• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Readers News Service

ముందస్తు ఎన్నికల కోసం కనీస మద్దతు ధరల పెంపు ఆలస్యం చేశారా ?

06 Friday Jul 2018

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Prices

≈ 1 Comment

Tags

Farm prices, loksabha midterm elections, MSP, msp announcement, NAENDRAMODI

Image result for why narendra modi delayed msp announcement

ఎం కోటేశ్వరరావు

ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని దేవులపల్లి కృష్ణ శాస్త్రి రాశారు. ఇది ముందస్తు ఎన్నికల తరుణమని అందుకే నరేంద్రమోడీ పంటల కనీస మద్దతు ధరలను ఆలస్యంగా ప్రకటించారని విమర్శలు ఎదుర్కొన్నారు.వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌(సిఏసిపి) 2018-19 ఖరీఫ్‌ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి మార్చి నెలలోనే సమర్పించింది. రేపేమవుతుందో తెలియని స్ధితిలో వున్నంతలో ఏ పంటకు ధర ఆకర్షణీయంగా వుంటే రైతాంగం వాటిని ఎంచుకొనేందుకు వీలుగా సాగుకు ముందే ప్రకటించాల్సిన వాటిని సాగు ప్రారంభమైన నెల రోజుల తరువాత కేంద్రం ప్రకటించింది. ఎన్నికల కోసం ఆలస్యం చేశారని విమర్శకులు తప్పుపడితే ఆశ్చర్యం ఏముంది, తప్పేముంది?

వెనుకో ముందో ప్రభుత్వం ఏదో ఒకటి చేసింది, పెంపుదలను అభినందిస్తారా లేదా అని మోడీ మద్దతుదారులు అడగటం సహజం. నాలుగు సంవత్సరాల పాలన తరువాత తన ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చానని నరేంద్రమోడీ స్వయంగా ప్రకటించారు. అంటే స్వామినాధన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులు అమలు జరిగినట్లే రైతాంగం భావించాలి. సగటు వుత్పత్తి ధరపై 50శాతం అదనంగా కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) నిర్ణయించాలన్నది 2004-06 మధ్య కాలంలో ఆయన సమర్పించిన నివేదికలలో చేసిన సిఫార్సులలో ఒకటి. దానిని ఇప్పుడు అమలు చేశామని మోడీ, బిజెపి నేతలు చెబుతున్నారు. దీన్ని అమలు జరిపేందుకు ప్రభుత్వానికి పదిహేను వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని కేంద్రహోం మంత్రి రాజనాధ్‌ సింగ్‌ ప్రకటించారు. ఇంత స్వల్ప భారం మాత్రమే పడేదానికి నాలుగు సంవత్సరాలు ఎందుకు పట్టిందన్నది ప్రశ్న.

ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రచారం, వాదన, ధరల నిర్ణయానికి తీసుకున్న ప్రాతిపదికలు మోసపూరితమైనవని ఆలిండియా కిసాన్‌సభ వంటి సంస్ధలు పేర్కొన్నాయి. ఎన్నికల తాయిలం అని కాంగ్రెస్‌ పేర్కొన్నది. క్వింటాలు ధాన్యం వుత్పత్తికి రైతుకు రు.1166 ఖర్చు అవుతుందని లెక్కగట్టి దాని మీద యాభైశాతం కలిపితే రు. 1750 వచ్చేందుకు గాను గత ఏడాది వున్న ధరమీద 200 రూపాయలు పెంచారు. ఇలాగే మిగతా పంటల ధరలను నిర్ణయించారు. వివిధ రాష్ట్రాలలో ఒకే పంటల వాస్తవ సాగు వ్యయం భిన్నంగా వుంటుంది. అందువలన కేంద్రం ప్రాతిపదికగా తీసుకున్న ధర శాస్త్రీయమైనది కాదన్నది స్పష్టం. తెలంగాణాలో వాస్తవ వ్యయం క్వింటాలుకు రు2,158 అని వ్యవసాయశాఖ లెక్క కడితే కేంద్రం తీసుకున్న సగటు ప్రాతిపదిక రు. 1166, నిర్ణయించిన ధర రు. 1745. ఇలాగే అన్ని పంటల విషయంలోనూ జరిగింది. పత్తి (పొట్టి, మధ్య రకం పింజ) సాగు ఖర్చు రు.3433 గా లెక్కించి మద్దతు ధరను రు.5150గానూ పొడవు పింజ( తెలుగు రాష్ట్రాలలో పండించే రకాలు)కు రు.5450గా నిర్ణయించారు. ఇవి వాస్తవ ఖర్చును ప్రతిబింబించేవి కాదన్నది వేరే చెప్పనవసరం లేదు.

ధరల నిర్ణయ ప్రాతిపదికలోపాల తీరుతెన్నులను చూద్దాం.వ్యవసాయ ధరల, ఖర్చుల కమిషన్‌(సిఏసిపి) వ్యవసాయ ఖర్చును లెక్కించేందుకు ఎంచుకున్న పద్దతిలోనే లోపం వుంది. అది మూడు రకాలగా ఖర్చులను చూపింది. వుదాహరణకు ధాన్య వుత్పత్తికి అది రు.865 వాస్తవ ఖర్చు ఎ2, రు.1166 వాస్తవ ఖర్చు ఎ2 ప్లస్‌ రైతు శ్రమ ఎఫ్‌ఎల్‌, రు 1560 సి2( దీనిలో వాస్తవఖర్చు ఎ2, రైతు శ్రమ ఎఫ్‌ఎల్‌, కౌలు, బ్యాంకు వడ్డీలు, ఇతరాలు సి2, అన్నీ వున్నాయి.) గిట్టుబాటు ధర నిర్ణయించేటపుడు ప్రభుత్వాలు సి2ను పరిగణనలోకి తీసుకోవాలి. దానికి బడుదు ఎ2ప్లస్‌ ఎఫ్‌ల్‌ 1166ను మాత్రమే తీసుకొని దానిలో యాభైశాతం కలిపితే వచ్చే మొత్తాన్ని కేంద్రం నిర్ణయించి, ఇదే గిట్టుబాటు ధర, మా వాగ్దానాన్ని నెరవేర్చామని చెబుతోంది. సి2ను పరిగణనలోకి తీసుకుంటే ధాన్యం ధర రు.2,340 కావాలి. కానీ కేంద్రం రు.1750,1770 వంతున నిర్ణయించింది. అన్ని పంటలకూ ఇదే తీరు. పత్తికి రు 6,771కి గాను 5150,5450 వంతున నిర్ణయించింది.కేరళ ధాన్యానికి క్వింటాలుకు రు.780 బోనస్‌గా ఇస్తోంది.1016-17లో కేరళలో రోజు వారీ వ్యవసాయ కార్మికుల సగటు వేతనం రు. 673 కాగా దేశ సగటు 270, అంతకంటే ఎక్కువగా తమిళనాడు 411, హిమచలప్రదేశ్‌ 394, హర్యానా 365, పంజాబ్‌ 314, కర్ణాటక 318, రాజస్ధాన్‌ 281, ఆంధ్రప్రదేశ్‌ 276లు దేశ సగటు కంటే తక్కువగా పశ్చిమ బెంగాల్‌ 259, మహారాష్ట్ర 258, అసోం 256, యుపి 249, బీహార్‌ 230, గుజరాత్‌ 223, ఒడిసా 217 ఎంపీ 202 ఇస్తున్నాయి. ఇలాంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకోకుండా దేశమంతటికీ రూళ్ల కర్ర సిద్ధాంతాన్ని అమలు జరపటం శాస్త్రీయం అవుతుందా?

కనీస మద్దతు ధరలను నిర్ణయించటం ఒక ఎత్తు. దానిలో లోపాల సంగతి చూశాము. వాటిని అమలు జరిపే యంత్రాంగం లేదు, ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్దలు అరకొరగా కొనుగోళ్లు, అదీ ప్రయివేటు మార్కెట్‌ కనుసన్నలలో మాత్రమే చేస్తున్నాయి. కొన్ని పంటల ధరలు కనీస మద్దతు కంటే ఎక్కువ వుంటున్నాయి. వుదాహరణకు పత్తి విషయం తీసుకుందాం. కనీస మద్దతు కంటే ధరపడిపోయినపుడు సిసిఐ రంగంలోకి వచ్చి మద్దతు ధరకే పరిమితం అవుతోంది. వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌(సిఏసిపి) 2018-19 ఖరీఫ్‌ నివేదికలో అందచేసిన వివరాల ప్రకారం 2013-17 మధ్య ఐదు సంవత్సరాల కాలంలో క్వింటాలు ముడి పత్తి(పొట్టి పింజ) కనీస మద్దతు సగటు ధర రు. 3,763. ఇదే కాలంలో దేశీయ మార్కెట్లో రైతుకు వచ్చిన సగటు ధర రు. 4616, అంతర్జాతీయ మార్కెట్లో లభించినది రు.4674. అంటే కనీస మద్దతు ధర మార్కెట్‌ ధర కంటే తక్కువగానే వుంది. కొన్ని త్రైమాసిక సగటు ధరలను చూసినపుడు కొన్ని సార్లు దేశీయ మార్కెట్లో అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే ఎక్కువగానూ, కొన్నిసార్లు తక్కువగానూ వున్నాయి. ఐదేండ్ల సగటు స్వల్పంగా ఎక్కువగా వున్నాయి. ప్రభుత్వ విధానాలు కూడా కొన్ని సార్లు రైతాంగాన్ని దెబ్బతీస్తున్నాయి.

ప్రభుత్వ నియంత్రణల విధానానికి స్వస్తిపలికినట్లు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడిన వుదంతాలు వున్నాయి. గత ఎన్‌డిఏ పాలనా కాలంలో 2001జూలై నుంచి పత్తి ఎగుమతులపై పరిమాణ ఆంక్షలను ఎత్తివేసి సాధారణ ఎగుమతుల జాబితాలో చేర్చారు. దేశీయంగా ధరలు పెరుగుతుండటంతో మిల్లు యజమానుల వత్తిడికి లంగిన యుపిఏ సర్కార్‌ 2010 ఏప్రిల్‌లో క్వింటాలు పత్తి (దూది) ఎగుమతిపై రు.2500 సుంకం విధించి నిరుత్సాహపరచింది. ఎగుమతులను పరిమితుల ఆంక్షల జాబితాలో పెట్టింది. అదే ఏడాది ఆగస్టు నెలలో ఎలాంటి పన్ను లేకుండా ఎగుమతులను అనుమతించింది. ఒక వైపు ఎగుమతులతో పాటు దిగుమతులను కూడా మన సర్కార్‌ ప్రోత్సహించింది. కొన్ని సంవత్సరాలు ఐదు, పదిశాతం దిగుమతి విధిస్తే కొన్నేండ్లు ఎలాంటి పన్ను లేకుండా అనుమతించింది. ఈ చర్య రైతాంగంపై ప్రతికూల ప్రభావం చూపింది. మన పత్తి ఎగుమతులలో ఎగుడుదిగుడులు కూడా రైతాంగానికి లభించే ధరపై ప్రభావం చూపుతున్నాయి. గరిష్టంగా 2013-14లో గరిష్టంగా 18.6లక్షల టన్నుల పత్తి ఎగుమతి జరిగింది. అది 2016-17 నాటికి 9.1లక్షలకు పడిపోయింది. దీనికి ప్రధాన కారణం చైనా దిగుమతులను గణనీయంగా తగ్గించిందని చెబుతున్నారు. అది వాస్తవమే అయినప్పటికీ నరేంద్రమోడీ సర్కార్‌, సంఘపరివార్‌ నిత్యం చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటం పత్తి దిగుమతులపై ప్రభావం చూపిందా అన్న కోణంలో కూడా ఆలోచించటం అవసరం. వ్యవసాయ మన రైతాంగానికి గిట్టుబాటు గాకపోవటానికి ప్రభుత్వాలు పెట్టుబడిని తగ్గించటమే. దిగుబడులు పెంచటానికి అవసరమైన వంగడాల సృష్టికి ఖర్చుతోకూడిన పరిశోధనలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇవ్వటం లేదు. ఫలితంగా పత్తి దిగుబడి హెక్టారుకు మన దేశంలో గత పది సంవత్సరాలలో 5 నుంచి4.8 క్వింటాళ్లకు పడిపోయింది. ప్రపంచ సగటు ఎనిమిది క్వింటాళ్లు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలలో 35.9 నుంచి 19.1శాతం వరకు దిగుబడులు తగ్గటం గమనించాల్సిన అంశం. 2008-12 మధ్య దేశ సగటు దిగుబడి ఐదు క్వింటాళ్లు కాగా తెలుగు రాష్ట్రాలలో 5.4 వుంది, అదే 2013-17 మధ్య దేశ సగటు 4.8 కాగా తెలుగు రాష్ట్రాలలో 4.4కు పడిపోయింది. పంటల దిగుబడులలో మన దేశం చాలా వెనుక బడి వుంది. ఇది కూడా మన రైతాంగాన్ని దెబ్బతీస్తోంది.(హెక్టారుకు కిలోలు)

పంట             ప్రపంచ సగటు     గరిష్టం               భారత్‌                రాష్ట్రాలు

ధాన్యం           4,636.6      చైనా6,932.4      2,400.2      పంజాబ్‌ 3974.1

మొక్కజన్న     5,640.1      అమెరికా10960.4  2,567.7      తమిళనాడు 7010

పప్పులు         731.2       ఆస్ట్రేలియా 5540.3    656.2       గుజరాత్‌ 931

కందిపప్పు       829.9      కెన్యా 1612.3         646.1       గుజరాత్‌ 1124.8

సోయాబీన్స్‌      2,755.6    అమెరికా 3,500.6     738.4         ఎంపి 831

వేరుశనగ      1,5,90.1      అమెరికా 4118.6       1,464.9  తమిళనాడు 2,574.3

ప్రపంచ మార్కెట్లో మన మొక్కజన్నల కంటే రేట్లు తక్కువగా వుండటంతో ఇటీవలి కాలంలో దాదాపు మొక్క జన్నల ఎగుమతి ఆగిపోయింది. 2012-13లో 47.9లక్షల టన్నులు ఎగుమతి చేస్తే 2016-17 నాటికి 5.7లక్షల టన్నులకు పడిపోయింది. పప్పు ధాన్యాలన్నీ అంతర్జాతీయ ధరలకంటే మన దేశంలో ఎక్కువగా వుండటంతో తక్కువ ధరలకు వ్యాపారులు దిగుమతిచేసుకుంటున్నారు. మన మార్కెట్లో కనీస మద్దతు ధర కూడా గతేడాది రైతాంగానికి రాలేదు. గత రెండు సంవత్సరాలలో బహిరంగ మార్కెట్లో కనీస మద్దతు ధరలకంటే తక్కువకే రైతాంగం అమ్ముకోవాల్సి వచ్చింది. గత రెండు సంవత్సరాలలో పప్పుధాన్యాల ధరలు కనీస మద్దతు కంటే మార్కెట్లో తక్కువ వున్నాయి. వాటిని అమలు జరిపిన దిక్కులేదు. మన వ్యవసాయ ఎగుమతులు 2013-14 నుంచి 2016-17వరకు 268.7 నుంచి 233.6 బిలియన్‌ డాలర్లకు పడిపోగా, దిగుమతులు 109.7 నుంచి 185.3 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి.

చివరిగా మోడీ సర్కార్‌ ప్రకటన ఎన్నికలకోసం చేసినదని స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి జిమ్మిక్కులు గత యుపిఏ ప్రభుత్వం చేసింది. అది నడచిన బాటలోనే ఎన్‌డిఏ నడుస్తోంది. వుదాహరణకు గత పద్దెనిమిది సంవత్సరాలలో పత్తి ధరలను పెంచిన తీరు చూద్దాం. వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ అసలు రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసింది. 2000-01 నుంచి 2003-04 వరకు పొడవు పింజ పత్తి కనీస ధరను 1825,1875,1895,1925 మాత్రమే చేసింది. తరువాత అధికారానికి వచ్చిన యుపిఏ ఒకటి 2009 ఎన్నికలను దృష్టిలో వుంచుకొని 2007-08లో వున్న 2030 ధరను ఏకంగా 3000కు పెంచింది. తరువాత 3000,33300కు పెంచి తరువాత 2014 ఎన్నికలను దృష్టిలో వుంచుకొని ఆమొత్తాన్ని 4000 చేసింది.నరేంద్రమోడీ సర్కార్‌ దానిని 4050 నుంచి నాలుగు సంవత్సరాలలో 4,320కి పెంచి ఇప్పుడు రు.5450 చేసింది. ఈ విషయంలో మన్మోహన్‌ సింగ్‌, నరేంద్రమోడీ ఇద్దరూ దొందూ దొందే అంటే కరెక్టుగా వుంటుందేమో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికాలో రైతాంగానికి సబ్సిడీల తీరు తెన్నులు !

02 Monday Jul 2018

Posted by raomk in Current Affairs, Farmers, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

american farmers, Farm bill 2018, Farmers, subsidies to american farmers, subsidies to farmers

Image result for agriculture mechanisation

ఎం కోటేశ్వరరావు

అనుచిత వాణిజ్య లావాదేవీలకు పాల్పడుతున్నదనే సాకుతో చైనానుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై 50బిలియన్‌ డాలర్ల సుంకాలను ప్ర కటించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇది రాస్తున్న సమయానికి మరొక 200 బిలియన్‌ డాలర్ల మేరకు పన్ను విధించేందుకు సరకుల జాబితాను తయారు చేయాలంటూ అధికార గణానికి ఆదేశాలిచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఆందోళనతో వున్న అమెరికా రైతాంగం ఈ వార్తతో మరింత వత్తిడికి లోనైనట్లు వార్తలు వచ్చాయి. అమెరికా వ్యవసాయం అంటే పెద్ద రైతులతో పాటు కార్పొరేట్‌ల ప్రయోజనాలు ఇమిడి వుంటాయి. అందుకే వాణిజ్య యుద్దమంటే అవి గజగజలాడతాయి. అమెరికాలోని ప్రతి రైతుకు వచ్చే ఆదాయంలో వందకు ఇరవై రూపాయలు ఇతర దేశాలతో జరిపే అమెరికా వాణిజ్యంపై ఆధారపడి వుంటాయని అంచనా. అందువలన సహజంగానే వారి భయం వారికి వుంటుంది. ఇతర దేశాలతో ట్రంప్‌ సామరస్యంగా వున్నంత వరకు వారికి ఢోకాలేదు, తగాదా పెట్టుకుంటే తమ స్ధితి ఏమవుతుందో తెలియని అయోమయంలోకి వారు పోతారు.

అమెరికాలో ఏటా 6కోట్ల టన్నుల గోధుమలు పండుతాయి. వాటిలో సగాన్ని ఎగుమతి చేయాల్సిందే. నిజంగా వాణిజ్య యుద్ధం వాస్తవ రూపందాల్చితే వాటిని ఎక్కడ అమ్ముకోవాలన్నది ప్రశ్న. ట్రంప్‌ ఒక్క చైనా మీదనే కాదు అనేక దేశాల మీద తొడగొడుతున్నాడు. కెనడా, మెక్సికో, ఐరోపా యూనియన్‌ కూడా ప్రతి చర్యలు తీసుకొనేందుకు సిద్దమౌతున్నాయి. అమెరికా ఏటా 140 బిలియన్‌ డాలర్ల మేర వ్యవసాయ వుత్పత్తులను ఎగుమతి చేస్తోంది.కెనడా, మెక్సికోలు 39, చైనా 20, ఐరోపా యూనియన్‌ 12 బిలియన్‌ డాలర్ల మేర దిగుమతి చేసుకుంటున్నాయి. నిజంగా వాణిజ్య యుద్దమే జరిగితే సగం ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. పర్యవసానాలు ఎలా వుంటాయో తెలియదు కనుక ఆచి తూచి వ్యవహరించాలని అనేక మంది సూచిస్తున్నా ట్రంప్‌ దూకుడు తగ్గటం లేదు. ఇది ప్రపంచీకరణ యుగం, ఎక్కడ ఏ వస్తువు లేదా విడి భాగం తయారైతే అక్కడి నుంచి మరికొన్ని చోట్ల కూర్చి వస్తువులను తయారు చేస్తున్నారు. అందువలన చైనా నుంచి అటువంటి వాటి మీద అమెరికా లేదా మరొక దేశం పన్నులు విధిస్తే దాని పర్యవసానం ఒక్క చైనాకే అనేక దేశాలమీద పడుతుంది. చైనాగనుక ప్రతికూల చర్యల్లో భాగంగా సోయా, పందిమాంస వంటి వాటిపై పన్నులు విధిస్తే మొత్తంగా అమెరికాకు పెద్దగా దెబ్బతగలకపోవచ్చుగానీ రైతాంగానికి పెద్ద దెబ్బ. గత ఏడాది చైనా దిగుమతి చేసుకున్న 95మిలియన్‌ టన్నుల సోయాను ఈ ఏడాది వంద టన్నులకు పెంచనుంది. వాటిలో ఒక్క అమెరికా ఎగుమతులే 33 మిలియన్‌ టన్నులు. వాటి మీద 25శాతం అదనంగా దిగుమతి పన్ను విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. అందువలన అంత పన్ను చెల్లించి దిగుమతి చేసుకోవటమా ప్రత్యామ్నాయం చూసుకోవటమా అన్నది చైనా ముందు వుంది. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌లో గతేడాది 119 మిలియన్‌ టన్నుల సోయా వుత్పత్తి కాగా దానిలో 51మిలియన్‌ టన్నులు చైనాకు ఎగుమతి చేశారు. ఇది 2016కంటే 33శాతం ఎక్కువ. అమెరికా బెదిరింపులకు లొంగకుండా వుండేందుకు చైనా తన ప్రయత్నాలలో తాను వున్నట్లు ఈ పరిణామం తెలియ చేస్తోంది.బ్రెజిల్‌ కరెన్సీ విలువ తక్కువ వుండటంతో అమెరికా కంటే తక్కువ ధరలకు అది ఎగుమతి చేయగలుగుతోంది. దీంతో ఇటు చైనా వినియోగదారులు, అటు బ్రెజిల్‌ రైతులు లబ్దిపొందుతున్నారు.

మూడు దశాబ్దాల నాటి అంటే 1986ా88 సంవత్సరాలలో వున్న ప్రపంచ ధరల సగటు ప్రాతిపదికన ప్రపంచ వాణిజ్య సంస్ధ సబ్సిడీలను లెక్కిస్తోంది. అందువలన అప్పటి మన కనీస మద్దతు ధరలను ఇప్పటితో పోల్చితే చాలా ఎక్కువగా వున్నట్లు కనిపించటం సహజం, దాన్ని చూపే అమెరికా మన మీద డబ్ల్యుటివోలో ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో ఆ సంస్ధలో వున్న నిబంధనల లసుగు లేదా ధనిక దేశాలకు అనుగుణంగా రూపొందించిన ఫార్ములాలకు అనుగుణంగా అనేక రూపాలలో తన రైతాంగానికి పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తూ మనవంటి వర్ధమాన దేశాల రైతాంగాన్ని దెబ్బతీసేందుకు పూనుకుంది. నిబంధనావళి ప్రకారం మొత్తం వ్యవసాయ పంటల విలువలో పదిశాతం మేరకు సబ్సిడీలు ఇవ్వటానికి అవకాశం వుంది. ఆ మొత్తంలో ఏ పంటకు ఎంత ఇవ్వాలన్నది తమ ఇష్టమని ధనిక దేశాలు వాదిస్తున్నాయి. వుదాహరణకు వంద రకాల పంటలకు అనుమతించిన సబ్సిడీ మొత్తం వంద రూపాయనుకుందాం. ఒక్కొక్క పంటకు రూపాయి బదులు పది పంటలకు పది రూపాయల చొప్పున ఇస్తే అభ్యంతర పెట్టకూడదని అమెరికా వాదిస్తోంది. ఆ పద్దతిలో అమెరికా, ఐరోపా యూనియన్‌లో అనేక పంటలకు ఇచ్చే సబ్సిడీ మొత్తాలు 50శాతానికి మించాయి. వుదాహరణకు అమెరికాలో వరికి 59శాతం సబ్సిడీ ఇస్తున్నారు. 2015 నవంబరులో మింట్‌ పత్రికలో డాక్టర్‌ రవికాంత్‌ రాసినదాని ప్రకారం అమెరికాలో ప్రతి రైతుకు 50వేల డాలర్ల మేర సబ్సిడీ ఇవ్వగా మన దేశంలో ఇచ్చినది కేవలం 200డాలర్లే. అక్కడి వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీ జనానికి వూబకాయం పెరిగేందుకు తోడ్పడుతోందని సైంటిఫిక్‌ అమెరికన్‌ అనే పత్రిక రాసింది. ఐరోపాయూనియన్‌ వుమ్మడి బడ్జెట్‌లో 40శాతం వ్యవసాయ సబ్సిడీలకే కేటాయిస్తున్నారు. ఈ విషయంలో అమెరికాాఐరోపా యూనియన్‌ మధ్య కూడా విబేధాలు వున్న కారణంగానే వ్యవసాయంపై గత పదిహేను సంవత్సరాలుగా ఒప్పందం కుదరటం లేదు. మన దేశం నుంచి ఎగుమతులకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు, సామర్ధ్యనిర్మాణం, ఎగుమతులకు ఇచ్చే ప్రోత్సాహకాలను కూడా రైతుల ఖాతాలో జమచేసి అమెరికా అభ్యంతర పెడుతోంది.

అమెరికా లేదా ఇతర ఐరోపా ధనిక దేశాలు మన వ్యవసాయం మీద దాడిని ప్రధానంగా కేంద్రీకరించాయి. భారీ సబ్సిడీలతో వారి వుత్పత్తులను మన దేశంలో కుమ్మరించాలని చూడటం ఒకటైతే మన వుత్పత్తులు ప్రపంచమార్కెట్లో వాటికి పోటీ రాకుండా చూడటం మరొకటి. మన దేశంలో ఏదో ఒక ఏడాదో, రెండుసార్లో తప్ప మొత్తం సబ్సిడీలు జిడిపిలో ఒకశాతానికి మించటం లేదు. ఇదే సమయంలో పారిశ్రామిక, వాణిజ్యాలకు ఏటా ఇస్తున్న పన్ను రాయితీల మొత్తం నాలుగు నుంచి ఆరులక్షల కోట్ల వరకు వుంటోంది. ఇది జిడిపిలో 5-8శాతం. ఈ రంగాలలో అమెరికా, ఇతర ధనిక దేశాల నుంచి వస్తున్న ప్రత్యక్ష పెట్టుబడులు లేదా సంస్ధల వాటాల కొనుగోలు చేస్తున్నవారికి ఈ మొత్తంలో లాభాల రూపంలో వాటా ముడుతోంది కనుక ఆ దేశాలకు ఎలాంటి అభ్యంతరాలు కనిపించటం లేదు.

