ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి బుకాయింపులు – అసలు రంగు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఎంతో ఆసక్తి కలిగించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. తమకు ఇంక 2024లో కూడా తిరుగులేదని బిజెపి ఢంకా బజాయిస్తోంది. కాంగ్రెస్‌, ఇతర పార్టీలు ఆత్మశోధనలో పడ్డాయి. ఎవరి సూత్రీకరణలు వారు చేసుకుంటున్నారు. ఇంకా కొత్త ప్రభుత్వాలు కొలువు తీరలేదు. పలు కోణాల్లో విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇవన్నీ సహజం.వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక అన్నట్లుగా రాజకీయ పార్టీలు చెప్పిన వాటికి ప్రతిదానికీ తలూపాల్సిన అవసరంలేదు. జనం ఇచ్చిన తీర్పును గౌరవించటం వేరు. చరిత్రలో ఇచ్చిన తీర్పులన్నీ సరైనవే అని ఆమోదించాల్సిన అవసరం లేదు. హిట్లర్‌ వంటి నియంతలకు కూడా జనమే ఓట్లు వేసి గెలిపించారు. అంతమాత్రాన వారి తీర్పు సరైనదే అంటామా ? ఉత్తర ప్రదేశ్‌కు సంబంధించి కొన్ని అంశాల తీరు తెన్నులను చూద్దాం.


యోగి ఆదిత్యనాధ్‌ అభివృద్దిని చూసి తిరిగి గెలిపించి చరిత్ర సృష్టించారు. ఇటీవలి సంవత్సరాల్లో వరుసగా రెండవసారి పార్టీ అధికారానికి రాని చరిత్రను బిజెపి తిరగరాసింది.రెండవది నిజమే. ఇక మొదటి అంశం, అభివృద్ధి అంటే ఏమిటి ? అందునా యోగి చిన్న ఇంజనైతే పెద్ద ఇంజను నరేంద్రమోడీ కూడా తోడయ్యారు అన్నారు. జరిగిందేమిటి ? 2016-21 కాలంలో ఉత్తర ప్రదేశ్‌లో ఉపాధి రేటు 38.5 నుంచి 32.79(2021 సెప్టెంబరు-డిసెంబరు)శాతానికి పడిపోయింది.కార్మికశక్తి భాగస్వామ్యం కూడా ఇదే కాలంలో 46.32 నుంచి 34.45 శాతానికి తగ్గింది. నీతిఆయోగ్‌ సంస్ధ వెల్లడించిన వివరాల ప్రకారం దారిద్య్రంలో బీహార్‌, ఝార్ఖండ్‌ తరువాత ఉత్తర ప్రదేశ్‌ మూడవ స్ధానంలో ఉంది. అందుకే బిజెపి చెప్పే అభివృద్ధి అంటే ఏమిటి అన్న ప్రశ్న వస్తోంది. అయినా జనం ఎందుకు ఓట్లు వేశారనే ప్రశ్న తలెత్తుతుంది. గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నపుడు మరొక ప్రత్నామ్నాయం లేక జనం పదే పదే ఓట్లు వేశారు, దానినేమందాం ?ఉత్తర ప్రదేశ్‌లో ప్రతిపక్ష సమాజవాది మీద తగినంత విశ్వాసం లేకపోవటం ఒకటిగా కనిపిస్తోంది. రెండవది బిజెపి బి టీమ్‌లుగా పేరు తెచ్చుకున్న బిఎస్‌పి, మజ్లిస్‌ పార్టీలు చీల్చిన ఓట్లు బిజెపికి తోడ్పడ్డాయి. పోటీ 80-20శాతాల(హిందూ-ముస్లిం) మధ్య అనే బిజెపి మత సమీకరణల నినాదం కూడా పని చేసింది.


2019లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి 49.98, దాని మిత్రపక్షానికి 1.21శాతం కలుపుకుంటే ఉత్తర ప్రదేశ్‌లో రెండు ఇంజన్లకు కలిపి వచ్చిన ఓట్లు 51.19 శాతం. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమిలోని మూడు పార్టీలకు వచ్చిన ఓట్లు 43.82శాతమే, మోడీ మంత్రం పని చేయనట్లేనా ? 2019లో సమాజవాది పార్టీ-బిఎస్‌పి-ఆర్‌ఎల్‌డి ఒక కూటమిగా పోటీ చేస్తే 39.23శాతం వచ్చాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజవాదీ కూటమికి 36.32శాతం వచ్చాయి. విడిగా పోటీచేసిన బిఎస్‌పి 12.88శాతం తెచ్చుకుంది.దీని అర్ధం ఏమిటి గతంలో బిజెపి, బిఎస్‌పి, కాంగ్రెస్‌కు పడిన ఓట్లలో కొన్ని సమాజవాది కూటమికి రాబట్టే ఓట్లశాతం పెరిగింది. బిజెపి సర్కార్‌ మీద ఉన్న వ్యతిరేకతే తమను గద్దె నెక్కిస్తుందని సమాజవాది అతి అంచనా వేసుకొని చేయాల్సిన కృషి లేకపోవటం ఓటమికి ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎన్నికల సర్వేలు చేసిన వాటిలో ఒకటైన ఏబిపి-సి ఓటర్‌ సంస్ధ 2021 మార్చి నెల నుంచి 2022 జనవరి వరకు చేసిన ఆరు సర్వేల్లో బిజెపి కూటమి సగటు ఓట్ల శాతం 41.11శాతం కాగా చివరి సర్వేలో 41.5శాతంగా పేర్కొన్నది. ఇదే సంస్ద సమాజవాది కూటమి సగటు ఓట్లశాతాన్ని 30.8గానూ, తొలి సర్వేలో 24.4శాతంగానూ చివరి సర్వేలో 33.3శాతంగా పేర్కొన్నది.


యోగి సర్కార్‌ గూండాయిజాన్ని, నేరగాండ్లను బుల్‌డోజర్లతో అణచివేసింది, రెండవ సారి గద్దె నెక్కితే మిగతావారిని కూడా తొక్కివేస్తుంది. మంచిదే. వాస్తవ అలా ఉందా ? ఇదే ఉత్తర ప్రదేశ్‌ను గతంలో బిజెపి, బిఎస్‌పి, ఎస్‌పి పార్టీలు ఏలాయి, గూండాయిజం, మాఫియా ముఠాల పెరుగుదలకు ఎవరివంతు తోడ్పాటు వారు ఇచ్చారన్నది తిరుగులేని నిజం.ఇక 2022 ఎన్నికల్లో గెలిచిన నేరచరిత గలిగిన వారి మీద బుల్డోజర్లను ఎలా నడిపిస్తారో తరువాత చూద్దాం.


2022లో అసెంబ్లీకి ఎన్నికైన 403 మందిలో 205 మంది మీద క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. గత అసెంబ్లీలో అలాంటి వారు 143 మంది మాత్రమే ఉన్నారు. ప్రజాస్వామిక సంస్కరణల సంస్ధ(ఏడిఆర్‌) వెల్లడించిన నివేదిక ప్రకారం తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నవారు అంటే హత్య, హత్యాయత్నం, కిడ్నాప్‌, మహిళల మీద నేరాలకు పాల్పడినట్లు అభియోగాలున్నవారు 158 మంది, వీరిలో ఒకరి మీద అత్యాచారయత్నం కేసు కూడా ఉంది. గతంలో ఇలాంటి ఘనులు 117 మాత్రమే. పార్టీల వారీగా చూస్తే తమ పార్టీ ప్రత్యేకం అని చెప్పుకొనే బిజెపి అగ్రస్దానంలో అంటే 255కు గాను 111 మందిని కలిగి ఉంది. సమాజవాది పార్టీలో 111 మందికిగాను 71 మంది ఉన్నారు. ఐదేండ్ల తరువాత అభివృద్ధిని చూపి ఓట్లడిగామని చెప్పుకొనే వారు మరింత మంది నేర చరితులను ఎందుకు రంగంలోకి దింపినట్లు ? ఎన్నికైన ఎంఎల్‌ఏల్లో గతంలో 322 మంది కోటీశ్వరులుంటే ఇప్పుడు వారి వృద్ది 366కు పెరిగింది. బిజెపి తరఫున గెలిచిన 255 మంది సగటు 8.14 కోట్లు, అదే సమాజవాది సగటు రు.7.39 కోట్లు ? ఎవరిది డబ్బు, కండబలం ఉన్న పార్టీ ? గెలిచిన ఇద్దరు కాంగ్రెస్‌ వారి ఆస్తి రు.19.71 కోట్లు.


ఉత్తర ప్రదేశ్‌ చట్టసభలో మెజారిటీ 205 మంది నేర చరితులు ఉన్న తరువాత వారి అనుచరులు, అభిమానులు వేరే దారిలో నడుస్తారా ? చట్టాలను అమలు జరిపే యంత్రాంగాన్ని సక్రమంగా నడవనిస్తారా ? చరిత్రలో ఎక్కడా అలాంటి ఉదంతాలు లేవు. హత్రాస్‌ దుర్మార్గం జరిగింది, లఖింపూర్‌ ఖేరీ దారుణం తెలిసిందే. ఇప్పుడు బిజెపి ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన అవసలు జరగలేదు, ప్రతిపక్షాల కుట్ర లేదా ప్రచారమని చెబుతారా ? చెప్పండి ! మహిళలు పెద్ద ఎత్తున ఓట్లు వేసినట్లు చెబుతున్నారు.నిజం కూడా కావచ్చు, దీని అర్ధం ఉత్తర ప్రదేశ్‌ మహిళలకు స్వర్గంగా ఉన్నట్లా ? 2015-19(రెండు సంవత్సరాలు అఖిలేష్‌, రెండు సంవత్సరాలు యోగి ఏలుబడి) సంవత్సరాలలో అక్కడ మహిళలపై నేరాలు 66.7శాతం పెరిగాయి. దేశ సగటు 23శాతం మాత్రమే.2019లో దేశంలో నమోదైన కేసుల్లో 15శాతం యోగి ఖాతాలో పడ్డాయి. సామూహిక మానభంగాలలో 2019లో రాజస్తాన్‌ 902 కేసులతో ముందుంటే ఉత్తర ప్రదేశ్‌ 301, మధ్యప్రదేశ్‌ 162తో రెండు, మూడు స్ధానాల్లో ఉన్నాయి. ఉన్నత విలువలు నేర్పుతామని చెప్పే ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూత్వ సంస్ధలకు ఈ మూడు రాష్ట్రాల్లో ఎంతో పట్టు ఉందన్నది తెలిసిందే. వారు తెచ్చిన సామాజిక మార్పు ఏమిటి ?


పైన చెప్పుకున్న నాలుగు సంవత్సరాల్లో దళితులపై జరిగిన దారుణాల కేసుల్లోనూ ఉత్తర ప్రదేశ్‌ అగ్రస్ధానంలో ఉంది. తరువాత స్ధానాల్లో సంఘపరివారం బలంగా ఉన్న రాజస్తాన్‌, బీహార్‌, మధ్య ప్రదేశ్‌ ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో 2015లో 8,357 నమోదు కాగా 2019లో 11,829కి చేరాయి.2018 – 2020 (పూర్తిగా యోగి స్వర్ణయుగంలో) మూడు సంవత్సరాల్లో 36,467 కేసులు నమోదయ్యాయి, అంటే సగటున ఏడాదికి 12,155, వేద గణితం ప్రకారం లెక్కలు వేసినా యోగి ఏలుబడిలో తగ్గినట్లు ఎవరైనా చెప్పగలరా ? 2019లో దేశంలో పదిహేను శాతం కేసులు ఉత్తరప్రదేశ్‌లో ఉంటే అవి 2020నాటికి 26శాతానికి పెరిగాయి.
సబ్‌కాసాత్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌ అంటే అందరినీ కలుపుకుపోతాం, అందరి వృద్ధి, అందరి విశ్వాసం అన్నది బిజెపి నినాదం. బిజెపికి మింగుడుపడినా పడకున్నా ఉత్తర ప్రదేశ్‌ జనాభాలో 20శాతం ముస్లింలు ఉన్నారు. ఆ సామాజిక తరగతికి చెందిన వారికి ఒక్కటంటే ఒక్క సీటూ ఇవ్వలేదు. అంటే బిజెపి ఇచ్చే నినాదం మోసపూరితం కాదా ?మత ప్రాతిపదికన ఓటర్లను సమీకరించేందుకు వేసిన ఎత్తుగడకాదా ? హిందూ పత్రిక-సిఎస్‌డిఎస్‌-లోక్‌నీతి సంస్ధలు సంయుక్తంగా ఎన్నికల అనంతర సర్వే వివరాల ప్రకారం బిజెపి ముందుకు తెచ్చిన మతపరమైన రెచ్చగొట్టుడు పని చేసింది.2017 బిజెపికి హిందువులు 47శాతం ఓటు వేస్తే 2022లో 54శాతానికి పెరిగింది. అదే సమాజవాది పార్టీకి 19 నుంచి 26శాతానికి పెరిగింది. బిఎస్‌పికి 23 నుంచి 14శాతానికి, కాంగ్రెస్‌కు నాలుగు నుంచి రెండుశాతానికి తగ్గింది. ఈ ఓట్లు బిజెపి-సమాజవాది పార్టీలకు వెళ్లాయి. ఇక సమాజవాది పార్టీ కూటమి సీట్ల సంఖ్యపెరగటానికి బిజెపి చేసిన విద్వేష ప్రచారంతో ముస్లింలు ఆ వైపు మొగ్గటమే అన్నది స్పష్టం.గత ఎన్నికల్లో 46శాతంగా ఉన్నవి ఈసారి 79శాతం మంది ఎస్‌పి కూటమివైపు మొగ్గారు. బిఎస్‌పి ఓట్లు 19 నుంచి ఆరు, కాంగ్రెస్‌ ఓట్లు 23 నుంచి మూడు, ఇతరుల ఓట్లు పది నుంచి నాలుగుశాతానికి తగ్గాయి. ఇదే సమయంలో ముస్లిం ఓట్లు బిజెపికి ఐదు నుంచి ఎనిమిదిశాతానికి పెరిగాయి.


యోగి సర్కార్‌ అభివృద్దే గెలిపిస్తుందని చెప్పుకుంటూనే బిజెపి173 మంది కొత్త ముఖాలను రంగంలోకి దించి పాత వారి మీద జనంలో ఉన్న అసంతృప్తిని చల్లార్చేందుకు చూసింది. వారిలో 99 మాత్రమే గెలిచారు.గత ఎన్నికల్లో బిజెపి కూటమి ఓడిన 85 స్దానాల్లో ఈసారి 69 మంది కొత్తవారిని రంగంలోకి దించినా గెలిచింది 19 మాత్రమే. పాతవారిలో 104 మంది సిట్టింగులకు సీట్లు ఇవ్వలేదు. అక్కడ కొత్తవారిని పెట్టగా 80 మంది గెలిచారు. గత ఎన్నికల్లో ఓడిన 16 మందిని ఈ సారి కూడా పోటీకి నిలిపితే కేవలం నలుగురు మాత్రమే గెలిచారు.


మజ్లిస్‌ పార్టీ ఓట్లు చీల్చిన కారణంగా సమాజవాది ఓడింది అన్నది ఒక అభిప్రాయం.ఆ పార్టీ బిజెపికి బిటీమ్‌ అన్నది, దాని అధినేత మీద జరిగిన దాడి బూటకం అన్నది నిజం. కానీ ఇక్కడ ఆ పార్టీ పోటీచేసిన 94 స్ధానాల్లో వచ్చిన ఓట్లు 4,50,929(0.49శాతం) మాత్రమే అయినా అనేక చోట్ల బిజెపికి తోడ్పడింది. మొత్తంగా చూసినపుడు మూడవ స్దానంలో ఉన్న బిఎస్‌పి పోటీ బిజెపికి తోడ్పడిందన్నది గమనించాలి. తిరుగులేదు అని చెప్పుకున్న బిజెపికి ఉత్తర ప్రదేశ్‌లో మూడు చోట్ల డిపాజిట్లు రాలేదు.399 చోట్ల పోటీ పడిన కాంగ్రెస్‌ 387 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. రెండు చోట్ల గెలవగా నాలుగు చోట్ల రెండవ స్ధానంలో ఉంది. తనబలాన్ని అతిగా అంచనా వేసుకొని పోటీ చేసిన కాంగ్రెస్‌ సగటున ఒక్కో చోట 5,391 ఓట్లు తెచ్చుకొంది, ఆ విధంగా కూడా బిజెపికి తోడ్పడినట్లే. బిఎస్‌పి పోటీ చేసిన 403 స్ధానాల్లో 290 చోట్ల డిపాజిట్లు పోగొట్టుకుంది.ఒక చోట గెలవగా 14చోట్ల రెండవ స్దానంలో ఉంది.


నువ్వానేనా అన్నట్లుగా అధికారం కోసం పోటీపడిన సమాజవాది పార్టీ 376 చోట్ల పోటీ చేసింది, ఆరు చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. నూటపదకొండు సీట్లు గెలిచి 231 చోట్ల రెండవ స్దానంలో ఉంది. ఆ పార్టీతో జట్టు కట్టిన ఆర్‌ఎల్‌డి 33 చోట్ల పోటీ చేసి మూడు డిపాజిట్లు కోల్పోయి ఎనిమిది చోట్ల గెలిచింది.చెల్లిన ఓట్లలో 16.66శాతం తెచ్చుకుంటే డిపాజిట్‌ దక్కుతుంది. పురుషుల్లో కేవలం నాలుగుశాతం మాత్రమే సమాజవాది కంటే బిజెపికి ఎక్కువగా ఓట్లు వేయగా మహిళల్లో బిజెపికి 16శాతం మంది అధికంగా ఓటు వేసినట్లు సర్వేలు పేర్కొన్నాయి. ఇది కూడా బిజెపికి తోడ్పడిన అంశంగా భావిస్తున్నారు. కొన్ని సంక్షేమ పధకాలు వీరిని ఆకర్షించినట్లు చెబుతున్నారు. ఇక రైతులు కూడా బిజెపికి గణనీయంగా ఓటు చేశారు. ఏడాదికి ఆరువేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కిసాన్‌ సమ్మాన్‌ యోజనం పధకం, ఎన్నికలలో బిజెపి చేసిన కొన్ని వాగ్దానాలు ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతాంగాన్ని ఆకర్షించినట్లు వెల్లడైంది.లఖింపూర్‌ ఖేరీ, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో కూడా తాము గణనీయంగా రైతుల మద్దతు పొందినట్లు బిజెపి చెప్పుకొంటోంది. అంగీకరిద్దాం, క్షమాపణలు చెప్పి రద్దు చేసిన మూడు సాగు చట్టాలను తిరిగి నరేంద్రమోడీ ప్రవేశపెడతారా ? కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించే అంశాన్ని పరిశీలించేందుకు వేస్తామన్న కమిటీని ఉత్తిదే అంటారా ? చూద్దాం !

పాతవరవడిలోనే జగనన్న బడ్జెట్‌ – పెరుగుతున్న అప్పులు, తిప్పలు ?

