ప్రియమైన భారతీయులకు మీ నరేంద్రమోడీ రాసిన లేఖార్ధములు !

Tags

, , ,


హలో ప్రియమైన భారతీయులారా !
నేను భారత ప్రధాని నరేంద్రమోడీని,


మిత్రోం ఈ మధ్య నేను రాసిన లేఖ పేరుతో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. నా భక్తులు, అభిమానులు లేదా నా వ్యతిరేకులు గానీ వాటిని రాసి ఉండవచ్చు. అభిమానులు అయితే నాకు మద్దతుగా, వ్యతిరేకులు అయితే నా మీద తప్పుడు అభిప్రాయం కలిగించేందుకు కావచ్చు. ఏమైనప్పటికీ నేను మీకు అదే పద్దతిలో కొన్ని విషయాలు చెప్పదలిచాను. నా పేరుతో అనధికారికంగా తిరుగుతున్న అంశాల మాదిరే వీటిని కూడా అనధికారికంగానే పరిగణించాలన్నది నా మనుసులోని మాట. నాపేరుతో ఉన్న లేఖ అంశాలకు సంబంధించి కొన్ని వివరణలు ఇస్తామరి !


” మీరు నాకు బాధ్యతలను అప్పగించి ఏడు సంవత్సరాలైంది.ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు ముళ్ల సింహాసనం ఎదురైంది ”


మిత్రోం మనలో మాట, నేను ఇప్పుడు కొన్ని తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాను గనుక నా అభిమానులు నాకు దక్కింది ముళ్ల సింహాసనం అని చెప్పవచ్చుగాని నేనుగా ఎప్పుడూ నోరు విప్పి ఎప్పుడూ ఆ మాట చెప్పలేదు. మిత్రోం పెళ్లి కాగానే హనీమూన్‌ ఉంటుంది. నాకు అలాంటిదేమీ అవసరం లేదని నేను అప్పుడే చెప్పాను. నాకు ముందున్న ప్రభుత్వాలు వంద రోజులు కాదు అంతకంటే ఎక్కువే హానీమూన్‌ గడిపాయి, వంద రోజులు కాదు కదా వంద గంటలు కూడా గడవక ముందే నా మీద విమర్శలు ప్రారంభమయ్యాయి.


” గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అస్త్యస్ధ పాలన కారణంగా అన్ని ప్రభుత్వ వ్యవస్ధలూ చిన్నాభిన్నం అయ్యాయి.పెద్ద మొత్తంలో విదేశీ అప్పు పేరుకు పోయింది, భారతీయ కంపెనీలు నష్టాల పాలయ్యాయి.”

మిత్రోం ఇలాంటి వాటిని నా పేరుతో లేదా ఇతర పేర్లతో రాసేటపుడు జాగ్రత్తలు తీసుకోవాలని మా వాళ్లకు పదే పదే చెప్పాను గానీ వారికి అది ఎక్కినట్లు లేదు. కంపెనీలకు నష్టాలు వస్తున్నాయంటే నేనేదో కంపెనీల గురించి తప్ప జనాలకు కలిగిన నష్టాలను పట్టించుకోలేదనుకుంటారు. అందుకే కదా అచ్చే దిన్‌ , గుజరాత్‌ మోడల్‌ అని చెప్పాను. అయితే ఇన్నేండ్ల తరువాత వాటిని గుర్తు చేస్తే జనం నా పీక ఎక్కడ పట్టుకుంటారో అని చెప్పి ఉండరు. నా సంగతి తెలుసుగా ఒకసారి చెప్పిన మాట తిరిగి చెప్పటం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అయినా జనానికి ఎప్పుడూ కొత్త కబుర్లు చెప్పాలి తప్ప పాత చింతకాయ పచ్చడి ఎందుకు ? అర్ధం చేసుకోరూ !


మిత్రోం అరవై సంవత్సరాల గతపాలనలో విదేశీ అప్పు 446 బిలియన్‌ డాలర్లు అయితే ఏడు సంవత్సరాలలోనే దానికి నేను 124 బిలియన్‌ డాలర్లు అదనంగా చేర్చాను. దేశీయ అప్పు ఇదే కాలంలో 55 లక్షల కోట్ల నుంచి 117 లక్షల కోట్లకు పెంచాను అంటున్నారు. రెండూ కలిపితే 2021 మార్చి ఆఖరుకు రు.121లక్షల కోట్లు, అవును చేశాను, ముందే చెబుతున్నా వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు అది 136లక్షల కోట్లకు పెరుగుతుంది. ఇదంతా నా సరదా కోసం చేశానా, నేనేమైనా వెనుకేసుకున్నానా ? దేశం అంటే మీ కోసమే కదా ! నన్ను నమ్మాలి మరి !!


మిత్రోం రాహుల్‌ గాంధీ, సీతారామ్‌ ఏచూరీ వంటి వారు ఎంత సేపూ కరోనా, జనం చేతికి డబ్బు ఇవ్వాలి డబ్బు ఇవ్వాలీ అంటారు. మీరు చెప్పండి జనం చేతికి కొన్ని వేలిస్తాం, వాటితో వారేమన్నా పరిశ్రమలు పెడతారా, వాణిజ్యం చేస్తారా, పది మందికి ఉపాధి కల్పిస్తారా ? కరోనా కాలంలో జనం దివాలా తీశారు – కార్పొరేట్లు బలిశారని అంటున్నారు. మన ఎస్‌బిఐ వారిని అన కూడదు గానీ అస్సలు బుర్రుందా ? ఎప్పుడేం చెప్పాలో తెలిసినట్లు లేదు. కరోనా కారణంగా వ్యక్తిగత అప్పులు జిడిపిలో 32.5 నుంచి 37.3శాతానికి పెరిగాయని చెబుతారా ? లెక్కలు సరిగా వేసినట్లు లేదు.


మిత్రోం రెండు సంవత్సరాల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు నిరుద్యోగం గురించి లెక్కలు సరిగా వేయలేదని, పకోడీలు అమ్ముకోవటం కూడా ఉపాధి కల్పనే అని, అలాంటి వన్నీ లెక్కల్లో రాలేదని చెప్పాం గుర్తుంది కదా ! ఇప్పుడు కరోనా అప్పుల్లో ప్రతిదాన్నీ కలిపినట్లున్నారు, అందుకే సంఖ్య పెరిగింది. బి పాజిటివ్‌గా చూసినపుడు ఇలాంటి పరిస్దితి వచ్చినపుడే జనం పొదుపు చేస్తారు. అదే అసలైన దేశభక్తి. ఇక కరోనా కాలంలో కార్పొరేట్లు బలిశారు అంటున్నారు. మంచిదే కదా వారు బలిస్తే పెట్టుబడులు పెడతారు, పది మందికి ఉపాధి కల్పిస్తారు. అందుకే కదా గతేడాది 20లక్షల కోట్ల ఆత్మనిర్భరత, ఈ ఏడాది 6.209లక్షల కోట్ల తాయిల పొట్లం. అయినా అందరినీ ఒకేసారి బాగు చేయగలమా, ముందు కంపెనీలను బలపడేట్లు చేద్దాం – తరువాత జనం సంగతి చూద్దాం.


” ఇరాన్‌ అప్పు 48వేల కోట్లు వదలిపోయారు, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు అప్పు 40వేల కోట్లు ”


మిత్రోం వీటి గురించి పదే పదే ఎక్కువగా ప్రచారం చేయకండిరా గోబెల్స్‌ కూడా సిగ్డుపడతాడు మన పరువే పోతుంది అని నెత్తీ నోరు కొట్టుకొని చెబుతున్నా మా వారికి, అయినా వినటంలా. ఇరాన్‌ నుంచి మనం చమురు కొన్నాం. దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకొని మన ఖజానాలో వేసుకున్నాం. మనకేం నష్టం లేదు. ఆ చమురుకు డబ్బు చెల్లించే సమయానికి అమెరికా వారు ఆంక్షలు పెట్టారు. బ్యాంకు ఖాతాలను స్ధంభింప చేశారు. మనమేం చేస్తాం. మీరు చెప్పండి ! ఇరాన్ను వదులుకోగలం గానీ అమెరికాకు ఆగ్రహం వస్తే తట్టుకోగలమా ? అందుకే మన్మోహన్‌ సింగ్‌ హయాంలో చెల్లించటం కుదరలేదు కనుక నా హయాంలో చెల్లించా. తరువాత మాకు అమెరికా ముఖ్యం తప్ప మీరు కాదు అంటూ ఇరాన్‌ నుంచి చమురు కొనుగోళ్లనే ఏకంగా నిలిపివేశాం. దాని బదులు అమెరికా నుంచి కొంటున్నాం.ఈ విషయంలో డోనాల్డ్‌ ట్రంప్‌కు ఎంత సంతోషం కలిగిందో నేను వర్ణించలేనబ్బా !

మిత్రోం ఇరాన్‌కు మనకూ ఎలాంటి పేచీ లేదు. అయినా అమెరికా కోసం దాని దగ్గర చమురు కొనటం ఆపాం. కానీ అదేంటో ఈ చర్యతో వారు చైనాకు దగ్గరైనట్లు, ఆ పనేదో నేనే చేసినట్లు కొందరు అర్ధాలు తీస్తున్నారు. ఇక యునైటెట్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు ఉన్న బాకీల గురించి అవి మన దేశానికి చెందిన సంస్దలు అక్కడ చేసిన అప్పులు. వాటికి తిప్పలో మరో కారణంతోనో అవి చేతులెత్తేశాయి. అవి కూడా మన మీద పడ్డాయి.


” భారతీయ చమురు కంపెనీలకు వచ్చిన నష్టాల మొత్తం రు.1,33,000 కోట్లు ”


మిత్రోం ఇంత మొత్తం మన కంపెనీలకు నష్టం వచ్చిందని నేనెక్కడా చెప్పినట్లు లేదు. గత ప్రభుత్వాలు చమురు బాండ్లుగా ఇచ్చిన మొత్తం నా ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోందని మా మంత్రులు చెప్పారు. ఇప్పటికే వాటిని తీర్చేశామని అత్యుత్సాహంతో చెప్పి ఉండవచ్చు.ప్రతిపక్షాలకు పనీ పాటా లేదు. 2026 నాటికి తీర్చాల్సిన ఈ అప్పుల పేరుతో నేను గత ఏడు సంవత్సరాలుగా చమురు పన్ను పేరుతో జనాల జేబులు కొల్లగొట్టానని ఆడిపోసుకుంటున్నారు. ఇదేమన్నా న్యాయంగా ఉందా చెప్పండి ! నా జేబులో వేసుకున్నానా !

” ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ నష్టాలు రు.58,000,భారతీయ రైల్వేల నష్టాలు రు.22,000, బిఎస్‌ఎన్‌ నష్టాలు రు.1,500 ”


మిత్రోం ఇలాంటి వాటిని నా పేరుతో పోస్టు చేస్తున్న వారు నా భక్తుల ముసుగులో ఉన్న వ్యతిరేకులు తప్ప మరొకటి, కాదు ఇప్పటి ఎప్పటివో ఎందుకు వచ్చాయో చెప్పకపోతే పోయేది నా పరువే కదా !


” సైనికులకు కనీస ఆయుధాలు లేవు, వారికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్లు లేవు, ఆధునిక యుద్ద విమానాలు లేవు, సైన్యాలు నాలుగు రోజులు కూడా నిలవలేవు ”


మిత్రోం మనలో మాట. నిజానికి మన సైన్యం అంత దుస్దితిలో ఉందంటే మా గురువు గారు అతల్‌ బిహారీ వాజ్‌పారుకి, అంతకంటే పెద్ద గురువు ఎల్‌కె అద్వానీకి అవమానం. వారి పాలన ఆరు సంవత్సరాల పాటు కొనసాగింది.మన సైన్యం నాలుగు రోజుల్లోనే చేతులెత్తేసేట్లుంటే కార్గిల్‌ యుద్దంలో రెండు నెలల మూడు వారాల రెండు రోజులు ఎలా యుద్దం చేసి విజయం సాధించారు. ఉత్తినే, మా అమిత్‌ షా అప్పుడప్పుడు అంటుంటాడు కదా జుమ్లా అని అందుకే ఏదో అలా చెబుతుంటాం. సరే మా వాళ్లు నా పేరుతో చేస్తున్న ప్రచారం గురించి చెప్పాను, నా మనసులోని మాటలు కూడా చెప్పాను. పరిస్ధితి ఇలా ఉండగా బాధ్యతలు స్వీకరించిన నేను నిర్ణయించుకున్నదేమిటంటే….


” ఆ సమయంలో వ్యవస్ధలన్నింటినీ సరి చేయటం నా ప్రధాన బాధ్యత అనుకున్నాను. అదృష్టం కొద్దీ భారతీయుల కోసం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు దిగి వచ్చాయి. అయితే తగ్గిన ధరలమేరకు మీరు పూర్తిగా లబ్ది పొందలేదు. ప్రభుత్వం తప్పు చేసిందని మీరు తప్పకుండా భావిస్తూ ఉండి ఉంటారు. మీరు నన్ను ఎంతగానో ప్రేమించారు.అయితే చమురు ధరల కారణంగా నామీద మీకు కొద్దిగా కోపంగా ఉన్నారు. ఆ విషయం నాకు తెలుసు, కానీ నేనేమీ చేయలేను. ఎందుకంటే నేను నా భవిష్యత్‌ తరాల కోసం పనిచేస్తున్నాను. అంతకు ముందున్న ప్రభుత్వ తెలివితక్కువ తనం మనకు శాపంగా మారింది. వారు అప్పు తెచ్చి చమురు కొనుగోలు చేశారు, అయినప్పటికీ పౌరుల ఆగ్రహాన్ని తప్పించుకొనేందుకు వారు ధరలను పెంచలేదు. అప్పుడు ఆయన విదేశాల నుంచి రెండున్నరలక్షల కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. ఇందుకోసం మనం ప్రతి సంవత్సరం వడ్డీ కింద ఇరవై అయిదు వేల కోట్ల రూపాయలు చెల్లించాం. మన దేశానికి పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చారు. రుణం తీర్చాలని మనకు చెప్పారు, అలా చేస్తేనే ఎలాంటి ఆటంకాలు లేకుండా మన దేశానికి చమురు దొరుకుతుందన్నారు.”

మిత్రోం ఇవన్నీ స్వయంగా నేనే మీకు చెబుతున్నట్లుగా ఉంది కదూ, ఉత్తినే. అసలు నేనెక్కడా ఈ మాటలు చెప్పలేదు. అయితే నేను చెప్పినట్లుగా ప్రచారం చేస్తుంటే మనకు వాటంగా ఉన్నాయి కదా అని మౌనంగా ఉన్నా. మీరు కూడా అదే చేస్తారు కదా. సరే,


” చమురు మీద పన్నులు వేసిన కారణం ఏమిటంటారు. మనం వడ్డీతో సహా రెండున్నరలక్షల కోట్ల రూపాయల రుణాన్ని తిరిగి చెల్లించాం అని ఈ రోజు గర్వంగా చెప్పవచ్చు ”


మిత్రోం ఇలా చెబుతున్నానంటే ఈ అప్పువేరు, చమురు బాండ్ల అప్పు వేరా, అయితే ఎక్కడా అధికారికంగా అలా చెప్పలేదేం అని మీరు అడగవచ్చు. దేశభక్తులం, దేశ రహస్యాలను ఎలా చెబుతాం, చమురు బాండ్ల చెల్లింపు గడువు 2026 వరకు ఉందని బడ్జెట్‌ పత్రాల్లో ఉంది కదా అని మీరు నిలదీయవచ్చు. బడ్జెట్‌ పత్రాల్లో రాసినవన్నీ నిజం అనుకుంటే నేనేం చేయలేను. జుమ్లా, ఏదో రాస్తుంటాం. మీరు నిజంగా దేశభక్తులే అయితే అప్పు తీరిందంటున్నారు కదా పెంచిన పన్ను తగ్గిస్తారా అని మాత్రం అడగవద్దు,

” రైల్వేలు ఎంతో నష్టం కలిగిస్తున్నాయి. గత ప్రభుత్వాలు ప్రారంభించిన పధకాలన్నింటినీ పూర్తి చేశాం, అవన్నీ సక్రమంగా నడుస్తున్నాయి.గతం కంటే వేగంగా అన్ని రైలు మార్గాల విద్యుదీకరణ పూర్తి చేశాం. అదే విధంగా 18,500 గ్రామాలను విద్యుదీకరించాం. ఐదు కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు పేదలకు ఉచితంగా ఇచ్చాం. వందలాది కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం చేశాం. యువకులకు ఒకటిన్నరలక్షల కోట్ల రుణాలు ఇచ్చాం. ఆయుష్మాన్‌ భారత్‌ పేరుతో 50 కోట్ల మందికి వైద్య బీమాకోసం లక్షా 50వేల కోట్లతో పధకాన్ని ప్రారంభించాం”


మిత్రోం, భూమికి గొడుగు తొడిగించాం, పగలే లైట్లు వెలిగించాం, ఎడా పెడా చేతికి వచ్చిన బంగారం అంతా జనానికి ఇచ్చాం చివరకు అన్నీ పొగొట్టుకుని మాకు తినేందుకు తిండిలేక ఇలా అడుక్కునేందుకు వచ్చాం అనే తుపాకి రాముడి లేదా పిట్టల దొర మాటల్లా ఉన్నట్లు మీకు అనిపిస్తున్నాయి కదూ, నాకు తెలుసు. ఇన్ని పధకాలకు ఇంతంత భారీ మొత్తాలను ఖర్చు చేసిన మీరు కరోనా రోగులకు ఆక్సిజన్‌ కూడా అందించలేకపోయారెందుకని అడుగుతారు. ఉచితంగా వాక్సిన్‌ వేస్తామని మడమ తిప్పారెందుకుని కూడా అడుగుతారు. కరోనా మరణాలకు పరిహారం ఇవ్వలేమని చేతులెత్తేశారెందుకు అని నిలదీయవచ్చు.అసలు ఈ కోర్టులున్నాయి చూశారూ….ఒక్కోసారి ఏం చేస్తాయో తెలియదు.


” మన సైనికులకు అన్ని అధునాతన ఆయుధాలను, బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్లను, రాఫెల్‌ యుద్ద విమానాలను, ఇంకా అనేక రకాల మారణాయుధాలు మరియు ఇతర సౌకర్యాలు కల్పించాం. వీటన్నింటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు. అ సొమ్ము మీరిచ్చిందే, మీరంతా పెట్రోలు, డీజిలు కొని దేశానికి డబ్బు ఇచ్చారు. పెట్రోలు, డీజిలు మీద పన్ను రద్దు చేస్తే మనం అప్పులను తీర్చటం సాధ్యమా ? మనం అప్పులను తీర్చగలం, అదే విధంగా కొత్త పధకాలను తీసుకురాగలం. కాబట్టి పరోక్షంగా ప్రతిదాని మీద పన్నులు పెంచాల్సిందే. నూటముప్పయి కోట్ల మంది పౌరుల బాధ్యత వాహన యజమానిదిగా మాత్రమే ఉండకూడదు.”

మిత్రోం చమురు ధర లీటరుకు ఏడు పైసలు పెంచినందుకు మన నేత అతల్‌ బిహారీ వాజ్‌పాయి గతంలో ఢిల్లీలో ఎడ్లబండి మీద ఊరేగి నిరసన తెలిపారు కదా అని కొంత మంది పాత వీడియోను ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తిప్పుతున్నారు. దేశభక్తులు మీరు అలా ప్రచారం చేస్తే, నిలదీస్తే నా మనోభావాలు గాయపడతాయి. ప్రపంచంలో ఏ దేశంలోనూ చమురు మీద ఇంతగా పన్నులు లేవు కదా అని కొందరంటున్నారు. మన దేశ పరువును బజారుకీడ్చటం తప్ప దీనిలో దేశభక్తి ఉందా ? మనం ఇతర దేశాల గురించి పోల్చుకోవటం అంటే టూల్‌కిట్‌ను విదేశాలకు అందించటమే. అది దేశద్రోహం కదా !


” చివరిగా ఒక మాట… మీరు కుటుంబ పెద్ద అయితే మీ కుటుంబం మీద పెద్ద అప్పుల భారం ఉంటే ఏం చేస్తారు? ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు చేస్తారా లేక అప్పులు తీరుస్తారా ? రుణం దాని మీద వడ్డీ జాగ్రత్తగా తీర్చకపోతే కుటుంబ భవిష్యత్‌ ఏమౌతుంది ? ప్రత్యర్ధుల వలలో పడకండి.. ఈ దేశభక్తుడైన పౌరుడిగా మీరు దేశ అభివృద్దిలో భాగస్వాములు కండి.ఈ నిరసన అంతా ఎల్లవేళలా ఓట్ల కోసమే, కొంత మంది రాజకీయవేత్తలు తప్పుడు ప్రచారంతో పౌరులను తప్పుదారి పట్టిస్తున్నారు.భారతీయులుగా మీరు ఈ వాస్తవాలను అందరితో పంచుకోవాలని నేను కోరుతున్నాను.”


