• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Economics

దిగుబడుల పెరుగుదలకు దున్నకం తగ్గించాలా !

26 Thursday Dec 2019

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, USA

≈ Leave a comment

Tags

Agricultural, Reduced soil tilling, Smart Agriculture, soils, yields

Image result for could Reduced soil tilling helps both soils and yields

 

 

 

 

 

 

 

 

ఎం కోటేశ్వరరావు
భూమిని ఇష్టం వచ్చినట్లుగా ప్రతిదానికీ దున్నకూడదు, ఎంత తక్కువ దున్నితే అంతగా భూమి ఆరోగ్యం బాగుపడుతుంది, దిగుబడులు కూడా పెరుగుతాయని తమ అధ్యయనంలో తేలిందని తాజాగా కొందరు పరిశోధకులు చెప్పారు. రైతాంగం ముఖ్యంగా మన వంటి వర్ధమాన దేశాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవటం ఒక అంశమైతే, పంట మార్కెటింగ్‌ మరొక అంశం. ప్రపంచ వాణిజ్య సంస్ద ఉనికిలోకి రాక ముందే ప్రపంచీకరణ, దానిలో భాగంగా నయా ఉదారవాద విధానాలు వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. మన దేశంలో ఆ విధానాలు అమలులోకి వచ్చిన 1991 తరువాత అంతకు ముందు తలెత్తినదాని కంటే వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం దానికి సూచికగానే ఆత్మహత్యలన్న విషయం తెలిసిందే. వ్యవసాయం గిట్టుబాటు కానందున అనేక మంది వ్యవసాయ మానివేస్తే, అంతకంటే ఎక్కువగా మరోపని లేక కౌలు రైతులు ఉనికిలోకి వచ్చారు. పశ్చిమ దేశాలతో పోల్చితే మన దేశంలో వ్యవసాయ కమతాల సంఖ్య, వాటి మీద పని చేసే వారి సంఖ్యా ఎక్కువే.
తాజా సమాచారం ప్రకారం మన దేశంలో వ్యవసాయం మీద ఆధారపడుతున్నవారు 58శాతం ఉన్నారు.మన కంటే వెనుకబడిన, దారిద్య్రంతో మగ్గుతున్న దే శాలలో తప్ప మరే ఇతర వర్ధమాన దేశంలో ఇంత సంఖ్యలో లేరు. గడచిన ఆర్దిక సంవత్సరంలో 28.5 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేశాము. 2015-16లో ఒక రైతు కుటుంబ సగటు ఆదాయం రూ.96,703ను 2022-23 నాటికి రూ.2,19,724 చేస్తామని నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డిఏ సర్కార్‌ వాగ్దానం చేసింది. ఇది ఎలా జరుగుతుందో ఇప్పటి వరకైతే అంతుబట్టలేదు, నరేంద్రమోడీ ఇటీవలి కాలంలో దాని గురించి మాట్లాడటం లేదు. దీని గురించి మరో సందర్భంలో చూద్దాం. మన దేశ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకు, వందల, వేల ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఐరోపా, అమెరికాల్లో ఉండే రైతుల సమస్యలు వేరుగా ఉంటాయి. అయితే దేశం ఏదైనా భూమి ఎదుర్కొంటున్న సమస్యలు ఎక్కడైనా ఒకటే. తగ్గుతున్న భూసారం, దెబ్బతింటున్న భూమి ఆరోగ్యం.ఈ సెగ మనకు తగిలిన కారణంగానే ఇప్పటికే మన రైతాంగానికి పది కోట్ల మేరకు భూ ఆరోగ్య కార్డులు పంపిణీ చేశారు. ఒక మొబైల్‌ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.
ఈ తరం సూపర్‌ తిండి తింటున్నది కనుకనే మా తరం మాదిరి గట్టిగా ఉండటం లేదని వృద్ధులు అనటం వింటాం. దానిలో పాక్షిక సత్యం లేకపోలేదు. ఈ అంశాలన్నీ ఒక ఎత్తయితే ఇటీవలి కాలంలో భూమి ఆరోగ్యం దిగజారుతోందన్న అంశాలు రైతాంగాన్ని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. భూ ఆరోగ్య బాగుకు అయ్యే ఖర్చుకూడా రైతుమీదే పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఇది మునిగే పడవకు గడ్డిపోచకూడా భారం మాదిరే అన్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా 2.4 కోట్ల ఎకరాల భూమి సారం లేనిదిగా తయారు అవుతున్నదన్నది ఒక అంచనా. ఇది ప్రపంచ ఆహార భద్రతను ప్ర శ్నార్దకం చేయటంతో పాటు భూమి మీద వత్తిడిని పెంచటంతో పాటు మన వంటి దేశాలలో రైతు మీద భారాన్ని కూడా మోపనుంది.
దీనికి రైతులు వ్యక్తిగతంగా చేయగలిగింది పరిమితం, ప్రభుత్వాలు మాత్రమే పరిష్కరించగలిగిన అంశం. వ్యవసాయ అభివృద్ధి, విస్తరణ, పరిశోధన బాధ్యతల నుంచి వైదొలిగే విధానాలు అనుసరిస్తున్న పాలకుల నుంచి ఏమి ఆశించగలమన్నది ఒక ప్రశ్న. ఈ నేపధ్యంలో ప్రపంచంలో ఏమి జరుగుతోంది, శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారో చూద్దాం. ఒక దేశంలో జరిగిన అధ్యయనాలు మరొక దేశానికి లేదా ప్రాంతానికి మక్కీకి మక్కీ వర్తించకపోవచ్చుగానీ, ఆయాదేశాల, ప్రాంతాలకు సంబంధించి ఏమి చేయాలన్నదానికి దారి చూపుతాయి.

Image result for could Reduced soil tilling helps both soils and yields
కొన్ని అంశాలు విపరీతంగా కూడా అనిపించవచ్చు, వాటి మంచి చెడ్డలను శాస్త్రవేత్తలు మాత్రమే వివరించగలరు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం తాజాగా విడుదల చేసిన పరిశోధన అంశాల సారం ఏమంటే భూమిని ఇష్టం వచ్చినట్లుగా ప్రతిదానికీ దున్నకూడదు, ఎంత తక్కువ దున్నితే అంతగా భూమి ఆరోగ్యం బాగుపడుతుంది, దిగుబడులు కూడా పెరుగుతాయని చెబుతున్నారు.1930దశకంలో అమెరికా, కెనడాలలో తీవ్రమైన దుమ్ము తుపాన్లు,వర్షాభావ పరిస్ధితులు ఏర్పడి, కొన్ని చోట్ల సాగు నిలిపివేయాల్సి వచ్చింది.కొంత కాలం దున్నకం నిలిపివేసిన తరువాత పంటల దిగుబడి అక్కడ పెరిగిందని, భూ ఆరోగ్య మెరుగుదల, దిగుబడుల పెరుగుదలకు దాన్నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు.
రైతులు సాధారణంగా సాగుకు ముందు పాటు కలుపు మొక్కల తొలగింపుకు, ఎరువులు వేసే సమయంలోనూ దున్నటం, విత్తే సమయంలో దున్నటం తెలిసిందే. ఇలా ఎక్కువ సార్లు దున్ని భూమిలో కలుపు మొక్కలు లేకుండా చేయటం వలన స్వల్పకాలంలో దిగుబడులు పెరగవచ్చుగానీ దీర్ఘకాలంలో భూమి సారం తగ్గుతుందట.భూమికి మేలు చేసే బాక్టీరియా, ఇతర క్రిమి కీటకాలు అంతరిస్తున్నాయి. ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్ధ(ఎఫ్‌ఏఓ) 2015నివేదిక ప్రకారం గత నాలుగు దశాబ్దాల కాలంలో మూడో వంతు సాగు భూమిలో సారం తగ్గిందట. పదే పదే భూమి దున్నకం, దాని పర్యవసానాల గురించి అమెరికాలోని సోయా, మొక్కజొన్న సాగు చేసే భూముల మీద చేసిన అధ్యయనం మేరకు ఎంత తక్కువగా దున్నితే అంత మంచిదనే అభిప్రాయానికి వచ్చారు.తక్కువ సార్లు దున్నితే ఆరోగ్యకరమైన భూ యాజమాన్య పద్దతులను ప్రోత్సహించటంతో పాటు, కోతనిరోధం, నీటిని నిలుపుకోవటం మెరుగుపడుతుంది.యంత్రాలను వినియోగించకపోవటం లేదా పరిమితంగా దున్నటం ద్వారా గత సంవత్సరపు పంట కోసిన తరువాత మిగిలే సోయా, మొక్కజన్న దుబ్బులు కూడా భూమికి మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పరిమిత దున్నకపు పద్దతులను ప్రస్తుతం అమెరికా ఖండ దేశాలు, ఓషియానా ప్రాంతంలో 37 కోట్ల ఎకరాల్లో వినియోగిస్తున్నారు.పరిమిత దున్నక సాగు అమెరికా మొక్కజొన్న పొలాల్లో 2012-17 మధ్య పదిహేడు శాతం పెరిగింది. అయితే మొత్తం సాగులో ఇది 3.4శాతమే. అయితే దిగబడులు, లాభాలు తగ్గుతున్నాయని రైతాంగం ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. గతంలో ఈ పద్దతులను కొన్ని పరిశోధనా కేంద్రాల్లోనే అమలు జరిపారు, అక్కడ కూడా ఉత్పాకత మీద పడే ప్రభావం గాక భూసార మెరుగుదల గురించే కేంద్రీకరించారు.
స్టాన్‌ఫోర్డ్‌ బృందం ఎక్కువ సార్లు దున్నే ప్రాంతాలు, పరిమిత దున్నకపు ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసం గురించి అధ్యయనానికి 2005 నుంచి 2016వరకు కంప్యూటర్లలో సేకరించిన సమాచారంతో పాటు ఉపగ్రహ చిత్రాలద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు. దీనిలో పంటల దిగుబడులపై వాతావరణ మార్పులు, పంటల తీరు తెన్నులు, భూమి స్వభావం వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నారు. అమెరికాలోని తొమ్మిది రాష్ట్రాలలో అధ్యయనానికి ఎంచుకున్న కేంద్రాల సమాచారాన్ని విశ్లేషించారు. దీర్ఘకాలం పాటు పరిమితంగా దున్నిన పొలాల్లో సగటున మొక్కజొన్న దిగుబడి 3.3, సోయా 0.74 శాతం చొప్పున ఎక్కువ సార్లు దున్నిన పొలాలతో పోల్చితే పెరిగినట్లు వెల్లడైంది. కొన్ని కేంద్రాల్లో ఈ దిగుబడులు గరిష్టంగా 8.1,5.8 శాతాల చొప్పున ఉన్నాయి. కొన్ని చోట్ల 1.3, 4.7 శాతాల చొప్పున మొక్కజన్న, సోయా దిగుబడులు తగ్గినట్లు కూడా గమనించారు. ఇంతటి తేడాలు రావటానికి భూమిలో నీరు, ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పులు ప్రధానంగా పని చేసినట్లు వెల్లడైంది. ఎక్కువ సార్లు దున్నే ప్రాంతాలలో నేలలు పొడిబారటం, నీటిని నిలువ చేసే సామర్ధ్యం తగ్గగా తక్కువ సార్లు దున్నిన ప్రాంతాలలో నేలలో తేమ దిగుబడులు పెరిగేందుకు ఉపయోగపడింది.
అధ్యయనం వెల్లడైన ధోరణులను వెల్లడించింది తప్ప ఇంకా నిర్దిష్ట నిర్ధారణలకు రాలేదు. మరింత విస్తృత అధ్యయనాలు జరపాల్సి ఉంది.1980దశకం నుంచి ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు.తక్కువ సార్లు దున్నిన చోట రైతులు పూర్తి స్ధాయిలో లబ్ది పొందేందుకు మొక్కజొన్న విషయంలో పదకొండు సంవత్సరాలు పడితే సోయా విషయంలో రెట్టింపు వ్యవధి తీసుకుంది. తక్కువసార్లు దున్నకం వలన భూమి సారం అభివృద్ధి చెందటం ఒకటైతే యంత్రాల వాడకం, వాటికి అవసరమయ్యే ఇంధనం, కార్మికుల ఖర్చు తగ్గింది. భూసారం పెరిగే కొలదీ దిగుబడులు పెరగటాన్ని గమనించారు.2017 అమెరికా వ్యవసాయ గణాంకాల ప్రకారం దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు మొగ్గుచూపుతున్నట్లు, అమెరికాలోని పంటలు పండే భూమిలో 35శాతం వరకు తక్కువ సార్లు దున్నే పద్దతులను అనుసరిస్తున్నట్లు వెల్లడైంది. పరిశోధనా కేంద్రాల నుంచి వెల్లడైన సమాచారానికి, సాగు చేస్తున్న రైతాంగ అనుభవానికి అనేక మార్లు పొంతన కుదరకపోవటంతో రైతుల్లో పూర్తి విశ్వాసం ఇంకా ఏర్పడ లేదు. ఫలితంగా కొందరు రైతులు ఈ పద్దతికి మళ్లేందుకు ముందుకు రాని పరిస్ధితి కూడా ఉంది. తక్కువ ఉత్పాదకత ఉండే భూములను సారవంతవమైనవిగా మార్చవచ్చని క్వీన్‌లాండ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. స్ధానిక, గిరిజన తెగల సహకారంతో నిస్సారమైన భూములను చాలా చౌకగా, తక్కువ వ్యవధిలోనే పదిల పరచవచ్చంటున్నారు.
ప్రపంచ వ్యవసాయ రంగంలో తీవ్రమైన పోటీ, ఇటీవలి కాలంలో ఉత్పత్తుల ధరలపతనం వంటి అనేక అంశాలు కొత్త పరిశోధనలకు తెరలేపుతున్నాయి. అయితే ఇవి చిన్న, సన్నకారు రైతులు ఎక్కువగా ఉండే మన వంటి వ్యవసాయ పరిస్దితులున్న చోట పరిశోధనల ఫలితాలను ఎలా వుపయోగించుకోవాలి, ఎలా వర్తింప చేసుకోవాలి అన్నది ఒక పెద్ద సవాలే. అయినా ఎంత మేరకు వీలైతే అంతమేరకు వినియోగించుకోవటం తప్ప మరొక మార్గం కనిపించటం లేదు.సూక్ష్మ వ్యవసాయం, మార్కెట్‌ పద్దతుల గురించి ప్రస్తుతం అనేక చోట్ల కేంద్రీకరిస్తున్నారు. గ్లోబల్‌ మార్కెట్‌ ఇన్‌సైట్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ అనే సంస్ధ తాజాగా విడుదల చేసిన అధ్యయనం ప్రకారం 2025 నాటికి ప్రస్తుతం ఉన్న నాలుగు బిలియన్‌ డాలర్లుగా ఉన్న సూక్ష్మ వ్యయవసాయ మార్కెట్‌ పన్నెండు బిలియన్‌ డాలర్లవరకు పెరగవచ్చని అంచనా వేసింది.

Image result for could Reduced soil tilling helps both soils and yields
స్మార్ట్‌ ఫోన్ల మాదిరి స్మార్ట్‌ వ్యవసాయ పద్దతులకు గాను సమాచారాన్ని, సమాచార వ్యవస్ధలను వినియోగించుకొని రైతాంగానికి తోడ్పడేందుకు ప్రయత్నిస్తున్నారు. పంటల స్ధితిగతులను తెలుసుకొనేందుకు, కంప్యూటర్‌ వ్యవస్ధలతో పాటు డ్రోన్ల వినియోగం కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. సూక్ష్మ వ్యవసాయ పద్దతులంటే పరిమిత ప్రాంతాలలో సైతం ఎలాంటి పంటలను సాగు చేయాలి, ఎంత నీరు, ఎరువుల వినియోగం వంటి నిర్ధిష్ట సూచనలు చేసే వ్యవస్ద ఏర్పాటు. ఇందుకోసం 2017లో డచ్‌ ప్రభుత్వం పంటల సమాచార సేకరణకు ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు అవసరమైన నిధులను విడుదల చేసింది. గగనతలం నుంచి సమాచారాన్ని సేకరించేందుకు ద్రోన్స్‌, సెన్సర్లు, జిపిఎస్‌ వ్యవస్ధలు, స్మార్ట్‌ ఫోన్ల వినియోగం 2025నాటికి 70శాతం వరకు ఉండవచ్చని అంచనా. మెరుగైన, పొదుపు పద్దతుల్లో నేల, నీటి వినియోగానికి ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి. రానున్న ఆరు సంవత్సరాలలో పరికరాలను గరిష్టంగా, జాగ్రత్తగా వినియోగించటం దగ్గర నుంచి సూక్ష్మ వ్యవసాయ సేవల వరకు మార్కెట్‌ పెరుగుదల రేటు 27శాతం ఉంటుందని అంచనా. పొలాల్లో ఎక్కడ ఏ లోపం ఉందో తెలుసుకొనేందుకు, వాటి నివారణకు తగు చర్యలను తీసుకొనేందుకు 3డి మాపింగ్‌తో సహా అనేక పద్దతులు అందుబాటులోకి వచ్చాయి.
అమెరికా, ఐరోపా వంటి దేశాల్లో జరుపుతున్న పరిశోధనలన్నీ కార్పొరేట్‌ వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చే లక్ష్యంతో చేస్తున్నవే, వాటిని వినియోగించుకోగలిగింది కార్పొరేట్‌ సంస్ధలే అన్నది వేరే చెప్పనవసరం లేదు. ఆ ఫలితాలను మన వ్యవసాయ రంగానికి ఎలా వర్తింప చేయాలి, వినియోగించుకోవాలి అన్నది మన ప్రభుత్వాలు చేయాల్సిన పని. వ్యవసాయ విస్తరణ, అభివృద్ధి వ్యవస్ధ, సిబ్బంది నియామకం పట్ల పూర్తి నిర్లక్ష్యం వహించిన ఫలితాల పర్యవసానాలను చూస్తున్నాము. యూరియా, క్రిమి, కీటక నాశనులను అవసరానికి మించి వాడుతున్నందున జరుగుతున్న నష్టాల గురించి చెబితే చాలదు, ఇతర ఎరువుల ధరలు ఆకా శాన్ని అంటిన కారణంగా సబ్సిడీ వున్నందున రైతాంగం యూరియాను ఎక్కువగా వాడుతున్నారన్నది తెలిసిందే. అందువలన రైతాంగాన్ని చైతన్యపరచటంతో పాటు, భూ సారం, ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవటం, అందుకు అవసరమైన సబ్సిడీలు, బడ్జెట్‌ కేటాయింపులు చేయటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

విమర్శలను స్వీకరించే స్ధితిలో మోడీ సర్కార్‌ లేదు -రాహుల్‌ బజాజ్‌ !

01 Sunday Dec 2019

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

India economy 2019, India fiscal deficit, India GDP, Modi govt, Narendra Modi, Rahul Bajaj, We are not able to openly criticise Modi govt

Image result for Rahul Bajaj

ఎం కోటేశ్వరరావు
‘యుపిఏ 2 కాలంలో మనం ఎవరిని అయినా తిట్టగలిగేవారం. మీరు మంచి పని చేస్తున్నారు, అయితే మేము మిమ్మల్ని బహిరంగంగా విమర్శించాలి అనుకుంటే మీరు దాని స్వభావాన్ని గ్రహిస్తారన్న విశ్వాసం లేదు. నేను చెప్పింది తప్పు కావచ్చు గానీ ప్రతివారు అలా భావిస్తున్నారు. భోపాల్‌ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ పార్లమెంట్‌లో గాడ్సే గురించి వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీని కాల్చి చంపినవాడు ఒక ఉగ్రవాది అనటంలో ఎవరికైనా సందేహం ఉందా…..నాకు తెలియదు. గాడ్సే దేశభక్తుడని మేనెలలో ప్రజ్ఞ వర్ణించారు. దాని మీద ఆమెను క్షమించటం తనకు ఎంతో కష్టమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కానీ తరువాత ఆమెను రక్షణ శాఖ కమిటీలోకి తీసుకువచ్చారు.’

