• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: International

చైనా 5జిపై బెదిరింపుల నుంచి ప్రలోభాలు, బుజ్జగింపులకు దిగిన అమెరికా !

01 Thursday Jul 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Chinese 5G, G7, US fight against Chinese 5G, US-China Tech war

మన చుట్టూ జరుగుతున్నదేమిటి : ఐదవ భాగము

ఎం కోటేశ్వరరావు


ఏదైనా ఒక కంపెనీ తమ కంపెనీ ఉత్పత్తులు ఎంత గొప్పవో లేదా తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే లాభాలు ఎలా వస్తాయో చూడండి అంటూ దేశ విదేశాల్లో రోడ్‌ షోలను ఏర్పాటు చేయటం తెలిసిందే. ఇప్పుడు దానికి భిన్నంగా చైనా 5జి పరిజ్ఞానం, పరికరాలను గనుక మీరు తీసుకోకపోతే మేమిచ్చే శిక్షణ, రాయితీల గురించి తెలుసుకోండి అంటూ అమెరికా ఇప్పుడు రోడ్‌ షోలను నిర్వహిస్తోంది. ఇతర ధనిక దేశాలు కూడా అదే యోచనలో ఉన్నాయి. చైనా దగ్గర తీసుకుంటే జరిగే నష్టాలు ఇతర కంపెనీల నుంచి తీసుకుంటే కలిగే లాభాలు ఇవి అని రాజకీయ నేతలు, నియంత్రణ అధికారులు, ప్రభుత్వాలకు వివరించేందుకు అమెరికా యంత్రాంగం పుస్తకాల పంపిణీ, సమావేశాలను నిర్వహిస్తున్నదని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక రాసింది. చైనా హువెయి, జట్‌టిఇ తదితర కంపెనీల పరికరాలను కొనవద్దని గతంలో బెదిరించిన అమెరికా ఇప్పుడు ప్రలోభాలు, బుజ్జగింపులకు దిగింది. చైనా పరికరాల్లో ఆయా దేశాల సమాచారాన్ని తస్కరించే దొంగ చెవులు ఉన్నాయని ఇతర దేశాలను భయపెడుతోంది.


బ్రిటన్‌లో జూన్‌ 11-13వ తేదీలలో జరిగిన 47వ జి7 సమావేశాలు బి3డబ్ల్యు పధకాన్ని అమలు జరపాలని నిర్ణయించాయి. ఇది చైనా అమలు చేస్తున్న బెల్ట్‌ మరియు రోడ్‌ చొరవ (బిఆర్‌ఐ) పధకానికి పోటీగా అని చెప్పారు గనుక ప్రపంచం మరింత పురోగమిస్తుందని అందరూ భావించారు. వివరాలు ఇంకా వెల్లడిగాకున్నా కానీ దాని తీరు చూస్తే చైనా చొరవను నీరుగార్చే వ్యవహారంగా కనిపిస్తోంది. జి7 దేశాలు ప్రపంచాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాయి. దానిలో భాగంగా చైనా,రష్యా,బ్రెజిల్‌, మన దేశాన్ని పక్కన పెట్టాయి. వాటి భాషలో ఈ విషయాన్ని అంత సూటిగా చెప్పవు. ఆ సమావేశం విడుదల చేసిన ప్రకటనలో ఒక్క చైనా మీద మాత్రమే దాడి చేశారు. అక్కడ మానవహక్కులు లేవని, కరోనా మూలాలు అక్కడే, పర్యావరణాన్ని దెబ్బతీస్తోందంటూ దాడి సాగింది. అందరం కలసి కట్టుగా చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని సూటిగానే చెప్పాయి. జి7 దేశాలు మన సహజ భాగస్వాములని మన ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు గనుక మనకూ ” ఆ మహత్తర కార్యక్రమం ” లో ఏదో ఒక పాత్ర ఉంటుందన్నది స్పష్టం.


మధ్య, తూర్పు ఐరోపా దేశాలు గనుక చైనా బదులు ఇతర దేశాల టెలికాం పరికరాలు కొనుగోలు చేస్తే ఆర్ధిక సాయం చేసేందుకు వీలు కల్పించే బిల్లును మే నెలలో అమెరికా పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మీరు గనుక చైనా హువెయి పరికరాలను కొనుగోలు చేస్తే మిత్ర దేశాలైనప్పటికీ మా గూఢచారులు సేకరించిన సమాచారాన్ని అందచేయబోమని అమెరికా ఇతర దేశాలను బెదిరించింది. అయితే అది పని చేయకపోవటంతో బుజ్జగింపులకు పూనుకుంది, ఇప్పుడు ప్రలోభాలకూ పాల్పడుతోంది. అమెరికా వత్తిడికి లొంగిన జర్మనీ చాలా కాలం పాటు చైనా పరికరాలను తీసుకొనేందుకు ముందుకు రాలేదు. అయితే హువెయికి పోటీ కంపెనీలైన ఎరిక్స్‌న్‌, ఏబి, నోకియాలు అందచేసే పరికరాల ధర చాలా ఎక్కువగా ఉండటంతో అనేక దేశాలు ఎటూ మొగ్గకుండా తటపటాయిస్తున్నాయి. దీంతో అలాంటి దేశాల దగ్గర తగినంత సొమ్ము లేకపోతే అప్పులిస్తామంటూ అమెరికా ముందుకు వస్తోంది. అమెరికా చట్టాలు అభివృద్ది చెందుతున్న దేశాలకు రుణాలు ఇవ్వటానికి అంగీకరించవు, అయినప్పటికీ మినహాయింపు సవరణలు చేసి 50 కోట్ల డాలర్ల మేరకు రుణాలు ఇచ్చేందుకు సిద్దం చేశారు. అయితే హంగరీ, సెర్బియా వంటి దేశాలు చైనా కంపెనీ కేంద్రాలను తెరిచేందుకు అనుమతించాయి.


అమెరికా వత్తిళ్లను ఖాతరు చేయని జర్మనీ రెండు సంవత్సరాల తరువాత తమకు అన్ని కంపెనీలు ఒకటే అంటూ ఏప్రిల్‌ ఆఖరులో ఒక చట్టాన్ని చేసింది. తమ భద్రతా ప్రమాణాలను పాటించిన ఏ కంపెనీ ఉత్పత్తి అయినా తమకు సమ్మతమే, రక్షణ గురించి ఎలాంటి భయం లేదని ప్రకటించింది. తమ ప్రయోజనాలను ఫణంగా పెట్టి చైనా కంపెనీలకు వ్యతిరేకంగా అమెరికా చెప్పినట్లు నడుచుకోజాలమని జర్మనీ విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించాడు. జర్మనీ-చైనా తమ ప్రయోజనాలకు అనుగుణ్యంగా సహకరించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పాడు. కొన్ని ఐరోపా దేశాలు సంయక్తంగా టెలికాం సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించుకొనేందుకు ఏర్పాటు చేసిన పధకంలో పెట్టుబడి పెట్టిన జర్మనీ దాని వలన ఫలితం లేదని గ్రహించింది.


అభివృద్దిలో పోటీ బదులు చైనా నియంత్రణపై కేంద్రీకరించాలట !


ప్రపంచ సాంకేతిక పరిజ్ఞాన పరుగులో చైనాను నిరోధించేందుకు చతుష్టయ దేశాలు (అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌) ఉమ్మడిగా పని చేయాలని ముంబైలోని గేట్‌వే హౌస్‌ ఎకానమీ మరియు టెక్నాలజీ కార్యాచరణ సంస్ధ ప్రతినిధులు లిసా కర్టిస్‌, సూర్జిత్‌భల్లా సలహా ఇచ్చారు. చైనా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, కొన్ని ముఖ్యమైన ఖనిజ సంపదతో ప్రపంచ సరఫరా వ్యవస్ధలను నియంత్రించాలని చూస్తోందన్నది వారి ఆరోపణ. దానికి పోటీగా ఆర్ధిక, సాంకేతిక రంగాలలో నాలుగు దేశాలు, సహరించుకొని ఇతర దేశాలను కలుపుకోవాలని సలహా ఇస్తున్నారు. 5జి గురించి రెండు దేశాలూ సహకరించుకోవాలని డోనాల్డ్‌ట్రంప్‌-నరేంద్రమోడీ ఇద్దరూ గతంలో కబుర్లు చెప్పినా అడుగు గడపదాటలేదు. అసలు చతుష్టయ దేశాల దగ్గర ఆ పరిజ్ఞానమే లేదు, మరోవైపు చైనా ఆరవ తరం పరిజ్ఞానం గురించి ఆలోచనలు చేస్తున్నది. కీలకమైన సెమికండక్టర్ల రంగంలో అమెరికా వెనుకబడింది. మన దేశంలో సాంకేతిక నిపుణులు ఉన్నప్పటికీ వారికి పని లేదు, పెట్టుబడి పెట్టేవారూ లేరు. మన మేథావులు అమెరికా వెళితే వారికి వ్యక్తిగతంగా, అమెరికాకు లాభం తప్ప మనకు ప్రయోజనం లేదని గతం స్పష్టం చేసింది. మన వారిని ఆకర్షించటం తప్ప ముందే చెప్పుకున్నట్లు ఉమ్మడి పరిశోధనలకు అమెరికా వైపు నుంచి ఎలాంటి చొరవ లేదు. చైనా మాదిరి పరిశోధన-అభివృద్దికి కేటాయింపుల్లో మనం చాలా వెనుకబడి ఉన్నాము.

వివిధ రంగాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు.అయినప్పటికీ చైనా కంటే ఎంతో వెనుకబడే ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఎనిమిది సంవత్సరాలలో ఉపాధి కల్పనకు వివిధ రంగాలలో 2.25లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేయనున్నట్లు బైడెన్‌ ప్రకటించారు. ఇది ఏడాదికి 280 కోట్ల డాలర్లు. అయితే ఈ ఏడాది చైనా ప్రభుత్వం, స్ధానిక సంస్ధల ద్వారా 556 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తున్నారు. రానున్న సంవత్సరాలలో ఇదే ధోరణి కొనసాగినా అమెరికా కంటే ఎంతో ముందుంటుంది.పరిశోధన-అభివృద్ధికి గాను 180 బిలయన్‌ డాలర్లని అమెరికా పేర్కొన్నది, అయితే ఇవి ఏమూలకన్నది ప్రశ్న. అయితే అమెరికా ఎంతో అభివృద్ధి చెందిన దేశం. ఇప్పటికే మౌలిక సదుపాయాలు గణనీయంగా అభివృద్ధి చెందాయి, వాటికి పెద్ద ఎత్తున మరమ్మతులు తప్ప కొత్తగా ఏర్పాటు చేయాల్సినవి పెద్దగా ఉండవు. కనుక సహజంగానే చైనాలో ఏడాది కేడాది పెరుగుదల ఉంటుంది. అయితే మరి చైనా ప్రత్యేకత ఏమిటి అంటే గతేడాదినాటికి అక్కడ 38వేల కిలోమీటర్ల హై స్పీడు రైలు మార్గాలు ఉన్నాయి. ఇతర దేశాలతో పోల్చితే మూడవ వంతు ఖర్చుతో అక్కడ నిర్మిస్తున్నట్లు 2019లో ప్రపంచబ్యాంకు చెప్పింది.ఈ వ్యవస్ధ రవాణా ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది. అమెరికాతో పోల్చితే తలసరి ఉత్పత్తిలో చైనాలో ఆరోవంతు మాత్రమే ఉంది, అందువలన దాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. అందుకోసం పరిశోధన-అభివృద్ధికి చైనా పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది.

చైనా వద్దు గానీ లాభాలు మాత్రం ముద్దు !


చైనా విషయంలో అమెరికాతో జతకట్టిన ఐరోపా ధనిక దేశాలన్నీ ఒకటే. చైనా వద్దుగానీ దాని ద్వారా వచ్చే లాభాలు మాత్రం ముద్దు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇటలీలోని బార్సిలోనాలో జరిగిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ సమావేశంలో ఇది వెల్లడైంది. ఫ్రాన్స్‌లో అతి పెద్ద టెలికాం కంపెనీ పేరు ఆరెంజ్‌. చైనా పరికరాలను తమ దేశంలో వినియోగించవద్దని నిర్ణయించాం గానీ ఆఫ్రికాలో మాతో సంబంధాలున్న కంపెనీల్లో వాటిని వినియోగించటానికి సిద్దమే అని కంపెనీ స్టీఫెన్‌ రిచర్డ్‌ రాయిటర్‌ వార్తా సంస్దతో చెప్పాడు. ఆఫ్రికాలో యూరోపియన్లు పెట్టుబడులు పెట్టేందుకు విముఖంగా ఉన్నారు, చైనీయులు పెడుతున్నారు అని చెప్పాడు. ఆ ఖండంలోని అనేక దేశాల టెలికాం ఆపరేటర్లు చైనా పరికరాల మీద ఆధారపడుతున్నారు.అందువలన మేము చైనా కంపెనీలతో మంచి సంబంధాలను కలిగి ఉన్నామని దాపరికం లేకుండా చెప్పాడు. ఐరోపాలో ఇప్పుడు చైనా కంపెనీలతో కలసి 5జి నెట్‌వర్క్‌లను అభివృద్ది చేయటం ఎంతో కష్టం అన్నది వాస్తవం అన్నాడు. ఆరెంజ్‌ కంపెనీలో ఫ్రెంచి ప్రభుత్వానికి 23శాతం భాగస్వామ్యం ఉంది.


5జి గురించి ధనిక దేశాలు ఎందుకు ఇంతగా చైనాను దెబ్బతీయాలని చూస్తున్నాయి ? దీనిలో రాజకీయంంతో పాటు ఆర్ధికం కూడా ఇమిడి ఉంది. 2030 నాటికి ప్రపంచ జీడిపిలో 5జి ద్వారా 1.3లక్షల కోట్ల డాలర్ల ఆదాయం తోడవుతుందని ప్రైస్‌వాటర్‌ కూపర్‌ హౌస్‌ తాజా నివేదికలో పేర్కొన్నది.ఆరోగ్య, వినియోగదారుల, ఆర్ధికసేవలు, వస్తు తయారీ, మీడియా రంగాలలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉత్తర అమెరికా ఖండ దేశాల లబ్ది ఎక్కువగా ఉంటుంది. చైనా ఆర్ధిక వ్యవస్ధకు 220 బిలియన్‌ డాలర్లు తోడవుతాయని పేర్కొన్నది. ఎవరైనా అభివృద్ది చెందాలనుకుంటే చూసి నేర్చుకోమన్నారు తప్ప ఎదుటివారిని చూసి ఏడవమని, చెడగొట్టేందుకు ప్రయత్నించమని మన పెద్దలెవరూ చెప్పలేదు. అలాంటి వారు బాగుపడిన దాఖాలాలు కూడా లేవు. వారి శక్తుయుక్తులన్నీ తమ బాగుకోసం గాక ఇతరులను చెడొట్టేందుకు ఉపయోగిస్తే ఫలితం ఏముంటుంది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాతో ట్రంప్‌ చెలగాటం – బైడెన్‌కు ప్రాణ సంకటం !

24 Thursday Jun 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti China Propaganda, Donald trump, Joe Biden, Narendra Modi, Propaganda War, US-CHINA TRADE WAR


మన చుట్టూ జరుగుతున్నదేమిటి – 4

ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో నిత్యం అనేక కుట్ర సిద్దాంతాలు, వాటికి అనుగుణ్యంగా కట్టుకథలు-పిట్టకథలూ వెలువడుతుంటాయి. ఇది ప్రచార దాడిలో భాగం అని చాలా మందికి తెలియదు. నిజమే అని విశ్వసిస్తారు. వాస్తవం కాదని తెలిసేసరికి ఆ సమస్య ఉనికిలో ఉండదు కనుక పట్టించుకోరు. ఉదాహరణకు ఇరాక్‌ అధ్యక్షుడు సద్దామ్‌ హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసినందున తాము దాడి చేశామని అమెరికా ప్రపంచాన్ని నమ్మించింది. సద్దాంను అంతం చేసిన తరువాత అదే అమెరికా తరువాత కొన్ని సంవత్సరాల తరువాత అబ్బే అలాంటి గుట్టలేమీ దొరకలేదు అని చెప్పింది. ఎంత మంది దానిని పట్టించుకున్నారు.

గతంలో అమెరికన్లు రష్యన్లను విలన్లుగా చిత్రిస్తే ఇప్పుడు వారి బదులు చైనీయులను చేర్చారు. వారి పొడ మనకు గిట్టదు అని చెబుతుంటారు. కానీ అమెరికాలోని కాటో ఇనిస్టిట్యూట్‌ అనే ఒక మేథో సంస్ధకు చెందిన ఇద్దరు మేథావులు ఈ మధ్యే ఒక వ్యాసం రాశారు. చైనా నుంచి వలస వచ్చే వారిని అమెరికా ప్రోత్సహించాలి అని దానిలో ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్న డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా వారిని అమెరికా గడ్డమీద అడుగు పెట్టనివ్వొద్దు అన్నట్లుగా చెలరేగి పోయాడు.వారు గూఢచర్యాలకు పాల్పడుతున్నారని, విద్యా సంస్ధలలో కమ్యూనిస్టు సిద్దాంతాలను వ్యాపింపచేస్తున్నారని, అమెరికా సాంకేతిక పరిజ్ఞానాలను తస్కరిస్తున్నారని మొత్తం మీద అమెరికా భద్రతకే ముప్పు తెస్తున్నారన్నట్లుగా ప్రచారం చేయించాడు. చైనా మిలిటరీ-పౌర సంస్దలు సమ్మిళితంగా అనుసరించే వ్యూహాలతో సంబంధం ఉన్న ఎఫ్‌-1 విద్యార్ధులు, జె-1పర్యాటకులను అడుగుపెట్టనివ్వవద్దని ఆదేశాలు జారీ చేశాడు.చైనా సంస్ధల నుంచి నిధులు పొందే అమెరికన్‌ విశ్వవిద్యాలయాల మీద కూడా చర్యలు తీసుకున్నాడు. శాస్త్ర, సాంకేతిక సంస్ధలలో ప్రవేశం కోరే చైనీయుల వీసాలను ప్రత్యేకంగా తనిఖీ చేయాలన్నాడు.దాంతో ప్రతి వీసా నెలల తరబడి విచారణల్లోనే ఉండేది. కాటో సంస్ధ మేథావులు వీటన్నింటితో ఏకీ భావం కలిగిన వారే.


అయితే వారి దూరా లేదా దురాలోచనను దాచుకోలేదు.గతంలో సోవియట్‌ యూనియన్‌తో ప్రచ్చన్న యుద్దం సాగించినపుడు దాని పౌరులను ఆకర్షించటాన్ని ఒక విధానంగా అమెరికా అనుసరించింది. ఇప్పుడు దాన్ని చైనాకు ఎందుకు వర్తింప చేయకూడదన్నది వారి తర్కం. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో సోవియట్‌ యూనియన్‌ ఎర్రసైన్యం అనేక తూర్పు ఐరోపా దేశాలను హిట్లర్‌ ఆక్రమణ, దుర్మార్గాల నుంచి విముక్తి చేసింది. స్ధానిక కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీలు అధికారంలోకి వచ్చి సోషలిస్టు రాజ్యాలను నెలకొల్పటం ఒకపరిణామం. అదే సమయంలో ఆ దేశాలకు చెందిన కమ్యూనిస్టు వ్యతిరేకులు, పెట్టుబడిదారులను అమెరికాకు ఆహ్వానించి కమ్యూనిస్టు నియంతృత్వం నుంచి బయటపడిన స్వేచ్చా జీవులుగా ముద్రవేసి వారితో కట్టుకథలు చెప్పించి అమెరికన్లను, ప్రపంచాన్ని నమ్మించారు. నాటి అధ్యక్షుడు ట్రూమన్‌ అలా 80వేల మందికి ఆశ్రయం కల్పించాడు.1990లో సోవియట్‌, తూర్పు ఐరోపాలోని సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన సమయంలో కూడా అదే ఎత్తుగడను అనుసరించి వలసలను సరళతరం గావించారు.

అలా వచ్చిన లక్షలాది మంది రాజకీయ, నైతిక, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి ఎంతగానో తోడ్పడ్డారు. కమ్యూనిజం కంటే పెట్టుబడిదారీ విధానం ఎంత గొప్పదో వారి చేత చిలుకపలుకులు పలికించి ప్రపంచ కమ్యూనిస్టు వ్యతిరేకులకు వీనుల విందు చేశారు. అదే సమయంలో అమెరికాకు ఆర్ధికంగా ఎంతో ఉపయోగపడ్డారు. ఇప్పుడు చైనీయులు సాంకేతిక రంగంలో కూడా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు సవాలు విసురుతున్నారు. అందువలన అత్యంత ప్రతిభావంతులు, విద్యావంతులైన చైనీయులను అమెరికాకు రప్పించటం ఎంతో లాభదాయకం అన్నది కాటో తర్కం. అలావచ్చిన వారు గూఢచర్యానికి పాల్పడి, రహస్యాలను చైనాకు చేరవేస్తేనో అన్న ప్రశ్నకు కూడా వారే సమాధానం చెప్పారు.అలాంటి చర్యలవలన జరిగే నష్టం చాలా తక్కువ అని అంతకంటే ఎక్కువగా చైనా నుంచి వచ్చే వారు చేసే పరిశోధన, అభివృద్ధి ఎక్కువ లాభం అని బల్లలు చరిచి మరీ చెపుతున్నారు. కరోనా వైరస్‌ను ఊహాన్‌ పరిశోధనాకేంద్రంలోనే తయారు చేశారనే కథనాలు చైనా నుంచి ఫిరాయించిన ఒకరిద్దరు చెబుతున్నవే. వాటన్నింటితో ప్రపంచ మీడియా చైనా వ్యతిరేక పండగ చేసుకొంటోంది.


అయితే ఈ మేథావులు, వారిని సమర్ధించేవారు గానీ ఒక విషయాన్ని మరచి పోతున్నారు. మూడు దశాబ్దాల నాడు కూల్చి వేసిన సోవియట్‌ నాడు అమెరికాతో పోలిస్తే ఒక మిలిటరీ శక్తి తప్ప ఆర్ధిక శక్తి కాదు.ఇప్పుడు చైనా అమెరికా ఆర్ధికశక్తిని సవాలు చేసి రెండవ స్ధానం నుంచి మొదటి స్దానానికి పరుగులు తీస్తున్నది. మిలిటరీ పరంగా కూడా పటిష్టంగానే ఉంది. సోవియట్‌ నాయకత్వం సామ్రాజ్యావాదం, పెట్టుబడిదారీ విధానాల ప్రమాదాన్ని తక్కువ అంచనా వేసింది. పర్యవసానంగా జనానికి వాటి ముప్పు గురించి చైతన్యం కలిగించటంలో నిర్లక్ష్యం చేసింది. చైనా అలాంటి భ్రమల్లో లేదు. మూడు దశాబ్దాల క్రితం తూర్పు ఐరోపా రాజ్యాలను కూల్చివేసే సమయంలో సంభవించిన తియన్మెన్‌ స్క్వేర్‌ ఆందోళన వెనుక ఉన్న అంశాలను పసిగట్టి మొగ్గలోనే తుంచి వేసింది. జనాన్ని హెచ్చరించింది.ఇదే సమయంలో ప్రచ్చన్న యుద్దంలో విజయం సాధించామని చెప్పుకున్న అమెరికాలో నేడు పెట్టుబడిదారీ విధానం విఫలమైందని నమ్ముతున్న వారు రోజు రోజుకూ పెరుగుతున్నారు. సోషలిస్టు చైనా విజయాలు ఎలా సాధ్యం అవుతున్నాయనే ఆలోచన కలుగుతోంది.