Tags

, , ,



ఎం కోటేశ్వరరావు


2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ మార్చి 11వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంకెల గారడీ షరా మామూలే. భారీగా కొండంత రాగం తీసి చడీ చప్పుడు లేకుండా కోత పెట్టటం గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతోంది. ప్రభుత్వ ఆర్ధిక స్ధితి గురించి ఆందోళనకరమైన వార్తలు వెలువడుతున్నా తగ్గేదేలే అన్నట్లుగా ముందుకు పోవాలని గట్టిగా శపధం పూనినట్లుగా ఉంది. కొత్త అప్పులు పుట్టే అవకాశాలు మూసుకుపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అలా తీసుకోవాలంటే షరతులకు అంగీకరించాలి. దానిలో భాగమే చెత్త పన్ను. మున్సిపల్‌ ఎన్నికల తరువాత అలాంటి భారాలు వేస్తారని వామపక్షాలు హెచ్చరించినా జనం కూడా తగ్గేదేలే అన్నట్లుగా వైసిపికి ఓట్లు వేశారు. బండి గుర్రానికి గడ్డి ఆశచూపి పరుగెత్తించినట్లు కేంద్రం తాను ప్రకటించిన లేదా ప్రతిపాదించిన సంస్కరణలు అమలు చేస్తే అప్పులకు సడలింపులు ఇస్తామని ప్రకటించింది. ఆమేరకు దాదాపు ఇరవై లక్షల రైతుల పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు నిర్ణయించింది తెలిసిందే.
ఇక బడ్జెట్‌ పత్రాలు వెల్లడించిన వివరాల ప్రకారం చంద్రబాబు నాయుడు దిగిపోయినపుడు 2018-19 రాష్ట్ర రుణభారం రు. 257509.87 కోట్లు, అది రాష్ట్ర జిఎస్‌డిపిలో 28.02శాతం. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి వివిధ సంస్ధలు, శాఖలకు ఇప్పించిన అప్పు పేరుకు పోయిన మొత్తం రు.55508.46 కోట్లు. 2019 మే 30న అధికారానికి వచ్చిన జగనన్న వాటిని ఇబ్బడి ముబ్బడిగా పెంచారు. 2022 మార్చి నెలతో ముగిసే ఆర్ధిక సంవత్సరానికి ప్రభుత్వ రుణం రు.390670.19 కోట్లు, జిఎస్‌డిపిలో 32.51శాతం ఉంది. హామీగా ఉన్న అప్పుల మొత్తం 2021 డిసెంబరు 31నాటికి రు.117503.12 కోట్లకు పెరిగింది. 2022-23లో అప్పుల మొత్తాన్ని రు.439394.35 కోట్లు, 32.79 శాతం జిఎస్‌డిపిలో ఉంటుందని పేర్కొన్నారు. దీనికి హామీల రుణం అదనం. చంద్రబాబు ఏలుబడిలో అన్ని రకాల రుణాలు మూడు లక్షల కోట్లకు పైబడితే జగనన్న దాన్ని వచ్చే ఏడాది చివరికి ఐదున్నర లక్షల కోట్లకు పైగా పెంచనున్నారు. ఇది అంచనాలకు మించిన వృద్ధి.


ఆస్తుల కల్పన ద్వారా ఆదాయ, ఉపాధి పెరుగుదల ఉంటుంది. దీన్నే ఆర్ధిక పరిభాషలో పెట్టుబడి వ్యయం అంటారు.దీని తీరుతెన్నులను చూద్దాం. అప్పులకు సంబంధించి నిర్ణీత లక్ష్యాన్ని చేరేందుకు చూపే శ్రద్ద ఇతర వాటి మీద ఉండటం లేదు.పెట్టుబడివ్యయ పద్దు కింద గత ఏడాదిలో ప్రతిపాదించిన రు. 31,198 కోట్లను 18,529 కోట్లకు సవరించినట్లు చూపారు. అంతకు ముందు ఏడాది కూడా రు.29,300 కోట్లు ప్రతిపాదించి ఖర్చు చేసింది రు.18,974 కోట్లే. వచ్చే ఏడాది ఈ మొత్తాన్ని రు.30,679 కోట్లని పేర్కొన్నారు. దీన్ని అంకెల గారడీగాక ఏమనాలి ? ఇలాంటి కోతల కారణంగానే బడ్జెట్‌ ప్రతిపాదనలను ప్రకటించినపుడు గొప్పగా చెప్పి కోతలు వేస్తున్నారు.


బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం 2021- 22లో మొత్తం రు.2,29,779 కోట్లు ఖర్చు ఉంటుంది. దీన్ని ఇప్పుడు రు. 2,08,106.57 కోట్లుగా సవరించారు. వచ్చే ఏడాది బడ్జెట్‌ను రు.2,56,256.56 కోట్లుగా చూపారు. ద్రవ్యలోటు రు.48,724.11 కోట్లుగా చూపారు. ఈ మొత్తాన్ని ఎలా పూడుస్తారో తెలియదు. కేటాయింపులకు కోతలు పెట్టాలి, లేదా జనం మీద భారాలు మోపాలి. ఉదాహరణకు 2020-21లో కూడా ఖర్చు రు.2,24,789 కోట్లుగా చూపి చివరకు రు.1,85,468కి సవరించారు.


వర్తమాన ఆర్ధిక సంవత్సర అన్ని రకాల రాబడి రు.1,54,272.70 కోట్లుగా సవరించారు, వచ్చే ఏడాది ఈ మొత్తం రు.1,91,225.11కోట్లని చెప్పారు. దీనికి రు.64,816 కోట్ల మేరకు అప్పులు తెచ్చి బడ్జెట్‌ను అమలు చేస్తామన్నారు.ఈ అప్పులో రు.21,805 కోట్లు పాత వాటిని తీర్చేందుకే పోతుంది. వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో సాగు నీటి వనరుల వృద్ధి వలన రైతాంగ ఆదాయాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. జగన్‌ అధికారానికి రాక ముందు మూడు సంవత్సరాల్లో పెట్టుబడి ఖర్చు రు.31,624 కోట్లు ఖర్చు చేస్తే ఈ మూడేండ్లలో ఆ మొత్తం రు.15,193 (2021-22 సవరించిన అంచనాతో) మాత్రమే ఖర్చు చేశారు. గతేడాది నీటి పారుదల రంగానికి రు.11,586 కోట్లు ప్రతిపాదించి దాన్ని రు.6,832 కోట్లకు కోత పెట్టారు. వచ్చే ఏడాది అసలు ప్రతిపాదనే రు.9,810 కోట్లుగా పేర్కొన్నారు. పెరిగిన బడ్జెట్‌కు అనుగుణంగా లేదా ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని భారీగా పెంచాల్సింది పోయి ఇలా చేయటం ఏమిటి ?


నవరత్నాలు లేకపోతే జగన్‌ రత్నాలు పేరు ఏది పెట్టినా పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను తప్పు పట్టటం లేదు. అదే పేదలు కార్పొరేట్‌ ఆసుపత్రుల పాలైనపుడు ప్రభుత్వం ద్వారా వచ్చిన సంక్షేమ పధకాల సొమ్ము మొత్తం, ఇంకా అప్పులు చేసినదీ వాటి యజమానులకు సమర్పించుకుంటున్నారు. ఆ స్ధితిలో వైద్య, ఆరోగ్యం కుటుంబ సంక్షేమ ఖర్చును గణనీయం పెంచాలి. కానీ ఈ బడ్జెట్‌లో గతేడాది చేసిన ఖర్చు కంటే తగ్గించారు. సవరించిన అంచనా ప్రకారం రు.12,972 కోట్లనుంచి రు.11,974 కోట్లకు కుదించారు. షెడ్యూలు కులాలు, తరగతులు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి గతేడాది ప్రతిపాదించిన రు.27,401 కోట్లను రు.25,349కు కుదించారు. ఈ ఏడాది మాత్రం దాన్ని ఏకంగా రు.45,411 కోట్లుగా పేర్కొన్నారు. దీన్ని చూస్తే అంకెల గారడీ లేదా మధ్యంతర ఎన్నికల ప్రచార అస్త్రమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.


రోడ్ల నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో తెలిసిందే. గతేడాది రోడ్లు, వంతెనలకు పెట్టుబడి ఖర్చు రు.2,792 కోట్లుగా చూపి దాన్ని రు.927 కోట్లకు కుదించారు. ఇప్పుడు రు.2,713 కోట్లు ఖర్చు చేస్తామని నమ్మబలుకుతున్నారు.మొత్తం ఆర్ధిక సేవల పెట్టుబడి ఖర్చు రు.18,319 కోట్లుగా ప్రకటించి ఆచరణలో రు.9,859 కు కోత పెట్టి ఈ ఏడాది రు.17,412 కోట్లు ఖర్చు చేస్తామంటున్నారు. ఏ శాఖను చూసినా ఇదే తీరు. నోరున్నదని చెప్పుకొనే ఉద్యోగులకు తాను ప్రకటించిన 27తాత్కాలిక భృతిలో కూడా కోత పెట్టి పిఆర్‌సిని బలవంతంగా రుద్దిన సర్కార్‌ ఇక నోరు లేని లేదా ఉన్నా నోరెత్తలేని జనాలకు సంబంధించిన, అభివృద్ధి పనులకు కోత పెట్టటంలో ఆశ్చర్యం ఏముంది ?


కేంద్ర ప్రభుత్వం తన అజండాను అమలు జరిపేందుకు రాష్ట్రాల మీద ఆంక్షలు పెడుతోంది, షరతులు విధిస్తోంది. 2005ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం రాష్ట్రాలు ఏవిధంగా నడుచుకోవాలో ముందుగానే లక్ష్యాలను నిర్దేశించింది. పదిహేనవ ఆర్ధిక సంఘం 2021-26 సంవత్సరాలలో ద్రవ్యలోటును సంవత్సరాల వారీగా జిఎస్‌డిపిలో 2021-22కు 4, 2022-23కు 3.5, 2023-26కు మూడుశాతాల చొప్పున పరిమితం చేసుకోవాలి. దీని వలన ఆంధ్రప్రదేశ్‌కు 2020-21లో జిఎస్‌డిపిలో ఉన్న 35శాతం రుణ భారం 2025-26 నాటికి 32.1శాతానికి తగ్గుతుందని 15వ ఆర్ధిక సంఘం పేర్కొన్నది. ఇవన్నీ పరిస్ధితులు సాధారణంగా ఉంటే, కానీ కరోనా కారణంగా ఇచ్చిన మినహాయింపులు, ఇతర అంశాల కారణంగా అది అమలు జరుగుతుందని చెప్పలేము. ఐదు సంవత్సరాల కాలంలో పరిమితులను తొలి నాలుగు సంవత్సరాలలో వినియోగించుకోనట్లైతే ఐదవ ఏడాది అదనపు రుణాలు తీసుకోవచ్చు. ఈ లోగా విద్యుత్‌ రంగంలో కేంద్రం ప్రతిపాదించిన షరతులను అమలు జరిపితే తొలి నాలుగు సంవత్సరాలు ప్రతి ఏటా జిఎస్‌డిపిలో 0.5 శాతం చొప్పున అదనంగా అప్పులు తీసుకోవచ్చు.2021-25 మధ్య విద్యుత్‌ నిర్వహణ నష్టాలు తగ్గించాలి.ఆదాయ తేడాను కుదించాలి. వినియోగదారులకు నేరుగా సబ్సిడీని అందించటం ద్వారా సబ్సిడీ మొత్తాలను తగ్గించాలి. ఆదాయాన్ని సబ్సిడీ రేట్లను తగ్గించాలి. ఇవన్నీ ఈ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు దారి సుగమం చేయటమే.


జిఎస్‌డిపి ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది కనుక ఆ దామాషాలో రుణ పరిమితి కూడా పెరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు 2014-15లో ఆంధ్రప్రదేశ్‌ జిఎస్‌డిపి విలువ రు.5,26,470 కోట్లుగా ఉంది. మూడుశాతం రుణ పరిమితి ప్రకారం రు.15,794 కోట్లు తీసుకోవచ్చు.2018-19నాటికి అది రు.9,33,402 కోట్లకు పెరిగింది కనుక రుణం 28వేల కోట్లు తీసుకోవచ్చు. అలాగే 2020-21లో రు.10,19,146 కోట్లుగా సవరించినందున రుణం 34వేల కోట్ల వరకు తీసుకోవచ్చు. 2021-22లో ముందస్తు అంచనా ప్రకారం అది రు. 12,01,736 కోట్లుగా ఉన్నట్లు ఆర్ధిక సర్వేలో పేర్కొన్నారు. అందువలన ఆ మేరకు రుణపరిమితి పెరుగుతుంది. ఆత్మనిర్భర పధకం కింద రెండు శాతం అదనంగా తీసుకొనేందుకు అనుమతించారు. ఇప్పుడు ఆర్ధిక సంఘం ఆంక్షలకు మించి ద్రవ్యలోటు ఉంది. 2020-21లో ద్రవ్యలోటు జిఎస్‌డిపిలో 4.78శాతంగా ప్రతిపాదిస్తే అది 5.38శాతానికి చేరింది. కేంద్రం కరోనా కారణంగా సడలించిన రుణ పరిమితి ఐదుశాతానికి మించి ఇది ఉంది. ఐదుశాతానికి కూడా కేంద్రం షరతులు విధించింది. నాలుగుశాతం వరకు ఎలాంటి షరతులు లేవు, ఒకశాతానికి నాలుగు ఉన్నాయి. ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు ఒకటి, సులభతర వాణిజ్యం, స్ధానిక సంస్దలలో పన్నుల పెంపు, విద్యుత్‌ పంపిణీ సంస్కరణ. మొదటి మూడింటిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నెరవేర్చింది. దీంతో అదనంగా 9,090 కోట్లు అదనంగా అప్పు చేసేందుకు అవకాశం వచ్చింది. విద్యుత్‌ సంస్కరణలో భాగంగా మీటర్లు పెట్టేందుకు నిర్ణయించిన అంశం తెలిసిందే. అది జరిగిన తరువాత వినియోగదారులు ముందుగా బిల్లులు చెల్లించాలి. మిగిలిన షరతుల ప్రకారం సబ్సిడీలో కోత వంటి వాటికి పూనుకుంటే వంటగాస్‌ మాదిరి క్రమంగా తగ్గించి వేసి నామమాత్రంగా సబ్సిడీని నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణల ప్రకారం విద్యుత్‌ సరఫరా ధరలో 20శాతానికి మించి సబ్సిడీ ఇవ్వకూడదు. పెట్రోలు, డీజిలు ధరల మాదిరి ఖర్చు పెరిగినపుడల్లా చార్జీలను పెంచవచ్చు.


అసలేమీ ఇవ్వని వారి కంటే సంక్షేమ పధకాల పేరుతో జనాన్ని ఆదుకోవటాన్ని ఎవరైనా సమర్ధిస్తారు. వాటికీ పరిమితులుంటాయి. కానీ అవే జనాలను బొందితో కైలాసానికి చేరుస్తాయని ఎవరైనా చెబితే, నమ్మిస్తే అది వంచన అవుతుంది. జనాలకు కావలసినన్ని చేపలను తొలుత సరఫరా చేసినా వాటిని పట్టటం నేర్పితేనే ఎవరికైనా జీవితాంతం భరోసా ఉంటుంది, వారి బతుకు వారు బతుకుతారు. సంక్షేమ పధకాలూ అంతే ! రాబడి వనరులు లేక లేదా పెరగక, అప్పుల దారులన్నీ మూసుకుపోయినపుడు దాన్నుంచి బయట పడాలంటే సంక్షేమ పధకాలకు కోత పెట్టాలి లేదా మరిన్ని భారాలను జనం మీద మోపాలి. అందుకే ఐదేండ్లు గడిచే సరికి నవరత్నాలు, భరోసాలే బంధాలుగా మారి రాజకీయంగా కొంప ముంచినా ఆశ్చర్యంలేదు.జనం వైఫల్యాలను గుర్తించక, అసంతృప్తి పెరగముందే ఏదో ఒక సాకుతో ముందస్తు ఎన్నికలకు పోయినా పోవచ్చు !


వసుదేవుడిని అనుసరిస్తున్న అమెరికా జో బైడెన్‌ !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీ లొంగుబాటు సూచనలు, మరోవైపు మంటను మరింత ఎగదోస్తూ అమెరికా, దాని మిత్రదేశాల చర్యలు. రష్యా చమురును అమెరికా దిగుమతి చేసుకోవటంపై జోబైడెన్‌ నిషేధం విధించాడు. బ్రిటన్‌ దాన్ని అనుసరించింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో పీపా ధర 139 డాలర్లు తాకి తరువాత తగ్గింది. ఫిబ్రవరి 24న యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి ధర ఒక్క రోజు కూడా నిలకడగా లేదు. మార్చి 9వ తేదీన 121.5 డాలర్లుగా ఉంది. తమ ఇంధనంపై ఆంక్షలు విధిస్తే మూడువందల డాలర్లకు పెరగవచ్చని రష్యా హెచ్చరిక. మరోవైపున వెనెజులా చమురుపై ఆంక్షల ఎత్తివేత ఆలోచనల్లో అమెరికా. తమపై ఆంక్షలను ఎత్తివేసినా లేకున్నా రష్యాకు ఇచ్చే మద్దతుపై వెనక్కు తగ్గేదేలే అంటున్న వెనెజులా.


రష్యా ఇంధన దిగుమతులపై ఆంక్షలు విధిస్తే సామాజిక ఐక్యత కుప్పకూలుతుందని జర్మనీ హెచ్చరించింది. తాము ఆంక్షలను వ్యతిరేకిస్తామని కూడా జర్మనీ మంత్రి రాబర్ట్‌ హాబెక్‌ చెప్పాడు. సరఫరాలు తగ్గటం సామాజిక ఐక్యతకు ముప్పు తెస్తుందని కూడా అన్నాడు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది ఇంతకు మించి కొత్తగా చేసేదేమీ లేదని తదుపరి చర్యల గురించి మరొక మంత్రి క్రిస్టియన్‌ లెండర్‌ స్పష్టం చేశాడు. ఆంక్షల నుంచి రష్యన్‌ ఇంధన సరఫరాలను కావాలనే ఐరోపా మినహాయించింది, ఈ క్షణంలో మరోమార్గంలో ఇంధన సరఫరాకు అవకాశం లేదని జర్మన్‌ ఛాన్సల్‌ ష్కోల్జ్‌ చెప్పాడు. ఈ కారణంగానే బైడెన్‌ ఐరోపాతో నిమిత్తం లేకుండా తమ దేశానికి మాత్రమే వర్తించే నిషేధాన్ని ప్రకటించాడు. ఐరోపాయునియన్‌ నుంచి విడిపోయిన బ్రిటన్‌ వేరుగా నిషేధాన్ని ప్రకటించింది.రష్యా ఇంధనంపై ఆంక్షలు విధించటాన్ని తాము సమర్ధించటం లేదని హంగరీ ఆర్ధిక మంత్రి ప్రకటించారు.అమెరికా, సౌదీ అరేబియా తరువాత చమురు ఉత్పత్తిలో రష్యా మూడవ స్ధానంలో ఉంది. దాని ఎగుమతుల్లో 60శాతం ఐరోపా ఆర్ధిక సహకార మరియు అభివృద్ధి సంస్ధ(ఓయిసిడి) దేశాలకే చేస్తున్నది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలంటే వెంటనే జరిగేది కాదు. ఇటలీ గాస్‌ దిగుమతుల నిలిపివేతకు రెండున్నర సంవత్సరాలు పట్టింది. గతేడాది ఐరోపా యూనియన్‌ తన అవసరాల్లో 45శాతం రష్యానుంచి దిగుమతి చేసుకుంది.రష్యా ప్రతి రోజు 50లక్షల పీపాలు ఎగుమతి చేస్తుండగా దానిలో సగం ఐరోపాకే వెళుతుంది.


నోర్డ్‌ స్ట్ర్రీమ్‌ ఒకటి ద్వారా సరఫరా అవుతున్న తమ ఇంధనంపై నిషేధం విధిస్తే చమురు ధరలు మూడువందల డాలర్ల వరకు పెరగవచ్చని రష్యా ఉపప్రధాని నోవాక్‌ హెచ్చరించాడు. రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్నవాటిలో ముడిచమురు కంటే దానిఉత్పత్తులే ఎక్కువగా ఉన్నాయి. అందువలన నిషేధం ద్వారా ప్రచార వత్తిడి తప్ప పెద్ద ప్రభావం చూపదన్నది స్పష్టం. అమెరికా తన అవసరాల్లో రష్యా నుంచి ఎనిమిదిశాతం దిగుమతి చేసుకుంటుండగా దానిలో మూడుశాతం మాత్రమే ముడిచమురు, మిగిలినవి చమురు ఉత్పత్తులు. పశ్చిమ దేశాలు తమ మీద విధిస్తున్న ఆంక్షలకు ప్రతిగా రష్యా కూడా తన అస్త్రాలను ప్రయోగిస్తున్నది. పశ్చిమ దేశాల ఆంక్షలతో చమురు ధరలు పెరుగుతున్నందున అమెరికా, ఐరోపా దేశాలు కూడా వాటి ప్రతికూల పర్యవసాలను అనుభవించాల్సి ఉంటుంది. రష్యన్‌ చమురుపై నిషేధం విధిస్తే సరఫరా తగ్గి పీపా ధర 200 డాలర్లకు పెరగవచ్చని బాంక్‌ ఆఫ్‌ అమెరికా విశ్లేషకులు పేర్కొన్నారు.