పైన పేర్కొన్న వ్యాఖ్యలు, విమర్శలు చేసిన వ్యక్తి ప్రతిపక్షానికి చెందిన వారు కాదు, నరేంద్రమోడీ వ్యతిరేకి అంతకంటే కాదు. రాజకీయవేత్త కాదు, కమ్యూనిస్టు అసలే కాదు. ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్‌ బజాజ్‌. పోనీ ఆయనేమైనా ఎక్కడో అన్నారా అంటే అదేమీ కాదు.అనేక మంది దృష్టిలో ప్రధాని నరేంద్రమోడీ కంటే బలవంతుడని భావించే హౌంమంత్రి అమిత్‌ షా, ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌, రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ సమక్షంలోనే బహిరంగ వేదిక మీద చేసిన వ్యాఖ్యలవి. ముంబైలో నవంబరు 30న జరిగిన ఎకనమిక్‌ టైమ్స్‌ 2019 అవార్డుల ప్రదానోత్సవ సభలో రాహుల్‌ బజాజ్‌ చేసిన క్తుప్త ప్రసంగంలోని ముఖ్యాంశాలవి. ఎవరూ భయపడనవసరం లేదు, ప్రజ్ఞ చెప్పిన దానిని ఖండించాము అని వేదిక మీద ఉన్న అమిత్‌ షా చెప్పిన మాటలను నమ్మేందుకు ఎవరైనా చెవుల్లో కమలం పువ్వులు పెట్టుకొని ఉన్నారా ?
ఇదే రాహుల్‌ బజాజ్‌ జూలై చివరి వారంలో తమ కంపెనీ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం చెప్పవచ్చు చెప్పకపోవచ్చు, గత మూడు నాలుగు సంవత్సరాలుగా అభివృద్ధి పడిపోతున్నదని ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు వెల్లడిస్తోంది. డిమాండ్‌ లేకుండా ప్రయివేటు పెట్టుబడులు ఉండవు, అలాంటపుడు అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది, స్వర్గం నుంచి ఊడిపడదు. అన్ని ప్రభుత్వాల మాదిరి వారు(మోడీ సర్కార్‌) చిరునవ్వు ముఖాన్ని చూపుతారు, కానీ వాస్తవం, వాస్తవమే’ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇవి రాహుల్‌ బజాజ్‌ వ్యక్తిగత అభిప్రాయమే అనుకుంటే పప్పులో కాలేసినట్లే బొంబాయి క్లబ్‌ కార్పొరేట్ల మనోగతం !
నిద్రపోతున్న వారిని లేపగలం గానీ నిద్ర నటిస్తున్నవారిని లేపగలమా ? దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంత నిర్ధారణగా మరొకరికి తెలియదు. అంతర్గతంగా ఏమి జరుగుతోందో కేంద్ర ప్రభుత్వానికి తెలిసినంతగా మరొకరికి ముందుగా తెలిసే అవకాశం లేదు. మోడీ సర్కార్‌, దాన్ని నిరంతరం కాపాడే ఉన్నత అధికార యంత్రాంగం గత కొద్ది సంవత్సరాలుగా అనేక విషయాలను మూసిపెడుతోంది. అవి పాచిపోయి వాసన కొట్టిన తరువాతే బయటకు వస్తున్నాయి.
ప్రధాని నరేంద్రమోడీ తన చుట్టూ తనకు తాన తందానా అనే వారినే నియమించుకున్నారని బిజెపి నేత సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు. ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అర్ధశాస్త్రం తెలియదన్నారు. అమెరికన్‌ పత్రిక హఫ్‌పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వారు నిజమైన అభివృద్ది రేటు 4.8శాతం అంటున్నారు, నేను 1.5శాతమే అంటున్నాను అన్నారు.(ఈ ఇంటర్వ్యూ జరిగిన రెండు రోజుల తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం రెండవ త్రైమాసిక అభివృద్ధి రేటు 4.5శాతమే) మీరు చూస్తే గనుక మీడియా సమావేశంలో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తే నిర్మలా సీతారామన్‌ మైక్‌ను అధికారులకు ఇస్తారు. ఈ రోజు దేశంలో ఉన్న సమస్య ఏమిటి డిమాండ్‌ లేకపోవటం తప్ప సరఫరా లేమి కాదు, కానీ ఆమె కార్పొరేట్లకు పన్నుల రాయితీ ఇస్తున్నారు. వారు వాటిని తీసుకొని తమ రుణాలను తీర్చుకుంటారు, గతంలో కూడా అదే చేశారు. వాస్తవాలను ప్రధానికి చెప్పేందుకు ఆయన సలహాదారులు కూడా భయపడతారు. ప్రధానికేమీ దాని గురించి తెలియదు అద్భుతమైన ప్రగతి ఉందని చెబుతారు.
మాంద్యమా కాదా అన్నది కాదు అసలు నరేంద్రమోడీ సర్కార్‌కు ఆర్ధిక వ్యవస్ధలోపమేమిటో తెలియదనేందుకు అరకొర చర్యలు తీసుకుంటున్న తీరే నిదర్శనం అని ఆర్ధికవేత్త, 14వ ఆర్ధిక సంఘం సభ్యుడైన సుదీప్త మండల్‌ వ్యాఖ్యానించారు.అసలైన సమస్య డిమాండ్‌ వైపు ఉంది అన్నారు. ఆరునెలల ఆర్ధిక సమీక్ష నివేదికను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో అభివృద్ధి రేటు 4.9శాతానికి మించదు అన్నారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలన్నీ సరఫరా వైపున ఉండే పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు, కార్పొరేట్‌ సంస్ధలు, రియలెస్టేట్‌ వంటి వాటికి రాయితీలు ఇవ్వటమే. డిమాండ్‌ను పెంచే జనం చేతుల్లో డబ్బు ఉండాలి అని సుదీప్త చెప్పారు.
డిమాండ్‌కు సంబంధించినవే ఉపాధి, వినిమయ అంశాలు. నాలుగున్నర దశాబ్దాల గరిష్ట స్ధాయి 6.1శాతానికి నిరుద్యోగం పెరిగిందన్న నివేదికను ఎన్నికల ముందు విడుదల కాకుండా తొక్కిపెట్టింది మోడీ సర్కార్‌. ఎన్నికల తరువాత వినిమయం తగ్గిపోయిందన్న నివేదిక తప్పుల తడక అంటూ దాన్ని కూడా మూసిపెట్టింది. అవి రెండూ తిరుగులేని పక్కా నివేదికలని ఈ ఏడాది మొదటి ఆరునెలల్లో అభివృద్ధి రేటు 4.75శాతంగా నమోదై నిర్దారించింది, ఇది ఆరేండ్ల కనిష్టం.
కల్లు కుండను కొట్టేయటానికి ప్రయత్నిస్తూ దొరికి పోయిన వాడిని తాటి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడగడ్డి ఎక్కడుందో చూద్దామని అని అసలు విషయం దాచిన మాదిరి వ్యవహరిస్తున్నారు. ఆటో రంగంలో మాంద్యం ఎందుకంటే కుర్రవారు స్వంతకార్ల బదులు అద్దె కార్లవైపు మళ్లారని చెప్పటం అంటే దూడగడ్డి వ్యవహారమే. వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి మూడు మాసాల్లో వృద్ధి రేటు ఐదు శాతానికి పడిపోయింది. తొలి మూడు మాసాలు అలాగే ఉంటుంది, రెండవ త్రైమాస ఫలితాలు చూడండి అన్నారు. తీరా అది 4.5కు దిగజారింది. ఇప్పుడు డిసెంబరు ఫలితాలు చూడండి అంటున్నారు.
ఈ పతనానికి కారణాలు ఏమిటి? అసలు సమస్యను అంగీకరించేందుకు మోడీ సర్కార్‌ సిద్దంగా లేదు. పెట్టుబడుల గురించి మోడీ హడావుడి ఏడాదికేడాది పెరుగుతోంటే వాస్తవంలో 2015-16 నుంచి దేశంలో నూతన పెట్టుబడుల ప్రతిపాదనలు క్రమంగా తగ్గుతున్నాయి.2006-07 నుంచి 2010-11 వరకు ప్రతి ఏటా సగటున 25లక్షల కోట్ల రూపాయల నూతన పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. తరువాత దిగజారుడు ప్రారంభమై 2013-14లో పదిలక్షల కోట్ల రూపాయలకు పడిపోయాయి. తరువాత రెండు సంవత్సరాలలో 21, 20లక్షల కోట్లకు పెరిగాయి. 2015-16 తరువాత క్రమంగా తగ్గుతూ 2018-19లో 10.7లక్షల కోట్ల రూపాయలకు పడిపోయాయి. అయితే ఇవన్నీ కార్యరూపం దాల్చలేదు. ఇక పెట్టుబడుల విషయానికి వస్తే కొన్ని లక్షల కోట్లుగా కనిపించవచ్చుగానీ అవన్నీ పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించేందుకు దోహదం చేసేవి కాదు. ఉదాహరణకు 2018-19లో జెట్‌ ఎయిర్‌వేస్‌ బోయింగ్‌ కంపెనీ నుంచి లక్షా 31వేల కోట్లతో 150 విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రతిపాదించింది. తీరా దాన్ని రద్దు చేసుకుంది. అందువలన అంతిమంగా ప్రతిపాదిత పెట్టుబడుల్లో ఏ మేరకు కార్యరూపం దాల్చేది చెప్పలేము. ఈ ఏడాది జూన్‌, సెప్టెంబరుతో ముగిసిన ఆరు నెలల కాలంలో పెట్టుబడుల ప్రతిపాదనలు కేవలం 1.83లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అని బిజినెస్‌ టుడే అక్టోబరు ఏడవ తేదీన పేర్కొన్నది. ఇది 15 సంవత్సరాల కనిష్ట రికార్డు.

ఏటేటా ప్రభుత్వ పెట్టుబడులు దిగజారుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్ధలను తెగనమ్మి కార్పొరేట్లకు రాయితీలు, ద్రవ్యలోటును పూడ్చుకోవటం తప్ప వచ్చిన సొమ్మును తిరిగి పెట్టుబడులుగా పెట్టటం లేదు.2015-16లో పది లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించగా అది 2017-18లో 5.3లక్షల కోట్లకు, మరుసటి సంవత్సరానికి మూడు లక్షల కోట్లకు తగ్గిపోయాయి.
1991 నుంచి అమలు చేస్తున్న సరళీకరణ విధానాలలో భాగంగా ప్రభుత్వ పెట్టుబడులు తగ్గించివేస్తున్నారు. ఇదే సమయంలో కార్పొరేట్‌ శక్తులకు ఇచ్చే రాయితీలు ఏదో ఒక రూపంలో పెరుగుతూనే ఉన్నాయి. సంస్కరణలకు ముందు జిడిపిలో 12.7శాతంగా ఉన్న ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రస్తుతం ఏడుశాతానికి తగ్గాయని ప్రపంచ బ్యాంకు సమాచారం వెల్లడించింది.

అమెరికా, ఐరోపా ధనిక దేశాల మాదిరి వినియోగ ఆధారిత వ్యవస్ధగా మన దేశాన్ని మార్చివేసేందుకు ప్రపంచ, దేశీయ కార్పొరేట్‌ శక్తులు చేసిన యత్నం విజయవంతమైంది. అందుకే పరిమితంగా ఉన్న ధనిక మధ్యతరగతి ఆశలు, ఆకాంక్షలను తీర్చేందుకు వారికి దిగువన ఉన్న వారి ప్రయోజనాలను ఫణంగా పెట్టే విధానాలను ముందుకు తెచ్చారు. ఇప్పటికీ ధనికుల కొనుగోలు డిమాండ్‌లో మార్పు ఉన్నట్లు ఎవరూ చెప్పటం లేదు. ప్రతి ఒక్కరూ గ్రామీణ వినియోగం తగ్గిందనే చెబుతున్నారు. మెజారిటీ జనం అక్కడే ఉన్నారు, వారి ఆదాయాలు పరిమితం కనుక వినియోగమూ పరిమితమే. మునిగే పడవకు గడ్డి పోచకూడా భారమే అన్నట్లుగా వారు ఆధారపడుతున్న వ్యవసాయ రంగంలో ఏ చిన్న ప్రతికూల పరిణామం జరిగినా వినియోగం పడిపోతుంది. గత ఐదు సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో తలెత్తిన సంక్షోభం పరిష్కారం కాని కారణంగానే అది వినియోగం మీద ప్రభావం చూపి పారిశ్రామిక రంగాన్ని కూడా పడకేసేట్లు చేసింది. ఇది మన జనాభా పొదుపును హరించి వేస్తున్నది. పెట్టుబడికి వినియోగించే పొదుపు రేటు జిడిపిలో కొద్ధి సంవత్సరాల క్రితం సగటున 33.8శాతం ఉండగా 2019 ఆర్ధిక సంవత్సరంలో అది 29.3శాతానికి పడిపోయింది.ఇది ద్రవ్యలోటు పెరుగుదలకు దారి తీస్తోంది. ద్రవ్యలోటు పెరగటం జనం మీద ఖర్చు చేసే సంక్షేమ పధకాలకు కోత పెట్టటం లేదా అప్పులు తీసుకోవటం, అధికంగా కరెన్సీ నోట్ల ముద్రణకు దారి తీస్తుంది. ఇదొక విష వలయం. అందుకే ద్రవ్యలోటు పెరిగింది అంటే తొలి దెబ్బ సామాన్యుల మీదనే పడుతోంది. దేశంలో ద్రవ్యలోటు పెరుగుదల గురించి తెలిసే ఇటీవల కేంద్ర ప్రభుత్వం వాణిజ్య, పారి శామిక రంగాలకు పన్ను రాయితీలను ఇచ్చింది.
మన బడ్జెట్‌ అంచనాల ప్రకారం 2020 మార్చి నెల ఆఖరుకు ద్రవ్యలోటు ఏడులక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. అది అక్టోబరు నాటికే అంటే ఏడునెలల కాలంలోనే 7.2లక్షల కోట్లకు(102.4శాతానికి) చేరింది.పన్ను ఆదాయం 6.83లక్షల కోట్లు అయితే ఖర్చు 16.55లక్షల కోట్లకు చేరింది. ముందే చెప్పుకున్నట్లు జిడిపి వృద్ధి రేటు తగ్గటం పన్ను ఆదాయాలు తగ్గటానికి కూడా దోహదం చేస్తుంది. అంటే లోటు మరింతగా పెరగటం లేదా బడ్జెట్‌కోతలకు దారి తీస్తుంది. మరొక మార్గం బంగారు బాతుల వంటి ప్రభుత్వ రంగ సంస్ధలను తెగనమ్మటం.
సంస్కరణల పేరుతో ప్రభుత్వ రంగాన్ని వదిలించుకోవాలన్నది మన దేశం మీద ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ విధించిన ఒక ముఖ్యమైన షరతు. దాన్ని బయటకు చెబితే జనంలో వ్యతిరేకత వస్తుందనే భయంతో నష్టాల బారిన పడిన ప్రభుత్వరంగ సంస్దలను వదిలించుకోవాలనే ప్రచారం మొదలు పెట్టారు. జనానికి కూడా నిజమే అనిపించింది. ఆక్రమంలో ప్రభుత్వరంగం పతనం కావటానికి చేయాల్సిందంతా చేసి ఆ పేరుతో కారుచౌకగా ఆ శితులకు కట్టబెడుతున్నారు. ప్రయివేటు టెలికాం సంస్ధలు ఐదవ తరం టెక్నాలజీలోకి మారటం గురించి ఆలోచిస్తుంటే ప్రభుత్వ బిఎస్‌ఎన్‌ఎల్‌ను మూడవ తరం టెక్నాలజీకే పరిమితం చేసే చర్యలు తీసుకోవటం దానిలో భాగమే. ప్రభుత్వంలోని చమురు సంస్ధలు లాభాలు ఆర్జిస్తున్నాయి, అయినప్పటికీ వాటిని(బిపిసిఎల్‌) అమ్మివేయాలని నిర్ణయించారు. ఇదెక్కడి ఘోరం అని ప్రశ్నిస్తే ప్రభుత్వాలు వ్యాపారాలకు దూరంగా ఉండాలి కనుక అమ్మివేస్తున్నాం, అది కూడా ప్రయివేటు రంగానికే అని బిజెపి సర్కార్‌ చెబుతోంది. ఇంక నాటకాలు ఆడేందుకు ఏమాత్రం అవకాశం లేదు కనుక అసలు విషయాలు చెబుతున్నారు. ఇప్పుడు తేల్చుకోవాల్సింది జనమే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ సర్కార్‌ : అంకెల గారడీ, ఎదురుదాడులు !

20 Wednesday Nov 2019

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Aravind Subrahmanyam, India Data Crisis, India GDP, jugglery of numbers, narendra modi government, narendra modi offensive attacks, offensive attacks

Image result for narendra modi offensive attacks
(ఆర్థిక దిగజారుడు, సమాచార విశ్వసనీయత సంక్షోభం – 2 ముగింపు భాగం)
ఎం కోటేశ్వరరావు
గత లోక్‌సభ ఎన్నికలకు ముందు ఏడాది అవిశ్వాస తీర్మానంపై చర్చలో ప్రధాని నరేంద్రమోడీ ఉపాధి కల్పన గురించి పార్లమెంట్‌లో మాట్లాడారు. పిఎఫ్‌ పధకంలో ఎంత మంది చేరిందీ, వైద్యులు, చార్టర్డ్‌ ఎకౌంటెంట్ల గురించి అంకెలు చెబుతూ ఏడాదికి కోటి ఉద్యోగాల కల్పన చేయకపోతే అవన్నీ ఎలా సాధ్యమని ఎదురుదాడి చేశారు. తరువాత ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో కూడా అదే కబుర్లు చెప్పారు. ఎన్నికలకు ముందుగానే ఎన్‌ఎస్‌ఎస్‌ఓ వెల్లడైంది. నాలుగున్నర దశాబ్దాల రికార్డును అధిగమించి నిరుద్యోగశాతం 6.1కి చేరిందన్నది దాని సారం. అయితే తాము కల్పించిన ఉద్యోగాలన్నీ లెక్కల్లోకి చేరలేదని, తప్పుడు లెక్కలని పకోడీ బండి పెట్టుకోవటం కూడా ఉపాధి కల్పనకిందికే వస్తుందని కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు వెల్లడైన ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నివేదిక వాస్తవం కాదని బుకాయించిన సర్కార్‌ అనంతరం అదే నివేదికను వాస్తవమైనదిగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో 8.2శాతంగా ఉన్న నిరుద్యోగం అక్టోబరులో 8.5కు చేరింది.
నిరుద్యోగం లేదా ఉద్యోగాల కల్పన గురించి ప్రధాని, బిజెపి నేతలు జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. 2017 సెప్టెంబరు-2018నవంబరు మధ్య తొలిసారిగా కోటీ ఎనభై లక్షల మంది ప్రావిడెంట్‌ ఫండ్‌కు తమ వాటాను జమచేయటం ప్రారంభించారని వారిలో 65లక్షల మంది 28ఏండ్ల లోపు వారేనని, వారందరికీ కొత్తగా ఉద్యోగాలు వచ్చిన కారణంగానే అది జరిగిందని, అదే విధంగా 2014 మార్చి నుంచి 2018 అక్టోబరు వరకు కోటీ ఇరవై లక్షల మంది నూతన పెన్షన్‌ పధకంలో నమోదైనట్లు కూడా మోడీ చెప్పారు.
ఇక్కడ మోడీ మహాశయుడు నాణానికి ఒక వైపును మాత్రమే చూపారు. రెండో వైపు చూద్దాం. ప్రావిడెంట్‌ ఫండ్‌ వెబ్‌సైట్‌లో ఈ లెక్కలన్నీ పెడుతున్నారు. మోడీ గారు కోటీ 79లక్షల నమోదు కాలంలోనే కోటీ 39లక్షల మంది ఈ పధకం నుంచి తప్పుకున్నారు. 33లక్షల మంది గతంలో చేరి తప్పుకొని తిరిగి చేరిన వారు ఉన్నారు. అంటే నిఖరంగా నిలిచిన వారు 73లక్షల మందే. తప్పుకున్నవారందరూ నిరుద్యోగం సైన్యంలో చేరినట్లా లేక ఉద్యోగవిరమణ చేసినట్లా ? ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. నరేంద్రమోడీ సర్కార్‌ కార్మికుల పేరుతో యజమానులకు మేలుచేసే సబ్సిడీ పధకాన్ని ప్రవేశపెట్టింది. దాని పేరు పిఎం రోజ్‌గార్‌ ప్రోత్సాహ యోజన. దాని ప్రకారం తమ పధకం ప్రారంభం నాటికే ఉన్న సిబ్బంది గాకుండా తరువాత కొత్తగా చేరిన సిబ్బందిని ప్రావిడెంట్‌ పధకంలో చేర్చితే వారి ఖాతాలకు యజమానులు చెల్లించాల్సిన సొమ్మును మూడేండ్ల పాటు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అది కూడా పదిహేను వేల రూపాయల లోపు వేతన ఉన్న వారికి మాత్రమే. అందువలన అనేక యజమానులు దాన్ని వినియోగించుకొని అప్పటికే ఉద్యోగాల్లో వున్నా పిఎఫ్‌ పధకంలో చేర్చని వారిని కొత్తవారిగా చేర్పించి వుండవచ్చు. అందువలన ఒక్కసారిగా ఉద్యోగాలు పెరిగినట్లు చిత్రిస్తున్నారు.
అంకెలతో జనాన్ని ఎలాగైనా ఆడుకోవచ్చు. కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో పిఎం రోజ్‌గార్‌ ప్రోత్సాహయోజన పధకం ప్రారంభమైన 2016 నుంచి 2019 నవంబరు 18 వరకు విస్తరించిన జౌళి రంగ కార్మికులతో సహా లబ్ది పొందిన వారు కోటీ 24 లక్షల 33వేల 819 మంది. లబ్ది పొందిన సంస్ధల సంఖ్య లక్షా 53వేల 574. ఇందుకు గాను ప్రభుత్వం యజమానుల వాటాగా చెల్లించిన సొమ్ము 6,887 కోట్ల రూపాయలు. సగటున ఒక్కొక్క కార్మికుడి ఖాతాలో వేసిన సొమ్ము రూ.5,539. మరి ఈ లెక్కలను మోడీ గారు కాదంటారా తప్పంటారా ?
మోడీ గారు మరో లెక్క చెప్పారు. అదేమంటే 2014 నుంచి కొత్తగా 36లక్షల కొత్త వాణిజ్య ట్రక్కులు,27లక్షల ఆటోలు, కోటీ 50లక్షల ప్రయాణీకుల వాహనాల విక్రయం జరిగిందని, తద్వారా రవాణా రంగంలో కోటీ 25లక్షల ఉద్యోగాలు కొత్తగా వచ్చినట్లు వివరించారు. ఇక్కడ చూడాల్సింది, పాతవాహనాలు ఎన్ని వినియోగం నుంచి తప్పుకున్నాయి. కొత్తవాహనాలకు కొత్త ఉద్యోగులే వచ్చారనుకుందాం, వారిలో ఎవరూ అంతకు ముందు ఎక్కడా ఏ పనీ చేయటం లేదా కొత్త వాహనాల మీద అప్పటికే పని చేస్తున్నవారు గాక కొత్తవారు ఉద్యోగాల్లో చేరినట్లు రుజువులు ఏమిటి?
టూరిజం రంగంలో కొత్త హౌటళ్లకు అనుమతులు 50శాతం పెరిగాయని, దీని వలన మరో కోటీ 50లక్షల ఉద్యోగాలు వచ్చాయని మోడీ చెప్పారు. దీనికి కూడా రవాణా రంగం మాదిరే అధికారుల అంచనా లెక్కలు తప్ప ఆధారాలేమీ లేవు.
తొలిసారిగా ముద్ర రుణపధకం కింద నాలుగు కోట్ల 25లక్షల మంది రుణాలు పొందారని, అయితే ఉపాధి వివరాలు లేవని మోడీ చెప్పారు. అంటే రుణాలు తీసుకున్నవారందరికీ ఉపాధి చూపినట్లే అనుకోవాలనా ? ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారమే 15.59 కోట్ల మందికి ఇచ్చిన రుణాల మొత్తం రెండులక్షల 75వేల కోట్లు, అంటే సగటున ఇచ్చిన మొత్తం రు 17,582, దీనితో వచ్చే ఉపాధి ఎంత అన్నది ప్రశ్న.