Image result for subsidies to us farmers 2018

ఇక అమెరికాలో ఇస్తున్న సబ్సిడీల తీరుతెన్నుల గురించి చూద్దాం. ఒక తాజా నివేదిక ప్రకారం సబ్సిడీ లేదా ప్రకృతి వైపరీత్యాల నష్ట పరిహారంగాని 1985-2016 మధ్య 27,930 వ్యవసాయ క్షేత్రాల యజమానులకు చెల్లించిన మొత్తం 19బిలియన్‌ డాలర్లు. ప్రస్తుతం వున్న రూపాయి మారకపు విలువలో ఏడాదికి సగటున ఒక్కొక్క యజమాని పొందిన మొత్తం నాలుగు కోట్ల 67లక్షలకు పై మాటే. గరిష్టంగా ఒక యజమాని పొందిన మొత్తం 76కోట్ల రూపాయలకు పైగా వుంది. రానున్న పది సంవత్సరాలలో వ్యవసాయ సబ్సిడీల నిమిత్తం 868 బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని ఎవరికి ఎంత ఎలా చెల్లించాలనే అంశంపై వివాదం తలెత్తటంతో మే నెలలో వ్యవసాయ బిల్లుకు ఆమోదం లభించలేదు. సవరణలతో మరోమారు ఓటింగ్‌కు రానున్నది. పెద్ద యజమానులకు మరింత ఎక్కువ, చిన్న వారికి తగ్గించే ప్రతిపాదనలు వున్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం వున్న చట్ట ప్రకారం వ్యవసాయ నష్టభయం కింద నమోదు చేసుకున్న రైతులకు ఒక వ్యక్తికి ఏడాదికి లక్షా 25వేల డాలర్లకు మించి చెల్లించే అవకాశం లేదు. ఏడాదికి తొమ్మిది లక్షల ఆదాయపరిమితిని విధించారు. ఈ పరిమితిని తగ్గించి పరిహార మొత్తాన్ని పెంచాలనే ప్రతిపాదనలున్నాయి. రైతుల బీమా ప్రీమియంలో ప్రభుత్వం 62శాతం మొత్తం చెల్లిస్తోంది. అక్కడ కూడా చిన్న రైతులకు అన్యాయం జరుగుతోందనే విమర్శలున్నాయి. బీమా కంపెనీలకు ప్రభుత్వం 14శాతం లాభానికి గ్యారంటీ ఇస్తున్నది. ఆ మేరకు ఎంత లాభం తగ్గితే అంత ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రతిదానికీ నిర్ణీత ధర నిర్ణయించే అమెరికాలో రైతులకు సరఫరా చేసే నీటిని మార్కెట్‌ ధరలో కొన్ని సందర్భాలలో పదిశాతం మొత్తానికే అందచేస్తున్నారు. అక్కడి వ్యవసాయదారులలో పదిశాతం బడా యజమానులకు 90శాతం సబ్సిడీ అందుతున్నది. 2015లో దేశంలోని 21లక్షల మంది రైతులలో రెండులక్షల పదివేల మందికి ప్రభుత్వ చెల్లింపులలో 70, పంటల బీమా సొమ్ములో 78శాతం దక్కింది. మిగిలిన వారిలో 80శాతం మందికి నామమాత్రం లేదా అసలు అందని పరిస్ధితి వుంది.చెరకు సాగులో రసాయన ఎరువుల వాడకం వలన ఎవర్‌గ్లాడ్స్‌ ప్రాంతంలో వాగులు, వంకలలో చేరిన కాలుష్యాన్ని తొలగించేందుకు 2035నాటికి 10.5 బిలియన్‌ డాలర్లను ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే లాభాలు యజమానులకు, కాలుష్య పరిహారం ప్రజలు చెల్లించాలన్నమాట. వ్యవసాయ వస్తువులతో వ్యాపారం చేసే వారికి కూడా ఏటా 20బిలియన్‌ డాలర్ల మేర ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నది.

అమెరికా వ్యవసాయ శాఖ సమాచారం ప్రకారం ప్రత్యక్షంగా పరోక్షంగా 60కిపైగా పద్దతులలో రైతులకు సాయం చేస్తున్నారు. 2014లో వ్యవసాయ పరిశ్రమలో పని చేసిన వారు 8.27లక్షలు, మొత్తం వ్యవసాయ క్షేత్రాలు 20,48,000, సగటున ఒక వ్యవసాయ క్షేత్రం 440 ఎకరాలుంటుంది. పదహారు బీమా కంపెనీలు పంటల బీమా చేస్తున్నాయి. ప్రీమియం సబ్సిడీగా గత ఐదు సంవత్సరాలలో సగటున 6.7బిలియన్‌ డాలర్ల సబ్సిడీ చెల్లించారు.బీమా కంపెనీలకు ఇచ్చిన సబ్సిడీ 1.5బిలియన్‌ డాలర్లు, వాటికి వచ్చిన నష్టానికి పరిహారం 30కోట్ల డాలర్లు, ప్రభుత్వ యంత్రాంగ ఖర్చు 20కోట్ల డాలర్లు. వందరకాల పంటలకు బీమా వర్తిస్తుంది. బీమా కంపెనీలు అక్రమాలకు పాల్పడటం షరా మామూలు. ప్రభుత్వం సగటున 62శాతం బీమా సొమ్ము చెల్లిస్తోంది.2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రైతులు చెల్లించిన ప్రీమియం కంటే అదనంగా 65బిలియన్‌ డాలర్లు పొందారు. బీమాకు అందరూ అర్హులే కావటంతో బిలియనీర్లు కూడా సబ్సిడీలను పొందుతున్నారు.

వ్యవసాయ నష్టభయం కింద ఒక రైతు ఎకరా ఆదాయం లేదా ఆ ప్రాంతంలో ఎకరాకు గ్యారంటీ ఆదాయం కంటే తక్కువ పొందితే వారికి గ్యారంటీ ఇచ్చిన మేరకు పరిహారం చెల్లిస్తారు. ఇరవై పంటలకు దీనిని వర్తింప చేస్తున్నారు.గతేడాది 3.7బిలియన్‌ డాలర్లు చెల్లించారు. పార్లమెంట్‌ సూచించిన పంట జాతీయ సగటు ఆదాయం కంటే తక్కువ వచ్చిన రైతులకు ఆ మేరకు చెల్లిస్తారు. గతేడాది ఆ మొత్తం 3.2బిలియన్‌ డాలర్లుంది.పై రెండు పధకాలలో రైతులు దేనినో ఒకదానిని ఎంచుకోవాలి. ఇదే సమయంలో వారికి పంటల బీమా పరిహారం అదనం. కొన్ని ప్రాంతాలలో భూమిని అభివృద్ధి చేసినందుకు, మరికొన్ని చోట్ల సాగు నిలిపివేసి భూమిని కాపాడినందుకు కూడా ఇస్తున్న సొమ్ము మొత్తం ఏడాదికి ఐదు బిలియన్‌ డాలర్లుంది. పంట సమయంలో తక్కువ ధరలకు అమ్ముకోకుండా రైతాంగానికి రుణాలు ఇస్తే మంచి ధర వచ్చే వరకు పంటలను నిలువ చేసుకొనే పధకం వుంది. ఆ మేరకు ధరలు తగ్గితే దానికి కూడా పరిహారం ఇస్తారు. ఇక్కడ కూడా వ్యవసాయ సబ్సిడీలకోత లేదా ఎత్తివేయాలనే ప్రతిపాదనలు లేకపోలేదు. ఏడాదికి ఐదులక్షల డాలర్లకు మించి ఆదాయం వచ్చే రైతులకు సబ్సిడీలను ఎత్తివేస్తే ఏటా 6బిలియన్‌ డాలర్లు, పంటల బీమా సబ్సిడీ ఒక క్షేత్రానికి 40వేల డాలర్లకు పరిమితం చేస్తే రెండుబిలియన్‌ డాలర్లు ఆదాఅవుతాయని అంచనా.

అమెరికాలో 2016 సగటున ఏడాది కుటుంబాదాయం 83,143డాలర్లు కాగా వ్యవసాయ కుటుంబాలకు 1,17,918 వుంది. మొత్తంగా దారిద్య్రరేఖకు దిగువన వున్న కుటుంబాలు 14శాతం కాగా వ్యవసాయ రంగంలో అది రెండుశాతం వుంది. వ్యవసాయ సబ్సిడీలు అధిక వుత్పత్తికి దారితీస్తున్నాయని,భూమి దెబ్బతినటానికి, పర్యావరణానికి, ఇతరత్రా హానికరమని,అవినీతికి దారితీస్తున్నాయని, ఇతర వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తున్నాయని, జనమీంద అదనపు భారం మోపుతున్నాయని బలంగా వాదిస్తున్నవారు వున్నారు. వ్యవసాయంలో వచ్చే లాభాలను వ్యవసాయేతర రంగాలలో వస్తున్న నష్టాలను భర్తీ చేసుకొనేందుకు, పన్నుల ఎగవేతకు వుపయోగించుకుంటున్నారనే విమర్శలున్నాయి. మన దేశంలో వ్యవసాయం గిట్టుబాటు కానందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులను చూస్తున్నాం తప్ప ఇతర రంగాలలో అలాంటి పరిస్ధితి లేదు. అమెరికాలో వున్న గణాంకాల ప్రకారం వ్యాపారాలలో ప్రతి పదివేల సంస్ధలకు ఎనిమిది చొప్పున దివాలా ప్రకటిస్తుండగా వ్యవసాయంలో ఆ రేటు రెండు నుంచి మూడు వరకు మాత్రమే వుంది. గతేడాది 2.4గా నమోదైంది. మన దేశంలో ధనిక రైతులు ఏదో విధంగా నెట్టుకు వస్తుండగా పేద, మధ్యతరగతి, కౌలు రైతులు వ్యవసాయంలో నష్టాలు వచ్చి అప్పులపాలై చివరకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పతనంలో పోటీ పడుతున్న నరేంద్రమోడీ, రూపాయి విలువ !

01 Sunday Jul 2018

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

Narendra Modi, narendra modi bhakts, Rupee, rupee falls, rupee value

ఎం కోటేశ్వరరావు

‘ 48 సంవత్సరాలలో కాంగ్రెస్‌ చేయలేని దానిని నరేంద్రమోడీ 48నెలల్లో చేసి చూపించారు అన్నది తాజాగా ఆయన వీర భక్తులు చేస్తున్న భజనలలో ఒకటి. త్వరలో కొద్ది వారాల్లోనే లోక్‌సభ మధ్యంతర ఎన్నికల ప్రకటన రాబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మోడీ భక్తుల భజన రాతావళిలో రూపాయి విలువ గురించి కూడా చేర్చారు. పురుషలందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లు జర్నలిస్టులలో నిజమైన జర్నలిస్టులు వేరయా అనుకుంటే సిగ్గుమాలిన జర్నలిస్టుల ప్రతినిధిగా చెప్పాలంటే చాలా మంది వున్నారు. వారెవరో అందరికీ బాగా తెలుసు. మోడీ బృందంలో ఆర్నాబ్‌ గోస్వామి అనే ఒక పేరు మోసిన జర్నలిస్టు వున్నాడు. వెధవాయను నేను అంటే నీ కంటే పెద్ద వెధవాయను నేను అంటూ ఒక పాత సినిమాలో పాట వుంది. ఆర్నాబ్‌ గోస్వామి మోడీ భజన చేస్తుంటే ‘మా హీరో ఆర్నాబ్‌ గోస్వామి, మేము ఎల్లవేళలా అతనికి మద్దతు ఇస్తాము అంటూ ఫేస్‌బుక్‌లో ఒక పేజీని సృష్టించారు. వారు తాజాగా రూపాయి విలువ గురించి స్క్వింట్‌ నియాన్‌ అనే పేరుతో ఒక ట్వీట్‌ సమాచారాన్ని ప్రచారంలో పెట్టారు. దాని సారాంశం ఇది.’హార్వర్డ్‌ బంగారు పతక గ్రహీత ఆర్ధికవేత్త (మన్మోహన్‌ సింగ్‌) హయాంలో 2008లో ఒక డాలరుకు రూపాయి విలువ 39 కాగా 2014లో 68, ఒక చాయ్‌ వాలా(నరేంద్రమోడీ) హయాంలో 2014లో 68 వుండగా 2018లో 69. ఎదుటి వారు అవివేకులని భావించి ఎక్కటం తప్ప ఏమిటిది? ‘. అని ప్రశ్నించారు, అంటే మన్మోహన్‌ సింగ్‌ హయాంలో 39 నుంచి 68కి పడిపోతే దాన్ని వదలి పెట్టి 68 నుంచి 69కి మాత్రమే పడిపోయిన మోడీ గురించి రచ్చ చేస్తున్నారేమిటి అంటూ ఎదురు దాడికి దిగటం. ఈ స్క్వింట్‌ రియాన్‌ ఫ్రొఫైల్లో ఫెమినిస్ట్‌ అని వుంది కనుక మహిళ అనుకోవచ్చు. ఆడో మగో, అసలు నకిలీ ఖాతానో వదలివేద్దాం. పేరును బట్టి విదేశీయులు కూడా ప్రధాని మోడీ పాలనా తీరు గురించి ఎలా ప్రశంసిస్తున్నారో చూడండి అని చెప్పుకోవటమే దీని ప్రధాన లక్ష్య ం. దానిలో అంశమే చర్చనీయాంశం.

‘అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు,రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు ‘ ‘ యుపిఏ ప్రభుత్వాన్ని, రూపాయిని చూస్తుంటే ఎవరెంత ఎక్కువగా పతనం చెందుతారో పోటీ పడుతున్నట్లుగా వుంది’ ‘ రూపాయి తన విలువను కోల్పోయింది, ప్రధాని తన సొగసును కోల్పోయారు’ ఇద్దరు ప్రముఖు చేసిన వ్యాఖ్యలివి. మొదటి రెండు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ చేస్తే, మూడవది బిజెపి లోక్‌సభా పక్షనేతగా వున్నపుడు సుష్మా స్వరాజ్‌ చేసిన ట్వీట్‌ . ఇప్పుడు జూన్‌ 28న రు.69.09లకు పతనం చెందిన రూపాయితో నరేంద్రమోడీ తన రికార్డును తానే బద్దలు కొట్టుకొని కొత్తది సృష్టించారు. తేలు కుట్టిన దొంగల మాదిరి ఏ ఒక్క ప్రభుత్వ నేతా దీని మీద నోరు విప్పటం లేదు. మరుగుజ్జులతో ప్రచార దాడి చేయిస్తున్నారు. నిజానికి ఎదుటి వారు అమాయకులని భావించటమే కాదు, ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే నిజమై కూర్చుంటుందన్న గోబెల్స్‌ సూత్రాన్ని తు.చ తప్పకుండా పాటిస్తున్న వారు చేస్తున్న ప్రచారదాడి ఇది.

మన్మోహన్‌ సింగ్‌ అదికారంలో వుండగా 2013 ఆగస్టు 28న రూపాయి విలువ డాలరుకు రు.68.85కు పడిపోయి ఒక రికార్డు నమోదు చేసింది. నరేంద్రమోడీ సర్కార్‌ 2016 నవంబరు 24న దాన్ని రు.68.86కు దిగజార్చి పాత రికార్డును బద్దలు చేసింది. అదే సర్కార్‌ 2018 జూన్‌ 28న రు.69.09లకు పతనం చెందిన రూపాయితో మరో ‘విజయం’ సాధించింది. ప్రతి నెలాఖరులో మోడీ చెప్పే తన మనసులోని మాటలో దీని గురించి ఇంతవరకు ఎలాంటి ప్రస్తావన చేయలేదు. ప్రస్తుతం మోడీ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా వుండి, గతంలో ప్రతిపక్ష నేతగా వున్న రవిశంకర ప్రసాద్‌ నాడు ‘పూర్తిగా ఆర్ధిక వ్యవస్ధ దుర్నిర్వహణ’ కారణంగా రూపాయి పతనం అవుతున్నదన్నారు. ‘ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) మరియు విదేశీ సంస్ధాగత పెట్టుబడుల (ఎఫ్‌ఐఐ)తో ఆర్ధిక వ్యవస్ధను నిర్వహించే యుపిఏ విధాన కారణంగానే ఇలా జరుగుతున్నదని చెప్పారు. మన దేశం నుంచి డబ్బు తరలి పోయినందున రూపాయి విలువ పడిపోయిందని లాయర్‌గారు వాదించారు. ‘యుపిఏ ఏర్పడినపుడు డాలరకు రూపాయి విలువ రాహుల్‌ గాంధీ వయస్సుతో సమంగా వుంది. ఈ రోజు సోనియా గాంధీ వయస్సుకు దగ్గర అవుతున్నది.అది మన్మోహన్‌ సింగ్‌ వయస్సుకు దగ్గర అవుతుందేమోనని భయంగా వుంది ‘ అని చమత్కరించారు.

ఇప్పుడు రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది, యుపిఏ పాలనా విధానాలను మార్చి రూపాయి విలువను పెంచకుండా లేదా కనీసం పతనం చేయకుండా నిలువరించటంలో ఎవరు మోకాలడ్డారు ? ఎవరైనా సూటిగా సమాధానం చెప్పేవారున్నారా ?http://inr.fx-exchange.com/usd/2014_05_26-exchange-rates-history.html నరేంద్రమోడీ అధికారం స్వీకరించిన 2014 మే 26వ తేదీన డాలరుకు రూపాయి విలువ రు.58.73 వున్నట్లు పై ఆధారం తెలియ చేస్తున్నది. వచ్చే సెప్టెంబరు 17 నాటికి నరేంద్రమోడీ వయస్సు 68లో ప్రవేశించనుంది. రూపాయి విలువ ఇది రాస్తున్న సమయానికి రు.68.46(2018 జూన్‌ 29) వుంది. ఆయన వయస్సును దాటి పోయింది. మరి దీనికి ఏ స్టెరాయిడ్స్‌ ఇచ్చారో తెలియదు? త్వరలో 70 దాటనున్నదని విశ్లేషకులు జోశ్యం చెబుతున్నారు. పతనంలో రూపాయి, నరేంద్రమోడీ ఎవరు విజేత అవుతారో?

2014 సాధారణ ఎన్నికలలో నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి విజయం సాధించనున్నదనే అంచనాలు వెలువడిన సమయంలో అమెరికా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌ ప్రతినిధులు అమిత్‌ ప్రకాష్‌, క్రిస్టిన్‌ ఆక్వినో రూపాయి విలువ పెరగటం నరేంద్రమోడీ నిర్ణయాత్మక విజయానికి సూచిక అని వ్యాఖ్యానించారు. దీర్ఘకాలంలో రూపాయి విలువ ఒక అమెరికన్‌ డాలరుకు 2014 మార్చి నెలలో వున్న రు.61.19 నుంచి 45-40కి పెరిగే క్రమంలో ఎన్నికల ఫలితం ఒక వుత్ప్రేరకంగా పని చేయగలదని, ఒక వేళ బలహీన సంకీర్ణం ఏర్పడితే 2013 అగస్టు 28 నాటి రికార్డు పతనం 68.85ను అధిగమించ వచ్చని సిటీ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ ఆసియా-పసిఫిక్‌ అధిపతి ఆడమ్‌ గిల్‌మౌర్‌ చెప్పిన మాటలను వారు వుటంకించారు. అంతే కాదు, మోడీ విజయం సాధిస్తే అది ఆట తీరునే మార్చివేస్తుందన్నది మార్కెట్‌ అభిప్రాయమని కూడా ఆడమ్‌ వ్యాఖ్యానించాడు. ఆసియాలోని మూడవ పెద్ద ఆర్ధిక వ్యవస్థ అయిన భారత్‌ 2008లో ప్రారంభమైన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తరువాత ఇప్పుడే పట్టాలపైకి వస్తున్నదని మోడీ స్టీరింగ్‌ పట్టుకుంటే మరింత వేగం అందుకుంటుందని బ్లూమ్‌బెర్గ్‌ వ్యాఖ్యాతలు చెప్పారు.

రూపాయి విలువ పెరుగుతున్నదని, అది డాలరుకు 40కి పెరిగితే 2008 ఏప్రిల్‌ నాటి బలమైన స్ధాయికి చేరినట్లు అవుతుందని ఈ తరుణంలో డాలర్లను అమ్ముకోవటం మంచిదని ఎన్నికల వరకు ఆగితే ఆది ఆలస్యం కూడా కావచ్చని గిల్‌మౌర్‌ జోస్యంతో కూడిన సలహా ఇచ్చారు. అయితే అది ఎంత కాలంలో జరుగుతుందన్నది ఆయన చెప్పలేదని, బ్లూమ్‌బెర్గ్‌ జరిపిన సర్వే ప్రకారం 2014 డిసెంబరు నాటికి రు.61.21 అవుతుందని 2016 చివరికి 58.50లకు పెరుగుతుందని ఆ సంస్థ వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా 2018లో 69.09గా నమోదైంది. దీనికి కారణాలేమిటి ?

నిత్యం బలమైన కరెన్సీ గురించి బోధనలు చేయటం తప్ప మోడీ-జైట్లీ ద్వయం బ్రిటీష్‌ వలసవాద ఆర్ధిక విధానాలకు మద్దతు ఇస్తున్నారని, ఇంకా బలహీనమైన రూపాయి కొనసాగటం జాతి సిగ్గుపడాల్సిన అంశమని అంశుమన్‌ తివారీ అనే ఆర్ధిక వ్యవహారాల వ్యాఖ్యాత పేర్కొన్నారు.http://www.dailyo.in/business/rupee-narendra-modi-arun-jaitley-rbi-manmohan-singh-pv-narasimha-rao-dollar/story/1/6138.html  ఒక దేశ కరెన్సీ జాతి గర్వించదగిన లేదా దగని అంశంగా వుండకూడదు, చేయకూడదని తెలిసినప్పటికీ బిజెపి 2013లో రూపాయి విలువ ఎదుర్కొన్న సంక్షోభాన్ని జాతి సిగ్గుపడే అంశంగా ప్రదర్శించిందని తివారీ పేర్కొన్నారు.

‘మారకపు విలువ కేవలం ఒక ధర మాత్రమే. నీవు అమ్మకపు వ్యాపారంలో వుండాలంటే నీ ధర పోటీలో నిలబడేట్లుగా వుండాలి’ అని 1991లో రూపాయి విలువను భారీగా తగ్గించిన సమయంలో ఆర్ధిక మంత్రిగా వున్న మన్మోహన్‌ సింగ్‌ చెప్పిన తర్కాన్ని అంగీకరించాలంటారు తివారి. బూర్జువా మేథావుల ప్రతినిధి తివారీ. మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చిన నరేంద్రమోడీ మన దేశంలో సరకులను తయారు చేసి చౌకగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు రూపాయి విలువను కావాలనే పతనం గావిస్తున్నారా ? అవుననో కాదనో, అసలు కథేమిటో మోడీ నోరు విప్పితే కదా తెలిసేది.

1990 దశకంలో మన దేశం చెల్లింపుల సంక్షోభం ఎదుర్కొన్న కారణంగా మన ఎగుమతులను పెంచాలనే ఒక దివాళాకోరు ఆలోచనతో నాటి సర్కార్‌ ప్రపంచ బ్యాంకులో పని చేస్తున్న మన్మోహన్‌ సింగ్‌ను ఆర్ధిక మంత్రిగా తీసుకొన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచబ్యాంకు ఆదేశాలతో ఈ పెద్ద మనిషి ఒక్కసారిగా నాలుగు రోజుల్లో రూపాయి విలువను తొమ్మిదిశాతం వరకు తగ్గించారు. అంతకు ముందు దేశ చరిత్రలో అలాంటి వుదంతం జరగలేదు. ఆ సమయంలో ప్రభుత్వ ఆర్ధిక సలహాదారుగా జైరాం రమేష్‌, రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా రంగరాజన్‌ వున్నారు.

గతంతో అంటే 2013 రికార్డు పతనంతో పోల్చితే నాటికీ నేటికీ ఎంతో బేధం వుంది. అప్పుడు రూపాయి విలువ పతనం దేశ బలహీనతగా బిజెపి ప్రచారం ప్రారంభించింది. అ సమయంలో మన విదేశీ మారక ద్రవ్య నిల్వలపై తీవ్ర ప్రభావం చూపే చమురు పీపా ధర 100 డాలర్లకు పైగా వుంది. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 40-50 డాలర్ల మధ్య వుండి ఇటీవలి కాలంలో 75 డాలర్ల వరకు పెరిగింది. ఇక మోడీ భక్తులు తాజాగా ప్రారంభించిన రూపాయి విలువ ప్రచారం బండారం గురించి చూద్దాం.

ఒనడా డాట్‌ కామ్‌ డాటా ప్రకారం 2004ా05 నుంచి 2018 జూన్‌ వరకు వున్న ఏడాది సగటు రూపాయి విలువ ఇలా వుంది. ప్రతి రోజు పెరగటం, తగ్గుదల వుంటుంది కనుక సౌలభ్యం కోసం ఏడాది సగటు తీసుకుందాం.(డాలరుకు రూపాయి మారకం విలువ) 2018-19లో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు)

ఏడాది రూపాయి విలువ

2004ా05 44.94

2005ా06 44.28

2006ా07 45.25

2007ా08 40.28

2008ా09 46.46

2009ా10 47.74

2010ా11 45.90

2011ా12 48.53

2012ా13 54.44

2013ా14 60.42

2014ా15 61.17

2015ా16 65.49

2016ా17 67.15

2017ా18 64.54

2018ా19 67.02

ఈ అంకెల ప్రకారం పదేండ్ల మన్మోహన్‌ సింగ్‌ పాలనలో 2005ా06 నుంచి 2013ా14 మధ్య కాలంలో రూపాయి పతనం 44.28 నుంచి 60.42కు జరిగితే నాలుగేండ్ల మోడీ కాలంలో అది 60.42 నుంచి 67.02కు దిగజారింది. సగటు దిగజారుడు చూస్తే దాదాపు ఒకటే వుంది. అంటే మన్మోహన్‌ సింగ్‌ పాలన చివరి రోజుల్లో పడిన ఇబ్బందుల కంటే మోడీ కాలంలో ఎక్కువగా వున్నట్లు స్పష్టం అవుతోంది. పదేండ్ల కాంగ్రెస్‌ పాలన చివరి ఏడాదిని మినహాయించి తొలి తొమ్మిది సంవత్సరాల తీరు తెన్నులను గమనిస్తే రూపాయి విలువ 44.28 నుంచి 54.44 మధ్యనే కదలాడింది. అదే మోడీ పాలనలో 60.42 నుంచి 67.02 మద్య వుంది. దీని అర్ధం కాంగ్రెస్‌ విధానాలను సమరించటం లేదా మంచివని చెప్పటం కాదు. రెండు పార్టీల విధానాలలో ఎలాంటి మౌలిక తేడాలు లేవు.

మన దేశాన్ని కేవలం ముడి సరకులు ఎగుమతి దేశంగా వుంచాలని, మన పారిశ్రామిక వస్తువుల ధరలు ప్రపంచ మార్కెట్లో ఎక్కువగా వుంచేందుకు నాటి బ్రిటీష్‌ పాలకులు రూపాయి విలువను లేని దాని కంటే ఎక్కువగా వుంచారన్న అభిప్రాయం వుంది. యుపిఏ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు బిజెపి రూపాయి విలువ పతనాన్ని దేశానికి అవమానంగా చిత్రించింది. తాను అధికారంలోకి వచ్చిన తరువాత అదే పార్టీ ఇప్పుడు రూపాయి పతనమౌతోంటే గుడ్లప్పగించి చూస్తోంది. నోట మాట రావటం లేదు.

