• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Economics

శ్రీలంక సంక్షోభానికి చైనా కారణమా ! నిజానిజాలేమిటి !!

08 Friday Apr 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Prices, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

‘China debt trap’, Disinformation campaign, Hambantota Port, Propaganda War, Sri Lanka debt, Sri Lanka economic crisis


ఎం కోటేశ్వరరావు


శ్రీలంక తీవ్రమైన విదేశీ రుణ చెల్లింపుల సంక్షోభంలో ఉంది. దాంతో జనజీవితం అతలాకుతలం అవుతున్నది. అధికారపక్షానికి మద్దతు ఇచ్చే కొన్ని పార్టీలు, అదే పార్టీకి చెందిన కొందరు ఎంపీలు కూడా మద్దతు ఉపసంహరించుకొని స్వతంత్రులుగా ఉంటామని ప్రకటించారు. ఇది రాసిన సమయానికి తమ ప్రభుత్వానికి పార్లమెంటులో మెజారిటీ ఉందని, అధ్యక్షుడు, ప్రధాని గానీ రాజీనామా చేసేది లేదని మంత్రులు ప్రకటిస్తున్నారు. మరోవైపు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ప్రభుత్వ అసమర్ధత పట్ల జనం తీవ్ర నిరసన తెలుపుతున్నారు. ఆర్ధిక సంక్షోభం కారణంగా తలెత్తిన రాజకీయ అశాంతి ఎలా పరిష్కారం అవుతుందో ఊహించలేము. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) నుంచి రుణం తీసుకొని చెల్లింపుల సమస్యనుంచి బయటపడేందుకు పూనుకుంది. అసలు లంకలో ఇలాంటి పరిస్ధితి తలెత్తటానికి కారణం ఏమిటి అనే చర్చ జరుగుతోంది. అమెరికా, బ్రిటన్‌, మన దేశంలోని మీడియా చైనా వైపు వేలెత్తి చూపుతోంది. ఎంతవరకు వాస్తవం, అసలు నిజానిజాలేమిటి ?


శ్రీలంకలోని హంబంటోటా రేవును చైనా నిధులతో అభివృద్ది చేశారు. రుణాన్ని లంక సర్కార్‌ చెల్లించకపోవటంతో ఆ రేవును 99 సంవత్సరాలకు చైనా కౌలుకు తీసుకోవటం ఆక్రమించటమే కదా, బిఆర్‌ఐ పేరుతో అనేక దేశాలను ఇలానే ఆక్రమిస్తున్నది అని చెబుతారు. ఇదంతా అమెరికా, ఇతర పశ్చిమదేశాల మీడియా కట్టుకధ. దున్న ఈనిందంటే గాటన కట్టేయమన్నట్లుగా మన పత్రికలు, టీవీలు వెంటనే అందుకుంటాయి. లంకలో చైనా నిర్మిస్తున్న విద్యుత్‌ పధకాలు మన దేశ భద్రతకు ముప్పు అని ముక్తాయింపు ఇస్తాయి. చైనా నిర్మిస్తున్నది కనుక ఇలా అంటున్నాయా లేక లంకలో నిర్మాణం జరుగుతున్నందుకా? అదే నిజమైతే తమిళనాడులో మనం నిర్మిస్తున్న పధకాలు కూడా తమ భద్రతకు ముప్పే అని లంక భావిస్తే తప్పుపడతామా ? ఇదే తర్కాన్ని ఇతర మన ఇరుగుపొరుగుదేశాలు కూడా ముందుకు తెస్తే ఏంచెబుతారు ?


శ్రీలంకకు రుణాలు ఇచ్చిన అంతర్జాతీయ సంస్ధలు దేశాల వరుసలో చైనా నాలుగవ స్ధానంలో ఉంది. హంబంటోటా రేవు నిర్మాణం తమ ప్రభుత్వ ఆలోచన తప్ప చైనాది కాదు అని 2020అక్టోబరులో అధ్యక్షుడు రాజపక్స ప్రకటించాడు. చైనా నిర్మిస్తున్న పధకాలు అజాగళ స్ధనాల వంటివి అలంకార ప్రాయం తప్ప వాటి నుంచి పెద్దగా ఆదాయం రాదని ఒక పాటపాడతారు.తొలుత దీన్ని బ్రిటీష్‌ గూఢచార సంస్ధ, బిబిసి ప్రచారంలోకి తెచ్చింది. అలాంటి పధకాల నిర్మాణాన్ని చైనా, మరొకదేశం ఏదైనా ఒక స్వతంత్ర దేశం మీద రుద్దగలవా ? చైనా నిర్మిస్తున్న పధకాలలో కొలంబో పోర్టు సిటీ ఒకటి. ఈ ప్రత్యేక ఆర్ధిక ప్రాంతంలో పెట్టే సంస్ధలకు నాలుగు దశాబ్దాల పాటు పన్ను రాయితీలుంటాయి. దీని గురించి ప్రైస్‌వాటర్‌హౌస్‌ కూపర్స్‌(పిడబ్ల్యుసి) చెప్పిందేమిటి ? రానున్న ఇరవై సంవత్సరాల్లో 12.7బిలియన్‌ డాలర్ల అదనపు పెట్టుబడులు వస్తాయి, లంక ఆర్ధిక వ్యవస్ధకు 13.8బి.డాలర్లు తోడవుతాయని ఏడాది క్రితం పేర్కొన్నది. ఇది లండన్‌ కేంద్రంగా పని చేసే బహుళజాతి సంస్ధ. అదేమీ చైనా సంస్ధ కాదు కదా !


ఈ ఏడాది విదేశీ అప్పులకు గాను లంక చెల్లించాల్సిన కిస్తీ 4.5బి.డాలర్లు.గడువులోగా చెల్లించకపోతే దివాలా తీసినట్లు భావిస్తారు. ఇదిగాక దిగుమతులు, ఇతర అవసరాలకు మరో 20బి.డాలర్లు అవసరం అని అంచనా. శ్రీలంక 2007 నుంచి విదేశీ బాండ్ల రూపంలో రూపంలో తీసుకున్నది 35బి.డాలర్ల (ఇది 51బి.డాలర్లని కొందరు చెప్పారు) మొత్తం విదేశీ అప్పులో 47శాతం ఉంది. దీనిలో ఎక్కువ భాగం డాలర్లుగా చెల్లించాల్సింది ఉంది. ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బాంకునుంచి 14.3శాతం, జపాన్నుంచి 10.9, చైనా నుంచి తీసుకున్నది 10.8శాతం ఉంది. మిగతా రుణాలను మన దేశం, ప్రపంచబాంకు, ఇతర సంస్ధలు, దేశాల నుంచి తీసుకున్నది.శ్రీలంక బాండ్ల రుణాల్లో ఎక్కువ మొత్తం అమెరికా సంబంధిత సంస్ధల నుంచి తీసుకున్నదే, అంటే వాటిలో మదుపు చేసే వారందరూ అమెరికన్లే, ఆ రీత్యా ఎక్కువ అప్పులిచ్చింది అమెరికానే కదా ! గతేడాది డిసెంబరు ఆఖరు నాటికి లంక వద్ద 3.1 బి.డాలర్ల విదేశీ మారక ద్రవ్యం ఉంటే దానిలో చైనా సర్దుబాటు చేసి మొత్తం 1.5బి.డాలర్లుంది.వాస్తవాలు ఇలా ఉంటే చైనా కారణంగా లంక ఇబ్బందులు పడుతున్నదని ఎలా చెబుతారు ?


చైనా నుంచి శ్రీలంక ఎందుకు రుణాలు తీసుకుంది అన్నది అసక్తికరం.హంబంటోటా రేవు నిర్మాణం కోసం భారత్‌, అమెరికాలతో పోలిస్తే చైనాతో లావాదేవీలు మెరుగైనవిగా ఉండటమే కారణమని అమెరికాకు చెందిన అట్లాంటిక్‌ పత్రిక పేర్కొన్నది.2007లో లంక తొలుత ఈ రెండు దేశాలనే పెట్టుబడులు, రుణాలను కోరగా అవి తిరస్కరించాయి.2009లో లంకలో అంతర్యుద్దం ముగిసింది, ఆర్ధిక రంగం ఇబ్బందుల్లో పడటంతో విదేశాల నుంచి రుణాలు తీసుకోవటం ప్రారంభించింది. పదిహేను సంవత్సరాల వ్యవధి ఉన్న 30.7కోట్ల డాలర్ల రుణాలను 6.3శాతం వడ్డీతో చైనా ఇచ్చింది. తరువాత చైనా నుంచే మరో 75.7 కోట్ల డాలర్లను రెండు శాతం వడ్డీతో లంక తీసుకుంది. విదేశీ చెల్లింపుల సమస్యను అధిగమించేందుకు 2018లో చైనా అభివృద్ది బాంకు నుంచి వందకోట్ల డాలర్లను ఎనిమిదేండ్లలో తిరిగి చెల్లించే ప్రాతిపదికన లండన్‌ ఇంటర్‌ బాంక్‌ రేటు(లిబోర్‌) ప్రకారం 2.56శాతానికి తీసుకుంది. తరువాత 2020మార్చినెలలో అంతకు ముందు కంటే తక్కువ వడ్డీకి అదే బాంకును మరో 50కోట్ల డాలర్లు తీసుకుంది. ఈ ఏడాది మరో 150కోట్ల డాలర్ల రుణం తీసుకుంది. చైనా మెరుగైన షరతులతో రుణాలు ఇవ్వటం వల్లనే దానివైపు లంక మొగ్గినట్లు ఈ లావాదేవీలు వెల్లడిస్తున్నాయని అట్లాంటిక్‌ పేర్కొన్నది.


హంబంటోటా రేవు ద్వారా ఆశించిన మేరకు ఆదాయం రాకపోవటం, 2015నాటికి రుణ కిస్తీ చెల్లించకలేకపోవటంతో 70శాతం వాటాలను చైనా కంపెనీకి విక్రయించింది. తరువాత రేవు, పరిసరాల్లో ఉన్న 15వేల ఎకరాల భూమిని 99 సంవత్సరాల కౌలుకు ఇచ్చింది. దీంతో ఆ రేవును హిందూమహాసముద్రంలో చైనా మిలిటరీ అవసరాల కోసం వినియోగించనుందనే ప్రచారాన్ని అమెరికా, మన దేశం ప్రారంభించాయి. అదే నిజమనుకుంటే ఆ రేవు నిర్మాణానికి మన దేశం, అమెరికా తొలుత ఎందుకు తిరస్కరించినట్లు ? నిర్మాణం తరువాత విదేశీ సంస్ధలకు ఇవ్వాలనుకున్నపుడైనా చైనా నుంచి ముప్పు ఉందనుకున్నపుడు మనం లేదా అమెరికా ఎందుకు తీసుకోలేదు ?


ఒకరి దగ్గర రుణం తీసుకొని దాన్ని తీర్చేందుకు తిరిగి వారి దగ్గరే రుణం తీసుకోవటాన్ని రుణవల అని చైనా విమర్శకులు వర్ణిస్తున్నారు. ఇచ్చేవారుంటే ఇతర దేశాల దగ్గర తీసుకొని రుణాలు తీరిస్తే ఇబ్బందేముంది. ఆదుకోని ఇతర దేశాలను వదలిపెట్టి సాయం చేస్తున్న చైనాను విమర్శించటం దురుద్ధేశ్యపూరితం తప్ప మరొకటి అవుతుందా ? గిట్టుబాటు గాని రేవు నిర్మాణానికి రుణమిచ్చి తీర్చలేదనే పేరుతో అక్కడ పాగావేసేందుకు చైనా ఆ పని చేసిందని, అన్ని పేద దేశాల్లో ఇదే చేస్తోందని చెప్పే అమెరికా ప్రబుద్దులు, దానికి వంతపాడేవారు పుట్టుకువచ్చారు. ఇది నిజమా ?


చైనాతో నిమిత్తం లేకుండానే హంబంటోటా రేవును అభివృద్ధి చేసేందుకు లంక సర్కార్‌ నిర్ణయించింది. దాన్ని తొలుత ప్రోత్సహించింది చైనా కాదు కెనడా. దశాబ్దాలుగా ఆ ప్రతిపాదన ఉంది. తాము అధికారానికి వస్తే రేవు నిర్మాణం చేస్తామని యునైటెడ్‌ నేషనల్‌ ఫ్రంట్‌ పార్టీ 2001 ఎన్నికల్లో వాగ్దానం చేసింది. ఆ మేరకు ప్రభుత్వం 2002లో కెనడియన్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఏజన్సీకి సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించే బాధ్యతను అప్పగించగా అది తమ దేశానికే చెందిన ఎన్‌ఎన్‌సి-లావలిన్‌ కంపెనీకి ఇచ్చింది. 2003 నాటికి అది వెయ్యిపేజీల నివేదిక ఇచ్చింది. దాన్ని ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యంతో నిర్మించాలని సిఫార్సు చేసింది. సదరు ప్రాజెక్టును ఐరోపా దేశాలు దక్కించుకోవచ్చనే ఆందోళనను కూడా వెలిబుచ్చింది. అప్పటి లంక పరిస్ధితుల కారణంగా కెనడా ముందుకు రాలేదు.మహింద రాజపక్స సోదరుల ఏలుబడిలో 2005-15 మధ్యదానికి ఒక రూపు ఇచ్చారు. కెనడా కంపెనీ తరువాత డెన్మార్క్‌ కంపెనీ రామ్‌బోల్‌ 2006లో రెండవ సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించింది. అది కూడా దాదాపుగా కెనడా కంపెనీ చెప్పిన అంశాలనే పేర్కొన్నది.దశలవారీ వృద్ధి చేయాలని చెప్పింది. ఏ నివేదిక కూడా ఆ రేవు నిర్మాణం గిట్టుబాటు కాదని చెప్పలేదు. రామ్‌బోల్‌ నివేదికను తీసుకొని లంక సర్కార్‌ అమెరికా, భారత్‌ల వద్దకు వెళ్లగా కుదరదని చెప్పిన తరువాతే దాని గురించి తెలుసుకొని చైనా కంపెనీ కంపెనీ రంగంలోకి దిగింది, కాంట్రాక్టును దక్కించుకుంది. జరిగింది ఇదైతే లంకను రుణ ఊబిలోకి దింపింది చైనా అని ఏ నోటితో చెబుతారు.


ఒప్పందం ప్రకారం మొదటి దశ మూడు సంవత్సరాల్లోనే పూర్తయింది.సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించే సమయానికి ఉన్న పరిస్ధితులు మారిపోయాయి. మొదటి దశలో ఆశించిన రాబడి రాక ముందే 2012లో లంక సర్కార్‌ రెండవ దశను ముందుకు తెచ్చింది. దానికి గాను రెండుశాతం వడ్డీతో చైనా ఎగ్జిమ్‌ బాంకు 75.7 కోట్ల డాలర్ల రుణం ఇచ్చింది. 2008లో ధనికదేశాల్లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం నేపధ్యంలో ప్రపంచంలో వడ్డీరేట్లు తగ్గాయి. తొలుత రేవు నిర్వహణ ప్రభుత్వ చేతుల్లోనే ఉంది. 2014లో అనుభవం ఉన్న కంపెనీతో కలసి ఉమ్మడిగా నిర్వహించాలని నిర్ణయించారు. చైనా మర్చంట్స్‌ గ్రూప్‌ కంపెనీ అప్పటికే కొలంబో రేవులో ఒక జట్టీ నిర్వహిస్తున్నది కనుక దానితోనే ఒప్పందం చేసుకున్నారు.


2015 మధ్యంతర ఎన్నికల్లో అధికారపక్షంలో తిరుగుబాటు చేసిన ఆర్ధిక మంత్రి మైత్రీపాల సిరిసేన అధ్యక్షపదవిని కైవసం చేసుకున్నాడు. ఆ ఎన్నికల ప్రచారంలో రేవు లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని, అనవసరంగా ఖర్చు పెట్టి అప్పుల పాలు చేశారని ప్రచారం చేశాడు. సిరిసేన పదవి స్వీకరణ తరువాత విదేశీ అప్పుల చెల్లింపుల సమస్య ముందుకు వచ్చింది. మొత్తం విదేశీ అప్పులో 40శాతం బాండ్ల రూపంలో ఉంది. అప్పటికి విదేశీ అప్పులో జపాన్‌, ప్రపంచబాంకు, ఏడిబి ఇచ్చినవే ఎక్కువ.2017లో చెల్లించాల్సిన 450 కోట్ల డాలర్ల విదేశీ రుణంలో హంబంటోటా రేవుకు తెచ్చిన మొత్తం కేవలం ఐదుశాతమే. ఆ ఏడాదే ఆ రేవును చైనా కంపెనీకి అప్పగించారు. అది చెల్లించిన 120 కోట్ల డాలర్లను విదేశీ చెల్లింపులకు సర్కార్‌ వినియోగించింది. అజాగళ స్దనం వంటిది అని చెబుతున్న రేవును తీసుకున్న చైనా కంపెనీ దాని లాభనష్టాలను భరించేందుకు సిద్దపడినపుడు అది లంకకు ఉపశమనం కలిగించేదే కదా ? సర్కార్‌ చేతులెత్తేసిన తరువాత చైనా కంపెనీ తీసుకుంది, దానిలో బలవంతం ఎక్కడ ? చైనా మిలిటరీ దాడి చేసి రేవును ఆక్రమించలేదు కదా ! అప్పటి వరకు ఆ రేవు వ్యూహాత్మక ప్రాధాన్య గురించి ఎక్కడా ప్రస్తావించని అమెరికా ఒక్కసారిగా ఇంకేముంది చైనా మిలిటరీ కోసమే తీసుకున్నారంటూ మన దేశాన్ని రెచ్చగొట్టేందుకు దొంగేడుపులు ప్రారంభించింది.


2012-18 మధ్య చైనా ఎగ్జిమ్‌ బాంకు నుంచి తీసుకున్న 310 కోట్ల డాలర్ల రుణాలన్నీ రెండుశాతం వడ్డీ రేటువే. 2014లో చైనా డెవలప్‌మెంట్‌ బాంకు నుంచి తీసుకున్న 40కోట్ల డాలర్లకు మాత్రం మూడు నుంచి ఐదుశాతం వరకు ఉంది. ఇతరంగా విదేశాల నుంచి తీసుకున్న రుణాలన్నీ ఐదుశాతం కంటే ఎక్కువ రేటున్నవే. శ్రీలంకలో మన దేశం కూడా ఒక ప్రాజెక్టు నిర్మించింది.మెడెవాచచియా నుంచి మన్నార్‌ రైల్వేలైనుకు మన దేశం మూడు శాతం వడ్డీతో 16.4 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది.ఆ మార్గంలో తిరిగే రైల్లో రోజుకు రెండు వందల మంది కూడా ప్రయాణించటం లేదని, పెట్టుబడి వృధా అయిందనే విమర్శలు వచ్చాయి. ఏ దేశంలో ఏ ప్రాజక్టు నిర్మించినా దాని బాగోగులకు అక్కడి ప్రభుత్వానిదే బాధ్యత తప్ప రుణమిచ్చిన వారు, నిర్మించిన సంస్దలది బాధ్యత ఎలా అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యా మీద ఆంక్షలు – అమెరికా అసలు లక్ష్యం ఇంధన మార్కెట్‌ కబ్జా !

