• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Economics

పాకిస్తాన్‌ దివాలా తీయనుందా : బిజెపి నేతలు పదే పదే దానితో మన దేశాన్ని ఎందుకు పోలుస్తున్నట్లు ?

09 Monday Jan 2023

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

China–Pakistan Economic Corridor, CPEC, Pak debt matters, pakistan, Pakistan default, Pakistan’s economy


ఎం కోటేశ్వరరావు


గోధుమ పిండి ధర కిలో రు.150కి పెరిగింది. వంట గాస్‌ 11.8కిలోల బండ ధర రు.2,550. విద్యుత్‌ ఉత్పత్తి తగినంత లేక దుకాణాలను ముందుగానే మూసివేయాలని ఆదేశిస్తున్న అధికారులు. లీటరు పాల ధర రు.108.71, కిలో బియ్యం రు.245, డజను గుడ్ల ధర రు.240, కోడి మాంసం కిలో రు.548, కిలో ఉల్లి రు.86, బ్రెడ్‌ రు.108,(నంబియో డాట్‌కామ్‌) పాకిస్తాన్‌ నుంచి వస్తున్న వార్తలివి.అక్కడ విద్యుత్‌ కొరత ఉంది.(మన గుజరాత్‌లో కూడా గత వేసవిలో గంటల కొద్దీ ఇండ్లకు, వారానికి ఒకసారి పరిశ్రమలకు కోత విధించారు) అక్టోబరులో సవరించిన ధరల ప్రకారం 50 యూనిట్లకు రు.2 నుంచి 700 వరకు శ్లాబుల వారీ పెరుగుతూ రు.20.82, అంతకు మించితే ప్రతియూనిట్‌కు రు.23.92, ఇవి గాక ఇతర పన్నులు అదనం. తెలంగాణాలో 50 యూనిట్లకు రు.1.45 నుంచి క్రమంగా పెరుగుతూ 401-800కు రు.9, అంతకు మించితే రు.9.50 వసూలు చేస్తున్నారు. అక్కడి ధరలతో పోల్చుకొని మన దేశంలో ధరలను చూడండి, నరేంద్రమోడీ పాలన జనాలకు మంచి రోజులు తెచ్చిందా లేదా అని భక్తులు రెచ్చిపోతున్నారు, అడ్డు సవాళ్లు విసురుతున్నారు. పాకిస్తాన్‌ తీవ్ర మైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నమాట నిజం. అక్కడ పరిస్థితులన్నీ సజావుగా ఉన్నట్లు , జరుగుతున్నదంతా సరైనదే అని ఎవరూ చెప్పటం లేదు. అవసరమూ లేదు. అలాంటి దేశం గురించి ఎక్కువగా చెబుతున్నదీ, పోలుస్తున్నదీ ఎవరంటే బిజెపి నేతలు, మద్దతుదారులే. ఎందుకంటే అంతకంటే మెరుగైన దేశంతో పోల్చుకొనేందుకు వారి దగ్గర ఏమీ లేకపోవటమే. అక్కడ పెట్రోలు, డీజిలు ధరలు తక్కువ అంటే వెళ్లి అక్కడి నుంచి తెచ్చుకోవాలని ఎద్దేవా చేస్తారు.


మన దేశంలో గత నెల రోజులుగా గోధుమల టోకు ధర కిలో రు.28.50గా ఉందని, ఇది కనీస మద్దతు ధర కంటే 40శాతం ఎక్కువ అని జనవరి ఏడవ తేదీ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక పేర్కొన్నది. ప్రైస్‌ఇ డాట్‌కామ్‌ జనవరి ఎనిమిదవ తేదీ సమాచారం ప్రకారం ఆశీర్వాద్‌ షర్బతీ గోధుమ పిండి ధర అమెజాన్‌లో రు.282(ఐదు కిలోలు) అదే కంపెనీ సుపీరియర్‌ ఎంపీ రకం ధర రు.175(ఐదు కిలోలు),ఆశీర్వాద్‌ శుద్ద గోధుమ పిండి రకం ధర రు.95(రెండు కిలోలు). విడిగా ఎలాంటి బ్రాండ్‌ లేకుండా దొరికే పిండి ధర కిలో 40కి అటూ ఇటూగా ఉంటున్నది. మన దగ్గర 14.5 కిలోల గాస్‌ బండ ధర రు.1,105 గా ఉంది. మరి వీటితో పోల్చినపుడు పాకిస్తాన్‌ కంటే మన దేశంలోనే ధరలు తక్కువగా ఉన్నాయి కదా అని ఎవరికైనా సందేహం కలుగుతుంది. నిజమే కనిపించేదాన్ని కాదని ఎలా అంటాం ? ఎఎన్‌ఐ వార్తా సంస్థ జనవరి ఏడవ తేదీన పేర్కొన్నదాని ప్రకారం పాక్‌ పంజాబ్‌లో 15కిలోల గోధుమ పిండి సంచి ధర రు.2,250 ( కిలో 130 నుంచి 150వరకు ఉంది), అదే వార్తలో మండ్‌ గోధుమల ధర రు.5,000కు తాకినట్లు కూడా పేర్కొన్నది. మండ్‌ అంటే 37 కిలోల 324 గ్రాములకు సమానం. ఈ లెక్కన కిలో గోధుమలకు అక్కడి రైతులు రు. 134 పొందుతున్నారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక పేర్కొన్న ప్రకారం అదే మన రైతులు పొందుతున్నది రు.28.50 మాత్రమే ! ఇది ఘోరం అని అనిపించటం లేదూ ! పాక్‌ రైతులు అంత మొత్తం పొందుతుండగా మన రైతులకు ఎందుకు ఇవ్వటం లేదు ? మన రైతుల్ని పాకిస్తాన్‌ వెళ్లి అమ్ముకోమంటారా ?


ఒక డాలరుకు మన కరెన్సీ రూపాయి విలువ జనవరి ఎనిమిదిన రు.82.27 ఉంది. పాకిస్తానీ రూపాయి విలువ రు.227.25గా ఉంది. మన ఒక రూపాయి 2.76 పాక్‌ రూపాయలకు సమానం. మన దేశ బహిరంగ మార్కెట్‌నుంచి పాకిస్తాన్‌ ఒక క్వింటాలు గోధుమలను దిగుమతి చేసుకుంటే వారు చెల్లించాల్సిన మొత్తం రు.7,866 అవుతుంది.( మన బహిరంగ మార్కెట్‌ ధర కిలోకు రు.28.50, దాన్ని పాక్‌ కరెన్సీలోకి మారిస్తే రు.78.66, ఆ లెక్కన క్వింటాలు ధర రు.7,866. కానీ పాక్‌ రైతులకు కిలోకు 134 వంతున 13,400 దక్కుతున్నట్లు ఎఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొన్నది. పాక్‌లో గాస్‌ కిలో ధర రు.216. మన దేశంలో రు.76.20. గాస్‌ను మనమూ దిగుమతి చేసుకోవాలి, పాకిస్తాన్‌ కూడా దిగుమతి చేసుకోవాల్సిందే. అందువలన తక్కువగా ఉన్న పాక్‌ కరెన్సీ విలువను చూపి అక్కడ ఎంతో ఎక్కువగా ఉన్నట్లు చిత్రించటాన్ని ఏమనాలి ? రెండు కరెన్సీల పేర్లూ రూపాయి కావటంతో మభ్య పెట్టేందుకు వీలు కలుగుతోంది.


గ్లోబల్‌ ప్రైస్‌ డాట్‌కామ్‌ ప్రతి దేశంలో ఉన్న స్థానిక కరెన్సీలో ఉన్న పెట్రోలు, డీజిలు ధరలను డాలర్లలోకి మార్చి ధరల తీరు తెన్నులను వారానికి ఒకసారి ప్రచురిస్తుంది. దాని ప్రకారం పెట్రోలు, (బ్రాకెట్లలో డీజిలు) ధరలు డాలర్లలో జనవరి రెండవ తేదీన ఇలా ఉన్నాయి. పాకిస్తాన్‌ 0.947(1.005),భూటాన్‌ 0.990( 0.947 ), మయన్మార్‌ 1.046(1.156) చైనా 1.178(1.051) బంగ్లాదేశ్‌ 1.221(1.024) భారత్‌ 1.260(1.130) నేపాల్‌ 1.344(1.324) శ్రీలంక 1.396(1.108) ఉంది. ఇప్పటికీ మన దేశంలో పాకిస్తాన్‌ కంటే చమురు ధరలు ఎక్కువగానే ఉన్నాయి. అమెరికాలో లీటరు పెట్రోలు ధర 0.893, డీజిలు ధర 1.199 డాలర్లుగా ఉంది. ప్రతి దేశం ఎగుమతులు చేస్తుందా లేదా అన్నది ఒక అంశమైతే, దానికి అనేక అంశాలు తోడు కావాలి. సాధారణంగా ఎగుమతులు చేసే దేశాల కరెన్సీ విలువ తక్కువగా ఉంటేనే అది అంతర్జాతీయ మార్కెట్లో తన సరకులను అమ్ముకోగలుగుతుంది అని చెబుతారు. ఇది ఒక అంశం తప్ప అదొక్కటే చాలదు, జపాన్‌ ఎన్‌ విలువ ఒక డాలరుకు 132 కాగా చైనా యువాన్‌ విలువ 6.84 ఉంది. జపాన్‌ కరెన్సీ విలువ తక్కువగా ఉన్నా, చైనాతో పోలిస్తే వేతనాలు ఎక్కువ గనుక ఉత్పత్తి ఖర్చు ఎక్కువ. అందువలన ఒకే వస్తువును చైనా తక్కువ ధరలకు ఉత్పత్తి చేసి ఎగుమతులు చేస్తున్నది. మన దేశంలో వేతనాలు, కరెన్సీ విలువ తక్కువ ఉన్నప్పటికీ సరైన విధానం, నూతన ఆవిష్కరణలు,సాంకేతిక పరిజ్ఞానం లేక ఎగుమతులు చేయలేని స్థితి.


మన దేశంలో తక్కువ ఆదాయం వచ్చే వారు పెరిగిన ధరలతో ఎలా ఇబ్బందులు పడుతున్నారో పాకిస్తాన్‌లో కూడా మన కంటే ఎక్కువగా ద్రవ్యోణ పెరుగుదల ఉన్నందున అక్కడి పేదలు కూడా ఒకింత ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్లనే పెట్రోలు, డీజిలు ధరలకు పన్నులు వడ్డిస్తే భారం మరింతగా పెరుగుతుంది కనుక మన మాదిరి పన్నులు లేనందున, దాని కరెన్సీ విలువ ఎంత తగ్గినా మనతో పోలిస్తే తక్కువ ధరలకు పెట్రోలు, డీజిలు అందుబాటులో ఉంటున్నది. విదేశీ చెల్లింపుల సంక్షోభం, రుణ భారంతో శ్రీలంక తీవ్ర పరిస్థితి ఎదుర్కొన్నట్లుగానే పాకిస్తాన్‌ కూడా అదే బాటలో ఉన్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. దివాలా కోరు విధానాలను అనుసరిస్తే ఏ దేశమైనా అదే విధంగా మారుతుంది. పాకిస్తాన్‌ నుంచి వెలువడే ప్రముఖ దినపత్రిక ” డాన్‌ ” డిసెంబరు 18వ తేదీన ప్రచురించిన ఒక (ఇద్దరు ఆర్థిక నిపుణుల) విశ్లేషణలో కొన్ని అంశాలు దిగువ విధంగా ఉన్నాయి. దేశ విభజన నాటి నుంచే పాకిస్తాన్‌కు ఆర్థిక సవాళ్లు ఎదురయ్యాయి. రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని శక్తులు తమ స్వప్రయోజనాల కోసం దేశాన్ని రుణగ్రస్తం గావించాయి. విభజనతో నాడు వలస పాలనలో ఉన్న రాబడిలో 17శాతం పాకిస్తాన్‌కు రాగా మిలిటరీలో 33శాతాన్ని భరించాల్సి వచ్చింది. దీని వలన అనేక ప్రభుత్వాలు రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. పాకిస్తాన్‌ 22సార్లు ఐఎంఎఫ్‌ రుణాలు తీసుకోగా భారత్‌ ఏడు, బంగ్లాదేశ్‌ పదిసార్లు మాత్రమే తీసుకుంది. గడచిన ఏడున్నర దశాబ్దాలలో అనేక సార్లు సంక్షోభాలు దగ్గరకు వచ్చిన అనుభవాలను చూసింది.చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. ప్రతిసారీ మరింత నష్టం జరగకుండా ఐఎంఎఫ్‌ ఆదుకున్నది. ఆ సాయాన్ని సాంప్రదాయ పద్దతుల్లో ఆర్థిక రంగం స్వల్పకాలిక స్థిరత్వాన్ని సాధించేందుకు ఉపయోగించారు. తరచుగా సంక్షోభాలు రావటం, వాటి ప్రభావాలు పేరుకు పోవటంతో దీర్ఘకాలిక సవాళ్లు అలాగే ఉండి మొత్తం వృద్ధి మీద ప్రభావం చూపుతున్నది.


ప్రారంభంలో పాకిస్తాన్‌ కంటే భారత్‌ వెనుకబడి ఉంది, 1980దశకంలో ఒక దశలో పాక్‌ ఆర్థిక వృద్ధి రేటు భారత్‌ను దాటింది.1990ల్లో భారత ఆర్థిక సంస్కరణలు నిరంతర వృద్ధి బాటలో దేశాన్ని నిలిపాయి. పాకిస్తాన్‌ ఆర్థిక పురోగమనంలో దిగజారుడు అలాగే ఉంది. ప్రస్తుతం అస్థిరమైన జిడిపి వృద్ది రేటు, కరెన్సీ విలువ రికార్డు స్థాయికి పతనం, దానితో పాటు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, విస్తృతం అవుతున్న కరంట్‌ ఖాతా లోటు ఉంది. ప్రజల జీవనం తీవ్రంగా ప్రభావితం అవుతున్నది. వ్యవస్థాగతమైన ఆర్థిక సమస్యలేమిటో నిర్ధారించకుండా రాజ్యం రెంటియర్‌ ఆర్థిక వ్యవస్థను తయారు చేసింది. (దీని అర్ధం ఏమంటే కొత్త నిర్మాణాలేమీ లేకుండానే ఉన్న ఇండ్లకు అద్దె వసూలు చేసుకోవటం, బతకటం ) సమాజంలో ఆర్థికంగా ఉన్నతులైన వారందరూ అనేక సబ్సిడీలు పొందటంలో నిమగమయ్యారు. దీంతో ఉన్న అప్పులకు తోడు మరింతగా పెరిగాయి. అప్పులు పెరిగినపుడు పెట్టుబడులను ఆకర్షించటం, నవీకరణలు ప్రోత్సహించటం పాకిస్తాన్‌కు పెద్ద సవాలుగా ఉంది.చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి ఒక కారణం నాలుగు దశాబ్దాలుగా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయటం.1993-2020 సంవత్సరాలలో పాకిస్తాన్‌ కేవలం రెండు సార్లు ఆరుశాతం కంటే ఎక్కువగా వృద్ధి రేటును సాధించగా భారత్‌లో పద్దెనిమిది సార్లు ఉంది. ఇదీ డాన్‌ విశ్లేషణ సారం.


పాకిస్తాన్‌ మరోసారి ఇబ్బందుల్లో పడింది. దీంతో వెంటనే దీనికి కారణం చైనా నుంచి తీసుకున్న అప్పులే అనే ప్రచారం మొదలైంది. డాన్‌ పత్రికలో రాసిన విశ్లేషణ ప్రకారం పాక్‌ పాలకులు అనుసరించిన విధానాలే ప్రస్తుత స్థితికి కారణం. గతంలో 22 సార్లు ఐఎంఎఫ్‌ ఎందుకు రుణాలిచ్చి ఆదుకున్నట్లు ? అప్పుడేమీ చైనా నుంచి ప్రాజెక్టు రుణాలు లేదా ఇతర రుణాలేమీ లేవు కదా ? పాక్‌ అవసరాలకు లేదా అభివృద్ధికి పశ్చిమ దేశాలు తగినన్ని అప్పులిచ్చి పరిస్థితిని మెరుగుపరచి ఉంటే చైనా ప్రవేశానికి అవకాశం ఉండేది కాదు కదా ! అవెందుకు ఇవ్వలేదు అంటే పాకిస్తాన్‌ లేదా మరొక దేశం అభివృద్ది చెందితే వాటి మీద ఆధారపడటం లేదా దిగుమతులను తగ్గించుకుంటే వాటికి ఒరిగేదేమీ ఉండదన్న ఆలోచన తప్ప మరొకటి కాదు. మరి చైనా ఎందుకు పెట్టుబడులు పెడుతోంది, అప్పులు ఇస్తోంది అంటే పరస్పరం లబ్ది చేకూరుతుంది గనుక.


చైనా -పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ (సిపిఇసి) 2015 నుంచి ఉనికిలోకి వచ్చింది. గల్ఫ్‌ దేశాల నుంచి చైనా దిగుమతి చేసుకుంటున్న ఇంథన ఓడలు మలేషియా – ఇండోనేషియా మధ్యన ఉన్న మలక్కా జల సంధి గుండా రాకపోకలు సాగించాలి. ఏ కారణంతోనైనా వాటికి ఆటంకం కలిగితే చైనా ఆర్థిక రంగం మీద తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువలన ప్రత్యామ్నాయ మార్గ అన్వేషణలో వచ్చిందే సిపిఇసి. అట్లాంటిక్‌ – పసిఫిక్‌ సముద్రాలను కలుపుతూ పనామాలో 82కిలోమీటర్ల పొడవున ఒక కాలువను తవ్వితే కొన్ని వేల కిలోమీటర్ల మేరకు ఓడల ప్రయాణ దూరం,ఖర్చు తగ్గుతుందన్న ఆలోచకు ప్రతి రూపమే అది. అదే ప్రాతిపదికన సూయజ్‌ కాలువను కూడా తవ్వారు. పశ్చిమాసియా నుంచి పన్నెండువేల కిలోమీటర్లు ప్రయాణించి చమురు ఓడలు చైనా వస్తున్నాయి. అరేబియా సముద్రతీరంలోని పాకిస్తాన్‌ గ్వాదర్‌ వద్ద రేవు నిర్మాణం చేసి అక్కడి నుంచి చైనాలోని షింజియాంగ్‌ వరకు రైలు మార్గం నిర్మాణం చేస్తే కేవలం 2,395 కిలోమీటర్ల దూరంతోనే చమురును తెచ్చుకోవచ్చు. దీనివలన చైనాకు ఏటా 200 కోట్ల డాలర్లు ఆదా అవుతుంది. ఈ మార్గంలో అనుబంధంగా అనేక పథకాలను ఏర్పాటు చేస్తే అది పాకిస్తాన్‌కూ లబ్ది చేకూరుస్తుంది. మౌలిక సదుపాయాలు వృద్ధి చెందుతాయి. ఇవన్నీ శాశ్వతంగా ఉండేవి, రాబడిని పెంచేవి. ఈ పధకంలో చైనా 25.4బి.డాలర్ల పెట్టుబడులు పెడుతుందని, పాకిస్తాన్‌కు 2.12 బి.డాలర్ల మేరకు పన్ను ఆదాయం, లక్షా92వేల మందికి ఉపాధి దొరుకుతుందని చైనా రాయబారి చెప్పాడు.

గతంలో 22 సార్లు రుణం ఇచ్చిన ఐఎంఎఫ్‌ ఇతర దేశాలు ఇచ్చిన రుణాలతో ఇలాంటి మౌలిక సదుపాయాలును అభివృద్ది చేసి ఉంటే చైనా ప్రవేశానికి అవకాశం ఉండేదా ? పాక్‌ పాలకులు గానీ ఐఎంఎఫ్‌ సలహాదారులు గానీ ఆ దిశగా గతంలో ఎందుకు ఆలోచించలేదు ? ఇప్పుడు చైనా మీద తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నట్లు ?ఇప్పుడు పాకిస్తాన్‌ విదేశీ చెల్లింపుల సమస్యను ఎదుర్కొంటోంది. పారిస్‌ క్లబ్‌, ఇతర సంస్థలు ఇచ్చిన రుణాల చెల్లింపు గడువు దగ్గరపడింది తప్ప చైనా రుణాలు కాదు. పారిస్‌ క్లబ్‌ పేరుతో ఉన్న 22 ధనిక దేశాలు వంద దేశాలకు 610 బి.డాలర్లు రుణాలిచ్చాయి. పాకిస్తాన్‌కు పది బి.డాలర్లు వాటిలో ఉంది. ఇప్పటి వరకు రెండు సార్లు పారిస్‌ క్లబ్‌ రుణాల చెల్లింపు గడువును పెంచి వెసులు బాటు కల్పించింది. ఉగ్రవాదం మీద పోరులో అమెరికాతో కలసి పాకిస్తాన్‌ పోరాడింది కనుక రుణాలు చెల్లించలేనందున 15 సంవత్సరాల పాటు కిస్తీ గడువు పెంచింది. తరువాత కరోనా కారణంగా మరో ఐదేండ్లు పెంచింది. ఇప్పుడు మరోసారి ఆ పని చేసి ఆదుకోవాలని పాక్‌ కోరుతోంది.డిసెంబరు నాటికి కిస్తీ సొమ్ము 110 కోట్ల డాలర్లు చెల్లించాల్సి ఉంది. ఇలాంటి రుణాలను తీర్చేందుకు, దిగుమతుల అవసరాల కోసం ఐఎంఎఫ్‌తో మరింత అప్పు కోసం పాక్‌ సర్కార్‌ సంప్రదింపులు జరుపుతోంది

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా కంపెనీలపై జాక్‌ మా ఆధిపత్యానికి తెర !

07 Saturday Jan 2023

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Alibaba founder Jack Ma, Ant Group, china communist party, Jack Ma, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


చైనాలోని టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన యాంట్‌ గ్రూప్‌ కంపెనీలపై వివాదాస్పద జాక్‌ మా ఆధిపత్యానికి తెరపడింది.జపాన్‌లో ఉంటున్నట్లు వార్తలు రాగా చైనా నుంచి తప్పుకున్నారా లేక తాత్కాలికంగా అక్కడ ఉంటున్నాడా అన్నది స్పష్టం కాలేదు.యాంట్‌ కంపెనీ చేసిన ప్రకటన ప్రకారం యాజమాన్య వ్యవస్థలో చేసిన మార్పుల ప్రకారం ఒక వాటాదారు లేదా ఇతరులతో కలసి సంయుక్తంగా గానీ కంపెనీని అదుపులోకి తీసుకొనేందుకు వీలు లేదు. పరోక్ష పద్దతుల్లో 53.46 శాతం వాటాలపై అదుపు ఉన్న కారణంగా జాక్‌ మా పెత్తనం ఇప్పటి వరకు కొనసాగింది. మారిన నిబంధనల ప్రకారం ప్రస్తుతం అతగాడికి 6.2శాతం ఓటింగ్‌ హక్కులు మాత్రమే ఉంటాయి. మన దేశంలో అదానీ, అంబానీ వంటి వారు క్రమంగా అనేక కంపెనీలను మింగివేస్తూ రోజు రోజుకూ సంపదలను మరింత పోగు చేసుకుంటున్న తీరు తెన్నులు తెలిసిందే. చైనాలో అలాంటి అవకాశం ఉండదని జాక్‌ మా ఉదంతం స్పష్టం చేసింది.