అమెరికా ఇప్పటికీ బలమైన, ప్రమాదకర దేశమే అయినప్పటికీ దాని సమస్యలు దానికి ఉన్నాయి. అందుకే ఎక్కడన్నా బావేగానీ వంగతోట దగ్గర కాదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం మీద పట్టుకోసం అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌తో చతుష్టయం (క్వాడ్‌) పేరుతో జట్టుకడుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఫసిఫిక్‌ ప్రాంత భాగస్వామ్య కోసం సమగ్ర మరియు పురోగామి ఒప్పందం (సిపిటిపిపి) ఒప్పందంపై సంతకం చేసేందుకు అమెరికా సిద్దం కావటం లేదు. అది లేకుండా మిగతా దేశాలు చేసేదేమీ లేదు. అమెరికాలో తలెత్తిన ఆర్ధిక సమస్యల కారణంగా స్వంతగడ్డమీద పెట్టుబడులను ప్రోత్సహించాలని బైడెన్‌ సర్కార్‌ భావిస్తోంది. గడచిన నాలుగు సంవత్సరాలలో చైనాతో వాణిజ్యలోటు తగ్గింపులక్ష్యంతో దేశ భద్రత పేరుతో చైనా నుంచి వచ్చే ఉక్కు, అల్యూమినియం తదితర వస్తువుల మీద డోనాల్డ్‌ ట్రంప్‌ దిగుమతి సుంకాల పెంపు అమెరికన్ల మీదనే భారం మోపాయి. పనిలో పనిగా జపాన్‌, ఐరోపా మిత్ర దేశాల మీద కూడా అదేపని చేశాడు. ఈ పన్నులను ఎత్తివేయాలని చైనా కంటే అమెరికా వాణిజ్యవేత్తలే ఇప్పుడు బైడెన్‌ మీద ఎక్కువ వత్తిడి తెస్తున్నారు.


చైనాతో పోరు సంగతి తరువాత, అమెరికా వెలుపలి నుంచి వచ్చే వస్తువుల మీద దిగుమతి పన్నుల విధింపు కారణంగా తాము మార్కెట్లో పోటీ పడలేకున్నామని అందువలన వాటిని ఎత్తివేయాలని మూడువందల సంస్దలు బైడెన్‌కు విజ్ఞప్తి చేశాయి. అమెరికన్ల కొనుగోలు శక్తి పెంచేందుకు ఆరులక్షల కోట్ల డాలర్లతో అనేక పధకాలను అమలు జరిపేందుకు ఆమోదం తెలపాలని బైడెన్‌ పార్లమెంట్‌ను కోరారు. దీని వలన తమ మీద పడే ప్రభావం, పర్యవసానాలు ఏమిటని జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. అమెరికన్లు ఎంత హడావుడి చేసినా ఇతర దేశాల సహకారం లేకుండా చైనాను వారేమీ చేయలేరు. అదే సమయంలో చైనీయులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకుంటున్నారు. పరిశోధన-అభివృద్ధికి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. అమెరికా, ఐరోపా పశ్చిమ దేశాల మీద ఆధారపడకుండా స్వంత గడ్డమీద జనం కొనుగోలు శక్తి పెంచేందుకు, ఇతర దేశాల్లో మార్కెట్‌ను పెంచుకొనేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు ప్రారంభించారు.దానిలో భాగమే బెల్ట్‌ మరియు రోడ్‌ (బిఆర్‌ఐ) పధకాలు. రాజకీయంగా తమకు వ్యతిరేకంగా జట్టుకట్టిన ఆస్ట్రేలియాకు చైనా చుక్కలు చూపిస్తోంది.గతంలో ఏటా 50 కోట్ల డాలర్ల విలువగల పీతలు ఆస్ట్రేలియా ఎగుమతి చేసేది. అమెరికాతో జతకట్టి బస్తీమే సవాల్‌ అనగానే ఆ పీతల దిగుమతులను చైనా నిషేధించింది. ఇలాంటి అనేక చర్యలు తీసుకోవటంతో ఆస్ట్రేలియన్‌ వ్యాపారులు లబోదిబోమంటున్నారు. అమెరికా అండచూసుకొని చైనా వస్తువులను బహిష్కరించాలంటూ కొండంత రాగం తీసి హడావుడి చేసిన మన పాలకులు తిరిగి చైనా వస్తువుల దిగుమతులను పెంచారు.


మన దేశంలో చైనా అంటే అభిమానం లేని వారు కూడా దానితో వైరం తెచ్చుకొని సాధించేదేమిటి అన్న ప్రశ్నను ఇప్పుడు ముందుకు తెస్తున్నారు. మనతో సహా అమెరికా నాయకత్వంలోని దేశాలు చైనాను ఒంటరి పాటు చేయాలని చూస్తున్నాయి. చైనాను దెబ్బతీయటం అంటే తమను తాము నాశనం చేసుకోవటం అనే అంశాన్ని అవి మరచిపోతున్నాయి. నూటనలభై కోట్ల మంది జనాభా ఉన్న చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా ఉండటమే కాదు, వినియోగ మార్కెట్‌ అని మరచి పోరాదు. ఎవరి సంగతి వారు చూసుకుంటున్న ఈ తరుణంలో చైనాతో ఆసియన్‌ దేశాల కూటమి వాణిజ్యం 732 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.అమెరికా, ఐరోపాయూనియన్‌, జపాన్‌ వంటి దేశాలు చైనాతో జరుపుతున్న ఎగుమతి దిగుమతుల విలువ 1,600 బిలియన్‌ డాలర్లు. చైనా ప్రారంభించిన బిఆర్‌ఐ పధకానికి చైనా ప్రభుత్వం లక్ష కోట్ల డాలర్లను సమకూర్చగలదని వార్తలు వచ్చాయి. తానే స్వయంగా వాగ్దానం చేసినట్లుగా జనానికి వాక్సిన్లు వేయించకుండా భారాన్ని రాష్ట్రాల మీద నెట్టేందుకు ప్రయత్నించిన మన కేంద్ర ప్రభుత్వం నుంచి అంత మొత్తంలో విదేశాల్లో పెట్టుబడులను పెడుతుందని ఎవరైనా ఆశించగలరా ? దానితో పోటీగా మనమూ తయారైతే తప్ప కమ్యూనిస్టు వ్యతిరేకత పేరుతో అవి మనతో కలసి వస్తాయా ? మనలను నమ్ముకొని మిగతా దేశాలు చైనాకు వ్యతిరేకంగా జట్టుకడతాయా ?

పగలంతా ఎక్కడెక్కడో తిరిగిన సన్యాసులు రాత్రికి మఠానికి చేరి గంజాయి దమ్ము కొట్టి తెల్లవారిన తరువాత అది చేయాలి ఇది చేయాలని ప్రగల్భాలు పలికి తెల్లవారేసరికి మత్తు దిగి ఎవరి కర్రా బుర్రా వారు తీసుకొని ఎవరిదారిన వారు పోయినట్లు ఇప్పటికి 47 సార్లు జి7 దేశాల సమావేశాల కబుర్లున్నాయి తప్ప ఎవరికైనా విశ్వాసం కలిగించాయా ? గాల్వన్‌ లోయ ఉదంతాల సమయంలో మన ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశంలో చెప్పిందేమిటి ? చైనీయులు మన సరిహద్దుల్లోకి చొరబడిందీ లేదు, మన పోస్టులను తమతో తీసుకుపోయిందీ లేదు అన్నారు. అలాంటపుడు చైనాతో ఏ సమస్య మీద పోరాడుతారు ? చతుష్టయం పేరుతో శతృత్వం పెంచుకోవటం తప్ప సాధించేదేమిటి ? మనకంటే ఎంతో బలమైన చైనా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించగలిగిన ఆర్ధిక వనరులను కలిగి ఉంది. మన పరిస్ధితి ఏమిటి ? కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టటం ఎందుకు ? దాన్ని సంతుష్టీకరించేందుకు చైనాతో వైరం ఎందుకు, సైన్య మోహరింపు ఎవరికోసం, ఆ ఖర్చును జనం మీద మోపటం ఎందుకు ? గతంలో సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలతో పోరాడి అక్కడి వ్యవస్ధలను కూల్చివేసిన అమెరికా కొన్ని దేశాల మార్కెట్లను ఆక్రమించుకుంది. అయినా దాని ఆర్ధిక సమస్యలు తీరలేదు. 2008లో దానితో సహా తూర్పు ఐరోపాను పంచుకున్న ధనికదేశాలన్నీ ఆర్ధిక సంక్షోభానికి గురయ్యాయి. ఇప్పుడు చతుష్టయం పేరుతో చైనాను ఢకొీని దాని మార్కెట్‌ను ఆక్రమించుకోవటం సాధ్యమయ్యేనా. ఒకవేళ జరిగినా ఆమెరికా మిగతాదేశాలకు వాటా ఇస్తుందా ? ఎవరిపని వారు చేసుకోకుండా మనకెందుకీ ఆయాసం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనాను మించి భయపెడుతున్న చమురు – అచ్చేదిన్‌ కాదు జనం చచ్చే రోజులు !

23 Wednesday Jun 2021

Posted by raomk in Current Affairs, Economics, History, International, INTERNATIONAL NEWS, Opinion, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

$100 Oil Predictions Soar, crude oil price, world oil prices



ఎం కోటేశ్వరరావు
కొంత అతిశయోక్తిగానే ఉండవచ్చు గానీ అంతర్జాతీయ చమురు మార్కెట్లో పెరుగుతున్న ధరల తీరు తెన్నులను చూస్తే మన జనాలను కరోనా కంటే చమురు ధరలే ఎక్కువగా భయపెట్టేట్లు ఉన్నాయి. బుధవారం నాడు ఇది రాస్తున్న సమయానికి బ్రెంట్‌ రకం చమురు ధర 75.30 డాలర్లుగా ఉంది. ఇరాన్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమెరికాతో కరాఖండిగా వ్యవహరించే ఇబ్రహీం రైసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు గనుక అని ఒక కారణం చెప్పారు. అమెరికా ఇతర దేశాలు ఇరాన్‌తో జరుపుతున్న అణు చర్చలలో ప్రతిష్ఠంభన ఏర్పడవచ్చని చెబుతున్నారు. అమెరికాలో చమురు నిల్వలు తగ్గిపోవటం, ఒపెక్‌ దేశాలు ఉత్పత్తిని పెంచుతాయో లేదో తెలియని పరిస్ధితి కూడా ఇతర కారణాల్లో ఉన్నాయి. కరోనా తగ్గిపోయి క్రమంగా సాధారణ పరిస్ధితి ఏర్పడితే ఈ ఏడాది ఆఖరుకు లేదా వచ్చే ఏడాది ముడిచమురు పీపా ధర వంద డాలర్ల వరకు పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ఇదే సమయంలో అమెరికాలో షేల్‌ అయిల్‌ ఉత్పత్తి పెరిగితే డిమాండ్‌ తగ్గి ధరలు అదుపులో ఉండటం లేదా కొంత మేరకు తగ్గవచ్చని జోశ్యాలు చెప్పిన వారు పునరాలోచనలో పడ్డారు. దీనితో పాటు ఇరాన్‌కు కొత్త అధ్యక్షుడు వస్తే అమెరికాతో అణు ఒప్పందం కుదిరి ఆంక్షలు ఎత్తివేస్తే సరఫరా పెరుగుతుందని ఆశించిన వారంతా అలాంటి అవకాశాలు లేవని భావించటంతో ధరలు భగ్గుమన్నాయి.
అమెరికన్‌ పెట్రోలియం ఇనిస్టిట్యూట్‌(ఏపిఐ) మంగళవారం నాడు వెల్లడించిన సమాచారం ప్రకారం జూన్‌ 18వ తేదీతో ముగిసిన వారంలో చమురు నిల్వలు 7.199 మిలియన్‌ పీపాలకు తగ్గాయి. అంతకు ముందు వారంలో 8.537 మిలియన్‌ పీపాలు ఉన్నాయి. గతేడాది జనవరితో పోల్చితే ఎక్కువే ఉన్నప్పటికీ ఈ ఏడాది జనవరితో పోల్చితే తగ్గాయి.ఇది కూడా ధరల పెరుగుదల మీద ప్రభావం చూపింది. ఊహించినదానికంటే ముందుగానే వంద డాలర్లకు పెరుగుతుందా ? వచ్చే నెలలో ఒపెక్‌+దేశాల అదనపు ఉత్పత్తి మార్కెట్‌కు వచ్చినా ధరలు తగ్గకపోవచ్చన్నది కొందరి అభిప్రాయం.
ద్రవ్యోల్బణం, చమురు గిరాకీ పెరుగుదల, చమురు కంపెనీల వాటాదార్ల వత్తిడి, పర్యావరణం వంటి కారణాలతో రానున్న మూడు సంవత్సరాలలో ధరల పెరుగుదలతో పాటు చమురు సంక్షోభం తలెత్తవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. కొన్ని దేశాల్లో విద్యుత్‌ వాహనాల తయారీ మీద కేంద్రీకరణ, అమెరికా వంటి దేశాలలో పునరుత్పాదక ఇంథనాలకు ప్రోత్సాహం వంటి కారణాలతో చమురు ఉత్పత్తి తగ్గిపోయి ధరలు పెరగవచ్చన్నది విశ్లేషణల సారాంశం. ఈ పరిణామాలు, పర్యవసానాలకు సిద్దం గాని మనవంటి దేశాల మీద తీవ్ర ప్రతికూల ప్రభావం పడవచ్చు. అది పాలకుల మీద వత్తిడికి దారి తీసి రాజకీయ పర్యవసానాలు ముందుకు వచ్చే అవకాశం ఉంది.
రానున్న ఆరునెలల్లో ముడి చమురు ధర వంద డాలర్లకు పెరగవచ్చన్నది ఒక అంచనా అయితే రానున్న సంవత్సరాలలో 130 డాలర్లకు పెరగవచ్చని చెబుతున్నారు. కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చిన తరువాత పరిణామాలు ఎలా ఉండేది చెప్పలేని స్ధితి. చమురు మార్కెట్‌ను కృత్రిమంగా అదుపు చేస్తున్నారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ కారణంగానే గతంలో పడిపోయిన 35 డాలర్ల నుంచి 130 డాలర్లకు పెరగవచ్చు లేదా తిరిగి 35 డాలర్లకు దిగిరావచ్చన్నది కొందరి తర్కం. గిరాకీకి అనుగుణంగా ఉత్పత్తి పెరగాలి, అది జరగాలంటే ఆ రంగంలో పెట్టుబడులు కావాలి. కరోనా కారణంగా తలెత్తిన అనిశ్చితి వలన ఎవరూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం లేదు. ఇది చమురు కొరతకు దారి తీయవచ్చు. పర్యావరణ సమస్యల కారణంగా అనేక కంపెనీలు ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. చమురు, గ్యాస్‌ ఉత్పత్తిని తగ్గించాలని డచ్‌ కోర్టు షెల్‌ కంపెనీని ఆదేశించింది. మరోవైపున అంతర్జాతీయ ఇంథన సంస్ధ కొత్తగా నిక్షేపాల అన్వేషణలను నిలిపివేయాలని కోరింది.
అమెరికాలో షేల్‌ చమురు ఉత్పత్తి పరిమితంగా ఉన్నందున, తిరిగి పెరిగినా మార్కెట్‌ పడిపోయే అవకాశం లేదని ఒపెక్‌ దేశాలు భావిస్తున్నాయి.ఈ ఏడాది అమెరికా చమురు ఉత్పత్తి రోజుకు కేవలం రెండు లక్షల పీపాలు మాత్రమే పెరుగుతుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది పెరగవచ్చు. షేల్‌ ఆయిల్‌ ఉత్పత్తి ఖర్చు ఎక్కువగా ఉండటాన్ని ఒపెక్‌ దేశాలు గమనంలోకి తీసుకున్నాయి. గతేడాది రికార్డు స్ధాయిలో చమురు ధరలు పడిపోయినందున షేల్‌ ఉత్పత్తి దాదాపు నిలిచిపోయింది. ఆ కంపెనీలు లాభాలనే ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటాయి. ఈ సంవత్సరం అమెరికా ఉత్పత్తి రోజుకు 11.2 మిలియన్‌ పీపాలు ఉంటుందని, అది గతేడాది కంటే లక్షా 20వేల పీపాలు తక్కువని తాజా జోశ్యాలు ఉన్నాయి. అమెరికాలోని వెస్ట్‌ టక్సాస్‌ ఇంటర్‌మీడియెట్‌(డబ్ల్యుటిఐ) రకం చమురు ధర పీపాకు 60 డాలర్లకు మించితేనే అక్కడి కంపెనీలు ఉత్పత్తిని పెంచుతాయి. అయితే ప్రస్తుతం అంతకంటే ఎక్కువే ఉంది. మార్కెట్‌ స్ధిరపడింది అనుకున్న తరువాత వచ్చే ఏడాది ఉత్పత్తి పెంచవచ్చని భావిస్తున్నారు. తమ లాభాలు పెరుగుతాయనుకుంటేనే పెట్టుబడిదారులు మరింత ఉత్పత్తి చేస్తారు.
ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ను బట్టి ఆగస్టులో ముడి చమురు ఉత్పత్తి పెంచాలా వద్దా అని చమురు ఉత్పత్తి దేశాల సంస్ధ (ఒపెక్‌) చర్చలు జరుపుతోంది.వచ్చే వారంలో జరిగే సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. మార్కెట్‌లో ఉన్న లోటును పూడ్చేందుకు ఉత్పత్తి పెంచాలా అన్న అంశాన్ని రష్యా పరిశీలిస్తోంది. రెండు సంవత్సరాల తరువాత లండన్‌ మార్కెట్‌లో ముడిచమురు బ్రెంట్‌ ధర 75 డాలర్లు దాటింది. మే నుంచి జూలై మధ్య రోజుకు 20లక్షల పీపాల ఉత్పత్తి పెంచాలన్న అంశాన్ని ఒపెక్‌ దేశాలు సమీక్షిస్తున్నాయి, అయితే ఊహించినదాని కంటే ధరలు పెరగటంతో అంతకంటే ఎక్కువే పెంచాలనే వత్తిడి వస్తోంది. గిరాకీ ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉంటేనే నిలిపివేసిన ఉత్పత్తిని పునరుద్దరించటం గురించి పరిశీలిస్తామని ఒపెక్‌ దేశాల నేతగా ఉన్న సౌదీ అరేబియా చమురు మంత్రి అబ్దుల్‌ అజీజ్‌ బిన్‌ సల్మాన్‌ చెప్పారు. ప్రస్తుతం రోజుకు 30లక్షల పీపాల కొరత ఉన్నట్లు గోల్డ్‌మన్‌ సాచ్స్‌ అంచనా వేసింది. ఒపెక్‌+దేశాలు రోజుకు 58లక్షల పీపాలు ఉత్పత్తి చేస్తున్నాయి. సౌదీతో రోజువారీ ఫోన్లో మాట్లాడుతున్న రష్యా తక్షణమే ప్రత్యక్షంగా కూర్చుని చర్చించాల్సిన పరిస్ధితి లేదని భావిస్తోంది.
అమెరికాలో చమురు నిల్వల గురించి వస్తున్న వార్తల కారణంగా ముందస్తు చమురు మార్కెట్‌లో ధరలు పెరుగుతున్నాయి. సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబరులో సరఫరా చేయాల్సిన డబ్య్లుటిఐ చమురు ధర పీపాకు 1.2 డాలర్లు పెరిగింది. గత పద మూడు సంవత్సరాలలో రెండు నెలల మధ్య ఒక డాలరుకు మించిన వ్యత్యాసం కేవలం రెండు సార్లు (2008, 2014)మాత్రమే జరిగింది. ఏడాది క్రితం కొనుగోలు చేసిన చమురును ఎక్కడ నిల్వచేసుకోవాలో తెలియక ఒప్పందం ప్రకారం చమురు సరఫరాను స్వీకరించలేని కంపెనీలు ఎగుమతిదార్లకు ఎదురు డాలర్లు ఇచ్చి నష్టాలను తగ్గించుకున్నాయి.ఇప్పుడు చమురుశుద్ది కర్మాగారాలు అమెరికాలో పూర్తి స్దాయిలో పని చేస్తుండటంతో ఆ నిల్వలన్నీ ఖాళీ అవుతున్న కారణంగా చమురు నిల్వ టాంకులు అద్దెకు ఇవ్వబడును అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. జూన్‌ తరువాత ఒపెక్‌ దేశాలు ఉత్పత్తిని పెంచనట్లయితే చమురు కొరత ఏర్పడుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్ధ హెచ్చరించింది.
ప్రపంచ చమురు నిల్వల్లో 2012 అంచనా ప్రకారం ఐదో వంతు (296.5 బిలియన్‌ పీపాలు) నిర్దారిత చమురు కలిగి ఉంది వెనెజులా. మార్కెట్లో ధరలు పెరిగిన కారణంగా అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున చమురు ఉత్పత్తిని పెంచనున్నది. గతేడాది చమురు ధరలు భారీగా పతనమైనందున రోజుకు నాలుగు లక్షల పీపాలకు ఉత్పత్తి తగ్గిపోయింది. ఇప్పుడు ఏడులక్షలు జరుగుతోందని చమురుశాఖ మంత్రి ఎల్‌ ఇసామీ వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి పదిహేను లక్షల పీపాలకు పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అయితే అమెరికా ఆంక్షలు కొనసాగుతున్నందున ఉత్పత్తి చేసినప్పటికీ కొనుగోలుదార్లు ముందుకు రాకపోతే ప్రయోజనం లేదు. అందువలన ఆంక్షల గురించి జో బైడెన్‌ సర్కార్‌తో చర్చలు జరుపుతున్నట్లు వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో చెప్పాడు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిస్తేనే చర్చలు, ఆంక్షల తొలగింపు అని అమెరికా అంటోంది. మన దేశంలోని రిలయన్స్‌ చమురు కంపెనీ కోసం గతంలో సెనెటర్‌గా బైడెన్‌ ఉన్నపుడు సహాయకుడిగా పని చేసిన భారతీయ లాబీయిస్టు అంకిత్‌ దేశారు ఇప్పుడు బైడెన్‌ యంత్రాంగంతో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. రిలయన్స్‌ చమురు శుద్ది కర్మాగారానికి పని కావాలంటే ముడి చమురు కావాలి. వెనెజులా వద్ద చమురు ఉన్నప్పటికీ డీజిల్‌ తయారీకి అవసరమైన శుద్ది కర్మాగారాలు లేవు. వెనెజులా నుంచి చమురు దిగుమతి చేసుకొని డీజిల్‌ను తయారు చేసి తిరిగి ఎగుమతి చేసే అవకాశం ఉన్నందున ఏదో ఒక రూపంలో ఆంక్షలను సడలించి రిలయన్స్‌ కంపెనీకి తోడ్పడాలని అంకిత్‌ దేశారు రాయబారాలు జరుపుతున్నారు. అంబానీలతో నరేంద్రమోడీకి విడదీయరాని సంబంధాలు ఉన్నందున ఆయన కూడా జోక్యం చేసుకోవచ్చు. అయితే తమ కంపెనీ అమెజాన్‌కు మోడీ మొండి చేయి చూపుతున్నందున బైడెన్‌ యంత్రాంగం ఏమేరకు దిగి వస్తుందో తెలియదు. అమెజాన్‌-రిలయన్స్‌ రాజీపడితే…..ఏమో ఏదైనా జరగవచ్చు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మన చుట్టూ జరుగుతున్నదేమిటి – 2 ఇతరుల భుజాల మీద తుపాకితో చైనాను కాల్చాలని చూస్తున్న అమెరికా – జి7 47వ శిఖరాగ్ర సభ, !

14 Monday Jun 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

47th G7 Summit, China, G7, G7-India, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


ఏడు ధనిక దేశాల (జి7) బృంద 47వ వార్షిక సమావేశం జూన్‌ 11-13 తేదీలలో బ్రిటన్‌లోని ఇంగ్లండ్‌ సముద్రతీరంలోని కారన్‌వాల్‌లో జరిగింది. ఈ సమావేశానికి భారత్‌,ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికాను ఆహ్వానించారు. ప్రతి ఏటా చేస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా అనేక అంశాల మీద తీర్మానాలు చేశారు, సంకల్పాలు చెప్పుకున్నారు. హడావుడి చేశారు. చైనా మీద జబ్బ చరచటం ఈ సమావేశాల ప్రత్యేకత. జి7కు భారత్‌ సహజ మిత్రదేశమని మన ప్రధాని నరేంద్రమోడీ అంతర్జాలంద్వారా చేసిన ప్రసంగంలో చెప్పటం ద్వారా తామెటు ఉన్నదీ మరోసారి స్పష్టం చేశారు.


