గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌ ఓటమి ఎవరిది ! ముస్లిం విద్వేషం రెచ్చగొడితేనే బిజెపికి ఓట్లా ?

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


గుజరాత్‌, హిమచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. గుజరాత్‌లో 182కు గాను 156 సీట్లు తెచ్చుకుంది. కాంగ్రెస్‌ 17, ఆప్‌ 5 సీట్లు తెచ్చుకుంది. గతంలో కాంగ్రెస్‌ తెచ్చుకున్న 149 సీట్ల రికార్డును బిజెపి బద్దలు కొట్టింది. గత ఎన్నికలతో 49.05 శాతం తెచ్చుకున్న బిజెపికి ఈసారి 52.5 శాతం రాగా కాంగ్రెస్‌కు 41.44 నుంచి 27.28 శాతానికి తగ్గగా , ఆమ్‌ ఆద్మీ 12.92శాతం తెచ్చుకుంది. హిమచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ 40, బిజెపి 25, ఇతరులు మూడు సీట్లు తెచ్చుకున్నారు. హౌరా హౌరీగా సాగిన పోరులో ఈ సారి బిజెపి ఓట్లు 48.8 నుంచి 43శాతానికి తగ్గగా కాంగ్రెస్‌ 41.7 నుంచి 43.9శాతానికి పెంచుకుంది. ఈ ఫలితాల గురించి వెంటనే కొన్ని సాధారణ విశ్లేషణలు వెలువడ్డాయి. రానున్న రోజుల్లో లోతైన పరిశీలనలు రావచ్చు. ఈ లోగా దేశంలో తిరిగి ఎన్నికల కోలాహలం ప్రారంభం కానుంది. ఫిబ్రవరిలో బిజెపి లేదా దాని మిత్రపక్షాల ఏలుబడిలోని త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాల్లో, మే నెలలో కర్ణాటక, నవంబరులో చత్తీస్‌ఘర్‌ (కాంగ్రెస్‌), మిజోరాం(ఎంఎఎన్‌ఎఫ్‌), మధ్య ప్రదేశ్‌(బిజెపి), డిసెంబరులో తెలంగాణా(బిఆర్‌ఎస్‌), రాజస్తాన్‌(కాంగ్రెస్‌) అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటికి గడువు ప్రకారమే జరిగితే మూడు సార్లు అంటే దాదాపు ఏడాది మొత్తం ఎక్కడో ఒక చోట ఎన్నికల వాతావరణం ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల పాలకపార్టీల నేతలు ముందుస్తు ఎన్నికలు లేవని చెబుతున్నప్పటికీ రావని చెప్పలేము. జరుగుతున్న మధింపు, సర్వేలు ముగిశాక ఒక స్పష్టత రావచ్చు. కర్ణాటకతో పాటు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు లేకపోలేదు. ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.


కుక్క మనిషిని కరవటం సాధారణం, మనిషి కుక్కను కరిస్తేనే వార్త అవుతుంది.నరేంద్రమోడీ నాయకత్వానికి ఎదురు లేదు, ఎవరైనా వస్తే పుట్టగతులుండవన్న రీతిలో ప్రచారం జరుగుతోంది. గతంలో ఇందిరా గాంధీ గురించి కూడా ఇలాగే చెప్పారు. రెండు సార్లు నరేంద్రమోడీ తిరుగులేని మెజారిటీతో కేంద్రంలో అధికారానికి వచ్చిన తరువాత చివరికి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తనకే ఓటు వేసినట్లుగా భావించాలని మోడీ కోరినప్పటికీ హిమచల్‌ ప్రదేశ్‌లో ఫలితం దక్కలేదు. అందుకే గుజరాత్‌లో గెలుపు కంటే ఇక్కడ ఓటమి వార్తగా మారింది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే రాష్ట్రాలు బాగా వృద్ది చెందుతాయని గతంలో కాంగ్రెస్‌ ఇప్పుడు బిజెపి అంటున్నది. కేంద్రంలోని ప్రభుత్వం, పార్టీతో సఖ్యతతో ఉంటే రాష్ట్రాలకు నిధులు ఎక్కువ తెచ్చుకోవచ్చని చెప్పే ప్రాంతీయ పార్టీల సన్నాయి నొక్కులను చూస్తున్నాము. ” గుజరాత్‌ పర్యటనలో రు. 9.4లక్షల కోట్ల పధకాలను ప్రారంభించనున్న ప్రధాని ” అంటూ హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక ఒక వార్తను 2022 సెప్టెంబరు 30న ప్రచురించింది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పధకాలే అనుకోవాల్సిన అవసరం లేదు, కొన్నింటికి శంకుస్థాపనలు, ప్రారంభాలు ఉండవచ్చు. హిమచల్‌ ప్రదేశ్‌లో కూడా ఉన్నది బిజెపి ప్రభుత్వమే కదా అక్కడ ప్రారంభించిన పథకాల గురించి అలాంటి వార్తలు కనిపించలేదు. హిమచల్‌ ప్రదేశ్‌లో రు.3,650 కోట్ల మేర వివిధ పథకాలకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని అంటూ 2022 అక్టోబరు మూడవ తేదీ దక్కన్‌ క్రానికల్‌ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. పోనీ అంతకు ముందు అక్కడ మరో రెండు రెట్ల విలువగల పథకాలను ప్రారంభించారనుకుందాం అవి గుజరాత్‌కు సాటి వచ్చేవేనా ? ఒకే పార్టీ రెండు ఇంజన్ల పాలన ఉన్నప్పటికీ గుజరాత్‌కు మరొక రాష్ట్రానికి ఇంత తేడా ఎందుకున్నట్లు ? ఏ పీఠమెక్కినా, ఎందుకాలిడినా చూపరా గుజరాత్‌ పక్షపాతం అన్నట్లుగా నరేంద్రమోడీ గుజరాత్‌ ప్రధాని అని ఎవరైనా ఎద్దేవా చేస్తే , కాదు దేశానికే ప్రధాని అని బిజెపి పెద్దలు లేదా వారిని సమర్ధించేవారు ఎలానో వెల్లడించాలి.


సిఎంగా నరేంద్రమోడీ గుజరాత్‌ను ఎంతో వృద్ది చేశారని అందుకే దేశమంతటా గుజరాత్‌ మోడల్‌ను అమలు చేస్తామని 2014లో చెప్పారు, మోడీ ప్రధాని పీఠమెక్కారు గానీ సదరు మోడల్‌ను చివరికి తమ ఏలుబడిలోని రాష్ట్రాల్లో కూడా అమలు జరపలేదు, అసలు ఇంతవరకు ఎక్కడా దాని ప్రస్తావన కూడా తేలేదు. ఇది నరేంద్రమోడీ విశ్వసనీయతను ప్రశ్నించటం లేదూ ! ప్రణాళికా సంఘాన్ని పక్కన పెట్టి తన పేరును శాశ్వతంగా తలచుకొనే విధంగా మోడీ నీతిఅయోగ్‌ను రంగంలోకి తెచ్చారు. అది వెల్లడించిన సమాచారం ప్రకారం 2021 దేశ ఆరోగ్యసూచికలో మొత్తం మీద పని తీరులో కేరళకు 82.2 పాయింట్లు రాగా దేశానికే నమూనా అని పేర్కొన్న గుజరాత్‌కు వచ్చింది 63.59 మాత్రమే. నరేంద్రమోడీ ఏలుబడిలో ఏమి సాధించించినట్లు ? రెండో ఇంజను తగిలించిన తరువాత కూడా కేరళ కంటే అంత వెనుకబడి ఎందుకు ఉన్నట్లు ? అక్కడే కాదు మధ్య ప్రదేశ్‌లో కూడా దశాబ్దాల తరబడి బిజెపి పాలనే కొనసాగుతున్నది దానికి వచ్చిన పాయింట్లు 36.72 , పందొమ్మిది పెద్ద రాష్ట్రాల్లో మధ్య ప్రదేశ్‌, బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌ చివరన ఉన్నాయి, గుజరాత్‌లో, ఇతర చోట్ల తమ పని తీరును చూసి జనం ఓటేశారని బిజెపి నేతలు చెప్పుకుంటున్నారు. వారి ముందు నవ్వటానికి జనానికి భయం అన్నది తెలిసిందే. అదే అభివృద్దని బిజెపి చెప్పినా జనం భావించినా ఎవరూ చేసేదేమీ లేదు.దారిద్య్రనిర్మూలనలో ఆర్‌బిఐ ప్రకటించిన 2013 నివేదిక ప్రకారం గుజరాత్‌ 14వ స్థానంలో ఉంది.అది నరేంద్రమోడీ పన్నెండేళ్ల పాలన తరువాత. తాజా వివరాల ప్రకారం దేశంలో సగటున 2021-22లో 21.92 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువున ఉంటే గుజరాత్‌లో 16.63 శాతం ఉన్నారు. కేరళలో 0.71శాతం మాత్రమే ఉన్నారు. రెండింజన్లు ఉండి ఏమి సాధించినట్లు ? ఇది దేశానికి ఆదర్శం(మోడల్‌) ఎలా అవుతుంది.


గుజరాత్‌లో ఘన విజయానికి కారకుడు నరేంద్రమోడీ అని బ్రహ్మరధం పడుతున్నారు.అమిత్‌ షా దగ్గరుండి అన్నీ చూసుకున్నారని చెబుతున్నారు. వరుసగా గెలవటమే గొప్ప అనుకుంటే గతంలో కాంగ్రెస్‌కూ అలాంటి రికార్డులున్నాయి. అక్కడ బిజెపి ఏలుబడి ప్రారంభం నుంచి చూస్తే క్రమంగా తగ్గుతూ 2017ఎన్నికల్లో 182కు 99 (మెజారిటీ 92 ) మాత్రమే బిజెపి తెచ్చుకుంది. తమ నేత ప్రధానిగా ఎదిగిన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో అక్కడి జనం పెద్దగా స్పందించలేదు. అంతకు ముందు మోడీ నేతగా ఉన్నపుడు వచ్చిన 115 సీట్లు 99కి తగ్గాయి. దీనికి కారకులెవరు ? అమిత్‌ షా మంత్రాంగం అప్పుడు ఎందుకు పని చేయలేదు. నరేంద్రమోడీ తరువాత 2014 నుంచి ముగ్గురు సిఎంలను అక్కడ బిజెపి మార్చింది. ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులు చేయించి 99 నుంచి 112కు పెంచుకుంది.ఇదంతా నీతి సూత్రాలు వల్లించే నరేంద్రమోడీకి తెలియకుండా జరిగిందనుకోలేము. ఎందుకంటే ఈ దేశంలో ఏది జరిగినా మోడీ వలనే అని చెబుతున్నారు గనుక దీనికి మినహాయింపు ఎందుకివ్వాలి ?


గుజరాత్‌లో బిజెపి ఈ సారి ముందు జాగ్రత్త పడింది. అనేక సామాజిక తరగతులను సంతుష్టీకరించింది. ముస్లిం విద్వేషాన్ని కొనసాగించింది. అనేక చోట్ల కాంగ్రెస్‌ అనుసరించిన ఎత్తుగడలనే పునరావృతం గావించింది. ఆ పార్టీ నుంచి డజన్ల కొద్దీ నేతలను తెచ్చుకొని బరిలో నిలిపింది. బలమైన పటేల్‌ సామాజిక తరగతి లేకుండా గెలవలేమని గ్రహించి జైన్‌ బనియా సామాజిక తరగతికి చెందిన విజయ రూపాని చేత అవమానకరంగా సిఎం పదవికి రాజీనామా చేయించి 2021 సెప్టెంబరులో భూపేంద్ర పటేల్‌ను గద్దె నెక్కించారు. రూపాని నాయకత్వంలో 2017లో ఎన్నికలు జరిగినపుడు నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారానికి దూరంగా లేరు. ఆ ఎన్నికల్లో 99 రావటానికి రూపాని బలహీన నాయకత్వమే కారణమని, బలహీనమైన సిఎం అని, కరోనాను ఎదుర్కోవటంలో విఫలం చెందారని ప్రచారం చేసి రాజీనామా చేయించారు. అలాంటపుడు ఐదేండ్లు ఎందుకు కొనసాగించినట్లు? మోడీ-షా ఏం చేస్తున్నట్లు ? ఇప్పుడు రికార్డు స్థాయిలో వచ్చిన సీట్లకు కారకుడు నరేంద్రమోడీ అంటున్నారు. అంటే గెలుపు మోడీ ఖాతాకు, పరాజయం ఇతరుల ఖాతాకు వేస్తారని స్పష్టమైంది. ప్రస్తుత సిఎం భూపేందర్‌ పటేల్‌ ఎక్కువ మంది జనానికి తెలియదని రాష్ట్ర బిజెపి ప్రధాన ప్రతినిధి యామల్‌ వ్యాస్‌ చెప్పినట్లు 2022 డిసెంబరు ఐదవ తేదీ అవుట్‌లుక్‌ పత్రిక పేర్కొన్నది. అంటే పలుకుబడి కలిగిన పటేల్‌ సామాజిక తరగతి మద్దతు కోసమే ఒక బొమ్మగా సిఎం గద్దె మీద కూర్చోపెట్టారన్నది స్పష్టం. రూపాని కాబినెట్‌లోని మంత్రులందరినీ తొలగించారు. తాజా ఎన్నికల్లో 41మంది సిట్టింగ్‌లకు సీట్లు నిరాకరించారు. రాష్ట్ర పార్టీ సారధినీ మార్చివేశారు. చిత్రం ఏమిటంటే మూడు దశాబ్దాల పాలన తరువాత గుజరాత్‌ ఆత్మగౌరవం అంటూ బిజెపి కొత్త పల్లవి అందుకుంది. ఎవరి నుంచి దాని గౌరవానికి ఎసరు వచ్చినట్లు ?


ఇక ఏకత, శీలము అంటూ కబుర్లు చెప్పే సంఘపరివార్‌కు గుజరాత్‌ పెట్టని కోట. ఆ కోటలోకి కాంగ్రెస్‌ నుంచి2007, 2012లో గోద్రాలో గెలిచిన సికె రావుల్జీ 2017 ఎన్నికల ముందు బిజెపిలో చేరి ఆ పార్టీ తరఫున అదే ఏడాది కేవలం 258 ఓట్ల తేడాతో గెలిచారు.అతగాడు 2002 గోద్రా మారణకాండలో అత్యాచారానికి గురైన బిల్కిస్‌ బానో కేసులో శిక్షలు పడి జైలు జీవితం అనుభవిస్తున్న 11 మంది శిక్షా కాలం తగ్గించి వెలుపలికి రప్పించేందుకు కృషి చేసిన అపర శీలవంతుడు. 2022 ఆగస్టు 19న కోర్టు నిర్ధారించి నేరగాండ్లుగా తేల్చిన 11మంది గురించి మాట్లాడుతూ ” వారు నేరానికి పాల్పడిందీ లేనిదీ నాకు తెలియదు. వారు బ్రాహ్మలు, బ్రాహ్మలు మంచి సంస్కారవంతులని తెలిసిందే ” అని అప్పటికే ఏడు సార్లు గెలిచి ఒకసారి మంత్రి పదవి వెలగబెట్టిన ఆ పెద్దమనిషి సెలవిచ్చారు.తాజా ఎన్నికల్లో 35వేల 198 ఓట్ల మెజారిటీతో అక్కడ గెలిచారు. గుజరాత్‌లో తిరుగులేని ప్రభావం చూపుతున్న సంఘపరివార్‌ సంస్థలు అక్కడి జనాలకు నేర్పిన ” సంస్కారానికి ” ఫలితమిది. ఇలాంటి వారిని బరిలోకి దించిన బిజెపి తప్ప గుజరాత్‌ గౌరవాన్ని మరో పార్టీ ఎలా దెబ్బతీస్తుంది ? జర్మనీలో హిట్లర్‌ యుూదుల మీద ఉన్మాదాన్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టినపుడు అక్కడి జనం నీరాజనాలు పలికిన ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. నాడు హిట్లర్‌ను నెత్తిమీద పెట్టుకున్న జర్మన్లు నేడు వాడి పేరు ఉచ్చరించటానికి కూడా ఇష్టపడరు. ఎక్కడైనా రోజులన్నీ ఒకే విధంగా ఉండవు.


హిమచల్‌ ప్రదేశ్‌లో ఓటమికి అక్కడ ఒకసారి కాంగ్రెస్‌ ఉంటే మరోసారి బిజెపి అధికారానికి రావటం రివాజుగా ఉందని దాని కొనసాగింపు తప్ప వేరేఏమీ కాదని బిజెపిని సమర్ధించే వారు కొట్టి పారవేస్తున్నారు. ఆ ముక్క ఎన్నికలకు ముందే చెప్పి ఈ వుంటే అది వేరుగా ఉండేది. నరేంద్రమోడీ పరువు దక్కేది. అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా ఫలితాల తరువాత చెబుతున్నారు. దేశంలో రివాజులను మార్చటమే మోడీ గొప్పతనమని, ఐదు దశాబ్దాల్లో కాంగ్రెస్‌ చేయలేని వాటిని ఐదేండ్లలో మోడీ చేసి చూపించారని నీరాజనాలు పలికారు. ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌లో కూడా అలాగే ఉన్న రివాజును మార్చివేశామని, హిమచల్‌ ప్రదేశ్‌లో కూడా అదే జరగనున్నట్లు బిజెపి పెద్దలు చెప్పారు. పార్టీ అభ్యర్ధులను చూసి కాదు, కమలం గుర్తుకు ఓటేస్తే తనకు వేసినట్లే అని మోడీ స్వయంగా చెప్పుకున్నారు. కమలం ఓడి వాడింది కనుక నరేంద్రమోడీ కూడా అక్కడ ఓడినట్లా కాదా ? తిరుగుబాటు అభ్యర్ధులు బిజెపిని దెబ్బతీశారని ఒక ముక్తాయింపు. జెపి నడ్డా బిజెపి పార్టీ దేశ అధ్యక్షుడు కావచ్చుగానీ హిమచల్‌ ప్రదేశ్‌ బిజెపిలో ఒక ముఠానేత అని అందరికీ తెలుసు. కాంగ్రెస్‌ కూడా ఆ సమస్యను ఎదుర్కొన్నది. లేకుంటే దానికి ఇంకా సీట్లు వచ్చేవేమో ? అయినా కాంగ్రెస్‌ నేతలను పార్టీలో చేర్చుకొని వారికి పెద్ద పీటవేస్తే బిజెపిలో అధికార రుచిమరిగిన వారు మడి కట్టుకు కూర్చుంటారా ? వారంతా రంగంలో ఉన్నప్పటికీ తమదే అధికారం అని చెప్పినవారు ఇప్పుడు అంతా వారే చేశారు అంటే కుదురుతుందా ? ఒకసారి అధికారం వస్తే వారు వీరవుతారన్నది స్పష్టం.


బిజెపి అంటే మోడీ – మోడీ అంటే బిజెపి అంటున్నారు. దేశంలో మోడీ ఎక్కడ బలహీనంగా ఉంటే అక్కడ ఇడి చురుకుగా పని చేస్తుందని జనం గ్రహిస్తున్నారు. ఇతర పార్టీలు బలంగా ఉంటే వారి మద్దతుదార్ల మీద దాడులు జరుగుతాయి, భయపెడతారు. అత్యాచారం చేసిన వారు సంస్కారవంతులని కితాబునిచ్చిన గుజరాత్‌ బిజెపి ఎంఎల్‌ఏ తిరిగి రికార్డు మెజారిటీతో గెలిచిచారంటే అక్కడి జనానికి కాషాయ దళాలు కలిగించిన అపర చైతన్యానికి నిదర్శనం. ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్‌ సాదర్‌లో తొలిసారిగా ఒక హిందువు అసెంబ్లీకి ఎన్నికైనట్లు మరొక వార్త. వీటి గురించి మరొక విధంగా చెప్పాలంటే ఎక్కడ ముస్లిం విద్వేషాన్ని, హిందూ భావోద్వేగాలను రెచ్చగొడితే అక్కడ బిజెపికి ఓట్ల పంట ఎక్కువగా పండుతున్నది. గుజరాత్‌లో గోద్రా మారణకాండ ఇంకా లబ్ది చేకూర్చుతూనే ఉంది. అక్కడ జనాభాలో 2011లెక్కల ప్రకారం 88.6శాతం హిందువులు, 9.7శాతం ముస్లింలు ఉన్నారు. గోద్రా మారణకాండకు ముందు 1960, 80దశకాల్లో తీవ్రమైన మత ఘర్షణలు జరిగిన పూర్వరంగం ఉంది. అదే హిమచల్‌ ప్రదేశ్‌లో ముస్లింలను బూచిగా చూపేందుకు అవకాశం లేదు.అక్కడ జనాభాలో దేశంలో ఎక్కడా లేని విధంగా 95.17శాతం మంది హిందువులే ఉన్నారు. అక్కడ 2.18శాతం మందే ముస్లిం జనాభా ఉంది. ఈ కారణంగా అక్కడ ముస్లిం విద్వేష భావోద్వేగాన్ని రగిల్చే అవకాశం లేనందున మోడీ-బిజెపి ఎత్తుగడలు పారలేదని కొందరు చెబుతున్నారు. ప్రభుత్వ పనితీరును బట్టే జనం ఓట్లేశారని, ఆమేరకు బిజెపి వైఫల్యం ఓటమికి దారి తీసిందని అభిప్రాయపడుతున్నారు. హిందూమతానికి ముప్పు వచ్చిందని, లవ్‌ జీహాద్‌, ఉమ్మడి పౌరస్మృతి, వెనుకబడిన తరగతుల వంటి అంశాలు అక్కడ ఓటర్లను ఆకర్షించేవికాదు.జనాభాలో మూడోవంతు మంది ఠాకూర్లు, 25.2శాతం దళితులు(33శాతం మంది ఉన్న పంజాబ్‌ తరువాత ఇంత మంది మరొక రాష్ట్రంలో ఎక్కడా లేరు) 18శాతం బ్రాహ్మణులు,13.5శాతం వెనుకబడిన తరగతులు 5.7శాతం మంది గిరిజనులు ఉన్నారు. ఇక్కడ మరొక పార్టీ ఎదగలేదు. జనాభాలో అగ్రవర్ణాలుగా పేర్కొనబడుతున్నవారే ఎక్కువగా ఉన్నందున ఇతర రాష్ట్రాల్లో మాదిరి ఎక్కువగా ఉన్న వెనుకబడిన తరగతుల సామాజిక సమీకరణలకూ అవకాశం లేదు. పంజాబ్‌లో కూడా ముస్లిం విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు వీలుగా అక్కడ ఆ సామాజిక తరగతి జనాభా లేకపోవటంతో బిజెపి ఓటు బాంకును ఏర్పరుచుకోలేకపోయిందని సూత్రీకరించిన వారున్నారు.

