• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: RELIGION

అయోధ్య రామాలయ వివాదం : ఎరక్కపోయి ఇరుక్కున్న గాయని చిత్ర ! శంకరాచార్యలపై కేంద్ర మంత్రి ధ్వజం !!

17 Wednesday Jan 2024

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

#ks Chithra, #Pinarayi Vijayan, BJP, Kerala CPI(M), Narayan Rane, Narendra Modi, Ram temple, Ram Temple politics, RSS, Sanatan Hindu Dharma, sankaracharya, shiva sena, Singer Chitra


ఎం కోటేశ్వరరావు


అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్ట జరిగేవరకు దాని గురించి పెద్ద ఎత్తున ప్రచారంతో పాటు వివాదాలు కూడా కొనసాగేట్లున్నాయి. మతాన్ని, విశ్వాసాలను పాటించేవారు మౌనంగా ఉండగా ఓట్ల కోసం రాముడిని ముందుకు తెచ్చిన రాజకీయ కుహనా హిందూత్వవాదులదే పైచేయి కావటం ప్రత్యేకత. తెలిసిగానీ తెలియకగానీ చేసిన ప్రకటనలతో సుప్రసిద్ద గాయని చిత్ర తాజాగా సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. జనవరి 22న విగ్రహ ప్రతిష్ట జరిగే 12.20ని సమయంలో శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ సంకీర్తన జరపాలని, జ్యోతులను వెలిగించాలని, లోకసమస్తా సుఖినోభవంతు అంటూ గాయని చిత్ర సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు, విడుదల చేసిన వీడియోలో కోరారు.దీని మీద అనేక మంది అనుకూలంగానూ వ్యతిరేకంగానూ స్పందించారు. బిజెపి నేతలు కేరళ ప్రభుత్వం మీద, కమ్యూనిస్టుల మీద దాడికి ఉపయోగించుకున్నారు. వామపక్ష పాలిత రాష్ట్రంలో అసహనానికి ఇది నిదర్శనమంటూ ఆరోపించారు. సామాజిక మాధ్యమం మీద కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి గానీ ఎలాంటి నియంత్రణ, అధికారం లేదు. వామపక్షాలు, పురోగామి భావాలకు వ్యతిరేకంగా సంఘపరివార్‌, బిజెపి నేతల స్పందనలు అదే సామాజిక మీడియా, సంప్రదాయ మీడియాలో చోటు చేసుకుంటున్నాయంటే అసహనం, వ్యతిరేకత ఉంటే కుదిరేదా ? తన మీద వచ్చిన విమర్శలు లేదా ప్రశంసల గురించి గానీ ఇది రాస్తున్న సమయానికి చిత్ర వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు.


భావ వ్యక్తీకరణ హక్కులో భాగంగా ఇతరుల హక్కులకు భంగం కలుగకుండా ఏమైనా చెప్పవచ్చు. ఆ రీత్యా చూసినపుడు చిత్ర తన భావాన్ని వ్యక్తం చేశారు. అయితే అదే భావ వ్యక్తీకరణలో భాగంగా ఒకరి భావాలను మరొకరు విమర్శించే హక్కు కూడా మన రాజ్యాంగం కల్పించింది. అఫ్‌కోర్సు దానికీ కొన్ని నిబంధనలు ఉన్నాయి. నూరుపూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్నట్లుగా భావజాల చర్చ జరగాల్సిందే. చిత్రను సమర్ధించిన వారు కొందరైతే అలాంటి సందేశం ద్వారా రాజకీయ వైఖరులను తీసుకున్నారని మరికొందరు విమర్శించారు. ” చిత్రకు భావ ప్రకటనా స్వేచ్చ ఉంది, ఆమె నచ్చిన వైపు నిలిచే స్వేచ్చ కూడా ఉంది.ఆమె తన ఇంట్లో రామ భజన చేయవచ్చు, దీపాలను వెలిగించుకోవచ్చు. మారణకాండకు, జాత్యంహంకారానికి దారితీసే ఒక కారణాన్ని అమాయకంగా ఉత్సవంగా జరుపుకోవటంలో హానికరమైనది కనిపించకపోవచ్చుగానీ అది వాస్తవానికి అది ఎంతో బాధాకర అనుభవం అని రచయిత్రి ఇందూ మీనన్‌ ఫేస్‌బుక్‌ పోస్టులో చిత్ర తీరును విమర్శించారు. జనాల రక్తం, వలసలు, వారి బాధలు పట్టకుండా మీరు రామ భజన చేస్తున్నారు.రాముడు లేదా విష్ణువు రాబోవటం లేదు. మీరు ఐదులక్షల దీపాలను వెలిగించినప్పటికీ మీ బుర్ర వెలుగుతో నిండదు. మీ కంఠం కారణంగానే మిమ్మల్ని నైటింగేల్‌(పశ్చిమ దేశాల్లో కోకిల వంటి మధురంగా కూసే పక్షి) అని భావించారు, కానీ మీరు నకిలీ నైటింగేల్‌ అని రుజువైంది అని ఇందూ మీనన్‌ తీవ్రంగా విమర్శించారు.చరిత్రను విస్మరించి ప్రతివారూ సుఖంగా ఉండాలని చెప్పేవారి అమాయకత్వం ఇక్కడ ముఖ్యమైనదని గాయకుడు సూరజ్‌ సంతోష్‌ అన్నారు.మసీదును కూల్చివేసి దేవాలయాన్ని కట్టిన చరిత్రను చిత్ర కావాలనే మరచినట్లు విమర్శించారు. ప్రముఖ గాయకుడు జి వేణుగోపాల్‌ ఒక వైపు చిత్రకు మద్దతు ఇస్తూనే ఆమె ప్రకటనలపట్ల ఏవైనా విబేధాలుంటే విమర్శించేవారు ఆమెను క్షమించాలని వ్యాఖ్యానించారు. ఆమె కేవలం భక్తిభావంతో చెప్పారే తప్ప రాజకీయ కోణం తెలియదని అన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల్లో చిక్కుకోలేదని, మనకోసం వేలాది పాటలు పాడిందని అన్నారు. క్షమించాల్సినంత తప్పేమి చేసిందని కొందరు వ్యాఖ్యానించారు.గాయని చిత్ర గతాన్ని చూసినపుడు ఎలాంటి వివాదాలలో చిక్కుకోలేదు. వివాదాస్పద వ్యాఖ్యలూ చేసిన చరిత్ర లేదు.ప్రతిదాన్నీ రాజకీయం గావిస్తున్న వర్తమానంలో ప్రజాజీవనంలో ఉన్న ప్రముఖులు తాము చేసే ప్రకటనల పట్ల తగిన జాగరూకత పాటించాలని ఈ ఉదంతం వెల్లడిస్తున్నది.


సుప్రీం కోర్టే ఆలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది.విశ్వాసం ఉన్నవారు అయోధ్య రామాలయానికి వెళ్లవచ్చు, లేనివారు వెళ్లకపోవచ్చు, గాయని చిత్ర ప్రకటనను వివాదాస్పదం కావించాల్సిన అవసరం ఏముంది, తమ అభిప్రాయాలను ఎవరైనా వెల్లడించుకోవచ్చని సిపిఎం నేత, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్‌ వ్యాఖ్యానించారు.కేరళ ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత విడి సతీశన్‌ మాట్లాడుతూ భౌతిక దాడులు చేయలేనపుడు సామాజిక మాధ్యమాల ద్వారా దాడి చేయటం ఫాసిజం అన్నారు. మనం చిత్ర వైఖరితో అంగీకరించకపోవచ్చు, ఆమె వైఖరిని ఆమెను వెలిబుచ్చనివ్వండి, ప్రతి ఒక్కరికీ విమర్శించే హక్కుంది, ఎవరైనా అంతకు ముందు చెప్పని వాటి గురించి మాట్లాడటాన్ని ప్రశ్నించవచ్చు అన్నారు. సనాతన ధర్మాన్ని నమ్ముతున్న కారణంగానే గాయని చిత్ర మీద విమర్శలు చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ఆరోపించారు. వామపక్ష-జీహాదీ వాతావరణంలో ఉన్నవారే దాడులు చేస్తున్నారన్నారు.ఈ విమర్శలు చేస్తున్నవారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. పినరయి విజయన్‌ పాలనలో హిందువులు తోటి వారితో తమ విశ్వాసాలను పంచుకొనే పరిస్థితి లేదని, కాంగ్రెస్‌ దీని మీద మౌనంగా ఉందని ఎక్స్‌లో ఆరోపించారు. కేరళకు చెందిన కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ విలేకర్లతో మాట్లాడుతూ అయోధ్యను అవకాశంగా తీసుకొని హిందూ సమాజాన్ని అవమానిస్తున్నారని ఆరోపించారు. వామపక్షం, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో అసహనానికి ఒక ఉదాహరణ చిత్ర మీద చేస్తున్న విమర్శలని జాతీయ మహిళాకమిషన్‌ సభ్యురాలు, బిజెపి నేత కుషఉ్బ ఆరోపించారు.


మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రి నారాయణ రాణే శంకరాచార్యల మీద ధ్వజమెత్తటాన్ని కుషఉ్బ వంటి వారు ఎలా వర్ణిస్తారు.నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు, ఇతర మతాల వారిని పక్కన పెడితే హిందూమతాన్ని నమ్మేవారు, పాటించేవారికి నలుగురు శంకరాచార్యలు పూజనీయులు ! ప్రధాని నరేంద్రమోడీతో సహా బిజెపి నేతలందరూ ఏదో ఒక సమయంలో వారి పాదాలవద్ద చేరి ఆశీస్సులు పొందిన వారే. రామాలయ ప్రతిష్ట మీద వారు మాట్లాడినదాన్ని ఇప్పుడు ఎందుకు సవాలు చేస్తున్నట్లు ? హిందూ ధర్మానికి మీరేమి చేశారని గతంలో ఎవరూ ఎందుకు ప్రశ్నించలేదన్నది కీలక అంశం. శంకరాచార్యులను అవమానించినందుకు గాను కేంద్ర మంత్రి రాణేను పదవి, పార్టీ నుంచి తొలగించాలని శివసేన నేత ఉద్దావ్‌ థాకరే డిమాండ్‌ చేశారు. బిజెపి బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా కోరారు. రాణేకు వ్యతిరేకంగా ఆదివారం నాడు నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అంతకు ముందు మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో మంత్రి రాణే విలేకర్లతో మాట్లాడుతూ శంకరాచార్యలు ప్రధాని నరేంద్రమోడీ,బిజెపిని రాజకీయ కోణం నుంచి చూస్తున్నారని ఆరోపించారు. ఇంతవరకు ఏ ఒక్కరూ ఏమీ చేయలేదని, ప్రధాని మోడీ, బిజెపి బాధ్యతను తీసుకొని రామాలయాన్ని నిర్మించిందని, దాన్ని వారు ఆశీర్వదించాలా లేక విమర్శించాలా ? ఆలయాన్ని రాజకీయాలకోసం కాదు మతం కోసం నిర్మించాము, రాముడు మా దేవుడు.హిందూమతం కోసం తామేమీ చేసిందీ శంకరాచార్యలు చెప్పాలని రాణే డిమాండ్‌ చేశారు. శంకరాచార్యలు రాకపోవటానికి ప్రధాని నరేంద్రమోడీ కూడా కారకులే అని శివసేన విమర్శించింది. వారు రాకపోతేనే మీ బొమ్మలు కనిపిస్తాయి, వస్తే వారి చిత్రాలనే పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నది.రామాలయాన్ని కూల్చి బాబరీ మసీదును కట్టారని ఇంతకాలం సంఘపరివారం ఆరోపించింది.కానీ పూర్తికాని రామాలయాన్ని ఎన్నికల కోసం ముందే ప్రారంభించారన్న విమర్శలు ఇప్పుడు చరిత్రకెక్కాయి. ఇది వాస్తవం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నయనతారకు ఒక న్యాయం,రామాలయ ట్రస్టుకు మరొకటా ! పవిత్ర కట్టడం కాదు సమాధి అన్న శంకరాచార్య !! హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నదెవరు ?

15 Monday Jan 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized, Women

≈ Leave a comment

Tags

# Anti Sanatan Dhrma, #Annapoorani, Ayodhya Ramalayam, BJP, Narendra Modi, Nayanthara's Film, RSS, sankaracharya


ఎం కోటేశ్వరరావు


నయనతార ప్రధాన పాత్రలో నటించిన అన్నపూరణి సినిమా తమ మనోభావాలను గాయపరచిందని హిందూత్వవాదులు ఫిర్యాదు చేసిన కారణంగా నెట్‌ఫ్లిక్స్‌ ఆ సినిమాను తన వేదిక నుంచి తొలగించింది. ఒక బ్రాహ్మణ పూజారి కుమార్తె బతుకుతెరువు కోసం వంటగత్తెగా మారి ఎలా ఎదిగిందన్నది ప్రధాన కథ. తండ్రి ప్రసాదాలు వండి వడ్డిస్తే, కుటుంబ ఆంక్షలకు భిన్నంగా పాకశాస్త్ర కాలేజీలో చేరి మాంసాహార తయారీ నేర్చుకోవటమే గాక, ఒక రోజు తింటూ కనిపిస్తుంది. ఆ క్రమంలో ఆమెకు బలవంతంగా వివాహం చేసేందుకు తండ్రి చూడటంతో ఇష్టం లేనందున తన స్నేహితుడు ఫర్హాన్‌తో కలసి ఇంటి నుంచి పారిపోతుంది. ఈ సినిమాను సెన్సార్‌ బోర్డు అనుమతించిన తరువాత విడుదలైంది. అయితే కొద్ది రోజుల తరువాత ఆ కథ, చిత్రీకరణలో తమ దేవతలు మాంసాహారాన్ని తింటున్నట్లు చిత్రించారని, ఇది హిందూమత, బ్రాహ్మణ కుల మనోభావాలను గాయపరచిందంటూ ఫిర్యాదులు, పోలీసు కేసుల దాఖలు వరకు హిందూత్వవాదులు వెళ్లారు.లవ్‌ జీహాద్‌ కోణం కూడా ఉందని ఆరోపించారు. ఇదే సమయంలో అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ట శాస్త్రవిరుద్దంగా జరుగుతోందంటూ ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఏకంగా నలుగురు శంకరాచార్యలు తిరస్కరించారు. వారి మనోభావాలు దెబ్బతిన్న కారణంగానే అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. భార్యలేని నరేంద్రమోడీ విగ్రహ ప్రతిష్ట పూజలకు అనర్హులని సామాజిక మాధ్యమంలో వ్యతిరేక, అనుకూల వాదనలు వెల్లువెత్తాయి. శంకరాచార్యుల వ్యాఖ్యల మీద మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రామాలయ ట్రస్టు చేస్తున్నది సనాతన హిందూ ధర్మ విరుద్దమని వారు ప్రకటించినప్పటికీ ఏ ఒక్క హిందూత్వవాది మనోభావాలూ గాయపడలేదు, ఆ కార్యక్రమం మీద ఎలాంటి పోలీసు కేసులు నమోదు చేయలేదు. ఎవరు ఎవరి మనోభావాలను దెబ్బతీశారు. కొందరిపైనే హిందూత్వవాదులు ఎందుకు ఫిర్యాదులు చేస్తున్నారు.శంకరాచార్యులు చెప్పిన మాటలనే ఏ నాస్తికులో, హేతువాదులో చెప్పి ఉంటే ఈ పాటికి ఎంత రచ్చ జరిగి ఉండేది !


బాబరీ మసీదు-రామ మందిర వివాదానికి సుప్రీం కోర్టు తెరదించింది. ఆ తీర్పు గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా దాన్నెవరూ సవాలు చేయలేదు. ఆ మేరకు బాబరీ మసీదును కూల్చిన ప్రాంతంలో రామాలయ నిర్మాణం జరుగుతోంది.అది పూర్తిగాక ముందే ప్రారంభానికి ముహూర్తం పెట్టటంతో కొన్ని వివాదాలు తలెత్తాయి. వాటిని నాస్తికులు, హేతువాదులు, అబ్రహామిక్‌ మతాల వారో చెప్పలేదు. సనాతన హిందూ ధర్మానికి ప్రతినిధులుగా, భాష్యం చెబుతున్న నలుగురు శంకరాచార్యులే అభ్యంతరాలను లేవనెత్తారు. రామాలయ నిర్మాణం కావించిన నరేంద్రమోడీ విగ్రహ ప్రతిష్టకు ముఖ్య అతిధిగా రావటాన్ని సహించలేని శంకరాచార్యులు తమ మనోభావాలను గాయపరుస్తున్నారంటూ వారి మీద సామాజిక మాధ్యమంలో మోడీ భక్తులు విరుచుకుపడుతున్నారు. అసలు రామాలయ ఉద్యమంలో వారెక్కడ ఉన్నారని సవాళ్లు విసురుతున్నారు. తమ మనోభావాలను దెబ్బతీస్తూ సనాతన ధర్మ విరుద్ద పద్దతులకు తెరతీశారని శంకరాచార్యులను అనుసరించేవారు కుమిలిపోతున్నారు. ఎవరైనా నరేంద్రమోడీ చేస్తున్నది ధర్మవిరుద్దం అంటూ వీధుల్లోకి వస్తే వారి వీపులకు హామీ లేదనే వాతావరణం నేడుంది అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి పరిస్థితిని ఎవరూ ఊహించి ఉండరు. హిందూ మతంలోని అసంబద్దతలు, మతం లేదా మనుస్మృతి పేరుతో అమలు జరిపిన వివక్షాపూరితమైన చర్యలను ప్రశ్నించిన నాస్తికులు, హేతువాదులు, సంస్కరణ వాదులు, పురోగామివాదులు, కమ్యూనిస్టులను హిందూ ద్వేషులు, సనాతన ధర్మవిరోధులుగా విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు హిందూత్వను పరిరక్షిస్తామని చెబుతున్నవారు శంకరాచార్యులను కూడా ఆ జాబితాలో చేరుస్తారా ? లేదా సనాతనాన్ని నిలబెట్టాలని కంకణం కట్టుకున్నాం అనుకుంటున్నవారు రామాలయాన్ని రాజకీయం చేసిన నరేంద్రమోడీ, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ సంస్థలను ధర్మం కోసం- దేశం కోసం వ్యతిరేకిస్తారో లేదో తేల్చుకోవాల్సిన తరుణం వచ్చింది.


హిందూ ఉనికి కోసం పోరాటం(స్ట్రగుల్‌ ఫర్‌ హిందూ ఎగ్జిస్టెన్స్‌.ఓఆర్‌జి) అనే వెబ్‌ సైట్‌ జనవరి ఏడవ తేదీన దైనిక్‌ జాగరణ్‌ అనే పత్రిక ప్రచురించిన ఒక వ్యాసం ఆధారంగా చేసిన వ్యాఖ్యను తన సైట్‌లో ఉంచింది. నలుగురు సనాతన హిందూ ధర్మ గురువులు ఎందుకు రామ మందిర ప్రాణప్రతిష్టలో పాల్గొనటం లేదు అన్నది దాని శీర్షిక. దాన్ని రాసిన వారు ఉపేంద్ర భారతి, శౌనక్‌ రారు చౌదరి. వారి రచనలో పేర్కొన్న కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.” గోవర్ధన మఠ పూరీ పీఠ శంకరాచార్య స్వామి శ్రీ నిశ్చలానంద సరస్వతి అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరస్కరించారు. ఆయనిలా చెప్పారు.” పవిత్ర ఆలయ నిర్మాణంవైపుగా ప్రభుత్వ ప్రయత్నం లేదు ” ఆయన మాటల్లోనే ” ఒక సమాధి ” అని ఆ నిర్మాణాన్ని వర్ణించటాన్ని బట్టి సాంప్రదాయ ఆలయ నిర్మాణానికి ఉండవలసిన పూజ్యభావం మరియు పవిత్రత దానికి లేవు అని సూచించినట్లయింది. తగిన గౌరవంలేని స్థలానికి వెళ్లటం ఇష్టం లేదనే ఆయన నిర్ణయం వెల్లడిస్తున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవటం అంటే శ్రీరాముడిని తిరస్కరించటం కాదు. కొందరు నేతల అవకాశవాద, తిమ్మినిబమ్మిని చేసే రాజకీయాలకు వ్యతిరేకం.


శృంగేరి శారదా పీఠ శంకరాచార్య స్వామి శ్రీ భారతీ తీర్ధ ఎందుకు తిరస్కరించారంటే ఆలయ నిర్మాణం అసంపూర్తిగా జరగటమే.అలాంటి దానికి వెళ్లటం సరైన చర్యకాదు. దీనితో పాటే ఆసియాలో అతి పెద్దదైన మసీదును అయోధ్యలో నిర్మించాలని తలపెట్టటం పట్ల ఆయన తన ఆందోళన వెల్లడించారు. దురదృష్టకరమైన పరిణామాలుగా భావిస్తున్నారు.తాను, ఇతరులు కోర్టుకు రామమందిరం సాక్ష్యాలను సమర్పించామని, కానీ రామమందిర ట్రస్ట్‌ లేదా దాని ప్రతినిధులుగానీ ఆలయనిర్మాణంలో తమ సలహాలు తీసుకోలేదని భారతీ తీర్ధ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలో ద్వంద్వ వైఖరి ఉన్నట్లు శంకరాచార్య విమర్శించారు. రామాలయ నిర్మాణం చేసినప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం హిందూ మనోభావాలను ఉపయోగించుకుంటున్నట్లు కనిపిస్తున్నది. ఒక్క ముక్కలో చెప్పాలంటే భారతీ తీర్ధ నిరాకరణకు ప్రాణ ప్రతిష్ట పవిత్రత, నిర్మాణ క్రమం పట్ల అసంతృప్తి, మత వ్యవహారాల పట్ల ప్రభుత్వ వైఖరికి తిరస్కరణగా చెప్పవచ్చు.


ద్వారకా పీఠ శంకరాచార్య స్వామి సదానంద సరస్వతి అనేక అంశాల మీద ఆందోళన వెల్లడించారు. పుష్య మాసం ప్రాణప్రతిష్టకు శుభప్రదం కాదన్నది మొదటి విమర్శ.దేవతల ప్రతిష్టాపన అశుభ గడియల్లో చేపట్టకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. సరైన సమయం వచ్చే శ్రీరామ నవమి అవుతుంది.రామ నవమి నాటికి ఎన్నికల నియమావళి అడ్డం వస్తుంది గనుక ముందుగానే ఎంచుకోవటం వ్యూహాత్మకమని, అప్పుడు జరిపితే పెద్దగా ఉపయోగం ఉండదని బిజెపి నేతలు భావించిన కారణంగానే నిర్మాణం పూర్తి కాకుండా ముందుగానే ఈ కార్యక్రమాన్ని తలపెట్టారని సదానంద సరస్వతి భావిస్తున్నారు. మతపరమైన అంశాలు, రాజకీయ ఉద్దేశ్యాలు, ప్రాణ ప్రతిష్ట సమయం, నిర్మాణం పూర్తికాకుండానే ప్రారంభించటం అనే అంశాలు అయోధ్య రావటం లేదని చెప్పటానికి సదానంద సరస్వతి కారణాలుగా చెప్పవచ్చు.


