2022 అమెరికా పార్లమెంటు ఎన్నికలు : ఫాసిస్టు శక్తులకు ఎదురు దెబ్బ – పురోగామి శక్తులకు హెచ్చరిక !

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు


నవంబరు ఎనిమిదిన అమెరికా పార్లమెంటు, రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. పదిహేనవ తేదీ మంగళవారం నాటికి కూడా లెక్కింపు పూర్తి కాలేదు. అక్కడ అనుసరిస్తున్న ఓటింగ్‌ , లెక్కింపు విధానాలతో ఫలితాల ఖరారు ఎక్కువ రోజులు తీసుకుంటున్నది. పార్లమెంటు దిగువ సభలో 435 స్థానాలకు గాను 218 తెచ్చుకున్నవారికి స్పీకర్‌ పదవి దక్కుతుంది.తాజా వివరాల ప్రకారం రిపబ్లికన్లు 217, డెమోక్రాట్లు 209 స్థానాలతో ఉన్నారు. రిపబ్లికన్లకు మెజారిటీ రానుంది. వంద సీట్లున్న ఎగువ సభ సెనేట్‌లో ఇద్దరు ఇతర పార్టీల వారి మద్దతుతో డెమోక్రటిక్‌ పార్టీ బలం 50 కాగా రెండవసారి ఎన్నిక జరగాల్సిన అలాస్కా సీటు రిపబ్లికన్‌ పార్టీకి కచ్చితంగా దక్కుతుంది కనుక దానికి 50 సీట్లు వచ్చినట్లుగా పరిగణిస్తున్నారు. ఉపాధ్యక్ష స్థానపు ఓటుతో డెమాక్రాట్లకు 51 ఓట్లతో మెజారిటీ ఖాయమైంది. కనుక అక్కడి ఓటర్లు కూడా రిపబ్లికన్లను తిరస్కరించే అవకాశం లేకపోలేదు. ఇక 50 గవర్నర్‌ పదవులకు గాను ఎన్నికలు జరిగిన 36 చోట్ల రిపబ్లికన్లు రెండు కోల్పోయి 25 రాష్ట్రాలను కైవసం చేసుకోగా, డెమోక్రాట్లు అదనంగా రెండు తెచ్చుకొని 24 చోట్ల పాగావేశారు. మరొక ఫలితం తేలాల్సి ఉంది.


ఓట్ల లెక్కింపు సరళిని చూసిన అధ్యక్షుడు జో బైడెన్‌ వెంటనే చేసిన వ్యాఖ్యలు ఓటమిని పరోక్షంగా అంగీకరించటమేగాక రిపబ్లికన్లతో సఖ్యతకు సిద్దమే అనే సంకేతాలిచ్చాడు. అంచనాలకు మించి డెమోక్రటిక్‌ పార్టీ మెరుగ్గా ఉన్నందుకు ప్రజాస్వామ్యానికి శుభదినం, రిపబ్లికన్ల గాలి వీస్తుందన్న మీడియా, ఎన్నికల పండితులు చెప్పిందేమీ జరగలేదు అని జో బైడెన్‌ చెప్పాడు. ఎన్నికలకు ముందు దిగజారిన జో బైడెన్‌ పలుకుబడి కారణంగా డెమోక్రటిక్‌ పార్టీకి తగలనున్న ఎదురు దెబ్బల గురించి అందరూ విశ్లేషణలు చేశారు. రద్దయిన దిగువ సభలో డెమోక్రటిక్‌ పార్టీకి 220, రిపబ్లికన్‌ పార్టీకి 212, మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రిపబ్లికన్లకు మెజారిటీ ఖరారైంది. ఓటింగ్‌ సరళి ప్రకారం రెండు పార్టీల తేడా తొమ్మిది సీట్లు ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికల చరిత్రను చూసినపుడు ఏ పార్టీ అధ్యక్ష స్థానాన్ని గెలుచుకొని అధికారానికి వస్తే రెండేళ్ల తరువాత జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్షం మెజారిటీ సాధించటం ఒక ధోరణిగా ఉంది. ఈ కారణంగానే లెక్కింపు పూర్తిగాక ముందే అవన్నీ మరిచిపోదాం అన్నట్లుగా జో బైడెన్‌ మాట్లాడటం మొదలు పెట్టాడు. రిపబ్లికన్లతో కలసిపనిచేసేందుకు నేను సిద్దపడ్డాను, రిపబ్లికన్లు నాతో కలసి పని చేయాలని కోరుకుంటున్నట్లు ఓటర్లు స్పష్టం చేశారని కూడా చెప్పాడు.


పార్లమెంటు మీద దాడిచేయించిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఉగ్రవాదాన్ని సమర్ధించిన అనేక మంది ” మాగా ( మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగెయిన్‌ ) ” రిపబ్లికన్లు ఈ ఎన్నికల్లో ఓడిపోవటం ఒక్కటే బైడెన్‌కు ఊరటనిచ్చినట్లు కనిపిస్తోంది. సెప్టెంబరు నెలలో ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం రిపబ్లికన్‌ పార్టీని డోనాల్డ్‌ ట్రంప్‌, అతని మద్దతుదార్లు, అమెరికాకు అగ్రస్థానం అనే శక్తులు నడుపుతున్నందున దేశానికి ఇది ముప్పని వర్ణించిన బైడెన్‌ ఇప్పుడు అదే పార్టీతో కలసి పని చేస్తానని, మద్దతు కావాలని కోరటం డెమోక్రాట్ల రాజకీయ వంచన తప్ప మరొకటి కాదు. రిపబ్లికన్‌ పార్టీ మొత్తంగా మితవాద శక్తులతో కూడినప్పటికీ దానిలో మాగా రిపబ్లికన్లు పచ్చి మితవాద ఫాసిస్టు, దురహంకార శక్తులు.


ఎన్నికల్లో ఓడినప్పటికీ రోజు రోజుకు పెరుగుతున్న మాగా రిపబ్లికన్ల మీద ఒక కన్నేసి ఉంచాలనిఎఎఫ్‌ఎల్‌-సిఐఓ కార్మిక సంఘం అధ్యక్షురాలు లిజ్‌ షులర్‌ హెచ్చరించారు. పోటీ తీవ్రంగా ఉన్న చోట్ల ప్రతి ఓటూ ఫలితాన్ని నిర్ధారిస్తుందని అందువలన కార్మికులు లెక్కింపును జాగ్రత్తగా అనుసరించాలని పిలుపునిచ్చారు. వారు ప్రజాస్వామ్యానికి ప్రమాదకారులని చెప్పారు. అబార్షన్‌ హక్కు గురించి రాష్ట్రాలకు వదలి వేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వలన అనేక చోట్ల అబార్షన్‌ హక్కుకు మద్దతు ఇచ్చిన డెమోక్రాట్లకు జనం మద్దతు ఇచ్చారని షులర్‌ చెప్పారు. ఈ శక్తులు ఓడటం వారి పట్ల అమెరికా ఓటర్లలో ఉన్న ఆందోళన, అడ్డుకోవాలనే తపనకు నిదర్శనంగా చెప్పవచ్చు.ఆర్థిక సవాళ్లు, గాస్‌, ఆహార అధిక ధరలు రిపబ్లికన్లవైపు ఓటర్లను నెడతాయని సాధారణ విశ్లేషణలు వెలువడినా మితవాద శక్తుల అజెండాను కూడా కార్మికులు తీవ్రమైనదిగా పరిగణించిన కారణంగానే మాగా శక్తులను ఓడించారు.యువత, మహిళలు, ఆఫ్రికన్‌-అమెరికన్లు, మొత్తంగా కార్మికవర్గం తమ హక్కుల రక్షణకు, ఓటింగ్‌కు ముందుకు వచ్చిన కారణంగానే రిపబ్లికన్లకు చాలా మేరకు అడ్డుకట్ట పడింది. మాగా రిపబ్లికన్లకు తీవ్ర ఎదురుదెబ్బలు తగిలినా వారి నేతగా ఉన్న డోనాల్డ్‌ ట్రంప్‌ పట్టు పార్టీ మీద ఇంకా ఉంది,రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్దులలో 300 మందికి ట్రంప్‌ మద్దతు ఉంది. వారి మద్దతుతో 2024 ఎన్నికల్లో తిరిగి తాను పోటీ చేస్తానని చెబుతున్నాడు. బైడెన్‌ గెలుపును తాను గుర్తించనని ప్రకటించిన ట్రంప్‌ తన మాగా మద్దతుదార్లను ఉసిగొల్పి 2021 జనవరి ఆరున పార్లమెంటు భవనంపై దాడి చేయించిన సంగతి తెలిసిందే. వీరిని ఫాసిస్టులుగా వర్ణిస్తారు.


ఈ ఎన్నికలు అమెరికా చరిత్రలో ఖర్చు అంశంలో కొత్త రికార్డును సృష్టించాయి. ఓపెన్‌ సీక్రెట్స్‌ అనే సంస్థ అంచనా ప్రకారం 1670 కోట్ల డాలర్ల ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. మన కరెన్సీలో ఇది రు.1,37,000 కోట్లకు సమానం. ఇది ఎన్నికలకు వారం ముందు అంచనా, అనధికారికంగా అనేక మంది చేసిన ఖర్చు దీనిలో లేదు. bుార్టీల అభ్యర్ధుల ఎంపిక నుంచే డబ్బు ప్రవాహం మొదలౌతుంది. గత ఎన్నికల్లో పార్టీ వెలుపలి బృందాలు 160 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే ఇప్పుడు అది 190 కోట్లకు పెరిగిందని అంచనా. రకరకాల పేర్లతో ఖర్చు చేస్తారు. జనాభాలో కేవలం 0.0003 శాతం ఉన్న బిలియనీర్లు ఎన్నికల ఖర్చులో పదిశాతం డాలర్లు ఖర్చు చేస్తారని అంచనా. జార్జి సోరస్‌ 12.8 కోట్ల డాలర్ల ఖర్చుతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అభ్యర్ధులే ఎక్కువ మంది గెలిచినట్లు రెండు దశాబ్దాల సమాచారాన్ని క్రోడీకరించిన ఓపెన్‌ సీక్రెట్స్‌ సంస్థ పేర్కొన్నది. పార్లమెంటుకు పోటీ చేసి ఎక్కువ డబ్బు ఖర్చు చేసిన వారు 71 నుంచి 98శాతం వరకు గెలిచినట్లు తేలింది. ప్రారంభంలో చేసే ఖర్చును బట్టి ఫలితాలను ఊహించుకోవచ్చు.
సాంకేతికంగా ఎంతో ముందున్న అమెరికాలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ పద్దతి లేదు. బాలట్‌ పత్రాలనే వాడుతున్నారు. పోలింగ్‌ తేదీకి ముందే ఓట్లు వేసే అవకాశం కూడా ఉంది.మన దగ్గర విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్‌ బాలట్‌ మాదిరి ఏ ఓటరైనా వేయ వచ్చు. ఇమెయిల్‌ ద్వారా ఓటు వేసి తరువాత బాలట్‌ పత్రాన్ని పోస్టు ద్వారా పంపుతారు. ఈ కారణంగానే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వారాల తరబడి సాగుతున్నది. అరిజోనా రాష్ట్రంలోని మరికోపా కౌంటీలో ఈ ఏడాది 2,90,000 పోస్టల్‌ బాలట్లు వచ్చాయి. వాటి మీద ఉన్న సంతకాలు నిజమైనవా కాదా అన్నది సరి చూసేందుకు ఎంత సమయం పడుతుందో ఊహించుకోవచ్చు. పోలింగ్‌ ముగిసిన తరువాత కూడా వచ్చే పోస్టల్‌ బాలట్‌లను పరిగణనలోకి తీసుకుంటారు. నెవడాలో పోలింగ్‌ ముగిసిన నాలుగు రోజుల తరువాత వచ్చే పోస్టల్‌ బాలట్‌ను తీసుకొని లెక్కిస్తారు. ఎన్నికల అక్రమాలకు అమెరికా అతీతమేమీ కాదు. గతంలో అలాంటి తీవ్ర విమర్శలు వచ్చాయి. కొన్ని చోట్ల రాష్ట్రాల అసెంబ్లీల సెగ్మెంట్ల సరిహద్దులను అధికారంలో ఉన్న పార్టీ తనకు అనుకూలంగా మార్చివేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఎన్నికల నిబంధనలు అన్ని చోట్లా ఒకే విధంగా ఉండనవసరం లేదు, ప్రతి రాష్ట్రం తనదైన నిబంధనలు రూపొందించుకోవచ్చు.


వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో కూడా పచ్చిమితవాద శక్తులకు ఎదురు దెబ్బలు తగిలాయి. కొన్ని చోట్ల అక్రమాలకు పాల్పడి గెలిచిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఓహియోలో ఇలాంటి అక్రమాలకు పాల్పడిన కారణంగా 33 రాష్ట్ర అసెంబ్లీ సెనెట్‌ సీట్లకు గాను 1951 తరువాత తొలిసారిగా రిపబ్లికన్లు 26 సీట్లు తెచ్చుకున్నారు. సౌత్‌ కరోలినాలో కూడా తొలిసారిగా ఇలాగే మూడింట రెండువంతుల సీట్లు తెచ్చుకున్నారు.డెమోక్రాట్లకు పట్టున్న న్యూయార్క్‌ రాష్ట్రంలో ఇలాంటి అక్రమాల కారణంగానే ఈ సారి నలుగురు రిపబ్లికన్లు పార్లమెంటుకు అదనంగా గెలిచారు. 2020 అధక్ష ఎన్నికల లెక్కింపు సందర్భంగా కుట్ర వార్తలు వచ్చాయి. తొలుత రిపబ్లికన్లకు ఎక్కువగా పడినట్లు భావిస్తున్న బాలట్‌ బాక్సులు రావటం, తరువాత డెమోక్రాట్లకు పడిన బాక్సులు రావటంతో అనుమానాలు తలెత్తాయి. కొన్ని వారాల ముందే పోస్టల్‌ బాలట్స్‌ వేయవచ్చు గానీ, వాటిని ముందుగా లెక్కించటానికి వీలులేదు.కొన్ని చోట్ల పోస్టల్‌ బాలట్లే ఎక్కువ. జార్జియాలో 50శాతం ఓట్లు రానట్లయితే, ప్రధమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నవారి మధ్య రెండోసారి ఎన్నిక జరుపుతారు. అక్కడి రెండు సెనెట్‌ స్థానాలకు డిసెంబరు 6న ఎన్నికలు జరుగుతాయి. అలాస్కా రాష్ట్రంలో పార్టీలకు గుర్తింపు లేదు. పార్టీలు కాండిడేట్లను నిలిపినా వారు స్వతంత్రులుగానే ఉంటారు. ఎన్నికల తరువాత సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. దానికి ఎన్నివారాలైనా పట్టవచ్చు. రాష్ట్రాల అసెంబ్లీలను మొత్తంగా చూస్తే డెమోక్రాట్‌లే ఎక్కువ మంది ప్రతినిధులను కలిగి ఉన్నప్పటికీ ఎక్కువ రాష్ట్రాలల్లో గవర్నర్లు రిపబ్లికన్లు ఎన్నికయ్యారు.1900 సంవత్సరం తరువాత కేవలం రెండు సార్లు మాత్రమే మధ్యంతర ఎన్నికల్లో అధికారంలో ఉన్న అధ్యక్షుడి పార్టీ రాష్ట్రాల చట్టసభల్లో మెజారిటీ సాధించింది.


రిపబ్లికన్ల గాలిని అడ్డుకున్నప్పటికీ అమెరికా కార్మికవర్గానికి వారి నుంచి ఉన్న ముప్పును తక్కువ అంచనా వేయ కూడదు. ప్రజాప్రతినిధుల సభలో మెజారిటీ ఉన్నందున కార్మిక అనుకూల ప్రతిపాదనలను అడ్డుకొనే అవకాశం ఉంది.ఆ మెజారిటీని ఆసరా చేసుకొని బైడెన్‌, కుటుంబ సభ్యులు, డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధుల మీద విచారణల పేరుతో వేధింపులకు పాల్పడి తమ అజెండాను ముందుకు తీసుకుపోవచ్చు. జడ్జీల నియామకాలకు ఆటంకం కల్పించవచ్చు. ట్రంప్‌ పిలుపుతో పార్లమెంటు మీద దాడిచేసిన ఉదంతంలో ట్రంప్‌, పార్టీ వారి మీద ఉన్నకేసులను నీరుగార్చేందుకు పూనుకుంటారు. వచ్చే ఎన్నికల్లో రిపబ్లికన్లను అడ్డుకొనేందుకు ఇప్పటి నుంచే పూనుకోవాలని కొందరు సూచిస్తున్నారు. అధికారంలో బైడెన్‌ ఉన్నప్పటికీ ప్రజా ఉద్యమాలు లేకుండా పురోగామి అజెండాను అమలు జరిపే అవకాశం ఉండదు. నేరాలను రిపబ్లికన్లు పెద్ద అంశంగా ఎన్నికల్లో ముందుకు తెచ్చారు. సర్వేల ప్రకారం అది ప్రధాన అంశమని కేవలం పదకొండుశాతం మాత్రమే పేర్కొన్నారు. ఆర్ధికం, అబార్షన్లు, ప్రజాస్వామ్యం ప్రధాన అంశాలుగా చూశారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలనే డెమోక్రాట్లకు జనం మద్దతు ఇచ్చినట్లు ఫలితాలు వెల్లడించాయి. పాఠశాల కమిటీల్లో రాజకీయాలను చొప్పించిన వారిని, తిరోగామి భావాలు, పుస్తకాలను రుద్దేందుకు, ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చిన వారిని వారిని ఓడించారు. అమెరికాలో ఎవరు గెలిచినా తమ ప్రయోజనాల రక్షణకు కార్మికులకు పోరుబాట తప్ప మరొక మార్గం లేదు. ఫాసిస్టు, పచ్చిమితవాద శక్తులు ఓటమి చెందటం తాత్కాలిక ఊరటతప్ప పరిష్కారం కాదు. అందుకే నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అమెరికా కమ్యూనిస్టు పార్టీ, కార్మిక సంఘాలు హెచ్చరించాయి.

అవినీతి నిరోధంపై సుభాషితాలు,సుద్దులు : ప్రధాని మోడీ ఆచరణ చూస్తే విస్తుపోతారు !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


దేశంలో ఏం జరుగుతోంది ? అందరూ శాకాహారులే రొయ్యలబుట్ట మాయం అన్నట్లుగా దేశంలో అందరూ సత్యహరిశ్చంద్రుల వారసులం, అవినీతి అంటే అదేమిటో తెలియని వారం అన్నట్లుగా ఉంటారు. అయినా అవినీతి గురించి మాట్లాడని రోజు లేదు. దేశంలో అవినీతిని రూపు మాపేందుకు ఒక నిపుణుల కమిటీని వేసేందుకు ఆదేశాలు జారీ చేయాలంటూ బిజెపి నేత అశ్వనీ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన దరఖాస్తును సుప్రీం కోర్టు కొట్టివేసింది. అదే బిజెపి నేతలు మరొక వైపు దేశంలో అవినీతి లేదు అక్రమాలు లేవంటూ రోజూ ఢంకా బజాయించి మరీ చెబుతుంటారు. స్వచ్చత సూచికలను ప్రకటిస్తున్న మాదిరి నెల లేదా మూడు నెలలకు ఒకసారి అవినీతి అధికారుల మీద ఉన్న కేసుల ఆధారంగా వివిధ శాఖలకు కూడా సూచికలను ప్రకటించాలని ప్రధాని నరేంద్రమోడీ చెబుతారు. ఆచరణ చూస్తే విస్తుపోతారు. అవినీతి గురించి 2014 తరువాత చెప్పిన వాటిని అమలు చేయకుంటే బిజెపికి వ్యతిరేకంగా తమ బృందం ఆందోళనకు దిగుతుందని అన్నాహజారే కార్యదర్శి కల్పనా ఇనాందార్‌ ప్రకటించారు. కొంత మంది నమ్ముతున్నట్లుగా ఆ జగన్నాటక సూత్రధారి ఎవరిని ఎలా ఆడిస్తున్నాడో, ఎందుకు అలా ఆడిస్తున్నాడో అర్ధం కావటం లేదు.


అవినీతి సూచికలో మన దేశ స్థానాన్ని మెరుగుపరిచేందుకు ప్రపంచంలో తొలి 20 స్థానాల్లో ఉన్న దేశాలు అనుసరిస్తున్న అవినీతి నిరోధక విధానాలు, అవగాహన ఏమిటో తెలుసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిపుణులతో కమిటీలు వేసేవిధంగా, దేశ అవినీతి సూచిక మెరుగుపడే విధంగా అవగాహనకు సూచనలు చేసే విధంగా లా కమిషన్ను ఆదేశించాలని అశ్వినీ ఉపాధ్యాయ పిటీషన్‌ దాఖలు చేశారు. సంబంధిత అంశాలపై పని చేస్తున్న వారిని సంప్రదించాలని, మన దగ్గర ఇప్పటికే ప్రత్యేక చట్టాలున్నాయని, అవినీతి నిరోధానికి చర్యల గురించి లా కమిషన్ను అడుగుతామంటూ పిటీషన్ను కోర్టు కొట్టివేసింది. నరేంద్రమోడీకి అధికారాన్ని కట్టబెట్టంలో కాంగ్రెస్‌ నేతల అవినీతి, అక్రమాలు ప్రధాన పాత్ర పోషించిన అంశం తెలిసిందే.ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ (టిఐ) ప్రకటించిన అవినీతి సూచికలో 2012, 13 సంవత్సరాల్లో మన దేశం 94వ స్థానంలో 2014లో 85, 2015లో 76కు ఎదిగింది. తరువాత క్రమంగా దిగజారుతూ 2020లో 86, 2021లో 85లో ఉంది.2022 సూచికను వచ్చే ఏడాది జనవరిలో ప్రకటిస్తారు. అవినీతి అంతం గురించి చెప్పిన నరేంద్రమోడీ ఏలుబడిలో తిరిగి అది కోరలు చాస్తోందన్నది స్పష్టం. టిఐ సూచికలు సరైనవా కాదా అన్న చర్చకు వస్తే కాంగ్రెస్‌ పాలనలో-బిజెపి ఏలుబడిలో సూచికలను ఇచ్చింది కూడా అదే సంస్థ కనుక మోడీ పాలన గురించి ఇచ్చింది తప్పైతే కాంగ్రెస్‌ పాలన గురించి చెప్పింది కూడా తప్పే అవుతుంది. ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తోంది కనుకనే అసలు దాని గురించి చర్చకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. వచ్చినా మా మోడీ మీద ఇంతవరకు ఒక్క ఆరోపణలేదుగా అని ఎదురుదాడికి దిగుతున్నారు. ఆ మాటకొస్తే మన్మోహన్‌ సింగ్‌ మీద కూడా ఏమీ లేవు.