ఉత్తర ప్రదేశలో చేసిన మాదిరి పదమూడు శాతం ఉన్న ముస్లింలు ఉన్న కర్ణాటకలో రెచ్చగొడుతున్న వివాదాలు, తెలంగాణాల టిఆర్‌ఎస్‌ను నడిపిస్తున్నది మజ్లిస్‌ అని ప్రచారం చేయటం, కేరళలో ముస్లిం మతశక్తుల గురించి చేస్తున్న ప్రచారం వంటివన్నీ ఈ సూత్రీకరణలకు ఊతం ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం విద్వేషాన్ని రెచ్చగొడితే కుదరదు, జగన్మోహన్‌ రెడి ్డ క్రైస్తవమతానికి చెందిన వారు గనుక హిందూ మతానికి ముప్పు వచ్చిందని ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో ఢిల్లీలో తీవ్ర విద్వేషాన్ని రెచ్చగొట్టినా పదిహేను సంవత్సరాలు మున్సిపల్‌ పాలన సాగించిన బిజెపి తాజాగా దెబ్బతిన్నది. కేరళలో దాని ఎత్తుగడలు పారలేదు, ఉన్న ఒక్క సీటును, గతంలో తెచ్చుకున్న ఓట్లనూ అది పోగొట్టుకుంది. శబరిమల పేరుతో మెజారిటీ మతాన్ని రెచ్చగొట్టాలని చూసినా కుదరలేదు. క్రైస్తవుల ఓట్ల కోసం వెంపర్లాడుతున్నది. బెంగాల్లో కొంత మేరకు ముస్లిం విద్వేషం ఫలించినా గత అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. అంతకు ముందు తెచ్చుకున్న ఓట్లను తెచ్చుకోలేకపోయింది. ఇలా బిజెపికి మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నా దాని ముస్లిం విద్వేషం తగ్గలేదు. సబ్‌కా సాత్‌ సబ్‌కా విశ్వాస్‌, వికాస్‌ అని చెబుతున్న ఆ పార్టీ గుజరాత్‌లో పదిశాతం ఉన్న ముస్లింలకు ఒక్క సీటంటే ఒక్కటీ ఇవ్వలేదు. ఇచ్చిన వారికి ముస్లిం సంతుష్టీకరణ పార్టీలని ముద్రవేస్తున్నది. స్వాతంత్య్ర పోరాటంలో అందరినీ కూడగట్టేందుకు కాంగ్రెస్‌ అనుసరించిన ఎత్తుగడలు, తరువాత మైనారిటీలను ఓటు బాంకుగా మార్చుకున్న తీరును బిజెపి బాగా ఉపయోగించుకుంది.అసలు స్వాతంత్య్ర పోరాటంతో సంబంధం లేని సంఘపరివార్‌, తరువాత దాని రాజకీయ ముసుగులుగా ముందుకు వచ్చిన జనసంఘం, బిజెపి డిఎన్‌ఏలోనే ముస్లిం విద్వేషం ఉంది. షాబానో కేసు వంటి వాటితో మైనారిటీలను సంతుష్టీకరిస్తూనే బిజెపిని ఎదుర్కొనేందుకు బాబరీ మసీదును కూడా తెరిపించి మెజారిటీ మతస్తుల సంతుష్టీకరణకు కాంగ్రెస్‌ తెరలేపింది. రెండింటికీ చెడింది. బిజెపి గతంలో జరిగిన వాటి పేరుతో ముస్లిం విద్వేషం, మెజారిటీ హిందువుల సంతుష్టీకరణకు తెరతీసింది. కానీ ఎక్కడా దానికి మెజారిటీ హిందువుల మద్దతు ఇంతవరకు రుజువు కాలేదు. ప్రతిపక్షాల్లో చీలికల కారణంగానే అది ఎక్కువ సీట్లు తెచ్చుకుంటున్నది.

.

అమెరికా సబ్సిడీలు – ఐరోపాతో వాణిజ్య పోరుకు నాంది కానున్నాయా !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌ రక్షణ పేరుతో రష్యా మీద ఆంక్షలు, ఆయుధాలతో ఉమ్మడిగా పోరుచేస్తున్న అమెరికా – ఐరోపా సమాఖ్య మధ్య అమెరికా సబ్సిడీలు కొత్త వాణిజ్య పోరుకు నాంది కానున్నాయా అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఈ రాయితీలు ప్రధానంగా జర్మనీ, ఫ్రెంచి కార్ల కంపెనీలకు ముప్పుగా కనిపించటంతో ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. జర్మనీ కాస్త ఆచితూచి స్పందిస్తున్నది.ఉక్రెయిన్‌ పోరులో అన్ని రకాలుగా అమెరికా లబ్ది తమకు ఇబ్బందులా అన్న ఉక్రోషం ఇప్పటికే ఐరోపాలో ప్రారంభమైంది. దాన్ని మరింతగా పెంచేదిగా తాజా పరిణామాలున్నాయి. సబ్సిడీ వివాదం టీ కప్పులో తుపానులా ముగుస్తుందా మరింత తీవ్రం అవుతుందా ? అమెరికాలో తయారైన ఉత్పత్తులకు పెద్ద ఎత్తున అక్కడి ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ, పన్ను రాయితీల గురించి ఐరోపా సమాఖ్య ఒక్కటిగా ఉండాలని తొలిసారిగా సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌ లేయాన్‌ పిలుపునిచ్చారు.అనుచిత పోటీకి దారితీసి మార్కెట్ల మూత, సరఫరా గొలుసుల విచ్చిన్నానికి దారి తీస్తుందని వాన్‌డెర్‌ అన్నారు. నిజానికి ఆమె ఐరోపాలో అమెరికా అనుకూల నేత, అంతరంగంలో ఏమున్నప్పటికీ ఐరోపాలో తలెత్తిన ఆందోళనను ప్రతిబించించే విధంగా ఆమె మాట్లాడాల్సి వచ్చింది.


ద్రవ్యోల్బణం తగ్గింపు చట్టం(ఐఆర్‌ఏ) పేరుతో జో బైడెన్‌ సర్కార్‌ 430 బిలియన్‌ డాలర్ల పథకాన్ని ప్రకటించింది. దీనిలో అమెరికాలో తయారైన వస్తువులను కొనుగోలు చేసే వారికి రాయితీలు ఇస్తారు. ఇది అక్కడి కంపెనీలకు ఇచ్చినట్లే. ఈ పధకం అమెరికాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం చేసుకున్న కెనడా, మెక్సికో దేశాలకు కూడా వర్తిస్తుంది. మరోవైపు తమ కంపెనీలకు నష్టదాయకమని ఐరోపా సమాఖ్య ఆందోళన వెల్లడించింది. అమెరికాకు ప్రతిగా సమాఖ్య కూడా తన స్వంత నిబంధనలను సరి చేసుకొని అమెరికాకు పోటీగా చర్యలు తీసుకోవాలని ఉర్సులా సూచించారు. అమెరికా ఐఆర్‌ఏ చట్టం గురించి ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యుటిఓ)కు ఫిర్యాదు చేయాలని ఐరోపా పార్లమెంటు వాణిజ్య కమిటీ అధిపతి బెరెండ్‌ లాంగే అన్నాడు. అమెరికా ఇప్పటికే చట్టాన్ని ఆమోదించినందున పెద్దగా ఒరిగేదేమీ ఉండదని కూడా అన్నట్లు వార్తలు.ద్రవ్యోల్బణం తగ్గింపు చట్టం పేరుతో ఇస్తున్న సబ్సిడీ నిజానికి పోటీదార్లను బలహీనపరిచేందుకు తప్ప మరొకటి కాదు. ఇదే విధంగా అమెరికా చిప్స్‌ చట్టం పేరుతో తీసుకున్న చర్య తన స్వంత సెమికండక్టర్‌ పరిశ్రమ రక్షణ కోసమే.


అమెరికా ప్రకటించిన సబ్సిడీల మొత్తం అమెరికాలో ఉత్పత్తి అయిన వాటికి ఇవ్వటం డబ్ల్యుటిఓ నిబంధనలకు విరుద్దమని, దానితో తాము పోటీ పడలేమని 27దేశాల ఐరోపా సమాఖ్య అంటోంది. అమెరికా సబ్సిడీలు మహా కలహశీలమైనవి, పశ్చిమ దేశాలను విడదీస్తాయని ఫ్రెంచి అధినేత మక్రాన్‌ వాషింగ్టన్‌ పర్యటనలోనే తన అసమ్మతిని వెళ్లగక్కాడు. మరోవైపున ఐఆర్‌ఏలో ఎలాంటి మార్పులు చేసేది లేదని అధికార డెమోక్రాట్లు స్పష్టం చేశారు. లోపల ఏమి ఉన్నప్పటికీ సబ్సిడీల వివాదాన్ని అట్లాంటిక్‌ వ్యాపిత దేశాల వాణిజ్య వివాదంగా మార్చకుండా చూడాలని మక్రాన్‌-జో బైడెన్‌ ప్రకటించారు. అమెరికా సబ్సిడీలకు ఐరోపా నుంచి గట్టి స్పందన ఉండాలని జర్మనీ ఆర్థిక మంత్రి రాబర్ట్‌ హెబెక్‌ అన్నాడు. జర్మనీ విత్త మంత్రి క్రిస్టియన్‌ లిండ్‌నెర్‌ స్పందిస్తూ అమెరికాతో వాణిజ్యపోరుకు సిద్దపడాలన్నాడు. తమ వాణిజ్య ప్రయోజనాల రక్షణకు ఆర్థిక దౌత్యం మీద ఆధారపడాలని కూడా చెప్పాడు. ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉన్నట్లు వార్తలు వచ్చిన నేపధ్యంలో అమెరికా-ఐరోపా ప్రతినిధులు టెక్‌ సహకారం గురించి చర్చలు జరపనున్నారు. ఈ చర్చలల్లో సబ్సిడీల గురించి తేలేదేమీ ఉండదు గనుక ఐరోపా తన పరిశ్రమకు మద్దతు ఇచ్చేందుకు సిద్దం కావాలని ఐరోపా పార్లమెంటు వాణిజ్య కమిటీ అధిపతి బెరెండ్‌ లాంగే అన్నాడు. ఐరోపా అంతర్గత మార్కెట్‌ కమిషనర్‌ థిర్రీ బ్రెటన్‌ మాట్లాడుతూ ఐరోపా పరిశ్రమలను కాపాడుకొనేందుకు ఒక నిధిని ఏర్పాటు చేసుకోవాలని సూచించాడు.అమెరికాకు ప్రతిగా ఇతర దేశాలు కూడా కొన్ని ప్రతికూల చర్యలు తీసుకోకపోలేదు. ఉదాహరణకు డిజిటల్‌ సార్వభౌమత్వం పేరుతో అమెరికా టెక్‌ కంపెనీల మీద ఫ్రాన్సు డిజిటల్‌ పన్ను విధించింది. అమెరికా మీద ఆధారపడకుండా సబ్సిడీలతో ఐరోపా సెమికండక్టర్‌ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదించింది. అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి అమెరికా కంపెనీలను తమ దేశంలో కాంట్రాక్టుల్లో పాల్గొనకుండా నిషేధించాలని చూస్తున్నది. నిజంగా విబేధాలు ముదిరితే ఇలాంటి వాటిని చూపి అమెరికా ఎదురుదాడికి దిగవచ్చు.


అమెరికా-ఐరోపా మధ్య వాణిజ్య పోరు జరిగే అవకాశాలున్నాయనే ఆందోళన పెరుగుతోందని, ఈ పూర్వరంగంలో తాము మూల్యం చెల్లిస్తూ అమెరికా పెత్తనానికి తలవంచి అనుసరించటం కంటే తమ ప్రయోజనాల రక్షణకు స్వంత నిర్ణయాలు తీసుకోవటం మంచిదని చైనా విశ్లేషకులు ఐరోపాకు సూచించారు. ప్రస్తుతం ఐరోపా నేతలు అటు అమెరికా ఇటు చైనాతోను సంబంధాలను కొనసాగిస్తున్నారు.చైనాతో విడగొట్టుకోవాలని అమెరికా నిరంతరం ఇతర దేశాలకు చెబుతోంది.ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మక్రాన్‌ జనవరిలో చైనా రానున్నాడు. ఎలక్ట్రిక్‌ వాహనాలు, క్లీన్‌ ఎనర్జీకి అమెరికా ఇస్తున్న భారీ సబ్సిడీల కారణంగా పెట్టుబడులు ఐరోపా నుంచి అమెరికాకు తరలుతాయని భావిస్తున్నారు. అందుకే ప్రతి ఐరోపా నేత వాటి గురించి ఆందోళన వెల్లడిస్తున్నారు.


ఉదాహరణకు అమెరికాలో తయారు చేసిన ఒక విద్యుత్‌ వాహనాన్ని కొనుగోలు చేసిన వారికి ధరను బట్టి గరిష్టంగా ఏడున్నరవేల డాలర్లు సబ్సిడీ ఇస్తారు. సదరు కారు విడి భాగాలు అమెరికా లేదా అమెరికాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం ఉన్న దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవై ఉండాలి. ఐరోపా సమాఖ్య – అమెరికాకు అలాంటి ఒప్పందాలు లేవు. అందువలన ఐరోపా కార్లకు సబ్సిడీ వర్తించదు.సోలార్‌ పానెల్స్‌, హీట్‌ పంప్స్‌, బయోమాస్‌ స్టవ్‌ల వంటి వాటికి కూడా సబ్సిడీలు ఇస్తారు. ఇవి జనవరి నుంచి అమల్లోకి రానుండటంతో ఆగస్టులోనే అమెరికా చట్టం చేసినా ఇప్పుడు ఐరోపాలో చర్చగా మారింది. మాతో సహకరిస్తున్నవారికి హాని కలిగించం అని జో బైడెన్‌ చెబుతూ ఐరోపాను బుజ్జగిస్తున్నప్పటికీ చట్టంలో మార్పులు చేసేందుకు అవకాశాలు లేవని చెబుతున్నారు.


ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసు దాఖలు చేస్తే అది ఎంత కాలానికి తేలుతుందో, ఏ తీర్పు వస్తుందో అన్న అనుమానాలు కూడా ఐరోపాలో ఉన్నాయి. అమెరికా కంపెనీ బోయింగ్‌- ఐరోపా కంపెనీ ఎయిర్‌బస్‌ విమానాలకు ఇచ్చే సబ్సిడీ వివాదం పదిహేడు సంవత్సరాలు నడిచింది. ఆ సంస్థలో కొత్త జడ్జీల నియామకాన్ని అమెరికా అడ్డుకుంటున్నది, అందువలన అసలు కొత్త కేసులను అది చేపట్టటం కూడా అనుమానమే. దెబ్బకు దెబ్బ పంటికి పన్ను అన్నట్లుగా మనం కూడా సబ్సిడీలు ఇద్దామని మక్రాన్‌ అంటున్నాడు. ఐతే ఈ చర్య ఐరోపా అంతర్గత మార్కెట్‌ను దెబ్బ తీస్తే సమాఖ్య వాటిని తిరస్కరించే అవకాశం ఉంది. ఉమ్మడి పారిశ్రామిక విధానంతో పాటు సబ్సిడీలు ఇచ్చేందుకు కూడా ఉమ్మడి నిధి అవసరం, దాని కోసం అప్పు తేవాలి లేదా దేశాలన్నీ నిధులు సమకూర్చాలి. ఇప్పుడున్న స్థితిలో దాన్ని ఏమేరకు అంగీకరించేది అనుమానమే. కావాలంటే ఐరోపా కూడా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తే తాము ఇస్తున్నదానికి సరితూగవచ్చు అని అమెరికా వాణిజ్య కాథరీన్‌ తాయి సలహా ఇచ్చారు. అలా ఇవ్వగలిగిన అవకాశం జర్మనీకే ఉంది. ఒక వేళ ఇస్తే ఒకే మార్కెట్‌ అన్న ఐరోపా సమాఖ్య లక్ష్యానికే ఎసరు వస్తుంది. చిన్న దేశాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే పెరిగిన ఇంథన ధరల నుంచి గృహాలు, వాణిజ్య సంస్థలకు ఉపశమనం కలిగించేందుకు జర్మన్‌ ప్రభుత్వం ముందుకు తెచ్చిన 206 బిలియన్‌ డాలర్ల సబ్సిడీ పథకం మీద మిగతా దేశాలు గుర్రుగా ఉన్నాయి.


ఐరోపా కార్పొరేట్ల లబ్ది ప్రధానంగా రష్యా నుంచి చౌకగా వచ్చే ఇంథనం, చైనా నుంచి వస్తువుల మీద ఆధారపడి ఉంది. అమెరికాకు తోకగా మారి నడుస్తున్న కారణంగా ఇప్పుడు రష్యా నుంచి ఇంథనం నిలిచి ధరలు విపరీతంగా ధరలు పెరిగాయి. పరిశ్రమలకు ముప్పు వచ్చింది. దీనికి అమెరికా సబ్సిడీలు తోడైతే ఐరోపా పరిశ్రమల భవిష్యత్‌ సందిగ్దంలో పడుతుంది. ఇప్పటికే అక్కడ ఇంథన ధరలు విపరీతంగా పెరగటంతో అనేక మంది ఐరోపా పారిశ్రామిక, వాణిజ్య వేత్తలు తమ స్వంత దేశాల్లో బదులు అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. వారికి కావాల్సింది లాభాలు తప్ప మరొకటి కాదు. ఈ స్థితిలో అమెరికా మాట నమ్మి చైనాతో కూడా తెగతెంపులు చేసుకొంటే ఇబ్బంది పడేది ఐరోపా దేశాలే. అందువలన అది జరగకపోవచ్చు. అమెరికా-ఐరోపా మధ్య దూరం పెరిగే అవకాశాలు వస్తే చైనా దాన్ని వదులు కోదన్నది తెలిసిందే.


ఇతర దేశాల సబ్సిడీల గురించి వివిధ రకాలుగా నానా గొడవ చేస్తున్నది అమెరికా, ఐరోపా దేశాలు. పలు రకాలుగా వాటిని అదుపు చేస్తూ తమ మార్కెట్‌ను కాపాడుకుంటున్నాయి. ఇప్పుడు అమెరికా జాతీయవాదం, రక్షణాత్మక చర్యలకు దిగింది.అమెరికాకు అగ్రస్థానం అన్న విధానానికి డోనాల్డ్‌ ట్రంప్‌ తెరతీస్తే జో బైడెన్‌ దాన్ని కొనసాగిస్తున్నాడు. దీన్ని ఎదుర్కొనేందుకు ఐరోపా వద్ద ఎక్కువ అస్త్రాలు లేవు. తొలుత చర్చలతో ప్రారంభించి కుదరకపోతే ప్రపంచ వాణిజ్య సంస్థను ఆశ్రయించవచ్చు. వాటితో అమెరికా కొంత మేర దిగిరావచ్చు లేదా ససేమిరా అంటే నీవు నేర్పిన విద్యే అన్నట్లుగా ఐరోపా కూడా సబ్సిడీలు ప్రారంభించటం, అమెరికా వస్తువులపై పరిమితులు విధింపు వంటి పనులకు పూనుకోవచ్చు. ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితిలో అమెరికా తెగేదాకా లాగుతుందా ? చైనా, రష్యాలను అదుపు చేసేందుకు దానికి ఐరోపా అవసరం. అందువలన ఇతరంగా దానికి లబ్ది చేకూర్చేందుకు పూనుకుంటుందా? కొందరు ఐరోపా నేతలు, పెద్దల్లో అమెరికా గురించి ఇంకా భ్రమలు ఉన్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభంతో ఇంథన సరఫరాకు ఇబ్బందులు, ధరల పెరుగుదలతో ఇప్పటికే ఐరోపా అతలాకుతలం అవుతున్నందున ఇప్పుడు అమెరికా సబ్సిడీలతో తన పరిశ్రమలను కూడా దెబ్బతీస్తే జనం ఊరుకుంటారా ? ఐరోపా సమాఖ్య ఒకటిగా ఉన్నట్లు కనిపిస్తున్నా అన్ని దేశాలు ఒకే విధంగా లేవు. అమెరికాతో రాజీకి కొన్ని సుముఖంగా, మరికొన్ని స్వతంత్ర వైఖరితో ఉండాలని కోరుకుంటున్నాయి. జర్మనీ, ఫ్రాన్సు వంటి దేశాలు అవసరమైతే తాము చైనాకు దగ్గర అవుతామనే సంకేతాలను పంపటం అమెరికా నుంచి మరిన్ని రాయితీలు పొందేందుకే అన్నది స్పష్టం. మక్రాన్‌ వాషింగ్టన్‌లో జో బైడెన్‌తో చర్చలు జరుపుతున్న సమయంలోనే బీజింగ్‌లో షీ జింపింగ్‌తో పెట్టుబడుల గురించి ఐరోపా కౌన్సిల్‌ అధ్యక్షుడు చార్లెస్‌ మైఖేల్‌ భేటీ జరిపాడు. నిజంగా అమీ తుమీ తేల్చుకోవాల్సి వస్తే ఎవరెటు ? ఏం జరుగుతుందనేది తెరమీద చూడాల్సిందే !

అదానీ కోసం కేరళలో బిజెపితో సిపిఎం చేతులు కలిపిందా ? నిజా నిజాలేమిటి ?