మిత్రోం, ఇన్ని విషయాలు చెప్పిన తరువాత మీకు తత్వం తలకెక్కిందని భావిస్తున్నాను. మీరు నిజంగా దేశభక్తులే , బాధ్యతగల పౌరులే అయితే, దేశం మనకేమిచ్చిందని గాక దేశానికి మనమేం ఇచ్చామని ఆలోచించే వారయితే ఏడు సంవత్సరాల కాలంలో 55లక్షల కోట్ల దేశీయ అప్పును 117లక్షల కోట్లకు ఎందుకు పెంచారు, ఏం చేశారని అడగొద్దు. అత్మనిర్భరలో జనానికి ఏం చేశారని అసలే అడగొద్దు. గత ప్రభుత్వం రెండున్నరలక్ష కోట్ల రూపాయల అప్పుకే పాతివేల కోట్ల వడ్డీ చెల్లించామని చెప్పాను. ముందే చెప్పినట్లు ఈ ఏడాది 121లక్షల కోట్ల దేశీయ, విదేశీ అప్పుకు గాను ఈ ఏడాది వడ్డీ పన్నెండు లక్షల 10వేల కోట్లు, వచ్చే ఏడాది 136లక్షల కోట్లకు గాను పదమూడు లక్షల 60వేల కోట్ల వడ్డీయే చెల్లించాల్సి ఉంటుంది. అదంతా ఎవరు చెల్లిస్తారు. మీకోసం అప్పు చేసినపుడు మీదే బాధ్యత ! నా దగ్గర గడ్డం జులపాలు తప్ప వేరే ఏమీ లేవని తెలిసిందే. అందువలన మీరే చెల్లించాలి. ముందుగానే చెబుతున్నా, ఎవరేమనుకున్నా ఏదీ ఊరికే రాదు అని టీవీల్లో ఎప్పుడూ చూస్తూనే ఉన్నారు కదా, కనుక రాబోయే రోజుల్లో ఇంకా పన్నులు వేయక తప్పదు, దేశభక్తులుగా మీరు భరించకా తప్పదు.
మీ
నరేంద్రమోడీ,
మాతా నీకు వందనం,
భారత మాత వర్దిల్లుగాక ,
జై హింద్‌.

ఇక చాలు నరేంద్రమోడీ గారూ – మీ వైఫల్య భారాన్ని ఇంకేమాత్రం మోయలేం !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


‘ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు, రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి పతనం కేవలం పాలకుల అవినీతి వల్లనే. అది పారిశ్రామిక ప్రగతి, ఎగుమతి, దిగుమతులపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తోంది ‘ ఆగండి ఆగండి నరేంద్రమోడీ అభిమానులారా ! ఈ మాటలన్నది రాహుల్‌ గాంధీయో, సీతారామ్‌ ఏచూరో కాదు. ఒక్కసారి గతంలోకి వెళితే గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ గారి నోటి నుంచి వెలువడిన సుభాషితాలే ఇవి అని మీరు ఇట్టే గ్రహించేస్తారు.


ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే రూపాయి విలువ పతనం కారణంగా మన విదేశీ అప్పు గణనీయంగా పెరిగి పోయింది. ఈ విషయాన్ని సాక్షాత్తూ రిజర్వుబ్యాంకే తాజాగా చెప్పింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో మన విదేశీ అప్పు 570 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. గతేడాది మార్చి నాటికి జిడిపిలో విదేశీ అప్పుశాతం 20.6శాతం ఉంటే ఈ ఏడాదికి అది 21.1శాతానికి ” అభివృద్ధి ” చెందింది. గతేడాది మన విదేశీ అప్పు 11.5బిలియన్‌ డాలర్లు పెరిగింది. మన రూపాయి విలువ పతనం కానట్లయితే ఆ పెరుగుదల 4.7 బిలియన్‌ డాలర్లు ఉండేది, పతనం కారణంగా 6.8బి.డాలర్లు అదనం అయింది. మనందరికీ తెలిసిన సాధారణ విషయం ఏమంటే ఒప్పందం ప్రకారం వడ్డీ నెల నెలా కట్టకపోతే అది అసలులో కలిసి అప్పు భారం పెరుగుతుంది. మనం కొత్తగా అప్పులు తీసుకోకపోయినా, వడ్డీ సకాలంలో చెల్లించినా రూపాయి విలువ తగ్గితే మన అప్పు పెరిగి పోతుంది. అందువలన మోడీ గారు చెప్పినట్లు రూపాయి విలువ తగ్గుదల-పెరుగుదల ప్రభుత్వాలదే గనుక ఆ పుణ్యం మన నరేంద్రమోడీ ఖాతాలోకే వేయాలి మరి. మన్మోహన్‌ సింగ్‌కు ఒక న్యాయం నరేంద్రమోడీకి ఒక న్యాయం ఉండదు కదా !


మా నరేంద్రమోడీ గారు అప్పులే చేయలేదు, గతంలో చేసిన అప్పులు తీర్చారు అని బిజెపి మరుగుజ్జులు(ట్రోల్స్‌) సామాజిక మాధ్యమంలో ఊదరగొట్టారు. మరి రిజర్వు బ్యాంకు చెబుతున్న వివరాల సంగతేమిటి ? అప్పులు తీరిస్తే ఎందుకు పెరుగుతున్నాయి ? 2014లో 446.2 బిలియన్‌ డాలర్ల అప్పుంటే ఇప్పుడు 570బి.డాలర్లకు పెరిగింది. గత ఏడాది చెల్లించిన అసలు , వడ్డీ కలిపి 8.2శాతం ఉండగా అంతకు ముందు 6.5శాతం ఉంది. గత ఏడు సంవత్సరాలలో అది 5.9 నుంచి 8.2శాతం మధ్య ఉంది తప్ప మోడీ భక్తులు చెబుతున్నట్లుగా ఏ ఒక్క ఏడాదిలోనూ అసాధారణంగా అప్పు తీర్చిన దాఖలా లేదు. ప్రభుత్వం తీసుకున్న అప్పులు ఇదే కాలంలో 79 బిలియన్‌ డాలర్ల నుంచి 107కు పెరిగాయి. అందువలన గత ప్రభుత్వం మాదిరే మోడీ సర్కార్‌ కూడా అప్పులు తీసుకుంటున్నదీ, చెల్లిస్తున్నది తప్ప 56 అంగుళాల ఆర్ధిక నైపుణ్య ప్రత్యేకత ఏమీ లేదు.


గత ప్రభుత్వం జారీ చేసిన చమురు బాండ్ల భారం తమ మోడీ సర్కార్‌ భరించాల్సి వస్తున్నది కనుక సమీప భవిష్యత్‌లో చమురు ధరలు లేదా పన్ను తగ్గించే అవకాశం లేదని అభిమానులు చెబుతారు.మన్‌కీ బాత్‌ అంటూ ప్రతి నెలా మోడీ గారు దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఏ నెలలో అయినా ఆ విషయం చెప్పారా అందువలన ఏదో ఒక సమయంలో ఆ ముక్కేదో నరేంద్రమోడీ గారినే చెప్పమనండి ! చెప్పలేరు ? ఎందుకని ? మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌, అంతకు ముందు వాజ్‌పారు సర్కార్‌ జారీ చేసిన బాండ్లకు గాను చెల్లించాల్సిన మొత్తం లక్షా 30వేల కోట్ల రూపాయలు. వాటి గడువు ఇంకా ఉంది. అది కూడా వినియోగదారులకు సబ్సిడీగా ఇచ్చిన మొత్తం తప్ప మరొకటి కాదు. ఈ మొత్తానికి గుండెలు బాదుకుంటూ చమురు ధర తగ్గించలేరని చెబుతున్న వారు మోడీ సర్కార్‌ చేసిన అప్పుల గురించి మాట్లాడరు. విదేశీ అప్పు గురించి పైన చెప్పుకున్నాం. గత ఏడు సంవత్సరాల కాలంలో చేసిన అప్పు ఎంతో తెలుసా ! 2014లో ఉన్న అప్పు 54,90,763 కోట్లు. అది 2021మార్చి 31 నాటికి 116.21 లక్షల కోట్లకు పెరిగింది. చమురు బాండ్లు ఈ మొత్తంలో వందో వంతు కంటే తక్కువే కదా ? మరి ఇంత అప్పు ఎందుకు చేసినట్లు ? ఈ మొత్తంతో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ? దాని వలన వచ్చిన ఫలితాలేమిటో ఎవరైనా చెప్పేవారున్నారా ?


ఏడు సంవత్సరాల క్రితం ఒక లీటరు పెట్రోలు మీద రు. 9.48 ఎక్సైజ్‌ పన్ను ఉంది. అది ఇప్పుడు 32 రూపాయలకు పెరిగింది. ఒక రూపాయి పన్ను పెరిగితే కేంద్ర ప్రభుత్వానికి ఏటా పద్నాలుగు వేల కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని అంచనా. అంటే ఏడు సంవత్సరాల కాలంలో ఆదాయం లక్షా 30వేల కోట్ల నుంచి నాలుగున్నర లక్షల కోట్లకు పెరిగింది. యుపిఏ చమురు బాండ్ల పేరుతో ఇంత బాదుడా ? జనాన్ని అంత ఆమాయకంగా చూస్తున్నారా ?
2014 మేనెలలో మనం కొనుగోలు చేసిన ముడి చమురు పీపా ధర డాలర్లలో 107.7 ఉండగా మన రూపాయల్లో చెల్లించిన మొత్తం 6,326. ఇప్పుడు జూన్‌ నెలలో 71.40 డాలర్లు కాగా రూపాయల్లో 5,257, జూలై రెండవ తేదీ ధర 74.75 కాగా రూపాయల్లో 5,560 ఉంది. ఏడు సంవత్సరాల క్రితం అంత తక్కువ ఎందుకు చెల్లించాము, ఇప్పుడు ఇంత ఎక్కువ ఎందుకు చెల్లిస్తున్నాము. అంటే మోడీ గారి ఏలుబడిలో రూపాయి విలువ పతనం కావటమే కారణం. మరి రూపాయి విలువ గురించి గతంలో చెప్పిన మాటలేమైనట్లు ? ఇలా పతనం అవుతుంటే ఎవరు లాభపడుతున్నట్లు ? గోడదెబ్బ-చెంపదెబ్బ మాదిరి వినియోగదారులకు పన్ను పోటు-రూపాయి పోటు రెండూ ఎడాపెడా తగులుతున్నాయి. సమర్ధవంతమైన పాలన ఎక్కడ, అనుభవం ఏమైనట్లు ?


మోడీ పాలనలో విదేశీ మారక ద్రవ్యం నిల్వలు అంత పెరిగాయి, ఇంత పెరిగాయి చూడండి అంటూ గొప్పలు చెబుతారు. మన వాణిజ్యం ప్రతి సంవత్సరం లోటులోనే నడుస్తున్నది. మరి ఈ నిల్వలు ఎక్కడి నుంచి వచ్చాయి ? గతేడాది కరోనా కారణంగా వినియోగం తగ్గి దిగుమతులు పడిపోయి వాణిజ్య మిగులు ఉంది తప్ప ఎప్పుడూ మనకు చైనా, జపాన్‌ మాదిరి డాలర్లు మిగల్లేదు. మరి మన దగ్గర ఉన్న డాలర్‌ నిల్వలు ఏమిటి అంటే మన స్టాక్‌ మార్కెట్లో విదేశీయుల పెట్టుబడులు, చేస్తున్న అప్పులు, ప్రవాస భారతీయులు దాచుకుంటున్న నిల్వలు మాత్రమే. మరో విధంగా చెప్పాలంటే మన జేబులో సొమ్ము తప్ప బీరువా ఖాళీయే. మన రూపాయి విలువ తక్కువ, ఎక్కువ ఉండటం గురించి మన వాణిజ్య వేత్తల్లో విబేధాలు ఉన్నాయి. విదేశాల నుంచి రుణాలు తీసుకున్నా లేదా విదేశీ పెట్టుబడిదారులు స్టాక్‌ మార్కెట్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టినా మన దగ్గర డాలర్‌ నిల్వలు పెరుగుతాయి, దాంతో రూపాయి విలువ పెరుగుతుంది. ఇది ఎగుమతి దారుల లాభదాయకతను దెబ్బ తీస్తుంది. విదేశీ మార్కెట్లో మన వస్తువులు పోటీ పడలేవు. అందువలన రూపాయి బలంగా ఉండటాన్ని ఎగుమతిదారులు వ్యతిరేకిస్తారు.ఇప్పుడున్న దాని మీద రూపాయి విలువ 20శాతం తగ్గిస్తే మన ఎగుమతులు ఇబ్బడి ముబ్బడి అవుతాయని వారు చెబుతారు.


మన రూపాయి బలంగా ఉంటే చమురు, ఇతర దిగుమతుల ధరలు తగ్గుతాయి. వినియోగదారుల మీద భారం తగ్గుతుంది. కనుక రూపాయి విలువ పతనాన్ని అరికట్టాలని దిగుమతిదారులు డిమాండ్‌ చేస్తారు. 2011 నుంచి మన ఎగుమతులు 300 నుంచి 314 బిలియన్‌ డాలర్ల మధ్యనే ఉన్నాయి. ఒక సంవత్సరం మాత్రం 330 బి.డాలర్లు ఉన్నాయి.ఇదే సమయంలో దిగుమతులు పెరగటమే తప్ప తరగటం లేదు. ఏడు సంవత్సరాలుగా మేకిన్‌ ఇండియా పేరుతో ప్రధాని మోడీ వస్తు తయారీకి పిలుపులు ఇస్తున్నా ఎగుమతులూ లేవు, దిగుమతులూ తగ్గలేదు. అంటే మనకు అవసరమైన వస్తువులను కూడా మనం తయారు చేసుకోలేకపోతున్నాం. మొత్తం మీద చెప్పవచ్చేదేమంటే మోడీ సర్కార్‌ వైఫల్యాలు జనం మీద భారాలు పెంచుతున్నాయి. మునిగే పడవ గడ్డిపోచను కూడా భరించలేదన్నట్లుగా పరిస్ధితి దిగజారుతోంది. అందుకే మోడీ గారు మీ భారాలు మోయలేకున్నాం అని చెప్పాల్సి వస్తోంది. వినిపించుకుంటారా ! అధికారంలో ఉన్నవారు అలాంటి మంచి పని చేసిన దాఖలా లేదు మరి !!

చిలీ అధ్యక్ష పోటీలో ముందున్న కమ్యూనిస్టు అభ్యర్ధి !

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


ఈ ఏడాది నవంబరు 21న జరగనున్న చిలీ అధ్యక్ష ఎన్నికలలో అభ్యర్ధిగా అనూహ్యంగా కమ్యూనిస్టు పార్టీ నేత డేనియల్‌ జాడ్యు ముందుకు దూసుకు వస్తున్నట్లు తాజా సర్వేలు వెల్లడించాయి. వివిధ పార్టీల అభ్యర్ధులను ఇంకా ఖరారు చేయనప్పటికీ కాగల అభ్యర్ధులను ఊహించి సర్వేలు చేస్తున్నారు. మే నెలలో జరిగిన రాజ్యాంగ పరిషత్‌ ఎన్నికలలో విజయం సాధించిన రెండు వామపక్ష సంఘటనలు, మరొక వామపక్ష పార్టీ అభ్యర్ధులు కూడా అధ్యక్ష పదవికి పోటీలో ఉంటారని వార్తలు వచ్చాయి. వారిలో అంతిమంగా జాడ్యు అభ్యర్దిగా నిర్ణయం అవుతారని భావిస్తున్నారు. అదే జరుగుతుందా, మరో వామపక్ష అభ్యర్ధి రంగంలో ఉంటారా అన్నది త్వరలో తేల నుంది. ఈనెల 18న వివిధ పార్టీలు,కూటములు అభ్యర్ధులను ఖరారు చేయనున్నాయి.


రాజధాని శాంటియాగో మహానగరంలో ఉన్న రికొలెటా ప్రాంత కార్పొరేషన్‌ మేయర్‌గా ఇటీవల జాడ్యు తిరిగి ఎన్నికయ్యారు. పాలస్తీనా నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన జాడ్యు తొలి దశలో పోటీ ఎలా జరిగినప్పటికీ మెజారిటీ రాకపోతే రెండవ దఫా ఎన్నికలో అయినా విజేతగా కాబోయే అధ్యక్షుడంటూ వార్తలు, విశ్లేషణలు వెలువడుతున్నాయి.లాటిన్‌ అమెరికాలోని వెనెజులా, బొలీవియా, బ్రెజిల్‌, అర్జెంటీనా తదితర దేశాలలో వామపక్ష అధ్యక్షులుగా ఎన్నికైన వారందరూ వామపక్షాలకు చెందిన వారు, మార్క్సిజం-లెనిజం పట్ల విశ్వాసం ప్రకటించిన వారే అయినప్పటికీ కమ్యూనిస్టు పార్టీలకు చెందిన వారు కాదు. ఆయా దేశాల్లోని కమ్యూనిస్టు పార్టీలు వారికి సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. సామ్రాజ్యవాదులు కుట్రలకు పాల్పడి ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్పిస్తే ఏం జరుగుతుందో చెప్పలేము గానీ లేనట్లయితే లాటిన్‌ అమెరికాలో మరో ఎర్రమందారం వికసించటం ఖాయంగా కనిపిస్తోంది.తొలి దశలోనే మెజారిటీ సంపాదిస్తారా లేక రెండవ పోటీలోనా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


నూతన రాజ్యాంగ పరిషత్‌, రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధిస్తున్న కమ్యూనిస్టులు, ఇతర వామపక్ష శక్తులు పార్లమెంట్‌, అధ్యక్ష ఎన్నికలలో అదే పరంపరను కొనసాగించనున్నాయి. ప్రస్తుతం పచ్చి మితవాది సెబాస్టియన్‌ పినేరా అధ్యక్షుడిగా ఉన్నారు. రాజ్యాంగ పరిషత్‌ ఎన్నికల్లో వామపక్ష శక్తులు, వారిని బలపరిచే వారే మెజారిటీగా ఎన్నికైన విషయం తెలిసిందే. కమ్యూనిస్టు జాడ్యుతో పాటు మితవాద పార్టీలైన ఇండిపెండెంట్‌ డెమ్రోక్రటిక్‌ యూనియన్‌ అభ్యర్ధి జాక్విన్‌ లావిన్‌, క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన యాసనా ప్రొవోటే మధ్య ప్రధాన పోటీ ఉండవచ్చని భావిస్తున్నారు.
లాటిన్‌ అమెరికాలో మరోసారి వామపక్ష తరంగం వస్తున్నది. గతనెల ఆరున పెరూలో జరిగిన ఎన్నికలలో వామపక్ష అభ్యర్ధి పెడ్రో కాస్టిలో నలభైవేలకు పైగా మెజారిటీతో గెలుపొందినప్పటికీ ఇంతవరకు ఎన్నికల సంఘం ఖరారు చేయలేదు. అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్ష మితవాద అభ్యర్ధి చేసిన ఫిర్యాదును విచారించే పేరుతో కాలయాపన చేస్తున్నది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో బ్రెజిల్‌లో తిరిగి వామపక్ష నేత లూలా డ సిల్వా తిరిగి ఎన్నిక కానున్నారని, నికరాగువాలో అధ్యక్షుడు డేనియల్‌ ఓర్టేగా తిరిగి విజయం సాధించనున్నారనే వాతావరణం ఉంది. దానికి అనుగుణ్యంగానే చిలీ పరిణామాలు ఉంటాయని భావిస్తున్నారు.


ప్రజల ఆస్తులను ప్రయివేటు వారికి కట్టబెట్టటం, వివిధ సేవల ప్రయివేటీకరణ చర్యలతో లాటిన్‌ అమెరికా దేశాల్లో అమలు జరిపిన నూతన ఆర్ధిక లేదా నయా ఉదారవాద విధానాలు సామాన్య జనజీవితాలను దిగజార్చాయి. ధనికుల మీద పన్ను భారం పెంచటం, పెన్షన్‌ వ్యవస్ధను పునర్వ్యస్తీకరించటం, ఆర్ధిక వ్యవస్ధలో ప్రభుత్వ ప్రమేయం పెంపు, పన్నులు ఎగవేసేందుకు కంపెనీలు సరిహద్దులు దాటి పోవటాన్ని నిరోధించటం వంటి చర్యలను కమ్యూనిస్టు పార్టీ ప్రతిపాదించింది. ప్రపంచంలో అత్యధిక రాగి నిల్వలను కలిగి ఉన్న చిలీ సంపదను బహుళజాతి గుత్త సంస్ధల పాలు చేయకుండా ప్రజల కోసం వినియోగించాలని చెప్పింది. ఖనిజ సంపదకు రాజ్యం యజమాని గనుక అన్ని కార్యకలాపాలలో అది భాగస్వామిగా ఉండాలని కోరింది. సమస్యలపై ఉద్యమించిన ప్రజా సమూహాలపై మాజీ నియంత పినోచెట్‌ తరువాత ప్రస్తుత అధ్యక్షుడు పినేరా మిలిటరీని ప్రయోగించిన తాజా నిరంకుశుడిగా చరిత్రకెక్కాడు.


