• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Readers News Service

పెట్టుబడిదారీ విధానాన్నే అస్త్రంగా మార్చి అమెరికాపై చైనా దాడిని ఎక్కుపెట్టిందా ?

10 Thursday Aug 2023

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

#Anti China, Anti communist, CAPITALISM, capitalism or socialism, China, Joe Biden



ఎం కోటేశ్వరరావు


పెట్టుబడిదారీ విధానాన్నే అస్త్రంగా మార్చి అమెరికాను దెబ్బతీసేందుకు చైనా ఎలా చూస్తున్నదో చూడండి, మన పెట్టుబడులనే మన నాశనానికి వాడుతున్నది అంటూ అమెరికాలో విశ్లేషకులు కొందరు అక్కడి పాలకవర్గాన్ని హెచ్చరించారు. ఇది ఒక్కరిద్దరి అభిప్రాయం అనుకుంటే పొరపాటు, అమెరికాలో పెట్టుబడిదారీ విధాన మీద తలెత్తిన ఆగ్రహాన్ని పక్కదారి పట్టించేందుకు అక్కడి పాలకవర్గ మేథావులు ముందుకు తెచ్చిన సరికొత్త ప్రచారదాడిలో అదొక అస్త్రం.అదే విధంగా అమెరికా స్కూళ్లలో చైనా ప్రవేశించి కమ్యూనిస్టు పాఠాలు చెబుతున్నదని ఆధారంలేని ఆరోపణలతో ఒక నివేదికను విడుదల చేశారు. ఈ రెండూ అక్కడి పాలకవర్గంలో ఉన్న చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకత, దాన్ని జనం మెదళ్లలోకి ఎక్కించే ప్రయత్నం కనిపిస్తున్నది.


విశ్లేషకుల కథన సారం ఇలా ఉంది. ” ప్రపంచ పెట్టుబడిదారీ విధానానికి కమ్యూనిస్టు సిద్దాంత మార్గదర్శకత్వంలో పని చేసే చైనా నుంచి ముప్పు తీవ్రం అవుతున్నది. అందువలన దానితో ఆర్థిక లావాదేవీలను పున: విశ్లేషణ చేసుకోవాల్సిన అత్యవసరం ఎన్నటి కంటే మరింత పెరిగింది. అమెరికా పెట్టుబడులతో అపార సంపదలను చైనా పోగేసుకుంది. మన స్వంత పెట్టుబడిదారీ వ్యవస్థను మన వ్యతిరేక ఆయుధంగా మార్చింది. పెన్షన్‌ నిధులు, ఇతర మార్గాల ద్వారా దాదాపు పది కోట్ల మంది అమెరికన్లు తమకు తెలియకుండానే తమను దెబ్బతీసే ఆర్థిక ప్రత్యర్ధి చైనాలో పెట్టుబడులు పెట్టారు.ప్రపంచాధిపత్యం కోసం చూస్తున్న దాని మిలిటరీ బలపడేందుకు అవకాశం కల్పించారు. ఆర్థిక సరళీకరణను ప్రారంభించిన 1978 నుంచి చైనా ఒక పద్దతి ప్రకారం పశ్చిమ దేశాల పెట్టుబడి మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంది. చైనా కమ్యూనిస్టు పార్టీపై అమెరికా పార్లమెంటు ఏర్పాటు చేసిన సెలెక్ట్‌ కమిటీ ముందు సాక్ష్యమిచ్చిన పెట్టుబడి మార్కెట్ల భద్రతా కమిషనర్‌ రోజర్‌ రాబిన్సన్‌ మాట్లాడుతూ పరాకుగా ఉన్న అమెరికా చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలో ఉన్న ఐదు వేల కంపెనీల్లో లక్షల కోట్ల డాలర్లును పెట్టుబడులుగా పెట్టేందుకు సాధారణ అమెరికన్లను అనుమతించింది. ప్రపంచమంతటి నుంచి చైనా వచ్చే పెట్టుబడుల్లో అరవైశాతం డాలర్లు అమెరికా వనరుల నుంచే ఉన్నాయి గనుక అవి నిలిచిపోతే అక్కడి ఆర్థికరంగం పూర్తిగా దెబ్బతిని చైనా ప్రభుత్వానికి ముప్పు ఏర్పడుతుంది.


పెట్టుబడులు పెట్టినందుకు దోహదం చేసిన బ్లాక్‌రాక్‌ వంటి అగ్రశ్రేణి ఆస్తుల నిర్వహణ సంస్థలు ఇప్పుడు సాకులు చెబుతున్నాయి.అమెరికా పర్యావరణ, సామాజిక, పాలన ప్రమాణాలను పక్కన పెట్టి పెట్టుబడులు పెట్టాయి. ఇలాంటి కంపెనీలు వాటిని గట్టిగా పాటించి ఉంటే చైనా కంపెనీలకు పెట్టుబడులు వెళ్లేవి కాదు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ పెట్టనన్ని పెట్టుబడులను బ్లాక్‌రాక్‌ కంపెనీ సిఇఓ లారీ ఫింక్‌ ప్రవహింపచేశాడు. పెట్టుబడి సంస్థలు చైనాలో పెట్టుబడులు పెడితే సంభవించే ఆపదల గురించి పట్టించుకోకపోగా పైకి కనిపించినంత చెడుగా చైనా సంస్థలు లేవని యుబిఎస్‌ గ్లోబల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ చెప్పింది. నిర్భంద శిబిరాలు, బలవంతంగా కార్మికులను తరలించే,మారణకాండ, చైనా మిలిటరీకి ఆధునిక ఆయుధాలను సరఫరా చేసేందుకు దోహదం చేసేవిగా చైనా కార్పొరేట్‌ కంపెనీలు ఉన్నాయి.ప్రపంచ ప్రజాస్వామిక ఆర్థిక వ్యవస్థలున్న దేశాలన్నీ చైనా సంస్థలతో చేతులు కలిపితే వచ్చే ముప్పును గ్రహిస్తున్నాయి. చైనా మీద ఆధారపడితే తలెత్తే ముప్పును తొలగించుకొనేందుకు, నూతన సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు జి7 దేశాల కూటమి పూనుకుంది. ఇది చాలదు, అమెరికా స్టాక్‌ ఎక్సేంజ్‌లలో ఉన్న చైనా కంపెనీలను జాబితా నుంచి తొలగించాలి, రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలి.చైనా కంపెనీలకు రుణాలు ఇచ్చే సంస్థలను నిషేధించాలి.డాలర్ల రూపంలో ఇస్తున్న చైనా ప్రభుత్వ బాండ్ల మీద నిషేధం విధించాలి. గతంలో సోవియట్‌ ముప్పును వమ్ము చేసేందుకు అనుసరించిన ఆర్థిక పద్దతులను ఇప్పుడు చైనా మీద అనుసరించాలి. మనం దీర్ఘకాలంగా ప్రేక్షకుల మాదిరి ఉన్నాం, మన పెట్టుబడిదారీ వ్యవస్థను నియంత్రించేందుకు ఇది సరైన తరుణం. ”


అమెరికా గడ్డ మీద, వెలుపలా అమెరికా మీద చైనా నిరంతర నిఘాను ఉపేక్షించరాదని ఆగస్టు మొదటి వారంలో జరిగిన పార్లమెంటు సెలెక్ట్‌ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ మైక్‌ గాలఘర్‌ డిమాండ్‌ చేశాడు. ఇప్పుడే మేలుకున్నామని కూడా అన్నాడు. దానిలో భాగంగా ప్రపంచమంతటా రహస్య పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసిందని ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.చైనాలో ప్రైవేటు కంపెనీలంటూ లేవు, ప్రతి ఒక్కరూ, ప్రతిదీ, ప్రతి సంస్థ షీ జింపింగ్‌ కోరుకున్నదాని ప్రకారమే ఉంటుందని గాలఘర్‌ ఆరోపించాడు.చైనాలో పెట్టుబడులపై పరిమితులను మరింతగా విస్తరించాలని జో బైడెన్‌న్ను గాలఘర్‌ కోరాడు. ఉత్తరువుల ద్వారా వాటిని వెంటనే అమల్లోకి తేవాలంటూ ఒక లేఖను కూడా రాశాడు. ప్రభుత్వ పెట్టుబడులకే పరిమితం గాకుండా ప్రైవేటు పెట్టుబడుల మీద ఆంక్షలు విధించాలని కోరాడు. చైనా మిలిటరీ కంపెనీలకు మన పెట్టుబడులు తరలటం అంటే మన నాశనానికి మనమే సహకరించినట్లు అవుతుందన్నాడు. చైనా బాండ్లు, కంపెనీల వాటాల్లో 1.1లక్షల కోట్ల డాలర్లు, ప్రైవేటు పెట్టుబడిదారులు 200బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొన్నారు. దీనిలో ఎక్కువ భాగం చైనా మిలిటరీతో సంబంధాలున్న కంపెనీలలో ఉందని ఆరోపించాడు. తైవాన్‌ విలీనం షీ జింపింగ్‌ జీవిత లక్ష్యమని అందుకు గాను సన్నాహాలకు గాను అవసరమైన సమాచారం మొత్తాన్ని సేకరిస్తున్నారని అన్నాడు. దాన్ని ఎదుర్కొనేందుకు ఇండో ఫసిఫిక్‌ ప్రాంతానికి తరలించేందుకు అవసరమైన మిలిటరీ, పరికరాలను సమీకరించే మన సామర్ధ్యాన్ని దెబ్బతీసేందుకు చైనా చూస్తున్నదని, చైనాతో ఘర్షణకు దిగాల్సి వస్తే మనం భూమ్యాకాశాలను కదిలించాల్సి ఉంటుందని,ఎంతో వినాశకరంగా ఉంటుందని అన్నాడు.అమెరికా నిషేధిత జాబితాలో ఉంచిన చైనా కంపెనీల్లో పెట్టుబడులు ఎందుకు పెట్టారంటూ బ్లాక్‌రాక్‌, ఎంఎస్‌సిఐ కంపెనీలకు సెలెక్ట్‌ కమిటీ అడిగిన సంజాయిషీకి తాము చట్ట ప్రకారమే తమ వాణిజ్య పద్దతుల్లో భాగంగానే పెట్టుబడులు పెట్టినట్లు ఆ కంపెనీలు చెప్పాయి.


ఇలా సాగిన విశ్లేషణలు, పార్లమెంటరీ కమిటీ చైనా మీద చేసిన విచారణ అంతా అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు, రాజకీయంగా ప్రపంచంలో తింటున్న ఎదురుదెబ్బలకు కారణం చైనా అని తమ జనాన్ని నమ్మించేందుకు, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ముందుకు తెచ్చిన కొత్త ప్రచార ఎత్తుగడ. గతంలో సోవియట్‌ యూనియన్‌ ఉన్నపుడు దానితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు. కమ్యూనిజం విస్తరణను అడ్డుకొనే పేరుతో ప్రచ్చన్న పోరు పేరుతో సాగించిన ప్రత్యక్ష ప్రచార దాడిలో భాగంగా సోషలిజం, కమ్యూనిజం వ్యతిరేకతను రెచ్చగొట్టారు. ఆ పోరులో విజయం సాధించినట్లు మూడు దశాబ్దాల క్రితం స్వయంగా ప్రకటించుకున్నారు. మరోవైపు చైనాలో పెట్టుబడులు పెట్టటంతో పాటు అక్కడి నుంచి భారీ ఎత్తున సరకులు దిగుమతి చేసుకున్నది. దాంతో అనేక మంది చైనా తమ ఉపాధిని హరించిందనే ప్రచారాన్ని అమెరికాలో పెద్ద ఎత్తున ప్రారంభించారు. అది అనేక మంది యువతలో సైద్ధాంతిక మధనాన్ని పెంచింది. సోషలిజమే మెరుగైనది, పెట్టుబడిదారీ విధానం విఫలమైంది అనే భావనలు పెరుగుతున్నాయి. అందువలన పాతబడిన కమ్యూనిస్టు వ్యతిరేక అస్త్రాన్ని ప్రధానంగా ప్రయోగిస్తే దశాబ్దాల తరబడి ఆ కమ్యూనిస్టు చైనాలో ఎందుకు పెట్టుబడులు పెట్టారు, ప్రతి వస్తువును అక్కడి నుంచి ఎందుకు దిగుమతులు చేసుకున్నారు, ఇప్పటికీ ఎందుకు కొనసాగిస్తున్నారు, చైనాతో తెగతెంపులు చేసుకోవటం లేదని ఎందుకు ప్రకటిస్తున్నారు అన్న ప్రశ్నలకు అమెరికా విధాన నిర్ణతల దగ్గర సమాధానం లేదు. అందుకే మనలను దెబ్బతీసేందుకు మన పెట్టుబడిదారీ వ్యవస్థనే చైనా అస్త్రంగా మార్చుకున్నదనే తర్కానికి నిలవని ప్రచారానికి పూనుకున్నారు. ఒకటి వాస్తవం, ఏ విధంగా చూసినా నేటి చైనా నాటి సోవియట్‌ కాదు.ఆర్థికంగా త్వరలో అమెరికాను అధిగమించనుంది.ప్రపంచీకరణ భావన, స్వేచ్చామార్కెట్‌ను ముందుకు తెచ్చింది అమెరికా తప్ప చైనా కాదు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని చైనా లబ్ది పొందిన మాట వాస్తవం. దివాలా కోరు విధానాలతో అమెరికా పెట్టుబడిదారీ విధానం విఫల బాటలో ఉంది.


అమెరికా స్కూళ్లలో పెద్ద ఎత్తున ప్రవేశిస్తున్న చైనా వాటిని కమ్యూనిస్టు ప్రచారానికి అడ్డాలుగా మారుస్తున్నదని విద్యా పరిరక్షక తలిదండ్రుల కమిటీ(పిడిఇ) పేరుతో ఉన్న సంస్థ తాజాగా ఒక నివేదికలో ఆరోపించింది. అమెరికాలో స్కూళ్లు పన్నెండవ తరగతి(మన దగ్గర ఇంటర్‌ మీడియెట్‌) వరకు బోధిస్తాయి. తమ దేశ తత్వవేత్త కన్ఫ్యూసియస్‌ పేరుతో వందకు పైగా కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో తరగతులను నిర్వహించేందుకు అమెరికా ప్రభుత్వ అనుమతుల మేరకే చైనా ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నది. నిజానికి అక్కడి సంస్థల సంఖ్యతో పోలిస్తే అసలు లెక్కలోకి రావు. ఈ పేరుతో అమెరికా సాంకేతిక పరిజ్ఞానాన్ని తస్కరించేందుకు, తమకు ఏజంట్లుగా పనిచేసే వారిని ఎంచుకొనే కేంద్రాలుగా మార్చుతున్నదంటూ ఆరోపిస్తూ ఇటీవల అమెరికా ఎఫ్‌బిఐ ఒక నివేదికను వెల్లడించింది. చైనా జాతీయ ఇంటిలిజెన్స్‌ చట్టంలో చైనా పౌరులు ఎక్కడ నివశిస్తున్నప్పటికీ తమ మాతృభూమి కోసం కళ్లు, చెవులుగా పని చేయాలని చెప్పిందని, అందువలన అమెరికాతో సహా విదేశాల్లో ఉన్న చైనా జాతీయులందరూ గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ గతేడాది సిఐఏ మాజీ అధికారి శామ్‌ ఫడీస్‌ ఒక తర్కాన్ని ముందుకు తెచ్చాడు. ఇదంతా తప్పుడు ప్రచారంలో భాగమే అన్నది స్పష్టం. అదే సూత్రం ప్రతి దేశ పౌరులకు వర్తిస్తుంది. అందరినీ అలాగే చూసేట్లైతే ఎవరూ వేరే దేశానికి వెళ్లే అవకాశం ఉండదు.


ఇతర దేశాలతో ఉన్న సంబంధాలను మెరుగుపరచుకొనేందుకు గాను ప్రతి దేశం అనేక చర్యలను తీసుకోవటం తెలిసిందే. అమెరికా స్కూళ్లలోని టీచర్లు, విద్యార్ధులతో చైనా వారు సంబంధాలు పెట్టుకుంటూ చైనా భాష, సాంస్కృతిక సంబంధాలు, విద్యార్ధి బృందాల మార్పిడి పేరుతో గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు పిడిఇ ” లిటిల్‌ రెడ్‌ క్లాస్‌ రూమ్స్‌” పేరుతో విడుదల చేసిన ఒక నివేదికలో ఆరోపించింది. ఇలాంటి స్కూళ్లు, కాలేజీలన్నీ అమెరికాలోని 20 మిలిటరీ కేంద్రాల చుట్టూ ఉన్నట్లు మరొక కథనాన్ని దానిలో పేర్కొన్నారు. నిజానికి ఇవేవీ అమెరికా ప్రభుత్వానికి తెలియకుండా జరిగే అవకాశం లేదు.ప్రపంచంలో ఏ మూలన చీమ చిటుక్కుమన్నా పసిగట్టే శక్తి ఉన్న అమెరికా సిఐఏ, ఎఫ్‌బిఐ, ఎన్‌ఐఏ వంటి సంస్థలకు వేళ్ల మీద లెక్కించదగిన ఆ సంస్థల్లోని కేంద్రాలను మూసి వేయించటం పెద్ద కష్టమేమీ కాదు. ఒక వేళ నిజమే అనుకుంటే ఆ పని చేయకుండా వాటిని అనుమతిస్తూనే మరో వైపు అనుమానాలు రేకెత్తించే ప్రచారానికి అవి తెరలేపుతున్నాయి. అలాంటి కేంద్రాలన్నీ గూఢచర్యానికి పాల్పడుతుంటే, అది వాస్తవమనుకుంటే అమెరికా సర్కార్‌ లేదా అక్కడి సంస్థలు మన దేశంతో సహా అనేక చోట్ల విద్యా సంస్థలతో సంబంధాలు, అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి, వారాలు , నెలల తరబడి మన వారిని అమెరికా ఆహ్వానిస్తున్నాయి. వాటన్నింటినీ సిఐఏ గూఢచార కేంద్రాలుగా పరిగణించాలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కాశ్మీరీ ఫైల్స్‌ వివేక్‌ అగ్నిహౌత్రికి ఆగ్రహం ! మణిపూరీ ఫైల్స్‌ మీద ఎదురుదాడి !!

06 Sunday Aug 2023

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Literature., NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Women

≈ Leave a comment

Tags

BJP, Kashmir Files, Mahashweta Jani, Manipur files, Narendra Modi Failures, Parul Khakhar, RSS, Saffron gang, Vivek agnihotri


ఎం కోటేశ్వరరావు


కాశ్మీరీ ఫైల్స్‌ సినిమాతో డబ్బుకు డబ్బు, కాషాయ దళాలను ఎంతగానో రంజింప చేసి వారి మద్దతు పొందిన వివేక్‌ రంజన్‌ అగ్నిహౌత్రిని మణిపూర్‌ ఫైల్స్‌ గురించి అడగ్గానే అగ్నిహౌత్ర అవధానులయ్యారు. అగ్నిహౌత్రి సంఘపరివార్‌ సభ్యుడా లేక అనేక మంది మాదిరి ముసుగులో ఉన్న అదే తెగ సినిమా రంగ పెద్దమనిషా అన్నది పక్కన పెడదాం. మణిపూరీ ఫైల్స్‌ సినిమా ఎందుకు తీయరు అని ప్రశ్నించిన వారి మీద నేను తప్ప వేరే మగాళ్లే లేరా అంటూ మండిపడ్డారు. ఎదురుదాడికి దిగారు. కాశ్మీరీ ఫైల్స్‌ సినిమా 2022లో ప్రపంచమంతటా 350 కోట్ల రూపాయలను వసూలు చేసి హిందీ సినీ రంగంలో ఒక రికార్డు నెలకొల్పింది. దాని కొనసాగింపుగా మరింతగా సొమ్ము చేసుకొనేందుకు, ప్రచార పర్వంలో భాగంగా కాశ్మీరీ ఫైల్స్‌ అన్‌రిపోర్టెడ్‌ పేరుతో అంటే వెలుగులోకి రాని కాశ్మీరి పండిట్ల ఉదంతాల పేరుతో ఒక సిరీస్‌ విడుదల చేయనున్నారు. తొలి భాగం ఆగస్టు 11న జీ5లో ప్రసారం కానుంది. తాము పరిశోధించిన దానిలో పది నుంచి ఇరవై శాతమే ఈ సిరీస్‌లో చూపనున్నామని, వాస్తవ గాధలను వీటిలో చూస్తారని, తమ పరిశోధన సారాన్ని కాశ్మీరీ ఫైల్స్‌ సినిమాగా తీశామని అగ్నిహౌత్రి చెప్పారు. ఇది రాజకీయ ప్రచారం కోసం అన్నది వేరే చెప్పనవసరం లేదు. కాశ్మీరీ పండిట్ల మీద జరిగిన దాడుల గురించి అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలేవీ దాచలేదు, వార్తల మీద ఆంక్షలు విధించలేదు. వాటిని అన్ని పార్టీలూ ఖండించాయి. నేడు మణిపూర్‌ ఉదంతాల మీద జరిగినట్లుగా పార్లమెంటు దద్దరిల్లలేదు. నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న విపి సింగ్‌ ప్రభుత్వానికి బిజెపి కూడా వెలుపలి నుంచి మద్దతు ఇచ్చింది. రాముడి రధ యాత్ర పేరుతో 1990 నవంబరు రెండున అయోధ్యకు చేరుకున్న కరసేవకులను నిరోధించేందుకు నాడు అధికారంలో ఉన్న ములాయం సింగ్‌ ప్రభుత్వం కాల్పులు జరపటానికి దారితీసిన పరిస్థితి తరువాత బిజెపి దానికి నిరసగా కేంద్రంలో విపి సింగ్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది తప్ప కాశ్మీరీ పండిట్ల మీద జరిగిన దాడులకు కాదు. మూడు దశాబ్దాల తరువాత నాటి ఉదంతాల పేరుతో సినిమా తీసిన వివేక్‌ అగ్నిహౌత్రి వర్తమాన మణిపూర్‌ ఫైల్స్‌ గురించి పరిశోధనా లేదు, సినిమా లేదు.


మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించి, అత్యాజరిపిన ఉదంతం ప్రపంచమంతటినీ కదిలించింది. వివేక్‌ అగ్నిహౌత్రి ఒక సంఘపరివార్‌ విధేయుడిగా స్పందించారు. ఆ ఉదంతాన్ని తక్కువ చేసి చూపేందుకు బిజెపి ఎత్తుగడనే ఆ పెద్దమనిషి కూడా అనుసరించి తన నిబద్దతలో ఎలాంటి సడలింపు లేదని ప్రదర్శించుకున్నారు. వెలుగులోకి రాని కాశ్మీరీ పండిట్ల ఉదంతాలు అనే సిరీస్‌ను విడుదల చేస్తున్నట్లు అగ్నిహౌత్రి ట్విటర్‌ ద్వారా, ఇతరంగా ప్రకటించారు. కాశ్మీరీ హిందువులను ఊచకోత కోస్తే భారత న్యాయవ్యవస్థ దాన్ని చూడకుండా, మౌనంగా నిస్సహాయంగా ఉందని ధ్వజమెత్తారు. మన రాజ్యాంగం వాగ్దానం చేసినట్లుగా కాశ్మీరీ హిందువుల జీవిత హక్కును రక్షించేందుకు తనంతట తానుగా స్పందించటంలో విఫలమైంది, ఇప్పటికీ విఫలమౌతూనే ఉంది అని ఆరోపించారు. మణిపూర్‌ ఉదంతాల మీద నెలల తరబడి మౌనంగా ఉన్న ప్రధాని మోడీ మీద అదే స్పందన ఎందుకు వెల్లడించలేదు ? నిజానికి అగ్నిహౌత్రి కడుపు మంట కాశ్మీరీ పండిట్ల మీద స్పందించలేదు అన్నదాని కంటే మణిపూర్‌ మీద నోరు విప్ప నోరు విప్ప అంటూ ప్రధాని నరేంద్రమోడీ నోటికి వేసుకున్న తాళాన్ని న్యాయవ్యవస్థ తీయించిందన్న దుగ్దను ఆ రూపంలో వెల్లడించుకున్నారు. సమయాన్ని వృధా చేయకండి మీరు దమ్మున్న మగాడే అయితే అక్కడికి వెళ్లండి, మణిపూర్‌ ఫైల్స్‌ సినిమా తీయండి అని దాని మీద ఒక ట్విటర్‌ సవాలు విసిరారు. ఒక ప్రముఖుడి నుంచి అలాంటి ట్వీట్‌ వెలువడితే వేరు. కానీ ఆ సాధారణ ట్వీట్‌ మీద స్పందించి మీకు నా మీద విశ్వాసం ఉన్నందుకు కృతజ్ఞతలు, కానీ నన్ను అన్ని సినిమాలూ తీయాలంటున్నారు దమ్మున్న వారు ఇంకెవరూ లేరా అని ఎదురుదాడికి దిగి అతి తెలివి ప్రదర్శించారు.