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


నూటనలభై రోజులుగా లాటిన్‌ కాథలిక్‌ చర్చి తిరువనంతపురం పెద్దల మార్గదర్శనంలో నడిచిన విఝంజమ్‌ రేవు నిర్మాణ వ్యతిరేక కమిటీ డిసెంబరు ఆరవ తేదీన బేషరతుగా ఆందోళనను విరమించింది. ఇది తాత్కాలికమని కూడా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సిఎంతో చర్చలు జరిపిన తరువాత ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ కమిటీ అంతకు ముందు లేవనెత్తిన ఏడు డిమాండ్లలో రేవు నిర్మాణం ఆపాలన్నదాన్ని మినహ మిగిలిన ఆరింటిని ప్రభుత్వం ఎప్పుడో అంగీకరించింది. అయినప్పటికీ తరువాత కూడా దాన్ని కొనసాగించేందుకు, శాంతి భద్రతల సమస్య సృష్టికి చూసినప్పటికీ సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం, పోలీసు శాఖ ఎంతో సంయమనం పాటించిన కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. మంగళవారం నాడు చర్చల్లో ఆందోళన కమిటీ కొత్తగా లేవనెత్తిన ఏ డిమాండ్‌ను ప్రభుత్వం ఆమోదించలేదు. అంతకు ముందు ఈ ఆందోళనను ఆసరా చేసుకొని ప్రభుత్వం, సిపిఎం గురించి తప్పుడు ప్రచారం చేసేందుకు, వాస్తవాలను వక్రీకరించేందుకు చూశారు. వాటిలో ఒకటి ” అదానీ విఝంజమ్‌ రేవు నిర్మాణానికి చేతులు కలిపిన సిపిఐ(ఎం)-బిజెపి ” అంటూ పత్రికల్లో వచ్చిన వార్త శీర్షిక.నవంబరు 26, 27 తేదీలలో రేవు నిర్మాణ ప్రాంతంలో జరిగిన విధ్వంసకాండపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)తో విచారణ జరిపించాలన్న వినతిని హైకోర్టు తిరస్కరించింది. అదానీ కంపెనీ కోరినట్లుగా రేవు రక్షణకు కేంద్ర బలగాల ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం, సిపిఎం చెప్పగా బిజెపి వ్యతిరేకించింది. తాము కూడా రేవు నిర్మాణానికి అనుకూలమే అన్న కాంగ్రెస్‌ దాన్ని అడ్డుకోచూసిన ఆందోళన కారులకు పరోక్షంగా వత్తాసు పలికింది. తిరువనంతపురం కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌ రేవు నిర్మాణం జరగాలంటూనే ఆందోళనకు మద్దతు ప్రకటిస్తున్నట్లు విలేకర్లతో చెప్పారు. వాస్తవాలను వివరించేందుకు ప్రజల వద్దకు వెళతామని సిపిఎం ప్రకటించింది. మరోవైపున మతం రంగు పులిమేందుకు, రెచ్చగొట్టేందుకు కాషాయ దళాలు విఫలయత్నం చేశాయి. రేవు నిర్మాణం ఆపేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటన్నింటిని చూసినపుడు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టికి కుట్ర జరిగిందా అన్న అనుమానం తలెత్తింది. కేరళలో తాజా పరిణామాలు వెల్లడిస్తున్న అంశాలేమిటి?


కేరళ రాజధాని తిరువనంతపురం దగ్గర నిర్మితమౌతున్న రేవు నిర్మాణం మీద తలెత్తిన వివాదం గురించి జరుగుతున్న పరిణామాలపై వాస్తవాలను తప్పుదారి పట్టించే ప్రచారానికి పైన పేర్కొన్న వార్తా శీర్షిక ఒక ఉదాహరణ. వాటిని పట్టుకొని అదానీని ఇతర చోట్ల వ్యతిరేకించి తమ పాలనలో ఉన్న కేరళలో కమ్యూనిస్టులు సమర్దించారంటూ కాషాయ మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో రెచ్చి పోయారు. రేవు అభివృద్ధిని వ్యతిరేకిస్తూ ఆందోళన జరుపుతున్న వారు లేవనెత్తిన ఏడు డిమాండ్లలో ఆరింటిని అంగీకరించామని, నిర్మాణం ఆపాలి, వద్దు అన్న ఏడవ అంశాన్ని అంగీకరించేది లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. తమ ఆందోళన ఒక దశకు వచ్చినందున తాత్కాలికంగా విరమిస్తున్నామని ఆందోళన కమిటీ కన్వీనర్‌ ఫాదర్‌ ఫెరీరా మంగళవారం సాయంత్రం ప్రకటించారు. అంతకు ముందు కమిటీ ప్రతినిధి వర్గం సిఎంను కలిసింది.విఝంజమ్‌ రేవు వద్ద జరిగిన ఉదంతాలపై న్యాయవిచారణ జరిపించాలని, సముద్ర పోటుకు ఇండ్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించేంత వరకు నెలకు ఎనిమిది వేలు అద్దెగా చెల్లించాలని, దీనిలో రేవు కంపెనీ అదాని కంపెనీ సొమ్ము ఉండకూడదని, ఈ ప్రాంతంలో సముద్రతీర కోతపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసే కమిటీలో స్థానిక ప్రతినిధి ఒకరు ఉండాలని ఆందోళనకారులు ప్రభుత్వం ముందు నాలుగు డిమాండ్లను ఉంచారు. దేన్నీ ప్రభుత్వం అంగీకరించలేదు. అద్దెగా చెల్లించాలన్న ఎనిమిది వేలలో ప్రభుత్వం ఐదున్నరవేలు, అదానీ రేవు కంపెనీ సిఎస్‌ఆర్‌ నిధుల నుంచి మరో రెండున్నరవేలు చెల్లించేందుకు చూస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను చర్చి పెద్దలు తిరస్కరించారు. తాము అదానీ కంపెనీ డబ్బు తీసుకోబోమని, ఐదున్నరవేలకే పరిమితం అవుతామని చెప్పారు. చర్చి అధికారులు, ఇతరులపై మోపిన తీవ్రమైన కేసుల గురించి కూడా ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదు. కేసులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.


విఝంజమ్‌ రేవును మూడు దశల్లో నిర్మించాలన్నది పథకం.2019 డిసెంబరు నాటికి తొలి దశ పూర్తి కావాలనుకున్నది జరగలేదు, తరువాత 2020 ఆగస్టుకు పొడిగించారు, కరోనా, భూసేకరణ పూర్తిగానందున అది కూడా జరగలేదు. 2023 సెప్టెంబరు నాటికి పూర్తి చేసేందుకు జరుగుతున్న పనులను రేవు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారికి స్థానిక చర్చి నేతలు మార్గదర్శకులుగా ఉన్నారు. ప్రయాణీకులు, కంటెయినర్‌, ఇతర సరకు రవాణా ఓడలను నడిపేందుకు కేరళ ప్రభుత్వం విఝంజమ్‌ ఇంటర్నేషనల్‌ సీ పోర్ట్స్‌ లిమిటెడ్‌(విఐఎస్‌ఎల్‌) పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ రేవు అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ ఓడల రవాణా మార్గానికి చాలా దగ్గరగా ఉన్నందున ఇతర దేశాల నుంచి వచ్చే వాటిని కూడా ఆకర్షించి ఇతర రేవుల నుంచి వచ్చే సరకుల ఎగుమతి-దిగుమతి ఓడల అవసరాలకు ఇది అనువుగా ఉంటుంది. కొలంబో, సింగపూర్‌, దుబాయి రేవులకు వెళ్లే కొన్ని ఓడలు ఇటు మరలుతాయి. దీని నిర్మాణం గురించి పాతిక సంవత్సరాలుగా చర్చ ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్దతిలో చేపట్టేందుకు గతంలో రెండు సార్లు టెండర్లు పిలిచినా ఫలించలేదు. తొలుత ఒక చైనా కంపెనీకి టెండరు దక్కినా కేంద్రం నుంచి దానికి భద్రతా పరమైన అనుమతి రానందున రద్దైంది. తరువాత లాంకో గ్రూపుకు ఇవ్వటాన్ని జూమ్‌ డెవలపర్స్‌ అనే సంస్థ కోర్టులో సవాలు చేసింది. దాంతో అదీ జరగలేదు. మూడవసారి 2014లో పిలిచిన టెండర్లకు అదానీ సంస్థ ఒక్కటే వచ్చింది, దాంతో 2015లో నాటి యుడిఎఫ్‌ (కాంగ్రెస్‌కూటమి) ప్రభుత్వం అదానీ కంపెనీకే ఇచ్చి ఒప్పందం చేసుకుంది. నాటి సిఎం ఊమెన్‌ చాందీ శంకుస్థాపన కూడా చేశారు. దీని ప్రకారం వెయ్యి రోజుల్లో రేవు నిర్మాణం పూర్తి కావాలి. రు.7,525 కోట్ల ఈ పథకానికి నిరసనగా 2022 ఆగస్టు 16 నుంచి స్థానిక మత్స్యకారులు ఆందోళనకు పూనుకున్నారు. దానికి చర్చి పెద్దలు నాయకత్వం వహించారు. ప్రతి ఆదివారం చర్చి ప్రార్ధనల్లో ఆదేశాలు జారీ చేశారు. కొందరు పర్యావరణ వేత్తలు కూడా రేవును వ్యతిరేకిస్తున్నారు.దీని వలన తీర ప్రాంతం మీద ప్రతికూల ప్రభావం పడుతుందన్నది వారి వాదన. సముద్ర తీరం కోతకు గురవుతుందని, తమ జీవనాధారం దెబ్బతింటుందని చేపలు పట్టేవారు అంటున్నారు. అలాంటిదేమీ ఉండదని పరిశీలన జరిపిన కమిటీ చెప్పింది. ఆందోళన ప్రారంభం నాటికి సగం రేవు పనులు పూర్తైనందున ఆపే అవకాశం లేదని ప్రభుత్వం అప్పుడే స్పష్టం చేసింది. గతంలో చర్చలకు వచ్చిన ప్రతినిధులు సమావేశాల్లో సంతృప్తిని ప్రకటించి వెలుపలికి వచ్చిన తరువాత ఆందోళనను కొనసాగిస్తున్నారు. మరోసారి చర్చలకు రావాలంటే ముందుగా నిర్మాణ పనులు ఆపాలనే షరతు విధిస్తున్నారు.ప్రభుత్వం దానికి అంగీకరించలేదు. వారు లేవనెత్తిన మిగిలిన ఆరు డిమాండ్లను అమలు జరిపేందుకు, పరిశీలించేందుకు అంగీకరించింది.


ఆగస్టు నుంచి నిరసన తెలుపుతున్నవారు ఆందోళనకు సంబంధించి గతంలో నమోదైన కేసులో ఉన్నవారిని, ఇతరులను రేవు పనులను అడ్డుకుంటున్నందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విడుదల చేయాలనే నెపంతో నవంబరు 26 రాత్రి 27వ తేదీన తీవ్ర హింసాకాండకు దిగారు. పోలీస్‌ స్టేషన్‌ మీద దాడి చేశారు, పరిసరాల్లో ఉన్న ఇండ్లపై రాళ్లు వేశారు. రెండు వాహనాలను దగ్దం చేసి అనేక మంది పోలీసులను గాయపరిచారు. వారిని ఆసుపత్రికి తీసుకు వెళ్లటాన్ని కూడా అడ్డుకున్నారు. రోడ్లను ఆక్రమించారు. రేవు నిర్మాణంలో తమకు రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ దళాలను రప్పించాలని అదానీ గ్రూపు రాష్ట్ర హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడేందుకు తమకు కేంద్ర దళాల అవసరం లేదని, కావాలని అదానీ కంపెనీ కోరింది తప్ప తాము కాదని రాష్ట్ర రేవుల శాఖ మంత్రి అహమ్మద్‌ దేవరకోవిల్‌ స్పష్టం చేశారు. కేంద్రం పంపితే తమకేమీ అభ్యంతరం లేదని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది.


ఈ రేవు నిర్మాణం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పిపిపి) పద్దతికి మారుగా కౌలు పద్దతిని పాటించాలని నాడు ప్రతిపక్షంలో ఉన్న ఎల్‌డిఎఫ్‌ కోరింది. పిపిపి పద్దతిలో రు.7,525 కోట్లకు గాను అదానీ రు.2,454 కోట్లు మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. ఒక ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నదాన్ని తరువాత వచ్చిన ప్రభుత్వం తిరగదోడితే నిర్మాణ హక్కు పొందిన వారికి పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందువలన తాను వ్యతిరేకించినప్పటికీ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అమలుకు కట్టుబడి ఉంది.ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరి, తమ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం గురించి వేరే విధంగా మాట్లాడటం వెనుక ఓట్ల రాజకీయం ఉంది. లాటిన్‌ కాథలిక్‌ మతపెద్దలు గతంలో ఆ పార్టీకి మద్దతు ఇచ్చినందున ఆ పార్టీ లబ్ది పొందింది. 2021 ఎన్నికల్లో కూడా మద్దతు ఇచ్చినా దక్షిణ, మధ్య కేరళలోని చర్చి ప్రభావితం చేసే 34 చోట్ల నాలుగు అసెంబ్లీ సీట్లు మాత్రమే కాంగ్రెస్‌కు వచ్చాయి. రేవు ప్రాంతంలోని రెండు సీట్లను కూడా ఎల్‌డిఎఫ్‌ గెలుచుకుంది. తిరిగి చర్చి మద్దతు పొందేందుకు రేవు ఆందోళనను ఆసరాగా చేసుకోవాలని కాంగ్రెస్‌ చూసింది, సకాలంలో నిర్మించలేదని, చర్చి డిమాండ్లను పరిశీలించలేదని ఆరోపించింది.


రేవు నిర్మాణాన్ని అడ్డుకుంటూ ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలకు అడ్డుగా నిలిచారు. దాంతో పనులను కొనసాగనివ్వాలని నవంబరు చివరి వారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ఆందోళనకారులు ఉల్లంఘించి విధ్వంసకాండకు పాల్పడ్డారు. పోలీసులు ఎంతో సంయమనం పాటించారు. ఒక వైపు క్రైస్తవ మత పెద్దలు పల్లెకారులను రెచ్చగొట్టి ఆందోళనకు పురికొల్పుతుంటే మరోవైపు దాన్ని సొమ్ము చేసుకొనేందుకు బిజెపి మద్దతు ఉన్నశక్తులు రేవుకు మద్దతు పేరుతో హిందూ ఐక్యవేదిక వంటి సంఘపరివార్‌ సంస్థలకు చెందిన వారు కాషాయ జండాలతో మరోవైపున టెంట్లు వేసి రెచ్చగొట్టేందుకు, మత రంగు పులిమేందుకు చూశారు.ఈ అంశంలో రెచ్చగొట్టేందుకు క్రైస్తవ మత పెద్దలు కూడా తక్కువ తినలేదు.రేవు నిర్మాణ వ్యతిరేక ఆందోళన కారుల సంస్థ నే తలలో ఒకరైన ఫాదర్‌ థియోడోసియస్‌ డి క్రజ్‌ జనాన్ని రెచ్చగొడుతూ మత్స్యశాఖ మంత్రి అబ్దుర్‌రహిమాన్‌ పేరులోనే ఒక ఉగ్రవాది దాగి ఉన్నాడని నోరుపారవేసుకున్నారు. ఎల్‌డిఎఫ్‌కు చెందిన వివిధ సంస్థలు, ఇతరుల నుంచి సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలు రావటం, హింసాకాండను ప్రోత్సహించినందుకు చివరికి మద్దతు ఇస్తున్న వారిలో, సాధారణ జనంలో సానుభూతి కనుమరుగు కావటం, పోలీసులు వివిధ కేసులను పెట్టిన పూర్వరంగంలో సదరు ఫాదర్‌ నోరు జారి మాట్లాడానని క్షమించాలని కోరారు.


కొన్ని స్వార్దపరశక్తులు రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాయని, కొందరు ప్రతిఘటించి బెదరించినంత మాత్రాన విశాల ప్రయోజనాలకోసం ఉద్దేశించిన దానిని నిలిపివేసే ప్రసక్తి లేదని సిఎం పినరయి విజయన్‌ స్పష్టం చేశారు.అదే జరిగితే రాష్ట్రం విశ్వసనీయత కోల్పోతుందని అన్నారు.విఝింజమ్‌ రేవు పరిరక్షణ సమితి పేరుతో ఉన్న వారు ఇచ్చిన పిలుపులో భాగంగా జరిగిన ప్రదర్శనలలో పార్టీలతో నిమిత్తం లేకుండా రేవు నిర్మాణం జరగాలని కోరుకోనే వారందరూ పాల్గొన్నారు. అది ఒక పార్టీకి చెందిన వేదిక కాదు. దానిలో సిపిఎం, బిజెపి ఇతర సంస్థల స్థానిక నేతలు పాల్గొన్నారు. దాన్నే రెండు పార్టీలు చేతులు కలిపినట్లుగా కొందరు చిత్రించారు. కేంద్ర దళాలను పంపాలని అదానీ కంపెనీ కేరళ హైకోర్టును కోరింది, ఇప్పటికే కొన్ని సంస్థలను కేంద్ర దళాల పరిధిలో ఉన్నందున మరొకదానికోసం పంపితే తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీని మీద వైఖరిని తెలపాలని కేంద్రాన్ని కోర్టు కోర్టు కోరింది. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు.


కేంద్ర దళాలు వస్తే తమకు అభ్యంతరం లేదని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం హైకోర్టుకు తెలపటం వెనుక పెద్ద రాజకీయ ఎత్తుగడ ఉన్నందున కేంద్ర పార్టీ దృష్టికి తీసుకు వెళ్లాలని రాష్ట్ర బిజెపి నేతలు నిర్ణయించినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక రాసింది. ఒక వేళ కేంద్ర దళాలు వచ్చినపుడు ఏదైనా అవాంఛనీయ ఉదంతం జరిగితే ఒక్క లాటిన్‌ కాథలిక్‌ చర్చ్‌కు చెందిన వారే కాదు మొత్తం క్రైస్తవులు పార్టీకి మరింత దూరం అవుతారని బిజెపి భావిస్తున్నట్లు పేర్కొన్నది. ఆ వార్త సారాంశం ఇలా ఉంది. ” కొంత కాలంగా వివిధ క్రైస్తవ సమూహాలకు చేరువ కావాలని బిజెపి, సంఘపరివార్‌ ప్రయత్నిస్తున్నది. వీరిలో ఒక తరగతి మద్దతైనా లేకుండా రాష్ట్రంలో ఎన్నికలలో నిలబడలేమని బిజెపికి తెలుసు. ఇటీవలి కాలంలో వివిధ చర్చ్‌ల అధికారులతో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి నాయకత్వం, ప్రధాని నరేంద్రమోడీ కూడా పలుసార్లు మీటింగ్‌లు జరిపారు.ఈ వెలుగులో హైకోర్టుకు ఎల్‌డిఎఫ్‌ వెల్లడించిన వైఖరి వెనుక రాజకీయం ఉందని బిజెపి నేతలు భావిస్తున్నారు. బిజెపి రాష్ట్ర ఇంఛార్జులుగా ఉన్న ప్రకాష్‌ జవదేకర్‌,రాధామోహన్‌దాస్‌ అగర్వాల్‌తో కేంద్ర మంత్రి మురళీధరన్‌తో కలసి రాష్ట్ర నేతలు దీన్ని గురించి చర్చించనున్నారు. విఝుంజమ్‌లో కేంద్ర దళాల గురించి విలేకరులతో మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడటంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని మురళీధరన్‌ ఆరోపించారు. రేవు వద్ద ఏదైనా జరిగితే దానికి బాధ్యత బిజెపిదే అని, కేంద్ర ప్రభుత్వం క్రైస్తవ మైనారిటీలకు వ్యతిరేకమని చిత్రించేందుకు ఎల్‌డిఎఫ్‌ చూస్తున్నదని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి కృష్ణకుమార్‌ చెప్పారు.సిపిఎం, ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలతో ఉంది అది కుదరదు ” అన్నట్లు ఆ పత్రిక పేర్కొన్నది.


ఇక్కడే బిజెపి దుష్ట ఆలోచన వెల్లడైంది. ఏదైనా జరుగుతుందని ముందే ఆ పార్టీ కోకిల ఎందుకు కూస్తున్నట్లు ? రేవు వద్ద ఒక పథకం ప్రకారం జరిపిన హింసాకాండ వెనుక ఉన్న శక్తుల ఎత్తుగడ తెలుసుగనుకనే పోలీసులు ఎంతో నిబ్బరంగా ఉన్నారు. రానున్న రోజుల్లో అందోళన చేస్తున్న వారు తిరిగి విధ్వంసకాండకు పాల్పడతారని బిజెపికి ముందే తెలుసా ? అందుకే కేంద్ర దళాలు వద్దని చెప్పిందా అన్న అనుమానాలు కలగటం సహజం. గతంలో శబరిమల పేరుతో హింసాకాండను రెచ్చగొట్టేందుకు కాషాయ దళాలు చూసిన సంగతి తెలిసిందే.


తిరువనంతపురం కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్న శశిధరూర్‌ డిసెంబరు ఐదున క్రైస్తవమత పెద్దలను కలసిన తరువాత విలేకర్లతో మాట్లాడుతూ రేవు నిర్మాణం ఆపాలనటాన్ని తాను సమర్ధించటలేదంటూ, నిలిపివేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న వారికి మాత్రం మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.సిరో మలబార్‌ కాథలిక్‌ చర్చి ఆర్చిబిషప్‌ మార్‌ జార్జి ఆలెన్‌ చెరీ విలేకర్లతో మాట్లాడుతూ రేవు అంశాన్ని కేరళ కాథలిక్‌ బిషప్పుల కౌన్సిల్‌ సమావేశంలో చర్చించనున్నట్లు వెల్లడించారు. శశి ధరూర్‌తో జరిపిన సమావేశంలో ఏదో ఒక అంశం గురించి మాత్రమే గాక అనేక అంశాలను చర్చించినట్లు చెప్పారు. సిరో-మలంకర కాథలిక్‌ చర్చి కార్డినల్‌ బేసిలోస్‌ క్లీమిస్‌తో ప్రతి రోజూ చర్చిస్తున్నట్లు శశిధరూర్‌ చెప్పారు. రేవు నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూసిన వారు గతంలో కమ్యూనిస్టు నేత నంబూద్రిపాద్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిఐఏ అందించిన సొమ్ముతో అన్ని రకాల మతశక్తులు, కాంగ్రెస్‌ కలసి విముక్తి సమరం సాగించినట్లుగా మరోసారి చేస్తామని కొందరు రెచ్చగొట్టేందుకు చూశారు. కొన్ని శక్తుల కుట్రల గురించి తెలుసుగనుకనే గత నాలుగున్నర నెలలుగా ఎంతగా రెచ్చగొడుతున్నా ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం సహనంతో ఉంది. చివరికి ఆందోళన కారులే దాడికి దిగారు. అది వికటించటంతో బేషరతుగా వెనక్కు తగ్గారు.

మార్కెట్‌ సునామీకి విలవిల్లాడుతున్న వనామీ రైతు !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


దేశంలో దాదాపు రెండు లక్షల 70వేల ఎకరాల్లో వనామీ రకం రొయ్యల రకం సాగు జరుగుతోంది. దీనిలో లక్షా 80వేల ఎకరాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. టైగర్‌ రొయ్యల రకం మరొక లక్షా 50వేల ఎకరాల్లో జరుగుతోంది. ఇది ప్రధానంగా లక్షా పాతికవేల ఎకరాలు ఒక్క పశ్చిమ బెంగాల్లోనే జరుగుతోంది. ప్రస్తుతం తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని వనామీ రైతులు వాపోతున్నారు. వివిధ కారణాలతో ప్రపంచంలో రొయ్యల ఎగుమతి మార్కెట్‌ అవకాశాలు తగ్గాయి. ఒక వైపు మేత ధరలు విపరీతంగా పెరగటం మరొక వైపు కొనే వారు లేక చేతికి వచ్చిన వాటిని తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి. రానున్న కొద్ది నెలలు కూడా ఇలాగే కొనసాగితే ఈ రంగం మొత్తం తీవ్ర సంక్షోభంలో పడనుంది. ఒక అంచనా ప్రకారం ఇప్పటికే రు.25వేల కోట్ల మేరకు నష్టపోయినట్లు అంచనా. రొయ్యలను శుద్ది చేసి ఎగుమతికి అనువుగా తయారు చేసే ఫ్యాక్టరీలలో చిన్నా, మధ్యతరగతివి మూసివేతకు దగ్గరగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎగుమతులు లేవనే పేరుతో కొందరు రైతులకు చెల్లించాల్సిన సొమ్మును సకాలంలో ముట్టచెప్పటం లేదు.