Image result for narendra modi offensive attacks
ఇక్కడ మరో ప్రశ్న తలెత్తుతున్నది. ప్రధాని నరేంద్రమోడీకి ఇన్ని వివరాలు తెలిసినపుడు, ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న జాతీయ గణాంక సంస్ధ(ఎన్‌ఎస్‌ఓ) లేదా ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వేల్లో అవెందుకు ప్రతిబింబించటం లేదు. లెక్కలు సరిగా వేయటం లేదంటున్నారు. ఐదున్నర సంవత్సరాల పాలనలో లెక్కల విధానాన్ని కూడా సరి చేసి సరైన లెక్కలు చెప్పటంలో మోడీ సర్కార్‌ విఫలమైనట్లు అంగీకరించటమే కదా ! లేదూ సరైన లెక్కల విధానాన్ని అమల్లోకి తెచ్చేంత వరకు ఆ సంస్ధ రూపొందించిన వాటిని ఎందుకు అంగీకరించటం లేదు ? ప్రతి సారీ వివాదం ఎందుకు రేపుతున్నట్లు ? మోడీ సర్కార్‌ కోసం ఎన్‌ఎస్‌ఓ కొత్త పద్దతినేమీ ప్రవేశపెట్టలేదు కదా, అంతకు ముందున్నదాని కొనసాగింపే కదా ? పోనీ నరేంద్రమోడీ సర్కార్‌ సాధించినట్లు చెప్పుకుంటున్న లెక్కలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నట్లు? అవి సరైనవే అయితే నిరుద్యోగం పెరగటం, వినిమయశక్తి తగ్గటం వంటి వివరాలు తప్పుడు లెక్కలు ఎలా అవుతాయి ?
2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని నరేంద్రమోడీ వాగ్దానం చేశారు. ఆచరణ సంగతి పక్కన పెడదాం. రైతుల ఆదాయం ఎంత అన్నది ప్రభుత్వం ఎప్పుడైనా ప్రకటించిందా ? రైతుల పరిస్ధితి గురించి శ్వేతపత్రం ఏమైనా ప్రకటించిందా అంటే లేదు. ప్రభుత్వ సంస్ధలు చెబుతున్న లెక్కలు తప్పు, వాస్తవాన్ని ప్రతిబింబించటం లేదు అంటున్నారు. స్వచ్చ భారత్‌ లేదా బహిరంగ మలవిసర్జన నిరోధ పధకం కింద మరుగుదొడ్ల గురించి ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ వాటిలో ఎన్నింటిని వినియోగిస్తున్నారు అన్న అంశంపై తయారు చేసిన విశ్లేషణ నివేదికను మాత్రం బయట పెట్టకుండా తొక్కి పెట్టారు.
మరుగుదొడ్ల నివేదిక సర్వేను ఎందుకు మూసిపెట్టారు ? ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించేందుకు వెళ్లిన మన ప్రధాని నరేంద్రమోడీ మన దేశంలో ఇప్పుడు ఎక్కడా బహిరంగ మలవిసర్జన లేదని అంతర్జాతీయ సమాజానికి చెప్పేశారు. తమ ప్రభుత్వం సాధించిన ఘనతగా చిత్రించారు. అక్టోబరు రెండవ తేదీన గాంధీ మహాత్ముడి 150 జయంతి సందర్భంగా అహమ్మదాబాద్‌ సబర్మతి నదీ తీరంలో ఇరవై వేల గ్రామపంచాయతీలకు సర్పంచ్‌లకు సర్టిఫికెట్లను కూడా ప్రదానం చేశారు. ఇంత హడావుడి చేసిన తరువాత అధికారిక నివేదికను విడుదల చేస్తే మోడీ గారి గాలి తీసినట్లు అవుతుంది. దేశంలో మరుగుదొడ్లు 75శాతం మందికే అందుబాటులో ఉన్నాయని, వాటిలో 80శాతం మాత్రమే వినియోగంలో ఉన్నట్లు సదరు ముసాయిదా నివేదిక పేర్కొన్నది. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ 76వ నివేదికకోసం 2018 జూలై నుంచి డిసెంబరు మధ్య సర్వే చేశారు. దానిలో చేర్చిన ప్రశ్నావళి మోడీ సర్కార్‌ను ఇబ్బంది పెట్టింది. తొలిసారిగా మీ ఇంట్లో మరుగుదొడ్డి ఉందా? ఉంటే దాన్ని వినియోగిస్తున్నారా ? వినియోగించకపోతే కారణాలేమిటి ? అని అడిగారు. ఈ నివేదిక సర్వేలో 75శాతం మందికే మరుగుదొడ్లు ఉన్నట్లు తేలింది. సర్వే ముగిసిన డిసెంబరు తరువాత కేవలం తొమ్మిది నెలల కాలంలో మిగిలిన 25శాతం మరుగుదొడ్లు కట్టటం ఎలా సాధ్యమైంది అనే ప్రశ్న తలెత్తుతుంది కనుక మోడీ సర్కార్‌ దీన్ని తొక్కి పెట్టిందన్నది స్పష్టం. ఇదే నివేదికను తరువాత ఎప్పుడో జనం మరచిపోయిన తరువాత గుట్టుచప్పుడు కాకుండా ఎన్నికల అనంతరం నిరుద్యోగ నివేదిక మాదిరి విడుదల చేస్తారా ?

Image result for narendra modi offensive attacks
ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి రేటు ఏడు వాస్తవం కాదని, నాలుగున్నరశాతానికి మించదని ప్రధాని ఆర్ధిక సలహాదారుగా పని చేసిన అరవింద్‌ సుబ్రమణ్యం , అభివృద్ధి అంకెలకు ఉపాధి కల్పనకు పొసగటం లేదని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ చెప్పిన విషయం తెలిసిందే. అరవింద సుబ్రమణ్యం గణించిన తీరులో లోపాలు ఉన్నాయని కాసేపు అంగీకరిద్దాం. అవెలా తప్పో ఇంతవరకు మోడీ సర్కార్‌ ఎందుకు అసలు గుట్టు విప్పి చెప్పలేదు, అడ్డుకున్నదెవరు ? ప్రతి అంశానికి సమాధానం చెబుతామని రంకెలు వేశారు, ఇంతవరకు అలాంటి దాఖలాలు లేవు. ఈ ఏడాది ఇప్పటి వరకు వెలుబడిన అంకెలు సుబ్రమణ్యం చెప్పిందే సరైనవని నిర్ధారించటం లేదా ? మోడీ స్వయంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు చర్యవలన జిడిపి వృద్ధిరేటు 6.7 నుంచి 8.2శాతానికి పెరుగుతుందని ప్రభుత్వమే అంతకు ముందు వేసిన అంచనాలను సవరించింది. కానీ ఆచరణలో ఆ చర్య వృద్దిని దెబ్బతీసిందని రుజువు చేసింది. అంటే కొందరి బుర్రల్లో తలెత్తిన ఆలోచనల మేరకు చేసిన అంకెల గారడీ తప్ప ప్రాతిపదిక లేదు లేదా తప్పుడు ప్రాతిపదికన అంకెలను సవరించారన్నది స్పష్టం. అభివృద్ది సూచికల తయారీకి తీసుకొనే అంశాలైన కార్ల అమ్మకాలు, విమానాల్లో సరకు రవాణా, కొనుగోలు శక్తి తదితర అంశాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం వృద్ది గురించి అతి అంచనాలు వేసినట్లు రాయిటర్స్‌ వ్యాఖ్యానించింది.
దేశంలో ఆర్ధిక వ్యవస్ధ మందగమనంలో ఉందా మాంద్యంలో ఉందా అనే పండిత చర్చను కాసేపు పక్కన పెడితే కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ ఉత్పత్తి సంస్దలు ఎంత సామర్ధ్యంతో పని చేస్తున్నాయి, అంచనాల మేరకు విద్యుత్‌ ఎందుకు అమ్ముడు పోవటం లేదంటే పరిశ్రమలు, వాణిజ్యం కొత్తగా రాకపోవటమే అన్నది స్పష్టం. అందుకే విద్యుత్‌ కంపెనీల దివాళా. ఈ పూర్వరంగంలో సమాచారం వెలువడుతున్న అనుమానాలు మన అధికారయంత్రాంగం, పాలకుల విశ్వసనీయతనే దెబ్బతీస్తున్నాయని గుర్తించాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ సర్కార్‌ : ఆర్థిక దిగజారుడు, సమాచార విశ్వసనీయత సంక్షోభం – 1

19 Tuesday Nov 2019

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

finance minister nirmala sitharaman, India Data Crisis, India Economic slowdown, Narendra Modi, narendra modi credibility crisis

Image result for narendra modi and nirmala sitharaman
ఎం కోటేశ్వరరావు
ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నాడు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం సుమతీ శతకకర్త బద్దెన భూపాలుడు లేక భద్ర భూపాల. అయితే ఆయన దాన్ని వాడిన సందర్భం తెలియదు గానీ మన రాజకీయనేతలు మాత్రం దాన్ని తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. కొందరిని కొంత కాలం అలాంటి మాటలతో మభ్యపరచవచ్చుగానీ ఎల్లరనూ ఎల్లకాలం మోసం చేయటం కుదురుతుందా ?
మోడీగారు తనకు ఇబ్బంది కలిగించే అంశాల మీద నోరు విప్పరు. ఆయన మాదిరి నోరు మూసుకొని ఉండటం మంత్రులకు సాధ్యం కాదు. ఎవరూ మాట్లాడకపోతే ప్రభుత్వ దుకాణం మూతపడిందని జనం అనుకుంటారు. ఆటోమొబైల్‌ రంగం మందగమనం లేదా రాయంచనడక సంగతేమిటమ్మా అని అడిగితే కుర్రాళ్ల మైండ్‌ సెట్‌ మారింది, స్వంతకారుకు నెలవారీ వాయిదాలు చెల్లించే బదులు ఓలా, ఉబర్‌ వంటి వాటిని ఉపయోగించటం, త్వరలో వచ్చే కొత్త మోడల్స్‌ కోసం ఎదురు చూస్తూ పాతవాటిని కొనుగోళ్లను వాయిదా వేయటం వంటి కారణాలున్నాయని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సెప్టెంబరులో చెప్పారు. ఆయితే ఆ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగటంతో ఆమె కాస్త తగ్గారు. దేశ ఆర్థిక వ్యవస్ధ మందగించింది తప్ప మాంద్యంలోకి జారలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నవంబరు 18న లోక్‌సభకు సమర్పించిన రాత పూర్వక సమాధానంలో చెప్పారు. అంతకు ముందు నాలుగు రోజుల క్రితం ఆర్ధిక వ్యవస్ధ అధమ స్ధాయిలోకి దిగజారలేదన్నారు. మందగించినా వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 20దేశాల బృందంలో మనదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా ఉందని, 2025 నాటికి ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపి లక్ష్యాన్ని సాధిస్తామని కూడా లోక్‌సభలో చెప్పారు.

Image result for finance minister nirmala sitharaman
మంత్రులు లేదా మరొకరు చట్టసభల వెలుపల మాట్లాడేవాటిలో అతిశయోక్తులు, అవాస్తవాలు, వక్రీకరణలు ఉండటాన్ని ప్రాణ, విత్త,మాన భంగములతో పాటు రాజకీయములందు కూడా అబద్దములాడవచ్చని సరిపెట్టుకుందాం. నిర్మలా సీతారామన్‌ సమాధానం తరువాత అనుబంధ ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యతను ఆమె జూనియర్‌ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్వీకరించారు. నిజమే చెబుతాను అబద్దాలు చెప్పను అని ప్రమాణం చేసిన ఆ మంత్రిగారు ఆధారాలు లేని అంశాలను చెప్పారు. వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి మూడు మాసాల్లో వృద్ధి రేటు ఐదు శాతానికి పడిపోయిందని(ఇది ఆరేండ్ల కనిష్టం) ప్రభుత్వమే చెప్పింది. ఐదుశాతం మాంద్యం లేదని సదరు మంత్రి అడ్డంగా మాట్లాడారు.
అంతేనా ! పెద్ద నోట్ల రద్దు తరువాత పన్ను చెల్లింపుదార్ల ప్రాతిపదిక రెట్టింపు కాగా, ప్రత్యక్ష పన్నుల వసూలు మొత్తం రెట్టింపు అయిందని బయట బహిరంగ సభల్లో చెప్పే అంశాలను పార్లమెంటులోనూ చెప్పారు. ఆదాయ పన్ను శాఖ గణాంకాల ప్రకారం 2016-17లో 6.92కోట్ల మంది పన్ను చెల్లింపుదార్లు ఉంటే 2018-19 నాటికి 8.45 కోట్ల మందికి పెరిగారు. కూడికలు తీసివేతలు మాత్రమే తెలిసిన వారికి కూడా ఇది రెట్టింపు కాదు కదా నాలుగోవంతుకు తక్కువ ఐదో వంతుకు ఎక్కువ అన్నది స్పష్టం. ఇక పన్ను వసూళ్లు 2015-16లో అంటే పెద్ద నోట్ల రద్దుకు ముందు రూ 7,41,945 కోట్లు కాగా అవి 11,37,685 కోట్లకు పెరిగాయి, అంటే యాభైశాతానికి కొద్దిగా ఎక్కువ. మరి రెట్టింపు ఎక్కడ ? సమర్ధించుకోవటానికి మంత్రులు ఎలాంటి పాట్లు పడుతున్నారో ఇంకా చూడండి !
జాతీయ సెలవు దినం అక్టోబరు రెండవ తేదీ ఒక్క రోజే మూడు సినిమాలు 120 కోట్ల రూపాయలు వసూలు చేశాయని చిత్ర విమర్శకుడు కోమల్‌ నహతా నాకు చెప్పాడు. ఒక దేశంలో 120 కోట్ల రూపాయలు వచ్చాయంటే ఆ దేశం గట్టి ఆర్దిక వ్యవస్ధను కలిగి ఉన్నట్లే అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్‌ ఆక్టోబరు 12న ముంబై పత్రికా గోష్టిలో వ్యాఖ్యానించారు. దీని మీద తీవ్ర విమర్శలు రావటంతో తన వ్యాఖ్యను అసందర్భంగా పేర్కొని వక్రీకరించారని, తానెంతో సున్నిత మనస్కుడను కనుక చేసిన వ్యాఖ్యలు సరైనవే అయినా వాటిని ఉపసంహరించుకుంటున్నా అని మరుసటి రోజు సదరు మంత్రి ప్రకటించారు.
తాజాగా నవంబరు 16న కేంద్ర మంత్రి సురేష్‌ అంగాడీ ఆర్ధిక వ్యవస్ధ గట్టిగా ఉందని దానికి నిదర్శనం వివాహాలు పెద్ద ఎత్తున జరుగుతుండటం, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో జనం పెద్ద సంఖ్యలో కనిపించటమే అని సెలవిచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. అంతే కాదు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఆర్ధిక వ్యవస్ధ మందగిస్తుందని, తరువాత పుంజుకుంటుందని ఇది ఒక చక్రమణం వంటిదని వివరించారు. దేశంలో పౌరుల వినిమయ ఖర్చు గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా 2017-18లో పడిపోయిందని జాతీయ గణాంక సంస్ధ(ఎన్‌ఎస్‌ఓ) తాజా నివేదికలో వెల్లడి కావటం గురించి మంత్రి సురేష్‌ అంగాడీ పై వ్యాఖ్యలు చే శారు.
నరేంద్రమోడీ చెబుతున్న ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్ధ పగటికల అన్నది ఒక అభిప్రాయం. కానీ కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్‌ తెల్లవారు ఝామున వచ్చిన కల నిజం అవుతుందనే మూఢనమ్మకంతో ఉన్నారు. ఈ జిడిపి అంకెలతో ఐదులక్షల కోట్లడాలర్ల ఆర్ధిక వ్య వస్ధ సాధ్యమా అని ప్రశ్నిస్తే జనాలు అంకెలను, ఆర్ధిక వ్యవస్ధ లెక్కలను పట్టించుకోవద్దు అన్నారు. అంతటితో ఆగితే ఫరవాలేదు. సాంద్రత సిద్దాంతాన్ని కనుగొనేందుకు ఐనిస్టీన్‌కు లెక్కలేమీ ఉపయోగపడలేదని వ్యాఖ్యానించారు.వాస్తవానికి ఐనిస్టీన్‌ సాపేక్షతా సిద్దాంతాన్ని న్యూటన్‌ సాంద్రతా సిద్దాంతాన్ని కనుగొన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి ఆర్ధిక పరిస్ధితిని చక్కదిద్ధే తెలివి తేటల సంగతి తరువాత, పై వ్యాఖ్యలను చూసిన తరువాత వారికి ఎప్పుడు, ఏం మాట్లాడాలో కూడా తెలియదనుకొనే పరిస్ధితులు తలెత్తాయని ఎవరైనా భావిస్తే అది వారి తప్పు కాదు. ఇప్పుడు ప్రధాని నాయకత్వం విశ్వసనీయత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదంటే అతిశయోక్తి కాదు.
ప్రధాని నరేంద్రమోడీ సుడిగాలి మాదిరి విదేశీ పర్యటనలు జరిపి దేశ ప్రతిష్టను పెంచి ఎక్కడికో తీసుకుపోయారని బిజెపి నేతలు చెప్పటాన్ని అంగీకరిద్దాం ! భారత ప్రభుత్వ అధికారిక సమాచారం గురించి ఆర్ధికవేత్తలు, పెట్టుబడిదారులకు ఏ మాత్రం నమ్మకం లేదని అంతర్జాతీయ వార్తా సంస్ద రాయిటర్స్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక వార్తా విశ్లేషణను విడుదల చేసింది. జిడిపి పెరుగుదలను అభివృద్దిగా చూపేందుకు మోడీ సర్కార్‌ పడుతున్న తాపత్రయం గురించి తెలిసిందే. 2016 జూలై నుంచి 2017 జూన్‌ వరకు పన్నెండు నెలల కాలంలో గణాంక మంత్రిత్వశాఖ ఒక సర్వే జరిపింది. దేశ జిడిపి లెక్కల్లో ఉపయోగించిన కంపెనీల సమాచారాన్ని ఎంచుకొని జరిపిన సర్వేలో 36శాతం కంపెనీల ఉనికి లేకపోవటం లేదా తప్పుడుగా వర్గీకరించినట్లు తేలింది. సమాచార సేకరణలో లోపాలు ఉన్నాయని అంగీకరిస్తూనే జిడిపి అంచనాల మీద వాటి ప్రభావం ఉండదని, తగిన జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రిత్వశాఖ చెప్పింది. నిరుద్యోగం నాలుగున్నర దశాబ్దాల గరిష్ట స్ధాయికి చేరిందన్న నివేదికను విడుదల చేయకుండా తొక్కి పట్టటాన్ని , జిడిపి గణాంకాలను ఆధారం చేసుకొని కేంద్ర ప్రభుత్వ సమాచారాన్ని నమ్మటానికి లేదనే నిర్ధారణకు రాయిటర్స్‌ వచ్చింది. ఈ కారణంగానే తాము ప్రత్యాయమ్నాయ సమాచార వనరులపై ఆధారపడేందుకు ప్రయత్నిస్తున్నామని రాయిటర్స్‌ విలేకర్లు ఇంటర్వ్యూలు చేసిన ఆర్ధికవేత్తలు, బ్యాంకుల విశ్లేషకులు, మేథావులు చెప్పారు.
దేశ జిడిపి వృద్ధి రేటు పడిపోతున్నది. ఎనిమిదిశాతంగా ఉన్నది ఈ ఏడాది రెండవ త్రైమాసంలో ఐదు శాతానికి పడిపోయినట్లు, నిరుద్యోగులు పెరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడించాయి.2020 ఆర్ధిక సంవత్సరంలో ముందుగా అంచనా వేసిన వృద్ధి రేటు 6.8శాతానికి బదులు 6.1శాతానికి మించకపోవచ్చునని రిజర్వుబ్యాంకు జోశ్యం చెప్పింది. వినిమయంపై జనాల ఖర్చు పడిపోవటం ఆందోళన కలిగిస్తోందని జాతీయ గణాంక సంస్ధ సర్వే చెప్పింది. నాలుగు దశాబ్దాల తరువాత ఆహార వినియోగం తగ్గిపోయిందని, దేశం పోషకాహారలేమి వైపు పయనిస్తోందని, వినిమయం తగ్గటం అంటే దారిద్య్రంలోకి జారుతున్న జనం పెరుగుదలను సూచిస్తోందని గణాంకాలు వెల్లడించాయి.1972-73లో కంటే వినిమయ ఖర్చు తగ్గిపోయింది. అప్పుడు వినిమయ ఖర్చు తగ్గుదలకు చమురు ధరల పెరుగుదలను కారణంగా చెప్పారు. ఎన్‌ఎస్‌ఓ తాజా నివేదికను తొలుత సర్కార్‌ బయటకు రాకుండా తొక్కి పెట్టింది. అది ఎలాగో బయటికి వచ్చింది, దాంతో గణాంకాల ప్రమాణాల మీద అనుమానాలు వున్నాయని, ఇది ముసాయిదా తప్ప నిర్ధారించినది కాదని ప్రభుత్వం ప్రకటించింది. అంటే మోడీ సర్కార్‌ అచ్చేదిన్‌ బండారాన్ని ఎండగట్టింది కనుక అంకెలను మార్చి అంతా బాగుంది అని విడుదల చేస్తారా ?
2011-12లో గ్రామీణులు సగటున నెలకు ఆహారం మీద రూ.643 ఖర్చు చేస్తే 2017-18లో రూ.580కి తగ్గింది. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో మాత్రం రూ.943 నుంచి 946కు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తంగా వినిమయ ఖర్చు ఇదే కాలంలో 8.8శాతం పడిపోగా, పట్టణాల్లో రెండుశాతం పెరిగింది. ఆహారం మీద వినియోగం తగ్గటం అంటే పోషకాహారలేమి పెరగటానికి ఒక సూచిక. ప్రపంచ ఆకలి సూచికలో మన దేశం అధమ స్ధానంలో ఉంది. ఎన్నో విజయాలు సాధించామని సులభరత వాణిజ్య సూచిక మెరుగుదల గురించి పదే పదే చెబుతున్న నరేంద్రమోడీ వంది మాగధులు దీని గురించి మాట్లాడరు.2014లో 76దేశాల వివరాలను విశ్లేషించగా మన దేశం 55వ స్ధానంలో ఉంది. 2019లో 117 దేశాల్లో 102వ స్ధానంలో ఉంది. అంటే దేశంలో ఆకలి పెరిగిందని స్పష్టంగా చెబుతోంది. అయితే దీనిలో అనేక తప్పులు ఉన్నాయని, వాస్తవ పరిస్ధితిని ప్రతిబింబించలేదని నీతి ఆయోగ్‌ నిపుణులు ఫిర్యాదు చేస్తున్నారు. అంతర్జాతీయ సంస్ధలు అనుసరించే పద్దతులు అనేక సందర్భాలలో మారుతున్నాయి. ఆ మేరకు మన దేశానికి వచ్చిన పాయింట్లలో ఒక ఏడాది నివేదికకు మరొక ఏడాది దానికి పొంతన ఉండటం లేదన్నది విమర్శ. గణాంక పద్దతులు ఏడాది కేడాది మారవచ్చు తప్ప దేశానికి దేశానికి మారవు. తప్పులుంటే అన్ని దేశాల సూచికల మీద ప్రతిబింబిస్తాయి. మన పరిస్ధితి గత ఐదు సంవత్సరాల్లో మెరుగుపడిందో లేదో చెప్పకుండా లెక్కల్లో తప్పులని తప్పించుకో చూస్తున్నారు.

Image result for narendra modi credibility  crisis
నిజానికి దేశంలో ఆర్ధిక పరిస్ధితి దిగజారుడు యుపిఏ చివరి రోజుల్లోనే ప్రారంభమైంది. అయితే దాని పాలనా కాలంలో జరిగిన భారీ కుంభకోణాల మీద ప్రతిపక్షాల, మీడియా దాడి కేంద్రీకృతం కావటంతో జనంలో పెద్దగా చర్చ సాగలేదు. విసిగిపోయి ఉన్న జనం నరేంద్రమోడీ ఆకర్షక నినాదాలతో పట్టం కట్టారు. గత ఐదు సంవత్సరాల కాలంలో చమురు ధరల భారీగా పడిపోయిన కారణంగా ఖజానాకు ఎంతో మిగులుతో పరిస్దితి తొలి రోజుల్లో స్ధిరంగా ఉంది. అయితే చమురు ధరలు ఒక స్ధితికి చేరిన తరువాత తిరిగి అన్ని రంగాల దిగజారుడు ప్రారంభమైంది. వాటిని మూసిపెట్టి భావోద్వేగాల మీద జనం దృష్టిని మళ్లించి, ఇతర అంశాలను ముందుకు తెచ్చి రెండవసారి అధికారానికి వచ్చారు.
ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. పియూష్‌ గోయల్‌, రవిశంకర ప్రసాద్‌, సురేష్‌ అంగాడీ, నిర్మలా సీతారామన్‌ వంటి వారు అలా మాట్లాడటానికి కారణాలను విస్మరించకూడదు. అలాంటి ప్రకటనలు చేయాలని స్వయంగా నరేంద్రమోడీయే దారి చూపారంటే ఆయన భక్తులకు కోపం రావచ్చు. భిన్నమైన ఫలితాలు రావాలని కోరుకుంటూ ఒకే పనిని పదే పదే చేయటం గురించి ఐనిస్టీన్‌ ఒక సందర్భంగా చెప్పారు. కొందరు ఏదీ నేర్చుకోరు, దేన్నీ మరచిపోరు అన్న విషయం కూడా తెలిసిందే. (ముగింపు రెండవ భాగంలో )

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్‌సిఇపి ఒప్పందం : కర్షకులకు కాస్త మోదం -కార్మికులకు తీవ్ర ఖేదం !