అంతకు ముందు వివేక్‌ అగ్నిహౌత్రి మణిపూర్‌ మీద ట్వీట్లు చేశారు, ఒక కవితను కూడా రాశారు. ఒక ట్వీట్‌లో ఇలా ఉంది. ” మణిపూర్‌ : మోప్లా, డైరెక్ట్‌ యాక్షన్‌ డే( ప్రత్యేక దేశంగా పాకిస్తాన్‌ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోకపోతే 1946 ఆగస్టు 11న ప్రత్యక్ష కార్యాచరణ దినాన్ని పాటిస్తామని ముస్లింలీగ్‌ నేత జిన్నా అదే ఏడాది జూలైలో చేసిన ప్రకటన), నౌఖాలీ, బంగ్లాదేశ్‌, పంజాబ్‌, కాశ్మీర్‌, బెంగాల్‌, కేరళ, అసోం, బస్తర్‌ ఇప్పుడు మణిపూర్‌…ప్రతిసారీ అంతిమంగా మన అమాయక తల్లులు, సోదరీమణులు అమానుష,ఆటవిక చర్యలకు బలౌతున్నారు. ఒక భారతీయుడిగా, ఒక పురుషుడిగా, ఒక మనిషిగా ప్రతిసారీ నా ధైర్యం చెదిరింది, నేను సిగ్గుపడ్డాను, నా చేతగాని తనానికి అపరాధన భావనతో ఉన్నా అని పేర్కొన్నారు. ఇక ఆ పెద్దమనిషి కవితా స్పందన గురించి చూద్దాం. ” ఓ మణిపూర్‌… నేను యత్నించా…నేను యత్నించా… కానీ విఫలమయ్యా……నా నైపుణితో ఇప్పుడు నేను చేయగలిగింది వారి విషాద గాధలను చెప్పటమే, కానీ అప్పటికి అది ఎంతో ఆలశ్యం అవుతుంది…… ఎంపిక చేసుకున్న, అతితో కూడిన పోటీ తత్వపు ఎన్నికల రాజకీయాలకు మనమందరం బాధితులం…..మనమందరం మత అతి బాధితులం….. మనమందరం ప్రమాదకర మీడియా బాధితులం…..మనం భారత పౌరులం, బాధితులం……..స్వేచ్ఛా భారతంలో జీవన హక్కులేదు, దాని గురించి మనమేమీ చేయలేం…… ఇది నేను కోరుకున్న స్వేచ్చ కాదు…. ఇలాంటి ప్రజాస్వామ్యం కాదు నేను కోరుకున్నది…… పరస్పరం కొట్టుకున్నవారి రక్తంతో ఒక అఖాతాన్ని మనతో ఏర్పాటు చేయిస్తే దానికి అర్దమే లేదు…..మనది ఒక విఫల సమాజం…. నా సోదరీమణులారా నేను విచారిస్తున్నాను…. నా తల్లులారా నేను విచారిస్తున్నాను…….భారత మాతా నేను విచారిస్తున్నాను.” ఇలా సాగింది ఆ కవిత.


ఇది చదివిన తరువాత ఎవరిలోనైనా తలెత్తే ప్రశ్న ఏమిటంటే దానిలో ఎక్కడైనా మణిపూర్‌ దురాగతానికి పాల్పడిన శక్తుల గురించి ఖండన ఉందా ? దాని మీద రెండు ఇంజన్ల పాలక పార్టీ, ప్రభుత్వాల తీరుతెన్నుల మీద అధిక్షేపణ ఎక్కడైనా ఉందా? మూడు దశాబ్దాల క్రితం జరిగిందని చెబుతున్న, అతిశయోక్తులతో కూడిన కాశ్మీరీ ఫైల్స్‌ సినిమాను తీశారు. ఇప్పుడు కానసాగింపుగా సిరీస్‌ను ఇప్పుడెందుకు తీస్తున్నట్లు ? మణిపూర్‌ గురించి తాను సినిమా తీసే సరికి ఎంతో ఆలశ్యం అవుతుందని చెప్పటాన్ని ఏమనాలి ? తప్పించుకొనే ఎత్తుగడ తప్ప ఇంకేమైనా ఉందా ? ఎంపిక చేసుకున్న ఎన్నికల రాజకీయాలని ఎత్తి చూపుతున్న పెద్దమనిషి వర్తమానాన్ని వదలి మూడు దశాబ్దాల నాటి సంఘటనలను ఇప్పుడెందుకు ”ఎంపిక” చేసుకున్నట్లు ? అవి జరిగినపుడు నా వయస్సు 17, అప్పుడు నాకు తెలియదు అని చెప్పవచ్చు. ఇప్పుడు 49 సంవత్సరాల పరిణితి వచ్చింది కదా పైన చెప్పిన కవితలోని అంశాలతో వర్తమాన భారతమాత ఫైల్స్‌ ఎందుకు తీయలేదు ? ఐరోపా పార్లమెంటుతో సహా ప్రపంచమంతా చర్చిస్తున్నప్పటికీ మణిపూర్‌ ఫైల్స్‌కు అంత సీన్‌ లేదు, గిరిజనుల జీవితాలు అంత విలువైనవి కాదు, వారికి కాశ్మీరీ పండిట్లకు ఉన్నంత పలుకుబడి వారికి లేదు, కాశ్మీరీ ఫైల్స్‌ మాదిరి సంఘపరివారం ప్రోత్సహించదు, డబ్బురాదు అనుకుంటున్నారా ? లేక అన్నింటికీ మించి అక్కడ అసలు కారకులు సంఘపరివారం అని చెప్పాల్సి వస్తుందనా ? బేటీ బచావో అని చెప్పిన పెద్దమనిషి మణిపూర్‌ బేటీల గురించి తనంతట తాను ముందుకు వచ్చి దేవాలయం అని వర్ణించిన పార్లమెంటులో మాట్లాడకుండా భవనపు మెట్లు, గోడల ముందు మొక్కుబడి ప్రకటన చేసిన ప్రధాని నరేంద్రమోడీ ఫైల్స్‌ను విప్పాల్సి ఉంటుందనా ?


గతంలో శవ గంగా వాహిని పేరుతో దిక్కులేని కరోనా మృతుల కళేబరాలను గంగానదిలో నెట్టివేసి చేతులు దులుపుకున్న యోగి ఆదిత్యనాధ్‌ ఏలుబడి నిర్వాకం మీద, సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ ప్రతినిధిగా ఉన్న వారణాసి వద్ద ప్రవహించే గంగను పవిత్ర నదిగా భావించే గుజరాతీ కవయిత్రి పారుల్‌ కక్కర్‌ రాసిన ఆగ్రహ, నిరసన కవిత మీద హిందూత్వశక్తులు విపరీతంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వివేక్‌ అగ్నిహౌత్రి మణిపూర్‌ ఫైల్స్‌ సినిమా తీస్తే అదే దాడి అతని మీద కూడా జరుగుతుంది. దేశంలో ఉన్న వర్తమాన స్థితి అది. అందుకే చచ్చిన చేప వాలు కథనాన్ని ఎంచుకున్నారన్నది స్పష్టం.మణిపూర్‌ మీద అల్లిన కవిత అలాంటిదే. దానితో సంఘపరివారానికి, పాలక బిజెపి నేతలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మానవాళి మీద జరుగుతున్న దోపిడీ, అణచివేత గురించి చరిత్రలో అనేక మంది చెప్పారు. దాన్ని తొలగించే కార్యాచరణను కూడా ప్రతిపాదించటమే కారల్‌ మార్క్స్‌, ఎంగెల్స్‌ ప్రత్యేకత. విఫల సమాజం గురించి చెప్పిన వారి కోవలో వివేక్‌ అగ్నిహౌత్రి మొదటి వారూ కాదు చివరి వారూ కాదు.


గంగ గురించి, దాని మురికి గురించి అనేక మంది రాశారు. ఇప్పుడు ఎవరైనా రాస్తే కొత్త దనం ఏమిటన్నది ప్రశ్న. ప్రధాన స్రవంతి మీడియా గంగలో కొట్టుకు వస్తున్న కరోనా శవాల గురించి అనివార్యమై పోటీ కారణంగా వార్తలు, చిత్రాలను ఇవ్వాల్సి వచ్చి ఇచ్చింది తప్ప ఆ నిర్వాకానికి కారణభూతమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నిజానికి పారుల్‌ ఖక్కర్‌ కూడా రాజకీయ కోణంతో రాయలేదు. ఒక హిందువుగా గంగానదిని పవిత్రమైనదిగా భావించే కోవకు చెందిన సామాన్యురాలు ఆమె. కొట్టుకు వస్తున్న శవాల వార్తలు, వాటిని కుక్కలు పీక్కు తింటున్న దశ్యాలను చూసిన తరువాత అలాంటి పవిత్ర భావనలను కుదిపివేయటంతో తట్టుకోలేక వెల్లడించిన స్పందన తప్ప మరొకటి కాదు. అలాంటి స్పందన కూడా వివేక్‌ అగ్నిహౌత్రిలో కనిపించలేదు. ఆమె కవితను మరోసారి ఇక్కడ చూద్దాం.అనువాదం : రాఘవశర్మ

శవవాహిని గంగ
భయపడకు..ఆనందపడిపో…ఒకే గొంతుతో శవాలు మాట్లాడుతాయి….ఓ రాజా..నీ రామ రాజ్యంలో శవాలు గంగానదిలో ప్రవహించడం చూశాం….ఓ రాజా..అడవి అంతా బూడిదయ్యింది,ఆనవాళ్ళు లేవు, అంతా శ్మశానమైపోయింది,…..ఓ రాజా..బతికించే వాళ్ళు లేరు,…..శవాలను మోసేవాళ్ళూ కనిపించడం లేదు,…..ధుఃఖితులు మాత్రం మిగిలారు……అంతా కోల్పోయి మిగిలాం…..మాటలు లేక బరువెక్కిన మా హదయాలు శోకగీతాలైనాయి…..ప్రతి ఇంటిలో మత్యుదేవత ఎగిసిపడుతూ తాండవమాడుతోంది……ఓ రాజా..నీ రామ రాజ్యంలో శవ గంగా ప్రవాహమైంది……ఓ రాజా..కరిగిపోతున్న పొగగొట్టాలు కదిలిపోతున్నాయి, వైరస్‌ మమ్మల్ని కబళించేస్తోంది……ఓ రాజా.. మా గాజులు పగిలిపోయాయి, భారమైన మా హదయాలు ముక్కలయ్యాయి……అతను ఫిడేలు వాయిస్తున్నప్పుడు మా నగరం కాలిపోతోంది…..బిల్లా రంగాల బరిసెలు రక్తదప్పిక గొన్నాయి….. రాజా..నీ రామ రాజ్యంలో శవ గంగా ప్రవాహమైంది……ఓ రాజా..నీవు మెరిసిపోతున్నట్టు, మండుతున్న కొలిమి లాగా నీ దుస్తులు తళుక్కుమనడం లేదు…..ఓ రాజా..ఈ నగరమంతా చివరిగా నీ ముఖాన్ని చూస్తున్నాయి…..ఇక పరిమితులు, మినహాయింపులు లేవు నీ దమ్ము చూపించు,…..రా..బయిటికి రా.. గట్టిగా చెప్పు, పెద్దగా అరువు,……దిగంబర రాజు అవిటివాడు, బలహీనుడు……ఇక నీవు ఏ మాత్రం మంచివాడిగా ఉండలేనని చెప్పు……కోపంతో ఊగిపోతున్న నగరం మంటలు ఎగిసిపడుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి…..,ఓ రాజా.. నీ రామరాజ్యంలో శవగంగా ప్రవాహాన్ని చూశావా?


ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ మణిపూర్‌ ఉదంతం మీద దాల్చిన మౌనం, అక్కడి మానవతుల మీద జరిపిన దుర్మార్గ పూర్వరంగంలో మరో గుజరాతీ రచయిత్రి మహాస్వేతా జానీ స్పందించారు. ఆ ఉదంతాలు గతంలో జరిగిన వాటి కొనసాగింపే అన్న అగ్నిహౌత్రకు, ఇక్కడ అలాంటివి ఎన్నో జరిగాయన్న మణిపూర్‌ సిఎం బిరేన్‌ సింగ్‌కూ తేడా ఏముంది ? మహిళలు, వారి శరీర భాగాల మీద మనువాదుల భావజాలాన్ని, అత్యాచారాన్ని ఆయుధంగా చేసుకొని దాడులు చేస్తున్న వారిని నిరసిస్తూ మణిపూర్‌ ఉదంతం మీద వెల్లడించిన మహాస్వేతా జానీ రచన ఇది. ఇతర రాష్ట్రాలలోని అనేక మంది కవులు, కవయిత్రులు స్పందించటం వేరు. గుజరాత్‌కు చెందిన వారు తమ మీద పెద్ద ఎత్తున కాషాయదళ దాడి జరుగుతుందని తెలిసినా గళం విప్పటం, అది కూడా ప్రధాని నరేంద్రమోడీ తీరు తెన్నుల నేపధ్యంలో అన్నది గమనించాలి. ఆ రచన ఇలా సాగింది.సంఘపరివార్‌ నీడలో జీవిస్తున్న వివేక్‌ అగ్నిహౌత్రి స్పందనకు దీనికి ఉన్న తేడాను వేరే చెప్పాల్సిన పనిలేదు.


ఇటీవల కామన్‌ కాజ్‌, లోకనీతి, సిఎస్‌డిఎస్‌ సంస్థలు గుజరాత్‌లో ఉన్న పరిస్థితి గురించి ఒక సర్వే చేశాయి. సామాజిక మాధ్యమంలో ఒక రాజకీయ లేదా సామాజిక అంశం మీద ప్రతికూలంగా స్పందిస్తే దాడికి దిగుతున్నవారిని చూసి తాము చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడుతున్నట్లు సర్వేలో మూడింట రెండు వంతుల మంది చెప్పారని తేలింది. వారిలో మూడో వంతు మంది తీవ్రంగా భయపడుతున్నట్లు, తమ ఫోన్ల మీద నిఘాఉన్నట్లు చెప్పారట. ఆ సర్వేలో లోకనీతి ప్రతినిధిగా ఉన్న మహాశ్వేతా జానీ ఆ తరువాతే మణిపూర్‌ ఉదంతం గురించి గుజరాతీ భాషలో ఒక కవితను రాశారు. దాన్ని సలీల్‌ త్రిపాఠీ ఆంగ్లీకరించారు. అది ఇలా సాగింది.

నేను
భగరంధ్రము…..నేను ఒక యుద్ధ క్షేత్రాన్ని కాదు……లేదా ఏ విశ్వాసాన్ని రక్షించేదాన్ని కాదు…..లేదా ఏ సంస్మృతినీ మోసేదాన్ని కాదు…..లేదా పవిత్రతవైపు నడిపించే మార్గాన్ని కాదు……లేదా ఏ సమాజపు సొత్తునూ కాదు…..లేదా బానిసత్వానికి దారి తీసే మార్గాన్ని కాదు….లేదా రక్త ప్రవాహాన్ని కాదు….లేదా స్త్రీత్వ సారాన్ని కాదు……కచ్చితంగా చెబుతున్నా భూమికి భారాన్ని కాదు……కానీ……ఆమె కోరుకుంటే…..
తరువాత…నేను …..ఒక నవసృష్టికి సారధిని అవుతా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

రానున్నది రోబోట్లు, కోబోట్ల యుగం !

02 Wednesday Aug 2023

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Education, employees, Europe, Germany, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Science, UK, Uncategorized, USA

≈ 1 Comment

Tags

China, Cobots, robotics, Robots, Robots vs. Cobots


ఎం కోటేశ్వరరావు


ఒక నాడు కంప్యూటర్ల ప్రవేశం, వినియోగం గురించి అనుకూల వ్యతిరేక వాదనలు జరిగినట్లుగానే ఇప్పుడు ప్రపంచంలో రోబోట్లు, కోబోట్ల గురించి మాట్లాడుతున్నారు. మానవులతో పని లేకుండా ప్రోగ్రామ్‌ చేసి వదిలితే వాటంతట అవే పని చేసేవి రోబోట్లు, మనుషులు పని చేయించేవి కోబోట్లు. రెండూ ఉత్పత్తిని పెంచేవే. ఎవరు వద్దన్నా కద్దన్నా వచ్చే రోజులు వాటివే. అంతర్జాతీయ రోబోటిక్స్‌ ఫెడరేషన్‌ వెల్లడించిన తాజా అధ్యయనం ప్రకారం చైనా పెద్ద మొత్తంలో రోబోట్ల మీద పెట్టుబడి పెడుతోంది. ప్రతి పదివేల మంది కార్మికులకు అక్కడ ప్రస్తుతం 322 రోబోట్లు ఉన్నాయి. దీన్ని రోబోట్ల సాంద్రతగా పరిగణిస్తున్నారు. ఉత్పాదక రంగ పరిశ్రమల్లో 2021 సమాచారం ప్రకారం ప్రపంచ సగటు 141రోబోలు ఉన్నాయి. దేశాల వారీగా దక్షిణ కొరియా 1,000, సింగపూర్‌ 670, జపాన్‌ 399, జర్మనీ 397, చైనా 322, స్వీడన్‌ 321, చైనీస్‌ హాంకాంగ్‌ 304, చైనీస్‌ తైవాన్‌ 276, అమెరికా 274, స్లోవేనియా 249తో తొలి పది స్థానాల్లో ఉన్నాయి. గతంలో వ్యవసాయం నుంచి పరిశ్రమలకు మారినపుడు, 1980వ దశకంలో వచ్చిన కంప్యూటర్ల తరువాత పరిస్థితులకు అనుగుణంగా కొత్త ఉపాధి దొరికినట్లే రోబోలు వచ్చినా కొత్త అవకాశాలు వస్తాయని సమర్దకులు చెబుతున్నారు. కార్మికుల స్థానంలో గతంలో యంత్రాలు వచ్చినా వాటిని నడిపేందుకు కార్మికులు కావాల్సి వచ్చింది. ఇప్పుడు రోబోలకు ఎవరితోనూ అవసరం ఉండదు.అందువలన అంత తేలిక కాదు అంటున్నారు మరికొందరు.


ప్రపంచ పరిణామాలను చూస్తున్నపుడు పెద్ద మొత్తంలో భారీ పరిశ్రమలను నిర్వహించేవారు లాభాలు ఎక్కువగా ఉంటాయి గనుక రోబోట్ల మీద ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. చిన్న సంస్థలు కోబోటిక్స్‌ వైపు మొగ్గు చూపుతున్నాయి. మరింత ఆధునిక రోబోలను రూపొందించేందుకు పరిశోధన- అభివృద్ధికి దేశాలూ, సంస్థలు కూడా భారీ మొత్తాలను వెచ్చిస్తున్నాయి. రోబో రంగంలో ప్రపంచ అగ్రగామిగా మారే లక్ష్యంతో చైనా 2021 డిసెంబరు 21న పద్నాలుగవ పంచవర్ష ప్రణాళికను ప్రకటించింది. ఐదు సంవత్సరాల్లో ఎనిమిది కీలక పరిశ్రమలను రోబోట్లతో నింపాలని పేర్కొన్నారు.” తెలివైన రోబో ” ను ఆవిష్కరించేందుకు 2022 ఏప్రిల్‌ 23న 4.35 కోట్ల డాలర్లతో పరిశోధనకు శ్రీకారం చుట్టారు.2018లో ప్రపంచంలో చైనా 20వ స్థానంలో ఉండగా మూడు సంవత్సరాల్లో ఐదవ స్థానానికి ఎదిగింది. నూతన రోబోట్‌ వ్యూహం పేరుతో జపాన్‌ 93 కోట్ల డాలర్లతో నూతన ఆవిష్కరణలతో తమ దేశాన్ని ప్రపంచ రోబో హబ్‌గా మార్చేందుకు పూనుకుంది. స్వంతంగా వాహనాలను నడిపే రోబోలతో సహా ఇతర ఆధునిక ఆవిష్కరణలకు నిధులు వెచ్చిస్తున్నది. పారిశ్రామిక రోబోల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జపాన్‌ 2021లో ప్రపంచానికి 45శాతం సరఫరా చేసింది.
నాలుగవ తరం పారిశ్రామిక విప్లవానికి అవసరమైన రోబోలను అందించేందుకు దక్షిణ కొరియా 2022వ సంవత్సరానికే 17.25 కోట్ల డాలర్లను కేటాయించింది. శాస్త్ర, సాంకేతిక పరిశోధనలకు 2021 నుంచి 2027వరకు 9.43 కోట్ల డాలర్లను ఐరోపా సమాఖ్య వెచ్చించనుంది. 2021-22లో రోబో సంబంధిత కార్యక్రమానికి 19.85 కోట్ల డాలర్లను కేటాయించింది. హైటెక్‌ వ్యూహం 2025 పేరుతో జర్మనీ పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. ఏటా 6.9 కోట్ల డాలర్లను 2026 వరకు ఖర్చు చేస్తుంది. జాతీయ రోబోటిక్‌ చొరవ(ఎన్‌ఆర్‌ఐ 3.0) పేరుతో అమెరికా కూడా 2021లో 1.4 కోట్ల డాలర్లతో నవీకరణకు పూనుకుంది. అంతరిక్షంలో పరిశోధనలకు అవసరమైన రోబోలను రూపొందించటం కూడా దీనిలో ఉంది. రోబో సాంద్రతలో వెనుకబడ కూడదని అది భావిస్తున్నది.