మారిన నిబంధనల ప్రకారం కంపెనీ స్థాపకుల్లో ఒకడైన జాక్‌ మా, ఇతర యాజమాన్య, సిబ్బంది ప్రతినిధులు పది మంది తమ ఓటింగ్‌ హక్కును స్వతంత్రంగా వినియోగించుకోవచ్చు. ఎవరి ఆర్థిక ప్రయోజనాలో మార్పు ఉండదని కంపెనీ ప్రకటన తెలిపింది.ఈ ప్రకటన తరువాత హాంకాంగ్‌ స్టాక్‌ మార్కెట్‌లో కంపెనీల వాటాల ధర తొమ్మిదిశాతం పెరిగింది. ఈ ప్రకటన వెలువడటానికి ముందు జాక్‌ మా థాయిలాండ్‌ రాజధాని బాంకాక్‌లో కనిపించినట్లు వార్తలు వచ్చాయి. టోకియో నగరంలో తన కుటుంబంతో సహా ఉంటున్నారని, అక్కడి నుంచి అమెరికా, ఇజ్రాయెల్‌, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌ తదితర దేశాలు వెళ్లి వస్తున్నట్లు గతేడాది నవంబరులో ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొన్నది. నూతన సంవత్సరం సందర్భంగా చైనాలోని కొందరు టీచర్లతో జాక్‌ మాట్లాడుతున్న వీడియో వెలువడినట్లు హాంకాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు అనే పత్రిక రాసింది. తాను త్వరలోనే ప్రత్యక్షంగా దర్శనమిస్తానని దానిలో చెప్పటాన్ని బట్టి తిరిగి జాక్‌ మా తన కార్యకలాపాలను కొనసాగిస్తాడని భావిస్తున్నట్లు పేర్కొన్నది.దీన్ని బట్టి జాక్‌ మా తిరిగి చైనా వచ్చాడా లేక ఎక్కడ ఉన్నాడన్నది స్పష్టం కావటం లేదు. 2020లో వివాదాస్పద ప్రకటనలు చేసినప్పటి నుంచీ జాక్‌ మా గురించి అనేక పుకార్లు వచ్చాయి. జైల్లో పెట్టారని, అసలు మనిషినే అంతం చేశారని కూడ పుకార్లు షికార్లు చేశాయి. అప్పటి నుంచి బహిరంగ జీవితంలో సరిగా కనిపించటం లేదు.

ఝజియాంగ్‌ వాణిజ్య,పారిశ్రామికవేత్తల మండలి అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినట్లు ఒక వెబ్‌సైట్‌లో వార్తను ఉటంకిస్తూ డిసెంబరు ఎనిమిదవ తేదీన చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఒక వార్తను ప్రచురించింది. ఆరున్నర కోట్ల మంది జనాభా ఉన్న తూర్పు చైనా ఝజియాంగ్‌ ప్రాంతంలో గతేడాది ఆగస్టు నాటికి 9.06 మిలియన్ల సంస్థలు సదరు మండలిలో ఉన్నట్లు, అది ఏర్పడిన 2025 నుంచి జాక్‌ మా అధ్యక్షుడిగా ఉన్నట్లు గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది.యాభై ఐదేండ్ల వయసులో జాక్‌ మా 2019 సెప్టెంబరు లోనే అధికారికంగా ఆలీబాబా కంపెనీ చైర్మన్‌ పదవి నుంచి వైదొలగినట్లు, హరున్‌ సంస్థ రూపొందించిన జాబితా ప్రకారం చైనాలో తొమ్మిదవ పెద్ద ధనవంతుడిగా ఉన్నాడని, సెప్టెంబరు ఆఖరు నాటికి అతని సంపద విలువ అంతకు ముందుతో పోలిస్తే మూడుశాతం పెరిగి 29.124 బిలియన్‌ డాలర్లని కంపెనీ రికార్డుల ప్రకారం ఉన్నట్లు కూడా ఆ పత్రిక పేర్కొన్నది. చిన్న కంపెనీలను మింగివేసేందుకు జాక్‌ మా చూసినట్లు వెల్లడి కావటంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. దాంతో తన వాటాలను కొన్నింటిని ప్రభుత్వానికి స్వాధీనం చేస్తానని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ గతంలో రాసింది. తాజా పరిస్థితి గురించి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.


ఒకటి మాత్రం స్పష్టం, చైనా ప్రభుత్వం జాక్‌ మాను అదుపులోకి తెచ్చింది. ప్రయివేటు సంస్ధలను నిరుత్సాహపరచకుండా సోషలిస్టు వ్యవస్ధకే ఎసరు తెచ్చే విధంగా బడా సంస్ధలను అనుమతించబోమనే సందేశాన్ని జాక్‌ మా ద్వారా చైనా కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిందిందన్నది స్పష్టం. కరోనా, లాక్‌డౌన్ల కారణంగా ఇతర దేశాల మాదిరే చైనా ఆర్థిక రంగం కూడా ప్రభావితమైంది. జాక్‌ మా, ఇతర టెక్‌ కంపెనీలపై తీసుకున్న క్రమబద్దీకరణ చర్యలతో చైనా నవకల్పనలు కుంటుపడినట్లు ఎవరూ చెప్పటం లేదు.


సోషలిజం అంటే దరిద్రాన్ని పారదోలటం తప్ప వక్రీకరించి చెప్పేవారు చెబుతున్నట్లుగా దాన్ని అలాగే ఉంచి అందరికీ పంచటం కాదు. సోషలిజం దాని తరువాత కమ్యూనిజం అంటే శక్తికొద్దీ పని, అవసరం కొద్దీ వినియోగం. ఇప్పటికైతే కమ్యూనిజం ఒక ఉత్తమ భావన. ఆదిమ కమ్యూనిజం అనే దశలో నాటి మానవులు సామూహిక శ్రమ ద్వారా సాధించిన వాటిని అవసరం కొద్దీ పంచుకొనే వారు గనుక ఆ స్ధాయిలో ఉత్పత్తి సాధిస్తే ఆధునిక కమ్యూనిజం సాధ్యమే అన్నది మార్క్స్‌-ఎంగెల్స్‌ భావన. దాన్ని సాధించాలంటే జనం అందరి అవసరాలు తీరేంతగా ఉత్పత్తిని, ఉత్పాదక శక్తులను పెంచాల్సి ఉంది. అది ఎంతకాలంలో సాధ్యం అవుతుంది అంటే చెప్పలేము. అత్యంత ఆధునిక పెట్టుబడిదారీ విధానం అమల్లో ఉన్న ప్రాంతాలతో పాటు కొండకోనలకే పరిమితమై ఆదిమానవుల లక్షణాలను ఇంకా కలిగి ఉన్న వారి వరకు వివిధ దశల్లో ఉన్న జనం ఉన్నారన్నది తెలిసిందే.
రష్యాలో విప్లవం వచ్చిన నాటికి ఆ ప్రాంతం అభివృద్ది చెందిన పెట్టుబడిదారీ వ్యవస్ధలలో ఒకటి. అదే చైనా విప్లవ సమయంలో ఫ్యూడల్‌ సంబంధాలతో ఉన్న వ్యవస్ధ, పారిశ్రామికంగా మనకంటే వెనుకబడిన దేశం. సోషలిస్టు వ్యవస్ధ లక్ష్యంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ అధికారానికి వచ్చిన తరువాత ఉత్పాదకశక్తుల పెరుగుదల ఆశించిన మేరకు పెరగలేదు. కనుకనే డెంగ్‌సియావో పింగ్‌ సంస్కరణలలో భాగంగా విదేశీ పెట్టుబడులు, పెట్టుబడిదారులను చైనాకు ఆహ్వానించారు. దేశీయంగా కూడా అనుమతించారు. దీంతో జాక్‌ మా వంటి వారు ఐటి, దాని అనుబంధ రంగాలలో ప్రవేశించి అనూహ్య స్దాయిలో సంపదలను సృష్టించారు, బిలియనీర్లుగా పెరిగిపోయారు. అయితే వారు సోషలిస్టు వ్యవస్ధకే ఎసరు తెచ్చే సూచనలు వెల్లడిస్తే కమ్యూనిస్టు పార్టీ అనుమతించదని జరిగిన పరిణామాలు వెల్లడిస్తున్నాయి.


గ్లాస్‌నోస్త్‌ పేరుతో సోవియట్‌ యూనియన్‌లో అమలు చేసిన అనుభవాలు చూసిన తరువాత తియన్మెన్‌ స్కేర్‌లో విద్యార్ధుల పేరుతో జరిపిన ప్రతీఘాత ప్రయత్నాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ మొగ్గలోనే తుంచి వేసింది. తాను పెరిగి, ఇతర సంస్దలను మింగివేసేందుకు పూనుకున్నట్లు జాక్‌మా గురించి వచ్చిన వార్తలు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినట్లు వెల్లడైన సమాచారం మేరకు ఇటీవలి పరిణామాలు చోటు చేసుకున్నాయి. గుత్త సంస్ధలు పెరగకుండా నిరోధించే చట్టాలు అన్ని దేశాలలో మాదిరి చైనాలో కూడా ఉన్నాయి. వాటిని లోపభూయిష్టంగా తయారు చేయటం, సరిగా అమలు జరపని కారణంగా అనేక దేశాలలో సంస్ధలు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగి ప్రభుత్వాలనే శాసిస్తున్నాయి. జాక్‌ మా ఆంట్‌ కంపెనీ 37 బిలియన్‌ డాలర్ల వాటాల విక్రయానికి పూనుకోగా చైనా ప్రభుత్వం అడ్డుకున్నది. ఈ చర్యలను చైనా అధినేత గ్జీ జింపింగ్‌ తన వ్యతిరేకులను అణచివేసే వాటిలో భాగంగా తీసుకుంటున్నట్లు చిత్రించారు. అక్రమాలకు పాల్పడిన అనేకమంది కమ్యూనిస్టులు, ఇతరుల మీద చర్యలు తీసుకున్నారు. రియలెస్టేట్‌ కంపెనీ వాండా యజమాని వాంగ్‌ జియాన్‌లిన్‌, ఇన్సూరెన్సు కంపెనీ అనబాంగ్‌ అధిపతి ఉ గ్జియావోహురు మీద చర్యలు తీసుకోవటమే గాక వారి వ్యాపారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.


1999లో కేవలం 20 మంది స్నేహితులు, సిబ్బందితో తన స్వంత ఫ్లాట్‌లో ఐటి కార్యకలాపాలను ప్రారంభించిన జాక్‌ మా కేవలం రెండు దశాబ్దాల కాలంలోనే 2020 నాటికి ఏడాదికి 72 బిలియన్‌ డాలర్ల ఆదాయం తెచ్చే కంపెనీలకు అధిపతి అయ్యాడు.కెఎఫ్‌సి కంపెనీ తమ దుకాణంలో ఉద్యోగానికి పనికి రాడని జాక్‌ను తిరస్కరించింది. తాను జన్మించిన పట్టణానికి వచ్చే విదేశీయుల పరిచయాలతో ఆంగ్లం నేర్చుకున్న జాక్‌ తరువాత ఆంగ్లబోధకుడయ్యాడు. అదే సమయంలో ఇంటర్నెట్‌ చైనాలో ఊపందుకుంటున్నది. తన ఆంగ్ల పరిజ్ఞానంతో వాణిజ్య సంస్దలకు వెబ్‌ పేజీలను తయారు చేయటంతో తన కార్యకలాపాలను ప్రారంభించి ఆ రంగంలో ఉన్నత స్ధానాలకు ఎదిగాడు. ఇలాంటి వారెందరో తమ ప్రతిభతో బిలియనీర్లుగా మారారు.చైనాలో బిలియనీర్లుగా ఉన్న వారిలో ఇలాంటి వారే అత్యధికులు. జాక్‌ మా వంటి వారు చైనా ప్రభుత్వ విధానాలనే ప్రశ్నించే స్దాయికి ఎదిగారు. దానికి పరాకాష్టగా 2020 అక్టోబరులో చేసిన ఒక ప్రసంగంలో తన అంతరంగాన్ని బయటపెట్టారు. దేశ ఆర్ధిక, నియంత్రణ, రాజకీయ వ్యవస్ధలను సంస్కరించాలని, వస్తు తనఖా లేదా ఆస్తి హామీ లేకుండా రుణాలు ఇవ్వని వడ్డీ వ్యాపార దుకాణ ఆలోచనల నుంచి బ్యాంకులు బయటపడాలని చెప్పారు. 2008లో ఇతర ధనిక దేశాల్లో వచ్చిన బ్యాంకింగ్‌ సంక్షోభం చైనాను తాకలేదు, దీనికి కారణం అక్కడి వ్యవస్ధపై ప్రభుత్వ అదుపు, ఆంక్షలు ఉండటమే.


చైనా మీద వాణిజ్య యుద్దం ప్రకటించిన డోనాల్డ్‌ ట్రంప్‌ తాను అధికారం స్వీకరించిన తరువాత భేటీ అయిన తొలి చైనీయుడు జాక్‌ మా అన్నది చాలా మందికి గుర్తు ఉండకపోవచ్చు. తొలి పది రోజుల్లోనే న్యూయార్క్‌లో వారి భేటీ జరిగింది. అమెరికా వస్తువులకు తన వేదికల ద్వారా చైనాలో మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించి పది లక్షల మంది అమెరికన్లకు ఉపాధి కల్పిస్తామని జాక్‌ మా ఆ సందర్భంగా ట్రంప్‌కు వాగ్దానం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో చైనాలో జరుగుతున్న పరిణామాలను చూడాల్సి ఉంది. వ్యవస్ధకు కంపెనీలు, వ్యక్తులు అనువుగా ఉండాలి తప్ప వారి కోసం వ్యవస్ధలు కాదని చైనా నాయకత్వం స్పష్టం చేయదలచుకుంది.నీరు వంద డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చే వరకు అంతర్గతంగా మరుగుతుంది తప్ప ఆ తరువాతనే ఆవిరిగా రూపం మార్చుకుంటుంది. అప్పటి వరకు జరిగింది కనిపించదు. చైనా సోషలిస్టు వ్యవస్థను దెబ్బతీసేందుకు అమెరికా, ఇతర దాని మిత్ర దేశాలు నిరంతరం చూస్తున్నాయి. ఏ అవకాశాన్నీ వదులు కోవటం లేదు. అందుకు సహకరించే శక్తులు, వ్యక్తుల కోసం అది ఎదురు చూస్తుంది. సోవియట్‌ కూల్చివేతకు ముందు కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడి గా ఉన్న బోరిస్‌ ఎల్సిన్‌ ముందు రాజీనామా చేశాడు. తరువాత సిఐఏ పథకం ప్రకారం దేశాధ్యక్షుడైన చరిత్ర తెలిసిందే. అందువలన సిఐఏ ఎవరి మీద వల విసురుతుందో, ఎవరు చిక్కేదీ చెప్పలేము. దీని అర్ధం జాక్‌ మా అలాంటి వారి జాబితాలో ఉన్నాడని చెప్పటం కాదు. చరిత్ర చెప్పాల్సిందే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ ప్రభావం : రూపాయి ఉల్లాస లాభం 328, వైఫల్య నష్టం 2,420 పైసలు !

31 Saturday Dec 2022

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

5 Trillion Dollar Economy, BJP, China, Donald trump, India GDP, Narendra Modi Failures, Rupee depreciation, Rupee Fall, U.S. Dollar


ఎం కోటేశ్వరరావు


” నరేంద్రమోడీ ప్రభావం : 2014లో ఆసియా-పసిఫిక్‌ కరెన్సీలో ఉత్తమ ప్రతిభ చూపుతున్న రూపాయి ” అని 2014 మే 25వ తేదీన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక ఒక విశ్లేషణకు పెట్టిన శీర్షిక. అదే పత్రిక 2022 డిసెంబరు 30వ తేదీన ” 2022లో ఆసియన్‌ కరెన్సీలో చెత్త ప్రదర్శనతో ముగిసిన రూపాయి ” అనే శీర్షికతో వార్తను ఇచ్చింది. 2014కంటే మరింత బలంతో రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత అదే నరేంద్రమోడీ ప్రభావం పెరిగింది తప్ప తగ్గలేదని చెబుతున్నారు. నాడు వార్త రాసినపుడు డాలరుకు రూపాయి మారకం రేటు రు.58.52 కాగా 2022 డిసెంబరు 30న ముగిసిన రేటు రు.82.72. ఎంత పతనం ? మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో పతనాన్ని చూసి గుండెలు బాదుకున్న బిజెపి పెద్దలు ఇప్పుడు తమ ఏలుబడిలో రూపాయి చక్కగా ఉందని బస్తీమే సవాల్‌, చర్చిద్దామా అంటూ తొడగొడుతున్నారు. అదేదో అమెరికా డాలర్‌ రేటు పెరిగింది తప్ప మన రూపాయి తగ్గలేదంటూ వాదనలు చేస్తున్నారు. ఇది ఏ వేద గణిత లెక్కో, ఏ తర్కమో వారే చెప్పాలి.


డాలరు విలువ పెరిగింది తప్ప మన బంగారం బానే ఉందని చెబుతున్నవారు, తాజాగా రాయిటర్‌ వార్తా సంస్థ, అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం అనేక దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్‌తో మన పతనం ఎక్కువగా ఎందుకుందో చెప్పగలరా ? ఎగువన రాయిటర్‌ గ్రాఫ్‌లో చూపిన దాని ప్రకారం సింగపూర్‌ డాలర్‌ విలువ పెరగ్గా పతనంలో ప్రధమంగా రూపాయి, వరుసగా ఇండోనేషియా రూపయా, ఫిలిఫ్పీన్స్‌ పెసో,చైనా యువాన్‌, దక్షిణ కొరియా వాన్‌, మలేసియా రింగిట్‌, థాయిలాండ్‌ బట్‌ ఉన్నాయి. శుక్రవారం ఉదయం లండన్‌లో ఉన్న ప్రాధమిక సమాచారం ప్రకారం వాల్‌స్రీట్‌ జర్నల్‌ ఒక వార్త ఇచ్చింది. దాని ప్రకారం 2022లో జపాన్‌ ఎన్‌ 13శాతం, భారత రూపాయి 10, చైనా యువాన్‌ 8.6, ఆస్ట్రేలియా డాలర్‌ 6.5,దక్షిణ కొరియా వాన్‌ 5.5 శాతం చొప్పున క్షీణించింది.


2014 జనవరి ప్రారంభంలో రు.61.80గా ఉన్న రూపాయి విలువ కొత్త ప్రభుత్వం వస్తుందన్న ఉల్లాసం, విదేశాల నుంచి డాలర్ల ప్రవాహంతో ఆరు నెలల్లో 58.52కు పెరిగింది, 328పైసలు లాభపడింది. అలాంటి ఉల్లాసానికి కారకుడైన నరేంద్రమోడీ ఏలుబడిలో ఇప్పటికి 2,420 పైసల నీరసం మిగిలింది. గతేడాది చివరిలో రు.74.33గా ఉన్నది కాస్తా పన్నెండు నెలల్లో రు.82.72కు అంటే 839 పైసలు దిగజారింది.ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు, చైనాను కట్టడి చేసేందుకు, ఇతర అంతర్జాతీయ అంశాల మీద నరేంద్రమోడీ కేంద్రీకరించి రూపాయి పాపాయి సంరక్షణను నిర్మలా సీతారామన్‌కు అప్పగించారు, అదే మోడీ కేంద్రీకరించి ఉంటేనా అని భజన పరులు ఎవరైనా అనవచ్చు. నిజమే అనుకుందాం కాసేపు, మోడీ చూపు ప్రపంచం మీద పెట్టినప్పటికీ ఏ ఒక్క అంతర్జాతీయ సమస్యా పరిష్కారం కాలేదు, మనకు మాత్రం రూపాయి పతనంతో దిగుమతులు భారమై కష్టాలు పెరిగాయి, పోనీ వాటికి విరుగుడుగా తన పలుకుబడితో ఎగుమతులు పెంచారా అంటే అదీ లేదు. అమెరికాకే అగ్రస్థానం అంటూ అంతకు ముందు డోనాల్డ్‌ ట్రంప్‌, ఇప్పుడు జో బైడెన్‌,తగ్గేదే లే అంటూ వ్లదిమిర్‌ పుతిన్‌, మా దారి మాదే వైదొలిగేది లేదు, అమెరికా కాదు దాని బాబు బెదిరించినా మేమింతే అంటూ షీ జింపింగ్‌ ఇలా ఎవరికి వారు తమ తమ అజెండాలతో ముందుకు పోతున్నారు. అచ్చేదిన్‌ తెస్తానన్న నరేంద్రమోడీ తన అజెండాను పక్కన పెట్టి విశ్వగురువు అవతారమెత్తి ప్రశంసలు పొందటం తప్పమన జనాలకు ఇంతవరకు ఒరగబెట్టింది ఏమిటి అన్నది ప్రశ్న. మొత్తంగా చూస్తే ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత లేదా బాహర్‌ షేర్వాణీ అందర్‌ పరేషానీగా ఉంది.


మన్మోహన్‌ సింగ్‌ పాలనలో 2013లో మన కరెన్సీ విలువ దారుణంగా పతనమైంది. ఆ తరువాత 2022లో 11.3 శాతం పతనంతో నరేంద్రమోడీ తనదైన రికార్డు నెలకొల్పారు. వచ్చే ఏడాది కొంత మేర విలువ పెరగవచ్చనే ఆశాభావంతో పాటు ఇంకా పతనం కావచ్చనే హెచ్చరికలూ వెలువడుతున్నాయి. జనవరి – మార్చి నెలల్లో రు.81.50 నుంచి 83.50 మధ్య రూపాయి విలువ ఉండవచ్చని కొందరి అంచనా. తీవ్రమైన అనిశ్చితి. ధనిక దేశాల్లో మాంద్య తీవ్రత ఎలా ఉంటుంది, ఎంత కాలం కొనసాగుతుంది అన్నది ఎవరికీ అంతుబట్టటం లేదు.ఇప్పటికే మన ఎగుమతులు అధోముఖంగా ఉన్నాయి. 2022లో ఇతర ఆసియా కరెన్సీలతో పోల్చితే రూపాయి పతనం ఎక్కువగా ఉంది, 2023లో మిగతా కరెన్సీలతో పాటు కోలుకున్నా దానిలో కూడా దిగువనే ఉంటామని విశ్లేషణలు వెలువడ్డాయి.