నాడు మన్మోహన్‌ సింగ్‌ కరెన్సీ విలువ తగ్గింపును సమర్ధించుకుంటూ ‘మారకపు విలువ కేవలం ఒక ధర మాత్రమే. నీవు అమ్మకపు వ్యాపారంలో వుండాలంటే నీ ధర పోటీలో నిలబడేట్లుగా వుండాలి’ అన్నారంటే దాని అర్ధం తక్కువగా వుంచాలనే కదా. అప్పటి నుంచి చూస్తే 1970 నుంచి 1989 వరకు వాణిజ్య లోటుతో వున్న చైనా ఆ తరువాత నుంచి నేటి వరకు తన మిగులును పెంచుకుంటూ పోతూనే వుంది.1990 నుంచి 8.74 బిలియన్‌ డాలర్ల మిగులుతో ప్రారంభమై 2017లో 422 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నది. మరి మనం ఎక్కడ వున్నాం ? 2017లో చైనా ఎగుమతులు, దిగుమతుల లావాదేవీల మొత్తం 4.1లక్షల కోట్లు కాగా మనది 800 బిలియన్‌ డాలర్లకు అటూ ఇటూగా 157 బిలియన్‌ డాలర్ల లోటుతో వున్నాం. మన వాణిజ్యలోటు పెరగటం తప్ప ఏ ఒక్క సంవత్సరంలోనూ మిగులు లేదు. మన రూపాయి విలువను తగ్గించుకున్నా మన వస్తువులను ఎగుమతి చేయలేని స్ధితి. అయినప్పటికీ నిరుద్యోగ యువతను తప్పుదారి పట్టించేందుకు మేకిన్‌ ఇండియా నినాదంతో ప్రధాని నరేంద్రమోడీ కాలం గడుపుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ మన దేశం వచ్చి ఇక్కడ మన కార్మికుల చేత వస్తువులను తయారు చేయించుకొని ఎగుమతి చేసుకోవాలన్నది ఈ నినాదం వెనుక వున్న లక్ష్యం. ఇన్నేళ్లుగా మనం ఎందుకు విఫలమయ్యాము. అందునా ప్రపంచ ధనిక దేశాలన్నీ ఆర్ధిక మాంద్యంలో వుండగా ఇప్పుడున్న పరిశ్రమల వుత్పత్తులకే దిక్కు లేకపోతే కొత్తగా ఎవరు ప్రారంభిస్తారు అన్నది ప్రశ్న. అందువలన మన ఆర్ధిక విధానాన్ని మన అవసరాలకు తగినట్లు సమూలంగా మార్చుకొని అంతర్గతంగా వస్తువినియోగానికి డిమాండ్‌ పెంచుకుంటేనే ఏ రంగమైనా అభివృద్ది చెందుతుంది. మన యువతకు వుపాధి దొరుకుతుంది.

విదేశాలకు తక్కువ ధరలకు ఎగుమతులు చేయటానికి మన వనరులన్నీంటినీ వుపయోగిస్తే మన వస్తువులు కొన్న వాడికి తప్ప మనకు లాభం ఏమిటి? ఏ కారణం చేత అయినా కొనే వారు ఎత్తుబడితే మన వస్తువులను ఎవరికి అమ్ముకోవాలి? ఇప్పుడు అమెరికా, ఐరోపా ధనిక దేశాలలో వస్తువులు కొనే వారు లేకనే మన వస్తువులు ఎగుమతి కావటం లేదని అందరూ చెబుతున్నదే. అలాంటపుడు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టి మన నరేంద్రమోడీ గారికి మేకిన్‌ ఇండియా పేరు తెచ్చేందుకు ఎవరు ముందుకు వస్తారు అన్నదే సమస్య? మన కంటే తక్కువ ధరలకు ఎగుమతులు చేయాలంటే చైనా దగ్గర డాలర్ల నిల్వలు గుట్టలు పడి వున్నాయి. రెండవది, ఎగుమతులు దెబ్బతింటే అంతర్గతంగా వినియోగాన్ని పెంచే విధంగా చైనా తన పౌరుల ఆదాయాలను పెంచుతున్నది. మన పరిస్దితి అందుకు విరుద్దంగా వుంది.

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుగా నరేంద్రమోడీ గారి మేకినిండియా పిలుపును జయప్రదం చేయటం కోసం రూపాయి విలువను మరింత పతనం గావిస్తే మనం దిగుమతి చేసుకొనే ఎరువులు, పురుగు మందులు, పెట్రోలియం వుత్పత్తుల వంటి వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. వుదాహరణకు మనకు స్వాతంత్య్రం వచ్చిన రోజు నాడున్న విలువ ప్రకారం ఒక రూపాయకు కొన్న ఒక వస్తువు ధర నరేంద్రమోడీ పదవిలోకి వచ్చే నాటికి రు.58.58కి పెరిగింది. నాలుగు సంవత్సరాల తరువాత జూన 28న రు.69.09కి చేరింది, ఇంకా పెరగవచ్చని కొందరి అంచనా. మోడీ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన మంచి రోజులంటే ఇవా ?

2014 మే 25న నరేంద్రమోడీ పదవీ బాధ్యతలను స్వీకరించిన సమయానికి 58.58 గా వుంది. ఇది తమ మోడీ ఘనతే అని అభిమానులు చెప్పారు. రూపాయి విలువ పతనం, పెరుగుదల చరిత్రను చూస్తేhttps://knoema.com/infographics/rygejhb/rupee-devaluation-against-dollar-1947-till-date ప్రధానిగా జవహర్‌ లాల్‌ నెహ్రూ వున్న సమయంలో 1947 నుంచి 1950 మధ్య ఒక రూపాయి నుంచి రు.4.76కు పడిపోయింది. ఆ ఏడాది నుంచి నెహ్రూ మరణించిన తరువాత లాల్‌ బహదూర్‌ శాస్త్రి పాలనలో 1965 వరకు స్ధిరంగా ఒక డాలరుకు రు.4.76 పైసలు వుంది. శాస్త్రి మరణించిన 1966లో రు.6.36కు పడిపోయింది. తరువాత ఇందిరా గాంధీ హయాంలో రు.6.36 నుంచి 1976లో రు.8.96కు పడిపోయి, ఆమె దిగిపోయే నాటికి రు.8.75కు పెరిగింది. జనతా పార్టీ నేత మొరార్జీ దేశాయ్‌ పాలనలో పెరుగుదల తప్ప పతనం లేదు, రు.8.75 నుంచి రు.8.14కు పెరిగి పెరిగింది.

రెండవ సారి ఇందిరా గాంధీ అధికారానికి వచ్చిన సమయంలో రు.7.86గా వున్నది కాస్తా ఆమె మరణించే నాటికి రు.11.36కు పతనమైంది. తరువాత రాజీవ్‌ గాంధీ ఏలుబడిలో రు.16.23కు దిగజారింది.1989లో అధికారానికి వచ్చిన విపి సింగ్‌ హయాంలో రు.17.50కి, నూతన ఆర్ధిక సంస్కరణలకు ఆద్యుడిగా పేరు గాంచిన పివి నరసింహారావు పాలనలో రు.22.74 నుంచి 35.43కు తగ్గింది. హెచ్‌డి దేవగౌడ, ఐకె గుజ్రాల్‌ పాలనా కాలంలో రు.41.26కు చేరింది. తరువాత బిజెపి నేత ఎబి వాజ్‌పేయి పాలనలో రు.48.61కి పతనమై చివరికి రు.45.32కు పెరిగింది. మన్మోహన్‌ సింగ్‌ పది సంవత్సరాల కాలంలో కిందికీ మీదికీ పడుతూ లేస్తూ రు.45.32 నుంచి గరిష్టంగా 68.85 వరకు పతనమై నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సమయానికి రు.58.43కు పెరిగింది. మోడీ హయాంలో తాజాగా 69.10కి దిగజారింది. ఏడాది సగటు ఎలా వుందో పైన చూశాము. మోడీపాలనా కాలం ముగిసే నాటికి ఇంకా పతనం అవుతుందనే వారే తప్ప పెరుగుతుందని చెప్పేవారు ఒక్కరూ లేరు. మోడీని అభిమానించే వారు దీనిని విజయం అంటారా పతనంగాక మరేదైనా పేరు పెడతారా ?

రూపాయి విలువ పతనమైతే సామాన్య జనానికి జరిగే నష్టం ఏమిటి? మోడీకి, మన్మోహన్‌ సింగ్‌కో మరొకరికో వ్యక్తిగత నష్టం గురించిన సమస్య కాదిది. మనిషికి బిపి పెరిగినా, తగ్గినా శరీరంలో ఎటువంటి ప్రమాదకర మార్పులు సంభవిస్తాయో ఏ దేశ ఆర్ధిక వ్యవస్ధలో అయినా కరెన్సీ విలువ వుద్ధాన, పతనాలు అలాంటి పర్యవసానాలకే దారితీస్తాయి. అంటే మొత్తం జనాన్ని ముఖ్యంగా సామాన్య జనాన్ని తీవ్ర ప్రభావితం చేస్తాయి. ఎలాగో చూద్దాం.

మనకు చమురు నిక్షేపాలు తగినన్ని లేని కారణంగా అత్యధికంగా దిగుమతులపై ఆధారపడుతున్నాం. అందువలన ఆ రంగంలో పర్యవసానాలు మన నిత్యజీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నరేంద్రమోడీ అధికారాన్ని స్వీకరించిన తరువాత 2014 మే 29 జూన్‌ 11వ తేదీతో ముగిసిన పక్షంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు పీపా(బారెల్‌) ధర 106.72 డాలర్లు వుంది. ఆ రోజుల్లో డాలరు సగటు రూపాయి విలువ రు. 59.17 ఆ లెక్కన మనం రు 6314 లకు ఒక పీపాను కొనుగోలు చేశాము. ఇప్పుడు అంటే 2018 జూన్‌ 30 నాటికి ఒక పీపాధర 75 డాలర్లకు తగ్గినా రూపాయల్లో డాలరుకు రు.68-69 మధ్య విలువ పతనం కారణంగా పీపాను ఆరువేల రూపాయలకు అటూ ఇటూగా కొనుగోలు చేస్తున్నాము. నరేంద్రమోడీ సర్కార్‌ రూపాయి విలువ పతనాన్ని అరికట్టి స్ధిరంగా వుంచి వుంటే, ప్రపంచ ఆర్ధికవేత్తలు వూహించినట్లు 45-40 రూపాయలకు పెరిగి వుంటే చమురు ధరలు గణనీయంగా తగ్గి వుండేవి. అన్నీ తానే అయి చూసుకుంటున్న నరేంద్రమోడీ రూపాయి పతనాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు.అది చేయలేకపోగా తన హయాంలో డీజిలు, పెట్రోలుపై పన్ను పెంచి అదనపు భారం ఎందుకు మోపి నట్లు ?

రూపాయి విలువ పతనమైతే ఎక్కువ మందికి నష్టం జరిగితే, లాభపడే వారు కూడా వుంటారు. విదేశాలలో వుద్యోగాలు చేస్తూ మన దేశానికి డాలర్లు పంపే వారికి ఇక్కడ రూపాయలు అదనంగా వస్తాయి. మన వస్తువులను దిగుమతులు చేసుకొనే వారు తక్కువ డాలర్లు చెల్లించి లబ్దిపొందుతారు. మన దేశం దిగుమతి చేసుకొనే ముడి చమురు, ఎరువులు, ఔషధాలు, పురుగుమందులు, పప్పుధాన్యాలు, పామాయిల్‌ వంటి ఖాద్య తైలాలకు ఎక్కువ డాలర్లు చెల్లించాలి, పర్యవసానంగా ధరలు పెరుగుతాయి. అవి ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తాయి. విదేశాలలో విద్యనభ్యసించేవారిపై భారం పెరుగుతుంది. విదేశాల నుంచి డాలర్ల రూపంలో తీసుకొనే రుణాలకు చెల్లించాల్సిన మొత్తాలు పెరుగుతాయి.

అంతర్జాతీయ మార్కెట్‌ ముఖ్యంగా డాలరుతో మన బంధం ముడివేసుకున్న కారణంగా, మన పాలకులు గత 70సంవత్సరాలుగా అనుసరిస్తున్న దివాలాకోరు ఆర్ధిక విధానాల పర్యవసానంగా కరవ మంటే కప్పకు కోపం విడవ మంటే పాముకు ఆగ్రహం అన్నట్లుగా మన రూపాయి విలువ పరిస్ధితి తయారైంది. విలువ తగ్గినా, పెరిగినా కార్పొరేట్లకు పోయిందేమీ లేదు. ఆ కారణాలతో దివాలా తీసి బలవన్మరణాలకు పాల్పడిన పెద్దలు ఒక్కరంటే ఒక్కరు కూడా వున్నట్లు మనకు వార్తలు లేవు. వారు బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పులను ఎగవేయటం, మన్మోహన్‌, మోడీ వంటి పాలకులు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు రుణాలు ఇవ్వటం, బ్యాంకులకు ఎగవేసిన కార్పొరేట్ల అప్పులను ఏటా లక్షల కోట్ల వంతున రద్దు చేయటం తప్ప మరొకటి చేయటం లేదు. ఎటు తిరిగి సామాన్య వ్యాపారులు, జనమే గగ్గోలు పెట్టి ఆత్మహత్యలకు పూనుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది. రూపాయి బలపడితే ఎగుమతి వ్యాపారులు లబోదిబో మంటే దిగుమతి వ్యాపారులు సంతోషించారు, ఇప్పుడు దిగుమతి వ్యాపారులతో పాటు జనమంతా గగ్గోలు పెట్టే దిశంగా ఈ పతనం కొనసాగుతుందా అనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పలు దేశాలతో వాణిజ్య యుద్ధానికి కాలు దువ్వుతున్న అమెరికా !

17 Sunday Jun 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

Donald Trump starting trade war, TRADE WAR, US-CHINA TRADE WAR

Image result for Is Donald Trump starting trade war

ఎం కోటేశ్వరరావు

‘డోనాల్డ్‌ ట్రంప్‌ ఒక బఫూన్‌ కావచ్చు, కానీ అతగాడి వాణిజ్య యుద్ధం నిజం, ట్రంప్‌ ఎల్లవేళలా వాణిజ్య యుద్ధాన్ని కోరుకుంటాడు, ఇప్పుడు ఎన్నో తెచ్చుకున్నాడు, ట్రంప్‌ వాణిజ్య యుద్ధం ఎంతటి తప్పిదమో ఒక విదూషకుడు కూడా చెప్పగలడు, గనులు, రైతుల లక్ష్యంగా వాణిజ్య యుద్ధం ఇప్పటికే ట్రంప్‌ గుండెకాయను తాకింది, చైనా పన్నులు ఇప్పటికే ట్రంప్‌ ఓటర్లను దెబ్బతీస్తున్నాయి, ట్రంప్‌ ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభిస్తున్నాడు’.పత్రికలను తిరగేస్తే కనిపిస్తున్న కొన్ని వార్తల శీర్షికలివి. నిజంగా వాణిజ్య యుద్దమే వస్తే కలిగే లాభనష్టాలేమిటన్నది ప్రతి దేశమూ లెక్కలు వేసుకొంటోంది. గతంలో పెట్టుబడిదారీ వ్యవస్ధ విస్తరణ కోసం ప్రారంభించిన వాణిజ్య యుద్ధాలు చివరికి దేశాల ఆక్రమణలు, వలసలు, పలు ప్రాంతీయ, రెండు ప్రపంచ యుద్ధాలకు దారితీశాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అనేక ప్రాంతీయ కూటముల ఏర్పాటు ద్వారా మార్కెట్లను విస్తరించుకొనే, రక్షించుకొనే చర్యలకు పూనుకున్నారు. ఇప్పుడు సరికొత్త రక్షణాత్మక చర్యలకు పూనుకోవటమే తాజా వాణిజ్య యుద్ధ శంఖాల పూరింపు. ఇవి మార్కెట్ల విస్తరణ కాంక్షను, పెట్టుబడిదారీ వ్యవస్ధలో తలెత్తిన తీవ్ర సమస్యలనూ వెల్లడిస్తోంది.

ట్రంప్‌ బఫూనా లేక వయస్సుతో వచ్చిన చిత్త చాంచల్యంతో ఇలా ప్రవర్తిస్తున్నాడా ? కొంత మందికి నిజంగా కలుగుతున్న సందేహాలివి. అమెరికా పీఠంపై ఒక విదూషకుడిని, ముది, మది తప్పిన ముసలివారిని కూర్చో పెట్టేందుకు అక్కడి కార్పొరేట్‌ శక్తులేమీ తెలివితక్కువవి కాదు. పెట్టుబడిదారీ ప్రపంచంలో తలెత్తే సంక్షోభాలను ఇతరుల మీదకు తోసి వేసేందుకు సామ,దాన, బేధోపాయాలు విఫలమైన తరువాత దండోపాయాన్ని ప్రయోగిస్తారు. దానిలో ఒక రంగం వాణిజ్య యుద్ధం. కమ్యూనిస్టు చైనా మీదే కాదు, పక్కనే వున్న తన అనుంగు దేశాలైన కెనడా, మెక్సికోలతో పాటు అంతర్జాతీయ రంగంలో దుర్మార్గపు పనులు చేసేందుకు సై అంటే సై అని కలసి వచ్చే ఐరోపా ధనిక దేశాల మీద కూడా ట్రంప్‌ ఇప్పుడు బస్తీమే సవాలు అంటూ పలు రంగాలలో దాడులకు సిద్ధం అవుతున్నాడు. కొద్ది వారాల క్రితం చైనాతో వాణిజ్య యుద్ధం దాదాపు వచ్చినట్లే అనేంతగా వాతావరణం ఏర్పడినపుడు నాటకీయంగా పరిష్కారమైందని చెప్పారు. ఇప్పుడు తిరిగి మొదలైంది. ఈ రోజు మరణిస్తే రేపటికి రెండు అన్నట్లుగా అమెరికాను పక్కన పెడితే ఇంకా ఆరుగురం వున్నాం, జి6 బృందాన్ని ఏర్పాటు చేద్దాం అంటూ ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ ప్రకటించటాన్ని చూస్తే వీటి పర్యవసానాలు అంత తీవ్రంగా వుంటాయా అంటే అవునని చెప్పలేము. ఎందుకంటే ధనిక దేశాలు తమలో తాము కుమ్ములాడుకోవటంతో పాటు తమకు పోటీదారుగా తయారవుతున్న చైనాను వుమ్మడిగా తప్ప ఎదుర్కోలేమనే భావంతో వున్నాయి. అందువల్లనే పైకి బింకాలు పోయినా వాటి మధ్య రాజీకి అవకాశాలు వున్నాయి. గత మూడు దశాబ్దాల పరిణామాలను చూసినపుడు ధనిక దేశాల మధ్య విబేధాల గ్రాఫ్‌ వూర్ధ్వముఖంగా పయనిస్తోంది.

Image result for Is Donald Trump starting trade war cartoons

కెనడా, ఐరోపా యూనియన్‌, మెక్సికోల నుంచి అమెరికాకు దిగుమతి చేసుకొనే వుక్కు వుత్పత్తులపై 25, అల్యూమినియంపై పదిశాతం పన్నులు విధిస్తామని ట్రంప్‌ ప్రకటించాడు.ఇది అంతటితో ఆగకుండా కెనడా, జపాన్‌ ఆటోమొబైల్‌ రంగం మీద కూడా పన్నులు విధించే అవకాశం వుంది. జూలై నుంచి చైనా నుంచి వచ్చే దిగుమతులపై 50బిలియన్‌ డాలర్ల మేరకు పన్నులు విధిస్తున్నట్లు ప్రకటించారు. తాపీగా మీ ఇంటికి మా ఇల్లెంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం అన్నట్లుగా తాము కూడా అదే పని చేయకతప్పదని తనదైన శైలిలో చైనా ప్రకటించింది. ఈ వైఖరి చివరకు ప్రపంచ మాంద్యానికి దారి తీస్తుందా అన్న భయాలు తలెత్తుతున్నాయి. గతేడాది అమెరికా వాణిజ్య లోటు 566 బిలియన్‌ డాలర్లు,ఇది దాని జిడిపిలో 2.9శాతం. జి7 దేశాల మధ్య వాణిజ్య సుంకాలు చాలా తక్కువగా వున్నాయి. అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై ఐరోపా యూనియన్‌ సగటున కేవలం మూడుశాతమే పన్ను విధిస్తోంది. మనదేదో ప్రపంచ పిగ్గీబ్యాంక్‌ అయినట్లు ప్రతివారూ దాన్నుంచి లబ్ది పొందుతున్నారు, ఇదింకేమాత్రం కుదరదని ట్రంప్‌ పదే పదే చెబుతున్నాడు. నిజానికి అమెరికాకు నష్టం అనేది తప్పుడు ప్రచారమే. అనేక రూపాలలో దానికి వచ్చే ఇతర ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుంటే అది మిగులులోనే వుంటుంది.

గుండెలు బాదుకుంటున్న అమెరికా వాణిజ్య లోటులో సగానికి పైగా (385బిలియన్‌ డాలర్లు) ఒక్క చైనాతోనే వుంది. అమెరికాతో పాటు ఇతర ధనిక దేశాలు కూడా వాణిజ్యలోటు విషయంలో చైనా పట్ల గుర్రుగా వున్నాయి. అదే సమయంలో వివిధ కారణాలతో అమెరికా మాదిరి చైనాతో యుద్ధానికి అవి సిద్దంగా లేవు. ఇదే సమయంలో తాత్కాలికంగా అయినా అమెరికాతో కలసి ఐక్యంగా దాడి చేసే స్ధితిలో కూడా లేవు. అమెరికాకు ఇప్పుడున్న అప్పును చూస్తే ప్రతివారికీ ఆందోళన కలుగుతోంది. మమ్మల్ని కాపాడుకోవటం మీకే శ్రేయస్కరం అన్నట్లుగా అమెరికా వైఖరి కనిపిస్తోంది. అనేక యుద్ధాలలో దెబ్బలు తిన్న అమెరికా ఒకవైపు ఇప్పుడు ప్రాంతీయ యుద్ధాలతో పాటు రెండో వైపు వాణిజ్య యుద్ధాలకు తెరలేపుతోందని భావిస్తున్నారు. స్వేచ్చా వాణిజ్యం గురించి ఇంతకాలం చెప్పిన అమెరికా దానికి వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతోంది. కెనడా, ఐరోపాయూనియన్‌, మెక్సికో వంటి తన మిత్రదేశాలతో పాటు రాజకీయంగా వ్యతిరేకించే చైనాతో యుద్ధానికి పూనుకుంది. సహజంగానే ఈ దేశాలు కూడా ప్రతి చర్యలకు పూనుకుంటాయని వేరే చెప్పనవసరం లేదు. ప్రస్తుతం పెట్టుబడిదారీ వర్గం తక్కువ వ్యయంతో ఎక్కడ వస్తువులు తయారైతే అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటూ తన లాభాలను కాపాడుకుంటోంది. ఆ విధంగా చూసినపుడు ఆ దిగుమతి చేసుకొనే వస్తువులపై అమెరికా పన్నులు విధించటమంటే తన వినియోగదారులపై భారం మోపటం ఒకటైతే ఎగుమతి చేసే దేశంలో వుత్పత్తి మీద ప్రభావం చూపుతుంది. అందువలన వుభయతారకంగా సమస్యను పరిష్కరించుకోవటం అందరికీ మేలు. కానీ ట్రంప్‌ అలా అనుకోవటం లేదు, తాను పన్నులు విధిస్తే ఇతర దేశాలు భయపడిపోయి తమ దగ్గర ఎక్కువగా వస్తువులను కొనుగోలు చేస్తాయని, తద్వారా అమెరికన్‌ కార్పొరేట్ల లాభాలకు ముప్పు వుండదని భావిస్తున్నాడు. ప్రస్తుతం అమెరికా వ్యవసాయం, ద్రవ్యరంగం, సాఫ్ట్‌వేర్‌ రంగాలలో పెద్ద మొత్తంలో లాభాలు సంపాదిస్తోంది. అందుకనే వస్తూత్పత్తి రంగంలో వస్తున్న వడిదుడుకులను ఎదుర్కోగలుగుతోంది. చౌకగా తయారయ్యే దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటుండటం, యాంత్రీకరణతో వస్తూత్పత్తి రంగంలో అమెరికన్లకు నానాటికీ పని లభ్యత తగ్గిపోతోంది. వేతనాలు తగ్గిపోతున్నాయి, అది కొనుగోలు శక్తి క్షీణతకు దారి తీస్తుంది. దాని వలన దేశీయంగా వస్తూత్పత్తి కూడా పడిపోతుంది. ఇది ఒక విష వలయం. ఇప్పటికిప్పుడు అమెరికా తనకు అవసరమైన వస్తువులను చైనా నుంచి దిగుమతి చేసుకొనే ధరలకు తయారు చేసి తన వినియోగదారులకు అందించగలదా? అంత సీను లేదు. అందుకే మిగతాదేశాలు కూడా కన్నుకు కన్ను పన్నుకు పన్ను సై అంటున్నాయి. ఇది మరింత ముదిరితే మిగతా దేశాలు తమ వస్తువులు,సేవలను కొనుగోలు చేయటం మానుకుంటే తమ పరిస్ధితి ఏమిటన్న ఆందోళన అమెరికన్లలో వుంది. అమెరికా నుంచి వస్తున్న సేవలు, వస్తువులు ఆగిపోతే ఆయా దేశాలు ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసుకుంటే నష్టపోయేది అమెరికాయే. లేదూ అదే వ్యాపారం ఇతర దేశాలకు పోయినా నష్టపోయేది అమెరికన్‌ కార్పొరేట్లే. ప్రతి దేశమూ కొన్నింటికి ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్ధితులలో అమెరికా కొండెక్కితే మిగతా దేశాలు కూడా అదే చేస్తాయి. అందుకే వాణిజ్య యుద్ధం తమకు నష్టదాయకమని అమెరికన్లు భావిస్తున్నారు. చైనాతో అమెరికా వాణిజ్య యుద్ధానికి ఇప్పుడున్న లోటు కంటే భవిష్యత్‌లో ఎదురయ్యే పోటీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మేడిన్‌ 2025పేరుతో చైనా రోబోటిక్స్‌, ఏరోస్పేస్‌, పారిశ్రామిక యంత్రాలు, ఆటోమొబైల్‌ రంగాలలో వున్నత సాంకేతిక పరిజ్ఞాన వుత్పత్తుల తయారీ దిశగా ముందుకు పోతోంది. ఇప్పటి వరకు ఆ రంగంలో అగ్రగామిగా వున్న అమెరికాకు మరిన్ని సవాళ్లు ఎదురుకావటం అనివార్యం. అందుకే ముందుచూపుతో అదిరింపులు బెదిరింపులకు పూనుకుందనేది ఒక అభిప్రాయం.