రానున్న రోజుల్లో పారిశ్రామిక ఉత్పత్తి, అంతరిక్షం, వైద్యం మొదలు అనేక రంగాల్లో ముందుండేందుకు ప్రపంచ దేశాలన్నీ పరుగులు పెడుతున్నాయి.కృత్రిమ మేథలో ఎవరికి వారు పైచేయి సాధించాలని చూస్తున్నారు. వైద్యం వంటి రంగాలలో రోబోలతో మరింత మెరుగైన సేవలను అందించవచ్చుగానీ పారిశ్రామిక రంగంలో వీటి ప్రవేశంతో వేతనాల తగ్గుదల, నిరుద్యోగం పెరుగుతుందనే అభిప్రాయాలతో పాటు దీర్ఘకాలంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని చెప్పేవారు కూడా ఉన్నారు.చైనాలో జరిగిన పరిశోధనలో పారిశ్రామిక రోబోలు ప్రతికూల ప్రభావం చూపుతాయని తేలిందని కొందరు ఉటంకిస్తున్నారు.2016లో ప్రచురితమైన ఒక పత్రం ప్రకారం యాంత్రీకరణ వలన 77శాతం మంది ఉపాధికి గండిపడుతుందని పేర్కొన్నారు. దానికి ఫాక్స్‌కాన్‌ కంపెనీని ఉదహరించారు. 2020నాటికి 30శాతం ఆటోమేషన్‌ చేసేందుకు గాను 2012-16 సంవత్సరాల్లో నాలుగు లక్షల ఉద్యోగాలను రోబోలతో నింపారు. అన్నింటా అదే జరుగుతుందని చెప్పలేము. గంటలవారీ చెల్లించే వేతనాలు తొమ్మిదిశాతం తగ్గినట్లు కూడా తేలింది. కార్మికుల పని గంటలు కూడా పెరిగాయి. మెకెన్సీ గ్లోబల్‌ సంస్థ 2017లో వెల్లడించిన నివేదిక ప్రకారం 2030 నాటికి ప్రపంచంలో ఐదో వంతు అంటే 80 కోట్ల ఉద్యోగాలు రద్దుకానున్నట్లు అంచనా వేశారు.నలభై ఆరు దేశాల్లోని పరిస్థితిని విశ్లేషించారు. ధనిక దేశాల్లో యాంత్రీకరణ మరింత ఎక్కువగా ఉంటుంది కనుక నిధులు కూడా ఎక్కువగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుందని, పేద దేశాల దగ్గర డబ్బు ఉండదు కనుక వాటి మీద ప్రభావం తక్కువేనని కూడా పేర్కొన్నది. యాంత్రీకరణతో మెషిన్‌ ఆపరేటర్లు, ఆహార కార్మికులు, ఆఫీసు సిబ్బంది, అకౌంటెంట్లు ఎక్కువగా ప్రభావితులౌతారు. భారత్‌లో తొమ్మిది శాతం ఉద్యోగాలను నూతన సాంకేతిక యంత్రాలతో నింపుతారని మెకెన్సీ పేర్కొన్నది. వైద్యులు, లాయర్లు, బార్లలో పనిచేసే వారు, తక్కువ వేతనాలతో పనిచేసే గార్డెనర్లు, ప్లంబర్లు, సంరక్షణ సిబ్బంది మీద పెద్దగా ప్రభావం ఉండదు. తక్కువ చదువుకున్నవారికి ఉపాధి తగ్గుతుంది, అభివృద్ది చెందిన దేశాలలో విశ్వవిద్యాలయాల చదువు అవసరాలు పెరుగుతాయి.అమెరికాలో 2030 నాటికి 3.9 నుంచి 7.3 కోట్ల వరకు ఉద్యోగాలు రద్దవుతాయని, ఉపాధి కోల్పోయే రెండు కోట్ల మందిని ఇతర పరిశ్రమల్లోకి సర్దుబాటు చేయవచ్చని, బ్రిటన్‌లో 20శాతం ఉద్యోగాలను రోబోలతో నింపుతారని మెకెన్సీ పేర్కొన్నది.


అమెరికాలో రోబోల ప్రవేశం గురించి జరిగిన పరిశోధనలో ప్రతి 1000 మంది కార్మికులకు ఒక రోబోను ఏర్పాటు చేస్తే 0.42 శాతం వేతనాలు తగ్గుతాయని, ఉపాధి జనాభా దామాషాలో 0.2శాతం తగ్గుతుందని అంచనా వేశారు.ప్రదేశాలను బట్టి ఇవి మారతాయి. మరొక రోబోను తోడు చేస్తే ఆరుగురికి ఉపాధి ఉండదు. వెల్డింగ్‌, పెయింటింగ్‌, పాకింగ్‌ వంటి వాటిని పూర్తిగా ఆటోమేషన్‌ చేయవచ్చు. 1993-2007 కాలంలో అమెరికాలో పారిశ్రామిక రోబోట్లు నాలుగు రెట్లు పెరిగాయి.యాంత్రీకరణ కంటే ఇవి ఎక్కువ మంది ఉపాధి పోగొట్టినట్లు తేలింది. ఆటోమోటివ్‌ పరిశ్రమలో ఎక్కువగా రోబోట్లు వస్తున్నాయి.ఎలక్ట్రానిక్స్‌లో 15,కెమికల్స్‌లో 10శాతం రోబోట్లను పెట్టగా ఆటో పరిశ్రమలో 38శాతం ఏర్పాటు చేశారు. పెట్టుబడిదారీ దేశాల్లో కార్పొరేట్ల లాభాల ప్రాతిపదికనే రోబోలను ఏర్పాటు చేస్తే చైనాలో ఎందుకు వేగంగా ప్రవేశపెడుతున్నారనే ప్రశ్న తలెత్తవచ్చు. అమెరికా, ఐరోపా ధనిక దేశాల్లో జనాభా తక్కువ, ఉత్పత్తి ఎక్కువ గనుక లాభాల కోసం చేస్తే చైనాలో 140 కోట్ల జనాభా వినియోగం కోసం ఉత్పత్తి, సేవలను ఎంతగానో పెంచాల్సిన అవసరం ఉంది. పెట్టుబడిదారీ దేశాల్లో లాభం కొన్ని సంస్థల చేతుల్లో చేరుతుంది, చైనాలో ఎక్కువ భాగం సమాజపరం అవుతుంది. ఐరోపా, జపాన్‌ మాదిరి చైనాలో సగటు జీవిత కాలం పెరగటం, పిల్లల్ని కనటం తగ్గింది కనుక రానున్న కాలంలో కార్మికులకు కొరత ఏర్పడనుందని అక్కడి నిపుణులు అంచనా వేశారు. ఆ పరిణామం పశ్చిమ ఐరోపా దేశాల్లో చూస్తున్నదే. ఈ కారణంగా కూడా చైనా రోబోట్లను ప్రవేశపెడుతున్నది. చైనాలో గత దశాబ్దిలో 50లక్షల జనాభా తగ్గింది. సామర్ధ్యపెంపుదలకు, డ్రైవర్లతో పని లేని కార్లు, రోబోలతో నడిచే గోదాముల వంటి వాటి ఏర్పాటుకు అనేక పరిశోధనలు చేస్తున్నారు. పది సంవత్సరాల క్రితం ఫైనాన్సియల్‌ రంగంలో పని చేసే ఒక కార్మికుడి ఉత్పాదకత ఐరోపాతో పోల్చితే చైనాలో 20శాతం ఉంది, తరువాత 40,50 శాతం వరకు పెరిగినప్పటికీ ఇంకా చాలా తేడా ఉంది. అందువలన వాటితో పోటీ పడాలంటే తగిన మార్పులు అవసరం అని భావిస్తున్నారు. మన దేశంలో కారు డ్రైవర్లకు తక్కువ వేతనాలకు దొరుకుతున్నారు గానీ ఐరోపాలో, అమెరికాలో అలా దొరకరు. అందుకే డ్రైవర్లతో పనిలేని కార్ల గురించి పరిశోధనకు తెరతీశారు.రోబో, యాంత్రీకరణ కారణంగా చైనాలో 2018-30 మధ్య 30శాతం మంది కార్మికులు ఒక పని నుంచి మరొకదానికి మారాల్సి ఉంటుందని మెకెన్సీ సంస్థ అంచనా వేసింది. ఇది అక్కడి ప్రభుత్వం, పౌరులకూ పెద్ద సవాలే అనటంలో సందేహం లేదు. దాన్ని అధిగమించేందుకు చైనా సన్నద్దం అవుతున్నది.


చైనాలో రోబోట్ల ప్రవేశం వలన కలిగే ప్రతికూల పర్యవసానాలు రానున్న రెండు దశాబ్దాల్లో కనిపిస్తాయని కొందరు చెబుతున్నారు. కృత్రిమ మేథ, రోబోట్ల వలన రెండు దశాబ్దాల్లో 26శాతం మంది వేరే ఉపాధి చూసుకోవాల్సి వుంటుందని ప్రైస్‌వాటర్‌ కూపర్‌ హౌస్‌ అంచనా వేసింది. దీనికీ మెకెన్సీ అంచనాకు చాలా తేడా ఉంది. కొన్ని పోవటం, కొత్త ఉపాధి రావటం ఏతా వాతా వచ్చే రెండు దశాబ్దాల్లో నికరంగా పన్నెండు శాతం ఉపాధి పెరుగుతుందని కూడా ప్రైస్‌వాటర్‌ చెప్పింది.2017-37 మధ్య సేవారంగంలో 9.7 కోట్లు, నిర్మాణ రంగంలో 1.4 కోట్లు, పరిశ్రమల్లో 40లక్షల మందికి ఉపాధి పెరిగితే వ్యవసాయంలో 2.2 కోట్లు తగ్గితే మొత్తంగా 9.3 కోట్లు పెరుగుతాయని అంచనా వేసింది. అక్కడ ఉన్నది ప్రజానుకూల సోషలిస్టు ప్రభుత్వం గనుక వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తగిన సర్దుబాటు చేస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ఇదంతా దానికంతటికి అదే జరుగుతుందని ఎవరూ భావించనవసరం లేదు. ఎదురవుతున్న అనేక సవాళ్లను అధిగమించిన చైనా గత చరిత్రను బట్టి ఇలా చెప్పవచ్చు. జనానికి పని కల్పించి ఉత్పత్తి పెంచి ఎగుమతులు చేసి ఎంతో ప్రగతి సాధించిన చైనాలో మాదిరి ఇతర దేశాల్లో కార్మికుల వేతనాలు పెరగలేదు. ఒకనాడు తక్కువగా ఉన్న కారణంగా అనేక దేశాలు తమ పెట్టుబడులతో అక్కడకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వేతనాలు పెంచిన కారణంగా ఆశించిన మేర లాభాలు రావటం లేదని కొన్ని సంస్థలు అక్కడి నుంచి వెనక్కు పోతున్నాయి. ఎగుమతుల మీద ఎల్లకాలం ఆధారపడటం సాధ్యం కాదని గ్రహించిన కారణంగానే తమ జనాల కొనుగోలు శక్తిని పెంచేందుకు వేతన పెంపుదల వంటి చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. నూతన ఆవిష్కరణలతో ఉత్పత్తి పెరిగితే ఆ మేరకు మానవ శ్రమ పని గంటలను తగ్గించి అందరికీ ఉపాధి కల్పించటం, సంపదల పంపిణీతో జనం అవసరాలను తీర్చటం వంటి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందువలన ఈ నూతన సవాలును ప్రజల పట్ల బాధ్యత కలిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ అధిగమించటం ఖాయం, అయితే ఎలా పరిష్కరిస్తుంది అన్నది ఆసక్తికరం, ఇదే సమస్యను ఎదుర్కొనే పెట్టుబడిదారీ దేశాలు ఎలా పని చేసేది చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రధాని నరేంద్రమోడీకి ఒక బహిరంగ లేఖ : ఆవు పేడ కాదు, కావాల్సింది సెమీ కండక్టర్ల పరిశోధన !

31 Monday Jul 2023

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Europe, Germany, History, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Science, UK, USA

≈ Leave a comment

Tags

America's tech war with China, India’s R&D, Narendra Modi, Narendra Modi Failures, R&D investment, Research on cow dung, Semicon India 2023, Semiconductor


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ గారికి,
అయ్యా ప్రతి నెలా మీ మన్‌కీ బాత్‌ అంశాలను చదివేవారిలో నేను ఒకరిని.ఒక జర్నలిస్టుగా జన్‌కీ బాత్‌లో ఉన్న కొన్ని ంటిని ఈ బహిరంగ లేఖ ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాను. జూలై 28-30 తేదీలలో గుజరాత్‌ రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో తమరు సెమికాన్‌ ఇండియా 2023 రెండవ వార్షిక సమావేశాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా దేశమంతటా పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు కూడా జారీ చేశారు. దేశాన్ని సెమీకండక్టర్ల కేంద్రంగా మార్చుతామని, మూడు వందల కాలేజీల్లో సెమికండక్టర్‌ కోర్సులను ప్రవేశపెడతామని తమరు ప్రకటించటం సంతోషం. గతంలో దేశంలో జరిగిన అనర్ధాలకు, వెనుకబడి ఉండటానికి,మనకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం రాకపోవటానికి నెహ్రూనే కారణం అని బిజెపి, దాని మాతృసంస్థ సంఘపరివారం ఠకీమని సమాధానం చెబుతుంది. సెమికండక్టర్ల రంగంలో వెనుకబడటానికి కూడా నెహ్రూనే నిందిస్తారా ?


అన్నీ మీరే చేశారు అని మా తెలుగు సినిమాలో ఒక పాత్ర తండ్రిని తప్పుపడుతుంది. అలాగే అన్నీ ఆ నెహ్రూ చేశారనే కాసేపు అనుకుందాం.ఆయన అనుసరించిన విధానాల నుంచి కాంగ్రెస్‌ 1990దశకంలోనే నూతన ఆర్ధిక విధానాల పేరుతో వైదొలిగిందని మీకు తెలియంది కాదు. వాటినే మీరు అమలు జరుపుతున్నారు తప్ప కొత్త విధానాలు కాదు, ఎందుకంటే వాటిని మన మీద ప్రపంచ బాంకు, ఐఎంఎఫ్‌ రుద్దింది. గత పది సంవత్సరాలలో మీకు పూర్తి అధికారం ఉన్నప్పటికీ మీరు అంగీకరించినా లేకున్నా అనేక రంగాలలో వైఫల్యబాటలోనే దేశం ఉండటానికి కారణం ఆ విఫల విధానాలనే మరింత వేగంగా అమలు జరపటమే. అరిగిపోయిన రికార్డు అంటే ఇప్పటివారికి తెలియదు కనుక అన్నీ నెహ్రూనే చేశారు అనే పాచిపాట ఇంకా ఎంతకాలం పాడాలి అని మీ భక్తులు, జనం నుంచి ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది. మీరు చెప్పిన మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, దేశమంతటా గుజరాత్‌ నమూనా అభివృద్ధి వంటి విఫల నినాదాలను చూసిన తరువాత ఎన్నికల కోసం ఆడుతున్న ఆటలో భాగం ఇదని అనేక మంది భావిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి ఇచ్చిన నినాదం, చెప్పిన మాట మరోసారి మీ నోటి వెంట రాదన్నది స్పష్టమే. మీ శైలి అనితరసాధ్యం. గతంలో అమెరికా, పూర్వపు సోవియట్‌ మధ్య ప్రచ్చన్న పోరులో అణ్వాయుధాలు కేంద్ర స్థానంలో ఉంటే ఇప్పుడు అమెరికా, చైనా మధó్య తలెత్తిన పోరులో సెమీకండక్టర్‌లు ఉన్నాయి.ఆయుధాలలో కూడా ఇవి కీలకంగా మారనున్నాయని విశ్వగురువుగా ప్రపంచాన్ని ఔపోసన పట్టిన మీకు నేను చెప్పాల్సినపని లేదు.


ఎయిర్‌బస్‌లో అనేక దేశాలను అలా వెళ్లి ఇలా చుట్టివచ్చిన మీరు సెమీకండక్టర్‌ బస్‌ను ఎలా మిస్‌ అయ్యారన్నది చాలా మందికి అర్ధం కావటం లేదు. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తరువాత వచ్చిన ప్రధానులెవరికీ(వారిలో అతల్‌ బిహారీ వాజ్‌పాయి ఉన్నదీ లేనిదీ తెలియదు) దూర దృష్టి లేదని విమర్శించే మీ అనుయాయులు (సుబ్రమణ్య స్వామిని పక్కన పెడదాం) మీ గురించి ఏం చెబుతారో తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్‌ యాభై సంవత్సరాలలో చేసిన దాన్ని మీరు తొలి ఐదు సంవత్సరాల్లోనే చేసి చూపించారని గత ఎన్నికలపుడు ప్రచారం చేశారు. చేసిందేమిటో సాధికారిక సమాచారాన్ని జనానికి అందిస్తే వాస్తవం తెలుస్తుంది. మన దేశంలో మీ కంటే ముందు నుంచి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌) పేరుతో వివరాలను సేకరిస్తున్నారు. దానిలో మీ పాలనలో అనేక సూచికలు దిగజారినట్లు కనిపించింది. మీ ఏలుబడిలో నిరుద్యోగం పెరిగిందన్న సమాచారాన్ని గత లోక్‌సభ ఎన్నికల ముందు తొక్కిపెట్టిన సంగతి మీకు చెప్పనవసరం లేదు. వచ్చే సర్వేలో ఎలాంటి ఫలితాలు వస్తాయో అని సమాచారాన్ని సేకరించే పద్దతిని రూపొందించే సంస్థ అధిపతినే తప్పించారు అని జనం అనుకుంటున్నారు.


నరేంద్రమోడీ పెద్ద విజనరీ అంటే భూత, వర్తమాన, భవిష్యత్‌ను చూడగలిగిన దృష్టి కలవారని అని ప్రచారం చేశారు. నిజమే కావచ్చు, సర్వేల్లో వచ్చే సమాచారం ఎలాంటిదో మీకు ముందే తెలిసి ఉంటుంది గనుక దాని రూపకర్తనే తొలగించారు. అన్నట్లు మరిచాను. ఈ ఏడాది మీ మీద ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాయని మీరు ముందే గ్రహించి ఆ విషయాన్ని ఎన్నో సంవత్సరాల ముందే మీరు చెప్పినట్లు కొందరు సామాజిక మాధ్యమంలో మీ గొప్ప గురించి ప్రచారం చేస్తున్న పోస్టు ఉంది. దాని నిజా నిజాలు మీకే ఎరుక. నిజంగా మీకు తెలిసి ఉంటే మణిపూర్‌ దురంతాన్ని ఎందుకు నివారించలేకపోయారు అన్న ప్రశ్న వస్తోంది. దాన్ని వదలివేద్దాం. నాలుగవ తరం పారిశ్రామిక విప్లవం గురించి కూడా మీరు చెప్పారు. పిండి లేకుండా రొట్టెలు రావు కదా ? దానికి అవసరమైన పరిశోధన, అభివృద్ధి రంగాల ప్రాధాన్యత, దానిలో సెమికండక్టర్ల గురించి ప్రధాని కాగానే లేదా అంతకు ముందు గుజరాత్‌ సిఎంగా ఎందుకు పసిగట్టలేకపోయినట్లు ? ఈ రంగానికి నిధుల కేటాయింపు కేంద్ర ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థలు చేయాల్సి ఉంది. రెండూ జరగటం లేదు. ముంబై కేంద్రంగా పని చేస్తున్న గేట్‌వే హౌస్‌ అనే ఒక మేథో సంస్థ 2015 జనవరి పదహారున టెక్నాలజీ పరుగులో చైనా ముందు భారత్‌ ఓడిపోనుందా అనే శీర్షికతో ఒక విశ్లేషణను ప్రచురించింది. మీ సలహాదారులకు దీని గురించి తెలియదని అనుకోలేము.లేదా ఇలాంటి వాటిని పట్టించుకోకపోతే మన దేశ ఖర్మ అనుకోవటం తప్ప చేసేదేమీ లేదు. దానిలో పరిశోధన, అభివృద్ది ఖర్చు గురించి చర్చించారు. 1991 నుంచి చైనా పరిశోధన ఖర్చును ఏటా 19శాతం పెంచుతూ 2012నాటికి జిడిపిలో 1.97శాతానికి చేరినట్లు పేర్కొన్నారు.అప్పటికి మనదేశ ఖర్చు 0.9శాతం మాత్రమే ఉంది.ఫస్ట్‌ పోస్ట్‌ అనే పత్రికలో 2023 ఫిబ్రవరి ఒకటిన ప్రచురితమైన ఒక విశ్లేషణలో జిడిపిలో మనదేశ తాజా ఖర్చు 0.7శాతమే అని చైనా 2.1శాతంగా పేర్కొన్నారు. జిడిపిలో రెండు శాతం ఖర్చు చేయాలని గతంలో వాజ్‌పాయి సర్కార్‌ కూడా చెప్పింది. దూరదృష్టి గల మీ పాలనలో గతం కంటే తగ్గిందేమిటి ? మన దేశంలో నిపుణులకు, పరిశోధకులకు కొరత ఉన్నదా ?


కుహనా అంశాలమీద పరిశోధనకు మీరు చూపుతున్న శ్రద్ధ సెమికండక్టర్స్‌ వంటి ప్రాధాన్యరంగాల మీద లేదు, ఆవు పేడ, మూత్రం, పాలలో బంగారం ఉందా, ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ పరిశోధనలకు ప్రజాధనాన్ని ప్రభుత్వం వృధా చేస్తున్నదని 2020 సంవత్సరంలో వందలాది మంది శాస్త్రవేత్తలు ప్రభుత్వతీరుతెన్నులను తప్పు పడుతూ ఆ పరిశోధనలను ఆపివేయాలని కోరినా మీరు పట్టించుకోలేదు. అంతకు ముందు 2017లో పంచగవ్య గురించి ఆయుర్వేద పుస్తకాల్లో రాసిన వాటిని రుజువు చేసేందుకు పరిశోధనలు చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. మొత్తంగా పరిశోధనలకు తగినన్ని నిధులు కేటాయించకుండా ముందుకు పోవటానికి మీ దగ్గర మంత్రదండమేదైనా ఉంటే హాం ఫట్‌ అంటూ తిప్పండి.ప్రతి లక్ష మంది జనాభాకు ఇజ్రాయెల్‌లో 834, దక్షిణ కొరియా 749,అమెరికాలో 441, చైనాలో 130 మంది పరిశోధకులు ఉండగా మనదేశంలో కేవలం 25 మంది మాత్రమే ఉన్నారని చెప్పటం మీకు ఇష్టముండదని తెలిసినా తప్పటం లేదు.


తినేందుకు బంగాళాదుంప, అరటి చిప్స్‌ లేకున్నా రోజు గడుస్తుందిగానీ ఎలక్ట్రానిక్స్‌ చిప్స్‌ లేకుండా మనకు క్షణం గడవదంటే అతిశయోక్తి కాదు.ప్రపంచంలో నిపుణులైన సెమికండక్టర్‌ రూపకల్పన ఇంజనీర్లు ప్రపంచం మొత్తంలో ఉన్నవారిలో 20శాతం మంది మనదేశంలో ఉన్నారని అంచనా. వారందరినీ విదేశీ కంపెనీలకు చౌక శ్రామికులుగా సమర్పించటం తప్ప ఇప్పుడు జరుగుతున్నదేమైనా ఉందా ? వారు సాధించే పేటెంట్స్‌ మన దేశానికి దక్కవు. మన ఇంజనీర్లు ఐటి రంగంలో ముందున్నారు. దీనికి మీ సర్కార్‌ ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. హార్డ్‌వేర్‌ రంగంలో ఆ స్థితి లేదు. ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువ భాగం మనం దిగుమతి చేసుకుంటున్నార. అదే విధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలతో విదేశీ కంపెనీలు రూపకల్పనలో లబ్ది పొందటం తప్ప చిప్స్‌ తయారీ మన దేశంలో ఎంతమేరకు జరుగుతుందన్నది ప్రశ్నార్ధకమే. ప్రస్తుతం అమెరికా మైక్రాన్‌ కంపెనీ ఎక్కడో ఉత్పత్తి చేసిన వాటిని మనదేశంలో పరీక్షించి పాకింగ్‌ చేయిస్తున్నది. దానితోనే పండగ చేసుకుందామా ?