కమ్యూనిస్టు నేత జాడ్యు ప్రజాదరణ పొందుతున్నట్లు సర్వేలు వెల్లడి చేస్తుండటంతో మితవాద శక్తులు ఆయన్ను ఒక బూచిగా చూపేందుకు పూనుకున్నాయి. కమ్యూనిస్టును ఎన్నుకుంటే ప్రమాదమని జనాన్ని రెచ్చగొడుతున్నాయి. అధ్యక్షపదవి అభ్యర్ధిగా ఉన్న జాడ్యు పాఠశాల్లో చదువుకొనే రోజుల్లో యూదు వ్యతిరేకిగా ఉన్నాడని అభిశంసిస్తూ పార్లమెంట్‌లోని మితవాద ఎంపీలు ఒక తీర్మానంలో ధ్వజమెత్తారు. అనుకూలంగా 79 వ్యతిరేకంగా 47 వచ్చాయి. చిలీలో యూదులు ఇరవై వేలకు మించి లేనప్పటికీ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ తీర్మానాన్ని ఆయన కొట్టిపారవేశారు. చిలీలో పాలస్తీనా మూలాలు కలిగిన వారు ఐదు లక్షల మంది ఉన్నారు. జాడ్యు క్రైస్తవమతానికి చెందిన వ్యక్తి. ఆయన తాతల కాలంలో పాలస్తీనా నుంచి చిలీకి వలస వచ్చారు. చిలీ రాజధాని శాంటియాగోలో 1967 జూన్‌ 28జన్మించిన జాడ్యు పాఠశాల విద్యార్ధిగా ఉన్నప్పటి నుంచి ఇజ్రాయెల్‌ యూదుల దురంతాలను వ్యతిరేకించాడు. పాలస్తీనా విముక్తికి మద్దతుగా చిలీ లోని పాలస్తీనియన్‌ విద్యార్ధి సంఘం, తరువాత కమ్యూనిస్టు విద్యార్ధి సంఘ నేతగా, పని చేశారు. నియంత పినోచెట్‌కు మద్దతుదారు అయిన తండ్రిని ఎదిరించి కుటుంబం నుంచి బయటకు వచ్చాడు.1993లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు.2012 నుంచి రికొలెటా కార్పొరేషన్‌ మేయర్‌గా పని చేస్తున్నారు. పేదలకు అవసరమైన జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చొరవ చూపి ప్రశంసలు పొందారు.


జాడ్యు పాఠశాలలోనే ఇజ్రాయెల్‌ దురహంకారం, పాలస్తీనియన్లపై జరుపుతున్న దురాగతాలను వ్యతిరేకించేవాడు. ప్రతి సంవత్సరం ప్రచురించే పాఠశాల ప్రత్యేక సంచికలో జాడ్యు స్నేహితులు సరదాగా అనేక వ్యాఖ్యలు రాస్తుండేవారు.వాటిలో ” అతని వాంఛ యూదుల నగరాన్ని శుద్ధి చేయటం, అతని లక్ష్య సాధన కసరత్తుకు తగిన బహుమానం ఒక యూదును ఇవ్వటమే ” వంటి వ్యాఖ్యలు చేసే వారు. అతని రికార్డులో పాఠశాల తనిఖీ అధికారి జాడ్యు యూదు వ్యతిరేకి అని రాశాడు. చిలీ యూదుల నేత ఒకరు ఈ విషయాలున్న పత్రాల కాపీని ట్వీట్‌ద్వారా ఎంపీలు, ఇతరులకు పంపాడు. దాన్ని పట్టుకొని పార్లమెంటు అభిశంసన తీర్మానం చేసింది. ఇదంతా అతను ఎన్నికల్లో కమ్యూనిస్టు అభ్యర్ధిగా ముందుకు వస్తున్న నేపధ్యంలోనే జరిగింది.


పార్లమెంట్‌ తీర్మానాన్ని జాడ్యు కొట్టిపారవేశాడు.” దేశం ఇప్పుడు ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా సంక్షోభంతో ఉంది. వందలాది మంది మరణిస్తున్నారు, కుటుంబాలు అవసరాలు తీర్చుకోలేకపోతున్నాయి. కానీ మితవాద ఎంపీలు 35 సంవత్సరాల క్రితం ఇతరులు స్కూలు పత్రికలో నా గురించి రాసినదాన్ని వివరించటానికి తీవ్రంగా శ్రమించారు. పాఠశాల తనిఖీ అధికారి రాసిన వాటిని నేను అప్పుడే ఖండించాను ” అని చెప్పాడు. తాజాగా వెలువడిన ఒక సర్వే ప్రకారం జాడ్యుకు 38శాతం మద్దతు ఉండగా అతని సమీప ప్రత్యర్ధికి 33శాతం ఉంది.


చిలీ సోషలిస్టు పార్టీ (మార్క్సిస్టు భావజాలంతో పని చేసింది) నేత సాల్వెడార్‌ అలెండీ లాటిన్‌ అమెరికాలో అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి వామపక్షవాది.1970 నవంబరు మూడు నుంచి 1973 సెప్టెంబరు 11న సైనిక తిరుగుబాటులో ప్రాణాలు కోల్పోయేంతవరకు అధ్యక్షుడిగా ఉన్నాడు. అలెండీ కొనసాగితే లాటిన్‌ అమెరికాలో వామపక్ష ఉద్యమాలు ఊపందుకుంటాయనే భయంతో అమెరికా సిఐఏ కుట్రలో భాగంగా మిలిటరీ అధికారి పినోచెట్‌ తిరుగుబాటు చేశాడు. మిలిటరీని ఎదుర్కొనే క్రమంలో అలెండీ స్వయంగా, అనుచరులు కూడా ఆయుధాలు చేపట్టారు. అయితే తగిన విధంగా పార్టీ నిర్మాణం, సన్నద్దత లేకపోవటంతో మిలిటరీదే పైచేయి అయింది. తరువాత అమెరికా చికాగో విశ్వవిద్యాలయంలో చదివిన ఆర్ధికవేత్తలను చిలీతో పాటు దాదాపు అన్ని లాటిన్‌ అమెరికా దేశాలకు అమెరికా పంపటమే గాక ఉదారవాద విధానాల అమలుకు ఆ ఖండాన్ని ప్రయోగశాలగా చేసింది. అందువలనే ఆ విధాన ఆర్ధికవేత్తలందరినీ ” చికాగో బాలురు ” అని పిలిచారు. రాజ్యాంగాల రచనల నుంచి అన్నింటా వారి ముద్ర ఉండేది. తాజా రాజ్యాంగ ఎన్నికలలో వామపక్ష, అభ్యుదయవాదులు విజయం సాధించటంతో చిలీలో వారి శకం అంతరించినట్లే అనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. అలెండీ నాయకత్వం వహించిన పార్టీలో తరువాత అనేక పరిణామాలు సంభవించాయి. ఆ పార్టీ ఇప్పుడు వామపక్షాలతో లేదు.


నూటతొమ్మిది సంవత్సరాల క్రితం 1912 జూన్‌ నాలుగున ఏర్పడిన చిలీ కమ్యూనిస్టు పార్టీ అనేక నిర్బంధాలను తట్టుకొన్నది.. డెమోక్రటిక్‌ పార్టీ నుంచి బయటకు వచ్చిన వారు 1912లో సోషలిస్టు వర్కర్స్‌ పార్టీని ఏర్పాటు చేశారు. పది సంవత్సరాల తరువాత అదే కమ్యూనిస్టు పార్టీగా మారింది.1938లో పాపులర్‌ ఫ్రంట్‌ నాయకత్వాన ఏర్పడిన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. తరువాత డెమోక్రటిక్‌ కూటమిలో ఉంది. పెద్ద ఎత్తున కార్మికులను సమీకరించి బలం పుంజుకుంటున్న తరుణంలో 1948 నుంచి 58వరకు పార్టీపై నిషేధం విధించారు.1960 దశకంలో తిరిగి బహిరంగంగా పని చేయటం ప్రారంభించింది. పాబ్లో నెరూడా వంటి నోబెల్‌ బహుమతి గ్రహీత కవి, తదితర ప్రముఖులు పార్టీలో పని చేశారు.1970లో అలెండీ నాయకత్వంలో పాపులర్‌ యూనిటీ కూటమిలో భాగస్వామిగా ప్రభుత్వంలో చేరింది. అలెండీ సర్కార్‌ను కూలదోసిన మిలిటరీ నియంత పినోచెట్‌ 1973 నుంచి 1990 వరకు పార్టీపై నిషేధం అమలు జరిపాడు. మరోసారి కమ్యూనిస్టులు అజ్ఞాతవాసానికి వెళ్లారు.1977లో గెరిల్లా దళాన్ని కూడా ఏర్పాటు చేశారు.2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో సోషలిస్టు రికార్డో లాగోస్‌ ఎన్నిక వెనుక కమ్యూనిస్టులు ఉన్నారు. తరువాత 2006లో జరిగిన ఎన్నికలలో సోషలిస్టు మిచెల్లీ బాచెలెట్‌ ప్రభుత్వానికి కూడా మద్దతు ఇచ్చారు. ఈ ఏడాది జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో రాజధాని శాంటియాగోతో సహా అనేక చోట్ల మేయర్లుగా ఎన్నికయ్యారు.1927-31, 1948-1958, 1973-1990 సంవత్సరాల మధ్య నిర్బంధాలకు గురికావటంతో పాటు పినోచెట్‌ పాలనలో పలువురు నేతలతో సహా వేలాది మంది కమ్యూనిస్టులు హత్యలకు గురయ్యారు. తిరుగుబాటు సమయంలో అలెండీని మిగతా వామపక్షాలు వదలి వేసినప్పటికీ కమ్యూనిస్టులు ఆయనతో భుజం కలిపి పినోచెట్‌ను ఎదుర్కొన్నారు. పినోచెట్‌ హయాంలో తీవ్ర కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టారు. కమ్యూనిస్టులు రహస్యంగా పని చేశారు.


చిలీలో గతంలో ఉన్న కమ్యూనిస్టు వ్యతిరేకత, భయం తగ్గిపోతున్నదని 31 ఏండ్ల యువతి, శాంటియాగో నగరంలోని ముగ్గురు కమ్యూనిస్టు మేయర్లలో ఒకరైన జవీరా రేయాస్‌ చెప్పారు. డేనియల్‌ జాడ్యూ మేయర్‌గా ఒక ఆదర్శం అన్నారు. కార్పొరేషన్‌ తరఫున ఔషధ దుకాణాలు, కండ్లజోళ్ల షాపులు, పుస్తకాల షాపులు, రియలెస్టేట్‌ తదితర సంస్దలను నడుపుతూ ప్రజల మన్ననలను పొందారన్నారు. ఆరోగ్యం, విద్య వంటి అంశాలతో కమ్యూనిస్టు మేయర్లు మున్సిపల్‌ సోషలిజాన్ని (పేదల పక్షపాతం) అమలు జరుపుతారని అన్నారు. 2006లో విద్య ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన విద్యార్దుల నాయకురాలిగా ఆమె ప్రస్తానం ప్రారంభమైంది. ఆ సమయంలోనే ఆమెతో పాటు మరో మేయర్‌ హాస్లర్‌తో పాటు అనేక మంది విద్యార్ధి నేతలు కమ్యూనిస్టు పార్టీలో చేరారు. గతంలో 1931, 32, 1999లో కమ్యూనిస్టు పార్టీ తరఫున అభ్యర్ధులు అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఇప్పుడు ఎన్నికలు సక్రమంగా జరిగితే చిలీ తొలి కమ్యూనిస్టు అధ్యక్షుడిగా డేనియల్‌ జాడ్యు చరిత్రకెక్కుతాడు. ఆయన కూడా విద్యార్ధినేతగానే రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు.
.

మోడీ అభిమానులూ వంట గ్యాస్‌కు మీ నుంచి కూడా ఎంత పిండుతున్నారో తెలుసా !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


జూలై ఒకటి నుంచి వంటగ్యాస్‌ సిలిండరు ధర మరో ఇరవై అయిదు రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాదులో 861.50 నుంచి రూ.886.50 అయింది. నలభై రూపాయల సబ్సిడీ పదిహేనుకు పడి పోయింది. ఈ ముష్టి కూడా త్వరలో ఎత్తివేస్తారు. కరోనా కారణంగా కుదేలైన వారికి మరో 6.29లక్షల కోట్ల పాకేజి ప్రకటించిన నిర్మలమ్మ ఘనత గురించి ఇంకా చెప్పుకుంటూ ఉండగానే గ్యాస్‌ ధర పెరిగింది. రోజువారీ పెట్రోలు, డీజిలు ధరలకు జనం అలవాటు పడ్డారు. ఇప్పటికే వంద రూపాయలు దాటింది, 125, 150, 175, మోడీ అభిమానులు ఎదురు చూస్తున్న 200 కూడా త్వరలోనే దాటి పోతుందేమో. కనుక దాని గురించి పదే పదే చెప్పుకున్నా, వామపక్షాలు, కాంగ్రెస్‌ వారు చేసే ఆందోళనవలన ప్రయోజనం లేదు. పెరుగుదల మన ఒక్కరికే కాదు కదా, పెరుగుట విరుగుట కొరకే అన్న వేదాంతంలో నమ్మకం ఉన్న వారం గనుక ఇంకా ఇంకా ఎంత పెంచుతారో అదీ చూద్దాం. త్వరలో వంట గ్యాస్‌ ధరలు కూడా పెట్రోలు, డీజిలు మాదిరి రోజు వారీ పెరుగుతాయా మరొక పద్దతిలోనా అన్నది చూడబోతున్నాం.


2019-20లో వంట గ్యాస్‌ మీద ఇచ్చిన సబ్సిడీ మొత్తం రు.34,085 కోట్లు. 2020-21లో బడ్జెట్‌ అంచనా 37,256 అయితే దాన్ని 36,072 కోట్లకు సవరించారు. 2021-22లో ఆ మొత్తాన్ని 14,073 కోట్లకు తగ్గించి ప్రతిపాదించారు గనుక ఇప్పుడు పాతిక రూపాయలు ధర పెంచారు. ఆ మేరకు సబ్సిడీని తగ్గించారు. వివిధ ప్రాంతాలకు ఇస్తున్న సబ్సిడీలో తేడాలున్నప్పటికీ వడ్డింపులో వివక్ష లేదు కనుక ఆ మేరకు అందరికీ వర్తిస్తుంది.


పెట్రోలు, డీజిలు ధరలతో పాటు తమ ఏలుబడిలో గ్యాస్‌ ధరలు కూడా తక్కువే అని బిజెపి మరుగుజ్జులు(ట్రోల్స్‌) ప్రచారం చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. నమ్మని వారి గురించి వదిలేద్దాం, నరేంద్రమోడీని నమ్మిన వారిని తప్పుదారి పట్టిస్తున్నారనేదే ఆవేదన. దిగువ వివరాలు చూడండి.దిగుమతి ధర డాలర్లలో, వినియోగదారుల ధర, సబ్సిడీ మన రూపాయల్లో అని గమనించాలి. దిగుమతి ధరకు రవాణా ఖర్చులు అదనంగా ఉంటాయి.


సంవత్సరం××× దిగుమతి ధర××× వినియోగదారు ధర××× సబ్సిడీ
2014 ××× 970 ××× 414 ××× 638
2021 ××× 530 ××× 886 ××× 15


ఈ వివరాలను గమనించినపుడు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు గత ఏడు సంవత్సరాలలో గణనీయంగా పడిపోయినందున ప్రభుత్వం లేదా చమురు కంపెనీలు ఇచ్చే సబ్సిడీ మొత్తం కూడా ఆమేరకు తగ్గిపోతుంది. కానీ అసలు సబ్సిడీ ఎత్తివేయటమే విధానంగా పెట్టుకున్నందున ఇప్పుడు గ్యాస్‌ ధరలు కూడా పెట్రోలు, డీజిలు మాదిరే రోజు వారీ పెరిగినా ఆశ్చర్యం లేదు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే గతేడాది చమురు ధరలు గణనీయంగా పడిపోయినందున దిగుమతి చేసుకున్న ఎల్‌పిజి ధర కూడా 383 డాలర్లకు పడిపోయింది. గత ఏడు సంవత్సరాలలో ఇలా తరగటం తప్ప యుపిఏ కాలం నాటి ధరలకు పెరిగలేదు. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినందున 2018-19లో ఉన్న 526 డాలర్ల స్ధాయికి తిరిగి చేరాయి. దిగుమతి రవాణా ఖర్చు 2014లో టన్నుకు 46 డాలర్లు ఉంటే 2018 జూన్‌ ఒకటిన 20 డాలర్లు మాత్రమే ఉంది.


దేశం ఇప్పుడు రెండుగా చీలి పోయింది. నరేంద్రమోడీ ప్రభుత్వ విధానాలను విమర్శించేవారిని దేశద్రోహుల దొడ్లో వేస్తున్నారు. మిగిలిన వారంతా దేశభక్తులే. ” దేశ ద్రోహుల ” గురించి వదలివేద్దాం. వారి నుంచి ఎంత వీలైతే అంత పెట్రోలు,డీజిలు, వంట గ్యాస్‌ నుంచి పిండమనండి ఇబ్బంది లేదు. కొత్త దేవుడైన నరేంద్రమోడీని విమర్శించినందుకు వారికి ఆ శాస్తి జరగాల్సిందే. గడ్డాలు, దుస్తులను చూసి ఎవరు ఏమతం వారు అన్నది గుర్తించి మరీ దాడి చేస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో అన్ని మతాల వారూ ఒకే మాదిరి గడ్డం పెంచటం ఒక సరదా అయింది కనుక పొరపాటు పడే అవకాశం కూడా ఉంది. నాజీ జర్మనీలో యూదులను గుర్తించేందుకు హిట్లర్‌ వారికి పసుపు పచ్చ రంగు గుర్తు(బ్యాడ్జి) వేయించాడు. అలాగే మోడీ వ్యతిరేకులందరికీ ఏదో ఒక రంగు గుర్తు వేస్తే గుర్తించటం సులభం అవుతుంది.


దేశద్రోహులు ప్రతి అంశం మీద ఎప్పటి కప్పుడు వాస్తవాలు చెబుతున్నారు. ఇక దేశభక్తులైన మోడీ అభిమానులైన వారిని తోటి వారే మోసం చేయటమే ఆవేదన కలిగించే అంశం. మోడీ కంటే ముందు సంవత్సరాలలోనే గ్యాస్‌ ధరలు ఎక్కువ అంటూ ప్రచారం చేశారు. వారు పేర్కొన్న అంకెలు సబ్సిడీతో నిమిత్తం లేకుండా దిగుమతి, ఇతర ఖర్చులు, డీలరు కమిషన్‌ వంటి వాటిని కలిపి లెక్కిస్తే నిర్ణీత సిలిండరు ధర ఎంత పడుతుంది అన్న అంశాన్ని అవి వెల్లడిస్తాయి. అవి ఒక వైపు ఉన్న బొమ్మ లాంటివి. మరోవైపు ఉండే బొరుసును కూడా చూపితేనే స్పష్టత వస్తుంది. ఉదాహరణకు యుపిఏ పాలనలో 2014 మార్చి ఒకటవ తేదీ నాడు లెక్కించిన మేరకు సిలిండరు ఒకదానికి వసూలు చేయాల్సిన మొత్తం రు.1001.78. అయితే వినియోగదారు నుంచి వసూలు చేసింది రు. 414 మాత్రమే. మోడీ సర్కార్‌ పార్లమెంటులో స్వయంగా చెప్పినదాని ప్రకారం 2018జూన్‌ ఒకటవ తేదీన వసూలు చేయాల్సిన మొత్తం రూ.698 అయితే వినియోగదారుల నుంచి వసూలు చేసింది రూ.493. ఇచ్చిన సబ్సిడీ 205, 2014తో పోల్చితే అంతర్జాతీయంగా ధరలు తగ్గి ప్రభుత్వానికి ఏకంగా సిలిండరుకు మూడు వందల రూపాయలు మిగిలాయి.

దేశంలో మెజారిటీ రాష్ట్రాలలో బిజెపియే అధికారంలో ఉంది. అది లేని రాష్ట్రాలలో కూడా మద్దతుదారులు ఉన్నారు.ఎవరు అవునన్నా కాదన్నా అది పెద్ద పార్టీగా ఉంది. దీన్ని చూసి ఇంక మోడీ శాశ్వతం అని కొందరు చెబుతుంటే ఇప్పట్లో దిగిపోయే అవకాశం లేదని మరి కొందరు అంటున్నారు. ఎవరెంత కాలం ఉంటారో ఎవరూ చెప్పలేరు గనుక దాన్ని పక్కన పెడదాం. మోడీ భక్తులుగా మీ నుంచి ఈ ప్రభుత్వం ఎంత పిండుతున్నదో అభిమానులు తెలుసుకోవాలి. మోడీ విధానాలను వ్యతిరేకిస్తారా లేదా అనేది వేరే అంశం. మోడీ మీద మాకు అభిమానం ఉంది, పెట్రోలు రెండు వందలు, గ్యాస్‌ బండ రెండువేలు అయినా మాకేమీ ఇబ్బంది లేదు, అంటారా మీ ఇష్టం అని తప్ప ఇంకేమి చెప్పగలం !