అమెరికాలో వుపాధి తగ్గిపోవటానికి చైనా, ఇతర తక్కువ వ్యయమయ్యే దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకోవటమే అనే సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు అమెరికన్‌ పాలకవర్గం ప్రయత్నిస్తోంది. ఇది పూర్తివాస్తవం కాదు. అమెరికాలో పెరిగిన యాంత్రీకరణ ఒక ప్రధాన కారణం అన్నది అనేక మంది చెబుతున్న నిజం. అదే విధంగా ఒక్కొక్క దేశం పట్ల ఒక్కో కారణం చెబుతోంది. చైనా అక్రమవాణిజ్య పద్దతులకు, సాంకేతికపరిజ్ఞాన చోరీకి పాల్పడుతున్నదంటూ ఆరోపిస్తుండగా కెనడా,మెక్సికో, ఐరోపా యూనియన్‌ దేశాల నుంచి చేసుకొనే దిగుమతులు తమ రక్షణకు ముప్పు తెస్తున్నాయని అంటోంది. అమెరికాతో రెండవ పెద్ద వాణిజ్య సంబంధాలున్న కెనడా వుత్పత్తులను పన్నుల పెంపు నుంచి మినహాయిస్తామని చెప్పిన ట్రంప్‌ మాటతప్పాడు. గతేడాది రెండు దేశాల మధ్య వాణిజ్యంలో అమెరికాదే మిగులు. అమెరికా పాడి వుత్పత్తులపై 270శాతం పన్నులు విధిస్తోందంటూ కెనడాపై ట్రంప్‌ మండి పడ్డారు. కెనడాతో అమెరికా జరుపుతున్న 680 బిలియన్‌ డాలర్ల వాణిజ్యంలో పాడి వుత్పత్తుల శాతం 0.1 మాత్రమే, 99శాతం వాణిజ్యంపై అసలు పన్నులే లేవు.కెనడా తన రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకున్నా గతేడాది అమెరికాతో మూడుబిలియన్ల లోటులోనే వుంది. పోనీ అమెరికా ఏమైనా వుదారంగా వుంటోందా అంటే లేదు. అక్కడి పొగాకు పరిశ్రమకు ఇతరుల నుంచి పోటీ లేకుండా చూసేందుకు దిగుమతులపై 350శాతం పన్నులు విధిస్తోంది.

ట్రంప్‌ చర్యకు ప్రతిగా చైనా ప్రారంభించిన ఎదురుదాడిలో భాగంగా 34బిలియన్‌ డాలర్ల మేరకు వ్యవసాయ వుత్పత్తులు, 16బిలియన్‌ డాలర్ల మేరకు బగ్గు, చమురు వంటి వాటిపై దిగుమతి పన్నులు పెంచింది. తరువాత మరికొన్నింటిని పెంచుతామని ప్రకటించింది. గత నెలలో సయోధ్య కుదిరిన సమయంలో తాము అమెరికా వ్యవసాయ వుత్పత్తుల కొనుగోలు పెంచుతామని చైనా పేర్కొన్నది ఇప్పుడు వాటిమీదే ఎక్కువ పన్నులు విధించింది.తొలి దఫా ప్రకటించిన 50బిలియన్‌ డాలర్ల పన్నులు గాకుండా తదుపరి మరో వంద బిలియన్ల మేరకు విధిస్తామని ట్రంప్‌ బెదిరించాడు.

Image result for Is Donald Trump starting trade war cartoons

ఆంబోతుల మధ్య లేగదూడలు నలిగినట్లు మన దేశ పరిస్ధితి వుంది. ఒకవైపు ఈ యుద్ధంతో మనం లాభపడవచ్చని కొందరు సంతోషపడుతున్నారు. నరేంద్రమోడీ ఏ దేశం వెళ్లినా ఆ నాయకులతో ఎంతో సాన్నిహిత్యం వున్నట్లు వెల్లడించేందుకు ఆలింగనాలు చేసుకుంటున్నారు. ట్రంప్‌తో కూడా అలాగే చేశారు. వుక్కు వుత్పత్తులపై 25, అల్యూమినియంపై 10శాతం పన్నుల నుంచి మన దేశాన్ని మినహాయించాలని వేడుకున్నా ఎక్కడన్నా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా అమెరికా తిరస్కరించింది. మన మంత్రి సురేష్‌ ప్రభు అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఇప్పటి వరకు అమెరికాకు 30వస్తువుల విషయంలో ఇస్తున్న 24 కోట్ల డాలర్ల రాయితీలను వుపసంహరించనున్నట్లు ప్రకటించారు. స్వదేశంలో విమర్శలపాలైన మోడీ ఎంతగా విదేశాల్లో పర్యటించినా మన ఎగుమతులు నానాటికీ తగ్గుతున్నాయి తప్ప పెరగటం లేదు.ఆర్‌సియిపిలోని పదహారింటిలో ఏడు దేశాలతో మన వాణిజ్య లోటు పెరుగుతున్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. 2017-18లో చైనా, దక్షిణ కొరియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియాలో మన వాణిజ్యలోటు 97.71బిలియన్‌ డాలర్లు, అంతకు ఏడాది 77.58 బిలియన్‌ డాలర్లు మాత్రమే వుంది. మన దేశంలో వుత్పాదకశక్తి తక్కువగా వున్నందున ఇతర దేశాలతో స్వేచ్చావాణిజ్య ఒప్పందాలు చేసుకున్నా బలవంతులకు తప్ప మనకు పయోజనం వుండదు. నాలుగేండ్లుగా మోడీ మేకిన్‌ ఇండియా ప్రభుత్వ ప్రకటనలకే పరిమితం తప్ప అడుగు ముందుకు సాగలేదు. అమెరికా-చైనా-ఐరోపా యూనియన్‌ మధ్య ఒకవేళ నిజంగా వాణిజ్య యుద్ధమే జరిగితే మన వుత్పత్తులకు జరిగే ప్రయోజనం ఎంతో తెలియదు గానీ చైనా నుంచి మరిన్ని దిగుమతులు పెరగటం ఖాయం. అందువలన ధనిక దేశాల మధ్య తలెత్తిన వాణిజ్య యుద్ధ పరిణామ పర్యవసానాలు, పరిష్కారాలు ఎలా వుంటాయన్నదే ఆసక్తి కరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికన్‌ ధృతరాష్ట్ర కౌగిలి దిశగా దేశాన్ని నడిపిస్తున్న నరేంద్రమోడీ !

30 Wednesday May 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

american dhritarashtra embrace, dhritarashtra embrace, India Foreign Policy, India foreign policy under narendra modi, modi foreign policy

ఎం కోటేశ్వరరావు

నరేంద్రమోడీ ప్రధానిగా పదవిని స్వీకరించి నాలుగు సంవత్సరాలు గడిచింది. స్వదేశీ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్న రాష్ట్రపతి అంటూ ఒక జోక్‌ సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది. లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా మోడీ పదవీ స్వీకార ప్రమాణం చేసింది మొదలు ఇప్పటి వరకు విదేశీ ప్రయాణాల్లోనే ఎక్కువగా గడిపారనే పేరు తెచ్చుకున్నారు. మోజు తీరినపుడు, అసంతృప్తి కలిగినపుడు ఎప్పుడన్నా జనం ఈ విషయాల గురించి చర్చించి వుంటారేమోగానీ మన విదేశాంగ విధానం గురించి మాత్రం కచ్చితంగా చర్చకు రావటం లేదని చెప్పవచ్చు. అంతర్గత విధానాలు మన జన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో వర్తమాన ప్రపంచీకరణ యుగంలో విదేశాంగ విధానాల పర్యవసానం కూడా తీవ్రంగానే వుంటుంది. ఈ విషయం మనకు స్వాతంత్య్రానికి ముందు తెలిసినంతగా ఇప్పుడు తెలియటం లేదు. బ్రిటీష్‌ పాలకుల దేశీయ, విదేశాంగ విధానాలు మన దేశాన్ని ఎలా దోపిడీకి గురిచేశాయో నాడు స్వాతంత్య్ర సమరయోధులు నిత్య పారాయణం చేసేవారు. ఇప్పుడు కమ్యూనిస్టులు తప్ప మిగతా పార్టీలేవీ ఈ విషయాల గురించి నోరెత్తవు.

సోవియట్‌ యూనియన్‌ కూల్చివేత, మన దేశంలో సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టిన 1991 నుంచి మన దేశ విదేశాంగ విధానంలో పెద్ద మార్పులు వచ్చాయి. నాటి నుంచి నేటి వరకు చూస్తే అలీన విధానం నుంచి వైదొలగి అమెరికా బిగి కౌగిట్లోకి మరింతగా చేరువు కావటం ముఖ్యమైన మార్పు. గత పాతిక సంవత్సరాలలో కాంగ్రెస్‌, బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ఎవరు అధికారంలో వున్నప్పటికీ అదే కొనసాగుతోంది. యుపిఏ పాలనా కాలంలో అమెరికావైపు మొగ్గు, దానికి చిన్న భాగస్వామిగా చేరేందుకు పూనుకున్న కారణంగానే వామపక్షాలు మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వానికి మద్దతు వుపసంహరించిన విషయం తెలిసిందే. నరేంద్రమోడీ హయాంలో వాటిలో ఎలాంటి మార్పు లేదు, మరింత విస్తృతం, చేరువైంది. 2015లో బరాక్‌ ఒబామా మన దేశ పర్యటనకు వచ్చినపుడు సంయుక్త స్వప్న దర్శనం పేరుతో ఒక ప్రకటన చేశారు. దాని ప్రకారం ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా భూ, రాజకీయ వ్యూహంతో సమన్వయం చేసుకొనేందుకు మన దేశం అంగీకరించింది. సోషలిస్టు చైనా, వియత్నాం, లావోస్‌ వియత్నాంలను చక్రబంధంలో బిగించటంతో పాటు ఈ ప్రాంతంపై మొత్తంగా తన పట్టుబిగించుకోవటం అమెరికా లక్ష్యం. ఇప్పటికే జపాన్‌, ఆస్ట్రేలియాలతో అమెరికాకు ఒప్పందం వుంది. ఆ మూడింటితో సమన్వయం చేసుకుంటామని మోడీ సర్కార్‌ మరొక అడుగు ముందుకు వేసింది. అంతకు ముందు చేసుకున్న రక్షణ ఒప్పందాన్ని మరో పది సంవత్సరాలు పొడిగించింది. గతంలో ఏ ప్రభుత్వమూ అంగీకరించని విధంగా మన రేవులు, వైమానిక స్ధావరాలకు వచ్చి అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధ ఓడలు ఇంధనం నింపుకొనేందుకు, మరమ్మతులు చేయించుకొనేందుకు అంగీకరించింది. ఇది మన సార్వభౌమత్వాన్ని తక్కువ చేసుకోవటమే.

దశాబ్దాల తరబడి అనుసరిస్తున్న విధానాన్ని పక్కన పెట్టి ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద భావజాలానికి అనుగుణంగా ఇజ్రాయెల్‌ను సందర్శించిన తొలి భారత ప్రధానిగా నరేంద్రమోడీ చరిత్రకెక్కారు.పాలస్తీనా సందర్శనను తప్పించారు. వెనెజులా రాజధాని కారకాస్‌లో జరిగిన అలీన దేశాల సభకు వెళ్లకుండా అమెరికాను మెప్పించేందుకు ప్రయత్నించారు. ఇలా అమెరికా, ఇతర సామ్రాజ్యవాద దేశాలు, వాటి అడుగుజాడలలో నడిచే దేశాలతో బంధాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఇతర దేశాలకు ఇవ్వలేదు. వుదాహరణకు మన దేశం బ్రెజిల్‌,రష్యా,చైనా, దక్షిణాఫ్రికాతో కలసి బ్రిక్స్‌ కూటమిగా ఏర్పడింది. అదే విధంగా షాంఘై కూటమిలో పూర్తి సభ్యురాలిగా చేరింది. ఇవి ప్రాంతీయ, పరస్పర సహకారం, బహుళధృవ ప్రపంచ వ్యవస్ధ ఏర్పాటు వంటి అనేక లక్ష్యాలను కలిగి వున్నాయి. వాటన్నింటినీ వదలి పెట్టి కేవలం వుగ్రవాద సమస్య మీద మాత్రమే ఈ వేదికల మీద మోడీ సర్కార్‌ కేంద్రీకరిస్తున్నది. పోనీ వుగ్రవాదులను పెంచి పోషిస్తున్న అమెరికా నాయకత్వంలోని పశ్చిమ దేశాలను, సౌదీ వంటి రాజ్యాల వైఖరి, చర్యలను తప్పుపడుతున్నదా అంటే లేదు.

ఇరుగు పొరుగు దేశాలన్న తరువాత అనేక సమస్యలూ, సానుకూల అంశాలూ వుంటాయి.మన రక్షణ ఖర్చు తగ్గి ఆమేరకు అభివృద్ధి వైపు కేంద్రీకరించాలంటే సరిహద్దులలో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొని సానుకూల అంశాలను పెంచుకోవటం అవసరం. నరేంద్రమోడీ సర్కార్‌ వైఖరి ఆవిధంగా లేదు. పాకిస్ధాన్‌ మనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న మాట వాస్తవం. దానికి సూత్రధారి, తెరవెనుక పాత్రధారి అమెరికా అన్నది బహిరంగ రహస్యం. అలాంటి దేశంతో సఖ్యత, పాకిస్ధాన్‌తో వైరంలో అర్ధం లేదు. పాక్‌తో వైరాన్ని పెంచుకోవటం ద్వారా దేశంలో ముస్లిం వ్యతిరేకతను, జాతీయ దురహంకారాన్ని రెచ్చగొట్టి హిందూ ఓట్‌ బ్యాంకును ఏర్పరచుకోవాలనే యావ తప్ప మరొక లక్ష్యం కనిపించటం లేదు.పోనీ పాకిస్ధాన్‌ను సరిహద్దులలో అదుపు చేసిందా అంటే అదీ లేదు. ఎప్పుడు ఎక్కడ కాల్పులు జరుపుతారో, రెచ్చగొడతారో, వుగ్రవాదులను మన దేశంలో ప్రవేశపెడతారో, ఎక్కడ దాడులు చేయిస్తారో తెలియని స్ధితి. పక్కనే వున్న నేపాల్‌లో మధేషీ ఆందోళనకు మద్దతు తెలిపి ఆ దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకొని అక్కడి ప్రజానీకానికి, అన్ని రాజకీయపార్టీలను వ్యతిరేకం చేసుకున్నది. నరేంద్రమోడీ భజనలో భాగంగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ తప్పుడు వ్యాఖ్యలు చేసి చివరకు క్షమాపణ చెప్పారు. నరేంద్రమోడీ మే రెండవ వారంలో నేపాల్‌ పర్యటనలో భాగంగా జనక్‌పూర్‌( సీత జన్మించిన ప్రాంతం అని నమ్మకం)లో ఒక సభలో ప్రసంగించారు. దానికి వచ్చిన జనాన్ని భారతీయులని సుష్మా స్వరాజ్‌ పేర్కొన్నారు. అది నేపాల్‌ సార్వభౌమాధికారాన్ని కించపరచటమే.

డోక్లాం సమస్య భూటాన్‌ాచైనా తేల్చుకోవాల్సిన అంశం. ఆ ప్రాంతంలో చైనా మిలిటరీ కేంద్రీకరణ జరిగితే దాని గురించి చైనాతో చర్చలు జరిపి పరిష్కరించుకోవచ్చు. అందుకు విరుద్దంగా అక్కడ జోక్యం చేసుకోవటం ద్వారా సాధించిందేమీ లేకపోగా చైనాతో అనవసరంగా మరో సమస్యను తెచ్చుకున్నట్లయింది. ఒకనోటితో అధికారికంగా చైనాతో సంబంధాల మెరుగుదల గురించి చెబుతూ మరోనోటితో నిత్యం చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటంలో సంఘపరివార్‌ వ్యవస్ధలు నిమగ్నమయ్యాయి. దక్షిణ చైనా సముద్రం మీద ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నించటమంటే చైనాను చక్రబంధంలో బిగించటమే. దాని వ్యూహంలో మన దేశం భాగస్వామి కావటం అంటే మన ప్రయోజనాలను మనమే దెబ్బతీసుకున్నట్లు. మన మలబార్‌ తీరంలో అమెరికా, జపాన్‌తో కలసి మనం సైనిక విన్యాసాలు చేయటం దానిలో భాగమే. దానికి ప్రతీకారంగా అణుసరఫరా గ్రూపులో మనకు సభ్యత్వం రాకుండా చైనా అడ్డుపడుతోంది. అజార్‌ మసూద్‌ను వుగ్రవాదిగా ప్రకటించేందుకు ఐరాసలో చైనా అడ్డుపడటం కూడా చైనా పట్ల మనం అనుసరిస్తున్న వైఖరి పర్యవసానమే. చైనా మసూద్‌ పట్ల అనుసరించిన వైఖరికి ప్రతిగా చైనా వుగ్రవాదిగా ఇంటర్‌పోల్‌ ప్రకటించిన వాడిని మన దేశం ఆహ్వానించటం, టిబెట్‌ను చైనా అంతర్భాంగా గుర్తిస్తూనే మరోవైపు దానిని రెచ్చగొడుతూ దలైలామాను అరుణాచల్‌ ప్రదేశ్‌ పర్యటనకు అంగీకరించటం వంటి వన్నీ ప్రతీకార పర్యవసానాలే.యూరేషియాాఆఫ్రికన్‌ రైలు,రోడ్డు, సముద్ర రవాణా పధకానే ఒన్‌ బెల్ట్‌ ఒన్‌ రోడ్‌ ప్రాజెక్టుఅని పిలుస్తున్నారు. చైనా చొరవతో ప్రారంభమైన ఈ పధకంలో చేరేందుకు దాదాపు వంద దేశాలు సంతకాలు చేశాయి. చైనాాపాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ కూడా దానిలో భాగమే. దానిలో చేరటమా లేదా అన్నది నిర్ణయించుకోవటానికి భారత్‌కు హక్కుంది. చేరకపోతే మన దేశం వంటరి అవుతుంది.ఆ పధకాన్ని వ్యతిరేకించేందుకు మద్దతు పలికిన అమెరికా ఇటీవల బీజింగ్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశానికి ఒక ప్రతినిధి వర్గాన్ని పంపింది. మనం మాత్రం దూరంగా వుండటం ఎవరికి ప్రయోజనమో ఆలోచించుకోవాలి.

మన విదేశాంగ విధానంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రెండు రకాల ధోరణులు వున్నాయి. పూసల్లో దారంలా సామాన్య జన ప్రయోజనాల కంటే మన కార్పొరేట్‌ సంస్ధలకు లాభాలే ముఖ్యంగా దానిని అమలు జరుపుతూ వచ్చారు. ఆ క్రమంలో 1991కి ముందు మన జనానికి కూడా కొన్ని వుపయోగాలు జరిగాయి. పెట్టుబడిదారుల నాయకత్వంలో భూస్వామిక శక్తులు స్నేహితులుగా మన పాలకవర్గ పొందిక వుంది. అందువలన రెండు దోపిడీ తరగతుల ప్రయోజనాలు ఎప్పుడూ ఇమిడి వుంటాయి. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు మన దేశం వదలి వెళ్లిన వెంటనే ఆ స్ధానాన్ని ఆక్రమించేందుకు అమెరికా ప్రయత్నించింది. అప్పుడే విస్తరణకు ప్రయత్నిస్తున్న స్వదేశీ పెట్టుబడిదారులకు అది సమ్మతం కాదు. అదే సమయంలో రెడవ ప్రపంచ యుద్ధంలో ఎంతో నష్టపోయినప్పటికీ సోవియట్‌ యూనియన్‌ పారిశ్రామికంగా బాగా పుంజుకున్నది. రాజకీయంగా సామ్రాజ్యవాదుల కూటమిని సవాలు చేసేదిగా బలంగా తయారైంది. దీన్ని అవకాశంగా తీసుకొని లబ్దిపడేందుకు సోవియట్‌వైపు మొగ్గిన పాలకవర్గం ఎంతగానో లబ్దిపొందింది. తనవైపు నిలబడిన నిలబడిన భారత్‌ను నిలుపుకొనేందుకు సోవియట్‌ యూనియన్‌, తమ వైపు ఆకర్షించేందుకు అమెరికా కూటమి కూడా మన దేశంలో అనేక బడాపరిశ్రమలు, ఇతర సంస్ధల ఏర్పాటుకు పోటీ పడ్డాయి. సోవియట్‌ది పైచేయిగా వుంది. 1950-90 దశకం మధ్య మన కార్పొరేట్‌ సంస్ధలు మరింత విస్తరించి మరొక దేశంతో నిమిత్తం లేకుండా స్వంతంగా బడా పరిశ్రమలు ఏర్పాటు చేసే స్ధాయికి ఎదగటమే కాదు, మన కంటే చిన్న దేశాలలో తమ పెట్టుబడులను పెట్టేవిగా తయారయ్యాయి. సోవియట్‌ కూలిపోవటం, ఆ సమయానికి బలమైన దేశీయ గుత్తపెట్టుబడిదారీ వర్గం తయారు కావటంతో ప్రభుత్వ ప్రమేయం తగ్గి ఆర్ధిక రంగాన్ని మొత్తంగా తమకు అప్పగించాలనే డిమాండ్‌ చేయటంతో సంస్కరణల పేరుతో 1991లో విధానాల మార్పుకు శ్రీకారం చుట్టారు. ఇదే సమయంలో ప్రపంచ ఆర్ధిక శక్తిగా వున్న అమెరికా తదితర దేశాలతో జతకట్టి జూనియర్‌ భాగస్వాములుగా మారేందుకు కూడా పాలకవర్గం నిర్ణయించుకుంది. పర్యవసానంగా మన మార్కెట్‌ను తెరవాల్సివచ్చింది. తొలుతు సంయుక్త భాగస్వామ్య సంస్ధల రూపంలో ప్రవేశించిన విదేశీ సంస్ధలు క్రమంగా వాటి స్ధానంలో తమ వుత్పత్తులనే నేరుగా ప్రవేశపెట్టాయి. ఎలక్ట్రానిక్‌ రంగంలో 1990 దశకంలో మార్కెట్‌కు వచ్చిన స్వదేశీ బ్రాండ్‌ టీవీలు ఇప్పుడు మనకు ఒక్కటీ కనపడదు, ఆటోమొబైల్‌ రంగంలో కూడా అదే పరిస్ధితి స్వరాజ్‌-మజ్డా, మారుతీ-సుజుకి, హీరో-హోండా వంటి కంపెనీల ఒప్పందాలు ముగిసిన తరువాత అత్యధిక భాగం విదేశీ కంపెనీలు తమ వుత్పత్తులను స్వయంగా ఇక్కడే తయారు(విడిభాగాల కూర్పు) చేయటం, ఇక్కడి నుంచి ఎగుమతులు కూడా చేయటం ప్రారంభించాయి. బలమైన స్వదేశీ హీరో వంటి కంపెనీలు వాటితో పోటీ పడుతున్నాయి. ఇప్పుడు మన రిటెయిల్‌ రంగంలోకి ప్రవేశించేందుకు అమెజాన్‌, మెట్రో, వాల్‌మార్ట్‌ వంటి కంపెనీలు రంగంలోకి దిగాయి. ఎప్పుడైతే సామ్రాజ్యవాద దేశాల నుంచి పెట్టుబడులు రావటం ప్రారంభమైందో ప్రపంచ రాజకీయాలలో వాటి విధానాలను కూడా మన మీద రుద్దటం ప్రారంభించారు. వుదాహరణకు ఇజ్రాయెల్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా స్వతంత్ర పాలస్తీనా పునరుద్దరణకు మద్దతు ప్రకటించింది మన దేశం. ఇప్పటికీ అధికారికంగా దాని నుంచి వైదొలగనప్పటికీ ఆచరణలో నీరుగార్చటాన్ని చూస్తున్నాము. ఇజ్రాయెల్‌తో సంబంధాలు పెంచుకోవటమే దానికి నిదర్శనం.

మన కార్పొరేట్‌ రంగం అటు సోవియట్‌, ఇటు అమెరికా, ఐరోపా ధనిక దేశాలను వినియోగించుకొని లాభపడేందుకు గతంలో ప్రయత్నించినట్లుగానే ఇప్పుడు కూడా చేస్తోంది. విబేధాలను వినియోగించుకొని లాభపడేందుకు చూడటం గురించి వేరే చెప్పనవసరం లేదు.తనకు నష్టం కలిగిస్తుందనుకున్నపుడు అమెరికా వాంఛలకు వ్యతిరేకంగా వ్యవహరించటాన్ని కూడా చూడవచ్చు. చైనాతో అమెరికా వాణిజ్య యుద్ధం ప్రారంభించింది అనగానే అది మనకు ఎలా లాభమో దాన్నుంచి ఎలా లబ్ది పొందవచ్చో సూచిస్తూ వాణిజ్య వార్తల పత్రికల్లో అనేక మంది విశ్లేషణలు రాశారు. దాదాపు అన్ని దేశాలతో వాణిజ్య లావాదేవీలలో ఈరోజు చైనా మిగులును కలిగి వుంది. ఈ పరిస్ధితి ఎంతకాలం అన్నది ఒక ప్రశ్న. ఇటీవలి కాలంలో చూస్తే అన్ని దేశాలూ ముఖ్యంగా ధనిక దేశాలు చైనా పట్ల ముద్దులాట-దెబ్బలాటలు అడుతున్నాయి. అమెరికా బెదిరింపులు, అదే సమయంలో ఐరోపా దేశాల మౌనం దానిలో భాగమే. మన విషయానికి వస్తే ఏటేటా చైనాతో వాణిజ్యలోటు పెరిగిపోతోంది. గడిచిన పది సంవత్సరాలలో ఈ మొత్తం 16 నుంచి 51బిలియన్‌ డాలర్లకు పెరిగింది.నరేంద్రమోడీ హయాంలో గత నాలుగు సంవత్సరాలలో తగ్గుదల తప్ప పెరుగుదల లేదు. కారణం చైనాతో రాజకీయంగా వైరభావంతో వుండటం ఒకటి అని వేరే చెప్పనవసరం లేదు. గత కొద్ది కాలంగా మన ఎగుమతిదారుల లాబీవత్తిడి కారణంగా ఈ మధ్య నరేంద్రమోడీ ఎలాంటి అజెండా లేకుండానే చైనా పర్యటన జరిపి వచ్చారు. పైకి అలా కనిపించినప్పటికీ మన దిగుమతులు పెంచాలని కోరటమే అసలు లక్ష్యం. అందుకే చైనాపై రెచ్చగొట్టే వైఖరిని ఇటీవలి కాలంలో తగ్గించింది అని కూడా చెప్పాలి.

Image result for narendra modi foreign policy, china cartoons

ఇరాన్‌తో రాజకీయ వైరంలో భాగంగానే దానితో కుదిరిన అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగింది. అయితే దానికనుగుణ్యంగా మన దేశం కూడా ఇరాన్‌తో తెగతెంపులు చేసుకుంటే నష్టపోయేది మనమే. అసలే చమురు ధరలు పెరుగుతూ దడపుట్టిస్తున్న తరుణంలో రూపాయి వాణిజ్యానికి అంగీకరించిన ఇరాన్‌ను వదులుకుంటే ఇబ్బంది మనకే. అందుకే అణుఒప్పందం విషయంలో మన వైఖరి ఇరాన్‌కు అనుకూలంగానే వుంది. మొత్తం మీద చూసినపుడు అమెరికా వైపే మొగ్గుచూపుతున్నప్పటికీ అది తమ లాభాలకు ముప్పురానంత వరకే మన కార్పొరేట్‌ రంగం దానిని అనుమతిస్తుంది, మొదటికే మోసం వచ్చినపుడు ప్రతిఘటించటం తప్పనిసరి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా రాస్తున్న రైతాంగ తల రాత- మోడీ సర్కార్‌ అమలు చేస్తున్న సబ్సిడీ కోత !