వసుదేవుడంతటి వాడే అవసరం తనది గనుక గాడిద కాళ్లను పట్టుకొనేందుకు సిద్ద పడిన కథ తెలిసిందే. ఇప్పుడు అమెరికా అదే చేస్తోంది.రష్యాను దెబ్బతీసేందుకు గతంలో తాను వ్యతిరేకించిన, తిట్టిపోసిన దేశాలతో ఇప్పుడు చమురు అమ్ముతారా అంటూ తెరవెనుక సంప్రదింపులు జరుపుతోంది. దీని వెనుక రెండు కారణాలున్నాయి. ఐరోపా, ఇతర ప్రాంతాల్లోని తన మిత్రరాజ్యాల ఇంధన అవసరాలకు ఆటంకం కలగకుండా చూడటం, చమురు ధరలు మరింత పెరిగితే యురోపియన్లలో అమెరికా పట్ల ప్రతికూలత పెరుగుతుంది. తన ఆర్ధిక వ్యవస్ధకు సైతం తలెత్తే ముప్పు నివారణ అవసరం. లేనట్లయితే ఇంటా బయటా ప్రతికూల పరిస్ధితులు బైడెన్‌కు ఎదురవుతాయి.అందువల్లనే అమెరికా ప్రతినిధులు గతవారంలో వెనెజులాను సందర్శించి చమురు సరఫరా గురించి చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్‌తో అణు ఒప్పందం చేసుకొని చమురు ఆంక్షలను ఎత్తివేసేందుకు సంసిద్దతను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఉత్పత్తిని పెంచమని కోరేందుకు బైడెన్‌ స్వయంగా సౌదీ అరేబియాను సందర్శించవచ్చని వార్తలు వచ్చాయి. రష్యాపై విధించిన ఆంక్షలను సొమ్ము చేసుకొనేందుకు ఉత్పత్తి పెంచాలన్న సూచనలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు సౌదీ అందుకు సముఖత చూపలేదు. గతంలో రష్యాతో వచ్చిన అవగాహనకే కట్టుబడి ఉంటామని చెబుతోంది. అణు ఒప్పందం గురించి ఇరాన్‌తో రాజీకి వచ్చి ఆంక్షలు వెనక్కు తీసుకుంటే అక్కడి నుంచి కూడా సరఫరా పెరుగుతుంది.యుద్దం ప్రారంభమైన తరువాత అమెరికా ఒక మెట్టు దిగుతున్నట్లుగానే ఈ పరిణామాలను చూడవచ్చు. జర్నలిస్టు ఖషోగ్గీ హత్య తరువాత సౌదీ-అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. సౌదీ రాజును హంతకుడని బైడెన్‌ వర్ణించాడు. ఇప్పుడు చమురు ఉత్పత్తి పెంచాలని కోరుతున్నాడు. వారి సమావేశం జరుగుతుందా లేదా అన్నది సందేహమే. తాలిబాన్లతోనే ఒప్పందం చేసుకున్నపుడు సౌదీతో సయోధ్య కుదుర్చుకోవటంలో ఆశ్చర్యం ఉండదు. చమురు ధరలు తగ్గటం ప్రతివారికీ ప్రయోజనకరమే నంటూ అధికారులు చర్చలు జరుపుతున్నారు గానీ, బైడెన్‌ పర్యటన గురించి ఇప్పటికైతే ఖరారు కాలేదని పత్రికా కార్యదర్శి జెస్‌ సాకీ చెప్పారు. వ్రతం చెడ్డా ఫలం దక్కుతుందా ?


అనేక సంవత్సరాల తరువాత ఇద్దరు అమెరికా ఉన్నతాధికారులు వెనెజులా రాజధాని కారకాస్‌ వెళ్లి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను గద్దె దించేందుకు కుట్రపన్నినందుకు గాను 2017లో అమెరికా ఇంధన అధికారులను అరెస్టు చేశారు. 2019లో ఆంక్షలతో పాటు, కారకాస్‌లో అమెరికా తన రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. తమ వారిని వదలిపెట్టాలని కోరటంతో పాటు చమురు ఎగుమతి గురించి చర్చలు ప్రారంభించారు. అధికారులు వెళ్లటానికి ఒక రోజు ముందు వెనెజులాలో పెట్టుబడులు పెట్టిన రష్యా వ్యాపారి ఉస్మనోవ్‌ వ్యక్తిగత ఆస్తులపై ఆంక్షలు తొలగించలేదు గానీ కంపెనీ లావాదేవీలు జరిపేందుకు అమెరికా ఆర్ధికశాఖ సాధారణ అనుమతి మంజూరు చేసింది. అతను పుతిన్‌ మద్దతుదారు. ఇది వెనెజులా పట్ల ఒక సానుకూల వైఖరి. దీనికి ప్రతిగా ఇద్దరు అమెరికన్లను వెనెజులా విడుదల చేసింది. బైడెన్‌ వైఖరి మార్చుకోవటాన్ని ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ ఎంపీలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వారితో కొందరు డెమోక్రాట్లు కూడా గొంతు కలిపారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు మదురో బహిరంగంగానే మద్దతు పలికాడు. ఇంతకాలం వెనెజులాను వ్యతిరేకించిన అమెరికా తన మాటలను తానే ఖండించుకున్నట్లయింది. దీంతో మదురో మరింత బలపడతారని, వ్యతిరేకుల నడుంవిరిచినట్లవుతుందని కొందరు వాపోతున్నారు.


చమురు ధరలు పెరగటంతో దాన్ని సొమ్ము చేసుకోవాలని అమెరికాలో వాటాదార్లతో నిమిత్తం లేకుండా కుటుంబ సంస్ధలుగా ఉన్న కొన్ని చిన్న షేల్‌ ఆయిల్‌ కంపెనీలు ఉత్పత్తికి సిద్దం అవుతున్నాయి.నూటపది డాలర్లుంటే తమకు గిట్టుబాటు అవుతుందని అంటున్నాయి. పెరుగుదల ఎంత కాలం ఉంటుందో తెలీని స్ధితిలో బడా కంపెనీలు ఉత్పత్తికి సిద్దం కావటం లేదు. కరోనా కారణంగా ఆ కంపెనీల్లో మదుపు చేసిన వారికి చేతులు కాలటంతో ఆచితూచి స్పందిస్తున్నాయి.


మన దేశంలో నవంబరు నాలుగవ తేదీ నుంచి స్ధంభింపచేసిన చమురు ధరలను ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత ఏ రోజైనా తిరిగి సవరించే అవకాశం ఉంది. దీని గురించి ప్రభుత్వం రెండు నాలుకలతో మాట్లాడుతోంది. చమురు ధరలను నిర్ణయించేది చమురు కంపెనీలు తప్ప ప్రభుత్వం కాదని, అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టి తగ్గటం, పెరగటం ఉంటుందని గతంలో చెప్పారు. ఇప్పుడు ప్రజా ప్రయోజనాల ప్రాతిపదికన ధరల గురించి నిర్ణయం తీసుకుంటామని చమురుశాఖ మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ మంగళవారం నాడు విలేకర్లతో చెప్పారు. నవంబరు నుంచి ధరల స్ధంభనతో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు లేదని కూడా చెప్పారు. రోజువారీ ధరల సవరణ చేసే కంపెనీలు గతంలో ఎన్నికల తరుణంలో, తాజాగా నవంబరు నాలుగునుంచి ఎందుకు స్ధంభింపచేసినట్లో ఇంతవరకు ప్రకటించలేదు.
.

భారత్‌పై బుజ్జగింపులు, వత్తిడి, బెదిరింపులకు దిగిన అమెరికా !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు
లాహిరి లాహిరిలో ఓహౌ జగమే ఊగెనుగా సాగెనుగా అంటూ సాగుతున్న భారత – అమెరికా ప్రేమ నౌకను ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం ఒక్క కుదుపు కుదిపింది.ప్రేమ జంట తాత్కాలికంగా వేరు పడింది. జన్మజన్మలకు ఒక్కటిగా ఉందామంటూ చేసుకున్న బాసలను మర్చి పోయి నాతో కలసి రష్యాను ఖండిస్తూ యుగళగీతం పాడేందుకు నిరాకరిస్తావా అంటూ అమెరికా గుర్రుగా ఉంది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటల్లేవుగానీ తడిక రాయబారాలు కొనసాగుతున్నాయి.వత్తిడికి తట్టుకోలేక నరేంద్రమోడీ సర్కార్‌ తిరిగి ప్రేమ నౌక ఎక్కుతుందా, మరేమైనా చేస్తుందా ? అసలెందుకు భాగస్వాముల మధ్య ఈ పరిస్ధితి వచ్చిందన్నది ప్రపంచంలో చర్చ జరుగుతోంది. మధ్యలో కొందరు చైనాను లాగుతున్నారు? వారి ఎత్తుగడ ఏమిటి ? ఇలాంటి ప్రశ్నలెన్నింటినో ఉక్రెయిన్‌ – రష్యా వివాదం ముందుకు తెచ్చింది. మరోమాటలో చెప్పాలంటే మన విదేశాంగ విధానం గురించి సరైన దారీ తెన్నూ గురించి తేల్చుకోవాల్సిన అగత్యాన్ని వెల్లడిస్తోంది.


ఈ వివాదంలో మన దేశం ప్రకటించిన తటస్ధ వైఖరి గురించి అంతర్గతంగా రష్యా ఏమనుకుంటోందో ఇంకా తెలియదు, తన వ్యతిరేకులతో చేతులు కలపకపోవటం ఒక రకంగా మేలే అని భావిస్తున్నట్లు దాని సానుకూల స్పందన వెల్లడించింది. మరోవైపు అమెరికా పట్టలేని ఆగ్రహంతో ఉన్నా తన పధకాల్లో మన అవసరాలను గమనంలో ఉంచుకొని తమాయించుకుంటూ బయపడకుండా ఉంది. దాని అధినేత, నరేంద్రమోడీతో పెద్దన్న బైడెన్‌ ఇంతవరకు మాట్లాడలేదు. యుద్ధానికి ముందే కొన్ని నెలల పాటు తమతో గొంతు కలపాలని ఒప్పించేందుకు తమ నేతలు తీవ్ర కసరత్తు చేసినట్లు, యుద్దం ప్రారంభమైన తరువాత మరింతగా ప్రయత్నాలున్నట్లు అధికారయంత్రాంగం చెప్పింది.


పలు వైఫల్యాల కారణంగా ప్రపంచంలో పరువు పోగొట్టుకుంటున్నది అమెరికా. శత్రుదేశాలుగా పరిగణిస్తున్నవాటి మీద మరింతగా దూకుడు పెంచటం ద్వారా నష్టనివారణ, తన మిత్రదేశాల్లో విశ్వాసం పెంపొందించేందుకు దుస్సాహసాలకు పాల్పడుతోంది. గత రెండు దశాబ్దాలుగా భారత్‌ను తన కౌగిట్లోకి తీసుకొనేందుకు పావులు కదిపింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత కొంత మేరకు సఫలీకృతమైంది.చైనాకు వ్యతిరేకంగా మన దేశాన్ని ముందుకు నెట్టే ఎత్తుగడతో ఒక ప్రాంతీయ కూటమిని ఏర్పాటు చేసేందుకు 2007లోనే చతుష్టయ(క్వాడ్‌) కూటమికి రూపకల్పన చేసినా అది ముందుకు సాగలేదు. మన దేశం చేతులు కాల్చుకొనేందుకు సిద్దం కాకపోవటం ఒక ప్రధాన కారణం.కానీ 2017లో దానికి నరేంద్రమోడీ సిద్దపడటంతో అది అమల్లోకి వచ్చింది. లడఖ్‌ సరిహద్దులోని గాల్వన్‌ ఉదంత రూపంలో దాని పర్యవసానాలను చూశాము.


ఇప్పుడు ఉక్రెయిన్‌ – రష్యా పరిణామాలను ఆసరా చేసుకొని అమెరికా, మన దేశంలోని దాని మద్దతుదారులు మరోసారి చైనాను ఒక బూచిగా చూపేందుకు పూనుకున్నారు.ఆసియాలో ఆధిపత్యానికి చైనా పూనుకున్నదనే అమెరికా ప్రచారాన్ని మరో రూపంలో ముందుకు తెస్తున్నారు. రష్యా మనకు తరతరాలుగా మిలిటరీ సాయం అందిస్తున్నది. దాన్ని వదులుకుంటే మన జుట్టు అమెరికా వాడి చేతికి చిక్కుతుందనే భయమూ, వారి పాతబడిన ఆయుధాలు కొనుగోలు చేయటం కంటే రష్యా గతంలో ఇచ్చిన వాటిని నవీకరించుకోవటం మెరుగు అనే అభిప్రాయమూ ఉంది. రష్యాను చూపి కొత్త వాటిని ఇస్తారా లేదా అని అమెరికాతో బేరమాడేందుకూ కావచ్చు, ఇలా అనేక అంశాలున్నాయి. మనం కావాలన్న క్షిపణి రక్షణ వ్యవస్ధలను ఇచ్చేందుకు అమెరికా సిద్దం కాదు. రష్యా గతంలో ఇస్రోకు క్రయోజనిక్‌ ఇంజన్లు, వాటి పరిజ్ఞానం అందచేసింది. మనతో కలసి బ్రహ్మౌస్‌ అనే ఆధునిక క్షిపణులు, బహుళ ప్రయోజనాలకు అవసరమైన విమానాల రూపకల్పన, ఎకె రకం తుపాకుల తయారీ వంటి అంశాల్లో భాగస్వామిగా ఉంది. అమెరికా మబ్బుల్లో నీళ్లు చూసి రష్యా ముంతలోని నీళ్లు పారబోసుకుంటే జరిగేదేమిటో మనకు తెలుసు. అందుకే అమెరికా బెదిరించినా ఎస్‌-400 అనే రష్యా క్షిపణి వ్యవస్ధలను కొనుగోలు చేశాము. ఇన్ని కారణాలతో ఉక్రెయిన్‌ కోసం రష్యాను కాదని అమెరికా చంకనెక్కి దాని పాటపాడేందుకు మనం సిద్దం కాలేదు.


ఈ విషయాలు చెప్పుకొనేందుకు మన పాలక ప్రభువులు, మీడియాకు భయం, ఎందుకంటే అమెరికా ఆగ్రహం మరింత పెరుగుతుందేమోననే దడ. దాన్ని కప్పి పుచ్చి చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే రష్యా అవసరం కనుక తటస్ధంగా ఉండి దాన్ని దగ్గర చేసుకొనేందుకు పూనుకున్నామని చెప్పేవారు తయారయ్యారు. అమెరికన్లు ఇప్పుడు పుతిన్‌ బూచిని చూపి మనలను వారి చంకనెక్కమంటున్నారు. దక్షిణాసియా వ్యవహారాల అమెరికా విదేశాంగశాఖ సహాయ మంత్రి డోనాల్డ్‌ లు తమ ఎంపీలతో మాట్లాడుతూ అమెరికా-భారత్‌ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు ప్రతి రోజూ పని చేస్తున్నామని, పుతిన్‌కు అడ్డుకట్టవేయకపోతే చైనా మరింత రెచ్చిపోతుందని, ఉక్రెయిన్‌లో జరుగుతున్నదానితో చైనా ప్రవర్తన ప్రభావితం అవుతుందని, అది భారత్‌కు అర్ధంకావాలి. ” అన్నాడు.ఇప్పటి వరకు ఐరాసలో మన దేశం నాలుగు సార్లు తటస్ధంగా ఉంది.


ఒక స్పష్టమైన వైఖరి (అంటే తమబాటలో నడిచే) తీసుకోవాలని అమెరికా కోరుతోంది. కొద్ది నెలలుగా మన మీద బుజ్జగింపులు, వత్తిడికి దిగిన అమెరికన్లు ఇప్పుడు బెదిరింపులకూ పాల్పడ్డారు. ” ఇప్పుడు రష్యాకు మరింతదూరంగా భారత్‌ జరగాల్సిన తరుణం ఆసన్నమైంది.లేనట్లయితే తమ ” కాట్సా ” చట్టం (తమ ప్రయోజనాలకు భంగం కలిగితే ఏ దేశం మీదనైనా ఆంక్షలు విధించవచ్చని అమెరికా రూపొందించుకున్న స్వంత చట్టం ) కింద గతంలో ఇచ్చిన మినహాయింపులను ఉపసంహరించుకొనే అంశాన్ని బైడెన్‌ పరిశీలిస్తారని ” డోనాల్డ్‌ లు బెదిరించాడు.ఆంక్షలను ధిక్కరించి రష్యా నుంచి 543 కోట్ల డాలర్ల ఎస్‌-400 క్షిపణి వ్యవస్ధల కొనుగోలుకు 2018లో ఒప్పందం చేసుకున్నాము. అప్పటి అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మన మీద ” కాట్సా” తో వేటు వేస్తానని బెదిరించినా వెనక్కు తగ్గాడు. తరువాత అదే ట్రంప్‌ను అమెరికా వెళ్లి మన నరేంద్రమోడీ కౌగిలింతలతో ముంచెత్తి ట్రంప్‌ మరోసారి అధికారంలోకి రావాలని ఒక సభలో ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు ఆ మినహాయింపు గురించి జోబైడెన్‌ బెదిరిస్తున్నాడు.


అంతేకాదు భారత అధికారులను మందలించాలని, ఐరాసలో పదే పదే చర్చలు జరపాలని కోరటం, తటస్ధ వైఖరి అవలంభించటం అంటే రష్యా శిబిరంలో ఉన్నట్లే అన్న ముద్రవేయాలని అమెరికా తన దౌత్యసిబ్బందికి పదునైన పదజాలంతో వర్తమానం పంపింది. దాన్ని కావాలనే లీకు చేసింది. రష్యాకంటే భారత్‌ మనకు దగ్గరగా ఉన్నందున ఇలాంటి పని చేస్తే తీరా అది వ్యతిరేక ఫలితాలనిస్తుందేమో అన్న భయం కొందరిలో పట్టుకుందని వార్తలు వచ్చాయి. ఈ సమస్యకారణంగా చైనాపై భారత్‌-అమెరికా వ్యూహాత్మక ఐక్యతకు భంగం కలిగించకూడదని, అమెరికా ప్రయోజనాల రీత్యా భారత్‌తో సంబంధాలు కొనసాగించటం ముఖ్యమని చెబుతున్నవారు కూడా ఉన్నారు. మన దేశం ఇప్పుడు ఉక్రెయిన్‌ అంశంలో తటస్ధంగా ఉన్నట్లే భారత్‌-చైనా వివాదంలో బహిరంగంగా, నిర్ణయాత్మకంగా చైనా వైపు రష్యా ఉండకుండా చూసుకోవాలన్నది కొందరి సలహా.


ఇస్లామాబాద్‌లోని 22 మంది విదేశీ రాయబారులు ఒక బహిరంగ సంయుక్త లేఖను విడుదల చేశారు. రష్యా చర్యను ఐరాసలో ఖండించాలని వారు పాకిస్తాన్ను కోరారు. దీని మీద ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మండిపడ్డాడు. మీరు చెప్పినట్లు చేసేందుకు మేమేమైనా బానిసలం అనుకుంటున్నారా, మా గురించి ఏమనుకుంటున్నారు ? ఇలాంటి లేఖను మీరు భారత్‌కు రాశారా అంటూ ఐరోపా దేశాల రాయబారులపై ధ్వజమెత్తాడు. తమకు అమెరికా, రష్యా, చైనా, ఐరోపా అందరూ కావాల్సినవారే, స్నేహితులే, ఏ శిబిరంలోనూ మేము ఉండం అన్నాడు. మన దేశానికి లేఖ రాసిందీ లేనిదీ బహిరంగం కాలేదు గాని ఢిల్లీలోని విదేశీ దౌత్యవేత్తలు కొందరు ఉక్రెయినుకు మద్దతుగా ఒక సమావేశం నిర్వహించారు. దాని మీద మన దేశం ఎలాంటి అభ్యంతరమూ వెల్లడించలేదు.