ఉత్తరాఖండ్‌ జ్యోతిర్‌మఠ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద తిరస్కరణకు మతపరమైన, సామాజిక అంశాలు ఉన్నాయి. వేదాలు, హిందూ మత గ్రంధాల్లో బ్రాహ్మణుల పాత్ర గురించి ప్రత్యేక స్థానం ఉంది. పూజారులుగా కేవలం వారినే నియమించాలి.ప్రత్యేకించి శూద్రులను పూజారులుగా నియమించటాన్ని ఆయన విమర్శిస్తున్నారు. మత ఆచారాల ఫలాలను అందరూ పొందటానికి అర్హులే అయినప్పటికీ శూద్రులు సేవకు మాత్రమే పరిమితం, సనాతన హిందూ ధర్మంలో వివక్ష ఉందనటాన్ని ఆయన ఖండిస్తారు.బ్రాహ్మణులకు బదులు పూజారులుగా శూద్రుల నియామకం వేదాలకు విరుద్ధం అని భావిస్తారు. అలాంటి నియామకాలు శ్రీ రాముడితో ముడివడిన ఆదర్శాలకు విరుద్దం, వేదాల్లో చెప్పినట్లు సామాజిక వ్యవస్థ ఉండాలి అంటారు. వీటికి విరుద్దంగా జరుగుతున్న కారణంగానే అవిముక్తేశ్వరానంద హాజరు కావటం లేదు. రాజకీయ లబ్దికోసం ఒకనాడు శంకరాచార్యుల పాదాల ముందు మోకరిల్లిన నరేంద్రమోడీ ఇప్పుడు సనాతన విలువలు, మర్యాదలకు భిన్నంగా అధర్మంగా వ్యవహరించటం దురదృష్టకరం. రామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రారు ప్రధాని మోడీలో విష్ణు అవతారాన్ని మాత్రమే చూస్తున్నారు. నలుగురు శంకరాచార్యల్లో శివుడిని చూడలేకపోతున్నారు. రామాలయ ప్రాణప్రతిష్టలో హిందూ ధర్మంలోని ఉన్నత ధర్మ గురువులు భాగస్వాములు గాకపోవటం దురదృష్టకరం. ఇది కేవలం మతపరమైన ఎదురుదెబ్బే కాదు సామాజిక, రాజకీయ చిక్కులను కూడా తీసుకువస్తాయి. ఇదీ స్ట్రగుల్‌ ఫర్‌ హిందూ ఎగ్జిస్టెన్స్‌.ఓఆర్‌జి విశ్లేషణ, వ్యాఖ్య సారం. ఈ భావాలు, అభిప్రాయాలతో నిజమైన హిందువులు ఏకీభవిస్తారు తప్ప రాజకీయ హిందూత్వ వాదులకు మింగుడు పడదు. పురోగామి వాదుల దృష్టిలో మతం వ్యక్తిగతం, రాజీకీయాల్లోకి చొప్పించకూడదని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇప్పుడు మతాన్ని రాజకీయాలకు ముడి పెట్టారని ఏకంగా శంకరాచార్యలు చెప్పటమే కొసమెరుపు.


విశ్వాసుల ఖర్మో లేక రాముడికి పరీక్షో గానీ రామాలయాన్ని కూడా సొమ్ము చేసుకొనేందుకు మోసగాండ్లు బయలుదేరారు. జనవరి 22 అయోధ్య రామాలయ ప్రతిష్టకు ఆహ్వానం అంటూ వాట్సాప్‌ విశ్వవిద్యాలయంలో మోసగాండ్లు రెచ్చిపోతున్నారని వార్తలు.” రామజన్మ భూమి గృహసంపర్క్‌ అభియాన్‌.ఏపికే ” పేరుతో ఉన్న యాప్‌ను ఫోన్లో ఏర్పాటు చేసుకోవాలని, దానితో ప్రముఖుల పాస్‌లను పొందాలని కోరుతున్న మెసేజ్‌లు మొదలయ్యాయి.ఎవరైనా ఆ పని చేస్తే తమ సమాచారం మొత్తాన్ని దొంగలకు స్వయంగా అప్పగించినట్లే.ఇక అనేక వెబ్‌సైట్లు కూడా ప్రారంభమై దోచుకోవటం ప్రారంభించాయి. రాముడి ప్రసాదం ఉచితంగా పంపుతామని, మీరు చేయవలసిందల్లా రవాణా ఖర్చులు ముందుగా పంపటమేనని పేర్కొంటున్నాయి. ఇది మీ జేబులోని సొమ్ముతో పాటు మీ సమాచారాన్ని కూడా మోసగాండ్లకు అప్పగించటమే అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అయోధ్య రామాలయ రాజకీయం : అద్వానీని రావద్దన్నారు ! పిలిచినా వెళ్లేది లేదన్నారు పూరీ శంకరాచార్య !!

08 Monday Jan 2024

Posted by raomk in BJP, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

AYODHYA, BJP, Narendra Modi, Ram Temple politics, RSS, Swami Nischalananda Saraswati


ఎం కోటేశ్వరరావు


అయోధ్య రామాలయంలో జనవరి 22న రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తాను రావటం లేదని పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు.దీని మీద మోడీ భక్తులు సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ చేస్తున్నారు. వస్తే ఎంత రాకపోతే ఎంత అసలు రామాలయం కోసం పూరీ శంకరాచార్య ఏం చేశారంటూ నిలదీస్తున్నారు.రధయాత్ర నిర్వహించి, బాబరీ మసీదు కూల్చివేత కేసులను ఎదుర్కొన్న ఎల్‌కె అద్వానీకి ఆహ్వానం ఇస్తూనే అసలు కార్యక్రమానికి రావద్దని చెప్పినట్లు నిర్వాహకులు ప్రకటించారు. చిత్రం ఏమిటంటే రామాలయంతో ఎలాంటి సంబంధంలేని, బాబరీ మసీదు కూల్చివేతను ఖండించిన సీతారాం ఏచూరి, ఇతర పార్టీల నేతలనూ ఆహ్వానించారు గానీ రావద్దని చెప్పలేదు. హాజరు కావటం లేదని చెప్పిన వారి మీద ప్రచారదాడులు చేస్తున్నారు. అద్వానీ(96), మురళీమనోహర్‌ జోషి(90) ఏండ్ల పెద్దవారు గనుక వారు వచ్చి ఇబ్బంది పడతారని అందువల్లనే రావద్దని చెప్పామని విమర్శలు చెలరేగిన తరువాత వివరణ ఇచ్చుకున్నారు. తరువాత నష్ట నివారణ చర్యల్లో భాగంగా విశ్వహిందూపరిషత్‌ నేతలు ఆహ్వానించినట్లు ప్రకటించారు. కానీ మాజీ ప్రధాని దేవెగౌడకూ 90 ఏండ్లే అయినప్పటికీ ఆయన వయసు రీత్యా రావద్దని నిర్వాహకులు చెప్పలేదు.ఎందుకు అంటే గత అసెంబ్లీ ఎన్నికల తరువాత దేవెగౌడ-కుమారస్వామి పార్టీ జెడిఎస్‌ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపితో జట్టుకట్టాలని నిర్ణయించింది. అందుకే అయోధ్య రామాలయ రాజకీయం రంజుగా నడుస్తోంది అని చెప్పాల్సి వస్తోంది. ఈ మాట అంటే కొందరు మనోభావాలను ముందుకు తెచ్చుకొని బాధపడితే చేసేదేమీ లేదు. వయసు రీత్యా కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ శుభ కార్యాలు జరిగినపుడు ఆహ్వానం పలకటం, వారు రాలేమని చెప్పినపుడు వీలు చూసుకొని రావాలని ఆకాంక్ష వెలిబుచ్చటం మన భారతీయ సంప్రదాయం. కానీ దాన్ని తుంగలో తొక్కి రావద్దని మేమే చెప్పామని నిర్వాహకులు చెప్పటాన్ని ఏ సంప్రదాయం అంటారో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు.రధయాత్ర పేరుతో బిజెపి నేత ఎల్‌కె అద్వానీ నిర్వహించిన కార్యక్రమం అది సృష్టించిన వినాశకర, అవాంఛనీయ ఉదంతాల గురించి తెలిసిందే. వారు వస్తారా లేదా స్పందన ఏమిటో చూడాల్సి ఉంది. ఒక వేళ వారు నిజంగా రాగలిగినా రానిచ్చేవారా అన్న సందేహాలు కూడా వారిని వద్దన్న తరువాత జనంలో తలెత్తాయి. తనదారిని సుగమం చేసుకొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన వెంటనే అద్వానీ, ఎంఎ జోషి వంటి వారితో మార్గదర్శక మండలిని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. అది ఇంతవరకు ఒక్కసారి కూడా సమావేశమైన సమాచారంగానీ, ఇచ్చిన మార్గదర్శనం గురించి గానీ ఎవరికీ తెలియదు. గుడులకు పరిమితం కావాల్సిన రాముడిని ఓట్ల కోసం వీధుల్లోకి తెచ్చారు.


ఆది శంకరాచార్య ఏర్పాటు చేసిన నాలుగు పీఠాల్లో పూరీలోని గోవర్ధన మఠం ఒకటి. దాని అధిపతిగా ఉన్న స్వామి నిశ్చలానంద సరస్వతి(80)కి కూడా రామాలయ నిర్వాహకులు ఆహ్వానం పంపారు. దాన్ని తిరస్కరించినట్లు స్వామి చెప్పారు, గతవారంలో ఒక టీవీ ఛానల్‌తో, అదే విధంగా మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో జరిగిన ఒక సనాతన ధర్మ సభకు హాజరైనపుడు విలేకర్లతో మాట్లాడారు. తనకు పంపిన ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఒక వేళ హాజరు కావాలని అనుకుంటే తోడుగా గరిష్టంగా ఒకరిని మాత్రమే తెచ్చుకోవాలని దానిలో పేర్కొన్నట్లు చెబుతూ ఒక్కరు కాదు వందమందిని అనుమతించినా ఆ రోజు తాను వెళ్లేది లేదని నిశ్చలానంద చెప్పారు. గతంలో కూడా వెళ్లానని భవిష్యత్‌లో కూడా అయోధ్య వెళ్లి రాముడిని సందర్శిస్తానని అన్నారు. రాముడి విగ్రహాన్ని శాస్త్ర విధి ప్రకారం ఏర్పాటు చేయాలని ఇప్పుడు అలా జరగటం లేదన్నారు. తమ మఠపరిధి ప్రయాగ వరకు ఉందని అయినప్పటికీ తమ సలహా, మార్గదర్శనం కానీ కోరలేదని చెప్పారు. ఈ పరిణామాల గురించి ” నేను ఏ మాత్రం ఆశాభంగం చెందలేదు. ఇతర హిందూ సనాతనుల మాదిరి సంతోషంగా ఉన్నాను. ప్రత్యేకించి ప్రస్తుత ప్రధాని ఒక లౌకికవాదిగా కనిపించేందుకు తాపత్రయపడటం లేదు.విగ్రహారాధన, హిందూత్వ అంశాలలో అతనెంతో ధైర్యశాలి, వాటి పట్ల గర్వపడతారు. తనను ఒక లౌకికవాదిగా ప్రదర్శించుకొనేందుకు అతనేమీ పిరికివాడు కాదు.అయితే ఒక శంకరాచార్యగా నేను అక్కడికి వెళ్లి ఏం చేయాలి ? మోడీగారు విగ్రహాన్ని ప్రతిష్టిస్తుంటే చప్పట్లు కొట్టి పొగడాలా ? అని ప్రశ్నించారు. ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే ముందు తనను నరేంద్రమోడీ ఎలా కలిశారో నిశ్చలానంద గుర్తు చేసుకున్నారు.కరోనాకు ముందు యోగి ఆదిత్యనాధ్‌ ఏడాదికి రెండు మూడు సార్లు కలిసేవారు. విశ్వహిందూ పరిషత్‌ మాజీ అధ్యక్షుడు దివంగత అశోక్‌ సింఘాల్‌ కనీసం 70సార్లు కలిశారని చెప్పారు.తీర్థస్థలాలను అభివృద్ధి పేరుతో భోగస్థలాలుగా మార్చుతున్నారు,టూరిజం కేంద్రాలుగా చేస్తున్నారని అన్నారు. ఇదే అంశంపై సోమవారం నాడు మరోసారి నిశ్చలానంద తన వ్యతిరేకతను వెల్లడించారు. చత్తీస్‌ఘడ్‌ రాజధాని రాయపూర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఈనెల 17న ఒడిషా ప్రభుత్వం ప్రారంభించనున్న శ్రీమందిర్‌ పరికర్మ ప్రకల్ప పధకం గురించి స్పందించారు.పుణ్య స్థలాలను విహార కేంద్రాలుగా మార్చటం అంటే వాటిని విలాస కేంద్రాలుగా మార్చటమే అన్నారు.హౌటళ్ల వారు, రవాణా రంగంలో ఉన్నవారు లబ్ది పొందుతారు తప్ప ఆ కేంద్రాలకు ఉన్న ప్రత్యేకత తగ్గుతుందన్నారు.ఆ కార్యక్రమానికి తనను ఆహ్వానించారని అయితే వెళ్లాలా లేదా అన్నది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. రామాలయ ప్రతిష్టాపన గురించి చేసిన వ్యాఖ్యల మీద నిశ్చలానందపై కాషాయ మరుగుజ్జు దళాలు పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ చేస్తున్నాయి.


సిఎన్‌ఎన్‌ న్యూస్‌ 18 టీవీ ఛానల్‌తో 30 నిమిషాలు మాట్లాడిన శంకరాచార్య రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించేటపుడు క్రతువులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.చాతుర్వర్ణ వ్యవస్థకు భగవద్గీతలోని కృష్ణుడి బోధనల్లోనే మూలాలు ఉన్నాయి.గుణము, చర్యలను బట్టి నాలుగు వర్ణాలుగా సమాజాన్ని వర్గీకరించారు.ఇది పుట్టుకను బట్టి అని చెప్పటంగాక చేసే పనులు, వాటి స్వభావాన్ని వర్ణాలు ఉంటాయి.పశ్చిమ దేశాల్లో కూడా వర్ణ వ్యవస్థ మాదిరే విద్య, ఆర్థికం, రక్షణ, సేవా రంగాలు ఉన్నాయి.ఇప్పుడు వర్తమాన సమాజంలో పోలీసుల లేదా ప్రధానులు ఏలాంటి పాత్రను పోషించారో వర్ణ వ్యవస్థలో కూ ఎవరికి వారు తమ స్థితిని బట్టి సమతూకాన్ని నిర్వహించారు. శివపురాణంలో వివిధ రకాల బ్రాహ్మలు ఉన్నారని ఒక కుటుంబంలో పుట్టినంత మాత్రాన్నే బ్రాహ్మలుకాదన్నారు.ఒక బ్రాహ్మడు వ్యాపారం చేస్తే వైశ్య బ్రాహ్మణ అని పిలవాలి, పురాతన గ్రంధాలలో చెప్పిన వాటిని అచరిస్తేనే ఒకబ్రాహ్మడిని బ్రాహ్మడిగా పరిగణించాలి అన్నారు.


ఏసుక్రీస్తు, మహమ్మద్‌ ప్రవక్త పూర్వీకులు సనాతన హిందువులే అని స్వామీజి గతేడాది సెలవిచ్చారు(ఫిబ్రవరి 1, 2023 ఓపి ఇండియా పోర్టల్‌) అమెరికా ప్రతిపక్ష సభ్యులు పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తారని అది రుజువైందని నిశ్చలానంద చెప్పారు. వారు క్రైస్తవం, ఇస్లాం స్వీకరించే ముందు హిందువులే అన్నారు. ఏసు క్రీస్తు పది సంవత్సరాలు భారత్‌లో ఉన్నారని దాన్ని ఎక్కడా పేర్కొనలేదన్నారు. పూరీలో మూడు సంత్సరాలు ఉన్నారని క్రీస్తు వైష్ణవుడని హిందూ క్రతువులన్నీ చేసినట్లు చెప్పారు. ఏసు క్రీస్తుకంటే ముందే హిందూయిజం ఉందని అందువలన ఆయన పూర్వీకులు హిందువులే అన్నది స్వామి వారి అభిప్రాయమని ఎన్నోసార్లు చెప్పారని, పూరీ మఠ ప్రజా సంబంధాల అధికారి మాతృదత్తా చెప్పారు. ప్రభుత్వాలకు మఠాలు, దేవాలయాల మీద అదుపు ఉండకూడదని, ప్రతి మూలను అభివృద్ధి చేసేందుకు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను అనుసరిస్తున్నారంటూ తన మీద వచ్చిన విమర్శలు నిశ్చలానంద ఖండించారు, నేను అనుసరించటం లేదు, కావాలంటే వారే నా వెనుక నడవొచ్చు,ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ నాముందు బాలగోపాలుడి మాదిరి కూర్చుంటారని అన్నారు.


రామాలయం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు చూస్తున్నదనే విమర్శలను ఎదుర్కొంటున్న బిజెపి ఒడిషాలో అక్కడి సిఎం నవీన్‌ పట్నాయక్‌ శ్రీమందిర్‌ పరిక్రమ రధాల ద్వారా ఎన్నికల రాజకీయం చేస్తున్నారని బిజెపి నేత పృధ్వీరాజ్‌ హరిచందన్‌ ఆరోపించారు. జగన్నాధ సంస్కృతిని రూపుమాపేందుకు కుట్ర జరుగుతోందని, తన మాజీ ప్రయివేటు కార్యదర్శి ద్వారా ఒరియా పౌరుల మీద దక్షిణ భారత సంస్కృతిని బలవంతంగా రుద్దేందుకు చూస్తున్నారని ధ్వజమెత్తారు.దాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.శ్రీమందిర్‌ పధకం ఒక రాజకీయ నాటకమని, ఎన్నికల ముందు తమ అక్రమాలను కప్పిపుచ్చుకొనేందుకు తలపెట్టారని, 160 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును బిజెడి తన ఎన్నికల ప్రచారానికి వినియోగించటం గర్హనీయమైన చర్య అన్నారు. బిజెపి నేతల విమర్శలను బిజెడి నేత, ఎంఎల్‌ఏ పద్మనాభ బెహరా తిప్పికొట్టారు. మనమంతా జగన్నాధుని పిల్లలం, మనంగాకపోతే భగవంతుడి పేరును ఎవరు తీసుకుంటారు, దీని గురించి మాట్లాడేందుకేమీ లేదు, రాజకీయం అసలే లేదన్నారు. భువనేశ్వర్‌ నగరంలోని అరవై ఏడు వార్డుల్లో శ్రీమందిర్‌ పరిక్రమ పధకంలోని రధాలను రెండు రోజుల పాటు తిప్పుతారు. ప్రతి ఇంటి నుంచి ఆకు వక్కలను, ప్రసాదాలను స్వీకరిస్తారు. ఈ పధకంలో భాగంగా పూరీలోని జగన్నాధ ఆలయ పరిసరాలలో రధయాత్ర వేగంగా కదలటాన్ని సులభతరం చేసేందుకు, తొక్కిడి లేకుండా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. జగన్నాధ దేవాలయం చుట్టూ 75 మీటర్ల పరిధిలో ఉన్న కట్టడాలను తొలగించేందుకు యాత్రకు అవసరమైన పద్దతుల్లో తీర్చిదిద్దేందుకు అవసరమైన భూ,భవనాలను సేకరించారు. జనాలకు అవసరమైన మరుగుదొడ్లు, మంచినీరు, సామాన్లు భద్రపరుచుకొనే గదులతో పాటు భద్రతకు అవసరమైన కేంద్రాల వంటివి ఈ పధకంలో ఏర్పాటు చేశారు. దీన్ని బిజెపి రాజకీయం చేస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ క్మిస్మస్‌ విందు రాజకీయం – కేరళ మంత్రి వ్యాఖ్య టీకప్పులో తుపాను !

05 Friday Jan 2024

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

a storm in a tea cup, BJP, CPI()M, Narendra Modi, Pinarayi Vijayan, Saji Cherian, wine and cake christmas politics


ఎం కోటేశ్వరరావు


క్రిస్మస్‌ సందర్భంగా క్రైస్తవ పూజార్లకు ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలో విందు ఇచ్చారు. దానిలో పాల్గొన్న బిషప్పులు మణిపూర్‌లో తమ సామాజిక తరగతికి చెందిన వారి మీద జరుగుతున్నదాడుల గురించి ప్రధానితో ప్రస్తావించలేదని కేరళ మంత్రి సాజి చెరియన్‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది.జనవరి మూడున కేరళ సిఎం పినరయి విజయన్‌ ఇచ్చిన క్రిస్మస్‌ విందుకు చెరియన్‌ వ్యాఖ్యలను తప్పుపట్టిన బిషప్పుల కౌన్సిల్‌ నేత క్లిమిస్‌తో సహా అనేక మంది హాజరయ్యారు. అంతకు ముందు చెరియన్‌ తాను చేసిన కొన్ని వ్యాఖ్యలను ఉపసంహరించుకోవటంతో ఆ వివాదం ముగిసింది. ఈ విందుకు గవర్నర్‌ మహమ్మద్‌ ఆరిఫ్‌ ఖాన్‌ హాజరు కాలేదు. సిఎం ఆహ్వానించని కారణంగానే రాలేదని వచ్చిన వార్తలపై గవర్నర్‌ స్పందించారు. కావాలంటే రాజభవన్‌కు వచ్చి తనిఖీ చేసుకోవచ్చు, నేను ఆహ్వానాన్ని ఎందుకు తిరస్కరించానో మీరు శోధించవచ్చు, ముఖ్యమంత్రిని కూడా ప్రశ్నలు అడగవచ్చు అన్నారు. ప్రధాని విందు వివాదం గురించి చూద్దాం. న్యూ ఢిల్లీలో ప్రధాని నివాసంలో ఇచ్చిన క్రిస్మస్‌ విందుకు ఆహ్వానం అందగానే కొందరు బిషప్పులకు వెంట్రుకలు నిక్కబొడుచుకొని అక్కడ అందించిన పండ్లరసాలు, ద్రాక్ష రసాలు, కేకుల మీద చూపిన శ్రద్ద తమ స్వంత సామాజిక తరగతి మీద మణిపూర్‌లో జరిగిన హింసను మరిచిపోయారని, వారికది ఒక సమస్యగా కనిపించలేదని కేరళ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజి చెరియన్‌ ఒక సభలో అన్నారు. చెరియన్‌ సిపిఎం నేత, క్రైస్తవ సామాజిక తరగతికి చెందిన వారు. దాని మీద కేరళ కాథలిక్‌ బిషప్పుల కౌన్సిల్‌(కెసిబిసి) అధ్యక్షుడు కార్డినల్‌ మార్‌ బెసిలియోస్‌ క్లిమిస్‌ మండిపడుతూ మంత్రి మాటలను ఉపసంహరించుకొనేంత వరకు తాము ప్రభుత్వానికి సహకరించేది లేదని ప్రకటించారు. వివాదాన్ని పొడిగించకుండా ఉండేందుకు తాను చేసిన విమర్శలో వెంట్రుకలు నిక్కపొడుచుకోవటం, కేకులు, డ్రాక్ష రసం పదాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే మణిపూర్‌ హింసాకాండపై క్రైస్తవ మతాధికారులు స్పందించలేదన్న విమర్శకు కట్టుబడి ఉన్నట్లు చెరియన్‌ స్పష్టం చేశారు. కెసిబిసి ప్రతినిధి ఫాదర్‌ జాకబ్‌ పాలకపిలి మాట్లాడుతూ దేశానికి క్రైస్తవులు చేసిన సేవల గురించి చర్చించేందుకు ప్రధాని ఏర్పాటు చేసిన సమావేశమని పేర్కొన్నారు.మణిపూర్‌ జనాభాలో 41శాతాల చొప్పున క్రైస్తవులు, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఎనిమిదిశాతంపైగా ఉన్నారు. అక్కడ గతేడాది మే 3వ తేదీన ప్రారంభమైన మెయితీ-గిరిజన ఘర్షణలు వందలాది మంది ప్రాణాలు తీశాయి. వేలాది ఇండ్లు, వందలాది ప్రార్ధనా మందిరాలను ధ్వంసమయ్యాయి. దాదాపు లక్ష మంది నిరాశ్రయులయ్యారు. గిరిజన మహిళలను ఇద్దరిని వివస్త్రలను గావించి రోడ్ల మీద తిప్పిన దుర్మార్గం వెలుగులోకి వచ్చిన తరువాత ప్రధాని మొక్కుబడిగా ఖండించారు తప్ప ఇంత వరకు ఆ రాష్ట్రానికి వెళ్లి భరోసా కల్పించేందుకు పూనుకోలేదు..