అమెరికా, ఐరోపా, జపాన్‌ దేశాలలో క్రిస్మస్‌ సందర్భంగా పలు ఉత్పత్తులకు డిమాండ్‌ ఉంటుంది. ప్రస్తుతం తలెత్తిన ఆర్థిక వడిదుడుకుల కారణంగా ఈ ఏడాది దానికి తగిన విధంగా మన దేశం నుంచి దిగుమతి ఆర్డర్లు లేవు. చైనాలో కరోనా కేసులను సున్నాకు తగ్గించాలని అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్లు ఇతర ఆంక్షలను విధించిన కారణంగా అక్కడి డిమాండ్‌ కూడా తగ్గినట్లు వార్తలు. ఆగస్టు నెల నుంచి ఎగుమతి డిమాండ్‌ తగ్గిన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రొయ్యల మార్కెట్‌ సంక్షోభం మొదలైంది. విదేశాల్లో డిమాండ్‌ తగ్గటంతో ధరలు కూడా పడిపోయాయి. 2021-22లో మన దేశం నుంచి 7.76 బిలియన్‌ డాలర్ల మేర సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు జరగ్గా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది లక్ష్యంగా 8.6బి.డాలర్లను నిర్ణయించింది. అది నెరవేరే పరిస్థితి కనిపించటం లేదు. గిరాకీ తగ్గుదల 30 నుంచి 35శాతం వరకు, ధరల పతనం 20 నుంచి 25శాతం ఉన్నందున జనవరి తరువాత తిరిగి పూర్వపు స్థాయికి చేరితే తప్ప అటు కేంద్ర ప్రభుత్వానికి విదేశీ మారకద్రవ్యం తగ్గుదల ఇటు రైతాంగానికి ఆర్థిక నష్టం జరుగుతుంది. ఎగుమతి-దిగుమతి దేశాలన్నింటా శీతల గిడ్డంగులన్నీ ఆక్వా ఉత్పత్తులతో నిండి ఉన్నట్లు వార్తలు.ఈ కారణంగానే కొనుగోళ్లు మందగింపు, పరిస్థితి మెరుగుపడకపోదా అనే ఆశ ఉన్న ఎగుమతిదార్లు రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. మెరుగుపడితే మంచి లాభాలు లేకపోతే నష్టం ఉండదు అన్న అంచనాలే దీనికి కారణం. గతంలో కూడా మార్కెట్లో కొన్ని ఇబ్బందులు తలెత్తినా ఇలాంటి తీవ్రత గడచిన నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేదని ఆ రంగంలోని ప్రముఖులు చెబుతున్నారు.


ధనిక దేశాల్లో తలెత్తిన ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల కారణంగా జేబులకు చిల్లుపడుతున్నందున జనం తమ అలవాట్లు, అవసరాల ప్రాధాన్యతలను కూడా మార్చుకుంటారు. అత్యవసరమైన వాటినే కొనుగోలు చేస్తారు.ఈ పరిస్థితికి తోడు గతేడాది ప్రపంచంలో 40లక్షల టన్నుల మేర రొయ్యల ఉత్పత్తి జరిగితే ఈ ఏడాది 50లక్షల టన్నుల వరకు ఉండవచ్చని అంచనా. ఇది కూడా ధరల పతనానికి ఒక కారణం అంటున్నారు. ఈక్వెడోర్‌, ఇండోనేషియా, వియత్నాంలో ఉత్పత్తి పెరిగింది. పన్నెండు లక్షల టన్నులతో ఈక్వెడోర్‌ ఇప్పుడు ప్రపంచంలో అగ్రదేశంగా ఎదిగింది.చమురు ధరల పెరుగుదలతో రవాణా ఖర్చు పెరిగింది. మన దేశం నుంచి అమెరికా, తరువాత స్థానాల్లో చైనా ఎక్కువగా దిగుమతులు చేసుకుంటున్నాయి. రవాణా ఖర్చుల పెరుగుదల కారణంగా పక్కనే ఉన్న ఈక్వెడోర్‌ నుంచి దిగుమతి చేసుకోవటం అమెరికాలోని దిగుమతి కంపెనీలకు ఎక్కువ లాభం కనుక అక్కడి ఉత్పత్తులకు మొగ్గు చూపుతున్నారు. చైనా కూడా అక్కడి నుంచి కొంత దిగుమతి చేసుకుంటున్నది.


మన కరెన్సీ విలువ తగ్గినందున ఎగుమతిదార్లకు పెరిగిన రవాణా ఖర్చు కలసి వచ్చి కొనుగోలు చేస్తారని భావిస్తే అమెరికా మినహా మిగిలిన దిగుమతి చేసుకొనే దేశాల కరెన్సీ విలువలు కూడా మన రూపాయి మాదిరి పతనమై ఆ దేశాలలో కొనుగోలు శక్తి తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లో కిలోకు వంద తూగే వనామీ రకం రొయ్యలకు కనీసం రు.240 చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, ఎవరూ కొనుగోలుకు ముందుకు రాకపోవటంతో దాన్ని రు.210కి తగ్గించినా చిత్తశుద్దితో అమలు జరిపేవారు లేరు. నిల్వ ఉండే సరకు కానందున చివరకు రు.180, ఇంకా అంతకు తక్కువకు సైతం అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఉత్పత్తి ఖర్చులు కూడా రాక ఆర్థికంగా నష్టపోతున్నారు. చివరకు టైగర్‌ రకం ధర కూడా రు.600 నుంచి 450కి పడిపోయింది. ఈ కారణంగా గతేడాది జరిగిన 9.2లక్షల టన్నుల ఉత్పత్తి ఈ ఏడాది ఎనిమిది లేదా ఇంకా తక్కువకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇతర దేశాల రైతులకు సైతం ఎగుమతి అవరోధాలు ఉన్నప్పటికీ మలేషియా, వియత్నాం, థాయిలాండ్‌ వంటి దేశాల్లో వంద కౌంట్‌ ఉన్న వాటికి రు.290 నుంచి 310వరకు రైతుకు వస్తుండగా మన దగ్గర రెండువందలకంటే తక్కువకు దిగజారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కిలోకు రు.300లకు తగ్గితే గిట్టుబాటు కాదని, 270 కంటే తగ్గితే నష్టమని అంటున్నారు.


మన దేశం 123 దేశాలకు సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నది. వీటిలో ఎక్కువ భాగం రొయ్యలే ఉండటంతో గతేడాది జరిగిన మొత్తం ఆరులక్షల టన్నుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ వాటా 60శాతం వరకు ఉంది. చైనా తన దిగుమతుల్లో 70శాతం మన దేశం నుంచి చేసుకొనేది ఇప్పుడు ఈక్వెడోర్‌ నుంచి కూడా చేసుకుంటున్నది. వివిధ దేశాలు చేసుకొనే దిగుమతులపై వర్తమాన రాజకీయాలు, వాణిజ్య సంబంధాలు కూడా ప్రభావం చూపుతాయి. తమకు వ్యతిరేకంగా పని చేస్తున్న అమెరికాతో భారత్‌ చేతులు కలుపుతోందన్న అభిప్రాయం చైనాకు ఉంది. మరోవైపున మనదేశంలో బిజెపి, దానికి మార్గదర్శకంగా పనిచేసే సంఘపరివార్‌ సంస్థల దళాలు, వారికి వంతపాడే మీడియా విశ్లేషకులు సుప్రభాతం మాదిరి రోజు చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని దానికి బుద్ది చెప్పాలని,మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని ప్రచారం చేస్తుంటారు. ఈ నోటి దూలను చూసిన తరువాత మన ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా ఎగుమతి చేసే దేశాలున్నపుడు వాటి నుంచి దిగుమతుల చేసుకోవాలనే అలోచన కలగవచ్చు. లేకపోతే ఎంతో దూరంలో ఉన్న ఈక్వెడోర్‌ నుంచి చైనా దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చినట్లు ? వాటికి ప్రతిగా చైనాకు తన వస్తువులను అక్కడికి ఎగుమతి చేసేందుకు అవకాశాలు పెరుగుతాయి.మన ప్రభుత్వం విధిస్తున్న ఎగుమతి పన్నులు, మన దేశంతో ఒప్పందాలు లేని కారణంగా దిగుమతి చేసే దేశాలు మన ఉత్పత్తులపై విధిస్తున్న పన్నులు కూడా దిగుమతిదార్లను అవి లేని దేశాలవైపుకు నెడతాయి. అందువలన ఇలాంటి పన్నులు లేకుండా ఉండాలంటే మన దేశం ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవటం కూడా అవసరమే. అయితే అలాంటి ఒప్పందాలకు వెళ్లే ముందు మన దేశ లబ్దిని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఐరోపా, ఇతర దేశాలతో వియత్నాం స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నందున అవి మనకు బదులు అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటాయి. మన రొయ్యలపై తెల్లమచ్చల కారణంగా ఆస్ట్రేలియా దిగుమతులను నిలిపివేసింది. అందువలన ఎగుమతి చేసే దేశాలు కోరుకున్న ప్రమాణాల మేరకు వ్యాధులు, నిషేధిత మందుల అవశేషాలు లేకుండా మన ఉత్పత్తులుండటం కూడా అవసరమే. ఒక వేళ ఇక్కడ కన్ను గప్పి పంపినా ఎక్కడైనా పట్టుబడితే మొదటికే మోసం వస్తుంది.


ఇక స్థానిక సమస్యల సంగతులను చూస్తే నాణ్యమైన రొయ్య విత్తన(పిల్లల) లభ్యత కూడా తీవ్రంగానే ఉంది.ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం విద్యుత్‌ సబ్సిడి ఎత్తివేసేందుకు దారులు వెతికి రైతుల్లో ఆందోళన కలిగించింది. ఆక్వా జోన్‌, నాన్‌ ఆక్వా జోన్‌ అని కొన్ని రోజులు, ఐదెకరాల లోపు, ఆపైవారు అని మరికొన్ని రోజులు, సర్వేల పేరుతో చేస్తున్న కాలయాపన గురించి రైతుల్లో అసంతృప్తి ఉంది. ప్రతి గ్రామంలో సచివాల యాలు, వలంటీర్లు ఉన్నందున ఒక్క రోజులో సమాచారాన్ని సేకరించవచ్చు. మరోవైపు విపరీతంగా పెరుగుతున్న మేత ధరలు అదుపులో ఉండటం లేదు. కనీస మద్దతు ధరను అమలు జరిపే అధికారులు, ఉల్లంఘించిన వారి మీద చర్యలు గానీ ఉండటం లేదు. ఎగుమతి పరిస్థితి మెరుగుపడేంతవరకు పంటవిరామం ప్రకటించాలని కూడా కొందరు రైతులు సూచిస్తున్నారు. లక్షలాది మందికి ఆక్వా ఉపాధి కల్పిస్తున్నది. అందువలన ఈ రంగాన్ని కూడా పరిశ్రమగానే గుర్తించి ఇతర పరిశ్రమలకు మాదిరే ఇస్తున్న విద్యుత్‌, ఇతర రాయితీలను అందరికీ వర్తింప చేయాలని కూడా రైతులు కోరుతున్నారు.సంక్షోభ సమయాల్లో అన్ని రంగాలను ఆదుకున్నట్లుగానే ఆక్వాను కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వారి గోడును పాలకులు వినిపించుకుంటారా ? అనుమానమే !

ఉక్రెయిన్‌ పోరులో కంటే ఇంథన సంక్షోభంతో ఐరోపాలో చలి మరణాలే ఎక్కువా !

Tags

, , , , ,



ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన సైనిక చర్య బుధవారం నాటికి 280 రోజులు. అగ్నికి ఆజ్యం పోస్తున్న మాదిరి వ్యవహరిస్తున్న పశ్చిమ దేశాలు దీన్ని ఇంకా ఎంత కాలం కొనసాగిస్తాయో ఎవరూ చెప్పలేని స్థితి. రష్యాతో చర్చలకు ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ తొలి రోజుల్లో సిద్దపడినప్పటికీ అమెరికా, బ్రిటన్‌ ఇతర నాటో దేశాలు వాటిని పడనివ్వలేదని తరువాత స్పష్టమైంది. అమెరికా, దాన్ని అనుసరించే పశ్చిమ దేశాలు వేసిన తప్పుడు అంచనాలు, ఎత్తుగడల గురించి ఇతరులు చర్చించుకోవటం ఒక ఎత్తు కాగా తొమ్మిది నెలల తరువాత ఐరోపా సమాఖ్యలోని కొన్ని దేశాలు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ సంక్షోభంతో తలెత్తిన పరిస్థితి, పర్యవసానాలు కార్మికవర్గం మీద ప్రభావం చూపటం ప్రారంభమైంది. డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు చలి కాలం ఎలా గడపాలిరా బాబూ అని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.


మరోవైపున ఈ సంక్షోభాన్ని అమెరికా తన లాభాల కోసం వినియోగించుకుంటున్నదని ఐరోపా గొణగటం ప్రారంభించింది.ఉక్రెయిన్‌ సంక్షోభం మీద తటస్థ వైఖరిని అనుసరిస్తున్న భారత్‌, చైనా తదితర దేశాలు పశ్చిమ దేశాల బెదరింపులను పక్కన పెట్టి రష్యా నుంచి పెద్ద ఎత్తున ముడిచమురును చౌకధరలకు కొనుగోలు చేసి పుతిన్‌కు లబ్ది కలిగించటంతో పాటు డాలర్లను పొదుపు చేసుకుంటున్నాయి. డిసెంబరు ఒకటవ తేదీన చైనా అధినేత షీ జింపింగ్‌ ఆహ్వానం మేరకు ఐరోపా సమాఖ్య మండలి అధ్యక్షుడు ఛార్లెస్‌ మైఖేల్‌ చైనా రానున్నాడు. క్రిమియా వంతెన పేల్చివేతకు ఉక్రెయిన్‌ చేసిన కుట్ర వెల్లడి కావటంతో రష్యా దళాలు విద్యుత్‌ కేంద్రాలను దెబ్బతీశాయి. దీంతో రాజధాని కీవ్‌తో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో మంచినీరు, విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చలికాలాన్ని ఆయుధంగా చేసుకొని తమ దేశం మీద పుతిన్‌ దళాలు విరుచుకుపడుతున్నట్లు జెలెనెస్కీ ఆరోపించాడు. డిసెంబరు ఐదు నుంచి రష్యా చమురును తాము నిర్ణయించిన ధరలకే కొనుగోలు చేయాలనే ఆంక్షలను అమెరికా, నాటో కూటమి ప్రకటించిన సంగతి తెలిసిందే. దాన్ని ఉల్లంఘించిన వారి మీద చర్య తీసుకుంటామని అమెరికా చెప్పగా ధరల అదుపును అంగీకరించిన దేశాలకు అసలు తాము విక్రయించేది లేదని రష్యా స్పష్టం చేసింది.


ఒక వైపు ఉక్రెయిన్‌కు తాము మద్దతుగా ఉన్నామని చెబుతూనే ఎక్కడన్నా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా ఆర్థిక అంశాల దగ్గరకు వచ్చేసరికి లాభాలు మీకు – భారాలు మాకా ఏమిటీ పద్దతి అని ఐరోపా దేశాలు అమెరికాను ఇప్పుడు అడుగుతున్నాయి. అమెరికా చేసిన దురాగతాలన్నింటిని ఆమోదించి అనుసరించిన గతం వాటిని వెన్నాడుతోంది. అనేక విధాలుగా అమెరికా బంధంలో చిక్కుకొని ఉన్నాయి. ఉక్రెయిన్‌ పరిణామాలను చూస్తే ఐరోపా కంటే అమెరికాపెత్తనమే ఎక్కువగా ఉంది. నాటో పేరుతో అక్కడ తిష్టవేసేందుకు చూసిన సిఐఏ పథకంలో భాగంగా 2014లో జరిగిన తిరుగుబాటులో నయా నాజీలను అధికారానికి తెచ్చారు. ఈ పూర్వరంగంలో జనాభిప్రాయానికి అనుగుణంగా గతంలో తమ ప్రాంతంగా ఉన్న ఉక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపకల్పాన్ని తనలో విలీనం చేసుకుంది. అదేబాటలో నడచిన డాంటెస్క్‌ ప్రాంతంలోని జనాన్ని ఉక్రెయిన్‌ మిలిటరీతో అణచివేతకు పాల్పడటం, గతంలో రష్యాకు ఇచ్చిన హామీకి భిన్నంగా నాటో విస్తరణకు పూనుకోవటంతో ఈ ఏడాది ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్యను ప్రారంభించింది.


చర్చలను అడ్డుకోవటంతో పాటు దీర్ఘకాలం కొనసాగేలా, తీవ్ర పర్యవసానాలకు దారి తీసేందుకు దోహదం చేసే విధంగా భారీ ఎత్తున అమెరికా ఆయుధాలను అందిస్తున్నది. మరోవైపున రష్యా నుంచి చమురు తదితర దిగుమతులను నిషేధించి ఐరోపాను తమపై ఆధారపడేట్లు చేసుకుంది. గోడదెబ్బ చెంపదెబ్బ మాదిరి ఐరోపా దేశాలు ఉక్రెయిన్నుంచి వచ్చిన శరణార్ధుల భారంతో పాటు పెరిగిన చమురు, విద్యుత్‌ ధరల భారాలను అనుభవిస్తున్నాయి. కరోనాకు ముందే తక్కువ వృద్ధి రేటుతో ఉన్న పరిస్థితి తరువాత మరింత దిగజారింది. దాని మీద ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభంతో ద్రవ్యోల్బణం, ధరల భారాలతో ఆర్థిక రంగం కుదేలౌతున్నది. ఇది పాలకపార్టీల మీద వత్తిడితో పాటు జనాన్ని వీధుల్లోకి రప్పిస్తున్నది. మరోవైపు రాజకీయంగా అమెరికాతో స్నేహం కోసం కొన్ని దేశాలతో వైరం తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇప్పుడిప్పుడే వాస్తవాలు బోధపడుతుండటంతో సుభాషితాలు చెబుతున్న నాయకగణం నేల మీద నడిచేందుకు చూస్తున్నది. తాము చేయాల్సింది చేయకుండా వ్లదిమిర్‌ పుతినే అన్నింటికి కారణం అని చెబితే నమ్మేందుకు జనాలు సిద్దంగా లేరు.


తాజాగా పొలిటికో అనే పత్రికలో ఒక విశ్లేషణ వెలువడింది. ” ఉక్రెయిన్‌పై తొమ్మిది నెలల దురాక్రమణ(ఇది పొలిటికో పదజాలం) తరువాత పశ్చిమ దేశాల ఎముకలు విరగ్గొట్టేందుకు పుతిన్‌ పూనుకుంటున్నాడు. ఐరోపా ఉన్నతాధికారులు జో బైడెన్‌ అధికార యంత్రాంగం పట్ల ఆగ్రహంతో ఉన్నారు. ఐరోపా సమాఖ్య దేశాలు ఇబ్బందులు పడుతుండగా అమెరికన్లు యుద్దం నుంచి లాభాలు పొందుతున్నారు.” అని పేర్కొన్నది. ఇన్ని నెలలుగా పుతిన్‌ శకం ముగిసింది, ఉక్రెయిన్‌ గెలిచింది అంటూ గంతులు వేసిన వారు ఇప్పుడు ఎముకలు విరగ్గొట్టటం గురించి మాట్లాడటం గమనించాలి. విధించిన ఆంక్షలు వికటించి ఐరోపాకు దిక్కుతోచని స్థితిలో జో బైడెన్‌ అమెరికా పరిశ్రమలకు ఇస్తున్న పన్ను, హరిత రాయితీలు ఐరోపా పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని తమ మిలిటరీ పరిశ్రమలకు లబ్ది చేకూర్చేందుకు ఉపయోగించుకుంటున్నారని, శాంతియుత పరిష్కారానికి పూనుకోవాలన్న తమ వినతులను చెత్తబుట్టలో పడవేస్తున్నారని పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఐరోపా అధికారి ఒకరు చెప్పినట్లు పొలిటికో పేర్కొన్నది. ” వాస్తవం ఏమంటే, మీరు గనుక నిమ్మళంగా చూస్తే ఈ యుద్దం నుంచి ఎక్కువగా లబ్ది పొందిన దేశం ఏదంటే అమెరికా, ఎందుకంటే వారు అధిక ధరలకు గాస్‌ అమ్ముతున్నారు, ఎక్కువగా ఆయుధాలు అమ్ముతున్నారు. మేము నిజంగా ఇప్పుడు చారిత్రాత్మక సంకట స్థితిలో ఉన్నాము. ముందు చెప్పినట్లుగా అమెరికా ఇస్తున్న సబ్సిడీలు, అధిక ఇంథన ధరల ముప్పు అట్లాంటిక్‌ కూటమి(నాటో),యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం మారుతున్నది. అనేక ఐరోపా దేశాలలో ప్రజాభిప్రాయం మారుతున్నదని అమెరికా గుర్తెరగాల్సిన అవసరం ఉంది.” అని కూడా సదరు అధికారి చెప్పినట్లు పొలిటికో పేర్కొన్నది.


రష్యా అంటే ఒంటికాలి మీద లేచే ఐరోపా సమాఖ్య విదేశాంగ విధాన అధిపతి జోసెఫ్‌ బోరెల్‌ ఉక్రెయిన్‌కు ఉమ్మడిగా సాయపడాలనే భావననే ప్రశ్నించాడు. ” అమెరికన్లు – మా స్నేహితులు – నిర్ణయాలుతీసుకుంటారు, అవి మాపై ఆర్ధిక ప్రభావం చూపుతాయి ” అన్నాడు. ” అమెరికా మాకు అమ్ముతున్న గాస్‌ ధర అట్లాంటిక్‌ దాటే సరికి అనేక రెట్లు పెరిగి నాలుగింతలు అవుతున్నది. అమెరికన్లు మా స్నేహితులనటంలో ఎలాంటి సందేహం లేదు….. కానీ మిత్రుల మధ్య ఎక్కడో తప్పు జరుగుతున్నది అనిపించినపుడు దాని గురించి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ” అని ఐరోపా అంతర్గత మార్కెట్‌ కమిషనర్‌ థెరీ బ్రెటన్‌ ఒక ఫ్రెంచి టీవీతో మాట్లాడుతూ చెప్పాడు. పొలిటికోతో మరొక ఐరోపా ప్రతినిధి మాట్లాడుతూ ద్రవ్యోల్బణాన్ని తగ్గించే చట్టం పేరుతో జో బైడెన్‌ సర్కార్‌ 369 బిలియన్‌ డాలర్ల పారిశ్రామిక రాయితీల పథకాన్ని ప్రకటించాడు. అది ఐరోపా రాజధానులన్నింటా ఆకస్మిక భయాన్ని కలిగించింది.ద్రవ్యోల్బణాన్ని తగ్గించే చట్టం అన్నింటినీ మార్చివేస్తున్నది. అమెరికా ఇప్పటికీ మా మిత్రదేశంగా ఉన్నట్లా లేనట్లా అని అడిగినట్లు పొలిటికో పేర్కొన్నది.


