• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: International

జనానికి చమురు ధరల చెలగాటం – నరేంద్రమోడీకి రాజకీయ ఇరకాటం !

08 Monday Mar 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

#narendra modi failures, BJP, India fuel price, Rising Fuel prices


ఎం కోటేశ్వరరావు


సోమవారం నాడు అంతర్జాతీయ మార్కెట్‌లో పీపా ముడి చమురు ధర 70.82 డాలర్లు (2019 మే తరువాత ఇది గరిష్టం) పలికి ఇది రాసిన సమయానికి 69.62 డాలర్లుగా ఉంది. ఈ పెరుగుదలతో అనేక మంది నరేంద్రమోడీ అభిమానుల్లో అసలైన ఆందోళన ప్రారంభమైంది. మరోవైపు ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్లో ” అషోల్‌ పరివర్తన్‌ ” (అసలైన మార్పు) తెస్తామని ప్రధాని బిజెపి ఎన్నికల సభలో చెప్పారు. ఏడు సంవత్సరాల క్రితం అచ్చేదిన్‌, గుజరాత్‌ తరహా అభివృద్ధి వంటి కబుర్లు చెప్పిన పెద్దమనిషి నోటి నుంచి ఏ రోటికాడ ఆ పాట అన్నట్లుగా ఏ రాష్ట్రం వెళితే ఆ కబుర్లు చెబుతున్నారు. పెరుగుతున్న ధరల గురించి ఒక్క మాటా లేదు.


ఒపెక్‌ ప్లస్‌ దేశాలు(చమురు ఉత్పత్తి ఎగుమతి దేశాల సంస్ద(ఒపెక్‌)లో లేకుండా గణనీయంగా చమురును ఉత్పత్తి ఎగుమతి చేసే దేశాలు) ఏప్రిల్లో కూడా ఉత్పత్తిని తగ్గించాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించటంతో ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. మేనెల నుంచి చమురు ధరలు తగ్గుతాయని కబుర్లు చెబుతున్న బిజెపి పెద్దలకు అది ఎక్కడైనా తగిలిందో లేదో తెలియదు. గత నాలుగు రోజులుగా ధర పెరుగుతూనే ఉన్నా సోమవారం నాడు ఎక్కువగా పెరగటానికి కారణం అని సౌదీ అరేబియా దాడును ప్రతిఘటిస్తున్న యెమెన్‌లోని హుతీ తిరుగుబాటుదారులు జరిపిన క్షిపణి దాడి అని చెబుతున్నారు. సౌదీ చమురు కంపెనీ ఆరామ్‌కో ప్రధాన కేంద్రాలపై ఆదివారం నాడు ఈ దాడి జరిగింది. దీని తీవ్రత ఇంకా తెలియదు, ఆందోళనపడిన వారు చమురు కొనుగోలుకు ఆతృపడిన కారణంగా ధర పెరిగినట్లు కనిపిస్తోంది. ఆ దాడులతో నిమిత్తం లేకుండానే ధరలు పెరగటానికి ముందే చెప్పుకున్నట్లు ఉత్పత్తి తగ్గింపు నిర్ణయమే అసలు కారణం.
చమురు మార్కెట్‌ను ప్రభావితం చేయటంలో ఒపెక్‌లో సౌదీ అరేబియా, దాని వెలుపల రష్యా ఇప్పుడు కీలక పాత్రధారులుగా ఉన్నాయి. ధరలు పెరగటం తమ షేల్‌ అయిల్‌ కంపెనీలకు లాభాలు తెచ్చిపెడతాయి గనుక అమెరికా కూడా సంతోషంగానే ఉంది. చమురు ఆదాయమే ప్రధాన వనరుగా ఉన్న వెనెజులా వంటి దేశాలకూ ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. చమురు దిగుమతుల మీద ఆధారపడిన చైనా మనకంటే ఎంతో మెరుగైన స్దితిలో ఉంది కనుక దానికి ఇబ్బంది లేదు. ధరల పెరుగుదలతో ఎటొచ్చీ తీట వదలిలేది మనకే. అమెరికా నుంచి ఆయుధాలు, ఆయిలు తెచ్చుకుంటూ కొత్త సమస్యలూ తెచ్చుకుంటున్నాము. ఏప్రిల్‌ నెలలో రోజుకు పదిహేను లక్షల పీపాల మేరకు చమురు ఉత్పత్తి కోత విధించనున్నట్లు జోశ్యం చెబుతున్నారు.అయితే ఈ కోతనుంచి రష్యా, కజకస్ధాన్లు మినహాయింపు పొందాయి.రష్యా లక్షా30వేలు, కజకస్దాన్‌ ఇరవై వేల పీపాల మేరకు రోజు వారీ ఉత్పత్తిని పెంచనున్నాయి. ఫిబ్రవరి, మార్చినెలలో కూడా అవి మినహాయింపు పొందటానికి స్ధానికంగా చలికాలంలో ఎక్కువ వినియోగమే కారణం. తాను మాత్రం రోజుకు పదిలక్షల పీపాల కోత నిర్ణయానికి కట్టుబడే ఉన్నానని, ధరలతో తమకు నిమిత్తం లేదని సౌదీ ప్రకటించింది. కోత ఎప్పటి వరకు అన్నది కూడా వెల్లడించని కారణంగా ఒక్క మన పాలకుల్లో తప్ప అన్ని వినియోగదేశాల్లో ఆందోళన పెరిగింది.పెరిగిందానికన్నా ఎక్కువగా వసూలు చేసినా ఇదేం దోపిడీ అని అడిగే దమ్మూ ధైర్యం మన వినియోగదారులకు లేనందున కేంద్ర ప్రభుత్వానికి ఎలాగూ పట్టదు. ఎంత పెరిగితే అంత ఆదాయం తమకు పెరుగుతుంది కనుక మెజారిటీగా ఉన్న బిజెపి పాలిత రాష్ట్రాలతో పాటు ఇతరులూ పట్టించుకోరు.

ధరలు ఎంతవరకు పెరగవచ్చు !

ప్రస్తుతం ఉన్న జోశ్యాల ప్రకారం ఏప్రిలు-సెప్టెంబరు మాసాల మధ్య బ్రెంట్‌ రకం ముడి చమురు 75 నుంచి 80 డాలర్ల మధ్య ఉండవచ్చు. ఈ నెలాఖరుకు 70 డాలర్ల వరకు పెరగవచ్చని సిటీబ్యాంకు అంచనా వేసిందని ఆదివారం నాడు వార్తలు వచ్చాయి. అయితే సోమవారం నాడు 71డాలర్ల వరకు పెరిగిన తీరు చూసిన తరువాత జోశ్యాలన్నీ గాల్లో కలసి అంతకంటే ఎక్కువగా పెరిగినా ఆశ్చర్యం లేదు. చమురు దిగుమతి దేశంగా ఉన్న అమెరికా ఇప్పుడు ఎగుమతి దేశాల్లో ఒకటిగా మారింది. అందువలన ధరల పెరుగుదలను అక్కడి చమురు ఉత్పత్తి ముఖ్యంగా షేల్‌ కంపెనీలు కోరుకుంటాయి. అయితే తన ఎన్నికను దృష్టిలో ఉంచుకొని అమెరికా వినియోగదార్లకు ధరలు తక్కువగా ఉంచేందుకు గాను డోనాల్డ్‌ ట్రంప్‌ సౌదీపై వత్తిడి తెచ్చి ధరలను అదుపు చేయించాడని, ఇప్పుడు జో బైడెన్‌ అధికారంలో ఉన్నందున సౌదీ గతంలో మాదిరి వ్యవహరించకపోవచ్చనే అభిప్రాయాలూ వెల్లడవుతున్నాయి.


అరబ్బు దేశమైన ఎమెన్‌లో సంవత్సరాలుగా అంతర్యుద్ధం జరుగుతోంది. ప్రభుత్వానికి సౌదీ అరేబియా నాయకత్వంలోని కొన్ని అరబ్బు దేశాలు మద్దతు ఇవ్వటమే కాదు, తిరుగుబాటుదార్ల పట్టున్న ప్రాంతాలపై దాడులు చేస్తున్నాయి. అమెరికా తన చేతులకు మట్టి అంటకుండా వాటితో ఈపని చేయిస్తున్నది. ప్రభుత్వవ్యతిరేక శక్తులైన హుతీలకు ఇరాన్‌ మద్దతు ఉంది. రాజధాని సనా తిరుగుబాటుదార్ల వశంలోనే ఉంది. దానిమీద దాడుల నేపధ్యంలోనే ఆదివారం నాడు హుతీదళాలు డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించాయి. వాటిని తాము అడ్డుకున్నట్లు సౌదీ చెబుతోంది. అందువలన రానున్న రోజుల్లో ఎమెన్‌పై సౌదీ దాడులు పెరిగితే మరోసారి ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. అవి చమురు ధరల మీద ప్రభావం చూపవచ్చు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలేవీ కొద్ది నెలల క్రిందట ఊహించినవి కాదు. పడిపోయిన చమురు డిమాండ్‌ పెరుగుతుందని భావించారు తప్ప ధరల పెరుగుదలను ఊహించలేదు.

నాడు ఘనతగా కీర్తనలు -నేడు భక్తుల మౌన రాగాలు !


గత ఆరు సంవత్సరాలుగా చమురు ధరలు గణనీయంగా పడిపోవటం ద్వారా కలిగిన ఆర్ధిక ఉపశమనాన్ని నరేంద్రమోడీ ఘనతగా, మోడినోమిక్సుగా ఆయన భక్తులు ప్రచారం చేశారు. ఇప్పుడు చమురు ధరలు పెరుగుతుంటే భక్తిగీతాలాపనకు బ్రేకు పడింది. రిజర్వుబ్యాంకు అంచనా ప్రకారం పీపా చమురు ధర పది డాలర్లు పెరిగితే మన చమురు వాణిజ్య లోటు 1250 కోట్ల డాలర్లు ( రూపాయల్లో సోమవారం నాడున్న విలువ ప్రకారం 91,622 కోట్లు ) పెరుగుతుంది. ఎంత పెరిగితే అంత మనం చెల్లించాలని అతల్‌ బిహారీ వాజ్‌పేయి ఏలుబడిలో ప్రవేశ పెట్టిన విధానాన్ని నరేంద్రమోడీ ఎలాంటి శషభిషలు లేకుండా అమలు జరుపుతున్నందున మరో విధంగా చెప్పాలంటే అంత మొత్తాన్ని లేదా ఇంకా ఎక్కువగానే మన నుంచి వసూలు చేస్తారు. గతేడాది డిసెంబరు నాటికి మనం కొనుగోలుచేసిన ముడి చమురు ధర 49 డాలర్లు ఉంది. ఇప్పుడు 68డాలర్లకు పెరిగింది, అంటే మన లోటు లేదా భారం రెండు లక్షల కోట్లు పెరిగినట్లే. భర్త సంపాదన భార్య బుట్టలోలకులకే పరిపోయిందన్న సామెత తెలిసిందే. జన వేతనాలు ఎంత పెరిగినా, పెరగకున్నా కేంద్ర ప్రభుత్వానికి ఇంత మొత్తం చెల్లించాల్సిందే.మన కరెన్సీ పతనం అయితే అది అదనపు భారం.చమురు ధరల ప్రభావం కరెంట్‌ ఖాతా లోటు మీద ఎలా ప్రభావం చూపుతుందో దిగువ పట్టికలో చూడవచ్చు
ధర × జిడిపిలో వాణిజ్యలోటుశాతం× కోట్ల డాలర్లు
55 ×× -2.33 ×× -6,890
65 ×× -2.76 ×× -8,140
75 ×× -3.18 ×× -9,390
85 ×× -3.61 ×× -10,640
చమురు ధరల పెరుగుదల పెట్రోలు, డీజిలును వినియోగించేవారి మీద ప్రత్యక్ష భారాన్ని మోపితే పరోక్ష భారం జనం అందరి మీదా పడుతుంది. ఇది చమురు వినియోగదారులకు అదనం.చమురు ధరల పెరుగుదల వలన ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయి. నిజవేతనాలు పతనమౌతాయి, దానికి అనుగుణ్యంగా వేతనాలు పెంచకపోతే జీవితాలు దిగజారతాయి. అది కొనుగోలు శక్తిని దెబ్బతీసి పారిశ్రామిక, వాణిజ్య, సేవారంగాలు కుంటుపడి కొత్త సంక్షోభానికి దారితీసి ఉపాధిని దెబ్బతీస్తుంది. ఇది ఒక విష వలయం. ఒకటి మరొకదానిని దెబ్బతీస్తుంది.


మన వాణిజ్య లోటు పెరిగిన కొద్దీ మన రూపాయి విలువ మీద వత్తిడి పెరిగి పతనానికి దారి తీస్తుంది. అది మనం దిగుమతి చేసుకొనే చమురుతో సహా అన్నింటి ధరల పెరుగుదలకూ దారి తీస్తుంది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన సమయంలో 58గా ఉన్న మన రూపాయి విలువ ఇప్పుడు మోడీగారి వయస్సును కూడా అధిగమించి 73పైగా ఉంది.చమురు ధరల పెరుగుదల పరిశ్రమలు, వాణిజ్యం మీద కూడా పడి కంపెనీల వాటాల ధరల మీద ప్రభావం చూపుతుంది. వాటి ధరలు పడిపోతే విదేశీ సంస్ధలు తమ వాటాలను అమ్ముకొని సొమ్ము చేసుకుంటే మన విదేశీమారక ద్రవ్యనిల్వలు తగ్గిపోయి కొత్త సమస్య మొదలవుతుంది.గతంలో ఇది తీవ్రమై బంగారాన్ని తాకట్టు పెట్టటం, రూపాయి విలువ తగ్గించటం, ప్రపంచబ్యాంకు,ఐఎంఎఫ్‌ షరతులను ఆమోదించి మన మార్కెట్‌ను తెరవటం వంటి అవాంఛనీయ పరిణామాలకు మన పాలకులు తెరలేపారు. ప్రస్తుతం అలాంటి పరిస్ధితి అప్పుడే ఇంకా తలెత్తనప్పటికీ మోడీ సర్కార్‌ మన మార్కెట్‌ను ఇంకా తెరుస్తోంది. వ్యవసాయ సంస్కరణల పేరుతో తెచ్చిన మూడు చట్టాలు వాటిలో భాగమే. ఉన్న ఆస్ధులను తెగనమ్ముతోంది.ప్రభుత్వ ఆస్ధులన్నీ అమ్మిన తరువాత అప్పు తీసుకోవాలన్నా ఇచ్చేవారు మన ప్రభుత్వం దగ్గర ఏముంది అని చూస్తారు. ఇప్పటి వరకు నల్లేరు మీద బండిలా నడిచిన మోడీ సర్కార్‌ ప్రయాణం చమురు ధరలు ఇలాగే పెరిగితే అలా సాగదు.జనం సహనానికీ ఒక హద్దు ఉంటుంది. అది దాటితే అభిమానమే దురభిమానంగా మారుతుంది. అప్పుడేం జరుగుతుందో ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, అతల్‌బిహారీ వాజ్‌పేయిల ఏలుబడిలో ఏమి జరిగిందో చూసిన వారికి అర్దం అవుతుంది.కొత్త తరాలకు నరేంద్రమోడీ అలాంటి ”చైతన్యం ”, అవగాహన కలిగిస్తారా ? మోడీ గారికి ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో తన పార్టీ బలం పెరుగుదల మీదే దృష్టి ఉంది గాని జనం ఊసే లేదు. అందువలన అనుమానమే అవసరం లేదు ! చరిత్ర పునరావృతం అవుతుంది గానీ గతం మాదిరే అవుతుందని చెప్పలేము, కొత్త రూపంలో జరుగుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు – బిజెపి నేతల ఆంతర్యం ఏమిటి ?

10 Sunday Jan 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, USA

≈ Leave a comment

Tags

Amit Malviya, Capitol hill rioters, Donald trump, Donald Trump's Twitter account, Tejaswi Surya


ఎం కోటేశ్వరరావు
డోనాల్డ్‌ ట్రంప్‌ ! అతగాడిని ఇప్పుడెలా వర్ణించాలో తెలియటం లేదు. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యముంటేనే లేకపోతేనేం, ట్రంపూ అంతే ! నిర్ణీత వ్యవధి జనవరి 20వరకు పదవిలో ఉంటాడా, అభిశంసన లేదా మరో ప్రక్రియ ద్వారా మెడపట్టి వైట్‌ హౌస్‌ నుంచి గెంటి వేస్తారా అన్నది పెద్దగా ఆసక్తి కలిగించే అంశం కాదు. నిండా మునిగిన వారికి చలేమిటి-కొత్తగా పోయే పరువేమిటి ! ట్రంప్‌ అంటే ఏమిటో ఇంకా తెలియని వారు ఉండవచ్చు. తెలిసిన వారు అతగాడి స్నేహితుల గురించి ఆలోచించాలి, ఆందోళనపడాలి !


ఆ పిచ్చోడు ఏమి చేస్తాడో తెలియదు కనుక మిలటరీ పరంగా ఎలాంటి నిర్ణయాలనూ ఆమోదించవద్దు, అణ్వాయుధాల మీటల దగ్గరకు రానివ్వవద్దంటూ మిలిటరీ అధికారులకు అమెరికన్‌ కాంగ్రెస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ లేఖ రాసి జాగ్రత్తలు చేప్పారు. ఏ విద్వేషాలు రెచ్చగొట్టి మరింతగా ముప్పు తలపెడతాడో అని సామాజిక మాధ్యమాలు తాత్కాలికంగా అతని ఖాతాలను నిలిపివేశాయి. ఈ చర్య ప్రజాస్వామ్య విరుద్దం, ట్రంప్‌ భావ ప్రకటనా స్వేచ్చకు విఘాతం అంటూ బిజెపి నేతలు మీడియాకు ఎక్కటం వారేమిటో తెలియనివారికి తెలుస్తున్నది, వీరు కూడా ట్రంప్‌ బాటలో పయనిస్తారా అన్న ఆందోళనకు తావిస్తోంది.


జనవరి ఆరవ తేదీన వాషింగ్టన్‌ డిసిలోని అమెరికా అధికార పీఠం ఉన్న కాపిటల్‌ హిల్స్‌ భవనంలో అధ్యక్ష,ఉపాధ్యక్ష ఎన్నికలలో పోలైన ఓట్ల లెక్కింపు- విజేతల నిర్ధారణకు పార్లమెంట్‌ ఉభయ సభలు సమావేశం జరిపాయి. ఆ ఎన్నికలను గుర్తించవద్దు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ట్రంప్‌ చేసిన రెచ్చగొట్టే ప్రకటనలతో ఆ సమావేశం మీద ఒక్కసారిగా డోనాల్డ్‌ ట్రంప్‌ మూకలు దాడికి దిగాయి, ఎంపీలు బ్రతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగులు తీశారు. నేల మాళిగలో దాక్కున్నట్లు వార్తలు వచ్చాయి. మూకదాడిలో ఐదుగురు మరణించగా 50 మందికి పైగా పోలీసులు గాయపడినట్లు వార్తలు వచ్చాయి.


అమెరికాలో, ప్రపంచంలో చీమ చిటుక్కుమన్నా పసిగట్టగల వేగు యంత్రాంగం, అత్యాధునిక పరికరాలు కలిగినవని చెప్పుకొనే వారికి ఇది తలవంపులు తెస్తున్నది, వారి సామర్ధ్యం మీద అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసు, భద్రతా సిబ్బంది ఏకంగా తమ కాపిటల్‌ మీద జరగనున్న దాడిని ఎలా పసిగట్టలేకపోయారు? వీరు ప్రపంచాన్ని రక్షిస్తామంటే, సమాచారాన్ని అందిస్తామంటే నమ్మటం ఎలా ? భద్రతా వైఫల్యానికి బాధ్యత ఎవరిది ? మూకలను పురికొల్పిన డోనాల్డ్‌ ట్రంప్‌ మీద, మూకల కుట్రను పసిగట్టలేకపోయిన యంత్రాంగం మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ట్రంప్‌ను ఈ పాటికే పదవి నుంచి తొలగించి ఉగ్రవాద చట్టం కింద అరెస్టు చేసి ఉండాల్సింది.
బొలీవియా, వెనెజులా వంటి దేశాలలో గెలిచిన వారిని గుర్తించేది లేదని ప్రకటించినపుడు వారు వామపక్ష శక్తులు గనుక ఏమైపోతే మనకేమిలే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావించారు. ఇప్పుడు తాము నిజంగా ఓటువేసిన ఎన్నికలను గుర్తించేది లేదంటూ, ఆ ప్రక్రియను వమ్ము చేసేందుకు మూకలను పంపి అధికార కేంద్రంపై దాడికి ట్రంప్‌ ఉసిగొల్పటాన్ని చూసి వారు, యావత్‌ ప్రపంచం విస్తుపోతోంది. విదేశాల్లో అమెరికా దుశ్చర్యలను ప్రజాస్వామిక వాదులందరూ గట్టిగా ఖండించి ఉంటే ట్రంప్‌ ఇంతకు బరితెగించి ఉండేవాడా ?

తాను ఓడిపోతే ఓటమిని అంగీకరించను అని ఎన్నికలకు ముందే తెగేసి తేల్చి చెప్పిన అపర ప్రజాస్వామికవాది ట్రంప్‌. తోటకూర నాడే అన్నట్లుగా అప్పుడే ప్రియమైన స్నేహితుడా ఇది నీకు తగదు అని నరేంద్రమోడీ చెప్పి ఉంటే ఇంతటి దురాగతానికి పాల్పడి ఉండేవాడు కాదేమో ! అతగాడి చర్యలను చూస్తూ దు:ఖితుడనయ్యానని చెప్పుకోవాల్సిన దుస్ధితి వచ్చేది కాదేమో ! అలా చెప్పాల్సిన అవసరం మోడీకి ఏమిటి అని మరుగుజ్జులు ఎగిరి పడవచ్చు. ట్రంప్‌ మద్దతుదార్ల దాడిని చూసిన తరువాత అనేక మంది దేశాధినేతలు అధికారమార్పిడి సజావుగా జరగాలంటూ సుభాషితాలు చెప్పారు. కానీ నరేంద్రమోడీగారికి అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంది. ఏడాది క్రితమే తిరిగి వచ్చేది ట్రంప్‌ సర్కారే (అబ్‌ కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌) అని, మీరంతా మద్దతు ఇవ్వండని అమెరికాలోని భారతీయులకు చెప్పి, తరువాత అహమ్మదాబాద్‌కు తీసుకు వచ్చి ఊరేగించిన మోడీగారు కూడా ఇతరుల మాదిరే సుభాషితాలు చెబితే ? కొట్టినా, తిట్టినా, ముద్దు పెట్టుకున్నా ఇష్టమై కౌగిలించుకున్నవారికే కదా అవకాశం ఉండేది.


మన పార్లమెంట్‌ మీద జరిగిన దానిని ఉగ్రవాద దాడి అన్నాము. కాపిటల్‌ భవనం మీద ట్రంప్‌ మద్దతుదార్లు చేసిన దాడి, హత్యలను మూర్తీభవించిన ప్రజాస్వామిక పరిరక్షక మహత్తర కర్తవ్యంలో భాగం అంటారా ? తనకు ఓటు వేసిన వారిని దేశభక్తులు అని ట్రంప్‌ వర్ణించారు, వారిలో కొందరు దాడికి పాల్పడ్డారు కనుక వారిని కూడా దేశ భక్తులుగానే పరిగణించాలా ? లేకపోతే మోడీ నోట దు:ఖం తప్ప ఖండన మాట రాలేదేం !


ప్రపంచంలో ట్రంపు ముఖ్యస్నేహితులు కొద్ది మందిలో జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబె, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, మన ప్రధాని నరేంద్రమోడీ సరేసరి. వీరి మధ్య ఉన్న ఉల్లాసం, సరసత గురించి పదే పదే చెప్పుకోనవసరం లేదు. ఆ చెట్టపట్టాలు-ఆ కౌగిలింతలను చూసిన తరువాత అదొక అనిర్వచనీయ బంధం వాటిని ప్రత్యక్షంగా చూసే భాగ్యం అందరికీ కలగదు కదా అని ఎందరో మురిసిపోవటాన్ని చూశాము.

ఎంతలో ఎంత మార్పు ! ” వాషింగ్టన్‌ డిసి.లో కొట్లాటలు మరియు హింసా కాండ వార్తలు చూడాలంటే దు:ఖం కలిగింది. అధికార మార్పిడి పద్దతి ప్రకారం మరియు శాంతియుత పద్దతుల్లో కొనసాగాలి. చట్టవిరుద్దమైన నిరసనలతో ప్రజాస్వామిక ప్రక్రియను కూలదోయకూడదు ” అని నరేంద్రమోడీ నోటి నుంచి అదే లెండి ట్విటర్‌ ద్వారా స్పందన వెలువడుతుందని ఎవరైనా, ఎప్పుడైనా ఊహించారా ? దీన్ని విధిరాత అందామా ? లేక మోడీ గారి సిబ్బంది రాసింది అనుకోవాలా ? దు:ఖితులైన సామాన్యులు కోలుకోవాలంటే సమయం పడుతుంది. నరేంద్రమోడీ అసామాన్య వ్యక్తి గనుక త్వరలోనే మామూలు మనిషి కావచ్చు. అయినా ప్రపంచమంతా చీత్కరించుకుంటున్న వ్యక్తి ప్రేరేపిత చర్యల గురించి ఒక ప్రధాని దు:ఖితులు కావటంలో నిజాయితీ ఉందా అని ఎవరికైనా అనుమానం వస్తే… చెప్పలేం !


అమెరికా అధికార కేంద్రంపై తన మద్దతుదార్లను ఉసిగొల్పిన ట్రంప్‌ వైఖరి మీద ప్రపంచమంతా ఆగ్రహం వ్యక్తం కావటంతో విధిలేక మాట మాత్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన చేశాడు.చిత్రం ఏమంటే మన నరేంద్రమోడీ గారి నోట ఖండన రాలేదు. నిజానికి ట్రంప్‌ ఖండన కూడా ఒక నాటకమే. కాపిటల్‌ మీద మూక దాడికి సిద్దమౌతున్న సమయంలో కూడా ఎన్నికలలో అక్రమాలు జరిగాయని, ఎన్నిక అపహరణను అడ్డుకోవాలని, తనకు మద్దతు ఇవ్వాలని, ఎన్నికలను అంగీకరించేది లేదని గతంలో చేసిన ఆరోపణలను పునశ్చరణ గావిస్తూ ట్రంప్‌ ఉపన్యాసం చేశాడు. నా అద్భుతమైన మద్దతుదారులారా మీరు ఆశాభంగం చెందుతారని నాకు తెలుసు. నమ్మశక్యం కాని మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని మీరు తెలుసుకోవాలి అంటూ మాట్లాడాడు. దాడులకు పాల్పడిన వారి ఆశాభంగానికి నా సానుభూతి అని ఒక వీడియో ద్వారా తొలి స్పందనలో పేర్కొన్నాడు. (మరుసటి రోజు మాట మార్చాడు.)