మణిపూర్‌ ఉదంతాల గురించి మౌనంగా ఉండటంపై కేరళ క్రైస్తవ మత పత్రికల్లోనే తీవ్ర విమర్శలు చాలా నెలల క్రితమే వచ్చాయి. ఈ పూర్వరంగంలోనే మంత్రి చెరియన్‌ మాట్లాడారు. కేరళలో ఓటు బాంకు ఏర్పాటు చేసుకొనే ఎత్తుగడతో క్రైస్తవ మతాధికారులను ప్రసన్నం చేసుకొనేందుకు బిజెపి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నది.లౌ జీహాద్‌ పేరుతో హిందూ, క్రైస్తవ యువతులను కూడా ఆకర్షించి మతమార్పిడికి పూనుకుంటున్నారని క్రైస్తవుల-ముస్లింల మధ్య విబేధాలు సృష్టించే విధంగా బిజెపి నేతలు గతంలో కొందరు వ్యాఖ్యానించారు. క్రైస్తవులు దేశానికి చేసిన సేవ గురించి చర్చించేందుకు ప్రధాని విందు ఏర్పాటు చేసినట్లు చెప్పటమే విచిత్రం.సంఘపరివార్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ఏర్పాటు చేసిన బిజెపి, ఇతర అనేక సంస్థలు క్రైస్తవ మిషనరీల గురించి, ప్రలోభాలతో మతమార్పిడులు చేస్తున్నారంటూ నిత్యం చేస్తున్న ప్రచారం, ఆ పేరుతో చేస్తున్న దాడుల గురించి తెలిసిందే. వాటిని నివారించటం గురించి ప్రధాని నరేంద్రమోడీ గడచిన పది సంవత్సరాల్లో ఎలాంటి సమావేశాల ఏర్పాటు లేదా ప్రయత్నాలుగానీ కనిపించవు.
2014లో నరేంద్రమోడీ ప్రధానిగా అధికారానికి వచ్చిన తరువాత ముస్లింలు, క్రైస్తవులు అభద్రతా భావానికి గురయ్యారు.భారత్‌లో ఇతర మతాల్లో ఉన్నప్పటికీ వారంతా గతంలో హిందువులే అన్న ప్రచారాన్ని తీవ్రం చేయటంతో పాటు ఘర్‌వాపసీ పేరుతో ఇతర మతాల వారిని తిరిగి హిందువులుగా మార్చే పేరుతో పెద్ద హడావుడి చేశారు. దానికి స్పందన రాలేదు. గుజరాత్‌లో జరిపిన మారణకాండను నివారించటంలో విఫలమైన నరేంద్రమోడీ తమ దేశంలో అడుగుపెట్టకూడదంటూ 2005 అమెరికా అనుమతి నిరాకరించింది. తరువాత అదే అమెరికా మోడీ ప్రధాని పదవిలోకి వచ్చిన తరువాత ఆహ్వానం పలికింది. 2014 అక్టోబరు, 2015 జనవరిలో నరేంద్రమోడీతో భేటీ అయినపుడు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా,మత స్వేచ్చపై అమెరికా కమిషన్‌ కూడా భారత్‌లో మతస్వేచ్చకు భంగం కలుగుతున్నదని, మైనారిటీ మతాల వారి మీద దాడులు జరుపుతున్నట్లు విమర్శలు చేసింది. భారత్‌లో కనిపిస్తున్న అసహనాన్ని మహాత్మాగాంధీ చూసి ఉంటే దిగ్భ్రాంతికి గురై ఉండేవాడని బరాక్‌ ఒబామా వ్యాఖ్యానించాడు. ఈ పూర్వరంగంలో అమెరికాను సంతుష్టీకరించేందుకు, ప్రపంచంలో తన ప్రతిష్టకు కలిగిన మచ్చను కనిపించకుండా చేసుకొనేందుకు నరేంద్రమోడీ చూశారు. తమ ప్రభుత్వం ఎలాంటి వత్తిడీ, ప్రభావం లేకుండా పౌరులు ఏ మతాన్నైనా అనుసరించటానికి, లేదా నిలుపుకోవటానికి స్వేచ్చను అన్ని విధాలుగా పరిరక్షిస్తుందని, మెజారిటీ లేదా మైనారిటీ మతాలకు చెందిన వారు ఎవరైనా ఇతరుల మీద విద్వేషాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలా రెచ్చగొట్టినప్పటికీ సహించదని పార్లమెంటులో చెప్పాల్సి వచ్చింది. విదేశాల వారిని ఆకట్టుకొనేందుకు ఈ ముక్కలను ఆంగ్లంలో చెప్పారని కొందరు వ్యాఖ్యానించారు. ఈ మాత్రం మాట్లాడటాన్ని కూడా సహించలేని హిందూ జాతీయవాదులు ” లౌకిక నరేంద్రమోడీ ” అంటూ ఎద్దేవా చేశారని వాషింగ్టన్‌ పోస్టు, గార్డియన్‌ పత్రికలు రాశాయి. క్రైస్తవ మతాధికారులతో సమావేశాన్ని కూడా మోడీ నిర్వహించారు.


నరేంద్రమోడీ చేసిన ప్రకటన ఇంకా చెవుల్లో వినిపిస్తుండగానే ఆర్‌ఎస్‌ఎస్‌ నేత మోహన్‌ భగవత్‌ మదర్‌ తెరెసాను విమర్శిస్తూ తన గణాన్ని సంతృప్తి పరచేందుకు చూశారు. మిషనరీలు తమ సాయం కోరి వచ్చిన వారిని మతం మారాలని కోరినట్లు ఆరోపించారు.ఆమె సేవలు మంచివే కావచ్చు, కానీ వాటిని వినియోగించుకున్న వారిని క్రైస్తవులుగా మార్చే లక్ష్యంతో చేశారని అన్నారు. ప్రభుత్వేతర సంస్థలు కూడా సేవలు చేస్తాయి అవి మదర్‌ తెరేసా వంటివి కాదు అన్నారు. అంతకు ముందు మతపరమైన మైనారిటీలను అపహరణకు గురైన వస్తువులుగా వర్ణిస్తూ నా వస్తువులను నేను తిరిగి పొందుతా అన్నారు. మదర్‌ తెరేసాపై మోహన్‌ భగవత్‌ మాటలతో తీవ్ర విమర్శలు రావటంతో తమ నేత మాటలను మీడియా వక్రీకరించిందంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ ఆరోపించింది. విదేశీ నిధులతో క్రైస్తవ మిషనరీలు, సంస్థలు మత మార్పిడికి పాల్పడుతున్నాయంటూ చేస్తున్న ప్రచారం ఒక ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. క్రైస్తవం మన దేశానికి రెండువేల సంవత్సరాల నాడే వచ్చింది. రెండు వందల సంవత్సరాల బ్రిటీష్‌ పాలన, తరువాత కూడా చూస్తే ప్రస్తుతం దేశంలో క్రైస్తవుల సంఖ్య కేవలం 2.3శాతమే. అంటరానితనం వంటి తీవ్ర వివక్ష కారణంగా అనేక మంది క్రైస్తవంలోకి మారారు. ఆ సమస్యతో నిమిత్తం లేని వారు ఆర్థిక, ఇతర ప్రయోజనాల కోసం క్రైస్తవం పుచ్చుకున్నారు. మొఘల్‌ పాలనా కాలంలో కూడా జరిగింది అదే. రిజర్వేషన్ల కారణంగా అనేక మంది క్రైస్తవంలోకి మారనప్పటికీ దేవాలయాలకు బదులు చర్చ్‌లకు వెళ్లి క్రీస్తును పూజిస్తున్నారన్నది హిందూత్వవాదుల దుగ్ద.


గతంలో జపాన్‌ ప్రధాని షింజో అబేతో కలసి అహమ్మదాబాద్‌లో ఒక పురాతన మసీదును మోడీ సందర్శించారు. సందర్శన వేరు, చర్చిలో మాదిరి పూజా క్రతువులో భాగంగా కొవ్వొత్తి వెలిగించినట్లుగా మసీదులో ఎక్కడా చూడలేదు.విదేశాలకు వెళ్లినపుడు అబూదాబీలో మోడీ మసీదును సందర్శించారు. ఇవన్నీ ఇస్లామిక్‌, క్రైస్తవ దేశాల పాలకుల మెప్పు పొందేందుకే అన్నది స్పష్టం. గతేడాది ఈస్టర్‌ పండగనాడు మోడీ చర్చికి వెళ్లటానికి ముందు క్రైస్తవుల మీద అత్యాచారాలను అరికట్టాలని కోరుతూ ముంబైలో పదివేల మంది ప్రదర్శన చేశారు.” ఈస్టర్‌ పండగ రోజు కెథడ్రల్‌ చర్చిని సందర్శించాలన్న వాంఛను ప్రధాని మోడీ వెలిబుచ్చారు. మేము ఏర్పాటు చేశాము. దీని మీద స్పందన ఏమిటని అనేక మంది జర్నలిస్టులు ఎందుకు అడుగుతున్నారో తెలియటం లేదని ” అన్న ఢిల్లీ ఆర్చిబిషప్‌ అనిల్‌ కౌటో అంతకు మించి మాట్లాడేందుకు తిరస్కరించారు.ప్రధాని కోరితే కుదరదని చెప్పలేం అని ఫరీదాబాద్‌ సిరో మలబార్‌ చర్చి అధిపతి కురియకోస్‌ భరణికులనగార అన్నారు. ప్రధాని చర్చిలో ఉండగా మూడు స్తోత్రాలను ఆలపించాము, రైసెన్‌ క్రీస్టు విగ్రహం ముందు కొవ్వొత్తిని కూడా వెలిగించారని చెప్పారు.అరగంటపాటు అక్కడే ఉన్న మోడీ ప్రాంగణంలో ఒక మొక్క నాటారు.ముంబైలో క్రైస్తవుల ప్రదర్శన నిర్వాహకులలో ఒకరైన డోల్ఫీ డి సౌజా మాట్లాడుతూ నరేంద్రమోడీ చర్చికి రావటానికి మాకెలాంటి సమస్య లేదు. స్వాగతిస్తాం, కానీ మోడీ ప్రధాని పదవిలోకి వచ్చిన తరువాత క్రైస్తవుల మీద హింసాకాండ పెరిగింది, దాడులకు పాల్పడిన వారికి వ్యతిరేకంగా మాట్లాడటానికి మోడీ నిరాకరిస్తున్నారు, అదే మాకు ఆందోళన కలిగిస్తోంది అని కూడా డి సౌజా చెప్పారు.అలాంటి ప్రధాని మణిపూర్‌ గురించి మౌనంగా ఉండటాన్ని ఎందుకు ప్రశ్నించలేదనే కేరళ మంత్రి తప్పుపట్టారు.


ఈస్టర్‌ పండుగ రోజున బిజెపి నేతలు కేరళలో పదివేల చర్చ్‌లు, క్రైస్తవుల ఇండ్లను సందర్శించి వారిని సంతుష్టీకరించేందుకు, ఓటు బాంకుగా మార్చుకునేందుకు చూశారు. ఈస్టర్‌ రోజున ఆడించిన నాటకమిదని కేరళకు చెందిన కురియకోస్‌ భరణికులనగార విమర్శించారు. కేరళలో సిరో మలబార్‌ చర్చ్‌ ఆర్చిబిషప్‌ కార్డినల్‌ జార్జి అలెంచెరీ నరేంద్రమోడీని ప్రశంసించినట్లు, దేశంలో క్రైస్తవులు అభద్రతతో లేరని చెప్పినట్లు న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక రాసింది. దేశంలో ఆందోళనకరంగా ఉన్న వాస్తవం కార్డినల్‌ అలెంచెరీ మాటల్లో ప్రతిబింబించలేదని కేరళలో ప్రచురితమయే సత్యదీపమ్‌ అనే కాథలిక్‌ పత్రిక సంపాదకుడు ఫాదర్‌ పాల్‌ తెలక్కాట్‌ వ్యాఖ్యానించారు. మోడీ పాలనను ప్రశంసించటం క్రైస్తవులకు విభ్రాంతి కలిగించిందని కూడా అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాని మిజోరం వెళ్లలేదు. మణిపూర్‌ తగులబడుతుంటే రాని ప్రధాని తగుదునమ్మా అంటూ పక్కనే ఉన్న మిజోరంలో ఓట్ల కోసం వచ్చారనే విమర్శను మూటగట్టుకోవాల్సి వస్తుందనే కారణం తప్ప మరొకటి కాదు. లోక్‌సభ ఎన్నికల పూర్వరంగంలో నరేంద్రమోడీ క్రిస్మస్‌ రాజకీయం చేశారు. ఈ పూర్వరంగంలో ప్రధాని విందుకు వెళ్లిన బిషప్పులు మణిపూర్‌లో జరుగుతున్న ఉదంతాలను పట్టించుకోలేదని కేరళ మంత్రి సాజీ చెరియన్‌ చేసిన వ్యాఖ్యలను చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కర్ణాటక బిజెపి టిక్కెట్‌ మోసం కేసు : పోలీసు కస్టడీలో పక్కా హిందూత్వ వాదులు !

23 Saturday Sep 2023

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, Women, Women

≈ Leave a comment

Tags

BJP, Chaitra Kundapura, G M Abhinava Halaveerappajja, Karnataka BJP ticket promise case, RSS, VHP


ఎం కోటేశ్వరరావు


ఆమె మూడు పదులు నిండకుండానే అన్ని విధాలుగా పేరు మోసిన కట్టర్‌ హిందూత్వ వాది. అతడు తన మఠం, కాషాయ దుస్తులతో మోసానికి పాల్పడిన మరో కట్టర్‌. వీరితో చేతులు కలిపిన మరో నలుగురితో కలసి వారు ఇప్పుడు బెంగలూరు పోలీసు కస్టడీలో ఉన్నారు. కర్ణాటకలో పక్కా హిందూత్వ వాదులుగా జనంలో ప్రాచుర్యం పొందిన వారు. ఇప్పుడు పక్కా మోసకారులుగా పోలీసుల చేతికి చిక్కారు. సంవత్సరాల తరబడి వారిని ఉపయోగించుకున్న బిజెపి, ఇతర హిందూత్వ సంస్థలు ఇప్పుడు వారితో తమకేమీ సంబంధం లేదని నమ్మబలుకుతున్నాయి. ఉద్రేక, ఉన్మాద ఉపన్యాసాలు చేసి రెచ్చగొట్టటంలో పేరు మోసిన హిందూత్వ నేతగా పేరున్న చైత్ర కుందాపుర, శ్రీ హలస్వామి మహాసంస్థాన్‌మఠ అధిపతి అభినవ హలస్వామి, వారితో చేతులు కలిపిన బిజెపి యువమోర్చ నేతలు, ఇతరులు ఈ కేసులో ఉన్నారు. అధికారంలో ఉన్న పెద్దలతో తమకు ఉన్న సంబంధాలను ఉపయోగించి నామినేటెడ్‌ పోస్టులు, కాంట్రాక్టులు, ఎన్నికల్లో పోటీకి టిక్కెట్లు ఇప్పిస్తామంటూ డబ్బులు కొట్టేసేవారి గురించి బయటకు తెలిసేది తక్కువ. ఎందుకంటే చెప్పుకుంటే పరువుపోతుందని అనేక మంది తేలుకుట్టిన దొంగల మాదిరి కిమ్మనరు. కర్ణాటకలో ఇప్పుడు బిజెపి టిక్కెట్ల కుంభకోణం వెల్లడి కావటంతో ఆ పార్టీ ఇప్పుడు ఇరుకున పడింది.తమకేమీ సంబంధం లేదని పార్టీ నేతలు చెబుతుండగా, అగ్రనేతల ప్రమేయం ఉందని కేసుల్లో అరెస్టయిన వారు అంటున్నారు. బిజెపిలో టిక్కెట్లు ఎలా సంపాదించుకొనే అవకాశం ఉందో ఈ మోసం వెల్లడిస్తున్నది.


ఇంతకీ జరిగిందేమిటంటే బిజెపి టికెట్‌ వస్తే దాంతో గెలిచి ఇబ్బడి ముబ్బడిగా సంపాదించవచ్చనే దురాశతో గోవిందబాబు పూజారి అనే వ్యాపారవేత్త పైన చెప్పుకున్న మోసగాళ్ల ముఠాకు ఐదు కోట్లు సమర్పించుకున్నట్లు సెప్టెంబరు ఎనిమిదిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ప్రధాన నిందితుల్లో చైత్ర కుందాపుర, ఆమె అనుచరులను పోలీసు అరెస్టు చేశారు.ఈ వార్త తెలియగానే మరో ప్రధాన నిందితుడు అభినవ హలస్వామి కాషాయ దుస్తులు పక్కన పడేసి మారు వేషంలో తప్పించుకున్నాడు. టీ షర్టు, షార్టు (లాగు కంటే ఎక్కువ, పాంట్స్‌ కంటే తక్కువ పొడవు) వేసుకొని పారిపోతుండగా ఒడిషా పోలీసులు పట్టుకున్నారు. ఉడిపి జిల్లాలోని బైందూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తనకు బిజెపి టిక్కెట్‌ ఇస్తామంటూ డబ్బు తీసుకొని మోసం చేశారని గోవిందబాబు పూజారి అనే వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాని, కేంద్ర హౌం మంత్రి కార్యాలయం,ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో తమకు ఉన్న సంబంధాల గురించి చెప్పి డబ్బు వసూలు చేశారన్నది వారి మీద మోపిన నేరం. తనకు ఒకరిని పరిచయం చేసి అతగాడు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత అని చెప్పారని బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీకి నిధులు అవసరమంటూ చెప్పటంతో అతగాడికి మూడు కోట్లు, మరో రెండు కోట్లు చైత్ర అనుచరులకు చెల్లించినట్లు పూజారి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. డబ్బు తీసుకున్నప్పటి నుంచి వారంతా తప్పించుకుంటున్నారని తెలిపాడు.


అనేక రాష్ట్రాలలో ఇలాంటి మోసగాళ్లు ఎందరో ఉన్నారు. కర్ణాటకలో 2020లో బెంగలూరు పోలీసులు స్వామి అలియాస్‌ సేవాలాల్‌ అనే జ్యోతిష్కుడు యువరాజ్‌ రామదాస్‌ను అరెస్టు చేశారు.అతగాడు 2014 నుంచి 2020వరకు అనేక మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఒక గవర్నర్‌, ఒక కేంద్ర మంత్రి, ఒక రాజ్యసభ సభ్యుడితో తనకు సన్నిహిత సంబంధాలున్నట్లు చెప్పేవాడు.2015లో జౌళిశాఖ కేంద్ర మంత్రిగా ఉన్న సంతోష్‌ గాంగవార్‌కు శ్రీకాళహస్తికి చెందిన కోలా ఆనందకుమార్‌ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. కేంద్ర సిల్క్‌బోర్డు చైర్మన్‌ పదవి ఇప్పిస్తానంటూ ఒకటిన్నర కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఈ స్వామికి ఒక ప్రముఖ బిజెపి నేత తనను పరిచయం చేసినట్లు, తన దగ్గర డబ్బు తీసుకున్న తరువాత పదవీ లేదు, స్వామి ముఖంచాటేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆనందకుమార్‌ పేర్కొన్నారు. సదరు స్వామి ఒక ఎంపీని తిరిగి నామినేట్‌ చేయిస్తానని ఇరవై కోట్లు, కర్ణాటక హైకోర్టు మాజీ మహిళా జడ్జికి గవర్నర్‌ పదవి ఇప్పిస్తానంటూ ఎనిమిదిన్నర కోట్లు కోట్లు వసూలు చేశాడు. బిఎస్‌ ఇంద్ర కళ అనే ఆ మాజీ జడ్జి నగదు రూపంలో నాలుగున్నర కోట్లు, ఆర్‌టిజిఎస్‌ ద్వారా రు.3.77 కోట్లు చెల్లించారు. ఆమెను ఢిల్లీ తీసుకువెళ్లి కొంత మంది బిజెపి అగ్రనేతలను పరిచయం చేశారట.ఆమె 2020లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయమూర్తులుగా ఎలాంటి వారు ఎంపిక అవుతున్నారు, గవర్నర్‌ పదవులను కొనుక్కోవటం ఎంత సులభంగా ఉంటుందో డబ్బు, పలుకుబడి కలవారి ప్రయత్నాల గురించి ఈ ఉదంతం వెల్లడించింది.బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలతో ఉన్న పలుకుబడితో తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించమని ఒక డాక్టర్‌ 30లక్షలు సమర్పించుకున్నారట.2019లో స్వామి తనను పది కోట్లకు మోసం చేసినట్లు శశికాంత్‌ బంద్రే అనే వాణిజ్యవేత్త ఫిర్యాదు చేసిన తరువాత పైన పేర్కొన్న మోసాలన్నీ వెలుగులోకి వచ్చాయి.