ఉక్రెయినుపై భారత్‌ అనుసరిస్తున్న గడసాము వైఖరి సంతృప్తికరంగా లేదని, ఆ దేశం నిశిత పరిశీలనను ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. ఇది అమెరికా అంతరంగంగా చెప్పవచ్చు.ఇదీ బెదిరింపే. ఒక వేళ అమెరికా వత్తిడి ఫలించినా, భారత్‌ రాజీపడటం కష్టమని, కొన్ని స్వల్పమార్పులు మాత్రమే ఉండవచ్చని, బహిరంగంగా రష్యాను విమర్శించలేకపోవచ్చని చైనా నిపుణులు చెప్పారు. అమెరికా తన అవసరాలకు అనుగుణంగా చదరంగంలోని పావుల్లా దేశాలను వాడుకోవాలని చూస్తోందన్నది అనేక దేశాలు గుర్తిస్తున్నాయి. మెక్సికో, టర్కీ తాము రష్యాపై ఎలాంటి ఆర్ధిక ఆంక్షలను అమలు జరపబోమని ప్రకటించగా బ్రెజిల్‌, పనామా, అర్జెంటీనా, బలీవియా వంటివి ఖండించేందుకు తిరస్కరించాయి.


రష్యా ఇప్పుడు సోషలిస్టు దేశమూ కాదు, పుతిన్‌ కమ్యూనిస్టూ కాడు. సోవియట్‌ విడిపోయిన తరువాత రష్యా అనేక సమస్యలను ఎదుర్కొన్నది, ఆర్ధికంగా బలహీనపడింది. ఇదే అమెరికా, ఇతర ధనిక దేశాలు తమ జి7 బృందాన్ని విస్తరించి రష్యాను కలుపుకొని జి8గా వ్యవహరించిన రోజులు ఉన్నాయి. అది ఆర్ధికంగా బలపడటం ప్రారంభం కావటం, నాటో విస్తరణ పేరుతో దాని ముంగిటకు తన సైన్యాలు, ఆయుధాలను తరలించాలని ఎప్పుడైతే చూసిందో అప్పటి నుంచి రెండు దేశాలు దూరం కావటం, జి8 నుంచి రష్యాను తొలగించటం తెలిసిందే. ఇదే సమయంలో ఆర్ధికంగా ఎదుగుతున్న చైనాను చూసి కూడా అమెరికాకు దడపట్టుకుంది. ఈ రెండు దేశాలను దెబ్బతీయాలని ఒకేసారి పావులు కదుపుతోంది. వీటికి వ్యతిరేకంగా మన దేశాన్ని, జపాన్‌, ఆస్ట్రేలియాలను ముగ్గులోకి దించేందుకు పూనుకుంది. అందువలన రష్యా పెట్టుబడిదారీ దేశమైనా, చైనా సోషలిస్టు వ్యవస్ధ కలదైనా ఉమ్మడి శత్రువుగా అమెరికా కూటమి ముందుకు వస్తున్నందున ఇప్పుడున్న బలాబలాల్లో రెండూ కలిసి ఎదుర్కోవాల్సిన అగత్యాన్ని గుర్తించి ముందుకు పోతున్నాయి. ఇది శాశ్వతమా అంటే చెప్పలేము. రెండవ ప్రపంచ యుద్దంలో సోవియట్‌ నేత స్టాలిన్‌ నాజీ హిట్లర్‌తో ఒప్పందం చేసుకున్నాడు, అదిశాశ్వతంగా ఉండదని ఇద్దరికీ తెలుసు. రష్యా గత మూడుదశాబ్దాలుగా తన ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నది. ఇంతవరకు ఏ దేశాన్నీ ఆక్రమించేందుకు పూనుకున్న ఉదంతాలు లేవు. సిరియా వంటి చోట్ల అమెరికా కూటమికి వ్యతిరేకంగా ఉంది. రష్యా-చైనాల మధ్య 4,209 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. వివాదాల్లేకపోతే అంత పొడవున సాధారణ మిలిటరీ కార్యకలాపాతో సరిపెట్టుకోవచ్చు. అదే ఉద్రిక్తతలు ఉంటే పెద్ద మొత్తంలో వనరులు ఖర్చు. ఆ మొత్తాన్ని ఇప్పుడు చైనా అభివృద్ది కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చు.భవిష్యత్‌లో సమస్యవస్తే అప్పుడు ఎలాగూ తప్పదు.


ఈ వివాదంలో మన దేశం తీసుకుంటున్న వైఖరి గురించి ప్రతిపక్ష పార్టీలకు ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు వివరించలేదు అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఐరాసలో తటస్ధతను ప్రకటించటాన్ని ప్రతిపక్ష పార్టీలేవీ విమర్శించలేదు. ఆపరేషన్‌ గంగ మీద వచ్చిన విమర్శలకు విదేశాంగ విధానానికి సంబంధం లేదు.స్వతంత్ర వైఖరిని తీసుకోవాల్సిన తరుణం వచ్చింది. చైనా, పాకిస్తాన్‌లను బూచిగా చూపి అమెరికా వత్తిళ్లకు లొంగుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం : మీడియా ద్వంద్వ ప్రమాణాలు, జనంపై ప్రచారదాడి !

Tags

, , , ,



ఎం కోటేశ్వరరావు


రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, శాంతి నెలకొనేందుకు ఎన్ని రోజులు పడుతుందో అని యావత్‌ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఎక్కువ రోజులు కొనసాగితే అది వారూ వీరూ అనే తేడా లేకుండా అందరి మీద ప్రభావం చూపుతుంది. ఇప్పటికే మన దేశంతో సహా అన్ని చోట్లా అది కనిపిస్తోంది. ధరలు పెరుగుతున్నాయి, చమురు పిడుగు ఏక్షణంలో పడుతుందో తెలియదు. తమ దగ్గర చిక్కుకు పోయిన లేదా ఉక్రెయిన్‌ బందీలుగా చేసిన భారత్‌, ఇతర దేశాల విద్యార్ధుల భవిష్యత్‌ గురించి తలిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. సకాలంలో కేంద్ర ప్రభుత్వం మేలుకొని ఉంటే ఈ పరిస్ధితి ఉండేది కాదు. ఇక ఈ ఈ యుద్ధం గురించి మీడియా తీరు తెన్నులు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి.


ప్రపంచ చట్టాలను, భద్రతా మండలి తీర్మానాన్ని లెక్క చేయటం లేదంటూ రష్యాను దోషిగా చూపుతూ ప్రచారం జరుగుతోంది.1995లో తొలిసారిగా నాటో కూటమి యుగ్లోసావియా మీద మార్చినెల 24 నుంచి జూన్‌ పది వరకు 78 రోజుల పాటు వైమానిక దాడులు జరిపింది. దీనికి భద్రతా మండలి అనుమతి లేదు. అప్పుడు దాడికి దిగిన ” ఐరోపా అపర ప్రజాస్వామిక దేశాలు ”, వాటికి మద్దతు పలికిన మీడియాకు అంతర్జాతీయ చట్టాలు, ప్రజాస్వామిక సూత్రాలు గుర్తుకు రాలేదు. కొసావోలో ఉన్న పరిస్ధితులు ప్రాంతీయ స్ధిరత్వానికి ముప్పు వచ్చిందని నాటో సమర్ధించుకుంది. దానికి మీడియా తాన తందానా అంది. అదే నిజమైతే ఇప్పటి మాదిరి ఐరాసలో ఎందుకు చర్చించలేదు? ఇప్పుడు ఉక్రెయినుకు నాటో సభ్యత్వం ఇచ్చే చర్యలు తన భద్రతకు, ప్రాంత దేశాలకు ముప్పు అని ఎన్నో సంవత్సరాలుగా చెబుతున్న రష్యా అభ్యంతరాలను ఎందుకు పట్టించుకోలేదు ? ఉక్రెయిన్లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న డాన్‌బాస్‌ ప్రాంతంలో మెజారిటీగా ఉన్న రష్యన్‌ భాష మాట్లాడేవారిపై కిరాయి ఫాసిస్టు మూకలు, మిలిటరీ జరిపిన దాడులతో పదిహేను వేల మంది మరణించటం, ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్న అంతర్యుద్దం, జర్మనీ, ఫ్రాన్స్‌ కుదిర్చిన రెండవ మిన్‌స్క్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఉక్రెయిన్‌ ప్రభుత్వ తీరుతెన్నులు ఆ ప్రాంతంలో అస్ధిరతకు దారి తీయవా ? నాటో ఎందుకు పట్టించుకోలేదు ?


పశ్చిమ దేశాలు ఇరాక్‌, లిబియా, సిరియా, ఎమెన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ తదితర దేశాలపై దాడులు జరిపాయి. ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యాదాడులు జరుపుతోంది. రెండు ఉదంతాలపై మీడియా స్పందించిన తీరేమిటి ? సిబిఎస్‌ అనే అమెరికా మీడియా కీవ్‌ నగర విలేకరి చార్లీ డి అగటా చెప్పిన వార్తలో ” ఈ ప్రాంతం దశాబ్దాల తరబడి విబేధాలు చెలరేగుతున్న ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ వంటిది కాదు, ఇది వాటితో పోలిస్తే నాగరికమైన ప్రాంతం, ఐరోపాకు చెందినది, ఈ నగరంలో యుద్దం జరుగుతుందని మీరు ఊహించలేరు..” అన్నాడు. అంటే పైన పేర్కొన్న ప్రాంతాలు అనాగరికమైనవన్న శ్వేతజాతి జాత్యహంకారం తప్ప ఆ మాటల్లో మరేమైనా ఉందా ? అమెరికా, ఐరోపా వంటి నాగరిక దేశాలు అనాగరికంగా ఇతర దేశాల మీద దాడులకు దిగటం ఏమిటి ? పశ్చిమ దేశాల్లోని జనాలు అడవుల్లో ఉంటూ సరిగా బట్టలు కట్టుకోవటం కూడా రాని కాలంలోనే ఇరాక్‌ వంటి దేశాలు నాగరికతను కలిగి ఉన్నాయి. అనేక గణిత, సైన్సు అంశాలను బోధించాయి.


మరో అమెరికా మీడియా ఎన్‌బిఎస్‌ విలేకరి హాలీ కోబిలే ఒక మహిళ అనికూడా మరచి మరింత దారుణంగా మాట్లాడింది.” మొహమాటం లేకుండా చెప్పాలంటే వీరు సిరియా నుంచి వచ్చిన నిర్వాసితులు కాదు, ఉక్రెయిన్‌ వారు. వారు క్రైస్తవులు, వారు తెల్లవారు, మన మాదిరే ఉంటారు.” అంటే సిరియన్లు, ఇతరులు ఏమైనా వారికి ఫరవాలేదన్నమాట. బిబిసిలో ఒక విశ్లేషకుడు మాట్లాడుతూ ” నీలి కళ్లు, తెలుపు-రాగి రంగు జుట్టు కల ఐరోపా వారిని చంపుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను” అన్నాడు. మరొక యాంకర్‌ పీటర్‌ డోబీ మాట్లాడుతూ ” వారి దుస్తులను చూస్తుంటే వారంతా ధనికులు, మధ్యతరగతి వారిలా ఉన్నారు తప్ప మధ్య ప్రాచ్యం, లేదా ఉత్తరాఫ్రికా నుంచి పారిపోతున్న కాందిశీకుల్లా మాత్రం లేరు. మీ పక్కింటి యురోపియన్‌ వారిలానే ఉన్నారు. ” పశ్చిమాసియా,ఆఫ్రికా, ఆసియా ఖండాలలో జరిగిన యుద్ధాలకు పాల్పడిందీ, ప్రపంచాన్ని ఆక్రమించింది ఐరోపా సామ్రాజ్యవాదులే కదా !


బ్రిటన్‌ టెలిగ్రాఫ్‌ పత్రిక జర్నలిస్టు డేనియన్‌ హానన్‌ ఉక్రెయిన్‌ పరిస్ధితిని చూసి దిగ్భ్రాంతి చెందాడట. ఎందుకటా అది ఐరోపా దేశమట. నిజమే రెండు ప్రపంచ యుద్దాలను ప్రారంభించిందీ, అంతకు ముందు ఐరోపాలో, అమెరికాలో కొట్టుకు చచ్చిందీ, యుద్దాలకు పాల్పడిందీ, ఆఫ్రికన్లను బానిసలుగా చేసుకున్నదీ ” ఐరోపా నాగరికులే ” అని మర్చిపోతే ఎలా, అందుకే తమ కింత ఉన్న పెద్ద మచ్చను ఒకసారి చూసుకోమని చెప్పాల్సి వస్తోంది. ఐదు లక్షల మంది ఉక్రెయినియన్లు నిర్వాసితులుగా మారటం, ఇతర దేశాలకు పోవటం దురదృష్టకరమని ఐరాస అధికారి ఫిలిప్పో వాపోయారు. 1948 నుంచి తమ మాతృదేశం నుంచి వెళ్ల గొట్టిన కారణంగా ఏడున్నరలక్షల మందితో ప్రారంభమై ప్రస్తుతం 56లక్షలకు చేరిన పాలస్తీనియన్లు అప్పటి నుంచి పరాయి ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. కాందిశీకుల శిబిరాల్లోనే పుట్టి కాందిశీకులుగా అక్కడే మరణించిన వారే కొన్ని లక్షల మంది ఉన్నారు. పిల్లలకు దాడుల భయం తప్ప మరొకటి తెలియదు. వారి గురించి నాగరికులకు పట్టదు, దానికి కారణమైన ఇజ్రాయల్‌కు మద్దతు ఇస్తున్నారు.2019 నాటికి 7.95 కోట్ల మంది ప్రపంచంలో నిరాశ్రయులు కాగా వారిలో 2.04 కోట్ల మంది 18 ఏండ్ల లోపువారున్నారు. దీనికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకులెవరు అంటే 99శాతం ఐరోపా, అమెరికా అనాగరికులే.


ఉక్రెయిన్లో రష్యన్‌ సైన్యాన్ని వ్యతిరేకిస్తున్న వారి గురించి కథ కథలుగా చెబుతున్న పశ్చిమ దేశాల మీడియా ఎన్నడైనా పాలస్తీనియన్లు, వియత్నాం తదితర చోట్ల సామాన్యులు చూపిన తెగువ, అమెరికన్లను మూడు చెరువుల నీళ్లు తాగించి సలాం కొట్టించిన ఉదంతాలను ఎప్పుడైనా చెప్పిందా ? అంతెందుకు, మమ్మల్ని ప్రాణాలతో వెళ్లి పోనివ్వండ్రాబాబూ అని ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లతో ఒప్పందం చేసుకొని అమెరికన్లు పారిపోకముందు వరకు వారిని అణచివేశామనే కట్టుకథలనే ప్రపంచానికి వినిపించిన సంగతి మరచిపోగలమా ! ఉక్రెయిన్లో బాంబులు తయారు చేసి ఉపయోగించి చూపటాన్ని దేశభక్తిగా చూపుతున్న మీడియా పాలస్తీనాలో అదే పని చేస్తున్నవారిని ఉగ్రవాదులుగా చిత్రించి అణచివేస్తున్నవారికి అండగా నిలుస్తున్నారు. ఇలా ద్వంద్వ ప్రమాణాలు, మోసకారితనం గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబాన్లు అమెరికా సిఎన్‌ఎన్‌ విలేకరి బెర్నీ గోరెస్‌ను ఉరితీసి చంపారని గతంలో ప్రపంచాన్ని నమ్మించారు. ఇప్పుడు అదే బెర్నీ ఉక్రెయిన్లో దర్శనమిచ్చి పిట్ట, కట్టుకథలను రాసి ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తున్నాడు. ఐరోపా యూనియన్నుంచి బ్రిటన్‌ విడిపోవటానికి ప్రణాళికను రూపొందించాడన్న పేరు తెచ్చుకున్న ” నాగరిక ” నిగెల్‌ ఫారాజి గతంలో బ్రిటన్‌ నుంచి పోలిష్‌ జాతివారిని బయటకు పంపాలని కోరాడు, ఇప్పుడు రష్యన్లను తరిమివేయాలని చెబుతున్నాడు.


గత ఏడు సంవత్సరాలుగా పశ్చిమ దేశాల తరఫున వకాల్తా పుచ్చుకొని ఎమెన్‌పై దాడులు చేస్తున్న సౌదీ అరేబియా, ఇతర దేశాల దాడుల్లో 80వేల మంది పిల్లలతో సహా ఐదు లక్షల మంది మరణిస్తే ఐరోపా మానవతావాదులు, వారికి మద్దతు ఇచ్చే మీడియాకు చీమకుట్టినట్లుగా లేదు. రష్యన్ల ఆస్తులను స్ధంభింపచేయాలని నిర్ణయించిన ” నాగరికులు ” సౌదీ అరేబియా, ఇతర దేశాల మీద అలాంటి చర్యలెందుకు తీసుకోలేదు, బ్రిటన్‌లో అది రెండు ఫుట్‌బాల్‌ క్లబ్బులను నడుపుతోంది. భద్రతా మండలిలో తటస్ధంగా ఉన్న యుఏయి బ్రిటన్‌లో అత్యంత ధనవంతమైన మాంచెస్టర్‌ సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ భాగస్వామి, ఉక్రెయిన్‌పై బాంబు దాడులను నిరసిస్తూ సదరు క్లబ్బులో సభ నిర్వహించింది. దాని తటస్ధత ఎక్కడ ? రష్యన్లు ఉక్రెయిన్‌ తరువాత మిగతా దేశాలను కూడా ఆక్రమించుకుంటారు అని అమెరికా, ఐరోపా దేశాలన్నీ ఊదరగొడుతున్నాయి. ఐరాస తీర్మానం మేరకు ఏర్పడాల్సిన పాలస్తీనా ప్రాంతాలను గత ఏడు దశాబ్దాలుగా ఆక్రమించుకొని స్ధిరపడాలని చూస్తున్న ఇజ్రాయల్‌కు అవి తిరుగులేని మద్దతు ఇస్తున్నాయి. ఉక్రేనియన్లు తమ దేశం వెళ్లి పోరాడేందుకు అన్ని రకాల సాయం చేస్తామని బ్రిటీష్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ ప్రకటించారు. కానీ అదే బ్రిటన్‌ పశ్చిమాసియాకు చెందిన వారిని ఉగ్రవాదులుగా చిత్రించి జైళ్లలో పెట్టింది. ఫుట్‌బాల్‌ స్టేడియాల వద్ద పాలస్తీనా పతాకాలను ఎగురవేయటాన్ని బ్రిటన్‌ నిషేధించింది, ఎందుకంటే క్రీడలకు రాజకీయాలకు ముడి పెట్టకూడదని చెప్పింది, అదే ఇప్పుడు ఉక్రెయిన్‌ పతాకాలను ఎగురవేయిస్తున్నది.అమెరికాతో కలసి తనకు సంబంధం లేకపోయినా అనేక దేశాల మీద దాడులకు దిగిన బ్రిటన్‌ ఇప్పుడు రష్యాను చూపి గుండెలు బాదుకుంటోంది.


పశ్చిమ దేశాల మీడియా పోకడలను అమెరికాలోని అరబ్‌ మరియు మధ్యప్రాచ్యదేశాల జర్నలిస్టుల సంఘం ఒక ప్రకటనలో ఖండించింది. ఆ దేశాల దుష్టమనస్తత్వానికి వారి జర్నలిజం ప్రతీకగా ఉందని, మధ్యప్రాచ్యదేశాలలో విషాదాలు సర్వసాధారణమే అన్నట్లు చిత్రిస్తున్నదని పేర్కొన్నది.యుద్ద బాధితులు ఎవరైనా ఒకటేనని, అయితే మధ్యప్రాచ్యదేశాల బాధితుల పట్ల అమానుషత్వాన్ని ప్రదర్శిస్తున్నదని సంఘ అధ్యక్షురాలు హుదా ఉస్మాన్‌ విమర్శించారు. పశ్చిమ దేశాల జర్నలిస్టులు ఇతర దేశాల పట్ల అలవోకగా, సాదాసీదాగా వివక్షను వెల్లడించటం వృత్తికి తగనిపని అన్నారు.