చైనా మీద అమెరికా ప్రారంభించిన టెక్నాలజీ పోరులో ఎవరికి నష్టం ఎవరికి లాభం అన్న చర్చ జరుగుతోంది.తమ దేశంలోనే సెమీ కండక్టర్లను ఉత్పత్తి చేయాలని, అక్కడి నుంచి ఎగుమతులు జరపాలని అమెరికా సర్కార్‌ పట్టుబడుతోంది. తైవాన్‌లోని టిఎస్‌ఎంసి కంపెనీ ఉత్పత్తి మీద అదుపు కలిగి ఉంది.1990లో ప్రపంచ సెమీకండక్టర్ల ఉత్పతిలో అమెరికా వాటా 37శాతం ఉంటే 2020లో 12శాతానికి తగ్గింది. తిరిగి పూర్వపు స్థితికి చేరాలంటూ కొత్త పరిశ్రమలకు ఇచ్చేందుకు 280 బిలియన్‌ డాలర్లను అమెరికా కేటాయించింది.ఈ మొత్తానికి స్థానిక ప్రభుత్వాలు ఇచ్చేది అదనం. ఇప్పటి వరకు అమెరికా, ఐరోపా సమాఖ్య, జపాన్‌ సెమీకండక్టర్ల తయారీ కంపెనీలను ఆకర్షించేందుకు సబ్సిడీల నిమిత్తం పదివేల కోట్ల డాలర్లు పక్కన పెడుతున్నట్లు ప్రకటించాయి. ఇంటెల్‌ కంపెనీ జర్మనీలో 30బిలియన్‌ యూరోల ప్లాంట్‌ పెట్టాలంటే మూడో వంతు తమకు సబ్సిడీ ఇవ్వాలని బేరమాడింది.పోలాండ్‌, జర్మనీ, ఇజ్రాయెల్లో కొత్త ప్లాంటులు పెట్టేందుకు 50బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఇంటెల్‌ పేర్కొన్నది. మొత్తం మీద చూస్తే ఈ రంగంలో ముందున్న కంపెనీలు పెద్ద ఎత్తున లబ్దిపొందనున్నాయి. ఈ పోరులో మనదేశం ఎక్కడ అన్నది ప్రశ్నార్ధకమే.


గత పది సంవత్సరాలుగా ఈ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారు. దీనికి కూడా నెహ్రూ, కాంగ్రెసే కారణం అని మీ మద్దతుదార్లు చెప్పినా ఆశ్చర్యంలేదు. అమెరికా వాణిజ్య మంత్రి గినా రైమండోతో మన మంత్రి పియూష్‌ గోయల్‌ 2023 మార్చి పదవ తేదీన సెమీకండక్టర్ల సరఫరా, నూతన ఆవిష్కరణల భాగస్వామ్యం గురించి ఒక ఒప్పందం చేసుకున్నారు. అంతకు ముందు జనవరిలో సంక్లిష్టమైన, వర్ధమాన సాంకేతికతల (ఐసిఇటి) సహకారం గురించి ఒప్పందం జరిగింది. చిత్రం ఏమంటే అధ్యక్ష కార్యాలయం వెల్లడించిన వాస్తవాల పత్రంలో మిగతా అంశాల గురించి ఉంది తప్ప సెమీకండక్టర్ల మీద నిర్దిష్టంగా ఏమీ లేదు అని కార్నెగీ ఇండియా వెబ్‌సైట్‌లో 2023 మే నెల 23వ తేదీన కోణార్క భండారీ రాశారు. మన దగ్గర దానికి భిన్నమైన సమాచారం ఉంటే ఆ పత్రాన్ని విడుదల చేస్తే వాస్తవం తెలుస్తుంది. మనదేశంలో ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే వాటిని ప్రోత్సహించేందుకు ఉత్పాదకతతో ముడివడిన ప్రోత్సాహక(పిఎల్‌ఐ) పధకాన్ని 2021 నుంచి ఐదేండ్లలో రు.1.97లక్షల కోట్లు ఇచ్చే ప్రవేశపెట్టారు. కానీ దాన్ని ఆచరణలో ఉత్పత్తి బదులు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలను ఒక దగ్గర చేర్చే సెల్‌ఫోన్లకు, చిప్స్‌ పరీక్షలకు ఇస్తున్నారు. అందుకే భలే మంచి పధకం, వదలితే దొరకదని పొలోమంటూ ఆపిల్‌, మైక్రాన్‌ వంటి కంపెనీలు మన దేశానికి వస్తున్నాయి.


రెండు దిగ్గజదేశాలైన అమెరికా, చైనా సెమీకండక్టర్ల రంగంలో పైచేయి సాధించేందుకు భారీ సబ్సిడీలతో పోటీ పడుతున్నాయి. అదే సమయంలో చైనా తన స్వంత రూపకల్పన, ఉత్పత్తికి గాను భారీ మొత్తంలో పరిశోధనకు నిధులు వెచ్చిస్తున్నది. మనదేశంలో ఒక సమగ్ర విధానాన్ని కూడా ఇప్పటికీ రూపొందించుకోలేకపోయాము.అలూ లేదూ చూలూ లేదు అన్నట్లుగా ఉంటే మన దేశాన్ని సెమీకండక్టర్‌ హబ్‌గా మారుస్తానని మీరు చెబుతున్నారు. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ తాజా(2023) సమాచారం ప్రకారం సెమీకండక్టర్ల ఉత్పత్తిలో తైవాన్‌, దక్షిణ కొరియా, జపాన్‌, చైనా, అమెరికా తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఫాబ్రికేషన్‌లో 2022 డిసెంబరు నాటికి జపాన్‌లో 102, తైవాన్‌ 77, అమెరికా 76, చైనా 70, జర్మనీ 20, బ్రిటన్‌ 12, మలేషియా 7 ప్లాంట్లను కలిగి ఉన్నాయి. తరువాత స్థానాల్లో ఇజ్రాయెల్‌, నెదర్లాండ్స్‌ ఉన్నాయి. గుజరాత్‌లో 70శాతం సబ్సిడీ ఇచ్చి అమెరికా మైక్రాన్‌ కంపెనీతో ఒక పాకింగ్‌ కేంద్రాన్ని పెట్టించి దీంతో ప్రపంచ హబ్‌గా మారుస్తానని మీరు జనాలకు చెబుతున్నారు. ఇది ఎంతకాలం నడుస్తుంది ? అమెరికా మనలను తన సహజ భాగస్వామిగా పరిగణిస్తున్నదని, పిలిచి పెద్ద పీటవేస్తున్నదని చెబుతున్నారు. గతేడాది (2022) మార్చి నెలలో తొలిసారిగా అమెరికా చొరవతో చిప్స్‌ 4 లేదా ఫాబ్‌ 4 కూటమి ఏర్పడింది. దానిలో తైవాన్‌(చైనా తిరుగుబాటు రాష్ట్రం), జపాన్‌, దక్షిణ కొరియా ఇతర భాగస్వాములు తప్ప మనకు చోటు లేదు. ప్రపంచ సెమీకండక్టర్ల పరిశ్రమలో 70శాతం వాటా ఈ నాలుగు దేశాలదే. విధాన రూపకల్పన, ఉత్పత్తిలో పరస్పరం సహకరించుకొనేందుకు, విస్తరణకు దీన్ని ఏర్పాటు చేశారు.


గత తొమ్మిది సంవత్సరాల్లో దేశ అప్పును విపరీతంగా పెంచివేశారు. 2023 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు మొత్తం రు.152,61,122 కోట్ల 12లక్షలకు చేరుతుందని, అది 2024 మార్చి 31కి రు.169,46,666 కోట్ల 85లక్షల కోట్లకు చేరుతుందని నిర్మలమ్మగారి బడ్జెట్‌ పత్రాల్లో ఉంది.కాగ్‌ ఖరారు చేసిన గణాంకాల ప్రకారం 2014 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు రు.50,68,235 కోట్లు కాగా 2015 మార్చి నాటికి అంటే తొలి ఏడాది దాన్ని రు.56,07,315 కోట్లకు తరువాత మీరు దాన్ని ఎడాపెడా పెంచారు.కేవలం మీరు చేసిన అప్పు 2024 మార్చి నాటికి 118,78,431కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు.మీరు అధికారానికి వచ్చినపుడు కేంద్ర ప్రభుత్వ రుణం జిడిపిలో 67.1 శాతం కాగా 2021లో 88.5 శాతానికి పెరిగింది, 2023 నాటికి అది 83.1శాతంగా ఉంది. ఇంత చేసిన వారు పరిశోధనకు పెంచకపోగా ఎందుకు తగ్గించిందీ ఏదైనా ఒక మన్‌కీ బాత్‌లో చెబితే సంతోషం. ఆవు పేడ పరిశోధన నిధులు సెమీ కండక్టర్లకు మళ్లించండి, సబ్సిడీలతో పాటు పరిశోధనలకూ నిధులు ఇవ్వండి. ఇప్పటికి ఇంతటితో ముగిస్తున్నా.
తోటి భారతీయుడు
ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇది ఎన్నికల ఏడాది : కాషాయ గోబెల్స్‌ దళం రెచ్చిపోతుంది జర జాగ్రత్త !

23 Sunday Jul 2023

Posted by raomk in BJP, CHINA, Congress, COUNTRIES, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

BJP, FDI, India's outward FDI, Joseph Goebbels, Narendra Modi Failures, Nazi Joseph Goebbels, RBI data, RSS, saffron brigade hypocrisy


ఎం కోటేశ్వరరావు


దేశంలో ఏం జరుగుతోంది ? కేంద్ర ప్రభుత్వ, పాలకపక్ష భజనరాయుళ్లు ఏమి చెబుతున్నారో బేరీజు వేసుకొని చూడకపోతే జనం మోసపోతూనే ఉంటారు. బుద్ది జీవులు తమ మెదళ్లు, రాతలకు పదును పెట్టాల్సి ఉంది. ఎన్నికల సంవత్సరం గనుక అవాస్తవాలు, అతిశయోక్తులు, అర్థ సత్యాలను జనం ముందు కుమ్మరిస్తారు, కాషాయ దళాలు గోబెల్స్‌ ప్రచారంతో వాట్సాప్‌ను నింపేస్తారు. దానిలో భాగంగానే గత తొమ్మిది సంవత్సరాల్లో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో పెట్టుబడులు,నవకల్పనలో ముందు పీఠీన ఉందని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌లో జూలై 21న అమరజిత్‌ వర్మ అనే పరిశోధకుడు రాసిన విశ్లేషణలో పేర్కొన్నారు. కియర్‌నే డాట్‌ కామ్‌ నివేదిక ప్రకారం అగ్రశ్రేణిలో ఉన్న పాతిక దేశాల ఎఫ్‌డిఐ కాన్ఫిడెన్స్‌(విశ్వాస) సూచిక జాబితాలో 2020,21,22 సంవత్సరాల్లో మన దేశానికి చోటు లేదు. అంతకు ముందు 2017లో ఎనిమిది,2018లో 11, 2019లో 16వ స్థానాల్లో ఉన్నది. 2023 సూచిక ప్రకారం 16వ స్థానంలో ఉంది.2022లో పదవ స్థానంలో ఉన్న చైనా 2023లో ఏడవ స్థానానికి చేరింది. ఇక నవకల్పనలు అనేవి పరిశోధన-అభివృద్ది రంగాలలో పెట్టే పెట్టుబడులను బట్టి ఉంటాయి.2013లో ఈ సూచికలో మన దేశం 66వది కాగా 2022లో 40వ స్థానంలో ఉంది.(ఆర్గనైజర్‌ పత్రిక విశ్లేషకుడు 2015లో ఉన్న 81వ స్థానాన్ని తీసుకొని 2022లో 40వదిగా ఉందంటే మోడీ పాలనలో ఎంత పెరిగిందో చూడండని జనాన్ని నమ్మించేందుకు చూశారు) ఇదే కాలంలో చైనా 35 నుంచి 11వ స్థానానికి ఎదిగింది. ఈ సూచికలు స్థిరంగా ఉండవు, ఏడాదికేడాది మారుతుంటాయి. ధోరణి ఎలా ఉందన్నదే గీటురాయి.

మన దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల పెట్టుబడులను 2007 నాటికి జిడిపిలో రెండుశాతానికి పెంచాలని 2003లో నాటి వాజ్‌పాయి సర్కార్‌ విధాన పత్రంలో పేర్కొన్నది. తరువాత 2013లో యుపిఏ ప్రభుత్వం 2018 నాటికి ఆ మేరకు పెంచాలని గడువు పెంచింది. దాన్ని నరేంద్రమోడీ సర్కార్‌ 2020 విధాన పత్రంలో 2030 సంవత్సరంగా పేర్కొన్నారు. ఇక ఆచరణను చూద్దాం. ప్రపంచ బాంకు 2022 అక్టోబరు 24న తాజా పరిచిన సమాచారం ప్రకారం 1996లో మన దేశం ఈరంగానికి చేసిన ఖర్చు జడిపిలో 0.64శాతం.2004లో 0.76, 2008లో 0.86, 2014లో 0.7, 2018లో 0.66, 2023లో 0.7శాతం ఉంది. ప్రపంచ సగటు 1.8లో సగం కూడా మన దేశం ఖర్చు చేయటం లేదు. ఇంత తక్కువగా ఉండటానికి కార్పొరేట్‌ రంగం తగినంత ఖర్చు చేయకపోవటమే అని చెబుతున్నారు. (2023 ఫిబ్రవరి 24, హిందూ వార్త)


సులభతర వాణిజ్యం పేరుతో భారీ మొత్తంలో ఇచ్చిన పన్ను రాయితీల కారణంగా గతంతో పోలిస్తే ఎఫ్‌డిఐలు పెరిగాయి. వాటి మాదిరి మన పారిశ్రామిక ఉత్పత్తి లేదా వస్తు ఎగుమతులు పెరగలేదు. ఆత్మనిర్భరత గురించి ఊదరగొడుతున్నారు.ఉత్పాదకతతో ముడిపెట్టిన బోనస్‌ పధకం (పిఎల్‌ఐ) పెద్ద ఎత్తున విజయవంతమైందని, 14 రంగాలలో రు.2.74లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ పధకం 2020లో ప్రారంభమైంది. ఆరు సంవత్సరాల కాలంలో రు.1.9లక్షల కోట్ల మేర సబ్సిడీకోసం పక్కన పెట్టినట్లు చెప్పారు. దీని కింద 2023 మార్చి నాటికి రు.3,400 కోట్లు తమకు చెల్లించాలని కొన్ని కంపెనీలు కోరగా రు.2,900 కోట్లు చెల్లించారు. ఈ పధకం కింద ఇచ్చే సబ్సిడీతో ఉత్పాదక రంగానికి పెద్ద ఊపు వస్తుందని చెప్పారు. ఆపిల్‌ ఫోన్ల అసెంబ్లింగ్‌ను ఒక విజయగాధగా చెబుతున్నారు. దాని వెనుక ఉన్న అసలు కథేంటి ? వివిధ దేశాల్లో ఉత్పత్తి చేసిన విడి భాగాలను దిగుమతి చేసుకొని మన దేశంలో వాటిని ఒక దగ్గర కూర్చటం తప్ప అది ఉత్పత్తి చేసేది కాదు. ఆ ఫోన్లను మన మార్కెట్లో, విదేశాలకూ ఎగుమతి చేస్తున్నది. ఉదాహరణకు మన దేశంలో అసెంబ్లింగ్‌ చేసిన అలాంటి ఒక ఫోను విలువ రు. పదివేలు అనుకుందాం. దానిలో తొమ్మిదివేల విలువ గల విడిభాగాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని మన దేశంలో ఉత్పత్తి అవుతున్న విడి భాగాల విలువ మరొక వెయ్యి జత చేసిందనుకుందాం. దాన్ని రు.200 లాభంతో అమ్మింది, లేదు ఎలాంటి లాభం లేకుండా అసలు ధరకే అమ్మిందనుకుందాం. పిఎల్‌ఐ పధకం కింద మన ప్రభుత్వం ఐదు శాతం సబ్సిడీ ఇస్తే ఒక ఫోను మీద రు.500 లాభం వచ్చినట్లే. ఆ మేరకు ఇతర దేశాల్లో ధర తగ్గించి ఇతర ఫోన్‌ కంపెనీలను వెనక్కు నెట్టవచ్చు. ఇంత లాభసాటిగా ఉన్నపుడు చైనా నుంచో మరొక చోట నుంచో కంపెనీలు మన దేశానికి ఎందుకు రావు, అసెంబ్లింగ్‌ కేంద్రాలను ఎందుకు ప్రారంభించవు. ఈ పధకం కానసాగినంత కాలం ఇక్కడ ఉంటాయి. తరువాత వేరే చోటకు వెళతాయి.


మన దేశంలో పరిశ్రమలకు ఊపు నిచ్చే రాయితీలు ఆత్మనిర్భర పధకంతో మాత్రమే ప్రారంభం కాలేదు. 1991 నుంచి నూతన ఆర్థిక విధానాల పేరుతో అనేక రాయితీలు ఇచ్చారు, అనుకూల విధానాలు తీసుకువచ్చారు. దీని వలన వచ్చిన ఫలితాలను చూస్తే జిడిపిలో పారిశ్రామిక సంబంధిత సెకండరీ సెక్టర్‌ వాటా 1991-92లో ఉన్న 24.7 నుంచి 27.3 శాతానికి 2019-20 సంవత్సరం నాటికి పెరిగింది. ఇప్పుడు 24శాతం ఉంది. మనవంటి దేశాల్లో ఉత్పాదక రంగం గణనీయంగా పెరగాల్సి ఉంది. జిడిపిలో సెకండరీ సెక్టర్‌లో భాగమైన ఉత్పాదక రంగ వాటా 17శాతం దాటటం లేదు. పిఎల్‌ఐ పధకం వలన ఉత్పత్తి పెరుగుతుందన్నది నాణానికి ఒకవైపు మాత్రమే. ఈ సబ్సిడీ పొందేందుకు బడాకంపెనీలతో చిన్న సంస్థలు పోటీపడలేవు. దాంతో అవి మూతపడతాయి. అసెంబ్లింగ్‌ రంగంలో యాంత్రీకరణ, రోబోలు రంగంలోకి వస్తున్నందున కార్మికులకు ఉపాధికూడా పరిమితమే. ఉన్నది కూడా ఊడిపోతుంది. అందుకే ఉపాధి రహిత వృద్ధి అని చెప్పాల్సి వస్తున్నది. దీనితో పాటు పెద్ద మొత్తంలో పన్ను తగ్గింపు కారణంగా ఇటీవలి సంవత్సరాల్లో మనదేశ కార్పొరేట్ల లాభాలు పెరిగాయి, వాటాదార్లకు క్రమం తప్పకుండా డివిడెండ్లు ఇస్తున్నాయి. అందుకే విదేశీ మదుపుదార్లు మన వాటాల మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. తద్వారా వచ్చే డాలర్లను చూపి అది తమ ఘనతే అని ప్రభుత్వం చెప్పుకుంటున్నది. స్టాక్‌మార్కెట్ల సూచీలు, కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. దీన్ని తాము సాధించిన వృద్ధికి ప్రతీక అని బిజెపి చెబుతోంది. ఈ సూచికలు పెరిగినట్లుగా ఎగుమతులు, ఉపాధి సూచికలు ఎందుకు లేవో చెప్పదు. ఉపాధి రహిత వృద్ధి వలన సమాజంలో గిరాకీ తగ్గుతుంది. వస్తువుల కొనుగోలు తగ్గితే ఎన్నిరాయితీలు ఇచ్చినా ఉత్పత్తి చేసేందుకు ఎవరూ ముందుకురారు. దాంతో వృద్ధి రేటు తగ్గుతుంది. అది కొత్త సమస్యలను సృష్టిస్తుంది. దీన్ని మూసిపెట్టేందుకే కేంద్రంలోని మోడీ సర్కార్‌ గారడీలు చేస్తున్నది.


వందకు రు.30 పెట్టుబడి పెట్టించి రు.70 సబ్సిడీ ఇచ్చి ఇరవై రెండువేల కోట్లకు అమెరికా కంపెనీ మైక్రాన్ను అధిపతిగా చేసిన ప్రధాని నరేంద్రమోడీ నిర్వాకాన్ని దేశం ఇటీవలనే చూసింది. మేడ్‌లేదా మేకిన్‌ ఇండియా బదులు ప్యాకిన్‌ ఇండియా సంస్థను పెట్టించేందుకు, అదీ గుజరాత్‌లో ఏర్పాటుకు అమెరికా వెళ్లి మరీ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటిదే 70శాతం సబ్సిడీని (దాదాపు లక్షా పాతికవేల కోట్లు) జేబులో వేసుకొనేందుకు చూసిన వేదాంత-ఫాక్స్‌కాన్‌ కంపెనీకి సెమీకండక్టర్లను తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో చివరకు దాన్ని రద్దు చేసుకున్నది. తాజా వార్త ఏమంటే మనదేశ కంపెనీ టాటా సన్స్‌ బ్రిటన్‌లో 5.2బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్‌ కార్ల బాటరీలను తయారు చేసేందుకు ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. అదే కంపెనీ మనదేశంలో పెట్టకుండా అక్కడికి ఎందుకు పెట్టుబడులను తరలిస్తున్నట్లు అన్నది ప్రశ్న.అది 2026 నాటికి మేడిన్‌ బ్రిటన్‌ పేరుతో ఉత్పత్తి ప్రారంభిస్తుందని, నాలుగువేల మందికి నేరుగా పరోక్షంగా మరికొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు కూడా వెల్లడించారు. అది ఐరోపాలోనే అతి పెద్ద సంస్థగా ఉంటుందని, ఏటా 40గిగావాట్‌ గంటల బాటరీలను ఉత్పత్తి చేస్తుందని, తమ దేశ అవసరాల్లో సగం తీరుస్తుందని బ్రిటన్‌ ఇంథన భద్రతా శాఖ మంత్రి గ్రాంట్‌ షాప్స్‌ చెప్పాడు. టాటా కంపెనీకి బ్రిటన్‌ సర్కార్‌ పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇచ్చినట్లు చెబుతున్నప్పటికీ వివరాలు వెల్లడించలేదు.


ఒక దేశం నుంచి మరొక దేశానికి పెట్టుబడులు వెళ్లటం ఒక సాధారణ అంశంగా మారింది. తొలిసారిగా ప్రధాని పదవిలోకి వచ్చినపుడు విదేశాలకు తరచూ ఎందుకు వెళుతున్నారన్న ప్రశ్నకు కాంగ్రెస్‌ ఏలుబడిలో దిగజారిన దేశ ప్రతిష్టను తిరిగి తెచ్చేందుకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అని మోడీ మద్దతుదార్లు చెప్పారు. మరోవైపు మోడీ అధికారానికి వచ్చిన తరువాత మనదేశం నుంచి విదేశాలకు వెళ్లిన పెట్టుబడులు పెరిగాయి. బెల్లం ఎక్కడ ఉంటే అక్కడికి చీమలు చేరినట్లు ఎక్కడ లాభం ఉంటే అక్కడికి పెట్టుబడి పరుగులు తీస్తుంది తప్ప ఒక నేత పలుకుబడిని బట్టి ఉండదు.నరేంద్రమోడీ ప్రపంచ నేత అని అందరూ కీర్తిస్తున్నారని, ఎక్కడకు వెళ్లినా బ్రహ్మరధం పడుతున్నారని భక్తులు తన్మయత్వంతో ఊగిపోతారు. అంత పలుకుబడి ఉంటే టాటా కంపెనీ బ్రిటన్‌లో ఎందుకు పెట్టుబడులు పెడుతున్నట్లు ? ఫాక్స్‌కాన్‌ ఎందుకు తప్పుకుంది ? ఐరాస సంస్థ ఆంక్టాడ్‌ సమాచారం ప్రకారం 2004లో మనదేశానికి ఐదువందల కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు వస్తే 2021లో అవి 8,300 కోట్లకు పెరిగాయి. ఇదే కాలంలో మనదేశం నుంచి విదేశాలకు వెళ్లిన పెట్టుబడులు 200 నుంచి 1,500 కోట్ల డాలర్లకు చేరాయి. చైనా నుంచి కూడా పెట్టుబడులు పెద్ద మొత్తంలోనే ఇతర దేశాలకు వెళుతున్నాయి. అది ప్రపంచ ఫ్యాక్టరీగా మారింది, ఆక్రమంలో పెట్టుబడులు తరలాయి. విదేశాల్లో పెట్టుబడులు పెట్టకపోతే అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులు జరగకపోవటం వంటి అనేక షరతులు, ఆటంకాల పూర్వరంగంలో అది జరిగింది. మన దేశం కూడా మోడీ చెప్పినట్లు గుజరాత్‌ నమూనాను దేశమంతటా విస్తరించి చైనాను వెనక్కు నెట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా మారి ఉన్నా, ఆ దిశలో ప్రగతి ఉన్నా టాటా వంటి కంపెనీలు ఇతర దేశాలకు వెళ్లాయంటే అర్ధం చేసుకోవచ్చు.


