జనానికి చమురు ధరల చెలగాటం – నరేంద్రమోడీకి రాజకీయ ఇరకాటం !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


సోమవారం నాడు అంతర్జాతీయ మార్కెట్‌లో పీపా ముడి చమురు ధర 70.82 డాలర్లు (2019 మే తరువాత ఇది గరిష్టం) పలికి ఇది రాసిన సమయానికి 69.62 డాలర్లుగా ఉంది. ఈ పెరుగుదలతో అనేక మంది నరేంద్రమోడీ అభిమానుల్లో అసలైన ఆందోళన ప్రారంభమైంది. మరోవైపు ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్లో ” అషోల్‌ పరివర్తన్‌ ” (అసలైన మార్పు) తెస్తామని ప్రధాని బిజెపి ఎన్నికల సభలో చెప్పారు. ఏడు సంవత్సరాల క్రితం అచ్చేదిన్‌, గుజరాత్‌ తరహా అభివృద్ధి వంటి కబుర్లు చెప్పిన పెద్దమనిషి నోటి నుంచి ఏ రోటికాడ ఆ పాట అన్నట్లుగా ఏ రాష్ట్రం వెళితే ఆ కబుర్లు చెబుతున్నారు. పెరుగుతున్న ధరల గురించి ఒక్క మాటా లేదు.


ఒపెక్‌ ప్లస్‌ దేశాలు(చమురు ఉత్పత్తి ఎగుమతి దేశాల సంస్ద(ఒపెక్‌)లో లేకుండా గణనీయంగా చమురును ఉత్పత్తి ఎగుమతి చేసే దేశాలు) ఏప్రిల్లో కూడా ఉత్పత్తిని తగ్గించాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించటంతో ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. మేనెల నుంచి చమురు ధరలు తగ్గుతాయని కబుర్లు చెబుతున్న బిజెపి పెద్దలకు అది ఎక్కడైనా తగిలిందో లేదో తెలియదు. గత నాలుగు రోజులుగా ధర పెరుగుతూనే ఉన్నా సోమవారం నాడు ఎక్కువగా పెరగటానికి కారణం అని సౌదీ అరేబియా దాడును ప్రతిఘటిస్తున్న యెమెన్‌లోని హుతీ తిరుగుబాటుదారులు జరిపిన క్షిపణి దాడి అని చెబుతున్నారు. సౌదీ చమురు కంపెనీ ఆరామ్‌కో ప్రధాన కేంద్రాలపై ఆదివారం నాడు ఈ దాడి జరిగింది. దీని తీవ్రత ఇంకా తెలియదు, ఆందోళనపడిన వారు చమురు కొనుగోలుకు ఆతృపడిన కారణంగా ధర పెరిగినట్లు కనిపిస్తోంది. ఆ దాడులతో నిమిత్తం లేకుండానే ధరలు పెరగటానికి ముందే చెప్పుకున్నట్లు ఉత్పత్తి తగ్గింపు నిర్ణయమే అసలు కారణం.
చమురు మార్కెట్‌ను ప్రభావితం చేయటంలో ఒపెక్‌లో సౌదీ అరేబియా, దాని వెలుపల రష్యా ఇప్పుడు కీలక పాత్రధారులుగా ఉన్నాయి. ధరలు పెరగటం తమ షేల్‌ అయిల్‌ కంపెనీలకు లాభాలు తెచ్చిపెడతాయి గనుక అమెరికా కూడా సంతోషంగానే ఉంది. చమురు ఆదాయమే ప్రధాన వనరుగా ఉన్న వెనెజులా వంటి దేశాలకూ ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. చమురు దిగుమతుల మీద ఆధారపడిన చైనా మనకంటే ఎంతో మెరుగైన స్దితిలో ఉంది కనుక దానికి ఇబ్బంది లేదు. ధరల పెరుగుదలతో ఎటొచ్చీ తీట వదలిలేది మనకే. అమెరికా నుంచి ఆయుధాలు, ఆయిలు తెచ్చుకుంటూ కొత్త సమస్యలూ తెచ్చుకుంటున్నాము. ఏప్రిల్‌ నెలలో రోజుకు పదిహేను లక్షల పీపాల మేరకు చమురు ఉత్పత్తి కోత విధించనున్నట్లు జోశ్యం చెబుతున్నారు.అయితే ఈ కోతనుంచి రష్యా, కజకస్ధాన్లు మినహాయింపు పొందాయి.రష్యా లక్షా30వేలు, కజకస్దాన్‌ ఇరవై వేల పీపాల మేరకు రోజు వారీ ఉత్పత్తిని పెంచనున్నాయి. ఫిబ్రవరి, మార్చినెలలో కూడా అవి మినహాయింపు పొందటానికి స్ధానికంగా చలికాలంలో ఎక్కువ వినియోగమే కారణం. తాను మాత్రం రోజుకు పదిలక్షల పీపాల కోత నిర్ణయానికి కట్టుబడే ఉన్నానని, ధరలతో తమకు నిమిత్తం లేదని సౌదీ ప్రకటించింది. కోత ఎప్పటి వరకు అన్నది కూడా వెల్లడించని కారణంగా ఒక్క మన పాలకుల్లో తప్ప అన్ని వినియోగదేశాల్లో ఆందోళన పెరిగింది.పెరిగిందానికన్నా ఎక్కువగా వసూలు చేసినా ఇదేం దోపిడీ అని అడిగే దమ్మూ ధైర్యం మన వినియోగదారులకు లేనందున కేంద్ర ప్రభుత్వానికి ఎలాగూ పట్టదు. ఎంత పెరిగితే అంత ఆదాయం తమకు పెరుగుతుంది కనుక మెజారిటీగా ఉన్న బిజెపి పాలిత రాష్ట్రాలతో పాటు ఇతరులూ పట్టించుకోరు.

ధరలు ఎంతవరకు పెరగవచ్చు !

ప్రస్తుతం ఉన్న జోశ్యాల ప్రకారం ఏప్రిలు-సెప్టెంబరు మాసాల మధ్య బ్రెంట్‌ రకం ముడి చమురు 75 నుంచి 80 డాలర్ల మధ్య ఉండవచ్చు. ఈ నెలాఖరుకు 70 డాలర్ల వరకు పెరగవచ్చని సిటీబ్యాంకు అంచనా వేసిందని ఆదివారం నాడు వార్తలు వచ్చాయి. అయితే సోమవారం నాడు 71డాలర్ల వరకు పెరిగిన తీరు చూసిన తరువాత జోశ్యాలన్నీ గాల్లో కలసి అంతకంటే ఎక్కువగా పెరిగినా ఆశ్చర్యం లేదు. చమురు దిగుమతి దేశంగా ఉన్న అమెరికా ఇప్పుడు ఎగుమతి దేశాల్లో ఒకటిగా మారింది. అందువలన ధరల పెరుగుదలను అక్కడి చమురు ఉత్పత్తి ముఖ్యంగా షేల్‌ కంపెనీలు కోరుకుంటాయి. అయితే తన ఎన్నికను దృష్టిలో ఉంచుకొని అమెరికా వినియోగదార్లకు ధరలు తక్కువగా ఉంచేందుకు గాను డోనాల్డ్‌ ట్రంప్‌ సౌదీపై వత్తిడి తెచ్చి ధరలను అదుపు చేయించాడని, ఇప్పుడు జో బైడెన్‌ అధికారంలో ఉన్నందున సౌదీ గతంలో మాదిరి వ్యవహరించకపోవచ్చనే అభిప్రాయాలూ వెల్లడవుతున్నాయి.


అరబ్బు దేశమైన ఎమెన్‌లో సంవత్సరాలుగా అంతర్యుద్ధం జరుగుతోంది. ప్రభుత్వానికి సౌదీ అరేబియా నాయకత్వంలోని కొన్ని అరబ్బు దేశాలు మద్దతు ఇవ్వటమే కాదు, తిరుగుబాటుదార్ల పట్టున్న ప్రాంతాలపై దాడులు చేస్తున్నాయి. అమెరికా తన చేతులకు మట్టి అంటకుండా వాటితో ఈపని చేయిస్తున్నది. ప్రభుత్వవ్యతిరేక శక్తులైన హుతీలకు ఇరాన్‌ మద్దతు ఉంది. రాజధాని సనా తిరుగుబాటుదార్ల వశంలోనే ఉంది. దానిమీద దాడుల నేపధ్యంలోనే ఆదివారం నాడు హుతీదళాలు డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించాయి. వాటిని తాము అడ్డుకున్నట్లు సౌదీ చెబుతోంది. అందువలన రానున్న రోజుల్లో ఎమెన్‌పై సౌదీ దాడులు పెరిగితే మరోసారి ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. అవి చమురు ధరల మీద ప్రభావం చూపవచ్చు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలేవీ కొద్ది నెలల క్రిందట ఊహించినవి కాదు. పడిపోయిన చమురు డిమాండ్‌ పెరుగుతుందని భావించారు తప్ప ధరల పెరుగుదలను ఊహించలేదు.

నాడు ఘనతగా కీర్తనలు -నేడు భక్తుల మౌన రాగాలు !


గత ఆరు సంవత్సరాలుగా చమురు ధరలు గణనీయంగా పడిపోవటం ద్వారా కలిగిన ఆర్ధిక ఉపశమనాన్ని నరేంద్రమోడీ ఘనతగా, మోడినోమిక్సుగా ఆయన భక్తులు ప్రచారం చేశారు. ఇప్పుడు చమురు ధరలు పెరుగుతుంటే భక్తిగీతాలాపనకు బ్రేకు పడింది. రిజర్వుబ్యాంకు అంచనా ప్రకారం పీపా చమురు ధర పది డాలర్లు పెరిగితే మన చమురు వాణిజ్య లోటు 1250 కోట్ల డాలర్లు ( రూపాయల్లో సోమవారం నాడున్న విలువ ప్రకారం 91,622 కోట్లు ) పెరుగుతుంది. ఎంత పెరిగితే అంత మనం చెల్లించాలని అతల్‌ బిహారీ వాజ్‌పేయి ఏలుబడిలో ప్రవేశ పెట్టిన విధానాన్ని నరేంద్రమోడీ ఎలాంటి శషభిషలు లేకుండా అమలు జరుపుతున్నందున మరో విధంగా చెప్పాలంటే అంత మొత్తాన్ని లేదా ఇంకా ఎక్కువగానే మన నుంచి వసూలు చేస్తారు. గతేడాది డిసెంబరు నాటికి మనం కొనుగోలుచేసిన ముడి చమురు ధర 49 డాలర్లు ఉంది. ఇప్పుడు 68డాలర్లకు పెరిగింది, అంటే మన లోటు లేదా భారం రెండు లక్షల కోట్లు పెరిగినట్లే. భర్త సంపాదన భార్య బుట్టలోలకులకే పరిపోయిందన్న సామెత తెలిసిందే. జన వేతనాలు ఎంత పెరిగినా, పెరగకున్నా కేంద్ర ప్రభుత్వానికి ఇంత మొత్తం చెల్లించాల్సిందే.మన కరెన్సీ పతనం అయితే అది అదనపు భారం.చమురు ధరల ప్రభావం కరెంట్‌ ఖాతా లోటు మీద ఎలా ప్రభావం చూపుతుందో దిగువ పట్టికలో చూడవచ్చు
ధర × జిడిపిలో వాణిజ్యలోటుశాతం× కోట్ల డాలర్లు
55 ×× -2.33 ×× -6,890
65 ×× -2.76 ×× -8,140
75 ×× -3.18 ×× -9,390
85 ×× -3.61 ×× -10,640
చమురు ధరల పెరుగుదల పెట్రోలు, డీజిలును వినియోగించేవారి మీద ప్రత్యక్ష భారాన్ని మోపితే పరోక్ష భారం జనం అందరి మీదా పడుతుంది. ఇది చమురు వినియోగదారులకు అదనం.చమురు ధరల పెరుగుదల వలన ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయి. నిజవేతనాలు పతనమౌతాయి, దానికి అనుగుణ్యంగా వేతనాలు పెంచకపోతే జీవితాలు దిగజారతాయి. అది కొనుగోలు శక్తిని దెబ్బతీసి పారిశ్రామిక, వాణిజ్య, సేవారంగాలు కుంటుపడి కొత్త సంక్షోభానికి దారితీసి ఉపాధిని దెబ్బతీస్తుంది. ఇది ఒక విష వలయం. ఒకటి మరొకదానిని దెబ్బతీస్తుంది.


మన వాణిజ్య లోటు పెరిగిన కొద్దీ మన రూపాయి విలువ మీద వత్తిడి పెరిగి పతనానికి దారి తీస్తుంది. అది మనం దిగుమతి చేసుకొనే చమురుతో సహా అన్నింటి ధరల పెరుగుదలకూ దారి తీస్తుంది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన సమయంలో 58గా ఉన్న మన రూపాయి విలువ ఇప్పుడు మోడీగారి వయస్సును కూడా అధిగమించి 73పైగా ఉంది.చమురు ధరల పెరుగుదల పరిశ్రమలు, వాణిజ్యం మీద కూడా పడి కంపెనీల వాటాల ధరల మీద ప్రభావం చూపుతుంది. వాటి ధరలు పడిపోతే విదేశీ సంస్ధలు తమ వాటాలను అమ్ముకొని సొమ్ము చేసుకుంటే మన విదేశీమారక ద్రవ్యనిల్వలు తగ్గిపోయి కొత్త సమస్య మొదలవుతుంది.గతంలో ఇది తీవ్రమై బంగారాన్ని తాకట్టు పెట్టటం, రూపాయి విలువ తగ్గించటం, ప్రపంచబ్యాంకు,ఐఎంఎఫ్‌ షరతులను ఆమోదించి మన మార్కెట్‌ను తెరవటం వంటి అవాంఛనీయ పరిణామాలకు మన పాలకులు తెరలేపారు. ప్రస్తుతం అలాంటి పరిస్ధితి అప్పుడే ఇంకా తలెత్తనప్పటికీ మోడీ సర్కార్‌ మన మార్కెట్‌ను ఇంకా తెరుస్తోంది. వ్యవసాయ సంస్కరణల పేరుతో తెచ్చిన మూడు చట్టాలు వాటిలో భాగమే. ఉన్న ఆస్ధులను తెగనమ్ముతోంది.ప్రభుత్వ ఆస్ధులన్నీ అమ్మిన తరువాత అప్పు తీసుకోవాలన్నా ఇచ్చేవారు మన ప్రభుత్వం దగ్గర ఏముంది అని చూస్తారు. ఇప్పటి వరకు నల్లేరు మీద బండిలా నడిచిన మోడీ సర్కార్‌ ప్రయాణం చమురు ధరలు ఇలాగే పెరిగితే అలా సాగదు.జనం సహనానికీ ఒక హద్దు ఉంటుంది. అది దాటితే అభిమానమే దురభిమానంగా మారుతుంది. అప్పుడేం జరుగుతుందో ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, అతల్‌బిహారీ వాజ్‌పేయిల ఏలుబడిలో ఏమి జరిగిందో చూసిన వారికి అర్దం అవుతుంది.కొత్త తరాలకు నరేంద్రమోడీ అలాంటి ”చైతన్యం ”, అవగాహన కలిగిస్తారా ? మోడీ గారికి ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో తన పార్టీ బలం పెరుగుదల మీదే దృష్టి ఉంది గాని జనం ఊసే లేదు. అందువలన అనుమానమే అవసరం లేదు ! చరిత్ర పునరావృతం అవుతుంది గానీ గతం మాదిరే అవుతుందని చెప్పలేము, కొత్త రూపంలో జరుగుతుంది.

కేరళామే హమ్‌ దేఖేంగే !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఇల్లలకగానే పండగ కాదు. మంత్రాలకు చింతకాయలు రాలతాయా ! హాం ఫట్‌ అంటే బంగాళాఖాతం కేరళపక్కకు వస్తుందా ? కస్టమ్స్‌ శాఖ దాఖలు చేసిన తప్పుడు అఫిడవిట్లు కేరళ సిపిఎంను దెబ్బతీస్తాయా ? యుఏయి నుంచి దౌత్య సంచిలో వచ్చిన దొంగబంగారం కేసులో అరెస్టయి జైల్లో ఉన్నవారిలో స్వప్న సురేష్‌ ప్రధాన నిందితురాలు. లక్షా 90వేల డాలర్ల( కోటీ ముప్పయి లక్షల రూపాయలకు సమానం)ను అక్రమంగా తరలించటంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, అసెంబ్లీ స్పీకర్‌ పి శ్రీరామకృష్ణన్‌ మరికొందరు మంత్రులు, ఇతరులకు సంబంధం ఉందని ఆమె చెప్పిందంటూ ఆ విషయాలను కస్టమ్స్‌ శాఖ హైకోర్టులో దాఖలు చేసింది. ఇంకేముంది దున్నఈనిందంటే గాటన కట్టేయమన్నట్లుగా ముఖ్యమంత్రి విజయన్‌ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్‌ శనివారం నాడు రాష్ట్ర వ్యాపితంగా ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. ఎన్నికలలో దెబ్బతీసేందుకు జరిపిన కుట్రలో భాగంగా కస్టమ్స్‌ శాఖ తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేయటాన్ని నిరసిస్తూ కస్టమ్స్‌ కార్యాలయాల ముందు నిరసన తెలపాలని సిపిఎం, ఇతర పక్షాలు పిలుపునిచ్చాయి. స్ధానిక సంస్దల ఎన్నికలను అవకాశంగా తీసుకొని కాంగ్రెస్‌, బిజెపి వాటితో జతకలసిన మీడియా పెద్దలు పెద్ద ఎత్తున దొంగ బంగారం, ఇతర కేసులు, ఆరోపణలతో సిపిఎంను దెబ్బతీసేందుకు చేసిన తప్పుడు ప్రచారాన్ని అక్కడి జనం పట్టించుకోలేదు. ఎల్‌డిఎఫ్‌ పక్షాలను గెలిపించారు.


మరోసారి అధికారానికి వచ్చి ఎల్‌డిఎఫ్‌ చరిత్ర సృష్టించనుందంటూ స్ధానిక సంస్ధల ఎన్నికలలో వచ్చిన ఓట్ల తీరు తెన్నులు, ఎన్నికల ముందు సర్వేలు వెల్లడించటంతో కేంద్రంలోని బిజెపి పెద్దలకు బుర్ర ఖరాబై (సామాన్యుల భాషలో మైండ్‌ దొబ్బి) కస్టమ్స్‌ శాఖ ద్వారా ఇలాంటి చౌకబారు చర్యలకు పాల్పడిందని సిపిఎం రాష్ట్రకార్యదర్శి వర్గం వర్ణించింది. కేంద్ర సంస్దలు బిజెపి ఎన్నికల ప్రచారంలో భాగస్వాములు కావటం తప్ప దీనిలో పసలేదని పేర్కొన్నది. నిజానికి ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించటమే అని విమర్శించింది.ఈ అంశం మీద యుడిఎఫ్‌, బిజెపి ముందుకు తెచ్చిన సవాలును తగిన విధంగా ఎదుర్కొంటామని, స్ధానిక సంస్దల ఎన్నికలలో వారి దిగజారుడు యత్నాలను జనం వమ్ము చేశారంటూ, చౌకబారు వ్యవహారాలకు పాల్పడే వారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి అదేమంటే ఇది కేరళ అని సిపిఎం పేర్కొన్నది.


నిజానికి స్వప్ప సురేష్‌ చెప్పింది అంటూ కస్టమ్స్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలు కొద్ది నెలలుగా కేరళలో తిరుగుతున్నవే.ఒక మెజిస్ట్రేట్‌ ముందు నిందితురాలు ఒక ముఖ్యవిషయం వెల్లడించిందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమైంది. ఇప్పుడు వాటినే రాజకీయ అవసరాల కోసం అఫిడవిట్‌ రూపంలో సమర్పించి సంచలనాత్మక అంశంగా మార్చారు. ఇంకేముంది దీంతో సిపిఎం ఢమాల్‌ అన్నట్లుగా కొందరు చిత్రిస్తున్నారు. ఏప్రిల్‌ ఆరున కేరళలో ఏం జరగనుందో (హమ్‌ దేఖేంగే )మనమూ చూద్దాం !

బిజెపి కూడా సిగ్గుపడిన అంశాన్ని కాంగ్రెస్‌ చెబుతోంది !

కరోనా మహమ్మారి సమయంలో వామపక్ష సంఘటన సర్కార్‌ పౌరులను ఆదుకున్న తీరును జనం మెచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన ఆహార కిట్‌ ఎంతగానో ఆదరణ పొందింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది తప్ప రాష్ట్రం చేసిందేమిటని కన్నూరు కాంగ్రెస్‌ ఎంపీ, రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు కె సురేంద్రన్‌ తాజాగా ఆరోపించారు. గతేడాది నవంబరు నెలవరకు కేంద్ర ప్రభుత్వం నెలకు ఐదు కిలోల బియ్యం, ఒక కిలో కందిపప్పు కరోనా సమయంలో ఇచ్చింది. కేరళ ప్రభుత్వం పంపిణీ చేసిన కిట్‌లో 17రకాల వస్తువులు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. దాన్ని మరో ఐదు నెలల వరకు అంటే మే నెల వరకు పొడిగించింది. దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్‌ ఎంపీ సుధాకరన్‌ మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన సరకులను రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు నుంచి కొనుగోలు చేసిన సంచులలో నింపి జనానికి ఇచ్చిందని, సంచుల కొనుగోలులో కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. కేంద్రం ఇస్తే అవే సరకులను తమ పాలిత రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు ఎందుకు పంపిణీ చేయలేదో సురేంద్రన్‌ చెప్పి ఉంటే అసలు బండారం బయటపడేది. తమ కేంద్ర పభుత్వం ఇచ్చిన సరకులను విజయన్‌ సర్కార్‌ పంపిణీ చేసిందని స్దానిక ఎన్నికల ప్రచారంలో చెప్పుకొనేందుకు బిజెపి కూడా సిగ్గుపడి నోరుమూసుకుంది. అలాంటిది కాంగ్రెస్‌ ఎంపీ నోట వెలువడింది. ఇలాంటి నోటి ముత్యాలు ఏం చేస్తాయో ,ఏప్రిల్‌ ఆరున కేరళలో ఏం జరగనుందో (హమ్‌ దేఖేంగే )మనమూ చూద్దాం !

కాంగ్రెస్‌ ఓడిపోబోతోంది అంటున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు !


ఆహార కిట్‌లో సరకులు కేంద్రమే ఇచ్చిందన్న కాంగ్రెస్‌ ఎంపీ సుధాకరన్‌ మరో మాట కూడా చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఓడిపోనుందని, బలమైన కాంగ్రెస్‌ వర్గం బిజెపిలో చేరనుందని కూడా చెప్పినట్టు కేరళ కౌముది పత్రిక పేర్కొన్నది. ఈ పెద్దమనిషే బిజెపిలో చేరనున్నారంటూ కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి.ఈ ఎన్నికల్లో గనుక అధికారానికి రానట్లయితే కేరళలో కాంగ్రెస్‌ చరిత్రలో కలసినట్లే అని కాసరగోడ్‌ కాంగ్రెస్‌ ఎంపీ రాజమోహన్‌ ఉన్నితన్‌ చెప్పారు. పార్టీలో ముఠాలు పెద్ద శాపంగా ఉన్నాయని వాటిని అదుపు చేయనట్లయితే అధికారానికి వచ్చే అవకాశం లేదన్నారు. పార్టీ కంటే కేరళలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ముఠాలనే ఎక్కువగా ప్రేమిస్తారు. అది పార్టీ వైఫల్యం. ఈ ఎన్నికల్లో దానిలో మార్పు వస్తుందనుకుంటున్నా , లేనట్లయితే అధికారానికి వచ్చే అవకాశం లేదు. అసెంబ్లీ నామినేషన్ల సమయంలోనే కుట్రలు జరుగుతాయి అన్నారు.


పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌కు రాష్ట్రం గురించి తెలియదని, అది కాంగ్రెస్‌ పార్టీకి బలహీనత అని మాజీ మంత్రి వయలార్‌ రవి ఆసియా నెట్‌ ఛానల్‌తో చెప్పారు. వ్యక్తిగతంగా కె సుధాకరన్‌(కన్నూరు ఎంపీ) ఉండాలని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. పార్టీలో ఇప్పటికీ ముఠాతత్వం ఉందని, అందువల్లనే వాటి ప్రాతిపదికన గాక పార్టీ ప్రాతిపదికన అభ్యర్ధుల ఎంపిక జరగాలన్నారు. ముళ్లపల్లి రామచంద్రన్‌ కూడా కన్నూరుకు చెందిన నాయకుడే అయినప్పటికీ కేరళలో తిరిగిన అనుభవం లేదని, తనకు, ఎకె ఆంటోని, ఊమెన్‌ చాందీకి మాత్రమే కన్నూరుకు రైళ్లలో తిరిగిన అనుభవం ఉందన్నారు. ఇక్కడ ఉన్నవారందరూ, రాజకీయాలు కూడా తెలుసు, ముళ్లపల్లిని ఢిల్లీలో నేతను చేశారు, ఇది పార్టీకి ఎంతో చెడు, ఊమెన్‌ చాందీని నాయకత్వ స్దాయికి తీసుకురావటం ఎంతో ప్రాధాన్యత కలిగిందని వయలార్‌ రవి చెప్పారు.

ఉన్న ఒక్కటీ దక్కుతుందో లేదో…. కేరళలో బిజెపి సిఎం అభ్యర్ధి ప్రహసనం !


కేరళలో బిజెపికి ఉన్నది ఒకే ఒక అసెంబ్లీ స్ధానం. దాని ప్రతినిధి ఓ రాజగోపాల్‌. వివిధ కారణాలతో గత అసెంబ్లీ ఎన్నికలలో నీమమ్‌ నియోజకవర్గం నుంచి గెలిచారు. రాజగోపాల్‌ను గెలిపించేందుకు అక్కడ కాంగ్రెస్‌ బలహీన అభ్యర్ధిని నిలిపిందన్నది బహిరంగ రహస్యం. ఈ సారి ఆయన పోటీ చేయటం లేదని ఇప్పటికే ప్రకటించారు. ఎవరు పోటీ చేస్తారో, ఫలితం ఎలా ఉంటుందో తెలియదు. ఆ స్ధానంలో పోటీ చేసి గెలవాలని అనేక మంది తాపత్రయ పడుతున్నారు. సినిమా స్టార్లు, మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారుల్లో ఒకరైన శ్రీధరన్‌ లాంటి వారిని బిజెపి తన టూల్‌కిట్‌లో అలంకార వస్తువులుగా, ఎన్నికల సమయంలో ప్రచారానికి, ఫొటోలకు మాత్రమే ఉపయోగించుకోవటం తెలిసిందే. టూరిస్టు పాకేజి ముసిగిన తరువాత ఎక్కడా కనపడరు. అలాంటి వారిలో ఒకరిగా భావించిన మెట్రోమాన్‌ 88 సంవత్సరాల ఇ శ్రీధరన్‌ తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించటానికి సిద్దంగా ఉన్నానని, ఎన్నికల్లో పోటీ చేస్తే బిజెపికి గతంలో వచ్చిన వాటికంటే రెట్టింపు ఓట్లు వస్తాయని, పోటీ చేస్తానని ప్రకటించారు. రెండు సార్లు దేశంలో బిజెపిని వరుసగా అధికారానికి తెచ్చిన నరేంద్రమోడీకే కేరళ కొరకరాని కొయ్యగా ఉంది. అలాంటి స్దితిలో రెట్టింపు ఓట్ల వస్తాయని చెప్పటం పరోక్షంగా నరేంద్రమోడీ పలుకుబడిని కించపరచటమే. నాలుగు ఓట్లు వస్తాయి కదా అని శ్రీధరన్‌కు కాషాయ కండువా కప్పారు.


కేరళ ఓటర్లను మరీ అంత అమాయకులుగా భావించారో లేక ఆత్రత వారిని అలా ముందుకు తోసిందో లేక ఇతరంగా ఏ నేతను ముందుకు తెస్తే ఏమిసమస్యలు వస్తాయో తెలియదుగానీ శ్రీధరన్‌ తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ ప్రకటించారు. వెంటనే అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి వి. మురళీ ధరన్‌ కూడా నిర్ధారించారు.అసెంబ్లీ ఎన్నికలకు స్ధానిక సంస్ధల ఫలితాలకు సంబంధం లేదని, ఎన్నికల ముందు వెలువడే సర్వేలను తాము విశ్వసించబోమని, ఈ సారి తమకు ఎక్కువ స్ధానాలు వస్తాయని కేంద్ర మంత్రి మురళీధరన్‌ చెబుతున్నారు. అధికారానికి వస్తామని కలలు కంటున్న చోటే సిఎం అభ్యర్ధిని ప్రకటించే స్ధితిలో లేని బిజెపి ప్రకటన కేరళ, దేశ వ్యాపితంగా నవ్వులు పండించింది. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం కేంద్ర నాయకత్వం ఇదేమి పిచ్చి ప్రకటన అంటూ రాష్ట్ర నాయకులకు బుద్దిశుద్ది చేయటంతో కొద్ది గంటల్లోనే అబ్బే మీడియాలో వార్తలను చూసి నిజమే అనుకున్నా తప్ప నిజం కాదు అని కేంద్ర మంత్రి తన మాటలను తానే దిగమింగారు. సురేంద్రన్‌ కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ జారుకున్నారు. ఈలోగా శ్రధరన్‌ తానే కాబోయే ముఖ్యమంత్రిని అని తెగ ఫీలయిపోయి రైల్వే సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన పరువు కాపాడుకొనేందుకు ఒక ప్రకటన చేశారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్ధిని కానని, అయితే ఎన్నికల్లో ప్రచార బాధ్యత నిర్వహిస్తానని అన్నారు. ఆ పార్టీలో ఇంకే పరిణామాలు వస్తాయో, ఏప్రిల్‌ ఆరున ఎన్నికల్లో కేరళలో బిజెపికి ఏం జరగనుందో (హమ్‌ దేఖేంగే )మనమూ చూద్దాం !

ప్రమాదకర బిజెపి టూల్‌కిట్టు – పసలేని చమురు బాండ్ల లోగుట్టు – 2

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రభుత్వాలు బాండ్లను జారీ చేయటం ప్రపంచమంతటా జరుగుతున్నదే. చెల్లించాల్సిన మొత్తాలను ఈక్విటీలుగా మార్చిన విషయం తెలిసిందే. జనాలకు చెవుల్లో పూలు పెట్టదలచుకున్నవారు నటించటం తప్ప 2010వరకు అంతకు ముందున్న ప్రభుత్వాలన్నీ చమురు బాండ్లను జారీ చేశాయనే విషయం తెలుసు. అసలు చమురు బాండ్లంటే ఏమిటి ? ఏమీ లేదండీ . ప్రభుత్వాలు వినియోగదారులకు ఎంత సబ్సిడీ ఇస్తే అంత మొత్తాన్ని చమురు కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాలి. ఆ మొత్తాలను చెల్లించకుండా చమురు కంపెనీలకు ప్రభుత్వం ప్రామిసరీ నోట్లు రాసి ఇవ్వటాన్నే అంతర్జాతీయ భాషలో బాండ్లు అంటున్నారు. అంటే అసలు చెల్లించేంతవరకు వడ్డీ కూడా చెల్లించాలి కదా ? ఈ మొత్తాలను పది నుంచి 20 సంవత్సరాల వ్యవధిలో చెల్లించే అవకాశం ఉంది. అంటే అప్పటి వరకు నిర్ణీత తేదీల ప్రకారం వడ్డీ, గడువు మీరిన వాటికి అసలు చెల్లిస్తారు. దాని వలన చమురు కంపెనీలకు నష్టం ఉండదు, ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది.ఈ బాండ్లను చమురు కంపెనీలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవచ్చు లేదా ఇతర సంస్ధలకు అమ్మి సొమ్ము చేసుకోవచ్చు.

చమురు బాండ్లను వాజ్‌పేయి సర్కార్‌ జారీ చేయలేదా ? జనానికి ఇచ్చిన దానికి ఏడుపెందుకు ?


2002-03 సంవత్సర బడ్జెట్‌ ప్రసంగంలో నాడు వాజ్‌పారు సర్కార్‌ ఆర్ధిక మంత్రిగా ఉన్న యశ్వంత సిన్హా ప్రభుత్వం చమురు బాండ్లను జారీ చేయనున్నదని చెప్పారు. 2014-15 సంవత్సర బడ్జెట్‌ పత్రాలలో పేర్కొన్నదాని ప్రకారం 2013-14 సంవత్సరం నాటికి చెల్లించాల్సిన బాండ్ల విలువ మొత్తం రు.1,34,423 కోట్లు. మోడీ అధికారానికి వచ్చిన తరువాత చమురు ధరలు విపరీతంగా పడిపోయినప్పటికీ చమురు బాండ్లు, మరొక సాకుతో పెద్ద మొత్తంలో పన్నులు పెంచిన కారణంగా వినియోగదారులకు పెద్దగా ప్రయోజనం లేకపోయింది. 2018లో చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇలా చెప్పారు.” కాంగ్రెస్‌ హయాంలో కొనుగోలు చేసిన రు.1.44లక్షల కోట్ల రూపాయల చమురు బాండ్లు మాకు వారసత్వంగా వచ్చాయి. ఈ మొత్తమే కాదు, వీటికి గాను కేవలం 70వేల కోట్ల రూపాయలు వడ్డీగా చెల్లించాము. రెండు లక్షల కోట్ల రూపాయలను చెల్లించటం ద్వారా మా ప్రభుత్వ బాధ్యతను నెరవేర్చాము. చమురు ధరలు ఎక్కువగా ఉండటానికి ఇంకా చెల్లించాల్సిన చమురు బాండ్లు దోహదం చేశాయి ” అని చెప్పుకున్నారు. మంత్రి చెప్పింది అర్ధ సత్యం. ఒక వేళ నిజమే అనుకున్నా, ఈ మొత్తం వినియోగదారులకు ఇచ్చిన రాయితీ తప్ప మరొకటి కాదు. జనానికి ఇచ్చిన ఈ మొత్తం గురించి బిజెపి మంత్రి ఏడవటం, అంతకంటే ఎక్కువగా జనం నుంచి వసూలు చేసే పన్ను భారాన్ని సమర్ధించుకొనేందుకు ఆడిన నాటకం తప్ప మరొకటి కాదు.

చమురు బాండ్ల బాజా వదలి సరిహద్దు పాట అందుకున్నారు !


చమురు బాండ్లకు సంబంధించి ఇప్పటి వరకు యుపిఏ సర్కార్‌ చెల్లించిందే ఎక్కువ అన్నది అసలు నిజం. ఇప్పటి వరకు 1750 కోట్ల చొప్పున ఉన్న రెండు బాండ్లు మాత్రమే గడువు తీరినందున మోడీ సర్కార్‌ 3500 కోట్లు చెల్లించింది. మిగిలిన మొత్తాలను చెల్లించాల్సి ఉంది. తదుపరి చెల్లింపు 2021 అక్టోబరులో ఉంది. ఈ బాండ్లకు వడ్డీగా చెల్లించిన మొత్తం 40,226 కోట్లని మంత్రి పియూష్‌ గోయల్‌ మూడు సంవత్సరాల క్రితం చెప్పారు.2014-15 నుంచి 2017-18 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వానికి 11.04లక్షల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలకు 7.19 లక్షల కోట్ల రూపాయల ఆదాయం చమురు రంగం నుంచి వచ్చింది. ఇంత ఆదాయ బిజెపి పెద్దలు చెబుతున్నట్లుగా చమురు బాండ్ల అప్పు తీరిపోతే ఆ పేరుతో విధించిన అదనపు భారం ఎందుకు కొనసాగిస్తున్నట్లు ?చమురు బాండ్ల గురించి మరీ ఎక్కువ చెబితే జనానికి అనుమానాలు తలెత్తుతాయనే భయంతో ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు.


సరిహద్దులో చైనాతో వివాదం కారణంగా తలెత్తిన ఖర్చు జనం గాక ఎవరు భరించాలి ? అందుకే పన్నులను కొనసాగించక తప్పదు అని వాదిస్తున్నారు. అందుకే ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకొనే వారని చెప్పాల్సి వస్తోంది. మన భూభాగాన్ని చైనీయులు ఆక్రమించలేదని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. అలాంటపుడు సరిహద్దుల్లో లక్షల కోట్లు ఖర్చు చేసి అమెరికా,ఇజ్రాయెల్‌, రష్యా తదితర దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసి కరోనా కష్టకాలంలో జనాన్ని ఇబ్బంది పెట్టటం అవసరమా ? ప్రతిపైసాకు జవాబుదారీ అని చెప్పుకున్న మోడీ గారికి తగినపనేనా ?
చమురు ధరలు పెరగటానికి మరొక కారణం రూపాయి విలువ పతనం.చమురు బాండ్లు, సరిహద్దులో ఖర్చు అంటే కాసేపు అంగీకరిద్దాం. మరి రూపాయి పతనానికి బాధ్యత ఎవరిది ? మోడీ అధికారానికి వచ్చిన సమయంలో 58 రూపాయలుగా ఉన్నది ఇప్పుడు 72-73కు పతనమైంది. గతంలో ముఖ్యమంత్రిగా మోడీ రూపాయి విలువ పతనానికి కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్ధతే అని చెప్పారు. ఇప్పుడు మరి తన మాటలను తనకే వర్తింప చేసుకొనే నిజాయితీని ప్రదర్శిస్తారా ? కేంద్ర బడ్జెట్‌ పత్రాల్లో పేర్కొన్న సమాచారం ప్రకారం 2012 మార్చి-సెప్టెంబరు నెలల మధ్య యుపిఏ సర్కార్‌ రు.9,762.85 కోట్ల రూపాయలను చెల్లించింది. తరువాత మోడీ సర్కార్‌ 2015 మార్చినెలలో 3,500 కోట్లు చెల్లించింది. ఈ ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో పదివేల కోట్లు చెల్లించాలి.తిరిగి 2023 నవంబరు, డిసెంబరు మాసాల్లో మరో 26,150 కోట్లు, 2024 ఫిబ్రవరి-డిసెంబరు మాసాల మధ్య 37,306.33 కోట్లు, 2025లో 20,553.84 కోట్లు, చివరిగా 2026లో 36,913 కోట్లు చెల్లించాల్సి ఉంది. వాస్తవం ఇది కాగా ఈ మొత్తాలను, వడ్డీ చెల్లించామని, అందుకోసమే అదనంగా పన్నులు వేశామని చెప్పటం గుండెలు తీసే బంట్లకు తప్ప మరొకరికి సాధ్యమా ?


దీనిలో కూడా జనాలను ముఖ్యంగా విద్యావంతులను ఎందుకంటే ఇతరులకు బడ్జెట్‌ పత్రాలు అందుబాటులో ఉండవు కనుక తప్పుదారి పట్టించారు. పోనీ విద్యావంతులు తాము తెలుసుకొని వాస్తవాలను జనాలకు చెప్పారా అంటే వాట్సాప్‌లో వచ్చిన తప్పుడు సమాచారాన్ని తాము నమ్మి ఇతరులను నమ్మించేందుకు వాటిని ఇతరులకు కరోనా వైరస్‌ కంటే వేగంగా అందిస్తున్నారు. వాస్తవాలు చెప్పే వారికి ప్రధాన స్రవంతి మీడియాలో చోటు లేదు కనుక వారి గళం వినపడదు, బొమ్మ కనపడదు. వాస్తవ సమాచారాన్ని ఇచ్చే మీడియాను జనం ఆదరించటం లేదు. మోడీ సర్కార్‌ అందచేసిన బడ్జెట్‌ పత్రాలు వాజ్‌పాయి హయాంలో కూడా చమురు బాండ్లు జారీ చేశారనే వాస్తవాన్ని బయటపెట్టాయి.సంవత్సరాల వారీగా ఎప్పుడు ఎంత వడ్డీ చెల్లించారో దిగువ చూడండి, ఏది నిజమో ఎవరు పచ్చి అవాస్తవాలు చెబుతున్నారో అర్ధం చేసుకోండి !


సంవత్సరం××××× వడ్డీ మొత్తం కోట్ల రు.
అతల్‌ బిహారీ వాజ్‌పాయి ఏలుబడి
1998-99××××× 1,050
1999-2000××× 224
2000-01××××× 40
2001-02××××× 40
2002-03××××× 667
2003-04××××× 667
మొత్తం××××× 2688
మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడి
2004-05××××× 684
2005-06××××× 846
2006-07××××× 1,899
2007-08××××× 3,853
2008-09××××× 5,529
2009-10××××× 10,535
2010-11××××× 10,958
2011-12××××× 10,958
2012-13××××× 10,458
2013-14××××× 10,256
మొత్తం××××× 45,536
నరేంద్రమోడీ ఏలుబడి
2014-15××××× 10,256
2015-16××××× 9,990
2016-17××××× 9,990
2017-18××××× 9,990
2018-19××××× 9,990
2019-20××××× 9,990
2020-21××××× 9,990
మొత్తం××××× 70,196
ప్రభుత్వం చమురు కంపెనీలకు చెల్లించాల్సిన సబ్సిడీ బదులు జారీ చేసిన చమురు బాండ్లను తప్పు పడుతున్న నరేంద్రమోడీ సర్కార్‌ ఇతర అవసరాలకు అసలు అప్పులే చేయటం లేదా ? వడ్డీ చెల్లించటం లేదా ? మరి ఆ నిర్వాకానికి ఎందుకు పాల్పడుతున్నట్లు ? ద్రవ్యలోటును కప్పి పుచ్చి అదుపులోనే ఉందని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌,ఇతర అంతర్జాతీయ సంస్ధలను నమ్మించేందుకు( నిజానికి వాటికి తెలియని జిమ్మిక్కులేమీ కాదు- అందరూ ” పెద్దమనుషులు ” కనుక ఎవరూ ఏమీ తెలియనట్లు నటిస్తారు) అంకెల గారడీ చేస్తారు. నగదు చెల్లింపు కాదు గనుక ఈ బాండ్లు ప్రభుత్వ లోటులో కనిపించవు.ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వానికి చమురు రంగంలో వచ్చిన డివిడెండ్‌, ఆదాయపన్ను మొత్తం రు.2,11,026 కోట్లు. ఇదే సమయంలో వినియోగదారులకు ఇచ్చిన సబ్సిడీ మొత్తం 1.7లక్షల కోట్లు. పన్ను సంగతి సరే లాభం కంటే తక్కువే కదా ? ఎప్పుడో తీర్చాల్సిన చమురు బాండ్ల పేరుతో లక్షల కోట్ల రూపాయలను జనం మీద బాదటం మంచి రోజులకు, జవాబుదారీ పాలనకు నిదర్శనమా ?

మొదటి భాగం ” ప్రమాదకర బిజెపి టూల్‌కిట్టు – పసలేని చమురు బాండ్ల లోగుట్టు – 1” లో చదవండి.

ప్రమాదకర బిజెపి టూల్‌కిట్టు – పసలేని చమురు బాండ్ల లోగుట్టు – 1

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


దిశా రవి అనే రెండు పదుల యువతి మనం సమాజానికి టూల్‌కిట్టు అనే పదాన్ని ఎంతగానో పరిచయం చేసింది. అసలు టూల్‌కిట్టు అంటే ఏమిటి ? రోజూ మనం ఎక్కడో అక్కడ చూస్తూనే ఉంటాం. ఇవి అనేక రకాలు. స్ధల, కాలాలను బట్టి వాటి స్వభావం మారుతూ ఉంటుంది. ప్రధానంగా రెండు తరగతులుగా చూస్తే ఒకటి జనాలకు ఉపయోగపడేవి. రెండవ రకం హాని చేసేవి. చాకు వంటింట్లో ఉంటే పండ్లు, కూరలు, ఉల్లి వంటి వాటిని కోస్తాము. అదే సంఘవ్యతిరేక శక్తుల చేతుల్లో ఉంటే ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుందో తెలియదు.
పాండవుల అరణ్యవాసం ముగిసిన తరువాత ఏడాది అజ్ఞాతవాసం చేసే సమయంలో తమ ఆయుధాలన్నింటినీ కట్టగట్టి జమ్మి చెట్టు మీద పెట్టారని చదువుకున్నాము. అదీ టూల్‌కిట్టే. అందుకే దసరా రోజున అనేక ప్రాంతాలలో ఫ్యాక్టరీలు, వ్యాపార సంస్దలలో వినియోగించే పరికరాలకు పూజలు కూడా చేస్తారు. పాత సినిమాలలో వైద్యులు ఒక పెట్టె లేదా సంచి వంటిదానిని తీసుకువస్తారు. అది వైద్యుల టూల్‌కిట్టు, కొన్నిదశాబ్దాల క్రితం క్షురకులు తమ టూల్‌కిట్టును తీసుకొని ఇండ్లకు వచ్చి క్షవరాలు చేసేవారు. ఇప్పుడు కూడా పెత్తందారులకు అలా చేస్తూ ఉండవచ్చు. దాన్నే పొది అని పిలిచేవారు. వివిధ సేవలు చేసే మెకానికల్‌లు తమ వెంట తెచ్చే పరికరాలను ఒక బాక్సులో లేదా సంచిలో వేసుకొని వస్తారు. అదీ టూలుకిట్టే. పాములను ఆడించే వారు తమ టూల్‌కిట్టులో పాములతో పాటు, నాగస్వరం వంటివి ఉంటాయి.ఒక మతోన్మాదుల టూల్‌కిట్టులో మిగతావాటితో పాటు ఆవు మాంసం ఉంటే, మరో మతోన్మాదుల దానిలో పంది మాంసం ఉంటుంది. రెండు మతాల వాటిలో కుట్ర సిద్దాంతాలు, విద్వేష, ఉన్మాద ప్రచార సామగ్రి కోకొల్లలు. పట్టణాలలో పెద్ద పెద్ద ఉత్సవాలు, బహిరంగ సభలు జరిగే సమయాల్లో ఏ మార్గాల్లో ప్రయాణించాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ప్రభుత్వం లేదా నిర్వాహకులు ప్రకటిస్తారు. అది కూడా టూల్‌కిట్టే.

దిశ రవి టూలుకిట్టులో ఏముంది ?


రైతు ఉద్యమం సందర్భంగా దానికి మద్దతుగా దిశరవి, ఇతరులు రూపొందించిన అంశాలనే ప్రపంచవ్యాపితంగా తెలిసిన భాషలో టూల్‌కిట్‌ అన్నారు. దానిలో ఎక్కడా నరేంద్రమోడీ లేదా బిజెపి పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చివేయాలనే అంశాలే లేవు. అయినా దేశద్రోహ నేరం మోపి అన్యాయంగా దిశ రవితో పాటు మరికొందరిని కేసుల్లో ఇరికించారు. దిశ రవికి బెయిలు మంజూరు చేస్తూ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు అనేక మందికి కనువిప్పు కలిగించాయి. దేశంలో మతోన్మాద సంస్దలు అవి మెజారిటీ అయినా మైనారిటీ అయినా విద్వేషాలను ఎలా రెచ్చగొట్టాలి, ఘర్షణలు ఎలా సృష్టించాలి, దాడులు ఎలా చేయాలి తదితర అంశాలతో అనేక టూలుకిట్లను ఉపయోగిస్తున్నాయి. వాటికోసం రకరకాల సంస్దలను ఏర్పాటు చేస్తున్నాయి. అన్నింటినీ సమన్వయం పరిచేది ఒక కేంద్రమే. రాజకీయ పార్టీల టూలుకిట్లకు కొదవే లేదు. మరి అవన్నీ నేరం కానపుడు రైతు ఉద్యమానికి మద్దతుగా తయారు చేసిన టూలుకిట్టునే ఎందుకు దేశ ద్రోహంగా పాలకులు భావిస్తున్నారు ? అదే దేశద్రోహం అయితే రైతుల కోసం ఆ టూల్‌కిట్‌ను అందరూ ఇతరులకు పంచాలి. టూలుకిట్టు అంటే పరికరాలతో కూడిన ఒక సంచి లేదా పెట్టె అని అనుకున్నాం. ఇంద్రజాల-మహేంద్రజాల కనికట్టు విద్యలు ప్రదర్శించేవారి దగ్గర కూడా టూలుకిట్టు ఉంటుంది.

బిజెపి అబద్దాల అక్షయ టూలుకిట్టు !