28 Monday May 2018

Posted by raomk in BJP, Current Affairs, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, USA

≈ Leave a comment

Tags

Farm prices, farm subsidies, farmers fate, indian farmers, US writing the farmers fate, WTO

Image result for US writing the indian farmers fate

ఎం కోటేశ్వరరావు

అమెరికా ! ఎందరో యువతీ యువకులకు కలల ప్రపంచం. అమెరికా !! అక్కడి కార్పొరేట్లతో చేతులు కలిపి తెల్లవారే సరికి ధనవంతులై పోవాలని చూసే వాణిజ్య, పారిశ్రామికవేత్తలు. వారి ప్రయోజనాల కోసం చొంగకార్చుకుంటూ అమెరికా పాలకుల అడుగులకు మడుగులత్తే పాలకులు. నిజానికది అమెరికా కష్ట జీవులతో ప్రపంచ శ్రామికుల మూలుగులు పీల్చి తన కార్పొరేట్ల కడుపులు నింపేందుకు ఎంతకైనా తెగించే ఒక దుర్మార్గ వ్యవస్ధ వున్న దేశం. మన దేశం రైతాంగానికి అధిక మొత్తంలో మద్దతు ధరలు కల్పిస్తున్నారని, ఇది ప్రపంచ వాణిజ్య సంస్ధ ఆమోదించిన నియమావళికి విరుద్దమని ఈ అక్రమంపై విచారణ జరపాలని 2018 మే నెల మొదటి వారంలో అమెరికా ఫిర్యాదు చేసింది. రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తామన్న మాటలు కోటలు దాటి వూరంతటికీ వినిపించే విధంగా వాగ్దానాలు చేసిన నరేంద్రమోడీ సర్కార్‌ కాలు ఆచరణలో గడపదాట లేదు. ఇంతవరకు కనీసం ఆ చర్యను ఖండిస్తూ గట్టిగా ఒక ప్రకటన కూడా చేయలేదు.

మన దేశంలో ప్రతి ఏటా ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలు ఏమాత్రం గిట్టుబాటు కావటం లేదని అందరూ అంగీకరిస్తున్నదే. రైతాంగంలో వున్న ఈ అసంతృప్తిని ఓట్ల రూపంలో మలుచుకొనేందుకు 2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి గత లోక్‌సభ ఎన్నికలలో వాగ్దానం చేసింది. ఆ దిశగా ఇంతవరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదు, గత నాలుగు సంవత్సరాలలో పరిస్ధితి మరింత దిగజారిందని అనేక రాష్ట్రాలలో ప్రారంభమైన రైతాంగ వుద్యమాలే అందుకు నిదర్శనం. మన దేశంలో అమలు జరుగుతున్న విధానాల గురించి పశ్చిమ దేశాలు ఏవిధంగా ఆలోచిస్తున్నాయి? ప్రపంచ వాణిజ్య సంస్ధకు ఫిర్యాదు చేసేంతగా అమెరికాను ప్రేరేపించేందుకు మన ప్రభుత్వం కొత్తగా తీసుకున్న చర్యలేమన్నా వున్నాయా?

ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యుటివో) వునికిలోకి వచ్చిన గత పద్దెనిమిది సంవత్సరాలుగా పశ్చిమ దేశాలు మన దేశ వ్యవసాయ ఆర్ధిక వ్యవస్ధలో ఎప్పుడు చొరబడదామా, లాభాలను ఎంత త్వరగా తరలించుకుపోదామా అని ఆతృతపడుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ సంస్కరణల గురించి కబుర్లు చెప్పటమే తప్ప సమూలంగా మార్చేందుకు అది ముందుకు రావటం లేదు, మేమొస్తే తెల్లవారేసరికల్లా చేయాల్సింది పూర్తి చేస్తామని దేశ, విదేశీ కార్పొరేట్‌ సంస్ధలకు బిజెపి అరచేతిలో వైకుంఠం చూపింది. ముద్దు చేసినపుడే చంకనెక్కేందుకు సరైన సమయం అన్నట్లుగా మోడీ సర్కార్‌ అధికారంలోకి రాగానే పశ్చిమ దేశాలు మరోసారి పెద్ద ఎత్తున తమ వాదనలను ముందుకు తెచ్చి ప్రభావితం చేసేందుకు ప్రయత్నించాయి. కొంత మేరకు జయప్రదం అయ్యాయి. అనేక మంది మంది మంత్రులు, ఇతరులు పశ్చిమ దేశాలు చేసిన వాదనలనే చిలుక పలుకుల్లా వల్లెవేశారు.

2014 ఆగస్టు చివరి వారంలో డిప్లొమాట్‌ అనే పత్రికలో డాన్‌ పియర్సన్‌ అనే రచయిత పశ్చిమ దేశాల ఆలోచనా సరళిని ప్రతిబింబిస్తూ ఒక పెద్ద విశ్లేషణ రాశారు.’ ప్రమాదకరమైన భారత ఆహార రాయితీలు’ అని దానికి పేరు పెట్టారు. దాని సారాంశం, అందుకు అనుగుణ్యంగా మోడీ సర్కార్‌ తీరు తెన్నులు ఎలా వున్నాయో చూద్దాం.

‘భారత వ్యవసాయ సబ్సిడీలు(రాయితీలు) ప్రపంచ రైతాంగానికి హాని కలిగించటంతో పాటు స్వంత ఆహార భద్రతకే ముప్పు తెస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధతో భారత్‌ ఇచ్చిన అంగీకారం మేరకు ఇప్పటికే వ్యవసాయ సబ్సిడీలు ఎంతో ఎక్కువగా వున్నాయి. ప్రపంచవ్యాపితంగా వ్యవసాయ వస్తువుల రేట్లు పడిపోతున్నాయి, ఆ రాయితీలు ఇతర దేశాల్లోని రైతులను నష్టపరుస్తాయి. దెబ్బకు దెబ్బ తీయాలనే విధంగా వారి ప్రభుత్వాలపై వుద్యుక్తులౌతారు. వ్యవసాయ వాణిజ్యం చేసే దేశాలు ఈ విషయాన్ని ప్రపంచవాణిజ్య సంస్ధ వివాదాల పరిష్కారానికి నివేదించాలి. భారత దుర్వినియోగానికి స్వస్తి పలకాలి. భారత్‌లో కృత్రిమంగా ఎక్కువ ధరలకు రైతుల నుంచి పంటలను కొనుగోలు చేస్తున్నారు. తరువాత కొంత భాగాన్ని ఐదులక్షల చౌకదుకాణాల ద్వారా 80కోట్ల మంది పేదలకు తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. వుద్దేశించిన వినియోగదారులకు 40శాతం ఆహారం చేరటం లేదని అంచనా. అనేక మంది ఇంకా ఆకలితో వుండగా ఆహార నష్టం జరగటం దుర్మార్గం. ఏటా 30లక్షల టన్నుల ఆహారాన్ని నేల మీద ప్లాస్టిక్‌ సంచులు కప్పినిలవ చేస్తున్నారు.భారత్‌ ఈ విధానాన్ని ఇంకా కొనసాగిస్తున్నది.

భారత వ్యవసాయ సబ్సిడీలు దాని స్వంత ఆర్ధిక వ్యవస్ధకే హాని కలిగిస్తున్నాయి. గోధుమ, వరి, చెరకు వంటి పంటల సాగుకు మరింత భూమి, నీటిని వినియోగించే విధంగా రైతాంగానికి రాయితీలు ఇస్తున్నారు. దీని వలన వినియోగదారులు కొనుగోలు చేయాలని కోరుకొనే ఇతర పంటలైన పండ్లు, కూరగాయలు తదితరాల వుత్పత్తి తగ్గుదలకు, అధికధరలకు దారితీస్తోంది. మౌలిక పంటల సాగును ప్రోత్సహించి ఆహార భద్రతను సాధించేందుకే ఇవన్నీ చేస్తున్నామని ముసుగులో భారత్‌ వీటిని సమర్ధించుకుంటోంది. ఇదే సాకుతో పంటలకు అధిక ధరలు ఇవ్వటాన్ని, దిగుమతులపై ఎక్కువ పన్నుల విధింపు, తదితర ఆటంకాలు కలిగించటాన్ని సమర్ధించుకుంటోంది. దిగుమతులపై ఆంక్షలు విధించటం ద్వారా సాయపడటం కంటే ఆహార భద్రత సరఫరాకు హాని ఎక్కువని అత్యధిక ఆర్ధికవేత్తలు అంగీకరిస్తారు. భారత్‌లో వార్షిక రుతుపవనాలు విఫలమైతే అది కరవుకు దారి తీసి పంటల వుత్పత్తి తగ్గుతుంది. కాబట్టి పూర్తిగా స్వంత వుత్పత్తి మీదే పూర్తిగా ఆధారపడితే సరఫరా షాక్‌లు తగిలే అవకాశం వుంది. అలాగాక పెద్దదైన, విస్తరించే గుణం వున్న ప్రపంచ మార్కెట్‌తో తన వ్యవసాయ ఆర్ధిక వ్యవస్ధను పూర్తిగా ముడివేయాలి.

కాబట్టి అమెరికా వంటి ధనిక దేశాలు ఏం కోరుకుంటున్నాయో రైతు సోదరులు, సమాజంలోని ఇతరులకు చెప్పనవసరం లేదు. 2011లో డిటిబి అసోసియేట్స్‌ అనే ఒక సంస్ధ చేసిన సర్వే ప్రకారం భారత్‌కు అనుమతించిన 37బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువగానే రాయితీలిస్తున్నట్లు తేలిందని, ఇది ప్రపంచ వస్తు మార్కెట్లను, వాటిపై ఆధారపడిన రైతాంగాన్ని దెబ్బతీస్తుందని సదరు విశ్లేషకుడు పేర్కొన్నాడు. ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలను భారత్‌ పాటించకపోతే ఇతర దేశాలు కూడా అదే విధానాన్ని అనుసరిస్తాయని బెదిరించిన ఈ పెద్దమనిషి అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కమిషన్‌లో పది సంవత్సరాలు పని చేశాడంటే ఎవరి అభిప్రాయాలను ప్రతిబింబించాడో చెప్పనవసరం లేదు.

రోగి కోరుకున్నదే వైద్యుడు ఇచ్చాడన్నది పాత లోకరీతి, బహుళజాతి గుత్త సంస్ధలు కోరుకుంటున్నవాటినే మన పాలకులు తీరుస్తున్నారన్నది నేటి రీతి. అది కాంగ్రెస్‌ అయినా బిజెపి అయినా ఒకటే. నరేంద్రమోడీ సర్కార్‌ బిజెపి సీనియర్‌ నాయకుడు శాంతకుమార్‌ అధ్యక్షతన ఒక వున్నత స్ధాయి కమిటీని ఏర్పాటు చేసింది. అది చేసిన సిఫార్సులను దేశీయ, విదేశీ కార్పొరేట్లన్నీ హర్షించాయంటే అవెలాంటివో చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఎఫ్‌సిఐ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు లోపభూయిష్టంగా వున్నాయి. రైతులందరికీ కనీస మద్దతు ధరల లబ్ది చేకూరటం లేదు, మరోవైపు వినియోగదారులు అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది.ఈ కమిటీ సిఫార్సుల ప్రకారం ఎఫ్‌సిఐ సేకరణను పరిమితం చేస్తారు. రాష్ట్రాల అవసరాలకు పోను మిగులు వున్న ధాన్యాన్నే అదీ ప్రభుత్వాల నుంచి కొనుగోలు చేస్తారు. అసలే రాష్ట్ర ఆర్ధిక వనరులు అంతంత మాత్రంగా వున్న స్ధితిలో ఇది రాష్ట్రాలపై భారం మోపటం, కేంద్రం తన బాధ్యతల నుంచి వైదొలగటం తప్ప వేరు కాదు. అన్ని రాష్ట్రాల నుంచి, రైతులందరి నుంచి కొనుగోలు చేసి లోటు రాష్ట్రాలకు సరఫరా చేయాల్సిన ఎఫ్‌సిఐ పాత్రను చిన్న కమతాలున్న రాష్ట్రాలకే పరిమితం చేయాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. ఏ రాష్ట్రమైనా తన రైతాంగానికి బోనస్‌ ఇచ్చేట్లయితే అలాంటి రాష్ట్రాల నుంచి మిగులు ధాన్యాన్ని కూడా ఎఫ్‌సిఐ కొనుగోలు చేయరాదని పేర్కొన్నది. ఇది రైతాంగానికి అన్యాయం చేయటమే.

రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తానని చెప్పిన నరేంద్రమోడీ సర్కార్‌ ఆచరణలో రైతాంగాన్ని ప్రయివేటు వ్యాపారులకు అప్పగించేందుకు చేయాల్సిందంతా చేస్తోంది. కనీస మద్దతు ధరలే తక్కువని రైతాంగం గగ్గోలు పెడుతుంటే వాటి కంటే మార్కెట్లో ధరలు తగ్గినపుడే ప్రభుత్వం జోక్యం చేసుకోవటం అంటే అంతకు మించి కొనుగోలు చేసేందుకు ప్రయివేటు వ్యాపారులు ముందుకు రారన్నది పత్తి విషయంలో చూశాము. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కొనుగోళ్లు ఎంఎస్‌పికే పరిమితం కావటం, రైతాంగం నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసిన వ్యాపారుల నుంచి మద్దతు ధరలకు కొనుగోలు చేసి వారికి లబ్ది చేకూర్చటం అందిరికీ తెలిసిందే. ఆహార భద్రతను జనాభాలో ఇప్పటి వరకు వున్న 67శాతం మందిని 40శాతానికి పరిమితం చేసేందుకు శాంతకుమార్‌ కమిటీ సిఫార్సు చేసింది.

ప్రపంచ ఆకలి సూచికలో మన దేశ స్ధానం గత నాలుగు సంవత్సరాలలో ఒకటో అరా పాయింటు దిగజారింది తప్ప మెరుగుపడలేదు, అయినప్పటికీ లబ్దిదారుల సంఖ్యను తగ్గించేందుకు ఈ కమిటీ సిఫార్సు చేయటం గమనించాల్సిన అంశం. ఆహార భద్రతలో రెండు అంశాలున్నాయి. రైతులకు అధిక ధరలు కావాలి, వినియోగదారులకు తక్కువకు ఇవ్వాలి అంటే ఎలా అన్న వాదనను ముందుకు తేవటం తెలిసిందే.గిట్టుబాటు ధరలు రాక ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల వుదంతాలు చూశాము గానీ, తమ వుత్పత్తులకు గిట్టుబాటు ధరరాక దివాలాతీసిన పారిశ్రామికవేత్తలను ఎక్కడా చూడలేదు. అలాగే ఆత్మహత్యల కారణాలలో నమోదైన వాటిలో ధరల పెరుగుదల అంశం ఎక్కడా కనపడదు. రైతులు పండించిన వాటికి గిట్టుబాటు ధర రాక, వినియోగదారుడిగా అధిక ధరలు చెల్లించి రెండు విధాలుగా నష్టపోతున్నాడు. వినియోగదారుడికి వస్తున్న నష్టం ఒక్కటే. అందువలన ప్రభుత్వాలు ఇరువురి ప్రయోజనాలను కాపాడాల్సిందే. అది దాని బాధ్యత.

Image result for US writing the indian farmers fate

ప్రభుత్వాల ద్రవ్యలోటు తగ్గాలంటే సమాజంలోని బలహీనవర్గాలకు ఇస్తున్న రాయితీలన్నింటికీ కోత పెట్టాలని ఎక్కువ మంది చెబుతారు. అదే సమయంలో వుపాధి కల్పించాలంటే పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు రాయితీలు ఇవ్వాలని కూడా ఆ వాదన చేసే వారే చెబుతారు. జరుగుతున్నదేమిటి? దేశంలో ఇస్తున్న రాయితీలన్నింటికీ కోత పెట్టారు. పెట్రోలు,డీజిల్‌ రాయితీ ఎత్తివేశారు. గ్యాస్‌, కిరోసిన్‌పై క్రమంగా ఎత్తివేస్తున్నారు. కాంప్లెక్స్‌ ఎరువులపై ధర నియంత్రణ ఎత్తివేశారు. వాటి మీద ఇచ్చే రాయితీలను తగ్గించటం లేదా ఒక పరిమితిదాట కుండా చూస్తున్నారు. ఎరువుల విషయం చూద్దాం. పౌష్టికాధార ప్రాతిపదికన రాయితీ విధానం(ఎన్‌బిఎస్‌) కింద నైట్రోజన్‌(ఎన్‌) కిలోకు 2011-12లో రు.27.15 ఇస్తే 2016-17కు రు.15.85కు తగ్గింది. ఇదే విధంగా ఫాస్ఫేట్‌ (పి)కు రు.32.34 నుంచి 13.24కు, పొటాష్‌(కె)కు రు.26.75 నుంచి 15.47కు తగ్గింది. ఇదే సమయంలో సల్ఫర్‌(ఎస్‌)కు రు.1.78 నుంచి 2.04కు పెరిగింది.(కేంద్ర ఎరువుల శాఖ 2016-17వార్షిక నివేదిక, పేజీ 41) యూరియా మీద రాయితీ కొనసాగుతున్నది, పెరుగుతున్నది. అన్నింటికీ ద్రవ్యోల్బణం ప్రాతిపదికన రేట్లు పెరుగుతున్నపుడు ఎరువుల రాయితీ మొత్తం కూడా ఆమేరకు పెరగాలి, కానీ అలా జరగటం లేదు. భారత ఫెర్టిలైజర్స్‌ అసోసియేషన్‌ సమాచారం మేరకు 2011-12 నుంచి 2014-15 మధ్య యూరియా మీద ఇస్తున్న రాయితీ 20,208 కోట్ల నుంచి 36వేల కోట్ల రూపాయలకు పెరిగింది. ఇదే సమయంలో ధరల నియంత్రణ ఎత్తివేసిన కాంప్లెక్‌ ఎరువులపై ఇస్తున్న రాయితీ రు.36,089 కోట్ల నుంచి 24,670 కోట్లకు పడిపోయింది. దిగుమతులతో సహా అన్ని రకాల ఎరువులకు ఇచ్చిన రాయితీలు వరుసగా నాలుగు సంవత్సరాలలో 70013,65613, 67971, 72970 కోట్ల వంతున వున్నాయి. ఈ ఏడాది మార్చినెలలో ప్రకటించిన బడ్జెట్‌ లెక్కల ప్రకారం 2017-18 సంవత్సరంలో ఇచ్చిన రాయితీల సవరించిన మొత్తం రు.64,973 కోట్లు కాగా దీనిలో 42,721 కోట్లు యూరియా వాటా, వర్తమాన సంవత్సరం అంటే 2018-19లో మొత్తం సబ్సిడీ రు.70,079 కోట్లకు పెంచగా దానిలో యూరియా నిమిత్తం 44,989 కోట్లుగా ప్రతిపాదించారు. అంటే మొత్తంగా ఎరువుల రాయితీ తగ్గుతున్నట్లా పెరుగుతున్నట్లా ?

ఒకటి రెండు సంవత్సరాలలో తప్ప జనానికి ఇచ్చే ఆహార, పెట్రోలియం వుత్పత్తుల, ఎరువుల సబ్సిడీ మొత్తం జిడిపిలో ఒకశాతానికి అటూ ఇటూగా వుంటున్నాయి. ఇదే సమయంలో కార్పొరేట్‌లకు ఇస్తున్న రాయితీలు ఐదు నుంచి ఎనిమిదిశాతం మధ్యన వుంటున్నాయి. ఐదుశాతం రాయితీలు ఇస్తున్నామని, వాటిని ఎత్తివేస్తే జిడిపిలో పన్ను 22శాతానికి పెరుగుతుందని ప్రధాని ఆర్ధిక సలహా మండలి అధ్యక్షుడు వివేక్‌ దేవరాయ్‌ 2017 డిసెంబరులో చెప్పారు. మన దేశంలో జిడిపిలో పన్ను 15శాతమే, అదే ఇతర బ్రిక్స్‌ దేశాలైన బ్రెజిల్‌లో 25.4, రష్యాలో 23,చైనాలో 18.9, దక్షిణాఫ్రికాలో 26శాతం కాగా అమెరికాలో 28, స్కాండినేవియన్‌ దేశాలలో 45-50శాతం మధ్య వున్నాయి. అందువలన రకరకాల ముసుగుల్లో విదేశాలకు, దేశీయ కార్పొరేట్‌ సంస్ధలకు తరలిపోతున్న లాభాలపై పన్ను రేటు పెంచి ఆ వచ్చిన మొత్తాన్ని అటు రైతాంగం, ఇటు వినియోగదారులకు రాయితీలు ఇస్తే ఎవరూ ఇబ్బంది పడకుండా వుంటారు. అలాంటి సంస్కరణలకు ఈ పాలకులు పూనుకుంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మీ ఇంటికొస్తే మాకేమి ఇస్తారు, మా ఇంటి కొస్తూ మాకేమి తెస్తారంటే కుదరదు అమెరికా పెద్దన్నా !

22 Tuesday May 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

america first, anti china, CHINA TRADE, Donald trump, Indo-China trade, TRADE WAR, US-CHINA TRADE WAR

ఎం కోటేశ్వరరావు

వాణిజ్య యుద్ధంలో అమెరికా ముందు చైనా చేతులెత్తేసిందా? ఏమో ! చైనా మెడలు వంచి వాణిజ్య పోరులో అమెరికా విజయం సాధించిందా ? ఏమో చెప్పలేం గానీ తాత్కాలికంగా రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరింది. ‘చైనాతో యుద్దం వాయిదా పడింది, కానీ ట్రంప్‌ వ్యూహ గందరగోళం కొనసాగుతూనే వుంది’ . కార్పొరేట్ల పత్రిక ఫోర్బ్స్‌ ఒప్పందంపై రాసిన తక్షణ విశ్లేషణ శీర్షిక ఇది. ‘ చైనా ముఖ్యమైన ప్రయోజనాలను కాపాడుకుంది’ ఇది చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక విశ్లేషణకు పెట్టిన శీర్షిక. వివరాలేమీ తెలియకుండానే అమెరికాన్లకు చైనా లంగిపోయిందని సంతోష పడే వారికి చివరకు మిగిలేది నిరాశే అని గత చరిత్రను బట్టి చెప్పక తప్పదు.

ప్రపంచంలో స్వేచ్చా వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు అమెరికా నాయకత్వంలోని ధనిక దేశాలు వునికిలోకి తెచ్చినదే ప్రపంచవాణిజ్య సంస్థ(డబ్ల్యుటిఓ). అది ఒక పక్క వుండగానే మరోవైపు దానిలోని సభ్యదేశాలు వాణిజ్య యుద్ధాలకు తలపడటం అంటే దాని వైఫల్యాన్ని సూచిస్తున్నది. నిజానికి ప్రపంచీకరణ యుగంలో రెండు దేశాల మధ్య తలెత్తే వాణిజ్యపోరు, పరిష్కారం కూడా వాటికే పరిమితం కాదు. ప్రపంచంలో ప్రతి ధనిక దేశమూ చైనాతో వాణిజ్యంలో లోటుతోనే వుంది, కనుక ప్రతి దేశమూ దానిని తగ్గించుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూనే వుంటుంది. వాటిలో అమెరికా ఒకటి. దిగుమతి సుంకాల పెంపుతో ఎవరైనా చైనాను దెబ్బతీయాలని చూస్తే ఆ విబేధాన్ని వినియోగించుకొనేందుకు మిగతా దేశాలు కాచుకొని వుంటాయి, వున్నాయి. అందుకు పెద్ద వుదాహరణ మన దేశమే.

కాషాయ మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో నిత్యం చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతుంటారు. దేశభక్తి నిరూపణకు చైనా వ్యతిరేకతను ఒక ప్రమాణంగా ముందుకు తెస్తున్నారు. అయితే గతకొద్ది నెలలుగా ప్రధాని నరేంద్రమోడీ, విదేశాంగమంత్రి మొదలు, వున్నత అధికారయంత్రాంగం మొత్తం చైనాతో సయోధ్య దిశగా ముందుకు పోతున్నారంటే అతిశయోక్తి కాదు. పాత సామెత ప్రకారం వ్యాపారి వరదనబడి పోతున్నాడంటే ఏదో లాభం కనిపించబట్టే అని వేరే చెప్పనవసరం లేదు. కమ్యూనిస్టు వ్యతిరేకతలో అమెరికా కంటే సంఘపరివారం పేరుమోసిందేమీ కాదు. అలాంటి అమెరికానే చైనాతో కాళ్లబేరానికి వస్తున్నపుడు పరివార పెద్దలైన మోడీ, మరొకరు ఎంత? వారంతా కార్పొరేట్ల ప్రతినిధులు తప్ప మరొకరు కాదు. ఎడ్లెవిస్‌ అగ్రీవాల్యూ చైన్‌ లిమిటెడ్‌ కంపెనీ పరిశోధన విభాగ అధిపతి పెరెరాణా దేశాయ్‌ చైనా-అమెరికా వాణిజ్య పోరు గురించి ఇలా చెప్పారు.’ ఎగుమతుల ధరలు పోటాపోటీగా వున్నట్లయితే అయిల్‌ సీడ్స్‌ మీల్స్‌ అయిన సోయా, ఆవ, పత్తి మరియు మొక్కజన్న భారతీయ ఎగుమతిదార్లకు ఒక చిన్న వ్యవసాయ ఎగుమతి కిటికీ తెరుచుకుంటుంది. నూట ఆరు అమెరికా వుత్పత్తులపై చైనా 25శాతం వరకు కొత్త పన్నులు ప్రకటించింది, అంతకు ముందు 128 అమెరికా వుత్పత్తులపై పన్నులు పెంచింది. రెండు అతి పెద్ద దేశాలు ఒక వాణిజ్య యుద్ధంలోకి అడుగుపెట్టాయి.పదమూడు వందల చైనా వుత్పత్తులపై అమెరికా 25శాతం పన్నులు విధించింది.’ భారత పత్తి సంఘం అధ్యక్షుడు అతుల్‌ గణత్ర మాట్లాడుతూ ‘ అమెరికా తరువాత పత్తి ఎగుమతిలో స్థానం భారత్‌దే. చైనా 50మిలియన్‌ బేళ్ళ పత్తి దిగుమతి చేసుకుంటే దానిలో 40శాతం అమెరికా నుంచి వస్తోంది. ఆ పత్తిపై చైనా 25శాతం పన్ను విధిస్తోంది. మన పత్తిపై చైనాలో ఎలాంటి పన్నులు లేవు, అందువలన అమెరికా పత్తి కంటే మన సరకు చౌక అవుతుంది కనుక మనకు ఇది మనకు లాభదాయకం.’ సౌరాష్ట్ర జిన్నర్స్‌ అసోసియేషన్‌ ఆనంద్‌ పోపట్‌ మాట్లాడుతూ ఆస్ట్రేలియా, ఆఫ్రికన్‌ కాటన్‌ కంపెనీల కంటే మన పత్తి ధర చౌక, భారత సోయాబీన్‌పై వున్న ఆంక్షలను చైనా తొలగించినట్లయితే వారికి మనం సరఫరా చేయగల మరొక వస్తువు అవుతుంది. చైనాకు అవసరమైన 93.4 మిలియన్‌ టన్నులు సోయాలో ప్రస్తుతం అమెరికా 39శాతం సరఫరా చేస్తోంది.’ అన్నారు. చైనా పశు, కోళ్ల దాణాకు వుపయోగించే సోయాను మన దేశం నుంచి ఎగుమతి చేసేందుకు ఇప్పుడున్న ఆంక్షల ఎత్తివేతకు మన దేశవాణిజ్య శాఖ సంప్రదింపులు జరుపుతోంది.