ఇక హిందూత్వ నాయకురాలు చైత్ర కుందాపూర్‌, ఆమె గాంగ్‌ మోసం చేసిన తీరు గురించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. మోసగాళ్ల ముఠాలో స్వామీజీతో పాటు కబాబ్‌లు తయారు చేసి అమ్ముకొనే వ్యక్తి , ఒక క్షురకుడు ఉన్నారు.తమ సైద్ధాంతిక గురువు ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, ప్రధాని కార్యాలయంలో తనకు పెద్ద తలకాయలు ఎందరో తెలుసని చైత్ర ప్రచారం చేసుకుంది. 2022లో వ్యాపారవేత్త పూజారికి ప్రసాద్‌ బైదూర్‌ అనే వ్యక్తిని పరిచయం చేసి అతను బిజెపి కార్యకర్త అని చెప్పారు. చైత్ర తలచుకుంటే రాష్ట్రంలో, కేంద్రంలో ఏదైనా సాధించగలదని అతను పూజారిని నమ్మించాడు. అది బాగా పని చేసిందని గ్రహించిన తరువాత ఆ ముఠా గగన్‌ కదూర్‌, రమేష్‌ నాయక్‌ అనే వారిని పరిచయం చేశారు. రమేష్‌ తన పేరును దాచి తాను చిక్‌మగళూరుకు చెందిన విశ్వనాధ్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతనని గత 45 ఏండ్లుగా పని చేస్తున్నట్లు నమ్మించాడు. తరువాత బెంగలూరులోని ధనికులు నివాసం ఉండే ప్రాంతంలో చెన్నా నాయక్‌ అనే అతన్ని బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడని పరిచయం చేశారు. ఒక పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు పొందిన 110 సంవత్సరాల తిమ్మక్క కుమారుడు ఉమేష్‌తో గగన్‌ కదూర్‌కు పరిచయం ఉంది. ఆమెకు వయసు పైబడటంతో కాబినెట్‌ స్థాయి కల్పించి ఒక కారు కూడా ఇచ్చారు.ఉమేష్‌ను ఒప్పించి ఆ కారులో చెన్నానాయక్‌, ఇతర ముఠా పూజారిని కలిశారు. అధికారిక కారును చూసి నిజంగానే పలుకుబడి కలిగిన వారని పూజారి నమ్మాడు. టిక్కెట్‌ కనుక రాకపోతే ఇచ్చిన సొమ్ము పూర్తిగా తిరిగి ఇస్తామని రమేష్‌ నాయక్‌ నమ్మబలికాడు. మూడు రోజుల్లో 50 లక్షలు, తరువాత మూడు కోట్ల మేర వసూలు చేశారు. ఆ సొమ్ములో ఒకటిన్నర కోట్లు అభినవ హలశ్రీ స్వామి అనే మఠాధిపతికి చెల్లించినట్లు పూజారి పేర్కొన్నాడు.2022 జూలై ఏడు నుంచి 2023 జనవరి 16 వరకు మొత్తం ఐదు కోట్లు సమర్పించుకున్నాడు.


బిజెపి అభ్యర్ధులను ప్రకటించటానికి కొద్ది రోజుల ముందు కాశ్మీరులోని ఒక ఆసుపత్రిలో ఆర్‌ఎస్‌ఎస్‌నేత విశ్వనాధ్‌ మరణించినట్లు గగన్‌ కదూర్‌ చెప్పాడు. అనుమానం వచ్చిన పూజారి విచారించగా అసలు ఆ పేరుగల వ్యక్తి లేడని తేలింది.దాంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేయటంతో మోసగాళ్ల ముఠా తప్పించుకు తిరిగింది.చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అరెస్టు చేశారు. సెప్టెంబరు పన్నెండు నుంచి హలశ్రీ స్వామి పరారీలో ఉండి పందొమ్మిదవ తేదీ రాత్రి ఒడిషా పోలీసులకు చిక్కాడు. ఇంతకీ రమేష్‌ నాయక్‌ చిక్‌మగలూర్‌లోని ఒక క్షురకుడు అని తేలింది. చెన్నానాయక్‌ బెంగలూర్‌ కెఆర్‌ పురంలో వీధుల్లో కబాబ్‌లు అమ్ముతాడని పోలీసులు గుర్తించారు. పూజారి నుంచి కొట్టేసిన సొమ్ములో భారీ మొత్తాని చైత్ర నొక్కేసింది. కుందాపురలోని ఒక సహకార బాంకులో రు.1.8 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసినట్లు, రు.65లక్షలు పెట్టి బంగారు నగలు కొన్నట్లు, మరో రు.40లక్షలను ఒక బంధువు సాయంతో శ్రీరామ్‌ బాంక్‌లో డిపాజిట్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరొక బాంకులాకర్‌ నుంచి రు.23లక్షల బంగారు బిస్కట్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒక నలభై లక్షలు వెచ్చింది చైత్ర తనకు కొత్త ఇంటి నిర్మాణంతో పాటు తన సోదరి ఇంటిని 15లక్షలతో మరమ్మతు చేయించినట్లు, పన్నెండు లక్షలతో కియా కారు కొన్నట్లు తేలింది. గగన్‌ కదూర్‌ వివాహానికి రు.35లక్షలు ఖర్చు చేసి పది లక్షలతో కొత్త కారు కొన్నారు, రమేష్‌ నాయక్‌ రు.1.5లక్షలు, చెన్నా నాయక్‌కు రు.93వేలు ఇచ్చారు. తమ ముఠాలోని ఆరుగురు మూడు కోట్లు తీసుకున్నట్లు చైత్ర పోలీసులకు వెల్లడించింది. స్వామీజిని అరెస్టు చేస్తే దీని వెనుక ఉన్న పెద్దల గురించి తెలుస్తుందని కూడా చెప్పిందని పోలీసులు చెప్పారు.ఆమెను ప్రశ్నిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకేమీ కాలేదని తరువాత తేలింది. బిజెపి నేత ఒకరు ఈ ముఠావెనుక ఉన్నట్లు రాష్ట్ర మంత్రి ఆర్‌బి తిమ్మాపూర్‌ ఆరోపించారు. కొంత మందికి టిక్కెట్లు రాకపోవటంతో ఇలాంటి మోసాలన్నీ వెలుగు చూస్తున్నాయని మాజీ సిఎం, బిజెపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన జగదీష్‌ షెట్టార్‌ అన్నారు.రియలెస్టేట్‌ బిజినెస్‌లో ఉన్నవారికి టిక్కెట్లు ఇచ్చారని విమర్శించారు. అరెస్టు చేసిన వారెవరూ అసలు తమకు తెలియదని బిజెపి నేతలు చెబుతున్నారు.ఈ కేసులో ఇప్పటి వరకు 80శాతం కొట్టేసిన సొమ్ము ఆచూకీ దొరికినట్లు పోలీసులు చెప్పారు.


ఒకటిన్నర కోట్లు తీసుకున్న హలశ్రీ స్వామి తప్పించుకోగా అతని కారు డ్రైవర్‌ పోలీసులకు దొరికాడు. సెప్టెంబరు ఎనిమిదవ తేదీన గోవింద పూజారి కేసు దాఖలు చేశారు. పన్నెండవ తేదీన చైత్రను ఉడిపిలో అదుపులోకి తీసుకున్నారు. అది తెలిసిన స్వామి ఆ రోజు హాజరు కావాల్సిన ఒక కార్యక్రమానికి వెళ్ల కుండా తప్పించుకున్నాడు. మైసూరు పారిపోయే ముందు నాలుగు కొత్త సిమ్‌ కార్డులు, నాలుగు కొత్త ఫోన్లు కొన్నాడట, పారిపోతున్నపుడు కారు నంబరు ప్లేటును తొలగించారు, తరువాత కారును ఒక బంధువు ఇంట్లో ఉంచి, కర్ణాటక నుంచి తప్పించుకున్నాడు. భువనేశ్వర్‌ నుంచి బుద్ధ గయకు రైలులో వెళుతుండగా కటక్‌ వద్ద పోలీసులకు దొరికాడు. మైసూరు నుంచి హైదరాబాద్‌, పూరీ, కోణార్క్‌ వెళ్లి అక్కడి నుంచి వారణాసి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు దొరికాడు. గోవింద పూజారి నుంచి తీసుకున్న సొమ్ముతో వ్యవసాయ భూమి కొనుగోలు, ఒక పెట్రోలు బంకులో పెట్టుబడి పెట్టినట్లు చెబుతున్నారు.


విద్యార్ధినిగా ఉండగా ఎబివిపిలో పని చేసిన చైత్ర కొన్ని పత్రికల్లో జర్నలిస్టుగా, స్పందన అనే టీవీలో యాంకర్‌గా పని చేసింది. హిందూత్వ కార్యకర్తగా మైనారిటీల మీద రెచ్చగొట్టే ప్రసంగాలతో అనేక పాత్రల్లో కనిపించిన చైత్ర 2018లో ఉడిపి పట్టణంలో కాంగ్రెస్‌ మీద ధ్వజమెత్తి వెలుగులోకి వచ్చింది. కేంద్ర మంత్రులు కూడా ఆమెను ఆకాశానికి ఎత్తారు. ముస్లింల మీద విద్వేష పూరిత ప్రసంగాలు చేసినందుకు ఆమె మీద కేసులు కూడా నమోదు చేశారు.ఈ ఉపన్యాసాలకు భజరంగ్‌దళ్‌, విశ్వహిందూపరిషత్‌ ఏర్పాటు చేసిన ప్రదర్శనలు, సభలు, సమావేశాలే వేదికలు.2021లో ఒక సభలో ముస్లింలు, క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇరవై మూడు శాతం ఉన్న మీకే ఇంత అహం ఉంటే 70శాతంగా ఉన్న హిందువులకు ఎంత ఉండాలి ?ఇదే మీకు చివరి హెచ్చరిక, మీరు గనుక లౌ జీహాద్‌ను మానుకుంటేనే మీరు బతికి ఉంటారు, 70శాతం హిందువులు 23శాతం మందిని మార్చాలని అనుకుంటే, లౌ జీహాద్‌కుపూనుకుంటే రెండు రోజులు చాలు మీ ఇండ్లలో ఒక్క బుర్కా కూడా కనిపించదు. మేము ప్రతి ముస్లిం యువతి నుదుటి మీద తిలకం దిద్దుతాం అని రెచ్చగొడుతూ మాట్లాడారు. ఆమె గత ఎన్నికల్లో బిజెపి తరఫున ప్రచారం చేశారు. శ్రీరామ్‌ సేన నేత ప్రమోద్‌ ముతాలిక్‌తో కలసి వేదికలను పంచుకున్నది. రెచ్చగొట్టే ప్రసంగాలు శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్నందును కలుబుర్గి జిల్లాలో అలంద్‌ తాలుకాలో వారం రోజుల పాటు తిరగ కుండా జిల్లా కలెక్టర్‌ ఈ ఏడాది ప్రారంభంలో నిషేధం విధించారు. 2018లో సర్పపూజ్‌ ఎలా చేయాలనే అంశంపై గొడవ పడి గురుప్రసాద్‌ పంజా అనే హిందూ జాగరణ్‌ వేదిక కార్యకర్తమీద చేయి చేసుకున్న కేసులో అరెస్టయింది.


అవివాహిత అయిన చైత్ర కుందాపుర మీద ఉడిపిలో బిజెపి కార్యకర్త సుధీన్‌ ఒక కేసు దాఖలు చేశాడు. తన కోసం ఒక దుకాణాన్ని కట్టిస్తానని చెప్పి ఆమె ఐదు లక్షలు తీసుకున్నదని, అది చేయకపోగా సొమ్ము వాపసు అడిగితే అత్యాచారం చేసినట్లు కేసు పెడతానని , హత్య చేయిస్తానని బెదిరించినట్లు పేర్కొన్నాడు. బిజెపి టిక్కెట్‌ పేరుతో సొమ్ము తీసుకున్న వ్యాపారి పూజారిని కూడా బెదిరించినట్లు వెల్లడైంది. అరెస్టుకు ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు ఒక లేఖ రాసి అతని వాణిజ్య లావాదేవీల మీద విచారణ జరపాలని, దర్యాప్తుకు తాను సహకరిస్తానని పేర్కొన్నది. తాను జర్నలిస్టుగా ఉన్నప్పటి నుంచి గోవిందబాబు పూజారి తెలుసునని, బిజెపి టిక్కెట్‌ కోసం చూశాడని, తాను ఒక ప్రైవేటు కంపెనీలో పని చేసినపుడు అతని అక్రమ లావాదేవీల గురించి తెలుసుకున్నట్లు రాసింది. అతని అక్రమాలను బయట పెట్టేందుకు అతనితో సంబంధాల్లో ఉండి సమాచారం సేకరించినట్లు చెప్పుకుంది. చిత్రం ఏమిటంటే సదరు పూజారికి ఎంఎల్‌ఏ టిక్కెట్‌ రాకున్నా, ఎన్నికలకు ముందు బిజెపి వెనుకబడిన తరగతుల మోర్చా కార్యదర్శి పదవిని బహుకరించారు. ఏ నియోజకవర్గంలో టికెట్‌ను ఆశించాడో అదే చోట బిజెపి అభ్యర్ధికి ప్రచారం చేశాడు. అనేక మంది నేతలతో సంబంధాలను ఏర్పాటు చేసుకొని ఒక గుర్తింపు పొందాడు. అధికారం వచ్చిన తరువాత ఆ సొమ్మును ఏదో విధంగా రాబట్టుకోవచ్చని భావించి ఉండాలి. బిజెపి ఓడిపోవటం, పార్టీ పదవి ఉన్నా ప్రయోజనం లేదని గ్రహించిన తరువాత తన సొమ్ము తనకు ఇచ్చివేయాలని డిమాండ్‌ చేయటంతో అసలు కథ బట్టబయలైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సనాతన ధర్మంపై పోరుకు అంబేద్కర్‌ మారుపేరు : వ్యాఖ్యల నుంచి తగ్గేది లేదన్న ఉదయనిధి స్టాలిన్‌ !

05 Tuesday Sep 2023

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence, Social Inclusion

≈ Leave a comment

Tags

# Anti Sanatan Dhrma, #Hindutva, #Udhayanidhi Stalin, Anti Hindu, BJP, DMK, Dravida, Eradicate Sanatan Dharma, INDIA, Narendra Modi, RSS


ఎం కోటేశ్వరరావు


” మన సమాజానికి సనాతన ధర్మం ఒక మలేరియా, డెంగీ వంటిది, దాన్ని వ్యతిరేకించటం కాదు, రూపుమాపాలి ” అని శనివారం నాడు తమిళనాడు పురోగామి రచయితలు మరియు కళాకారుల అసోసియేషన్‌ సభలో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ వెల్లడించిన అభిప్రాయం దేశంలో దుమారం రేపింది.ఇది హిందూ వ్యతిరేక వైఖరి, సనాతన ధర్మాన్ని పాటించే వారిని ఊచకోత కోయాలని పిలుపు ఇచ్చారంటూ బిజెపి చిత్రించింది. మాట్లాడే స్వేచ్చ పార్టీల కుందని కాంగ్రెస్‌ చెప్పగా, తృణమూల్‌ కాంగ్రెస్‌ తప్పుపట్టింది. చెన్నయి సభ సందర్భంగా నిర్వాహకులు ” సమతా ధర్మ నిర్మూలన ” అనే అంశంపై చర్చను పెట్టారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించటం గాక నిర్మూలించాలని నిర్వాహకులు పేరు పెట్టినందున వారిని అభినందిస్తున్నానని ఉదయనిధి స్టాలిన్‌ అన్నారు.” కొన్ని అంశాలను మనం నిర్మూలించాలే తప్ప దోమలు, డెంగీ, కరోనా, మలేరియా వంటి వాటిని కేవలం వ్యతిరేకించలేం, నిర్మూలించాలి. సనాతన ధర్మం కూడా ఇలాంటిదే.వ్యతిరేకించటంగాక నిర్మూలించటం అన్నది మన తొలి లక్ష్యంగా ఉండాలి అన్నారు. సనాతనం జనాన్ని కులపరంగా చీల్చిందని చెప్పారు. అది సమానత్వానికి, సామాజిక న్యాయానికి వ్యతిరేకం తప్ప మరింకేమీ కాదన్నారు. తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలు, పుదుచ్చేరిలో ఒకదానిలో అన్నింటా మనం గెలవాలి. సనాతనం ఓడాలి, ద్రావిడం గెలవాలి అన్నారు. ప్రతిదాన్నీ ప్రశ్నించేందుకే కమ్యూనిస్టు, ద్రవిడ ఉద్యమం పుట్టిందని అన్నారు.


సనాతన ధర్మాన్ని రూపుమాపాలి అని చెప్పిన తన మాటలను బిజెపి వక్రీకరించిందని రద్దు లేదా రూపు మాపాలి అంటే అర్ధం సనాతన ధర్మాన్ని పాటించేవారిని అంతం చేయాలని కాదని ఉదయనిధి స్పష్టం చేశారు. తన వైఖరిని పదే పదే వెల్లడిస్తానని, సనాతన ధర్మాన్ని మాత్రమే విమర్శించానని, దాని మీద ఎన్నికేసులు దాఖలైనా ఎదుర్కొంటానని ఆది, సోమవారాలలో పునరుద్ఘాటించారు. కొంత మంది తీరు పిల్లచేష్టల మాదిరి ఉందంటూ ద్రావిడవాదాన్ని రద్దుచేయాలి అని చెప్పినవారి మాటలకు అర్ధం డ్రావిడులను అంతం చేయాలనా, కాంగ్రెస్‌ ముక్త భారత్‌ అని ప్రధాని నరేంద్రమోడీ చెబుతున్నారు అంటే కాంగ్రెస్‌ వారిని చంపాలనా అని ప్రశ్నించారు. సనాతన అంటే దేన్నీ మార్చకూడదు, దానిలో చెప్పినవన్నీ శాశ్వతంగా ఉంటాయని అర్ధం అని ఉదయనిధి చెప్పారు. అదిఆద్యంత రహితమైనది, దాన్ని మార్చలేము, ఎవరూ దాన్ని ప్రశ్నించకూడదన్నదే దాని అర్ధం,కుల ప్రాతిపదికన సనాతనం జనాన్ని చీల్చింది అన్నారు.


సనాతన ధర్మ పునరుద్దరణ కోసమే పుట్టామని చెబుతున్న హిందూత్వశక్తులు రెచ్చిపోతున్న తరుణమిది. ఆ ధర్మం పేరుతో కోట్లాది మందిని అంటరానివారిగా, విద్య, వ్యక్తిత్వాలకూ దూరం చేసిన భావజాలం మీద అంబేద్కర్‌ , వామపక్ష, పురోగామి, హేతువాదులు నిరంతరం పోరాడారు. దాన్ని కొనసాగించటం కోసం నేడు కోట్లాది మంది అంబేద్కర్‌లు తయారు కావాల్సిన అవసరం వచ్చింది.ఇది భావజాల పోరు. దానిలో భాగంగానే ఉదయనిధి స్టాలిన్‌ వదిలిన ఒక వాగ్బాణం దెబ్బకు విలవిల్లాడుతున్న వారు దాన్ని చిలవలు పలవలుగా మార్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.ఉదయనిధి స్టాలిన్‌ తల నరికిన వారికి పది కోట్ల రూపాయల బహుమతి ఇస్తానని అయోధ్య తపస్వి ఛావనికి చెందిన మహంత పరమహంస దాస్‌ పిలుపు నిచ్చారు. గత రెండు వేల సంవత్సరాలలో అనేక మతాలు వచ్చి అంతరించాయని సనాతన ధర్మం మాత్రమే మిగిలి ఉందని అన్నారు. దాన్ని ఎవరైనా నాశనం చేయాలని చూస్తే అంతు చూస్తామని అన్నారు. ఉదయనిధిని చంపివేస్తే తాను కోటి రూపాయలు ఇస్తానని బిజెపి నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గ నేత దిలీపాచారి ప్రకటించారు. ఇలాంటి ప్రకటనలు మత ఉగ్రవాదం తప్ప మరొకటి కాదు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ కొన్ని చోట్ల కొందరు కేసులు దాఖలు చేశారు.


” భగవద్గీతలో ప్రవచించిన హిందూ సామాజిక తత్వాన్ని నేను తిరస్కరిస్తాను.అది సాంఖ్య తత్వశాస్త్రంలోని త్రిగుణాల ప్రాతిపదికన ఉంది. నా అభిప్రాయం ప్రకారం ఇది కపిలుడి తత్వశాస్త్రానికి క్రూరమైన వక్రీకరణ రూపం, అది హిందూ సామాజిక జీవన న్యాయంలో అంతరాలతో కూడిన అసమాన కుల వ్యవస్థను తయారు చేసింది. సహపంక్తి భోజనాలు లేదా అక్కడక్కడా జరిగే కులాంతర వివాహాల వలన కులం అంతరించదు. కులం ఒక మానసిక స్థితి, అది బుర్రకు పట్టిన వ్యాధి. ఈ వ్యాధికి హిందూ మతబోధనలే మూలకారణం. మనం కులతత్వాన్ని , అస్పృశ్యతను పాటిస్తున్నాం.హిందూమతం ద్వారా వాటిని చేసేందుకు ఆజ్ఞాపితులమయ్యాము.పచ్చి చేదును తీపిగా మార్చలేము. దేని రుచినైనా మార్చగలము.కానీ విషాన్ని అమృతంగా మార్చలేము.మానవులు శాశ్వతం కాదు. భావజాలం కూడా అంతే.మొక్కలకు నిరంతరం నీటిని అందించటం ఎంత అవసరమో ఒక భావజాలానికి ప్రచారం కూడా అంతే అవసరం, లేకుంటే రెండూ చచ్చిపోతాయి.నేను చివరిగా చెప్పేదేమంటే జనాలను మీరు చైతన్యపరచండి, పోరు సాగించండి, సంఘటితపరచండి, మీరు ఆత్మవిశ్వాసంతో ఉండండి.మన పోరు సంపద కోసమో లేదా అధికారం కోసమో కాదు. స్వేచ్చకోసం, ఇది మానవ వ్యక్తిత్వ పునరుద్దరణ పోరు. ” ఇవి వివిధ సందర్భాలలో మహనీయుడు బిఆర్‌ అంబేద్కర్‌ చెప్పిన మాటలు, చేసిన దిశానిర్దేశం.


