• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Anti communist

ఏమి రాజకీయాల్రా బాబూ : చైనాపై అమెరికా పెద్దన్న ధ్వజం – విశ్వగురువు నరేంద్రమోడీ లొంగుబాటు !!

16 Thursday May 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, USA, WAR

≈ Leave a comment

Tags

Anti China Propaganda, Anti communist, BJP, China, CHINA TRADE, Donald trump, Import duty on EVs, Joe Biden, Narendra Modi Failures, RSS, TRADE WAR, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు బెదిరించి లొంగదీసుకోవాలన్న ఎత్తుగడ. మరోవైపు జనం ముందు శత్రువు అంటూనే చైనా సంతుష్టీకరణ.ఎందుకిలా జరుగుతోంది ? ” ఉక్రెయిన్‌ యుద్ధాన్ని నరేంద్రమోడీ ఆపివేయగలిగారు. అమెరికా, రష్యా అధినేతలను సైతం శాసించగలిగిన పలుకుబడి కలిగిన విశ్వగురువుగా ఎదిగారు, ప్రపంచ నేతల్లో పలుకుబడి ఎక్కువ కలిగిన నేతగా ఉన్నారు.” మోడీ గురించి ఇలాంటి ఎన్నో అంశాలను ప్రచారం చేస్తున్నారు. జనం కూడా నిజమే కదా అని వింటున్నారు, మేము సైతం తక్కువ తిన్నామా అన్నట్లుగా వాటిని ఇతరులకు ఉచితంగా పంచుతున్నారు. వాట్సాప్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎలాంటి కష్టం లేకుండానే పట్టాలు పొందుతున్నారు.ఇక తాజా విషయానికి వస్తే చైనా నుంచి దిగుమతి అవుతున్న విద్యుత్‌ వాహనాలు,కంప్యూటర్‌ చిప్స్‌, వైద్య ఉత్పత్తులపై అమెరికా సర్కార్‌ వందశాతం వరకు దిగుమతి సుంకాన్ని విధించి వాణిజ్య యుద్దాన్ని కొనసాగిస్తున్నాం కాసుకోండి అంటూ ఒక సవాల్‌ విసిరింది. మరి అదే అమెరికా మెడలు వంచారని, దారిలోకి తెచ్చుకున్నారని చెబుతున్న నరేంద్రమోడీ ఏం చేశారు ? ఇప్పటి వరకు మనదేశం విదేశీ విద్యుత్‌ వాహనాలపై రకాన్ని బట్టి 70 నుంచి 100శాతం వరకు విధిస్తున్న దిగుమతి సుంకాన్ని పదిహేను శాతానికి తగ్గించారు. అయితే చైనా కంపెనీలతో సహా ఎవరైనా 50 కోట్ల డాలర్ల మేరకు ఆ వాహనరంగంలో మనదేశంలో పెట్టుబడులు పెట్టాలి, ఉత్పత్తి ప్రారంభించేంత వరకు ఐదు సంవత్సరాల పాటు ఏటా ఎనిమిది నుంచి 40వేల వరకు వాహనాలను ప్రతి కంపెనీ నేరుగా దిగుమతులు చేసుకోవచ్చు. వాహనాల తయారీలో దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న విడిభాగాల వినియోగం ప్రస్తుతం 30 నుంచి 40శాతం వరకు ఉందని, నూతన విధానం వలన మరింత పెరుగుతుందని ప్రభుత్వం చెబుతుండగా రానున్న రోజుల్లో చైనా వాహనాలతో భారత మార్కెట్‌ నిండిపోతుందని ఆ రంగ నిపుణులు హెచ్చరిక, ఆందోళన వెల్లడించారు. అమెరికా మెడలే వంచగలిగిన నరేంద్రమోడీ చైనా విషయంలో ఇప్పుడున్న పన్నును కొనసాగించకుండా ఇలా ఎందుకు లొంగిపోయినట్లు ? అమెరికా పెద్దన్న బెదిరించి లొంగదీసుకోవాలని చూస్తుంటే, విశ్వగురువు తనకు నచ్చని మాట సంతుష్టీకరణకు ఎందుకు పూనుకున్నట్లు ?


నవంబరు నెలలో జరగనున్న ఎన్నికల్లో జో బైడెన్‌కు ప్రత్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ చుక్కలు చూపిస్తున్నాడు.చైనా నుంచి దిగుమతులు అంటే అమెరికన్లకు ఉపాధి తగ్గటమే. అందుకే ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు బైడెన్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే అమెరికాలో విద్యుత్‌ వాహనాలను తయారు చేసే కంపెనీలు ఉన్నాయి గనుక అక్కడి వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనదేశంలో పదేండ్లలో మోడీ అలాంటి కార్ల తయారీని ప్రోత్సహించటం, పరిశోధనా, అభివృద్ధి రంగాలను పట్టించుకోలేదు. ఈ కారణంగా మనదేశంలోని కార్పొరేట్‌ సంస్థలు చైనా కంపెనీలతో సంయుక్త భాగస్వామ్యం, దిగుమతులకు మోడీ సర్కార్‌ మీద వత్తిడి తెచ్చాయి. ఎన్నికలలో వాటి నుంచి నిధులు కావాలి గనుక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడక ముందే వాటిని సంతుష్టీకరించేందుకు విద్యుత్‌ వాహనాల దిగుమతి, తయారీ విధానంలో వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. కొన్ని కంపెనీలు ఎన్నికల బాండ్ల రూపంలో అంతకు ముందే బిజెపికి గణనీయమొత్తాలను సమర్పించుకున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు తరువాత బహుశా టెంపోలలో నోట్లను రవాణా చేసి ఉంటాయి. దిగుమతుల కారణంగా ఉపాధి తగ్గినా లేక నిరుద్యోగం ప్రాప్తించినా అమెరికా సమాజం సహించదు. మనదేశంలో అలాంటి పరిస్థితి లేదు, మతం, కులం, ప్రాంతం, విద్వేషం, తప్పుడు సమాచారం తదితర అనేక మత్తుమందులను ప్రయోగిస్తూ అసలు సమస్యల నుంచి జనాన్ని తప్పుదారి పట్టించటంలో ఎవరు అధికారంలో ఉన్నా సర్వసాధారణమైంది. జనం కూడా అలవాటు పడ్డారు.గుళ్లు, మసీదు, చర్చీలు ఇతర ప్రార్ధనామందిరాలకు వెళ్లి రోజంతా వేడుకోవటానికి కానుకల సమర్పణ, కొబ్బరి కాయలు కొట్టేందుకు సిద్దపడుతున్నారు గానీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించటానికి ఆసక్తి చూపటం లేదు.


అమెరికా పెంచిన పన్నులను రద్దు చేయాలని లేదా తాము కూడా ప్రతిచర్య తీసుకుంటామని చైనా స్పందించింది.చైనా నుంచి దిగుమతి చేసుకొనే విద్యుత్‌ వాహనాలు,అల్యూమినియం, సెమీకండక్టర్లు,బ్యాటరీలు, కొన్ని రకాల ఖనిజాలు, సోలార్‌ సెల్స్‌,క్రేన్ల వంటి వాటి మీద దిగుమతి పన్ను పెంపు కారణంగా కనీసం 1,800కోట్ల డాలర్ల మేర అమెరికా వినియోగదారుల మీద భారం పెరుగుతుంది. ఆ కారణంగా దిగుమతులు నిలిపివేస్తే ప్రత్యామ్నాయం చూపే పరిస్థితిలో అమెరికా లేదు. వాటినే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సివస్తే భారం ఇంకా పెరుగుతుంది. గత ఏడాది చైనా నుంచి 427 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులను దిగుమతి చేసుకున్న అమెరికా 148బి.డాలర్ల విలువగల వస్తువులను ఎగుమతి చేసింది.గతంలో చైనా కూడా ప్రతిచర్యల్లో భాగంగా పన్నులు పెంచింది. చైనా వస్తువుల మీద ఆధారపడకుండా స్వంతంగా తయారు చేసుకోవాలని, తద్వారా చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని, తమ కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలనే సంకల్పం చెప్పుకున్న అమెరికా, ఐరోపా దేశాల సరసన మనదేశం కూడా ఉంది.
అనేక దేశాలతో మనదేశం స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు(ఎఫ్‌టిఏ) చేసుకుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టి పరస్పరం లబ్ది పొందేందుకు వీటిని చేసుకుంటున్నారు. విదేశాలు తిరిగి మనవస్తువులకు మార్కెట్‌ అవకాశాలను పెంచానని, దానితో పాటు పలుకుబడి కూడా పెరిగిందని నరేంద్రమోడీ పదే పదే చెబుతారు. కానీ గత ఐదు సంవత్సరాల వివరాలను చూసినపుడు ఎగుమతుల అంశంలో మన పలుకుబడి పప్పులు ఉడకలేదు. 2019-2024 ఆర్థిక సంవత్సరాలలో ఎఫ్‌టిఏలు ఉన్న దేశాలకు మనం ఎగుమతి చేసిన వస్తువుల విలువ 107.2 నుంచి 122.72 బిలియన్‌ డాలర్లకు(14.48శాతం) పెరిగితే, దిగుమతులు 136.2 నుంచి 187.92 బిలియన్‌ డాలర్లకు ( 37.97శాతం) పెరిగినట్లు జిటిఆర్‌ఐ నివేదిక వెల్లడించింది. ఎగుమతులపై మోడీ ప్రచార బండారాన్ని బయట పెట్టింది. మొత్తంగా చూసుకున్నపుడు ప్రపంచ వాణిజ్య ఎగుమతుల్లో 1.8శాతంతో మనదేశం 17వదిగా ఉండగా దిగుమతుల్లో 2.8శాతం వాటాతో ఎనిమిదవ స్థానంలో ఉంది. అంతా బాగుంది అని చెప్పిన 2023-24లో మన వస్తు ఎగుమతులు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 3.11శాతం తగ్గి 437.1బిలియన్‌ డాలర్ల వద్ద ఉన్నాయి. దిగుమతి చేసుకున్న వస్తువులను కొనుగోలు చేయటం తగ్గటంతో గతేడాది 5.4శాతం తగ్గి 677.2బి.డాలర్లుగా ఉన్నాయి.


ట్రంప్‌ మాదిరి చైనా పట్ల కఠినంగా ఉండాలని జో బైడెన్‌ కూడా జనానికి కనిపించేందుకు తాజా చర్యకు పూనుకున్నాడు. గతనెలలో రాయిటర్స్‌ జరిపిన ఒక సర్వేలో ట్రంప్‌ కంటే బైడెన్‌ ఏడుపాయింట్లు వెనుకబడి ఉన్నాడు. అయితే 2020లో చైనాతో ట్రంప్‌ కుదుర్చుకున్న ఒప్పందంతో ఎలాంటి ఫలితమూ రాలేదు. పరస్పరం సహకారం పెంచుకోవాలని చెబుతూనే దిగుమతి పన్నుల పెంపుదలకు సాకుగా తాము అవసరాలకు మించి హరిత ఉత్పత్తులు చేస్తున్నామని లేనిపోని మాటలు చెబుతున్నదని చైనా విమర్శించింది. ఇది రక్షణాత్మక చర్యలకు పూనుకొనేందుకు చేస్తున్న ప్రచారమని, తనను తాను దెబ్బతీసుకోవటమేనని, గతంలో వచ్చిన అవగాహనకు భిన్నమని, రెండు దేశాల మార్గంలో గుంతలు తవ్వవద్దని హితవు చెప్పింది. బైడెన్‌ ఎన్నికల కోసం రాజకీయంగా తీసుకున్న చర్య తప్ప తమ మీద పెద్దగా ప్రభావం పడదని కూడా వ్యాఖ్యానించింది.2023 నుంచి ఈ ఏడాది మార్చినెల వరకు అమెరికా సమాచారాన్ని చూస్తే జర్మనీ నుంచి 689 కోట్ల డాలర్లు, దక్షిణ కొరియా నుంచి 622 కోట్ల డాలర్ల విలువగల విద్యుత్‌ బాటరీల వాహనాలను కొనుగోలు చేసిన అమెరికా చైనా నుంచి దిగుమతి చేసుకున్నది కేవలం 38 కోట్ల డాలర్ల విలువగలవే అని ఒక పత్రిక పేర్కొన్నది. బైడెన్‌ నిర్ణయం ప్రకారం విద్యుత్‌ వాహనాలపై పన్ను 25 నుంచి 102.5శాతానికి పెరిగింది. బాటరీలు, వాటి విడి భాగాలపై 7.5శాతం నుంచి 50శాతం వరకు పెంచారు.నౌకల నుంచి సరకులను తీరానికి చేర్చే క్రేన్లపై ఇప్పటి వరకు పన్నులేదు, వాటి మీద 25శాతం, సిరంజ్‌లు, సూదులపై 50శాతం, రక్షణకు ఉపయోగించే వైద్య కిట్లపై 25శాతం విధించారు. రానున్న సంవత్సరాల్లో ఈ పన్నులు ఇంకా పెరుగుతాయి.ఈ పెరుగుదల అంతా అమెరికా వినియోగదారుల మీదనే భారం మోపుతుంది.చైనా అనుచిత వ్యాపారాన్ని అడ్డుకొనేందుకే ఈ చర్యలని అమెరికా సమర్ధించుకుంటున్నది. ద్రవ్యోల్బణాన్ని అరికట్టే సాకుతో దేశీయంగా తయారైన వాహనాల కొనుగోలుదార్లకు అమెరికా ప్రభుత్వం ఏడున్నరవేల డాలర్లు రాయితీ ఇస్తుంది. అయితే ఇటీవల అలాంటి వాహనాల్లో చైనా విడిభాగాలు ఏవైనా ఉంటే ఆ రాయితీ వర్తించదని ప్రకటించారు.


మధ్యలో ఒకటి రెండు సంవత్సరాలు మనదేశంతో వాణిజ్య లావాదేవీల్లో అమెరికా మొదటి స్థానంలోకి వచ్చింది. దాంతో మీడియాలో కొందరు ఇంకేముంది చైనాతో మనకు పనేముంది, సరఫరా గొలుసు నుంచి బయటపడ్డాం అన్నట్లుగా సంబరాన్ని ప్రకటించారు. కానీ తిరిగి చైనా మొదటి స్థానానికి వచ్చినట్లు తాజా సమాచారం వెల్లడించింది. ఇదంతా సరిహద్దు వివాదంలో చైనా సంగతి తేలుస్తాం, బుద్దిచెబుతాం అనే పటాటోపం మధ్యనే జరిగింది.2023-24 సంవత్సరంలో రెండు దేశాల వాణిజ్యం 11,840 కోట్లు కాగా అమెరికాతో 11,380 కోట్ల డాలర్లు ఉంది.కౌంటర్‌పాయింట్‌ అధ్యయనం ప్రకారం ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహకం(పిఎల్‌ఐ) పధకం ఉన్నప్పటికీ మనదేశంలో చైనా బ్రాండు ఫోన్లు గణనీయమార్కెట్‌ వాటాను కలిగి ఉన్నాయి.ఈ పధకం వలన ఆపిల్‌, శాంసంగ్‌ వంటి కంపెనీలు లబ్దిపొందినప్పటికీ మార్కెట్లో వాటి వాటా దానికి తగినట్లుగా పెరగలేదని హిందూ బిజినెస్‌లైన్‌ పత్రిక రాసింది. ఇతర బ్రాండ్లతో ఉత్పత్తి కాంట్రాక్టులు కుదుర్చుకోవటం, ఎగుమతులు తప్ప భారతీయ బ్రాండ్లకు రూపకల్పన, అభివృద్ధి జరగలేదు.ఫార్మారంగంలో కొన్నింటిని పిఎల్‌ఐ కారణంగా మనదేశంలోనే తయారు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ మన పరిశ్రమలు చైనా మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. దిగుమతుల నిరోధానికి ఈ పధక చికిత్స పనిచేయలేదు. గతేడాది మనదేశం చేసుకున్న ఎలక్ట్రానిక్స్‌ దిగుమతుల్లో చైనా నుంచి 43.9శాతం ఉన్నాయి. కుండలో కూడు అలాగే ఉండాలి పిల్లాడు దుడ్డులా ఎదగాలి అంటే కుదరదన్న సామెత తెలిసిందే. గడచిన పది సంవత్సరాల్లో అన్నీ వేదాల్లోనే ఉన్నాయష బాపతు పెరిగింది తప్ప ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం ప్రభుత్వం ఖర్చు చేయాలన్న జ్ఞానం పాలకులకు రాలేదు.గతమెంతో ఘనం అనే పిచ్చిలోనే కొట్టుకుంటున్నారు. జనాన్ని ముంచుతున్నారు. జిడిపిలో మనకంటే చైనా ఐదు రెట్లు పెద్దది. మనం 0.75శాతం పరిశోధనలకు ఖర్చు చేస్తుంటే అక్కడ 3.5శాతం ఉంది. దీని అర్ధం మనకంటే చైనాలో 25రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని ప్రొఫెసర్‌ అరుణకుమార్‌ వ్యాఖ్యానించారు.మన విశ్వవిద్యాలయాల్లో రాజకీయ, అధికార జోక్యం ఎక్కువగా ఉంది తప్ప పరిశోధన వాతావరణాన్ని సృష్టించలేదన్నారు. ఏవైనా నిధులు ఉంటే గోమూత్రం, పేడలో బంగారం, ఇతరంగా ఏమున్నాయో పరిశోధనలు చేయిస్తున్నారు.చైనా ఉత్పత్తులపై అమెరికా దిగుమతి సుంకం పెంపు పర్యవసానాలు మనదేశం మీద ఎలా ఉంటాయన్న చర్చ మొదలైంది. చైనా ఉత్పత్తులు కుప్పలు తెప్పలుగా మనదగ్గరకు వచ్చిపడతాయని, మన ఎగుమతి అవకాశాలు పెరగవన్నది ఒక అభిప్రాయం. అమెరికా, ఐరోపా యూనియన్‌ దిగుమతి పన్నులు పెంచటం, దిగుమతులను తగ్గిస్తున్న కారణంగా చైనా తన వాహనాలకు భారత్‌ ఇతర దేశాల మీద ఆధారపడుతుందని కొందరి అంచనా. ఈ అంశాలను ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నప్పటికీ నరేంద్రమోడీ చైనా నుంచి పెట్టుబడులు, దిగుమతులను పెంచేందుకు వీలుగా దిగుమతి పన్ను ఎందుకు తగ్గించారన్నది వారి ప్రశ్న. కార్పొరేట్ల లాభాల కోసం సంతుష్టీకరణ తప్ప మరొకటి కనిపించటం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చిలీలో మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం !

13 Wednesday Mar 2024

Posted by raomk in Current Affairs, History, imperialism, International

≈ Leave a comment

Tags

#latin american left, Anti communist, Chile communists, Gabriel Boric


ఎం కోటేశ్వరరావు


ప్రజాస్వామ్యాన్ని, ప్రజాభిప్రాయాన్ని ఏడు నిలువుల లోతున పాతిపెట్టిన చిలీ నియంత పినోచెట్‌ చచ్చి పద్దెనిమిదేండ్లు అవుతున్నా, వాడి వారసులు వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల పూర్వరంగంలో మరోసారి కమ్యూనిస్టుల మీద విరుచుకుపడుతున్నారు. చిలీలో ఆశ్రయం పొందిన వెనెజులా సోషలిస్టు వ్యతిరేక మిలిటరీ అధికారి ఒకడు ఇటీవల హతుడయ్యాడు. కమ్యూనిస్టులే చంపారంటూ చిలీ మీడియా,పినోచెట్‌ వారసులైన ప్రతిపక్ష పార్టీ కూటమి తప్పుడు ప్రచారం ప్రారంభించింది. కమ్యూనిస్టుల విశ్వసనీయత ప్రశ్నించరానిదని చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్‌ బోరిక్‌ బహిరంగంగా సమర్ధించాడు. వామపక్ష సంఘటన ప్రభుత్వంలో కమ్యూనిస్టు పార్టీ ఒక ప్రధాన భాగస్వామిగా ఉంది. పార్లమెంటులోని 155 స్థానాలకు గాను అధికార కూటమికి 37,దానికి మద్దతు ఇస్తున్న కూటమికి మరో 37 ఉన్నాయి.వాటిలో సోషలిస్టులకు 13, కమ్యూనిస్టు పార్టీ 12సీట్లతో ప్రధమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. లాటిన్‌ అమెరికాలో ఉన్న సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో మితవాద శక్తుల ప్రధాన ఆయుధం కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టటం ఒకటన్నది తెలిసిందే. అనేక దేశాల్లో నిరంకుశ, మితవాద శక్తులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సోషలిస్టులు, కమ్యూనిస్టులు అధికారానికి వస్తే క్రైస్తవమతానికి, ధనికుల ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందనే ప్రచారం ఎప్పటి నుంచో చేస్తున్నారు. నాజీ గోబెల్స్‌ను మించి అవాస్తవాలను ప్రచారంలో పెడుతున్నారు.


2017లో వెనెజులా నుంచి పారిపోయి వచ్చి చిలీలో ఆశ్రయం పొందిన మిలిటరీ మాజీ అధికారి రోలాండ్‌ జెడాను కొద్ది రోజుల క్రితం కొందరు అపహరించి హత్యచేశారు. దీని వెనుక కమ్యూనిస్టులు ఉన్నారని, దేశంలో హింసాకాండ సృష్టికి కుట్రలు పన్నుతున్నారంటూ అనేక పత్రికలు, ప్రతిపక్ష మితవాద పక్షాలు ఎలాంటి ఆధారం లేకుండా ధ్వజమెత్తుతున్నాయి. జనంలో అనుమానాలు కలిగించేరీతిలో కథనాలు అల్లుతున్నాయి. ఈ శక్తులన్నీ నియంత పినోచెట్‌ హయాంలో కమ్యూనిస్టులు, సోషలిస్టులు, ఇతర ప్రజాస్వామిక వాదుల అణచివేత, అపహరణలను సమర్ధించినవే. మార్క్సిస్టు కాన్సర్‌ను అంతమొందించాలనే పేరుతో పినోచెట్‌ మిలిటరీ పాలకులు వేలాది మంది కమ్యూనిస్టులు, అభ్యుదయవాదులను హతమార్చారు, అనేక మంది జాడలేకుండా చేశారు. చిత్రహింసలు, జైళ్లపాలు సరేసరి. 1983లో కేవలం రెండు నెలల వ్యవధిలోనే 20 మంది కమ్యూనిస్టు నేతలను హత్యచేశారు. తరువాత ముగ్గురు నేతల నాలుకలను చీల్చి చిత్రహింసలకు గురిచేశారు. పినోచెట్‌ పాలనలో నాలుగువేల మంది అపహరణలకు గురయ్యారు. కనీసం ఇరవై వేల మంది పిల్లలను అపహరించి విదేశాల్లో చట్టవిరుద్ద దత్తతకు సహకరించారనే విమర్శలున్నాయి. వాటి గురించి దర్యాప్తు జరపాలని, నిజాల నిగ్గుతేల్చాలని కమ్యూనిస్టులు కోరుతున్నారు.