07 Thursday Nov 2019

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Labour Reforms INDIA, Labour reforms RCEP, RCEP Farmers, RCEP INDIA, RCEP workers

Image result for rcep
ఎం కోటేశ్వరరావు
‘ ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ‘ ఒప్పందం(ఆర్‌సిఇపి)లో మన దేశం చేరుతుందా లేదా అన్న అంశంపై చివరి క్షణం వరకూ ఉత్కంఠకు గురి చేసి ఇప్పటికైతే చేరటం లేదు అని ప్రధాని నరేంద్రమోడీ దానికి తెరదించారు.మన వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యానికి హాని కలిగించే తద్వారా మన ఆర్ధిక వ్యవస్ధను మరింత దిగజార్చి జనాన్ని ఇబ్బందుల పాలు చేయకుండా తాత్కాలికంగా అయినా నివారించారు. అధికార పార్టీ, కేంద్ర ప్రభుత్వ తీరుతెన్నులు, చివరి నిమిషం వరకూ ఏమి జరుగుతుందో తెలియకుండా యావత్‌ దేశాన్ని ఉంచిన తీరు గత విశ్లేషణల్లో పేర్కొన్నందున చర్విత చరణం చేయనవసరం లేదు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వెనుక పని చేసిన అంశాలేమిటి ? పర్యవసానాలేమిటి ? అనే చర్చ ఇప్పుడు దేశంలో ప్రారంభమైంది. ఒప్పందంలో చేరటానికి ఇంకా తలుపులు తెరిచే ఉన్నందున అంతిమంగా ఒక వైఖరిని ప్రకటించే వరకు ఎవరి అనుమానాలు వారికి ఉండటం సహజం. అప్పటి వరకు మెడమీద కత్తి వేలాడుతూనే ఉంటుంది. ఒప్పందంలో చేరితే ఎగుమతుల పోటీని మన రైతాంగం, పరిశ్రమలు, వాణిజ్యం తట్టుకోలేదు, నష్టం అనే కారణాలే వెనుకడుగుకు ప్రధాన కారణం. అయితే ఇది సమాజంలోని కోట్లాది మంది కార్మికులను దెబ్బతీస్తుందా ?
రైతులు, పరిశ్రమలు, వాణిజ్యవేత్తలు ముప్పు తప్పిందిలెమ్మని ఆదమరవ కూడదు. ఒప్పందంలో చేరాలని ఇప్పటికీ వత్తిడి చేసే బలమైన కార్పొరేట్‌ శక్తులు ఉన్నాయని మరచి పోరాదు. గతంలో చేసుకున్న ఒప్పందాలు, అనుసరించిన విధానాలు మన రైతాంగాన్ని నిండా ముంచాయి. వాటిని వెనక్కు తీసుకొనేందుకు, రైతుల జీవితాలను బాగు పరిచేందుకు గత ఐదున్నర సంవత్సరాలుగా తీసుకున్న చర్యలేమీ లేవని గ్రహించాలి. పారిశ్రామిక, వాణిజ్యవేత్తల నుంచి వసూలు చేస్తున్న పన్నులను గణనీయంగా తగ్గించటాన్ని మనం చూశాము. ఇది కార్పొరేట్‌శక్తులకు ఇచ్చిన అతిపెద్ద సబ్సిడీ. మరోవైపున రైతాంగానికి ఇస్తున్న సబ్సిడీలకు కోత పెట్టారు. ఉన్నవాటిని మరింత తగ్గించటం తప్ప కొత్తగా పెంచిందేమీ లేదు. ఇప్పుడు రైతాంగాన్ని మరింత ముంచకుండా చూశారు తప్ప అదనపు మేలేమీ లేదు. మరింతగా దిగజారకుండా చూడటమే గొప్ప మేలు కదా అని ఎవరైనా అంటే వారి మేథకు జోహార్లు.
ఆర్‌సిఇపి ఒప్పందం- మోడీ సర్కార్‌ 2024 ఓట్ల లెక్కలు అనే శీర్షికతో అక్టోబరు 19వ తేదీన కొన్ని అంశాల మీద, ఒప్పంద ఖరారు సమావేశం నవంబరు నాలుగవ తేదీకి ఒక రోజు ముందుగా ‘ఆర్‌సిఇపికి బిజెపి అనుకూలం, కమ్యూనిస్టుల వ్యతిరేకత-ఎవరు దేశ భక్తులు ? అనే శీర్షికతో మరికొన్ని అంశాలను చర్చించాను. దీనికి సంబంధించిన మంచి చెడ్డలను స్ధలాభావం రీత్యా పరిమితంగానే రెండు వ్యాసాల్లో విశ్లేషణ చేశాను.
ఒప్పందం మీద సంతకాలు చేయరాదని నిర్ణయించటం వెనుక ఏ కారణం ఎంత మేరకు పని చేసింది అనే అంశాన్ని పక్కన పెడితే భవిష్యత్‌లో కూడా మోడీ సర్కార్‌ ఇదే వైఖరికి కట్టుబడితే హర్షించాల్సిందే. మోడీ ఈ నిర్ణయానికి రావటానికి కారణాలను మరోసారి చర్చించబోయే ముందు గత రెండు వ్యాసాల్లో ఏమి రాశానో పాఠకులకు గుర్తు చేయటం అవసరం.(ఆసక్తి వున్న వారు పూర్తి వ్యాసాలు ఇక్కడే చదవుకోవచ్చు)
అక్టోబరు 19 వ్యాసంలో ” ఇప్పటి వరకు వెలువడిన సూచనలు, ధోరణులను బట్టి ‘ ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యం(ఆర్‌సిఇపి)’ ఒప్పందంపై మన దేశం సంతకాలు చేసే అంశం చివరి నిమిషం వరకు ఉత్కంఠను కలిగించే అవకాశం వుంది. మన ఎగుమతిదార్లకు తగినన్ని రాయితీలు సంపాదించేందుకు ప్రయత్నించి ఒప్పందం మీద సంతకం చేయాలన్న వైఖరితో మన కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. ఆమేరకు కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఒప్పందం మన ఆర్ధిక వ్యవస్ధను మరింతగా దెబ్బతీస్తుందనే అభిప్రాయాల పూర్వరంగంలో మోడీ సర్కార్‌ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పటికీ స్పష్టం కాలేదు. అధికారిక అభిప్రాయాలు వెల్లడి కాలేదు.
మూడు సంవత్సరాల క్రితం మతిమాలిన పెద్ద నోట్ల రద్దు, తగినంత కసరత్తు లేకుండా జిఎస్‌టి ప్రవేశపెట్టటం, ఇతర కారణాలతో దేశం ప్రస్తుతం రోజురోజుకూ మాంద్యంలోకి కూరుకుపోతోంది. ఈనేపధ్యంలో మోడీ సర్కార్‌ రాజకీయంగా తన లాభనష్టాలను లెక్కవేసుకుంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఒప్పందం వ్యవసాయంతో పాటు అనుబంధ పాడి, సేవా రంగాలను దెబ్బతీస్తుందని రైతు సంఘాలు, ఇతర సంస్ధలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాయి. నవంబరులో ఆర్‌సిఇపి ఒప్పందం కుదిరితే దాని అంశాలు 2021-22 నాటికి అమల్లోకి వస్తాయి. వాటి ప్రభావం 2023-24లో కనిపిస్తుంది. ఒక వేళ అది ప్రతికూలమైతే ఆ ఏడాది జరిగే ఎన్నికల్లో తమ భవిష్యత్‌ ఏమిటన్నది బిజెపి తేల్చుకోలేకపోతున్నది. పైన చెప్పుకున్నట్లు ఓట్ల లెక్కలు కేంద్ర పాలకులను ప్రభావితం చేస్తాయా? కార్పొరేట్ల వత్తిడిది పై చేయి అవుతుందా చూడాల్సి వుంది. ”
నవంబరు మూడవ తేదీ వ్యాసంలో ఇలా పేర్కొన్నాను ” ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ‘ ఒప్పందం(ఆర్‌సిఇపి)లో మన దేశం సహేతుకమైన ప్రతిపాదనలను చేసిందని ప్రధాని నరేంద్రమోడీ బ్యాంకాక్‌ పోస్ట్‌ అనే థారులాండ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఒప్పందం అమల్లోకి వస్తే రాగల ప్రతికూల పర్యవసానాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు, వ్యాపారవేత్తలకు అవేమిటో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. గత నెల రోజులుగా దీని గురించి ఎంతో ఉత్కంఠనెలకొన్నది. ఒప్పందంతో ప్రభావితులయ్యే వారితో బిజెపి చర్చించినట్లు మీడియాలో వార్తలు రాయించుకోవటం తప్ప ఏమి చర్చించారు, సర్కార్‌కు ఏమి సూచించారో తెలియదు. మరోవైపు కేంద్రం ఏమి చెబుతుందా అని ఎదురు చూసిన వారికి ఎలాంటి సమాచారం అందించలేదు. ప్రభావితులయ్యే తరగతులతో అధికారిక చర్చ అసలే లేదు. సోమవారం నాడు సదరు ఒప్పందం మీద సంతకాలు జరగాల్సి ఉంది. ఒక వేళ మన దేశానికి అంగీకారం కానట్లయితే ప్రదాని నరేంద్రమోడీ బ్యాంకాక్‌ పర్యటన రద్దయి ఉండేది. అసాధారణ పరిణామాలు జరిగితే తప్ప సంతకాలు జరగటం ఖాయంగా కనిపిస్తోంది.”

Image result for rcep modi
సమావేశం జరిగిన సోమవారం నాడు ఒప్పందం మీద సంతకాలు చేయరాదని మన సర్కార్‌ నిర్ణయించింది.దీనికి ఓట్ల లెక్కలే ప్రధానంగా పని చేశాయన్నది స్పష్టం. ఒప్పందం ప్రజల జీవనాధారాలను దెబ్బతీస్తుంది కనుక వ్యతిరేకించినట్లు బిజెపి చెప్పింది. ఇది భారత విజయం అని కూడా పేర్కొన్నది. ప్రస్తుత పరిస్ధితుల్లో ఈ ఒప్పందంలో చేరటం సరైంది కాదని విదేశాంగ వ్యవహారాల శాఖ వ్యాఖ్యానించింది. ఇది మా విజయమే అని కాంగ్రెస్‌ ప్రకటించుకుంది. తాము గట్టిగా వ్యతిరేకత వ్యక్తం చేయటంతో తప్పనిసరై బిజెపి సర్కార్‌ వెనక్కు తగ్గిందని వ్యాఖ్యానించింది. మంత్రులు పియూష్‌ గోయల్‌, అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌, స్మృతి ఇరానీ, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఇంకా ఇతరులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. మోడీని అభినందించారు. సర్కార్‌ వెనక్కు తగ్గటం వెనుక వత్తిడిలో ఎవరి వాటా ఎంతో తేల్చటం కష్టం గనుక ఆ లెక్కలను వదలి వేద్దాం. తాత్కాలికంగా కొంతకాలం పాటు అయినా రైతాంగం, చిన్న వ్యాపారులు, తోటల రైతాంగం కాస్త ఊపిరి పీల్చుకుంటుంది అనటం నిస్సందేహం.
అయితే అది ఎంతకాలం? ఇంతటితో ఆర్‌సిఇపి కథ ముగిసినట్లేనా ? ఇప్పుడు జరగాల్సింది ఏమిటి ? ఏదో ఒకసాకుతో ముగిసిన అధ్యాయాన్ని తిరిగి ప్రారంభిస్తారా ? ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానిద్దాం, హర్షిద్దాం అయితే ముసాయిదా ఒప్పందంలోని ఏఏ అంశాల మీద మన సర్కార్‌ ఎలాంటి సవరణలు కోరింది? అవి ఏమిటో అధికారయుతంగా వెల్లడిస్తే అనేక ఊహాగానాలకు తెరపడుతుంది. ఒప్పందంలో చేరితే చైనా, ఇతర దేశాల నుంచి చౌకగా వస్తువులు మన మార్కెట్‌ను ముంచెత్తుతాయన్న అభిప్రాయాలు, ముంచెత్తుతున్న వాస్తవాలూ పాతవే. వాటిని అరికట్టేందుకు ఏ చర్యలు తీసుకోవాలని మన సర్కార్‌ కోరింది, చైనాతో సహా మిగతా దేశాలు ఎక్కడ విబేధించాయి అన్నది తెలియాల్సి ఉంది.
పదహారు దేశాల కూటమి నుంచి మన దేశం సంతకం చేయటం లేదని ప్రకటించటంతో మిగిలిన దేశాలన్నీ ముందుకు పోవాలని నిర్ణయించాయి. భారత్‌ ఎప్పుడైనా చేరవచ్చని పేర్కొన్నాయి. అంటే ద్వారాలు ఇంకా తెరిచే ఉంచారు. అనేక అంతర్జాతీయ ఒప్పందాలపై సంతకాలు చేసిన దేశాలన్నీ ఒకేసారి చేరలేదు. ఏదైనా ఒక ఒప్పందాన్ని సూత్రప్రాయంగా అంగీకరించిన తరువాత ఆయా దేశాల రాజ్యాంగాలను బట్టి వాటికి చట్టసభలు ఆమోద ముద్రవేయాల్సి ఉంటుంది. అందువలన సంతకాల కార్యక్రమం వచ్చే ఏడాది ప్రారంభం అవుతుంది.
అమెరికా ప్రభావంతో మన దేశం వెనక్కు తగ్గిందా ? ఆర్‌సిఇపిని చూపి మన దేశం బేరమాడుతోందా ?
ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక బడా కొర్పొరేట్ల మానస పుత్రిక అనటంలో ఎలాంటి సందేహం లేదు. దానిలో సైబల్‌ దాస్‌గుప్తా అనే వ్యాఖ్యాత చేసిన విశ్లేషణ సారాంశం ఇలా ఉంది.” ఆర్‌సిఇపి ఒప్పందం మీద సంతకం చేయటం అమెరికాకు వ్యతిరేకంగా బల ప్రదర్శన అవుతుంది. ఈ బృందంలో చేరేందుకు భారత్‌ తిరస్కరించటం, తద్వారా దాన్ని బలిష్టం కావించేందుకు తిరస్కరించటాన్ని ఈ రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. భారత్‌ నిర్ణయాన్ని కొంత మేరకు అమెరికా ప్రభావితం చేసిందని చైనా సర్కార్‌తో ముడిపడిపడి వున్న నిపుణులు ఇప్పటికే చెబుతున్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో బేరమాడేందుకు ఈ నిర్ణయాన్ని భారత్‌ ఉపయోగించేందుకు సాధ్యపడుతుంది అని ఏనాన్‌ అకాడమీలో భారత అధ్యయనాల కేంద్రం పరిశోధకుడు మావో కెజీ చెప్పారు. ఇందుకు గాను ట్రంప్‌ యంత్రాంగం భారత్‌కు లబ్ది చేకూరుస్తుందనిగానీ లేదా భారత కంపెనీలతో సామరస్య వైఖరి తీసుకుంటుందని ఎవరూ అనుకోవటం లేదు.
తక్షణ ప్రశ్న ఏమంటే భారత్‌ నుంచి ఔషధాలు ముఖ్యంగా కాన్సర్‌కు సంబంధించి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలన్న చైనా పధకాల మీద మోడీ నిర్ణయం ప్రభావం చూపుతుందా అన్నది. పశ్చిమ దేశాల కంపెనీలతో మాదిరి చైనా కంపెనీలతో సంయుక్త భాగస్వామ్యం లేదా భారత ఉత్పత్తి కేంద్రాలను చైనాలో ఏర్పాటు చేయాలని గానీ చైనీయులు కోరుతున్నారు. ఇందుకు భారత తయారీదారులు ఉత్సాహంగా లేరు.ఔషధాల తయారీ సాంకేతిక పద్దతులను చైనీయులు అపహరిస్తారని భయపడుతున్నారు. ధరలు తక్కువగా ఉండే భారత ఔషధాలకు చైనాలో డిమాండ్‌ పెరుగుతున్నందున తలుపులు మూయటం చైనాకు అంత సులభం కాదు. సంతకం చేయకపోవటం ద్వారా భారత్‌కు జరుగుతుందని చెబుతున్న నష్టం ఏమైనా అది తాత్కాలికమే.” అని దాస్‌ గుప్తా పేర్కొన్నారు.
చైనా, అమెరికా, ఐరోపా యూనియన్‌ దేనితో అయినా బేరమాడేందుకు ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు తప్పు పట్టనవసరం లేదు. అయితే అది మన రైతాంగం, పరిశ్రమలకు మొత్తంగా ఎంతమేరకు ఉపయోగపడుతుందన్నది గీటు రాయిగా ఉండాలి. గతంలో ఆ విధంగా బేరమాడిన పర్యవసానమే నాటి సోవియట్‌ యూనియన్‌ సహకారంతో అనేక ప్రభుత్వ రంగ సంస్ధల ఏర్పాటు, అంతరిక్ష పరిశోధనలకు ఊపు ఇచ్చిన క్రయోజనిక్‌ ఇంజన్ల పరిజ్ఞానం, ఆయుధాలు మనకు అందాయి. వాటితో మనకు కలిగిన లబ్ది తెలిసిందే. ఇప్పుడు అంతా ప్రయివేటీకరణ, ప్రయివేటు రంగం తప్ప ప్రభుత్వరంగం లేనందున జనానికి ఎలా లబ్ది కలిగిస్తారో తెలుసుకోవటం అవసరం.
దేశంలో నెలకొన్న ఆర్ధిక పరిస్ధితిపై ఆందోళనలు వ్యక్తమౌతున్న నేపధ్యంలో ఒప్పందంపై సంతకం చేయరాదన్న నిర్ణయం వెనుక రాజకీయ ప్రాముఖ్యత వుందని మింట్‌ పత్రిక వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. అనుకున్నదాని కంటే రెండు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి పనితీరు తక్కువగా ఉండటం, త్వరలో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో ఈ నిర్ణయం జరిగింది. ఒప్పందం వలన భారత మార్కెట్‌ను ఇతర దేశాలకు తెరవటం తప్ప చైనా వంటి మార్కెట్లలో ప్రవేశానికి ఎలాంటి హామీ లేకపోవటం ఒప్పందం మీద సంతకం చేయకపోవటానికి ఒక ప్రధాన కారణం అని ఒప్పందం గురించి బాగా తెలిసిన ఒకరు చెప్పినట్లు మింట్‌ వ్యాఖ్యాతలు పేర్కొన్నారు.
సిఐఐ ఏమి చెప్పింది ?
ఆర్‌సిఇపిలో మన దేశం భాగస్వామి కానట్లయితే ప్రాంతీయ, ప్రపంచ గుంపులో చేరే ప్రయత్నాలకు నష్టం జరిగి దేశ ఎగుమతులు, పెట్టుబడుల ప్రవాహానికి హాని జరుగుతుందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిస్టీ(సిఐఐ) ఒప్పంద గడువు సోమవారానికి ఒక రోజు ముందు ఆదివారం నాడు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ సంస్ధ దేశంలోని బడా కార్పొరేట్‌ సంస్ధలకు ప్రతినిధి అన్నవిషయం తెలిసిందే. ప్రతి చోటా బడా పెట్టుబడిదారులు-చిన్న పెట్టుబడిదారుల మధ్య ఉండే మిత్రవైరుధ్యం దీనిలో చూడవచ్చు. ఒప్పందం కుదిరిన తరువాత పదహారు భాగస్వామ్య దేశాల మధ్య వాణిజ్యం పెరుగుతుంది. ఎగుమతుల అవకాశాలు దెబ్బతింటాయని సిఐఐ పేర్కొన్నది. చైనా నుంచి ద్వైపాక్షికంగా మనం రాయితీలు పొందటం అన్ని వేళలా ఎంతో కష్టమని తెలిసిందే, ఇప్పుడు ఆర్‌సిఇపిని ఒక అవకాశంగా ఉపయోగించుకోవటంలో మనం వైఫల్యం చెందామని వ్యాఖ్యానించింది. మన పరిశ్రమలోని కొందరు ఈ రోజు ఏమిటని చూస్తున్నారు. ఈ ప్రాంతంలోని సచేతనమైన 15 ఇతర దేశాల్లో ప్రవేశించాలని పదేండ్ల తరువాత వీరే కోరతారని సిఐఐ అధ్యక్షుడు విక్రమ్‌ కిర్లోస్కర్‌ వ్యాఖ్యానించారు. ఒక దేశం ప్రాతిపదికగా మనం ఆందోళన చెందకూడదని దీర్ఘకాలంలో జరిగే ప్రయోజనాన్ని చూడాలన్నారు. ఈ ఒప్పందం గురించి చర్చలు ప్రారంభమైన 2012లో ఇప్పుడు చర్చిస్తున్న అంశాలు లేవని, మొత్తం వ్యవహారమంతా స్వకీయ రక్షణ, చైనా నుంచి రక్షణ గురించి మాట్లాడుతున్నారని కిర్లోస్కర్‌ వ్యాఖ్యానించారు.
నరేంద్రమోడీ సర్కార్‌ చిత్తశుద్ది గురించి ఎవరికీ భ్రమలు ఉండనవసరం లేదు. ఆర్‌సిఇపి ఒప్పందం చర్చల్లో చైనా వస్తువుల గురించి ఒక ప్రధాన సమస్యగా వస్తోంది. వాస్తవం కూడా, అయితే దీనికి బాధ్యులెవరు ? మనకు అవసరమైన వాటిని చైనా నుంచి గాకపోతే అమెరికా లేదా ఐరోపా యూనియన్‌ నుంచి ఎక్కడో ఒక దగ్గర నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. చైనా నుంచి దిగుమతులు లాభసాటి గనుక సైద్ధాంతికంగా బిజెపి సర్కార్‌ చైనాను వ్యతిరేకిస్తున్నా గత ఐదు సంవత్సరాలలో ఇబ్బడి ముబ్బడిగా దిగుమతులు పెరగటానికి అనుమతి ఇచ్చింది. ఒప్పందంలో చేరితే పాడి రైతాంగం నష్టపోతారు. దీనికి చైనా కాదు, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా అన్నది అందరికీ తెలిసిందే. అదే విధంగా మన వేరుశనగ, ఇతర చమురు గింజల, పామాయిల్‌ రైతులు నష్టపోయేది ఇండోనేషియా, మలేషియాల నుంచి వచ్చే పామాయిల్‌ తప్ప మరొక దేశం నుంచి కాదు. ఒప్పందం జరగక ముందే సుగంధ ద్రవ్యాలు ఇతర దేశాల నుంచి శ్రీలంకకు వచ్చి అక్కడి నుంచి మన మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఒప్పందంలో చేరి ఉంటే మరింతగా వరదలా పారతాయన్నది నిజం. అందుకే రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించారు. దానికి దూరంగా ఉండాలన్న నిర్ణయం మంచిదే. కానీ అంతటితో సమస్య పరిష్కారం అవుతుందా ? వ్యవసాయ రంగంలో తలెత్తిన సంక్షోభం సమసి పోతుందా ?
అసలే ఆర్ధిక మందగమనం లేదా మాంద్యం, ఎగుమతులు తగ్గటం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న మన దేశానికి వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్ధలో అమెరికా కేసు దాఖలు చేసి గెలిచింది. మన ప్రభుత్వం అమలు చేస్తున్న ఎగుమతి రాయితీ లేదా సబ్సిడీ పధకాలను రద్దు చేయాలన్నది ఈనెల ప్రారంభంలో వచ్చిన కేసు తీర్పు సారాంశం. దీని వలన కేవలం ఎగుమతుల కోసమే ఏర్పాటు చేసిన సంస్ధలు, ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ టెక్నాలజీ పార్కులు, బయో టెక్నాలజీ పార్కులు, ఎగుమతి దారులకు పన్నులేని దిగుమతుల అనుమతులు, ఇలా అనేక పధకాలకు ఇప్పుడు ఇబ్బందులు తలెత్తాయి. దీనికి చైనా కారణం కాదు. తలసరి జిడిపి భారత్‌లో వెయ్యి డాలర్లు దాటింది కనుక ఎగుమతుల ప్రోత్సాహక సబ్సిడీలు ఇవ్వకూడదని కూడా తీర్పులో ఉంది. వరుసగా మూడు సంవత్సరాల పాటు తలసరి జిడిపి వెయ్యి డాలర్లు దాటితే అన్ని రకాల ఎగుమతుల రాయితీలను నిలిపివేయాల్సి ఉంటుంది. ఉక్కు, ఔషధాలు, రసాయనాలు, వస్త్రాలు, దుస్తులు, ఐటి వంటి వాటికి వెంటనే రాయితీలను మూడు నుంచి నాలుగు నెలల్లోగా నిలిపివేయాలని డబ్ల్యుటిఓ మన దేశాన్ని ఆదేశించింది. దీనిపై అప్పీలుకు ఒక నెల గడువు ఇచ్చింది.

