• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Anti communist

మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేక వున్మాదం ఎందుకు ?

28 Sunday May 2017

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Anti communist, Bernie Sanders, communist, Indonesian Communist Party (PKI).

ఎం కోటేశ్వరరావు

అమెరికాతో సహా అనేక దేశాలలో మరోసారి ఇప్పుడు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇందుకు గాను గతంలో చెప్పిన వాటికి భిన్నమైన కారణాలను చూపుతున్నప్పటికీ పూసల్లో దారంలా వున్న ఏకైక అంశం కమ్యూనిస్టు భావజాల వ్యాప్తిని అడ్డుకోవటమే. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత రష్యాలో తొలి శ్రామిక రాజ్య ఆవిర్భావం, రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ హిట్లర్‌ను కమ్యూనిస్టులు మట్టి కరిపించటం, వలసరాజ్యాలకు జాతీయోద్యమాలు మంగళం పాడటం, చైనాతో సహా సోషలిస్టు శిబిర విస్తరణ వంటి పరిణామాలు అమెరికా నాయకత్వాన కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి నాంది పలికాయి. స్వయంకృత వైఫల్యాలు కొన్ని వున్నప్పటికీ పాతికేండ్ల క్రితం తొలి సోషలిస్టు రాజ్యం, దాని అండతో ఏర్పడిన తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాలను సామ్రాజ్యవాదులు పతనం కావించారు. సోషలిజం, కమ్యూనిజం వెనుక పట్టు పట్టిందనే వాతావరణం ఎల్లెడలా ఏర్పడింది. తాము విజయం సాధించామని కమ్యూనిస్టు వ్యతిరేకులు ప్రకటించుకున్నారు. అయినా సరే ప్రస్తుతం ప్రపంచంలో మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. ఎందుకు ?

కొద్ది రోజుల క్రితం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర ప్రజాప్రతినిధుల సభ కమ్యూనిస్టులు ప్రభుత్వ వుద్యోగాలలో చేరటంపై వున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అది ఎగువ సభ ఆమోదం పొందితే అది అమలులోకి వస్తుందని వచ్చిన వార్తలపై రాసిన ఒక విశ్లేషణను మీరు చదివారు. ఆ తరువాత జరిగిన పరిణామాలలో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సభ్యుడిపై వచ్చిన తీవ్ర వత్తిడి కారణంగా ఎగువ సభ ఆమోదానికి పెట్టకుండానే దానిని వుపసంహరించుకున్నాడు.1950 దశకంలో ఒక అసెంబ్లీలో అలాంటి నిబంధనకు వ్యతిరేకంగా మాట్లాడటమే అనూహ్యం, అలాంటిది 2017లో ఒక ప్రముఖ రాష్ట్రంలో డెమోక్రటిక్‌ పార్టీ సభ్యుడైన రోబ్‌ బంటా ఒక తీర్మానాన్ని ప్రవేశ పెట్టటం తీవ్ర చర్చ, వాదోపవాదాల మధ్య అది ఆమోదం పొందటమే ఆశ్చర్యం. విజయం కమ్యూనిస్టు శక్తులకు వుత్తేజం కలిగించినప్పటికీ దాంతో అంతా అయిపోయిందని, కమ్యూనిస్టు వ్యతిరేకత అంతరించిందని ఎవరూ భావించలేదు, కనుకనే బిల్లు వుపసంహరణ నిరుత్సాహకారణం కాలేదు.

తీర్మానం పెట్టినందుకు నన్ను కమ్యూనిస్టు అన్నారు, చైనా వెళ్లమన్నారు, హత్య చేస్తామని బెదిరించారు. ప్రాధమిక హక్కులకు భంగం కలిగించేదని భావించి నేను ఇప్పటికీ భావిస్తున్నప్పటికీ ఈ సమస్య లేవనెత్తిన మనోభావాల కారణంగా ఆ ప్రతిపాదనతో ముందుకు పోరాదని నిర్ణయించుకున్నానని రోబ్‌ చెప్పాడు. నిజానికి అవి ప్రధాన కారణాలుగా కనిపించటం లేదు. గతేడాది ఎన్నికలలో తాను సోషలిస్టును అని బహిరంగంగా చెప్పుకున్న బెర్నీశాండర్స్‌కు పెద్ద ఎత్తున యువత మద్దతు తెలపటం, అమెరికా ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకుందని, కొంత మంది రష్యాతో కుమ్మక్కయ్యారంటూ రోజూ వస్తున్న వార్తా కథనాలు, అక్కడ కూడా పెట్టుబడిదారీవిధానమే వున్నప్పటికీ ప్రచ్చన్న యుద్ధకాలం నాటి మనోభావాలు ఇంకా అమెరికన్లలో బలంగానే వున్న కారణంగా రోబ్‌పై వత్తిడి అధికమైందని చెప్పవచ్చు.

నిజానికి కమ్యూనిస్టులపై నిషేధం ఎత్తివేయాలన్న ప్రతిపాదన ఇదే మొదటిది కాదు. అన్ని రాష్ట్రాలూ ఏదో ఒక రూపంలో కమ్యూనిస్టు వ్యతిరేక చట్టాలను చేశాయి. అయితే సుప్రీం కోర్టు అలాంటివి చెల్లవు అని చెప్పటంతో అమలు చేయకుండా అలాగే వుంచేశారు. అరిజోనా రాష్ట్రంలో వున్న చట్టాన్ని 2003లో కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడను కాను అని ప్రమాణం చేయటానికి బదులు ఏ వుగ్రవాద సంస్ధలోనూ సభ్యుడను కాను అని సవరించారు. కొన్ని చోట్ల విధేయత ప్రమాణాన్ని స్వచ్చందం చేశారు. అదే కాలిఫోర్నియా రాష్ట్రంలో 2008లో అలాంటి తీర్మానం లేదా బిల్లు ఆమోదం పొందిన తరువాత ఆ రాష్ట్ర గవర్నర్‌గా వున్న సినీ నటుడు ష్కావర్జ్‌నెగ్గర్‌ దానిని వీటో చేశాడు. ‘చట్టాన్ని మార్చాల్సినంత తప్పనిసరి కారణం నాకు కనిపించటం లేదు, అమెరికా లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేసే కమ్యూనిస్టు కార్యకలాపాలకు ప్రభుత్వ వనరులను వినియోగించరాదన్న చట్టాన్ని కొనసాగించాల్సి వుంది ‘ అని కారణం చెప్పాడు. 2012 నుంచి ఇప్పటికి మూడు సార్లు జో ఇట్జ్‌గిబ్బన్‌ అనే డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధి అలాంటి చట్టాన్ని సవరించాలని వాషింగ్టన్‌లో ప్రయత్నించి రిపబ్లికన్ల వ్యతిరేకత కారణంగా విఫలమయ్యాడు. అయితే తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే వుంటానని, రిపబ్లికన్లు తమ వైఖరిని మార్చుకోవాలని, వారి రష్యన్‌ స్నేహితులతో సంప్రదింపులు జరుపుకోవచ్చని జో చెప్పాడు.

అమెరికా ఇలా జరుగుతోంటే దాని కుట్రలో భాగంగా కమ్యూనిస్టులను వూచకోత కోసిన ఇండోనేషియాలో అక్కడి పాలకవర్గం తన నీడను తానే నమ్మలేనంతగా అదిగో కమ్యూనిస్టుల పునరుజ్జీవనం, ఇదిగో కమ్యూనిస్టు చిహ్నం అంటూ వులికి పడుతోంది. ఇండోనేషియాలో కమ్యూనిజ పునరుద్ధరణ గురించి భయపడాల్సిందేమీ లేదంటూనే ఈ సమస్యను అధిగమించాల్సి వుందని ఇండోనేషియా మంత్రి లుహుట్‌ పాండ్‌ జైతాన్‌ తన గోల్కార్‌ పార్టీ జాతీయ నాయకుల సమావేశంలో చెప్పారు.’ సిద్దాంతాన్ని మనం పాతి పెట్టలేము, అది వునికిలోనే వుంటుంది, అయితే దేశ సిద్ధాంతమైన పంచశీలను మార్చేందుకు ప్రయత్నించే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించే వారిని మనం ఎదుర్కోవాలి, ఈ సమస్యను పరిష్కరించేందుకు గోల్కార్‌ పార్టీ సభ్యులందరూ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలి, కమ్యూనిజం పెరగటానికి వీలు లేకుండా చూడాలి అని లుహుట్‌ చెప్పాడు. సుత్తీ, కొడవలి చిహ్నాలున్న టీ షర్టులు అమ్మేవారిని, వేసుకొనే వారిని కమ్యూనిస్టులుగా అనుమానించి అరెస్టులు చేస్తోంది. అక్కడి పాలకవర్గం ఎంతగా వులిక్కి పడుతోందంటే ఇండోనేషియా రిజర్వుబ్యాంకు నకిలీ నోట్లను గుర్తించేందుకు వీలుగా కాపీ చేయటానికి వీల్లేకుండా కొత్తగా ముద్రించిన నోట్లలో అంతర్గతంగా ఏర్పాటు చేసిన లోగో కమ్యూనిస్టు చిహ్నాలను పోలి వుందంటూ అక్కడి ముస్లింమతోన్మాద శక్తులు నానా యాగీ చేశాయి. దాంతో అదేమీ లేదని బ్యాంకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ఆ రాణీ ప్రేమ పురాణం, ఈ ముట్టడికైన ఖర్చులు ఇవి కాదోయ్‌ చరిత్ర సారం అన్నాడు మహాకవి శ్రీశ్రీ . తర తరాలుగా దోపిడీదార్లపై జరిగిన ప్రజా ప్రతిఘటనలో ధీరోదాత్తుల కథలు వుత్తేజాన్ని కలిగిస్తాయి. చారిత్రాత్మక తెలంగాణా ప్రజాప్రతిఘటనలో విసునూరు దేశముఖ్‌ రామచంద్రారెడ్డి గడీ, నైజాం నవాబు రాజ్యం ఎలా ధ్వంసమైందీ ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడిచే విధంగా జనం చెప్పుకుంటారు. కానీ ఆ దేశముఖ్‌, నిజాం వారసులు ఇప్పుడు వచ్చి కమ్యూనిస్టుల చేతిలో తమ కుటుంబాలు బాధపడిన చరిత్రను నమోదు చేయాలని, తమ ప్రతిఘటనను వీరోచితంగా చిత్రించాలని కోరితే ఎలా వుంటుంది? తూర్పు ఐరోపాలో అదే జరుగుతోంది. సోషలిస్టు వ్యవస్దలను కూల్చివేసిన తూర్పు ఐరోపా దేశాలలో జనాన్ని సంతృప్తి పరచటంలో విఫలమైన పాలకవర్గం రెచ్చగొట్టిన కమ్యూనిస్టు వ్యతిరేకతను సజీవంగా వుంచేందుకు నానా గడ్డీ కరుస్తోంది. సోషలిస్టు వ్యవస్ధ ఏర్పాటు సమయంలో తిరుగుబాటు చేసిన భూస్వామిక, పెట్టుబడిదారీ, వాణిజ్యవేత్తల కుటుంబాలకు చెందిన వారి కథలతో దోపిడీ వర్గ చరిత్రను సమాజంపై రుద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక చోట్ల కమ్యూనిస్టు వ్యతిరేక చిహ్నాల ఏర్పాటు, అణచివేతకు గురైన వారి పేరుతో స్మారక కేంద్రాల నిర్మాణాలు చేస్తున్నారు.

ఇలాంటి చరిత్రకు గతంలో స్ధానం ఇవ్వలేదు, భవిష్యత్‌లో వుండదన్నది వేరే చెప్పనవసరం లేదు. ఎక్కడ సోషలిస్టు, కమ్యూనిస్టు భావజాలం వ్యాపించినా అమెరికాలో అందుకు స్ధానం లేదన్నది అనేక మంది భావన. ఎవరి నమ్మకం వారిది, వారి విశ్వాసాన్ని అంగీకరించకపోయినా భావ స్వాతంత్య్రంలో భాగంగా గౌరవిద్దాం. నూరు పూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను సంఘర్షించనివ్వండి. అంతా అయిపోయింది, ఇక భవిష్యత్‌ లేదు అని మెజారిటీ అనుకుంటున్న సమయంలో కమ్యూనిజం గురించి భయపడేవారు వున్నారనే విషయం కూడా ఆ మెజారిటీకి తెలియటం అవసరం. అమెరికాలోని పాలకవర్గ డెమోక్రటిక్‌ పార్టీలో బెర్నీ శాండర్స్‌ అనే ఒక ఎంపీ తాను సోషలిస్టును అని బహిరంగంగా ప్రకటించుకొని ఆ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యర్ధిగా ఎన్నుకోవాలని పోటీకి దిగి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

అమెరికాలోని క్రిస్టియన్‌ లీగల్‌ సొసైటీ అనే ఒక సంస్ధ సిఇఓ డేవిడ్‌ నమో అనే పెద్దమనిషి నేషనల్‌ రివ్యూ అనే పత్రిక మార్చినెల సంచికలో ఒక వ్యాసం రాసి అమెరికా భవిష్యత్‌కు సోషలిస్టు భావజాలం ముప్పు తెస్తున్నది గమనించండి అంటూ మొర పెట్టుకున్నాడు. ఓ సర్వే ప్రకారం పది మందిలో నలుగురు పెట్టుబడిదారీ విధానానికి బదులు సోషలిజానికి ప్రాధాన్యత ఇస్త్నుట్లు తేలిందని హెచ్చరించాడు. బెర్నీ శాండర్సు పలుకుబడి వలన ఈ వుద్యమం ఆదరణ పొందిందని భావించటం గాక అసలు వుద్యమానికి అదొక సూచికగా పరిగణించాలని పేర్కొన్నాడు. అంటే శాండర్స్‌ గాక పోతే మరొకరిని ఆ వుద్యమం ముందుకు తెచ్చేది. సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేకులు భయపడుతున్నది అందుకే.అనేక అనుభవాల తరువాత దోపిడీ వర్గంతో పాటు దానిని వ్యతిరేకించే వారు కూడా తమ ఎత్తుగడలు, భాషకు నగిషీ పెడుతున్నారు. దోపిడీ వర్గం తన అధికారాన్ని కాపాడుకొనేందుకు సాయుధ శక్తులను నిరంతరం పెంచిపోషిస్తుంది. ఏ దేశ చరిత్ర చూసినా పోలీసు, పారామిలిటరీ, మిలిటరీ దోపిడీ వర్గాల ప్రతినిధిగా పని చేయటం తప్ప వారికి వ్యతిరేకంగా ఒక్క వుదంతంలో కూడా వ్యతిరేకంగా వ్యవహరించిన వుదంతం మనకు కనపడదు. దోపిడీ, దోపిడీ శక్తులను ఎదుర్కోవటానికి కార్మికవర్గం శాంతియుత మార్గాన్నే ఎంచుకుంటుంది, అనివార్యమైతేనే ఆయుధాల ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకుంటుంది.ఈ విషయాన్ని కమ్యూనిస్టులు ఎన్నడూ దాచుకోలేదు. తుపాకీ గొట్టం ద్వారానే ఆధికారం తప్ప ఇతర పద్దతులలో రాదంటూ కొందరు హింసాత్మక పద్దతులతో సోషలిజాన్ని సాధిస్తామని పిలుపులు ఇవ్వటం, శ్రామికవర్గ నియంతృత్వాన్ని అమలు చేస్తామనే పదజాలాన్ని వినియోగించటం, అన్ని దేశాలలో దోపిడీ శక్తుల నిర్మూలనకు ఆయుధాలు పట్టిన వుదంతాలను చూపి కమ్యూనిస్టు వ్యతిరేకులు చేయని తప్పుడు ప్రచారం లేదు.

నైజాం నవాబు, అతగాడికి వెన్నుదన్నుగా వున్న దేశముఖులు, జాగీర్దార్లు కోరిన వెంటనే వెట్టి చాకిరీ రద్దు, భూములను దున్నేవారికే అప్పగించి వుంటే తెలంగాణా రైతాంగం ఆయుధాలను పట్టాల్సిన అవసరం వచ్చేదే కాదు. నిర్బంధం పెరిగిన కొద్దీ వడిసెలలతో ప్రారంభించిన దళాలు తుపాకులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కోరిన వెంటనే బ్రిటీషు వారు స్వాతంత్య్రం ఇచ్చి వుంటే భగత్‌ సింగుకు బాంబులతో, సుభాష్‌ చంద్రబోస్‌కు విముక్తి దళాల నిర్మాణం అవసరమయ్యేది కాదు. వినతి పత్రాలతో ప్రారంభమైన స్వాతంత్య్ర వుద్యమం అల్లూరి సీతారామరాజు కాలం నాటికి విల్లంబులు, తుపాకులు పట్టాల్సి వచ్చింది. స్వపరిపాలన, సంపూర్ణ స్వాతంత్య్రం వంటి నినాదాలను క్రమంగా ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రారంభంలో విద్యావంతులైన భారతీయులకు ప్రభుత్వంలో మరింత భాగస్వామ్యం కల్పించాలని మాత్రమే కోరింది.

ప్రస్తుతం అమెరికాలో సోషలిస్టులుగా సగర్వంగా చెప్పుకుంటున్న బెర్నీ శాండర్స్‌ వంటి వారు ప్రజాస్వామిక సోషలిజం గురించి మాట్లాడుతున్నారు తప్ప అమెరికా దోపిడీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామనో, సాయుధపోరాటం చేస్తామనో చెప్పటం లేదు. ఆర్ధిక సంక్షోభం, అసమానతలు, దారిద్య్రం, సంక్షేమ పధకాలకు కోత వంటి వాటిని వ్యతిరేకిస్తున్నారు తప్ప మరొకటి కాదు. వారు కూడా తుపాకి గొట్టం ద్వారానే అధికారం వంటి నినాదాలు ఇచ్చి వుంటే అణచివేత సులభమై వుండేది. తాము కోరుతున్న ప్రజాస్వామిక సోషలిజాన్ని, సంక్షేమ చర్యలను అమలు జరిపేందుకు నిరాకరించినపుడు ఏం చేయాలో అమెరికన్లే నిర్ణయించుకుంటారు. కమ్యూనిస్టు వ్యతిరేకులు భయపడుతున్న అంశమిదే.అందుకే మొగ్గలోనే సోషలిజం కోరుకొనే వారిని తుంచి వేయాలని కోరటంలో అంతరార్ధమిదే. అమెరికాలో కమ్యూ నిస్టు పార్టీ వున్నప్పటికీ ప్రజాస్వామిక సోషలిస్టు పార్టీ(డిఎస్‌ఏ) కూడా ఎన్నో దశాబ్దాల నుంచి నామ మాత్రంగా వుంది. అలాంటి పార్టీలో గతేడాది ఎన్నికల నాటికి 8,500 సభ్యత్వం వుంటే మే నాటికి 21వేలకు చేరిందని అఫింగ్టన్‌ పోస్టు పత్రిక తాజాగా రాసింది. దశాబ్దాలుగా సోషలిజం అనే పదం గిట్టనివారు నేడు దాన్ని వదిలించుకుంటున్నారన్నది స్పష్టం. ఎందుకు ?

అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్ధాయిలో యువత విద్యకోసం తీసుకున్న అప్పులపాలై వున్నారు. రానున్న రెండు దశాబ్దాలలో మరింత యాంత్రీకరణ కారణంగా అమెరికాలో ప్రభుత్వ వుద్యోగాలతో సహా మొత్తం యాభై శాతం వుద్యోగాలు రద్దవుతాయని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. తమ తలిదండ్రుల కంటే దుర్భర పరిస్థితులను అనుభవించే తొలి తరంగా యువత జీవనం గడపబోతున్నది. పర్యావరణ ముప్పు సరేసరి. ఇంతకాలం తాము బలపరిచిన పెట్టుబడిదారీ విధానం ఇంతకంటే తమకు మెరుగైన జీవితాన్ని ఇవ్వదనే విషయాన్ని యువత క్రమంగా గ్రహిస్తున్నది. అందుకే దాని బదులు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు.

గతంలో సోషలిజం ఆకర్షణీయంగా వుండటం కారణమైతే, ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం తీవ్ర సంక్షోభంలో పడటం, అనేక భ్రమలతో సోషలిజాన్ని వదులుకున్న దేశాలు పెట్టుబడిదారీ విధానం గురించి పునరాలోచించటం, అంతకు మించి సోషలిస్టు విధానంలో వున్న వాటి కంటే పరిస్ధితులు దిగజారటం గురించి జనంలో చర్చ జరగటం, ప్రపంచ ఆర్ధిక సంక్షోభం చైనా తదితర సోషలిస్టు దేశాలను అంతగా ప్రభావితం చేయకపోవటం వంటి కారణాలు మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు, జనం ఆ వైపు ఆలోచించకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది.

ఇంటర్నెట్‌ యుగంలో సమాచారాన్ని వక్రీకరించవచ్చు తప్ప వాస్తవ సమాచారాన్ని కోరుకొనే వారిని నిరోధించటం సాధ్యం కాదు. సోషలిజం, కమ్యూనిజం గురించి గతంలో మాదిరి కట్టుకధలు చెబితే యువత బుర్ర ఆడించే పరిస్ధితి లేదు. ఆస్ట్రేలియాలో ఒక హైస్కూలు విద్యార్ధిని ఆ స్కూలు నిరంకుశ యాజమాన్యం రెచ్చగొట్టి దేనికి పురికొల్పిందో చూడండి.

స్వేచ్చా ప్రపంచంగా వర్ణితమయ్యే దేశాలలో ఆస్ట్రేలియా ఒకటి. మేనెల ఏడవ తేదీన సిడ్నీ నగరంలో జరిగిన ఒక మేడే ప్రదర్శనకు జస్సీ అనే 16 సంవత్సరాల హైస్కూలు విద్యార్ధి హాజరయ్యాడు. అది అతనికి తొలి మేడే ప్రదర్శన. అదే రోజు అతని స్కూలు స్ధాపకుడి సంస్మరణార్దం నిర్వహించే కార్యక్రమానికి వెళ్లకుండా జెస్సీ మేడే ప్రదర్శనకు వెళ్లాడు. అందుకు గాను శనివారం నిర్బంధ శిక్ష విధించినట్లు స్కూలు యాజమాన్యం తెలిపింది. తలిదండ్రులకు పంపిన లేఖలో స్కూలు కార్యక్రమానికి బదులు మేడే ప్రదర్శనకు వెళ్లినట్లు, శనివారపు శిక్షలు ఎక్కువగా వుంటే స్కూలు నుంచి బయటకు పంపే విషయాన్ని ఆలోచించాల్సి వుంటుందని హెచ్చరించారు.

గతేడాది స్కూలు స్ధాపకుడి సంస్మరణ కార్యక్రమానికి వెళ్లిన తనకు అక్కడి తంతు విసుగు పుట్టించిందని జెస్సీ చెప్పాడు. మరి మేడే ప్రదర్శనకు ఎందుకు వెళ్లావు అనిఅడిగితే మేడే గురించి ట్విటర్‌లో అమెరికన్ల మరియు ప్రపంచమంతటి నుంచీ జరిగిన రచ్చ గురించి నేను ఎంతో తెలుసుకున్నాను. హాజరైతే ఎలా వుంటుందో తెలుసుకోవాలనే వుబలాటంతో వెళితే నిజంగానే ఎంతో వుద్వేగం కలిగింది అని చెప్పాడు. శనివారం నాడు విధించిన శిక్షా సమయంలో మౌనంగా వుండకుండా స్కూలు చర్యను నిరసిస్తూ అణచివేత గురించి తాను రాసుకు వచ్చిన మార్క్సిజం విశ్లేషణను చదివాడు. వచ్చే ఏడాది మేడే ప్రదర్శనకు హాజరయ్యేందుకు అనుమతి కోసం ప్రయత్నిస్తాను. ఒక వేళ ఇవ్వకపోతే ఎలాగైనా సరే మేడే ప్రదర్శనకు వెళతా. స్కూలు విధించే శిక్ష నన్ను నిరసన తెలపకుండా ఆపలేదు అని చెప్పాడు. అంతే కాదు ఆరోజు స్కూలు ప్రారంభానికి ముందు వుదయం, స్కూలు తరువాత సాయంత్రం రెండు నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నాడు జెస్సీ. పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత తెలిసిందే. అమెరికా, ఇతర దాని వుపగ్రహ దేశాల పాలకవర్గ కమ్యూనిస్టు వ్యతిరేకత కూడా చివరికి దానికే దారి తీస్తుందా ? అవును అని చెప్పటానికి సందేహించనవసరం లేదు, చరిత్ర చెప్పిన సత్యమది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కాలిఫోర్నియా ప్రభుత్వ వుద్యోగాలలో కమ్యూనిస్టులపై నిషేధం ఎత్తివేత !