ఉదయనిధి స్టాలిన్‌ చేసి వ్యాఖ్యల మీద సహజంగానే బిజెపి, దాన్ని అనుసరించేవారు మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ విరుచుకుపడుతున్నారు. వర్తమాన పరిస్థితుల్లో అదేమీ అనూహ్యమైంది కాదు. శాంతి, సహనాల గురించి రోజూ సుభాషితాలు చెప్పే వారు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సనాతన ధర్మ ప్రబోధకులు, దాన్ని అమలు చేయాలని చూసే వారిని గట్టిగా విమర్శిస్తే వారు మరింత రెచ్చిపోతారు, జనం అర్ధం చేసుకోకపోతే మనకే నష్టం అని చెప్పేవారు మంచి ఉద్దేశంతోనే చెబుతున్నారు. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవటం తప్ప భావజాల పోరును పక్కన పెడితే మరింతగా రెచ్చిపోతారు. దేశంలో చివరికి ఏ గల్లీ సిల్లీ స్వామీజీని కదలించినా చెప్పేవి ధర్మం కోసం దేశం, సనాతనం, హిందూత్వ పరిరక్షణ, ముస్లింలుక, కైస్తవులు దేశానికి ముప్పుగా మారారు అనే కబుర్లే కదా ! ఉదయనిధి స్టాలిన్‌ వంటి వారు మాట్లాడినందునే వారంతా రెచ్చిపోతున్నారా ? లేదు, ఒక అజెండా ప్రకారమే వారు మాట్లాడుతున్నారు, వామపక్ష, పురోగామి వాదులతో పాటు ఉదయనిధి మాదిరి మాట్లాడేవారు ఇతర పార్టీలలో ఇప్పుడు ఎందరున్నారు అన్నది ప్రశ్న. సనాతవాదుల మారణకాండకు పిలుపునిచ్చినట్లు అతని మాటలను వక్రీకరించిన బిజెపి తీరు దేశం చూస్తున్నది. ఒక భావజాలాన్ని మరొక భావజాలం కలిగిన వారు విమర్శించటం ప్రజాస్వామిక లక్షణం. అనేక అంశాల మీద తర్కం జరిగినట్లు మన ప్రాచీన భారత చరిత్ర కూడా చెబుతున్నది. హిందూత్వ, సనాతనం మీద విమర్శలు చేస్తే అవి ఆ శక్తులకే ఉపయోగపడతాయని, జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడాలని కొందరు సనాతన ధర్మ వ్యతిరేకులు కూడా మాట్లాడుతున్నారు.

అసలు కమ్యూనిస్టులు, ఇతర పురోగామి వాదులు గతంలో గట్టిగా పోరాడని కారణంగానే మతశక్తులు పేట్రేగిపోయారని చెప్పేవారు కూడ మనకు తగులుతారు.కానీ అసలు కారణం అది కాదు, స్వాంత్య్ర ఉద్యమానికి దూరంగా ఉండటమేగాక ద్రోహం చేసిన శక్తులు మహాత్ముడిని హతమార్చిన తరువాత వాటిమీద తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా మేం మారాం అని ఇచ్చిన లేఖను తీసుకొని కొనసాగనిచ్చిన వారు అసలు దోషులు అని చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ ప్రపంచవ్యాపితంగా మితవాద పిచ్చిమొక్కలు పెరగటానికి అనువైన వాతావరణం ఏర్పడిందని గ్రహిస్తే వాటిని పీకివేసేందుకు చేయాల్సిన కార్యాచరణకు ముందుకు వస్తారు. పర్యవసానాల గురించి తెలియకుండానే దేశంలో అనేక మంది మితవాదుల పట్ల ఒక సానుకూల వైఖరితో ఉన్నారు, మేథావులుగా ఉన్నవారు కొందరు మతశక్తుల చంకనెక్కుతున్నారు.చాలా మంది మౌనంగా ఉంటున్నారు. అంబేద్కర్‌ చెప్పినట్లు ఉదాసీనత లేదా తటస్థవాదం అత్యంత ప్రతికూల చెడు వ్యాధిగా జనాన్ని ప్రభావితం చేస్తుంది.” చెడ్డవారి అణచివేత, దుర్మార్గం కంటే మంచి వారి మౌనం చివరికి విషాదంగా మారుతుంది. మౌనం ఒకనాటికి నమ్మక ద్రోహంగా పరిణమిస్తుంది ” అని మార్టిన్‌ లూధర్‌ కింగ్‌ జూనియర్‌ చెప్పిన అంశాన్ని అందరూ గుర్తించాల్సిన తరుణం వచ్చింది.


ఒక మతభావజాలం సమాజ పురోగమనానికి ఆటంకం కలిగినపుడు మరో తత్వశాస్త్రం ముందుకు వచ్చి కొత్త మతాల ఆవిర్భావానికి కారణం అన్నది ప్రతి మత చరిత్ర చెబుతున్నది. మన దేశంలో వేదమతం లేదా సనాతన ధర్మం 50 బ్రహ్మ సంవత్సరాల పాటు కొనసాగిందని చెప్పేవారు ఉన్నారు. ఒక్కో బ్రహ్మ సంవత్సరానికి 3.1104 లక్షల కోట్ల మానవ సంవత్సరాలు అంటే సనాతన ధర్మం 155.52లక్షల కోట్ల సంవత్సరాలు సాగిందని నమ్మింప చూస్తారు. దీనికి ఎలాంటి ఆధారం లేదు.వేద మతం మీద తిరుగుబాటుగా లేదా కొత్త ఆలోచనల నుంచి వచ్చినవే బుద్ద, జైన, అనేక సారూప్యతలు కలిగిన వివిధ హిందూ మతాలు. ఈ కాలంలోనే చార్వాకులు లేదా లోకాయతులుగా పిలిచిన భారత తొలి భౌతికవాదులు తమ తత్వశాస్త్రాన్ని ముందుకు తెచ్చినట్లు వారికి వ్యతిరేకంగా వెలువడిన రచనలను బట్టి తెలుస్తున్నది. పరలోకం లేదా మరణానంతర లోకం లేదన్న వాదనలను ముందుకు తెచ్చిన చార్వాకులను అవి ఉన్నాయని చెప్పే మతశక్తులు భౌతికంగా అంతమొందించటంతో పాటు వారి రచనలను కూడా ధ్వంసం చేసినట్లు చెబుతారు. చివరకు తమతో విబేధించిన బౌద్ద, జౌన మతాలను కూడా మన దేశంలో అణచివేసిన చరిత్ర మనకు తెలిసిందే. గతంలో శైవు- వైష్ణవ మతాలను అనుసరించిన వారు మతోన్మాదంతో కొట్టుకుచచ్చినా తరువాత కాలంలో రాజీపడ్డారు. ఇప్పుడు కూడా నిఖార్సయిన శైవులుగా చెప్పుకొనేవారు వైష్ణవాలయాలను, వైష్ణవమత పరిరక్షకులమని అంటున్నవారు శివాలయాలను సందర్శించరు. ఇలాంటి వారంతా ఇప్పుడు హిందూత్వశక్తులుగా, హిందూమత పరిరక్షకులుగా ఫోజు పెడుతున్నారు. ఈ రోజు హిందూమతం అంటే సనాతనకు ప్రతిరూపంగా ముందుకు తెస్తున్నందున ఉదయనిధి స్టాలిన్‌ వంటి వారు విమర్శలు చేస్తున్నారు. సనాతన, హిందూత్వ లేదా హిందూ అనేది ఒక జీవన విధంగా చెబుతూ సామాన్యుల చేత తమ చేదు మాత్ర మింగించేందుకు మతశక్తులు చూస్తున్నాయి. అలాంటి జీవన విధానానికి తిరిగి వెళ్లాలని ప్రబోధిస్తున్నవారు సమాజాన్ని వెనక్కు నడపాలని చూసే వారు తప్ప మరొకరు కాదు. ఎందుకంటే భారత్‌లో ఏనాడూ జనమందరి జీవన విధానం ఒక్కటిగా లేదు. అన్ని కులాలది ఒకటే జీవన విధానం కాదు. సామాజిక న్యాయం లేదు. జీవన విధానమే అసలైన అంశం అయితే హిందూ మతానికి ముప్పు వచ్చిందని ఎందుకు ప్రచారం చేస్తున్నట్లు ? తమ మతం, జీవన విధానాలను ఎంచుకొనే స్వేచ్చ జనానికి సంబంధించిన అంశం.


ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మ విధానం మీద విమర్శ చేయగానే బిజెపి నేతలు ధ్వజమెత్తారు. సనాతను వ్యతిరేకించటం కాదు నిర్మూలించాలని పిలుపునిచ్చారంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే సనాతన ధర్మాన్ని పాటిస్తున్న దేశంలోని 80శాతం మందిని ఊచకోత కోయాలని పిలుపు నివ్వటమే అని బిజెపి ఐటి విభాగ నేత అమిత్‌ మాలవీయ ఆరోపించారు. దీనికి ముంబైలో సమావేశమైన ఇండియా కూటమి నేతలు అంగీకరించినట్లేనా అని బిజెపి ప్రశ్నించింది. ఇదంతా మెజారిటీగా ఉన్న హిందువులతో ఓటు బ్యాంకు రాజకీయం తప్ప మరొకటి కాదు. తమిళనాడు బిజెపి నేత నారాయణ తిరుపతి ధ్వజమెత్తారు. డిఎంకె ఒక కాన్సర్‌ వంటిది దానికి సనాతన ధర్మ సూత్రాలతో చికిత్స చేయాలన్నారు. డిఎంకెకు ఇలాంటివి కాత్త కాదు. వారికి చెడు అంశాలు మంచివిగా మంచివి చెడుగా కనిపిస్తాయి. సనాతనం ఆద్యంతరహితమైనది, డిఎంకె ఒక మత పార్టీ, అది ముస్లింలు, క్రైస్తవుల ఓట్ల మీద బతుకుతున్నది అన్నారు.(తమిళనాడులో హిందువుల జనాభా 88శాతం వరకు ఉన్నదని లెక్కలు చెబుతున్నాయి) క్రైస్తవ మిషినరీల నుంచి అరువుతెచ్చుకున్న భావజాలంతో ఉదయనిధి స్టాలిన్‌ చిలుకపలుకులు వల్లించినట్లు బిజెపి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై వర్ణించారు. రాష్ట్ర జిఎస్‌డిపి కంటే ఎక్కువగా గోపాలపురం కుటుంబం(స్టాలిన్‌ కుటుంబం నివాసం ఉండే ప్రాంతం పేరు) సంపదలను పోగేసుకుందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని బిజెపి ఎంపీ సుధాంశు త్రివేది అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ భిన్న స్వరాలను వినిపించింది. తమిళనాడుకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం ఉదయనిధి వ్యాఖ్యలను సమర్ధించగా, జాతీయ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ మాట్లాడుతూ ప్రతి పార్టీకి అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఉందని అన్నారు. తమ పార్టీ అన్ని మతాల మనోభావాలను గౌరవిస్తుందని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌ టిఎంసి ప్రతినిధి విమర్శించారు. ఇండియా కూటమిలోని ఒక భాగస్వామి పార్టీ నుంచి వెలువడిన వ్యాఖ్యలపై కూటమి అభిప్రాయం ఏమిటని బిజెపి ప్రశ్నించింది. మౌనంగా ఉండటం ద్వారా సనాతనవాదుల ఊచకోత పిలుపును కాంగ్రెస్‌ సమర్ధించినట్లయిందని బిజెపి నేత అమిత్‌ మాలవీయ ఆరోపించారు. కాంగ్రెస్‌, డిఎంకె ఓట్ల కోసం సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నదని కేంద్ర మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. రాజస్థాన్‌ ఎన్నికల సభలో మాట్లాడుతూ మోడీ గెలిస్తే సనాతన గెలిచినట్లు కాంగ్రెస్‌ చెబుతోంది, లష్కరే తోయబా కంటే హిందూ సంస్థలు ప్రమాదకరమైనవని రాహుల్‌ గాంధీ చెప్పారని షా ఆరోపించారు. ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలతో దేశంలో తిరోగామి సనాతన ధర్మం గురించి చర్చ జరుగుతున్నది. ఇది కొందరి కళ్లు తెరిపించినా మంచిదే. సనాతన ధర్మం కొనసాగాలని చెప్పేవారి వాదనలేమిటో, వ్యతిరేకించేవారి కారణాలేమిటో జనం తెలుసుకొనేందుకు ఒక అవకాశం వచ్చింది.నూరుపూవులు పూయనివ్వండి వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్నట్లుగా భావజాల పోరు సాగాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇష్టం లేని పెళ్లిలో తలంబ్రాలు పోసినట్లు : పులిహోర – పప్పుచారు మీద ఉన్న యావ మణిపూర్‌ మీద లేకపాయే ! నరేంద్రమోడీ 133 నిమిషాల ప్రసంగంలో కేవలం మూడు నిమిషాలే !

11 Friday Aug 2023

Posted by raomk in BJP, Communalism, Congress, History, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence, Social Inclusion, Women, Women

≈ Leave a comment

Tags

BJP, Manipur crisis, Manipur unrest, Narendra Modi, Narendra Modi Failures, No confidence motion 2023, RSS

  ఎం కోటేశ్వరరావు

పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లుగానే దేశనేతలందు మన ప్రధాని నరేంద్రమోడీ వేరయా అని చెప్పక తప్పదు. సుదీర్ఘ ప్రసంగంతో తన రికార్డును బద్దలు చేశారు. గురువారం నాడు(ఆగస్టు పదవ తేదీ) తన ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మీద ప్రశ్నలను సంధిస్తూ ప్రధాని మాట్లాడిన తీరు కూడా దాన్ని నిర్ధారించింది. మణిపూర్‌ మీద నోరు విప్పించేందుకే అవిశ్వాసం అన్నది తెలిసిందే. దానికి సమాధానం అంటూ 133 నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో కేవలం మూడంటే మూడు నిమిషాలే (డక్కన్‌ హెరాల్డ్‌ పత్రిక) మణిపూర్‌ గురించి మాట్లాడారంటే మొక్కుబడి,ఎంత నిర్లక్ష్య వైఖరితో ఉన్నారో లోకానికి వెల్లడైంది. ప్రశ్నలను అడిగే చతురత ఏ ఒక్కరి సొత్తూ కాదు. మీడియాతో మాట్లాడని దేశాధినేతలెవరు లేదా ఎందరు ? ప్రజాస్వామ్యానికి మన దేశం పుట్టినిల్లు , పార్లమెంటును దేవాలయం అని వర్ణించి దానికి దూరంగా ఉండటం, మాట్లాడేందుకు ?ఇచ్చగించని ప్రధాని ఎవరు ? పార్లమెంటుకు వస్తూ సభలో చేయాల్సిన ప్రకటనను ప్రాంగణంలోని మెట్లు, గోడలను ఉద్దేశించి మొక్కుబడిగా మాట్లాడిన ప్రధాని ఎవరు అన్న ప్రశ్నలకు సమాధానం అంత కష్టమేమీ కాదు. యావత్‌ దేశాన్నే గాక ఐరోపా పార్లమెంటులో కూడా చర్చనీయాంశమైన మణిపూర్‌ దారుణాల గురించి స్పందనకు కూడా తీరికలేకుండా ప్రధాని ఉన్నారు.పార్లమెంటులో ఈ అంశం గురించి ప్రధాని నోరు విప్పాలన్న ప్రతిపక్షాల, యావత్‌ సమాజ వేడుకోళ్లు, విన్నపాలు, డిమాండ్లను పట్టించుకోకపోవటంతో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టి మాట్లాడించే మార్గాన్ని అనుసరించాల్సిన పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా తలెత్తి ఉండదు. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదు. మణిపూర్‌ మీద ఏం చెబుతారో దేశానికి వెల్లడించాలన్న ఏకైక లక్ష్యంతోనే ప్రవేశపెట్టారన్నది తెలిసిందే.

మానవతుల మర్యాద మంట గలిపిన దుర్మార్గం గురించి మాట్లాడవయ్యా మహానుభావా అంటే మణిపూర్‌ ప్రభుత్వ ఆఫీసుల్లో మహాత్మాగాంధీ చిత్రాలను అనుమతించనపుడు అక్కడున్న ప్రభుత్వం ఎవరిది, జాతీయగీతం అలపించటాన్ని అనుమతించనపుడు ఎవరు అధికారంలో ఉన్నారు, తిరుగుబాటుదార్లు చెప్పిందే జరిగినపుడు ఏలుబడి ఎవరిది అంటూ జికె ప్రశ్నలను సంధించారు. మిజోరామ్‌ అమాయక పౌరుల మీద 1956 మార్చి ఐదున వైమానిక దళంతో కాంగ్రెస్‌ దాడులు చేయించింది అంటూ ప్రధాని మోడీ మాట్లాడిన తీరును చూసి ఏమనుకోవాలి ! జనాలకు బుర్ర తిరిగింది. అప్పుడు మిజోరంలో కాంగ్రెస్‌ దాడి చేయిస్తే నేడు మణిపూర్‌లో ఉన్న రెండింజన్ల పాలన సాగిస్తున్న బిజెపి మేమేన్నా తక్కువ తిన్నామా అంటూ మహిళలను నగంగా తిప్పి మానభంగం చేయించినట్లుగా ప్రధాని తర్కం ఉంది. మణిపూర్‌ వెళ్లి బాధితులను ఎందుకు పరామర్శించలేదు, రెండు సామాజిక తరగతుల మధ్య తలెత్తిన అనుమానాలను ఎందుకు తీర్చలేదు, ప్రధాని కనిపించటం లేదు అని పోస్లర్లు వేసి మరీ అక్కడ జనం అడుగుతున్నారు అని ప్రతిపక్షాలు అడిగాయి. వాటికి సమాధానం చెప్పకుండా కాంగ్రెస్‌ ఎన్నడూ ఆ ప్రాంత ప్రజల మనోభావాలను అర్ధం చేసుకొనేందుకు చూడలేదు, నేను 50సార్లు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాను అన్నారు ప్రధాని. ఓట్ల కోసం వందసార్లు వెళ్లవచ్చు, ఒక రాష్ట్రం మొత్తాన్ని మిలిటరీకి అప్పగించి జనం బిక్కుబిక్కు మంటూ దిక్కులేకుండా ఉన్నపుడు మణిపూర్‌ వెళ్లారా, పరామర్శించారా ,గాయపడిన మణిపూర్‌ పౌరుల మనోభావాలను పట్టించుకున్నారా లేదా అన్నది గీటురాయి తప్ప ఆ ప్రాంతానికి ఎన్నిసార్లు వెళ్లారు అని ఏ ప్రతిపక్ష పార్టీ అయినా అడిగిందా ? మణిపూర్‌లో నిందితులను కఠినంగా శిక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.సమీప భవిష్యత్‌లో మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని దేశ ప్రజలకు హామీ ?ఇస్తున్నాను, దేశం మొత్తం మీతో ఉందని మణిపూర్‌ మహిళలు, బిడ్డలతో సహా పౌరులందరికీ నేను చెబుతున్నాను అని ప్రధాని చెప్పారు. ఈ ముక్కేదో మణిపూర్‌లో హింసాకాండ చెలరేగిన తొలి రోజుల్లోనే చెప్పి ఉంటే ? పార్లమెంటు ప్రారంభం కాగానే స్వయంగా ప్రకటన చేసి ఉంటే ఇంత రచ్చ జరిగేదా ?

  తనకు లేని అధికారాన్ని పుచ్చుకొని మెయితీలను గిరిజనులుగా పరిగణిస్తూ రిజర్వేషన్లు వర్తింప చేయాలన్న మణిపూర్‌ హైకోర్టు ఆదేశమే కదా అక్కడ జరిగిన పరిణామాలకు కారణం.దాని మీద కేంద్ర ప్రభుత్వం ఒక వైఖరి ప్రకటించనంతవరకు గిరిజనుల్లో ఉన్న అనుమానాలు తొలగవు. ఇతర ప్రాంతాల్లోని గిరిజనులలో కూడా అదే పరిస్థితి తలెత్తవచ్చు. కానీ ప్రధాని ప్రసంగంలో దాని ప్రస్తావన లేదు. అంటే ఆ వివాదాన్ని కొనసాగించాలని చూస్తున్నారన్నది స్పష్టం. మణిపూర్‌ దారుణాలు జరిగినపుడు కర్ణాటకలో ఓట్ల వేటలో ఉన్నందున మోడీ గారికి వెళ్లే తీరికలేదు అనుకుందాం. ఒక ట్వీట్‌ ద్వారానైనా తన స్పందన ఎందుకు వెల్లడించలేదు. ట్వీట్‌ అంటే గుర్తుకు వచ్చింది. మణిపూర్‌లో హింసాత్మక ఉదంతాలు ఆగలేదు, ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. పక్కనే ఉన్న హర్యానాలో బుల్డోజర్లను నడిపిస్తున్న ఆటవిక పాలన సాగుతున్నది. సరిగ్గా అప్పుడు అంటే ఆగస్టు రెండున ఒక ఉదంతం జరిగింది. దాన్ని నరేంద్రమోడీ గారి ట్వీట్‌లోనే చూద్దాం. ” గత సాయంత్రం నేను భారత దక్షిణ రాష్ట్రాల ఎన్‌డిఏ ఎంపీలతో ఒక అద్భుతమైన సమావేశాన్ని జరిపాను. తరువాత గొప్ప విందు జరిగింది. దానిలో పానియారమ్‌, అప్పమ్‌, కూరగాయల కుర్మా, పులిహోర,పప్పుచారు,అడాయి. అవియాల్‌ ?ఇంకా కొన్ని వడ్డించారు ” అని ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు మూడవ తేదీ సాయంత్రం 4.1?కు ఒక ట్వీట్‌ చేశారు, దానికి విందు ఫొటోను కూడా జత చేశారు.

  రోమ్‌ తగులబడుతుంటే ఫిడేలు వాయిస్తూ కూర్చున్న నీరో చక్రవర్తి నిర్వాకం గురించి తెలిసిందే. పులిహౌర-పప్పుచారు రుచుల మీద ఉన్న యావ మణిపూర్‌ మీద ప్రధానికి ఎందుకు లేకపోయింది అన్నది ప్రశ్న. అవిశ్వాస తీర్మానం మీద సమాధానంగా ప్రధాని చేసిన మిగతా ప్రసంగమంతా కాంగ్రెస్‌, ప్రతిపక్ష పార్టీల మీద గతంలో చేసిన దాడిని పునరుచ్చరించటం తప్ప మరేమీ లేదు.ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నిసార్లు వెళ్లిందీ ప్రధాని చెప్పారు. దేవాలయం అని వర్ణించిన పార్లమెంటుకు ప్రధాని ఎన్నిసార్లు వచ్చారు, ఎంతసేపు గడిపారు, ఏం మాట్లాడారు అన్నది ప్రశ్న.పార్లమెంటు నిబంధనల ప్రకారం ప్రధానితో సహా కేంద్ర మంత్రులు పార్లమెంటుకు వచ్చినా రిజిస్టర్‌లో సంతకాలు చేయాల్సిన అవసరం లేదు గనుక వారెన్ని సార్లు వచ్చిందీ మనకు తెలియదు. మన ప్రజాస్వామ్య గొప్పతనమిది అనుకొని మన భుజాలను మనమే చరుచుకోవాలి. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను 2014 ఎన్నికలపుడు నరేంద్రమోడీ విమర్శించిన తీరును చూశాము. బలహీన, నోరులేని, మౌన మోహన సింగ్‌ అని వర్ణించారు. గడచిన తొమ్మిది సంవత్సరాలలో అదే పెద్దముషి తాజాగా చేసిన ప్రసంగంతో కలుపుకొని పార్లమెంటులో మాట్లాడింది కేవలం 31 సార్లు మాత్రమే అని తేలింది. ఇంత కంటే ఎక్కువ సార్లు మాట్లాడినట్లు ఎవరైనా చెబితే ఆ మేరకు అంకెను సవరిద్దాం. అదే మౌన మోహన సింగ్‌ గారు పదేండ్ల పాలనా కాలంలో 70సార్లు మాట్లాడారు. అనేక కీలక అంశాల మీద నరేంద్రమోడీ మౌనం జగమెరిగిన సత్యం.ప్రతి ఏడాదీ రాష్ట్రపతి ప్రసంగం మీద ధన్యవాదాలు తెలపటం, స్పీకర్‌ ఎన్నిక సందర్భంగా అభినందనలు, తన మంత్రుల పరిచయం, రామ మందిర నిర్మాణం గురించి ప్రకటనల వంటివి మోడీ ప్రసంగాల జాబితాలో ఉన్నట్లు ఇండియా టుడే ఒక విశ్లేషణలో పేర్కొన్నది.