Image result for labour reforms india protest citu
అమెరికా వంటి దేశాలు మనలను ప్రపంచవాణిజ్య సంస్ధలో ఇలాంటి ఇబ్బందులను పెడుతుంటే మరోవైపున ఏమి జరుగుతోందో చూద్దాం. ఎగుమతుల్లో పోటీ పడాలంటే పారిశ్రామికవేత్తలకు చౌకగా వస్తువులు తయారు కావాలి. అందుకు గాను మన దేశంలో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయని, కార్మిక చట్టాలు ఆటంకంగా వున్నాయని, వేతనాలు ఎక్కువగా ఉన్నాయనే వాదనలను ముందుకు తెస్తూ ఆ రంగాలలో మార్పులను డిమాండ్‌ చేస్తున్నారు. సంస్కరణల పేరుతో నరేంద్రమోడీ సర్కార్‌ అందుకు పావులు కదుపుతోంది. ఈ మేరకు వేతనాలపై నవంబరు ఒకటి ఒక ముసాయిదా పత్రాన్ని తయారు చేసి దాని మీద డిసెంబరు ఒకటిలోగా అభిప్రాయాలు తెలపాల్సిందిగా కార్మిక సంఘాలను కోరింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన బిఎంఎస్‌కే అవి మింగుడుపడలేదు. అనేక లోపాలు వున్నాయని, కొన్ని అంశాల మీద స్పష్టత లేదని చెప్పాల్సి వచ్చింది. వేతనాల గురించి స్పష్టత ఇవ్వలేదు గానీ రోజుకు తొమ్మిది గంటలను పని వ్యవధిగా చేయాలనే ప్రతిపాదన చేశారు. వేతన నిర్ణాయక సంఘాలలో కార్మిక సంఘాలకు ప్రస్తుతం ఉన్న ప్రాతినిధ్యం గురించి ముసాయిదా పత్రంలో ప్రతిపాదన లేదు. ఎగుమతుల కోసం లేదా వస్తువులు చౌకగా తయారు అయ్యేందుకు కార్మికుల మీద భారాలు మోపటం ఏమిటి ? కర్షకులను మరింత ఇబ్బందుల పాలు కాకుండా ఆర్‌సిఇపిలో చేరేందుకు నిరాకరించినందుకు సంతోషించాలా? అదే సమయంలో కార్మికులపై భారాలు మోపేందుకు, వారి ప్రయోజనాలను దెబ్బతీసేందుకు పూనుకున్నందుకు ఆగ్రహించాలా ? కార్మికులు, కర్షకులు మిత్రులే తప్ప శత్రువులు కాదు, ఒకరి ప్రయోజనాలకు ఒకరు బాసటగా ఉండాల్సిన సమయం ఆసన్నమైనట్లు అనిపించటం లేదూ !

Share this:

  • Tweet
  • More
Like Loading...

లాటిన్‌ అమెరికాలో నయా ఉదారవాద విధానాలు-పర్యవసానాలు !

30 Wednesday Oct 2019

Posted by raomk in Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Latin America, Opinion, USA

≈ Leave a comment

Tags

Argentina elections, Bolivarian Revolution, Latin America, Lenín Moreno, neoliberalism, Neoliberalism in Latin America

Image result for chilean protests

ఎం కోటేశ్వరరావు
లాటిన్‌ అమెరికాలో ఒక వైపున ఉవ్వెత్తున ఎగిసిన ప్రజా ఉద్యమాలు, మరోవైపున కొన్ని దేశాల్లో ఎన్నికలతో అక్కడి పరిణామాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. చిలీ, ఉరుగ్వే,హైతీ, బొలీవియాలో ఆందోళనలు జరిగాయి. అర్జెంటీనా, బొలీవియా, ఈక్వెడోర్‌లో సాధారణ, కొలంబియాలో స్ధానిక సంస్దల ఎన్నికలు ముగిశాయి. చిలీ పాలకులు ఒక అడుగు దిగినా అక్కడి ఉద్యమం ఆగలేదు. ఉరుగ్వేలో ప్రభుత్వం రద్దు చేసిన సబ్సిడీలను, పెంచిన భారాలను వెనక్కు తీసుకుంటూ ఉద్యమకారులతో ఒక ఒప్పందం చేసుకోవటంతో తాత్కాలికంగా ఆందోళనలు ఆగాయి. స్థలాభావం రీత్యా ఉద్యమాలకు సంబంధించి మరో సందర్భంలో చర్చించుదాం. నాలుగు దేశాల్లో జరిగిన ఎన్నికల ప్రాధాన్యతను చూద్దాం.
నాలుగు సంవత్సరాల క్రితం మితవాద శక్తులు విజయం సాధించిన అర్జెంటీనాలో అంతకు ముందు అధికారంలో ఉన్న ప్రజాతంత్ర లేదా వామపక్ష శక్తులు తిరిగి ఈ గద్దెనెక్కాయి. బొలీవియాలో వామపక్ష ఇవో మోరెల్స్‌ మరోసారి అధికారానికి వచ్చారు. ఉరుగ్వేలో అధికారంలో ఉన్న వామపక్ష బ్రాడ్‌ ఫ్రంట్‌ మెజారిటీకి అవసరమైన 50శాతం ఓట్లను సాధించలేదు, పెద్ద పార్టీగా అవతరించి వచ్చే నెలలో జరిగే అంతిమ పోటీకి సిద్దం అవుతోంది. కొలంబియాలో కొలంబియా విప్లవ సాయుధ శక్తులు(ఎఫ్‌వామపక్ష సాయుధ సంస్ధ (ఎఫ్‌ఏఆర్‌సి)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న తరువాత జరిగిన తొలి స్ధానిక సంస్ధల ఎన్నికలలో రాజధాని బగోటాతో సహా అనేక ప్రధాన పట్టణాలు, ప్రాంతాలలో వామపక్ష శక్తులు విజయం సాధించాయి. కొన్ని దేశాలలో తలెత్తిన ఉద్యమాలు, కొన్ని దేశాలలో జరిగిన ఎన్నికలలో వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల విజయాల వెనుక ఉన్న అంశాలేమిటి, వాటిని ఎలా చూడాలన్నది ఒక ప్రశ్న.
అర్జెంటీనా ఎన్నికల ఫలితం వామపక్ష జనాకర్షకం వైపు మొగ్గుదలకు సూచిక అని ఒక విశ్లేషణ శీర్షిక. రెండవ ప్రపంచ యుద్దం తరువాత అర్జెంటీనాలో సామాజిక న్యాయం కోరే న్యాయ పార్టీ పేరుతో ముందుకు వచ్చిన శక్తులు పెట్టుబడిదారీ విధానం, కమ్యూనిజాలకు భిన్నంగా తృతీయ మార్గం అనుసరిస్తామని చెప్పుకున్నాయి. ఇప్పటి వరకు వరుసగా మూడు సార్లు ఆ పార్టీకి చెందిన జువాన్‌ డోమింగో పెరోన్‌ అధ్యక్షుడిగా ఎన్నికై ఒక వరవడికి నాంది పలకటంతో ఆ పార్టీని పెరోనిస్టు పార్టీ అని కూడా అంటారు. సంక్షేమ చర్యలకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ప్రత్యర్ధి పార్టీలు పెరోనిస్టులను నిరంకుశులని కూడా విమర్శిస్తారు. పెరోనిస్టు పార్టీ విధానాలతో విబేధించిన వారు కమ్యూనిస్టు పార్టీలో చేరారు. కమ్యూనిస్టు పార్టీ నుంచి విడివడి వేరే పార్టీని ఏర్పాటు చేసిన మావోయిస్టులు ఈ ఎన్నికలలో విజయం సాధించిన పెరోనిస్టు పార్టీ అభ్యర్ధికి మద్దతు ప్రకటించారు. మొత్తంగా చూస్తే అర్జెంటీనాలో కమ్యూనిస్టుల బలం పరిమితం.

Image result for argentina new president
తాజా ఎన్నికల విషయానికి వస్తే 2015లో అధికారం కోల్పోయిన పెరోనిస్టు పార్టీ తిరిగి విజయం సాధించింది. గతంలో ఆ పార్టీలో తెరవెనుక ప్రముఖ పాత్ర వహించిన ఆల్బర్టో ఫెర్నాండెజ్‌ ప్రస్తుత అధ్యక్షుడు మార్సియో మక్రీని తొలి దశ ఎన్నికల్లోనే ఓడించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం నలభైశాతం ఓట్లు తెచ్చుకొని ప్రధమ స్ధానంలో ఉన్న అభ్యర్ధికి రెండో స్ధానంలో వున్న వారికి పదిశాతం ఓట్ల తేడా ఉండాలి లేదా పోలైన ఓట్లలో 45శాతం తెచ్చుకొని ప్రధమ స్ధానంలో ఉంటే ఎన్నికైనట్లు పరిగణిస్తారు. ప్రస్తుతం ఫెర్నాండెజ్‌ 48శాతం ఓట్లు సాధించి తొలి దశలోనే ఎన్నికయ్యారు. పెరోనిస్టు పార్టీకి చెందిన మాజీ దేశాధ్యక్షురాలు క్రిస్టినా కిర్చెనర్‌ వైఖరితో విబేధించి పార్టీకి దూరంగా ఉన్న ఫెర్నాండెజ్‌తో సర్దుబాటు చేసుకొని అధ్యక్ష అభ్యర్ధిగా, ఆమె ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఫెర్నాండెజ్‌ అధ్యక్షుడే అయినా అసలు సారధి క్రిస్టినా అనే అభిప్రాయం కొంత మందిలో ఉంది. గత అనుభవాల రీత్యా ఫెర్నాండెజ్‌ తనదైన ముద్ర వేయటానికి ప్రయత్నిస్తారని కూడా మరో అభిప్రాయం వెల్లడైంది.
లాటిన్‌ అమెరికా రాజకీయాల్లో నేడున్న పరిస్ధితుల్లో ఫెర్నాండెజ్‌ ఎన్నిక ప్రజాతంత్ర, పురోగామి శక్తులకు ఊపునిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. వెనెజులాలో వామపక్ష నికోలస్‌ మదురో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా జరుపుతున్న కుట్రలకు ఓడిపోయిన మార్సియో మక్రీ మద్దతు ఇచ్చాడు. తిరుగుబాటుదారు జువాన్‌ గురుడోను అధ్యక్షుడిగా గుర్తించిన వారిలో ఒకడు. ఇప్పుడు మదురో కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. ఆర్ధికంగా ఉన్న ఇబ్బందులు, ఐఎంఎఫ్‌తో సంబంధాల కారణంగా అమెరికా వత్తిడికి తలొగ్గితే అనే సందేహం ఉండనే వుంటుంది. గతంలో అధికారంలో ఉన్న పెరోనిస్టు పార్టీ, మక్రీ సర్కారు కూడా సంక్షేమ చర్యల విషయంలో తప్పితే మొత్తంగా నయావుదారవాద విధానాలనే అనుసరించారు. అందువల్లనే గతంలో పెరోనిస్టు క్రిస్టినా సర్కార్‌ మీద జనంలో అసంతృప్తి తలెత్తింది. మక్రీ అనుసరించిన విధానాల కారణంగా జనజీవనం మరింత దిగజారింది. ద్రవ్యోల్బణం 50శాతం, అభివృద్ధి సూచనలు కనుచూపు మేరలో కనపడటం లేదు, ఉపాధి తగ్గింది, దారిద్య్రం పెరిగింది. ఈ నేపధ్యంలో ఐఎంఎఫ్‌, ఇతర సంస్ధలతో వందబిలియన్‌ డాలర్లకోసం గత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. దాన్ని తీసుకుంటే చిలీ, ఉరుగ్వే మాదిరి సంక్షేమ చర్యలు, సబ్సిడీలకు తిలోదకాలివ్వాల్సి ఉంటుంది. ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది.
బొలీవియాలో అక్టోబరు 20న జరిగిన ఎన్నికల్లో ‘సోషలిజం దిశగా ఉద్యమం’ (మువ్‌మెంట్‌ టువార్డ్స్‌ సోషలిజం-మాస్‌) పార్టీ నేత ఇవో మొరేల్స్‌ మరోసారి ఘన విజయం సాధించారు. అయితే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ అనేక దేశాలు ఆ ఎన్నికను ఇంకా గుర్తించలేదు. అక్రమాలపై విచారణ జరపాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేసింది. అమెరికా దేశాల సంస్ధ అలాంటి విచారణ జరిపి అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే మరోసారి ఎన్నికలు జరపటానికి తాను సిద్ధమే అని మొరేల్స్‌ ప్రకటించారు. ఆదివాసీలు మెజారిటీగా ఉన్న బొలీవియాలో ఐదు వందల సంవత్సరాల తరువాత తొలిసారిగా ఆ సామాజిక తరగతులకు చెందిన మొరేల్స్‌ దేశాధ్యక్షుడయ్యారు.ఒక ఉద్యమకారుడిగా ఉన్న సమయంలో పాలకపార్టీ, మాదక ద్రవ్యాల మాఫియా గూండాలు ఆయనమీద దాడి చేసి మరణించాడనుకొని వదలి వెళ్లారు. బతికి బయటపడి అనేక ఉద్యమాల తరువాత 2006లో అధికారానికి వచ్చారు. రాజ్యాంగంలో అనేక మార్పులు చేసి సామాన్య జనానికి సాధికారత కలిగించటంతో పాటు దారిద్య్ర నిర్మూలనకు ఎన్నో చర్యలు తీసుకున్నారు. తొలి నుంచి ఆయనను అధికారం నుంచి తొలగించేందుకు అమెరికాతో చేతులు కలిపిన శక్తులను ఎదుర్కొని నిలిచారు. మొరేల్స్‌ గెలిస్తే తాము ఆ ఎన్నికను గుర్తించబోమని ప్రతిపక్షాలు ముందే ప్రకటించాయి. దానికి అనుగుణ్యంగానే విచారణ డిమాండ్‌ను ముందుకు తెచ్చాయి.

Image result for claudia lopez
కొలంబియా స్ధానిక సంస్ధల ఎన్నికల విషయానికి వస్తే దేశాధ్యక్ష పదవి తరువాత ప్రాధాన్యత కలిగిన రాజధాని బగోటా మేయర్‌గా వామపక్ష వాది క్లాడియా లోపెజ్‌ను ఎన్నుకున్నారు. ఆ నగర తొలి మహిళా మేయర్‌గా కూడా ఆమె చరిత్రకెక్కారు. మాజీ అధ్యక్షుడు, పచ్చి మితవాది అయిన అల్వారో యురిబి ఒక ట్వీట్‌లో స్ధానిక సంస్ధల ఎన్నికలలో తమ ఓటమిని అంగీకరిస్తూ మధ్యే, వామపక్ష వాదుల వైపు ఓటర్లు మొగ్గు చూపారని వ్యాఖ్యానించాడు. అవినీతి వ్యతిరేక ఆందోళనకారిణిగా పేరున్న లోపెజ్‌ ఒక జర్నలిస్టు. పారామిలిటరీ దళాల రాజకీయ జోక్యం గురించి పరిశోధనాత్మక కధనాలు వెల్లడించినందుకు ఆమెను చంపివేస్తామనే బెదిరింపులు రావటంతో 2013లో కొలంబియా వదలి విదేశాల్లో తలదాచుకున్నారు.2016లో ఎఫ్‌ఏఆర్‌సితో ఒప్పందం కుదిరిన తరువాత స్వదేశం వచ్చి రాజకీయ కార్యాకలాపాల్లో పాల్గొని 2018లో ఉపాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
ఉరుగ్వేలో 2005 నుంచి అధికారంలో ఉన్న వామపక్ష బ్రాడ్‌ ఫ్రంట్‌ పెద్ద పార్టీగా అధ్యక్ష ఎన్నికలలో ముందుకు వచ్చినప్పటికీ అవసరమైన సంఖ్యలో ఓట్లను తెచ్చుకోలేకపోయింది. సగానికి పైగా ఓట్లు తెచ్చుకోవాల్సి ఉండగా పార్టీ అభ్యర్ధి డేనియల్‌ మార్టినెజ్‌కు 40.7శాతం వచ్చాయి. దీంతో నవంబరు 24న ప్రధమ, ద్వితీయ స్ధానాల్లో వున్న అభ్యర్ధుల మధ్య తుది పోటీ జరగనుంది. మితవాద నేషనల్‌ పార్టీకి చెందిన లాకలే పౌ 29.7శాతం తెచ్చుకున్నాడు, మూడు, నాలుగు స్ధానాల్లో 12.8, 11.3శాతం చొప్పున ఓట్లు తెచ్చుకున్న మితవాద పార్టీలు లాకలేకు మద్దతు ఇస్తామని ప్రకటించాయి. ఆ ఓటింగ్‌లో ఎలాంటి మార్పు లేనట్లయితే బ్రాడ్‌ఫ్రంట్‌ గెలిచే అవకాశం వుండదని విశ్లేషణలు వెలువడ్డాయి.2014 ఎన్నికల్లో బ్రాడ్‌ ఫ్రంట్‌కు తొలి దశలో 49.45శాతం వచ్చాయి. తుది ఎన్నికల్లో 56శాతం తెచ్చుకుంది. ఈ సారి తొలి దశలో ఓట్లు గణనీయంగా తగ్గినందున అంతిమ ఫలితం గురించి ఉత్కంఠనెలకొన్నది.
నేషనల్‌, కొలరాడో మితవాద పార్టీల కూటమి 1830 నుంచి తిరుగులేని అధికారాన్ని చలాయించింది. 2005లో బ్రాడ్‌ఫ్రంట్‌ దానికి తెరదించింది. అయితే ఈ ఎన్నికల్లో శాంతి భద్రతలు, పౌరులకు భద్రత అంశాలతో పాటు ఎదుగూ బొదుగూ లేని ఆర్ధిక స్ధితి, ఏడున్నరశాతం ద్రవ్యోల్బణం, తొమ్మిదిశాతం నిరుద్యోగం కారణంగా బ్రాడ్‌ ఫ్రంట్‌ మద్దతు కొంత మేరకు దెబ్బతిన్నట్లు ఓట్ల వివరాలు వెల్లడించాయి. అయితే ఓటర్లు తిరిగి మితవాద శక్తులకు అధికారాన్ని అప్పగిస్తారా అన్నది చూడాల్సి వుంది.

Image result for neoliberalism and its consequences in latin america
లాటిన్‌ అమెరికాలోని కొన్ని దేశాలలో ప్రజా ఉద్యమాలు తలెత్తటానికి, కొన్ని చోట్ల వామపక్ష శక్తులకు ఎదురు దెబ్బలు తగలటానికి, తిరిగి ఓటర్ల మద్దతు పొందటానికి ఆయా దేశాలలో అనుసరిస్తున్న నయా ఆర్ధిక విధానాలే కారణంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ విధానాల ప్రయోగశాలగా మారిన లాటిన్‌ అమెరికాలో దాదాపు అన్ని దేశాలలో వాటిని అమలు జరిపేందుకు గతంలో నియంతలను పాలకవర్గాలు ఆశ్రయించాయి. చిలీ వంటి చోట్ల వాటిని వ్యతిరేకించినందుకు కమ్యూనిస్టు అయిన సాల్వెడార్‌ అలెండీ వంటి వారిని హతమార్చేందుకు కూడా వెనుదీయలేదు. ప్రజాస్వామ్య ఖూనీ, సంక్షేమ చర్యలకు కోత, ప్రజల మీద భారాలు మోపటం, ఆర్ధిక వ్యవస్ధలను దివాలా తీయించిన పూర్వరంగంలో అక్కడ వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు నిర్వహించిన నిరంతర పోరాటాల కారణంగా జనం మద్దతు పొంది ఈ శతాబ్ది ప్రారంభంలో అనేక దేశాలలో అధికారానికి వచ్చాయి. అయితే నయా వుదారవాద విధానాల పునాదులను పెకలించకుండా ఉన్నంతలో జనానికి మేలు చేకూర్చేందుకు ఆ ప్రభుత్వాలు పని చేసి వరుస విజయాలు సాధించాయి. అయితే పెట్టుబడిదారీ వ్యవస్ధలో వాటికి వున్న పరిమితుల కారణంగా జనంలో కొంతకాలానికి అసంతృప్తి తలెత్తటం, కొన్ని చోట్ల అవినీతి కారణంగా బ్రెజిల్‌, అర్జెంటీనా వంటి చోట్ల ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే అర్జెంటీనాలో ప్రత్యామ్నాయంగా వచ్చిన పాలకుల తీరు మరింతగా దిగజారటంతో తిరిగి వామపక్ష, ప్రజాతంత్ర శక్తులకు పట్టం కట్టారు. ఈక్వెడోర్‌లో అధికారానికి వచ్చిన రాఫెల్‌ కొరెయా 2007-17 అధ్యక్షుడిగా అనేక సంక్షేమ చర్యలు చేపట్టారు. అంతకుముందు పాలకులు చేసిన అప్పులతో తమకు సంబంధం లేదని ప్రకటించటమే కాదు, అంతర్జాతీయ కోర్టులలో వాదించి 60శాతం మేరకు అప్పును రద్దు చేయించారు.దారిద్రాన్ని గణనీయంగా తగ్గించారు. అయితే 2017ఎన్నికలో వామపక్ష అభ్యర్ధిగా విజయం సాధించి లెనిన్‌ మొరెనో వామపక్ష విధానాలకు స్వస్ధి చెప్పి దేశీయంగా, అంతర్జాతీయంగా నయావుదారవాద విధానాలు, రాజకీయ వైఖరులను అనుసరించి ప్రజాగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే తప్పుడు కేసులతో రాఫెల్‌ కొరియాను అరెస్టు చేయించేందుకు ప్రయత్నించాడు. ప్రజల మీద భారాలు మోపేందుకు పూనుకోవటంతో తాజాగా అక్కడ ప్రజాందోళనలు తలెత్తాయి. విధిలేని స్ధితిలో తలగ్గాల్సి వచ్చింది. అందువలన లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులు వర్గపోరాటాన్ని మరింతగా ముందుకు తీసుకుపోయి, రాజీలేని విధానాలతో పాటు నయా వుదారవాద విధానాల బాటను వీడాల్సిన అవసరాన్ని అక్కడి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా నాయకత్వంలో సామ్రాజ్యవాదంతో మరింత ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వుంటుంది. దాన్ని ఎదుర్కొవటం తప్ప మరొక దగ్గరి దారి లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం- ఆర్ధిక నిందితులకు రాజకీయ ఆశ్రయం !