ఇక మన మీడియా విషయానికి వస్తే ఒక మంచి రేటింగుల అవకాశాన్ని కోల్పోయినట్లుగా బాధపడుతున్నట్లు కనిపిస్తోంది.రష్యా పట్ల మన దేశం తటస్ధవైఖరిని ప్రదర్శించటం దానికి ఒక కారణం. అయినప్పటికీ పశ్చిమ దేశాల మీడియా కథనాలను కొత్త పాకింగులో అందిస్తున్నది. భక్తి ప్రపత్తులతో తమ పని చేసిపెడుతున్నందున పశ్చిమ దేశాలు మాట్లాడటం లేదు. భారత మీడియా వివక్ష పూరితంగానూ, తప్పుదారి పట్టించే వార్తలను అందిస్తున్నదని రష్యా విమర్శించింది. ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ వాస్తవ సమాచారాన్ని భారత పౌరులకు అందించాలని హితవు చెప్పింది. ఉక్రెయిన్లోని అణువిద్యుత్‌ కేంద్రాలు, చర్చల గురించి తప్పుడు సమాచారాన్ని భారత మీడియా అందించిదని విమర్శించింది. ” రష్యా దురాక్రమణ ” గురించి భారత మీడియా విమర్శించటం లేదెందుకంటూ బిబిసి ఒక కథనాన్ని రాసింది. యుద్దాన్ని ఆసరా చేసుకొని రేటింగులను పెంచుకొనేందుకు, తద్వారా సొమ్ము చేసుకొనేందుకు చూస్తున్న అత్యధిక పశ్చిమ దేశాల మీడియా సంస్ధలు ఇల్లు కాలుతుంటే చుట్టకాల్చుకొనే వారిని గుర్తుకు తెస్తున్నాయి.జనాలను కించపరుస్తున్నాయి, ఏకపక్ష వార్తలు, వ్యాఖ్యానాలతో తప్పుదారి పట్టిస్తున్నాయి. ఈ విషయంలో మన మీడియా కూడా తక్కువ తినటం లేదు. తప్పును తప్పని ఖండించలేని నరేంద్రమోడీ సర్కారు మాదిరి యుద్దానికి అసలు కారకులైన అమెరికా దాని నేతృత్వంలోని నాటో కూటమి కుట్రలు, ద్వరద్వ ప్రమాణాలను వెల్లడించటంలో మ్యావ్‌ మ్యావ్‌ మంటున్నాయి. జనం మీద జరిగే ప్రచారదాడికి జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్ధలు అణ్వస్త్రాల క్షిపణుల మాదిరి ఉపయోగపడుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
.

‘ మహా రష్యన్‌ దురహంకారం ‘ – పొసగని రంగనాయకమ్మ సూత్రీకరణలు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


నూరు పూవులు పూయనీయండి – వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్న స్ఫూర్తితో ఎవరు ఏమైనా చెప్పవచ్చు, రాయవచ్చు. దానిలో భాగంగానే ఎవరైనా వాటితో విబేధించవచ్చు కూడా. తొలుత ప్రముఖ రచయిత్రిగా తెలుగునాట పేరు తెచ్చుకున్న రంగనాయకమ్మ తరువాత మార్క్సిస్టు సిద్దాంతవేత్తగా కూడా మారారు. మార్క్సిజం- లెనినిజం లేదా దానికి మావోయిజాన్ని తోడు చేసి వాటి మీద వ్యాఖ్యానాలు చేసేందుకు ఎవరికీ మేథోసంపత్తి హక్కులేమీ లేవు, కనుక ప్రతివారికీ అవకాశం ఉంది, అనేక మంది రాస్తున్నారు. అలాంటి వారిలో రంగనాయకమ్మ ఒకరు. ‘ మహా రష్యన్‌ దురహంకారం ‘ అనే శీర్షికతో మార్చి రెండవ తేదీన ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసిన అంశాలలో కొన్నింటి గురించి చూద్దాం. బోల్షివిక్‌ పార్టీ సారధిగా, తొలి సోషలిస్టు విప్లవానికి నేతృత్వం వహించి అనేక అంశాలపై మార్క్సిజాన్ని మరింతగా పరిపుష్టం చేసిన కారణంగానే లెనిన్‌కు చరిత్రలో ఒక ప్రత్యేక స్ధానం ఉంది. అదెంతటి మహత్తరమైనదంటే తరువాత కాలంలో మార్క్సిజం-లెనినిజంగా ప్రతి కమ్యూనిస్టు పార్టీ మార్గదర్శనంగా చేసుకొనేంతగా అన్నది స్పష్టం.


రంగనాయకమ్మగారు ప్రస్తావించిన జాతుల సమస్య మీద ప్రపంచంలో ఏ కమ్యూనిస్టు పార్టీలోనూ జరగనన్ని చర్చలు, వాదోపవాదాలు అక్కడి భౌతిక పరిస్ధితుల కారణంగా విప్లవానికి ముందు తరువాత రష్యన్‌ పార్టీలో జరిగాయి. లెనిన్‌ ప్రతిపాదించిన వాటితో తీవ్రంగా విబేధించిన వారున్నారు, లెనిన్‌ విబేధించినవీ రాజీపడినవీ ఉన్నాయి. ఆ చర్చ జోలికి పోదలచలేదు. బోల్షివిక్‌ పార్టీ ఒక ప్రజాస్వామిక సంస్ధ. మెజారిటీ నిర్ణయాన్ని మైనారిటీ కూడా అంగీకరించి అమలు జరపాలనే కేంద్రీకృత ప్రజాస్వామిక సూత్రాలతో పని చేసింది. అందువలన పార్టీలో లెనిన్‌ప్రతిపాదించినా, స్టాలిన్‌ ప్రతిపాదించినా తప్పయినా ఒప్పయినా చర్చల తరువాత ఆమోదం పొందిన వాటినే అమలు చేశారు. అందువలన వాటిని వ్యక్తులకు ఆపాదించటం తగనిపని.ఉమ్మడి óాకమ్యూనిస్టు పార్టీ సైద్దాంతిక విబేధాలతో చీలిన తరువాత తెలుగునాట రెండు పార్టీలను కొందరు సుందరయ్య పార్టీ, రాజేశ్వరరావు పార్టీ అని పిలవటాన్ని ఆమె గుర్తుకు తెచ్చారు. ” లెనిన్‌ వ్యతిరేకించిన జాతుల విధానమే స్టాలిన్‌ ఆధిపత్యంలో కొనసాగింది ” అని చెప్పటం అలాంటిదే. బోల్షివిక్‌ విప్లవం జయప్రదమైనపుడు రష్యాలో అనేక మైనారిటీ జాతులు ఉన్నాయి. తొలి శ్రామిక రాజ్యం పేరు ” రష్యన్‌ సోవియట్‌ ఫెడరేటివ్‌ సోషలిస్టు రిపబ్లిక్‌(ఆర్‌ఎస్‌ఎఫ్‌ఎస్‌ఆర్‌) ”. తరువాత 1924లో వివిధ రిపబ్లిక్‌ల మధ్య ఒప్పందం జరిగి ”యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్టు రిపబ్లిక్‌(యుఎస్‌ఎస్‌ఆర్‌)గా పేరు మార్చారు.


జారు కాలంలో మైనారిటీ జాతులను అణచివేసింది నిజం, అందుకే విప్లవం సంభవించక ముందే సోషలిస్టు దేశంలో జాతుల సమస్య పరిష్కారం గురించి పార్టీలో చర్చ జరిగింది. ఐనప్పటికీ రష్యన్‌ రిపబ్లిక్‌ అని నామకరణం చేసింది లెనిన్‌ నాయకత్వంలో ఉన్న పార్టీ, ప్రభుత్వమే కదా పెట్టింది. దాని అర్ధం మహా రష్యన్‌ దురహంకారానికి లెనిన్‌ లోనైనట్లా ? రిపబ్లిక్‌లకు స్వయం నిర్ణయాధికారం ఉండాలన్న లెనిన్‌ వైఖరిని కొందరు ఆమోదించకపోయినా మెజారిటీ అంగీకరించారు.1917 నవంబరు ఏడున రష్యన్‌ సోషలిస్టు రిపబ్లిక్‌ ఏర్పడితే, స్వయం నిర్ణయాధికార అవకాశాన్ని వినియోగించుకొని అంతకు ముందు స్వయం పాలిత ప్రాంతంగా ఉన్న ఫిన్లండ్‌ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుంటే లెనిన్‌ ఆమోదించాల్సి వచ్చింది. దీని మీద భిన్న అభిప్రాయాలు వెల్లడయ్యాయి, తరువాత కూడా అలాంటి అవకాశం కల్పించినా మరొకటేదీ విడిపోలేదు. స్టాలిన్‌ కాలం నుంచి అనుసరించిన ఆధిపత్య విధానాలు 1991లో వేరుపడి పోవటానికి ఒక ముఖ్యకారణం అని రంగనాయకమ్మ చేసిన సూత్రీకరణకు స్టాలిన్‌ పట్ల గుడ్డి వ్యతిరేకత తప్ప తర్కబద్దత కనిపించదు. అమెరికా ఇతర శక్తుల కుట్రలను గుర్తించేందుకు నిరాకరించటమే. ఆమెతో సహా కొందరు చెప్పే స్టాలిన్‌ ఆధిపత్యానికి తలొగ్గి రిపబ్లిక్కులు విధిలేక కలసి ఉన్నాయనుకుందాం, స్టాలిన్‌ 1953లో మరణించిన తరువాత ఎక్కడి నుంచీ స్వయం నిర్ణయాధికార కాంక్ష లేదా డిమాండ్‌ ఎందుకు తలెత్తలేదు. రిపబ్లిక్కులకు అసమాన అధికారాలు ఉంటే మన దేశంలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల సమస్య మాదిరి అక్కడ కూడా తలెత్తి ఉండేవి.లెనిన్‌ వ్యతిరేకించిన లేదా స్టాలిన్‌ అమలు పరచిన విధానాలు అనే పదప్రయోగాలు కూడా తప్పే. అవేవీ ఏకపక్షమైనవి కాదు, తప్పయినా ఒప్పయినా పార్టీ తీసుకున్న వైఖరిని అమలు చేశారు. తప్పనుకుంటే గుణపాఠాలు తీసుకోవచ్చు, అభిప్రాయాలు వెల్లడించవచ్చు. రంగనాయకమ్మకు ఆ స్వేచ్చ ఉంది. ఆమె ఆలోచనా బడిలొ చదువుకుంటున్నవారికి, అనుసరిస్తున్నవారికి అవే తిరుగులేనివిగా అనిపించవచ్చు, ఇతరులు విబేధించవచ్చు.


ఇక ” ఉక్రెయిన్‌ ముందుగా దాడి చేయనపుడు రష్యాకు ఆత్మరక్షణ ప్రశ్న ఏమిటి ” అని రంగనాయకమ్మ అడుగుతున్నారు. ఇది అమాయకత్వమో లేక కొందరి టీకా తాత్పర్యాల ప్రభావమో తెలియదు. అసలు రష్యా ఆ మాట ఎక్కడ చెప్పింది ? చెప్పలేదు, కనుక ఇతరులు చెప్పినదాన్ని ప్రమాణంగా తీసుకోవటం ఏమిటి ? ” ఉక్రెయిన్‌ స్వతంత్ర దేశంగా ఏర్పడిన తరువాత….అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌,జర్మనీతో సంబంధాలు పెట్టుకుంది ” అన్నారు. ఇది వాస్తవ విరుద్దం. ఒక స్వతంత్ర దేశంగా ప్రతిదేశంతో దౌత్య సంబంధాలు పెట్టుకోవటం వేరు, ఒక దేశం లేదా కూటమికి వ్యతిరేకంగా మరో కూటమి వైపు మొగ్గి ఇతర సంబంధాలు పెట్టుకోవటం వేరు. 2013లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు విక్టర్‌ ఎన్‌కోవిచ్‌ ఒక ప్రకటన చేశాడు. ఐరోపా యూనియన్‌తో ఆర్ధిక అనుసంధాన ఒప్పందానికి తిరస్కరిస్తున్నట్లు ప్రకటించాడు. తొలుత ఆర్ధికం పేరుతో సంబంధాలు, తరువాత నాటోలో చేర్చుకోవాలని తద్వారా రష్యా ముంగిటకు తమ సేనలను చేర్చాలన్నది అమెరికా పధకం. దానికి ఎదురుదెబ్బ తగలటంతో సిఐఏ రంగంలోకి దిగి ప్రతిపక్ష పార్టీలతో ప్రదర్శనలు చేయించి తిరుగుబాటును రెచ్చగొట్టింది. ఎనుకోవిచ్‌ రష్యాలో తలదాచుకున్నాడు. తరువాత ఎన్నికల్లో తమ అనుకూల ప్రభుత్వాన్ని అమెరికా ఏర్పాటు చేసింది. అసలు సమస్య ఇక్కడినుంచే ప్రారంభం కాగా స్వతంత్రదేశంగా ఏర్పడిన వెంటనే అమెరికా ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకున్నదని రాయటం వక్రీకరణ కాదా ?


” రెండవ ప్రపంచ యుద్దం తరువాత నుంచీ ప్రపంచం మీద పెత్తనం చేసే విషయంలో అమెరికాకి రష్యా ప్రధాన పోటీదారు.అందుకే అమెరికా, రష్యాలను అగ్రరాజ్యాలు అంటారు ఇతర దేశాల వారు. అసలు అనవలసింది రెండూ పెద్ద బందిపోటు ముఠాలు అని….” ఇది రంగనాయకమ్మ వంటి సీనియర్‌ కలం నుంచి వెలువడటం ఆశ్చర్యంగా ఉంది. ప్రాధమిక అంశాలను కూడా విస్మరిస్తే అమెకు ఉన్న పేరును బట్టి చదువరులు నిజమే అని భావించి తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకొనే అవకాశం ఉంది.రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌ ఉంది. దానిలో రష్యాతో సహా 15 రిపబ్లిక్కులున్నాయి.1991 వరకు అదే కొనసాగింది. సోవియట్‌ ప్రపంచ పెత్తనం కోసం చూసిందని అమెరికా కూటమి, దాన్ని అనుసరించే వారు చేసిన ప్రచారాన్ని రంగనాయకమ్మ కూడా వంటపట్టించుకున్నారా ? మార్క్సిజాన్ని అధ్యయనం చేసిన తరువాత అంతకు ముందు చేసిన తన రచనల్లో కొన్ని పదాలను సవరించారు. కానీ సోవియట్‌ గురించి పూర్వపు వైఖరితోనే ఉన్నట్లున్నారు. లేకపోతే అమెరికాతో అంటగట్టి రెండూ ఒకటే అనటం ఏమిటి ? అమెరికా పెత్తనానికి, దుర్మార్గాలకు బలైన కొరియా, వియత్నాం, ఇరాక్‌, లిబియా, సిరియా వంటి ఉదంతాలున్నాయి. వీటిలో ఏ ఒక్కదేశమైనా అమెరికాను ఆహ్వానించిందా, ఏకపక్ష దాడులకు గురయ్యాయా ?అటువంటి చరిత్ర సోవియట్‌ లేదా దాని తరువాత రష్యాకు గానీ ఉందా ? ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌ ఎందుకు జోక్యం చేసుకుందో రంగనాయకమ్మకు తెలీదనుకోవాలా లేక అమెరికా దాడులకు దీనికి తేడా లేదని అనుకుంటున్నారా ? ఆఫ్ఘన్‌లో అధికారానికి వచ్చిన వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అమెరికా చేసిన కుట్రల్లో భాగంగా తాలిబాన్లను తయారు చేసి ఉసిగొల్పారు. వారి నుంచి రక్షణకు ఆ ప్రభుత్వం సోవియట్‌ సాయం కోరింది.


శ్రామికవర్గ దృక్పధం కలిగిన వారు యుద్దం పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి అని ప్రశ్నిస్తూ రంగనాయకమ్మ చెప్పిన అంశాలు ఆ దృక్పధాన్ని ప్రతిబింబించలేదు. రష్యా పెట్టుబడిదారీ దేశమే, అన్ని పెట్టుబడిదారీ దేశాలూ దురాక్రమణదారులు కాదు. గత మూడు దశాబ్దాల్లో రష్యాకు అలాంటి చరిత్ర లేదు. అమెరికా కుట్రలకు వ్యతిరేకంగా ఉక్రెయిన్లో ప్రత్యేక సైనిక చర్యకు పూనుకుంది. ప్రపంచాధిపత్యం కోసం పూనుకున్న అమెరికా కుట్రలను ఎదిరించేందుకు ఒక పెట్టుబడిదారీ దేశంగా రష్యా లేదా మరొకటి ముందుకు వస్తే శ్రామికవర్గ దృక్పధం కలిగిన వారు ఎదిరించిన వారిని బలపరచాలి. మొదటి ప్రపంచ యుద్దంలో జర్మనీతో లెనిన్‌ బ్రెస్ట్‌-లిటోవస్క్‌ సంధి కుదుర్చుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్దంలో స్టాలిన్‌ ఒక ఎత్తుగడగా హిట్లర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అమెరికా ఇతర పెట్టుబడిదారీ దేశాలనే కాదు, సోషలిస్టు దేశాలనూ వ్యతిరేకిస్తోంది. కనుక దాన్ని ఎదుర్కొనేవారిని బలపరచాలి. వర్తమాన ఉదంతంలో ఐరాసలో చైనా తటస్ధ వైఖరిని తీసుకుంది. అదే సమయంలో పశ్చిమ దేశాల ఆంక్షలను ఖాతరు చేయకుండా రష్యా నుంచి చమురు, గోధుమల వంటి వాటిని దిగుమతి చేసుకుంటోంది. రంగనాయకమ్మగారు వర్ణించినట్లు ” ఒక బందిపోటు ”ను చైనా సమర్ధిస్తున్నట్లుగా అనుకోవాలా, అమెరికాతో పోరాడేశక్తికి తోడ్పాటు ఇస్తున్నట్లుగా భావించాలా ? ఆమె కళ్లతో చూస్తే అమెరికా బందిపోట్లతో 50 సంవత్సరాల క్రితం సోషలిస్టు చైనా ఒప్పందం చేసుకుంది.దానిలో భాగంగా పెట్టుబడులను ఆహ్వానించింది. దాని వలన చైనా శ్రామికులకు మేలు జరిగినట్లా కీడు జరిగిందా ? దీనికి ఏ భాష్యం చెబుతారు. అదే విధంగా రష్యాతోనూ ఒప్పందాలు, ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నది. దీని అర్ధం రెండు పెద్ద బందిపోటు దేశాలతో చైనా చేతులు కలిపినట్లా ?


తన ప్రధాన పోటీదారైన అమెరికా అడుగుజాడల్లోనే నడుస్తోందనే కారణంతోనే ఉక్రెయిన్‌ మీద రష్యా దురాక్రమణకు పాల్పడిందని రంగనాయకమ్మ చెప్పారు. తన వర్గం ఏదో మరచిపోయి ఒక ఫ్యాక్టరీ కార్మికుడు, వ్యవసాయ కార్మికుడు తమ యజమానులవైపు కొమ్ముకాస్తే పర్యవసానాలను అనుభవించకతప్పదు. అదే ఇక్కడా వర్తిస్తుంది. ఐరోపాలో ఉక్రెయిను కంటే అనేక చిన్న దేశాలు అదే పని చేస్తున్నాయి, మరి వాటి మీద ఎందుకు దాడికి దిగలేదు ? యుద్ధ వ్యతిరేక ప్రదర్శనల గురించి ప్రస్తావించారు, అవి జరిగే కారణాలు వేరు, అవన్నీ విముక్తి మార్గ బాటలో ఉన్నట్లు భావిస్తున్నారా ? గతంలో అమెరికా, అనేక ఐరోపా దేశాల్లో ఇంతకంటే పెద్ద ఎత్తున జరిగాయి. వాటికీ విముక్తికీ ముడిపెట్టటం ఏమిటి ?


ఇక శ్రామికవర్గ చైతన్యం గురించి, ఐరాస గురించి చెప్పిందానితో విబేధించాల్సిందేమీ లేదు.తాను శ్రామికవర్గ పక్షపాతినని ఆమె పదే పదే పునరుద్ఘాటిస్తున్నారు. అందుకు అభినందించాల్సిందే, ఆహ్వానించాల్సిందే. అయితే, పద ప్రయోగాలు, భాష్యాలు చెప్పేటపుడు మార్క్సిజాన్ని ఔపోసన పట్టినట్లు కనిపించే రంగనాయకమ్మగారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆమె రచనలను అనుసరించేవారు తర్కబద్దంగా ఆలోచించి సరైనవో కాదో నిర్ధారించుకోవాలి.

దడ పుట్టిస్తున్న చమురు ధరలు – నరేంద్రమోడీ జనం గురించి పట్టించుకుంటారా ?