చిలీలో నియంతృత్వం ఉన్నకాలంలో కమ్యూనిస్టు పార్టీ అజ్ఞాతవాసంలోకి వెళ్లింది.ప్రజల తరఫున పోరాడేందుకు సాయుధ దళాలను ఏర్పాటు చేసింది. నియంతల పాలన అంతరించిన తరువాత కమ్యూనిస్టులు తిరిగి బహిరంగంగా పనిచేయటం ప్రారంభించారు.ప్రస్తుతం 46,023 మంది సభ్యులతో దేశంలో అతి పెద్ద పార్టీగా ఉంది. గత ఎన్నికల్లో కమ్యూనిస్టు అభ్యర్ధి బరిలో ఉంటారని అందరూ భావించారు. అయితే వామపక్ష కూటమిలోని పార్టీల అభిప్రాయం మేరకు గాబ్రియెల్‌ బోరిక్‌ పోటీ చేసి 2021ఎన్నికల్లో గెలిచారు. హతుడైన వెనెజులా మాజీ మిలిటరీ అధికారికి వెనెజులాలో అనేక మందిని హతమార్చిన చరిత్ర ఉంది. హత్యవెనుక వెనెజులా హస్తం ఉందని, దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురోను ఖండించటంలో గొంతుకలపాలని చిలీ మితవాద పార్టీలు చేసిన డిమాండ్‌ను కమ్యూనిస్టు పార్టీ తిరస్కరించింది. కమ్యూనిస్టుల మీద విషం చిమ్మటానికి ఇదొక కారణమని చిలీ మంత్రి, కమ్యూనిస్టు నేత గామిలా వలేజో చెప్పారు. పార్లమెంటులో ఉన్న బలంతో గాబ్రియెల్‌ బోరిక్‌ ప్రభుత్వానికి అనేక ఆటంకాలు కలిగిస్తున్న ప్రతిపక్షాలు కమ్యూనిస్టు పార్టీ మీద విషం చిమ్మటంలో ఆశ్చర్యం ఏముందని కమ్యూనిస్టు పార్టీ ఎంపీ, విద్యార్ధి సంఘమాజీ నాయకురాలు కరోల్‌ కారియోలా చెప్పారు.భాగస్వామ్య పక్షాల అవగాహన మేరకు పార్లమెంటు సభాధ్యక్ష స్థానాన్ని కమ్యూనిస్టులు చేపట్టనున్న పూర్వరంగంలో పార్టీ మీద దాడికి దిగినట్లు చెప్పారు.


అంతరంగంలో గూడు కట్టుకున్న కమ్యూనిస్టు వ్యతిరేకతను ప్రతిపక్షాలు వెల్లడిస్తున్నాయి.ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా వ్యక్తులు, సంస్థలు ఎవరిమీదనైనా భయంకరమైన ఆరోపణలు చేయగల సమర్ధత కలిగినవి.వాటి పర్యవసానాలు వాటికి పట్టదు.ఊహాజనితమైన ఆరోపణలు చేస్తున్నాయి. చరిత్రలో చిలీ కమ్యూనిస్టు పార్టీ ప్రజాస్వామిక నిబద్దతను ఎవరూ సందేహించాల్సిన అవసరం లేదు. అది ప్రారంభమైనప్పటి నుంచి అందరికీ తెలుసు. ప్రజాస్వామిక పోరాటాల్లో తమదైన ముద్రను వారు ఎప్పుడూ ప్రదర్శిస్తూనే ఉన్నారు.ప్రజాస్వామ్య పరిరక్షణను వారెన్నడూ వీడలేదు. ఆ క్రమంలో నిరంతరం భాగస్వాములుగానే ఉన్నారు. వ్యవస్థాపరమైన చట్రానికి అనుగుణంగా వారు సర్దుబాటు చేసుకొని నడుచుకుంటున్నారు.అందువల్లనే కమ్యూనిస్టుల మీద జరుపుతున్నదాడిని కాకమ్మ కథలుగా చూస్తున్నాను అని చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్‌ బోరిక్‌ చెప్పాడు. కమ్యూనిస్టులు న్యాయం, సమానత్వం, హక్కులకు అంకితమయ్యారు. కార్మికుల హక్కులను కాపాడేందుకు, ఆదర్శసమాజాన్ని ఏర్పాటు చేసేందుకు దేశంలో ఒక ప్రజాస్వామిక వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నారు. అన్ని రకాల వివక్ష, అణచివేతను నిర్మూలించాలన్నదే తమ లక్ష్యమని కూడా చెప్పారు.జనం, సమాజ కేంద్రంగా ఉండాలని, జీవితాలు మెరుగుపడాలని మేం కోరుతుండగా నయా ఉదారవాదం ప్రజలు, వారి హక్కుల కంటే పెట్టుబడికి పెద్ద పీటవేస్తున్నదని బోరిక్‌ చెప్పాడు. ప్రభుత్వ ఏర్పాటు ఒప్పందంలో భాగంగా ప్రజాప్రతినిధుల సభ అధ్యక్ష పదవిని కమ్యూనిస్టులకు అప్పగించాల్సి ఉంది. దానికి అనుగుణంగా నిర్ణయించామని, గౌరవిస్తామని అన్నాడు. ఆ పదవిలో ఎవరు అన్నది సమస్యే కాదు, పార్లమెంటులోని సహచరులందరూ సమర్ధులే, వ్యక్తులు దొరుకుతారా లేదా అన్నది కాదు, సమిష్టి నిర్ణయాలు ఉంటాయి గనుక ఎవరున్నా ఇబ్బంది ఉండదన్నాడు.


ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణలకు సామాజిక ఉద్యమాల ద్వారా మద్దతు కూడగట్టాలని కమ్యూనిస్టు పార్టీ పిలుపు ఇవ్వటం పార్లమెంటులోని మితవాద శక్తులకు కంటగింపుగా మారింది.చిలీ పార్లమెంటులో ఇప్పుడున్న బలాబలాల ప్రకారం అధికారంలో ఉన్న కూటమి ప్రతిపాదించే విధానాలు ఓటింగ్‌లో వీగిపోయే అవకాశం ఉంది. చట్టాలు, విధానాలను రూపొందించాల్సిన బాధ్యత చట్టసభలది తప్ప సామాజిక మద్దతు పేరుతో వత్తిడి తేవటం ఏమిటని మితవాదశక్తులు, వాటికి మద్దతుగా ఉన్న మీడియా,వాదిస్తున్నాయి. అందులో తప్పేం ఉందని అధ్యక్షుడు బోరిక్‌ ప్రశ్నించాడు. ఆ ఉద్యమాలు ప్రజా ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించినట్లయితే ఆహ్వానించాల్సిందే అన్నాడు. అబార్షన్‌ మీద చేసిన చట్టం వెనుక మహిళా ఉద్యమాల సమీకరణ లేదా అని ప్రశ్నించాడు. విద్యార్ధి ఉద్యమం ఉచిత విద్య కోసం పోరాడిందని, నూతన రాజ్యాంగం సామాజిక ఉద్యమాలను ప్రోత్సహిస్తున్నదని, ప్రజాస్వామిక పద్దతుల్లో సామాజిక చర్చ జరగాలన్నాడు.వామపక్ష శక్తులు అధికారానికి వచ్చిన తరువాత ప్రతిపాదించిన ప్రజానుకూల సంస్కరణలను ముందుకు తీసుకు వెళ్లలేని వాస్తవ పరిస్థితి పార్లమెంటులో ఉంది. దానిలో భాగంగానే ధనికుల నుంచి పన్నువసూళ్లను పెంచే ప్రతిపాదన పార్లమెంటుముందుంచగా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి.కార్పొరేట్‌, ధనికులకు మద్దతుగా నిలిచాయి. పెన్షన్ల పెంపు, పెన్షన్‌ హామీ, సంరక్షణ వంటి పధకాలకు అవసరమైన నిధులను సేకరించేందుకు కలిగిన వారి మీద పన్ను పెంచాలని వామపక్ష ప్రభుత్వం ప్రతిపాదించింది.దాన్ని అడ్డుకోవటం అంటే పౌరుల సామాజిక హక్కుల మీద దాడి చేయటమే. అందుకే అలాంటి పార్టీల మీద వత్తిడి తేవాలంటే పార్లమెంటుతో పాటు వెలుపల ప్రజా ఉద్యమాలను నడపాలని కమ్యూనిస్టు పార్టీ కోరింది. దీని మీద ఆగ్రహిస్తున్న మీడియా వెనెజులా మిలిటరీ మాజీ అధికారి హత్యను సాకుగా తీసుకొని కమ్యూనిస్టుల మీద తప్పుడు ఆరోపణలతో దాడికి దిగింది.


గతంలో ఎన్నడూ లేనంత భయం, విపరీత కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచార నేపధ్యంలో 2021 డిసెంబరు 19న జరిగిన చిలీ మలి విడత అధ్యక్ష ఎన్నికలలో వామపక్ష కూటమి అభ్యర్ధి గాబ్రియెల్‌ బోరిక్‌ ఘనవిజయం సాధించాడు.నవంబరు 21న జరిగిన ఎన్నికలలో క్రిస్టియన్‌ సోషల్‌ ఫ్రంట్‌ అభ్యర్ధి జోస్‌ ఆంటోనియో కాస్ట్‌ 27.92 శాతం ఓట్లతో ప్రధమ స్దానంలో ఉండగా బోరిక్‌ 25.82శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. డిసెంబరు 19న తుది పోటీ జరిగింది. బోరిక్‌ 55.87శాతం, కాస్ట్‌ 44.13శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. నయా ఉదారవాద తొలి ప్రయోగశాల లాటిన్‌ అమెరికా కాగా, దానిలో చిలీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే అక్కడి యువత నయా ఉదారవాదం పుట్టింది ఇక్కడే దానికి గోరీ కట్టేది ఇక్కడే అనే నినాదంతో ఉద్యమించింది, దానికి బోరిక్‌ రూపంలో విజయం లభించింది. పదేండ్ల క్రితం విద్యార్ధి ఉద్యమం ముందుకు తెచ్చిన నేతలలో బోరిక్‌ ఒకడు, 2014 నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు.
1973లో సోషలిస్టు పార్టీ నేత (మార్క్సిజం-లెనినిజానికి కట్టుబడిన) సాల్వెడార్‌ అలెండీ ప్రభుత్వంపై జరిగిన కుట్రలో భాగంగా మిలిటరీ, పోలీసు తిరుగుబాటు చేసింది. దాన్ని ప్రతిఘటించేందుకు ఆయుధం పట్టిన అలెండీని కుట్రదారులు కాల్చి చంపారు. అయితే ప్రాణాలతో మిలిటరీకి పట్టుబడటం ఇష్టం లేక ఆత్మహత్యచేసుకున్నట్లు 2011లో కోర్టు ప్రకటించింది. ఈ కథను ఎవరూ నమ్మకపోయినా తాము విశ్వసిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పటంతో ఆ కేసు విచారణ ముగించారు. అలెండీ మీద తిరుగుబాటు చేసిన జనరల్‌ పినోచెట్‌ తరువాత పగ్గాలు చేపట్టి నయాఉదారవాద విధానాలను జనం మీద రుద్దాడు.1973 నుంచి 1990వరకు నియంతగా పాలించాడు. తరువాత పౌరపాలన పునరుద్దరణ జరిగింది.

మధ్యలో రెండు సార్లు గతంలో అలెండీ నాయకత్వం వహించిన సోషలిస్టు పార్టీకి చెందిన మిచెల్లీ బాచలెట్‌ అధికారానికి వచ్చినప్పటికి మిగతావారి మాదిరే మొత్తం మీద నయా ఉదారవాద విధానాలనే కొనసాగించారు. సాధారణంగా తొలిదఫా ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ రాకున్నప్పటికీ ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీ అంతిమ పోటీలో గెలుస్తుంది. చిలీలో దానికి భిన్నంగా రెండవ స్ధానంలో వచ్చిన బోరిక్‌ ఘనవిజయం సాధించాడు. మితవాద శక్తులన్నీ ఒకవైపు, వారిని ప్రతిఘటించే పురోగామి, ఉదారవాదులందరూ మరోవైపు సమీకరణయ్యారు.ఈ క్రమంలో బోరిక్‌ను ఎన్నుకుంటే కమ్యూనిస్టు ప్రమాదం వస్తుందని, దేశం మరొక వెనెజులాగా మారిపోతుందనే ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. సామాజిక, మతపరమైన అంశాలను కూడా ముందుకు తెచ్చారు. భయం మీద ఆశ విజయం సాధించిందని, ఒక పద్దతి ప్రకారం కమ్యూనిస్టునిస్టు వ్యతిరేక విష ప్రయోగాన్ని కూడా జనం అధిగమించారని బోరిక్‌ తన విజయ సందేశంలో చెప్పాడు. పార్లమెంటు దిగువ సభ డిప్యూటీల ఛాంబర్‌లో దామాషా ప్రాతిపదికన 155 స్ధానాలకు గాను వామపక్ష కూటమి పార్టీలకు వచ్చింది 37 మాత్రమే. ఎగువ సభలోని 50 స్దానాలకు గాను వామపక్షాలకు ఐదు, స్వతంత్రులు ఇద్దరు, మిగిలిన 43మితవాద పార్టీలకే వచ్చాయి. వామపక్షాలలో ప్రధాన పార్టీగా ఉన్న కమ్యూనిస్టులు గతంలో ఉన్నఎనిమిదింటిని 12కు పెంచుకున్నారు, ఎగువ సభలో కొత్తగా రెండు స్దానాలను గెలుచుకున్నారు. నూతన రాజ్యాంగ ప్రతిపాదనపై 2022లో జరిగిన ఓటింగ్‌ తిరస్కరణకు గురైంది. దాన్ని వామపక్ష వాదులు ప్రతిపాదించినట్లు ప్రచారం చేశారు. తరువాత 2023డిసెంబరులో రెండవ రాజ్యాంగం గురించి జరిగిన ఓటింగ్‌లో మరోసారి తిరస్కరణకు గురైంది. దానిలో మితవాద ముద్ర ఉండటంతో వామపక్ష శక్తులు వ్యతిరేకించాయి. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలు, నూతన రాజ్యాంగం వంటి అంశాలలో మితవాద శక్తులు ఇప్పటి నుంచే వామపక్షాలను దెబ్బతీసేందుకు పూనుకున్నాయి. దానిలో భాగంగానే పెద్ద పార్టీగా ఉన్న కమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారం ప్రారంభించినట్లు కనిపిస్తోంది. వాటిని వామపక్షాలు ఎలా ఎదుర్కొంటాయన్నది ఆసక్తిగా మారింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అర్జెంటీనా అధ్యక్షుడిగా పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకి !

22 Wednesday Nov 2023

Posted by raomk in COUNTRIES, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Latin America, Opinion

≈ Leave a comment

Tags

#latin american left, Anti communist, Argentina presidential election 2023, Donald trump, Javier Milei, Joe Biden


ఎం కోటేశ్వరరావు


ఆదివారం నాడు జరిగిన అర్జెంటీనా అధ్యక్ష తుది ఎన్నికల్లో పచ్చి మితవాది జేవియర్‌ మిలై విజయం సాధించాడు. వామపక్షాల మద్దతు ఉన్న అధికార పెరోనిస్టు పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి, కూటమి అభ్యర్థి సెర్గియో మాసాకు 44శాతం ఓట్లు రాగా మిలై 56శాతం తెచ్చుకున్నాడు.డిసెంబరు పదవ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నాడు. మార్కెట్‌ అనుకూల మిలై వాగాడంబరానికి మితవాద శక్తులు, అసంతృప్తి చెందిన యువతరం అధికార కూటమికి వ్యతిరేకంగా ఓటు చేసినట్లు కనిపిస్తోంది. ఒక అరాచక కాపిటలిస్టునని తన గురించి మిలై స్వయంగా చెప్పుకున్నాడు. ఎన్నికల ఫలితాలు వెలుబడగానే పెట్టుబడిదారులు సంబరాలు జరుపుకున్నారు. బాండ్ల రేట్లు పెరిగాయి.నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే అధ్యక్ష ఎన్నికలలో అంతకు ముందు అధికారంలో ఉన్న మితవాద శక్తులను ఓడించి 2019లో పెరోనిస్టు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.2015 నుంచి 2019వరకు మితవాద శక్తులు అధికారంలో ఉన్నాయి. వాటి వైఫల్యంతో అంతకు ముందు అధికారంలో ఉన్న పెరోనిస్టు కూటమికి జనం తిరిగి పట్టం కట్టారు. కరోనా సమయంలో విధించిన లాక్‌డౌన్‌, మరింత దిగజారిన ఆర్ధిక వ్యవస్థ కారణంగా జనంలో ప్రభుత్వం మీద అసంతృప్తి తలెత్తింది.జనాభాలో45శాతం మంది దారిద్య్రరేఖకు దిగువ ఉన్నట్లు అంచనా. వందశాతం దాటిన ద్రవ్యోల్బణం అదుపులేదు. కరెన్సీ పెసో విలువ దిగజారింది.గడచిన పదకొండు సంవత్సరాలలో ఏడు సార్లు వృద్ది రేటు తిరోగమనంలో నమోదైంది. ఈ ఏడాది మాంద్యంలోకి జారవచ్చని ఐఎంఎఫ్‌ జోశ్యం చెప్పింది. ఈ పూర్వరంగంలో పెరోనిస్టు కూటమి ఓడింది.


కరోనా, ఇతర వైఫల్యాల కారణంగా తలెత్తిన పరిస్థితిని ఉపయోగించుకొని జేవియర్‌ మిలై 2021 పార్లమెంటు ఎన్నికల్లో కొత్త పార్టీతో రంగంలోకి దిగాడు. వాస్తవ ప్రతిపాదనలతో ముందుకు వచ్చిన అభ్యర్ధిని తాను మాత్రమేనని మిలై చెప్పాడు. అతగాడికి కుక్కలంటే పిచ్చి. వాటి భాషలో మాట్లాడతాడు. ఎన్నికలకు ముందు ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రికతో మాట్లాడుతూ ద్రవ్యోల్బణాన్ని తగ్గించటం గురించి ఆలోచిస్తున్నానని, అందుకుగాను తన దగ్గర ఐదు కుక్కలున్నాయని, అవి పది లేదా ఇరవై కూడా కావచ్చు అని చెప్పాడు. వాటిని వదిలితే తగ్గుతుందన్నాడు. మిలై దృష్టిలో కుక్కలంటే రాజ్యాన్ని పక్కన పెట్టి మొత్తం వ్యవస్థను పెట్టుబడిదారులకు అప్పగించాలని ప్రబోధించే ప్రముఖులు. ఆర్థిక సమస్యలను పరిష్కరించటానికి రాజ్యం ఒక పరిష్కారం కాదు, అదే అసలు సమస్య అని కూడా చెప్పాడు. ఐరోపా సంతతితో ఏర్పడిన అర్జెంటీనా గత శతాబ్ది తొలి రోజుల్లో సంపద్వంతంగా ఉండేదని, ప్రస్తుత దురవస్థకు ప్రభుత్వాల వైఫల్యమే కారణమనేందుకు ఉదాహరణగా ఉందన్నాడు. దేశంలోని మొత్తం రాజకీయ తరగతి అంతా దొంగలని, పన్నులు విధించాలని కోరటం హింసాత్మక చర్య అన్నాడు. ఇతగాడి నోటి దురుసుతనంతో అసంతృప్తితో ఉన్న జనం మద్దతుదారులుగా మారవచ్చు, ఓట్లు వేయవచ్చు, నిజంగా అధికారం వస్తే ఎలా పాలిస్తాడో ఏ తిప్పలు తెచ్చిపెడతాడో అన్న భయాన్ని వెల్లడించిన వారు కూడా ఉన్నారు.చివరకు అదే నిజమైంది. అర్జెంటీనాలో నాలుగు సంవత్సరాలకు ఒకసారి అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. పార్లమెంటు ఉభయ సభలకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి దిగువ సభలో సగం సీట్లకు, ఎగువ సభలో మూడోవంతు సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంటు రద్దు కాదు. ఒకసారి ఎన్నికైన వారు ఎగువ సభలో ఆరు సంవత్సరాలు, దిగువ సభలో నాలుగేండ్లు ఉంటారు.ప్రజాప్రతినిధుల దిగువ సభలో రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన సీట్లు ఖరారు చేస్తారు. అధ్యక్ష ఎన్నికలు రెండు లేదా మూడుదశల్లో జరుగుతాయి.


ప్రాధమిక ఎన్నికల్లోనే అర్జెంటీనాకు పచ్చి మితవాద శక్తుల ముప్పు ముంచుకువస్తున్నట్లు వెల్లడైంది. ఫలితాలు అనేక మందిని దిగ్భ్రాంతికి గురి చేశాయి. కొత్త రాజకీయ చర్చకు తెరతీశాయి. ఆ ఎన్నికల్లో స్వేచ్చతో ముందుకు (లిబర్టీ అడ్వాన్సెస్‌) పార్టీ నేతగా జేవియర్‌ మిలై అగ్రస్థానంలో నిలిచాడు. దేశంలోని 24 ప్రావిన్సులలో పదహారు చోట్ల ఆధిక్యత కనపరిచాడు.మిలైకు 30.04శాతం, మరో మితవాద పార్టీకి 28.28శాతం, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రజాతంత్ర, వామపక్ష కూటమికి 27.27శాతం ఓట్లు వచ్చాయి.తొలి దఫా ఓటింగ్‌ 45శాతంపైగా తెచ్చుకున్నవారు ఒకరే ఉంటే సదరు అభ్యర్ధితో పాటు ఉపాధ్యక్షపదవికి పోటీ చేసిన అభ్యర్ధి కూడా నెగ్గినట్లు ప్రకటిస్తారు. అలాగాక 40శాతం తెచ్చుకున్నప్పటికీ విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే రెండవ స్థానంలో ఉన్న అభ్యర్ధికి మొదటి స్థానంలో ఉన్నవారికి తేడా పదిశాతం కంటే ఎక్కువ ఉండాలి. ఒక వేళ ఇద్దరికి 45శాతానికి మించి ఓట్లు వచ్చినా లేక 40శాతం నిబంధన ప్రకారం ఎవరూ నెగ్గకున్నా, ఎక్కువ ఓట్లు వచ్చిన తొలి ఇద్దరి మధ్య రెండవ దఫా ఎన్నిక జరిపి విజేతను ప్రకటిస్తారు. పదహారు సంవత్సరాలకే ఓటింగ్‌ హక్కు ఇచ్చినప్పటికీ 18-70 సంవత్సరాల వయస్సులో ఉన్న వారు విధిగా ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రాధమిక ఎన్నికలలో విధిగా ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. అక్టోబరు 22న జరిగిన తొలి దఫా ఎన్నికల్లో ఐదుగురు పోటీ చేశారు. వారిలో పెరోనిస్టు మెసాకు 36.78శాతం, మిలైకి 29.99శాతం, మూడో అభ్యర్ధికి 23.81 శాతం రాగా మిగిలిన ఇద్దరికీ కలిపి 9.43శాతం వచ్చాయి. దీంతో నవంబరు19న తుది దఫా మెసా-మిలై మధ్య పోటీ జరిగింది.