14 Sunday May 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Anti communist, California state, California state assembly, Communists, Oakland Democrat Rob Bonta, The first Red Scare

ఎం కోటేశ్వరరావు

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ప్రభుత్వ వుద్యోగాలలో కమ్యూనిస్టులు పని చేయటంపై వున్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ మేనెల ఎనిమిదవ తేదీన ఒక తీర్మానాన్ని ఆమోదించింది. తదుపరి శాసన మండలి ఆమోదం పొందితే అది అమలులోకి వస్తుంది. కమ్యూనిస్టులకు ఇది సంతోషకరమైన వార్త అయితే మింగుడుపడని వ్యతిరేకులు గుండెలు బాదుకుంటున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచాన్ని కమ్యూనిజం ఆవహిస్తోందంటూ భయపడిన అమెరికన్‌ పాలకవర్గం కమ్యూనిస్టు వ్యతిరేక, నిషేధ చట్టాలను చేసింది. వుద్యోగం, వుపాధి, కార్మిక, కళా ఇలా ఒకటేమిటి అన్ని జీవన రంగాలలో అనేక లక్షల మందిని కమ్యూనిస్టులు అన్న అనుమానాలతో వెంటాడి వేధించింది. ఇప్పటికీ వేధిస్తోంది, న్యూయార్క్‌ నగరంలో ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కమ్యూనిస్టు కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణతో అక్కడి విద్యాశాఖ విచారణ చేపట్టిన విషయం, దానిని ఆపాలని కోరితే కోర్టు తిరస్కరించిన వుదంతం ఇదే సమయంలో జరిగింది.

మరోవైపున అమెరికాలోని కమ్యూనిస్టు వ్యతిరేకులు తమ ప్రయత్నాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రతి ఏటా ఫ్రీడం ఫెస్టివల్‌ పేరుతో జరిపే కార్యక్రమాలలో భాగంగా ఈ ఏడాది ‘వందేళ్ల భావజాల పోరులో పెట్టుబడిదారీ విధానమా ? మ్యూనిజమా ఎవరు గెలిచారు?’ అనేపేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తూర్పు ఐరోపా, సోవియట్‌లో సోషలిజాన్ని కూల్చివేసిన సమయంలో రాబర్ట్‌ హెయిల్‌బర్టన్‌ అనే అమెరికన్‌ ఆర్ధికవేత్త న్యూయార్కర్‌ అనే పత్రికలో రాసిన వ్యాసంలో ‘పెట్టుబడిదారీ విధానం-సోషలిజం మధ్య యుద్ధం ముగిసింది. సోషలిజం విఫలమైంది, పెట్టుబడిదారీ విధానం విజయం సాధించింది. దీంతో చరిత్ర ముగసింది ‘ అని రాశాడు. ఆ పెద్దమనిషి 2005లో 85 ఏండ్ల వయస్సులో వృద్ధాప్యంతో మరణించాడు. ఇన్ని సంవత్సరాల తరువాత ఎవరు విజయం సాధించారు అనే చర్చకు ఆ పెద్దమనిషి వారసులైన కమ్యూనిస్టు వ్యతిరేకులు తెరతీశారంటే అనుకున్న, ఆశించిన దానికి భిన్నంగా జరుగుతోందనే అనుమానం వారిలో తలెత్తినట్లే !

కాలిఫోర్నియా అసెంబ్లీలోని డెమోక్రటిక్‌ పార్టీ సభ్యుడు రోబ్‌ బోంటా గతేడాది డిసెంబరులో కమ్యూనిస్టులపై నిషేధం ఎత్తివేయాలనే బిల్లును ప్రవేశపెట్టాడు. కమ్యూనిస్టు అనే ముద్ర పాతదైన పుక్కిటి పురాణ ప్రస్తావన వంటిది. దానిని దుర్వినియోగం చేసే అవకాశం వుంది, నిర్మొగమాటంగా చెప్పాలంటే గతంలో మన చరిత్రలోని కొన్ని చీకటి అధ్యాయాలలో అది జరిగింది, అందువలన సాంకేతికంగా దానిని తీసివేయాల్సి వుంది అని తన బిల్లు వుద్దేశ్యాన్ని వివరించాడు. ఈ సవరణ ప్రకారం కమ్యూనిస్టు పార్టీ సభ్యులు అనే పదాన్ని మాత్రమే తొలగిస్తారు. హింసా మార్గాల ద్వారా ప్రభుత్వాన్ని కూలదోసే ఏ సంస్ధ సభ్యుల నైనా ప్రభుత్వ వుద్యోగాల నుంచి తొలగించ వచ్చు అనే నిబంధన ఇక ముందు కూడా కొనసాగుతుంది. కమ్యూనిస్టుల నుంచి ఇప్పటికీ ముప్పు వుందని ఆ పదాన్ని తొలగించటం మొత్తం కాలిఫోర్నియన్లను అవమానించటమే అని రెచ్చగొట్టే విధంగా కొందరు రిపబ్లికన్‌ సభ్యులు వ్యాఖ్యానించారు.

ఆండ్రూ మిల్లర్‌ అనే వ్యాఖ్యాత ఒక పత్రికలో ఇలా గగ్గోలు పెట్టాడు. ‘1991లో సోవియట్‌ యూనియన్‌ కూలిపోయినపుడు అమెరికా విశ్వవిద్యాలయాలలో తప్ప ప్రతి చోటా మార్క్సిజం చచ్చిపోయింది అని కొంత మంది జోకు వేశారు. ఇరవైఆరు సంవత్సరాల తరువాత విద్యావేత్తల వలయం నుంచి ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన స్రవంతిలోకి వచ్చింది. కాలిఫోర్నియా సెనెట్‌(మన శాసనమండలి మాదిరి)లో ఈ బిల్లు విజయవంతంగా ఆమోదించబడుతుందా లేదా అన్నది తార్కికాంశం. ఒక వాస్తవం ఏమంటే త్వరలో కమ్యూనిస్టులు త్వరలో అధికారానికి వస్తారా అన్నది రాజకీయాలలో గొప్ప ప్రాధాన్యత వున్న అంశం కాదు. ఎన్నికలలో మార్క్సిజాన్ని కూడా సాధ్యమైన అంశంగానే పరిగణిచాలని నమ్మేంత వరకు అమెరికా సంస్కృతి రావటమే భయంగొలుపుతున్న వాస్తవం. 2006లో జరిగిన ఒక సర్వే ప్రకారం అమెరికన్‌ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లలో మూడు శాతం మంది స్వయంగా తాము మార్క్సిస్టులమని చెప్పుకున్నారు. హ్యుమానిటీస్‌ ప్రొఫెసర్లలో ఐదుశాతం, సామాజిక శాస్త్రాల వారిలో 18శాతం వున్నారు. మితవాదులతో పోల్చితే ఒక సామాజిక శాస్త్ర ప్రొఫెసర్‌ తాను మార్క్సిస్టును అని మూడు రెట్లు ఎక్కువగా స్పష్టంగా చెబుతారని ఈ సర్వేలో తేలింది.2011లో రాస్‌ముసేన్‌ నివేదిక ప్రకారం వర్తమాన అమెరికా రాజకీయ, ఆర్ధిక వ్యవస్ధల కంటే నైతికంగా కమ్యూనిజం వున్నతమైందని అమెరికన్‌ ఓటర్లలో 11శాతం మంది భావించటం ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించదు………..అమెరికా కాంగ్రెస్‌(పార్లమెంట్‌ దిగువ సభ)లో 14శాతం మంది అభ్యుదయగామి సభ్యులున్నారని డెమోక్రటిక్‌ సోషలిస్టులు కనుగొన్నారు. మార్క్సిజం మరణించలేదు అనటానికి ఇది పెరుగుతున్న సాక్ష్యం. అది అమెరికన్‌ విశ్వవిద్యాలయాలలో సజీవంగా వుంది సమాజంలోని ఇతర చోట్లకు విస్తరిస్తోంది…..1960 దశకపు ‘నూతన వామపక్ష విద్యార్ధి విప్లవకారులు’ ఇప్పుడు ఆధునిక డెమోక్రటిక్‌ పార్టీ నాయకులుగా వున్నారు. కాలిఫోర్నియాలోని అలంకార ప్రాయమైన రాజకీయ నేతల గురించే మనం మాట్లాడటం లేదు. ఈ విప్లవ నాయకులు నూతన సహ్రాబ్ది యువతరాన్ని ఆకర్షించేందుకు తమ పార్టీని మరింతగా వామపక్షం వైపునకు తీసుకుపోతున్నారు. ఈ సంఖ్య ఎక్కువగా డెమోక్రటిక్‌ మరియు చివరికి సోషలిస్టులవైపు మొగ్గితే ఈ వ్యూహం చివరికి పౌర అశాంతి మరియు హింసాత్మక విప్లవానికి దారితీస్తుంది.’అని మిల్లర్‌ హెచ్చరిక చేశాడు.https://www.thetrumpet.com/15791-california-mulls-communists-in-government

మరో కమ్యూనిస్టు వ్యతిరేకి మార్క్‌ స్కౌసెన్‌ ‘మ్యూనిజం ఎందుకు పని చేయదు, అయినా ఇప్పటికీ ఆకర్షిస్తోంది’ అనే శీర్షికతో ఒక పత్రికలో వ్యాసం రాశాడు. తాను మార్క్సిజం గురించి జీవిత కాలంలో ఎక్కువగా చదివానని చెప్పుకున్న ఆ పెద్దమనిషి తన తండ్రి కమ్యూనిస్టు వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే ఎఫ్‌బిఐ ఏజంట్‌ లియోరీ స్కౌసెన్‌ అని, పినతండ్రి ది నేకెడ్‌ కమ్యూనిస్టు అనే పుస్తకం రాసిన క్లియోన్‌ స్కౌసెన్‌ అని స్వయంగా చెప్పుకున్నాడు కనుక అతనేమిటో చెప్పనవసరం లేదు. అనేక విషయాలను ఏకరువు పెడుతూ అయినప్పటికీ ఇంకా విప్లవకారులు ఆకర్షణీయంగానే వున్నారని అనేక విశ్వవిద్యాలయాలలో &ద్యార్ధులు చే గువేరా టీ షర్టులు ధరించటం, ప్రొఫెసర్లు మార్క్సిజం గురించి చెబుతున్నారని వాపోయాడు. ఫ్లోరిడాలోని రోలిన్స్‌ కాలేజీకి వెళ్లినపుడు ఎదురైన తన స్వంత అనుభవాన్ని ఇలా వివరించాడు. అక్కడి ఒక మార్క్సిస్టు ప్రొఫెసర్‌ను గుర్తించి నేను నీకు 1883 నాటి ఒక వెండి డాలర్‌ ఇస్తాను, అయితే దానిని ముద్రించిన సంవత్సరంలో మరణించిన ఒక ఆర్ధికవేత్త పేరు చెప్పాలి అని షరతు పెట్టాడట. వెంటనే ఓ అదెంతో సులభం, ఆయన కారల్‌ మార్క్స్‌ అని జవాబు వచ్చిందట. సరైనదే, ఎప్పుడూ మరచి పోవద్దు ఆయన మరణించాడు అన్నాడట.దానికి ఠకీమని ఆ ప్రొఫెసర్‌ ఇలా జవాబు చెప్పాడట.’ అవును మీరు చెప్పింది కరేక్టే, ఆయన మరణించాడు కానీ నేను బతికి వున్నాను, మార్క్సిజం లోని శక్తి, ప్రభావం వంటి గురించి మీ విద్యార్దులకు నేను బోధిస్తున్నాను ‘ అన్నాడట. అడిగిన పెద్దమనిషికి ఏమై వుంటుందో చెప్పనవసరం లేదు. వ్యక్తులు మరణించినంత మాత్రాన శాస్త్రీయ భావజాలాలు మరణిస్తాయి, వుద్యమాలు అంతరిస్తాయని భ్రమపడే చరిత్ర జ్ఞానం లేని లేదా తెలిసీ అడ్డంగా వాదించే వారికి ఇంతకంటే జవాబు అనవసరం.

మార్క్‌ స్కౌసెన్‌ ఇంకా ఇలా రాశాడు.’ పిల్లలకు కమ్యూనిజం’ పేరుతో రాసిన ఒక చిన్న పుస్తకాన్ని ఇటీవలే మిట్‌ ప్రెస్‌ ముద్రించటాన్ని చూశాను. అది రాసిన ఓ జర్మన్‌ కమ్యూనిస్టు పెట్టుబడిదారీ విధాన లోపాలను మాత్రమే చూశారు, కమ్యూనిజం లోపాల గురించి ఏమీ చెప్పలేదు.అది ఇరవయ్య శతాబద్దంలో పదికోట్ల మందిని చంపింది, ఇప్పటికీ కోట్ల మందికి క్యూబా,వెనెజులా, వుత్తర కొరియాలో జీవితం, స్వేచ్చ,ఆస్ధిని మరియు సంతోషంగా వుండటాన్ని నిరాకరిస్తోంది. ఈ రోజు విద్యార్ధులు మరియు అనేక మంది పౌరులు కమ్యూనిస్టు లేదా సోషలిస్టు తత్వశాస్త్ర ప్రయోజనాలకు ఆకర్షితులౌతున్నారు, ప్రత్యేకించి విద్య, వైద్యం మరియు ఇతర మౌలిక సదుపాయాలను ప్రభుత్వాలు వుచితంగా అందచేయాలనే దానికి ఆకర్షితులౌతున్నారు.’

అతి సర్వత్ర వర్జయేత్‌ అని పెద్దలు చెప్పారు, ఎంత ఎత్తు పెరిగితే అంత త్వరగా కూలిపోయే అవకాశం వుంటుంది. బొల్లు బొల్లరా ఎంకన్నా అంటే మా వూళ్లో మిరియాలు తాటికాయలంత వుంటాయి దొరా అన్నట్లు కమ్యూనిస్టు వ్యతిరేకత గురించి అతిశయోక్తులతో ఎంతో చెత్తరాశారు. ఇప్పటికీ కిరాయి రచయితలు రాస్తూనే వున్నారు. చైనాలో చర్చిలను కూల్చివేస్తున్నారని, క్రైస్తవుల సమావేశాలను అడ్డుకుంటున్నారని మీడియాలో ప్రతి రోజూ ఒక పధకం ప్రకారం వార్తలు వస్తుంటాయి. గతంలో సోవియట్‌లో చర్చిలన్నింటినీ కూల్చివేశారని చేసిన ప్రచారం తెలిసిందే. నిజానికి ఏ ఒక్క చర్చిని కూడా కూల్చివేయలేదు. యథాతధంగా వున్నాయని ఇప్పుడందరూ చెబుతున్నారు. చైనాలోని హోనాన్‌ రాష్ట్రంలో మావో పుట్టారు. ఆయన పెరిగిన చాంగ్‌షా పరిసరాలన్నీ క్రైస్తవులు ఎక్కువగా వుండేవి. అక్కడే స్కూలులో మావో కమ్యూనిస్టు పాఠాలు నేర్చుకున్నాడు. అలాంటి పట్టణంలో మావో విగ్రహం కంటే ఎత్తైన 260 అడుగుల చర్చి భవనాన్ని నిర్మిస్తున్నారని, దానికి ప్రభుత్వ సబ్సిడీ కూడా వుందని న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక రాసింది. మావో కమ్యూనిస్టు పాఠాలు నేర్చుకున్న చోట చర్చికి అనుమతించటం, దానికి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వటం ఏమిటని కొందరు అభ్యంతర పెట్టినప్పటికీ ప్రభుత్వం అనుమతించింది.అయితే ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే మతశక్తులు ఎవరైనా అలాంటి వారిపై చైనా సర్కార్‌ చర్యలు తీసుకుంటోంది. అంతే తప్ప మత స్వేచ్చను అణచటం లేదు.http://www.gospelherald.com/articles/70424/20170511/massive-church-being-built-city-where-mao-zedong-first-embraced.htm  కమ్యూనిస్టు వ్యతిరేకత గురించి నూరిపోసిన వారి మాటలకు ఇప్పుడు విశ్వసనీయత సమస్య ఎదురవుతోంది. పెట్టుబడిదారీ దేశాలలో తలెత్తిన తీవ్ర సమస్యలు, సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసి పెట్టుబడిదారీ వ్యవస్దలను తిరిగి రుద్దిన చోట జనం అనుభవిస్తున్న జీవితాన్ని చూసిన తరువాత కమ్యూనిస్టు వ్యతిరేకత ఇప్పుడు పశ్చిమ దేశాలలో అంత ఆకర్షణీయంగా లేదు. అయినా చరిత్రను వెనక్కు తిప్పాలని చూసే తిరోగమన వాదులు తమ ప్రయత్నాలను మానుకోవటం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వివక్షను ప్రశ్నించిన మహిళా టీచర్‌పై కమ్యూనిస్టు ముద్ర !

07 Sunday May 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Anti communist, Brooklyn School, communist, Discrimination, Jill Bloomberg, Park Slope Collegiate, Principal Jill Bloomberg

ఎం కోటేశ్వరరావు

అపర ప్రజాస్వామిక దేశంగా, ఎలాంటి పరిమితులు లేని స్వేచ్ఛా ప్రపంచంగా కీర్తి ప్రతిష్టలతో అలరారుతోంది అమెరికా. తమకు నిధులు కేటాయించటంలో వివక్ష చూపారని ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వ్యాఖ్యానించటమే అక్కడ నేరమైంది.ఇంకే ముంది, రంగంలోకి దిగిన విద్యాశాఖ అబ్బే దానితో సంబంధం లేదు ఆమె కమ్యూనిస్టు కార్యకలాపాలలో పాల్గొన్నారా లేదా అనేది మాత్రమే విచారణ చేస్తున్నామని చెబుతోంది. అమెరికాలో కమ్యూనిస్టు పార్టీ బహిరంగంగా పని చేస్తోంది. దాని ప్రతినిధులు ఎన్నికలలో పోటీ చేసేందుకు అవకాశం వుంది. అయినా ఒక టీచరు రాజకీయ కార్యకలాపాల గురించి, అందునా ఆమె కమ్యూనిస్టు అని ఆరోపిస్తూ విచారణ జరపటం గమనించాల్సిన అంశం. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా ? బ్రూక్లిన్‌ ప్రాంతంలోని పార్క్‌ స్లోప్‌ కాలేజియేట్‌ స్కూలు ప్రధానోపాధ్యుయురాలు జిల్‌ బ్లూమ్‌ బెర్గ్‌ ఆ విచారణను సవాలు చేస్తూ తన రాజకీయ కార్యకలాపాల గురించి ఎలాంటి రుజువులు లేవని, నిధుల కేటాయింపు గురించి తాను చేసిన బహిరంగ వ్యాఖ్యలకు కక్ష సాధింపు చర్యగా జరుపుతున్న విచారణను నిలిపివేయలసిందిగా ఆమె చేసిన విన్నపాన్ని న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌ ప్రాంత కోర్టు ఈనెల మూడున తిరస్కరించింది.

మార్చినెల మొదటి వారంలో న్యూయార్క్‌ నగర విద్యాశాఖ ప్రత్యేక దర్యాప్తు విభాగ ప్రతినిధి ఒకరు వచ్చి ప్రధానోపాధ్యాయురాలు బ్లూమ్‌బెర్గ్‌పై విచారణ జరుపుతున్నట్లు ఆమెకు తెలియచేశారు. ఏ అంశం గురించి విచారణ జరుపుతున్నదీ, వాటి స్వభావం గురించి కూడా తాము చెప్పకూడదని, సిబ్బందితో మాట్లాడాల్సి వుందని మాత్రమే తెలిపారు. ఆ తతంగం ముగిసిన తరువాత కమ్యూనిస్టు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపించి విచారణ జరుపుతున్నారని సిబ్బందిలో ఒకరు బ్లూమ్‌బెర్గ్‌కు తెలిపారు. పరిహాసానికి అలా చెప్పారేమోనని తొలుత భావించిన ఆమె తరువాత ఇలాంటిదేదో జరుగుతుందని తాను చాలాకాలంగా వూహిస్తున్నానని చెప్పారు.

న్యూయార్క్‌ నగర ప్రభుత్వ స్కూళ్ల తీరుతెన్నులు, విద్యాశాఖ వున్నతాధికారుల గురించి గత కొన్ని సంవత్సరాలుగా ఆమె విమర్శనాత్మకంగా మాట్లాడటం, ఆ విషయాలు మీడియాలో రావటం బహిరంగ రహస్యమే. నల్లజాతీయులు, లాటినోల పిల్లల విషయంలో వివక్ష పాటిస్తున్నారని ఆమె విమర్శించేవారు. తమ పాఠశాల ప్రాంగణంలోనే నిర్వహిస్తున్న మరొక పాఠశాలలో ఆ ప్రాంతంలో మైనారిటీలుగా వున్న శ్వేతజాతీయుల పిల్లలు చదువుతున్నారు. క్రీడలకు నిధుల కేటాయింపులో ఒకే దగ్గర వున్న రెండు స్కూళ్లలో తమ స్కూలు పట్ల వివక్షతో తక్కువ నిధులు కేటాయించారన్నది ఆమె తాజా విమర్శ. ఇలాంటి వాటిపైనే గత కొంత కొన్ని సంవత్సరాలుగా ఆ స్కూలు విద్యార్ధులు, తలిదండ్రులు చేస్తున్న ఆందోళన, సమీకరణల పట్ల ఆమె సానుకూలంగా వుండటం అందరికీ తెలిసిన అంశమే.