చైనా 5జిపై బెదిరింపుల నుంచి ప్రలోభాలు, బుజ్జగింపులకు దిగిన అమెరికా !

Tags

, , ,

మన చుట్టూ జరుగుతున్నదేమిటి : ఐదవ భాగము

ఎం కోటేశ్వరరావు


ఏదైనా ఒక కంపెనీ తమ కంపెనీ ఉత్పత్తులు ఎంత గొప్పవో లేదా తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే లాభాలు ఎలా వస్తాయో చూడండి అంటూ దేశ విదేశాల్లో రోడ్‌ షోలను ఏర్పాటు చేయటం తెలిసిందే. ఇప్పుడు దానికి భిన్నంగా చైనా 5జి పరిజ్ఞానం, పరికరాలను గనుక మీరు తీసుకోకపోతే మేమిచ్చే శిక్షణ, రాయితీల గురించి తెలుసుకోండి అంటూ అమెరికా ఇప్పుడు రోడ్‌ షోలను నిర్వహిస్తోంది. ఇతర ధనిక దేశాలు కూడా అదే యోచనలో ఉన్నాయి. చైనా దగ్గర తీసుకుంటే జరిగే నష్టాలు ఇతర కంపెనీల నుంచి తీసుకుంటే కలిగే లాభాలు ఇవి అని రాజకీయ నేతలు, నియంత్రణ అధికారులు, ప్రభుత్వాలకు వివరించేందుకు అమెరికా యంత్రాంగం పుస్తకాల పంపిణీ, సమావేశాలను నిర్వహిస్తున్నదని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక రాసింది. చైనా హువెయి, జట్‌టిఇ తదితర కంపెనీల పరికరాలను కొనవద్దని గతంలో బెదిరించిన అమెరికా ఇప్పుడు ప్రలోభాలు, బుజ్జగింపులకు దిగింది. చైనా పరికరాల్లో ఆయా దేశాల సమాచారాన్ని తస్కరించే దొంగ చెవులు ఉన్నాయని ఇతర దేశాలను భయపెడుతోంది.


బ్రిటన్‌లో జూన్‌ 11-13వ తేదీలలో జరిగిన 47వ జి7 సమావేశాలు బి3డబ్ల్యు పధకాన్ని అమలు జరపాలని నిర్ణయించాయి. ఇది చైనా అమలు చేస్తున్న బెల్ట్‌ మరియు రోడ్‌ చొరవ (బిఆర్‌ఐ) పధకానికి పోటీగా అని చెప్పారు గనుక ప్రపంచం మరింత పురోగమిస్తుందని అందరూ భావించారు. వివరాలు ఇంకా వెల్లడిగాకున్నా కానీ దాని తీరు చూస్తే చైనా చొరవను నీరుగార్చే వ్యవహారంగా కనిపిస్తోంది. జి7 దేశాలు ప్రపంచాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాయి. దానిలో భాగంగా చైనా,రష్యా,బ్రెజిల్‌, మన దేశాన్ని పక్కన పెట్టాయి. వాటి భాషలో ఈ విషయాన్ని అంత సూటిగా చెప్పవు. ఆ సమావేశం విడుదల చేసిన ప్రకటనలో ఒక్క చైనా మీద మాత్రమే దాడి చేశారు. అక్కడ మానవహక్కులు లేవని, కరోనా మూలాలు అక్కడే, పర్యావరణాన్ని దెబ్బతీస్తోందంటూ దాడి సాగింది. అందరం కలసి కట్టుగా చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని సూటిగానే చెప్పాయి. జి7 దేశాలు మన సహజ భాగస్వాములని మన ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు గనుక మనకూ ” ఆ మహత్తర కార్యక్రమం ” లో ఏదో ఒక పాత్ర ఉంటుందన్నది స్పష్టం.


మధ్య, తూర్పు ఐరోపా దేశాలు గనుక చైనా బదులు ఇతర దేశాల టెలికాం పరికరాలు కొనుగోలు చేస్తే ఆర్ధిక సాయం చేసేందుకు వీలు కల్పించే బిల్లును మే నెలలో అమెరికా పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మీరు గనుక చైనా హువెయి పరికరాలను కొనుగోలు చేస్తే మిత్ర దేశాలైనప్పటికీ మా గూఢచారులు సేకరించిన సమాచారాన్ని అందచేయబోమని అమెరికా ఇతర దేశాలను బెదిరించింది. అయితే అది పని చేయకపోవటంతో బుజ్జగింపులకు పూనుకుంది, ఇప్పుడు ప్రలోభాలకూ పాల్పడుతోంది. అమెరికా వత్తిడికి లొంగిన జర్మనీ చాలా కాలం పాటు చైనా పరికరాలను తీసుకొనేందుకు ముందుకు రాలేదు. అయితే హువెయికి పోటీ కంపెనీలైన ఎరిక్స్‌న్‌, ఏబి, నోకియాలు అందచేసే పరికరాల ధర చాలా ఎక్కువగా ఉండటంతో అనేక దేశాలు ఎటూ మొగ్గకుండా తటపటాయిస్తున్నాయి. దీంతో అలాంటి దేశాల దగ్గర తగినంత సొమ్ము లేకపోతే అప్పులిస్తామంటూ అమెరికా ముందుకు వస్తోంది. అమెరికా చట్టాలు అభివృద్ది చెందుతున్న దేశాలకు రుణాలు ఇవ్వటానికి అంగీకరించవు, అయినప్పటికీ మినహాయింపు సవరణలు చేసి 50 కోట్ల డాలర్ల మేరకు రుణాలు ఇచ్చేందుకు సిద్దం చేశారు. అయితే హంగరీ, సెర్బియా వంటి దేశాలు చైనా కంపెనీ కేంద్రాలను తెరిచేందుకు అనుమతించాయి.


అమెరికా వత్తిళ్లను ఖాతరు చేయని జర్మనీ రెండు సంవత్సరాల తరువాత తమకు అన్ని కంపెనీలు ఒకటే అంటూ ఏప్రిల్‌ ఆఖరులో ఒక చట్టాన్ని చేసింది. తమ భద్రతా ప్రమాణాలను పాటించిన ఏ కంపెనీ ఉత్పత్తి అయినా తమకు సమ్మతమే, రక్షణ గురించి ఎలాంటి భయం లేదని ప్రకటించింది. తమ ప్రయోజనాలను ఫణంగా పెట్టి చైనా కంపెనీలకు వ్యతిరేకంగా అమెరికా చెప్పినట్లు నడుచుకోజాలమని జర్మనీ విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించాడు. జర్మనీ-చైనా తమ ప్రయోజనాలకు అనుగుణ్యంగా సహకరించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పాడు. కొన్ని ఐరోపా దేశాలు సంయక్తంగా టెలికాం సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించుకొనేందుకు ఏర్పాటు చేసిన పధకంలో పెట్టుబడి పెట్టిన జర్మనీ దాని వలన ఫలితం లేదని గ్రహించింది.


అభివృద్దిలో పోటీ బదులు చైనా నియంత్రణపై కేంద్రీకరించాలట !


ప్రపంచ సాంకేతిక పరిజ్ఞాన పరుగులో చైనాను నిరోధించేందుకు చతుష్టయ దేశాలు (అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌) ఉమ్మడిగా పని చేయాలని ముంబైలోని గేట్‌వే హౌస్‌ ఎకానమీ మరియు టెక్నాలజీ కార్యాచరణ సంస్ధ ప్రతినిధులు లిసా కర్టిస్‌, సూర్జిత్‌భల్లా సలహా ఇచ్చారు. చైనా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, కొన్ని ముఖ్యమైన ఖనిజ సంపదతో ప్రపంచ సరఫరా వ్యవస్ధలను నియంత్రించాలని చూస్తోందన్నది వారి ఆరోపణ. దానికి పోటీగా ఆర్ధిక, సాంకేతిక రంగాలలో నాలుగు దేశాలు, సహరించుకొని ఇతర దేశాలను కలుపుకోవాలని సలహా ఇస్తున్నారు. 5జి గురించి రెండు దేశాలూ సహకరించుకోవాలని డోనాల్డ్‌ట్రంప్‌-నరేంద్రమోడీ ఇద్దరూ గతంలో కబుర్లు చెప్పినా అడుగు గడపదాటలేదు. అసలు చతుష్టయ దేశాల దగ్గర ఆ పరిజ్ఞానమే లేదు, మరోవైపు చైనా ఆరవ తరం పరిజ్ఞానం గురించి ఆలోచనలు చేస్తున్నది. కీలకమైన సెమికండక్టర్ల రంగంలో అమెరికా వెనుకబడింది. మన దేశంలో సాంకేతిక నిపుణులు ఉన్నప్పటికీ వారికి పని లేదు, పెట్టుబడి పెట్టేవారూ లేరు. మన మేథావులు అమెరికా వెళితే వారికి వ్యక్తిగతంగా, అమెరికాకు లాభం తప్ప మనకు ప్రయోజనం లేదని గతం స్పష్టం చేసింది. మన వారిని ఆకర్షించటం తప్ప ముందే చెప్పుకున్నట్లు ఉమ్మడి పరిశోధనలకు అమెరికా వైపు నుంచి ఎలాంటి చొరవ లేదు. చైనా మాదిరి పరిశోధన-అభివృద్దికి కేటాయింపుల్లో మనం చాలా వెనుకబడి ఉన్నాము.

వివిధ రంగాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు.అయినప్పటికీ చైనా కంటే ఎంతో వెనుకబడే ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఎనిమిది సంవత్సరాలలో ఉపాధి కల్పనకు వివిధ రంగాలలో 2.25లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేయనున్నట్లు బైడెన్‌ ప్రకటించారు. ఇది ఏడాదికి 280 కోట్ల డాలర్లు. అయితే ఈ ఏడాది చైనా ప్రభుత్వం, స్ధానిక సంస్ధల ద్వారా 556 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తున్నారు. రానున్న సంవత్సరాలలో ఇదే ధోరణి కొనసాగినా అమెరికా కంటే ఎంతో ముందుంటుంది.పరిశోధన-అభివృద్ధికి గాను 180 బిలయన్‌ డాలర్లని అమెరికా పేర్కొన్నది, అయితే ఇవి ఏమూలకన్నది ప్రశ్న. అయితే అమెరికా ఎంతో అభివృద్ధి చెందిన దేశం. ఇప్పటికే మౌలిక సదుపాయాలు గణనీయంగా అభివృద్ధి చెందాయి, వాటికి పెద్ద ఎత్తున మరమ్మతులు తప్ప కొత్తగా ఏర్పాటు చేయాల్సినవి పెద్దగా ఉండవు. కనుక సహజంగానే చైనాలో ఏడాది కేడాది పెరుగుదల ఉంటుంది. అయితే మరి చైనా ప్రత్యేకత ఏమిటి అంటే గతేడాదినాటికి అక్కడ 38వేల కిలోమీటర్ల హై స్పీడు రైలు మార్గాలు ఉన్నాయి. ఇతర దేశాలతో పోల్చితే మూడవ వంతు ఖర్చుతో అక్కడ నిర్మిస్తున్నట్లు 2019లో ప్రపంచబ్యాంకు చెప్పింది.ఈ వ్యవస్ధ రవాణా ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది. అమెరికాతో పోల్చితే తలసరి ఉత్పత్తిలో చైనాలో ఆరోవంతు మాత్రమే ఉంది, అందువలన దాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. అందుకోసం పరిశోధన-అభివృద్ధికి చైనా పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది.

చైనా వద్దు గానీ లాభాలు మాత్రం ముద్దు !


చైనా విషయంలో అమెరికాతో జతకట్టిన ఐరోపా ధనిక దేశాలన్నీ ఒకటే. చైనా వద్దుగానీ దాని ద్వారా వచ్చే లాభాలు మాత్రం ముద్దు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇటలీలోని బార్సిలోనాలో జరిగిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ సమావేశంలో ఇది వెల్లడైంది. ఫ్రాన్స్‌లో అతి పెద్ద టెలికాం కంపెనీ పేరు ఆరెంజ్‌. చైనా పరికరాలను తమ దేశంలో వినియోగించవద్దని నిర్ణయించాం గానీ ఆఫ్రికాలో మాతో సంబంధాలున్న కంపెనీల్లో వాటిని వినియోగించటానికి సిద్దమే అని కంపెనీ స్టీఫెన్‌ రిచర్డ్‌ రాయిటర్‌ వార్తా సంస్దతో చెప్పాడు. ఆఫ్రికాలో యూరోపియన్లు పెట్టుబడులు పెట్టేందుకు విముఖంగా ఉన్నారు, చైనీయులు పెడుతున్నారు అని చెప్పాడు. ఆ ఖండంలోని అనేక దేశాల టెలికాం ఆపరేటర్లు చైనా పరికరాల మీద ఆధారపడుతున్నారు.అందువలన మేము చైనా కంపెనీలతో మంచి సంబంధాలను కలిగి ఉన్నామని దాపరికం లేకుండా చెప్పాడు. ఐరోపాలో ఇప్పుడు చైనా కంపెనీలతో కలసి 5జి నెట్‌వర్క్‌లను అభివృద్ది చేయటం ఎంతో కష్టం అన్నది వాస్తవం అన్నాడు. ఆరెంజ్‌ కంపెనీలో ఫ్రెంచి ప్రభుత్వానికి 23శాతం భాగస్వామ్యం ఉంది.


5జి గురించి ధనిక దేశాలు ఎందుకు ఇంతగా చైనాను దెబ్బతీయాలని చూస్తున్నాయి ? దీనిలో రాజకీయంంతో పాటు ఆర్ధికం కూడా ఇమిడి ఉంది. 2030 నాటికి ప్రపంచ జీడిపిలో 5జి ద్వారా 1.3లక్షల కోట్ల డాలర్ల ఆదాయం తోడవుతుందని ప్రైస్‌వాటర్‌ కూపర్‌ హౌస్‌ తాజా నివేదికలో పేర్కొన్నది.ఆరోగ్య, వినియోగదారుల, ఆర్ధికసేవలు, వస్తు తయారీ, మీడియా రంగాలలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉత్తర అమెరికా ఖండ దేశాల లబ్ది ఎక్కువగా ఉంటుంది. చైనా ఆర్ధిక వ్యవస్ధకు 220 బిలియన్‌ డాలర్లు తోడవుతాయని పేర్కొన్నది. ఎవరైనా అభివృద్ది చెందాలనుకుంటే చూసి నేర్చుకోమన్నారు తప్ప ఎదుటివారిని చూసి ఏడవమని, చెడగొట్టేందుకు ప్రయత్నించమని మన పెద్దలెవరూ చెప్పలేదు. అలాంటి వారు బాగుపడిన దాఖాలాలు కూడా లేవు. వారి శక్తుయుక్తులన్నీ తమ బాగుకోసం గాక ఇతరులను చెడొట్టేందుకు ఉపయోగిస్తే ఫలితం ఏముంటుంది ?

వందేండ్ల చైనా కమ్యూనిస్టు పార్టీ విజయాల ప్రాధాన్యత !

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో అనేక పార్టీలు పుట్టాయి, గిట్టాయి. అది పెద్ద విషయం కాదు, వంద పార్టీ జనాలకు ఏమి చేసిందనేదే గీటురాయి. ఈ నేపధ్యంలో జూలై ఒకటవ తేదీన వందవ వార్షికోత్సవం చేసుకోనున్న చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) గురించి అందరూ తెలుసుకోవటం అవసరం. వందేళ్ల చరిత్ర, విజయాలు, అనుభవాల వివరణకు పెద్ద గ్రంధమే అవసరం. చైనా సాధించిన విజయాల నుంచి జనాల దృష్టి మళ్లించేందుకు నిరంతరం కమ్యూనిస్టు వ్యతిరేకులు చేస్తున్న ప్రయత్నాలు ఈ సందర్భంగా మరీ ఎక్కువయ్యాయి.అక్కడ మానవ హక్కులు లేవు, ఏక పార్టీ నియంతృత్వం, ప్రశ్నిస్తే సహించరు. సోషలిస్టు వ్యవస్ధ కూలిపోతుంది, అభివృద్ది అంకెల గారడీ తప్ప నిజం కాదు అని చెబుతారు. అలాంటపుడు అలా చెప్పే దేశాలు, శక్తులు కూలిపోయేంతవరకు వేచి చూస్తే పోయేదానికి ఆందోళన ఎందుకు ? చతుష్టయ కూటములెందుకు, జి7 సమావేశాలెందుకు, చైనాను అడ్డుకోవాలనే సంకల్పాలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది ?


1948లో చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చినప్పటి నుంచి ఇలాంటి కబుర్లు చెబుతూనే ఉన్నారు. వాటిని ఒక చెవితో వింటూ ఒక కంట కనిపెడుతూనే చైనా తన పని తాను చేసుకుపోతూ అనేక విజయాలు సాధించింది. దీని అర్ధం చైనాకు ఎలాంటి సమస్యలూ లేవని కాదు. ఒక్కొక్క మెట్టూ అధిగమిస్తూ ముందుకు పోతున్నది. ఆ తీరు సామ్రాజ్యవాదులను బెంబేలెత్తిస్తున్నది. పూర్వపు సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా రాజ్యాల అనుభవాలు, గుణపాఠాలు తీసుకున్న సిపిసి నాయకత్వం తమవైన లక్షణాలతో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేస్తున్నది. కూల్చివేతకు గురైన సోషలిస్టు దేశాలలోని జనం తమ స్ధితిని పెట్టుబడిదారీ దేశాలలో ఉన్న పరిస్ధితినీ పోల్చుకున్నారు గనుకనే కమ్యూనిస్టు వ్యతిరేకుల పని సులభమై ఆ వ్యవస్ధలను కూలదోశారు. అయితే చైనీయులు కూడా పోల్చుకోవటం సహజం. తాము ఉత్పత్తి చేసిన సరకుల మీద అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు ఆధారపడ్డాయని, ఆ ఎగుమతులు తమ జీవితాలను మెరుగుపరిచాయని కూడా వారికి తెలుసు. ఇలాంటి అనుభవం సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాల వారికి లేదు. అప్పుడు సోషలిజం విఫలమైందనే ప్రచారం అమెరికాలో జరిగితే ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే చర్చ రోజు రోజుకూ పెరుగుతోంది. తాము సాధిస్తున్న విజయాలు పశ్చిమ దేశాల మీద మిగిలి ఉన్న భ్రమలను చైనీయుల్లో క్రమంగా తొలగిస్తున్నాయి.


మొదటి ప్రపంచ యుద్దంలో సామ్రాజ్యవాదుల పట్ల చైనా ప్రభుత్వ మెతక వైఖరికి నిరసనగా 1919లో విద్యార్ధులు, మేథావులు తీవ్రంగా స్పందించారు. చైనాలోని కొన్ని ప్రాంతాలను జపాన్‌ ఆధీనంలో ఉంచేందుకు అంగీకరించటం ఆగ్రహం కలిగించిది. దానికి నిరసనగా మే నాలుగవ తేదీన ప్రదర్శనలు నిర్వహించారు. రష్యాలో బోల్సివిక్‌ విప్లవం, ప్రధమ శ్రామిక రాజ్యం ఏర్పడటం వంటి పరిణామాలు కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటుకు పురికొల్పాయి. మే నాలుగు ఉద్యమంలో భాగస్వాములైన మేథావులు ప్రపంచ విప్లవం, మార్క్సిజం భావజాలంతో స్పూర్తి పొందారు. రష్యన్‌ కమ్యూనిస్టు ఓటిన్‌స్కీ 1920 ఏప్రిల్‌ నెలలో చైనా వచ్చి అక్కడి మేథావులను కలిసి చర్చలు జరిపారు. షాంఘైలో దూర ప్రాచ్య కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ శాఖను ఏర్పాటు చేశారు. దాని ఫలితమే షాంఘై రివల్యూషనరీ బ్యూరో లేదా కమ్యూనిస్టు గ్రూప్‌ ఏర్పాటు, అధ్యయన తరగతులు నిర్వహించారు.1921 జూలై 1న చైనా కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారు. తరువాత జూలై 23-31వ తేదీల మధ్య పార్టీ వ్యవస్దాపక మహాసభ జరిగింది.