కాపిటల్‌ మీద దాడి జరుగుతున్న సమయంలో ఒక తాత్కాలిక గుడారంలో ట్రంప్‌ తన చుట్టూ ఉన్నవారితో నృత్యాలు చేయటం, దాడుల దృశ్యాలను టీవీల్లో ఉత్సాహంతో చూసినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. ట్రంప్‌తో పాటు కుమారుడు ఎరిక్‌, కుమార్తె ఇవాంక, సలహాదారు కింబర్లే గుయిల్‌ ఫోయిల్‌, అధ్యక్ష భవన సిబ్బంది ప్రధాన అధికారి మార్క్‌ మెడోస్‌ తదితర సీనియర్‌ అధికారులందరూ అక్కడే టీవీల ముందు ఉన్నారు. అయితే ఆ వీడియోలు మూకలను రెచ్చగొడుతూ పోరాడాలని, తాను కూడా వస్తానంటూ ట్రంప్‌ ప్రసంగం చేయటానికి ముందు చిత్రీకరించినవని ఒక కధనం.
పిచ్చి పట్టిన ట్రంప్‌ అధికారపు చివరి రోజుల్లో మిలటరీ లేదా అణుదాడికి పాల్పడకుండా అణ్వాయుధాల సంకేతాలు అందకుండా చూడాలని మిలిటరీ ఉన్నతాధికారి మార్క్‌ కెలీకి చెప్పినట్లు అమెరికన్‌ కాంగ్రెస్‌(మన లోక్‌సభ వంటిది) స్పీకర్‌ నాన్సీ పెలోసీ వెల్లడించారంటే పరిస్ధితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.


ట్విటర్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలు ప్రయివేటు కంపెనీల చేతుల్లో ఉన్నాయి. వాటితో అవి పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నాయి. ప్యాకేజీలు ఇవ్వని వారికి వ్యతిరేకంగా ఇచ్చిన వారికి అనుకూలంగా పని చేస్తాయి. కాపిటల్‌పై దాడి తరువాత ట్రంప్‌ ఖాతాలను పూర్తిగా స్ధంభింప చేశారని, తాత్కాలికంగా నిలిపివేశారని భిన్నమైన వార్తలు వచ్చాయి. ఆ చర్యలు ప్రజాస్వామ్య బద్దమా కాదా అన్న చర్చను కొందరు లేవదీశారు. ట్రంప్‌ ఖాతాలను నిలిపివేయటం అక్రమం అని గుండెలు బాదుకుంటున్నారు. ట్రంప్‌కు పిచ్చి పట్టింది పట్టించుకోవద్దు, ఎలాంటి కీలకాంశాలు అందుబాటులో ఉంచవద్దని నాన్సీ పెలోసీ వంటి వారు మిలిటరీ ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. అలాంటి పిచ్చివాడు జనాన్ని మరింతగా రెచ్చగొట్టకుండా ఖాతాలను నిలిపివేసి కట్టడి చేయకుండా ఇంకా అగ్నికి ఆజ్యం పోసేందుకు అనుమతించాలా ?అనుమతించాలనే సంఘపరివార్‌ కోరుతోంది. ఎందుకంటే వారికి ఆ స్వేచ్చ అవసరం కదా !


తన ట్వీట్లను తొలగించగానే స్పందిస్తూ ట్రంప్‌ చేసిన ట్వీట్లలో మరో ప్రత్నామ్నాయ సామాజిక వేదికలను ఏర్పాటు చేయాలని చెప్పాడు. ” నన్ను అడిగే వారందరికీ ఇదే చెబుతున్నా జనవరి 20వ తేదీ ప్రారంభోత్సవానికి నేను వెళ్లటం లేదు. ఏడున్నర కోట్ల మంది అమెరికన్‌ దేశ భక్తులు నాకు ఓటు వేశారు. అమెరికాదే అగ్రస్ధానం, మరోసారి అమెరికాను గొప్పదిగా చేయండి, భవిష్యత్‌లో మరింత పెద్ద గొంతుకను కలిగి ఉండబోతున్నాం. వారు ఏవిధంగానూ, ఏ రూపంలోనూ మనల్ని కించపరలేరు ” అని పేర్కొన్నాడు. తెలంగాణా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ కూడా ఇదే మాదిరి హైదరాబాద్‌ ఎన్నికల సమయంలో దేశభక్తులు కావాలో దేశద్రోహులు కావాలో తేల్చుకోమని ఓటర్లకు సవాలు విసిరిన విషయం తెలిసిందే. తమకు ఓటు వేస్తే ఓటర్లు దేశభక్తులు, ఇతరులకు వేస్తే దేశద్రోహులు. ట్రంపు – సంజయ ఇద్దరూ ఎన్నడూ మాట్లాడుకొని ఉండరు,కానీ చెట్టుమీది కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్లు భావజాలం ఎలా కలుపుతుందో, కలుస్తుందో చూడండి.
ఈ రోజు ట్రంప్‌ ఖాతాలను మూసివేసిన వారు రేపు ఎవరి దాన్నయినా అదే చేసే ప్రమాదం ఉందంటూ బిజెపి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఈ చర్య మేలుకొలుపు, నియంత్రణలేని బడా కంపెనీల నుంచి పొంచి ఉన్న ముప్పు అని గుండెలు బాదుకున్నారు. పొద్దున లేస్తే అసత్యాలు, అర్ధసత్యాలు, నకిలీ వార్తలను పుంఖాను పుంఖాలుగా సృష్టించే కాషాయ ఫ్యాక్టరీల పర్యవేక్షకుడు అమిత్‌ మాలవీయ, బిజెపి ఎంపీ తేజస్వీ సూర్య ఇప్పుడు ట్రంప్‌ హక్కులు హరించారంటూ నానా యాగీ చేస్తున్నారు. ఒక వేళ సామాజిక మాధ్యమాలు తదుపరి చర్యలు తీసుకోవాల్సి వస్తే తక్షణమే ” అమిత్‌ మాల్‌వేర్‌ ” మీద తీసుకోవాలని ట్విటరైట్స్‌ స్పందించారు.(మాల్‌వేర్‌ అంటే కంప్యూటర్‌ వైరస్‌ ) అమెరికా అధ్యక్షుడి విషయంలోనే వారా పని చేయగలిగితే ఎవరినైనా అదే చేస్తారు. మన ప్రజాస్వామ్యాన్ని మెరుగుపరచేందుకు త్వరలో భారత్‌ వీటిని సమీక్షంచ నుంది అని బిజెపి యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య పేర్కొన్నారు.

అధికారంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాల నిలిపివేత ప్రమాదకరమైన సంప్రదాయం అని బిజెపి ఐటి విభాగ అధిపతి అమిత్‌ మాలవీయ పేర్కొన్నారు. విద్వేషాన్ని రెచ్చగొట్టటం, తప్పుడు వార్తలను ప్రచారంలో బెట్టటంలో దేశంలో ముందున్నది ఎవరో అందరికీ తెలిసిందే. కనుకనే మాలవీయ వంటి వారు రేపు తమ మీద కూడా అదే డిమాండ్‌ వస్తుందేమో అని ఆందోళన పడుతున్నారు. ట్రంప్‌ అభిప్రాయాల మీద చేయగలిగింది తక్కువే అయినా విభేదించే వాటిని సహించకపోవటం ఎక్కువ కావచ్చు అని అమిత్‌ మాలవీయ చెప్పారు. సహనం గురించి ఆ పెద్దమనిషి చెప్పటాన్ని చూస్తే దొంగే దొంగ అన్నట్లుగా లేదూ ! ప్రజాస్వామ్యంలో అసమ్మతి ప్రాధమికమైనది, ప్రభుత్వం దాన్ని స్వాగతిస్తుంది(బిజెపి ?) అయితే దాని సహేతుకతను రాజ్యాంగబద్దమైన అధికారవ్యవస్ధలే నిర్ణయించగలవు. బడా టెక్‌ కంపెనీలు ఇప్పుడు ఆ బాధ్యతను తీసుకున్నాయి, వాటిని నియంత్రించేందుకు సమయం ఆసన్నమైంది అని తేజస్వి సూర్య చెప్పారు. ఉపయోగించుకున్నంత కాలం ఉపయోగించుకోవటం, మాట విననపుడు తమదారికి తెచ్చుకోవటం-పాలన నియంత్రణ తక్కువ, స్వేచ్చ ఎక్కువ అని కబుర్లు చెప్పిన వారి సిజరూపం ఇది.

అమెరికా అధికార కేంద్రం మీద దాడి చేసిన ట్రంపు ప్రేరేపిత నేరగాండ్ల మీద బిజెపి నేతలు ” తమలపాకుల ”తో కొడుతున్నారు ఎందుకు అన్న అనుమానం రావచ్చు. 2001 డిసెంబరు 13న పాక్‌ ప్రేరేపిత జైషే మహమ్మద్‌, లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఢిల్లీలోని మన పార్లమెంట్‌ భవనం మీద దాడి చేశారు. ఆ దుండగుల స్ఫూర్తితో మూడు రోజుల తరువాత 16వ తేదీన ఆర్‌ఎస్‌ఎస్‌ పుట్టించిన విశ్వహిందూపరిషత్‌, భజరంగదళ్‌, దుర్గావాహినీ సంస్ధలకు చెందిన వారు ఒడిషా అసెంబ్లీ భవనం మీద దాడి చేశారు. అంతకు ముందు రోజు అసెంబ్లీలో కొందరు ఎంఎల్‌ఏలు విశ్వహిందూ పరిషత్‌ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారట. అందువలన వాటిని ఉపసంహరించుకోవాలని, అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిని అప్పగించాలని, తమ నేత గిరిరాజ కిషోర్‌ను విడుదల చేయాలనే నినాదాలతో త్రిశూలాలు, కర్రలు, ఇతర ఆయుధాలు ధరించి జై శ్రీరామ్‌, వాజ్‌పేయి జిందాబాద్‌ నినాదాలతో అరగంటపాటు విధ్వంసం సృష్టించారు. అనేక మంది మీద దాడి చేశారు. దీనికి నాయకత్వం వహించిన వారిలో ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న ప్రతాప సారంగితో పాటు అనేక మందిని అరెస్టు చేశారు. ఈ దాడిని అంతకు ముందు మూడు రోజలు ముందు పార్లమెంట్‌ మీద జరిగిన దాడిని ఒకే విధంగా చూడకూడదని,అంతకు ముందు కొన్ని సంస్ధల వారు వివిధ సందర్భాలలో అసెంబ్లీని ముట్టడించారని బిజెపి నేతలు అప్పుడు సమర్ధించుకున్నారు. ఇప్పుడు ట్రంప్‌ సామాజిక మాధ్యమ ఖాతాల నిలిపివేత తగదని చెప్పటంలో కూడా రేపు తమకూ అదే ప్రాప్తించవచ్చనే ముందు చూపు ఉందేమో ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

వేగంగా పెరుగుతున్న జపాన్‌ మిలిటరీ బడ్జెట్‌ !

23 Wednesday Dec 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

#japan military, East Asia, Japan, Japan military, Japan record military budget


ఎం కోటేశ్వరరావు


ఐక్యరాజ్యసమితి నిబంధనావళి ప్రకారం ప్రతిదేశమూ రక్షణ హక్కు కలిగి ఉంటుంది. అయితే రెండవ ప్రపంచ యుద్దంలో జర్మనీ, జపాన్‌ మిలిటరీ దుర్మార్గాలను చూసిన తరువాత ఆ రెండు దేశాల మిలిటరీలను రద్దు చేస్తూ యుద్ద విజేతలు శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాటికి ఆత్మరక్షణ భద్రతా వ్యవస్ధలు తప్ప సాధారణ మిలిటరీ లేదు. ఆ కారణంగా పొదుపు అయిన సొమ్మును ఆ రెండు దేశాలూ పరిశోధనా-అభివృద్ధి రంగానికి మరల్చి పారిశ్రామిక రంగాలలో ఎన్నో విజయాలు సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అవి ప్రపంచ మార్కెట్ల కోసం ఇతర ధనిక దేశాలతో పోటీకి వస్తున్నాయి. ఈ నేపధ్యంలో వాటి మిలిటరీ బడ్జెట్ల పెరుగుదల, ఆయుధ పోటీ ఎక్కడకు దారితీస్తుందో అన్న ఆందోళన కలిగిస్తోంది.


వరుసగా తొమ్మిదవ సంవత్సరం జపాన్‌ తన మిలిటరీ బడ్జెట్‌ను పెంచింది. 2021 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వచ్చే ఈ పెంపుదల 52బిలియన్‌ డాలర్లకు చేరింది. అమెరికాతో రక్షణ ఒప్పందం ఉండి, ఆత్మరక్షణకు మాత్రమే పరిమిత ఆయుధాలు, ఏర్పాట్లు కలిగి ఉండాల్సిన జపాన్‌ పూర్తి స్ధాయిలో యుద్దానికి వినియోగించే జెట్‌ బాంబర్లు, దీర్ఘశ్రేణి క్షిపణులను, యుద్ద నౌకలు, విమానవాహక యుద్ద నౌకలను సమకూర్చుకుంటున్నది. ఆత్మ రక్షణకు రక్షణ పేరుతో జరుగుతున్న ఈ చర్యలు ఆ ప్రాంతంలోని రష్యా, చైనాలను రెచ్చగొట్టేందుకు, ఆయుధ పోటీకి దారితీయవచ్చని భావిస్తున్నారు. తాజా పెంపుదలతో ప్రపంచంలో మిలిటరీ బడ్జెట్‌ అగ్రదేశాలలో జపాన్‌ పదవ స్దానానికి చేరింది.
అమెరికా ఆయుధాలను విక్రయిస్తున్నప్పటికీ తన ఆధునిక యుద్దవిమానాలను జపాన్‌కు అందచేయటాన్ని నిషేధించింది. వాటి నిర్మాణ రహస్యాలను జపనీయులు తెలుసుకొని తమకు పోటీకి వస్తారన్నదే దాని భయం. ఈ కారణంగానే రానున్న పదిహేను సంవత్సరాలలో తన స్వంత యుద్ద విమానాలను రూపొందించేందుకు మిత్సుబిషి సంస్దకు జపాన్‌ ప్రభుత్వం 40బిలియన్‌ డాలర్ల ప్రాజెక్టును అప్పగించింది. 2030 నాటికి విమానాన్ని రూపొందించి, 2035నాటికి మిలిటరీకి అందచేయాలన్నది లక్ష్యం. దీనిలో అమెరికా యుద్ద విమానాల కార్పొరేట్‌ సంస్ధ లాక్‌హీడ్‌ మార్టిన్‌ సహకారం కూడా తీసుకుంటున్నారు. అప్పటి వరకు ఆ కంపెనీ ఉత్పత్తి ఎఫ్‌-35ఆరు బాంబర్లను జపాన్‌ కొనుగోలు చేయనుంది.

రెండవ ప్రపంచ యుద్దంలో మిత్రరాజ్యాల చేతుల్లో ఓడిపోయిన జపాన్‌ మరోసారి మిలిటరీ శక్తిగా ఎదగకుండా చూసేందుకు మిలిటరీని రద్దు చేస్తూ పోట్స్‌డామ్‌ సమావేశం నిర్ణయించింది. శాంతి ఒప్పందం ప్రకారం జపాన్‌ ఇతర దేశాలతో రక్షణ ఒప్పందాలు చేసుకోవచ్చు, ఆత్మరక్షణ చర్యలు తీసుకోవచ్చు. అయితే తరువాత అమెరికా తన షరతుల మేరకు జపాన్‌తో రక్షణ ఒప్పందాన్ని రుద్దింది. ఒక ఏడాది ముందు తెలియచేసి ఎవరైనా ఒప్పందం నుంచి వైదొలగవచ్చనే ఒక నిబంధన ఉన్నప్పటికీ ఒక విధంగా జపాన్‌ సార్వభౌమత్వాన్ని అమెరికా తన తాకట్టులో ఉంచుకుంది. 1951 సెప్టెంబరు ఎనిమిదిన కుదిరిన ఈ ఒప్పందం మరుసటి ఏడాది ఏప్రిల్‌ 28నుంచి అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం అమెరికా సైనిక స్ధావరం ఏర్పాటుకు జపాన్‌ తన గడ్డపై భూమిని కేటాయించాల్సి ఉంది. అమెరికా అనుమతి లేకుండా ఇతర దేశాలతో ఎలాంటి రక్షణ ఒప్పందాలు లేదా మిలిటరీ స్దావరాల ఏర్పాటుకు హక్కులు ఇవ్వరాదు. తన స్వంత ఖర్చుతో జపాన్‌లో మిలిటరీ స్దావరాలను నిర్వహించటమే గాక రక్షణ కల్పించాలి. ఆ మేరకు జపాన్‌లో అమెరికా మిలటరీ తిష్టవేసింది.
అయితే ఇంతవరకు ఏ దేశమూ జపాన్‌ మీద దాడి చేయలేదు, అలాంటి సూచికలు కూడా లేవు. సోవియట్‌ యూనియన్‌ లేదా దాన్ని కూల్చివేసిన తరువాత రష్యా వైపు నుంచి లేదా ఒక నాడు జపాన్‌ ఆక్రమణకు గురైన చైనా నుంచి ఎలాంటి ముప్పు తలెత్తిన దాఖలాలు లేవు. అయినా గత కొద్ది సంవత్సరాలు జపాన్‌ తన మిలటరీ శక్తిని పెంచుకుంటూ వస్తోంది. అమెరికాతో రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకొని స్వతంత్ర మిలిటరీ శక్తిగా ఎదగాలనే డిమాండ్‌ కార్పొరేట్‌ శక్తుల నుంచి పెరుగుతోంది. ఇదే సమయంలో తన కంటే మెరుగైన ఆర్ధిక స్దితిలో ఉన్న జపాన్‌ను ఒక వైపు తమ అదుపులో ఉంచుకుంటూనే దానికి తమ ఆయుధాలను అమ్మి సొమ్ము చేసుకోవాలనే ఎత్తుగడను అమెరికా యుద్ద పరిశ్రమ ముందుకు తెచ్చినట్లు కనిపిస్తోంది. ఇదే అదునుగా భావించి ఆయుధాల కొనుగోలుతో పాటు స్వంతంగా ఆయుధాల తయారీకి జపాన్‌ శ్రీకారం చుట్టింది. గతంలో వాణిజ్యం విషయంలో వివాద పడి సర్దుబాటు చేసుకున్న ఈ రెండు దేశాల మధ్య మిలిటరీ చర్యలు ఏ పర్యవసానాలకు దారి తీస్తాయో చూడాలి. అయితే జపాన్‌ సాయుధం కావటం తూర్పు ఆసియాలో శాంతికి ముప్పు కలిగిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

జపాన్‌-రష్యాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న కొన్ని దీవుల వివాదం పరిష్కారం కాలేదు. పసిఫిక్‌ సముద్రంలోని కురిల్‌, సఖాలిన్‌ దీవులు ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్నాయి. అవి తమవని జపాన్‌ చెబుతోంది. ఈ కారణంగానే రెండవ ప్రపంచ యుద్దం నాటి నుంచి రెండు దేశాల మధ్య యుద్ద శాంతి ఒప్పందం మీద సంతకాలు జరగలేదు. అయినప్పటికీ గత ఏడుదశాబ్దాలలో పూర్వపు సోవియట్‌ లేదా ఇప్పటి రష్యా-జపాన్‌ ఎలాంటి వివాదానికి దిగలేదు. ఆ పేరుతో ఆయుధాల మోహరింపు మాత్రం జరుగుతోంది. ఈ దీవులలో రష్యా ఇటీవలనే ఆధునిక రక్షణ వ్యవస్ధలను ఏర్పాటు చేసింది. వాటిలో స్వల్ప శ్రేణి క్షిపణులు, ఫైటర్‌ జెట్‌లు, నౌకల మీద ప్రయోగించే క్షిపణులు ఉన్నాయి. చైనాతో రష్యా సంబంధాలు సజావుగానే ఉన్నందున ఇవి తమకు వ్యతిరేకంగా ఎక్కు పెట్టినవే అని జపాన్‌, అమెరికా చిత్రిస్తున్నాయి.


మరోవైపు జపాన్‌లో అమెరికా మోహరిస్తున్న మధ్యశ్రేణి క్షిపణులు, వాటికి తోడుగా జపాన్‌ క్షిపణి వ్యవస్ధలు ఎవరికి వ్యతిరేకంగా అన్న ప్రశ్న సహజంగానే ముందుకు వస్తోంది. ఇటీవలి కాలంలో ఈ దీవులకు సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో అమెరికా నౌక, యుద్ద విమానాల కదలికలు కనిపించాయి. జపాన్‌ విమానాలు ఈ ఏడాది కాలంలో తమ ప్రాంతాల సమీపంలో మూడు వందల సార్లు, చైనా సరిహద్దులో ఆరువందల చక్కర్లు కొట్టాయని రష్యా చెబుతోంది. కొరియా సమీపంలోని కొన్ని దీవులు కూడా తమవే అని జపాన్‌ వివాద పడుతోంది. ఆసియాలో సామ్రాజ్యవాదశక్తిగా గతంలో చైనా, కొరియా, ఇండోచైనా ప్రాంతాలను జపాన్‌ ఆక్రమించుకుంది. విధిలేని పరిస్ధితుల్లో వాటి నుంచి ఖాళీచేసినప్పటికీ కొన్ని దీవులు తమవే అని గిల్లికజ్జాలకు దిగుతోంది. ఆ పేరుతో ఆయుధీకరణకు పూనుకుంది.కరోనా వైరస్‌ కారణంగా ఆర్ధిక వ్యవస్ధ మీద పడిన ప్రతికూల ప్రభావం ఎంతో ఇంకా తేలనప్పటికీ మిలిటరీ ఖర్చు పెంచేందుకు పాలకులు వెనకాడటం లేదు. కరోనా కట్టడిలో జపాన్‌ మిగతా ధనిక దేశాలకంటే మెరుగ్గా పని చేసినప్పటికీ ఆర్ధిక వ్యవస్ధ 2027వరకు కోలుకొనే అవకాశం లేదని, అయినా మిలిటరీ ఖర్చు పెంచటం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.


అమెరికా నాయకత్వాన ఆస్ట్రేలియా, భారత్‌తో కలసి చతుష్టయం పేరుతో జపాన్‌ ఒక మిలిటరీ కూటమి ఏర్పాటుకు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. మిలిటరీ బడ్జెట్‌ పెంపు దీనిలో భాగమే అని భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా వద్ద నుంచి క్షిపణులు, విమానాలు కొనుగోలు చేస్తున్నప్పటికీ స్దానికంగానే తయారీకి కూడా ప్రాజెక్టులను ప్రారంభించింది. జలాంతర్గాములపై దాడి చేసే ఫ్రైగేట్స్‌, ఇతర వేగంగా ప్రయాణించే చిన్న నౌకలను కూడా సేకరిస్తున్నది.
కొద్ది మంది సిబ్బందితో దాడులు చేయగలిగిన రెండు యుద్ద నావల తయారీకి 91 కోట్ల డాలర్లను బడ్జెట్‌లో కేటాయించారు. క్షిపణుల తయారీ లేదా కొనుగోలు ఇతర దేశాల మీద దాడులకు ఉద్దేశించినవి, ఆత్మరక్షణ విధానానికి అనుకూలమైన రాజ్యాంగానికి వ్యతిరేకమైన పరిణామాలని జపాన్‌ ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దేశ నైరుతి దీవుల చుట్టూ చైనా నౌకా దళ కార్యకలాపాలకు స్పందనగా, దేశ ఆత్మరక్షణ దళాల రక్షణ కోసం క్షిపణులు కీలకమని రక్షణ మంత్రి నోబు కిషి సమర్దించుకున్నారు. ఐదు సంవత్సరాలలో యుద్ద నావల నిర్మాణం, క్షిపణి పరిశోధనలు పూర్తవుతాయని, ఇప్పటికే 900 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను తాకే వాటిని అభివృద్ది చేసినట్లు చెబుతున్నారు. తమ గగనతలపై ఎగిరే సూపర్‌సోనిక్‌ విమానాలను పసిగట్టేందుకు అవసరమైన టెలిస్కోప్‌లు, పర్యవేక్షణ వ్యవస్ధల పరిశోధనలకు నిధులు కేటాయించారు. తమ దేశ మిలిటరీ బడ్జెట్‌ వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రాంతీయ శక్తులకు ధీటుగా ఉంటుందని టోకియోలోని ఇంటర్నేషనల్‌ క్రిస్టియన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ స్టీఫెన్‌ నాగీ చెప్పారు. రెండువేల సంవత్సరం నుంచి చైనా మిలిటరీ బడ్జెట్‌ పెరుగుతున్న కారణంగా జపాన్‌ కూడా పెంచకతప్పటం లేదని సమర్ధించారు. టోకియోలోని టకుషోకు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ హెయిగో నాగీ మాట్లాడుతూ స్వయం రక్షణకు జపాన్‌ మరింత బాధ్యత వహించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వత్తిడి కూడా మిలిటరీ బడ్జెట్‌ పెంపుదలకు ఒక కారణం అన్నారు. రక్షణ బడ్జెట్‌ పెంచకూడదనే రోజులు పోయాయన్నారు.