విద్యాశాఖ దర్యాప్తు విషయం వెల్లడైన తరువాత తనపై తప్పుడు ఆరోపణలతో విచారణ జరుపుతున్నారని అది తన వ్యక్తిగత, భావ ప్రకటనా స్వేచ్చ, పౌరహక్కుల రక్షణ చట్టానికి విరుద్దం కనుక తాను దాఖలు చేసిన పిటీషన్‌పై తీర్పు వెలువడే వరకు దర్యాప్తు నిలిపివేయాలని ఆమె కోర్టుకు విన్నవించారు. విచారణ నిలిపివేయలేమని కోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా బ్లూమ్‌బెర్గ్‌పై దర్యాప్తు గురించి ఆమె న్యాయవాదికి విద్యాశాఖ ఆరోపణలను అందచేశారు. పాఠశాల పని వేళల్లో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించటం, ఎలాంటి నిధి వసూలు చేయటం నిషేధమని, అయితే ఆమె, మరో ఇద్దరు టీచర్లు ఒక కమ్యూనిస్టు సంస్ధ అయిన ప్రోగ్రెసివ్‌ లేబర్‌ పార్టీ కార్యకర్తలని, పార్టీ నిర్వహించే ప్రదర్శనలతో సహా దాని కార్యకలాపాలలో పాల్గొనేందుకు విద్యార్ధులను సమీకరిస్తున్నారని, ఆ పార్టీకి నిధులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

న్యూయార్క్‌లో టీచర్‌గా పనిచేయటానికి ముందు చికాగాలో పని చేసిన ఆమె 2004లో బ్రూక్లిన్‌ పాఠశాలకు ప్రధానోపాధ్యాయురాలిగా వచ్చారు. ఆ సమయంలో ఒక భవనంలో మూడు చిన్న హైస్కూళ్లు వున్నాయి. అందులో ఒక దానికి ఆమె ప్రధానోపాధ్యాయురాలు. ఆ భవనం ఎలా వుందంటే పై కప్పు నుంచి వర్షపునీరు కారుతుంది. మరుగుదొడ్ల గురించి చెప్పాల్సిన పని లేదు. తరగతి గదుల గోడలు బూజుపట్టి వున్నాయి. తలుపులు, కిటికీలు మామూలుగా తెరుచుకొనే స్ధితిలో లేవు. ప్రభుత్వ పాఠశాలలను మూసి వేసేందుకు పొమ్మునకుండానే పొగబెడుతున్న అమెరికా సర్కార్‌ నిధుల కేటాయింపులో వివక్ష పాటిస్తున్నట్లు ఆ సమయంలో ఆమెకు ఊహకు అందలేదు. అనేక మంది మాదిరి దాన్నే వున్నంతలో బాగు పరిచేందుకు పూనుకొని పని చేశారు. అయితే 2010లో జరిగిన పరిణామాలు ఆమె ఆలోచనలో మార్పు తెచ్చాయి. తమ భవనంలో వున్న స్కూళ్లకు తోడు అదనంగా తెల్లవారి పిల్లల కోసమంటూ ప్రత్యేకంగా ఒక స్కూలును ఏర్పాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. వున్న స్కూళ్లలో అదనంగా చేర్చేందుకు అవకాశం వుండగా కొత్త స్కూలు ఎందుకని ఆమె ఆమాయకంగా ప్రశ్నించారు. ఆ స్కూలును సదరు భవనంలో ఏర్పాటు చేస్తే శిధిలావస్తలో వున్న మిగతా స్కూళ్లకు కూడా నిధులు వస్తాయని నమ్మబలుకుతూనే అసలు విషయం చెప్పారు. తెల్లపిల్లలకు విడిగా స్కూలు ఏర్పాటు చేస్తే వారి ప్రతిభ, మరియు ప్రవర్తనను విడిగా పర్యవేక్షించటానికి అవకాశం వుంటుందని కూడా తెలిపారు. అది వివక్ష తప్ప మరొకటి కాదని ఆమెకు అప్పుడు అర్ధమైంది. కొత్త స్కూలు అయితే పెట్టారు గాని పాత స్కూళ్ల మెరుగుదలకు ఎలాంటి నిధులు ఇవ్వలేదు. తెల్లవారి పిల్లలకు ఏర్పాటు చేసిన స్కూళ్లకు ఎలాంటి కొరత లేకుండా నిధులు మంజూరు చేస్తున్నపుడు తమ వరకు వచ్చే సరికి ఎలా లేకుండా పోతాయని ఆమె ప్రశ్నించటం ప్రారంభించారు. పిల్లలు, తలిదండ్రులు కూడా నిరసన తెలిపినా ఫలితం లేకపోయింది.

తమ పాఠశాలలో మెటల్‌ డిటెక్టర్‌ను ఏర్పాటు చేయాలన్న విద్యార్ధుల ఆందోళనకు బ్లూమ్‌బెర్గ్‌ మద్దతు తెలిపారు. స్కూలు అసెంబ్లీలో పోలీసుల హింస, వివక్ష, జాత్యహంకారంతో కూడిన విద్యాశాఖ విధానాల గురించి ఆమె మాట్లాడటమేగాక ఇతరులను ప్రోత్సహించారు. అదే స్కూలులోని కొందరు టీచర్లు ఈ ధోరణిని వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో ప్రధానోపాధ్యాయురాలిగా విద్యాశాఖకు ఒక మెయిల్‌ పంపారు. ఒకే భవనంలోని మిగతా స్కూళ్లలో వున్న క్రీడా బృందాల కంటే తక్కువ వున్న తెల్లవారి పిల్లల స్కూలుకు రెండింతలు ఎక్కువగా నిధులు మంజూరు చేయటాన్ని దానిలో అభ్యంతర పెట్టారు.మెయిల్‌ చేరిన వెంటనే దర్యాప్తు సిబ్బంది ఆమె స్కూలుకు వచ్చారు. టీచర్లలో విభజన ఏర్పడింది. వారిలోని కొంత మంది ఆమెను కమ్యూనిస్టుగా చిత్రిస్తూ ఫిర్యాదు చేసినట్లు కూడా తేలింది. బ్లూమ్‌బెర్గ్‌ భర్త నిర్వహించే ఒక సంస్ధ నిధుల సేకరణలో భాగంగా స్కూలులో ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించారని, దానికి గాను ఒక్కొక్కరి నుంచి 20 డాలర్లు సేకరించారని, తద్వారా బ్లూమ్‌ బెర్గ్‌కు కూడా లబ్ది చేకూరిందని, ఈ కార్యక్రమానికి సిబ్బంది, విద్యార్దుల అంగీకారం తీసుకోలేదన్నది ఒక ఆరోపణ ప్రోగ్రెసివ్‌ లేబర్‌ పార్టీ వెబ్‌సైట్‌లో పేర్కొన్నదాని ప్రకారం బ్లూమ్‌బెర్గ్‌ పని చేస్తున్న స్కూలులోని కొందరు విద్యార్ధులు ఆ పార్టీ నిర్వహించే అధ్యయన బృందాలలో చేరారని, వర్గ చైతన్యాన్ని కలిగించేందుకు సదరు స్కూలును వినియోగించుకుంటున్నారని, దానికి ఆమే కారణమని చేసిన ఆరోపణను బ్లూమ్‌బెర్గ్‌ తిరస్కరించారు. ఆ పార్టీ తమ పాఠశాలలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదని, పిల్లలు లేదా వారి తలిదండ్రులు బయటి కార్యక్రమాలలో పొల్గొంటే తానెలా బాధ్యురాలినౌతానని ఆమె ప్రశ్నించారు.

తనపై జరుపుతున్న విచారణను నిలిపివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్‌ విచారణ సందర్భంగా కొందరు టీచర్లు, ప్రస్తుత, పూర్వ విద్యార్ధులు, తలిదండ్రులు ఎందరో బ్లూమ్‌బెర్గ్‌కు మద్దతుగా కోర్టు హాలుకు వచ్చారు.విద్యాశాఖ విచారణ తన భావ ప్రకటనా స్వేచ్చకు ఎలా ఆటంకం కలిగించిందో స్పష్టం చేయలేకపోయారని జడ్డి వ్యాఖ్యానించారు. విచారణ తీరు, దానిలో వాడిన భాష కమ్యూనిస్టు వ్యతిరేక మెకార్ధీ కాలాన్ని గుర్తుకు తెస్తోందని న్యూయార్క్‌ సిటీ పౌరహక్కుల సంఘం డైరెక్టర్‌ డోనా లైబర్‌మన్‌ వ్యాఖ్యానించారు.

ప్రధానోపాధ్యాయురాలు కమ్యూనిస్టా లేక కమ్యూనిస్టు కార్యకలాపాలను ప్రోత్సహించారా లేదా అన్నది ఒక అంశం. తమ స్కూలులో అలాంటి కార్యకలాపాలేవీ నిర్వహించలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కూళ్లలో అధికారికంగా కమ్యూనిస్టు వ్యతిరేక, అనుకూల కార్యకలాపాలతో బాటు, ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకూడదు. తమ స్కూలు పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని ప్రధానోపాధ్యాయురాలిగా వ్యాఖ్యానించటం లేదా విమర్శించటం సమర్ధనీయమే. ఆ కారణంగానే ఆమెకు కమ్యూనిస్టు అని ముద్రవేయటం నిజంగా కమ్యూనిస్టులు గర్వించదగిన అంశం. వివక్ష, జాత్యహంకారం వంటి వాటిని ప్రశ్నించేవారందరినీ కమ్యూనిస్టులు అని పిలిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది. కమ్యూనిజానికి దూరంగా వున్న వారిలో కనీసం ఒక్కరిని ఆ శిబిరంలోకి నెట్టేందుకు ఎవరు పూనుకున్నా వారందరూ అభినందనీయులే. న్యూయార్క్‌ నగర మేయర్‌గా వున్న డి బ్లాసియో డెమోక్రటిక్‌ పార్టీలోని వామపక్ష వాదిగా పేరుంది. అయినప్పటికీ యంత్రాంగం కమ్యూనిస్టు వ్యతిరేకులతో నిండి వున్నపుడు, ఆ పార్టీలో కూడా పుష్కలంగా కమ్యూనిస్టు వ్యతిరేకులు వున్నపుడు ఒక్క మేయర్‌ ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను అడ్డుకోలేరని ఈ వుదంతం స్పష్టం చేసింది. తన పెరటి తోటగా భావించే లాటిన్‌ అమెరికాలోనే వామపక్ష, సోషలిస్టు, కమ్యూనిస్టు శక్తుల వ్యాప్తిని అడ్డుకోవటంలో విఫలమైన అమెరికా యంత్రాంగం తమ స్వంత దేశంలో అలాంటి ప్రతి ప్రయత్నంతో తమ ప్రజాస్వామ్య బండారాన్ని బయటపెట్టి ఆచరణలో మేడి పండు చూడ మేలిమై వుండు పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్లుగా నిరూపించుకుంటోంది.

ప్రతి నిరంకుశ వ్యవస్ధ తనను నాశనం చేసే శక్తులను తానే చేసుకుంటుంది, బయటి నుంచి ఎవరూ రానవసరం లేదన్నది చరిత్ర చెప్పిన సత్యం. అది అమెరికన్లకు ఎలా వర్తించకుండా వుంటుంది? వారేమైనా పరలోక జీవులా ? పవిత్ర మూర్తులా ? వంద డిగ్రీలు దాటి మరిగితేనే నీరు రూపం మార్చుకొని ఆవిరిగా మారుతుంది. దేనికైనా సమయం రావాలి. అమెరికాలోని సామాన్యులు పెట్టుబడిదారీ వ్యవస్ధ విఫలమైందనే విషయం గుర్తించటం నానాటికీ పెరుగుతోంది. దాని స్ధానంలో అంతకంటే మెరుగైన వ్యవస్ధను ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన మొగ్గతొడగటం తదనంతర సహజ పరిణామం. అది సోషలిజమా మరొకటా అన్నది నిర్ణయించుకోవాల్సింది వారే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రతి వారికి ఒక రోజు అవకాశం వస్తుందన్నపుడు కమ్యూనిస్టులకు ఎందుకు రాదు ?

04 Thursday May 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Latin America, Left politics, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Anti communist, communist, Donald trump, mayday, pope, Pope Francis

Image result for anti communist

ఎం కోటేశ్వరరావు

మొన్ననే మహాకవి శ్రీశ్రీ జయంతి జరుపుకున్నాం. అనేక అంశాలను విస్మరిస్తున్నట్లుగానే ఆయన చేసిన రచనలను కూడా చదవటం తగ్గిపోతోంది. ఆయన రచనలలో ఒకదానిలో ఎంత వున్నతమైన సందేశం దాగి వుందో చూడండి.

కుక్క పిల్లా / అగ్గిపుల్లా/ సబ్బు బిళ్లా

హీనంగాచూడకుదేన్నీ/కవిత్వమేనోయ్‌ అన్నీ

రొట్టె ముక్కా/అరటి తొక్కా/బల్లచెక్కా

నీ వైపే చూస్తుంటాయ్‌/ తమ లోతు కనుక్కో మంటాయ్‌

ఇక శంకర్‌ దాదా ఎంబిబిఎస్‌ భాషలో చెప్పాలంటే ప్రతి కుక్కకూ ఒక రోజు వస్తుంది. రోజులన్నీ ఒకే విధంగా వుండవు. అంటే ప్రతి వారికీ ఏదో ఒక రోజు తామేమిటో నిరూపించుకొనే అవకాశం వస్తుంది. దానికి కమ్యూనిస్టులు మినహాయింపు ఎలా అవుతారు ? ఎరుపంటే భయం భయంగా చూసే అనేక మందికి ఈ చిన్న లాజిక్కు ఎందుకు అర్ధం కాదో తెలియదు. సినిమా వారు బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన పదాలలో ‘గీకటం లేదా గోకటం ‘ ఒకటి. ఇష్టం వున్న వారు ఆ పని చేస్తే కథ సుఖాంతం అవుతుంది. లేకపోతే ఏం జరిగేదీ మనం రోజూ చూస్తున్నదే. బెంగాల్‌లో కమ్యూనిస్టులు అధికారాన్ని కోల్పోయిన చాలా సంవత్సరాల తరువాత ఈ మధ్య ఒక కుటుంబం తమ అమ్మాయికి కమ్యూనిస్టు రాజకీయాలు వున్న వరుడు కావాలని ఒక ప్రకటనలో కోరినట్లు వార్తలు వచ్చాయి. అంటే కమ్యూనిస్టు అబ్బాయి చాలా మంచోడు ( సమాజ దుష్ట ప్రభావం పడో, మరొకటో జరిగో మిగతావారి మాదిరి భార్యలను వేధించే వారు లేరని కాదు) అన్నది వారి అనుభవం. చాలా మంది దృష్టిలో కమ్యూనిస్టులు ఈ కాలానికి పనికిరాని మంచి వారు. వారి వలన ముప్పు లేదని ప్రపంచ కమ్యూనిస్టు వ్యతిరేక అధిపతి అమెరికా పాలకులే పాతికేండ్ల క్రితం ప్రకటించారు. అలాంటపుడు వారి మానాన వారిని వదిలేయాలి కదా !

ఆ పని చేయకుండా అనవసరంగా కొంత మంది వ్యతిరేకులు కమ్యూనిస్టులను గోకుతున్నారు. అమెరికాలోని సియాటిల్‌ మరికొన్ని చోట్ల మేడే రోజున కమ్యూనిస్టు వ్యతిరేకులు ప్రదర్శనలు జరటం, ఆ సందర్భంగా మీడియా నిండా చెడరాయటం, చూపటం దానిలో భాగమే. వామపక్షం, సోషలిజం, కమ్యూనిజం భావజాలానికి దూరంగా వున్న యువతలో కూడా ఇదేమిటి అన్న ఆసక్తి కలిగించి కొంత మందిని అయినా ఆ వైపు నెడుతున్నందుకు అలాంటి వారిని సహజంగానే కమ్యూనిస్టులు అభినందిస్తారు. అలా వచ్చిన వారు మరింత గట్టిగా తయారు కావటం తెలిసిందే.

మే ఒకటవ తేదీన ప్రపంచ వ్యాపితంగా కార్మికదినాన్ని పాటించారు. ఈ సందర్బంగా ఇష్టం వున్న, లేని మీడియా పెద్దలు కూడా ఆరోజు గురించి చెప్పక తప్పలేదు. ‘అమెరికన్‌ స్పెక్టేటర్‌ ‘ అనే ఒక పత్రికలో ‘ డియర్‌ కామ్రేడ్‌ ఏ ట్రంప్‌డ్‌ అప్‌ మే డే ‘ అనే శీర్షికతో ఒక వ్యాసాన్ని రాశారు. దీనిలో రెండు అర్ధాలున్నాయి. ప్రియమైన కామ్రేడ్‌ మేడే నగారా వూరించిన ‘ట్రంప్‌ ‘ అని ఒకటైతే ప్రియమైన కామ్రేడ్‌ మే డే నగరా అన్నది మరొకటి. ‘ విధిగా కూలదోయాల్సిన జారు చక్రవర్తి మాదిరి మన అధ్యక్షుడిని చూస్తున్నారు’ అంటూ వుక్రోషంతో తొలి వ్యాక్యంతో ఆ వ్యాసాన్ని ప్రారంభించారు. (అమెరికాలో సామాన్య జనం అధ్యక్ష ఎన్నిక సందర్భంగా నిజంగా అమెరికా అభినవ జారు చక్రవర్తిగా భావించే మెజారిటీ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అయితే అక్కడున్న అప్రజాస్వామిక ఎన్నికల విధానం వలన ప్రత్యక్ష ఓట్లకు బదులు ఎలక్టొరల్‌ కాలేజీలో ట్రంప్‌ను బలపరిచేవారు మెజారిటీ తెచ్చుకొని అతగాడిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.)https://spectator.org/a-trumped-up-may-day/ దీనిని జోష్‌ డెక్‌, పాల్‌ కెంగర్‌ అనే ఇద్దరు రాశారు. దీనిలో కమ్యూనిస్టు వ్యతిరేకతకు, వుక్రోషం, వ్యంగ్యానికి, ఆరోపణలకు కొదవ లేదు. డ్రడ్జ్‌ రిపోర్ట్‌ అనే బహుళాదరణ గల వెబ్‌ సైట్‌లో గతంలో తామెన్నడూ చూడని ఒక ప్రత్యేక అంశం అమెరికా కమ్యూనిస్టు పార్టీ వెబ్‌ పత్రిక పీపుల్స్‌ వరల్డ్‌లో ప్రచురితమైన ఒక వ్యాసపు లింక్‌ను చూశామని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదే మంటే అమెరికా కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ విభాగపు కార్యదర్శి ఎమిలీ షెపర్స్‌ క్యూబా కమ్యూనిస్టు పార్టీ పత్రిక గ్రాన్మాకు ఇచ్చిన ఇంటర్వ్యూ. దానిలో http://www.peoplesworld.org/article/communist-party-membership-numbers-climbing-in-the-trump-era/ అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికైన తరువాత కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం గురించి అభ్యర్ధనలు పెద్ద ఎత్తున పెరిగాయని, అయితే అమెరికా అంతటా ఇప్పటికీ మెకార్ధీ కాలం నాటి భూతం(కమ్యూనిస్టు వ్యతిరేక) ఇప్పటికీ కనిపిస్తున్నప్పటికీ కమ్యూనిస్టు భావజాల గురించి ఆసక్తి పెరుగుతోందని చెప్పటాన్ని వారు నొక్కి వక్కాణించారు. వారు కమ్యూనిస్టు పార్టీతో పాటు డిఎస్‌ఏ అనే ఒక వామపక్ష పార్టీ గురించి కూడా తమ వ్యాసంలో వ్యాఖ్యానించారు. వాటిని పునరావృతం చేయాల్సిన అవసరం లేదు. ఆసక్తి కలిగిన వారు పైన ఇచ్చిన లింక్‌ ద్వారా చదువు కోవచ్చు. అయితే వ్యాసాన్ని ముగిస్తూ వారు చెప్పిన మాటలను మననం చేసుకోవటం అవసరం.

Image result for anti communist

‘ అందరికీ కొంత ప్రత్యేకమైనది వుంది ప్రియమైన కామ్రేడ్‌, అది నిజమైన కమ్యూనిస్టు పూలు, పండ్లతో నిండి వున్న కల్పవృక్షం’. దేశ వ్యాపితంగా మేడేను నిర్వహించటం ద్వారా వలస వచ్చిన వారు, మహిళలు, కార్మికులు, నల్లజాతి జీవన్మరణ వుద్యమం, పర్యావరణవేత్తలు, మరియు ట్రంప్‌ ముప్పు ఎదుర్కొంటున్న అందరూ ఐక్యం కావటానికి మంచి అవకాశమని జాకోబిన్‌ పత్రిక రచయిత్రి కష్మా సావంత్‌ వివరించినట్లుగా పెద్ద బృందాలైన ప్లానెడ్‌ పేరెంట్‌ హుడ్‌ ( ఏంజెలా డేవిస్‌ సహ అధ్యక్షురాలితో పాటు మహిళా ప్రదర్శన నిర్వహించినవారు) వంటి పెద్ద బృందాల మద్దతు పొందటం ద్వారా మేడే ట్రంప్‌ వ్యతిరేక ప్రతిఘటనలో అది అంతర్బాగం అవుతుందనే ఆశాభావాన్ని సావంత్‌ వ్యక్తం చేశారు. విస్తృతమైన వామపక్షం -దీనిలో డెమోక్రటిక్‌ పార్టీ వుంటుందని చెప్పనవసరం లేదు- అణచివేత, దోపిడీ, వివక్ష రూపాలు, వ్యవస్ధల గురించి వాటికి గురైన శక్తులు తరచుగా పరస్పరం తమ అనుభవాలను కలబోసుకుంటూ వుమ్మడి సామాజిక అస్తిత్వాన్ని పంచుకొనే నూతన అవగాహనను(ఇంటర్‌ సెక్షనాలిటీ) అనుసరించటం ఇటీవల వామపక్ష శక్తుల మధ్య ప్రారంభమైంది. దీనిని ప్రముఖంగా ప్రస్తావించటం ద్వారా పలు బాధిత బృందాలను కలుపుకొంటూ వారి అణచివేతకు మూలం ట్రంప్‌ మరియు రిపబ్లికన్‌ పార్టీ అని స్పష్టం చేయటం ద్వారా కొత్త ప్రాంతాలకు విస్తరించటం , కొత్త వారిని ఆకర్షించటం సమరశీల వామపక్ష లక్ష్యంగా వుంది. ఈ 2017 మేడే ఒక పెద్ద ప్రచారం, ఐక్యతను పెంపొందించే అవకాశం.ఈ ఏడాది అంతర్జాతీయ మేడేను పాటించటానికి ఒక ప్రత్యేకత వుంది. ఇది రష్యన్‌ విప్లవ శతవార్షిక సందర్బం.’

ఇలా చెబుతూనే చివరికి తమ వుక్రోషాన్ని కూడా ఎలా వెలిబుచ్చారో చూడండి.’ బోల్షివిక్‌లు తమ చారిత్రాత్మక హింస, అణచివేత ప్రారంభించిన వంద సంవత్సరాల తరువాత కూడా నూతన అధ్యక్షుడికి వ్యతిరేకంగా ‘భిన్నత్వం, ఏకీకరణ,’ప్రతిఘటన పేరుతో పెద్ద సంఖ్యలో అమెరికన్‌ వామపక్ష వాదులు తమకు తెలియకుండానే లెనిన్‌ చెప్పినట్లు ప్రయోజనకరమైన బుద్ధి హీనుల( యూజ్‌ఫుల్‌ ఇడియట్స్‌) మాదిరి ఒక అణచివేత భావజాలానికి విశ్వాసపాత్రులుగా మారుతున్నారు.’ ముందే చెప్పినట్లు ‘పీపుల్స్‌ వరల్డ్‌ ‘లోని కమ్యూనిస్టు ఇంటర్వ్యూను గోకటం ద్వారా స్పెక్టేటర్‌ పత్రిక తన పాఠకులందరికీ దాని మీద ఆసక్తి రేకెత్తించింది. అంతకు ముందు వినని వారు తప్పకుండా ఏం చెప్పారో, లెనిన్‌ ఆ పదాన్ని ఏ సందర్భంగా వాడారో, దాని మీద ఈ వ్యాస రచయితలు ఎందుకు విరుచుకుపడుతున్నారో అనే వుత్సుకత కలుగుతుంది. వానపడుతున్నా కదలని…… మాదిరి ఏమీ పట్టని వారికి ఇది వర్తించదని మనవి.