ఇలాంటి కనికట్టు విద్యలో రాజకీయ పార్టీలు తలమునకలుగా ఉన్నాయి. వీటిలో వామపక్షాలు మినహా కాంగ్రెస్‌, బిజెపి, వైసిపి, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ ఇలాంటి పార్టీలన్నీ ఒకేతానులో ముక్కలు. వాటి దగ్గర పరికరాల కంటే ప్రచార అస్త్రాలు ఉంటాయి. వాటిలో బిజెపి ఒకటి. నిత్యం ఉదయం ఆరుగంటలకు చమురు ధరలు పెరిగితే పెంచే, తగ్గితే తగ్గించే ప్రకటన వెలువడుతుంది. ధరలు భారంగా మారుతున్నాయి, ప్రపంచంలో ఎక్కడా లేనంత పన్ను మొత్తాన్ని మన దేశంలో విధిస్తున్నారు. ఆ చేదు గుళికను మింగించేందుకు బిజెపి తన అక్షయ తూణీరంలోని అబద్దాల ఆయుధాలను నిత్యం ప్రయోగిస్తున్నది. గతేడాది నవంబరు నుంచి అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న చమురు ధరల గురించి జనం ముందు గుండెలు బాదుకుంటూ మహా నటి నటులను మరపిస్తున్నది.వాటిని మనం ఎందుకు నిలదీయలేకపోతున్నాం ?
దిగువ ఇస్తున్న అంకెలన్నీ కేంద్ర పెట్రోలియం శాఖలోని పిపిఏసి విభాగ నివేదికల నుంచి సేకరించినవి.2014 మార్చి ఒకటవ తేదీ( నరేంద్రమోడీ ఏలుబడిలోకి రాక ముందు),2015 నవంబరు ఏడవ తేదీన, 2020నవంబరు ఒకటవ తేదీన న్యూఢిల్లీలో పెట్రోలు ధరల్లో ఏ భాగం ఎంత శాతం ఉన్నదో వివరాలు ఇలా ఉన్నాయి
వివరాలు ×× ఏడాది×× డీలరుకు లీటరు ధర ×××× చిల్లర ధరలో శాతం
సరకు ధర × 2014-49.50×67.6×2015- 26.73×44 × 2020×25.73× 31.74
కేందప్రన్ను×× 2014-9.48 × 13 × 2015-19.56 ×32.2× 2020-32.98×40.68
రాష్ట్రపన్ను ××× 2014-12.20× 16 × 2015-12.14 × 20 × 2020-18.71×23.1
మొత్తం పన్నులు ×2014-21.68×29.61×2015-31.70×52.2× 2020-52.2 ×63.76
2015 నవంబరు ఏడవ తేదీన న్యూఢిల్లీలో డీజిలు ధరల్లో ఏ భాగం ఎంత శాతం, బ్రాకెట్లలో ఉన్న అంకెలు 2020 నవంబరు ఒకటవ తేదీ నాటివని గమనించాలి. 2014లో డీజిలు మీద ఎనిమిది రూపాయల సబ్సిడీ ఉంది.
వివరాలు × సంవత్సరం×× డీలరుకు లీటరు ధర ××× చిల్లర ధరలో శాతం
సరకు ధర ×2014-44.31×2015-26.55×57.8×2020-25.75×36.5
కేందప్రన్ను×2014-3.56×6.4× 2015-11.16×24.29× 2020-31.83×45.17
రాష్ట్రపన్ను ×2014-6.41×11.55×2015-6.79×14.8 × 2020-10.36×14.7
మొత్తంపన్ను×2014-9.97×18 ×2015-17.95×39.1×2020-42.19 × 63.45

మధ్య ప్రదేశ్‌ సంగతి ఏమిటి ?


పైన పేర్కొన్న వివరాలను గమనించినపుడు ఏ రీత్యా చూసినా కేంద్ర పన్నుల భారం పెరిగింది.ఆ దామాషాలో రాష్ట్రాల భారం పెరగలేదన్నది స్పష్టం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. కేంద్ర పన్నులు ఏక మొత్తం. వాటిని సవరించేంతవరకు ధరలతో నిమిత్తం లేకుండా స్ధిరంగా ఉంటాయి. రాష్ట్రాల పన్నులు శాతాల మేరకు పెరుగుతాయి. నెలలో కేంద్రం 30 రోజుల పాటు పెట్రోలు, డీజిలు ధరలు పెంచినా కేంద్ర పన్ను మొత్తం పెరగదు.ఈ మధ్య బిజెపి నేతలు పెట్రోలు ధర విషయంలో కాంగ్రెస్‌ పాలిత రాజస్ధాన్‌ రాష్ట్రాన్ని చూపి చూశారా అక్కడ ఎంత ఉందో అని చెబుతున్నారు. ఎదుటి వారి కంట్లో నలుసులను వెతికేవారు తమ సంగతి చూసుకోరు. కేంద్ర పెట్రోలియం శాఖ నివేదిక ప్రకారం 2020నవంబరు ఒకటవ తేదీన రాజస్ధాన్‌లో పెట్రోలు ధర రు.88.21 ఉంటే తమ ఏలుబడిలోని మధ్య ప్రదేశ్‌లో రు.88.70 ఉందని సదరు నివేదిక ఒక్కాణించి మరీ చూపింది. ఆ తరువాత ధరలు అదే స్ధాయిలో పెరుగుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల వివరాలు తీసుకుంటే అసలు కథను కొంత మేరకు అర్ధం చేసుకోవచ్చు. అనేక రాష్ట్రాలలో స్ధానిక ప్రభుత్వాలు స్దానిక సెస్‌లు, ప్రత్యేక పన్నులను విధిస్తున్నాయి.
మధ్య ప్రదేశ్‌ పెట్రోలు ×వ్యాట్‌ 33శాతం+లీటరుకురూ.4.50 వీటి మీద ఒకశాతం సెస్‌
రాజస్దాన్‌ పెట్రోలు ×వ్యాట్‌ 36శాతం+లీటరుకురూ.1.50 రోడ్‌ సెస్‌
మధ్య ప్రదేశ్‌ డీజిలు ×వ్యాట్‌ 23శాతం+లీటరుకురూ.3.00 వీటి మీద ఒకశాతం సెస్‌
రాజస్దాన్‌ డీజిలు ×వ్యాట్‌ 26శాతం+లీటరుకురూ.1.75 రోడ్‌ సెస్‌

చమురు బంకుల దగ్గర బోర్డులు పెడితే బండారం బయటపడుతుంది !

బిజెపి నేతలు చెప్పే మరొక అబద్దం, గారడీ ఏమంటే కేంద్రం వసూలు చేస్తున్న పన్నులలో రాష్ట్రాలకు 42శాతం(అది ఇప్పుడు 41శాతం) బదలాయిస్తున్నది కనుక కేంద్ర పన్నుల కంటే రాష్ట్రాలకే ఎక్కువ కనుక రాష్ట్రాలే ధరలు తగ్గించాలని చెబుతారు. మెజారిటీ రాష్ట్రాలు తమ ఏలుబడిలోనివేగా ఎన్ని తగ్గించాయి? ఈ వాదన వెనుక కూడా మోసం ఉంది. పైన చెప్పుకున్నట్లుగా కేంద్రం పెట్రోలు, డీజిలు మీద వసూలు చేస్తున్న రూ.32.98, 31.83లలో రాష్ట్రాలకు 41శాతం కేటాయిస్తే ఆ వాదనను సమర్ధించవచ్చు ? ఈ మొత్తాలలో రెండు భాగాలు ఉంటాయి. ఎక్సయిజు పన్ను మరియు సర్‌ఛార్జీలు,సెస్‌లు. వీటిలో పన్నుల్లోనే రాష్ట్రాలకు 41శాతం వాటా. రెండో భాగంలో ఇచ్చేదేమీ ఉండదు. అందుకే కేంద్రం ఏటేటా రెండో భాగాన్ని పెంచుతున్నది. రాష్ట్రాలు ఆందోళన చేస్తున్నాయి గనుక పన్ను వాటాను 32 నుంచి 42శాతానికి పెంచినట్లు అంకెల గారడీ చేశారు.


2017ఏప్రిల్‌-2020 మే నెల మధ్య కేంద్ర ప్రభుత్వం పెట్రోలు మీద సెస్‌, సర్‌ఛార్జీ 150శాతం, డీజిలు మీద 350శాతం పెంచితే ఇదే సమయంలో పన్ను మొత్తాలు 69, 57శాతాలను మాత్రమే పెంచింది.తాజాగా బడ్జెట్‌లో పెట్రోలు మీద రూ.2.50, డీజిలుకు రు.4.00 వ్యవసాయ సెస్‌ విధించారు. ఇది అదనం కాదు, ఈ మేరకు పన్ను తగ్గించి దాన్ని సెస్‌గా చూపారు. వినియోగదారులకు భారం లేనప్పటికీ రాష్ట్రాలకు కోత పడుతుంది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం సెస్‌లు, సర్‌ఛార్జీల నుంచి రాష్ట్రాలకు వాటా లేదు. ఇలాంటి జిమ్మిక్కు కారణంగా ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు కేటాయింపులు పెరిగినట్లు కనిపించినా వాస్తవంలో రాష్ట్రాలకు బదలాయించిన నిధులు 2019తో పోల్చితే 2020లో 36.6 నుంచి 32.4శాతానికి పడిపోయాయి. అందువలన రాష్ట్రాలు పన్ను తగ్గించాలనే బిజెపి వాదన అసంబద్దం మోసపూరితం.

రోడ్డు సెస్‌-టోలు టాక్సు వెరసి గోడ దెబ్బ చెంపదెబ్బ !

చమురు మీద రోడ్డు సెస్‌ వసూలు చేస్తున్న కేంద్రం మరోవైపు ఆ రోడ్లను వినియోగించినందుకు టోలుపన్ను వసూలు చేస్తున్నది. అంటే మన నుంచి వసూలు చేసిన సొమ్ముతో రోడ్లు వేస్తూ తిరిగి మన నుంచి టోలు వసూలు చేయటం వినియోగదారులకు గోడదెబ్బ చెంపదెబ్బ కాదా ? ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. తమ నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయి స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల అభివృద్ధికి నాంది పలికారని బిజెపి గొప్పగా చెప్పుకుంటుంది. నిజమే, అదే వాజ్‌పేయి ఆ రోడ్లకు నిధులను జనం నుంచి వసూలు చేసే పధకానికి కూడా నాంది పలికారు.
ప్రస్తుతం మనకందరికీ మీడియాలో లేదా ప్రభుత్వం కూడా చెబుతున్న ఎక్సయిజు పన్ను పెట్రోల మీద లీటరుకు రు.32.98. దీనిలో వాస్తవానికి మౌలిక ఎక్సయిజ్‌ పన్ను(బెడ్‌) రు.2.98 మాత్రమే.మిగిలిన రూ.30లో ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ పన్ను(సీడ్‌) రూ.12, రోడ్డు మరియు మౌలిక సదుపాయాల పన్ను రు.18. తాజాగా విధించిన వ్యవసాయ సెస్‌ను సర్దుబాటు చేసేందుకు బెడ్‌ను రు.1.41కి సీడ్‌ను రూ.11కు తగ్గించారు. డీజిలు విషయానికి వస్తే వ్యవసాయ సెస్‌కోసం బెడ్‌ను రు.4.83 నుంచి రూ.1.80కి సీడ్‌ను 9నుంచి 8కి తగ్గించారు. బెడ్‌, సీడ్ల నుంచి రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఆమేరకు తగ్గిపోతుంది. కేంద్ర పన్నుల పెంపుదల రాష్ట్రాలకు వరమా శాపమా ?

బిజెపి పక్కా విదేశీ – లేకుంటే గోబెల్స్‌ను ఎలా అనుకరిస్తారు ?

దిశా రవి టూల్‌కిట్టు గురించి నానాయాగీ చేసిన సంఘపరివార్‌ మరుగుజ్జులు(ట్రోల్స్‌) చమురు బాండ్ల గురించి జనాల మెదళ్లను ఖరాబు చేశారంటే అతిశయోక్తి కాదు. పక్కా భారతీయతను పాటిస్తున్నామంటారు గాని నిజానికి పక్కా విదేశీ, అందునా నాజీ హిట్లర్‌ మంత్రి పక్కా అబద్దాలను ప్రచారం చేసిన గోబెల్స్‌ వీరికి ఆరాధ్యదైవం, నిత్యం కొలుస్తూ ఉంటారు. అసలు ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటే విదేశీ సంస్ధల అనుకరణ లేదా అరువు తెచ్చుకున్నది అనుకోండి.
గత కాంగ్రెస్‌ పాలకులు చమురు బాండ్లు చేసి చమురు ఖాతాను గుదిబండగా చేశారని, తమ నేత నరేంద్రమోడీ వచ్చి వాటన్నింటినీ తీర్చాల్సి వచ్చినందున కేంద్ర పన్నులు పెంచాల్సి వచ్చిందని ఒక పిట్టకథ వినిపిస్తారు. ఒక వేళ అదే నిజమనుకోండి. ఆయిల్‌ బాండ్‌ సెస్‌ అనే పేరుతో వసూలు చేసి వాటిని తీర్చివేయవచ్చు. అప్పు తీరగానే నిలిపివేయవచ్చు, కానీ ఆపని చేయలేదే ? అయినా ఒక ప్రభుత్వం చేసిన అప్పు తరువాత వచ్చే మరొక ప్రభుత్వానికి గుదిబండ ఎలా అవుతుంది. పార్టీలు, పాలకులు మారతారు తప్ప ప్రభుత్వం కొనసాగుతుంది కదా ?
అర్ధ సత్యాలను, అసత్యాలను చెప్పటంలో బిజెపి ఆరితేరింది. గత యుపిఏ ప్రభుత్వం జారీ చేసిన చమురు బాండ్లకు గాను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం 1.3లక్షల కోట్ల రూపాయలను చెల్లించాల్సి వచ్చిందని గతంలో ప్రచారం చేశారు, చమురు మంత్రిగారయితే 1.5లక్షల కోట్లన్నారు. బిజెపి అబద్దాల ఫ్యాక్టరీ నుంచి వెలువడిన దాని ప్రకారం 40వేల కోట్ల రూపాయల వడ్డీ, 1.3లక్షల కోట్ల అప్పుకు చెల్లించినట్లు ఒక బొమ్మను చూపారు. తీరా 2018లో రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు ఇదే పాలకులు చెప్పిందేమిటి చెల్లించిన మొత్తం రూ.3,500 కోట్లు. గత ఏడు సంవత్సరాలుగా ఆ పేరుతో జనాల నుంచి వసూలు చేసిన లక్షల కోట్ల రూపాయలను ఏమి చేశారు ? కరోనా సమయంలో జనమంతా దివాలా తీస్తే బిలియనీర్లు మరింత బలిశారు, కొత్తగా 40 మంది చేరి 177కు చేరారు. జనాన్ని కొట్టి పోగేసిందంతా ఇలాంటి వారికి కట్టబెట్టకపోతే అది సాధ్యమయ్యేనా ? ఇంతకూ చమురు బాండ్ల అప్పును మొత్తం తీర్చినట్లేనా ? నిజం ఏమిటి ?


మిగతా – ప్రమాదకర బిజెపి టూల్‌కిట్టు – పసలేని చమురు బాండ్ల లోగుట్టు – 2 లో చదవండి

లాటిన్‌ అమెరికాలో మరో వామపక్ష తరంగం !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


లాటిన్‌ అమెరికాలో కొన్ని చోట్ల తగిలిన తీవ్ర ఎదురు దెబ్బలతో ఇంకేముంది వామపక్షాల పని ముగిసింది అని చాలా మంది సంతోషించారు. ఎదురు దెబ్బలు తగిలిన ప్రతి సారీ మనుషుల ప్రాణాలు పోయేట్లయితే మానవ జాతి ఇంతలా పెరిగి ఉండేది కాదు. అలాంటిది తగిలిన ఎదురు దెబ్బలకు ఉద్యమాలు అంతరించిపోతాయను కోవటం ఒక భ్రమ మాత్రమే. సామ్రాజ్యవాదుల కుట్రలు, వాటికి వ్యతిరేకంగా జాగ్రత్తలను తీసుకోకపోవటం, నయా ఉదారవాదం మీద భ్రమలు, దాని ప్రమాదాన్ని తక్కువ అంచనా వేయటం, నయా ఉదారవాద పునాదులను కదిలించకపోవటం వంటి అనేక అంశాలు వామపక్షాల ఎదురు దెబ్బల వెనుక ఉన్నాయి. ఎదురు దెబ్బలను మాన్పుకొని తిరిగి పయనం ఎలా సాగిస్తామో ఉద్యమాలూ అంతే . ఇటీవల జరిగిన పరిణామాలు, కొన్ని చోట్ల ఎన్నికలలో తిరిగి వామపక్షాలు విజయం సాధించటాన్ని కొందరు మరోసారి వామపక్ష పురోగమన తరంగం ప్రారంభం అయిందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కడలి తరంగాల ఆటు పోట్లు నిత్యం జరుగుతుంటాయి. సముద్రం అలాగే ఉంటుంది. అదే మాదిరి ఉద్యమాలుంటాయి. అల అది పురోగామి లేదా తిరోగామి ఏదైనా జనానికి కొత్త అనుభవం నేర్పుతుంది.


లాటిన్‌ అమెరికా ప్రత్యేకించి బొలీవియాలో ఉన్న పరిస్దితి గురించి దేశ మాజీ ఉపాధ్యక్షుడు అల్వారా గార్సియా లినేరా మాట్లాడుతూ రెండవ పురోగమన తరంగంలో ఉన్నామని చెప్పారు.యాభై ఎనిమిది సంవత్సరాల లినేరా చేగువేరా స్ఫూర్తితో ఏర్పాటయిన టపాక్‌ కటారీ గెరిల్లా సైన్య నేతగా పని చేశారు. తిరుగుబాటు చేశారనే ఆరోపణలతో 1992లో అరెస్టు చేసి 1997లో విడుదల చేశారు. ఇవోమొరేల్స్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2005 నుంచి 2019వరకు దేశ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో తిరిగి ఎన్నికైన వారిద్దరి మీద పోలీసు, మిలిటరీ తిరుగుబాటు చేసి దేశం నుంచి వెళ్లిపోయేట్లు చేసింది. గతేడాది నవంబరులో జరిగిన ఎన్నికలలో మొరేల్స్‌ నాయకత్వంలోని మాస్‌ పార్టీ అభ్యర్ధి లూయీస్‌ ఆర్సీ ఘన విజయం సాధించటంతో ఇద్దరూ స్వదేశానికి చేరుకున్నారు.


ఒక వార్తా సంస్దతో తన స్వగృహంలో మాట్లాడుతూ ఏడాది తరువాత ఇంటి తలుపులు తెరిచినపుడు వచ్చిన శబ్దాలు తనను ఎంతో ఉద్వేగానికి గురి చేశాయన్నారు. లూయీస్‌ ఆర్సీ 55శాతం ఓట్లతో అధికారానికి రావటం వామపక్ష వాద విజయాలు మరియు పురోగమనాన్ని నిర్దారించింది.కొంత మంది వామపక్ష సైకిలు చక్రం తిరగటం ఆగిపోయిందనటం వాస్తవం కాదనేందుకు ప్రత్యక్ష నిదర్శనం ఇది, వామపక్ష ఉద్యమం తరంగాల వంటిది తప్ప ఆగిపోయే చక్రం కాదు, తరంగాలు వస్తుంటాయి పోతుంటాయి అన్నారు. తొలి తరంగం బలమైన ప్రజాకర్షణ గల నాయకత్వంతో విప్లవాత్మక పురోగమనవాదం అయితే రెండవది అలాంటి ప్రజాకర్షక నాయకత్వం లేని సాధారణ పురోగమనవాదంగా మనం చూస్తామన్నారు. మధ్యేవాద మితవాద శక్తుల పతనం పచ్చిమితవాద శక్తులకు దారి కల్పిస్తుంది, బలపడతాయి, దీన్ని మనం బ్రెజిల్లో చూశాము. ఇదేదో ఏదో ఒక చోట జరిగింది కాదు, డోనాల్డ్‌ ట్రంప్‌లో చూశాము, ఐరోపాలో చూస్తున్నాము. మధ్యేవాద మితవాదం విప్లవాత్మకంగా మారలేక వామపక్ష ప్రజాకర్షకనేతలను విమర్శిస్తూ హింసాత్మక మితవాదులనుంచి తనకు తాను దూరం జరుగుతోందని లినేరా చెప్పారు. బొలీవియాలో మరోసారి కుట్ర జరిగే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు బదులిస్తూ అందుకే నేను యువతను కలిసిన ప్రతిసారీ మరోసారి కుట్ర జరిగితే మీరేం చేస్తారు అని అడుగుతాను. అదొక సంస్దాపరమైన ప్రశ్న. అలా అడగటం ద్వారా సంఘటితం కావటం, రాజకీయ శిక్షణవైపు, స్పష్టమైన మార్గంవైపు వారిని నెడుతుంది. కేవలం ఎన్నికల కూటములకు మించి ఆలోచించటం నూతన ప్రజాస్వామ్య తరంగానికి ముఖ్యం అన్నారు.


అనేక చోట్ల ప్రతిపక్ష స్ధానాల్లోకి పోయిన లాటిన్‌ అమెరికా వామపక్షం తిరిగి నూతన ఎన్నికల విజయాల గురించి ఆశలు రేపుతున్నది.చిలీలో 1973లో వామపక్ష అధ్యక్షుడు సాల్వెడార్‌ అలెండీని హత్య చేసి నియంత అగస్టో పినోచెట్‌ అధికారాన్ని చేపట్టాడు. వామపక్ష ఉద్యమాన్ని అణచివేశాడు. పినోచెట్‌ అధికారం కోల్పోయిన తరువాత ఎవరు అధికారానికి వచ్చినా అతగాడి నిరంకుశ రాజ్యాంగమే అమల్లో ఉంది. గతేడాది జరిగిన ప్రజా ఉద్యమం కారణంగా వామపక్షాలు ఆమోదించిన కొత్త రాజ్యాంగ రచన జరగనుంది. దాని రూపు రేఖల మీద కొందరికి అనుమానాలు ఉన్నప్పటికీ అది కూడా ఒక విజయంగానే పరిగణించాల్సి ఉంది. అన్నీ సక్రమంగా జరిగి కొత్త రాజ్యాంగం ప్రకారం ఈ ఏడాది నవంబరులో ఎన్నికలు జరిగితే వామపక్షాలు సమైక్యంగా ఉంటే విజయం సాధించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. వామపక్షం అని పూర్తిగా చెప్పేందుకు లేకున్నా వారితో కలసిపని చేసే, అర్జెంటీనాలో గతంలో అధికారానికి వచ్చి తరువాత ఓడిపోయిన పెరోనిస్టు పార్టీ 2019లో అధికారానికి వచ్చింది. ” లాటిన్‌ అమెరికాలో వామపక్షాలు వెనుకపట్టు పట్టినా మితవాదం-వామపక్షం మధ్య వైరుధ్యం ముగియలేదు.2021లో వామపక్షం తిరిగి లాటిన్‌ అమెరికాలో ముందుకు పోయేందుకు వీలుగా ఉంది. ఈక్వెడోర్‌లో మాజీ అధ్యక్షుడు రాఫెల్‌ కొరెయా బలపరచిన వామపక్ష అభ్యర్ధి ఆండ్రెస్‌ అరౌజ్‌ విజయం సాధిస్తే ఎంతో ప్రాధాన్యత కలిగినది అవుతుంది. లాటిన్‌ అమెరికాలో పురోగమన వాదం నూతన రాజకీయ దశకు నాంది అవుతుంది” అని కొలంబియాకు చెందిన సామాజికవేత్త జేవియర్‌ కాలడెరన్‌ కాస్టిలో చెప్పారు. పెరూలో వామపక్ష విజయావకాశాలు పెరుగుతున్నాయి, వెరోనికా మెండోజా విజయం సాధించే అవకాశాలున్నాయని కూడా అన్నారు. ”నయా ఉదారవాదానికి బొలీవియా, చిలీలో పెద్ద దెబ్బ తగిలింది. నేడు నయా వుదారవాదవిధానాల పర్యవసానాలకు వ్యతిరేకంగా జనం పోరాడుతున్నారు. పురోగామి శక్తులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. పురోగమించే అవకాశాలు అంటే గత దశాబ్దంలో మాదిరి సాధ్యమైనంత త్వరలో అని కాదు. నయా ఉదారవాద శక్తులకు తమ ఇబ్బందులేమిటో తెలుసు, ఇదే సమయంలో పురోగామిశక్తుల పురోగమనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2022లో జరిగే కొలంబియన్‌ ఎన్నికలలో కొందరు పురోగామి శక్తులు విజయం సాధించవచ్చు ” అని కాస్టిలో చెప్పారు. బ్రెజిల్‌ గురించి చెబుతూ ” అది లాటిన్‌ అమెరికాలో పెద్ద దేశం. అది లాటిన్‌ అమెరికాలో బలాబలాల పొందికను కచ్చితంగా మారుస్తుంది. ప్రస్తుతానికి అది పచ్చి మితవాదశక్తుల చేతుల్లో ఉంది. అక్కడ పురోగమనం ఉన్నా అది సంపూర్ణం కాదు, పోరు ఇంకా సాగుతూనే ఉంది.అక్కడ పురోగామి శక్తులు ఉన్నా ఇంకా ఎంతో ముందుకు పోవాల్సి ఉంది.