06 Sunday Oct 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Adani, Ambani, Ambani and Adani, crony capitalism in India, India crony capitalism, Narendra Modi

Image result for political patronage  for economic offenders, india

(ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం- ఆర్ధిక నేరస్ధులకు అవధుల్లేని అవకాశాలు ! విశ్లేషణ ముగింపు రెండవ భాగం)

ఎం కోటేశ్వరరావు

ఆర్ధిక నేరగాళ్ల గురించి కూడా మన దేశంలో రాజకీయాలు చేయటం ఒక విషాదం. ఒక పార్టీలో వుంటూ ఆర్ధిక నేరాల ఆరోపణలను ఎదుర్కొన్నవారు మరో పార్టీలో చేరగానే పునీతులౌతున్నారు. కేసులు మరుగునపడుతున్నాయి. దీనికి ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం తప్ప మరొక కారణం కనిపించటం లేదు. ఈ ఏడాది ఏప్రిల్‌ 17న ఎకనమిక్‌ టైమ్స్‌లో ఒక వార్త వచ్చింది. గత మూడు సంవత్సరాలలో మహారాష్ట్రలో ఆర్ధిక నేరాలకు పాల్పడిన వారి వివరాల గురించి సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన వివరాలను ఆ పత్రిక ఇచ్చింది. నూట ఎనభైకి పైగా కేసులు రాగా ఆర్ధిక నేరాల ముంబై పోలీసు విభాగం చేపట్టింది రెండు మాత్రమే. ఈ కేసులలో రూ. 19,317 కోట్ల మేరకు దుర్వినియోగం జరిగినట్లు అంచనా లేదా అనుమానం కాగా స్వాధీనం చేసుకున్న సొమ్ము రెండున్నర కోట్ల రూపాయలు మాత్రమే. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ వార్షిక నివేదిక ప్రకారం తీవ్ర అక్రమాల దర్యాప్తు కార్యాలయం(సిఎఫ్‌ఐఓ)కు 2017 డిసెంబరు నుంచి 2018 నవంబరు వరకు 33 కేసులను దర్యాప్తు చేయాలని ఆదేశించగా కేవలం ఐదు మాత్రమే పూర్తయ్యాయి. కొన్ని కేసులలో మూడు లేదా నాలుగు సంస్ధలు చేపడుతున్నందున సమయంతో పాటు డబ్బు వ ధా అవుతోంది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కేసును మూడు సంస్ధలు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును ముంచిన నీరవ్‌ మోడీ కేసును మూడు సంస్ధలు దర్యాప్తు చేస్తున్నాయి. భూషణ్‌ స్టీల్స్‌ అక్రమాల కేసులో ఎండీ నీరజ్‌ సింగాల్‌ అరెస్టును ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దర్యాప్తు సంస్ధ అనుసరించిన పద్దతుల్లో లోపాలు, ఇతర కొన్ని అక్రమాలు దీనికి కారణం.

2015 నేషనల్‌ క్రైమ్‌ రికార్డుల బ్యూరో సమాచారం ప్రకారం అంతకు ముందు పది సంవత్సరాలలో ఆర్ధిక నేరాలు రెట్టింపైనట్లు వెల్లడైంది.2006లో ప్రతి లక్ష మందికి 6.6 నమోదు కాగా 2015 నాటికి 11.9కి పెరిగాయి. రాజస్ధాన్‌లో 17.42 నుంచి 37.4కు, అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 12.01 వుంటే తెలంగాణాలో 24.6 నమోదయ్యాయి.ఆర్ధిక నేరాల పెరుగుదల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మీద, సులభతర వాణిజ్యం మీద ప్రతికూల ప్రభావం కలిగిస్తుందని అనేక మంది చెబుతున్నారు. అయితే లావాదేవీలు పెరిగినందున దానికి అనుగుణ్యంగానే నేరాలు కూడా పెరిగాయన్నది కొందరి అభిప్రాయం.ప్రతి స్ధాయిలో డబ్బు అందుబాటులో వుండటం నేరాల పెరుగుదలకు కారణం అని న్యాయవాదులు అంటున్నారు.

గత ఐదు సంవత్సరాలలో దేశం నుంచి 27 మంది ఆర్ధిక నేరగాండ్లు దేశం విడిచి పోయారని 2019 జనవరి నాలుగున కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్‌ శుక్లా లోక్‌సభకు ఒక రాతపూర్వక సమాధానంలో చెప్పారు. వీరిలో 20 మంది మీద రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ను కోరగా ఎనిమిది మీద నోటీసులు జారీ అయినట్లు తెలిపారు. 2018 జూలై 25వ తేదీన విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వికె సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం 2015 నుంచి ఆరుగురు మహిళలతో సహా 28 మంది ఆర్ధిక అవకతవకలు, నేరాలకు సంబంధించి చట్టపరమైన చర్యలను ప్రారంభించామని, వారంతా విదేశాల్లో వున్నట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు.

2018 మార్చి 23న ప్రభుత్వం రాజ్యసభకు తెలిపిన సమాచారం ప్రకారం నేరగాండ్ల అప్పగింతకు అప్పటి వరకు 48దేశాలతో ఒప్పందాలు, మరో మూడు దేశాలతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది. సిబిఐ 23, ఇడి 13 కేసులను దర్యాప్తు చేస్తుండగా విజయ మాల్య, మెహుల్‌ చోక్సి, నీరవ్‌ మోడీ, జతిన్‌ మెహతా, ఆషిష్‌ జోబన్‌ పుత్ర, చేతన్‌ జయంతిలాల్‌ సందేశరా, నితిన్‌ జయంతి లాల్‌ సందేశరా, దీప్తిబెన్‌ చేతన్‌ కుమార్‌ సందేశారా రెండు సంస్ధల దర్యాప్తులో నిందితులుగా వున్నారు. ఆర్ధిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారి జాబితాలో దిగువ పేర్లు వున్నాయి.

పుష్ప బైద్‌, అషిష్‌ జీబన్‌ పుత్ర, ప్రీతి అషిష్‌ జీబన్‌ పుత్ర, విజయమాల్య, సన్నీ కల్రా,సంజరు కల్రా, సుధీర్‌ కుమార్‌ కల్రా, ఆరతి కల్రా, వర్ష కల్రా, జతిన్‌ మెహతా, వుమేష్‌ పరేఖ్‌, కమలేష్‌ పరేఖ్‌, నిలేష్‌ పరేఖ్‌, ఏకలవ్య గార్గ్‌, వినరు మిట్టల్‌,చేతన్‌ జయంతిలాల్‌ సందేశరా, నితిన్‌ జయంతి లాల్‌ సందేశరా, దీప్తిబెన్‌ చేతన్‌ కుమార్‌ సందేశరా, నీరవ్‌ మోడీ, నీషాల్‌ మోడీ, సబయ సేథ్‌, రాజీవ్‌ గోయల్‌, అల్కా గోయల్‌, లలిత్‌ మోడీ, రితేష్‌ జైన్‌, హితేష్‌ నరేంద్రభారు పటేల్‌, మయూరీ బెన్‌ పటేల్‌.

గత ఐదు సంవత్సరాలలో విదేశాలకు పారిపోయిన ఆర్ధిక, ఇతర నేరగాండ్లు పద్దెనిమిది మందిని కేంద్ర ప్రభుత్వం దేశానికి రప్పించింది.1. అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలు కేసులో రాజీవ్‌ సక్సేనా(యుఏయి నుంచి)తో పాటు లాబీయిస్టు దీపక్‌ తల్వార్‌, ఇదే కేసులో మధ్యవర్తి పాత్ర వహించిన బ్రిటీష్‌ జాతీయుడు క్రిస్టియన్‌ మిచెల్‌, 2. మోసం, ఫోర్జరీ, నేరపూరిత కేసులలో ఇండోనేషియా నుంచి మహమ్మద్‌ యాహ్యా, అక్కడి నుంచే ఇదే కేసులలో వినరు మిట్టల్‌, 3. యుఏయి నుంచి వుగ్రవాద కార్యకలాపాల కేసులో మన్సూర్‌ లేదా ఫరూక్‌ టక్లా, 4. బ్యాంకు అక్రమాల కేసులో రుమేనియా జాతీయుడు ఎంఎం ఫరూక్‌ యాసిన్‌ను నికరాగువా నుంచి, 5. వుద్యోగాల పేరుతో టోకరా కేసులో అబూబకర్‌ కదిర్‌ లోనట్‌ అలెగ్జాండ్రును సింగపూర్‌ నుంచి,6. హత్య కేసులో బంగ్లాదేశ్‌ నుంచి అబ్దుల్‌ రౌత్‌ మర్చంట్‌ మహమ్మద్‌ సుల్తాన్‌, 7. హత్యాయత్నం కేసులో సింగపూర్‌ నుంచి కుమార్‌ క ష్ణ పిళ్లె, 8.భారత్‌కు వ్యతిరేకంగా వుగ్రవాద కేసులో యుఏయి నుంచి అబ్దుల్‌ వాహిద్‌ సిద్ది బాపాను, 9.హత్యాయత్నం కేసులో మారిషస్‌ నుంచి కళ్లం గంగిరెడ్డి, 10. వుగ్రవాద కేసులో అనూప్‌ చెటియా నుంచి బంగ్లాదేశ్‌ నుంచి, కిడ్నాప్‌, హత్య కేసుల్లో ఇండోనేషియా నుంచి చోటా రాజన్‌,11. హత్య కేసులో మొరాకో నుంచి బన్నాజే రాజా, 12. హత్య కేసులో థారులాండ్‌ నుంచి జగతార్‌ సింగ్‌ను మన దేశానికి రప్పించారు.

వీరుగాక ఆర్ధిక నేరాలకు పాల్పడిన మరికొందరిని దేశం విడిచి పోకుండా చూడాలని కార్పొరేట్‌ మంత్రిత్వ వ్యవహారాల శాఖ 20 మంది పేర్లతో ఒక జాబితాను తయారు చేసి ఐబికి అదచేసింది. వారిలో జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌, అనిత గోయల్‌, దీపక్‌ కొచార్‌, వీడియోకాన్‌ ఎండీ వేణుగోపాల్‌ ధూత్‌ తదితరుల పేర్లు వున్నట్లు వెల్లడైంది. నరేష్‌ గోయల్‌, అనితా గోయల్‌ దుబారు మీదుగా లండన్‌ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ముంబ్‌ విమానాశ్రయంలో వారిని నిలిపివేసిన విషయం తెలిసిందే.

ఆర్ధిక నేరాలకు పాల్పడి దేశం వదలి పారిపోయే వారి గురించి విచారణకు వున్న చట్టాలు పటిష్టంగా లేనందున కొత్తగా 2018లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్నే చేయాల్సి వచ్చింది. విజయ మల్య అనే పెద్ద మనిషి 18-20 సంచులు తీసుకొని పారిపోతుంటే నిఘాసంస్ధల సిబ్బంది విమానాశ్రయంలో గుడ్లప్పగించి చూశారు. ఆయన కదలికల మీద కన్నేసి వుండమన్నారు తప్ప అరెస్టు చేయాలనే ఆదేశాలు లేవని వారు చెప్పిన విషయం తెలిసిందే. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును ముంచిన నీరవ్‌ మోడీ విషయంలో కూడా అదే జరిగింది. కొత్త చట్టం ప్రకారం వంద కోట్ల రూపాయలకు పైబడి అక్రమాలకు పాల్పడి పారిపోయిన వారిని ఒక ప్రత్యేక కోర్టులో విచారిస్తారు. విచారణ సమయంలో నిందితుల ఆస్ధులను స్వాధీనం చేసుకోవచ్చు. పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా మాట్లాడిన సభ్యులు దాదాపు రెండులక్షల నలభైవేల కోట్ల రూపాయల మేరకు అక్రమాలకు పాల్పడినట్లు,పారిపోయిన నిందితులు 39 అని చెప్పారు.గతేడాది పార్లమెంట్‌కు ప్రభుత్వం చెప్పినదాని ప్రకారం 31 మంది దేశం వదలి పారిపోయారు. అలాంటి నిందితులను మనకు అప్పగించటానికి వీలుగా కేవలం 57దేశాలతో మాత్రమే ఒప్పందాలున్నాయి. అనేక మంది నిందితులు అవి లేని దేశాలకు పారిపోయారు.

ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధ సజావుగా వుందా లేక ఇబ్బందుల్లో వుందా అన చెప్పటానికి బ్యాంకుల్లో పేరుకు పోతున్న నిరర్ధక ఆస్ధులు ఒక సూచిక. మన దేశంలో ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు పెరుగుతున్నాయి. ఏటా లక్షల కోట్ల రూపాయల బకాయిలను పారు బాకీలుగా పక్కన పెడుతున్నారు. వాటిని వసూలు చేస్తామని మరోవైపు చెబుతుంటారు. అలాంటి బాకీలను పరిష్కరించుకోవటంలో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. 2019 మార్చి నాటికి 8.06లక్షల కోట్ల రూపాయల నిరర్ధక ఆస్తులున్నాయి. మూడు నెలల గడువు తీరినా కనీస మొత్తం చెల్లించని వాటిని, రుణం తీర్చటం కోసం రుణం తీసుకున్న మొత్తాలను నిరర్ధక ఆస్ధులుగా పరిగణిస్తున్నారు. గతంలో వాటిని రావాల్సిన బకాయిలుగా చూపే వారు. ఇప్పుడు ప్రతి ఏటా రద్దు చేసిన వాటిని మినహాయించి చూపుతూ నిరర్ధక ఆస్ధుల మొత్తం తగ్గుతున్నట్లు చిత్రిస్తున్నారు. అలా చేయకపోతే బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టేవారు ముందుకు రావటం లేదు.ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ అందించిన సమాచారం ప్రకారం 2018 ఆర్ధిక సంవత్సరంలో 1.28లక్షల కోట్లు,2019లో 1.77లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్ధక ఆస్ధులను రద్దు చేశారు. ఈ చర్యలు ఆర్ధిక నేరస్ధులను ఆదుకోవటం కాదా ?

Image result for India crony capitalism cartoons

ప్రతి ఆర్ధిక విధానంలోనూ లబ్ది పొందేవారు వుంటారు. పాతికేండ్ల సంస్కరణల ఫలితాల గురించి ఆర్ధిక వ్యవహారాల ప్రముఖ జర్నలిస్టు స్వామినాధన్‌ ఎస్‌ అంక్లేసరియా అయ్యర్‌ 2016లో రాసిన విశ్లేషణను కాటో సంస్ధ ప్రచురించింది. దానిలో వున్న అంశాలతో ఏకీభవించటం లేదా విబేధించటం వేరే విషయం. ఆర్ధిక నేరాలు అనే ఈ విశ్లేషణతో ముడిపడిన దానిలోని కొన్ని అంశాల సారం ఇలా వుంది.

Image result for India crony capitalism: political patronage

” 1991 తరువాత అంతకు ముందు రాజకీయ సంబంధాలున్న కొన్ని కుటుంబాల ప్రాబల్యం అంతరించి కొత్తవారు ఎదిగారు. కొత్తగా వాణిజ్య రంగంలోకి వచ్చిన(ముఖ్యంగా రియలెస్టేట్‌, మౌలిక సదుపాయాల రంగం) వారిని ఆశ్రిత పెట్టుబడిదారులు అని పిలిచారు. వారికి బలమైన రాజకీయ సంబంధాలు తప్పనిసరిగా వుంటాయి. వారింకా సురక్షితమైన గుత్త సంస్ధలుగా మారలేదు, వాటిలో అనేక మంది(డిఎల్‌ఎఫ్‌, యూనిటెక్‌, లాంకో, ఐవిఆర్‌సిఎల్‌) దారుణంగా విఫలమయ్యారు. భారత్‌లో లంచాలను రాజకీయ నేతల బలవంతపు వసూలు అని పిలుస్తారు, ఎందుకంటే లంచాలు కొన్ని సందర్భాలలో అనిశ్చితంగానూ కొన్ని సార్లు ప్రతికూల ఆపదగా వుంటాయి. ఆర్ధిక సరళీకరణ మరియు పోటీ కొన్ని సందర్భాలలో పేరుగాంచిన పాత కంపెనీలను దివాలా తీయించాయి.(హిందుస్ధాన్‌ మోటార్స్‌, ప్రీమియర్‌ ఆటోమొబైల్స్‌, జెకె సింథటిక్స్‌, డిసిఎం) తీవ్రమైన పోటీని తగినంత సౌష్టవంగా వుంటేనే మనుగడ సాగించగలవని సూచించాయి.1991లో సెన్సెక్స్‌లో వున్న 30 కంపెనీలలో రెండు దశాబ్దాల తరువాత కేవలం తొమ్మిదే మిగిలాయి.కొత్త కంపెనీల గురించి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘ ఈ కంపెనీలు ధనికుల సంతానం కాదు, సరళీకరణ సంతానం ‘ అన్నారు. గత పాతికేండ్లలో పాతపద్దతిలోని లైసన్సులు, అదుపులు రద్దయ్యాయిగానీ కొత్తవి, అధికార యంత్రాంగపు ఆటంకాలు వచ్చాయి. పర్యావరణం, అడవులు, గిరిజన హక్కులు, భూమి, కొత్త అవకాశాలైన చిల్లరవర్తకం, టెలికాం, ఇంటర్నెట్‌ సంబంధిత కార్యకలాపాల్లో వీటిని చూడవచ్చు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తగినంతగా సరళీకరించటంలో ఘోరంగా విఫలమయ్యాయి. దాంతో వాణిజ్య, పారిశ్రామికవేత్తలు అవినీతి, ఫైళ్లను పక్కన పడేయటం గురించి తీవ్రంగా ఫిర్యాదులు చేస్తున్నారు.

భారత్‌లో నేరగాండ్లు రాజకీయాల్లో భాగస్వాములౌతున్నారు, తరచుగా కాబినెట్‌ మంత్రులు అవుతున్నారు.దీంతో వారి మీద వున్న ఆరోపణలను పరిశీలించకుండా చేసుకోగలుగుతున్నారు. ఏడిఆర్‌ విశ్లేషణ ప్రకారం 2014లో ఎన్నికైన 543 మంది లోక్‌సభ సభ్యులలో 186 మంది మీద నేరపూరిత కేసులు పెండింగ్‌లో వున్నాయి. 2009లో ఎన్నికైన వారిలో 158 మంది మీద వున్నాయి. 2014లో ఎన్నికైన వారిలో 112 మంది మీద హత్య, కిడ్నాప్‌, మహిళల మీద నేరాల వంటి తీవ్ర కేసులు వున్నాయి. ఏ పార్టీ కూడా పరిశుద్దంగా లేదు. అన్ని పార్టీల్లో నేరగాండ్లు పుష్కలంగా వున్నారు. అలాంటి వారు ప్రతిపార్టీకి డబ్బు,కండబలం, ప్రాపకాలను సమకూర్చుతారు.

 

Image result for India crony capitalism cartoons

దేశాల్లో జిడిపితో పాటు అవినీతి పెరుగుతోంది. భారత గత పాతిక సంవత్సరాల అనుభవం దీనికి మినహాయింపు కాదు. వ్యభిచార కేంద్రాన్ని నిర్వహించే ఒక మహిళ ప్రచారంలో పెట్టిన ఫొటోల కారణంగా సెక్స్‌ కుంభకోణంలో ఒక రాష్ట్ర గవర్నర్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. నగంగా వున్న ముగ్గురు యువతులు ఆ గవర్నర్‌తో వున్నారు. వ్యభిచార కేంద్ర నిర్వాహకురాలికి ఒక గని అనుమతి ఇప్పిస్తానన్న వాగ్దానాన్ని గవర్నర్‌ నిలబెట్టుకోలేకపోయాడు. ప్రతీకారంగా ఆమె ఫొటోలను బయటపెట్టింది.మొదట వచ్చిన వారికి తొలి కేటాయింపు( వాస్తవానికి గడువు గురించి ముందుగానే స్నేహితులకు తెలియచేసి లబ్ది చేకూర్చారు) పద్దతిలో స్పెక్ట్రమ్‌ కేటాయింపుల వలన ఖజానాకు 1.76లక్షల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని, వేలం వేయకుండా మంత్రిత్వశాఖ విచక్షణతో బొగ్గు గనులు కేటాయించిన కారణంగా 1.86లక్షల కోట్ల నష్టం వచ్చిందని కాగ్‌ నివేదిక పేర్కొన్నది. ఆర్ధిక సంస్కరణలు పెద్ద ఎత్తున అవినీతికి ఆస్కారమిచ్చాయని విమర్శకులు అంటారు. సమగ్రంగా సరళీకరణ గావించిన రంగాలలో అవినీతి అద శ్యమైంది. 1991కి ముందు పారిశ్రామిక, దిగుమతి లైసన్సులు, విదేశీమారకద్య్రవ్య కేటాయింపులు, రుణాల వంటి వాటికి లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. సంస్కరణల తరువాత అవన్నీ సులభంగా లభ్యమౌతున్నాయి. పన్నుల తగ్గింపు కారణంగా స్మగ్లింగ్‌ దాదాపు అంతమైంది. అయితే అన్ని సహజవనరుల, టెలి కమ్యూనికేషన్స్‌ స్ప్రెక్ట్రమ్‌ విలువలను భారీగా పెంచిన కారణంగా వాటి కేటాయింపుల్లో ముడుపులకు అవకాశం కలిగింది. గతంలో ప్రభుత్వ రంగానికి మాత్రమే కేటాయించబడిన రంగాలలో ప్రయివేటు రంగ భాగస్వామ్యానికి తెరిచారు. ప్రభుత్వ-ప్రయివేటు రంగ భాగస్వామ్యం తరచుగా ఆశ్రిత పెట్టుబడిదారుల కారణంగా నష్టం కలిగిస్తోంది. సరళీకరణ తరువాత అనేక రంగాల్లో అవినీతి పోయిందని అయితే కొన్నింటిలో ఎక్కడైతే ఎక్కువగా నియంత్రణలు, అవినీతి ఎక్కువగా వుంటాయో సహజవనరులు, రియలెస్టేట్‌ రంగాల్లో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో అవినీతి మరింత పెరిగింది. ఇటీవలి కాలంలో కొన్ని రంగాలలోని విస్త త అవినీతి పూర్తిగా సరళీకరించిన రంగాల్లో మెరుగుదలను మరుగున పడవేస్తున్నది.” నయా వుదారవాద లేదా సరళీకరణ విధానాలను పూర్తిగా సమర్ధించే అంక్లేసరియా అయ్యర్‌ వంటి వారే అవినీతి గురించి చెప్పకతప్పలేదు. అందరికీ కనిపిస్తున్న అవినీతి సమర్ధకులకు ఒక పట్టాన కనిపించదు. సరళీకరణ విధానం అంటే ప్రజల సంపదను కొంత మందికి కట్టబెట్టటం. ఈ క్రమంలో రాజకీయ-వ్యాపారవేత్తలు లేదా కలగలసిన వారు ప్రజాధనంతో నడిచే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటం, ఎగవేయటం అనే అక్రమాలు సర్వసాధారణంగా మారాయి. తెల్లవారే సరికి ధనవంతుడి వయ్యావా లేదా అన్నదే గీటు రాయి, ఎలా అయ్యారన్నది అనవసరం అన్న విలువలే నేడు సమాజాన్ని నడిపిస్తున్నాయి. అలాంటపుడు అక్రమాలకు కొదవేముంటుంది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆవు కథలు కాదు మోడీ గారూ ఆర్ధిక అంశాల మీద నోరు విప్పండి !