అమెరికన్‌ మేథావులు తాజాగా మార్క్సిజం లెనినిజం పట్ల ఆకర్షితులు కావటంపై కొందరు వుక్రోషం వెలి బుచ్చటం అర్దం చేసుకోగలిగినదే. పెట్టుబడిదారీ విధానం ఎందుకు విఫలం అవుతున్నదో, ఆర్ధిక అసమానతలు ఎందుకు పెరుగుతున్నాయో ఆ విధాన సమర్ద పండితులు చెప్పలేకపోతున్నారు. సోషలిస్టు, కమ్యూనిస్టు సమాజాల విశ్లేషకులు వాటికి కారణాలు చెబుతున్నపుడు యువతరం, మేథావులు ఆకర్షించటం సహజం. లెనిన్‌ వుపయోగించిన పదాన్ని అసందర్బంగా వుపయోగించటం రెచ్చగొట్టటం తప్ప మరొకటి కాదు. అందువల పై వ్యాస కర్తలు పేర్కొన్న గ్రాన్మా పత్రికలో అమెరికా కమ్యూనిస్టు నేత ఏం చెప్పారో చూద్దాం. సెర్గియో అలెగ్జాండరో గోమెజ్‌ స్పానిష్‌ భాషలో వున్న ఇంటర్యూను ఆంగ్లంలో సంక్షిప్తీకరించారు. దానిని గ్రాన్మాతో పాటు పీపుల్స్‌ వరల్డ్‌ వెబ్‌సైట్‌లో కూడా ప్రచురించారు. ‘ అమెరికాలో అంతర్ధానం అయ్యేందుకు తిరస్కరిస్తున్న కమ్యూనిజం ‘ అనే శీర్షికతో గ్రాన్మా ప్రచురించింది. http://en.granma.cu/mundo/2017-04-17/communism-refuses-to-disappear-in-the-united-states

‘డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత గతంలో ఎన్నడూ లేని దాని కంటే అమెరికన్‌ కమ్యూనిస్టు పార్టీకి సభ్యత్వ అభ్యర్దనలు అందుతున్నాయి. 1919లో వారి పార్టీ ఏర్పడినప్పటికీ 1917లో అక్టోబర్‌ విప్లవం సంభవించినపుడు తొలిసారిగా మార్క్సిస్టు భావజాలంతో సంఘటితమైన వారిలో అమెరికన్‌ పౌరులు కూడా వున్నారు, త్వరలో శత వార్షికోత్సవం జరుపుకోనున్నారు. పార్టీ ఏర్పాటయిన నాటి నుంచి రెండు యుద్దాల మధ్యకాలం, ప్రచ్చన్న యుద్ద అణచివేతలో, దీనిలో వాస్తవంగా రహస్య సంస్దగా పని చేయాల్సి వచ్చింది. ముఫ్పై కోట్ల మంది జనం వున్న దేశంలో ప్రస్తుతం ఐదువేల మంది సభ్యులు వున్నారు. మెకార్ధీ కాలం నాటి భూతం అమెరికా అంతటా ఇప్పటికీ వున్నప్పటికీ కమ్యూనిస్టు భావజాలం పట్ల అమెరికాలో ఆసక్తి పెరుగుతోంది.

ఎమిలీ షెపర్స్‌ వృత్తి రీత్యా మానవశాస్త్రవేత్త, దక్షిణాఫ్రికాలో జన్మించారు. జాత్యహంకార వ్యవస్దను తప్పించుకొనేందుకు ఆయన తలిదండ్రులు అమెరికాకు వలస వచ్చారు. ఎమిలీ 1987లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యారు. అయితే మార్క్సిస్టు భావజాలం ఆయన చిన్నతనంలోనే మేరీ లాండ్‌, చికాగో సమీపంలోనిఒక పోర్టారికో నివాస ప్రాంతంలోనే అబ్బింది. ‘ కమ్యూనిస్టు పరిభాషలో చెప్పాలంటే అమెరికాలో ఏ రీత్యా చూసినా విప్లవానికి ముందుండే పరిస్ధితి లేనప్పటికీ ప్రపంచ వ్యాపితంగా పెట్టుబడిదారీ విధానం అంత్య దశలో వున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచ ద్రవ్య సంక్షోభం అనేక మందిని ప్రభావితం చేసింది. వామపక్షాలుగా చెప్పాలంటే తలిదండ్రుల కంటే వారి పిల్లలు అత్యంత హీన స్ధితిలో వున్నారు. దేశంలోని మెజారిటీ పౌరులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను ఇటీవలి డెమోక్రటిక్‌ లేదా రిపబ్లికన్‌ పార్టీల ప్రభుత్వాలు పరిష్కరించగలిగిన స్ధితిలో లేవు. జనంలో వున్న అసంతృప్తి అన్ని వేళలా సరైన పురోగమన బాట పట్టదు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికలలో సైద్ధాంతిక పరమైన తిమ్మినిబమ్మిని కారణంగా ఒక మితవాద వైఖరికి దారితీసింది. మా స్వంత రాష్ట్రమైన వర్జీనియా కేవలం ధనవంతమైనదే కాదు, ఎందరో తెల్లవారైన పేదలు కూడా వున్నారు. వారంతా ట్రంప్‌కు ఓటు వేసేందుకు ముందుకు వచ్చారు. బొగ్గు తవ్వకం ఆప్రాంతంలో ప్రధాన వుపాధి వనరు. ఇటీవలి సంవత్సరాలలో వేలాది మంది కార్మికులను పనుల నుంచి తొలగించారు. రిపబ్లికన్లు దీనంతటికీ బరాక్‌ ఒబామా పర్యావరణ విధానాలు కారణమని ప్రచారం చేశారు.

డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి ఎన్నిక ప్రచారం సందర్బంగా మిలియన్ల మంది యువత బెర్నిశాండర్స్‌ పురోగామి భావజాలం వైపు సమీకృతమయ్యారు.శాండర్స్‌ కనుక ట్రంప్‌ ప్రత్యర్ధి అయి వుంటే ఆయన గెలిచి వుండేవారు.ఈ నేపధ్యంలోనే షెపర్స్‌ ప్రస్తావించిన ‘కుహనా వర్గ చైతన్యం ‘ మరియు తిమ్మిని బమ్మిని చేయటాన్ని వ్యతిరేకించటానికి వామపక్షం ఇవ్వాల్సిన ప్రాధాన్యతను అమెరికా కమ్యూనిస్టు పార్టీ ఎత్తి చూపింది.’ మీడియాను కార్పొరేషన్లు అదుపు చేసిన స్ధితిలో స్ధానిక న్యూస్‌ ఛానల్స్‌లో ప్రసార బోధకులు ప్రపంచం అంతం కావటం గురించి చెబుతున్నపుడు ఇది చాలా కష్టం ‘అని షెపర్స్‌ చెప్పారు. అందుకే అన్ని రకాల పద్దతులలో సాధ్యమైనంత మేరకు తన భావజాలాన్ని జనంతో పంచుకోవటానికి, వారిని చైతన్యవంతులను చేయటాన్ని కమ్యూనిస్టు పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది అన్నారు. ఆ రీత్యానే కమ్యూనిస్టు పార్టీ వెబ్‌సైట్‌లో కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమం, పార్టీలో ఎలా చేరాలనే సమాచారాన్ని పొందుపరిచారు. అయినప్పటికీ కార్మికుల హక్కులను రక్షించుకుంటూ వారి అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా కార్మికులు, కార్మిక సంఘాలను సంఘటితపరచటం ఒక పెద్ద సవాలే అన్నారు.

అమెరికా కమ్యూనిస్టు పార్టీ పాలస్తీనాను సమర్ధిస్తుంది మరియు అమెరికా మిలిటిరిజాన్ని వ్యతిరేకిస్తుంది. అనేక సంవత్సరాలుగా క్యూబా విప్లవాన్ని మరియు ఇటీవల బొలివేరియన్‌ రిపబ్లిక్‌ వెనెజులాను సమర్ధిస్తున్నది. క్యూబాతో సాధారణ సంబంధాలను పునరుద్దరించుకోవాలని అమెరికా ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం చేసిన ప్రకటనను కమ్యూనిస్టు స్వాగతించింది.’2014 డిసెంబరు 17వ తేదీ మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది,అయితే అది మంచి వార్త. కొన్ని విషయాలలో ముందుకు పోయినప్పటికీ ఒబామా తాను చేయగలిగినదంతా చేయలేదు’ అని షెపర్స్‌ చెప్పారు. అయినప్పటికీ క్యూబాపై దిగ్బంధనాన్ని ఎత్తివేయాలనేందుకు పార్లమెంట్‌లోని డెమోక్రటిక్‌ మరియు రిపబ్లికన్‌ పార్టీలు రెండింటిలోనూ పెరుగుతోంది.’దీనికి మానవతాపూర్వకమైన మనోభావాలతో కొందరు ఇతరులు ఆర్ధిక ప్రయోజనాలకోసం ఇద్దరూ దిగ్బంధం విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. దిగ్బంధనాన్ని కొనసాగించాలని కోరుతున్న ఏకైక తరగతులెవరంటే ప్రత్యేకించి ఫ్లోరిడాలోని క్యూబన్‌-అమెరికన్లు మాత్రమే ‘ అన్నారు. రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొల్పుకోవాలని తాజా సర్వేలో మెజారిటీ అమెరికన్‌ పౌరులు వెల్లడించారు. ట్రంప్‌ ఏం చేస్తాడో మాకు తెలియదు, జనం మాట వింటారా సిద్ధాంతవేత్తల మాట వింటారో తెలియదు. అయితే మొత్తంగా చెప్పాలంటే అమెరికన్‌ కమ్యూనిస్టులు ఆశాభావంతో వున్నారు ‘ అని చెప్పారు.

Image result for pope francis communist

మే డే రోజునే ‘పోప్‌ ఫ్రాన్సిస్‌ కమ్యూనిస్టు గురువు’ అనే శీర్షికతో స్పెక్టేకర్‌ పత్రికే మరో వ్యాసాన్ని కూడా ప్రచురించింది. ‘ రాజకీయ పోప్‌ ‘ అనే పేరుతో జార్జి న్యూమర్‌ రాసిన పుస్తకంలోని కొన్ని భాగాలను దానిలో వుటంకించారు.https://spectator.org/pope-franciss-communist-mentor/ ‘ పోప్‌ నోటి నుంచి వెలువడిన స్వచ్చమైన మార్క్సిజం ఇది ‘ అని రేడియో వ్యాఖ్యాత రష్‌ లింబా, ‘ లెనిన్‌ గారి పోప్‌ ‘ అని మరో వ్యాఖ్యాత మైఖేల్‌ శావేజ్‌ నోరు పారవేసుకున్నారు. వాటి గురించి ఇటాలియన్‌ మీడియాతో మాట్లాడిన సందర్భంగా పోప్‌ తోసి పుచ్చారు.’ నా జీవితంలో నేను ఎందరో మంచి వారైన మార్క్సిస్టులను కలుసుకున్నాను. అందువలన అలాంటి మాటలకు నేను బాధపడటం లేదు’ అన్నారు. మొదటి-రెండవ ప్రపంచ యుద్ధ మధ్యకాలం 1922-39 మధ్య పని చేసిన పోప్‌ పదకొండవ పయస్‌ కమ్యూనిస్టు వ్యతిక ప్రకటన చేశారు.’ ఒకే సారి మంచి కాథలిక్‌గానూ నిజమైన సోషలిస్టుగానూ ఎవరూ వుండలేరు’ అని పయస్‌ ప్రకటిస్తే దానికి విరుద్దంగా ఈ రోజు పోప్‌ ఫ్రాన్సిస్‌ చెబుతున్నది వింటే ‘ ఒక మంచి కాథలిక్‌ సోషలిజం వ్యతిరేకిగా వుండజాలరు అని ఎవరైనా అర్ధం చేసుకుంటారు అని సదరు రచయిత వ్యాఖ్యానించారు.

‘పోప్‌ రెండవ జాన్‌ పాల్‌ మరియు పోప్‌ 16వ బెండిక్ట్‌ శిలువతో అసహజంగా ప్రవర్తించారా వారు దానిని తమ మోకాళ్ల ముందు వుంచుకొని వుండవచ్చు, పోప్‌ ఫ్రాన్సిస్‌ అలా కాదు. సుత్తీ కొడవలి చిహ్నంగా వున్న శిలువను ఎంతో సాదరంగా స్వీకరించారు. విమానంలో రోమ్‌కు తిరిగి వస్తూ విలేకర్లతో మాట్లాడుతూ ‘ఈ పనిని నేను అర్ధం చేసుకోగలను, నా వరకు ఇదేమీ ఒక అపరాధం కాదు’ అన్నారు. పోప్‌ పర్యటన తరువాత నాకు ఒక పోప్‌ వున్నారనే భావన నాకు ఇప్పుడు కలిగింది. ఇంతకు ముందు నాకు ఆభావన కలగలేదు ‘ అని బొలీవియా అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ అన్నారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.ఈ రెండు వ్యాసాలలోని అంశాలను చూసినపుడు సోషలిజం, కమ్యూనిజంపై అటు రాజకీయంగానూ ఇటు మతపరంగానూ దాడి ఎలా జరుగుతోందో, పేదలకు మంచి జరగాలి, దోపిడీ వుండకూడదని చెప్పిన జీసస్‌ తొలి కమ్యూనిస్టు అని చెప్పిన పోప్‌ ఫ్రాన్సిస్‌ వంటి వారి మీద ఎలా వ్యతిరేకత రెచ్చగొడుతున్నారో చూడవచ్చు. పాడిందే పాడరా పాచి పళ్ల పాటగాడా అన్నట్లుగా కమ్యూనిస్టు మానిఫెస్టోను రాయక ముందే ప్రారంభమైన కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం కమ్యూనిస్టు భావజాల ప్రచారం, ప్రభావం, విస్తరణను అడ్డుకోలేకపోయింది. ఇంకా ఆ తుప్పు పట్టిన ఆయుధంతోనే ఈ ఇంటర్నెట్‌ యుగంలో కూడా ప్రయత్నిస్తున్నారు.

నాజీజం మాదిరి ఎందుకు కమ్యూనిజాన్ని ద్వేషించటం లేదు అనే శీర్షికతో ఒక వ్యాఖ్యాత మరో పత్రికలో రాశాడు. http://www.theblaze.com/news/2017/05/01/watch-why-isnt-communism-as-hated-as-nazism/ . దానిలో ఏం చెప్పినప్పటికీ నాజీజం అన్నది లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్నదని, అంతర్జాతీయ న్యాయస్ధానంలో అందుకు బాధ్యులైన వారిని విచారించిన విషయం దాస్తే దాగేది కాదు. కమ్యూనిజం గురించి జరిపిన వ్యతిరేక ప్రచారం అక్కడ అంత మందిని చంపారు ఇక్కడ ఇంత మందిని చంపారు అంటూ తప్పుడు లెక్కలు, కట్టుకధలు ప్రచారం చేయటం తప్ప రుజువులను జనం ముందుంచలేకపోయారు. సిద్ధాంత పరంగా కమ్యూనిజాన్ని వ్యతిరేకించే వారందరూ కమ్యూనిస్టులు హంతకులు అనే కట్టుకధలను నమ్మరు. తెలంగాణా సాయుధ పోరాటంలో ప్రాణత్యాగాలు చేసింది కమ్యూనిస్టులు అనేది కళ్ల ముందున్న వాస్తవం. ఆ సందర్భంగా కమ్యూనిస్టు గెరిల్లాల చేతిలో హతమైన వారందరూ దోపిడీదారులు, వారికి ఏజంట్లుగా, గూండాలుగా, జనంపై దాడులు చేసిన పోలీసులు, రజాకార్లు తప్ప సామాన్యులను కమ్యూనిస్టులు చంపలేదనే విషయం జనానికి తెలుసు. అందుకే కమ్యూనిస్టులపై నాటి నిజాం, కాంగ్రెస్‌, నెహ్రూ ప్రభుత్వం, మీడియా చేసిన ప్రచారాన్ని తోసిరాజని తొలి ఎన్నికలలో వుద్యమం జరిగిన, దాని ప్రభావం వున్న ప్రాంతాలన్నింటా కమ్యూనిస్టులనే జనం గెలిపించారు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలలో కమ్యూనిస్టుల గురించి చేసిన తప్పుడు ప్రచారం ఎల్లకాలం జనాన్ని మోసం చేయలేదు. చైనాలో నానాటికీ దారిద్య్రం తగ్గుతోందని ప్రపంచబ్యాంకే చెబుతోంది, అదే సమయంలో అమెరికాలో దారిద్య్రంలోకి చేరే వారి సంఖ్య పెరుగుతోంది. సోషలిస్టు దేశమైన చైనా ఎన్నో విజయాలు సాధిస్తున్నపుడు అదే మాదిరి మన దేశంలో కూడా సోషలిస్టు వ్యవస్ధను నెలకొల్పుకుంటే నిరుద్యోగం, దారిద్య్రాల నుంచి బయటపడవచ్చు కదా అన్న ఆలోచన రాకుండా అమెరికా, ఇతర పశ్చిమ దేశాల యువత మెదళ్లను ఎవరైనా ఎలా కట్టడి చేయగలరు?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా పెట్టుబడులపై కాషాయ దళాల ఆత్మవంచన, పరవంచన ?

04 Sunday Dec 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, International, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

anti china, Anti communist, China, china boycott, chinese investments, RSS Outfits anti china, RSS Outfits anti china feets, saffron brigade hypocrisy

సత్య

    కాషాయ తాలిబాన్లకు దేశభక్తి గురించి ఆకస్మికంగా మెలకువ వచ్చిందా ? లేక ఎవరైనా వెనుకనుంచి పొడుస్తున్నారా ? కాషాయ పరంపరలో భాగమైన ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు వారం రోజుల క్రితం పేటిమ్‌ సంస్ధలో చైనా పెట్టుబడుల గురించి అధ్యయనం చేయాలని తన విభాగమైన స్వదేశీ జాగరణ మంచ్‌ (ఎస్‌జెఎం)ను కోరినట్లు వారం రోజుల క్రితం మీడియాలో ఒక వార్త వచ్చింది. ప్రభుత్వం ఈ విషయమై విచారణ జరపాలని కోరుతున్నట్లు తాజాగా ఆ సంస్ధ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ వెల్లడించారని ఒక వార్తా సంస్ధ ఆదివారం నాడు తెలిపింది. పద్నాలుగు నెలల క్రితం మన దేశానికి చెందిన పేటిమ్‌ కంపెనీలో 68కోట్ల డాలర్లకు 40శాతం వాటాను చైనా ఇ కామర్స్‌ దిగ్గజం ఆలీబాబా కొనుగోలు చేసినట్లు లోకానికంతటికీ తెలిసిందే. అదేమీ రహస్యంగా జరగలేదు. ఇన్ని నెలల తరువాత ఆ లావాదేవీ, దాని పర్యవసానాలపై విచారణ జరపాలని కోరటమే విచిత్రం. ఇది వారికి కలిగిన ఆలోచనా , వేరే ఎవరినైనా సంతుష్టీకరించేందుకు ఇలా చేస్తున్నారా ? చైనా కంపెనీలు మన దేశ సంస్ధలలో పెట్టుబడులు పెట్టటం, వాటాలు కొనుగోలు చేయటం ఈ వారంలోనే ప్రారంభమైందా ?

     స్వదేశీ జాగరణ మంచ్‌ వారు చెబుతున్న అభ్యంతరం ఏమిటి ? పేటిమ్‌ ద్వారా చైనా కంపెనీలు మన దేశ సమాచారాన్ని తెలుసుకొని దుర్వినియోగం చేసే అవకాశం వుందని, అసలు ఏ కంపెనీకి ఎంత వాటా వుందో, ఎలా ఇచ్చారో వెల్లడించాలని కోరటంతో పాటు పేటిమ్‌ తన వాణిజ్య ప్రకటనలలో ప్రధాని నరేంద్రమోడీ బొమ్మను వుపయోగించుకోవటం అభ్యంతరకరం అని మహాజన్‌ చెప్పారు. పది సంవత్సరాల పాటు అధికారంలో వున్న యుపిఏ సర్కారు సంస్కరణలను సంపూర్ణంగా అమలు జరపలేదని, తాము వాటిని పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్నామని బాసలు చేసిన కారణంగానే విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ కంపెనీలు, వాటి కనుసన్నలలో మెలిగే మీడియా నరేంద్రమోడీకి మద్దతు ఇచ్చాయన్నది బహిరంగ రహస్యమే. దానిలో భాగంగానే విదేశీ పెట్టుబడులకు ద్వారాలు మరింతగా తెరిచిన ఖ్యాతి తమదే అని చెప్పుకుంటున్న కాషాయ ‘దేశ భక్తులు’ ఆ విదేశీ పెట్టుబడుల గురించి లబలబలాడటం ఎనిమిదో ప్రపంచ వింత.

    చైనా సంస్కరణలకు ఆద్యుడిగా పేరు తెచ్చుకున్న డెంగ్‌ సియావో పింగ్‌ ఒక మాట చెప్పాడు. మనం కిటికీ తెరిచినపుడు మంచి గాలితో పాటు ఈగలు, దోమలూ కూడా ప్రవేశిస్తాయి, వాటి బెడదను వదిలించే శక్తి తమకు వుందన్నారు. మన దేశ పాలకవర్గం కూడా సంస్కరణల పేరుతో మన ఆర్ధిక వ్యవస్ధ కిటికీని బాహాటంగా తెరిచింది. మన ప్రధాని నరేంద్రమోడీ పెట్టుబడుల కోసం తిరగని విదేశీ నగరం లేదు, కలపని చేయిలేదు. ఎక్కడా ఫలానా దేశాల నుంచి పెట్టుబడులు వస్తే తిరస్కరిస్తాం అని ఎన్నడూ, ఎక్కడా చెప్పలేదు. అందువలన అనేక దేశాల కంపెనీలు వచ్చిన మాదిరే చైనా కంపెనీలు కూడా అన్ని దేశాలలో ప్రవేశించినట్లుగానే మన దేశంలో కూడా కాలుపెడుతున్నాయి. మన దేశానికి చెందిన అనేక కంపెనీలు విదేశాలలో పెట్టుబడులు పెడుతున్నాయి. అక్కడి సమాచారాన్ని తెలుసుకుంటున్నాయి. దుర్వినియోగం చేసినట్లు గమనిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు ఏ ప్రభుత్వానికైనా సర్వ హక్కులూ వున్నాయి. అలాంటిది కేవలం చైనా కంపెనీలే దుర్వినియోగం చేస్తాయని చెప్పటం వెనుక ఆంతర్యం ఏమిటి ?మన సమాచారాన్ని దుర్వినియోగం చేస్తాయనుకుంటే అది ఒక్క చైనా కంపెనీయే చేస్తుందని, మిగతా కంపెనీలు చేయవనే గ్యారంటీ ఏముంది. తనకు మార్గదర్శనం చేసే, తన కార్యకలాపాలను సమీక్షించే స్వంత సంస్ధలే డిమాండ్‌ చేస్తున్నాయి గనుక చైనాతో సహా మన సమాచారాన్ని దుర్వినియోగం చేసే అన్ని విదేశీ కంపెల గురించి గతంలో తీసుకున్న చర్యలేమిటి? భవిష్యత్‌లో ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో కేంద్ర ప్రభుత్వం ఒక శ్వేత పత్రం ద్వారా ప్రకటించటం అవసరం.

     పేటిమ్‌ కంపెనీ ఏ లావాదేవీలనైతే నిర్వహిస్తున్నదో వాటినే ముఖేష్‌ అంబానీ రిలయన్సు జియో మనీ పేరుతో నిర్వహించేందుకు తన ప్రణాళికలను ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు తరువాత పేటిమ్‌ లావాదేవీలు పెద్ద ఎత్తున పెరిగాయని మీడియా వార్తలు తెలుపుతున్నాయి. తాను వెనుకబడిపోతానని అంబానీ ఆందోళన చెందుతున్నారా ? సరిగ్గా ఈ సమయంలో స్వదేశీ జాగరణ మంచ్‌కు పేటిమ్‌ విదేశీ (చైనా) సంబంధాల గురించి గుర్తుకు వచ్చింది. నిత్యజీవితంలో మన సమాచారాన్ని తెలుసుకోని,తెలుసుకోలేని విదేశీ కంపెనీలు ఏమున్నాయి గనుక. మనం మాట్లాడే ప్రతి మాటా, పంపే ప్రతి ఎస్‌ఎంఎస్‌, ప్రతి ఇ మెయిల్‌ సమాచారాన్ని అవసరం వున్నా లేకపోయినా అమెరికా సిఐఏ ఎప్పటిప్పుడు సేకరిస్తున్నదని తెలిసిందే. ఆధార్‌ కార్డుల గురించి అందరికీ తెలిసిపోయింది. పాన్‌ కార్డుల ద్వారా ఎవరి నగదు లావాదేవీలేమిటో ఎవరైనా తెలుసుకోవచ్చు. టీవీలలో అమర్చిన సాధనాల ద్వారా మన ఇండ్లలో, చివరికి పడక గదుల్లో ఏం జరుగుతోందో కూడా తెలుసుకొనే రోజులు వచ్చాయి. మన సమాచార గోప్యత ఎక్కడుంది కనుక. వాటన్నింటినీ వదలి చైనా గురించి మాత్రమే సందేహాలు వెలిబుచ్చేవారి గురించి సందేహించాల్సిన అవసరం కలుగుతోంది. ఎవరికైనా ఏజంట్లుగా పని చేస్తున్నారా ? ప్రపంచంలో ఏ దేశం కూడా చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపు ఇచ్చిన వార్తలు మనకు తెలియదు. పాలస్తీనా అరబ్బులను ఇక్కట్ల పాలు చేస్తున్న ఇజ్రాయెల్‌ వస్తువులను బహిష్కరించాలని కొన్ని ముస్లిం సంఘాలు ఎప్పటి నుంచో పిలుపులు ఇస్తున్నాయి.