అక్టోబరులో చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభ తరువాత ఐరోపా సమాఖ్య నుంచి ఒక ఉన్నతాధికారి చైనా సందర్శించటం ఇదే ప్రధమం. చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకుంటే తప్ప ఐరోపా మండలి అధ్యక్షుడు ఛార్లెస్‌ మైఖేల్‌ బీజింగ్‌ సందర్శన జరుగుతుంది. చైనాను ఒంటరిపాటు గావించాలని, అక్కడి నుంచి సరకులు కొనుగోలు నిలిపివేయాలంటూ రోజూ పారాయణం చేస్తున్న అమెరికా వైఖరిని తోసిరాజనటమే ఇది. చైనా మిగతా దేశాలన్నింటికీ పోటీదారు, వ్యవస్థాపరంగా శత్రువు అని అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో అమెరికాకు మరింత దగ్గరైన ఐరోపా సమాఖ్య ప్రముఖుడు చైనా సందర్శన ఒక కీలక పరిణామం. ఎంతో కసరత్తు జరిగితే తప్ప ఇలాంటివి జరగవు.చైనా మీద గుర్రుగా ఉన్న ఐరోపా సమాఖ్యలోని అగ్రదేశం జర్మనీ ఛాన్సలర్‌ ష్కుల్జ్‌ ఇటీవల చైనా సందర్శించి తాము ఘర్షణకు సిద్దం కాదనే సందేశాన్ని నాటో కూటమికి పంపాడు. తరువాత బీజింగ్‌తో సంబంధాలకు సిద్దమే అని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ ప్రకటించాడు. దానికొనసాగింపుగా మండలి నేత వస్తున్నట్లు చెప్పవచ్చు. ఐరోపాను తన అవసరాలకు వాడుకుంటూ ఆ మేరకు లబ్ది పొందుతూ ఐరోపాకు వాటా ఇచ్చేందుకు అమెరికా నిరాకరిస్తున్నకారణంగానే అవసరమైతే తమదారి తాము చూసుకుంటామనే సందేశాన్ని ఐరోపా ఇస్తున్నది. అమెరికా పెత్తనాన్ని అడ్డుకొని తాము బతకాలంటే చైనా లేకుండా జరిగేది కాదన్న గ్రహింపు కూడా దీనిలో ఉంది. అంటే వారి అవసరాల కోసమే చైనాతో చెలిమి అన్నది స్పష్టం.


ఉక్రెయిన్‌ పోరు సంక్షోభం కారణంగా మరణించేవారి కంటే దాని పర్యవసానాలతో తలెత్తిన పరిస్థితి కారణంగా చలి కాలంలో ఎక్కువ మంది ఐరోపా వారు మరణిస్తారని బ్రిటన్నుంచి వెలువడే వారపత్రిక ఎకానమిస్ట్‌ నవంబరు 28వ తేదీ సంచిక విశ్లేషణ పేర్కొన్నది. ఐరాస అధికారికంగా ప్రకటించిన తాజా సమాచారం ప్రకారం ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా అక్కడ మరణించిన పౌరులు 6,900 మంది, గాయపడిన వారి సంఖ్య పదివేలకు చేరింది. మిలిటరీ పరంగా ఎందరు సైనికులు మరణించిందీ నిర్ధారించటం కష్టమని రెండు వైపులా మరణించిన వారు 25 నుంచి 30వేల చొప్పున ఉండవచ్చని ఎకనమిస్ట్‌ పేర్కొన్నది. చలికాలంలో ఇంథన ధరలు పెరిగితే దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే ఇతివృత్తంతో గత సమాచార ప్రాతిపదికన ప్రాణ నష్టం గురించి పేర్కొన్నది. అసాధారణ రీతిలో గాస్‌, విద్యుత్‌ ధరలు పెరిగిన కారణంగా రానున్నది ప్రత్యేకమైన చలికాలంగా మారితే సాధారణ మరణాలకంటే లక్షా 47వేల మంది అదనంగా మరణిస్తారని పేర్కొన్నది. చలి మరింత తీవ్రంగా ఉంటే, వాతావరణ మార్పులు జరిగితే ఈ సంఖ్య 3,35,000 ఉండవచ్చని పేర్కొన్నది. చలి తక్కువగా ఉన్నప్పటికీ కనిష్టంగా 79 వేలు అదనంగా ఉండవచ్చని తెలిపింది.జూన్‌-ఆగస్టు నెలలతో పోలిస్తే డిసెంబరు-ఫిబ్రవరి మధ్య మరణాలు 21శాతం ఎక్కువగా ఉంటాయని అంచనా. ఈ విశ్లేషణ తరువాత ఐరోపా ప్రభుత్వాలు, సమాజాల్లో స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.రికార్డు స్థాయిలో పెరిగిన ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల కారణంగా పేదలు, మధ్యతరగతి జనాలు చలికాలంలో ఆహారానికి ఎక్కువ సొమ్ము వెచ్చించాలా గృహాలను వెచ్చచేసుకొనే ఇంథనానికి ఎక్కువ ఖర్చు చేయాలా అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది.2000 నుంచి 2019 ధరలతో పోల్చితే గాస్‌ ధర 144, విద్యుత్‌ ధర 78శాతం పెరిగింది. ఇటలీలో 2020 నుంచి 200శాతం వరకు విద్యుత్‌ బిల్లులు పెరిగాయి. ఎక్కువగా నష్టం, ఇబ్బందులు పడుతున్నది ఐరోపా సమాజమే గనుక దాన్నుంచి బయటపడేందుకు ఉక్రెయిన్‌ – రష్యా చర్చలకు వత్తిడి తెచ్చే అవకాశం ఉంది.

పాలస్తీనాను అడ్డుకుంటున్న అమెరికా – నేడు సంఘీభావ దినం !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఏడున్నర దశాబ్దాలుగా మాతృదేశంలోనే బందీలుగా, కొలువులు నెలవులు తప్పిన వారిగా, ఇరుగు పొరుగు దేశాల్లో శరణార్ధుల శిబిరాల్లోనే పుట్టి పెరిగి, మరణించిన వారెవరైనా వర్తమాన ప్రపంచంలో ఉన్నారంటే వారే పాలస్తీనా అరబ్బులు. ఐరాస చరిత్రలో ఘోర వైఫల్యాల్లో తాను చేసిన పాలస్తీనా తీర్మానాన్ని అమలు జరపలేని అసమర్ధత. జోర్డాన్‌, లెబనాన్‌, సిరియా, సౌదీ అరేబియా, ఇరాక్‌లలో లక్షలాది మంది పాలస్తీనియన్లు శరణార్ధులుగా ఉన్నారు.1947 నవంబరు 29న ఐక్య రాజ్యసమితి సాధారణ అసెంబ్లీ ఆమోదించిన 181వ తీర్మానం ప్రకారం పాలస్తీనాను రెండుగా చీల్చి ఒక ముక్కను ఇజ్రాయల్‌గా ప్రకటించారు. చారిత్రాత్మక జెరూసలెం పట్టణం, పరిసరాలను ఎవరికీ చెందకుండా వాటికన్‌ మాదిరి ప్రత్యేక ప్రాంతంగా ఉంచాలని ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని అరబ్బులు తిరస్కరించారు.1948 మే 14 అధికారికంగా ఇజ్రాయల్‌ ఏర్పాటు ప్రకటన జరగ్గానే అరబ్బులు తిరుగుబాటు చేశారు అప్పటికే బ్రిటన్‌, అమెరికా తదితర సామ్రాజ్యవాదులు కుట్ర చేసి ఇతర దేశాల్లోని యూదులను రప్పించటమే గాక విభజిత ప్రాంతంలో వారికి ఆయుధాలు, డబ్బు అందచేసి సిద్దంగా ఉంచారు. ఎప్పుడైతే అరబ్బులు తిరుగుబాటు చేశారో దాన్ని సాకుగా తీసుకొని . యూదు సాయుధ మూకలు మొత్తం పాలస్తీనా ప్రాంతాన్ని ఆక్రమించేందుకు పూనుకున్నాయి.ఆ క్రమంలో ఇజ్రాయల్‌ దురాక్రమణను నివారించేందుకు ఇరుగు పొరుగు అరబ్బు దేశాలు పాలస్తీనా ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. తరువాత జరిగిన అనేక పరిణామాల్లో అమెరికా రంగ ప్రవేశం చేసి పాలస్తీనాకు గుర్తింపు రాకుండా అడ్డుపడుతున్నది. దాని అండ చూసుకొని ఇరుగుపొరుగు దేశాలపై ఇజ్రాయల్‌ దాడులకు దిగి కొన్ని ప్రాంతాలను తన ఆక్రమణలోకి తెచ్చుకుంది. పాలస్తీనాకు కేటాయించిన ప్రాంతాలను ఆక్రమించుకుంది. ఇతర చోట్ల నుంచి యూదులను రప్పించి అక్కడ శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసి అరబ్బులను మైనారిటీలుగా మార్చివేసి అవి కూడా తనవే అనే అడ్డగోలు వాదనకు దిగింది. జరూసలెం పట్టణాన్ని కూడా ఆక్రమించి అది కూడా తనదే అని ప్రకటించుకుంది. తన రక్షణకు హామీగా మరికొన్ని ప్రాంతాలను తనకు అప్పగించాలని విపరీత కోర్కెలను ముందుకు తెస్తున్నది.


మధ్య యుగాల్లో జరిగిన మత యుద్దాలలో యూదులను పాత ఇజ్రాయల్‌, జుడా దేశాల నుంచి తరిమివేశారు. ఆక్రమంలో వారంతా అనేక దేశాలకు వెళ్లారు. చరిత్రలో వారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే పేరుతో ఇజ్రాయల్‌ను పునరుద్దరించాలనే వాదాన్ని ముందుకు తెచ్చారు. పశ్చిమాసియాలో కనుగొన్న చమురు నిల్వలను సొంతం చేసుకోవటం కూడా దానివెనుక ఉంది. తమకు విశ్వాసపాత్రధారిగా ఉండేందుకు బ్రిటన్‌ సామ్రాజ్యవాదులు పన్నిన ఎత్తుగడలో భాగంగా మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ఏర్పడిన పాలస్తీనాను రెండు ముక్కలుగా చేసి ఇజ్రాయల్‌ను ఏర్పాటు చేశారు. అడ్డగోలుగా చేసిన తీర్మానాన్ని యూదులు అంగీకరించగా అరబ్బులు తిరస్కరించారు. ఒక పరిష్కారాన్ని కనుగొనే పేరుతో ఐరాస కొత్త వివాదాన్ని ముందుకు తెచ్చింది. పాలస్తీనాను మూడు ముక్కలుగా చేసి వాటి చుట్టూ ఉన్న ప్రాంతాలను ఇజ్రాయల్‌కు కేటాయించింది. జెరూసలెం నగరం పాలస్తీనా మధ్యలో ఉంది. పాలస్తీనా పౌరులు తమ దేశంలోని ప్రాంతాలకు వెళ్లాలంటే ఇజ్రాయల్‌ అనుమతి అవసరం. 1948 దాడులలో యూదులు జెరూసలెంను ముట్టడించారు. దాన్ని ఎదుర్కొనేందుకు రంగంలోకి దిగిన జోర్డాన్‌ పాలకులు జోర్డాన్‌ నదికి పశ్చిమాన ఉన్న (దాన్నే పశ్చిమ గట్టు ప్రాంతం అంటారు) పాలస్తీనా ప్రాంతాలు, తూర్పు జెరూసలెంను అదుపులోకి తీసుకొని తరువాత వాటిని విలీనం చేసుకున్నట్లు ప్రకటించారు. తరువాత వాటి మీద తమ హక్కును వదులుకున్నట్లు ప్రకటించింది.


అంతకు ముందు పశ్చిమ జెరూసలెం పట్టణాన్ని ఆక్రమించుకున్న ఇజ్రాయిల్‌ తరువాత అసలు మొత్తం నగరాన్ని స్వంతం చేసుకుంది. రాజధానిగా టెల్‌అవీవ్‌ ఉన్నప్పటికీ ఐరాస తీర్మానం,అరబ్బుల అభిప్రాయాలకు విరుద్దంగా పార్లమెంటుతో సహా ప్రభుత్వశాఖలన్నింటినీ అక్కడ ఏర్పాటు చేసింది. దేశ అధ్యక్షుడు, ప్రధాని నివాసాలు, సుప్రీం కోర్టును కూడా అక్కడే ఏర్పాటు చేశారు. దీన్ని అంతర్జాతీయ సమాజం ఆమోదించలేదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ 2017 డిసెంబరులో జెరూసలెంను ఇజ్రాయల్‌ రాజధానిగా గుర్తిస్తూ టెల్‌ అవీవ్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని అక్కడికి తరలిస్తున్నట్లు ప్రకటించాడు. వివాదాస్పద ప్రాంతంలోని ఒక భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఇటీవలనే శాశ్వత భవనానికి స్థలం కేటాయించినట్లు అక్కడి మేయర్‌ ప్రకటించాడు. ఈ విధంగా ఐరాస తీర్మానాన్ని అమెరికా కూడ ఉల్లంఘించింది. పశ్చిమ గట్టు ప్రాంతం పాలస్తీనాది కాగా అక్కడ 167 అరబ్బుల నివాస ప్రాంతాలు మాత్రమే పాలస్తీనా ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. ఇజ్రాయల్‌ తన పౌరులతో నింపేందుకు నిర్మించిన 200 నివాస ప్రాంతాలు దాని ఆధీనంలో ఉన్నాయి. ఈ ప్రాంతాలలో మిలిటరీ,యూదు దురహంకార శక్తులు నిత్యం అరబ్బులతో గిల్లి కజ్జాలకు పాల్పడుతుంటాయి, వారు ప్రతిఘటిస్తే దాడులు జరుపుతాయి. గాజా ప్రాంతంలో పాలస్తీనా విముక్తి కోసం పోరాడే హమస్‌ సంస్థ అధికారంలోకి వచ్చిన తరువాత 2007 నుంచి ఆప్రాంత మొత్తాన్ని ఇజ్రాయల్‌ దిగ్బంధనం గావించింది. గతంలో దాడులు కూడా చేసింది.


పాలస్తీనా ప్రాంతాలన్నింటితో కూడిన ప్రభుత్వాన్ని 1948 సెప్టెంబరు 22న అరబ్‌లీగ్‌ నాడు ఈజిప్టు రక్షణలో ఉన్న గాజా ప్రాంతంలో ఏర్పాటు చేసింది. దాన్ని ఒక్క జోర్డాన్‌ తప్ప అన్ని అరబ్‌ దేశాలూ గుర్తించాయి. 1988లో పాలస్తీనా ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అల్జీర్స్‌లో పిఎల్‌ఏ నేత యాసర్‌ అరాఫత్‌ ప్రకటించాడు.1993లో ఓస్లో ఒప్పందాల తరువాత పశ్చిమ గట్టు, గాజా ప్రాంతాల్లో పరిమిత అధికారాలు గల ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం పాలస్తీనాను ఐరాసలోని 193కు గాను 138 దేశాలు గుర్తించాయి.2012లో ఐరాస ఆమోదించిన తీర్మానం ప్రకారం సభ్యురాలు గాని పరిశీలక దేశ హౌదాను కల్పించారు. ప్రస్తుతం అరబ్‌లీగ్‌, ఇస్లామిక్‌ దేశాల సంస్థ, జి77, అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ,యునెస్కో, అంక్టాడ్‌, అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టులో ప్రతినిధిగా ఉంది. పూర్తి స్థాయిలో ఐరాసలో సభ్యత్వం ఇస్తే ఐరాస 181 తీర్మానం ప్రకారం అన్ని ప్రాంతాలను పాలస్తీనాకు అప్పగించాల్సి ఉంటుంది. జరూసలెం సమస్యనూ పరిష్కరించాల్సి ఉంటుంది. అది జరగుకుండా అమెరికా తన వీటో హక్కుతో అడ్డుపడుతున్నది. అందువలన ఇజ్రాయల్‌తో పాటు దానికి మద్దతు ఇస్తున్న అసలైన నేరస్థురాలు అమెరికా, మద్దతు ఇస్తున్న దేశాల వైఖరిని నిరసిస్తూ నవంబరు 29న ప్రపంచమంతటా పాలస్తీనాకు మద్దతుగా జన సమీకరణ జరుగుతున్నది.మన దేశంలో అఖిల భారత శాంతి సంఘీభావ సంస్థ ఈ మేరకు పిలుపునిచ్చింది.

భారత్‌పై ప్రపంచ మాంద్య ప్రభావం పడనుందా !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


నిన్నా మొన్నా ఫేస్‌బుక్‌, ట్విటర్‌, అమెజాన్‌ సంస్థల్లో సిబ్బంది తొలగింపు వార్తలు, నేడు గూగుల్‌ ప్రకటన, రేపు ఏ కంపెనీ ఎందరిని తొలగిస్తుందో తెలవదు. ఈ ప్రకటనల నడుమ హైదరాబాద్‌లో అమెజాన్‌ కంపెనీ డేటా కేంద్రంతో వేలాది మందికి ఉపాధి కబురు. ఒక వైపు ఆర్థిక మాంద్యం గుబులు-మరోవైపు లాభాల వేటలో కంపెనీల కొత్త కేంద్రాల ఏర్పాటు ! ఐటి కంపెనీల్లో కోతలు, కంపెనీల్లో రోబోట్లు, ఆధునిక యంత్రాల ప్రవేశం వెరసి ఉద్యోగాలు హాంఫట్‌ ! ప్రపంచంలో ఏం జరుగుతోంది ? ఉన్న ఉపాధి కోల్పోయినా, కొత్త ఉద్యోగాలు రాకపోయినా కుటుంబాల మీద దాని ప్రభావం పడుతుంది. అది తిరిగి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. దాంతో మందగమనం తదుపరి మాంద్యం, అది ముదిరితే ఆర్థిక సంక్షోభం. కుటుంబాల మీద మరింత ప్రతికూల ప్రభావం, ఇదొక విష వలయం. ప్రపంచం, దేశం, రాష్ట్రం, కుటుంబాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్న చర్చలు ప్రారంభం అయ్యాయి. ప్రపంచ ధనిక దేశాల్లో మాదిరి తీవ్ర పరిస్థితులు మన దేశంలో తలెత్తుతాయా ? తెలంగాణా మీద ఎలాంటి ప్రభావం పడుతుంది ? మనమందరం ప్రపంచీకరణ యుగంలో ఉన్నాం. అందువలన ప్రతి చోటా జరిగే ప్రతి పరిణామమూ తరతమ తేడాలతో అందరి మీదా పడుతుంది. అమెరికాలో ఫేస్‌బుక్‌, అమెజాన్‌, గూగుల్‌ వంటి కంపెనీల్లో ఉద్యోగులను తొలగిస్తే వారిలో మన భారతీయులు,తెలుగువారు, ఆంధ్ర, తెలంగాణా వారు కూడా ప్రభావితులైనారు. చివరికి వారిలో మన కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు కూడా ఉండవచ్చు.


ప్రపంచ వ్యాపితంగా ఆర్థికరంగం అనిశ్చితంగా ఉంది. వచ్చే ఏడాది అనేక దేశాలు మాంద్యంలోకి వెళ్ల వచ్చుననే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వృద్ధి రేటును ప్రకటిస్తారు. ఏ దేశంలో వరుసగా ఆరు నెలల పాటు తిరోగమన(మైనస్‌) వృద్ది నమోదైతే అది మాంద్యంలోకి జారినట్లు పరిగణిస్తారు. గతంలో అనేక దేశాలు అలా దిగజారి తిరిగి కోలుకున్నాయి. పెట్టుబడిదారీ విధానం అనుసరిస్తున్న దేశాల్లో ప్రతి పదేండ్లకు ఒకసారి ఈ పరిస్థితి ఏర్పడినట్లు గత చరిత్ర వెల్లడించింది. 2008లో, 2020లో కరోనా సందర్భంగా తలెత్తిన పరిస్థితి కంటే రానున్న మాంద్యం మరింత తీవ్రంగా ఉండనుందని ఐరాస హెచ్చరించింది. వాణిజ్యం-అభివృద్ది 2022 నివేదిక ప్రకారం ప్రపంచం మాంద్యం అంచున ఉంది, ఆసియాలోని అభివృద్ది చెందుతున్న దేశాలు దీని పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నది.

ఆర్థికవేత్తలు చెప్పిన వాటన్నింటినీ క్రోడీకరిస్తే మాంద్యానికి ఐదు ప్రధాన అంశాలు దోహదం చేస్తున్నట్లు చెబుతున్నారు. అమెరికా డాలరు గత కొన్ని నెలలుగా బలపడుతున్నది, గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత బలంగా ఉంది. మరింత బలంగా మారనుందని అంచనా. బలమైన డాలరు అమెరికాకు బలమూ, నష్టమూ కలిగించినట్లుగానే ప్రపంచ దేశాలకూ ఉంటుంది. బ్రిటీష్‌ పౌండ్‌,ఐరోపా యురో, చైనా, జపాన్‌, మనతో పాటు దాదాపు అన్ని దేశాల కరెన్సీల విలువలను కోల్పోయాయి. ఫలితంగా దిగుమతులు భారంగా మారుతున్నాయి. ఉదాహరణకు 2014లో అక్టోబరులో ముడిచమురు పీపా ధర 92 డాలర్లు ఉండగా మన కరెన్సీలో రు.5,650 చెల్లించాము. ఇప్పుడు 91 డాలర్లు ఉండగా పీపాకు రు.7,514 చెల్లించాము. దీనికి కారణం మన కరెన్సీ మారకపు విలువ 61.40 నుంచి 82.26 దిగజారటమే కారణం. అన్ని దిగుమతి వస్తువుల ధరలూ ఇదే మాదిరి పెరిగాయి. మన వారు విదేశాల్లో చదువుకుంటే వారి మీద ఇదే మాదిరి అదనపు భారం పడుతున్నది. ద్రవ్యోల్బణం పెరిగినపుడు, కరెన్సీ విలువలు పతనమైనపుడు అదుపు చేసేందుకు వడ్డీ రేట్లు పెంచుతున్నారు. ఇది కొత్త సమస్యలకు కారణం అవుతున్నది. ఇది అమెరికాకూ వర్తిస్తుంది. అక్కడ వడ్డీ రేట్లు పెంచినపుడల్లా ఇతర దేశాల నుంచి డాలర్లు అక్కడకు చేరుతున్నాయి.దీని వలన అమెరికన్లు లాభపడుతున్నారా అంటే అదీ లేదు.ద్రవ్యోల్బణంతో వృద్ధిరేటు దిగజారి మాంద్యంలోకి దిగజారే ముప్పు ఉంది.వడ్డీ రేట్లు పెరిగితే పరిశ్రమలు, వాణిజ్యాల పెట్టుబడులపై భారం పెరుగుతుంది. కొత్తగా పెట్టుబడులు ఉండవు, పరిశ్రమలూ రావు. రుణాలు తీసుకొని ఇండ్లు కొనుగోలు చేసిన వారికి భారం పెరుగుతుంది. ధరల పెరుగుదలతో జనాల జేబులకు చిల్లిపడి వస్తువులను తక్కువగా కొనుగోలు చేస్తారు. అది మాంద్యానికి దారితీస్తుంది. డిమాండ్‌ తగ్గటంతో ఆపిల్‌ ఐఫోన్‌ 14 ఉత్పత్తి తగ్గించింది. దాంతో దాని షేర్ల ధర తగ్గింది.