ఇటీవల నిఘా చైతన్య వారోత్సవాల్లో ప్రధాని నరేంద్రమోడీ ఎన్నో సుభాషితాలు పలికారు. అధికారుల మీద అపరిష్కృతంగా ఉన్న కేసుల సంఖ్యను బట్టి వివిధ శాఖలకు సూచికలు ఇవ్వాలని సూచించారు. ఆ నిర్ణయం చేసి ఆ సభలో పాల్గొని ఉంటే విశ్వసనీయత ఉండేది.ఎవరు అడ్డుపడ్డారు ? కేంద్ర నిఘా సంస్థలో ఫిర్యాదుల యాజమాన్య వ్యవస్థను ప్రధాని ప్రారంభించారు. అవినీతి నిరోధక సంస్థలలో పని చేస్తున్నవారి మీద బురద చల్లేందుకు, పని చేయనివ్వకుండా చూసేందుకు స్వప్రయోజనపరులు చూస్తారని,ఆ క్రమంలోనే తనను కూడా లక్ష్యంగా చేసుకున్నారని, కానీ జనం దేవుళ్లు వారికి నిజం తెలుసు, తరుణం వచ్చినపుడు వారు నిజానికి మద్దతుగా నిలుస్తారు అన్నారు. కేంద్ర నిఘా సంస్థ 2021 వార్షిక నివేదిక ప్రకారం కేంద్ర శాఖల్లోని అధికారులు, సిబ్బందిపై వచ్చిన 1,09,214 ఫిర్యాదుల్లో ప్రధాని తరువాత స్థానంలో ఉన్న అమిత్‌ షా నిర్వహిస్తున్న హౌంశాఖ మీద వచ్చినవి 37,670, తరువాత 11,003తో రైల్వే, 6,330తో బాంకులు ఉన్నాయి. 2013లో సివిసికి 35,332 వచ్చాయి. ఆ తరువాత నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. దీని భావమేమి తిరుమలేశా ! మోడీ అధికారానికి వచ్చిన తరువాత అధికారుల్లో అవినీతి పెరిగినట్లా తగ్గినట్లా !!


కేసుల గురించి సూచికలు ఇమ్మని ప్రధాని చెప్పారు సరే, తన ఏలుబడిలోని ప్రభుత్వ శాఖలు ఎలా పనిచేస్తున్నట్లు ? కామన్‌వెల్త్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఇనీషిఏటివ్‌ సంస్థ ఒక సమాచారహక్కు ప్రశ్నకు ఇచ్చిన సమాధానాన్ని వెల్లడించింది. దాని ప్రకారం 2013 ఏప్రిల్‌ నుంచి 2017 ఫిబ్రవరి వరకు డిజిఎఫ్‌టి కార్యాలయాలకు అందిన 181 అవినీతి ఫిర్యాదులపై ఒక్కదాని మీద కూడా ఎలాంటి చర్యలు ప్రారంభించలేదని, 2009లో వచ్చిన వాటిలో ఒక కేసులో ఒక అధికారిపై విధించిన పెనాల్టి వివరాలను కూడా సమాచార హక్కు కింద ఇవ్వలేదని తేలింది.దరఖాస్తులకు సమాధానాలు కూడా ఇవ్వలేదు. కర్ణాటక లోకాయక్త సమాచారహక్కు ప్రశ్నకు ఇచ్చిన సమాధానం మరింత దారుణంగా ఉంది. అవినీతి కేసులు,తాను దర్యాప్తు చేసిన వాటి వివరాలను గణాంకాలను నిర్వహించాల్సిన బాధ్యత తమకు లేదని, 2006లో కేంద్ర సమాచార కమిషన్‌ జారీ చేసిన ఉత్తరువు ప్రకారం పెద్ద ప్రజా ప్రయోజనం ఉంటే తప్ప సమాచారం ఇవ్వనవసరం లేదని, సమాచారం గనుక ఇస్తే నిందితులైన అధికారుల గోప్యతకు భంగం కలుగుతుందని కూడా సమాధానమిచ్చింది. నిఘా చైతన్య వారోత్సవాల్లో ఇలాంటి సంస్థలు, వ్యవస్థ అధికారులకే నరేంద్రమోడీ సుభాషితాలను వినిపించారు.


నరేంద్రమోడీ పాలనలో అవినీతి పెరిగిందని, గ్రామాల సంపదలను పారిశ్రామికవేత్తలు లూటీ చేస్తుంటే ప్రభుత్వం మౌనంగా ఉందని అన్నా హజారే కార్యదర్శి కల్పన నవంబరు పదవ తేదీన లక్నోలో రాష్ట్రీయ కిసాన్‌ మంచ్‌ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చెప్పారు.2011లో అన్నా ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఆందోళన కారణంగా కాంగ్రెస్‌కు మారుగా బిజెపి అధికారానికి వచ్చిందని ఎనిమిది సంవత్సరాలుగా చేసిందేమీ లేదన్నారు. గతంలో కూడా అన్నా హజారే ఇలాంటి హెచ్చరికలే చేశారు. ఇప్పుడేం చేస్తారో చూడాల్సి ఉంది. మోడీ అధికారానికి వచ్చిన తరువాత ఇడి తదితర సంస్థల దాడులు విపరీతంగా పెరిగాయి. అవినీతి మీద పోరులో తమ తీరుకు ఇది నిదర్శనం అని బిజెపి చెప్పుకుంటుంది. అసలు కథలు వేరే అన్నది తెలిసిందే. ఆర్ధికరంగం క్రమబద్దీకరణ జరిగి పన్ను ఎగవేతలు, ఆర్ధిక నేరాలకు తావు లేదంటున్నారు, మరి గత ఎనిమిదిన్నర సంవత్సరాల్లో దాడుల సంఖ్య విపరీత పెరుగుదలకు కారణం ఏమిటి ? 2004 నుంచి 2014 వరకు 112 ఇడి దాడులు జరిగితే 2014నుంచి 2022 వరకు3,010 దాడులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. నూటపన్నెండు దాడుల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం రు.5,346 కోట్లు , 3010 దాడుల్లో చేసుకున్నది రు.99,356 కోట్లు.3010 కేసుల్లో శిక్షలు పడింది కేవలం 23 ఉదంతాల్లోనే, అందుకే వీటిని ప్రతిపక్షాల నేతల మీద బెదిరింపు దాడులని జనాలు అనుకుంటున్నారు. ఏటా జిఎస్‌టి 85వేల కోట్ల మేరకు ఎగవేస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన రుబిక్స్‌ సంస్థ అంచనా వేసింది. ఇలా అవినీతి గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు.


ఇటీవలి కాలంలో సమాచార కేంద్రాల అనుసంధానం కారణంగానే చట్టబద్దంగా జరిగే లావాదేవీల మీద నిఘాతో పాటు అక్రమాలను కనుగొనటం కూడా సులభతరమైంది. వాటి ఆధారంగా అక్రమార్కుల మీద తీసుకొంటున్న చర్యలే ప్రశ్నార్దకం. రెండవది అక్రమాలకు పాల్పడుతున్నవారు గతంలో మాదిరి నగదుతోనే పని నడిపిస్తున్నారు. అందుకే దాడులు జరిపితే టన్నుల కొద్దీ నగదు పట్టుబడుతున్నది. పెద్ద నోట్ల రద్దు తరువాత ఆర్ధిక రంగంలో నగదు సరఫరా 17.7లక్షల కోట్ల నుంచి 32లక్షల కోట్లకు పెరిగింది. అవినీతి పెరుగుదలకు ఇదొక సూచిక. మోడీ సర్కార్‌ చెబుతున్నట్లు లావాదేవీలన్నీ బాంకుల ద్వారా జరిగితే ఇటీవల తెలంగాణాలోని మునుగోడు, అంతకు ముందు హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో వందల కోట్ల ఖర్చు గుట్టువెల్లడికావాలి. అలాంటిదేమీ లేదు.


2014కు ముందు అవినీతి ప్రభుత్వానికి ఒక అత్యవసరమైన భాగంగా ఉండేది, ఇప్పుడు ఏ మాత్రం సహించని విధానం అనుసరిస్తున్నామని నరేంద్రమోడీ హిమచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల సభల్లో చెప్పారు. మాటలు కాదు ఆచరణ అన్నది అసలు జరుగుతున్నదేమిటో మనకు చూపుతుంది.లోక్‌ పాల్‌ జోక్‌ పాల్‌గా మారిందని కేంద్ర సమాచార కమిషన్‌ మాజీ సభ్యుడు శైలేష్‌ గాంధీ చమత్కరించారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేసిన ఆందోళనకు మోడీ అండ్‌ కో మద్దతు ఇచ్చింది. దాన్నే ఒక ప్రధాన ఎన్నికల అంశంగా చేసుకొని లబ్ది పొందింది. అలాంటి పెద్దలు సుప్రీం కోర్టు ఆదేశించిన తరువాతనే ప్రధాని పీఠం ఎక్కిన ఐదు సంవత్సరాల తరువాత ఇష్టం లేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లు లోక్‌పాల్‌ నియామకం జరిపారు.
అన్నా హజారే తదితరుల ఆందోళన, అనేక అవినీతి ఆరోపణల పూర్వరంగంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం 2013లో లోక్‌పాల్‌, లోకాయక్త చట్టాలను చేసింది. ఈ వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ అంతకు ముందు ఎప్పటి నుంచో ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చిన ఐదు సంవత్సరాల తరువాత ఏర్పాటు చేశారు. లోక్‌పాల్‌ వ్యవస్థలో బిజెపి అనుకూలురను నింపి దాన్ని ఒక ప్రహసన ప్రాయంగా మార్చారనే విమర్శలు ఉన్నాయి. అన్నా హజారే బృందంలోని కిరణ్‌ బేడి తరువాత బిజెపిగా అసలు రూపాన్ని వెల్లడించారు.అరవింద్‌ కేజరీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు. ప్రధాని అధ్యక్షతన లోక్‌పాల్‌ ఎంపిక కమిటీని ఏర్పాటు చేసిన తరువాత దాదాపు నాలుగు సంవత్సరాలు నరేంద్రమోడీ ఆ కమిటీతో ఒక్కసారి కూడా సమావేశం కాలేదని 2018లో సమాచర హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం వెల్లడించిందని అంజలీ భరద్వాజ తెలిపారు. అంతకు ముందు లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయకుంటే ఆందోళన చేస్తానని 2015లో అన్నా హజారే ప్రకటించారు. రెండేళ్ల తరువాత 2017లో మోడీని ప్రశ్నిస్తూ ఒక ప్రకటన చేశారు.2018లో ఆరు రోజులు నిరసన దీక్ష చేపట్టారు. లోక్‌పాల్‌ అంశం సుప్రీం కోర్టు ముందుకు వచ్చినపుడు అది ” ఒక సంక్లిష్టమైన ప్రక్రియ ” అని కేంద్ర ప్రభుత్వం నివేదించింది. ప్రభుత్వ వివరణ ఏమాత్రం సంతృప్తికరంగా లేదని సుప్రీం కోర్టు అన్నది. చివరకు 2019లో నియమించారు. ఎంపిక కమిటీ కూడా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రధాని అధ్యక్షులు, లోక్‌సభ స్పీకర్‌, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ప్రతినిధి, ప్రతిపక్ష నేత, మరో ప్రముఖ న్యాయవాది, అంటే ముగ్గురు అధికారపార్టీ వారే ఉంటారు లేదా మద్దతుదారులు ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేను కమిటీ ఆహ్వానితుడిగా మాత్రమే పిలిచారు.ఎంపికలో తన పాత్ర ఉండదు కనుక సమావేశాన్ని బహిష్కరించారు. ఆ కమిటీ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు మార్చినెలలో లోక్‌పాల్‌గా సుప్రీం కోర్టు జడ్జిగా పనిచేసిన పినాకి చంద్రను ఎంపిక చేశారు.


ఇక లోక్‌పాల్‌కు వచ్చిన ఫిర్యాదుల తీరుతెన్నులను చూస్తే 2019-20లో వచ్చిన 1,427లో 85 శాతం తమ పరిధిలోకి రావని, ఆరుశాతం సరైన పద్దతిలో నింపలేదని తిరస్కరించారు. మిగిలిన వాటిని విచారించి నిగ్గుతేల్చిందేమిటో జనానికి తెలియదు. నియామకం జరిగి ఏడాది కూడా నిండక ముందే లోక్‌పాల్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న దిలీప్‌ భోంసలే 2020 జనవరి ఆరున ” వ్యక్తిగత కారణాల ”తో రాజీనామా చేశారు. తరువాత వెల్లడైనదేమంటే భోంసలేకు ఆఫీసు లేదా అధికారిక పనిగానీ లేదంటూ మూడు లేఖలు రాసినా లోక్‌పాల్‌ చైర్మన్‌ పట్టించుకోలేదు.” తొలి రోజు నుంచీ పని చేయకపోవటాన్ని, మబ్బుగా ఉండటాన్ని చెబుతూనే ఉన్నాను. చైర్మన్‌ నా సూచనలను పూర్తిగా పక్కన పడేశారు. ఏ మాత్రం ఆసక్తి చూపలేదు, స్పందన ప్రతికూలంగా ఉంది ” అని భోంసలే చెప్పినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ రాసింది. తన వద్దకు వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం నిరర్థకమైనవని, వాటి గురించి మూడు సంవత్సరాల తన పదవీకాలాన్ని గడిపితే సమయం వృధా తప్ప మరొకటి కాదని భోంసలే అన్నారు. పని చేయాల్సిన పద్దతి ఇది కాదు, పరిస్థితిని మెరుగుపరిచేందుకు చైర్మన్‌ ఎలాంటి చొరవ చూపలేదని అన్నారు.


జస్టిస్‌ భోంసలే రాజీనామా తరువాత మరొక జడ్జి కరోనాతో మరణించారు. ఆ రెండు పోస్టులను ఇంతవరకు నింపలేదు. విచారణ, ప్రాసిక్యూషన్‌ డైరెక్టర్ల పోస్టులతో పాటు అవసరమైన ఇతర సిబ్బందిని కూడా కేంద్రం నియమించలేదు. కేటాయించిన నిధుల్లో మూడో వంతు కూడా ఖర్చు పెట్టలేదని 2021లో పార్లమెంటరీ కమిటీ తీవ్ర ఆందోళన వెల్లడించింది. గుజరాత్‌ సిఎంగా నరేంద్రమోడీ లోకాయక్త గురించి అనుసరించిన వైఖరిని చూస్తే లోక్‌పాల్‌ జోక్‌ పాల్‌గా ఎందుకు మారిందో అర్ధం చేసుకోవచ్చు. పదేండ్ల పాటు గుజరాత్‌ లోకాయక్త నియామకం జరపలేదు లేదా వ్యతిరేకించారు. 2011లో నాటి గవర్నర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి జస్టిస్‌ ఆర్‌ఏ మెహతాను నియమించగా తొలగించాలంటూ నరేంద్రమోడీ సుప్రీం కోర్టు తలుపు తట్టి విఫలమయ్యారు. నరేంద్రమోడీ తీరు తెన్నులతో ఆగ్రహించిన జస్టిస్‌ మెహతా బాధ్యతలను తీసుకొనేందుకు తిరస్కరించారు. లోకాయక్తలు ప్రభుత్వ వ్యతిరేక వైఖరితో ఉండకూడదని మోడీ సర్కార్‌ వాదించింది. జస్టిస్‌ మెహతా తిరస్కరణ తరువాత ఏకంగా చట్టానికే సవరణలు తెచ్చారు. నియామక ప్రక్రియలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమేయం లేకుండా చేశారు.మొత్తం ప్రభుత్వానికే అధికారాన్ని కట్టబెట్టారు. నరేంద్రమోడీ ప్రధానిగా అధికారానికి వచ్చిన తరువాత 2016లో లోక్‌పాల్‌, లోకాయక్త చట్టాన్ని నీరుగార్చారు. ఎవరైనా అక్రమంగా సంపాదించిన వారు తమ కుటుంబ సభ్యుల పేర్లతో దాచుకుంటారు. సవరణల ప్రకారం అధికారుల పేరుతో ఉన్నవి తప్ప మిగతా కుటుంబ సభ్యుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేకుండా చేశారు. సమాచార హక్కు చట్టం ప్రకారం ఏ సమాచారం వెల్లడించాలో లేదో నిర్ణయించే అధికారం సమాచార కమిషన్‌కు ఇచ్చింది.

ప్రస్తుత లోక్‌పాల్‌, కమిటీ సభ్యుల ఎంపిక ప్రక్రియ సమావేశాల మినిట్స్‌ ఇవ్వాలని అడిగిన ప్రశ్నకు ఇవ్వనవసరం లేదని 2021లో ప్రభుత్వం పేర్కొన్నది. కేంద్ర సమాచార కమిషనర్ల ప్రక్రియలోనూ మోడీ సర్కార్‌ ఇలాగే తిరస్కరించింది. ఆచరణ ఇలా ఉంటే మరోవైపు బహిరంగ వేదికల మీద చెబుతున్న సుభాషితాలను చూస్తే దగా దగా కుడి ఎడమల దగా దగా అన్న మహాకవి శ్రీశ్రీ గుర్తుకు రావటం లేదూ ! ” నేను తినను ఇతరులను తిననివ్వను ” ఇదీ నరేంద్రమోడీ జనానికి చెప్పిన మాటలు. అంతే కాదు, జనం సొమ్ముకు చౌకీదారు(కాపలాదారు)నని కూడా చెప్పుకున్నారు. ఇంకేముంది ! అనుచర గణమంతా తమ పేర్ల చివర చౌకీదార్‌ అని తగిలించుకున్నారు. అందరూ జేజేలు పలికారు. అవినీతిని అంతం చేసే కొత్త దేవుడు దిగివచ్చారని ప్రచారం చేశారు. ఇంతకాలం తిన్న సొమ్మంతా అణాపైసలతో కక్కిస్తారని అనుకున్నారు. ఇప్పుడెవరూ చౌకీదార్‌ అని చెప్పుకోవటం లేదు. లోక్‌పాల్‌కు ఫిర్యాదులు ఎందుకు రావటం లేదంటే తమ పాలనలో అవినీతి లేనపుడు ఎలా వస్తాయంటూ బిజెపి నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు ! మహిమ కలికాలానిది అందామా నరేంద్రమోడీది అందామా ?అవినీతి గురించి అందరికీ తెలిసినందున ఎవరికి తోచింది వారు అనుకోవచ్చు. పైకి అంటే పంచాయితీ గానీ లోలోపల అనుకునేందుకు ఇంకా స్వేచ్చ ఉంది. మహాభారతంలో ధర్మపీఠం ఎక్కిన శకుని కౌరవులను నాశనం చేయాలనేఅంతరంగాన్ని వెల్లడిస్తాడు. మన పూర్వీకుల దగ్గర ఆ పాత పీఠాలు ఎక్కడైనా ఉన్నా లేదా దేశ భక్తులైన మన సంస్కృత పండితులు ఆ పరిజ్ఞానాన్ని వెలికి తీసి వాటిని రూపొందించి పుణ్యం కట్టుకుంటే మన పాలకులను వాటి మీద ఎక్కించి అంతరంగాలను బయట పెట్టించవచ్చు, అది తప్ప మరొక మార్గం లేదు, దేశం కోసం వారా పని చేస్తారా ?

చైనా నుంచి కంపెనీలు ఏ దేశం వెళుతున్నాయి ? నిజానిజాలేమిటి ?

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


చైనా నుంచి పెద్ద ఎత్తున కంపెనీలు వెలుపలికి వస్తున్నాయి. అదింకేమాత్రం ప్రపంచ ఫ్యాక్టరీగా ఉండదు. చైనా వైఫల్యం – భారత అదృష్టం ఇలాంటి వార్తలు, విశ్లేషణలు ఇటీవల మరోసారి పెరిగాయి. ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. పరిస్థితులన్నీ ఒకే విధంగా ఎప్పుడూ ఉండవు. చైనా దానికి మినహాయింపు కాదు.దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమని చెప్పి పాలు పితికేందుకు పూనుకున్నట్లుగా కొందరున్నారు.ఆత్ర పడినంత మాత్రాన లేదా అదృష్టాన్ని నమ్ముకుంటే కంపెనీలు వస్తాయా ? మన దేశం చైనాను వెనక్కు నెట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా మారుతుందా, పోటీ పడి మారాలని కోరుకోవటాన్ని ఎవరూ తప్పు పట్టరు, అది వాస్తవాల ప్రాతిపదికగా ఉండాలి. ఇంతకూ అసలు నిజానిజాలేమిటి ?


2022 అక్టోబరు చివరి వారంలో అమెరికాకు చెందిన సిఎన్‌బిసి ఒక విశ్లేషణను ఇచ్చింది.2016 నుంచి 2022లో ఇప్పటి వరకు వచ్చిన మార్పులను అది పేర్కొన్నది. దాని ప్రకారం ప్రపంచ దుస్తులు, వాటి సంబంధిత వస్తువుల ఎగుమతుల్లో చైనా వాటా 41 నుంచి 37శాతానికి, ఫర్నీచర్‌లో 64 నుంచి 53కు, పాదరక్షలు 72 నుంచి 65, ప్రయాణ వస్తువులు, చేతి సంచుల వాటా 83 నుంచి 70శాతానికి తగ్గింది. ఇదే కాలంలో వియత్నాం వాటా ఫర్నీచర్‌లో 8 నుంచి 17 శాతానికి, పాదరక్షలు 12 నుంచి 16, ప్రయాణ వస్తువులు, చేతి సంచుల వాటా 6 నుంచి 10శాతానికి పెరిగింది. బంగ్లాదేశ్‌ నుంచి దుస్తులు పది నుంచి 12 శాతానికి పెరగ్గా, మలేషియా నుంచి దుస్తులు 14 నుంచి 19శాతానికి పెరిగి తిరిగి 14శాతానికి తగ్గాయి. మన దేశ వివరాలను అది అసలు పరిగణనలోకే తీసుకోలేదు. కఠినమైన కరోనా నిబంధనలు, లాక్‌డౌన్ల కారణంగా ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా తగ్గటానికి ఒక కారణంగా సిఎన్‌బిసి పేర్కొన్నది. జీరో కరోనా విధానాల కారణంగా ఉత్పత్తిమీద తిరోగమన ప్రభావం పడటంతో దిగుమతిదారులు ప్రత్యామ్నాయాలను చూసుకున్నారని ఎండిఎస్‌ ట్రాన్స్‌మోడల్‌ సలహాదారు ఆంటోనెలా టియోడోరో చెప్పాడు. చైనా వాటా తగ్గినందున అత్యధికంగా లబ్ది పొందింది వియత్నాం తప్ప మరొక దేశం కాదని అందరూ చెబుతున్నారు.2014 నుంచి అది సుదూర వాణిజ్యాన్ని 360 శాతం పెంచుకుందని ఆంటోనెలా చెప్పాడు. కరోనా నిబంధనలను ఎత్తివేస్తే తిరిగి చైనా వాటా పెరగనూ వచ్చు.


మన దేశంలో ఉన్న వారు ఆలోచించాల్సింది ఈ అవకాశాన్ని వినియోగించుకోవటంలో నరేంద్రమోడీ సర్కార్‌ఎందుకు విఫలమైందన్నదే. వస్తూత్పత్తి చౌకగా అంటే చౌకగా దొరికే శ్రామిక శక్తి వియత్నాంలో ఉన్నందున పరిశ్రమలు, పెట్టుబడులు అక్కడకు వెళుతున్నట్లు కొందరు చెబుతున్నారు. అదే గనుక అసలు కారణమైతే ఈ పాటికి మన దేశం ప్రపంచ ఫ్యాక్టరీగా మారి ఉండాలి. వికీపీడియా సమాచారం ప్రకారం వియత్‌నామ్‌లో 2020 వివరాల ప్రకారం ఏడాది కనీస వేతనం సగటున 1,591 డాలర్లు, మన దేశంలో 2015 వివరాల ప్రకారం 664 డాలర్లు, చైనాలో 2018 ప్రకారం 2,084 డాలర్లు ఉంది.( తాజా వివరాల ప్రకారం అదింకా పెరిగింది) పోనీ నరేంద్రమోడీ అచ్చేదిన్‌లో భాగంగా ఇప్పటికి కనీసవేతనం రెట్టింపు చేశారని అనుకున్నా, వియత్‌నామ్‌ కంటే తక్కువే ఉంటుంది.మోడీ సర్కార్‌ నైపుణ్యశిక్షణ ఇచ్చింతరువాత కూడా మరెందుకు చైనా కంపెనీలు మన వైపు రాకుండా అక్కడికి పోతున్నట్లు ?