చిలీ సోషలిస్టు పార్టీ పార్లమెంట్‌ సభ్యుడు ఎన్రిక్వెజ్‌ ఒమినామీ ఇలా అభిప్రాయపడ్డారు.” లాటిన్‌ అమెరికా ఖండం మరింత సన్నిహితం అయ్యేందుకు సాధ్యమైనన్ని ప్రభుత్వాలతో వామపక్షం తిరిగి ముందుకు రావాలి. అది వాణిజ్య పరంగా, ఆర్ధిక విలువ, రుణాలపై మారటోరియం, మిలిటరీ ఖర్చు, అమెరికాతో సంబంధాలలో జరగాలి. ఆర్దిక సామర్ధ్యం కంటే సామాజిక న్యాయం గురించి వామపక్షం కేంద్రీకరిస్తుంది, కనుక ఇది ఎంతో ముఖ్యం. మితవాద లేదా ఉదారవాద ప్రభుత్వాలు అర్జెంటీనా, బొలీవియా, చిలీ, ఈక్వెడోర్లలో తమ వాగ్దానాలను నిలుపుకోలేదు కనుక వామపక్షాలకు అవకాశాలు ఉన్నాయి.దీనికి తోడు లాటిన్‌ అమెరికా వామపక్షం వ్యవస్దా వాదాన్ని మార్చాల్సి ఉందనే పాఠాన్ని నేర్చుకున్నది. మధ్య తరగతి డిమాండ్లకు అనుగుణ్యంగా సామాజిక న్యాయం కోసం పోరాడాలి” అన్నారు.


ఏప్రిల్‌ నెలలో రెండవ దఫా ఎన్నికలు జరగాల్సిన ఈక్వెడోర్‌లో ఏం జరగనుందో ఇప్పటికీ స్పష్టత లేదు. అమెరికా అనుకూల హరితవాది యకు పెరెజ్‌ను రెండవ స్ధానంలో నిలిపేందుకు, తుది దఫా ఎన్నికల్లో వామపక్ష అభ్యర్ధిని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారు. ఫిబ్రవరి చివరి వారంలో నాలుగు జైళ్లలో ఆటవిక పద్దతిలో జరిగిన హింసాత్మక ఘటనల్లో 81 మంది మరణించారు. రంపాలతో శరీరాలను కోయటం, కుళ్లపొడవటం, ముక్కలు చేయటం వంటి దారుణాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.లాటిన్‌ అమెరికాలోని కొలంబియా వంటి కొన్ని దేశాల్లో ఇటువంటి చర్యలకు పోలీసులు, పారామిలిటరీ, ప్రభుత్వకిరాయి హంతక దళాలు, వాటిని ఎదిరించే వారు పాల్పడటం తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో ముసుగులు ధరించి గుర్తింపు బయటకు రాకుండా ఇలాంటి పనులు చేయించి ఇతరుల మీద నిందలు వేయటం సర్వసాధారణం. ఈక్వెడోర్‌ జైళ్లలో జరిగిన ఉదంతాలకు మాజీ అధ్యక్షుడైన వామపక్ష రాఫెల్‌ కొరెయా అనుచరులే కారణమని ప్రభుత్వం ప్రకటించటం వెనక ఉన్న కుట్ర ఏమిటో స్పష్టం.రెండవ దఫా జరగనున్న ఎన్నికలలో కొరెయా బలపరచిన అభ్యర్దిని దెబ్బతీసే దుర్మార్గమైన ఎత్తుగడ ఇది.మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో అనేక మంది నేరగాండ్లు ఈ జైళ్లలో ఉన్నారు. అలాంటి సంఘవ్యతిరేక చర్యలకు పాల్పడే ముఠాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా జైళ్లలో కూడా వారు మారణకాండకు పాల్పడిన ఉదంతాలెన్నో. తాజా ఉదంతాలలో మరణించిన వారిలో అలాంటి మాఫియాలకు చెందిన వారు ఉన్నప్పటికీ ప్రభుత్వం చేయించిన దారుణం తప్ప రాజకీయంగా వామపక్ష పార్టీకి ఎలాంటి సంబందం లేదు. జైళ్లలో ఉన్నవారికి అధికారుల అనుమతి, అవకాశం ఇవ్వకుండా అలాంటి మారణాయుధాలు ఎలా అందుబాటులోకి వస్తాయి ? వామపక్ష ఇఎల్‌ఎన్‌ పార్టీకి మాదకద్రవ్యాల ముఠాల నుంచి నిధులు అందుతున్నాయని ముందే తప్పుడు ప్రచారం చేశారు. ఆ పార్టీ అభ్యర్ధి ఆండ్రెస్‌ అరుజ్‌ ప్రధమ స్ధానంలో ఉన్నందున, ఏదో ఒకసాకుతో అసలు ఎన్నికలనే రద్దు చేసేందుకు ఇదంతా చేశారన్నది స్పష్టం.

అమెరికా అనుకూల అభ్యర్ధి యకు పెరెజ్‌ అనూహ్యంగా మూడవ స్ధానంలో రావటంతో అసలు రెండోసారి పోటీకే అనర్హుడయ్యాడు.మూడో స్ధానంలో వచ్చిన మరోమితవాది లాసో అతని మధ్య ఓట్ల తేడా కేవలం 20వేలు లోపు కావటంతో లెక్కింపులో అక్రమాలు జరిగాయంటూ యాగీ చేశాడు. దానికి ఎన్నికల సంఘం అంగీకరించింది. తీరా చూస్తే దానిలో కూడా పసలేదని తేలింది. లెక్కింపులో అటువేయాల్సిన ఓట్లను ఇటు వేశారని చెప్పిన 31 పత్రాలను పరిశీలించగా వాటిలో ఉన్న మొత్తం ఓట్లే పదహారు వేలు. అవి మొత్తం పెరేజ్‌కు వచ్చినా మూడవ స్ధానం మారదు.వాటిలో 7,233 ఓట్లలో మాత్రమే ఓటు నంబరు, ఓటరు సంతకానికి తేడాలు కనిపించాయి, వాటిలో కూడా 1,453ను రెండుసార్లు లెక్కించారు. అందువలన అది కూడా వీగిపోయిన తరువాత చట్టపరంగా ఇతర ఇబ్బందులు కలిగించేందుకు పూనుకోవటంతో పాటు జైల్లో హత్యాకాండ చేయించారు. అందువలన అడుగడుగునా ఎన్నికలను తొత్తడం చేసేందుకు కుట్ర సాగుతూనే ఉంది. దానిలో భాగమే మాదకద్రవ్య మాఫియా నుంచి వామపక్ష అభ్యర్ధికి నిధులు అందాయన్న మరొక కట్టుకధ. దాని మీద ఫిర్యాదు, విచారణ తతంగం. ఎంతకు బరితెగించారంటే ఏప్రిల్‌లోగా వామపక్ష అభ్యర్ధి అరౌజ్‌ పతనం కానట్లయితే తరువాత అక్రమంగా నిధులు పొందారన్న కారణంతో పతనం అవుతాడని యకు పెరేజ్‌ ప్రకటించటం కుట్రగాక మరేమిటి ?


ఈ కుట్రలను వ్యతిరేకిస్తూ అంతర్గతంగా అనేక మంది గళమెత్తుతున్నారు.ప్రజాస్వామిక ప్రక్రియ ఈక్వెడోర్‌లో కొనసాగుతుందనే హామీ ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లు మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యుయల్‌ లోపెజ్‌ అబ్రాడోర్‌, అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్‌ ప్రకటించాల్సి వచ్చింది. ఈ ప్రకటనను బొలీవియా అధ్యక్షుడు లూయీస్‌ ఆర్సీ కూడా బలపరిచారు. రాఫెల్‌ కొరియా నాయకత్వంలో ఉన్న పార్టీకి ద్రోహం చేసి విద్రోహ శక్తులతో చేతులు కలిపిన ప్రస్తుత అధ్యక్షుడు లెనిన్‌ మోరెనో తన అభ్యర్ధి సోదిలో కూడా లేకుండా పోవటంతో ఇప్పుడు బ్యాంకర్‌ అయిన రెండవ స్ధాన అభ్యర్ధి లాసోకు మద్దతు ఇస్తున్నాడు. కనిపించని కుట్రల నేపధ్యంలో ఇప్పటి వరకు ఉన్న పరిస్దితిని బట్టి పోటీ అరౌజ్‌ -లాసో మధ్య జరుగుతుందా ? మితవాదశక్తులన్నీ లాసో వెనుక నిలుస్తాయా ? అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయా అన్నది చెప్పలేము. ఇక్కడ అరౌజ్‌ విజయం లాటిన్‌ అమెరికాలో వామపక్షాల నిర్ణయాత్మక పాత్రను మరింత ముందుకు తీసుకుపోనుంది. అయితే సామ్రాజ్యవాదులు దీన్ని అనుమతిస్తారా లేక గతం మాదిరి మిలిటరీ నియంతలను తిరిగి రంగంలోకి తెస్తారా ?

చమురు ధరలు : పండుగాడి దెబ్బతో బిజెపి నేతల మైండ్‌ బ్లాక్‌ – జనానికి దరిద్రంగా మారిన నరేంద్రమోడీ అదృష్టం !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు
” ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్‌ బ్లాక్‌ అయిపోద్దో వాడే పండు గాడు ” దీని గురించి వేరే చెప్పనవసరం లేదు కదా ! బిజెపి నేతలు, వారి అనుయాయులకు చమురు పండుగాడి దెబ్బ తగిలినట్లుంది. లేకపోతే చమురు ధరల మీద గతంలో ఒక మాట ఇప్పుడు ఒక మాట, ప్రధాని, ఆర్ధిక మంత్రి, చమురు మంత్రి ఇలా ఢిల్లీ నుంచి గల్లీ వరకు తలా ఒక మాట ఎలా మాట్లాడతారు ? రాజకీయ పార్టీల నేతలు (వామపక్షాలు దీనికి మినహాయింపు-వారు కూడా అలాంటివి పెట్టినట్లు ఎవరైనా నిరూపిస్తే సవరించుకుంటానని మనవి) జనానికి చెవుల్లో పూలు పెట్టాలను కోవటం నిత్యకృత్యం. అందులోనూ కమలం పువ్వు బిజెపిదే కనుక వారికి మేథోపరమైన, ప్రత్యేక హక్కులు కూడా ఉంటాయి.
” చమురు బంకుల దగ్గర బోర్డులు పెట్టాలి. కేంద్రం, రాష్ట్రాలు ఎంతెంత పన్ను విధిస్తున్నాయో, కేంద్రం విధించే పన్నుల్లో తిరిగి రాష్ట్రాలకు ఎంత వస్తున్నదో వాస్తవ భారం ఎంతో వివరిస్తూ ఆ బోర్డుల్లో రాస్తే జనానికి అసలు విషయాలు తెలుస్తాయి.” అని కొంతకాలం క్రితం మోడీ భక్తులు ప్రచారం చేశారు. బారు గడ్డంతో చిదానంద స్వామిలా ఎలాంటి తొణుకూ బెణుకూ లేకుండా ఉన్న నిలువెత్తు నరేంద్రమోడీ చిత్రంతో ప్రతి బంకు వద్ద ఇప్పటికైనా భక్తులు స్వచ్చందంగా పెట్టినా ఇబ్బంది లేదు.లేదా జియోకు ఎలాగూ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నారు గనుక ముకేష్‌ అంబానీ లేదా అదానీ అయినా తమ ప్రచార అంశాన్ని కిందో పైనో పెట్టి చమురు గురించి బోర్డులు పెట్టి రుణం తీర్చుకోవాలి.జనానికి వాస్తవాలను తెలియపరచాలి.

చమురు ధర వందడాలర్ల గురించి చర్చ ప్రారంభం !

ఇక పండుగాడి దెబ్బ గురించి చూద్దాం.కొద్ది రోజుల క్రితం బ్రెంట్‌ ముడి చమురు ధర 67-68 డాలర్ల వరకు ఊగిసలాడి ఆదివారం సాయంత్రం 66.13డాలర్ల దగ్గర, మన చమురు 65.70 డాలర్ల వద్ద ఉంది. మరోవైపున 2022 నాటికి వందడాలర్ల గురించి వ్యాపారులు ఆలోచిస్తున్నారు. త్వరలో 75-80 డాలర్ల వరకు పెరగవచ్చని కొందరి జోశ్యం. పిల్లి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నది తెలిసిందే. చమురు ధరల చెలగాటం జనానికి అలవాటైపోయింది. ఎంత చెబితే అంత చెల్లించటం దేశభక్తిగా భావిస్తున్నారు.తాము చెల్లించేది కార్పొరేట్లకు రాయితీల రూపంలో సమర్పిస్తున్నారనేది తెలియటం లేదు. నరేంద్రమోడీ గారికి ఇప్పుడిప్పుడే అనుభవంలోకి వస్తోంది. ఎందుకంటే ఆయన అధికారానికి వచ్చిన నాటి నుంచి బహుశా ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండానే అంతర్జాతీయ మార్కెట్‌ను నియంత్రించి ఉండాలి. లేకపోతే రికార్డు స్దాయిలో సంవత్సరాల తరబడి ధరలు ఎందుకు తగ్గి ఉంటాయి. ఇప్పుడు కాక మొదలైంది కనుక చమురు పండు గాడు గుర్తుకు వస్తున్నట్లుంది.

ఎవరేం మాట్లాడుతున్నారో తెలుస్తోందా ! సమన్వయం ఉండదా !

ఫిబ్రవరి 17వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ చమురు ధరలు వందరూపాయలు(బ్రాండెడ్‌) దాటాయన్న వార్తలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ధరలు ఆకాశాన్ని తాకటానికి గత పాలకులే కారణమంటూ గడ్డాన్ని సవరించుకున్నారు. వారు గనుక (తమ నేత వాజ్‌పాయి గారు కూడా ఆరేండ్లు అధికారంలో ఉన్న విషయం గుర్తు లేనట్లుంది) దిగుమతుల మీద ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్రీకరించి ఉంటే మధ్యతరగతికి ఈ భారం ఉండేది కాదు అంటూనే అబ్బే నేను ఎవరినీ విమర్శించటానికి కాదు గానీ ఈ విషయం చెప్పక తప్పదు అన్నారు. ఏ స్కూలు విద్యార్ధిని అడిగినా గత ఏడు సంవత్సరాల కాలంలో చమురు దిగుమతులు పెరిగాయో తరిగాయో, స్వదేశీ ఉత్పత్తి ఎలా దిగజారిందో మోడీ గారికి పాఠంగా చెబుతారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కబుర్లు ఆయన గడ్డం పెరుగుదల కంటే ఎక్కువగా ఉన్నాయి.పెట్రోల్లో ఇథనాల్‌ను ప్రస్తుతం 8.5శాతం కలుపుతున్నామని, 2025 నాటికి దాన్ని 20శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించామని అది జరిగితే దిగుమతులు తగ్గుతాయి, రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయాలు పెరుగుతాయి. మధ్యతరగతి గురించి తాము ఎంతో సున్నితంగా వున్నామన్నారు. అసలు విషయం ఏమంటే చక్కెర పరిశ్రమలు ఇథనాల్‌ సరఫరా చేస్తుంటే వాటిని నిల్వచేసే ట్యాంకులను కూడా చమురు సంస్దలు ఏర్పాటు చేయలేదు. మోడీ గారు ఏమి చేస్తున్నారో తెలియదు.


చలికాలం తరువాత చమురు ధరలు తగ్గుతాయని ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఫిబ్రవరి 26న చెప్పారు.అయినా ఇది అంతర్జాతీయ వ్యవహారం, గిరాకీ పెరిగిన కారణంగా ధరలు పెరిగాయని సెలవిచ్చారు. చలికాలంలో ధరలు పెరగటం తరువాత తగ్గటం మామూలే అన్నారు. గత ఏడు సంవత్సరాల కాలంలో అలా ఎప్పుడైనా జరిగిందా ? ఒక దేశంలో చలికాలం అయితే మరో దేశంలో మరో వాతావరణం ఉంటుందని జనానికి తెలియదా అని అడిగితే దేశద్రోహం కేసు బనాయిస్తారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో చమురు ధరలు అత్యంత కనిష్టానికి పడిపోయిన సమయంలో దానికి అనుగుణ్యంగా 86 రోజుల పాటు ధరలను ఎందుకు తగ్గించలేదో మంత్రిగారు చెబుతారా ? చమురేమైనా టమాటాల్లాంటివా ! సీజన్‌లో కొనేవారు లేక రైతులు పారపోస్తారు లేదా కిలో రూపాయికి లోపే అమ్ముకుంటారు. చమురు అలాంటిది కాదే.


మరోవైపున ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చమురు ధరలు తగ్గుతాయని తాను చెప్పలేనని,అదొక ధర్మ సంకటమని చెప్పారు. ఉల్లిధరల గురించి అడిగినపుడు నేను వాటిని తినను కనుక తెలియదని, జిఎస్‌టి నష్టాలకు దేవుడి విధి అని కేంద్రం ఏమీ చేయలేదని గతంలో చెప్పిన ఆమె నుంచి అంతకు మించి ఏమి ఆశించగలదు దేశం. ఇదే సమయంలో రిజర్వుబ్యాంకు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మాట్లాడుతూ చమురుపై పన్నులు తగ్గించేందుకు కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పని చేయాలని కోరారు.ఎవరేం మాట్లాడుతున్నారో గమనించే స్ధితిలో ఉన్నారా ? పెట్రోలియం మంత్రి ఫిబ్రవరి పదవ తేదీన రాజ్యసభలో మాట్లాడుతూ గత మూడు వందల రోజుల్లో కేవలం 60 రోజులు మాత్రమే ధరలు పెంచామని పెట్రోలు ఏడు, డీజిలు 21 రోజులు తగ్గించామని, 250 రోజులు, పెంచలేదు తగ్గించలేదు అన్నారు. అంటే ఆ రోజుల్లో అంతర్జాతీయ ధరల్లో ఎలాంటి మార్పు లేదా ? ఎవరిని మభ్యపెట్టేందుకు ఇలాంటి మాటలు చెబుతారు.

మతిమరపు నటిస్తున్న బిజెపి పెద్దలు ! చంద్రబాబుకు మోకాళ్ల నొప్పులు !

ఇప్పుడు జనానికి సుభాషితాలు చెబుతున్న బిజెపి నేతలు గతంలో చమురు ధరలు పెరిగి నపుడు ఏమి సెలవిచ్చారో మతిమరపు నటిస్తున్న కారణంగా వారేమీ చెప్పలేరు గాని వారిని అభిమానించే వారు తెలుసుకోవాలి. వీధుల్లో వేసిన వేషాలు, చేసిన ప్రదర్శనలు, అన్నట్లు మరిచాను చంద్రబాబు నాయుడు కూడా బిజెపితో జతకట్టిన కారణంగా యుపిఏకు వ్యతిరేకంగా సైకిలు తొక్కి నిరసన తెలియచేశారు. ఇప్పుడు బహుశా మోకాళ్ల నొప్పులు వచ్చి ఉంటాయి అనుకుంటే కుర్రవాడైన కొడుకు లోకేష్‌ ఎందుకు తొక్కటం లేదు ?


2006లో ముడిచమురు ధర పీపా 55 నుంచి 70 డాలర్లకు పెరిగినపడు బిజెపి డ్రామాలను జనం చూశారు.లీటరుకు 4,2 రూపాయల చొప్పున పెట్రోలు, డీజిలు మీద పెంచిన యుపిఏ సర్కార్‌ దానికి చెప్పిన కారణం అలా పెంచకపోతే చమురు కంపెనీలు కుప్పకూలిపోతాయని.గత సంవత్సరం చమురు ధర 20 డాలర్లకు పడిపోయినపుడు తరువాత 40 డాలర్లయినపుడు కూడా అంతకు ముందు ఉన్న ధరలను తగ్గించలేదు. ఎందుకంటే కరోనా సమయంలో చమురు వినియోగం పడిపోయింది తప్ప కంపెనీల, పెట్రోలు బంకుల ఖర్చులు తగ్గలేదు కనుక తగ్గిన మేరకు ధరలు తగ్గించలేదని బిజెపి నేతలు చెప్పటం తెలిసిందే. మరి సామాన్య జన ఆదాయాలు తగ్గకుండా ఏం చేశారంటే మాత్రం నోరు పెగలదు. నాడు మాజీ ప్రధాని వాజ్‌పాయి గారు యుపిఏ సర్కార్‌ క్రూరమైన పరిహాస మాడుతోందన్నారు.కేంద్రం, రాష్ట్రాలు పన్నులు తగ్గించాలన్నారు. గుజరాత్‌లో మారణకాండ సమయంలో నరేంద్రమోడీ రాజధర్మం పాటించాలని వాజ్‌పాయి చెప్పారు. ఆయన బతికి ఉండగానే ఆ మాటల మీద చల్‌ అన్నట్లుగా పట్టించుకోని నరేంద్రమోడీ ఇప్పుడు దివంగత నేతకు ప్రమాణాలు చేయటం తప్ప ఆయన మాటలను పట్టించుకుంటారా, పాటిస్తారా !


ఇప్పుడు బిజెపిఏతర పాలిత రాష్ట్రాలు పన్నులు తగ్గించవచ్చు కదా అంటున్న బిజెపి వారు అప్పుడు తమ ఏలుబడిలో ఎంత మేరకు తగ్గించారో చెప్పగలరా ? అప్పుడు పెట్రోలు లీటరు ధర 47.51, డీజిలు ధర 23.52 ఉండేది. నిజంగా క్రూరమైన పరిహాసం ఏమంటే వాజ్‌పారు నాయకత్వంలోని ఎన్‌డిఏ సర్కార్‌ ఆరు సంవత్సరాలలో 33 సార్లు ధరలను పెంచింది. 2002-06 మధ్య అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర 24 నుంచి 75 డాలర్లకు పెరిగింది. చమురు ధరలపై నియంత్రణ ఎత్తివేసి మార్కెట్‌ ధరలను వసూలు చేయాలని నిర్ణయించింది. అధికారం పోగానే మర్యాదస్తుడని అనేక మంది భావించే వాజ్‌పేయి నాయకత్వంలోనే బిజెపి ధరల పెరుగుదల వ్యతిరేక నిరసన నాటకాలాడింది నిజం కాదా ?

పన్నుల విధింపులో ఔరంగజేబు ఆదర్శమా !


2020 ఏప్రిల్‌-నవంబరు మాసాల్లో (లాక్‌డౌన్‌ సమయం) కేంద్ర ఎక్సయిజు పన్ను చమురు ఖాతా నుంచి 1,96,342 కోట్లు వస్తే అంతకు ముందు సంవత్సరంలో అదే వ్యవధిలో వచ్చిన మొత్తం 1,32,899 కోట్లు మాత్రమే.చమురు కంపెనీలతో పాటు మోడీ సర్కార్‌ జనం నుంచి పిండిన తీరు ఇది. అంతకు ముందుతో పోల్చితే వినియోగం తగ్గినప్పటికీ ఔరంగజేబు మాదిరి పన్నులతో పీల్చిన ఫలితమిది.ఇదే సమయంలో జిఎస్‌టి ఆదాయం గణనీయంగా తగ్గి రాష్ట్రాలు ఎంతో ఇబ్బంది పడ్డాయి. నిద్రపోయే వారిని లేపి ఈ విషయాలన్నీ చెప్పగలం తప్ప నటించేవారికి చెప్పలేము.