ప్రాధమిక ఎన్నికల్లో మొదటి స్థానంలో ఉన్నట్లు ఫలితాలు వెల్లడి కావటంతో మిలై తన మద్దతుదారులతో మాట్లాడుతూ సంబరాలు చేసుకున్నాడు.రాజకీయ నేతలు మారకపోతే వారిని వదిలించుకోవాలని పిలుపునిచ్చాడు. ప్రస్తుత అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్‌ చైనాను అనుమతించి కొన్ని కీలకరంగాలను అప్పగించాడని ఆరోపించాడు. తాను చైనాతో సంబంధాలను తెంచివేస్తానని, కమ్యూనిస్టులతో వ్యాపారం చేయనని అన్నాడు. కమ్యూనిజం ఒక హంతక వ్యవస్థ, సోషలిజం ఆత్మకు పట్టిన జబ్బు అన్నాడు. తాను అధికారానికి వచ్చిన తరువాత దేశ రిజర్వుబాంకును రద్దు చేస్తానని, ప్రభుత్వ ఖర్చు కోత పెడతానని, పతనమౌతున్న దేశ కరెన్సీ పెసోను రద్దు చేసి కొన్ని దేశాల మాదిరి అమెరికా డాలరును చట్టబద్దమైన కరెన్సీగా ప్రకటిస్తానని చెప్పాడు. విధిగా పాఠశాలల్లో లైంగిక విద్య బోధన జరపాలన్న గత ప్రభుత్వ చట్టాన్ని రద్దు చేస్తానని అన్నాడు.అర్జెంటీనా ఎన్నికలు ఒక్క లాటిన్‌ అమెరికాకే కాదు, మొత్తం ప్రపంచానికే ఆసక్తికరంగా మారాయని చెప్పవచ్చు.


లాటిన్‌ అమెరికాను అమెరికా సామ్రాజ్యవాదం తన పెరటి తోటగా పరిగణించింది. తనకు లోబడిన వారిని గద్దె నెక్కించటం వీలుగాకపోతే మిలిటరీ నియంతలను రంగంలో తెచ్చింది. ఇదే సమయంలో ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌ విధానాలను ఆ దేశాల మీద రుద్దారు. అవి వికటించటం, అనేక దేశాల్లో నియంతలు, మితవాద పాలకులకు వ్యతిరేకంగా వామపక్ష శక్తులు పార్లమెంటరీ పోరాటంతో పాటు ఆయుధాలు కూడా పట్టి జనాన్ని సమీకరించారు. దివాలా కోరు ఆర్థిక విధానాలతో పాలకులు ప్రజల నుంచి దూరం కావటం, ప్రతిఘటన తీవ్రమైన తరుణంలో విధిలేక ఎన్నికలు జరపటం వాటిలో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అనేక మంది ఒక్కటిగా నిలవటంతో వామపక్ష శక్తులు అధికారానికి వచ్చాయి. వాటికి మద్దతు ఇచ్చిన వారందరూ సోషలిజం, కమ్యూనిజాలకు మద్దతుదార్లు కాదు. నిరంకుశ వ్యతిరేక పోరాటంలో విశాల వేదికల్లో కలసి వచ్చినవారు ఎందరో ఉన్నారు. ప్రజలకు మేలు చేయాలనే వైఖరిని బలపరిచారు.దోపిడీ వ్యవస్థ పునాదులను కూలిస్తే తప్ప జనజీవితాల్లో మౌలిక మార్పులు రావనే అంశాన్ని గుర్తించటంలో, అమలు జరపటంలో ఏకాభిప్రాయం లేదు. అందువల్లనే అధికారానికి వచ్చినచోట వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు గత పునాదులను అలాగే ఉంచి వాటి మీదనే సామాన్య జనానికి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవటంతో వరుసగా రెండు, మూడు సార్లు గెలుస్తూ వచ్చారు. అయితే వాటికి ఉన్న పరిమితులు వెల్లడి కావటంతో జనంలో తలెత్తిన అసంతృప్తి కారణంగా తిరిగి మితవాద శక్తులు తలెత్తుతున్నాయి.బ్రెజిల్లో, మరికొన్ని చోట్ల అదే జరిగింది. కొన్ని చోట్ల వామపక్షం పేరుతో గెలిచిన వారు మితవాద శక్తులతో చేతులు కలిపారు.


గతంలో మాదిరి నియంతలను రుద్దితే లాభం లేదని గుర్తించిన అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను దెబ్బతీసేందుకు మితవాద శక్తులకు మద్దతు ఇస్తున్నాయి.ఎన్నికల్లో గెలిచినప్పటికీ పెట్టుబడిదారీ, కార్పొరేట్‌ అనుకూల విధానాల కారణంగా అసంతృప్తి తలెత్తి తిరిగి జనం వామపక్షాలకు పట్టంగడుతున్నారు. బ్రెజిల్లో లూలా అదే విధంగా మరోసారి గెలిచాడు. అర్జెంటీనాలోగత ఎన్నికల్లో జరిగింది అదే.ప్రజాతంత్ర, వామపక్ష శక్తులు మౌలిక విధానాల మార్పుల జోలికి పోని కారణంగా జన జీవితాల్లో పెద్ద మార్పులు రాలేదు. అర్జెంటీనాలో ప్రస్తుతం 45శాతం జనం దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. వార్షిక ద్రవ్యోల్బణం 143 శాతానికి చేరింది. ప్రభుత్వం వద్ద నగదు నిల్వలు లేవు. దశాబ్దికాలంగా జిడిపి ఎదుగూ బొదుగూ లేకుండా ఉంది.కరెన్సీ విలువ పతనమైంది. అప్పుల మీదనే దేశం నడుస్తోంది. ఈ కారణంగానే మితవాద ఆర్థికవేత్త కూడా అయిన మిలై చేసిన సైద్దాంతికపరమైన దాడికి నూతన తరం ఆకర్షితమైనట్లు కనిపిస్తోంది. ఇప్పుడున్న వాటన్నింటినీ రద్దు చేసి మొత్తం బాధ్యత అంతటినీ మార్కెట్‌ శక్తులకు వదలి వేస్తే అవే సమస్యలను పరిష్కరిస్తాయంటూ అరచేతిలో స్వర్గం చూపుతున్నాడు. డోనాల్డ్‌ ట్రంప్‌, బ్రెజిల్‌ మితవాది బోల్సనారో బాటలో తాను దేశాన్ని నడిపి ఫలితాలను చూపుతానని నమ్మబలికాడు. ఏ ప్రభుత్వమైతే పెద్ద ఎత్తున సబ్సిడీలు, నగదు బదిలీ చేసిందో ఆ లబ్ది పొందిన పేదలు కూడా దానికి వ్యతిరేకంగా మితవాద మిలైకి ఓటువేసినట్లు స్పష్టమైంది. మితవాద మిలై విప్లవాత్మక మార్పులను నిజంగా తెస్తాడని, మరొక మార్గం లేదని జనం భ్రమలకు గురైనట్లు పరిశీలకులు భావిస్తున్నారు. నయా ఉదారవాద విధానాలకు శస్త్ర చికిత్స తప్ప పై పూతలతో దాన్ని సంస్కరించి ప్రజానుకూలంగా మార్చలేరన్నది గ్రహించాల్సి ఉంది. జనంలో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకొని గద్దె నెక్కినప్పటికీ జేవియర్‌ మిలై తాను ప్రకటించిన అరాచక పెట్టుబడిదారీ విధానాలను అమలు జరపటం అంత తేలిక కాదు. 2021లో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాల తరువాత 257 స్థానాలకు గాను పెరోనిస్టు కూటమికి 118,వర్కర్స్‌ లెఫ్ట్‌ ఫ్రంట్‌కు నాలుగు మినహా మిగిలిన సీట్లన్నింటిలో మితవాద పార్టీల కూటమికి 116, ఇతర మితవాద పార్టీలు, స్వతంత్రులు కలిపితే మెజారిటీ ఉన్నారు. అనేక దేశాల్లో అధికారానికి వచ్చిన మితవాదులు తొలుత తమ దాడిని కార్మికుల మీదనే ప్రారంభించిన నేపధ్యంలో మిలై ఆచరణ కూడా దానికి భిన్నంగా ఉంటుందని భావించలేము. అదే జరిగితే వెంటనే ప్రజా ప్రతిఘటన కూడా ప్రారంభం అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కమ్యూనిస్టుగా ఎలన్‌ మస్క్‌ కుమార్తె, కసితో భావజాలాన్ని అడ్డుకొనేందుకే ట్విటర్‌ కొనుగోలు !

09 Saturday Sep 2023

Posted by raomk in BJP, CHINA, Communalism, COUNTRIES, Current Affairs, Europe, Germany, imperialism, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ 2 Comments

Tags

Anti China Propaganda, Anti communist, BJP, China, communist, Elon Musk, Elon Musk daughter, Karl Marx, RSS


ఎం కోటేశ్వరరావు


కమ్యూనిజం భావజాల వ్యాప్తిని అరికట్టేందుకు తొలుత ఐరోపాను ఆవరించిన భూతంగా నిందించారు. కారల్‌ మార్క్స్‌ను జర్మనీ, బెల్జియంల నుంచి వెళ్లగొట్టారు. తొలి సోషలిస్టు రాజ్యం ఏర్పడిన తరువాత కమ్యూనిజం విస్తరణను అడ్డుకొనేందుకు అమెరికా ఇతర ధనిక దేశాలు ప్రచ్చన్న యుద్ద్ధం సాగించాయి. అనేక దేశాల్లో కుట్రలు చేశాయి. అలెండీ వంటి వారిని హత్య చేశాయి. మిలిటరీ నియంతలను గద్దెలపై కూర్చో పెట్టాయి. సైనిక కూటములను ఏర్పాటు చేశాయి. వియత్నాం, లావోస్‌, కంపూచియా, ఉత్తర కొరియాలపై భౌతిక దాడులకు పాల్పడి భంగపడ్డాయి. విధిలేని స్థితిలో వియత్నాం నుంచి అమెరికన్లు బతుకు జీవుడా అంటూ పారిపోయారు.కమ్యూనిజం అంతమే తమ పంతం అని ప్రకటించిన అమెరికా గడ్డమీదే ప్రపంచ ధనికుడైన ఎలన్‌ మస్క్‌ కుమార్తె కమ్యూనిస్టుగా మారింది. అక్కడే లక్షలాది మంది యువత నేడు అక్కడ అవును మేము సోషలిస్టులం, కమ్యూనిస్టులం అంటూ ముందుకు వస్తున్నారు.


తన కుమార్తె కమ్యూనిస్టుగా మారిందన్న ఉక్రోషం, కమ్యూనిస్టు భావజాల ప్రచారానికి ఒక వేదికగా ఉన్నందున నిరోధించేందుకు ఏకంగా సామాజిక మాధ్యమం ట్విటర్‌నే కొనుగోలు చేసినట్లు త్వరలో వెలువడనున్న ఎలన్‌ మస్క్‌ జీవిత చరిత్రలో వెల్లడించారు. ఎలన్‌ మస్క్‌ 2000 నుంచి 2016వరకు మూడు వివాహాలు చేసుకొని ముగ్గురికీ విడాకులు ఇచ్చాడు, తరువాత 2018 నుంచి 2021వరకు ఒకామెతో సహజీవనం చేశాడు. ఇప్పుడెలా ఊరేగుతున్నాడో తెలవదు. పది మంది పిల్లల్ని కన్నాడు. వారిలో ఒకడైన గ్జేవియర్‌ అలెగ్జాండర్క్‌ మస్క్‌ 2004లో పుట్టాడు. 2022 జూన్‌లో కాలిఫోర్నియా కోర్టుకు సమర్పించిన ఒక వినతిలో తన పేరును వివియన్‌ జెనా విల్సన్‌ అని మార్చుకొనేందుకు అంగీకరించాలని, తాను యువతిగా లింగమార్పిడి చేయించుకున్నట్లు పేర్కొన్నాడు. తన తండ్రి ఎలన్‌ మస్క్‌తో గానీ, అతని ఆస్తిపాస్తులతో గాని తనకు ఎలాంటి సంబంధం లేదని క్రటించాడు.2021లో లింగమార్పిడి జరిగింది.


తన కుమారుడు లింగ మార్పిడి చేయించున్నదాని కంటే స్కూల్లో వామపక్ష భావజాలానికి ప్రభావితుడు కావటం ఎలన్‌ మస్క్‌కు ఆగ్రహం తెప్పించింది. పచ్చి మితవాది అయిన మస్క్‌ తన కుమార్తెను కమ్యూనిస్టుగా వర్ణించాడు.కాలిఫోర్నియాలోని ఒక స్కూల్లో ఏడాదికి 50వేల డాలర్ల ఫీజు చెల్లించి చదివిస్తుండగా కమ్యూనిస్టు భావజాల వైరస్‌కు గురైందని, తన పట్ల కుమార్తె వైఖరి మారటానికి కొంత వరకు క్రాస్‌రోడ్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సు స్కూలు పురోగామి విధానాలు కూడా కారణమని ఆరోపించాడు. తన కుమార్తె సోషలిజాన్ని అధిగమించి ధనవంతులందరూ దుష్టులని భావించే పూర్తి స్థాయి కమ్యూనిస్టుగా మారిందని చెప్పాడు. తొలి రోజుల్లో ఉదారవాద భావాలతో కొడుకు లేదా కుమార్తె ఉన్నట్లు సరిపెట్టుకున్న తరువాత తెగతెంపులు చేసుకున్నాడు. అంతే కాదు, దీనంతటికీ కమ్యూనిస్టు భావజాల ప్రచారానికి వేదికగా ఉపయోగపడుతున్న ట్విటర్‌ కూడా తన బిడ్డ వంటి అనేక మందిని కమ్యూనిస్టులుగా మార్చుతున్నదని, ట్విటర్‌ వేదికగా ఆ భావజాలం రోజు రోజుకు పెరుగుతున్నదని భావించాడు.అది ప్రజాస్వామ్యం, స్వేచ్చా భావ ప్రకటనకు ముప్పుగా మారిందని, దాని విధానాలను మార్చేందుకు ఏకంగా 44 బిలియన్‌ డాలర్లతో ఆ సంస్థను కొనుగోలు చేశాడు. అంటే పురోగామి భావాలను అడ్డుకొని మితవాద ప్రచారానికి దాన్ని వేదికగా మార్చనున్నాడన్నది స్పష్టం. దానికి అనుగుణంగానే గత యాజమాన్యం రద్దు చేసిన డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి పచ్చి మితవాదుల ఖాతాలన్నింటినీ పునరుద్దరించాడు. ట్విటర్‌ పేరు ఎక్స్‌గా మార్చాడు. వాల్టర్‌ ఇసాక్‌సన్‌ రాసిన ఎలన్‌ మస్క్‌ జీవిత చరిత్రను సెప్టెంబరు 12న మార్కెట్‌కు విడుదల చేయనున్నారు. దాని గురించి ఆసక్తి కలిగించేందుకు కొన్ని భాగాలను మీడియాకు విడుదల చేశారు.


ఎలన్‌ మస్క్‌ వంటి కమ్యూనిస్టు వ్యతిరేక మితవాద భావజాలం ఉన్న వారు అమెరికాలో తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. ఒక బంతిని ఎదురుగా ఉన్న గోడవైపు ఎంత గట్టిగా విసిరితే అంతే వేగంతో తిరిగి మనవైపు వస్తుంది. భావజాలం కూడా అంతే. దేన్నయినా అణచివేయాలని చూస్తే అంతేవేగంతో విస్తరిస్తుంది. కొత్త రాతియుగం నుంచి చైనా నేత షీ జింపింగ్‌ వరకు కమ్యూనిజం చరిత్ర పేరుతో జర్నలిస్టు పాల్‌ మాసన్‌ రాస్తున్న పుస్తకం 2026లో విడుదల కానుంది. ఒక భావం, ఒక ఉద్యమం, ఒక పాలన వరకు ఎలా పరిణమించిందీ దానిలో ఉంటుందని చెబుతున్నారు. పురాతన, మధ్యయుగాలలో సంభవించిన తిరుగుబాట్ల నుంచి కమ్యూనిస్టులు ఈ భావ చరిత్రను గుర్తించారు. పందొమ్మిదవ శతాబ్ది పెట్టుబడిదారీ వ్యతిరేక ఉద్యమాల పెరుగుదలతోనే ఈ కధ ముగియలేదు అన్నాడు పాల్‌ మాసన్‌. ” పశ్చిమ దేశాల ప్రజాస్వామ్యాలు గిడసబారాయి, తమ మీద తమకే విశ్వాసం లేకుండా ఉన్నాయి. వాతావరణం గురించి పెరుగుతున్న ఆందోళన విప్లవాత్మక ఆర్థిక సమాధానాలను డిమాండ్‌ చేస్తున్నది. ప్రపంచ పేద దేశాల్లోని కోట్లాది మంది జనం దృష్టిలో చైనా ముందుకు తెచ్చిన అధికారతత్వ(ఇది రచయిత పదజాలం కాదు), రాజ్య నేతృత్వంలోని అభివృద్ధి ప్రత్నామ్నాయ నమూనాగా చూస్తున్నారు. ఇరవై సంవత్సరాల క్రితం కమ్యూనిజం అంతాన్ని చూశామని అనుకున్నాం.. ఈ రోజు ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీయే.ప్రపంచంలో అత్యంత విజయవంతమైన ఆర్థిక వ్యవస్థగా ఉంది. కావున ప్రచ్చన్న యుద్ధంలో భావజాల విజేతలు సెలవు తీసుకుంటూ రాసిన ఉద్గ్రంధాలన్నిటినీ భిన్నమైన చరిత్రగా చూడాల్సిన అవసరం ఉన్నదని భావిస్తున్నాను. ఇప్పటికీ అనేక మంది ఆర్థిక పురోగతి సాధనకు స్వేచ్చకోసం ఎందుకు సిద్దం అవుతున్నారో అర్ధం చేసుకోవటానికి తోడ్పడుతుంది.” అని పాల్‌ మాసన్‌ చెప్పాడు.


అమెరికా స్కూళ్లలో విద్యార్ధులు కమ్యూనిస్టులుగా మారుతున్నారని గుండెలు బాదుకుంటున్నది ఒక్క ఎలన్‌ మస్క్‌ మాత్రమే కాదు. అనేక మంది మితవాద రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు కూడా కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకతతో ఊగిపోతున్నారు.అమెరికా స్కూళ్లు, విశ్వవిద్యాలయాలు చైనా సంస్థలతో పరిశోధనా ప్రాజక్టులలో భాగస్వాములు కావటాన్ని నిషేధించాలని సెనెటర్‌ జేమ్స్‌ లాంక్‌ఫోర్డ్‌ డిమాండ్‌ చేశాడు. అంతర్జాతీయంగానే కాదు, అమెరికా గడ్డ మీద కూడా దేశాన్ని చైనా సవాలు చేస్తున్నదని, విద్యా సంస్థలలో పాతుకుపోతున్నదని ఒక ప్రకటనలో తాజాగా ఆరోపించాడు. అమెరికా పరిశోధనలను తస్కరిస్తున్నదని, రాజకీయంగా విద్యార్థులు, బోధకులు, వారి కుటుంబాల మీద ప్రభావం చూపుతున్నదని చెప్పుకున్నాడు. అమెరికాలో తన ప్రతిష్టను పెంచేందుకు అనేక పధకాలను రూపొందించిందని, వాటి ద్వారా గూఢచర్యం జరుపుతున్నదని ఆరోపించాడు. ఆగస్టు 27న చైనాతో పరిశోధన ఒప్పందం ముగిసినప్పటికీ జో బైడెన్‌ సర్కార్‌ మరో ఆరునెలలు పొడిగించిందని వాపోయాడు.
కమ్యూనిస్టు వ్యతిరేక ఉన్మాదం అమెరికా పక్కనే ఉన్న మెక్సికోకు కూడా పాకింది. పాఠ్యపుస్తకాలకు కమ్యూనిస్టు వైరస్‌ సోకిందంటూ కొన్ని చోట్ల క్రైస్తవ మత బృందాలు తలిదండ్రుల పేరుతో కొందరిని సమీకరించి పుస్తకాలను తగులబెట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ పుస్తకాల్లో లైంగిక విజ్ఞానం, లింగసమానత్వం వంటి అంశాలు ఉన్నాయన్నది వారి ఆరోపణ. వాటి పంపిణీ నిలిపివేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఆ పుస్తకాల్లో మార్క్సిస్టు-కమ్యూనిస్టు సిద్దాంతాలను చేర్చారని ఆరోపించారు. ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టిపారవేసింది. పాఠ్య అంశాలను టీచర్లు, నిపుణులు రూపొందించినట్లు పేర్కొన్నది.


అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర శాసనసభలో రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధి మరియ ఎలివిరా సాలాజార్‌ ఒక బిల్లును ప్రవేశపెట్టారు.దానిలో కమ్యూనిజం, నిరంకుశత్వాలను ఒకే గాటన కడుతూ వాటివలన సంభవించే నష్టాలను విద్యార్ధులకుచెప్పాలని పేర్కొన్నారు. అమెరికా యువత కమ్యూనిస్టుల పాలనలో జరిగిన నేరాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.కమ్యూనిజం బాధితుల ఫౌండేషన్‌కు పాఠాలను రూపొందించే బాధ్యత అప్పగించాలని ప్రతిపాదించారు. గతంలో కూడా సాలాజార్‌ ఇదే బిల్లును ప్రవేశపెట్టగా దాన్ని చర్చించక ముందే మురిగిపోయింది. ఈ బిల్లును ప్రతిపాదించినపుడు అధికారంలో డెమోక్రాట్లు ఉన్నారు. ఇప్పుడు రిపబ్లికన్లు ఉన్నందున తిరిగి ప్రవేశపెట్టారు.క్యూబా, కొరియా, వియత్నాం తదితర దేశాల నుంచి పారిపోయి వచ్చిన కమ్యూనిస్టువ్యతిరేకులు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు.