13 Friday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Cow excreta, Cow excreta start-ups, India cow commoission, Panchgavya, Rashtriya Kamdhenu Aayog

Image result for not cow stories Mr narendra modi speak on country economy

ఎం కోటేశ్వరరావు

చరిత్రకు పక్షపాతం లేదు. దాన్నుంచి తీసుకొనే పాఠాలకే ఏదో ఒక పక్షపాతం. అది దోపిడీదారులకు అనుకూలమైనది కావచ్చు, దోపిడీకి గురయ్యేవారిని మేల్కొలిపేదిగానూ వుండవచ్చు. గాంధీ గురించి ఎంత రాసినా స్వీకరించింది, ఆయన హంతకుడు గాడ్సేను ఎంత పొగిడినా అదే రీతిలో చరిత్ర తనలో నిక్షిప్తం చేసుకుంటున్నది. అదే చరిత్ర మనకు కావలసినంత వినోదం, విషాదాలతో పాటు చతురతను కూడా అందిస్తుంది.

మనకు జ్ఞాపకశక్తి తక్కువని గుర్తు చేయటం కాదుగానీ మన ప్రధాని నరేంద్రమోడీ 2018వ సంవత్సరానికి ఒక అంతర్జాతీయ అవార్డును స్వీకరించారు. మోడీకి ఈ అవార్డు ఎందుకు వచ్చింది అంటే ‘మోడినోమిక్స్‌’ (మోడీ అర్ధశాస్త్రం- ఎవరైనా ఒక ప్రత్యేక సిద్దాంతం లేదా మరొకదాన్ని కనిపెట్టినా, అభివృద్ధి చేసినా వారి కృషికి గుర్తింపుగా ఆ పేరుతో వ్యవహరిస్తారు) ద్వారా భారత్‌, ప్రపంచ ఆర్ధిక పురోభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా ఇచ్చారని మన విదేశాంగశాఖ వెల్లడించింది. అంతర్జాతీయ సహకారానికి ఆయన పునరంకితమైన తీరు, ప్రపంచ ఆర్ధిక అభివృద్ధిని పెంచేందుకు, ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా రూపుదిద్ది భారతీయుల అభివృద్ధికి చేసిన కృషికి, అవినీతి వ్యతిరేక చర్యలు, సమాజాన్ని ఒకటిగా చేసిన కృషికి గుర్తింపు అని వ్యాఖ్యానించింది. నరేంద్రమోడీగారికి ఏ డిగ్రీలు వున్నాయో తెలియదు, తెలిసినా దేశభద్రత దృష్ట్యా వెల్లడించకూడదనుకోండి. మరోవైపు అందరికీ తెలిసిన డిగ్రీలు కలిగి ఆర్ధిక నిపుణుడిగా పేరుగాంచిన మన్మోహన్‌ సింగ్‌ పదేండ్లు ప్రధానిగా వున్నా అదేమిటో ఒక్క అంతర్జాతీయ అవార్డూ రాలేదు. (ఆయన ఆర్ధిక విధానాలు, వైఖరితో ఏకీభవించినా లేకున్నా, అవి ఎవరికి వుపయోగపడతాయన్నది వేరే అంశం కావచ్చుగానీ ఆయన పట్టాలు వున్న ఒక ఆర్ధికవేత్త )

చరిత్రలో వినోదం, విషాదం అని ఎందుకన్నానంటే మన్మోహన్‌ సింగ్‌ దేశంలో తలెత్తిన ఆర్దిక మందగమనం గురించి మాట్లాడుతున్నారు. ప్రపంచ అవార్డు గ్రహీత నరేంద్రమోడీ మాత్రం ఆర్ధిక వ్యవస్ధకు బదులు ఆవు వ్యాసం, కథల గురించి దేశ ప్రజలకు చెబుతున్నారు. ఓం, ఆవు అనే మాటలు వినపడితే కొంత మందికి వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయని, దేశం 16,17 శతాబ్దాల వెనక్కు పోయిందని మాట్లాడతారని 2019 సెప్టెంబరు పదకొండున చెప్పారు. ఓం, ఆవులకు ఆ రెండు శతాబ్దాలకు సంబంధం ఏమిటో ఎంత వెతికినా కనపడలేదు. ఎందుకంటే అవి రెండూ అంతకంటే చాలా పురాతనమైనవి. దేశాన్ని ఆ కాలానికి తీసుకుపోవాలన్నది మోడీ అండ్‌కో ప్రయత్నం అన్నది తెలిసిందే. మేకిన్‌ ఇండియా పిలుపు ఏమైందో, అచ్చేదిన్‌ ఎప్పుడొస్తాయో, ఒక వేళ ఆర్ధిక మాంద్యం లేకపోతే లేదనైనా చెప్పకుండా ఈ అవుగోలేందో, ఎవరో దేశాన్ని వెనక్కు తీసుకుపోతున్నారని అంటూ ఎదురుదాడి చేయటం ఏమిటో ఎవరికైనా అంతుపడుతోందా ?

అంటే అన్నారని ఏడుస్తారు. మోడీ సర్కార్‌ రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ అనే సంస్ధను తాత్కాలిక బడ్జెట్‌లో ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేయాల్సి వుంది. జాతీయ మహిళ, జాతీయ ఎస్‌సి,ఎస్‌టి కమిషన్ల మాదిరి ఇది జాతీయ ఆవు కమిషన్‌. ఆవు పేడ, గోమూత్రం, వాటితో వుత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌కు యువతీ, యువకులు ఏర్పాటు చేసే అంకుర సంస్ధలకు 60శాతం వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వనున్నదని జాతీయ ఆవు కమిషన్‌ అధ్యక్షుడు వల్లభ్‌ కథిరియా నాలుగు రోజుల క్రితం వెల్లడించారు. పేడ, మూత్రాలతో ఔషధాలను తయారు చేస్తున్నామని, వాటిని మనుషులతో పాటు వ్యవసాయానికి వినియోగించవచ్చని చెప్పారు. ఇందుకోసం ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. పాడి ఎండిపోయిన తరువాత ఆవులు దేనికీ పనికిరావనుకోవటం సరైంది కాదని పేడ, మూత్రం వస్తాయని, వాటిలో వున్న ఔషధ గుణాల గురించి పరిశోధనలు చేయాలని శాస్త్రవేత్తలను కోరినట్లు కథిరియా చెప్పారు. గోశాల నిర్వాహకుల నైపుణ్య అభివృద్దికి శిక్షణ ఇస్తామని కూడా అన్నారు. ఆవు పేడ, మూత్రాలతో తయారు చేసే ప్రత్యేక ఔషధం పంచగవ్యను గర్భిణీ స్త్రీలు తీసుకుంటే వున్నతమైన తెలివిగల పిల్లలు పుడతారని ఆయుష్‌, జాతీయ ఆవు కమిషన్‌ అధికారులు చెబుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

Image result for cow stories,narendra modi cartoon

గ్రామాల నుంచి వుద్యోగాల కోసం యువత పట్టణాలకు రాకుండా చూసేందుకు మోడీనోమిక్స్‌లో ఇదొకటి. పంచగవ్యతో పాటు ఆవు, పేడ మూత్రాలతో సబ్బులు, దోమల నివారణ పిడకలు, కాగితం తయారీ వంటి వాటిని యువకులకు వుపాధిగా చూపాలని తలపెట్టారు. వీటిని వ్యాపారపరంగా తయారు చేసే వారికి పన్నెండు సంవత్సరాల్లో తీర్చే విధంగా తక్కువ వడ్డీకి రుణాలు కూడా ఇస్తారు. ప్రతి ఇంటికి ఒక ఆవు వుండే విధంగా చేయాలన్నది మోడీగారి లక్ష్యం. తాము అధికారానికి వస్తే ఒక లక్ష ఆవులను పంపిణీ చేస్తామన్నది తెలంగాణా బిజెపి ఎన్నికల వాగ్దానాల్లో ఒకటి.

కార్పొరేట్ల సామాజిక బాధ్యత(సిఎస్‌ఆర్‌) పధకాల్లో గోశాలల నిర్మాణం కూడా ఒకటిగా చేరుస్తూ యుపి యోగి ఆదిత్యనాధ్‌ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది, రెండు శాతం ఆవు పన్ను విధించింది. అన్ని దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆయుర్వేద, ఖాదీ కేంద్రాలలో ఆవు సంబందిత వుత్పత్తులను విక్రయిస్తారు.

మోడీ గారు దేశం గురించి ఎప్పుడు నోరు తెరుస్తారో, శాశ్వతంగా మూసుకుంటారో తెలియదు. ఆది గోద్రెజ్‌, ఆయనేమీ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకి కాదు, పాకిస్ధానీ మద్దతుదారు లేదా తుక్‌డే తుక్‌డే గ్యాంగ్‌ అసలే కాదు. ప్రముఖ పారిశ్రామిక సంస్ధ గోద్రెజ్‌ గ్రూప్‌ చైర్మన్‌. ‘ త్వరగా నిర్ణయాలు తీసుకోవటం మంచిది, వుదాహరణకు కాశ్మీర్‌, కానీ వాణిజ్య విషయాల్లో వేగంగా నిర్ణయాలు చేయకపోవటం మంచిది కాదు ‘ అన్నారాయన. దేశంలో వాణిజ్య, పారిశ్రామికవేత్తల్లో నెలకొన్న అసహనం లేదా అసంతృప్తికి నిదర్శనం. ఈ వ్యాఖ్య ఈ ఏడాది తొలి త్రైమాసిక ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు ఐదుశాతానికి పడిపోయిందని, ఎనిమిది ప్రధాన రంగాలలో గతేడాది జాలైలో 7.3శాతంగా వున్న వృద్ధి రేటు ఈ ఏడాది జూలైలో 2.1శాతానికి పడిపోయిందని సాక్షాత్తూ కేంద్ర వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వ శాఖే ప్రకటించటానికి ముందే గోద్రెజ్‌ మాట్లాడారు. తన ప్రభుత్వంలో ఎవరైనా పాక్‌ ఏజంట్లు చొరబడ్డారేమో, వారి మీద మెరుపు దాడులు చేయాలేమో మోడీ గారు ఆలోచించాలి. రాయిటర్స్‌ వార్తా సంస్ధ చేసిన ఇంటర్వ్యూలలో డజనుకు పైగా ప్రముఖులు గోద్రెజ్‌ మాదిరే ఆందోళన, అసంతృప్తి వ్యక్తం చేశారు, కొంత మంది పేరు రాయటానికి ఇష్టపడలేదు. వారంతా మోడీ విజయానికి హారతులు పట్టిన వారే సుమా ! వీరి అభిప్రాయాలపై వ్యాఖ్యానించాలని అడగ్గా ప్రధాని కార్యాలయం తిరస్కరించిందట. మోడీ గారే మాట్లాడనపుడు కందకు లేని దురద కత్తి పీటకెందుకు అన్నట్లుగా ఆయన ఆఫీసు ఎలా స్పందిస్తుంది. జూలై నెలలో ఈ విదేశీ మదుపుదార్లు మన స్టాక్‌ మార్కెట్‌ నుంచి 1.8 బిలియన్‌ డాలర్ల మేరకు పెట్టుబడులు వుపసంహరించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వుద్దీపన చర్యలు, బ్యాంకుల విలీనాలు ఎలాంటి ప్రభావం చూపలేదని విశ్లేషకులు పేర్కొన్నారు.

తాము అప్పుల పాలయ్యామని, దివాలా తీశామని, వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదు కనుక రుణాల రద్దు, సబ్సిడీలను కొనసాగించాలన్న కోట్లాది రైతాంగ వినతుల సందర్భంగా మీడియా, పారిశ్రామికవేత్తలు కూడా వాటికి వ్యతిరేకమైన వాదనలు చేస్తున్న విషయం తెలిసింది. ఎవరైనా స్వంత కాళ్ల మీద నిలబడాలి తప్ప ప్రభుత్వాలు ఆదుకుంటే సోమరితనాన్ని పెంచినట్లే అని సుభాషితాలు పలికారు. అవే నోళ్లు ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందుల నుంచి పారిశ్రామిక, వాణిజ్య రంగాన్ని బయటపడవేసేందుకు వుద్దీపన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. రాయిటర్స్‌ కధనం ప్రకారం కొంత మంది బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగానికి చెందిన ప్రముఖులు ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ గ.ారిని కలిశారు. వారు చెప్పిన అంశాల మీద ఎలాంటి చర్చ లేకుండా కృతజ్ఞతలు, మేం పరిశీలిస్తామని చెప్పి పంపారు. ఎక్కువ సమావేశాల తంతు ఇలాగే వుంటోంది.

ఆర్ధిక వ్యవస్ధ దిగజారుతుండటంతో దిక్కుతోచని ప్రభుత్వం జనం దృష్టిని మళ్లించేందుకు పెద్ద ఎత్తున సిబిఐ, ఇడి, ఇతర ఆర్ధిక దర్యాప్తు సంస్ధల దాడులను ప్రారంభించింది. అక్రమాల మీద చర్య తీసుకోవటాన్ని తప్పు పట్టనవసరం లేదు. ఇదే సమయంలో ఆర్ధిక వ్యవస్ధ రక్షణకు తీసుకున్న చర్యలేమిటన్నది అసలు ప్రశ్న. ఐదేండ్ల క్రితం ఒక నవయువకుడు ప్రేమలో పడినట్లుగా మేము వున్నాం, ఇప్పుడు కలలు కల్లలైనట్లుగా తయారైంది అని ఒక వాణిజ్య వేత్త వ్యాఖ్యానించారు. అది నరేంద్రమోడీ గురించి అని వేరే చెప్పనవసరం లేదు.

Image result for cow stories,narendra modi cartoon

దేశం ఆర్ధికంగా దిగజారుతోంది అని గుర్తించటానికి కూడా నరేంద్రమోడీ సర్కార్‌ సిద్దపడటం లేదు. ఆర్ధిక వ్యవస్ధను చక్కదిద్దేందుకు స్ధిరచిత్తం గలవారు చెప్పే మాటలను ఆలకించండి అని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వ్యాఖ్యల గురించి ఏం చెబుతారని విలేకర్లు అడిగితే ఆయనేం చెప్పారో నాకు తెలియదు, చెప్పినదాని మీద నాకెలాంటి ఆలోచన లేదు, ఆయన చెప్పింది నేను విన్నాను అంతే అని ముక్తసరిగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానం చెప్పారు. కార్ల అమ్మకాలు పడిపోవటానికి యువతీ యువకులు కార్లు కొనటం మాని ఓలాలు, వూబర్‌లు ఎక్కుతున్నారని ఆమె సెలవిచ్చిన విషయం తెలిసిందే.

దేశంలో నిరుద్యోగుల శాతం 8.2కు పెరిగిందని, పట్టణాల్లో అది 9.4శాతంగా వుందని సిఎంఐఇ చెప్పింది. పెంచిన సర్‌ఛార్జిని వుపసంహరిస్తున్నట్లు ప్రకటించిన తరువాత కూడా విదేశీ (ఎప్‌పిఐ) మదుపుదార్లు పెట్టుబడులను వుపంసంహరించటం ఆగలేదు. రూపాయి విలువ 72 దాటి పతనమైంది. ఒక వైపు పరిస్ధితి ఇలా వుంటే ఇప్పటికీ భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగానే వుంది అంటూ గతనెల 26న బిజెపి ట్వీట్‌ ద్వారా ప్రకటించింది. పని గట్టుకొని ఎగవేస్తున్న వారి నుంచి బ్యాంకు రుణాలు వసూలు చేయటం మీద అంతగా శ్రద్ద పెట్టని కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీనాన్ని ముందుకు తెచ్చింది. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్‌ అన్నట్లుగా ప్రభుత్వం ప్రచారం చేసింది. ప్రస్తుతం అభివృద్ధి మందగించటానికి అవే ప్రధాన కారణం అని అనేక సర్వేలు చెబుతున్నా అంగీకరించటానికి ప్రభుత్వం సిద్దంగా లేదు. వీటి గురించి రోజూ మీడియాలో వార్తలు వస్తుంటే ప్రస్తావించని మోడీ గారు దేశానికి ఆవు పాఠాలు చెబుతున్నారు. దేశాన్ని ఎవరు వెనక్కు తీసుకుపోతున్నారు ? ఇది వినోదమా దేశానికి పట్టిన విషాదమా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నిర్మలమ్మా నిజాలను అంగీకరించండి, నివారణ చర్యలు తీసుకోండి !

11 Wednesday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ 1 Comment

Tags

automobile, BoycottMillennials, mindset of millenials, Nirmala Sitharaman

Image result for Twitter trolls Nirmala Sitharaman's 'mindset of millennials' remarks cartoon

అమ్మా నిర్మలమ్మా ఒక తెలుగింటి కోడలివనే గౌరవంతో ఒక తెలుగువాడిగా ఈ బహిరంగ లేఖలో నాలుగు ముక్కలు రాస్తున్నా. ఆటో మొబైల్‌ పరిశ్రమలో తలెత్తిన పరిస్ధితికి కారణాలను వివరించాలని మీరే అనుకున్నారో, విలేకర్లు ఎవరైనా వ్యాఖ్యానించమని కోరారో తెలియదు. మీ అధినేత ప్రధాని నరేంద్రమోడీయే ఇంతవరకు నోరు విప్పలేదు, మన్‌కీ బాత్‌లో కూడా చెప్పలేదు. ప్లాస్టిక్‌ గురించి, ఫిట్‌నెస్‌ వంటి సుభాషితాలనే పలికారు. మీ రెందుకమ్మా అలా వ్యాఖ్యానించారు. కార్ల అమ్మకాలు పడిపోవటానికి యువత ఓలాలు, వూబర్‌లు, మెట్రోలు ఎక్కటం, వాయిదాలు కట్టేందుకు సిద్దం గాకపోవటం, బిఎస్‌ 6 కారణాలని చెప్పటం ఏమిటి తల్లీ ?

తెలుగునాట ఒక సామెత వుంది, తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి ఎక్కడుందో చూడటానికని చెప్పాడట ఒకడు. అసలు విషయం కల్లుకోసం ఎక్కాడని వేరే చెప్పనవసరం లేదు. మీరు కూడా సమస్య వుంది, పరిశీలిస్తున్నాం, తగిన సమయంలో తగు చర్యలు తీసుకుంటాం ఇలా ఏదో ఒకటి చెప్పకుండా ఈ సహస్రాబ్ది కుర్రకారు మానసిక స్ధితి గురించి అలా మాట్లాడారేమి తల్లీ ! అయినా కార్ల అమ్మకాలు, కుర్రకారు గురించి మీరు చెప్పిన మాటలను ఏడాది క్రితమే మహింద్రా సంస్ధ అధిపతి ఆనంద్‌ మహింద్ర, మారుతి కంపెనీ చైర్మన్‌ ఆర్‌సి భార్గవ చెప్పారమ్మా. వాటినే ఇప్పుడు మీరు పునశ్చరణ చేశారు. కార్లంటే అదేదో కుర్ర వ్యవహారంగా మార్చి వేశారు. మన దేశంలో వున్న జనాభాలో 40 కోట్ల మంది కుర్రకారే. వారిలో ఒక కోటి మంది కొనుగోలు చేసినా ఎంతో మార్కెట్‌ వుంటుంది. 2018 మార్చినెలతో ముగిసిన ఆర్దిక సంవత్సరంలో మన దేశంలో వుత్పత్తి అయిన అన్ని రకాల మోటారు వాహనాల సంఖ్య 2.91 కోట్లు. వీటిలో ద్విచక్ర వాహనాలు 2.31 కోట్లు, కార్లు 21.7లక్షలు, త్రిచక్ర వాహనాలు పది లక్షలు, వాణిజ్య వాహనాలు ఆరులక్షల అరవై వేలు,ఎగుమతి చేసిన కార్లు ఏడు లక్షలు, ద్విచక్ర వాహనాలు 32.6లక్షలు, వాణిజ్యవాహనాలు లక్ష,త్రిచక్ర వాహనాలు 5.3లక్షలు.

Image result for Twitter trolls Nirmala Sitharaman's 'mindset of millennials' remarks cartoon

మీరు వూహా లోకంలో వున్నట్లున్నారు. మన యువతీ, యువకులందరూ కార్లు కొనేంతగా వేతనాలు తెచ్చుకోవటం లేదు గనుక మన దగ్గర అంత సీన్‌ లేదు తల్లీ. 2018 డిసెంబరు 12న ఆటో. ఎకనమిక్‌ టైమ్స్‌ సమాచారం ప్రకారం మన దేశంలో ప్రతి వెయ్యి మందికి 22 కార్లు వుంటే చైనాలో 164, జపాన్‌లో 591, కెనడాలో 662, ఆస్ట్రేలియాలో 740, న్యూజీలాండ్‌లో 774, బ్రిటన్‌లో 850, అమెరికాలో 980 వున్నాయట. సహస్రాబ్ది కుర్రకారు అందరూ కార్లు కొనటం మానుకోలేదు. వారికి అంత ఆర్ధిక శక్తి కూడా లేదు. అంతర్జాతీయ చమురు సంస్ధ(ఐఇఏ) అంచనా ప్రకారం 2040 నాటికి మన దేశంలో వెయ్యి మందికి 175 కార్లు వుంటాయట. మోడీగారు చెప్పినట్లు పకోడీల బండ్లు నిర్వహించే వారు కూడా వుద్యోగులే అయితే వారందరికీ ఐటి ఇంజనీర్లలో కొంత మందికి వస్తున్న మంచి ఆదాయాలు వారికి కూడా వస్తే వారు కూడా కారులో వచ్చి పకోడీలు అమ్మి తిరిగి కారుల్లోనే ఇండ్లకు వెళతారు. అమెరికాలో రోడ్లు వూడ్చే వారు కూడా కార్లలో వస్తారని మా చిన్నపుడు చెబితే అబ్బో అక్కడికి వెళ్లి వీధులూడ్చినా మన జీవితం ధన్యం అనుకొనే వాళ్లం. ఎందుకంటే అసమయంలో సినిమాల్లో తప్ప పల్లెటూళ్లలో వాస్తవంగా కార్లు చూసిన వారి సంఖ్య చాలా నామమాత్రంగా వుండేది మరి.

అనేక కంపెనీలు మందగమనం కారణంగా తమ వుత్పాదకతను తగ్గించిన తరువాత ఈ ఏడాది జూలై నెలలో కార్లు 25-30 రోజుల వుత్పత్తి, వాణిజ్య వాహనాలు 55-60 రోజుల, ద్విచక్ర వాహనాలు 60ా65 రోజుల వుత్పత్తి నిల్వలు వున్నాయని ఆటో పరిశ్రమ అంచనా. కుర్రకారంటే కార్లు కొనటం లేదు, మరి వాణిజ్య వాహనాలు, ద్విచక్రవాహనాల అమ్మకాల్లో ఎందుకు మాంద్యం ఏర్పడినట్లు ? బిఎస్‌ 6 ను ఒక కారణంగా చూపుతున్నారు. ఇది కూడా అంతగా అతకటం లేదమ్మా! బిఎస్‌ ఒకటి నుంచి ఐదు వరకు లేని సమస్య ఆరుకు వచ్చిందంటే ఎలా? కొత్తగా వచ్చే తరం వాహనాల కోసం ఎదురు చూసే వారు చాలా నామమాత్రంగా వుంటారు తప్ప అసలు కొనుగోళ్లను బంద్‌ చేసిన వుదంతం లేదు. అసలు కంపెనీలే కొత్త తరం గడువుకు అనుగుణ్యంగా తమ పాత తరం వుత్పత్తి క్రమంగా తగ్గించటం లేదా నిలిపివేసే ప్రణాళికలను రూపొందించుకుంటాయి తప్ప అమాయకంగా అమ్ముడు పోని వాహనాలను తయారు చేసి పెట్టుకుంటాయా ? మన కార్పొరేట్‌ సంస్ధలు మరీ అంత అమాయకంగా లేవు తల్లీ !