జనానికి బుర్రలుండవని, ఉన్నా ఉపయోగించలేని బద్దకం బలిసిపోయిందని బిజెపికి అనుకుంటున్నట్లుగా మరొక పార్టీ భావించదని అంగీకరించకతప్పదు. లేకపోతే పెరిగిన ధరలను సమర్ధించేందుకు ఎంత ధైర్యం ఉండాలి. స్మృతి ఇరానీ పెద్ద నటి అన్న విషయం తెలిసిందే. ఆమె బిజెపి నేతగా 2011 జూన్‌ 24న గ్యాస్‌ బండ మీద 50 రూపాయల పెంపుదల మీద చేసిన ట్వీట్‌లో ఏమన్నారో తెలుసా ? మాది సామాన్యుల ప్రభుత్వం అని చెప్పుకుంటారు, గ్యాస్‌ ధర 50 పెంపా, ఎంత సిగ్గు చేటు అన్నారు. ఇప్పుడు ఆమె గౌరవనీయమైన కేంద్ర మంత్రి. డిసెంబరు నుంచి ఇప్పటి వరకు 150 రూపాయలు పెంచారు. మంత్రిగారు గనుక ఆమె వంటశాలకు దూరంగా ఉంటారు గనుక తెలిసి ఉండదు. లేకపోతే గతంలో మాదిరి వీధుల్లో వచ్చి ఉండేవారు. బిజెపి ఐటి విభాగ అధిపతి అమిత్‌ మాలవీయ జగమెరిగిన ఫేకిస్టు.2012 అక్టోబరు ఆరున ఒక ట్వీట్‌ చేశారు. అదేమంటే అప్పటి యుపిఏ సర్కార్‌ గ్యాస్‌ బండమీద రు.11.42పైసలు పెంచింది. దానికి వ్యతిరేకంగా సామాన్యులు, మహిళల మీద కాంగ్రెస్‌ బ్యాండ్‌ మోత మోగించింది అన్నారు. ఇప్పుడు జరిగిందేమిటి ? లెక్కలు చెప్పాలా ?ఒక సంఖ్య చెబితే మరుసటి రోజుకో వారానికో మారిపోతున్నందున ఎవరికి వారు బండను బుక్‌ చేసినపుడు ఎంత ఉందో తెలుసుకొని మోడీ సర్కార్‌కు భజన చేయాలో బ్యాండ్‌ బజాయించాలో నిర్ణయించుకోవచ్చు.


సిఎంగా మోడీ నాడేమన్నారు-ప్రధానిగా నేడేం చేస్తున్నారు !


2012 మే నెలలో పెట్రోలు ధరను లీటరుకు రూ.7.54 పెంచారు. దాంతో ఢిల్లీలో రు.73.18కి పెరిగింది. దాని మీద నాటి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ మండిపడ్డారు.అది కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ ప్రభుత్వ వైఫల్యానికి ఒక ముఖ్య ఉదాహరణ అన్నారు.తొమ్మిది సంవత్సరాల తప్పుడు ఆర్ధిక విధానాల పర్యవసానం అన్నారు బిజెపి నేతలు. ఆర్ధిక వ్యవస్ధను బలంగా ఉంచే విధంగా సరైన విధానాలను యుపిఏ అనుసరించి ఉంటే అది చమురు సబ్సిడీలను ఇచ్చే స్ధితిలో ఉండేది అన్నారు. తరువాత వామపక్షాలతో పాటు బిజెపి కూడా చమురు ధరలకు వ్యతిరేకంగా భారత్‌ బంద్‌లో పాల్గొన్నది. ఇప్పుడు బిజెపి నేతలు ఏం చేస్తున్నారు ? సబ్సిడీలన్నీ ఎత్తివేశారు. మోడీ అధికారానికి రాక ముందు మే 2014లో 113 డాలర్లు ఉన్న ముడిచమురు ధర మరుసటి ఏడాది జనవరి నాటికి 50 డాలర్లకు పడిపోయింది.


2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయనేమన్నారు. నిజమే నేను అదృష్టవంతుడనే, కానీ మీకు డబ్బు ఆదాఅవుతోంది. మోడీ అదృష్టం జనానికి లబ్ది చేకూర్చుతుంటే అంతకంటే కావాల్సిందేముంది ? నా అదృష్టం కారణంగా పెట్రోలు, డీజిలు ధరలు తగ్గితే సామాన్యుల పొదుపు ఎక్కువ అవుతుంది. అందువలన అదృష్టవంతులు కాని వారిని తీసుకురావాల్సిన(ఎన్నుకోవాల్సిన) అవసరం ఏముంది అంటూ కాంగ్రెస్‌ మీద వ్యాఖ్యానించారు. ఆ అదృష్టం ఇంకా పెరిగి 2016లో ఒక దశలో ముడిచమురు ధర 29 డాలర్లకు పడిపోయింది. సదరు అదృష్టవంతుడు చేసిందేమిటి ? వినియోగదారులకు దరిద్రాన్ని పట్టించటం కాదా ? 2014 మే నుంచి ఇప్పటి వరకు వరకు వంద రూపాయలు పెంచి ఒక్క రూపాయి తగ్గించిన మాదిరి ఉదారత్వాలను పరిగణనలోకి తీసుకుంటే భారం ఎలా ఉందో చూద్దాం.
సం ××సరకు ×× ఎక్సయిజ్‌×××డీలరు ధర××వినియోగదారు ధర
2014 ×× పెట్రోల్‌ ×××× 9.48 ××× 49.50 ××××× 73.20
2021 ×× పెట్రోల్‌ ×××× 32.98 ××× 27.75 ××××× 83.71
2014 ×× డీజిలు ×××× 3.56 ××× 52.68 ××××× 55.48
2021 ×× డీజిలు ×××× 31.80 ××× 33.74 ××××× 79.74
(గమనిక 2014డీజిలు, పెట్రోలు ధరలు మార్చి ఒకటవ తేదీ ఢిల్లీ, 2021 డీజిలు ధర ఫిబ్రవరి 16, పెట్రోలు ధర జనవరి ఒకటవ తేదీ ఢిల్లీకి చెందినవి, హిందూస్దాన్‌ పెట్రోలియం కంపెనీ ధరలుగా గమనించాలి.2014 మార్చిలో పెట్రోలు మీద సబ్సిడీ లేదు, డీజిలు మీద లీటరుకు రూ.8.37 సబ్సిడీ ఉంది.)

అమెజాన్‌ ”టూల్‌ కిట్‌ ” లో ప్రధాని నరేంద్రమోడీ గురించి ఉన్నది ఏమిటి ?


విదేశీయులు లేదా స్వదేశీయులు ఒక ప్రధాని లేదా ముఖ్యమంత్రులను పొగడుతున్నారు అంటే వారిలో రెండు రకాల అభిప్రాయాలు ఉంటాయి. దానికి ఎవరూ మినహాయింపు కాదు. ఒకటి ప్రయోజనం కోసం చెప్పే మెరమెచ్చు మాటలు, రెండోది అంతర్గతంగా ఉన్న అభిప్రాయం.2012 ఫిబ్రవరి 18వ తేదీన బిజినెస్‌ టుడే అనే పత్రిక రాయిటర్‌ సంస్ధ ఇచ్చిన వార్తను ప్రచురించింది. ” మోడీ ఒక మేథావి కాదు: ప్రధాని గురించి అంతర్గత పత్రాల్లో అమెజాన్‌ వర్ణణ ” అన్నది దాని శీర్షిక. ప్రముఖులు ఇతరులతో సంభాషించే సమయంలో మాట్లాడాల్సినవి ఏవి, మాట్లాడకూడనివి ఏవి, బలం ఏమిటి బలహీనతలు ఏమిటి అని కంపెనీ సిబ్బంది ఒక నోట్‌ తయారు చేస్తారు. దానికి అనుగుణ్యంగానే అమెరికాలోని భారత రాయబారితో 2019లో అమెజాన్‌ డాట్‌కామ్‌ మాజీ ఎగ్జిక్యూటివ్‌ జే కార్నే మాట్లాడేందుకు వెళ్లినపుడు సిబ్బంది ఒక పత్రంలో కొన్ని విషయాలు రాశారు.అప్పుడు కార్నే మోడీని బహిరంగంగా ఇలా వర్ణించాడు ” సీదా సాదాగా, తర్కబద్దంగా, ముక్కుసూటిగా ఉంటారు” అని పేర్కొన్నాడు. అమెజాన్‌ కంపెనీ 2012 నుంచి 2019వరకు రూపొందించిన ఇలాంటి పత్రాలు రాయిటర్‌ వార్తా సంస్దకు దొరికాయి. ఒకదానిలో మోడీ ముక్కుసూటి తనం, ఆలోచించే తీరు ఆయన ఒక మేథావి స్దాయికి తగినదిగా ఉండదు అని పేర్కొన్నారు. ఒక మేథావీకాదు, ఒక పండితుడు కాదు గానీ బలమైన పాలనా, యంత్రాంగంతో విజయవంతమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నారని పేర్కొన్నారు.అలాంటి పత్రాలను రూపొందించిన వారిలో మన దేశానికి చెందిన అమెజాన్‌ కంపెనీ ప్రతినిధి అమిత్‌ అగర్వాల్‌ వంటి స్వదేశీయులే ఉన్నారు. టూల్‌కిట్‌తో మన పరువు పోయిందని గగ్గోలు పెడుతున్నవారు ఇలాంటి టూల్‌కిట్ల గురించి కూడా తెలుసుకుంటే మంచిదేమో ?

కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఏప్రిల్‌ ఆరవ తేదీన కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం చేసిన ప్రకటనతో రాజకీయ సమీకరణలు, సర్దుబాట్లు త్వరలో ఒక కొలిక్కి రానున్నాయి. గత నాలుగు దశాబ్దాల చరిత్రను చూసినపుడు ఒక సారి కాంగ్రెస్‌ నాయకత్వంలోని కూటమి అధికారానికి వస్తే మరోసారి సిపిఎం నాయకత్వంలోని కూటమి రావటం తెలిసిందే. దానికి భిన్నంగా ఈ సారి మరోసారి అధికారాన్ని నిలుపుకొనేందుకు సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ కూటమి ప్రయత్నిస్తుంటే, అధికారానికి రావాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడిఎఫ్‌ చేయని ప్రయత్నం లేదు. కేవలం ఒక స్ధానం ఉన్న బిజెపి తాము కూడా అధికారంలోకి వచ్చేందుకు సిద్దం అన్నట్లుగా ప్రచారం చేస్తోంది. తాను చేరితే బిజెపి ఓట్లు రెట్టింపు అవుతాయని, అధికారానికి వస్తే తాను ముఖ్యమంత్రి పదవికి సిద్దంగా ఉన్నానని మెట్రో మాన్‌ ఇ శ్రీధరన్‌ చెప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎల్‌డిఎఫ్‌లో 14 పార్టీలు, యుడిఎఫ్‌లో ఐదు ఉన్నాయి. ఎన్‌డిఏలో బిజెపితో పాటు మరో నాలుగు చిన్న పార్టీలు ఉన్నాయి. మొత్తం 140 స్దానాలకు గాను ఎల్‌డిఎఫ్‌కు 91 స్ధానాలు, యుడిఎఫ్‌కు 47, బిజెపికి ఒకటి, ఆ పార్టీతో జత కట్టిన మరో పార్టీకి ఒక స్ధానం ఉన్నాయి.


ఎల్‌డిఎఫ్‌లో కొత్తగా చేరిన కేరళ కాంగ్రెస్‌(ఎం), లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ యుడిఎఫ్‌లో ఉండగా గత ఎన్నికల్లో 11, 7 స్దానాల చొప్పున పోటీ చేశాయి. ఇప్పుడు వాటికి ఎల్‌డిఎఫ్‌లోని భాగస్వామ్య పక్షాలు ముఖ్యంగా సిపిఎం, సిపిఐ తమ స్దానాల సంఖ్యను తగ్గించుకొని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఈమేరకు యుడిఎఫ్‌లో ఖాళీ అవుతున్న సీట్లలో మిగిలిపోయిన కేరళ కాంగ్రెస్‌(జె)కు ఏడు సీట్లు పోను మిగిలిన వాటిని కాంగ్రెస్‌-ముస్లిం లీగు పంచుకుంటాయని వార్తలు వచ్చాయి. కొద్ది వారాల క్రితం పార్టీ ప్రాతిపదికన జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో వచ్చిన ఓట్లను బట్టి ఎల్‌డిఎఫ్‌కు 101 స్ధానాలు వస్తాయని, మళయాల మనోరమ విశ్లేషించగా, 98వస్తాయని సిపిఎం సమీక్షలో తేలిందని అదే ప త్రిక రాసింది. స్దానిక సంస్ధల ఎన్నికలకు ముందు ఎల్‌డిఎఫ్‌పై తీవ్రమైన ఆరోపణలు, తప్పుడు ప్రచారం చేసినప్పటికీ ఆ ఎన్నికలలో ఓటర్లు వాటిని తిప్పికొట్టారు. అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో కూడా తిరిగి అదే ప్రచారం ప్రారంభమైంది.మీడియా వాటికి వంతపాడుతున్నది.


ఓట్లకోసం చర్చిల చుట్టూ ప్రదక్షిణలు చేయనున్న బిజెపి -ముస్లిం లీగుకూ ఆహ్వానం !


కేరళలో సీట్లు వచ్చినా రాకపోయినా కనీసం ఓట్లయినా పెంచుకోవాలని, దాన్నే పెద్ద విజయంగా చెప్పుకోవాలన్నది బిజెపి ఆత్రం. అత్రగాడికి బుద్ది మట్టు అన్న సామెత తెలిసిందే. నిత్యం మత మార్పిడుల గురించి క్రైస్తవ మతాన్ని తిట్టిపోసే బిజెపి నేతలు ఇప్పుడు కేరళలో చర్చ్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు, ఆ మత పెద్దలను సంతుష్టీకరించి ఓట్లు పొందేందుకు నిర్ణయించుకున్నారు.కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అశ్వద్ధ నారాయణ త్వరలో అందుకోసం బయలుదేర నున్నారని కేరళలో అగ్రశ్రేణి దినపత్రిక మళయాల మనోరమ రాసింది.కర్ణాటక నుంచి కేరళ బిజెపి అభ్యర్ధులకు అవసరమైన డబ్బుతో పాటు ఇతరత్రా సాయం చేసేందుకు అక్కడి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు నడుంకట్టారు. కేరళలో సమస్యలు, బిజెపి ఎత్తుగడల గురించి చర్చించేందుకు బెంగళూరులోని వంద మంది మళయాలీ ప్రముఖులతో చర్చలు జరుపుతున్నారట.
కేరళ రాజకీయాల్లో ఏది వాటంగా ఉంటే దాన్ని అనుసరించే సీనియర్‌ ఎంఎల్‌ఏ పిసి జార్జి. కాంగ్రెస్‌తో జీవితాన్ని ప్రారంభించి స్వతంత్రుడిగా, కేరళ కాంగ్రెస్‌లోని రెండు ప్రధాన గ్రూపుల్లో చేరి తరువాత దాన్నుంచి బయటకు వచ్చి జనపక్షం పేరుతో స్వంత పార్టీని పెట్టుకున్నారు. ఏ పేరుతో పోటీ చేసినా మంచి మెజారిటీలతో ఏడు విజయాలతో ఒక ప్రత్యేకత సాధించారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. తాజా వార్తల ప్రకారం మరోసారి బిజెపితో చేతులు కలపబోతున్నారు. రెండు సీట్లు కేటాయించేందుకు అంగీకరించినట్లు వార్తలు. ఇటీవల ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన బహిరంగ ప్రకటనలు, అంతర్గతంగా బిజెపితో సంబంధాలు నెరపటంతో జార్జిని చేర్చుకుంటే చేర్చుకుంటే సంగతి తేలుస్తాం అంటూ కాంగ్రెస్‌లోని ఒక వర్గం హెచ్చరించింది. ఒక వేళ చేర్చుకొని సీటు ఇస్తే పోటీగా ఒక స్వతంత్ర అభ్యర్ధిని రంగంలోకి దింపుతామని కొట్టాయం జిల్లా నేతలు హెచ్చరించారు. ఇప్పుడున్న పరిస్ధితిలో ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకంగా కొన్ని వేల ఓట్లు కూడా ఎంతో కీలకమైనవి కనుక చేర్చుకోవాలన్న వర్గం వాదనలను మెజారిటీ అంగీకరించలేదు.


ఎల్‌డిఎఫ్‌ ఎలాగూ చేర్చుకోదు గనుక పిసి జార్జి బిజెపి వైపు చేరనున్నారు. ఆ పార్టీని మంచి చేసుకునేందుకు ముందుగానే చెప్పినట్లు ముస్లింలను విమర్శించి మెప్పు పొందేందుకు ప్రయత్నించారు. మరోవైపు రామాలయ నిర్మాణానికి నిధులు కూడా ఇచ్చినట్లుగా మాతృభూమి పత్రిక రాసింది. బిజెపితో కలసిన మరొక పార్టీ కేరళ కాంగ్రెస్‌(థామస్‌). దీని నేత పిసి థామస్‌ గతంలో వాజ్‌పేయి మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. పిసి జార్జిని బిజెపి వైపు తీసుకురావటంలో సంధానకర్తగా పనిచేశారని వార్తలు.జార్జి వస్తే కొట్టాయం జిల్లాలో ప్రతిష్ఠాత్మక స్ధానంగా మారిన పాలా నియోజకవర్గంలో బిజెపి గెలవవచ్చనే అంచనాతో ఆ పార్టీ పావులు కదుపుతోంది. ఐదు దశాబ్దాల పాటు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కేరళ కాంగ్రెస్‌ (ఎం) నేత మణి మరణించిన తరువాత జరిగిన ఉప ఎన్నికలో ఎల్‌డిఎఫ్‌ తరఫున్‌ ఎన్‌సిపి అభ్యర్ధి ఎంసి కప్పన్‌ విజయం సాధించారు. అయితే స్ధానిక సంస్ధల ఎన్నికలకు ముందు యుడిఎఫ్‌ నుంచి కేరళ కాంగ్రెస్‌(ఎం) బయటకు వచ్చి ఎల్‌డిఎఫ్‌లో చేరింది.దాంతో పాలా నియోజకవర్గాన్ని ఆ పార్టీకి కేటాయించాలని సిపిఎం నిర్ణయించింది. కప్పన్‌కు వేరే చోట కేటాయిస్తామని చెప్పినప్పటికీ వినలేదు. దాంతో ఎన్‌సిపి అతగాడిని పార్టీ నుంచి బహిష్కరించటంతో యుడిఎఫ్‌లో చేరారు. పిసి జార్జి గతంలో కేరళ కాంగ్రెస్‌(ఎం)లో ఉన్నపుడు దివంగతనేత మణి కుమారుడు ప్రస్తుత నేత జోస్‌కె మణితో విబేధాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో తిరిగి మణి పాలాలో పోటీ చేస్తారన్న వార్తల పూర్వరంగంలో పిసి జార్జి కాంగ్రెస్‌లో చేరి దెబ్బకొట్టాలని చూశారు. అది సాధ్యంగాకపోవటంతో బిజెపితో చేతులు కలుపుతున్నారు. పాలాలో తన కుమారుడిని పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.


మరొక ముఖ్యమైన పరిణామం ముస్లిం లీగ్‌ను ఎన్‌డిఏలోకి ఆహ్వానించారు. కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు శోభా సురేంద్రన్‌ మాతృభూమి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ముస్లిం లీగ్‌ జాతీయవాదాన్ని అంగీకరించి ఎన్‌డిఏలోకి రావాలని అది లీగ్‌ నేతలకు, ముస్లింలకూ ఉపయోగం అని ఆమె వ్యాఖ్యానించారు. అది జరిగినా ఆశ్చర్యం లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు. శోభ వ్యాఖ్యలు సంచలనం సృష్టించటంతో కేరళకు చెందిన కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ మాట్లాడుతూ తాము ముస్లింలీగ్‌తో ఎలాంటి ఒప్పందమూ చేసుకోలేదని, అలాంటి ఆలోచన కూడా లేదన్నారు. కాంగ్రెస్‌, ముస్లిం లీగ్‌ మైనారిటీ కమ్యూనిటీ ప్రతినిధులు కాదని, ఎవరైనా తమ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పుకున్నారు. సిపిఎం, కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారాలను వారు గుర్తించాలన్నారు. మరోవైపున కేరళలో తాము అధికారానికి రావాలంటే 35-40 స్ధానాలు వస్తే చాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ చెప్పారు.


బిజెపి రిక్రూట్‌మెంట్‌ ఏజంట్‌గా రాహుల్‌ గాంధీ !


కాంగ్రెస్‌ నిర్వహించిన కేరళ ఐశ్వర్య యాత్ర ముగింపు సభకు వచ్చిన రాహుల్‌ గాంధీ ప్రసంగ తీరుతెన్నులు బిజెపి రిక్రూటింగ్‌ ఏజంట్‌ మాదిరిగా ఉన్నాయని సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గం విమర్శించింది. బిజెపిపై పల్లెత్తు విమర్శకూడా చేయకుండా వామపక్షాలపై బిజెపి చేస్తున్న విమర్శల పదజాలాన్నే పునశ్చరణ గావించారని, ఆ కారణంగానే అనేక చోట్ల కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలు ఏకంగా బిజెపిలోనే చేరేందుకు ఉత్తేజం పొందుతున్నారని సిపిఎం పేర్కొన్నది. బిజెపి అమలు చేస్తున్న వ్యవసాయ సంస్కరణలు అమలు జరుపుతామని కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తూ వైనాడ్‌లో ఆ చట్టాలకు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించిన రాహుల్‌ గాంధీ చిత్తశుద్ది ఏమిటని సిపిఎం ప్రశ్నించింది.
ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమాన్ని విస్మరించిన రాహుల్‌ గాంధీ కేరళ వచ్చి మద్దతు ప్రకటించటం అసాధారణమని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు.1990 దశకంలో కాంగ్రెస్‌ అమలు జరిపిన ఉదారవిధానాలు వ్యవసాయ సంక్షోభానికి కారణమని, ఆ పార్టీ చేతులు రైతుల రక్తంతో తడిచాయని, అందుకు రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తన నియోజకవర్గం వైనాడ్‌లో గతంలో ఏమి జరిగిందో, కాఫీ, మిరియాల రైతులు ఎలా నాశనమయ్యారో తెలుసుకొనేందుకు సిద్దపడాలని అన్నారు. రెండు దశాబ్దాల నాడు కాంగ్రెస్‌ అమలు జరిపిన విధానాల కారణంగా వైనాడ్‌లోని ఆ పంటల రైతులు రెండు మూడు సంవత్సరాలలో ఆరువేల కోట్ల రూపాయలు నష్టపోయారని జర్నలిస్టు శాయినాధ్‌ పేర్కొన్న విషయాన్ని రాహుల్‌ గాంధీ తెలుసుకోవాలన్నారు.ఆ విధానాల ఫలితంగా వేలాది మంది రైతులు ఆత్మహత్యల పాలయ్యారని అందుకుగాను రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలన్నారు. సిపిఎం పట్ల రాహుల్‌ గాంధీ, ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ ఒకే విధమైన వైఖరితో ఉన్నందున వారి మధ్య ఐక్యత ఏర్పడిందన్నారు.

చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !

Tags

,

ఎం కోటేశ్వరరావు

వ్యవసాయ చట్టాలకు ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలిపేందుకు వచ్చిన రైతాంగాన్ని నగర ప్రవేశానికి నిరాకరించటంతో ప్రారంభమైన ఢిల్లీ శివార్లలో తిష్టకు మూడు నెలలు నిండాయి. నోటితో మాట్లాడుతూ నొసటితో ఎక్కిరించినట్లు అన్న సామెత తెలిసిందే. చర్చలకు సిద్దమే అన్న ప్రధాని నరేంద్రమోడీ ఆందోళనా జీవులంటూ రైతులను కించపరిచారు. తాము సిద్దంగానే ఉన్నామని రైతులు చెప్పినా జనవరి 22 తరువాత చర్చలు జరగలేదు. చట్టాల అమలు వాయిదా వేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యం కాదని, చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని అయితే చర్చలకు తాము సిద్దమే అని రైతులు స్పష్టం చేశారు. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు.రైతులు గుమికూడినంత మాత్రానే చట్టాలు రద్దవుతాయా అని తనలోనూ తల్లి వైపు నుంచి రైతు రక్తం ఉందని చెప్పుకున్న వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ రైతులను తాజాగా ఎద్దేవా చేశారు.ఆవు చేలో మేస్తుంటే దూడలు గట్టున ఉంటాయా ? జనాలు గుమికూడితే చట్టాలేం ఖర్మ ప్రభుత్వాలే మారిపోతాయని మతులు పోగొట్టుకున్న వారికి అర్ధం కాదు అని రైతు నేత రాకేష్‌ తికాయత్‌ కుక్కకాటుకు చెప్పుదెబ్బ మాదిరి సమాధానమిచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి వాటిని ఎన్నింటిని చూడాలో !

బేటీ బచావో అన్న నోటితో ఉచ్చరించరాని బూతులా ? హవ్వ !!

మరోవైపున సామాజిక, సంప్రదాయ మాధ్యమాల్లో, పోలీసు యంత్రాంగం వైపు నుంచి ఉద్యమం మీద, రైతులకు మద్దతు ఇచ్చిన వారి మీద ఎడతెగని ముమ్మర దాడి సాగుతూనే ఉంది. భిన్నాభిప్రాయం లేదా నిరసన తెలిపిన మహిళలను సామాజిక మాధ్యమంలో బజారు…..లని తిడుతూ పోస్టులు పెడుతున్నారు. తమ సంఘపరివార్‌ సంస్ధలకు చెందిన మహిళలు, యువతులు కూడా అనేక ఆందోళనల్లో పాల్గొంటున్నారు అనే స్పృహ వారిలో ఉందా లేక ఉన్మాదంలో ఉన్నారా అన్న అనుమానం కలుగుతోంది. శీలము,ఏకత అంటూ కబుర్లు చెప్పేవారు ఇంతగా నోరుపారవేసుకోవాలా ? వారి నిజస్వరూపం ఏమిటో ఇప్పుడు బయటపడుతున్నంతగా గతంలో ఎన్నడూ లేదన్నది నిజం.తమను వ్యతిరేకించే వారిని ఇలాంటి పదజాలంతో తిట్టే బాపతు తమను కూడా వదలరు అని బిజెపి మహిళా అభిమానులు, కార్యకర్తలు గ్రహించటం అవసరం.

ఎన్ని చెప్పినా, ఎంత మొత్తుకున్నా రైతులు మనం చెప్పేది వినటం లేదు. వ్యవసాయ చట్టాల మీద వారిని మాయపుచ్చేందుకు కొన్ని చిట్కాలు చెప్పండి అంటూ ఫిబ్రవరి 22న హర్యానాలోని గురుగామ్‌లో జరిగిన సమావేశంలో కార్యకర్తలు బిజెపి రాష్ట్ర నేతలను కోరినట్లు వార్తలు వచ్చాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఓపి ధనకర్‌, క్రీడల మంత్రి సందీప్‌ సింగ్‌, హిసార్‌ ఎంపీ బ్రిజేందర్‌ సింగ్‌ తదితరులు హాజరైన సమావేశ దృశ్యాలతో ఉన్న ఒక వీడియోను కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా షేర్‌ చేశారు.

ప్రజా ఉద్యమాల అనుభవం ఏమిటి ? పాలకులను బట్టే కొత్త ఎత్తుగడలు !

మూడు నెలల తరువాత రైతు ఉద్యమ భవిష్యత్‌ ఏమిటి అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.నిజానికి ఇదొక కొత్త అనుభవం. రైతాంగ ఆవేదన నుంచి ఉద్బవించిన ఈ ఉద్యమం ముందుకు తీసుకుపోయే దారిని కనుగొనగలదు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన 2011నాటి వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ ఉద్యమాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. సెప్టెంబరు 17 ప్రారంభమైన ఆందోళనను పారిశుధ్య పరిస్ధితి దిగజారిందనే పేరుతో నవంబరు 15న నిరసనకారులను బలవంతంగా పోలీసులతో బయటకు గెంటివేశారు. కొన్ని వందల మంది మాత్రమే జుకొట్టి పార్కులో ఉన్నారు గనుక తొలగించగలిగారు. ఢిల్లీ సరిహద్దుల్లో కూడా తాత్కాలిక మరుగుదొడ్లను తొలగించటం, నీటి సరఫరా, విద్యుత్‌ నిలిపివేయటం వంటి చౌకబారు చర్యలకు పాల్పడినా స్ధానిక జనం మద్దతుతో రైతులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు తప్ప వెనక్కు తగ్గలేదు.

ప్రపంచ ప్రజా ఉద్యమాల చరిత్రను చూస్తే విజయాలకంటే అపజయాలే ఎక్కువ. ఇలా చెప్పటం అంటే నిరాశావాదమూ, నిరుత్సాహపరచటమూ కాదు. మన దేశంలో బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల అణచివేతకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం 1857 నుంచి 1947వరకూ సాగింది.ఉవ్వెత్తున ఉద్యమించటం,నీరసించటాన్ని చూశాము. బ్రిటీష్‌ పాలకులు తమ ఎత్తుగడలను ఎన్నింటినో మార్చుకున్నారు. స్వాతంత్య్ర ఉద్యమం కూడా అదే పద్దతిలో తనను తాను మార్చుకుంటూ ముందుకు సాగింది తప్ప వెనక్కు పోలేదు. సంఘపరివార్‌ మినహా కమ్యూనిస్టులతో సహా అన్ని శక్తులూ ఆ ఉద్యమంలో భాగస్వాములే, వారసులే.తమ చరిత్రను,త్యాగాలను మరచిపోయి ప్రజావ్యతిరేకిగా మారిన స్వాతంత్య్రానంతర కాంగ్రెస్‌ నిజస్వరూపాన్ని గుర్తించేందుకు జనానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. అలాంటిది విద్రోహ చరిత్ర తప్ప మరొకటి లేని సంఘపరివార్‌ సంస్ధ బిజెపి నిజస్వరూపం తెలుసుకొనేందుకు ఒక దశాబ్దం కూడా పట్టలేదు. మన శరీర ధర్మాలకు దేనికీ పనికి రాని క్రిమిక(అపెండిసైటిస్‌) ప్రతివారిలో ఉంటుంది.అది కొందరికి ప్రాణాంతకం అయినపుడు సకాలంలో గుర్తిస్తే ముప్పుతొలుగుతుంది.లేనపుడు కొనసాగితే ఎలాంటి హాని ఉండదు. బ్రిటీష్‌ వారు దేశం వదలి పోయిన తరువాత కూడా వారి పాలనను పొగిడిన జనం ఉన్నారు. అలాగే హిట్లర్‌ దుర్మార్గాలు తెలిసిన తరువాత కూడా సమర్దించిన వారు ఉన్నారు. వారు క్రిమికలాంటి వారే ఏ పార్టీకి అయినా అలాగే ఉంటారు.ఇలా ఎందుకున్నారు అని గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదు.

ఉద్యమాన్ని ఎంతకాలం సహిస్తారు ?

ఢిల్లీ శివార్లలో మూడు వైపుల ఉన్న లక్షలాది మంది రైతులను వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణదారుల మాదిరి తొలగించటం సాధ్యం కాదు గనుక మోడీసర్కార్‌ ఆపని చేయలేదు.కారణాలు ఏవైనా సుప్రీం కోర్టు రైతు ఉద్యమం పట్ల అనుసరించిన వైఖరి సానుకూలం అని చెప్పకపోయినా అణచేందుకు తాత్కాలికంగా అయినా ప్రభుత్వానికి ఆయుధాన్ని ఇవ్వలేదు. ఇదొక ప్రధాన అంశం, తరువాత కూడా ఇలాగే ఉంటుందని చెప్పలేము. ఢిల్లీ అన్ని వైపులా బిజెపి ఏలుబడే ఉంది, కనుక పోలీసులను, ప్రత్యేక దళాలను రప్పించటం పెద్ద పని కాదు. సాధ్యంగాకనే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రోడ్ల మీద మేకులు కొట్టించి, కాంక్రీటుతో ఆటంకాలను ఏర్పాటు చేశారు. ఎంతకాలం ఇలా అనుమతిస్తారు.తరువాతేం జరుగుతుందో తెలియదు గానీ అసోం, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎలాంటి బల ప్రయోగానికి పూనుకోకపోవచ్చు. ఇప్పటికే పంజాబ్‌ మున్సిపల్‌ ఎన్నికలలో బిజెపికి జనం చుక్కలు చూపించారు.

ఒక వైపు పంజాబ్‌, హర్యానా, యుపిలో రబీ గోధుమ పంట చేతికి వచ్చే తరుణం. కొంత మంది రైతులు తమ స్వస్ధలాలకు పోవటం అనివార్యం. అందువలన ఢిల్లీ శివార్లలో ఉన్నవారి సంఖ్య కొంత మేరకు తగ్గవచ్చు కూడా. దీన్ని చూపి ఉద్యమం వెనుక పట్టు పట్టిందనే ప్రచారం జరిపేందుకు బిజెపిశ్రేణులు సిద్దంగా ఉన్నాయి. ఇదే సమయంలో ఉద్యమం కొత్త ప్రాంతాలకు విస్తరించటం, కిసాన్‌ పంచాయత్‌లు, మహాపంచాయత్‌ల పేరుతో నిర్వహిస్తున్న సభలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న రైతాంగంలో మోడీ సర్కార్‌ మీద ఆగ్రహం పెరుగుతున్నదే తప్ప తగ్గటం లేదు.ఫిబ్రవరి 21వ పంజాబ్‌లోని బర్నాలాలో లక్ష మందితో జరిగిన మజ్దూర్‌ కిసాన్‌ మహా ర్యాలీలో రైతులతో పాటు వ్యవసాయ కార్మికులు కూడా గణనీయంగా పొల్గొన్నారు. ఒక్క రైతులే కాదు, వ్యవసాయంతో పెనవేసుకున్న వ్యవసాయ కార్మికులను కూడా భాగస్వాములను చేయటం ద్వారా ఒక ప్రజా ఉద్యమంగా మార్చే యత్నం ఇది. రైతులు-వ్యవసాయ కార్మికులు పరస్పర ఆధారితులు. వ్యవసాయ కార్మికులకు రెక్కల కష్టం తప్ప మరొక ఆదాయం ఉండదు తప్ప వేతనాలు పెంచాలని అడుగుతారు. తమకు వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటానికి వేతనాలు కారణం కాదని అర్ధం చేసుకోలేని రైతులు వ్యతిరేకిస్తారు. వ్యవసాయ సంస్కరణలు రెండు తరగతులకూ నష్టం చేకూర్చేవి గనుక ఐక్యంగా పోరాడాల్సిన అవసరం వుంది. వారి మధ్య ఉన్నది మిత్రవైరుధ్యమే తప్ప శత్రువైరుధ్యం కాదుగనుక సర్దుబాటు చేసుకోవచ్చు.

తమ మూడవ దశ ఉద్యమం గురించి ఫిబ్రవరి 28న వెల్లడిస్తామని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది.ఇరవై ఆరవ తేదీన యువ రైతుల దినం పాటిస్తున్నారు.మరుసటి రోజు స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర అజాద్‌ ప్రాణార్పణం చేసిన రోజు, సంత్‌ రవిదాస్‌ జయంతి రోజును కలిపి కిసాన్‌ మజ్దూర్‌ ఏక్తా దినం-రైతు, వ్యవసాయ కార్మిక ఐక్యతా దినం- పాటించాలని పిలుపునిచ్చినట్లు డాక్టర్‌ దర్శన్‌ పాల్‌ వెల్లడించారు.మార్చి ఎనిమిదిన ఢిల్లీ సరిహద్దుల్లో మహిళాదినోత్సవం సందర్భంగా ఉద్యమంలో మహిళల పాత్రను గుర్తిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తారు. గోధుమ కోతలను గమనంలో ఉంచుకొనే కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. స్ధానిక కిసాన్‌ పంచాయత్‌లు వాటిలో భాగమే. సభలకు హాజరవుతూనే రైతులు తమపని తాము చేసుకుంటారు. వెసులుబాటు కుదరగానే తిరిగి ఢిల్లీ ముట్టడిలో చేరతారని భావిస్తున్నారు.

వ్యవసాయ చట్టాల నిలిపివేత ఓ ప్రహసనం !

రైతు ఉద్యమం ఒక అనూహ్య పరిణామం. ప్రభుత్వ నిఘా సంస్ధలు,లేదా దిగువ స్దాయిలో ఉన్న సంఘపరివార్‌ కార్యకర్తలు కూడా దీన్ని పసిగట్టలేకపోయారు. లక్షల మంది రైతుల మీద బలప్రయోగం సాధ్యం కాదు, ఒక వేళ పశుబలాన్ని ప్రయోగిస్తే అది మోడీ సర్కార్‌ అంతానికి ఆరంభం అవుతుంది. చట్టాల అమలు నిలిపివేసినట్లు ప్రకటించిన సుప్రీం కోర్టు రైతులతో చర్చించాలని ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మేకలతో చర్చలకు తోడేళ్లను మధ్యవర్తులుగా పంపినట్లుగా వ్యవసాయ చట్టాలను సమర్దించేవారితో కూడిన కమిటీ అది. దానికి ఇచ్చే నివేదనలు ఎలా ఉన్నా, అంతిమంగా ఎలాంటి నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పిస్తారో ఊహించుకోవటం కష్టం కాదు.ఆ కమిటీ నివేదిక సుప్రీం కోర్టుకు అంది దాని మీద ఒక నిర్ణయం తీసుకొనే వరకు లేదా పద్దెనిమిది నెలలపాటు చట్టాల అమలు నిలిపివేస్తామని కేంద్రం చెబుతోంది. నిజానికి నిలిపివేసినట్లు కాదు. చట్టాల సవరణకు ముందున్న పరిస్దితిని పునరుద్దరించకుండా చట్టాల అమలు నిలిపివేత అంటే మోసం తప్ప మరొకటి కాదు. ఆర్డినెన్స్‌ తెచ్చిన గతేడాది జూన్‌ నుంచే అమలు జరుగుతోంది అని ప్రభుత్వమే చెప్పింది.దాన్ని నిలిపివేయటం అంటే అర్ధం ఏమిటి ? అంటే ఇప్పుడు అసలే చట్టమూ లేదా ? చట్టరహిత పాలన ఎవరికి ఉపయోగం ? నిజానికి ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన నిలిపివేత ప్రకటనలో నిజాయితీ లేదు. రైతు ఉద్యమం గురించి చర్చించేందుకు భయపడిన సర్కార్‌ శీతాకాల సమావేశాలను రద్దు చేసి నేరుగా పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకే పోయింది. ప్రభుత్వాన్ని నిలదీస్తే సుప్రీం కోర్టు కమిటీ ఏర్పాటు, నిలిపివేతను చూపుతూ చర్చ లేకుండా చేస్తారు. ఒక వేళ అనూహ్య పరిస్దితిలో సుప్రీం కోర్టు చట్టాలను శాశ్వతంగా నిలిపివేయాలని తీర్పునిస్తే అప్పుడు ప్రభుత్వం ఏమి చేస్తుంది అన్నది పెద్ద ప్రశ్న. రిపబ్లిక్‌ డే రోజున ట్రాక్టర్ల పరేడ్‌కు అనుమతివ్వాలా లేదా అనే అంశం తేల్చుకోవాల్సింది ప్రభుత్వమే అని సుప్రీం కోర్టు చెప్పటం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి ఇష్టం లేకున్నా ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చిన అనుమతిని ఎలా వినియోగించుకుందో చూశాము.

రైతుల కంటే హిందూత్వ గురించే ఆర్‌ఎస్‌ఎస్‌ బెంగ !

ఇరు పక్షాలూ ఒక మధ్యేమార్గంలో పరిష్కారానికి రావాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సురేష్‌ భయ్యాజీ జోషి బహిరంగంగానే రైతు ఉద్యమం-ప్రభుత్వ తీరు గురించి ఒక ప్రకటన చేశారు. ఉద్యమ సెగ వారికి కూడా తగిలిందన్నది స్పష్టం. ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. బిజెపికి మార్గదర్శనం చేసేది, ప్రభుత్వాన్ని పర్యవేక్షించేది కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ అన్నది స్పష్టం. సాంస్కృతిక సంస్ద ముసుగులో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తోందన్నది బహిరంగ రహస్యం.వ్యవసాయ చట్టాల గురించి ఆర్డినెన్స్‌ తెచ్చినపుడే అనేక రైతు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి, ఆందోళనలు చేసినా వారికి పట్టలేదు, ఆందోళనా జీవులను నెట్టవతల పడవేయవచ్చన్న అతి అంచనా కావచ్చు. రైతుల ఆందోళనను బలప్రయోగంతో అణచివేస్తే దాని అసలైన హిందూత్వ అజెండా ముందుకు పోకపోగా వ్యతిరేకత ముందుకు వస్తుంది. ఆ కారణంతో జాగ్రత్తపడమని మధ్యేమార్గం చూడమని చెప్పింది తప్ప చిత్తశుద్ది, రైతుల పట్ల దానికి ఆసక్తి అనుమానమే.దాన్ని దాచిపెట్టి ప్రభుత్వం పట్ల సంఫ్‌ు సంతృప్తిగా లేదంటూ లీకుల ద్వారా దాని మంచితనం గురించి ప్రచారం చేశారు.

రైతు ఉద్యమం గురించి చేస్తున్న తప్పుడు ప్రచారంలో భాగంగా రాకేష్‌ తికాయత్‌ – ఇతర నేతల మధ్య తేడా ఉన్నట్లు చూపే ప్రయత్నం కూడా జరిగింది. భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత మహేంద్రసింగ్‌ తికాయత్‌ కుమారుడిగా రాకేష్‌కు గుర్తింపు ఉంది. ఉత్తర భారత్‌లోని వ్యవసాయ సామాజిక తరగతి జాట్‌ల పలుకుబడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. పంజాబ్‌లో వీరు సిక్కు మతాన్ని ఇతర చోట్ల హిందూమతాన్ని పాటిస్తారు. అందువలన హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ జాట్‌ ప్రాంతాలలో తికాయత్‌కు పరిచయం అవసరం లేదు. రిపబ్లిక్‌ డే రోజు ఢిల్లీలో జరిగిన ఉదంతాల తరువాత ఆయన కన్నీళ్లు పెట్టుకోవటం గురించి భిన్న కథనాలున్నా లక్షలాది మంది రైతులను కదిలించింది.ఉద్యమానికి కొత్త ఊపిరినిచ్చింది. ప్రారంభంలో తికాయత్‌ ప్రభావం పరిమితమే. ఆయనను విడిగా కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలవటంలో కూడా విభజించి పాలించాలనే ఎత్తుగడ ఉంది. దాన్ని గ్రహించి వెనక్కు తగ్గారనుకోండి. తికాయత్‌ కొన్ని వ్యక్తిగతమైన నిర్ణయాలు ప్రకటిస్తున్నారనే అభిప్రాయం ఉంది. మహాత్మాగాంధీ జన్మదినమైన అక్టోబరు రెండు వరకు రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తారని చేసిన ప్రకటన అలాంటిదే. ఇలాంటి వాటిని చూపే బిజెపి రాజకీయ దాడి చేస్తున్నది. కార్యాచరణ కమిటీలో దాన్ని గురించి చర్చించలేదని ఒక నేత చెప్పాల్సి వచ్చింది.ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇలాంటి ఉద్యమాలలో ఎవరైనా వ్యక్తిగత అభిప్రాయాలు చెబితే ప్రతిదానికీ దురుద్ధేశ్యాలను ఆపాదించనవసరం లేదు. అన్నా హజారే అంటే ఇప్పటికీ గౌరవం ఉంది, కానీ ఆ పెద్దమనిషి ఉద్యమానికి మద్దతు ప్రకటించి తరువాత ప్రభుత్వం వేసిన కమిటీ గురించి సంతృప్తి ప్రకటించారు. ఇలాంటి వారి గురించి రైతులు ఆలోచించుకోవాలి.

ఉద్యమ బలం – బలహీనతలూ !

నెల రోజులుగా ప్రభుత్వం చర్చలకు పిలవటం లేదని కొందరు రైతు నేతలు ఆందోళన పడుతున్నట్లుగా కొందరు చిత్రిస్తున్నారు.పదకొండు కాదు, పదకొండు వందల సార్లు పిలిచినా ఇంతకు ముందు చెప్పిందే చెబుతారు. తేల్చుకోవాల్సింది ప్రభుత్వమే. అయితే ఆందోళనా జీవి అంటూ ఎద్దేవా చేసిన ప్రధాని నరేంద్రమోడీ వైఖరిని చూస్తే ఢిల్లీ శివార్లలో ఎన్ని నెలలు కూర్చుంటారో కూర్చోనివ్వండి, విసిగిపోయి వారే లేచిపోతారనే భావంతా ఉన్నారని కూడా కొందరు వ్యాఖ్యానించారు.

ఒక ఉద్యమం, అదీ స్వచ్చందంగా ప్రారంభించిన ఉద్యమం. ప్రతి ఉద్యమానికి బలం-బలహీనతలు రెండూ ఉంటాయి. రెండోదాన్ని అధిగమించి ముందుకు పోవటమే ఉద్యమ లక్షణం.ఒక కొండ ఎక్కేందుకు ముందు చాలా ఉత్సాహంగా ప్రారంభం అవుతాము. అదే పైకిపోయే కొలదీ ఎక్కటానికి ఎంత ఇబ్బంది పడాలో తెలిసిందే. ఒక ఉద్యమం కూడా అలాంటిదే. రోజులు గడిచే కొద్దీ కొంత మందిలో తొలుత ఉన్న ఉత్సాహం, పట్టుదల సడలుతుంది.నలుగురితో పాటూ మనమూ అంటూ సాదాసీదాగా ప్రారంభమైన వారిలో పట్టుదల రెట్టించటం కూడా తెలిసిందే.

రైతులపై ముప్పేట దాడి !

రైతులు కష్టపడి దుక్కి దున్ని నాట్లు వేసి కోత కోసి పంటను తేగలరు తప్ప మధ్యలో వచ్చే తెగుళ్లను తట్టుకోవటం అంత తేలిక కాదు. ఉద్యమం ప్రారంభంలోనే ఖలిస్తానీ, ఉగ్రవాద ముద్రవేశారు. దీని వెనుక జాతి వ్యతిరేక శక్తులున్నారని ప్రచారం చేశారు. అంతర్జాతీయంగా సమన్వయ పరుస్తున్నారని అతిశయోక్తులు చెప్పారు.ఇప్పటి వరకు పాలకుల అణచివేతకంటే ఏ ఉద్యమం ఎరగని విధంగా మాధ్యమాల ముట్టడి- తప్పుడు ప్రచారదాడిని రైతాంగం ఎదుర్కోవాల్సి వచ్చింది, ఇంకా కొనసాగుతూనే ఉంది.యుద్దంలో ఒక్క అంగుళాన్ని కూడా వదలకుండా బాంబులతో నాశనం చేయటాన్ని కార్పెట్‌ బాంబింగ్‌ అంటారు. వియత్నాంలో అమెరికా దురాక్రమణ-దాడి సమయంలో ఈ పదంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు అలాంటి ప్రచార దాడి జరుగుతోంది. ఇన్ని నెలల ఉద్యమం, ప్రపంచవ్యాపితంగా ప్రాచుర్యం పొందిన తరువాత అంతర్జాతీయంగా ప్రముఖులు స్పందించకుండా ఎలా ఉంటారు. రీఆనె, గ్రేటా టన్‌బెర్జ్‌, మీనా హారిస్‌ వంటి వారు ట్వీట్లు చేయగానే మన దేశంలో ప్రముఖులుగా ఉన్నప్పటికీ దేనికీ స్పందించని వారందరితో ట్వీట్ల మీద ట్వీట్లు చేయించి మరో యుద్దరంగాన్ని తెరిచారు.మన దేశం గురించి తప్పుడు ప్రచారం చేసేందుకు విదేశీయులకు టూల్‌కిట్‌ సరఫరా చేశారనే పేరుతో దిశారవి మరికొందరి మీద దేశద్రోహం నేరం వంటివి ఆపాదించి అరెస్టులు చేశారు. ఇలాంటి ఎదురుదాడి, రిపబ్లిక్‌ డే రోజున జరిగిన కుట్రలను నిజంగానే రైతాంగం ఊహించలేదు. దిశారవి టూల్‌కిట్‌లో దేశద్రోహమూ లేదు, హింస ప్రేరేపణా లేదంటూ ఢిల్లీ హైకోర్టు ఆమెకు బెయిలు మంజూరు చేసింది.