రెండవ ప్రపంచ యుద్దం తరువాత ధనిక దేశాల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన బ్రెట్టన్‌ ఉడ్‌ కవలలు( ప్రపంచ బ్యాంక్‌, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్ధ) తమ ప్రయోజనాలను సక్రమంగా నెరవేర్చటం లేదనే అసంతృప్తి వాటిని ఏర్పాటు చేసిన దేశాల్లోనే తలెత్తింది. దాంతో వాటిని కొనసాగిస్తూనే తమ ప్రయత్నాలు తాము చేయాలనే లక్ష్యంతో 1973లో అమెరికా చొరవతో సన్నాహక సమావేశం జరిగింది. దానిలో అమెరికా, పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ ఆర్ధిక మంత్రులు పాల్గొన్నారు.మీకు అభ్యంతరం లేకపోతే జపాన్ను కూడా కలుపుకుందాం అన్న అమెరికా ప్రతిపాదనకు మిగతా దేశాలు అంగీకరించటంతో జి5గా ప్రారంభమైంది.1975లో తొలిశిఖరాగ్ర సమావేశానికి ఇటలీని కూడా ఆహ్వానించారు.మరుసటి ఏడాది సమావేశంలో బృందంలో ఆంగ్లం మాట్లాడేవారు మరొకరు ఉంటే బాగుంటుందంటూ కెనడాను కూడా ఆహ్వానించాలని అమెరికా ప్రతిపాదించటంతో 1976 నాటికి జి7గా మారింది. ఈ బృంద సమావేశాలకు ఐరోపా యూనియన్ను శాశ్వత ఆహ్వానితురాలిగా నిర్ణయించారు. సోవియట్‌ యూనియన్ను కూల్చివేసిన తరువాత 1997లో రష్యాను జి7లోకి ఆహ్వానించి, జి8గా మార్చారు. 2014వరకు సభ్యురాలిగా కొనసాగింది. ఉక్రెయిన్‌లోని క్రిమియా ప్రాంతాన్ని ఆక్రమించటంతో అదే ఏడాది దాన్ని సస్పెండ్‌ చేశారు. 2018లో ఈ బృందం నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా ప్రకటించింది. అయితే 2020లో అమెరికా, ఇటలీ రెండు దేశాలూ తిరిగి రష్యాను చేర్చుకోవాలని చేసిన ప్రతిపాదనను మిగిలిన దేశాలు తిరస్కరించాయి. తమకసలు చేరాలనే ఆసక్తి లేదని రష్యా చెప్పేసింది. ఏ దేశంలో సమావేశం జరిగితే ఆ దేశం ఎవరిని కోరుకుంటే వారిని ఆహ్వానితులుగా పిలుస్తారు. మన దేశం పెద్ద మార్కెట్‌ గనుక ప్రతి దేశమూ ప్రతిసారీ మనలను ఆహ్వానిస్తున్నది.


జి7 మౌలికంగా సామ్రాజ్యవాద దేశాల కూటమి. వలసలుగా చేసుకోవటం ఇంకేమాత్రం కుదిరే అవకాశం లేకపోవటంతో రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఈ కూటమి దేశాలన్నీ రాజీకి వచ్చి దేశాలకు బదులు మార్కెట్‌ను పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. వాటి మధ్య విబేధాలున్నప్పటికీ తాత్కాలికంగా పక్కన పెట్టాయి. అయితే రష్యా పెట్టుబడిదారీ వ్యవస్ధకు మారి రంగంలోకి వచ్చిన తరువాత అది కూడా తన వాటా సంగతేమిటని డిమాండ్‌ చేసింది. ద్వితీయ శ్రేణి పాత్ర పోషించేందుకు సిద్దం కాదని ప్రధమ స్ధానంలో ఉండాలని కోరింది కనుకనే జి7 మొత్తంగా దాని మీద దాడికి దిగాయి. దాన్నుంచి తట్టుకొనేందుకు వర్గరీత్యా ఒకటి కాకున్నా ప్రస్తుతానికైతే చైనాతో కలసి ఎదిరించాలని రష్యా నిర్ణయించుకుంది. ఈ కూటమి దేశాలు మన దేశాన్ని కూడా వినియోగించుకోవాలని చూస్తున్నాయి తప్ప తమ భాగస్వామిగా చేసుకొనేందుకు సిద్దం కావటం లేదు. బ్రెజిల్‌ పరిస్ధితీ అదే.

జి7 47వ సమావేశం ఆమోదించిన అంశాలను క్లుప్తంగా చూద్దాం. వీటిలో రెండు రకాలు, ఒకటి రాజకీయ పరమైనవి, రెండవది ఆర్ధిక, ఇతర అంశాలు. మొదటిదాని సారం ఏమంటే అన్ని దేశాలు కలసి చైనా మెడలు వంచాలి, కాళ్లదగ్గరకు తెచ్చుకోవాలి. గ్జిన్‌ జియాంగ్‌, హాంకాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్లు, తైవాన్ను బెదిరిస్తున్నట్లు ప్రచారం చేయాలి, వత్తిడి తేవాలి. అర్ధిక అంశాలలో తప్పుడు పద్దతులకు పాల్పడుతున్నని ఊదరగొట్టాలి. రెండవ తరగతిలో కంపెనీలు పన్ను ఎగ్గొట్టేందుకు పన్నుల స్వర్గాలుగా ఉన్న ప్రాంతాలకు తరలిపోతున్నందున కార్పొరేట్‌ పన్ను కనీసంగా 15శాతం విధించాలని పేర్కొన్నాయి. పేద దేశాలకు వందకోట్ల డోసుల కరోనా వాక్సిన్‌ అందించాలి. అభివృద్ది చెందుతున్న దేశాల అభివృద్ధికి తోడ్పడాలి.దానిలో భాగంగా బి3డబ్యు పధకాన్ని అమలు చేయాలి.


ఈ బృందంలో ఒకటైన బ్రిటన్‌ మన దేశాన్ని వలసగా చేసుకొని మన మూల్గులను పీల్చింది. మనం ఎదగాల్సినంతగా ఎదగకపోవటానికి అది కూడా ఒక కారణం. అదే విధంగా మిగిలిన దేశాలు కూడా అలాంటి చరిత్ర కలిగినవే. అలాంటి వాటికి మన దేశం సహజ బంధువు అని చెప్పటం అసలు సిసలు దేశభక్తుడిని అని చెప్పుకొనే నరేంద్రమోడీ చెప్పటం విశేషం. మన స్వాతంత్య్ర స్ఫూర్తికి అది విరుద్దం. సంఘపరివార్‌ దానిలో భాగం కాదు కనుక ఆ స్ఫూర్తితో దానికి పనిలేదు. ఆ కూటమి దేశాలతో వాణిజ్య లావాదేవీలు జరపటం వేరు, వాటికి సహజ మిత్రులం అని చెప్పుకోవటం తగనిపని. అణచివేసినవారు-అణిచివేతకు గురైన వారు సంబంధీకులు ఎలా అవుతారు? జి7 కూటమి దేశాల పాలకవర్గాల చరిత్ర అంతా ప్రజలు, ప్రజాస్వామ్యాన్ని అణచివేయటం లేదా అణచివేతకు మద్దతు ఇచ్చిందే తప్ప మరొకటి కాదు. రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యవారసుడైన ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తాజా సమావేశాల్లో దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా చైనా వంటి నియంతృత్వ దేశం కంటే తమ కూటమి పేద దేశాలకు మంచి స్నేహితురాలని చెప్పుకున్నారు. కమ్యూనిస్టు చైనా ఉనికిలో లేకముందు ఆ దేశాల చరిత్ర ఏమిటో లోకానికి తెలియదా ? పులిమేకతోలు కప్పుకున్నంత మాత్రాన సాధు జంతువు అవుతుందా ?

నలుగురు కూర్చుని ప్రపంచాన్ని శాసించే రోజులు ఎప్పుడో గతించాయని జి7 కూటమి గ్రహిస్తే మంచిదని చైనా తిప్పికొట్టింది.ఐక్యరాజ్యసమితి సూత్రాల ప్రాతిపదికన నిజమైన ఉమ్మడి లక్ష్యంతో మాత్రమే నిర్మాణం జరగాలని పేర్కొన్నది. దేశాలు చిన్నవా – పెద్దవా, బలమైనవా – బలహీనమైనవా పేద-ధనికా అన్నది కాదు అన్నీ సమానమైనవే, వ్యవహారాలన్నీ అన్ని దేశాలు సంప్రదింపులతో నిర్ణయం కావాల్సిందే. ఏదైనా ఒక పద్దతి అంటూ ఉంటే అది ఐరాస వ్యవస్ధ ప్రాతిపదికనే తప్ప కొన్ని దేశాలు నిర్ణయించేది కాదు అని స్పష్టం చేసింది. ధనిక దేశాల్లో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించుకొనేందుకు ఏర్పాటు చేసుకున్న కూటమి ఇది. మరో మూడు సంవత్సరాల్లో ఐదు దశాబ్దాలు నిండనున్నాయి. ఈ కాలంలో ఈ కూటమి తన సమస్యలనే పరిష్కరించుకోలేకపోయింది, ఇక పేద దేశాల గురించి ఎక్కడ ఆలోచిస్తుంది? కరోనా విషయంలో ఇవన్నీ ఎంత ఘోరంగా విఫలమయ్యాయో ప్రత్యక్షంగా చూశాము. కరోనాను అదుపు చేయటమే గాక ఆర్ధికంగా పురోగమిస్తున్న చైనా మరింత బలపడుతుందన్న దుగ్ద, దాన్ని అడ్డుకోవాలన్నది తప్ప మరొకటి ఈ సమావేశాల్లో వ్యక్తం కాలేదు.


ఒక వైపు అమెరికాలో ఉన్న వాక్సిన్లు సకాలంలో వినియోగంచకు మురిగిపోతున్నాయనే వార్తలు మరోవైపు ప్రపంచాన్ని ఆదుకుంటామనే గంభీర ప్రకటనలు. ఇంతవరకు ఒక్కటంటే ఒక్కడోసును కూడా అమెరికా ఇతర దేశాలకు ఇవ్వలేదు. వాటి తయారీకి అవసరమైన ముడిసరకులు, పరికరాల ఎగుమతులపై నిషేధం కొనసాగిస్తూనే ఉంది. చైనా బెల్ట్‌ మరియు రోడ్‌ చొరవ (బిఆర్‌ఐ) పేరుతో తలపెట్టిన ప్రాజెక్టుల అమలుకు ఇప్పటి వరకు వందకు పైగా దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. 2013లో ప్రారంభమైన ఈ పధకాన్ని 2049లో కమ్యూనిస్టు చైనా ఆవిర్భావ వందవ సంవత్సరం నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. నిజానికి ఇలాంటి పధకాలను ఏ దేశం లేదా కొన్ని దేశాల బృందం ప్రారంభించటానికి ఎలాంటి ఆటంకం లేదు. చైనా చెప్పేది అమలు జరిగేనే పెట్టేనా అని నిర్లక్ష్యం చేసిన దేశాలు దాని పురోగమనాన్నిచూసి ఎనిమిది సంవత్సరాల తరువాత దానికి పోటీగా ఇప్పుడు బి3డబ్ల్యు (బిల్డ్‌ బాక్‌ బెటర్‌ వరల్డ్‌ )పేరుతో ఒక పధకాన్ని అమలు జరపాలని ప్రతిపాదించాయి. మంచిదే, అభివృద్దిలో పోటీ పడటం కంటే కావాల్సింది ఏముంది.


బ్రిటన్‌ సమావేశాల్లో జి7 ఎన్ని కబుర్లు చెప్పినా, ఎంత చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టినప్పటికీ దానికి నాయకత్వం వహిస్తున్న అమెరికా ప్రస్తుతం చైనాతో యుద్దానికి సిద్దంగా లేదన్నది స్పష్టం. ఇతర దేశాల భుజాల మీద తుపాకి పెట్టి కాల్చాలని చూస్తున్నది. అయితే మూడు దశాబ్దాల క్రితం ప్రచ్చన్న యుద్దం ముగిసింది, విజేతలం మేమే అని ప్రకటించుకున్న తరువాత ఇప్పటి వరకు అమెరికన్లు తమ మిలిటరీ మీద 19లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేశారు. ఇదే కాలంలో చైనా ఖర్చు మూడులక్షల కోట్ల డాలర్లని అంచనా. అయినప్పటికీ అమెరికా యుద్దాన్ని కోరుకోవటం లేదని అనేక మంది విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతవరకు అమెరికా ఏ ఒక్క యుద్దంలోనూ చిన్న దేశాల మీద కూడా విజయం సాధించలేదు, అలాంటిది చైనాతో తలపడే అవకాశాలు లేవన్నది వారి వాదన. అయితే ఉక్రోషం పట్టలేక తెగించి అలాంటి పిచ్చిపనికి పూనుకున్నా ఆశ్చర్యం లేదు. తైవాన్‌ను బలవంతంగా విలీనం చేసుకోవాలని చైనా గనుక పూనుకుంటే అడ్డుపడే అమెరికా మిలిటరీని పనికిరాకుండా చేయగలదని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇంతకాలం అమెరికా అనుసరించిన మిలిటరీ ఎత్తుగడలు దానికి పెద్ద భారంగా మారాయి.అందువల్లనే నాటో ఖర్చును ఐరోపా దేశాలే భరించాలని డోనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. చైనాకు పోటీగా భారత్‌ను తీర్చి దిద్దుతామనే బిస్కట్లు వేసి ముగ్గులోకి దించి మన దేశం కేంద్రంగా ఆసియా నాటో కూటమి ఏర్పాటు చేయాలన్నది అమెరికా ఎత్తుగడ. ఇన్ని దశాబ్దాల నాటో కూటమితో ఐరోపా బావుకున్నదేమిటో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అమెరికన్లు యుద్దాన్ని కూడా లాభనష్టాల లెక్కల్లో చూస్తారు. 1986లో అమెరికా దళాల చర్యలు, నిర్వహణకు పెంటగన్‌ (రక్షణ) బడ్జెట్‌లో 28శాతం ఖర్చు అయ్యేది, ఇప్పుడది 41శాతానికి పెరిగింది, ఆయుధాల కొనుగోలు కంటే ఇది రెండు రెట్లకంటే ఎక్కువ.

అమెరికా మిలిటరీ బడ్జెట్‌, ఆయుధాలతో పోలిస్తే చైనా బలం తక్కువే అని వేరే చెప్పనవసరం లేదు. వేల మైళ్ల దూరం నుంచి అమెరికా వచ్చి యుద్దం చేయాలన్నా లేదా దానికి ముందు చైనా చుట్టూ తన దళాలను మోహరించాలన్నా చాలా ఖర్చుతో కూడింది. కానీ చైనాకు అలాంటి అదనపు ఖర్చు, ప్రయాస ఉండదు. రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ చేతులెత్తేసిన తరువాత అణుబాంబులు వేసి భయపెట్టింది అమెరికా. ఇప్పుడు పశ్చిమాసియాలో అమెరికాను ఎదిరించే ఇరాన్‌, సిరియా వంటి దేశాలు, సాయుధశక్తుల వద్ద ఉన్న ఆయుధాలు అంతగొప్పవేమీ కాదు, అలాంటి వారి మీద అమెరికా అత్యంత అధునాతన ఆయుధాలను ప్రయోగించి చూడండి మా ప్రతాపం అంటున్నది. అది చైనా విషయంలో కుదిరేది కాదు. నిజంగా చైనాతో యుద్దమంటూ వస్తే అది ఒక్క దక్షిణ చైనా సముద్రానికే పరిమితం కాదు.కరోనా నేపధ్యంలో వైరస్‌ పేరుతో అమెరికా, ఇతర దేశాలు చేస్తున్న ప్రచార యుద్దంతో జనాల్లో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటంలో విజయవంతం అయ్యారని చెప్పవచ్చు. అది వాస్తవ యుద్దంలో అంత తేలిక కాదు. సాధ్యమైన మేరకు అదిరించి బెదిరించి తన పబ్బంగడుపుకొనేందుకే అమెరికా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి.తాజా జి7 సమావేశాలను కూడా అందుకే వినియోగించుకుంది. అమెరికాను నమ్ముకొని తాయత్తులు కట్టుకొని ముందుకు దూకిన దేశాలకు చైనా చుక్కలు చూపుతుందని ఇప్పటికే కొన్ని ఉదంతాలు వెల్లడించాయి.మన దేశం వాస్తవ దృక్పధంతో ఆలోచిస్తుందా ? దుస్సాహసం, దుందుడుకు చర్యలకు మొగ్గుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మన చుట్టూ జరుగుతున్నదేమిటి -1 వైఫల్యాలపై దృష్టి మరల్చేందుకు మరో వివాదం : మోడీపై చైనా అనుమానం !

13 Sunday Jun 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ 1 Comment

Tags

anti china, Anti China Propaganda, Indo-China trade, Narendra Modi Failures, Quadrilateral Security Dialogue


ఎం కోటేశ్వరరావు


లడఖ్‌ సరిహద్దులోని గాల్వన్‌ లోయలో భారత్‌-చైనా ఘర్షణ జరిగి ఏడాది గడిచింది. మనవైపు 20 మంది మరణించగా తమవారు నలుగురు చనిపోయినట్లు చైనా చెప్పింది. అది ఒక బాధాకరమైన, అవాంఛనీయ ఉదంతం. సాధారణ పరిస్ధితులను పునర్దురించాలని ఇరుదేశాలూ సంకల్పం ప్రకటించాయి, చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. అయినా ఒకరి మీద ఒకరికి అనుమానాలు తొలగలేదు. అందుకే ఉభయులూ కొన్ని చోట్ల బలగాలను కొంత మేరకు ఉపసంహరించుకున్నా, పూర్తిగా వైదొలగలేదు. చైనా వైపు నుంచి బలగాలను మోహరిస్తున్నారని మన మీడియాలో, మనమూ అదే పని చేస్తున్నామని చైనా ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఏడాది గడచిన సందర్భంగా ప్రపంచ మీడియాలోనూ దాని గురించి రాశారు.

బ్రిటన్‌కు చెందిన టెలిగ్రాఫ్‌ పత్రిక జూన్‌ ఎనిమిదవ తేదీన రాసిన వార్తలో కొత్త వివాదాలు తలెత్తుతాయనే భయంతో భారత్‌ సరిహద్దుల్లో మిలిటరీ బలగాలను పటిష్ట పరుస్తున్నదని పేర్కొన్నది. వేసవి కాలం వచ్చినందున రెండు దేశాల మధ్య ఘర్షణలు జరిగే పెద్ద ముప్పు ఉన్నట్లు రష్యా పత్రిక ఇండిపెండెంట్‌ పేర్కొన్నది. ఈ పత్రికల వార్తలను ప్రస్తావిస్తూ అనేక పత్రికలు విశ్లేషణలు రాశాయి.కరోనా వైరస్‌, ఆర్ధిక రంగంలో వైఫల్యాల నుంచి జనం దృష్టిని మరల్చేందుకు భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రయత్నించవచ్చని చైనా విశ్లేషకులు చెప్పిన అంశాలను చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌ ప్రచురించింది. ” యుద్దం రాదు, అయితే 2020 మేనెలలో సంక్షోభం ప్రారంభమైనప్పటి కంటే ఇప్పుడు ముప్పు గణనీయంగా ఎక్కువగా ఉంది, ఉభయపక్షాలూ పోరుకు ఎంతో సన్నద్దంగా ఉన్నాయి ” అని ఆసియా రక్షణ వ్యవహారాల విశ్లేషకుడు అర్జన్‌ తారాపోర్‌ చెప్పినట్లు టెలిగ్రాఫ్‌ రాసింది. కరోనా మహమ్మారి, ఆర్ధిక పరిస్ధితి మరింతగా దిగజారితే సరిహద్దుల్లో భారత్‌ మరో ఘర్షణకు పాల్పడవచ్చని షాంఘైలోని సామాజిక అధ్యయనాల సంస్ధ అంతర్జాతీయ సంబంధాల విభాగపు పరిశోధకుడు హు ఝియాంగ్‌ చెప్పారు.దేశీయంగా సంక్షోభం ఉన్నపుడు ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎప్పుడూ సరిహద్దు సమస్యలవైపు చూసే రాజకీయ సంప్రదాయం భారత్‌కు ఉందని, ఈ విషయమై చైనా చాలా జాగ్రత్తగా ఉండాలని హు చెప్పాడు.

ఎక్కువ భాగం సైన్యాలను రెండు దేశాలూ ఉపసంహరించుకున్నాయి. హాట్‌స్ప్రింగ్స్‌, డెస్పాంగ్‌ మైదానాల వంటివాటి నుంచి ఇంకా జరగాల్సి ఉందని సింఘువా విశ్వవిద్యాలయంలోని జాతీయ వ్యూహ సంస్ధ డైరెక్టర్‌ క్వియాన్‌ ఫెంగ్‌ చెప్పారు.సరిహద్దు వెంబడి చైనా మౌలిక సదుపాయాలు చక్కగా ఉన్నాయి,అయినప్పటికీ ముందు పీఠీన అక్కడ ఎక్కువ దళాలు లేవు, రెండవ వరుసలో బలాలను మోహరించాల్సి ఉందని క్వియాన్‌ చెప్పారు. వివాదం చిన్నదే అన్నారు. గత ఏడాదితో పోలిస్తే సరిహద్దులో పరిస్దితి ఎంతో మెరుగ్గా ఉంది, అయితే ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగితే రెండు దేశాల మిలిటరీ మధ్య సంబంధాలకు, పశ్చిమ సరిహద్దులో స్ధిరత్వానికి ముప్పు అని కొందరు అభిప్రాయపడ్డారు. సరిహద్దుకు సమీపంలోని టిబెట్‌లో చైనా తన దళాలం సంఖ్యను పెంచిందని కొన్ని వార్తలు సూచించాయి. భారత-చైనా నేతలు జనాలకు జవాబుదారీ కనుక సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోగలరని, ఇతర ప్రాంతాల వారు ఆ ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా ఉండటం ముఖ్యమని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ వ్యాఖ్యానించాడు. మే నెలలో జరిగిన కీలక ఎన్నికలలో ఓటమి తరువాత ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి వచ్చే ఎన్నికల్లో మద్దతు పొందాలని చూస్తోందని గ్లోబల్‌టైమ్స్‌ వ్యాఖ్యాత పేర్కొన్నారు.

రెండు దేశాల సైన్యాల ఉపసంహరణకు రెండు రోజుల ముందు చైనా నుంచి బెదిరింపులు ఉన్నందున ఇండో – పసిఫిక్‌ అవగాహనను మరింత పటిష్టపరుచుకోవాల్సిఉందని ఫిబ్రవరి 8న ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ అంగీకరించినట్లు ప్రకటించారు.ఇరు దేశాల సంబంధాలు చౌరాస్తాలో ఉన్నాయి, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నంత కాలం సహకారం గురించి ఆలోచించలేమని మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ మేనెలలో వ్యాఖ్యానించారు. పరిస్ధితి ఇలా ఉన్నప్పటికీ ఈ ఏడాది జనవరి-మే మాసాల మధ్యకాలంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం డాలర్ల విలువలో చూస్తే 70.1శాతం జరిగినట్లు చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపింది. చైనా నుంచి భారత్‌కు ఎగుమతులు 64.1 పెరిగితే, భారత్‌ నుంచి చైనా దిగుమతుల 90.2శాతం పెరిగినట్లు వెల్లడించింది. 2020 సంవత్సరంలో రెండు దేశాల మధ్య 86.4 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరిగింది. తిరిగి అమెరికాను వెనక్కు నెట్టేసి మన దేశం చైనాతో అత్యధికంగా వాణిజ్యం నిర్వహించింది. ఈ ఏడాది తొలి ఐదునెలల్లో 48.16బిలియన్‌ డాలర్ల లావాదేవీలు జరిగినట్లు చైనా కస్టమ్స్‌శాఖ వద్ద జూన్‌ ఏడవ తేదీనాటికి నమోదైన వివరాలు వెల్లడించాయి. గతేడాది జరిగిన సరిహద్దు వివాదాలు చాలా వరకు వెనక్కు పోయినట్లు అసాధారణ వాణిజ్య లావాదేవీలు సూచిస్తున్నాయని చెప్పవచ్చు. అయితే గతంలో రెండు దేశాల మధ్య వాణిజ్యంలో చైనా 63 బిలియన్‌ డాలర్ల మేరకు మిగుల్లో ఉంటే 2020-21లో అది 44 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.మన ఎగుమతులు ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి.