గత నాలుగు సంవత్సరాలుగా నరేంద్రమోడీ సర్కార్‌ తన విజయాల గురించి ఎన్ని అతిశయోక్తులు చెబుతున్నప్పటికీ కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లుగా పరిస్ధితి వుంది. మన వాణిజ్యలోటు గతేడాది ఏప్రిల్‌లో 13.25బిలియన్‌ డాలర్లు వుండగా ఈ ఏడాది 13.72 బిలియన్లకు పెరిగింది. రోజు రోజుకూ చమురు ధరల పెరుగుదల కారణంగా ఇది మరింత విస్తరించటమే కాదు, మన దేశం నుంచి డాలర్లు తరలిపోవటం పెరుగుతుండటంతో విదేశీమారకద్రవ్య సమస్యకూడా తలెత్తే అవకాశం వుంది. ఎక్కడన్నా బావే కాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు మన మార్కెట్లో ప్రవేశించేందుకు మోడీని కౌగలించుకోవటం తప్ప వారి మార్కెట్లలో మనకు ప్రవేశం ఇవ్వటం లేదు. మన దేశ ధనికులు ఏ కారణం చేతో బంగారం, బంగారు ఆభరణాలు, ముత్యాలు, రంగురాళ్లు దిగుమతి చేసుకోవటం తగ్గించబట్టిగాని లేకపోతే వాణిజ్యలోటు మరింత పెరిగి వుండేది. గత ఏప్రిల్‌లో చమురు దిగుమతులకు 7.36బిలియన్‌ డాలర్లు మనం చెల్లించగా ఈ ఏడాది ఆ మొత్తం 10.41బిలియన్లకు పెరిగింది.

ప్రపంచంలో నేడు చైనా పెద్ద ఎగుమతిదారే కాదు, పెద్ద వినియోగదారుగా కూడా మారుతోంది. అక్కడి జనాభా కొనుగోలు శక్తి పెరుగుతున్న కారణంగా ఆ మార్కెట్‌ను వదులుకొనేందుకు ఏ ధనిక దేశమూ సిద్దంగా లేదు. అలాంటి దేశంతో మనం అనవసరంగా తగాదా పెట్టుకోవాల్సిన అవసరం ఏముందనే అభిప్రాయం మన కార్పొరేట్‌ రంగంలో క్రమంగా పెరుగుతోంది. సంఘపరివార్‌ చైనా వ్యతిరేక చిల్లర ప్రచారం ఎలా వున్నప్పటికీ ప్రభుత్వపరంగా అది కుదరదని స్పష్టం చేస్తున్న కారణంగానే ఇటీవలి కాలంలో డోక్లాం దగ్గర నుంచి అనేక సానుకూల వైఖరులను వెల్లడిస్తున్నది. చైనా ఆహార, ఔషధ నియంత్రణ శాఖ వద్ద పెండింగ్‌లో వున్న 254 వుత్పత్తుల నమోదుకు వేగంగా అనుమతులు తీసుకోవాలని మన ఫార్మారంగం మోడీ సర్కార్‌ మీద వత్తిడి తెస్తోంది.

తాను ఎగుమతి చేయటమే తప్ప దిగుమతులు చేసుకోవటం లేదన్న విమర్శలను పూర్వపక్షం చేసేందుకు లేదా ఎవరేమి ఎగుమతి చేయగలరో చూపండి అన్నట్లుగా ఈ ఏడాది నవంబరు నెలలో షాంఘై నగరంలో తొలిసారిగా చైనా దిగుమతుల ప్రదర్శన నిర్వహిస్తోంది. అంటే ప్రపంచ దేశాలన్నీ తమ వుత్పత్తులను అక్కడ ప్రదర్శించాల్సి వుంటుంది. రానున్న ఐదు సంవత్సరాలలో తాము పది లక్షల కోట్ల డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటామని చైనా చెబుతోంది. అందువలన ప్రతి దేశం తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రయత్నిస్తుంది. షాంఘై ప్రదర్శనలో చైనా తన విధానాన్ని, నిబంధనలను ప్రపంచానికి తెలియచేయనుంది. ఈ ప్రదర్శనలో మన దేశం నుంచి కనీసం వందమంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం వుంది. చైనా వస్తువుల దిగమతులు నిలిపివేసి దేశభక్తి నిరూపించుకోవాలని సంఘపరివార్‌ సంస్ధలు ఎంతగా గగ్గోలు పెట్టినా గత ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు మన దేశం చైనా నుంచి 69.4బిలియన్‌ డాలర్ల మేరకు వస్తువులను దిగుమతి చేసుకోగా ఇదే సమయంలో కేవలం 11.5బిలియన్ల మేరకు మాత్రమే ఎగుమతులు చేసింది. వాణిజ్య తేడా 58 బిలియన్‌ డాలర్లు. చైనాతో సరిహద్దు సమస్యతో పాటు వాణిజ్యపరంగా ఇలాంటి ఎన్నో ప్రాధాన్యత అంశాలున్నందున వారితో వైరం తెచ్చుకోవాలని ఏ కార్పొరేట్‌ సంస్ధా కోరుకోదు. పాలకులు ఎవరైనా అలాంటి పిచ్చిపనులకు పూనుకుంటే వైఖరి మార్చుకునే విధంగా తాను చేయాల్సింది చేస్తుంది. ఈ పూర్వరంగంలోనే ఎలాంటి ముందస్తు ఎజండా లేకుండా నరేంద్రమోడీ చైనా వెళ్లినప్పటికీ సానుకూలంగా వున్నామన్న సందేశం దానిలో ఇమిడి వుంది.

అమెరికాాచైనాల మధ్య వాణిజ్య పోరుకు స్వస్థిచెప్పి వాణిజ్యలోటు సమస్యను పరిష్కరించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. అయితే ఆచరణలో ఎవరి ప్రయోజనాలు వారికి వున్నాయి గనుక అమలు ప్రశ్న తలెత్తుతోంది. గతంలో కూడా ప్రతి అమెరికా అధ్యక్షుడూ ఏదో ఒక దశలో వాణిజ్యపోరు పేరుతో బెదిరింపులకు దిగిన వారే. ట్రంప్‌ వైఖరి మొరటుగా వుంది. తన పదవీకాలం పూర్తయ్యే నాటికి రెండు దేశాల మధ్య వున్న వాణిజ్యలోటులో 200బిలియన్‌ డాలర్లను తగ్గించాలని చెబుతున్నాడు. అయితే హడావుడి చేస్తోందని చైనీయులు చెబుతున్నారు. మేడిన్‌ చైనా 2025 పేరుతో చైనా తన వుత్పాదక పరిశ్రమను వున్నత స్ధాయికి పెంచుకొనేందుకు దీర్ఘకాలిక క్రీడను ప్రారంభించిందని, దానిని పడనివ్వకుండా చేయటంతో పాటు అమెరికా తాత్కాలిక ప్రయోజాలను కోరుతోందని, చైనా కీలక ప్రయోజనాలను ఎట్టి పరిస్ధితులలో ఫణంగా పెట్టదని పరిశోధకులు చెబుతున్నారు.

చైనాతో పూర్తి స్థాయి వాణిజ్య యుద్ధం తప్పిపోయిందని విజయోత్సవాలు చేసుకోవటం తప్ప సాధించిందేమిటో తెలియదని అమెరికాలో విమర్శకులు అంటున్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధతో కలవకుండా తన ప్రయోజాలకే పెద్ద పీట వేస్తున్న చైనాను ఒంటరి పాటు చేయటం లేదా అంకెకు తీసుకురావటం అన్న అసలు లక్ష్యాన్ని ట్రంప్‌ పట్టించుకోవటం లేదన్న విమర్శలు చెలరేగాయి. అసలు చైనాను ప్రపంచ వాణిజ్య సంస్ధలో అడుగుపెట్టనివ్వటమే అమెరికా చేసిన పెద్ద తప్పిదమని అమెరికా వాణిజ్య ప్రతినిధి ఒక నివేదికలో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఆర్ధిక వ్యవస్ధలో రాజ్య జోక్యం చేసుకోకుండా చైనాను కట్టడి చేయటమే అంతి మ లక్ష్యం అయితే అమెరికా వస్తువులను కొనుగోలు చేయించమని చైనాను కోరటం ప్రతికూలమౌతుందని కొందరు హెచ్చరిస్తున్నారు.

అమెరికా ఇప్పుడు ఒక్క చైనా మీదే కాదు మా వస్తువులు కొంటారా లేక మీ వస్తువుల మీద దిగుమతి పన్ను విధించమంటారా తేల్చుకోండని అన్ని దేశాలను బెదిరిస్తున్నది. వాటిలో జపాన్‌ ఒకటి. రాజకీయంగా చైనాకు వ్యతిరేకంగా దానిని కూడగడుతున్నప్పటికీ ఆర్ధిక విషయాల్లో జపాన్‌పై అమెరికా తన షరతులను రుద్దేందుకు పూనుకుంది. తమ వుక్కు, అల్యూమినియం వస్తువులపై 25,10 శాతం చొప్పున దిగుమతి పన్ను విధించేందుకు అమెరికా పూనుకుంటే తాము కూడా ప్రతి చర్యలకు దిగక తప్పదని ప్రపంచవాణిజ్య సంస్ధకు జపాన్‌ తెలియచేసింది. అమెరికా బెదిరింపులకు చైనా లంగకపోవటం జపాన్‌కు వూతమిచ్చి అమెరికాను హెచ్చరించేంత వరకు వెళ్లిందని పరిశీలకులు భావిస్తున్నారు. 1970,80 దశకాలలో అమెరికాను ఎదిరించే శక్తిలేని జపాన్‌ ప్లాజా ఒప్పందాన్ని అంగీకరించాల్సి వచ్చిందని పర్యవసానంగా జపాన్‌లో దీర్ఘకాల ఆర్ధిక తిరోగమనానికి దారి తీసిందని ఇప్పుడు అమెరికా గొంతెమ్మ కోర్కెలను చైనా అంగీకరించటం లేదని అందువలన చైనా నుంచి నేర్చుకోవాల్సి వుందని జపాన్‌ భావిస్తున్నది.

చిత్రం ఏమిటంటే ఐరోపాలో రష్యాకు వ్యతిరేకంగా అమెరికాతో చేతులు కలుపుతున్న అక్కడి ధనిక దేశాలు కూడా జపాన్‌ చర్యను చూసి అమెరికా దిగుమతి సుంకాలకు ప్రతిగా తాము కూడా అమెరికా వస్తువులపై అదనపు సుంకాలను విధించాల్సి వుంటుందని ఐరోపా యూనియన్‌ పేర్కొన్నది.అయితే ఈ హెచ్చరికలేవీ జపాన్‌-ఐరోపాయూనియన్‌- అమెరికా మధ్య వున్న రాజకీయ బంధాన్ని దెబ్బతీసేవిగా మారే అవకాశాలు ఇప్పటికైతే లేవు. మన దేశంపై అమెరికా వాణిజ్య యుద్దానికి దిగకపోయినప్పటికీ మన వ్యవసాయ మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు వత్తిడి తెస్తోంది. దానిలో భాగంగానే మన దేశంలో ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధరలను ఎక్కువగా నిర్ణయిస్తోందని, వ్యవసాయ, ఆహార రాయితీలను పరిమితికి ఇస్తోందని ప్రపంచ వాణిజ్య సంస్ధకు కొద్దివారాల క్రితం ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో వుక్కు, అల్యూమినియం దిగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలు మన దేశానికి కూడా వర్తిస్తాయని మన దేశం కూడా వాణిజ్య సంస్ధకు నోటీసు అందచేసింది. మొత్తం మీద చూసినపుడు మీ ఇంటికొస్తే మాకేమి ఇస్తారు, మా ఇంటికొస్తూ మాకేమి తెస్తారు అన్న రీతిలో అమెరికా ప్రవర్తిస్తోంది. అందువలన దాని వైఖరికి ప్రభావితులయ్యే ప్రతి ఒక్కరు ఏదో విధంగా సమన్వయం చేసుకొని పెద్దన్న వైఖరిని అడ్డుకోవటం అవసరం. ఈ దృష్ట్యా కూడా చైనాతో మన దేశం సఖ్యంగా వుండి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మే డే అంటే ఎర్రజెండాల పార్టీల వ్యవహారం కాదు

24 Tuesday Apr 2018

Posted by raomk in Current Affairs, employees, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

communist, communist parties, may day, Trade Union Movement in India

ఎం కోటేశ్వరరావు

మే డే అంటే ఎర్రజెండాల పార్టీల రోజు, కమ్యూనిస్టుల వ్యవహారం అనుకుంటారు. ప్రపంచంలో కమ్యూనిస్టులు, పార్టీలు పుట్టక ముందే కార్మికులు, వారిని దోపిడీ చేసే వ్యవస్ధ వునికిలోకి వచ్చింది. ఒక్కసారి అవలోకిస్తే కార్మిక సమస్యల మీద మన దేశంలో స్పందించిందీ, వారిని సంఘటిత పరచేందుకు ముందుగా ప్రయత్నించింది కమ్యూ నిస్టులు కాదు. అసలు శాస్త్రీయ సోషలిజం భావన వునికిలోకి రాక ముందే అంటే 1848లో కమ్యూనిస్టు మానిఫెస్టో విడుదల కాక ముందు, కమ్యూనిస్టు పార్టీల నిర్మాణం గాక ముందే ప్రపంచంలో కార్మిక చట్టాలు, ప్రాధమిక రూపంలో కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి. మన దేశంలో తొలి జాతీయ కార్మిక సంఘాన్ని(ఏఐటియుసి) ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌ నాయకులే. దాని తొలి అధ్యక్షుడు లాలా లజపతిరాయ్‌. తరువాతే కమ్యూనిస్టులు దానిలో చురుకుగా పనిచేసి, మిలిటెంట్‌ కార్మిక పోరాటాలను నిర్వహించారు గనుక తరువాత కమ్యూనిస్టులు నాయకత్వ స్ధానాలలోకి వచ్చారు. స్వాతంత్య్రం తరువాత రాజకీయ పార్టీలు తమ భావజాలానికి అనుగుణంగా జాతీయ కార్మిక సంఘాలను ఏర్పాటు చేశాయి.

ఎప్పుడైతే వస్తూత్పత్తి ప్రక్రియలో యంత్రాలను ప్రవేశపెట్టారో అప్పుడే వాటిపై పని చేసే పారిశ్రామిక కార్మికులు కూడా తయారయ్యారు. ఇది పారిశ్రామిక విప్లవ తొలి పర్యవసానం. దోపిడీ, అసమానతల వంటివి సరేసరి. మన వేదాల్లో అంతులేని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం దాగుందని కాషాయ తాలిబాన్లు చెప్పగా వినటం తప్ప మనకు కనపడదు. నిజంగా అదే నిజమైతే పారిశ్రామిక విప్లవం భారత వుపఖండానికి బదులు ఐరోపాలో ఎందుకు ప్రారంభమైంది, పోనీ ఇప్పటికైనా వేద సాంకేతిక పరిజ్ఞానాన్ని బయటకు తీసి మేకిన్‌ ఇండియా పిలుపులో భాగంగా ఎందుకు వుత్పత్తి చేయరు, దిగుమతులను ఎందుకు ఆపరు అన్నది ఒక మౌలిక ప్రశ్న. దాని గురించి వేరే సందర్భంగా చర్చించుకుందాం. పారిశ్రామిక విప్లవం ఐరోపాలోనే జరిగినప్పటికీ దానితో ప్రభావితం గాని దేశం లేదు. మన దేశంలో సంభవించిన పర్యవసానాల గురించి 1853లో న్యూయార్క్‌ డైలీ ట్రిబ్యూన్‌ పత్రికలో కారల్‌ మార్క్స్‌రాసిన విశ్లేషణలో ఇలా వుంది.’ భారత చేనేత రంగంలో ప్రవేశించిన బ్రిటీష్‌ చొరబాటుదారుడు నేత ప్రక్రియనే నాశనం చేశాడు. ఐరోపా మార్కెట్లనుంచి భారత వస్త్రాలను బయటకు నెట్టటంతో ప్రారంభించి చివరకు హిందూస్తాన్‌లో తానే చేయితిప్పటాన్ని ప్రారంభించింది ఇంగ్లండు.నేత వస్త్రాలకు నిలయమైన దేశాన్ని తన వస్త్రాలతో ముంచివేసింది.1818-36 మధ్య గ్రేట్‌ బ్రిటన్‌ నుంచి ఇండియాకు ఎగుమతులు 1:5,200 దామాషాలో పెరిగాయి.1824లో గ్రేట్‌ బ్రిటన్‌ నుంచి భారత్‌కు కేవలం పది లక్షల గజాలలోపే ఎగుమతి జరగ్గా 1837నాటికి 6.40 కోట్లకు పెరిగాయి. ఇదే సమయంలో ఢాకా పట్టణ జనాభా లక్షా 50వేల నుంచి ఇరవై వేలకు పడిపోయింది.ఒక నాడు తమ వస్త్రాలతో పండుగ చేసుకున్న మాదిరి కళకళలాడిన పట్టణాలు దిగజారటం దీని పర్యవసానమే. బ్రిటీష్‌ వారి ఆవిరిశక్తి, సైన్సు హిందూస్దాన్‌ అంతటా వ్యవసాయం-వుత్పాదక పరిశ్రమ మధ్య వున్న సంబంధాన్ని కూకటి వేళ్లతో పెకలించాయి.’

పారిశ్రామిక విప్లవంలో పెరిగిన వస్తూత్పత్తిని అమ్ముకొనేందుకు యజమానులు ఇతర దేశాల మార్కెట్ల వేట సాగిస్తే వారి యంత్రాలపై పని చేసే కార్మికులు దిగజారిన తమ బతుకులను బాగుచేసుకొనేందుకు బతుకుపోరు జరిపారు. పారిశ్రామికీకరణతో వుపాధి కోల్పోయిన చేనేత వృత్తిదారుల నుంచి బ్రిటన్‌లో తొలిసారిగా యాంత్రీకరణకు ప్రతిఘటన కూడా ప్రారంభమైంది. యజమానుల చర్యలు మార్కెట్లకోసం యుద్ధాలు, వలసలు, ప్రపంచీకరణ, అంతులేని దోపిడీకి దారితీశాయి. కార్మికుల బతుకుపోరు మేడే, సోషలిజం, కమ్యూనిజం వంటి దోపిడీలేని నూతన సమాజాల అన్వేషణకు పురికొల్పాయి. ప్రతి ఏడాది మే ఒకటవ తేదీ, దీన్నే అంతర్జాతీయ కార్మిక దినం అని కొన్ని చోట్ల కార్మికదినం అని పిలుస్తారు. కొంత మంది ఆ రోజును దినోత్సవంగా జరుపుతారు, మరి కొందరు దీక్షా దినంగా పాటిస్తారు. ఈ పూర్వరంగంలో కార్మికులు, ఇతర కష్ట జీవులు మే ఒకటవ తేదీని ఎలా జరపాలన్నది వారి చైతన్యానికి గీటురాయి. కనీస సౌకర్యాలు కూడా లేక చెమటలు కక్కుతూ శారీరక శ్రమను, అధునాతన భవనాలలోని ఎసి గదుల్లో ఆధునిక కంప్యూటర్లపై పని చేస్తూ మేధోశక్తిని అమ్ముకుంటూ ఒక యజమాని దగ్గర వేతనం తీసుకొని పని చేసే ఐటి ఇంజనీరు, కార్యాలయ బంట్రోతు, ప్రభుత్వ వుద్యోగి, కార్మికుడు, గుమస్తా ఇలా ఎవరైనా తెల్ల చొక్కా లేక యూనిఫాం వేసుకున్నా అందరూ కార్మికులే.

మన దేశ కార్మికవర్గ చరిత్రను చూసినపుడు రైల్వేకార్మికులు అగ్రగాములలో ముఖ్యులు. దాని అనుబంధ పరిశ్రమలతో పాటు బగ్గు, పత్తి,జనపనార పరిశ్రమలతో కార్మికులు విస్తరించారు. పారిశ్రామిక విప్లవం జరిగిన ఐరోపాలోగానీ, విస్తరించిన భారత్‌ వంటి దేశాలలోగానీ దుర్భరపరిస్ధితులు, దోపిడీలో ఎలాంటి తేడా లేదు. మన కార్మికవర్గం సామ్రాజ్యవాద పాలన కింద మగ్గటంతో పాటు అటు విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులదోపిడీకీ గురైంది అయింది. అందువలన దోపిడీతో పాటు సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయపోరాటంలో కూడా భాగస్వామి అయింది. అందువలన జాతీయవాదులు, వుదారవాదులే తొలి కార్మికోద్యమ నిర్మాతలుగా వుండటం ఒక సహజపరిణామం. దీని ప్రభావం కార్మికవర్గ అవగాహనమీద కూడా పడింది. కొంత మంది కార్మిక సమస్యల కంటే వారిని సామ్రాజ్యవాద వ్యతిరేకులుగా మార్చటంపైనే కేంద్రీకరించారు. బ్రిటీష్‌ యజమానులు, భారత యజమానుల ఫ్యాక్టరీల పట్ల తేడా వుండాలని చెప్పారు. కార్మిక చట్టాలను గనుక అమలు జరిపితే భారతీయ యజమానుల ఆధ్వర్యంలోని ఫ్యాక్టరీలు పోటీని తట్టుకోలేవని భావించారు.ఈ కారణంగానే 1881,91లో తెచ్చిన ఫ్యాక్టరీ చట్టాలను కొందరు వ్యతిరేకించారు. వర్గ అవగాహనతో కార్మికులను విడదీయవద్దని చెప్పారు. దయాదాక్షిణ్యాలతో కార్మికుల ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపరచాలని చూశారు.

తొలిసారిగా 1870లో శశిపాద బెనర్జీ కార్మిక క్లబ్బు స్ధాపించి, భారత శ్రమజీవి అనే పత్రికను కూడా ఏర్పాటు చేశారు. సొరాబ్జీ షాపూర్జీ బెంగాలీ చొరవతో 1878లో కార్మికుల పని పరిస్ధితుల మెరుగుదలకు బంబాయి శాసన మండలి ఒక చట్టాన్ని ఆమోదించింది.1880లో నారాయణ్‌ మేఘాజీ లోఖాండే దీన బంధు అనే పత్రికతో పాటు బంబే మిల్‌ అండ్‌ మిల్‌హాండ్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేశారు.1899లో ముంబైలో తొలి రైల్వే కార్మిక సమ్మె జరిగింది. దానికి బాలగంగాధర తిలక్‌ వంటి వారు తమ పత్రికల ద్వారా మద్దతు ప్రకటించారు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ధరలు విపరీతంగా పెరిగి కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి తలెత్తింది. అదే సమయంలో రష్యాలో తొలి శ్రామికరాజ్యం ఏర్పడి కార్మికవర్గాన్ని ఎంతగానో వుత్తేజపరచి వుద్యమాలకు పురికొల్పింది. అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ఐఎల్‌ఓ) కూడా ఏర్పడింది. ఈ పూర్వరంగంలో స్వాతంత్య్ర వుద్య మాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం జాతీయ స్ధాయిలో ప్రజాసంఘాలను నిర్మించటం అవసరమని భావించింది. దాని పర్యవసానమే 1920అక్టోబరు 31ఆలిండియా ట్రేడ్‌యూనియన్‌ కాంగ్రెస్‌(ఎఐటియుసి) ఏర్పాటు. ఆ తరువాతే పెద్ద ఎత్తున చెలరేగిన పోరాటాలను అణచివేసేందుకు, ఆంక్షలు విధించేందుకు వీలుగా 1926లో ట్రేడ్‌యూనియన్‌ తరువాత, ఇతర అనేక చట్టాలను తెచ్చారు. వాటన్నింటికి పరాకాష్టగా మీరట్‌, కాన్పూరు కుట్రకేసులను బనాయించి కమ్యూనిస్టులుగా అనుమానం వున్నవారందరినీ వాటిలో ఇరికించి విచారణ జరిపారు.

బ్రిటన్‌లో తొలిసారిగా 1802లో పారిశ్రామిక కార్మికుల చట్టాన్ని తెచ్చారు. ఫ్యాక్టరీల్లో పిల్లలతో ఎన్నిగంటలు, ఎలాంటి పని చేయించాలి, ఏ తరహా సంస్ధలలో ఎలాంటి పరిస్ధితులు వుండాలో దాన్లో పేర్కొన్నారు. ఎవరైనా ఈ చట్టాన్ని వుల్లంఘించితే రెండు నుంచి ఐదు పౌండ్ల జరిమానా విధించాలని కూడా పేర్కొన్నారు. తరువాత ఆ చట్టాన్ని 1819లో సవరించారు.1833లో ఫ్యాక్టరీల తనిఖీ వ్యవస్ధను ప్రవేశపెట్టారు. 1874లో బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీపాలన రద్దయి విక్టోరియా రాణి పాలన మొదలైంది. 1875లో కార్మికుల పని పరిస్ధితులపై అధ్యయనానికి ఒక కమిటీని వేసి దాని నివేదిక ఆధారంగా వంద అంతకంటే ఎక్కువ మంది పని చేసే ఫ్యాక్టరీలలో అమలు చేసే విధంగా 1881లో తొలి ఫ్యాక్టరీ చట్టం వచ్చింది. అధ్యయన కమిటీ విషయం తెలిసిన కొందరు 1879డిసెంబరులో రఘబా సుఖరామ్‌ అనే కార్మికుడి నాయకత్వంలో సమావేశమై రాతపూర్వకంగా తమ స్ధితిగతులను వివరించారు. దానిపై 578 మంది సంతకాలు చేశారు. భారత కార్మికోద్యమ చరిత్రలో తొలి నేతగా సుఖరామ్‌ నమోదయ్యాడు. తొలి ఫ్యాక్టరీ చట్టంపై నాటి మీడియాలో కొన్ని సమర్ధించగా మరికొన్ని తీవ్రంగా విమర్శించాయి. బ్రిటీష్‌ పాలకులకు విన్నపాలు చేయటం ఏమిటి, మన పని మనం చేసుకుందాం అంటూ కొందరు జాతీయవాదులు పత్రికల్లో రాశారు. బాలగంగాధర తిలక్‌ 1881 మార్చి 13న తన మరాఠా పత్రికలో ఇండియా పాలన ఇండియా కొరకు గాక ఇంగ్లండు ప్రయోజనాలకొరకు జరుగుతోంది.మనది పరాజిత దేశం, ఒక పరాజిత దేశంగానే పరిపాలించబడతామని దేశీయులు తెలుసుకోవాలి’ అని రాశారు. మన దేశంలో పారిశ్రామికీకరణ పందొమ్మిదవ శతాబ్ది మధ్యలో ప్రారంభమైంది. అసోంలో 1839లో తొలి తేయాకు కంపెనీ, 1843లో బెంగాల్‌ బగ్గు కంపెనీ, 1854లో బంబాయిలో తొలి బట్టల మిల్లు, కొలకత్తాలో తొలి జూట్‌మిల్లు ప్రారంభమైంది. ఆ తరువాతే ముడి సరకుల రవాణాకు రైలు మార్గాలను వేశారు. 1890నాటికి వివిధ దేశాలలో పని చేసేందుకు బ్రిటీష్‌ పాలకులు పంపిన భారతీయ కార్మికుల సంఖ్య ఐదులక్షలు కాగా దేశంలో పారిశ్రామిక కార్మికులు సంఖ్య మూడులక్షలు మాత్రమే.