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు గురువారం నాడు మరో మెట్టు ఎక్కాయి. ఇది రాసిన సమయానికి బ్రెంట్‌ రకం పీపా ధర 116.94 డాలర్లను తాకింది. వ్యూహాత్మక నిల్వల నుంచి 60మిలియన్ల పీపాల చమురును మార్కెట్లోకి విడుదల చేయాలని అంతర్జాతీ ఇంధన సంస్ధ(ఐఇఏ) మంత్రుల సమావేశం ప్రకటించిన తరువాత కూడా మార్కెట్లో ధరలు పెరిగాయి. ఈ మొత్తంలో తాము 30మిలియన్ల పీపాలు విడుదల చేస్తామని అమెరికా పేర్కొన్నది. అరవై మిలియన్ల పీపాలు ఐఇఏలోని 31 దేశాల నిల్వల్లో నాలుగుశాతం. ఈ దేశాల్లో 1.5బిలియన్ల పీపాలు ఉంటే ఒక్క అమెరికాలోనే 600మి. పీపాలుంది. మార్కెట్‌ ఇబ్బందుల్లో పడిన ప్రతికూల సందేశాన్ని సందేశాన్ని ఈ నిర్ణయం పంపిందని, అరవై మిలియన్లన్నది చమురు పీపాలో ఒకబొట్టు వంటిదని, ప్రపంచంలో ఒక రోజుకు అవసరమైన 100మి. పీపాల గిరాకీ కంటే తక్కువంటూ ఇది చమురు ధరలపై ప్రభావం ఎలా చూపుతుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఆంక్షల కారణంగా మార్కెట్లోకి రష్యానుంచి రోజుకు ఏడు మిలియన్‌ పీపాల సరఫరా నిలిచిపోనుంది. ఆంక్షలున్నప్పటికీ తమ కొనుగోళ్లు కొనసాగుతూనే ఉంటాయని చైనా ప్రకటించింది. గోధుమల దిగుమతులపై గతంలో ఉన్న పరిమితులను కూడా ఎత్తివేస్తున్నట్లు తెలిపింది.


ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలతో నిమిత్తం లేకుండానే అమెరికాలో నాలుగుదశాబ్దాల రికార్డు స్ధాయిలో 7.5శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. ఇప్పుడు చమురు ధరల పెరుగుదల తోడైంది. కొందరి అంచనా ప్రకారం 125 డాలర్లకు పెరిగితే అమెరికా ఏకంగా మాంద్యంలోకి దిగజారుతుంది. ఐరోపా దేశాలకు చమురు, గాస్‌ అవసరం కనుక రష్యా నుంచి వాటి ఎగుమతులపై ఆంక్షలను మినహాయించారు, లేనట్లయితే ఐరోపాలో మరోరకం సంక్షోభం తలెత్తి ఉండేది.ఐరోపా దేశాలు మరిన్ని ఆంక్షలను విధించినట్లయితే తనకు మరింత నష్టమైనా రష్యా చమురు, గాస్‌ నిలిపివేత అస్త్రాన్ని ప్రయోగించవచ్చు. ఈ కారణంగానే స్విఫ్ట్‌( అంతర్జాతీయ బాంకు లావాదేవీల వ్యవస్ధ) నుంచి ఏడు రష్యన్‌ బాంకులకు ఆంక్షల నుంచి పశ్చిమ దేశాలు మినహాయింపునిచ్చాయి. ఉక్రెయిన్‌ వివాదం వలన ఇంధన ధరలు పెరిగితే అది ద్రవ్యోల్బణానికి దారితీసి అమెరికా ఆర్ధిక పురోగతి, పౌరుల ఖర్చు తగ్గేందుకు దారి తీస్తుందని రిచ్‌మండ్‌ ఫెడరల్‌ రిజర్వు అధ్యక్షుడు టామ్‌ బార్కింగ్‌ హెచ్చరించాడు.ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ సగటున చమురు ధరలు వంద డాలర్లు ఉంటే అమెరికా ఆర్ధిక రంగం ఆరునెలల పాటు నిభాయించుకోగలదని, 125 డాలర్లకు పెరిగితే నిరుద్యోగం పెరుగుతుందని, వృద్ధి ఆగుతుందని ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జో బైడెన్‌ సైతం ఉక్రెయిన్‌ వివాదానికి అమెరికన్లు మూల్యం చెల్లించాల్సి రావచ్చని చెప్పిన అంశం తెలిసిందే.ఐరోపాలో గాస్‌ ధరలు 60శాతం పెరిగాయి. చలికాలంలో మరింతగా పెరగవచ్చని భావిస్తున్నారు. రష్యాకు వెసులుబాటు కల్పించేందుకు ఇరు దేశాల మధ్య తమ కరెన్సీలో చెల్లింపులకు చైనా ఏర్పాట్లు చేసింది.ఈ అనుభవం భవిష్యత్‌లో అంతర్జాతీయ మార్పిడి కరెన్సీగా డాలర్‌ను పక్కకు నెట్టేందుకు కూడా తోడ్పడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం డాలర్‌ చెల్లింపులు 40శాతం ఉండగా చైనా కరెన్సీ రెన్‌మిన్‌బీ(యువాన్‌) రెండుశాతం జరుగుతున్నాయి.


2022-23 ఆర్ధిక సంవత్సరంలో ముడి చమురు పీపా ధర 70-75 డాలర్ల మధ్య ఉంటుందనే అంచనాతో కేంద్ర బడ్జెట్‌ను ప్రతిపాదించారు. మార్చి నెలాఖరుతో ముగియనున్న ఆర్ధిక సంవత్సరంపై పెరిగిన చమురు ధరలు ప్రభావం చూపటం ప్రారంభమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం పెట్రోలు, డీజిలుపై సెస్‌లను ఐదు, పది చొప్పున తగ్గించటంతో పాటు నవంబరు నాలుగవ తేదీ నుంచి వాటి ధరలను స్ధంభింప చేశారు.ఈ నెల ఏడవ తేదీన చివరి దశ పోలింగ్‌ ముగిసిన తరువాత నుంచి చమురు ధరలు పెరగటం ఖాయం. రానున్న రోజుల్లో జిడిపి వృద్ధి తగ్గటంతో పాటు ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఎంకి పెళ్లి సుబ్చి చావుకు వచ్చిందన్నట్లుగా ఉక్రెయిన్‌ – రష్యా వివాదంతో మనకు ప్రమేయం లేనప్పటికీ దాని పర్యవసానాలను అనుభవించాల్సి వస్తోంది. మన దిగుమతుల బిల్లు తడిచి మోపెడు అవుతోంది.దీంతో మన కరెంటు ఖాతాలోటు పెరుగుతోంది. ముడిచమురు, ఎరువులు, ఖాద్య, ఖనిజతైలాలు, ఇతర దిగుమతుల ధరలు పెరుగుతున్నాయి. దిగుమతుల బిల్లు 2022లో 600బి. డాలర్లు దాటవచ్చని అంచనా. తక్షణం ద్రవ్యోల్బణం, దానితో పాటు వచ్చే ధరల పెరుగుదల, రూపాయి విలువ పతనం జరగవచ్చు. ఒక పీపా ధర ఐదు డాలర్లు పెరిగితే మన కరెంటు ఖాతాలోటు 6.6బి.డాలర్లు పెరుగుతుంది. ముడి చమురు ధర 105 డాలర్లకు అటూ ఇటూగా ఉన్నప్పటి అంచనాల ప్రకారం మార్చి ఎనిమిది తరువాత చమురు కంపెనీలు పెట్రోలు, డీజిలు ధరలను పది రూపాయల వరకు పెంచవచ్చని అంచనా. ఇప్పుడు 117 డాలర్ల వరకు తాకింది. ఇది ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దోహదం చేస్తుంది. మన ఎగుమతుల మీద కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈ ఏడాది తొలి ఆరునెలల పాటు చమురు ధరలు వంద డాలర్లకు ఎగువనే ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఏడాది మొత్తంగా దేశ ప్రగతి నిస్తేజంగా ఉంటుందని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ విశ్లేషకులు చెప్పారు.


జాతీయ గణాంకాల సంస్ధ(ఎన్‌ఎస్‌ఓ) 2021-22లో వృద్ధి రేటు అంతకు ముందు సంవత్సరంలోని 7.3శాతం తిరోగమనాన్ని అధిగమించి 9.2శాతం పురోగమనం ఉంటుందని అంచనా వేసింది. తాజాగా తొమ్మిది నెలల తరువాత దాన్ని8.9శాతానికి తగ్గించింది. తొలి మూడు మాసాల్లో 20.3 శాతంవృద్ధి కాస్తా రెండవ త్రైమాసికంలో 8.4శాతానికి తగ్గింది.తదుపరి మూడు నెలల్లో 5.4శాతంగా ఉందని అంచనా వేశారు. చమురు ధరల పెరుగుదల గణనీయంగా ఉన్న జనవరి-మార్చి నెలల గణాంకాలు వెల్లడైతే స్పష్టమైన అంచనాలు తెలుస్తాయి. ఈ వృద్ధి కూడా గతేడాది తగ్గిన దాని ప్రాతిపదికన చెబుతున్న లెక్క కనుక వాస్తవ వృద్ధి రేటు అంత ఉండదు. అందుకే గతంలో ఉన్న జిడిపి స్దాయికి చేరాలంటే దీర్ఘకాలం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. రిజర్వుబాంకు వడ్డీ రేట్లను తక్కువగా ఉంచినప్పటికీ వృద్ది రేటు ఆందోళనకరంగా ఉంది. ద్రవ్యోల్బణం మరింతగా పెరిగేట్లయితే వడ్డీ రేట్లు పెరుగుతాయి, అది మరొక సమస్యకు దారి తీస్తుంది.


వినియోగదారుల ధరల సూచిక (సిపిఐ) ప్రాతిపదికన ద్రవ్యోల్బణం ఆరుశాతం వరకు మనం భరించగలమని రిజర్వుబాంకు అన్నది. అంటే ఆ మేరకు ధరలు పెరుగుతాయని సిద్దంకమ్మని జనానికి చెప్పింది.డిసెంబరులో 5.59శాతం ఉన్నది జనవరిలో 6.01శాతానికి పెరిగింది. ఇదే తరుణంలో టోకు ధరల ద్రవ్యోల్బణం దాదాపు 13శాతంగా ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక కూడా పదినెలల కనిష్టానికి పడిపోయింది. మన దేశంలో ప్రయివేటు వినియోగం 55శాతం ఉంది. ఇది కరోనాకు ముందున్న స్దాయికంటే తక్కువే. కరోనా మహమ్మారి జనాల పొదుపు మొత్తాలను, గణనీయంగా వేతనాలను హరించివేసినందున వినియోగం బలహీనంగా ఉంది. పులిమీద పుట్రలా దీనికి ఉక్రెయిన్‌ వివాదం మరింత ముప్పు తెచ్చింది. జనంపై పెరిగే భారాల గురించి ఏం చేద్దామన్న అంశాన్ని చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోడీ పూనుకున్నారని గానీ, సమీక్షలు జరిపినట్లుగా ఎక్కడా వార్తలు లేవు. చేతులు కాలిన తరువాత ఆకలు పట్టుకున్నట్లు ఆపరేషన్‌ గంగ పేరుతో ఉక్రెయిన్లో చిక్కుకు పోయిన మన విద్యార్దుల గురించి ఎక్కడలేని శ్రద్ద చూపుతున్నట్లు సమావేశాల మీద సమావేశాలు జరుపుతున్నట్లు ప్రకటిస్తున్నారు, మంచిదే, ఇవాళా రేపట్లో అది కూడా పూర్తి అవుతుంది. తరువాతనైనా జనం గురించి పట్టించుకుంటారా ?చమురు ధరలు తగ్గితే ఆ మేరకు జనానికి ఉపశమనం కలిగించకుండా వందల రెట్లు పన్ను, సెస్‌లు పెంచి ఖజానా నింపుకొనేందుకు చూపిన వేగం ఇప్పుడు చమురు ధరలు పెరుగుతుంటే భారం తగ్గించేందుకు కనపరచరేం ?

రష్యాపై నాటో కూటమి దేశాలు, ఇతరుల ఆర్ధిక దాడి !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


అమెరికా ఆధ్వర్యంలోని నాటో కూటమి కుట్రల కారణంగా ఉక్రెయిన్‌-రష్యా దేశాల మధ్య తలెత్తిన వివాదం విచారకరమైన యుద్ధానికి దారి తీసి బుధవారం నాటికి ఏడవ రోజులో ప్రవేశించింది. రష్యా సైనిక పాటవం ముందు ఉక్రెయిన్‌ నిలిచే అవకాశం లేదని, త్వరగానే పతనం అవుతుందన్న అంచనాలు తప్పాయి. ఎవరి తురుపు ముక్కలను వారు ప్రయోగిస్తున్నారు. వస్తున్న వార్తలను బట్టి సామాన్య జన నష్టం జరగకుండా చూసేందుకు రష్యన్‌ దళాలు కేవలం నిర్దేశిత సైనిక కేంద్రాల మీదనే కేంద్రీకరించటం ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నాటో అందచేసిన ఆధునిక ఆయుధాలు కూడా ఉక్రెయిన్‌ మిలిటరీ ప్రతిఘటన శక్తిని పెంచాయి. ఉక్రెయిన్‌ దళాల ప్రతిఘటన ఊహించలేదని పశ్చిమ దేశాల సంస్ధలు వార్తలు ఇచ్చాయి. బైలోరస్‌ మధ్యవర్తిత్వంలో జరిగిన బేషరతు చర్చలు ఎలాంటి ఫలితం తేలకుండానే సోమవారం ముగిశాయి.భద్రతా కారణాల రీత్యా ఈ చర్చలు సరిగ్గా ఎక్కడ జరిగాయన్నది అధికారికంగా ప్రకటించలేదు. బెలారస్‌-ఉక్రెయిన్‌ సరిహద్దులో ” మత్స్యకారుడి గుడిసె ”లో అని గుప్తనామం చెప్పారు. ఈ చర్చలు సరిహద్దులో తమవైపే జరపాలని పట్టుబడిన ఉక్రెయిన్‌ మెట్టుదిగి బెలారస్‌ వైపుకే తన ప్రతినిధులను పంపింది. రెండవ దఫా సంప్రదింపులు బెలోరస్‌- పోలాండ్‌ సరిహద్దులో జరపాలని నిర్ణయించారు. వీటి ఫలితం గురించి ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఈ రెండు దేశాల వివాదంతో ఇప్పటికే చమురు ధరల పెరుగుదల, సరఫరా వ్యవస్ధలకు అంతరాయం, పరస్పర ఆంక్షల కారణంగా ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలు, పర్యవసానాలను ప్రపంచం చవి చూస్తోంది. మంగళవారం నాడు జరిగిన దాడుల్లో ఉక్రెయిన్‌లో రెండవ పెద్ద పట్టణమైన ఖర్‌కివ్‌ నగరంలో కర్ణాటకకు చెందిన విద్యార్ధి నవీన్‌ శేఖరప్ప మరణించటం తీవ్ర విచారకరం.


శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో ఇరు పక్షాలూ సంయమనం, కాల్పులకు విరామం పాటించటం సాధారణంగా జరుగుతుంది. ఇక్కడ అటువంటి అవకాశాలు కనిపించలేదు. చర్చలు చర్చలే, దాడులు దాడులే అని రష్యా చెప్పటం కొంత మందికి విపరీతంగా అనిపించవచ్చు. ఉక్రెయిన్ను రెచ్చగొట్టి ముందుకు తోసిన పశ్చిమ దేశాలు ప్య్రత్యక్షంగా దాడులకు దిగలేదు తప్ప రష్యాను దెబ్బతీసేందుకు భద్రతా మండలిని సాధనంగా చేసుకొని ప్రచారదాడి, ప్రతిరోజూ కొత్త ఆంక్షలు, చర్యలను ప్రకటిస్తూనే పరోక్షదాడులను పెంచుతున్నాయి. ఇదంతా ఉక్రెయినుకు మద్దతుగానే అన్నది తెలిసిందే. ఈ నేపధ్యంలోనే తన అణుదళాలను సిద్దంగా ఉండాలని పుతిన్‌ ఆదేశించాడు, చర్చల సమయంలో దాడులను ఆపేది లేదని కూడా ప్రకటించాడు. ఇవన్నీ వత్తిడిని పెంచే ఎత్తుగడలే.


రెండు దేశాల మధ్య చర్చలు ఎన్నిసార్లు జరిగినా కీలక సమస్యపై అంగీకారం కుదిరితేనే సంధి తప్ప మరొకమార్గం లేదు.ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వమిచ్చి ఆ ముసుగులో రష్యా సరిహద్దుల్లో తిష్టవేయాలన్న అమెరికా ఎత్తుగడను పక్కన పెట్టేందుకు సిద్దం కావటం లేదు. అందువలన భౌతికంగా దాడి ఉక్రెయిన్‌ మీద జరుపుతున్నప్పటికీ అసలు లక్ష్యం నాటో కూటమి, దాని పెద్ద అమెరికా అన్నది స్పష్టం. నాటోలో చేరకుండా తటస్ధదేశంగా ఉంటామని ఉక్రెయిన్‌ హామీ ఇవ్వాలని రష్యా పట్టుపడుతోంది. ఒకవైపు తమను ముందుకు తోసి నట్టేట ముంచారని ఉక్రెయిన్‌ నేత జెలెన్‌స్కీ చెబుతూనే ఇంకా దింపుడు కల్లం ఆశమాదిరి పశ్చిమ దేశాల ఆంక్షలు రష్యాను దారికి తెస్తాయనే భ్రమలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయ మీరు మా వైపు ఉన్నారో లేదో రుజువు చేయాలంటూ ఐరోపాయునియన్ను మంగళవారం నాడు డిమాండ్‌ చేశాడు. రష్యాను ఖండిస్తూ భద్రతా మండలిలో పెట్టిన తీర్మానాలు వీగిపోతాయని తెలుసు. ఐనా ప్రచారదాడిలో భాగంగా ఆ తతంగం నడిపించిన తరువాత కొనసాగింపుగా ఇప్పుడు సోమవారం నుంచి ఐరాస సాధారణ అసెంబ్లీలో ప్రత్యేక చర్చకు తెరతీశారు. దాని మీద ఓటింగ్‌ జరగనుంది. దాని ఫలితం ఏమైనప్పటికీ నిబంధనల ప్రకారం దాన్నెవరూ అమలు జరపాల్సిన అవసరం లేదు. గతంలో యుగోస్లావియాపై భద్రతా మండలి అనుమతి లేకుండానే నాటో దళాలు 78 రోజుల పాటు దాడులు చేశాయి. దాన్ని మూడు ముక్కలు చేసి బోస్నియా, హెర్జ్‌గోవినా, సెర్బియాగా విడతీసి ప్రత్యేక రాజ్యాలుగా గుర్తించాయి. అల్బేనియా నుంచి కొసావోను విడగొట్టి గుర్తింపునిచ్చాయి. ఇప్పుడు అవే నాటో దేశాలు ఉక్రెయిన్లో స్వాతంత్య్రం కోరుకుంటున్న డాంటెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్‌లను రష్యాగుర్తిస్తే ఇంకేముంది చట్టబద్దతకు ముప్పు వాటిల్లిందంటూ గుండెలు బాదుకుంటున్నాయి. చైనా అంతర్భాగాలైన తైవాన్‌, హాంకాంగ్‌లను స్వతంత్ర దేశాలుగా గుర్తించాలన్న కుట్రను బలపరుస్తున్నాయి.