ఇతర దేశాల్లో మాంద్య పరిస్థితులు ఏర్పడితే వాటి మార్కెట్లపై ఆధారపడిన ప్రతిదేశమూ ప్రభావితం అవుతుంది. పశ్చిమ దేశాల్లో డిమాండ్‌ తగ్గిన కారణంగా రెండు సంవత్సరాల్లో తొలిసారిగా 2022 అక్టోబరులో మన ఎగుమతులు 16.7 శాతం తగ్గాయి. దిగుమతులు పెరిగినందున మన దేశంలో డిమాండ్‌ పెరిగిందని చెబుతున్నారు. మన పెట్టుబడులు ఎగుమతి ఆధారితంగా ఉన్నందున వృద్ధి రేటు పడిపోనుందని అంచనా వేస్తున్నారు, అదే జరిగితే అంతర్గత డిమాండ్‌ కూడా తగ్గుతుంది. అక్టోబరు నెలలో ఎగుమతి చేసే 30 వస్తువులకు గాను 24 తిరోగమనంలో ఉన్నాయి. ఎలక్ట్రానిక్‌ వస్తువులు, బియ్యం, టీ, చమురు గింజలు, పొగాకు, చమురు గింజల ఉత్పత్తుల ఎగుమతుల్లో పెరుగుదల ఉంది. చమురు ఉత్పత్తుల ఎగుమతులు సెప్టెంబరులో 43శాతం పెరగ్గా అక్టోబరులో 11.4శాతం తిరోగమనంలో ఉన్నాయి. ఇంజనీరింగ్‌ వస్తువులు 21.3, ఆభరణాలు 21.6, రసాయనాలు 16.4, రెడీమేడ్‌ దుస్తులు 21.2,డ్రగ్స్‌-ఫార్మా 9.24 శాతాల చొప్పున తిరోగమనంలో ఉన్నాయి. తెలంగాణా, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ జాబితాలోని వస్తువుల ఎగుమతులు జరుగుతుంటే వాటి ప్రభావం రాష్ట్ర సంస్థలు, వాటిలో పని చేసే సిబ్బంది మీద కూడా పడుతుంది. రానున్న రోజుల్లో పశ్చిమ దేశాల్లో పరిస్థితులు ఇంకా దిగజారవచ్చని చెబుతున్నందున పరిస్థితిని ఊహించలేము.


పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభానికి గురైనపుడల్లా కార్మికవర్గం మీద దాని భారాలను మోపి తాను తప్పించుకొనేందుకు చూస్తుంది. 2008లో తలెత్తిన సంక్షోభం తరువాత కూడా అదే జరుగుతోంది. దానిలో భాగంగా ఐటి కంపెనీలన్నీ రోబో ప్రోసెస్‌ ఆటోమేషన్‌ (ఆర్‌పిఏ) వైపు కేంద్రీకరించాయి. ఇది ఏదో ఒక దేశానికే పరిమితం కాదు. బాంక్‌ ఆఫ్‌ అమెరికా గతంలో ఒక విశ్లేషణలో పేర్కొన్నదాని ప్రకారం 2022 నాటికి మన దేశంలోని కోటీ 70 లక్షల ఐటి, ఐటి సంబంధిత ఉద్యోగాల్లో 30లక్షలు రద్దవుతాయని అంచనా వేసింది. పరిశ్రమల్లో కార్మికుల బదులు రోబోలు పని చేస్తాయి. ఐటి రంగంలో రోబో ప్రాసెస్‌ అంటే ఇంజనీర్ల బదులు రోబోలు అని కాదు, వాటి ప్రోగ్రామ్స్‌లో చేసే మార్పులతో ఎక్కువ మంది సిబ్బందితో పనిలేకుండా చేస్తాయి. డేటా విశ్లేషణ, ఎకౌంటింగ్‌, ఫైనాన్స్‌, కస్టమర్‌ సర్వీస్‌ వంటి సేవలను ఆటోమేషన్‌, కృత్రిమ మేథతో చేసి కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకొని లాభాలకు ముప్పు లేకుండా చూసుకుంటున్నాయి. ఇప్పుడు అలాంటి క్రమంలోనే అమెరికాలో ఐటి రంగంలో ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఎంతో నిపుణులైన వారిని మాత్రమే ఉంచుకుంటారు. కొన్ని కంపెనీలు తొలగించకపోయినా కొత్తగా సిబ్బందిని తీసుకోకుండా సర్దుబాటు లేదా విస్తరణకు పూనుకుంటాయి.కొత్త కంపెనీలు పరిమిత సిబ్బందిని మాత్రమే చేర్చుకుంటాయి.


గార్టనర్‌ కార్పొరేషన్‌ పేర్కొన్న సమాచారం ప్రకారం 2022లో ఆర్‌పిఏ సాఫ్ట్‌వేర్‌ 20శాతం పెరుగుతుందని, అందుకోసం కంపెనీలు 290 కోట్ల డాలర్లను ఖర్చు చేయనున్నట్లు అంచనా వేసింది. ప్రపంచమంతటా 2023లో ఈ సాఫ్ట్‌వేర్‌ మార్కెట్‌ రెండంకెల వృద్ధి సాధిస్తుందని పేర్కొన్నది. అంటే అది పెరిగే కొద్దీ తీసివేతలు మరింతగా ఉంటాయి, కొత్త అవకాశాలు తగ్గుతాయి.ఆర్‌పిఏ సాఫ్ట్‌వేర్‌తో పని చేసే కంప్యూటర్ల మీద పనిచేసేందుకు సాంకేతిక అర్హతలున్నవారే ఉండనక్కరలేదు. మరోవైపున నైపుణ్యాలు ఎక్కువగా ఉన్న అవకాశాలు, వేతనాలూ పెరుగుతాయి. ఇదే సమయంలో జనాలకు మరింత వేగంగా సేవలు, కంపెనీలకు లాభాలు ఉంటాయి. సేవలు మెరుగుపడినందుకు సంతోషించాలా ? ఉపాధి తగ్గినందుకు విచారపడాలా ? ఇప్పుడు ప్రపంచమంతటా కంపెనీలన్నీ ఆర్‌పిఏ లాభ నష్టాల గురించి మదింపు చేసుకుంటున్నాయి. లాభం లేనిదే వ్యాపారి వరద ప్రాంతాలకు పోడు అన్న సామెత తెలిసిందే.వర్తమాన సంవత్సరంలో ఇంతవరకు ప్రపంచంలో 853 టెక్‌ కంపెనీలు 1,37,492 మందిని తొలగించినట్లు తాజా సమాచారం. అదే కరోనా మహమ్మారి తలెత్తినప్పటి నుంచి చూస్తే 1,388 సంస్థలు 2,33,483 మందిని ఇంటికి పంపాయని లేఆఫ్స్‌ డాట్‌ ఫై అనే సంస్థ వెల్లడించింది. ఐటి రంగంలో పని చేస్తున్న వారికి, ఉపాధికోసం చూస్తున్న వారికి 2022 సంవత్సరం ఒక పీడకలగా మిగిలిపోనుంది.


2023లో మాంద్యం తలెత్తితే మన దేశం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అనే తర్జన భర్జన మొదలైంది. మన దేశం ప్రపంచీకరణలో మరీ లోతుగా దిగలేదు గనుక అంతగా మునగం అన్నది ఒక భావం. ప్రతి సంక్షోభంలో తొలుత నష్టపడేది కార్మికులు, సామాన్యులే అన్నది గత అనుభవసారం. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో మన జిడిపి వృద్ది గురించి అనేక సంస్థలు ప్రతినెలా అంచనాలను తగ్గిస్తూనే ఉన్నాయి. అంతిమంగా ఎంత ఉండేది చెప్పలేని స్థితి. కరోనా మహమ్మారి తలెత్తకుండా ఉండి ఉంటే 2016 నుంచి ప్రపంచ ఉత్పత్తి 23శాతం పెరిగి ఉండేదని, ప్రస్తుత అంచనా 17శాతమే అని చెబుతున్నారు. నిజమైన జిడిపి కరోనాకు ముందున్నదాని కంటే తక్కువే. దీని వలన 17లక్షల కోట్ల డాలర్ల మేర నష్టం జరిగిందని అంచనా. గతంలో ఎక్కువ వృద్ది రేటు ఉన్న దేశాలే ఎక్కువ భాగం నష్టపడ్డాయి.2019 జిడిపి సూచిక 110 కాగా కరోనా లేకుంటే 2023 నాటికి 123.4 పెరిగి ఉండేది, అలాంటిది ఇప్పుడు 117.3కు మాత్రమే చేరుతుందని అంచనా. ఇటీవలి పరిణామాలు మన ఆర్థిక రంగం మీద తీవ్ర వత్తిడిని కలిగిస్తున్నాయి. ఆహార ధరల సూచిక 2021 నవంబరులో 148.2 ఉంటే 2022 అక్టోబరు నాటికి 165.2కు పెరిగింది. మన దేశం కొనుగోలు చేస్తున్న ముడి చమురు పీపా ధర 2020-21లో సగటున 44.82 డాలర్లుంటే 2021-22లో 79.18, 2022-23లో నవంబరు 22 నాటికి 100.2 డాలర్లు ఉంది. ఇలాంటి భారాలు ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో పరిమితం కావు. దేశమంతటా ఉంటాయి.


పశ్చిమ దేశాల్లో ఆర్థికరంగంలో సంభవించే మార్పుల పరిణామాలు, పర్యవసానాల గురించి అందుబాటులో ఉండే సమాచారము ఎక్కువగా ఉంటుంది గనుక విశ్లేషణలు కూడా వెంటనే వెలువడతాయి. మన దేశంలో దానికి విరుద్దం. సమాచార ప్రభావం ఎక్కడ తమ ఎన్నికల లబ్ది మీద పడుతుందో అని అధికారంలో ఉన్నవారు తొక్కి పట్టటం, ప్రభావాన్ని తక్కువగా చూపటం జరుగుతోంది. ఉదాహరణకు 2019లోక్‌ సభ ఎన్నికలకు ముందు నాలుగు దశాబ్దాల రికార్డును నిరుద్యోగం బద్దలు కొట్టిందని సమాచారం తెలుపగా దాన్ని వెల్లడించకుండా కేంద్ర ప్రభుత్వం తొక్కిపట్టింది. తీరా అది అనధికార మార్గాల ద్వారా బహిర్గతం కావటంతో అది తప్పుల తడక అని దాన్ని నమ్మవద్దంటూ కేంద్రం చెప్పింది. తీరా ఎన్నికలు ముగిసిన తరువాత అదే వాస్తవమంటూ ఆ విశ్లేషణను ఆమోదిస్తున్నట్లు ప్రకటించింది. 2014 నుంచి ప్రపంచ సంస్థలు వెలువరించే అనేక సూచికల్లో మన దేశం వెనుకబడి ఉండటాన్ని చూస్తున్నాము. అన్ని దేశాలకూ వర్తింప చేసే పద్దతినే మన దేశానికీ వర్తింప చేస్తున్నప్పటికీ మన దేశ వాస్తవాలను ప్రతిబింబించటం లేదని ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నది, నిరాకరిస్తున్నది తప్ప వాస్తవం ఏమిటో తన అంకెలను ఇంతవరకు వెల్లడించలేదు.


ధనిక పశ్చిమ దేశాల్లో జరిగే పరిణామాలు వెంటనే మన దేశం మీద పడే అవకాశం లేదు. 2008లో ఆ దేశాల్లో మాదిరి బాంకులు మన దేశంలో కుప్పకూలలేదు.కారణం అవి ప్రభుత్వరంగంలో ఉండటమే. ఇప్పుడు ఐటి కంపెనీల్లో జరుగుతున్న లేఆఫ్‌లు, తొలగింపులు ప్రధానంగా అమెరికాలో జరుగుతున్నాయి. ఆర్థిక మాంద్యం మహా సంక్షోభంగా మారినపుడు ప్రతి దేశాన్ని ఆవహిస్తుంది. మన జిడిపి వృద్ది రేటు బ్రిటన్‌లో మాదిరి తిరోగమనంలో పడలేదు. తాజాగా బ్రిటన్‌లో తలెత్తిన స్థితిని చూస్తే మాంద్యం కారణంగా ఎనిమిది సంవత్సరాల్లో పెరిగిన గృహస్తుల రాబడి హరించుకుపోయి జీవన వ్యయ సంక్షోభం తలెత్తింది.వంద బిలియన్‌ పౌండ్ల ప్రభుత్వ ఉద్దీపన ఉన్నప్పటికీ 2024 ఏప్రిల్‌ నాటికి నిజ ఆదాయాలు ఏడుశాతం తగ్గుతాయని అంచనా. ఉత్పత్తి రెండు శాతం తిరోగమనంతో ఐదులక్షల ఉద్యోగాలు పోయినట్లు అంచనా.


పశ్చిమ దేశాల్లో తలెత్తిన సంక్షోభం మన దేశంలో లేదా తెలంగాణాలో లేదు అంటే దాని అర్ధం అసలేమీ సమస్యలు లేవని అంతా సజావుగానే ఉందని కాదు. తెలంగాణా పౌరస్పందన వేదిక నిర్వహించిన ఒక సర్వే, యుటిఎఫ్‌ చెబుతున్న దాని ప్రకారం రాష్ట్ర పాఠశాలల్లో 26వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బంగారు, ధనిక రాష్ట్రం అని చెబుతున్న చోట ఇలాంటి పరిస్థితి ఉండటం ఆర్ధిక ఇబ్బందులకు నిదర్శనంగా చెప్పవచ్చు. మార్చి నెలలో సిఎం కెసిఆర్‌ ఆర్భాటంగా ప్రకటించిన 90వేల ఖాళీల భర్తీ ఎక్కడుందో ఎవరికీ అర్ధం కాదు. అన్ని శాఖల్లో ఉన్న ఖాళీల గురించి చెబుతున్న అంకెలకు ఒకదానికి ఒకటి పొంతన ఉండటం లేదు. ప్రభుత్వం శ్వేత పత్రం ప్రకటిస్తే తప్ప జనానికి అర్ధం కాదు. ఉన్న సిబ్బంది, పెన్షనర్లకు సకాలంలో వేతనాలు చెల్లించలేని స్థితిలో ఈ ఖాళీలను భర్తీ చేస్తే ఏటా ఏడున్నరవేల కోట్ల మేరకు అదనంగా ఖర్చు అవుతుందని అంచనా. ఈ కారణంగానే గత ఎనిమిది సంవత్సరాలుగా సంక్షేమ పథకాలకు తప్ప ఉద్యోగాల భర్తీకి పూనుకోవటం లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక సాకు చెబుతున్నారు.ప్రభుత్వం మీద పైసా అదనపు భారం పడని వివిధ రంగాల కనీసవేతనాల సవరణకూ ప్రభుత్వం ముందుకు రావటం లేదు.


తెలంగాణాలో ఉన్న భూముల అమ్మకం, రిజిస్ట్రేషన్‌ ఛార్జీల పెంపు వంటి చర్యల ద్వారా సమకూరుతున్న ఆదాయం సంక్షేమ పథకాలకు తప్ప వనరుల పెంపుదలకు అవసరమైన పెట్టుబడులు పెట్టటం లేదనే విమర్శ ఉంది. కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను అతిక్రమించేందుకు ప్రభుత్వాలు తీసుకొనే రుణాలకు పరిమితులు ఏర్పడటంతో వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా అప్పులు తీసుకొని వాటికి ప్రభుత్వం హామీదారుగా ఉంటున్నది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఈ మొత్తాలను కూడా ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామని ప్రకటించి వెనుకటి నుంచి అమలు జరుపుతామని ప్రకటించటంతో కొత్తగా తీసుకొనే రుణాల మొత్తం తగ్గే పరిస్థితి తలెత్తింది. ఇలాంటి అప్పులను బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా తీసుకుంటున్న కారణంగా వచ్చే ఏడాది నుంచి అమలు జరుపుతామని చెప్పటంతో కాస్త ఊరట లభించింది. వర్తమాన సంవత్సర జిఎస్‌డిపి పదమూడు లక్షల కోట్లుగా అంచనా వేశారు.దీని ప్రకారం నాలుగుశాతం అంటే 52వేల కోట్ల మేరకు అప్పులు తీసుకోవచ్చు. హామీ రుణాలను కూడా పరిగణనలోకి తీసుకోవటంతో 43వేల కోట్లకు మించి తీసుకొనే అవకాశం లేకపోయింది. దీంతో నెలవారీ ఖర్చులు – రాబడి తేడా ఒకటి నుంచి రెండువేల కోట్ల వరకు ఉండటంతో ప్రతినెలా ఇబ్బంది పడుతున్నది. అనేక అభివృద్ధి పనులకు కోతలు పెడుతున్నారు.2020-21లో ఇండ్ల నిర్మాణానికి 10,591 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది కేవలం ఆరువందల కోట్లే. అలాటే పట్టణాభివృద్దికి 13,053 కోట్లకు గాను ఖర్చు 3,816 కోట్లు మాత్రమే. అందుకే రెండు పడకల ఇండ్లు లేవు, పట్టణాల్లో వరదలు వస్తే తట్టుకొనే స్థితిలేదు. ఈ ఏడాది ప్రకటించిన బడ్జెట్‌లో ఎన్నికోతలు పెట్టేది తరువాత గానీ వెల్లడి కాదు. ప్రపంచం, దేశంలో మాంద్యం తలెత్తితే తెలంగాణాకు మినహాయింపు ఉండదు.

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు : ఆసియాలో అమెరికా చిచ్చు పర్యవసానమే !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగాలను ఖండించేందుకు,మరిన్ని ఆంక్షలను మోపేందుకు సోమవారం నాడు జరిగిన భద్రతా మండలి సమావేశం చైనా, రష్యా అభ్యంతరాలతో ఎలాంటి ప్రకటన చేయకుండానే ముగిసింది. దీంతో వత్తిడి పెంచేందుకు అధ్యక్ష స్థానం పేరుతో ఖండన ప్రకటనకు అమెరికా ప్రతిపాదించింది. నవంబరు నెలలో ఘనా ప్రతినిధి అధ్యక్షత వహిస్తుండగా డిసెంబరు నెలలో మన దేశ వంతు రానుంది. పదిహేనుకు గాను భారత్‌తో సహా ఎనిమిది భద్రతా మండలి సభ్యదేశాలు, అమెరికాను అనుసరించే మరో ఆరు, 14 దేశాలు ఉత్తర కొరియాను ఖండిస్తూ చేసిన ప్రకటనను అమెరికా ప్రతినిధి మండలి సమావేశంలో చదివి వినిపించారు.ఉత్తర కొరియా నవంబరు 18వ తేదీన తన దగ్గర ఉన్న శక్తివంతమైన క్షిపణి ప్రయోగం జరిపిందని, అది అమెరికా ప్రధాన భూ భాగం మీద కూడా దాడి చేసే సత్తాకలిగినదని జపాన్‌ రక్షణ మంత్రి హమదా చెప్పాడు. ఈ క్షిపణి జపాన్‌ తీరానికి 200 కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో పడింది.


కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరగటం. వైరుధ్యం తీవ్రం కావటం పట్ల తాము కూడా ఆందోళన చెందుతున్నట్లు సోమవారం నాడు ఐరాసలో చైనా రాయబారి ఝాంగ్‌ జున్‌ అన్నాడు.అయితే భద్రతా మండలి ఉద్రిక్తతలను సడలించటానికి బదులు ఎప్పుడూ ఉత్తర కొరియాను ఖండించటం, వత్తిడి తెస్తున్నదని విమర్శించాడు. న్యాయమైన ఉత్తర కొరియా ఆందోళనలకు ప్రతిస్పందనగా వాస్తవికమైన ప్రతిపాదనలను ముందుకు తెచ్చేందుకు అమెరికా చొరవ తీసుకోవాలని ఝంగ్‌ అన్నాడు. అన్ని పక్షాలూ సంయమనం పాటించాలని, జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికాడు. రష్యా ప్రతినిధి అనా విస్టిజెనీవా మాట్లాడుతూ ఏకపక్షంగా ఆయుధవిసర్జనకు ఉత్తర కొరియాపై అమెరికా వత్తిడి తెస్తున్నదని, అమెరికా, దాని అనుచర దేశాలు జరిపిన సైనిక విన్యాసాల కారణంగానే క్షిపణి పరీక్షలు జరిపినట్లు చెప్పారు. అమెరికా రాయబారి లిండా థామస్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ మాట్లాడుతూ బీజింగ్‌, మాస్కో అడ్డుకుంటున్న కారణంగానే ఉత్తరకొరియాకు ధైర్యం వస్తున్నదని, ఈ రెండు దేశాలూ ఈశాన్య ఆసియా, మొత్తం ప్రపంచానికి ముప్పు తెస్తున్నట్లు ఆరోపించారు.తమకు శత్రువుల నుంచి అణు ముప్పు కొనసాగుతున్నట్లయితే తమ పార్టీ, ప్రభుత్వం కూడా అణ్వాయుధాల తయారీతో సహా అన్ని రకాలుగా ధృడంగా ఎదుర్కొంటామని ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రకటించాడు. ఉత్తర కొరియా అణు, క్షిపణి కార్యక్రమాలను నిరోధించే పేరుతో 2006 నుంచి భద్రతా మండలి ఆంక్షలను విధిస్తూ తీర్మానాలు చేస్తున్నది.


