఎవరైనా హామీ ఇస్తే తన దగ్గర ఉన్న సంపదనంతా ఇస్తానని కూడా చెప్పాడు.మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో బుష్‌ ఓటమి కోసం డెమోక్రటిక్‌ పార్టీకి సోరస్‌ వివిధ సంస్థలపేరుతో రెండున్నర కోట్ల డాలర్ల మేర విరాళం కూడా ఇచ్చాడు.పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశాడు. సంపాదించినదాన్లో వెనకేసిందానికన్నా దాన ధర్మాలకే ఎక్కువ ఇచ్చాడు. అతను కూడా షార్ట్‌ సెల్లింగ్‌ పద్దతుల్లో లాభాలు గడించిన స్టాక్‌ మార్కెట్‌ జూదగాడే. ఆ జూదాన్ని చట్టపరంగానే అన్ని దేశాలూ అనుమతిస్తున్నాయి.


హంగరీలో నాజీ మూకల దాడి నుంచి మారుపేర్లతో తప్పించుకున్న యూదు కుటుంబాలలో సోరస్‌ది ఒకటి.నాజీలతో చేతులు కలిపాడనే విమర్శలకు కూడా అతని మీద ఉన్నాయి.బుడాపెస్ట్‌లో 1930లో జన్మించిన సోరస్‌ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత లండన్‌ చేరుకున్నాడు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో చదువు కొనేందుకు కొంతకాలం రైల్వే కూలీగా, కొంత కాలం హౌటళ్లలో సర్వర్‌గా పని చేశాడు. (నరేంద్రమోడీ రైల్వే స్టేషన్లో టీ అమ్మినట్లు ప్రచారం చేశారు గానీ దానికి ఎక్కడా రుజువుల్లేవు.) 1956లో అమెరికా చేరుకొని అక్కడ సంపాదన ప్రారంభించాడు. అనేక దేశాల్లో అనేక మందికి గిట్టనిపనులు చేసి ప్రమాకరమైన మనిషిగా పేరు తెచ్చుకున్నాడు.పచ్చి మితవాద శక్తులను కూడా భయపెట్టే మనిషి అని 2019లో బిబిసి వర్ణించింది.డోనాల్డ్‌ ట్రంప్‌ అంటే అసలు పడదు. ట్రంప్‌-మోడీ జిగినీ దోస్తులు కనుక జార్జి సోరస్‌ చేసిన విమర్శలు, ప్రశ్నలు సహజంగానే మోడీ భక్తగణాన్ని కూడా భయపెట్టి ఉండాలి. సోరస్‌ వివాదాస్పద నేపధ్యం కారణంగా నరేంద్రమోడీ, అదానీ మీద అతని విమర్శలను కొట్టివేస్తే కుదరదు.

సోరస్‌ వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టటం అవి లాభాల బాటలో ఉన్నపుడు వాటినుంచి తప్పుకోవటం, షార్ట్‌ సెల్లింగ్‌ వంటి పనులకు పాల్పడతాడు. గతంలో లండన్‌ బాంకు షేర్లను అలాగే షార్ట్‌ సెల్లింగ్‌ చేసి వాటాల ధరల పతనం కాగానే పెద్ద ఎత్తున కొని లబ్ది పొందాడు. గొర్రెల గోత్రాలు కాపరులకు ఎరుక అన్నట్లు నడమంత్రంగా దూసుకు వచ్చిన కంపెనీల వెనుక ఏం జరిగేదీ అతనికి తెలిసినంతగా మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదు.అనేక దేశాలు అతన్ని నిషేధించాయి. సోరస్‌కు అనేక ప్రభుత్వాలల్లో కీలకమైన చోట్ల ఉప్పందించేవారు ఉన్నారు. 1992లో బ్రిటన్‌ ప్రభుత్వం పౌండ్‌ విలువను తగ్గించాలని తలపెట్టింది. దాన్ని పసిగట్టిన సోరస్‌ అప్పులు చేసి మరీ పెద్ద మొత్తంలో పౌండ్లను సేకరించి వాటిని మార్కెట్లో విక్రయించాడు. ఆ లావాదేవీల్లో వందకోట్ల డాలర్ల మేర లబ్ది పొందాడు.తన కంపెనీలు అక్రమాలకు పాల్పడలేదనే ప్రచారం చేసేందుకు అదానీ ఒక అమెరికా కంపెనీని ఆశ్రయించినట్లు వార్తలు.దానికి ఉన్న విశ్వసత నీయత ఏమిటి ? ఒక జాతీయ వాదిని, దేశభక్తుడిని అని చెప్పుకున్న పెద్దమనిషి విదేశీ కంపెనీల కోసం ఎందుకు ఆరాటపడుతున్నట్లు ? నెల రోజులు కావస్తున్నా రోజురోజుకూ అదానీ కంపెనీల వాటాల ధర పతనం తప్ప ఆగలేదు. అంతాబాగుంది అని చెప్పిన దానిని ఎవరూ నమ్మటం లేదు. ప్రస్తుతం ట్రెండింగ్‌గా ఉన్న మోదాని (మోడీ + అదానీ = మోదాని ) సినిమాలో జార్జి సోరస్‌ సంచలన ప్రవేశం. ఆ సినిమా చివరకు ఏమౌతుంది.అదానీ అక్రమాల చిట్టా రాజకీయంగా నరేంద్రమోడీ మెడకు చట్టుకుంటుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రచార ఆర్భాటం తో మోసం- కంపెనీలకు ధనరాసులు-రైతులకు కన్నీరు-జన్యుమార్పిడి ఆవాలు

20 Monday Feb 2023

Posted by raomk in Current Affairs, Economics, Farmers, Health, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, corporates, Farmers, Gm Mustard seeds, GMO hybrids, Narendra Modi

డాక్టర్ కొల్లా రాజమోహన్,  

అధిక ధిగుబడులు వస్తాయనీ, గులాబీరంగు పురుగు బెడద తప్పుతుందనీ 2002 సం. లో బీ టీ పత్తిని భారతదేశంలో ప్రవేశపెట్టారు. రైతులకు తాత్కాలికంగా ఉపయోగపడింది. మోన్సాంటో లాంటి కంపెనీలకు లాభాల పంటపండింది. కాలం గడిచేకొద్దీ, బీటీ పత్తి వలన రైతులకు ప్రయోజనం లేకపోగా పురుగు బెడద విషమించింది. ప్రురుగు మందుల ఖర్చు ఎక్కువయింది. 2002 సం.లో హెక్టారుకు 100 కేజీల పురుగుమందుల వాడకం 2013సం.కి 220 కేజీలకు పెరిగింది. అయినా పురుగులు కంట్రోలుకాక పంట సగటు దిగుబడి హెక్టారుకు 554 కిలోలనుండి 445 కిలోలకు తగ్గిపోయి, పత్తికి ధర లేక, అప్పులు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 

బీటీ పత్తి విత్తనాలలో లాభాలను రుచిమరిగిన మోన్సాంటో, బేయర్స్ లాంటికంపెనీలు మానవులందరూ తినే కూరగాయలు, ఆహారధాన్యాలలో బీటీ ప్రవేశపెట్టి అధిక లాభాలనార్జించాలని కంపెనీలు విరామమెరుగని కృషి సాగిస్తున్నాయి. నిబంధనలను పక్కన పెట్టి  బీటీ వంకాయ, బీటీ బెండ పై గుంటూరు జిల్లా నారాకోడూరు లో 2005 సం.లో ప్రయోగాలను చేశారు. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రజాసంఘలు, మీడియా చేసిన ఆందోళన ఫలించి ఆ ప్రయోగాలను ప్రభుత్వం ఆపక తప్పలేదు. బీటీ వంకాయ పై మారటోరియం విధించారు. 

మొట్టమొదటి జన్యుమార్పిడి ఆహార పంట – ధారామస్టర్డ్ హైబ్రిడ్-11

ఇపుడు జన్యుమార్పిడి ఆవాలను (GM MUSTARD) ప్రవేశపెట్టటానికి ప్రభుత్వం రంగం సిధంచేసింది. కేంద్ర పర్యావరణ శాఖ( MOEFC) క్రింద పనిచేసే జనిటెక్ ఇంజనీరింగ్ మదింపు కమిటీ (GEAC) జన్యుపరంగా మార్పు చేసిన బీ టీ ఆవాలకు 2022 అక్టోబర్ 25న అనుమతించింది. భారతదేశ శాస్త్రవేత్త దీపక్ పెంటేల్, ప్రభుత్వ నిధుల సహాయంతో ” ధారా మస్టర్డ్ హైబ్రిడ్-DMH-11”విత్తనాలను అభివృధిచేశారు. ఆవ మొక్క ఒక్క పువ్వు లోనే మగ స్టేమెన్-ఆడ పిస్టిల్  వుండటంవలన ప్రకృతిలో స్వతహాగా సహజసిధంగా సంపర్కం తేలికగాజరుగుతున్నది. కొత్తజన్యువులను పువ్వులో చొప్పించటానికి బార్-బార్నేస్-బార్ స్టార్ టెక్నాలజీని ఉపయోగించారు. బార్నేస్ పధతివలన మొగ స్టేమెన్ ను నిర్వీర్యం చేసి, బార్ స్టార్ పధతివలన భూమిలో నుండి సేకరించిన బాక్టీరియా బేసిల్లస్ ఆక్వాఫిసియన్స్ జన్యువు ను చొప్పించి ఆడ పిస్టిల్ నుఉత్తేజపరచి, సాంప్రదాయ ఆవాల మొక్కఅయిన వరుణ  జన్యువు తో సంకరం చేశారు. హెర్బిసైడ్ రెసిస్టెంట్ కలుపు మందును తట్టుకునేటట్లుగా బార్ జన్యువు ను ప్రవేశపోట్టారు. జన్యుమార్పిడి విత్తనాలే కాకుండా స్ధానిక “వరుణ “తో సంకరం వలన అధిక దిగుబడులు లభిస్తాయంటున్నారు. హెర్బిసైడ్ టాలరెంట్ గా జన్యు మార్పిడి చేసినందువలన పొలంలో కలుపు తీసే పని లేదంటున్నారు. హెర్బిసైడ్ టాలరెంట్ అంటే కలుపు మందు ను తట్టుకునే విధంగా జన్యువులను మార్చటం. కలుపు మందు కొట్తే ఈ జన్యుమార్పిడి ఆవాల పంట మాత్రమే బతుకుతుంది. కలుపు మొక్కలన్నీ నాశనం అవుతాయి.

ధారా మస్టర్డ్ హైబ్రిడ్ DMH-11 కు బహిరంగంగా పొలాలలో ప్రయోగాత్మకంగా సాగుచేయటానికి, ప్రదర్శనకు, విత్తనాల ఉత్పత్తికి అనుమతించారు. రాజస్ధాన్, పంజాబ్,హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో 100 చోట్ల ప్రయోగాలను ఐ.సీ.ఏ. ఆర్ నిర్వహిచాలన్నారు. జీ ఎమ్ ఆవాల అనుమతి, దేశంలోతీవ్రమైన చర్చనీయాంశమయింది. జన్యుపరంగా మార్పుచెందిన ఆవాల పంట మన దేశంలో తేనె ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందని జన్యుమార్పిడి పంట లో వచ్చిన తేనె ను విదేశాలు కొనవనీ, విదేశీ మారకద్రవ్యం రాదనీ గ్లూఫోసినేట్ హెర్భిసైడ్ కలుపుమందు ఆవ పంటలో వాడితే, ఎవరూ కొననందున మా బతుకు బజారున పడుతుందని తేనె సాగుదారులు ఆందోళనకు దిగారు. రైతులు 150,000 టన్నుల తేనెను తీసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. . ఇది మనకు రూ. 75,000 కోట్లు ( రూ. 750 బిలియన్లు ) ఆర్జించే తేనె ఎగుమతులపై ప్రభావం చూపుతుంది

GM ఆవాలతో తేనెటీగ జనాభా నశిస్తుంది. నేడు, తేనెటీగల రైతులు ఆధారపడిన ఏకైక సహజ పంట ఆవాలు.

సుప్రీమ్ కోర్టు స్టే

అరుణా రోడ్రిగ్జ్ , కవితా కురుగంటి లాంటి సామాజిక కార్యకర్తలు ప్రజాప్రయోజనాల దృష్ట్యా సుప్రీమ్ కోర్టును ఆశ్రయించారు. సీనియర్ న్యాయవాది ప్రశాంత భూషణ్ జన్యుమార్పిడి పంటల సమస్యను పరిశీలించేటందుకు సాంకేతిక నిపుణుల కమిటీ ని సుప్రీమ్ కోర్టు ఏర్పాటు చేసిన విషయాన్ని కోర్టుకి గుర్తు చేశారు. సుప్రీంకోర్టు సాంకేతిక నిపుణుల కమిటీ ( 2013 ) మరియు జన్యుమార్పిడి పంటలను పరిశీలించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల ఏకగ్రీవ నివేదికలు జన్యుమార్పిడి పంటలపై పూర్తి నిషేధాన్ని సిఫార్సు చేశాయి.

భారతదేశంలో హెర్బిసైడ్ టాలరెంట్ అంటే కలుపుమందులను చేలో చల్లితే తట్టుకునే పంటలు పనికిరావని కమిటీ చెప్పిందన్నారు. హెర్బిసైడ్లు అంటే కలుపు నివారణ మందులు కాన్సర్ కు కారణమవుతాయని కూడా కమిటీ అభిప్రాయపడింది. మానవ ఆరోగ్యం, జంతు ఆరోగ్యం, జీవ వైవిధ్యం పై దీర్ఘకాలిక ప్రభావం గురించి ఎటువంటి అధ్యయనాలు నిర్వహించనందున హెర్బిసైడ్ అంటే కలుపు మందులు వాడే పంటలపై పూర్తి నిషేధాన్ని విధించాలని సుప్రీమ్ కోర్టు ఏర్పాటు చేసిన కమిటీసిఫార్సు చేసిందని కోర్టుకు గుర్తు చేశారు. జన్యుమార్పిడి పంటలపై స్వతంత్ర అధ్యయనం చేయకుండా స్వంత ఆర్ధిక ప్రయోజనాలున్న కంపెనీలే ప్రయోగాలు, అధ్యయనాలు చేయటం, ఆ రిపోర్టులపై ఆధారపడి పర్యావరణ అనుమతులివ్వడం తగదని ప్రశాంతభూషణ్ నివేదించారు.

 ప్రజారోగ్యం పై పర్యావరణంపై రహస్యనివేదికలకు బదులుగా స్వతంత్ర నిపుణుల సంస్ధలచే , నిర్వహించబడే పబ్లిక్ డొమైన్ లో సమగ్రమైన, పారదర్శకమైన, నిజాయితీతో వాస్తవ అంశాలతోకూడిన  బయోసేఫ్టీ రిపోర్టును జీ ఈ ఏ సీ  బహిరంగపరచాలన్నారు. 

జన్యుమార్పిడి ఆవాల విత్తనాలపై యధాస్ధితినినకొనసాగించాలని కేంద్రాన్ని సుప్రీమ్ కోర్టు ఆదేశించింది.

 ఆహారం లో జన్యుమార్పిడి పదార్ధాలను ప్రవేశపెట్టే ముందు అందరికీ తెలిసేటట్లుగా క్షేత్ర ప్రయోగాలు భారీ ఎత్తున పారదర్శకంగా జరగాలి. కానీ జరగలేదు. రహస్యనివేదికలే తప్పబహిరంగ రిపోర్టులు లేవు. కనీసం ఇంటర్నెట్ లో కూడా పెట్టలేదు. తేనెటీగలు, తేనె పై బతికే వారి సమస్యలేకాకుండా ఆవాలు తిన్నందువలన, ఆవ నూనె వాడినందువలన మనుష్యులపై, తాగే నీటిపై, పశువులపై, భూమిపై, పర్యావరణంపై  ప్రభావం ఏమిటో తాత్కాలిక, దీర్ఘకాలిక పరిశోధనలుజరగాలి. సైంటిఫిక్ గా పరిశోధనలతో నిర్ణయించవలసిన ఆహార భధ్రత అంశాన్ని రాజకీయ ప్రయోజనాలను, వ్యాపార ప్రయోజనాలను, విదేశీ పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని అగ్ర రాజ్యాల వత్తిడికి లొంగి నిర్ణయం చేయటం మన దేశ స్వతంత్ర్యాన్నిఅమ్ముకోవటమే.  

కలుపు నివారణ మందులను, జన్యుమార్పిడి హైబ్రిడ్ విత్తనాలను  అమ్ముకోవాలనీ, లాభాలను దండుకోవాలనీ కంపెనీలు తహతహలాడుతున్నాయి. కలుపు నివారణ మందులవలన భూమి విషతుల్యమౌతుందనే వాస్తవాన్ని ప్రభుత్వంకాదనలేకపోతున్నది. ఒక పక్క ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం అంటూ ప్రచారం చేస్తూ మరోపక్క భూమిని, భూసారాన్ని, ప్రజారోగ్యాన్ని నాశనం చేసే జన్యుమార్పిడి   పంటలకు, కలుపు మందుల పంటలకు అనుమతులనిస్తున్నది.  భూమికి, ప్రజల ఆరోగ్యానికి ప్రమాదమన్న రుజువుల కారణంగా గ్లైఫోసేట్ కలుపు నివారణ మందులను నిషేధించక తప్పలేదు. ప్రభుత్వ వైఫల్యం వలన ప్రమాదకరమైన నిషేధిత మందులు కూడా మార్కెట్లో అమ్ముతున్నారు. కలుపు మందులు అమ్ముకోవటానికి వీలుగా విత్తనాలనే జన్యుమార్పిడి చేశారు. కలుపు మందులతో భూమికి, మనిషికి, పశువులకు, వాతావరణానికి ప్రమాదమని నిర్ధారించి నిషేధించారు. మరోప్రక్క హెర్భిసైడ్ టాలరెంట్ జన్యుమార్పిడి ఆవాల పంటలకు అనుమతిని ఇచ్చి హెర్బిసైడ్ కలుపు నివారణ మందులను యధేఛగా వాడుకోమంటున్నారు. బీ.జే.పీ. ఎన్నికల ప్రణాళికలలో ఆహారం లో జన్యుమార్పిడి పంటలను , హెర్బిసైడ్ కలుపునివారణ మందులకు అనుమతులు ఇవ్వమన్నారు. ఆచరణలో జన్యుమార్పిడి పంటలకు హెర్బిసైడ్ కలుపు నివారణ మందుల వ్యాపార కంపెనీలకు స్వేఛనిచ్చి ప్రజలను మోసంచేస్తున్నారు. జన్యుమార్పిడి పంటలతోపాటుగా , హెర్బిసైడ్స్ వాడకం వలన భూమి నాశనమవటం వలన ఏ మందులకూ లొంగని “సూపర్ వీడ్స్”, “సూపర్ వీడ్స్” అభివృధి చెందుతున్నాయి. ఇంకా ఎక్కువ పురుగు మందుల వాడే అవసరం పెరిగి భూమి, పర్యావరణం మరింతగా నాశనమయి ప్రకృతి విఛిన్నమై కాన్సర్ లాంటి జబ్బులతో మానవుని మనుగడ ప్రశ్నార్ధకమౌతున్నది. 

జన్యమార్పిడి ఆవాల పంటవలన ఆవాల దిగుబడి పెరిగి ఆవనూనె దిగుమతులను తగ్గించవచ్చనీ, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చనీ ప్రభుత్వం అసత్య ప్రచారం చెప్తోంది. 1980 సం.లో ఆయిల్ మిషన్ ఇచ్చిన ప్రోత్సాహంతో వంటనూనెల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. సాంప్రదాయ హైబ్రిడ్ విత్తనాలతోనే హెక్టారుకు 3012 కేజీల దిగుబడిని రైతులు సాధించారు. DMH-11 జన్యుమార్పిడి విత్తనాలతో 30 శాతం అధిక దిగుబడిని సాధించవచ్చని ప్రభుత్వం అసత్యప్రచారం చేస్తున్నది. రుజువులను చూపించలేకపోతున్నది.. DDB-DMH -1. సాంప్రదాయ విత్తనంతో    2924 KG ల దిగుబడిని, DDB-DMH-4.  సాంప్రదాయ విత్తనంతో  3012 KG, ల దిగుబడిని సాధించారు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్న జన్యుమార్పిడి హెర్బిసైడ్ టాలరెంటు విత్తనం  GM MUSTARD  వలన  2626 KG ల దిగుబడి మాత్రమే వచ్చింది. అదేమంటే మీరు సైన్సుకు వ్యతిరేకం అని దబాయిస్తున్నారు. 

ఆవనూనెను దక్షిణ భారతదేశంలో వాడరు. ఆవ నూనెను ఉత్తర భారత దేశంలో విరివిగా వాడతారు. విస్తారంగా పండిస్తారు. మన దేశంలో వంటనూనెల ఉత్రత్తిలో 40 శాతం ఆవనూనెదే. ఆవపంట 80 లక్షల ఎకరాలలో60 లక్షలమంది రైతులు సాగు చేస్తున్నారు. 1993-1994లోనే, ఆవనూనెలో స్వయం సమృద్ధిని సాధించారు. దేశీయ ఉత్పత్తి అన్ని అంతర్గత అవసరాలను తీర్చింది.ఆవనూనె దిగుమతి అవసరం లేదు. దక్షిణ భారత దేశంలో ఆవనూనె వాడకం చాలా తక్కువ. ఊరకనే ఇచ్చినా వాడరు. తక్కువ ఉత్పత్తి వుండి, ఎక్కువమంది ప్రజలు వాడే పామాయిల్, వేరుశనగనూనె, నువ్వులనూనె, కొబ్బరినూనెలకు ప్రోత్సాహం కరువయింది. ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నపుడు రైతులు అనూహ్యమైన ఫలితాలు సాధిస్తున్నారు.