ఇక్కడ ముందుగా తెలుసుకోవాల్సింది చైనా నుంచి గానీ మరొక దేశం నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులను అమెరికా లేదా ఐరోపాలోని ధనిక దేశాలు ఉత్పత్తి చేయలేనివి, అసాధ్యమైనవి అంతకంటే కాదు. శ్రమశక్తికి చెల్లించే వేతనాలు అసలు అంశం. తమ దగ్గర ఉన్న రేట్లను పోల్చి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడి ధనిక దేశాల పెట్టుబడిదారులు అక్కడికి పోతున్నారు. చైనాలో తక్కువ వేతనాలకు పనిచేసే కార్మికులు, జనాభా, అక్కడి మౌలిక సదుపాయాలు, మార్కెట్‌, తదితర అవకాశాలను చూసి గత నాలుగు దశాబ్దాల్లో చలో చైనా బాట పట్టారు.చైనాలో వేతనాలను పెంచుతున్న కొద్దీ చైనాలో ఉన్న విదేశీ కంపెనీల లాబీలు ప్రభుత్వాన్ని బెదిరించి వేతనాలు పెంచకుండా చూసేందుకు విశ్లేషణల పేరుతో కథనాలను వండివారుస్తున్నాయి. ఉదాహరణకు 2010 జూన్‌ నెలలో ఫైబర్‌ టు ఫాషన్‌ అనే వెబ్‌సైట్‌(పత్రిక)లో కార్మికవేతన ఖర్చు పెరుగుతున్న కారణంగా వస్తున్న వత్తిడితో అమెరికా దుస్తుల కంపెనీల సంస్థలు చైనా నుంచి వెలుపలికి పోయి ఇతర దేశాల్లో తమ సంస్థల ఏర్పాటు గురించి ఆలోచిస్తున్నట్లు, ఈ అవకాశాన్ని భారత్‌తో సహా ఆసియాలోని సహదేశాలు వినియోగించుకుంటాయా అనే పద్దతిలో ఒక విశ్లేషణ ప్రచురితమైంది. చిల్లర అమ్మకాల దిగ్గజాలైన కోచ్‌,ఆన్‌ టైలర్‌ స్టోర్స్‌,గస్‌,జె సి పెనీ వంటి కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను విదేశాలకు తరలించే ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నది. 2010 ఒక నివేదిక ప్రకారం గంటలకు కార్మికవేతన వేతనం( పెట్టుబడిదారుల పదజాలంలో ఖర్చు ) 1.84 డాలర్లని అంతకు ముందు ఏడాది కంటే 17శాతం పెరిగినట్లు అదే భారత్‌లో గంటకు 2.99 డాలర్లు, వియత్నాంలో 0.49 డాలర్లు ఉన్నట్లు తెలిపింది. చైనా వేతన ప్రమాణాలను పెంచటం, కరెన్సీ ఎన్‌ విలువ పెరగటం వంటి కొన్ని అంశాలను కూడా పేర్కొన్నారు.


ఆ తరువాత గడచిన పది సంవత్సరాల్లో కరోనాకు ముందు ఇప్పుడు కూడా ఇలాంటి విశ్లేషణలను ప్రచురించని ఏడాది లేదంటే అతియోక్తి కాదు. అయినప్పటికీ పొలోమంటూ మొత్తంగా చైనాను ఖాళీ చేసి విదేశీ బాట పట్టిందేమీ లేదు. దాని ఎగుమతుల్లో వచ్చిన మార్పును పైన చూశాము. 2022 నవంబరు ఏడవ తేదీన అంతకు ముందు ప్రచురించిన వివరాలను నవీకరించి చైనా బ్రీఫింగ్‌ డాట్‌ కామ్‌ అనే సంస్థ చైనాలో పెట్టుబడులు పెట్టదలచుకున్న వారికోసం అనేక వివరాలను ప్రచురించింది. దానిలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న కనీసవేతనాలు, నిబంధనలు తదితర అంశాలను వెల్లడించింది. దాని ప్రకారం 31రాష్ట్రాలలో షాంఘైలో కనీసవేతనం గరిష్టంగా నెలవారి 2,590యువాన్లు లేదా 400 డాలర్లు ఉండగా బీజింగ్‌లో గంటకు 25.3 యువాన్లు లేదా 3.99 డాలర్లు ఉంది. మిగతా చోట్ల రాష్ట్రాల వారీ అంతకంటే తక్కువ ఉన్నాయి. కనిష్టంగా అన్‌హులో 1,340యువాన్లు లేదా 212 డాలర్లు ఉంది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న నాలుగు జోన్లలో చివరిది ఒకటవ జోన్‌లో 1,650యువాన్లు ఉంది. ప్రతి చోటా ఇలా జోన్ల వారీ హెచ్చు తగ్గులుంటాయి. నవంబరు 8వ తేదీన ఒక డాలరుకు మన కరెన్సీ మారకం విలువ రు.81.80కి అటూ ఇటుగా, ఒక యువానుకు రు.11.26 ఉంది.
మన కనీస వేతనాల్లో వైద్య బీమా – ఇఎస్‌ఐ నిమిత్తం కార్మికులు,యజమానులు చెల్లించాల్సి వాటాలు ఎలానో చైనాలో ఇతర అంశాలతో పాటు ఇంటి బీమా కోసం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం క్రితపు ఏడాదిలో మూడు నెలల సగటు వేతనాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అంటే సగం దానిలో కార్మికుడు చెల్లిస్తే మరో సగం కంపెనీ చెల్లిస్తుంది. ఆ నిధులను కార్మికులు గృహాలను కొనుగోలు చేసేందుకు మాత్రమే అనుమతిస్తారు. ఈ మొత్తాలు కనీస వేతనం పెరిగినపుడల్లా దానికి అనుగుణంగా పెరుగుతాయి. ఇవి కనీసవేతనాలు మాత్రమే. ఉదా షాంఘై నగరంలో 2020లో సగటు నెల కనీసవేతనం 1,632 డాలర్లు అంటే రు.1లక్షా 33వేలు. ఇది ప్రభుత్వం ప్రకటించిన నాటి కనీసవేతనం కంటే నాలుగు రెట్లు. మొత్తం వేతనంతో పాటు ఇతర సామాజిక రక్షణ పధకాలకు గాను యజమానులు చెల్లించాల్సిన మొత్తం 37శాతం ఉంటుందని వీటిని కూడా గమనంలోకి తీసుకోవాలని చైనా బ్రీఫింగ్‌ డాట్‌ కామ్‌ సమాచారం పేర్కొన్నది.


చైనా ఉత్పత్తులు నాసిరకమని అనేక మంది ప్రచారం చేశారు. నిజానికి చైనా బజార్ల పేరుతో మన దేశంలో విక్రయించే వస్తువులన్నీ చైనావి కాదు. తక్కువ ధరలకు వచ్చేవన్నీ నాసిరకమనే భావన మనలో ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. కానీ అమెరికా, ఐరోపా దుకాణాలన్నింటా చైనా వస్తువులే అన్నది తెలిసిందే. చైనా తన ఎగుమతుల్లో కేవలం రోజువారీ అవసరమైనవే గాకుండా ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వస్తువుల ఉత్పత్తి మీద కేంద్రీకరించింది. ఈ రంగంలో ఇప్పటికీ అమెరికా, ఐరోపా ధనిక దేశాలదే అగ్రస్థానం. నాలుగవ పారిశ్రామిక విప్లవంలో భాగంగా మేడిన్‌ చైనా 2025 పేరుతో అక్కడి ప్రభుత్వం 2015 ప్రారంభించిన పారిశ్రామిక విధానంలో ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తే వాటికి గండితో పాటు పోటీ పెరుగుతుంది. ధరలు కూడా తగ్గుతాయి. ఇది తమకు ముప్పు అని అందరికంటే ముందు గుర్తించింది అమెరికా, అందుకే డోనాల్డ్‌ ట్రంప్‌ 2018లో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించాడు.తమ ఉత్పత్తులకు ఎదురుకానున్న పోటీ గురించి చెప్పటానికి బదులు చైనా తమ పరిజ్ఞానాన్ని తస్కరించిందని, తమ భద్రతకు ముప్పు ఉందంటూ అమెరికా ప్రచారం చేస్తున్నది.


ఏ దేశానికి ఆ దేశం భిన్నమైన పేర్లతో ఇలాంటి విధానాలనే చేపట్టింది.” పరిశ్రమలు 4.0 అభివృద్ధి ప్రణాళిక ” పేరుతో జర్మనీ ప్రకటించింది. మన మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ వంటి వాటి గురించి తెలిసిందే. ప్రపంచం వంద సెమీ కండక్టర్లను వాడుతుంటే అందులో చైనా వాటా 60, దానికి గాను అది ఉత్పత్తి చేస్తున్నది పదమూడు మాత్రమే. చైనా ప్రకటించిన లక్ష్యాల ప్రకారం 2025నాటికి ఈ రంగంలో 70శాతం స్వయం సమృద్ధి సాధించాలని, 2049లో వందేళ్ల చైనా కమ్యూనిస్టు పాలన నాటికి హైటెక్‌ పరిజ్ఞానంలో అగ్రగామిగా ఉండాలని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే దుస్తులు, పాదరక్షల వంటి వాటి మీద పని చేస్తూనే ఇతర కీలక రంగాల మీద కేంద్రీకరించారు.లాభాలను మాత్రమే చూసుకొనే విదేశీ కంపెనీలు చైనాలో పెరుగుతున్న వేతన ఖర్చు, ఇతర రాజీలేని నిబంధనల కారణంగా ఇతర దేశాలవైపు చూస్తున్నాయి. అందువలన కొన్ని పరిశ్రమలు వెళ్లవచ్చు. అలా వెళితే వాటికే నష్టం. వాటి ఉత్పత్తులకు చైనా మార్కెట్‌లో అవకాశం ఉండదు. అందువలన ఎందరు ఎన్ని విశ్లేషణలు చేసినా, పారిశ్రామికవేత్తల ఆలోచనలు భిన్నంగా ఉంటున్నాయి.

చైనా చేపట్టిన సంస్కరణల గురించి భిన్న అభిప్రాయం వెల్లడించే కొందరు వామపక్ష వాదులు గానీ, అది కూలిపోతుంది, వాలిపోతుంది అని గత నాలుగు దశాబ్దాలుగా జోశ్యాలు చెబుతున్న చైనా వ్యతిరేకులకు గానీ ఇంత కాలం ఆశాభంగమే తప్ప మరొకటి లేదు. అయితే చైనాకు ఎలాంటి సమస్యలు, సవాళ్లు లేవా ? లేవని ఎవరు చెప్పారు ! పెట్టుబడిదారీ సమాజాన్ని నెలకొల్పేందుకు పూనుకున్నవారికి అంతా పూలబాటగా ఎలాంటి ప్రతిఘటన, సవాళ్లు లేకుండా అంతా సాఫీగా నడిచిందా, ఆధిపత్యం కోసం ఖండాలు, ప్రపంచ యుద్ధాలు చేసుకున్నారు. సోషలిస్టు సమాజ నిర్మాణంలో పెట్టుబడిదారుల నుంచి ప్రతిఘటన లేకుండా ఎలా ఉంటుంది ?


చైనా ఒక విధానాన్ని అనుసరించి అనూహ్య విజయాలను సాధించింది. ఆ…. అది ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం తప్ప సోషలిజం ఎక్కడుంది అనే వారు కొందరు. నిజమే, సోషలిజం లేనపుడు అది వద్దని కోరుకొనే వారు ఆ ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానంతో చైనా మాదిరి ఎందుకు ముందుకు పోవటం లేదు ? అక్కడంతా నిరంకుశత్వం ఉంటుంది అనే వాదన మరొకటి. ప్రపంచంలో అనేక దేశాలు మిలిటరీ నిరంకుశపాలనలో ఉన్నాయి,మరి అవెందుకు చైనా మాదిరి పురోగమించలేదు. పత్రికల రాతలను చూసి గతంలో కంపెనీలు చైనాకు వరుసలు కట్టలేదు. ఇప్పుడు వీటిని చూసి తిరుగుముఖం పడితే ఏం చేయాల్సిందీ చైనా వారు చూసుకుంటారు. వసుధైక కుటుంబం, సర్వే జనా సుఖినో భవా, అందరూ బాగుండాలి-అందులో నేనుండాలి అనుకొనే దేశంలో చైనా ఆర్థికంగా దెబ్బతింటే బాగుపడేది మనమే లేదా మనకు మంచి అవకాశం అనే ఆలోచనలు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. చైనా మీద విద్వేషాన్ని విపరీతంగా రెచ్చ గొట్టిన పర్యవసానమిది. ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో మాదిరి కష్టపడకుండా లక్కు మీద ఆధారపడి పనీ పాటా లేకుండా తిరిగే సోంబేరుల మాదిరి ఉండి బాగుపడిన వారెవరూ లేరు. ప్రపంచ ఫ్యాక్టరీగా ఉన్న చైనా దెబ్బతింటే తప్ప మనకు అవకాశాలు రావని చెప్పే ప్రబుద్దుల మాటలు విని దాని కోసం ఎదురు చూస్తూ చేయాల్సినవి చేయకుండా కూర్చుంటే ఫలితం ఉండదని పాలకులకు, ఇతరులకు ఎవరు చెప్పాలి ?

బ్రెజిల్‌ 2022 ఎన్నికలు : మూడవ సారి లూలా చారిత్రాత్మక విజయం ! ఓటమిని అంగీకరించని బోల్సనారో !!

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


జైల్లో 580 రోజులు గడిపిన వామపక్ష నేత లూలా రాజకీయ జీవితం ముగిసినట్లే అని ఆశించిన మితవాద శక్తులకు, వారిని బలపరిచిన అమెరికా, ఇతర దేశాలకు చెంపపెట్టు. మరోసారి అధికారపీఠాన్ని అధిరోహించేందుకు జనం ఆమోదం తెలిపారు. ఆదివారం నాడు (అక్టోబరు 30వ తేదీ) బ్రెజిల్‌ అధ్యక్షపదవికి జరిగిన తుది విడత పోరులో వర్కర్స్‌ పార్టీకి చెందిన వామపక్ష నేత లూలా డిసిల్వా మూడవ సారి అధికారానికి వచ్చారు. జనవరి ఒకటవ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. కార్పొరేట్ల అనుకూల మితవాద, ప్రజాస్వామ్య విధ్వంసశక్తులు- ప్రజానుకూల వామపక్ష, ప్రజాస్వామ్య పరిరక్షణ శక్తుల మధ్య పోటాపోటీగా జరిగిన పోరులో నిరంకుశ జైర్‌ బోల్సనారో మట్టి కరిచాడు. పోలింగ్‌ ముగిసిన కొద్ది గంటల్లోనేే ఆదివారం రాత్రే ఫలితాలను ప్రకటించారు. పోలైన ఓట్లలో లూలాకు 50.9శాతం (6,03,45,499) రాగా, బోల్సనారోకు 49.1శాతం( 5,82,06,356) వచ్చాయి. లూలా మెజారిటీ 21,39,143 కాగా చెల్లని, తిరస్కరించిన ఓట్లు 57,00,443 ఉన్నాయి. బ్రెజిల్‌ నిబంధనల మేరకు అధ్యక్షపదవికి వేసిన ఓట్లనే ఉపాధ్యక్ష పదవికీ వర్తింప చేసి విజేతగా ప్రకటిస్తారు. ఆదివారం రాత్రే ఫలితాలను ప్రకటించినప్పటికీ మంగళవారం రాత్రి రెండు నిమిషాల పాటు మాట్లాడుతూ ఓటమిని అంగీకరిస్తున్నట్లు ప్రకటించకుండానే అధికార మార్పిడికి ఏర్పాట్లు చేయాలని కోరాడు. తాను ఓడితే తీర్పును అంగీకరించేది లేదని ఎన్నికలకు ముందే చెప్పాడు. బోల్సనారో గట్టి మద్దతుదారైన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మాత్రం బోల్సనారో కోసం వేచి చూడకుండా వెంటనే లూలాకు అభినందనలు తెలిపాడు.ఫలితాలు తెలిసిన గంటలోపే , ఎన్నికలు ” స్వేచ్చగా, న్యాయంగా, విశ్వసనీయంగా జరిగినట్లు ” బైడెన్‌ తన సందేశంలో పేర్కొన్నాడు. అమెరికాను అనుసరించే అనేక ఐరోపా, ఇతర దేశాల నేతలు కూడా అదే బాట పట్టి అభినందనలు తెలిపారు. దేశంలోని అనేక చోట్ల రోడ్ల మీద బోల్సనారో మద్దతుదార్లు ఏర్పాటు చేసిన ఆటంకాలన్నింటినీ తొలగించాలని బ్రెజిల్‌ సుప్రీం కోర్టు ఆదేశించింది. మద్దతుదార్లు తమ నేత ఆదేశాల కోసం ఆదివారం నుంచి ఎదురు చూశారు.


లాటిన్‌ అమెరికాలో అతి పెద్ద దేశమైన బ్రెజిల్‌ జనాభా 22 కోట్లు. అమెరికా మద్దతుతో 1964లో మిలిటరీ తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకొని 21 సంవత్సరాల పాటు ఉక్కుపాదాలతో కార్మికులు, రైతులను అణచివేసింది. దానికి వ్యతిరేకంగా పోరు సాగించిన వారిలో ఒకరైన లూలా తదితరులు 1980లో వర్కర్స్‌ పార్టీని ఏర్పాటు చేశారు.తమది డెమోక్రటిక్‌ సోషలిస్టు సిద్దాంతం అని ప్రకటించారు. 1982లో పార్టీకి గుర్తింపు లభించింది.1988 స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక ప్రముఖ పట్టణాల్లో ప్రజాదరణ, విజయాలను సొంతం చేసుకుంది. తరువాత జరిగిన మూడు ఎన్నికలలో లూలా అధ్యక్ష పదవికి పోటీ చేశాడు.2002 ఎన్నికలు, తరువాత 2006 ఎన్నికల్లో గెలిచాడు. తరువాత జరిగిన రెండు ఎన్నికల్లో వర్కర్స్‌ పార్టీ నాయకురాలు దిల్మా రౌసెఫ్‌ గెలిచారు. రెండవ సారి ఆమె పదవిలో ఉండగా 2016లో మితవాద శక్తులు కుట్రచేసి తప్పుడు ఆరోపణలతో పార్లమెంటులో తమకున్న మెజారిటీని ఆసరాచేసుకొని ఆమెను అభిశంసించి పదవి నుంచి తొలగించారు. తరువాత లూలాపై తప్పుడు కేసులు పెట్టి 2017లో తొమ్మిదిన్నర సంవత్సరాల జైలు శిక్ష విధించారు.ఆ కేసును విచారించిన జడ్జి తరువాత బోల్సనారో ప్రభుత్వంలో మంత్రి అయ్యాడు. లూలా 580 రోజులు జైల్లో ఉన్నారు. 2018 ఎన్నికల్లో పోటీ చేసేందుకు చూడగా శిక్ష పడిందనే పేరుతో అనుమతించలేదు. తరువాత జరిగిన పరిణామాల్లో 2019నవంబరులో సుప్రీం కోర్టు లూలాను జైల్లో ఉంచటం అక్రమం అంటూ విడుదలకు ఆదేశించింది.శిక్షపై అప్పీలు చేసినందున జైల్లో ఉంచకూడదని చెప్పింది. తరువాత 2021 మార్చినెలలో కేసును విచారించిస జడ్జి తీర్పు లూలా మీద కేసులను కొట్టివేశారు.అంతకు ముందు శిక్ష విధించిన జడ్జికి తగిన అధికారాలు లేవని, లూలా పౌరహక్కులను పునరుద్దరిస్తూ తీర్పు చెప్పారు. దాంతో ఈ ఏడాది ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత లభించింది.


మిలిటరీ నిరంకుశ పాలన ముగిసిన 1980దశకం తరువాత పదవిలో ఉండి రెండవసారి పోటీ చేసిన వారిలో తొలిసారిగా ఓడిన ఘనత బోల్సనారోకు దక్కింది. తొలి దఫాలోనే ఓడిపోతాడని చెప్పిన సర్వేలు వాస్తవం కాదని తేలింది. రెండు రౌండ్లలోనూ భారీగానే ఓట్లు సంపాదించటాన్ని బట్టి బ్రెజిల్‌ సమాజంలో సమీకరణలు ఎంత బలంగా ఉన్నదీ వెల్లడించింది. అధ్యక్ష ఎన్నికల్లో ఓడినప్పటికీ పార్లమెంటులో మితవాద శక్తులదే పైచేయిగా ఉంది.పార్లమెంటు దిగువ సభ 513 మంది ఉండే ఛాంబర్‌ ఆఫ్‌ డిప్యూటీస్‌లో బోల్సనారో లిబరల్‌ పార్టీ తన స్థానాలను 77 నుంచి 99కి పెంచుకుంది. వామపక్ష ” బ్రెజిల్‌ విశ్వాసం ” కూటమి కూడా గతం కంటే మరో పదకొండు పెంచుకొని 80 గెలుచుకుంది. మొత్తం మీద చూసినపుడు పార్లమెంటు రెండు సభల్లో మితవాద శక్తులు 60శాతం సీట్లతో మెజారిటీగా ఉన్నారు. లాటిన్‌ అమెరికా వామపక్షాలు గెలిచిన ప్రతి దేశంలోనూ ఇదే విధమైన బలహీనతను ఎదుర్కొంటున్నాయి. ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా ఉన్నట్లు నిర్దారణ కాగానే లూలా డిసిల్వా మద్దతుదార్లతో మాట్లాడుతూ మెజారిటీ బ్రెజిలియన్లు మరింత ప్రజాస్వామ్యాన్ని, మరింత సమానత్వం, సౌభ్రాత్వత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పాడు. తన పదవీ స్వీకరణ ఉత్సవానికి రానవసరం లేదు గానీ ప్రజలిచ్చిన తీర్పును బోల్సనారో గుర్తించాలని లూలా హితవు చెప్పాడు. ప్రజలే తనకు పదవీ పట్టం గట్టారని అన్నాడు. గత ఆరు సంవత్సరాల్లో ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాల బోల్సనారా ఏలుబడిలో ప్రజాస్వామిక వ్యవస్థలను, అమెజాన్‌ అడవులను ధ్వంసం చేసిన తీరు, కరోనాలో జనాన్ని గాలికి వదలివేసిన బాధ్యతా రాహిత్యాన్ని చూసిన వారు, వామపక్షాల వైఖరితో ఏకీభవించని వారు కూడా బోల్సనారో ఓడిపోవాలని కోరుకున్నారు.కరోనా వచ్చినపుడు లాక్‌డౌన్లు వద్దన్నాడు, తరువాత వాక్సిన్లను తిరస్కరించాడు, చివరికి కొనుగోలు చేసిన వాటిలో కుంభకోణానికి పాల్పడ్డాడు. ఆరులక్షల 80వేల మంది ప్రాణాలు పోవటానికి కారకుడయ్యాడు.