Image result for boycott chinese products

    సదరు స్వదేశీ జాగరణ మంచ్‌ గత కొంత కాలంగా చైనా వస్తు బహిష్కరణ గురించి సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. నిజమే కదా అని అమాయకులు వీర సైనికుల్లా పని చేస్తున్నారు. అధికారంలో వున్న వారి ప్రతినిధులేమో చైనా వస్తు బహిష్కరణ సాధ్యం కాదని చెబుతుంటారు. అక్కడి వస్తువుల కొనుగోలుకు అవసరమైన విదేశీ మారక ద్రవ్యాన్ని కేటాయిస్తుంటారు ! డాలర్ల కేటాయింపు నిలిపివేస్తే చైనా వస్తువుల దిగుమతులు ఎప్పుడో ఆగిపోయి వుండేవి కదా ! మోడీ సర్కారు ఆపని ఎందుకు చేయదు ? దొంగతనంగా దిగుమతి అయితే పట్టుకోకుండా ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారు ? ఏమిటీ నాటకం, ఎవరిని మోసం చేద్దామని ? ఎవరి చెవుల్లో పూలు పెడతారు ? ఇంతకాలం చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ తమ ప్రతినిధులు సర్కారు పగ్గాలు చేపట్టి చైనాతో నానాటికీ బంధం పెంచుకుంటూ పోతుంటే మిన్నకుండటం ఆత్మవంచన కాదా ? వీధుల్లో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటం పరవంచన కాదంటారా ? ఎందుకీ ద్వంద్వ ప్రమాణాలు ?

    నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత మన దేశంలో చైనా పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడి అయ్యాయని మీడియా కోడై కూస్తున్నది.http://www.livemint.com/Politics/X9NBWqqs0JzkX0OQ3UaMQO/Chinese-investments-in-India-increased-sixfold-in-2015.html 2000 ఏప్రిల్‌ నుంచి 2016 మార్చి నెల వరకు మన దేశంలో చైనా పెట్టుబడుల మొత్తం 135 కోట్ల డాలర్లయితే ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే 230 కోట్ల డాలర్లు వచ్చాయట.http://www.vccircle.com/news/economy/2016/08/30/chinese-investment-india-shoots-23-bn-past-3-months-against-135-bn-2000-16 వీటి గురించి స్వదేశీ జాగరణ మంచ్‌ ఎందుకు మాట్లాడదు ? విచారణ జరపాలని ఎందుకు డిమాండ్‌ చేయదు ? ఈ ఏడాది అక్టోబరు 6-7 తేదీలలో ఢిల్లీలో స్వయంగా నరేంద్రమోడీ ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌ చైనా ప్రభుత్వంతో కుదుర్చుకున్న పెట్టుబడుల సహకార ఒప్పందాల గురించి ఎందుకు ప్రశ్నించదు ?

    నల్ల ధనాన్ని వెలికి తీసే పేరుతో ఆ పని చేసిన వారు తరువాత బాణీ మార్చి నగదు రహిత లావాదేవీల గురించి ఎక్కువగా చెబుతున్నారు. చెప్పుకోలేని బాధ ఏమిటో సానుభూతి చూపుదాం. నోట్ల రద్దు తరువాత బిజెపి నేతలందరూ ఇప్పుడు చైనా భజన చేస్తున్నారు. మన కంటే పెద్ద దేశమైన చైనాలో నగదు రహిత కార్యకలాపాలు జయప్రదం అయినపుడు మన దేశంలో ఎందుకు కావు అన్నది వారి ఒక ప్రశ్న. చైనా చర్యలను సమర్ధించిన కమ్యూనిస్టులు అదే పని మన దేశంలో చేస్తే విమర్శిస్తారు ఎందుకు అని ఎదురుదాడికి దిగుతున్నారు. రోజంతా చైనా కమ్యూనిస్టు వ్యతిరేకతను నూరిపోయటం, సాయంత్రం కాగానే దాన్ని అడ్డం పెట్టుకొని తమ చర్యలను సమర్ధించుకోవటం. అవకాశవాదానికి హద్దులు లేవు. మేథోపరంగా ఎంతదివాళా స్ధితిలో వున్నారో కదా !

   నల్లధనాన్ని, నగదు రహిత లావాదేవీలను కమ్యూనిస్టులే కాదు, ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించటం లేదు. చైనా ఆర్ధిక వ్యవస్ధ మన కంటే ఎన్నోరెట్లు పెద్దది. అక్కడ నగదు రహిత లావాదేవీలను మోడీ సర్కార్‌ మాదిరి బలవంతంగా రుద్దలేదు. తగినంత నగదు రాదని, నగదు రహితానికి మళ్లాలని తెలంగాణా ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి కె. ప్రదీప్‌ చంద్ర ప్రకటించటాన్ని బట్టి తగినన్ని నోట్లను ముద్రించేందుకు మోడీ సర్కార్‌ ముందుకు రావటం లేదని తేలిపోయింది. నగదు రహిత కార్యకలాపాలకు అవసరమైన ఏర్పాట్లు చేయని, కార్డులు గీకటానికి నిరాకరించే విద్యా, వైద్య సంస్ధలు, దుకాణాల తగిన గడువు నిచ్చి అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. కార్డుల వినియోగం భారం కాదని జనాన్ని ఒప్పించగలిగితే వారే దుకాణాలలో డిమాండ్‌ చేస్తారు. ఒక పరిమితి దాటిన లావాదేవీలు కార్డుల ద్వారా మాత్రమే చేయాలని, అందుకు రెండున్నర శాతం రుసుం అదనం అని వసూలు చేస్తే శిక్షించటం వంటి చర్యలు తీసుకుంటే క్రమంగా అలవాటు పడిపోతారు. ఆ పని చేయకుండా పొమ్మనకుండా పొగపెట్టినట్లు నగదును అందుబాటులో లేకుండా చేసి బలవంతంగా అమలు చేయపూనుకోవటం ఏ ప్రజాస్వామిక లక్షణం ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా కాలేజీల్లో అగ్రస్థానంలో ‘కమ్యూనిస్టు ప్రణాళిక ‘

03 Saturday Sep 2016

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, USA

≈ Leave a comment

Tags

Anti communist, Che Guevara, communist manifesto, HONG KONG ELECTIONS, Kapernick, Karl Marx, lavish banquets, National Anthem Controversy, Norman Bethune

Image result for Original Communist Manifesto

ఎంకెఆర్‌

   అమెరికా పాలకవర్గం కమ్యూనిజాన్ని అంతం చేయాలని చూస్తున్నది. కానీ ప్రస్తుతం అక్కడి కళాశాలలోని ఆర్ధిక శాస్త్ర విద్యార్ధులు అధ్యయనం చేయాల్సిన పుస్తకాలంటూ సిఫార్సు చేసిన వాటిలో కమ్యూనిస్టు ప్రణాళిక గ్రంధం అగ్రస్థానంలో వుంది. ఆ గ్రంధాన్ని మార్క్స్‌-ఎంగెల్స్‌ 1848లో రాసిన విషయం తెలిసిందే. ఓపెన్‌ సిలబస్‌ ప్రాజెక్టు(ఒపిఎస్‌) కింద నూతన సిలబస్‌ సమాచారాన్ని సేకరించగా ఈ విషయం వెల్లడైందని మార్కెట్‌ వాచ్‌ డాట్‌ కాంలో ప్రచురించిన విశ్లేషణలో పేర్కొన్నారు. వివిధ వెబ్‌సైట్లు, సమాచారాన్నుంచి సేకరించిన వివరాల ప్రకారం ప్రతి ప్రచురణకు పాయింట్లను కేటాయించారు. ఒక పుస్తకం పేరు ఎన్నిసార్లు ప్రస్తావనకు వచ్చింది, దానిని ఎన్నిసార్లు బోధించారు అనే లెక్కలను తీశారు. వాటి ప్రకారం కమ్యూనిస్టు ప్రణాళిక సంఖ్య 3,189 కాగా బోధనా పాయింట్లు 99.7 వచ్చాయి.మిగతా పుస్తకాలకంటే ఇవి రెండు, నాలుగు రెట్లు ఎక్కువ. కమ్యూనిస్టు ఆర్ధిక, సామాజిక బోధనల తరువాత కీనిసియన్‌ సిద్ధాంతాల ప్రచురణలు ఎక్కువగా వున్నాయి.ఆర్ధిక, ద్రవ్య విషయాలకు సంబంధించి అగ్రస్ధానంలో వున్న పది హేను పుస్తకాలలో పది కీనిసియన్‌ లేదా కమ్యూనిస్టు సిద్ధాంతానికి చెందినవే వున్నాయి. స్వేచ్చా మార్కెట్‌ వ్యవస్థకు సంబంధించిన పుస్తకాలు అగ్రస్థానంలో రెండు మాత్రమే వున్నాయి. వాటిలో ఒక వెల్త్‌ ఆఫ్‌ నేషన్స్‌ అనే ఆడమ్‌ స్మిత్‌ రచన రెండవ స్ధానంలో, పెట్టుబడిదారీ విధానం మరియు స్వేచ్ఛ అనే మిల్టన్‌ ఫ్రైడ్‌ మాన్‌ గ్రంధం ఐదవ స్ధానంలో వుంది.http://www.marketwatch.com/story/communist-manifesto-among-top-three-books-assigned-in-college-2016-01-27

imrs.php

విలాస విందులు-చైనా కమ్యూనిస్టు పార్టీ ఆంక్షలు

   అవినీతి, అక్రమాలపై దృష్టి సారించిన చైనా కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు విలాసవంతమైన విందులకు సభ్యులు దూరంగా వుండాలని ఆంక్షలు విధించింది. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు విందు ఆహ్వానాలను అందుకున్నపుడు వాటికి ఎవరు సొమ్ము ఖర్చు చేస్తున్నారు? ఇంకా ఎవరెవరు హాజరవుతున్నారో,ఎక్కడ జరుగుతోందో ముందుగా తెలుసుకోవాలని సూచించింది. పార్టీ సభ్యులు, అధికారులు ఎలాంటి విందులకు హాజరు కాకూడదో తెలిపింది.అధికారులు ప్రయివేటు క్లబ్బులలో జరిగే విందులకు వెళ్లటాన్ని, ఇతరులను ఆహ్వానించటంపై నిషేధం విధించింది. అలాంటి 20 రకాల విందులకు పార్టీ కార్యకర్తలు హాజరు కాకూడదని తెలిపింది.వివాహాలు, దినాలను విలాసవంతంగా నిర్వహించకూడదని సూచించింది. గ్జీ జింగ్‌ పింగ్‌ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి గత మూడు సంవత్సరాలుగా అవినీతిపై కేంద్రీకరించారు. ఇప్పుడు విలాసాలపై దృష్టి సారించారు. పార్టీ కార్యకర్తలు, అధికారులు దిగువ సూచనలు పాటించాలని ఆదేశించారు.

     భారీ ఎత్తున జరిపే విందులకు పార్టీ కార్యకర్తలు హాజరు కాకూడదు. అధికార విధులతో సంబంధం లేని విందులు ఏర్పాటు చేయరాదు. అదే నగరం లేదా దేశంలోని ఇతర శాఖల వారిని ఆహ్వానించినపుడు ప్రజల సొమ్మును విందులకు ఖర్చు చేయరాదు.దిగువ స్ధాయి డిపార్ట్‌మెంట్లను విందులు ఏర్పాటు చేయమని అడగ కూడదు.అధికారిక విధులతో సంబంధం లేని విందులకు ఇతర నగరాలలో వెళ్లకూడదు. గ్రామశాఖలు ఏర్పాటు చేసే విందులను స్వీకరించరాదు. ప్రయివేటు కంపెనీలు ఏర్పాటు చేసే విందులకు వెళ్ల కూడదు, ఒక వేళ వెళ్లాల్సి వస్తే అందుకయ్యే ఖర్చును చెల్లించాలి. తమ భోజన ఖర్చు చెల్లించాలని ప్రయివేటు కంపెనీలను అడగ కూడదు. వాణిజ్య పర్యటనలలో ఇతర అధికారుల భోజనాలకు చెల్లించకూడదు. పొద్దు పోయిన తరువాత చేసే భోజనాలకు ప్రజాధనాన్ని ఖర్చు చేయకూడదు. స్వప్రయోజనాలు ఇమిడి వున్న వ్యక్తుల నుంచి వచ్చే విందు ఆహ్వానాన్ని తిరస్కరించాలి. అలాంటి వాటి పట్ల ఎల్ల వేళలా అప్రమత్తంగా వుండాలి. అధికారిక విధులకు అంతరాయం కలిగించే విందులకు వెళ్ల కూడదు. అధికారిక విధులతో నిమిత్తం లేని ఫంక్షన్లకు వచ్చిన అతిధులకు ప్రజల సొమ్మును వెచ్చించకూడదు. ప్రభుత్వ సంస్ధలు ఇచ్చే విందులకు ప్రయివేటు వ్యక్తులను పిలవ కూడదు, అలాంటి విందులలో విందు ఆడంబరంగా వుండకూడదు. ప్రయివేటు క్లబ్బులు, ఇతర ఖరీదైన ప్రాంతాలకు వెళ్లకూడదు. చిన్న బృందాలు, గ్యాంగులను ఏర్పాటు చేసేందుకు వుద్ధేశించిన విందులకు దూరంగా వుండాలి. నగదు బహుమతులు అందచేసే, అధికారులకు చెడ్డపేరు తెచ్చేందుకు అవకాశం వున్న విందులకు వెళ్లకూడదు.

Image result for Dr. Norman Bethune

నార్మన్‌ బెతూన్‌పై కెనడా కమ్యూనిస్టు వ్యతిరేకుల కడుపు మంట

   ఒకవైపు ప్రపంచంలో కమ్యూనిజం అంతిరించి పోయిందంటూనే ఆదర్శ కమ్యూనిస్టుల గురించి కమ్యూనిస్టు వ్యతిరేకులు అంతగా భయపడుతున్నారు. ఎందుకంటే ఆదర్శవాదులు ధృవతారలుగా వెలుగుతూనే వుంటారు. చైనా విముక్తి, జపాన్‌ దురాక్రమణ వ్యతిరేకపోరాటంలో నిమగ్నమైన కమ్యూనిస్టులకు సాయపడేందుకు కెనడా నుంచి నార్మన్‌ బెతూన్‌, భారత్‌ నుంచి ద్వారకా నాధ్‌ శాంతారామ్‌ కొట్నీస్‌(డిఎన్‌ కొట్నిస్‌) వంటి ఎందరో ప్రాణాలకు తెగించి చైనా వెళ్లి సేవలు అందించారు.

   ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు ఆరు వరకు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడెవ్‌ చైనా పర్యటన జరుపుతున్నారు.ఆయన రాక సందర్భంగా చైనా ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక నార్మన్‌ బెతూన్‌ మెడల్‌ను బహుకరించింది. ఇలాంటిదే 1973లో తన తండ్రికి బహుకరించారని జస్టిన్‌ తన ఇస్‌స్టాగ్రామ్‌ పేజీలో వ్యాఖ్యానించారు. ఇంకేముంది కెనడా కమ్యూనిస్టు వ్యతిరేకులకు అవకాశం దొరికినట్లయింది. మాజీ ప్రధాని పిరే ఇలియట్‌ ట్రుడెవ్‌ అడుగుజాడల్లో ఆయన కుమారుడు జస్టిన్‌ కూడా చైనా తో సంబంధాల విషయంలో వ్యవహరిస్తున్నాడని చైనాలో మానవ హక్కుల హరణం గురించి తెలుసుకోవాలంటూ కాగితాలు, ఇంటర్నెట్‌ను ఖరాబు చేస్తున్నారు. నార్మన్‌ బెతూన్‌ అంటే కెనడాలో అత్యధికులకు అసలు తెలియదు, చైనాలో మాత్రం జాతీయ వీరుడు, ప్రతి స్కూలు పిల్లవాడికీ బెతూన్‌ పేరు తెలుసు. వైద్యుడిగా జీవితం ప్రారంభించిన బెతూన్‌ కమ్యూనిస్టు కూడా. కెనడాలో వైద్యం వలన తన జీవితం ధన్యం కాదని గ్రహించిన ఆయన తొలుత స్పెయిన్‌ వెళ్లి అక్కడ నియంతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వాన సాగిన అంతరుద్ధ్యంలో పాల్గొన్నాడు. తరువాత 1938లో చైనా వెళ్లి కమ్యూనిస్టు గెరిల్లా దళాలలో చేరి వారికి వైద్య చికిత్స అందించారు. ఆ సమయంలోనే మావోతో పరిచయం ఏర్పడింది. అయితే 1939లో జరిగిన ఒక ప్రమాదంలో బెతూన్‌ మరణించారు. చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత అంతర్జాతీయ కమ్యూనిస్టు సౌహార్ధ్రతకు ఒక ఆదర్శంగా బెతూన్‌ సేవలను పరిగణించి ఆయన గురించి స్కూలు పాఠ్యాంశాలలో చేర్చటంతో ఆయన పేరు ప్రతి చైనీయుడికీ సుపరిచితం అవుతోంది.

   1970 దశకం వరకు కమ్యూనిస్టు చైనాను గుర్తించేందుకు అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద కూటమి తిరస్కరించింది. ఒక తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ ప్రభుత్వాన్నే అసలైన చైనాగా పరిగణించి ఐక్యరాజ్యసమితిలో ప్రాతినిధ్యం కలిగించింది. అయితే అలా కొనసాగటం సాధ్యం కాని స్ధితిలో అమెరికా దిగి వచ్చి కమ్యూనిస్టు చైనాను గుర్తించక తప్పలేదు. దాంతో అప్పటి వరకు అమెరికాను అనుసరించిన కెనడా కూడా చైనాతో దౌత్య సంబంధాలు పెట్టుకొంది. 1973లో కెనడా ప్రధాని పిరే చైనా పర్యటన జరిపి మావోతో భేటీ అయ్యారు. ఆ పర్యటన సందర్భంగా నార్మన్‌ బెతూన్‌కు చైనాలో వున్న ఆదరణ, వున్నత స్ధానాన్ని గమనించారు.బెతూన్‌ది కెనడా, మాదీ కెనడా అన్నట్లుగా సంబంధాలను కలుపుకున్నారు.అప్పటి నుంచి కెనడాలో ఎవరు అధికారంలో వున్నప్పటికీ, కమ్యూనిస్టు వ్యతిరేకులైనా చైనాతో సంబంధాల విషయంలో నార్మన్‌ బెతూన్‌ పేరును వుపయోగించుకుంటూనే వున్నారు.

   జపాన్‌ సేనలకు వ్యతిరేకంగా పోరాడేందుకు చైనాకు వెళ్లిన బెతూన్‌ కెనడా విలువలకు ద్రోహం చేశాడని అతడే మాత్రం ఆదర్శం కాదంటూ కెనడా కమ్యూనిస్టు వ్యతిరేకులు విషం చిమ్ముతున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం టొరోంటో సన్‌ అనే పత్రిక అధిపతి పీటర్‌ వర్తింగ్టన్‌ ఒక వ్యాఖ్యానం రాస్తూ ‘ మానవత్వానికి సాయం చేసేందుకు బెతూన్‌ చైనా వెళ్లలేదు, అక్కడ మావో కమ్యూనిస్టు పార్టీ సైన్యానికి తోడ్పడేందుకు మాత్రమే వెళ్లారు, సాధారణ రోగులకు బదులు గాయపడిన కమ్యూనిస్టు గెరిల్లాలకు చికిత్స చేసేందుకు మాత్రమే వెళ్లారు అని రాసిన విషయాన్ని ఇప్పుడు వుటంకిస్తూ ఆ విషయాన్ని ప్రధాని జస్టిన్‌ మరిచిపోకూడదని కమ్యూనిస్టు వ్యతిరేక రచయితలు వుద్బోధించారు. మానవ హక్కుల వుల్లంఘనలకు పాల్పడుతున్న చైనాను ప్రధాని ఎలాగూ నిలదీయలేరు, కనీసం బెతూన్‌ను పొగిడుతూ నటించటం అయినా మానుకోవాలని కొందరు వ్యాఖ్యాతలు రాశారు.

కమ్యూనిస్టులు ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తప్పేనా ?

    హాంకాంగ్‌ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ ఎందుకు పోటీ చేయటం లేదంటూ అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేకులు దానినొక సమస్యగా ఓటర్ల ముందుంచేందుకు పూనుకున్నారు. హాంకాంగ్‌ విషయానికి వస్తే దానిదొక ప్రత్యేక పరిస్థితి. బ్రిటీష్‌ వారి కౌలు 99 సంవత్సరాల కౌలు గడువు ముగిసిన తరువాత మాతృదేశం చైనాలో ప్రాంతమది. అంతర్జాతీయ నౌకాశ్రయంగా, పెట్టుబడులు, వాణిజ్య కేంద్రంగా బ్రిటీష్‌ వారి ఏలుబడిలో రూపొందింది. దానిని విలీనం చేసే సందర్భంగా 1997వ సంవత్సరంలో చైనా ఒక ఒప్పందం చేసుకుంది. అదే మంటే చైనాలో అంతర్భాగమైనప్పటికీ యాభై సంవత్సరాల పాటు అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థను కొనసాగించేందుకు అంగీకరించింది. ఒకే దేశం రెండు వ్యవస్థలు అన్న విధానంగా దీనిని వర్ణించారు. ప్రధాన భూభాగంలో సోషలిస్టు వ్యవస్ధ, హాంకాంగ్‌లో పెట్టుబడిదారీ వ్యవస్ధ.దానికి అనుగుణ్యంగానే హాంకాంగ్‌ పాలక మండలి నిర్ణీత గడువులో ఎన్నికలు నిర్వహిస్తూ స్వయం పాలనా మండలికి అప్పగించింది.అయితే హాంకాంగ్‌ను ఎలాగైనా చైనా నుంచి విడదీయాలన్న దుర్బుద్ధితో సామ్రాజ్యవాదులు అనేక రకాలుగా అక్కడి పౌరులను రెచ్చగొడుతున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో విబేధించే శక్తులు పాలకులుగా ఎన్నికైనప్పటికీ చైనా ప్రభుత్వం వారికి ఎలాంటి ఆటంకాలు కలిగించటం లేదు. ఆదివారం నాడు ఎన్నికలు జరిగే హాంకాంగ్‌లో 72లక్షల మంది జనాభా వున్నారు. దానికి ఎన్నికయ్యే పాలక మండలితో పాటు చైనా ప్రభుత్వం తరఫున పర్యవేక్షణ మండలి ప్రత్యేకంగా వుంటుంది. హాంకాంగ్‌ తరఫున చైనాలో అధికారిక ప్రతినిధిగా అదే వుంటుంది. రోజువారీ పాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకోదు. కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకులు దానిలోని సభ్యులందరూ కమ్యూనిస్టులే అని అయితే బయటికి అలా చెప్పుకోరు అని తప్పుడు ప్రచారం చేస్తారు. ఒప్పందానికి అనుగుణంగా హాంకాంగ్‌లోని సంస్ధలకు విశ్వాసం కలిగించేందుకు కమ్యూనిస్టు పార్టీ ఎన్నికలలో పోటీ చేయటం లేదు.