కమ్యూనిస్టు వ్యతిరేక వైరస్‌ ఒక్క అమెరికా, ఐరోపాల్లోనే కాదు మనదేశంలో కూడా ఉంది. ఇటీవల మహారాష్ట్రలోని నాగపూర్‌ విశ్వవిద్యాలయం ఎంఎ చరిత్ర విద్యార్ధుల సిలబస్‌లో అధ్యయనం చేయాల్సిన అంశాల్లో బిజెపి, రామజన్మభూమిని చేర్చింది. కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించింది. నూతన విద్యా విధానంలో భాగంగా సిలబస్‌లో మార్పులు చేర్పులు చేసినట్లు అధికారులు చెప్పారు. ఇదే విశ్వవిద్యాలయం గతంలో బిఏ విద్యార్ధులకు ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి పాఠాన్ని సిలబస్‌లో చేర్చింది. కమ్యూనిస్టు ఉద్యమం, పార్టీల గురించి నేర్చుకోవాలి, తెలుసుకోవాలనే ఆసక్తి కలగాలేగానీ పాఠ్యపుస్తకాలు, ట్విటర్‌, ఫేస్‌బుక్‌లతో పనేముంది. అవేవీ లేనపుడు ప్రపంచమంతా వ్యాప్తి చెందలేదా ? కమ్యూనిస్టు సిద్దాంతాలకు సంబంధించిన పుస్తకాలను బ్రిటీష్‌వారు, ఇతర సామ్రాజ్యవాదులు,అనేక దేశాల్లో ప్రభుత్వాలు నిషేధించినపుడు జనం వాటిని సంపాదించుకోలేదా అధ్యయనం చేయలేదా ? ఈ చరిత్ర తెలిసి కూడా ఇలాంటి పిచ్చిపనులు చేస్తున్నారు. చరిత్రలో యంత్ర విధ్వంసకుల గురించి చదివాము. ఐరోపాలో చేనేత రంగంలో మరమగ్గాలు వచ్చినపుడు తమ వృత్తిని అవి దెబ్బతీస్తున్నాయని ఆగ్రహించిన కార్మికులు వాటిని ధ్వంసం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని భావించి కొన్ని చోట్ల ఆపని చేశారు. సమస్య యంత్రాలది కాదు, వాటిని ధ్వంసం చేస్తే యాంత్రీకరణ ఆగదు. అదే విధంగా భూస్వాములను అంతం చేస్తే భూస్వామిక వ్యవస్థ రద్దవుతుందని నమ్మి ఆ పని చేసిన వారి సంగతి తెలిసిందే. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్నది ఎంత వాస్తవమో నిషేధాలద్వారా ఒక భావజాల వ్యాప్తిని అడ్డుకోవటం కూడా సాధ్యం కాదన్నది కూడా అంతే నిజం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెట్టుబడిదారీ విధానాన్నే అస్త్రంగా మార్చి అమెరికాపై చైనా దాడిని ఎక్కుపెట్టిందా ?

10 Thursday Aug 2023

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

#Anti China, Anti communist, CAPITALISM, capitalism or socialism, China, Joe Biden



ఎం కోటేశ్వరరావు


పెట్టుబడిదారీ విధానాన్నే అస్త్రంగా మార్చి అమెరికాను దెబ్బతీసేందుకు చైనా ఎలా చూస్తున్నదో చూడండి, మన పెట్టుబడులనే మన నాశనానికి వాడుతున్నది అంటూ అమెరికాలో విశ్లేషకులు కొందరు అక్కడి పాలకవర్గాన్ని హెచ్చరించారు. ఇది ఒక్కరిద్దరి అభిప్రాయం అనుకుంటే పొరపాటు, అమెరికాలో పెట్టుబడిదారీ విధాన మీద తలెత్తిన ఆగ్రహాన్ని పక్కదారి పట్టించేందుకు అక్కడి పాలకవర్గ మేథావులు ముందుకు తెచ్చిన సరికొత్త ప్రచారదాడిలో అదొక అస్త్రం.అదే విధంగా అమెరికా స్కూళ్లలో చైనా ప్రవేశించి కమ్యూనిస్టు పాఠాలు చెబుతున్నదని ఆధారంలేని ఆరోపణలతో ఒక నివేదికను విడుదల చేశారు. ఈ రెండూ అక్కడి పాలకవర్గంలో ఉన్న చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకత, దాన్ని జనం మెదళ్లలోకి ఎక్కించే ప్రయత్నం కనిపిస్తున్నది.


విశ్లేషకుల కథన సారం ఇలా ఉంది. ” ప్రపంచ పెట్టుబడిదారీ విధానానికి కమ్యూనిస్టు సిద్దాంత మార్గదర్శకత్వంలో పని చేసే చైనా నుంచి ముప్పు తీవ్రం అవుతున్నది. అందువలన దానితో ఆర్థిక లావాదేవీలను పున: విశ్లేషణ చేసుకోవాల్సిన అత్యవసరం ఎన్నటి కంటే మరింత పెరిగింది. అమెరికా పెట్టుబడులతో అపార సంపదలను చైనా పోగేసుకుంది. మన స్వంత పెట్టుబడిదారీ వ్యవస్థను మన వ్యతిరేక ఆయుధంగా మార్చింది. పెన్షన్‌ నిధులు, ఇతర మార్గాల ద్వారా దాదాపు పది కోట్ల మంది అమెరికన్లు తమకు తెలియకుండానే తమను దెబ్బతీసే ఆర్థిక ప్రత్యర్ధి చైనాలో పెట్టుబడులు పెట్టారు.ప్రపంచాధిపత్యం కోసం చూస్తున్న దాని మిలిటరీ బలపడేందుకు అవకాశం కల్పించారు. ఆర్థిక సరళీకరణను ప్రారంభించిన 1978 నుంచి చైనా ఒక పద్దతి ప్రకారం పశ్చిమ దేశాల పెట్టుబడి మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంది. చైనా కమ్యూనిస్టు పార్టీపై అమెరికా పార్లమెంటు ఏర్పాటు చేసిన సెలెక్ట్‌ కమిటీ ముందు సాక్ష్యమిచ్చిన పెట్టుబడి మార్కెట్ల భద్రతా కమిషనర్‌ రోజర్‌ రాబిన్సన్‌ మాట్లాడుతూ పరాకుగా ఉన్న అమెరికా చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలో ఉన్న ఐదు వేల కంపెనీల్లో లక్షల కోట్ల డాలర్లును పెట్టుబడులుగా పెట్టేందుకు సాధారణ అమెరికన్లను అనుమతించింది. ప్రపంచమంతటి నుంచి చైనా వచ్చే పెట్టుబడుల్లో అరవైశాతం డాలర్లు అమెరికా వనరుల నుంచే ఉన్నాయి గనుక అవి నిలిచిపోతే అక్కడి ఆర్థికరంగం పూర్తిగా దెబ్బతిని చైనా ప్రభుత్వానికి ముప్పు ఏర్పడుతుంది.


పెట్టుబడులు పెట్టినందుకు దోహదం చేసిన బ్లాక్‌రాక్‌ వంటి అగ్రశ్రేణి ఆస్తుల నిర్వహణ సంస్థలు ఇప్పుడు సాకులు చెబుతున్నాయి.అమెరికా పర్యావరణ, సామాజిక, పాలన ప్రమాణాలను పక్కన పెట్టి పెట్టుబడులు పెట్టాయి. ఇలాంటి కంపెనీలు వాటిని గట్టిగా పాటించి ఉంటే చైనా కంపెనీలకు పెట్టుబడులు వెళ్లేవి కాదు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ పెట్టనన్ని పెట్టుబడులను బ్లాక్‌రాక్‌ కంపెనీ సిఇఓ లారీ ఫింక్‌ ప్రవహింపచేశాడు. పెట్టుబడి సంస్థలు చైనాలో పెట్టుబడులు పెడితే సంభవించే ఆపదల గురించి పట్టించుకోకపోగా పైకి కనిపించినంత చెడుగా చైనా సంస్థలు లేవని యుబిఎస్‌ గ్లోబల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ చెప్పింది. నిర్భంద శిబిరాలు, బలవంతంగా కార్మికులను తరలించే,మారణకాండ, చైనా మిలిటరీకి ఆధునిక ఆయుధాలను సరఫరా చేసేందుకు దోహదం చేసేవిగా చైనా కార్పొరేట్‌ కంపెనీలు ఉన్నాయి.ప్రపంచ ప్రజాస్వామిక ఆర్థిక వ్యవస్థలున్న దేశాలన్నీ చైనా సంస్థలతో చేతులు కలిపితే వచ్చే ముప్పును గ్రహిస్తున్నాయి. చైనా మీద ఆధారపడితే తలెత్తే ముప్పును తొలగించుకొనేందుకు, నూతన సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు జి7 దేశాల కూటమి పూనుకుంది. ఇది చాలదు, అమెరికా స్టాక్‌ ఎక్సేంజ్‌లలో ఉన్న చైనా కంపెనీలను జాబితా నుంచి తొలగించాలి, రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలి.చైనా కంపెనీలకు రుణాలు ఇచ్చే సంస్థలను నిషేధించాలి.డాలర్ల రూపంలో ఇస్తున్న చైనా ప్రభుత్వ బాండ్ల మీద నిషేధం విధించాలి. గతంలో సోవియట్‌ ముప్పును వమ్ము చేసేందుకు అనుసరించిన ఆర్థిక పద్దతులను ఇప్పుడు చైనా మీద అనుసరించాలి. మనం దీర్ఘకాలంగా ప్రేక్షకుల మాదిరి ఉన్నాం, మన పెట్టుబడిదారీ వ్యవస్థను నియంత్రించేందుకు ఇది సరైన తరుణం. ”


అమెరికా గడ్డ మీద, వెలుపలా అమెరికా మీద చైనా నిరంతర నిఘాను ఉపేక్షించరాదని ఆగస్టు మొదటి వారంలో జరిగిన పార్లమెంటు సెలెక్ట్‌ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ మైక్‌ గాలఘర్‌ డిమాండ్‌ చేశాడు. ఇప్పుడే మేలుకున్నామని కూడా అన్నాడు. దానిలో భాగంగా ప్రపంచమంతటా రహస్య పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసిందని ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.చైనాలో ప్రైవేటు కంపెనీలంటూ లేవు, ప్రతి ఒక్కరూ, ప్రతిదీ, ప్రతి సంస్థ షీ జింపింగ్‌ కోరుకున్నదాని ప్రకారమే ఉంటుందని గాలఘర్‌ ఆరోపించాడు.చైనాలో పెట్టుబడులపై పరిమితులను మరింతగా విస్తరించాలని జో బైడెన్‌న్ను గాలఘర్‌ కోరాడు. ఉత్తరువుల ద్వారా వాటిని వెంటనే అమల్లోకి తేవాలంటూ ఒక లేఖను కూడా రాశాడు. ప్రభుత్వ పెట్టుబడులకే పరిమితం గాకుండా ప్రైవేటు పెట్టుబడుల మీద ఆంక్షలు విధించాలని కోరాడు. చైనా మిలిటరీ కంపెనీలకు మన పెట్టుబడులు తరలటం అంటే మన నాశనానికి మనమే సహకరించినట్లు అవుతుందన్నాడు. చైనా బాండ్లు, కంపెనీల వాటాల్లో 1.1లక్షల కోట్ల డాలర్లు, ప్రైవేటు పెట్టుబడిదారులు 200బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొన్నారు. దీనిలో ఎక్కువ భాగం చైనా మిలిటరీతో సంబంధాలున్న కంపెనీలలో ఉందని ఆరోపించాడు. తైవాన్‌ విలీనం షీ జింపింగ్‌ జీవిత లక్ష్యమని అందుకు గాను సన్నాహాలకు గాను అవసరమైన సమాచారం మొత్తాన్ని సేకరిస్తున్నారని అన్నాడు. దాన్ని ఎదుర్కొనేందుకు ఇండో ఫసిఫిక్‌ ప్రాంతానికి తరలించేందుకు అవసరమైన మిలిటరీ, పరికరాలను సమీకరించే మన సామర్ధ్యాన్ని దెబ్బతీసేందుకు చైనా చూస్తున్నదని, చైనాతో ఘర్షణకు దిగాల్సి వస్తే మనం భూమ్యాకాశాలను కదిలించాల్సి ఉంటుందని,ఎంతో వినాశకరంగా ఉంటుందని అన్నాడు.అమెరికా నిషేధిత జాబితాలో ఉంచిన చైనా కంపెనీల్లో పెట్టుబడులు ఎందుకు పెట్టారంటూ బ్లాక్‌రాక్‌, ఎంఎస్‌సిఐ కంపెనీలకు సెలెక్ట్‌ కమిటీ అడిగిన సంజాయిషీకి తాము చట్ట ప్రకారమే తమ వాణిజ్య పద్దతుల్లో భాగంగానే పెట్టుబడులు పెట్టినట్లు ఆ కంపెనీలు చెప్పాయి.


ఇలా సాగిన విశ్లేషణలు, పార్లమెంటరీ కమిటీ చైనా మీద చేసిన విచారణ అంతా అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు, రాజకీయంగా ప్రపంచంలో తింటున్న ఎదురుదెబ్బలకు కారణం చైనా అని తమ జనాన్ని నమ్మించేందుకు, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ముందుకు తెచ్చిన కొత్త ప్రచార ఎత్తుగడ. గతంలో సోవియట్‌ యూనియన్‌ ఉన్నపుడు దానితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు. కమ్యూనిజం విస్తరణను అడ్డుకొనే పేరుతో ప్రచ్చన్న పోరు పేరుతో సాగించిన ప్రత్యక్ష ప్రచార దాడిలో భాగంగా సోషలిజం, కమ్యూనిజం వ్యతిరేకతను రెచ్చగొట్టారు. ఆ పోరులో విజయం సాధించినట్లు మూడు దశాబ్దాల క్రితం స్వయంగా ప్రకటించుకున్నారు. మరోవైపు చైనాలో పెట్టుబడులు పెట్టటంతో పాటు అక్కడి నుంచి భారీ ఎత్తున సరకులు దిగుమతి చేసుకున్నది. దాంతో అనేక మంది చైనా తమ ఉపాధిని హరించిందనే ప్రచారాన్ని అమెరికాలో పెద్ద ఎత్తున ప్రారంభించారు. అది అనేక మంది యువతలో సైద్ధాంతిక మధనాన్ని పెంచింది. సోషలిజమే మెరుగైనది, పెట్టుబడిదారీ విధానం విఫలమైంది అనే భావనలు పెరుగుతున్నాయి. అందువలన పాతబడిన కమ్యూనిస్టు వ్యతిరేక అస్త్రాన్ని ప్రధానంగా ప్రయోగిస్తే దశాబ్దాల తరబడి ఆ కమ్యూనిస్టు చైనాలో ఎందుకు పెట్టుబడులు పెట్టారు, ప్రతి వస్తువును అక్కడి నుంచి ఎందుకు దిగుమతులు చేసుకున్నారు, ఇప్పటికీ ఎందుకు కొనసాగిస్తున్నారు, చైనాతో తెగతెంపులు చేసుకోవటం లేదని ఎందుకు ప్రకటిస్తున్నారు అన్న ప్రశ్నలకు అమెరికా విధాన నిర్ణతల దగ్గర సమాధానం లేదు. అందుకే మనలను దెబ్బతీసేందుకు మన పెట్టుబడిదారీ వ్యవస్థనే చైనా అస్త్రంగా మార్చుకున్నదనే తర్కానికి నిలవని ప్రచారానికి పూనుకున్నారు. ఒకటి వాస్తవం, ఏ విధంగా చూసినా నేటి చైనా నాటి సోవియట్‌ కాదు.ఆర్థికంగా త్వరలో అమెరికాను అధిగమించనుంది.ప్రపంచీకరణ భావన, స్వేచ్చామార్కెట్‌ను ముందుకు తెచ్చింది అమెరికా తప్ప చైనా కాదు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని చైనా లబ్ది పొందిన మాట వాస్తవం. దివాలా కోరు విధానాలతో అమెరికా పెట్టుబడిదారీ విధానం విఫల బాటలో ఉంది.


అమెరికా స్కూళ్లలో పెద్ద ఎత్తున ప్రవేశిస్తున్న చైనా వాటిని కమ్యూనిస్టు ప్రచారానికి అడ్డాలుగా మారుస్తున్నదని విద్యా పరిరక్షక తలిదండ్రుల కమిటీ(పిడిఇ) పేరుతో ఉన్న సంస్థ తాజాగా ఒక నివేదికలో ఆరోపించింది. అమెరికాలో స్కూళ్లు పన్నెండవ తరగతి(మన దగ్గర ఇంటర్‌ మీడియెట్‌) వరకు బోధిస్తాయి. తమ దేశ తత్వవేత్త కన్ఫ్యూసియస్‌ పేరుతో వందకు పైగా కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో తరగతులను నిర్వహించేందుకు అమెరికా ప్రభుత్వ అనుమతుల మేరకే చైనా ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నది. నిజానికి అక్కడి సంస్థల సంఖ్యతో పోలిస్తే అసలు లెక్కలోకి రావు. ఈ పేరుతో అమెరికా సాంకేతిక పరిజ్ఞానాన్ని తస్కరించేందుకు, తమకు ఏజంట్లుగా పనిచేసే వారిని ఎంచుకొనే కేంద్రాలుగా మార్చుతున్నదంటూ ఆరోపిస్తూ ఇటీవల అమెరికా ఎఫ్‌బిఐ ఒక నివేదికను వెల్లడించింది. చైనా జాతీయ ఇంటిలిజెన్స్‌ చట్టంలో చైనా పౌరులు ఎక్కడ నివశిస్తున్నప్పటికీ తమ మాతృభూమి కోసం కళ్లు, చెవులుగా పని చేయాలని చెప్పిందని, అందువలన అమెరికాతో సహా విదేశాల్లో ఉన్న చైనా జాతీయులందరూ గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ గతేడాది సిఐఏ మాజీ అధికారి శామ్‌ ఫడీస్‌ ఒక తర్కాన్ని ముందుకు తెచ్చాడు. ఇదంతా తప్పుడు ప్రచారంలో భాగమే అన్నది స్పష్టం. అదే సూత్రం ప్రతి దేశ పౌరులకు వర్తిస్తుంది. అందరినీ అలాగే చూసేట్లైతే ఎవరూ వేరే దేశానికి వెళ్లే అవకాశం ఉండదు.


ఇతర దేశాలతో ఉన్న సంబంధాలను మెరుగుపరచుకొనేందుకు గాను ప్రతి దేశం అనేక చర్యలను తీసుకోవటం తెలిసిందే. అమెరికా స్కూళ్లలోని టీచర్లు, విద్యార్ధులతో చైనా వారు సంబంధాలు పెట్టుకుంటూ చైనా భాష, సాంస్కృతిక సంబంధాలు, విద్యార్ధి బృందాల మార్పిడి పేరుతో గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు పిడిఇ ” లిటిల్‌ రెడ్‌ క్లాస్‌ రూమ్స్‌” పేరుతో విడుదల చేసిన ఒక నివేదికలో ఆరోపించింది. ఇలాంటి స్కూళ్లు, కాలేజీలన్నీ అమెరికాలోని 20 మిలిటరీ కేంద్రాల చుట్టూ ఉన్నట్లు మరొక కథనాన్ని దానిలో పేర్కొన్నారు. నిజానికి ఇవేవీ అమెరికా ప్రభుత్వానికి తెలియకుండా జరిగే అవకాశం లేదు.ప్రపంచంలో ఏ మూలన చీమ చిటుక్కుమన్నా పసిగట్టే శక్తి ఉన్న అమెరికా సిఐఏ, ఎఫ్‌బిఐ, ఎన్‌ఐఏ వంటి సంస్థలకు వేళ్ల మీద లెక్కించదగిన ఆ సంస్థల్లోని కేంద్రాలను మూసి వేయించటం పెద్ద కష్టమేమీ కాదు. ఒక వేళ నిజమే అనుకుంటే ఆ పని చేయకుండా వాటిని అనుమతిస్తూనే మరో వైపు అనుమానాలు రేకెత్తించే ప్రచారానికి అవి తెరలేపుతున్నాయి. అలాంటి కేంద్రాలన్నీ గూఢచర్యానికి పాల్పడుతుంటే, అది వాస్తవమనుకుంటే అమెరికా సర్కార్‌ లేదా అక్కడి సంస్థలు మన దేశంతో సహా అనేక చోట్ల విద్యా సంస్థలతో సంబంధాలు, అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి, వారాలు , నెలల తరబడి మన వారిని అమెరికా ఆహ్వానిస్తున్నాయి. వాటన్నింటినీ సిఐఏ గూఢచార కేంద్రాలుగా పరిగణించాలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా కమ్యూనిస్టులు బైబిల్‌ను తిరగరాస్తున్నారా ? నిజానిజాలేమిటి ?

29 Saturday Jul 2023

Posted by raomk in CHINA, Communalism, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RELIGION, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti communist, chinese communist party, Gospel of John, Jesus, Pope Francis, Rewriting the Bible, RSS, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


మతాన్ని చైనీకరణ కావించేందుకు గాను అక్కడి కమ్యూనిస్టు పార్టీ (సిసిపి) బైబిల్‌ను తిరగరాస్తున్నదని ప్రచారం చేస్తున్నవారిని అమెరికా ప్రోత్సహిస్తున్నది. దానికి పార్లమెంటరీ కమిటీని వేదికగా చేసుకుంది. అమెరికా పార్లమెంట్‌లో చైనా కమ్యూనిస్టు పార్టీ తీరుతెన్నులపై ఏర్పాటు చేసిన సెలెక్ట్‌ కమిటీ సమావేశంలో రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ మైక్‌ గాలఘెర్‌ చైనా మీద ఆరోపించాడు. జనాలు దేవుడి కంటే పార్టీకి విశ్వాస పాత్రులుగా ఉండేట్లుగా మార్చాలని, దానికి గాను అన్ని మతాలను చైనీకరణ గావించాలని, మతం, సోషలిజం ఒకదానికి ఒకటి తోడుగా ఉనికిలో ఉండేట్లు చూడాలని చైనా కమ్యూనిస్టు పార్టీ 19వ మహాసభ జరిగినపుడు 2017లో అధినేత షీ జింపింగ్‌ కోరినట్లు ,దానిలో భాగంగానే బైబిల్‌ను తిరగరాస్తున్నారని కూడా మైక్‌ ఆరోపించాడు. ఈ ప్రచారాన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఒక పథకం ప్రకారం సాగిస్తున్నారు. పది సంవత్సరాల్లో బైబిల్‌ను తిరగరాసే పని పెట్టుకున్నారన్నది వాటిలో ఒకటి. దీన్ని ఒక్క క్రైస్తవ మతానికే పరిమితం చేయలేదని బౌద్దం, ఇస్లాంకు కూడా వర్తింప చేస్తున్నారని మైక్‌ ఆరోపించాడు.మతం మీద పూర్తి అధికారాన్ని సాధించేందుకు సిసిపి చూస్తున్నదనే ప్రచారాన్ని అనేక క్రైస్తవ మత సంస్థలు, మీడియాలో కూడా గత ఆరు సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. మతం, సోషలిజం సహజీవనం అన్నది వక్రీకరణ తప్ప వాస్తవం కాదు. మత స్వేచ్చను అనుమతించటం అంటే ప్రోత్సహించటం, ఉనికిని కాపాడటం కాదు. తరతరాలుగా వేళ్లూనుకున్న భావనలను క్రమంగా పోగొట్టాలి తప్ప ప్రార్ధనా మందిరాలను కూల్చివేసినా, నిషేధాలతో అణచివేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయి.