విదేశాల నుండి దిగుమతి చేస్తున్న పామాయిల్, సన్ ఫ్లవర్ వంటనూనెలకు దిగుమతి సుంకాలను తగ్గించి సింగపూరు, ఇండోనేషియా, ఉక్రెయిన్ ప్రభుత్వాలకు సహాయం చేస్తున్నారు. మన దేశంలోని పామాయిల్, వేరుశనగ, నువ్వుల నూనె, కొబ్బరినూనె రైతులకు కనీస మద్దతు ధరకు చట్టపరమైన గ్యారంటీ లేదు. లాభసాటి ధర, గిట్టుబాటు ధరల మాటేలేదు. ప్రకృతి వైపరీత్యాల లో రైతుకు దిక్కే లేదు. 2022 సం.కు రైతు ఆదాయం రెట్టింపు చేస్తామన్న వాగ్దానాన్ని మరిచారు. 

బీ టీ కాటన్ వలన కలిగిన దుష్పరిణామాలన్నిటికీ మోన్సాంటో లాంటి బహుళజాతుల సమస్ధలే కారణం అని ఫ్రజలు గుర్తిస్తున్నందున కార్పోరేట్ సంస్ధలు కొత్తముసుగులో ప్రవేశిస్తున్నాయి.  బార్, బార్నేజ్, టెక్నాలజీని ఢిల్లీ యూనివర్సిటీ అధ్యయన బృందం మన దేశంలో పబ్లిక్ సెక్టార్ రంగం లో కొత్తగా కనుగొన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. బార్, బార్నేజ్, టెక్నాలజీపై బేయర్స్ కంపెనీకి పేటెంట్ వున్నది. 2001 సం లో బార్నేజ్ ,బార్ స్టార్ టెక్నాలజీని బేయర్సకంపెనీ వాడింది. 

యూరప్ లో జన్యుమార్పిడి ఆహారాలను తినరు. పంటలకు అనుమతిలేదు. యూరప్ దేశాలు జీ ఎమ్ పంటలను గట్టిగా వ్యతిరేకించాయి.  యూరప్ ప్రజలు తినని ఆహారం మనం ఎందుకు తినాలో ప్రభుత్వం చెప్పాలి. తినే ఆహారంలో విషతుల్యమైన జన్యుమార్పిడి పదార్ధాలున్నయ్యేమో అని అమెరికా ప్రజలు అనుమానిస్తున్నారు. ఆహార పదార్ధాలపై జీ యమ్ లేబుల్స్ అతికించమని  ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అమెరికా లో శక్తివంతమైన విత్తన సంస్ధల వత్తిడికి లొంగి మాన్సాంటో, బేయర్స్ కంపెనీలకు అనుమతులు, పేటెంట్లు ప్రభుత్వం మంజూరుచేసింది. మన దేశంలోజన్యుమార్పిడి పంటలను, ఆహారాన్ని  అనుమతించబోమని ఎన్నికల ప్రణాళిక లో స్పష్టంగా  చెప్పిన బీజేపీ , ప్రభుత్వం లోకి వచ్చిన తర్వాత పంధా మార్చుకుంది. ఎమ్ ఎన్ సీ ల వత్తిడికి ప్రభుత్వం లొంగిపోయింది. ఆర్.యస్.యస్ అనుబంధ సంస్ధయిన స్వదేశీ జాగరణమంచ్ జన్యుమార్పిడి ఆవాలను వ్యతిరేకించింది. అయినా విత్తన కార్పోరేట్ కంపెనీలు తమ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి యొక్క శక్తిని చూపించి ధారా మస్టర్డ్ హైబ్రిడ్ DMH-11 కు అనుమతులను పొందాయి.

 దుష్ట పరిణామాలకు భాధ్యత ఎవరిది  

 అమెరికా లో “లైబిలిటీ లా” వుంది. పరిశోధనల ఫలితాలకు భిన్నంగా దుష్ట పరిణామాలు సంభవిస్తే ఎవరు బాధ్యులో నిర్ణయించి తగిన చర్యలు చేపడ్తారు. మనదేశంలో, మీకేమీ కాదన్నప్రభుత్వం, దిగుబడులు పెరుగుతాయన్న కంపెనీలు, ఆరోగ్యానికి ఢోకా లేదన్న జీ ఈ ఏ సీ సభ్యులు, ప్రభుత్వం – ఎవరిదీ బాధ్యత? 2015 సం. లో, ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లైఫోసేట్ను “మానవ క్యాన్సర్ కు ముఖ్య కారణం” గా వర్గీకరించింది. నాన్ హాడ్కిన్స్ లింఫోమాతో సహా 10 రకాల క్యాన్సర్లకుకారకమైన గ్లైఫోసేట్ ఆధారిత హెర్బిసైడ్ వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించనందుకు మోన్ శాంటో / బేయర్ కంపెనీపై లక్షకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి.  జీన్ క్యాంపెయిన్‌క జన్యు శాస్త్రవేత్త డాక్టర్ సుమన్ సహాయ్ మాట్లాడుతూ, దేశంలో మొట్టమొదటి వాణిజ్య బిటి పత్తి పంటకు సంబంధించిన భద్రతా డేటా ఏదీ పబ్లిక్ డొమైన్‌లో ఉంచబడలేదన్నారు. అక్టోబర్ 25, 2022న పర్యావరణ విడుదలకు ఆమోదం లభించిన GM మస్టర్డ్‌కు కూడా అదే విధానాన్ని అవలంబించి విత్తనాల విడుదల తర్వాత అవసరమైన పరీక్షలు నిర్వహించబడతాయా? 

మన దేశంలో GM ఆవాలు పండించడానికి అన్నిఅడ్డంకులు తొలగినతరువాత ఇతర GM పంటలకు కూడా వరద గేట్లను తెరుస్తారు. బీటీ వంకాయ,బీటీ బెండ, గోల్డెన్ రైస్, వరి, గోధుమ, మొక్కజొన్న, బంగాళాదుంప-అన్నిటిలో కాస్తోకూస్తో జన్యుమార్పు చేసి వ్యవసాయ వ్యాపారాన్ని పెంచుకోవటానికి కార్పోరేట్ కంపెనీలు కాచుకు కూర్చున్నాయి. ప్రపంచ ద్రవ్య పెట్టుబడిని ఎదిరించలేని ప్రభుత్వాలన్నీలొంగిపోయి మాన్సాంటో, బేయర్స్ లాంటి కంపెనీలను ఆహ్వానిస్తున్నాయి. జీ యమ్ ఆవాలు ప్రవేశపెట్టటానికి బలమైన అమెరికా ఒత్తిడి వున్నదని జర్నలిస్టు రష్మీ సెహగల్ అంటున్నారు.
మన దేశంలో వ్యవసాయం ఒక జీవన విధానం. 66శాతం ప్రజలు వ్యవసాయం పై ఆధారపడిజీవిస్తున్నారు.53 శాతం ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నది.దేశ ఆదాయంలో వ్యవసాయ ఆదాయం క్రమేపీ 15 శాతానికి తగ్గింది. జన్యుమార్పిడి పంటలు మన నేలను, నీటిని  కలుషితం చేస్తాయి. ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుంది. ఈ ప్రక్రియ కోలుకోలేనిది. వివిధ వాతావరణ పరిస్ధితులున్నభారతదేశం జీవ వైవిధ్యానికి ప్రసిధి చెందింది. వైవిధ్యమైన జన్యు వనరులున్నాయి. మన విత్తనోత్పత్తి చాలా శక్తివంతమయినది. మన రైతులు ప్రపంచంలోనే అతిపెద్ద విత్తనోత్పత్తిదారులు.జీవ వైవిధ్యం మన గొప్ప బలాలలో ఒకటి. అది నాశనం చేసి ఒకటే దేశం, ఒకటే విత్తనం, ఒక్కటే పంట అంటూ విశాల భూక్షేత్రాలలో మోనోక్రాప్ తో కోర్పోరేట్ స్ధాయి వ్యవసాయం వైపు నడిపిస్తున్నారు.

వ్సవసాయం లో వున్న వారిలో సగం మందికి సెంటు భూమి కూడా లేదు. ఇప్పటికే 86 శాతం మంది చిన్న రైతులు ఒత్తిడిలో ఉన్నారు. GM టెక్నాలజీ పేరున కంపెనీలు దారుణంగా పెంచుతున్న రేట్లలోఖరీదైన GM విత్తనాలను కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారు. పెరుగుతున్న ధరలతో ఎరువులనుకొనలేరు. పెంచనున్నవిధ్యుత్ ఛార్జీలను భరించలేరు. అప్పులను కట్టలేరు. కనీల ధరకు చట్టపరమైన గ్యారంటీ లేదు. వారేం చేయాలి. వారికి ఏమవుతుంది? ఢిల్లీ సరిహద్దుల లో సంవత్సరంపైగా సాగిన రైతాంగ పోరాటమే రహదారి. అదే స్పూర్తితో మరింత శక్తివంతంగా సాగించే రైతాంగ పోరాటాలే వ్యవసాయ సమస్యలన్నిటికీ పరిష్కారం. 

Share this:

  • Tweet
  • More
Like Loading...

హిండెన్‌బర్గ్‌ నివేదిక ప్రకంపన : సుప్రీంకోర్టుకైనా నరేంద్రమోడీ చెబుతారా, కమిటీ పేరుతో కాలయాపన చేస్తారా ?

11 Saturday Feb 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Adani Group, Adani-Hindenburg row, BJP, HINDENBURG, Joe Biden, Narendra Modi, Narendra Modi Failures, RSS, SEBI, Supreme Court of India


ఎం కోటేశ్వరరావు


దేశం మొత్తాన్ని కుదిపివేసినా, ప్రపంచంలో మన కంపెనీల విశ్వసనీయత మీద అనుమానం తలెత్తినా, మదుపర్లు లక్షల కోట్లు పోగొట్టుకున్నా దేశ అత్యున్నత పార్లమెంటులో అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదం మీద ప్రధాని నరేంద్రమోడీ నోరు మెదపలేదు. మోడీ తీరు తెన్నులను గమనించిన వారు నోరు విప్పుతారని ఏ ఒక్కరూ ఆశించలేదన్నది కూడా పచ్చినిజం. ఎవరి స్టైల్‌ వారిది, తగిన తరుణం వచ్చినపుడు ఎవరి పద్దతిలో వారు స్పందిస్తారు. పార్లమెంటులో ప్రతిపక్షాల డిమాండ్‌ను ఖాతరు చేయని అపర ప్రజాస్వామికవాది ఇప్పుడు సుప్రీం కోర్టుకైనా ఏదైనా నివేదిస్తారా ? లేక దేశభద్రతకు సంబంధించిన అంశం కనుక కోర్టుకు చెప్పలేం అని ఠలాయిస్తారా ? లేదా విచారణ, సూచనల కమిటీ పేరుతో కాలయాపన చేస్తారా ? చూద్దాం !


శుక్రవారం నాడు సుప్రీం కోర్టు ముందు ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎంఎల్‌ శర్మ, విశాల్‌ తివారీ అనే ఇద్దరు న్యాయవాదులు ఒక దావా వేశారు. అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా అమెరికా కేంద్రంగా ఉన్న హిండెన్‌బర్గ్‌ సంస్థ కుట్రలో భాగంగా విడుదల చేసిన పరిశోధన నివేదిక మదుపర్లకు భారీ నష్టం కలుగ చేసినందున సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని విడి విడిగా కేసులు దాఖలు చేశారు.దీన్ని స్వీకరించిన కోర్టు సోమవారం నాడు విచారణకు తీసుకుంటామని వివాదం తలెత్తిన నేపధ్యంలో నియంత్రణ విధానం, తీసుకున్న చర్యల గురించి ఆరోజుకు నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి)ని ఆదేశించింది. ప్రభుత్వం, సెబీని సంప్రదించి భవిష్యత్‌లో ఇలాంటి ఉదంతం పునరావృతం కాకుండా నియంత్రణ వ్యవస్థలను ఎలా పటిష్ట పరచాల్సిందీ, క్రమబద్దీకరణ చట్టాలు, మార్కెట్ల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన మార్పులు అవసరమైతే దాని కోసం ఒక నిపుణుల కమిటీ ఏర్పాటుతో సహా ఒక నివేదికను అందచేయాలని సొలిసిటర్‌ జనరల్‌ను కోరింది.కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే ఒక కమిటీని వేయవచ్చని కూడా చెప్పింది. తాము దీని గురించి ఏదైనా చెబితే మార్కెట్‌ ప్రవృత్తి, మదుపుదార్ల విశ్వాసం మీద ప్రభావం చూపవచ్చని కోర్టు పేర్కొన్నది. భారత మదుపుదార్ల ప్రయోజనాలను ఎలా కాపాడాలన్నదే నిజంగా తమ తాపత్రయమని కోర్టు పేర్కొన్నది. బంతి ఇప్పుడు ఎక్కడ ఉన్నదీ చెప్పనవసరం లేదు.


జరిగిన పరిణామాలపై సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని,హిండెన్‌ బర్గ్‌ నివేదిక దేశ స్టాక్‌ ఎక్సేంజ్‌ను కుదిపివేయటమే కాదు, దేశంలోని వాణిజ్యవేత్తలను అనుసరిస్తున్న పద్దతులను కూడా ప్రశ్నార్ధకంగా మార్చిందని పిటీషనర్లు పేర్కొన్నారు.నియంత్రణలు లేకుండా ప్రభుత్వ రంగ బాంకులు రుణాలు ఇవ్వటం తీవ్ర ఆందోళనకరమైన అంశమని, బడా కార్పొరేట్లకు ఐదు వందల కోట్ల రూపాయలకు మించి ఇచ్చే రుణాలపై పరిశీలనకు ఒక ప్రత్యేక కమిటీని వేయాలని కూడా కోరారు. ఈ పిటీషన్‌ మీద విచారణ ఎలా జరుగుతుందో, ఏమి తేలుస్తారో చెప్పలేము గానీ పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తకుండా ఒకవేళ ఎవరైనా అడిగినా సమాధానం చెప్పకుండా తప్పించుకొనేందుకు వీలుగా సుప్రీం కోర్టు సూచించినట్లుగా ఒక కమిటీ ఏర్పాటుకు కేంద్రం అంగీకరిస్తే కథకంచికే. కోర్టు అందుకు అంగీకరిస్తే దాని నిర్ణయాన్ని తప్పు పట్టకూడదు గానీ ఇది నరేంద్రమోడీ-అదానీ ప్రయోజనం కోసం దాఖలైన పిటీషన్‌ అనుకొనేందుకు అవకాశం ఉంది.


ప్రపంచంలో హిండెన్‌బర్గ్‌ వంటి షార్ట్‌ సెల్లర్స్‌, వారి లీలలు కొత్త కాదు. ఇలాంటి వారు ఉండటం మార్కెట్‌కే మంచిదని సమర్ధించేవారు ఉన్నారు. అదానీ కంపెనీల మీద ఇప్పుడు కాకుండా మరోఐదేండ్ల తరువాత గనుక ఇలాంటి నివేదిక వచ్చి ఉంటే ఇంకా పెద్ద ముప్పు వచ్చి ఉండేదని అనేక మంది అనుకుంటున్నట్లుగా మీరాయె ఎసెట్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సిఐఓ రాహుల్‌ చద్దాతో నిర్వహించిన ఇంటర్వ్యూలో చెప్పిన అంశాన్ని ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా రాసింది.” రానున్న 5-10 సంవత్సరాల్లో భారత్‌ గనుక ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారితే మన కంపెనీలలో ఎక్కువ భాగం మరింతగా తనిఖీకి గురికావచ్చు. దీన్ని గతంలో చూశాము. కొంత మంది షార్ట్‌ సెల్లర్స్‌ చైనా కంపెనీల గురించి నివేదికలు రాశారు. కొన్ని నివేదికలు వాస్తవమే, కొన్ని సంచలనం కలిగించాయి.మార్కెట్‌ దాన్ని పెద్ద అంగలు వేయటంగా చూసింది. ఎక్కడైతే నివేదికలు వాస్తవమో అక్కడ స్టాక్స్‌ ప్రభావితం అయ్యాయి. అదానీ గ్రూపు విషయానికి వస్తే ఎక్కువ మంది మదుపుదార్లు ప్రైవేటు సంభాషణల్లోనే మాట్లాడుతున్నారు. ప్రముఖంగా ప్రస్తావించిన కొన్ని అంశాలను చూస్తే ఒక విధంగా చెడ్డలో మంచిగా చూస్తున్నారు. ఇప్పుడు గాకుండా ఐదేండ్ల తరువాత ఈ సమస్య తలెత్తివుంటే పెద్ద వ్యవస్థాపరమైన ముప్పుగా ఉండేది. దీన్నుంచి ప్రతివారూ పాఠం నేర్చుకున్నారని అనుకుంటున్నాను ” అని చద్దా చెప్పారు. ఇటీవల తాను ఐరోపా వెళ్లినపుడు ప్రతి చోటా మదుపర్లు తనను అదానీ ఉదంతం గురించి అడిగితే పైన చెప్పుకున్న అంశాలనే వివరించాల్సి వచ్చిందని, ఇంత జరిగాక తానైతే ఆచితూచి పెట్టుబడులు పెడతానని కూడా చెప్పారు.


సంస్థాగత మదుపర్ల ఆలోచన ఎలా ఉందో చూశాము. ఎంతసేపూ షార్ట్‌ సెల్లర్లు, వారి వెనుక ఉన్న కుట్ర సిద్దాంతాల చుట్టూ చర్చను తిప్పేందుకు చూస్తున్నారు.హిండెన్‌బర్గ్‌ నివేదిక తరువాత అదానీ కంపెనీ ఎఫ్‌పిఓ పేరుతో రు.20వేల కోట్లను సేకరించేందుకు వాటాలను జారీ చేసింది. చిన్న చిన్న మదుపుదార్లెవరూ ముందుకు రాలేదు. కానీ ఆశ్చర్యంగా కొందరు రంగంలోకి దిగి వాటిని కొని అదానీ పరువు నిలిపేందుకు చూశారు. అలా ఎల్‌ఐసి కూడా మూడు వందల కోట్ల మేరకు దరఖాస్తు చేసిందని వార్తలు. వాటిని స్టాక్‌ఎక్సేంజ్‌లో పెడితే కొన్నవారంతా చేతులు కాల్చుకొనేవారే. కానీ అదానీ ఆ అమ్మకాలను రద్దు చేసి ఆదుకున్న తన మిత్రులను రక్షించారు. ఇదొక పెద్ద కుంభకోణం, దీని మీద విచారణ జరపాలి.అస్థిరపరిస్థితి ఉన్నపుడు అదానీ కోసం ముందుకు వచ్చిన వారెవరు అన్నది బహిరంగం కావాల్సి ఉంది.


ఇక షార్ట్‌ సెల్లర్స్‌ అంటే ఎవరు అన్న ఆసక్తి చాలా మందిలో కలిగింది. అమరావతి ప్రాంత రైతులతో అగ్రిమెంటు చేసుకొని భూములు కొనుగోలు చేసి చేతులు కాల్చుకున్నవారి సంగతి తెలిసిందే. వైసిపి ప్రభుత్వం రాగానే మూడు రాజధానుల ప్రతిపాదన రంగంలోకి తేవటంతో భూముల ధరలు ఢమాల్‌ అన్నాయి. దాంతో ఒప్పందాలు చేసుకున్న వారు రైతులకు పెద్ద మొత్తంలో ఇచ్చిన బయానా సొమ్మును వదులుకొని లావాదేవీలను రద్దు చేసుకున్నారు. అదే అదనుగా ధరలు తగ్గటంతో కొందరు చౌకగా కొనుగోలు చేసిన వారూ ఉన్నారు. స్టాక్‌ మార్కెట్‌లో బ్రోకర్ల వద్ద కొందరు ఒక కంపెనీ వాటాలను అరువు తెచ్చుకుంటారు. వాటిని మార్కెట్‌లో ఉన్న ధరల కంటే కారుచౌకగా తెగనమ్ముతారు. దీన్నే షార్ట్‌ సెల్లింగ్‌ (తక్కువ ధరలకు అమ్మకం) అంటారు. దాంతో ఆ కంపెనీలో ఏదో గోల్‌మాల్‌ జరిగిందని ఇతరులు కూడా మరింత నష్టపోకుండా చూసుకుందామని అమ్మకాలకు పాల్పడతారు. వాటి విలువ పడిపోతుంది.ఆ ఒక్క కంపెనీ వాటాల ధరలే కాదు, స్టాక్‌ మార్కెట్లో ఇతర కంపెనీల ధరలూ పతనం కావచ్చు. దాన్ని ఆసరా చేసుకొని అదే షార్ట్‌ సెల్లర్స్‌ భారీగా అదే కంపెనీ లేదా ఇతర కంపెనీల వాటాలను తక్కువ ధరలకు కొని పెద్ద మొత్తంలో లాభాలు పొందిన ఉదంతాలతో పాటు చేతులు కాల్చుకున్నవారు లేకపోలేదు. స్టాక్‌ మార్కెట్లో ఇదొక ఖరీదైన జూదం. షార్ట్‌ సెల్లర్స్‌కు వాటాలను అరువుగా ఇచ్చిన బ్రోకర్లకు ఎలాంటి నష్టమూ ఉండదు.లేదూ కొంత మంది బ్రోకర్లే షార్ట్‌ సెల్లింగ్‌కూ పాల్పడి జూదమాడవచ్చు.ఈ షార్ట్‌ సెల్లర్స్‌ ఎలాంటి వారంటే ప్రధాన పట్టణాల బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద కొంత మంది ఆటో, టాక్సీ వాలాలు వచ్చిన వారిని ఎక్కించుకొని కష్టపడి నాలుగు డబ్బులు సంపాదించుకోకుండా పగలంతా పడిగాపులు పడి ఎవరైనా అమాయకులు దొరికితే దోచుకొనే ఒక సినిమాలో నిక్కర్‌ నారాయణ పాత్రను గుర్తుకు తెస్తారు.