మనదేశం నుంచి వెళుతున్న పెట్టుబడుల గురించి రిజర్వుబాంక్‌ ఇచ్చిన వివరాల ప్రకారం 2007 నుంచి 2021వరకు 68 శాతం పెట్టుబడులు విదేశాల్లో ఉన్న ద్రవ్య సంబంధ కేంద్రాలకు వెళుతున్నాయి. వాటి వలన మనదేశానికి సాంకేతిక పరిజ్ఞానం, మరొకటో ఏమీ రాదు. పన్నులు తక్కువగా ఉండే సింగపూర్‌, మారిషస్‌, బెర్ముడా, కేమాన్‌ ఐలండ్స్‌, బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌, నెదర్లాండ్స్‌ వంటి వాటికి 51శాతం వెళుతున్నాయి. ఈ దేశాలు, ప్రాంతాల్లో నమోదైన కార్పొరేషన్ల మీద అక్కడి ప్రభుత్వాలు నామమాత్ర పన్ను లేదా కొన్ని సార్లు అసలు పన్నే లేకుండా అనుమతిస్తాయి, అంటే పన్నులను తప్పించుకొనేందుకే అన్నది స్పష్టం. ఈ నిధులు చివరికి ఎక్కడికి చేరుతున్నదీ తెలియటం లేదు. హిండెన్‌బర్గ్‌ నివేదికలో ఇలాంటి డొల్ల కంపెనీలతో లావాదేవీల గురించి ఉంది. మారు పేర్లతో ఎక్కడి నుంచి వచ్చాయో ఆ దేశాలకే విదేశీ పెట్టుబడుల పేరుతో వచ్చి రాయితీలు పొందుతున్నాయి. అక్కడున్న డొల్ల కంపెనీలకు అధికారికంగా లేదా అక్రమ పద్దతుల్లో పెట్టుబడులు చేరుతున్నాయి. నల్లధనం తెల్లధనంగా మారుతున్నది. మన దేశానికి 2000 నుంచి 2023లో ఇప్పటి వరకు వచ్చిన విదేశీ పెట్టుబడులను చూస్తే మారిషస్‌ నుంచి 26, సింగపూర్‌ 23 అంటే రెండు చోట్ల నుంచే 49శాతం వచ్చాయి. దీని వలన మన ఖజానాకు ఎంతో నష్టం జరుగుతోంది. మన ప్రభుత్వానికి ఇచ్చిన హామీ మేరకు విదేశాలకు వెళ్లిన పెట్టుబడులను ఉపయోగిస్తున్నారనేది కూడా స్పష్టంగా తెలియదు. మన దేశం నుంచి వెళుతున్న పెట్టుబడులతో కొన్ని దేశాల్లో అప్పటికే ఉన్న సంస్థల కొనుగోలు లేదా విలీనాలకు పూనుకుంటున్నారు. ఇదంతా సదరు కంపెనీల మార్కెట్‌ విస్తరణ, లాభాలను పెంచుకొనేందుకు తప్ప మన దేశంలో ఉపాధి కల్పించేందుకు ఏమాత్రం తోడ్పడదు. ఆర్థిక వ్యవహారాల కేంద్ర ప్రభుత్వ శాఖ సమాచారం ప్రకారం మనదేశం విదేశాల్లో నేరుగా పెట్టిన పెట్టుబడుల మొత్తం 2021-22లో 17.53 బిలియన్‌ డాలర్లు కాగా అత్యంత ధనిక దేశమైన అమెరికా పెట్టిన పెట్టుబడులు 12.1 బి.డాలర్లు మాత్రమే. అక్కడి సంస్థలు పన్నులను తప్పించుకొనేందుకు మారిషస్‌ వంటి పన్నులు లేని చోట్ల నుంచి పెట్టుబడులు పెడతాయి. భారీ మొత్తాల్లో సబ్సిడీలు ఇచ్చి పాకింగ్‌ కంపెనీలను తెస్తున్న నరేంద్రమోడీ బాటరీలను ఉత్పత్తి చేసే టాటా కంపెనీ బ్రిటన్‌ ఎందుకు వెళ్లిందో మన జనాలకు చెప్పాలా లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌కు అమెరికా నుంచి క్లస్టర్‌ బాంబులు-మరో మలుపు తిరిగిన సంక్షోభం !

19 Wednesday Jul 2023

Posted by raomk in Current Affairs, Europe, Germany, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

cluster munitions, Joe Biden, Ukraine crisis, US Cluster Munitions, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


శాంతి నెలకానాల్సిన చోట మరింత అశాంతి తలెత్తేలా జో బైడెన్‌ సర్కార్‌ ఉక్రెయిన్‌కు క్లస్టర్‌ బాంబులు పంపింది. సంక్షోభాన్ని మరింత తీవ్రతరం కావించేందుకు, రష్యా మీద మరిన్ని ఆంక్షలతో నష్టపరిచేందుకు నాటో కూటమి పూనుకుంది. దానికి ప్రతిగా దాడులను మరింత తీవ్రం గావించటంతో పాటు, ఉక్రెయిన్నుంచి నల్లసముద్రం ద్వారా జరుగుతున్న ధాన్య ఎగుమతుల ఒప్పందం నుంచి రష్యా తప్పుకుంది. ఆదివారంతో ముగిసిన ఒప్పందాన్ని అది పొడిగించలేదు. దీంతో 45 దేశాలకు ఉక్రెయిన్‌ ధాన్య ఎగుమతులపై అనిశ్చితి ఏర్పడింది.నౌకలకు భద్రత లేనందున రవాణా నిలిచిపోనుంది. గత ఏడాది టర్కీ చొరవతో ఐరాస మధ్యవర్తిత్వంలో కుదిరిన ఒప్పందం మేరకు ఉక్రెయిన్‌ రేవుల దిగ్బంధనాన్ని రష్యా ఎత్తివేసింది. దానికి ప్రతిగా తమ ఆహార ధాన్యాలు, ఎరువుల ఎగుమతులపై పశ్చిమ దేశాలు ఆంక్షలను తొలగించలేదని పుతిన్‌ విమర్శించాడు.మూడు ఉక్రెయిన్‌ రేవుల నుంచి వివిధ దేశాలకు 3.28 కోట్ల టన్నుల గోధుమలు,ఇతర ధాన్యాలు, పొద్దుతిరుగుడు పువ్వుల నూనె ఎగుమతి జరిగింది. వీటిలో 46శాతం ఆసియా, 40శాతం పశ్చిమ ఐరోపా, 12శాతం ఆఫ్రికా, రెండు శాతం తూర్పు ఐరోపా దేశాలకు వెళ్లాయి. దాంతో గత ఏడాది మార్చి నుంచి ఇటీవలి వరకు ప్రపంచ మార్కెట్లో ఆహార ధరలు 23శాతం వరకు తగ్గినట్లు తేలింది. తిరిగి పరిస్థితి మొదటికి రావటంతో సోమవారం నాడు చికాగో మార్కెట్లో గోధుమల ముందస్తు ధర 3.5శాతం పెరిగింది. వెంటనే ఒప్పంద పునరుద్దరణ జరగకపోతే భారత్‌తో సహా అనేక దేశాల మీద ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఒప్పందాన్ని కొనసాగించలేదనే ఆగ్రహంతో క్రిమియా ద్వీపాన్ని రష్యా ప్రధాన భూ భాగాన్ని కలిపే వంతెన పేల్చివేసేందుకు ఉక్రెయిన్‌ దాడిజరిపింది. పాక్షికంగా దెబ్బతిన్న వంతెనను వెంటనే రాకపోకలకు పునరుద్దరించినటు పుతిన్‌ సర్కార్‌ ప్రకటించింది. దీనికి ప్రతిగా భారీ ఎత్తున నల్లసముద్రంలోని రేవు, ఉక్రెయిన్‌ ఇతర ప్రాంతాల మీద రష్యా పెద్ద ఎత్తున వైమానిక దాడులు జరుపుతున్నట్లు మంగళవారం నాడు వార్తలు వచ్చాయి. తమ తూర్పు ప్రాంతంలో పరిస్థితి సంక్లిష్టంగా ఉన్నప్పటికీ తమ అదుపులోనే ఉందని ఉక్రెయిన్‌ మిలిటరీ అధికారి చెప్పాడు. లక్ష మందికి పైగా మిలిటరీ, తొమ్మిది వందలకు మించి టాంకులను రష్యా మోహరించిందని అన్నాడు.


మానవ హక్కుల బృందాలు విమర్శించినా ఖాతరు చేయకుండా నిషేధిత క్లస్టర్‌ బాంబులను ( పలు రకాల బాంబుల గుత్తి ) ఉక్రెయిన్‌కు సరఫరా చేసి సంక్షోభాన్ని ప్రమాదకర మలుపు తిప్పేందుకు అమెరికా పూనుకుంది. ఎనభై కోట్ల డాలర్ల విలువగల పాకేజ్‌లో భాగంగా ఇప్పటికే వాటిని అక్కడకు తరలించింది. ఒక వేళ వాటిని తమ మీదకు వదిలితే తాము కూడా ప్రయోగించేందుకు తమ వద్ద భారీగా నిల్వలు ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ హెచ్చరించాడు. ఒక రష్యా జర్నలిస్టుతో మాట్లాడినపుడు ఈఅంశాన్ని చెప్పాడు. గతంలో అమెరికా వీటిని ప్రయోగించిన ప్రాంతాలలో జరిగిన ప్రాణ నష్టం, వనరుల విధ్వంసం కారణంగా వాటిని నిషేధించారు. కొన్ని సందర్భాలలో కొన్ని బాంబులు పేలవు. వాటి గురించి తెలియక ఎవరైనా ముట్టుకుంటే సంవత్సరాల తరువాత కూడా మందుపాతరల మాదిరి పేలే ముప్పు ఉంది. గగనతలం నుంచి విమానాలు, భూమి, సముద్రాల మీద నుంచి కూడా వీటిని ప్రయోగించవచ్చు. గతంలో ఇవి పేలినపుడు మరణించిన వారిలో 94శాతం మంది పౌరులు కాగా 40శాతం మంది పిల్లలు ఉన్నారు. వీటిని రూపొందించే పద్దతిని బట్టి ఒక్కో గుత్తిలో కొన్ని డజన్ల నుంచి గరిష్టంగా ఆరువందల బాంబులను అమర్చవచ్చు. తక్కువ మంది మిలిటరీ, పరిమితమైన విమానాలు, ఓడలు, రాకెట్‌ వాహనాలతో భారీ నష్టం కలిగించవచ్చు.


ఈ బాంబులను రకరకాలుగా రూపొందిస్తున్నారు. మామూలుగా ఒక బాంబును వేస్తే ఒక చోటే నష్టం కలిగిస్తుంది. కానీ ఈ గుత్తి బాంబు వేసిన తరువాత అది అనేకంగా విడిపోయి విసృత ప్రాంతంలో పేలుళ్లకు కారణమౌతుంది. మనుషులను చంపటంతో పాటు రోడ్లు,వాహనాలు, విద్యుత్‌ లైన్లు ఇలా ఆ ప్రాంతంలో ఏవి ఉంటే వాటిని ధ్వంసం చేస్తాయి. కొన్ని సందర్భాలలో మానవాళి, పంటలకు ముప్పు కలిగించే జీవ, రసాయనాలతో కూడా బాంబులను రూపొందిస్తున్నారు. యుద్ధం, ఇతర సందర్భాలలో పౌరులను హెచ్చరించేందుకు, బెదిరించేందుకు రూపొందించిన కరపత్రాలను కూడా ఈ బాంబుల ద్వారా వెదజల్లిన ఉదంతాలు ఉన్నాయి. వివిధ దేశాల్లో ఇవి కలిగించిన అపార నష్టాన్ని చూసిన తరువాత 2008 మే 30వ తేదీన డబ్లిన్‌ నగరంలో 107 దేశాలు వీటి ఉత్పత్తి, వినియోగం, బదిలీ, నిల్వ చేయరాదని ఒక అవగాహనకు వచ్చాయి, అదే ఏడాది డిసెంబరు మూడున ఓస్లో నగరంలో ఒప్పందం మీద సంతకాలు చేశాయి. 2010 ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం 111 దేశాలు సంతకాలు చేసి పార్లమెంట్లలో ఆమోద ముద్ర వేశాయి, మరో పన్నెండు దేశాలు సంతకాలు చేసినా తదుపరి ప్రక్రియను పూర్తి చేయలేదు. మన దేశం, అమెరికా, చైనా, రష్యా, ఉక్రెయిన్‌, పాకిస్తాన్‌, ఇజ్రాయెల్‌ వంటి దేశాలు ఒప్పందంలో చేరలేదు. నాటోలోని ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ వంటి పద్దెనిమిది దేశాలు కూడా ఒప్పందాన్ని అమలు చేస్తున్నవాటిలో ఉన్నాయి. అవి కూడా అమెరికాను నివారించేందుకు పూనుకోలేదు. అయిష్టంగానే తాము ఉక్రెయిన్‌కు అందచేస్తున్నట్లు జో బైడెన్‌ ప్రపంచాన్ని నమ్మించేందుకు చూశారు. రెండవ ప్రపంచ యుద్ధంలో దురాక్రమణకు పూనుకున్న నాజీ సేనల మీద 1943లో నాటి సోవియట్‌ కురుస్క్‌ ప్రాంతంలో వీటిని వేసింది. అదే ఏడాది ఇంగ్లాండ్‌లోని గ్రిమ్స్‌బై ప్రాంతం మీద నాజీ సేనలు వెయ్యి బటర్‌ ఫ్లై బాంబులు వేశాయి. ఇండో చైనాను ఆక్రమించుకొనేందుకు పూనుకున్న అమెరికా 1960,70 దశకాల్లో వియత్నాం, లావోస్‌, కంపూచియాల మీద వాటిని వేసింది. ఒక్క వియత్నాం మీదనే 4,13,130 టన్నుల బాంబులు, లావోస్‌ మీద 27 కోట్లు వేసింది. రెడ్‌క్రాస్‌ సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం లావోస్‌లోని 17 రాష్ట్రాలలో ఇప్పటికీ ఏటా మూడు వందల మంది చొప్పున అవి పేలి మరణిస్తున్నారు. అక్కడ ఎనిమిది కోట్ల బాంబులు పేలలేదని అంచనా. అవి ఎక్కడ పడిందీ కనుగొనటం ఎంతో కష్టం. ఎప్పుడైనా పేలవచ్చు. 1975-88 సంవత్సరాల్లో మొరాకో మిలిటరీ వీటిని తిరుగుబాటుదార్ల మీద వేసింది.1978లో లెబనాన్‌పై దురాక్రమణ జరిపిన ఇజ్రాయెల్‌ వాటితో దాడులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌-అమెరికా రెండూ కూడా వాటితో దాడులు జరిపాయి. బ్రిటన్‌ 1982 ఫాక్‌లాండ్స్‌ దాడిలో అర్జెంటీనా మీద వేసింది. ఇరాక్‌పై దురాక్రమణ దాడిలో అమెరికా, దాని మిత్ర పక్షాలు 61వేల వైమానిక దాడులలో వీటిని వదిలాయి. బోస్నియాపై 1992-95లో యుగోస్లావ్‌ సేనలు, 1994-96లో చెచెన్‌ తిరుగుబాటుదార్లపై రష్యా,1995లో క్రోషియాపై సెర్బ్‌, 1996-99లో సూడాన్‌ మిలిటరీ దక్షిణ సూడాన్‌ తిరుగుబాటుదార్ల మీద, ఇంకా ఎరిట్రియా, ఇథియోపియా,అల్బేనియా, కొసావా వార్‌లో నాటో సేనలు, జార్జియాపై 2008లో రష్యా,సిరియా, ఎమెన్‌ తదితర చోట్ల కూడా వీటిని వినియోగించారు.


రష్యా ఉక్రెయిన్‌ మీద వేసినట్లు గతంలో నాటో కూటమి ఆధారం లేని ఆరోపణలు చేసింది. తాజాగా అమెరికా వాటిని ఇవ్వటాన్ని సమర్ధించుకొనేందుకు ముందుగానే ఈ ప్రచారం చేసినట్లు దీన్ని బట్టి అర్ధం అవుతోంది. పట్టణాల మీద వీటిని వేయకూడదని రాతపూర్వకంగా ఉక్రెయిన్నుంచి హామీ పొందినట్లు నమ్మించేందుకు అమెరికా చూస్తోంది. కొంత మంది ఇలా అందచేతతో తలెత్తే చట్టపరమైన అంశాల గురించి చర్చలు చేస్తున్నారు. నాటోలోని కొన్ని అమెరికా మిత్రదేశాల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. తప్పని చెబుతూనే ఉక్రెయిన్‌ ఆత్మరక్షణకు ఇస్తున్నారు గనుక అర్ధం చేసుకున్నామంటూ సమర్ధించాయి. ఐదు వందల రోజుల సంక్షోభం తరువాత ఎందుకు ఇప్పుడు వీటిని అమెరికా సరఫరా చేస్తున్నది అనే ప్రశ్న తలెత్తటం సహజం. రష్యా అదుపులో ఉన్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు తాము ప్రతిదాడులు జరుపుతున్నట్లు జెలెనెస్కీ ప్రకటించాడు. దాదాపు నెల రోజులు కావస్తున్నా, ఎలాంటి పురోగతి లేకపోగా భారీ నష్టాలను చవి చూస్తున్నట్లు వార్తలు. టాంకులు, శతఘ్నులను పెద్ద ఎత్తున నష్టపోయింది. దీనికి ప్రధాన కారణం ఆ ప్రాంతాలలో రష్యన్లు భారీ సంఖ్యలో మందుపాతరలను అమర్చినట్లు, కందకాలను తవ్వినట్లు వెల్లడికావటంతో ఉక్రెయిన్‌, నాటో మిలిటరీ అంచనాలు తప్పాయి. వాటిని దాటుకొని ముందుకు పోవటం అంటే ప్రాణాల మీదకు తెచ్చుకోవటమే. అందుకే ఆ ప్రాంతాల మీద క్లస్టర్‌ బాంబులను వేయటం తప్ప మరొక మార్గం లేదనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇవి కందకాల మీద, బహిరంగంగా ఉన్న టాంకులు, శతఘ్నులను పేలుళ్లు జరిపి నష్టపరుస్తాయి. పేలని బాంబులు, వాటితో పాటు జారవిడిచే మందుపాతరలను తప్పించుకొని పుతిన్‌ సేనలు ముందుకు పోవటం కూడా ఇబ్బందే.


క్లస్టర్‌ బాంబులను గతంలో ప్రయోగించిన ప్రాంతాలన్నీ మిలిటరీ, పౌరులు కలసి ఉన్న ప్రాంతాలే కావటంతో అనేక మంది వీటిని నిషేధించాలని డిమాండ్‌ చేశారు. ఈ బాంబులలో రెండు నుంచి నలభై శాతం వరకు పేలే అవకాశం లేదని, చెట్లు, గుట్టలు, బురద ప్రాంతాల్లో పడినవి తరువాత ఎవరైనా వాటిని కదిలించినపుడు లేదా అవేమిటో తెలియని పిల్లలు, ఇతరులు వాటిని ముట్టుకున్నపుడు పేలి ప్రాణాలు తీస్తాయి. తాము ఉక్రెయిన్‌కు పంపిన ఈ బాంబుల్లో పేలనివి 2.35శాతమే ఉంటుందని, ఎంతో మెరుగుపరచిన పరిజ్ఞానంతో రూపొందించినట్లు అమెరికా నమ్మించచూస్తోంది. అయితే దాని రక్షణశాఖ జరిపిన పరీక్షల్లో పేలనివి 14 నుంచి 20శాతం అంతకంటే ఎక్కువే ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌కు వాటిని అందించటమంటే అక్కడి సంక్షోభాన్ని మరో మలుపు తిప్పటమే కాదు, తీవ్ర పర్యవసానాలకూ దారి తీస్తుంది. ఉద్రిక్తతలను ఎగదోసే యుద్ధోన్మాదాన్ని ఎండగట్టాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పేదరికం మీద పరిహాసం : మన ” దరిద్రపు ” లెక్కలేంటి , మనమెక్కడున్నాం ?

17 Monday Jul 2023

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Uncategorized, Women

≈ 1 Comment

Tags

Anemia, BJP, Multidimensional Poverty Index (MPI), Narendra Modi Failures, Poverty in India, POVERTY LINE IN INDIA, poverty reduction


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ బహుముఖ దారిద్య్ర సూచిక (ఎంపిఐ) 2023 ప్రకారం మన దేశం గడచిన పదిహేను సంవత్సరాలలో 41.5 కోట్ల మందిని దారిద్య్రనుంచి విముక్తి కలిగించినట్లు ప్రకటించారు. ఎందరో ఈ వార్తను చదివి సంతోషించారు. జీవన పరిస్థితులను ”గణనీయం” గా మెరుగుపరచినందున ఈ పురోగతి సాధించినట్లు పేర్కొన్నారు. గత కాంగ్రెస్‌ -వర్తమాన బిజెపి పాలన కలసి ఉంది గనుక, మరీ డబ్బా కొట్టుకుంటే జనం నవ్విపోతారు గనుక కాషాయ దళాలు కాస్త తగ్గి ఉన్నట్లు కనిపిస్తోంది. సున్నా కంటే ఒకటి విలువ ఎంతో ఎక్కువ అన్నట్లుగా దీని గురించి సానుకూల వైఖరితోనే మంచి చెడ్డలను చూద్దాం. ఈ సూచికను ఐరాస అభివృద్ధి కార్యక్రమం(యుఎన్‌డిపి), ఆక్స్‌ఫర్డ్‌ దారిద్య్ర, మానవ అభివృద్ధి చొరవ (ఓపిహెచ్‌ఐ) సంస్థ ఉమ్మడిగా రూపొందించాయి. ప్రభుత్వాలు అందించిన సమాచారాన్ని విశ్లేషించి వివరాలను వెల్లడించారు. ఇది ఒక్క మన దేశం గురించే కాదు, అన్ని దేశాల గురించీ 2010 ప్రతి ఏటా ఇలాంటి సమాచారాన్ని ప్రకటిస్తున్నారు.వివిధ అంశాల ప్రాతిపదికన జీవన నాణ్యతను లెక్కిస్తున్నారు. మన దేశంలో 2005-06 నుంచి 2019-2021వరకు పదిహేను సంవత్సరాలలో వచ్చిన మార్పు ప్రకారం పోషకాహారం, శిశుమరణాలు, స్కూలు వెళ్లే సంవత్సరాలు, బడికి హాజరు, వంట గాస్‌, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్‌ అందుబాటు, ఇంటివసతి, ఆస్తులు ఎంత మేరకు కలిగి ఉన్నారనేదాని ప్రాతిపదికగా అంచనా వేశారు. 2005-06లో ఇవి లేని వారు దేశ జనాభాలో 55.1శాతం, 2015-16లో 27.7శాతం, 2019-2021లో 16.4 శాతం మంది ఉన్నారని ఎంపిఐ సూచికలో పేర్కొన్నారు. మన దేశంలో 41.5 కోట్ల మంది జీవితాలు మెరుగుపడితే చైనాలో 2010-14 మధ్య 6.9 కోట్ల మంది జీవితాలు మెరుగుపడ్డాయి. ప్రపంచమంతటా 110 దేశాల్లో 110 కోట్ల మంది ఇంకా దారిద్య్రంలో మగ్గుతున్నారు. మన దేశంలో 23 కోట్ల మంది ఉన్నారు. ప్రతి ఆరుగురిలో ఐదుగురు ఆఫ్రికాలోని సబ్‌ సహారా, దక్షిణాసియాలో ఉన్నారు. ఈ విశ్లేషణలన్నీ కరోనాకు ముందు ఉన్న సమాచారం ప్రాతిపదికగా చేసినవే, ఆ మహమ్మారి కలిగించిన ప్రతికూల ప్రభావం వలన దారిద్య్రంలోకి దిగజారిన వారు ఇంకా పెరిగారని చెబుతున్నారు.