Image result for Twitter trolls Nirmala Sitharaman's 'mindset of millennials' remarks cartoon

మీరు గానీ మీ సర్కార్‌ గానీ దేశంలో ఆర్దిక మాంద్యం పెరుగుతోంది అని అంగీకరించటానికి సిద్ధంగా లేరు. కుర్రకారు కార్లు కొనేందుకు విముఖత చూపుతున్నారు గనుక ఆటోమొబైల్‌ రంగం కుదేలైందని కాసేపు మీ అభిప్రాయాన్ని అంగీకరిద్దాం. అమెరికా-చైనా వారు వాణిజ్య యుద్ధంలో మునిగితే దాన్ని వుపయోగించుకొని మన దేశం చైనా స్ధానాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తామని ఎప్పటి నుంచో చెబుతున్నారు కదా ? అదే వాస్తవమైతే గత ఏడాది కాలంలో మన ఎగుమతులు పెరగాల్సింది పోయి తగ్గాయి ఎందుకని ? ఎనిమిది కీలక రంగాల్లో వృద్ధి రేటు గతేడాది జూలైలో 7.3శాతం వుంటే ఈ ఏడాది జూలైలో 2.1శాతానికి పడిపోవటానికి కారకులు ఎవరు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా గత 25నెలల్లో అత్యంత కనిష్టంగా టోకు ధరల సూచి పెరుగుదల 1.8శాతంగా నమోదైంది. అంటే ధరల పెరుగుదల వున్నా పెద్దగా లేవు. అయినప్పటికీ వినియోగ వస్తువులను తయారు చేసే కంపెనీలు తమ వస్తువులకు డిమాండ్‌ తగ్గిపోయిందని గగ్గోలు పెడుతున్నాయి. వినియోగవస్తువులను వుపయోగించే విషయంలో సహస్రాబ్ది కుర్రకారు పాత తరాలను మించిపోయింది కదా ! మరి ఆ వస్తువులకు డిమాండ్‌ ఎందుకు తగ్గినట్లు ? చివరకు ఐదు రూపాయల బిస్కెట్‌ పాకెట్లు కూడా సరిగా అమ్ముడు పోవటం లేదని పార్లే కంపెనీ ముంబైలోని విల్‌ పార్లే ఫ్యాక్టరీని మూసివేసింది. వీటికి ఓలా, వూబర్‌లు ఎక్కే కుర్రకారేనా ? అందుకే తల్లీ నిజాలను అంగీకరించండి, ఆత్మావలోకనం చేసుకోండి. వైఫల్యానికి ఎవరో ఒకరిని బలి చేయాలి కనుక ఆర్‌ఎస్‌ఎస్‌ మరో కొత్త బమ్మను రంగంలోకి తెస్తే ఏమో గాని లేకపోతే మరో నాలుగు సంవత్సరాల వరకు మీ సర్కార్‌కు ఎలాంటి ఢోకా వుండదు. నిజాన్ని అంగీకరించి నివారణ చర్యలు చేపట్టండి, మూసిపెడితే పాచిపోతుందని గుర్తించండి.

Image result for Twitter trolls Nirmala Sitharaman's 'mindset of millennials' remarks cartoon

చెన్నయ్‌లో మీరు విలేకర్ల సమావేశంలో మాట్లాడిన మాటలు విన్న వారు టీవీల్లో కన్నవారిలో కుర్రకారు ఒకటే జోకులు వేసిన విషయం మీ వరకు వచ్చే వుంటుంది. ఏది ఏమైతేనేం ఒకందుకు మాత్రం మిమ్మల్ని అభినందించక తప్పదు. రేపేం కానుందో అని అన్ని తరగతుల వారు ఆందోళనపడుతున్న తరుణంలో మీ ప్రకటనతో పేలుతున్న జోకులతో విషాదంలో వినోదం మాదిరి నవ్వుకుంటున్నారంటే అది మీ పుణ్యమే. ఇదే మాట నరేంద్రమోడీ నోట వచ్చి వుంటే దేశం ఇంకా విరగబడి నవ్వి వుండేది. కొన్ని జోకులు ఎలా వున్నాయో మీకు చెబుదామనుకుంటున్న. దేశంలో మంచి నీటి కొరతకు మిలీనియల్స్‌ ఎక్కువగా తాగటం, ఆక్సిజన్‌ కొరతకు ఎక్కువగా పీల్చటం. పారగాన్‌ చెప్పుల అమ్మకాలు పడిపోవటానికి మిలీనియల్స్‌ చెప్పులు లేకుండా తిరగటమే కారణం. ఎంఎల్‌ ఏలను కొనేందుకు అమిత్‌ షా పేటిఎంను వినియోగిస్తున్న కారణంగా నల్లధనం తగ్గిపోయింది. అనిల్‌ అంబానీ అప్పులు చెప్పులు చెల్లిస్తున్నందున నిరర్ధక ఆస్ధులు తగ్గుతున్నాయి. పార్లమెంట్‌ సభ్యురాలైన సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ బిజెపి మంత్రుల మీద చేతబడి చేస్తున్న కారణంగా జనాభా తగ్గుతోంది. కార్ల అమ్మకాలు ఢమాల్‌ అన్నందుకు దేశం నుంచి మిలీనియన్స్‌ను బహిష్కరించాలంటూ ఒకటే ట్వీట్లు. ఇంకా వున్నాయి గానీ వినోదం కాస్త విషాదం అవుతుంది. వుంటా మరి

ఓ తెలుగోడు

ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

తరిగిపోతున్న అమెరికన్‌ కార్మిక సంపద !

04 Wednesday Sep 2019

Posted by raomk in Current Affairs, Economics, History, International, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

American Workers, Inequality in USA, US Plutocracy, USA Labor Day

Image result for inequality in wealth holdings, usa

ఎం కోటే శ్వరరావు

ప్రపంచంలో మెజారిటీ దేశాల్లో మే ఒకటవ తేదీ కార్మిక దినం. చిత్రం ఏమిటంటే మే డే పోరాటాల గడ్డ అమెరికాలో మాత్రం అధికారయుతంగా సెప్టెంబరు 2 కార్మిక దినం. అంతర్జాతీయ కార్మిక వుద్యమం ఖరారు చేసిన మే డేను అంగీకరిస్తే కార్మికవర్గం ఎక్కడ కమ్యూనిజం వైపు పయనిస్తుందో  అనే భయంతో  అమెరికా పారిశ్రామికవేత్తలు దానికి బదులుగా 1880దశకంలో సెప్టెంబరు రెండవ తేదీని కార్మిక దినంగా నిర్ణయించాలని తమకు అనుకూలురైన కార్మికులతో ఒక ప్రతిపాదన చేయించారు. ముందే తెలుసుగనుక నాటి అమెరికా అధ్యక్షుడు గ్రోవర్‌ క్లీవ్‌లాండ్‌ అంగీకరించారు. అంటే ఆచరణలో అది కార్మికవర్గానికి చెందినది కాదు యజమానుల దినం.

అమెరికా కార్మికదినాన్ని జరుపుకొనేందుకు నిజానికి అక్కడి కార్మికవర్గం సంతోషించాల్సిందేమీ లేదు. నానాటికీ వారి పరిస్ధితులు దిగజారుతున్నాయి.2003తో పోల్చితే సగం అమెరికన్‌ కుటుంబాల(12.9 కోట్ల మంది) సంపద ఇప్పుడు 32శాతం తక్కువ. ఇదే కాలంలో ఎగువన వున్న ఒక శాతం మంది(పన్నెండు లక్షల 90వేల మంది) ధనికుల సంపద రెండు రెట్లు పెరిగింది.రెండవ ప్రపంచ యుద్దం తరువాత ప్రతి ఏటా  సగటు వేతనాలు 1970వరకు పెరిగాయి. ముఖ్యంగా గత రెండు దశాబ్దాల్లో పేదలు మరింత పేదలుగానూ, ధనికులు మరింత ధనికులుగా మారారు. డోనాల్డ్‌ ట్రంప్‌ బడ్జెట్‌లో లక్ష కోట్ల డాలర్లమేరకు లోటును పెంచి ఒక శాతం ధనికులకు పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చాడు. ఇది వారికి రాయితీలు అనటం కంటే పేదల మీద విధించిన పన్ను అనటం సబబు.

1894లో అమెరికా పార్లమెంట్‌ ఒక చట్టం చేసింది. దాని ప్రకారం ప్రతి ఏడాది సెప్టెంబరులో వచ్చే మొదటి సోమవారం సెలవు ప్రకటించి అమెరికా కార్మిదినంగా పాటించాల్సి వుంది. అదే ఏడాది అమెరికా రైల్వే కార్మికుల సమ్మెను నిరంకుశంగా అణచివేయటంలో అప్పటి అధ్యక్షుడు గ్రోవర్‌ క్లీవ్‌లాండ్‌ పేరు మోశాడు. ప్రస్తుతం అమెరికాలో యూనియన్‌లు నామ మాత్రంగా మారాయన్నది ఒక అభిప్రాయం. ఈ కారణంగానే వారి ఆదాయాలు ఏడాదికేడాది పడిపోతున్నాయి, మధ్యతరగతి అంతరిస్తున్నది.1950దశకంలో మూడో వంతు మంది కార్మికులు ఏదో ఒక యూనియన్‌లో వుండే వారు. 1983 నాటికి ప్రయివేటు రంగంలోని కార్మికులు 16.8శాతం మంది యూనియన్లలో వుండగా గతేడాది అది 6.4శాతానికి పడిపోయింది. ప్రభుత్వ రంగంలో 37 నుంచి 34శాతానికి తగ్గింది. యూనియన్లకు కార్మికులు ఎప్పుడైతే దూరంగా వుంటారో అప్పుడు కార్మిక సంఘాల బేరమాడేశక్తి తగ్గుతుంది.1940 దశకం నుంచి చూస్తే 66శాతం మేరకు  యూనియన్ల సభ్యత్వం పడిపోగా ఆర్ధిక అసమానతలు 30శాతం వరకు పెరిగాయని ఒక అధ్యయనం తెలిపింది.

అమెరికాలో ఏర్పడిన మహా సంక్షోభ సమయంలో అధికారానికి వచ్చిన డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ఫ్రాంక్లిన్‌ డి రూజ్‌వెల్ట్‌ తన తొలి పదవీ కాలం 1935లో జాతీయ కార్మిక సంబంధాల చట్టాన్ని తెచ్చారు. దాని ప్రకారం ప్రయివేటు రంగంలోని కార్మికులకు యూనియన్‌ ఏర్పాటు చేసుకొనే హక్కుతో పాటు బేరమాడే, సమ్మె చేసే హక్కులు కూడా సంక్రమించాయి. రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత న్యాయమైన కార్మిక ప్రమాణాల పేరుతో మరొక చట్టాన్ని తెచ్చారు.దాన్లో భాగంగానే కనీస వేతన వ్యవస్ధను ఏర్పాటు చేశారు. బాలలతో పని చేయించటాన్ని నిషేధించటం, వారానికి నలభై గంటలకు మించి పని చేసిన వారికి ఒకటిన్నర రెట్లు ఓవర్‌ టైమ్‌ చెల్లింపులు వచ్చాయి. ఈ కారణంగానే నేటికీ అమెరికాలో వున్న మేరకు కార్మిక సంఘాలు ఎక్కువ భాగం డెమోక్రటిక్‌ పార్టీతోనే వుంటాయి.

కార్మికులు పై మెరుగులు, నాయకుల దయాదాక్షిణ్యాలను కాదు, తమకు అనుకూలమైన ఆర్ధిక వ్యవస్ధ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారని కార్మికదినం సందర్భంగా క్రిస్టియన్‌ సైన్స్‌ మానిటర్‌ పత్రిక నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఎఎఫ్‌ఎల్‌-సిఐఓ అధ్యక్షుడు రిచర్డ్‌ ట్రమ్‌కా  చెప్పారు. ఎన్నికల ప్రచారంలో వున్న అభ్యర్ధులను తాము ఇదే అడుగుతున్నామని అన్నారు.కేవలం వాణిజ్య ఒప్పందాలు కాదు, ఆర్ధిక వ్యవస్దలో మార్పులు తెచ్చే కార్యాచరణ కావాలి. యూనియన్ల అవసరం వుందని గుర్తించిన వారి సంఖ్య 64శాతానికి పెరిగినట్లు గాలప్‌ పోల్‌ వెల్లడించింది, అయితే అమెరికా కార్మిక చట్టంలోని లోపాల కారణంగా అది సభ్యత్వంగా మారటం లేదు అన్నారు. గతేడాది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తరువాత ప్రభుత్వ రంగంలోని వుద్యోగులు యూనియన్లలో చేరటం తగ్గవచ్చని భయపడ్డాము కానీ వుద్యోగ సంఘంలో రెండు లక్షల మంది, టీచర్స్‌ యూనియన్‌లో 88వేల మంది తోడయ్యారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులను అడగాల్సి ప్రశ్నల గురించి కార్మిక సంఘాలకు పెద్ద ఎత్తున శిక్షణ ఇస్తామని వెల్లడించారు. స్ధంభించిన వేతనాలు, పెన్షన్ల గురించే కాదు ఆరోగ్య సంరక్షణకు చేస్తున్న ఖర్చు, స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు, అమెరికా వుద్యోగాలను మెక్సికో, ఇతర చోట్లకు తరలించటం వంటి అనేక అంశాల గురించి పోటీ చేయనున్న అభ్యర్దులను ప్రశ్నిస్తామని అన్నారు. కొత్త ఒప్పందంలో భాగస్వాములు కానున్న అమెరికా, కెనడా, మెక్సికో దేశాలలో కార్మికుల హక్కులు, గౌరవ మర్యాదలను కాపాడవలసి వుందని చెప్పారు. గతంలో మెక్సికోలోని అమెరికా కార్పొరేట్‌ కంపెనీలు ప్రభుత్వ అనుకూల, కంపెనీ అనుకూల యూనియన్లతో ఏడు లక్షల ఒప్పందాల గురించి చర్చించాయని  కొత్త ఒప్పందం అమల్లోకి వస్తే నాలుగు సంవత్సరాల కాలంలో వాటిని రద్దు చేసి స్వతంత్ర కార్మిక సంఘాలతో ఒప్పందాలు చేసుకొనే విధంగా చేస్తామనే మెక్సికో ప్రతిన ఎంతమేరకు నెరవేరుతుందో, అక్కడి కార్మికుల వేతనాలు ఎంత మేరకు పెరుగుతాయో అనుమానమే అన్నారు. చట్టాలను అమలు జరిపే యంత్రాంగం లేకపోతే అది కార్మికుల పాలిట వినాశకరంగానూ, కార్పొరేట్లకు విపరీత లాభాలకు దారి తీస్తుందని, మెక్సికో నూతన అధ్యక్షుడు ఒబ్రాడర్‌ కార్మికుల హక్కులను కాపాడతానన్న తన హామీని ఎలా నిలబెట్టుకుంటారో వెల్లడించాలని అన్నారు.

ఇతర దేశాలతో ఎగుమతుల్లో పోటీ పడేందుకు కార్మికులు వేతనాలు తగ్గించుకొని దేశ భక్తిని చూపాలని లేకపోతే వున్న వుద్యోగాలు కూడా వుండవని బెదిరించిన అమెరికన్‌ కార్పొరేట్ల వత్తిడికి కార్మికవర్గం తలవంచి వేతన స్ధంభనకు అంగీకరించింది. అయినా ఎగుమతులు పెరగలేదు. ఆర్ధిక వ్యవస్ధలో ఎదుగూ బొదుగూ లేదు. ఈ పూర్వరంగంలోనే చైనా, ఐరోపా యూనియన్‌ తదితర దేశాలతో డోనాల్డ్‌ ట్రంప్‌ వాణిజ్య యుద్ధానికి దిగుతున్న విషయం తెలిసిందే. మరోవైపున ట్రంప్‌ కార్మికవర్గం మీద మొత్తంగా దాడి కొనసాగిస్తూనే వున్నాడు. అనేక సంక్షేమ చర్యలకు కోతపెట్టటం దానిలో భాగమే. పేరుకు  అనేక పధకాలు వున్నప్పటికీ వాటిని పొందాలంటే కార్మికులు ఎంతో నష్టపోవాల్సి వుంది. మన దేశంలో ఇఎస్‌ఐ ఆసుపత్రులలో వైద్యం కోసం కార్మికులు ఎన్ని ఇబ్బందులు పడాలో చూస్తున్నదే. కార్మికోద్యమాన్ని బలహీనపరిచేందుకు యూనియన్లను దెబ్బతీస్తున్నారు.

కుటుంబ నియంత్రణ కార్యక్రమ ప్రచారానికి దానిని వ్యతిరేకించే వారిని నియమించినట్లుగా కార్మిక వ్యతిరేకులుగా రుజువైన వారిని కార్మిక మంత్రులుగా నియమించటం వంటి చర్యలకు ట్రంప్‌ పూనుకున్నాడు. తన సంస్దలలో కార్మిక చట్టాలను వుల్లంఘించి, కార్మికులను మోసం చేసి విధిలేక మిలియన్ల డాలర్ల మేరకు జరిమానాలు చెల్లించిన ఒకరిని కార్మిక మంత్రిగా నియమిస్తే  రిపబ్లికన్లు కూడా అంగీకరించలేదు. రెండవ మంత్రి కూడా అలాంటి వ్యక్తే, తాజాగా ప్రతిపాదించిన మూడవ మంత్రి ఇప్పటివరకు చేసిందేమిటయ్యా అంటే వాణిజ్య సంస్ధలను సమర్ధించటమే పని. ట్రంప్‌ విషయానికి వస్తే ఎన్నికల్లో చేసిన సామాజిక భద్రత, వైద్యం గురించి వాగ్దానాలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నాడు. సామాజిక భద్రత యంత్రాంగాన్ని పెద్ద ఎత్తున తగ్గించి దరఖాస్తుల పరిశీలన తతంగాన్ని సంవత్సరాల తరబడి సాగదీస్తున్నారు. మంజూరైన తరువాత కూడా లబ్ది అందుకోవటంలో అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఒక వాణిజ్య, పారిశ్రామికవేత్తగా ట్రంప్‌ తక్కువ తినలేదు. అధ్యక్షుడిగా ఎన్నికవటానికి ముందు సంవత్సరాలలో కార్మికులు, వుద్యోగులను వేధించిన చరిత్ర చాలా వుంది. పని చేయించుకొని కాంట్రాక్టర్లు, కార్మికులకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవటం, చట్టాల వుల్లంఘన వంటి వివిధ వుదంతాలకు సంబంధించి అరవై కేసులను ట్రంప్‌ సంస్దలు ఎదుర్కొన్నాయి.

అమెరికాలో ఎన్నికల వాతావరణం మొదలైంది గనుక సహజంగానే కార్మికులు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎనిమిదేండ్ల డెమోక్రటిక్‌ పార్టీ నేత బరాక్‌ ఒబామా పాలనలో వుద్యోగాలను కాపాడటంలో, కొత్త వాటి కల్పనలో దారుణంగా విఫలమయ్యాడు. ఎన్నో వాగ్దానాలతో రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ట్రంప్‌ జనంలో వున్న అసంతృప్తిని సొమ్ము చేసుకున్నాడు. గత మూడు సంవత్సరాలలో అన్ని రంగాల్లో విఫలమై వుద్యోగాల రక్షణ, మరొక పేరుతో అనేక వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నాడు. చైనా, భారత్‌ వంటి దేశాలతో బలవంతంగా అధికరేట్లకు తమ సరకులు కొనాలని వత్తిడి, ప్రతి చర్యలకు దిగుతున్నాడు. డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఎలిజబెత్‌ వారెన్‌, బెర్నీ శాండర్స్‌తో పాటు మరికొందరు అధ్యక్ష పదవి అభ్యర్ధిత్వం కోసం పోటీ పడుతూ తాము అధికారానికి వస్తే ఏం చేయనున్నారో వెల్లడిస్తున్నారు. వాటిలో కొన్ని ఇలా వున్నాయి.

Image result for inequality in wealth holdings, usa

గంటకు పదిహేను డాలర్ల కనీస వేతనం ఇవ్వాలన్న ప్రతిపాదనకు డెమోక్రటిక్‌ పార్టీనేతలు మద్దతు తెలుపుతున్నారు. అంతేకాదు కొన్ని ఐరోపా దేశాల్లో మాదిరి కార్పొరేట్‌ డైరెక్టర్ల బోర్డుల్లో కార్మిక ప్రతినిధులకు చోటు కల్పించాలన్న ప్రతిపాదనలను కూడా చేస్తున్నవారు లేకపోలేదు. జవాబుదారీ పెట్టుబడిదారీ బిల్లు ప్రతిపాదన వాటిలో ఒకటి. దాని ప్రకారం డైరెక్టర్లుగా 40శాతం మంది కార్మికుల నుంచి ఎన్నుకోవాల్సి వుంటుంది. జర్మనీలో కొన్ని పరిశ్రమల్లో సగం మంది వరకు డైరెక్టర్లు కార్మికుల నుంచి వున్నారు. పని స్ధలాల్లో ప్రజాస్వామ్యం పేరుతో గత ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడిన,  మరోసారి అదే ప్రయత్నం చేస్తున్న బెర్నీ శాండర్స్‌ కూడా కొన్ని ప్రతిపాదనలను ముందుకు తెచ్చారు.  బ్రిటన్‌లోని బడా పరిశ్రమల్లో వచ్చిన లాభాల్లో పదిశాతం వాటాల వరకు వచ్చిన మొత్తాన్ని కార్మిక నిధులకు జమ చేస్తారు. ప్రతి ఏటా కార్మికులు 600 పౌండ్లు డివిడెండ్‌ పొందుతారు. ఇలాంటి అంశాలను చర్చకు తెస్తున్నారు.

కార్మికోద్యమాన్ని నిర్మించకుండా అమెరికాలో మధ్యతరగతి పెరిగే అవకాశాలు లేవని బెర్నీ శాండర్స్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అధికారాలన్నీ యజమానులు, బడా కార్పొరేట్ల చేతుల్లో వున్నాయి, యూనియన్లు లేకుండా వేతనాలు, ఇతర లబ్ది పొందటం అసాధ్యం అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మౌలికంగా వీటి స్వభావం సంస్కరణలు తప్ప మౌలిక మార్పులను కోరేవి కాదు. అమెరికాలో ఇప్పుడున్న వాతావరణంలో ఆ పెట్టుబడిదారీ సంస్కరణల మీద కూడా దాడి జరుగుతున్నది, కనీసం వాటిని రక్షించుకొనే స్ధితిలో కూడా కార్మికవర్గం లేదని గమనించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d