05 Tuesday Apr 2022

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

fuel politics, Narendra Modi, oil, Sanctions on Russia, US crude to India, US imperialism


ఎం కోటేశ్వరరావు


” మన దేశానికి ముందు ఇంధన భద్రత ముఖ్యం, ఎక్కడైనా చౌకగా చమురు దొరికితే అక్కడ ఎందుకు కొనకూడదు ? రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాం, పెద్ద మొత్తంలో ఇప్పటికే వచ్చింది, మొత్తంగా దేశ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటాం ” అని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. నిజమే కదా ! అభ్యంతర పెడుతున్నది ఎవరు? అమెరికా ! దాన్ని ఒక్కమాట అనలేకపోవటం దేశ ప్రయోజనాలకోసమేనా అన్నది ప్రశ్న. 2021ఏడాది మొత్తంగా మన దేశం రష్యానుంచి కొనుగోలు చేసిన చమురు 16 మిలియన్ల పీపాలు, ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారం నుంచి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన మొత్తం 13మి.పీపాలు. ఇది పెద్ద పెరుగుదలే ఐనా మన దిగుమతుల మొత్తంలో రెండుశాతం లోపే అన్నది గమనించాలి.


ఉక్రెయిన్‌-రష్యా వివాదం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నందున మనం కూడా ధరలు పెంచకతప్పటం లేదని కేంద్ర మంత్రులు, బిజెపి నేతలు నమ్మబలుకుతున్నారు ఇది పూర్తిగా నిజమా ? నవంబరు నాలుగు నుంచి 137 రోజుల పాటు వినియోగదారుల చమురు ధరలను కేంద్ర ప్రభుత్వం( ప్రభుత్వరంగ సంస్ధల ద్వారా) స్ధంభింప చేసింది. మార్చినెల 21వ తేదీ నుంచి పెంపుదలకు శ్రీకారం చుట్టారు. గతంలో మనకు చెప్పిందేమిటి ? అంతర్జాతీయంగా ఎంత ధర పెరిగితే అంత మొత్తాన్ని జనాల నుంచి వసూలు చేస్తాము, ఎంత తగ్గితే అంత మేరకు రోజూ ఉదయాన్నే తగ్గిస్తామని, ఇది విధాన నిర్ణయం అన్నారు. మరి అది 137 రోజుల పాటు ఎందుకు అమల్లో లేదు.ఐదు రాష్ట్రాల ఎన్నికలకోసమే అని ప్రతిపక్షాలు అంటే కాదన్నారు తప్ప కారణం చెప్పలేదు. గట్టిగా అడిగితే దేశభక్తులతో గొడవెందుకని సర్దుకుపోదాం రండి అన్నట్లుగా జనం ఉన్నారు. చిత్రం ఏమిటంటే మార్చి 21 నుంచి మన దేశంలో చమురు ధరలు పెరుగుతుంటే అంతర్జాతీయంగా తగ్గుతున్నాయి. దీని భావమేమి గోమాతా !


మార్చినెల తొమ్మిదవ తేదీన మనం కొనుగోలు చేసే పీపా చమురు ధర 128.24 డాలర్లు. అది తరువాత క్రమంగా తగ్గుతూ ఏప్రిల్‌ ఒకటవ తేదీన 103.02 డాలర్లు(కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలసిస్‌ సెల్‌ ) ఉన్నట్లు నాలుగవ తేదీన ప్రకటించింది. మరి ఈలెక్కన పెంపుదల-తగ్గించటం ఉంటే జనాలకు ధరలు తగ్గాలి. మార్చి 22వ తేదీ ధరను ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ అది 113.41 డాలర్లే, దాని ప్రకారం చూసినా తగ్గాల్సింది పోయి ” తగ్గేదేలే ” అన్నట్లుగా పెంచుతున్నారు. ఎందుకని ? ప్రజా ప్రయోజనాల కోసమే అనుకుందామా ? లక్షల కోట్లు ప్రజల కోసం కుమ్మరించామని ఒక నోటితో చెబుతారు, వాటితో పోలిస్తే 137 రోజులో చమురు సంస్ధలకు వచ్చినట్లు చెప్పిన నష్టమెంత కేవలం 19వేల కోట్ల రూపాయలు. ఇంత చిన్న మొత్తాన్ని భరించలేని దుస్ధితిలో కేంద్ర ప్రభుత్వం ఉందా ?


నిజానికి ఇది పాక్షిక అంచనాగానే భావించాలి. ఇది వచ్చిన నష్టం, కంపెనీలకు రావాల్సిన లాభాలు కూడా కలుపుకుంటే ఇంకా ఎక్కువ ఉండవచ్చు. ఈ కారణంగానే నిలిపివేసిన మొత్తాన్ని ఇప్పుడు వసూలు చేస్తున్నారు. మనం కొనుగోలు చేసిన ముడి చమురు సగటు ధర నవంబరు నెలలో 80.64డాలర్లు, డిసెంబరులో 73.30, జనవరిలో 84.67, ఫిబ్రవరిలో 94.07, మార్చినెలలో 112.87 డాలర్లుంది. తొలుత ఈ మొత్తాన్ని లెక్కించి వచ్చిన లోటును వసూలు చేస్తారు, అందుకే అంతర్జాతీయ మార్కెట్లో మార్పులతో నిమిత్తం లేకుండా వరుసగా పెంచుతున్నారు. పైసా వసూలు మొత్తం జరిగిన తరువాత పెరుగుదలను బట్టి వడ్డింపు ఉంటుంది.


ప్రస్తుత ధరల(మార్చిచివరి వారం) ప్రకారం చమురు కంపెనీలు లీటరుకు రు.15 తక్కువ ధరకు విక్రయిస్తున్నాయని, ఈ మేరకు ధరలు పెంచవచ్చన్నది ఒక అంచనా. ఏప్రిల్‌ 5వ తేదీ పెంపుతో లీటరు పెట్రోలు ధర ఢిల్లీలో రు.104.61 ఉంది, అంటే ఇప్పటికే రు.9.20 పెరిగింది. దీపావళి కానుక పేరుతో ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది రూపాయల సెస్‌ తగ్గించింది. గోళ్లూడగొట్టి వసూలు చేస్తున్న దానిలో ఆ మేరకు తగ్గింపు మంచిదే కదా అనుకున్నాం. ఇప్పుడు పెంచిన ధరలతో అది కూడా హరించుకుపోయింది. ఒక లీటరు మీద ఒక రూపాయి సెస్‌ తగ్గిస్తే కేంద్రానికి ఏటా పదిహేనువేల కోట్ల ఆదాయలోటని అంచనా.దీన్నే జనం వైపు నుంచి చూస్తే ఒక రూపాయి పెంచితే అంతే మొత్తం భారం అవుతుంది. నరేంద్రమోడీ సర్కార్‌ అధికారానికి వచ్చిన తొలి ఏడాది కేంద్ర ప్రభుత్వానికి చమురు మీద ఎక్సైజ్‌ డ్యూటీ లేదా సెస్‌ ఖాతా కింద వచ్చిన రాబడి 2014-15లో రు.99,068 కోట్లు కాగా 2020-21లో వచ్చిన మొత్తం రు.4,19,884 కోట్లు.


ఇంధన ధరలు బాగా తగ్గినపుడు ఆ మేరకు వినియోగదారులకు తగ్గకుండా మన్మోహన్‌ సింగ్‌ గారి ” చెడు ” రోజులు చివరిలో లేదా నరేంద్రమోడీ గారి ” మంచి రోజుల ” ప్రారంభంలో లీటరు పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వ పన్ను రూ.9.48, 3.56 చొప్పున ఉంటే దాన్ని పెంచారు. తాజా తగ్గింపునకు ముందు రూ.32.98, 31.83 చొప్పున ఉంది.పెట్రోలుపై లీటరుకు ఐదు, డీజిలుపై పది రూపాయల భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఈ పెంచిన పన్ను, మరోసారి చమురు ధరల పెంపుదల ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. అందువలన అది జరిగి జన జీవితాలు అతలాకుతలం కాకుండా ఉండాలంటే ఇంధనం మీద పన్నులను తగ్గించాలని ఆర్ధికవేత్తలందరూ మొత్తుకుంటున్నారు. కేంద్ర పాలకులు దాని గురించి మాట్లాడటం లేదు. రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించవచ్చు కదా అని ఎవరైనా సన్నాయి నొక్కులు నొక్కవచ్చు. కేంద్ర ప్రభుత్వం భారీగా పన్ను పెంచినపుడు బిజెపి అధికారంలో ఉన్న చోట్లతో సహా ఏ రాష్ట్రం కూడా ఈ రీతిలో పన్ను పెంచలేదు. ఒకటీ అరా రాష్ట్రాలు రూపాయో,రెండో ఇంకాస్త ఎక్కువో సెస్‌లు మాత్రమే పెంచాయి. కేంద్రం మాత్రం పన్నుల పెంపుదలతో పాటు అంతకు ముందు ఇస్తున్న రాయితీలను కూడా ఎత్తివేసి ఎంత పెరిగితే అంత మొత్తాన్ని వినియాగదారుల నుంచి వసూలు చేస్తున్నది. అందువలన కేంద్రం ముందుగా తాను పెంచిన వాటిని పూర్తిగా తగ్గించి రాష్ట్రాలను కూడా తగ్గించమనటం సమంజసం. లేదా చమురు ఉత్పత్తులను కూడా జిఎస్‌టి పరిధిలోకి తేవాలి. ఆ మేరకు రాష్ట్రాలకు తగ్గిన రాబడిని కేంద్రం భరిస్తే అదొకదారి. ఇప్పటికే పరిమిత ఆదాయ వనరులున్న రాష్ట్రాలను తగ్గించమనటం సబబు కాదు.


ఏప్రిల్‌ మూడుతో ముగిసిన వారంలో అంతర్జాతీయ చమురు ధరలు పదమూడుశాతం తగ్గాయి. ఒక వారంలో ఇంత పెద్ద మొత్తంలో గత రెండు సంవత్సరాల్లో జరగలేదు. ఈ తగ్గుదలకు కారణం సౌదీ అరేబియా – ఎమెన్‌లోని హౌతీ(షియా) తెగ తిరుగుబాటుదార్లతో కుదిరిన ఒప్పందం మేరకు చమురు సరఫరాలకు ఆటంకం తొలగటం ఒక కారణంగానూ, అమెరికా తన వ్యూహాత్మక నిల్వల నుంచి ఒక మిలియన్‌ పీపాల విడుదలకు బైడెన్‌ ప్రకటన దోహదం చేసిందని వార్తలు వచ్చాయి. ఈ పరిణామం జరిగినపుడు బ్రెంట్‌ రకం ధర 103.38డాలర్లుంటే ఏప్రిల్‌ ఐదున ఇది 109 డాలర్లుగా ఉంది అందువలన చమురు ధరల పెరుగుదలాపతనానికి ఏకైక కారణం ఏదీ కనిపించటం లేదు. ఎవరైనా ఉక్రెయిన్‌ – రష్యా వివాదాన్ని సాకుగా చూపితే కుదరదు.


రష్యా నుంచి చమురు కొనుగోలు వద్దని మన దేశాన్ని అమెరికా వత్తిడి చేస్తోంది. దాన్ని తెరవెనుక నుంచి చూస్తే తమ నుంచి ఇంకా ఎక్కువ మొత్తం కొనుగోలు చేసి తమ కార్పొరేట్లకు లబ్ది చేకూర్చాలన్న వత్తిడి కనిపిస్తుంది. రాయిటర్స్‌ వార్తా సంస్ద పేర్కొన్న సమాచారం ప్రకారం జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో అమెరికా నుంచి మన దేశం కొనుగోలు చేసే చమురు 48శాతం పెరిగింది. దీంతో మన దేశం దిగుమతి చేసుకొనే చమురువాటా అమెరికా నుంచి 14శాతానికి చేరింది. దశాబ్దాల తరబడి మనతో సత్సంబంధాలు కలిగి ఉన్న పశ్చిమాసియా దేశాల నుంచి చమురు కొనుగోలు తగ్గించి అమెరికా వైపు నరేంద్రమోడీ సర్కార్‌ మొగ్గటానికి రాజకీయ కారణాలు, అమెరికా చమురు కంపెనీల ప్రభావం ప్రధాన కారణం. మన దిగుమల్లో ఇరాక్‌ ప్రధమ స్ధానంలో ఉండగా ఇప్పటివరకు రెండవదిగా ఉన్న సౌదీ అరేబియాను ఇప్పుడు అమెరికా వెనక్కు నెట్టేసింది. గతంలో చమురు దిగుమతి దేశంగా ఉన్న అమెరికా ఇప్పుడు ఎగుమతిదారుగా మారింది. అందువలన అక్కడి కార్పొరేట్లకు మార్కెట్‌ను సంపాదించేందుకు వైట్‌హౌస్‌లో పాలకులు ఎవరున్నా ఒకేదెబ్బతో అనేక దేశాలను తమ ఖాతాదారులుగా మార్చుకొనేందుకు పూనుకున్నారు.


మన కంటే ఎక్కువ మొత్తం దిగుమతి చేసుకొనే చైనాకు అమెరికాతో ఉన్న వైరం కారణంగా అది దిగుమతి చేసుకోవటం లేదు. మన దేశం ఇప్పటికే అమెరికా వలలో పడింది. మధ్యప్రాచ్య లేదా పశ్చిమాసియా నుంచి మన దిగుమతుల్లో 52.7శాతం ఉండగా ఆఫ్రికా నుంచి 15, అమెరికా నుంచి 14శాతం ఉంది. వీటితో పోల్చుకుంటే రష్యానుంచి దిగుమతి చేసుకుంటున్నది 1-2శాతం మధ్యలో ఉంది. దీన్ని కూడా నిలిపివేయాలని మన నరేంద్రమోడీని అమెరికా ఆదేశిస్తున్నది. మన దేశ ఎగుమతుల్లో నాలుగో వంతు శుద్ది చేసిన చమురు లేదా చమురు ఉత్పత్తులు ఉన్నాయి. అందువలన చమురు శుద్ది కంపెనీలు రష్యానుంచి తక్కువ ధరలకు దిగుమతి చేసుకుంటే ఎగుమతులకు దాన్ని వినియోగిస్తే ఆ కంపెనీలకు లాభం. ఐరోపా దేశాలు రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లను నిలిపివేస్తే ఐరోపా మార్కెట్లో పాగావేసేందుకు అమెరికా పూనుకుందన్నది స్పష్టం. ప్రపంచంలో చైనా తరువాత రెండో పెద్ద దిగుమతిదారుగా ఉన్న మన మార్కెట్‌ను కూడా కబళించేందుకు పూనుకుంది. బహుశా ఆ ఎత్తుగడతో కూడా రష్యాను మన నుంచి వేరే చేసేందుకు పూనుకున్నట్లు భావించవచ్చు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాల పాటలకు(ఆంక్షలకు) అనుగుణంగా ఇప్పటికే మనదేశంతో నరేంద్రమోడీ డాన్స్‌ చేయిస్తున్నారు. దాన్లో óభాగంగానే ఇరాన్‌, వెనెజుల నుంచి చమురు కొనుగోళ్లను ఆపివేశారు. గతంలో వెనెజులా నుంచి మన అవసరాల్లో 12శాతం, ఇరాన్‌ నుంచి ఆరుశాతం దిగుమతి చేసుకున్న ఉదంతాలున్నాయి.ఇలా లొంగిపోయిన కారణంగానే ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలు వద్దనే ధైర్యం అమెరికాకు వచ్చింది.


మరో వైపు అదే అమెరికా చేస్తున్నదేమిటి ? రాయిటర్స్‌ మార్చి ఎనిమిదవతేదీ వార్తా కథనం ప్రకారం అమెరికా 2021లో రోజుకు 6,72,000 పీపాల ముడి చమురు లేదా చమురు ఉత్పత్తులను రికార్డు స్దాయిలో రష్యానుంచి దిగుమతి చేసుకుంది. దీనిలో 1,99,000 పీపాల చమురు ఉంది. అమెరికా గల్ఫ్‌ తీరంలో వచ్చిన భారీ తుపాన్ల కారణంగా దిగుమతులను ఎక్కువగా చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆంక్షలతో నిమిత్తం లేకుండానే రోజుకు 57వేల పీపాలకు కొనుగోళ్లను తగ్గించి, తిరిగి లక్ష పీపాలకు పెంచినట్లు వార్తలు.ఈ నెల 22లోగా లావాదేవీలను నిలిపివేయాలని అమెరికా ఆర్ధికశాఖ కోరింది. మనం వెంటనే కొనుగోలు నిలిపివేయాలని చెబుతున్న పశ్చిమ దేశాల్లో ఒకటైన బ్రిటన్‌ తాను మాత్రం ఈ ఏడాది చివరి నాటికి దశలవారీగా రష్యా దిగుమతులను నిలిపివేస్తుందట.


తాజాగా అమెరికా తమ నుంచి కొనుగోళ్ల మొత్తాన్ని 43శాతం పెంచినట్లు రష్యా భద్రతామండలి ఉప కార్యదర్శి మిఖాయిల్‌ పొపోవ్‌ ఏప్రిల్‌ మూడున చెప్పాడు. రోజుకు లక్ష పీపాలు దిగుమతి చేసుకుంటున్నట్లు, అత్యవసర వస్తువుల కింద మినరల్‌ ఎరువులను దిగుమతి కూడా చేసుకోవచ్చని అమెరికా కంపెనీలకు అనుమతిచ్చినట్లు తెలిపాడు. అమెరికా వద్ద చమురు పెద్ద మొత్తంలో ఉన్నప్పటికీ అక్కడి చమురుశుద్ది సంస్ధలకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొనే ముడిచమురుతో లాభాలు ఎక్కువగా వస్తున్నందున దిగుమతి చేసుకొని దాన్ని ఇతర దేశాలకు అధిక ధరలకు అమ్ముకొని లబ్ది పొందుతున్నాయి. అందుకే 2014 నుంచి అమెరికా సర్కార్‌ రష్యా మీద అనేక ఆంక్షలను విధించినప్పటికీ చమురు జోలికి పోలేదు. బైడెన్‌ ప్రకటించినట్లు నిజంగానే అమెరికా పూర్తి నిషేధం అమల్లోకి వస్తే అక్కడి కార్పొరేట్‌ శక్తులు అంగీకరిస్తాయా ? తమ మార్కెట్‌ను అమెరికాకు అప్పగిస్తే వచ్చే పర్యవసానాలను ఐరోపా దేశాలు ఆలోచించుకోవా ? చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ సంక్షోభం : రైతాంగానికి గోడదెబ్బ-చెంపదెబ్బ !

31 Thursday Mar 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Farmers, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, burden on farmers, fertilizer prices enhancement, Fertilizers subsidies, India fertilizer prices, India's farmers, Narendra Modi, Ukraine-Russia crisis


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. విమానంలో వెళితే 5,089, రోడ్డు మార్గమైతే 6,528 కిలోమీటర్ల దూరంలో అది జరుగుతోంది. కానీ దాని ప్రభావం అనేక రూపాల్లో మనకు దూరంతో నిమిత్తం లేకుండా స్వానుభవంలోకి వస్తోంది. కలికాల మహిమ కాదు ప్రపంచీకరణ పర్యవసానమిది. దీని వెనుక ఉన్న అమెరికా,దాని గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. అన్ని తరగతుల కష్టజీవులను ఇబ్బంది పెడుతోంది. ఈ సందర్భంగా దేశానికి అన్నంపెట్టే రైతన్నకు ఈ యుద్దం ఎలాంటి ఇబ్బందులను కలిగిస్తుందో చూద్దాం. భారత్‌లో తీవ్ర కొరత మధ్య ఎరువుల ధరలు భారీగా పెరుగుతాయని అంతర్జాతీయ స్టాక్‌మార్కెట్‌ సూచీల కదలికల మీద విశ్లేషణలు అందించే ఎస్‌ అండ్‌ పి(స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌) సంస్ధ మార్చి 30వ తేదీన పేర్కొన్నది.