నరేంద్రమోడీ పాలన పదవ ఏటలో ప్రవేశించే ముందు రూపాయి పతనంలోనే కాదు, ఇంకా అనేక రికార్డులు నెలకొల్పుతున్నారు. 2022-23వ సంవత్సరం రెండవ త్రైమాసకాలం(జూలై – సెప్టెంబరు)లో దిగుమతులు-ఎగుమతుల్లో (దీన్ని కరంట్‌ ఖాతా అంటారు) 36.4 బిలియన్‌ డాలర్లు లోటు ఉంది. ఇది జిడిపిలో 4.4శాతానికి సమానం. గతేడాది ఇదే కాలంలో ఉన్న లోటు 9.7 బి.డాలర్లు మాత్రమే. మన దేశం నుంచి వస్తువులతో పాటు సేవల ఎగుమతులు కూడా ఉన్నాయి. వస్తు లావాదేవీల లోటు గతేడాది 44.5 బి.డాలర్లు కాగా ఈ ఏడాది 83.5 బి.డాలర్లకు పెరిగింది. వస్తుసేవలకు సంబంధించి మిగులు 25.6 నుంచి 34.4బి.డాలర్లకు పెరిగింది.ఇది కాస్త ఊరట కలిగిస్తోంది. 2012లో అక్టోబరు – డిసెంబరు మాసాల్లో వాణిజ్యలోటు 32.6 బి.డాలర్లు ఒక రికార్డు కాగా నరేంద్రమోడీ దాన్ని బద్దలు కొట్టారు. ఈ ఏడాది అక్టోబరు- డిసెంబరు వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. సెప్టెంబరు తరువాత పరిస్థితి దిగజారింది తప్ప మెరుగుపడింది లేదు.


డిసెంబరు 15న కేంద్ర ప్రభుత్వం వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు ఎగుమతి-దిగుమతి లావాదేవీల వివరాలను వెల్లడించింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మన ఎగుమతులు 424.45 నుంచి 499.67బి.డాలర్లకు(17.72శాతం) పెరగ్గా దిగుమతులు 471.68 నుంచి 610.7 బి.డాలర్లకు (29.47శాతం) పెరిగాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో తొలి ఎనిమిది నెలల్లో మన వాణిజ్యలోటు అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 47.23 నుంచి 111.02 బి.డాలర్లకు పెరిగింది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యలోటు అంతకు ముందు ఏడాదితో పోల్చితే 102.63 బి.డాలర్ల నుంచి 192.41 బి.డాలర్లకు పెరిగింది. ఈ లెక్కన 2023 మార్చితో ముగిసే సంవత్సరంలో ఎంతకు చేరుతుందో చూడాల్సి ఉంది.


ప్రకటిత లక్ష్యం కనుచూపు మేరలో కనిపించకున్నా ఇంకా మన నేతలు 2025నాటికి దేశ జిడిపిని ఐదులక్షల కోట్లడాలర్లకు పెంచుతామని చెబుతూనే ఉన్నారు. శుక్రవారం నాడు విదేశాంగ మంత్రి జై శంకర్‌ సైప్రస్‌లో మాట్లాడుతూ ఇదే చెప్పారు. 2025 మార్చి నాటికి ఐదులక్షల కోట్ల డాలర్లకు, 2033-34 నాటికి పది లక్షల కోట్ల డాలర్ల సాధిస్తామని 2019లో ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ప్రస్తుత అంచనా 2022 ప్రకారం 3.3 లక్షల కోట్ల డాలర్లు. కరోనా తదితర కారణాలను చూపుతూ 2025 గడువును 2027కు పెంచినట్లు కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ చెప్పారు. వచ్చే ఐదు సంవత్సరాల పాటు సగటున ఏటా తొమ్మిది శాతం వృద్ధి సాధిస్తే 2028-29నాటికి ఐదులక్షల కోట్ల డాలర్లను సాధించగలమని రిజర్వుబాంకు మాజీ గవర్నర్‌ డి సుబ్బారావు 2022 ఆగస్టులో చెప్పారు.


కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, జై శంకర్‌ తదితరులు ఇలాంటి వారి అభిప్రాయాలు, వాస్తవాలను పరిగణనలోకి తీసుకోరా ? జనాన్ని మరీ అంత తక్కువగా అంచనా వేస్తున్నారా ? 2047నాటికి మన జిడిపి 40లక్షల కోట్లకు చేరుతుందని ముకేష్‌ అంబానీ ప్రకటించారు. ఇక ఆసియాలో అతి పెద్ద ధనవంతుడిగా మారిన గౌతమ్‌ అదానీ వచ్చే పది సంవత్సరాల కాలంలో ప్రతి 12-18 నెలలకు మన జిడిపి లక్ష కోట్ల డాలర్ల వంతున పెరుగుతుందని అన్నారు. ఇలా ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ తమ సంపదల మాదిరి దేశ జిడిపి కూడా పెరుగుతుందని జనాన్ని నమ్మమంటున్నారు. ఒక 50 ఏండ్ల క్రితం పల్లెటూళ్లలో ఎవరైనా పెద్ద పట్టణాల్లో కొత్త సినిమా చూసి వస్తే దాని కథ, పాటల గురించి చెబుతుంటే జనం గుంపులుగా చేరేవారు. పాటల పుస్తకాలను తీసుకువస్తే ఇక చెప్పాల్సిన పనిలేదు. జిడిపి గురించి కూడా జనానికి బిజెపి నేతలు అలాగే కథలు వినిపిస్తున్నారు. ప్రపంచ జడిపిలో మొత్తం సంపదలో చూస్తే అగ్రస్థానంలో ఉన్న అమెరికా తలసరి జిడిపిలో ఏడవ స్థానంలో ఉంది. రెండవదిగా ఉన్న చైనా 77వస్థానం, ఐదవదిగా ఉన్న మన దేశం 128వదిగా ఉంది. మన దేశం అమెరికా, చైనాలను దాటి వృద్ది సాధించేందుకు పోటీపడాలని ఎవరైనా కోరుకోవటం తప్పు కాదు. ప్రపంచ అగ్రదేశం అమెరికాలో ఇప్పటికీ రోడ్ల మీద అడుక్కొనే వారు, ఫుడ్‌ కూపన్లతో కడుపునింపుకొనే జనాలు ఉన్నారంటే సంపదలు పెరగటమే కాదు, అవి జనాలకు చెందితేనే గౌరవ ప్రదమైన జీవితాలను గడుపుతారని చెప్పకనే చెబుతున్నది. మన దేశ పరిస్థితి ఒక్క సారి ఊహించుకుంటే మనం ఎక్కడ ఉన్నాం, ఎంత ఎదగాలి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త్రాలు- హెచ్చరికగా చైనా మిలిటరీ విన్యాసాలు !

28 Wednesday Dec 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, International, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ 1 Comment

Tags

AUKUS, china communist party, Joe Biden, PLA actions, PLA Eastern Theater Command, Quadrilateral Security Dialogue, Taiwan independence, Taiwan Next propaganda, US imperialism, US-CHINA TRADE WAR, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


మరోసారి చైనాను అమెరికా రెచ్చగొట్టింది. రానున్న ఐదు సంవత్సరాల్లో తైవాన్‌కు పది బిలియన్‌ డాలర్ల మిలిటరీ సాయం చేసేందుకు ఆమోదించిన బిల్లు మీద అధ్యక్షుడు జో బైడెన్‌ డిసెంబరు మూడవ వారంలో సంతకాలు చేసి మరోసారి రెచ్చగొట్టాడు. ఆగస్టు (2022)లో అమెరికా పార్లమెంటు స్పీకర్‌ నాన్సీ పెలోసి వివాదాస్పద చైనా పర్యటన తరువాత తైవాన్‌లోని వేర్పాటు వాదులను హెచ్చరిస్తూ చైనా మిలిటరీ భారీ విన్యాసాలను జరిపింది. ఇప్పుడు చైనా ఆగస్టు కంటే పెద్ద ఎత్తున మరోసారి తైవాన్‌ చుట్టూ మిలిటరీ విన్యాసాలను జరిపింది. ప్రపంచ నలుమూలలా ఎక్కడో ఒక చోట ఏదో ఒక వివాదాన్ని సృష్టించకపోతే అమెరికా మిలిటరీ కార్పొరేట్లకు నిదరపట్టదు. నిజానికి ఆసియాలో యుద్ద రంగాన్ని తెరవాలన్నది ఎప్పటి నుంచో ఉన్న అమెరికా ఆలోచన, దానికి పరిస్థితులు అనుకూలించటం లేదు. క్వాడ్‌ (అమెరికా, భారత్‌,జపాన్‌, ఆస్ట్రేలియాలతో ఏర్పాటు చేసిన చతుష్టయ కూటమి) పేరుతో 2007 అమెరికా ప్రారంభించిన కూటమికి మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ ఆసక్తి చూపకపోవటంతో మూలనపడింది. దాన్ని నరేంద్రమోడీ రాకతో అమెరికా మరోసారి ముందుకు తెచ్చింది. దీనిలో మన దేశం మరోసారి వెనక్కు తగ్గవచ్చు అన్నమానం లేదా ఇతర కారణాలతో మరో కూటమి ” అకుస్‌ ”ను ఏర్పాటు చేసింది. 2021లో ఆస్ట్రేలియా,బ్రిటన్‌, అమెరికాలతో ఏర్పడిన అకుస్‌ లక్ష్యం ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గాములను సరఫరా చేయటం. వాటిని చైనా మీదకు వదలటానికి తప్ప మరొకటి కాదు. ఇదిగాక ఐదు కళ్లు (ఫైవ్‌ ఐస్‌) పేరుతో ఈ మూడు దేశాలతో పాటు కెనడా, న్యూజిలాండ్‌తో కూడిన గూఢచార సమాచారాన్ని పంచుకొనే మరో ఏర్పాటు, ఇదిగాక ఇండో-పసిఫిక్‌ పేరుతో ఇంకో కూటమి ఇలా ఎన్ని వీలైతే అన్నింటిని కూడగట్టి ఏదో విధంగా చైనాను దెబ్బతీయాలన్నది అమెరికా పధకం.


తాజా పరిణామాలకు ముందు డిసెంబరు రెండవ వారంలో అమెరికన్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో తైవాన్ను స్వాధీనం చేసుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అమెరికా రక్షణశాఖ అధికారి ఎలీ రాట్నర్‌ బెదిరించాడు. 2027 నాటికి తైవాన్‌ మీద మిలిటరీ చర్యకు పూనుకొనేందుకు చైనా చూస్తున్నదని ఆరోపించాడు.గతంతో పోల్చితే నాన్సీ పెలోసీ పర్యటన తరువాత మరింత స్థిరంగా ఉందన్నాడు. అవధులు లేని భాగస్వామ్య ఒప్పంద చేసుకున్నప్పటికీ ఆగస్టు విన్యాసాలలో మాస్కో చేరలేదన్నాడు. తాము వెనక్కు తగ్గేదేలేదని, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తమ విమానాలు ఎగురుతూనే ఉంటాయి, నౌకలు తిరుగుతూనే ఉంటాయన్నాడు. ఉత్తర ఆసియా, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తమ సేనలను మరింతగా పెంచేందుకు చూస్తున్నామని, చైనాను నిలువరించాలంటే అవసరమైన స్థావరాల కొరకు ఒప్పందాలు చేసుకోవాల్సి ఉందన్నాడు. ఈ పూర్వరంగంలో చైనా మిలిటరీ పరిణామాలను చూడాల్సి ఉంది.


చైనా ప్రజావిముక్త సైన్య (పిఎల్‌ఏ) చర్య కేవలం ” తైవాన్‌ స్వాతంత్య్రాన్ని ” అడ్డుకోవటానికి మాత్రమే కాదని చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ తాజా సంపాదకీయంలో పేర్కొన్నది. తైవాన్‌లోని వేర్పాటు వాద పార్టీ డిపిపి నేతలు అమెరికా అండచూసుకొని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నది. చైనా తూర్పు కమాండ్‌ డిసెంబరు 25, 25 తేదీలలో తైవాన్‌ చుట్టూ పహారా, వైమానిక, నావికా విన్యాసాలు జరిపింది. తైవాన్‌ అధికారిక సమాచారం ప్రకారం 71 విమానాలు, ఏడు నౌకలు వీటిలో ఉన్నాయి. కొన్ని విమానాలు తమ గగన తలంలోకి చొచ్చుకు వచ్చినట్లు పేర్కొన్నది. అసలు తైవాన్‌ ప్రాంతం తమదే గనుక దానికి ప్రత్యేక గగనతలం అంటూ లేదని చైనా గతంలోనే చెప్పింది. తైవాన్‌ ఏకపక్షంగా ప్రకటించిన ఎవరూ ప్రవేశించని ప్రాంతాన్ని కూడా చైనా అంగీకరించలేదు. అమెరికా, ఇతర చైనా వ్యతిరేకులు ఏవిధంగా వర్ణించినప్పటికీ తాజా చైనా విన్యాసాలు తైవాన్‌ వేర్పాటు వాదుల మీద మానసికంగా వత్తిడి తెచ్చేందుకు, వేర్పాటు వాదానికి దూరం చేసేందుకు, వారికి మద్దతు ఇస్తున్నవారిని హెచ్చరించేందుకే అన్నది స్పష్టం.ఇదే సమయంలో ఈ ప్రాంతంలో ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినపుడు తీసుకోవాల్సిన చర్యలకు ఇది ముందస్తు కసరత్తుగా కూడా ఉంటుందని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. ప్రతి దేశ మిలిటరీ తమ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక భద్రతను కాపాడేందుకు పూనుకున్నట్లుగానే చైనా మిలిటరీ కూడా అందుకు సన్నద్దతను ఇలాంటి వాటి ద్వారా ప్రదర్శిస్తున్నది. అమెరికా-తైవాన్‌ ప్రాంత ప్రభుత్వ నేతల కుమ్మక్కు, రెచ్చగొట్టుడుకు ఇది ధృఢమైన ప్రతిస్పందన అని తూర్పు కమాండ్‌ ప్రతినిధి స్పష్టం చేశారు. ఏటా రెండు వందల కోట్ల డాలర్ల చొప్పున రానున్న ఐదు సంవత్సరాల్లో వెయ్యి కోట్ల డాలర్ల మేరకు మిలిటరీ సాయం చేసేందుకు డిసెంబరు 23న జో బైడెన్‌ సంతకాలు చేశాడు. ఇంతే కాదు ఒకే చైనా అని అంగీకరించిన విధానానికి తూట్లు పొడిచి 2024లో జరిపే పసిఫిక్‌ ప్రాంత దేశాల సమావేశానికి కూడా తైవాన్ను ఆహ్వానించేందుకు అమెరికా పూనుకుంది. వీటిని చూస్తూ చైనా మౌనంగా ఉండజాలదు. తైవాన్లో అమెరికా వేలు పెట్టటాన్ని తమ అంతర్గత అంశాల్లో జోక్యంగా చూస్తోంది.


1995లో చైనాను రెచ్చగొట్టేందుకు అమెరికన్లు తైవాన్‌ అధ్యక్షుడు లీ టెంగ్‌ హుకు వీసా ఇచ్చారు. దానికి నిరసనగా చైనా అనేక క్షిపణి పరీక్షలు జరిపింది, దాంతో చైనాను బెదిరించేందుకు అమెరికా 1996లో రెండు విమాన వాహకయుద్ధ నౌకలను తైవాన్‌ జలసంధికి పంపింది. దాని కొనసాగింపుగా 1997లో నాటి స్పీకర్‌ న్యూటన్‌ గింగ్‌రిచ్‌ను తైవాన్‌ పర్యటనకు పంపింది. ఆగస్టులో నాన్సీ పెలోసీ మాదిరి అనుమతి లేకుండా గింగ్‌రిచ్‌ రాలేదు. చైనాతో ముందుగా సంప్రదించిన తరువాతే జరిగింది. తైవాన్‌ గురించి తమ నేత ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయరని అమెరికా చెప్పిన మాటలు నమ్మింది చైనా. ఆ మేరకు అధికారికంగానే అనుమతించింది తప్ప తైవాన్‌ మీద ఎలాంటి రాజీ వైఖరిని అనుసరించలేదు. తమతో రక్షణ ఒప్పందం ఉన్న జపాన్ను కూడా అమెరికా రెచ్చగొడుతోంది. ఒక వేళ ఏదైనా కారణంగా జపాన్‌ మీద చైనా దాడి చేస్తే దాన్ని సాకుగా తీసుకొని రక్షణ ఒప్పందం పేరుతో నేరుగా అమెరికా రంగంలోకి దిగవచ్చు. తైవాన్‌ సమీపంలో జపాన్‌ ఒకినావా దీవులుండగా అక్కడ అమెరికా మిలిటరీ స్థావరం ఉంది. తూర్పు చైనా సముద్రంలో ఉన్న సెనెకాకు దీవుల్లో జనావాసాలు లేవు,అవి గతంలో చైనాలో భాగంగా ఉండేవి. రెండవ ప్రపంచ జపాన్‌ యుద్దం తరువాత జపాన్‌ అదుపులో ఉన్నాయి. అవి తమవని, జపాన్‌కు వాటి మీద హక్కులేదని వాదిస్తున్న చైనా వాటి మీద సార్వభౌత్వం తమదే అని ప్రదర్శించుకొనేందుకు తరచూ విమానాలను ఆ ప్రాంతానికి పంపుతున్నది. లియాఓనింగ్‌ అనే విమాన వాహక యుద్ద నౌక నుంచి విమానాలు ఆ దీవుల సమీపంలో చక్కర్లు కొడతాయి. దానికి ప్రతిగా జపాన్‌ కూడా స్పందించి విమానాలను పంపుతుంది.


చైనా చుట్టూ వివిధ దేశాలలో పెద్ద సంఖ్యలో అమెరికా సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. రోజు రోజుకూ వాటిని మంరింతగా పటిష్టం చేస్తున్నది. చైనా కూడా అమెరికా, దాని మిత్రదేశాల మిలిటరీని తట్టుకోగలిగేట్లు క్షిపణులను రూపొందించింది. ఉపగ్రహాల సంకేతాలు, మార్గదర్శనంలో ఒకే సారి ఒకే వ్యవస్థ నుంచి పలు దిక్కులకు క్షిపణులను ప్రయోగించగల ఎంఎల్‌ఆర్‌ఎస్‌ వ్యవస్థలను కూడా రూపొందించింది. అవి ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్నవాటి కంటే ఎక్కువ రాకెట్లను పంపగలిగినవని బిజినెస్‌ ఇన్‌సైడర్‌ అనే పత్రిక రాసింది. ఒకేసారి ఎనిమిది 370 ఎంఎ రాకెట్లను 350 కిలోమీటర్ల దూరం, రెండు 750 ఎంఎం రాకెట్లను 500 కిలోమీటర్ల దూరం వరకు వదలవచ్చు. చైనా-తైవాన్‌ మధ్య దూరం 150 కిలోమీటర్లే గనుక ఆ ప్రాంతంపై ఎక్కడికైనా క్షిపణులను చైనా వదలగలదు. తైవాన్‌కు రక్షణ పేరుతో సముద్ర జలాల్లో ప్రవేశించిన మరో దేశ మిలిటరీని కూడా ఎదుర్కొనే సత్తాను కలిగి ఉంది. అమెరికా సైనిక స్థావరం ఉన్న ఒకినావా(జపాన్‌)కు తైవాన్‌కు దూరం 730 కిలోమీటర్లు కాగా, జపాన్‌ ప్రధాన ప్రాంతానికి ఒకినావా 1456 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువలన ఎక్కడి నుంచో వచ్చి అమెరికా, జపాన్‌, ఇతర దేశాలు చైనా మీద తలపడాల్సి ఉంది.


తాము ఎంతగా రెచ్చగొట్టినా ఇప్పటికిప్పుడు తైవాన్‌ విలీనానికి చైనా బలాన్ని వినియోగిస్తుందని అమెరికా నేతలు అనుకోవటం లేదు. కానీ ఆయుధ వ్యాపారుల లాబీ 2027లో చైనా ఆ పని చేస్తుందని దానికి అనుగుణంగా ఉండాలని చెబుతున్నది. దానికి ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఉదాహరణగా చూపుతున్నది. నిజానికి తైవాన్‌-ఉక్రెయిన్‌ మధ్యపోలికే లేదు. వివాదం అసలే లేదు. దీర్ఘకాలం పాటు చైనా ప్రధాన ప్రాంతానికి దూరంగా ఉంది కనుక అనుమానాల నివృత్తి తరువాత విలీనం జరగాలని చెప్పారు తప్ప మరొకటి కాదు. అందుకే హాంకాగ్‌, మకావో దీవులు బ్రిటన్‌, పోర్చుగీసుల కౌలు గడువు ముగిసిన తరువాత తనలో విలీనం చేసుకున్నది చైనా . ఒకే దేశం-రెండు వ్యవస్థల పేరుతో ఒక విధానాన్ని ప్రకటించి అమలు జరుపుతున్నది. తైవాన్‌కూ దాన్ని వర్తింపచేసేందుకు అది సిద్దమే. దాన్ని ఒక స్వతంత్ర దేశంగా మార్చి తిష్టవేయాలని అమెరికా చూస్తున్నది. అది జరిగేది కాదని చైనా చెబుతున్నది.


త్వరలో చైనా మిలిటరీ చర్యకు పాల్పడవచ్చని చెబుతున్నవారు నవంబరు నెలలో తైవాన్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను చూపుతున్నారు. ఆ ఎన్నికలలో అధికార పార్టీ డిపిపి చావు దెబ్బతిన్నది. ప్రధాన ప్రతిపక్షమైన కొమింటాంగ్‌ పార్టీ భారీ విజయాలు సాధించింది. అది విలీనానికి పూర్తి వ్యతిరేకం కాదు. ఈ పార్టీ నేతగా మాజీ చైనా పాలకుడు చియాంగ్‌ కై షేక్‌ ముని మనవడు వేనీ చియాంగ్‌ ఉన్నాడు. రాజధాని తైపే మేయర్‌గా గెలిచాడు.1949 నుంచి తైవాన్‌లో తిష్ట వేసిన చియాంగ్‌ కై షేక్‌, తరువాత 1975లో అధికారానికి వచ్చిన అతని కుమారుడు 1987వరకు నిరంకుశ పాలన సాగించాడు. ప్రధాన ప్రాంతం లేకుండా తైవాన్‌ స్వాతంత్య్రానికి, ఒకే ఒకే దేశం-రెండు వ్యవస్థలనే ప్రతిపాదనను కొమింటాంగ్‌ పార్టీ అంగీకరించదు. తైవాన్‌ జలసంధికి ఇరువైపులా ఉన్న రెండు ప్రాంతాలు ఒకే చైనా అన్న 1992 ఏకాభిప్రాయాన్ని అంగీకరించినప్పటికీ భిన్న భాష్యాలతో అస్పష్టంగా ఉంటుంది. డిపిపి మాదిరి చైనా వ్యతిరేక వైఖరి లేదు. 2024లో జరిగే ఎన్నికలలో తిరిగి ఈ పార్టీ అధికారానికి వస్తుందా అని కొందరు ఎదురుచూస్తున్నారు.గతంలో కూడా స్థానిక ఎన్నికలలో డిపిపి ఓడినప్పటికీ సాధారణ ఎన్నికల్లో గెలిచిందని ఈసారి కూడా అదే పునరావృతం కావచ్చన్నది మరొక వైఖరి. అక్కడ ఎవరు అధికారానికి వచ్చినప్పటికీ అమెరికా ప్రభావం ఎక్కువగా ఉన్నందున చైనా తన జాగ్రత్తలను తాను తీసుకుంటుంది. పదే పదే రెచ్చగొడుతున్న అమెరికా వెనుక దుష్ట ఆలోచనలు లేవని చెప్పలేము.ఉక్రెయిన్లో చేసిన మాదిరి తైవాన్లో కుదరదని తెలిసినా అమెరికా తీరుతెన్నులను చూస్తే వెనక్కు తగ్గేట్లు కనిపించటం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ కనికట్టు గుజరాత్‌ వైఫల్యాలను దాచగలదా !