  2014లో మంత్రిగా ఉన్న సాధ్వి నిరంజన ప్రతిపక్షాల మీద చేసిన సంస్కారం లేని అనుచిత వ్యాఖ్యల మీద దుమారం లేవటంతో తప్పనిసరై మోడీ జోక్యం చేసుకొని పార్లమెంటులో మాట్లాడటం, తరువాత ఆమె మంత్రి పదవి పోవటం, ముంబై పేలుళ్లలో పాక్‌ జాతీయుడికి బెయిలిచ్చిన ఉదంతం మీద, ఒకసారి కాశ్మీరు మీద, మరోసారి వ్యవసాయ సంక్షోభం, పదహారవ లోక్‌సభలో ముగింపు మాటలు తప్ప మరొకటి లేదు.రాఫెల్‌ గురించి, అదానీ కంపెనీల మీద హిండెన్‌బర్గ్‌ నివేదిక వంటి అంశాల మీద నోరు విప్పలేదు. వర్తమాన లోక్‌సభలో నెలల తరబడి సాగు చట్టాల మీద పార్లమెంటు అనేక సార్లు స్థంభించినా, మిత్రపక్షం అకాలీదళ్‌ వెళ్లిపోయినా నోరు విప్పలేదు. బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ తమ మర్యాదకు భంగం కలిగించినట్లు మహిళా రెజ్లర్లు కేసులు పెట్టి ఆందోళన చేసినా నోరు మెదపలేదు. అందువలన మణిపూర్‌లో తమ పార్టీ నిర్వాకం వలన తలెత్తిన పరిస్థితి గురించి ప్రధాని మౌనంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. విధిలేక సాగు చట్టాలను రద్దు చేస్తూ జాతికి క్షమాపణలు చెబుతూ బయట మాట్లాడారు తప్ప పార్లమెంటులో కాదు. అంతకు ముందు గోరక్షకుల పేరుతో జరిపిన దురాగతాల గురించి చేసిన ప్రకటన, సిఏఏ ఆందోళన గురించి మాట్లాడింది కూడా పార్లమెంటులో కాదు. చివరికి గాల్వన్‌ ఉదంతాల మీద కూడా ప్రతిపక్షాలతో జరిపిన అఖిల పక్ష సమావేశంలో, టీవీలో మాత్రమే మన భూభాగంలోకి ఎవరూ రాలేదు, ఏ పోస్టునూ కదిలించలేదు అని మాట్లాడారు. ప్రతిపక్షం అవిశ్వాసం తీర్మానం పెట్టటమే తప్పు అధికారం కోసం ఆకలితో ఉన్నట్లు ప్రధాని ఆరోపించారు. చరిత్రను ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే తమ గతం గుర్తుకు వచ్చి ఉండేది. కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద గతంలో ప్రవేశపెట్టిన అన్ని అవిశ్వాస తీర్మానాలకు బిజెపి లేదా దానికి ముందు రూపమైన జనసంఘం మద్దతివ్వటమే కాదు, తానే స్వయంగా ప్రవేశపెట్టిన ఉదంతాలు కూడా ఉన్నాయి.ప్రతిపక్షాలకు అవిశ్వాస తీర్మానం ఒక ఆయుధం.దేశ చరిత్రలో 28సార్లు ప్రవేశపెట్టారు. పదహారు సంవత్సరాల పాలనలో ఇందిరా గాంధీ పదిహేను తీర్మానాలను ఎదుర్కొన్నారు. ఏ ఒక్కటీ నెగ్గలేదు.

  ఇక ప్రధాని నరేంద్రమోడీ పులిహోర- ప్చుచారు ట్వీట్‌ మీదా నెటిజన్లు తీవ్రంగానే స్పందించారు. కొన్ని స్పందనలను చూద్దాం.” ఉప్మా ఎక్కడ మోడీ గారూ, పెరుగన్నం గురించి చెప్పలేదేం సార్‌, పప్పు అంటే ఏమిటి ? ” ఒక మొద్దుబారిన స్పందన ఇది, హర్యానా, మణిపూర్‌ తగులబడుతున్నది, ఎక్కడ చూసినా హింసాకాండ, రక్తపాతం, విద్వేష ప్రసంగాలు, ప్రతి చోటా జనం చచ్చిపోతుండగా ఈ మనిషి తాను తిన్నదాని గురించి ట్వీట్‌ చేశారు.అతనికేమీ సహానుభూతి లేదు, అతనేమీ పట్టించుకోరు.” ” జరుగుతున్న పార్లమెంటు సమావేశాలకు ఎందుకు వెళ్లరు,మణిపూర్‌ను ఎందుకు సందర్శించరు ?” ” ఈ మనిషి నిజంగా ఆశ్చర్యకరంగా ఉన్నారు, దేశం తగులబడుతుంటే తాను తిన్న పదార్ధాల గురించి చెబుతున్నారు ” ” మీ డిన్నర్‌లో దాక్షిణాది వంటకాలతో మజా చేసుకోండి ” ” చాలా గొప్పగా ఉందండి హర్యానా లేదా మణిపూర్‌లో గుజరాత్‌ నమూనా విద్వేష విస్తరణ పండగ పార్టీలా ఉంది. మీరు పార్లమెంటు లేదా మణిపూర్‌ ఎప్పుడు వెళతారు ” ” ఎంతటి గొప్ప మనిషిని మనం ప్రధానిగా కలిగి ఉన్నాం. మణిపూర్‌ సమస్య మీద వివరణ కోసం మీరు పార్లమెంటుకు రావాలని యావత్‌ ప్రతిపక్షం కోరుతుండగా మీరు మాత్రం తాపీగా ఉన్నారు. దక్షిణాది వంటకాల రుచులను అనుభవిస్తున్నారు. మోడీ గారూ పౌరుల గురించి మీకు ఎంత విశాల హృదయ స్పందన ఉందో కదా ! ” ” మీరు మంచి సమావేశాన్ని జరిపారు కానీ మీకు దేశంలో జరుగుతున్న దానిమీద చర్చించేందుకు తగిన సమయం లేదాు. మీరు ఆ గద్దెమీద ఎందుకు ఉన్నారు. మీ వంటి నేతను కలిగి ఉన్నాం కాబట్టి వందల సంవత్సరాల తరువాత కూడా మీ కారణంగా మనం అభివృద్ది చెందిన దేశం మాదిరి గాక అభివృద్ది చెందుతున్న దేశంలోనే ఉంటాం.” ” అద్భుతం మీరూ హాపీ మేమూ హాపీ . రకరకాల దుస్తులు, ఎన్నో రకాల వంటలు అనుభవించండి, భిన్న రుచులను అనుభవించటమే కదా జీవితం ” ” సార్‌ అప్పుడప్పుడూ డిన్నర్‌లో ఒక రొట్టె ముక్కను కూడా తినేందుకు ప్రయత్నించాలి మీరు. ఎందుకంటే మణిపూర్‌ సహాయ శిబిరాల్లో ఉంటున్నవారు తింటున్నది అదే ” ” ఎనభై కోట్ల మంది జనం ఐదు కిలోల ఉచిత రేషన్‌తో బతుకుతుండగా మీరు అనేక వంటకాలను భుజిస్తున్నారు ” ” అనేక శాంతి భద్రలతల సమస్యల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం, లక్షలాది మంది పేదా మధ్యా తరగతి జనాల ఆదాయం మీద ప్రతికూల ప్రభావం చూపుతున్నది. మన దేశ ప్రధానికి తమ పార్టీ ఎంపీలతో కలసి ఆరగించిన ఆహార పదార్దాల గురించి ట్వీట్‌ చేసేందుకు వ్యవధి ఉంటుంది గానీ పరిస్థితిని అదుపు చేసేందుకు ఎలాంటి ప్రయత్నం కనిపించటం లేదు.” వీటి గురించి వేరే వ్యాఖ్యలు అవసరమా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కాశ్మీరీ ఫైల్స్‌ వివేక్‌ అగ్నిహౌత్రికి ఆగ్రహం ! మణిపూరీ ఫైల్స్‌ మీద ఎదురుదాడి !!

06 Sunday Aug 2023

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Literature., NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Women

≈ Leave a comment

Tags

BJP, Kashmir Files, Mahashweta Jani, Manipur files, Narendra Modi Failures, Parul Khakhar, RSS, Saffron gang, Vivek agnihotri


ఎం కోటేశ్వరరావు


కాశ్మీరీ ఫైల్స్‌ సినిమాతో డబ్బుకు డబ్బు, కాషాయ దళాలను ఎంతగానో రంజింప చేసి వారి మద్దతు పొందిన వివేక్‌ రంజన్‌ అగ్నిహౌత్రిని మణిపూర్‌ ఫైల్స్‌ గురించి అడగ్గానే అగ్నిహౌత్ర అవధానులయ్యారు. అగ్నిహౌత్రి సంఘపరివార్‌ సభ్యుడా లేక అనేక మంది మాదిరి ముసుగులో ఉన్న అదే తెగ సినిమా రంగ పెద్దమనిషా అన్నది పక్కన పెడదాం. మణిపూరీ ఫైల్స్‌ సినిమా ఎందుకు తీయరు అని ప్రశ్నించిన వారి మీద నేను తప్ప వేరే మగాళ్లే లేరా అంటూ మండిపడ్డారు. ఎదురుదాడికి దిగారు. కాశ్మీరీ ఫైల్స్‌ సినిమా 2022లో ప్రపంచమంతటా 350 కోట్ల రూపాయలను వసూలు చేసి హిందీ సినీ రంగంలో ఒక రికార్డు నెలకొల్పింది. దాని కొనసాగింపుగా మరింతగా సొమ్ము చేసుకొనేందుకు, ప్రచార పర్వంలో భాగంగా కాశ్మీరీ ఫైల్స్‌ అన్‌రిపోర్టెడ్‌ పేరుతో అంటే వెలుగులోకి రాని కాశ్మీరి పండిట్ల ఉదంతాల పేరుతో ఒక సిరీస్‌ విడుదల చేయనున్నారు. తొలి భాగం ఆగస్టు 11న జీ5లో ప్రసారం కానుంది. తాము పరిశోధించిన దానిలో పది నుంచి ఇరవై శాతమే ఈ సిరీస్‌లో చూపనున్నామని, వాస్తవ గాధలను వీటిలో చూస్తారని, తమ పరిశోధన సారాన్ని కాశ్మీరీ ఫైల్స్‌ సినిమాగా తీశామని అగ్నిహౌత్రి చెప్పారు. ఇది రాజకీయ ప్రచారం కోసం అన్నది వేరే చెప్పనవసరం లేదు. కాశ్మీరీ పండిట్ల మీద జరిగిన దాడుల గురించి అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలేవీ దాచలేదు, వార్తల మీద ఆంక్షలు విధించలేదు. వాటిని అన్ని పార్టీలూ ఖండించాయి. నేడు మణిపూర్‌ ఉదంతాల మీద జరిగినట్లుగా పార్లమెంటు దద్దరిల్లలేదు. నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న విపి సింగ్‌ ప్రభుత్వానికి బిజెపి కూడా వెలుపలి నుంచి మద్దతు ఇచ్చింది. రాముడి రధ యాత్ర పేరుతో 1990 నవంబరు రెండున అయోధ్యకు చేరుకున్న కరసేవకులను నిరోధించేందుకు నాడు అధికారంలో ఉన్న ములాయం సింగ్‌ ప్రభుత్వం కాల్పులు జరపటానికి దారితీసిన పరిస్థితి తరువాత బిజెపి దానికి నిరసగా కేంద్రంలో విపి సింగ్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది తప్ప కాశ్మీరీ పండిట్ల మీద జరిగిన దాడులకు కాదు. మూడు దశాబ్దాల తరువాత నాటి ఉదంతాల పేరుతో సినిమా తీసిన వివేక్‌ అగ్నిహౌత్రి వర్తమాన మణిపూర్‌ ఫైల్స్‌ గురించి పరిశోధనా లేదు, సినిమా లేదు.


మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించి, అత్యాజరిపిన ఉదంతం ప్రపంచమంతటినీ కదిలించింది. వివేక్‌ అగ్నిహౌత్రి ఒక సంఘపరివార్‌ విధేయుడిగా స్పందించారు. ఆ ఉదంతాన్ని తక్కువ చేసి చూపేందుకు బిజెపి ఎత్తుగడనే ఆ పెద్దమనిషి కూడా అనుసరించి తన నిబద్దతలో ఎలాంటి సడలింపు లేదని ప్రదర్శించుకున్నారు. వెలుగులోకి రాని కాశ్మీరీ పండిట్ల ఉదంతాలు అనే సిరీస్‌ను విడుదల చేస్తున్నట్లు అగ్నిహౌత్రి ట్విటర్‌ ద్వారా, ఇతరంగా ప్రకటించారు. కాశ్మీరీ హిందువులను ఊచకోత కోస్తే భారత న్యాయవ్యవస్థ దాన్ని చూడకుండా, మౌనంగా నిస్సహాయంగా ఉందని ధ్వజమెత్తారు. మన రాజ్యాంగం వాగ్దానం చేసినట్లుగా కాశ్మీరీ హిందువుల జీవిత హక్కును రక్షించేందుకు తనంతట తానుగా స్పందించటంలో విఫలమైంది, ఇప్పటికీ విఫలమౌతూనే ఉంది అని ఆరోపించారు. మణిపూర్‌ ఉదంతాల మీద నెలల తరబడి మౌనంగా ఉన్న ప్రధాని మోడీ మీద అదే స్పందన ఎందుకు వెల్లడించలేదు ? నిజానికి అగ్నిహౌత్రి కడుపు మంట కాశ్మీరీ పండిట్ల మీద స్పందించలేదు అన్నదాని కంటే మణిపూర్‌ మీద నోరు విప్ప నోరు విప్ప అంటూ ప్రధాని నరేంద్రమోడీ నోటికి వేసుకున్న తాళాన్ని న్యాయవ్యవస్థ తీయించిందన్న దుగ్దను ఆ రూపంలో వెల్లడించుకున్నారు. సమయాన్ని వృధా చేయకండి మీరు దమ్మున్న మగాడే అయితే అక్కడికి వెళ్లండి, మణిపూర్‌ ఫైల్స్‌ సినిమా తీయండి అని దాని మీద ఒక ట్విటర్‌ సవాలు విసిరారు. ఒక ప్రముఖుడి నుంచి అలాంటి ట్వీట్‌ వెలువడితే వేరు. కానీ ఆ సాధారణ ట్వీట్‌ మీద స్పందించి మీకు నా మీద విశ్వాసం ఉన్నందుకు కృతజ్ఞతలు, కానీ నన్ను అన్ని సినిమాలూ తీయాలంటున్నారు దమ్మున్న వారు ఇంకెవరూ లేరా అని ఎదురుదాడికి దిగి అతి తెలివి ప్రదర్శించారు.


అంతకు ముందు వివేక్‌ అగ్నిహౌత్రి మణిపూర్‌ మీద ట్వీట్లు చేశారు, ఒక కవితను కూడా రాశారు. ఒక ట్వీట్‌లో ఇలా ఉంది. ” మణిపూర్‌ : మోప్లా, డైరెక్ట్‌ యాక్షన్‌ డే( ప్రత్యేక దేశంగా పాకిస్తాన్‌ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోకపోతే 1946 ఆగస్టు 11న ప్రత్యక్ష కార్యాచరణ దినాన్ని పాటిస్తామని ముస్లింలీగ్‌ నేత జిన్నా అదే ఏడాది జూలైలో చేసిన ప్రకటన), నౌఖాలీ, బంగ్లాదేశ్‌, పంజాబ్‌, కాశ్మీర్‌, బెంగాల్‌, కేరళ, అసోం, బస్తర్‌ ఇప్పుడు మణిపూర్‌…ప్రతిసారీ అంతిమంగా మన అమాయక తల్లులు, సోదరీమణులు అమానుష,ఆటవిక చర్యలకు బలౌతున్నారు. ఒక భారతీయుడిగా, ఒక పురుషుడిగా, ఒక మనిషిగా ప్రతిసారీ నా ధైర్యం చెదిరింది, నేను సిగ్గుపడ్డాను, నా చేతగాని తనానికి అపరాధన భావనతో ఉన్నా అని పేర్కొన్నారు. ఇక ఆ పెద్దమనిషి కవితా స్పందన గురించి చూద్దాం. ” ఓ మణిపూర్‌… నేను యత్నించా…నేను యత్నించా… కానీ విఫలమయ్యా……నా నైపుణితో ఇప్పుడు నేను చేయగలిగింది వారి విషాద గాధలను చెప్పటమే, కానీ అప్పటికి అది ఎంతో ఆలశ్యం అవుతుంది…… ఎంపిక చేసుకున్న, అతితో కూడిన పోటీ తత్వపు ఎన్నికల రాజకీయాలకు మనమందరం బాధితులం…..మనమందరం మత అతి బాధితులం….. మనమందరం ప్రమాదకర మీడియా బాధితులం…..మనం భారత పౌరులం, బాధితులం……..స్వేచ్ఛా భారతంలో జీవన హక్కులేదు, దాని గురించి మనమేమీ చేయలేం…… ఇది నేను కోరుకున్న స్వేచ్చ కాదు…. ఇలాంటి ప్రజాస్వామ్యం కాదు నేను కోరుకున్నది…… పరస్పరం కొట్టుకున్నవారి రక్తంతో ఒక అఖాతాన్ని మనతో ఏర్పాటు చేయిస్తే దానికి అర్దమే లేదు…..మనది ఒక విఫల సమాజం…. నా సోదరీమణులారా నేను విచారిస్తున్నాను…. నా తల్లులారా నేను విచారిస్తున్నాను…….భారత మాతా నేను విచారిస్తున్నాను.” ఇలా సాగింది ఆ కవిత.


ఇది చదివిన తరువాత ఎవరిలోనైనా తలెత్తే ప్రశ్న ఏమిటంటే దానిలో ఎక్కడైనా మణిపూర్‌ దురాగతానికి పాల్పడిన శక్తుల గురించి ఖండన ఉందా ? దాని మీద రెండు ఇంజన్ల పాలక పార్టీ, ప్రభుత్వాల తీరుతెన్నుల మీద అధిక్షేపణ ఎక్కడైనా ఉందా? మూడు దశాబ్దాల క్రితం జరిగిందని చెబుతున్న, అతిశయోక్తులతో కూడిన కాశ్మీరీ ఫైల్స్‌ సినిమాను తీశారు. ఇప్పుడు కానసాగింపుగా సిరీస్‌ను ఇప్పుడెందుకు తీస్తున్నట్లు ? మణిపూర్‌ గురించి తాను సినిమా తీసే సరికి ఎంతో ఆలశ్యం అవుతుందని చెప్పటాన్ని ఏమనాలి ? తప్పించుకొనే ఎత్తుగడ తప్ప ఇంకేమైనా ఉందా ? ఎంపిక చేసుకున్న ఎన్నికల రాజకీయాలని ఎత్తి చూపుతున్న పెద్దమనిషి వర్తమానాన్ని వదలి మూడు దశాబ్దాల నాటి సంఘటనలను ఇప్పుడెందుకు ”ఎంపిక” చేసుకున్నట్లు ? అవి జరిగినపుడు నా వయస్సు 17, అప్పుడు నాకు తెలియదు అని చెప్పవచ్చు. ఇప్పుడు 49 సంవత్సరాల పరిణితి వచ్చింది కదా పైన చెప్పిన కవితలోని అంశాలతో వర్తమాన భారతమాత ఫైల్స్‌ ఎందుకు తీయలేదు ? ఐరోపా పార్లమెంటుతో సహా ప్రపంచమంతా చర్చిస్తున్నప్పటికీ మణిపూర్‌ ఫైల్స్‌కు అంత సీన్‌ లేదు, గిరిజనుల జీవితాలు అంత విలువైనవి కాదు, వారికి కాశ్మీరీ పండిట్లకు ఉన్నంత పలుకుబడి వారికి లేదు, కాశ్మీరీ ఫైల్స్‌ మాదిరి సంఘపరివారం ప్రోత్సహించదు, డబ్బురాదు అనుకుంటున్నారా ? లేక అన్నింటికీ మించి అక్కడ అసలు కారకులు సంఘపరివారం అని చెప్పాల్సి వస్తుందనా ? బేటీ బచావో అని చెప్పిన పెద్దమనిషి మణిపూర్‌ బేటీల గురించి తనంతట తాను ముందుకు వచ్చి దేవాలయం అని వర్ణించిన పార్లమెంటులో మాట్లాడకుండా భవనపు మెట్లు, గోడల ముందు మొక్కుబడి ప్రకటన చేసిన ప్రధాని నరేంద్రమోడీ ఫైల్స్‌ను విప్పాల్సి ఉంటుందనా ?


గతంలో శవ గంగా వాహిని పేరుతో దిక్కులేని కరోనా మృతుల కళేబరాలను గంగానదిలో నెట్టివేసి చేతులు దులుపుకున్న యోగి ఆదిత్యనాధ్‌ ఏలుబడి నిర్వాకం మీద, సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ ప్రతినిధిగా ఉన్న వారణాసి వద్ద ప్రవహించే గంగను పవిత్ర నదిగా భావించే గుజరాతీ కవయిత్రి పారుల్‌ కక్కర్‌ రాసిన ఆగ్రహ, నిరసన కవిత మీద హిందూత్వశక్తులు విపరీతంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వివేక్‌ అగ్నిహౌత్రి మణిపూర్‌ ఫైల్స్‌ సినిమా తీస్తే అదే దాడి అతని మీద కూడా జరుగుతుంది. దేశంలో ఉన్న వర్తమాన స్థితి అది. అందుకే చచ్చిన చేప వాలు కథనాన్ని ఎంచుకున్నారన్నది స్పష్టం.మణిపూర్‌ మీద అల్లిన కవిత అలాంటిదే. దానితో సంఘపరివారానికి, పాలక బిజెపి నేతలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మానవాళి మీద జరుగుతున్న దోపిడీ, అణచివేత గురించి చరిత్రలో అనేక మంది చెప్పారు. దాన్ని తొలగించే కార్యాచరణను కూడా ప్రతిపాదించటమే కారల్‌ మార్క్స్‌, ఎంగెల్స్‌ ప్రత్యేకత. విఫల సమాజం గురించి చెప్పిన వారి కోవలో వివేక్‌ అగ్నిహౌత్రి మొదటి వారూ కాదు చివరి వారూ కాదు.