ఇలాంటి జూదాన్ని స్టాక్‌మార్కెట్‌ నియంత్రణ సంస్థలు నిషేధించవచ్చుకదా అని కొందరు అడగవచ్చు.ప్రపంచంలో చైనాతో సహా ఎక్కడా స్టాక్‌మార్కెట్లలో అలా జరగలేదు.అనుమతిస్తూనే ఉన్నారు. భారీ ఎత్తున అమ్మకాలకు దిగినపుడు స్టాక్‌ ధరలు పతనమైతే ఒక పరిమితి దగ్గర కొద్దిసేపు అమ్మకాలను నిలిపివేస్తారు. అది భారీ ఎత్తున నిర్ణీత పరిమితికి మించి పెరుగుతున్నపుడు కూడా అదే పని చేస్తారు. పూర్తిగా నిషేధించే అవకాశాలు దాదాపు లేవనే చెప్పవచ్చు. అదానీ కంపెనీల వాటాల ధరలు విపరీతంగా పెరిగినపుడు లేని నిషేధాలు పతనమైనపుడు ఎలా పెడతారు? గతంలో కేతన్‌ పరేఖ్‌ అనే నేరస్తుడు ఇతర బ్రోకర్లతో కలసి కంపెనీల వాటాల ధరలను కృత్రిమంగా పెంచిన కుంభకోణం జరిగింది. జి టెలిఫిలిమ్‌ వాటా ధర రు.127 ఉంటే దాన్ని పదివేలకు, విజువల్‌ సాప్ట్‌ రు.625ను రు.8,448, సోనాటా సాఫ్ట్‌ రు.90ని రు.2,936కు పెంచి మదుపుదార్లను ముంచారు. వైస్‌ జగన్‌మోహనరెడ్డి సాక్షి పత్రిక, టీవీ కంపెనీలో పది రూపాయల విలువగల వాటాలను వందల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన వారిని మీరెందుకు అలా కొన్నారని ప్రశ్నిస్తే మేం వ్యాపారులం, లాభాలు వస్తాయనే అంచనాతో కొన్నాం, ఒక వేళ రాలేదనుకోండి నష్టపోయేది మేమే కదా మాకు లేని ఇబ్బంది ఇతరులకు ఎందుకు అని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దాని వెనుక ఆసలు కథ ఏమంటే అదే వ్యాపారులు రాజశేఖరరెడ్డి సర్కార్‌ నుంచి భారీ మొత్తంలో లబ్ది పొందారని దానికి బల్లకింద గాక బల్లమీదనే బహిరంగంగా చట్టపరంగానే అలా ప్రతిఫలం చెల్లించారనే విమర్శలున్న సంగతి తెలిసిందే. వాటి మీద ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి.దీన్నే నీకది నాకిది అంటారు. హిండెన్‌బర్గ్‌ ఉదంతంపై సోమవారం నాడు లేదా తరువాత సుప్రీం కోర్టు ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది.


షార్ట్‌ సెల్లర్లు ఒక్క అదానీ కంపెనీ మీదనే తొలిసారిగా కుట్ర చేసినట్లు, దాన్ని దేశం మీదనే జరిగిన దాడిగా, దానివెనుక చైనా ఉన్నదని ఆరోపిస్తూ కుహనా జాతీయభావాలను రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు.హిండెన్‌బర్గ్‌ కంపెనీ ఉంది అమెరికాలో, దానికి నిజంగా చైనా మద్దతు ఇస్తే అమెరికా ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు ? చైనా బెలూన్ను కూల్చివేసి అమెరికాను రక్షించినట్లు చెబుతున్న ప్రభుత్వం హిండెన్‌బర్గ్‌ మీద విచారణకు ఆదేశించి చైనా పాత్రను వెల్లడించేందుకు,తన మిత్రదేశంగా భావిస్తున్న భారత్‌ను, అదానీని బహిరంగంగా సమర్ధించలేక విమర్శించలేక ఎక్కాతిక్కా స్థితిలో ఉన్న జిగినీ దోస్తు నరేంద్రమోడీని రక్షించేందుకు జో బైడెన్‌ ఎందుకు పూనుకోలేదు ? 2021లో చైనా ప్రభుత్వం తమ టెక్నాలజీ సంస్థలపై చర్య తీసుకున్నపుడు షార్ట్‌ సెల్లర్స్‌ భారీ ఎత్తున లబ్ది పొందారు. ఆ ఏడాది ఒక్క జూలై నెలలోనే ఎనిమిది బిలియన్‌ డాలర్లు పోగేసుకున్నారు. అలాంటి సొమ్ముతో ఎంచుకున్న కంపెనీల వాటాలను కొనుగోలు చేసి షార్ట్‌ సెల్లింగ్‌కు పాల్పడి లబ్దిపొందేందుకు చూశారు. ఇది నిరంతర ప్రక్రియ. అలీబాబా కంపెనీల షేర్లను మార్కెట్‌ కంటే పదమూడుశాతం తక్కువకు అమ్మి పతనం కాగానే అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసి లాభాలు పొందారు. అలాంటి వారికి ఒక దేశం, ఒక కంపెనీ, దేశభక్తి లాంటివేమీ ఉండవు.అప్పుడు అలీబాబా కంపెనీ కూడా అదానీ మాదిరే కొత్త షేర్లను అమ్మచూపితే ప్రభుత్వం అడ్డుకున్నది. ఇక్కడ నరేంద్రమోడీ సర్కార్‌ అలాంటి పని చేయకున్నా అదానీ తోక ముడిచిన సంగతి తెలిసిందే.2021 జూలైలోనే చైనాలోని ఆన్‌లైన్‌ సరకుల విక్రయ కంపెనీ పిండూడూ కూడా షార్ట్‌ సెల్లర్ల దాడికి గురైంది.వారు పెద్ద మొత్తంలో లబ్ది పొందారు. అప్పుడు చైనా ప్రభుత్వం లేదా పాలకపార్టీ దాన్ని తమ దేశం మీద దాడిగానో దాని వెనుక భారత్‌ లేదా అమెరికా ఉందనో ఆరోపించలేదు. టెక్నాలజీ కంపెనీలపై చైనా సర్కారు తీసుకున్న చర్యలు కొనసాగింపుగా తదుపరి గేమింగ్‌ కంపెనీలపై ఉంటాయని పుకార్లు పుట్టించి షార్ట్‌ సెల్లర్లు లబ్ది పొందారు. ఇలా ప్రతిదేశంలో అచిరకాలంలోనే తారా జువ్వలా ఎదిగిన కంపెనీలన్నింటినీ షార్ట్‌ సెల్లర్లు ఎంచుకొని లబ్ది పొందుతున్నారు. ప్రభుత్వ మద్దతుతో అదానీ వంటి వారు, పాలకుల పక్కన చేరి లెక్కలను తిమ్మినిబమ్మిని చేసిన సత్యం కంప్యూటర్స్‌ మాదిరి కంపెనీలకు లేని విలువను సృష్టించి జనం నెత్తిన చేతులు పెట్టదలచుకుంటే ఇలాంటి షార్ట్‌ సెల్లర్స్‌ అలాంటి కంపెనీల మీద కన్నేసి దెబ్బతీసి లబ్ది పొందుతారు. దివాలా తీసేది అమాయకపు మదుపుదార్లు మాత్రమే. మహా అయితే అదానీ వంటి వారు 2014లో ఎక్కడ ఉన్నారో తిరిగి అక్కడకు పోతారు, వారికి వచ్చే నష్టం ఉండదు. అంతే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !

04 Saturday Feb 2023

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, Filims, Health, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Others, Prices, RELIGION, Women

≈ Leave a comment

Tags

BJP, Budget-2023-24, Farmers, Fertilizers subsidies, Food Subsidy, india debt, Narendra Modi, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి బడ్జెట్‌ ప్రతిపాదనలు చేసింది. మేం చెప్పాల్సింది చెప్పాం ఇక మీ ఇష్టం అని మంత్రి నిర్మలా సీతారామన్‌ సెలవిచ్చారు. రెండవ సారి తిరుగులేని మెజారిటీతో అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ 2.0కు ఇది చివరి బడ్జెట్‌. మూడో సారి 2024లో తిరిగి వస్తారా, ఇంతటితో సరిపెట్టుకుంటారా అన్నది తరువాత చూద్దాం. వివిధ రాష్ట్రాలలో ఈ ఏడాది, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు గనుక ఇప్పటి వరకు మోడీ సర్కార్‌ సాధించిన ఘనత, తాజా బడ్జెట్‌ గురించి బిజెపి శ్రేణులు ప్రచారం చేసేందుకు జనం ముందుకు రానున్నారు. ఈ తీరు తెన్నులన్నింటినీ ఒక్క విశ్లేషణలో వివరించలేం గనుక కొన్ని ముఖ్య అంశాలను చూద్దాం.


” మోడీ హయాంలో కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రు.169లక్షల 46వేల 666 కోట్లు. ఈ ఏడాది కొత్తగా చేస్తున్న అప్పులు రు.16 లక్షల 85వేల కోట్లు. కడుతున్న వడ్డీలు రు.10లక్షల 79వేల కోట్లు.1947 నుంచి 2014వరకు 67 ఏండ్లలో 14 మంది ప్రధానులు చేసిన అప్పు 56లక్షల కోట్లు. ఎనిమిదేండ్లలో మోడీ చేసిన అప్పు 114లక్షల కోట్లు. దీనికి గబ్బర్‌సింగ్‌ టాక్సు, ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తే వచ్చిన డబ్బు అదనం. ఇంత అప్పుతో దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కానీ, పేదరిక నిర్మూలన అనేది ఎక్కడా జరగలేదు. మరి ఈ డబ్బు ఎక్కడికి పోయింది ? ” అంటూ ఒక పోస్టు వాట్సాప్‌లో తిరుగుతోంది. ఈ వివరాలు మింగుడుపడని మోడీ వీర భక్తులు నిజమేనా అని ప్రశ్నిస్తున్నారు. స్వల్ప సవరణలతో అవి తిరుగులేని వివరాలు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌లో చెప్పిన అంశాలే అని గమనించాలి. 2023 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు మొత్తం రు.152,61,122 కోట్ల 12లక్షలకు చేరుతుందని, అది 2024 మార్చి 31కి రు.169,46,666 కోట్ల 85లక్షల కోట్లుగా ఉంటుందని నిర్మలమ్మగారి బడ్జెట్‌ పత్రాల్లో ఉంది.


అచ్చేదిన్‌, తనకు అధికారం ఇస్తే కాంగ్రెస్‌ ఏలుబడిలో తూర్పున పొడిచిన సూర్యుడిని పశ్చిమానికి మారుస్తాను అన్నట్లుగా జనాన్ని నమ్మించిన నరేంద్రమోడీ 2014లో అధికారానికి వచ్చిన నాటికి ఉన్న అప్పు 56లక్షల కోట్లు కాదు. కాగ్‌ ఖరారు చేసిన గణాంకాల ప్రకారం 2014 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ విదేశీ, స్వదేశీ అప్పు మొత్తం రు.50,68,235 కోట్లు కాగా 2015 మార్చి నాటికి అంటే తొలి ఏడాది దాన్ని రు.56,07,315 కోట్లకు పెంచారు. దాని ప్రకారం ఇప్పటి వరకు మోడీ ఒక్కరే చేసిన అప్పు రు.101,92,887 కోట్లను 2024 మార్చి నాటికి 118,78,431కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు. అందువలన ఇంత అప్పుచేసి సాధించిన ప్రగతి ఏమిటి అని అడగటం తప్పంటారా ? కానేకాదు. కాంగ్రెస్‌ పాలకులు 50 ఏండ్లలో సాధించలేని దానిని తాను తొలి ఐదు సంవత్సరాల్లోనే సాధించానని చెప్పుకున్న నరేంద్రమోడీ ఎలాగూ దీని గురించి నోరు విప్పరు.


గ్రామీణ ప్రాంతాలలో కొనుగోలు శక్తి తగ్గినట్లు అనేక నివేదికలు చెబుతున్నాయి. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరుగుదల వలన రోజు రోజుకూ మానవ శ్రమ పని దినాలు తగ్గుతున్నాయి.వివిధ రాష్ట్రాల నుంచి కోట్లాది మంది వలసలే అందుకు పక్కా నిదర్శనం.కనీసం వంద రోజులు పని కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి పధకానికి 2021-22లో రు.98,468 కోట్లు ఖర్చు చేస్తే 2022-23లో 89,400 కోట్లకు దాన్ని 2023-24లో రు.60వేల కోట్లకు(32.9శాతం) తగ్గించారు. అంటే గ్రామాల్లో ఇబ్బడి ముబ్బడిగా పని పెరిగింది అనుకోవాలి. ఈ పధకం కింద ఏడాదికి కుటుంబానికి వంద రోజులు పని కల్పించాలని నిర్దేశించారు. గతేడాది సగటున 40 రోజులకు మించలేదు. అందువలన కనీసం లక్షా 40 నుంచి రెండు లక్షల 20వేల కోట్లకు బడ్జెట్‌ను పెంచాలని అనేక మంది డిమాండ్‌ చేశారు. ఏడాది పాటు సాగిన రైతుల ఆందోళనతో దిగి వచ్చి క్షమాపణ చెప్పి మరీ మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకొంటూ కనీస మద్దతు ధరకు హామీ కల్పించాలన్న డిమాండ్‌ను పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటామని నరేంద్రమోడీ చెప్పారు. అది ఏమైందో మోడీకే ఎరుక. క్షమాపణ చెప్పే స్థితికి రైతులు తనను నెట్టారన్న కోపమో, పగసాధింపో మరొకటో తెలియదు గానీ 2022-23లో ఎరువులకు ఖర్చు చేసిన రు.2,27,681 కోట్లను రు.1,78,482 కోట్లకు(21.6శాతం) తగ్గించారు.


అదే విధంగా ఆహార సబ్సిడీ రు.2,87,194 నుంచి రు.1,97,350 కోట్లకు(31.3) శాతం కోత పెట్టారు. మొత్తంగా సబ్సిడీలను రు. 5,62,080 నుంచి 4,03,084 కోట్లకు(28.3) శాతం కోత పెట్టారు. వ్యవసాయం-రైతు సంక్షేమ పద్దు కింద 2021-22లో రు.1,22,836 కోట్లు ఖర్చు చేశారు.దాన్ని 2022-23 బడ్జెట్‌లో రు.1,32,14 కోట్లకు పెంచినట్లు గొప్పలు చెప్పారు. ఆచరణలో రు.1,18,913 కోట్లకు కోత పెట్టారు. తాజా బడ్జెట్‌లో దాన్ని రు.1,25,036 కోట్లకు పెంచామని చంకలు కొట్టుకుంటున్నారు. దేశంలో కార్పొరేట్‌ విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో చేరి అప్పుల పాలై తిప్పలు తెచ్చుకున్న కుటుంబాలు మనకు ప్రతి చోటా కనిపిస్తాయి. అలాంటి స్థితిలో కేటాయించిన మొత్తాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయకపోవటాన్ని ఏమనాలి ? 2022-23లో విద్యా రంగానికి రు.1,04,278 కోట్లు కేటాయించి రు.99,881 కోట్లు ఖర్చు చూపారు, వర్తమాన బడ్జెట్‌లో రు.1,12,899 కోట్లు ఖర్చు చేస్తామని ప్రతిపాదిస్తే నమ్మేదెలా ? ఇదే పరిస్థితి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఉంది. గతేడాది రు.86,201 కోట్లని చెప్పి రు.79,145 కోట్లకు కోత పెట్టారు, ఇప్పుడు 89,155 కోట్లు ఖర్చు పెడతామని మనల్ని నమ్మించేందుకు చూస్తున్నారు.


పైన చెప్పుకున్నట్లుగా ఈ ఏడాది కొత్తగా తీసుకోనున్న 16.85లక్షల కోట్ల అప్పును రైతులు, గ్రామీణ కార్మికులు, జనం కోసం గాక ఎవరికోసం ఖర్చు చేయనున్నట్లు ? పారిశ్రామికవేత్తలకు ఉత్పత్తితో ముడిపెట్టి బోనస్‌ ఇస్తామని చెబుతున్నవారు పంట పండించే రైతులను ఎందుకు విస్మరిస్తున్నట్లు ? ఏమిటీ వివక్ష – ఎందుకీ కక్ష ? పఠాన్‌ సినిమాలో హీరోయిన్‌ ధరించిన బికినీ కాషాయ రంగులో ఉన్నందున హిందూ మతానికి ముప్పు వచ్చిందని, సినిమా హాళ్లు తగులబెడతామని నానా రచ్చ చేసిన వారే ఇప్పుడు అదానీ దేశభక్తి గురించి అతని కంపెనీల మీద మన శత్రువులు దాడి చేస్తున్నట్లు గుండెలు బాదుకుంటున్నారు. ఆ పెద్ద మనుషులకు కోట్లాది మంది గ్రామీణులున్న రంగాలు, సబ్సిడీల తగ్గింపు ఎందుకు పట్టలేదు, ఒక్కరు కూడా ఎందుకు నోరు విప్పలేదు, ఏ టీవీ ఛానల్‌ కూడా వీటి మీద ప్రత్యేక చర్చలు ఎందుకు పెట్టలేదు. జనం ఆలోచించాలి, దేవదూతగా భావిస్తున్న మోడీ నోట సినిమాల గురించి అనవసరంగా మాట్లాడవద్దని నేరుగా వెలువడింది, హిండెన్‌బర్గ్‌ నివేదిక వివాదంలో అదానీ కంపెనీల గురించి గాక బడ్జెట్‌ గురించి జనంలో మాట్లాడండని బిజెపి అధిష్టానం నేతలను కోరినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.కనుక మోడీ భక్తులు గతంలో ఉద్రేకంలో ఏ మాట్లాడినా ఇప్పుడు దాన్ని తగ్గించుకొని పునరాలోచించాలి. ఎవరూ మాట మార్చినట్లు అనుకోరు.


ఇటీవలనే ఆక్స్‌ఫామ్‌ సంస్థ కొంత మంది చేతుల్లో పోగుపడుతున్న సంపదలు, ఏటేటా పెరుగుతున్న శత కోటీశ్వరుల గురించి చెప్పింది. కొత్తగా వస్తున్న పరిశ్రమలు, నరేంద్రమోడీ తన పలుకుబడితో తెచ్చిన విదేశీ పెట్టుబడులు, కార్మికుల పిఎఫ్‌ ఖాతాల పెరుగుదల అంకెలను చూడండని ఊదరగొట్టిన అంశాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.పరిశ్రమలు పెరిగితే, వాటి నుంచి ఖజానాకు తగినంత పన్ను రావటం లేదు, పోనీ ప్రయివేటు కంపెనీలు తాము పొందిన రాయితీలను తిరిగి పెట్టుబడులు పెట్టిన దేశభక్తికి నిదర్శనంగా ఉపాధి పెరగక పోగా నిరుద్యోగ రేటు ఎందుకు పెరుగుతున్నట్లు ? నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు కేంద్ర ప్రభుత్వానికి వివిధ రంగాల నుంచి వస్తున్న పన్నులు, మోడీ ఏలుబడిలో వస్తున్న పన్నుల వసూలు తేడాల గురించి చూద్దాం. అంకెలను కోట్ల రూపాయలుగా గమనించాలి.
వనరు×××× 2014-15 ××× 2022-23××× 2023-24అంచనా
కార్పొరేట్‌×× 4,28,925 ××× 8,35,000 ××× 9,22,675
ఆదాయ ×× 2,65,733 ××× 8,15,000 ××× 9,00,575
కస్టమ్స్‌ ×× 1,88,016 ××× 2,10,000 ××× 2,33,100
ఎక్సైజ్‌ ×× 1,89,953 ××× 3,20,000 ××× 3,39,000
జిఎస్‌టి ×× 1,67,969 ××× 8,54,000 ××× 9,56,600
మొత్తంపన్ను××13,64,524×× 30,43,067×× 33,60,858
రాష్ట్రాలకు ×× 3,82,216××× 9,48,405 ×× 10,21,448
ఎగువ అంకెల్లో గమనించాల్సిన అంశాలు 2014-15లో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు దక్కిన వాటా 28శాతం కాగా 2020-21లో అది 33.16 శాతం, 2022-23లో31.16శాతం, 2023-24లో 30.3 శాతంగా ఉండనుంది.గత ప్రభుత్వం రాష్ట్రాలకు 32శాతం ఇస్తే తాము 41శాతం ఇచ్చినట్లు బిజెపి చెప్పుకుంది. మరి ఈ అంకెల మతలబు ఏమిటి ? ఈ అంకెలను ఎవరైనా కాదనగలరా ? కార్పొరేట్‌ పన్ను క్రమంగా తగ్గిస్తున్న కారణంగానే గత తొమ్మిది సంవత్సరాల్లో రెండు రెట్లు పెరగ్గా జనాన్ని బాదుతున్న జిఎస్‌టి మాత్రం ఐదు రెట్లు పెరిగింది. ఈ కారణంగానే కార్పొరేట్ల సంపదల పెరుగుదల జన సంపదల తరుగుదల.


కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో రాష్ట్రాలకు బదలాయిస్తున్న తీరు తెన్నులు ఎలా ఉన్నదీ చూద్దాం. దీనిలో రాష్ట్రాలకు కేటాయిస్తున్నది పోను మిగిలిందంతా కేంద్రం వద్దనే ఉంటుంది.
వనరు ××× ఏడాది×××× కేంద్రం ×××× రాష్ట్రాలకు ఇస్తున్నది, శాతం
కార్పొరేట్‌×× 2014-15 ×× 4,28,925 ××× 1,18,235 (27.56)
కార్పొరేట్‌×× 2020-21 ×× 5,57,719 ××× 1,79,716 (32.22)
ఆదాయ ×× 2014-15 ×× 2,65,733 ××× 84.431(31.77)
ఆదాయ ×× 2020-21 ×× 4,70,719 ××× 184.271(39.14)
కస్టమ్స్‌ ×× 2014-15 ×× 1,88,016 ××× 54,759 (29.1)
కస్టమ్స్‌ ×× 2020-21 ×× 1,34,750××× 31,529 (23.39)
ఎక్సైజ్‌ ××2014-15 ×× 1,89,953 ××× 30,920 (16.3)
ఎక్సైజ్‌ ××2020-21 ×× 3,89,667 ××× 19,793 (5.07)
జిఎస్‌టి ××2014-15 ×× 1,67,969 ××× 49,142 (29.25)
జిఎస్‌టి ××2020-21 ×× 5,48,778 ××× 1,76,451 (32.15)
ఎగువ అంకెలను చూసినపుడు మోడీ పాలన తొలి సంవత్సరం ఎక్సైజ్‌ మొత్తంలో రాష్ట్రాలకు కేటాయించిన మొత్తానికి, ఏడు సంవత్సరాల తరువాత మొత్తానికి చాలా తేడా ఉన్నది. కారణం ఏమంటే పెట్రోలు, డీజిలు, ఇతర పెట్రో ఉత్పత్తుల మీద ఎక్సైజ్‌ పన్ను తగ్గించి, సెస్‌లను భారీ మొత్తంలో పెంచారు. సెస్‌లో రాష్ట్రాలకు వాటా ఉండదు కనుక కేంద్రానికి అది కామధేనువుగా మారింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే రోడ్డు సెస్‌ వసూలు చేస్తారు, అదే రోడ్లకు టోల్‌ టాక్సు వసూలు చేస్తారు, వ్యవసాయ సెస్‌ వేస్తారు ఆ రంగానికి కేటాయింపులు తగ్గిస్తారు, స్వచ్చభారత్‌ సెస్‌ వేస్తారు, పట్టణాల్లో, గ్రామాల్లో కూడా చెత్త పన్ను జనం నుంచి వసూలు చేస్తారు. ఈ తీరు తెన్నుల గురించి ఆలోచించాలా లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !

02 Thursday Feb 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, Japan, Latin America, NATIONAL NEWS, Prices, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Agriculture, Fertilizers, Fertilizers subcidies, world agriculture challenge 2023


ఎం కోటేశ్వరరావు


సమస్యలను ఎదుర్కొనే అంశంలో తప్ప ప్రపంచమంతటా రైతాంగం ఒకే విధంగా లేదు. పురాతన పద్దతుల్లో విత్తనాలు చల్లి పండిన మేరకు పంట తీసుకొనే రైతుల మొదలు ఆధునిక పద్దతుల్లో మొత్తం యంత్రాలతో సాగు చేసే వారు ఉన్నారు. కడుపు నింపుకొనేందుకు మాత్రమే పండించుకొనే వారు ఎందరో ఉంటే అమ్ముకొని లాభాలు పోగేసుకొనేందుకు చూసే వారు కొందరు. అందువలన సమస్యలు కూడా ఒకే విధంగా లేవు. మనుషులందరూ ఒకటే గానీ కొందరికి ఆకలి జబ్బు మరికొందరికి తిన్నది అరగని జబ్బు మాదిరి ఎవరి సమస్య వారిది. రైతులు అంటే కేవలం పంటలు పండించేవారే కాదు, అనుబంధ రంగాలలో పని చేసేవారు కూడా అదే కోవకు చెందుతారు. ఈ సందర్భంగా కొన్ని దేశాల్లో రైతాంగం తీరు తెన్నులు, వారి ముందున్న కొన్ని సవాళ్లు-సమస్యల గురించి చూద్దాం.


ఏ రైతుకైనా కావాల్సిన వాటిలో ఎరువు ఒకటి. ప్రస్తుతం కొనసాగుతున్న ఉక్రెయిన్‌ – రష్యా వివాదం దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల రైతాంగాన్ని, ప్రభుత్వాలను ప్రభావితం చేస్తున్నది.2022లో ఎరువుల ధరలు రికార్డులను బద్దలు కొట్టాయి. అనేక దేశాల్లో మాంద్యం రానుందనే హెచ్చరికల నేపధ్యంలో రైతులు, ఆహార సరఫరా మీద 2023లో మరింత వత్తిడి పెరగనుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. వాతావరణ అనుకూల ప్రతికూలతలకు ఎక్కువగా ప్రభావితం అవుతున్నది రైతులే. ఉదాహరణకు ఉక్రెయిన్‌ సంక్షోభం, చమురు, గాస్‌ ధరల పెరుగుదుల, రవాణా అంశాల కారణంగా ఎరువుల ధరలు విపరీతంగా పెరిగి సాగు ఖర్చు ఇబ్బడి ముబ్బడై అనేక దేశాల రైతాంగం ఇబ్బంది పడింది.2022 రెండవ అర్ధకాలంలో పొటాష్‌, ఫాస్పేట్‌ వినియోగం పది నుంచి 40శాతం తగ్గింది, దాంతో ధరలూ తగ్గాయి.చైనా ఎగుమతులు నిలిపివేసిన తరువాత ప్రపంచమార్కెట్లో 2022 ఏప్రిల్‌లో టన్ను డిఏపి ధర వెయ్యి డాలర్లు ఉండగా తరువాత 713కు తగ్గింది. ఈ ఏడాది 550 డాలర్లకు తగ్గుతుందని ఒక అంచనా. మన దేశంలో ఏడాది పాటు సాగిన రైతాంగ ఆందోళన, వివిధ రాష్ట్రాలు, 2024లో లోక్‌సభ ఎన్నికల్లో ఎరువుల ధరలు ప్రభావం చూపకుండా చూసేందుకు సబ్సిడీలను పెంచి రైతుల మీద భారం పడకుండా చూసింది. అనేక దేశాలలో రైతులే వాటిని భరించారు. సబ్సిడీ ఎరువులు మినహా, ఇతర పెట్రోలు,డీజిలు, రవాణా ఖర్చులు, పురుగుమందుల ధరల పెరుగుదల వంటి భారాలను మన రైతులే భరించారు. 2022 జూలైలో ఉక్రెయిన్‌ వ్యవసాయ ఉత్పత్తుల దిగ్బంధననాన్ని రష్యా ముగించటంతో ఎగుమతులు పెరిగి ధరల తగ్గుదలకు దారితీసింది. కొన్ని దేశాల ఎగుమతులు తగ్గిన మేరకు రైతులకు నష్టం జరిగింది. అందువల ఉక్రెయిన్‌ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేము, దాని పర్యవసానాలు, ప్రభావాలు ఎలా ఉండేదీ అనూహ్యమే.

ప్రపంచంలో ఫాస్పేట్‌ను ఎక్కువగా 2021లో చైనా 85మిలియన్‌ టన్నులను ఉత్పత్తి చేయగా రష్యా 14మి.టన్నులతో నాలుగవ స్థానంలో ఉంది.
అంతర్జాతీయ ఫర్టిలైజర్స్‌ సంస్థ సమాచారం ప్రకారం ప్రపంచ భూముల్లో 85శాతం నత్రజని కొరత, 73శాతానికి ఫాస్పేట్‌, 55శాతానికి పొటాష్‌ కొరత ఉంది. ధరల పెరుగుదల కారణంగా అనేక మంది రైతులు వీటి వాడకాన్ని తగ్గించారు. అది పంటల ఆరోగ్యం, దిగుబడుల మీద ప్రతికూల ప్రభావం చూపింది.పొటాష్‌ ఉత్పత్తిలో 14మి.టన్నులతో కెనడా ప్రధమ స్థానంలో ఉండగా రష్యా,బెలారస్‌ కలసి 17 మి.టన్నులు ఉత్పత్తి చేశాయి.2022కు ముందు ప్రపంచంలో 40శాతం ఉత్పత్తి వీటిదే. ఉక్రెయిన్‌ వివాదానికి ముందు ఎంఓపి టన్ను ధర 221 డాలర్లుండగా తరువాత 562 డాలర్లకు చేరింది. 2009 తరువాత ఇదే అధికం.పొటాష్‌కు డిమాండ్‌ తగ్గింది. 2022లో ఆంక్షల కారణంగా రష్యా,బెలారస్‌ నుంచి ఎగుమతులు ఆగాయి. దీన్ని కెనడా సొమ్ము చేసుకొని విపరీత లాభాలు పొందింది. ఈ విధంగా అమెరికా, నాటో కూటమి దేశాలు రైతాంగాన్ని, సాగును దెబ్బతీశాయి.


వివిధ దేశాలలో మన దేశంలో మాదిరి కనీస మద్దతు ధరలు లేవు. ఉన్నవాటిని కూడా ఒకదానితో మరొకదానిని పోల్చలేము. చైనా వంటి ఒకటి రెండు చోట్ల తప్ప ముందే చెప్పుకున్నట్లు ఎక్కడ ఎంత ఉన్నా అక్కడి సాగు ఖర్చులతో పోలిస్తే సాగు గిట్టుబాటు కావటం లేదన్నది స్పష్టం. అందుకే అనేక ప్రభుత్వాలు భారీ మొత్తంలో సబ్సిడీలు ఇస్తున్నాయి.లేని చోట రైతాంగం నష్టపోతున్నది. ఎగుమతులకు సైతం సబ్సిడీలు ఇచ్చే అమెరికా వంటి ప్రభుత్వాల గురించి తెలిసిందే. వివిధ దేశాలలో ఉన్న పంటల దిగుబడి కూడా రైతాంగ రాబడిని ప్రభావితం చేస్తుంది. దిగవన కొన్ని దేశాల వివరాలను చూద్దాం. వాతావరణాన్ని బట్టి అంచనాలు మారుతూ ఉంటాయి. ఒక హెక్టారుకు దిగుబడి అంచనాలు కిలోల్లో ఇలా ఉన్నాయి.2023 జనవరి అంచనాలని గమనించాలి. ఆఫ్రికా ఖండానికి సూచికగా ఈజిప్టును తీసుకున్నప్పటికీ పంటల దిగుబడి మిగతా దేశాలలో దానితో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నదని గమనించాలి.


దేశం ××× గోధుమ ××వరి×× ముతక ధాన్యం×× పత్తి ×× చమురు గింజలు××మొక్కజొన్న
ప్రపంచం×× 3,550 ×××4,590××× 4,290 ××× 787 ××× 2,330 ××× 5,740
అమెరికా×× 3,130 ×××8,280××× 10,130×××1,062 ××× 3,150 ×××10,880
ఐరోపా××× 5,500 ××× 6,060××× 4,980××× నిని ××× 2,640 ××× 6,010
బ్రిటన్‌ ××× 8,610 ××××××××××× 6,320××× ×× ××× 3,400 ××× ×××××××
చైనా ××× 5,860 ××× 7,080××× 6,270××× 2,032××× 2,560 ××× 6,440
భారత్‌ ××× 3,370 ×××4,120××× 2,030××× 444 ××× 1,030 ×××3,200
బ్రెజిల్‌ ××× 3,060 ×××7,000××× 5,330××× 1,777××× 3,490 ××× 5,510
ఈజిప్టు ××× 6,410 ×××8,700××× 7,130××× 703 ××× 1,040 ×××8,000


పైన పేర్కొన్న వివరాల అంచనాల్లో స్వల్ప మార్పులు తప్ప దిగుబడుల ధోరణులను వెల్లడిస్తాయి. మన దేశంలో పత్తి కనీస మద్దతు ధర గిట్టుబాటు కాదని తెలిసిందే. చైనాలో కూడా అంతే ఇచ్చినప్పటికీ అక్కడ దిగుబడులు ఎక్కువ కారణంగా రైతాంగానికి నష్టం ఉండదు. పత్తి పండే దేశాల్లో అనేక ఆఫ్రికా దేశాలకు దగ్గరగా తక్కువ దిగుబడి ఉంది. అమెరికా వంటి దేశాలు మన దేశంలో కనీస మద్దతు ధరలు ఇవ్వటాన్ని సబ్సిడీ ఇవ్వటంగా చిత్రిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసులు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దిగుబడులు ఎక్కువగా ఉండటం, సబ్సిడీలు ఇచ్చి తక్కువ ధరలకే ఎగుమతులు చేస్తూ మన వంటి దేశాలను అమెరికా,ఇతర ధనిక దేశాలు దెబ్బతీస్తున్నాయి.

ప్రపంచమంతటా 2022లో పెరిగిన సాగు ఖర్చులు, రైతులను ఎలా ప్రభావితం చేసిందీ ఇంకా సమగ్రమైన సమాచారం అందుబాటులోకి రాలేదు. అమెరికాలో ప్రతి డాలరును పట్టి పట్టి చూస్తారు గనుక మిగతా దేశాలతో పోలిస్తే ఆ లెక్కలు కూడా వేగంగా రూపొందుతాయి. భూమి,యంత్రపరికరాలు, ఇంథనం, ఎరువులు, పురుగుమందుల ధరలు బాగా పెరిగినందున ఉత్పత్తి ఖర్చు పెరుగుదల తీరు గురించి కొంత విశ్లేషణ అందుబాటులోకి వచ్చింది. సాగు పద్దతులు, మెట్ట, తరి వంటి తేడాలు, దిగుబడులు కూడా సాగు ఖర్చులను ప్రభావితం చేస్తాయి. అమెరికాలోని నెబరస్కా లో వివిధ పంటలకు పెరిగిన ఖర్చు ఇలా ఉంది. ఒక ఎకరా విస్తీర్ణంలో సగటు దిగుబడి బుషెల్స్‌ (25.4 కిలోలకు సమానం)లో, ఒక్కో బుషెల్‌కు ఖర్చు డాలర్లలో అని గమనించాలి.
పంట××××××× సగటు దిగుబడి××× 2021 ×××2022
మెట్ట మొక్కజొన్న×× 150 ××× 2.34 ××× 2.87
తరి మొక్కజొన్న×× 239 ××× 2.28 ××× 2.83
మెట్ట గోధుమ ×× 62 ××× 3.36 ××× 4.55
తరి గోధుమ ×× 98 ××× 3.11 ××× 4.20
మెట్ట సోయా ×× 47 ××× 5.53 ××× 6.46
తరి సోయా ×× 73 ××× 4.64 ××× 5.55
యంత్రాల వినియోగాన్ని బట్టి అమెరికాలో శ్రమశక్తి-కార్మికుడి ఖర్చును లెక్కిస్తారు. అది సగటున గంటకు 25డాలర్లు ఉంది.ఇతర అంశాల్లో తప్ప ఈ ఖర్చులో ఎలాంటి మార్పు లేదు. ఎరువుల ఖర్చు 30 నుంచి 70శాతం వరకు పురుగుమందుల ఖర్చు 16 నుంచి 60శాతం పెరిగింది. అది ఎలా పెరిగిందో చూద్దాం.( డాలర్లలో)
పంట, ఏడాది×× ఎరువు ××పురుగుమందు ××మెటీరియల్‌×× నిర్వహణ×× భూమి
మెట్ట మొక్కజొన్న×× —- ××× — ××× —- ××××× —×××——
2020 ×× 49 ××× 60 ××× 226 ×××××× 66 ××× 132
2021 ×× 42 ××× 62 ××× 221 ×××××× 75 ××× 135
2022 ×× 84 ××× 69 ××× 280 ×××××× 78 ××× 144
తరి మొక్కజొన్న×× — ××× — ××× — ××××× —××× —-
2020 ×× 95 ××× 70 ××× 344 ×××××× 144 ××× 260
2021 ×× 82 ××× 59 ××× 320 ×××××× 152 ××× 259
2022 ×× 167 ××× 86 ××× 489 ×××××× 152 ××× 281
ఇదే విధంగా మిగతా పంటల పెట్టుబడి ఖర్చుల్లో కూడా పెరుగుదల ఉంది.


పది ప్రధాన దేశాల వ్యవసాయానికి సంబంధించిన కొన్ని సంక్షిప్త వివరాలు ఇలా ఉన్నాయి.1చైనా : ప్రపంచంలో పదిశాతం సాగుభూమి ఉన్న చైనా నాలుగో వంతు ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నది.గోధుమ, వరి, మొక్కజొన్న ప్రధాన పంటలు. ప్రపంచ కూరగాయల్లో సగం సరఫరా చేస్తూ 50 కోట్ల టన్నులను ఉత్పత్తి చేస్తున్నది.2019లో అమెరికా, ఐరోపా సమాఖ్యలను వెనక్కు నెట్టి అగ్రశ్రేణి వ్యవసాయ ఎగుమతిదారుగా ఉంది.2.అమెరికా: మొక్కజొన్న, సోయా, పత్తి ప్రధాన పంటలు. ఆధునిక సాగు పద్దతుల్లో అగ్రస్థానంలో ఉంది. 3.బ్రెజిల్‌ : ప్రపంచంలో కర్రపెండలాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇది గాక కాఫీ, చెరకు, సోయా ప్రధాన పంటలు. ప్రపంచంలో కాఫీ ప్రధాన ఎగుమతిదారుగా ఉంది. జిడిపిలో 25శాతం వ్యవసాయ రంగం నుంచి ఉంది.4.భారత్‌ : పాలు, జనపనార, పప్పుదినుసుల ఉత్పత్తిలో ప్రపంచంలో పెద్దది.వరిలో రెండవ స్థానంలో ఉంది. వ్యవసాయ రంగం 58శాతం మందికి జీవనాధారంగా ఉంది.జీడిపిలో 19.9శాతం(2020-21) కలిగి ఉంది.పాల ఉత్పత్తిలో ప్రపంచంలో తొలి స్థానంలో ఉంది. 5.రష్యా: గోధుమ, బార్లీ, ఓట్స్‌ ప్రధాన పంటలు.ఐదోవంతు భూమిలో గోధుమ సాగు చేస్తారు. పదహారు శాతం మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోంది.6. ఫ్రాన్స్‌ : గోధుమ, తృణ ధాన్యాలు, బంగాళాదుంపల వంటి పంటలతో ఫ్రాన్స్‌ ఐరోపాలో ముందుంది. ప్రపంచంలో ద్రాక్షతో ఉత్పత్తి చేసే వైన్‌లో ప్రధమ స్థానంలో ఉంది.ఏడుశాతం మందికి ఉపాధి కల్పిస్తున్నది. 7.మెక్సికో : పండ్లు, మొక్కజొన్న ప్రధాన పంటలు. చెరకు, కాఫీ వాణిజ్య పంటలు.పశుపోషణ ఎక్కువ.8.జపాన్‌ : ప్రధాన పంట వరి. జిడిపిలో రెండుశాతం వాటా ఉంది, పదిశాతం మందికి ఉపాధి కల్పిస్తోంది.సగటు కమతం విస్తీర్ణం మూడు ఎకరాలు మాత్రమే. 9.జర్మనీ : ప్రపంచంలో బీట్‌రూట్‌ ద్వారా పంచదార ఉత్పత్తి చేసే దేశాల్లో నాలుగో స్ధానంలో ఉంది. తరువాత ప్రధాన పంటగా బార్లీ, గోధుమలు ఉన్నాయి. సాగు రంగంలో ఐరోపాలో నాలుగవదిగా ఉంది. 10.టర్కీ : గోధుమ, బీట్‌రూట్‌ ప్రధాన పంటలు. హాజల్‌నట్స్‌, చెస్ట్‌నట్స్‌,అప్రికోట్స్‌, చెరీస్‌ వంటి వాటిని ఎగుమతి చేస్తుంది. ఇరవై ఐదుశాతం మందికి ఉపాధి కల్పిస్తూ జిడిపికి ఎనిమిది శాతం అందిస్తున్నది.


వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ఒక మిత్ర వైరుధ్యంగా చెప్పవచ్చు. తమకు గిట్టుబాటు కావాలంటే యంత్రాలు తప్పవని రైతులు, వాటితో తమ ఉపాధి పోతుందని కూలీలు. రైతులకు గిట్టుబాటు కాకపోవటానికి కూలీల వేతనం కానే కాదు. అదేగనుక వాస్తవమైతే అమెరికాలో కూలీల్లేకుండా చేస్తున్న సాగుదార్లకు పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఎందుకు ఇస్తున్నట్లు ? ఐరాస ఆధ్వర్యంలోని ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) 2022 నివేదికలో యాంత్రీకరణ గురించి చెప్పిన అంశాల సారాన్ని చూద్దాం. దారిద్య్రం, ఆకలిని పోగొట్టాలంటే యాంత్రీకరణ ఒక ప్రధాన పాత్రను పోషిస్తుంది.అది చిన్న రైతులకు అందుబాటులోకి రాకుంటే అసమానతలను పెంచుతుంది. డిజిటల్‌ విప్లవం, యాంత్రీకరణలో దేశాల మధ్య, దేశంలోనే ప్రాంతాల మధ్య తేడాలు ఉన్నాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా డిజిటల్‌ పరికరాలు ఉండాలి.యాంత్రీకరణ ప్రభావం సందర్భాన్ని బట్టి ఉంటుంది. వేతనాలు పెరుగుతున్నపుడు, కూలీల కొరత ఉన్నపుడు అది రైతులు, కార్మికులకు లాభసాటి, నైపుణ్యం కలిగిన వారికి అవకాశాలను సృష్టిస్తుంది. గ్రామీణ కూలీలు ఎక్కువగా, వేతనాలు తక్కువగా ఉన్నపుడు నిరుద్యోగానికి దారితీస్తుంది. సబ్సిడీలు ఎంత ఎక్కువ ఇస్తే అంతగా, వేగంగా యాంత్రీకరణ చేయవచ్చు.కూలీలు అగ్గవగా ఉన్నపుడు విధాననిర్ణేతలు సబ్సీడీలు ఇవ్వకూడదు.అంతగా ఇవ్వాలనుకున్నపుడు సంధికాలంలో పని కోల్పోతున్న వారికి సామాజిక భద్రత కల్పించాలి. మన దేశం, ఇతర అనేక దేశాల అనుభవం చూసినపుడు అలాంటి భద్రత కల్పించిన దాఖలాలు లేవు.


పేదరికం, ఆకలి తాండవించే ప్రాంతాలు ఆఫ్రికా, ఆసియా ఖండాలలో ఎక్కువగా ఉన్నాయి.ప్రపంచంలో 2030నాటికి ఆకలితో ఉండేవారు ఉండకూడదన్నది లక్ష్యం. గడచిన వంద సంవత్సరాలలో ఆఫ్రికాలో తీవ్రమైన కరవులు 300 సంభవించాయంటే అక్కడి పరిస్థితిని ఊహించుకోవచ్చు. 2021లో ఆ ఖండంలో 30 కోట్ల మంది అన్నార్తులున్నారు. అక్కడి ఆహార ఉత్పత్తిలో 70శాతం చిన్న రైతులే చేస్తున్నారు. నిరంతర సాగు వృద్ది, దిగుబడుల పెంపు,ఉపాధి అక్కడి ప్రధాన సవాళ్లు. ఆహార ఉత్పత్తిలో 40శాతం మంది మహిళలు ఉన్నారు. ఆఫ్రికా సాగు వృద్దికి గాను 2030 నాటికి 600 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు అవసరం. అందుకనే ధనిక దేశాలు అక్కడ పెట్టుబడి పెడితే అంటూ పెట్టుబడి-లాభాలు-నష్టాలను బేరీజు వేసుకుంటున్నాయి.


అడవిని కొట్టి కొంత కాలం సాగు చేసి ఆ భూమిని వదలి మరోచోట సాగు చేసే పోడు పద్దతిని అనుసరించే అడవి బిడ్డల నుంచి ఆకాశం నుంచి డ్రోన్లు, విమానాల ద్వారా మందులు చల్లే ఆధునిక సాగుదార్లు ఉన్న ప్రపంచంలో దవోస్‌లో జనవరిలో కొలువు దీరిన ప్రపంచ వాణిజ్య, పారిశ్రామికవేత్తలు డిజిటల్‌ సాగు గురించి సలహాలు ఇచ్చారు. మూడు సాగు చట్టాల పేరుతో నరేంద్రమోడీ సర్కార్‌ ముందుకు తీసుకువచ్చిన అంశాలవే. ఇంటర్నెట్‌లో రైతులు తమ వద్ద ఉన్న పంట గురించి వివరాలు పెడితే, మార్కెట్లో కొనుగోలు చేసే వారు, అప్పులు ఇచ్చేవారు ముందుకు వచ్చి అంతా ఆన్‌లైన్‌లోనే లావాదేవీలు జరుపుతారు, రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని దవోస్‌లో చెప్పారు. కరోనా కాలంలో ఆన్‌లైన్‌ తరగతులు అని చెపితే సెల్‌ఫోన్లకు ఇంటర్నెట్‌ సంకేతాల కోసం చెట్లు ఎక్కిన పిల్లల మాదిరి మారుమూల రైతులు పొలాలను వదలి చెట్లెక్కాల్సి ఉంటుంది. మన దేశంలో చిన్న, సన్నకారు రైతులు 86శాతం మంది ఉన్నారు. ప్రపంచ జిడిపి నాలుగున్నరలక్షల కోట్ల డాలర్లలో నాలుగుశాతం వాటా, నాలుగోవంతు మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయం గురించి ప్రపంచ కార్పొరేట్లు పట్టించుకోవటం వెనుక అసంఘటితంగా ఉన్న రైతుల నుంచి ఎలాంటి పెట్టుబడి, రిస్కు తీసుకోకుండా ఉత్పత్తులను కారుచౌకగా కొట్టేసి లాభాలు పోగేసుకోవాలన్న ఎత్తుగడ తప్ప ఉద్దరించేందుకు కాదు. ప్రపంచంలో మూడో వంతు ఆహారాన్ని 60.8కోట్ల మందిగా ఉన్న చిన్న రైతులు పండిస్తున్నారు. వారికి నిరంతర జీవనం గురించి ఎలాంటి హామీ లేదు.


కార్పొరేట్‌ శక్తుల ధనదాహం, విచక్షణ రహితంగా రైతాంగానికి అందుబాటులోకి తెస్తున్న రసాయనాలు, వాతావరణ మార్పులు తదితర అంశాల కారణంగా ఏటా కోటీ 20లక్షల హెక్టార్ల భూమి సాగుకు పనికి రాకుండా పోతున్నది. దాన్ని అరికట్టి జనాలకు ఉపాధి చూపటం ఒక పద్దతి. దానికి బదులు కృత్రిమ సాగు గురించి కార్పొరేట్‌ సంస్థలు ప్రతిపాదనలను ముందుకు తెస్తున్నాయి. వాటిని ఎందుకు తెచ్చినప్పటికీ వీటిని తిరస్కరించాల్సిన అవసరం లేదు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, వారు కడుపునిండా తినేందుకు అవసరమైన మొత్తంలో ఆహారం కావాలంటే 70శాతం ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని అంచనా. ఇతర అవసరాలకోసం చేసే పరిశోధనలు అనేక సందర్భాలలో ఇతర రంగాలలో విప్లవాత్మక మార్పులకు వీలు కల్పించాయి. అంతరిక్ష పరిశోధనలే అందుకు ఉదాహరణ. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్వహణకు చేసిన వార్షిక ఖర్చుతో పోల్చితే అది చేసిన పరిశోధనల వలన అమెరికా ఆర్థిక వ్యవస్థకు మూడు రెట్లు ఆర్థిక లబ్ది కలుగుతోంది.హరికేన్ల గురించి హెచ్చరించటం మొదలు రోబోటిక్స్‌ వరకు ఆరోగ్యం నుంచి ఆహార నిల్వ పద్దతుల వరకు అనేక రూపాల్లో అది ఉంది. ఇప్పుడు అంతరిక్షంలో సాగు గురించి పరిశోధిస్తున్నారు. అంతరిక్ష నౌకలలో వెళ్లి పరిశోధనలు చేసే వారి మీద అంతరిక్ష వెలుగు ప్రభావం ఎలా ఉంటుంది అన్న అంశంపై చేసిన పరిశోధనలలో వచ్చిన ఫలితాలతో ఇండ్లలో ఎల్‌ఇడి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కిరణ జన్య సంయోగ క్రియతో మొక్కలను పెంచవచ్చని చేసి చూపారు. దీంతో కొన్ని దేశాల్లో సాగుభూమి కొరతను అధిగమించేందుకు అనేక అంతస్తుల భవనాలను నిర్మించి వాటిలో ఆహారానికి అవసరమైన ఆకుకూరల వంటి వాటిని పండిస్తున్నారు. ఇలాంటి భవనాల్లో ఒక ఎకరం విస్తీర్ణం అందుబాటులోకి వచ్చి అక్కడ పండించే పంటల మొత్తం భూమి మీద నాలుగు-ఆరు ఎకరాలలో పండేదానికి సమానంగా ఉంటున్నది. ఈ భవనాల్లో ఏడాది అంతటా సాగు చేయవచ్చు. వాటికి భారీ యంత్రాల వంటి పరికరాలు అవసరం ఉండదు, ఇతర ఖర్చులూ తక్కువే. ఇలాంటి పరిశోధనలు, ప్రయోగాలు మరింతగా అవసరం. అదే విధంగా ఆస్ట్రోనాట్లకు నిల్వవుండే ఆహార పదార్దాలను ఎలా అందచేయాలన్న పరిశోధన వెలుపల ఆహార నిల్వ ప్రక్రియకు దోహదం చేసింది. శాస్త్రవేత్తలు నూతన వంగడాల మొదలు ఆవిష్కరించిన అనేక నూతన ప్రక్రియలను రైతాంగానికి తక్కువ ధరలతో అందుబాటులోకి తేవాల్సిన ప్రభుత్వాలు వాటిని కార్పొరేట్‌ సంస్థలకు లాభాల కోసం అప్పగిస్తున్నాయి.


ప్రపంచ వాణిజ్య సంస్థలో వ్యవసాయ సబ్సిడీలు, వాణిజ్యం మీద దోహా దఫా చర్చలు ప్రారంభమై రెండు దశాబ్దాలు గడిచినా కనుచూపు మేరలో ఒప్పందం కుదిరే అవకాశం కనిపించటం లేదు. ఇంతకాలం చర్చలు చేసి సాధించిందేమిటంటే ఇప్పుడున్న స్థితిని మరింతగా అస్థిరపరచవద్దనే ఏకాభిప్రాయానికి తాజా (2022 జూన్‌) జెనీవా సమావేశం వచ్చింది. ఒకసారి ఆఫ్ఘనిస్తాన్‌లో అస్థిరత అని చెప్పారు తరువాత ఉక్రెయిన్‌ సంక్షోభం అంటూ సాకులతో కాలం గడుపుతున్నారు. ఒప్పందం కుదిరితే ధనిక దేశాలకు నష్టం గనుక అవి ముందుకు సాగనివ్వటం లేదు. ప్రపంచీకరణకు ప్రపంచ వాణిజ్య సంస్థను ఏర్పాటు చేశారు. ఇంజన్‌ మొరాయించలేదు గాని వాహనాన్ని ముందుకు లాగలేకపోతోంది అన్నట్లుగా దాని పరిస్థితి ఉంది. సర్వేజనా సుఖినోభవంతు దానికి ప్రతిదేశం సంపద్వంతం కావాలన్నది ప్రపంచీకరణ సుభాషితం. అందుకు గాను స్వేచ్చామార్కెట్‌ ఉండాలని చెప్పింది. మార్కెట్‌ అంటేనే లాభాలు, కర్ర ఉన్నవాడితే గొర్రె అన్నట్లు అవి మార్కెట్లో పట్టున్నవారికే వస్తాయి. ఇప్పుడు ఆ పట్టుకోసం కుమ్ములాట, ధనికదేశాలు తాము చెప్పిన పద్దతిల్లో ఆట నిబంధనలు ఉండాలని చెబుతున్నాయి.వాటిలో కూడా విబేధాలు. ప్రపంచ వాణిజ్య సంస్థ, దానికి ముందు ఉన్న పన్నులు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం(గాట్‌) గానీ మీరు పప్పులు తీసుకు రండి మేము పొట్టు తీసుకువస్తాం రెండింటినీ కలిపి ఊదిన తరువాత మిగిలిన వాటిని పంచుకుందాం అన్నట్లుగా పశ్చిమ దేశాలు తమకు అనుకూలంగా ఏర్పరచుకున్నవే. దేశాలను ఆక్రమించి వలసలుగా చేసుకోవటం కుదరదు గనుక మార్కెట్లను ఆక్రమించే ఎత్తుగడదానిలో ఉంది. అది పారలేదు గనుక కొత్త దారులు వెతుకుతున్నాయి. భారత్‌, చైనా వంటివి కొరకరాని కొయ్యలుగా మారాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

31 Tuesday Jan 2023

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Adani, Adani Group, BJP, HINDENBURG, HINDENBURG RESEARCH, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


” విదేశీయులు చెప్పింది నమ్ముతారు తప్ప భారతీయులు చెప్పింది నమ్మరు ” అదానీ కంపెనీల అవకతవకలంటూ అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ సంస్థ ప్రకటించిన నివేదిక మీద స్పందనగా స్వయం ప్రకటిత ” దేశభక్తులు ”గా చెప్పుకుంటున్నవారి స్పందన. నిజమే, బ్రిటన్ను వెనక్కు నెట్టి ప్రపంచ జిడిపిలో ఐదవ స్థానానికి మన దేశాన్ని తీసుకుపోవటంలో నరేంద్రమోడీ గొప్పతనం గురించి గతేడాది మన భారతీయులు చెప్పారు. దానికి తోడు ఆత్మనిర్భరత పేరుతో ప్రకటించిన భరోసా, రాయితీల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయటంతో 2022లో ప్రపంచ స్టాక్‌మార్కెట్లో మన వాటాల విలువ 3.6శాతం పెరిగింది. ఎవరో విదేశీయులో మరొకరో చెప్పిన మాటలను బట్టి కాదు పక్కా భారతీయులు చెప్పిందాన్ని నమ్మబట్టే. కానీ తాజాగా ఒక్క విదేశీ కంపెనీ చెప్పిన అంశాలతో అలాంటి మార్కెట్‌ వాటా 3.1శాతానికి తగ్గింది, దాని విలువ 3.2లక్షల కోట్ల డాలర్లు.అబ్బే నిజం అసలే అక్రమాలేం జరగలేదని పక్కా భారతీయుడు అదానీ జాతీయ జండాను ఎగురవేసి 413 పేజీల వివరణ ఇచ్చినా మార్కెట్లో అతని కంపెనీల షేర్ల పతనం ఆగలేదు.


ఇప్పుడంతా విదేశీయులు చెప్పిందే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. స్వదేశీయులు గుజరాత్‌ మారణకాండ గురించి గతంలో చెప్పిందాన్ని జనం విశ్వసించలేదు, కనుకనే ఇప్పుడు బిబిసి డాక్యుమెంటరీలో చెప్పిందేమిటి అనే ఆసక్తి పెరిగింది ? దాన్ని చూసిన విద్యార్థులను రాజస్తాన్‌లో అరెస్టు చేసినట్లు వార్తలు. నాడు జరిగిన ఉదంతాలపై బ్రిటీష్‌ రాయబారి తమ దేశానికి నివేదించిన అంశాలను బిబిసి వెల్లడించింది. విశ్వహిందూపరిషత్‌ వంటి సంస్థల పాత్రను పేర్కొన్నారు. దాని గురించి మీరు చెప్పాల్సిందేమైనా ఉందా అని మన కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే చెప్పేందుకు నిరాకరించింది. గుజరాత్‌లో జరిగిందేమిటో, ఎవరు మారణకాండకు పాల్పడ్డారో మన జనానికి తెలియదా ? నిజానికి తమకేమీ సంబంధం లేదని చెప్పే సంస్థలు, బిజెపి గానీ బిబిసికి పోటీగా దేశమంతటా ఊరూవాడా తిరిగి సభలు పెట్టి జరిగిందేమిటో వివరించవచ్చు. స్వంత డాక్యుమెంటరీలను తీసి తాము చెప్పదలచుకున్నదానిని చెప్పవచ్చు. నటించేందుకు కమలశ్రీ కంగన రనౌత్‌ వంటి నటీమణులు, ఎందరో నటులు, కాశ్మీరీ ఫైల్స్‌ ఫేమ్‌ వివేక్‌ అగ్నిహౌత్రి వంటి ఎలా కావాలంటే అలా తీసే దర్శకులకేమీ కొదవ లేదు.


దానికి బదులు అధికారం ఉంది కదా అని సామాజిక మాధ్యమాల్లో కనిపించకుండా అడ్డుకున్నారు. ప్రపంచంలోని పలు దేశాలు, చివరికి మన దేశానికి సంబంధించి అనేక అంశాల మీద సమాచారం కోసం బిబిసి రేడియో మీదనే ఆధారపడిన రోజులు దేశంలో ఉన్నాయి.1975లో అత్యవసర పరిస్థితి ప్రకటన అనేక మంది ముందుగా దాని ద్వారానే తెలుసుకున్నారు. మన ప్రభుత్వ, ప్రయివేటు మీడియా సంస్థలు పాలకులకు బాకాలుగా మారిన స్థితిలో నిజాల కోసం పరితపించిన జనాలు విదేశీ మీడియా కోసం ఎదురు చూశారు. అర్నాబ్‌ గోస్వామి వంటి వారి కారణంగా ఇప్పటికీ అదే స్థితి. హిండెన్‌బర్గ్‌ నివేదిక తరువాత అదానీ కంపెనీల వాటాలను తెగనమ్ముకున్నవారికి అదానీ మీద నమ్మకం లేకనే కదా ఆ పని చేశారు. వారందరినీ దేశద్రోహులు అంటారా ! గతంలో సత్యం కంప్యూటర్స్‌ వంటి కంపెనీలెన్ని జనాన్ని ముంచలేదు ? అదానీ కంపెనీల వాటాల ధరలు విపరీతంగా పెరగటాన్ని చూసిన అనేక మంది ఇది ఏదో ఒక ముహూర్తాన వాటి బాటన పడుతుందని చెబుతూనే ఉన్నారు.


ఇప్పుడు చూస్తే అదానీ గ్రూపు కంపెనీల తీరుతెన్నుల గురించి వెలువడిన హిండెన్‌బర్గ్‌ నివేదిక దేశమంతటా సంచలనం సృష్టించింది. ఇది నరేంద్రమోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో భాగమనే పల్లవిని అందుకున్నారు. అవినీతి మరకలేని కేంద్ర ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలకు శ్రీకారం చుట్టేందుకు అదానీ గ్రూపును తీసుకున్నారన్నది ప్రచార సారం. కానీ నరేంద్రమోడీ అలా అనుకుంటున్నట్లు లేదు, లేకుంటే ఎందుకు స్పందించటం లేదు? మోడీ అంటే అదానీ – అదానీ అంటే మోడీ అన్న వాతావరణం దేశంలో ఉన్నమాట వాస్తవం. అందువల్లనే అదానీ కంపెనీ మీద వచ్చిన నివేదికను మోడీకి కూడా కలిపి ప్రభుత్వం మీద కుట్రగా చెప్పటం తప్ప మరొకటి కాదు. మోడీ సర్కార్‌ విధానాలను విమర్శించటం దేశద్రోహం అని చిత్రించినట్లుగానే ఇప్పుడు అదానీ కంపెనీ గురించి ఏదైనా ప్రతికూల అంశాలను చెబితే దాన్ని కూడా దేశద్రోహం అనే స్థితికి వెళ్లారు. మన వారు ధనికులు కావటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని నిందిస్తున్నారు.


అదానీ కంపెనీ ఆర్థిక విభాగ అధిపతి జగుషిందర్‌ సింగ్‌ హిండెన్‌ బర్గ్‌ నివేదికను బ్రిటీష్‌ వారి జలియన్‌వాలాబాగ్‌ మారణకాండతో పోల్చారు. దేశం మీద, దాని సంస్థల మీద పథకం ప్రకారం జరిపిన దాడి అన్నారు. మదుపుదార్లు ఈ నివేదికను ఎందుకు నమ్మారు అన్న ప్రశ్నకు తోటి భారతీయులు కొందరి తీరు తనకు ఆశ్చర్యం కలిగించలేదని సెలవిచ్చారు. జనవరి 24న హిండెన్‌బర్గ్‌ నివేదిక వెల్లడైంది. తరువాత స్టాక్‌ మార్కెట్లో అదానీ కంపెనీల వాటా ధరల పతనానికి దారితీసింది. రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లు మిగతా కంపెనీల వాటాల ధరలు కూడా తగ్గాయి. కొన్ని లక్షల కోట్ల మేరకు వాటాదార్ల సంపద ఆవిరైంది. సోమవారం నాడు రాయిటర్‌ వార్తా సంస్థ ఇచ్చిన కథనం మేరకు 65బిలియన్‌ డాలర్ల సంపద హరీమంది. ప్రతి పైసాకు జవాబుదారీగా ఉంటానని చెప్పిన చౌకీదార్‌ ప్రధాని నరేంద్రమోడీ జనవరి 31న ఇది రాసిన సమయం వరకు దీని మీద ఎలాంటి ప్రకటన చేయలేదు. పత్రికా గోష్టి పెట్టి విలేకర్ల ప్రశ్నలను ఎదుర్కొనేందుకు మనస్కరించకపోవచ్చు, విశ్వగురువుగా తన స్థాయికి తగిన విధంగా ప్రశ్నలు అడిగే విలేకర్లు లేరని భావించవచ్చు. ఆర్నాబ్‌ గోస్వామి వంటి ఒకరిద్దరు ధైర్యం చేసి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్దంగాకపోవచ్చు. ఇంత పెద్ద సంచలనం మీద జనాలకు ఏదో ఒకటి చెప్పాలా లేదా ? నిజంగా అదానీ కంపెనీల నిజాయితీ మీద అంత నమ్మకం ఉంటే అవి ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ప్రకటించి అనుమానాలకు తెరదించాలి, లేదా వాజ్‌పాయి చెప్పినట్లు అధికారంలో ఉన్నవారు రాజధర్మాన్ని పాటించి విచారించి నిజా నిజాలు తేలుస్తామనైనా చెప్పాలి. మౌనానికి అర్ధం ఏమిటి ?మన్మోహన్‌ సింగ్‌ను మౌన ముని అంటూ ఎద్దేవా చేసిన వారు దీన్ని గురించి ఏమంటారు ? మోడీ స్పందించాల్సినంత పెద్దది కాదు అనుకోవాలా ? అంటే మీరు నందంటే నంది పందంటే పందని జనం కూడా చెవులో పూలు పెట్టుకొని తలూపాలా ?