25 Sunday Dec 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, Health, History, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, Women

≈ Leave a comment

Tags

BJP, Gujarat model, Narendra Modi, Narendra Modi Failures, RSS, Rural daily wages


ఎం కోటేశ్వరరావు


మన జనాలకు జ్ఞాపక శక్తి తక్కువ అని భావిస్తున్నారో లేక పాలకులు చేయించిన సర్వేలలో అలాంటి ఫలితం వచ్చిందేమో తెలియదు గానీ జ్ఞాపకశక్తి తక్కువ అన్న నిర్ధారణకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే సత్య హరిశ్చంద్రుడికి అసలు సిసలు వారసులం, శీలవంతులం అని చెప్పుకుంటున్న వారు కూడా అదే విధంగా ఉన్నారా ? 2022 డిసెంబరు 20న రాష్ట్రాలు, జిల్లాల సామాజిక ప్రగతి సూచికలను విడుదల చేశారు.మౌలిక మానవ అవసరాల ప్రాతిపదికన పోటీ తత్వం, సామాజిక ప్రగతి అవసరం గురించి అధ్యయనం చేసిన ఒక సంస్థ ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలికి సూచికలను అందచేసింది. దాన్ని మండలి అధó్యక్షుడు డాక్టర్‌ వివేక్‌ దేవరాయి అధికారికంగా విడుదల చేశారు. ఉచితాలు-అనుచితాల గురించి దేశంలో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఒక వైపు ప్రతిపక్షాల మీద అనుచిత దాడి చేస్తూనే మరోవైపు ఉచితాలను చూపి 2024 లోక్‌సభ ఎన్నికలకు బిజెపి సిద్దం అవుతోంది.దానిలో భాగంగానే మరో ఏడాది పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని వేరే చెప్పనవసరం లేదు.


ఈ పధకం గురించి గతంలో బిజెపి ఏమి చెప్పింది, ఇప్పుడు ఎలా ప్రచారం చేసుకుంటోంది ? 2013లో నాటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తెచ్చేందుకు ఆర్డినెన్స్‌ జారీ చేసింది. పార్లమెంటు సమావేశాలకు ముందు అదెందుకు అని నాడు ప్రతిపక్ష బిజెపి ప్రశ్నించింది. దాని మీద పార్లమెంటు చర్చలో బిజెపి నేత మురళీ మనోహర జోషి ఆ బిల్లు ఆహారం కాదు, కాంగ్రెస్‌ ఓట్ల భద్రత కోసం తెచ్చిందని సెలవిచ్చారు. ఇక బిజెపి మాజీ కేంద్ర మంత్రి శాంతకుమార్‌ పార్టీ అంతరంగాన్ని వెల్లడిస్తూ బహిరంగంగా చెప్పిన అంశాల మీద 2015 జనవరి 23న ఇచ్చిన వార్తకు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక పెట్టిన శీర్షిక ” జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని బిజెపి వ్యతిరేకించిందని చెప్పిన మాజీ ఆహార శాఖ మంత్రి శాంతకుమార్‌ ”, కావాలంటే విదేశీ గూగుల్‌ దేవతను అడిగితే మన స్వదేశీ సమాచారాన్ని కూడా చూపిస్తుంది. ఎందుకంటే వేదాల్లో అన్నీ ఉన్నప్పటికీ మనకు అలాంటి దేవత లేదు మరి. అదే బిజెపి నేతలు ఆహార భద్రత చట్టం కింద ఇస్తున్న వాటి గురించి ఇప్పుడు ఎంతగా ప్రచారం చేసుకుంటున్నదీ తెలిసిందే. కరోనా సాయం పేరుతో 2020 నుంచి 2022 డిసెంబరు వరకు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇచ్చే పధకం ముగిసింది. దాన్ని 2023 ఆఖరు వరకు పొడిగించాలని తాజాగా కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ఇది 2024 ప్రారంభంలో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసమని ఎవరైనా అంటే అవునో కాదో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. జనాలకు తాము ఇప్పటికే నాలుగు లక్షల కోట్ల విలువగల ఆహార ధాన్యాలు సరఫరా చేశామని మరో రెండులక్షల కోట్లు వచ్చే ఏడాది ఖర్చు చేస్తామనే ప్రచారాన్ని బిజెపి ఊదరగొట్టనుంది.


శాంత కుమార్‌ (88) బిజెపిలో వెనుకటి తరానికి చెందిన వారు. అలాంటి వారిలో కొంత మంది పార్టీ ఏదైనా కొన్ని సందర్భాలలో సూటిగా మాట్లాడతారు. ఆహార భద్రతా చట్టాన్ని ప్రారంభం నుంచీ బిజెపి వ్యతిరేకించినప్పటికీ ఎన్నికల ముందు జనంలో చెడుగా చూపే అవకాశం ఉన్నందున సమర్ధించినట్లు చెప్పారు. పార్లమెంటులో చర్చకు వచ్చినపుడు 67శాతం మందిని ఆ చట్టపరిధిలోకి తేవటం చాలా ఎక్కువని చాలా మంది భావించారు, ఎన్నికలే గనుక లేకపోతే అదే చెప్పేవారు. ఎలాగూ తమ ప్రభుత్వం వస్తుందని, దాన్ని సవరిస్తాం గనుక మేము కూడా ఆమోదించామన్నారు. ఇక నరేంద్రమోడీ గుజరాత్‌ సిఎంగా కేంద్రానికి ప్రతిపాదిత ఆ బిల్లు మీద ఒక లేఖ రాశారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఇచ్చే ఆహార ధాన్యాలను నెలకు 35 నుంచి 25 కిలోలకు తగ్గించటం ఏమిటని మండిపడుతూ భద్రత సంగతి సరే ఆ మొత్తంతో అవసరమైన కాలరీల వక్తిని ఎలా సమకూర్చుకోగలరని ప్రశ్నిస్తూ ఆ బిల్లు ఒక మనిషికి రెండు పూటలా తిండికి హామీ ఇవ్వటం లేదన్నారు. నిజంగా ఎంత చక్కగా చెప్పారు. చిత్రం ఏమిటంటే ఆ తరువాత మూడోసారి లోక్‌ సభ ఎన్నికలకు పోతున్నప్పటికీ సరఫరాను ఒక్క కిలో కూడా పెంచలేదు. బిజెపి నేత మురళీ మనోహర జోషి బిల్లుకు ప్రతిపాదించిన సవరణల్లో ఆహార ధాన్యాలతో పాటు పప్పులు, నూనె కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సదరు జోషి ఇప్పుడు బిజెపి మార్గదర్శక మండలి సభ్యుడిగా ఉన్నారు.తన ప్రతిపాదన గురించి మోడీకి చెప్పారో లేదో లేక చెప్పినా ఊడగొట్టిన నాగటి దుంపలతో మనకు పనేమిటని, ఎన్నికలకు ముందు అనేకం చెబుతాం అన్నింటినీ అమలు జరుపుతామా అని మోడీ పట్టించుకోలేదో మనకు తెలియదు.


ప్రపంచ ఆకలి సూచికలో మన దేశ స్థానం పడిపోతున్నది తప్ప మెరుగుపడటం లేదు. 2022లో అంతకు ముందున్న 101 నుంచి 107కు దిగజారింది. మదింపు సరిగా జరగటం లేదని ప్రతిసారీ బిజెపి, కేంద్ర ప్రభుత్వం కూడా చెబుతున్నది. దాని సంగతి పక్కన పెడితే ప్రపంచ సంస్థలు మన సూచికను పెంచే వరకు లేదా అసలు అన్నార్తులు లేరు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వరకు ఉచితంగా ఆహార ధాన్యాలను ఇవ్వాల్సి ఉంటుంది. అంత మాత్రాన బిజెపి రాజకీయాన్ని జనం దృష్టికి తేకుండా ఉండాల్సిన అవసరం లేదు. తాజాగా కేంద్ర ఆహార మంత్రి పియుూష్‌ గోయల్‌ గారు తమ ప్రధాని చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఏడాది పాటు 81.35 కోట్ల మందికి ఉచితంగా ఆహార పంపిణీ జరపనున్నట్లు జేజేలు పలికారు. ఈ పధకాన్ని దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి అమలు జరపాలి. 2014 నుంచి మూడేండ్ల వరకు అమలు జరపాలని 2013లో నిర్ణయించారు. తరువాత అవసరాన్ని బట్టి అమలు చేస్తున్నారు. కానీ ఇంతవరకు దారిద్య్రరేఖకు ప్రాతిపదికను కేంద్ర ప్రభుత్వం తేల్చలేకపోతోంది. కొన్ని అంచనాల ప్రకారం 22శాతం మంది అంటున్నారు. ఎనభై ఒక్క కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలంటే ఈ లెక్కన దేశంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు 58శాతంగా చెప్పాలి. మోడీ సర్కార్‌ తొమ్మిది సంవత్సరాల్లో సాధించిన ప్రగతిగా దీన్ని చెప్పుకుంటారా ? లేక పాలక పార్టీకి ఓట్ల కోసం ప్రజల సొమ్ముతో అర్హత లేని వారికి కూడా ఇస్తున్నారా ? సమాధానం చెప్పేవారెవరు ? పరిస్థితి ఇలా ఉంటే పేదలకు అనుచితంగా ఉచితాలను ఇస్తున్నారని, గుజరాత్‌లో అలాంటి పధకాలు, ప్రలోభాలను తిరస్కరించారని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ఇది నిజమేనా ?


వివిధ రాష్ట్రాల్లో ఇస్తున్న ఉచితాల మంచి చెడ్డల గురించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఉచితాలు వస్తు, ధన, సేవలు ఏ రూపంలో ఉన్నా వాటిని పొందిన వారు ఆమేరకు వాటికోసం ఖర్చు చేయాల్సిన మొత్తాలను ఇతర వాటికి వినియోగదారుల రూపంలో వెచ్చిస్తే ఆ మేరకు మార్కెట్‌ పెరిగి అది దేశాభివృద్దికే తోడ్పడుతుందన్నది ఒక వాదన, కనిపించే వాస్తవం. కానీ పరిశ్రమలను పెట్టక ముందే ఏటా లక్షల కోట్ల మేరకు రాయితీల రూపంలో లబ్ది చేకూర్చుతున్న కార్పొరేట్లకు ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహకాల పేరుతో కేంద్రం మరికొన్ని రాయితీలను ఇస్తున్నది. లబ్ది పొందిన కంపెనీలు ఆ మేరకు పెట్టుబడులు పెట్టి ఉంటే మన పారిశ్రామిక ఉత్పాదకత, ఉపాధి ఎందుకు పెరగటం లేదు ?


ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ) 2020లో వేసిన అంచనా ప్రకారం మన దేశంలో తీవ్ర ఆహార కొరతతో 22 కోట్ల మంది, ఒక మోస్తరు నుంచి తీవ్రంగా ఉన్న వారు 62 కోట్ల మంది ఉన్నట్లు పేర్కొన్నది. ప్రపంచానికి ఆహార ఎగుమతులు చేస్తున్న మన దేశంలో ఆకలి ఏమిటని కొందరు అడుగుతారు. లేదని నమ్మించ చూస్తారు. ఆఫ్రికాలో వజ్రాలు, బంగారు గనులున్నా అక్కడ ఎంత మంది చేతిలో అవి ఉన్నాయి ? అలాగే మన జనాల్లో రెండు పూటలా తిండి తినేందుకు అవసరమైన వాటిని కొనుగోలు చేసే శక్తి ఎందరికి ఉంది? నిజానికి అలాంటి శక్తే ఉంటే పిల్లలు, మహిళల్లో రక్తహీనత ఎందుకు ఉన్నట్లు ? ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల మధ్య వయసులో ఉన్న పిల్లల్లో రక్తహీనత ఉన్నవారు 2015-16తో పోలిస్తే 2019-21 కాలంలో 58.6 నుంచి 67.1శాతానికి పెరిగినట్లు 2022 ఆగస్టు 5న కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ పార్లమెంటులో ప్రకటించారు. ఇది మన ప్రభుత్వ సర్వే ప్రకారమే తేలింది. దీనికి కారణం ఏమిటి ? మెజారిటీ రాష్ట్రాల్లో రెండింజన్ల సర్కార్లే ఉన్నాయి. గుజరాత్‌లో పరిస్థితి మరీ దారుణం. జాతీయ సగటు కంటే ఎక్కువగా గడచిన ఐదు సంవత్సరాల్లో పిల్లల్లో రక్తహీనత 62.6 నుంచి 79.7శాతానికి పెరిగింది, తీవ్ర పరిస్థితిలో ఉన్నవారు 1.7 నుంచి 3.1శాతానికి పెరిగారు. పిల్లలే కాదు,స్త్రీ, పురుషులందరిలో రక్తహీనత పెరిగింది. ప్రతివారం పండ్లు తీసుకొనే వారు దేశంలో సగటున 56.1శాతం ఉంటే అభివృద్ధి చెందిన గుజరాత్‌లో 39.8 శాతమే.(2022 మే 23 టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ). దీనికి ఏమంటారు ?జాతీయ వినియోగ ఖర్చు గురించి 2017-18 సర్వే వివరాలను మోడీ ప్రభుత్వం తొక్కి పెట్టింది. తరువాత అసలు సర్వే ఊసే లేదు.


సమగ్ర జాతీయ పోషకాహార సర్వే (సిఎన్‌ఎన్‌ఎస్‌ ) 2016-18 ఆధారంగా 2022 ఏప్రిల్‌లో రక్తహీనత ముక్త భారత్‌ సంస్థ విడుదల చేసిన వాస్తవాల పత్రం ప్రకారం దేశంలో ఉన్న పరిస్థితితో కేరళను పోల్చితే పరిస్థితి ఇలా ఉంది. (అంకెలు శాతాల్లో )
వయసు సంవత్సరాలు ××× దేశ సగటు ××× కేరళ
1 నుంచి 4 బాలికలు ××× 40.5 ×××××× 13.1
1 నుంచి 4 బాలురు ××× 40.6 ×××××× 12
5 నుంచి 9 బాలికలు ××× 24.7 ×××××× 2.8
5 నుంచి 9 బాలురు ××× 22.3 ×××××× 3.3
10 నుంచి19 బాలికలు××× 39.6 ×××××× 13.7
10నుంచి 19 బాలురు ××× 17.6 ×××××× 4.1
రెండింజన్ల బిజెపి పాలిత రాష్ట్రాలు, సంక్షేమ పధకాల అమలు గురించి గొప్పలు చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా వంటి రాష్ట్రాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 ప్రకారం చూసినా కేరళలో పరిస్థితి మెరుగ్గా ఉంది. నాలుగవ సర్వేతో పోలిస్తే ఐదవ సర్వేలో దేశంలో దేశం మొత్తంలో రక్తహీనత సమస్య పెరిగింది.


ఇక 2022 సామాజిక ప్రగతి సూచికను చూస్తే బిజెపి రెండింజన్ల ప్రభుత్వాల వైఫల్యం గురించి చెప్పుకుంటే సిగ్గు చేటు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సూచికలను చూస్తే 36కు గాను బిజెపి ఏలుబడిలోని అసోం 34, మధ్య ప్రదేశ్‌ 33, ఉత్తర ప్రదేశ్‌ 31, గుజరాత్‌ 22, హర్యానా 21, వైసిపి పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ 23, తెలంగాణా 26వ స్థానంలో ఉంది.తమిళనాడు, కేరళ 6,9 స్థానాల్లో ఉన్నాయి.తొలి ఐదు స్థానాల్లో పుదుచ్చేరి,లక్ష ద్వీప్‌, గోవా, సిక్కిం, మణిపూర్‌ ఉన్నాయి.


ఉచితాల గురించి ఆర్‌బిఐ విడుదల చేసిన ఒక నివేదికలో 2022-23 బడ్జెట్లలో కేరళలో సున్నా కేటాయింపులున్నట్లు పేర్కొన్నది.తొలి రెండు స్థానాల్లో పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం 2022 మార్చి ఆఖరుకు మధ్య ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలలో పురుష వ్యవసాయ కార్మికులకు అతి తక్కువగా రోజువారీ సగటు వేతనం రు,217.8, 220.3 చొప్పున ఉండగా కేరళలో రు.726.8 ఉంది. నిర్మాణ రంగంలో రు.837.7 కాగా గుజరాత్‌లో రు.373 ఇస్తున్నారు. దేశ కార్మిక శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం దేశంలోని గ్రామీణ ప్రాంతాలో వ్యవసాయెతర పనులకు 2020-21లో సగటు వేతనం రు.315.3 కాగా ఆంధ్రప్రదేశ్‌లో రు.305.3 ఉండగా కేరళలలో అది రు.677.6 ఉంది. అందుకే అంటారు, జనాలకు చేపలను తెచ్చి పెట్టటం ఉచితం అదే చేపలను పట్టటం నేర్పితే సాధికారత. ఏడాదికి వంద రోజులు సగటున పని దొరికిందనుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో రు.30,530 రాబడి ఉంటుంది. అదే కేరళలో రు.67,776 వస్తుంది. అందుకే అక్కడ ఉచితాలతో పని లేదు, ఉచితాలు ఇచ్చిన చోట, ఇవ్వని చోటా మానవాభివృద్ది లేదు. దేశమంటే అదానీ, అంబానీలు కాదు, మనుషులు అన్నపుడు గుజరాత్‌లో మనుషులెందుకు అంతగా అధ్వాన్న జీవితం గడుపుతున్నారో వేరే చెప్పాలా ? కనికట్టుతో గుజరాత్‌లో అంతా బాగుంది అంతా బాగుంది అని నరేంద్రమోడీ గారడీ చేస్తే కుదరదు, తన పాలన వైఫల్యాలు దాస్తే దాగేవి కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉచితాలు – అనుచితాల చర్చ : నరేంద్రమోడీకి జ్ఞాపకశక్తి తగ్గుతున్నదా లేక బిజెపి చేస్తే సంసారం…. !

15 Thursday Dec 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Women

≈ Leave a comment

Tags

BJP, Freebies, Narendra Modi, Narendra Modi Failures, Politics Of Freebies, Revadi Politics


ఎం కోటేశ్వరరావు


గుజరాత్‌లో వచ్చిన ఘన విజయంతో ప్రధాని నరేంద్రమోడీ మరోమారు ఉచితాలు – అనుచితాల చర్చకు తెరతీశారు. దేశ వృద్ధికి ప్రమాదకరమంటూ ఉచిత రాజకీయాలు చేయవద్దని ఇతర పార్టీల మీద ధ్వజమెత్తారు. సదరు అజండాను ముందుకు తీసుకుపోవాలని చూస్తున్నారు గనుకనే ఇటీవల నాగపూర్‌లో టికెట్‌ కొని మెట్రో రైలు ఎక్కి తాను ప్రధాని పదవిలో ఉన్నా ఉచితంగా రైలెక్కను అనే సందేశమిచ్చారు.ఏదీ ఊరికే రాదు అన్న ఒక నగల వర్తకుడి వాణిజ్య ప్రకటనను చాలా మంది చూసే ఉంటారు. మోడీ టికెట్‌ కౌంటర్‌లో ఉన్న ఫొటో మాదిరి ఉచితాల వ్యతిరేక చర్చ కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. ఏది ఉచితం, ఏది కాదు అన్న చర్చ చాలా రోజులుగా జరుగుతున్నది. ఇది ఇంతటితో ఆగేది కాదు. ఎవరికి తోచిన భాష్యం వారు చెబుతున్నారు. విశ్వగురువు నరేంద్రమోడీ వివిధ సందర్భాలలో చేసిన ప్రవచనాల సారం ఏమిటి ? రివాదీ (ఉచితాలు) సంస్కృతి దేశానికి చాలా ప్రమాదకరం. ఈ రోజు దేశంలో ఉచితాల ద్వారా ఓట్లను దండుకొనేందుకు కొన్ని పార్టీల వారు చూస్తున్నారు. ప్రత్యేకించి యువత ఈ ఉచిత సంస్కృతి గురించి జాగ్రత్తగా ఉండాలి. జనాలకు ఉచితాలు ఇవ్వటం ద్వారా మీకు అవసరమైన రహదారులు, విమానాశ్రయాలు లేదా రక్షణ నిర్మాణాలు జరగవు. ఈ ఆలోచనలు చేసే వారిని ఓడించాల్సి ఉంది.


మోడీ గారి వయస్సు ఇప్పుడు 73 నడుస్తున్నది. బహుశా ఇతర మానవ మాత్రుల మాదిరి ఆయనకూ జ్ఞాపకశక్తి తగ్గుతున్నదా అన్న అనుమానం కలుగుతోంది. ఈ ఏడాది(2022) ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు కేవలం రెండు రోజుల ముందు లోక కల్యాణ సంకల్ప పత్రం పేరుతో బిజెపి ఎన్నికల వాగ్దాన పత్రాన్ని మోడీలో సగంగా భావిస్తున్న కేంద్ర మంత్రి అమిత్‌ షా విడుదల చేశారు. దానిలో పేర్కొన్న అంశాలను చూస్తే ఐదు సంవత్సరాల పాటు రైతులకు ఉచిత విద్యుత్‌, ఆరుపదులు దాటిన మహిళలకు ఉచిత ప్రయాణం ( కరోనా పేరుతో రైళ్లలో వృద్దు స్త్రీ, పురుషులకు ఇస్తున్న రాయితీలను మోడీ సర్కార్‌ రద్దు చేసిన సంగతిని ఇక్కడ గుర్తుకు తేవాలి), ప్రతిభ చూపిన విద్యార్థినులకు స్కూటీలు, విద్యార్థులందరికీ రెండు కోట్ల స్మార్ట్‌ ఫోన్లు, టాబ్లెట్ల పంపిణీ, పిఎం ఉజ్వల పధకం కింద హౌలి, దీపావళి పండుగలకు రెండు ఉచిత గాస్‌ సిలిండర్లు, అన్న పూర్ణ కాంటీన్లు వాటిలో ఉన్నాయి. బహుశా బిజెపి నిఘంటువులో వీటికి వేరే అర్ధం ఏమన్నా ఉన్నట్లా లేక నరేంద్రమోడీ గారికి ఈ సంకల్పం గురించి గుర్తు లేదా లేక నటిస్తున్నారా ? ఇదే ఉత్తర ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కన్య సుమంగళ యోజన పేరుతో ఉచితంగా నిధులు ఇచ్చేందుకు 2022-23 బడ్జెట్‌లో పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయించారు.