తాను ఓడితే ఫలితాలను అంగీకరించనని, అవసరమైతే వీధులకు ఎక్కుతానని బెదిరించిన బోల్సనారో రెండో విడత పోలింగ్‌ రోజు లూలా మద్దతుదార్లను ఓటింగ్‌కు రాకుండా తన మద్దతుదార్లను ఉసిగొల్పి అడ్డుకున్నట్లు వార్తలు వచ్చాయి. అంతకు ముందు రేడియోలో తన ప్రకటనలను ప్రసారం చేయకుండా అడ్డుకుంటున్నారని, తన ఫిర్యాదులపై విచారణ జరపకపోతే పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుందని బెదిరించాడు. బోల్సనారో కుమారుడు,ఎంపీ ఎడ్వర్డ్‌ బోల్సనారో గురువారం నాడు ఒక టీవీలో మాట్లాడుతూ ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేశాడు. మొత్తం నమోదైన ఓటర్లు 15,64,54,011 మంది కాగా తుది విడత పోలింగులో 12,42,52,716 మంది పాల్గన్నారు. ఐదువందలకు పైగా ఉదంతాల్లో బోల్సనారో మద్దతుదార్లు, వారికి మద్దతుగా కేంద్ర పోలీసులు ఓటర్లను అడ్డుకున్నట్లు ఫిర్యాదులు రాగా వాటిలో సగం లూలాకు గట్టి పట్టున్న ఈశాన్య ప్రాంతాల నుంచే ఉండటం గమనార్హం. అధ్యక్ష భవనంలో నెల రోజులకు ముందే బోల్సనారో రూపొందించిన ఒక పధకం ప్రకారమే ఇలా అడ్డుకున్నట్లు టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయి. ఓటర్లను నిరోధించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినప్పటికీ పోలీసులు తప్పుడు సాకులు చూపి తామెవరినీ అడ్డుకోలేదని చెప్పారు. ట్రక్కుల యజమానులు,డ్రైవర్లు బ్రెజిల్‌ రాజకీయాల్లో మితవాద శక్తుల మద్దతుదార్లుగా ఉన్నారు. వారంతా రెండవ విడత పోలింగ్‌ జరుగుతుండగా రోడ్ల మీద ట్రక్కులను అడ్డం పెట్టి లూలా మద్దతుదార్లను కదలకుండా చేశారు. గతంలో వర్కర్స్‌ పార్టీ ప్రభుత్వం మీద తలెత్తిన అసంతృప్తిని ఆసరా చేసుకొని వీరంతా వీధుల్లోకి వచ్చి బోల్సనారోకు మద్దతుగా నిలిచారు. మరోవైపు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు బోల్సనారో అనేక పధకాలను ప్రకటించాడు.తనకు వ్యతిరేకంగా మీడియా-ఎన్నికల సంఘం కుట్ర చేసిందని లేకుంటే తాను తొలి దఫా ఎన్నికల్లోనే గెలిచి ఉండేవాడినని, 60లక్షల ఓట్లు తనకు పడకుండా చేశారని బోల్సనారో ఆరోపించాడు.

గతంలో ఎనిమిది సంవత్సరాల పాలనా కాలంలో లూలా అమలు జరిపిన సంక్షేమ చర్యలతో కోట్లాది మంది దారిద్య్రం నుంచి బయటపడ్డారు, ఉన్నత విద్యను పేదలకు అందుబాటులోకి తెచ్చారు. అయితే ఇవన్నీ అంతకు ముందు నుంచి కొనసాగుతున్న నయా ఉదారవాద చట్రం నుంచే అమలు జరిపారు. అందువలన లాటిన్‌ అమెరికాలోని ఇతర వామపక్ష ప్రభుత్వాలు ఎదుర్కొన్న సమస్యలు, ప్రజల అసంతృప్తిని దిల్మారౌసెఫ్‌ ప్రభుత్వం కూడా ఎదుర్కొన్నది. గత ఎన్నికలలో వర్కర్స్‌ పార్టీ ఓడిపోయింది. తాను ఆర్ధిక రంగాన్ని చక్కదిద్దుతానని ముందుకు వచ్చిన మితవాది బోల్సనారో ప్రజలను గాలికి వదలివేయటంతో తిరిగి వర్కర్స్‌ పార్టీకి జనం పట్టం గట్టారు. ఈ ఎన్నికల్లో లూలా-బోల్సనారో ఇద్దరూ దేశ ఆర్థికపరిస్థితి గురించి ప్రధానంగా ప్రచారంలో ప్రస్తావించారు.ఆకలి, దారిద్య్రం పెరగటానికి బోల్సనారో విధానాలే కారణమని లూలా విమర్శించాడు. ఇప్పుడు లూలా ప్రభుత్వానికి ఇది పెద్ద సవాలుగా మారనుంది.

స్పెయిన్‌ – పోర్చుగీసు వలస పాలకుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 1500సంవత్సరం ఏప్రిల్‌ 22 నుంచి పోర్చుగీసు పాలనలోకి బ్రెజిల్‌ వంచ్చింది. ఆ ప్రాంతంలో చెరకు తోటల్లో, ఇతరంగా పని చేసేందుకు అప్పటి నుంచి తెల్లవారి వలసలతో పాటు దాదాపు 30లక్షల మంది బానిసలను ఆఫ్రికా నుంచి రప్పించారు. దీర్ఘకాలం సాగిన పోరు తరువాత 1825 ఆగస్టు 29న స్వతంత్ర దేశంగా అవతరించింది. ప్రస్తుతం దేశ జనాభాలో 47.73 శాతం తెల్లవారు, 43.13శాతం బ్రెజిల్‌ స్థానిక తెగలు – సంకర వర్ణాలకు చెందిన వారు. లూలా ఈ సామాజిక తరగతికి చెందిన వారు. వీరుగాక 7.61శాతం మంది ఆఫ్రో-బ్రెజిలియన్లు ఉన్నారు. బోల్సనారో మూలాలు ఇటాలియన్‌-జర్మన్‌ జాతీయులవి. జనాభాలో ఉన్న ఈ పొందిక అక్కడ జాత్యహంకార, వివక్ష సమస్యలను కూడా ముందుకు తెస్తున్నాయి. మత రీత్యా 89శాతం మంది క్రైస్తవులు కాగా వారిలో నాలుగింట మూడు వంతులు రోమన్‌ కాథలిక్కులు.

అమెరికా, ఐరోపా దేశాలతో సత్సంబంధాలను కోరుతున్నట్లు లూలా ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నాడు.ఒక ఎత్తుగడగా లేదా అనివార్యమైగానీ ఈ దేశాలు వెంటనే స్పందించి అభినందన సందేశాలు పంపాయి. చైనాతో సంబంధాల గురించి ప్రత్యేకంగా విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. బోల్సనారో పాలనలో చైనా వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున సాగినప్పటికీ పెట్టుబడులు, వాణిజ్య లావాదేవీలు పెద్దగా ప్రభావితం కాలేదు. ఇప్పుడు లూలా వాటితో పాటు ఇతర అంశాలల్లో చైనాతో సంబంధాలకు ముందుకు పోతారని చెబుతున్నారు. ఇప్పటికే బ్రెజిల్‌, రష్యా,భారత్‌,చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన ” బ్రిక్స్‌” బృందం సంబంధాలు మరింతగా విస్తరించవచ్చు. బోల్సనారో ఎంతసేపటికీ పశ్చిమ దేశాలతో కూడిన ఓయిసిడి కూటమి వైపు మొగ్గుచూపాడు.చైనా చొరవతో అమలు జరుపుతున్న బిఆర్‌ఐ పధకంలో భాగంగా ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో తన పాలనా కాలంలో అమలు జరిపిన సంక్షేమ పధకాలను ఎన్నికల ప్రచారంలో లూలా మరోసారి గుర్తుకు తెచ్చారు.
ప్రపంచబాంకు నివేదిక ప్రకారం లూలా పాలనా కాలంలో 2003-2009 కాలంలో బ్రెజిల్‌ మధ్యతరగతి కుటుంబాలు 50శాతం పెరిగాయి. బ్రెజిల్‌తో సహా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, మాంద్యం, వృద్ధి రేట్లు పడిపోవటం వంటి పరిణామాలు, పర్యవసానాల నేపధ్యంలో గతంలో మాదిరి సంక్షేమ పధకాలను ఎలా అమలు జరుపుతారన్నది అనేక మందిలో ఉన్న సందేహం. ఆదాయం పెరిగినకొద్దీ పన్ను రేట్లు పెంచుతామని, ప్రభుత్వ ఖర్చు మీద విధించిన ఆంక్షలను ఎత్తివేస్తానని, కనీసవేతనాల పెంపుదల ద్వారా అర్థిక అసమానతల తగ్గింపు, సామాజిక న్యాయం అమలు చేస్తానని వాగ్దానం చేశాడు. సవాళ్లతో పాటు లాటిన్‌ అమెరికాలో వామపక్షాల విజయపరంపరలో లూలా గెలుపు కార్మికోద్యమాలకు, అమెరికా పెత్తనాన్ని వ్యతిరేకించే శక్తులకు మరింత ఊపు,బలాన్ని ఇస్తుంది.

పేరులో ఏమున్నది పెన్నిధి : ప్రధాని నరేంద్రమోడీ దేశభక్తుడా – నిజమైన దేశ భక్తుడా !

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు


నిజమే ! అనేక మందికి అలాంటి సందేహమే కలిగింది. కొన్నింటిని తీర్చే అవకాశాలు లేవు. అక్టోబరు 27న మాస్కోలోని మేథావులు ఉండే వాలెడై క్లబ్బులో రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ చేసిన ప్రసంగంలో మన ప్రధాని నరేంద్రమోడీ గురించి నిజంగా వాడిన పదాలేమిటి అనే చర్చ అలాంటిదే. రోమియో-జూలియట్‌ నాటకంలో పేరులో ఏమున్నది పెన్నిధి అన్న షేక్స్పియర్‌ మాటలు తెలిసినవే. గులాబీని ఎవరు ఏ పేరుతో పిలిచినా దాని వాసన తీపిని గుర్తుకు తెస్తుంది అన్నట్లుగా పేరు ఏదైనా భావం ఏమిటన్నది కీలకం. దేశభక్తి కూడా అలాంటిదే. దేశభక్తులం అని చెప్పుకున్నవారందరూ దేశ భక్తులు కాదు.దేశ ద్రోహులని కొందరు చిత్రించిన వారందరూ దేశ ద్రోహులు కాదు. 2019 డిసెంబరు 15వ తేదీన ఎఎన్‌ఐ ఒక వార్తను ఇచ్చింది. దాని ప్రకారం ఝార్కండ్‌లోని దమ్‌కా బిజెపి ఎన్నికల సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి.” కాంగ్రెస్‌, దాని మిత్ర పక్షాలు ఒక గొడవను సృష్టిస్తున్నాయి.వారికి దారి దొరకనందున మంటపెడుతున్నారు. హింసాకాండను సృష్టిస్తున్నవారెవరో వారి దుస్తులను బట్టే గుర్తించగలం ” అని సెలవిచ్చారు. తద్వారా పేరెత్త కుండా మాటలతో కూడా మత విద్వేషాన్ని రెచ్చగొట్టవచ్చనే మార్గాన్ని చూపారు. ఇక పేరుతో జరుపుతున్న మారణకాండల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మన దేశపరువుకు మంచిది. దీన్ని ఎందుకు గుర్తుకు తెచ్చుకోవాల్సింది అంటే మన ప్రధాని గురించి పుతిన్‌ పొగడ్తలకు పెద్ద ఎత్తున ప్రచారం వచ్చింది గనుక.


” భారత నిజమైన దేశ భక్తుడు నరేంద్రమోడీ ” రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ ఇచ్చిన కితాబిది అని కొన్నింటిలో ” భారత దేశభక్తుడు నరేంద్రమోడీ ” అన్నట్లుగా మీడియాలో భిన్న వర్ణనలు వచ్చాయి. మొత్తం మీద నరేంద్రమోడీ దేశభక్తుడు అన్నది పుతిన్‌ చెప్పిన మాటలకు అర్ధం. మన దేశంలో ఇటీవలి కాలంలో ఎవరు నిజమైన దేశభక్తులు అనే చర్చ జరుగుతున్నది, తామే అసలైన దేశభక్తులం అని బిజెపి వారు ఢంకా బజాయించి మరీ చెప్పుకుంటున్న రోజులివి. బ్రిటీష్‌ వారిని ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎవరు కొమ్ము కాస్తున్నారు అన్న ప్రాతిపదికన దేశభక్తులా కాదా అన్నది స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో పెద్ద చర్చ, పరీక్ష. ఇప్పుడు విధానాల ప్రాతిపదిక తప్ప అలాంటి గీటురాయి లేదు. పద్మశ్రీ కంగనా రనౌత్‌ వంటి వారు దేశానికి నిజమైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందని చెప్పారు మరి. ఆ ఏడాది నరేంద్రమోడీని అధికారానికి తెచ్చినందున తామే అసలైన దేశభక్తులమని బిజెపి వారు చెప్పుకుంటున్నారు. దుస్తులను బట్టి ఎవరో గుర్తించవచ్చు అన్న నరేంద్రమోడీకి ఉన్న ప్రజ్ఞ లేదా అపార తెలివితేటలను ఎవరైనా అభినందించాల్సిందే, అంగీకరించాల్సిందే. అందరికీ అది సాధ్యం కాదు. ” ప్రధాని మోడీ నాయకత్వంలో ఎన్నో చేశారు. అతను ఆ దేశభక్తుడు. ఆర్ధికంగా మరియు నైతిక ప్రవర్తన రీత్యాకూడా అతని మేకిన్‌ ఇండియా ఆలోచనలో కూడా ఎంతో విషయం ఉంది.భవిష్యత్‌ భారత్‌దే. ప్రపంచంలో అది అతి పెద్ద ప్రజాస్వామిక దేశమన్నది గర్వంగా చెప్పుకోగల గలవాస్తవం.బ్రిటీష్‌ వలస దేశంగా ఉండి ఆధునిక దేశంగా మారేక్రమంలో భారత్‌ బ్రహ్మాండమైన పురోగతి సాధించింది. సయోధ్య లేదా కొంతమేర పరిమితం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించటంలో ప్రపంచంలో సామర్ధ్యం ఉన్నవారిలో ప్రధాని నరేంద్రమోడీ ఒకరు. భారత వ్యవసాయానికి అవసరమైన ఎరువుల సరఫరా పెంచాలని నరేంద్రమోడీ కోరారు. మనం 7.6 రెట్లు పెంచాము, వ్యవసాయంలో వాణిజ్యం రెట్టింపైంది ” అని పుతిన్‌ అన్నాడు. నరేంద్రమోడీలో ఏ లక్షణాన్ని బట్టి దేశభక్తుడు అని పుతిన్‌ కితాబిచ్చారన్నదే ఆసక్తి కలిగించే అంశం.


నరేంద్రమోడీతో చెట్టా పట్టాలు వేసుకు తిరిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పదవిలో ఉండగా ” నరేంద్రమోడీ భారత దేశ పిత ” అని వర్ణించాడు. దీనితో పోలిస్తే పుతిన్‌ ప్రశంస పెద్దదేమీ కాదు. ఎందుకంటే మోడీ దేశభక్తి గురించి ఇప్పటికే దేశంలో ఎందరో చెప్పారు.2019 సెప్టెంబరులో ఐరాస సమావేశాల్లో పాల్గొనేందుకు నరేంద్రమోడీ న్యూయార్క్‌ వెళ్లినపుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వీర లెవెల్లో పొగిడి మునగచెట్టెంకించటమే కాదు, హౌడీ మోడీ సభలో అబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని మోడీ పలికే విధంగా వ్యవహరించాడు. అప్పుడు అవసరం అలా ఉంది మరి ! అవసరం వచ్చినపుడే ఎవరైనా పొగుడుతారా అంటే, లోకం తీరు అలా ఉంది. ” నరేంద్రమోడీ పాలనకు ముందు నాకు భారత్‌ గురించి అంత పెద్దగా గుర్తు లేదు గానీ తీవ్రంగా చిన్నాభిన్నంగా ఉందని గుర్తు. ఎంతగానో కుమ్ములాడుకొనే వారు, వారందరినీ మోడీ ఒక్కటి చేశారు. ఒక తండ్రి మాదిరి ఒకదగ్గరకు చేర్చారు. బహుశా అతను దేశ పిత కావచ్చు. మనం అతన్ని దేశ పిత అని పిలవవచ్చు. అన్ని అంశాలను ఒక దగ్గరకు చేర్చారు, వాటి గురించి మనమింకేమాత్రం వినం ” అని జర్నలిస్టులు, రెండు దేశాల దౌత్యవేత్తల ముందు ట్రంప్‌ చెప్పాడు. ఎన్నో అనుకుంటాంగానీ అనుకున్నవన్నీ జరుగుతాయా ? బైడెన్‌ గెలుస్తాడని, ట్రంప్‌ మట్టి కరుస్తాడని నరేంద్రమోడీ ఏ మాత్రం పసిగట్టినా అబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అనేవారు కాదు.


నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత దేశ ప్రతిష్ట పెంచినట్లు బిజెపి లేదా మిత్రపక్షాల వారే కాదు. అనేక మంది అలాగే చెప్పారు. ప్రతిష్టను పెంచటమే కాదు, ప్రపంచ నేతల మీద చెరగని ప్రభావాన్ని కలిగించారని కూడా రాశారు.” మోర్నింగ్‌ కన్సల్ట్‌ పొలిటికల్‌ ఇంటెలిజన్స్‌ ” అనే సంస్థ ఇచ్చిన రేటింగ్స్‌లో ప్రపంచ నేతల్లో నరేంద్రమోడీ 71శాతంతో ప్రధమ స్థానంలో ఉన్నారు. ఓడిపోవటానికి ముందు 2020లో డోనాల్డ్‌ ట్రంప్‌ మన దేశానికి వచ్చాడు. అంతకు ముందు ఏడాది అమెరికాలో హౌడీ మోడీ సభను ఏర్పాటు చేస్తే మర్యాదలకు మనమేమీ తక్కువ కాదన్నట్లు ” నమస్తే ట్రంప్‌ ” కార్యక్రమాన్ని పెట్టారు. నరేంద్రమోడీ ఎంతో విజయవంతమైన నేత అని, భారత్‌ను మరో ఉన్నత స్థానానికి తీసుకుపోతారని ట్రంప్‌ పొగిడాడు.డేవిడ్‌ కామెరాన్‌ బ్రిటన్‌ ప్రధాని(2010-16)గా ఉండగా లండన్‌లో భారత సంతతి వారితో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ నరేంద్రమోడీ బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటూ అచ్చేదిన్‌ జరూర్‌ ఆయెంగే అంటూ మోడీ నినాదాన్ని ఉటంకించి జనాన్ని ఉత్సాహపరిచాడు. బ్రిటన్‌లోని గ్లాస్‌గో పట్టణంలో 2021లో జరిగిన ప్రపంచ వాతావరణ సభలో ఇజ్రాయెల్‌ ప్రధాని నఫ్తాలీ బెనెట్‌ మన ప్రధాని నరేంద్రమోడీతో పిచ్చాపాటీ మాట్లాడుతూ ” మీరు ఇజ్రాయెల్‌లో ఎంతో బాగా తెలిసినవారు, రండి మా పార్టీలో చేరండి ” అని బెనెట్‌ అనగానే నరేంద్రమోడీ పగలబడి నవ్విన వీడియో బహుళ ప్రచారం పొందింది.


నరేంద్రమోడీని ఇతర ప్రపంచ నేతలు వివిధ సందర్భాలలో పొగిడిన ఉదంతాలు ఉన్నాయి. తమకు అనుకూల వైఖరి తీసుకోనపుడు వత్తిడి తెచ్చిన ఉదంతాలు కూడా తెలిసిందే. ముఖ్యంగా ఉక్రెయిన్‌ సంక్షోభంలో తమ పాటలకు అనుగుణ్యంగా నరేంద్రమోడీ నృత్యం చేస్తారని ఆశించిన అమెరికా, ఇతర పశ్చిమ దేశాల అంచనాలు తప్పాయి. స్వతంత్ర వైఖరిని తీసుకున్నారు, తద్వారా రష్యా అనుకూల వైఖరి తీసుకున్నారని పశ్చిమ దేశాలు కినుక వహించినా వైఖరిని మార్చుకోలేదు.భారీ మొత్తంలో చమురును కొనుగోలు చేస్తూ పుతిన్‌ సర్కార్‌కు అదనపు రాబడిని కూడా మోడీ సమకూర్చుతున్నారు. ఎనిమిది నెలలు గడచిన తరువాత కూడా అదే వైఖరి అనుసరించటంతో వచ్చే రోజుల్లో కూడా అదే వైఖరితో ఉంటారనే నమ్మకం కుదిరి లేదా వుండాలనే కాంక్షతో నరేంద్రమోడీని పుతిన్‌ పొగిడి ఉండాలన్నది ఒక అభిప్రాయం. నరేంద్రమోడీ ప్రధాని పదవిలోకి రాక ముందే పుతిన్‌ 1999 నుంచి ప్రధాని లేదా అధ్యక్ష పదవుల్లో ఉన్నాడు. 2012 నుంచి అధ్యక్షుడిగా ఏకబిగిన ఉన్నాడు, అన్నీ సక్రమంగా ఉంటే 2024 వరకు ఉంటాడు. మోడీ అధికారానికి వచ్చిన ఎనిమిదిన్నర సంవత్సరాల తరువాత పుతిన్‌ ఎందుకు అన్నాడు అన్నది సందేహాలకు ఉక్రెయిన్‌పై తీసుకున్న వైఖరే అన్నది స్పష్టం. అంతర్జాతీయ రాజకీయాల్లో, తమ దేశాలకు ఆర్ధికంగా లబ్ది కలిగినపుడు ఇలాంటివి సహజం.


డేవిడ్‌ కామెరాన్‌ అచ్చే దిన్‌ నినాదాన్ని ప్రస్తావించి పొగిడినా, పుతిన్‌ మేకిన్‌ ఇండియా గురించి చెప్పినా అవి అవెంత ఘోరంగా వైఫల్యం చెందిందీ మనకు బాగా తెలిసిందే. అంతర్జాతీయ సహకారం, ప్రపంచ ఆర్ధిక వృద్దికి గాను చేసిన కృషికి 2018 సియోల్‌ శాంతి బహుమతిని నరేంద్రమోడీకి ప్రదానం చేశారు. ఆ తరువాత మన దేశంలో అదే మోడీ ఏలుబడిలో ఆర్ధిక వృద్ధి దిగజారిన సంగతి తెలిసిందే. పుతిన్‌ ఒక్కడే కాదు, అంతకు ముందు పదవీచ్యుతుడైన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా భారత విదేశాంగ విధానాన్ని పొగిడాడు. స్వతంత్ర దేశాలు తమ విదేశాంగ విధానాలను ఎలా రూపొందించుకోవాలో భారత్‌ను చూసి నేర్చుకోమని కూడా చెప్పాడు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దంటే ధిక్కరించి కొనుగోలు చేసిందన్నాడు.


భావజాల రీత్యా అమెరికాకు దగ్గర కావాలని తొలి రోజుల్లో నెహ్రూ కాలంలోనే ఊగినప్పటికీ అది విధించిన షరతులకు తలొగ్గకూడదని మన పాలకవర్గం వత్తిడి తెచ్చిన కారణంగానే నాటి సోవియట్‌ వైపు మొగ్గారు. దేశానికి లబ్ది చేకూరేట్లు చూశారు. ఇప్పుడు అమెరికాతో కలసి మార్కెట్ల వేటలో లబ్దిపొందాలని మన పాలకవర్గం ఉత్సాహపడినా ఎక్కడన్నా బావేగానీ వంగతోట కాదన్నట్లు అమెరికా నిరూపించింది. తమ అమెజాన్‌ కంపెనీకి మన మార్కెట్‌లో పూర్తి ప్రవేశం కల్పించాలని అమెరికా వత్తిడి తెచ్చింది. అది భారతీయ అమెజాన్‌గా మారాలని చూస్తున్న అంబానీ రిలయన్స్‌ ప్రయోజనాలకు దెబ్బ. దీనికి తోడు నరేంద్రమోడీ మీద వత్తిడి తెచ్చేందుకు అమెరికా ప్రముఖ పత్రికల్లో ఒకటైన వాషింగ్టన్‌ పోస్టు పత్రిక నరేంద్రమోడీ విధానాలను విమర్శనాత్మకంగా చూసింది. అది అమెజాన్‌ కంపెనీదే. ఆ కోపం, అంబానీల వత్తిడి కారణంగా అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ ఢిల్లీ వస్తే కలిసేందుకు ప్రధాని నరేంద్రమోడీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రష్యా నుంచి తక్కువ ధరలకు ముడిచమురు దిగుమతి చేసుకొని పెట్రోలు,డీజిలు, ఇతర ఉత్పత్తులను తయారు చేసి విపరీత లాభాలు పొందుతున్న కంపెనీ అంబానీ రిలయన్స్‌. అమెరికా విధానాలకు మద్దతు ఇస్తే వచ్చేది బూడిదే. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు మన దేశంలో కరోనా వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి సరుకు, ఇతర వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధించిన జో బైడెన్ను మర్చిపోగలమా? అంతకు ముందు మనలను బెదిరించిన ట్రంప్‌ను మన మిత్రుడిగా చూడగలమా ? ఇప్పుడు పుతిన్‌ చెప్పినట్లు భారీ మొత్తంలో ఎరువులను దిగుమతి చేసుకుంటే వాటికి మన కరెన్సీలో చెల్లిస్తే భారీ బడ్జెట్‌ లోటును ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎంతో ఊరట కలుగుతుంది. అందుకే ఎన్ని బెదిరింపులు వచ్చినా నరేంద్రమోడీ పరోక్షంగా రష్యాకు మద్దతు ఇస్తున్నారు. దాన్ని నిర్దారించుకున్న తరువాతనే పుతిన్‌ ఇప్పుడు నోరు తెరిచి మెచ్చుకోలు మాటలు చెప్పాడు. ఇదే వైఖరిని మోడీ సర్కార్‌ ఎంత కాలం కొనసాగిస్తుంది అన్నది ఊహాజనితమైన ప్రశ్న.