నాటో కూటమి ఖర్చులో ఎక్కువ మొత్తాన్ని ఐరోపా దేశాలు భరించాలని వత్తిడి చేసినట్లే జపాన్‌తో రక్షణ ఒప్పందం ఉన్నప్పటికీ రక్షణ బడ్జెట్‌ పెంపుదల వత్తిడి వెనుక అమెరికా యుద్ద పరిశ్రమల వత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది.జపాన్‌కు వంద ఎఫ్‌-35 రకం యుద్ద విమానాలను విక్రయించాలని జూలై నెలలో నిర్ణయించారు. అమెరికా ఆయుధ పరిశ్రమలైన లాక్‌హీడ్‌ మార్టిన్‌, బోయింగ్‌,నార్త్‌రోప్‌గ్రుమాన్‌, బ్రిటన్‌కు చెందిన బియేయి సిస్టమ్స్‌, రోల్స్‌ రాయిస్‌ కంపెనీలు జపాన్‌ ఆయుధ తయారీలో భాగస్వాములు కావాలని చూస్తున్నాయి. కరోనాకు ముందే అమెరికా ఆర్ధిక వ్యవస్ద సమస్యలను ఎదుర్కొంటుండగా కరోనా కాలంలో తీవ్రంగా దెబ్బతిన్నదని అందువలన తూర్పు ఆసియాలో తన తరఫున ప్రాంతీయ భద్రతా పెంపుదల చర్యలకు జపాన్‌ ఎక్కువగా ఖర్చు చేయాలనే వత్తిడి పెంచుతున్నట్లు భావిస్తున్నారు.
రెండవ ప్రపంచ యుద్దం తరువాత గణనీయంగా పుంజుకున్నప్పటి నుంచి తిరిగి ప్రపంచ రాజకీయాల్లో పాత్ర పోషించటం ద్వారా తమ మార్కెట్‌ను పెంచుకోవాలని జపాన్‌ చూస్తోంది. దానికి మిలిటరీ శక్తి ఒక సాధనం అన్నది తెలిసిందే. దానిలో భాగంగానే కార్పొరేట్లు రాజ్యాంగాన్ని సవరించి పూర్తి స్ధాయి మిలిటరీని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎప్పటి నుంచో వత్తిడి తెస్తున్నాయి. అయితే రక్షణ ఒప్పందం పేరుతో తన గుప్పెట్లో ఉన్న జపాన్‌ మరోసారి తనకు పోటీనిచ్చే మిలిటరీ శక్తిగా ఎదగాలని అమెరికా కోరుకోవటం లేదు. ఆసియాలో తన అనుయాయిగా ఉంచుకొనేందుకే ప్రాధాన్యత ఇస్తున్నది. గతంలో ఒక సామ్రాజ్యశక్తిగా పెత్తనం చేసినపుడు లబ్దిపొందిన కార్పొరేట్లు అమెరికా, ఇతర దేశాలనుంచి ఆయుధాల కొనుగోలుకు బదులు తామే వాటిని తయారు చేసి లబ్ది పొందాలని చూస్తున్నాయి. ఇప్పుడు చైనా, ఉత్తర కొరియాలను బూచిగా చూపి తమ మిలిటరీ బడ్జెట్‌ను పెంచుకుంటున్నాయి. ఒక వైపు అమెరికా మరోవైపు స్వంత కార్పొరేట్ల వత్తిడిని అక్కడి పాలకవర్గం ఏ విధంగా సమన్వయ పరుస్తుందో చూడాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు అమెరికాను తోసిరాజనే స్ధితి లేనప్పటికీ దానికి బాటలు వేస్తోందన్నది బడ్జెట్‌ కేటాయింపులే చెబుతున్నాయి. అమెరికా బలహీనత ఏమంటే అనూహ్యరీతిలో చైనా ఆర్ధికంగా, మిలిటరీ రీత్యా పెరగటంతో దానికి గతం కంటే ఆర్దిక భారాన్ని ఎక్కువగా పంచుకొనే మిత్ర రాజ్యాలు అవసరం పెరిగింది. దాన్ని గ్రహించి జపాన్‌, జర్మనీలు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దేవుడి మీద ఒట్టు – నిజంగానే యావత్‌ ప్రపంచం నరేంద్రమోడీ వైపు చూస్తోంది !

12 Saturday Sep 2020

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

India economy, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ఇది రాస్తున్న సమయానికి వరల్డోమీటర్‌ ప్రకారం మన దేశ జనాభా 138 కోట్లు దాటింది. కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 47లక్షలను అధిగమించింది. అగ్రస్దానంతో 66లక్షలున్న అమెరికాను దాటిపోయేందుకు ఎక్కువ రోజులు పట్టదు. ఇతర దేశాల జనాభాతో పోలిస్తే మన కేసుల సంఖ్య తక్కువే అని ప్రాధమిక గణితం తెలిసిన వారు కూడా చెబుతారు. సంతోషించాల్సిన అంశమే. దీన్ని నరేంద్రమోడీ గారి విజయ ఖాతాలోనే వేద్దాం. కేసులు తక్కువగా ఉన్నపుడు లాక్‌డౌన్‌ ప్రకటించి విపరీతంగా పెరుగుతున్నపుడు ఎత్తివేసిన ఘనతను కూడా ఆయనకే ఆపాదిద్దాం.


జనవరిలోనే వైరస్‌ గురించి తెలిసినా, అధికారులు హెచ్చరించినా నిర్లక్ష్యంగా వ్యవహరించి సకాలంలో లాక్‌డౌన్‌ ప్రకటించకుండా, ప్రకటించినా అరకొర చర్యలతో అమెరికన్లకు ముప్పు తెచ్చాడు డోనాల్డ్‌ ట్రంప్‌. ఆ పెద్దమనిషి జిగినీ దోస్తు, కౌగిలింతల ఫేం నరేంద్రమోడీ మే 16వ తేదీ నాటికి కరోనా కేసులు పూర్తిగా ఆగిపోతాయని చెప్పిన నీతి ఆయోగ్‌ అధికారుల మాటలు నమ్మినట్లు కనిపిస్తోంది. నిజంగా తగ్గిపోతే ఆ ఖ్యాతి తనఖాతాలో ఎక్కడ పడదోనని పెద్ద నోట్లను రద్దు చేసిన మాదిరి ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు, రాష్ట్రాలతో చర్చలు లేకుండా ఆకస్మికంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు నరేంద్రమోడీ. అయితే అంచనాలు తప్పి కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నప్పటికీ దశలవారీ ఎత్తివేసి మరింత పెరిగేందుకు కారకులయ్యారు, అయినా దాన్ని కూడా విజయంగానే చిత్రించేందుకు ప్రయత్నించారన్నది సర్వత్రా వినిపిస్తున్నమాట. అధికారులదేముంది ! రాజుగారికి ఏది ప్రియమో అదే కదా చెప్పేది. తప్పుడు సలహాలు, జోశ్యాలు చెప్పిన వారి మీద చర్య తీసుకున్నారా ? అదేమీ లేదు.


అన్నీ బాగానే ఉన్నాయి. అసలు విషయం ఆర్ధికం సంగతేమిటి ? దీన్ని ఎవరి ఖాతాలో వేయాలి, ఎవరిని బాధ్యులుగా చేయాలి ? నాకు సంబంధం అంటకట్టేందుకు చూస్తున్నారు, నాకేం బాధ్యత లేదు అని జిఎస్‌టి విషయంలో ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ గారికి పగలూ, రేయీ దేవతలతో సహా కలలోకి వచ్చిన దేవుడు ఒకటికి పదిసార్లు స్పష్టం చేశారని తెలిసింది.


పెద్ద వాటిలో ఒక్క చైనా తప్ప అనేక దేశాల ఆర్ధిక వ్యవస్ధలు కరోనా భాషలో చెప్పాలంటే ఆక్సిజన్‌ సిలిండర్ల మీద ఉన్నాయి. మనది వెంటిలేటర్‌ మీద ఉంది అని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్న తెలుగు లోకోక్తి తెలిసిందే.జనాభాతో పోల్చుకుంటే మన కరోనా కేసులు తక్కువ అని చెబుతున్నవారు ఆర్ధిక రంగంలో అన్ని దేశాల కంటే దిగజారుడులో అగ్రస్ధానంలోకి ఎందుకు నెట్టారో మాట్లాడరేమి ? ఏమిటీ మన దేశ ప్రత్యేకత ? అదైనా చెప్పాలి కదా !
వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి మూడు మాసాల్లో అంటే ఏప్రిల్‌-జూన్‌ మధ్య జిడిపి వృద్ది రేటు 24శాతం తిరోగమనంలో ఉందని, ఇంకా లెక్కలు పూర్తిగానందున నవంబరు 28న సరైన లెక్కలు చెబుతామని కేంద్రం ప్రకటించింది. కొందరు ఆర్ధికవేత్తలు దిగజారుడు 35శాతం వరకు వుండవచ్చని చెప్పారు. నిండా మునిగిన వారికి లోతు ఎంత ఉంటేనేం ! మొదటి మూడు నెలలే కాదు మిగిలిన తొమ్మిదినెలలూ ఎంత తిరోగమనంలో ఉంటామన్న దాని మీద కేంద్ర ప్రభుత్వం తప్ప మిగిలిన అందరూ కుస్తీపడుతున్నారు.


వర్తమాన ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి(2021 మార్చి 31) మన ఆర్ధిక వ్యవస్ధ 14.8శాతం తిరోగమనంలో ఉంటుందని గోల్డ్‌మన్‌ శాచస్‌, 10.5శాతమని ఫిచ్‌ రేటింగ్‌ సంస్ధలు జోశ్యం చెప్పగా మన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆర్ధికవేత్తలు 16.5శాతంగా పేర్కొన్నారు. వరుసగా రెండు త్రైమాసాలు(ఆరునెలలు) ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనంలో ఉంటే మాంద్యం అంటారు. స్వతంత్ర భారత చరిత్రలో 1958లో 1.2శాతం 1966లో 3.66, 1973లో 0.32, 1980లో 5.2శాతం తిరోగమన వృద్ధి నమోదైంది. తొలి త్రైమాసిక తాత్కాలిక ఫలితాలను ప్రకటించిన తరువాత ప్రతి సంస్ధ అంతకు ముందు వేసిన అంచనాలను సవరించి లోటును మరింత పెంచింది. ఉదాహరణకు ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసర్చ్‌ సంస్ద 5.3శాతంగా పేర్కొన్న లోటును 11.8శాతానికి పెంచింది.ఎస్‌బిఐ మాత్రం 20 నుంచి 16.5శాతానికి తగ్గించింది. అయితే వచ్చే జూన్‌ నాటికి ఆర్ధిక వ్యవస్ద పురోగమించవచ్చని కూడా ఈ సంస్దలు జోశ్యం చెబుతున్నాయి. రెండవ త్రైమాసంలో 12శాతం విలోమ అభివృద్ధి ఉంటుందని, రానున్న మూడు సంవత్సరాలలో సగటున పదమూడు శాతం చొప్పున అభివృద్ధి నమోదు చేస్తేనే కరోనాకు ముందున్న స్ధాయికి జిడిపి చేరుకుంటుందని క్రిసిల్‌ సంస్ధ చెప్పింది.
వాస్తవ జిడిపిలో పదమూడు శాతం అంటే 30లక్షల కోట్ల రూపాయలు శరీరం మీద మిగిలిపోయే మచ్చ మాదిరి శాశ్వత నష్టం సంభవిస్తుందని, ఆసియా-పసిఫిక్‌ ప్రాంత దేశాలలో ఈ నష్టం మూడు శాతానికి మించి ఉండదని క్రిసిల్‌ పేర్కొన్నది. జి20 దేశాలలో మన జిడిపి పతనం గరిష్టంగా ఉందని మూడీస్‌ పేర్కొన్నది. ప్రస్తుత అంచనాల ప్రకారం వచ్చే ఏడాది కూడా జిడిపిలోటులోనే ఉంటుందని అంచనా వేసింది.ఆక్స్‌ఫర్డ్‌ అనలిటికా మరింత స్పష్టంగా సచిత్రంగా చూపింది. భారత్‌లో మరో ఉద్దీపన పధకాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ అభిప్రాయపడింది. ఆరోగ్యం, ఆహారం, అవసరమైన వారికి ఆదాయ మద్దతు, వాణిజ్యానికి రాయితీలు ఇవ్వాలని ఐఎంఎఫ్‌ సమాచార శాఖ అధికారి గెరీ రైస్‌ చెప్పారు. వర్తమాన సంవత్సరంలో 4.5శాతం, వచ్చే ఏడాది ఆరుశాతం తిరోగమన వృద్ధి ఉంటుందని ఐఎంఎఫ్‌ జోశ్యం చెప్పింది.


కరోనా వైరస్‌ సమయంలో ప్రభుత్వ ఖర్చు తగ్గినకారణంగా అదిశాశ్వత నష్టాన్ని కలిగించవచ్చని కొందరు చెబుతున్నారు. ప్రభుత్వం తన డబ్బు సంచి ముడి విప్పకపోతే కోలుకోవటం కష్టమని హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి ఉద్దీపన ప్రకటించాలనే సూచనలు అన్ని వైపుల నుంచీ వస్తున్నాయి. ఇది కూడా 21లక్షల కోట్ల రూపాయల పధకం వంటిదే అయితే ప్రభుత్వం రానున్న రోజుల్లో మరింత నగుబాట్ల పాలు కావటం ఖాయం.
ఏప్రిల్‌ జూలై మాసాల్లో గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 9.4లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఈ ఏడాది ఆ వ్యవధిలో 10.5లక్షల కోట్లుగా ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే గత ఏడాది కంటే తక్కువ.2020-21 బడ్జెట్‌లో అంతకు ముందు సంవత్సరం కంటే మొత్తంగా 12.7శాతం అదనపు ఖర్చు ఉంటుందని ప్రతిపాదించారు. అయితే ఇప్పటి వరకు పెరిగింది 11.3శాతం మాత్రమే. కరోనా బాధితులను ఆదుకొనేందుకు మేము అది చేశాము ఇది చేశాము అని చెప్పుకొనే చర్యలకు డబ్బు ఎక్కడి నుంచి తెచ్చినట్లు ? బడ్జెట్‌లో కొన్నింటికి తగ్గించి మరికొన్నింటికీ ఖర్చు చేస్తున్నారను కోవాలి. ఇది కూడా రెవెన్యూ ఖర్చు తప్ప దాని మీద వచ్చే రాబడి నామమాత్రం. దాని వలన ఆస్తుల కల్పన జరగదు, ఉపాధి పరిమితం తప్ప పెరగదు. మౌలిక సదుపాయాల మీద ప్రభుత్వం ఖర్చు చేస్తే వాటిని వినియోగించుకొనేందుకు ప్రయివేటు పెట్టుబడిదారులు ముందుకు వస్తారు. తద్వారా కొంత ఉపాధి పెరుగుతుంది. ఇప్పుడు అది చాలా పరిమితంగానే చేస్తున్నారు. ఇది ఆర్ధిక వ్యవస్ధ దిగజారటానికి లేదా పక్షవాత రోగి మాదిరి తయారు కావటానికి దారితీస్తుంది.


సిఎంఐయి సంస్ధ సమాచారం ప్రకారం గత రెండు సంవత్సరాలలో ప్రతి మూడు మాసాలకు 1.5లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో చేసిన ఖర్చు రూ.19,200 కోట్లు మాత్రమే. 2018-19 మరియు 2019-20సంవత్సరాలలో ప్రతి మూడు మాసాలకు సగటున మూడున్నర లక్షల కోట్ల రూపాయల మేర ప్రభుత్వం లేదా ప్రయివేటు రంగం కొత్త ప్రాజెక్టులను ప్రకటించాయి. అంత మొత్తం ఉన్నపుడే ఆర్ధిక వ్యవస్ధ దిగజారుడు ప్రారంభం అయింది. ఇప్పుడు జూన్‌తో ముగిసిన మూడు మాసాల్లో ప్రకటించిన నూతన ప్రాజెక్టుల విలువ ఐదోవంతు కేవలం రూ.70,600 కోట్లు మాత్రమే. గతంలో ప్రకటించిన పధకాల పూర్తి కూడా చాలా తక్కువగా ఉంది. ప్రయివేటు వినియోగం 2014 సెప్టెంబరు తరువాత కనిష్టంగా నమోదైంది.
కేంద్రం, రాష్ట్రాలు కరోనా ఉద్దీపనల పేరుతో చేసిన ఖర్చు ఏప్రిల్‌-జూన్‌ మధ్య 16శాతం పెరిగింది. ఇది పెట్టుబడులను ఆకర్షించటానికి లేదా ప్రయివేటు వినిమయం పెరగటానికి గానీ తోడ్పడదని ఆర్ధిక రంగ విశ్లేషకులు చెబుతున్నారు. ఉపాధి పోగొట్టుకున్నవారు పెద్ద సంఖ్యలో ఉంటే పని చేస్తున్న వారికి కూడా వేతనాల కోత గురించి తెలిసిందే. ఇది పారిశ్రామిక, సేవా రంగాలలో మాంద్యానికి దోహదం చేసింది. ఎగుమతులు 19శాతం పడిపోయాయి. ఇది ఒక నష్టం. ఇదే సమయంలో దిగుమతులు 40శాతం తగ్గిపోయాయి. దీని అర్ధం ఏమిటి ? కొనుగోలు డిమాండ్‌ తగ్గిపోవటమే, అది కేంద్రానికి, రాష్ట్రాలకు వచ్చే ఆదాయానికి కూడా గండికొడుతుంది.
కరోనాను ఎదుర్కొనేందుకు లేదా దాని కారణంగా దిగజారిన ఆర్ధిక వ్యవస్ధను పునరుద్దరించేందుకు అదనపు ఖర్చు చేసినందువలన గాక ఆదాయం తగ్గిన కారణంగానే లోటు ఏర్పడుతున్నది. దానిని పూడ్చుకొనేందుకు కేంద్రం అప్పులు చేయటానికి లేదా రిజర్వుబ్యాంకును ఆదేశించి అదనంగా నోట్లను ముద్రించి కేంద్రం కొంత మేరకు బయటపడవచ్చు. రాష్ట్రాలు అప్పుల ఊబిలో మరింతగా కూరుకుపోతాయి. రిజర్వుబ్యాంకు నోట్లను ముద్రిస్తే అది ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. గతంలో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన బిజెపికి దాని పర్యవసానాలు తెలుసు కనుక నోట్ల ముద్రణ గురించి గుంజాటన పడుతోంది. అవసరమైన సాకులు వెతుకుతోందని చెప్పవచ్చు. ఏ పేరుతో చేసినా అది సామాన్యుల నెత్తిమీద మోదటమే అవుతుంది. ద్రవ్యలోటు పన్నెండు శాతానికి పెరుగుతుందని, అప్పులు జిడిపిలో 90శాతానికి పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఆర్ధిక వ్యవస్ధను పునరుజ్జీవింప చేసేందుకు పెద్ద ఉద్దీపన పధకాన్ని ప్రకటించాలని ఫిక్కి అధ్యక్షురాలు సంగీతా రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. లాక్‌డౌన్‌ సడలించిన కారణంగా తమ ఆర్డర్లు పెరిగాయని 25శాతం కంపెనీలే జూన్‌లో పేర్కొనగా ఆగస్టునాటికి 44శాతానికి చేరాయని ఆమె పేర్కొన్నారు.


1933లో అమెరికా ఎదుర్కొన్న మాదిరి సవాలును ఇప్పుడు మన దేశం ఎదుర్కొంటోందని ప్రధాని ఆర్ధిక సలహాదారుల బృంద సభ్యుడైన నీలేష్‌ షా సుప్రసిద్ద జర్నలిస్టు కరన్‌ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బలంగా ఉన్న ఎంఎస్‌ఎంఇలను ఆదుకొని బలహీనమైన వాటిని అంతరించి పోయేందుకు అనుమతించాలని తాను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు. స్వాతంత్య్రం తరువాత తొలిసారిగా దేశం ఒకేసారి వైద్య, ఆర్ధిక, ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, దీన్నొక అవకాశంగా మార్చుకోవాలన్నారు. ప్రపంచ పుత్తడి మండలి అంచనా ప్రకారం భారత్‌లో రెండులక్షల కోట్ల డాలర్ల విలువగల 25వేల టన్నుల బంగారం గృహస్తుల వద్ద ఉంది. దీనిలో ఎక్కువ భాగం లెక్కల్లో లేదు. అందువలన అలాంటి బంగారం కలిగిన వారందరికీ క్షమాభిక్ష పెట్టి చట్టబద్దం గావిస్తే బిలియన్ల డాలర్లను సమీకరించుకోవచ్చు అన్నారు నీలేష్‌ షా. దేశం ఇప్పటికి 500 బిలియన్‌ డాలర్ల విలువగల బంగారాన్ని దిగుమతి చేసుకుంటే దానిలో 376 బిలియన్ల మేరకు అధికారికంగా జరగ్గా 140 బిలియన్‌ డాలర్ల విలువగలది దొంగబంగారం అన్నారు. 1933లో అమెరికా ఆర్ధిక మాంద్యం నుంచి తప్పించుకొనేందుకు బంగారాన్ని జాతీయం చేసిందని, మన దేశంలో గతంలో మొరార్జీదేశారు జాతీయానికి బదులు నియంత్రణ చట్టాన్ని తెచ్చారన్నారు. మన ఆర్ధిక వ్యవస్ధ కోలుకొనేందుకు జనం త్యాగాలు చేయాలన్నారు. కోటక్‌ మహీంద్రా కంపెనీలో పని చేస్తున్న నీలేష్‌ షా వ్యక్తిగత అభిప్రాయాలుగా చెప్పినప్పటికీ నరేంద్రమోడీకి సలహాలు ఇచ్చే సమయంలో అవి ప్రభావితం చూపకుండా ఉంటాయా, లేక వాటిని పక్కన పెట్టి మోడీగారికి ఇష్టమైన సలహాలు చెబుతారా ?


నరేంద్రమోడీ ప్రపంచ నాయకుడు, ఆయన కోసం ప్రపంచ మంతా ఎదురు చూస్తోందని బిజెపి శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. మరొక విధంగా అది నిజమే అనిపిస్తున్నది. ప్రపంచ నేతగాకపోతే 2018 సియోల్‌ శాంతి బహుమతిని నరేంద్రమోడీ ఎందుకు పొందారు ? ఇప్పటి వరకు 14 మంది ఈ బహుమతిని పొందగా మోడీ తొలి భారతీయుడని మోడీ అభిమానులు పొంగిపోయారు. మోడినోమిక్స్‌, యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీకి గాను నరేంద్రమోడీకి సియోల్‌ శాంతి బహుమతి ప్రదానం ‘ అంటూ శీర్షికలు పెట్టిన పత్రికలున్నాయి. మోడినోమిక్స్‌(మోడీ తరహా ఆర్ధిక విధానం) ద్వారా భారత్‌లో మరియు ప్రపంచంలో వున్నతమైన ఆర్ధిక అభివద్ధికి అందించిన తోడ్పాటుకుగాను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు మన విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొన్నది. ‘ అంతర్జాతీయ సహకారాన్ని మెరుగుపరచేందుకు ఆయన అంకిత భావం, ప్రపంచ ఆర్ధిక వద్ధి పెంపుదల, ప్రపంచంలో వేగంగా వద్ధి చెందుతున్న పెద్ద ఆర్ధిక వ్యవస్ధ అభివద్ది పెంపుదలతో భారత పౌరుల మానవాభివద్ధికి కషి, అవినీతి వ్యతిరేక మరియు సామాజిక ఏకీకరణం ద్వారా ప్రజాస్వామ్యం మరింతగా అభివద్ధి చెందించే ప్రయత్నాలకు గుర్తింపు ఇది, క్రియాశీలకమైన విదేశాంగ విధానంతో ప్రపంచవ్యాపితంగా వున్న దేశాలతో వ్యవహరించిన మోడీ సిద్దాంతాలు, ఆసియా పసిఫిక్‌ దేశాలతో సానుకూల విధానంతో ప్రాంతీయ మరియు ప్రపంచ శాంతికి ప్రధాని చేసిన కషిని కూడా ఎంపిక కమిటీ గుర్తించింది అని కూడా ప్రకటన పేర్కొన్నది.


ఇంతగొప్ప నరేంద్రమోడీ ప్రధానిగా ఉండగా అమెరికాను అధిగమించే వేగంతో పెరుగుతున్న కరోనా కేసులేమిటి ? 2008 ఆర్ధిక సంక్షోభంలో దెబ్బతిన్న తాము కూడా భారత స్ధాయిలో జిడిపిలో దిగజారలేదు, అక్కడ ఇలా ఎందుకు జరుగుతోంది, ఆర్భాట ప్రకటనలేనా అసలేమీ లేదా అనే సందేహాలతో యావత్‌ ప్రపంచం భారత్‌ను, దానికి ప్రతినిధిగా ఉన్న ప్రధాని నరేంద్రమోడీ గురించి నిజంగానే మోరెత్తి చూస్తోంది. లేకపోతే ఇప్పుడు మన దేశం నుంచి ప్రపంచ దేశాలు నేర్చుకొనేది ఏమి ఉంది కనుక ? ఆస్తికులు నమ్మే, నాస్తికులు తిరస్కరించే దేవుడి మీద ఒట్టు. ఇది నిజమని అందరూ నమ్మాల్సిందే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

సుత్తీ, కొడవలి, నక్షత్రాలుంటే బ్రెజిల్లో 15 ఏండ్ల జైలు !

08 Tuesday Sep 2020

Posted by raomk in Current Affairs, History, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Anti communist, Brazil, Brazill Communists, equate communist symbols with Nazi ones, Jail time for hammer and sickle, Jair Bolsonaro


ఎం కోటేశ్వరరావు
పారిశ్రామిక విప్లవ కాలంలో యజమానులు ప్రవేశపెట్టిన యాంత్రిక మగ్గాలు తమ ఉపాధిని హరించటంతో పాటు, ప్రాధాన్యతను తగ్గిస్తాయని, వాటి మీద పని చేసే నైపుణ్యంలేని కార్మికులకు ప్రాధాన్యత ఇస్తారని బ్రిటన్‌లోని నిపుణులైన చేనేత కార్మికులు భావించారు. వాటిని విధ్వంసం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని నిర్ధారణకు వచ్చి అదే పని చేశారు. చరిత్రలో యంత్రవిధ్వంసక కార్మికులుగా మిగిలిపోయారు. పెట్టుబడిదారీ విధానాన్ని సరిగా అర్ధం చేసుకోలేని తొలి రోజుల్లో అది జరిగింది.


ప్రపంచంలో సోషలిజం, కమ్యూనిజం గురించి గత రెండు శతాబ్దాలుగా తెలిసినప్పటికీ వాటిని వ్యతిరేకించే నిరంకుశ శక్తుల ఆలోచన యంత్రవిధ్వంసకుల స్ధాయినిదాటలేదని జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఆ కార్మికులకు దిక్కుతోచక యంత్ర విధ్వంసం చేస్తే ప్రస్తుతం కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా దిక్కుతోచక చిహ్నాల నిషేధానికి పాల్పడుతున్నారా ?
కమ్యూనిస్టు చిహ్నాలుగా పరిగణిస్తున్న సుత్తీ, కొడవలి, నక్షత్రం కమ్యూనిస్టు భావజాలం పురుడు పోసుకోక ముందే ఉన్నాయి. సుత్తీ, కొడవలిని కార్మిక-కర్షక మైత్రికి, నక్షత్రాన్ని ఐదు భూ ఖండాలకు గుర్తుగా కార్మికవర్గంపై జరిపినదాడిలో పారిన రక్తానికి చిహ్నంగా ఎర్రజెండాను కమ్యూనిస్టులు స్వీకరించారు. వాటిమీద కమ్యూనిస్టులకేమీ పేటెంట్‌ హక్కు లేదు. అయితే ఆ చిహ్నాలను వినియోగించిన వారికి పది నుంచి పదిహేనేండ్ల పాటు జైలు శిక్ష విధించాలని కోరుతూ సెప్టెంబరు రెండవ తేదీన బ్రెజిల్‌ పార్లమెంట్‌లో ఒక బిల్లును ప్రవేశ పెట్టారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనారో కుమారుడు, పార్లమెంట్‌ సభ్యుడు అయిన ఎడ్వర్డ్‌ బోల్జానో దాన్ని ప్రతిపాదించాడు. వాటిని తయారు చేసినా, విక్రయించినా, పంపిణీ చేసినా శిక్షార్హంగా పరిగణిస్తూ చట్టసవరణకు నిర్ణయించారు. నాజీలు, తరువాత కమ్యూనిస్టులు పోలాండ్‌ను ఆక్రమించారని అందువలన వారిని హంతకులుగా పరిగణించాలని, వారి చిహ్నాలను ఉపయోగించిన వారిని శిక్షించాలని బోల్జానో చెప్పాడు. అది పార్లమెంట్‌ ఆమోదం పొందుతుందా? లేదా, పొందితే తదుపరి కమ్యూనిస్టుల మీద నిషేధం విధిస్తారా ? ఏమైనా జరగొచ్చు.