ఈ ఏడాది మాదిరే 2017లో కూడా హిమచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన పక్షం రోజులకు గుజరాత్‌ ఎన్నికలను ప్రకటించారు. ” హిమచల్‌ ఎన్నికల ప్రకటన తేదీ నుంచి గుజరాత్‌లో కురుస్తున్న ఉచితాల వాన ” అని సిఎన్‌ఎన్‌ – న్యూస్‌ 18 అక్టోబరు 26, 2017న ఒక వార్తను ప్రచురించింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చే 24 గంటల ముందు బిజెపి సర్కార్‌ నాలుగు పెద్ద పధకాలను ప్రకటించిందని దానిలో పేర్కొన్నారు.( మోడీ నైతిక విలువల వెలుగులో పెరిగిన బిజెపి కూడా ఇతర పార్టీల మాదిరే ఇలా చేస్తుందా అని ఆశ్చర్యపోవద్దు, ఎంతవారలైనా కాంతదాసులే అన్న కవి ఇప్పుడుంటే పార్టీలన్నీ అధికార దాసులే అనే వారు) డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాల కొనుగోలుపై రైతులకు 18శాతం జిఎస్‌టి రద్దు, రైతులకు సున్నా వడ్డీకి రుణాలు వాటిలో ఉన్నాయి. ఇక ప్రస్తుతాంశానికి వస్తే అమ్‌దానీ ఆఠాణీ, ఖర్చా రూపయా (రాబడి ఎనిమిదణాలు ఖర్చు పదహారణాలు) అని నరేంద్రమోడీ ఉచితాల గురించి ఎద్దేవా చేశారు. గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత బిజెపి కేంద్ర ఆఫీసులో మాట్లాడుతూ దేశానికి తొలి ప్రాధాన్యత అన్నది బిజెపి విధానమని, ఏది తమకు అనుకూలంగా పని చేస్తుందో ఏది వ్యతిరేకమో ఓటర్లకు తెలుసునని, దగ్గరదారి రాజకీయాలు దేశానికి నష్టమని వారికి తెలుసు అన్నారు. దేశం బాగుపడితే ప్రతి ఒక్కరూ సంపదలు పొందుతారని చెప్పారు. ఉచితాలు కొనసాగితే ఈ రోజు మన పొరుగుదేశాల్లో జరుగుతున్న మాదిరే పరిస్థితి ఉంటుందని, అందువలన అలాంటి ఎత్తుగడలు ఎవరికీ లబ్ది ఉండదు అన్నారు. ఇలాంటి సుభాషితాలను ఒక వైపు వినిపిస్తూ మరోవైపు గుజరాత్‌ నేతలకు ఏ మార్గదర్శనం చేశారో చూడండి.


” ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పధకం కింద 39లక్షల మందికి రెండు ఉచిత గాస్‌ సిలిండర్లు ఇవ్వనున్నట్లు అక్టోబరు 17న గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించింది.” (డెక్కన్‌ హెరాల్డ్‌ 2022 నవంబరు 13). ” బిజెపి ప్రకటించిన వాటిలో ఉచిత విద్య,ఉచిత వైద్యం, రెండు ఉచిత సిలిండర్లు, సబ్సిడీతో సెనగలు, వంట నూనె, కాలేజీలకు వెళ్లే బాలికలకు ఉచిత ఎలక్ట్రిక్‌ స్కూటీలు కూడా ఉన్నాయి. బిజెపి కూడా ఉచితాల క్రీడా బరిలో ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మధ్య తరగతిని ఆకర్షించేందుకు పూనుకుంది. గుజరాత్‌ ఆర్థిక వ్యవస్థను(జిఎస్‌డిపి) లక్ష కోట్ల డాలర్లకు పెంచుతామని(2022-23లో అంచనా రు.22 లక్షల కోట్లు, డాలర్లలో 280 బిలియన్లు.2018-19లో రు.15 లక్షల కోట్లు, అది గత ఐదేండ్లలో 22లక్షల కోట్లకే పెరిగింది. అలాంటిది ఐదేండ్లలో లక్షకోట్ల డాలర్లంటే 1000 బి.డాలర్లకు ఎలా చేరుతుంది.) 2036లో అహమ్మదాబాద్‌లో ఒలింపిక్స్‌ నిర్వహిస్తామని పేర్కొన్నది.(గుజరాత్‌పై టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా 2022 నవంబరు 27 తేదీ సంపాదకీయం). ఆలూ లేదూ చూలూ లేదు, 2036 ఒలింపిక్స్‌ నిర్వహణ ఎవరికి అప్పగిస్తారనేది 2025-29 సంవత్సరాల మధ్య ప్రకటించే అవకాశం ఉంది,మన దేశానికి అవకాశం వస్తుందో రాదో చెప్పలేము.అలాంటిది ఏకంగా నిర్వహిస్తామని ఇప్పుడే బిజెపి చెప్పటం జనాలను అమాయకులుగా పరిగణించటం తప్ప మరొకటి కాదు. తాను ప్రకటించే ఉచితాలు సాధికారతలో భాగమని, ఇతరులు ప్రకటించే వాటిని ప్రలోభాలని బిజెపి చిత్రిస్తోంది. మధ్య ప్రదేశ్‌లో రైతులకు విద్యుత్‌ సబ్సిడీగా రు.15,700 కోట్లు ఇస్తున్నట్లు 2021 అక్టోబరులో అక్కడి బిజెపి సర్కార్‌ ప్రకటించింది. అదేవిధంగా గృహాలకు 2021-22కు గాను రు.4,980 కోట్లు కేటాయించారు. సరిగ్గా ఎన్నికలకు ముందు హిమచల్‌ ప్రదేశ్‌లోని బిజెపి సర్కార్‌ ఏప్రిల్‌ నెలలో ఇండ్ల అవసరాలకు గాను 125 యుూనిట్లకు చార్జీ ఎత్తివేసి రు.250 కోట్లు లబ్ది చేకూర్చుతున్నట్లు, గ్రామాలలో నీటి సరఫరా చార్జీలను మాఫీ చేస్తున్నట్లు, రాష్ట్ర ఆర్టీసి బస్సుల్లో మహిళలకు సగం చార్జీ రాయితీ ఇస్తున్నట్లు, 18-60 సంవత్సరాల మహిళలకు నెలకు రు.1,500 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తమను తిరిగి ఎన్నుకుంటే వృద్దాప్య పెన్షన్‌ మొత్తాన్ని రు.200 నుంచి 1000కి పెంచుతామని మణిపూర్‌ బిజెపి ప్రకటించింది.


నేను తినను ఇతరులను తిననివ్వను అని చెప్పిన నరేంద్రమోడీ ప్రధానిగా ప్రతి పైసాకు జవాబుదారీ అన్న సంగతి తెలిసిందే. ఉచితాలను పన్ను చెల్లింపుదార్లు నిరసిస్తున్నారని అంటూ వాటికి వ్యతిరేకమైన వాతావరణాన్ని సృష్టించేందుకు చూస్తున్నారు.గడచిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బాంకులు రు.10,09,510 కోట్ల మేరకు నిరర్ధక ఆస్తులుగా ప్రకటించగా ఇదే కాలంలో అలాంటి ఖాతాల నుంచి వసూలు చేసిన మొత్తం రు.1,32,036 కోట్లని ప్రభుత్వం తాజాగా పార్లమెంటులో, సమాచార హక్కు కింద ఆర్‌బిఐ వెల్లడించింది.(2022, డిసెంబరు 13వ తేదీ వార్త).ఇవన్నీ బడాబాబులు, కావాలని ఎగవేసిన రుణాలన్నది అందరికీ తెలిసిందే. పారు బాకీల రద్దు కాదు, వేరు ఖాతాల్లో చూపుతున్నామని అంటున్నారు. ఇంత తక్కువగా వారి నుంచి రాబట్టటంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిదన్నది స్పష్టం. అలాంటి పెద్ద మనుషుల పేర్లు వెల్లడిస్తే వారి మర్యాదలకు భంగం అని చెబుతున్నారు. వారితో బాంకులు ఉన్నతాధికారులు కుమ్మక్కు కాకుండా అలాంటి రుణాలు ఇచ్చే అవకాశం లేదు. అలాంటి వారి మీద తీసుకున్న చర్యలేమిటో ఎవరికైనా తెలుసా ?


కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముద్ర రుణాలను తీసుకోవటం తప్ప తిరిగి చెల్లించనవసరం లేదనే అభిప్రాయం ఉంది. ఎగవేసిన వారు చిన్నవారా పెద్దవారా అని కాదు ఎలాంటి సందేశం జనాల్లోకి వెళుతున్నదనేది కీలకం.ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ప్రభుత్వ పధకాల కారణంగానే తిరిగి అధికారానికి వచ్చిందన్నది అనేక మంది చెబుతున్న అంశం. అక్కడ ముద్రా రుణాల కింద పద్దెనిమిదివేల కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. ఈ పధకం కింద ఇచ్చే రుణాలను క్రెడిట్‌ గారంటీ ఫండ్‌ ట్రస్ట్‌ ద్వారా మంజూరు చేస్తారు గనుక చెల్లించకున్నా బాంకులు ఎలాంటి ఇబ్బందులు పడవని బాంకు అధికారుల సంఘం పేర్కొన్నది. చిన్న, సన్నకారు సంస్థలకు ఇచ్చే ఈ రుణాల నిరర్ధక ఆస్తుల మొత్తం 2021 మార్చి 31నాటికి 11.98శాతం లేదా రు.2.84లక్షల కోట్లని ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ సమాచార హక్కు చట్టం కింద పొందిన సమాచారం వెల్లడించింది.2018 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌పిఏలు కేవలం 5.38శాతమే. ఇదేమీ చిన్న మొత్తం కాదు, పైసల్లో అంతకంటే లేదు. ఇది కూడా పన్ను చెల్లించిన వారి సొమ్మే మరి.


కార్పొరేట్‌లపై పన్ను ద్వారా ఖజానాకు వచ్చే మొత్తం కూడా ప్రజలదే. కానీ ఒక్క పైసాను కూడా జాగ్రత్తగా చూస్తానని చెప్పిన నరేంద్రమోడీ కార్పొరేట్‌ పన్నును 30 నుంచి 22కు, 15శాతానికి తగ్గించారు. దీన్ని హర్షించే పెద్దలు సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను ఇస్తే పేదలు వాటిని తినకుండా వేరే వారికి అమ్ముకుంటున్నారని దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. మరి కార్పొరేట్లకు ఇస్తున్న సబ్సిడీ అంతా తిరిగి పెట్టుబడిగా వస్తున్నదా ? అది దేశానికి, జనానికి లబ్ది చేకూర్చుతున్నదా ? దీన్ని కార్పొరేట్లకు ఇస్తున్న ఉచితం అంటారా, దోచిపెడుతున్న సొమ్మంటారా ? ఇదే కాలంలో కార్పొరేట్ల నుంచి ఎన్నికల బాండ్ల రూపంలో బిజెపికి వస్తున్న సొమ్మెంతో కూడా చూస్తున్నాము. కార్పొరేట్లకు పన్ను తగ్గిస్తే వారు తిరిగి దాన్ని పెట్టుబడి పెట్టి ఉపాధి కల్పిస్తారని చెబుతున్నారు. జనమూ అంతేగా ! ఒక వస్తువు లేదా సేవను ఉచితంగా పొందితే దానికి వెచ్చించే సొమ్ముతో మరొకదాన్ని కొనుగోలు చేసి దేశానికి తోడ్పడుతున్నారు. ఉదాహరణకు నరేంద్రమోడీ 2019 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం రైతులకు ఉచితంగా ఏడాదికి ఆరువేల రూపాయలను మూడు విడతలుగా బాంకుల్లో వేసే పథకాన్ని ప్రకటించారు. రైతులు ఆ సొమ్మును స్విస్‌ బాంకుల్లోకి, ఇతర దేశాలకేమీ తరలించి దాచుకోవటం లేదు, ఎరువులో, పురుగుమందులో మరొక వస్తువునో కొనుక్కుంటున్నారు. సాగు చేయని వారు ఇతర వస్తువులకు వెచ్చిస్తున్నారు. అదీ దేశానికి మేలు చేస్తున్నట్లేగా ! తమిళనాడు ప్రభుత్వం కార్పొరేట్లకు రద్దు చేస్తున్న రుణాల గురించి సుప్రీం కోర్టు కేసులో ప్రస్తావించింది. మోడీ తొలి మూడేండ్ల పాలనలో అదానీ తీసుకున్న రుణాల్లో 75వేల కోట్లను మాఫీ చేసిందని పేర్కొన్నది, లేదూ పక్కన పెట్టామంటే ఎంత వసూలు చేసిందీ చెప్పాలి కదా ! ఉత్పాదకతతో ముడిపెట్టిన రాయితీల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏటా కొన్ని వేల కోట్లు పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నది, ఏమంటే అవి ఎగుమతికి పనికి వస్తాయట. కాసేపు అంగీకరిద్దాం, రైతులు పండించే వరి, గోధుమలు, చెరకు నుంచి తీసే పంచదార కూడా ఎగుమతి చేస్తున్నాం, మరి వారికి ప్రోత్సాహకాలను ఎందుకు ఇవ్వటం లేదు.


దేశ సంపద పెరిగితే జనమూ ధనవంతులౌతారని నరేంద్రమోడీ చెబుతున్నారు. దానికి ఆధారాలుండాలి కదా ! సంపదల పంపిణీలో తీవ్ర అసమానలు ఉన్న దేశాల్లో మనది ఒకటి.1990 నుంచి 2020 నాటికి ధనికులుగా ఉన్న ఒకశాతం మంది వద్ద ఉన్న దేశ సంపద 10.4 నుంచి 21.7 శాతానికి పెరగ్గా, పేదల్లోని దిగువ 50శాతం మంది సంపద వాటా 22 నుంచి 14.7శాతానికి తగ్గింది. ఈ కారణంగానే కదా పేదలు ఉచితాల కోసం ఆకర్షితులౌతున్నది. స్వేచ్చా మార్కెట్‌, ఏదీ ఉచితం ఇవ్వకూడదు అన్న నయా ఉదారవాదం పేరుతో కార్పొరేట్లకు సంపదలను కట్టబెట్టే విధానాలు వచ్చిన దగ్గర నుంచీ అసమానతల పెరుగుదలతో పాటు ఉచితాల మీద దాడి ప్రారంభమైంది. ఉచితంగా ఉన్న విద్య, వైద్యాలను అమ్మకపు సేవలుగా మార్చివేశారు. ఏది ఉచితమో, ఏది సంక్షేమమో ఏది కాదో టీకా తాత్పర్యాలు చెప్పేవరకు ఇది సాగుతూనే ఉంటుంది. చెప్పేవారెవరు ? దాని మీద ఏకాభిప్రాయం ఎలా వస్తుంది ? ఒకనాడు అపహాస్యం చేసిన పధకాలనే తరువాత జాతీయంగా అమలు చేశారు.తొలుత తమిళనాడు స్కూలు పిల్లలకు మధ్యాహ్నభోజన పథకాన్ని అమలు చేసినపుడు అదే జరిగింది. ఇప్పుడు దేశమంతటా అమలు చేస్తున్నారు. ఎన్టీర్‌ కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని ఎద్దేవా చేసిన వారున్నారు. ఆహార భద్రతా పధకం కింద ఇప్పుడు దేశమంతటా అమలు చేస్తున్నారు. ఒడిషా, తెలంగాణాలో ముందుగా రైతు బంధును ప్రకటిస్తే తరువాత నరేంద్రమోడీ కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో దేశమంతటా అమలు చేస్తున్నారు. అందువలన ఈ రోజున ఉచితాలన్న వాటిని రేపు ఏం చేస్తారో చెప్పలేము. రాష్ట్రాల వనరులు తగ్గుతున్నట్లు ఉచితాలకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారంటూ కేంద్ర పెద్దలు గుండెలు బాదుకుంటున్నారు. ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల వాటాను 41శాతం రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పినా ఆచరణలో దక్కుతున్నది 29శాతమే అని చెబుతున్నారు. మరి దీని సంగతేమిటి ? ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకోవటం కాదా ! ఉచితాల పేరుతో అందించే సేవలు లేక నగదు బదిలీగానీ అవి పొందిన వారి కొనుగోలు శక్తిని పెంచి దేశానికి తోడ్పడేవే తప్ప వేరు కాదు. వాటి వలన ప్రభుత్వాలకు జిఎస్‌టి లేదా మరో రూపంలో రాబడి, పారిశ్రామికవస్తువుల కొనుగోలు, తద్వారా ఉపాధి పెరుగుదలకు పరోక్షంగా తోడ్పడే వాటి మీద దాడికి దిగుతున్నారు. మరోవైపు అంతకు మించి కార్పొరేట్లకు సంపదలు దోచిపెడుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా సబ్సిడీలు – ఐరోపాతో వాణిజ్య పోరుకు నాంది కానున్నాయా !

08 Thursday Dec 2022

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Prices, Uncategorized, USA, WAR

≈ 1 Comment

Tags

America’s green subsidies, Inflation Reduction Act, subsidy war with America, Trade Protectionism, TRADE WAR, US-EU Trade war


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌ రక్షణ పేరుతో రష్యా మీద ఆంక్షలు, ఆయుధాలతో ఉమ్మడిగా పోరుచేస్తున్న అమెరికా – ఐరోపా సమాఖ్య మధ్య అమెరికా సబ్సిడీలు కొత్త వాణిజ్య పోరుకు నాంది కానున్నాయా అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఈ రాయితీలు ప్రధానంగా జర్మనీ, ఫ్రెంచి కార్ల కంపెనీలకు ముప్పుగా కనిపించటంతో ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. జర్మనీ కాస్త ఆచితూచి స్పందిస్తున్నది.ఉక్రెయిన్‌ పోరులో అన్ని రకాలుగా అమెరికా లబ్ది తమకు ఇబ్బందులా అన్న ఉక్రోషం ఇప్పటికే ఐరోపాలో ప్రారంభమైంది. దాన్ని మరింతగా పెంచేదిగా తాజా పరిణామాలున్నాయి. సబ్సిడీ వివాదం టీ కప్పులో తుపానులా ముగుస్తుందా మరింత తీవ్రం అవుతుందా ? అమెరికాలో తయారైన ఉత్పత్తులకు పెద్ద ఎత్తున అక్కడి ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ, పన్ను రాయితీల గురించి ఐరోపా సమాఖ్య ఒక్కటిగా ఉండాలని తొలిసారిగా సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌ లేయాన్‌ పిలుపునిచ్చారు.అనుచిత పోటీకి దారితీసి మార్కెట్ల మూత, సరఫరా గొలుసుల విచ్చిన్నానికి దారి తీస్తుందని వాన్‌డెర్‌ అన్నారు. నిజానికి ఆమె ఐరోపాలో అమెరికా అనుకూల నేత, అంతరంగంలో ఏమున్నప్పటికీ ఐరోపాలో తలెత్తిన ఆందోళనను ప్రతిబించించే విధంగా ఆమె మాట్లాడాల్సి వచ్చింది.


ద్రవ్యోల్బణం తగ్గింపు చట్టం(ఐఆర్‌ఏ) పేరుతో జో బైడెన్‌ సర్కార్‌ 430 బిలియన్‌ డాలర్ల పథకాన్ని ప్రకటించింది. దీనిలో అమెరికాలో తయారైన వస్తువులను కొనుగోలు చేసే వారికి రాయితీలు ఇస్తారు. ఇది అక్కడి కంపెనీలకు ఇచ్చినట్లే. ఈ పధకం అమెరికాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం చేసుకున్న కెనడా, మెక్సికో దేశాలకు కూడా వర్తిస్తుంది. మరోవైపు తమ కంపెనీలకు నష్టదాయకమని ఐరోపా సమాఖ్య ఆందోళన వెల్లడించింది. అమెరికాకు ప్రతిగా సమాఖ్య కూడా తన స్వంత నిబంధనలను సరి చేసుకొని అమెరికాకు పోటీగా చర్యలు తీసుకోవాలని ఉర్సులా సూచించారు. అమెరికా ఐఆర్‌ఏ చట్టం గురించి ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యుటిఓ)కు ఫిర్యాదు చేయాలని ఐరోపా పార్లమెంటు వాణిజ్య కమిటీ అధిపతి బెరెండ్‌ లాంగే అన్నాడు. అమెరికా ఇప్పటికే చట్టాన్ని ఆమోదించినందున పెద్దగా ఒరిగేదేమీ ఉండదని కూడా అన్నట్లు వార్తలు.ద్రవ్యోల్బణం తగ్గింపు చట్టం పేరుతో ఇస్తున్న సబ్సిడీ నిజానికి పోటీదార్లను బలహీనపరిచేందుకు తప్ప మరొకటి కాదు. ఇదే విధంగా అమెరికా చిప్స్‌ చట్టం పేరుతో తీసుకున్న చర్య తన స్వంత సెమికండక్టర్‌ పరిశ్రమ రక్షణ కోసమే.