గాల్వన్‌ ఉదంతాలతో చైనాతో అమీతుమీ తేల్చుకుంటారని నరేంద్రమోడీ గురించి అనేక మంది భావించారు. కానీ అదేమీ లేకుండా అక్కడి నుంచి రికార్డులను బద్దలు కొడుతూ దిగుమతులకు అనుమతిస్తున్నారు. ఇది చైనా మీద ప్రేమ కాదు, మరొకటి కాదు. చైనా నుంచి ముడి సరకులను దిగుమతి చేసుకొని ఇతర దేశాలకు ఎగుమతి చేసే కంపెనీల కోసమే, అది లేకుంటే సదరు కంపెనీలు కన్నెర్ర చేస్తాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు రెండు దేశాల లావాదేవీలు 103.63 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఈ లెక్కన ఈ ఏడాది గత రికార్డులను బద్దలు కొట్టనుంది. ఉక్రెయిన్ను ముందుకు తోసి ఆయుధాలు అమ్ముకుంటూ లబ్ది పొందుతున్నది అమెరికా. తైవాన్‌ విలీనాన్ని అడ్డుకోవటంలో కూడా దాని ఎత్తుగడ, ఆచరణ అదే. మనకూ చైనాకు తగాదా పెట్టి మనకు ఆయుధాలు అమ్మి అంతకంటే ఎక్కువ లాభాలను ఆర్జించాలన్న అమెరికా ఎత్తుగడ మన కార్పొరేట్లకు తెలియంది కాదు. అందుకే కాషాయ దళాలు ఒక వైపు వ్యతిరేకతను రెచ్చగొడుతున్నా చైనాతో తెగేదాకా లాగకూడదన్నది మన కార్పొరేట్ల వైఖరి. ఈ కారణంగానే సరిహద్దుల్లో ఎలాంటి దురాక్రమణలు లేవు అని ప్రధాని నరేంద్రమోడీ అఖిల పక్ష సమావేశంలో ప్రకటించాల్సి వచ్చింది.


పెద్ద మొత్తంలో బహుమతులు పొందేందుకు గాను చుట్టుపక్కల అరవై ఆరు గ్రామాలకు మీ ఊరు పోతుగడ్డ అని గతంలో హరికథలు, బుర్రకథలు చెప్పేవారు గ్రామీణులను ఉబ్బించేవారు. వారిని మించిపోయాడు బ్రిటన్‌ మాజీ పధాని బోరిస్‌ జాన్సన్‌.” ఒక్క మనిషి, ఎంతో బాగా అర్ధం చేసుకొని తన దేశమైన భారత్‌కు పూర్తిగా అసాధారణమైన వాటిని సాధించి పెట్టిన వ్యక్తి భారత ప్రధాని నరేంద్రమోడీ. సూర్యుడు ఒక్కడే,ప్రపంచం ఒక్కటే, నరేంద్రమోడీ ఒక్కరే ” అన్నారు.ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని రెచ్చగొట్టిన వారిలో జాన్సన్‌ ఒకడు. అంతే కాదు ఆ వివాదంలో, అంతకు ముందు కూడా పూర్తిగా అమెరికా శిబిరంలో ఉంటూ రష్యాను వ్యతిరేకించిన జపాన్‌ దివంగత ప్రధాని షిజో అబె తాను ఎంతో ఎక్కువగా ఆధారపడే, విలువైన స్నేహితుల్లో నరేంద్రమోడీ ఒకరు అని పొగిడారు. రష్యాను తీవ్రంగా వ్యతిరేకించే ఆస్ట్రేలియా కూడా అమెరికా ఆడించే కీలుబొమ్మే. ఆ దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ తమదేశంతో వాణిజ్య ఒప్పందం కుదిరిన సందర్భంగా మాట్లాడుతూ ఆ సందర్భాన్ని ఆనందంగా గడిపేందుకు నా ప్రియమైన స్నేహితుడు ప్రధాని నరేంద్రమోడీకి ఇష్టమైన కిచిడీతో సహా మోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్‌ కూరలను వండేందుకు సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రెండు విరుద్ద శిబిరాల్లోని వారు నరేంద్రమోడీని ఈ విధంగా పొగుడుతున్నారు అంటే వాటి వెనుక రాజకీయాలు లేవని చెప్పగలమా ?


సాధారణంగా రాజులకు ముగ్గురు భార్యలు ఉంటారని మనం చూసిన సినిమాలు, కథలు, కొందరి చరిత్రలను బట్టి తెలిసిందే. వారిలో పెద్ద భార్య మహాపతివ్రత అంటేనే కదా పేచీ వచ్చేది. నరేంద్రమోడీ నిజమైన లేదా అసలైన దేశభక్తుడు అని పుతిన్‌ చెప్పినదానికి ప్రాతిపదిక ఏమిటి ? సజీవులై ఉన్న వారిలోనా లేక భారత చరిత్రలోనే నిజమైన దేశ భక్తుడని అన్నాడా అన్న అనుమానం రావటం సహజం. నిజమైన దేశభక్తుడని అన్నట్లు ఆలిండియా రేడియో, దూరదర్శన్లలో కూడా చెప్పారు గనుక దాన్నే ప్రమాణంగా తీసుకుందాం.(దీని అర్దం అన్నింటినీ అని కాదు) పుతిన్‌ రష్యన్‌ భాషలో చేసిన ప్రసంగం గురించి రాయిటర్స్‌ వార్తా సంస్థ ఇచ్చిన అనువాదంలో దేశభక్తుడు అని ఉంది. అందుకే కొన్ని సంస్థలు అలాగే ఇచ్చాయి.ఎవరైనా దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే వారికి ఇచ్చే గౌరవం వేరు. మిగిలిన ప్రతి పౌరుడూ దేశభక్తుడే. ఎక్కువ తక్కువ, నిజమైన, సాధారణ అనే కొలబద్దలేమీ లేవు. అందువలన పుతిన్‌ చెప్పిన వర్ణన ప్రకారం మన దేశం మీద వత్తిడి తెస్తున్న వారిని వ్యతిరేకించిన దేశ భక్తుడు నరేంద్రమోడీ అన్న అర్ధంలో పుతిన్‌ చెప్పి ఉంటే పేచీ లేదు. అలాగాక అసలైన దేశభక్తుడు అంటే పేచీ వస్తుంది. గతంలో మన మీద ఇంతకంటే ఎక్కువగా వత్తిడి తెచ్చిన అమెరికా, ఇతర దేశాలకు వ్యతిరేకంగా, అలీన విధాన సారధులుగా దశాబ్దాల తరబడి( దీని అర్దం దేశ రాజకీయాల్లో వారి పాత్రను బలపరుస్తున్నట్లు కాదు) విదేశాంగ విధానాన్ని అనుసరించిన మన ప్రధానులు ఉన్నారు. మరి వారినేమనాలి ?

పేట్రేగుతున్న కేరళ గవర్నర్‌ : 15న రాజభవన్‌ వద్ద ధర్నా , ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ రద్దుకు సుబ్రమణ్య స్వామి డిమాండ్‌ !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ తనకు పదవి ఇచ్చిన కేంద్ర పెద్దలను సంతుష్టీకరించేందుకుగాను నానా పాట్లు పడుతున్నారు. దానిలో భాగంగానే ఎవరేమనుకుంటే నాకేటి అన్నట్లుగా పేట్రేగుతూ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వంతో ఘర్షణకు దిగుతున్నారు. పచ్చి అవాస్తవాలు కూడా చెబుతున్నారు. ఈ పూర్వరంగంలో అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు బిజెపి కేంద్ర నేత సుబ్రమణ్య స్వామి మరింతగా రెచ్చిపోయారు. ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ వెంట్రుకను ముట్టుకున్నా ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ప్రధాని నరేంద్రమోడీని ఒక ట్వీట్‌ ద్వారా డిమాండ్‌ చేశారు.” రాజ్యాంగం ప్రకారం కేరళ గవర్నర్‌ అంటే భారత రాష్ట్రపతి ప్రతినిధి అని కేరళలోని వెర్రి కమ్యూనిస్టులు తెలుసుకొనేట్లు చేయండి. ఒక వేళ గవర్నర్‌ వెంట్రుకను ముట్టుకున్నా మొత్తం ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు సిద్దం కావాలని మోడీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను ” అని ఒక ట్వీట్‌ చేశారు. తాజా వివాదానికి వస్తే రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్ల నియామకంలో యుజిసి నిబంధనలను పాటించని కారణంగా వారంతా రాజీనామా చేయాలని గవర్నర్‌ ఆదేశించారు. దీని గురించి పరోక్షంగా రాష్ట్ర ఆర్ధిక మంత్రి కెఎన్‌ బాలగోపాల్‌ చేసిన సాధారణ విమర్శ తన గురించే అని ఊహించుకొని ఏకంగా మంత్రిని తొలగించాలని లేఖ రాశారు.


కేరళ విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో బాలగోపాల్‌ మాట్లాడుతూ ” ఉత్తర ప్రదేశ్‌ వంటి చోట్ల ఉన్న పరిస్థితులకు అలవాటు పడి అక్కడి నుంచి వచ్చిన కొందరికి కేరళ విశ్వవిద్యాలయాలు ప్రజాస్వామికంగా పని చేస్తున్న తీరును అర్ధం చేసుకోవటం కష్టం. వారణాసిలోని బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ భద్రతా సిబ్బంది ఐదుగురు విద్యార్దుల మీద కాల్పులు జరిపారు. నేను అప్పుడు ఎంపీగా ఉండి అక్కడికి వెళ్లాను. వైస్‌ ఛాన్సలర్‌కు 50 నుంచి 100 మంది వరకు భద్రతా సిబ్బంది ఉన్నారు.అక్కడి అనేక విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి అది.” అన్నారు. గవర్నర్‌ ఖాన్‌ పేరు ప్రస్తావించినట్లుగా ఏ పత్రిక కూడా వార్తలు ఇవ్వలేదు. కానీ ఆమాటలను తనకు వర్తింప చేసుకొని, మంత్రిగా బాలగోపాల్‌ చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించినందున తాను ఇచ్చిన సమ్మతిని వెనక్కు తీసుకుంటున్నానని, దానికి అనుగుణంగా వ్యవహరించాలని అక్టోబరు 25న ఒక లేఖలో ముఖ్యమంత్రిని కోరారు. దాన్ని విజయన్‌ తిరస్కరించుతూ, గవర్నర్‌కు అలాంటి అధికారం లేదని, బాలగోపాల్‌ మంత్రిగా కొనసాగటానికి గవర్నర్‌ అనుమతి అవసరం లేదు కనుక ఎలాంటి చర్య అవసరం లేదని అన్నారు. తొలగించాలన్న పదాన్ని గవర్నర్‌ పేర్కొనకపోయినా మంత్రిని తొలగించాలన్నదే దాని తార్కిక ముగింపు.


ముఖ్యమంత్రి గనుక మంత్రిని తొలగించకపోతే ఎవరో ఒకరు కోర్టుకు వెళతారని శుక్రవారం నాడు ఢిల్లీలో గవర్నర్‌ ఖాన్‌ ది ప్రింట్‌ పత్రిక ప్రతినిధితో చెప్పారు. ఆర్ధిక మంత్రి బాలగోపాల్‌ను తొలగించాలని తాను కోరలేదని, తన సమ్మతి లేకుండా పదవిలో కానసాగే అవకాశం లేదని రాజ్యాంగం చెప్పిన దానిని కేవలం వివరించానని గవర్నర్‌ వివరించారు. తన లేఖ మీద నిర్ణయం ముఖ్యమంత్రి విచక్షణకు సంబంధించిందని, అయితే ఈ అంశం మీద ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని అన్నారు. ప్రమాణం చేయించాల్సింది గవర్నర్‌,నేనాపని చేశాను. దేశ ఐక్యత సమగ్రతలను కాపాడతానని అతను ప్రమాణం చేశాడు. అతను( బాలగోపాల్‌ ) దాన్ని ఉల్లంఘించారు. విద్యావ్యవస్థను ఉత్తర దక్షిణాలుగా విభజిస్తే అది ఉల్లంఘన కాదా ! అతనికి బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం ఒక కేంద్ర విశ్వవిద్యాలయం అని కూడా తెలియదు, అంతేకాదు దాని వైస్‌ ఛాన్సలర్లను ఉత్తరాది నుంచి గాక దక్షిణాది నుంచి నియమిస్తారు అని గవర్నర్‌ చెప్పారు.( ఆ విశ్వవిద్యాలయ ప్రస్తుత వైస్‌ ఛాన్సలర్‌ సుధీర్‌ కె జైన్‌.2000 సంవత్సరంలో తెలుగువాడైన విసి సింహాద్రి, 2003లో పచ్చా రామచంద్రరావు పనిచేశారు. వారికి ముందు 1952 వరకు-తరువాత జాబితాను చూస్తే ఉత్తరాది, ఇతర ప్రాంతాల వారు, ఒకరిద్దరు తప్ప దక్షిణాది వారు కనిపించరు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌కు ఈ అంశాలు తెలియవనుకోవాలా ? లేక బుకాయించారా. జాబితాను ఎవరైనా చూడవచ్చు. ) తనకు కేరళలోని ప్రతి ఒక్కరూ మద్దతు ఇస్తున్నారని గవర్నర్‌ చెప్పుకున్నారు.


వైస్‌ ఛాన్సలర్లు రాజీనామాలు సమర్పించాలని తాను సూచించానే తప్ప ఉత్తరువులు ఇవ్వలేదని, తన సూచనలను నిర్ణీత గడువులో ఖాతరు చేయనందున సంజాయిషి కోరుతూ నోటీసులు జారీ చేశానని గవర్నర్‌ చెప్పారు. తన మార్గదర్శకాలను కోర్టు పక్కన పెట్టిందని చెప్పటం తప్పని గవర్నర్‌ అన్నారు. కేసు విచారణ రోజున విసిలకు పదకొండు గంటల వరకు గడువు ఇచ్చానని ఎలాంటి స్పందన లేకపోవటంతో 11.30 నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. అదే రోజు కోర్టు సాయంత్రం నాలుగు గంటలకు విచారించిందని అప్పటికే నోటీసులు జారీ చేశానని అన్నారు. సమాధానం చెప్పేందుకు వారికి నవంబరు మూడవ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు చెప్పారు.


గవర్నర్‌ చేస్తున్న పనులన్నీ సంఘపరివార్‌ అజెండా మేరకే ఉన్నాయని, తన పదవిని దుర్వినియోగం చేస్తున్నందున నవంబరు 15న రాజభవన్‌ ఎదుట, జిల్లా కేంద్రాలలో ఎల్‌డిఎఫ్‌ నిరసన తెలుపుతుందని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌ ప్రకటించారు. రాజభవన్‌ వద్ద సిఎం కూడా పాల్గొంటారని వెల్లడించారు. విశ్వవిద్యాలయాల స్వతంత్ర ప్రతిపత్తిని నాశనం చేస్తున్నారని, విసిలను తరచూ బెదిరిస్తున్నారని అన్నారు. ఏదో విధంగా సెనెట్‌, సిండికేట్లలో ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని దూర్చేందుకు చూస్తున్నారని, వాటిని సాగనివ్వబోమని అన్నారు. నవంబరు రెండవ తేదీన భావ సారూప్యత కలిగిన వారితో పెద్ద సభ నిర్వహిస్తామని, పదవ తేదీలోగా జిల్లాల్లో సభలు, పన్నెండవ తేదీన కాలేజీల్లో జరుగుతాయని చెప్పారు.


గవర్నర్‌ విధుల నిర్వహణకు ఎలాంటి ఢోకా ఉండదని, అంతకు మించి ఇతర అధికారపరిధిలోకి ఒక్క అంగుళం మేర ప్రవేశం గురించి కూడా ఊహించుకోవద్దని, తలదూర్చుదామనుకుంటే కుదరదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ హితవు చెప్పారు.వ్యక్తిగత హౌదాతో పని చేసేందుకు గవర్నర్లకు అధికారాలు లేవని స్పష్టం చేశారు. వైస్‌ ఛాన్సలర్ల రాజీనామా కోరటం లేని అధికారాన్ని చెలాయించ చూడటమే అన్నారు. కెటియు వైస్‌ ఛాన్సలర్‌ నియామకాన్ని కోర్టు కొట్టివేయటాన్ని అవకాశంగా తీసుకొని తొమ్మిది మంది విసీలను తప్పు కోమని కోరుతున్నారని, ఒక వేళ నిబంధనలకు విరుద్దంగా నియామకం జరిగితే నియమించే అధికారర ఉన్న గవర్నర్‌దే దానికి దానికి ప్రాధమిక బాధ్యత అవుతుందని అన్నారు. కెటియు విసి ఉదంతంలో అకడమిక్‌ అర్హతలు లేవని సుప్రీం కోర్టు చెప్పలేదని, అనుసరించిన పద్దతిని మాత్రమే పరిగణనలోకి తీసుకుందని, ఈ వివాదం హైకోర్టులో ఉన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని, సుప్రీం తీర్పును సమీక్షించాలని పిటీషన్‌ వేసే అవకాశం ఉందని, ఈ లోగా దాన్ని అవకాశంగా తీసుకొని గవర్నర్‌ రాష్ట్రం మొత్తంలో యంత్రాంగాన్ని అస్థిరపచేందుకు చూస్తున్నారని సిఎం చెప్పారు. సుప్రీం తీర్పు ఒక్క కెటియుకే పరిమితమని అన్నారు.


వైస్‌ ఛాన్సలర్లను తొలగించేందుకు రెండు కారణాలుండాలని వాటిలో నిధుల దుర్వినియోగం, చెడునడతకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే వాటి మీద హైకోర్టు లేదా సుప్రీం కోర్టు జడ్జి విచారణ జరిపి నిర్దారిస్తేనే తొలగించాలి తప్ప ఛాన్సలర్లకు తొలగించే అవకాశం లేదని ముఖ్యమంత్రి విజయన్‌ చెప్పారు. గవర్నర్‌ తీరు ప్రజల తీర్పునే అవమానించేదిగా ఉంది.అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా నిలిపివేయటం, రాజ్యాంగమిచ్చిన అధికారాల మేరకు ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌లను సకాలంలో ఆమోదించకపోవటంతో పదకొండింటికి గడువు ముగిసింది.2019లో గవర్నర్‌గా వచ్చిన దగ్గర నుంచీ ఏదో ఒక వివాదాన్ని గవర్నర్‌ ముందుకు తెస్తున్నారు. మంత్రి వర్గం రూపొందించిన ప్రసంగాన్ని చదివేందుకు తిరస్కరించి తన స్వంత ప్రసంగం చేశారు. తాను కోరిన అధికారిని విధుల నుంచి మార్చకపోతే గవర్నర్‌ ప్రసంగ ప్రతిపై సంతకాలు చేసేది లేని భీష్మించారు. మంత్రుల నియామకం, తొలగింపులో గవర్నర్లకు విచక్షణ అధికారాలు లేవు. గవర్నర్‌ ఖాన్‌ విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది నియామకంపై ప్రారంభించి, సెనెట్‌, సిండికేట్‌ మెంబర్స్‌, చివరికి విసీలను కూడా రచ్చ చేస్తున్నారు. పోలీసు అధికారులకు నేరుగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. సంఘపరివార్‌ శక్తులు అడుగుపెట్టిన జెఎన్‌యు, హైదరాబాద్‌ విశ్వవిద్యాలయాల్లో జరిగిందేమిటో తెలిసిందే, కేరళ సంస్థలను కూడా అలాంటి వారితో నింపేందుకు చూస్తున్నారని ఎల్‌డిఎఫ్‌ విమర్శిస్తోంది.


గవర్నర్‌ తీరుతెన్నులను కాంగ్రెస్‌ కూడా విమర్శించింది. ప్రశ్నించటానికి వీల్లేని దేవుడేమీ కాదు అంటూ ప్రతిపక్ష నేత విడి సతీషన్‌ చెప్పారు. మంత్రిని తొలగించాలనే అధికారం గవర్నర్‌కు లేదన్నారు. దేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడైనా జరిగిందా అని ప్రశ్నించారు. మంత్రి తొలగింపు కోరుతూ గవర్నర్‌ రాసిన లేఖకు పూచికపుల్లకున్న విలువ కూడా లేదని మాజీ మంత్రి, సిపిఎం నేత థామస్‌ ఐజాక్‌ అన్నారు. ఈ వివాదం చివరకు ఏమౌతుంది, ఎలా ముగుస్తుందన్నది చూడాల్సి ఉంది.
.

ఆంగ్లేయుల దోపిడీ, అణచివేతలపై బ్రిటన్‌ అధినేతగా రిషి సునాక్‌ భారతీయులకు క్షమాపణ చెబుతారా !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


కన్సర్వేటివ్‌ పార్టీ నేత రిషి సునాక్‌ కొత్త చరిత్రను సృష్టించాడు.పంజాబు మూలాలున్న తొలి ఆసియన్ను బ్రిటన్‌ నూతన ప్రధానిగా బకింగ్‌హామ్‌ పాలెస్‌లో మంగళవారం నాడు రాజు ఛార్లెస్‌ నియమించాడు. హిందువు, భారతీయుడు,మనవాడు అంటూ మన మీడియా స్పందించింది. ఏడు వారాలలో ఇద్దరు ప్రధానుల రాజీనామాతో మూడవ కృష్ణుడిగా రిషి రంగంలోకి వచ్చాడు. ఆరు సంవత్సరాల కాలంలో ఐదుగురు ప్రధానులు మారటం బ్రిటన్‌లో ఏర్పడిన అస్థిరతకు తాజా పరిణామాలు నిదర్శనం. బ్రిటన్‌ చరిత్రలో కేవలం 50 రోజులు మాత్రమే పదవిలో ఉండి అతి తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా లిజ్‌ ట్రస్‌ చరిత్రకెక్కారు. అంతకు ముందు ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా కారణంగా ప్రధాని పదవికి కన్సర్వేటివ్‌ పార్టీలో జరిగిన పోటీలో సునాక్‌ను వెనక్కు నెట్టి ట్రస్‌ మొదటి స్థానంలో నిలవటంతో సెప్టెంబరు ఆరున ఆమె పదవిలోకి వచ్చారు.(బ్రిటన్‌ పార్టీల నిబంధనల ప్రకారం పార్లమెంటులో పార్టీ నేతగా ఎన్నిక కావాలంటే నిర్ణీత సంఖ్యలో పార్టీ ఎంపీల మద్దతు పొందిన వారు పోటీ పడతారు, తొలి రెండు స్థానాల్లో వచ్చిన వారికి ఆ పార్టీల సాధారణ సభ్యులు ఎన్నుకుంటారు. ఒక్కరే ఉంటే ఏకగ్రీవం అవుతారు). ప్రధానిగా సునాక్‌ తొలిసారి మాట్లాడుతూ దేశం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌ చేసిన తప్పిదాలను సరిదిద్దాల్సి ఉందన్నాడు.ప్రతిపక్ష లేబర్‌ పార్టీ, ఇతరులు డిమాండ్‌ చేసినట్లుగా ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని స్పష్టం చేశాడు.


ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలకు భిన్నంగా పన్ను రాయితీలు ప్రకటించటంతో విమర్శలపాలు కావటమే కాదు, స్వంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత తలెత్తటంతో లిజ్‌ ట్రస్‌ ఇంటిదారి పట్టారు. తొలుత తాను రాజీనామా చేసేది లేదని బీరాలు పలికినా చివరకు తలొగ్గక తప్పలేదు. దీంతో మరోసారి పార్టీలో పోటీ తలెత్తింది. ఈ సారి ప్రధాని పదవికి పోటీ పడేవారికి కనీసం వంద మంది ఎంపీల మద్దతు ఉన్నవారే అర్హులని నిర్ణయించారు. మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రేసులో నిలిచేందుకు పావులు కదిపినా ఆశించిన మద్దతురాకపోవటంతో వెనక్కు తగ్గి పరువు నిలుపుకున్నాడు. పార్లమెంటులో పార్టీ నాయకురాలు పెనీ మోర్డాంట్‌ అర్హతకు అవసరమైన మద్దతును కూడగట్టటంలో విఫలం కావటంతో చివరి క్షణంలో ఆమె కూడా తప్పుకోవటంతో సునాక్‌ ఒక్కరే మిగిలారు. లండన్‌ కాలమానం ప్రకారం అక్టోబరు 25వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు(మన దేశం కంటే నాలుగున్నర గంటలు వెనుక) తన చివరి కాబినెట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసిన లిజ్‌ ట్రస్‌ రాజీనామా ప్రకటించి రాజు ఛార్లెస్‌కు అందచేశారు. చివరి మంత్రి వర్గ సమావేశం తరువాత లిజ్‌ ట్రస్‌ పన్నుల తగ్గింపు తన చర్యను సమర్ధించుకున్నారు.అధికారంలో ఉన్న వారు ధైర్యంగా ఉండాలన్నారు.


సునాక్‌ పదవి నిజానికి ముళ్ల కిరీటం వంటిదే. లిజ్‌ ట్రస్‌ సెప్టెంబరు 23న మినీ బడ్జెట్‌గా పిలిచిన చర్యలలో కొన్ని ఇలా ఉన్నాయి. కార్పొరేట్‌ సంస్థల మీద పన్ను మొత్తాన్ని 25శాతానికి పెంచాలన్న ప్రతిపాదనకు భిన్నంగా 19శాతానికి తగ్గించారు. జి20 దేశాలలో ఇది కనిష్టం. మౌలిక ఆదాయపన్ను 20 నుంచి 19శాతానికి తగ్గించారు.లక్షన్నర పౌండ్లకు మించి రాబడి ఉన్నవారికి పన్ను మొత్తాన్ని 45 నుంచి 40శాతానికి తగ్గించారు. బీమా పధకానికి పెంచిన 1.25 శాతం చెల్లింపును రద్దు చేశారు. ఇండ్ల కొనుగోలుపై పన్నుల తగ్గింపు, పన్ను తగ్గింపు జోన్ల ఏర్పాటు, అక్కడ నిబంధనలను నీరు గార్చటం, టూరిస్టులు తాము చెల్లించిన అమ్మకపు పన్నును తిరిగి తీసుకొనే వెసులుబాటు, మద్యంపై పెంచిన పన్నుల తగ్గింపు. నలభై ఐదు బిలియన్‌ పౌండ్ల మేర ఖజానాకు గండిపడేచర్యలివి. నిజానికి ఈ కారణంగా ఆమె పదవిని కోల్పోవటం పెట్టుబడిదారీ వ్యవస్థలో చిత్రంగానే కనిపించవచ్చు. దీని వలన దేశ లోటు, రుణ భారం మరింతగా పెరగనుంది, సంక్షేమ చర్యలకు కోత పడుతుంది. ఇప్పటికే కార్మికులు, మధ్యతరగతి వారి మీద గతంలో పెంచిన పన్నులు, ఇటీవలి కాలంలో ధరల పెరుగుదలతో జీవన వ్యయం విపరీతంగా పెరిగి జనజీవితాలు అతలాకుతలం అవుతున్న నేపధ్యంలో కార్పొరేట్‌లు, ధనికులకు ప్రకటించిన రాయితీలు తీవ్ర విమర్శలకు, అధికారపార్టీలో కుమ్ములాటలకు దారి తీశాయి.


ఏక్షణంలోనైనా ఆర్ధిక రంగం మాంద్యంలోకి జారనుందనే సూచనలు కనిపిస్తున్నాయి. నాలుగు దశాబ్దాల రికార్డును బద్దలు కొట్టి ద్రవ్యోల్బణం 10.1శాతం దాటింది. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. దీంతో రుణాల భారం పెరుగుతుంది. మరోవైపు పౌండు విలువ దారుణంగా దిగజారింది. అధికారపక్ష పలుకుబడి అధమ స్థాయికి పడిపోయింది. ట్రస్‌ – రిషి ఇద్దరూ ఒకే తానులో ముక్కలైనా అనుసరించే పద్దతుల్లో మాత్రమే తేడా. 2024 వరకు పార్లమెంటు గడువు ఉన్నందున వెంటనే ఎన్నికలు జరగాలని టోరీ పార్టీ కోరుకోవటం లేదు. ఇంకా తగినంత గడువు ఉన్నందున ఆర్ధిక రంగాన్ని పునరుజ్జీవింపచేసి, జీవన ప్రమాణాలను పెంచి ఓటర్ల ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓడిపోవటం ఖాయం. ప్రభుత్వ ఖర్చు తగ్గింపు ద్వారా లోటు బడ్జెట్‌ తగ్గింపు, పన్నుల పెంపును ఐఎంఎఫ్‌ కోరుతున్నది.ఇదే జరిగితే కార్మికుల జీవితాలు మరింతగా దిగజారతాయి. అందువలన రానున్న రోజుల్లో రిషి సునాక్‌ కత్తిమీద సాము చేయాల్సి ఉంటుంది. ఈ నెల 31న తన విధానాల గురించి సునాక్‌ చేసే ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.


పెరిగిన ఇంథన, ఆహార, ఇతర వస్తువుల ధరల తగ్గింపు, నిజవేతనాల పెరుగుదల కోసం జనాలు చూస్తున్నారు. దేశం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని సునాక్‌ చెప్పాడు.2020 ఫిబ్రవరి నుంచి 2022 జూలై వరకు ఆర్ధిక మంత్రిగా పని చేసిన సునాక్‌ 1950 దశకం తరువాత తొలిసారిగా పన్నుల భారాన్ని పెంచాడు. ప్రభుత్వ ఖర్చునూ పెంచాడు. ద్రవ్యోల్బణం తగ్గి అదుపులోకి వచ్చిన తరువాత మాత్రమే పన్నులను తగ్గిస్తానని లిజ్‌ ట్రస్‌తో ప్రధాని పదవికి పోటీపడినపుడు రిషి చెప్పాడు. 2029 నాటికి ఆదాయపన్నును 20 నుంచి 16శాతానికి తగ్గిస్తామని చెప్పాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా కన్సర్వేటివ్‌ పార్టీలో విబేధాలు ఉన్నాయి. ఈ కారణంగానే బోరిస్‌ జాన్సన్‌, లిజ్‌ ట్రస్‌ ఇంటిదారి పట్టారు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వేరుపడాలన్న వైఖరిని రిషి సమర్ధించాడు. అది పొరపాటని తిరిగి చేరాలంటూ కొందరు ఇప్పుడు వత్తిడి చేస్తున్నారు. వెలుపల ఉండటం ద్వారా బ్రిటన్‌కు కలిగే ప్రయోజనాలను వెంటనే చూపకపోతే ఆ డిమాండ్‌ మరింతగా పెరగవచ్చు. విదేశీ వలసలను అరికట్టాలని కన్సర్వేటివ్‌ పార్టీలో మెజారిటీ కోరుతున్నారు. అయితే అలాంటి వలసవచ్చిన వారి సంతతికి చెందిన సునాక్‌ ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం. అలాంటి కుటుంబం నుంచి వచ్చినందుకు తాను గర్వస్తానని అన్నాడు. ఆర్ధిక రంగ సమస్యలను నిర్ధారించి, పార్టీని ఐక్య పరచి దేశాన్ని ముందుకు తీసుకుపోతానని సునాక్‌ చెప్పాడు. విధ్వంసం జరిగిన ప్రాంతంలోకి సునాక్‌ అడుగుపెడుతున్నాడని ఒక టీవీ వ్యాఖ్యాత చేసిన వర్ణన వాస్తవానికి దగ్గరగా ఉంది. ప్రభుత్వ ఖర్చును 30బిలియన్‌ పౌండ్ల మేర తగ్గించటం లేదా ఆ మేరకు అదనపు రాబడిని చేకూర్చాల్సి ఉంది.రానున్న మూడు సంవత్సరాల్లో ప్రభుత్వ రుణభారాన్ని తగ్గిస్తామన్న వాగ్దానాన్ని కూడా అమలు జరపాల్సి ఉంది.


బ్రిటన్‌లో ప్రధాని పదవిని చేపట్టిన రెండవ క్రైస్తవేతరుడిగా, తొలి హిందువుగా రిషి సునాక్‌ చరిత్రకెక్కారు. అతడు భారతీయ మూలాల కంటే హిందువు కావటంతోనే మన దేశంలో మీడియా, సామాజిక మాధ్యమంలో ప్రచారం జరుగుతున్నది. నిజానికి సునాక్‌ తాతలు ప్రస్తుతం పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రాంతంలోని గుజ్రాన్‌వాలాకు చెందిన వారు. దేశ విభజనకు ముందే వారు బతుకు తెరువు కోసం ఆఫ్రికాలోని కెన్యా, టాంజానియాకు వలస వెళ్లారు. అక్కడే సునాక్‌ తండ్రి జన్మించాడు.1960 దశకంలో వారి కుటుంబం బ్రిటన్‌ వలస వచ్చింది. తరువాత 1980లో రిషి సునాక్‌ బ్రిటన్‌లో జన్మించాడు. చదువుకొనేటపుడు మన దేశానికి చెందిన ప్రముఖ ఐటి సంస్థ ఇన్ఫోసిన్‌ నారాయణ మూర్తి కుమార్తె అక్షత లండన్‌లో చదివేటపుడు ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు. సునాక్‌ నానమ్మ ఆఫ్రికన్‌. వారి కుటుంబం పుట్టింది, పెరిగిందీ ఆఫ్రికాలోనే ఉగండాలో ఇడీ అమీన్‌ పాలనలో జరిగిన దాడులపుడు అనేక మంది బ్రిటన్‌ ఇతర దేశాలకు వలస వెళ్లారు. అలాంటి కుటుంబాలలో సునాక్‌ తండ్రి ఒకరు. అందువలన నిజంగా చెప్పాల్సి వస్తే ఆఫ్రికా మూలాలు లేదా తాతలు పుట్టిందీ పెరిగినదాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే పాక్‌ మూలాలని కూడా చెప్పాల్సి ఉంటుంది. మన మాజీ ప్రధాని ఐకె గుజ్రాల్‌, మన్మోహన్‌ సింగ్‌, ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ కుటుంబాలు విభజన సమయంలో పాకిస్తాన్‌ నుంచి వలస వచ్చినవే. అలాగే పాక్‌ అధ్యక్షుడిగా పనిచేసిన పర్వేజ్‌ ముషారఫ్‌ కుటుంబం భారత్‌ నుంచి పాక్‌ వలస వెళ్లింది. వారు పదవుల్లోకి వచ్చినపుడు వారి మూలాల గురించి ఎలాంటి చర్చ లేదు. సోనియా గాంధీ 1983లోనే పూర్తిగా భారత పౌరురాలిగా మారినప్పటికీ తరువాత 2004లో బిజెపి లేని వివాదాన్ని ముందుకు తెచ్చి ప్రధాని గాకుండా మనోభావాలతో ఆడుకొనేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆమె ఇటలీ మూలాల గురించి ఏదో రూపంలో ప్రస్తావిస్తూనే ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు చూస్తున్నారు. వసుధైక కుటుంబం కబుర్లు చెప్పేది కూడా వారే అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రిషి సునాక్‌ మూలాలు భారత్‌లో ఉన్నట్లు మన మీడియా చిత్రిస్తున్నది, దాన్ని ఏ ప్రాతిపదికన చెబుతారు. దాని వలన ఒరిగేదేమిటి ? అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్‌ ఒబామా తొలి ఆఫ్రికన్‌ సంతతికి చెందినవాడు. లాటిన్‌ అమెరికా, ఐరోపాలోని అనేక దేశాల్లో ఇలా వలస వచ్చిన వారు, వారి సంతతి ఉన్నత పదవులను పొందారు. అందువలన అదేమీ వింత కాదు.


ఈ దేశంలో పుట్టిన ముస్లింలను పాకిస్తాన్‌ పోవాలని చెబుతున్న విద్వేష శక్తులే రిషి సునాక్‌ మూలాల గురించి ఎక్కువగా ముందుకు తెస్తున్నాయి.బ్రిటన్‌లో కూడా జాత్యహంకార శక్తులు లేకపోలేదు. వారికి భారత్‌, పాకిస్తాన్‌, చైనా ఇలా ఎక్కడ నుంచి వలస వచ్చిన కుటుంబాలనైనా ఆసియన్లంటూ చులకనగా చూసేవారున్నారు.మొత్తం మీద చూస్తే అలాంటి సంకుచిత భావాలకు అతీతంగా అక్కడి సమాజం ఎదిగిన కారణంగానే సునాక్‌తో సహా అనేక మంది ఇతర ఖండాల మూలాలు ఉన్న సంతతికి చెందినప్పటికీ మంత్రులుగా, ఏకంగా ఇప్పుడు ప్రధానిగానే అంగీకరించారు. రిషి సునాక్కు అమెరికా గ్రీన్‌ కార్డు కూడా ఉందని కూడా తెలిసిందే. రిషి సునాక్‌ కుటుంబం మీద విమర్శలు కూడా ఉన్నాయి. భార్య అక్షిత 20లక్షల పౌండ్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డారని విమర్శలు రాగా తరువాత ఆ మొత్తాన్ని తాను చెల్లిస్తానని ఆమె వివాదానికి స్వస్థిపలికారు. సునాక్‌ ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు అనేది కాదు, వర్తమానంలో ఎవరి కోసం పని చేస్తున్నాడు అన్నది కీలకం. ఆ విధంగా చూస్తే కార్పొరేట్లకు చెందిన కన్సర్వేటివ్‌ పార్టీ నేతగా వారి సేవలోనే తరిస్తున్నాడు. ఒకనాడు తెల్లవారు మన దేశాన్ని పరిపాలిస్తే నేడు మన వాడు బ్రిటన్‌ పాలకుడిగా ఉన్నారని కొందరు చెబుతున్నారు. గతంలో ఎంపీగా భగవద్గీత మీద ప్రమాణం చేసినట్లు మురిసిపోతున్నారు. ఎవరి విశ్వాసం వారిది. వందల సంవత్సరాల పాటు బ్రిటీష్‌ వారు మన సంపదలను కొల్లగొట్టి తమ దేశానికి తరిలించారు. అణచివేతలో భాగంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్నారు. వారు చేసిన నేరాలకు ఎన్నడూ క్షమాపణ కాదు కదా తమ పూర్వీకులు తప్పు చేసినట్లు విచారం కూడా ప్రకటించలేదు. చెప్పేందుకు సిద్దంగా కూడా లేరు.అందరూ చెబుతున్నట్లు భారత మూలాలు ఉన్న ఒక పంజాబీగా జలియన్‌వాలా బాగ్‌ దురంతాన్ని రిషి గుర్తు చేసుకోగలరా ? ఇదే రిషి సునాక్‌ ఆర్ధిక మంత్రిగా తమ దేశానికి లబ్ది చేకూర్చే వాణిజ్య ఒప్పందాల చర్చలను కొనసాగించారని తెలుసా ? వాటితో మన దేశాన్ని కొత్తగా కొల్లగొట్టకుండా ప్రధానిగా తన గడ్డ రుణం తీర్చుకుంటారని అతను మనవాడని భుజాన వేసుకుంటున్న వారు చెప్పగలరా ? అదే భగవద్గీత మీద ప్రమాణం చేసి తన జాతికి చేసిన అన్యాయాలకు బ్రిటన్‌ అధినేతగా క్షమాపణ సరే కనీసం విచారమైనా ప్రకటించగలరా ?

నరేంద్రమోడీ ఘోర వైఫల్యం : ఆరేండ్ల నాటి పెద్ద నోట్ల రద్దుకు నేడు అడ్డగోలు సమర్ధనలా !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు
ప్రధాని నరేంద్రమోడీ నోట రెండోసారి పలికేందుకు ఇబ్బంది పడిన పెద్ద నోట్ల రద్దును సమర్ధిస్తూ రిజర్వుబాంకు ద్రవ్యవిధాన పర్యవేక్షక కమిటీ సభ్యురాలుద, ఆర్ధికవేత్త అషిమా గోయల్‌ ఇటీవల ముందుకు వచ్చారు. దేశ చరిత్రలో పెద్ద నోట్ల రద్దు జనానికి ఒక పెద్ద పీడకల, పాలకులకు ఘోర వైఫల్యం. దీని గురించి ఆరు సంవత్సరాల తరువాత ఐదుగురు జడ్జీలతో కూడిన సుప్రీం కోర్డు డివిజన్‌ బెంచ్‌ పెద్ద నోట్ల రద్దు లక్షా˜్యన్ని సాధించిందా అన్న అంశాన్ని విచారించేందుకు అంగీకరించింది. ప్రభుత్వ విధానాల సమీక్ష మీద తమకు ఉన్న లక్ష్మణ రేఖ గురించి తెలుసునని కూడా కోర్టు పేర్కొన్నది. అందువలన ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందనే అంశం గురించి ఊహాగానాలు అవసరం లేదు. తీర్పు తీరు తెన్నులు ఎలా ఉన్నప్పటికీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయ ఫలితాలు, పర్యవసానాల మంచి చెడ్డల గురించి జరిగే చర్చలో అనేక అంశాలు వెలుగులోకి వస్తాయి, పాలకుల మాటలను, నాటి పరిస్థితి, ప్రహసనాలను జనాలకు మరోసారి గుర్తుకు తెస్తాయి.


పెద్ద నోట్ల రద్దు బడా వైఫల్యమని తెలిసినప్పటికీ పన్ను వసూళ్ల ప్లవనశక్తి వెనుక పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ ఉన్నదని అషిమా గోయల్‌ పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అది నిజమా, ఆ వైఖరితో అందరూ ఏకీభవించాలా? అఫ్‌ కోర్సు ఇదే తర్కం ఆర్ధికవేత్తలందరికీ వర్తిస్తుంది కదా అని ఎవరైనా అనవచ్చు. నిజమే, ఎవరేం చెప్పినా వారు చెప్పినదానికి ప్రాతిపదికలే విశ్వసనీయతను వెల్లడిస్తాయి. ఇదే అషిమాకూ వర్తిస్తుంది. దేశంలో పెద్ద నోట్ల రద్దుకు ముందు- తరువాత పన్ను వసూళ్ల అంకెలు ఏమి చెబుతున్నాయి ? ఇలా అనేక అంశాలను చూడాల్సి ఉంది. పెద్ద నోట్ల రద్దు గురించి ఆర్‌బిఐ, కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులో దాఖలు చేసే అఫిడవిట్లలో ఏమి చెబుతారన్నది ఆసక్తి కలిగించే అంశమే. అషిమా గోస్వామి చెప్పిన అంశాల ప్రాతిపదిక, వాదనే వాటిలో ఉంటుందా ? చూద్దాం.


పెద్ద నోట్ల రద్దు ద్వారా నల్లధనాన్ని వెలికి తీస్తామని, ఉగ్రవాదులు, ఇతర విద్రోహశక్తులకు నిధులు అందకుండా చూస్తామని,సమాంతర ఆర్థిక వ్యవస్థ అంతు చూస్తామని, తెరవెనుక లావాదేవీలను బహిర్గతపరుస్తామని ప్రధాని నరేంద్రమోడీ 2016నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటనలో చెప్పారు. ” ప్రభుత్వ అధికారుల పరుపుల కింద కరెన్సీ కట్టలు లేదా గోనె సంచుల్లో నగదు దొరికింది అనే వార్తలతో నిజాయితీపరులైన పౌరులు బాధపడకూడదనే ” పెద్ద నోట్ల రద్దు విధానాన్ని ప్రకటించినట్లు చెప్పారు. లెక్కాపత్రం లేని ధనాన్ని పన్ను అధికారులకు వెల్లడించటం లేదా బాంకుల్లో జమ మినహా మరొక మార్గం లేదన్న ఎందరో దాన్ని అవినీతి, నల్లధనంపై మెరుపు (సర్జికల్‌) దాడిగా పేర్కొన్నారు. ఆ తరువాత తెలంగాణాలో జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక, ఇప్పుడు జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికలో లెక్కా పత్రం లేని డబ్బు ప్రవాహాన్ని చూసిన తరువాత మోడీ అమాయకుడై అలా చెప్పారా లేక జనాలను వెంగళప్పలుగా భావించినట్లా ? ఇటీవలనే పశ్చిమ బెంగాల్‌ మంత్రి పార్థా చటర్జీ, అతని సన్నిహితురాలు అపర్ణా ముఖర్జీ ఇండ్లలో అధికారికంగా ప్రకటించిన రు.49.80 కోట్ల నగదు కట్టలు, ఐదు కోట్ల విలువైన బంగారం వారి వద్దకు ఎలా చేరినట్లు ? ఇది సముద్రంలో కాకిరెట్ట వంటిది. ఆ పెద్దమనిషి రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు గనుక, మమతాబెనర్జీకి కూడా వాటా వుండి చూసీ చూడనట్లు ఉన్నారనుకుందాం, మరి కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నట్లు ? నిజానికి చిత్తశుద్దితో దాడులు చేస్తే దేశంలో అలాంటివి ఇంకా ఎన్ని దొరికేదీ చెప్పాల్సినపని లేదు. పెద్ద నోట్ల రద్దు తరువాత కొంత ఇబ్బంది పడినప్పటికీ ఇప్పుడు దాని ఫలాలు అందుతున్నట్లు అషిమా చెప్పారు. ఫలాలంటే ఏమిటి ? ఆర్ధిక వ్యవస్థ క్రమబద్దీకరణ జరిగింది, డిజిటైజేషన్ను పెంచింది, పన్నుల ఎగవేతను నిరోధించింది అని ఆమె చెప్పారు. గత ఏడాదితో పోల్చితే వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో కార్పొరేట్‌, వ్యక్తిగత పన్ను చెల్లింపు 24శాతం పెరిగి రు.8.98లక్షల కోట్లకు, జిఎస్‌టి గత ఏడాది సెప్టెంబరుతో పోల్చితే ఈ ఏడాది 26శాతం చేరినట్లు అక్టోబరు 9న పన్నుల శాఖ చెప్పిన అంశాన్ని ఆమె తన వాదనకు రుజువుగా పేర్కొన్నారు.