ప్రపంచం మొత్తం మీద వంద కిలోల ఎరువుల ఉత్పత్తి జరిగితే పద మూడు కిలోలు రష్యాలో తయారవుతాయి. వాటి నుంచి మనతో సహా అనేక దేశాలు తెచ్చుకుంటాయి.2022 మార్చినెల ప్రారంభంలో ఎరువుల ఎగుమతులను అక్కడి ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించింది. ఫిబ్రవరి ఆఖరు నాటికి మన దేశంలో 8.12మిలియన్‌ టన్నుల డిఏపి, 1.9మి.టన్నుల ఎంఓపి, 7.7మి.టన్నుల ఎన్‌పికె మిశ్రమ ఎరువుల నిల్వలున్నాయని, అవి వచ్చే ఖరీఫ్‌ పంటకాలంలో అవసరమైన వాటి కంటే తక్కువని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్‌లో 65.4మి.టన్నుల డిఏపి, 23.4మి.టన్నుల ఎంఓపి, 58.3మి.టన్నుల ఎన్‌పికె మిశ్రమ ఎరువుల అవసరం ఉంటుందని అంచనా.యూురియా 19.8మి.టన్నులు అవసరం కాగా ఫిబ్రవరి చివరి నాటికి 25.5మి.టన్నుల నిల్వలున్నాయని చెప్పినట్లు ఎస్‌ అండ్‌ పి పేర్కొన్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే ఎంఓపి, డిఏపి ధరలు 30-40శాతం పెరిగాయని, రానున్న రోజుల్లో పెరిగే ధరలు, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను బట్టి రైతులకు ఏ ధరలకు ఎరువులు దొరుకుతాయనేది చెప్పలేమని ఇండియా రేటింగ్స్‌ విశ్లేషకుడు భాను పాట్ని చెప్పారు.


తమ శత్రుదేశాలకు తాము ఎగుమతి చేసే సరకులకు రూబుళ్లలోనే సొమ్ము చెల్లించాలని రష్యా అధినేత పుతిన్‌ ప్రకటించాడు. మన దేశం ఆ జాబితాలో లేనందున రూపాయి-రూబుల్‌ లావాదేవీలకు అవకాశం ఉంది.మనం అమెరికా, నాటో దేశాల ఆంక్షలను ఖాతరు చేయనప్పటికీ నౌకలపై ఆంక్షలు, బీమా సౌకర్యం వర్తించవనే అనుమానాల నేపధ్యంలో రవాణా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రభుత్వం సబ్సిడీని పెంచని పక్షంలో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల ఉంటుంది. ఎరువుల ధరల పెరుగుదల వలన సాగు విస్తీర్ణం తగ్గవచ్చని, సూపర్‌(ఎస్‌ఎస్‌పి) వంటి ఇతర ఎరువుల వైపు రైతులు మరలవచ్చని చెబుతున్నారు. గాస్‌ ధరల్లో ప్రతి ఒక్క డాలరు పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తం రు.4000-5000 కోట్ల వరకు అదనంగా ఇవ్వాల్సి ఉంటుందని ఎస్‌బిఐ పరిశోధనా బృందం వెల్లడించిన ఒక పత్రంలో పేర్కొన్నారు.


నత్రజని ఎరువుల తయారీకి అవసరమైన ముడిపదార్దాల ధరల పెరుగుదల కారణంగా గత ఏడాది కాలంలో ఉత్పత్తి ఖుర్చు రెండున్నర రెట్లు పెరిగినట్లు కంపెనీలు చెబుతున్నాయి. మన అవసరాల్లో 25శాతం యూరియా, 90శాతం ఫాస్పేట్‌ ఎరువులు లేదా ముడిపదార్ధాలను, నూటికి నూరుశాతం పొటాష్‌ ఎరువులను దిగుమతి చేసుకుంటున్నాము.2021 ఆర్ధిక సంవత్సరంతో పోల్చితే 2022లో(ఏప్రిల్‌-జనవరి కాలంలో) రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్న యూరియా విలువ 27.15 మిలియన్‌ డాలర్ల నుంచి 123.79మి.డాలర్లకు పెరిగింది, ఉక్రెయిన్‌ నుంచి 2021జనవరి నాటికి 368.79మి. డాలర్ల మేరకు దిగుమతి చేసుకున్నాము. రష్యా ఎరువుల ఎగుమతులపై తాత్కాలిక ఆంక్షలు విధించగా ఉక్రెయిన్నుంచి సరఫరాలు అనిశ్చితంగా మారాయి. ఇతర దేశాల నుంచి ఏదో విధంగా తెచ్చుకున్నా సబ్సిడీల మొత్తం పెరగనుంది. ప్రస్తుతం కేటాయించిన రు.1.05లక్షల కోట్లు చాలకపోతే పెరిగిన మొత్తాన్ని రైతుల మీద మోపాలి లేదా బడ్జెట్‌ మొత్తాలను పెంచాల్సి ఉంటుంది. ఫాక్టంఫాస్‌(20-20-0-13) ధరలు గత పది నెలల కాలంలో బస్తా ధర రు.500 పెరిగి ఇప్పుడు రు.1,490కి చేరింది.

పాత స్టాక్‌ పూర్తిగా అమ్ముడు పోయిన తరువాత పెరిగిన కొత్త ధరలు అమల్లోకి వస్తాయని ఎరువుల కంపెనీలు కొద్ది నెలల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటికి ఉక్రెయిన్‌ – రష్యా వివాదం లేదు. అంతకు ముందు అంతర్జాతీయంగా పెరిగిన ఎరువుల ధరలు, దేశీయంగా పెరిగిన ఖర్చుల కారణంగా ఎంత మేరకు ధరలు పెంచవచ్చో కంపెనీలు తమ అంతర్గత సమాచారంలో డీలర్లకు తెలిపా యి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. కంపెనీలు తాజా పరిణామాలను కూడా గమనంలోకి తీసుకొని వాటిని ఇంకా పెంచటమే తప్ప తగ్గించేది ఉండదు. ఇఫ్‌కో సంస్ధ ప్రకటించిన దాని ప్రకారం ఎరువుల ధరల పెంపుదల ప్రతిపాదన ఇలా ఉంది.( యాభై కిలోల ధర రూపాయలలో )
ఎరువు రకం××××× పాత ధర×××× కొత్త ధర
10:26:26×××××× 1,175 ×××× 1,775
12:32:16×××××× 1,185 ×××× 1,800
20:0:13 ×××××× 925 ×××× 1,350
డిఏపి ×××××× 1,200 ×××× 1,900
ఎరువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా సబ్సిడీ మొత్తాన్ని కేంద్రప్రభుత్వం పెంచని పక్షంలో ఆ భారం రైతుల మీదనే పడుతుంది.దీనికి తోడు డీజిలు, పెట్రోలు ధరల భారం రైతుల మీద పడనుంది. చిన్న కమతాల్లో కూడా యంత్రాల వాడకం పెరిగినందున ఆ మేరకు ఖర్చు రైతులే భరించాల్సి ఉంటుంది.ఇది గోడదెబ్బ-చెంపదెబ్బ వంటిదే. పెద్ద మొత్తంలో ఒకేసారి కొనుగోలు చేసే వారికి లీటరుకు డీజిలు ధరను రు.25పెంచుతూ చమురు సంస్ధలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. మానసికంగా అంతభారం భరించకతప్పదని జనాన్ని సిద్దం చేసేందుకే అలా చేశారు. ఆ మేరకు చిల్లర కొనుగోలుదార్లకు పెరగనున్నాయి.ఒకేసారి పెంచితే నిరసన వెల్లడౌతుందనే భయంతో మార్చి నెల 21వ తేదీ నుంచి రోజూ కొంత చొప్పున పెంచుతున్నారు. వీటికి అంతర్జాతీయ మార్కెట్‌తో సంబంధం లేదు. గత లోటును పూడ్చుకున్న తరువాత ధరలనుబట్టి నిరంతర పెరుగుదల ఎలానూ ఉంటుంది.


బెలారస్‌ నుంచి పొటాష్‌, రష్యానుంచి ఫాస్ఫేట్‌ ఎరువుల దిగుమతి అనిశ్చితంగా మారిందని రేటింగ్స్‌ సంస్ధ ఇక్రా పేర్కొన్నది. ఈ రెండు దేశాలు ప్రపంచ ఎగుమతుల్లో నలభైశాతం పొటాష్‌ను సరఫరా చేస్తున్నాయి. అమోనియాలో 22, అమోనియం ఫాస్పేట్‌ , యురియా 14శాతాల చొప్పున రష్యా ఎగుమతులు చేస్తున్నది. రక్షణ భయంతో నౌకలు నల్లసముద్రం వైపు వెళ్లేందుకు సుముఖత చూపటం లేదు. ఎరువుల సరఫరాకు అంతరాయం కలిగితే అది ఆహార ధాన్యాల ఉత్పత్తుల మీద కూడా ప్రభావం చూపుతాయి.ఉక్రెయిన్‌-రష్యా వివాదం కారణంగా ఎరువులు, పురుగుమందుల ధరలు 11 నుంచి 15శాతం పెరుగుతాయని కోటక్‌ మహేంద్ర సంస్ధ పేర్కొన్నది. కంపెనీలు, రైతులకు ఖర్చు పెరిగిన కారణంగా కనీస మద్దతు ధరలను పెంచవచ్చని కూడా జోశ్యం చెప్పింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి-మార్చి నెలల కాలంలో అమోనియా ధరలు 200శాతం, పొటాష్‌ ధర 100శాతం పెరిగిందని ఎలారా కాపిటల్‌ తన నివేదికలో పేర్కొన్నది. సబ్సిడీ మొత్తాన్ని ఆ మేరకు పెంచని పక్షంలో రైతులే పెరిగిన మొత్తాలను భరించాల్సి ఉంటుందని తెలిపింది. సరఫరాలో ఇబ్బందులు తలెత్తవచ్చనే అంచానాతో ఎరువుల కంపెనీల వాటాలను కొనుగోలు చేసేందుకు మదుపుదార్లు ఎగబడటంతో గత నెలలో కొన్ని కంపెనీల వాటాల ధరలు 50శాతం పెరగ్గా సగటున 20శాతం పెరుగుదల నమోదైంది. మద్రాస్‌ ఫర్టిలైజర్స్‌ ధరలు 76.7శాతం పెరిగాయి.


రైతులకు అవసరమైన ఎరువులు, చమురు ధరల పెరుగుదల ప్రపంచమంతా ఆందోళన కలిగిస్తున్నది.లాటిన్‌ అమెరికాలోని బ్రెజిల్‌ రైతాంగం మొక్కజొన్న పంటకు ఎరువుల వాడకాన్ని తగ్గించగా, పొటాష్‌కు డిమాండ్‌ పెరగటంతో సొమ్ము చేసుకొనేందుకు అమెజాన్‌ ప్రాంతంలోని రక్షిత భూమిపుత్రుల(మన దగ్గర గిరిజనులు అంటున్నాం) భూముల్లో పొటాష్‌ను వెలికి తీసేందుకు అనుమతించాలని పాలకపార్టీ ఎంపీలు డిమాండ్‌ చేస్తున్నారు. ఆఫ్రికాలోని జింబాబ్వే, కెన్యాలో చిన్న రైతులు ఎరువుల వాడకాన్ని తగ్గించారు. ఉత్తర అమెరికాలోని కెనడాలో ముందు జాగ్రత్త చర్యగా కనోలా రైతులు 2023కు కూడా ఇప్పుడే నిల్వలు చేసుకుంటున్నట్లు వార్తలు. ఇప్పటికే ధరలు పెరగ్గా వచ్చే ఏడాది ఇంకా పెరుగుతాయని వారు భావిస్తున్నారు. అమెరికాలో గతేడాది ఎరువుల ధరలు 17శాతం పెరగ్గా, ఈ ఏడాది 12శాతంగా ఉండవచ్చని అంచనా. కొందరు రైతులు తక్కువ ఎరువులతో పండే పంటల వైపు చూడటం, సాగు తగ్గించాలనే ఆలోచన చేస్తున్నారు. తమ పంటలకు ఎంత ధరలు వస్తాయనిగాక ఇంత ఖర్చు పెట్టి సాగులోకి దిగాలా, ఎరువుల సరఫరా ఉంటుందా అనే ప్రాతిపదికన ఆలోచించి రైతులు నిర్ణయాలు తీసుకుంటున్నారని అమెరికాలోని కొందరు ఎంపీలు అమెరికా అంతర్జాతీయ వాణిజ్యకమిషన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొనే ఎరువుల మీద పన్నులు తగ్గించాలని కోరారు. గతేడాది తన రైతుల రక్షణకు గాను చైనా ఎరువుల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ ఏడాది సడలించవచ్చని, అదే జరిగితే కొంత మేరకు ఇతర దేశాలకు సరఫరా పెరగవచ్చని భావించారు. ఇప్పుడేర్పడిన అనిశ్చిత పరిస్ధితుల్లో అది జరగకపోవచ్చని చెబుతున్నారు.


మూడు సాగు చట్టాలను రద్దు చేస్తూ కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించే అంశం మీద ఒక కమిటీని వేస్తామని కేంద్రం ప్రకటించి నెలలు గడిచినా మాటల్లేవు, చేతల్లేవు.2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న కబుర్లు ఇప్పుడు ఎక్కడా వినిపించటం లేదు. పెంచుతున్న చమురు ధరలకు అంతర్జాతీయ పరిస్ధితులు కారణమని కేంద్ర మంత్రులు చెబుతున్నారు. ఎరువుల ధరలకూ ఇదే పాటపాడతారా ? భారం మొత్తాన్ని రైతుల మీదనే వేస్తారా ? అదే జరిగితే గ్రామీణ భారతంలో పరిస్ధితులు మరింత దిగజారుతాయి. మొత్తంగా ధరలు పెరుగుతాయి.

.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అచ్చేదిన్‌ నరేంద్రమోడీ కాపీ నినాదం ! ఎనిమిదేండ్ల ఏలుబడిలో ఆవిరైన సంతోషం !!

22 Tuesday Mar 2022

Posted by raomk in Current Affairs, Economics, Health, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Narendra Modi Failures, World Happiness Index 2022, World Happiness India Index


ఎం కోటేశ్వరరావు
సంతోషం అంటే ఏమిటి అంటే ప్రపంచంలో ఒక నిర్ణీత నిర్వచనం లేదా నిర్దిష్ట అర్ధం లేని పదాల్లో ఒకటి. చిత్రం ఏమిటంటే ప్రతివారూ సంతోషాన్ని కోరుకుంటారు. అదానీ రోజుకు రు.1002 కోట్లు సంపాదిస్తున్నదాన్ని రెట్టింపు చేసుకోవటం సంతోషాన్ని కలిగిస్తుంది. నిత్యం ఏదో ఒక సమస్యతో కొట్టుమిట్టాడే అభాగ్యులకు ఆరోజు పని దొరికి వచ్చిన సొమ్ముతో పెళ్లాంబిడ్డల కడుపునింపితే ఎనలేని సంతోషం. ఇహలోకంలో నీతులు, రీతులు చెబుతూ స్వర్గంలో అవేవీ లేకుండా మనతాత, ముత్తాతలు, తండ్రులకు సేవలందించిన రంభ ఊర్వశి, మేనకలతో సౌఖ్యం పొందాలని ఉవ్విళ్లూరే వారికి కలిగే సంతోషం గురించి చెప్పేదేముంది. ఒకరికి మోదం అనుకున్నది మరొకరికి ఖేదం కలిగిస్తుంది. ఉక్రెయిన్లో రష్యా సైనిక చర్య, అంతకు ముందు కొన్ని సంవత్సరాలుగా కొన్ని దేశాల మీద జరుగుతున్న పెత్తందారీ దేశాల దాడులు ఆగిపోతే అక్కడి జనాలకే కాదు, ప్రపంచవ్యాపితంగా సంతోషమే. కానీ జనాలు సంతోషంగా ఉంటే తాము తయారు చేస్తున్న మారణాయుధాలకు మార్కెట్‌ ఉండదని వాటిని తయారు చేస్తూ నిత్యం ఎక్కడో ఒక చోట తంపులు పెట్టే అమెరికా,బ్రిటన్‌ వంటి బడాదేశాల కార్పొరేట్‌లకు సంతోషం కరవు. రక్తం తాగే ఇలాంటి వారిని వదలివేస్తే మిగతా జనాలకు సంతోషమే సగము బలము అన్నది తిరుగులేని సత్యం. దాన్ని కొలిచే సాధనాలేవీ లేవు. సంతోషంగా ఉండాలన్నది ప్రతి ఒక్కరి వాంఛ.దాన్ని గనుక ప్రాధమిక రాజ్యాంగహక్కుగా చేసి ఉంటేనా !


ఐక్యరాజ్యసమితి నిరంతర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఆమోదించిన వాటిని ఏమేరకు అమలు చేస్తున్నారో కొలిచేందుకు రూపొందిస్తున్నదే ప్రపంచ సంతోష సూచిక. ప్రతి ఏటా ప్రచురించే దీని వివరాల మేరకు 2022 సూచికలో 146 దేశాలకు గాను మనం 136వ స్ధానంలో ఉన్నాము. గతేడాది కంటే 0.236 పాయింట్లు పెంచుకొని 139 నుంచి 136కు ఎగబాకాము. ఇది నిజంగా మోడీ భక్తులు పండగచేసుకొనే అంశమే. ఆగండి అప్పుడే రంగులు చల్లుకోవద్దు.2013లో 111వ స్ధానంలో ఉన్నది, 2015లో 117కు తరువాత 2020లో 144వ స్ధానానికి దిగజారింది. తిరిగి పూర్వపు స్ధానానికి ఎప్పుడు చేరుకుంటామో, జనాలకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయో చెప్పి మరీ పండగ చేసుకోవాలి. నూటపదకొండులో ఉన్నపుడే మన్మోహన్‌ సింగ్‌ పాలనను జనం భరించలేకపోయారు. తరువాత దిగజారినా మోడీకి మరొక అవకాశం ఇచ్చి చూద్దామని జనం భావించారు, భరిస్తున్నారు. గొర్రె కసాయిని నమ్ముతుందని ఎందుకు మన పెద్దలు అనుభవసారంగా చెప్పారో ఆలోచిద్దాం.