చిత్రం ఏమిటంటే మతాన్ని అణచివేస్తున్నట్లు ఒక వైపు ఆరోపణలు చేస్తున్న తరుణంలోనే 2018లో చైనా ప్రభుత్వంతో పోప్‌ ఒక ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం ప్రభుత్వం ఎంపిక చేసిన వారిని చైనాలో కాథలిక్‌ మత అధిపతులుగా పోప్‌ ఆమోదించాల్సి ఉంటుంది. ఇదంతా టిబెట్‌లో తదుపరి దలైలామాను కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసేందుకు గాను ముందుగా పోప్‌తో ఒప్పందం చేసుకున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక బైబిల్‌ను తిరగరాస్తున్నారని చెప్పేందుకు మైక్‌ గాలఘెర్‌ రెండు ఆరోపణలు చేశాడు. న్యూటెస్ట్‌మెంట్‌ బైబిల్‌లో జాన్‌ సువార్త ప్రకారం వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఒక మహిళను రాళ్లతో కొట్టటాన్ని చూసిన ఏసు క్రీస్తు వారి వద్దకు వెళ్లి మీలో పాపం చేయనివారెవరైనా ఉంటే ముందుగా వారు వచ్చి కొట్టమని చెప్పారన్న కథ అందరికీ తెలిసిందే.దాన్ని చైనా వారు మార్చి ఏసు క్రీస్తే స్వయంగా రాళ్లు వేసినట్లు రాశారని మైక్‌ ఆరోపించాడు. ఇది తప్పుడు ప్రచారం తప్ప మరొకటి కాదు. మరికొన్ని దీన్నే మరోవిధంగా ప్రచారం చేస్తున్నారు. ఏసుక్రీస్తు జోక్యం చేసుకున్న తరువాత రాళ్లు వేసిన వారు వెళ్లిపోయారని, వారు నిన్ను చంపారా అని సదరు మహిళను అడిగితే లేదని ఆమె చెప్పిన తరువాత వారు గాక పోతే నేనే చంపేస్తా, ఇలాంటి పాపం మరొకసారి చేేయ వద్దు, వెళ్లిపో అన్నట్లుగా బైబిల్‌ను తిరగరాసినట్లు ప్రచారం చేస్తున్నారు.


మరొక కథనం ప్రకారం ఫార్సీ(నాటి చట్టాల గురించి తెలిసినవారు) యూదులు ఒక మహిళను తీసుకు వచ్చి ఏసుక్రీస్తు ముందు నిలిపారు. బోధకుడా ఈ మహిళ వ్యభిచారం చేస్తూ పట్టుబడినది. చట్టం , మోజెస్‌ మాకు చెప్పినదాని ప్రకారం అలాంటి మహిళను రాళ్లతో కొట్టాలి. ఇప్పుడు మీరేమి చెబుతారు అని ప్రశ్నించారట. ఇదంతా ఏసుక్రీస్తును ఉచ్చులో ఇరికించేందుకు యూదునేతలు చేశారట. అప్పుడు ఏసు క్రీస్తు నేల మీద వేలితో ఏదో రాస్తూ (అదేమిటో ఇప్పటికీ తెలియదట) మీలో పాపం చేయని వారెవరైనా ఉంటే ముందుగా వారు రాళ్లతో కొట్టండి అన్నారట. దాంతో వణికిపోయి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారట. అప్పుడు ఏసు మహిళా వారెక్కడ, ఎవరూ నీ మీద దాడి చేయలేదు కదా అంటే అవునయ్యా అందట. నేను కూడా నిన్ను కొట్టను వెళ్లిపో నీ జీవితంలో ఇంక పాపం చేయవద్దు అన్నాడట. అలా అందరూ వెళ్లిన తరువాత ఏసు ఆమెను స్వయంగా రాయితో కొట్టి నేను కూడా పాపినే అని చెప్పినట్లు చైనా కమ్యూనిస్టులు తిరగరాస్తున్న బైబిల్‌లో ఉందని, దాన్ని తరగతి పుస్తకాల్లో పెట్టారని కొన్ని క్రైస్తవ సంస్థలు ప్రచారం చేస్తున్నాయి.ఇది ఏసు దైవత్వాన్ని కించపరచటమే అని ఆరోపిస్తున్నారు.


ప్రస్తుతం చైనా, మన దేశం,ఇంకా అనేక దేశాల్లో ఉన్న చట్టం ప్రకారం అక్రమ సంబంధం నేరం కాదు. అందువలన దానికి పాల్పడిన వారిని రాళ్లతో కొట్టాలని, ఏసుక్రీస్తే ఆపని చేశారు గనుక మీరూ చేయవచ్చని చైనాలో ఉన్న క్రైస్తవులకు గానీ మరొకరికి గానీ చెప్పాల్సిన అవసరం కమ్యూనిస్టులకు లేదు, అందుకుగాను బైబిల్‌ను తిరగరాయాల్సిన అగత్యమూ లేదు. దానికీ సోషలిస్టు సమాజ నిర్మాణానికి సంబంధం లేదు. అలాగని అక్రమ సంబంధాలను ప్రోత్సహిస్తున్నదీ లేదు. ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ కారణంతో విడాకులు తీసుకోవచ్చని చైనా చట్టాలలో ఉంది. వివాహం చేసుకున్నప్పటికీ స్త్రీ సదరు పురుషుడి ఆస్తికాదు. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 497 ప్రకారం భర్త అనుమతి లేకుండా భార్య పరపురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంటే సదరు పరపురుషుడు అవివాహితుడైనప్పటికీ అభియోగం రుజువైతే ఐదు సంవత్సరాల వరకు శిక్ష విధించవచ్చు. వివాహిత మహిళకు ఎలాంటి శిక్ష ఉండదు. ఈ సెక్షన్‌ రాజ్యాంగ విరుద్దమని 2018 సెప్టెంబరు 27న సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. మరొకరి భాగస్వామి అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే నగదు జరిమానా విధించవచ్చని సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ చెప్పింది.


చైనాలోని హేనాన్‌ రాష్ట్రంలోని ప్రొటెస్టెంట్‌ చర్చిలలో టెన్‌కమాండ్‌మెంట్స్‌ బదులు చైనా అధినేత షీ జింపింగ్‌ చెప్పిన మాటలను బోధించాలని కమ్యూనిస్టు పార్టీ నేతలు బలవంతం చేస్తున్నారని, ఈ మేరకు మొదటి కమాండ్‌మెంట్‌ను మార్చి రాశారని కూడా అమెరికన్‌ ఎంపీ ఆరోపించాడు. పశ్చిమ దేశాల భావజాలాన్ని చొరనివ్వకుండా ఇలా చేస్తున్నారని, తిరస్కరించిన ఇద్దరు పాస్టర్లను శిక్షించినట్లు, ఇతరులను అడ్డుకుంటున్నట్లు ఇంటర్నేషనల్‌ క్రిస్టియన్‌ కన్సరన్‌(ఐసిసి) నివేదించినట్లు పార్లమెంటు కమిటీ ముందు చెప్పాడు. బైబిల్‌ రెండు రకాలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఓల్డ్‌ టెస్టిమెంట్‌, న్యూ టెస్టిమెంట్‌ అన్న గ్రంధాలు మనం ఎక్కడైనా చూడవచ్చు. వాటిని తిరగ రాసింది క్రైస్తవులు తప్ప కమ్యూనిస్టులు కాదు.వివిధ మత గ్రంధాల మీద అనేక మంది భిన్నమైన భాష్యాలు రాశారు. కైస్తవం కమ్యూనిజానికి అనుకూలమని, వ్యతిరేకమని బైబిల్‌లో ఉన్న అంశాలకు వ్యాఖ్యానం చెప్పిన వారు లేకపోలేదు. అసలు ఏసుక్రీస్తు ఎప్పుడు జన్మించాడు, బైబిల్‌ అంశాలను ఎవరు ఎప్పుడు ప్రబోధించారు లేదా ఎప్పుడు రాశారు ? అప్పటికీ అసలు కమ్యూనిజం, సోషలిజం అన్న ప్రాధమిక భావనలు కూడా లేవు. అలాంటపుడు ప్రబోధకులు లేదా రాసిన వారు వాటికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఎలా వాదనలు చేయగలరు. బైబిల్‌ను తిరగరాసి దానిలో ఇలా ఉంది అని చెప్పి జనాన్ని కమ్యూనిజానికి అనుకూలంగా మార్చేంత భావ దారిద్య్రంలో ప్రపంచంలో ఏ కమ్యూనిస్టులూ లేరు. దోపిడీకి వ్యతిరేకంగా జరిపే పోరాటాలను పక్కదారి పట్టించేందుకు, దోపిడీదార్లకు కొమ్ముకాసేందుకు ప్రతి మతం యత్నించటాన్ని రోజూ మనం చూస్తున్నదే.

మనదేశంలో మనుధర్మం పేరుతో అమలు జరిపిన వివక్ష, దుర్మార్గాలు చేస్తున్నపుడే సర్వేజనా సుఖినోభవంతు అని కూడా చెప్పారు. అందువలన అలా చెప్పిన వారిని మన దేశంలో తొలి సోషలిస్టులు, కమ్యూనిస్టులు అంటారా ? ప్రతి సమాజంలో దుర్మార్గాలను చూడలేని అనేక మంది తమ వాంఛలను వెల్లడించారు. వాటిని వాస్తవ రూపంలోకి తీసుకువచ్చే శాస్త్రీయ సిద్దాంతం, ఆచరణలను కమ్యూనిస్టులు చెప్పారు. వ్యక్తులకు, వారి ఇండ్లకు, ప్రార్ధనా స్థలాలకు పరిమితం కావాల్సిన మతాన్ని వీధులు, రాజకీయాలు, దోపిడీదార్లకు కొమ్ముకాసేందుకు తీసుకురావటాన్ని కమ్యూనిస్టులే కాదు, హేతువాదులు, పురోగామివాదులెవరూ అంగీకరించరు. రాజ్యం, పౌరుల మీద మత పెత్తనాన్ని చివరికి పెట్టుబడిదారులు కూడా అంగీకరించరు.ఐరోపాలో ఒక దశలో భూమిలో అత్యధిక భాగం మత సంస్థల చేతుల్లోనే ఉండేది. దాన్ని బద్దలు కొట్టటం ఫ్రెంచి విప్లవంలో ఒక భాగం, ఫ్యూడల్‌ బంధాలను,మత పట్టును అది బద్దలు చేసింది.పేదలు,అణగారిన వర్గాలను రక్షించేందుకే క్రైస్తవం తొలి రోజుల్లో ముందుకు వచ్చింది గనుకనే జనం ఖండాలు, రంగు, భాషా బేధాలతో నిమిత్తం లేకుండా ఆదరించారు. కానీ అదే మతం కష్టజీవుల మూలుగులను పీల్చే పెట్టుబడిదారులు,యుద్ధాలతో రక్తపుటేరులు పారించిన నియంతల పట్ల దాని వైఖరి ఏమంటే సానుకూలమే. మత యుద్ధాలకు పాల్పడిన చరిత్ర కూడా తెలిసిందే. దోపిడీని అంతం చేయాలన్న సోషలిస్టు, కమ్యూనిజం మతానికి వ్యతిరేకం అని ఆ మత పెద్దలే రోజూ తప్పుడు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.


దేశాల మీద మతపెత్తనం కుదరదు, మత రాజ్యాలు అంతరించాయి. మతం పేరుతో విద్రోహానికి పూనుకుంటే సహించాల్సిన అవసరం ఉందా? తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాలు, సోవియట్‌ కూల్చివేతలో క్రైస్తవమత పెద్దలు కూడా అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులతో చేతులు కలిపిన చరిత్ర మన కళ్ల ముందు ఉంది. అటువంటి కుట్రలను చైనా సాగనివ్వటం లేదు గనుక దాని మీద తప్పుడు ప్రచారాలు అన్నది స్పష్టం. చైనాలో బైబిల్‌, ఖురాన్‌ ఏ పవిత్ర గ్రంధాన్ని కూడ సహించరని ప్రచారం చేస్తున్న క్రైస్తవ సంస్థలు నేడు ఐరోపాలో పెరుగుతున్న ముస్లిం వ్యతిరేకత, ఖురాన్‌ గ్రంధాలను తగులపెడుతున్న ఉదంతాల గురించి ఎక్కడా మాట్లాడవు.స్టాక్‌హౌమ్‌లోని టర్కీ ఎంబసీ ముందు ఖురాన్‌ ప్రతిని తగుల బెట్టేందుకు స్వీడన్‌ ప్రభుత్వం ఏకంగా అధికారిక అనుమతి మంజూరు చేసింది. ఇంకా అనేక దేశాల్లో పచ్చి ముస్లిం వ్యతిరేకులు ఇలానే రెచ్చిపోతున్నారు. వాటి గురించి అమెరికా ఎంపీలెవరూ మాట్లాడరు. చైనా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 36 ప్రకారం మత స్వేచ్చ ఉంది. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలు లేదా వ్యక్తులు ఫలానా మతాన్ని నమ్మాలని లేదా వద్దని గానీ వత్తిడి తేకూడదు.వివక్ష చూపకూడదు.ప్రజా జీవనాన్ని విచ్చిన్నం చేసేందుకు లేదా పౌరుల ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు చూడకూడదు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జోక్యం చేసుకోకూడదు. ఏ మత సంస్థకూడా విదేశీ పెత్తనాన్ని అంగీకరించకూడదు. ఇదే విధంగా మత సంస్థలు విద్యాసంస్థలను ఏర్పాటు చేయవచ్చు తప్ప వాటిలో మత బోధన చేయకూడదు. ఇలా మతాన్ని పరిమితం చేసే నిబంధనలు ఉన్నాయి. అంతే తప్ప మా మతం ఇలా చెప్పింది లేదా మత కేంద్రం ఫలానా చోట ఉంది, వారు చెప్పినట్లు నడచుకుంటాం, దేశంలోని చట్టాలు మాకు వర్తించవు అంటే కుదరదు. మేం చెప్పినట్లే నడవాలి అంటే అసలు కుదరదు. ఇది అన్ని మతాలకూ వర్తిస్తుంది. బౌద్దం పేరుతో జనాన్ని రెచ్చగొట్టి తిరుగుబాటు చేసిన టిబెట్‌ దలైలామా పారిపోయి మన దేశంలో ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.


అమర జీవుల గళం(విఓఎం) పేరుతో పని చేస్తున్న ఒక సంస్థ ప్రతినిధి టోడ్‌ నెటెల్టన్‌ ఒక పత్రికతో మాట్లాడుతూ పది సంవత్సరాల్లో బైబిల్‌ను తిరగ రాయాలని చైనా కమ్యూనిస్టు పార్టీ 2019లో నిర్ణయించిందని. దానిలో కన్ఫూసియస్‌, బౌద్ద సూత్రాలను కూడా చొప్పించి పార్టీకి మద్దతు ఇచ్చేవిధంగా రాస్తారని ఆరోపించాడు. ఇక్కడ గమనించాల్సిందేమంటే 140 కోట్ల చైనా జనాభాలో ఇండెక్స్‌ ముండీ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం క్రైస్తవులు కేవలం 5.2, ముస్లింలు రెండు శాతమే.ఏ మతానికీ చెందని వారు 51.8, స్థానిక తెగల మతాల వారు 21.9, బౌద్దులు 18.3 శాతాల చొప్పున ఉన్నారు. మనదేశంలో మాదిరి 80శాతం మంది ఉన్న హిందూమతానికి ముస్లిం, క్రైస్తవుల నుంచి ముప్పు వచ్చిందని చెప్పేవారెవరూ అక్కడ లేరు. ప్రపంచంలో ఎక్కడా వర్తమాన కాలంలో ఏ దేశంలోనూ ఒక మతస్తులు తమ జనాభాను విపరీతంగా పెంచి మరొక మతానికి ముప్పు తెచ్చిన ఉదంతమేదీ జరగలేదు. చైనాలో నిజంగా బైబిల్‌ను తిరగరాస్తూ దానిలో కొన్ని భాగాలను ఇప్పటికే పాఠ్యపుస్తకాల్లో పెట్టి ఉంటే రోమ్‌లో ఉన్న క్రైస్తవమత కేంద్రానికి, పోప్‌కు తెలియకుండా ఉంటుందా ? తెలిస్తే అధికారికంగానే దాని మీద స్పందించిన దాఖలా ఇంతవరకు లేదు.


క్రైస్తవుల కోసం పని చేస్తున్నామంటూ ప్రచారం చేసుకొనే వారూ, పత్రికల్లో రాతలు రాసేవారూ చివరికి పోప్‌ ఫ్రాన్సిస్‌ను కూడా వదలటం లేదు. చైనా అక్రమంగా నియమించిన షాంఘై బిషప్‌ను అంగీకరించినట్లు ధ్వజమెత్తారు.2018లో చైనాతో పోప్‌ కుదుర్చుకున్న ఒప్పందం ఇప్పటికీ రహస్యమేనని, దాన్ని ఇప్పటికి రెండు సార్లు సమీక్షించినట్లు జూలై 27న ఒక విశ్లేషకుడు పేర్కొన్నాడు. ఒప్పందం ప్రకారం బిషప్పులను ఎంపిక చేసేది చైనా అయినా అధికారికంగా ప్రకటించాల్సింది పోప్‌ అని దానికి విరుద్దంగా షాంఘై బిషప్‌ వ్యవహారం ఉందని, వాటికన్‌కు ఆ సంగతి పత్రికా వార్తల ద్వారా తెలిసిందని కూడా ఆరోపించాడు. ఏప్రిల్‌ నాలుగున నియామకం జరిగితే జూలై 15న పోప్‌ అధికారికంగా ప్రకటించారని వాపోయాడు. గొడవలెందుకని ఊరుకొని ఆమోదించాంగానీ చైనా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు వాటికన్‌ విదేశాంగ మంత్రి కార్డినల్‌ పెట్రో పరోలిన్‌ చెప్పినట్లు కూడా రాశాడు. 2018 ఒప్పందం ప్రకారం అనుమతి లేకుండా చర్చి సమావేశాలు నిర్వహించటాన్ని ఎవరూ ప్రోత్సహించకూడదు. అలాంటి వారంతా చైనా ప్రభుత్వం గుర్తించిన దేశభక్త కాథలిక్‌ చర్చిలో విలీనం కావాలి.కానీ ఇప్పటికీ రహస్య చర్చ్‌లు కొనసాగుతున్నట్లు వాటికన్‌ మంత్రి అంగీకరించాడు. అలా చేరని వారి మనోభావాలను గౌరవించాలని కూడా ఇప్పుడు మంత్రి చెప్పటాన్ని బట్టి దాని అర్ధం వారికి వెలుపలి నుంచి మద్దతు లభిస్తున్నది. వారికి రక్షణ కల్పించాలని అనేక మంది పత్రికల్లో డిమాండ్‌ చేస్తున్నారంటే పోప్‌ కుదుర్చుకున్న ఒప్పందానికి తూట్లు పొడవటం, ధిక్కరణ తప్ప మరొకకాదు. బైబిల్‌ను తిరగరాయాలంటే ఎక్కడైనా పది సంవత్సరాలు అవసరం లేదు. తెల్లవారేసరికి పోటీ గ్రంధాలను రాసేవారున్నారు. కమ్యూనిస్టులు అలాంటి పనికిమాలిన పని పెట్టుకోరు. గతంలో మతాన్ని అనుమతించరని, ప్రార్ధనా మందిరాలను కూల్చివేశారని చేసిన ప్రచారం అబద్దమని తేలింది. అందువలన ఎత్తుగడలను మార్చి మతాన్ని తమకు అనుకూలంగా మారుస్తున్నారని, మత గ్రంధాలను తిరగరాస్తున్నారనే తప్పుడు ప్రచారానికి పూనుకున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెట్టుబడిదారీ విధానంపై యువతలో ఆగ్రహం – ఆందోళనలో పాలకవర్గం !

07 Wednesday Jun 2023

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Anti communist, capitalism or socialism, Capitalism’s flaws, capitalist crisis, karal marx


ఎం కోటేశ్వరరావు


ఎవరు ఎన్ని చెప్పినా చివరికి కారల్‌ మార్క్స్‌ చెప్పిందే సరైనదా ? అంటూ జర్మన్‌ కార్పొరేట్‌ల పత్రిక డెర్‌ స్పీగల్‌ ఈ ఏడాది జనవరిలో ఒక విశ్లేషణను ప్రచురించింది. అంతకు ముందు గతేడాది సెప్టెంబరులో అమెరికా పరిశోధనా సంస్థ పూ సోషలిజం-పెట్టుబడిదారీ విధానాల గురించి అమెరికన్లలో ఉన్న వైఖరి గురించి సర్వే వివరాలను వెల్లడించింది.దీనిలోని కొన్ని ముఖ్య అంశాలను చూద్దాం. అమెరికాలో పద్దెనిమిది-ఇరవై తొమ్మిది సంవత్సరాల వయస్సు వారిలో సోషలిజాన్ని సమర్ధించే వారు 44శాతం మంది ఉండగా పెట్టుబడిదారీ విధానాన్ని అభిమానించిన వారు 40శాతం ఉన్నారు.2019 మే నెలలో కాపిటలిజం పట్ల సానుకూలంగా ఉన్న వారు 65శాతం కాగా 2022 ఆగస్టులో వారు 57శాతానికి తగ్గారు. ఇదే కాలంలో సోషలిజం పట్ల సానుకూలంగా ఉన్నవారు 42 నుంచి 36శాతానికి తగ్గినట్లు. ఆక్సియోస్‌ సర్వే ప్రకారం 2019 నుంచి 2021వరకు చూస్తే రిపబ్లికన్‌ పార్టీని సమర్ధించే 18-34 సంవత్సరాల యువతలో పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధించేవారు 81 నుంచి 66శాతానికి తగ్గారు. మొత్తంగా సోషలిజాన్ని సమర్ధించే వారు 39 నుంచి 41శాతానికి పెరిగారు. ధనిక దేశాల్లో పెట్టుబడిదారీ విధానం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యల పూర్వరంగంలో సోషలిజం, మార్క్స్‌ మీద ప్రేమ కంటే పెట్టుబడిదారీ విధాన సమర్ధకులను హెచ్చరిస్తూ చేసిన విశ్లేషణలు ఇవి అన్నది గమనించాలి. సర్వే సంస్థలు ఇచ్చే ప్రశ్నావళి, దానికి అడిగే సమాధానాల తీరు తెన్నులను బట్టి సమర్ధకులు, కాని వారి సంఖ్య మారుతున్నప్పటికీ రూపుదిద్దుకుంటున్న ప్రధాన ధోరణులు ఏమిటన్నదానిని చూడాలి. గతంలో సోషలిజాన్ని వ్యతిరేకించే అంశం గురించి చర్చలు జరిగితే ఇప్పుడు పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి కమ్యూనిస్టుల కంటే పెట్టుబడిదారీ విధాన సమర్ధకులే ఎక్కువగా మాట్లాడుతున్నారు.