రోజుకు ఎనిమిది గంటల పని దినాన్ని అమలు జరపాలని కోరుతూ అమెరికాలోని కార్మికవర్గం కమ్యూనిస్టుపార్టీ పుట్టక ముందే అనేక ఆందోళనలు చేసింది. వాటిలో భాగంగా 1886 ఏప్రిల్‌లో అనేక చోట్ల సమ్మెలు, ప్రదర్శనలు జరిగాయి.వాటి కొనసాగింపుగా మే ఒకటవ తేదీన అమెరికా అంతటా ఒక రోజు సమ్మె జరపాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.ప్రభుత్వం సమ్మెను అణచివేసేందుకు పూనుకుంది.దాంతో చికాగో నగరంలో మే మూడవ తేదీన నిరసన ప్రదర్శనలు జరిగాయి. అనేక చోట్ల పోలీసులు కార్మికులపై విరుచుకుపడ్డారు. అనేక మంది గాయపడ్డారు, కొంత మంది మరణించారు. దాంతో మరింతగా ఆగ్రహించిన కార్మికులు నాలుగవ తేదీన హే మార్కెట్‌ ప్రాంతంలో సభ జరిపేందుకు పిలుపునిచ్చారు. పోలీసు యంత్రాంగ కుట్రలో భాగంగా అక్కడకు వచ్చిన పోలీసులపై వారి ఏజంటుతో బాంబుదాడి చేయించారు. ఒక పోలీసు మరణించాడు. దానిని సాకుగా చూపి పోలీసులు జరిపిన కాల్పులలో అనేక మంది కార్మికులు మరణించారు. రక్తం ఏరులై పారింది. బాంబు పేలుడుపై ఎనిమిది మంది కార్మికులను ఇరికించి ఒక తప్పుడు కేసు పెట్టారు. వారిలో ఏడుగురికి దిగువ కోర్టు మరణశిక్ష విధించింది. పై కోర్టులలో అప్పీలులో శిక్షలను ఖరారు చేశారు. 1987 నవంబరు పదిన ఒక కార్మికుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. మరుసటి రోజు నలుగుర్ని వురితీశారు. తరువాత ఆరు సంవత్సరాలకు మిగిలిన ఇద్దరికి ఇల్లినాయిస్‌ గవర్నర్‌ క్షమాభిక్షతో వురిశిక్షను రద్దు చేశారు.

1889 జూలైలో పారిస్‌లో సమావేశమైన అంతర్జాతీయ సోషలిస్టు, కార్మిక పార్టీల ప్రతినిధులు(రెండవ ఇంటర్నేషనల్‌) చికాగో కార్మికుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది మే ఒకటవ తేదీని కార్మికుల దీక్షా దినంగా పాటించాలని ప్రతిపాదించి ఆ మేరకు 1890లో మే ఒకటిన అంతర్జాతీయంగా ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చారు. మరుసటి ఏడాది సమావేశమైన రెండవ ఇంటర్నేషనల్‌ వార్షిక సమావేశం మే ఒకటవ తేదీని ఖరారు చేస్తూ ప్రతి ఏడాదీ జరపాలని పిలుపు ఇచ్చింది.

పందొమ్మిదవ శతాబ్ది, ఇరవయ్యవ శతాబ్దం ప్రపంచ కార్మికవర్గానికి అనేక పాఠాలు నేర్పింది. దుర్భర పరిస్ధితుల నుంచి బయటపడేందుకు కార్మికవర్గం చేసిన పోరాటాల ఫలితమే సాధించుకున్న హక్కులు, చట్టాలు. తొలి చట్టాలు అమలులోకివచ్చి వందసంవత్సరాలు కూడా గడవక ముందే సంస్కరణల పేరుతో వాటికి చెల్లుచీటీ ఇవ్వటం ప్రారంభమైంది. ఫలితంగా నూటయాభై సంవత్సరాల నాటి దుర్భరపరిస్ధితులైన పన్నెండు గంటల పని, తక్కువ వేతనాలు, యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలివేయటం పునరావృతం అవుతున్నాయి. ఇదంతా స్వేచ్చావాణిజ్యం, ప్రపంచీకరణపేరుతో జరుగుతోంది. వీటినే నయా వుదారవాద విధానాలు అని కూడా అంటున్నారు. కొంత మంది వీటిని వూట సిద్ధాంతంగా వర్ణించారు. దాని ప్రకారం సరిహద్దులు, కరెన్సీ,మిలిటరీ, పోలీసు వంటి అంశాలు తప్ప మిగిలిన అన్నింటినీ ప్రయివేటు రంగాలకు అప్పచెబితే ఆ రంగం నుంచి వచ్చే ఫలితాలు వూట మాదిరి సమాజం అంతటికీ దిగుతాయి. గత మూడున్నర దశాబ్దాల ఈ విధానాల అమలులో వూట ఎలా దిగింది? కేంద్ర ప్రభుత్వ సమాచారం, గణాంకాల ప్రకారం 1980-81లో ఒక వస్తువు తయారీ లేదా సేవ విలువ(గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌- జివిఏ)లో వేతనాలు, అలవెన్సులు తదితర రూపాలలో సగటున కార్మికులకు దక్కిన లబ్ది 44శాతం. అది 2012-13 నాటికి 23.6కు పడిపోయింది. ఇదే సమయంలో వడ్డీ చెల్లింపులు 19.8 నుంచి 13.7శాతానికి తగ్గాయి. మరి లాభాల వాటా 15.7 నుంచి 44.1శాతానికి పెరిగింది. 2012 జిడిపి ఆధారంగా గుణిస్తే మన దేశంలో ఒక శ్రామికుడు గంటలో చేసిన వుత్పత్తి విలువ రెండు వందల యాభై రూపాయలు అదే రోజుకు రెండువేలు. వివిధ పరిశ్రమలు, రంగాలలో వున్న కనీస వేతనాల మొత్తాలను చూస్తే కార్మికులు ఎంత దోపిడీకి గురవుతున్నారో చెప్పనవసరం లేదు. అ తక్కువ మొత్తాలను కూడా దశాబ్దాల తరబడి సవరించని ప్రభుత్వాలున్నాయి. ఇవి చట్టాలను నీరుగార్చటమే. అవసరాల మేరకు పెంపుదల సంగతిపక్కన పెడితే అసలు ఏదో ఒక సవరణ కోసం కూడా వుద్యమించాల్సిన రోజులివి. ఈ పూర్వరంగంలో కార్పొరేట్లకు మరింత లబ్ది చేకూర్చేందుకు సంస్కరణల పేరుతో కాంగ్రెస్‌ అమలు జరప ప్రయత్నించిన వాటిని బిజెపి ఆచరించేందుకు పూనుకుంది. ఇది అధికార దుర్వినియోగం కాదా ? దీన్నెవరు ప్రశ్నించాలి, కోర్టు పరిభాషలో చెప్పాలంటే ఈ పరిస్ధితిని ఎలా సరిచెయ్యాలి?

బిజెపి పాలిత రాజస్ధాన్‌ కార్మిక చట్టాల సవరణ ప్రయోగశాలగా తయారైంది.అక్కడి పారిశ్రామిక వివాదాల చట్ట సవరణ ప్రకారం మూడు వందలలోపు సిబ్బంది పనిచేసే చోట ప్రభుత్వ అనుమతితో నిమిత్తం లేకుండా యజమానులు ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్మికులను తొలగించవచ్చు. కార్మిక సంఘాలను ఏర్పాటు చేయాలంటే కనీసం 30శాతం మంది సిబ్బంది ఆమోదం వుంటేనే అనుమతిస్తారు. గో స్లో( వుత్పత్తి నెమ్మదించటం) అనే పదానికి నిర్వచనాన్ని విస్తృతపరిచారు.ఏ కారణంతో వుత్పత్తి తగ్గినా, కార్యకలాపం విఫలమైనా దానికి బాధ్యత కార్మికులదే అని యజమానులు ఆరోపించి చర్యలు తీసుకొనేందుకు వీలు కల్పించారు. అంటే సూటిగా చెప్పాలంటే ఏ చట్టాలు లేనపుడు యజమానుల దయాదాక్షిణ్యాలపై కార్మికులు వున్నట్లే గతంలో సాధించుకున్న హక్కులను హరించి తిరిగి పూర్వ పరిస్ధితిలోకి నెట్టారు. ఫ్యాక్టరీ చట్టం వర్తించాలంటే విద్యుత్‌ అవసరం లేని చోట పని చేసే కార్మికుల సంఖ్యను 20 నుంచి 40కి, అవసరం వున్నచోట 10 నుంచి 20కి పెంచారు. ఏ యజమాని అయినా చట్టాలను వుల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాతపూర్వక అనుమతి లేకుండా కోర్టులు వాటిని పరిగణనలోకి తీసుకోకూడదనే సవరణ కూడా చేశారు. చట్టాలను వుల్లంఘించిన వుదంతాలలో వేయాల్సిన శిక్షలను కూడా ఎంతో సరళతరం చేశారు. 2014 ఆగస్టు ఒకటిన తీవ్ర కార్మిక నిరసనల మధ్య ఫ్యాక్టరీలు మరియు కాంట్రాక్టు లేబర్‌(క్రమబద్దీకరణ, రద్దు)చట్టాన్ని కార్మిక వ్యతిరేక అంశాలతో సవరించి ఒకే రోజు ప్రవే శపెట్టి అదే రోజు ఆమోదింపచేయించిన ఘనత బిజెపి ఖాతాలో చేరింది. ఇది దళితులు, గిరిజనులు, ఇతర బలహీనవర్గాల వ్యతిరేక చర్య, చట్టాల దుర్వినియోగం గాక మరేమిటి? బిజెపి కార్మిక సంస్కరణల పర్యవసానంగా రాజస్ధాన్‌లోని 7622 ఫ్యాక్టరీలలో 7252 కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే అవకాశం లేదని వెల్లడైంది. యాంత్రీకరణ, రోబోల వినియోగం మరింతగా పెరుగుతున్న ఈ తరుణంలో ఇలాంటి సవరణలు చేయటం అంటే అత్యధిక ఫ్యాక్టరీలు, సంస్ధలను కార్మిక చట్టాల పరిధి నుంచి తొలగించటమే. అలాంటపుడు కనీసవేతనాలను సవరించినా వుపయోగం ఏముంది? ప్రభుత్వం యజమానులు ఏం చేయాలనుకుంటే అందుకు వారికి అనుమతిచ్చే చర్యలకు ముద్దుగా ‘సంస్కరణలు’ అని పేరు పెట్టింది.

ప్రభుత్వ రంగ సంస్ధలలో 50, ప్రయివేటు రంగంలో 70శాతం పైగా కార్మికులు చట్టాలు పెద్దగా వర్తించని కాంట్రాక్టు కార్మికులుగా వున్నారు.పన్నెండు గంటల పని సర్వసాధారణమైంది. ఓవర్‌ టైమ్‌ లేదు, చేయించుకొనే ఓవర్‌ టైమ్‌కు కొందరు సాధారణ సెలవులు ఇస్తారు లేదా ఓవర్‌ టైమ్‌ రెట్టింపు కంటే తక్కువగా వుంటాయి. నేడు కార్మికులు-యజమానుల మధ్య తలెత్తుతున్న వివాదాలలో అత్యధికం కార్మిక చట్టాల వుల్లంఘనలపైనే అన్నది స్పష్టం. చివరికి కార్మిక సంఘాల నమోదు కూడా దుర్లభం అవుతోంది. నమోదు ప్రక్రియ పూర్తిగాక ముందే సంఘం పెట్టుకున్న కార్మికుల వుద్యోగాలు పోతున్నాయి. ఇటువంటి పరిస్ధితిని అన్ని రాష్ట్రాలలో రుద్దాలని చూస్తున్నారు. లేదా వున్న చట్టాలను అమలు జరపకుండా వుపేక్షిస్తున్నారు. కార్మికవర్గానికి ఇదొక సవాల్‌.

ప్రపంచవ్యాపితంగా ధనిక దేశాలన్నింటా అప్రెంటిస్‌షిప్‌(నైపుణ్య శిక్షణ) పేరుతో పెద్ద ఎత్తున పర్మనెంటు కార్మికుల స్ధానంలో కార్మిక చట్టాల పరిధిలో లేని కార్మికులను నియమిస్తున్నారు. వారికి తక్కువ వేతనాలు, అలవెన్సులు చెల్లించేందుకు ఇదొక దొంగదారి అన్నది తెలిసిందే. మన దేశంలో కూడా అప్రెంటిస్‌షిప్‌ చట్టాన్ని సవరించి శిక్షణలో వున్న వారు చేయకూడని పనులను కూడా వారితో చేయించేందుకు, పెద్ద ఎత్తున నియామకానికి తెరతీశారు. శిక్షణా కాలంలో అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించేవిధంగా పధకాలు సిద్దం చేశారు. ఇది యజమానులకు మరొక అదనపు రాయితీ.

ే మన సమాజాన్ని వెనక్కు నడపాలని చూస్తున్న మనువాదుల దృష్టిలో మేడే పశ్చిమ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. నిజమే ! మనం చెప్పుకుంటున్న ప్రజాస్వామిక వ్యవస్ధ, భావజాలం సైతం పశ్చిమ దేశాల నుంచి అనుకరించింది కాదేమిటి? అంతెందుకు మన నిత్య జీవితంలో ఇతర దేశాల నుంచి అనుకరిస్తున్నవి, వినియోగిస్తున్నవి ఎన్ని వున్నాయో ఎవరికి వారు ఆలోచించుకోండి. ప్రపంచ మానవుడు ఎక్కడ మంచి వుంటే దాన్ని, ఎవరు జీవనాన్ని సుఖమయం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తే దానిని స్వంతం చేసుకోలేదా ? ఒక దేశం నుంచి ఖండం నుంచి మన దేశం ప్రపంచానికి నాగరికత అంటే ఏమిటో నేర్పిందని కొంత మంది చెబుతారు. మన దాన్ని ఇతరులు అనుసరించినపుడు మే డే వంటి వాటిని దాని వెనుక వున్న పురోగామి భావజాలాన్ని విదేశీ అంటూ మనకు పనికి రాదని పక్కన పెట్టమంటున్నారంటే అర్ధం ఏమిటి? ఏ పదజాలం వెనుక ఏ అర్ధం దాగుందో తెలుసుకోనంత కాలం జనం మోసపోతూనే వుంటారని మార్క్సిజాన్ని తొలిసారిగా తమ దేశానికి అన్వయించి తొలి శ్రామికవర్గ రాజ్య స్ధాపనకు నాయకత్వం వహించిన లెనిన్‌ చేసిన హెచ్చరికను తీసుకోవటానికి ఆయన విదేశీయత అడ్డం వస్తుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

సూక్ష్మంలో నరేంద్రమోడీ మోక్షం: పకోడీలతో స్వయం వుపాధి !

09 Friday Feb 2018

Posted by raomk in BJP, Current Affairs, Economics, employees, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

India budget, Narendra Modi, pakoda, pakoda budget, pakoda self employment, self employment

ఎం కోటేశ్వరరావు

ఎట్టకేలకు నరేంద్రమోడీ నాలుగేండ్ల తరువాత తాము వుపాధి కల్పించలేకపోతున్నట్లు పరోక్షంగా అయినా అంగీకరించినందుకు అభినందించకుండా ఎలా వుంటాం ! పెట్టలేని వారు పెట్టే దారన్నా చూపాలి అన్నట్లు పకోడీలు అమ్మి స్వయం వుపాధి కల్పించుకోవాలని మంచి సలహా కూడా ఇచ్చినందుకు ఆయన మేథోశక్తికి నీరాజనాలు పలకాల్సిందే. బాబొస్తే జాబొచ్చినట్లే అన్న తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌ బాబు చేయలేని ధైర్యం, తెగువను నరేంద్రమోడీ చూపారు. పకోడీ వ్యాఖ్యానం తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో యావత్‌ దేశాన్నీ ఆకర్షించేందుకు మోడీ మరో విన్యాసం చేశారు. వుద్యోగులకు ఏడాదికి మెడికల్‌ రీయంబర్స్‌మెంట్‌ పదిహేనువేలు, నెలకు 16వందల ప్రయాణ అలవెన్సు వెరసి ఏడాదికి 34,200కు ఇప్పుడు పన్ను మినహాయింపు వుంది. ఈ రెండింటి బదులు గుండుగుత్తగా 40వేల రూపాయలకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఆర్ధిక మంత్రి అరుణ్‌జెట్లీ ప్రకటించారు. దీని వలన వుద్యోగులకు ఎనిమిదివేల కోట్ల రూపాయలు మిగిలితే, ఖజానాకు అంతే మొత్తం నష్టం అని చెప్పారు. ఈ వుదారత్వానికి వుద్యోగులు ఎలా పండుగ చేసుకుంటారన్నది వారికే వదలివేద్దాం.

‘కోటీ 89లక్షల మంది వేతన జీవులు ఒక్కొక్కరు 2016ా17లో చెల్లించిన సగటు పన్ను రు.76,306 కాగా వ్యక్తిగతంగా వ్యాపారులు, వైద్యులు, లాయర్ల వంటి వృత్తిదారులు 1.88 కోట్ల మంది సగటున చెల్లించింది రు.25,753 మాత్రమే. ఇవి కేంద్ర ఆర్ధిక కార్యదర్శి హష్‌ముఖ్‌ అధియా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం వెల్లడించిన వివరాలు. నిజాయితీగా పన్ను చెల్లించే తమకు భారం తగ్గించి అక్రమ మార్గాలను వెతక్కుండా సరైనదారిలో పెట్టాల్సిన ప్రభుత్వం ఆ పని చేయటం లేదు. మరోవైపు తమ కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న ఇతరుల పన్ను ఎగవేత నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఇదీ స్థూలంగా బడ్జెట్‌ సందర్భంగా వేతన జీవులలో వెల్లడవుతున్న అసంతృప్తి. దిగువనున్న ఇతరులతో పోల్చుకుంటే వుద్యోగుల పరిస్ధితి మెరుగే అయినప్పటికీ పెరుగుతున్న ధరలు, అవసరాలు, గౌరవ ప్రదమైన జీవనం గడపాలంటే ప్రస్తుత వేతనాలను ఇంకా పెంచాల్సిన అవసరం వుంది. ప్రతి బడ్జెట్‌లో భారాలు మోపటం సర్వసాధారణ రివాజుగా మారింది కనుక సామాన్యులకు పెద్దగా ఆసక్తి వుండదు. ఎన్ని రాయితీలు ఇచ్చినా మంగళగిరి పానకాల రాయుడి మాదిరి ఇంకా కావాలనే వాణిజ్య, పారిశ్రామికవేత్తలు, న్యాయమైన రాయితీల కోసం ఎదురు చూసే వేతన జీవులలోనే బడ్జెట్‌ పట్ల ఆసక్తి వుంటుంది. వ్యాపారులు, వృత్తిదారులు పన్నుల విధింపు సమాచారం గురించి కుతూహలం చూపుతారు. ఏ భారం మోపినా చివరకు దాన్ని ఏదో ఒక రూపంలో తిరిగి వినియోగదారులు, సేవలు పొందే జనం మీదనే మోపుతారు కనుక బడ్జెట్‌లో ఏం చేసినా వారికేమీ చింత వుండదు.

ఎక్కువ మంది వుద్యోగులు బడ్జెట్‌లో తమకేమి రాయితీలు ప్రకటించారు అనే విషయం మీదనే ప్రధానంగా కేంద్రీకరించటం సహజం. నిజానికి పౌరులుగా, చదువుకున్న వారికి అంతకంటే ఎక్కువ ఆసక్తి, విమర్శనాత్మక వైఖరితో ఈ ప్రక్రియను చూడటం అవసరం. అందుకే అసలు బడ్జెట్‌ అంటే ఏమిటి ? ప్రజారంజక, ప్రజా సంక్షేమ బడ్జెట్‌నే ప్రవేశపెట్టామని చెప్పని పార్టీ ఏముంది? అదే నిజమైతే 2017లో దేశంలో వృద్ధి అయిన సంపదల మొత్తంలో ఒక శాతంగా వున్న ధనికులు 73శాతం దక్కించుకున్నారని ఆక్స్‌పామ్‌ అనే స్వచ్చంద సంస్ధ ఎందుకు చెప్పింది. వివిధ సంస్ధల, లెక్క విధానాలు, అంచనాలలో హెచ్చు తగ్గులుండవచ్చుగానీ సంపద కొద్ది మంది దగ్గర పోగుపడుతున్నదనేది వాస్తవమే కదా ?

ఆదాయాన్ని ఖర్చుల నిమిత్తం చేసే పంపిణీ ప్రక్రియే బడ్జెట్‌. దీనిలో సామాన్యులుగా వున్న 99శాతానికి, ఒకశాతం ధనికులకు దామాషా ప్రకారం పంపిణీ చేస్తే సమస్య లేదు. లేకపోతేనే తేడాలు వస్తాయి. కాంగ్రెస్‌, బిజెపి వంటి పార్టీలు ప్రతిపక్షంలో వుండగా ప్రజల కోసం కడవల కొద్దీ కన్నీరు కార్చి అధికారం రాగానే కార్పొరేట్లకు కామధేనువులుగా మారుతున్నాయి. నాలుగు సంవత్సరాల క్రితం అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ సామాన్యులకు మంచిరోజులు( అచ్చేదిన్‌) వచ్చాయని ప్రకటించారు. ఆక్స్‌ఫామ్‌ సంస్ధ వెల్లడించిన విశ్లేషణ ప్రకారం 2017లో దేశంలోని బిలియనీర్ల ్లబ్బులో కొత్తగా పదిహేడు మంది చేరారు. మోడీ నిజంగా రాబిన్‌హుడ్‌ అవతారం అయితే బిలియనీర్ల సంపద తగ్గాలి కదా ! గత నాలుగు సంవత్సరాలుగా తాను ఎన్నో విజయాలు సాధించానని ప్రతి నెలా మన్‌కీబాత్‌ పేరుతో (మనసులోని మాట) ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ జన్‌కీ బాత్‌(జనం మాట) వేరేగా వుంది. మొత్తంగా చూసుకున్నపుడు వుత్పత్తి, ఎగుమతులు పడిపోయాయి. అనేక చోట్ల గిట్టుబాటు ధరలు రాక రైతాంగం ఆందోళనలకు దిగింది, ఆత్మహత్యలు ఆగలేదు. అయినా మరోవైపు కార్పొరేట్ల లాభాలు తగ్గలేదు, స్టాక్‌మార్కెట్‌ సూచీలు రికార్డులను తిరగరాశాయి. పర్యవసానంగా శతకోటీశ్వరుల సంఖ్య పెరిగింది, అప్పటికే ఆ జాబితాలో వున్నవారి ఆస్ధులు ఇంకా పెరిగాయని వేరే చెప్పనవసరం లేదు. అంటే మోడీ గారు చెప్పిన మంచి రోజులు ఎవరికి వచ్చినట్లు ? ఒక చాయ్‌ వాలా పాలనలో ఎంత మంది ఫ్లాస్కుల నుంచి టీ స్టాల్స్‌, హోటల్స్‌ పెట్టే స్ధాయికి ఎదిగారు ? తాజాగా మోడీతో పాటు, అమిత్‌షా గారు కూడా చెప్పినట్లు పకోడీలు అమ్మేవారు ఎంత మంది లక్షాధికార్లు అయ్యారు అని ప్రశ్నించుకోవాలి.

ఐదేండ్ల కాలానికి ఎన్నుకున్న మోడీ సర్కార్‌కు ఇది చివరి, ఎన్నికల బడ్జెట్‌ కనుక సహజంగానే జనంలో ఆసక్తి కలిగించింది. ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టిన 2018-19 బడ్జెట్‌ ప్రకారం మొత్తం ఆదాయం 24లక్షల కోట్ల 42 వేల 213 కోట్లు. దీనిలో పన్నుల ద్వారా వచ్చే మొత్తం రు.17,25,738 కోట్లు. అప్పుల ద్వారా సమకూర్చుకొనేది 6,24,276 కోట్లు మిగతాది ఇతర వనరుల ద్వారా వస్తుంది. దీనిలో వడ్డీ చెల్లింపులకు కేటాయింపు 5,75,795 కోట్లు. నరేంద్రమోడీ పాలనలో మన రూపాయి రాకపోకల తీరు తెన్నులు ఎలా మారాయో చూద్దాం. 2015-16 బడ్జెట్‌లో 21పైసలు అప్పుల ద్వారా సమకూర్చుకుంటే 2018-19కి అది 19కి తగ్గిపోయింది. కార్పొరేట్‌ పన్ను 20 నుంచి 19కి తగ్గింది, ఆదాయపన్ను 14 నుంచి 16కు పెరిగింది. తాజా బడ్జెట్‌ రూపాయి రాకలో నూరు పైసలకు గాను జిఎస్‌టి నుంచి 23, కార్పొరేట్‌ పన్ను నుంచి 19,అప్పుల ద్వారా 19, ఆదాయ పన్ను నుంచి 16, ఎక్సయిజ్‌, కస్టమ్స్‌ నుంచి 12, ఇతరంగా 11పైసల వంతున వస్తోంది. ఇక పోక విషయానికి వస్తే పన్నులు, డ్యూటీలలో రాష్ట్రాల వాటా 24, వడ్డీ చెల్లింపులు 18, రక్షణ, కేంద్ర పధకాలు, సబ్సిడీలకు 9చొప్పున, ఫైనాన్స్‌ కమిషన్‌ బదిలీలకు 8, ఇతర ఖర్చులకు 13పైసలు పోతోంది.