కాస్ట్రోతో చేయి కలుపుతారు, ఆయన బొమ్మపై రాద్ధాంతం చేస్తారు

    అమెరికా పాలకులు క్యూబాను నాశనం చేయాలని, దాని అధినేత ఫిడెల్‌ కాస్ట్రోను అంతం చేయాలని ఎన్నో యత్నాలు చేసి సాధ్యంగాక చివరికి దిగి వచ్చి దౌత్య సంబంధాలు పెట్టుకున్న విషయం తెలిసిందే.అయితే మరోవైపు కాస్ట్రో బొమ్మతో వున్న టీ షర్టులను ధరించిన వారిపై మాత్రం రాద్ధాంతం చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తాజాగా ఫుట్‌బాల్‌ ఆటగాడు కోలిన్‌ కయోపెర్నిక్‌ తెలిపిన నిరసన తీరుతెన్నులపై పెద్ద రగడ చేస్తున్నారు. నల్లజాతీయులపై జరుగుతున్న దాడులు, వివక్షకు నిరసనగా ఒక ఫుట్‌బాల్‌ పోటీ సందర్భంగా జాతీయ గీతం ఆలపిస్తున్నపుడు లేచి నిలబడలేదు.దానిపై నెల రోజుల తరువాత చెలరేగిన వివాదం గురించి మాట్లాడేందుకు గత వారంలో విలేకర్లతో మాట్లాడాడు.ఆ సందర్భంగా ఫిడెల్‌ కాస్ట్రో, అమెరికాలో నల్లజాతీయుల హక్కుల కోసం పోరాడిన ప్రముఖులతో కూడి వున్న టీ షర్టును వేసుకన్నాడు. దానిపై ‘భావ సారూప్యం వున్నవారు ఒకే విధంగా ఆలోచిస్తారు ‘ అనే నినాదం రాసి వుంది.”Like Minds Think Alike.”)నల్ల, రంగు జాతీయులను అణచివేస్తున్నందుకు నిరసనగా తాను జాతీయ గీతాలాపన సందర్భంగా నిలబడకుండా నిరసన తెలిపానని స్పష్టం చేశాడు. తనకు ఫుట్‌ బాల్‌ కంటే నిరసన ముఖ్యమని వేరే విధంగా ఆలోచిస్తే స్వార్ధం అవుతుందని అన్నాడు. విలేకర్ల సమావేశం సందర్భంగా వేసుకున్న టీషర్టుపై ఫిడెల్‌ కాస్ట్రో బొమ్మ వుందంటే కయో పెర్నిక్‌ ఒక కమ్యూనిస్టు నియంతను సమర్ధించినట్లేనని ఒక పత్రికలో రాశారు. క్యూబా నుంచి ప్రవాసం వచ్చిన క్యూబన్‌-అమెరికన్లు కయో పెర్నిక్‌పై మండి పడుతున్నారుె. ఎందుకలా చేశాడంటూ మీడియాలో నిరసన ఒక పెద్ద చర్చనీయాంశమైంది. కయో పెర్నిక్‌ తల్లి పేద కుటుంబానికి చెందిన శ్వేత జాతి యువతి కాగా తండ్రి నల్లజాతీయుడైన ఆఫ్రో-అమెరికన్‌.

   అమెరికా జాతీయ గీతం జాతి వివక్షా పూరితమైనదనే విమర్శ ఎప్పటి నుంచో వుంది. దానిని రాసింది ఒక బానిస యజమాని. నల్లజాతి వారిని బానిసలుగా చేసి అమెరికా ఖండంలో వ్యాపారం చేసిన విషయం తెలిసినదే. ఆ గీతంపై గతంలో ఎందరో నిరసన తెలిపారు. అనేక మంది నల్లజాతి క్రీడాకారులు ఆ గీతాలాపన సందర్భంగా మాట్లాడుతూ వుండటమో, కాలో చేయో కదిలించటం, టోపీ తీయటం,పెట్టుకోవటం వంటి రూపాలలో నిరసన తెలపటం జరుగుతున్నది. తాను అమెరికా వ్యతిరేకిని కాదని, అమెరికా మరింత మెరుగ్గా తయారు కావటానికే ఈ నిరసన తెలిపినట్లు కయో పెర్నిక్‌ చెప్పాడు.తొలుత కూర్చుని నిరసన తెలిపిన అతను ఇప్పుడు మోకాళ్ల మీద నిలబడుతున్నాడు.1972లో జాకీ రాబిన్సన్‌ అనే బేస్‌బాల్‌ ఆటగాడు నిరసన తెలిపుతూ ‘నేను నిలబడను, జాతీయ గీతం పాడను, పతాకానికి వందనం చేయను, శ్వేతజాతి లోకంలో నేనొక నల్లజాతీయుడనని నాకు తెలుసు ‘ అని వ్యాఖ్యానించాడు.అంతకు ముందు ఇద్దరు నల్లజాతి ఒలింపిక్‌ రన్నర్లు జాతీయ గీతాలాపన సందర్భంగా నల్లజాతీయుల శక్తి చిహ్నంగా బిగించిన పిడికిలి చూపి నిరసన తెలిపారు.

చే గువేరాపై నోరు పారవేసుకున్న టర్కిష్‌ స్పీకర్‌

    ప్రముఖ విప్లవ కారుడు చే గువేరా ఒక హంతకుడు కనుక అతనినెవరూ అభిమానించకూడదని వ్యాఖ్యానించిన టర్కీ పార్లమెంట్‌ స్పీకర్‌ ఇస్మాయిల్‌ కర్మాన్‌ చర్యను ప్రపంచంలో అనేక మంది ఖండించారు.తమ ఆరాధ్యనేత అయిన చేగువేరాను అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని క్యూబా డిమాండ్‌ చేసింది. ఒక యువజన బృందాన్ని వుద్ధేశించి ఆయన మాట్లాడుతుండగా వారిలో కొందరు చేగువేరా బొమ్మలున్న టీ షర్టులు ధరించి కనిపించటంతో స్పీకర్‌కు పట్టరాని ఆగ్రహం వచ్చింది. అతనొక గెరిల్లా, బందిపోటు ,39 సంవత్సరాల వయస్సులోనే వురి తీసి చంపాడు, అతను అదర్శం కాకూడదు అని మాట్లాడాడు. క్యూబా నిరసన తెలపటంతో టర్కీ ప్రభుత్వం సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది. తమ స్పీకర్‌ మార్క్సిస్టు వ్యతిరేకి కాదని, ఒక జాతీయ వాదిగా తమ దేశంలో వున్న వేలాది మందిని ఆదర్శంగా తీసుకోవాలి తప్ప క్యూబా సోషలిస్టు విప్లవంలో భాగస్వామి అయిన వారిని కాదని చెప్పేందుకు ప్రయత్నించారని వివరణ ఇచ్చింది. స్పీకర్‌ వ్యాఖ్యలు చేగువేరా చరిత్రను వక్రీకరించాయని క్షమాపణ చెప్పాల్సిందేనని టర్కీలో క్యూబా రాయబారి డిమాండ్‌ చేశారు. టర్కీలోని వామపక్ష పార్టీల కార్యకర్తలు చే గువేరా టీషర్టులు ధరించి దేశమంతటా స్పీకర్‌ వ్యాఖ్యలకు నిరసన తెలుపుతూ ప్రదర్శనలు చేశారు. పార్లమెంట్‌ ఎదుట చేసిన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. టర్కీ పాలకపార్టీ ఏకెపి కమ్యూనిస్టు వ్యతిరేక, మతవాద పార్టీ అన్న విషయం తెలిసిందే. క్యూబాలో ఒక మసీదు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలన్న టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ అభ్యర్ధనను క్యూబా సర్కార్‌ గతంలో అంగీకరించలేదు. అమెరికాను 1492లో కొలంబస్‌ కనుగొనక ముందే ముస్లింలు కనుగొన్నారని ఎర్డోగన్‌ వాదిస్తారు. కొలంబస్‌ డైరీలలో ఒక కొండ పక్కన గుమ్మటాలతో కూడిన ఒక భవనం గురించి వర్ణణ వుందని అది అక్కడి మసీదు గురించే అని టర్కీలోని కొందరు చెబుతారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మేం మీతో వున్నాం ! ఫెబ్రియానా ఫిర్దౌస్‌ ముందుకు సాగిపో !!

15 Wednesday Jun 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics

≈ Leave a comment

Tags

1965 Symposium, Anti communist, Febriana Firdaus, Indonesia, Indonesian Communist Party (PKI)., victims of 1965

కమ్యూనిస్టు వ్యతిరేకుల వత్తిళ్లకు లొంగవద్దు,

ఎం కోటేశ్వరరావు

స్థలం ఇండోనేషియా రాజధాని జకర్తా నగరం !

సమయం 2016 జూన్‌ రెండవ తేదీ !!

      సందర్భం కమ్యూనిజం నుంచి దేశాన్ని కాపాడాలంటూ కమ్యూనిస్టు వ్యతిరేకుల సభ రెండవ రోజు కొనసాగింపు !!!

    ఆ సభ ప్రాంగణం దగ్గరకు వచ్చారు కొందరు క్రైస్తవ విద్యార్ధులు. కుక్క మనిషిని కరవటం సాధారణం, అదే మనిషి కుక్కను కరిస్తే వార్త. ప్రపంచంలో కమ్యూనిస్టుల కార్యకలాపాలు, అందులో భాగంగా సభలు సమావేశాలు సాధారణం. కమ్యూనిస్టుల నుంచి దేశాన్ని కాపాడండని సభ పెట్టటమే వార్త. ఆ సభకు వచ్చిన క్రైస్తవ యువకులు సభ వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్‌లో శిలువ గుర్తు కూడా వుంది. ఆ చిహ్నాన్ని వుపయోగించుకోవటం పట్ల తమకు అభ్యంతరం వుందంటూ తమ నిరసనను వారు నిర్వాహకుల ముందు వెల్లడించారు.

     ఇంకేముంది జర్నలిస్టులకు అదొక మిర్చి మసాలా ! మిరప చిన్నదా పెద్దదా అని కాదు అన్నయా అది కారంగా వుందా లేదా అన్నదే పాయింటు అన్నట్లుగా అది చాలా హాట్‌గా వుంటుంది కదా !! మూడుపదులు దాటిన ఒక మహిళా జర్నలిస్టు ఆ విద్యార్ధులను పక్కకు పిలిచి మీ అభ్యంతరం ఏమిటని వారితో మాట్లాడుతున్నారు. ఇంటర్వ్యూ ఇంకా పూర్తి కాలేదు. మధ్యలో తెల్లటి తలపాగా ధరించిన ఒక వ్యక్తి వచ్చాడు. దుర్వాసుడికి దూరపు బంధువులా వుంది ముఖం. వస్తూనే ఈమె ఫెబ్రియానా ఫిర్దౌస్‌ , తప్పుడు వార్తలు రాస్తుంటుంది.ఆమెతో మాట్లాడకండి అంటూ వాదులాటకు దిగాడు.ఇంతలో అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లుగా వున్న మరో తలపాగా వాలా వస్తూనే ఈ వార్త కనుక అచ్చయిందో, నీ ఫొటో, వివరాలన్నీ మా దగ్గర వున్నాయి, జైల్లో తోయిస్తాం జాగ్రత్త అంటూ బెదిరింపులకు దిగాడు. ఇస్లాం రక్షణ సంఘటన, దేశ రక్షణ వుద్యమం పేరుతో వున్న సంస్ధలకు చెందిన వారు ఈ వ్యక్తులు.

    అసలే కోతి, ఆపైన కల్లుతాగింది అన్నట్లుగా రెండు తలపాగాలూ పెద్దగా రంకెలు వేస్తూ వుండటంతో అసలే ఎరుపు భయంతో వున్న సభికులు తాము మట్టుబెట్టిన లక్షలాది మంది కమ్యూనిస్టులలో ఎవరైనా భూతంగా ఆ సభకు వచ్చిందేమో అని భయపడ్డారో లేక భ్రమపడ్డారో గాని అనేక మంది అక్కడకు చేరుకున్నారు. ఇంకే ముంది . ఆ రెండు పత్రికల వార్తలను పట్టించుకోకూడదని వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆ పత్రిక, ఛానల్‌ వారు తమ వార్తలను కవర్‌ చేయవద్దని చంద్రబాబు నాయుడు ఆగ్రహించినట్లుగా ఫెబ్రియానా రాసే వార్తలు మాకు అవసరం లేదు, అసలు ఆమెను మేం పిలవలేదు, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కొందరు ఆమె మీదకు వెళ్లారు.జాగ్రత్త మన మహిళల్లో కొందరు నకిలీ ముస్లింలు బురఖాలు వేసుకొని వస్తారు, నిజానికి వారు కమ్యూనిస్టు తొత్తులు, బురఖాలతో మోసం చేయవద్దు అంటూ వీరంగం వేశారు. వున్మాదంతో వున్న జనం, విచక్షణ జ్ఞానం వుండదు వారికి వివరించినా ప్రయోజనం శూన్యం అని గ్రహించి ఆ ప్రాంగణం నుంచి ఆమె నిష్క్రమించారు. ఆ తరువాత ఆమె అంతం చూస్తామంటూ సామాజిక మీడియాలో మతశక్తులు బెదిరింపులు ప్రారంభించాయి.

AJI Condemns Intimidation against Journalist

     ఫెబ్రియానా ఫిర్దౌస్‌ గురించి ఇంక పరిచయం అవసరం లేదేమో ! ఇండోనేషియాలో వున్న తాజా పరిస్థితికి ఆ వుదంతం అద్దం పట్టింది. ఇంతకూ ఆమె చేసిన అపరాధం ఏమిటి ? నియంత సుహార్తో నాయకత్వంలో అమెరికా కుట్ర ప్రకారం మిలిటరీ, పారా మిలిటరీ, రజాకార్ల వంటి మతోన్మాద గూండాలను తయారు చేసి దాదాపు ఐదులక్షల మంది కమ్యూనిస్టులను హతమార్చిన దారుణ మారణం కాండ గురించి ఆ నియంత మరణించిన వచ్చిన కొద్దిపాటి వెసులు బాటును వుపయోగించుకొని బుద్ధి జీవులు ఆ దారుణాల గురించి మెల్లగా మాట్లాడటం ప్రారంభించారు. అది క్రమంగా వూపందుకొని ఆ దారుణాలపై విచారణ జరపాలని, బాధ్యులపై చర్య తీసుకోవాలని, ప్రభుత్వం హత్యాకాండపట్ల క్షమాపణ చెప్పాలని తదితర డిమాండ్లు ముందుకు వచ్చాయి. ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పేవారు తాము ప్రజాస్వామ్యయుతంగా వున్నామని జనం ముందు ప్రదర్శించుకోవాలి కదా ? కొంత మంది అభిప్రాయం ప్రకారం పాలకులకు ఇష్టం లేకపోయినా పెరుగుతున్న వత్తిడిని తట్టుకోలేక, ఏదో ఒక పేరుతో ఆ చర్చకు తెరదించాలనే లక్ష్యంతో కొద్ది వారాల క్రితం ఇండోనేషియా ప్రభుత్వం 1965నాటి వూచకోతపై ఒక సెమినార్‌ను ఏర్పాటు చేసింది. ఆచరణలో గతంలో మాదిరే ప్రస్తుత ప్రభుత్వం కూడా కమ్యూనిస్టు భావజాలం, పదజాలం వున్న కళారూపాలు, డాక్యుమెంటరీలు, పాటలను కూడా నిషేధించారు.కేసులను నమోదు చేశారు. అంతకు ముందున్న పరిస్ధితికి వర్తమానానికి తేడా లేదని అనేక మంది అభిప్రాయపడుతున్నారు.

    అయినప్పటికీ దేశంలోని నిరంకుశ, మతశక్తులు గగ్గోలు ప్రారంభించాయి.కమ్యూనిస్టు సిద్దాంతాన్ని తిరిగి ఇండోనేషియాలో వ్యాపింప చేయాలనే వారు ప్రభుత్వ సదస్సు వెనుక వున్నారని కొందరు, అసలు ప్రభుత్వంలోనే కమ్యూనిస్టులున్నారని మరి కొందరు, ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీ పునరుద్దరించబడిందని, వచ్చే ఏడాది లాంఛనంగా ప్రకటన చేయనున్నారని ఇలా రకరకాల ప్రచారాలు ప్రారంభించారు. వీటిలో వాస్తవాలు ఎంత వరకు అన్నది చెప్పలేము గాని 1965 మారణకాండ గురించి జనానికి నిజాలు చెప్పాలన్న ప్రజాతంత్ర డిమాండ్‌ మాత్రం నానాటికీ అక్కడ పెరుగుతోందన్నది స్పష్టం.

     ఈ పూర్వరంగంలోనే కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు, నాటి మారణకాండలో భాగస్వామ్యులైన మాజీ సైనికాధికారులు, వారితో చేతులు కలిపిన మతోన్మాద శక్తులు, సంస్ధలు, కమ్యూనిస్టు వ్యతిరేకులు కలిసి ప్రభుత్వం పెట్టినదానికి పోటీ సదస్సును పెట్టి కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టాలని, గతంలో జరిగినదానిపై ఎలాంటి క్షమాపణ చెప్పటం, విచారణ చేయాల్సిన అవసరం లేదంటూ తీర్మానించారు. దాని గురించి విమర్శనాత్మకంగా వార్తలు,వ్యాఖ్యలు రాయటమే ఫెబ్రియానా చేసిన పని. అంతకు ముందు కూడా కమ్యూ నిస్టులు, సానుభూతిపరులు అన్న అనుమానం వున్న కళాకారులు, రచయితల సభలు,సమావేవాలపై కూడా ప్రస్తుత ప్రభుత్వ అధికార యంత్రాంగం తీసుకున్న నిషేధ చర్యలు మొదలైన వాటి గురించి కూడా ఆమె విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆమె పేరు ఎత్తితేనే కమ్యూ నిస్టు వ్యతిరేకులు, మతశక్తులు మండి పడుతున్నాయి. భౌతిక దాడులకు ప్రయత్నించటంతో ఆమె ప్రస్తుతం అజ్ఞాతవాసంలో వున్నట్లు వార్తలు వచ్చాయి.

     ఒక్క ఫెబ్రియానా గురించే కాదు, ఇండోనేషియాలో పత్రికా స్వాతంత్య్రం గురించి అనేక మంది తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రశ్నిస్తున్నారు. ఫెబ్రియానాకు బెదిరింపుల గురించి జర్నలిస్టు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి.జర్నలిస్టుల విధి నిర్వహణను అడ్డుకొనే వారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా అక్కడి కరెన్సీలో 50 కోట్ల రుపయాల( 34,500 డాలర్లకు సమానం) జరిమానా విధించవచ్చు.తమ జర్నలిస్టును సభ నుంచి గెంటివేయటం అక్రమం అని ఫెబ్రియానా ఒక సంపాదకురాలిగా పనిచేస్తున్న రాప్లర్‌ డాట్‌ కాం యాజమాన్యం ఒక ప్రకటనలో ఖండించింది.ఆగ్నేయాసియా ప్రెస్‌ అలయన్స్‌ ఇండోనేషియా ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ రాసింది.ఇండోనేషియా ఇండిపెండెంట్‌ జర్నలిస్టు అలయన్స్‌ ఫెబ్రియానా రక్షణకు చర్యలు తీసుకుంది.ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇండోనేషియాలో కమ్యూనిస్టు పార్టీ పునరుద్దరించబడిందా !

04 Saturday Jun 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics

≈ Leave a comment

Tags

Anti communist, Indonesian Communist Party, PKI, victims of 1965

ఎంకెఆర్‌

    ఇండోనేషియాలో అంత మైంది అనుకున్న కమ్యూనిస్టు పార్టీ పునరుద్దరించబడిందా ? కొంత మంది చెబుతున్నట్లు 2017లో ఈ మేరకు ప్రకటన వెలువడుతుందా ? లేక మరికొందరు అంటున్నట్లు ఎక్కువ చేసి చెబుతున్నారా ? యాభై సంవత్సరాల క్రితం ఇండోనేషియాలో దాదాపు ఐదు లక్షల మంది కమ్యూనిస్టులను వూచకోత కోశారు. మరికొన్ని లక్షల మందిని అనుమానంతో కమ్యూనిస్టులుగా భావించి జైళ్లలో పెట్టారు, చిత్రహింసల పాలు చేశారు. కమ్యూనిజాన్ని అణచివేశామని అదింకేమాత్రం ఇండోనేషియాలో కనిపించదని సంబరాలు చేసుకున్నారు. ఆసియాలో కమ్యూనిజ వ్యాప్తి నిరోధంలో భాగంగా అమెరికా సిఐఏ రూపొందించిన ఒక దుష్ట పధకం ప్రకారం ఇదంతా జరిగింది.నాడు ఏక్షణంలో ఏ సైనికులు, పోలీసులు, వారి కిరాయి ఏజంట్లు వచ్చి తమను హతమారుస్తారో అని కమ్యూనిస్టులు, అభిమానులు, సాధారణ ప్రజాతంత్ర వాదులు భయపడ్డారు. నేడు అందుకు విరుద్ధంగా ఏ మూల నుంచి కమ్యూనిస్టులు పుట్టుకు వస్తారో అని భయపడుతూ అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేకులు వీధులకెక్కుతున్నారు. అనేక సంస్థలకు చెందిన వారూ, రిటైర్డ్‌ మిలిటరీ అధికారులు కొద్ది రోజుల క్రితం కమ్యూనిస్టు వ్యతిరేక సదస్సు పెట్టి ఆ సందర్భంగా రాజధాని జకర్తాలో ఒక ప్రదర్శన చేశారు.అరుణ పతాకాలను తగుల పెట్టారు.కమ్యూనిస్టులను చంపటం సరైనదే అని వున్మాదంతో నినాదాలు చేశారు. కమ్యూనిజం, ఇతర భావజాలాల నుంచి దేశాన్ని రక్షించుకొనేందుకు ఈ ప్రదర్శన జరిపినట్లు వుపన్యాసాలు చేసిన వారు చెప్పారు. హిరోషిమా, నాగసాకీలపై అణుబాంబులు వేసి ఎంతో మందిని చంపిన అమెరికా క్షమాపణ చెప్పేందుకు నిరాకరించిందని, కమ్యూనిస్టులను చంపటం కూడా యుద్ధంలో భాగంగానే పరిగణించి ప్రభుత్వం ఎలాంటి క్షమాపణలు చెప్పకూడదని వాదించారు. ఇంతకాలంగా కార్యకలాపాలలో లేని ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ(పికెఐ) తన వునికిని చాటుకొనేందుకు పధకాలు వేసిందని, దానిని అడ్డుకోవాలని కోరారు. కొన్ని పత్రికలు మూడువేల మంది పాల్గొన్నట్లు రాస్తే మరికొందరు పదివేలని పేర్కొన్నారు.

    దీనికి కొద్ది వారాల ముందు ప్రభుత్వమే 1965 హత్యాకాండ బాధితుల గురించి వారి కుటుంబాలు, మేథావులు, మానవహక్కుల కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులతో ఒక సదస్సు జరిపిన విషయం తెలిసినదే.అదే ప్రభత్వం కమ్యూనిస్టు ప్రచారం, పునరుద్ధరణలో భాగంగా చివరికి కమ్యూనిస్టు చిహ్నాలున్న టీ షర్టులను అమ్ముతున్నవారిని, ధరించిన వారిని కూడా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పికెఐ భావజాలం వున్న వారు చెప్పింది మాత్రమే వినవద్దు, మేము చెప్పేది కూడా వినాలి, 1965లో మరణించిన వారిని (కమ్యూనిస్టులను) బాధితులుగా ప్రభుత్వం గుర్తిస్తే వారిని హతమార్చిన వారిని(మిలిటరీ, ఇతర కిరాయి ఏజంట్లు) నేరస్థులుగా పరిగణించాల్సి వుంటుందని కమ్యూనిస్టు వ్యతిరేకులు పేర్కొన్నారు.