” పెట్టుబడిదారీ విధానం మీద విమర్శ కొత్తదేమీ కాదు. కరోనా మహమ్మారి నాలుగో సంవత్సరం, ఉక్రెయిన్‌ యుద్ధం రెండవ సంవత్సర ప్రారంభంలో గమనించాల్సినంతగా అది పెరుగుతున్నది. అనేక అంశాలు ఎక్కువ కాలం పని చేయవు. ప్రపంచీకరణ కుప్పకూలుతున్నది, దానితో పాటే జర్మన్‌ తరహా కలిమి కూడా ఉంది.ప్రపంచం శత్రుపూరిత కూటములలో పాదుకొనిపోతున్నది. ద్రవ్యోల్బణం పేదలు-ధనికులను మరింతగా వేరు చేస్తున్నది. దాదాపు అన్ని పర్యావరణ లక్ష్యాలు తప్పాయి. వ్యవస్థలో కనిపిస్తున్న కొత్త పగుళ్లన్నింటినీ రాజకీయవేత్తలు ఇంకేమాత్రమూ సరి చేయలేరు. ఒక పెద్ద సమస్య తరువాత మరొకటి వెనుకే వస్తున్నది, అవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. ఇంథన సంక్షోభం, వాణిజ్యపోరు, ప్రపంచ యుద్ధం పోకడలు కనిపిస్తున్నాయి.జనాకర్షక(మభ్యపెట్టే) నేతలు, నిరంకుశ పాలకుల నుంచి ప్రజాస్వామ్యం దాడులను ఎదుర్కొంటున్నది.ఇటీవలి వరకు ఈ సమస్యలన్నింటికీ ఒక పరిష్కారం ఉంటుందని, మార్కెట్‌ తనను తాను రక్షించుకోగలదని అనుకున్నారు. కానీ ఈ రోజు దాన్ని ఎంత మంది నిజంగా నమ్ముతున్నారు ? ప్రత్యేకించి అన్ని ప్రతికూలతలు, వాతావరణ సంక్షోభం అనేక రెట్లు పెరుగుతున్నది.” ఇలాంటి వర్ణన సాధారణంగా సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీలు చేస్తుంటాయి. కానీ ఇదంతా పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధించే డెర్‌ స్పీగల్‌ విశ్లేషకుల అభిప్రాయాల సారమే.అంతేనా ?


” పెట్టుబడిదారీ విధానాన్ని తక్షణమే మౌలికంగా సంస్కరించాల్సి ఉంది. లేకుంటే అది నాశనమౌతుంది గనుక తగిన చర్యలు తీసుకోవాలి ” అని రే డాలియో అనే 2200 కోట్ల డాలర్ల హెడ్జ్‌ ఫండ్‌ మేనేజర్‌ చెప్పాడు.ఫైనాన్సియల్‌ టైమ్స్‌,గోల్డ్‌మన్‌ శాచ్స్‌, బోష్చ్‌ వంటి సంస్థలు ఎన్నో ఇలాంటి అభిప్రాయాలను వెల్లడించినట్లు ఆ పత్రిక విశ్లేషకులు ఉటంకించారు.” మహా పెట్టుబడిదారులుగా రుజువు చేసుకున్న వారు ప్రపంచస్థితి గురించి చెబుతూ ఆకస్మికంగా కారల్‌ మార్క్స్‌ అభిమానుల మాదిరి మాట్లాడుతున్నారు. అనేక ప్రాంతాల్లో ప్రభుత్వాలు, కార్పొరేట్‌ ప్రధాన కార్యాలయాలు,అగ్రశ్రేణి మేథావులు, వ్యవహార జ్ఞానులు ఎవరైనా అడుగుతున్న అతి పెద్ద, మౌలిక ప్రశ్న ఏమిటంటే ఈ ఆర్థిక వ్యవస్థతో మనం కొనసాగ గలమా అంటున్నారు.” అని డెర్‌ స్పీగల్‌ అన్నదంటే పెట్టుబడిదారులకు తమ వ్యవస్థ మీద తమకే విశ్వాసం సన్నగిల్లుతున్నదని చెప్పినట్లే . దీని అర్ధం వారు చేతులు ముడుచుకు కూర్చుంటారని కాదు, దాన్ని అధిగమించేందుకు, జనాన్ని తొక్కిపెట్టేందుకు కొత్త పద్దతులను వెతికే పనిలో ఉన్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం పెట్టుబడిదారీ విధానం సాధారణ సంక్షోభాన్ని కాదు ప్రపంచంలో 2023లో విధాన పరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు డెర్‌ స్పీగల్‌ విశ్లేషకులు చెబుతున్నారు.


వారి అసలు బాధ ఏమిటో కూడా దాచుకోలేకపోయారు. ” పారిశ్రామిక దేశాలలో సంవత్సరాల తరబడి ఒక స్పష్టమైన ఆగ్రహం వ్యాపిస్తున్నది. అది సైద్దాంతిక కారణాలతో కాదు, ఎందుకంటే ఇండ్ల అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయి, ఎందుకంటే ఆస్తులను కొనుగోలు చేయలేనివిగా మారాయి. వనరులనుంచి సంపదలను సృష్టించే యంత్రం అందరికీ సృష్టించనపుడు దాన్ని ఎందుకు ఆమోదించాలి ” అని ప్రశ్నిస్తున్నారని అంటూ అమెరికాలో సోషలిజం పట్ల యువతలో సానుకూల వైఖరి పెరగటాన్ని ఉటంకించారు. అసంతృప్తి, ఆగ్రహం, ఉద్యోగాలకు రాజీనామాలతో నిరసన కొట్టవచ్చినట్లుగా కనిపిస్తోందని, సోషలిస్టు సిద్దాంతాల పట్ల ఆకర్షితులౌతున్నట్లు పేర్కొన్నారు.గతంలో ఇదే పత్రిక జరిపిన సర్వేలో పెట్టుబడిదారీ విధానం వాతావరణ సంక్షోభానికి కారకురాలైనట్లు సగం మంది జర్మన్లు భావిస్తున్నట్లు వెల్లడైంది. ఎక్కడైనా సంక్షోభాలు తలెత్తినపుడే దాన్నుంచి బయటపడే మార్గాలను సమాజం వెతుకుతుంది. అసలీ కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ పుట్టకపోతే ఈ కమ్యూనిస్టు సిద్దాంతం, బీరకాయ ఉండేది కాదు అని కొందరు అనుకుంటారు. వారుగాక పోతే మరొకరు, మరొకరు దోపిడీని అంతం చేసే శాస్త్రీయ సిద్దాంతాన్ని ముందుకు తెచ్చి ఉండేవారు. సోషలిజం గాక పోతే మరొక పేరు పెట్టి ఉండేవారు. దోపిడీ అంతం కావటం, సమసమాజం రావటం తప్ప పేరు ఏదైతేనేం. నిజానికి వారి కంటే ముందుగానే సోషలిజం గురించి చెప్పిన వారున్నారు. దాన్ని సాధించే మార్గం వారు చెప్పలేకపోయారు గనుక వారిని ఊహాజనిత సోషలిస్టులని పిలిచారు. మన దేశంలో కూడా సర్వేజనా సుఖినో భవంతు అని చెప్పిన వారు, వసుధైక కుటుంబం అన్నవారి గురించి తెలిసిందే.


అమెరికాలో పూ సంస్థ జరిపిన సర్వే ప్రకారం అక్కడి డెమోక్రాట్లలో అనేక మంది పౌరుల మౌలిక అవసరాలను సోషలిజం తీరుస్తుందని నమ్ముతున్నారు. వ్యక్తిగత స్వేచ్చను హరిస్తుందని రిపబ్లికన్లు చెబుతారు.2019లో సోషలిజం పట్ల డెమోక్రాట్లలో 65శాతం మంది సానుకూలంగా ఉన్నారని 2022లో 57శాతానికి తగ్గినట్లు సర్వే చెప్పింది. పెట్టుబడిదారీ విధానం గురించి సానుకూల వైఖరి ఉన్న డెమోక్రాట్లు ఇదే కాలంలో 55 నుంచి 46 శాతానికి తగ్గినట్లు కూడా పేర్కొన్నది. దీన్ని ఏ విధంగా చూడాలి ? ఏ సమాజంలోనైనా మధనం జరగాలి. అమెరికాలో ఇప్పుడు అదే జరుగుతున్నదని చెప్పవచ్చు. పెట్టుబడిదారీ విధానం పట్ల రిపబ్లికన్లలో సానుకూల వైఖరి 78 నుంచి 74శాతానికి తగ్గింది. ఇదీ మంచి పరిణామమే కదా ! పెట్టుబడిదారీ విధానం ఎక్కువ అవకాశాలను కల్పిస్తుందని నమ్ముతున్నవారు తగ్గుతున్నారు. తక్కువ కుటుంబ ఆదాయం ఉన్న వారు సోషలిజం పట్ల సానుకూలంగా ఉంటే ఎక్కువ వస్తున్నవారు పెట్టుబడిదారీ విధానమే ఉండాలని కోరుకుంటున్నారు. జనాలకు మౌలిక అవసరాలైన ఆహారం, ఆరోగ్యం, ఇంటి వసతులను సోషలిజం తీరుస్తుందని 38శాతం నమ్ముతుంటే 18శాతానికి పెట్టుబడిదారీ విధానం మీద భ్రమలు ఉన్నాయి. మూడు పదులు దాటిన వారిలో వయసుపైబడిన కొద్దీ సోషలిజం పట్ల సానుకూల వైఖరి ఉన్నవారు తగ్గినట్లు సర్వే వెల్లడించింది. దానిలో ఆశ్చర్యం ఏముంది ? తీవ్రమైన సోషలిస్టు వ్యతిరేక ప్రచారానికి లోనైన వారు.గతంలో అనుభవించిన సామాజిక రక్షణ పధకాలు నేటి తరాలకు అందుబాటులో ఉండటం లేదు. పాతవారితో పోల్చితే బతుకుదుర్భరంగా మారుతున్నది. అందువలన యువతలో కొత్త ఆలోచనలు. సోవియట్‌ ఉనికిలో ఉన్నపుడు సోషలిస్టు దేశాల గురించి చేసిన తప్పుడు ప్రచారంతో పోలిస్తే ఇప్పుడు అమెరికాలో అది తగ్గింది. ఎందుకంటే సోషలిజం మీద విజయం సాధించామని అక్కడి పాలకులు మూడు దశాబ్దాల క్రితం ప్రకటించారు. అదే నోటితో ఇప్పుడు పోరు సాగిస్తామని చెప్పలేరు కదా ! అందుకే కొత్త తరాలు పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి ఆలోచించే క్రమంలో ప్రత్యామ్నాయంగా సోషలిజం తప్ప మరొకటి కనిపించటం లేదు గనుక దాని పట్ల క్రమంగా సానుకూలత పెరుగుతోంది.


సోషలిస్టు దేశాలంటే జనానికి ఇచ్చిన మేరకు తీసుకోవటం తప్ప అవసరమైన సరకులను అందించలేరంటూ ఖాళీగా ఉన్న దుకాణాలను చూపి కట్టుకథలను ప్రచారం చేశారు. మరోవైపు చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. కానీ అక్కడి నుంచి కావాల్సిన వస్తువులన్నింటినీ దిగుమతి చేసుకుంటారు. ఆ మేరకు తమ ప్రభుత్వం తమ ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నదని అమెరికన్లు భావించటంతో పాటు చైనా అనేక దేశాలకు వస్తువులను ఎలా అందచేస్తున్నది. అక్కడ ఉపాధిని, ఆదాయాలను ఎలా పెంచుతున్నది అనే మధనం కూడ ప్రారంభమైంది.మనకు పెట్టుబడిదారీ విధానం వలన ఉపయోగం ఏమిటి ? అన్న సందేహాలు మొగ్గతొడిగాయి.. వరుసగా వచ్చిన ఆర్థిక మాంద్యాలకు పెట్టుబడిదారీ దేశాలు ప్రభావితమైనట్లుగా చైనాలో జరగకపోవటం కూడా అమెరికన్లలో సోషలిజం పట్ల మక్కువను పెంచింది. నూట ఆరు సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా బ్రిటన్‌లో నర్సులు సమ్మె చేశారు. ఫ్రాన్సు సమ్మెలు, ప్రదర్శనల ఆందోళనలతో ఉడికిపోతోంది. ప్రభుత్వం దిగిపోవాలని 74శాతం మంది కోరుకుంటున్నారు. ఐరోపాలో అనేక దేశాల్లో కార్మికవర్గం వీధుల్లోకి వస్తోంది. పెట్టుబడిదారీ విధానం మీద కరోనాకు ముందే అమెరికాలో దాడి మొదలైందని, తరువాత ఆర్ధిక, సామాజిక ఇబ్బందులు పెరగటంతో మరింత తీవ్రమైందని కొందరు గగ్గోలు పెడుతూ పత్రికల్లో రాశారు. పెట్టుబడిదారీ విధానం చితికింది అని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక, ఇంకేమాత్రం పెట్టుబడిదారీ విధానం పనిచేయదు అంటూ సిఎన్‌ఎన్‌, పెట్టుబడిదారీ విధానాన్ని తిరిగి పెద్ద ఎత్తున తిరిగి ప్రారంభించాలి అని ప్రపంచ ఆర్థికవేదిక వంటివి చెప్పిన తరువాత జనాలకు ఆ వ్యవస్థమీద విశ్వాసం ఎలా పెరుగుతుంది. మరో ప్రపంచం అది సోషలిస్టు సమాజం సాధ్యమే అని చెప్పేందుకు పెట్టుబడిదారీ విధానమే అనేక అవకాశాలను ముందుకు తెచ్చింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పాలకవర్గాలను భయపెడుతున్న కమ్యూనిజం !

17 Wednesday May 2023

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, USA

≈ Leave a comment

Tags

Anti communist, Austrian Communist Party, Chicago mayor, communism, Communism won, communist manifesto, Joe Biden, karal marx


ఎం కోటేశ్వరరావు


కమ్యూనిస్టు విప్లవం గురించి పాలక వర్గాలను భయపడనివ్వండి. కార్మికవర్గానికి వారి సంకెళ్లు తప్ప పోయేదేమీ లేదు.వారు గెలుచుకొనేందుకు తమదైన ప్రపంచం ఉంది. అన్ని దేశాల కార్మికులూ ఐక్యం కండి అన్న పిలుపు గురించి తెలిసిందే. సరిగ్గా 175 సంవత్సరాల క్రితం 1848 ఫిబ్రవరి 21న తొలిసారిగా ముద్రితమైన కమ్యూనిస్టు ప్రణాళికలో కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ రాశారు.పైకి ఎవరెన్ని చెప్పినా, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ఇప్పటికీ ఆ ప్రణాళిక పాలకవర్గాలను భయపెడుతూనే ఉంది. ఫిబ్రవరి 21 రెడ్‌ బుక్స్‌ డే రోజున ప్రపంచమంతటా కార్మికవర్గం దాన్ని పఠించింది. ప్రపంచ చరిత్రలో ఏ గ్రంధాన్ని ఇలా చదివి, చర్చించి ఉండరు. కమ్యూనిస్టు ప్రణాళిక ప్రచురణకు ముందు ప్రజాస్వామ్యం, విముక్తి కోసం అనేక పోరాటాలు, విప్లవాలు జరిగాయి. అప్పటివరకు జరిగింది ఒక ఎత్తుకాగా వాటికి ఒక దశ, దిశ నిర్దేశం చేస్తూ నిర్దిష్ట కార్యాచరణకు నాంది పలికింది కమ్యూనిస్టు ప్రణాళిక.అమెరికాలోని సెంటినల్‌ రికార్డ్‌ అనే వెబ్‌ పత్రిక మే ఎనిమిదవ తేదీన కమ్యూనిజం విజయం అనే శీర్షికతో బ్రాడ్లే గిట్జ్‌ అనే విశ్లేషకుడు రాసిన అంశాన్ని ప్రచురించింది. అదేమీ సానుకూల వైఖరితో చేసిన పరిశీలన కాదు. పేరులో ఏమున్నది పెన్నిధి అన్నట్లుగా పదాలను, వాటికి అర్ధాలను ఎటుతిప్పి ఎటు చెప్పినా చివరికి కమూనిస్ట్యులు చెప్పిన దాన్నే చెబుతున్నారుగా అని ఉక్రోషంతో పెట్టిన శీర్షిక అనిపించింది. భిన్నత్వం, న్యాయం లేదా ధర్మం, అంతర్గహణం (డిఇఐ) అని బైడెన్‌ ప్రభుత్వం, విశ్వవిద్యాలయాల్లో ఏమి బోధించినప్పటికీ వెనుక ద్వారం నుంచి కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రవేశపెట్టినట్లే.సమానత్వం అన్నది న్యాయం నుంచి పుట్టిందే. గత రెండువందల సంవత్సరాలు అంతకు ముందు నుంచి అమెరికాలో చెబుతున్న హక్కుల సమానత్వానికి కారల్‌ మార్క్స్‌, లెనిన్‌, ఇతర కమ్యూనిస్టు సిద్దాంతవేత్తలు చెప్పిన పర్యవసానం లేదా ఫలితాల సమానత్వానికి వైరుధ్యం ఉంది. అని ఆ విశ్లేషణలో పేర్కొన్నారు.


మన దేశంలో దున్నేవాడికే భూమి అన్న నినాదం ఇచ్చారు కమ్యూనిస్టులు. దున్నగలిగేవాడికే భూమి అన్నది తమ వైఖరని భూసమస్య ప్రధాన చర్చగా ఉన్నపుడు బిజెపి నేతలు చేప్పేవారు. సోషలిజం, తరువాత కమ్యూనిజం తమ అంతిమ లక్ష్యమని కమ్యూస్టులు చెప్పే సంగతి తెలిసిందే.జనం ఈ నినాదాల పట్ల ఆకర్షితులవటాన్ని గమనించి తామే సోషలిజాన్ని తీసుకువస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఆవడి ఏఐసిసి సమావేశంలో తీర్మానించింది.బిజెపి కూడా ఆ నినాద ప్రభావాన్ని తప్పించుకోలేక తాము గాంధేయ సోషలిజం తెస్తామని చెప్పింది.అదే మాదిరి భూ పోరాటాలు అవసరం లేకుండా భూ సంస్కరణలను తామే అమలు జరుపుతామని,భూమిని పంచుతామని కాంగ్రెస్‌ బూటకపు సంస్కరణలకు తెరతీసింది. ఇప్పుడు కమ్యూనిస్టులు తప్ప మిగతా పార్టీలేవి భూ సమస్య గురించి మాట్లాడటం లేదు. సోషలిస్టు నినాదం జనాన్ని ఆకర్షించిన కారణంగానే ఐరోపాలోని పెట్టుబడిదారీ దేశాల్లో సంక్షేమ పధకాలు, సబ్సిడీల వంటి చర్యలతో అక్కడి పాలకవర్గాలు కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు చూశారు. తరువాత అనేక దేశాల్లో వాటిని అమలు జరపాల్సి వచ్చింది.చివరికి నరేంద్రమోడీ ముందుకు తెచ్చిన అచ్చేదిన్‌ నినాదం కూడా అలాంటిదే. అసమానతలు పెరిగి జనజీవనం దిగజారుతున్న క్రమంలో మంచి రోజులు తెస్తానంటే తప్ప బిజెపి చెప్పే మత సిద్దాంతాలకు ఓట్లు రాలవని తెలిసే జనాన్ని వంచించేందుకు ఇలాంటి నినాదాలను ముందుకు తెస్తున్నారు. రాజకీయాలకు తోడు జనాన్ని చీల్చేందుకు, మత్తులో ముంచి వర్గ దృక్పధం వైపు చూడకుండా చూసేందుకు మతాన్ని ముందుకు తెస్తున్నారు. కమ్యూనిస్టు ప్రణాళిక, సిద్దాంతాల మీద గందరగోళం సృష్టించే, తప్పుదారి పట్టించే ఎత్తుగడలతో నిరంతరం వక్రీకరణ దాడి జరుగుతూనే ఉంది.


కమ్యూనిజం గురించి ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు, విద్వేషాన్ని రెచ్చగొట్టినా జనజీవితాలు దుర్భరం అవుతున్నపుడు ప్రత్యామ్నాయాల గురించి జనం ఆలోచిస్తారు. అమెరికాలో, ఐరోపాలో,ఇతర చోట్ల ఇప్పుడు జరుగుతోంది అదే. గతంలో కమ్యూనిజం వైఫల్యగురించి చర్చకు తెరతీస్తే సోషలిజం అంతరించింది అని చెప్పిన చోట జనం పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి ఆలోచించటం మొదలు పెట్టారు. ముందే చెప్పుకున్నట్లు 175 ఏండ్ల నుంచి కమ్యూనిస్టు ప్రణాళిక దోపిడీ వర్గాన్ని భయకంపితం గావిస్తుంటే ఇప్పుడు పెట్టుబడిదారీ విధాన వైఫల్యంపై చర్చ కూడా దానికి తోడైంది. దాన్ని పక్కదారి పట్టించేందుకే మేము కూడా మీ గురించి ఆలోచిస్తున్నామని కార్మికవర్గానికి చెప్పేందుకు భిన్నత్వం, న్యాయం లేదా ధర్మం, అంతర్గహణం (డిఇఐ) భావనలను ముందుకు తెస్తున్నారు. అమెరికాలోని అనేక నగరాల్లో తమకు సరైనదారి చూపేది పురోగామి శక్తులే అనే భావం బలపడుతోంది. మూడో పెద్ద నగరమైన చికాగో నగరంలో మితవాదులను పక్కకు పెట్టి పురోగామి వాదులను నగరపాలక సంస్థకు ఎన్నుకోవటం దాన్నే సూచిస్తోంది.