ఒక వైపు చైనాను కట్టడి చేసే లక్ష్యంతో ఏర్పడిన చతుష్టయ బృందంలో అమెరికా, జపాన్‌,ఆస్ట్రేలియా,మన దేశం ఉన్నప్పటికీ మరోవైపున వాణిజ్యంలో మన దేశం చైనాతో ప్రధమ స్దానంలో ఉంది. వాణిజ్యం గురించి చర్చిందేందుకు మేము సిద్దమే అని ఆస్ట్రేలియా ప్రకటించింది. అమెరికా వైపు నుంచి కూడా అలాంటి సంకేతాలే వెలువడుతున్నాయి. సరిహద్దు వివాదాలకు వాణిజ్యానికి లంకె పెట్టవద్దని చైనా చెబుతున్నది. అయితే చైనా వస్తువులను బహిష్కరించాలని, చైనా మన శత్రువు, ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని ఒకవైపున ప్రచారంతో జనాన్ని సంతృప్తి పరుస్తున్నారు. మరోవైపు అదే చైనా నుంచి వస్తువుల దిగుమతులు, లాభాలతో వాణిజ్యవేత్తలను ప్రధాని నరేంద్రమోడీ సంతుష్టులను గావిస్తున్నారు. టెలికామ్‌ రంగంలో ఐదవ తరం ఫోన్లను ప్రవేశపెట్టేందుకు చౌకగా ఉండే చైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని తిరస్కరించి అధిక ఖర్చుతో కూడిన అమెరికా, ఐరోపాల వైపు మన దేశం చూస్తున్నది. అదే జరిగితే సెల్‌ఫోన్‌ ఛార్జీలు ఇంకా పెరుగుతాయి.
బీజింగ్‌ కేంద్రంగా పని చేస్తున్న ఆసియా మౌలికసదుపాయాల పెట్టుబడుల బ్యాంకు (ఏఐఐబి)లో మన దేశం ఒక వాటాదారు. చైనాకు దానిలో 30.34శాతం వాటాలు ఉండగా మన దేశం 8.52, రష్యా 6.66శాతంతో రెండు, మూడు స్ధానాలలో ఉన్నాయి. చైనా వద్దుగానీ దాని డబ్బు ముద్దు అన్న విమర్శలు వచ్చిన నేపధ్యంలో ఈ బ్యాంకులో మనమూ వాటాదారులమే గనుక సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ రుణం తీసుకుంటే తప్పేముందని మన అధికారులు వ్యాఖ్యానించారు. అయితే ఈ బ్యాంకు లేదా ఆసియా అభివృద్ది బ్యాంకు(ఏడిబి), ప్రపంచబ్యాంకు వంటి సంస్దల నుంచి రుణాలు తీసుకుంటే ఆ పధకాలకు సభ్యదేశాల కంపెనీలన్నీ టెండర్లు వేసి పాల్గొనేందుకు హక్కును కలిగి ఉంటాయి. గతేడాది ఏడిబి రుణంతో చేపట్టిన రైల్వే ప్రాజక్టులలో చైనా కంపెనీలను అనుమతించవద్దని కొందరు పెద్ద వివాదం సృష్టించిన విషయం తెలిసినదే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కనిపించిన కేసు ఒక్కటే, పరీక్షలు కోటీ 80లక్షలు – కరోనా కట్టడిలో చైనా రహస్యం అదే !

11 Friday Jun 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Science

≈ 1 Comment

Tags

china communists action to fight against covid-19, China Covid-19, COVID- 19 pandemic, Guangzhou tests 18m people, Narendra Modi Failures, nucleic acid test


ఎం కోటేశ్వరరావు


ఏ రోజు, ఏ నెలలో చైనా ఎలా ప్రవర్తిస్తుందో అర్ధం చేసుకోవటం ఎంతో కష్టంగా మారిందంటూ ఒక విశ్లేషకుడు కొద్ది రోజుల క్రితం ఒక వ్యాఖ్యానం రాశాడు. ఇది నిజమే. అది అతని వ్యక్తిగతం కాదు, చైనా వారు చెప్పే అంశాలపై నమ్మకం కోల్పోయిన వారందరి తీవ్ర మానసిక సమస్య ఇది. వారికి పూర్తిగా తెలియదు, ఇతరులు చెబితే వినరు. చైనా వారు చెప్పేవన్నీ అతిశయోక్తులే, అంత అభివృద్ది, పురోగమనం లేదూ, పాడూ లేదు, అన్నీ నాశిరకరం అని కొట్టి పారవేసిన వారు ఇప్పుడు నమ్మలేని అంశాలతో బిత్తరపోతున్నారు. అది నేల నుంచి నింగి విజయాల వరకు దూసుకుపోతున్నది. త్వరలో ఆర్ధికంగా అమెరికాను అధిగమించనుంది. సాంకేతిక రంగంలో కొన్ని అంశాలలో అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలదే పైచేయిగా ఉన్నప్పటికీ వాటికి ధీటుగా ముందుకు వస్తోంది.


అనేక మంది చైనా గురించి సరైన సమాచారం తెలుసుకోవటం కష్టం అంటూనే రకరకాల చెత్తకథనాలు రాయటం, చూపటం, వినిపించటం చూస్తున్నాము. ఎంతో స్వేచ్చ, దేన్ని గురించైనా మాట్లాడుకోవచ్చు, తెలుసుకోవచ్చు, బయట పెట్టవచ్చు అడ్డూ అదుపు ఉండదు అని చెప్పుకొనే అమెరికా వంటి దేశాలలో కూడా అక్కడి పాలకుల కనుసన్నలలో వారికి పనికిరానిదాన్ని, వారి ప్రయోజనాలకు పనికి వచ్చే సమాచారాన్నే బయటికి వదులుతారు తప్ప ప్రతిదాన్నీ బహిరంగపరచరు. చైనా దానికి మినహాయింపు కాదు. చైనా విలేకర్ల పేరుతో వ్యవహరించే వారిలో అత్యధికులు తైవాన్‌, హాంకాంగ్‌, దక్షిణకొరియా, జపాన్‌లో ఉండి వార్తలు రాస్తారు. వారికి సిఐఏ ఏజంట్లు, చైనా వ్యతిరేకులు అందించే అంశాలే ఆధారం. చైనా ప్రధాన భూభాగంలో ఉండేవారు కూడా ఎక్కువ మంది అసత్య, అర్ధసత్య వార్తలనే వండి వడ్డిస్తారు. వీరిలో చాలా మంది జర్నలిస్టుల ముసుగులో విదేశీ గూఢచార ఏజంట్లు ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. రెండు పనులూ చేస్తారు. మరి చైనా జర్నలిస్టులు ఇతర దేశాల్లో ఎలా ఉంటారు ? వ్యతిరేకులు బాంబులు వేస్తుంటే చైనా వారు రసగుల్లాలు విసురుతూ ఉంటారా ? అయితే ఎవరూ నిజాన్ని అంగీకరించరు.

విదేశీ జర్నలిస్టులు ప్రశ్నించినపుడు సహజంగానే జనాలు ఏ దేశంలో అయినా సందేహిస్తారు. దానికి చైనా మినహాయింపు కాదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎవరైనా పార్టీ కార్యకర్తలను విదేశీ జర్నలిస్టులు కలిసినపుడు వారు చెప్పదలచుకున్న అంశాలను వక్రీకరించకుండా ఉండేందుకు రాతపూర్వకంగా అందచేస్తారు. ప్రభుత్వ వైఖరి గురించి జనాలు స్వేచ్చగా అభిప్రాయాలు వెల్లడించేందుకు అవకాశం, వేదికలు ఉండవు అని చాలా మంది చెబుతారు. కానీ చైనా పేరుతో విశ్లేషణలు రాసే అనేక మంది అక్కడి సామాజిక మాధ్యమాల్లో వెల్లడయ్యే వైఖరుల ఆధారంగా, వాటిని ఉటంకిస్తూ, భిన్నఅభిప్రాయాలను తీసుకొని కాళిదాసు కవిత్వానికి తమపైత్యం జోడించి అన్నట్లుగా రాస్తారు.


కరోనా వైరస్‌ గురించి చేసిన తప్పుడు ప్రచారాల్లో వెయ్యోవంతు ఆ వైరస్‌ నివారణ, అంతానికి చైనా సర్కార్‌ తీసుకుంటున్న చర్యల గురించి రాసినా ప్రపంచానికి ప్రయోజనం ( అది చైనాకు కాదు ) ఉండి ఉండేది. అక్కడ అనుసరిస్తున్న పద్దతులను ఎందుకు అమలు చేయరంటూ ఆయా దేశాల జనాలు పాలకుల మీద వత్తిడి తెచ్చేందుకు అవకాశం ఉండేది. వరల్డో మీటర్‌ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం ఇది రాసిన సమయానికి ప్రపంచలో మొత్తం కరోనా కేసులు 17కోట్ల 56లక్షల 79వేల 912. మరణించిన వారు 37లక్షల 90వేల 392 మంది. మన దేశానికి సంబంధించి మొత్తం కేసులు రెండు కోట్ల 92లక్షల 74,823, మరణాలు 3,63,097. కేసుల సంఖ్యలో అమెరికా తరువాత రెండవ స్ధానంలో ఉంది, మరణాల్లో అమెరికా,బ్రెజిల్‌ తరువాత మూడవ స్ధానం. మొత్తం 222 దేశాలు, ప్రాంతాలలో చైనా 98వ స్ధానంలో ఉంది. అక్కడ నమోదైన కేసులు 91,359, మరణాలు 4636.చైనాలో కరోనా కేసులు, మరణాలు అంత తక్కువ ఎందుకున్నాయని ఇప్పటికీ సందేహించే వారున్నారు. వారిని ఎవరూ ఒప్పించలేరు,మెప్పించలేరు.ఇంకా మరికొన్ని దేశాల్లో కూడా కేసులు, మరణాలు తక్కువే ఉన్నాయని వారికి తెలిస్తే తట్టుకోలేరేమో !

తాజాగా ప్రపంచ మీడియాలో వచ్చిన ఒక వార్త మరోసారి చైనా కరోనా కట్టడి గురించి ఆసక్తిరేపింది. దేశీయంగా ఒక వాక్సిన్‌ తయారు చేసినందుకు మన ప్రధాని నరేంద్రమోడీ తన భుజాలను తానే చరుచుకొని అభినందించుకున్నారు. పొగడ్తలకు అలవాటు పడ్డ ప్రాణం కదా, పోనీయండి అని అనేక మంది సమర్ధిస్తున్నారు. దక్షిణ చైనాలోని గ్వాంగ్‌ఝౌ అనే పట్టణం, పరిసరాల జనాభా కోటీ 86లక్షలు. ఒక మహిళ (75) ఒక హౌటల్‌కు వెళ్లినపుడు కరోనా లక్షణాలు కనిపించాయి. దాంతో అప్రమత్తమైన అధికారులు మేనెల 21 నుంచి జూన్‌ 8వ తేదీ వరకు నగరంలో కోటీ 80లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 115 మందికి కరోనా లక్షణాలు కనిపించాయి, 106 మందికి నిర్ధారణ అయింది. ఈ కేసులన్నింటిలో భారత్‌లో బయటపడిన డెల్టా రకం కనిపించింది. ఇది వేగంగా వ్యాపించే లక్షణం కలిగినదని చైనా అధికారులు చెప్పారు. ఒక గంటలోపే ఫలితాన్ని వెల్లడించే న్యూక్లియక్‌ యాసిడ్‌ టెస్టులు చేశారు. రక్తం,కండరాలు,మూత్రంలో ఏవైనా వైరస్‌, బాక్టీరియాలు ఉంటే వెంటనే పసిగట్టే ఆధునిక పరిజ్ఞానంతో ఆ పరీక్షను చేస్తారు. ప్రపంచంలో పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించిన పట్టణంగా రికార్డులకెక్కింది. గతంలో చైనాలోనే మరికొన్ని పట్టణాల్లో కూడా ఈ పరీక్షలు పెద్ద సంఖ్యలో నిర్వహించినా సంఖ్యరీత్యా ఇదే అత్యధికం. వాన్‌ఫు బయోటెక్నాలజీ అభివృద్ది చేసిన విధానం ప్రకారం బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ దేశాలలో బయటపడిన కరోనా వైరస్‌ లక్షణాలను ఈ పరీక్ష వెల్లడిస్తుంది. గ్వాంగఝౌ పట్టణం, పరిసరాలలో 5,500 బయో, ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమలు, ఈ రంగంలోనే వెయ్యి ఆధునిక పరిజ్ఞాన సంస్ధలు ఉన్నాయి. కింగ్‌మెడ్‌ డయాగస్టిక్స్‌ గ్రూప్‌ రోజుకు మూడున్నరలక్షల పరీక్షలు చేయగల సామర్ధ్యం కలిగినది ఇక్కడ ఉంది, ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. తమకు కరోనా వచ్చిన విషయాన్ని దాచినందుకు లేదా తెలియచేయనందుకు, పరీక్షకు నిరాకరించినందుకు కొందరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఒక హౌటల్‌లో ఉన్న వ్యక్తి పరీక్షకు నిరాకరించి పోలీసులతో వాగ్వాదానికి దిగటమేగాకుండా భోజనానికి ఉపయోగించే ఫోర్క్‌తో పోలీసు మీద దాడి చేశాడు.

చైనాలో కరోనా కట్టడికి ఇప్పటివరకు మూడు రకాల వ్యూహాలను అనుసరించారు. వైరస్‌ బయటపడగానే దానికి చికిత్స ఏమిటో తెలియలేదు గనుక తొలి దశలో ప్రజారోగ్య నిరోధం మరియు అదుపు పద్దతులను అమలు జరిపారు. రెండవ దశలో వాక్సిన్లను ఉపయోగించారు. ఇప్పుడు మూడవ దశలో నిరోధం మరియు అదుపు పద్దతులను కూడా పాటిస్తున్నట్లు చైనా సిడిసి అధిపతిగా గతంలో పని చేసిన జెంగ్‌ గ్వాంగ్‌ చెప్పారు.ఈ చర్యలతో పాటు వాటిని అమలు జరిపే క్రమంలో చైనీయుల సామాజిక అలవాట్లను, అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొన్నారు. గ్వాంగ్‌ఝౌ నగరంలో కేసులు 115 మాత్రమే బయటపడినప్పటికీ కొన్ని ప్రాంతాలలో లాక్‌డౌన్‌ ప్రకటించి జన సంచారాన్ని పరిమితం చేశారు.చైనాలో అనేక సంస్ధలు వాక్సిన్ల తయారీకి పరిశోధనలు, పరీక్షలు చేస్తున్నాయి. వాటిలో ఇప్పటి వరకు ఏడు రకాలకు చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు 80 కోట్ల మందికి తొలి, రెండవ డోసు వాక్సిన్లు వేసినట్లు చైనా ప్రకటించింది.


గత ఏడాది ఊహాన్‌ నగరంలో కరోనాను కట్టడి చేయటం అనేక అనుభవాలను ముందుకు తెచ్చింది. తరువాత కాలంలో చెదురుమదురుగా వివిధ నగరాల్లో చాలా పరిమితంగా అయినా కేసులు బయటపడ్డాయి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లుగా వైరస్‌ విస్తరించకుండా చూసేందుకు నూక్లియక్‌ యాసిడ్‌ పరీక్షలు చేసి జల్లెడ పట్టాలని నిర్ణయించారు. దీనికి కూడా ఊహాన్‌ అనుభమేతోడ్పడింది. అక్కడ ప్రారంభంలో యాభైవేల పరీక్షలు చేసి సమాచారాన్ని విశ్లేషించారు. తరువాత గతేడాది మేనెల ప్రారంభంలో అక్కడి కోటి మంది జనాభాకు పది రోజుల్లో ఈ పరీక్షలు చేసి దాగున్న వైరస్‌ను వెలికి తీసే యత్నం చేశారు.లక్షణాలు బయటకు కనిపించకుండా వైరస్‌ ఉన్న మూడు వందల కేసులు వెల్లడయ్యాయి.తరువాత బీజింగ్‌లోని కోటి ఇరవైలక్షల మందికి పరీక్షలు చేశారు, 174కేసులు బయటపడ్డాయి.


చైనాలో ప్రయాణాలు చేసే వారు గణనీయ సంఖ్యలో ఉంటారు. ప్రతివారినీ ప్రతి చోటా పరీక్షించటం సాధ్యంకాదు, అవసరమైన సిబ్బంది లభ్యత కూడా పెద్ద సమస్యే. అందువలన చైనా ప్రయాణ ఆరోగ్య సూచిక (కోడ్‌)లను రూపొందించాలని ఐటి కంపెనీలను కోరారు. ఆమేరకు తయారు చేసి ప్రతి ఒక్కరికీ ఒక సూచికను కేటాయించారు. వారి సెల్‌ఫోన్లలో యాప్‌ ఏర్పాటు చేశారు. దానిలో మూడు రంగుల సూచికలను పొందుపరిచారు.దానిలో సదరు వ్యక్తి చిరునామా వంటి ప్రాధమిక సమాచారంతో పాటు అనుమతించిన ఆరోగ్య వివరాలు, సందర్శించిన ఆసుపత్రులు, వాడిన మందుల వంటి వాటిని పొందుపరిచారు.అంతే కాదు, వారు పర్యటించిన ప్రాంతాలు, హౌటల్స్‌, మాల్స్‌, రైలు, విమానం, బస్‌, స్వంత వాహనం వంటి వివరాలు కూడా ఉంటాయి. ఎక్కడైనా తనిఖీ సిబ్బంది ఫోన్లలో వారి కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఆ వివరాలన్నీ కనిపిస్తాయి. ఉదాహరణకు ఆకుపచ్చ సూచిక ఉన్నవారి వివరాలను చూస్తే వారు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యలు లేవని, కరోనా ప్రాంతాల్లో సంచరించలేదని అర్ధం. పసుపు పచ్చ కోడ్‌ వస్తే వారు శ్వాస సంబంధ సమస్యలను ఎదుర్కొన్నారని, కరోనా ముప్పు ప్రాంతాలను సందర్శించటం, వైరస్‌ సోకిన వారితో కలిసినట్లు అర్ధం. ఎరుపు సూచిక ఉంటే ప్రమాదం ఉందని అర్ధం. వారికి లేదా కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకటం, సోకినవారిని కలిసినందున విడిగా ఉంచాల్సిన అవసరం ఉందని అర్ధం. కరోనాను మహమ్మారిగా ప్రభుత్వం ప్రకటించినందున పసుపు, ఎరుపు సూచికలు ఉన్న వారికి ప్రయాణించేందుకు అవసరమైన టిక్కెట్లను తిరస్కరించే, ప్రయాణ అనుమతి నిరాకరించే అధికారం యంత్రాంగానికి ఉంటుంది. ఆకుపచ్చ సూచిక ఉన్నవారు మాత్రమే ప్రయాణించేందుకు వీలుంటుంది.

కరోనా నివారణకు వాక్సిన్‌ రూపొందించే వరకు ఫలానా ఔషధంతో నివారించవచ్చనే హామీ ఎక్కడా లేదు. అనేక రకాలతో ప్రయోగాలు చేశారు. . రెమిడెసివర్‌ కరోనా చికిత్సకు పనికిరాదని గతేడాది ఏప్రిల్‌ 15 నుంచే చైనాలో దాన్ని పక్కన పెట్టారు. అయినా మన నిపుణులు దాని గురించి జనంలో పెద్ద ఎత్తున ఆశలు కల్పించేందుకు కారకులయ్యారు. దాంతో మన జనాన్ని ఎలా పిండుకున్నారో చూశాము. ఫార్మా మాఫియాల పీకనులిమే కొత్త దేవుడు మోడీ అంటూ ప్రచారం చేసినప్పటికీ ఇది జరిగింది. తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్ధ పరిశోధనలో కూడా అదే తేలింది. చైనాలో మన ఆయుర్వేదం మాదిరే స్ధానిక వైద్య పద్దతిలో వాడుతున్న ఔషధాలను కూడా చికిత్సలో ఉపశమనానికి వినియోగించారు. ఆ రంగ నిపుణులను కూడా అల్లోపతి ఆసుపత్రుల్లో నియమించారు, పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. అయితే ఆ వైద్యపద్దతి, ఔషధం వైరస్‌ను అంతం చేస్తుందనే భ్రమలు కల్పించలేదు. కనుకనే అక్కడ బాబా రామ్‌దేవ్‌ వంటి వారు వాటితో సొమ్ము చేసుకోవటం గానీ, ఆనందయ్య పచ్చడి వంటివి రంగంలోకి రావటం గానీ జరగలేదు.


ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్న కారణంగానే చైనాలో వైరస్‌ అదుపులో ఉంది. అయితే ఇందుకయ్యే ఖర్చు కూడా తక్కువేమీ కాదు. అయినప్పటికీ కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం అక్కడ ఉంది కనుక దేశ సంపదలను జనం కోసం ఖర్చు చేసేందుకు వెనుకాడలేదు.లాభ నష్టాల లెక్కలు వేసుకోలేదు. ముందు ప్రాణాలను రక్షించటమే ప్రధమ కర్తవ్యంగా పెట్టుకున్నారు. మన వంటి దేశాలలో పెట్టుబడిదారులు దేని మీద ఎంత ఖర్చు చేస్తే ఎంత లాభం వస్తుందనే లెక్కలు ముందే వేసుకుంటారు. కొత్తదాని మీద ఖర్చు పెడితే ఒకవేళ ప్రయోజనం లేకపోతే మొత్తం దండగే అని భావిస్తే అసలు ముందుకు రారు. పాలకులు కూడా వారినే అనుసరిస్తారు గనుక అంబానీ, అదానీ అండ్‌కోకు ఆత్మనిర్భర అనో మరొక పేరుతోనే రాయితీలు ఇచ్చేందుకు చూపే శ్రద్ద జనం మీద చూపరు. ఆ కారణంగానే కేవలం రెండు వందల కోట్ల ఖర్చుతో జనానికి అవసరమైన ఆక్సిజన్‌ అందించే యంత్రాల ఏర్పాటు టెండర్లను ఎనిమిది నెలల పాటు కేంద్రం ఖరారు చేయలేదు. తీరా ముప్పు ముంచుకు వచ్చిన తరువాత, సుప్రీం కోర్టు మందలింపులతో చేయటాన్ని చూశాము. వాక్సిన్లు కూడా అంతే కదా ! అందుకోసం కేటాయించినట్లు చెప్పిన 35వేల కోట్లకు లెక్కలు చెబుతారా లేదా అని నిలదీసిన తరువాత విధిలేక మేమే వాక్సిన్లు వేయిస్తాం అనే ప్రకటన వెలువడింది. కేసులు తక్కువే అయినప్పటికీ చైనాలో ఖర్చు తక్కువేమీ కాలేదు. దాని కంటే ఆర్ధిక కార్యకలాపాలు నిలిచిపోవటం పెద్ద దెబ్బ అని వెంటనే గ్రహించింది. అందుకే ప్రపంచంలో పెద్ద ఆర్ధిక వ్యవస్ధలున్న దేశాల్లో ఎక్కడా లేనిóంగా వైరస్‌ కనిపించిన నాలుగు నెలల్లోనే దాన్ని అదుపులో ఉంచి ఆర్ధిక కార్యకలాపాలన్నింటినీ పునరుద్దరించింది. అది ఖర్చు కంటే లబ్దే ఎక్కువ చేకూర్చిందని రుజువైంది. దాన్నుంచి మనం పాఠాలు నేర్చుకుంటామా ? మన భుజాలను మనమే చరుచుకుంటామా ?
అనువుగాని చోట అధికులమన రాదు,
కొంచెమైన నదియు కొదువగాదు,
కొండ అద్దమందు కొంచెమై ఉండదా,
విశ్వదాభిరామ వినుర వేమా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెరూలో తీవ్ర ఉత్కంఠ-అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష విజయం !