ఉక్రెయిన్‌ నాటోలో చేరకూడదన్న ప్రధాన డిమాండ్‌తో పాటు రష్యా మరికొన్ని అంశాలను కూడా ముందుకు తెచ్చింది. 2015మిన్‌స్క్‌ ఒప్పందాన్ని అమలు జరపాలని అది డిమాండ్‌ చేస్తోంది. డాంటెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్‌లను స్వయంపాలిత ప్రాంతాలుగా ఉక్రెయిన్‌ గుర్తించాలని, ఆ ప్రాంతాల నుంచి మిలిటరీ సామగ్రిని తొలగించాలన్న వాటితో పాటు పన్నెండు అంశాలున్నాయి. దాన్ని ఉక్రెయిన్‌ ఉల్లంఘించింది. ఆ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన నాటోలోని జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాలు కూడా పట్టించుకోకుండా చోద్యం చూశాయి. ఇప్పుడు ఆ రిపబ్లిక్‌లను స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తించటంతో అవి కూడా గగ్గోలు పెడుతున్నాయి. రష్యా ముందుకు తెచ్చిన అంశాలను అంగీకరించేందుకు ఉక్రెయిన్‌ సిద్దంగా ఉన్నప్పటికీ అమెరికా, నాటో కూటమి పడనిచ్చేట్లు కనిపించటం లేదు. అవి విధించిన ఆంక్షలు రష్యాకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తి జనంలో పుతిన్‌ మీద వ్యతిరేకతను రేకెత్తించాలన్న పధకం కూడా ఉందన్నది స్పష్టం. రష్యన్‌ ఆర్ధిక వ్యవస్ధను కుప్పకూల్చివేస్తామని ఫ్రాన్స్‌ ఆర్ధిక మంత్రి బ్రూనో లీ మారీ చెప్పాడు. రష్యామీద పూర్తి స్ధాయిలో ఆర్ధిక యుద్ధం చేయనున్నట్లు, ఆ మేరకు ఆర్ధిక రంగాన్ని దెబ్బతీస్తామని ఒక రేడియోలో మాట్లాడుతూ చెప్పాడు.ఈ అంశాలు పుతిన్‌కు తెలియనివేమీ కాదు కనుకనే ప్రతి ఆంక్షలు, తీవ్ర వత్తిడికి పూనుకున్నాడు. ఇప్పటికి ఐదు దఫాలుగా నాటోను విస్తరించి రష్యా ముంగిట తిష్టవేసేందుకు అమెరికా పూనుకుంది. ఈ వివాదానికి మూలం అదే అన్నది తెలిసిందే.రష్యా భద్రత అంశాన్ని విస్మరించి ఏకపక్షంగా ముందుకు సాగితే కుదరదని పుతిన్‌ పశ్చిమ దేశాలకు స్పష్టం చేశాడు. దానిలో భాగంగానే క్రిమియాను తమ అంతర్భాగంగా గుర్తించాలని, ఉక్రెయిన్లోని నయానాజీ మూకలను వదిలించుకోవాలని కూడా కోరుతున్నాడు.


పశ్చిమ దేశాల కవ్వింపు చర్యలు, సమీప దేశాల్లో ఆయుధమోహరింపును ఎదుర్కొనేందుకు రష్యాకూడా పావులు కదిపింది. దానిలో భాగంగానే బెలారస్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి అవసరమైతే అణ్వాయుధాలు, క్షిపణులను మోహరించేందుకు, రష్యాదళాలను శాశ్వతంగా దేశంలో కొనసాగించేందుకు రాజ్యాంగబద్ద ఆమోదం పొందారు. రష్యా మీద ప్రకటించిన ఆంక్షలు అణుదాడి కంటే తక్కువేమీ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే రూబుల్‌ విలువిలువ కుప్పకూలింది.ద్రవ్యోల్బణం పెరిగింది. జనం బాంకుల ముందు వరుసలు కట్టారు. ఇతర దేశాల నుంచి నగదు బదిలీకి వీల్లేకుండా కొన్ని రష్యన్‌ బాంకులను స్విఫ్ట్‌ నుంచి తొలగించారు.పుతిన్‌తో సహా అనేక మంది వ్యక్తిగత ఆస్తులపై ఆంక్షలు విధించారు. విదేశాల్లో ఉన్నవారి ఆస్తుల విలువ 800 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. ఆంక్షల నుంచి గాస్‌, చమురు, ఎరువులు, గోధుమల వంటి వాటి లావాదేవీలకు చెల్లింపులను మినహాయించారు. ఇరాన్‌, వెనెజులా మీద ఇలాంటి ఆంక్షలనే అమెరికా విధించింది. క్యూబామీద దశాబ్దాలుగా ఇంతకంటే తీవ్ర అష్టదిగ్బంధనం గావించినప్పటికీ అవి తట్టుకొని నిలిచాయి. అందువలన తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ రష్యాకు తట్టుకొనే శక్తి ఉంది. ఐరోపాలో అమెరికా అణ్వాయుధాల మోహరింపు తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రష్యన్‌ విదేశాంగ మంత్రి లావరోవ్‌ మంగళవారం నాడు చెప్పాడు. ప్రస్తుత పరిస్ధితిలో నూతన ఆయుధపోటీ తగదని, నిరోధించాలని అన్నాడు.ఐరోపాలో స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణుల మోహరింపుపై మారటోరియం ప్రకటించాలని ప్రతిపాదించాడు. అమెరికా అణ్వాయుధాలు కొన్ని దేశాల్లో ఉన్నాయని ఇది అణ్వస్త్రవ్యాప్తి నిరోధ ఒప్పందానికి విరుద్దమని జెనీవాలో జరుగుతున్న నిరాయుధ సభలో వీడియో ద్వారా మాట్లాడుతూ లావరోవ్‌ చెప్పాడు.


తమ గడ్డమీద అణ్వాయుధాలను ఉంచేందుకు బెలారస్‌ తీర్మానించటాన్ని బట్టి పశ్చిమ దేశాల నుంచి వచ్చే ముప్పు కనిపిస్తున్నది. బహుశా అందుకే రష్యా అణుదళాలు సన్నద్దంగా ఉండాలని పిలుపునిచ్చినట్లు చెప్పవచ్చు. అణ్వాయుధాల గురించి ముందుగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఫిబ్రవరి 24న ప్రస్తావించాడు. అణుదాడి గురించి పుతిన్‌ బెదిరిస్తున్నాడని బైడెన్‌ విలేకర్లతో చెప్పాడు. అదేమిటో వివరిస్తారా అని అడిగితే అతనేమనుకుంటున్నాడో తనకు తెలియదని సమాధానాన్ని దాటవేశాడు. పశ్చిమ దేశాలన్నీ ఐక్యంగా ఉంటాయా లేదా అని పుతిన్‌ పరీక్షించాలనుకుంటున్నాడని కూడా అన్నాడు. అణుదళాల సన్నద గురించి పుతిన్‌ చెప్పటాన్ని అణుదాడికి దిగుతాడని భావించనవసరం లేదు.


ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడినపుడల్లా అణ్వాయుధ అగ్రదేశాలు హెచ్చరికలు, కొత్త పరీక్షలు, అణు సామర్ధ్య క్షిపణుల పరీక్షలు చేయటం సాధారణంగా జరుగుతోంది తప్ప రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఎవరూ ప్రయోగించలేదు. గతంలో ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు జరిపినపుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన హడావుడి, తరువాత మౌనంగా ఉండటం తెలిసిందే. ఇప్పుడు ఉక్రెయిన్‌ వ్యవహారంలో పుతిన్‌ కూడా అదే ఎత్తుడను అనుసరించాడు. దాడికి రెండునెలల ముందు నుంచి అనేక విధాలుగా తమ దేశ భద్రతకు హామీ గురించి ఐరాసకు, నాటో దేశాలకు మొరపెట్టుకున్నా పట్టించుకున్నవారు లేకపోగా మరింతగా రెచ్చగొట్టిన అంశం తెలిసిందే.ఉక్రెయిన్‌ అణుశక్తి దేశం కాదు. కేవలం బెదిరింపు, వత్తిడికి మాత్రమే పరిమితం అని విశ్లేషకులు చెఋన్నారు. ఐతే ప్రస్తుతం జరుగుతున్న ప్రచార యుద్దంలో ఏ దేశం ఎటువంటి వైఖరి తీసుకుంటుందో ఎలాంటి తెగింపులకు పాల్పడుతుందో చెప్పలేము. ఉక్రెయిన్‌కు నాటో తీర్ధం ఇవ్వనంత మాత్రాన గత మూడు దశాబ్దాలుగా ఆదేశానికి వచ్చిన ముప్పేమీ లేదు. అక్కడి రాజకీయాల్లో జోక్యం చేసుకొని ఎప్పుడైతే తన అనుకూల శక్తులను గద్దెనెక్కించి రష్యాను కవ్విస్తోందో అప్పటి నుంచే అసలు సమస్య మొదలైంది. ఇప్పుడు పశ్చిమ దేశాలు అనుసరించే వైఖరిపైనే అనేక అంశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రతిదేశం తన రక్షణను తాను చూసుకోవాల్సిన పరిస్ధితిని అమెరికా, నాటో కూటమి కల్పించింది. అందువలన ఇప్పుడు ఎక్కడా మనకు శాంతిదూతలు కనపడరు.పశ్చిమదేశాల తీరు తెన్నులను చూస్తుంటే మరోసారి ఐరోపా ఆయుధ మోహరింపు కేంద్రంగా మారే అవకాశాలు లేకపోలేదు. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ ఒక వైపు రష్యా మరోవైపు ఉంటాయి. తగులుతున్న ఎదురుదెబ్బలు, దెబ్బకుదెబ్బ తీస్తామని చేస్తామని హెచ్చరికల కారణంగానే అమెరికా అదుపులో ఉంటోంది.

తరువాత వంతు తైవాన్‌దే అంటూ తప్పుడు ప్రచారం – జలసంధిలో అమెరికా యుద్ద నౌక !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌ తరువాత వంతు తైవాన్‌దే అంటూ అంతర్జాతీయ మీడియా మరోసారి కథనాలను వండి వడ్డిస్తోంది. గతంలో హాంకాంగ్‌ వేర్పాటువాదులపై చైనా చర్య తీసుకోగానే ఇంకేముంది తరువాత వంతు తైవాన్‌దే అంటూ ఇలాంటి ఊహాగానాలే రాసింది. ఒకవైపు తన కనుసన్నల్లో పని చేసే మీడియా ఇలాంటి కథనాలను రాయిస్తూ మరోవైపు చైనాను రెచ్చ గొట్టేందుకు తైవాన్‌ జలసంధిలో శనివారం నాడు అమెరికా తన యుద్ధ నౌక రాల్ఫ్‌ జాన్సన్ను నడిపింది. అంతర్జాతీయ జలాల్లో నౌకలను నడిపే హక్కు తమకుందని అమెరికా చెప్పటంతో పాటు తైవాన్‌కు మద్దతుగా తామున్నామనే సందేశాన్నివ్వటం దీనిలో ఉంది. ఈ నౌక మామూలుగానే అటువచ్చినట్లు కనిపిస్తున్నా చెడు సంకేతాలను ఇచ్చిందని చైనా నిపుణులు చెప్పారు. ఈ నౌకను అనుసరిస్తూ ఒక అమెరికా నిఘావిమానం కూడా చక్కర్లు కొట్టింది. చైనా వైపు నుంచి ఉన్న కదలికలు, చర్యలను కనిపెట్టటమే దాని లక్ష్యం. డిసెంబరు, జనవరి మాసాల్లో కూడా అమెరికా నౌకలు ఇదే మాదిరి రాకపోకలు సాగించాయి. ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబాన్ల చేతిలో పరాభవం తరువాత తాము ఒకేసారి రెండు రంగాల్లో సత్తా చూపగలమని ప్రపంచానికి చాటేందుకు అమెరికా పూనుకుంది.దానిలో భాగంగానే ఉక్రెయినుకు ఆయుధాలు ఇచ్చింది. ఇటు చైనాను రెచ్చగొట్టేందుకు ఇలాంటి కవ్వింపు చర్యలు, తప్పుడు ప్రచారానికి పూనుకుంది.ఐరోపాలో ఆరవ, ఐరోపా కమాండ్‌ నౌకాదళాలను దించితే చైనాను బెదరించేందుకు ఇండో-పసిఫిక్‌ సముద్రంలో సప్తమ నౌకాదళాన్ని మోహరించింది.


ఆఫ్ఘనిస్తాన్‌లో పరాభవంతో అమెరికా బలహీనత ఏమిటో ప్రపంచానికి స్పష్టమైంది. ఇప్పుడు కొండంత రాగం తీసి కీచుమన్నట్లు ఉక్రెయిన్లో వ్యవహరించిన తీరు దాని డొల్లతనాన్ని(దీని అర్ధం అమెరికా పూర్తిగా బలహీనపడింది అని కాదు) వెల్లడించింది. దాని దగ్గర ఎన్ని అణ్వాయుధాలు, ఆధునిక జెట్‌, యుద్ద విమానాలు, క్షిపణులు ఉన్నా తమను నమ్ముకున్న వారిని నట్టేట ముంచి తన ప్రయోజనం తాను చూసుకుంటుందని స్వయంగా నిరూపించుకుంది. మరొక దేశం చేతులు కాల్చుకోకుండా ఒక గుణపాఠం నేర్పింది. తాను ఆడించినట్లు ఐరోపా ధనిక దేశాలు ఆడవన్న వాస్తవాన్ని ప్రపంచం చూసింది. ఉక్రెయిన్‌ యుద్దం ముగిసిన తరువాత చైనా, రష్యా మరింతగా అమెరికా, దాని మిత్రపక్షాల మీద వత్తిడి పెంచుతాయి.దాని కూటములు బీటలు వారతాయని, రాజగురుత్వం పలుచనవుతుందనే విశ్లేషణలు ఇప్పటికే వెలువడ్డాయి.


ఇక తదుపరి వంతు తైవాన్‌దే అనే ప్రచారం ప్రారంభమైంది. ఉక్రెయిన్‌ ఉదంతాన్ని చూసిన తరువాత తైవాన్ను విలీనం చేసుకొనేందుకు చైనా గనుక బలప్రయోగానికి పాల్పడితే ఇక్కడికి కూడా అమెరికా తన దళాలను పంపదా అంటూ ఊహాగానాలు రాస్తున్నారు. ఇది విలీనాన్ని మరింత క్లిష్టతరం గావించే ఎత్తుగడలో భాగం. అసలు ఉక్రెయిన్‌ సమస్యకు, తైవాన్‌, హాంకాంగ్‌లకు సంబంధమే లేదు. చైనా గురించి రాస్తున్న పశ్చిమ దేశాల మీడియా కాశ్మీరు గురించి ఎందుకు మౌనంగా ఉన్నట్లు ? అది తైవాన్‌ కంటే ముందే తలెత్తింది. ఈ దశలో నరేంద్రమోడీ సర్కార్‌ను చర్చలోకి లాగితే అమెరికా, పశ్చిమ దేశాలకే నష్టం కనుకనే వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఆక్రమిత కాశ్మీరును స్వాధీనం చేసుకుంటామని, అవసరమైతే మిలిటరీ చర్యకు పూనుకుంటామని కూడా బిజెపి పదే పదే చెప్పింది. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, ఇతరులు కూడా కాశ్మీరు గురించి మాట్లాడటం అంటే ఆక్రమిత కాశ్మీరు స్వాధీనం గురించే అని చెప్పారు. ఆక్రమిత కాశ్మీరు మన దేశ అంతర్భాగమే అన్నది నిస్సందేహం.


పాకిస్ధాన్‌ – భారత్‌ మధ్య కాశ్మీరు అనే స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసి భారత్‌, చైనాలను దెబ్బతీసే కుట్రకు అమెరికా, బ్రిటన్‌ తెరతీశాయి. అందుకే కాశ్మీరును ఆక్రమించుకొనేందుకు దేశవిభజన తరువాత పాకిస్తాన్ను పురికొల్పాయి. దానిలో భాగంగానే కాశ్మీరు ఒక స్వతంత్రదేశం కనుకనే దాన్ని తమలో విలీనం చేసుకోలేదని ఆజాద్‌ కాశ్మీర్‌ (స్వతంత్ర కాశ్మీరు) అని పాక్‌చేత చెప్పించటమే కాదు, పాకిస్తాన్‌లో విలీనం చేయకుండా దాని పర్యవేక్షణలో ఒక ప్రత్యేక ప్రాంతంగా ఉంచారు. అందుకే పాక్‌ పార్లమెంటులో కూడా అక్కడి నుంచి ప్రాతినిధ్యకల్పించలేదు. అమెరికా, ఇతర ఐరోపా దేశాలు తమ దుష్టపధకంలో భాగంగా కాశ్మీరును భారత ఆక్రమిత ప్రాంతమని వర్ణిస్తాయి. ఇటీవల అమెరికా మనతో మిత్రత్వం నెరపుతోంది కనుక చిల్లికాదు తూటు అన్నట్లు భారత పాలిత అని చెబుతున్నాయి తప్ప మన అంతర్భాగంగా ఇప్పటికీ గుర్తించటం లేదు. దానికి ప్రతిగా మన దేశం కాశ్మీరు మన అంతర్భాగమని ప్రకటించింది. ఆక్రమిత కాశ్మీరు కూడా ఎప్పటికైనా విలీనం కావాల్సిందేనని, ఆ ప్రాంతానికి కాశ్మీరు అసెంబ్లీలో కొన్ని స్దానాలను కూడా కేటాయించింది. ఆక్రమిత్‌ కాశ్మీరును వెనక్కు తీసుకురావటంలో కాంగ్రెస్‌ విఫలమైందని, తాము అధికారానికి అధికారానికి వస్తే ఆ పని చేసి చూపుతామని బిజెపి చెప్పిన అంశం తెలిసిందే.


ఉక్రెయిన్‌ మాదిరి తైవాన్‌ గురించి ఇటీవలి కాలంలో ఎక్కడైనా చర్చ జరిగిందా ? రష్యా మాదిరి చైనా తన మిలిటరీని మోహరించిందా అంటే లేదు. ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 16న రష్యా దురాక్రమణకు పాల్పడనున్నదని అమెరికా చెప్పింది. అలాంటి గడువులను తైవాన్‌ అంశంలో చెప్పలేదు. మరి అమెరికన్‌ మీడియా తదుపరి తైవానే అంటూ ప్రచారం ఎందుకు మొదలు పెట్టినట్లు ? చైనాను రెచ్చగొట్టటం, ప్రపంచదృష్టిని మరల్చటం తప్ప మరొకటి కనిపించటం లేదు.


తైవాన్‌, హాంకాంగ్‌, మకావో దీవులు చైనాలో అంతర్భాగాలు అన్నది ఐరాసతో పాటు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలన్నీ అంగీకరించినదే. తైవాన్‌కు ఐరాస గుర్తింపులేదు. అక్కడి జనాలకు ఆమోదమైనపుడు చైనాలో విలీనం జరగాలని అమెరికా చెబుతున్నది. అదే సమయంలో స్వాతంత్య్రం కావాలంటూ కొందరితో నాటకం ఆడిస్తూ పరోక్షంగా ప్రోత్సహిస్తున్నది, జెట్‌ విమానాలతో సహా అన్ని రకాల ఆయుధాలను అందిస్తున్నది.బ్రిటన్‌ కౌలు గడువు తీరగానే 1997లో హంకాంగ్‌ , పోర్చుగీసు కౌలు గడువు తీరగానే మకావూ దీవులు1999లో చైనా ఆధీనంలోకి వచ్చాయి. ఈ రెండు ప్రాంతాల్లోని వ్యవస్ధలను 50 సంవత్సరాల పాటు కొనసాగనిస్తామని చైనా ఒప్పందం చేసుకుంది. అందువల్లనే అవి ప్రత్యేక పాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక 1949లో కమ్యూనిస్టులు దీర్ఘకాల సాయుధ పోరాటం తరువాత చైనాలో అధికారానికి వచ్చినపుడు అధికారంలో ఉన్న చాంగ్‌కై షేక్‌ మొత్తం నాటి మిలిటరీ, ఆయుధాలన్నింటినీ తైవాన్‌ దీవికి తరలించి అక్కడ తిష్టవేశాడు. దాన్ని కాపాడేందుకు అప్పుడే అమెరికా, బ్రిటన్‌ అన్ని రకాల సాయం అందించి పటిష్టపరిచాయి. మిగతా దేశంలో అధికారాన్ని సుస్దిరం చేసుకున్న తరువాత తైవాన్‌ సంగతి చూద్దాంలెమ్మని కమ్యూనిస్టులు కేంద్రీకరించారు. అదే సమయంలో అమెరికా ఎత్తుగడలో భాగంగా అప్పటికే భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశంగా ఉన్న చైనాకు అసలైన ప్రతినిధిగా ఐరాసలో చాంగ్‌కై షేక్‌ ప్రభుత్వాన్నే గుర్తించి తైవాన్‌ కేంద్రంగా ఉన్న పాలకులు నియమించిన అధికారులనే అనుమతించారు.1970దశకం వరకు అదే కొనసాగింది. తరువాత అమెరికా-కమ్యూనిస్టు చైనా మధ్యకుదిరిన ఒప్పందం మేరకు అసలైనా చైనాగా ప్రధాన భూభాగాన్ని గుర్తించారు. అంతకు ముందు ఒకే చైనా ఉంది కనుక తరువాత కూడా తైవాన్‌తో సహా అంతా ఒకే చైనా అని కూడా గుర్తించాల్సి వచ్చింది. అప్పటి నుంచి తైవాన్ను బలవంతంగా చైనాలో విలీనం చేయకూడదనే కొత్త పల్లవి అందుకున్నారు.హాంకాంగ్‌ అంశానికి వస్తే 99 సంవత్సరాల పాటు బ్రిటన్‌ ఏలుబడిలో ఉన్న అక్కడ అసలు ఎన్నికలే లేవు, ఎవరూ స్వాతంత్య్ర అంశాన్నే ఎత్తలేదు. చైనా ఆధీనంలోకి వచ్చిన తరువాతనే తొలిసారి ఎన్నికలు జరిగాయి.అమెరికా ఇతర దేశాలు రెచ్చగొట్టి వేర్పాటు వాదాన్ని రెచ్చగొట్టాయి.