అమెరికాలో న్యూయార్క్‌, లాస్‌ ఏంజల్స్‌ తరువాత మూడో పెద్ద నగరమైన చికాగో మేయర్‌గా పురోగామివాది బ్రాండన్‌ జాన్సన్‌ ఏప్రిల్‌ నాలుగవ తేదీన ఎన్నికయ్యాడు. చికాగో టీచర్స్‌ యూనియన్‌, కార్మిక నేతగా పని చేస్తున్నారు.మే పదిహేనవ తేదీన ప్రమాణ స్వీకారం చేశాడు. యాభై మంది కౌన్సిలర్లలో నగర చరిత్రలో పురోగామి వాదులు ఎక్కువగా ఎన్నికైన సందర్భమిదే. నిబంధనల ప్రకారం నగర పోలీసు కమిషనర్‌ పదవికి నగరంలోని 22 పోలీసు డివిజన్ల నుంచి వివిధ సామాజిక తరగతుల సమూహాల నుంచి ఎన్నికైన 60 మంది కమిటి ముగ్గురు అధికారుల పేర్లను ఎంపిక చేసి సిఫార్సు చేస్తే వారిలో ఒకరిని మేయర్‌ ఎంపిక చేస్తారు. పోలీసు విభాగాన్ని కూడా ప్రజాస్వామ్యపద్దతుల్లో పనిచేసేట్లు చూస్తున్నారు. వచ్చే ఏడాది పాఠశాలల కమిటీలను కూడా ఎన్నికల ద్వారా నింపుతారు.ప్రజా ఉద్యమాల ప్రభావం, ప్రజానుకూల రాజకీయాలు, ఎన్నికల పట్ల పౌరుల ఉత్సాహంతో చికాగో నగరం మరింత ప్రజాస్వామిక వాతావరణంలో పురోగమించనుంది. ఇటీవలి కాలంలో అనేక నగరాలలో పురోగామి శక్తులు మేయర్లుగా ఎన్నిక అవుతున్నారు. వారంతా ప్రజా ఉద్యమాలలో పని చేసి ప్రజాదరణ పొందిన వారే.చికాగోలో గతంలో అధికారంలో ఉన్న వారు అనుసరించిన విధానాల ఫలితంగా ధనికులకు మెరుగైన వసతులు, కార్మికులకు దుర్భరపరిస్థితులు, అవినీతి, అక్రమాలు, నేరాలతో జనం విసిగిపోయారు. కేంద్రం, రాష్ట్రాల నుంచి నిధులను రాబట్టి నగర జీవనాన్ని మెరుగుపరచాలన్న ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా ఎన్నికల్లో పురోగామి శక్తులు నెగ్గారు. నగరంలోని 50 వార్డులకు గాను జాన్సన్‌ మద్దతుదారులు 29 మంది గెలిచారు. ఆఫ్రికన్‌-అమెరికన్‌ ఓటర్లలో 80శాతం, తెల్లవారిలో 39,లాటినోలలో 49శాతం మంది వారికి ఓటు వేశారు. ఇటీవలి కాలంలో ఆసియన్‌-అమెరికన్‌ జనాభా కూడా పెరుగుతోంది. ఎన్నికైన వారిలో ఆరుగురు డెమోక్రటిక్‌ సోషలిస్టులు కూడా ఉన్నారు. వారి నేత బెర్నీ శాండర్స్‌ రెండు సార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు.


ఏప్రిల్‌ 23వ తేదీన ఐరోపా దేశమైన ఆస్ట్రియాలోని సాల్జ్‌బర్గ్‌ రాష్ట్ర ఎన్నికల్లో కమ్యూనిస్టులు(కెపిఓ) 11.7శాతం ఓట్లు సంపాదించారు.ఐదు సంవత్సరాల క్రితం వారికి వచ్చిన ఓట్లు కేవలం 0.4శాతమే. మితవాదానికి కేంద్రంగా ఉన్న ఇక్కడ ఇన్ని ఓట్లు రావటం పరిశీలకులను ఆశ్చర్యపరిచింది.కెపిఓ ప్లస్‌ పేరుతో స్వతంత్రులను కూడా కలుపుకొని ఒక మ్యూజియంలో గైడ్‌గా పని చేస్తున్న 34 సంవత్సరాల కె మైఖేల్‌ డంకల్‌ అనే కార్మికుడి నేతృత్వంలో పార్టీ పోటీ చేసింది. మొదటి స్థానంలో ఉన్న పార్టీకి 30, రెండో స్థానంలో ఉన్న పార్టీకి 25శాతం చొప్పున వచ్చాయి. డంకల్‌ గతంలో గ్రీన్ప్‌ పార్టీలో పని చేశాడు. వర్గ రాజయాలను అనుసరించటం లేదని, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా లేదని 2017లో రాజీనామా చేసి కమ్యూనిస్టులతో కలిశాడు. తరువాత 2019లో స్లాజ్‌బర్గ్‌ నగర ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచాడు. కమ్యూనిస్టు పార్టీ ఓట్లు అంతకు ముందున్న 1.19 నుంచి 21.5శాతానికి పెరిగాయి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఆస్ట్రియాలో నాలుగో పెద్ద నగరమైన ఈ నగరమేయర్‌గా ఒక కమ్యూనిస్టు ఉండబోతున్నట్లు విశ్లేషణలు వెలువడ్డాయి.దేశమంతటా పార్టీ ఓటింగ్‌ 2019లో ఒకటి నుంచి ఏడు శాతానికి పెరగ్గా 1959 తరువాత 2024 ఎన్నికల్లో తొలిసారిగా పార్లమెంటులో కూడా ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉంది. ఇళ్ల సమస్య, అద్దెలు, ఇంథన ధరల పెరుగుదల వంటి రోజువారీ కార్మికుల సమస్యల మీద కేంద్రీకరించి పార్టీ ప్రజల అభిమానం పొందింది. అధికార కూటమి జనం నుంచి దూరమైంది.2021లో జరిగిన ఎన్నికల్లో దేశంలో రెండో పెద్ద నగరమైన గ్రాజ్‌ మేయర్‌గా కమ్యూనిస్టు ఎన్నికయ్యాడు. గ్రీసులో జరిగిన విశ్వవిద్యాలయాల విద్యార్ధి సంఘ ఎన్నికల్లో వామపక్ష భావజాలం కలిగిన వారు 35శాతం ఓట్లు తెచ్చుకున్నారు.వరుసగా రెండవ ఏడాది ఈ ఆదరణ లభించింది. ఈ వీధులు ఎవరివి ? మావే, ఈ భూములు ఎవరికి, స్థానికులం మావే, వేరే వారికి అప్పగించటాన్ని అంగీకరించం అంటూ అమెరికాలోని మినియాపోలీస్‌లో జరిపిన ప్రదర్శనల్లో స్థానికులు కమ్యూనిస్టు, సోషలిస్టు పతాకాలను చేబూని నినదించారు. పురోగామి శక్తులు ఎన్నికల పోరాటాలతో పాటు ప్రజా ఉద్యమాల్లోనూ ముందుంటున్నారు.లాటిన్‌ అమెరికాలో రాగల ముప్పును గురించి కూడా హెచ్చరిస్తున్నారు.


తమ దేశ ప్రజాస్వామ్య భవిష్యత్‌ ప్రమాదంలో పడిందని చిలీ కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించింది. దేశ నూతన రాజ్యాంగ రచనకు ఏర్పాటు చేసిన 50 మంది సభ్యుల సభకు మే ఏడవ తేదీన జరిగిన ఎన్నికల్లో మితవాద, తీవ్రవాదుల పార్టీలకు చెందిన వారు 33 మంది ఎన్నికకావటాన్ని కమ్యూనిస్టు పార్టీ ఉటంకించింది. ఆ ఎన్నికల్లో రెండు స్థానాలను పొందిన పార్టీకి ఎనిమిదిశాతం ఓట్లు వచ్చాయి. అక్కడి నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేయాల్సి ఉంది. పోలైన ఓట్లలో 21శాతం చెల్లనివిగా ప్రకటించారు. ఇవన్నీ కూడా వామపక్ష శక్తులుగా చెప్పుకొనే వారివేనని, వారంతా వామపక్షాలకు ఓట్లు వేసి ఉంటే ఫలితాలు వేరుగా వచ్చి ఉండేవని కమ్యూనిస్టు పార్టీ చిలీ అధ్యక్షుడు గులిరెమో టెలియర్‌ అన్నారు. నూతన రాజ్యాంగ రచనకు ఎంతో గట్టిపోరాటం చేయాల్సి ఉంటుందని అన్నారు. కార్పొరేట్‌ శక్తులు రంగంలోకి దిగి పెద్ద ఎత్తున కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేసినప్పటికీ దేశంలో ఓట్ల రీత్యా మూడవ స్థానంలో పార్టీ నిలిచిందని చెప్పారు.2021 ఎన్నికల్లో గెలిచిన వామపక్ష గాబ్రియెల్‌ బోరిక్‌ ప్రభుత్వానికి తాజా పరిణామంతో ఎలాంటి ముప్పు లేనప్పటికీ కీలకమైన రాజ్యాంగ రచనకు ఓటర్లు మితవాద శక్తులవైపు మొగ్గు చూపటం గమనించాల్సిన అంశం. మొత్తం లాటిన్‌ అమెరికా, ప్రపంచంలోని కమ్యూనిస్టు, వామపక్ష శక్తులు చిలీ పరిణామాల నుంచి గుణపాఠాలను నేర్చుకోవాల్సి ఉంటుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సుప్రీం మాజీ జస్టిస్‌ ఇందు మల్హోత్రా నోట వాస్తవాల వక్రీకరణ, కమ్యూనిస్టు వ్యతిరేకత !

02 Friday Sep 2022

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

Anti communist, BJP, CPI(M), LDF, Pinarai Vijayan, RSS, Sabarimala Entry Case, SC Justice Indu Malhotra, Sree Padmanabhaswamy Temple Case


ఎం కోటేశ్వరరావు


సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఇందు మల్హోత్రా మాదిరిగా ఉన్న ఒక మహిళ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన ఒక వీడియో వైరల్‌గా మారిందంటూ దాని గురించి మీడియాలో ప్రముఖంగా 2022 ఆగస్టు చివరి వారంలో వార్తలు వచ్చాయి. దాని గురించి వివరణ ఇవ్వాలని మీడియా సంస్థలు కోరగా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ మహిళను ఇందు మల్హోత్రాగానే భావించిన కేరళ ప్రభుత్వం ఆమె మాట్లాడిన తీరును తప్పు పట్టింది. ఇందు మల్హోత్రాను కొందరు తప్పుదారి పట్టించి ఉంటారు, వాస్తవాలను సరి చూసుకొని ఆమె మాట్లాడి ఉండాల్సిందని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి కెటి థామస్‌ అన్నారు. ఆమె మాట్లాడిందాన్లో తప్పు లేదని బిజెపి, దాని అభిమానులు సమర్ధించారు. ఆమె తీరు ఆందోళన కలిగిస్తోందని అనేక మంది సామాజిక మాధ్యమంలో స్పందించారు. భక్తులతో మాట్లాడినపుడు ఇందు మల్హోత్రా మాస్క్‌ ధరించి ఉన్నారు, వీడియో అధికారికమైనది కాదు, ఆమె వివరణ తీసుకొనేందుకు ఫోన్‌, వర్తమానం, మెయిల్‌ ద్వారా ప్రయత్నించగా ఫలించలేదని ” ద ఫెడరల్‌ ” న్యూస్‌ పోర్టల్‌, వివరణ రాలేదని టెలిగ్రాఫ్‌ పత్రిక పేర్కొన్నది.

ఇంతకీ ఆమె చేసిన వ్యాఖ్యలేమిటి ?2022 ఆగస్టు 28న ఆమె తిరువనంతపురం పద్మనాభ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా భక్తులలో ఒకరు ఆలయం వెలుపల ఆమెతో మాట్లాడుతూ పద్మనాభస్వామి ఆలయ కేసులో మంచి తీర్పు ఇచ్చారని ప్రశంసించినపుడు స్పందించిన ఇందు మల్హోత్రా వారితో మాట్లాడుతూ ” ఈ కమ్యూనిస్టు ప్రభుత్వాలతో జరుగుతున్నది అదే. కేవలం దేవాలయాలకు వస్తున్న ఆదాయం కారణంగానే వారు దేవాలయాలను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు. అన్ని చోట్లా వారు స్వాధీనం చేసుకున్నారు….. అన్ని చోట్లా, కేవలం హిందూ దేవాలయాలనే. కాబట్టే జస్టిస్‌ (యుయు) లలిత్‌ నేను కుదరదని చెప్పాం, మేము దాన్ని అనుమతించం. మేం అడ్డుకోకుండా ఉండి ఉంటే ఇంకా కొనసాగేవి ” అని మాట్లాడినట్లుగా వీడియోలో ఉంది.మీ గురించి మేము ఎంతో గర్విస్తున్నాం, మీరు అలాంటి అద్భుతమైన పని చేశారు అన్న కొందరి మాటలు కూడా సదరు వీడియోలో ఉన్నాయి. పద్మనాభ స్వామి దేవాలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని 2011లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దేవాలయం తమ నిర్వహణలోనే కొనసాగాలన్న పూర్వపు రాజవంశీకుల అప్పీలుపై 2020 జూలై 13న జస్టిస్‌లు యుయు లలిత్‌, ఇందు మల్హోత్రాలతో కూడిన బెంచ్‌ వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.2021 మార్చి 13న ఇందు మల్హోత్రా పదవీ విరమణ చేయగా జస్టిస్‌ లలిత్‌ ప్రస్తుతం సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సంగతి తెలిసిందే.


నిజంగా కేరళ ప్రభుత్వం దేవాలయాలను స్వాధీనం చేసుకోవాలనుకున్నదా ?2007లో ఆనంద పద్మనాభన్‌ అనే ఒక లాయరు రాజకుటుంబ వారసత్వ హక్కులను సవాలు చేస్తూ తిరువనంతపురం కోర్టులో ఒక కేసును దాఖలు చేశారు. ఆలయ ఆస్తుల పరిరక్షణకు కొత్త ట్రస్టీలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆలయం, ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. శతాబ్దాలుగా ఉన్న తమహక్కును రద్దు చేసేందుకు లేదంటూ రాజకుటుంబం హైకోర్టుకు అప్పీలు చేసింది. 1950నాటి చట్టంలోని ఒక సెక్షన్‌ ప్రకారం సంస్థాన విలీన ఒప్పందంలో గుర్తించిన చివరి రాజు 1991లో మరణించిన తరువాత వారసులు స్వతసిద్దంగా ఆలయ నిర్వహణ హక్కులను పొందలేరని అందువలన ప్రభుత్వం వెంటనే ఆలయ స్వాధీనానికి ఒక కొత్త ట్రస్టును లేదా చట్టపరమైన అధారిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీని మీద రాజు, నాటి ఆలయ అధికారి సుప్రీం కోర్టులో విడిగా అప్పీలు చేశారు. పద్మనాభ స్వామి దేవస్థానాన్ని స్వాధీనం చేసుకొనే ఆలోచన తమకు లేదని, ప్రస్తుత యాజమాన్యం గురించి ఎలాంటి ఫిర్యాదులు లేవని ప్రభుత్వం (ముఖ్యమంత్రి విఎస్‌ ఆచ్యుతానందన్‌) తిరువనంతపురం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.(2010 మార్చి 16, హిందూ పత్రిక). 1949లో కేంద్ర ప్రభుత్వం-తిరువాన్కూర్‌-కొచ్చిన్‌ సంస్థానం చేసుకున్న విలీన ఒప్పందంలో రాజు వారసులు దేవాలయ యాజమాన్యంలో కొనసాగవచ్చనే నిబంధన ఉంది. సుప్రీం కోర్టు దాన్ని గుర్తించి ఆ మేరకు తీర్పు ఇచ్చింది.1950 చట్టం ప్రకారం కేరళలోని దేవాలయాలన్నీ దేవస్థానాల బోర్డుల అజమాయిషీల కిందకు వచ్చినప్పటికీ సంస్థాల విలీన ఒప్పందం ప్రకారం పద్మనాభ స్వామి ఆలయం మాత్రం రాజు వారసుల నిర్వహణలోనే ఉంటుందని పేర్కొన్నారు.కార్యనిర్వహణ అధికారిని, ముగ్గురు సలహాదారులను కూడా నియమించే అధికారం ఉంది.1965లో రాజు మేనేజింగ్‌ ట్రస్టీగా, నలుగురు సభ్యులతో పద్మనాభ స్వామి ఆలయ ట్రస్టును ఏర్పాటు చేశారు.


హైకోర్టు తీర్పును కొట్టివేసిన సుప్రీం కోర్టు రాజకుటుంబం విధానపరమైన నిర్ణయాలు తీసుకొనేందుకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ముగ్గురితో ఒక సలహా కమిటీ ఏర్పాటు, దానికి అధ్యక్షత వహించేందుకు ఒక రిటైర్డ్‌ హైకోర్టు జడ్జి, రాజు నియమించిన ఒక ప్రముఖ వ్యక్తి, రాజుతో సంప్రదించి అధ్యక్షుడు నియమించే ఒక చార్టెడ్‌ ఎకౌంటెంట్‌ ఉండాలి. ఆలయపాలనకు ఐదుగురితో ఒక కమిటీ, దానిలో రాజు వారసుల అదుపు, పర్యవేక్షణకు లోబడి పని చేసే విధంగా జిల్లా జడ్జి, రాజు ప్రతినిధి, ప్రధాన పూజారి, కేంద్ర, రాష్ట్ర ప్రతినిధులు ఉండాలని సుప్రీం కోర్టు పేర్కొన్నది. ఈ తీర్పును సవాలు చేయరాదని సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం నిర్ణయించింది.


పద్మనాభ స్వామి ఆలయంలోని ఐదు నేలమాళిగల్లో లక్షల కోట్ల విలువ గల వజ్రాలు, కిరీటాలు, సింహాసనాలు, బంగారు నగలు,నాణాలు, ఇతర వస్తువులు ఉన్నట్లు 2011లో వెల్లడైన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన అమికస్‌ క్యూరీ గోపాల సుబ్రమణియం, కాగ్‌ మాజీ అధిపతి వినోద్‌ రాయి వాటిని తనిఖీ చేసి ఒక నివేదికను సమర్పించారు. మరో నేలమాళిగను తెరిస్తే ప్రళయం సంభవిస్తుందని రాజకుటుంబం, భక్తుల పేరుతో కొందరు వాదించారు. 1990 తరువాత అనేక సార్లు దాన్ని తెరిచారని ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు జరగలేదని కోట్లాది విలువైన వస్తువులు మాయమైనట్లు వినోద్‌ రాయి తన నివేదికలో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు దాన్ని తెరవటం గురించి ఆలయ యాజమాన్యకమిటీ నిర్ణయానికే వదలి వేసింది.


హిందూ దేవాలయాలను కమ్యూనిస్టు ప్రభుత్వం దోచుకుంటున్నదని చేస్తున్న ప్రచారం అబద్దమని అనేకసార్లు గతంలో వెల్లడైంది. అక్కడ ఐదు సంవత్సరాలు కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే మరో ఐదు సంవత్సరాలు సిపిఎం ఉన్న చరిత్ర తెలిసిందే.తొలిసారిగా వరుసగా రెండవ సారి గతేడాది సిపిఎం అధికారానికి వచ్చి చరిత్ర సృష్టించింది. 2014 ఏప్రిల్‌ 22న కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ విటి బలరాం బిజెపి నేత ఎఎన్‌ రాధాకృష్ణన్‌కు సమాధానమిస్తూ ఫేస్‌బుక్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం మలబార్‌ దేవస్థానం బోర్డుకు అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం వేతనాల కోసం రు.22 కోట్లు చెల్లించింది. పద్మనాభ స్వామి దేవాలయానికి రాష్ట్ర ప్రభుత్వం 1970 నుంచి ఏటా రు.ఇరవైలక్షలు చెల్లిస్తున్నది.2011 నుంచి 2014వరకు శబరిమల ఆలయం రు. 60కోట్లు పొందింది.2015 డిసెంబరు ఏడున కేరళ అసెంబ్లీకి నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇలా ఉంది.” శబరిమలతో వివిధ ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఖర్చుల కోసం ఖజానాకు జమ చేస్తున్నారన్నది ఆధారం లేని ఆరోపణ. తిరువాన్కూర్‌, కొచ్చిన్‌, మలబార్‌, గురువాయుర్‌ దేవస్థానం బోర్టుల పరిధిలోని ఆలయాల ఆదాయం నేరుగా వాటి బాంకు ఖాతాలకే జమ అవుతుంది. తిరువాన్కూర్‌, కొచ్చిన్‌ బోర్డుల లావాదేవీలను హైకోర్టు నేరుగా నియమించే ఆడిటర్లే తనిఖీ చేస్తారు, ఇతర వాటిని లోకల్‌ ఫండ్‌ డిపార్ట్‌మెంట్లు తనిఖీ చేస్తాయి. ఆ నివేదికలను ఎవరైనా చూడవచ్చు.2011 నుంచి 2015వరకు ప్రభుత్వ నిధుల నుంచి వివిధ ఆలయాలకు రు.231 కోట్లు ఖర్చు చేసింది.”

ఆగస్టు 29(2022) అసెంబ్లీలో చర్చకు ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం చేస్తున్న ఖర్చు, ఇతర అంశాల గురించి ప్రభత్వం వివరాలను ఇచ్చింది. దేవస్థానాల మంత్రి కె రాధాకృష్ణన్‌ ఇచ్చిన సమాచారం మేరకు కరోనాతో ఏర్పడిన సంక్షోభాన్ని అధిగమించేందుకు గత ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం వివిధ దేవాలయాలకు రు.165 కోట్లు ఇచ్చింది. ఈ ఏడాది జూలై 31వరకు తిరువాన్కూర్‌ బోర్డుకు 20 కోట్లు , మలబార్‌ బోర్డుకు రు.44 లక్షలు ఇచ్చింది.” మితవాద హిందూత్వ శక్తులు పదే పదే చేసిన ప్రచారం రిటైర్డ్‌ న్యాయమూర్తిని ప్రభావితం చేసి ఉండవచ్చు. ప్రభుత్వం ఏ దేవాలయాన్ని స్వాధీనం చేసుకోలేదు.2018 నుంచి 2022 వరకు ఐదేండ్లలో వివిధ బోర్డులకు కరోనా, వరదలపుడు ఆదుకొనేందుకు రు.449 కోట్లు ప్రభుత్వం ఇచ్చిందని,30 కోట్లతో శబరిమల మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు పూనుకున్నదని, రిటైర్డ్‌ న్యాయమూర్తి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని రాధాకృష్ణన్‌ మీడియాకు చెప్పారు. మాజీ ఆర్ధిక మంత్రి, సిపిఎం నేత థామస్‌ ఐజాక్‌ స్పందిస్తూ కేరళ ప్రభుత్వ నిధుల గురించి జస్టిస్‌ ఇందు మల్హోత్రాకు తెలియదని, ఆమెకు కమ్యూనిస్టుల గురించి తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లున్నదని అన్నారు.