09 Wednesday Jun 2021

Posted by raomk in Current Affairs, History, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion

≈ Leave a comment

Tags

Elecciones en Perú, Latin america left, Pedro Castillo, Peru presidential election 2021, Socialist Castillo


ఎం కోటేశ్వరరావు


నువ్వా నేనా ! ఒక వైపు పచ్చిమితవాద, అవినీతి వారసత్వం మరోవైపు మచ్చలేని వామపక్ష ఘన వారసత్వం. నరాలు తెగే ఉత్కంఠ. ఓటు ఓటుకూ అభ్యర్ధులు, మద్దతుదారుల రక్తపోటులో తేడా. ఆదివారం నాడు పెరూలో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో వామపక్ష అభ్యర్ధి పెడ్రో కాస్టిల్లో స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. మూడు లక్షల ఓట్లను లెక్కించకుండా బయటపడవేశారంటూ ప్రత్యర్ధి మద్దతుదారులు ఎన్నికల కార్యాలయం ముందు ప్రదర్శనలకు దిగగా కాస్టిల్లో మద్దతుదారులు కూడా ఫలితాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ పోటీ ప్రదర్శనలకు దిగారు. ఇది రాస్తున్న సమయానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. సోమవారం నాడు ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటికీ మారు మూల గ్రామీణ ప్రాంతాలు, విదేశాల నుంచి ఓట్ల వివరాలు రావటంలో ఆలశ్యం కారణంగా లెక్కింపు ఇంకా పూర్తి కాలేదు. పెరూ కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన 99.8 శాతం ఓట్లలెక్కింపులో కాస్టిల్లో 50.20 ప్రత్యర్ధి మితవాద కైయికు ఫుజిమోరి 49.80శాతం ఓట్లు సాధించారు. సంఖ్య రీత్యా కాస్టిల్లోకు 87,35,448, ప్రత్యర్ధికి 86,63,684 వచ్చాయి. కాస్టిలో మెజారిటీ 71,764 ఉంది. మెజారిటీ కంటే లెక్కించాల్సిన ఓట్లు తక్కువగా ఉండటంతో కాస్టిలో విజయం ఖాయమైంది. అక్రమాలకు పాల్పడి అవాంఛనీయ పరిణామాలు జరిగితే తప్ప అదే ఖరారు అవుతుంది.

గ్రామీణ ప్రాంతాలలో వామపక్ష అభ్యర్ధికి పెద్ద ఎత్తున మద్దతు ఉన్నట్లు వెల్లడైన కారణంగా మిగిలిన ఓట్లు అక్కడివే కావటంతో తమ అభ్యర్ధి విజయం సాధించినట్లు కాస్టిలో మద్దతుదారులు చెబుతున్నారు. మరోవైపు లెక్కింపులో అక్రమాలు జరిగినందున ఫలితాన్ని తాను అంగీకరించేది లేదని కైయికూ ప్రకటించినందున పరోక్షంగా ఓటమిని అంగీకరించినట్లు పరిగణిస్తున్నారు. పరిశీలకులుగా ఉన్న లాటిన్‌ అమెరికా దేశాల సంస్ధ సభ్యులు ఎలాంటి ఫిర్యాదులూ చేయలేదు. పది సంవత్సరాల కాలంలో మూడవ సారి కూడా ఓడిపోతుండటంతో కైకు నిరాశతో ఇలాంటి ఆరోపణలకు దిగారని విమర్శలు వచ్చాయి.


వామపక్ష అభ్యర్ధి విజయం తధ్యమనే వాతావరణం ఏర్పడటంతో స్టాక్‌ మార్కెట్‌, వాణిజ్య, పారిశ్రామికవేత్తలలో వెల్లడైన భయం కూడా ఒక సూచిక. స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలటంతో సోమవారం నాడు కొద్ది సేపు క్రయ విక్రయాలను నిలిపివేయాల్సి వచ్చింది. కరెన్సీ విలువ కూడా గణనీయంగా పడిపోయింది. వామపక్ష నేత అధికారానికి వస్తే మార్కెట్‌ శక్తుల ఆధిపత్యంలోని వ్యవస్ధను మార్చివేస్తారనే ఆందోళన వ్యక్తమైంది.పట్టణ ప్రాంతాల నుంచి తొలుత లెక్కింపు ప్రారంభమైంది. ఎనభై ఆరుశాతం ఓట్ల లెక్కింపు వరకు మితవాద అభ్యర్ధిని కెయికో ఫుజిమోరీ 52శాతానికి పైగా ఓట్ల మెజారిటీతో కొనసాగారు,అప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల ఓట్ల లెక్కింపు ప్రారంభం కావటంతో 93శాతానికి చేరగానే ఇద్దరి ఓట్లు సమం తరువాత కాస్టిల్లో ఓట్లు పెరగటం ప్రారంభమైంది.

పెరూ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి అవసరమైతే రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలిదశలోనే 50శాతానికి మించి ఓట్లు తెచ్చుకుంటే రెండవ సారి అవసరం ఉండదు. లేనట్లయితే తొలి దశలో మొదటి రెండు స్దానాలలో ఉన్న అభ్యర్ధుల మధ్య అంతిమ పోటీ జరుగుతుంది. దీని ప్రకారం ఏప్రిల్‌ 11న జరిగిన ఎన్నికలలో 18 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. వీరిలో మార్క్సిస్టు భావజాలంతో పని చేస్తున్న ఫ్రీ పెరు పార్టీ అభ్యర్ది పెడ్రో కాస్టిల్లో 18.92శాతం ఓట్లతో ముందుండగా ద్వితీయ స్ధానంలో పాపులర్‌ ఫోర్స్‌ పార్టీకి చెందిక కెయికు ఫుజిమోరి 13.41శాతంతో రెండవ స్ధానంలో నిలిచారు. పార్లమెంట్‌లోని 130 స్ధానాలకు గాను 27 బహుళనియోజకవర్గాల నుంచి ప్రతినిధులను దామాషా ప్రాతిపదికన ఎన్నుకుంటారు. మొత్తంగా ఐదుశాతంపైగా ఓట్లు సాధించటం లేదా ఒక నియోజకవర్గంలో ఏడుగురు ప్రతినిధులు గెలిచినా దేశం మొత్తంలో దామాషా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. ఈ మేరకు 20 పార్టీలు పోటీ పడగా పది పార్టీలు ఐదుశాతానికి పైగా ఓట్లు సాధించి పార్లమెంట్‌లో ప్రవేశం పొందాయి.ఫ్రీ (విముక్త )పెరు పేరుతో రంగంలోకి దిగిన కొత్త పార్టీ 13.4శాతం ఓట్లు పొంది 37 స్ధానాలతో పెద్ద పార్టీగా ఎన్నికైంది. .


దేెశంలో జరిగిన అభివృద్ది సామాన్యులకు ఉపయోగపడలేదని, కరోనా సమయంలో పిల్లలు ఇంటి దగ్గర నుంచి చదువుకొనేందుకు అవసరమైన లాప్‌టాప్‌లు, ఇంటర్నెట్‌కు నోచుకోలేకపోయారని పేదలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు నరకాల మాదిరి తయారయ్యాయని విమర్శిస్తున్నారు. గతంలో ఎన్నికైన పది మంది అధ్యక్షులలో ఏడుగురు అవినీతి కేసుల్లో జైలు పాలయ్యారు. గత మూడు సంవత్సరాలలో నలుగురు అధ్యక్షులు మారారంటే రాజకీయ అనిశ్చితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.తీవ్ర మాంద్యం, కరోనా కేసులతో పాటు మరణాల రేటూ ఎక్కువగా ఉంది. కేవలం మూడు కోట్ల 20లక్షల మంది జనాభాలో కరోనా కారణంగా ఇప్పటి వరకు రెండు లక్షల మంది మరణించారు. ప్రపంచంలో ఇది అత్యధిక రేటు. ఇదే సమయంలో పదకొండుశాతం మంది అన్నార్తులు పెరిగారు. చిలీ తరువాత ప్రపంచంలో రాగి ఎగుమతి చేసే రెండవ దేశంగా ఉంది. రాగి ఎగుమతులతో జిడిపిలో పదిశాతం ఆదాయం వస్తోంది.

తుది పోరులో పోటీ బడిన కైయికు ఫుజిమోరి జనానికి పరిచయం అవసరంలేని పేరు. కుట్రతో అధికారానికి వచ్చిన తిరుగుబాటుదారుగా, నియంతగా పేరున్న తండ్రి ఆల్బర్ట్‌ ఫుజిమోరి నుంచి రాజకీయవారసత్వం, ధనికులకు అనుకూల వైఖరితో పాటు, గత రెండు ఎన్నికలలో ఆమె అధ్యక్షపదవికి పోటీ పడ్డారు.2016 ఎన్నికలలో విజయం సాధించిన పెడ్రో పాబ్లోకు ప్రత్యర్ధి కెయికు ఫుజిమోరి మీద కేవలం 42,597 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. తాను గెలిస్తే కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు 2,600 డాలర్ల విలువగల స్ధానిక కరెన్సీ చెల్లిస్తానని, గనుల నుంచి వచ్చే ప్రతిఫలంలో 40శాతం సొమ్ము ఆ ప్రాంత పౌరులకు నేరుగా అందచేస్తానని వాగ్దానం చేశారు. కెయికో ఫుజిమోరీ మాజీ ఎంపీ, అవినీతి కేసులు శిక్ష అనుభవించారు. పాతిక మందిని హత్య చేయించటం, అవినీతి కేసులో పాతిక సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న తన తండ్రిని విడుదల చేస్తానని చెప్పారు. గత ఎన్నికల తరువాత దేశంలో తలెత్తిన రాజకీయ అనిశ్చిత పరిణామాలకు తనను క్షమించాలని వేడుకున్నారు.ఆల్బర్టో ఫూజిమోరి పాలన అవినీతి అక్రమాలు, సంఘటిత నేరాల మయంగా మారింది, పది సంవత్సరాల పాలనలో పాల్పడిన నేరాలకు గాను పాతికేండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆల్బర్ట్‌ కుమార్తె కెయికు నాయకత్వంలోని పార్టీ గత ఐదు సంవత్సరాలలో రాజకీయ అనిశ్చితికి కారకురాలు కావటంతో పాటు అవినీతి కేసులో కెయికు కూడా జైలు శిక్ష అనువించింది.అయితే ధనికులందరూ ఆమె తమ ప్రయోజనాలను కాపాడే సమర్ధురాలనే అభిప్రాయంతో మద్దతుగా నిలిచారు.


వామపక్ష అభ్యర్ధి కాస్టిలో ఒక స్కూలు టీచరు. ఫుజిమోరి హయాంలో రూపొందించిన ప్రజావ్యతిరేక రాజ్యాంగాన్ని తిరిగి రాస్తామని ఆయన వాగ్దానం చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా పెరూలో ధనికులు-పేదల మధ్య అంతరాలు పెరిగాయి. ఎన్నికల్లో కూడా ఇదే సమీకరణ కనిపిస్తోంది.పెరూ ప్రయోజనాలకు విరుద్దమైన వాణిజ్య ఒప్పందాలు, పెట్టుబడులను సమీక్షిస్తామని, గ్యాస్‌ ప్రాజెక్టులను జాతీయం చేయటం వంటి చర్యలు తీసుకుంటామని, లూటీ చేసిన సంపదలను స్వాధీనం చేసుకుంటామని పెరూ విముక్త పార్టీ వాగ్దానం చేసింది. 2007లో తొలుత పెరూ విముక్త రాజకీయ ప్రాంతీయ ఉద్యమంగా ప్రారంభమైంది.2012లో పెరూ విముక్త పార్టీగా ఏర్పడింది.2016లో దీన్ని ఎన్నికల సంఘం దగ్గర నమోదు చేశారు. 2019లో పెరూ విముక్త జాతీయ రాజకీయ పార్టీగా పేరు ఖరారైంది.తమది సోషలిస్టు సంస్ధ అని, తాము మార్క్సిజానికి కట్టుబడి ఉంటామని ఆ పార్టీ ప్రకటించింది.

ఓట్ల లెక్కింపులో తన మెజారిటీ తగ్గటం ప్రారంభం కాగానే కెయికో ఆరోపణల పర్వానికి తెరలేపారు.తనకు పడిన ఓట్లను బయట పడవేశారని, ఫలితాన్ని అంగీకరించేది లేదని ప్రకటించారు. లెక్కింపు సమయంలో ప్రతి ఒక్కరూ జాగరూకులై ఉండాలని అంతకు ముందు కాస్టిలో తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. రెండవ దశ ఎన్నికలకు ముందు ఆయన మీద పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం జరిగింది. గత నెలలో గుర్తు తెలియని సాయుధులు జరిపిన జరిపినదాడిలో నలుగురు పిల్లలతో సహా 16 మంది మరణించారు. దీనికి షైనింగ్‌ పాత్‌ పేరుతో సాయుధ చర్యలకు పాల్పడిన మావోయిస్టు గెరిల్లాల నుంచి విడిపోయిన వారే కారణమని ప్రచారం జరిగింది. ఈ మారణకాండను కాస్టిలో తీవ్రంగా ఖండించారు.
తొలి దశ ఎన్నికల్లో వామపక్ష కాస్టిల్లో ప్రధమ స్ధానంలో నిలవటంతో మీడియాలో, సామాజిక మాధ్యమంలో ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశారు.మావోయిష్టు షైనింగ్‌ పాత్‌ సంస్ధతో సంబంధాలున్నాయని, కమ్యూనిస్టు అని ముద్రవేసి ఓటర్లను భయపెట్టేందుకు ప్రయత్నించారు. వెనెజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురో సంబంధాలు ఉన్నాయని మనం మరో వెనెజులాగా మారవద్దంటూ ధ్వజమెత్తారు. తనపై జరిగిన ప్రచారాన్ని ఖండిస్తూ, కొందరిలో ఉన్న అనుమానాలను తొలగిస్తూ మేం కమ్యూనిస్టులం కాదు, ఛావిస్తాలమూ(వెనెజులా ఛావెజ్‌) కాదు, ఉగ్రవాదులమూ కాదు. మేం కార్మికులం, మీ వంటి వారిమే,మనమందరం వీధుల్లో ఉన్నాం, ప్రశాంతంగా ఉండే వ్యవస్ధ కావాలని కోరుకుంటున్నాం అని ప్రచారంలో చెప్పారు.అంతకు ముందు విముక్త పెరూ పార్టీ నేత కాస్టిలోకు షైనింగ్‌ పాత్‌తో సంబంధాలు ఉన్నాయని, వారి మద్దతుదారులు నాయకులుగా ఉన్న టీచర్స్‌ యూనియన్‌ నాయకత్వంలో నాలుగు సంవత్సరాల క్రితం సమ్మెకు నాయకత్వం వహించాడని మీడియా ప్రచారం చేసింది. తన పదవీకాలం ఐదు సంవత్సరాలు పూర్తయిన తరువాత గ్రామీణ ప్రాంతాలలోని తన పాఠశాలలో తిరిగి బోధన చేస్తానని కాస్టిలో చెప్పాడు.


రాజ్యాంగం ప్రకారం ఒకసారి ఎన్నికయిన తరువాత వెంటనే జరిగే ఎన్నికలో పాల్గొనేనేందుకు అవకాశం లేదు. ఐదు సంవత్సరాల తరువాత తిరిగి పోటీ చేయవచ్చు. పెరూ రాజ్యాంగం ప్రకారం ఐదు సంవత్సరాలకు ప్రత్యక్ష ఎన్నిక జరిగిన తరువాత మరణించినా, ఏకారణంతో అయినా పదవి కోల్పోయినా, రాజీనామా చేసినా తదుపరి ఎవరిని ఎన్నుకోవాలో కూడా నిర్ధిష్టంగా ఉంటుంది, ఆమేరకు వారిని ఎన్నుకోవాలి తప్ప కొత్తగా ఎన్నికలు ఉండవు. అధ్యక్షుడిని అభిశంసించే అధికారం పార్లమెంట్‌కు ఉంది. స్పెయిన్‌ వలస నుంచి విముక్తి పొందిన జూలై 28న ఎన్నికైన ప్రభుత్వం నూతన బాధ్యతలను స్వీకరిస్తుంది. ఇక పెరూలో ఉన్న రాజకీయ అనిశ్చితి విషయానికి వస్తే ఐదు సంవత్సరాల క్రితం పెడ్రో పాబ్లో కుజిన్‌స్కి ఎన్నికయ్యాడు.2018లో రాజీనామా చేయటంతో ఉపాధ్యక్షుడిగా ఉన్న మార్టిన్‌ విజికారా బాధ్యతలు స్వీకరించాడు. అతగాడిని 2020లో అభిశంసించి పదవి నుంచి తొలగించారు. తరువాత పార్లమెంట్‌ స్పీకర్‌ మెరినో బాధ్యతలు స్వీకరించిన వారంలోగానే జనం నిరసన కారణంగా రాజీనామా చేశాడు.తరువాత ఫ్రాన్సిస్కో సగస్తీని పార్లమెంట్‌ ఎన్నుకుంది.


తొలి దశ ఎన్నికలో పోటీపడి గణనీయంగా ఓట్లు సంపాదించిన పార్టీలలో వామపక్ష శక్తులతో పాటు ఫుజిమోరిజంగా వర్ణితమైన మితవాదులను వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు. తుది దశ ఎన్నికల్లో వారంతా కాస్టిలోకు మద్దతు ప్రకటించారు. రాజధాని లిమా, ధనికులుండే పట్టణ ప్రాంతాలలో కైయికు మెజారిటీ సాధించగా పేదలు, గ్రామీణ ప్రాంత ఓటర్లు కాస్టిలోను ఎంచుకున్నారు. రాజకీయాల్లో వామపక్ష శక్తుల పలుకుడి పెరిగినట్లే. రానున్న రోజుల్లో విధానపరమైన మార్పుల కోసం పెరూవియన్లు పెద్ద ఎత్తున ఉద్యమించే అవకాశం ఉంది. లాటిన్‌ అమెరికాలోని అనేక దేశాలలో వామపక్షాల విజయాలను చూసి అనేక మంది తాము కూడా వామపక్ష వాదులమే అనే ముసుగు తగిలించుకొని ప్రజాకర్షక నినాదాలతో రంగంలోకి వచ్చారు. ఆ విధంగా గతంలో పెరూలో అధికారానికి వచ్చిన ఇద్దరు అధ్యక్షులు తాము వామపక్ష వాదులమే అని ప్రకటించుకున్నారు. ఆచరణలో పెట్టుబడిదారుల బంట్లుగా మారారు. వారిలో ఒల్లాంటా హుమలా ఒకడు. 2011నుంచి 2016 వరకు అధికారంలో ఉన్నాడు. నయాఉదారవాద విధానాలను అమలు జరిపి అభాసుపాలయ్యాడు. అవినీతి అక్రమాలకు తరువాత అరెస్టయ్యాడు.తాజా ఎన్నికల్లో తొలిదశలో పోటీ చేసి పదమూడవ స్ధానంలో నిలిచి కేవలం 1.5శాతం ఓట్లు మాత్రమే తెచ్చుకున్నాడు. అనేక దేశాల అనుభవం చూసినపుడు వామపక్ష శక్తులు అధికారంలో ఉండి పెట్టుబడిదారులు, ప్రపంచ ద్రవ్య పెట్టుబడిని వ్యతిరేకించే చర్యలు తీసుకుంటే ఆశక్తుల కుట్రలను ఛేదించేందుకు జనం అవసరమైతే వీధుల్లోకి రావాల్సి ఉంటుందని బొలీవియా, వెనెజులా, చిలీ తదితర దేశాల అనుభవాలు తెలుపుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సరఫరాలు ఆపొద్దు, ధరలు పెంచొద్దని చైనాను కోరిన మోడీ సర్కార్‌ !

14 Friday May 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, Science, UK, USA

≈ 1 Comment

Tags

Big Pharma Vaccine Profits, BJP Propaganda, China's vaccine diplomacy, Narendra Modi Failures, vaccination Policy, Vaccine Nationalism, WHO


ఎం కోటేశ్వరరావు


మన దేశంలో ఆక్సిజన్‌, ఇతర ఔషధాల ధరలు ముఖ్యంగా కరోనా చికిత్సలో వినియోగించే వాటి ధరలు ఎలా పెరుగుతున్నాయో, బ్లాక్‌ మార్కెట్‌ ఎలా ఉందో పదే పదే చెప్పనవసరం లేదు.బాధితులు, వారి బాధలు పంచుకున్నవారందరికీ అనుభవమే. దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్దితిని విధించి ముఖ్యమైన ఔషధాలు,వాక్సిన్లకు కంపల్సరీ లైసెన్సింగ్‌ విధానం కింద అనుమతులు ఇచ్చి అవసరాల మేరకు ఉత్పత్తిని పెంచేందుకు, ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమీ లేవు. ఇదేం పనయ్యా బాబూ అని ఎవరైనా ప్రశ్నిస్తే బిజెపి ప్రతినిధులు ఆరోగ్యం రాష్ట్రాలకు సంబంధించింది అని ఎదురుదాడులకు దిగుతున్నారు. మరోవైపున తొలి దశలో కరోనాను జయించింది తమ ప్రధాని మోడీ అని ఆయన లేకపోతే అదుపుఅయ్యేది కాదని, జనం ప్రాణాలు నిలిచేవి కాదంటూ పాడిన భజన గీతాల సంగతేమిటి, ఇప్పుడు ఇలా తాళం మార్చారేమిటి అని అడిగితే కష్ట కాలంలో సహకరించాల్సింది పోయి దెప్పి పొడుపులు, విమర్శలా అంటూ విరుచుకు పడుతున్నారు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువారు అంటూ సుమతీ శతకకారుడు బహుశా ఇలాంటి వారి గురించే చెప్పి ఉంటాడు.

మన దేశంలో కరోనా వాక్సిన్‌ ధరల మీద కేంద్ర ప్రభుత్వం నియంత్రణ విధించలేదు. కేంద్రానికి ఇచ్చే వాక్సిన్లకు ఒక రేటు, రాష్ట్రాలకు ఇచ్చేదానికి ఒక రేటు, ప్రయివేటు ఆసుపత్రులకు అమ్మేది ఒక రేటు. ఒక వైపు సామాజిక మాధ్యమాలు, సాంప్రదాయ మాధ్యమాల్లో బిజెపి ప్రతినిధులు ఇప్పటికీ చైనా వైరస్‌ అంటూ దాడులు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ జనానికి తెలియాల్సిందేమంటే చైనా వస్తువులను బహిష్కరిస్తాం, చైనాకు బుద్ది చెబుతాం, కాళ్ల దగ్గరకు రప్పిస్తాం అని ఏడాది నుంచి ప్రగల్భాలు పలుకుతున్న వారు తేలు కుట్టిన దొంగల మాదిరి అదే చైనా నుంచి చేసుకుంటున్న దిగుమతుల గురించి మాత్రం మాట్లాడటం లేదు. గుండెలు తీసిన బంట్ల సంగతేమోగానీ అలాంటి వారిని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. కొద్ది రోజుల క్రితం రవాణా విమానాలు ఆపేసి మనలను దెబ్బతీసిందంటూ చైనాను నిందించారు. ఆ సమస్య పరిష్కారం అయిన విషయం మాత్రం జనానికి చెప్పకుండా ఇంకా అదే అభిప్రాయంతో ఉండాలని కోరుకొనే వారు మాత్రమే దాన్ని మూసిపెడతారు.