జనం ఆశించిన సంతోషానికి కారణమైన నరేంద్రమోడీ అచ్చేదిన్‌ నినాదం అసలు కథ తెలుసా ? నరేంద్రమోడీ, బిజెపి 2014 ఎన్నికలకు ముందు ఓం శ్రీరామతో పాటు అచ్చేదిన్‌ అనే నినాదాన్ని కూడా తారకమంత్రంగా జపిÄంచారు. తరువాత ఎక్కడా మాట్లాడటం లేదు. నినాదాలను కాపీ కొట్టటంలో నరేంద్రమోడీ పెద్ద మాస్టర్‌. కొందరికిది ఆగ్రహం కల్పించినా నిజం నిజమే కదా ! కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్వయంగా ఈ సంగతి చెప్పినట్లు 2016 సెప్టెంబరు 20 తేదీ టైమ్స్‌ఆఫ్‌ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. 2012 జనవరి ఎనిమిదిన జైపూర్‌లో జరిగిన ప్రవాస భారతీయ దినం సభలో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడారు. అంతకు ముందు తలెత్తిన ప్రపంచ మాంద్యం నుంచి భారత్‌ తప్పించుకున్నప్పటికీ తరువాత తలెత్తిన ఇబ్బందులను అధిగమిస్తామని ఎన్‌ఆర్‌ఐలకు భరోసా ఇచ్చారు. దేశంలో తలెత్తిన ద్రవ్యోల్బణం తమ ప్రభుత్వ ప్రతిష్టకు ఎలా మచ్చతెచ్చిందో చెబుతూ ఆరు సంవత్సరాల తరువాత ద్రవ్యోల్బణం తొలిసారిగా తిరోగమనంలో ఉందంటూ అబ్‌ అచ్చేదిన్‌ ఆనేవాలే హై ( ఇప్పుడు మంచి రోజులు రానున్నాయి) అన్నారు. వెంటనే నరేంద్రమోడీ ఆ మాటలను తనవిగా చేసుకొని మరుసటి రోజే దాడికి దిగారు. అదే సభలో జనవరి తొమ్మిదిన గుజరాత్‌ సిఎంగా మాట్లాడారు. ఆ సభలో ఉక్కు పరిశ్రమ దిగ్గజం ఎల్‌న్‌ మిట్టల్‌ కూడా ఉన్నారు. మిట్టల్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు లండన్‌లో తినే టమాటాలు, బెండకాయలు కూడా గుజరాత్‌లో పండించినవే అని అతిశయోక్తులను చెప్పారు. తరువాత 2014 ఎన్నికల ప్రచారంలో అచ్చేదిన్‌ నినాదాన్ని ముందుకు తెచ్చారు. మన్మోహన్‌ సింగ్‌ రెండు సంవత్సరాలకు ముందు చెప్పిందాన్ని ప్రస్తావిస్తూ ” హా మైనే భీ కహతా హుం కి అబ్‌ జల్దీ హై అచ్చేదిన్‌ ఆనే వాలే హై ” ( అవును నేను కూడా చెబుతున్నా ఇప్పుడు త్వరగా మంచి రోజులు రానున్నాయి) అని చెప్పారు. ఇప్పుడు ఆ నినాదమే తమ గొంతుల్లో పచ్చివెలక్కాయ మాదిరి ఇరుక్కుపోయిందని గడ్కరీ అన్నట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధి రాశారు. మంచి రోజులు రావని తెలిసీ జనాలు చప్పట్లు కొడుతున్నారని ఇచ్చిన నినాదాన్ని అవసరం తీరింతరువాత పక్కన పెట్టేశారు. ఓట్ల కోసం కొత్త నినాదాలు, మనోభావాలను ముందుకు తెచ్చే కొత్త అవకాశాల కోసం చూస్తున్నారు.


ఇక సంతోష సూచికల గురించి చూద్దాం. వరుసగా గత ఐదు సంవత్సరాల పాటు ఫిన్లండ్‌ సంతోష సూచికలో మొదటి స్ధానంలో వచ్చింది. మన దేశం చివరి పది స్దానాల్లో నిలిచింది. మనం ప్రతిదానికీ ఇరుగుపొరుగు దేశాలతో పోల్చుకుంటూ మన గొప్పలను చెప్పుకుంటున్నాము. సంతోష సూచికల్లో 2012 నుంచి(2014మినహా) 2022 వరకు తొమ్మిది సంవత్సరాల సగటు 128.8 కాగా కనిష్టం 111, గరిష్టం 144 ఉంది. ఇదే చైనా సగటు 85.6 కాగా కనిష్ట-గరిష్టాలు 2015-2022 ఎనిమిది సంవత్సరాలలో 79-94గా ఉన్నాయి. ఇక బ్రిక్స్‌, మన ఇరుగుపొరుగుదేశాల సంతోష సూచికలు ఇలా ఉన్నాయి.


దేశం××××××× 2022 సూచిక
బ్రెజిల్‌××××××× 34
రష్యా ××××××× 74
ఇండియా ××××× 136
చైనా ××××××× 82
ద.ఆఫ్రికా ××××× 101
నేపాల్‌ ××××××× 85
బంగ్లాదేశ్‌ ××××× 99
పాకిస్తాన్‌×××××× 103
మయన్మార్‌××××× 123
శ్రీలంక ××××××× 126
ఆఫ్‌ఘనిస్తాన్‌××××× 146
వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా సంతోష సూచికల్లో ప్రతి ఏటా మార్పులు ఉంటాయి.తలసరి జిడిపి, ఆరోగ్య జీవితప్రమాణం, సామాజిక మద్దతు, జీవన విధాన ఎంపిక అవకాశం, ఉదారత, అవినీతి వంటి అంశాలను పరిగణనలోకీ తీసుకొని ఇచ్చే మార్కుల ఆధారంగా సూచిక నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాలలో కొత్త అంశాలను కూడా చేరుస్తారు. కొన్ని దేశాలను పరిగణనలోకి తీసుకోకపోవచ్చు. అందువలన ప్రతి ఏడాదీ మార్కులు మారినా ఒక్కోసారి సూచికల్లో స్ధానం మారకపోవచ్చు. మన జనాల్లో ఉన్న ఒక అవాంఛనీయ వైఖరి ఏమంటే మన కంటే దిగువన ఉన్నవారిని ఎద్దేవా చేయటం, మనం మరికొందరి కంటే చాలా దిగువన ఉన్నామని మరచిపోవటం.


నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి ఎప్పటికప్పుడు కొత్త నినాదాలను ముందుకు తెచ్చి జనాన్ని ఆకర్షించటంలో, మభ్యపరచటంలో ఎంతో ముందుందనటం అతిశయోక్తి కాదు. చెప్పిన కథ చెప్పకుండా కొత్త కథలు చెబుతోంది. అచ్చేదిన్‌, గుజరాత్‌ నమూనా వృద్ది, నల్లధనం వెలికితీత, 2022 నాటికి నవభారతం, 2024నాటికి ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపి సాధన.2022 ఆగస్టు పదిహేను నాటికి లేదా ఏడాది ఆఖరుకు సాధిస్తామని చెప్పిన అంశాల గురించి చెప్పుకొని ఒక్కసారి సంతోషిద్దాం.
1.జిడిపి వృద్ది రేటు 9-10శాతంగా ఉంటుంది. పెట్టుబడుల రేటు 2022ా23 నాటికి 36శాతానికి పెంపుదల, పది నూతన కల్పనల జిల్లాల ఏర్పాటు.దాతలతో నైపుణ్యాల పెంపుదల, ఆరవ తరగతి నుంచి నైపుణ్య శిక్షణకు స్కూళ్లు. ప్రస్తుతం 5.4శాతంగా ఉన్న నైపుణ్య కార్మికులను కనీసం 15శాతానికి పెంచటం, మహిళాశ్రామిక శక్తి భాగస్వామ్యం 30శాతానికి పెంపు,ఆరోగ్య సంరక్షణ రంగంలో ఇరవై నుంచి 30లక్షలు, పర్యాటక రంగంలో నాలుగు కోట్లు, ఉద్యోగాలు, గనుల రంగంలో 50లక్షల కొత్త ఉద్యోగాల కల్పన. 2. ప్రతి పౌరుడికి బాంకు ఖాతా, జీవిత, ప్రమాద బీమా, పెన్షన్‌, ఉద్యోగానంతర ప్రణాళికల సేవలు అందచేత,3.రైతుల ఆదాయాలు రెట్టింపు, పొలాలన్నింటికీ జలాల సరఫరా, పొలాల్లో వదలివేసిన గడ్డిని తగులబెట్టకుండా చూడటం, దేశంలో గాలికాలుష్యాన్ని సగానికి తగ్గించటం, ప్లాస్టిక్‌ వాడకంపై నిషేధం. 4. ప్రతి కుటుంబానికి గాస్‌ సిలిండర్‌, రైలు ప్రమాదాల్లో ఒక్కరు కూడా మరణించకుండా చూడటం, ముంబై-అహమ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు పరుగులు(ఇప్పుడు దీనికి ఒక తుది గడువు అంటూ లేదు గానీ 2023డిసెంబరుకు పూర్తి అని చెబుతున్నారు). కేరళలొ బిజెపి వేగంగా పరుగెత్తే కె రైల్‌ పధకాన్ని మాత్రం వద్దంటుంది. 5. ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు, ఇళ్లలో మరుగుదొడ్లు, చేతులతో మలమూత్రాల ఎత్తివేత నివారణ, రోజంతా విద్యుత్‌ సరఫరా.6.2012-13లో ఉన్న 7.7శాతం పారిశ్రామిక ఉత్పాదకత రెట్టింపు.ప్రతిగ్రామానికి ఇంటర్నెట్‌, ప్రతివారూ దాన్ని ఉపయోగించేలా చర్యలు, ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా, పోషకాహారలేమి నివారణ. ప్రస్తుతం 21శాతంగా ఉన్న అడవులను 33శాతానికి పెంపు, పదవ తరగతి పూర్తి గాకుండా ఏ ఒక్క విద్యార్దీ మధ్యలో బడి మానకుండా చూడటం. ఉన్నత విద్యలో 25శాతంగా ఉన్న చేరికలను 35శాతానికి పెంచటం 7. ఏడువందల జిల్లా కేంద్ర ఆసుపత్రులు వైద్య కేంద్రాలుగా వృద్ది. ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలలో ఆరోగ్యనిపుణులకు ప్రయివేటు పరిశ్రమలవారితో శిక్షణ, మెడికల్‌ టూరిస్టులను ఆకర్షించేందుకు ఇరవై స్వేచ్చా జోన్ల ఏర్పాటు., దేశంలో 11,082 మందికి ఒక అలోపతి వైద్యుడు ఉన్న స్ధితిని ప్రతి పద్నాలుగు వందల మందికి ఒకరుండేట్లు చూడటం.వెనుకబడిన ప్రాంతాల్లో వంద చోట్ల కొత్త విహార కేంద్రాల ఏర్పాటు. మన దేశానికి వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్యను 88 లక్షల నుంచి కోటీ 20లక్షలకు పెంచటం, స్వదేశీపర్యాటకుల సంఖ్యను 1,614 నుంచి 3,200 మిలియన్లకు పెంచటం.8. చమురు, గాస్‌ దిగుమతులను పదిశాతం తగ్గింపు(2022-2023).80 గిగావాట్లుగా ఉన్న పునరుత్పాదక ఇంధనాన్ని 175 గిగావాట్లకు పెంచటం. 9. 1.22లక్షల కిలోమీటర్లుగా ఉన్న జాతీయ రహదారులను రెండులక్షల కిలోమీటర్లకు పెంచటం. దశాబ్దాల తరబడి 2017 నాటికి పూర్తిగాకుండా ఉన్న ప్రాజెక్టుల పూర్తి. ఇలాంటి కబుర్లతో గతంలో కాంగ్రెస్‌ కాలక్షేపం చేసింది. ఇపుడు బిజెపి బిజెపి చేస్తున్నది.


ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ది చెందుతున్న దేశమని త్వరలో చైనాను అధిగమిస్తామని చెబుతున్నవారి ఏలుబడిలో సంతోష సూచిక ఇలా తగులడుతోందేం అని ఎవరైనా ప్రశ్నించరా ? జిడిపి మొత్తం పెరగటం వేరు, జనాభా పెరుగుతున్నపుడు దానికి అనుగుణంగా తలసరి పెరగటం వేరు.2014లో జిడిపి తలసరి సగటు 1,574 డాలర్లు, 2020లో 1,901 డాలర్లు, ఇదే కాలంలో చైనాలో 7,679 నుంచి 10,500 డాలర్లకు పెరిగింది. ప్రపంచంలో మొత్తం జిడిపిలో చైనా రెండవ స్దానంలో ఉన్నా తలసరిలో ప్రపంచ సగటు కంటే తక్కువే, ఇక మన దేశం గురించి చెప్పుకోవాల్సిందేముంది. సంతోష సూచిక లెక్కింపులోకి తీసుకొనే జిడిపి తలసరి సగటు సూచికలో గత నాలుగు సంవత్సరాలుగా మనది 102-103 స్దానాల్లో , ఆరోగ్యజీవిత సూచికలో 104-107, సామాజిక మద్దతులో 141-145 స్ధానాల్లో ఉన్నపుడు జనాల్లో ఆనందం ఎక్కడ ఉంటుంది. నేపాల్‌ పేదరికంలో కూడా తన స్ధానాన్ని 48 స్ధానాలు ఎగువకు గణనీయంగా మెరుగుపరుచుకోగా మన దేశం 28 స్ధానాలు కోల్పోయింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పాతవరవడిలోనే జగనన్న బడ్జెట్‌ – పెరుగుతున్న అప్పులు, తిప్పలు ?

12 Saturday Mar 2022

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Telugu

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, AP Budget 2022-23, AP debt, YS jagan



ఎం కోటేశ్వరరావు


2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ మార్చి 11వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంకెల గారడీ షరా మామూలే. భారీగా కొండంత రాగం తీసి చడీ చప్పుడు లేకుండా కోత పెట్టటం గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతోంది. ప్రభుత్వ ఆర్ధిక స్ధితి గురించి ఆందోళనకరమైన వార్తలు వెలువడుతున్నా తగ్గేదేలే అన్నట్లుగా ముందుకు పోవాలని గట్టిగా శపధం పూనినట్లుగా ఉంది. కొత్త అప్పులు పుట్టే అవకాశాలు మూసుకుపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అలా తీసుకోవాలంటే షరతులకు అంగీకరించాలి. దానిలో భాగమే చెత్త పన్ను. మున్సిపల్‌ ఎన్నికల తరువాత అలాంటి భారాలు వేస్తారని వామపక్షాలు హెచ్చరించినా జనం కూడా తగ్గేదేలే అన్నట్లుగా వైసిపికి ఓట్లు వేశారు. బండి గుర్రానికి గడ్డి ఆశచూపి పరుగెత్తించినట్లు కేంద్రం తాను ప్రకటించిన లేదా ప్రతిపాదించిన సంస్కరణలు అమలు చేస్తే అప్పులకు సడలింపులు ఇస్తామని ప్రకటించింది. ఆమేరకు దాదాపు ఇరవై లక్షల రైతుల పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు నిర్ణయించింది తెలిసిందే.
ఇక బడ్జెట్‌ పత్రాలు వెల్లడించిన వివరాల ప్రకారం చంద్రబాబు నాయుడు దిగిపోయినపుడు 2018-19 రాష్ట్ర రుణభారం రు. 257509.87 కోట్లు, అది రాష్ట్ర జిఎస్‌డిపిలో 28.02శాతం. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి వివిధ సంస్ధలు, శాఖలకు ఇప్పించిన అప్పు పేరుకు పోయిన మొత్తం రు.55508.46 కోట్లు. 2019 మే 30న అధికారానికి వచ్చిన జగనన్న వాటిని ఇబ్బడి ముబ్బడిగా పెంచారు. 2022 మార్చి నెలతో ముగిసే ఆర్ధిక సంవత్సరానికి ప్రభుత్వ రుణం రు.390670.19 కోట్లు, జిఎస్‌డిపిలో 32.51శాతం ఉంది. హామీగా ఉన్న అప్పుల మొత్తం 2021 డిసెంబరు 31నాటికి రు.117503.12 కోట్లకు పెరిగింది. 2022-23లో అప్పుల మొత్తాన్ని రు.439394.35 కోట్లు, 32.79 శాతం జిఎస్‌డిపిలో ఉంటుందని పేర్కొన్నారు. దీనికి హామీల రుణం అదనం. చంద్రబాబు ఏలుబడిలో అన్ని రకాల రుణాలు మూడు లక్షల కోట్లకు పైబడితే జగనన్న దాన్ని వచ్చే ఏడాది చివరికి ఐదున్నర లక్షల కోట్లకు పైగా పెంచనున్నారు. ఇది అంచనాలకు మించిన వృద్ధి.


ఆస్తుల కల్పన ద్వారా ఆదాయ, ఉపాధి పెరుగుదల ఉంటుంది. దీన్నే ఆర్ధిక పరిభాషలో పెట్టుబడి వ్యయం అంటారు.దీని తీరుతెన్నులను చూద్దాం. అప్పులకు సంబంధించి నిర్ణీత లక్ష్యాన్ని చేరేందుకు చూపే శ్రద్ద ఇతర వాటి మీద ఉండటం లేదు.పెట్టుబడివ్యయ పద్దు కింద గత ఏడాదిలో ప్రతిపాదించిన రు. 31,198 కోట్లను 18,529 కోట్లకు సవరించినట్లు చూపారు. అంతకు ముందు ఏడాది కూడా రు.29,300 కోట్లు ప్రతిపాదించి ఖర్చు చేసింది రు.18,974 కోట్లే. వచ్చే ఏడాది ఈ మొత్తాన్ని రు.30,679 కోట్లని పేర్కొన్నారు. దీన్ని అంకెల గారడీగాక ఏమనాలి ? ఇలాంటి కోతల కారణంగానే బడ్జెట్‌ ప్రతిపాదనలను ప్రకటించినపుడు గొప్పగా చెప్పి కోతలు వేస్తున్నారు.


బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం 2021- 22లో మొత్తం రు.2,29,779 కోట్లు ఖర్చు ఉంటుంది. దీన్ని ఇప్పుడు రు. 2,08,106.57 కోట్లుగా సవరించారు. వచ్చే ఏడాది బడ్జెట్‌ను రు.2,56,256.56 కోట్లుగా చూపారు. ద్రవ్యలోటు రు.48,724.11 కోట్లుగా చూపారు. ఈ మొత్తాన్ని ఎలా పూడుస్తారో తెలియదు. కేటాయింపులకు కోతలు పెట్టాలి, లేదా జనం మీద భారాలు మోపాలి. ఉదాహరణకు 2020-21లో కూడా ఖర్చు రు.2,24,789 కోట్లుగా చూపి చివరకు రు.1,85,468కి సవరించారు.


వర్తమాన ఆర్ధిక సంవత్సర అన్ని రకాల రాబడి రు.1,54,272.70 కోట్లుగా సవరించారు, వచ్చే ఏడాది ఈ మొత్తం రు.1,91,225.11కోట్లని చెప్పారు. దీనికి రు.64,816 కోట్ల మేరకు అప్పులు తెచ్చి బడ్జెట్‌ను అమలు చేస్తామన్నారు.ఈ అప్పులో రు.21,805 కోట్లు పాత వాటిని తీర్చేందుకే పోతుంది. వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో సాగు నీటి వనరుల వృద్ధి వలన రైతాంగ ఆదాయాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. జగన్‌ అధికారానికి రాక ముందు మూడు సంవత్సరాల్లో పెట్టుబడి ఖర్చు రు.31,624 కోట్లు ఖర్చు చేస్తే ఈ మూడేండ్లలో ఆ మొత్తం రు.15,193 (2021-22 సవరించిన అంచనాతో) మాత్రమే ఖర్చు చేశారు. గతేడాది నీటి పారుదల రంగానికి రు.11,586 కోట్లు ప్రతిపాదించి దాన్ని రు.6,832 కోట్లకు కోత పెట్టారు. వచ్చే ఏడాది అసలు ప్రతిపాదనే రు.9,810 కోట్లుగా పేర్కొన్నారు. పెరిగిన బడ్జెట్‌కు అనుగుణంగా లేదా ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని భారీగా పెంచాల్సింది పోయి ఇలా చేయటం ఏమిటి ?