చైనా సంస్కరణలు, ఆర్ధికాభివృద్ది మీద కేంద్రీకరించింది.ముందే చెప్పుకున్నట్లు హాంకాంగ్‌, మకావూల్లో ఐదు దశాబ్దాల పాటు అక్కడి పెట్టుబడిదారీ వ్యవస్దలను కొనసాగించేందుకు అంగీకరించినందున ఆ గడువు నాటికి వాటితో పాటు తైవాన్ను కూడా విలీనం చేసుకోవాలన్నది చైనా ఆలోచన. అందుకే అక్కడ కూడా అనుమతిస్తున్నది. నిజానికి తైవాన్ను స్వాధీనం చేసుకోవటం చైనాకు పెద్ద సమస్యకాదు. అది శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నది కనుకనే సహనంతో ఉంది. పశ్చిమ దేశాలు దాని స్వాతంత్య్రం గురించి మాట్లాడినపుడల్లా తన అధికారాన్ని గుర్తు చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నది. అందువలన పశ్చిమ దేశాలు అధికారికంగా మాట్లాడే వీలు లేదు, మాట్లాడితే చైనాతో సంబంధాలు దెబ్బతింటాయి. దాని బదులు మీడియా ద్వారా కథనాలు వెల్లడిస్తుంటాయి. ఉక్రెయిన్‌ పరిణామాలు జరిగినా జరగకున్నా చైనాలో తైవాన్‌ విలీనం అనేది ముందే రాసిపెట్టి ఉంది. అది ఎప్పుడు ఎలా అన్నది చూడాల్సి ఉంది. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వమిచ్చి రష్యా ముంగిట ఆ ముసుగులో తన సైన్యాన్ని, ఆయుధాలను మోహరించి మెడమీద కత్తిలా మారాలన్న అమెరికా దురాలోచన అక్కడి తాజా పరిణామాలకు మూలం. అదే మాదిరి తైవాన్ను, హాంకాంగ్‌ను స్వతంత్ర రాజ్యాలుగా చేసి చైనాకు రెండు వైపులా ఎసరు పెట్టాలన్నది అమెరికా, జపాన్‌ తదితర దేశాల దుష్టాలోచన. దాన్ని ఎట్టి పరిస్ధితిలోనూ చైనా అంగీకరించదు, సాగనివ్వదు. ఎవరికీ ఎలాంటి భ్రమలు, ఈ అంశాల మీద తప్పుడు అంచనాలకు లోనుకాకూడదని చైనా పదే పదే హెచ్చరిస్తోంది. అమెరికా, జపాన్‌, ఇతర దేశాలను హెచ్చరించేందుకు చైనా కూడా శనివారం నాడు తైవాన్‌ జలసంధికి వైపు జలాంతర్గాములను దెబ్బతీసే విమానాలు, ఇతర విమానాలను చైనా పంపింది.

ఏ క్షణమైనా ఉక్రెయిన్‌ పతనం ! విశ్వగురువుగా మోడీ పాత్ర ఏమిటి ?

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


రష్యన్‌ దళాలు రెండవ రోజు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరంవైపు కదులుతున్నాయి. రష్యా పోరుకు తాము దళాలను పంపేది లేదని అమెరికా, నాటో ప్రకటించాయి. అందువలన ఏ క్షణంలోనైనా అది పతనం కావచ్చు. తరువాత ఉక్రెయిన్‌ పాలకులను అదుపులోకి తీసుకుంటారా, మిలిటరీ లొంగిపోతుందా ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది. కీవ్‌ తరువాత తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెస్కీ ప్రకటించాడు. తమను ముందుకు నెట్టి ఈ దేశాలు దూరం నుంచి చూస్తున్నాయని జెలెనెస్కీ అన్నాడు. ఇప్పుడు రష్యా వ్యతిరేక యుద్ద కూటమిని ఏర్పాటు చేయాలని కూడా అన్నాడు. ప్రపంచంలో శక్తివంతమైన దేశం దూరం నుంచి చూస్తోంది అని అమెరికానుద్దేశించి వాపోయాడు. పరస్పరం ఆంక్షల ఆంక్షల పర్వం కొనసాగుతోంది. మూడు వైపుల నుంచి రష్యా ముట్టడి, గగనతలంపై అదుపు సాధించిన కారణంగా అమెరికా, ఇతర నాటో దేశాల నుంచి గానీ ఉక్రెయిన్‌కు కొత్తగా ఆయుధాలు అందే అవకాశం లేదని, అందువలన అక్కడి మిలిటరీ పోరాడటమో లొంగిపోవటమో జరుగుతుందని సిఐఏ మాజీనేత పెట్రాస్‌ చెప్పాడు. పోలాండ్‌ వైపు నుంచి రోడ్డుద్వారా అందే అవకాశాలున్నా ఇప్పుడు పంపేదెవరు ?


ఉక్రెయిన్‌ అస్త్ర సన్యాసం చేస్తేనే చర్చలు జరుపుతామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్‌ చెప్పాడు. తాము ఉక్రెయిన్‌ ఆక్రమణకు పాల్పడేందుకు నయా నాజీలం కాదని, అక్కడ ఎవరిని పాలకులుగా ఎన్నుకుంటారన్నది ఆ దేశ ప్రజల ఇష్టమని అన్నాడు. మరోవైపు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు రష్యా ఆక్రమణకు పాల్పడుతుందని, తనలో విలీనం చేసుకుంటుందని ప్రచారం మొదలెట్టాయి. ఉక్రెయిన్‌లో పోరాడేందుకు అమెరికా దళాలు వెళ్లటం లేదు, వెళ్లాలనుకోవటం లేదు, కానీ అమెరికా నాటో మిత్రదేశాలను రక్షించుకుంటామని మరోసారి హామీ ఇస్తున్నట్లు జోబైడెన్‌ స్పష్టంగా చెప్పాడు. ఆంక్షల విధింపు ఆత్మరక్షణ చర్యలేతప్ప తమకు రష్యాతో పోరుసల్పాలని లేదన్నాడు. ఒకరిపై ఒకరు కాల్చుకొనే ప్రపంచ యుద్దం ఉండదన్నాడు.నాటో కూటమి కూడా అదే చెప్పింది. అమెరికాలోని 52శాతం మంది ఉక్రెయిన్‌ వివాదంలో అమెరికా స్వల్ప పాత్ర పోషించాలని చెబితే, 20శాతం మంది అది కూడా వద్దని చెప్పినట్లు ఎపి-ఎన్‌ఓఆర్‌సి సర్వే వెల్లడించింది.ఇరవైఆరుశాతం మంది మాత్రం చురుకైనా పాత్రపోషించాలని చెప్పారు. బహుశా ఈ కారణంగానే జో బైడెన్‌ జోరు తగ్గించినట్లు చెప్పవచ్చు.ఆంక్షల ప్రకటనతో గురువారం నాడు పీపా ముడిచమురు ధర 106డాలర్లకు పెరిగింది. తరువాత ఇంధనాన్ని మినహాయించినట్లు ప్రకటించటంతో 99కి పడిపోయింది.శుక్రవారం నాడు తిరిగి 102 డాలర్ల వరకు పెరిగినా తిరిగి 98.74కు తగ్గింది.


మనది 138 కోట్ల జనాభాగల దేశం. దానికి నరేంద్రమోడీ ప్రధాని.ప్రపంచ నేతగా, విశ్వగురువుగా ఇంటా బయటా పొగడ్తలు అందుకుంటున్న స్ధితి.మన దేశం ప్రపంచ రాజకీయాల్లో పాత్ర వహించాలని అధికారానికి వచ్చిన రోజు నుంచీ నరేంద్రమోడీ చెబుతున్నారు, తహతహలాడుతున్నారు. తప్పులేదు, మన దేశానికి గౌరవాన్ని పెంచినా, మన ప్రయోజనాలను కాపాడినా సంతోషమే. ఎవరి చాణక్యమైనా, నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వచ్చేది కీలక పరిణామాలు జరిగినప్పుడే కదా ! ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపిన రష్యా-ఉక్రెయిన్‌ పరిణామాల్లో నరేంద్రమోడీ నాయకత్వం అలాంటి వాటిని ప్రదర్శించిందా ? అనేక దేశాల నేతల మాదిరి నరేంద్రమోడీ ఒక్క ప్రకటన కూడా బహిరంగంగా ఎందుకు చేయలేకపోయారు.


సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భద్రతామండలిలో మన ప్రతినిధి దేశ వైఖరిని వెల్లడించారు. ” అన్ని పక్షాలు ” ” పరిస్ధితి దిగజారకుండా” ” దౌత్యం ద్వారా ” పరిష్కరించుకోవాలనే ధ్వని, పరిధిలోనే మాట్లాడారు. ఇలా తటస్ధంగా ఉన్నందుకు రష్యా స్వాగతం పలికింది. జో బైడెను యంత్రాంగం గుర్రుగా ఉంది.ఉక్రెయిన్‌ తీవ్ర అసంతృప్తి వెల్లడించింది. అమెరికా మన సహజ భాగస్వామి అని పదే పదే చెప్పారు. ఏమోయి మోడీ అంటే ఏంటోయి బైడెన్‌ అంటూ భుజాల మీద చేతులు వేసుకొని మాట్లాడే బంధం ఉంది.( డోనాల్డ్‌ట్రంప్‌తో కౌగిలింతల గురించి చెప్పనవసరం లేదు.) అలాంటి వారు ఐరోపాలో ఇంత జరుగుతుంటే ముందుగానీ, పోరు ప్రారంభమైన తరువాత గానీ (ఇదిరాసిన సమయానికి) వారిరువురూ ఎందుకు సంప్రదింపులు జరపలేదు, అభిప్రాయ మార్పిడిగానీ ఎందుకు చేసుకోలేదన్నది పెద్ద ప్రశ్న. పోరు మొదలైన తరువాత పుతిన్‌తో ప్రధాని మోడీ మాట్లాడి దాడులను నివారించాలని కోరారు. ఇదే సమయంలో మరింతగా ఆజ్యం పోయవద్దు అని జో బైడెనుకు ఒక్క ముక్క చెప్పి ఫోన్‌పెట్టేసి ఉంటే మోడీ సర్కార్‌ నిజంగానే తటస్ధంగా ఉంది అనేది మరింతగా వెల్లడై ఉండేది. కానీ అది జరగలేదు, అన్నింటా మనకు మద్దతుగా ఉన్న నరేంద్రమోడీ ఈ అంశంలో మనతో మాట్లాడలేదు, ఏమైందో ఏమో పోనీ మనమే ఫోన్‌ చేద్దామని జో బైడెన్‌ కూడా అనుకోలేదు.


తీరా దాడులు మొదలైన తరువాత భారత్‌తో సంప్రదింపులు జరుపుతామని జో బైడెన్‌ గురువారం నాడు ప్రకటించారు. ఈ వివాదంలో మీ రక్షణ భాగస్వామి భారత్‌ పూర్తిగా మీ బృంద సభ్యురాలిగా ఉందా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ భారత్‌తో సంప్రదింపులు జరపనున్నాం,ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని మేము పూర్తిగా పరిష్కరించలేదు అని బైడెన్‌ చెప్పాడు.అందువలన నరేంద్రమోడీ నోరు విప్పి తలెత్తిన సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంది. అంతకంటే ముందు భారత్‌లో ఉక్రెయిన్‌ రాయబారి డాక్టర్‌ ఇగోర్‌ పోలిఖా విలేకర్లతో మాట్లాడుతూ ” ప్రస్తుతం మేము భారత్‌ నుంచి అన్ని రకాల రాజకీయ సాయం అందించాలని కోరుకుంటున్నాము.ప్రపంచంలోని శక్తివంతులైన నేతలలో ఒకరైన మోడీ గారికి రష్యాతో ప్రత్యేక భాగస్వామ్యం ఉంది. కౌటిల్యుడు, చాణక్యుడి వంటివారితో దౌత్యంలో భారత్‌ ఎప్పుడో అర్హత సాధించింది. ఐరోపాలో నాగరికత లేని కొన్నివేల సంవత్సరాలనాడే భారత్‌లో ఈ స్ధితి ఉంది. అనేక సంవత్సరాలుగా ఇటీవల భారత్‌ ప్రభావం చూపే ప్రపంచ పాత్రధారిగా ఉంది. మహాభారతంలో మాదిరి మోడీ దౌత్యాన్ని ప్రదర్శించాలి ” అని కూడా చెప్పారు. అదే రాయబారి భారత వైఖరితో తాము తీవ్ర అసంతృప్తి చెందామని కూడా చెప్పాడు. ఇప్పుడు రష్యాదాడుల్లో 50 మంది మరణించినట్లు తెలిసింది, అదే వందలు, వేల మంది మరణించి ఉంటే ఏమై ఉండేది అంటూ భారత్‌ జోక్యం చేసుకోవాలని అన్నాడు. ఇదేదో కేవలం మా రక్షణ కోసమే కాదు, మీ దేశానికి చెందిన పదిహేనువేలమందికి పైగా ఉన్న విద్యార్దుల రక్షణ కూడా ఇమిడి ఉంది అని కూడా అన్నాడు. దీన్ని మొత్తంగా చూస్తే వారి అసంతృప్తి, అమెరికా అంతరంగాన్ని వెల్లడించటమే.భద్రతా మండలిలో భారత వైఖరిని ఎలా చూస్తున్నారన్న ప్రశ్నకు అమెరికన్‌ అధికారి సమాధానం చెప్పకుండా తప్పించుకోవటం కూడా దీన్ని నిర్దారించింది. తెరవెనుక అమెరికా మన వైఖరి మీద అసంతృప్తి ప్రకటించుతున్నట్లు వార్తలు వచ్చాయి.


నరేంద్రమోడీ చెప్పినట్లుగా జోబైడెన్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ వింటే సమస్య పరిష్కారం అవుతుందంటూ జాతీయ మీడియాలో కొంత మంది మోడీ గొప్పతనాన్ని చాటేందుకు ప్రయత్నించారు. అనేక హిందీ, ఆంగ్ల ఛానళ్లు కూడా అమెరికా మీడియా, లీకువార్తలను నిజమే అని నమ్మి ఇంకే ముంది ప్రపంచయుద్దం వచ్చేస్తోంది అన్నట్లు వార్తలను ప్రసారం చేశాయి, కానీ మోడీ వైపు నుంచి పోరు ప్రారంభానికి ముందు అలాంటి నివారణ చొరవ మనకు కనిపించదు.ఎక్కడా మన ప్రమేయం, పలుకుబడి కనిపించలేదు.తటస్ధం అంటే తప్పును తప్పని కూడా చెప్పకపోవటమా ?


ఉక్రెయిన్‌-రష్యా వివాదంలో మన దేశం తటస్ధ వైఖరిని వెల్లడించింది. కానీ అంతర్జాతీయ విషయాల్లో అమెరికాకు లొంగిపోయిన అపఖ్యాతిని మోడీ సర్కార్‌ మన దేశానికి కలిగించింది. అణుపరీక్షల అంశంలో ఇరాన్‌ – అమెరికాకు, వామపక్ష వ్యతిరేకత కారణంగా లాటిన్‌ అమెరికాలో వెనెజులాతో అమెరికాకు పంచాయితీ తలెత్తింది. ఆ రెండు దేశాలూ మనకు మిత్రులే, రెండు చోట్ల నుంచీ మనం చమురు కొనుగోలు చేస్తున్నాము. కానీ వాటి మీద ఆంక్షలు విధిస్తూ ఎవరైనా వాటితో లావాదేవీలు జరిపితే ఆంక్షలు విధిస్తామని అమెరికా ప్రకటించింది. మన నరేంద్రమోడీ సర్కార్‌ వాటికి భయపడి చమురు కొనుగోలు నిలిపివేసింది. అమెరికాకు లొంగుబాటు తప్ప ఈ అంశాల్లో తటస్ధత ఎక్కడుంది. హాంకాంగ్‌ చైనాలో అంతర్భాగం, అక్కడ ఆందోళనలు దాని అంతర్గత అంశం. పశ్చిమదేశాలు దాన్ని రాజకీయం చేశాయి. వాటితో మనం గొంతు కలపకపోయినా అది వారి అంతర్గత వ్యవహారం అని మన దేశం చెప్పకపోగా ఐరాస మానవహక్కుల సంస్ధలో పశ్చిమ దేశాలకు సంతోషం కలిగే విధంగా ఆందోళన వెలిబుచ్చింది. ఇప్పుడు అమెరికా-ఇరాన్‌ అణు అంశంలో రాజీకుదుర్చుకోనున్నాయి, మన దేశం ఏముఖం పెట్టుకొని గతంలో ఇరాన్‌ ఇచ్చిన రాయితీధరలకు తిరిగి చమురు సరఫరా గురించి అడుగుతుంది ? ప్రపంచంలో మనం పలుచనకావటం లేదా ?


ఉక్రెయిన్‌ – రష్యా వివాదం గత కొద్ది నెలలుగా ముదురుతోంది. ఫిబ్రవరి 16న రష్యాదాడికి దిగనుందని అమెరికా ముందుగానే గడువు ప్రకటించింది.ఉక్రెయిన్లో దాదాపు 20వేల మంది భారతీయ విద్యార్దులున్నారు. వారి సంక్షేమం, అవసరమైతే స్వదేశానికి రప్పించటం, దానిలో ఇమిడి ఉన్న సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం తగినంత ముందుగా పట్టించుకోని కారణంగా వారితో పాటు వారి కుటుంబాలు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన, అనిశ్చితికి గురవుతున్నారు. ఎందుకీ వైఫల్యం అంటే సమాధానం చెప్పేవారు లేరు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనాగ్రామాలు నిర్మించింది, లడక్‌లో మరొకటి చేసిందంటూ సమాచారం ఇచ్చిన అమెరికా ఎందుకు ఉక్రెయిన్లో పరిస్ధితి, పర్యవసానాల గురించి మనకు సమాచారం ఇవ్వలేదు ? మన కేంద్ర భద్రతా అధిపతి అజిత్‌దోవల్‌ను జేమ్స్‌బాండ్‌గా వర్ణిస్తారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లకు సలాం చేసి అమెరికా పారిపోవటాన్ని దోవల్‌ పసిగట్టలేదు. ఇప్పుడు వివిధ దేశాల నుంచి ఈ సంక్షోభం గురించిన సమాచారం సేకరించలేదా, అసలు పట్టించుకోలేదా ? పట్టించుకుంటే ఇప్పుడు విద్యార్ధుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది కాదు కదా ? వారి తరలింపు గురించి తగినంత ముందుగానే ఏర్పాట్లు చేసి ఉంటే వారంతా తిరిగి వచ్చి ఉండేవారు, పరిస్ధితి చక్కబడిన తరువాత తిరిగి వెళ్లి ఉండేవారు.అలా జరగకపోవటానికి బాధ్యులెవరు ? ఉక్రెయిన్‌ ఉదంతం ప్రపంచదేశాలకు ఒక పాఠం నేర్పింది. అదేమంటే దాన్ని నమ్ముకొని మరొక దేశంతో తగాదా పెట్టుకోకూడదు, నట్టేట ముంచి తనదారి తాను చూసుకుంటుంది. దీన్ని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటామా ? అమెరికా తోకపట్టుకు పోతామా ?