గంగ గురించి, దాని మురికి గురించి అనేక మంది రాశారు. ఇప్పుడు ఎవరైనా రాస్తే కొత్త దనం ఏమిటన్నది ప్రశ్న. ప్రధాన స్రవంతి మీడియా గంగలో కొట్టుకు వస్తున్న కరోనా శవాల గురించి అనివార్యమై పోటీ కారణంగా వార్తలు, చిత్రాలను ఇవ్వాల్సి వచ్చి ఇచ్చింది తప్ప ఆ నిర్వాకానికి కారణభూతమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నిజానికి పారుల్‌ ఖక్కర్‌ కూడా రాజకీయ కోణంతో రాయలేదు. ఒక హిందువుగా గంగానదిని పవిత్రమైనదిగా భావించే కోవకు చెందిన సామాన్యురాలు ఆమె. కొట్టుకు వస్తున్న శవాల వార్తలు, వాటిని కుక్కలు పీక్కు తింటున్న దశ్యాలను చూసిన తరువాత అలాంటి పవిత్ర భావనలను కుదిపివేయటంతో తట్టుకోలేక వెల్లడించిన స్పందన తప్ప మరొకటి కాదు. అలాంటి స్పందన కూడా వివేక్‌ అగ్నిహౌత్రిలో కనిపించలేదు. ఆమె కవితను మరోసారి ఇక్కడ చూద్దాం.అనువాదం : రాఘవశర్మ

శవవాహిని గంగ
భయపడకు..ఆనందపడిపో…ఒకే గొంతుతో శవాలు మాట్లాడుతాయి….ఓ రాజా..నీ రామ రాజ్యంలో శవాలు గంగానదిలో ప్రవహించడం చూశాం….ఓ రాజా..అడవి అంతా బూడిదయ్యింది,ఆనవాళ్ళు లేవు, అంతా శ్మశానమైపోయింది,…..ఓ రాజా..బతికించే వాళ్ళు లేరు,…..శవాలను మోసేవాళ్ళూ కనిపించడం లేదు,…..ధుఃఖితులు మాత్రం మిగిలారు……అంతా కోల్పోయి మిగిలాం…..మాటలు లేక బరువెక్కిన మా హదయాలు శోకగీతాలైనాయి…..ప్రతి ఇంటిలో మత్యుదేవత ఎగిసిపడుతూ తాండవమాడుతోంది……ఓ రాజా..నీ రామ రాజ్యంలో శవ గంగా ప్రవాహమైంది……ఓ రాజా..కరిగిపోతున్న పొగగొట్టాలు కదిలిపోతున్నాయి, వైరస్‌ మమ్మల్ని కబళించేస్తోంది……ఓ రాజా.. మా గాజులు పగిలిపోయాయి, భారమైన మా హదయాలు ముక్కలయ్యాయి……అతను ఫిడేలు వాయిస్తున్నప్పుడు మా నగరం కాలిపోతోంది…..బిల్లా రంగాల బరిసెలు రక్తదప్పిక గొన్నాయి….. రాజా..నీ రామ రాజ్యంలో శవ గంగా ప్రవాహమైంది……ఓ రాజా..నీవు మెరిసిపోతున్నట్టు, మండుతున్న కొలిమి లాగా నీ దుస్తులు తళుక్కుమనడం లేదు…..ఓ రాజా..ఈ నగరమంతా చివరిగా నీ ముఖాన్ని చూస్తున్నాయి…..ఇక పరిమితులు, మినహాయింపులు లేవు నీ దమ్ము చూపించు,…..రా..బయిటికి రా.. గట్టిగా చెప్పు, పెద్దగా అరువు,……దిగంబర రాజు అవిటివాడు, బలహీనుడు……ఇక నీవు ఏ మాత్రం మంచివాడిగా ఉండలేనని చెప్పు……కోపంతో ఊగిపోతున్న నగరం మంటలు ఎగిసిపడుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి…..,ఓ రాజా.. నీ రామరాజ్యంలో శవగంగా ప్రవాహాన్ని చూశావా?


ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ మణిపూర్‌ ఉదంతం మీద దాల్చిన మౌనం, అక్కడి మానవతుల మీద జరిపిన దుర్మార్గ పూర్వరంగంలో మరో గుజరాతీ రచయిత్రి మహాస్వేతా జానీ స్పందించారు. ఆ ఉదంతాలు గతంలో జరిగిన వాటి కొనసాగింపే అన్న అగ్నిహౌత్రకు, ఇక్కడ అలాంటివి ఎన్నో జరిగాయన్న మణిపూర్‌ సిఎం బిరేన్‌ సింగ్‌కూ తేడా ఏముంది ? మహిళలు, వారి శరీర భాగాల మీద మనువాదుల భావజాలాన్ని, అత్యాచారాన్ని ఆయుధంగా చేసుకొని దాడులు చేస్తున్న వారిని నిరసిస్తూ మణిపూర్‌ ఉదంతం మీద వెల్లడించిన మహాస్వేతా జానీ రచన ఇది. ఇతర రాష్ట్రాలలోని అనేక మంది కవులు, కవయిత్రులు స్పందించటం వేరు. గుజరాత్‌కు చెందిన వారు తమ మీద పెద్ద ఎత్తున కాషాయదళ దాడి జరుగుతుందని తెలిసినా గళం విప్పటం, అది కూడా ప్రధాని నరేంద్రమోడీ తీరు తెన్నుల నేపధ్యంలో అన్నది గమనించాలి. ఆ రచన ఇలా సాగింది.సంఘపరివార్‌ నీడలో జీవిస్తున్న వివేక్‌ అగ్నిహౌత్రి స్పందనకు దీనికి ఉన్న తేడాను వేరే చెప్పాల్సిన పనిలేదు.


ఇటీవల కామన్‌ కాజ్‌, లోకనీతి, సిఎస్‌డిఎస్‌ సంస్థలు గుజరాత్‌లో ఉన్న పరిస్థితి గురించి ఒక సర్వే చేశాయి. సామాజిక మాధ్యమంలో ఒక రాజకీయ లేదా సామాజిక అంశం మీద ప్రతికూలంగా స్పందిస్తే దాడికి దిగుతున్నవారిని చూసి తాము చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడుతున్నట్లు సర్వేలో మూడింట రెండు వంతుల మంది చెప్పారని తేలింది. వారిలో మూడో వంతు మంది తీవ్రంగా భయపడుతున్నట్లు, తమ ఫోన్ల మీద నిఘాఉన్నట్లు చెప్పారట. ఆ సర్వేలో లోకనీతి ప్రతినిధిగా ఉన్న మహాశ్వేతా జానీ ఆ తరువాతే మణిపూర్‌ ఉదంతం గురించి గుజరాతీ భాషలో ఒక కవితను రాశారు. దాన్ని సలీల్‌ త్రిపాఠీ ఆంగ్లీకరించారు. అది ఇలా సాగింది.

నేను
భగరంధ్రము…..నేను ఒక యుద్ధ క్షేత్రాన్ని కాదు……లేదా ఏ విశ్వాసాన్ని రక్షించేదాన్ని కాదు…..లేదా ఏ సంస్మృతినీ మోసేదాన్ని కాదు…..లేదా పవిత్రతవైపు నడిపించే మార్గాన్ని కాదు……లేదా ఏ సమాజపు సొత్తునూ కాదు…..లేదా బానిసత్వానికి దారి తీసే మార్గాన్ని కాదు….లేదా రక్త ప్రవాహాన్ని కాదు….లేదా స్త్రీత్వ సారాన్ని కాదు……కచ్చితంగా చెబుతున్నా భూమికి భారాన్ని కాదు……కానీ……ఆమె కోరుకుంటే…..
తరువాత…నేను …..ఒక నవసృష్టికి సారధిని అవుతా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా కమ్యూనిస్టులు బైబిల్‌ను తిరగరాస్తున్నారా ? నిజానిజాలేమిటి ?

29 Saturday Jul 2023

Posted by raomk in CHINA, Communalism, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RELIGION, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti communist, chinese communist party, Gospel of John, Jesus, Pope Francis, Rewriting the Bible, RSS, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


మతాన్ని చైనీకరణ కావించేందుకు గాను అక్కడి కమ్యూనిస్టు పార్టీ (సిసిపి) బైబిల్‌ను తిరగరాస్తున్నదని ప్రచారం చేస్తున్నవారిని అమెరికా ప్రోత్సహిస్తున్నది. దానికి పార్లమెంటరీ కమిటీని వేదికగా చేసుకుంది. అమెరికా పార్లమెంట్‌లో చైనా కమ్యూనిస్టు పార్టీ తీరుతెన్నులపై ఏర్పాటు చేసిన సెలెక్ట్‌ కమిటీ సమావేశంలో రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ మైక్‌ గాలఘెర్‌ చైనా మీద ఆరోపించాడు. జనాలు దేవుడి కంటే పార్టీకి విశ్వాస పాత్రులుగా ఉండేట్లుగా మార్చాలని, దానికి గాను అన్ని మతాలను చైనీకరణ గావించాలని, మతం, సోషలిజం ఒకదానికి ఒకటి తోడుగా ఉనికిలో ఉండేట్లు చూడాలని చైనా కమ్యూనిస్టు పార్టీ 19వ మహాసభ జరిగినపుడు 2017లో అధినేత షీ జింపింగ్‌ కోరినట్లు ,దానిలో భాగంగానే బైబిల్‌ను తిరగరాస్తున్నారని కూడా మైక్‌ ఆరోపించాడు. ఈ ప్రచారాన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఒక పథకం ప్రకారం సాగిస్తున్నారు. పది సంవత్సరాల్లో బైబిల్‌ను తిరగరాసే పని పెట్టుకున్నారన్నది వాటిలో ఒకటి. దీన్ని ఒక్క క్రైస్తవ మతానికే పరిమితం చేయలేదని బౌద్దం, ఇస్లాంకు కూడా వర్తింప చేస్తున్నారని మైక్‌ ఆరోపించాడు.మతం మీద పూర్తి అధికారాన్ని సాధించేందుకు సిసిపి చూస్తున్నదనే ప్రచారాన్ని అనేక క్రైస్తవ మత సంస్థలు, మీడియాలో కూడా గత ఆరు సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. మతం, సోషలిజం సహజీవనం అన్నది వక్రీకరణ తప్ప వాస్తవం కాదు. మత స్వేచ్చను అనుమతించటం అంటే ప్రోత్సహించటం, ఉనికిని కాపాడటం కాదు. తరతరాలుగా వేళ్లూనుకున్న భావనలను క్రమంగా పోగొట్టాలి తప్ప ప్రార్ధనా మందిరాలను కూల్చివేసినా, నిషేధాలతో అణచివేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయి.


చిత్రం ఏమిటంటే మతాన్ని అణచివేస్తున్నట్లు ఒక వైపు ఆరోపణలు చేస్తున్న తరుణంలోనే 2018లో చైనా ప్రభుత్వంతో పోప్‌ ఒక ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం ప్రభుత్వం ఎంపిక చేసిన వారిని చైనాలో కాథలిక్‌ మత అధిపతులుగా పోప్‌ ఆమోదించాల్సి ఉంటుంది. ఇదంతా టిబెట్‌లో తదుపరి దలైలామాను కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసేందుకు గాను ముందుగా పోప్‌తో ఒప్పందం చేసుకున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక బైబిల్‌ను తిరగరాస్తున్నారని చెప్పేందుకు మైక్‌ గాలఘెర్‌ రెండు ఆరోపణలు చేశాడు. న్యూటెస్ట్‌మెంట్‌ బైబిల్‌లో జాన్‌ సువార్త ప్రకారం వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఒక మహిళను రాళ్లతో కొట్టటాన్ని చూసిన ఏసు క్రీస్తు వారి వద్దకు వెళ్లి మీలో పాపం చేయనివారెవరైనా ఉంటే ముందుగా వారు వచ్చి కొట్టమని చెప్పారన్న కథ అందరికీ తెలిసిందే.దాన్ని చైనా వారు మార్చి ఏసు క్రీస్తే స్వయంగా రాళ్లు వేసినట్లు రాశారని మైక్‌ ఆరోపించాడు. ఇది తప్పుడు ప్రచారం తప్ప మరొకటి కాదు. మరికొన్ని దీన్నే మరోవిధంగా ప్రచారం చేస్తున్నారు. ఏసుక్రీస్తు జోక్యం చేసుకున్న తరువాత రాళ్లు వేసిన వారు వెళ్లిపోయారని, వారు నిన్ను చంపారా అని సదరు మహిళను అడిగితే లేదని ఆమె చెప్పిన తరువాత వారు గాక పోతే నేనే చంపేస్తా, ఇలాంటి పాపం మరొకసారి చేేయ వద్దు, వెళ్లిపో అన్నట్లుగా బైబిల్‌ను తిరగరాసినట్లు ప్రచారం చేస్తున్నారు.


మరొక కథనం ప్రకారం ఫార్సీ(నాటి చట్టాల గురించి తెలిసినవారు) యూదులు ఒక మహిళను తీసుకు వచ్చి ఏసుక్రీస్తు ముందు నిలిపారు. బోధకుడా ఈ మహిళ వ్యభిచారం చేస్తూ పట్టుబడినది. చట్టం , మోజెస్‌ మాకు చెప్పినదాని ప్రకారం అలాంటి మహిళను రాళ్లతో కొట్టాలి. ఇప్పుడు మీరేమి చెబుతారు అని ప్రశ్నించారట. ఇదంతా ఏసుక్రీస్తును ఉచ్చులో ఇరికించేందుకు యూదునేతలు చేశారట. అప్పుడు ఏసు క్రీస్తు నేల మీద వేలితో ఏదో రాస్తూ (అదేమిటో ఇప్పటికీ తెలియదట) మీలో పాపం చేయని వారెవరైనా ఉంటే ముందుగా వారు రాళ్లతో కొట్టండి అన్నారట. దాంతో వణికిపోయి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారట. అప్పుడు ఏసు మహిళా వారెక్కడ, ఎవరూ నీ మీద దాడి చేయలేదు కదా అంటే అవునయ్యా అందట. నేను కూడా నిన్ను కొట్టను వెళ్లిపో నీ జీవితంలో ఇంక పాపం చేయవద్దు అన్నాడట. అలా అందరూ వెళ్లిన తరువాత ఏసు ఆమెను స్వయంగా రాయితో కొట్టి నేను కూడా పాపినే అని చెప్పినట్లు చైనా కమ్యూనిస్టులు తిరగరాస్తున్న బైబిల్‌లో ఉందని, దాన్ని తరగతి పుస్తకాల్లో పెట్టారని కొన్ని క్రైస్తవ సంస్థలు ప్రచారం చేస్తున్నాయి.ఇది ఏసు దైవత్వాన్ని కించపరచటమే అని ఆరోపిస్తున్నారు.


ప్రస్తుతం చైనా, మన దేశం,ఇంకా అనేక దేశాల్లో ఉన్న చట్టం ప్రకారం అక్రమ సంబంధం నేరం కాదు. అందువలన దానికి పాల్పడిన వారిని రాళ్లతో కొట్టాలని, ఏసుక్రీస్తే ఆపని చేశారు గనుక మీరూ చేయవచ్చని చైనాలో ఉన్న క్రైస్తవులకు గానీ మరొకరికి గానీ చెప్పాల్సిన అవసరం కమ్యూనిస్టులకు లేదు, అందుకుగాను బైబిల్‌ను తిరగరాయాల్సిన అగత్యమూ లేదు. దానికీ సోషలిస్టు సమాజ నిర్మాణానికి సంబంధం లేదు. అలాగని అక్రమ సంబంధాలను ప్రోత్సహిస్తున్నదీ లేదు. ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ కారణంతో విడాకులు తీసుకోవచ్చని చైనా చట్టాలలో ఉంది. వివాహం చేసుకున్నప్పటికీ స్త్రీ సదరు పురుషుడి ఆస్తికాదు. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 497 ప్రకారం భర్త అనుమతి లేకుండా భార్య పరపురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంటే సదరు పరపురుషుడు అవివాహితుడైనప్పటికీ అభియోగం రుజువైతే ఐదు సంవత్సరాల వరకు శిక్ష విధించవచ్చు. వివాహిత మహిళకు ఎలాంటి శిక్ష ఉండదు. ఈ సెక్షన్‌ రాజ్యాంగ విరుద్దమని 2018 సెప్టెంబరు 27న సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. మరొకరి భాగస్వామి అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే నగదు జరిమానా విధించవచ్చని సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ చెప్పింది.


చైనాలోని హేనాన్‌ రాష్ట్రంలోని ప్రొటెస్టెంట్‌ చర్చిలలో టెన్‌కమాండ్‌మెంట్స్‌ బదులు చైనా అధినేత షీ జింపింగ్‌ చెప్పిన మాటలను బోధించాలని కమ్యూనిస్టు పార్టీ నేతలు బలవంతం చేస్తున్నారని, ఈ మేరకు మొదటి కమాండ్‌మెంట్‌ను మార్చి రాశారని కూడా అమెరికన్‌ ఎంపీ ఆరోపించాడు. పశ్చిమ దేశాల భావజాలాన్ని చొరనివ్వకుండా ఇలా చేస్తున్నారని, తిరస్కరించిన ఇద్దరు పాస్టర్లను శిక్షించినట్లు, ఇతరులను అడ్డుకుంటున్నట్లు ఇంటర్నేషనల్‌ క్రిస్టియన్‌ కన్సరన్‌(ఐసిసి) నివేదించినట్లు పార్లమెంటు కమిటీ ముందు చెప్పాడు. బైబిల్‌ రెండు రకాలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఓల్డ్‌ టెస్టిమెంట్‌, న్యూ టెస్టిమెంట్‌ అన్న గ్రంధాలు మనం ఎక్కడైనా చూడవచ్చు. వాటిని తిరగ రాసింది క్రైస్తవులు తప్ప కమ్యూనిస్టులు కాదు.వివిధ మత గ్రంధాల మీద అనేక మంది భిన్నమైన భాష్యాలు రాశారు. కైస్తవం కమ్యూనిజానికి అనుకూలమని, వ్యతిరేకమని బైబిల్‌లో ఉన్న అంశాలకు వ్యాఖ్యానం చెప్పిన వారు లేకపోలేదు. అసలు ఏసుక్రీస్తు ఎప్పుడు జన్మించాడు, బైబిల్‌ అంశాలను ఎవరు ఎప్పుడు ప్రబోధించారు లేదా ఎప్పుడు రాశారు ? అప్పటికీ అసలు కమ్యూనిజం, సోషలిజం అన్న ప్రాధమిక భావనలు కూడా లేవు. అలాంటపుడు ప్రబోధకులు లేదా రాసిన వారు వాటికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఎలా వాదనలు చేయగలరు. బైబిల్‌ను తిరగరాసి దానిలో ఇలా ఉంది అని చెప్పి జనాన్ని కమ్యూనిజానికి అనుకూలంగా మార్చేంత భావ దారిద్య్రంలో ప్రపంచంలో ఏ కమ్యూనిస్టులూ లేరు. దోపిడీకి వ్యతిరేకంగా జరిపే పోరాటాలను పక్కదారి పట్టించేందుకు, దోపిడీదార్లకు కొమ్ముకాసేందుకు ప్రతి మతం యత్నించటాన్ని రోజూ మనం చూస్తున్నదే.

మనదేశంలో మనుధర్మం పేరుతో అమలు జరిపిన వివక్ష, దుర్మార్గాలు చేస్తున్నపుడే సర్వేజనా సుఖినోభవంతు అని కూడా చెప్పారు. అందువలన అలా చెప్పిన వారిని మన దేశంలో తొలి సోషలిస్టులు, కమ్యూనిస్టులు అంటారా ? ప్రతి సమాజంలో దుర్మార్గాలను చూడలేని అనేక మంది తమ వాంఛలను వెల్లడించారు. వాటిని వాస్తవ రూపంలోకి తీసుకువచ్చే శాస్త్రీయ సిద్దాంతం, ఆచరణలను కమ్యూనిస్టులు చెప్పారు. వ్యక్తులకు, వారి ఇండ్లకు, ప్రార్ధనా స్థలాలకు పరిమితం కావాల్సిన మతాన్ని వీధులు, రాజకీయాలు, దోపిడీదార్లకు కొమ్ముకాసేందుకు తీసుకురావటాన్ని కమ్యూనిస్టులే కాదు, హేతువాదులు, పురోగామివాదులెవరూ అంగీకరించరు. రాజ్యం, పౌరుల మీద మత పెత్తనాన్ని చివరికి పెట్టుబడిదారులు కూడా అంగీకరించరు.ఐరోపాలో ఒక దశలో భూమిలో అత్యధిక భాగం మత సంస్థల చేతుల్లోనే ఉండేది. దాన్ని బద్దలు కొట్టటం ఫ్రెంచి విప్లవంలో ఒక భాగం, ఫ్యూడల్‌ బంధాలను,మత పట్టును అది బద్దలు చేసింది.పేదలు,అణగారిన వర్గాలను రక్షించేందుకే క్రైస్తవం తొలి రోజుల్లో ముందుకు వచ్చింది గనుకనే జనం ఖండాలు, రంగు, భాషా బేధాలతో నిమిత్తం లేకుండా ఆదరించారు. కానీ అదే మతం కష్టజీవుల మూలుగులను పీల్చే పెట్టుబడిదారులు,యుద్ధాలతో రక్తపుటేరులు పారించిన నియంతల పట్ల దాని వైఖరి ఏమంటే సానుకూలమే. మత యుద్ధాలకు పాల్పడిన చరిత్ర కూడా తెలిసిందే. దోపిడీని అంతం చేయాలన్న సోషలిస్టు, కమ్యూనిజం మతానికి వ్యతిరేకం అని ఆ మత పెద్దలే రోజూ తప్పుడు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.