నవరత్నాలు లేకపోతే జగన్‌ రత్నాలు పేరు ఏది పెట్టినా పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను తప్పు పట్టటం లేదు. అదే పేదలు కార్పొరేట్‌ ఆసుపత్రుల పాలైనపుడు ప్రభుత్వం ద్వారా వచ్చిన సంక్షేమ పధకాల సొమ్ము మొత్తం, ఇంకా అప్పులు చేసినదీ వాటి యజమానులకు సమర్పించుకుంటున్నారు. ఆ స్ధితిలో వైద్య, ఆరోగ్యం కుటుంబ సంక్షేమ ఖర్చును గణనీయం పెంచాలి. కానీ ఈ బడ్జెట్‌లో గతేడాది చేసిన ఖర్చు కంటే తగ్గించారు. సవరించిన అంచనా ప్రకారం రు.12,972 కోట్లనుంచి రు.11,974 కోట్లకు కుదించారు. షెడ్యూలు కులాలు, తరగతులు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి గతేడాది ప్రతిపాదించిన రు.27,401 కోట్లను రు.25,349కు కుదించారు. ఈ ఏడాది మాత్రం దాన్ని ఏకంగా రు.45,411 కోట్లుగా పేర్కొన్నారు. దీన్ని చూస్తే అంకెల గారడీ లేదా మధ్యంతర ఎన్నికల ప్రచార అస్త్రమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.


రోడ్ల నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో తెలిసిందే. గతేడాది రోడ్లు, వంతెనలకు పెట్టుబడి ఖర్చు రు.2,792 కోట్లుగా చూపి దాన్ని రు.927 కోట్లకు కుదించారు. ఇప్పుడు రు.2,713 కోట్లు ఖర్చు చేస్తామని నమ్మబలుకుతున్నారు.మొత్తం ఆర్ధిక సేవల పెట్టుబడి ఖర్చు రు.18,319 కోట్లుగా ప్రకటించి ఆచరణలో రు.9,859 కు కోత పెట్టి ఈ ఏడాది రు.17,412 కోట్లు ఖర్చు చేస్తామంటున్నారు. ఏ శాఖను చూసినా ఇదే తీరు. నోరున్నదని చెప్పుకొనే ఉద్యోగులకు తాను ప్రకటించిన 27తాత్కాలిక భృతిలో కూడా కోత పెట్టి పిఆర్‌సిని బలవంతంగా రుద్దిన సర్కార్‌ ఇక నోరు లేని లేదా ఉన్నా నోరెత్తలేని జనాలకు సంబంధించిన, అభివృద్ధి పనులకు కోత పెట్టటంలో ఆశ్చర్యం ఏముంది ?


కేంద్ర ప్రభుత్వం తన అజండాను అమలు జరిపేందుకు రాష్ట్రాల మీద ఆంక్షలు పెడుతోంది, షరతులు విధిస్తోంది. 2005ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం రాష్ట్రాలు ఏవిధంగా నడుచుకోవాలో ముందుగానే లక్ష్యాలను నిర్దేశించింది. పదిహేనవ ఆర్ధిక సంఘం 2021-26 సంవత్సరాలలో ద్రవ్యలోటును సంవత్సరాల వారీగా జిఎస్‌డిపిలో 2021-22కు 4, 2022-23కు 3.5, 2023-26కు మూడుశాతాల చొప్పున పరిమితం చేసుకోవాలి. దీని వలన ఆంధ్రప్రదేశ్‌కు 2020-21లో జిఎస్‌డిపిలో ఉన్న 35శాతం రుణ భారం 2025-26 నాటికి 32.1శాతానికి తగ్గుతుందని 15వ ఆర్ధిక సంఘం పేర్కొన్నది. ఇవన్నీ పరిస్ధితులు సాధారణంగా ఉంటే, కానీ కరోనా కారణంగా ఇచ్చిన మినహాయింపులు, ఇతర అంశాల కారణంగా అది అమలు జరుగుతుందని చెప్పలేము. ఐదు సంవత్సరాల కాలంలో పరిమితులను తొలి నాలుగు సంవత్సరాలలో వినియోగించుకోనట్లైతే ఐదవ ఏడాది అదనపు రుణాలు తీసుకోవచ్చు. ఈ లోగా విద్యుత్‌ రంగంలో కేంద్రం ప్రతిపాదించిన షరతులను అమలు జరిపితే తొలి నాలుగు సంవత్సరాలు ప్రతి ఏటా జిఎస్‌డిపిలో 0.5 శాతం చొప్పున అదనంగా అప్పులు తీసుకోవచ్చు.2021-25 మధ్య విద్యుత్‌ నిర్వహణ నష్టాలు తగ్గించాలి.ఆదాయ తేడాను కుదించాలి. వినియోగదారులకు నేరుగా సబ్సిడీని అందించటం ద్వారా సబ్సిడీ మొత్తాలను తగ్గించాలి. ఆదాయాన్ని సబ్సిడీ రేట్లను తగ్గించాలి. ఇవన్నీ ఈ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు దారి సుగమం చేయటమే.


జిఎస్‌డిపి ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది కనుక ఆ దామాషాలో రుణ పరిమితి కూడా పెరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు 2014-15లో ఆంధ్రప్రదేశ్‌ జిఎస్‌డిపి విలువ రు.5,26,470 కోట్లుగా ఉంది. మూడుశాతం రుణ పరిమితి ప్రకారం రు.15,794 కోట్లు తీసుకోవచ్చు.2018-19నాటికి అది రు.9,33,402 కోట్లకు పెరిగింది కనుక రుణం 28వేల కోట్లు తీసుకోవచ్చు. అలాగే 2020-21లో రు.10,19,146 కోట్లుగా సవరించినందున రుణం 34వేల కోట్ల వరకు తీసుకోవచ్చు. 2021-22లో ముందస్తు అంచనా ప్రకారం అది రు. 12,01,736 కోట్లుగా ఉన్నట్లు ఆర్ధిక సర్వేలో పేర్కొన్నారు. అందువలన ఆ మేరకు రుణపరిమితి పెరుగుతుంది. ఆత్మనిర్భర పధకం కింద రెండు శాతం అదనంగా తీసుకొనేందుకు అనుమతించారు. ఇప్పుడు ఆర్ధిక సంఘం ఆంక్షలకు మించి ద్రవ్యలోటు ఉంది. 2020-21లో ద్రవ్యలోటు జిఎస్‌డిపిలో 4.78శాతంగా ప్రతిపాదిస్తే అది 5.38శాతానికి చేరింది. కేంద్రం కరోనా కారణంగా సడలించిన రుణ పరిమితి ఐదుశాతానికి మించి ఇది ఉంది. ఐదుశాతానికి కూడా కేంద్రం షరతులు విధించింది. నాలుగుశాతం వరకు ఎలాంటి షరతులు లేవు, ఒకశాతానికి నాలుగు ఉన్నాయి. ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు ఒకటి, సులభతర వాణిజ్యం, స్ధానిక సంస్దలలో పన్నుల పెంపు, విద్యుత్‌ పంపిణీ సంస్కరణ. మొదటి మూడింటిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నెరవేర్చింది. దీంతో అదనంగా 9,090 కోట్లు అదనంగా అప్పు చేసేందుకు అవకాశం వచ్చింది. విద్యుత్‌ సంస్కరణలో భాగంగా మీటర్లు పెట్టేందుకు నిర్ణయించిన అంశం తెలిసిందే. అది జరిగిన తరువాత వినియోగదారులు ముందుగా బిల్లులు చెల్లించాలి. మిగిలిన షరతుల ప్రకారం సబ్సిడీలో కోత వంటి వాటికి పూనుకుంటే వంటగాస్‌ మాదిరి క్రమంగా తగ్గించి వేసి నామమాత్రంగా సబ్సిడీని నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణల ప్రకారం విద్యుత్‌ సరఫరా ధరలో 20శాతానికి మించి సబ్సిడీ ఇవ్వకూడదు. పెట్రోలు, డీజిలు ధరల మాదిరి ఖర్చు పెరిగినపుడల్లా చార్జీలను పెంచవచ్చు.


అసలేమీ ఇవ్వని వారి కంటే సంక్షేమ పధకాల పేరుతో జనాన్ని ఆదుకోవటాన్ని ఎవరైనా సమర్ధిస్తారు. వాటికీ పరిమితులుంటాయి. కానీ అవే జనాలను బొందితో కైలాసానికి చేరుస్తాయని ఎవరైనా చెబితే, నమ్మిస్తే అది వంచన అవుతుంది. జనాలకు కావలసినన్ని చేపలను తొలుత సరఫరా చేసినా వాటిని పట్టటం నేర్పితేనే ఎవరికైనా జీవితాంతం భరోసా ఉంటుంది, వారి బతుకు వారు బతుకుతారు. సంక్షేమ పధకాలూ అంతే ! రాబడి వనరులు లేక లేదా పెరగక, అప్పుల దారులన్నీ మూసుకుపోయినపుడు దాన్నుంచి బయట పడాలంటే సంక్షేమ పధకాలకు కోత పెట్టాలి లేదా మరిన్ని భారాలను జనం మీద మోపాలి. అందుకే ఐదేండ్లు గడిచే సరికి నవరత్నాలు, భరోసాలే బంధాలుగా మారి రాజకీయంగా కొంప ముంచినా ఆశ్చర్యంలేదు.జనం వైఫల్యాలను గుర్తించక, అసంతృప్తి పెరగముందే ఏదో ఒక సాకుతో ముందస్తు ఎన్నికలకు పోయినా పోవచ్చు !


Share this:

  • Tweet
  • More
Like Loading...

వసుదేవుడిని అనుసరిస్తున్న అమెరికా జో బైడెన్‌ !

09 Wednesday Mar 2022

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Fuel prices freezing, Joe Biden, NATO allies, Ukraine war, Ukraine-Russia crisis, US, US imperialism, Venezuela


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీ లొంగుబాటు సూచనలు, మరోవైపు మంటను మరింత ఎగదోస్తూ అమెరికా, దాని మిత్రదేశాల చర్యలు. రష్యా చమురును అమెరికా దిగుమతి చేసుకోవటంపై జోబైడెన్‌ నిషేధం విధించాడు. బ్రిటన్‌ దాన్ని అనుసరించింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో పీపా ధర 139 డాలర్లు తాకి తరువాత తగ్గింది. ఫిబ్రవరి 24న యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి ధర ఒక్క రోజు కూడా నిలకడగా లేదు. మార్చి 9వ తేదీన 121.5 డాలర్లుగా ఉంది. తమ ఇంధనంపై ఆంక్షలు విధిస్తే మూడువందల డాలర్లకు పెరగవచ్చని రష్యా హెచ్చరిక. మరోవైపున వెనెజులా చమురుపై ఆంక్షల ఎత్తివేత ఆలోచనల్లో అమెరికా. తమపై ఆంక్షలను ఎత్తివేసినా లేకున్నా రష్యాకు ఇచ్చే మద్దతుపై వెనక్కు తగ్గేదేలే అంటున్న వెనెజులా.


రష్యా ఇంధన దిగుమతులపై ఆంక్షలు విధిస్తే సామాజిక ఐక్యత కుప్పకూలుతుందని జర్మనీ హెచ్చరించింది. తాము ఆంక్షలను వ్యతిరేకిస్తామని కూడా జర్మనీ మంత్రి రాబర్ట్‌ హాబెక్‌ చెప్పాడు. సరఫరాలు తగ్గటం సామాజిక ఐక్యతకు ముప్పు తెస్తుందని కూడా అన్నాడు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది ఇంతకు మించి కొత్తగా చేసేదేమీ లేదని తదుపరి చర్యల గురించి మరొక మంత్రి క్రిస్టియన్‌ లెండర్‌ స్పష్టం చేశాడు. ఆంక్షల నుంచి రష్యన్‌ ఇంధన సరఫరాలను కావాలనే ఐరోపా మినహాయించింది, ఈ క్షణంలో మరోమార్గంలో ఇంధన సరఫరాకు అవకాశం లేదని జర్మన్‌ ఛాన్సల్‌ ష్కోల్జ్‌ చెప్పాడు. ఈ కారణంగానే బైడెన్‌ ఐరోపాతో నిమిత్తం లేకుండా తమ దేశానికి మాత్రమే వర్తించే నిషేధాన్ని ప్రకటించాడు. ఐరోపాయునియన్‌ నుంచి విడిపోయిన బ్రిటన్‌ వేరుగా నిషేధాన్ని ప్రకటించింది.రష్యా ఇంధనంపై ఆంక్షలు విధించటాన్ని తాము సమర్ధించటం లేదని హంగరీ ఆర్ధిక మంత్రి ప్రకటించారు.అమెరికా, సౌదీ అరేబియా తరువాత చమురు ఉత్పత్తిలో రష్యా మూడవ స్ధానంలో ఉంది. దాని ఎగుమతుల్లో 60శాతం ఐరోపా ఆర్ధిక సహకార మరియు అభివృద్ధి సంస్ధ(ఓయిసిడి) దేశాలకే చేస్తున్నది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలంటే వెంటనే జరిగేది కాదు. ఇటలీ గాస్‌ దిగుమతుల నిలిపివేతకు రెండున్నర సంవత్సరాలు పట్టింది. గతేడాది ఐరోపా యూనియన్‌ తన అవసరాల్లో 45శాతం రష్యానుంచి దిగుమతి చేసుకుంది.రష్యా ప్రతి రోజు 50లక్షల పీపాలు ఎగుమతి చేస్తుండగా దానిలో సగం ఐరోపాకే వెళుతుంది.


నోర్డ్‌ స్ట్ర్రీమ్‌ ఒకటి ద్వారా సరఫరా అవుతున్న తమ ఇంధనంపై నిషేధం విధిస్తే చమురు ధరలు మూడువందల డాలర్ల వరకు పెరగవచ్చని రష్యా ఉపప్రధాని నోవాక్‌ హెచ్చరించాడు. రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్నవాటిలో ముడిచమురు కంటే దానిఉత్పత్తులే ఎక్కువగా ఉన్నాయి. అందువలన నిషేధం ద్వారా ప్రచార వత్తిడి తప్ప పెద్ద ప్రభావం చూపదన్నది స్పష్టం. అమెరికా తన అవసరాల్లో రష్యా నుంచి ఎనిమిదిశాతం దిగుమతి చేసుకుంటుండగా దానిలో మూడుశాతం మాత్రమే ముడిచమురు, మిగిలినవి చమురు ఉత్పత్తులు. పశ్చిమ దేశాలు తమ మీద విధిస్తున్న ఆంక్షలకు ప్రతిగా రష్యా కూడా తన అస్త్రాలను ప్రయోగిస్తున్నది. పశ్చిమ దేశాల ఆంక్షలతో చమురు ధరలు పెరుగుతున్నందున అమెరికా, ఐరోపా దేశాలు కూడా వాటి ప్రతికూల పర్యవసాలను అనుభవించాల్సి ఉంటుంది. రష్యన్‌ చమురుపై నిషేధం విధిస్తే సరఫరా తగ్గి పీపా ధర 200 డాలర్లకు పెరగవచ్చని బాంక్‌ ఆఫ్‌ అమెరికా విశ్లేషకులు పేర్కొన్నారు.


వసుదేవుడంతటి వాడే అవసరం తనది గనుక గాడిద కాళ్లను పట్టుకొనేందుకు సిద్ద పడిన కథ తెలిసిందే. ఇప్పుడు అమెరికా అదే చేస్తోంది.రష్యాను దెబ్బతీసేందుకు గతంలో తాను వ్యతిరేకించిన, తిట్టిపోసిన దేశాలతో ఇప్పుడు చమురు అమ్ముతారా అంటూ తెరవెనుక సంప్రదింపులు జరుపుతోంది. దీని వెనుక రెండు కారణాలున్నాయి. ఐరోపా, ఇతర ప్రాంతాల్లోని తన మిత్రరాజ్యాల ఇంధన అవసరాలకు ఆటంకం కలగకుండా చూడటం, చమురు ధరలు మరింత పెరిగితే యురోపియన్లలో అమెరికా పట్ల ప్రతికూలత పెరుగుతుంది. తన ఆర్ధిక వ్యవస్ధకు సైతం తలెత్తే ముప్పు నివారణ అవసరం. లేనట్లయితే ఇంటా బయటా ప్రతికూల పరిస్ధితులు బైడెన్‌కు ఎదురవుతాయి.అందువల్లనే అమెరికా ప్రతినిధులు గతవారంలో వెనెజులాను సందర్శించి చమురు సరఫరా గురించి చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్‌తో అణు ఒప్పందం చేసుకొని చమురు ఆంక్షలను ఎత్తివేసేందుకు సంసిద్దతను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఉత్పత్తిని పెంచమని కోరేందుకు బైడెన్‌ స్వయంగా సౌదీ అరేబియాను సందర్శించవచ్చని వార్తలు వచ్చాయి. రష్యాపై విధించిన ఆంక్షలను సొమ్ము చేసుకొనేందుకు ఉత్పత్తి పెంచాలన్న సూచనలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు సౌదీ అందుకు సముఖత చూపలేదు. గతంలో రష్యాతో వచ్చిన అవగాహనకే కట్టుబడి ఉంటామని చెబుతోంది. అణు ఒప్పందం గురించి ఇరాన్‌తో రాజీకి వచ్చి ఆంక్షలు వెనక్కు తీసుకుంటే అక్కడి నుంచి కూడా సరఫరా పెరుగుతుంది.యుద్దం ప్రారంభమైన తరువాత అమెరికా ఒక మెట్టు దిగుతున్నట్లుగానే ఈ పరిణామాలను చూడవచ్చు. జర్నలిస్టు ఖషోగ్గీ హత్య తరువాత సౌదీ-అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. సౌదీ రాజును హంతకుడని బైడెన్‌ వర్ణించాడు. ఇప్పుడు చమురు ఉత్పత్తి పెంచాలని కోరుతున్నాడు. వారి సమావేశం జరుగుతుందా లేదా అన్నది సందేహమే. తాలిబాన్లతోనే ఒప్పందం చేసుకున్నపుడు సౌదీతో సయోధ్య కుదుర్చుకోవటంలో ఆశ్చర్యం ఉండదు. చమురు ధరలు తగ్గటం ప్రతివారికీ ప్రయోజనకరమే నంటూ అధికారులు చర్చలు జరుపుతున్నారు గానీ, బైడెన్‌ పర్యటన గురించి ఇప్పటికైతే ఖరారు కాలేదని పత్రికా కార్యదర్శి జెస్‌ సాకీ చెప్పారు. వ్రతం చెడ్డా ఫలం దక్కుతుందా ?