ఒక పధకం ప్రకారం అమెరికా, దాని మిత్ర దేశాలు తమ పధకాలు, ఎత్తుగడల్లో భాగంగా అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నాయి. అలాంటి వాటిలో చైనా, రష్యాలతో సరిహద్దులను కలిగి ఉన్న కొరియా ద్వీపకల్పం ఒకటి. రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ ఆక్రమణల నుంచి వియత్నాం, కొరియాలను విముక్తి చేసే క్రమంలో ఒక వైపు నుంచి సోవియట్‌, మరోవైపు నుంచి అమెరికా సేనలు జపాన్ను ఓడించటంలో కీలక పాత్ర వహించాయి. ఆ క్రమంలో ఎవరి ఆధీనంలోకి వచ్చిన ప్రాంతంలో వారు స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. పరిస్థితులు చక్కబడిన తరువాత విడిన రెండు దేశాలను విలీనం చేయాలని ఒప్పందం జరిగింది. ఆ మేరకు సోవియట్‌ సేనల రక్షణలో ఉన్న ఉత్తర వియత్నాం, ఉత్తర కొరియాలలో జపాన్‌ వ్యతిరేక పోరాటంలో ఆయుధాలు పట్టిన కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. సోవియట్‌ సేనలు వెనక్కు వెళ్లాయి. అమెరికా ప్రాబల్యం కింద ఉన్న దక్షిణ వియత్నాం, దక్షిణ కొరియాలలో తన తొత్తులుగా మారిన మిలిటరీ నియంతలను రుద్దారు. అంతేగాక రకరకాల సాకులతో అమెరికా అక్కడ సైనికంగా తిష్టవేసింది. దక్షిణ వియత్నాంలో కమ్యూనిస్టులు, జాతీయ వాదులు ఏకమై అమెరికా, దాని తొత్తులను తరిమి కొట్టి 1975లో రెండు దేశాలను విలీనం చేశారు. మొత్తం సోషలిస్టు దేశంగా మారింది.


దక్షిణ కొరియాలో తిష్టవేసిన అమెరికా, దాని తొత్తులు కలిసి ఉత్తర కొరియా ప్రాంతాన్ని ఆక్రమించేందుకు 1950దశకంలో పూనుకోవటంతో చైనా, సోవియట్‌ సేనలు అడ్డుకొని తిప్పికొట్టాయి. అప్పటి నుంచి అమెరికా తన సైనిక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఏదో ఒకసాకుతో ఉభయ కొరియాల విలీనాన్ని అడ్డుకుంటున్నది. జపాన్ను లొంగదీసుకొని తన రక్షణ ఒప్పందంలో భాగస్వామిగా చేసి అక్కడ కూడా తన స్థావరాలను ఏర్పాటు చేసింది. ఆ రెండూ కలసి అప్పటి నుంచి చైనా, గతంలో సోవియట్‌, అది విచ్చిన్నం తరువాత రష్యాలను దెబ్బతీసేందుకు నిరంతరం ఏదో ఒక పేరుతో రెచ్చగొడుతున్నాయి. అక్కడ శాశ్వతంగా తిష్టవేసేందుకు పూనుకుంది. అక్కడ జరుగుతున్న పరిణామాలకు అసలు కారణం ఇదే. దక్షిణ కొరియాలో చాలా కాలం మిలిటరీ, ప్రస్తుతం పేరుకు పౌరపాలన ఉన్నా అంతా మిలిటరీ,దాని వెనుక ఉన్న అమెరికా కనుసన్నలలోనే ఉంటుంది. ఐరోపాలో జర్మనీ విభజన జరిగి ఇదే మాదిరి రెండు ప్రాంతాల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అమెరికా, ఫ్రాన్స్‌,బ్రిటన్‌ ప్రాబల్యంలో పశ్చిమ జర్మనీ, సోవియట్‌ అదుపులో తూర్పు జర్మనీ ఉంది. రెండింటినీ విలీనం చేసేందుకు 1952లో సోవియట్‌ నేత స్టాలిన్‌ ఒక ప్రతిపాదన చేశాడు. దాని ప్రకారం ఐక్య జర్మనీ తటస్థ దేశంగా ఉండాలి. దానికి అమెరికా, పశ్చిమ జర్మనీ పాలకులు అంగీకరించలేదు. వెంట వెంటనే జరిగిన పరిణామాల్లో అది ఐరోపా సమాఖ్య, నాటో కూటమిలో చేరింది. తూర్పు జర్మనీ సోషలిస్టుదేశంగా కొనసాగింది. నాటో ముసుగులో అమెరికా సేనలు తిష్టవేశాయి. 1990దశకంలో తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాల్లో జరిగిన పరిణామాలు, సోవియట్‌ విచ్చిన్నం తరువాత రెండు జర్మనీలను కలిపివేశారు. దాన్ని అంగీకరించిన అమెరికా ఆసియాలో కొరియా విలీనానికి మోకాలడ్డుతోంది. ఉత్తర కొరియాను బూచిగా చూపుతోంది. దానికి జపాన్‌ వంతపాడుతోంది.


ఐరాస ప్రధానకార్యదర్శి గుటెరస్‌ ఈ ఉదంత పూర్వపరాలను పరిగణనలోకి తీసుకోకుండా రెచ్చగొట్టే పనులకు పూనుకోవద్దని తమను హెచ్చరించటంపై ఉత్తర కొరియా తీవ్ర విచారం ప్రకటిస్తూ గర్హనీయమైన వైఖరిని ప్రదర్శించారని విదేశాంగ మంత్రి చో సన్‌ హుయి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐరాస ఏర్పాటు, దాని నిబంధనలు, లక్ష్యాలు అన్ని అంశాల్లో నిష్పాక్షికత, వాస్తవికత, సమానత్వం పాటించాల్సి ఉందని అలాంటి సంస్థ ప్రధాన కార్యదర్శి గుటెరస్‌ అమెరికా తొత్తు మాదిరి ఉన్నాడని ఉత్తర కొరియా మంత్రి చెప్పారు. ఆందోళనకరంగా ఉన్న భద్రతా వాతావరణంలో ఆత్మరక్షణకు అన్ని చర్యలూ తీసుకోవాల్సి ఉంటుదని తమ దేశం స్పష్టం చేసిందని, అమెరికా, దాని చేతికింద ఉండే ప్రమాదకరమై మిలిటరీ సహకారంతో ఈ ప్రాంతంలో కలిగిస్తున్న ఉద్రిక్తతల కారణంగానే ఇదంతా జరుగుతుండగా అమెరికాను వదలి ఐరాస తమను మాత్రమే తప్పు పట్టటం ఏమిటని ఉత్తర కొరియా ప్రశ్నిస్తున్నది. పద్దెనిమిదవ తేదీన ఆ దేశ అధినేత కిమ్‌ పర్యవేక్షణలో జపాన్‌ మీదుగా 1,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సముద్రంలో పడిన క్షిపణి గురించి అమెరికా, దాని భజన బృందం నానా యాగీ చేస్తున్నది. ఈ క్షిపణి పరీక్ష జరిగిన వెంటనే అమెరికా-జపాన్‌ వైమానిక దళాలు జపాన్‌ సముద్రంపై విన్యాసాలు జరిపి ఉత్తర కొరియాను బెదిరించినప్పటికీ గుటెరస్‌కు పట్టలేదు.


ఆగస్టు నెల నుంచి అమెరికా – దక్షిణ కొరియా అనేక చిన్నా చితకవాటితో పాటు ఐదు భారీ మిలిటరీ విన్యాసాలు జరిపిన సంగతి, గడచిన రెండు నెలలుగా రోజూ ఏదో ఒక క్షిపణి ప్రయోగం పశ్చిమ దేశాల మీడియా, గుటెరస్‌ వంటి వారికి కనిపించదని అనుకోవాలా లేక చూసేందుకు నిరాకరిస్తున్నట్లా ?నవంబరు ఐదవ తేదీన రెండు దేశాలూ 240 విమానాలతో గతంలో ఎన్నడూ జరపని డ్రిల్లు జరిపిన తరువాతే 18వ తేదీ కిమ్‌ తమ దగ్గర ఉన్న తీవ్రమైన క్షిపణిని వదిలి వారికి చూపించాడు. ఐదవ తేదీకి ముందు కూడా కొన్నింటిని ప్రయోగించాడు. అమెరికా బెదిరింపులు పెరిగిన పూర్వరంగంలో సెప్టెంబరు తొమ్మిదవ తేదీన ఉత్తర కొరియా పార్లమెంటు ఆమోదించిన ఒక బిల్లు ప్రకారం దేశ రక్షణకు అవసరమైతే అణ్వస్త్రాల ప్రయోగానికి కూడా అధ్యక్షుడికి అనుమతి ఇచ్చారు.


గతంలో ఇరాక్‌ మీద దాడి జరిపి సద్దామ్‌ను హతమార్చాలని పథకం వేసిన అమెరికా దానికి ముందు పచ్చి అబద్దాలను ప్రచారం చేసింది. సద్దామ్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసి పరిసర దేశాలకు ముప్పుగా మారాడని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉత్తర కొరియాను కూడా అదే మాదిరి బూచిగా చూపేందుకు చూస్తున్నారు. ప్రపంచంలో అనేక దేశాలు క్షిపణి ప్రయోగాలను నిరంతరం జరుపుతూనే ఉంటాయి. కానీ ఉత్తర కొరియా జరిపినపుడు తమ మీద దాడి జరుగుతున్నట్లుగా జనాన్ని భ్రమింపచేసేందుకు సొరంగాల్లోకి, ఇతర రక్షిత ప్రాంతాలకు వెళ్లాలని జనాలకు చెప్పి జపాన్‌ ప్రభుత్వం హడావుడి చేస్తున్నది. ఇంతవరకు ఒక్కసారి కూడా విఫలమైన క్షిపణులు గానీ మరొకటి గానీ జపాన్‌ భూభాగంపై పడిన దాఖలా లేదు. దానికి సుదూరంగా సముద్రంలో మాత్రమే పడ్డాయి. ఉత్తర కొరియా వద్ద శక్తివంతమైన క్షిపణులు ఉన్నది వాస్తవం, ఇతర దేశాల మాదిరి నిరంతరం వాటి పరిధిని పెంచేందుకు పరిశోధనలు చేస్తున్నారు. అణు కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ప్రపంచాన్ని తన మిలిటరీ శక్తితో శాసించేందుకు చూస్తున్న అమెరికా ఏకంగా తన ముంగిట ఉన్న తరువాత ఉత్తర కొరియా తన భద్రతను తాను చూసుకోకుండా ఎలా ఉంటుంది. అమెరికా,జపాన్‌ దేశాల వద్ద క్షిపణులను పసిగట్టి వాటిని కూల్చివేసే ఆధునిక వ్యవస్థలున్నాయి. అందుకే వాటి రాడార్లకు దొరక్కుండా వేగంగా, తక్కువ ఎత్తులో ఎగురుతూ సుదూరంలోని లక్ష్యాలను చేరే సూపర్‌ సోనిక్‌ క్షిపణుల కోసం నిరంతరం తన అస్త్రాలకు పదును పెడుతున్నది. ఇంతవరకు మరొక దేశం మీద దాడికి దిగిన దాఖలాల్లేవు. అమెరికా ఆయుధాలను మిత్ర దేశాలకు ఇస్తున్నట్లుగానే ఉత్తర కొరియా కూడా తన మిత్ర దేశాల నుంచి సాయం పొందటంలో తప్పేముంది?


ఉత్తర కొరియా దగ్గర ఎంత దూరంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులు ఉన్నదీ ఎవరికి వారు ఊహించుకోవటం తప్ప నిర్ధారణ లేదు. ఒక దుష్ట దేశంగా చిత్రించేందుకు పెద్ద ఎత్తున ప్రచారదాడి జరుగుతున్నది. వారి దగ్గర పదిహేనువేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి అమెరికాలోని ఏ ప్రాంతం మీదైనా దాడి చేయగల సత్తా కలిగినదని జపాన్‌ రక్షణ మంత్రి సుకాజు హమడా ప్రకటించాడు. మమ్మల్ని రక్షిస్తామని చెబుతున్న మీ మీదే దాడి చేయగల క్షిపణులు కిమ్‌ దగ్గర ఉన్నట్లు జపాన్‌ చెప్పటం అమెరికాను రెచ్చగొట్టటం తప్ప మరొకటి కాదు. శుక్రవారం నాడు వదిలిన క్షిపణి ఒకేసారి అనేక బాంబులను మోసుకుపోగలదని, రక్షణ వ్యవస్థలను తప్పించుకోగలదని కొందరు విశ్లేషించారు. 2017లో చివరి సారిగా ఉత్తర కొరియా అణుపరీక్షలు జరిపింది. అప్పటి నుంచి అమెరికా రెచ్చగొడుతూనే ఉంది. దానిలో భాగంగా గత ఐదేండ్లలో తొలిసారిగా నవంబరు మొదటి వారంలో పెద్ద మొత్తంలో అస్త్రాలను మోసుకుపోగల బి-1బి బాంబర్లను అమెరికా ఐదింటిని దక్షిణ కొరియాకు తరలించింది. ఆంక్షలను కఠినతరం గావించేందుకు అమెరికా పూనుకోవటం, చైనా, రష్యా వాటిని వీటో చేయటం జరుగుతోంది. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు వస్తాడు అన్నట్లుగా సాంకేతిక పరిజ్ఞానం ఒకరి సొత్తు కాదు, వెనుకా ముందూ ఉండటం తప్ప ఎవరికీ అసాధ్యం కాదు. అమెరికా ఇప్పుడు ఆర్థికంగా, మిలిటరీ పరంగా అనేక దేశాలను బెదిరిస్తున్నది, ప్రలోభపెడుతున్నది, లొంగదీసుకుంటున్నది. ఉత్తర కొరియా, ఇరాన్‌ వంటివి దానికి కొరకరాని కొయ్యలుగా మారాయి. నిరంతరం ఎక్కడో అక్కడ ఉద్రిక్తతలను రెచ్చగొట్టే క్రమంలో ఇప్పుడు అమెరికా ఆసియాలో చిచ్చు పెట్టింది. గడచిన మూడు దశాబ్దాలుగా అమెరికా బెదిరింపులకు లొంగని ఉత్తర కొరియాను ఇప్పుడు అదుపులోకి తెచ్చుకోవాలనుకోవటం అమెరికా పగటి కల తప్ప మరొకటి కాదు.

నరేంద్రమోడీపై గుజరాత్‌ మారణకాండ మచ్చ : వీసా నిరాకరణపై మరోసారి గుర్తు చేసిన అమెరికా !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


పెళ్లికొడుకు వీడే గానీ వేసుకున్న చొక్కా మాత్రం నేనివ్వలేదంటూ నరసింహ సినిమాలో రజనీకాంత్‌ అవసరం లేని అంశాన్ని చెప్పి గుట్టు రట్టు చేసిన దృశ్యం తెలిసిందే. అదే మాదిరి అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి అవసరం లేని అంశాన్ని చెప్పి నరేంద్రమోడీ మీద ఉన్న గుజరాత్‌ మారణకాండ మచ్చను తిరిగి ప్రపంచానికి గుర్తు చేసిన తీరు మీద మీడియాలో మరోసారి చర్చ జరిగింది. అమెరికాలోని వాషింగ్టన్‌ పోస్టు పత్రిక కాలమిస్టు జమాల్‌ ఖషోగ్గీని టర్కీలోని ఇస్తాంబుల్‌లో 2018లో హత్య చేశారు. దాని వెనుక సౌదీ రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ హస్తం ఉందని గతంలో అమెరికా విమర్శించింది. సౌదీలో భిన్న అభిప్రాయాలను, అసమ్మతిని అణిచివేస్తున్నట్లు ధ్వజమెత్తింది. ఖషోగ్గీ అమెరికా నివాసిగా ఉన్నందున అతని సన్నిహితురాలు, పౌరహక్కుల గ్రూపులు అమెరికా కోర్టులో దాఖలు చేసిన కేసుల్లో విచారణ జరుగుతున్నది. ప్రస్తుతం అతను దేశాధినేతగా ఉన్నందున అమెరికా చట్టాల ప్రకారం ఒక దేశాధినేతను అమెరికాలో విచారించే అవకాశం లేదని విచారణల నుంచి ప్రభుత్వ పరంగా మాపు(మినహాయింపు) ప్రకటించినట్లు తాజాగా అమెరికా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే మాపు కోర్టును ప్రభావితం చేయదని, విచారించాలా లేదా అన్నది జడ్జి నిర్ణయానికే వదలి వేసినట్లు కూడా ప్రభుత్వం చెప్పింది.


అయినప్పటికీ పౌర హక్కుల బృందాలు ప్రభుత్వ చర్య మీద ధ్వజమెత్తాయి. ఖషోగ్గీకి అనుకూలంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొత్తదేమీ కాదని, గతంలో ఆంక్షల మాపు పొందిన వారిలో హైతీ నేత జీన్‌ బెర్ట్రాండ్‌ అరిస్టైడ్‌, జింబాబ్వే నేత రాబర్ట్‌ ముగాబే, కాంగోనేత కబిల, భారత ప్రధాని నరేంద్రమోడీ కూడా ఉన్నారని విదేశాంగశాఖ ప్రతినిధి వేదాంత పటేల్‌ పేర్కొన్నాడు. వీరందరినీ పౌరహక్కులను హరించిన, జనాలను అణచివేసిన వారిగా అంతకు ముందు అమెరికా పేర్కొన్నది. వీసాల నిరాకరణ, ఆంక్షల వంటి చర్యలను ప్రకటించించి అమలు జరిపింది. వారు దేశాధినేతలుగా అధికారానికి వచ్చిన తరువాత వాటి నుంచి మినహాయింపులు ఇచ్చింది. ఆ దేశాలతో అమెరికా దౌత్య సంబంధాలు, నేతలతో అవసరాలు, అధికారికంగా వారు ఐరాస సమావేశాలకు అమెరికా రావాల్సిన అగత్య వంటి అంశాల కారణంగా కూడా ఆంక్షలను సడలించాల్సి వచ్చింది. కోర్టులో దాఖలైన దావా మంచి చెడ్డల జోలికి పోవటం లేదు.ఆంక్షలను మాపు చేసినప్పటికీ హత్యలో సౌదీ ఏజంట్ల పాత్రను అమెరికా ప్రభుత్వం నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నదని అమెరికా విదేశాంగశాఖ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది . దానిలో రాజు పాత్ర గురించి ఎలాంటి ప్రస్తావన లేదు.జర్నలిస్టు ఖషోగ్గీని హత్య చేయాలని ఎంబిఎస్‌గా పిలిచే మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆదేశించినట్లు అమెరికా గూఢచార సంస్థలు తమ నివేదికల్లో పేర్కొన్నప్పటికీ సౌదీతో సంబంధాల అవసరాల రీత్యా ఎంబిఎస్‌ మీద ఎలాంటి ఆంక్షలు విధించలేదు. హత్యకు ముందు 2017 నుంచి ఎంబిఎస్‌ సౌదీ రక్షణ, గూఢచార విభాగాల అధిపతిగా ఉన్నాడు. ఇటీవలనే ప్రధానిగా ప్రకటించారు. కుట్రకు ఎవరు పధకాన్ని రూపొందించినప్పటికీ దాని స్వభావం, జరిగిన తీరును చూస్తే అతని అనుమతి లేకుండా జరిగేది కాదని సిఐఏ నివేదికల్లో స్పష్టంగా పేర్కొన్నారు.2021 ఫిబ్రవరిలో అమెరికా బహిర్గతపరచిన రహస్య పత్రాలలో జర్నలిస్టు ఖషోగ్గీని బందీగా పట్టుకు రండి లేదా అంతమొందించండన్నదానికి ఎంబిఎస్‌ ఆమోదం వుందని పేర్కొన్నారు.
.
ఎంబిఎస్‌పై మాపు ప్రకటించటం ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాను శిక్షించాలని చెబుతున్న అమెరికా, దాని మిత్రపక్షాల ప్రయత్నాలకు హాని కలిగిస్తుందని విమర్శకులు ధ్వజమెత్తుతున్నారు.నిరంకుశ సౌదీ వత్తిడికి లొంగినట్లు విమర్శించారు. ఖషోగ్గి హత్యతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న కొందరు సౌదీ అధికారుల మీద వీసా నిరాకరణ, ఇతర ఆంక్షలను అమలు జరుపుతున్నారు. హత్యలో సౌదీ రాజు పాత్ర గురించి విదేశాంగశాఖ ప్రకటనలో ఎలాంటి ప్రస్తావన లేదు.తన ఎన్నికల ప్రచారంలో సౌదీ రాజును ” అంటరాని ” వాని జోబైడెన్‌ వర్ణించాడు. ఈ ఉదంతంలో అతన్ని జవాబుదారీగా చేసేందుకు చేయాల్సిందంతా చేస్తామని అమెరికన్లకు వాగ్దానం చేశాడు. అధికారానికి వచ్చిన తరువాత మారిన అంతర్జాతీయ పరిణామాల్లో రష్యాకు వ్యతిరేకంగా తమతో చేతులు కలపమంటూ సౌదీకి వెళ్లి రాజును కౌగలించుకున్నాడు, చమురు ఉత్పత్తిని పెంచమని బతిమిలాడుకున్నాడు.వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. ఇప్పుడు విచారణ నుంచి మాపు చేసి మరోసారి ప్రసన్నం చేసుకోవాలని అమెరికా చూస్తున్నది. హత్య జరిగినపుడు సల్మాన్‌ ప్రభుత్వ ప్రతినిధి మాత్రమే. ఇప్పుడు దేశాధినేత, అతడిని ప్రభుత్వం శిక్షించేది లేదని జో బైడెన్‌ 2021 ఫిబ్రవరిలోనే చెప్పాడు. సౌదీ రాజు సల్మాన్‌పై గూఢచార నివేదికలను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ వ్యూహాత్మక భాగస్వామిపై చర్య తీసుకున్న సంప్రదాయం అమెరికాకు లేదని చెప్పాడు.ఇది కేసు మంచి చెడ్డల ప్రతిబింబం కాదు లేదా ఖషోగ్గీ హత్య మీద మా అభిప్రాయాలకూ ప్రతిబింబం కాదు, ప్రభుత్వ అధిపతిగా రాజు పాత్ర మీద చట్టపరమైన పదవి మీద ఇక్కడి చట్టాల ప్రతిబింబమే అని తాజాగా వేదాంత పటేల్‌ చెప్పాడు.