పచ్చి మితవాదులైన తండ్రీ కొడుకులు తాము కమ్యూనిస్టు వ్యతిరేకులమని బహిరంగంగానే గతంలో ప్రకటించుకున్న నేపధ్యంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవటం ఆశ్చర్యమేమీ కాదు. కమ్యూనిస్టులు, నాజీలు ఒకటే అనేందుకు రుజువులు ఇవిగో అంటూ నాటి సోవియట్‌లోని ఉక్రెయిన్‌లో కమ్యూనిస్టులు కరవుకు కారకులయ్యారని ఒక చిత్రాన్ని, నాజీల చిత్రహింసలకు సంబంధించి ఒక చిత్రాన్ని ట్వీట్‌ చేశాడు. అయితే కరవు అని చెప్పిన చిత్రం బ్రిటీష్‌ ఇండియాలోని బెంగాల్‌ కరవుకు సంబంధించింది. కొందరు ఆ విషయాన్ని చెప్పినప్పటికీ ఎడ్వర్డ్‌ వెనక్కు తీసుకొనేందుకు నిరాకరించాడు. కరోనా వైరస్‌కు కారణం చైనాయే అంటూ గతంలో ప్రకటించి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కూడా కారకుడయ్యాడు.


కమ్యూనిస్టు సంబంధిత లేదా కమ్యూనిస్టు నేతల పేర్లతో ఉన్న బహిరంగ స్ధలాలు, సంస్ధలు, కట్టడాల పేర్లు కూడా మార్చాలని బ్రెజిల్‌ పాలకులు ఆలోచిస్తున్నారు. పాలకపక్ష చర్యను బ్రెజిల్‌ కమ్యూనిస్టు యువజన సంఘం ఖండించింది. గతంలో నిరంకుశ పాలకులు ఇదే విధంగా తమ సంస్ధను, కమ్యూనిస్టు పార్టీని పని చేయనివ్వకుండా చేశారని తిరిగి అదే చర్యకు ఒడిగట్టారని పేర్కొన్నది. తూర్పు ఐరోపాలోని పోలాండ్‌, హంగరీ వంటి దేశాలలో చేస్తున్న మాదిరే ఇక్కడ కూడా చేస్తున్నారని పేర్కొన్నది. కమ్యూనిజం-నాజీజాలను ఒకే గాటన కడుతున్న ఐరోపా యూనియన్‌ వైఖరినే బ్రెజిల్‌ పాలకులు అనుసరిస్తున్నారని ఇది చరిత్రను వక్రీకరించటం తప్ప వేరు కాదని విమర్శించింది. రెండవ ప్రపంచ యుద్దంలో నాజీలను ఓడించేందుకు సోవియట్‌ కమ్యూనిస్టులు తమ రక్తాన్ని ధారపోశారన్న నిజం దాస్తే దాగేది కాదని పేర్కొన్నది.


తమ భావజాలాన్ని వ్యక్తపరిచేందుకు విధించే ఈచర్యలను తాము సహించబోమని, ప్రజల్లో తమ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తామని స్పష్టం చేసింది.ఇవి బ్రెజిల్‌ ప్రజాస్వామిక స్వేచ్చ, సామాజిక ఉద్యమాల మీద దాడి తప్ప మరొకటి కాదన్నది. కమ్యూనిస్టులను అరెస్టులు చేయాలని, హతమార్చాలని తండ్రీ కొడుకులు, వారితో కుమ్మక్కయిన జనరల్‌ హామిల్టన్‌ మౌరో చూస్తున్నారని వారి ఆటలను అరికట్టేందుకు ప్రజాఉద్యమాన్ని నిర్మిస్తామని కమ్యూనిస్టు యువజన సంఘం పేర్కొన్నది.
ఉక్రెయిన్‌,మరికొన్ని తూర్పు ఐరోపా దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత అధికారానికి వచ్చిన నియంతలు, ఫాసిస్టు శక్తులు కమ్యూనిస్టు చిహ్నాలను నిషేధించారు. కొన్ని చోట్ల కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికలలో పోటీ చేయకుండా ఆంక్షలు పెట్టారు.తాను ఉక్రెయిన్‌ దేశాన్ని ఆదర్శంగా తీసుకొని కమ్యూనిస్టు చిహ్నాలను నిషేధించాలని బిల్లును ప్రతిపాదించినట్లు ఎడ్వర్డ్‌ బోల్జానో చెప్పాడు.

బ్రెజిల్‌ పార్లమెంట్‌లో కమ్యూనిస్టు పార్టీ(పిసిడిఓబి)కి ఎనిమిది మంది సభ్యులున్నారు, 27కు గాను ఒక రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంది, అనేక మున్సిపల్‌, కార్పొరేషన్లలో పార్టీ అధికారంలో ఉంది. కమ్యూనిస్టు చిహ్నాల బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం పొందిన తరువాత కమ్యూనిస్టు, ఇతర పురోగామి శక్తుల కార్యకలాపాలను నిషేధించినా ఆశ్చర్యం లేదు. కరోనా వైరస్‌ నివారణలో వైఫల్యం, కార్మికుల హక్కులపై దాడి, ఆర్ధిక రంగంలో తిరోగమనం వంటి సమస్యలతో బోల్సనారో ప్ర భుత్వం నానాటికీ ప్రజావ్యతిరేకంగా మారుతున్నది. కమ్యూనిస్టు పార్టీ ఆ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది, ప్రజా ఉద్యమాలకు పిలుపు ఇచ్చింది.
గత ఎన్నికలలో మితవాద బోల్సనారో అధికారానికి వచ్చిన తరువాత విదేశాంగ విధానాలలో ప్రభుత్వం గుడ్డిగా అమెరికాను అనుసరిస్తున్నది. దానిలో భాగంగానే బ్రిక్స్‌ కూటమిలో భాగస్వామిగా ఉంటూనే మరో భాగస్వామి అయిన చైనాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. మంత్రులు బహిరంగంగానే చైనా వ్యతిరేక ప్రకటనలు చేస్తూ డోనాల్డ్‌ ట్రంప్‌ను సంతోష పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆగస్టు 11న బ్రెజిల్‌-అమెరికా సంబంధాలను కాపాడాలనే పేరుతో ఎడ్వర్డ్‌ బోల్జానో ఒక ఉపన్యాసం చేశాడు. ఒక దేశాన్ని ఎలా నాశనం చేయవచ్చు అనే పేరుతో నిర్వహించిన ఒక కార్యక్రమంలో వెనెజులా గురించి అభూత కల్పనలతో సంక్షేమ చర్యలకు వ్యతిరేకంగా వక్తలు ఉపన్యాసాలు చేశారు. అంతకు ముందు గ్లోబలిజం-కమ్యూనిజం పేరుతో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇంకా ఇలాంటివే క్యూబాకు వ్యతిరేకంగా కూడా నిర్వహించారు.


కమ్యూనిస్టు వ్యతిరేకతకే బ్రెజిల్‌ ప్రభుత్వం పరిమితం కాలేదు. క్రైస్తవ విలువల పేరుతో అబార్షన్లకు వ్యతిరేకంగా ఉపన్యాసాలను ఇప్పించారు. విదేశాంగ విధానంలో లాటిన్‌ అమెరికన్‌ దేశాల ఐక్యత, రక్షణ అనే వైఖరికి బ్రెజిల్‌ దూరం అవుతున్నది. అంతర్జాతీయ విధానాలకు సంబంధించి రాజ్యాంగం రూపొందించిన విధానాలకు వ్యతిరేకంగా ముందుకు సాగుతున్నది.
ఇటీవలి కాలంలో ఐరోపా, అమెరికాలో కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులు రెచ్చిపోతున్నాయి. అనేక దేశాల్లో మితవాద శక్తుల పట్టు పెరుగుతోంది. గతేడాది సెప్టెంబరులో ఐరోపా యూనియన్‌ పార్లమెంటులో కమ్యూనిస్టు వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించటాన్ని చూస్తే ఒక వ్యవస్ధగానే కమ్యూనిస్టు వ్యతిరేకతను ప్రోత్సహిస్తోంది. రెండవ యుద్ద ప్రారంభంలో సోవియట్‌ యూనియన్‌ ఒక ఎత్తుగడగా జర్మనీతో చేసుకున్న ఒప్పందాన్ని సాకుగా చూపుతూ నాజీలు – కమ్యూనిస్టులూ ఒకటే అనే పేరుతో కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు ప్రచారం చేస్తున్నాయి. నాజీలు సోవియట్‌ మీద జరిపిన దాడి, కమ్యూనిస్టుల చేతుల్లోనే నాజీలు నాశనమైన చరిత్రను దాచేందుకు ప్రయత్నిస్తున్నారు.


అమెరికా ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడుతున్న నేపధ్యంలో బ్రెజిల్‌ పార్లమెంట్‌లో కమ్యూనిస్టు చిహ్నాల మీద నిషేధం విధించాలనే బిల్లు ప్రతిపాదనను చూడాల్సి ఉంది. అధ్యక్ష , ఉపాధ్యక్షులుగా జో బిడెన్‌, కమలాహారిస్‌ ఎన్నికైతే అమెరికా కమ్యూనిజం వైపుకు పోయినట్లే అని గత పది రోజులుగా రిపబ్లికన్‌ పార్టీ నేతలు ప్రసంగాలు చేస్తున్నారు. డెమోక్రటిక్‌ పార్టీలో బెర్నీ శాండర్స్‌ వంటి డెమోక్రటిక్‌ సోషలిజం గురించి మాట్లాడేవారు, ఎలిజబెత్‌ వారెన్‌, అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌, కమలా హారిస్‌ వంటి ఉదారవాదులను కమ్యూనిస్టులుగా చిత్రించి రిపబ్లికన్‌ పార్టీ కమ్యూనిస్టు వ్యతిరేకత ఉన్న అమెరికన్ల ఓట్లకోసం నానా గడ్డీ కరుస్తున్నది. మన దేశంలో ఇందిరా గాంధీని కూడా సోషలిస్టుగా పశ్చిమ దేశాల మీడియా చిత్రించిన విషయం తెలిసిందే. అందువలన వారి పరిభాషలో సోషలిస్టులు, కమ్యూనిస్టులుగా చిత్రించిన వారందరూ కమ్యూనిస్టులు కాదు. కొన్ని అంశాలలో మితవాదులతో విబేధించే పరిమిత పురోగామి భావాలు కలిగిన వారిగానే చూడాల్సి ఉంది.


బ్రిటన్‌, ఫ్రాన్స్‌లలో పారిశ్రామిక విప్లవకాలంలో యంత్రాలను విధ్వంసం చేసినంత మాత్రాన ఆ క్రమం ఆగలేదు, పెట్టుబడిదారీ విధానం మరింతగా యాంత్రిక విధానాలతో ముందుకు పోతున్నది. ఐరోపా లేదా బ్రెజిల్‌ మరొక దేశంలో కమ్యూనిస్టు చిహ్నాల మీద నిషేధం విధించినంత మాత్రాన, వాటిని వినియోగించే పార్టీలను ఎన్నికలకు దూరం చేసినంతనే పురోగామి శక్తుల రధచక్రాలు ఆగిపోతాయనుకుంటే అంతకంటే పిచ్చి భ్రమ మరొకటి ఉండదు. మహత్తర తెలంగాణా సాయుధ పోరాట ప్రారంభంలో వడిసెలతో శత్రువులను ఎదుర్కొన్న యోధులకు తుపాకులు సమకూర్చుకోవటం పెద్ద సమస్యగా మారలేదు. శిక్షణ పొందిన మిలిటరీతో సమంగా తమకు తామే ప్రాధమిక పరిజ్ఞానంతో తుపాకులు పేల్చిన సామాన్యులు కిరాయి మూకలు, సైన్యాన్ని ఎలా ఎదిరించారో చూశాము. అవసరాలు అన్నింటినీ సంపాదించుకొనే మార్గాలను కూడా చూపుతాయి.


బ్రెజిల్‌, ఇండోనేషియా, ఐరోపా మరొక చోట ఎక్కడైనా దోపిడీ శక్తులను హతమార్చక తప్పదు, దోపిడీ లేని సమాజాన్ని నిర్మించుకోవాలనే నిశ్చయానికి కార్మికవర్గం, రైతులు రావాలే గాని సుత్తీ, కొడవలి, నక్షత్రం, ఎర్రజెండాగాక పోతే మరో గుర్తులు, పతాకంతో సంఘటితం అవుతారు. లాటిన్‌ అమెరికా, ఐరోపా, ఆసియాలోని కొన్ని దేశాలలో విప్లవాన్ని సాధించిన పార్టీలన్నీ తొలుత కార్మిక మరొక పేరుతో ప్రారంభమయ్యాయి తప్ప కమ్యూనిస్టు పార్టీలుగా కాదన్నది చరిత్రలో ఉంది. వియత్నాం కమ్యూనిస్టు నేత హౌచిమిన్‌ వియత్నాం వర్కర్స్‌ పార్టీ ప్రధమ కార్యదర్శిగా పని చేశారు. క్యూబాలో ఫిడెల్‌ కాస్ట్రోతొలుత క్యూబా ప్రజా పార్టీలో చేరారు. వివిధ ఉద్యమాల పేరుతో కార్యకలాపాలు నిర్వహించారు.పాపులర్‌ సోషలిస్టు పార్టీ పేరుతో ఉన్న కమ్యూనిస్టులతో అంతర్గతంగా సంబంధాలు పెట్టుకున్నారు తప్ప బహిరంగంగా పార్టీతో కలవలేదు. కమ్యూనిస్టుల గురించి జరిగిన తప్పుడు ప్రచార నేపధ్యంలో నియంతలను వ్యతిరేకించే వారిని సమీకరించేందుకు ఆ పని చేశారు. అధికారానికి వచ్చిన రెండు సంవత్సరాల తరువాత తాను కమ్యూనిస్టును అని కాస్ట్రో ప్రకటించారు. కమ్యూనిస్టుల మీద నిషేధం విధించిన పూర్వరంగంలో కమ్యూనిస్టులు వివిధ దేశాలలో అనేక మారు పేర్లతో పని చేశారు. మన దేశంలో కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ పేరుతో కమ్యూనిస్టులు పని చేసిన విషయం తెలిసినదే. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు చూడాల్సింది. ఎలుకలను పడుతుందా లేదా అన్నది ముఖ్యం. పార్టీ చిహ్నాలు, జెండాలు వేరుగావచ్చు, అధికారాన్ని శ్రామికవర్గ రాజ్య నిర్మాణానికి ఉపయోగిస్తున్నాయా లేదా అన్నదే గీటు రాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కంపల్సరీ లైసెన్స్‌తో కరోనా మందులు, టీకాలను అందుబాటులో ఉంచాలి !

24 Friday Jul 2020

Posted by raomk in CHINA, Current Affairs, Health, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, Science, UK, USA

≈ Leave a comment

Tags

Compulsory licensing, compulsory licensing of patented drugs, Coronavirus and pharmaceutical companies, Coronavirus outbreak


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


కొద్ది రోజులుగా కోవిడ్‌ 19 కి మందులను కనుగొన్నట్లుగా వార్తలు పెరిగాయి, ప్రజలలో ఆశలు చిగురిస్తున్నాయి. మందులున్నాయికదా అని ముందు జాగ్రత్తలను వదిలేసి కరచాలనాలు, కౌగిలింతలూ, కేరింతలూ, మొదలయ్యే ప్రమాదం వుంది. ఇక కరోనా వ్యాధి మనల్నేమీ చేయలేదనే ధైర్యం ప్రజలలో పెరుగుతున్నది. కొన్నివందల కంపెనీలు మందుల తయారీలో పోటీలు పడుతున్నాయి. అందరికన్నా ముందు మార్కెట్‌ లో ప్రవేశించి త్వరగా అమ్ముకోవాలని పరుగెత్తుతున్నాయి. ఉత్పత్తి సామర్ధ్యం ఉన్నచిన్న కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి.

కొత్తగా వచ్చే మందులన్నీ కొత్తవేనా? ప్రభావమెంత ?
క్వారంటైన్‌తో ఇపుడు వైద్యం మొదలవుతున్నది. వ్యాధి లక్షణాలు ప్రబలే కొద్దీ రోగులను కోవిడ్‌ హాస్పిటల్‌కి మార్చి ప్రాణాన్ని నిలపటానికి ఆక్సిజన్‌ వెంటిలేటర్‌ ద్వారా ఇస్తున్నారు. చికిత్సలో భాగంగా అందుబాటులోవున్న యాంటీ వైరల్‌ , 30 రకాల మందులను కాంబినేషన్లలో ఇంతవరకూ వాడారు. ఇప్పటివరకూ వున్న మందులలో కరోనావైరస్‌ ను విజయవంతంగా సంహరించే మందు ఒక్కటి కూడా లేదనే వాస్తవాన్నిగ్రహించాలి. ఫలానా మందు పనిచేస్తుందని విశ్వసనీయవర్గాలు చెప్తే, వాడి చూడండని ఐసీయమ్‌ఆర్‌ ప్రొటోకాల్‌లో లేని మందులకు కూడా అనుమతులను ఇస్తున్నది. అత్యవసర సందర్భాలలో మాత్రమే వాడే రెమిడెసివీర్‌ అనేమందు నుండి మలేరియాకు, రుమటాయిడ్‌ ఆర్దరైటిస్‌కు వాడే క్లోరోక్విన్‌, లో మాలిక్యులార్‌ వైట్‌ హెపారిన్‌ డీప్‌ వైన్‌ త్రంబోసిస్‌ రాకుండా దేశీయ ట్రెడిషనల్‌ మందుల వరకూవాటిచూస్తున్నారు.
ఒక దశాబ్దం క్రితం కనిపెట్ట్టిన రెమిడెసివీర్‌ అనేమందును మొదట హెపటైటిస్‌ చికిత్సకు అభివృద్ధి చేశారు. ఆఫ్రికాలో ఎబోలా వ్యాధిని నియంత్రించటానికి మందుగా ప్రయోగించారు. తగ్గించటంలో ఉపయోగపడలేదు. అయినా ట్రయల్స్‌లో దుష్పలితాలేమీ కలగనందున కోవిడ్‌-19 చికిత్సలో క్లినికల్‌ ట్రయల్స్‌ మొదలెట్టారు. రెమిడెస్విర్‌ జనరిక్‌ మందును తయారు చేయటానికి డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ ) అనుమతిని ఇచ్చారు. హెటిరో , సిప్లా, జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, జైడస్‌ కాడిలా కంపెనీలతో గిలియాడ్‌ ఒప్పందాలు కుదుర్చుకున్నది .కోవిఫర్‌ బ్రాండ్‌ పేరున 100 మి.గ్రా.ఇంజెక్షన్గను ఒకరు విడుదలచేశారు. మన దేశంతోపాటు, 127 దేశాలలో విక్రయించుకోవటానికి ఈ కంపెనీలకు అనుమతి లభించింది.
రెమ్డెసీవీర్‌ అందుబాటులోకివచ్చిన తరువాత కూడా మరణాల రేటు తగ్గకపోవటం ఆందోళన కలిగిస్తున్నది. అయితే రోగి శరీరంలోని వైరస్‌ లోడ్‌ తగ్గటం ప్రోత్సాహకరంగా వుంది. కోలుకోవడానికి సమయం15 నుంచి 11 రోజులకు తగ్గించటంలో స్పష్టమైన ప్రభావం చూపింది. అయిదురోజుల చికిత్సకు మందు ఖర్చు 40 వేల రూపాయలు అంటున్నారు, కానీ అపుడే బ్లాక్‌ మార్కెట్లో 3-4 రెట్లు ఎక్కువకు అమ్ముతున్నారు. ఢిల్లీ వంటి చోట్ల రూ.5,400 కు ఇవ్వవలసిన ఒక డోసు మందును రూ. 30,000 వేలకు అమ్ముతున్నారు. ధనవంతులు కరోనా వ్యాధిని అందరికీ పంచారు, ఆరోగ్యాన్ని కొనుక్కుంటున్నారు, పేదప్రజలు కరోనాతో సహజీవనం చేస్తున్నారు.
అమెరికన్‌ కంపెనీ ఐన గిలియాడ్‌ సైన్సెస్‌ కు రెమిడెసీవీర్‌ మందుల పై పేటెంట్‌ హక్కు ఉన్నది. రాబోయే మూడు నెలలలో ఉత్పత్తి చేసిన రెమిడెసీవీర్‌ మందులన్నీ అమెరికాకే ఫస్ట్‌ ఇవ్వాలని ట్రంప్‌ దురహంకారంతో ఆదేశించాడు. సెప్టెంబరు వరకు తయారయ్యే మందులన్నీ అమెరికా ప్రజలకే అంటున్నాడు. మా సంగతేంటని యూరప్‌ నాయకులు అడుగుతున్నారు. ఉత్పత్తిని పెంచి అందరికీ మందును అందిస్తామని గిలియాడ్‌ కంపెనీ చెప్తున్నది. రెమిడెసీవీర్‌ మందును ఇంజెక్షన్‌ గా తయారుచేయటానికి 3 డాలర్లుఱర్చవుతుంది. 3000 డాలర్లకు అమ్మటానికి కంపెనీ నిశ్చయించింది.

2) ఇటోలిజుమాబ్‌ మరియు టోసిలిజుమాబ్‌ మందులను ఇన్వెస్టిగేటివ్‌ ధెరపీ గా ఉపయోగించటానికి అధికారులు అనుమతినిచ్చారు. శరీరంలో కరోనా వైరస్‌ ప్రవేశించినపుడు , ఈ మందులవలన కత్రిమంగా తయారైన యాంటీబాడీస్‌ వైరస్‌ని ఎదుర్కొంటాయనే ప్రతిపాదనతో బెంగుళూరులో వున్న బయోకాన్‌ కంపెనీ ముందుకొచ్చింది. ఫేజ్‌-2 పరిశోధనలో మరణాలను గణనీయంగా తగ్గించిందని కంపెనీ పత్రికలకు వెళ్ళడించింది. ఐసీయమ్‌ఆర్‌ డైరక్టర్‌ భార్గవ గారు ఈ మందులు మరణాలను తగ్గించలేదనీ, కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చన్నారు. ఇంకా ఎక్కువ పరిశోధనలు అవసరమన్నారు. అయితే ఈ మందులు మంచికంటే ఎక్కువ హాని చేయవచ్చని కూడా నిపుణులు ఆందోళన చెందుతున్నారు. టోసిలాజుమాబ్‌ ను వాడాలంటే రోగి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లో వుండాలి, 3) ఫావిపిరవిర్‌అనే యాంటీవైరల్‌ మందును మైల్డ్‌, మోడరేట్‌ లక్షణాలున్నకోవిడ్‌ 19 కేసులలో వాడవచ్చని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతించారు. ఇన్‌ ఫ్లూయంజాను నియంత్రించటానికి ఈ మందును గ్లిన్‌ మార్క్‌ అనే జపాన్‌ కంపెనీ కనిపెట్టింది. 150 మంది మనుష్యులపై క్లినికల్‌ ట్రయల్స్‌ చేస్తున్నట్లుగా గ్లిన్‌ మార్క్‌ కంపెనీ ప్రకటించింది. ఒక టేబ్లెట్‌ ను రూ.103 రేటు ప్రకటించి రూ 75 కి తగ్గించారు. దారుణంగా బ్లాక్‌ మార్కెట్‌ నడుస్తున్నది.

4) హైడ్రాక్సీ క్లోరోక్విన్‌: మార్చి 19 న డోనాల్డ్‌ ట్రంప్‌ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ను ”చాలా ప్రోత్సాహకరమైనది” ,” చాలా శక్తివంతమైనది” మరియు ”గేమ్‌ ఛేంజర్‌” అని పత్రికా విలేఖరుల సమావేశంలో అభివర్ణించారు. తరువాత ప్రపంచవ్యాపితంగా అనూహ్యమైన డిమాండ్‌ ఏర్పడింది.
5) ప్లాస్మా ధెరపీుప్లాస్మా ధెరపీ అంటే రోగనిరోధక శక్తి బాగావున్నవారి రక్తంనుండి ప్లాస్మాను వేరుచేసి రోగనిరోధక శక్తి తక్కువగావున్నవారికి ఇవ్వటాన్ని ప్లాస్మా ధెరపీ అంటారు. కోవిడ్‌-19 వ్యాధినుండి పూర్తిగా కోలుకున్నవారికి కరోనా వైరస్‌ ను ఎదుర్కొనే రోగనిరోధకణాలు యాంటీబాడీస్‌ ఎక్కువగావుంటాయి. వారి ప్లాస్మాను వేరుచేసి కరోనాతో బాధపడుతున్న రోగులకు ఇచ్చి పరిశోధనలు జరుపుతున్నారు. ఫలితాలు ప్రోత్సాహకరంగా వున్నాయంటున్నారు. కోలుకున్నరోగులనుండి రక్తాన్ని సేకరించి రోగులకు ఇవ్వటం కొత్తేమీకాదు. వంద సంవత్సరాల క్రితం స్పానిష్‌ ఫ్లూ వచ్చినపుడు కూడా ప్లాస్మాధెరపీ ద్వారా చికిత్సచేశారు.
6) క్యూబా లో 1980 లో కనిపెట్టిన ”ఇంటర్‌ ఫెరాన్‌ ఆల్ఫా2” వైరస్‌ వ్యాధుల చికిత్స లో ప్రముఖమైనది. ప్రాధమిక దశలో వైరస్‌ వ్టాధులన్నిటిలోను ఉపయోగపడ్తుందని, అమెరికా తో సహా ప్రపంచవ్యాపిత పరిశోధనలు నిరూపించాయి. చైనా తో కలిసి సంయుక్తంగా ఉత్పత్తి చేస్తున్న ఈ మందును 40 దేశాలలో వాడుతున్నారు. వూహాన్‌లో కోవిడ్‌-19 ప్రబలినపుడు ఇంటర్‌ ఫెరాన్‌ ఆల్ఫా2 ను వాడి సత్ఫలితాలను సాధించారు.
కరోనా మందులకు, వ్యాక్సిన్‌ కు కంపల్సరీ లైసెన్సింగ్‌ (తప్పనిసరిలైసెన్స్‌) ఇవ్వాలి. ఎక్కువ కంపెనీలకు మానుఫ్యాక్చరింగ్‌ లైసెన్సు ఇచ్చిప్రభుత్వం ధరలను నియంత్రించాలి. ప్రభుత్వాధీనంలో కరోనా మందులను అవసరమయిన ప్రజలందరికీ అందుబాటులో వుంచాలి.
కొత్త ఔషధాలను, టీకాలను సైంటిస్టులు ప్రజలప్రయోజనాలకోసం కనిపెట్తారు. ఆ ఖర్చులు భరించిన కంపెనీలు ఆ ఔషధాన్ని మరే కంపెనీ తయారుచేయకుండా పేటెంట్‌ తీసుకుంటాయి. 20 సంవత్సరాలు ఆ మందును తమ ఇష్టమొచ్చిన రేటుకి ప్రపంచంలో ఎక్కడైనాఅమ్ముకోవచ్చు. పోలియో వ్యాధినిరోధక మందును డాక్టర్‌ జోనాస్‌ సాల్క్‌ 1955 లో కనుగొన్నారు. ‘ పోలియో వాక్సిన్‌ పై పేటెంట్‌ ఎవరిది” అని అడిగితే ”ప్రజలది’ అని చెప్తూ ” సూర్యుని పేటెంట్‌ చేయగలమా” అన్నారు.