తాజా విషయానికి వస్తే భారత్‌ దిగుమతి చేసుకొనే వైద్యపరమైన వస్తువుల సరఫరా ఆగకుండా, ధరలు పెరగకుండా చూడండి సారో అని మన దేశం చైనా నాయకత్వాన్ని అభ్యర్ధిస్తున్నది. ఈ సమాచారం కొందరికి మింగుడు పడకపోవచ్చు. నరేంద్రమోడీ విఫల ప్రధాని అంటే మింగుడు పడుతోందా ! ఇదీ అంతే !! నిజం త్వరగా ఎక్కదు. చైనా ప్రత్యేక ప్రాంతంగా ఉన్న హాంకాంగ్‌లోని భారత కాన్సుల్‌ జనరల్‌ ప్రియాంక చౌహాన్‌ అక్కడి నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు పత్రిక విలేకరితో మాట్లాడారు.” చైనా సరఫరా వ్యవస్ద తెరిచే ఉండాలని, ఉత్పత్తుల ధరలు స్ధిరంగా ఉండాలన్నది ఈ దశలో మా ఆకాంక్ష. సరఫరా గిరాకి వత్తిడి కొంత పెరిగినప్పటికీ ఉత్పత్తుల ధరలు స్ధిరంగా, అంచనాకు అందేట్లు ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రభుత్వ స్ధాయిలో కూడా మద్దతు, ప్రయత్నాలు అవసరం. అయితే ఈ విషయంలో చైనా ప్రభుత్వ పలుకుబడి ఎంత ఉంటుందో, ఏమి చేయగలదో నాకు సమాచారం లేదు, అయితే వారు చేయగలరు, అలా చేస్తే మేము స్వాగతిస్తాం ” అని ప్రియాంక చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొన్నది. సూటిగా మన రాజకీయ నాయకత్వం అడిగేందుకు ముఖం చెల్లక తడిక రాయబారం చేశారన్నది స్పష్టం.


మనకు అవసరమైన ముఖ తొడుగులు, పిపిఇ కిట్లు అన్నీ మనమే తయారు చేసుకోగలుగుతున్నట్లు కాషాయ దళాలు ప్రచారం చేస్తున్నాయి. మంచిదే, ఇంతకంటే కావాల్సింది ఏముంది ? మేకిన్‌ ఇండియా కింద గత ఏడు సంవత్సరాలుగా ఇబ్బడి ముబ్బడిగా ప్రపంచానికే వస్తువులను ఎగుమతి చేస్తున్నాము కదా అని పగటి కలలు కంటున్న వారున్నారు. మే 14వ తేదీ హిందూ పత్రిక వార్త వారి కళ్లు తెరిపిస్తుందా ? దాని ప్రకారం మన దేశం చైనా కంపెనీలకు ఏప్రిల్‌ నుంచి 40వేల ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లకు ఆర్డరు పెడితే 21వేలు మనకు వచ్చాయి. వీటితో పాటు ఐదువేల వెంటిలేటర్లు, రెండు కోట్ల పది లక్షల ముఖతొడుగులు( మాస్కులు), 3,800 టన్నుల ఔషధాలు భారత్‌కు ఎగుమతి చేసినట్లు చైనా కస్టమ్స్‌శాఖలో నమోదైనట్లు దానిలో పేర్కొన్నారు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు అని కొట్టి పారవేస్తే చేసేదేమీ లేదు. ప్రచారానికి – వాస్తవానికి ఉన్న తేడాను జనానికి చెప్పేందుకే ఈ విషయాలు తప్ప నరేంద్రమోడీని దెప్పాలని కాదు. ఇప్పటి వరకు విదేశీ పత్రికలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాయి. ప్రభుత్వమే కనపడటం లేదని మన దేశానికి చెందిన అవుట్‌లుక్‌ పత్రిక తాజా ముఖచిత్రంగా ప్రచురించినందున మోడీని వెతికి తెచ్చి ఎక్కడికి పోయారని ప్రశ్నించాలి తప్ప దెప్పి ప్రయోజనం ఏముంది ? ఒక వేళ ప్రశ్నించినా నోరు విప్పుతారా ?

కరోనా మహమ్మారి నుంచి రక్షణకు వినియోగించే వాక్సిన్లకు కొంత కాలం పాటు పేటెంట్‌ హక్కుల అమలు నిలిపివేయాలని ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటివో)లో దక్షిణాఫ్రికా, మన దేశం కూడా ప్రతిపాదించాయని, నరేంద్రమోడీ చొరవ ఎలాంటిదో చూడండి, చివరికి అగ్రరాజ్యం అమెరికా కూడా అంగీకరించింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.(మనకు అవసరమైన వాక్సిన్‌ ముడిపదార్దాలనే ఇచ్చేందుకు అంగీకరించని వారు పేటెంట్ల రద్దుకు అంగీకరిస్తారా ? ) దీనితో పాటు కంపల్సరీ లైసెన్సు విధానం కింద గతంలో నాట్కో కంపెనీకి కాన్సర్‌ ఔషధ తయారికి అనుమతి ఇచ్చినట్లుగా వాక్సిన్లకు సైతం ఇవ్వాలన్న ప్రతిపాదనను ప్రజారోగ్య నిపుణులు, ఆ రంగంలో పని చేస్తున్నవారు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందువలన మన ప్రభుత్వం ప్రపంచ సంస్ధలో అలాంటి ప్రతిపాదన చేయటం మంచిదే, ఎవరు చేసినా అభినందించాల్సిందే. ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు ఏం జరుగుతోంది. ఇదే నరేంద్రమోడీ సర్కార్‌ మే తొమ్మిదవ తేదీన సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో దానికి విరుద్దమైన వాదన చేసింది. సుప్రీం కోర్టు సూచించిన విధంగా కంపల్సరీ లైసెన్సు నిబంధనను ఈ దశలో ఉపయోగిస్తే, మేథోసంపత్తి హక్కుల ఒప్పందానికి విరుద్దంగా చర్యలు తీసుకుంటే ప్రతికూల ఫలితాలు వస్తాయని వాదించింది. ప్రచారం కోసం, జనాన్ని మభ్యపెట్టేందుకు ప్రపంచ వాణిజ్య సంస్దలో ఒక వైఖరి, తన అధికారాన్ని వినియోగించాల్సి వచ్చే సరికి కార్పొరేట్‌ కంపెనీల అనుకూల వాదనలు. ఎంత దగా ! పోనీ ఇప్పటి వరకు సానుకూలంగా వ్యవహరించి నరేంద్రమోడీ సర్కార్‌ సాధించింది ఏమిటి ? కోవిషీల్డ్‌ తయారీకి అవసరమైన ముడి పదార్ధాలు, పరికరాల ఎగుమతులపై అమెరికా ప్రభుత్వం నిషేధం విధించినపుడు దానికి రాని ప్రతికూల ఫలితాలు ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పూనుకుంటే మనకు వస్తాయా ? ఒక వేళ వస్తే ఏమిటి ? మిన్ను విరిగి మీద పడుతుందా ? చైనాకు వ్యతిరేకంగా మనం చతుష్టయం పేరుతో అమెరికాతో జతకట్టి బస్తీమే సవాల్‌ అన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి వారు మనకు అవసరమైన వాటిని అందచేస్తున్నారా లేదా ? అమెరికా ఒక వైపు తమ జనం కోసం యుద్దసమయాల్లో వినియోగించే చట్టాలకు దుమ్ముదులిపి అమలు జరుపుతుంటే దాని భాగస్వామి అని చెప్పుకొనే మనం మన సార్వభౌమ అధికారాన్ని వినియోగించలేనంత దుర్బలంగా ఉన్నామా ? అసలు నరేంద్రమోడీ గారి సమస్య ఏమిటి ? ఇంత విపత్తు వస్తే కనీసం ప్రతిపక్షాలతో అఖిలపక్ష సమావేశం వేసి పరిస్ధితిని వివరించి సలహాలను కోరేందుకు తీరికలేనంతగా ఏం చేస్తున్నట్లు ? కేంద్రం చెబుతున్నట్లు ఆరోగ్య సమస్య రాష్ట్రాలదే అయినపుడు కేంద్రంలో ప్రధాని, ఇతర మంత్రులకు గోళ్లు గిల్లు కుంటూ కూర్చోవటం తప్ప ఇప్పుడు మరొక పనేముంటుంది. తీవ్రత తక్కువ మొదటి దశలో మోడీ చేయించిన పళ్లాలు, గ్లాసుల మోత, దీపాలు వెలిగించటం వంటి చర్యలన్నింటినీ జనం పాటించారుగా, ఇప్పుడు ఆ చొరవ ఏమైనట్లు ? పిచ్చిదో ఎచ్చిదో ఏదో ఒకటి ఎందుకు చేయించటం లేదు ? ఏమీ లేదు, ఎంత హడావుడి చేస్తే అంతగా జనం కేంద్రం వైపు చూస్తారు. ఉచిత వాక్సిన్‌ సరఫరాకే చేతులెత్తేసి అధిక భారాన్ని రాష్ట్రాల మీద నెట్టింది. గతేడాది మాదిరి 27లక్షల కోట్ల ఆత్మనిర్భర వంటి బూటకపు ప్రకటనలు చేస్తే నమ్మే జనం లేరు. అందుకే ప్రజాస్వామ్యబద్దంగా రాష్ట్రాల నిర్ణయానికే వదిలేస్తున్నానంటూ బాధ్యత నుంచి తప్పుకుంటున్నారు.

కోవిషీల్డు లేదా కోవాగ్జిన్‌కు గానీ ప్రయోగాలు పూర్తిగాక ముందే అత్యవసర వినియోగం పేరుతో ముందుగానే అనుమతి ఇచ్చారు. దాదాపు అన్ని దేశాలూ అదే చేశాయి. కోవిషీల్డు మన స్వంత తయారీ కాదు. దాని మాదిరే రష్యా స్పుత్నిక్‌ వాక్సిన్‌ ఉత్పత్తికి రెడ్డీలాబ్స్‌ ఒప్పందం చేసుకుంది. ఈ రెండింటితో పాటు దానికి, ఇతర వాక్సిన్లకు అనుమతి ఇచ్చి ఉంటే ఇప్పుడు తలెత్తిన వాక్సిన్‌ గిరాకీని సులభంగా అధిగమించి ఉండేవారం కదా ? రెండు కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనం కాపాడేందుకు చూపిన శ్రద్ద వేగంగా వాక్సిన్‌ తయారీ మీద ఎందుకు లేకపోయింది. మొదటి డోసు తీసుకున్న తరువాత నెల రోజుల్లోగా రెండవ డోసు తీసుకోవాలని చెప్పింది ప్రభుత్వమూ, నిపుణులే. ఇప్పుడున్న నెలన్నర – రెండు నెలల వ్యవధిని పొడిగించి మూడు నుంచి నాలుగు నెలల్లోపు కోవిషీల్డు తీసుకోవచ్చు అంటున్నారు. జనం దేన్ని నమ్మాలి ?
ప్రపంచంలో 184 వాక్సిన్లను జంతువుల మీద ప్రయోగించి పరిశీలిస్తున్నారు. ఆరోగ్యవంతులైన యువతీయువకుల మీద 32 వాక్సిన్లు మొదటి దశ ప్రయోగంలోనూ, 35 వాక్సిన్లు వివిధ తరగతుల మీద రెండవ దశ, 25వాక్సిన్ల ప్రభావం గురించి మూడవ దశ ప్రయోగాలు జరుగుతున్నాయి. పద్నాలుగు వాక్సిన్లను వినియోగిస్తున్నారు. అవన్నీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్ధ అనుమతి పొందినవే. ఎవరు ముందుకు వస్తే వాటి తయారీకి మన దేశం ఆహ్వానించి ఉంటే వెంటనే అన్ని వయస్సుల వారికి వాక్సిన్‌ పూర్తయ్యేది, రోజుకు నాలుగువేల మరణాలు తప్పి ఉండేవి కదా ? ఎందుకు ఇవ్వలేదు ?
ఔషధాల తయారీలో మన దేశం పురోగమించిన మాట వాస్తవం. అది చైనా కంటే ఎక్కువ అని కొందరు అనుకుంటారు, అనుకోనివ్వండి మనకు ఇబ్బంది లేదు. మన ఔషధ పరిశ్రమలకు అవసరమైన ముడి సరకు పూర్తిగా లేదా పాక్షికంగా తయారైన వాటిని మన ఫార్మారంగం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్న పచ్చినిజం తెలిసిందే. ఇప్పుడు చైనా నుంచి మన దేశం అత్యవసర ఔషధాలను తెచ్చుకుంటున్నది దానికి లేని అభ్యంతరం తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్ద ఆమోదించిన చైనా వాక్సిన్‌ తెచ్చుకొనేందుకు, జనం ప్రాణాలను కాపాడేందుకు ఇబ్బంది ఏమిటి ? చైనా వాక్సిన్లు అంతగా పని చేయవని ఆ దేశ నిపుణులే చెప్పారని కట్టుకధలు ప్రచారం చేశారు. చైనాలో ఏటా ఐదు వందల కోట్ల డోసులను ఉత్పత్తి చేయగల సామర్ధ్యం ఉంది. మన దేశంలో ఐసిఎంఆర్‌తో కలసి భారత బయోటెక్‌ తయారు చేసిన కోవాగ్జిన్‌ పూర్తిగా వినియోగ అనుమతి మన దేశంలోనే ఉంది. మరో 14 దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతించారు. ఇదే సమయంలో చైనాలో తయారైన నాలుగు వాక్సిన్లలో ఒకటైన సినో ఫార్మ నాలుగు దేశాల్లో పూర్తి వినియోగం 50 దేశాల్లో అత్యవసర అనుమతి పొందింది. మరొకటి కరోనా వాక్సిన్‌ పూర్తి వినియోగం చైనాలో, మరో 35దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందింది. మరో రెండు పరిమితంగా అనుమతి పొందాయి. అందువలన మన దేశం వాక్సిన్ల రంగంలో ముందుంది అని చెప్పుకోవటం అతిశయోక్తి తప్ప మరొకటి కాదు.


నరేంద్రమోడీ ప్రపంచ ఫార్మా కంపెనీలను దెబ్బతీసినందున అవన్నీ కక్ష కట్టాయంటూ ఆయన భక్తులు మహిమలను అంటగట్టి ప్రచారం చేస్తున్నారు. మన దేశంలో తయారయ్యే వాక్సిన్లు మన అవసరాలకే సరిపోని స్ధితి కళ్ల ముందు కనిపిస్తుంటే ఇలాంటి అతిశయోక్తులను చూసి నవ్వాలో ఏడవాలో అర్ధం కాదు. ఆపని చేసింది చైనా అన్నది పచ్చి నిజం. వాక్సిన్‌ మానవ హక్కు. ఎవరు జాతీయ వాదంతో సంకుచితంగా వ్యవహరిస్తున్నారు, ఎవరు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారో ప్రపంచం చూస్తూనే ఉంది. ఏప్రిల్‌ 25 నాటికి చైనా 41.5 కోట్ల డోసులను ఉత్పత్తి చేసి 20 కోట్ల డోసులను ఎగుమతి చేసి మిగిలిన దాన్ని తన దగ్గర ఉంచుకుంది. అమెరికా 26.8 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి మొత్తం అంతర్గత వినియోగానికి ఉంచుకుంది. బ్రిటన్‌ కూడా అదే మాదిరి 2.3 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి మొత్తం ఉంచుకుంది. ఐరోపా యూనియన్‌ 22 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి తొమ్మిది కోట్ల డోసులు ఎగుమతి చేసి మిగిలింది తన సభ్య దేశాలకు వినియోగించింది. మన దేశం 19.6 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి పన్నెండున్నర కోట్ల డోసులు మన దేశంలో వినియోగించి మిగతాది ఎగుమతి చేసింది. ఇప్పటి వరకు ఎవరు ప్రపంచ ఫార్మాను దెబ్బతీసినట్లు ? ఎవరు ప్రపంచాన్ని ఆదుకొనేందుకు ముందుకు వచ్చినట్లు ? నేడు ఆంగ్లో-శాక్జన్‌ (అమెరికా-బ్రిటన్‌) దేశాలు వాక్సిన్ల తయారీకి అవసరమైన ముడిపదార్దాలను దాచివేస్తున్నాయని కడుపు మండిన ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ వ్యాఖ్యానించాడు. మన ప్రధాని నరేంద్రమోడికి నోరు పెగల్లేదు.


చైనా వాక్సిన్‌ సినోఫార్మకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ అనుమతి ఇవ్వటంతో ఇప్పుడు పెద్ద ఎత్తున వాక్సిన్‌ పేద దేశాలకు అందేందుకు వీలు కలిగింది. త్వరలో చైనా మరో వాక్సిన్‌ సిన్‌వాక్‌ కూడా అనుమతి రాబోతున్నదని వార్తలు. మన కోవాగ్జిన్‌కు ఇంకా రాలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్ధలోని సభ్య దేశాలలో 192 కోవాక్స్‌ పేరుతో వాక్సిన్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ప్రాంతాలకు 2021 చివరి నాటికి 200 కోట్ల డోసుల వాక్సిన్‌ అందించాలన్నది లక్ష్యం. ఇప్పటి వరకు కోవాక్స్‌ పధకంలో భాగంగా 5.4 కోట్ల డోసులను 121 దేశాలకు అందించింది. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో వాక్సిన్ల ద్వారా ఫైజర్‌ కంపెనీ 350 కోట్ల డాలర్లు సంపాదించింది. మోడెర్నా కంపెనీ ఏడాదిలో 1900 కోట్ల డాలర్లను సంపాదించనుందని అంచనా. కార్పొరేట్‌ కంపెనీల లాభాల కోసం మహమ్మారిని దీర్ఘకాలం పొడిగిస్తున్నారా ? అంటూ ప్రపంచబ్యాంకు మాజీ అధిపతి, ఆర్ధికవేత్త జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ మరొకరితో కలసి రాసిన వ్యాసంలో ప్రశ్నించారు. ఫైజర్‌, మోడెర్నా కంపెనీలు ఎంఆర్‌ఎన్‌ఏ వాక్సిన్ల తయారీలో గుత్తాధిపత్యం వహిస్తున్నాయి. వాటి తయారీకి ఇతరులను అనుమతించటం లేదు. ఎంతకాలం వీలైతే అంతకాలం మహమ్మారిని పొడిగించి సొమ్ము చేసుకోవాలన్నది వాటి ఎత్తుగడ. వైరస్‌ కొత్త రూపం సంతరించుకుంటున్న కారణంగా వాటికి అవసరమైన వాక్సిన్ల కోసం తమ వనరులను పదిలపరచుకోవాలని పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయన్నది స్పష్టం. కోవాక్స్‌ పధకానికి కోటి డోసులు ఉచితంగా సమకూర్చుతామని చైనా ఇప్పటికే వాగ్దానం చేసింది. వాక్సిన్‌తో పని లేకుండానే వైరస్‌ను అదుపు చేసిన చైనా పెద్ద ఎత్తునవాక్సిన్‌ తయారు చేస్తూ అత్యవసరమైన ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నది. మరోవైపు తన జనానికి తాపీగా వాక్సిన్‌ వేస్తున్నది. మరోవైపు దాని ఉత్పత్తిలో సగం కంటే తక్కువ ఉన్న మనం దేశం చైనా కంటే వేగంగా వాక్సిన్‌ వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది.


మన దేశంలో ఆగస్టు -డిసెంబరు నాటికి మొత్తం 216 కోట్ల డోసుల వాక్సిన్‌ అందుబాటులోకి రానున్నదని నీతి ఆయోగ్‌ సభ్యుడు వికె పాల్‌ చెప్పారు. ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీలు కూడ అత్యవసర వినియోగం కింద తయారీకి దరఖాస్తు చేసుకోవాలని కోరినట్లు పాల్‌ తెలిపారు. ఆయన చెప్పినట్లు, అనుకున్నట్లు సవ్యంగా జరిగితే డిసెంబరు నాటికి గాని మన జనాభాకు వాక్సిన్‌ వేసే అవకాశం లేదు. కొందరు చెబుతున్నట్లు ప్రతివారికీ బూస్టర్‌ మూడో డోసు వేయాల్సి వస్తే , మూడో తరంగంలో వస్తుందని చెబుతున్న కొత్త వైరస్‌కు పాత వాక్సిన్లు పనికి రాకపోతే పరిస్ధితి ఏమిటి ? చైనా వాక్సిన్‌ సిన్‌ఫార్మకు అనుమతి ఇస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్ధ చేసిన ప్రకటనలో చైనా మరో 15వాక్సిన్ల తయారీ పురోగమనంలో ఉన్నట్లు తెలిపింది. వాక్సిన్ల తయారీలో చైనా – రష్యా సహకరించుకోనున్నాయి. మరి మనం ఎక్కడ ? అది ఉత్పత్తి కావచ్చు, వాక్సిన్‌ దౌత్యం కావచ్చు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కూలిన చైనా రాకెట్‌ – పతనమైన అమెరికా స్కైలాబ్‌ !

12 Wednesday May 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, Science, UK

≈ Leave a comment

Tags

Long March-5B Y2, NASA, skylab failure, US anti China Propaganda


ఎం కోటేశ్వరరావు


అదుపు తప్పిన చైనా రాకెట్‌ గురించి మీడియా వర్ణనలతో ఎవరికి వారు తమమీదే పడబోతోందని భయపడిపోయిన వారున్నారు. అలాంటిదేమీ లేకుండానే భూతలంలోకి రాగానే మండిపోగా మిగిలిన శకలాలు ఏమైనా ఉంటే మాల్దీవుల సమీపంలోని అరేబియా సముద్రంలో పడ్డాయి. జనం ఊపిరి పీల్చుకున్నారు. ప్రపంచంలో అనేక దేశాలు జరిపిన రాకెట్‌ ప్రయోగాలు విఫలమై కూలిపోయిన ఉదంతాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి చైనా రాకెట్‌. విఫలమైన రాకెట్‌ గమనాన్ని పర్యవేక్షిస్తున్న చైనా శాస్త్రవేత్తలు చెప్పక ముందే అమెరికా వారు దాన్ని రచ్చ చేశారు. కూలిపోక ముందే ఫలానా చోట పడింది, ఇవిగో ఫొటోలంటూ కుహనా వార్తలను ప్రచారంలో పెట్టారు. చైనా బాధ్యతా రహితంగా వ్యవహరించిందని, శకలాలు ఎక్కడ పడతాయో ఏ ముప్పు సంభవిస్తుందో అన్నట్లుగా నానా యాగీ చేశారు. అసలే కోతి, పైగా కల్లుతాగింది అన్నట్లుగా రాకెట్‌ చైనాది, చెప్పింది అమెరికా, రెచ్చిపోవటానికి మన మీడియాకు అంతకంటే కావాల్సిందేముంది. అంతరిక్ష ప్రయోగాల్లో ఆరుదశాబ్దాల అనుభవంలో రాకెట్లు కూలిన ఉదంతాలు అంత తీవ్రమైనవి కాదని తెలిసిన శాస్త్రవేత్తలు కూడా నోరు మూసుకొని తప్పుడు ప్రచారానికి ఊతమిచ్చారు.