నిజానికి అంత ముప్పేగనుక వస్తే దాన్ని మరింత రచ్చ చేయటం ఎందుకు ? కుట్రలు వాస్తవమే అనుకుంటే వాటిని వమ్ము చేసేందుకు చట్టాలను రద్దు చేస్తే పోలా ? నరేంద్రమోడీకి దేశమా ? మరొకటా ! ఏది ముఖ్యం ! ముందు చట్టాలను రద్దు చేసి అంతర్జాతీయ కుట్రలను వమ్ము చేసి అంతగా అయితే అన్ని తరగతులతో చర్చించి ఆమోదయోగ్యమైన సంస్కరణలు తెచ్చి నిజంగా రైతాంగాన్ని ఉద్దరిస్తామంటే ఎవరు వద్దంటారు ?

పాలకులను బట్టే ఉద్యమ స్వభావంలో మార్పు !

ఉద్యమం సాగుతున్నకొద్దీ, పాలకుల వైఖరిని అర్ధం చేసుకున్న కొద్దీ ఏ కష్టజీవుల ఉద్యమం అయినా తమ సమస్యలకే పరిమితం కాదు. కాంగ్రెస్‌ 1895లో ప్రారంభమైనపుడు దానికి రాజకీయాల్లేవు.భారతీయుల ప్రయోజనాలను కాపాడాలని, చదుకున్న భారతీయులకు ప్రభుత్వంలో ఎక్కువ అవకాశాలివ్వాలనే కోర్కెలతోనే ఉద్యోగవిరమణ చేసిన బ్రిటీష్‌ జాతీయుడు ఎఓ హ్యూమ్‌ ఒక ఉద్యమంగా ప్రారంభించాడు.నిజాం సంస్ధానంలో తెలుగును బతికించాలనే కోర్కెతోనే ఆంధ్ర మహాసభ ప్రారంభమైంది. చివరికి ఆ కాంగ్రెస్‌ బ్రిటీష్‌ వారు దేశం వదలి పోవాలనే వైఖరితో, నైజాం సంస్దానాన్ని కూల్చివేసే విధంగా కమ్యూనిస్టుల నాయకత్వాన ఆంధ్రమహాసభ తయారయ్యాయి. అలాగే ఇప్పుడు రైతు ఉద్యమం పట్ల బిజెపి అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి నేతలను బహిష్కరించాలనే పిలుపులు వెలువడుతున్నాయి,వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక పాఠం చెప్పాలనే ఆలోచనలు ప్రారంభం అయినట్లు వార్తలు వస్తున్నాయి.వీటిని చూసి ఆ పార్టీ కూడా పంజాబ్‌, రాజస్ధాన్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లో తమ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి రాజకీయ దాడికి సిద్దం అవుతోంది. దానిలో భాగమే పైన చెప్పుకున్న హర్యానా గురుగామ్‌ సమావేశం. చూశారా మేము ముందే చెప్పాం ఇది రైతుల ఉద్యమం కాదు, ఆపేరుతో బిజెపి వ్యతిరేక ఉద్యమం అని ప్రచారం ప్రారంభించవచ్చు.కానివ్వండి ఆ పార్టీకి ఆ హక్కు ఉంది. జనమే తేల్చుకుంటారు. బిజెపికి ఏ రాజకీయ పార్టీ వద్దలేనంత డబ్బు ఉంది, దాన్ని నిలబెట్టేందుకు అదానీ,అంబానీల వంటి వారు ఎంతైనా ఇంకా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు.తప్పుడు ప్రచారాన్ని గుడ్డిగా చేసే యంత్రాంగం ఎలాగూ ఉంది.నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు గోవిందా అన్నట్లు జనం తలచుకోవాలేగానీ ఏదీ ఆగదు. రైతు పోరు కొత్త దిశ, కొత్త దశలో ప్రవేశించనుంది. ప్రభుత్వంతో చర్చల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మరింతగా రైతులను, వారికి మద్దతు ఇచ్చే వారిని సమీకరించటం, దేశ వ్యాపితంగా విస్తరించటమే చేయాల్సి ఉంది.

8 .

కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఇప్పుడున్న ఒక స్ధానాన్ని డెబ్బయి ఒకటికి పెంచాలని ప్రధాని నరేంద్రమోడీ కేరళ బిజెపి నేతలకు ఉద్బోధ చేశారు. దాన్ని నిజమే అని నమ్మినట్లున్నారు మెట్రోమాన్‌గా ప్రసిద్ది చెందిన ఇ శ్రీధరన్‌. ఇంకేముంది కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్దం సుమతీ అంటూ మీడియాకు ఎక్కారు. దీన్నే ముది మది తప్పటం అంటారేమో ! అసంఖ్యాక అభిమానుల నీరాజనాలు అందుకున్న ఏడు పదుల సూపర్‌ స్టార్‌ రజనీకాంతే ఆ దేవుడు వద్దన్నాడు ఈ రజనీ పార్టీ రద్దన్నాడు అన్నట్లుగా తమిళనాడులో చేతులెత్తేశాడు. అలాంటిది 88ఏండ్ల వయస్సులో శ్రీధరన్‌ కేరళలో నేను రెడీ అంటున్నారు. అయితే తాను, లేకపోతే కాంగ్రెస్‌ నేత ఊమెన్‌ చాందీ మరోసారి ముఖ్యమంత్రి అయినా తనకు సంతోషమే అన్నారు. కాంగ్రెస్‌ నేతలు రమేష్‌ చెన్నితల, ముస్లింలీగు నేత కున్హాలీ కుట్టి తనను మంచిగా చూసుకున్నారని, వామపక్షాల నుంచి అలాంటిది లేదన్నారు.పాలక్కాడ్‌ జిల్లా జన్మస్దలం అయినా ప్రస్తుతం మలప్పురం జిల్లాలో ఉంటున్నారు. అక్కడి నుంచే పోటీ చేయాలని ఉబలాటపడుతున్నారు. అందుకే ముస్లిం లీగు నేతను కూడా ఉబ్బించే యత్నం చేశారు. నేను గాని ఈల వేస్తే అన్నట్లుగా నేను గనుక బిజెపిలో చేరితే ఇప్పుడు ఆ పార్టీకి ఉన్న ఓట్లు రెట్టింపు అవుతాయి అని శ్రీధరన్‌ చెప్పుకున్నారు. అది దేశభక్తి సంస్ద తప్ప మతతత్వపార్టీ కాదు, అది తప్ప మిగతా పార్టీలేవీ అభివృద్దిని పట్టించుకోవు అన్నారు.


ఇప్పటి వరకు ఒక ఇంజనీరుగా గౌరవం పొందిన ఆ పెద్దమనిషి జీవిత చరమాంకంలో కాషాయతాలిబాన్‌గా తన అంతరంగాన్ని బయటపెట్టుకున్నారు. ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నంత వరకు ఏ పార్టీ పట్ల అభిమానం చూపకూడదు, ఇప్పుడు తనకు అలాంటివేమీ లేవు గనుక బిజెపిలో చేరుతున్నా అన్నారు. కాకినాడ జెఎన్‌టియు ఇంజనీరింగ్‌ విద్యార్ధిగా, తదుపరి మంచి ఇంజనీరుగా తన ప్రతిభను చూపారు. ఆ విషయంలో ఎవరూ వేలెత్తి చూపటం లేదు. మాజీ ఎన్నికల ప్రధాన అధికారి టిఎన్‌ శేషన్‌కూ అదే ఇంజనీరింగ్‌ కాలేజీలో ఒకేసారి సీటు వచ్చింది. అయితే శేషన్‌ ఇంజనీరింగ్‌ వద్దని సివిల్స్‌ను ఎంచుకొన్నారు. ఇద్దరూ ప్రస్తుత కేరళలోని పాలక్కాడ్‌ జిల్లాకు చెందినవారే.శేషన్‌ 1997 రాష్ట్రపతి ఎన్నికలలో కెఆర్‌ నారాయణన్‌ మీద పోటీ చేసి ఓడిపోయారు. రాజకీయంగా ఇద్దరూ మితవాదులే.


బిజెపి నిర్వహిస్తున్న యాత్ర మలప్పురం జిల్లాలో ప్రవేశించే 21వ తేదీన శ్రీధరన్‌ ఆ పార్టీలో చేరే తతంగం పూర్తి చేస్తారు. ఈ రోజుల్లో బిజెపిలో పార్టీలో చేరాలంటే తాము పచ్చి హిందూత్వవాదులమని ప్రకటించుకోవటం మొదటి అర్హత. శ్రీధరన్‌ బీఫ్‌ నుంచి లవ్‌ జీహాద్‌ వరకు దేన్నీ వదలకుండా అన్నింటినీ వల్లిస్తూ దాన్ని జయప్రదంగా పూర్తి చేశారు. కేరళ అభివృద్ది కావాలంటే తాను ముఖ్యమంత్రి అయితే తప్ప సాధ్యం కాదన్నారు. అధికారాల్లేని గవర్నర్‌ పదవి తనకు అవసరం లేదని కూడా ముందే చెప్పారు. రాజ్యసభ సభ్యత్వం తీసుకుంటే ప్రశ్నలు అడగటం తప్ప వేరే ఏమీ ఉండదన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది కనుక తాను ఆ పార్టీలో చేరితే రాష్ట్రానికి ఉపయోగం అన్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం పొందిన బిజెపి కేరళ నేత కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఆయనే చేయలేనిది శ్రీధరన్‌ చేయగలరా ?
ఇక బిజెపి గురించి ఆ తాతయ్య లేదా ముత్తాత పూర్తి వివరాలు తెలుసుకోకుండానే ఈ ప్రకటన చేసినట్లు కనిపిస్తోంది. బిజెపి స్వయంగా విధించుకున్న నిబంధన ప్రకారం 75 సంవత్సరాలు దాటిన వారు ఎలాంటి పాలనా పదవుల్లో ఉండకూడదు. ఆ మేరకు గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ను మార్చివేశారు. అయితే కర్ణాటక వచ్చేసరికి తనకు పదవి లేకపోతే అసలు పార్టీయే ఉండదని బెదిరించిన కారణంగా అబ్బే తూచ్‌ అదేమీ మాటతప్పని-మడమ తిప్పని సూత్రమేం కాదు, అవసరమైనపుడు మినహాయింపు ఇస్తాం అన్నట్లుగా 77 ఏండ్ల యడియూరప్పను కొనసాగిస్తున్నారు. శ్రీధరన్‌ ఇంజనీరుగా తన అనుభవంతో రైళ్లను నడిపించగలరు తప్ప రాజకీయవేత్తగా ఈ వయస్సులో బిజెపిని అదీ కేరళలో ? పెద్దాయన, ఎందుకు లెండి !


ఊమెన్‌ చాందీ ఊపేస్తున్నారంటున్న కాంగ్రెస్‌ !


కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీని ఎన్నికల పర్యవేక్షణ కమిటీ అధ్యక్షుడిగా నియమించటం, ప్రస్తుతం యాత్ర చేస్తున్న రమేష్‌ చెన్నితలతో ఆయన పర్యటిస్తుండటంతో స్దానిక ఎన్నికల తరువాత ఊపు వచ్చిందని, ప్రస్తుతం ఎల్‌డిఎఫ్‌తో పోటా పోటీ స్ధితికి చేరుకున్నట్లు తమ సర్వేలో వెల్లడైందని కాంగ్రెస్‌ ఏఐసిసి ప్రకటించుకుంది. స్దానిక సంస్దలలో కూడా గణనీయంగా గెలిచినట్లు చెప్పుకున్న విషయం తెలిసిందే. ఎల్‌డిఎఫ్‌ సర్కార్‌ మీద బట్టకాల్చివేసే కార్యక్రమాన్ని ముమ్మురం చేసింది. ఈనెల 24న రాహుల్‌ గాంధీతో మత్స్యకారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సముద్రంలోని లోతు ప్రాంతాలలో చేపల వేటకు ఒక అమెరికన్‌ కంపెనీతో ఎల్‌డిఎఫ్‌ సర్కార్‌ ఒప్పందం చేసుకుందని, మంత్రి మెర్సీకుట్టి కంపెనీ ప్రతినిధులను కలుసుకున్నారని రమేష్‌ చెన్నితల ఒక నిరాధార ఆరోపణ చేశారు. నిజానికి ఆ కంపెనీ ప్రవాస కేరళీయులు అమెరికాలో ఏర్పాటు చేసుకున్నది. చేపల వేట గురించి ఒక పధకాన్ని రూపొందించి ప్రభుత్వానికి అందచేశార తప్ప ఆలూ లేదు చూలూ లేదని కంపెనీ స్వయంగా ఖండించింది. మత్స్యకారులను దెబ్బతీసే లోతు ప్రాంత చేపల వేటకు అనుమతిస్తూ గత యుపిఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎం వ్యతిరేకించిందని, ప్రస్తుత బిజెపి ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పిందని, అయితే తాము అంగీకరించేది లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటించారు. మత్స్యకారులు, స్దానిక కంపెనీల ప్రయోజనాలను కాపాడతామని పేర్కొన్నారు. అమెరికన్‌ కంపెనీ ప్రతినిధులు తొలుత అమెరికాలో మంత్రిని కలిశారని ఆరోపించిన చెన్నితల తరువాత తన మాటలను తానే దిగమించి కాదు, సచివాలయంలో కలిశారంటూ కంపెనీ ప్రతిపాదనలు అందచేసిన సమావేశ చిత్రాలను విడుదల చేసి ఇంతకంటే రుజువు ఏమి కావాలని అడ్డు సవాళ్లు విసిరారు. మంత్రిగా తనను అనేక మంది కలుస్తుంటారని అంత మాత్రాన ఒప్పందం జరిగిందనటం పచ్చి అవాస్తవం, రమేష్‌ చెన్నితల క్షమాపణ చెప్పాలని మెర్సికుట్టి డిమాండ్‌ చేశారు.


ఎన్‌సిపి నుంచి బయటకు వచ్చి యుడిఎఫ్‌లో చేరిన ఎంఎల్‌ఏ కప్పన్‌ పరిస్ధితి అయోమయంగా తయారైంది. తమ పార్టీ గుర్తు మీదే పోటీ చేయాలని, ఫ్రంట్‌ భాగస్వామిగా చేరటం గురించి ఎన్నికల తరువాతే చూద్దాం అని కొంత మంది కాంగ్రెస్‌ నేతలు షరతు పెడుతుండగా, అలా చేస్తే ఆయన తప్ప వెంట నీడ కూడా రాదని అందువలన అలాంటి తీవ్ర షరతు పెట్టకూడదని మరికొందరు అంటున్నారు. కేరళ కాంగ్రెస్‌ నుంచి బలమైన మణి వర్గం చీలి ఎల్‌డిఎఫ్‌లో చేరినందున గతంలో కేటాయించినన్ని సీట్లు ఈ సారి ఇచ్చేది లేదని జోసెఫ్‌ వర్గానికి కాంగ్రెస్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. అవమానాన్ని తట్టుకొని అంగీకరిస్తారా ? మరేం చేస్తారో తెలియదు.

అదీ సిపిఎం నిబద్దత !


కొన్ని పంచాయతీలలో అడగకుండానే యుడిఎఫ్‌, బిజెపి, ఇతర పార్టీల సభ్యులు స్ధానిక రాజకీయాలు, ఎత్తుగడల్లో భాగంగా సిపిఎం సభ్యులకు ఓటు వేసి సర్పంచ్‌లు అయ్యేందుకు దోహదం చేశారు. అలాంటి చోట్ల ఆ పదవులు తమకు అవసరం లేదంటూ సిపిఎం సర్పంచ్‌లు రాజీనామా చేశారు. ఒక చోట ఎల్‌డిఎఫ్‌లోని మరో పార్టీ సర్పంచ్‌ అందుకు నిరాకరించటంతో ఫ్రంట్‌ నుంచి బహిష్కరించారు. ప్రస్తుతం స్టాండింగ్‌ కమిటీల ఎన్నికలు జరుగుతున్నాయి. మలప్పురం జిల్లా వెట్టం పంచాయతీలో సంక్షేమ స్టాండింగ్‌ కమిటీలో సిపిఎంకు రెండు, యుడిఎఫ్‌కు రెండు, వెల్ఫేర్‌ పార్టీకి ఒక స్ధానం ఉంది. దాని చైర్‌పర్సన్‌ ఎన్నికలో వెల్ఫేర్‌ పార్టీ సభ్యుడు సిపిఎంకు ఓటు వేయటంతో కెటి రుబీనా ఎన్నికయ్యారు. అయితే తాము ఎవరి మద్దతూ కోరలేదని, అందువలన ఆ పదవి తనకు అవసరం లేదని రుబీనా రాజీనామా చేశారు. మతతత్వ వెల్ఫేర్‌ పార్టీతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవటం స్ధానిక సంస్ధల ఎన్నికలలో రాజకీయ దుమారం రేపింది. దాన్ని సిపిఎంకు అంటించేందుకు వేసిన ఎత్తుగడను పార్టీ ఇలా తిప్పికొట్టింది.పంచాయతీలోని 20 వార్డులకు గాను యుడిఎఫ్‌కు 10, ఎల్‌డిఎఫ్‌కు తొమ్మిది, వెల్ఫేర్‌ పార్టీకి ఒకటి ఉంది. సర్పంచ్‌ ఎన్నికను వెల్ఫేర్‌ పార్టీ బహిష్కరించింది.


బెదిరింపులకు దిగిన జాకోబైట్‌ చర్చ్‌ !


కేరళలోని మలంకర చర్చి వివాదంలో సుప్రీం కోర్టులో ఓడిపోయిన జాకోబైట్‌ చర్చ్‌ పెద్దలు బెదిరింపులకు దిగారు. సుప్రీం కోర్టు 2017లో ఇచ్చిన తీర్పు మేరకు 800 సంవత్సరాల నాటి చర్చి నిర్వహణ బాధ్యతను ఆర్డోడాక్స్‌ వర్గానికి అప్పగించాల్సి ఉంది. అయితే వివాద పడుతున్న రెండు వర్గాలు సామరస్యంగా పరిష్కరించుకుంటాయనే వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం అందుకు పూనుకోలేదు. అయితే ఆర్దోడాక్స్‌ వర్గం వారు కోర్టు తీర్పును అమలు జరపటం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం మీద కోర్టు ధిక్కరణ ఫిర్యాదులు చేయటంతో గత ఏడాది స్వాధీనం చేసుకొని అప్పగించారు. సుప్రీం కోర్టు తీర్పును వమ్ము చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ తెచ్చి తిరిగి తమకు స్వాధీనం చేయాలని జాకోబైట్స్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించలేదు. గత 50 రోజులుగా నిరసన తెలుపుతున్న ఆ వర్గం దాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించింది. అధికార, ప్రతిపక్షం రెండూ తమను పట్టించుకోలేదని, తామింక ఏ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉండదలచలేదని, తమ రాజకీయ కార్యాచరణ రెండు వారాల్లో ప్రకటిస్తామని, అది ఎన్నికల ఫలితాలలో కనిపిస్తుందని ఆవర్గ పెద్దలు ప్రకటించారు. తమ మద్దతు కోసం ఎవరినీ బిషప్‌ బంగ్లాల్లోకి రానివ్వబోమన్నారు. ఈవర్గపు పెద్దలు కొద్ది వారాల క్రితం ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. బిజెపి, ట్వంటీ20 పార్టీతో సహా తమ 15లక్షల ఓట్లను ఏ పార్టీకి వేయాలనేదీ తాము నిర్ణయిస్తామని జాకోబైట్‌ వర్గాలు తెలిపాయి. నిత్యం క్రైస్తవ, ఇస్లాం మతాలపై విద్వేషాన్ని రెచ్చగొట్టే బిజెపి ఈ చర్చి వివాదంలో సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా జాకోబైట్‌లను సమర్ధించి ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు. మత ప్రాతిపదికన ఓట్లు పొందేందుకు సంతుష్టీకరణ చర్యలకు ఎల్‌డిఎఫ్‌ దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

.

మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ ! అది ఎప్పుడు సాధ్యం అవుతుంది ? మనం అంటే జనం బుర్రలకు పని పెట్టకుండా, చరిత్రను మర్చిపోతేనే అలాంటి వారు రెచ్చిపోతుంటారు. సమాజం పుచ్చిపోతుంది !
ఇపుడు అదే జరుగుతోంది. కారణాలు ఏవైనా, పేనుకు పెత్తనం ఇచ్చినట్లు మనం మెదళ్లను విదేశీ వాట్సాప్‌కు అప్పగించాం, ఇప్పుడు స్వదేశీ ”కూ ”కు అప్పగించమని కొందరు చెబుతున్నారు. ఎందుకంటే తప్పు యాప్‌లది కాదు. విదేశీ అయినా, స్వదేశీ అయినా మనం వాటిలో దేన్ని ఉంచితే దాన్నే పదుగురిక పంచుతాయి. అందుకే పళ్లూడ గొట్టించుకొనేందుకు ఏ రాయి అయితేనేం ? బుర్రలను తాకట్టు పెట్టదలచుకుంటే ఎక్కడైతేనేం ! దాన్ని కూడా చూద్దాం !
వినేవాడికి బుర్రలేకపోతే చెప్పేవాడికి లోకువ ! నేనూ ఇక్కడ కొన్ని విషయాలు చెబుతున్నాను గనుక మెదడుకు పని పెట్టమనే చెబుతున్నా. వినదగునెవ్వరు చెప్పిన అన్నట్లుగా ఎవరు చెప్పినా వినండి. హంస పాలూ నీళ్లను వేరు చేస్తుందంటారు, మనమూ మంచీ-చెడును వేరు చేసి మంచిని స్వీకరించుదాం !


పెట్రోల్‌ ,డీజిల్‌, ఎల్పిజి ధరలేం ఖర్మ ! రాబోయే రోజుల్లో ప్రతి వస్తువు, సేవ ధర పెరుగుతుంది. ఏమంటే దేశభక్తి అంటారు ! నరేంద్రమోడీ గారి అచ్చేదిన్‌ ఆచరణ అదే కదా ! వాట్సాప్‌లో తిప్పుతున్న అనేక పోస్టులలో ఒక దాని ప్రకారం కేంద్రలోని పెద్దలకు అవగాహన ఉంది కనుకనే వాటిని పెంచుతున్నారట ! వారికి లేదని ఎవరన్నారు. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో వడ్డించేందుకు కావాలనే చేస్తున్నారు. సందేహం లేదు. తెగించిన వాడికి తెడ్డే లింగం ! ఇంతకు ముందు ధరలు పెంచితే జనం ఆగ్రహిస్తారనే భయం ఉండేది కనుక పాలకులు కాస్త వెనుకా ముందూ చూసే వారు. దున్నపోతు మీద వాన కురిసినట్లుగా పరిస్దితి ఉందని గ్రహించారు గనుకనే చెప్పి మరీ చేస్తున్నారు.


గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో డిమాండ్‌ లేకపోవటంతో ఒక దశలో ముడి చమురు ధర15 డాలర్లకు పడిపోయినా సౌదీ అరేబియా నుంచి మన దేశం పాత ధరకే కొనుగోలు చేసిందట ? డిమాండ్‌ తగ్గినా సౌదీ నుంచి కొనుగోళ్లను ఆపలేదట, డిమాండ్‌ లేనపుడు ఎందుకు కొనుగోలు చేసినట్లు ? అదీ పాత ధరకు ! స్వంత జనం మీద అంత కోపమెందుకు ? సౌదీ మీద అంత ప్రేమ ఎందుకబ్బా ! మనం చెవులప్పగిస్తే ఫ్రీగా ఉన్నాయి కదా అని ప్రతి చెత్త వాటిలో వేసిపోతారు !
అంతర్జాతీయ మార్కెట్లో ఏరోజు ఎంత ఉంటే ఆరోజు మన వినియోగదారుల నుంచి అంత వసూలు చేయాలన్నది మన విధానం. మన కొనుగోలు కూడా అలాగే ఉంటుంది తప్ప వచ్చే ఏడాది సరఫరా చేసే చమురుకు ముందు సంవత్సరమే ఒప్పందాలేమీ ఉండవు. ధర తగ్గినా సౌదీ నుంచి పాత ధరలకే కొనుగోలు చేయటం అంటే జనానికి శఠగోపం పెట్టటం, కుంభకోణం ఉన్నట్లే ! లేదా రాసిన వారికి అసలు విషయం పరిజ్ఞానం లేకపోయి ఉండాలి.