అనేక సంవత్సరాల తరువాత ఇద్దరు అమెరికా ఉన్నతాధికారులు వెనెజులా రాజధాని కారకాస్‌ వెళ్లి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను గద్దె దించేందుకు కుట్రపన్నినందుకు గాను 2017లో అమెరికా ఇంధన అధికారులను అరెస్టు చేశారు. 2019లో ఆంక్షలతో పాటు, కారకాస్‌లో అమెరికా తన రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. తమ వారిని వదలిపెట్టాలని కోరటంతో పాటు చమురు ఎగుమతి గురించి చర్చలు ప్రారంభించారు. అధికారులు వెళ్లటానికి ఒక రోజు ముందు వెనెజులాలో పెట్టుబడులు పెట్టిన రష్యా వ్యాపారి ఉస్మనోవ్‌ వ్యక్తిగత ఆస్తులపై ఆంక్షలు తొలగించలేదు గానీ కంపెనీ లావాదేవీలు జరిపేందుకు అమెరికా ఆర్ధికశాఖ సాధారణ అనుమతి మంజూరు చేసింది. అతను పుతిన్‌ మద్దతుదారు. ఇది వెనెజులా పట్ల ఒక సానుకూల వైఖరి. దీనికి ప్రతిగా ఇద్దరు అమెరికన్లను వెనెజులా విడుదల చేసింది. బైడెన్‌ వైఖరి మార్చుకోవటాన్ని ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ ఎంపీలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వారితో కొందరు డెమోక్రాట్లు కూడా గొంతు కలిపారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు మదురో బహిరంగంగానే మద్దతు పలికాడు. ఇంతకాలం వెనెజులాను వ్యతిరేకించిన అమెరికా తన మాటలను తానే ఖండించుకున్నట్లయింది. దీంతో మదురో మరింత బలపడతారని, వ్యతిరేకుల నడుంవిరిచినట్లవుతుందని కొందరు వాపోతున్నారు.


చమురు ధరలు పెరగటంతో దాన్ని సొమ్ము చేసుకోవాలని అమెరికాలో వాటాదార్లతో నిమిత్తం లేకుండా కుటుంబ సంస్ధలుగా ఉన్న కొన్ని చిన్న షేల్‌ ఆయిల్‌ కంపెనీలు ఉత్పత్తికి సిద్దం అవుతున్నాయి.నూటపది డాలర్లుంటే తమకు గిట్టుబాటు అవుతుందని అంటున్నాయి. పెరుగుదల ఎంత కాలం ఉంటుందో తెలీని స్ధితిలో బడా కంపెనీలు ఉత్పత్తికి సిద్దం కావటం లేదు. కరోనా కారణంగా ఆ కంపెనీల్లో మదుపు చేసిన వారికి చేతులు కాలటంతో ఆచితూచి స్పందిస్తున్నాయి.


మన దేశంలో నవంబరు నాలుగవ తేదీ నుంచి స్ధంభింపచేసిన చమురు ధరలను ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత ఏ రోజైనా తిరిగి సవరించే అవకాశం ఉంది. దీని గురించి ప్రభుత్వం రెండు నాలుకలతో మాట్లాడుతోంది. చమురు ధరలను నిర్ణయించేది చమురు కంపెనీలు తప్ప ప్రభుత్వం కాదని, అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టి తగ్గటం, పెరగటం ఉంటుందని గతంలో చెప్పారు. ఇప్పుడు ప్రజా ప్రయోజనాల ప్రాతిపదికన ధరల గురించి నిర్ణయం తీసుకుంటామని చమురుశాఖ మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ మంగళవారం నాడు విలేకర్లతో చెప్పారు. నవంబరు నుంచి ధరల స్ధంభనతో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు లేదని కూడా చెప్పారు. రోజువారీ ధరల సవరణ చేసే కంపెనీలు గతంలో ఎన్నికల తరుణంలో, తాజాగా నవంబరు నాలుగునుంచి ఎందుకు స్ధంభింపచేసినట్లో ఇంతవరకు ప్రకటించలేదు.
.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దడ పుట్టిస్తున్న చమురు ధరలు – నరేంద్రమోడీ జనం గురించి పట్టించుకుంటారా ?

03 Thursday Mar 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, crude oil price, Fuel Price in India, Fuel prices freezing, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు గురువారం నాడు మరో మెట్టు ఎక్కాయి. ఇది రాసిన సమయానికి బ్రెంట్‌ రకం పీపా ధర 116.94 డాలర్లను తాకింది. వ్యూహాత్మక నిల్వల నుంచి 60మిలియన్ల పీపాల చమురును మార్కెట్లోకి విడుదల చేయాలని అంతర్జాతీ ఇంధన సంస్ధ(ఐఇఏ) మంత్రుల సమావేశం ప్రకటించిన తరువాత కూడా మార్కెట్లో ధరలు పెరిగాయి. ఈ మొత్తంలో తాము 30మిలియన్ల పీపాలు విడుదల చేస్తామని అమెరికా పేర్కొన్నది. అరవై మిలియన్ల పీపాలు ఐఇఏలోని 31 దేశాల నిల్వల్లో నాలుగుశాతం. ఈ దేశాల్లో 1.5బిలియన్ల పీపాలు ఉంటే ఒక్క అమెరికాలోనే 600మి. పీపాలుంది. మార్కెట్‌ ఇబ్బందుల్లో పడిన ప్రతికూల సందేశాన్ని సందేశాన్ని ఈ నిర్ణయం పంపిందని, అరవై మిలియన్లన్నది చమురు పీపాలో ఒకబొట్టు వంటిదని, ప్రపంచంలో ఒక రోజుకు అవసరమైన 100మి. పీపాల గిరాకీ కంటే తక్కువంటూ ఇది చమురు ధరలపై ప్రభావం ఎలా చూపుతుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఆంక్షల కారణంగా మార్కెట్లోకి రష్యానుంచి రోజుకు ఏడు మిలియన్‌ పీపాల సరఫరా నిలిచిపోనుంది. ఆంక్షలున్నప్పటికీ తమ కొనుగోళ్లు కొనసాగుతూనే ఉంటాయని చైనా ప్రకటించింది. గోధుమల దిగుమతులపై గతంలో ఉన్న పరిమితులను కూడా ఎత్తివేస్తున్నట్లు తెలిపింది.


ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలతో నిమిత్తం లేకుండానే అమెరికాలో నాలుగుదశాబ్దాల రికార్డు స్ధాయిలో 7.5శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. ఇప్పుడు చమురు ధరల పెరుగుదల తోడైంది. కొందరి అంచనా ప్రకారం 125 డాలర్లకు పెరిగితే అమెరికా ఏకంగా మాంద్యంలోకి దిగజారుతుంది. ఐరోపా దేశాలకు చమురు, గాస్‌ అవసరం కనుక రష్యా నుంచి వాటి ఎగుమతులపై ఆంక్షలను మినహాయించారు, లేనట్లయితే ఐరోపాలో మరోరకం సంక్షోభం తలెత్తి ఉండేది.ఐరోపా దేశాలు మరిన్ని ఆంక్షలను విధించినట్లయితే తనకు మరింత నష్టమైనా రష్యా చమురు, గాస్‌ నిలిపివేత అస్త్రాన్ని ప్రయోగించవచ్చు. ఈ కారణంగానే స్విఫ్ట్‌( అంతర్జాతీయ బాంకు లావాదేవీల వ్యవస్ధ) నుంచి ఏడు రష్యన్‌ బాంకులకు ఆంక్షల నుంచి పశ్చిమ దేశాలు మినహాయింపునిచ్చాయి. ఉక్రెయిన్‌ వివాదం వలన ఇంధన ధరలు పెరిగితే అది ద్రవ్యోల్బణానికి దారితీసి అమెరికా ఆర్ధిక పురోగతి, పౌరుల ఖర్చు తగ్గేందుకు దారి తీస్తుందని రిచ్‌మండ్‌ ఫెడరల్‌ రిజర్వు అధ్యక్షుడు టామ్‌ బార్కింగ్‌ హెచ్చరించాడు.ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ సగటున చమురు ధరలు వంద డాలర్లు ఉంటే అమెరికా ఆర్ధిక రంగం ఆరునెలల పాటు నిభాయించుకోగలదని, 125 డాలర్లకు పెరిగితే నిరుద్యోగం పెరుగుతుందని, వృద్ధి ఆగుతుందని ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జో బైడెన్‌ సైతం ఉక్రెయిన్‌ వివాదానికి అమెరికన్లు మూల్యం చెల్లించాల్సి రావచ్చని చెప్పిన అంశం తెలిసిందే.ఐరోపాలో గాస్‌ ధరలు 60శాతం పెరిగాయి. చలికాలంలో మరింతగా పెరగవచ్చని భావిస్తున్నారు. రష్యాకు వెసులుబాటు కల్పించేందుకు ఇరు దేశాల మధ్య తమ కరెన్సీలో చెల్లింపులకు చైనా ఏర్పాట్లు చేసింది.ఈ అనుభవం భవిష్యత్‌లో అంతర్జాతీయ మార్పిడి కరెన్సీగా డాలర్‌ను పక్కకు నెట్టేందుకు కూడా తోడ్పడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం డాలర్‌ చెల్లింపులు 40శాతం ఉండగా చైనా కరెన్సీ రెన్‌మిన్‌బీ(యువాన్‌) రెండుశాతం జరుగుతున్నాయి.


2022-23 ఆర్ధిక సంవత్సరంలో ముడి చమురు పీపా ధర 70-75 డాలర్ల మధ్య ఉంటుందనే అంచనాతో కేంద్ర బడ్జెట్‌ను ప్రతిపాదించారు. మార్చి నెలాఖరుతో ముగియనున్న ఆర్ధిక సంవత్సరంపై పెరిగిన చమురు ధరలు ప్రభావం చూపటం ప్రారంభమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం పెట్రోలు, డీజిలుపై సెస్‌లను ఐదు, పది చొప్పున తగ్గించటంతో పాటు నవంబరు నాలుగవ తేదీ నుంచి వాటి ధరలను స్ధంభింప చేశారు.ఈ నెల ఏడవ తేదీన చివరి దశ పోలింగ్‌ ముగిసిన తరువాత నుంచి చమురు ధరలు పెరగటం ఖాయం. రానున్న రోజుల్లో జిడిపి వృద్ధి తగ్గటంతో పాటు ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఎంకి పెళ్లి సుబ్చి చావుకు వచ్చిందన్నట్లుగా ఉక్రెయిన్‌ – రష్యా వివాదంతో మనకు ప్రమేయం లేనప్పటికీ దాని పర్యవసానాలను అనుభవించాల్సి వస్తోంది. మన దిగుమతుల బిల్లు తడిచి మోపెడు అవుతోంది.దీంతో మన కరెంటు ఖాతాలోటు పెరుగుతోంది. ముడిచమురు, ఎరువులు, ఖాద్య, ఖనిజతైలాలు, ఇతర దిగుమతుల ధరలు పెరుగుతున్నాయి. దిగుమతుల బిల్లు 2022లో 600బి. డాలర్లు దాటవచ్చని అంచనా. తక్షణం ద్రవ్యోల్బణం, దానితో పాటు వచ్చే ధరల పెరుగుదల, రూపాయి విలువ పతనం జరగవచ్చు. ఒక పీపా ధర ఐదు డాలర్లు పెరిగితే మన కరెంటు ఖాతాలోటు 6.6బి.డాలర్లు పెరుగుతుంది. ముడి చమురు ధర 105 డాలర్లకు అటూ ఇటూగా ఉన్నప్పటి అంచనాల ప్రకారం మార్చి ఎనిమిది తరువాత చమురు కంపెనీలు పెట్రోలు, డీజిలు ధరలను పది రూపాయల వరకు పెంచవచ్చని అంచనా. ఇప్పుడు 117 డాలర్ల వరకు తాకింది. ఇది ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దోహదం చేస్తుంది. మన ఎగుమతుల మీద కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈ ఏడాది తొలి ఆరునెలల పాటు చమురు ధరలు వంద డాలర్లకు ఎగువనే ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఏడాది మొత్తంగా దేశ ప్రగతి నిస్తేజంగా ఉంటుందని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ విశ్లేషకులు చెప్పారు.


జాతీయ గణాంకాల సంస్ధ(ఎన్‌ఎస్‌ఓ) 2021-22లో వృద్ధి రేటు అంతకు ముందు సంవత్సరంలోని 7.3శాతం తిరోగమనాన్ని అధిగమించి 9.2శాతం పురోగమనం ఉంటుందని అంచనా వేసింది. తాజాగా తొమ్మిది నెలల తరువాత దాన్ని8.9శాతానికి తగ్గించింది. తొలి మూడు మాసాల్లో 20.3 శాతంవృద్ధి కాస్తా రెండవ త్రైమాసికంలో 8.4శాతానికి తగ్గింది.తదుపరి మూడు నెలల్లో 5.4శాతంగా ఉందని అంచనా వేశారు. చమురు ధరల పెరుగుదల గణనీయంగా ఉన్న జనవరి-మార్చి నెలల గణాంకాలు వెల్లడైతే స్పష్టమైన అంచనాలు తెలుస్తాయి. ఈ వృద్ధి కూడా గతేడాది తగ్గిన దాని ప్రాతిపదికన చెబుతున్న లెక్క కనుక వాస్తవ వృద్ధి రేటు అంత ఉండదు. అందుకే గతంలో ఉన్న జిడిపి స్దాయికి చేరాలంటే దీర్ఘకాలం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. రిజర్వుబాంకు వడ్డీ రేట్లను తక్కువగా ఉంచినప్పటికీ వృద్ది రేటు ఆందోళనకరంగా ఉంది. ద్రవ్యోల్బణం మరింతగా పెరిగేట్లయితే వడ్డీ రేట్లు పెరుగుతాయి, అది మరొక సమస్యకు దారి తీస్తుంది.


వినియోగదారుల ధరల సూచిక (సిపిఐ) ప్రాతిపదికన ద్రవ్యోల్బణం ఆరుశాతం వరకు మనం భరించగలమని రిజర్వుబాంకు అన్నది. అంటే ఆ మేరకు ధరలు పెరుగుతాయని సిద్దంకమ్మని జనానికి చెప్పింది.డిసెంబరులో 5.59శాతం ఉన్నది జనవరిలో 6.01శాతానికి పెరిగింది. ఇదే తరుణంలో టోకు ధరల ద్రవ్యోల్బణం దాదాపు 13శాతంగా ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక కూడా పదినెలల కనిష్టానికి పడిపోయింది. మన దేశంలో ప్రయివేటు వినియోగం 55శాతం ఉంది. ఇది కరోనాకు ముందున్న స్దాయికంటే తక్కువే. కరోనా మహమ్మారి జనాల పొదుపు మొత్తాలను, గణనీయంగా వేతనాలను హరించివేసినందున వినియోగం బలహీనంగా ఉంది. పులిమీద పుట్రలా దీనికి ఉక్రెయిన్‌ వివాదం మరింత ముప్పు తెచ్చింది. జనంపై పెరిగే భారాల గురించి ఏం చేద్దామన్న అంశాన్ని చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోడీ పూనుకున్నారని గానీ, సమీక్షలు జరిపినట్లుగా ఎక్కడా వార్తలు లేవు. చేతులు కాలిన తరువాత ఆకలు పట్టుకున్నట్లు ఆపరేషన్‌ గంగ పేరుతో ఉక్రెయిన్లో చిక్కుకు పోయిన మన విద్యార్దుల గురించి ఎక్కడలేని శ్రద్ద చూపుతున్నట్లు సమావేశాల మీద సమావేశాలు జరుపుతున్నట్లు ప్రకటిస్తున్నారు, మంచిదే, ఇవాళా రేపట్లో అది కూడా పూర్తి అవుతుంది. తరువాతనైనా జనం గురించి పట్టించుకుంటారా ?చమురు ధరలు తగ్గితే ఆ మేరకు జనానికి ఉపశమనం కలిగించకుండా వందల రెట్లు పన్ను, సెస్‌లు పెంచి ఖజానా నింపుకొనేందుకు చూపిన వేగం ఇప్పుడు చమురు ధరలు పెరుగుతుంటే భారం తగ్గించేందుకు కనపరచరేం ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎనిమిదేండ్ల నరేంద్రమోడీ పాలన : జనంపై రణం – దేశానికి రుణం పెంపుదల !

16 Wednesday Feb 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ 1 Comment

Tags

BJP, Farmers agitations, india debt, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


మన దేశ క్రమశిక్షణ గురించి పెద్దలు చెప్పిన అంశాలలో అప్పు చేయటం ఎంత చెడ్డపనో చెప్పనవసరం లేదు. తినటానికి లేకపోతే కడుపులో కాళ్లు ముడుచుకొని పడుకుంటాం గాని అప్పు చేసి పప్పుకూడు తినం అనే మాట ఇప్పటికీ అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటుంది. గతంలో అప్పులున్నవారెందరు అని వెతికితే ఇప్పుడు అప్పులేని వారెవరు అన్నది ప్రశ్న. భారతీయత గురించి లౌడ్‌ స్పీకర్లతో పని లేకుండానే గొంతెత్తి అరచి మాట్లాడేవారి పాలనలో దేశం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. కలియుగ దైవం వెంకటేశ్వరుడే అప్పులు చేయగా లేనిది మనమెంత అని సమర్ధించుకొనే అవకాశం కూడా మనకు ఉంది. జనం నమ్ముతున్న దేవుడి వీధుల్లోకి లాగి రాజకీయం చేస్తున్న వారికి ఇదొక లెక్కా ! ఇంతకీ వడ్డీకాసుల వాడు ఎందుకు అప్పు చేసినట్లు ? మన పాలకులు దేనికి చేస్తున్నట్లు ?


మాటా మాటా వచ్చి లక్ష్మీదేవి భర్త విష్ణుమూర్తిని వదలి వెళ్లిపోయిందట. దాంతో దిక్కుతోచక ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ విష్ణుమూర్తి తిరుపతి ప్రాంతానికి రాగానే ఎందుకో కాస్త ప్రశాంతత దొరికినట్లు అనిపించి అక్కడే ఒక రూము తీసుకొని ఉన్నాడు. అప్పుడు మారు పేరుతో ఆకాశరాజు కూతురు పద్మావతి ప్రేమలో పడ్డాడు. వివాహం చేసుకొనేందుకు డబ్బు లేకపోతే కుబేరుడి దగ్గర భారీ వడ్డీ రేటుతో అప్పు చేశాడు. వడ్డీ చెల్లించటానికి కూడా వనరులేని వెంకటేశ్వరుడు తిరుమలను శాశ్వత నివాసంగా మార్చుకున్నప్పటి నుంచి తన భక్తులు హుండీరూపంలో ఇచ్చే కానుకలను వడ్డీగా చెల్లిస్తున్నాడు. అప్పు తీరటం లేదు ఇదీ కథ. మరి మన పాలకులు ఎందుకు అప్పు చేస్తున్నారు అనిఅడిగితే అప్పులోనే ఉంది అభివృద్ధి అని టక్కున చెప్పేస్తారు. ఎన్ని కానుకలు వేసినా వెంకటేశ్వరుడి అప్పు ఎలా తీరటం లేదో అలాగే ఎన్ని అప్పులు చేసినా అభివృద్ధి ఎక్కడా కనిపించటం లేదు.