గతేడాది నోట్ల రద్దు వలన సాధారణ పెరుగుదల కంటే అదనంగా 18లక్షల మంది కొత్తగా పన్నులు చెల్లించేవారు పెరిగారని ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. మంచిదే, రెండు కోట్ల ఎనభైలక్షల మంది పన్ను చెల్లింపుదార్లుండగా మరో 18లక్షల మంది కోసం పెద్ద నోట్లు రద్దు చేయాలా? ఇంట్లో ఎలుకలున్నాయని ఇంటికే నిప్పు పెట్టిన ప్రబుద్ధులను ఈ చర్య గుర్తుకు తేవటం లేదూ? ఈ పద్దెనిమిది లక్షల మంది అదనంగా చెల్లించే పన్నెంతో, నోట్ల రద్దు వలన జరిగిన నష్టం, జనం పడిన ఇబ్బందుల గురించి అధికారంలో వున్న వారు నోరు విప్పారా ? పోనీ ఆ కారణంగా ఆదాయపన్ను రాబడి రూపాయి రాకలో రెండుశాతం పెరిగిందని అనుకుందాం. కార్పొరేట్‌ పన్ను ఆదాయం పెరగకపోగా తగ్గటానికి కారణం ఏమిటి? లోపాలను సరిచేస్తే వసూలు పెరగాలి కదా ! చెప్పే మాటలకు, చేతలకు పొత్తు కుదరటం లేదు. ఇంతకు ముందు 50 కోట్ల లావాదేవీలు వున్న కంపెనీలకు 25శాతం కార్పొరేట్‌ పన్ను వుంటే ఇప్పుడు దానిని ఏకంగా ఐదు రెట్లు అంటే 250 కోట్లకు పెంచటం వంటి వెసులుబాటు కాదా? పోనీ ఇలాంటి మినహాయింపులతో కంపెనీలు పొందిన లబ్దిని తిరిగి పెట్టుబడులుగా పెట్టిన దాఖలాలేమీ లేవు. అందుకే ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షా మహాశయులు వుద్యోగాలు లేకపోతే పకోడీలు అమ్మాలని సెలవిచ్చారు. 2015-16 వుపాధి, నిరుద్యోగ సర్వే ప్రకారం దేశంలో పని చేస్తున్న వారిలో 46.6శాతం మంది స్వయం వుపాధి అంటే మోడీ గారి భాషలో పకోడీ వుద్యోగాలు చేస్తున్నవారే. వారి వార్షిక ఆదాయం అరవైవేల రూపాయలు. వారందరూ మంచి రోజుల కోసం ఎదురు చూస్తుంటే కొత్తగా వుద్యోగాల కోసం చూస్తున్నవారికి నాలుగేండ్ల తరువాత మోడీ ఈ సలహా ఇచ్చారు.

యుపిఏ , ఎన్‌డిఏ రెండూ సంస్కరణలు అమలు జరిపాయి. అవి ఎవరికి లబ్ది చేకూర్చాయి? గత పది సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వానికి పన్ను రాబడిలో ఏ రంగం నుంచి ఎంత వచ్చిందో బడ్జెట్‌ పత్రాలలో వివరించారు. దాని ప్రకారం 2009-10లో మొత్తం పన్ను రాబడి 6,24,528 కోట్లకు గాను కార్పొరేట్‌, ఆదాయ పన్ను వాటాలు 39,19.6 శాతం చొప్పున వున్నాయి. అదే 2018-19 బడ్జెట్‌లో 27.3,23.2 శాతాలుగా వున్నాయి. అంటే పదేండ్లలో కార్పొరేట్లకు పన్నెండుశాతం వరకు లబ్ది చేకూరితే వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదార్లపై 3.6శాతం భారం పెరిగింది. ఆదాయ అసమానతలు పెరగటానికి శతకోటీశ్వరులు వృద్ధి చెందటానికి ఇది కారణం కాదా ? వుద్యోగులకు మొత్తం ఆదాయం మీద పన్ను విధిస్తుండగా కార్పొరేట్‌లు, వ్యాపారులు, ఇతర వృత్తిదారులకు ఖర్చులు పోను నిఖర ఆదాయం మీదనే పన్ను వేస్తున్నారు. ఇదొక అన్యాయం. వుద్యోగులకు కుటుంబ ఖర్చులను లెక్కవేసే వేతనాలు నిర్ణయిస్తున్నారు తప్ప ప్రతి ఏటా వారికి ఇంత మిగులు వుండాలనే ప్రాతిపదికేమీ వుండదు. హష్‌ముఖ్‌ చెప్పినదాని ప్రకారం ఏడు లక్షల నమోదైన కంపెనీలలో సగం సమర్పించిన ఆదాయ వివరాల ప్రకారం సున్నా మిగులు లేదా నష్టాలను చూపారు. వుద్యోగులకు ఇటువంటి అవకాశం లేదు. నిజానికి వారు వినియోగదారులుగా ఇతర పన్నులతో పాటు అదనంగా ఆదాయపన్ను చెల్లిస్తున్నారు. ‘బ్రిటీరాజ్యం నుంచి బిలియనీర్‌ రాజ్యం వరకు ‘ అనే శీర్షికతో ప్రముఖ ఆర్ధికవేత్తలు ల్యూకాస్‌ ఛాన్సెల్‌, థామస్‌ పికెట్టి ఆదాయ పన్ను చట్టం చేసిన 1922 నుంచి 2014 వరకు మన దేశ ఆర్ధిక వ్యవస్ధలో అసమానతల గురించి ఒక అధ్యయన పత్రాన్ని తయారు చేశారు. దాని ప్రకారం 2014లో పదిశాతం ధనికులు వార్షికాదాయంలో 56శాతాన్ని పోగేసుకున్నారు.1930 దశకంలో ఒకశాతం ధనికులు మొత్తం ఆదాయంలో 21శాతం లోపు కలిగి వుండగా అది 1980దశకం ప్రారంభానికి ఆరుశాతానికి పడిపోయి 2014నాటికి 22శాతానికి పెరిగింది. గతేడాది ఆక్స్‌ఫామ్‌ సర్వే ప్రకారం ప్రపంచ ధనికులలో ఒక శాతం మంది 50శాతం సంపదను కలిగి వుండగా మన దేశంలో అది 58శాతంగా వుంది. 2017 వివరాల ప్రకారం ఒకశాతం ధనికుల సంపద 20.9లక్షల కోట్లకు అంటే కేంద్ర బడ్జెట్‌కు సమంగా చేరుకుంది. మన దేశంలోని ఒక ప్రముఖ వస్త్రకంపెనీ సిఇఓ ఒక ఏడాది ఆదాయాన్ని పొందాలంటే గ్రామీణ ప్రాంతంలో కనీస వేతనం పొందుతున్న కార్మికుడు 941 సంవత్సరాలు పనిచేయాల్సి వుంటుంది. మరో విధంగా లెక్క వేస్తే గ్రామీణ కార్మికుడు జీవితాంతం(50 సంవత్సరాలు) పని చేస్తే సంపాదించే మొత్తాన్ని అదే సిఇఓ కేవలం 17.5 రోజుల్లో సంపాదిస్తాడట. అదే అమెరికాలో ఒక కార్మికుడు ఏడాది మొత్తంలో పొందిన వేతనాన్ని ఒక కంపెనీ సిఇవో ఒక రోజులో పొందుతాడని ఆక్స్‌ఫామ్‌ పేర్కొన్నది.

కారిపోతున్న ‘సంపద బక్కెట్‌ ‘ కన్నాలు పూడ్చాలని కార్పొరేట్లకు పన్ను రాయితీలు రద్దు చేయాలని, పన్ను నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆక్స్‌ఫామ్‌ కోరింది. గతేడాదినాటికి మన దేశంలోని బిలియనీర్ల సంపద 20.7లక్షల కోట్లకు పెరిగితే దానిలో గతేడాదే 4.89లక్షల కోట్లు చేరింది. ఈ మొత్తంతో దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించవచ్చు, ప్రతి రాష్ట్రంలో జాతీయ ప్రాజక్టులకు ధారాళంగా నిధులు కేటాయించవచ్చు. బాహుబలి సినిమా వసూలు చేసిన మొత్తమంత కూడా తమకు కేటాయించలేదని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సిన అవసరం వుండదు.

ఆర్ధిక సర్వే, బడ్జెట్‌లోని మరికొన్ని విషయాలను చూద్దాం. ఆర్ధిక సర్వే, ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు అంకెలన్నీ ఒకచోటనే తయారు చేసి స్వల్ప మార్పులతో ఎవరికి వారు ప్రకటించుకున్నట్లుగా వుంది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో జిడిపి పెరుగుదల రేటు 6.75శాతం వుంటుందని అంచనా వేస్తే కేంద్ర గణాంకశాఖ 6.5శాతంగానూ, ఐఎంఎఫ్‌ 6.7గా చెప్పింది, వచ్చేఏడాది పెరుగుదల రేట్లను 7.5,7.4శాతాలుగా పేర్కొన్నాయి. పెరుగుదల రేట్లు అచ్చేదిన్‌ అంచనాలు అని చెప్పవచ్చు. ఎందుకంటే మన చేతుల్లో లేని ప్రపంచ చమురు మార్కెట్‌ రేట్ల మీద ఇవి ఆధారపడి వుంటాయి. స్టాక్‌ మార్కెట్‌ ఇప్పుడు మంచి కాక మీద వుంది కనుక లాభాలు దండిగా సంపాదించుకొనేందుకు విదేశీ కంపెనీలు డాలర్లను కుమ్మరించి వాటాలను కొనుగోలు చేస్తున్నాయి. ఆ మొత్తాలను మన విదేశీ మారక నిల్వలుగా చూపుతున్నాం, వాటితో చమురు కొనుగోలు చేస్తున్నాం. స్టాక్‌ మార్కెట్‌ పతనమైనా, చమురు ధరలు పూర్వపు స్ధాయికి పెరిగినా మన పరిస్ధితి ఢమాల్‌. ఒకవేళ స్టాక్‌ మార్కెట్‌ బుడగ మరికొంత కాలం కొనసాగిందనుకుందాం. అది వుండగానే మన పారిశ్రామిక వుత్పత్తి పడిపోయింది, ఎగుమతులు తగ్గిపోయాయి. అందువలన ఈ పరిస్ధితి కొనసాగదన్న గ్యారంటీ ఏముంది? ముదిమది తప్పిన మాదిరి డోనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై కాలుదువ్వుతున్న పూర్వరంగంలో ఇప్పటికే పీపా చమురు 70 డాలర్లకు చేరింది. తగ్గే పరిస్ధితి కనిపించటం లేదు. అందుకే మనకు రోజూ పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు అమెరికా సర్కార్‌ మన ఐటి ఎగుమతులను దెబ్బతీసే విధంగా, మన ఇంజనీర్లకు వీసాలు నిరాకరించే ధోరణిలో వ్యవహరిస్తోంది. అది కూడా మనకు నష్టం చేకూర్చే పరిస్థితే. ప్రపంచ ధనిక దేశాలలో పరిస్ధితులు చక్కబడితే తప్ప మన ఎగుమతులు పెరగవు అని తేలిపోయింది. వాటి పరిస్ధితి కూడా అంత ఆశావహంగా కనిపించటం లేదు. అనేక దేశాలు రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. వాటి ప్రభావం మన మీద పడింది కనుకనే మన ప్రధాని దవోస్‌ సమావేశ వేదికపై వుగ్రవాదం ఎంత చెడ్డదో రక్షణ చర్యలు కూడా అంతే అని చెప్పాల్సి వచ్చింది.

ఈ సమస్యల నుంచి బయట పడాలంటే అంతర్గత మార్కెట్‌ను పెంచుకోవటం తప్ప మరొక మార్గం లేదు. అది జరగాలంటే జనంలో కొనుగోలు శక్తి పెరగాలి. ఇప్పుడు ఎగుమతుల కోసం లేదా కార్పొరేట్‌ సంస్ధలకు ఇస్తున్న ఇతర రాయితీల మొత్తాన్ని వేతన పెరుగుదల లేదా జనం కొనుగోలు శక్తి పెంపుదలకు మళ్లిస్తే పారిశ్రామిక వుత్పత్తి పెరగటంతో పాటు వుపాధి అవకాశాలు పెరుగుతాయి. బడ్జెట్‌ విషయానికి వస్తే 2022 నాటికి వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేస్తామన్నది ఒక పెద్ద వాగ్దానం. అయితే దానికి తోడ్పడే చర్యలేమీ లేవు. రానున్న ఎన్నికలకు రైతులకు విసిరిన ఎర. ప్రత్యక్ష పన్నుల వాటా 51.6 నుంచి 50.6శాతానికి తగ్గనున్నట్లు చెప్పటమంటే కార్పొరేట్లకు రాయితీ ఇవ్వటమే. ఏడాదికి ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల వరకు చెల్లించేందుకు వీలుగా పది కోట్ల కుటుంబాలకు ఆరోగ్యబీమా. పాత పధకాలన్నీ కలిపి కొత్తగా చెప్పిన అంకె. జన ఆరోగ్యం కంటే పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్న బీమా కంపెనీలకు పెద్ద ఎత్తున సొమ్ము ముట్టచెప్పే ఎత్తుగడ దీని వెనుక వుందని అనుమానిస్తున్నారు. ఇప్పటికే ప్రయివేటు రంగం పెట్టుబడులు పెద్దగా రావటం లేదు. వచ్చినవి కూడా వుపాధి రహిత వృద్ధికే దోహదం చేస్తున్నాయి. ప్రభుత్వ పెట్టుబడులు నానాటికీ తగ్గుతున్నాయి. అనేక పధకాలకు కేటాయింపులు తగ్గించారు. డబ్బు మొత్తాలు స్వల్పంగా పెరగవచ్చుగానీ జిడిపితో పోల్చితే శాతాలన్నీ తగ్గిపోయాయి. పోనీ పేర్కొన్నవాటిని కూడా పూర్తిగా ఖర్చు చేస్తున్నారా అంటే అదీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నిరుద్యోగ యువతను పకోడీలమ్మించే దిశగా బడ్జెట్‌కు రూపకల్పన చేశారని చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

శీతాకాల ఒలింపిక్స్‌లో ‘కొరియా’ రాజకీయ వేడి !

09 Friday Feb 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Sports, USA

≈ Leave a comment

Tags

Kim Jung-un, Pyongyang., The Pyeongchang 2018 Winter Olympics, winter olympics

ఎం కోటేశ్వరరావు

ఫిబ్రవరి ఎనిమిదిన దక్షిణ కారియా నగరమైన పయోంగ్‌ చాంగ్‌లో శీతాకాల ఒలింపిక్స్‌పోటీలు ప్రారంభంగాక ముందే కొరియా ద్వీపకల్పం, దానితో ముడివడిన దేశాల మధ్య రాజకీయ క్రీడలతో వేడి మొదలైంది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికా నాయకత్వంలోని కమ్యూనిస్టు వ్యతిరేక దేశాల కూటమి క్రీడలలో కూడా రాజకీయాలను జొప్పించిన విషయం విదితమే. ఈ ఒలింపిక్స్‌కూడా దానికి మినహాయింపు కాదని అవి మరోసారి నిరూపించాయి. ఒలింపిక్‌ క్రీడల ప్రారంభానికి మన రాష్ట్రపతి వంటి స్ధాయి కలిగిన వుత్తర కొరియా పార్లమెంటు అధ్యక్షుడు కిమ్‌ యోంగ్‌ నామ్‌ నాయకత్వంలో శుక్రవారం నాడు వచ్చిన ప్రతినిధివర్గంలో వుత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ అన్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ కూడా వున్నారు. 1950 దశకంలో కొరియా యుద్దం తరువాత దక్షిణ ప్రాంతాన్ని సందర్శించిన తొలి వున్నత స్ధాయి ప్రతినిధి వర్గం ఇదే.

పశ్చిమ దేశాల తప్పుడు ప్రచారాన్ని ఎండగడుతూ ఈ పోటీల్లో ఒకేపతాకం నీడలో ఒకే గీతం పాడుతూ కదం తొక్కుదామని, వుమ్మడిగా సాంస్కృతిక ప్రదర్శనలు ఇద్దామని, వీలైతే కొన్ని పోటీలలో వుమ్మడి జట్లను బరిలోకి దింపుదామని వుత్తర కారియా చేసిన ప్రతిపాదనలకు దక్షిణ కొరియా కూడా ముందుకు వచ్చింది. అయితే పొమ్మనకుండానే పొగబెట్టినట్లు పాలకవర్గదన్ను వున్న దక్షిణ కొరియా మీడియా అవమానించేవిధంగా రాతలు రాసిన కారణంగా తాము వెనక్కు తగ్గుతున్నట్లు వుత్తర కారియా ప్రకటించింది. ఒలింపిక్స్‌ జరిగే సమయంలోనే అమెరికా దాడులకు దిగనుందనే వార్తలు వచ్చినప్పటికీ వాటిని ఖాతరు చేయకుండా ఈ పోటీలకు ఐదువందల మందితో కూడిన వుత్తర కొరియా ప్రతినిధి బృందం పయోంగ్‌ చాంగ్‌ చేరుకుంది. పోటీలు జరిగే ఈ నగరం వుత్తర కొరియా సరిహద్దుకు కేవలం 80కిలోమీటర్ల దూరంలోనే వుంది.

తాము శాంతి ప్రయత్నాలు చేస్తున్నా వుత్తర కొరియా అణు పరీక్షలను కొనసాగిస్తూనే వుందని ప్రపంచం ముందు కనిపించేందుకు గతేడాది మేనెలలో ఎన్నికైన అధ్యక్షుడు మూన్‌ ప్రయత్నిస్తున్నాడు. శాంతి ఒలింపిక్స్‌ అని తమ దేశంలో జరుగుతున్న పోటీలను అభివర్ణించాడు. అణు పరీక్షలు జరిపిందనే పేరుతో మూన్‌కు ముందున్న అధ్యక్షుడు పార్క్‌గున్‌ హై 2016జనవరి తరువాత వుత్తర కొరియాకు సాయాన్ని నిలిపివేశాడు. ఇప్పుడున్న స్ధితిలో సాయం వద్దని జపాన్‌ ప్రధాని షింజో అబే వ్యక్తిగతంగా కోరినప్పటికీ మూన్‌ నాలుగునెలల క్రితం ఎనిమిది మిలియన్‌డాలర్ల సాయాన్ని పునరుద్దరించాడని పరిశీలకులు వ్యాఖ్యానించారు. నిజానికి అది ప్రచార ఎత్తుగడని వేరే చెప్పనవసరం లేదు. ఈ సాయాన్ని వుత్తర కొరియా మిలిటరీకి వుపయోగిస్తున్నదని అమెరికా, జపాన్‌ ప్రచారం చేస్తున్నాయి. ఈ రెండు దేశాల ప్రయోజనాలకోసం వుత్తర కొరియాను రెచ్చగొడుతున్నారని, ఒక వేళ యుద్ధమే వస్తే నష్టపోయేది తాము తప్ప ఆ దేశాలు కాదని దక్షిణ కొరియా పౌరులు ఆందోళన చెందుతూ సోదర కొరియాతో శాంతికోసం ప్రయత్నించాలని పెద్ద ఎత్తున వత్తిడి తెస్తున్న కారణంగానే మూన్‌ శాంతి ప్రకటనలు చేస్తున్నాడు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు కేవలం 35కిలోమీటర్ల దూరంలో వున్న సరిహద్దులో వుత్తర కొరియా తన భారీ ఫిరంగి దళాన్ని మోహరించింది.

రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ ఆక్రమణకు గురైన కొరియాను విముక్తి చేసే క్రమంలో వుత్తర ప్రాంతంలో సోవియట్‌ సేనలు, దక్షిణ ప్రాంతంలో అమెరికా నాయకత్వంలోని సేనలు జపాన్‌ మిలిటరీని ఓడించాయి. దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టుల నాయకత్వంలో వుత్తర ప్రాంతంలో ఏర్పడిన ప్రభుత్వానికి సోవియట్‌ మద్దతు ప్రకటించగా దానికి పోటీగా అమెరికాలో వున్న కమ్యూనిస్టు వ్యతిరేకి, మాజీ కొరియా నియంత సింగమాన్‌ రీని అమెరికా నుంచి రప్పించి అమెరికన్లు దక్షిణ ప్రాంతంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రెండు ప్రభుత్వాలు మొత్తం కొరియాపై తమదే ఆధిపత్యం అని ప్రకటించుకున్నాయి. పరిస్ధితులు చక్కపడిన తరువాత ఐక్య కొరియా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే అంగీకారం కుదిరింది. తరువాత దక్షిణ కొరియాలోని నియంత ప్రభుత్వం అమెరికా దన్నుతో వుత్తర కొరియాను ఆక్రమించుకొనేందుకు దాడి చేసింది. దానిని సోవియట్‌, చైనా మద్దతుతో వుత్తర కొరియా కమ్యూనిస్టు ప్రభుత్వం తిప్పి కొట్టింది. వుభయుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి విలీనం గురించి వుత్తర కొరియా ప్రయత్నిండగా తగిన పరిస్ధితులు ఏర్పడలేదనే పేరుతో 1953 నుంచీ దక్షిణ కొరియా అడ్డుకొంటోంది. దీనికి అమెరికా, జపాన్‌ మద్దతు ఇస్తున్నాయి. వుత్తర కొరియాకు రద్దయ్యే వరకు సోవియట్‌, తరువాత చైనా, వియత్నాం వెన్నుదన్నుగా వున్నాయి.

వుత్తర కొరియాతో సఖ్యత, ఐక్యతకు సిద్దమంటూనే మూన్‌ ఒకవైపు ప్రకటనలు చేస్తుంటే మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ యంత్రాంగం ఒలింపిక్‌ క్రీడల సమయంలోనే అవసరమైతే వుత్తర కారియాపై దాడి చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దాన్ని ఆంగ్లంలో బ్లడీనోస్‌ అని పిలుస్తున్నారు. (ముక్కు బద్దలు కొట్టి భయ పెట్టటం వంటిది). ఎవరు అవునన్నా కాదన్నా అణ్వస్త్ర దేశాలలో వుత్తర కొరియా ఒకటి. అమెరికా దగ్గర వెయ్యి వుంటే దాని దగ్గర ఒకటే వుండవచ్చు. వాటిని ప్రయోగిస్తే జరిగే నష్టం ఒకటైనా, వెయ్యి అయినా ఒకటే. అందువలన తక్షణమే వాటిని వుపయోగించకపోయినా మారణకాండ జరిపే ఆయుధాలు అమెరికా దగ్గర గుట్టలుగా వున్నాయి. అమెరికా గనుక యుద్దానికి పూనుకుంటే దక్షిణ కొరియాలో వున్న రెండులక్షల 30వేల మంది అమెరికన్‌ సైనికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని దక్షిణ కొరియాలో అమెరికా రాయబారిగా కొత్తగా నియమితుడైన విక్టర్‌ చా హెచ్చరించాడు.అందుకుగాను ట్రంప్‌ ఆ నియామకాన్ని రద్దు చేశాడు. గత ఏడాది కాలంలో అనేక సార్లు ట్రంప్‌ వుత్తర కొరియా నాయకత్వాన్ని తూలనాడటం, రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేయటం తెలిసినదే. గతవారంలో వుత్తర కొరియా నుంచి ఫిరాయించిన వారితో సమావేశమై గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని, దాడులు తప్ప మరొక మార్గం లేదని నోరుపారవేసుకున్నాడు. ఒలింపిక్స్‌కు బయలుదేరి అమెరికా వుపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ మధ్యలో అలాస్కాలోని క్షిపణి వ్యతిరేక కేంద్రాన్ని సందర్శించటంతో పాటు జపాన్‌తో చర్చలు జరపాలని నిర్ణయించాడు. నిజానికి ఇతగాడి పర్యటన వుత్తర కొరియాకు వ్యతిరేకంగా ప్రచార దాడి లక్ష్యం తప్ప తలెత్తిన వుద్రిక్తతలను వుపశమింపచేసేదిగా లేదు. క్రీడల తరువాత గతేడాది మాదిరే వుత్తర కొరియా సమీపంలో ఆధునిక ఆయుధాలతో సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.కొరియా ద్వీపకల్పంపై దాడికి వీలుగా గువామ్‌ సైనిక కేంద్రంలో అణ్వాయుధాలను తీసుకుపోవగల బి-52, బి2 రకాల విమానాలను మోహరించారు.

వుత్తర కొరియాపై దాడులు చేసేందుకు అమెరికా అవకాశం కోసం చూస్తున్నది. దానిలో భాగంగానే జనవరి 13వ తేదీన హవాయి దీవుల వైపు ఖండాంతర క్షిపణి వస్తున్నదని, ఇది డ్రిల్లు కాదు, వెంటనే రక్షణ తీసుకోండనే తప్పుడు సమాచారాన్ని జనంలో ప్రచారంలో పెట్టారు. దాంతో వీధుల్లోని జనం కార్లను వదలి పరుగులు తీసిన వుదంతం తెలిసిందే. ముఫ్నై ఎనిమిది నిమిషాలపాటు జనం కకావికలయ్యారు. అది వాస్తవం కాదని విన్యాసమని కూడా సమాచారంలో వుందని తరువాత అధికారులు చెబుతున్నప్పటికీ చివరలో డ్రిల్లు కాదని కూడా పేర్కొన్నందున జనం నిజమని భావించారు. అబద్దాలు చెప్పి జనాన్ని బురిడీ కొట్టించటంలో అమెరికా గూడచార, మీడియా సంస్ధలు పేరు మోశాయి. జపాన్‌పై అణుబాంబును ప్రయోగించేందుకు సాకుగా రెండవ ప్రపంచ యుద్ధంలో పెరల్‌ హార్బర్‌పై దాడి చేసిందనే పెద్ద అబద్దాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. వియత్నాంపై దాడి చేసేందుకు 1964లో టోంకిన్‌ గల్ఫ్‌లో తమ యుద్ధ నౌకపై దాడి జరిపిందనే సాకుతో దాడులకు దిగిన విషయం దాస్తే దాగేది కాదు నిన్నగాక మొన్న ఇరాక్‌లో మారణాయుధాలను గుట్టలుగా పోశాడనే పేరుతో సద్ధాం హుస్సేన్‌పై దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. వుగ్రవాదంపై పోరు పోరు పేరుతో ఇప్పుడు దాడులు చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌ వుగ్రవాదులను సృష్టించిందీ అమెరికాయే అన్న విషయం తెలిసిందే.

ఒకవైపు శీతాకాల ఒలింపిక్స్‌ వుత్సవాలకు ప్రతినిధి బృందాలను పంపిన వుత్తర కొరియా నాయకత్వం మరోవైపు ఏప్రిల్‌ 25న జరగాల్సి కొరియా ప్రజాసైన్య 70వ వార్షికోత్సవాన్ని ఒలింపిక్‌ క్రీడల ప్రారంభానికి ఒక రోజు ముందే జరిపేందుకు పూనుకున్నదని, తన దగ్గర వున్న దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రదర్శన ద్వారా అమెరికాను బెదిరించేందుకు పూనుకుందని, అందువలన శాంతి కావాలనే ఎత్తుగడతో దక్షిణ కొరియా, దాని మిత్రపక్షాల మధ్య అంతరం పెంచేందుకు వుద్దేశించిన దాని ప్రచారాన్ని నమ్మవద్దని జపాన్‌, పశ్చిమ దేశాల మీడియా గగ్గోలు పెడుతోంది. తను అణుకార్యక్రమాన్ని కొనసాగించేందుకు అవసరమైన వ్యవధి తీసుకొనేందుకు అది శాంతి గురించి మాట్లాడుతున్నదని ఆరోపణలు చేస్తున్నది.

గత ఏడు దశాబ్దాల పరిణామాలను గమనించినపుడు వుభయ కొరియాల విలీనానికి అడ్డుపడుతున్నది అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద దేశాల కూటమి అన్నది స్పష్టం.1950 దశకంలో వుత్తర కొరియాను ఆక్రమించుకొనేందుకు అమెరికా మద్దతుతో దక్షిణకొరియా ప్రయత్నించింది తప్ప ఇంతవరకు ఏ నాడూ దక్షిణ కొరియాపై సోషలిస్టు వుత్తర కొరియా దాడిచేసిన దాఖలాలు లేవు. అయినప్పటికీ విలీనానికి ఇంకా అనుమానాలు తొలగలేదనే పాచిపాటనే పశ్చిమ దేశాలు పాడుతున్నాయి. శీతాకాల ఒలింపిక్స్‌ సందర్భంగా చేస్తున్న ప్రచారదాడి దానిలో భాగమే.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d