అమెరికా ప్రకటించిన సబ్సిడీల మొత్తం అమెరికాలో ఉత్పత్తి అయిన వాటికి ఇవ్వటం డబ్ల్యుటిఓ నిబంధనలకు విరుద్దమని, దానితో తాము పోటీ పడలేమని 27దేశాల ఐరోపా సమాఖ్య అంటోంది. అమెరికా సబ్సిడీలు మహా కలహశీలమైనవి, పశ్చిమ దేశాలను విడదీస్తాయని ఫ్రెంచి అధినేత మక్రాన్‌ వాషింగ్టన్‌ పర్యటనలోనే తన అసమ్మతిని వెళ్లగక్కాడు. మరోవైపున ఐఆర్‌ఏలో ఎలాంటి మార్పులు చేసేది లేదని అధికార డెమోక్రాట్లు స్పష్టం చేశారు. లోపల ఏమి ఉన్నప్పటికీ సబ్సిడీల వివాదాన్ని అట్లాంటిక్‌ వ్యాపిత దేశాల వాణిజ్య వివాదంగా మార్చకుండా చూడాలని మక్రాన్‌-జో బైడెన్‌ ప్రకటించారు. అమెరికా సబ్సిడీలకు ఐరోపా నుంచి గట్టి స్పందన ఉండాలని జర్మనీ ఆర్థిక మంత్రి రాబర్ట్‌ హెబెక్‌ అన్నాడు. జర్మనీ విత్త మంత్రి క్రిస్టియన్‌ లిండ్‌నెర్‌ స్పందిస్తూ అమెరికాతో వాణిజ్యపోరుకు సిద్దపడాలన్నాడు. తమ వాణిజ్య ప్రయోజనాల రక్షణకు ఆర్థిక దౌత్యం మీద ఆధారపడాలని కూడా చెప్పాడు. ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉన్నట్లు వార్తలు వచ్చిన నేపధ్యంలో అమెరికా-ఐరోపా ప్రతినిధులు టెక్‌ సహకారం గురించి చర్చలు జరపనున్నారు. ఈ చర్చలల్లో సబ్సిడీల గురించి తేలేదేమీ ఉండదు గనుక ఐరోపా తన పరిశ్రమకు మద్దతు ఇచ్చేందుకు సిద్దం కావాలని ఐరోపా పార్లమెంటు వాణిజ్య కమిటీ అధిపతి బెరెండ్‌ లాంగే అన్నాడు. ఐరోపా అంతర్గత మార్కెట్‌ కమిషనర్‌ థిర్రీ బ్రెటన్‌ మాట్లాడుతూ ఐరోపా పరిశ్రమలను కాపాడుకొనేందుకు ఒక నిధిని ఏర్పాటు చేసుకోవాలని సూచించాడు.అమెరికాకు ప్రతిగా ఇతర దేశాలు కూడా కొన్ని ప్రతికూల చర్యలు తీసుకోకపోలేదు. ఉదాహరణకు డిజిటల్‌ సార్వభౌమత్వం పేరుతో అమెరికా టెక్‌ కంపెనీల మీద ఫ్రాన్సు డిజిటల్‌ పన్ను విధించింది. అమెరికా మీద ఆధారపడకుండా సబ్సిడీలతో ఐరోపా సెమికండక్టర్‌ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదించింది. అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి అమెరికా కంపెనీలను తమ దేశంలో కాంట్రాక్టుల్లో పాల్గొనకుండా నిషేధించాలని చూస్తున్నది. నిజంగా విబేధాలు ముదిరితే ఇలాంటి వాటిని చూపి అమెరికా ఎదురుదాడికి దిగవచ్చు.


అమెరికా-ఐరోపా మధ్య వాణిజ్య పోరు జరిగే అవకాశాలున్నాయనే ఆందోళన పెరుగుతోందని, ఈ పూర్వరంగంలో తాము మూల్యం చెల్లిస్తూ అమెరికా పెత్తనానికి తలవంచి అనుసరించటం కంటే తమ ప్రయోజనాల రక్షణకు స్వంత నిర్ణయాలు తీసుకోవటం మంచిదని చైనా విశ్లేషకులు ఐరోపాకు సూచించారు. ప్రస్తుతం ఐరోపా నేతలు అటు అమెరికా ఇటు చైనాతోను సంబంధాలను కొనసాగిస్తున్నారు.చైనాతో విడగొట్టుకోవాలని అమెరికా నిరంతరం ఇతర దేశాలకు చెబుతోంది.ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మక్రాన్‌ జనవరిలో చైనా రానున్నాడు. ఎలక్ట్రిక్‌ వాహనాలు, క్లీన్‌ ఎనర్జీకి అమెరికా ఇస్తున్న భారీ సబ్సిడీల కారణంగా పెట్టుబడులు ఐరోపా నుంచి అమెరికాకు తరలుతాయని భావిస్తున్నారు. అందుకే ప్రతి ఐరోపా నేత వాటి గురించి ఆందోళన వెల్లడిస్తున్నారు.


ఉదాహరణకు అమెరికాలో తయారు చేసిన ఒక విద్యుత్‌ వాహనాన్ని కొనుగోలు చేసిన వారికి ధరను బట్టి గరిష్టంగా ఏడున్నరవేల డాలర్లు సబ్సిడీ ఇస్తారు. సదరు కారు విడి భాగాలు అమెరికా లేదా అమెరికాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం ఉన్న దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవై ఉండాలి. ఐరోపా సమాఖ్య – అమెరికాకు అలాంటి ఒప్పందాలు లేవు. అందువలన ఐరోపా కార్లకు సబ్సిడీ వర్తించదు.సోలార్‌ పానెల్స్‌, హీట్‌ పంప్స్‌, బయోమాస్‌ స్టవ్‌ల వంటి వాటికి కూడా సబ్సిడీలు ఇస్తారు. ఇవి జనవరి నుంచి అమల్లోకి రానుండటంతో ఆగస్టులోనే అమెరికా చట్టం చేసినా ఇప్పుడు ఐరోపాలో చర్చగా మారింది. మాతో సహకరిస్తున్నవారికి హాని కలిగించం అని జో బైడెన్‌ చెబుతూ ఐరోపాను బుజ్జగిస్తున్నప్పటికీ చట్టంలో మార్పులు చేసేందుకు అవకాశాలు లేవని చెబుతున్నారు.


ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసు దాఖలు చేస్తే అది ఎంత కాలానికి తేలుతుందో, ఏ తీర్పు వస్తుందో అన్న అనుమానాలు కూడా ఐరోపాలో ఉన్నాయి. అమెరికా కంపెనీ బోయింగ్‌- ఐరోపా కంపెనీ ఎయిర్‌బస్‌ విమానాలకు ఇచ్చే సబ్సిడీ వివాదం పదిహేడు సంవత్సరాలు నడిచింది. ఆ సంస్థలో కొత్త జడ్జీల నియామకాన్ని అమెరికా అడ్డుకుంటున్నది, అందువలన అసలు కొత్త కేసులను అది చేపట్టటం కూడా అనుమానమే. దెబ్బకు దెబ్బ పంటికి పన్ను అన్నట్లుగా మనం కూడా సబ్సిడీలు ఇద్దామని మక్రాన్‌ అంటున్నాడు. ఐతే ఈ చర్య ఐరోపా అంతర్గత మార్కెట్‌ను దెబ్బ తీస్తే సమాఖ్య వాటిని తిరస్కరించే అవకాశం ఉంది. ఉమ్మడి పారిశ్రామిక విధానంతో పాటు సబ్సిడీలు ఇచ్చేందుకు కూడా ఉమ్మడి నిధి అవసరం, దాని కోసం అప్పు తేవాలి లేదా దేశాలన్నీ నిధులు సమకూర్చాలి. ఇప్పుడున్న స్థితిలో దాన్ని ఏమేరకు అంగీకరించేది అనుమానమే. కావాలంటే ఐరోపా కూడా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తే తాము ఇస్తున్నదానికి సరితూగవచ్చు అని అమెరికా వాణిజ్య కాథరీన్‌ తాయి సలహా ఇచ్చారు. అలా ఇవ్వగలిగిన అవకాశం జర్మనీకే ఉంది. ఒక వేళ ఇస్తే ఒకే మార్కెట్‌ అన్న ఐరోపా సమాఖ్య లక్ష్యానికే ఎసరు వస్తుంది. చిన్న దేశాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే పెరిగిన ఇంథన ధరల నుంచి గృహాలు, వాణిజ్య సంస్థలకు ఉపశమనం కలిగించేందుకు జర్మన్‌ ప్రభుత్వం ముందుకు తెచ్చిన 206 బిలియన్‌ డాలర్ల సబ్సిడీ పథకం మీద మిగతా దేశాలు గుర్రుగా ఉన్నాయి.


ఐరోపా కార్పొరేట్ల లబ్ది ప్రధానంగా రష్యా నుంచి చౌకగా వచ్చే ఇంథనం, చైనా నుంచి వస్తువుల మీద ఆధారపడి ఉంది. అమెరికాకు తోకగా మారి నడుస్తున్న కారణంగా ఇప్పుడు రష్యా నుంచి ఇంథనం నిలిచి ధరలు విపరీతంగా ధరలు పెరిగాయి. పరిశ్రమలకు ముప్పు వచ్చింది. దీనికి అమెరికా సబ్సిడీలు తోడైతే ఐరోపా పరిశ్రమల భవిష్యత్‌ సందిగ్దంలో పడుతుంది. ఇప్పటికే అక్కడ ఇంథన ధరలు విపరీతంగా పెరగటంతో అనేక మంది ఐరోపా పారిశ్రామిక, వాణిజ్య వేత్తలు తమ స్వంత దేశాల్లో బదులు అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. వారికి కావాల్సింది లాభాలు తప్ప మరొకటి కాదు. ఈ స్థితిలో అమెరికా మాట నమ్మి చైనాతో కూడా తెగతెంపులు చేసుకొంటే ఇబ్బంది పడేది ఐరోపా దేశాలే. అందువలన అది జరగకపోవచ్చు. అమెరికా-ఐరోపా మధ్య దూరం పెరిగే అవకాశాలు వస్తే చైనా దాన్ని వదులు కోదన్నది తెలిసిందే.


ఇతర దేశాల సబ్సిడీల గురించి వివిధ రకాలుగా నానా గొడవ చేస్తున్నది అమెరికా, ఐరోపా దేశాలు. పలు రకాలుగా వాటిని అదుపు చేస్తూ తమ మార్కెట్‌ను కాపాడుకుంటున్నాయి. ఇప్పుడు అమెరికా జాతీయవాదం, రక్షణాత్మక చర్యలకు దిగింది.అమెరికాకు అగ్రస్థానం అన్న విధానానికి డోనాల్డ్‌ ట్రంప్‌ తెరతీస్తే జో బైడెన్‌ దాన్ని కొనసాగిస్తున్నాడు. దీన్ని ఎదుర్కొనేందుకు ఐరోపా వద్ద ఎక్కువ అస్త్రాలు లేవు. తొలుత చర్చలతో ప్రారంభించి కుదరకపోతే ప్రపంచ వాణిజ్య సంస్థను ఆశ్రయించవచ్చు. వాటితో అమెరికా కొంత మేర దిగిరావచ్చు లేదా ససేమిరా అంటే నీవు నేర్పిన విద్యే అన్నట్లుగా ఐరోపా కూడా సబ్సిడీలు ప్రారంభించటం, అమెరికా వస్తువులపై పరిమితులు విధింపు వంటి పనులకు పూనుకోవచ్చు. ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితిలో అమెరికా తెగేదాకా లాగుతుందా ? చైనా, రష్యాలను అదుపు చేసేందుకు దానికి ఐరోపా అవసరం. అందువలన ఇతరంగా దానికి లబ్ది చేకూర్చేందుకు పూనుకుంటుందా? కొందరు ఐరోపా నేతలు, పెద్దల్లో అమెరికా గురించి ఇంకా భ్రమలు ఉన్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభంతో ఇంథన సరఫరాకు ఇబ్బందులు, ధరల పెరుగుదలతో ఇప్పటికే ఐరోపా అతలాకుతలం అవుతున్నందున ఇప్పుడు అమెరికా సబ్సిడీలతో తన పరిశ్రమలను కూడా దెబ్బతీస్తే జనం ఊరుకుంటారా ? ఐరోపా సమాఖ్య ఒకటిగా ఉన్నట్లు కనిపిస్తున్నా అన్ని దేశాలు ఒకే విధంగా లేవు. అమెరికాతో రాజీకి కొన్ని సుముఖంగా, మరికొన్ని స్వతంత్ర వైఖరితో ఉండాలని కోరుకుంటున్నాయి. జర్మనీ, ఫ్రాన్సు వంటి దేశాలు అవసరమైతే తాము చైనాకు దగ్గర అవుతామనే సంకేతాలను పంపటం అమెరికా నుంచి మరిన్ని రాయితీలు పొందేందుకే అన్నది స్పష్టం. మక్రాన్‌ వాషింగ్టన్‌లో జో బైడెన్‌తో చర్చలు జరుపుతున్న సమయంలోనే బీజింగ్‌లో షీ జింపింగ్‌తో పెట్టుబడుల గురించి ఐరోపా కౌన్సిల్‌ అధ్యక్షుడు చార్లెస్‌ మైఖేల్‌ భేటీ జరిపాడు. నిజంగా అమీ తుమీ తేల్చుకోవాల్సి వస్తే ఎవరెటు ? ఏం జరుగుతుందనేది తెరమీద చూడాల్సిందే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మార్కెట్‌ సునామీకి విలవిల్లాడుతున్న వనామీ రైతు !

03 Saturday Dec 2022

Posted by raomk in AP, AP NEWS, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Andhra Pradesh Aqua farmers, AP shrimp farmers, Aquaculturists, seafood export, vannamei shrimp


ఎం కోటేశ్వరరావు


దేశంలో దాదాపు రెండు లక్షల 70వేల ఎకరాల్లో వనామీ రకం రొయ్యల రకం సాగు జరుగుతోంది. దీనిలో లక్షా 80వేల ఎకరాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. టైగర్‌ రొయ్యల రకం మరొక లక్షా 50వేల ఎకరాల్లో జరుగుతోంది. ఇది ప్రధానంగా లక్షా పాతికవేల ఎకరాలు ఒక్క పశ్చిమ బెంగాల్లోనే జరుగుతోంది. ప్రస్తుతం తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని వనామీ రైతులు వాపోతున్నారు. వివిధ కారణాలతో ప్రపంచంలో రొయ్యల ఎగుమతి మార్కెట్‌ అవకాశాలు తగ్గాయి. ఒక వైపు మేత ధరలు విపరీతంగా పెరగటం మరొక వైపు కొనే వారు లేక చేతికి వచ్చిన వాటిని తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి. రానున్న కొద్ది నెలలు కూడా ఇలాగే కొనసాగితే ఈ రంగం మొత్తం తీవ్ర సంక్షోభంలో పడనుంది. ఒక అంచనా ప్రకారం ఇప్పటికే రు.25వేల కోట్ల మేరకు నష్టపోయినట్లు అంచనా. రొయ్యలను శుద్ది చేసి ఎగుమతికి అనువుగా తయారు చేసే ఫ్యాక్టరీలలో చిన్నా, మధ్యతరగతివి మూసివేతకు దగ్గరగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎగుమతులు లేవనే పేరుతో కొందరు రైతులకు చెల్లించాల్సిన సొమ్మును సకాలంలో ముట్టచెప్పటం లేదు.


అమెరికా, ఐరోపా, జపాన్‌ దేశాలలో క్రిస్మస్‌ సందర్భంగా పలు ఉత్పత్తులకు డిమాండ్‌ ఉంటుంది. ప్రస్తుతం తలెత్తిన ఆర్థిక వడిదుడుకుల కారణంగా ఈ ఏడాది దానికి తగిన విధంగా మన దేశం నుంచి దిగుమతి ఆర్డర్లు లేవు. చైనాలో కరోనా కేసులను సున్నాకు తగ్గించాలని అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్లు ఇతర ఆంక్షలను విధించిన కారణంగా అక్కడి డిమాండ్‌ కూడా తగ్గినట్లు వార్తలు. ఆగస్టు నెల నుంచి ఎగుమతి డిమాండ్‌ తగ్గిన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రొయ్యల మార్కెట్‌ సంక్షోభం మొదలైంది. విదేశాల్లో డిమాండ్‌ తగ్గటంతో ధరలు కూడా పడిపోయాయి. 2021-22లో మన దేశం నుంచి 7.76 బిలియన్‌ డాలర్ల మేర సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు జరగ్గా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది లక్ష్యంగా 8.6బి.డాలర్లను నిర్ణయించింది. అది నెరవేరే పరిస్థితి కనిపించటం లేదు. గిరాకీ తగ్గుదల 30 నుంచి 35శాతం వరకు, ధరల పతనం 20 నుంచి 25శాతం ఉన్నందున జనవరి తరువాత తిరిగి పూర్వపు స్థాయికి చేరితే తప్ప అటు కేంద్ర ప్రభుత్వానికి విదేశీ మారకద్రవ్యం తగ్గుదల ఇటు రైతాంగానికి ఆర్థిక నష్టం జరుగుతుంది. ఎగుమతి-దిగుమతి దేశాలన్నింటా శీతల గిడ్డంగులన్నీ ఆక్వా ఉత్పత్తులతో నిండి ఉన్నట్లు వార్తలు.ఈ కారణంగానే కొనుగోళ్లు మందగింపు, పరిస్థితి మెరుగుపడకపోదా అనే ఆశ ఉన్న ఎగుమతిదార్లు రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. మెరుగుపడితే మంచి లాభాలు లేకపోతే నష్టం ఉండదు అన్న అంచనాలే దీనికి కారణం. గతంలో కూడా మార్కెట్లో కొన్ని ఇబ్బందులు తలెత్తినా ఇలాంటి తీవ్రత గడచిన నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేదని ఆ రంగంలోని ప్రముఖులు చెబుతున్నారు.


ధనిక దేశాల్లో తలెత్తిన ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల కారణంగా జేబులకు చిల్లుపడుతున్నందున జనం తమ అలవాట్లు, అవసరాల ప్రాధాన్యతలను కూడా మార్చుకుంటారు. అత్యవసరమైన వాటినే కొనుగోలు చేస్తారు.ఈ పరిస్థితికి తోడు గతేడాది ప్రపంచంలో 40లక్షల టన్నుల మేర రొయ్యల ఉత్పత్తి జరిగితే ఈ ఏడాది 50లక్షల టన్నుల వరకు ఉండవచ్చని అంచనా. ఇది కూడా ధరల పతనానికి ఒక కారణం అంటున్నారు. ఈక్వెడోర్‌, ఇండోనేషియా, వియత్నాంలో ఉత్పత్తి పెరిగింది. పన్నెండు లక్షల టన్నులతో ఈక్వెడోర్‌ ఇప్పుడు ప్రపంచంలో అగ్రదేశంగా ఎదిగింది.చమురు ధరల పెరుగుదలతో రవాణా ఖర్చు పెరిగింది. మన దేశం నుంచి అమెరికా, తరువాత స్థానాల్లో చైనా ఎక్కువగా దిగుమతులు చేసుకుంటున్నాయి. రవాణా ఖర్చుల పెరుగుదల కారణంగా పక్కనే ఉన్న ఈక్వెడోర్‌ నుంచి దిగుమతి చేసుకోవటం అమెరికాలోని దిగుమతి కంపెనీలకు ఎక్కువ లాభం కనుక అక్కడి ఉత్పత్తులకు మొగ్గు చూపుతున్నారు. చైనా కూడా అక్కడి నుంచి కొంత దిగుమతి చేసుకుంటున్నది.


మన కరెన్సీ విలువ తగ్గినందున ఎగుమతిదార్లకు పెరిగిన రవాణా ఖర్చు కలసి వచ్చి కొనుగోలు చేస్తారని భావిస్తే అమెరికా మినహా మిగిలిన దిగుమతి చేసుకొనే దేశాల కరెన్సీ విలువలు కూడా మన రూపాయి మాదిరి పతనమై ఆ దేశాలలో కొనుగోలు శక్తి తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లో కిలోకు వంద తూగే వనామీ రకం రొయ్యలకు కనీసం రు.240 చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, ఎవరూ కొనుగోలుకు ముందుకు రాకపోవటంతో దాన్ని రు.210కి తగ్గించినా చిత్తశుద్దితో అమలు జరిపేవారు లేరు. నిల్వ ఉండే సరకు కానందున చివరకు రు.180, ఇంకా అంతకు తక్కువకు సైతం అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఉత్పత్తి ఖర్చులు కూడా రాక ఆర్థికంగా నష్టపోతున్నారు. చివరకు టైగర్‌ రకం ధర కూడా రు.600 నుంచి 450కి పడిపోయింది. ఈ కారణంగా గతేడాది జరిగిన 9.2లక్షల టన్నుల ఉత్పత్తి ఈ ఏడాది ఎనిమిది లేదా ఇంకా తక్కువకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇతర దేశాల రైతులకు సైతం ఎగుమతి అవరోధాలు ఉన్నప్పటికీ మలేషియా, వియత్నాం, థాయిలాండ్‌ వంటి దేశాల్లో వంద కౌంట్‌ ఉన్న వాటికి రు.290 నుంచి 310వరకు రైతుకు వస్తుండగా మన దగ్గర రెండువందలకంటే తక్కువకు దిగజారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కిలోకు రు.300లకు తగ్గితే గిట్టుబాటు కాదని, 270 కంటే తగ్గితే నష్టమని అంటున్నారు.


మన దేశం 123 దేశాలకు సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నది. వీటిలో ఎక్కువ భాగం రొయ్యలే ఉండటంతో గతేడాది జరిగిన మొత్తం ఆరులక్షల టన్నుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ వాటా 60శాతం వరకు ఉంది. చైనా తన దిగుమతుల్లో 70శాతం మన దేశం నుంచి చేసుకొనేది ఇప్పుడు ఈక్వెడోర్‌ నుంచి కూడా చేసుకుంటున్నది. వివిధ దేశాలు చేసుకొనే దిగుమతులపై వర్తమాన రాజకీయాలు, వాణిజ్య సంబంధాలు కూడా ప్రభావం చూపుతాయి. తమకు వ్యతిరేకంగా పని చేస్తున్న అమెరికాతో భారత్‌ చేతులు కలుపుతోందన్న అభిప్రాయం చైనాకు ఉంది. మరోవైపున మనదేశంలో బిజెపి, దానికి మార్గదర్శకంగా పనిచేసే సంఘపరివార్‌ సంస్థల దళాలు, వారికి వంతపాడే మీడియా విశ్లేషకులు సుప్రభాతం మాదిరి రోజు చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని దానికి బుద్ది చెప్పాలని,మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని ప్రచారం చేస్తుంటారు. ఈ నోటి దూలను చూసిన తరువాత మన ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా ఎగుమతి చేసే దేశాలున్నపుడు వాటి నుంచి దిగుమతుల చేసుకోవాలనే అలోచన కలగవచ్చు. లేకపోతే ఎంతో దూరంలో ఉన్న ఈక్వెడోర్‌ నుంచి చైనా దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చినట్లు ? వాటికి ప్రతిగా చైనాకు తన వస్తువులను అక్కడికి ఎగుమతి చేసేందుకు అవకాశాలు పెరుగుతాయి.మన ప్రభుత్వం విధిస్తున్న ఎగుమతి పన్నులు, మన దేశంతో ఒప్పందాలు లేని కారణంగా దిగుమతి చేసే దేశాలు మన ఉత్పత్తులపై విధిస్తున్న పన్నులు కూడా దిగుమతిదార్లను అవి లేని దేశాలవైపుకు నెడతాయి. అందువలన ఇలాంటి పన్నులు లేకుండా ఉండాలంటే మన దేశం ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవటం కూడా అవసరమే. అయితే అలాంటి ఒప్పందాలకు వెళ్లే ముందు మన దేశ లబ్దిని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఐరోపా, ఇతర దేశాలతో వియత్నాం స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నందున అవి మనకు బదులు అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటాయి. మన రొయ్యలపై తెల్లమచ్చల కారణంగా ఆస్ట్రేలియా దిగుమతులను నిలిపివేసింది. అందువలన ఎగుమతి చేసే దేశాలు కోరుకున్న ప్రమాణాల మేరకు వ్యాధులు, నిషేధిత మందుల అవశేషాలు లేకుండా మన ఉత్పత్తులుండటం కూడా అవసరమే. ఒక వేళ ఇక్కడ కన్ను గప్పి పంపినా ఎక్కడైనా పట్టుబడితే మొదటికే మోసం వస్తుంది.