తాజా బడ్జెట్‌ పత్రాల్లో వెల్లడించిన సమాచారం ప్రకారం 2022 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు రు.1,35,87,893 కోట్లుగానూ 2023 మార్చి ఆఖరుకు అది రు.1,52,17,910 కోట్లకు పెరుగుతుందని ఉంది. అంటే ఏడాది కాలంలో 16లక్షల 30వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం కొత్తగా అప్పు చేయనుంది.వర్తమాన కరెన్సీ మారకపు విలువ, ఇబిఆర్‌, కాష్‌బాలన్సులను పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తాలు 139, 155లక్షల కోట్లుగా ఉంటాయని ప్రభుత్వమే వివరణలో పేర్కొన్నది. నరేంద్రమోడీ సర్కార్‌ అధికారానికి వచ్చిన ఏడాది అంటే 2014 మార్చి ఆఖరుకు ఉన్న అప్పు రు.53,11,980 కోట్లు. ఎనిమిది సంవత్సరాల్లో కొత్త అప్పులు 99,05,930 కోట్లు. బహుశా దీనికి కూడా నెహ్రూ, కాంగ్రెసే కారణమని జనం చెవుల్లో ఎక్కించేందుకు పూనుకోవచ్చు.పోనీ ఇంత చేసినా అభివృద్ధి కరోనాతో నిమిత్తం లేకుండా సాధారణ పరిస్దితి ఉన్నపుడే ఎనిమిది నుంచి నాలుగుశాతానికి తగ్గింది. ఏమిటీ నిర్వాకం అని ఎవరైనా ప్రశ్నిస్తే మీరు దేశభక్తులేనా, ఇక్కడి తిండి తింటూ ఇక్కడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా అని దాడి చేస్తారు.


కేంద్రానికి వచ్చే ఆదాయం వంద రూపాయలనుకుంటే దానిలో అప్పుల ద్వారా 35, జిఎస్‌టి ద్వారా 16, ఆదాయపన్ను, కార్పొరేట్‌ పన్ను ద్వారా 15 చొప్పున, ఎక్సయిజ్‌ పన్ను ఏడు, కస్టమ్స్‌, పన్నేతర ఆదాయం ఐదేసి చొప్పున, ఇతరంగా రెండు రూపాయలు వస్తోంది. దీన్ని ఖర్చెలా చేస్తున్నారు ? వడ్డీ చెల్లింపులకు 20, రాష్ట్రాలకు పన్నుల వాటాగా 17, కేంద్ర పధకాలకు 15, ఆర్ధిక సంఘం, ఇతర బదిలీలకు 10, కేంద్ర ప్రాయోజిత పధకాలకు 9, ఇతర ఖర్చులకు 9, సబ్సిడీలు, రక్షణకు ఎనిమిది చొప్పున, పెన్షన్లకు నాలుగు వంతున ఖర్చు చేస్తున్నారు. అప్పులు తీసుకురావటాన్ని తప్పు పట్టాల్సినపనేమీ లేదు గానీ దాని వలన జరుగుతున్న వృద్ధి ఎంత అనేది మాత్రం ప్రశ్నార్ధకమే. పెట్టుబడి ఖర్చును పెంచినట్లు చెబుతున్నారు. రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేశారు. దీని వలన కలిగే మేలు ఏమంటే రోడ్ల నిర్మాణానికి అవసరమైన యంత్రాలు, సిమెంట్‌, ఉక్కు, ఇతర ముడి సరకులకు గిరాకీ పెరుగుతుంది, ఆ పరిశ్రమలకు పని దొరుకుతుంది.గతంలో రోడ్ల నిర్మాణం అంటే మానవ శ్రమ గణనీయంగా ఉండేది, ఇప్పుడు యంత్రాలు ఆ పని చేస్తున్నాయి. ఇక ఈ రోడ్ల నిర్మాణానికి చమురు మీద సెస్‌లను విధించి జనాల నుంచే వసూలు చేస్తున్నారు. అదే జనాలు(ద్విచక్రవాహనాలు మినహా) రోడ్లను వినియోగిస్తే టోలు వసూలు చేస్తున్నారు. వాణిజ్యవాహనాలు చెల్లించే టోల్‌టాక్సు పరోక్షంగా తిరిగి జనం మీదనే రుద్దుతారు.


ఒక వైపు దేశాన్ని అప్పులపాలు చేయటంతో పాటు అనుసరిస్తున్న విధానాలు జనాలను కూడా అప్పుల ఊబిలో దింపుతున్నాయి. కరోనా కాలంలో ప్రభుత్వాలు, జనాలు ఇబ్బందులు, అప్పుల పాలయ్యారు, కుబేరులు మాత్రం మరింతగా పెరిగారు, బలపడ్డారు. ఇదెలా జరిగింది ? వారికి అనుకూలమైన విధానాలే కారణం, ఎవరినైనా ఇతర సహేతుక కారణాలు చెప్పమనండి. అనేక మంది పారిశ్రామికవేత్తలు కరోనా కారణంగా తమ సంస్ధలను మూసివేశారు, వాటిని పునరుద్దరించే పేరుతోనో మరొక సాకుతోనే ప్రభుత్వాల నుంచి రాయితీలు పొందారు. పోనీ వాటిని తిరిగి పెట్టుబడిగా పెట్టి ఉపాధి కల్పించేందుకు పూనుకున్నారా అంటే అదెక్కడా కనిపించటం లేదు. కరోనా తొలి, ద్వితీయ తరంగాల్లో అనేక కుటుంబాలు ఆసుపత్రి ఖర్చుల కోసం ఉన్న ఆస్తులు అమ్మి, అప్పుల పాలైనా అనేక కుటుంబాల్లో ఆప్తులు దక్కలేదు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచటం లేదు.


కుటుంబాలు కరోనాతో ఎలా దెబ్బతిన్నాయో, వత్తిడి ఎలా పెరిగిందో వారి బంగారం తాకట్టు ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. రిజర్వుబాంకు నివేదిక ప్రకారం 2019 నవంబరు 22 నాటికి బాంకుల్లో బంగారు రుణాల మొత్తం రు.29,514 కోట్లు కాగా 2021 నవంబరు 19 నాటికి 65,630 కోట్లకు పెరిగాయి. ఇది అర్ధిక వ్యవస్ధ సజావుగా లేదనేందుకు ఒక సూచిక. వారు వ్యక్తులు లేదా చిన్న, సన్నకారు సంస్ధల వారు ఎవరైనా కావచ్చు.పత్రికల్లో ఏ రోజు చూసినా బంగారు తాకట్టు సంస్దల వేలం వార్తలు కనిపిస్తాయి. ఒక నాడు ఆర్ధిక భరోసా లేదా భద్రతగా భావించి కూడపెట్టుకున్న బంగారాన్ని ఒకసారి తాకట్టు పెట్టిన తరువాత విడిపించుకోవటం పెద్ద సమస్యగా మారుతోంది ఇప్పుడు. ముతూట్‌ ఫైనాన్స్‌ వంటి బంగారం తాకట్టు కంపెనీలు గత ఏడాది 21శాతం లాభాలు సంపాదించాయి. ఈ ఏడాది తాకట్టు రుణాలు 15శాతం పెరిగే అవకాశాలున్నట్లు అంచనా.


గృహ రుణాల్లో వినిమయ వస్తువుల కోసం చేసిన వాటి నుంచి అనేక రకాలు ఉంటాయి.2020లో జిడిపిలో ఈ అప్పు 12.6శాతం ఉంటే 2021 మార్చి నాటికి 14.5శాతానికి పెరిగింది. ఈ కాలంలో జనాలు విలాసవస్తువుల జోలికి పోలేదన్నది అందరికీ తెలిసిందే. 1999లో ఇది కేవలం 2.2శాతమే ఉంది. ఆ తరువాత జనాలతో అప్పులు చేయించి వస్తువుల కొనుగోలుకు ప్రోత్సహించిన అంశం తెలిసిందే.ఇదే కాలంలో కార్పొరేట్‌శక్తులు విద్య, వైద్యరంగాల్లో పెద్ద ఎత్తున విస్తరించటం, ప్రభుత్వం ఈ రంగాలను నిర్లక్ష్యం చేసిన కారణంగా రుణగ్రస్త అంశాల్లో ఇవి కూడా ప్రముఖంగా చోటు చేసుకుంటున్నాయి.2021 మార్చినాటికి గృహరుణ భారం 393 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు.మన కరెన్సీలో దాదాపు 30లక్షల కోట్ల రూపాయలు.


కరోనా లాక్‌డౌన్లు, మూసివేతలను ఎత్తివేసిన తరువాత అనేక సంస్దలు తిరిగి పాతవారికి అవకాశం ఇచ్చినప్పటికీ అనేక చోట్ల వేతనకోతలు ఉన్నాయి, అందువలన కుటుంబ అవసరాల కోసం తాకట్టు పెట్టిన బంగారాన్ని ఎంత మంది విడిపించుకుంటారన్నది సందేహమే. కరోనాతో నిమిత్తం లేకుండానే గృహస్తుల పొదుపు తగ్గింది.2014-15లో జిడిపిలో 13శాతంగా ఉన్నది 2019-20కి పదకొండుశాతానికి, 2020-21 డిసెంబరు త్రైమాస కాలానికి 8.2శాతానికి పడిపోయింది. అంటే ఉన్న పొదుపును కరోనా ఖర్చు చేయించింది. కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఎస్‌ఓ సమాచారం ప్రకారం గ్రామీణ కుటుంబాల సగటు అప్పు 2012-18 సంవత్సరాలలో 84, పట్టణాలలో 42శాతం చొప్పున పెరిగింది. 2021ఐసిఇ 360 సర్వే ప్రకారం 2015-16 నుంచి 2020-21తో పోలిస్తే దేశంలో దిగువన ఉన్న 20 పేద గృహస్తుల ఆదాయం 53శాతం తగ్గితే ఇదే కాలంలో 20శాతం ధనికులకు 39శాతం పెరిగింది. ఈ కాలమంతా నరేంద్రమోడీ అమలు చేసిన విధానాలే ఉన్నాయి.


రైతులపై 2021లో రణం సాగించిన నరేంద్రమోడీ సర్కార్‌ రానున్న రోజుల్లో కార్మికవర్గాన్ని లక్ష్యంగా చేసుకుంది. లేబర్‌ కోడ్‌ పేరుతో ప్రతిపాదించిన అంశాలు ఇప్పుడున్న బేరమాడే శక్తిని, వారి హక్కులను మరింత హరిస్తాయి.యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలివేసే బాటలో నడుస్తున్నారు. జనంపై రణం, దేశానికి రుణాన్ని పెంచటం తప్ప నరేంద్రమోడీ ఎనిమిది సంవత్సరాల పాలనలో చేసిందేమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

రైతుల పట్ల నరేంద్రమోడీ చిత్తశుద్దికి అగ్ని పరీక్ష !

15 Tuesday Feb 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

BJP, Farmers agitations, Fertilizers subsidies, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


2021 నరేంద్రమోడీ సర్కార్‌కు నిదురపట్టకుండా చేసింది. దిగిరాను దిగిరాను అంటూ భీష్మించుకు కూర్చున్న నరేంద్రమోడీ మెడలు వంచిన సంఘటిత శక్తి ఎంత బలమైనదో ప్రపంచానికి దేశ రైతులు చూపించారు.ఆదరాబాదరా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పాతరవేసి మూడు సాగుచట్టాలను ఆమోదించటం, చివరకు రైతాంగానికి క్షమాపణ చెప్పి వాటిని ఉపసంహరించుకున్న తీరు తెలిసిందే. ఈ అధ్యాయంలో నరేంద్రమోడీ కంటే మోడీ తీసుకున్న నిర్ణయాలను వెనక్కు తీసుకోరని గుడ్డిగా నమ్మిన వారు ఎక్కువగా ఆశాభంగం చెందారు, అభాసుపాలయ్యారంటే అతిశయోక్తి కాదు. నిజానికి రైతాంగ ఉద్యమ విరమణ అంతం కాదు ఆరంభం- ఒక విరామం మాత్రమే !


రానున్న సంవత్సరాల్లో రైతు ఉద్యమం ముందుకు తెచ్చిన అంశాలను కేంద్రం ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తికరం.కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించే అంశానికి సంబంధించి ఒక కమిటీని వేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు దాని ఊసే ఎత్తటం లేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత ప్రకటిస్తామని చెప్పారు. నిజానికి ఎన్నికలకు దానికి సంబంధం లేదు. కొద్ది నెలలైనా జాగు చేసేందుకే ఇలా చెప్పారన్నది స్పష్టం. దేశ వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్న కారణంగానే ఉన్న కొద్ది పాటి రక్షణలు కూడా రద్దు చేస్తున్నారనే ఆందోళనే రైతులు అసాధారణ రీతిలో ఉద్యమించటానికి కారణం. 2022-23 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్‌ కేటాయిలను చూస్తే రైతాంగం మరోసారి నిరాశకు గురయ్యారు.


కేంద్ర ప్రభుత్వం ఏడాదికేడాది సబ్సిడీలకు ఎసరు పెడుతున్నది.కేటాయింపు అంకెలు ద్రవ్యోల్బణాన్ని ప్రతిబింబించటం లేదు. 2021-22 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అన్ని రకాల సబ్సిడీల విలువ రు.7,07,707 కోట్లు కాగా సవరించిన అంచనాల్లో ఆ మొత్తం రు.4,33,108 కోట్లకు అంటే 39శాతం కోతపడింది. పోనీ వచ్చే ఏడాది ఈ మొత్తమైనా ఇస్తున్నారా అంటే 2022-23 బడ్జెట్‌లో ప్రతిపాదించిన మొత్తం రు.3,17,866 కోట్లు మాత్రమే. ఆకలిలో దేశ సూచిక మెరుగుపడిందేమీ లేదు.2020లో ప్రపంచ ఆకలి సూచికల్లో 107దేశాల్లో మనది 94వ స్ధానంలో ఉంది.2021లో 116దేశాలకు గాను 101వ స్ధానానికి దిగజారింది తప్ప మెరుగుపడలేదు. కానీ ఆహార సబ్సిడీని రు.5,41,330(2020-21) నుంచి 2022-23కు రు.2,86,469కోట్లకు కోత పెట్టారు.దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? వలస కార్మికులు పని స్దలాల నుంచి స్వస్ధలాలకు వెళ్లేందుకు కరోనా కాలంలో ఎన్ని ఇబ్బందులు పడిందీ దేశమంతా చూసింది. దాన్ని మరిచిపోయినట్లుగా వారే కరోనాను వ్యాప్తి చేసినట్లు నరేంద్రమోడీ తాజాగా ఆరోపించిన అంశం తెలిసిందే. వారికి, పనులు కోల్పోయిన వారికి అవసరమైన మొత్తంలో ఆహార ధాన్యాలను కూడా కేంద్రం సరఫరా చేయలేదు. మనిషికి నెలకు ఐదు కిలోలు ఇచ్చి వాటినే గొప్పగా ప్రచారం చేసుకున్నారు. చమురు సబ్సిడీలు రు.38,455 నుంచి రు.6,517 కోట్లకు కోత పెట్టారు. వంటగాస్‌ సబ్సిడీ రు.14,073 కోట్లు ఇస్తామని చెప్పిన కేంద్రం ఆచరణలో రు.6,517 కోట్లకు కోత పెట్టింది.వచ్చే ఏడాది ఈ మొత్తాన్ని రు.5,813 కోట్లకు తగ్గించారు. ఇక ఎరువుల సబ్సిడీ తీరుతెన్నులను చూద్దాం. 2021-22లో రు.1,40,122 కోట్లు ఉంటుందని సవరించిన అంచనాల్లో పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని 2022-23లో రు.1,05,222 కోట్లుగా ప్రతిపాదించారు, 35వేల కోట్లు కోత పెట్టారు.


గతేడాది పట్టువదల కుండా రైతు ఉద్యమం జరగటం, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వాతావరణం, ఇదే తరుణంలో డిఏపి, మిశ్రమ ఎరువుల ధరలు గణనీయంగా పెరగటంతో కేంద్ర ప్రభుత్వం మరొకదారి లేక ఎరువుల సబ్సిడీని పెంచకతప్ప లేదు. గత పది సంవత్సరాలలో కేంద్రం ఎరువులపై రాయితీలను 70-80వేల కోట్ల రూపాయల మధ్యనే ఇచ్చింది. ప్రస్తుతం చమురు, గాస్‌ ధరలు విపరీతంగా పెరిగిన నేపధ్యంలో దిగుమతి ఖర్చు తడిచి మోపెడు అవుతుంది. దాన్ని రైతులు భరించాలా, కేంద్రం గతేడాది మాదిరి అదనపు కేటాయింపులతో భరిస్తుందా అన్నది తెలియదు. అంతర్జాతీయంగా వరుసగా రెండు సంవత్సరాల నుంచి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా గతం కంటే ఎక్కువగా పెరిగిన అంశం తెలిసినప్పటికీ కేంద్రం ఎరువుల సబ్సిడీకి కోత పెట్టిందంటే పెరిగిన మేరకు రైతులే భరించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న మాదిరే దిగుమతి చేసుకుంటున్న ధరల మీద ప్రతిపాదించిన సబ్సిడీని పరిమితం చేస్తే ఆరేడు నెలలకు మించి రాదని విశ్లేషకులు చెబుతున్నారు. యురియా ధరలను పెంచటం ద్వారా సబ్సిడీని సర్దుబాటు చేసే అవకాశం కూడా ఉంది. గతేడాది బడ్జెట్‌లో రు.79,530 కోట్లు ప్రతిపాదించినా దిగుమతి,ఉత్పాదక ఖర్చు విపరీతంగా పెరిగినందున ఆ మొత్తాన్ని రు.1,40,122 కోట్లకు పెంచారు.


అంతర్జాతీయ మార్కెట్లో యురియా ధర 2021 ఏప్రిల్‌ ఒకటి 2022 జనవరి 28 మధ్య టన్ను ధర 357నుంచి 869డాలర్లకు పెరిగింది.(నవంబరు నెలలో 959 డాలర్లు పలికింది) డిఏపి ధర ఇదే కాలంలో 400 నుంచి 930 డాలర్లకు పెరిగింది. దాన్ని మొత్తంగా లేదా ముడిసరకులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అందుకే గతేడాది 46వేల కోట్ల రూపాయలు అదనంగా కేటాయించాల్సివచ్చింది. ఇప్పుడు ధరలు తగ్గే సూచనలు లేవు.యురియా ఉత్పత్తికి అవసరమమైన గాస్‌ ధర దేశీయంగా కూడా పెరిగింది. మన దేశం 67శాతం ఎల్‌ఎన్‌జి దిగుమతి చేసుకుంటోంది. దాదాపు ఏడాది కాలంగా చైనా ఎరువుల ఎగుమతులపై అనేక ఆంక్షలు విధించటం కూడా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుదలకు ఒక కారణం. తమ అవసరాల్లో నాలుగోవంతు పొటాష్‌ ఎరువులు చైనా నుంచి ఇతర దేవాలు దిగుమతి చేసుకుంటున్నా యి. మన దేశంలో యురియా ధరలను మాత్రమే నియంత్రణ పరిధిలో ఉంచి మిగిలిన ఎరువులన్నింటీని మార్కెట్‌ శక్తులకు వదలివేశారు. వాటి మీద పరిమితంగా సబ్సిడీలు పోను భారమంతా రైతులమీదే పడుతోంది. మన దేశంలో ఏటా 18.7 మిలియన్‌ టన్నుల యురియా దిగుమతి లేదా దేశీయంగా ఉత్పత్తి అవుతోంది. డిఏపి మూడు, మిశ్రమ(ఎన్‌పికె) ఎరువులు 6.8మి.టన్నులు దిగుమతి లేదా ఉత్పత్తి అవుతున్నాయి. గతేడాది రు.1.4లక్షల కోట్ల సబ్సిడీలో లక్ష కోట్ల వరకు యురియా సబ్సిడీకే కేటాయించారు.