పెద్ద నోట్ల రద్దు వలన సుమారు నాలుగున్నరలక్షల కోట్ల మేర నగదు చలామణి నుంచి అదృశ్యమౌతుందని ఎస్‌బిఐ ప్రధాన ఆర్ధిక సలహాదారుగా ఉన్న సౌమ్యకాంతి ఘోష్‌ 2016 నవంబరు 14వ తేదీన బిజినెస్‌ స్టాండర్డ్‌ అనే పత్రికలో రాసిన విశ్లేషణలో పేర్కొన్నారు.( అంటే ఆమేరకు ప్రభుత్వానికి లబ్ది చేకూరినట్లే) అంతే కాదు ఇప్పటికే ఉన్న ఢిల్లీ పొగను మరింత పెంచేవిధంగా అంత మొత్తాన్ని తగుల పెట్టబోరనే చతురోక్తిని కూడా విసిరారు. అషిమా అభిప్రాయం కూడా అలాంటిదేనా ? ఇద్దరూ ఆర్ధికవేత్తలే కదా ! చివరికి ఏమైంది, ఒక్కరంటే ఒక్కరు కూడా నోట్లు తగలబెట్టలేదు, పోపుల డబ్బాల్లో దాచుకొని నోట్ల రద్దు తెలియని వారు, ఇతర కుటుంబ సభ్యులకు తెలపకుండా కొంత మొత్తాలను దాచుకొని అవి వెల్లడైతే కుటుంబంలో కలతల గురించి భయపడినవారు తప్ప నల్ల ధనికులందరూ తమ సొమ్మును తెల్లగా మార్చుకున్నారని అధికారిక గణాంకాలే చెప్పాయి.ఆశించిన ఫలితాలు రాకపోవటంతో భంగపడిన అధికారపార్టీ పెద్దలు పెద్ద నోట్ల రద్దు వలన అసలెందుకు చేశారో చెప్పటం మానేసి దీని వలన డిజిటల్‌ చెల్లింపులు పెరిగాయి కదా అని వాదించారు. మొగుడు పోతే పోయాడు గానీ గుండు మాత్రం పొన్నకాయలా భలే ఉందే అన్న సామెతను గుర్తుకు తెచ్చారు. అది కూడా నిజం కాదు. కార్డుల ద్వారా చెల్లిస్తే రెండు శాతం అదనంగా వసూలు చేస్తుండటంతో జనాలు తిరిగి నగదుకే మొగ్గారు. అనేక దుకాణాల్లో యుపిఐ చెల్లింపులను అంగీకరించటం లేదు.కార్డులు లేదా యుపిఐ లావాదేవీలను పెంచేందుకు ప్రపంచంలో ఏ దేశంలో కూడా పెద్ద నోట్ల రద్దు అనే పిచ్చిపనులు చేయలేదు. కానీ కొందరు ఈ ఘనతను నరేంద్రమోడీకి ఆపాదించేందుకు మరోసాకు లేక పెద్ద నోట్ల రద్దుకు ముడిపెట్టారు.

2016 నవంబరు 14న గోవాలోని మోపా విమానాశ్రయ శంఖుస్థాపన సందర్భంగా గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ దేశానికి ఒక విన్నపం చేశారు. ‘నేను కేవలం 50రోజులు మాత్రమే అడుగుతున్నాను. డిసెంబరు 30వరకు గడువు ఇవ్వండి. ఆ తరువాత నా వుద్ధేశ్యాలు లేదా చర్యలలో ఏదైనా లోపం కనపడితే దేశం ఏ శిక్ష విధించినా భరించటానికి నేను సిద్దంగా వున్నాను, వురికైనా సిద్దమే, సజీవ దహనం చేయండి’ అన్నట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. డెబ్బయ్యేండ్ల నుంచి కుంభకోణాలకు పాల్పడిన వారు నన్ను బతకనివ్వరు, వారంతా ఇప్పుడు తమ దగ్గర వున్న నల్లధనాన్ని మార్చుకొనేందుకు బ్యాంకుల ముందు బారులు తీరారని కూడా సెలవిచ్చారు.


పెద్ద నోట్ల రద్దు గురించి దివంగత ఆరుణ్‌ జైట్లీ ఆర్ధిక మంత్రిగా 2017 ఫిబ్రవరి రెండున పార్లమెంటులో చేసిన ప్రసంగంలో చెప్పిందేమిటి ? 2016 నవంబరు ఎనిమిది నుంచి డిసెంబరు 30వరకు రెండు నుంచి 80లక్షల వరకు డిపాజిట్లు చేసిన ఖాతాలు 1.09 కోట్లు కాగా ఒక్కొక్క ఖాతా సగటు మొత్తం రు.5.03 లక్షలు, 80లక్షలకు మించి దాఖలు చేసిన ఖాతాలు 1.48 లక్షలు, వీటి సగటు రు.3.31 కోట్లు. వీటిని మరొక విధంగా చెప్పారు కొందరు. రు.80లక్షల లోపు డిపాజిట్లు చేసిన ఖాతాల్లో చేరిన మొత్తం రు.5.48 లక్షల కోట్లు కాగా అంతకు మించి చేసిన ఖాతాల మొత్తం రు.4.89 లక్షల కోట్లు.ఆర్‌బిఐ ప్రకటించిన దాని ప్రకారం 99శాతంపైగా నగదు వెనక్కు వచ్చింది, రిజర్వుబ్యాంకు నివేదిక ప్రకారం 99.3శాతం రద్దయిన నోట్లు వెనక్కు తిరిగి వచ్చాయి.10,720 కోట్లు మాత్రమే వెనక్కు రాలేదని, మొత్తం నోట్లలో 0.0005శాతం అంటే 5,22,783 మాత్రమే నకిలీ నోట్లను కనుగొన్నట్లు రిజర్వుబ్యాంకు వెల్లడించింది.రిజర్వుబ్యాంకు అధికారికంగా చెప్పినదాని ప్రకారమే వెనక్కు రాని నోట్ల కంటే కొత్త నోట్లు అచ్చేసి, పంపిణీ చేసేందుకు అయిన ఖర్చు ఎక్కువ. పదమూడు వేల కోట్ల రూపాయలని చెప్పింది. రద్దు చేసిన నోట్ల విలువ రు.15.44లక్షల కోట్లు. మూడోవంతు(31శాతం) సొమ్ము రు.4.89 లక్షల కోట్లు 80లక్షలకు పైగా డిపాజిట్లు కేవలం 1.48 లక్షల మంది నుంచే వచ్చిందంటే నోట్ల రద్దు వలన లబ్ది పొందింది నల్ల మహా ధనికులా మరొకరా ?


పెద్ద నోట్ల రద్దు తరువాత నగదు రహిత ఆర్ధిక వ్యవస్థగా మారిందని చెప్పే పెద్దమనుషులతో, డిజిటల్‌ లావాదేవీలు పెరిగాయంటూ టీ స్టాల్‌, కూరల దుకాణాల ఉదాహరణలు చెప్పేవారితో నాకు పేచీ లేదు. అది వేరే సమస్య. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలకు అవినీతితో సంబంధం ఉంటుందని పెద్ద నోట్ల రద్దు ప్రసంగంలో నరేంద్రమోడీ గారే చెప్పారు.” పెద్ద మొత్తంలో నగదు చెలామణి అవినీతి స్థాయితో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. అవినీతి పద్దతుల్లో నగదు సమీకరణతో ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుంది. పేదలు ఈ భారాన్ని భరించాల్సి ఉంటుంది. మీరు స్వయంగా అనుభవించి ఉంటారు. భూమి లేదా ఇంటినో కొనుగోలు చేసినపుడు చెక్కు ద్వారా చెల్లించేదానితో పాటు పెద్ద మొత్తంలో నగదును డిమాండ్‌ చేస్తారు. ఒక నిజాయితీ పరుడు ఆస్తిని కొనుగోలు చేసినపుడు సమస్యలను సృష్టిస్తుంది. నగదును దుర్వినియోగం చేస్తే వస్తువుల ధరలు, సేవలైన ఇండ్లు, భూమి, ఉన్నత విద్య, ఆరోగ్య సంరక్షణ ఇంకా ఎన్నింటి ధరలో కృత్రిమంగా పెరుగుతాయి.” ఇవన్నీ చెప్పింది మన గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ గారే. నోట్ల రద్దు జరిగి ఆరేండ్లు కావస్తోంది, నల్లధనం ఎలా జడలు విరుచుకొని తిరుగుతోందో రిజిస్ట్రారు కార్యాలయాలను సందర్శించిన వారికి తెలిసిందే. నిజాయితీపరులైన వారు చెక్కుల ద్వారా ఇండ్లు కొనుక్కున్న ఉదంతం ఒక్కదాన్ని ఎవరైనా చూపగలరా ? ఆత్మవంచన చేసుకోకుండా ఎవరికి వారు అవలోకించుకోవాలి.


పెద్ద నోట్ల రద్దుకు ముందు 2015 -16లో నగదు చెలామణి జిడిపిలో 12.1శాతం ఉంది. రద్దు తరువాత సంవత్సరం అది 8.7 శాతానికి తగ్గింది. నగదును తీసుకొనేందుకు బాంకులు పడిన ఇబ్బంది గురించి వాటిలో పని చేసే వారికి తెలుసు. తరువాత అది ఇంతింతై వటుడింతై అన్నట్లుగా నరేంద్రమోడీ ఏలుబడిలో కొత్త రికార్డులను బద్దలు చేసింది. నగదు చెలామణి – అవినీతికి ఉన్న సంబంధం గురించి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లుగా వరదలపుడు గోదావరి నీటి మట్టం పెరిగే మాదిరి 2021-22లో 16.8 శాతానికి పెరిగింది. మోడినోమిక్స్‌ ప్రకారం ఉక్రెయిన్‌ సంక్షోభం లేకున్నా నగదు చెలామణితో ద్రవ్యోల్బణం, ధరలు పెరిగి ఉండేవి. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం చమురు మీద పన్నులు తగ్గించినపుడు బంకుల వద్ద పన్నుల గురించి బోర్డులు పెట్టాలని బిజెపి పెద్దలు చెప్పినట్లుగా ఇప్పుడు అవినీతి స్థాయి గురించి బోర్డులు పెడితే తప్ప జనానికి అర్ధం కాదు.


పెద్ద నోట్ల రద్దు వలన పన్నుల వసూలు పెరిగిందని చెప్పవచ్చు తప్ప దానికి ఆధారాలు చూపటం చాలా కష్టం. ఎందుకంటే అది జరిగిన కొద్ది నెలలకే 2017 జూలైలో జిఎస్‌టి విధానాన్ని తీసుకువచ్చారు.ఆ తరువాత కార్పొరేట్‌ పన్ను మొత్తాన్ని గణనీయంగా తగ్గించారు. అందువలన పన్ను లక్ష్యాలను ఏ మేరకు సాధించిందీ, దాన్ని పెద్ద నోట్ల రద్దుకు ముందు తరువాత చూడాలన్నది కొందరి అభిప్రాయం. తాత్కాలికంగా ఇబ్బందులు పెట్టినా దీర్ఘకాలంలో పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు. కానీ జరిగిందేమిటి ? పెద్ద నోట్ల రద్దుకు ముందు 2011-12 నుంచి 2016-17 వరకు జిడిపి వృద్ధి రేటు 5.2 నుంచి 8.3 శాతానికి పెరిగింది. తరువాత దానికి భిన్నంగా కరోనాకు ముందు 2019-20 నాటికి నాలుగు శాతానికి దిగజారింది.మరుసటి ఏడాది కరోనాతో 7.3శాతం తిరోగమనంలో పడింది. తరువాత వృద్ధి రేటు ఇంకా కరోనా పూర్వపు స్థితికి చేరుకోలేదు. అలాంటపుడు అషిమా గోయల్‌ ఏ శాస్త్రీయ పరిశీలన ప్రాతిపదికన పెద్ద నోట్ల రద్దుకు-పన్నుకు ముడిపెట్టారు ? అదేవిధంగా యుపిఐ చెల్లింపుల పెరుగుదల గణనీయంగా ఉంది. అది పెద్ద నోట్ల రద్దుకు ముందే ప్రారంభమై ఉంటే తరువాత పెరుగుదల ఎక్కువగా ఉంటే దాని ఫలితమే అనవచ్చు.యుపిఐ సౌకర్యాన్ని ప్రవేశపెట్టిందే 2016ఏప్రిల్‌ పదకొండున, ఆ ఏడాది అసలు లావాదేవీలు జరగలేదు.2017 నవంబరు నాటికి కూడా నామమాత్రమే. అందువలన దానికి పెద్ద నోట్ల రద్దుకు సంబంధమే లేదు. ఈ లావాదేవీల పెరుగుదలకు వాటి మీద అవగాహన పెరగటం, ఇటీవలి కాలంలో ఇంటర్నెట్‌ జనాలకు అందుబాటులోకి రావటం, వేగం పెరగటమే కారణంగా చెప్పవచ్చు. దీన్ని ఆర్ధిక రంగ క్రమబద్దీకరణ అని చెప్పగలమా ?


ఆర్ధికరంగం క్రమబద్దీకరణ జరిగి పన్ను ఎగవేతలు, ఆర్ధిక నేరాలకు తావు లేకపోతే గత ఎనిమిదిన్నర సంవత్సరాల్లో దాడుల సంఖ్య విపరీత పెరుగుదలకు ఏ భాష్యం చెబుతారు ? పోనీ దాడులతో సాధించింది ఏమిటో చెప్పాలి.2004 నుంచి 2014 వరకు 112 ఇడి దాడులు జరిగితే 2014నుంచి 2022 వరకు3,010 డాడులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. నూటపన్నెండు దాడుల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం రు.5,346 కోట్లు సగటున 47.73 కోట్లు కాగా 3010 దాడుల్లో చేసుకున్నది రు.99,356 కోట్లు సగటున 33 కోట్లు ఉంది. దేశంలో అక్రమలావాదేవీలు ఇంతేనా ? ఎంతకాలం జనాన్ని మభ్య పెడతారు.3010 కేసుల్లో శిక్షలు పడింది కేవలం 23 ఉదంతాల్లోనే, అందుకే వీటిని ప్రతిపక్షాల నేతల మీద బెదిరింపు దాడులని జనాలు అనుకుంటున్నారు. ఏటా జిఎస్‌టి 85వేల కోట్ల మేరకు ఎగవేస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన రుబిక్స్‌ సంస్థ అంచనా వేసింది. ప్రభుత్వం కూడా దాదాపు ఇలాంటి మొత్తాల గురించే అధికారికంగా ప్రకటిస్తున్నది. ఇలాంటి వైఫల్యాల గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు. సుప్రీం కోర్టులో తన చర్యను కేంద్ర ప్రభుత్వం ఎలా సమర్ధించుకుంటుందో ఏ వాదనలను ముందుకు తెస్తుందో చూద్దాం !

ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌హ‌త‌హ‌..  శ‌ర‌వేగంగా మారుతున్న పరిస్థితులు

Tags

, , , ,

 

డాక్టర్ కొల్లా రాజమోహన్,

 ఇతిహాసపు చీకటికోణం

అట్టడుగున పడి కాన్పించని

కధలన్నీ కావాలిప్పుడు!

దాచేస్తే దాగని సత్యం …

అంటారు మ‌హాక‌వి శ్రీ‌శ్రీ‌. ప్ర‌స్తుతం జరుగుతున్న  ఉక్రేయిన్, ర‌ష్యా దాడి అనంత‌రం   ప‌రిణామాలు గ‌మ‌నిస్తే అనేక అంశాలు ప్ర‌జ‌ల దృష్టికి రాకుండా చేస్తున్న కుట్ర‌లు స్ప‌ష్ట‌మౌతాయి. ఉద్దేశ పూర్వ‌కంగానే అమెరికా సామ్రాజ్య‌వాద శ‌క్తుల‌కు మ‌డుగులొత్తుతూ మీడియా చేస్తున్న ప్రాప‌కాండ అంతా ఇంతా కాదు.  అమెరికా దేశానికి మ‌ద్దతు ఇస్తున్న అనేక దేశాల్లో తెర‌చాటుగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను నిశితంగా ప‌రిశీలిస్తే ఆయా దేశాల రాజ‌కీయ‌, ఆర్ధిక వ్య‌వ‌హారాలు తీవ్ర సంక్షోభంలో ఉన్న విష‌యం బ‌హిర్గ‌తమౌతుంది. 

రష్యాను లొంగతీసుకోవాలనే ఎత్తుగడతో అమెరికా ఆంక్షలను విధించింది. ఎత్తుగడ బెడిసికొట్టింది. రష్యా తన ఆయిల్ నిల్యలను ఆయుధాలుగా వాడుకుని ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాలను వణికిస్తున్నది.  అమెరికా- రష్యాలనే కాకుండా ప్రపంచాన్నేఆర్ధికసంక్షోభంలోకి, ఆర్ధిక మాంద్యం దిశగా నెట్తున్నది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సామ్రాజ్యవాదం మొదటిసారిగా చిక్కుల్లో పడింది. బ్రిటన్ పౌండ్ రికార్డు స్ధాయిలో పతన మయింది. ఆర్ధిక సంక్షోభం వలన ధరలు పెరిగిపోతున్నాయి. రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరుపొందిన బ్రిటన్లో సంక్షోభం వలన ఇద్దరు ప్రధానులు మారిపోయారు. మూడో ప్రధాని వరసలో వున్నాడు. ఆహార ధరలు, గ్యాసు, పెట్రోలు ధరలు పెరిగిపోయాయి. ప్రజల ఆదాయాలు తగ్గిపోతున్నాయి. కార్పోరేట్ అనుకూల విధానాలతో  ప్రధాని లిజ్ ట్రస్ 44 రోజులలోనే తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. *ఫ్రాన్స్ లో ప్రజలు రోడ్డెక్కారు.

. పోరాట సాంప్రదాయాలు కలిగిన ఫ్రెంచ్ కార్మికులు, విద్యార్ధులు ఆందోళనాపధంలో వున్నారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు పదవీగండం తెచ్చేటట్లున్నది.ఇటలీ. ఆస్ట్రియా, హంగెరీ, యూరోపియన్ దేశాలన్నిటిలో అసంతృప్తి ప్రజాందోళనలను ప్రభుత్వాలు తట్టుకోలేకపోతున్నాయి.సౌదీ అరేబియా అమెరికాకు ఎదురుతిరిగింది. అక్టోబరు 5 న ఒపెక్ ప్లస్  దేశాలు 2మిలియన్ బారళ్ళ చమురు ఉత్పత్తిని తగ్గించటానికి నిశ్చయించారు. ఫలితంగా ఆర్ధిక మాంద్యం కి చేరువలో వున్న యూరప్. అమెరికా లలో తీవ్ర ఆందోళన మొదలయింది.  ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసివస్తుంది.

 *అమెరికా లో రాజకీయ కల్లోలం* .

నవంబరు 8న జరిగే మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్లు విజయం సాధిస్తే ఉక్రెయిన్ కు అమెరికా చేస్తున్న సహాయాన్ని నిలిపేస్తామని రిపబ్లికన్ పార్టీ నాయకుడు కెవిన్ మెక్ కార్తీ విలేఖరుల సమావేశం లో చెప్పాడు. ఫిబ్రవరి లో రష్యా-ఉక్రెయిన్-నాటో యుద్ధం ప్రారంభమయిన దగ్గరనుంచీ అమెరికా ఆయుధాలు, నిధులు, నిఘా పరికరాలతోపాటుగా సైనిక శిక్షణ ను అందిస్తున్నది. శాటిలైట్ ల ద్వారా అత్యంత ఆధునిక నిఘావ్యవస్ధను ఉక్రెయిన్ కు ప్రతి నిముషం రష్యా సైనికుల కదలికలను తెలుపుతున్నది. ఇప్పటివరకూ 16.8 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించిందని అంచనా. ప్రభుత్వ ఖర్చులు పెరిగాయి. ద్రవ్యోల్బణం తీవ్రరూపం దాల్చింది. ప్రజాగ్రహం తో యుద్ద‌వ్యతిరేక ప్రదర్శనలు పెరుగుతున్నాయి.   

 *ఫ్రాన్స్, జర్మనీ ప్రజల  ప్రదర్శనలు  

అమెరికా మాట విని యూరప్‌ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. రష్యా తో వ్యాపారాలనన్నిటినీ ఆపేశారు. గ్యాస్ సరఫరా బందయింది. అమెరికా లిక్విఫైయిడ్ గ్యాసును సరఫరా చేస్తామంటే సంతోషించారు. లిక్విఫైయిడ్ గ్యాసును నాలుగు రెట్లు ధర ఎక్కువతో అందుబాటులోవుంచింది. కావాలంటే కొనుక్కోండంది. చౌకగా వస్తున్న రష్యన్ గ్యాసు రాకుండా చేసి కష్టకాలంలోవున్నమిత్రదేశంతో నెత్తురు పిండే వ్యాపారమేమిటని ఫ్రాన్స్, జర్మనీలు ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతం జర్మన్ ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించవలసివస్తోంది. చలి రోజులు రానున్నాయి. ఎముకలు కొరుక్కుతినే చలిని తట్టుకోవటానికి వాతావరణాన్నివేడిగా వుంచే హీటర్లు కావాలి. హీటర్లు పని చేయటానికి గ్యాసు కావాలి. ఇంధనం కొరతతో ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి  పరిశ్రమలు నడవనందున కార్మికులు నిరుద్యోగులయ్యారు. వారు ఉద్యోగాలను కోల్పోతున్నారు. నాటో విధానాల ఫలితంగా రష్యా పై విధించిన ఆంక్షల వలన ప్రజలు ఆకలితో అలమటించడమే కాకుండా, నిరుద్యోగులుగా మారుతున్నారని జర్మన్లు గుర్తించడంతో వీధిలో ప్రదర్శనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

మీడియాలో చోటు చిక్కని యూరప్ ప్రజల నాటో వ్యతిరేక ప్రదర్శనలు..

ఫ్రాన్స్ లో ప్రజలు రోడ్డెక్కారు. సైన్యంతో వీధి పోరాటాలకు దిగారు. బారికేడ్లను, ముళ్ళకంచెలను ఎదుర్కొంటున్నారు. వేలాదిమంది భారీ ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. నాటో సైనికకూటమి నుండి వైదొలగమని కార్మికులు, విద్యార్దులు దేశవ్యాపిత సమ్మెకు దిగారు. ఆదివారం ప్యారిస్ లో భారీ మార్చ్ ను నిర్వహించారు. దేశవ్యాపితంగా 180 చోట్ల భారీ ప్రదర్షనలను నిర్వహించారు. అమెరికా ప్రేరేపిత యుద్ధం వలన. ఆయిల్, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయాన్ని కలిగించింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పోతున్నాయి.  పరిశ్రమలు మూతపడుతున్నాయి. నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ఏమీకొనేటట్లు లేదు.  ఏమీ తినేటట్లులేదు. ద్రవ్యోల్బణం అదుపుతప్పి 6.2 శాతానికి మించింది. ఇంధన కొరతతో పెట్రోల్ పంపులముందు బారీక్యూ లైన్ల తో ప్రజలు విసుగెత్తిపోయారు. కొన్ని పెట్రోల్ పంపులలో ఇంధనం అందుబాటులో లేనందున ధరలు  ఆకాశాన్నంటాయి. దేశంలోని మూడోవంతు గ్యాసు స్టేషన్లలో ఇంధనం అయిపోయింది. రాబోయే చలికాలంలో ఇంటిలో వేడిచేసే గ్యాస్ లేక చలికి గడ్డకట్టుకుపోయే  పరిస్ధితులను ఊహించుకొని ఆందోళనకు గురవుతున్నారు. యుద్ధం, ఇంధన కొరత, ధరల పెరుగుదల వలన సంభవించిన కార్మికుల, ప్రజల ఆగ్రహం  ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు పదవీగండం తెచ్చేటట్లున్నది. ఫ్రాన్స్ లో ప్రపంచ యుధాలకు, అణచివేటకు కారణమైన నాటోను  రద్దు చేయమని ఫ్రెంచ్ కార్మికులు కోరుతున్నారు

 *అణుయుద్ధం తప్పదా..?* 

రష్యా భూభాగాన్ని రక్షించటానికి మాస్కో “తనకున్న అన్ని మార్గాలనూ” ఉపయోగిస్తుందని, తప్పనిసరి పరిస్ధితులలో అణ్వాయుధాలు ఉపయోగించటానికి వెనకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ హెచ్చరించాడు. రెండవ ప్రపంచయుద్ధంలో అణ్వాయుధాలను ఉపయోగించటం ద్వారా అమెరికా ఒక “ఆనవాయితీని” సృష్చించిందని హిరోషిమా, నాగసాకీలపై ణుబాంబుల దాడిని పుతిన్ గుర్తు చేశాడు. రష్యా మరియు నాటోదేశాల మధ్య అస్తిత్వ యుద్ధంగా ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని పుతిన్ అభివర్ణించారు. రష్యాను రక్షించేందుకు అణ్వాయుధాలను ఉపయోగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పాశ్చాత్య దేశాలను హెచ్చరించాడు. కొంతమంది విశ్లేషకులు పుతిన్‌ను “బ్లఫ్“చేస్తున్నారని అంటున్నారు, అయితే వాషింగ్టన్, పుతిన్‌ను తీవ్రంగా పరిగణిస్తోంది.60 ఎళ్ళ క్రితం క్యూబా మిస్సైల్ సంక్షోభం వచ్చింది. మరల ఇపుడు అణుయుధ ప్రమాదం తీవ్ర స్ధాయిలో వుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.