కేవలం యాభై మంది సభ్యులతో ప్రారంభమైన పార్టీ ప్రధమ మహాసభకు మావో జెడాంగ్‌తో సహా ప్రతినిధులు పన్నెండు మంది మాత్రమే. అది కూడా షాంఘైలోని ఫ్రాన్స్‌ భూభాగంలో ఒక ఇంట్లో జరిగింది. దాన్ని పసిగట్టిన ఫ్రెంచి పోలీసులు సభను అడ్డుకోవటంతో పక్కనే ఉన్న ఒక నదిలో విహార యాత్రీకుల పడవలోకి మార్చారు. అయితే ఆ సమావేశానికి అప్పటికే ప్రముఖ కమ్యూనిస్టు మేధావిగా, చైనా లెనిన్‌గా పేరు గాంచిన చెన్‌ డూక్సీ హాజరు కాలేకపోయినప్పటికీ పార్టీ కార్యదర్శిగా ఎన్నికైయ్యారు.1927వరకు ఆ బాధ్యతల్లో కొనసాగారు. చైనా జాతియోద్యమనేత సన్‌యేట్‌ సేన్‌ కమ్యూనిస్టు కాకపోయినప్పటికీ కమ్యూనిస్టు భావజాలానికి అనుకూలం. చైనా కమ్యూనిస్టులు ఆయన నాయకత్వంలోని కొమింటాంగ్‌ పార్టీతో కలసి పని చేయటమే గాకుండా జాతీయవాదులను కమ్యూనిస్టులుగా మార్చేందుకు పని చేశారు. ఒక దశలో ఆ పార్టీకి కమ్యూనిస్టులే నాయకత్వం వహిస్తారా అన్న స్దితిలో 1925లో సన్‌ఏట్‌ సేన్‌ మరణించారు. తరువాత చాంగ్‌కై షేక్‌ కొమింటాంగ్‌ పార్టీ, ప్రభుత్వ అధినేతగా ఎన్నికయ్యాడు. సన్‌యేట్‌ సేన్‌ మరణించేంతవరకు తన కమ్యూనిస్టు వ్యతిరేకతను దాచుకున్న చాంగ్‌ పార్టీనేతగా మారగానే కమ్యూనిస్టులను పక్కన పెట్టటం ప్రారంభించాడు. పశ్చిమదేశాలకు దగ్గరయ్యాడు.1927 నాటికి కమ్యూనిస్టుల అణచివేతకు పూనుకున్నాడు.


చైనా విప్లవం ఏ పంధాలో నడవాలనే అంశంపై 1925లోనే పార్టీలో చర్చ జరిగింది. కార్మికవర్గ నాయకత్వాన జరగాలని చెన్‌ డూక్సీ ప్రతిపాదించగా చైనాలో ఉన్న పరిస్ధితిని బట్టి రైతాంగం ఆధ్వర్యాన జరగాలని మావో ప్రతిపాదించాడు. కొమింటాంగ్‌ పార్టీతో ఎలా వ్యవహరించాలనే అంశంపై కూడా చెన్‌ వైఖరి వ్యతిరేకంగా ఉంది. చాంగ్‌కై షేక్‌ కమ్యూనిస్టులను వ్యతిరేకించినప్పటికీ ఆ పార్టీలోని అనేక మంది కమ్యూనిస్టులతో సఖ్యతగా ఉన్నారు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం చెన్‌ వైఖరిని తప్పు పట్టింది. చివరికి 1929లో పార్టీ నుంచి బహిష్కరణకు గురై తరువాత ట్రాట్సీయిస్టుగా మారిపోయాడు. చాంగ్‌కై షేక్‌ను ప్రతిఘటించే క్రమంలోనే కమ్యూనిస్టుల లాంగ్‌ మార్చ్‌ తరువాత 1948లో అధికార హస్తగతం తెలిసిందే.
దారిద్య్రం నుంచి 77 కోట్ల మందిని బయట పడవేయటం 50 కోట్ల మంది మధ్యతరగతి జనాల వినియోగశక్తిని పెంచటం చైనా కమ్యూనిస్టు పార్టీ సాధించిన పెద్ద విజయం. కమ్యూనిజం మీద వ్యతిరేకత ఉన్నా, దాన్ని కూల్చివేయాలని కోరుతున్నా బహుళజాతి సంస్ధలన్నీ చైనాలో పెట్టుబడులు పెట్టటం, వాణిజ్యానికి ముందుకు రావటం వెనుక ఉన్న కారణం అదే. వీటికి తలుపులు తెరిచే సమయంలోనే సంస్కరణలకు ఆద్యుడిగా ఉన్న డెంగ్‌సియావో పింగ్‌ ఒక మాట చెప్పారు. కిటికీలు తెరిచినపుడు మంచి గాలితో పాటు ఈగలు, దోమలు కూడా వస్తాయి, అయితే వాటిని ఎలా నిరోధించాలో కూడా మాకు తెలుసు అన్నారు.


గత పద్దెనిమిది నెలలుగా కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కుదిపి వేస్తుండగా దాన్ని అరికట్టటం, కొద్ది నెలల్లోనే తిరిగి సాధారణ ఆర్ధిక, సామాజిక జీవనాన్ని పునరుద్దరించటం చైనా కమ్యూనిస్టు పార్టీ సాధించిన అతి పెద్ద విజయం. మన దేశంలో కరోనా సోకిన వారు ఆసుపత్రులపాలై ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులు పడ్డారో, ఎలాంటి సామాజిక సంక్షోభంతో సతమతమౌతున్నారో మనం నిత్యం చూస్తున్నాం. సమర్ధవంతమైన చర్యల ద్వారా చైనీయులకు అటువంటి పరిస్ధితి నుంచి కమ్యూనిస్టు పార్టీ కాపాడింది. అందుకే అంతర్జాతీయ సంస్ధలు జరిపిన సర్వేలో 95శాతం మందికిపైగా జనం కమ్యూనిస్టు పార్టీ పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు నూటపది కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ వేయటం చిన్న విషయం కాదు. ఈ విజయాలు సాధించటం వెనుక 9.2 కోట్ల మంది సిపిసి సభ్యుల పాత్ర ఉంది.2008లో ధనిక దేశాలలో ప్రారంభమైన సంక్షోభం చైనా మీద ప్రభావం చూపింది. అయితే దాన్ని అధిగమించేందుకు మౌలిక సదుపాయాలు, శాస్త్ర, సాంకేతిక, మానవ వనరుల రంగాలలో పెద్ద ఎత్తున చైనా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి త్వరలోనే దాన్ని అధిగమించింది. ఆ పెట్టుబడులు ఇప్పుడు వివిధ రంగాలలో చైనా విజయాలను ప్రపంచానికి వెల్లడించుతున్నాయి. టెలికాం రంగంలో 5జి, మొబైల్‌ చెల్లింపులు, ఇ కామర్స్‌, కృత్రిమ మేథ, రోబోటిక్స్‌, రోబో కార్లు,హైస్పీడ్‌ రైల్వేలు, అంతరిక్ష రంగం, అధునాతన ఆయుధాల తయారీలో నేడు చైనా కొత్త వరవడిని సృష్టిస్తోందంటే దాని వెనుక చోదకశక్తి చైనా కమ్యూనిస్టు పార్టీ తప్ప మరొకటి కాదు.

చైనా తొలి పంచవర్ష ప్రణాళిక 1953లో ప్రారంభమైంది. సోవియట్‌ యూనియన్ను చూసి ఈ విధానాన్ని ప్రారంభించిన చైనా త్వరలోనే దానిలో ఉన్న లోపాలు, పొరపాట్లను గమనించింది. చైనాకు తగిన విధంగా ప్రణాళికలకు రూపకల్పన చేసింది.1981-90 మధ్య జిడిపిని రెట్టింపు, తరువాత పది సంవత్సరాలో దానికి రెట్టింపు లక్ష్యంతో ప్రణాళికలను రూపొందించారు. ప్రపంచ వాణిజ్య సంస్ధలో ప్రవేశించకుండా ఆర్ధిక కార్యకలాపాలను విస్తరించేందుకు అవకాశాలు లేవని గుర్తించారు. దాంతో అంతకు ముందు అనుసరించిన ప్రణాళికాబద్ద విధానంతో పాటు కొద్ది మార్పులు చేసి సోషలిస్టు మార్కెట్‌ ఆర్ధిక వ్యవస్ధగా మార్చి 2001లో ప్రవేశం పొందారు. 2049 నాటికి అంటే సోషలిస్టు వ్యవస్ధ వందవ సంవత్సరంలో ప్రవేశించే నాటికి ఆధునిక సోషలిస్టు రాజ్యంగా రూపొందాలనే లక్ష్యంతో పని చేస్తున్నది. చైనా సాధించిన వృద్ధి ఏదో ఒక ఏడాదిలో వచ్చింది కాదు. సంస్కరణలు ప్రారంభించిన పది సంవత్సరాల తరువాతనే ఫలితాలనివ్వటం ప్రారంభమైంది.
1960లో ప్రపంచ జిడిపిలో చైనా వాటా 4.4శాతం, 1970లో 3.1, 1980లో 1.7, 1990లో 1.6, 2000లో 3.6, 2010లో 9.2, 2020లో 18.34శాతం ఉంది.సంస్కరణల్లో భాగంగా తలుపులు తెరిచినపుడు కమ్యూనిస్టు పార్టీలోనే ప్రతిఘటన ఎదురైంది. ఇవి చివరకు పెట్టుబడిదారీ విధానం వైపు దారి తీస్తాయోమో అన్నదే దాని వెనుక ఉన్న ఆందోళన. 1982లో షెంజన్‌లోని షెకావ్‌ పారిశ్రామిక ప్రాంతంలో విదేశీయుడిని వాణిజ్య మేనేజర్‌గా నియమించేందుకు తీసుకున్న నిర్ణయం మీద తీవ్ర విమర్శ వచ్చింది. వెంటనే డెంగ్‌సియావో పింగ్‌ జోక్యం చేసుకొని దాన్ని సమర్ధించారు,అదేమీ దేశద్రోహ వైఖరి కాదు అన్నారు. చైనా అమలు జరిపిన విధానాలను చూసి పశ్చిమ దేశాల వారు, కొందరు వామపక్ష అభిమానులు కూడా ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం అని ప్రచారం చేశారు. నిజానికి అది పెట్టుబడిదారీ విధానమే అయితే నేడు ఇతర పెట్టుబడిదారీ దేశాలు మన వంటి దేశాలను కూడా కలుపుకొని కలసికట్టుగా వారి మీద దాడి చేయాల్సిన అవసరం ఏముంది ?

గత ఆరు దశాబ్దాలలో చైనాలో వచ్చిన మార్పును వివిధ దేశాల జిడిపితో పోల్చినపుడు ఎలా ఉందో దిగువ చూడవచ్చు. విలువ బిలియన్‌ డాలర్లలో.
దేశం ××× 1960×× 1970×× 1980××× 1990××× 2000×××× 2010×××× 2020
చైనా ××× 59.7 ×× 92.6×× 191.1×××360.9×××1211.3 ×× 6,087.2 ××16,640
జపాన్‌ ×××44.3××212.6 ××1,105.4××3,132.8××4,887.5 ×× 5,700.1 ×× 5,378
బ్రిటన్‌ ××× 73.2××130.7 ××564.9 ××1,093.2 ××1,657.8×× 2,475.2 ×× 3,120
అమెరికా ××543.3 ×1,073.3××2,857.3××5,963.5××10,252.3××14,992.1××22,680


జపాన్‌ అభివృద్ది గురించి లొట్టలు వేసుకుంటూ వర్ణించినంత ఆనందంగా చైనా గురించి మీడియా గానీ మరొకరు గానీ చెప్పలేదు. కారణం ఏమంటారు ? కరోనా రెచ్చిపోయిన 2020 సంవత్సరంలో చైనా గురించి ఎవరెన్ని కథలు చెప్పినా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టే వారు పొలోమంటూ చైనాకే వెళ్లారు. చైనాకు 163 బిలియన్‌ డాలర్లు రాగా అమెరికాకు 134 బిలియన్‌ డాలర్లు వచ్చాయి. తరువాత పరిస్దితి మెరుగుపడితే తిరిగి అమెరికాయే మొదటి స్ధానానికి చేరవచ్చు. తొలి రోజుల్లో జనానికి అవసరమైన ఉపాధి, ఆహారం, అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం గురించి చైనా కమ్యూనిస్టుపార్టీ తొలి రోజుల్లో కేంద్రీకరించింది. ఇప్పుడు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం మీద కేంద్రీకరించింది. అమెరికా వంటి ధనిక దేశాలకు అదే కంటగింపుగా మారింది.

నిర్మలమ్మ తాయిల పొట్లంలో ఏముంది ? ఎంత మేరకు ప్రయోజనం !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు మన ప్రధాని నరేంద్రమోడీ గారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గారితో ఒక తాయిల పొట్లాన్ని పంపారు. దాని విలువ 6.29లక్షల కోట్ల రూపాయలని చేసిన ప్రకటనపై మిశ్రమ స్పందన వెలువడింది. వాణిజ్య, పారిశ్రామికవేత్తలు స్వాగతించారు.గతంలో ప్రకటించిన అంశాలనే కొత్త రంగు కాగితాల్లో చుట్టి చూపటం తప్ప కేంద్ర ప్రభుత్వం చేసే అదనపు ఖర్చేమీ లేదని సిపిఎంనేత సీతారామ్‌ ఏచూరి వ్యాఖ్యానించారు. ఇంకా మరికొన్ని వ్యాఖ్యలు కూడా వెలువడ్డాయి. గత ఏడాది ప్రకటించిన 20లక్షల కోట్ల ఆత్మనిర్భర పాకేజ్‌ వలన జనానికి, పారిశ్రామిక వాణిజ్య రంగాలకు జరిగిన మంచేమిటో ఇంతవరకు చెప్పిన వారెవరూ లేరు. ఇప్పుడు ఇది కూడా అలాంటి వట్టి విస్తరి మంచినీళ్లేనా ?


నిర్మలమ్మ దేశం ముందుంచిన పొట్లంలో ఏముందో విప్పి చూద్దాం. 1.కరోనా ప్రభావిత రంగాలకు రుణ హామీ నిమిత్తం రు.1.10లక్షల కోట్లు.2.అత్యవసర రుణాల హామీగా రు.1.5లక్షల కోట్లు. 3. విద్యుత్‌ పంపిణీదార్లకు ఆర్ధిక సాయం రు.97,631 కోట్లు, 4. ఉచిత ఆహార ధాన్యాలకు రు.93,869 కోట్లు, 5.ఎగుమతి బీమా నిమిత్తం రు.88,000 కోట్లు, 6.ఎగుమతుల ప్రోత్సాహం కోసం రు.33,000 కోట్లు, 7. అదనపు ఎరువుల సబ్సిడీ రు.14,775 కోట్లు, 8.నూతన ఆరోగ్య పధకం రు.15,000 కోట్లు, 9. గ్రామీణ ఇంటర్నెట్‌కోసం రు.19,041 కోట్లు,10. విదేశీ పర్యాటకులకు ఉచిత వీసాల నిమిత్తం రు.100 కోట్లు, 11.ఈశాన్య ప్రాంత వ్యవసాయ కార్పొరేషన్‌కు రు.77 కోట్లు దీనిలో ఉన్నాయి. వీటిలో గతంలో ప్రకటించిన ఆహార సబ్సిడీ, ఎరువుల సబ్సిడీ రు.1,08,644 కోట్లు పోతే ఐదు లక్షల 21వేల కోట్లే కొత్తవి.


మహమ్మారి అయినా మాంద్యం వచ్చినా రెండు రకాల పనులు చేయాల్సి ఉంటుందని అనేక దేశాల అనుభవాలు వెల్లడించాయి. మన ప్రభుత్వానికి అవేమైనా పట్టాయా అన్నదే అర్ధంగాని విషయం. తక్షణమే ఉపశమనం కలిగించేవి, దీర్ఘకాలంలో ఉపయోగపడే వృద్ధికి అవసరమైనవి. జనానికి నగదు అందచేస్తే తక్షణ గిరాకీ పెరుగుతుంది. ఉచిత నగదు అంటే దాని అర్దం అది వస్తు డిమాండ్‌ను పెంచేదే తప్ప సోంబేరులను తయారు చేసేది కాదు. అత్మనిర్భర, తాజా తాయిలంలో అవి ఉన్నాయా అంటే లేవు. జనాలకు ఉచితంగా కొన్ని కిలోల బియ్యం లేదా గోధుమలు ఇస్తే చాలదు. కేరళలో మాదిరి బియ్యంతో పాటు వంటకు అవసరమైన పప్పులు, నూనెలు, ఇతర వస్తువులను కూడా అందచేసినపుడే ప్రయోజనం ఉంటుంది.


విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఐదు లక్షల మందికి వీసాలు ఉచితంగా ఇస్తాం రమ్మంటున్నారు. వీసా ఉచితంగా వచ్చింది కదా అని ఎవరైనా వచ్చి ఖరీదైన కరోనాను తగిలించుకుంటారా ? అనేక రాష్ట్రాలు పరీక్షలను సమగ్రంగా లేదా పెద్ద సంఖ్యలో చేయటం లేదు. వ్యాధిగ్రస్తులు, మరణాలను లెక్కల్లో చూపటం లేదు. కొత్త రకం వైరస్‌ వ్యాప్తి జరుగుతున్న నేపధ్యం. పోనీ వాక్సిన్లు వేసి వ్యాధి నిరోధక చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు. మన దేశంలోని జనాలే మరో చోటుకు పోవాలంటే భయపడుతున్న స్ధితిలో పొలో మంటూ విదేశీయులు వస్తారా ? అందువలన పర్యాటక రంగానికి 60వేల కోట్లు అప్పులిప్పిస్తామంటున్నారు. ఇప్పటికే కుదేలైన ఈ రంగం వాటిని తీసుకొని ఏమి చెయ్యాలి అన్నది సమస్య.


మన ప్రజారోగ్య వ్యవస్ధను ఎంత పటిష్టం గావించాలో కరోనా మహమ్మారి వెల్లడించింది. దానికి అవసరమైన చర్యలు తీసుకోవటం ద్వారా జనాల జేబులు గుల్లకాకుండా చూడవచ్చు. రాష్ట్రాలకు ఆమేరకు నిర్ధిష్టంగా సాయం ప్రకటించి ఉంటే అది వేరు. మూడవ తరంగం, అది పిల్లలను ప్రభావితం చేయనుందనే భయాల నేపధ్యంలో అత్యవసర ఏర్పాట్లకు ప్రకటించింది కేవలం పదిహేను వేల కోట్ల రూపాయలే అవి ఏమూలకు వస్తాయి. వైద్య రంగంలో పెట్టుబడులకు వడ్డీ రేటు తక్కువకు 50వేల కోట్ల రూపాయలను చిన్న పట్టణాలలో ఆసుపత్రుల ఏర్పాటుకు అప్పులిప్పిస్తామని నిర్మలమ్మ హామీ ఇచ్చారు. దాని వలన జనానికి ఆరోగ్య ఖర్చు పెరుగుతుంది తప్ప తగ్గేదేమీ ఉండదు. అనేక కార్పొరేట్‌ ఆసుపత్రులు కొంత శాతం పేదలకు ఉచితంగా సేవలు అందిస్తామని చెప్పి రాయితీలు పొంది వాటిని ఎగనామం పెట్టటమే గాకుండా వారు కొనుగోలు చేసిన వైద్య యంత్రాలకు అవసరమైన సమిధలుగా రోగులను మార్చటాన్ని, లాభాలు పిండటాన్ని చూస్తున్నాము.


మన ఆర్ధిక వ్యవస్ధలో ఎంఎస్‌ఎంఇల ప్రాధాన్యత గురించి చెప్పనవసరం లేదు. గతేడాది ఆత్మనిర్భర పధకం ప్రకటించే సమయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి దగ్గర కొనుగోలు చేసిన వస్తువులకే లక్షల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు వెల్లడైంది. ఇప్పటికీ వాటికి ఎంత బకాయి ఉన్నదీ, ఏడాది కాలంలో ఎంత చెల్లించిందీ స్పష్టత లేదు. రెండు నుండి మూడులక్షల కోట్ల మేరకు బకాయి ఉన్నట్లు చెబుతుంటే కేంద్ర ప్రభుత్వం చెల్లించినట్లు చెబుతున్న మొత్తం పదిశాతం కూడా లేదు. ఇంకా బకాయిలు పన్నెండువేల కోట్లకు మించి లేవని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు ప్రకటించిన పాకేజ్‌ కూడా ఇప్పటికే రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రికార్డు ఉన్నవారికే హమీ అనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరోవైపు కొనుగోలు శక్తి పడిపోయిన స్దితిలో గిరాకీయే లేదంటుంటు రుణాలు ఎవరు తీసుకుంటారు, ఉత్పత్తి చేసిన సరకులను ఎక్కడ అమ్ముకుంటారు ?

రుణ హామీ పధకాల గత ఏడాది ప్రకటించిన పరిమితుల విస్తరణే తప్ప కొత్తవేమీ లేవు. అదే విధంగా కొత్తగా ఉపాధి కల్పించే సంస్ధలకు ప్రభుత్వమే రెండు సంవత్సరాల పాటు పిఎఫ్‌ చెల్లించే పధకాన్ని మరో తొమ్మిది నెలలు పాడిగించారు. రానున్న ఐదు సంవత్సరాలలో ఎగుమతుల ప్రోత్సాహకానికి 88వేల కోట్లు ప్రకటించారు. ఉత్పత్తి, ఎగుమతులతో ముడిపడిన ఎలక్ట్రానిక్‌ వస్తువుల కోసం ప్రవేశపెట్టిన ఈ పధకం కొత్తదేమీ కాదు. దాని వలన ఇప్పటి వరకు నిర్ధిష్టంగా పెరిగిన ఎగుమతులేమిటో తెలియదు.