  ప్రస్తుతం ఇండోనేషియాలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తికలిగిస్తున్నాయి.ప్రపంచంలో కమ్యూనిజాన్ని అంతం చేశామని అమెరికన్లు ప్రకటించిన పాతిక సంవత్సరాల తరువాత అదే అమెరికాలో తాము సోషలిస్టుల మంటూ బహిరంగంగా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అధికార డెమోక్రటిక్‌ పార్టీ తరఫున పోటీ చేసేందుకు తన అభ్యర్ధిత్వానికి మద్దతు ఇవ్వాలంటూ స్వయంగా సోషలిస్టును అని ప్రకటించుకున్న బెర్నీ శాండర్స్‌ ప్రస్తుతం ప్రచారంలో మునిగిన విషయం, ఆయనకు యువత నీరాజనాలు పడుతున్న సంగతి తెలిసిందే.

   ఇండోనేషియాలో నియంత సుహార్తో పతనం తరువాత 1965 నాటి మారణకాండపై విచారణ జరపాలనే అంశం మెల్లగా వూపందుకుంది. మొత్తాన్ని అంతం చేసిన తరువాత కూడా ఇంకా కమ్యూనిస్టులు మిగిలి వున్నారా ? వుంటే ఏ పేరుతో వున్నారు, తాజా డిమాండ్‌ వెనుక వారున్నారా ? అన్నది కమ్యూనిస్టు వ్యతిరేకులను వేధిస్తున్న ప్రశ్న. కమ్యూనిస్టుల నాయకత్వాన నైజా నవాబు, దేశముఖ్‌లు, జాగీర్దార్లకు వ్యతిరేకంగా సాగిన మహత్తర తెలంగాణా సాయుధ పోరాట సందర్బంగా కోస్తా జిల్లాలో ఆ పోరాటానికి మద్దతు తెలిపిన వారిని కూడా మిలిటరీ, పోలీసులు అనేక మందిని కాల్చి చంపటమే గాక గ్రామాలకు గ్రామాలను చుట్టుముట్టి చిత్ర హింసల పాలు చేశారు. పోలీసులకు ఎవరు కమ్యూనిస్టులో ఎవరు కాదో తెలియని స్ధితి, వచ్చిన స్పెషల్‌ ప ోలీసులకు జనాన్ని బాదటం తప్ప తెలుగు తెలియదు. గాంధీ విగ్రహాల ముందు జనాన్ని మందవేసి చిత్రహింసలు పెడుతున్న సందర్భంలో కొంత మంది తాము యాంటీ కమ్యూనిస్టుల మని చెప్పుకున్నారట. అసలే పోలీసు, తలమీద టోపీ పెట్టగానే బుర్ర అసలు పని చేయదని తెలిసిందే. దాంతో వున్న కమ్యూనిస్టులతోనే వేగలేకపోతుంటే వీరెవరో కొత్తగా యాంటీ కమ్యూనిస్టులట వీరికి నాలుగు అదనంగా తగిలించమని పురమాయించినట్లు చెప్పేవారు. అలాగే ఇండోనేషియాలో కమ్యూనిస్టు వ్యతిరేకత ఎంతవరకు పోయిందంటే కమ్యూనిస్టు వ్యతిరేక పుస్తకాలను కూడా మిలిటరీ, పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారట. ఏమిటంటే కమ్యూనిస్టులను విమర్శించాలన్నా కమ్యూనిస్టులు ఏమి చెప్పేది వివరించాలి కనుక అది కూడా కమ్యూనిస్టు ప్రచారానికి తోడ్పడుతందని వారు భయపడుతున్నారు. కమ్యూనిస్టు వ్యతిరేకత ముసుగులో నియంత సుహార్తో అనుసరించిన మేథోవ్యతిరేక ధోరణులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇంటర్నెట్‌ బాగా అందుబాటులోకి వచ్చిన తరుణంలో ఇలాంటి చర్యలు ఫలితాలనివ్వవని తెలిసినప్పటికీ అదే మొరటు పద్దతులను పాటిస్తున్నారు. మిలిటరీ, పోలీసులు ఎంతగా కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడితే యువతరం అంతగా దానిపట్ల ఆకర్షితులయ్యే ప్రమాదం లేకపోలేదని కొందరు భయపడుతున్నారు.

   ఇండోనేషియాలో కమ్యూనిస్టు కార్యకలాపాల పునరుద్ధరణ గురించి వస్తున్న వార్తలు అతిశయోక్తులని దేశ వుపాధ్యక్షుడు యూసఫ్‌ కలా వ్యాఖ్యానించారు.’ కమ్యూనిజం అనేది సమానత్వం కోరుతున్న ఒక భావజాలం,అందుకే కాబోలు జనం దానిని భిన్నంగా చూస్తున్నారు, ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ పునరుద్ధరణ అనేది అతిశయోక్తి అనుకుంటున్నా. అది అనేక దేశాలలో విఫలమైంది, ప్రస్తుతం వుత్తర కొరియాలో మాత్రమే వుంది, అక్కడి ప్రభుత్వం కూడా విఫలమైంది, ఒక భావజాలంగా ఒకసారి తిరస్కారానికి గురైంది తిరిగి వేళ్లూను కుంటుంది అనుకోవటం లేదు.’ అన్నారు. మిలిటరీ అధికారి కివలన్‌ జెన్‌ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ పునరుద్ధరించబడింది, 2017లో ప్రకటన వెలువడ నుంది అన్నారు. రాజకీయ, భద్రత, న్యాయ వ్యవహారాల మంత్రి లుహుత్‌ బిన్సర్‌ పండజైటన్‌ మాట్లాడుతూ ‘ అదే నిజమైతే ఆ సంస్ధ ఎక్కడుందో చెప్పమనండి, నాకు చాలా కళ్లు,చెవులు వున్నాయి కానీ ఒక్క నివేదిక కూడా నాకు అందలేదు’ అని విలేకర్లతో వ్యాఖ్యానించారు. ఇండోనేషియాలో జరుగుతున్న పరిణామాలు ఎటు దారి తీస్తాయనేది ఆసక్తి కలిగిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సుత్తీ, కొడవలి టీ షర్టులతో భయపడిన ఇండోనేషియా సర్కార్‌

15 Sunday May 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics

≈ Leave a comment

Tags

Anti communist, communist, communist symbols, Indonesian Communist Party (PKI)., Jokowi, PKI, victims of 1965

ఎంకెఆర్‌

  ప్రపంచంలో సోషలిజాన్ని తొక్కి వేశామని, కమ్యూనిజాన్ని కాలరాశామని అమెరికా సామ్రాజ్యవాదులు ప్రకటించిన పాతిక సంవత్సరాలు దాటింది. అయితేనేం వారి కనుసన్నలలో నడుస్తున్న ఇండోనేషియా పాలకవర్గం ఇప్పుడు ఎటు వైపు నుంచి ఎప్పుడు కమ్యూనిస్టులు తమకు దర్శనమిస్తారోనని భయపడి చస్తోంది, మాటి మాటికీ వులికిపడుతోంది. యాభై సంవత్సరాల నాడు ఐదులక్షల మందికిపైగా కమ్యూనిస్టులు, వారి సానుభూతి పరులుగా పరిగణించిన వారిని వూచకోత కోసిన వారు ఇప్పుడు ఏ సమాధి నుంచి ఎవరు ఎక్కడ లేచి వస్తారో అన్నట్లుగా సామూహిక సమాధులను కూడా కానరాకుండా చేసేందుకు పూనుకుంది.

     లేకపోతే కార్మిక, కర్షక చిహ్నాలైన సుత్తీ, కొడవలి ముద్రించిన టీ షర్టులు అమ్ముకుంటున్న ఇద్దరు చిరు వ్యాపారులు కమ్యూనిజాన్ని వ్యాపింపచేస్తున్నారంటూ అరెస్టు చేస్తారా? అలాంటి టీ షర్టులను తయారు చేయవద్దని యజమానులను ఆదేశిస్తారా ? ప్రస్తుతం ఇండోనేషియాలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అక్కడి పాలకవర్గం వామపక్ష భావజాల చర్చను బహిరంగంగా అనుమతిస్తే ఏం జరుగుతుందో, అనుమతించక ఇంకా అణచివేత కొనసాగనిస్తే దాని మీద ఇంకా యువతలో మోజు పెరుగుతుందా అన్నది తేల్చుకోలేక పోతున్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు యాభై సంవత్సరాల నాడు జరిగిన అణచివేతకు గురైన వారి కుటుంబాలతో సర్దుబాటు చేసుకోవాలనే పేరుతో మారణకాండ గురించి ప్రభుత్వమే అధికారికంగా ఒక సదస్సు నిర్వహించి వివరాలుంటే చెప్పమని కోరింది.మరోవైపున అదే ప్రభుత్వం కమ్యూనిస్టు చిహ్నాలను పంపిణీ చేస్తూ కమ్యూనిజాన్ని ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. కమ్యూనిస్టు పార్టీపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయలేదు, ఏకపక్షంగా రాసిన చరిత్రను, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ఇంకా అధికారికంగా కొనసాగిస్తూనే వుంది.

    ఈ కారణంగానే పోలీసులు తాజాగా సుత్తీ,కొడవలి గుర్తులున్న టీ షర్టులను విక్రయించేవారిని అరెస్టు చేసి, వాటి తయారీని నిలిపివేయాలని కోరారు.ఈ చర్య కమ్యూనిస్టు వ్యతిరేకులకు ప్రతికూల ఫలితాలనే ఇస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ప్రభుత్వ చర్యను అనేక మంది మానవ హక్కుల కార్యకర్తలు ఖండిస్తున్నారు. కమ్యూనిస్టు చిహ్నాలను ప్రదర్శిస్తున్న, వ్యాపింప చేస్తున్నవారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని అధ్యక్షుడు జోకోవి ఇండోనేషియా మిలిటరీ, నేషనల్‌ ఇంటలిజెన్స్‌, అటార్నీ జనరల్‌ కార్యాలయాలను ఆదేశించించినట్లు జాతీయ పోలీసు ప్రధాన అధికారి బద్రుదిన్‌ హయతీ వెల్లడించారు.దేశంలో కమ్యూనిస్టు భావజాలం అదుపులేకుండా విస్తరించటం ఆందోళన కలిగిస్తున్నదని బద్రుదిన్‌ విలేకర్ల సమావేశంలో చెప్పారు. కమ్యూనిజం గురించి చర్చించటం, సమావేశాలు జరపటం వంటి కార్యకలాపాలు పెరగటాన్ని గమనించామన్నారు.ఈ పరిస్ధితులను కొన్ని బాధ్యతారాహిత్య పార్టీలు వినియోగించుకోచూడటాన్ని నిరోధించేందుకు పోలీసులు సత్వరమే స్పందిస్తున్నారని చెప్పారు. ఎవరైనా ఒక వ్యక్తి సుత్తీ, కొడవలి గుర్తులున్న టీ షర్టులు ధరించి వున్నా వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఎందుకు వాటిని ధరించారో విచారణ జరుపుతారని చెప్పారు. కమ్యూనిజం గురించి ప్రచారం చేస్తున్న అనేక మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారని వెల్లడించారు. మ్యూనిజం గురించి ప్రచారం చేస్తున్నారన్నది వాస్తవమని తేలితే అలాంటి వారికి పది సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. పోలీసులతో పాటు కమ్యూనిస్టులని అనుమానం వున్నవారి సమాచారం చేరవేసేందుకు ఏజంట్లను కూడా వినియోగిస్తున్నారు. టీషర్టులను అమ్మేవారిని నిర్బంధించటంతో వెల్లువెత్తిన నిరసనలతో దిక్కుతోచని అధ్యక్ష కార్యాలయ ప్రతినిధి జాన్‌ బౌడీ ఒక ప్రకటన చేస్తూ భద్రతా సిబ్బంది ఈ విషయంలో అతిగా స్పందించారని, మానవ హక్కులు, భావ ప్రకటనా స్వేచ్చను పరిరక్షించేందుకు కూడా శ్రద్ధ తీసుకోవాలని అధ్య క్షుడు కోరినట్లు నష్ట నివారణకు ప్రయత్నించారు.

   కమ్యూనిజం పునరుద్ధరణను నిరోధించే పేరుతో పౌర విధుల్లో మిలిటరీ ప్రమేయం ఎక్కువ అవుతోందని అనేక మంది విమర్శిస్తున్నారు. తూర్పు జావాలో ఈనెల మూడవ తేదీన ‘చెరకు తోటల్లో సుత్తీ, కొడవలి ‘ అనే పేరుతో వున్న గ్రంధ కాపీలను మిలిటరీ స్వాధీనం చేసుకుంది. మరొక ప్రాంతంలో గిరిజన సంఘం సభ్యుల వద్ద వామపక్ష సాహిత్యం, కమ్యూనిస్టు గుర్తులున్న టీ షర్టులు ధరించారనే పేరుతో నలుగురిని అరెస్టు చేశారు.

   టీ షర్టులపై ముద్రించేందుకు ఏ గుర్తులు బాగుంటాయో చూద్దామని తాము ఇంటర్నెటలో వెతికామని దానిలో 1990 దశకం నాటి తూర్పు జర్మనీ చిత్రం ఆకర్షణీయం వుండటంతో దానిని తీసుకొని టీ షర్టులపై ముద్రణకు ఇచ్చాం తప్ప ఆ గుర్తుల గురించి వాటిని కలిగి వుంటే ఇలా జరుగుతుందని తమకు తెలియదని వాటిని అమ్మిన చిరు వ్యాపారులు చెప్పారు. పోలీసులు కూడా తరువాత దానిని నిర్ధారించారు.అయితే ఆ చిహ్నాలను ముద్రించిన ఫ్యాక్టరీ యజమానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెలలోనే జకర్తాలో జరిపిన ఆసియన్‌ సాహిత్య వుత్సవాన్ని కమ్యూనిజం వ్యాప్తి కోసం తలపెట్టారంటూ కమ్యూనిస్టు వ్యతిరేకులు దానిని జరగనీయరాదని డిమాండ్‌ చేశారు.అయితే పోలీసు రక్షణలో అది జరిగింది. ఇదిలా వుండగా 1965 హత్యాకాండ బాధితుల పరిశోధనా సంస్ధ ప్రతినిధులు జావా,సుమత్రా దీవులలో 122 సామూహిక సమాధుల వివరాలను వెల్లడించింది. ఇండోనేషియా విశ్వవిద్యాలయ ఆంత్రోపాలజిస్టు దవే లుమెంటా మాట్లాడుతూ పాఠశాలల్లో బోధించినది తప్ప అత్యధికులకు దేశ చరిత్ర అందుబాటులో లేదన్నారు. ప్రభుత్వం అందించిన దానిని అంగీకరించటం తప్ప దాని అర్ధం చేసుకోలేక జనం కమ్యూనిజం గురించి భయపడుతున్నారని అన్నారు. ఆ పాఠాలలో కూడా చరిత్రలో ఏ రోజు ఏం జరిగిందో వరుసగా చెప్పటం తప్ప అలా జరగటానికి కారణాలు, పర్యవసానాల గురించి వాటిలో వుండదని, ప్రస్తుతం వునికిలో లేని కమ్యూనిస్టు పార్టీ గురించి ఏమీ వుండదని తెలిపారు. 1965నాటి సామూహిక హత్యాకాండ గురించి ఏకపక్షంగా చెప్పే కధనాల ప్రకారం కమ్యూనిస్టులు కేవలం అంతరాత్మలు లేని నాస్థికులుగా చిత్రితమైందని దవే చెప్పారు. 1965 తరువాత మిలిటరీతో సహా కొన్ని పార్టీలకు రాజకీయ చట్టబద్దత లభించిందని, వాటికి పైన చెప్పిన చెప్పిన కథనాలను పరిరక్షించటం తప్ప మరొకదానిపట్ల ఆసక్తి లేదంటూ నూతన అధికార వ్యవస్ధ కాలంగా పరిగణించబడుతున్న 1966-1998 మధ్య మిలిటరీకి చెందిన వారిని రాజకీయాలు, వాణిజ్యంలో కూడా అనుమతించారని తీవ్రవాదంతో కూడిన మితవాద శక్తులను ప్రోత్సహించటం ప్రమాదకరమని అన్నారు. యాభయి సంవత్సరా క్రితం సామూహిక హత్యాకాండకు గురైన వారి, లేదా దాని నుంచి తప్పించుకున్నవారి కుటుంబాలపై ఇప్పటికీ నింద, వివక్ష కొనసాగుతోందని ఇండోనేషియా విశ్వవిద్యాలయానికి చెందిన సోషియాలజిస్టు రువైదా నూర్‌ చెప్పారు. ప్రభుత్వం దానిని సంస్థాగతంగా జోక్యం చేసుకొని సరిదిద్దాలన్నారు. కుటుంబం, స్కూలు, మీడియా ద్వారా ఇది జరగాలని చెప్పారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జెఎన్‌యులో జరుగుతున్న ఘటనలకు మూలం ఏమిటి ?

17 Wednesday Feb 2016

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

ABVP, Anti communist, ANTI NATIONAL, BJP, democracy, JNU, JNU ROW, RSS, students

ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత పద్దతుల్లో  సమావేశం జరుపుకొనే హక్కున్న తమకు సాయం చేయాలని జెఎన్‌యు విద్యార్ధి సంఘాన్ని, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ వంటి ఇతర వామపక్ష విద్యార్ధి సంఘాలను డిఎస్‌యు కోరింది. కాశ్మీర్‌పై తమ వైఖరిని లేదా తమ భావజాలానికి మద్దతు కోరటం కాదని మీరు గమనించాలి. ఎంతో కష్టపడి సాధించుకున్న ప్రజాస్వామిక భావ వ్యక్తీకరణ చర్చ అవకాశాన్ని వమ్ముచేయటానికి పూనుకున్న ఎబివిపిని , యంత్రాంగాన్ని వదలి పెట్టకూడదని ఎట్టి పరిస్ధితుల్లోనూ సభజరిపి తీరాలని విద్యార్ధి యూనియన్‌ ఇతర విద్యార్ధి సంఘాలు నిర్ణయించి ముందుకు పోయాయి.

ఎం కోటేశ్వరరావు

హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జాతి వ్యతిరేక కార్యకలాపాలను అణచేపేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అణచివేత వైఖరి బంగారం లాంటి ఒక యువశాస్త్రవేత్త వేముల రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైంది.ఈ వుదంతంపై జరుగుతున్న ఆందోళన ఇంకా ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే వుంది. ఒక వుదంతం జరిగితే దాన్నుంచి మంచో చెడో ఏదో ఒకటి నేర్చుకోవాలన్నది సమాజం నేర్పిన పాఠం. హైదరాబాదు వుదంతం నుంచి కేంద్రం ప్రభుత్వం ఏమి నేర్చుకున్నది? తన భావజాలానికి వ్యతిరేకులుగా వున్న వారిని అణచివేసేందుకే ముందుకు పోవాలని ఒక గట్టి నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. దానిలో భాగమే న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్‌యు)లో వామపక్ష భావజాలం వున్న విద్యార్ధులు, విద్యార్ధి సంఘాలపై దేశద్రోహ ముద్రవేసి అరెస్టులకు పూనుకున్నది. దానిలో భాగంగానే విద్యార్ధి సంఘ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ తదితరుల అరెస్టు. హైదరాబాదు వుదంతంలో స్ధానిక ఎంఎల్‌ఏ,ఎంఎల్‌సిలు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ లేఖలు, ఇతర రూపంలో విశ్వవిద్యాలయ అధికారులపై వత్తిడి, ఏబివిపి విద్యార్ధులతో అసత్య కేసుల నమోదు వంటి పనులు చేశారు. న్యూఢిల్లీలో ఏకంగా బిజెపి ఎంఎల్‌ఏ ఒపి శర్మ కోర్టుకు వచ్చిన విద్యార్ధులు, అధ్యాపకులు, జర్నలిస్టులపై ఏకంగా పోలీసుల సమక్షంలో చేయి చేసుకున్నాడు. అంతే కాదు తనకు చిన్నప్పటి నుంచి జాతి వ్యతిరేకులుగా వున్నవారిపై దాడి చేయటం అలవాటని ఆ పెద్దమనిషి సమర్ధించుకున్నాడు.అంటే అధికార యంత్రాంగాన్ని వుపయోగించుకోవటమే కాదు, తమతో విబేధించేవారిపై సంఘపరివార్‌ కార్యకర్తలు ప్రత్యక్షంగా గూండాగిరీ చేయటానికి కూడా సిద్ధం అవుతున్నారనుకోవాలా ? ఇప్పటి వరకు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏటా ఫిబ్రవరి 14న వాలంటైన్స్‌ డే సందర్బంగా భజరంగ్‌దల్‌, విశ్వహిందూ పరిషత్‌ ఇతర వారి అనుబంధ సంఘాల కార్యకర్తలు వీధులు, పార్కుల వెంట తిరిగి అనుమానం వచ్చిన యువతీ యువకులను కొట్టటాన్ని మాత్రమే చూశాము.ఇప్పుడు వారు విశ్వవిద్యాలయాల వ్యవహారాలలో కూడా జోక్యం చేసుకుంటున్నారు.జాతి వ్యతిరేకులకు మద్దతు ఇస్తున్న విద్యార్ధులు, అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలని వారు ప్రతి ప్రదర్శన చేశారు. అలాంటి వారికి కేంద్రంగా వుందంటూ పనిలో పనిగా అసలు ఆ విశ్వవిద్యాలయాన్నే మూసివేయాలని కూడా డిమాండ్‌ చేశారు.