ఒక అగ్రదేశ ఇంటిలిజన్స్‌ నిధులతో నడుస్తున్న హిండెన్‌బర్గ్‌ అని వాట్సాప్‌లో ఒక ప్రచారం జరుగుతున్నది. అమెరికాలో సిఐఏ, ఎఫ్‌బిఐ గురించి అందరికీ తెలిసిందే. వాటిలో ఏదో ఒకటి దీనికి నిధులు ఇచ్చిందంటున్నారు. నిజమే అనుకుందాం. మన దేశం అమెరికాకు జిగినీ దోస్తుగా ఉంది కదా ! మా దేశానికి వ్యతిరేకంగా ఇలాంటి కుట్రలు చేయిస్తున్నారేమిటని నరేంద్రమోడీ ఎందుకు ప్రశ్నించరు ? 2014కు ముందు అదానీ గ్రూపు లేదా అప్పటి ప్రభుత్వం దాన్ని పెంచి పోషించలేదా, రుణాలు ఇవ్వలేదా ఇప్పుడెందుకు గగ్గోలు అంటున్నారు. లేదని ఎవరు చెప్పారు, కాంగ్రెస్‌ పాలకులు పెంచి పోషించలేదని ఎవరు అన్నారు. నరేంద్రమోడీ కూడా ఆపని చేస్తున్నారా లేదా అది తప్పా ఒప్పా అన్నదే ప్రశ్న. గతానికి నరేంద్రమోడీ పాలనకూ పోల్చి అనేక అంశాలు చెబుతున్నవారు 1988లో ప్రారంభమైన అదానీ కంపెనీల ఆస్తులు 2014కు ముందు తరువాత ఎంత అన్నది చెప్పలేరా ? నరేంద్రమోడీ తిరిగేందుకు తన జెట్‌ విమానాన్ని ఇచ్చారు తప్ప కాంగ్రెస్‌ నేతలకు ఇచ్చారా లేదా అన్నది కూడా చెప్పాలి. 2014లో అదానీ సంపదల విలువ 8 బిలియన్‌ డాలర్లు కాగా 2022లో అది 137బి.డాలర్లకు (1,600శాతం) పెరిగింది. ఈ వాస్తవాన్ని కాదనగలరా ? మిగతా కంపెనీలకు లేని ఈ పెరుగుదల అదానీకి ఎలా వచ్చింది ? ఏదైనా మంత్రదండం ఉందా ? మిగతా పారిశ్రామికవేత్తలు కూడా చొక్కా – పాంట్లు విప్పి పక్కనపెట్టి పలుగూ పారా, సుత్తీ రెంచీలు పట్టుకొని పని చేసిన వారు కాదా ? వందల సంవత్సరాలుగా పారిశ్రామికవేత్తలుగా ఉన్న టాటా, బిర్లా, తరువాత వచ్చిన అంబానీ కంపెనీలకు రాని లాభాలు అదానీకి ఎలా వచ్చినట్లు ?


హిండెన్‌బర్గ్‌ లేవనెత్తిన అంశాల్లో అదానీ గ్రూపు రుణాల గురించి మాత్రమే కాదు అదొకటి మాత్రమే. పన్ను స్వర్గాలతో సంబంధాలు పెట్టుకొని ఎగవేసినట్లు కూడా ఆరోపించింది. రుణ ఎగవేతదార్ల జాబితాలో అదానీ ఉన్నట్లు ఎవరూ చెప్పటం లేదు, అలాంటి ప్రమాదం ఉందని మాత్రమే అంటున్నారు.2015లోనే క్రెడిట్‌ సూసీ తన నివేదికలో తీవ్ర రుణ వత్తిడిని ఎదుర్కొంటున్న పది సంస్థలలో అదానీ గ్రూపు ఒకటని పేర్కొన్నది. తాజాగా అమ్మకానికి పెట్టిన ఎఫ్‌పిఓ వాటాలతో వచ్చిన సొమ్మును కొత్త పెట్టుబడి కోసం గాక ఇప్పటికే ఉన్న కంపెనీల అప్పులు తీర్చేందుకు అన్నది తెలిసిందే. బమ్మిని తిమ్మిని చేసి లేని విలువను సృష్టించి మోసానికి పాల్పడిన సత్యం కంపెనీ మాదిరి అదానీ చేసినట్లు చెప్పింది ప్రధాన అంశం, దాని గురించి చెప్పకుండా రుణాల చుట్టూ తిప్పుతున్నారు. ఎల్‌ఐసి పెట్టిన పెట్టుబడుల కంటే ఇప్పటికీ విలువ ఎక్కువే ఉన్నదని, నష్టం లేదు కదా అని లెక్కలు చెబుతూ పక్కదారి పట్టించేందుకు చూస్తున్నారు. ఎల్‌ఐసి కొనుగోలు చేసిందంటే కంపెనీ విశ్వసనీయత కలిగినదని మదుపుదార్లు విశ్వసిస్తారు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వ పెద్దలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించి ఉంటారన్నది ఒక అభిప్రాయం.


అదానీ కంపెనీలకు బాంకులు కాంగ్రెస్‌ ఏలుబడిలో రుణాలు ఇవ్వలేదా అని సవాలు విసురుతున్నారు. ఇవ్వలేదని ఎవరూ చెప్పటం లేదే. పారుబాకీల పారిశ్రామికవేత్తలందరికీ కాంగ్రెస్‌ నేతలు రుణాలు ఇప్పించి ఎగవేయించారని చెప్పింది బిజెపి నేతలు. అదానీ కంపెనీకి ఉన్న అప్పు మొత్తాన్ని చూస్తే మిగతా వారి మాదిరే ఈ కంపెనీ కూడా చేతులెత్తేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక రాకముందే గత ఏడాదే అనేక మంది ఈ అంశాన్ని లేవనెత్తినపుడు అదానీ కంపెనీ అప్పులు తీర్చే స్థితిలో ఉందని అనేక మంది కంపెనీ లాబీయిస్టులు మీడియాలో రాశారు. అదానీ కంపెనీలకు ఎస్‌బిఐ రుణాలు ఇవ్వటం, ఎల్‌ఐసి పెద్ద మొత్తంలో వాటాలు కొనటం వెనుక బిజెపి పెద్దల హస్తం ఉందన్న విమర్శలున్నాయి. ఎవరో ఏదో అన్నదాని గురించి రాముడు, సీత, అగ్ని ప్రవేశం గురించి రోజూ చెబుతారు కదా ! అది తమకు వర్తించదా, సచ్చీలతను నిరూపించుకోరా, సీత మాదిరి అగ్ని ప్రవేశాన్ని గానీ రాజీనామాను గానీ ఎవరూ కోరటం లేదు. బ్యాంకు కార్మిక యూనియన్లలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలు ఇప్పించిన రుణాల మీద కూడా విచారణ జరిపించాలని, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన లోన్ల దందాలపై కూడా నిష్పాక్షిక విచారణ జరిపించాలని వాట్సాప్‌ పండితులు వాదిస్తున్నారు. అసలు వీరి సమస్య ఏమిటి ? ఆ పని చేస్తే నరేంద్రమోడీకి ఎవరు అడ్డుపడ్డారు ? ఇడి, సిబిఐలను అలాంటి అక్రమాల నిగ్గుతేల్చేందుకు పంపండి. అధికారానికి వచ్చి తొమ్మిదేండ్లు , అరిగిపోయిన రికార్డులను ఎన్ని సంవత్సరాలు ఇంకా వినిపిస్తారు ?


హిండెన్‌బర్గ్‌ లేవనెత్తిన అంశాలకు అదానీ కంపెనీ 413 పేజీలతో సుదీర్ఘ వివరణ ఇచ్చింది.అసలు అంశాలను పక్కన పెట్టిందని, జాతీయజండాను కప్పి అక్రమాలను కనపడకుండా చేసేందుకు పూనుకున్నదని హిండెన్‌బర్గ్‌ స్పందించింది. గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీకి సంబంధించిన విదేశీ సూట్‌కేస్‌ కంపెనీల లావాదేవీల గురించి తాము ప్రశ్నించినదానికి సమాధానం లేదని పేర్కొన్నది. వాటికి అదానీ కంపెనీల నుంచి పంపినవి, తిరిగి వాటి నుంచి అదానీ కంపెనీలకు చేరిన బిలియన్ల డాలర్ల నిధుల సంగతేమిటని, అవి వినోద్‌ అదానీకి ఎక్కడి నుంచి వచ్చిందీ చెప్పాలని హిండెన్‌బర్గ్‌ కోరింది. దానికి అదానీ కంపెనీ ఇచ్చిన వివరణ ఏమిటో తెలుసా ! ” ఆ కంపెనీలకు నిధులు ఎక్కడివో మాకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందీ తెలుసుకోవాల్సిన అవసరమూ మాకు లేదు. వినోద్‌ అదానీ వాణిజ్యం, లావాదేవీల గురించి వ్యాఖ్యానించే స్థితిలో మేము లేము ” అని పేర్కొన్నారు. అదే గనుక నిజమైతే గౌతమ్‌ అదానీ తన సోదరుడిని విడిగా లేదా కుటుంబ సంస్థను నడుపుతున్నారు గనుక భోజన టేబుల్‌ దగ్గర గానీ ఆ వివరాలన్నీ అడిగి రహస్యాన్ని చేధించాలని, తాము లేవనెత్తిన ప్రశ్నలలో 62 నుంచి 88 వరకు నిర్దిష్ట సమాధానాలు చెప్పలేదని పేర్కొన్నది.
హిండెన్‌బర్గ్‌ సంస్థ నివేదిక వెనక కుట్ర ఉంది అంటున్నారు. మనకు జేమ్స్‌ బాండ్‌ అజిత్‌ దోవల్‌, అనేక కుట్రలను ఛేదించిందని అని చెబుతున్న ” రా ” ఎన్‌ఐఏ వంటి సంస్థలున్నాయి, ఆఫ్టరాల్‌ ఒక చిన్న సంస్థ సంగతి తేల్చేందుకు అమెరికా మీద వత్తిడి తేలేరా ? దాని బండారాన్ని బయటపెట్టి జనానికి, అదానీ వంటి పారిశ్రామికవేత్తలకు, వారి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారికి, వాటాలు కొనుగోలు చేసిన లక్షలాది మంది మదుపుదార్లకు ధైర్యం కల్పించలేరా ? నష్టాలను నివారించలేరా? విమర్శకుల నోరు మూయించలేరా ? భద్రమైన చేతుల్లో దేశం ఉందని,ప్రతి పైసాకు జవాబుదారునని చెప్పటం కాదు నిరూపించాలి.ఇది తగిన తరుణం. బిబిసి చిత్రం గురించి మాట్లాడలేదు, హిండెన్‌బర్గ్‌ వంటి సంస్థల కుట్రలను గురించీ అదే మౌనం. చిన్న సందేహం, అవసరమైనపుడు కూడా నరేంద్రమోడీ నోరు విప్పకపోతే చరిత్ర క్షమిస్తుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

దిమ్మ తిరిగే నరేంద్రమోడీ మంత్రాంగం : రష్యా చమురు దిగుమతి అసలు మతలబు ఇదా !

18 Wednesday Jan 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

BJP, Energy Crisis, Narendra Modi, Oil Imports From Russia, Reliance, Russian oil


ఎం కోటేశ్వరరావు


2021 డిసెంబరు నెలతో పోలిస్తే 2022 డిసెంబరులో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురు 33 రెట్లు పెరిగింది. మన దిగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న ఇరాక్‌ను వెనక్కు నెట్టి రష్యా ముందుకు వచ్చింది. డిసెంబరు నెలలో రోజుకు పన్నెండు లక్షల పీపాలను మనం దిగుమతి చేసుకున్నాము. జనవరిలో 17లక్షలకు పెరిగింది. మన దేశం ఏడాది క్రితం దిగుమతి చేసుకున్న ముడిచమురులో అక్కడి నుంచి వచ్చేది కేవలం 2శాతమే, అలాంటిది ఇప్పుడు 25 నుంచి 30శాతానికి చేరింది. ఇరాక్‌ నుంచి 8.86లక్షలు, సౌదీ అరేబియా నుంచి 7.48లక్షల పీపాలు దిగుమతి చేసుకున్నాము. ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక చర్యను అమలు చేస్తున్న రష్యాను దెబ్బతీసేందుకు ప్రకటించిన ఆనేక ఆంక్షల్లో భాగంగా డిసెంబరు ఐదవ తేదీ నుంచి తాము నిర్ణయించిన పీపా 60డాలర్ల ధరకు మించి ఎవరూ కొనుగోలు చేయరాదని, తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే వారి మీద కూడా ఆంక్షలు ప్రకటిస్తామని అమెరికా, ఐరోపా సమాఖ్య, జి7 కూటమి, మరికొన్ని దేశాలు ప్రకటించాయి. వాటిని ఆమోదించిన దేశాలకు తాము విక్రయించేది లేదని పుతిన్‌ ప్రకటించాడు. ఉక్రెయిన్‌ సంక్షోభానికి ముందు మన దేశం వంద పీపాలు దిగుమతి చేసుకుంటే 60 మధ్యప్రాచ్య దేశాల నుంచి 14 అమెరికా, 12 ఆఫ్రికా, ఐదు లాటిన్‌ అమెరికా, రెండు పీపాలు రష్యా నుంచి దిగుమతి ఉండేది.


పశ్చిమ దేశాలు ప్రకటించిన ఆంక్షలను ఖాతరు చేయరాదని భారత్‌, చైనా మరికొన్ని దేశాలు నిర్ణయించాయి.ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా తమ ఇంథన భద్రతను తాము చూసుకోవాలని అందుకోసమే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటామని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు.కేంద్ర ప్రభుత్వం క్రియాశీలత, వేగాన్ని ప్రదర్శించిందని ఆర్థికవేత్త అశోక్‌ గులాటీ వర్ణించారు. ఇంథన ధరలు అదుపు తప్పకుండా ఉండేందుకే కొనుగోలు అన్నారు.రష్యా ప్రతిపాదనను అంగీకరించకపోతే లీటరు పెట్రోలు రు.150 నుంచి 175కు పెరిగేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలివైన నిర్ణయం తీసుకుందని క్రిసిల్‌ ప్రధాన ఆర్థికవేత్త డికె జోషి చెప్పారు. ఇక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌గారు ప్రధాని రాజనీతిజ్ఞత, ధైర్యం కారణంగానే రష్యా నుంచి కొనుగోళ్లు పెంచినట్లు చెప్పారు. తమ ఆంక్షలను ధిక్కరించినా భారత్‌ మీద ఎలాంటి ప్రతికూల చర్యలు తీసుకోకూడదని పశ్చిమ దేశాలు నిర్ణయించాయి. దాంతో మన అవసరం వారికి ఉంది కనుకనే అమెరికా దిగివచ్చిందని, ఇదంతా నరేంద్రమోడీకి ప్రపంచంలో ఉన్న పలుకుబడి, అమెరికా మెడలు వంచే సత్తా కలిగి ఉండటమే అని ప్రచారం చేశారు. దశాబ్దాలుగా సోవియట్‌, తరువాత రష్యా మనకు మిత్రదేశంగా ఉంది కనుక అనేక మంది నిజమే అని నమ్మారు. తాజాగా వచ్చిన సమాచారం ఇప్పుడు అనేక అనుమానాలను ముందుకు తెస్తున్నది. ముందే చెప్పుకున్నట్లు రికార్డు స్థాయిలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన రష్యా చమురుతో వినియోగదారులకు ఒరిగిందేమిటో ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. గతేడాది ఏప్రిల్‌ తరువాత ధరలను తగ్గించిందీ లేదు. దానిని అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రిలయన్స్‌, నయారా సంస్థలు ఎక్కడా ఒక్క లీటరు పెట్రోలు, డీజిల్‌ కూడా తక్కువ ధరలకు అమ్మిన జాడలేదు. రష్యా ఇచ్చిన రిబేటు ఎవరి జేబుకు వెళ్లినట్లు ?


నిజానికి రష్యా చమురును అమెరికా, ఇతర దేశాలకు అమ్మేందుకే అని, అంబానీకి లాభాలు కట్టబెట్టేందుకే అని ఇప్పుడు అసలు సంగతి వెల్లడైంది. ఆ చమురును ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న అంబానీ, ఇతర ప్రైవేటు చమురుశుద్ధి కర్మాగారాలు దాన్నుంచి ఉత్పత్తి చేసిన వివిధ ఉత్పత్తులను అమెరికా,బ్రిటన్‌కు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నాయి. ఒక వైపు రష్యా మీద ఆంక్షలు మరోవైపు అక్కడి నుంచి దిగుమతి చేసుకొని మరో దేశంలో ఉత్పత్తి చేస్తున్న చమురు ఉత్పత్తులను చౌకగా కొనుగోలు చేసి లబ్దిపొందుతున్న పశ్చిమ దేశాల మోసకారితనం దాస్తే దాగేది కాదు. ఇదంతా నరేంద్రమోడీ సర్కార్‌కు తెలియకుండా జరుగుతుందా ? ఆంక్షలకు ముందు అమెరికా కంపెనీలు రష్యాలో ముడిచమురు నుంచి ఉత్పత్తి చేసే వర్జిన్‌ గాస్‌ ఆయిల్‌ (విజిఓ)ను దిగుమతి చేసుకొనేవి. ఇప్పుడు భారత్‌ నుంచి కొనుగోలు చేస్తున్నాయి. రష్యా నుంచి రిలయన్స్‌, నయారా ఎనర్జీ కంపెనీలు ముడి చమురు దిగుమతి చేసుకొని విజిఓ, ఇతర ఉత్పత్తులుగా మార్చి అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. రోజుకు రెండులక్షల పీపాల ఎగుమతి జరుగుతున్నట్లు కెప్లర్‌ సంస్థలో ముడిచమురు విశ్లేషకుడిగా ఉన్న విక్టర్‌ కాటోనా చెప్పాడు. రష్యా చమురును పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నది ఆ రెండు కంపెనీలైనప్పటికీ ప్రభుత్వ రంగంలోని ఐఓసి,బిపి, హెచ్‌పి సంస్థలు కూడా పెద్ద ఎత్తున రంగంలోకి దిగుతున్నాయని, ప్రతివారూ కొంటున్నారు, ఇప్పుడిది ఒక జాతీయ క్రీడగా మారిందని కాటోనా అన్నాడు.


ప్రస్తుతం రోజుకు మన దేశం 17లక్షల పీపాలు కొనుగోలు చేస్తుండగా దానిలో ఒక్క రిలయన్స్‌ కంపెనీ రోజుకు ఆరులక్షల పీపాలు దిగుమతి చేసుకుంటోంది. దాని చమురు శుద్ది సామర్ధ్యంలో ఇది సగం.నయారా ఎనర్జీ ఇటీవల దాదాపుగా రష్యన్‌ చమురునే శుద్ధి చేస్తోంది. భారత్‌కు పీపాకు పది డాలర్ల చొప్పున తక్కువ ధరకు ఇస్తున్నందున ఇక్కడి చమురుశుద్ది కంపెనీలకు ఒక టాంకరుకు కోటి డాలర్ల మేరకు లాభం వస్తున్నదని, ప్రస్తుతం భారత రేవులకు వచ్చినవి లేదా దారిలో ఉన్నవిగానీ 68 టాంకర్లు ఉన్నట్లు కాటోనా వెల్లడించాడు. డిసెంబరు నెల సమాచారాన్ని చూసినపుడు విజిఓ ఎక్కువగా అమెరికా, తరువాత ఐక్య అరబ్‌ ఎమిరేట్స్‌, సింగపూర్‌ వెళ్లినట్లు కాటోనా చెప్పాడు.ఎక్కడైనా ఆధునిక చమురుశుద్ది కర్మాగారం ఉంటే విజివోతో రవాణా ఇంథనాల తయారు ప్రత్యేకించి డీజిల్‌, అవసరమైతే పెట్రోలుగా కూడా మార్చవచ్చన్నాడు. మన దేశం నుంచి అమెరికా ఒక్కటే కాదు, రష్యా మీద కాలుదువ్వుతున్న బ్రిటన్‌ కూడా దొడ్డిదారిన కొనుగోలు చేస్తున్నట్లు కెప్లర్‌ సమాచారం వెల్లడించింది. 2022లో జామ్‌ నగర్‌లోని రిలయన్స్‌ రిఫైనరీ 215 టాంకర్లలో చమురు దిగుమతి చేసుకుంది.


అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలు తమ చమురు ఉత్పత్తులను కొనుగోలు చేసి తమకు డాలర్లను సమకూర్చుతున్నందున, మన దేశం ద్వారా లబ్ది కలుగుతున్నది కనుక రష్యా ఎలాంటి అభ్యంతరాలు పెట్టటం లేదు, మనం ఎంత కోరితే అంత పంపుతున్నది. ఈ పరిణామం రష్యా చమురు కొనుగోలు నిలిపివేసిన ఐరోపా దేశాలు-అమెరికా మధ్య విబేధాలను కలిగిస్తే అదీ పుతిన్‌కు లాభమే కనుక చూసీ చూడనట్లు ఉన్నాడని అనుకోవాలి. ఐరోపాలో ప్రస్తుతం పెట్రోలు, డీజిలు ధరలు భారీ ఎత్తున పెరిగాయి. ముడి చమురు ఎక్కడిదైనా మన దేశం తక్కువ ధరలకు ఎగుమతి చేస్తే తీసుకొనేందుకు వాటికి అభ్యంతరం లేదు. గతంలో కూడా కొంత మేర దిగుమతి చేసుకున్నందున ఇప్పుడు ఇంకా పెంచుకుంటున్నాయి. బ్రిటన్‌ నిబంధనలు కూడా ఈ దిగుమతులకు అవకాశం కలిగిస్తున్నాయి. పశ్చిమ దేశాల తరఫున రష్యాతో తలపడుతున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీ దీని గురించి తెలిసినా పైకి చెప్పుకోలేని స్థితి. జెలెనెస్కీ సలహాదారు ఒలెగ్‌ ఉస్తెంకో మాట్లాడుతూ ఆంక్షలు విధించిన దేశాల బలహీనతలను ఈ కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నట్లు వాపోయాడు. ” తమ సరిహద్దుల పొడవునా నెత్తుటి ఇంథనాన్ని పారించటం ద్వారా ఉక్రెయిన్‌కు ఇస్తున్న మద్దతును నీరుగార్చే నిబంధనలను బ్రిటన్‌ సరిచేసుకోవాలి. ఆ కంపెనీలు శుద్ది చేస్తున్న ప్రతి ఐదు పీపాల్లో ఒకటి రష్యాదే, అవి ఉత్పత్తి చేస్తున్న దానిలో పెద్ద మొత్తం డీజిలు రష్యా ముడిచమురు నుంచే ” అన్నాడు. ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తరువాత జామ్‌నగర్‌లోని రిలయన్స్‌ కర్మాగారం నుంచి బ్రిటన్‌ 2022లో కోటి పీపాల డీజిల్‌, ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. ఈ మొత్తం 2021తో పోల్చితే రెండున్నరెట్లు ఎక్కువ అని కెప్లర్‌ సమాచారం తెలిపింది.


ఒక్క అమెరికా, బ్రిటన్‌ మాత్రమే దొడ్డిదారిన డీజిల్‌,ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకోవటం లేదు. పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలలో ఎల్‌ఎన్‌జి లేకపోవటంతో ఐరోపా దేశాలు భారీ ఎత్తున రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. 2021 ఆగస్టుతో పోల్చితే 2022 ఆగస్టులో 41శాతం ఎల్‌ఎన్‌జి దిగుమతి పెరిగింది.లేనట్లయితే ఇంథన ధరలు ఇంకా పెరిగి ఉండేవని లండన్‌లోని ఒక సంస్థ పేర్కొన్నది. ఫిబ్రవరి ఐదు నుంచి మరిన్ని ఆంక్షలు అమల్లోకి రానున్నందున అప్పుడేం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఒకవైపు రష్యాను నిలువరించే ఎత్తుగడలో భాగంగా ఉక్రెయిన్ను శిఖండిగా నిలిపిన ఐరోపా దేశాలు ఊహించని పరిణామాలను ఎదుర్కొంటున్నాయి. ఆ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఇంథన కొరత కారణంగా పెట్టుబడులను ఆకర్షించటంలో జర్మనీ వెనుకబడిందని జర్మన్‌ దినపత్రిక ఒకటి తెలిపింది.జర్మనీ పరిశోధనా సంస్థ జే రూపొందించిన సూచికల ప్రకారం 21 దేశాలలో జర్మనీ 18వ స్థానంలో ఉంది. గతంతో పోలిస్తే నాలుగు స్థానాలు దిగజారింది. ప్రభుత్వం 200బిలియన్‌ యూరోల సబ్సిడీ ప్రకటన,2024వరకు గాస్‌ ధరల అదుపు వంటి పధకాలను ప్రకటించినప్పటికీీ ఇంథన ధరలు తక్కువగా ఉన్న అమెరికా, ఆసియా దేశాలకు జర్మనీ వ్యాపారులు వలస పోతున్నారు. గడచిన నాలుగు సంవత్సరాల సగటుతో పోల్చితే 2022లో జర్మనీలో 14శాతం గాస్‌ వినియోగం తగ్గింది. పారిశ్రామిక డిమాండ్‌ 15శాతం పడిపోయింది. గతంలో వెనెజులాను సాధించేందుకు విధించిన ఆంక్షలను తన అవసరాల కోసం అమెరికా ఎత్తివేసింది. ఇప్పుడు దొడ్డిదారిన రష్యా నుంచి మన దేశం దిగుమతి చేసుకున్న చమురును శుద్ది చేసిన తరువాత దొడ్డిదారిన దిగుమతి చేసుకుంటోంది. ఆ విధంగా మన ప్రభుత్వం అమెరికా- రష్యాలను సంతుష్టీకరిస్తున్నట్లు భావించవచ్చా ? తటస్థ విధానం అంటే ఇదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాతో వాణిజ్య లోటు వంద బి.డాలర్లు : వస్తువులు నాసిరకమైతే దిగుమతులు ఎందుకు ? మోడీ కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి !

15 Sunday Jan 2023

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices

≈ Leave a comment

Tags

Anti China Propaganda, BJP, China goods boycott, India’s Trade Deficit With China, Indo-China trade, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


లడక్‌ సరిహద్దులో గాల్వన్‌ ఉదంతం తరువాత చైనా పెట్టుబడులను అడ్డుకున్న కేంద్ర ప్రభుత్వం లేదా ప్రధాని నరేంద్రమోడీ చైనా దిగుమతులను కూడా అడ్డుకుంటారని అనేక మంది కాషాయ దేశభక్తులు నిజంగానే ఆశించారు, భ్రమించారు, కోరుకున్నారు. మోడీ వారి మనో భావాలను దారుణంగా దెబ్బతీశారు. చైనాతో వాణిజ్య లావాదేవీలను వంద బిలియన్‌ డాలర్లకు పెంచాలని ఆశించిన మన్మోహన్‌ సింగ్‌ అది నెరవేరకుండానే గద్దె దిగారు. మన్మోహన్‌ సింగ్‌ వైఫల్యాలను, మౌనాన్ని ఎండగట్టి రాజకీయంగా సొమ్ము చేసుకున్న నరేంద్రమోడీని ఒకందుకు ” అభినందించక ” తప్పదు. చైనాతో లావాదేవీలను వంద బి.డాలర్లు దాటించి ఒక రికార్డు నెలకొల్పారు. తాజాగాచైనాతో వాణిజ్య లోటును కూడా ఏకంగా వంద బి.డాలర్లు దాటించి సరిలేరు నాకెవ్వరూ అన్నట్లుగా మౌన గీతాలు పాడుతున్నారు. కాకపోతే ఈ ఘనత గురించి బిజెపితో సహా ఎవరూ ఎక్కడా చెప్పరు, టీవీలు చర్చలు జరిపి ఆహౌ ఓహౌ అన్న వాతావరణం కల్పించవు. మోడీ నోరు విప్పరు. ఇదేం నిర్వాకం బాబూ అని బిజెపి ప్రతినిధులను అడిగితే సరిహద్దు వివాదాలకూ మిగతా వాటికి లంకెలేదు, వాణిజ్య ఒప్పందాలకు అనుగుణంగా చేసుకోక తప్పదు కదా అంటారు. ఇదొక జుమ్లా, తప్పించుకొనే మోసకారి వాదన.


తాజాగా చైనా జనవరి 13న విడుదల చేసిన వివరాల ప్రకారం రెండు దేశాల వాణిజ్య లావాదేవీలు 2022(వారి లెక్క జనవరి నుంచి డిసెంబరు )లో 135.98 బి.డాలర్లకు చేరింది. అంతకు ముందు ఏడాది 125 బి.డాలర్లుంది. అఫ్‌ కోర్సు ఈ లెక్కలు తప్పని ” దేశభక్తులు ” చెప్పినా ఎవరూ చేసేదేమీ లేదు. చైనా నుంచి దిగుమతులు 118.5 బి.డాలర్లు కాగా మన ఎగుమతులు 17.48 బి.డాలర్లు. నిఖరంగా మనం 101.02 బి.డాలర్లు చైనాకు సమర్పించుకున్నాం.2021లో ఆ మొత్తం 69.38 బి.డాలర్లు. ఇదంతా దేశభక్తి, సైనికుల త్యాగాల గురించి రోజూ జనాలకు మనోభావాలను గుర్తు చేస్తుండగానే, వారి కనుసన్నలలోనే జరిగింది. ఏ వాణిజ్య ఒప్పందాల ప్రకారం ఈ దిగుమతులు చేసుకుంటున్నారో, ఏటేటా పెంచుతున్నారో ఎవరైనా చెప్పగలరా ? ప్రపంచ వాణిజ్య సంస్థలో ఇరు దేశాలూ సభ్యులుగా ఉన్నందున లావాదేవీలు జరిపినపుడు దాని నిబంధనలను పాటించాల్సిన విధి తప్ప మరొక లంపటం ఎవరికీ లేదు. దాని వెలుపల ఇతర దేశాలతో కుదుర్చుకుంటున్న మాదిరి ద్విపక్ష ఒప్పందాలు కూడా లేవు.చైనాలోని మన దేశ రాయబార కార్యాలయ వెబ్‌సైట్‌లో లావాదేవీల గురించి తప్ప ఫలానా ఒప్పందం ప్రకారం పెరుగుతున్నట్లు ఎక్కడా ఉండదు.మన దేశం చైనాతో సహా 38 దేశాలతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల గురించి చర్చలు జరుపుతున్నది తప్ప ఇంకా ఖరారు చేసుకోలేదు. గాల్వన్‌ ఉదంతాల తరువాత చైనా నుంచి దిగుమతులను నిలిపివేసి వారిని మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని అనేక మంది కలలు కన్నారు. అనేక చైనా వస్తువుల మీద మన దేశం ఆంక్షలు విధించింది. టీవీలు, పాదరక్షలు, బొమ్మలు, ఫర్నీచర్‌ వంటి 89 వస్తువులపై దిగుమతి పన్నులు పెంచి నిరుత్సాహపరచింది. యాప్స్‌పై నిషేధం సంగతి తెలిసిందే. పెట్టుబడులను రాకుండా చూస్తున్నది. మరి ఒప్పందాలు ఉంటే ఈ ఆంక్షలు ఎలా పెట్టినట్లు ?


గాల్వన్‌ ఉదంతాల తరువాత మన దేశం విదేశీ పెట్టుబడులకు సంబంధించి కొన్ని మార్పులు చేసింది. దాని ప్రకారం మనతో భూ సరిహద్దులు కలిగి ఉన్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను సమీక్షించి అనుమతి ఇచ్చిన తరువాతనే స్వీకరించాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. అలాంటి సరిహద్దులున్న దేశాల్లో ఒక్క చైనా తప్ప గతంలో మన దేశంలో పెట్టుబడి పెట్టిన వారెవరూ లేరు గనుక ఆ నిబంధన చైనాను లక్ష్యంగా చేసిందే అన్నది స్పష్టం. చైనా నుంచి తెచ్చుకోవాలని ఏ ప్రతిపక్ష పార్టీ కూడా కోరలేదు. చైనాతో సహా ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్యదేశాలన్నింటి నుంచి నిబంధనలను పాటించిన మేరకు ఎఫ్‌డిఐలను అనుమతిస్తామని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటుకు తెలిపింది. మూడో దేశం నుంచి వచ్చే చైనా పెట్టుబడులను అడ్డుకొనే అవకాశం లేదు. స్టాటిస్టా వెబ్‌సైట్‌ సమాచారం మేరకు 2015లో గరిష్టంగా మన దేశానికి చైనా నుంచి వచ్చిన పెట్టుబడులు 70.525 కోట్ల డాలర్లు. తరువాత 2019లో 53.46 కోట్లకు తగ్గాయి. ఆంక్షలు విధించిన తరువాత 2020లో20.519 కోట్లకు, 2021లో 29.946 కోట్ల డాలర్లకు తగ్గాయి.2022 జూన్‌ 29 నాటికి 382 ప్రతిపాదనలు రాగా చైనాతో సంబంధమున్న 80కి అంగీకారం తెలిపారు. 2014నుంచి 2019 వరకు ఏటా సగటున 36 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు రాగా 2021-22 ఆరు నెలల్లో 3.6 కోట్లకు తగ్గాయి.


ఒక గణతంత్ర దేశంగా మనం ఎలాంటి నిబంధనలైనా పెట్టుకోవచ్చు, అమలు జరపవచ్చు. పెట్టుబడుల సూత్రాన్నే దిగుమతులకు వర్తింప చేసి అనుమతులు ఇచ్చిన తరువాతే లావాదేవీలు జరపాలన్న నిబంధన ఎందుకు పెట్టలేదు అన్నది సహస్రశిరఛ్చేద అపూర్వ చింతామణి ప్రశ్న.ఒప్పందాల ప్రకారమే మనం రికార్డులను బద్దలు కొడుతూ చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్నాం అని చెబుతున్నవారు అదే ఒప్పందం ప్రకారం చైనా మన దేశం నుంచి ఎందుకు దిగుమతులు చేసుకోవటంలేదు, ఆ మేరకు మన ప్రభుత్వం ఎందుకు డిమాండ్‌ చేయటంలేదో చెప్పాలి కదా ! 2022లో మొత్తం చైనా వాణిజ్య మిగులు 877.6 బి.డాలర్లు అంటే దానిలో మన వాటా 101 బి.డాలర్లు (11.5శాతం) ఉంది. ఇక చైనా ఆర్థికం అంతా దిగజారింది, ఇబ్బందుల్లో ఉంది అని చెబుతున్నవారు నమ్మినా నమ్మకున్నా వృద్ది వేగం తగ్గింది తప్ప తిరోగమనంలో లేదు.2021లో 3.548 లక్షల కోట్ల డాలర్ల విలువ గల ఎగుమతులు చేస్తే 2022లో అది 3.95 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది.


1962లో సరిహద్దు వివాదం తరువాత రెండు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి.1988లో రాజీవ్‌ గాంధీ చైనా పర్యటన తరువాత 1993లో సరిహద్దులో శాంతి సామరస్యాల గురించి జరిగిన ఒప్పందం, 2003లో వాజ్‌పాయి పర్యటనతో మరొక అడుగు ముందుకు వేసి మరో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. వాణిజ్యంతో సహా వివిధ రంగాలకు సంబంధించి చైనాతో అనేక డజన్ల సాధారణ ఒప్పందాలున్నాయి. మానస సరోవర యాత్రకు నాథూలా మార్గాన్ని తెరవటం వాటిలో ఒకటి. ఏ ప్రధానీ కలవన్ని సార్లు నరేంద్రమోడీ వివిధ సందర్భాల్లో చైనా నేతలతో భేటీ కావటం కూడా ఒక రికార్డుగా ఉంది. రాజీవ్‌ గాంధీ పర్యటనకు,చైనాలో సంస్కరణలకు తెరలేపక ముందే ఐరాస చొరవతో 1975లో ఆసియా-పసిఫిక్‌ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కుదిరింది. దాన్నే బాంకాక్‌ ఒప్పందం అంటారు.దానిలో చైనా, మనం ఇతర దేశాలు భాగస్వాములు. ఈ దేశాల మధ్య ప్రాధాన్యత ఒప్పందాలు కుదుర్చుకోవాలని కూడా దానిలో ఉంది.2005లో ఒప్పంద దేశాల మంత్రుల మండలి సమావేశం బీజింగ్‌లో జరిగింది. సవరించిన పన్నుల తగ్గింపు చర్చలకు మరుసటి ఏడాది ఒక రూపం వచ్చింది. దాన్ని మరింతగా విశదీకరించి ఖరారు చేసుకోవాలని అనుకున్నప్పటికీ ఇప్పటికీ ఒక రూపానికి రాలేదు. అప్పుడే చైనా -భారత్‌ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం గురించి కూడా ఏడిబి చొరవతో చర్చలు జరిగాయి.ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అనే సంస్థ వెబ్‌సైట్‌లో 2022 జనవరి నాలుగవ తేదీ నాటికి నవీకరించిన సమాచారం ప్రకారం చైనాకు వంద దేశాలతో వివిధ ఒప్పందాలుండగా 17 దేశాలు, బృందాలతో మాత్రమే స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలున్నాయి. వీటిలో మన దేశం లేదు. ఇవిగాక 2022 నుంచి అమల్లోకి వచ్చిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)లో తొలుత మన దేశం చేరేందుకు అంగీకరించినా తరువాత దూరంగా ఉంది. దీనిలో చేరితే మన ఎగుమతులకు బదులు ఇతర దేశాల నుంచి దిగుమతులు మరింతగా పెరుగుతాయని, అది మన పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి దెబ్బ అని చెప్పిన అంశం తెలిసిందే. ఒప్పందంలో చేరిన దేశాలు దిగుమతుల మీద పన్నులు తగ్గించాల్సి ఉంటుంది.దాంతో చైనా నుంచి మరింతగా దిగుమతులు పెరుగుతాయని మన కార్పొరేట్లు హెచ్చరించాయి. ప్రపంచ జిడిపిలో 30శాతం ఉన్న దేశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. దాని ప్రకారం రెండు దశాబ్దాలలో పూర్తిగా పన్నులను రద్దు చేస్తారు.


కార్పొరేట్‌ లాబీకి లొంగి మన దేశంలో దొరికే వాటిని కూడా మోడీ సర్కార్‌ దిగుమతి చేసుకుంటున్నది.ఇప్పటికి వెల్లడైన సమాచారం మేరకు మన దేశంలో 319.02 బిలియన్‌ టన్నుల బొగ్గునిక్షేపాలు ఉన్నాయి. వాటి నుంచి ఏటా ఒక బిలియన్‌ టన్నులు కూడా మనం వెలికి తీయటం లేదు. కానీ దరిద్రం ఏమిటంటే గత పాలకుల విధానాలను తప్పు పట్టిన నరేంద్రమోడీ అదే బాటలో నడుస్తూ మన దగ్గర బొగ్గు తవ్వకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకొనేందుకు ఉత్తరువులు జారీ చేసిన అపరదేశ భక్తి పరుడిగా రుజువు చేసుకున్నారు. మన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు పదిశాతం విదేశీ బొగ్గు దిగుమతి చేసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చిన తరువాత దాని మీద వచ్చిన విమర్శలను తట్టుకోలేక తరువాత వెనక్కు తగ్గారు. ఇదంతా ఆస్ట్రేలియాలో బొగ్గు గనులు ఉన్న అదానీ కోసం అన్నది తెలిసిందే. మన బొగ్గును మనం తవ్వుకుంటే ఉపాధి కల్పనతో పాటు డాలర్లూ మిగులుతాయి. నరేంద్రమోడీకి ఈ మాత్రం తెలియదని అనుకొనేంత అమాయకులెవరూ లేరు.


చైనా నాసిరకం వస్తువులను తయారు చేస్తుందన్నది ఒక ప్రచారం. అమెరికా, ఐరోపా మార్కెట్లన్నింటా నాసిరకం కొంటున్నారా ? తక్కువ ధరలకు వస్తువులను సరఫరా చేస్తున్నందున అలాంటి అభిప్రాయంతో పాటు చైనా బజార్ల పేరుతో మన దేశంలో తయారు చేసిన నకిలీ వస్తువులను అమ్మిన కారణంగా అనేక మంది అలా అనుకోవచ్చు. ఒక వేళ నిజంగానే చైనా సరకులు నాసి అనుకుంటే మన విలువైన విదేశీమారకద్రవ్యాన్ని ఫణంగా పెట్టి ఆ సరకులను దిగుమతి చేసుకొని మన జనం మీద ఎందుకు రుద్దుతున్నట్లు ? నిజానికి చైనా నుంచి ఇప్పుడు మనం రికార్డులను బద్దలు కొడుతూ దిగుమతి చేసుకుంటున్న వస్తువులేవీ ఇతర దేశాల్లో దొరకనివి కాదు. ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారంటే కార్పొరేట్‌ లాబీ వత్తిడికి మోడీ సర్కార్‌ తలవంచటమే, అది చెప్పినట్లు వినటమే. అవే వస్తువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే చెల్లించాల్సిన మొత్తాలు ఎక్కువగా ఉండటమే అసలు కారణం. ఆ సంగతిని అంగీకరించటానికి ముందుకురారు. మరోవైపున కాషాయదళాలు మాత్రం నిరంతరం చైనా వ్యతిరేక ప్రచారం చేస్తూ కొంత మంది మనోభావాల సంతుష్టీకరణ, మరికొందరిని తప్పుదారి పట్టిస్తుంటాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడినోమిక్స్‌ 2023 : దేశానికి కావాల్సిందేమిటి ? బిజెపి నేతలు ఇస్తామంటున్నదేమిటి ?