దేశాల మీద మతపెత్తనం కుదరదు, మత రాజ్యాలు అంతరించాయి. మతం పేరుతో విద్రోహానికి పూనుకుంటే సహించాల్సిన అవసరం ఉందా? తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాలు, సోవియట్‌ కూల్చివేతలో క్రైస్తవమత పెద్దలు కూడా అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులతో చేతులు కలిపిన చరిత్ర మన కళ్ల ముందు ఉంది. అటువంటి కుట్రలను చైనా సాగనివ్వటం లేదు గనుక దాని మీద తప్పుడు ప్రచారాలు అన్నది స్పష్టం. చైనాలో బైబిల్‌, ఖురాన్‌ ఏ పవిత్ర గ్రంధాన్ని కూడ సహించరని ప్రచారం చేస్తున్న క్రైస్తవ సంస్థలు నేడు ఐరోపాలో పెరుగుతున్న ముస్లిం వ్యతిరేకత, ఖురాన్‌ గ్రంధాలను తగులపెడుతున్న ఉదంతాల గురించి ఎక్కడా మాట్లాడవు.స్టాక్‌హౌమ్‌లోని టర్కీ ఎంబసీ ముందు ఖురాన్‌ ప్రతిని తగుల బెట్టేందుకు స్వీడన్‌ ప్రభుత్వం ఏకంగా అధికారిక అనుమతి మంజూరు చేసింది. ఇంకా అనేక దేశాల్లో పచ్చి ముస్లిం వ్యతిరేకులు ఇలానే రెచ్చిపోతున్నారు. వాటి గురించి అమెరికా ఎంపీలెవరూ మాట్లాడరు. చైనా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 36 ప్రకారం మత స్వేచ్చ ఉంది. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలు లేదా వ్యక్తులు ఫలానా మతాన్ని నమ్మాలని లేదా వద్దని గానీ వత్తిడి తేకూడదు.వివక్ష చూపకూడదు.ప్రజా జీవనాన్ని విచ్చిన్నం చేసేందుకు లేదా పౌరుల ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు చూడకూడదు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జోక్యం చేసుకోకూడదు. ఏ మత సంస్థకూడా విదేశీ పెత్తనాన్ని అంగీకరించకూడదు. ఇదే విధంగా మత సంస్థలు విద్యాసంస్థలను ఏర్పాటు చేయవచ్చు తప్ప వాటిలో మత బోధన చేయకూడదు. ఇలా మతాన్ని పరిమితం చేసే నిబంధనలు ఉన్నాయి. అంతే తప్ప మా మతం ఇలా చెప్పింది లేదా మత కేంద్రం ఫలానా చోట ఉంది, వారు చెప్పినట్లు నడచుకుంటాం, దేశంలోని చట్టాలు మాకు వర్తించవు అంటే కుదరదు. మేం చెప్పినట్లే నడవాలి అంటే అసలు కుదరదు. ఇది అన్ని మతాలకూ వర్తిస్తుంది. బౌద్దం పేరుతో జనాన్ని రెచ్చగొట్టి తిరుగుబాటు చేసిన టిబెట్‌ దలైలామా పారిపోయి మన దేశంలో ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.


అమర జీవుల గళం(విఓఎం) పేరుతో పని చేస్తున్న ఒక సంస్థ ప్రతినిధి టోడ్‌ నెటెల్టన్‌ ఒక పత్రికతో మాట్లాడుతూ పది సంవత్సరాల్లో బైబిల్‌ను తిరగ రాయాలని చైనా కమ్యూనిస్టు పార్టీ 2019లో నిర్ణయించిందని. దానిలో కన్ఫూసియస్‌, బౌద్ద సూత్రాలను కూడా చొప్పించి పార్టీకి మద్దతు ఇచ్చేవిధంగా రాస్తారని ఆరోపించాడు. ఇక్కడ గమనించాల్సిందేమంటే 140 కోట్ల చైనా జనాభాలో ఇండెక్స్‌ ముండీ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం క్రైస్తవులు కేవలం 5.2, ముస్లింలు రెండు శాతమే.ఏ మతానికీ చెందని వారు 51.8, స్థానిక తెగల మతాల వారు 21.9, బౌద్దులు 18.3 శాతాల చొప్పున ఉన్నారు. మనదేశంలో మాదిరి 80శాతం మంది ఉన్న హిందూమతానికి ముస్లిం, క్రైస్తవుల నుంచి ముప్పు వచ్చిందని చెప్పేవారెవరూ అక్కడ లేరు. ప్రపంచంలో ఎక్కడా వర్తమాన కాలంలో ఏ దేశంలోనూ ఒక మతస్తులు తమ జనాభాను విపరీతంగా పెంచి మరొక మతానికి ముప్పు తెచ్చిన ఉదంతమేదీ జరగలేదు. చైనాలో నిజంగా బైబిల్‌ను తిరగరాస్తూ దానిలో కొన్ని భాగాలను ఇప్పటికే పాఠ్యపుస్తకాల్లో పెట్టి ఉంటే రోమ్‌లో ఉన్న క్రైస్తవమత కేంద్రానికి, పోప్‌కు తెలియకుండా ఉంటుందా ? తెలిస్తే అధికారికంగానే దాని మీద స్పందించిన దాఖలా ఇంతవరకు లేదు.


క్రైస్తవుల కోసం పని చేస్తున్నామంటూ ప్రచారం చేసుకొనే వారూ, పత్రికల్లో రాతలు రాసేవారూ చివరికి పోప్‌ ఫ్రాన్సిస్‌ను కూడా వదలటం లేదు. చైనా అక్రమంగా నియమించిన షాంఘై బిషప్‌ను అంగీకరించినట్లు ధ్వజమెత్తారు.2018లో చైనాతో పోప్‌ కుదుర్చుకున్న ఒప్పందం ఇప్పటికీ రహస్యమేనని, దాన్ని ఇప్పటికి రెండు సార్లు సమీక్షించినట్లు జూలై 27న ఒక విశ్లేషకుడు పేర్కొన్నాడు. ఒప్పందం ప్రకారం బిషప్పులను ఎంపిక చేసేది చైనా అయినా అధికారికంగా ప్రకటించాల్సింది పోప్‌ అని దానికి విరుద్దంగా షాంఘై బిషప్‌ వ్యవహారం ఉందని, వాటికన్‌కు ఆ సంగతి పత్రికా వార్తల ద్వారా తెలిసిందని కూడా ఆరోపించాడు. ఏప్రిల్‌ నాలుగున నియామకం జరిగితే జూలై 15న పోప్‌ అధికారికంగా ప్రకటించారని వాపోయాడు. గొడవలెందుకని ఊరుకొని ఆమోదించాంగానీ చైనా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు వాటికన్‌ విదేశాంగ మంత్రి కార్డినల్‌ పెట్రో పరోలిన్‌ చెప్పినట్లు కూడా రాశాడు. 2018 ఒప్పందం ప్రకారం అనుమతి లేకుండా చర్చి సమావేశాలు నిర్వహించటాన్ని ఎవరూ ప్రోత్సహించకూడదు. అలాంటి వారంతా చైనా ప్రభుత్వం గుర్తించిన దేశభక్త కాథలిక్‌ చర్చిలో విలీనం కావాలి.కానీ ఇప్పటికీ రహస్య చర్చ్‌లు కొనసాగుతున్నట్లు వాటికన్‌ మంత్రి అంగీకరించాడు. అలా చేరని వారి మనోభావాలను గౌరవించాలని కూడా ఇప్పుడు మంత్రి చెప్పటాన్ని బట్టి దాని అర్ధం వారికి వెలుపలి నుంచి మద్దతు లభిస్తున్నది. వారికి రక్షణ కల్పించాలని అనేక మంది పత్రికల్లో డిమాండ్‌ చేస్తున్నారంటే పోప్‌ కుదుర్చుకున్న ఒప్పందానికి తూట్లు పొడవటం, ధిక్కరణ తప్ప మరొకకాదు. బైబిల్‌ను తిరగరాయాలంటే ఎక్కడైనా పది సంవత్సరాలు అవసరం లేదు. తెల్లవారేసరికి పోటీ గ్రంధాలను రాసేవారున్నారు. కమ్యూనిస్టులు అలాంటి పనికిమాలిన పని పెట్టుకోరు. గతంలో మతాన్ని అనుమతించరని, ప్రార్ధనా మందిరాలను కూల్చివేశారని చేసిన ప్రచారం అబద్దమని తేలింది. అందువలన ఎత్తుగడలను మార్చి మతాన్ని తమకు అనుకూలంగా మారుస్తున్నారని, మత గ్రంధాలను తిరగరాస్తున్నారనే తప్పుడు ప్రచారానికి పూనుకున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాడు సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి లొంగుబాటు – నేడు అమెరికన్ల మీద నరేంద్రమోడీ మౌనమెందుకు ?

11 Tuesday Jul 2023

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, USA

≈ Leave a comment

Tags

BJP, Manipur unrest, Meitei and Kuki, Narendra Modi Failures, Narendra Modi's silence on Manipur, RSS


ఎం కోటేశ్వరరావు


ఏదైనా ఉంటే మన దేశంలో విమర్శించుకోవాలి, దెబ్బలాడుకోవాలి, విదేశీ గడ్డ మీద పరువు తీసుకుంటామా, ఎవరైనా మన దేశాన్ని ఏమైనా అంటే రాజకీయ విబేధాలతో నిమిత్తం లేకుండా అందరం ఒకటై ఖండించాలి.రాహుల్‌ గాంధీ విదేశాల్లో నరేంద్రమోడీ సర్కార్‌ మీద చేసిన విమర్శల సందర్భంగా కాషాయ మార్కు దేశభక్తి ప్రబోధకులు చెప్పిన అంశాల సారమది. నిజమే కదా అంటే నిజమే అని అనేక మంది అనుకుంటున్నారు. కాశ్మీరు వివాదంలో మధ్యవర్తిత్వం వహించాలని ప్రధాని నరేంద్రమోడీ తనను కోరినట్లు నాలుగు సంవత్సరాలనాడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నపుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనను ఖండించేందుకు నరేంద్రమోడీకి నోరు రాలేదు. అలాంటిదేమీ లేదని మన విదేశీ మంత్రిత్వశాఖ ఒక ప్రకటన చేసి చేతులు దులుపుకుంది. కరోనా వైరస్‌ చికిత్సకు పనికి వస్తుందో లేదో నిర్ధారణగాని మలేరియా నిరోధక హైడ్రోక్సీక్లోరోక్విన్‌ ఔషధాన్ని తక్షణమే తమకు పంపకపోతే డొక్క చించుతామని అదే ట్రంప్‌ మన దేశాన్ని 2020 ఏప్రిల్లో బెదిరించాడు. కొద్ది గంటల్లోనే మన దేశం అంతకు ముందు ఎగుమతులపై విధించిన నిషేధాన్ని సడలించి గుజరాత్‌లోని మూడు ఫ్యాక్టరీల నుంచి అడిగినంతా పంపింది. దాంతో మోడీ గొప్ప అంటూ ఆకాశానికి ఎత్తాడు ట్రంప్‌.మనది ఒక సర్వసత్తాక దేశం. ఒక దేశాధినేతతో మరొకదేశం అనుసరించాల్సిన కనీస మర్యాదను పాటించకున్నా నరేంద్రమోడీ నోరు మెదపలేదు. మన ఇరుగు పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్‌ అడిగినా వెంటనే స్పందించని మోడీ అమెరికా బెదిరింపుతో వెంటనే పంపారు. ఇవి గతానికి చెందినవి. ఒక సినిమాలో నీ ఊరు వస్తా నీ ఇంటి కొస్తా అన్నట్లుగా మన గడ్డమీద ఉండి ఒక విదేశీయుడు మన అంతర్గత అంశం గురించి మాట్లాడినా రాహుల్‌ గాంధీ గురించి రచ్చ చేసిన వారు నోటికి తాళం వేసుకున్న తాజా ఉదంతాన్ని చూద్దాం.


ఎరిక్‌ గార్సెటీ అనే పెద్ద మనిషి మన దేశంలో అమెరికా రాయబారి. భారత్‌ కోరితే మణిపూర్‌ మంటలను ఆర్పేందుకు తాము సిద్దంగా ఉన్నామని చెప్పాడు. అది మన అంతర్గత అంశం, మరొకరు ఎవరూ జోక్యం చేసుకోకూడదు. కానీ గార్సెటీ వేలుదూర్చాడు. కొల్‌కతాలో జూలై ఆరవ తేదీన విలేకర్ల మాట్లాడుతూ ” మణిపూర్‌లో జరుగుతున్న హింస వ్యూహాత్మక సంబంధమైనది కాదని నేను అనుకుంటున్నాను. ఇది మానవ సంబంధమైనది. ఇలాంటి హింసలో పిల్లలు లేదా ఇతరులు మరణిస్తున్నపుడు ఒక భారతీయుడిగా మీరు రక్షించేందుకు చూడరా. అనేక మంచి పరిణామాలు జరగాలంటే ముందు శాంతి నెలకొనాలని మనకు తెలుసు. ఈశాన్యం, తూర్పు భారతాల్లో ఎంతో పురోగతి ఉంది. కోరితే ఏ విధంగానైనా సాయపడేందుకు మేము సిద్దంగా ఉన్నాం. ఇది భారత్‌కు చెందిన అంశమని మాకు తెలుసు, అక్కడ తక్షణమే శాంతి నెలకానాలని మేము ప్రార్ధిస్తాము. ఆ శాంతి నెలకొంటే మేము మరింత భాగస్వామ్యం, మరిన్ని ప్రాజెక్టులు, మరింత పెట్టుబడి తెస్తాము ” అన్నాడు. ఏ విధంగా చూసినప్పటికీ ఏ విదేశీ రాయబారి నోటి వెంటా ఇలాంటి మాటలు రాకూడదు. మరొక దేశమైతే తక్షణమే అతగాడిని పిలిపించి హద్దుల్లో ఉండాలని మందలించి పంపేది. ఎవరికీ తలొగ్గం అని చెబుతున్న మన విదేశంగా శాఖ మంత్రికి, అధికారగణానికి ఇదేమీ పట్టలేదు. ఎందుకంటే అది అపర దేశభక్త ప్రధాని నరేంద్రమోడీకి ఇష్టం ఉండదు అని వారికి తెలుసు. ఆఫ్రో-అమెరికన్ల మీద జరిగే దాడుల గురించి లోకానికంతటికీ తెలుసు.ఏ రోజు ఎవడు తుపాకులు తీసుకొని ఉత్తి పుణ్యానికి ఎంతమందిని కాల్చి చంపుతాడో తెలియదు. అలాంటి వాటి నివారణలో సహకరిస్తామని మనదేశంతో సహా ఎవరైనా ప్రకటిస్తే అమెరికా ఊరుకుంటుందా ? ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు మన దేశమే అని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ దీని గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. విశ్వగురువులు లేదా బాస్‌లు ఇలాంటి చిన్న చిన్న అంశాల మీద మాట్లాడరని అనుకోవాలి, అంతే ! నాడు జైలు నుంచి విడుదల చేస్తే బ్రిటీషు వారికి సేవ చేసుకుంటానని , స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనను అని రాసిచ్చిన సావర్కర్‌ తరువాత దానికి కట్టుబడి ఉన్న అపర దేశభక్తుడు. ఇప్పుడు నరేంద్రమోడీ గారు కూడా అమెరికాకు ఖాళీ కాగితం మీద సంతకాలు చేసి ఇచ్చారా ? ఏమిటీ మౌనం, ఎందుకీ బలహీనత, రాయబారిని మందలిస్తే అమెరికాకు ఆగ్రహం వస్తుందని భయపడుతున్నారా ? ప్రపంచంలోనే చక్రం తిప్పుతున్నారని మురిసిపోతున్న భక్తులేం అవుతారో అన్నది ఆలోచించాలి కదా !


చిత్రం ఏమిటంటే రాహుల్‌ గాంధీ విదేశాల్లో మన కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్రమోడీని విమర్శిస్తే అది దేశద్రోహం. కానీ అమెరికా రాయబారి మన గడ్డ మీద మణిపూర్‌ మంటలను మీరు ఆర్పలేకపోయారు, మీరు కోరితే ఆర్పటంలో సాయం చేస్తామని చెప్పటం కంటే మన కేంద్ర ప్రభుత్వానికి అవమానం మరొకటి ఉండదు. అయినప్పటికీ దున్నపోతు మీద వాన కురిసినట్లు ఉంది. అరిందమ్‌ బాగ్చీ అని మన విదేశాంగశాఖ ప్రతినిధి ఉన్నారు. దాదాపు రోజూ ఏదో ఒక అంశం మీద విలేకర్లతో మాట్లాడుతూ ఉంటారు. ఎరిక్‌ గార్సెటీ మాట్లాడిన అంశాల గురించి తనకు తెలియదని అన్నారు. అంతటితో ఊరుకుంటే వేరు. విదేశీ దౌత్యవేత్తలు మన అంతర్గత అంశాల గురించి మాట్లాడటం అసాధారణం. అతను ఏం మాట్లాడిందీ కచ్చితంగా తెలుసుకొనేంతవరకు తానేమీ వ్యాఖ్యానించలేనని కూడా అరిందమ్‌ చెప్పారు. మణిపూర్‌లో శాంతికోసం భారత ప్రభుత్వం, భద్రతాదళాలు పని చేస్తున్నట్లు చెప్పారు. పదకొండవ తేదీ వరకు విదేశాంగ ప్రతినిధి నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ఏ మాట్లాడిందీ ముఖతా తెలుసుకొనేందుకు అమెరికా రాయబారిని పిలిచారన్న వార్తలు కూడా లేవు. నాకు సరిగ్గా తెలియదు అని చెప్పటం అరిందమ్‌ బాగ్చీకి కొత్తకాదు. భారత్‌ తమ వ్యూహాత్మక భాగస్వామి అని ప్రకటనలు గుప్పించటంలో అమెరికా గద్దె మీద ఎవరున్నా తక్కువ తినలేదు. ఇరవైనెలల పాటు ఖాళీగా ఉన్న తరువాత ఎరిక్‌ గార్సెటీని మన దేశంలో రాయబారిగా జో బైడెన్‌ ఖరారు చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో ఆ మేరకు అమెరికా సెనేట్‌ ఆమోదం తెలిపింది.


పౌరసత్వ చట్ట సవరణ గురించి, భారత్‌లో మానవహక్కుల గురించి గార్సెటీ గతంలో విమర్శలు చేశాడు.రాయబారిగా ఖరారు చేసిన తరువాత వాటి గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నకు మన విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా ? ఇటీవల అతను ఏం మాట్లాడాడో తెలియదు, సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఉన్నాయి, అవి చాలా పాతవి, వాటి మీద మన వైఖరి ఏమిటో మీకు బాగా తెలిసిందే అన్నారు. ” తప్పుడు అభిప్రాయాలతో మన అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకొనేందుకు రాజకీయ అజెండాతో అతన్ని పంపుతున్నారు. అతనికేమీ తెలియదు, అహంకారి, అతన్ని ఆమోదించకూడదు ” అని బిజెపి మాజీ ఎంపీ తరుణ్‌ విజయి ట్వీట్‌ చేశారు. అతని నియామకం పశ్చిమ దేశాల వ్యతిరేక మనోభావాలను రగిలిస్తుందని బిజెపి యువమోర్చా ఉపాధ్యక్షుడు అభినవ్‌ ప్రకాష్‌ అన్నారు.


కేరళలో కమ్యూనిస్టులంటే గిట్టని సత్యదీపం అనే పత్రిక ప్రధాని నరేంద్రమోడీకి ఉక్రెయిన్‌ పోరు గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడటానికి సమయం ఉంటుంది గానీ మణిపూర్‌ గురించి మాత్రం పట్టదు అని విమర్శించింది.మోడీగారు మన్‌కీ బాత్‌లో అడవుల్లో పెరిగే గడ్డి గురించి కూడా మాట్లాడుతారు గానీ మణిపూర్‌లో ఇబ్బందులు పడుతున్నవారి గురించి పట్టించుకోరు. ఈశాన్య రాష్ట్రాలలో 30సార్లకు పైగా పర్యటించి ఉంటారు. మణిపూర్‌కు మాత్రం కావాలనే వెళ్లటం లేదు అని సంపాదకీయంలో పేర్కొన్నది.ఈ పత్రికను అంగామలీ సిరో-మలబార్‌ చర్చ్‌ నడుపుతుంది. ఆ పత్రిక చర్చి నేతలను కూడా వదల్లేదు. తొలి రోజుల్లో మణిపూర్‌ హింసాకాండను చర్చి నేతలు విస్మరించారన్నది నిజం. ప్రకటనలు చేయటం తప్ప వారు ఇప్పటికీ హింసాకాండ జరిగిన ప్రాంతాలను సందర్శించేందుకు లేదా రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లేందుకు సిద్దంగా లేరు, కనీసం ఢిల్లీలో పత్రికా విలేకర్ల సమావేశం పెట్టే ప్రయత్నం కూడా లేదు అని పేర్కొన్నది. మండుతున్న మణిపూర్‌ గురించి అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చిన తరువాత కూడా ప్రధాని మోడీలో చలనం లేదు. ఎవరేమనుకుంటే నాకేం అన్నట్లుగా ఉన్నారు. ఇంత హింసాకాండ, రచ్చకు కారణం మణిపూర్‌లో మెజారిటీగా ఉన్న మెయితీ తెగవారిని షెడ్యూలు కులాల జాబితాలో చేర్చాలని సిఫార్సు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించటమే. అలాంటి అధికారం హైకోర్టుకు లేదని సుప్రీం కోర్టు చెప్పిన తరువాత కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరులను వెల్లడించలేదు.

జనాభాలో హిందువులైన మెయితీలు 53శాతం ఉండగా, క్రైస్తవులుగా ఉన్న గిరిజనులు 40శాతం. అరవై మంది ఉన్న అసెంబ్లీలో నలభైమంది మెయితీలు ఉన్నారు. వారు బిజెపి ఓటు బాంకుగా ఉన్నారు. జరుగుతున్న హింసాకాండలో మెయితీలకు పోలీసులే ఆయుధాలు ఇచ్చారని, పోలీస్‌ స్టేషన్ల నుంచి అపహరించినట్లు కేసులు నమోదు చేశారని వార్తలు వచ్చాయి. హింసాకాండ ప్రారంభమైన 70 రోజుల నుంచి ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. ఎవరి మీద ఎవరికీ విశ్వాసం లేదు.1960లో తెచ్చిన భూ సంస్కరణల చట్ట ప్రకారం కొండ ప్రాంతాల్లో గిరిజనేతరులు భూమి కొనుగోలు చేసేందుకు, అమ్మేందుకు అవకాశం లేదు. ఆ భూముల మీద కన్నేసిన మెయితీలు తమను గిరిజనులుగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తున్నారు.ఆర్టికల్‌ 371సి ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. మణిపూర్‌లో హింసాకాండ జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం తమాషా చూస్తున్నది.రాష్ట్ర ప్రభుత్వం మీద ఎలాంటి చర్యలూ లేవు. రిజర్వేషన్ల గురించి మాట్లాడితే ఓటుబాంకు దెబ్బతింటుంది, మౌనంగా ఉంటే ఏ రోజు ఏం జరుగుతుందో, ఎందరి ప్రాణాలు పోతాయో తెలియదు. అయినా ప్రధానికి పట్టదు. విస్తారమైన భూమిని ఏదో ఒక పద్దతిలో స్వంతం చేసుకోవాలని ఈ సామాజిక తరగతి చూస్తున్నదనే ఆరోపణ ఉంది. అందుకు గాను అక్రమంగా పక్కనే ఉన్న మయన్మార్‌ నుంచి అక్రమంగా గిరిజనుల వలసలను ప్రోత్సహిస్తున్నట్లు ఆ తరగతి ఆరోపిస్తోంది. అక్రమవలసలన్నది ఒక సాకు మాత్రమే అని గిరిజనులు అంటున్నారు. వాస్తవాలను వివరించి రెండు సామాజిక తరగతుల్లో ఉన్న అనుమానాలు, అపోహలను తొలగించటంలో గతంలో ఉన్న ప్రభుత్వాలతో పాటు వర్తమాన బిజెపి కూడా విఫలమైంది, మతం పేరుతో ఓటు బాంకు ఏర్పాటుకు పూనుకుంది. తాజా పరిణామాలో మణిపూర్‌లో తిరిగి ఉగ్రవాదం తలెత్తితే బిజెపిదే బాధ్యత అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d