 అణ్వాయుధాలను తమ జాతీయ భద్రతకు హామీ ఇచ్చే ఆయుధాలుగా, యుధనిరోధక సాధనాలుగా అణ్వాయుధ దేశాలు పరిగణిస్తున్నాయి. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ న్యూక్లియార్ వార్ హెడ్స్ రష్యావద్ద 5977 వుండగా అమెరికా వద్ద 5428 న్యూక్లియార్ వార్ హెడ్స్ వున్నాయి తమ ప్రజల సంపదను ఫణంగా పెట్టి, తమ శక్తికి మించి ఖర్చు చేసి అణ్వాయుధాలను నిర్మిస్తున్నాయి.

యద్దం ఎపుడు ఆగుతుందో తెలియని అనిశ్చిత పరిస్ధితి దాపురించింది. బైడెన్ జనవరి 2021న అధ్యక్షపీఠాన్ని అదిష్టించినప్పటినుండీ  రష్యా సరిహద్దుదేశాలన్నిటిలో రష్యా వ్యతిరేక విష ప్రచారాన్నిఉధృతంచేశాడు.  రష్యాని నాశనం చేయపూనుకున్నాడు. సరిహద్దుల వైపు నాటో విస్తరణను కొనసాగించాడు. ఉక్రెయిన్ ను తటస్ధదేశంగా వుంచే అవకాశాన్ని జారవిడిచి రష్యాను నాశనం చేయాలనే తలంపుతో యుధానికి పాచికలు విదిలాడు. రష్యా, చైనాలపై విషాన్ని చిమ్మాడు. నాటో సైనిక కూటమి లో సభ్యత్వాలను ఆధారం చేసుకుని యూరోపియన్ యూనియన్ దేశానన్నిటినీ  ఉక్రెయిన్ కి సహాయంగా యుద్ధం లోకి లాగారు. రష్యా పైకి రెచ్చకొట్టాడు. సైనికంగా అమెరికా పై ఆధారపడిన నాటో దేశాలైన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ ల నాయకత్వాలు అమెరికా ఉచ్చులో పడి బయటకు రాలేక ప్రజల క్రోధాగ్నిని ఎదుర్కొంటున్నాయి. అమెరికా యుధోన్మాధం వలన ప్రపంచ ప్రజలంతా ద్రవ్యోల్బణంలో చిక్కుకుని గిలగిల లాడుతున్నారు. రష్యా సరిహద్దు దేశాలను నాటో సైనిక కూటమిలో చేర్చుకునేప్రయత్నంలో అమెరికా సఫలం అయింది. రష్యాను వేరు చేసి ఒక మూలకునెట్టి నాశనం చేయాలనే తలంపుతో పావులు కదుపుతుంది. రష్యా కమ్యూనిస్టు దేశం కాకపోయినా అమెరికా ను ఎదుర్కొనే సైనిక శక్తి, అణ్వాయుధాలు, సహజవనరులు గల శక్తివంతమైన దేశంగా వుంది. రష్యా కమ్యూనిజాన్నివదిలి , స్వేఛామార్కెట్ , ప్రజాస్వామ్యం అంటూ పెట్టుబడిదారీ విధానాన్ని, నాటోపట్ల మెతక వైఖరిని అనుసరించినా అమెరికా సామ్రాజ్యానికి తృప్తి కలగలేదు. యూరప్ కు దగ్గర కానీయలేదు. అమెరికా అగ్రరాజ్య అధిపత్యాన్ని ప్రశ్నించేవారిని సహించే పరిస్ధితి లేదు. బలమైన ప్రత్యర్ధిగా రూపొందే అవకాశం వున్నపెద్ద దేశాన్ని నాశనం చేయటమే ధ్యేయంగా అమెరికా నాటో ను విస్తరించింది. సోవియట్ యూనియన్ ని విఛిన్నం చేసిన గోర్బచేవ్ తో నాటో ను రష్యా వైపు విస్తరించబోమన్నవాగ్దాన భంగమే ఈ యుధానికి కారణం. నాటోను విస్తరించి పుతిన్ ని యుద్ధంలోకి లాగి ప్రపంచ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. అమెరికా యుద్దోన్మాదంతో ప్రపంచాధిపత్యంకోసం ఉక్రెయిన్ లో అంతర్యుధాన్నిప్రోత్సహించి రష్యా అనుకూల ప్రభుత్వాన్ని కూల్చేసి రష్యాని రెచ్చకొట్టింది.

 *అమెరికా దేశ భధ్రత… Vs…క్యూబా దేశభధ్రత* 

1962, క్యూబా మిస్సైల్ సంక్షోభానికి ఉక్రెయిన్ యుధానికి ఉన్న పోలికలను గమనించాలి. ఉక్రెయిన్ ను నాటో లో చేర్చుకుంటే మా దేశ భధ్రతకు ప్రమాదం అనే కారణంతో ఉక్రయిన్ పై రష్యా యుద్దానికి దిగింది. స్వతంత్రదేశమైన ఉక్రెయిన్ నాటో లో చేరాలనే నిర్ణయం తీసుకునే స్వేఛ ఉందని అమెరికా వాదన. అమెరికాకి 90 మైళ్ళ దూరంలో తన భధ్రతకు ప్రమాదమైన  అమెరికా వ్యతిరేక సోవియట్ అనుకూల ప్రభుత్వం వుంటానికే వీలులేదంది. ఆకాశమార్గంకుండా వేలాదిమంది తో సాయుధ దళాలను  క్యూబాదేశంలో దింపింది. ఒక స్వతంత్ర ప్రభుత్వాన్నికూలదోయటానికి “ బే ఆఫ్ పిగ్స్” పేరున సైనిక చర్య చేపట్టింది. క్యూబాప్రజలు విద్రోహ సైన్యాన్నిబంధించి అమెరికా కుట్రను భగ్నం చేశారు. చిన్న దేశమైన క్యూబా తన రక్షణ కోసం సోవియట్ సహాయం తీసుకుంది. సోవియట్ అణు క్షిపణులను క్యూబాలో ఏర్పాటు చేసుకున్నారు. మామీద దాడిచేస్తే 5 నిముషాలలో అమెరికా ప్రధాన నగరాలైన న్యూయార్క్, వాషింగటన్ లపై దాడి చేయగలమన్నారు. అమెరికాభధ్రతకు ప్రమాదమైన అణు క్షిపణులను క్యూబా నుండి తీసేయకపోతే యుద్ధం తప్పదని కెన్నడీ హెచ్చరించాడు. సోవియట్ నౌక లు క్యూబా రాకుండా నావికా దిగ్బంధాన్నివిధించారు. ఆరోజున అమెరికా తన భధ్రత కోసం స్వతంత్ర దేశమైన క్యూబా భూభాగం నుండి అణు క్షిపణులు తీసేయకపోతే యుద్ధం తప్పదన్నది. ఈ రోజున రష్యా తన భధ్రత కోసం ఉక్రెయిన్ దేశాన్ని నాటో సైనిక కూటమి లో చేర్చుకోవద్దంటున్నది. తన దేశ సరిహద్దుదేశాలలో అణ్వాయుధాలు మోహరించి నిముషాలలో దాడి చేసేపరిస్ధితి వస్తే అణుయుద్దానికైనా సిధం అంటున్నది.   

క్యూబా మిస్సైల్స్ సంక్షోభంలో ప్రపంచం అణుయుధపుటంచుకు చేరింది. ఏ క్షణమైనా క్యూబా పై అమెరికాదాడి చేయవచ్చనీ మరో క్షణంలో సోవియట్ అణ్వాయుధాలు అమెరికా పై ప్రయోగించటం తప్పదనీ ప్రపంచ నాశనం అనివార్యమనే పరిస్ధితి దాపురించింది.  క్యూబా నుండి అణు క్షిపణులను తొలగించటానికి రష్యా అంగీకరించింది. క్యూబా పై దాడి చేయనని అమెరికా హామీ ఇచ్చింది. రష్యా సరిహద్దున వున్న టర్కీనుండి అణుక్షిపణులను తొలగించటానికి అమెరికా అంగీకరించింది.  సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించి ప్రపంచ యుధాన్ని నివారించారు.

 *ప్రజలే చరిత్ర నిర్మాతలు.* 

ఈ రోజున రష్యా ఒక మూలకు నెట్టబడింది. అమెరికా ద్రవ్యోల్బణంలో చిక్కుకుంది. ఆర్ధిక మాంద్యం అంచుల్లో వుంది. నాటో నుండి వైదొలగమని యూరప్ ప్రజలు తిరగపడుతున్నారు. ప్రపంచ ప్రజల ఆహార భధ్రత ప్రమాదంలో పడింది. అణ్వాయుధ ప్రమాదం ముంచుకొస్తున్నది. అమెరికా కుట్రలను అర్దం చేసుకున్నయూరప్ యువత, కార్మికుల  ప్రజాందోళనలు యుద్ద‌గ‌తిని  మార్చబోతున్నాయి. అంతిమంగా ప్రజలే చరిత్ర నిర్మాతలు.

——————————————

డాక్టర్ కొల్లా రాజమోహన్,

నల్లమడ రైతు సంఘం.

9000657799

మత తటస్థ దేశంలో విద్వేష వాతావరణం ఉందన్న సుప్రీం కోర్టునూ తప్పు పడతారా !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


కుటుంబంలో లోపాలు ఉంటే సర్దుకుపోవాలి, ఎవరైనా పరువును బజారుకు ఈడుస్తారా ? అలాగే దేశం గురించి వేలెత్తి చూపే విధంగా విదేశాలకు అవకాశమిచ్చే రీతిలో ప్రవర్తించవచ్చా ! నిజమే, ఎవరు ఏ సందర్భంలో ఎందుకు చెప్పినా ఎప్పుడైనా ఆలోచించాల్సిన అంశమే. ఈ సుభాషితం ముందుగా ఎవరికి వర్తింప చేయాలి ? ఎవరు పాటించాలి ? భారతీయులందరూ ఆలోచించాల్సిన అంశం. తమ మీద విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని ముస్లింలు విమర్శిస్తుండగా, ఈ మతం వారు తమ మతం మీద జీహాద్‌ ప్రకటించారని, విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని హిందూమత పెద్దలుగా చెప్పుకొనే వారు ప్రతి ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం మీద భారత్‌ అంటే మధ్య యుగాల నాటి మతవిద్వేష భూమిగా ప్రపంచం భావించేట్లు చేస్తున్నారనే భావం రోజు రోజుకూ పెరుగుతోంది. విదేశాల్లో లేదా స్వదేశంలో విమర్శలకు అవకాశం కల్పిస్తున్నదెవరు ? ఏం చెబుతున్నారు ? ఆచరణలో ఏం చేస్తున్నారు ?


ఇటువంటి స్థితిలో 2022 అక్టోబరు 21న సుప్రీం కోర్టు చరిత్రలో ఒక కొత్త అధ్యాయం తోడైంది. దాఖలైన ఒక కేసు ఏమౌతుంది అన్నది పక్కన పెడితే కోర్టు చేసిన పరిశీలన ఎంతో కీలకమైనది. న్యాయమూర్తులు కెఎం జోసెఫ్‌, హృషీకేష్‌ రాయి బెంచ్‌ ” ఇది 21వ శతాబ్దం, మనం దేవుడిని ఎంతకు దిగజార్చాము ? మనకు శాస్త్రీయ దృష్టి ఉండాలని ఆర్టికల్‌ 51చెబుతున్నది.మతం పేరుతో జరుగుతున్నదేమిటి ? ఇది విషాదం ” అని చెప్పింది. మతం తటస్థంగా ఉండే దేశంలో విద్వేష వాతావరణం ఉందంటూ సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తాము చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఆదేశాలు ఇస్లాంకు వ్యతిరేకంగా చేసిన ద్వేష పూరిత ప్రసంగాలకు మాత్రమే పరిమితం కాదని, ఏ మతానికి వ్యతిరేకంగా ఎవరు చేసిన వాటికైనా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌ పోలీసు అధికారులు అలాంటి ద్వేష పూరిత ప్రసంగాల ఏ మతం వారు చేసినప్పటికీ వాటి గురించి ఎవరూ ఫిర్యాదు చేసినా, చేయకున్నా స్వంతంగా కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలు పాటించకుంటే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మూడు రాష్ట్రాల్లో ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన ద్వేష పూరిత ప్రసంగాల గురించి జర్నలిస్టు షాహిన్‌ అబ్దుల్లా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆర్టికల్‌ 51(ఏ) ప్రకారం ప్రతి ఒక్కరూ మౌలిక విధుల్లో భాగంగా శాస్త్రీయ దృష్టి, మానవత్వం, పరిశీలన, సంస్కరణ దృక్పధాన్ని పాటించాలని, భారత్‌ ఒక లౌకిక దేశంగా రాజ్యాంగం ఆలోచించిందని, భిన్న మతాలు, కులాలకు చెందిన వారు సామరస్య పూర్వకంగా జీవించనట్లైతే సహౌదరభావం ఉండదని కోర్టు పేర్కొన్నది.


సుప్రీం కోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచ జనావళిని, విశ్లేషకులను ఆకర్షించకుండా ఉంటాయా ? మన పత్రికలను చదవరా,టీవీలను చూడరా ? ఇప్పటికే విద్వేష ప్రసంగాలు మన దేశానికి పెద్ద మరకను అంటించాయి. దీనికి కారకులు ఎవరు అంటే మెజారిటీ, మైనారిటీ మతాలకు చెందిన ఓటు బాంకు పార్టీలు, నేతలు, కుట్రదారులు, ఉన్మాదులు, వారి ప్రభావానికి లోనై తప్పుదారి పట్టినవారు తప్ప సామాన్యులు కాదు. విద్వేష వాతావరణం ఏర్పడటానికి ఎవరిది ఎంత భాగం అంటే జనాభాలో ఎవరి వాటా ఎంత ఉంటే అంత అన్నది స్పష్టం. ఫిర్యాదును చూస్తుంటే దేశంలో విద్వేష వాతావరణం వ్యాపించినట్లు కనిపిస్తోందని కోర్టు పేర్కొన్నది. పిటీషనర్‌ తరఫున న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదిస్తూ విద్వేష ప్రసంగాల గురించి ఇప్పటికే సుప్రీం కోర్టు ముందు కేసులున్నాయని, నిరోధ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ అక్టోబరు తొమ్మిదిన ఢిల్లీలో జరిగిన ఒక సభలో ముస్లింల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టినందున కోర్టును ఆశ్రయించినట్లు సిబల్‌ చెప్పారు. ఢిల్లీలో ముస్లింలు చేసినట్లుగా చెబుతున్న ఒక హత్య గురించి విశ్వహిందూ పరిషత్‌ ఏర్పాటు చేసిన జన అక్రోశ్‌ నిరసన సభలో బిజెపి ఎంపీ పర్వేష్‌ సాహిబ్‌ సింగ్‌ వర్మ ప్రసంగిస్తూ పేరు ప్రస్తావించకుండానే ముస్లింలను సాంఘికంగా బహిష్కరించాలని పిలుపు ఇచ్చినట్లు దరఖాస్తుదారు పేర్కొన్నారు. పిటీషన్‌పై వాదన ప్రతివాదనల సందర్భంగా అలాంటి పిలుపులు హిందువులకు వ్యతిరేకంగా కూడా ఇస్తున్నారని, ఉభయపక్షాలు అందుకు పాల్పడుతున్నట్లు కోర్టు పేర్కొన్నది. ముస్లింలు కూడా విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు కదా అని పేర్కొన్నది.దాని మీద సిబల్‌ స్పందిస్తూ వారిని మినహాయించాలని అనుకుంటున్నారా ? ఎవరు అలాంటి విద్వేష ప్రసంగాలు చేసినా సహించకూడదు అని చెప్పారు. ఒక సామాజిక తరగతికి వ్యతిరేకంగా ఒక తరహా ప్రకటనను నొక్కి వక్కాణించాలని తాము చూడటం లేదని, తమకు ఆ సంగతి తెలుసునని కోర్టు పేర్కొన్నది. ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో బిజెపి అధికారంలో ఉంది. ఢిల్లీలో ఆమ్‌ అద్మీ పాలన ఉన్నా పోలీసులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటారు. ఇక్కడ జరుగుతున్న విద్వేష ప్రసంగాలు జనాభా దామాషా ప్రకారం చూసినా హిందూ ఉన్మాదులు చేస్తున్నవే ఎక్కువ. ఎవరూ ఫిర్యాదులు చేయకున్నా పోలీసులు తమకు తామే కేసులు నమోదు చేయాలని దేశ సర్వోన్నత కోర్టు చెప్పిందంటే మన దేశంలో ఉన్న పరిస్థితి గురించి వేరొకరెవరో వేలెత్తి చూపాల్సిన అవసరం ఉందా ? గతంలో అధికారంలో ఉన్న పార్టీలు లేదా ప్రభుత్వాలకు ఇలాంటి ఆదేశాలు ఎన్నడైనా జారీ చేసిన ఉదంతం ఉందా ? ఎవరు సమాధానం చెబుతారు ! ఇలాంటి పరిస్థితి రావటం మెజారిటీ రాష్ట్రాల్లో, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని అభిశంసించటమే.


మానభంగం వంటి అత్యాచారాల కేసుల్లో శిక్షలు పడిన వారికి ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. తాను చేసిన చట్టాన్ని తానే ఉల్లంఘించింది. అలాంటి ప్రభుత్వం గుజరాత్‌లో బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారం చేసి కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో శిక్షలు అనుభవిస్తున్న పదకొండు మంది పెరోలుపై వెలుపలికి వచ్చినపుడు సత్పప్రవర్తనతో మెలిగారని చెబుతూ జీవిత కాల శిక్ష పడిన వారిని గుజరాత్‌ సర్కార్‌ విడుదల చేసింది.2002లో గోద్రా రైలు సజీవదహనం,దానిలో కొందరు కరసేవకులు మరణించిన తరువాత జరిగిన మారణకాండలో ఈ దారుణం చోటు చేసుకుంది. బిజెపి పెద్దలు వారికి ఘనస్వాగతాలు పలికి స్వీట్లు పంచారు, వీరకుంకుమలు దిద్దారు. తమ ” ఘన ” కార్యానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదించింది. బాధితులుగా ఉన్న తమను దీని గురించి సంప్రదించలేదని, విడుదల గురించి తమకు తెలుపలేదని బిల్కిస్‌ కుటుంబం పేర్కొన్నది. పదకొండు మంది దోషులు పెరోలు, శిక్ష పడక ముందే జైల్లో ఉన్నారనే పేరుతో సంవత్సరాల తరబడి వెలుపలే ఉన్నారు. గడువు తీరిన తరువాత జైలుకు వచ్చినా ఇదేమిటని అడిగిన వారు లేరు. కారణం వారంతా బిజెపికి చెందిన వారు, అక్కడున్నది వారి ప్రభుత్వమే గనుక. వారిలో ఒకడు పెరోలు మీద వచ్చి ఒక మహిళ మర్యాదకు భంగం కలిగించాడంటూ పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. అతడిని విడుదల చేయ కూడదని పోలీసుల డైరీలో రాసినా ఖాతరు చేయకుండా విడుదల చేశారు. మరొకరిని విడుదల చేస్తే మీకేమైనా అభ్యంతరమా అని బిల్కిస్‌ కుటుంబాన్ని అడగ్గా కూడదని చెప్పినప్పటికీ విడుదల చేశారు, ఇతరుల గురించి అసలు అలా అడగనూ అడగలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ విడుదలకు మెరుపువేగంతో కదిలింది. గుజరాత్‌ సర్కార్‌ 2022 జూన్‌ 28న కేంద్రానికి లేఖరాస్తే జూలై 11న అనుమతి మంజూరైంది. ఏ కారణంతో విడుదలకు కేంద్రం అనుమతించిందో గుజరాత్‌ ప్రభుత్వం కేంద్రం సుప్రీం కోర్టుకు వెల్లడించలేదు. సిపిఎం నాయకురాలు సుభాషిణీ ఆలీ నేరగాండ్ల విడుదలను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ప్రజాహిత కేసును దాఖలు చేశారు. ఆమెకు ఈకేసుతో ఎలాంటి సంబంధమూ లేదని మూడవ పక్షపు కేసును స్వీకరించకూడదని గుజరాత్‌ ప్రభుత్వం వాదించింది.నవంబరు 29న కేసు విచారణకు రానుంది.


చిత్రం ఏమిటంటే ఈ నేరగాండ్లను గుజరాత్‌ ప్రభుత్వం ఆజాదీకా అమృతమహౌత్సవం పేరుతో ఆగస్టు15న విడుదల చేసింది. అనేక చోట్ల ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఖైదీలను విడుదల చేశారు. ఈ నేరగాండ్లకు దానితో నిమిత్తం లేకుండా అదే రోజున వదిలారు. నారీశక్తి, మహిళలకు రక్షణ గురించి కబుర్లు చెబుతున్న పెద్దలు ఈ కేసులో రేపిస్టులను విడుదల చేసేందుకు ఎవరినీ ఖాతరు చేయలేదు. కేసు విచారణ జరిపిన సిబిఐ, సిబిఐ కోర్టు జడ్జి కూడా వీరి విడుదలను వ్యతిరేకించారు.” ఈ కేసులో నేరగాండ్లకు – బాధితులకు ఎలాంటి సంబంధమూ లేదు, ఎలాంటి వైరమూ లేదు.బాధితులు ఒక మతానికి చెందిన వారనే కారణాలతో మాత్రమే నేరానికి పాల్పడ్డారు.ఈ కేసులో చిన్న పిల్లలను, గర్భిణీని వదల్లేదు.ఇది అత్యంత హీనమైన విద్వేషపూరిత, మానవత్వం మీదనే జరిపిన నేరం ” అని సిబిఐ కోర్టు జడ్జి పేర్కొన్నారు. దేశంలో ఇలాంటి పాలకులు, వాతావరణం ఉన్నపుడు ఎవరో బదనాం చేసేందుకు చూస్తున్నారని గగ్గోలు పెట్టటం అంటే దొంగే దొంగని అరవటం తప్ప వేరు కాదు. విదేశాల్లో స్పందిస్తే జాతి దురహంకారం అని, దేశీయంగా స్పందించిన వారిని దేశద్రోహులు మరొకపేరుతో నిందిస్తూ ఎదురుదాడి చేస్తున్నారు.