కరోనా టీకాల తయారీ.
ఇప్పటివరకూ కోవిడ్‌-19 కి వాక్సీన్‌ ను రూపొందించటానికి 200 పరిశోధనా బందాలు పోటీపడుతున్నాయి. కొన్ని సంవత్సరాలు పట్టే పరిశోధనలను కొన్ని నెలలకు కుదించారు. కంపెనీలన్నీ క్లినికల్‌ ట్రయల్స్‌ దశలోవున్నాయి. పరుగు పందెంలో ముందుగా వచ్చి మార్కెట్‌ను శాసించి అంతులేని లాభాలను పొందాలని తీవ్రప్రయత్నాలు చేస్తున్నాయి.
బ్రిటన్‌ ఆక్సఫర్డ్‌ జెన్నర్‌ ఇన్స్టిట్యూట్‌లో అసాధారణ వేగంతో ఫేజ్‌-1, ఫేజ్‌-2 ట్రయల్స్‌ పూర్తి చేశారని, ప్రఖ్యాత మెడికల్‌ పత్రిక లాన్సెట్‌ ప్రకటించింది. మూడవ దశలో బ్రిటన్‌లో పది వేలమంది వాలంటీర్లపై ఆగస్టునెలలో ప్రయోగం ప్రారంభమవుతుందన్నారు. వాక్సిన్‌ను ఆస్ట్రా జనికాతో కలిసి పూనేలో తయారు చేయటానికి సీరమ్‌ ఇన్సిటిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ సంవత్సరం చివరకు వంద కోట్ల డోసులను మార్కెట్‌లోకి తేవటానికి పూర్తిస్ధాయిలో తయారవుతున్నారు.

కోవిడ్‌-19 కొరకు వ్యాక్సిన్ల తయారీలో చైనా లోని సినోఫార్మా , సినోవాక్‌ బయోటెక్‌ సంస్ధలు ఫేజ్‌-2 ట్రయల్స్‌ ను పూర్తిచేశాయని లాన్సెట్‌ పత్రిక ప్రకటించింది. ప్రపంచవ్యాపితంగా వివిధ దేశాలలోని వేలాదిమంది వాలంటీర్లపై ఫేజ్‌-3 వ దశ పరిశోధనలకు తయారవుతున్నారు. ఆరు బ్రెజిలియన్‌ రాష్ట్రాలలో 9000 మంది పై అధ్యయనం ప్రారంభమయిందని గవర్నర్‌ జోవా డోరియా తెలిపారు. టీకా సమర్ధవంతమైనదని రుజువయితే 120 మిలియన్‌ డోసులను ఉత్పత్తి చేయబోతున్నామని గవర్నరు అన్నారు. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ , చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కూడావ్యాక్సిన్‌ పరిశోధనలలో ముందున్నదంటున్నారు, అడినోవైరల్‌ ఆధారిత వ్యాక్సిన్‌ లను కొన్ని చైనా కంపెనీలు అభివద్ది చేస్తున్నాయి.
విజయవంతమౌతున్న చైనా వ్యాక్సిన్లను చూసిన తరువాత, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ , చైనాతో కలిసి పనిచేయటానికి సుముఖత వ్యక్తంచేసాడు.

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్‌ , ఐ సీ యమ్‌ ఆర్‌ సంయుక్తంగా కొరోనా వైరస్‌ వాక్సిన్‌ తయారీలో ముందున్నాయి. భారత్‌ బయోటిక్‌ అభివద్ది చేసిన” కోవాగ్జిన్‌ ” ఇంజెక్షన్‌ రూపంలో ఫేజ్‌-1 క్లినికల్‌ ట్రయల్స్‌ ను ప్రారంభించారు. ఢిల్లీ లోని ఎయిమ్స్‌, హైదరాబాద్‌ నిమ్స్‌, విశాఖ కేజీ హెచ్‌ తోపాటుగా12 ఆసుపత్రులను గుర్తించారు.
కరోనాకు ప్రపంచంలో అందరికన్నా ముందు తొలి టీకాను బయటకు తీసుకురావాలని రష్యా ప్రయత్నిస్తోంది. క్లినికల్‌ ప్రయోగాలు పూర్తయ్యాయని, టీకా సురక్షితమైనదనీ, ఆగస్టు నెల ఆరంభంలో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా ప్రకటించింది. మూడో దశ ప్రయోగాలను రష్యాతోపాటు ఆరబ్‌ ఎమిరేట్స్‌ వంటి దేశాలలో వేలమందిపై నిర్వహించనున్నారు. మూడోదశ ప్రయోగాలకు సమాంతరంగా టీకాల ఉత్పత్తికి ప్రణాలికలు రచించారు. ఈ ఏడాది 3 కోట్ల డోసులను రష్యాఉత్పత్తి చేస్తుందని, విదేశాలలో 17 కోట్ల టీకాలను ఉత్పత్తి చేయ ప్రయత్నిస్తున్నామన్నారు.

అత్యవసర పరిస్ధితులలో ” కంపల్సరీ లైసెన్సు ”, కరోనా మహమ్మారికి మించి అత్యవసరం ఏమున్నది.?
డబ్లు టీ ఓ నిబంధనలను తయారుచేసేటపుడు ఒక చిన్న వెసులుబాటును పేద దేశాలు కల్పించుకున్నాయి. ఆ ప్రకారం ఒక దేశంలో ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్ధితులు ఏర్పడినపుడు కంపల్సరీ లైసెన్సింగ్‌ ఇవ్వటానికి అవకాశంవున్నది. పేటెంట్‌ చట్టం సెక్షన్‌ 84 ప్రకారం ప్రజల అవసరాలను తీర్చలేనపుడు మందు అందుబాటులో లేకపోతే, మందు ఖరీదును ప్రజలు భరించలేకపోతే, స్ధానిక మార్కెట్‌ లో అందుబాటులో లేకపోతే పెటెంట్‌ ఆఫీసర్‌ స్ధానిక ఉత్పత్తి దారునికి తప్పనిసరిగా లైసెన్సును ఇవ్వవచ్చు. ఛాలా తక్కువ ధరకు ప్రాణాలను నిలిపే మందుల తయారీకి అనుమతించవచ్చు. పేటెంట్‌ చట్టాన్ని పక్కన పెట్టవచ్చు. కానీ శక్తివంతమైన, దుర్మాగ్గమైన, నీతీ జాతీ లేని బహుళజాతి కార్పోరేట్‌ కంపెనీలకెదురొడ్డి నిలిచేదెవరు. సెక్షన్‌ 92 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ద్వారా కంపల్సరీ లైసెన్సును ఇవ్వవచ్చు . చాలా ఖర్చుపడి పరిశోధన జరిపినందుకు పేటెంట్‌ కంపెనీ కి అమ్మకాలలో 4-6 శాతం రాయల్టీగా ఇచ్చేటట్లుగా కూడా చట్టంలో వుంది.
2012 మార్చినెలలో ఇండియన్‌ పెటెంట్‌ ఆఫీసర్‌ పీ హెచ్‌ కురియన్‌ మొదటిసారి ప్రజలకు అనుకూలంగా కంపల్సరీ లైసెన్సింగ్‌ ఆర్డరును ఇచ్చి చరిత్రలో నిలిచారు. భారతదేశంలో నెలకు సరిపోయే ఆ నెక్సావార్‌ మందును రూ.8800కు అమ్మేటట్లుగానూ బేయర్‌ కంపెనీకి అమ్మకాలలో 6 శాతం ఇచ్చేటట్లుగా ఇండియన్‌ పేటెంట్‌ యాక్ట్‌ 2005 క్రింద పేటెంట్‌ ఆఫీసు చారిత్రాత్మక ఆర్డరును ఇచ్చింది.
అంతకు ముందు నెలకు సరిపోయే ఆ మందును రూ 2లక్షల80 వేలకు విక్రయించే వారు.
ఇపుడు ఉపయోగిస్తున్న మందులన్నీ పాతవే. కోవిడ్‌-19 కి కాకపోయినా వైరస్‌ వ్యాధులైన సార్స్‌
( యస్‌.ఈ,ఆర్‌.యస్‌.), మెర్స్‌ ( ఎమ్‌.ఇ,ఆర్‌.యస్‌,), ఎబోలా, ఇన్‌ ఫ్లూయంజా. హెపటైటిస్‌-సీ, హెచ్‌.ఐ.వీ. వ్యాధుల కోసం అభివద్ధిచేశారు. కోవిడ్‌-19 ని కట్టడికి కొత్త మందులేవీ లేవు కనుగొనలేదు కాబట్టి పాత మందులను కారుణ్య కారణాలతో అనుమతిస్తున్నారు. పాత మందులకు కొత్త ఇండికేషన్స్‌, రీ పర్పస్‌ అంటే నూతన ప్రయోజనాలను, ఉపయోగాలను కనుగొని, క్లినికల్‌ ట్రయల్స్‌ చేసి పాత పేటెంట్‌ మందులను అమ్ముకునే ప్రయత్నం జరుగుతున్నది.
వంద సంవత్సరాలక్రితం స్పానిష్‌ ఫ్లూ వచ్చినపుడు భారత ప్రజలు 1 కోటి 70 లక్షల మంది మరణించారు. ప్రపంచంలో 10 కోట్ల మంది చనిపోయారని అంచనా. గంగా నది శవాలతో ఉప్పొంగిందంటారు. అమెరికాలో మూతికి మాస్క్‌ ధరించని వ్యక్తులకు 100 డాలర్ల జరిమానాను వందసంవత్సరాలనాడే విధించారు. కానీ ఈనాటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నేను మాస్క్‌ ధరించనన్నాడు. మాస్క్‌ ధరించటం కంపల్సరీ చేయనన్నాడు. ప్రపంచం కరోనా కేసుల లెక్కలలో అమెరికాకు ప్రధమ స్ధానాన్నిసాధించాడు. బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సొనోరొ కూడ మాస్క్‌ ధరించనన్నాడు. బ్రెజిల్‌ కు ద్వితీయ స్ధానాన్ని తేవటమే కాకుండా తను కొరోనా జబ్బు బారిన పడ్డాడు.
స్పానిష్‌ ఫ్లూ తరువాత అధికారంలోకి వచ్చిన శ్రామికవర్గ సోవియట్‌ సోషలిస్టు కమ్యూనిస్టు ప్రభుత్వం , ప్రపంచంలో మొదటిసారిగా ప్రజలందరికీ వైద్యం ( యూనివర్సల్‌ హెల్త్‌ ) అనే ఆలోచనను ఆచరణలోకి తెచ్చింది. ప్రపంచ ప్రజలందరికీ ఆదర్శమయింది. అందరికీ విద్యనందించి ప్రజలకు ప్రాధమిక ఆరోగ్యసూత్రాలను నేర్పి చైతన్యపరచింది. ఆ ఒరవడిలో పయనిస్తూ ప్రపంచప్రజలందరి ఆరోగ్యం తన ధ్యేయంగా క్యూబా ముందుకెళ్తూవుంది. అందరికీ ఆరోగ్యం( యూనివర్సల్‌ హెల్త్‌ ) ఆచరించే దేశాలే కరోనా కట్టడి లో ముందున్నాయి. క్యూబా , వియత్నాం, న్యూజిలాండ్‌,కేరళ లాంటి చోట్ల ప్రజలను చైతన్యపరిచారు. రోగంగురించి ప్రజలకు తెలియచేశారు. ప్రభుత్వం ఏంచేస్తున్నదో ప్రజలేమి చేయాలో చెప్పారు. చెప్పింది చేశారు. ప్రభుత్వ నాయకులు- ప్రజలు సైంటిస్టుల మాటలను విన్నారు. తు.చ తప్పకుండా పాటించారు. ప్రజారోగ్యంపట్ల బాధ్యతతో వ్యవహరించారు.అందువలననే వియత్నాంలో ఒక్క మరణమూ నమోదు కాలేదు. కేరళ రాష్టంలో ప్రభుత్వం-ప్రజలు ఒకటై మహమ్మారిని అదుపులో వుంచారు.

పేద ప్రజలకు మందులు, టీకాలు దొరుకుతాయా? మాస్కులతోనే ప్రాణాలను కాపాడుకోవాలా?

ఇపుడు సైన్స్‌ అభివధ్ధిచెందింది. రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. వైరస్‌ వలన జబ్బు పడిన వారిని త్వరగా టెస్టులు చేసి గుర్తిస్తున్నారు, అందుబాటులోవున్నమందులను ఉపశమనానికి ప్రతిభావంతంగా వాడుతున్నారు. వెంటిలేటర్‌ ద్వారా కత్రిమంగా ప్రాణవాయువును అందించి ప్రాణాన్ని నిలుపుతున్నారు. ఈ లోగా శరీరం తన రోగనిరోధకశక్తితోనూ, ఉపశమన మందుల ప్రభావంతోనూ, మెరుగైన. వైద్యసేవలతోనూ బతికిబయటపడుతున్నారు. చనిపోయేవారిసంఖ్య గణనీయంగా తగ్గుతోంది. వంద సంవత్సరాలనాడు స్పానిష్‌ ఫ్లూ వచ్చినపుడు మాస్కు ధరించి, భౌతికదూరం పాటించి, రోగనిరోధక శక్తివున్నవారే బతికి బట్టకట్టారు. ఇపుడు కూడా మందులున్నా లేకపోయినా కరోనా రాకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
1) మాస్క్‌ ఖచ్చితంగా ధరించాలి. 2) ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి,3) సబ్బుతో చేతులు కడుక్కోవాలి.4) ఉన్నంతలో సమీకత పౌష్టికాహారం తీసుకోవాలి.5) శారీరక శ్రమ, వ్యాయామం చేయాలి.

ఎబోలా, హెచ్‌ ఐ వీ, ఏవియన్‌ ఫ్లూ, నిఫా, స్వైన్‌ ఫ్లూ, సార్స్‌, మెర్స్‌, ఈ వ్యాధులన్నిటికీ మూలం పూసలో దారంలాగా వున్న రహస్యాన్ని గమనించాలి. వన్యజీవులనుండి మానవులకు సంక్రమిస్తున్నజూనోటిక్‌ వ్యాధుల్లో అది దాగివున్నది. ఈ రకమైన వైరస్‌ వ్యాధులతో 1981 నుండి 3 కోట్ల మంది మరణించారు. అడవి లో వుండే వైరస్‌,లేడి,జింక,కోతి, ఏనుగు లాంటి ప్రాణులు మామూలుగా మనుష్యుల మధ్య వుండవు. సహజ వనరుల కోసం అడవులను నరకటం, కొండలను తవ్వటం, భూమిపొరలలో దాగున్న చమురు ను పిండటం లాంటి చర్యల వలన జీవసమతుల్యత నాశనమయి వైరస్‌ లు మానవ నివాసాలవద్దకుచేరుతున్నాయి. అభివద్ది పేరున జరుగుతున్న పర్యావరణ విధ్వంస వలన వైరస్‌లు , వన్యజీవులు స్ధానభ్రంశం చెంది మరొక నివాసాన్ని ఏర్పరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో మనిషిలో చేరిన వైరస్‌లు అల్లకల్లోలం సష్టించి మానవ వినాశనానికి కారణమౌతున్నాయి.
ధనం-లాభం-పెట్టుబడి-ధనం, తప్ప మరే విలువలూ లేని పెట్టుబడి దారీ వ్యవస్ధలో భూమాత ముడిపదార్ధాల గనిగా , మనుష్యులు వినియోగదారులుగా . కార్మికుడు ఉత్పత్తిశక్తిగా మారారు. ప్రకతిని నాశనం చేసిన కార్పోరేట్‌ శక్తులు వ్యాధి అంటకుండా దూరంగా వుండగలరు. ఆధునాతన వైద్యాన్ని అందుకోగలరు. ఎంతఖరీదైనా మందులు వాడుకోగలరు. వాక్సిన్‌ రాగానే కొనుక్కోగలరు. జనాభాలో సగంపైగావున్నపేదప్రజలకు వైద్యం, మందులు, టీకాలు అందుతాయా? రెక్కాడితే డొక్కాడని పేదప్రజల ఉనికికే ప్రమాదం తెచ్చిన ఈ వ్యవస్ధ మార్పుకోసం పోరాడాలి. తక్షణకర్తవ్యంగా కరోనా మందులను, వాక్సిన్‌ లను కంపల్సరీ లైసెన్సుక్రిందకు తెచ్చి ప్రజలందరికీ అందుబాటులోకి తేవటంకోసం ఆందోళన చేయాలి. సైన్సు ఫలితాలు అందరికీ అందేవరకూ పోరాడాలి.

వ్యాస రచయిత డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌, గుంటూరు జిల్లా నల్లమడ రైతు సంఘనేతగా కూడా పని చేస్తున్నారు. ఫోన్‌-9000657799

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా వస్తు బహిష్కరణ: వేయి వాట్సాప్‌లు – పదివేల పగటి కలలు !