దారిద్య్రం నుంచి ఇంత మంది బయపడ్డారు అన్నది ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు. దీనికి ఆయా దేశాలు నిర్ణయించిన ప్రమాణాలు తప్ప ప్రపంచమంతటికీ వర్తించే ప్రాతిపదిక లేదు. ప్రపంచబాంకు నిర్వహించే దారిద్య్రం, అసమానతల వేదిక – పావర్టీ అండ్‌ ఇనీక్వాలిటీ ప్లాట్‌ఫాం(పిఐపి) విశ్లేషణ ప్రకారం రోజుకు 2.25 డాలర్లు, అంతకంటే తక్కువ వచ్చే వారు మన దేశంలో 2019లో 11.88శాతం ఉన్నారు. త్వరలో మన దేశం చైనాను అధిగమించనుందని అనేక మంది చెబుతున్నారు గనుక, దానితో పోలిక ఎలా ఉందో చూద్దాం. 2017 పిపిపి పద్దతిలో లెక్కించిన మేరకు 2019నాటి వివరాలు. ఆ ఏడాది సగటున ఒక డాలరుకు రు.70 మారకపు విలువ ఉంది.(జూలై 15న ఒక డాలరుకు రు.82గా ఉంది) కనుక ఎవరికి వారు ఆ రోజున ఉన్న విలువ ప్రకారం లెక్కించుకోవచ్చు. ప్రామాణికంగా డాలర్లను తీసుకున్నారు గనుక ఇక్కడ కూడా దాన్నే తీసుకుందాం. విశ్లేషకులు తీసుకొనే రాబడి అంకెలలో స్వల్ప తేడాలుంటే జనాభా శాతాలు ఎలా మారతాయో కూడా చూద్దాం. ప్రపంచ బాంకు పేర్కొన్న ప్రమాణం ప్రకారమే రోజుకు 2.15 డాలర్ల రాబడిని ప్రాతిపదిక తీసుకుంటే 2015 – 2019 కాలంలో దారిద్య్రరేఖకు దిగువ ఉన్న జనాభా మన దేశంలో 18.7 నుంచి 10శాతానికి తగ్గగా చైనాలో 1.2 నుంచి 0.1 శాతానికి తగ్గింది. పిఐపి వేదిక సమాచారం మేరకు దిగువ విధంగా ఉన్నారు.
దేశం××× డాలర్లలో రాబడి×× జ. శాతం ×× డాలర్లలో రాబడి×× జ. శాతం ×× డాలర్లలో రాబడి×× జ. శాతం
భారత్‌ ×× 2.25 ×× 11.88 ×× 3.60 ×× 43.66 ×× 6.95 ×× 84.31
చైనా ×× 2.25 ×× 0.18 ×× 3.70 ×× 3.24 ×× 6.80 ×× 24.34


ఎగువ అంకెలను బట్టి రోజుకు ఎక్కువ సంపాదించే వారు చైనాలో చాల ఎక్కువ మంది ఉన్నారు. రాబడిని బట్టి జీవన ప్రమాణాలు, నాణ్యత ఆధారపడి ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. జనాల రాబడితో పాటు ప్రభుత్వాలు అందించే సేవలు కూడా వాటికి తోడౌతాయి. బిజెపి పెద్దలు, కొన్ని మీడియా సంస్థలు మన దేశాన్ని పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌(2016), పాకిస్తాన్‌(2018)లతో పోల్చి చూపటం తెలిసిందే. వాటి స్థితి ఎలా ఉందో కూడా చూద్దాం. అచ్చేదిన్‌ గురించి ప్రతి దేశంలోని పాలకులూ చెప్పే కబుర్లే కనుక ఎవరు ఎక్కడ ఉన్నారో ఎవరికి వారే పోల్చుకోవచ్చు.
దేశం××× డాలర్లలో రాబడి×× జ. శాతం ×× డాలర్లలో రాబడి×× జ. శాతం ×× డాలర్లలో రాబడి×× జ. శాతం
బంగ్లాదేశ్‌ ×× 2.20 ×× 14.62 ×× 3.65 ×× 51.63 ×× 6.95 ×× 87.43
పాకిస్తాన్‌ ×× 2.15 ×× 4.93 ×× 3.65 ×× 39.84 ×× 6.95 ×× 85.16


దక్షిణాసియాలో మన ఇరుగు పొరుగు దేశాల్లో శ్రీలంక పరిస్థితి మెరుగ్గా ఉంది. మన దేశంలో దారిద్య్రరేఖ గురించి ఎవరికి వారే తమదైన సూత్రీకరణలు చేశారు, భాష్యాలు చెప్పారు. వాటి తీరు తెన్నుల గురించి చూద్దాం. ప్రపంచ బాంకు రోజుకు 1.90 డాలర్లుగా అంతకు ముందు నిర్ణయించిన దానిని 2022లో 2.15 డాలర్లకు పెంచింది. దారిద్య్రరేఖ నిర్ణయానికి అన్ని దేశాల ప్రమాణాలు ఒకే విధంగా లేవని ముందే చెప్పుకున్నాం. మన దేశంలో కూడా వివిధ కమిటీలు భిన్న ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకున్నాయి. అలఫ్‌ు కమిటీ (1979) ప్రతి రోజూ పెద్దవారికి గ్రామాలలో 2,400, పట్టణాలలో 2,100 కాలరీల శక్తి అవసరమని, అందుకు అవసరమైన ఆహారం, దాని ధరలను ప్రాతిపదికగా తీసుకుంది. తరువాత లకడావాలా కమిటీ(1993), టెండూల్కర్‌ కమిటీ(2009), రంగరాజన్‌ కమిటీ (2012)లు దీని గురించి నివేదికలు ఇచ్చాయి. రంగరాజన్‌ కమిటీ పట్టణాల్లో రోజుకు తల ఒక్కింటికి నెలకు రు.1,407, గ్రామాలలో రు.972 ఖర్చును దారిద్య్రరేఖ నిర్ధారణకు ప్రామాణికంగా తీసుకుంది.


మన దేశంలో దారిద్య్రానికి కారణాలుగా దిగువ వాటిని పేర్కొంటున్నారు. జనాభా పెరుగుదల నిరంతరం జరుగుతున్నది, దానికి అనుగుణంగా వస్తు వినియోగ డిమాండ్‌ విపరీతంగా పెరుగుతున్నది. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత తక్కువగా ఉండటం. దీనికి కారణం కమతాలు చిన్నవిగా ఉండటం, రైతులకు పెట్టుబడి లేమి, నూతన సాంకేతిక పద్దతుల గురించి తెలియని తనం, సాంప్రదాయ పద్దతుల్లోనే సాగు, వృధాను అరికట్టలేకపోవటం, దీని వలన జీవన ప్రమాణాలు పెరగటం లేదు అని చెబుతున్నారు. వనరులను సమర్ధవంతంగా ఉపయోగించకపోవటం, ఆర్థిక వృద్ధి తక్కువగా ఉండటం, పెట్టుబడుల లేమి, ధరల పెరుగుదల,నిరుద్యోగం, వారసత్వం, కుల వ్యవస్థ కూడా కారణాలుగా పేర్కొంటున్నారు. ఇవి నాణానికి ఒక వైపు మాత్రమే.ఈ అంశాల పరిష్కారానికి పాలకులు అనుసరించిన దివాలా కోరు విధానాలు అసలైన కారణాలు. ఆపరేషన్‌ అవసరమైన చోట పూత మందులు పూసి చికిత్స చేసినట్లుగా అనేక ఉపశమన పథకాలను అమలు జరిపినా ఫలితం ఉండటం లేదు. పరిమితమైన మెరుగుదలను చూపి మొత్తం దారిద్య్రం నుంచి జనాలను బయటపడవేసినట్లు చెబుతున్నారు. దానికి జీవన ప్రమాణాలు మెరుగుపడినట్లు అందమైన పేరు. ప్రపంచ బాంకు చెప్పినట్లు రోజుకు 2.15 డాలర్లు అంటే (ఇప్పటి మారకపు రేటు ప్రకారం) రు.172 రాబడి ఉంటే దారిద్య్రం నుంచి వెలుపలికి వచ్చినట్లే. దీని ప్రకారం నెలంతా పని ఉందనుకుంటే రాబడి రు5160 వస్తుంది. రంగరాజన్‌ కమిటీ ప్రతి వ్యక్తి నెలకు రు.1,407 ఖర్చు చేస్తే చాలని చెప్పింది. ఇవి నేడున్న స్థితిలో వాస్తవాల ప్రాతిపదికన వేసిన అంచనాలేనా ? మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన కనీసవేతనం కూడా నెలకు ఐదున్నరవేలకు అటూ ఇటూగా ఉంటోంది. కేంద్ర ప్రభుత్వం వృద్దాప్య పెన్షన్‌గా 200, 500 చొప్పున నిర్ణయించింది అరవై, ఎనభై ఏండ్లు దాటిని వారికి ఇది ఏమూలకు వస్తుందో, ఇతర ఏ ఆధారం లేని పని చేయలేని వారు దానితో ఎలా బతుకులీడుస్తారో అచ్చేదిన్‌ కబుర్లు చెప్పేవారు ఎన్నడైనా ఆలోచించారా ? దారుణమైన అంశం ఏమంటే 2013లోనే టాస్క్‌ఫోర్స్‌ కమిటీ పెన్షన్లు పెంచాలని సిఫార్సు చేసింది. దాన్ని పట్టించుకోవాల్సినంత గొప్పది కాదన్నట్లుగా గత తొమ్మిది సంవత్సరాలుగా నరేంద్రమోడీ సర్కార్‌ పక్కన పెట్టింది. డిఎంకె సభ్యురాలు కనిమొళి సారధిగా ఉన్న పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ 2023 మార్చి నెలలో ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో దీర్ఘకాలంగా ఎదుగబొదుగూ లేకుండా ఉన్న ఈ మొత్తాలు ఇప్పుడు దేనీకీ చాలవని, పెంచాలని చేసిన సిఫార్సును కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నది పచ్చి నిజం.


మన దరిద్రం గురించి మనమే చెప్పుకుంటే ప్రపంచంలో పలుచనకామా అని కొంతమంది మండి పడతారు. మూసిపెడితే పాచిపోతుంది. మన గురించి ప్రపంచం ఎన్నో అంశాలను చెబుతోంది. మన పాలకులు వాటిని దాచిపెడుతున్నారు. ఎవరైనా లేవనెత్తితే దేశద్రోహం అంటున్నారు. ఈ అంశాలను ఎక్కడ చర్చించాలి ? ప్రపంచ సంస్థలు ఇచ్చే రాంకులు, సూచికలను అంగీకరించేది లేదు, వాస్తవాలకు ప్రతిబింబం కాదు అంటారు.పోనీ వారు అసలైన అంకెలను వెల్లడిస్తారా అంటే అదీ లేదు. నిజంగా మన దేశం దరిద్రం నుంచి 41.5 కోట్ల మందిని విముక్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన గణాంకాలు చెబుతున్నదేమిటి ? కేంద్ర ప్రభుత్వం 2018లో అనీమియా(రక్తహీనత) ముక్త భారత్‌ పధకాన్ని ప్రకటించింది. జీవన ప్రమాణాలను ప్రతిబింబించేవాటిలో ఇది ఒకటి. ప్రధాని నరేంద్రమోడీ కేంద్రంలో అధికారానికి వచ్చిన తరువాత రెండుసార్లు 2015-16లో నాలుగవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌), 2019-21 ఐదవ సర్వే చేశారు. రక్తహీనత పెరుగుదల తగ్గుదల గురించి ఈ రెండు సర్వేలను పోలుస్తూ కేంద్ర ప్రభుత్వం 2022 ఫిబ్రవరిలో పిఐబి ద్వారా సమాచారాన్ని విడుదల చేసింది. దాని ప్రకారం ఒకటి రెండు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తప్ప దేశమంతటా, మెజారిటీ రాష్ట్రాలలో రక్తహీనత ఉన్నవారి సంఖ్య పెరిగింది. దరిద్రం తగ్గితే ఇది కూడా తగ్గాలి కదా ! మన దేశంలో రక్త హీనత గురించి కొన్ని వివరాలు చూడవచ్చు.
గణన × రాష్ట్రం × పిల్లలు×15 -49 స్త్రీలు×15 -49గర్భిణులు×మొ.స్త్రీలు× బాలికలు× బాలురు
సర్వే 4 × దేశం × 58.6 × 53.2 × 50.4 × 53.1 × 54.1 × 29.2
సర్వే 5 × దేశం × 67.1 × 57.2 × 52.2 × 57 × 59.1 × 31.1
సర్వే 4 × గుజరాత్‌ × 62.6 × 55.1 × 51.3 × 54.9 × 56.5 × 31.9
సర్వే 5 × గుజరాత్‌ × 79.7 × 65.1 × 62.6 × 65 × 69.0 × 36.0
సర్వే 4 × కేరళ × 35.7 × 34.7 × 22.6 × 34.3 × 37.8 × 14.3
సర్వే 5 × కేరళ × 39.4 × 36.5 × 31.4 × 36.3 × 32.5 × 27.4

జనాభాను ఆరు బృందాలుగా విభజించి ఎవరిలో పరిస్థితి ఎలా ఉందో విశ్లేషించారు. ఇక్కడ బాలికలు, బాలురు అంటే 15-19 సంవత్సరాల వారు. గుజరాత్‌ అభివృద్ధి నమూనాను దేశమంతటా విస్తరిస్తాను అని నరేంద్రమోడీ 2014 ఎన్నికల్లో చెప్పిన సంగతి తెలిసిందే. కేరళలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ గానీ సిపిఎం గానీ తమది నమూనా అనే మాటలు చెప్పలేదు. దేశ సగటు కంటే ధనిక రాష్ట్రం గుజరాత్‌లో రక్తహీనత అన్ని తరగతుల వారిలో ఎక్కువగా ఉంది. దానికి విరుద్దంగా కేరళలో మెరుగైన స్థితి ఉంది. ప్రపంచ ఆకలి సూచికలో 2022లో 121 దేశాలకు గాను మన రాంక్‌ 107గా ఉంది. మెజారిటీ రాష్ట్రాలలో బిజెపి, నరేంద్రమోడీ కేంద్రంలో అధికారానికి రాక ముందు 2013లో 120 దేశాలకు మన రాంకు 63గా ఉంది. ఇండెక్స్‌ ముండీ డాట్‌ కామ్‌ సమాచారం 2019 ప్రకారం ఐదేండ్ల లోపు పిల్లల్లో రక్తహీనత ఎక్కువగా ఉన్నవారు 186 దేశాలకు గాను మనం 32వ స్థానంలో ఉన్నాం, అదే చైనా 141వ స్థానంలో ఉంది. మన కంటే మెరుగైన స్థానాల్లో శ్రీలంక 98, బంగ్లాదేశ్‌ 55, నేపాల్‌ 51, భూటాన్‌ 50, మయన్మార్‌ 41, పాకిస్తాన్‌ 33వ స్థానంలో ఉంది. రెండింజన్ల పాలన ఉంటేనే అభివృద్ది అని చెప్పేవారు దీనికి ఏ సమాధానం చెబుతారు. పిల్లలను ఆరోగ్యంగా ఉంచలేని వారు జిడిపి గురించి ఎన్నిక కబుర్లు చెప్పినా దాని వలన ఫలితం ఏమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ గుజరాత్‌ మోడల్‌ చిప్స్‌ యాపారం మేకింగ్‌ కాదు పాకింగ్‌ : రు. 30పెట్టుబడికి 70 సబ్సిడీ, ఎవడబ్బ సొమ్మనీ రామచంద్రా !

07 Friday Jul 2023

Posted by raomk in BJP, CHINA, COUNTRIES, Current Affairs, Economics, Europe, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, China, India’s Micron deal, Joe Biden, Micron, Narendra Modi Failures, Semiconductor


ఎం కోటేశ్వరరావు


2024 డిసెంబరు నాటికి మేడిన్‌ ఇండియా తొలి చిప్‌ మార్కెట్‌కు వస్తుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల అమెరికా వెళ్లినపుడు ఈ మేరకు మైక్రాన్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని, గుజరాత్‌లోని సనంద్‌ వద్ద దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.ఫాక్స్‌కాన్‌-వేదాంత సంయుక్త భాగస్వామ్యంలో మరో కంపెనీ కూడా దరఖాస్తు చేయనుందని చెప్పారు. జనాలు నిజమే అని ఆహౌ ఓహౌ నరేంద్రమోడీ మంత్రదండం మహిమ ఏమిటో చూడండి, ఇలా ఒప్పందం చేసుకున్నారో లేదా అలా ఉత్పత్తి వచ్చేస్తోంది, ఇదే ఊపుతో త్వరలో చైనాను వెనక్కు నెట్టేస్తాం అన్నట్లుగా స్పందించారు. ఆకలితో ఆవురావురు మంటూ ఎదురు చూస్తున్న అన్నం కనిపిస్తే చాలు కడుపు నిండుతుంది అన్నట్లుగా ఈ వార్త సంతోషం కలిగిస్తుంది, ఆనందాన్ని తెస్తుంది. దీని వెనుక ఉన్న కథ తెలిస్తే వామ్మో గుజరాత్‌ మోడల్‌ ఇలా ఉంటుందా అని గుండెలు బాదుకుంటారు.ఇక్కడ ఒక ప్రశ్న అడిగితే దేశభక్తిని ప్రశ్నిస్తారేమో ? ఫాక్స్‌కాన్‌ – వేదాంత సంస్థ కలసి గుజరాత్‌లో లక్ష మందికి ఉపాధి కల్పించేందుకు 19.5 బిలియన్‌ డాలర్లతో(రు.లక్షా 60వేల కోట్లు ) ఒక చిప్స్‌ ఫ్యాక్టరీని పెడుతున్నట్లు 2022 సెప్టెంబరులో ప్రకటించారు. అది ఇంతవరకు ఏమైందో ఎక్కడుందో చెప్పరు.కొత్తగా పద్దెనిమిది నెలల్లోనే ఐదువేల మందికి పని చూపే మైక్రాన్‌ ఉత్పత్తి మార్కెట్‌కు వస్తుందని చెబుతున్నారు. మోడీ గారు చెప్పింది వినాలి తప్ప అడిగితే మామూలుగా ఉండదు. ప్రశ్న అడిగిన అమెరికా జర్నలిస్టును ఎలా వేధిస్తున్నారో చూస్తున్నాంగా !


మైక్రాన్‌ కంపెనీ పెట్టుబడి 270 కోట్ల డాలర్లు( మన రూపాయల్లో 22,350 కోట్లు) అని చెప్పారు. దీనిలో అది నిజంగా పెట్టే మొత్తం రు.6,830 కోట్లు. మరి మిగతాది ! కేంద్ర ప్రభుత్వం పదకొండువేల కోట్లు ( 50శాతం) , రాష్ట్ర ప్రభుత్వం భూమి, ఇతర రూపాల్లో మరో ఇరవైశాతం సబ్సిడీ ఇస్తుందట. కంపెనీ పెట్టేది కేవలం 30శాతం మాత్రమే.అంటే రు.30 పెట్టుబడి పెట్టిన మైక్రాన్‌ కంపెనీని రు.వందకు స్వంతదారును చేస్తారు.ప్రతి పైసాను కాపాడేందుకు చౌకీదారును అని చెప్పుకున్న మోడీ ఏలుబడిలో తప్ప ఎక్కడైనా ఇలా జరుగుతుందా ? చైనాలో గిట్టుబాటు కావటం లేదని కొన్ని కంపెనీలు ఇతర దేశాల్లో సబ్సిడీలను చూసి అక్కడ నుంచి వెళుతున్నట్లు చెబుతున్నారు. అలాగే మరొక దేశం ఏదైనా ఇంతకంటే ఎక్కువ సబ్సిడీలు ఇస్తామంటే మైక్రాన్‌ కంపెనీ సరకు, సరంజామా మొత్తాన్ని అక్కడికి తరలిస్తే…..2020లో జనరల్‌ మోటార్స్‌ కంపెనీ వెళ్లిపోయినట్లే జరగవచ్చు. అది తీసుకున్న సబ్సిడీ పైసా తిరిగి ఇవ్వదు. అయినా 70శాతం సబ్సిడీ ఇస్తామంటే ఎవరైనా మన దేశానికి రాకుండా ఉంటారా ? అవసరం తీరింతరువాత వెళ్లిపోకుండా ఉంటారా ? అసలు కత వేరే. ఈ కంపెనీ మన దేశంలో చిప్స్‌(సెమీకండక్టర్లు) తయారు చేయదు. ఎక్కడో డిజైన్‌ చేసి మరెక్కడో ఉత్పత్తి చేసిన విడిభాగాలను మన దేశానికి తీసుకువచ్చి వాటి రూపకల్పన ప్రకారం ఒకదగ్గర అమర్చి(ఫాబ్రికేషన్‌), సరిగా ఉన్నాయా లేదా అని పరీక్ష చేసి అట్టపెట్టెల్లో పెట్టి ఎక్కడి కావాలంటే అక్కడికి పంపుతారు. చెప్పేది మేడిన్‌ లేదా మేకిన్‌ ఇండియా జరిగేది, పాకింగ్‌ ఇండియా. అదైనా గొప్పేకదా కొంత మందికి ఉపాధి దొరుకుతుంది కదా అని చెప్పేవారిని మేకింగుకు పాకింగు తేడా తెలుసుకోవాలని చెప్పటం తప్ప చేసేదేమీ లేదు.