తయాన్హీ అంతరిక్ష కేంద్ర నిర్మాణంలో భాగంగా అవసరమైన పరికరాలను మోసుకు పోయి క్షక్ష్యలో ప్రవేశపెట్టే లాంగ్‌ మార్చ్‌-5బి వై2 వాహక నౌక(రాకెట్‌)ను ఏప్రిల్‌ 29న చైనా ప్రయోగించింది. దానికి అమర్చిన వాటిని నిర్ణీత సమయంలో కక్ష్యలో ప్రవేశపెట్టటాన్ని బట్టి దాని విస్వసనీయత సరైనదే అని రుజువైంది. తిరిగి వచ్చే క్రమంలో చోదన ( ప్రొపల్షన్‌ ) వ్యవస్ధ విఫలమైంది, దాన్నే అదుపు తప్పటంగా పరిగణించారు. దాని గమనం, అదే విధంగా ఎక్కడ భూమిని చేరనుందనే అంశాలకు సంబంధించి చైనా చెప్పినట్లుగానే మే తొమ్మిదవ తేదీ అది గాలిలో మండగా, అవశేషాలు సముద్రంలో పడ్డాయి.
సాధారణమైన అంశాన్ని అమెరికా ఎందుకు ఇంత రచ్చ చేసింది ? ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేవు. మరో పది సంవత్సరాలలో ఆర్ధికంగా అమెరికాను వెనక్కు నెట్టేసి చైనా ప్రధమ స్ధానంలో ఉండబోతున్నది. అన్నింటికీ మించి ఆధునిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవటంలో వేగంగా దూసుకుపోతోంది. ఇలా చైనా ప్రతి అడుగునూ ప్రపంచానికి ముప్పుగా చూపేందుకు, కుట్ర సిద్దాంతాలను జనం మెదళ్లలో చొప్పించేందుకు అడుగడుగునా అమెరికా ప్రయత్నిస్తోంది. తాజా ఉదంతం దానిలో భాగమే అని చెప్పవచ్చు. ఇది ఒక్క చైనాకే అనుకుంటే పొరబాటు మన దేశం ఆ స్ధితిలో ఉన్నా అదే చేస్తుంది. రాకెట్లు భూ తలంలోకి వచ్చేటపుడు జరిగేదేమిటో సామాన్యులకంటే శాస్త్రవేత్తలకే బాగా తెలుసు. అమెరికన్లు తప్ప మిగిలిన అంతరిక్ష అగ్రరాజ్యాలేవీ రచ్చ చేయలేదు. అంతరిక్ష ప్రయోగశాలను చైనా నిర్మించటం అంటే ఆ రంగంలో అమెరికా, రష్యా సరసన చేరినట్లే. అందుకే నిష్పాక్షికంగా పరిశీలించే వారు పశ్చిమ దేశాలు ఈ కార్యక్రమాన్ని దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తున్నారు, ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తున్నట్లు విమర్శిస్తున్నారు. శకలాలతో జరిగే హాని పెద్దగా ఉండదని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ దాన్ని బూతద్దంలో చూపి ఒక దోషిగా చూపేందుకు ప్రయత్నించారు. దీనికి నాసాతో పాటు అమెరికా రక్షణశాఖ, మీడియా అన్నీ కలసి ప్రచారదాడి చేశాయి.చైనా రాకెట్‌ శకలాలు ఐవరీ కోస్ట్‌లోని రెండు గ్రామాల మీద పడ్డాయని కొన్ని పత్రికలు రాశాయి. వాటి మీద చైనా గుర్తులున్నాయని కూడా పేర్కొన్నాయి. ఇవిగో ఫొటోలంటూ ప్రచురించాయి. అవన్నీ తప్పుడు కధనాలని తేలిపోయింది.


అంతరిక్ష ప్రయోగాల శకలాల సమస్య చైనా ఒక్కదానితోనే తలెత్తింది కాదు, ఆ రంగంలో ప్రయోగాలు నిర్వహించే ప్రతిదేశమూ ఎదుర్కొంటున్నదే. సాంకేతిక పరమైనదానిని రాజకీయం చేయటం, జనాన్ని భయపెట్టేందుకు వినియోగించటమే గర్హనీయం. ప్రతి రాకెట్‌ ప్రయోగంలోనూ విజయవంతం చేయటంతో పాటు విఫలమైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ శాస్త్రవేత్తలు పాటిస్తారు. పశ్చిమ దేశాలు ముఖ్యంగా అమెరికా సంస్ధ నాసా, మిలిటరీ చైనా రాకెట్‌ జాడను వెంబడించటం మిలిటరీ కోణాన్ని వెల్లడించింది. ఒక క్షిపణి వ్యతిరేక కార్యక్రమ శిక్షణగా అవి పరిగణించాయంటే అతిశయోక్తి కాదు. అయితే ఆ రంగంలో ప్రావీణ్యత ఉన్న ఏదేశమైనా అదే చేస్తుంది.
తియాన్‌హి అంతరిక్ష కేంద్ర కేంద్ర నిర్మాణంలో తొలి కీలక పరికరాలను లాంగ్‌ మార్చ్‌ మోసుకుపోయింది. గతంలో ప్రకటించిన దాని ప్రకారం రానున్న రెండు సంవత్సరాలలో మరో పది రాకెట్‌ ప్రయోగాల ద్వారా అవసరమైన అన్నింటినీ సమకూర్చిన తరువాత 2022 నాటికి అది పని చేయటం ప్రారంభిస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం 2024లో పని చాలించనుంది. ఆ తరువాత విదేశీ భాగస్వాములకు అవకాశమిచ్చే అంతరిక్ష కేంద్రం తియాన్‌హి అని భావిస్తున్నారు. అమెరికా, ఐరోపా పశ్చిమ దేశాలకు ఈర్ష్య పుట్టిస్తున్న అంశమిదే. అంతరిక్ష రంగంలో చైనా అభివృద్ధిని అవి సహించలేకపోతున్నాయి.


ఇతర దేశాల రాకెట్లు కూలిపోలేదా ? చైనా రాకెట్‌ కూలిపోవటాన్ని ప్రమాదకరంగా వర్ణించిన వారు మార్చి నెల 26వ తేదీన కూలిపోయిన అమెరికా ఫాల్కన్‌ 9 రాకెట్‌ గురించి మాట్లాడలేదేం ? వాషింగ్టన్‌ రాష్ట్రంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో దాని శకలాలు పడ్డాయి. అది ఒక తోక చుక్క మాదిరి వెలుగులతో భూమిని తాకినట్లు ఎపి వార్తా సంస్ధ వర్ణించింది. కొందరికి అది ఎగిరే పళ్లాల మాదిరి అనిపించిందట. అదే జనావాసాల మీద పడి ఉంటే ఏమై ఉండేదన్న ఆందోళన, దానికి అనుగుణ్యమైన హెచ్చరికను కూడా అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించలేదు.

నాలుగు దశాబ్దాల క్రితం అమెరికా అంతరిక్ష కేంద్రం స్కైలాబ్‌ పతనమై కూలిపోయిన ఉదంతాన్ని ఇక్కడ ప్రస్తావించటం అవసరం. దాని గురించి నాటి పత్రికల్లో అల్లిన కథనాలు చదివి తెలుగు జనాలు ఎంత ఆందోళనకు గురయ్యారో నాటి తరాలకు తెలిసిందే. అది ఎంత ప్రాచుర్యం పొందిందంటే కొంత మంది తమ పిల్లలకు స్కైలాబ్‌ అని పేరు పెట్టుకున్నారు. సాధారణంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి దాని గడువు మీరిపోయిన తరువాత తిరిగి భూమికి తెచ్చే విధంగా రూపొందిస్తారు. దీర్ఘకాలం అంతరిక్షంలో బరువు కోల్పోయే మానవ శరీరాల మీద పడే ప్రభావం వంటి అనేక అంశాలను పరిశోధించేందుకు 77 టన్నుల బరువుగల స్కైలాబ్‌ను రూపొందించారు. తొమ్మిది సంవత్సరాల పాటు పని చేయించాలని నిర్ణయించి 1973లో ఏర్పాటు చేశారు. అయితే 1978 చివరిలో లోపాలు తలెత్తాయి. ఇలాంటి పరిస్ధితుల్లో దాన్ని సురక్షితంగా కిందికి దించటం ఎలా అనే అంశాన్ని నాసా శాస్త్రవేత్తలు రూపొందించిన సమయంలోనే పట్టించుకోని కారణంగా అది పతనం అవుతోందని గ్రహించారు. అయితే జనం ఆందోళన చెందటంతో దాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టి ఐదు సంవత్సరాల పాటు తిరిగేట్లు చేస్తామని, తరువాత అది అలా తిరుగుతూనే ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే అదేమీ జరగలేదు. 1979 జూలై 11న దాని బూస్టర్‌ రాకెట్లను పేల్చివేసి కూలిపోయేట్లు చేశారు. ఆస్ట్రేలియా, హిందూ మహా సముద్ర ప్రాంతంలో కూలిపోవచ్చని ఊహించారు. దాంతో మీడియాలో అనేక కధనాలు వచ్చాయి. చివరకు అనేక భాగాలు సముద్రంలో పడిపోగా కొన్ని పశ్చిమ ఆస్ట్రేలియాలోని జనావాసాల్లో పడ్డాయి ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు.
సరిగ్గా అదే సమయంలో అమెరికా ఆర్ధిక వ్యవస్ధ గిడసబారింది, చమురు సంక్షోభం తలెత్తింది. జనానికి ప్రభుత్వం, పార్లమెంట్‌ మీద విశ్వాసం సన్నగిల్లింది. స్కైలాబ్‌ కూలిపోనుందనే వార్తలు రావటంతో ప్రభుత్వాన్ని అపహాస్యం చేయటం ప్రారంభించారు. కొందరు దాన్ని కూడా సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించారు. దేశమంతటా స్కైలాబ్‌ విందులు జరుపుకున్నారు. వాటిలో పాల్గొవారి మీద స్కైలాబ్‌ శకలాలు పడితే తలలు పగలకుండా గట్టి హెల్మెట్లు పెట్టుకురావాలని నిబంధనలు పెట్టారు. కొన్ని హౌటళ్లయితే ఇదిగో ఈ ప్రాంతంలోనే శకలాలు పడతాయంటూ ప్రత్యేకంగా గుర్తించి ఆ ప్రాంతం చుట్టూ విందులు ఏర్పాటు చేశాయి. టీషర్టులను అమ్మారు. కొన్ని పత్రికలయితే అపహాస్యం చేస్తూ స్కైలాబ్‌ బీమా గురించి ప్రకటించాయి. శకలాలు పడి ఎవరైనా గాయపడినా, మరణించినా 72 గంటల్లోగా చెబితే పదివేల డాలర్లు చెల్లిస్తామని ఒక పత్రిక ప్రకటించింది. శకలాలు ఎప్పుడు, ఎక్కడ పడతాయో నాసా చెప్పలేకపోయింది. ఆస్ట్రేలియా-హిందూ మహాసముద్రం మధ్య 7,400 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఎక్కడైనా పడవచ్చని పేర్కొన్నది. ఆ ప్రాంతం వెలుపల ఉన్న దేశాల వారు చివరికి ఐరోపా వారు కూడా ఎక్కడ తమ మీద పడతాయో అని అందోళన చెందారు. 1978లో సోవియట్‌ ఉపగ్రహం ఉత్తర కెనడా ప్రాంతంలో కూలిపోవటంతో స్కైలాబ్‌ కూడా ఇదే విధంగా కూలిపోనుందని జనం భయపడ్డారు.1979 జూలై పదకొండున స్కైలాబ్‌ కూలిపోనుందని ప్రకటించటంతో ఇంగ్లండ్‌లోని కొందరు డీవన్‌ ప్రాంతంలోని ఒక గుహలోకి వెళ్లి కూర్చున్నారు. బెల్జియంలో శకలాలు పడతాయనే భయంతో అక్కడి ప్రభుత్వం యుద్ద సమయంలో వైమానిక దాడుల గురించి హెచ్చరిస్తూ మోగించే 1250 సైరన్లను సిద్దం చేసుకుంది.

1995 జనవరి పదిహేనున రష్యా తయారు చేసిన ఒక ఉపగ్రహాన్ని జపాన్‌ రాకెట్‌తో అంతరిక్షంలో ప్రవేశపెట్టారు.దానికి జర్మనీ సాంకేతిక పరికరాలను అందించింది. తీరా అది ఏమైందో తెలియకుండా పోయింది. అందరూ కక్ష్యలోకి వెళ్లిందనుకున్నారు. అది నిర్ధారణగాకపోవటంతో భూమీ మీద పడిందని భావించారు గాని ఎక్కడ పడిందో తెలియలేదు.తరువాత కొంత కాలానికి ఆఫ్రికాలోని ఘనాలో ఉపగ్రహంలోని కాప్సూల్‌ దొరికింది. దానికి అమర్చిన పారాచూట్‌తో కింద పడింది. దాన్నుంచి సంకేతాలు పంపినా ఎవరూ గ్రహించలేకపోయారు. ఒక స్కూలు టీచరు దాన్ని గుర్తు పట్టి ఒక రూములో భద్రపరిచాడు. కొన్ని నెలల తరువాత అది లండన్‌ చేరింది. 2003 ఫిబ్రవరి ఒకటవ తేదీన అమెరికా కు చెందిన కొలంబియా స్పేస్‌ షటిల్‌ కూలిపోయి ఏడుగురు వ్యోమగాములు మరణించారు. 1967 జనవరిలో అమెరికా ఉపగ్రహం అపోలో 1 పేలిపోయి ముగ్గురు వ్యోమగాములు మరణించారు.అదే ఏడాది ఏప్రిల్‌లో సోవియట్‌ తొలి వ్యోమగామి కొమరోవ్‌ భూమికి తిరిగి వస్తూ పారాచూట్‌ విఫలం కావటంతో మరణించాడు.1971 జూలైలో 24 రోజుల పాటు అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో గడిపి తిరిగి వస్తూ ముగ్గురు సోవియట్‌ వ్యోమగాములు మరణించారు.1986 జనవరి 28న కేప్‌ కేనరవాల్‌ నుంచి ప్రయోగించిన 72 సెకండ్లలోనే ఛాలెంజర్‌ స్పేస్‌ షటిల్‌ పేలిపోయి ఒక స్కూలు టీచరుతో సహా ఏడుగురు వ్యోమగాములు మరణించారు.అదే ఏడాది ఏప్రిల్‌ 18న కాలిఫోర్నియా నుంచి ప్రయోగించిన ఒక మిలిటరీ ఉపగ్రహం పేలిపోయింది. మే మూడవ తేదీన కేప్‌ కేనరవాల్‌ నుంచి ప్రయోగించిన డెల్టా రాకెట్‌ పేలిపోయింది. 1990 ఫిబ్రవరి 22న పశ్చిమ ఐరోపాకు చెందిన ఏరియానె 36వ రాకెట్‌ ఫ్రెంచి గుయానాలో ప్రయోగించిన రెండు నిమిషాలకు పేలిపోయింది.ఇలా ఎన్నో ఉదంతాలను పేర్కొన వచ్చు.


ఈ సందర్భాలలో అవన్నీ ఆయా దేశాల బాధ్యతా రాహిత్యమూ, ప్రమాణాలను పాటించలేదు, ఎంత ప్రమాదమో చూడండంటూ చైనా రాకెట్‌ వైఫల్యం గురించి చిత్రించిన కధనాలు వెలువడలేదు, ఎందుకంటే అవన్నీ ప్రమాదాలు. ఫుకుషిమా అణు కేంద్రంలో జరిగిన ప్రమాదం కారణంగా కలుషితమైన జలాలను సముద్రంలోకి విడుదల చేయనున్నట్లు జపాన్‌ ప్రకటించగానే ప్రపంచం గగ్గోలు పెట్టింది. ఆ చర్యకు అమెరికా మద్దతు పలికిగింది. వివాదాస్పదమూ, ప్రమాదకరమైన ఆ చర్యను సమర్ధించటానికి కారణం జపాన్‌ మిత్రపక్షం. అలాంటి ప్రమాదాలేమీ లేని చైనా రాకెట్‌ పతనం గురించి పెడబొబ్బలు పెట్టటం చైనాతో ఉన్న శతృత్వం తప్ప మరొకటి కాదు. చైనాతో ఆరోగ్యకరమైన ఆర్ధిక విధానాలతో తలపడటానికి అమెరికాతో అన్ని దేశాలకు అవకాశాలు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి అక్కసుతో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటం ద్వారా ఎవరి నిజ స్వరూపం ఏమిటో, చిత్తశుద్ది ఏమిటో స్పష్టం అవుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మరోసారి మీడియా, కాషాయ దళాల చైనా వ్యతిరేక ప్రచారం- వాస్తవాలు !

01 Saturday May 2021

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti China Propaganda, Narendra Modi Failures, RSS Outfits anti china, vaccine controversy, Vaccine Nationalism


ఎం కోటేశ్వరరావు


మరోసారి మీడియా – కాషాయ దళాలు ప్రచారదాడితో రెచ్చిపోతున్నాయి. ఎవరెంత సమర్దవంతంగా జనాన్ని పక్కదారి పట్టించగలమో చూద్దాం అన్నట్లుగా మిత్రులుగా పోటీ పడుతున్నాయి. నరేంద్రమోడీ వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు ప్రతిసారీ వాటికి ఏదో ఒక అంశం, బకరాలు కావాలి. కరోనా రెండవ దశను ఊహించటంలో వైఫల్యం, అలక్ష్యం, అసమర్ధ నిర్వహణ ఒకటేమిటి ? వందకు ఒకటైనా ప్రతికూల వార్తకు చోటు కల్పించకపోతే ” చాల బాగోదు ” కనుక బాధ్యత ఎవరిది అనే అంశాన్ని తెలివిగా పక్కన పెట్టి సమస్య తీవ్రతను ప్రతిబింబించక మీడియాకు తప్పని స్ధితి. కాషాయ దళాల ఆరాధ్య దైవం గోబెల్స్‌. రాముడికైనా విరామం ఇస్తారేమో గానీ ఆయనకు రోజూ అబద్దాల నైవేద్యం పెట్టటం మానరు. ఎవరైనా నిజాలు చెప్పటంలో పోటీ పడితే మంచిదే. కానీ జరుగుతోందేమిటి ?


వద్దంటున్నా అనుమతించిన ఉత్తరాఖండ్‌ కుంభమేళా ( మనం పుష్కరాలు అంటాం) గంగలో మునిగిన వారు కరోనాను ఎలా వ్యాప్తి చేస్తున్నారన్నదాన్ని గురించి చెప్పటంలో వాటి మధ్య పోటీ లేదు. గతంలో తబ్లిగీ సమావేశాల సందర్భంగా చేసిన రచ్చ ఊసేలేకుండా జాగ్రత్త పడుతున్నాయి. జనవరి 14 నుంచి ఏప్రిల్‌ 27 వరకు 91లక్షల మంది గంగలో మునిగారని, ఒక్క ఏప్రిల్లోనే 60లక్షల మందని ప్రభుత్వ నివేదికలో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఉత్తరాఖండ్‌లో మార్చి 31న కేవలం 1,862 కేసులుండగా ఏప్రిల్‌ 24 నాటికి 33,330 పెరిగినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ రాసింది. దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఎంత మందికి అంటించారో తెలియదు. దేశాన్ని వస్తు ఉత్పత్తి కేంద్రంగా మార్చి యావత్‌ ప్రపంచానికే ఎగుమతులు చేస్తామని చెప్పిన వారు స్వంత జన ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన ఆక్సిజన్‌ ఉత్పిత్తి, పంపిణీ చేయటంలో కూడా ఎందుకు విఫలమయ్యారో, విదేశీ సాయం కోసం ఎదురు చూడాల్సిన అగత్యం గురించి చెప్పటం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే రామాయణం రంకు-భారతం బొంకు అన్న ఇతిహాసాలలోని అధ్యాయాలను మించిపోతాయి. రాబోయే రోజుల్లో వాటి గురించి ఎలాగూ చెప్పుకుంటాం గనుక అసలు విషయానికి వద్దాం.

ఆవులు, ఎద్దులు, దున్నలు, గేదెల వంటి జీవులు ఆహారం దొరకగానే ఆబగా కొద్దిగా నమిలి తింటాయి. తరువాత తీరికగా నోట్లోకి తెచ్చుకొని పూర్తిగా నమిలి మింగుతాయి, దీన్నే నెమరు వేసుకోవటం అంటారు. మనుషులు అలా చేసేందుకు అవకాశం లేదు గానీ జరిగిన అంశాలను తిరిగి జ్ఞప్తికి తెచ్చుకొని నెమరు వేసుకోవచ్చు. గత రెండు నెలల కాలంలో జరిగిన కొన్ని ముఖ్య పరిణామాల గురించి ఒక్కసారి చూద్దాం. ఏప్రిల్‌ 28నాటికి అమెరికాలో పది కోట్ల మందికి పూర్తిగా వాక్సిన్‌ వేశారు, మరో 23 కోట్ల మందికి ఒక డోసు వేశారు.వివిధ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం అమెరికాలో 80 కోట్ల డోసులు అందుబాటులోకి రానుంది. జనాభా అంతటికీ వేసిన తరువాత కూడా పది కోట్ల డోసుల వరకు అదనంగా ఉంటుంది. అయినా అదేమిటో డబ్బు చెల్లిస్తామురా నా ప్రియమైన ఒకే మంచం ఒకే కంచం దోస్తూ అని మన దేశం రెండు నెలల నుంచి మొత్తుకుంటున్నా కోవిషీల్డ్‌ వాక్సిన్‌ తయారీకి అవసరమైన 37 రకాల ముడి పదార్దాలు, పరికరాలను విక్రయించేందుకు కొద్ది రోజుల క్రితం అంగీకరించాం అన్న ప్రకటన తప్ప ఇంతవరకు (మే 1 ) పంపిన దాఖలా లేదు. ఇది కూడా పాక్షిక సడలింపు మాత్రమే అని చెబుతున్నారు.


గతేడాది జరిగిన పరిణామాల నేపధ్యంలో మొత్తంగా మీడియా లేదా పూర్తిగా కాషాయ దళాలుగానీ చైనాను దోస్తుగా పరిగణించటం లేదు. యాప్‌లను నిషేధించారు, అక్కడి నుంచి పెట్టుబడులను ఆపేశారు. వస్తువుల దిగుమతి నిలిపివేసి కాళ్ల దగ్గరకు వచ్చేలా చేసుకుంటామని చెప్పారు. చైనా వస్తువులు నాశిరకం అన్నారు. వాటిని బహిష్కరించాలని పెద్ద హడావుడి చేశారు. ఇదిగో చూడండి మన దిగుమతులు తగ్గిపోయాయని అంకెలు చెప్పారు. అక్కడ తయారు చేసిన వాక్సిన్‌లో పసలేదని రాశారు. ఔషధాల నాణ్యత ప్రశ్నార్దకం అన్నారు. గతేడాది నవంబరు నుంచి రెండు దేశాల మధ్య విమానాల రాకపోకలు, వీసాల జారీలేదు. సరిహద్దు వివాదం గురించి ఎడతెగని చర్చలు సాగుతున్నాయి, ఎటూ తేలటం లేదు. అవి ఎప్పుడు పూర్తవుతాయో లడఖ్‌ కొండలెక్కించిన మన సైనికులను కిందికి ఎప్పుడు దింపుతారో తెలియదు. ఏ విధంగా చూసినా చైనాను శత్రువుగానే పరిగణిస్తున్నారు. చైనా ప్రభుత్వ సిచువాన్‌ విమాన సంస్ధ పదిహేను రోజుల పాటు వస్తురవాణా విమానాల రాకపోకలను నిలిపివేస్తామని ప్రకటించింది. తరువాత వెంటనే తిరిగి అనుమతిస్తామని, అవసరాన్ని బట్టి కొత్త షెడ్యూలును ప్రకటిస్తామని చెప్పింది. ఈలోగా ఇంకే ముంది సాయం చేస్తామని మోసం చేసింది, సరఫరాలను అడ్డుకుంటున్నది అనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే గతేడాది నవంబరు నుంచి ప్రయాణీకుల విమానాల రాకపోకలు లేకున్నా మన దేశంలోని వివిధ ప్రాంతాలకు చైనా నుంచి సిచువాన్‌ సంస్ధ వస్తురవాణా విమానాలను నడుపుతూనే ఉంది.సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులను దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. భారత్‌తో కరోనా విపరీతంగా పెరిగిన కారణంగా పదిహేను రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఏప్రిల్‌ చివరి వారంలో ప్రకటించింది. అంటే అప్పటి వరకు అటు నుంచి ఇటు నుంచి అటు సరకు రవాణా జరుగుతూనే ఉంది. కాషాయ దళాలు చెప్పినట్లు చైనా వస్తువుల బహిష్కరణ లేదు, పాడూ లేదు. తమకు అనేక దేశాల నుంచి ఆర్డర్లు ఉన్నాయని, వాటి తయారీలో తలమునకలుగా ఉన్నామని, అందువలన భారత ప్రభుత్వం తమకు ఏమి కావాలో స్పష్టంగా చెబితే దానికి అనుగుణ్యంగా చర్య తీసుకుంటామని చైనా ప్రభుత్వం ప్రకటించింది. మన దేశం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ లోగా కాషాయ దళం రంగంలోకి దిగింది. చైనా ప్రకటనపై మోడీ సర్కార్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఇంతవరకు అధికారికంగా స్పందన లేదు. మీడియా, కాషాయ దళాలు రచ్చ చేస్తున్నాయి. దక్షిణాసియా దేశాలలో కరోనా నిరోధం గురించి చర్చించేందుకు చైనా విదేశాంగ మంత్రి ఏర్పాటు చేసిన సమావేశానికి మన దేశం డుమ్మాకొట్టింది.