03 Wednesday Jun 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

anti china, Boycott of Chinese Products, China goods


ఎం కోటేశ్వరరావు
కేంద్రపాలిత లడఖ్‌ ప్రాంతానికి చెందిన ఒక ఇంజనీరు, విద్యా సంస్కరణవాదిగా వర్ణితమైన సోనమ్‌ వాంగ్‌చుక్‌ చైనా వస్తువులను బహిష్కరించి ఆ దేశాన్ని మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలంటూ సామాజిక మాధ్యమంలో పెట్టిన ఒక వీడియో వైరల్‌ అవుతోంది.జూన్‌ రెండవ తేదీ నాటికి 20లక్షల మంది చూశారట. భారత-చైనా సరిహద్దులో ఒకటైన లడక్‌ ప్రాంతంలో ప్రస్తుతం ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపధ్యంలో పెట్టిన ఈ పోస్టుకు మీడియాలో కూడా పెద్ద ప్రచారమే వచ్చింది. మరోసారి చైనా వస్తువులను బహిష్కరించండి అనే వార్తలు దర్శనమిస్తున్నాయి.
బ్రిటీష్‌ వారు బెంగాల్‌ను విభజిస్తూ చేసిన నిర్ణయానికి వ్యతిరేకంగా 1905లో నాటి జాతీయోద్యమ నేతలు స్వదేశీ పిలుపునిచ్చి బ్రిటీష్‌ వారి వస్తువుల కొనుగోలును బహిష్కరించాలని కోరారు.ఆ చర్యతో ఆ నిర్ణయాన్ని వెనక్కు గొట్టవచ్చని భావించారు. నాడు పిలుపు ఇచ్చిన వారు తాము కాంగ్రెస్‌ వాదులం అని రొమ్మువిరుచుకొని వీధుల్లోకి వచ్చారు. ఇప్పుడు చైనా వస్తువులు కొనుగోలు చేయవద్దని పిలుపు ఇస్తున్నవారు, ప్రచారం చేస్తున్నవారు ముసుగులు వేసుకొని తమ గుర్తింపు బయటపడకుండా ఆ పని చేస్తున్నారు. నాడు కాంగ్రెస్‌ వాదులు బ్రిటీష్‌ వారితో చేతులు కలపలేదు. నేడు కొందరు ముసుగులు వేసుకొని ఒక వైపు ప్రచారం చేస్తుంటే మరోవైపు పాలకులు చైనా నేతలకు ఎర్రతివాచీ పరచి మర్యాదలు చేస్తున్నారు. ఆ ముసుగు వీరులు ఎక్కడా ఈ ఎర్రతివాచీలను పల్లెత్తు మాట అనరు. అంటే వారికీ వీరికీ చీకటి సంబంధం ఉందన్నది బహిరంగ రహస్యం. ఇద్దరూ కలసి జనాన్ని వెర్రివాళ్లను చేస్తున్నారా? చెవుల్లో కమలం పువ్వులు పెడుతున్నారా ?
ముసుగు లేదా మరుగుజ్జు వీరులు వాట్సాప్‌ద్వారా చేస్తున్న ప్రచారాన్ని అనేక మంది నిజమే అనుకుంటున్నారు. తామంతా చైనా వస్తువులను బహిష్కరించినట్లు, చైనా కమ్యూనిస్టులు తలుపుతట్టి తమ కాళ్ల మీద పడి తప్పయి పోయింది, మా వస్తువులను కొనటం మాని మా నోటి కాడ కూడును కొట్టకండి మహాప్రభో అని వేడుకుంటున్నట్లు చాలా మంది కలలు కంటున్నారు. వయసులో ఉన్న వారికి వచ్చే కొన్ని కలలు వారిని మంచాల మీద నుంచి పడవేస్తుంటాయి. కొందరికి చైనా కలలు కూడా అలాంటి కిక్కు ఇస్తూ ఉండవచ్చు.
కోట్లాది మంది చైనా యాప్స్‌ను తమ ఫోన్ల నుంచి తొలగిస్తే మన సరిహద్దులలోకి ప్రవేశిస్తున్న చైనా ప్రభుత్వానికి అదొక హెచ్చరికగా ఉంటుందని సోనమ్‌ వాంగ్‌చుక్‌ చెప్పాడు. మన సైన్యం ఆయుధాలను తీసి సమాధానం చెబుతుంటే జనం పర్సులను మూసి చెప్పాలన్నాడు. చైనా వస్తువులను బహిష్కరించితే దాని మూల్యం ఎంతో చైనాకు తెలిసి వస్తుందన్నాడు. చైనా వస్తువుల కొనుగోలుకు పెట్టిన ఆర్డర్లను వ్యాపారులు రద్దు చేసుకుంటే వ్యాపారంతోనే బతుకుతున్న తమ జనం తిరగబడతారని చైనా ప్రభుత్వం భయపడుతుంది. వ్యాపారం నిలిచిపోయి వారి ఆదాయం దెబ్బతింటే తిరుగుబాటే వచ్చే అవకాశం ఉంది. అందువల చైనా వస్తువులను బహిష్కరించాల్సి ఉంది అని కూడా చెప్పాడు. ఇలాంటి కలలు కనే వారు నిజంగానే తట్టుకోలేక మంచాల మీద నుంచి దభీమని పడతారు.మన సరిహద్దుల్లోకి చైనీయులు చొరబడినట్లుగా ప్రచారంలో ఉన్న వీడియోలు ప్రామాణికమైనవి కాదు, దుష్ట ఆలోచనతో రూపొందించినవి అని మరోవైపు మన సైన్యం ప్రకటించింది.
రెండుదేశాల మధ్య గత ఏడాది 93 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లావాదేవీలు జరిగాయి. రెండుచోట్లా ఆర్ధిక పరిస్ధితులు బాగోలేక అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే మూడు బిలియన్‌ డాలర్ల మేర తగ్గాయి. మన దిగుమతులు ఎక్కువ కావటంతో చైనా మిగులు 56.77 బిలియన్‌ డాలర్లు ఉంది. కలలు అవి పగలు, రాత్రి అయినా కనేందుకు ఎవరికీ అభ్యంతరం లేదు. రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య లావాదేవీల గురించి కొన్ని వాస్తవాలను తెలుసుకోవటం అవసరం. బోగస్‌ వాట్సాప్‌ యూనివర్సిటీ మేథావుల సమాచారాన్ని నమ్మవద్దు. మన దేశం నుంచి 2019లో జరిగిన ఎగుమతులలో అమెరికాకు 15.91శాతం, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు 9.13, చైనాకు 5.08,హాంకాంగ్‌కు 3.93శాతం, సింగపూర్‌కు 3.51, మిగతా అన్ని దేశాలకు కలిపి 62.44శాతం ఉన్నాయి. ఇదే ఏడాది చైనా ఎగుమతులలో మన దేశ వాటా కేవలం మూడు శాతంతో ఏడవ స్ధానంలో ఉన్నాము. మొదటి స్ధానంలో ఉండి 16.8 శాతం దిగుమతి చేసుకుంటున్న అమెరికాయే రెండు సంవత్సరాల నుంచి వాణిజ్య యుద్దం చేస్తూ చైనాను వెంట్రుకవాసి కూడా కదిలించలేకపోయిందన్నది తెలుసుకుంటే సోనమ్‌ వాంగ్‌చుక్‌ లాంటి వారు కలలు కనటానికి అసలు నిదరే పట్టదు మరి.
చైనా నుంచి మనం మూడుశాతం దిగుమతులు నిలిపివేస్తే, మన ఎగుమతులు ఐదుశాతం నిలిచిపోతాయి. చైనా నుంచి మనం వస్తువుల దిగుమతిని నిలిపివేయాలని వాస్తవాల మీద ఆధారపడి పిలుపులు ఇస్తున్నారా లేక ఊహల్లో ఉండి చేస్తున్నారో తెలియదు. ఇవాళ అనేక వస్తువులు ఏవీ ఒక దేశంలో తయారు కావటం లేదు. ఒక్కో దేశంలో కొన్ని భాగాలు తయారైతే వాటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి సంపూర్ణ వస్తువును రూపొందిస్తున్నారు. ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫోన్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రికల్‌ వస్తువులన్నీ అలాంటివే. ఈ నేపధ్యంలో మన ప్రధాని నరేంద్రమోడీ స్ధానిక వస్తువులనే అడగండి అన్న పిలుపు మేరకు ఎవరైనా దుకాణాలకు వెళ్లి పక్కా స్ధానిక వస్తువులను ఎన్నింటిని కొనగలమో ఆలోచించండి.
ఒక దేశ వస్తువుల మీద మరొక దేశం లేదా కొన్ని దేశాలు దిగుమతి పన్నులు విధించినట్లయితే వాటిని తప్పించుకొనేందుకు ప్రతి దేశం ప్రయత్నిస్తుంది. అదే పని చైనా కూడా చేస్తున్నది. కొన్ని వస్తువులను హాంకాంగ్‌ ద్వారా ఎగుమతి చేయిస్తున్నది, మరికొన్నింటిని మరికొన్ని దేశాల ద్వారా సరఫరా చేస్తున్నది. అనేక వస్తువుల మీద ఏ దేశంలో తయారైంది అన్న సమాచారమే ఉండదు. అలాంటపుడు ఫలానా వస్తువు చైనాది అని ఎవరు చెప్పగలరు ? చైనా నుంచి మన ఔషధ కంపెనీలకు, ఇతర పరిశ్రమలకు అవసరమైన బల్క్‌డ్రగ్స్‌, ముడిసరకులను కూడా దిగుమతి చేసుకుంటున్నాము. వినిమయ వస్తువులనే కాకుండా చైనా అంశ ఉన్న ప్రాణావసర ఔషధాలను కూడా కూడా బహిష్కరించాలా ?
మన ప్రధాని మేకిన్‌ ఇండియా అని పిలుపు ఇచ్చిన తరువాత కొన్ని చైనా కంపెనీలు మన దేశంలోనే పెట్టుబడులు పెట్టి సెల్‌ఫోన్లను తయారు చేస్తున్నాయి. ఆ కంపెనీలను కూడా మూయిస్తారా, ఆ ఫోన్లను కూడా బహిష్కరిస్తారా ? చైనాగాక ఇతర దేశాలు తయారు చేస్తున్న అనేక వస్తువులను కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాము. వాటిలో ప్రతిదానిలో ఏదో ఒక భాగం చైనాలో తయారైనదిగా ఉంటుంది. మరి వాటి పట్ల వైఖరి ఏమిటి ? అమెరికా, జపాన్‌, మన దేశ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు కూడా అక్కడ సంస్ధలను స్ధాపించి వస్తువులను ఉత్పత్తి చేయించి ఎగుమతులు చేస్తున్నారు. వాటిని చైనా ఉత్పత్తులుగా పరిగణించాలా మరొక దేశానివిగా భావించాలా ?
చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటంలో బాబా రామ్‌దేవ్‌ కూడా తక్కువ తినలేదు. చైనా వస్తువులను బహిష్కరించటం దేశానికి సేవ చేయటమేనని చెప్పారు. ఫోన్‌ నుంచి టిక్‌టాక్‌, షేర్‌ఇట్‌,విడ్‌మేట్‌ వంటి యాప్స్‌ను తొలగిస్తున్న ఒకవీడియోను ట్వీట్‌ చేశారు. చైనా వ్యతిరేకతలో భాగంగా జైపూర్‌కు చెందిన ఒక సంస్ధ ‘రిమూవ్‌ చైనా యాప్‌(చైనా యాప్‌లను తొలగించండి) అనే ఒక యాప్‌ను తయారు చేసి వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంచింది. దాన్ని తమఫోన్‌లో పెట్టుకున్నవారికి ఏవి చైనా యాప్‌లో అది తెలియ చేస్తుంది. కావాలనుకున్నవారు వాటిని తొలగించుకోవచ్చు.
ఈ యాప్‌ను తన దుకాణంలో అందుబాటులో ఉంచిన గూగుల్‌ ప్రస్తుతం దాన్ని తొలగించింది. అలాంటి యాప్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచటం దుకాణ విధానాలకు వ్యతిరేకమని పేర్కొన్నది. అందుబాటుల్లో ఉంచే ముందు దానికి తెలియదా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఇదే కాదు టిక్‌టాక్‌కు ప్రత్నామ్నాయ తయారీ అంటూ మిత్రోం పేరుతో విడుదల చేసిన యాప్‌ను కూడా గూగుల్‌ నిలిపివేసింది. కాపీ యాప్‌ల తయారీ, విక్రయం తమ విధానాలకు వ్యతిరేకమని పేర్కొన్నది. అయితే చైనా వత్తిడి కారణంగానే గూగుల్‌ ఈ చర్యకు పాల్పడిందని కొందరు నెటిజన్లు సంస్ధ సిఇఓ సుందర్‌ పిచరు మీద విరుచుకు పడ్డారు. ఆయన దేశద్రోహా, దేశభక్తుడా ?
చైనా వస్తువులను బహిష్కరించాలి అని ప్రబోధిస్తున్న వారు, దానిని సమర్ధిస్తున్నవారు కాస్త ఉద్రేకాన్ని తగ్గించుకొని ఆలోచించాలి. సరిహద్దుతో మనకు సమస్యలున్నాయి గనుక ఆ దేశ వస్తువులను వద్దంటున్నారా ? లేక స్వదేశీ వస్తువులనే అడగండి అని మోడీ పిలుపు ఇచ్చారు కనుక వద్దంటున్నారా ? మొదటి అంశం అయితే ఏదో ఉద్రేకం అని సరిపెట్టుకోవచ్చు. రెండవది అయితే ఒక్క మూడుశాతం చైనాయేం ఖర్మ, యావత్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న 97శాతం వస్తువులు నిలిపివేస్తే మన వస్తువులు మనం కొనుక్కున్నట్లు అవుతుంది. అవి తయారు చేసేందుకు అవసరమైన పరిశ్రమలు, వాణిజ్యాన్ని పెంచుకున్నట్లు ఉంటుంది. దాని ద్వారా మన యువతకు ఉపాధి లభిస్తుంది. రాజకీయంగా ఆ దేశాలన్నీ కూడా మన కాళ్ల బేరానికి వస్తాయి కదా ! మరి ఆ పిలుపు ఎందుకు ఇవ్వటం లేదు ? దీన్లో కూడా రాజకీయాలు ఉన్నాయా ?
చైనా వస్తువులను బహిష్కరించాలని చెప్పేవారు వాటిని మన దేశంలోకి అనుమతిస్తున్న పాలకుల సంగతి ముందు తేల్చాలి. వారు దేశభక్తులో, ద్రోహులో నిలదీయాలి.ఒక వేళ అక్రమంగా సరిహద్దులు, సముద్రాలు దాటి వస్తుంటే మన భద్రతా దళాలు, నిఘా సంస్ధలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించాలి. అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నట్లుగా ఒకవైపు అనుమతించటం ఎందుకు, మరో వైపు బహిష్కరించమనటం ఏమిటి ? వాణిజ్యవేత్తల లాభాల కోసం దిగుమతులను అనుమతిస్తూ జనానికి దేశభక్తి, స్వదేశీ, ఓకల్‌ ఫర్‌ లోకల్‌ అని సొల్లు కబుర్లు చెబుతారా ? చైనా లేదా మొత్తం విదేశీ వస్తువులను కొన వద్దు అని ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు పిలుపు ఇవ్వరు ? యాభై ఆరు అంగుళాల ఛాతీ ఉప్పొంగటం లేదా ? ఒక్క వస్తువులనేనా లేక చైనా పెట్టుబడులను కూడా వద్దంటున్నారా ?
గేట్‌వే హౌస్‌ అనే ఒక సంస్ధ ఇటీవల ఒక నివేదికను ప్రచురించింది. మన దేశంలోని టెక్‌ అంకుర సంస్ధలలో నాలుగు బిలియన్‌ డాలర్ల చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఒక బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడి ఉన్న 30 పెద్ద అంకుర సంస్ధలలో 18లో చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఫిబ్రవరిలో వెల్లడైన ఆ నివేదిక ప్రకారం మొత్తం 92 సంస్ధలలో చైనా నిధులు ఉన్నాయి. నరేంద్రమోడీ గారు అధికారానికి వచ్చిన తరువాత ఆ పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. చైనా పెట్టుబడులు ఉన్న కంపెనీలన్నింటికీ యజమానులు చైనీయులు లేదా అక్కడి మాతృసంస్ధలు కావు. అనేక మంది భారతీయులు, చైనీయులు కాని వారు మెజారిటీ వాటాదారులుగా ఉన్నారు. అంతే కాదు, మన దేశానికి చెందిన వారు తమ సంస్ధలలో పెద్ద ఎత్తున నష్టాలు వచ్చిన తరువాతనే విదేశీ పెట్టుబడులకు అవకాశం ఇచ్చారు. వాటిలో చైనీయులు, కాని వారు అందరూ ఉన్నారు. పేటిమ్‌కు 2019లో రూ.3,690 కోట్లు, ఫ్లిప్‌కార్ట్‌కు రూ.3,837 కోట్ల నష్టం వచ్చింది. వాటిలో చైనీయులు పెట్టుబడి పెట్టారు. ఉన్న ఫళాన సోనమ్‌ వాంగ్‌చుక్‌ వంటి వారు వారిని తట్టాబుట్టా సర్దుకుపొమ్మంటారా ? లేదా స్వదేశీ రామ్‌దేవ్‌ బాబా చైనా పెట్టుబడులను తిరిగి ఇచ్చి ఆ వాటాలను తన పతంజలి సంస్ధద్వారా కొనుగోలు చేయాలి.
2019 నివేదిక ప్రకారం మన దేశంలో ఫోన్‌ వినియోగదారులు డౌన్లోడ్‌ చేసుకున్న అగ్రశ్రేణి 50శాతం యాప్‌లలో చైనా పెట్టుబడులు ఉన్నాయి. మరి వాటిని కూడా ఫోన్ల నుంచి తొలగిస్తారా ? 2019తొలి మూడునెలల్లో మన దేశంలోని స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లో చైనా బ్రాండ్స్‌ 66శాతం ఆక్రమించాయి. వాటిని కొనుగోలు చేసిన వారెందరు తమ ఫోన్లను చెత్తబుట్టలో పడవేసి తమ దేశభక్తిని నిరూపించుకున్నారో ఎవరికి వారు పక్కవారిని పరిశీలించాలి. మార్కెట్లో ఏ దేశంలో తయారైందో ,బ్రాండ్‌లు తెలియని అనేక చైనా వస్తువులను ఇబ్బడి ముబ్బడిగా విక్రయిస్తున్నారు, జనం కొనుగోలు చేస్తున్నారు. మేడిన్‌ ఇండియా అనే ముద్రలేని వస్తువులన్నింటినీ మన ఇండ్ల నుంచి బయటపడవేద్దామా ? స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా స్వదేశీ నినాదం మేరకు అనేక మంది బ్రిటన్‌ గ్లాస్కో పంచెలు, చొక్కాలను ,కోట్లు సూట్లు తీసి వేసి జీవితాంతం ఖద్దరు ధరించారు. మహాత్మా గాంధీయే అందుకు నిదర్శనం. ఆయనకంటే గొప్ప దేశభక్తులం మేము అని చెప్పుకుంటున్నవారు ఆపని చేయలేరా ? మనకా పట్టుదల లేదా ? ఓకల్‌ ఫర్‌ లోకల్‌ నినాద మిచ్చిన నరేంద్రమోడీ, ఆయన మంత్రి వర్గ సహచరులు ముందు ఆపని చేశారా ? ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులా ?
ప్రపంచీకరణ యుగంలో ఒక దేశం మరొక దేశంలో కంపెనీలు ఏర్పాటు చేస్తోంది. అక్కడి నుంచి మూడో దేశంలో పెట్టుబడులు పెడుతోంది. వాటిని ఏ దేశానికి చెందినవిగా పరిగణించాలి. ఉదాహరణకు సింగపూర్‌, హాంకాంగ్‌, మలేషియా, మారిషస్‌ వంటి దేశాల్లో ఉన్న రాయితీలు, ఇతర సౌలభ్యాల కారణంగా అనేక సంస్ధలు అక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి. పెట్టుబడులు కూడా అక్కడి నుంచే పెడుతున్నట్లు చూపుతున్నాయి.ఉదాహరణకు పేటిమ్‌లో చైనాకు చెందిన ఆలీబాబా సింగపూర్‌ హౌల్డింగ్స్‌ ద్వారా పెట్టుబడులు పెట్టారు. మన నరేంద్రమోడీ సర్కార్‌ వాటిని సింగపూర్‌ పెట్టుబడులుగా కాగితాల మీద చూపింది తప్ప చైనావిగా కాదు. మరి ఇలాంటి వాటి గురించి ఏమంటారు. ఇక్కడ చెప్పవచ్చేదేమంటే ఒక పిలుపు ఇచ్చేటపుడు, దాన్ని బలపరచే ముందు బాధ్యతాయుతంగా ఆలోచించాలి.ప్రతిపోసుకోలు కబురును భుజానవేసుకోకూడదు. భక్తి దేవుడి మీద చిత్తం చెప్పుల మీద అన్నట్లుగా రామ్‌దేవ్‌ బాబా తన వస్తువులను మరింతగా అమ్ముకొనేందుకు ఇలాంటి పిలుపులను సమర్ధిస్తారు తప్ప మరొకటి కాదని గుర్తించాలి. ఈ రోజు ఉన్నఫళంగా చైనా వస్తువులను ఆపివేస్తే వాటి స్ధానంలో ఎవరి వస్తువులను కొనాలి. చైనా తప్ప మనకు అన్ని దేశాలూ మిత్రపక్షాలే అని చెబుతున్నవారు ముందు ఆ సంగతి తేల్చాలి. వారు చైనా ధరలకే మనకు అందచేస్తారా ? సోనమ్‌ వాంగ్‌ చుక్‌ చెప్పినట్లు చైనా కోసం పర్సుమూస్తే అధిక ధరలుండా మిగతాదేశాల వస్తువుల కోసం ఉన్న పర్సును ఖాళీ చేసుకొని అప్పులు చేయాలి. చిప్పపట్టుకు తిరగాలి. అందుకు సిద్దపడదామా ?
విదేశీ వస్తువులు అవి చైనావి అయినా మరొక దేశానికి చెందినవి అయినా వినియోగదారులు ఎందుకు కొంటున్నారు. కొన్నవారందరూ దేశద్రోహులు, విదేశీ సమర్ధకులు, తుకడే తుకడే గ్యాంగులు కాదు. దిగుమతి చేసుకొనే వస్తువుల మాదిరి చౌక ధరలు, నాణ్యతను మన దేశంలో తయారీదారులు అందిస్తే ఎవరూ విదేశీ బ్రాండ్లకు ఎగబడరు. చౌకగా వస్తువులు విక్రయించటానికి చైనా,జపాన్‌, దక్షిణ కొరియాకు సాధ్యమౌతోంది. అదే అమెరికా,బ్రిటన్‌లకు ఎందుకు కావటం లేదు? తమ అవసరాలకు మించి మిగతా దేశాలకు సరఫరా చేసేందుకు పెద్ద ఎత్తున సరకులు తయారు చేస్తున్న కారణంగా చైనా వంటి దేశాలకు ఉత్పాదక ఖర్చు తగ్గుతోంది. తమ జనాభా మొత్తానికి పని కల్పించాలి కనుక వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని సబ్సిడీల రూపంలో ఇచ్చి విదేశీ మార్కెట్‌ను పెంచుకొంటోంది. అన్నింటికీ మించి చౌకగా వస్తువులను ఎలా తయారు చేయాలి, ఉత్పాదకతను ఎలా పెంచాలి అనేందుకు అవసరమైన పరిశోధన, అభివృద్ది ఖర్చు చైనా, జపాన్‌, కొరియాల్లో ఎక్కువగా ఉంటోంది. గతంలో ఎవరి చేతుల్లో చూసినా కొరియా శాంసంగ్‌, ఫిన్లాండ్‌ నోకియా కనిపించేది. చైనా ఫోన్లు చౌకరకం, సరిగా పనిచేయవని అనే వారు. ఇప్పుడు ఎక్కడ చూసినా చైనా ఫోన్లే, పని చేయవు అనే ఫిర్యాదు లేదు. వాటి దెబ్బకు జపాన్‌ సోనీ, పానాసోనిక్‌, మన దేశానికి చెందిన మైక్రోమాక్స్‌ కనుమరుగయ్యాయి.ఇప్పుడు మన దేశంలో తయారవుతున్న అనేక ఫోన్లలో వాడుతున్నది చైనా విడిభాగాలే, వాటిని తయారు చేస్తున్నదీ మన దేశంలో ఏర్పాటు చేసిన చైనా కంపెనీలే మరి. వాటన్నింటినీ మూసివేస్తే మన ఆర్ధిక వ్యవస్ధకు, ఉపాధికి సైతం నష్టమే. పడవ నుంచి దూకాలనుకొనే ముందు పర్యవసానాలను ఆలోచించుకోపోతే ఏమౌతుందో తెలుసా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ అసహనం, బెదిరింపుల వెనుక అసలు కథేంటి !

31 Sunday May 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Donald Trump threats and intolerance on WHO, G7 summit, WHO Controversy, WTO