ఇక స్థానిక సమస్యల సంగతులను చూస్తే నాణ్యమైన రొయ్య విత్తన(పిల్లల) లభ్యత కూడా తీవ్రంగానే ఉంది.ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం విద్యుత్‌ సబ్సిడి ఎత్తివేసేందుకు దారులు వెతికి రైతుల్లో ఆందోళన కలిగించింది. ఆక్వా జోన్‌, నాన్‌ ఆక్వా జోన్‌ అని కొన్ని రోజులు, ఐదెకరాల లోపు, ఆపైవారు అని మరికొన్ని రోజులు, సర్వేల పేరుతో చేస్తున్న కాలయాపన గురించి రైతుల్లో అసంతృప్తి ఉంది. ప్రతి గ్రామంలో సచివాల యాలు, వలంటీర్లు ఉన్నందున ఒక్క రోజులో సమాచారాన్ని సేకరించవచ్చు. మరోవైపు విపరీతంగా పెరుగుతున్న మేత ధరలు అదుపులో ఉండటం లేదు. కనీస మద్దతు ధరను అమలు జరిపే అధికారులు, ఉల్లంఘించిన వారి మీద చర్యలు గానీ ఉండటం లేదు. ఎగుమతి పరిస్థితి మెరుగుపడేంతవరకు పంటవిరామం ప్రకటించాలని కూడా కొందరు రైతులు సూచిస్తున్నారు. లక్షలాది మందికి ఆక్వా ఉపాధి కల్పిస్తున్నది. అందువలన ఈ రంగాన్ని కూడా పరిశ్రమగానే గుర్తించి ఇతర పరిశ్రమలకు మాదిరే ఇస్తున్న విద్యుత్‌, ఇతర రాయితీలను అందరికీ వర్తింప చేయాలని కూడా రైతులు కోరుతున్నారు.సంక్షోభ సమయాల్లో అన్ని రంగాలను ఆదుకున్నట్లుగానే ఆక్వాను కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వారి గోడును పాలకులు వినిపించుకుంటారా ? అనుమానమే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత్‌పై ప్రపంచ మాంద్య ప్రభావం పడనుందా !

24 Thursday Nov 2022

Posted by raomk in Current Affairs, Economics, employees, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Amazon, CAPITALISM, capitalist crisis, IT Job cuts, layoffs, tech companies


ఎం కోటేశ్వరరావు


నిన్నా మొన్నా ఫేస్‌బుక్‌, ట్విటర్‌, అమెజాన్‌ సంస్థల్లో సిబ్బంది తొలగింపు వార్తలు, నేడు గూగుల్‌ ప్రకటన, రేపు ఏ కంపెనీ ఎందరిని తొలగిస్తుందో తెలవదు. ఈ ప్రకటనల నడుమ హైదరాబాద్‌లో అమెజాన్‌ కంపెనీ డేటా కేంద్రంతో వేలాది మందికి ఉపాధి కబురు. ఒక వైపు ఆర్థిక మాంద్యం గుబులు-మరోవైపు లాభాల వేటలో కంపెనీల కొత్త కేంద్రాల ఏర్పాటు ! ఐటి కంపెనీల్లో కోతలు, కంపెనీల్లో రోబోట్లు, ఆధునిక యంత్రాల ప్రవేశం వెరసి ఉద్యోగాలు హాంఫట్‌ ! ప్రపంచంలో ఏం జరుగుతోంది ? ఉన్న ఉపాధి కోల్పోయినా, కొత్త ఉద్యోగాలు రాకపోయినా కుటుంబాల మీద దాని ప్రభావం పడుతుంది. అది తిరిగి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. దాంతో మందగమనం తదుపరి మాంద్యం, అది ముదిరితే ఆర్థిక సంక్షోభం. కుటుంబాల మీద మరింత ప్రతికూల ప్రభావం, ఇదొక విష వలయం. ప్రపంచం, దేశం, రాష్ట్రం, కుటుంబాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్న చర్చలు ప్రారంభం అయ్యాయి. ప్రపంచ ధనిక దేశాల్లో మాదిరి తీవ్ర పరిస్థితులు మన దేశంలో తలెత్తుతాయా ? తెలంగాణా మీద ఎలాంటి ప్రభావం పడుతుంది ? మనమందరం ప్రపంచీకరణ యుగంలో ఉన్నాం. అందువలన ప్రతి చోటా జరిగే ప్రతి పరిణామమూ తరతమ తేడాలతో అందరి మీదా పడుతుంది. అమెరికాలో ఫేస్‌బుక్‌, అమెజాన్‌, గూగుల్‌ వంటి కంపెనీల్లో ఉద్యోగులను తొలగిస్తే వారిలో మన భారతీయులు,తెలుగువారు, ఆంధ్ర, తెలంగాణా వారు కూడా ప్రభావితులైనారు. చివరికి వారిలో మన కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు కూడా ఉండవచ్చు.


ప్రపంచ వ్యాపితంగా ఆర్థికరంగం అనిశ్చితంగా ఉంది. వచ్చే ఏడాది అనేక దేశాలు మాంద్యంలోకి వెళ్ల వచ్చుననే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వృద్ధి రేటును ప్రకటిస్తారు. ఏ దేశంలో వరుసగా ఆరు నెలల పాటు తిరోగమన(మైనస్‌) వృద్ది నమోదైతే అది మాంద్యంలోకి జారినట్లు పరిగణిస్తారు. గతంలో అనేక దేశాలు అలా దిగజారి తిరిగి కోలుకున్నాయి. పెట్టుబడిదారీ విధానం అనుసరిస్తున్న దేశాల్లో ప్రతి పదేండ్లకు ఒకసారి ఈ పరిస్థితి ఏర్పడినట్లు గత చరిత్ర వెల్లడించింది. 2008లో, 2020లో కరోనా సందర్భంగా తలెత్తిన పరిస్థితి కంటే రానున్న మాంద్యం మరింత తీవ్రంగా ఉండనుందని ఐరాస హెచ్చరించింది. వాణిజ్యం-అభివృద్ది 2022 నివేదిక ప్రకారం ప్రపంచం మాంద్యం అంచున ఉంది, ఆసియాలోని అభివృద్ది చెందుతున్న దేశాలు దీని పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నది.

ఆర్థికవేత్తలు చెప్పిన వాటన్నింటినీ క్రోడీకరిస్తే మాంద్యానికి ఐదు ప్రధాన అంశాలు దోహదం చేస్తున్నట్లు చెబుతున్నారు. అమెరికా డాలరు గత కొన్ని నెలలుగా బలపడుతున్నది, గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత బలంగా ఉంది. మరింత బలంగా మారనుందని అంచనా. బలమైన డాలరు అమెరికాకు బలమూ, నష్టమూ కలిగించినట్లుగానే ప్రపంచ దేశాలకూ ఉంటుంది. బ్రిటీష్‌ పౌండ్‌,ఐరోపా యురో, చైనా, జపాన్‌, మనతో పాటు దాదాపు అన్ని దేశాల కరెన్సీల విలువలను కోల్పోయాయి. ఫలితంగా దిగుమతులు భారంగా మారుతున్నాయి. ఉదాహరణకు 2014లో అక్టోబరులో ముడిచమురు పీపా ధర 92 డాలర్లు ఉండగా మన కరెన్సీలో రు.5,650 చెల్లించాము. ఇప్పుడు 91 డాలర్లు ఉండగా పీపాకు రు.7,514 చెల్లించాము. దీనికి కారణం మన కరెన్సీ మారకపు విలువ 61.40 నుంచి 82.26 దిగజారటమే కారణం. అన్ని దిగుమతి వస్తువుల ధరలూ ఇదే మాదిరి పెరిగాయి. మన వారు విదేశాల్లో చదువుకుంటే వారి మీద ఇదే మాదిరి అదనపు భారం పడుతున్నది. ద్రవ్యోల్బణం పెరిగినపుడు, కరెన్సీ విలువలు పతనమైనపుడు అదుపు చేసేందుకు వడ్డీ రేట్లు పెంచుతున్నారు. ఇది కొత్త సమస్యలకు కారణం అవుతున్నది. ఇది అమెరికాకూ వర్తిస్తుంది. అక్కడ వడ్డీ రేట్లు పెంచినపుడల్లా ఇతర దేశాల నుంచి డాలర్లు అక్కడకు చేరుతున్నాయి.దీని వలన అమెరికన్లు లాభపడుతున్నారా అంటే అదీ లేదు.ద్రవ్యోల్బణంతో వృద్ధిరేటు దిగజారి మాంద్యంలోకి దిగజారే ముప్పు ఉంది.వడ్డీ రేట్లు పెరిగితే పరిశ్రమలు, వాణిజ్యాల పెట్టుబడులపై భారం పెరుగుతుంది. కొత్తగా పెట్టుబడులు ఉండవు, పరిశ్రమలూ రావు. రుణాలు తీసుకొని ఇండ్లు కొనుగోలు చేసిన వారికి భారం పెరుగుతుంది. ధరల పెరుగుదలతో జనాల జేబులకు చిల్లిపడి వస్తువులను తక్కువగా కొనుగోలు చేస్తారు. అది మాంద్యానికి దారితీస్తుంది. డిమాండ్‌ తగ్గటంతో ఆపిల్‌ ఐఫోన్‌ 14 ఉత్పత్తి తగ్గించింది. దాంతో దాని షేర్ల ధర తగ్గింది.

ఇతర దేశాల్లో మాంద్య పరిస్థితులు ఏర్పడితే వాటి మార్కెట్లపై ఆధారపడిన ప్రతిదేశమూ ప్రభావితం అవుతుంది. పశ్చిమ దేశాల్లో డిమాండ్‌ తగ్గిన కారణంగా రెండు సంవత్సరాల్లో తొలిసారిగా 2022 అక్టోబరులో మన ఎగుమతులు 16.7 శాతం తగ్గాయి. దిగుమతులు పెరిగినందున మన దేశంలో డిమాండ్‌ పెరిగిందని చెబుతున్నారు. మన పెట్టుబడులు ఎగుమతి ఆధారితంగా ఉన్నందున వృద్ధి రేటు పడిపోనుందని అంచనా వేస్తున్నారు, అదే జరిగితే అంతర్గత డిమాండ్‌ కూడా తగ్గుతుంది. అక్టోబరు నెలలో ఎగుమతి చేసే 30 వస్తువులకు గాను 24 తిరోగమనంలో ఉన్నాయి. ఎలక్ట్రానిక్‌ వస్తువులు, బియ్యం, టీ, చమురు గింజలు, పొగాకు, చమురు గింజల ఉత్పత్తుల ఎగుమతుల్లో పెరుగుదల ఉంది. చమురు ఉత్పత్తుల ఎగుమతులు సెప్టెంబరులో 43శాతం పెరగ్గా అక్టోబరులో 11.4శాతం తిరోగమనంలో ఉన్నాయి. ఇంజనీరింగ్‌ వస్తువులు 21.3, ఆభరణాలు 21.6, రసాయనాలు 16.4, రెడీమేడ్‌ దుస్తులు 21.2,డ్రగ్స్‌-ఫార్మా 9.24 శాతాల చొప్పున తిరోగమనంలో ఉన్నాయి. తెలంగాణా, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ జాబితాలోని వస్తువుల ఎగుమతులు జరుగుతుంటే వాటి ప్రభావం రాష్ట్ర సంస్థలు, వాటిలో పని చేసే సిబ్బంది మీద కూడా పడుతుంది. రానున్న రోజుల్లో పశ్చిమ దేశాల్లో పరిస్థితులు ఇంకా దిగజారవచ్చని చెబుతున్నందున పరిస్థితిని ఊహించలేము.


పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభానికి గురైనపుడల్లా కార్మికవర్గం మీద దాని భారాలను మోపి తాను తప్పించుకొనేందుకు చూస్తుంది. 2008లో తలెత్తిన సంక్షోభం తరువాత కూడా అదే జరుగుతోంది. దానిలో భాగంగా ఐటి కంపెనీలన్నీ రోబో ప్రోసెస్‌ ఆటోమేషన్‌ (ఆర్‌పిఏ) వైపు కేంద్రీకరించాయి. ఇది ఏదో ఒక దేశానికే పరిమితం కాదు. బాంక్‌ ఆఫ్‌ అమెరికా గతంలో ఒక విశ్లేషణలో పేర్కొన్నదాని ప్రకారం 2022 నాటికి మన దేశంలోని కోటీ 70 లక్షల ఐటి, ఐటి సంబంధిత ఉద్యోగాల్లో 30లక్షలు రద్దవుతాయని అంచనా వేసింది. పరిశ్రమల్లో కార్మికుల బదులు రోబోలు పని చేస్తాయి. ఐటి రంగంలో రోబో ప్రాసెస్‌ అంటే ఇంజనీర్ల బదులు రోబోలు అని కాదు, వాటి ప్రోగ్రామ్స్‌లో చేసే మార్పులతో ఎక్కువ మంది సిబ్బందితో పనిలేకుండా చేస్తాయి. డేటా విశ్లేషణ, ఎకౌంటింగ్‌, ఫైనాన్స్‌, కస్టమర్‌ సర్వీస్‌ వంటి సేవలను ఆటోమేషన్‌, కృత్రిమ మేథతో చేసి కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకొని లాభాలకు ముప్పు లేకుండా చూసుకుంటున్నాయి. ఇప్పుడు అలాంటి క్రమంలోనే అమెరికాలో ఐటి రంగంలో ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఎంతో నిపుణులైన వారిని మాత్రమే ఉంచుకుంటారు. కొన్ని కంపెనీలు తొలగించకపోయినా కొత్తగా సిబ్బందిని తీసుకోకుండా సర్దుబాటు లేదా విస్తరణకు పూనుకుంటాయి.కొత్త కంపెనీలు పరిమిత సిబ్బందిని మాత్రమే చేర్చుకుంటాయి.


గార్టనర్‌ కార్పొరేషన్‌ పేర్కొన్న సమాచారం ప్రకారం 2022లో ఆర్‌పిఏ సాఫ్ట్‌వేర్‌ 20శాతం పెరుగుతుందని, అందుకోసం కంపెనీలు 290 కోట్ల డాలర్లను ఖర్చు చేయనున్నట్లు అంచనా వేసింది. ప్రపంచమంతటా 2023లో ఈ సాఫ్ట్‌వేర్‌ మార్కెట్‌ రెండంకెల వృద్ధి సాధిస్తుందని పేర్కొన్నది. అంటే అది పెరిగే కొద్దీ తీసివేతలు మరింతగా ఉంటాయి, కొత్త అవకాశాలు తగ్గుతాయి.ఆర్‌పిఏ సాఫ్ట్‌వేర్‌తో పని చేసే కంప్యూటర్ల మీద పనిచేసేందుకు సాంకేతిక అర్హతలున్నవారే ఉండనక్కరలేదు. మరోవైపున నైపుణ్యాలు ఎక్కువగా ఉన్న అవకాశాలు, వేతనాలూ పెరుగుతాయి. ఇదే సమయంలో జనాలకు మరింత వేగంగా సేవలు, కంపెనీలకు లాభాలు ఉంటాయి. సేవలు మెరుగుపడినందుకు సంతోషించాలా ? ఉపాధి తగ్గినందుకు విచారపడాలా ? ఇప్పుడు ప్రపంచమంతటా కంపెనీలన్నీ ఆర్‌పిఏ లాభ నష్టాల గురించి మదింపు చేసుకుంటున్నాయి. లాభం లేనిదే వ్యాపారి వరద ప్రాంతాలకు పోడు అన్న సామెత తెలిసిందే.వర్తమాన సంవత్సరంలో ఇంతవరకు ప్రపంచంలో 853 టెక్‌ కంపెనీలు 1,37,492 మందిని తొలగించినట్లు తాజా సమాచారం. అదే కరోనా మహమ్మారి తలెత్తినప్పటి నుంచి చూస్తే 1,388 సంస్థలు 2,33,483 మందిని ఇంటికి పంపాయని లేఆఫ్స్‌ డాట్‌ ఫై అనే సంస్థ వెల్లడించింది. ఐటి రంగంలో పని చేస్తున్న వారికి, ఉపాధికోసం చూస్తున్న వారికి 2022 సంవత్సరం ఒక పీడకలగా మిగిలిపోనుంది.


2023లో మాంద్యం తలెత్తితే మన దేశం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అనే తర్జన భర్జన మొదలైంది. మన దేశం ప్రపంచీకరణలో మరీ లోతుగా దిగలేదు గనుక అంతగా మునగం అన్నది ఒక భావం. ప్రతి సంక్షోభంలో తొలుత నష్టపడేది కార్మికులు, సామాన్యులే అన్నది గత అనుభవసారం. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో మన జిడిపి వృద్ది గురించి అనేక సంస్థలు ప్రతినెలా అంచనాలను తగ్గిస్తూనే ఉన్నాయి. అంతిమంగా ఎంత ఉండేది చెప్పలేని స్థితి. కరోనా మహమ్మారి తలెత్తకుండా ఉండి ఉంటే 2016 నుంచి ప్రపంచ ఉత్పత్తి 23శాతం పెరిగి ఉండేదని, ప్రస్తుత అంచనా 17శాతమే అని చెబుతున్నారు. నిజమైన జిడిపి కరోనాకు ముందున్నదాని కంటే తక్కువే. దీని వలన 17లక్షల కోట్ల డాలర్ల మేర నష్టం జరిగిందని అంచనా. గతంలో ఎక్కువ వృద్ది రేటు ఉన్న దేశాలే ఎక్కువ భాగం నష్టపడ్డాయి.2019 జిడిపి సూచిక 110 కాగా కరోనా లేకుంటే 2023 నాటికి 123.4 పెరిగి ఉండేది, అలాంటిది ఇప్పుడు 117.3కు మాత్రమే చేరుతుందని అంచనా. ఇటీవలి పరిణామాలు మన ఆర్థిక రంగం మీద తీవ్ర వత్తిడిని కలిగిస్తున్నాయి. ఆహార ధరల సూచిక 2021 నవంబరులో 148.2 ఉంటే 2022 అక్టోబరు నాటికి 165.2కు పెరిగింది. మన దేశం కొనుగోలు చేస్తున్న ముడి చమురు పీపా ధర 2020-21లో సగటున 44.82 డాలర్లుంటే 2021-22లో 79.18, 2022-23లో నవంబరు 22 నాటికి 100.2 డాలర్లు ఉంది. ఇలాంటి భారాలు ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో పరిమితం కావు. దేశమంతటా ఉంటాయి.


పశ్చిమ దేశాల్లో ఆర్థికరంగంలో సంభవించే మార్పుల పరిణామాలు, పర్యవసానాల గురించి అందుబాటులో ఉండే సమాచారము ఎక్కువగా ఉంటుంది గనుక విశ్లేషణలు కూడా వెంటనే వెలువడతాయి. మన దేశంలో దానికి విరుద్దం. సమాచార ప్రభావం ఎక్కడ తమ ఎన్నికల లబ్ది మీద పడుతుందో అని అధికారంలో ఉన్నవారు తొక్కి పట్టటం, ప్రభావాన్ని తక్కువగా చూపటం జరుగుతోంది. ఉదాహరణకు 2019లోక్‌ సభ ఎన్నికలకు ముందు నాలుగు దశాబ్దాల రికార్డును నిరుద్యోగం బద్దలు కొట్టిందని సమాచారం తెలుపగా దాన్ని వెల్లడించకుండా కేంద్ర ప్రభుత్వం తొక్కిపట్టింది. తీరా అది అనధికార మార్గాల ద్వారా బహిర్గతం కావటంతో అది తప్పుల తడక అని దాన్ని నమ్మవద్దంటూ కేంద్రం చెప్పింది. తీరా ఎన్నికలు ముగిసిన తరువాత అదే వాస్తవమంటూ ఆ విశ్లేషణను ఆమోదిస్తున్నట్లు ప్రకటించింది. 2014 నుంచి ప్రపంచ సంస్థలు వెలువరించే అనేక సూచికల్లో మన దేశం వెనుకబడి ఉండటాన్ని చూస్తున్నాము. అన్ని దేశాలకూ వర్తింప చేసే పద్దతినే మన దేశానికీ వర్తింప చేస్తున్నప్పటికీ మన దేశ వాస్తవాలను ప్రతిబింబించటం లేదని ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నది, నిరాకరిస్తున్నది తప్ప వాస్తవం ఏమిటో తన అంకెలను ఇంతవరకు వెల్లడించలేదు.


ధనిక పశ్చిమ దేశాల్లో జరిగే పరిణామాలు వెంటనే మన దేశం మీద పడే అవకాశం లేదు. 2008లో ఆ దేశాల్లో మాదిరి బాంకులు మన దేశంలో కుప్పకూలలేదు.కారణం అవి ప్రభుత్వరంగంలో ఉండటమే. ఇప్పుడు ఐటి కంపెనీల్లో జరుగుతున్న లేఆఫ్‌లు, తొలగింపులు ప్రధానంగా అమెరికాలో జరుగుతున్నాయి. ఆర్థిక మాంద్యం మహా సంక్షోభంగా మారినపుడు ప్రతి దేశాన్ని ఆవహిస్తుంది. మన జిడిపి వృద్ది రేటు బ్రిటన్‌లో మాదిరి తిరోగమనంలో పడలేదు. తాజాగా బ్రిటన్‌లో తలెత్తిన స్థితిని చూస్తే మాంద్యం కారణంగా ఎనిమిది సంవత్సరాల్లో పెరిగిన గృహస్తుల రాబడి హరించుకుపోయి జీవన వ్యయ సంక్షోభం తలెత్తింది.వంద బిలియన్‌ పౌండ్ల ప్రభుత్వ ఉద్దీపన ఉన్నప్పటికీ 2024 ఏప్రిల్‌ నాటికి నిజ ఆదాయాలు ఏడుశాతం తగ్గుతాయని అంచనా. ఉత్పత్తి రెండు శాతం తిరోగమనంతో ఐదులక్షల ఉద్యోగాలు పోయినట్లు అంచనా.