ఒపెక్‌ (చమురు ఎగుమతి దేశాలు) ధరలు పెంచే ఆలోచనలో ఉండగా మన దేశ విజ్ఞప్తి మేరకు ఆసియా ఖండం వరకు పాత ధరలకే ఇవ్వటానికి ఒప్పుకున్నాయట. అలాంటపుడు సెంచరీ దిశగా ప్రతి రోజూ ధరలను పెంచటం ఎందుకు ? పాత ధరలు ఎంతో ఇప్పుడు ఎంతకు కొంటున్నామో చెప్పమనండి, మన బండారం బయటపడుతుంది.


చైనా యాప్‌లను నిషేధించినా, వారి వస్తువులను కొనుగోలు చేయం అని బెదిరించినా సరిహద్దుల్లో చెట్టు చివరి ఆకు కూడా ఊగలేదు. మీరూ మూసుకోండి-మేమూ మూసుకుంటాం అన్నట్లుగా ఒప్పందం చేసుకొని సరిహద్దుల్లో చైనా-భారత్‌ సైన్యాలు గతంలో ఎక్కడైతే ఉన్నాయో అక్కడికే వెనక్కు వెళ్లాయి. కొండల దిగువన ఉన్న చైనా వారు వెనక్కు తగ్గారు, కంపు ట్రంప్‌ మాటలు నమ్మి ఏదో అనుకొని, ఏదో చేద్దామని కొండలెక్కిన మనం కాళ్లనొప్పులతో దిగాము తప్ప జరిగిందేమీ లేదు.
అలాంటిది కొనుగోలు దేశంగా ఉన్న మనం కోరితే లేదా బెదిరిస్తే ఒపెక్‌ దేశాలు ధరలు తగ్గించాయంటే, ఒక్కసారికేం ఖర్మ 56 అంగుళాల ఛాతీ రోజూ గడ్డం నిమురుకోవటం మాని ఆ పని మీద కేంద్రీకరిస్తే జనం మీద బాదుడు తగ్గుతుంది కదా ! మనం ఎప్పుడు ఏ దేశం నుంచి చమురును ఎంతకు కొనుగోలు చేశామో, అధికారికంగా శ్వేత పత్ర ప్రకటన లేదా ప్రభుత్వ ప్రకటన చేయమనండిి అసలు సంగతి బయటపడుతుంది ! టూల్‌కిట్టూ కాదు, దేశద్రోహం అంతకంటే కాదు. దీన్ని కూడా అడగలేక ఏమి చెప్పినా తలలు ఊపుతాం – ఎందుకంటే మనం గంగిరెద్దులం కదా !


” క్రూడ్‌ ధరలు నిలకడగానే ఉన్నా దేశంలో పెట్రోల్‌ , డీజిలు ధరల పెంపు ఎందుకంటే వీలు ఉన్నంత వరకు వీటి ద్వారా మళ్ళీ ఆర్ధికంగా నిలదొక్కుకోవడం కోసమేనట ! లాక్‌ డౌన్‌ సమయంలో ఆదాయం లేదు కానీ కేంద్ర ప్రభుత్వం అల్పదాయ ప్రజల ఆరు నెలల పాటు ఉచిత రేషన్‌ ఇచ్చిందట.” కనుక చమురు ధరలు పెంచటం సమర్దనీయమే అని భజన చేయటం.
ప్రభుత్వం ప్రకటించిన మేరకు ఆరు నెలల పాటు కుటుంబానికి నెలకు ఐదు కిలోల బియ్యం లేదా గోధుమలు ఇవ్వటానికి 90వేల కోట్ల రూపాయలు ఖర్చయిందట. అంటే కుటుంబానికి రూ.1,125 కేటాయించారు. ఇంతకంటే ఎక్కువ ఖర్చు చేశారని సాధికారికంగా సమాచారం చెబితే సవరిస్తా ! కేంద్ర ప్రభుత్వం మార్చి నెల 14న కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిలు మీద మూడేసి రూపాయలు, మే ఐదవ తేదీన రూ.10,13చొప్పున పెంచింది. తద్వారా కేంద్రానికి అదనంగా వస్తుందని చెప్పిన ఆదాయం ఎంత ? రెండు లక్షల కోట్ల రూపాయలు. అంతకు ముందు లీటరు పెట్రోలు మీద రూ.9.48గా ఉన్న పన్ను 22.98కి పెంచారు. అంటే మరో రెండులక్షల కోట్లు ఉంటుంది. మరి దాన్ని ఎందుకు పెంచినట్లు ? అప్పుడేమీ కరోనా, ఉచిత రేషన్‌ లేదే ? మనకు ఇచ్చింది ఎంత మన జేబుల నుంచి కొల్లగొట్టింది ఎంత ? దేశ భక్తి ఉండాల్సిందే గానీ అది మరీ మత్తులోకి దిగకూడదు. దిగితే మన ఒంటి మీద దుస్తులు కూడా మిగల్చరు ! ఏది చెబితే దాన్ని నమ్మేందుకు మనం గంగిరెద్దులమా ? అయినా తలలెందుకు ఊపుతున్నాం ?


చమురు ధరల పెంపుదలకు మరో అంశాన్ని మెదళ్లకు ఎక్కించే యత్నం జరుగుతోంది. కరోనా, ఉచిత రేషను అంటే ఎక్కువ కాలం నడవదు . మరి అదేమిటి ? ” 2020 ఏప్రిల్‌ నుండి ఇప్పటి వరకు లడాక్‌ దగ్గర 50,000 మంది సైనికులని మోహరించింది మన దేశం. యుద్ధ టాంకులు, ఆర్టీలరీ గన్స్‌ తో పాటు నిత్యం యుద్ధ విమానాలని గస్తీ లో ఉంచింది. కేవలం సైనికులని తరలించడానికే 10,000 కోట్లు ఖర్చు అయ్యింది. ఇక మీరేజ్‌ యుద్ధ విమానం ఒక గంట గాలిలో ఎగిరితే అయ్యే ఖర్చు 6 లక్షలు అవుతుంది. ఒక ఎస్‌యు మిగ్‌ అయితే ఒక గంటకి 10 లక్షల ఖర్చు అవుతుంది. ఒక సి-30 రవాణా విమానం లోడ్‌ తో గాల్లోకి లేచి దింపినందుకు అయ్యే ఖర్చు అక్షరాల 750 కోట్లు అవుతుంది. యావరేజ్‌ గా చూస్తే మొత్తం 10 నెలల కాలానికి రోజుకి 5 వేల కోట్లు ఖర్చు అయ్యింది. పూర్తి స్థాయి యుద్ధం కనుక వస్తే రోజుకి లక్ష కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది – ఇది రెండు లక్షల కోట్లకి కూడా పెరగవచ్చు. మీరేజ్‌, రాఫెల్‌ ల తో వాడే ఒక్కో మిసైల్‌ ఖరీదు 600 కోట్లు ఉంటుంది మరి ఈ ఖర్చు ఎవరు భరిస్తారు ? ఎక్కడా తగ్గకుండా కేంద్ర ప్రభుత్వం సరిహద్దుల్లో గట్టిగానే నిలబడ్డది. దేశ భద్రత ద ష్ట్యా ఇది తప్పని సరి ఖర్చు. ” అని సమర్ధన !


మన ప్రాంతాన్ని చైనా ఆక్రమించలేదని గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా చెప్పారు. తన ప్రకటనను వక్రీకరించారని అనలేదు కనుక ఇప్పటికీ అదే మాటతో ఉన్నారనుకుందాం ! ఒక్క అంగుళం ఆక్రమించినా ఊరుకునేది లేదని రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. చైనా పది సార్లు సరిహద్దులను అతిక్రమిస్తే మనం 50సార్లు అతిక్రమించాం అని మాజీ సైనికాధిపతి, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న వికె సింగ్‌ తాజాగా చెప్పారు. సరిహద్దుల వెంబడి మనం తిష్టవేశాం, అది చైనా మీద వత్తిడి పెంచుతోందని కూడా సింగ్‌ చెప్పారు.
ప్రధాని చెప్పినట్లు మన ప్రాంతాన్ని చైనా వారు ఆక్రమించలేదు, రాజనాధ్‌ చెప్పినట్లు ఒక్క అంగుళం కూడా కొత్తగా ఆక్రమించలేదు ,అయినా వికె సింగ్‌ గారు చెప్పినట్లు మనం వెళ్లి సరిహద్దులో కూర్చున్నాం. అందుకు గాను మనకు వదిలిన చమురు ఎంత. రోజుకు ఐదు వేల కోట్లంటే నెలకు లక్షా యాభై వేల కోట్లు, పది నెలలకు పదిహేను లక్షల కోట్లు ? ఇదంతా ఎందుకు చేసినట్లు ? అంత ఖర్చు భరించే స్దితిలో దేశం ఉందా ? ప్రతి పైసాకు జవాబుదారీ వహిస్తా అని చెబుతున్నవారు చేయాల్సిన పనేనా ఇది ? ఎవడబ్బ సొమ్మని రామచంద్రా అన్న రామదాసు గుర్తుకు రావటం లేదూ ! తేడా ఏమిటంటే ఆయన నవాబు జైల్లో బందీగా ఉండి వాపోయాడు. మనం హిందూత్వ ప్రజాస్వామ్య బందీలుగా ఉండి నోరు విప్పలేకపోతున్నాం. రామదాసు రక్షణకు రాముడు వచ్చాడంటారు. మన రక్షణకు కనీసం జైల్లో పరామర్శించేందుకు సైతం రాముడు వచ్చే అవకాశం లేదు. వచ్చినా అధికారులు అనుమతించరు.
పోనీ చైనా వారు కొత్తగా మన ప్రాంతాన్ని ఒక్క అంగుళం అయినా ఆక్రమించినట్లు చెప్పి ఉంటే దాన్ని కాపాడుకొనేందుకు పదిహేను లక్షల కోట్లేమిటి, దేశం మొత్తాన్ని అమ్మివేసి ఆ సొమ్ముతో అమెరికా నుంచి తెచ్చుకొనే ఆయుధాలతో సదరు అంగుళాన్ని తిరిగి తెచ్చుకొనేందుకు పూనుకున్నా ఎవరూ అభ్యంతర పెట్టరు. దేశభక్తిలో ఎవరూ ఎవరికి తీసిపోరు ! ఏమీ లేని దానికి కరోనా కాలంలో ఇంత ఖర్చా ? అనేక దేశాలకు సరిహద్దు సమస్యలున్నాయి. ఎవరైనా కరోనా కాలంలో ఇలాంటి పని చేశారా ? ఇది రాజనీతా – బాధ్యతా రాహిత్యమా ! ఏది చెబితే దానికి తలూపటానికి మనం గంగిరెద్దులమా ! అయినా తలలెందుకు ఊపుతున్నాం ?


” ఈ ఖర్చు అంతా కోవిడ్‌ టాక్స్‌ పేరు మీదనో లేదా యుద్ధ టాక్స్‌ పేరు మీదనో మన నుండి వసూలు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం. ఆయిల్‌ పూల్‌ ఖాతా మీదనే భారం వేస్తున్నది అది కూడా ఇంకో రెండు నెలలు మాత్రమే. మే నెల ఆరంభం నుండి మళ్ళీ పెట్రో రేట్లు తగ్గుతాయి. భయం అవసరం లేదు. ”
జనానికి బుర్రలేదనుకొనే అతి తెలివి వాదనతప్ప పైన పేర్కొన్న లక్షల కోట్ల ఖర్చును జనం నుంచి వసూలు చేయటం లేదట ? ఆయిల్‌ పూల్‌ ఖాతా నుంచి చేస్తున్నారట. దానికి డబ్బు ఎక్కడ నుంచి వస్తోంది? నరేంద్రమోడీ గారికి అల్లాఉద్దీన్‌ అద్భుత దీపం ఏమైనా దొరికిందా ! జనాన్ని ఇంత వెర్రివారిగా జమకడుతున్నవారినా మనం నోరెత్తకుండా అంగీకరిస్తున్నది ? ఎందుకిలా ప్రశ్నించలేని స్ధితికి చేరుకున్నాం ? గంగిరెద్దులమా ?

ఆయిల్‌ పూల్‌ అనండి మరొకటనండి పేరేదైతేనేం గత కొద్ది సంవత్సరాలుగా కేంద్రానికి రాష్ట్రాలకు వస్తున్న ఆదాయ వివరాలు కోట్ల రూపాయలలో దిగువ విధంగా ఉన్నాయి. బ్రాకెట్లలో ఉన్నఅంకెలు కేంద్రం,రాష్ట్రాల పన్నులలో చమురు రంగం వాటాల శాతాలు.

సంవత్సరం 2013-14 ××××× 2014-15 ××××× 2015-16 ××××× 2016-17
కేంద్రం 1,04,163(38.0) ×× 1,22,925(39.2) ×× 2,13,995(57.4) ×× 2,37,388(52.6)
రాష్ట్రాలు 1,27,957(27.2) ×× 1,31,595(25.7) ×× 1,29,214(23.5) ×× 1,53,287(25.1)

కేంద్ర ప్రభుత్వం పెంచిన పన్ను భారాన్ని ఈ అంకెలు చెబుతున్నాయి. మనం చెల్లిస్తున్నవే. ఇచ్చిన అంకెలన్నీ కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన సంవత్సరాలవే. ఈ పెంపుదల సమయంలో కరోనా లేదు, సరిహద్దుల్లో సరాగాలు, పనేమీ లేదు ఒకసారి వచ్చి పోండి అన్న ఆత్మీయ పిలుపులే తప్ప మరొకటి లేదు కదా ! ఎందుకు పెంచినట్లు ? పైన పేర్కొన్న అంకెలకు గత ఏడాది పెంచిన పన్నుల మొత్తం రెండు లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ఆదాయానికి కలుపుకోవాలి. కేంద్ర పన్నుల మీద కూడా రాష్ట్రాల వాట్‌ ఉంటుంది కనుక ఆ మేరకు కొంత మేరకు రాష్ట్రాలకు కూడా ఆదాయం పెరుగుతుంది తప్ప శాతాలలో పెద్ద మార్పు ఉండదు.
ఒకవేళ ఆయిల్‌ పూల్‌ – మరొకటో ఏదో ఒకటి. కరోనా, సరిహద్దుల కోసమే పన్నులు పెంచా అని విలేకర్ల సమావేశం పెట్టి చెప్పే ధైర్యం ఎలాగూ నరేంద్రమోడీ గారికి లేదు కనుక కనీసం తన మన్‌కీ బాత్‌లో సెలవిమ్మనండి. పార్లమెంటులో చెప్పమనండి. కొద్ది నెలలే గనుక భరిద్దాం.
మనం చర్చిస్తున్న పోస్టులో రాసినట్లు ఆసియా ఖండానికి చమురు రేట్లు తగ్గించిన నరేంద్రమోడీ గారికి మిగతా దేశాల వారందరూ జేజేలు పలుకుతూ ఉండి ఉండాలి. లేకపోతే నేపాల్‌, శ్రీలంకతో సహా ఇరుగు పొరుగుదేశాల్లో కూడా బిజెపిని ఏర్పాటు చేసి అధికారానికి వచ్చేందుకు ప్రయత్నించాలని త్రిపుర పర్యటనలో హౌం మంత్రి అమిత్‌ షా ఎందుకు చెబుతారు, ఆ విషయాన్ని త్రిపుర ముఖ్యమంత్రి విప్లవదేవ్‌ ప్రపంచానికి ఎలా వెల్లడిస్తారు. బిజెపి నాయకులు జనాన్నే కాదు చివరికి స్వంత పార్టీ వారిని కూడా వెర్రి పుష్పాల కింద జమకడుతున్నారన్నమాట. లేకపోతే విదేశాల్లో బిజెపి ఏర్పాటు ఏమిటి ? నరేంద్రమోడీ ఘనత కారణంగా మన, ఇరుగు పొరుగుదేశాల్లో ఫిబ్రవరి 15న గ్లోబల్‌ పెట్రోల్‌ ప్రైసెస్‌ డాట్‌ కామ్‌ సమాచారం ప్రకారం పెట్రోలు, డీజిలు ధరలు, సెంట్లు, మన కరెన్సీలో(ఫిబ్రవరి 18 మారకపు రేటులో) ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది ఖలిస్తానీ లేదా చైనా, పాకిస్దాన్‌ టూలకిట్టులో భాగం కాదని మనవి.

దేశం ×××××× పెట్రోలు ×××× డీజిలు
భారత్‌ ××××× 126 (91.37) ×× 115 (83.39)
బంగ్లాదేశ్‌ ××× 105 (73.24) ×× 77 (55.84)
చైనా ×××××× 103 (74.69) ×× 90 (65.26)
నేపాల్‌ ××××× 95 (68.89) ×× 80 (58.04)
శ్రీలంక ×××× 83 (60.19) ×× 54 (39.16)
పాకిస్దాన్‌ ××× 70 (50.76) ×× 73 (52.93)
భూటాన్‌ ××× 68 (49.31) ×× 64 (46.41)
మయన్మార్‌× 67 (68.89) ×× 60 (43.51)

మనం కోరితే ఒపెక్‌ సంస్ద ఆసియా ఖండానికి ధరలు తగ్గించిందని చెబుతున్న పెద్దలకు ఒక ప్రశ్న. విదేశాలకే మన మాట మీద అంత ప్రేమ ఉండి అడిగిన మనకే గాక ఆసియా మొత్తానికి ఉదారంగా భారం తగ్గించేందుకు కారకులైన మాననీయ నరేంద్రమోడీ మన దేశంలో ఇంత ఎక్కువకు ఎందుకు అమ్మిస్తున్నారు ? మనకెందుకీ దరిద్రం పట్టుకుంది. ఎక్కడిదీ ఏలినాటి శని ? కరోనా అందరికీ ఉంది. సరిహద్దుల్లో వివాదానికి మనం పదిహేను లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నపుడు చైనా వారికీ అంతే మొత్తం ఖర్చు అవుతుంది కదా ? మరి వారెందుకు ఆయిల్‌పూల్‌లో పన్నులు వసూలు చేయటం లేదు ? గంగిరెద్దుల్లా తలాడించటం తప్ప మనం ఇవేవీ అడగకూడదు !

” 100 రూపాయలు ఉన్న బీరు 160 అయితే ఎవరూ కిక్కురుమనరు కానీ పెట్రోల్‌ లీటర్‌ 100 అయిపోతున్నది అని గగ్గోలు పెట్టేస్తున్నారు. ఒక కుటుంబం రెస్టారెంట్‌ కి వెళ్ళి భోజనం చేస్తే 2000 అవుతున్నది కానీ ఎవరికీ ఇబ్బంది అనిపించడం లేదు. స్టేట్‌ హైవే ల మీద టోల్‌ గెేట్‌లు పెట్టి వసూలు చేస్తుంటే మాత్రం కమ్మగా ఉంటున్నది. అసలు 10 ఖరీదు చేసే ఒక క్వార్టర్‌ విస్కీ ని 150 రూపాయాలకి అమ్ముతుంటే ఎవడూ ఆడగడు. కానీ దేశానికి అవసరం అయ్యే ఖర్చు మీద మాత్రం గొంతులు లేస్తాయి ఇది మన దౌర్భాగ్యం. ”
చమురు ధరలు ఎంత పెరిగినా జనం పట్టించుకోవటం లేదు అన్నది స్పష్టం. అప్పో సప్పో చేసి దేశం కోసం చమురు కొంటున్నవారు ఎక్కడా కనీసంగా నిరసన తెలిపిన పాపాన కూడా పోలేదు. ఒకవైపు రోడ్డు పేరుతో పెట్రోలు మీద సెస్‌ వేస్తున్నారు. మరో వైపు ద్విచక్ర వాహనాల మీద తప్ప మిగిలిన వాటన్నింటికీ ”తోలు” వసూలు చేస్తున్నారు. అయినా సరే నోరు మూసుకొని చెల్లించాల్సిందే ! గంగిరెద్దులం కదా మాట్లాడ కూడదు ! మనసులో కూడా ధరలు పెరిగాయి అనుకోకూడదు అన్నమాట ! ఎక్కడ నోరు తెరుస్తామో అని ముందుగానే మన నోరు మూయించేందుకు తిడుతున్నతిట్లు తప్ప ఇవి మరొకటి కాదు. ఒక వేళ ఎవరైనా చమురు ధరల మీద ఆందోళన చేశారో ! మీ వెనుక ఏపాకిస్ధానో, చైనానో ఉందనో, మీకు ఏదో ఒక ఉగ్రవాద సంస్ద నుంచి నిధులు అందుతున్నాయనో వెంటనే ముద్రవేస్తారు ! రైతులను చూస్తున్నాం కదా ! గంగిరెద్దులం కనుక తలెత్తటం లేదు !


వాట్సాప్‌లో తిరుగుతున్న మరో పోస్టు ఇరాన్‌కు చమురు బిల్లు చెల్లింపు గురించి. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే చెబితే నిజం అవుతుందన్నగోబెల్స్‌ సూత్రాన్ని పక్కాగా అమలు జరుపుతున్నారు. యుపిఏ పాలనా కాలంలో చమురు ఖాతాలో ఇరవై లక్షల కోట్ల లోటు పెట్టారని, ఇరాన్‌కు అరవైవేల కోట్ల రూపాయల చెల్లింపు గురించి గత మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం దాచి పెట్టిందని, ఆ సొమ్మును ప్రభుత్వం వినియోగించుకుందని, మోడీ సర్కార్‌ మీద భారం మోపిందనే ఆరోపణలు పదే పదే చేస్తున్నారు. వాస్తవం ఏమిటి ?
ఇరాన్‌పై పశ్చిమ దేశాల ఆంక్షలు అమలు జరుపుతున్న సమయంలో మన దేశంలోని మంగళూరు చమురు శుద్ది కర్మాగారం, హెచ్‌పిసిఎల్‌,ఐఓసి, హెచ్‌పిసిఎల్‌ మిట్టల్‌ ఎనర్జీ, ఎస్సార్‌ ఆయిల్‌ కంపెనీలు ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి చేసుకున్నాయి. దానికి గాను నలభైశాతం మొత్తాన్ని మన రూపాయల్లో చెల్లించాయి. అయితే మన దేశం మిగిలిన మొత్తాన్ని చెల్లించేందుకు సిద్దపడినప్పటికీ ఆంక్షల కారణంగా అంతర్జాతీయ బ్యాంకులు భయపడి సొమ్ము తీసుకొనేందుకు ముందుకు రాలేదు. ఈలోగా ప్రభుత్వం మారిపోయింది, ఆంక్షలను సడలించారు. టర్కీకి చెందిన హాక్‌బ్యాంక్‌ ముందుకు వచ్చింది, 6.5బిలియన్‌ డాలర్ల(మన కరెన్సీలో 43వేల కోట్లు) మొత్తాన్ని యూరోలలో చెల్లించాలని బ్యాంకు, ఇరాన్‌ కూడా కోరింది. ఆ మేరకు ప్రభుత్వం చెల్లించింది. అప్పటి వరకు ఆ సొమ్ము ఆయా కంపెనీల దగ్గరే ఉండిపోయింది తప్ప మన్మోహన్‌సింగ్‌ సర్కార్‌ వాడుకోలేదు, మోడీ సర్కార్‌ తన బొక్కసం నుంచి చెల్లించిందీ లేదు. అయితే ప్రభుత్వం ద్వారా చెల్లింపులు జరిగాయి. గత ప్రభుత్వం చమురు ఖాతాలోటు పూడ్చుకొనేందుకు గాను పన్ను భారం పెంచామని చెప్పుకొనేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేశారు. మనం గంగిరెద్దుల మాదిరి తలూపాలా ? నిజాల నిగ్గు తేల్చాలా ? మన గత చరిత్ర తలెత్తుకున్నది తప్ప తలూపింది కాదు మరి !!