ఎం కోటేశ్వరరావు
ప్రపంచ ఆరోగ్య సంస్ధ : చైనా చేతిలో కీలుబమ్మగా మారింది.
ప్రపంచ వాణిజ్య సంస్ధ: దీన్ని రద్దు చేయాలి, మాకు ఉపయోగపడటం లేదు. చైనా ఆర్ధిక సామ్రాజ్యవాదిగా వ్యవహరిస్తోంది.
ప్రపంచ మానవ హక్కుల కమిషన్‌: తన స్వార్ధం తాను చూసుకొంటోంది, దొంగ ఏడ్పులు ఏడుస్తోంది.
అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు : దీన్ని మేము గుర్తించం, మా మీద విచారణ జరిపే అధికారం దానికి లేదు.
ఏడుదేశాల బృందం(జి7) : దీనికి కాలదోషం పట్టింది. ఈ బృందంలో భారత్‌, రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలను చేర్చాలి.
ఇలాంటి సాకులు చెబుతూ ఒక్కొక్క ప్రపంచ సంస్ధ నుంచి తాము తప్పుకుంటామని ప్రకటించటం లేదా బెదిరించటం ఇటీవలి కాలంలో అమెరికాకు మామూలైంది.దశాబ్దాల పాటు తామే అయి నడిపిన యాంకీలు ఇప్పుడు ఆ సంస్ధలనే తూలనాడుతున్నారు, బెదిరిస్తున్నారు ఎందుకు ? కరోనా వైరస్‌ను అవకాశంగా తీసుకొని ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి బయటపడేందుకు పూనుకుంది. చైనీయులను బూచిగా చూపుతోంది. ఇలా మరికొన్నింటి నుంచి కూడా తప్పుకొనేందుకు పూనుకుంది వాటన్నింటికీ కారణం ఏమిటి , కారకులు ఎవరు ?
ప్రపంచంలో మానవ హక్కులను కాపాడే ఏకైక దేశంగా ఫోజు పెట్టిన అమెరికా ఆచరణలో వాటిని హరించేదిగా మారింది. స్వేచ్చకు ప్రతి రూపంగా లిబర్టీ విగ్రహాన్ని పెట్టుకున్న వారు ఒక వైపు యాత్రీకుల నుంచి ఆదాయం పిండుకొనే వనరుగా మార్చుకున్నారు. మరోవైపు ప్రపంచంలో అనేక దేశాల పౌరుల స్వేచ్చా, స్వాతంత్య్రాలను హరించిన మిలిటరీ, ఇతర నియంతలను ఆ విగ్రం ముందు నిలబెట్టి అసలైన రక్షకులుగా ప్రపంచానికి చూపారు.
2018లో ప్రపంచ మానవహక్కుల సంస్ధ నుంచి అమెరికా వైదొలగింది. పాలస్తీనియన్ల సమస్య మీద ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఆ సంస్ధ పని చేస్తున్నట్లు ఆరోపించింది. నిజానికి పాలస్తీనియన్ల మాతృదేశాన్ని లేకుండా చేసి వారి ప్రాంతాలను ఆక్రమించి, బందీలుగా మార్చి, నిత్యం దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ యూదు దురహంకారులకు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్న ఏకైక దేశం అమెరికా. తాను చేసిన ఆరోపణలకు ఆమోద ముద్రవేయకపోవటం, తాను నందంటే నంది, పందంటే పంది అని వంతపాడేందుకు ఆ సంస్ధ నిరాకరించటమే అసలు కారణం. ఆ సంస్ధ నుంచి వైదొలిగిన అమెరికా సాధించిందేమీ లేదు, అమెరికా లేనంత మాత్రాన దాని కార్యకలాపాలు ఆగిపోలేదు. సిరియా, ఇరాక్‌, లిబియా, ఆఫ్ఘనిస్తాన్‌ వంటి చోట్ల అమెరికన్లు దాడులు,తిరుగుబాట్లను ప్రోత్సహించి, రెచ్చ గొట్టి, తామే స్వయంగా దాడులకు పాల్పడి మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన సత్యం దాస్తే దాగేది కాదు. ఆ నేరాలు ఏడాది కేడాది పెరుగుతున్నాయి గనుక తమను ఎక్కడ బోనులో నిలబెడతారో అనే భయంతో ఐక్యరాజ్యసమితి చొరవతో ఏర్పడిన అంతర్జాతీయ నేర కోర్టును గుర్తించేందుకు నిరాకరిస్తున్నారు.
అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టును ఏర్పాటు చేయాలని అనేక సంప్రదింపుల అనంతరం రోమ్‌ సమావేశంలో తీర్మానించారు.1998 జూలై 17న దాన్ని 120దేశాలు ఆమోదించగా, 21 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. వ్యతిరేకించిన ఏడు దేశాలలో అమెరికా, చైనా, లిబియా, ఇరాక్‌, ఇజ్రాయెల్‌, ఎమెన్‌, కతార్‌ ఉన్నాయి. అయితే 2000 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ ఒప్పందం మీద సంతకం చేశాడు. ఇలాంటి ఒప్పందాల మీద దేశాలు సంతకాలు చేస్తేనే చాలదు, వాటిని ఆయా దేశాల పార్లమెంట్‌లు ఆమోదించాలి. క్లింటన్‌ పార్లమెంట్‌కు నివేదించలేదు. రెండు సంవత్సరాల తరువాత ఐక్యరాజ్యసమితికి ఒక లేఖ రాస్తూ రోమ్‌ ఒప్పందానికి తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదంటూ నాటి అధ్యక్షుడు బుష్‌ స్పష్టం చేశారు. ఒకసారి అంగీకరిస్తే ఆయా దేశాల మీద వచ్చే ఆరోపణలు, విమర్శల మీద విచారణ జరపాల్సి ఉంటుంది. అమెరికా గనుక చేరి ఉంటే ఏదో ఒకసాకుతో అనేక దేశాలలో జోక్యం చేసుకుంటున్నదాని దుర్మార్గాలపై ఈ పాటికి ఎన్నో విచారణలు జరిగి ఉండేవి, దాని దుర్మార్గం మరింతగా లోకానికి బట్టబయలు అయి ఉండేది. అందుకే చేరేందుకు నిరాకరిస్తోంది. ఒక వైపు తాము సహకరిస్తామని చెబుతూనే నేరాలకు పాల్పడిన తమ సైనిక, గూఢచార ఇతర పౌరులను రక్షించుకొనేందుకు, కోర్టు కార్యకలాపాలను అడ్డుకొనేందుకు చేయాల్సిందంతా చేస్తోంది. మరికొన్ని అంతర్జాతీయ ఒప్పందాల నుంచి కూడా ఏకపక్షంగా వైదొలగింది. వాటిలో ఇరాన్‌తో కుదిరి అణు ఒప్పందం అన్నది తెలిసిందే. దాన్నుంచి వైదొలగిన తరువాత అమెరికా దాడులు, దానికి ఇరాన్‌ ప్రతిదాడుల సంగతి తెలిసిందే.
ప్రపంచ వాణిజ్య సంస్ధ ఏర్పాటులో అమెరికా ప్రముఖ పాత్ర పోషించింది. ప్రపంచీకరణను అమలు జరిపే సాధనంగా దాన్ని మార్చుకొని తన ప్రయోజనాలు సాధించుకోవాలని చూసింది.కొన్ని సంవత్సరాల తరువాత భారత్‌, చైనాలు ఇంకేమాత్రం అభివృద్ధి చెందుతున్న దేశాలు కాదని, ఆ పేరుతో వాటికి రాయితీలు కల్పించటం అక్రమం అని, తమకు సంస్ధలో ఉన్నందున ప్రయోజనాలేమీ లేవని, తమకు సైతం అదే హౌదా ఇవ్వాలని లేకుంటే తాము సంస్ధ నుంచి విడిపోతామని ట్రంప్‌ బెదిరింపులకు దిగాడు. వర్ధమాన దేశాలు పన్నులను తగ్గించేందుకు ఇచ్చిన వ్యవధి మేరకే భారత్‌, చైనాలు అవకాశాలను వినియోగించుకుంటున్నాయి తప్ప ఎవరి దయాదాక్షిణ్యమో కాదు. నిజానికి నిబంధనలను ఉల్లంఘించి లబ్ది పొందుతోంది అమెరికాయే. అనేక దేశాలపై కేసులు దాఖలు చేసి బెదిరింపులకు దిగింది. మన దేశం పత్తికి మద్దతు ధర ప్రకటించటాన్ని రాయితీ ఇవ్వటంగా చిత్రించి ప్రపంచ వాణిజ్య సంస్దలో మనకు వ్యతిరేకంగా కేసు దాఖలు చేసింది. బోయింగ్‌ విమాన కంపెనీకి పెద్ద ఎత్తున దొడ్డిదారిన రాయితీలు ఇస్తోంది. ఆ విమానాలను కొనాలని ఇతర దేశాలపై తన పలుకుబడిని వినియోగిస్తోంది. బోయింగ్‌కు పోటీగా ఐరోపా ధనిక దేశాలు ఎయిర్‌బస్‌కు మద్దతు ఇస్తున్నాయి. రెండూ పరస్పరం ఆరోపణ చేసుకొని దాఖలు చేసిన కేసు ఇంకా కొలిక్కి రాలేదు. పదహారేండ్ల నుంచి సాగుతున్న ఈ వివాదంలో ఐరోపా యూనియన్‌ను బెదిరించేందుకు అక్కడి నుంచి దిగుమతి చేసుకొనే విమానాలు, విడిభాగాలపై విధిస్తున్న పన్ను 10 నుంచి 15శాతానికి ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా పెంచింది.
ప్రపంచ ఆరోగ్య సంస్ధ విషయానికి వస్తే కరోనా వైరస్‌కు కారణం చైనాయే అని ప్రకటించాలన్నది అమెరికా వత్తిడి. దానికి ఆ సంస్ధ లొంగకపోవటంతో ట్రంప్‌ ఎదురుదాడి ప్రారంభించి చైనాతో కుమ్మక్కయిందని ఆరోపించాడు, ముందు నిధులు నిలిపివేస్తామని ప్రకటించి ఇప్పుడు ఏకంగా వైదొలుగుతామని బెదిరింపులకు దిగాడు. ఈ సంస్ధకు ఇచ్చే నిధులను ప్రపంచంలో ప్రజారోగ్యానికి చేసే ఖర్చుకు అంద చేస్తామని గొప్పలు చెప్పాడు. కరోనా వైరస్‌ ఎక్కడ నుంచి ప్రారంభమైందో దర్యాప్తు జరిపేందుకు చైనా సంస్థలను తమకు అప్పగించాలని అమెరికా ముందు డిమాండ్‌ చేసింది, అంతేకాదు, బాధిత దేశాలకు నష్టపరిహారం చెల్లించాలని కేసుల నాటకం ఆడించింది. చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్ధ సమావేశాల్లో తాము చెప్పిన పద్దతుల్లో దర్యాప్తు తీర్మానం చేయించాలని వత్తిడి తెచ్చింది. అయితే రాజకీయ కోణంతో జరిపే దర్యాప్తులకు బదులు వాస్తవం తెలుసుకొనేందుకు కరోనా సమస్య సమసిపోయిన తరువాత స్వతంత్ర సభ్యులతో దర్యాప్తు జరపవచ్చని దానికి తాము కూడా సహకరిస్తామని చైనా ప్రకటించింది. భారత్‌తో సహా 122 దేశాలు ఉమ్మడిగా ప్రవేశపెట్టిన తీర్మానంపై ఎలాంటి ఓటింగ్‌ లేకుండా ఏకగ్రీవంగా ఆమోదించటం అమెరికాకు మింగుడు పడలేదు. చైనా వ్యతిరేకిస్తుందని, దాన్ని సాకుగా తీసుకొని దాడి చేయాలని చూసిన ఆమెరికా దీంతో హతాశురాలైంది. ఇక లాభం లేదనుకొని తాము సంస్ధ నుంచి వైదొలుగుతామని ప్రకటించింది. సంస్కరణలు తేవటంలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ విఫలమైందని ట్రంప్‌ ఆరోపించాడు. అయితే అమెరికా కోరుతున్న సంస్కరణలు ఏమిటో స్పష్టత లేదని, బయట చర్చకు పెట్టలేదని, ఒక నెల వేచి చూస్తామని చెప్పిన ట్రంప్‌ వారం రోజులకే బెదిరింపులకు ఎందుకు దిగారో తెలియటం లేదని సంస్ధ ప్రధాన కార్యదర్శి టెడ్రోస్‌ చెప్పారు. ట్రంప్‌ నిర్ణయం ముందు చూపులేమి, అమెరికన్ల ప్రాణాలకు ముప్పు తేవటమే అని విమర్శలు వచ్చాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్ధ అసెంబ్లీ ఆమోదించిన ఒక చారిత్రాత్మక ప్రతిపాదన కూడా అమెరికా నిర్ణయాన్ని ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది.కరోనా వైరస్‌ నిరోధానికి తయారు చేసే వ్యాక్సిన్‌ ప్రజల వస్తువుగా ఉండాలి తప్ప ఒకటి రెండు సంస్ధలకు పేటెంట్‌ ఔషధంగా ఉండకూడదని కోస్టారికా చేసిన ప్రతిపాదనను అమెరికా, బ్రిటన్‌ తప్ప మిగిలిన దేశాలన్నీ అంగీకరించాయి. వాటిలో అమెరికా అనుయాయి దేశాలు అన్నీ ఉన్నాయి. ప్రపంచానికి మహమ్మారులుగా మారిన వ్యాధుల నివారణకు రూపొందించిన ఔషధాలు చౌకగా అందరికీ అందుబాటులో ఉండాలి తప్ప కొన్ని కంపెనీలకు లాభాలను తెచ్చిపెట్టేవిగా ఉండకూడదు. అదే జరిగితే ఏం జరుగుతుందో ఎయిడ్స్‌ ఔషధాల విషయంలో చూశాము.
తాము కూడా కరోనా వాక్సిన్‌ తయారీలో ఉన్నామని, అవి జయప్రదమైన తరువాత ప్రజల వస్తువుగా అందుబాటులో ఉంచుతామని చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ ప్రకటించారు. అంతే కాదు ప్రజల వస్తువుగా ఉంచే వాక్సిన్‌ తయారీ యత్నాలకు రానున్న రెండు సంవత్సరాలలో రెండు బిలియన్‌ డాలర్లు అందచేస్తామని కూడా చెప్పారు. ప్రస్తుతం ఎనిమిది సంస్ధలు వాక్సిన్‌ ఒకటి, రెండవ దశ పరీక్షలలో ఉన్నాయి. వాటిలో నాలుగు చైనాలో, రెండు అమెరికా, జర్మనీ, బ్రిటన్‌లో ఒక్కొక్కటీ ఉన్నాయి.
ఎయిడ్స్‌ ఔషధ పేటెంట్‌ పొందిన కంపెనీ ఏడాదికి ఒక్కో రోగి నుంచి పది నుంచి పదిహేనువేల డాలర్లు వసూలు చేసి విక్రయించింది. పదేండ్ల పాటు అంత ఖర్చు భరించలేని రోగులందరూ దుర్మరణం పాలయ్యారు.2004లో మన దేశ కంపెనీలు ఏడాదికి కేవలం 350 డాలర్లకే మందులను అందుబాటులో తెచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచానికి కావలసిన ఎయిడ్స్‌ ఔషధాలలో 80శాతం మన దగ్గర నుంచే సరఫరా అవుతున్నాయి. కాన్సర్‌ చికిత్సకు ఉపయోగించే నెక్సావార్‌ ఔషధంపై బేయర్‌ కంపెనీ పేటెంట్‌ హక్కు కలిగి ఉంది. నూట ఇరవై బిళ్లలను రెండు లక్షల ఎనభైవేల రూపాయలకు కొనుగోలు చేయాల్సి వచ్చేది. అలాంటిది మన దేశంలోని నాట్కో కంపెనీ జనరిక్‌ ఔషధాన్ని కేవలం రూ.8,800లకే అందుబాటులోకి తెచ్చింది. తాము ఈ ఔషధాన్ని భారత మార్కెట్‌కోసం తయారు చేయలేదని పెద్ద మొత్తం చెల్లించి కొనుగోలు చేయగల పశ్చిమదేశాల వారికి ఉద్దేశించింది అని నాట్కో కంపెనీపై కేసు దాఖలు చేసిన సందర్భంగా బేయర్‌ కంపెనీ సిఇఓ చెప్పాడు. అయితే ఆ కేసులో బేయర్‌ ఓడిపోయింది.
ఇప్పుడు కరోనా వాక్సిన్‌తో వ్యాపారం చేయాలన్నది అమెరికా, బ్రిటన్‌ ఆలోచన. అనేక వ్యాధులు పశ్చిమ దేశాలలో అంతగా రావు, అయినా పశ్చిమ దేశాల కంపెనీలు ఆ వ్యాధులకు ఔషధాలను ఎందుకు రూపొందిస్తున్నాయంటే రోగులను పీల్చి పిప్పి చేసేందుకే అన్నది స్పష్టం. ప్రపంచ ఆరోగ్య సంస్ధలో ఉంటూ ఇలాంటి చర్యలకు మద్దతు ఇస్తే అమెరికన్లు సభ్య సమాజం నుంచి మరింతగా వేరుపడతారు. ఇతర జబ్బులకు ఒకసారి పెట్టుబడి పెట్టి అభివృద్ది చేస్తే తరువాత రోజుల్లో పెద్ద మార్పుల అవసరం ఉండదు. కరోనా వైరస్‌ లేదా మరొక వైరస్‌ దేనికీ ఒకసారి తయారు చేసిన ఔషధం శాశ్వతంగా పనికి రాదు. వైరస్‌లో మార్పులు జరిగినపుడల్లా మార్చాల్సి ఉంటుంది. అన్నింటికీ మించి ఎయిడ్స్‌ కోరి తెచ్చుకొనే జబ్బు, కరోనా కోరకుండానే దాడి చేస్తుంది కనుక ప్రతి ఒక్కరూ భయంతో జీవించాల్సి ఉంటుంది, వాక్సిన్‌కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్దపడతారు.మహమ్మారులుగా మారినపుడు లక్షలు, కోట్ల మందికి సోకుతాయి. ఈ అవసరం, బలహీనతను సొమ్ము చేసుకోవాలని అమెరికా, బ్రిటన్‌ కార్పొరేట్‌ సంస్ధలు కాచుకు కూర్చున్నాయి. వాటి ఆకాంక్షలను ట్రంప్‌ వెల్లడిస్తున్నాడు.
ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) నుంచి అమెరికా వైదొలగాలన్న అంశం గత పదిహేను సంవత్సరాలుగా నలుగుతున్నదే. అధికార పార్టీకి చెందిన ఎంపీలు ఇటీవల ఈ సంస్ధను రద్దు చేయాలంటూ ఊగిపోయారు. అలాంటి అధికారం గనుక అమెరికాకు ఉంటే ఈ పాటికి ట్రంప్‌ ఎప్పుడో ఆ పని చేసి ఉండేవాడు. ఈ విషయంలో ప్రతిపక్ష డెమోక్రాట్లు కూడా తక్కువ తినలేదు.ఆ సంస్ధ నుంచి తప్పుకోవాలంటూ పార్లమెంట్‌లో ఆ పార్టీ సభ్యుడు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఒక వేళ ట్రంప్‌ అలాంటి పిచ్చిపని చేస్తే ముందు నష్ట పోయేది అమెరికా తప్ప మిగతా ప్రపంచం కాదు. అయితే తీర్మానం నెగ్గి వెంటనే అమెరికా బయటకు పోతుందని ఎవరూ భావించటం లేదు. అదే జరిగితే ప్రపంచ వాణిజ్యం మీద ఐరోపా యూనియన్‌, చైనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందరితో పాటు కూర్చునేందుకు తమకు స్ధలం ఉండదు అని అమెరికా వాణిజ్య మాజీ ప్రతినిధి వెండీ కట్లర్‌ చేసిన వ్యాఖ్య తీవ్రతకు నిదర్శనం.
గాట్‌లో, తరువాత దాని స్ధానంలో ఏర్పడిన ప్రపంచ వాణిజ్య సంస్ధలో స్ధాపక సభ్యురాలిగా చైనాకు స్ధానం కల్పించేందుకు అమెరికా, దాని మిత్ర రాజ్యాలు అనుమతించలేదు.ఏ వర్ధమాన దేశానికీ విధంచని షరతులను చైనాకు పెట్టి చివరకు చేర్చుకున్నారు.అప్పటి నుంచీ చైనా తమ దేశం నుంచి ఫ్యాక్టరీలు, సంస్ధలను తరలించుకుపోతున్నది, ఉద్యోగాలకు ఎసరు పెట్టింది, వాణిజ్యాన్ని దెబ్బతీసింది అంటూ అమెరికా సణగని రోజు లేదు.
అమెరికా ఒక్క ఐక్యరాజ్యసమితి సంస్ధల నుంచే కాదు. ఇతర వ్యవస్ధలను కూడా చిన్నాభిన్నం చేయాలని చూస్తోంది. బలహీనులనే కాదు బలవంతులను కూడా తన పాదాల చెంతకు తెచ్చుకొనేందుకు పూనుకుంది. చరిత్రలో జరిగిన అనేక ప్రాంతీయ, రెండు ప్రపంచ యుద్దాలకు సామ్రాజ్యవాదుల ఇలాంటి వైఖరే కారణమైంది.
జి7 దేశాల బృందానికి కాలదోషం పట్టిందని ప్రకటించటానికి ట్రంప్‌ ఎవరు ? దానిలో అమెరికాతో పాటు కెనడా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, ఇటలీ, జర్మనీ, జపాన్‌ ఉన్నాయి. మధ్యలో కొన్ని సంవత్సరాలు రష్యాను ఎనిమిదవ దేశంగా చేర్చుకొనేందుకు నిర్ణయించి క్రిమియా ప్రాంతాన్ని ఆక్రమించుకొందనే సాకుతో పక్కన పెట్టారు.ఈ ఏడాది జరిగే సమావేశానికి తిరిగి అధికారికంగా పిలవాలని నిర్ణయించారు. గత ఏడాది మనదేశంతో సహా తొమ్మిది దేశాలను అతిధులుగా ఆహ్వానించారు. ఆరు దేశాల బృందంగా ఏర్పడిన ఈ ఆర్ధిక కూటమిలో తరువాత ఏడవద దేశంగా కెనడాను చేర్చుకున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత ఐరోపా యూనియన్‌ శాశ్వత ఆహ్వానిత సంస్ధగా పిలుస్తున్నారు. నిజానికి ఇది ధనిక రాజ్యాలు తమ ప్రయోజనాలకోసం ఏర్పాటు చేసుకున్నది తప్ప ఐక్యరాజ్యసమితితో ఎలాంటి ప్రమేయం లేదు. ఈ ఏడాది జూన్‌ 10-12 తేదీలలో అమెరికా మేరీలాండ్‌ రాష్ట్రంలోని కాంప్‌డేవిడ్‌లో జరపాలని నిర్ణయించారు. అయితే కరోనా కారణంగా సమావేశాన్ని ఆన్‌లైన్‌ జరపనున్నట్లు మార్చి నెలలో తెలిపారు. ఇప్పుడు దాన్ని కూడా ఏకంగా సెప్టెంబరుకు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. అప్పటికి అమెరికా ఎన్నికలు దగ్గరపడతాయి కనుక తన లాభనష్టాలను బేరీజు వేసుకొని తదుపరి నిర్ణయం తీసుకోవచ్చు.
ఒకే గూటి పక్షులైన ఈ బృంద దేశాలతో కూడా అమెరికా సక్రమంగా వ్యవహరించటం లేదు. మిగతా దేశాలన్నీ తనకు అణగి మణగి ఉండాలని కోరుకుంటోంది. ఈ నేపధ్యంలో 2018లో కెనడాలోని మాంట్రియల్‌ నగరంలో జరిగిన సమావేశం రసాభాస అయింది. డోనాల్డ్‌ ట్రంప్‌తో మిగిలిన ఆరుగురు నేతలు పడిన ఇబ్బందులను గమనించిన జర్నలిస్టులు ఆ సమావేశాన్ని ” జి6ప్లస్‌ ఒన్‌ ” అని అపహాస్యం చేశారు. ఆ సమావేశం ఎలాంటి ప్రకటనను ఆమోదించకుండా ముగియటానికి అమెరికా, ట్రంపే కారణం అంటే అతిశయోక్తి కాదు. ఆ ఏడాదే చైనా, కెనడా , ఐరోపా యూనియన్‌ ఇతర అనేక దేశాలపై బస్తీమే సవాల్‌ అంటూ ట్రంప్‌ వాణిజ్య యుద్దం ప్రకటించటమే దీనికి కారణం. ఈ ఏడాది ఆతిధ్యం ఇస్తూ ఈ బృందం పనికిమాలినది అని వ్యాఖ్యానించటాన్ని బట్టి ట్రంప్‌ సంస్కారం ఏమిటో బయటపడింది. అదే నోటితో మన దేశంతో సహా మిగిలిన దేశాలతో దాన్ని విస్తృత పరచాలంటూ ఆదేశాల తరఫున మాట్లాడుతున్నట్లు ఫోజు పెట్టాడు. నిజానికి ఆ బృందంలో ఉన్నంత మాత్రాన ఏ దేశానికైనా పెద్దగా ఒరిగేదేమీ లేదు. దానితో నిమిత్తం లేకుండానే చైనా అంతర్జాతీయ వాణిజ్యంలో ఎంతగా ఎదిగిందో, ఆ బృందంలోని అమెరికా మినహా మిగిలిన దేశాలను దాటి ఎలా ముందుకు పోతోందో ఇప్పుడు కరోనా వైరస్‌ను అరికట్టటంలో సోషలిస్టు వ్యవస్ధ ప్రత్యేకతను ప్రపంచానికి చాటింది. ఒక్క జపాన్‌ మినహా మిగిలిన అన్ని జి7దేశాలూ కరోనాతో సతమతం అవుతున్నాయి. అమెరికా గురించి చెప్పనవసరం లేదు. ప్రపంచంలో ఇది రాస్తున్న సమయానికి నమోదైన 62లక్షల కేసుల్లో పద్దెనిమిది లక్షల కేసులను దాటి పోయింది. 2008లలో ధనిక దేశాలలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం నుంచి జి7లోని ఏ ఒక్కదేశమూ బయటపడకపోగా మరో సంక్షోభంలోకి కూరుకుపోతుండటాన్ని చూస్తున్నాము.
అమెరికా పాలకవర్గం, దాని ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అనుకుంటున్నది ఒకటి-జరుగుతున్నది మరొకటి కావటంతో తట్టుకోలేకపోతున్నాడు. ఏదో ఒక పిచ్చిపనో, ప్రకటనో, బెదిరింపులో చేస్తున్నాడు. వాటిలో ఒకటి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి అమెరికా తప్పుకుంటుందన్న అంశం. గతంలో ప్రపంచాన్ని బెదిరించేందుకు జపాన్‌పై అణుబాంబులు వేశారు. ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత బెదిరింపులు ఎక్కువయ్యాయి. ప్రపంచ సంస్ధల నుంచి తప్పుకుంటామనే రూపంలో అవి ముందుకు వస్తున్నాయి.అందుకుగాను ప్రతిదానికీ ఏదో ఒక సాకు చూపుతున్నారు.
రెండవ ప్రపంచ యుద్దం తరువాత తలెత్తిన పరిస్ధితుల్లో అమెరికా ఒక పెద్ద ఆర్ధికశక్తిగా ఎదిగింది. కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే బాధ్యతను నెత్తికి ఎత్తుకొని ప్రపంచలోని కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులన్నింటినీ కూడగట్టింది. ఆ ముసుగులో తన కార్పొరేట్‌ సంస్ధలకు ఆయా దేశాలను మార్కెట్‌గా చేసుకొనేందుకు, సహజవనరులను కొల్లగొట్టేందుకు ప్రయత్నించింది. తన మిలిటరీ,రాజకీయ వ్యూహాలను అమలు జరిపేందుకు కేంద్రాలుగా చేసుకున్నది. గడచిన ఏడున్నర దశాబ్దాలలో అమెరికా అనుసరించిన ఎత్తుగడలు దానికి ఎదురుతన్నాయి.ఈ కారణంగానే డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ సంస్ధలలో అమెరికా కొనసాగటం, వాటికి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం దండగ, తమ లక్ష్యాలకు ఉపయోగపడటం లేదని భావించటం, తప్పుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అమెరికాయే కాదు ఏదేశంలో అయినా పాలకవర్గాలకు తమ ప్రయోజనాలే ముఖ్యం తప్ప వ్యక్తులు కాదు. తాము నిర్దేశించిన అజెండాను అమలు జరపకపోతే ఒక బొమ్మ బదులు మరొక బొమ్మను గద్దెపై కూర్చోబెడతాయి. ఈ నేపధ్యంలోనే నవంబరు ఎన్నికలలో ట్రంప్‌ ఓడిపోయి మరొకరు వచ్చినా భాష, హావభావాలు, పిచ్చిమాటలు మారవచ్చు తప్ప ఇదే వైఖరి కొనసాగుతుంది.
ఇలాంటి వైఖరి అమెరికాకు ఉపయోగపడుతుందా ? ప్రపంచ సంస్ధలతో నిమిత్తం లేకుండా తనకున్న ఆర్ధిక, మిలిటరీ శక్తితో ప్రపంచాన్ని శాసించి తన అదుపులోకి తెచ్చుకోవాలని గత కొంత కాలంగా ప్రయత్నిస్తోంది. అది సాధ్యం కాదని దానికి అవగతం అవుతోంది. 2008లో పెట్టుబడిదారీ దేశాలలో వచ్చిన మాంద్యం తరువాత అనేక దేశాలు రక్షణాత్మక చర్యలు తీసుకోవటం, ప్రపంచ వాణిజ్య సంస్ధను పక్కన పెట్టి విడిగా ఒప్పందాలు చేసుకోవటం పెరుగుతోంది. గత ఏడాది నవంబరు వరకు వచ్చిన వార్తల ప్రకారం రక్షణాత్మక చర్యల్లో అమెరికా 790తో అగ్రస్ధానంలో ఉంది. మన దేశం ప్రపంచ వాణిజ్యంలో చాలా తక్కువశాతమే కలిగి ఉన్నప్పటికీ దాన్నయినా కాపాడుకొనేందుకు రక్షణాత్మక చర్యల్లో 566తో అమెరికా తరువాత రెండో స్ధానంలో ఉన్నాం. దేశాల వారీ జర్మనీ 390, బ్రిటన్‌ 357, ఫ్రాన్స్‌262, చైనా 256, కెనడా 199, ఆస్ట్రేలియా 174 చర్యలు తీసుకున్నాయి.2018 చివరిలో ప్రపంచ వాణిజ్యం మాంద్యంలోకి జారిపోయింది. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచం ఎలాంటి పర్యవసానాలను చూడాల్సి వస్తుందో అప్పుడే చెప్పలేము.
ఐక్యరాజ్యసమితికి ఉండే బలహీనతలు దానికి ఉన్నాయి. అంతకంటే మెరుగైన వ్యవస్ధను ఏర్పాటు చేసుకొనేంతవరకు దాన్ని కొనసాగించటం తప్ప మరొక మార్గం లేదు. ఉన్నదాన్నే కొనసాగించటానికి అంగీకరించని అమెరికన్లు దాన్ని బోనులో నిలబెట్టే అంతకంటే శక్తివంతమైన ప్రపంచ వ్యవస్ధ ఏర్పాటుకు అంగీకరిస్తారని ఆశపెట్టుకోనవసరం లేదు. గతంలో సామ్రాజ్యవాదులు ప్రపంచాన్ని పంచుకొనేందుకు, రక్షణాత్మక చర్యలు అమలు జరిపిన కారణంగానే ప్రపంచ యుద్దాలు వచ్చాయి. ట్రంప్‌ చేస్తున్న పిచ్చిపనులు నవంబరులో జరిగే ఎన్నికల్లో లబ్దిపొందేందుకు అన్నది ఒకటైతే రెండవది అమెరికా వైఖరిలో రోజు రోజుకూ పెరుగుతున్న అసహనానికి నిదర్శనం. ట్రంప్‌ ఓడిపోతారా, డెమోక్రాట్‌ జోబిడెన్‌ గెలుస్తారా అన్నది పక్కన పెడితే అగ్రస్దానం అమెరికాదే అన్న వైఖరిని మరింత ముందుకు తీసుకుపోతే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడే తెలియదు గానీ, తీవ్రంగా ఉంటాయని కచ్చితంగా చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉత్తర కొరియా కిమ్‌పై కొనసాగుతున్న పిట్ట, కట్టుకథలు !

05 Tuesday May 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, International, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

DPRK Kim Jong Un, Kim Jong-un, North Korea, North Korea’s Kim Jong Un

Kim Jong-un 'speaks out' amid death claims, according to North ...

ఎం కోటేశ్వరరావు
ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ అన్‌ కొద్ది రోజులు కనిపించకపోవటం గురించి కట్టు కథలు అల్లి చివరకు ‘చంపేసిన’ మీడియా మే ఒకటవ తేదీన కనిపించిన తరువాత పిట్ట కథలు చెబుతోంది. ప్రపంచంలో అనేక దేశాధినేతలు, మీడియాలో కతలు వండే, చెప్పేవారిని, ఉత్తర కొరియా నుంచి ఫిరాయించి రాజభోగాలు అనుభవిస్తున్న విభీషుణులకు కిమ్‌ తీవ్ర ఆశాభంగం కలిగించారు. ప్రపంచంలో తమకు తెలియని రహస్యం ఉండదు అని విర్రవీగే సిఐఏ వంటి గూఢచార సంస్ధలు జరిగిన దాన్ని చూసి నోళ్లు వెళ్ల బెట్టాయి. అలాంటి పేరు మోసిన సంస్ధలు, జేమ్స్‌ బాండ్‌ వంటి గూఢచారులను కూడా ఉత్తర కొరియా వెర్రి వెంగళప్పలను చేసింది. అవాక్కయిన వారందరూ గుక్క తిప్పుకొని మరో రూపంలో దాడి చేస్తున్నారు. పిట్ట కథలు చెబుతున్నారు.
కిమ్‌ విషయంలో తెలుగు మీడియా కూడా తక్కువ తినలేదు. పోటీలు పడి అమెరికా సిఐఏ, దక్షిణ కొరియా సంస్ధలు, ఉత్తర కారియా వ్యతిరేకులు అందించిన సమాచారంతో కొద్ది రోజుల పాటు ఊహాగానాలతో కాలక్షేపం చేశారు. కొన్ని విదేశీ టీవీలు కిమ్‌ మరణించినట్లు వార్తలు చెప్పేశాయి. మన తెలుగు టీవీ ఉత్సాహవంతులెవరైనా ఆ పుణ్యం కట్టుకున్నారేమో తెలియదు. ఉత్తర కొరియా నుంచి ఫిరాయించిన ఒక మాజీ దౌత్యవేత్త థాయే ఎంగ్‌ హౌ మీడియాను రంజింప చేశాడు. కిమ్‌ నిలబడలేడు, నడవ లేని స్ధితిలో తీవ్రంగా జబ్బు పడ్డాడు అంటూ మే ఒకటవ తేదీకి మూడు రోజుల ముందు చెప్పాడు. అది వాస్తవం కాదని తేలటంతో ఇప్పుడు క్షమాపణలు చెప్పాడు. ఇంతకూ ఈ పెద్ద మనిషి 2016లో దక్షిణ కొరియాకు ఫిరాయించాడు, గత నెలలో పార్లమెంట్‌ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యాడు.ఉత్తర కొరియాకు సంబంధించిన అంశాలలో ఆకాంక్షలకు అనుగుణ్యంగా కచ్చితమైన విశ్లేషణ చేస్తానని, అంచనాలు వేస్తాననే నమ్మకంతో మీరు నన్ను పార్లమెంట్‌కు ఎన్నుకున్న కారణాలలో ఒకటని నాకు తెలుసు. కారణాలేమైనప్పటికీ నేను ప్రతివారికి ఇప్పుడు క్షమాపణ చెబుతున్నాను. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు బాధ్యత, తప్పు నాదే అని ప్రకటించాడు. కిమ్‌ చావు వార్త గురించి తాను ఎటూ చెప్పలేని కొద్ది రోజుల క్రితం చెప్పిన ట్రంప్‌ అంతర్గతంగా ఎదురు చూశాడని వేరే చెప్పనవసరం లేదు. అయితే మే ఒకటవ తేదీన కనిపించటంతో తనకు ఎంతో సంతోషంగా ఉందని ట్వీట్‌ చేశాడు.