మనది వ్యవసాయ ప్రధాన దేశం ఐనప్పటికీ రసాయన ఎరువుల వినియోగంలో చాలా వెనుకబడి ఉంది. 2018 సమాచారం ప్రకారం 162 దేశాల్లో హెక్టారుకు 393.2 కిలోలతో చైనా 12వ స్ధానంలో ఉండగా 49వ స్ధానంలో ఉన్న మన వినియోగం 175కిలోలు. రాజ్యసభలో ప్రభుత్వం ప్రకటించిన సమాచారం ప్రకారం 2019-20లో సగటు వినియోగం 133.44 కిలోలు ఉంది. గతేడాది ప్రభుత్వ రంగ సంస్ధ ఇఫ్‌కో కొత్త స్టాక్‌ ఎరువుల ధరలను పెంచుతూ డీలర్లకు పంపిన సమాచారం మీద రైతాంగం గగ్గోలు పెట్టింది. గరిష్టంగా 58.33 డిఏపి, ఇతర ఎరువుల ధరలను 46 నుంచి 51.9శాతం వరకు పెంచుతున్నట్లు పేర్కొన్నది. అప్పటికే రైతుల ఉద్యమిస్తుండటంతో కంగారు పడిన సర్కార్‌ వత్తిడి తెచ్చి ధరల పెరుగుదలను తాము అనుమతించలేదని పేర్కొన్నది. నిజానికి యురియా తప్ప మిగతా ఎరువుల ధరలపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదు. సబ్సిడీ ఇస్తున్నందున ఏ ఎరువును ఎంతకు అమ్మాలో మాత్రమే ప్రకటిస్తుంది. తమ దగ్గర అప్పటికే ఉన్న 11.26లక్షల టన్నుల ఎరువులకు పెంచిన ధరలు వర్తించవని, కొత్త ఉత్పత్తికి తాత్కాలిక ధరలను మాత్రమే సూచించామని ఇఫ్‌కో పేర్కొన్నది. ధరలపై నియంత్రణ లేదని కూడా ఆ సంస్ధ అధికారి గుర్తు చేశారు. తమ నిర్ణయంతో ప్రభుత్వానికి లేదా మరొక పార్టీకి గానీ సంబంధం లేదని చెప్పారు. ఉత్పత్తిదారుగా ఉన్నందున కొత్త స్టాకు సంచులపై పెరిగిన ధరలను ముద్రించాలంటే ముందుగానే ఆదేశించాల్సి ఉంటుందన్నారు. అంటే ధరల పెంపుదల తప్పదన్నది స్పష్టం. ఈ పెరిగే ధరల్లో కేంద్రం సబ్సిడీ ఇస్తుందా, మొత్తం రైతాంగం మీదనే మోపుతారా అన్నది చూడాల్సి ఉంది.

ఇఫ్‌కో సంస్ధ ప్రకటించిన దాని ప్రకారం ఎరువుల ధరల పెంపుదల ప్రతిపాదన ఇలా ఉంది.( యాభై కిలోల ధర రూపాయలలో )
ఎరువు రకం××××× పాత ధర×××× కొత్త ధర
10:26:26×××××× 1,175 ×××× 1,775
12:32:16×××××× 1,185 ×××× 1,800
20:0:13 ×××××× 925 ×××× 1,350
డిఏపి ×××××× 1,200 ×××× 1,900
కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు అందించిన సమాచారం ప్రకారం సగటున హెక్టారుకు 2015-16లో ఎరువుల వినియోగం 135.76కిలోలు ఉండగా మరుసటి ఏడాదికి 123.41కి తగ్గింది, 2019-20కి 133.44 కిలోలకు పెరిగింది.పైన పేర్కొన్న పట్టిక ప్రకారం నాలుగు ఎరువులను కలిపి 50కిలోల యూనిట్‌గా తీసుకుంటే సగటున పాత ధర రూ.1,121 ఉంది, పెంపుదల అమల్లోకి వస్తే రు.1,706 అవుతుంది. ఈ లెక్కన దేశ సగటు వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఒక హెక్టారుకు పెరిగే పెట్టుబడి భారం రు.2,991 నుంచి రు.4,553కు పెరుగుతుంది. గరిష్ట స్ధాయిలో బీహార్‌లో హెక్టారుకు 245.25కిలోలు వినియోగిస్తుండగా అత్యల్పంగా కేరళలో 36.49 కిలోలు మాత్రమే వినియోగిస్తున్నారు. సగటున రెండువందల కిలోలు వినియోగిస్తున్న రాష్ట్రాలలో పంజాబ్‌, హర్యానా, తెలంగాణా ఉన్నాయి. దేశ సగటు కంటే తక్కువ వినియోగం ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌ఘర్‌ ఉన్నాయి. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే బీహార్‌లో ఒక హెక్టారు ఉన్న రైతుకు భారం రు.2,991 నుంచి రు.4,553కు పెరిగితే అదే కేరళలోని రైతుకు రు.818 నుంచి రు.1,245కు పెరుగుతుంది.


అవసరానికి మించి యురియా వాడకం వలన భూమి ఆరోగ్యం దెబ్బతింటున్నదని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చెబుతున్నప్పటికీ సబ్సిడీ భారాన్ని తగ్గించుకొనేందుకు యురియా మీదనే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ సబ్సిడీ ఇస్తున్నది. దాంతో మిగతా ఎరువుల ధరలతో పోలిస్తే అది చౌకగా ఉండటంతో రైతాంగం అటే మొగ్గుతున్నది. అందువలన ఇతర ఎరువులకు సబ్సిడీని పెంచితే ఎరువుల వాడకంలో సమతుల్యత ఏర్పడుతుంది. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ఇప్పుడున్న బిజెపి పాలకులకు అవేమీ పట్టటంలేదు. అసమతుల్యత కారణంగా ఆహారధాన్యాల ఉత్పాదకత తగ్గుతోందని కూడా విశ్లేషణలు చెబుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఒకే దెబ్బతో చైనా, రష్యాలను కొట్టాలన్న అమెరికా ఆత్రం !

12 Saturday Feb 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

China Threat, Quad, Quadrilateral Security Dialogue, RUSSIA, Two-front wars’ with China and Russia, Ukraine war


ఎం కోటేశ్వరరావు
ఆత్రగాడికి బుద్ది మట్టు(తక్కువ లేదా పరిమితం) అన్నారు పెద్దలు.లేకపోతే రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘన్‌ తాలిబాన్లనే అదుపు చేయలేక సలాం చేసి తోకముడిచిన అమెరికన్లు ఒకేసారి చైనా, రష్యాలను మింగేస్తాం అంటుంటే ఏమనుకోవాలి మరి ! ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో అమెరికా, భారత్‌, జపాన్‌,ఆస్ట్రేలియాతో కూడిన చతుష్టయ(క్వాడ్‌) విదేశాంగ మంత్రుల నాలుగవ సమావేశం శుక్రవారం నాడు జరిగింది. ఇటీవలి కాలంలో అమెరికా విదేశాంగ విధానంలో వచ్చిన ఒక ప్రధాన మార్పు ఏమంటే తన చేతికి మట్టి అంటకుండా ఇతరులతో పని జరిపించుకోవటం. కొద్ది నెలల క్రితం దక్షిణ చైనా సముద్రంపై చైనా పెత్తనం ఏమిటంటూ ఆ ప్రాంత దేశాలను రెచ్చగొట్టింది. ఇప్పుడు ఇంకేముంది రష్యన్లు ఉక్రెయిన్‌ ఆక్రమణకు నడుంకట్టారు, మీ వెనుక మేముంటాం అందరం పోరాడుదాం , ముందుకు పదండితోసుకు అని హడావుడి చేస్తోంది. చతుష్టయ కూటమికి ఉక్రెయిన్‌ వివాదానికి సంబంధం లేదు, ఐనా మెల్‌బోర్న్‌లో దాని గురించి ప్రస్తావించారు. ప్రతిదానికి ప్రతిదేశ జుట్టును ముడివేయాలని అమెరికా చూస్తోంది. ఈ కూటమిలోని వారందరూ ఉక్రెయిన్‌ వెళ్లి రష్యా మీద దాడులకు దిగుతారా ? అంతసత్తా ఉందా ? ఆసియాకు చైనా నుంచి, ఐరోపాకు రష్యా నుంచి ముప్పు ఉందనే తన దుష్ట పన్నాగంలోకి అన్ని దేశాలనూ లాగేందుకు అమెరికా పూనుకుంది.


భారత్‌ ఎదుగుదలకు, ప్రాంతీయ నాయకురాలిగా నాయకత్వం వహించేందుకు మద్దతు ఇస్తాం అని మెల్‌బోర్న్‌లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ మనకు చెప్పారు. మనం ఏ దేశాలకు నాయకత్వం వహించాలి? ప్రపంచ పెత్తనం కోసం అమెరికా పడరాని పాట్లు పడుతోంది. మింగటం దానివల్ల కావటం లేదు. ఒక్కొక్క ఖండంలో ఒక్కో జూనియర్‌ భాగస్వామికోసం ఎదురు చూస్తోంది. మనం దాని ఏజంటుగా మారాలని కోరుకుంటోంది. అసలు భారత ఉపఖండంలో మన కోసం ఎదురు చూస్తున్నవారెవరైనా ఉన్నారా ? అందరిని, కాస్త దూరంలో ఉన్న ఇరాన్‌ వంటి మిత్రదేశాలను దూరం చేయటంలో అమెరికా జయప్రదమైంది. చిన్న దేశమైన భూటాన్‌ కూడా మనతో చెప్పకుండా డోక్లాం ప్రాంత వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు చైనాతో చర్చలు జరిపింది కదా ! మనలిన్న తన పట్టునుంచి పోకుండా అమెరికా బిగించింది.మీ ఊరు చుట్టుపక్కల 66 ఊళ్లకు పోతుగడ్డ అని పొగిడినట్లుగా మనలను మునగచెట్టు ఎక్కిస్తోంది. తన దక్షిణ చైనా సముద్ర ఆధిపత్య ఎత్తుగడలో భాగంగా గాల్వన్‌ రూపంలో మనకూ చైనాకు లడాయి పెట్టింది.

మరోవైపున ఆస్ట్రేలియాను చైనా మీదకు ఉసిగొల్పింది, జపాన్‌లో తానే తిష్టవేసింది గనుక జపాన్ను ప్రత్యేంగా రెచ్చగొట్టాల్సిన పనిలేదు. చైనా విస్తరణ వాదాన్ని అడ్డుకుందామనే పేరుతో భారత విస్తరణ వాదాన్ని ప్రోత్సహిస్తున్నది. అది జరిగేదేనా ?
ఈ కాలంలో జరిగిందేమిటి ? ఆస్ట్రేలియా తోకలను కత్తిరించేందుకు చైనా వాణిజ్య ఆయుధాన్ని వాడుతున్నది.2021 తొలి తొమ్మిది నెలల కాలంలో ఆస్ట్రేలియా నుంచి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే చైనా 17.3బిలియన్‌ డాలర్ల మేరకు దిగుమతులను తగ్గించింది. అదే వస్తువులను ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుందంటే, అమెరికా నుంచి 6.3, కెనడా నుంచి 1.5, న్యూజిలాండ్‌ నుంచి 1.1బి.డాలర్ల మేరకు అదనంగా చైనా దిగుమతి చేసుకుంది. అంటే ఆస్ట్రేలియాను ఫణంగా పెట్టి అమెరికా తన సంగతి తాను చూసుకుంది. ఇప్పుడు చైనాతో అమెరికాకు ఉన్న లడాయి ఏమిటి ? తన వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయటం లేదన్నదే, చైనా దిగుమతులు పెరిగితే దక్షిణ చైనా సముద్రమూ ఉండదు, భారత్‌కు నాయకత్వమూ ఉండదు. ఇతర దేశాల భుజాల మీద తుపాకి పెట్టి బెదిరింపులకు దిగుతోంది.


నవంబరులో జరిగే అమెరికా పార్లమెంటు ఎన్నికల్లోపు ఓటర్ల ముందు ఏదో ఒకటి సాధించినట్లు లేదా మరొక మహత్తర కార్యక్రమంలో ఉన్నట్లు ఓటర్లకు జోబైడెన్‌ కనిపిస్తేనే ఓట్లు పడతాయి.అందుకే ఈ తిప్పలు. ప్రస్తుతం అమెరికా-చైనా వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి.2020లో కుదిరిన ఒప్పందం మేరకు మా దగ్గర నుంచి సరకులు కొంటారా లేదా అని అమెరికా వత్తిడి తెస్తోంది. మీరు మాత్రం మా మీద అనేక ఆంక్షలు విధిస్తారు, చుట్టూ మంటపెడతారు, తగ్గించాల్సిన పన్నుల గురించి మాట్లాడరు, కరోనా కారణంగా తలెత్తిన సమస్యల గురించి మాట్లాడకుండా మా మీద నిందలు వేస్తే కుదరదు అని చైనా అంటోంది. ఆ ఒప్పందం ప్రకారం 2020లో అమెరికా నుంచి 260, 2021లో 310బి.డాలర్ల విలువగల వస్తువులు, సేవలను దిగుమతి చేసుకోవాల్సి ఉంది. దానికి ప్రతిగా అమెరికా చైనా నుంచి వచ్చే 120బి.డాలర్ల విలువగల వస్తువులపై పన్నును 15నుంచి 7.5శాతానికి తగ్గించాలి.2021లో రెండు దేశాల మధ్య 755.6బి.డాలర్ల మేర వాణిజ్యం జరగా అమెరికా నుంచి దిగుమతులు 179.53 బి.డాలర్లు మాత్రమే ఉన్నాయి. చైనా వార్షిక విదేశీ వాణిజ్య విలువ ఆరులక్షల కోట్ల డాలర్లుండగా అమెరికా వాటా పన్నెండుశాతంగా ఉంది.


మెల్‌బోర్న్‌ సమావేశం సందర్భంగా అమెరికా విడుదల చేసిన పత్రం భారత్‌ – చైనాల మధ్య మంటను మరింతగా ఎగదోసేదిగా ఉంది. చైనా నుంచి సవాళ్లు పెరుగుతున్నాయని ఈ ప్రాంతంలో భద్రతను సమకూర్చే భారత పాత్రకు తాము మద్దతు ఇస్తామని అమెరికా పేర్కొన్నది. క్వాడ్‌లో భారత్‌ భావ సారూప్యత కలిగిన భాగస్వామి, చోదకశక్తి అని వర్ణించింది. చైనా నుంచి సవాళ్లు పెరుగుతున్న కారణంగానే తాము ఈ ప్రాంతంపై కేంద్రీకరించామని, ఆస్ట్రేలియా మీద ఆర్ధిక బలాత్కారం, వాస్తవాధీన రేఖ వెంట భారత్‌తో ఘర్షణ, తైవాన్‌ మీద పెంచుతున్న వత్తిడి, తూర్పు, దక్షిణ చైనా సముద్ర ప్రాంత దేశాలపై బెదరింపులు వంటి చర్యలతో తమ మిత్రులు, భాగస్వాములు మూల్యం చెల్లించాల్సి వస్తోందని అమెరికా పత్రం పేర్కొన్నది. చైనాను మార్చటంలో తమకు పరిమితులు ఉన్నట్లు ఒక అమెరికా అధికారి ఈసందర్భంగా చెప్పినట్లు వార్తలు వచ్చాయి.


మెల్‌బోర్న్‌ సమావేశంలో రష్యాగురించి భిన్నంగా మాట్లాడినప్పటికీ చైనా విషయంలో దాదాపు ఒకే అభిప్రాయం వ్యక్తమైంది.క్వాడ్‌ బృందం విబేధాల గురించి గాక సహకారం, చేతులు కలపటం మీద కేంద్రీకరించాలని మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఉక్రెయిన్‌ వివాదం గురించి చెప్పారు. అమెరికా ఆంక్షలు, బెదిరింపులను ఖాతరు చేయ కుండా రష్యానుంచి క్షిపణి వ్యవస్దలను మనదేశం కొనుగోలు చేసింది. ఇప్పటికీ మిలిటరీ సరఫరాలపై వారి మీదే ప్రధానంగా ఆధారపడి ఉన్నాము. రష్యా మిలిటరీ బెదరింపులు ముప్పు తెస్తున్నాయని అమెరికా మంత్రి బ్లింకెన్‌ ఆరోపించగా ఈ వివాదంలోకి తాము దలదూర్చటం లేదని జైశంకర్‌ పేర్కొన్నారు. ఒక దేశంతో ఎవరితో కలవాలో లేదో మరొక దేశం నిర్ణయించరాదని అమెరికా మంత్రి రష్యామీద ధ్వజమెత్తారు.నాటోలో ఉక్రెయిన్ను చేర్చుకోరాదని రష్యా డిమాండ్‌ చేస్తుండగా చేర్చుకొని ఉక్రెయినుకు మిలిటరీని తరలించి రష్యా మెడమీద కత్తిలా మారాలని అమెరికా ఎత్తువేసింది. నా సహచరులు చెప్పినట్లుగా మేము కొన్నింటికోసం ఉన్నప్పటికీ కొందరికి వ్యతిరేకం కాదని జైశంకర్‌ అన్నారు. ఇటీవలి భద్రతామండలి సమావేశంలో కూడా రష్యాను విమర్శించేందుకు మన దేశం తిరస్కరించింది. జపాన్‌-రష్యా మధ్య సరిహద్దు సమస్యలున్నప్పటికీ ఘర్షణకు జపాన్‌ సిద్దంగా లేదు. అమెరికా వత్తిడి మేరకు కొన్ని ప్రకటనలు చేసినప్పటికీ చైనాతో వాణిజ్య మిగులు ఉన్న జపాన్‌ తెగేవరకు లాగేందుకు సిద్దంగా లేదు. దక్షిణ కొరియా కూడా చైనాతో సత్సంబంధాలనే కోరుకుంటోంది.

మన దేశం గాల్వన్‌ ఉదంతాల సమయంలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టినప్పటికీ గతేడాది రికార్డు స్దాయిలో వస్తువులను దిగుమతి చేసుకొని సానుకూల సందేశాన్ని పంపింది. కోవీషీల్డ్‌ కరోనా వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి పదార్ధాలను, పరికరాలను సరఫరా చేసేందుకు అమెరికా నిరాకరించి నిషేధం విధించిన అంశం తెలిసిందే. కేంద్రంలో ఉన్న అధికారపార్టీ రాజకీయాలను ఖాతరు చేయకుండా మన దిగుమతిదారులు లావాదేవీలు జరిపారు. చైనా నుంచి నిర్ణీత పరిమాణంలో వస్తువులను విధిగా కొనుగోలు చేయాలనే ఒప్పందాలేవీ లేవు, అగత్యమూ లేదు. అమెరికన్లు చెబుతున్నట్లు వారు మనకు సహజభాగస్వాములే ఐతే, జపాన్‌, ఆస్ట్రేలియా మన మంచి కోరుకున్నట్లయితే మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులను వారు సరఫరా చేయవచ్చు, చేేయగలరు కానీ వారు చెప్పిన ధరలను మనం చెల్లించాలి. ఎక్కడన్నా బావేగానీ వంగతోట దగ్గర కాదు. ఆ వెలతో దిగుమతి చేసుకుంటే మన జనాల జేబులు కొట్టి అమెరికా, ఇతర దేశాలకు సమర్పించాలి. తక్కువ ధరలకు వస్తువులు వస్తున్నందున దిగుమతిదారులు మొగ్గుచూపుతున్నారు తప్ప చైనా మీద వారికేమీ ప్రత్యేక ప్రేమ ఉండికాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d