ముడిసరకులపై నిషేధం ఎత్తివేసేందుకు నిరాకరించి వాక్సిన్‌ తయారీకి ఆటంకం కలిగేందుకు కారణమైన అమెరికా గురించి పల్తెత్తు మాట మాట్లాడని వారు చైనా పదిహేను రోజుల పాటు విమానాలను నిలిపివేస్తామని ప్రకటించగానే ఇంకేముంది నమ్మక ద్రోహం చేసింది, దాని బుద్ది బయటపెట్టుకుంది అంటూ రెచ్చిపోవటం ఏమిటి ? అప్రకటన చేసే ముందు రోజు వరకు మనకు అవసరమైన అత్యవసర సరఫరాలన్నింటినీ చైనా నుంచి తెచ్చుకున్నది వాస్తవం కాదా ? నేరుగా చైనా నుంచి గాకుండా ఇతర దేశాల మార్గాల ద్వారా తెచ్చుకొనేందుకు అవకాశం ఉంది, ప్రభుత్వ కంపెనీ గాకుండా ఉన్న మరో విమాన కంపెనీ ఎలాంటి నిషేధం విధించలేదు, దాని ద్వారా తెచ్చుకోవచ్చు. నిజానికి మనలను ఇబ్బంది పెట్టదలచుకుంటే అమెరికా మాదిరి నిషేధమే విధించవచ్చు కదా ! మనకు ఎగుమతి చేసే వాటి మీద మన నుంచి దిగుమతి చేసుకొనే వాటి మీద భారీ ఎత్తున పన్నులు విధించిందన్నది మరొక తప్పుడు ప్రచారం. నిజంగా ఆ పని చేస్తే దాపరికం ఏముంది ? గతంలో జిగినీ దోస్తు అమెరికా ట్రంపు అదేపని చేసినపుడు మీడియాలో వార్తలు వచ్చాయిగా, నిజంగా చైనా ఆ పని చేస్తే ఏ మీడియా కూడా ఎందుకు వార్తలు ఇవ్వలేదు.మన దేశం కూడా చైనా వస్తువుల మీద అదే మాదిరి పన్నులు ఎందుకు విధించకూడదు.

సిచువాన్‌ విమానాలను రద్దుచేసినట్లు ప్రకటించిన తరువాత హాంకాంగ్‌ నుంచి ఢిల్లీకి చైనాకు చెందిన 800 ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లు వచ్చినట్లు, వారంలో మరో పదివేలు పంపుతున్నట్లు కొలంబోలో చైనా రాయబారి ప్రకటించారు. ఏప్రిల్‌ నెలలో 26వేల వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ జనరేటర్లు పంపినట్లు చైనా విదేశాంగ మంత్రి ప్రకటించారు. చైనా నుంచి నేరుగా అవకాశం లేకపోతే సింగపూర్‌, ఇతర ప్రాంతాల మీదుగా తెచ్చుకొనేందుకు అవకాశం ఉంది.ఏప్రిల్‌ ఒకటి నుంచి 25వ తేదీ వరకు చైనా నుంచి ప్రతి రోజూ మన దేశానికి సగటున ఐదు విమానాలు నడిచాయి. వాటిలో సిచువాన్‌ ఎయిర్‌లైన్స్‌తో పాటు ఎస్‌ఎఫ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాలు కూడా ఉన్నాయి, అవి తిరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ సినిమా నటుడు చైనా తీసుకున్న నిర్ణయం కారణంగా తాను ఆర్డరు పెట్టిన ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లు ఆగిపోయాయని ఢిల్లీలోని చైనా రాయబారికి పంపిన ట్వీట్‌లో పేర్కొన్నారు. దాని మీద స్పందించిన రాయబారి ట్వీట్లద్వారా సమాధానం పంపుతూ రెండు దేశాల మధ్య సరకు రవాణా విమానాలు మామూలుగానే తిరుగుతున్నాయని, గత రెండు వారాల్లో 61 విమానాలు తిరిగాయని వెల్లడించారు. అనుమానాలుంటే ఎవరైనా తీర్చుకోవచ్చు, సమస్యలుంటే పరిష్కరించాలని కోరవచ్చు.
అందువలన నిజాలేమిటో, సమస్య ఏమిటో తెలుసుకోకుండా తొందరపడి తీవ్ర విమర్శలు చేయటం తగనిపని, మనకే నష్టం. కొద్ది రోజులుగా పద్దెనిమిది వేల ఆక్సిజన్‌ యంత్రాలకు మన దేశం నుంచి వివిధ సంస్ధలు ఆర్డరు చేశాయని చైనాలోని పెద్ద మెడికల్‌ కంపెనీ జియాంగ్‌సు యు మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ తెలిపింది. భారత్‌తో సహా వివిధ దేశాల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు ఉన్న కారణంగా వెంటనే సరఫరా చేయలేమని, నెల రోజులు కూడా పట్టవచ్చని, భారత మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చైనా సంస్దలు చెబుతున్నాయి.


గతేడాది చైనాతో తలెత్తిన సరిహద్దు వివాద నేపధ్యంలో మోడీ సర్కార్‌ వైఖరిలో అస్పష్టమైన మార్పు వచ్చింది. దానికి అనుగుణ్యంగానే చైనా నుంచి అత్యవసర వస్తువులను కొనుగోలు చేస్తున్నాము. భారత్‌ నుంచి వచ్చిన ఆర్డర్ల మేరకు 25వేల ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్లను సరఫరా చేసేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నామని భారత్‌లో చైనా రాయబారి సన్‌ వెయిడోంగ్‌ నిర్ధారించారు. వాటిని సరఫరా చేసేందుకు అసరమైన సరకు రవాణా విమానాలను సమకూర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.చైనా నుంచి వస్తువులను తీసుకుంటున్నామని భావనా పరమైన సమస్యలేవీ లేవని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకన్నట్లు మీడియా-కాషాయ దళాలు ఎందుకు రచ్చ చేస్తున్నాయి ?


లండన్‌ కేంద్రంగా పని చేస్తున్న ఎయిర్‌ఫినిటీ అనే సంస్ధ సేకరించిన సమాచారం ప్రకారం మార్చినెలాఖరుకు 16.4 కోట్ల కరోనా వాక్సిన్‌ డోసులను అమెరికా ఉత్పత్తి చేసింది. ఒక్కడోసు కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేయలేదు. ఐరోపా యూనియన్‌ పదకొండు కోట్ల డోసులు ఉత్పత్తి చేయగా 42శాతం ఎగుమతి జరిపింది. చైనాలో తయారైన సినోవాక్‌, సినోఫామ్‌ 20 కోట్ల డోసులను ఎగుమతి చేశారు. అమెరికా మీద తీవ్రమైన వత్తిడి రావటంతో రాబోయే రోజుల్లో ఆరుకోట్ల డోసుల ఆస్ట్రాజెనెకా వాక్సిన్‌ ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు అంగీకరించింది. ఇది గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం వంటిదే. ఈ వాక్సిన్‌ వినియోగానికి అమెరికాలో అనుమతి ఇవ్వాలో లేదో నిర్ణయించక ముందేే కొనుగోలు చేశారు. తరువాత అనుమతి ఇవ్వలేదు. అందువలన దాన్ని వదిలించుకొనేందుకు ముందుకు వచ్చింది. లేనట్లయితే అది నిరుపయోగంగా అక్కడే ఉండిపోతుంది.


వాక్సిన్‌ తయారీలో ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతిక పరిజ్ఞానంలో అమెరికా సంస్దలదే గుత్తాధిపత్యం.అక్కడి ఫైజర్‌ కంపెనీకి అవసరమైన ముడిపదార్దాల సరఫరా తద్వారా దాని లాభాలను ఇబ్బడి ముబ్బడి చేసేందుకు వాటి మీద నిషేధం విధించినట్లు చెబుతున్నారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అమెరికా, ఐరోపా స్వంతం కావటంతో వేగంగా పెద్ద మొత్తంలో తయారు చేసి సొమ్ము చేసుకొనేందుకు వాక్సిన్‌ తయారీని ఒక్కోదశలో ఒక్కో దేశానికి అప్పగించారు. మోడెర్నా వాక్సిన్‌ స్విడ్జర్లాండ్‌లో తయారు చేసి దాన్ని సీసాల్లో నింపేందుకు స్పెయిన్‌కు పంపుతారు. బ్రిటన్‌ కంపెనీ క్రోడా వాక్సిన్‌ తయారు చేసి సీసాల్లో నింపేందుకు నార్మండీ, ఫ్రాన్స్‌ పంపుతున్నారు. ఒక వేళ తమ కంపెనీ వాక్సిన్‌ వికటించి వినియోగించిన వారికి పరిహారం చెల్లించాల్సి వస్తే కోర్టు దావాల నుంచి ఔషధ కంపెనీలకు రక్షణ కల్పించేందుకు లాటిన్‌ అమెరికాలోని అర్జెంటీనా, బ్రెజిల్‌, ఇతర దేశాలు ప్రభుత్వ ఆస్తులను, రిజర్వుబ్యాంకుల నిధులు, మిలిటరీ కేంద్రాల వంటి వాటిని తాకట్టుపెట్టాలని ఫైజర్‌ కంపెనీ వత్తిడి చేసినట్లు వార్తలు వచ్చాయి. పూర్తిగా కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తే ఇదేంట్రాబాబూ తొలి రోజుల్లోనే బిడెన్‌ పెద్దమనిషి ట్రంప్‌ కంటే దారుణంగా తయారయ్యాడు అని ఎక్కడ అనుకుంటారో, అమెరికా వ్యతిరేకత ఎక్కడ పెరుగుతుందో అనే భయం – బిడియంతో వాక్సిన్‌ తయారీ వస్తువులపై నిషేధాన్ని కాస్త సడలించేందుకు నిర్ణయించుకున్నట్లుగా గత కొద్ది రోజుల పరిణామాలు స్పష్టం చేశాయి.

అజిత్‌ దోవల్‌ ఎవరికి ఏ భాషలో చెప్పాలో ఆ భాషలో చెప్పి దారికి తెస్తారని, అమెరికాను అదే విధంగా హెచ్చరించి మనకు సరఫరాలు చేసేందుకు అంగీకరింప చేయించారని కాషాయ దళాలు ప్రచారం ప్రారంభించాయి. మరి అదే అజిత్‌ దోవల్‌ చైనా విషయంలో కూడా అదే విధంగా ఎందుకు వ్యవహరించలేదు, అమెరికా కంటే బలహీనమైన చైనాను కాషాయ దళాల భాషలో చెప్పాలంటే ఎందుకు మన కాళ్లదగ్గరకు తేలేదు ? చివరికి బలహీన పాకిస్దాన్‌న్ను ఎందుకు అంకెకు తేలేకపోయారు ? మన ఇరుగు పొరుగుదేశాలను మన వైపు ఎందుకు తిప్పలేకపోయారు. అజిత్‌ దోవల్‌కు అంతసీన్‌ లేదు ! నరేంద్రమోడీ కంటే బలవంతుడా ! అందరికీ చెడ్డాం, చివరికి మీరు కూడా ఇలా చేస్తే మా మోడీ పరువు, పనేంగాను అని సాష్టాంగపడ్డారేమో ? చరిత్రలో ఇలాంటివారిని అమెరికన్లు ఎందరినో చూశారు. తిరిగే చక్రం మీద కూర్చున్న ఈగ దాన్ని తానే తిప్పుతున్నట్లు భావిస్తున్నట్లుగా ఈ ప్రచారం ఉంది. ఇలాంటి పోసుకోలు కబుర్లతో నరేంద్రమోడీ వైఫల్యాలను కప్పిపుచ్చగలరా ? తోకపట్టుకొని పోవటం తప్ప మరొక విధంగా వ్యవహరించలేని రీతిలో మనం అమెరికా చేతిలో చిక్కాము. దాన్ని నమ్మి రెచ్చి పోయి చైనా, పాకిస్దాన్‌, ఇతర ఇరుగు పొరుగు దేశాలను దూరం చేసుకున్నాం, వాటన్నింటినీ చైనాకు దగ్గర చేశాము. రెండునెలలుగా ససేమిరా అని మొరాయిస్తుంటే అజిత్‌ దోవల్‌ గానీ నరేంద్రమోడీ గానీ చేసిందేమీ లేదు. మిత్రదేశం అని చెప్పిన భారత్‌ను అమెరికన్లు ఎలా నిర్లక్ష్యం చేశారో చూడండి అంటూ చైనా మీడియాలో వ్యాఖ్యలు, ఇతర దేశాల నుంచి విమర్శలు, వత్తిడి, అన్నింటికీ మించి మన దేశంలో అమెరికా వ్యతిరేకత పెరిగితే తమకూ, అనుయాయి నరేంద్రమోడీకి నష్టం అని లెక్కలు వేసుకున్న తరువాతనే అమెరికా వైఖరిలో మార్పు వచ్చింది.


శ్రీరాముడంతటి శక్తివంతుడే రావణుడిపై పోరుకు ఉడత సాయం తీసుకున్నారని గొప్పగా చెప్పుకుంటారు. రాముడి అడుగుజాడల్లో నడుస్తున్నామని చెబుతున్నవారు పాక్‌ నుంచి సాయం తీసుకొనేందుకు తిరస్కరించటం శ్రీరాముడి పట్ల అపచారం చేసినట్లు కాదా ?వెంటిలేటర్లతో సహా కొన్ని ఇతర వైద్య సామగ్రిని పంపుతామని పాకిస్ధాన్‌ ప్రకటించింది. అయితే దాన్ని స్వీకరిస్తామని గానీ తిరస్కరిస్తున్నట్లుగానీ మోడీ సర్కార్‌ ప్రకటించలేదు. స్వీకరించటం తమ స్ధాయికి భంగకరమని, తలెత్తే ప్రశ్నలు, విమర్శలకు సమాధానాలు చెప్పలేమని ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.పాకిస్ధాన్‌తో సయోధ్య కుదిరినట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించినప్పటికీ ఈ వైఖరితో వ్యవహరించటం గమనించాల్సిన అంశం. పదహారు సంవత్సరాల క్రితం విదేశీ సాయం తీసుకోవటంపై మన్మోహన్‌ సింగ్‌ హయాంలో స్వయంగా విధించుకున్న ఆంక్షలను గుట్టుచప్పుడు కాకుండా నరేంద్రమోడీ ఎత్తివేసింది. చైనా నుంచి ప్రాణావసర ఔషధాలు, ఆక్సిజన్‌, సంబంధిత పరికరాలను తీసుకొనేందుకు భావనా పరమైన సమస్యల్లేవని ఒక అధికారి చెప్పినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక పేర్కొన్నది. అయితే పాకిస్ధాన్‌ నుంచి స్వీకరించే విషయంలో ఏం చేయాలనేది స్పష్టం చేయలేదు. ఇప్పటి వరకు ఉన్న విధానం ప్రకారం విదేశాల నుంచి బహుమతులు, విరాళాలను స్వీకరించాల్సి వస్తే వాటిని రెడ్‌ క్రాస్‌ సంస్ధకు మాత్రమే అందచేయాలి, దాని ద్వారానే పంపిణీ చేయాలి.ప్రభుత్వాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవాటికి వెల చెల్లించి మాత్రమే తీసుకోవాలి. గత కొద్ది రోజులుగా అమెరికాతో సహా వివిధ దేశాల నుంచి ప్రకటిస్తున్న సాయమంతా డబ్బు చెల్లించి కొనుగోలు చేసేదే అని గ్రహించాలి. విధాన సడలింపుల తరువాత వచ్చే సాయంలో కొంత విరాళం కొంత నగదు చెల్లింపులు ఉండే అవకాశం ఉంది. ఇంటా బయటా వెల్లువెత్తుతున్న విమర్శలు, ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేస్తున్న నేపధ్యంలో ఈ మార్పు చేసినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నేరుగా తమకు అవసరమైన వాటిని విదేశాల నుంచి సేకరించుకోవచ్చని కేంద్రం సూచించింది.

అంతకు ముందు ఉత్తరా ఖండ్‌ భూకంపం(1991) లాతూర్‌ భూకంపం(1993) గుజరాత్‌ భూకంపం(2001) బెంగాల్‌ తుపాను(2002) బీహార్‌ వరదలు(2004) సంభవించిన సమయాలలో విదేశీ సాయం తీసుకున్నాము.2004లో సునామీ తరువాత పరిస్ధితిని మనకు మనమే ఎదుర్కోగలమంటూ విదేశీ విరాళాలను తీసుకోవద్దని, అవసరమైతే వారి సాయం తీసుకుందామని నిర్ణయించారు. దీనికి అనుగుణ్యంగా 2005లో కాశ్మీరులో భూకంపం, అక్కడే 2014లో వరదల సమయాలో, 2013లో ఉత్తరా ఖండ్‌ వరదల సమయంలో విదేశీ విరాళాన్ని తీసుకొనేందుకు ప్రభుత్వ నిరాకరించింది.తాజా విషయానికి వస్తే లక్షలాది మంది మళయాలీలు పని చేసే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం 2018లో కేరళ వరదల సమయంలో 700 కోట్ల రూపాయల విరాళం అందచేస్తామని ముందుకు వచ్చినపుడు కేంద్రం తిరస్కరించింది. ఆ మేరకు కేంద్రం సాయం ఇవ్వకపోవటం తీవ్ర విమర్శలు రావటం అది వేరే విషయం. కానీ అదే ప్రభుత్వం పిఎం కేర్‌ నిధికి ఎవరు విరాళం ఇచ్చినా తీసుకోవాలని గతేడాది నిర్ణయించింది. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే స్వీకరించనుంది. అయితే ఈ అంశాన్ని బహిరంగంగా ప్రకటించలేదని, ఇదే సమయంలో సాయం చేయాల్సిందిగా ప్రభుత్వం ఎలాంటి వినతులు చేయలేదని, ప్రభుత్వాలు లేదా ప్రయివేటు సంస్ధలు ఏవైనా బహుమతిగా విరాళం ఇస్తే కృతజ్ఞతా పూర్వకంగా స్వీకరిస్తామని ఒక అధికారి చెప్పినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొన్నది. గతంలో మన ప్రభుత్వం ఇతర దేశాలకు విరాళంగా ఇచ్చిన హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ నుంచి వాక్సిన్లకు ప్రతిగా ఇలాంటి విరాళాలు వస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


ఇప్పుడు కావాల్సింది ఏమిటి ? ప్రపంచ లేదా ప్రాంతీయ రాజకీయాలు, శత్రుత్వమా ? ప్రజల రక్షణా ఏది ముఖ్యం. నిజమైన రాజనీతి ప్రాధాన్యత జన సంక్షేమం అన్నది స్పష్టం. గతంలో అన్ని దేశాలూ రాజకీయాలు చేశాయి. ఒకదానిని ఒకటి దెబ్బతీసుకొనేందుకు ప్రయత్నించాయి. మనం తప్ప మిగతావన్నీ అదే చేశాయనే కాషాయ ప్రచారాన్ని ఎవరైనా నమ్మితే తప్పుదారి పట్టినట్లే. చైనాకు వ్యతిరేకంగా మనం అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాతో చతుష్టయం పేరుతో కలిశాము. అయినా దానిని పక్కన పెట్టి చైనీయులు మనకు అవసరమైన వాటిని విక్రయిస్తున్నారు. ఎలాంటి నిషేధం పెట్టలేదు. మిత్రదేశం అనుకున్న అమెరికా ఆ పని చేసింది. మనకు వ్యతిరేకంగా పాకిస్ధాన్‌ -చైనా దగ్గరయ్యాయి. అమెరికాకు అనుకూలంగా మనం ఇరాన్‌ను దూరం చేసుకున్నాము. అమెరికాకు వ్యతిరేకంగా అది చైనాకు దగ్గరైంది. ఇతర ఇరుగుపొరుగు దేశాలు కూడా అమెరికాతో మన సంబంధాల కారణంగా చైనా వైపు మొగ్గుచూపుతున్నాయన్నది స్పష్టం. ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు, దేనితో ఎలా తేల్చుకోవాలో తరువాత నిర్ణయించుకోవచ్చు. సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ చైనాతో స్నేహం చేశాము, ఇప్పటికీ ఎగుమతి-దిగుమతి కొనసాగుతూనే ఉంది. పాకిస్ధాన్‌తో వైరం ఉన్నప్పటికీ నిన్న మొన్నటి వరకు వాణిజ్యంలో అత్యంత సానుకూల హౌదా ఇచ్చాము. ఒకవైపు మిత్ర రాజ్యం అంటూనే మరోవైపున మన ప్రయోజనాలకు వ్యతిరేకంగా అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్దలో ఫిర్యాదులు చేస్తున్నది, మన వస్తువుల దిగుమతులపై ఉన్న పన్ను రాయితీలను రద్దు చేసింది, కొత్తగా దిగుమతి పన్నులు వేసింది. మాకు మా దేశ పౌరులు తప్ప మిగతావారి గురించి పట్టించుకోము అంటూ వాక్సిన్‌ ముడిసరకులు, పరికరాలపై నిషేధం విధించినా అమెరికాతో సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అదే విధానం చైనా, పాకిస్దాన్‌తో ఎందుకు అనుసరించకూడదో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. వివాదాలు, విబేధాలతో రాజీపడాలని, లొంగిపోవాలని ఎవరూ చెప్పటం లేదు. ప్రజానుకూలంగా విధానాలుండాలని చెప్పటం తప్పుకాదు. అలాంటి వైఖరి, విదేశాల సాయం లేకుండా కరోనా బారి నుంచి మన జనాన్ని మన ప్రభుత్వం కాపాడగలదా ?

ఆపదలో ఆదుకుంటాయని నమ్మిన అమెరికా, జపాన్‌, ఐరోపా దేశాలు ముఖం చాటేశాయి.మనలను చైనాకు వ్యతిరేకంగా ఉపయోగించుకొనేందుకు ఇచ్చిన ప్రాధాన్యత ఆదుకొనేందుకు ఇవ్వలేదని కరోనా నిరూపించింది. మార్చినెలలో జరిగిన తొలి చతుష్టయ సమావేశంలో ప్రపంచానికి వంద కోట్ల వాక్సిన్లు అందించాలని, వాటిని భారత్‌లో తయారు చేసేందుకు అవసరమైన సాయం చేయాలని కూటమి నిర్ణయించింది. ఇప్పుడు మన దేశమే వాక్సిన్ల కొరతను ఎదుర్కొంటుంటే మిగతా దేశాలు ముఖం చాటేస్తున్నాయి. ముడిపదార్దాల సరఫరాను అడ్డుకుంటున్నాయి. లక్షల సంఖ్యలో ఆక్సిజన్‌ జనరేటర్లు మనకు అవసరం కాగా కొన్ని వందలు పంపుతూ దాన్నే పెద్ద సాయంగా అమెరికా చిత్రిస్తున్నది. జపాన్‌ మౌనంగా ఉంది.మానవహక్కుల గురించి నిత్యం కబుర్లు చెప్పే, గుండెలు బాదుకొనే అమెరికా, ఐరోపా ధనిక దేశాలు కరోనా వాక్సిన్ను మానవ హక్కుగా పరిగణించటం లేదు. అలాంటి వాటిని నమ్మి అలీన విధానానికి తిలోదకాలిచ్చి వాటి చంకనెక్కితే ప్రయోజనం లేదని తేలిపోయింది కనుక భేషజాలకు పోకుండా ఇప్పటికైనా మన విదేశాంగ విధానాన్ని పున:పరిశీలించుకోవటం అవసరం.
హొహొహొ

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d