పశ్చిమ దేశాల్లో తలెత్తిన సంక్షోభం మన దేశంలో లేదా తెలంగాణాలో లేదు అంటే దాని అర్ధం అసలేమీ సమస్యలు లేవని అంతా సజావుగానే ఉందని కాదు. తెలంగాణా పౌరస్పందన వేదిక నిర్వహించిన ఒక సర్వే, యుటిఎఫ్‌ చెబుతున్న దాని ప్రకారం రాష్ట్ర పాఠశాలల్లో 26వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బంగారు, ధనిక రాష్ట్రం అని చెబుతున్న చోట ఇలాంటి పరిస్థితి ఉండటం ఆర్ధిక ఇబ్బందులకు నిదర్శనంగా చెప్పవచ్చు. మార్చి నెలలో సిఎం కెసిఆర్‌ ఆర్భాటంగా ప్రకటించిన 90వేల ఖాళీల భర్తీ ఎక్కడుందో ఎవరికీ అర్ధం కాదు. అన్ని శాఖల్లో ఉన్న ఖాళీల గురించి చెబుతున్న అంకెలకు ఒకదానికి ఒకటి పొంతన ఉండటం లేదు. ప్రభుత్వం శ్వేత పత్రం ప్రకటిస్తే తప్ప జనానికి అర్ధం కాదు. ఉన్న సిబ్బంది, పెన్షనర్లకు సకాలంలో వేతనాలు చెల్లించలేని స్థితిలో ఈ ఖాళీలను భర్తీ చేస్తే ఏటా ఏడున్నరవేల కోట్ల మేరకు అదనంగా ఖర్చు అవుతుందని అంచనా. ఈ కారణంగానే గత ఎనిమిది సంవత్సరాలుగా సంక్షేమ పథకాలకు తప్ప ఉద్యోగాల భర్తీకి పూనుకోవటం లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక సాకు చెబుతున్నారు.ప్రభుత్వం మీద పైసా అదనపు భారం పడని వివిధ రంగాల కనీసవేతనాల సవరణకూ ప్రభుత్వం ముందుకు రావటం లేదు.


తెలంగాణాలో ఉన్న భూముల అమ్మకం, రిజిస్ట్రేషన్‌ ఛార్జీల పెంపు వంటి చర్యల ద్వారా సమకూరుతున్న ఆదాయం సంక్షేమ పథకాలకు తప్ప వనరుల పెంపుదలకు అవసరమైన పెట్టుబడులు పెట్టటం లేదనే విమర్శ ఉంది. కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను అతిక్రమించేందుకు ప్రభుత్వాలు తీసుకొనే రుణాలకు పరిమితులు ఏర్పడటంతో వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా అప్పులు తీసుకొని వాటికి ప్రభుత్వం హామీదారుగా ఉంటున్నది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఈ మొత్తాలను కూడా ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామని ప్రకటించి వెనుకటి నుంచి అమలు జరుపుతామని ప్రకటించటంతో కొత్తగా తీసుకొనే రుణాల మొత్తం తగ్గే పరిస్థితి తలెత్తింది. ఇలాంటి అప్పులను బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా తీసుకుంటున్న కారణంగా వచ్చే ఏడాది నుంచి అమలు జరుపుతామని చెప్పటంతో కాస్త ఊరట లభించింది. వర్తమాన సంవత్సర జిఎస్‌డిపి పదమూడు లక్షల కోట్లుగా అంచనా వేశారు.దీని ప్రకారం నాలుగుశాతం అంటే 52వేల కోట్ల మేరకు అప్పులు తీసుకోవచ్చు. హామీ రుణాలను కూడా పరిగణనలోకి తీసుకోవటంతో 43వేల కోట్లకు మించి తీసుకొనే అవకాశం లేకపోయింది. దీంతో నెలవారీ ఖర్చులు – రాబడి తేడా ఒకటి నుంచి రెండువేల కోట్ల వరకు ఉండటంతో ప్రతినెలా ఇబ్బంది పడుతున్నది. అనేక అభివృద్ధి పనులకు కోతలు పెడుతున్నారు.2020-21లో ఇండ్ల నిర్మాణానికి 10,591 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది కేవలం ఆరువందల కోట్లే. అలాటే పట్టణాభివృద్దికి 13,053 కోట్లకు గాను ఖర్చు 3,816 కోట్లు మాత్రమే. అందుకే రెండు పడకల ఇండ్లు లేవు, పట్టణాల్లో వరదలు వస్తే తట్టుకొనే స్థితిలేదు. ఈ ఏడాది ప్రకటించిన బడ్జెట్‌లో ఎన్నికోతలు పెట్టేది తరువాత గానీ వెల్లడి కాదు. ప్రపంచం, దేశంలో మాంద్యం తలెత్తితే తెలంగాణాకు మినహాయింపు ఉండదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా నుంచి కంపెనీలు ఏ దేశం వెళుతున్నాయి ? నిజానిజాలేమిటి ?

09 Wednesday Nov 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti China Propaganda, exodus of manufacturing from China, factory of the world, Narendra Modi Failures, US-CHINA TRADE WAR, Vietnam


ఎం కోటేశ్వరరావు


చైనా నుంచి పెద్ద ఎత్తున కంపెనీలు వెలుపలికి వస్తున్నాయి. అదింకేమాత్రం ప్రపంచ ఫ్యాక్టరీగా ఉండదు. చైనా వైఫల్యం – భారత అదృష్టం ఇలాంటి వార్తలు, విశ్లేషణలు ఇటీవల మరోసారి పెరిగాయి. ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. పరిస్థితులన్నీ ఒకే విధంగా ఎప్పుడూ ఉండవు. చైనా దానికి మినహాయింపు కాదు.దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమని చెప్పి పాలు పితికేందుకు పూనుకున్నట్లుగా కొందరున్నారు.ఆత్ర పడినంత మాత్రాన లేదా అదృష్టాన్ని నమ్ముకుంటే కంపెనీలు వస్తాయా ? మన దేశం చైనాను వెనక్కు నెట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా మారుతుందా, పోటీ పడి మారాలని కోరుకోవటాన్ని ఎవరూ తప్పు పట్టరు, అది వాస్తవాల ప్రాతిపదికగా ఉండాలి. ఇంతకూ అసలు నిజానిజాలేమిటి ?


2022 అక్టోబరు చివరి వారంలో అమెరికాకు చెందిన సిఎన్‌బిసి ఒక విశ్లేషణను ఇచ్చింది.2016 నుంచి 2022లో ఇప్పటి వరకు వచ్చిన మార్పులను అది పేర్కొన్నది. దాని ప్రకారం ప్రపంచ దుస్తులు, వాటి సంబంధిత వస్తువుల ఎగుమతుల్లో చైనా వాటా 41 నుంచి 37శాతానికి, ఫర్నీచర్‌లో 64 నుంచి 53కు, పాదరక్షలు 72 నుంచి 65, ప్రయాణ వస్తువులు, చేతి సంచుల వాటా 83 నుంచి 70శాతానికి తగ్గింది. ఇదే కాలంలో వియత్నాం వాటా ఫర్నీచర్‌లో 8 నుంచి 17 శాతానికి, పాదరక్షలు 12 నుంచి 16, ప్రయాణ వస్తువులు, చేతి సంచుల వాటా 6 నుంచి 10శాతానికి పెరిగింది. బంగ్లాదేశ్‌ నుంచి దుస్తులు పది నుంచి 12 శాతానికి పెరగ్గా, మలేషియా నుంచి దుస్తులు 14 నుంచి 19శాతానికి పెరిగి తిరిగి 14శాతానికి తగ్గాయి. మన దేశ వివరాలను అది అసలు పరిగణనలోకే తీసుకోలేదు. కఠినమైన కరోనా నిబంధనలు, లాక్‌డౌన్ల కారణంగా ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా తగ్గటానికి ఒక కారణంగా సిఎన్‌బిసి పేర్కొన్నది. జీరో కరోనా విధానాల కారణంగా ఉత్పత్తిమీద తిరోగమన ప్రభావం పడటంతో దిగుమతిదారులు ప్రత్యామ్నాయాలను చూసుకున్నారని ఎండిఎస్‌ ట్రాన్స్‌మోడల్‌ సలహాదారు ఆంటోనెలా టియోడోరో చెప్పాడు. చైనా వాటా తగ్గినందున అత్యధికంగా లబ్ది పొందింది వియత్నాం తప్ప మరొక దేశం కాదని అందరూ చెబుతున్నారు.2014 నుంచి అది సుదూర వాణిజ్యాన్ని 360 శాతం పెంచుకుందని ఆంటోనెలా చెప్పాడు. కరోనా నిబంధనలను ఎత్తివేస్తే తిరిగి చైనా వాటా పెరగనూ వచ్చు.


మన దేశంలో ఉన్న వారు ఆలోచించాల్సింది ఈ అవకాశాన్ని వినియోగించుకోవటంలో నరేంద్రమోడీ సర్కార్‌ఎందుకు విఫలమైందన్నదే. వస్తూత్పత్తి చౌకగా అంటే చౌకగా దొరికే శ్రామిక శక్తి వియత్నాంలో ఉన్నందున పరిశ్రమలు, పెట్టుబడులు అక్కడకు వెళుతున్నట్లు కొందరు చెబుతున్నారు. అదే గనుక అసలు కారణమైతే ఈ పాటికి మన దేశం ప్రపంచ ఫ్యాక్టరీగా మారి ఉండాలి. వికీపీడియా సమాచారం ప్రకారం వియత్‌నామ్‌లో 2020 వివరాల ప్రకారం ఏడాది కనీస వేతనం సగటున 1,591 డాలర్లు, మన దేశంలో 2015 వివరాల ప్రకారం 664 డాలర్లు, చైనాలో 2018 ప్రకారం 2,084 డాలర్లు ఉంది.( తాజా వివరాల ప్రకారం అదింకా పెరిగింది) పోనీ నరేంద్రమోడీ అచ్చేదిన్‌లో భాగంగా ఇప్పటికి కనీసవేతనం రెట్టింపు చేశారని అనుకున్నా, వియత్‌నామ్‌ కంటే తక్కువే ఉంటుంది.మోడీ సర్కార్‌ నైపుణ్యశిక్షణ ఇచ్చింతరువాత కూడా మరెందుకు చైనా కంపెనీలు మన వైపు రాకుండా అక్కడికి పోతున్నట్లు ?


ఇక్కడ ముందుగా తెలుసుకోవాల్సింది చైనా నుంచి గానీ మరొక దేశం నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులను అమెరికా లేదా ఐరోపాలోని ధనిక దేశాలు ఉత్పత్తి చేయలేనివి, అసాధ్యమైనవి అంతకంటే కాదు. శ్రమశక్తికి చెల్లించే వేతనాలు అసలు అంశం. తమ దగ్గర ఉన్న రేట్లను పోల్చి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడి ధనిక దేశాల పెట్టుబడిదారులు అక్కడికి పోతున్నారు. చైనాలో తక్కువ వేతనాలకు పనిచేసే కార్మికులు, జనాభా, అక్కడి మౌలిక సదుపాయాలు, మార్కెట్‌, తదితర అవకాశాలను చూసి గత నాలుగు దశాబ్దాల్లో చలో చైనా బాట పట్టారు.చైనాలో వేతనాలను పెంచుతున్న కొద్దీ చైనాలో ఉన్న విదేశీ కంపెనీల లాబీలు ప్రభుత్వాన్ని బెదిరించి వేతనాలు పెంచకుండా చూసేందుకు విశ్లేషణల పేరుతో కథనాలను వండివారుస్తున్నాయి. ఉదాహరణకు 2010 జూన్‌ నెలలో ఫైబర్‌ టు ఫాషన్‌ అనే వెబ్‌సైట్‌(పత్రిక)లో కార్మికవేతన ఖర్చు పెరుగుతున్న కారణంగా వస్తున్న వత్తిడితో అమెరికా దుస్తుల కంపెనీల సంస్థలు చైనా నుంచి వెలుపలికి పోయి ఇతర దేశాల్లో తమ సంస్థల ఏర్పాటు గురించి ఆలోచిస్తున్నట్లు, ఈ అవకాశాన్ని భారత్‌తో సహా ఆసియాలోని సహదేశాలు వినియోగించుకుంటాయా అనే పద్దతిలో ఒక విశ్లేషణ ప్రచురితమైంది. చిల్లర అమ్మకాల దిగ్గజాలైన కోచ్‌,ఆన్‌ టైలర్‌ స్టోర్స్‌,గస్‌,జె సి పెనీ వంటి కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను విదేశాలకు తరలించే ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నది. 2010 ఒక నివేదిక ప్రకారం గంటలకు కార్మికవేతన వేతనం( పెట్టుబడిదారుల పదజాలంలో ఖర్చు ) 1.84 డాలర్లని అంతకు ముందు ఏడాది కంటే 17శాతం పెరిగినట్లు అదే భారత్‌లో గంటకు 2.99 డాలర్లు, వియత్నాంలో 0.49 డాలర్లు ఉన్నట్లు తెలిపింది. చైనా వేతన ప్రమాణాలను పెంచటం, కరెన్సీ ఎన్‌ విలువ పెరగటం వంటి కొన్ని అంశాలను కూడా పేర్కొన్నారు.


ఆ తరువాత గడచిన పది సంవత్సరాల్లో కరోనాకు ముందు ఇప్పుడు కూడా ఇలాంటి విశ్లేషణలను ప్రచురించని ఏడాది లేదంటే అతియోక్తి కాదు. అయినప్పటికీ పొలోమంటూ మొత్తంగా చైనాను ఖాళీ చేసి విదేశీ బాట పట్టిందేమీ లేదు. దాని ఎగుమతుల్లో వచ్చిన మార్పును పైన చూశాము. 2022 నవంబరు ఏడవ తేదీన అంతకు ముందు ప్రచురించిన వివరాలను నవీకరించి చైనా బ్రీఫింగ్‌ డాట్‌ కామ్‌ అనే సంస్థ చైనాలో పెట్టుబడులు పెట్టదలచుకున్న వారికోసం అనేక వివరాలను ప్రచురించింది. దానిలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న కనీసవేతనాలు, నిబంధనలు తదితర అంశాలను వెల్లడించింది. దాని ప్రకారం 31రాష్ట్రాలలో షాంఘైలో కనీసవేతనం గరిష్టంగా నెలవారి 2,590యువాన్లు లేదా 400 డాలర్లు ఉండగా బీజింగ్‌లో గంటకు 25.3 యువాన్లు లేదా 3.99 డాలర్లు ఉంది. మిగతా చోట్ల రాష్ట్రాల వారీ అంతకంటే తక్కువ ఉన్నాయి. కనిష్టంగా అన్‌హులో 1,340యువాన్లు లేదా 212 డాలర్లు ఉంది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న నాలుగు జోన్లలో చివరిది ఒకటవ జోన్‌లో 1,650యువాన్లు ఉంది. ప్రతి చోటా ఇలా జోన్ల వారీ హెచ్చు తగ్గులుంటాయి. నవంబరు 8వ తేదీన ఒక డాలరుకు మన కరెన్సీ మారకం విలువ రు.81.80కి అటూ ఇటుగా, ఒక యువానుకు రు.11.26 ఉంది.
మన కనీస వేతనాల్లో వైద్య బీమా – ఇఎస్‌ఐ నిమిత్తం కార్మికులు,యజమానులు చెల్లించాల్సి వాటాలు ఎలానో చైనాలో ఇతర అంశాలతో పాటు ఇంటి బీమా కోసం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం క్రితపు ఏడాదిలో మూడు నెలల సగటు వేతనాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అంటే సగం దానిలో కార్మికుడు చెల్లిస్తే మరో సగం కంపెనీ చెల్లిస్తుంది. ఆ నిధులను కార్మికులు గృహాలను కొనుగోలు చేసేందుకు మాత్రమే అనుమతిస్తారు. ఈ మొత్తాలు కనీస వేతనం పెరిగినపుడల్లా దానికి అనుగుణంగా పెరుగుతాయి. ఇవి కనీసవేతనాలు మాత్రమే. ఉదా షాంఘై నగరంలో 2020లో సగటు నెల కనీసవేతనం 1,632 డాలర్లు అంటే రు.1లక్షా 33వేలు. ఇది ప్రభుత్వం ప్రకటించిన నాటి కనీసవేతనం కంటే నాలుగు రెట్లు. మొత్తం వేతనంతో పాటు ఇతర సామాజిక రక్షణ పధకాలకు గాను యజమానులు చెల్లించాల్సిన మొత్తం 37శాతం ఉంటుందని వీటిని కూడా గమనంలోకి తీసుకోవాలని చైనా బ్రీఫింగ్‌ డాట్‌ కామ్‌ సమాచారం పేర్కొన్నది.


చైనా ఉత్పత్తులు నాసిరకమని అనేక మంది ప్రచారం చేశారు. నిజానికి చైనా బజార్ల పేరుతో మన దేశంలో విక్రయించే వస్తువులన్నీ చైనావి కాదు. తక్కువ ధరలకు వచ్చేవన్నీ నాసిరకమనే భావన మనలో ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. కానీ అమెరికా, ఐరోపా దుకాణాలన్నింటా చైనా వస్తువులే అన్నది తెలిసిందే. చైనా తన ఎగుమతుల్లో కేవలం రోజువారీ అవసరమైనవే గాకుండా ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వస్తువుల ఉత్పత్తి మీద కేంద్రీకరించింది. ఈ రంగంలో ఇప్పటికీ అమెరికా, ఐరోపా ధనిక దేశాలదే అగ్రస్థానం. నాలుగవ పారిశ్రామిక విప్లవంలో భాగంగా మేడిన్‌ చైనా 2025 పేరుతో అక్కడి ప్రభుత్వం 2015 ప్రారంభించిన పారిశ్రామిక విధానంలో ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తే వాటికి గండితో పాటు పోటీ పెరుగుతుంది. ధరలు కూడా తగ్గుతాయి. ఇది తమకు ముప్పు అని అందరికంటే ముందు గుర్తించింది అమెరికా, అందుకే డోనాల్డ్‌ ట్రంప్‌ 2018లో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించాడు.తమ ఉత్పత్తులకు ఎదురుకానున్న పోటీ గురించి చెప్పటానికి బదులు చైనా తమ పరిజ్ఞానాన్ని తస్కరించిందని, తమ భద్రతకు ముప్పు ఉందంటూ అమెరికా ప్రచారం చేస్తున్నది.


ఏ దేశానికి ఆ దేశం భిన్నమైన పేర్లతో ఇలాంటి విధానాలనే చేపట్టింది.” పరిశ్రమలు 4.0 అభివృద్ధి ప్రణాళిక ” పేరుతో జర్మనీ ప్రకటించింది. మన మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ వంటి వాటి గురించి తెలిసిందే. ప్రపంచం వంద సెమీ కండక్టర్లను వాడుతుంటే అందులో చైనా వాటా 60, దానికి గాను అది ఉత్పత్తి చేస్తున్నది పదమూడు మాత్రమే. చైనా ప్రకటించిన లక్ష్యాల ప్రకారం 2025నాటికి ఈ రంగంలో 70శాతం స్వయం సమృద్ధి సాధించాలని, 2049లో వందేళ్ల చైనా కమ్యూనిస్టు పాలన నాటికి హైటెక్‌ పరిజ్ఞానంలో అగ్రగామిగా ఉండాలని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే దుస్తులు, పాదరక్షల వంటి వాటి మీద పని చేస్తూనే ఇతర కీలక రంగాల మీద కేంద్రీకరించారు.లాభాలను మాత్రమే చూసుకొనే విదేశీ కంపెనీలు చైనాలో పెరుగుతున్న వేతన ఖర్చు, ఇతర రాజీలేని నిబంధనల కారణంగా ఇతర దేశాలవైపు చూస్తున్నాయి. అందువలన కొన్ని పరిశ్రమలు వెళ్లవచ్చు. అలా వెళితే వాటికే నష్టం. వాటి ఉత్పత్తులకు చైనా మార్కెట్‌లో అవకాశం ఉండదు. అందువలన ఎందరు ఎన్ని విశ్లేషణలు చేసినా, పారిశ్రామికవేత్తల ఆలోచనలు భిన్నంగా ఉంటున్నాయి.

చైనా చేపట్టిన సంస్కరణల గురించి భిన్న అభిప్రాయం వెల్లడించే కొందరు వామపక్ష వాదులు గానీ, అది కూలిపోతుంది, వాలిపోతుంది అని గత నాలుగు దశాబ్దాలుగా జోశ్యాలు చెబుతున్న చైనా వ్యతిరేకులకు గానీ ఇంత కాలం ఆశాభంగమే తప్ప మరొకటి లేదు. అయితే చైనాకు ఎలాంటి సమస్యలు, సవాళ్లు లేవా ? లేవని ఎవరు చెప్పారు ! పెట్టుబడిదారీ సమాజాన్ని నెలకొల్పేందుకు పూనుకున్నవారికి అంతా పూలబాటగా ఎలాంటి ప్రతిఘటన, సవాళ్లు లేకుండా అంతా సాఫీగా నడిచిందా, ఆధిపత్యం కోసం ఖండాలు, ప్రపంచ యుద్ధాలు చేసుకున్నారు. సోషలిస్టు సమాజ నిర్మాణంలో పెట్టుబడిదారుల నుంచి ప్రతిఘటన లేకుండా ఎలా ఉంటుంది ?


చైనా ఒక విధానాన్ని అనుసరించి అనూహ్య విజయాలను సాధించింది. ఆ…. అది ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం తప్ప సోషలిజం ఎక్కడుంది అనే వారు కొందరు. నిజమే, సోషలిజం లేనపుడు అది వద్దని కోరుకొనే వారు ఆ ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానంతో చైనా మాదిరి ఎందుకు ముందుకు పోవటం లేదు ? అక్కడంతా నిరంకుశత్వం ఉంటుంది అనే వాదన మరొకటి. ప్రపంచంలో అనేక దేశాలు మిలిటరీ నిరంకుశపాలనలో ఉన్నాయి,మరి అవెందుకు చైనా మాదిరి పురోగమించలేదు. పత్రికల రాతలను చూసి గతంలో కంపెనీలు చైనాకు వరుసలు కట్టలేదు. ఇప్పుడు వీటిని చూసి తిరుగుముఖం పడితే ఏం చేయాల్సిందీ చైనా వారు చూసుకుంటారు. వసుధైక కుటుంబం, సర్వే జనా సుఖినో భవా, అందరూ బాగుండాలి-అందులో నేనుండాలి అనుకొనే దేశంలో చైనా ఆర్థికంగా దెబ్బతింటే బాగుపడేది మనమే లేదా మనకు మంచి అవకాశం అనే ఆలోచనలు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. చైనా మీద విద్వేషాన్ని విపరీతంగా రెచ్చ గొట్టిన పర్యవసానమిది. ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో మాదిరి కష్టపడకుండా లక్కు మీద ఆధారపడి పనీ పాటా లేకుండా తిరిగే సోంబేరుల మాదిరి ఉండి బాగుపడిన వారెవరూ లేరు. ప్రపంచ ఫ్యాక్టరీగా ఉన్న చైనా దెబ్బతింటే తప్ప మనకు అవకాశాలు రావని చెప్పే ప్రబుద్దుల మాటలు విని దాని కోసం ఎదురు చూస్తూ చేయాల్సినవి చేయకుండా కూర్చుంటే ఫలితం ఉండదని పాలకులకు, ఇతరులకు ఎవరు చెప్పాలి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d