మేకిన్‌, మేడిన్‌ ఇండియా పిలుపులు విఫలమైనందున కేంద్ర ప్రభుత్వం ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహకాల పేరుతో వేల కోట్ల రూపాయలను పక్కన పెట్టింది. మైక్రాన్‌ సంస్థ మన దేశంలో ఉత్పాదక కంపెనీ కాదు, కానీ దీనికి ఆ సొమ్మును ఇవ్వనుంది. ఇంత వాటంగా ఉంది కనుకనే అమెరికా పాలకులు అక్కడి కంపెనీలను మన దేశంలో పాకింగ్‌ యూనిట్లు పెట్టి ఎంత వీలైతే అంత సొమ్ము చేసుకోమని చెబుతున్నారు. చైనా బాటలో నడచి దేశాన్ని వృద్ది చేస్తామని, దాన్ని వెనక్కు నెడతామని మన పాలకులు చెప్పారు. చైనా కూడా పెట్టుబడులు పెట్టిన వారికి సబ్సిడీలు ఇచ్చింది, ఇలా పాకింగ్‌ రాయితీలు కాదు, ఉత్పత్తి చేసి తన జనానికి పని కల్పించి ఎగుమతులు చేసింది. అమెరికాను మించి జిడిపిలో ముందుకు పోనుంది. సెమికండక్టర్‌ రంగంలో స్వంతంగా ఉత్పత్తికి పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థలకు సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నది తప్ప ఇతర దేశాలకు లొంగి వాటి షరతులను, పాకింగ్‌లకు అంగీకరించటం లేదు. గతంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు అవసరమైన చిప్స్‌లో 90శాతం దిగుమతి చేసుకొనేది. ప్రస్తుతం నాణ్యత తక్కువగా ఉన్నప్పటికీ 1,000 రకాల చిప్స్‌ను చైనా ఉత్పత్తిదారుల నుంచే కొనుగోలు చేసేందుకు ప్రభుత్వరంగ కార్ల సంస్థ నిర్ణయించింది. ఆధునిక రకాల రూపకల్పనకు యుద్ధ ప్రాతిపదికన ముందుకు పోతున్నది.


చైనాతో మైక్రాన్‌ కంపెనీకి ఎక్కడ చెడింది ? ప్రతి దేశం తన భద్రతను తాను చూసుకుంటుంది. అమెరికాలో ఉత్పత్తి అవుతున్న చిప్స్‌ను ఏ దేశంలోనైనా వినియోగిస్తే ఆ దేశానికి లేదా ఉత్పత్తికి సంబంధించిన సమాచారం, రహస్యాలను సేకరించే అవకాశం ఉంది. తన టెలికాం పరికరాల ద్వారా చైనా ఆ పని చేస్తున్నదంటూ అమెరికా, మన దేశం అనేక యాప్స్‌ను నిషేధించించిన అంశం తెలిసిందే. అలాంటి పరీక్షలో మైక్రాన్‌ సంస్థ తన ఉత్పత్తుల్లో అలాంటి దొంగ చెవులు, కళ్లేమీ లేవని నిరూపించుకోలేపోయింది కనుక చైనా తమ మార్కెట్లో వాటి కొనుగోళ్ల మీద ఆంక్షలు ప్రకటించింది. భద్రతా పరీక్షలేమీ లేకుండా వాటిని మన మార్కెట్లో అమ్ముకొనేందుకు, ఇక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు చేసేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ అంగీకరించింది. అమెరికా మీద అంతనమ్మకం ఉంచటం ప్రమాదకరం. సెమికండక్టర్ల పరిశ్రమలు పెడితే సబ్సిడీలు ఇచ్చేందుకు 2021లో కేంద్ర ప్రభుత్వం దాదాపు లక్ష కోట్ల మేరకు నిధులు పక్కన పెడుతున్నట్లు చెప్పింది. ఆ మొత్తాన్ని స్వంతం చేసుకోవాలని అనేక మంది రంగంలోకి వచ్చారు.వాటిలో ఫాక్స్‌కాన్‌-వేదాంత ఒకటి. వీటి దగ్గర డబ్బు ఉంది తప్ప చిప్స్‌ ఉత్పత్తి సాంకేతిక పరిజ్ఞానం, అనుభవమూ లేదు. రెండూ కలసి ఐరోపాకు చెందిన ఎస్‌టిఎం మైక్రోటెక్నాలజీస్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రతిపాదించాయి. సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, పెట్టుబడితో సహా అనేక షరతులను ఎస్‌టిఎం ముందుకు తెచ్చింది. ఐదు-పది సంవత్సరాల తరువాత తాము తప్పుకుంటామని చెప్పగా వేదాంత-ఫాక్స్‌కాన్‌ దీర్ఘకాలం ఉండాలని డిమాండ్‌ చేసినట్లు వార్తలు. వీరి పెట్టుబడి రు.66 వేల కోట్లు కాగా దీనికి కూడా కేంద్రం రు.76వేల కోట్లు సబ్సిడీ ఇస్తామన్నది, గుజరాత్‌ కూడా గణనీయంగా రాయితీలు ఇచ్చేందుకు సిద్దపడినా ముందుకు సాగటం లేదు. ఇది కూడా 30కి 70 సబ్సిడీగానే ఉంటుంది. కర్ణాటకలో పరువు పోయింది. దేశంలో ఆర్థిక స్థితి సజావుగా లేదు. ఐదు రాష్ట్రాలు, తరువాత లోక్‌ సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. కనుక పాకింగ్‌ను కూడా మేకింగ్‌గా ఎన్నికల ముందు ప్రచారం చేసుకోవచ్చని మైక్రాన్‌ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు కనిపిస్తోంది.దేశ ప్రజలందరి సొమ్మును మోడీ సర్కార్‌ గుజరాత్‌కే సబ్సిడీగా ఖర్చు చేసేందుకు పూనుకోవటం మరొక అంశం. ఇతర బిజెపి పాలిత రాష్ట్రాలకూ లేదు, మోడీకి అణగిమణగి ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా, తెలంగాణా వంటి రాష్ట్రాలకూ ఒక్క ప్రాజెక్టూ రావటం లేదు. గుజరాత్‌కు ఇస్తున్న మాదిరి కేంద్రం సబ్సిడీ ఇస్తే ఏ రాష్ట్రంలోనైనా వాటిని పెట్టవచ్చు. మోడీ అంటే గుజరాత్‌ ప్రధాని అనుకుంటున్నారు గనుక అది జరగదన్నది తెలిసిందే.


నరేంద్రమోడీ సర్కార్‌ గత తొమ్మిదేండ్లలో చేసిన అప్పు గురించి ఎవరైనా అడిగితే కరోనా కాలంలో చేసిన సాయం, ఉకితంగా వాక్సిన్లకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఎదురు ప్రశ్నిస్తారు. అవి నిన్నగాక మొన్న, 2014 నుంచి చేసిన అప్పులు, చమురు మీద విధించిన భారీ సెస్సుల మొత్తం గురించి మాట్లాడరు. మోడీ చేసిన అప్పుకు గబ్బర్‌సింగ్‌ టాక్సు, ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తే వచ్చిన డబ్బు అదనం. ఇంత అప్పుతో దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కానీ, పేదరిక నిర్మూలన అనేది ఎక్కడా జరగలేదు. మరి ఈ డబ్బు ఎక్కడికి పోయింది ? అంటూ ఒక పోస్టు వాట్సాప్‌లో తిరుగుతోంది. అచ్చేదిన్‌, తనకు అధికారం ఇస్తే కాంగ్రెస్‌ ఏలుబడిలో తూర్పున పొడిచిన సూర్యుడిని పశ్చిమానికి మారుస్తాను అన్నట్లుగా జనాన్ని నమ్మించిన నరేంద్రమోడీ 2014లో అధికారానికి వచ్చారు. కాగ్‌ ఖరారు చేసిన గణాంకాల ప్రకారం 2014 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు రు.50,68,235 కోట్లు కాగా కేవలం నరేంద్రమోడీ చేసిన అప్పు 2024 మార్చి నాటికి 118,78,431కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు. దీనికి పాత అప్పును కలుపుకుంటే 169 లక్షల కోట్లు అవుతుంది. కొత్తగా ప్రభుత్వ రంగంలో ఒక్క పరిశ్రమ లేదు. తొమ్మిదేండ్లలో ఎవరితోనూ యుద్ధాలు లేవు గనుక మిలిటరీ నిర్వహణ తప్ప కొత్తగా ఆయుధాలు పెద్దగా కొన్నది లేదు. ఇంత సొమ్ము ఏం చేశారంటే కార్పొరేట్లు బాంకులకు ఎగవేసిన రుణాలను రద్దు చేసి దాని బదులు ప్రభుత్వ రంగ బాంకులకు కొంత మొత్తం సర్దుబాటు చేశారు.ఏదో ఒక పేరుతో పైన చెప్పిన సెమికండక్టర్‌ పరిశ్రమల రాయితీలు, ఇతర సబ్సిడీల పేరుతో కార్పొరేట్లకు సమర్పించుకున్నారన్నది స్పష్టం. వాటితో పోలిస్తే రైతాంగానికి, ఇతరులకు ఇచ్చిన రాయితీలు నామమాత్రం. అందుకే సొమ్ము పోయే శనీ పట్టే అన్నట్లుగా కార్పొరేట్లు సబ్సిడీలను తమ ఖాతాల్లో వేసుకున్నారు తప్ప తిరిగి పెట్టుబడిగా కూడా పెట్టలేదు. జనానికి ఉపాధిలేదు.


పాబ్రికేషన్‌, పాకింగ్‌ ద్వారా ప్రపంచ సెమికండక్టర్‌ ఉత్పత్తి కేంద్రంగా మన దేశం మారుతుందని ఎవరైనా చెప్పగలరా ? ఇలా ఏ దేశమైనా ఏ ఉత్పత్తిలోనైనా ఇలా మారిందా ?మలేషియా ఇప్పటికే ఈ రంగంలో ఎంతో ముందుంది. వేరే చోట్ల తయారైన చిప్స్‌ పరీక్ష, విడిభాగాల ఫాబ్రికేషన్‌ ప్రపంచ ఉత్పత్తిలో పదమూడుశాతం వరకు అక్కడే అక్కడ జరుగుతోంది. ఒక విధంగా ప్రపంచ హబ్‌గా ఉంది. ఆధునిక చిప్స్‌ కంపెనీలను తమ దేశంలోనే ఉంచుకొని తక్కువ రకం వాటిని ఇతర చోట్ల పరీక్షలకు అమెరికా కంపెనీలు పంపుతున్నాయి.వంద బిలియన్‌ డాలర్ల మెగా ఫాబ్రికేషన్‌ సంస్థను అమెరికా వాషింగ్టన్‌ సమీపంలోని క్లే అనే చోట ఏర్పాటు చేస్తూ 2.75బి.డాలర్ల (దానిలో 70శాతం మన సబ్సిడీ) సంస్థను గుజరాత్‌లో ఏర్పాటు చేసేందుకు మైక్రాన్‌ సంస్థ పూనుకుంది. మన దేశంలో చిప్స్‌ అవసరం నానాటికీ పెరుగుతున్నది. ఎంతగా అంటే 2019లో 22.7బిలియన్‌ డాలర్లుగా ఉన్న మార్కెట్‌ 2026 నాటికి 64బి.డాలర్లకు పెరుగుతుందని అంచనా. అందువలన మన దేశం స్వంతంగా ఉత్పత్తి చేసుకోవాలని ఎవరైనా కోరుకుంటారు. ప్రస్తుతం వివిధ రకాల సెమీకండక్టర్లు ఉన్నాయి. వాటి రూపకల్పన,తయారీ, విడిభాగాల అమరిక, పరీక్ష, ఉత్పత్తి చేసే యంత్రాలు ఇలా ఎన్నో ప్రక్రియలు ప్రస్తుతం కొన్ని దేశాల స్వంతం అంటే అతిశయోక్తి కాదు. గుత్తాధిపత్యం, మార్కెటింగ్‌ నిలుపుకొనేందుకు పెద్ద ఎత్తున పోటీపడుతున్నాయి. తైవాన్‌ ప్రాంతం, దక్షిణ కొరియా, అమెరికా, జపాన్‌, నెదర్లాండ్స్‌, చైనా, ఐరోపా సమాఖ్య, ఇజ్రాయెల్‌ ఈ రంగంలో తిరుగులేనివిగా ఉన్నాయి.


ఇతర దేశాల ఉత్పత్తులతో పోల్చితే చైనా వెనుకబడి ఉంది. ఉత్పత్తితో పాటు అవసరాలకు అది ఎక్కువగా దిగుమతుల మీదనే ఆధారపడుతోంది. దీన్ని అవకాశంగా తీసుకొని ఎగుమతులు, ఉత్పత్తికి అవసరమైన యంత్రాలను చైనాకు అమ్మకుండా అమెరికా, దానితో చేతులు కలిపిన దేశాలు ప్రస్తుతం చిప్స్‌ వార్‌ జరుపుతున్నాయి. చివరకు తమ పౌరులెవరూ చైనా కంపెనీల్లో పని చేయకూడదని నిషేధం విధించాయి. దెబ్బకు దెబ్బ అన్నట్లుగా ఎలక్ట్రిక్‌ వాహనాలు,రక్షణ ఉత్పత్తుల వంటి వాటిలో సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన గాలియం, జెర్మీనియం వంటి లోహాల దిగుమతి, వినియోగం గురించి అమ్మకాలు జరిపే సంస్థలు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలంటూ పరోక్షంగా చైనా నిషేధం విధించింది. అమెరికాకు చెందిన మైక్రాన్‌ సంస్థ ఉత్పత్తులు రక్షణకు ముప్పు తెస్తాయని వాటిని నిషేధించింది. ఈ పోరు ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించటం లేదు. గతంలో అనేక రంగాల్లో చైనాను ఇబ్బంది పెట్టేందుకు చూస్తే వాటిని సవాలుగా తీసుకొని తనదైన ప్రత్యేకతను నిరూపించుకుంది. ఇప్పుడూ అదే బాటలో ఉంది. మన దేశం మాదిరి పాకింగ్‌తో సంతృప్తి చెందకుండా మేకింగ్‌తో ముందుకు పోతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పోలీసు దురాగతం : రెండో వారంలోకి ఫ్రెంచి నిరసనలు !

05 Wednesday Jul 2023

Posted by raomk in Africa, Current Affairs, Europe, History, imperialism, International, INTERNATIONAL NEWS, Uncategorized

≈ Leave a comment

Tags

emmanuel macron, French protests, Nahel Merzouk, Riots in France


ఎం కోటేశ్వరరావు


అల్జీరియా-మొరాకో సంతతికి చెందిన 17 సంవత్సరాల నహేల్‌ అనే కుర్రవాడు ట్రాఫిక్‌ సిగల్‌ నిబంధనలను ఉల్లంఘించాడంటూ పోలీసులు గుండెల మీద కాల్చి చంపిన దురంతం ప్రస్తుతం ఫ్రాన్స్‌ను ఊపివేస్తున్నది. జూన్‌ 27న పారిస్‌ శివార్లలోని నాన్‌తెరేలో ఈ దారుణం జరిగింది. ఇరవై తొమ్మిదవ తేదీన అంత్యక్రియల సందర్భంగా దేశమంతటా ఆగ్రహించినవారి తీవ్ర నిరసనలు, దాడులు కొనసాగుతున్నాయి. మధ్యేవాద, వామపక్ష పార్టీలు, శక్తులు ఈ ఉదంతాన్ని ఖండించాయి, నిరసనలో పాల్గొన్నాయి. జాత్యహంకారి, హంతకుడైన పోలీసు అధికారికి మద్దతుగా విరాళాలు ఇవ్వాలని పచ్చిమితవాద నేషనల్‌ ఫ్రంట్‌ పార్టీ నేత మేరీనె లీపెన్‌ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నాటికి 17లక్షల డాలర్లకు పైగా వసూలైంది. నాలుగు సంవత్సరాల క్రితం ” పసుపు చొక్కాల ” ఆందోళన జరిగినపుడు పోలీసుల మీద దాడి చేసిన మాజీ బాక్సర్‌కు మద్దతుగా నిధుల సేకరణకు పిలుపు ఇచ్చినపుడు వెంటనే ఆ నిధి సేకరణను ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు అలా జరగలేదు. అరబ్బులను చంపండి మీరు మిలియనీర్లు కావచ్చు అని ఈ నిధి సేకరణ సందేశం ఇస్తున్నదని వామపక్ష నేత డేవిడ్‌ గుయిరాడ్‌ ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ చర్య అన్యాయం జరుగుతున్నదనే మనోభావాలను రగిలించటంతో పాటు ఉద్రిక్తతలు మరింతగా పెరిగేందుకు దోహదం చేస్తుందని స్లీపింగ్‌ జైంట్స్‌ అనే సంస్థ పేర్కొన్నది. ఒక మేయరు ఇంటి మీద తగులబడుతున్న కారును తోలి దాడికి పాల్పడ్డారంటే జాతి వివక్ష ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందో వెల్లడించింది. దేశంలో తలెత్తిన ఉద్రిక్తత కారణంగా అధ్యక్షుడు మక్రాన్‌ జర్మనీ పర్యటనను రద్దు చేసుకున్నాడు. మైనారిటీల పట్ల దేశంలో ఉన్న జాతివివక్ష గురించి మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆందోళన రెండో వారంలో ప్రవేశించింది.


ఉదయం ఎనిమిది గంటలపుడు మెర్సిడెజ్‌ కారు నడుపుతున్న నహేల్‌ దురుసుగా ఒక స్టాప్‌ వద్ద ఉన్న ఇద్దరు పోలీసుల మీద దురుసుగా కారును పోనిచ్చేందుకు చూసాడనే కథనాలు వెలువడ్డాయి. అది వాస్తవం కాదని, వారిద్దరూ కారు పక్కనే ఉన్నట్లు, కారు కదలక ముందే ఒక పోలీసు కారులో ఉన్న నహేల్‌ మీద తుపాకి గురిపెట్టినట్లు కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమంలో దర్శనమిచ్చాయి.కాల్పులు జరిపిన తరువాత అదుపుతప్పిన కారు సమీపంలోని ఒక స్థంభాన్ని ఢకొీట్టి ఆగింది. నీ తలలో బుల్లెట్‌ దిగుతోంది అన్న మాటలు వినిపించినట్లు ఒక టీవీ ఛానల్‌ పేర్కొన్నది. కాల్పులు జరిపినపుడు నహేల్‌తో పాటు కారులో మరో ఇద్దరు ఉన్నారని వారిలో ఒకడు పోలీసులతో మాట్లాడినట్లు, మరొకడు కారు దిగి పారిపోయినట్లు చూసిన వారు చెబుతున్నారు. కాల్పులు జరపటానికి ముందు బస్సులు వెళ్లే మార్గంలో వెళుతున్న కారును ఇద్దరు పోలీసులు మోటారు సైకిళ్ల మీద వెంబడించి ఆపేందుకు చూడగా నహేల్‌ కారును ఆపలేదు, కొంత దూరం వెళ్లిన తరువాత ట్రాఫిక్‌ కారణంగా నిలపాల్సి వచ్చింది. వెనుకనే వచ్చిన పోలీసుల్లో ఒకడు కారు పక్కకు వచ్చి కాల్పులు జరిపాడు. ఈ తీరుతో జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చైనా పర్యాటకులు వెళుతున్న బస్‌పై జరిగిన దాడి తరువాత అనేక దేశాలు తమ పౌరులను హెచ్చరిస్తూ ఫ్రాన్స్‌ వెళ్లవద్దని సలహా ఇచ్చాయి.


గతవారం రోజులుగా దేశమంతటా వేలాది మంది సాయుధ పోలీసులను మోహరించి హింసాకాండను ఆపేందుకు పూనుకున్నారు. వేలాది మందిని అరెస్టు చేశారు. హింసాకాండకు పాల్పడుతున్న వారు తన మనవడి మరణాన్ని సాకుగా చూపుతున్నారని అమ్మమ్మ నాదియా ఒక టీవీలో చెప్పింది. ఆందోళనలు విరమించాలని కోరింది. నహేల్‌ ఉదంతం ఇలాంటి పరిస్థితిని ఎందుకు సృష్టించిందన్నది ప్రశ్న. 2020లో అమెరికాలోని మినియాపోలిస్‌ పట్టణంలో పోలీసులు జార్జి ఫ్లాయడ్‌ అనే నల్లజాతి యువకుడిని ఊపిరాడకుండా చేసి చంపిన తీరును చుట్టుపక్కల ఉన్నవారు తీసిన వీడియో సంచలనంగా మారి ఆందోళనకు దారితీసింది. నహేల్‌ను కాల్చి చంపుతున్న వీడియో కూడా అలాంటి ప్రతిస్పందననే కలిగించింది.2005లో పోలీసులు వెంటాడినపుడు ప్రమాదానికి గురై ఇద్దరు మరణించినపుడు దేశమంతటా మూడు వారాల పాటు తీవ్ర ఆందోళనలు జరిగాయి. ఆ తరువాత ఇప్పుడు అదే మాదిరి ఫ్రాన్సులోని మైనారిటీలు ఆందోళనకు పూనుకున్నారు. ఫ్రెంచి పోలీసుల దుర్మార్గపూరిత వైఖరి, జాతి వివక్ష తీరుతెన్నులకు ఈ ఉదంతాలు నిదర్శనం.


నెలల తరబడి సాగిన పెన్షన్‌ సమ్మెలు,ఇతర ఆందోళనలతో అట్టుడికిన ఫ్రాన్స్‌లో అధికారాన్ని నెట్టుకువస్తున్న మక్రాన్‌ ప్రభుత్వానికి తాజా ఆందోళనతో ఎదురైన సవాలు ఎంత తీవ్రమైనదంటే బ్రసెల్స్‌లో జరుగుతున్న ఒక సమావేశం నుంచి ముందుగానే స్వదేశానికి చేరుకోవటం, జర్మనీ పర్యటన వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.పెన్షన్‌ సంస్కరణలకు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్న సమయంలో బ్రిటన్‌ రాజు చార్లెస్‌ కూడా ఈ ఏడాది ప్రారంభంలో ఫ్రెంచి టూర్‌ను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మన దేశంలోని మణిపూర్‌లో పరిస్థితి ఎంతగా దిగజారిందో తెలిసిందే. శాంతిగా ఉండాలని కనీసం ప్రధాని నరేంద్రమోడీ నోటి వెంట ఒక్క ముక్కరాలేదు, స్వయంగా పరిస్థితిని తెలుసుకొనేందుకు అక్కడకు వెళ్లలేదు. తమ రాష్ట్రంలో శాంతినెలకాల్పాలని కోరుతూ ఢిల్లీ వచ్చిన ఆ రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల ప్రతినిధులను కూడా కలుసుకొనేందుకు అవకాశం ఇవ్వలేదు. అమెరికా, ఈజిప్టు వెళ్లి సుభాషితాలు చెప్పివచ్చారు. సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ మంగళవారం నాడు దేశంలోని 220 మంది మేయర్లతో(స్థానిక సంస్థల అధిపతులు) సమావేశం కానున్నట్లు వార్తలు వచ్చాయి.