చట్టబద్దంగా ఖషోగ్గి కేసులో సౌదీ రాజును మరొక దేశంలో విచారించే అవకాశం లేదని అతని న్యాయవాదులు కోర్టులో చెప్పారు. దాని మీద కేసు విచారణ జరుపుతున్న వాషింగ్టన్‌ జడ్జి ఒకరు ఆదేశం జారీ చేస్తూ నవంబరు పదిహేడవ తేదీ అర్ధరాత్రి లోగా ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలంటూ బైడెన్‌ ప్రభుత్వాన్ని కోర్టు కోరారు. ఆ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేస్తూ సల్మాన్‌పై విచారణకు మినహాయింపు ఇచ్చామని అది కోర్టు నిర్ణయం మీద ప్రభావం చూపదని పేర్కొన్నది. దాన్నే మరుసటి రోజు మీడియాకు వివరిస్తూ విలేకర్ల ప్రశ్నకు నరేంద్రమోడీ మీద ఉన్న ఆంక్షలకు సైతం మాపు వర్తింప చేశామని వేదాంత పటేల్‌ చెప్పాడు. హతుడు ఖషోగ్గీ అమెరికా పౌరుడు గనుక అతని సన్నిహితురాలు, ఇతర హక్కుల సంస్థ అమెరికా కోర్టులో కేసు దాఖలు చేసే అవకాశం వచ్చింది. గుజరాత్‌ మారణకాండలో అమెరికా పౌరులెవరూ మరణించనందున అక్కడి కోర్టులో మోడీపై కేసులను దాఖలు చేసే అవకాశం లేదు. గుజరాత్‌లో 2002లో జరిగిన మారణకాండ నివారణలో సిఎంగా నరేంద్రమోడీ విఫలం కావటమే గాక దాడులను ప్రోత్సహించినట్లు విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. దాని గురించి అమెరికాలోని హక్కుల సంఘాలు చేసిన వత్తిడి మేరకు ప్రభుత్వం 2005 నుంచి 2014వరకు అమెరికా సర్కార్‌ మోడీ అధికారిక పర్యటనతో పాటు పర్యాటక, వాణిజ్య వీసాలను కూడా నిరాకరించింది.తమ విదేశాంగశాఖ భారత మానవహక్కుల కమిషన్‌, ఇతర భారత స్వతంత్ర సంస్థల సమాచార ప్రాతిపదికగా ఒక వైఖరి తీసుకున్నట్లు చెబుతున్నది 2014లో మోడీ ప్రధానిగా అధికారానికి వచ్చిన కొద్ది గంటల్లోనే దేశాధినేతగా ఉన్నందున బరాక్‌ ఒబామా ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టాడు. తమ దేశానికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. 2014లో నరేంద్రమోడీ ప్రధానిగా అధికారానికి వచ్చిన తరువాత ఆ హౌదాలో తొలిసారి అమెరికా వెళ్లటానికి ముందు గుజరాత్‌లో మానవహక్కుల ఉల్లంఘనకు గాను విచారించాలంటూ దాఖలైన ఒక కేసులో అమెరిక ఫెడరల్‌ కోర్టు నరేంద్రమోడీకి సమన్లు జారీ చేసింది. అదే ఏడాది అక్టోబరులో నరేంద్రమోడీతో సహా ఇతర దేశాధినేతలను అమెరికా కోర్టులో విచారించేందుకు మాపు ఉందని, తమ ప్రభుత్వం దానికే కట్టుబడి ఉందని నాటి ఒబామా సర్కార్‌ కోర్టుకు తెలిపింది.2015 జనవరిలో న్యూయార్క్‌ కోర్టు ప్రభుత్వ వైఖరిని సమర్ధిస్తూ కేసును కొట్టివేసింది. ఇప్పుడు సౌదీ రాజు మీద కేసును కూడా అదే విధంగా కొట్టివేసే అవకాశం ఉంది.

సిఎంగా ఉన్నపుడు మోడీకి వీసా నిరాకరించిన అమెరికా నిర్ణయాన్ని నాడు అధికారంలో ఉన్న యుపిఏ ప్రభుత్వం తప్పు పట్టింది. తమ దేశంలో చట్టబద్దంగా ఒక రాష్ట్రానికి ఎన్నికైన సిఎంకు వీసా నిరాకరణ పద్దతి కాదని 2005లోనే స్పష్టం చేసినప్పటికీ అమెరికా ఖాతరు చేయలేదు. నరేంద్రమోడీ వీసా నిరాకరణకు వత్తిడి చేసిన అంతర్జాతీయ మత స్వేచ్చ అమెరికన్‌ కమిషన్‌ సంస్థ(యు ఎస్‌సిఐఆర్‌ఎఫ్‌) ఎన్‌ఆర్‌సి పేరుతో భారత ప్రభుత్వం ముస్లింలను వేధిస్తున్నదంటూ దానికి కారకులైన ” ముఖ్యనేతలందరి ” మీద ఆంక్షలు విధించాలని 2019లో డిమాండ్‌ చేసింది. దానిలో ఎవరి పేర్లనూ ప్రస్తావించలేదు. అది నరేంద్రమోడీ, అమిత్‌ షాల గురించే అన్నది స్పష్టం.


జర్నలిస్టు ఖషోగ్గీ హత్య వెనుక సౌదీ రాజు సల్మాన్‌ హస్తం ఉందని గతంలో చెప్పిన అమెరికా నాలుక మడిచి ఇప్పుడు ఏజంట్ల పాత్ర గురించి చెబుతోంది. గుజరాత్‌ సిఎంగా నరేంద్రమోడీ రాజధర్మాన్ని పాటించాలని నాటి ప్రధాని వాజ్‌పాయి హితవు చెప్పిన సంగతి తెలిసిందే.దీన్ని 2013లో నరేంద్రమోడీ తిరస్కరించటమే గాక తాను రాజధర్మాన్ని పాటిస్తున్నట్లు వాజ్‌పాయి చెప్పారని అన్నారు. ” ఒక నిర్ణీత రాజధర్మం ఉంది, దాన్ని మీరు అనుసరిస్తున్నారని ” అన్నట్లుగా మోడీ వర్ణించారు. నరేంద్రమోడీ 2014లో దేశాధినేత పదవిలోకి వచ్చినందున అంతకు ముందు విధించిన ఆంక్షలను మాపు చేసింది తప్ప శాశ్వతంగా ఎత్తివేసిందా లేదా అన్నది స్పష్టం కాలేదు. ఇప్పుడు ఖషోగ్గీ ఉదంతంలో సౌదీ ఏజంట్ల పాత్ర గురించి పునరుద్ఘాటిస్తున్నట్లుగానే గుజరాత్‌ మారణకాండలో సంఘపరివార్‌ సంస్థల గురించి కూడా అమెరికా గత వైఖరినే పునరుద్ఘాటిస్తుందా ? గుజరాత్‌ ఉదంతాలపై మోడీ ఇంతవరకు క్షమాపణ చెప్పటం లేదా విచారం వ్యక్తం చేయలేదు. ఆ ఉదంతాల్లో ఒక మానభంగం కేసులో శిక్షలు పడిన వారిని కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఇటీవల గుజరాత్‌ సర్కార్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

2002 నాటి ఉదంతాలకు నరేంద్రమోడీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదని 2012లో సుప్రీం కోర్టు చెప్పింది. తరువాత కూడా అమెరికా ఆంక్షలను కొనసాగించింది. తన మీద ఆంక్షల కోసం వత్తిడి తెచ్చిన యుఎస్‌సిఐఆర్‌ఎఫ్‌ ప్రతినిధులు 2016లో భారత పర్యటనకు అనుమతి కోరగా చివరి క్షణంలో మోడీ సర్కార్‌ తిరస్కరించింది. ఈ అనధికార నిషేధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మోడీ సర్కార్‌, సంఘపరివార్‌ సంస్థల తీరు తెన్నుల మీద ఆ సంస్థ ఎప్పటికప్పుడు తన నివేదికల్లో విమర్శలు చేస్తూనే ఉంది. వాటి మీద అమెరికా సర్కార్‌ అవుననీ, కాదని చెప్పదు. కానీ అవసరమైనపుడు వాటి ఆధారంగా గతంలో అనేక దేశాల వారి మీద ఆంక్షలు విధించింది. చైనాకు వ్యతిరేకంగా భారత్‌ను తన వ్యూహాత్మక భాగస్వామిగా భావిస్తున్నందున నరేంద్రమోడీ ప్రధానిగా ఉన్నంత వరకు మోడీ అమెరికా వీసా భద్రంగా ఉంటుంది అని 2016 జూన్‌ రెండున గార్డియన్‌ పత్రిక విశ్లేషణలో పేర్కొన్నారు. వేదాంత పటేల్‌ స్పందనలో నరేంద్రమోడీ పేరు ప్రస్తావన తేవటంపై అధికారికంగా ఇది రాసిన సమయానికి కేంద్ర ప్రభుత్వం లేదా బిజెపి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ ప్రస్తావన కావాలని చేశారా లేక యధాలాపంగా చెప్పారా అన్నది పక్కన పెడితే గతంలో ట్రంప్‌ ప్రధాని నరేంద్రమోడీ తనను కాశ్మీరు వివాదంలో పెద్దమనిషిగా ఉండమని కోరినట్లు చేసిన తీవ్ర ఆరోపణ మీద కూడా మోడీ మౌనం దాల్చారు . స్పందిస్తే మరింత విస్తృత చర్చకు దారితీస్తుందన్న జాగ్రత్త దాని వెనుక ఉంది. ఇప్పుడూ దాన్నే అనుసరిస్తున్నారా ? అనుమానం ఎందుకు !

పట్టణ జనాలపై ప్రైవేటు భారాల బండ – భారత్‌కు ప్రపంచ బాంకు సిఫార్సు !

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు


రానున్న పదిహేను సంవత్సరాలలో (2021-2036) మన దేశంలోని పట్టణాలలో మౌలిక సదుపాయాల కల్పనకు 840 బిలియన్‌ డాలర్లు ( 2020 ధరల ప్రకారం (రూపాయి విలువ 73 చొప్పున ) లేదా రు. 61.4 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలని ప్రపంచబాంకు అధ్యయనం సిఫార్సు చేసింది. ఇది జిడిపిలో 1.18శాతానికి సమానం. గత దశాబ్దిలో జిడిపిలో 0.6 శాతం ఖర్చు చేశారు. నవంబరు 14న ఈ నివేదికతో పాటు ఒక ప్రకటనను ప్రపంచబాంకు విడుదల చేసింది.ప్రపంచబాంకు వివిధ దేశాల మీద నివేదికలను రూపొందించేందుకు కొందరిని ఎంపిక చేస్తుంది. వాటిని తనవిగా చెప్పుకోదు. దీనికి కూడా అదే చెప్పింది. దేశాలు రుణాలు, ఇతర అవసరాల కోసం వచ్చినపుడు సూచనల పేరుతో వాటిని రుద్దుతుంది. ప్రభుత్వాలు వాటిని తమ విధానాలుగా ముద్రవేసి అమలు చేస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సిఎంగా ఉండగా జరిగింది అదే. తాజా నివేదికను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు ఏమి చేస్తాయో చూడాల్సి ఉంది. పారిశ్రామిక పెట్టుబడుల నుంచి పూర్తిగానూ, సేవా రంగాల నుంచి పాక్షికంగా గత మూడు దశాబ్దాలుగా తప్పుకుంటున్న ప్రభుత్వాలు ప్రయివేటు పెట్టుబడుల మీదే ఆధారపడి అందుకు అనువుగా విధానాలను రూపొందిస్తున్నాయి.


ఈ నివేదికను కూడా అదే విధంగా రుద్దే అవకాశం ఉంది. ప్రపంచబాంకులోని ధనిక దేశాల్లో ఉండే పెట్టుబడి సంస్థలకు మార్కెట్‌ అవసరం, అందునా మన దేశం పెద్దదిగా ఉండటం, సంస్కరణలను వేగంగా అమలు జరుపుతానని ప్రధాని నరేంద్రమోడీ 2014 నుంచి చెప్పటం, ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేయకుండా ( లాభాలు వస్తున్న విశాఖ ఉక్కును అమ్మేస్తామని పదే పదే చెప్పటం అందుకు చక్కటి ఉదాహరణ) కొన్ని రంగాల్లో అమలు జరుపుతున్న పూర్వరంగంలో ఈ నివేదికను రూపొందించారు. దేశంలోని పట్టణ స్థానిక సంస్థల తీరు తెన్నుల గురించి నివేదికలో పేర్కొన్న అంశాల సారాంశం ఇలా ఉంది.


2021లో 47 కోట్లుగా ఉన్న పట్టణ జనాభా 2036 నాటికి 60 కోట్లకు, మొత్తం జనాభాలో 40శాతానికి పెరుగుతుంది.840 బిలియన్‌ డాలర్ల అంచనాలో నీటి సరఫరా, వర్షపు నీరు, మురుగునీటి పారుదల, చెత్తయాజమాన్యం, రోడ్లు, వీధి దీపాలకు గాను 450 బి.డాలర్లు, రవాణా సదుపాయాలకు 300 బి.డాలర్లు అవసరమౌతాయని అంచనా.గతంలో కేంద్ర ప్రభుత్వం 2012 నుంచి 2032 వరకు ఇరవై సంవత్సరాల్లో మౌలిక వసతులు, సేవల కల్పనకు 560 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి అవసరమని అంచనా వేసింది. మెకెన్సీ నివేదిక ప్రకారం 2000-14 సంవత్సరాలలో చైనా జిడిపిలో 2.8శాతం చేసింది. ఒక అంచనా ప్రకారం 2010లో తలసరి 116 డాలర్లు ఖర్చు చేసింది. చైనా మాదిరి పట్టణీకరణకు ఇతర దేశాల్లో జిడిపిలో నాలుగుశాతం ఖర్చు పెట్టాలని ప్రపంచబాంకు చెప్పింది. గత దశాబ్దిలో సగటున ఏటా 10.6బి.డాలర్లు మాత్రమే భారత్‌లో పెట్టుబడులు పెట్టారు.


స్థానిక సంస్థలు తమ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంటులు, స్థానిక వనరుల ద్వారా సమకూర్చుకుంటున్నాయి. కేంద్ర ఇచ్చే కొన్ని నిధులకు రాష్ట్రం కొంత తోడు చేస్తేనే విడుదల అవుతాయి. ఈ షరతుల కారణంగా మౌలిక సదుపాయాల మీద చేస్తున్న ఖర్చు నానాటికీ తగ్గుతున్నది. ఆర్థిక సంఘాల సిఫార్సుల మేరకు నిధుల బదలాయింపు పెరిగినప్పటికీ పట్టణ స్థానిక సంస్థల మొత్తం రాబడి 2011-18లో జిడిపిలో ఒక శాతం లోపుగానే ఉంది. స్వంత వనరుల రాబడి తక్కువగా, నానాటికీ తగ్గుతున్నది, దానికి సేవలకు వసూలు చేస్తున్న మొత్తాలు తక్కువ. స్వంత వనరుల రాబడి (ఓఎస్‌ఆర్‌)లో ఇంటి పన్ను అతి పెద్ద భాగమైనా తోటి దేశాలతో చూస్తే చాలా తక్కువ, ఈ మొత్తం జిడిపిలో 0.15శాతం కాగా మధ్య తరహా ఆదాయ దేశాల్లో 0.3 నుంచి 0.6 శాతం వరకు ఉంది. ఓయిసిడి దేశాల్లో 1.1 శాతం, అమెరికా, కెనడా, బ్రిటన్లో 2-3శాతం వరకు ఉంది. అనేక దేశాల్లో ఇతర పన్నుల కంటే ఆస్థిపన్ను వేగంగా పెరుగుతోంది. నిర్వహణ ఖర్చుల కంటే కూడా సేవా రుసుములు తక్కువగా ఉండటానికి విధాన పరమైన నిర్ణయాలే కారణం. కొన్ని పెద్ద పట్టణాలతో సహా నీరు, మురుగునీటి పారుదల రుసుము వసూలు ఖర్చులో సగం కూడా లేదు. ఇటీవలి సంవత్సరాలలో మూడింట రెండువంతులు మాత్రమే బడ్జెట్‌ కేటాయింపులలో మౌలిక సదుపాయాలకు ఖర్చు చేస్తున్నారు. స్మార్ట్‌ సిటీస్‌,అమృత్‌ పథకాల కింద ఆమోదించిన మొత్తాలలో కేవలం ఐదో వంతు మాత్రమే గడచిన ఆరు సంవత్సరాల్లో ఖర్చు చేశారు.


విధానపరమైన, రాజకీయ ఆర్ధిక విధాన నిర్ణయాలు రాబడి స్థాయిలను ఆచరణను ప్రభావితం చేస్తున్నాయి. ప్రైవేటు పెట్టుబడులకు ఇవి ఆటంకంగా ఉన్నాయి. భారీ పెట్టుబడులను ఇముడ్చుకోగల స్థితి లేదు. అవసరమైన పెట్టుబడులకు ప్రోత్సాహకాలతో పాటు తిరిగి చెల్లించే విధంగా పన్నులు, వినియోగ చార్జీలను పెంచాల్సి ఉంది.వీటన్నింటికీ ద్రవ్య, సంస్థాపరమైన ప్రాధమికంగా ఆటంకంగా ఉన్నాయి. వీటిని తొలగించటానికి వ్యవస్థాగతమైన సంస్కరణలు తేవాలి. అది ఎంతో కష్టం ఎందుకంటే రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలి.భారత పూర్వపరాలను చూసినపుడు ఇది పెద్ద సవాలుగా ఉంటుందని రుజువైంది. కొన్ని నగరాల్లోనైనా స్వల్ప, మధ్యకాల ప్రైవేటు వాణిజ్య పెట్టుబడులకు అవకాశం కల్పించేందుకు పూనుకోవాలి.భారత్‌లో పట్టణాల మౌలిక సదుపాయాలకుఅవసరమైన పెట్టుబడుల్లో కేవలం ఐదుశాతమే ప్రైవేటు పెట్టుబడులు సమకూరుతున్నాయి. గుజరాత్‌లో కేవలం ఒకశాతమే ఉండగా తమిళనాడులో 12శాతం ఉన్నాయి.ఇవి కూడా ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకున్నవే. పదిహేనవ ఆర్థిక సంఘ సిఫార్సుల మేరకు 2025 నాటికి జిడిపిలో 0.32శాతం షరతులు లేని మొత్తాలను పట్టణ సంస్థలకు ఇవ్వాలి. చక్కగా రూపొందించిన షరతులతో కూడిన మొత్తాలతో కూడా ఫలితాలను మెరుగుపరచవచ్చు. కేంద్రం, రాష్ట్రాల స్థాయిలో మరింత స్థిరమైన,సూత్రాలతో కూడిన, షరతులు లేని నిధుల బదలాయింపు పద్దతిని పాటించాలి. ప్రస్తుతం సగం నిధులు షరతులతో కూడిన నిధుల బదలాయింపు జరుగుతోంది. పట్టణాల్లో ద్రవ్య పునాది విస్తరణ, రుణయోగ్యత పెంపుదలకు రాబడి ఆటంకాలను తొలగించాలి. ప్రస్తుతం తక్కువగా ఉన్న ఆస్థిపన్ను, వినియోగ, సేవా రుసుములను గణనీయంగా పెంచాలి. గణనీయంగా వాణిజ్య రుణాలు తీసుకొనే విధంగా స్వంత వనరులు ప్రతి ఐదు సంవత్సరాలకు రెట్టింపు పెరిగే విధంగా పెంపుదల ఉండాలి.


పైన పేర్కొన్న అంశాలన్నీ ప్రపంచ నివేదికలో పేర్కొన్నవే.ఈ సిఫార్సుల సారం ఒక్కటే .పట్టణాలలో మౌలిక సదుపాయాల కల్పన పెట్టుబడులను వాణిజ్య సంస్థల నుంచి తీసుకోవాలి. వాటిని తీర్చేందుకు వీలుగా పట్టణ స్థానిక సంస్థలకు రాబడి వనరుల పెంపుదల, అందుకోసం జనం నుంచి వసూలు చేసేందుకు అవసరమైన సంస్కరణలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలి. ఈ నివేదికను తు.చ తప్పక అమలు జరిపితే ఎన్నో రెట్ల భారం పౌరుల మీద పడుతుంది.రాజును చూసిన కళ్లతో అన్నట్లుగా ధనిక దేశాలను చూసి అక్కడి మాదిరి మనదేశంలో కూడా అమలు జరపాలని ప్రపంచబాంకు బృందం చెప్పింది. అక్కడి మాదిరి మన దేశంలో కూడా జనాలకు రాబడి ఉంటే ఇప్పటికంటే ఎక్కువ మొత్తాలను సేవలకు చెల్లించేందుకు ఇబ్బంది ఉండదు. తమ ఇండ్ల మీద హెలికాప్టర్లు దిగేందుకు అవసరమైన సౌకర్యాలను సమకూర్చుకుంటున్న అపర కుబేరులొకవైపు ఉంటే వారి పక్కనే ఉండే మురికి వాడల్లో ఎండకూ వానకు రక్షణకు ప్లాస్టిక్‌ షీట్లను అమర్చుకొనే పేదరికం మరొకవైపు కనిపిస్తున్నది. మన దేశంలోని పట్టణాల్లో ఈ తేడా మరింత స్పష్టంగా కనిపిస్తున్నది.


అనేక దేశాల్లో ధనికుల మీద మనకంటే ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నారు. మన దేశంలో వారికి అనేక రాయితీలు ఇస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టణాల్లో ఇంటి పన్ను పెంచారు. ఎవరి చెత్తను వారు తొలగించేందుకు చెత్తపన్ను విధించారు. అదెక్కడా పన్ను రూపంలో కనిపించదు, చెత్తసేకరణకు వచ్చే వారికి ఇచ్చే మొత్తాలుగా ఉంటాయి. త్వరలో గ్రామాలకూ దీన్ని వర్తింప చేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న కారణంగా మౌలిక సదుపాయాలపై వత్తిడి, కొరత ఏర్పడుతున్నది. వాటిని ఉపేక్షిస్తే మరిన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఈ నివేదికలో 2021 నుంచి అమలు జరపాలని చెప్పటాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వానికి ముందే అందచేసి ఉండాలి. ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచాయి.2024లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల ముందు కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి పట్టణ జనాభా మీద విపరీత భారాలను మోపి ఓట్లడిగే సాహసానికి పూనుకోదన్నది స్పష్టం. అందువలన ఎన్నికల తరువాత వచ్చే కేంద్ర ప్రభుత్వం ఏదైనా భారాల బండను జనం మీద మోపటం ఖాయమని చెప్పవచ్చు. 2020 సంవత్సర ధరల ఆధారంగా ఖర్చు అంచనా వేశారు, రూపాయి విలువ 73 నుంచి 82కు పతనం కావటం, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరిస్తే 840 బి.డాలర్లు లేదా రు.61లక్షల కోట్ల అంచనా ఇంకా ఎంత పెరుగుతుందో చెప్పలేము.