ఎంఎస్‌ఎంఇ రంగం పన్నెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.జిడిపిలో 30శాతం, ఎగుమతుల్లో 40శాతం ఈ రంగం నుంచే ఉన్నాయి. ఈ రంగంలోని కన్సార్టియం ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్స్‌(సిఐఏ) జూన్‌ 24న ప్రకటించిన సర్వే ప్రకారం 88శాతం మైక్రో లేదా చిన్న సంస్ధలు గతేడాది ప్రకటించిన పాకేజ్‌ను ఉపయోగించుకోలేదని తేలింది. ఈ రంగంలో ఉపాధి పొందుతున్న వారు నాలుగు కోట్ల మంది ఉన్నారు.వారికి భవిష్యత్‌ మీద ఆశలేదు.ప్రపంచ బ్యాంకు చెప్పిన దాని ప్రకారం 6.3 కోట్ల ఎంఎస్‌ఎంఇ సంస్దలుంటే వాటిలో కేవలం 50లక్షలు మాత్రమే ప్రభుత్వ పధకాల నుంచి ఆర్ధిక సాయం పొందాయి.పొందాయి.కరోనా రెండవ తరంగంలో కేవలం ఐదోవంతు సంస్దలు మాత్రమే బతికి బట్టకడతాయని లోకల్‌ సర్కిల్స్‌ సర్వే వెల్లడించింది. నలభైశాతం సంస్దలు నెల రోజుల కంటే బతకలేవని తేలింది.

కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతున్న ఈ కాలమంతా లక్షలాది ప్రజలు తమ ఆదాయాలను, జీవనోపాధిని కోల్పోయారు. ఈ సమయంలో ప్రపంచంలోని చాలా ప్రభుత్వాలు తమ దేశాల్లో సార్వత్రిక నగదు బదిలీ ద్వారా ప్రజలను ఆదుకున్నాయి. అమెరికా ప్రభుత్వం తాజాగా ఆరులక్షల కోట్ల డాలర్ల పాకేజ్‌ను అమలు జరపాలని ప్రతిపాదించింది. దానిలో నగదు బదిలీతో పాటు శాశ్వత ఆస్ధుల కల్పన వంటి చర్యలున్నాయి. నరేంద్రమోడీ సర్కార్‌ అలాంటి ఆలోచనలో లేదు.


ద్రవ్యలోటును అదుపులో ఉంచే పేరుతో ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు,ఐఎంఎఫ్‌ ఆదేశించిన మేరకు కొన్ని స్వయం పరిమితులు విధించుకుంది. అయినా మే 2021లో టోకుధరలు 12.94 శాతం, రిటైల్‌ ధరలు 6.3 శాతం పెరిగాయి. జనానికి నగదు బదులు ఆ మొత్తాన్ని కార్పొరేట్‌ రంగానికి పన్ను రాయితీగా ఇస్తే లాక్‌డౌన్‌ అనంతర కాలంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికి ఆస్కారం కలుగుతుందని గతేడాది ప్రభుత్వం చెప్పింది. కాని ఏప్రిల్‌ నెలలో 4.3 శాతం వ ద్ధి రేటు ఉన్న పారిశ్రామిక వస్తూత్పత్తి రంగం మే నెల వచ్చేసరికి 3.1 శాతానికి పడిపోయింది. ఈ కాలంలో రూపాయి మారకపు రేటు మరింత తగ్గిపోయింది. ప్రభుత్వం చెప్పిందో, దానికి పూర్తి వ్యతిరేక దిశలో ఫలితాలు వస్తున్నాయి.

నగదు బదిలీ వామపక్షాలో, లేదా ఇతర మేథావులో చెబుతున్నదే కాదు, సిఐఐ చైర్మన్‌ నరేంద్రన్‌ రూ.3 లక్షల కోట్ల ఉద్దీపన పథకాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అందులో నగదుబదిలీ కూడా ఒక అంశం. కాబట్టి నగదు బదిలీ అనేది ఇప్పుడు ఆర్థికవేత్తలు, ప్రతిపక్షపార్టీలు, పౌర సంఘాలు మాత్రమే గాక పెట్టుబడిదారులు కూడా సమర్ధిస్తున్న ప్రతిపాదన. దీని వలన వస్తు డిమాండ్‌ పెరిగితేనే వారి ఉత్పత్తులకు మార్కెట్‌ ఉంటుందన్నది దీని వెనుక ఉన్న భావం. కొటాక్‌ మహింద్రా బ్యాంక్‌ యజమాని ఉదయ కొటాక్‌ ద్రవ్యలోటు పెంచాలని గట్టిగా చెప్పడమే గాక, అందుకోసం అదనంగా కరెన్సీని కూడా ముద్రించాలని సూచించారు. కోవిడ్‌-19 కారణంగా చనిపోయినవారి కుటుంబాలకు పరిహారం చెల్లించేది లేదని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొంది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన లెక్కలనే ప్రమాణంగా తీసుకుంటే కోవిడ్‌ మరణాలు దేశంలో 4 లక్షలకు మించవు. ఒక్కొక్క మరణానికి రు. 4 లక్షల పరిహారం చెల్లించాలంటే రూ.16,000 కోట్లు అవుతుంది.ఈ మాత్రం సొమ్ము కేంద్రం దగ్గర లేదా ?


సిఎంఐఇ అధ్యయనం ప్రకారం, జూన్‌ 13తో ముగిసిన వారంలో నిరుద్యోగిత రేటు 12 శాతానికి చేరుకుంది. పట్టణ ప్రాంతాల్లో, రేటు చాలా అధికంగా దాదాపు 15 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది దాదాపు 11 శాతంగా ఉంది. జనవరిలో ఉద్యోగుల సంఖ్య 40.1 కోట్లుగా అంచనా. మే నాటికి 36.6 కోట్లకు తగ్గింది. 2021లో లాక్‌డౌన్ల వల్ల ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన వారిలో అత్యధికులు రోజువారీ ఆదాయంపై ఆధారపడిన పేదలే. ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలలో రోజువారీ వేతన కార్మికులు 1.72 కోట్లకు పైగా ఉద్యోగాలు, ఆదాయాలు కోల్పోయారు. వేతనాలు, వ్యాపారరంగంపై ఆధారపడిన వారు ఈ రెండు నెలల్లో 90 లక్షల మంది తీవ్రంగా నష్టపోయారు. ఇవన్నీ ప్రధానంగా పట్టణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.


గత ఏడాది మాదిరిగానే వ్యవసాయ రంగంలోనూ ఉద్యోగావకాశాలు కుంచించుకుపోయాయి. నిర్మాణ రంగంపై ఆధారపడిన తక్కువ వేతనంతో పనిచేసే అసంఘటితరంగ కార్మికులు గత రెండు నెలల్లో 88 లక్షల మంది ఉపాధి కోల్పోయారని సిఎంఐఇ అంచనా వేసింది. దీంతోపాటు తీవ్రంగా ప్రభావితమైన తయారీరంగంలో 42 లక్షల ఉద్యోగాలు పోయాయి. ఆతిథ్య రంగంలో 40 లక్షలు, వాణిజ్య రంగంలో 36 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.


ప్రజల కోసం ప్రభుత్వ నిధులను ఖర్చు చేయాలని వామపక్షాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, అనేక ప్రజా సంఘాలు, కాంగ్రెస్‌ కూడా డిమాండ్‌ చేసింది. పన్ను చెల్లించని అన్ని కుటుంబాలకు ప్రతి నెలా కనీసం రూ.7,500 చెల్లించాలని డిమాండ్‌ చేశాయి. ఇది ప్రస్తుతం అందజేస్తున్న రేషన్‌కు అదనంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కనీసం 10 కిలోల ఆహార ధాన్యం, పప్పుధాన్యాలు, ఇతర సరకులు ఇవ్వటం ద్వారా జనాలు తక్షణం ఉపశమనం పొందుతారు, కొనుగోలు శక్తి పెరుగుతుంది. నిర్మలమ్మ తాయిలాల పొట్లంలో అలాంటివేమీ లేవు.

చమురు మంత్రి ప్రధాన్‌ తీరు తెన్నులు : డాంబికాలు పోవద్దురో డింగరీ డంగై పోతావు !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


చాలా మందికి అశ్చర్యం కలిగిస్తున్నదీ, అర్ధం గాని విషయం ఏమంటే బిజెపి జనాలు ఏ ధైర్యంతో పచ్చి అవాస్తవాలను, వక్రీకరణలను ఇంకా ప్రచారం చేయగలుగుతున్నారు అన్నది. జనానికి చమురు వదిలిస్తున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పెట్రోలు, డీజిలు ధరల పెరుగుదలకు దిగుమతుల మీద ఆధారపడటం, గత కాంగ్రెస్‌ ప్రభుత్వం జారీ చేసిన చమురు బాండ్లే అని మరోసారి చెప్పారు. కాంగ్రెస్‌ యాభై సంవత్సరాలలో చేయలేని వాటిని తాము ఐదు సంవత్సరాల్లోనే చేశామని చెప్పుకున్న పార్టీకి చెందిన వ్యక్తి ఇలా మాట్లాడటం ఏమిటి అని ఎవరికైనా తట్టిందా ? ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరగటం కదా !


ఇంతకీ గత ఏడు సంవత్సరాలలో ” దేశభక్తులు ” భారతీయ చమురు ఉత్పిత్తిని ఎంత పెంచారో చెప్పగలరా ? 2022 నాటికి దేశం చమురు దిగుమతులను పదిశాతం తగ్గించాలని 2015లో ప్రధాని నరేంద్రమోడీ లక్ష్య నిర్ధేశం చేశారు.2014-15లో మన దేశం వినియోగించే చమురులో 78.6శాతం దిగుమతులపై ఆధారపడి ఉంది.యుపిఏ పాలన చివరి ఏడాది 2013-14లో మన దేశీయ ముడిచమురు ఉత్పత్తి 37,788 మిలియన్‌ టన్నులు.అది 2019-20 నాటికి 32.173 మి. టన్నులకు పడిపోయింది. ఇది పద్దెనిమిది సంవత్సరాలలో కనిష్ట రికార్డు, 2020-21లో మోడీ సర్కార్‌ తన రికార్డును తానే తుత్తునియలు గావించి 30,5 మిలియన్‌ టన్నులకు తగ్గించేసింది. 2019-20 ఏప్రిల్‌-ఫివ్రబరి మాసాల వరకు ఉన్న సమాచారం ప్రకారం విదేశీ దిగుమతుల మీద ఆధారపడింది 86.7శాతం.( కరోనా కారణంగా వినియోగం పడిపోయింది కనుక దిగుమతులు కూడా తగ్గి ఇప్పుడు 85శాతానికి పైగా ఉంది.) దీనికి కూడా నెహ్రూ, కాంగ్రెసే కారణమా, బండబడ చెవుల్లో పూలు పెట్టుకొని వినేవాళ్లుండాలే గానీ ఎన్ని పిట్ట కథలైనా వినిపించేట్టున్నారుగా !

ఇదే ధర్మేంద్ర ప్రధాన్‌ గారి తీరుతెన్నులను చూస్తే లేస్తే మనిషిని గాను అని బెదిరించే కాళ్లు లేని మల్లయ్య కథను గుర్తుకు తెస్తున్నారు. చలి కాలంలో చమురు డిమాండ్‌ ఎక్కువ ఉంటుంది, వేసవి వచ్చిన తరువాత ధరలు తగ్గుతాయని కూడా మంత్రి సెలవిచ్చారు. తగ్గకపోగా రోజూ పెరుగుతున్నాయి. ఇన్నేండ్లుగా ఉన్న కేంద్ర మంత్రికి మార్కెట్‌ తీరుతెన్నులు ఆ మాత్రం తెలియదా లేక తెలిసి కూడా జనాన్ని జోకొట్టేందుకు అలా చెబుతున్నారా ? ఆదివారం ఉదయం (జూన్‌ 27) బ్రెంట్‌ రకం ముడి చమురు పీపా ధర 76.18 డాలర్లు ఉంది, అమెరికా రకం 74.05, మనం కొనుగోలు చేసేది 74.24 డాలర్లు ఉంది. ఇరాన్‌తో ముదురుతున్న అణువివాద నేపధ్యంలో ఎప్పుడైనా 80 డాలర్లు దాట వచ్చన్నది వార్త.


చమురు ఉత్పత్తి దేశాలు ముఖ్యంగా పశ్చిమాసియా దేశాలు ధరలను తగ్గించని పక్షంలో ” చమురు ఆయుధాన్ని ” వినియోగిస్తామని 2015 నుంచీ మంత్రి ప్రధాన్‌ బెదిరిస్తూనే ఉన్నారు. తాజాగా ఏప్రిల్‌ నెలలో మాట్లాడుతూ మధ్యప్రాచ్య దేశాల మీద ఆధారపడటాన్ని తగ్గించాలని చమురుశుద్ధి సంస్ధలను కోరారు. ” చమురు అమ్ముకొనే వారికి భారత్‌ పెద్ద మార్కెట్‌, వారు మా గిరాకీని, అదే విధంగా దీర్ఘకాలిక సంబంధాలను గమనంలో ఉంచుకోవాలని ” బెదిరించారు. సౌదీ తదితర దేశాలను దారికి తెచ్చే పేరుతో ఇప్పటికే అమెరికా చమురు కంపెనీల ప్రలోభాలకు లొంగిపోయి అక్కడి నుంచి చమురు కొనుగోలు చేయటం ప్రారంభించారు. నాలుగు సంవత్సరాల క్రితం ట్రంప్‌ అధికారంలోకి రాక ముందు మన చమురు దిగుమతుల్లో అమెరికా వాటా కేవలం 1.2శాతం మాత్రమే ఉండేది. అలాంటిది ట్రంప్‌తో నరేంద్రమోడీ కౌగిలింతల స్నేహం కుదిరాక ట్రంప్‌ దిగిపోయే సమయానికి 4.5శాతానికి పెరిగింది. మన డాలర్ల సమర్పయామీ, ఆయాసం మిగిలింది తప్ప మనకు ఒరిగిందేమీ లేదనుకోండి. అందుకే మన ప్రధాన్‌ గారు ఎన్ని హెచ్చరికలు చేసినా ఆ పెద్ద మనిషి మాటలకు అంత సీన్‌లేదులే, అయినా మా మీద అలిగితే ఎండేది ఎవరికో మాకు తెలుసు అన్నట్లుగా సౌదీ అరేబియా మంత్రిగానీ, అధికారులు గానీ ఖాతరు చేయలేదు. మిగతా దేశాలూ అంతే.

తాజాగా జూన్‌ 24న ఈ పెద్దమనిషే చమురు ధరలతో తట్టుకోలేకపోతున్నాం, మా ఆర్ధిక పరిస్ధితి కోలుకోవటం కష్టంగా ఉంది కనికరించండి అన్నట్లుగా చమురు ఉత్పత్తి-ఎగుమతి(ఒపెక్‌) దేశాల సంస్ధకు వేడుకోళ్లు పంపారు. ధరలు సరసంగా ఉంటే మీకూ మాకూ ఉపయోగం ఉంటుంది అని అర్ధం చేసుకోండీ అన్నారు. లీటరు రెండు వందలైనా సరే చెల్లిస్తాం-దేశభక్తిని నిరూపించుకుంటాం అంటున్న మోడీ వీరాభిమానుల మనోభావాలను దెబ్బతీయటం తప్ప ఏమిటంటారు.( వీరి కోసం కాషాయ పెట్రోలు బంకులను తెరిచి ఆ ధరలకు విక్రయించే ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి లేదా ప్రతి చోటా కొన్ని ప్రత్యేక బంకులను బిజెపి కార్యకర్తలకే కేటాయించాలి) బెదిరింపులనే ఖాతరు చేయని వారు సుభాషితాలను పట్టించుకుంటారా ? నరేంద్రమోడీ గారూ మీరైనా నోరు విప్పండి లేకపోతే ప్రధాన్‌ నోరైనా మూయించండి ! బడాయి మాటలతో చమురు మంత్రి దేశం పరువు గంగలో కలుపుతున్నారు, జనంలో నవ్వులాటలు ప్రారంభమయ్యాయి. వంద రూపాయలు దాటినా నిరసనగా వీధుల్లోకి వచ్చేందుకు సిగ్గుపడుతున్నారు గానీ అంతిమంగా నష్టపోయేది మీరే, ఆపైన మీ ఇష్టం !

సామాజిక మాధ్యమంలో సంఘపరివార్‌ మరుగుజ్జులు(ట్రోల్స్‌) తిప్పుతున్న ఒక పోస్టర్‌లో మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ జారీ చేసిన 1.3లక్షల కోట్ల చమురు బాండ్ల అప్పుడు మోడీ సర్కార్‌ను అప్పుల ఊబిలో దింపిందని గుండెలు బాదుకున్నారు. దానిలో చెప్పిందేమిటి ?2005 నుంచి 2010వరకు పెట్రోలు ధరలను తక్కువగా ఉంచేందుకు నాటి ప్రభుత్వం చమురుబాండ్లు జారీ చేసింది. ఆ బాండ్లతో చమురు కంపెనీలు రుణాలు తీసుకొనే వీలు కలిగినందున చమురు ధరలను తక్కువగా ఉంచాయి. యుపిఏ కాలం నాటి 20వేల కోట్ల రూపాయల చమురు బాండ్లను ఇప్పుడు మోడీ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోంది. రానున్న ఐదు సంవత్సరాలలో యుపిఏ ప్రభుత్వ బాండ్లకు గాను 1.3లక్షల కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంది. నిరర్దక ఆస్తులు, యుపిఏ అవకతవకలకు ఇప్పుడు మోడీ ప్రభుత్వం, పన్ను చెల్లింపుదార్లు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఈ వాదన ఎంతో వీనుల విందుగా ఉంది కదూ !


ఇందులో చెప్పని, మూసిపెట్టిన అంశం ఏమంటే వాజ్‌పారు నాయకత్వంలోని ఎన్‌డియే ప్రభుత్వం కూడా చమురు బాండ్లను జారీ చేసింది. చమురు వినియోగదారులకు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ మొత్తాన్ని చమురు కంపెనీలకు చెల్లించాలి. గతంలో అలాంటి సబ్సిడీల సొమ్మునే చెల్లించలేక సమర్ధ వాజ్‌పాయి, అసమర్ద మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌లు బాండ్ల రూపంలో(జనం ఎవరికైనా అప్పుపడితే ప్రామిసరీ నోట్లు రాసిస్తారు కదా ) ఇచ్చారు. వారందరినీ తలదన్ని 56 అంగుళాల ఛాతీ గలిగిన నరేంద్రమోడీ ఎవడొస్తాడో రండి అంటూ పూర్తిగా సబ్సిడీ ఎత్తివేశారు. మన్మోహన్‌ సింగ్‌ గారి ” చెడు ” రోజులు చివరిలో లేదా నరేంద్రమోడీ గారి ” మంచి రోజుల ” ప్రారంభంలో లీటరు పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వ పన్ను రూ.9.48, 3.56 చొప్పున ఉంటే తరువాత ఇప్పుడు రూ.32.98, 31.83 చొప్పున వసూలు చేస్తున్నారు. లీటరు మీద ఒక రూపాయి పన్ను లేదా ధర పెంచినా కేంద్రానికి ఏటా పదిహేను వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుంది. నరేంద్రమోడీ ఎంత గొప్పవ్యక్తో ఇతర ప్రపంచ నేతలతో పోల్చితే అది దేశభక్తి, ప్రజలపై భారాలను పోల్చితే అది దేశద్రోహం. సరే బిజెపి వారు చెబుతున్నట్లుగా గతంలో ఇచ్చిన సబ్సిడీలను జనం నుంచి వసూలు చేసేందుకే పన్ను విధించారని అంగీకరిద్దాం. రాబోయే ఐదు సంవత్సరాలలో వడ్డీతో సహా 1.3లక్షల కోట్ల మేరకు అదనపు భారం పడింది కనుక, నరేంద్రమోడీ అంతమొత్తాన్ని సర్దుబాటు చేయలేని అసమర్ధతతో ఉన్నారు కనుక మనం తీసుకున్నదాన్ని మనమే చెల్లిద్దాం.