అల్జీరియా ఫ్రెంచి వలసగా ఉన్న కాలంలో ఫ్రెంచి దళాలు జరిపిన దారుణమారణకాండలు ఇప్పటికీ గుర్తుకు వస్తాయి. అనేక మంది అల్జీరియన్స్‌ ఫ్రాన్స్‌లో స్థిరపడ్డారు. అలాంటి కుటుంబానికి చెందిన వాడే గత నెలలో పోలీసుల చేతిలో మరణించిన నహేల్‌. వలస వచ్చిన ఆఫ్రికా అరబ్బులు, ఇతరులు అంటే ఫ్రెంచి అధికార యంత్రాంగానికి చిన్న చూపు, నేరగాండ్లుగా చూస్తారు.వారితో మమేకం కావటానికి బదులు దమనకాండ ప్రదర్శిస్తారు. అందుకే వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో తరచూ వివాదాలు జరుగుతుంటాయి. పశ్చిమ దేశాలలో అమెరికా తరువాత ఫ్రాన్స్‌లోనే పోలీసుల చేతుల్లో ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభం, ఆర్థిక దిగజారుడు పరిణామాలు, వలసదారుల అంశాల మీద ఐరోపా దేశాల్లో పరిస్థితి దిగజారుతోంది.ఇటువంటి స్థితిలో జనంలో ఉన్న అసంతృప్తి ఇలాంటి ఉదంతాలు జరిగినపుడు ఊహించని రీతిలో వెల్లడౌతుంది.ఫ్రాన్స్‌ ఆందోళనకు పూర్వరంగమిదే. నహేల్‌ హత్య ఊహించని ఉదంతమైనా దానికి ప్రతికూల స్పందన గూడు కట్టుకున్న అసంతృప్తికి నిదర్శనం. ఇటీవలి కాలంలో ఫ్రెంచి అధినేత మక్రాన్‌ తమకు మరింత వ్యూహాత్మక స్వయం నిర్ణయాధికారం ఉండాలని, ప్రపంచ వ్యవస్థలో బహుళనాయకత్వం ఉండాలని గట్టిగా చెబుతున్నారు. ఇది అమెరికా గురించే అన్నది స్పష్టం. మక్రాన్నుదారిలోకి తెచ్చుకొనేందుకు పెత్తందారీ ఏకఛత్రాధిపత్యం చెలాయించాలని చూస్తున్న శక్తుల హస్తం కూడా తాజా కొట్లాటల వెనుక ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు. అమెరికాకు నచ్చని వైఖరిని తీసుకున్నపుడల్లా ఫ్రాన్స్‌లో కొట్లాటలు జరగటాన్ని బట్టి ఇలా అనుమానించాల్సి వస్తోందని చెబుతున్నారు. అందువలన ఇది ఒక్క ఫ్రాన్స్‌కే కాదు, ఐరోపా సమాఖ్యకు, దేశాలకు ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు.


ఐరోపాలో ఇటీవలి కాలంలో ముస్లిం వ్యతిరేక వైఖరితో ఉన్న పచ్చిమితవాద శక్తులు రెచ్చిపోతున్నారు.ఫ్రాన్స్‌ కొట్లాటల్లో పాల్గొన్నది వలస వచ్చిన లేదా ఎప్పటి నుంచో అక్కడ స్థిరపడిన ముస్లింలు, అరబిక్‌ లేదా ఆఫ్రికన్‌ దేశాల నుంచి వలస వచ్చిన వారని చెబుతున్నారు. తాజా పరిణామాల గురించి మీడియాలో చర్చ జరుగుతున్నది. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే పోలీసులకు మరింత శిక్షణ అవసరమని, జాతి వివక్ష అంశాన్ని పరిష్కరించాలని, పేదలు-ధనికుల మధ్యపెరిగిన అంతరాన్ని తగ్గించాలని, నిరుద్యోగం పెరుగుదల గురించి సూచనలు చేస్తున్నారు. నిజానికి ఇవి కొత్తవి కాదు ఎప్పటి నుంచో ఉన్నవే. ప్రపంచీకరణ తెచ్చిన సంక్లిష్ట సమస్యలు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ప్రపంచీకరణ క్రమంలో ఉత్పత్తి ఖర్చు అధికంగా ఉందనే కారణంతో ఇతర దేశాల నుంచి పారిశ్రామిక వస్తువులను దిగుమతి చేసుకొని సేవారంగం మీద కేంద్రీకరించాయి. ఈ విధానంతో నిరంతర వృద్ది సాగదని తేలింది. ప్రపంచ అభివృద్దిలో అసమతూకానికి దారితీసింది, ప్రపంచీకరణకు వ్యతిరేకతను పెంచింది. కరోనా, ఉక్రెయిన్‌ సంక్షోభం సమస్యల తీవ్రతను వేగతరం కావించింది. ఆర్థిక మందగమన ప్రతికూల పర్యవసానాలు పేద, మధ్య తరగతి మీద భారాలను మోపుతున్నాయి.స్థిరమైన ఉపాధి, అవసరాలకు అనుగుణంగా పెరిగే రాబడి, కుటుంబ జీవనం సంతోషంగా ఉంటుందనే అంశాల మీద ఆశలను తుంచివేస్తున్నది. వీటికి జాత్యహంకారం కూడా తోడైతే ఇక చెప్పనవసరం లేదు. అసంతృప్తి కనిపించని గాస్‌ మాదిరి వ్యాపిస్తే మండటం క్షణాల్లో జరుగుతుంది. గడచిన ఐదు దశాబ్దాల్లో ప్రపంచీకరణ తెచ్చిన మార్పు ఫ్రాన్సులోనూ ఇతర పశ్చిమ దేశాల్లోనూ అనేక పరిణామాలు, ఉద్యమాలు, ఆందోళనలకు దారి తీసింది. వస్తు దిగుమతులు తమ ఉపాధిని దెబ్బతీసిందనే అసంతృప్తి రోజు రోజుకూ పెరుగుతోంది. పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే అభిప్రాయం రోజు రోజుకూ బలపడటానికి దారి తీస్తోంది. గత రెండు దశాబ్దాల్లో ఏ నేతా ఎదుర్కోనటువంటి తీవ్ర సవాలును మక్రాన్‌ ఎదుర్కొంటున్నట్లు కొందరు విశ్లేషించారు. పార్లమెంటులోని 577 స్థానాలకు గాను మక్రాన్‌ నాయకత్వంలోని రినయసెన్స్‌ పార్టీకి 251 సీట్లే ఉన్నాయి. రెండవ సారి ఎన్నికైనపుడు సంపూర్ణ మెజారిటీ రాకపోవటంతో ద్వితీయ రౌండ్‌లో మితవాది మారినే లీపెన్‌ మీద 58శాతం ఓట్లతో గెలిచాడు. మరో నాలుగు సంవత్సరాలు అధికారంలో కొనసాగేందుకు పార్లమెంటులో ప్రతిపక్షాల సహకారంతోనే గట్టెక్కే అవకాశం ఉంది.వచ్చే ఏడాది జరగనున్న పారిస్‌ ఒలింపిక్స్‌ సందర్భంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా మక్రాన్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

విదేశాల్లో చైనా పోలీస్‌ స్టేషన్ల పిట్టకథల వెనుక సిఐఏ హస్తం !

21 Wednesday Jun 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

#Anti China, china’s economic growth, CHINESE POLICE STATION, cia, Joe Biden, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఒకటి మాత్రం వాస్తవం. ప్రస్తుతం ప్రపంచంలో కరోనా తీవ్రత తగ్గిన తరువాత వివిధ దేశాల ఆర్థిక రంగాలు ఎలా కోలుకుంటాయి, ఉక్రెయిన్‌ సంక్షోభం ఎలా ముగుస్తుంది.చైనా ఆర్థిక వ్యవస్థ ఏమౌతుంది అన్నవి ఎక్కువగా చర్చలో ఉన్న అంశాలు.కొద్ది రోజులుగా చైనా ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల గురించి సోషల్‌ మీడియా, సంప్రదాయ మీడియాలో కూడా కొందరు తెగ స్పందిస్తున్నారు. విదేశాల్లో చైనా పోలీస్‌ స్టేషన్లంటూ ప్రచారం సాగుతున్నది. ప్రపంచ ఆర్థిక రంగంతో చైనా ముడిపడి ఉన్నంతగా ప్రపంచంలో ప్రస్తుతం మరొక దేశం లేదని గ్రహించాలి. 2018 తరువాత తొలిసారిగా చైనా పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ చైనా మంత్రి క్విన్‌ గాంగ్‌తో రహస్య చర్చలు జరిపినట్లు జపాన్‌ వార్తా సంస్థ నికెయి పేర్కొన్నది. దాపరికం ఏమీ లేదు, చైనాతో అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్దం అంటూ చొక్కా చేతులు మడుస్తున్న అమెరికా మూసిన తలుపుల వెనుక ఏమి చర్చించి ఉంటుంది. రెండు దేశాల సంబంధాల గురించి సుభాషితాలు చెప్పటం కాదు, ఆచరణలో చూపండి అని చైనా అధినేత షీ జింపింగ్‌ చెప్పినట్లు వెల్లడైంది. మరోసందర్భంలో దాని గురించి చూద్దాం.


చైనా ఆర్థిరంగం మందగించిందంటూ అనేక కథనాలు వెలువడుతున్న తరుణంలో అమెరికా విదేశాంగ మంత్రి బీజింగ్‌ వచ్చాడు. అందరూ చెబుతున్నట్లు నిజంగా ఆర్థికంగా కుంగిపోతుందా ? గడచిన నాలుగు దశాబ్దాలుగా అనేక మంది ఇలాంటి కథలు వినిపిస్తూనే ఉన్నారు. మరింకేమీ పని లేనట్లు కొందరు వాటిని మన జనానికి సరఫరా గొలుసు ద్వారా పంపిణీ చేస్తున్నారు. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యం జోడిస్తున్నారు. మే నెలలో ఆర్థిక పరిస్థితి గురించి ప్రతి ప్రభుత్వం వివరాలను వెల్లడిస్తున్నది. మన సర్కార్‌ మాదిరే చైనా కూడా అదే చేసింది. ఏప్రిల్‌ మాసంతో పోలిస్తే ఆర్థికరంగం పురోగతి మందగించిందని పేర్కొన్నది.దాన్ని చూపి ఇంకేముంది ఫినిష్‌ అన్నట్లుగా సంబరపడిపోతున్నారు.వేగం తగ్గటం వేరు, ప్రతికూల వృద్ది నమోదు వేరు. చైనా తనను తాను సమర్ధించుకోగలదు,లోపాలు ఉంటే సరిచేసుకోగలదు. దాన్ని ఎవరూ భుజాన వేసుకొని మోయాల్సిన అవసరం లేదు. వామపక్ష శక్తులే కాదు, ఇతరులకూ అక్కడి పరిణామాల వాస్తవాలను తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవారి కోసం కొన్ని మాటలు చెప్పుకోక తప్పదు. అంతర్జాతీయ వాతావరణం ఇప్పటికీ సంక్లిష్టంగాను, తీవ్రంగా ఉందని, ప్రపంచ ఆర్థిక పరిస్థితి స్థబ్దుగా ఉందని, తమ ఆర్థికరంగం సరిగానే కోలుకుంటున్నప్పటికీ, మార్కెట్‌ గిరాకీ ఇంకా తక్కువగా ఉందని చైనా ప్రతినిధి విలేకర్లతో చెప్పారు. ఏ రంగంలో ఎంత పురోగతి ఉంది, దేనిలో ఎంత తిరోగమనం ఉందో కూడా అంకెలను వెల్లడించారు. మందగమనాన్ని అరికట్టి వేగాన్ని పెంచేందుకు ఉద్దీపన పాకేజీ గురించి ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దానిలో భాగంగానే 2.75 శాతం ఉన్న వడ్డీ రేటును 2.65కు తగ్గించింది.


ప్రైస్‌వాటర్‌ కూపర్‌ హౌస్‌ అనే అంతర్జాతీయ సంస్థ జరిపిన సర్వే గురించి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక ఒక వార్తను ప్రచురించింది. దాని ప్రకారం 74శాతం మంది జీవన వ్యయ పెరుగుదల, తమ వ్యక్తిగత ఆర్థిక స్థితి గురించి ఆందోళన వెల్లడించగా, 63శాతం మంది సేవలు, అత్యవసరం గాని వస్తువుల గురించి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నట్లు చెప్పారట. మరి మన కేంద్ర ప్రభుత్వం పాకేజీలేమైనా ప్రకటిస్తుందా ? ఆరున్నరశాతంగా ఉన్న వడ్డీ రేటును తగ్గిస్తుందా ? ఎందుకంటే చైనా కంటే మన పరిస్థితి మెరుగ్గా వుందని చెబుతున్నారు కదా !చైనాలో వేతనాలు పెరుగుతున్నందున తక్కువ ధరలకు అక్కడ సరకులను ఉత్పత్తి చేసేందుకు వీలు లేని కారణంగా కంపెనీలు మనవైపు చూస్తున్నాయని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఎర్రతివాచీలు పరచి ఏమేమి రాయితీలు ఇచ్చేది చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మి కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. బండి గుర్రానికి గడ్డి చూపించి పరుగెత్తిస్తున్నట్లు తాము సూచించిన సంస్కరణలను అమలు జరిపితే అప్పుల పరిమితి పెంచుతామని చెబుతోంది తప్ప జన జీవన వ్యయ పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వమూ ముందుకు రావటం లేదు, రాష్ట్రాలనూ కోరిన దాఖలాలు లేవేమి ?


చైనా నుంచి తరలి పోతున్నట్లు కొన్ని కంపెనీలు ప్రకటించిన మాట నిజం, అవి మన దేశానికి వస్తాయని చెప్పిన వారి అంచనాలు తప్పిందీ అంతే వాస్తవం.2022 డిసెంబరు నాటికి తొమ్మిది నెలల కాలంలో మన దేశానికి వచ్చిన ఎఫ్‌డిఐలు 36.7 బి.డాలర్లు, అదే అంతకు ముందు ఏడాది వచ్చిన మొత్తం 43.2 బి.డాలర్లని మార్చి 20 వ తేదీ బిజినెస్‌స్టాండర్డ్‌ పత్రిక వార్త పేర్కొన్నది.చైనాలో కూడా ఎఫ్‌డిఐ పెరుగుదల తగ్గినప్పటికీ 2022లో కొత్తగా 18,532 విదేశీ పెట్టుబడి సంస్థలు నమోదైనట్లు, అంతకు ముందేడాదితో పోలిస్తే 38.3 శాతం ఎక్కువని చైనా పేర్కొన్నది. ప్రపంచమంతటా కరోనా లాక్‌డౌన్లు ఎత్తివేసినా చైనాలో 2022 డిసెంబరు వరకు దాదాపు దేశమంతటా సున్నా కోవిడ్‌ కేసులు అనే విధానంలో భాగంగా లాక్‌డౌన్‌ కొనసాగింది, తరువాత ఎత్తివేశారు. ఈ కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి తిరిగి అనేక రంగాల్లో వినిమయం పెరిగి మే నెలలో తగ్గిందని చెబుతున్నారు. దాన్ని నమ్మటమా లేదా అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే. అంతర్గత మార్కెట్‌తో పాటు అనేక ధనిక దేశాల్లో తలెత్తిన మాంద్యం కూడా తోడైంది. మన దేశంలో ఈ ఏడాది మార్చినెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటుతో పోలిస్తే వర్తమాన సంవత్సరం రేటు తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అదే చైనాకూ వర్తించుతుంది.


చైనాలో 16-24 సంవత్సరాల వయస్సు గల వారిలో మే నెలలో 20.8శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించిన అధికారిక సర్వే వెల్లడించింది. మన దేశంలో ఎంత ఉందో ప్రభుత్వం ప్రకటించిన దాఖలాల్లేవు. ఇక్కడి పరిస్థితి మామూలేగా, అద్భుతాలు సృష్టిస్తున్నదని చెబుతున్న చైనాలో అలా ఉండటం ఏమిటని కొందరు అమాయకత్వాన్ని నటిస్తారు. చైనా పురోగతి అద్భుతమనటంలో ఎలాంటి సందేహం లేదు. నూటనలభై కోట్ల మంది అవసరాలను తీర్చగల స్థాయికి ఇంకా పెరగలేదు గనుకనే కొన్ని సమస్యలు. వాటిని తీర్చేందుకు అక్కడి ప్రభుత్వం చూస్తున్నదా లేదా లేక మన ప్రధాని చెప్పినట్లు పకోడీ, బజ్జీల బండి పెట్టుకొని ఉపాధి చూసుకోండని గాలికి వదలివేసిందా అన్నదే ప్రశ్న.మన దేశంలో ఏటా 65లక్షల మంది డిగ్రీలు తీసుకొని కాలేజీల నుంచి వెలుపలికి వస్తుంటే చైనాలో దానికి రెట్టింపుగా రికార్డు స్థాయిలో 115.8లక్షల మంది ఈ ఏడాది వచ్చారు. మే నెలలో మొత్తం 3.3 కోట్ల మందికి గాను 2.6 కోట్ల మంది ఏదో ఒక ఉపాధిలో చేరారని, 60లక్షల మంది వేచి ఉన్నారని కూడా చైనా సర్వే పేర్కొన్నది. మన దేశంలోని సిఎంఐఇ సంస్థ పేర్కొన్న సమాచారం ప్రకారం పాతికేండ్ల లోపు యువత మన జనాభాలో 40శాతం ఉన్నారు. వారిలో 2022 డిసెంబరు నాటికి 45.8శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. చైనాలో 20శాతంపైన ఉంటే అక్కడి వారి గురించి కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్నవారు మన దేశంలో దానికి రెట్టింపుకు మించి ఉన్నవారి గురించి మాట్లాడరేం ? చైనాలో మే నెలలో నిరుద్యోగులు మే నెలలో 4.1శాతం, అదే మన దేశంలో ఏప్రిల్‌ నెలలో 8.11శాతం ఉంది.


చైనా గడచిన నాలుగు దశాబ్దాలలో అనేక విజయాలతో పాటు కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొన్నది. వాటిని అధిగమించి ముందుకు పోతున్నది. ఇప్పుడు కూడా అంతే. అక్కడి నాయకత్వం మరింత పరిణితి చెందింది. కిటికీ తెరిచినపుడు మంచి గాలితో పాటు క్రిమి కీటకాలు కూడా లోనికి వస్తాయి, వాటిని ఎలా అరికట్టాలో మాకు తెలుసు అని సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌ సియావో పింగ్‌ చైనా మార్కెట్‌ను తెరిచేటపుడు చెప్పాడు. ఇప్పుడూ ఎదురైన సవాళ్లను అదిగమించగలదని గత చరిత్రను బట్టి చెప్పవచ్చు. మన దేశంతో సహా విదేశాలలో 110 చైనా పోలీస్‌ స్టేషన్లు అంటూ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. తన వ్యతిరేకులను పట్టుకొనేందుకు అనధికారికంగా వాటిని తెరిచిందనే ప్రచారం ఇప్పటికీ సాగుతోంది.దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమన్నట్లుగా ఈ కట్టు కథలను పిట్ట కతలను నమ్ముతున్నవారు లేకపోలేదు.


తమ రాజధాని సియోల్‌, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న చైనా రహస్య పోలీస్‌ స్టేషన్ల గురించి విచారణ జరుపుతున్నట్లు దక్షిణ కొరియా అధికారులు తాజాగా చెప్పారు. ఒక చైనా రెస్టారెంట్‌ కేంద్రంగా పని చేస్తున్నట్లు గుర్తించారట. స్పెయిన్‌ కేంద్రంగా పని చేస్తున్న సేఫ్‌గార్డ్‌ డిఫెండర్స్‌ అనే ఒక స్వచ్చంద సంస్థ చేస్తున్న ప్రచారం ప్రకారం 53 దేశాల్లో చైనా పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయట.కరోనా మహమ్మారి విజృంభించినపుడు వివిధ దేశాల్లో ఉన్న తమ జాతీయులను స్వదేశానికి రప్పించేందుకు కొన్ని సంస్థలు పని చేశాయి తప్ప పోలీస్‌ స్టేషన్లు లేవని మే 15వ తేదీన చైనా విదేశాంగశాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. చైనా జాతీయులు నిర్వహించే రెస్టారెంట్లు, వాణిజ్య సంస్థల ముసుగులో పోలీస్‌ స్టేషన్లు నడుపుతున్నారని గత కొద్ది నెలలుగా ప్రచారం చేస్తున్నారు. న్యూయార్క్‌ నగరంలో అలాంటి ఒక పోలీస్‌ స్టేషన్ను పట్టుకున్నామని, 1998 నుంచి పని చేస్తున్న ఒక ధార్మిక సంస్థకు చెందిన ఇద్దర్ని గుర్తించినట్లు అమెరికా పోలీసులు ప్రకటించారు. నగరంలోని చైనీయులకు అవసరమైన సేవలు అందిస్తామంటూ ఆ సంస్థ బహిరంగంగానే మీడియాలో చిరునామాతో సహా ప్రకటనలు జారీ చేసినప్పటికీ అమెరికా పోలీసులు అది రహస్యంగా పని చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేశారు. బ్రిటన్‌లో కూడా ఇలాంటివే ఉన్నట్లు సేఫ్‌గార్డ్‌ డిఫెండర్స్‌ చెప్పటంతో మూడు అనుమానిత ప్రాంతాల్లో సోదా చేసిన పోలీసులు తనిఖీ చేశారు. ఎలాంటి ఆధారాలు, చట్ట ఉల్లంఘనలు కనిపించలేదని బ్రిటన్‌ భద్రతా మంత్రి టామ్‌ ప్రకటించాడు.


చైనా పోలీస్‌ స్టేషన్ల ప్రచారం సేఫ్‌గార్డ్‌ డిఫెండర్స్‌ సంస్థ నుంచే జరుగుతోందన్నది స్పష్టం. దీని కథను చూస్తే అది అమెరికా సిఐఏ ఏర్పాటు చేసినది అని స్పష్టం అవుతున్నది. మానవహక్కుల కార్యకర్త పేరుతో స్వీడిష్‌ జాతీయుడైన పీటర్‌ డాహిలిన్‌ చైనాలో 2009లో కుర్ర లాయర్లు, గ్రామీణులకు సాయం చేసే పేరుతో చైనా యాక్షన్‌ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. చేస్తున్న సాయం సంగతి పక్కన పెడితే ప్రభుత్వ వ్యతిరేకతను రెచ్చగొట్టటం అసలు లక్ష్యంగా వెల్లడి కావటంతో 2016 చైనా అధికారులు డాహ్లిన్‌తో సహా పని చేస్తున్న వారందరినీ పట్టుకొని జైల్లో పెట్టారు. కొందరు కనిపించకుండా పోయారు. డాహ్లిన్‌ కేవలం 23 రోజులు మాత్రమే జైల్లో ఉన్నాడు. తాను చట్టవిరుద్దంగా పని చేశానని అంగీకరించటంతో విడుదల చేసి పది సంవత్సరాల పాటు తిరిగి చైనాలో అడుగు పెట్టకుండా నిషేధం విధించారు. అప్పటి నుంచి చైనా గురించి ప్రపంచానికి కట్టుకథలు చెప్పటం ప్రారంభించాడు. నేషనల్‌ ఎండోమెంట్‌ ఫర్‌ డెమోక్రసీ(ఎన్‌ఇడి) అనే పేరుతో పనిచేసే అమెరికా సంస్థ ప్రపంచంలో తప్పుడు ప్రచారం, కట్టుకథలు అల్లే వారికి, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారకులకు పెద్ద మొత్తంలో నిధులు అందచేస్తుంది. దీనికి సిఐఏ మార్గదర్శకత్వం ఉంది. ఆ సంస్థ నుంచి డాహ్లిన్‌ నిధులు పొందినట్లు 2017లో హాంకాంగ్‌ ఫ్రీ ప్రెస్‌ అనే కమ్యూనిస్టు వ్యతిరేక పత్రికతో చెప్పాడు. అమెరికా ఎన్‌ఇడి మాదిరి ఐరోపా ఇఇడి సంస్థ డాహ్లిన్‌కు పెద్ద మొత్తంలో నిధులు అందచేసింది. ఈ సంస్థలు అనేక దేశాల్లో అక్కడి పాలకుల మీద జనాలను రెచ్చగొట్టి వాటికి రంగుల విప్లవాలని పేరు పెట్టి ప్రచారం చేసిన చరిత్ర ఉంది, ఇప్పటికీ అదే జరుగుతోంది.చైనా గురించి ఎన్నిక కథలు చెప్పినా దాని పురోగతి ఆగటం లేదు, ఆగదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d