కరోనా పేరుతో ఆలయాలను మూసివేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ప్రచారం చేసిన శక్తులే తరువాత రాబడి కోసం తెరిచారని, కానుకలు ఇవ్వవద్దని పిలుపులు ఇచ్చాయి. పూజారులుగా కేవలం బ్రాహ్మలు మాత్రమే ఉంటూ, దళితులను అసలు ఆలయ దరి చేరనివ్వని రోజుల సంగతి తెలిసిందే. దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించాలని కోరుతూ కేరళలో జరిగిన ఉద్యమాలకు ఏకె గోపాలన్‌ వంటి కమ్యూనిస్టు నేతలు సారధ్యం వహించారు.2017లో పినరయి విజయన్‌ ప్రభుత్వం తిరువాన్కూర్‌ దేవస్థానం బోర్డులోని ఆలయాల్లో ఆరుగురు దళితులతో సహా 36 మంది బ్రాహ్మణేతర పూజారులను నియమించిన సంగతి తెలిసిందే.రుతు క్రమం జరిగే వయస్సులో ఉన్న మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం కూడదని దాఖలైన పిటీషన్లను కొట్టి వేస్తూ ఎవరైనా దర్శించవచ్చని సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు గురించి తెలిసిందే. ఆ కేసును విచారించిన ఐదుగురు ధర్మాసనంలో ఒకరుగా ఉన్న ఇందు మల్హోత్రా నలుగురి మెజారిటీ అభిప్రాయాన్ని తిరస్కరిస్తూ తన అసమ్మతిని తెలపటమే గాక రుతు క్రమ వయస్సులో ఉన్న మహిళలు ఆలయంలో ప్రవేశించరాదన్న వాదనను సమర్ధించారు. ఇప్పుడు ఆ తీర్పు మీద కొందరు పునర్విచారణకు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. దానితో పాటు బోహ్రా ముస్లింలలో మహిళలకు అంగచ్ఛేదము, ముస్లిం మహిళలకు మసీదుల ప్రవేశనిషిద్దం, వేరే మతం వారిని చేసుకున్న పార్సీ మహిళలకు వారి మత దేవాలయ ప్రవేశ నిషిద్దం వంటి పెద్ద అంశాలన్నింటినీ కలిపి విచారించాలని సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అదింకా తేలలేదు.


జస్టిస్‌ ఇందు మల్హోత్రా వీడియో వైరల్‌ కాగానే బిజెపి నేతలు మరోసారి దాడికి దిగారు.కేరళ బిజెపి నేత కెస్‌ రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ మార్క్సిస్టు నేతలు ఆలయ నిధులను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. ఇందు మల్హోత్రా చెప్పిందాన్లో తప్పేమీ లేదన్నారు. జర్మన్‌ నాజీ ప్రచార మంత్రి గోబెల్స్‌ను ఆరాధ్య దైవంగా భావిస్తూ కాషాయదళాలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మి జస్టిస్‌ ఇందు మల్హోత్రా మాట్లాడినట్లుంది తప్ప కేసు పూర్వపరాలను లోతుగా పరిశీలించినట్లు లేదు. ఇది నిజంగా విచారకరం, అంతకు మించి ఆందోళనకరం. తీర్పుల మీద తప్పుడు ప్రచారాల ప్రభావం ఉంటుందని జనాలు భావించేందుకు ఆస్కారం ఉంది. పద్మనాభస్వామి ఆలయ కేసులో తాను ఇచ్చిన తీర్పులో ఏమి చెప్పారో కూడా కూడా ఇందు మల్హోత్రా మరిచిపోవటం పరిహాసమని లైవ్‌ లా వెబ్‌సైట్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌, మను సెబాస్టియన్‌ ఒక ట్వీట్‌లో విమర్శించారు.ఆలయానికి ప్రభుత్వం చేసిన ఖర్చుకు గాను పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ కమిటీ రు.11.70 కోట్లు చెల్లించాలని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొన్నది. తమ ముందుకు వచ్చిన ఒక కేసులో దిగువ కోర్టుల్లో దాఖలైన అఫిడవిట్లలో ఏమున్నదో కూడా చూడకుండా ఉన్నత కోర్టులు తీర్పు ఇస్తాయా ?ఒక న్యాయవాదిగా ఉంటూ నేరుగా సుప్రీం కోర్టు జడ్జిగా ఎంపికైన తొలి మహిళగా ఇందూ మల్హోత్రా చరిత్రకెక్కారు. వాస్తవాలతో నిమిత్తం లేకుండా పదవి విరమణ చేసిన న్యాయమూర్తులు తాము ఇచ్చిన తీర్పుల గురించి బహిరంగంగా చర్చించటం, వాటిలోనూ మతాన్ని గురించి వక్కాణించటం, ఒక భావజాలంపై విద్వేషాన్ని వెల్లడించటం తగనిపని. ఇది ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నది ? బహుశా ఇలాంటి ఉదంతం మన దేశంలో ఇదే ప్రధమమేమో !


.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మతవిశ్వాసులపై లెనిన్‌ చెప్పిందేమిటి ? కేరళలో కమ్యూనిస్టు వ్యతిరేకత !

16 Sunday Jan 2022

Posted by raomk in Communalism, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

Anti communist, anti communist resolution, CPI(M), IUML, Samastha Kerala Jamayat Ulema, Vi Lenin on believers


ఎం కోటేశ్వరరావు


శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసింది సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం. దానిపై జనాన్ని రెచ్చగొట్టి లబ్దిపొందేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి సంబంధిత సంస్ధలు చేసిన కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం, కుట్రలను జనం వమ్ము చేశారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో అంతకు ముందు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌ కూటమికి చారిత్రాత్మక విజయాన్ని చేకూర్చారు. ఇప్పుడు ముస్లిం లీగు పార్టీ, కొన్ని మత సంస్ధలు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం, చర్యలకే పూనుకున్నాయి. హిందూత్వ శక్తులకు బుద్ది చెప్పిన జనాలు ముస్లింమతశక్తులను సహిస్తారా ?


సమస్త కేరళ జమాయతుల్‌ ఉలేమా(ఎస్‌కెజెయు) మలప్పురం గోల్డెన్‌ జూబిలీ సమావేశంలో ఇటీవల కమ్యూనిస్టు ఉద్యమం, భావజాలానికి వ్యతిరేకంగా చేసిన ఒక తీర్మానం ఆ సంస్ధలోను, వెలుపలా వివాదం రేపింది. తనకు తెలియకుండా చేసిన దానితో తనకు సంబంధం లేదని, తన ఫొటోను జత చేసి ఆ తీర్మానాన్ని ప్రచారం చేయటం పట్ల తన అసంతృప్తిని వెల్లడిస్తూ సంస్ధ అధ్యక్షుడు సయద్‌ మహమ్మద్‌ జిఫ్రీ ముతుకోయా తంగల్‌ తమ పత్రిక సుప్రభాతంలో ప్రకటించారు. ముస్లింలు కేరళలో కమ్యూనిస్టు భావజాలం, ఉద్యమం పట్ల జాగరూకులై ఉండాలని నాస్తికవాదం, దేవుడున్నాడో లేడో తెలియదనే ధోరణిని పధకం ప్రకారం మత విశ్వాసుల్లో కలిగించేందుకు చేసే ప్రయత్నాల పట్ల జాగరూకులై ఉండాలని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. కమ్యూనిస్టులకు మద్దతు ఇవ్వటం, వారితో కలవటం ప్రమాదకరమని నూరిపోయటం తప్ప మరొకటి దాని లక్ష్యం కాదన్నది స్పష్టం. ఆ తీర్మానం తనకు తెలియకుండా చేయటమే కాదు అనుమతి కూడా లేదని తంగల్‌ పేర్కొన్నారు.


మత విశ్వాసులైన పార్టీ సభ్యులు ఆరాధనా స్ధలాలకు వెళ్లటం, క్రతువుల్లో పాల్గొనటాన్ని పార్టీ వ్యతిరేకించటం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియరి బాలకృష్ణన్‌ చెప్పారు. ఏ విశ్వాసానికి, నమ్మకానికి పార్టీ వ్యతిరేకం కాదు, అలాంటి వారికి పార్టీ సభ్వత్వం ఇవ్వకూడదని నిబంధనావళిలో ఎక్కడా లేదు అన్నారు. పూజారులు కూడా పార్టీలో చేరవచ్చని ఒక సందర్భంలో మార్క్సిస్టు మహౌపాధ్యులలో ఒకరైన లెనిన్‌ చెప్పారని కోజికోడ్‌ జిల్లా సిపిఎం మహాసభలో చెప్పారు. నాస్తికత్వాన్ని పాటించటం, మతానికి పార్టీ వ్యతిరేకమని కొన్ని శక్తులు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఓట్ల కోసం విమర్శలు చేశారు. మతాన్ని దెబ్బతీసేందుకు కమ్యూనిస్టులు పూనుకున్నారని ఒక వైపు మతశక్తులు ధ్వజమెత్తుతుంటే మరోవైపు మరికొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఒకేసారి రెండు పరిణామాలు ఎలా జరుగుతాయి. శాస్త్ర, తర్కవిరుద్దం, ఏదో ఒకటే వాస్తవం కావాలి. సిపిఎంపై విమర్శలు చేసే వారు రెండు రకాలు. కమ్యూనిస్టు, లౌకిక భావాజాలాలకు ఎక్కడ దెబ్బ తగులుతుందో అనే సానుకూల వైఖరితో ఆందోళన చెందేవారు, విమర్శలు చేసే వారు కొందరైతే, సందట్లో సడేమియా అన్నట్లుగా రాళ్లేసే వ్యతిరేకులు రెండవ తరగతి.


పార్టీ సభ్వత్వానికి కావలసిన అర్హతల గురించి సిపిఎం కార్యక్రమం, నిబంధనావళి అనే పుస్తకాల్లో స్పష్టంగా ఉంది. అవేమీ రహస్యపత్రాలు కావు. ఎవరైనా పుస్తకాల్లో షాపుల్లో కొనుగోలు చేసి లేదా పార్టీ వెబ్‌సైట్‌లో చదువుకోవచ్చు. నాస్తికులైనే సభ్వత్వం అని లేదు. అలాగే దిద్దుబాటు కార్యక్రమం చేపట్టి అనుసరించాల్సిన పద్దతులు, పార్టీ సభ్యులకు ఉండకూడని అంశాల గురించి కూడా సిపిఎం చెప్పింది. ఇవేవీ పరస్పర విరుద్దంగా కనిపించటం లేదు. ఒకసారి పార్టీ సభ్వత్వాన్ని అంగీకరించిన తరువాత అనుసరించాల్సి ప్రవర్తన గురించి చెప్పిన అంశాలే దిద్దుబాటు. దీని అర్దం ఏదో ఘోరమైన తప్పిదం చేశారని కాదు. పార్టీ ఆమోదించిన ప్రవర్తనా నియమావళిని ఏ స్ధాయిలో ఉన్న వారైనా పాటిస్తున్నారా లేదా అన్నదాన్ని పరిశీలించేందుకు ప్రపంచంలోని ప్రతి పార్టీ అనుసరించిన పద్దతే అది. దానికి ఇమడలేని వారు సభ్యులుగా వైదొలగి మద్దతుదారులుగా ఉండవచ్చు. ఇక పార్టీ సభ్యులు- మత విశ్వాసాల గురించి లెనిన్‌ చెప్పిన సందర్భం ఏమిటి ? ఏమి చెప్పారో ఒకసారి చూద్దాం. లెనిన్‌ కాలంలో మొదటి ప్రపంచ యుద్దంలో టర్కీ కేంద్రంగా ఉన్న ఒట్టోమన్‌ సామ్రాజ్య కూల్చివేతలో నాటి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు ప్రధాన పాత్రధారులు. అందువలన అనేక మంది ముస్లింలు బ్రిటీష్‌ వ్యతిరేకతతో ముందుకు వచ్చారు. అదే విధంగా రష్యాలో జారుచక్రవర్తిని వ్యతిరేకించిన మత పూజారులు, విశ్వాసుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలనే చర్చలు పెద్ద ఎత్తున జరిగాయి. అలాంటి సందర్భంలో అనేక మంది అనేక అభిప్రాయాలు వెల్లడించారు.


ఒక క్రైస్తవ పూజారీ,మత విశ్వాసుడైన కార్మికుల పట్ల పార్టీ ఏ వైఖరి అనుసరించాలనే అంశం గురించి లెనిన్‌ వివరణ ఇచ్చారు. ” ఒక పూజారి పార్టీ లక్ష్యాలను ఆమోదించి వాటి కోసం పార్టీలో చురుకుగా పని చేస్తానని ముందుకు వస్తే అతను పార్టీలో చేరవచ్చు. అతని మతవిశ్వాసం-కమ్యూనిజం మధ్య వైరుధ్యం వస్తే అది అతనికి మాత్రమే సంబంధించిన అంశం. కానీ పూజారి పార్టీలో చేరి ఇతరులను మతంలోకి ప్రోత్సహిస్తే, తన మతభావాలను ఇతరుల మీద రుద్దితే, మతం పట్ల పార్టీ కలిగివున్న అంగీకృత వైఖరికి కట్టుబడి ఉండకపోతే అప్పుడు సభ్వత్వాన్ని కోల్పోతాడు. ఇదే సూత్రం విశ్వాసుడైన ఒక కార్మికుడు పార్టీలో చేరినపుడు కూడా వర్తిస్తుంది. పార్టీలో చేరి తన మత భావాలను ఇతరుల్లో కలిగించేందుకు ప్రయత్నిస్తే పార్టీ నుంచి తొలగించాల్సి ఉంటుంది.” అన్నారు. ఇలా చెబుతున్నపుడు అసలు మత విశ్వాసులను పార్టీలోకి చేర్చుకోవటం ఎందుకు ? అనే ప్రశ్న వస్తుంది.


విప్లవాన్ని సాధించాలన్నా, అందుకు అవసరమైన సాధనం పార్టీ నిర్మాణం జరగాలన్నా సభ్యులను ఎక్కడి నుంచి తేవాలి. ప్రతి వారికీ సమాజంలో ఉన్న వాటిలో ఏదో ఒక బలహీనత, విశ్వాసం ఉంటుంది. వారి నుంచే విప్లవ సైనికులను తయారు చేసుకోవాలి. వివిధ ఆందోళనలు, పోరాటాల సమయంలో చురుకుగా ఉన్న వారిని పార్టీ గుర్తిస్తుంది. అదే విధంగా వివిధ అంశాలపై పార్టీ తీసుకొనే సూత్రబద్ద వైఖరి, పోరాటాల సమయంలో పార్టీ కార్యకర్తలు చూపిన తెగువ, త్యాగాలను చూసి సాధారణ కార్మికులు, జనాలు తాము కూడా పార్టీలో చేరాలని అనుకోవచ్చు. అలాంటి వారిని కొంత కాలం రెండు మూడు దశల్లో తీరుతెన్నులను గమనించి బలహీనతలను సరిదిద్దుకొంటే వారిని సభ్యులుగా తీసుకుంటారు. తరువాత పార్టీ వైఖరికి అనుగుణంగా వారిని మరింతగా తీర్చిదిద్దేందుకు పూనుకుంటారు. ఆ సమయంలో దిద్దుబాటు అంశాలు ముందుకు వస్తాయి.ఒక స్త్రీ లేదా పురుషుడికి అన్నీ మంచి లక్షణాలు ఉండి, మత విశ్వాసాలు ఉన్నాయను కోండి. వారు పార్టీలో చేరతామని ముందుకు వస్తే ముందు మీరు కులాన్ని, మతాన్ని, దేవుడు, దేవతల మీద విశ్వాసాలను వదులుకొని రండి అప్పుడు పరిశీలిస్తాం అంటే కుదురుతుందా ? మతం, విశ్వాసాలు కుటుంబాలు, వ్యక్తిగతం అని చెప్పే కమ్యూనిస్టులు వాటికి కట్టుబడి ఉండేవారికి ఇతర అన్ని అర్హతలు ఉన్నపుడు పార్టీలో చేర్చుకోకపోతే నష్టం ఎవరికి? పార్టీలో చేరిన తరువాత అన్యవర్గ ధోరణులు, మత, మూఢవిశ్వాసాలను పోగొట్టేందుకు తగిన కృషి చేయకపోతే అది పార్టీ లేదా నాయకత్వ తప్పిదం అవుతుంది. సకాలంలో దిద్దుబాటు జరగకపోతే పార్టీలు దెబ్బతింటాయి.


కమ్యూనిజానికి మన మతం వ్యతిరేకం అని ప్రతి మతం వారు చెబుతారు. అలాగని ఏ మతం చెప్పింది. పురాతన మతమైన హిందూ, తరువాత వచ్చిన క్రైస్తవం దాన్నుంచి పుట్టిన తాజా మతం ఇస్లాం ప్రవక్తలు, దేవదూతలు గానీ ఎక్కడా కమ్యూనిజం గురించి చెప్పలేదు, అప్పటికీ అసలా భావనే లేదు కదా ! ఆ మతాలు పుట్టి పెరిగిన సమయంలో కూడా హేతువాదులు, నాస్తికులు ఉన్నారు. పార్టీలో చేరిన వారిని కమ్యూనిస్టులు మార్చి వేస్తారని, దోపిడీ శక్తులకు మద్దతు ఇచ్చే, తమ తిరోగమన, జనాన్ని తమ అదుపులో ఉంచుకొనే అజెండాలు సాగవనే భయంతోనే హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల పెద్దలు అభ్యుదయ, కమ్యూనిస్టు భావజాలాన్ని, పార్టీలను వ్యతిరేకిస్తున్నారు. కమ్యూనిస్టులు రాజీపడితే, భావజాలాన్ని పలుచన చేస్తే మతవాదులకు పేచీ ఉండదు కదా ?
సమస్త మలప్పురం సమావేశ తీర్మానం గురించి చర్చ జరుగుతోంది. తమ సమస్త సమావేశాలు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయాలు చేసేందుకు వేదికలు కాదని జిఫ్రీ కోయా తంగల్‌ స్పష్టం చేశారు. సమావేశాలను ముస్లిం లీగు హైజాక్‌ చేసిందని, రాజకీయ ప్రచారం కోసం వాడు కుంటున్నదని, వాస్తవానికి దీనిలో అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నవారున్నారని చెప్పారు. సమస్త ప్రభుత్వంతో సహకరిస్తుందని, దాని అర్ధం చేతులు కలిపినట్లు కాదని సమస్త సున్నీ యువజన సంఘం నేత అబ్దుస్‌ సమద్‌ పూకొత్తూర్‌ అన్నారు. కమ్యూనిస్టు పార్టీలలో ముస్లిం మతవిశ్వాసులకు స్ధానం ఉండదని, అంత మాత్రాన ఆ పార్టీలతో సంబంధాలు ఉన్న వారందరూ నాస్తికులు,లు, మతవ్యతిరేకులు కాదన్నారు.ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వంలో అనేక పార్టీలు ఉన్నాయని, ప్రభుత్వంతో విరోధ పంధాను ఎంచుకోవటం గాక సహకరించాలని తాము కోరుతున్నట్లు పూకొత్తూర్‌ చెప్పారు.


వక్ఫ్‌బోర్డులో ఉద్యోగుల నియామకాన్ని రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారపు నమాజు సందర్భంగా మసీదులలో ప్రచారానికి పిలుపు ఇచ్చిన ముస్లింలీగ్‌ వైఖరిని సమస్త వ్యతిరేకించింది. దాంతో లీగ్‌ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అంతకు ముందు కోజికోడ్‌ బీచ్‌లో లీగ్‌ నిర్వహించిన సభలో మాట్లాడిన అబ్దుర్‌ రహమాన్‌ కల్లాయి ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై అవాంఛనీయ పదజాలం ప్రయోగించినందుకు ఇతర లీగ్‌ నేతలు క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. రాష్ట్రమంత్రి, డివైఎఫ్‌ఐ నేతగా ఉన్న మహమ్మద్‌ రియాజ్‌తో విజయన్‌ కుమార్తె వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అది అక్రమ సంబంధం అంటూ కల్లాయి నోరుపారవేసుకున్నాడు. అదే సభలో మరో లీగ్‌ నేత కెఎం షాజీ మాట్లాడుతూ మతం మాకు సంబంధించిన అంశం, మతమే మాకు గుర్తింపు, మా చివరి శ్వాసవరకు మతమే మాకు పునాది ” అన్నారు. మతోన్మాదులు తప్ప మరొకరి నోటి నుంచి ఇలాంటి మాటలు రావు. మరుసటి రోజు సిఎం విజయన్‌ కోజికోడ్‌ సభ మాటలను ప్రస్తావిస్తూ ముస్లింలీగ్‌ ఒక రాజకీపార్టీనా లేక మత సంస్తో నిర్ణయించుకోవాలని అన్నారు. లీగ్‌ను మతోన్మాద జమాతే ఇస్లామీ నడిపిస్తున్నదని సిపిఎం పేర్కొన్నది.


వరుసగా రెండవ సారి ఎల్‌డిఎఫ్‌ అధికారంలోకి రావటంతో కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌ నేతలకు పాలుపోవటం లేదు. ముస్లింమతోన్మాద ఎస్‌డిపిఐ, ఆర్‌ఎస్‌ఎస్‌తో ముస్లింలీగు పోటీ పడి మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ తమ పునాదిని నిలుపుకోవాలని చూస్తోంది. నిజానికి వక్ఫ్‌బోర్డు వ్యవహారాలలో ఎల్‌డిఎఫ్‌ చేసిందేమీ లేదు. బోర్డు పాలకవర్గమే సిబ్బంది నియామకాలను పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా జరపాలని చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించింది. నియామక నిబంధనలను కూడా మార్చింది లేదు. ముస్లిమేతరులను సిబ్బందిగా నియమిస్తారంటూ ముస్లింలీగ్‌ రాజకీయ దాడికి, ముస్లింల్లో అనుమానాలను రేకెత్తించటానికి, సిపిఎంపై వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకుంది. ఈ నేపధ్యంలో తలెత్తిన అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ముస్లిం సంస్ధలతో సమావేశం ఏర్పాటు చేసి వాస్తవాలను వివరించిన తరువాత సమస్త నేతలు ఆందోళన మార్గం నుంచి విరమించారు, మసీదుల్లో లీగు ప్రచారాన్ని వ్యతిరేకించారు. మరింతగా చర్చలు జరిపిన తరువాతే అంతిమంగా నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకు యధాతధ స్ధితి కొనసాగుతుందని సిఎం ప్రకటించారు.ఆశించిన విధంగా అధికారం దక్కకపోవటంతో లీగు తన మద్దతుదార్లు చెదరకుండా ఉండేందుకు మతోన్మాదాన్ని ముందుకు తెస్తోంది. అది నెరవేరేనా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d