కానీ మన నుంచి వసూలు చేస్తున్నది ఎంత ? జేబులను పూర్తిగా ప్రభుత్వానికి అప్పగిద్దామా ? మన తేల్‌ మంత్రి మహౌదరు ధర్మేంద్ర ప్రధాన్‌ పార్లమెంట్‌ సాక్షిగా చెప్పిన సమాచారం ప్రకారం 2013లో పెట్రోలు, డీజిలు మీద యుపిఏ సర్కార్‌ వసూలు చేసిన పన్ను మొత్తం రు.52,537 కోట్లు, అది 2019-20 నాటికి 2.13లక్షల కోట్లకు చేరింది. ఆ మొత్తం 2020-21 ఆర్ధిక సంవత్సరంలో పదకొండు నెలలకు రు.2.94లక్షల కోట్లకు పెరిగింది. ఈ లెక్కన రాబోయే 1.3లక్షల కోట్ల మన్మోహన్‌ సింగ్‌ అప్పు చెల్లించటానికిగాను మన నరేంద్రమోడీ గారు ఇప్పటికి వసూలు చేసిన కొన్ని లక్షల కోట్లను పక్కన పెడితే, పన్నులేమీ తగ్గించేది లేదని కరాఖండిగా చెబుతున్నారు కనుక ఏటా మూడు లక్షల కోట్ల వంతున వచ్చే ఐదేండ్లలో పదిహేను లక్షల కోట్ల రూపాయలు వసూలు చేయబోతున్నారు. ఇదే విషయాన్ని ” దేశద్రోహులు ” ప్రశ్నిస్తే లడఖ్‌ సరిహద్దుల్లో మిలిటరీ ఖర్చుకు, చైనాతో యుద్ద సన్నాహాలకు మనం చెల్లించకపోతే డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటూ మరుగుజ్జులు వెంటనే కొత్త పల్లవి అందుకుంటారు. పోనీ ఆపేరుతోనే పన్ను వేయమనండి ! బిజెపి వారి ఆదర్శం ఔరంగజేబు విధించాడని చెబుతున్నట్లు జట్టు పెంచితే పన్ను తీస్తే పన్ను అన్నట్లుగా ఏదో ఒక పేరుతో వేయమనండి. మధ్యలో మన్మోహనెందుకు, కాంగ్రెస్‌ ఎందుకు ? చిత్తశుద్ది, నిజాయితీలేని బతుకులు ! జనం పట్టించుకోకపోతే ఇవే కబుర్లు పునరావృతం అవుతాయి మరి !

కరోనా మరణాలను దాచని రాష్ట్రం కేరళ ఒక్కటే !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


కేరళలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ కూటమి ప్రభుత్వం అనేక అంశాలలో ముఖ్యంగా కరోనా నిరోధంలో చేస్తున్న కృషికి ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. రెండవ తరంగంలో అక్కడ పెద్ద ఎత్తున కేసులు పెరిగిన నేపధ్యంలో సామాజిక మాధ్యమాల్లో సంఘపరివార్‌ మరుగుజ్జులు రెచ్చిపోయారు. కేరళ ఆదర్శం అన్నారు, కేసులు ఎందుకు పెరిగాయంటూ తమదైన పద్దతిలో ప్రచార దాడి చేశారు. దానికి కొందరు బలైపోయి ఉంటారు. అక్కడి ప్రభుత్వం పట్ల సానుకూలంగా వ్యవహరించే వారిలో కూడా ఎందుకిలా పెరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తమైన మాట నిజం. శత్రువులు ఎలా చూసినా మిత్రులు ఎలా ఆవేదన చెందినప్పటికీ కేరళ జనం వాటిని పట్టించుకోలేదు. పాలకులు, ప్రభుత్వ చిత్తశుద్దిని విశ్వసించి చరిత్రను తిరగరాస్తూ రెండో సారి అధికారాన్ని కట్టబెట్టారన్నది తెలిసిందే. ఆ రాష్ట్రముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కరోనా గురించి విలేకర్లతో మాట్లాడినన్ని రోజులు, నిర్వహించిన పత్రికా సమావేశాలు దేశంలో మరొకరెవరూ చేయలేదు. దేన్నీ దాచుకోలేదు,కేసులు ఎలా పెరగబోయేదీ ఆయనే చెప్పారు.


అన్నింటికంటే ముఖ్యవిషయం ఏమంటే దేశంలో మిగతా రాష్ట్రాలలో మాదిరి కరోనా మరణాలను, కేసులను కేరళ ప్రభుత్వం మూసిపెట్టలేదు. అలాచేసిన రాష్ట్రాలలో పరిస్ధితి ఎలా పాచిపోయిందో చూస్తున్నాము. సమాచార హక్కు కింద హిందూ పత్రిక సేకరించిన అధికారిక వివరాలు మరణాలను తక్కువ చేసి చూపిన రాష్ట్రాల బండారాన్ని బయటపెట్టాయి. కేరళ గురించి కూడా ఆ పత్రిక రాసిన విశ్లేషణ మరోసారి పినరయి ప్రభుత్వ నిజాయితీని నిర్ధారించింది. ఎక్కడైనా సాధారణ మరణాల రేటుకు ఒక ఏడాది ఒకటో రెండు శాతాలో ఎక్కువో తక్కువ ఉండవచ్చు. కరోనా మహమ్మారి కారణంగా జరిగిన మరణాలు అధికారిక లెక్కలకు ఎక్కినా వాటిని కరోనా ఖాతాలో చూపలేదన్నదే అసలు సమస్య. తెలంగాణా వంటి చోట్ల అలాంటివి పది రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే కేరళలో నూటికి నూరుశాతం మరణాలు నమోదవుతున్నాయా అంటే లాక్‌డౌన్‌,తదితర అనేక కారణాలతో సహజమరణాలు కూడా కొన్ని సకాలంలో నమోదు కావటం లేదనే అభిప్రాయం ఉంది.
కేరళ విషయానికి వస్తే ఏటా నమోదౌతున్న సాధారణ మరణాల కంటే కరోనా సమయంలో మరణాల సంఖ్య తగ్గింది.

రాజధాని తిరువనంతపురంలో 2020 ఏప్రిల్‌ నుంచి 2021 మేనెల వరకు కరోనా మరణాలు 765 కాగా ఇదే కాలంలో సాధారణ మరణాలతో సహా మొత్తం మీద 646 తగ్గాయి. 2015 నుంచి 2019 వరకు సగటున ఏటా నగరంలో మరణాలు 16,652 కాగా 2020లో కరోనా ఉన్నప్పటికీ 14,734 మాత్రమే నమోదయ్యాయి. కరోనాను పక్కన పెట్టి మరణాల పెరుగుదల రేటును పరిగణనలోకి తీసుకున్నప్పటికీ 18,340 వరకు పెరగాల్సింది, తగ్గాయి. ఒక్క రాజధాని నగరమే కాదు, మొత్తం రాష్ట్రంలో 2019తో పోల్చితే 2020లో 11.1శాతం తగ్గాయి. అయితే తాజా వివరాల ప్రకారం ఆ తగ్గుదల 7.9శాతంగా ఉంది. అంటే ఈ ఏడాది మరణాలు కొద్దిగా పెరిగాయి. అవి కరోనా మరణాలన్నది అధికారిక అంకెలే చెబుతున్నాయి. కేరళ మరణాల నమోదు నిబంధనల ప్రకారం మరణించిన 21 రోజుల్లోపల స్ధానిక సంస్ధలలో నమోదు చేసుకోవాలి. లేనట్లయితే ఆ ప్రక్రియ సంక్లిష్టం అవుతుంది. అందువలన ఆస్ధి, ఇతర వివాదాలు లేని మరణాలు నమోదు కాకపోవచ్చు. 2020లో లాక్‌డౌన్‌ కారణంగా సకాలంలో నమోదు ప్రక్రియ ఉండే శ్మశానాలలో తప్ప బయటివి నమోదు కానందున అధికారికంగా మరణాలు తగ్గినట్లు కనిపించవచ్చన్నది కూడా కొందరి అభిప్రాయం. దానిలో వాస్తవం కూడా ఉండవచ్చు.


కేరళలో మరణాల రేటు తగ్గటం అనేది ఇప్పుడే జరిగింది కాదు. గతంలో కూడా అలాంటి ధోరణి వ్యక్తమైంది. 2013లో రాష్ట్రంలో 2,53లక్షలు నమోదు కాగా 2014లో 12,621, 2015లో 3,920 తక్కువగా నమోదయ్యాయి. దీనికి రాష్ట్రంలో ఆరోగ్య సూచికల మెరుగుదల వలన సగటు జీవిత కాలం ఏడాదికేడాది పెరుగుతున్నది.అందువలన మరణాలు తగ్గుతాయి. 2021 జనవరి నుంచి మేనెలాఖరు వరకు పౌర నమోదు వ్యవస్ధ(సిఆర్‌ఎస్‌)లో ఉన్న సమాచారం మేరకు మొత్తం మరణాలు 1,13,372గా ఉన్నాయి. ఒక సంస్ధ చేసిన విశ్లేషణ ప్రకారం 2015 నుంచి 2019వరకు ఉన్న వివరాల ప్రకారం ప్రతి ఏటా జనవరి-మే మాసాల మధ్య మరణించిన సగటు సంఖ్య 98,387. దీని ప్రాతిపదికన చూస్తే ఈ ఏడాది ఐదు నెలల్లో నమోదైన అధిక మరణాలు 14,535 అని, ఇదే సమయంలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన కరోనా మరణాలు 6,700గా ఉన్నందున 8,867 నమోదు గాని కరోనా మరణాలు అని, అయితే అవి ఇతర రాష్ట్రాలతో పోల్చితే చాలా తక్కువ అని సదరు సంస్ధ పేర్కొన్నది. పైన పేర్కొన్న సంవత్సరాలలో మేనెల సగటు మరణాలు 19,600 అని ఈ ఏడాది మేనెలలో 28వేలుగా ఉన్నాయని వ్యాఖ్యానించింది.కేంద్ర ప్రభుత్వ సిఆర్‌ఎస్‌ సమాచారం ప్రకారం 2015-19 సంవత్సరాల మధ్య సగటు మరణాలు 1,08,425 మాత్రమే. దీని ప్రకారం చూస్తే అదనపు మరణాలు 4,950 మాత్రమే.

వివిధ మీడియా సంస్ధల విశ్లేషణ ప్రకారం కర్ణాటకలో 2021 జనవరి – జూన్‌ 15వ తేదీ మధ్య 1.02లక్షల మరణాలు నమోదయ్యాయి. అవి అధికారిక లెక్కల కంటే ఐదు రెట్లు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌లో జనవరి-మే మాసాల మధ్య 1.3లక్షలు నమోదు కాగా అవి అధికారికంగా ప్రకటించిన వాటి కంటే 34 రెట్లు ఎక్కువ. తమిళనాడులో 1.29లక్షలు అదనం, అధికారిక లెక్కల కంటే 7.5 రెట్లు అదనం, తెలంగాణాలోని హైదరాబాదులో అధికంగా నమోదైనవి 14,332. కేరళలో అనేక మంది మరణించిన కుటుంబ సభ్యులను గృహ ప్రాంగణాలలోనే సమాధి చేస్తారని, అలాంటి వారు నమోదు చేయటం, ధృవీకరణ పత్రాలు తీసుకోవటం గానీ చేయరని, 2020లో లాక్‌డౌన్‌ కారణంగా నమోదు గణనీయంగా తగ్గి ఉండవచ్చన్నది ఒక అభిప్రాయం. 2018లో సాధారణ పరిస్ధితిలోనే సకాలంలో మరణ నమోదుశాతం 62శాతమే ఉంది.

రాజధానుల వివరాలను మాత్రమే చూస్తే కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రభుత్వం ప్రకటించిన కరోనా మరణాలు 13,346 కాగా అక్కడ సాధారణం కంటే ఎక్కువగా నమోదైనవి 31,029 ఉన్నాయి. అలాగే చెన్నయిలో 7,091కిగాను 29,910 ఉన్నాయి. హైదరాబాదులో సాధారణం కంటే 32,751 ఎక్కువ ఉన్నాయి. పైన చెప్పుకున్నట్లుగా తిరువనంతపురంలో 765 కరోనా మరణాలు ఉన్నా మొత్తంగా 645 తగ్గాయి. ఈ ఏడాది జనవరి నుంచి కరోనా మరణాలు గణనీయంగా పెరిగినట్లు కార్పొరేషన్‌ వివరాలు వెల్లడించాయి. వీటిలో పొరుగునే ఉన్న గ్రామాలు, కొల్లం జిల్లా, తమిళనాడు నుంచి చికిత్సకోసం వచ్చి మరణించిన వారు కూడా ఉన్నారు. అలాంటి ఉదంతాలు మిగతా రాష్ట్రాలలో కూడా ఉండవచ్చు.


సహజమరణాలు తగ్గటానికి జనాలు ఇండ్లకే పరిమితం కావటంతో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గటం, న్యుమోనియా, ఫ్లూ, నీరు, బయటి ఆహార సంబంధ వ్యాధులు పరిమితం కావటం దోహదం చేశాయని భావిస్తున్నారు. అన్నింటి కంటే వెంటనే స్పందించే ప్రజారోగ్య సౌకర్యాలు, ప్రభుత్వ ఆసుపత్రుల వ్యవస్ధ, వాటిని పని చేయించే, పట్టించుకొనే రాజకీయ నాయకత్వం ప్రధాన కారణం. అక్షరాస్యత, విద్యావంతులు ఎక్కువగా ఉండటం వెంటనే స్పందించటం, పరీక్షలు, గుర్తించటం కూడా మిగతా చోట్లతో పోలిస్తే ఎక్కువే.కరోనా కారణంగా కేరళలో రోడ్డు ప్రమాద మరణాలు గణనీయంగా తగ్గాయి. మిగతా రాష్ట్రాలలో కూడా అదే జరిగి ఉండవచ్చు.2016-19 సంవత్సరాల మధ్య ఏడాదికి సగటున 4,290 మంది మరణించగా 2020లో 2,979, ఈ ఏడాది జూన్‌ 21వరకు 1,423 నమోదయ్యాయి.


అనేక రాష్ట్రాలలో జరుగుతున్న మాదిరే కేరళలో కూడా కొన్ని తేడాలు ఉండవచ్చు. ఉదాహరణకు కరోనా వచ్చి తగ్గిపోయిన తరువాత ఇతర కారణాలతో మరణిస్తే లేదా కరోనా లక్షణాలు లేనందున గుర్తించటంలో పొరపాటు గావచ్చు, మరణించిన తరువాత కరోనా అని తేలితే దాన్ని ఏ తరగతి కింద నమోదు చేయాలి అన్నది అందరికీ అవగాహన కూడా లేకపోవచ్చు. ఇటీవల సుప్రీం కోర్టు కరోనా మరణ ధృవీకరణ పత్రాల జారీని సులభతరం చేయాలని సూచించింది. ఆమేరకు అనేక రాష్ట్రాలలో కరోనా మరణాల సంఖ్యలను సవరిస్తున్నారు. కేరళలో కూడా అదే జరగవచ్చు, అయితే కేసులు స్వల్పంగా పెరుగుతాయి తప్ప మిగతా రాష్ట్రాలలో మాదిరి అసాధారణంగా ఉండవు. కేసులు, మరణాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలతో పోల్చితే వాటిని దాచని రాష్ట్రం కేరళ ఒక్కటే అన్నది స్పష్టం.

కరోనా మరణాల విషయానికి వస్తే ప్రస్తుతం దేశంలో 1.3శాతం ఉండగా కేరళలో అది 0.44శాతమే ఉంది. దేశంలో వాస్తవ మరణాలను లెక్కిస్తే దేశ సగటు గణనీయంగా పెరుగుతుంది.కేరళలో తొలి దశలో కేసులు, మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ రెండవ దశలో ఎక్కువగా ఎందుకు పెరిగాయన్నది పరిశీలించాల్సిన అంశం అయితే, దేశంతో పోల్చినపుడు మరణాలు తక్కువగా ఉండటం గమనించాల్సిన అంశం. తొలి దశలో మాదిరే రెండవ దశలో కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కేసులు పెరిగాయి. ఆ దామాషాలో మరణాలు పెరగలేదు. రెండవ దశలో వేగంగా విస్తరించే డెల్టా రకం వైరస్‌ వ్యాప్తి ఒక కారణం అని కొందరు నిపుణులు చెబుతున్నారు. మరణాలు ఎక్కువగా ఉండటానికి ఆరోగ్య వ్యవస్ధ మీద వత్తిడి పెరగటం అన్నవారు కొందరు. కేవలం నలభై రోజుల్లోనే రెండవ దశలో మరణాలు గణనీయంగా ఉన్నాయి. ఇతర ఆరోగ్య సమస్యలతో ఇండ్ల దగ్గరే మరణించిన వారి వివరాలు కొన్ని ప్రభుత్వ వ్యవస్ధలో ఇంకా చేరాల్సి ఉండవచ్చని, అయినప్పటికీ సగటు, వాస్తవ మరణాల మధ్య తేడా తగ్గుతుందే తప్ప పెరిగే అవకాశం లేదన్నది కొందరి అభిప్రాయం. మిగతా రాష్ట్రాలలో మాదిరి కేరళ ప్రభుత్వం కూడా వివరాలను మూసి పెట్టి ఉంటే అక్కడి ప్రభుత్వాన్ని నిరంతరం స్కాన్‌ చేసి చూసే మీడియా ఈ పాటికి రచ్చ రచ్చచేసి ఉండేది. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చి కేరళలో కూడా వాస్తవ మరణాలు ఎక్కువ ఉండవచ్చని అమెరికా సంస్ద చేసిన విశ్లేషణను అక్కడి పత్రికలు ప్రకటించాయి తప్ప స్వంత కథనాలు లేవు.


కరోనా అనాధలకు ప్రభుత్వ ఆదరణ !


కరోనా కారణంగా తలిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాధలైన పిల్లలను ఆదుకొనేందుకు కేరళ ప్రభుత్వం మూడు రకాలుగా ఆదుకోవాలని నిర్ణయించింది. ప్రతి ఒక్కరి పేరు మీద మూడు లక్షల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తారు. డిగ్రీ వరకు చదువుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. అప్పటి వరకు నెలకు రెండు వేల రూపాయల చొప్పున గుర్తింపు పొందిన సంరక్షకులు-పిల్లల సంయుక్త బ్యాంకు ఖాతాలో జమ చేస్తారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి చెప్పారు. ఈ వివరాలను ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియచేసింది. కరోనాతో నిమిత్తం లేకుండా తలిదండ్రులలో ఒకరు మరణించినా, కరోనాతో మరొకరు మరణించి అనాధలైన పిల్లలకు కూడా ఈ పధకం వర్తిస్తుంది. ప్రస్తుతం ఇద్దరూ మరణించిన పిల్లలు 74 మంది ఉండగా, ఎవరో ఒకరు మరణించిన వారు వెయ్యి మంది ఉన్నారు.


కన్నూరులో సిపిఎం వినూత్న ప్రచార కార్యక్రమం !


కన్నూరు జిల్లాలో సిపిఎం వినూత్న కార్యక్రమం చేపట్టింది.” కొటేషన్‌ మాఫియా ”, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా జూలై ఐదున 3801 కేంద్రాలలో సాయంత్రం ఐదు గంటలకు పెద్ద ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి ఎంవి జయరాజన్‌ ప్రకటించారు. కేరళకు చెందిన వారు గల్ఫ్‌, ఇతర దేశాలలో ఉపాధి కోసం వెళ్లే వారు పెద్ద సంఖ్యలో ఉన్న విషయం తెలిసిందే. వారు తాము మిగుల్చుకున్న పొదుపుతో బంగారం, హవాలా పద్దతిలో నల్లధనాన్ని కేరళకు తీసుకువస్తారు. అలాంటి వాటిని విదేశాల నుంచి పంపి విమానాశ్రయాలు, ఇతర చోట్ల నుంచి తీసుకొని సంబంధిత వ్యక్తులకు చేర్చేందుకు ప్రయివేటు వారిని వినియోగించుకుంటారు. వీరినే కొటేషన్‌ గ్యాంగ్‌ అంటారు. ఇవి లెక్కల్లో చూపనివి కనుక అంతా నమ్మకం, రహస్య పద్దతుల్లో జరుగుతుంది. ఈ బలహీనతలను సొమ్ము చేసుకొనేందుకు ఇవే కొటేషన్‌ గ్యాంగులు ప్రయత్నిస్తాయి. ఉదాహరణకు ఒక కొటేషన్‌ గ్యాంగ్‌ మనుషులు బంగారం, డబ్బు తీసుకు వస్తున్న విషయాన్ని మరో గ్యాంగు పసికట్టిందనుకోండి. దారి మధ్యలో మొదటి గ్యాంగు నుంచి వాటిని కొట్టివేస్తారు. ఇలాంటి వారు నేరగాండ్లుగా, ముఠానేతలుగా మారి పెద్ద ఎత్తున సంపాదించి ఆస్తులు సమకూర్చుకున్నవారున్నారు. బాధితులు ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేరు. ఈ వ్యవహారాల్లో ముఠాల మధ్య వివాదాలు చెలరేగి హింసాత్మక చర్యలకు పాల్పడటం, కొందరు మధ్యవర్తులుగా రంగంలోకి దిగటం, దుండగులు రాజకీయ పార్టీలను ఆశ్రయించటం పరిపాటిగా మారింంది.


అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిజెపి నేతలు పెద్ద ఎత్తున కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన కోట్ల రూపాయలు ఈ మార్గాన ఇలాంటి కొటేషన్‌ గ్యాంగుల ద్వారా తెచ్చినవే. రాష్ట్రబిజెపి నేతలు గిలగిల్లాడిపోతున్న కొడక్కర హవాలా సొమ్ము దోపిడీ ఉదంతం దీనిలో భాగమే. ఒక ముఠా తెస్తున్న సొమ్మును మధ్యలో ఒక ముఠా అడ్డగించి సొమ్మును అపహరించింది. మూడున్నర కోట్ల రూపాయల వరకు పోగొట్టుకున్నవారు కేవలం ఇరవై అయిదు లక్షల రూపాయల దోపిడీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసు తీగలాగటంతో డొంకంతా కదిలి ఇంకా పెద్ద మొత్తంలోనే చేతులు మారినట్లు, ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు బయటపడుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి మీదే ఈ సంబంధిత కేసు నమోదైంది. అనేక మంది యువకులు ఇలాంటి ముఠాల్లో చేరి నేరపూరిత చర్యల ద్వారా సులభంగా డబ్బు సంపాదించి తెల్లవారే సరికి పెద్దవారై పోవాలని చూస్తున్నారు. అందువలన తలిదండ్రులు తమ బిడ్డలు ఏమి చేస్తున్నారు, నేరగాండ్ల చేతుల్లో చిక్కుతున్నారా, విలాస వంతమైన జీవితం లేదా విచ్చల విడిగా ఖర్చు చేస్తుంటే వారికి ఆ సొమ్ము ఎలా వస్తున్నదీ చూసుకోవాల్సిన, జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని వివరిస్తూ సిపిఎం జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించనుంది. కొటేషన్‌ మాఫియా నిర్వాహకులు సమాజంలో గౌరవనీయ వ్యక్తులుగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ తమ లావాదేవీలను పెంచుకొనేందుకు కుటుంబాలతో సంబంధాలను పెట్టుకుంటారు. వివాహాల వంటి సామాజిక, కుటుంబ కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాల్లో భాగస్వాములౌతారు. వాటి మాటున తమ నేరాలను కప్పి పుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఇలాంటి వారందరినీ సమాజం నుంచి వేరు చేయాలని సిపిఎం కోరింది.


మహిళా కమిషన్‌ అధ్యక్షురాలి రాజీనామా !


కేరళ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు ఎంసి జోసఫిన్‌ రాజీనామా చేశారు. ఒక న్యూస్‌ ఛానల్‌ నిర్వహించిన ప్రత్యక్ష ప్రసారంలో అత్తింటి వేధింపులకు గురైన ఒక యువతి చేసిన ఫిర్యాదు సందర్భంగా స్పందించిన తీరు రాష్ట్రంలో తీవ్ర విమర్శలు, నిరసనలకు గురైంది. వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశావా అని జోసఫిన్‌ అడిగినపుడు లేదు అని యువతి సమాధానం చెప్పింది. అయితే అనుభవించు అని జోసఫిన్‌ చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది. ఒక తల్లి మాదిరి అలా అన్నానే తప్ప మరొక విధంగా కాదని, తన వ్యాఖ్యకు విచారిస్తున్నానని ఆమె ప్రకటించారు. అయినా నిరసనలు ఆగలేదు, ఈ లోగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గం ఈ అంశాన్ని చర్చించి పదవికి రాజీనామా చేయాలని ఆదేశించటంతో శుక్రవారం నాడు ఆ మేరకు ప్రకటన చేశారు. జోసఫిన్‌ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. రాష్ట్రంలో చాలా కాలం తరువాత వరకట్న వేధింపులకు విస్మయి అనే యువతి బలైన ఉదంతం ఇదే సమయంలో రాష్ట్రంలో తీవ్ర సంచలనం కలిగించి, నిరసనలు వెల్లడవుతున్న సమయంలో ఆమె చేసిన వ్యాఖ్య సామాజిక మాధ్యమం, రాజకీయ, మహిళా సంఘాల నుంచి తీవ్ర విమర్శలకు గురైంది.

చైనాతో ట్రంప్‌ చెలగాటం – బైడెన్‌కు ప్రాణ సంకటం !

Tags

, , , , ,


మన చుట్టూ జరుగుతున్నదేమిటి – 4

ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో నిత్యం అనేక కుట్ర సిద్దాంతాలు, వాటికి అనుగుణ్యంగా కట్టుకథలు-పిట్టకథలూ వెలువడుతుంటాయి. ఇది ప్రచార దాడిలో భాగం అని చాలా మందికి తెలియదు. నిజమే అని విశ్వసిస్తారు. వాస్తవం కాదని తెలిసేసరికి ఆ సమస్య ఉనికిలో ఉండదు కనుక పట్టించుకోరు. ఉదాహరణకు ఇరాక్‌ అధ్యక్షుడు సద్దామ్‌ హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసినందున తాము దాడి చేశామని అమెరికా ప్రపంచాన్ని నమ్మించింది. సద్దాంను అంతం చేసిన తరువాత అదే అమెరికా తరువాత కొన్ని సంవత్సరాల తరువాత అబ్బే అలాంటి గుట్టలేమీ దొరకలేదు అని చెప్పింది. ఎంత మంది దానిని పట్టించుకున్నారు.

గతంలో అమెరికన్లు రష్యన్లను విలన్లుగా చిత్రిస్తే ఇప్పుడు వారి బదులు చైనీయులను చేర్చారు. వారి పొడ మనకు గిట్టదు అని చెబుతుంటారు. కానీ అమెరికాలోని కాటో ఇనిస్టిట్యూట్‌ అనే ఒక మేథో సంస్ధకు చెందిన ఇద్దరు మేథావులు ఈ మధ్యే ఒక వ్యాసం రాశారు. చైనా నుంచి వలస వచ్చే వారిని అమెరికా ప్రోత్సహించాలి అని దానిలో ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్న డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా వారిని అమెరికా గడ్డమీద అడుగు పెట్టనివ్వొద్దు అన్నట్లుగా చెలరేగి పోయాడు.వారు గూఢచర్యాలకు పాల్పడుతున్నారని, విద్యా సంస్ధలలో కమ్యూనిస్టు సిద్దాంతాలను వ్యాపింపచేస్తున్నారని, అమెరికా సాంకేతిక పరిజ్ఞానాలను తస్కరిస్తున్నారని మొత్తం మీద అమెరికా భద్రతకే ముప్పు తెస్తున్నారన్నట్లుగా ప్రచారం చేయించాడు. చైనా మిలిటరీ-పౌర సంస్దలు సమ్మిళితంగా అనుసరించే వ్యూహాలతో సంబంధం ఉన్న ఎఫ్‌-1 విద్యార్ధులు, జె-1పర్యాటకులను అడుగుపెట్టనివ్వవద్దని ఆదేశాలు జారీ చేశాడు.చైనా సంస్ధల నుంచి నిధులు పొందే అమెరికన్‌ విశ్వవిద్యాలయాల మీద కూడా చర్యలు తీసుకున్నాడు. శాస్త్ర, సాంకేతిక సంస్ధలలో ప్రవేశం కోరే చైనీయుల వీసాలను ప్రత్యేకంగా తనిఖీ చేయాలన్నాడు.దాంతో ప్రతి వీసా నెలల తరబడి విచారణల్లోనే ఉండేది. కాటో సంస్ధ మేథావులు వీటన్నింటితో ఏకీ భావం కలిగిన వారే.


అయితే వారి దూరా లేదా దురాలోచనను దాచుకోలేదు.గతంలో సోవియట్‌ యూనియన్‌తో ప్రచ్చన్న యుద్దం సాగించినపుడు దాని పౌరులను ఆకర్షించటాన్ని ఒక విధానంగా అమెరికా అనుసరించింది. ఇప్పుడు దాన్ని చైనాకు ఎందుకు వర్తింప చేయకూడదన్నది వారి తర్కం. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో సోవియట్‌ యూనియన్‌ ఎర్రసైన్యం అనేక తూర్పు ఐరోపా దేశాలను హిట్లర్‌ ఆక్రమణ, దుర్మార్గాల నుంచి విముక్తి చేసింది. స్ధానిక కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీలు అధికారంలోకి వచ్చి సోషలిస్టు రాజ్యాలను నెలకొల్పటం ఒకపరిణామం. అదే సమయంలో ఆ దేశాలకు చెందిన కమ్యూనిస్టు వ్యతిరేకులు, పెట్టుబడిదారులను అమెరికాకు ఆహ్వానించి కమ్యూనిస్టు నియంతృత్వం నుంచి బయటపడిన స్వేచ్చా జీవులుగా ముద్రవేసి వారితో కట్టుకథలు చెప్పించి అమెరికన్లను, ప్రపంచాన్ని నమ్మించారు. నాటి అధ్యక్షుడు ట్రూమన్‌ అలా 80వేల మందికి ఆశ్రయం కల్పించాడు.1990లో సోవియట్‌, తూర్పు ఐరోపాలోని సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన సమయంలో కూడా అదే ఎత్తుగడను అనుసరించి వలసలను సరళతరం గావించారు.

అలా వచ్చిన లక్షలాది మంది రాజకీయ, నైతిక, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి ఎంతగానో తోడ్పడ్డారు. కమ్యూనిజం కంటే పెట్టుబడిదారీ విధానం ఎంత గొప్పదో వారి చేత చిలుకపలుకులు పలికించి ప్రపంచ కమ్యూనిస్టు వ్యతిరేకులకు వీనుల విందు చేశారు. అదే సమయంలో అమెరికాకు ఆర్ధికంగా ఎంతో ఉపయోగపడ్డారు. ఇప్పుడు చైనీయులు సాంకేతిక రంగంలో కూడా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు సవాలు విసురుతున్నారు. అందువలన అత్యంత ప్రతిభావంతులు, విద్యావంతులైన చైనీయులను అమెరికాకు రప్పించటం ఎంతో లాభదాయకం అన్నది కాటో తర్కం. అలావచ్చిన వారు గూఢచర్యానికి పాల్పడి, రహస్యాలను చైనాకు చేరవేస్తేనో అన్న ప్రశ్నకు కూడా వారే సమాధానం చెప్పారు.అలాంటి చర్యలవలన జరిగే నష్టం చాలా తక్కువ అని అంతకంటే ఎక్కువగా చైనా నుంచి వచ్చే వారు చేసే పరిశోధన, అభివృద్ధి ఎక్కువ లాభం అని బల్లలు చరిచి మరీ చెపుతున్నారు. కరోనా వైరస్‌ను ఊహాన్‌ పరిశోధనాకేంద్రంలోనే తయారు చేశారనే కథనాలు చైనా నుంచి ఫిరాయించిన ఒకరిద్దరు చెబుతున్నవే. వాటన్నింటితో ప్రపంచ మీడియా చైనా వ్యతిరేక పండగ చేసుకొంటోంది.


అయితే ఈ మేథావులు, వారిని సమర్ధించేవారు గానీ ఒక విషయాన్ని మరచి పోతున్నారు. మూడు దశాబ్దాల నాడు కూల్చి వేసిన సోవియట్‌ నాడు అమెరికాతో పోలిస్తే ఒక మిలిటరీ శక్తి తప్ప ఆర్ధిక శక్తి కాదు.ఇప్పుడు చైనా అమెరికా ఆర్ధికశక్తిని సవాలు చేసి రెండవ స్ధానం నుంచి మొదటి స్దానానికి పరుగులు తీస్తున్నది. మిలిటరీ పరంగా కూడా పటిష్టంగానే ఉంది. సోవియట్‌ నాయకత్వం సామ్రాజ్యావాదం, పెట్టుబడిదారీ విధానాల ప్రమాదాన్ని తక్కువ అంచనా వేసింది. పర్యవసానంగా జనానికి వాటి ముప్పు గురించి చైతన్యం కలిగించటంలో నిర్లక్ష్యం చేసింది. చైనా అలాంటి భ్రమల్లో లేదు. మూడు దశాబ్దాల క్రితం తూర్పు ఐరోపా రాజ్యాలను కూల్చివేసే సమయంలో సంభవించిన తియన్మెన్‌ స్క్వేర్‌ ఆందోళన వెనుక ఉన్న అంశాలను పసిగట్టి మొగ్గలోనే తుంచి వేసింది. జనాన్ని హెచ్చరించింది.ఇదే సమయంలో ప్రచ్చన్న యుద్దంలో విజయం సాధించామని చెప్పుకున్న అమెరికాలో నేడు పెట్టుబడిదారీ విధానం విఫలమైందని నమ్ముతున్న వారు రోజు రోజుకూ పెరుగుతున్నారు. సోషలిస్టు చైనా విజయాలు ఎలా సాధ్యం అవుతున్నాయనే ఆలోచన కలుగుతోంది.

అమెరికా ఇప్పటికీ బలమైన, ప్రమాదకర దేశమే అయినప్పటికీ దాని సమస్యలు దానికి ఉన్నాయి. అందుకే ఎక్కడన్నా బావేగానీ వంగతోట దగ్గర కాదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం మీద పట్టుకోసం అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌తో చతుష్టయం (క్వాడ్‌) పేరుతో జట్టుకడుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఫసిఫిక్‌ ప్రాంత భాగస్వామ్య కోసం సమగ్ర మరియు పురోగామి ఒప్పందం (సిపిటిపిపి) ఒప్పందంపై సంతకం చేసేందుకు అమెరికా సిద్దం కావటం లేదు. అది లేకుండా మిగతా దేశాలు చేసేదేమీ లేదు. అమెరికాలో తలెత్తిన ఆర్ధిక సమస్యల కారణంగా స్వంతగడ్డమీద పెట్టుబడులను ప్రోత్సహించాలని బైడెన్‌ సర్కార్‌ భావిస్తోంది. గడచిన నాలుగు సంవత్సరాలలో చైనాతో వాణిజ్యలోటు తగ్గింపులక్ష్యంతో దేశ భద్రత పేరుతో చైనా నుంచి వచ్చే ఉక్కు, అల్యూమినియం తదితర వస్తువుల మీద డోనాల్డ్‌ ట్రంప్‌ దిగుమతి సుంకాల పెంపు అమెరికన్ల మీదనే భారం మోపాయి. పనిలో పనిగా జపాన్‌, ఐరోపా మిత్ర దేశాల మీద కూడా అదేపని చేశాడు. ఈ పన్నులను ఎత్తివేయాలని చైనా కంటే అమెరికా వాణిజ్యవేత్తలే ఇప్పుడు బైడెన్‌ మీద ఎక్కువ వత్తిడి తెస్తున్నారు.


చైనాతో పోరు సంగతి తరువాత, అమెరికా వెలుపలి నుంచి వచ్చే వస్తువుల మీద దిగుమతి పన్నుల విధింపు కారణంగా తాము మార్కెట్లో పోటీ పడలేకున్నామని అందువలన వాటిని ఎత్తివేయాలని మూడువందల సంస్దలు బైడెన్‌కు విజ్ఞప్తి చేశాయి. అమెరికన్ల కొనుగోలు శక్తి పెంచేందుకు ఆరులక్షల కోట్ల డాలర్లతో అనేక పధకాలను అమలు జరిపేందుకు ఆమోదం తెలపాలని బైడెన్‌ పార్లమెంట్‌ను కోరారు. దీని వలన తమ మీద పడే ప్రభావం, పర్యవసానాలు ఏమిటని జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. అమెరికన్లు ఎంత హడావుడి చేసినా ఇతర దేశాల సహకారం లేకుండా చైనాను వారేమీ చేయలేరు. అదే సమయంలో చైనీయులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకుంటున్నారు. పరిశోధన-అభివృద్ధికి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. అమెరికా, ఐరోపా పశ్చిమ దేశాల మీద ఆధారపడకుండా స్వంత గడ్డమీద జనం కొనుగోలు శక్తి పెంచేందుకు, ఇతర దేశాల్లో మార్కెట్‌ను పెంచుకొనేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు ప్రారంభించారు.దానిలో భాగమే బెల్ట్‌ మరియు రోడ్‌ (బిఆర్‌ఐ) పధకాలు. రాజకీయంగా తమకు వ్యతిరేకంగా జట్టుకట్టిన ఆస్ట్రేలియాకు చైనా చుక్కలు చూపిస్తోంది.గతంలో ఏటా 50 కోట్ల డాలర్ల విలువగల పీతలు ఆస్ట్రేలియా ఎగుమతి చేసేది. అమెరికాతో జతకట్టి బస్తీమే సవాల్‌ అనగానే ఆ పీతల దిగుమతులను చైనా నిషేధించింది. ఇలాంటి అనేక చర్యలు తీసుకోవటంతో ఆస్ట్రేలియన్‌ వ్యాపారులు లబోదిబోమంటున్నారు. అమెరికా అండచూసుకొని చైనా వస్తువులను బహిష్కరించాలంటూ కొండంత రాగం తీసి హడావుడి చేసిన మన పాలకులు తిరిగి చైనా వస్తువుల దిగుమతులను పెంచారు.


మన దేశంలో చైనా అంటే అభిమానం లేని వారు కూడా దానితో వైరం తెచ్చుకొని సాధించేదేమిటి అన్న ప్రశ్నను ఇప్పుడు ముందుకు తెస్తున్నారు. మనతో సహా అమెరికా నాయకత్వంలోని దేశాలు చైనాను ఒంటరి పాటు చేయాలని చూస్తున్నాయి. చైనాను దెబ్బతీయటం అంటే తమను తాము నాశనం చేసుకోవటం అనే అంశాన్ని అవి మరచిపోతున్నాయి. నూటనలభై కోట్ల మంది జనాభా ఉన్న చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా ఉండటమే కాదు, వినియోగ మార్కెట్‌ అని మరచి పోరాదు. ఎవరి సంగతి వారు చూసుకుంటున్న ఈ తరుణంలో చైనాతో ఆసియన్‌ దేశాల కూటమి వాణిజ్యం 732 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.అమెరికా, ఐరోపాయూనియన్‌, జపాన్‌ వంటి దేశాలు చైనాతో జరుపుతున్న ఎగుమతి దిగుమతుల విలువ 1,600 బిలియన్‌ డాలర్లు. చైనా ప్రారంభించిన బిఆర్‌ఐ పధకానికి చైనా ప్రభుత్వం లక్ష కోట్ల డాలర్లను సమకూర్చగలదని వార్తలు వచ్చాయి. తానే స్వయంగా వాగ్దానం చేసినట్లుగా జనానికి వాక్సిన్లు వేయించకుండా భారాన్ని రాష్ట్రాల మీద నెట్టేందుకు ప్రయత్నించిన మన కేంద్ర ప్రభుత్వం నుంచి అంత మొత్తంలో విదేశాల్లో పెట్టుబడులను పెడుతుందని ఎవరైనా ఆశించగలరా ? దానితో పోటీగా మనమూ తయారైతే తప్ప కమ్యూనిస్టు వ్యతిరేకత పేరుతో అవి మనతో కలసి వస్తాయా ? మనలను నమ్ముకొని మిగతా దేశాలు చైనాకు వ్యతిరేకంగా జట్టుకడతాయా ?

పగలంతా ఎక్కడెక్కడో తిరిగిన సన్యాసులు రాత్రికి మఠానికి చేరి గంజాయి దమ్ము కొట్టి తెల్లవారిన తరువాత అది చేయాలి ఇది చేయాలని ప్రగల్భాలు పలికి తెల్లవారేసరికి మత్తు దిగి ఎవరి కర్రా బుర్రా వారు తీసుకొని ఎవరిదారిన వారు పోయినట్లు ఇప్పటికి 47 సార్లు జి7 దేశాల సమావేశాల కబుర్లున్నాయి తప్ప ఎవరికైనా విశ్వాసం కలిగించాయా ? గాల్వన్‌ లోయ ఉదంతాల సమయంలో మన ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశంలో చెప్పిందేమిటి ? చైనీయులు మన సరిహద్దుల్లోకి చొరబడిందీ లేదు, మన పోస్టులను తమతో తీసుకుపోయిందీ లేదు అన్నారు. అలాంటపుడు చైనాతో ఏ సమస్య మీద పోరాడుతారు ? చతుష్టయం పేరుతో శతృత్వం పెంచుకోవటం తప్ప సాధించేదేమిటి ? మనకంటే ఎంతో బలమైన చైనా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించగలిగిన ఆర్ధిక వనరులను కలిగి ఉంది. మన పరిస్ధితి ఏమిటి ? కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టటం ఎందుకు ? దాన్ని సంతుష్టీకరించేందుకు చైనాతో వైరం ఎందుకు, సైన్య మోహరింపు ఎవరికోసం, ఆ ఖర్చును జనం మీద మోపటం ఎందుకు ? గతంలో సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలతో పోరాడి అక్కడి వ్యవస్ధలను కూల్చివేసిన అమెరికా కొన్ని దేశాల మార్కెట్లను ఆక్రమించుకుంది. అయినా దాని ఆర్ధిక సమస్యలు తీరలేదు. 2008లో దానితో సహా తూర్పు ఐరోపాను పంచుకున్న ధనికదేశాలన్నీ ఆర్ధిక సంక్షోభానికి గురయ్యాయి. ఇప్పుడు చతుష్టయం పేరుతో చైనాను ఢకొీని దాని మార్కెట్‌ను ఆక్రమించుకోవటం సాధ్యమయ్యేనా. ఒకవేళ జరిగినా ఆమెరికా మిగతాదేశాలకు వాటా ఇస్తుందా ? ఎవరిపని వారు చేసుకోకుండా మనకెందుకీ ఆయాసం !