Kim Jong Un resurfaces on state media with mysterious mark on ...
అతనికి ఉన్న సిగ్గు, బిడియం మీడియాకు ఎందుకు లేకపోయింది ? తేలు కుట్టిన దొంగల మాదిరి ఏమీ ఎరగనట్లు కొత్త కథలు అల్లటంలో నిమగమయ్యారు. కిమ్‌కు అసలు ఎలాంటి ఆపరేషన్లు జరగలేదని దక్షిణ కొరియా చెబుతోంది. అయినా సరే కిమ్‌ చేతికి ఒక గాయం మాదిరి కనిపిస్తోందని జర్నలిస్టులు చెబుతున్నారు. తన వ్యతిరేకులను, కట్టు కథలను అల్లిన మీడియా జనాలను వెర్రి వెంగళప్పలను చేయటానికి అలాంటి చిహ్నంతో మేకప్‌ వేసుకొని కావాలని కనిపించేట్లు చేశారేమో ! మరొక ఫిరాయింపుదారు, పార్లమెంట్‌కు ఎన్నికైన జి సెయోంగ్‌ హౌ అయితే మరొక అడుగు ముందుకు వేసి గుండె ఆపరేషన్‌ జరిగిన కిమ్‌ మరణించాడని 99శాతం కచ్చితంగా చెబుతున్నా, మృతి వార్తను అధికారికంగా శనివారం నాడు ప్రకటిస్తారు అని శుక్రవారం నాడు చెప్పాడు. ఇతగాడిని 2018లో అమెరికా పార్లమెంట్‌ ఉభయ సభలలో ప్రసంగించేందుకు ట్రంప్‌ ఆహ్వానించాడు. ఇలాంటి ఫిరాయింపుదార్లందరినీ అమెరికా సర్కార్‌ పెంచి పోషిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ఈ పెద్దమనిషి ఇప్పుడు మీడియాను తప్పించుకు తిరుగుతున్నాడు.
చీకట్లో బాణాలు వేసే ఇలాంటి వారి మాటలను నమ్మి జనానికి మీడియా కట్టుకధలు అందిస్తోందని మరోసారి రుజువైంది. నిజం చెప్పకపోగా ఉత్తర కొరియాతో సంబంధాలను మరింతగా చెడగొట్టినందుకు గూఢచార, రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీల నుంచి వారిని తొలగించాలని అధికార పక్షంలో కొందరు సూచించారు.న్యూస్‌ వీక్‌ వంటి పత్రికల్లో రాసే వారు కూడా ఫేక్‌ న్యూస్‌ను పాఠకుల ముందు కుమ్మరించారు. హయాంగ్‌సాన్‌ రాష్ట్రంలోని మౌంట్‌ కుమగాంగ్‌లో ఒక విల్లాలో కిమ్‌ అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని రాసింది. నిజానికి అలాంటి రాష్ట్రం ఉత్తర కొరియాలో లేదు. అది మౌంట్‌ మోయోయాంగ్‌ ప్రాంతంలోని ఒక ఆసుపత్రి పేరు. ఇలాంటి వాటిని చూసి జనంలో నగుబాట్ల పాలౌతారని కామోసు ఒక వ్యాఖ్యాత కిమ్‌ గురించి వార్తలు రాయటం కంటే రాయకపోవటమే మంచిది అని పేర్కొన్నాడు.
క్యూబా ప్రజల ప్రియతమ నేత ఫిడెల్‌ కాస్ట్రోను సిఐఏ లేదా అది కిరాయికి నియమించిన హంతకులు 634 పద్దతుల్లో లేదా అన్ని సార్లు హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు హాలీవుడ్‌లో ఒక సినిమా కూడా తీశారు. సిఐఏ ఏజంట్లు, వారితో కుమ్మక్కైన వారు పలు దేశాలలో అనేక మంది నేతలను మట్టుపెట్టారు. మీకు కూతవేటు దూరంలో కేవలం 144 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యూబా అధినేత కాస్ట్రోను ఏమి చేయలేకపోయారు మీ గొప్పల గురించి మాదగ్గర చెప్పకండి అని అమెరికా మిత్రులు బహుశా ఎకసెక్కాలాడి ఉంటారు. అందుకే కసితో అన్ని సార్లు కాస్ట్రోను హతమార్చేందుకు యత్నించి ఉండాలి అనుకోవాల్సి వస్తోంది.అలాగే గత ఏడు దశాబ్దాలుగా ఆసియాలో కొరకరాని కొయ్యగా ఉన్న ఉత్తర కొరియా నాయకత్వాన్ని హతమార్చేందుకు అమెరికన్లు చేయని యత్నం లేదు. కిమ్‌ జోంగ్‌ అన్‌ మీద, తాత కిమ్‌ ఇల్‌ సంగ్‌, తండ్రి కిమ్‌ జోంగ్‌ ఇల్‌ను హత్య చేసేందుకు అమెరికా, దక్షిణ కొరియా సంస్ధలు చేయని యత్నం లేదు. అనేక సార్లు మీడియాలో వారిని బతికి ఉండగానే చంపేశారు.
క్యూబాలో ఫిడెల్‌ కాస్ట్రో ఆయన సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు, కొరియాలో కిమ్‌ ఇల్‌ సంగ్‌, ఆయన కుటుంబ సభ్యులు తమ తమ దేశాల్లో నియంతలు, దురాక్రమణదారులకు వ్యతిరేకంగా పోరాడిన ఘన చరిత్ర కలిగిన వారు తప్ప నియంతలు కాదు. ఏ సోషలిస్టు దేశంలోనూ లేని విధంగా ఉత్తర కొరియాలో కిమ్‌ ఇల్‌ సంగ్‌ వ్యక్తి పూజ గురించి, ఆయన తరువాత కుమారుడు, ఆ తరువాత మనుమడికి పట్టం కట్టటం గురించి ఎవరైనా విమర్శలు చేయవచ్చు. కుటుంబవారసత్వం అన్నది అది తప్పా ఒప్పా అన్నది ఆ దేశ పౌరులు తేల్చుకుంటారు, కానీ నియంతలని నిందించటం తగనిపని. అమెరికాకు లొంగని వారందరినీ నియంతలుగానే చిత్రిస్తారు. దాని మద్దతుతో గద్దెలెక్కి జనాన్ని అణచివేసిన నియంతలందరినీ అపర ప్రజాస్వామిక వాదులుగా చూపుతారు. వారితో బహిరంగంగా చేతులు కలపటాన్ని ప్రోత్సహిస్తారు. అమెరికా సిఐఏ, దానితో చేతులు కలిపిన అనేక సంస్ధలు, వ్యక్తులు కూడా నిఖార్సుగా నిలిచిన సోషలిస్టు దేశాల నేతలు, అంతర్గత విషయాలలో బొక్కబోర్లా పడ్డారు. ఇప్పుడూ అదే జరిగింది, ఊహాగానాలు తప్ప ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. ఫిరాయింపుదార్ల మాటలు నమ్మి ట్రంప్‌ వంటి వారు నగుబాట్ల పాలయ్యారు.
ఏప్రిల్‌ 11న ఉత్తర కొరియా పాలక వర్కర్స్‌ పార్టీ విధాన నిర్ణాయక కమిటీ సమావేశంలో కిమ్‌ పాల్గొన్నారు. పదిహేనవ తేదీన కిమ్‌ ఇల్‌ సంగ్‌ జయంతి కార్యక్రమానికి హాజరు కాలేదు.ఇరవై ఒకటవ తేదీన అమెరికా నిధులతో దక్షిణ కొరియా నుంచి నడిచే డెయిలీ ఎన్‌కె అనే దినపత్రిక కిమ్‌కు గుండె ఆపరేషన్‌ జరిగినట్లు రాసింది. ఇరవై మూడవ తేదీన కిమ్‌ ప్రయివేటు రైలు ఒక దగ్గర కనిపించిందంటూ కొన్ని చిత్రాలను విడుదల చేశారు, అదే రోజు అక్కడకు చైనా వైద్యులు వచ్చినట్లు కూడా వార్తలను రాశారు. మే ఒకటవ తేదీన ఒక ఎరువుల కర్మాగారంలో జరిగిన మేడే కార్యక్రమంలో పాల్గొన్న కిమ్‌ చిత్రాలు, వీడియోలను విడుదల చేయటంతో పుకార్ల మిల్లుల యంత్రాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఫిరాయింపుదార్లు, అమెరికా ఏజంట్లు వ్యాపింప చేసిన వార్తలను తాము నమ్మటం లేదని దక్షిణ కొరియా ప్రభుత్వం ఒకవైపు చెబుతున్నా, తప్పుడు సమాచారాన్ని ఖండించకపోవటంతో మీడియా రెచ్చిపోయింది. గతంలో ఉత్తర కొరియన్లు ఆకలితో చచ్చిపోతున్నారంటూ మీడియాలో చెప్పిన అంకెలను అన్నింటినీ కలిపితే ఆ దేశ జనాభాను మించి ఉన్నాయి. అసలు దేశమే అంతరించి పోయి ఉండేది. ఎవరికైనా ఇబ్బందులు రావటం వేరు, వాటిని బూతద్దంలో చూపి అంతా అయిపోయినట్లుగా చెప్పటాన్ని ఏమనాలి?

Kim Jong-un Resurfaces, State Media Says, After Weeks of Health Rumors
కిమ్‌ కనపడటం లేదంటూ చావుతో సహా రకరకాల ప్రచారం చేసిన పెద్దలు ఇప్పుడు అవే నోళ్లతో ఆరోగ్యంగా ఉన్నాను, ఇప్పటికీ అధికారంలో ఉన్నాను అని రుజువు చూపేందుకు ఇప్పుడు బయటకు వచ్చారంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఒక వేళ తనకేదయినా జరిగితే అధికారం కోసం ఎవరు ఎలా ప్రవర్తిస్తారో, జనం ఎలా స్పందిస్తారో తెలుసుకొనేందుకు కిమ్‌ చావు నాటకం అడారని కొందరు ఇప్పుడు వీక్షకులకు కతలు వినిపిస్తున్నారు. అధికారం కోసం పాకులాడిన వారి తొలగింపు తదుపరి జరగనుందని చెబుతున్నారు. కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ ఇటీవల సోదరుడితో తరచూ కనిపిస్తున్నారని, తదుపరి ఆమే పీఠం ఎక్కవచ్చంటూ గతంలో ప్రచారం చేశారు. ఇతర దేశాల నేతల మాదిరి ప్రతి రోజూ సోషలిస్టు దేశాల నేతలు మీడియాలో కనిపించకపోవటం కొత్తేమీ కాదు.2014లో నలభై రోజుల పాటు కిమ్‌ బహిరంగ కార్యక్రమాల్లో కనిపించలేదు. అంతకు ముందు ఆయన తండ్రి కిమ్‌ జోంగ్‌ ఇల్‌ కొన్ని నెలల పాటు కనిపించని సందర్భం కూడా ఉంది. తన సమీప బంధువు కిమ్‌ కొయోంగ్‌ హురును విషమిప్పించి కిమ్‌ చంపించాడని ఫిరాయింపుదార్లు నమ్మబలికారు. ఆ తరువాత ఆమె చిరునవ్వుతో దర్శనమిచ్చింది. ఉత్తర కొరియాలో ఏమి జరుగుతోందో తెలియదని ఇనుపతెర ఉందని చెబుతారు. అదే నోటితో అమెరికాలోని పెంటగన్‌ లేదా సిఐఏ కార్యాలయాల్లో ఏమి జరుగుతోందో తెలియదని, అక్కడి పాలకులు నియంతలని మీడియాలో ఎందుకు వర్ణించరు? తాము మెచ్చింది రంభ-మునిగింది గంగ అంటే ఇదేనా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా ”మందు” రెమిడెసివిర్‌ -కందకు లేని దురద కత్తి పీటలకా !

28 Tuesday Apr 2020

Posted by raomk in CHINA, Current Affairs, Health, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, UK, USA

≈ Leave a comment

Tags

Remdesivir, remdesivir clinical trial, remdesivir clinical trial coronavirus facts and myths

Gilead says Remdesivir trial posted online prematurely was ...

ఎం కోటేశ్వరరావు
చైనాకు వ్యతిరేకంగా ఏ చెత్తను మార్కెట్లో పెట్టినా ఆమ్ముడవుతుందా ? కొన్ని మీడియా సంస్ధలు అలాంటి చెత్త వార్తలను అమ్మి సొమ్ము చేసుకొనేందుకు పూనుకున్నాయా ? ఏమో ! చైనా ” మందు ” జాగ్రత్త అనే శీర్షికతో ఒక ప్రముఖ తెలుగు పత్రిక సోమవారం నాడు ఒక వార్తను ప్రచురించింది. తప్పుడు వార్తలు రాసేందుకు, రాయించేందుకు కూడా ” సమగ్రశిక్షణ ” అవసరం అని కాస్త జాగ్రత్తగా చదివిన వారికి అర్ధం అవుతుంది. ఇంతకూ ఏమిటట?
జనవరి 20న కరోనా వ్యాప్తిపై ప్రకటన, తరువాతి రోజే రంగంలోకి ” వూహన్‌ లాబ్‌ ”, రెమ్‌డెసివిర్‌ ఔషధం పేటెంట్‌కు దరఖాస్తు. ఈ అంశాల మీద ఆ కథను అల్లారు. వైరస్‌ వ్యాప్తి గురించి ఆరు రోజుల పాటు బయటి ప్రపంచానికి తెలియకుండా చైనా ప్రభుత్వమే మోకాలడ్డిందని ఇంకా ఏవేవో రాసిన వాటిని పునశ్చరణ చేయనవసరం లేదు. దీనర్ధం ఏమంటే వైరస్‌ పరిశోధనలు చేస్తూ దాన్ని ఒక పధకం ప్రకారం బయటకు వదలిన చైనాలోని వూహాన్‌ వైరాలజీ సంస్ధ దాని నిరోధానికి అవసరమైన ఔషధాన్ని కూడా ముందే తయారు చేసి పెట్టుకుందని జనాల బుర్రలకు ఎక్కించే యత్నమే.
ఈ వార్తను లండన్‌ నుంచి ప్రచురితమయ్యే డెయిలీ మెయిల్‌ డాట్‌కామ్‌ 25వ తేదీ బిఎస్‌టి(బ్రిటీష్‌ సమ్మర్‌ టైమ్‌) రాత్రి పది గంటలకు ప్రచురించింది. దానికి మనం నాలుగున్నర గంటలను కలుపుకుంటే మన సమయం రాత్రి రెండున్నర అవుతుంది. ఆ వార్త లేదా ఏదైనా ఏజన్సీ వార్తను గానీ తీసుకొని పైన చెప్పిన కథను వండి వడ్డించి ఉండాలి. దాని సంగతి తరువాత చూద్దాం. ముందుకొన్ని విషయాలు ఇక్కడ చెప్పుకోక తప్పదు. చైనా గురించి మీడియాలో వచ్చేది, దాని వ్యతిరేక దేశాల నేతలు, శాస్త్రవేత్తలు చెప్పేదంతా నిజమే అని నమ్మేవారు నమ్మవచ్చు. అలా నమ్మకాన్ని ఖరారు చేసుకొనే ముందు భిన్న కథనాలు కూడా ఉన్నాయని, వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సవినయ వినతి. అవన్నీ ఎక్కడ కుదురుతాయి… మా వీనులకు విందు, చెవులకు ఇంపుగా ఉండేది, బుర్రకు కిక్కునిచ్చేదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాం అనే వారి నిజాయితీకి జోహార్లు.
కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి ప్రకటనలు బయటకు రాగానే చైనా గూఢచారులు కెనడా లాబ్‌ నుంచి అపహరించి వూహాన్‌ లాబ్‌ నుంచి బయటకు వదిలారు, చైనా ప్రమాదకర జీవ ఆయుధాలను తయారు చేస్తోంది అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నిజంగా బయటకు వదల దలచుకొంటే కెనడా లాబ్‌ నుంచే చైనా గూఢచారులు బయటకు పంప వచ్చు కదా ! దున్న ఈనిందంటే ముందు దూడను గాటన కట్టేయమన్నట్లుగా చాలా మంది నమ్మేశారు. నిజంగానే ఎవరైనా ఒక వైరస్‌ను బయటకు వదిలితే దానికి సరిహద్దులు,దేశాలు, రంగు బేధాల తేడాలుండవు, ఎక్కడ అనువుగా వుంటే అక్కడకు పాకి తన ప్రభావం చూపుతుందనే లోకజ్ఞానం ఈ సందర్భంగా పని చేసి ఉంటే ఇప్పుడు కరోనా ప్రళయ తాండవానికి కకావికలౌతున్న దేశాలన్నీ జాగ్రత్తలు తీసుకొని ఉండేవి. లక్షలాది ప్రాణాలను కాపాడేవి. కొంత మంది కావాలని కాదు గానీ ప్రమాదవశాత్తూ బయటకు వచ్చి ఉంటుందని సన్నాయి నొక్కులు నొక్కుతూ నమ్మింపచేసేందుకు ప్రయత్నించారు. ప్లేగు, మసూచిని కావాలని అంటించిన దేశాలను, రసాయన బాంబులు, గ్యాస్‌లో జనాన్ని మట్టు పెట్టిన దుర్మార్గాన్ని ప్రపంచం చూసింది. ఒక వైరస్‌ను సృష్టించి వదలిన దేశం గురించి చరిత్రలో నమోదు కాలేదు. కొన్ని అనుమానాలు వ్యక్తం అయినా ఎక్కడా రుజువు కాలేదు. ఒక కొత్త వైరస్‌ తొలుత ఎక్కడ బయటపడితే దాన్ని ఆదేశమే తయారు చేసింది అనే నిర్ధారణకు వచ్చేట్లయితే ఆ వరుసలో చైనా కంటే ముందు అనేక దేశాలు ఉన్నాయి. కరోనా వైరస్‌ గురించి ప్రపంచానికి ఇంతకు ముందే తెలుసు. తాజాగా తలెత్తిన కోవిడ్‌-19 వైరస్‌ కొత్తరకం అని కృత్రిమ సృష్టి కాదని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్ధ, అనేక మంది ఆ రంగంలో పని చేస్తున్నవారు ప్రకటించినా, కొందరు పని గట్టుకొని చేస్తున్న ప్రచారానికి మీడియా ఎలాటి విమర్శనాత్మక దృష్టి లేకుండా ఏకపక్షంగా ప్రాధాన్యత ఇస్తోంది.
రెండవ అంశం ఈ వైరస్‌ను అమెరికన్లే తయారు చేసి తమ దేశం మీద ప్రయోగించినట్లు అనుమానిస్తున్నట్లు చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఒక విమర్శ చేశాడు. అమెరికా మిలిటరీ దాన్ని తీసుకువచ్చినట్లు పేర్కొన్నాడు. అమెరికాలోని మేరీలాండ్‌లో ఉన్న ఫోర్ట్‌ డెట్‌రిక్‌ అమెరికా మిలిటరీ లాబ్‌ నుంచి వైరస్‌లు బయటకు రాకుండా నివారించేందుకు తగిన రక్షణ ఏర్పాట్లు లేనందున ఏడాది క్రితమే దాన్ని మూసివేశారని వెంటనే వార్తలు వచ్చాయి. అయితే తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేశారు తప్ప మూసివేయలేదని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ప్రకటించింది.
ఇక రెమిడెసివిర్‌ ఔషధం కధను చూద్దాం. కరోనా వైరస్‌ కొత్తది కాదు, గతంలోనే గుర్తించారు. దానిలో అనేక రకాలు ఉన్నాయి. తాజాగా తలెత్తినదానిని కోవిడ్‌-19 అని పేరు పెట్టారు. గతంలో తలెత్తిన కరోనా వైరస్‌, ఇతర వైరస్‌లకు వ్యాక్సిన్‌లు, ఔషధాలు తయారు చేసే సంస్ధలు ఎన్నో గతంలోనే పేటెంట్లకు దరఖాస్తులు చేశాయి. అంటే అవి ముందే మందులను తయారు చేసి వైరస్‌ను ఇప్పుడు సృష్టించాయని భావించాలా ? కుట్ర సిద్దాంతాలను పరిగణనలోకి తీసుకున్నట్లయితే కోవిడ్‌-19ను అమెరికానే సృష్టించిందని అనుకోవాలి? అది అలాంటి ప్రయత్నాలు చేయకపోతే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గిలీడ్‌ కంపెనీ నాలుగు సంవత్సరాల క్రితమే కరోనా వైరస్‌ చికిత్సకు రెమిడెసివిర్‌ను అనుమతించాలని పేటెంట్‌కు దరఖాస్తు ఎందుకు చేసినట్లు ? ప్రపంచ వ్యాపితంగా వినియోగించేందుకు నాలుగు సంవత్సరాల క్రితమే దరఖాస్తు చేసినట్లు గిలీడ్‌ కంపెన చెప్పినట్లు డెయిలీ మెయిల్‌ రాసింది. కోవిడ్‌-19కు అది పని చేస్తుందని తేలితే భవిష్యత్‌లో సరఫరా చేసేందుకు గాను ప్రస్తుతం చికిత్సలో దాని పని తీరును నిర్ధారించుకునే పనిలో ఉన్నామని గిలీడ్‌ చెబుతోంది. నిజానికి ఆ ఔషధాన్ని ఎబోలా వైరస్‌కోసం గిలీడ్‌ తయారు చేసింది. ఇది కరోనాకూ పని చేస్తుందేమో అని అది నిర్ధారించుకుంటోంది. అదే ఔషధం తయారీకి తమకు పేటెంట్‌ ఇవ్వాలని ఊహాన్‌ వైరాలజీ సంస్ధ జనవరి 21న దరఖాస్తు చేసిందట. అది నిజంగా కరోనా కోసమో కాదో తెలియదు, కరోనా కోసమే అయితే ఏ తరగతి కోసమో అంతకంటే తెలియదు, దరఖాస్తులోని వివరాలు ఏడాది తరువాత గానీ బయటకు రావు. అలాంటిది ముందే కరోనా మందుకు పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసినట్లు ఏ ఆధారాలతో రాస్తారు ? ఒక వేళ నిజంగానే రెమ్‌డెసివిర్‌కు చైనా సంస్ధ దరఖాస్తు చేస్తే అంతకు ముందే ఉన్న గిలీడ్‌ కంపెనీకి ఇవ్వకుండా చైనా సంస్ధకు ఎలా ఇస్తారు ? నిజంగా ఆ ఫార్ములాను ఎవరైనా తస్కరిస్తే మరొక పేరుతో దరఖాస్తు చేస్తారు తప్ప అదే పేరుతో ఎలా చేస్తారు ? మరీ అంత అమాయకంగా ఎవరైనా ఉంటారా ? ఎప్పుడో నాలుగేండ్ల క్రితం దరఖాస్తు చేసిన దానికే ఇంతవరకు అనుమతి రాకపోతే జనవరిలో చేసిన దానికి వెంటనే అనుమతి ఎలా వస్తుంది ? ఇదంతా చూస్తే కందకు లేని దురద కత్తిపీటకు అన్నట్లు గిలీడ్‌ కంపెనీ తాపీగా ఉన్నా జర్నలిస్టులు కొందరు గోక్కుంటున్నారు.
ఇక రెమ్‌డెసివవిర్‌ గత కొద్ది వారాలుగా వార్తల్లో ఉంది. ఆ ఔషధాన్ని తయారు చేశారు గానీ ఎక్కడా ఉత్పత్తి చేయటం లేదు. ఎబోలా కోసం తయారు చేసిన దానిని ఇప్పుడు కరోనాకు ఉపయోగపడుతుందేమో చూద్దాం అన్నట్లుగా గిలీడ్‌ కంపెనీ ఉంది.కోవిడ్‌-19 రోగులు 63 మంది మీద ప్రయోగిస్తే 36 మందికి కాస్త గుణం కనిపించిందని, ఇంకా ప్రయోగదశలోనే ఉందని, ప్రపంచంలో ఎక్కడా చికిత్సకు అనుమతించలేదని కంపెనీ సిఇఓ డేనియల్‌ ఓడే ఏప్రిల్‌ 10న ప్రకటించినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వార్త పేర్కొన్నది.ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఫలితాలు వెల్లడైన తరువాత వినియోగం గురించి పరిశీలిస్తామని భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్‌) శాస్త్రవేత్త రామన్‌ గంగా ఖేద్‌కర్‌ చెప్పారు. 2015లో ఇదే కంపెనీ తయారు చేసిన హెపటైటిస్‌ సి ఔషధం గురించి చేతులు కాల్చుకున్న ఐసిఎంఆర్‌ అంత రెమ్‌డెసివర్‌ గురించి ఆసక్తి ప్రదర్శించటం లేదని కూడా వార్తలు వచ్చాయి. పనికి వచ్చేట్లయితే జనరిక్‌ ఔషధం తయారు చేసేందుకు గిలీడ్‌ కంపెనీ స్వచ్చందంగా అనుమతిస్తే తయారు చేయవచ్చని కొందరు అంతకు ముందు ఆలోచన చేశారు. మరికొన్ని వార్తల ప్రకారం ఇదే ఔషధంపై చైనాలోని రెండు ఆసుపత్రులలో 28 మగ చిట్టెలుకల మీద ప్రయోగాలు జరపగా వాటిలో వీర్య కణాల సంఖ్య తగ్గినట్లు, అసహజత పెరిగినట్లు ప్రాధమిక పరశీలనల్లో వెల్లడైంది.దీని గురించి ఎలాంటి నిర్దారణలకు ఇంకా రాలేదని ఏప్రిల్‌ 23న ఒక వెబ్‌సైట్‌ పేర్కొన్నది. ఇలాగే అమెరికా, బ్రిటన్‌, మరికొన్ని దేశాలలో కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇది కోవిడ్‌-19కు పని చేయదని తేలినట్లు గిలీడ్‌ కంపెనీ గతశుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపిందని కూడా వార్తలు వచ్చాయి.
చైనా దరఖాస్తు గురించి తమకు తెలుసునని, అయితే వచ్చే ఏడాది ఆ వివరాలను ప్రచురించేంత వరకు దాని గురించి తామేమీ చెప్పలేమని గిలీడ్‌ చెప్పింది. ఎబోలాకు తయారు చేసిన తమ ఔషధం కరోనాకు పనికి వస్తుందా లేదా అన్న అధ్యయనాన్ని నిలిపివేసినట్లు కూడా పేర్కొన్నది. ఒక కంపెనీ తయారు చేసిన దాన్ని మరొక దేశంలో పేటెంట్‌ కోరినా మంజూరు కాదు.గిలీడ్‌ కంపెనీ తమ ప్రయోజనాలకు భంగం కలుగుతోందని ఫిర్యాదు అయినా చేసి ఉండేది, ఒక వేళ అదే నిజమైతే ఈ పాటికి డోనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశ కంపెనీ తయారు చేసిన దాన్ని చైనా తస్కరించిందని ఈ పాటికే నానా యాగీ చేసి ఉండేవాడు. బహుశా ఈ ఔషధ ప్రయోగాల గురించి చెప్పి ఉంటే అది నిజమని నమ్మి కొద్ది రోజుల్లో వాక్సిన్‌ తయారు చేయాలని రెండు నెలల క్రితం ట్రంప్‌ బహిరంగంగా విలేకర్ల సమావేశంలో చెప్పాడని అనుకోవాల్సి వస్తోంది. కోవిడ్‌ -19 చికిత్సకోసం అమెరికా, ఐరోపాల్లో వాక్సిన్ల పేటెంట్‌ గురించి నంబర్లతో సహా సామాజిక మాధ్యమంలో ప్రచారం జరుగుతోంది. ఎఎఫ్‌పి వార్తా సంస్ధ వాటి గురించి నిర్ధారణ చేసుకొని అవన్నీ నకిలీ అని తేల్చింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d