13 Friday Jan 2023

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

10 trillion dollar economy, Amith shah, BJP, China, India Exports, India GDP, India imports from China, love jihad, Narendra Modi Failures, Ram Mandir, RSS, Yogi Adityanath


ఎం కోటేశ్వరరావు


2019లో నరేంద్రమోడీ ఒక పిలుపునిచ్చారు. 2024 మార్చి నాటికి(లోక్‌సభ ఎన్నికల తరుణం) దేశ జిడిపిని ఐదులక్షల కోట్ల డాలర్లకు పెంచాలన్నారు. ఐదు సంవత్సరాల పాటు దాన్నే ఊరిస్తూ జనంలో చర్చ జరగాలన్న దూరాలోచన దాని వెనుక ఉంది. అనుకోని పరిణామాలు ఎదురు కావటంతో మిగతా కబుర్ల మాదిరే ఇప్పుడు మోడీ కూడా దీని గురించి కూడా మాట్లాడటం లేదు. కొత్త ” కతలు ” తప్ప ఒకసారి చెప్పినదానిని మరోసారి చెప్పి బోరు కొట్టించే అలవాటు లేదు కదా ! ఆ తరువాత మోడీ మౌనం, ఆర్థిక సలహాదారులు 2027కి సాధిస్తాం అన్నారు, ఐఎంఎఫ్‌ 2029 అని చెప్పి కాదు కాదు లెక్క తప్పింది 2027కే అని చెప్పింది. పొలిటీషిియన్‌ అన్నతరువాత ఒపీనియన్స్‌ మారుస్తుండాలని గిరీశం చెప్పినట్లుగానే ఆ సంస్థ కూడా పరిస్థితిని బట్టి మా అంచనా తప్పిందంటూ మరోసారి మార్చదని చెప్పలేము. రానున్న ఐదు సంవత్సరాల్లో స్థిరంగా ఏటా తొమ్మిది శాతం వృద్ధి సాధిస్తే 2028-29 నాటికి ఐదులక్షల డాలర్లను సాధిస్తామని రిజర్వుబాంకు మాజీ గవర్నర్‌ డి సుబ్బారావు చెప్పినట్లు 2022 ఆగస్టు పదిహేనవ తేదీ పత్రికలు ప్రకటించాయి. తాజాగా ఐదు లక్షల డాలర్ల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఆ పాత పాట పాడితే బోరు కొడుతుంది కనుక కొత్త పల్లవి అందుకున్నారు.


ఈ మధ్య దేశ జిడిపి గురించి కొత్త గీతాలు వినిపిస్తున్నారు. మిత్రోం అంటూ శ్రావ్యమైన గళం నుంచి జిడిపి గానం ఎక్కడా వినపడటం లేదు, కనపడటం లేదు. పది లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా పెరుగుతున్న భారత్‌ అంటూ సిఇబిఆర్‌ అనే సంస్థ తాజాగా ఒక విశ్లేషణ చేసింది. దాని ప్రకారం 2035 నాటికి పది లక్షల డాలర్లకు చేరుతుందని చెప్పింది. ఒక లక్ష కోట్ల డాలర్లకు చేరేందుకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆరు దశాబ్దాలు పడితే తదుపరి ఒక లక్ష డాలర్లను జత చేసేందుకు ఏడు సంవత్సరాలు, ఆ తరువాత మూడవ లక్షకు ఐదు సంవత్సరాలు (2019) పట్టిందని, ప్రస్తుతం 3.1లక్షల కోట్ల డాలర్లుగా ఉందని పేర్కొన్నది. ప్రస్తుత వేగాన్ని చూస్తే రానున్న 14-15 సంవత్సరాల్లో ప్రతి రెండేళ్లకు ఒక లక్ష కోట్ల డాలర్ల వంతున జిడిపి పెరుగుతుందని అంచనా వేసింది.


తెలుగు నాట అంత్య కంటే ఆది నిషఉ్ఠరమే మేలని భావించేవారు ఏదైనా చెప్పే ముందు అంటే అన్నారని తెగ గింజుకుంటారు గానీ అని ప్రారంభిస్తారు. పట్టణాల్లో పదిశాతం, దేశ సగటు 8.3శాతం నిరుద్యోగం ఉందని, ఉపాధి కోసం ఎదురు చూస్తున్నవారి సంఖ్య 2022 డిసెంబరులో 40.48 శాతం పెరిగిందని సిఎంఐఇ పేర్కొన్నది. దేశ జిడిపి ఎంత పెరిగింది, ఎన్ని పెట్టుబడులను ఆకర్షించారు అన్నది ఒక అంశమైతే దాని వలన జనాలకు ఒరిగిందేమిటి అన్నది ప్రశ్న. సంపద పెరిగి కొందరి చేతుల్లో పోగుపడితే ఫలితం ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహకాల(పిఎల్‌ఐ) పధకాన్ని అమలు జరుపుతున్నది. కరోనా కాలంలో ఫార్మా రంగంలోకి పెట్టుబడులు వచ్చినా ఉపాధి పెరగలేదు. లక్ష్యాన్ని మించి 107శాతం పెట్టుబడులు వచ్చినా ఉపాధి పెరిగింది 13శాతమే. ఇక మన దేశం నుంచి సెల్‌ఫోన్ల ఎగుమతులు పెద్దగా పెరిగినట్లు అది తమ ఘనతగా చెప్పుకుంటున్న చోట అనుకున్నదానిలో వచ్చిన పెట్టుబడి 38శాతం కాగా ఉపాధి పెరిగింది కేవలం నాలుగు శాతమే. ఎలక్ట్రానిక్స్‌లో వచ్చిన పెట్టుబడులు 4.89శాతం కాగా పెరిగిన ఉపాధి 0.39శాతమే. (ఇండియా కేబుల్‌ విశ్లేషణ 2022 నవంబరు 14) అందుకే పెట్టుబడులు వచ్చి ఉపాధి రహిత వృద్ధి జరిగితే జిడిపి పెరిగినా జనానికి వచ్చేదేమీ ఉండదు.


అందుకే ఈ అంశాల గురించి జుమ్లా కబుర్లు చెబితే జనం నమ్మరు గనుక బిజెపి నేతలు కొత్త కబుర్లు చెబుతున్నారు. నిరుద్యోగం, ఉపాధి లేమి గురించి కొత్త రికార్డులు నమోదౌతున్నా, వీటిని గురించి పట్టించుకోకుండా ఇతర అంశాల గురించి మాట్లాడేవారిని ఏమనాలి ? 2024 జనవరి ఒకటి నాటికి అయోధ్య రామాలయ నిర్మాణం సిద్దం అవుతుందని ఆ రోజునే దర్శనం చేసుకొనేందుకు ముందుగానే టికెట్లు బుక్‌ చేసుకోవాలని కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా చెబుతారు. గతంలో కాశీని చూసేందుకు ఏడాదికి కోటి మంది వచ్చే వారని, కాశీ విశ్వనాధ్‌ ధామ్‌ అభివృద్ధి తరువాత ఒక్క గత శ్రావణమాసంలోనే కోటి మంది వచ్చారని, అదే మాదిరి అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తైన తరువాత పది రెట్లు పెరుగుతారని, ఆధ్యాత్మిక టూరిజాన్ని వృద్ధి చేస్తామని ఉత్తర ప్రదేశ్‌ సిఎం ఆదిత్య నాధ్‌ ఊరిస్తున్నారు. లక్షల కొలది ఉద్యోగాలను సృష్టిస్తామని, అందుకు గాను ఫలానా పధకాలు ఫలానా తేదీలోగా ఉనికిలోకి వస్తాయని చెప్పాల్సిన వారు పూజలు పునస్కారాలు, దేవుళ్ల సందర్శనకు వసతులు కల్పిస్తామంటున్నారు. రోడ్లు, మురుగు కాలవల వంటి అల్ప అంశాలను వదలి లవ్‌ జీహాద్‌ మీద కేంద్రీకరించాలని కర్ణాటకలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ నిరంజన్‌ సెలవిస్తారు. ఏ విత్తనం వేస్తే ఆ చెట్టుకు అవే పండ్లు కాస్తాయి. వీరంతా దేశాన్ని ఎక్కడికి తీసుకుపోదలచుకున్నారు. గత ఎన్నికల్లో వాగ్దానం చేసిన గుజరాత్‌ తరహా అభివృద్ది, నల్లధనం వెలికితీత, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, అచ్చే దిన్‌ కబుర్లు ఎక్కడా వినిపించటం లేదిప్పుడు, ఎందుకంటారు ? ఆధ్యాత్మిక టూరిజం గురించి ఒక వైపు కబుర్లు చెబుతూ మరోవైపు ఝార్కండ్‌ ప్రభుత్వం తలపెట్టిన ఆధ్యాత్మిక టూరిజాన్ని సంఘపరివార్‌ శక్తులు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ బిజెపి సర్కార్‌ లేదు. ఇరవై నాలుగుమంది జైన తీర్ధంకరులలో ఒకరైన( 23వ) పార్శ్వనాధ్‌ గిర్ధ్‌ జిల్లాలోని షిఖర్జీ పర్వతంపై మోక్షం పొందినట్లు చెబుతారు. జైనులకు అదొక పుణ్యస్థలం. ఆ ప్రాంతంలో టూరిజం వద్దని జైనులు అంటున్నారు, దానికి బిజెపి మద్దతు ఇస్తున్నది.అయోధ్యలో వారే అమలు చేస్తారు, మరొక చోట వద్దంటారు. రాజకీయంగాకపోతే ఏమిటి ?


రానున్న ఏడు సంవత్సరాల్లో 7లక్షల కోట్లకు చేరనున్న జిడిపి అంటూ మరొక వార్త. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్‌ చెప్పిన అంశాల ఆధారంగా వచ్చింది. 2023 మార్చి ఆఖరుకు మన జిడిపి 3.5లక్షల డాలర్లు ఉంటుందని, వచ్చే ఏడు సంవత్సరాల్లో ఏడు లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని, ఇది అసాధ్యం కాదని మర్చంట్స్‌ ఛాంబర్‌ (ఎంసిసిఐ) సమావేశంలో నాగేశ్వరన్‌ చెప్పారు. దేశ సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతున్నది. అందువలన ఎంత పెరిగితే ఏమి లాభం ! దేశంలోని పది మంది ధనికుల చేతుల్లో దేశ జిడిపిలో 11శాతం విలువగల సంపద ఉంది. ఫిన్‌బోల్డ్‌ అనే సంస్థ సేకరించి విశ్లేషించిన సమాచారం ప్రకారం 2022 డిసెంబరు నాటికి పది మంది సంపద 387 బిలియన్‌ డాలర్లు లేదా రు.31.64లక్షల కోట్లు. దేశ జిడిపి అక్టోబరు నాటికి 3.47 లక్షల కోట్ల డాలర్లని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది, దీనిలో 11.16శాతం పది మంది చేతిలో ఉంది. తొలి ఐదు స్థానాల్లో ఉన్నవారి వివరాలు దిగువన చూడవచ్చు.
ధనికుడి పేరు ×××× సంపద బి.డాలర్లు
గౌతమ్‌ అదానీ ××× 132.79
ముఖేష్‌ అంబానీ ×× 96.5
సైరస్‌ పూనావాలా×× 24.88
శివ నాడార్‌ ××××× 22.58
దమాని(డి మార్ట్‌) ×× 21.25
సంపదలు ఇలా కొద్ది మంది వద్ద పోగుపడుతూ ఉంటే దేశ ఆర్థిక, సామాజిక వృద్ధి కుంటుపడుతుందని, అనేక అనర్ధాలకు దారితీస్తుందని అనేక మంది హెచ్చరిస్తున్నా సంపదలు పోగుపడటాన్ని మన పాలకులు అనుమతిస్తున్నారు.ఆర్థిక వృద్ధి రేటు పెరిగితే సంపదల అంతరం తగ్గుతుందని చెబుతున్నారు. అలాంటి సూచనలు ఎక్కడా కనిపించటం లేదు. సంపదలు ఇలా పెరగటానికి పలు అంశాలు దోహదం చేస్తున్నాయి. సంపద పెరిగిన కొద్దీ పన్నులు పెంచాల్సి ఉండగా తగ్గించటం వాటిలో ఒకటి. ఉపాధి లేకపోవటం, ఉన్నవారికి కూడా వేతనాలు తక్కువగా ఉండటం, సామాజిక భద్రత లేకపోవటం, విద్య, వైద్యం వంటి సేవలను ప్రైవేటీకరించటం వంటి అంశాలన్నీ సంపదల అసమానతలను పెంచుతున్నాయి. వాటిని తగ్గించేందుకు చేసిందేమీ లేదు.


వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ అనే కితాబుకు భారత్‌ దూరం అన్నది మరొక వార్త. దేశంలో డిమాండ్‌ తగ్గిన కారణంగా వర్తమాన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7శాతానికి తగ్గుతుందని ప్రభుత్వమే పేర్కొన్నది. ఈ కారణంగా వేగంగా వృద్ది చెందున్న భారత్‌ అనే పేరుకు దూరం కానుంది. ప్రభుత్వం చెప్పినదాని కంటే తక్కువగా ఆర్‌బిఐ 6.8శాతమే ఉంటుందని చెప్పింది. గతేడాది 8.7శాతం ఉంది. ఈ ఏడాది సౌదీ అరేబియాలో 7.6 శాతం ఉంటుదని అంచనా వేస్తున్నందున అది మొదటి స్థానంలో ఉంటుంది.ద్రవ్యోల్బణం కారణంగా వర్తమాన సంవత్సరంలో నిజవేతనాల్లో పెరుగుదల లేకపోవటం లేదా కొన్ని నెలల్లో తిరోగమనంలో కూడా ఉండే అవకాశం ఉన్నందున ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీన్ని అధిగమించేందుకు బిజెపి నేతలెవరూ ఏం చేసేదీ చెప్పరు.


ఆర్థికవేత్తలు లేదా వారు పని చేస్తున్న సంస్థలు వేసే అంచనాలు, చెప్పే జోశ్యాల తీరు తెన్నులు ఎలా ఉంటున్నాయో చూద్దాం. అమెరికాలోని కార్నెగీ సంస్థ 2009లో ఒక అంచనాను ప్రపంచం ముందుంచింది. దాని ప్రకారం 2009లో 1.1లక్షల కోట్లడాలర్లుగా ఉన్న భారత జిడిపి 2050 నాటికి 17.8 లక్షల కోట్లకు పెరుగుతుందని ఆ విశ్లేషణలో పేర్కొన్నారు. అదే కాలంలో చైనా జిడిపి 3.3 నుంచి 45.6లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని, రెండవ స్థానంలో ఉండే అమెరికాలో 39లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పింది. పైన పేర్కొన్న సిఇబిఆర్‌ సంస్థ అంచనా ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఒక లక్ష కోట్ల డాలర్ల జిడిపి పెరుగుతుందనుకుంటే ఆ ప్రకారం చూసినా 2035 తరువాత పదిహేను సంవత్సరాలో ఏడులక్షల కోట్లు పెరిగితే దీని అంచనా ప్రకారం కూడా 17-18లక్షల కోట్లకు పరిమితం అవుతుంది. ఇక ముకేష్‌ అంబానీ పండిట్‌ దీన దయాళ్‌ ఇంథన విశ్వవిద్యాలయ సభలో చెప్పినదాని ప్రకారం 2047 నాటికి( నూరేళ్ల స్వాతంత్య్రం) ఇప్పుడున్న 3 లక్షల కోట్ల డాలర్ల నుంచి 40లక్షల కోట్లకు పెరుగుతుంది. దీనికి ప్రాతిపదిక ఏమిటో తెలియదు. ఆసియా ధనికుడు గౌతమ్‌ అదానీ 2050 నాటికి 30లక్షల కోట్లకు పెరుగుతుందని చెబుతున్నారు. ప్రతి పన్నెండు – పద్దెనిమిది నెలలకు ఒక లక్ష కోట్ల వంతున పెరుగుతుందని పేర్కొన్నారు. ఇద్దరు ప్రముఖులు ఇంత తేడాగా ఎలా చెబుతారు ?


ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం 2050 నాటికి ప్రపంచంలో 160 కోట్ల జనాభాతో భారత్‌ అగ్రదేశంగా ఎదుగుతుందని, చైనా జనాభా ఇప్పుడున్న 140 కోట్ల నుంచి 130 కోట్లకు తగ్గుతుందని చెబుతున్నారు.( ఈ ఏడాదే చైనాను వెనక్కు నెట్టి మన దేశం పెద్ద దేశంగా మారనుంది) పని చేసే శక్తి కలిగిన జనాభా భారత్‌లో పెరుగుతున్నందున ఆర్థిక ప్రగతికి ప్రధాన వనరుగా ఉంటుందని, అంతర్జాతీయ రాజకీయాల్లో నూతన శక్తిని పొందుతుందని చెబుతున్నారు. అమెరికా-చైనా తెగతెంపులు చేసుకోనున్నాయని, తరువాత సరఫరా గొలుసులో చైనా లేకపోతే భారత్‌ లబ్దిపొందుతుందని చెబుతున్నారు. ఆపిల్‌ కంపెనీ ఐఫోన్‌ 14ను భారత్‌లో తయారు చేయటాన్ని దానికి రుజువుగా చూపుతున్నారు. నరేంద్రమోడీ జి20 బాధ్యతలు చేపట్టినందున అమెరికా, చైనా, భారత్‌ మూడు ధృవాల ప్రపంచ వ్యవస్థకు ఈ ఏడాది నాంది అవుతుందని కొందరు చెప్పటం ప్రారంభించారు.(2024లోక్‌సభ ఎన్నికలకు జి20 సారధ్యాన్ని ఒక ప్రచార అస్త్రంగా చేసుకొనేందుకు నరేంద్రమోడీ చేస్తున్న యత్నాలను చూసి మెప్పు పొందేందుకు కూడా అలా చెప్పవచ్చు.)


మన ఎగుమతులు తగ్గటం, దిగుమతులు పెరగటంతో మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు హరించుకుపోతున్న అంశం పాలకులకు పట్టినట్లు లేదు. వాణిజ్య మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2021 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే 2022లో మన వస్తు దిగుమతులు 54.7శాతం పెరిగి 610 బి.డాలర్లకు చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్‌-నవంబరు మాసాల్లో 494 బి.డాలర్లు కాగా అదే కాలంతో గతేడాది 381బి.డాలర్లు మాత్రమే. ఇక వాణిజ్యలోటు ఏప్రిల్‌-నవంబరు మధ్య 115.39 నుంచి 198.35 బి.డాలర్లకు చేరింది. ఈ ఏడాది 700బి.డాలర్లు దాటవచ్చని అంచనా.దాన్ని బట్టి లోటు ఎంత ఉండేది అప్పుడే చెప్పలేము. స్వయం సమృద్ధి – ఆత్మనిర్భరత, ఎగుమతి- దిగుమతులు ఉపాధి కల్పన ఫలితాల గురించి చెప్పకుండా జనాలకు రామాలయం గురించి అమిత్‌ షా చెబుతున్నారు.

చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులు ఇతర దేశాల్లో దొరకనివి కాదు. లావాదేవీల్లో సభ్య దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు పాటించాలి తప్ప, మన దేశానికి చైనాకు ఎగుమతులు-దిగుమతుల కోటా గురించి ఎలాంటి ప్రత్యేక ఒప్పందాలేమీ లేవు. చైనాకు ధీటుగా ఐఫోన్లనే తయారు చేసి విదేశాలకు ఎగుమతులు చేస్తున్నామని చెబుతున్న వారు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇతర వస్తువులను నిలిపివేసి ఇక్కడే ఎందుకు తయారు చేయటం లేదు ? విదేశాలకు ఎందుకు ఎగుమతి చేయరు ? స్వదేశీ జాగరణ మంచ్‌ ఇటీవల ఎక్కడా ఎందుకు కనిపించటం లేదు. చైనా నుంచి దిగుమతుల్లో నరేంద్రమోడీ ఏటా తన రికార్డులను తానే బద్దలు కొడుతుంటే ఏమి చేస్తున్నట్లు ? చైనా యాప్‌ల రద్దు హడావుడి చేస్తే సరిపోతుందా ? మన ఉపాధిని ఫణంగా పెట్టే దిగుమతి లాబీకి ఎందుకు లొంగిపోతున్నట్లు ? 2021-22లో తొలి ఎనిమిది నెలల్లో అక్కడి నుంచి 59.17 బి.డాలర్ల విలువ గల వస్తువులను దిగుమతి చేసుకుంటే ఈ ఏడాది అదే కాలంలో 67.92 బి.డాలర్లకు పెంచారు . చైనా వస్తువులు నాసిరకం అని ప్రచారం చేస్తారు, అదే నిజమైతే అలాంటి వాటిని అక్కడి నుంచి దిగుమతి చేసి మన జనం మీద ఎందుకు రుద్దుతున్నట్లు ? పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం చైనాకు ఎందుకు కట్టబెడుతున్నట్లు ? మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా పిలుపులకు పదో ఏడు వస్తున్నది. వాటి అమలుకు ఏ ప్రతిపక్ష పార్టీ అడ్డుపడలేదే ! వాటి గురించి బిజెపి నేతలు ఎందుకు మాట్లాడరు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d