జెఎన్‌యులో ఏం జరిగింది? అసలు జాతి వ్యతిరేకత అంటే ఏమిటి? అన్నది ప్రతివారిలోనూ వస్తున్న సందేహం? విద్యార్ధులు ఏవైనా తప్పులు చేస్తే వారిని సరిదిద్దాలా లేక జాతి వ్యతిరేకులుగా ముద్రవేసి జైళ్లకు పంపాలా ? ‘ఫిబ్రవరి తొమ్మిది రాత్రి నిజంగా ఏం జరిగింది ?’ అనే శీర్షికతో హిందూస్ధాన్‌ టైమ్స్‌ పత్రిక ఫిబ్రవరి 16న ఒక విద్యార్ధి కధనాన్ని ప్రచురించింది. 2001లో పార్లమెంట్‌పై దాడి కేసులో శిక్ష పడిన అప్జల్‌ గురు స్మారకార్ధం ‘ఏ కంట్రీ వితౌట్‌ పోస్టాఫీసు’ అనే పేరుతో ఒక విద్యార్ధి సంఘం ఒక మీటింగ్‌ ఏర్పాటు చేసింది. దాని గురించి హర్షిత్‌ అగర్వాల్‌ అనే విద్యార్ధి క్వోరా వెబ్‌సైట్‌లో రాసిన అంశాలను హిందూస్థాన్‌ టైమ్స్‌ పేర్కొన్నది.’ ఫిబ్రవరి తొమ్మిదిన డిఎస్‌యు అంటే డెమోక్రటిక్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ పేరుతో వ్యవహరించే విద్యార్ధి సంఘం ఒక సాంస్కృతిక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వారు పేర్కొన్నట్లుగా కాశ్మీరీ పౌరుల ప్రజాస్వామిక హక్కయిన స్వయంత్రిపత్తి పోరాటానికి మద్దతుగా మరియు న్యాయవ్యవస్ధ హత్యకు గురైన అప్జల్‌ గురు మరియు మక్బూల్‌ భట్ల సంస్మరణగా ఆ సభ జరిగింది. క్యాంపస్‌(జెఎన్‌యు)లోని మరియు వెలుపలి నుంచి పెద్ద సంఖ్యలో కాశ్మీరీ విద్యార్ధులు ఈ కార్యక్రమానికి వచ్చారు.’ డిఎస్‌యు మావోయిజాన్ని నమ్మే విద్యార్ధులతో కూడిన ఒక చిన్న వుగ్రవాద వామపక్ష సంస్ద. వారు ఏ అర్ధంలో చూసినా టెర్రరిస్టులు గానీ నక్సల్స్‌గానీ కాదు. నేను రెండు సంవత్సరాలకుపైగా కాంపస్‌లో వుంటున్నాను. వారు ఎప్పడూ టెర్రరిస్టు కార్యకలాపాలకు పాల్పడటం గురించి రాజ్యాన్ని కూలదోయటానికి ఒక రాయి వేయటం వంటివిగానీ నేను చూడలేదు. వారి మీటింగ్‌ ప్రారంభం కావటానికి 20 నిమిషాల ముందు అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్‌ అధికారయంత్రాంగానికి ఒక లేఖ రాసింది.కాంపస్‌ వాతావరణానికి హానికరం గనుక ఆ సమావేశానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరింది. ఘర్షణలు జరుగుతాయనే భయంతో అధికారయంత్రాంగం అనుమతి నిరాకరించింది. జెఎన్‌యు అన్ని రకాల గళాలను వినటానికి ఒక అనువైన ప్రజాస్వామిక భావనల కేంద్రం. భావాలు తీవ్రవాదంతో కూడినప్పటికీ వ్యక్తం చేయటాన్ని గౌరవిస్తారు. ఇపుడు ఎబివిపి అటువంటి దాన్ని అడ్డుకుంటోంది. ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత పద్దతుల్లో తమ సమావేశం జరుపుకొనే హక్కున్న తమకు సాయం చేయాలని జెఎన్‌యు విద్యార్ధి సంఘాన్ని, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ వంటి ఇతర వామపక్ష విద్యార్ధి సంఘాలను డిఎస్‌యు కోరింది. కాశ్మీర్‌పై తమ వైఖరిని లేదా తమ భావజాలానికి మద్దతు కోరటం కాదని మీరు గమనించాలి. ఎంతో కష్టపడి సాధించుకున్న ప్రజాస్వామిక భావ వ్యక్తీకరణ చర్చ అవకాశాన్ని వమ్ముచేయటానికి పూనుకున్న ఎబివిపిని , యంత్రాంగాన్ని వదలి పెట్టకూడదని ఎట్టి పరిస్ధితుల్లోనూ సభజరిపి తీరాలని విద్యార్ధి యూనియన్‌ ఇతర విద్యార్ధి సంఘాలు నిర్ణయించి ముందుకు పోయాయి. సభజరగాల్సిన బ్యాడ్‌మింటన్‌ కోర్టు వద్దకు అధికార యంత్రాంగం భద్రతా సిబ్బందిని పంపింది. అయితే మైకులను వినియోగించటానికి మాత్రం అనుమతి నిరాకరించింది. అందుకు నిర్వాహకులు అంగీకరించి మైకులు లేకుండానే సభ జరుపుకోవాలని నిర్ణయించారు. అయినప్పటికీ ఎబివిపి తన కార్యకర్తలను సమీకరించి హాజరైన విద్యార్ధులు, నిర్వాహకులను బెదిరించటం ప్రారంభించింది. ఏ కాశ్మీర్‌ హమారా హయ్‌, సారా కా సారా హయ్‌ అంటూ నినాదాలు చేశారు. దానికి ప్రతిస్పందనగా సభ నిర్వాహకులు హమ్‌ క్యా చాహతే అజాదీ అని నినాదాలు చేశారు.తరువాత తుమ్‌ కితనే అఫ్జల్‌ మారోగె, హర్‌ ఘర్‌ సె అఫ్జల్‌ నికేగా అని నినదించారు. జెఎన్‌యు బయటి నుంచి వచ్చిన కాశ్మీరీ విద్యార్ధుల బృందం ఒకటి సభకు వచ్చిన వారి మధ్యలో ఒక వలయంగా ఏర్పడ్డారు. నన్ను నమ్మండి వారిలో ఒక్కరు కూడా జెఎన్‌యు వారు లేరు. ఆ కార్యక్రమం సందర్బంగా నేను కొద్ది సేపు వున్నాను. వారిలో ఒక్కరు కూడా జెఎన్‌యు వారిని నేను గుర్తించలేదు. దశాబ్దాల తరబడి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్ట అణచివేతకు గురైన కాశ్మీరీ విద్యార్ధులు ఏబివిపి వారిని చూడగానే భారత వ్యతిరేక నినాదాలు చేశారు. నేను దాదాపు రెండున్నర సంవత్సరాలుగా జెఎన్‌యులో వున్నాను. అటువంటి నినాదాలు నేను ఎక్కడా వినలేదు, డిఎస్‌యును మినహాయిస్తే ఏ వామపక్ష పార్టీ భావజాలానికి దగ్గరగా లేవు. పాకిస్ధాన్‌ జిందాబాద్‌ అనే నినాదానికి సంబంధించి అది వివాదాస్పాదం. నేను అక్కడ వున్నంత వరకు ఆ నినాదాన్ని వినలేదు. అటువంటి నినాదం చేసినట్లు ఒక వీడియో వుంది. అయితే అది స్పష్టంగా లేదు, కాశ్మీరీ విద్యార్ధులు చేశారా లేదా ఎబివిపి కుట్ర అన్నది తెలియటం లేదు.జెఎన్‌యు విద్యార్ధి సంఘనాయకుడు కనయ్య కుమార్‌ ఎలాంటి నినాదాలు చేయలేదు.అతను ఎఐఎస్‌ఎఫ్‌( సిపిఐ విద్యార్ధి విభాగం) సభ్యుడు మావోయిస్టు లేదా వేర్పాటు వాదానికి వారు వ్యతిరేకం’ అని అగర్వాల్‌ పేర్కొన్నాడు.

ఇక్కడ సమస్య ఏబివిపి అభ్యంతర పెట్టినా అడ్డుకున్నా ఆ సభ జరిగింది. సభ జరగటానికి వామపక్ష విద్యార్ధి సంఘాలు సహకరించాయనే దుగ్డతో ఎలాగైనా నిరంకుశ,అణచివేత చర్యల ద్వారా వారిని బెదిరించాలి, విశ్వవిద్యాలయంలో తమ పలుకుబడిని పెంచుకోవాలన్నది తప్ప మరొకటి కనిపించటం లేదు. పోలీసులను వినియోగించి తప్పుడు కేసులు బనాయించటాన్ని దేశ, విదేశాలలో లోని అనేక మంది విద్యావేత్తలు, విద్యార్ధులు, రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వంలోని పలు సంస్ధలు దేశభక్తి, వుగ్రవాద వ్యతిరేకం పేరుతో తమ వ్యతిరేకులను, ముఖ్యంగా వామపక్ష భావజాలాన్ని అడ్డుకొనేందుకు చూస్తున్నాయి. ప్రజాస్వామిక పద్దతులలో చర్చల ద్వారా ఒప్పించి తమ భావాలను ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు, మద్దతుదార్లను కూడగట్టుకోవచ్చు. కానీ తమ వాదనలో పసలేనపుడు ఎదుటివారిపై భౌతికదాడులకు దిగి నోరు మూయించటం ప్రజాస్వామ్యమా ? ఫాసిజమా ? జెఎన్‌యు విద్యార్ధులకు మద్దతు ఇస్తున్నందుకు ఢిల్లీలోని సిపిఎం కేంద్రకార్యాలయంపై దాడికి ప్రయత్నించటం, తరువాత పాటియాల కోర్టు ఆవరణలో బిజెపి ఎంఎల్‌ఏ నాయకత్వంలో పరివార్‌ మద్దతుదారులైన న్యాయవాదులు కూడా నల్లకోట్లు వేసుకొని విద్యార్ధులు, అధ్యాపకులు, వార్తల సేకరణకు వచ్చిన జర్నలిస్టులపై దాడులు చేయటం, మహిళా జర్నలిస్టులని కూడా చూడకుండా దాడులకు దిగటం ప్రమాదకర పోకడలకు నిదర్శనం.

అఫ్జల్‌ గురువంటి వుగ్రవాదులకు మద్దతుగా నినాదాలు చేయటం ద్వారా వుగ్రవాదులపై పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులను అవమానించటమే అని వారి త్యాగాలను అపహాస్యం చేయటమే అని మనోభావాలను రెచ్చగొడుతూ తమ తప్పుడు చర్యలను సమర్ధించుకొనేందుకు సంఘపరివార్‌ ప్రయత్నిస్తున్నది.పంజాబు, కాశ్మీరులలో అమెరికా కుట్రలో భాగంగా పాకిస్ధాన్‌ కేంద్రంగా వున్న వుగ్రవాదులు జరిపిన దాడులలో ఎందరో సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. రాజకీయ పార్టీలలో వారిని ఎదుర్కొని ఎందరో నాయకులు, కార్యకర్తలను కోల్పోయిన సిపిఎం, సిపిఐ వంటి వామపక్ష పార్టీలు , అకాలీదళ్‌ తప్ప దేశభక్తి,దేశం కోసం ప్రాణాలు అర్పిస్తామని చెప్పుకొనే బిజెపి , ఇతర పార్టీలకు చెందిన వారు ఎందరున్నారో చెప్పమనండి. బిజెపి కుహనా (నకిలీ) దేశభక్తి, వుగ్రవాద వ్యతిరేక పోరాట బండారం గురించి గతేడాది జూలైలో మన రిసర్చ్‌ మరియు ఎనాలసిస్‌ వింగ్‌( రా)లో పనిచేసిన మాజీ అధికారి ఎఎస్‌ దౌలత్‌ గతంలో బిజెపి అధికారంలో వున్నపుడు 1999లో కాందహార్‌ విమాన హైజాక్‌ వుదంతంలో వ్యవహరించిన తీరు గురించి వివరించారు. వందలాది మంది పౌరుల, భద్రతా సిబ్బంది ప్రాణాలు తీసిన వుగ్రవాదులతో రాజీపడిన వాజ్‌పేయి సర్కార్‌ ముగ్గురు కరడు గట్టిన తీవ్రవాదులను విడుదల చేసింది. పోనీ విమాన ప్రయాణీకుల ప్రాణాలు కాపాడేందుకు ఆ పనిచేసిందని సరిపెట్టుకోవచ్చు.కానీ పాకిస్ధాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న హిజబుల్‌ ముజహిదీన్‌ అధిపతి సయీద్‌ సలావుద్దీన్‌ కుమారుడికి 1999లో బిజెపి ప్రభుత్వం మనదేశంలోని ఒక మెడికల్‌ కాలేజీలో సీటు ఇప్పించటం దేశ భక్తా, వుగ్రవాదులతో కుమ్మక్కా? ఏ ప్రయోజనం ఆశించి చేసినట్లు ఇంతవరకు దాని గురించి ప్రభుత్వం నోరు విప్పదు. ఆ విమాన హైజాక్‌ వుదంతంలో అది అమృతసర్‌ నుంచి బయలుదేరి వెళ్లటానికి అనుమతించటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అది అమృతసర్‌ నుంచి వెళ్లిన తరువాత వుగ్రవాదులది పైచేయి అయిందని రా మాజీ అధికారి వ్యాఖ్యానించారు. నాటి బిజెపి ప్రభుత్వం రాజీపడి మన జైళ్లలో వున్న ముగ్గురు వుగ్రవాదులను విడుదల చేసింది.

నినాదాలు చేయటం చట్ట ప్రకారం వ్యతిరేకం, అందుకు పాల్పడిన వారిని శిక్షించవచ్చు, కానీ కాశ్మీర్‌లో ప్రతిరోజూ అనేక కారణాలతో అక్కడి పౌరులు ఏదో ఒకచోట నిరసన తెలుపుతూ భారత వ్యతిరేక నినాదాలు చేస్తూనే వున్నారు. వారందరినీ దేశవ్యతిరేకులుగా పరిగణించి జైళ్లలో పెడితే సమస్య పరిష్కారం అవుతుందా ? లేదు కొందరు నినాదాలు చేసినంత మాత్రానే కాశ్మీర్‌ విడిపోయి వుంటే ఈ పాటికి అ పని ఎప్పుడో జరిగి వుండేది. కానీ బిజెపి అలాంటి వుదంతాలను సాకుగా చూపి నకిలీ దేశభక్తిని ప్రదర్శిస్తోంది. చరిత్రలోకి వెళ్లేట్లయితే అసలు కాశ్మీర్‌ భారత్‌లో విలీనం విషయంలో నాటి కాశ్మీర్‌ రాజు హరిసింగ్‌ తటపటాయింపులు, విలీనానికి ఒక దశలో విముఖత, దానికి నేటి బిజెపి, అంతకు ముందు జనసంఘరూపంలో వున్న, సంఘపరివార్‌కు చెందిన వారంతా రాజుకు మద్దతుగా విలీనానికి విముఖత తెలిపిన వారే అన్నది చరిత్రలో నమోదయ్యే వుంది. రాజుకు వ్యతిరేకంగా నాడు షేక్‌ అబ్దుల్లా పోరాడి కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు కారకుడయ్యాడు కనుకనే విలీనం తరువాత ప్రధానిగా షేక్‌ అబ్దుల్లాను నియమించమని నాటి రాజు హరిసింగ్‌ స్వయంగా బ్రిటీష్‌ ప్రభుత్వానికి రాశారు. నాడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం, యువతలో నిరుద్యోగం, దారిద్య్రం వంటి కారణాలకు తోడు నిరంతరం పాకిస్ధాన్‌, అమెరికా తదితర సామ్రాజ్యవాదుల కుట్రకారణంగా కాశ్మీర్‌ వేరుపడి స్వతంత్ర రాజ్యం ఏర్పడాలనే భావనలు అక్కడ తలెత్తాయి. దానికి తోడు కాశ్మీర్‌కు రాజ్యాంగబద్దంగా కల్పించిన రక్షణలైన ఆర్టికల్‌ 370కు వ్యతిరేకంగా సంఘపరివార్‌ రాజకీయ రూపం ఎలా వున్నప్పటికీ నిరంతరం కాశ్మీరీయులకు వ్యతిరేకంగా ఏదో ఒక రూపంలో రెచ్చగొడుతూనే వున్న అపర దేశభక్తులు వారు. కాశ్మీర్‌లో తలెత్తిన వేర్పాటు వాద ధోరణులు, పాక్‌, అమెరికా సామ్రాజ్యవాదుల వుగ్రవాదుల కార్యకలాపాలను ఒకేగాటన గట్టిన కాంగ్రెస్‌, బిజెపి పాలకుల వైఖరి కారణంగా ఎవరు వేర్పాటు వాదో, ఎవరు వుగ్రవాదో తెలియని స్ధితి ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఆ రెండుశక్తులను దగ్గరయ్యేట్లు చేశారు. అంతే కాదు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్‌, మిజోరాం, మణిపూర్‌,అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సోం, తదితర రాష్ట్రాలన్నింటా వేర్పాటు వాదశక్తులు తలెత్తి సాయుధ పోరాటాలను కూడా సాగించిన విషయంతెలిసిందే. ఆ రాష్ట్రాలలో వాటికి ప్రభావితులైన యువతరాన్ని దేశద్రోహులుగా పరిగణించి జైళ్లలో పెడితే ఈశాన్య ప్రాంతంలో పరిస్ధితులు వేరే విధంగా వుండేవి. అందువలన కొత్తబిచ్చగాడికి పంగనామాలెక్కువ అన్నట్లు అసలు ఏనాడూ దేశభక్తులుగా లేని సంఘపరివార్‌ శక్తులు ఈనాడు తాము చెప్పిందే దేశభక్తి దానికి భిన్నంగా వుండేవారందరూ దేశద్రోహులే అన్నట్లు మాట్లాడుతూ నానా యాగీ చేయటమే కాదు, అధికారాన్ని దుర్వినియోగం చేసి అణచివేసేందుకు పూనుకుంది.

సంఘపరివార్‌ నాయకులలో ఒకరైన వీర సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి సలాంగొట్టి వారికి విధేయుడిగా పనిచేస్తానని 1914లోనే రాసిన లేఖ వారి దేశభక్తికి పెద్ద నిదర్శనం. దానికి అనుగుణంగానే తరువాత ఎక్కడా సంఘపరివారెవరూ స్వాతంత్య్ర వుద్యమంలో మనకు కనపడరు. అయితే సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి రాసిన లేఖ బయటపడగానే ఈ దేశభక్తులు కొత్త పల్లవి అందుకున్నారు. చరిత్రలో చాలా మంది ఒక ఎత్తుగడగా తమ శ త్రువులకు లొంగిపోయినట్లు లేఖలు రాసినట్లుగానే సావర్కర్‌ కూడా బ్రిటీష్‌ వారికి లేఖ రాసిన మాట నిజమే అని హాస్యాస్పదమైన ప్రచారం చేస్తున్నారు. స్వాతంత్య్ర వుద్యమంలో ఈ కాషాయ దళం భాగస్వామి అయి వుంటే ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడైన గాడ్సే జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసి వుండేవాడు కాదు. గాంధీ హత్య జరిగిన రెండు దశాబ్దాల తరువాత సంఘపరివార్‌ అధికారిక పత్రిక ఆర్గనైజర్‌లో 1970 జనవరి 11 సంచిక సంపాదకీయంలో ఇలా రాశారు.’ పాకిస్ధాన్‌ అనుకూల నెహ్రూకు మద్దతుగా గాంధీజీ దీక్షకు దిగారు, ఈ క్రమంలోనే జనాగ్రహం స్వయంగా ఆయనపైకి మళ్లింది. కాబట్టే నాధూరామ్‌ గాడ్సే ‘ప్రజలకు’ ప్రాతినిధ్యం వహించాడు మరియు జనాగ్రహానికి స్పందన అన్నట్లుగా హత్యకు పాల్పడ్డాడు’ అని నిస్సిగ్గుగా గాడ్సేసు, గాంధీజీ హత్యను సమర్ధించారు.అంతకు ముందు 1961లో దీన దయాళ్‌ వుపాధ్యాయ ఇలా చెప్పారు.’ గాంధీజీపై అన్ని రకాల గౌరవభావంతో మనం ఆయనను జాతిపిత అని పిలవటం మానివేద్దాం. మనం జాతీయవాద పాత ప్రాతికను అర్ధం చేసుకుంటే అది హిందూయిజం తప్ప మరొకటి కాదని మనకు స్పష్టం అవుతుంది.’ అన్నారు. 1989 అక్టోబరు 17నాటి సంపాదకీయంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఇలా వ్యాఖ్యానించింది.’ శ్రీ అద్వానీ భారత మాతను ముందుకు తెస్తున్నారంటే ఇప్పటివరకు జాతిపితగా పరిగణిస్తున్న మహాత్మాగాంధీని నిరాకరించటమే అవుతుంది’ అన్నది. గాడ్సేను కీర్తిస్తూ రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు గోవాలో అధికారంలో వున్న బిజెపి నాయకుడు అంగీకరించటమే గాక, తాను అధ్యక్షుడిగా వున్న ప్రభుత్వానికి చెందిన రవీంద్ర భవన్‌ను వేదికగా కూడా ఇచ్చిన ఆ పెద్దమనిషి దేశభక్తుడు, దానిని వ్యతిరేకించిన వారు దేశద్రోహులు, తిమ్మినిబమ్మిని చేయటం అంటే ఇదే.ఈ లెక్కన బిజెపి దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ ఏది చెబితే దాన్ని దేశ ప్రజలందరూ అంగీకరించాలి. అది హిందూయిజాన్ని జాతీయ వాదం అంటే అంగీకరించాలి, ఆ ప్రాతిపదికన దేశ భక్తులు ఎవరో ఎవరు కాదో నిర్ణయించేది వారే. వారి జాబితాలో వున్న గాడ్సే లాంటి వారందరూ దేశ భక్తులు, ఎవరైనా కాదంటే దేశద్రోహులు, కాదని గట్టిగా వాదిస్తే వారిపై దాడి చేసి ఒప్పిస్తారు. హైదరాబాదు కేంద్రీయ విద్యాలయం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుంది కనుక మంత్రులతో వత్తిడి చేయించి ఐదుగురు అంబేద్కరిస్టు దళిత విద్యార్ధులపై చర్య తీసుకొనేట్లు వత్తిడి చేశారు. జెఎన్‌యులో డిఎస్‌యు సభకు అధికారులే షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు కనుక తమ చేతిలో వున్న పోలీసులను ప్రయోగించి అరెస్టులు చేయించారు.అరెస్టయిన వారిని కోర్టులో ప్రవేశ పెట్టేందుకు తీసుకువస్తున్న సందర్భంగా చూసేందుకు వచ్చిన విద్యార్ధులు, అద్యాపకులు, వార్తలు సేకరించేందుకు వచ్చిన జర్నలిస్టులపై బిజెపి ఎంఎల్‌ఏ, న్యాయవాదులుగా వున్న పరివార్‌ కార్యకర్తలు దాడికి దిగారు. బిజెపికి మార్కు ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? దీన్ని నోర్మూసుకుని జనం అంగీకరించాలా ? మధ్య యుగాలలో శైవులు, వైష్ణవులు తమ మతాలను అనుసరించని వారిని, వ్యతిరేకించిన జైన, బౌద్ధ మతాలవారిని, చార్వాకులు, లోకాయతులపై భౌతికంగా దాడి చేసి హతమార్చారని, జైన, బౌద్ధ కేంద్రాలను వీర శైవమతస్దులు శివాలయాలుగా మార్చివేశారని చరిత్రలో చదువుకున్నాం. ఇప్పుడు తిరిగి బిజెపి, సంఘపరివార్‌ సంస్ధలు చేస్తున్నదానికి గతంలో జరిగినదానికీ పెద్ద తేడా కనిపించటం లేదు. జర్మనీలో ఫాసిస్టు హిట్లర్‌ యూదులు, కమ్యూనిస్టులపై వ్యతిరేకతను రెచ్చగొడితే మన దేశంలో సంఘపరివార్‌ ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులపై జనాన్ని వుసిగొల్పుతున్నది.అలాంటి శక్తులకు ఐరోపాలో, ప్రపంచంలో ఇతర చోట్ల ఏమి జరిగిందో మరోసారి చెప్పాల్సిన పనిలేదు.

సంఘపరివార్‌ ఇలాంటి దాడులకు ఎందుకు పూనుకున్నది, విశ్వవిద్యాలయాలను అది వేదికగా ఎందుకు చేసుకున్నది అన్నది అనేక మందిలో నలుగుతున్న సందేహం. విశ్వవిద్యాలయాలెప్పుడూ పురోగామి కేంద్రాలు తప్ప తిరోగాములకు ఆలవాలం కాదు. ముఖ్యంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రతి భావాన్ని వ్యక్తం చేసే విశాల ప్రజాస్వామిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. సహజంగానే అవి వివిధ వామపక్ష, ప్రజాస్వామిక భావజాల కేంద్రాలుగా వున్నాయి. సంఘపరివార్‌కు చెందిన అఖిలభారతీయ విద్యార్ధి పరిషత్‌ చరిత్రను వెనక్కు నడపాలని చూసే ఒక తిరోగామి శక్తి. సైద్ధాంతిక చర్చలో అది ప్రతి చోటా పాడిందే పాడరా అన్నట్లు సభ్య సమాజం ఎప్పుడో తిరస్కరించిన భావజాలాన్నే ముందుకు తెస్తోంది. సహజంగానే అది విద్యార్ధులలో తిరస్కరణకు గురి అవుతోంది. అందువలన వాటిని ఎలాగైనా తమ అదుపులోకి తెచ్చుకోవాలని, వాటిని కూడా మత కేంద్రాలుగా మార్చాలన్నది ఎప్పటి నుంచో వున్న దాని పధకం. ఇప్పుడు కేంద్రంలో, పలు రాష్ట్రాలలో అధికారంలో వుంది కనుక అధికారిక సంస్ధలన్నింటినీ తన భావజాలంతో వున్నవారు లేదా వారి కనుసన్నలలో నడిచే వారితో నింపుతోంది. పూనా ఫిలిం సంస్ధ వంటి ప్రఖ్యాత అకేంద్రానికి మహాభారత్‌ సీరియల్‌లో గుడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర ధరించటం మినహా మరొక అర్హతలేని చిన్న నటుడిని అధిపతిగా నియమించటాన్ని అక్కడి విద్యార్ధులు వ్యతిరేకించి నెలల తరబడి ఆందోళన జరిపినా పోలీసు బలప్రయోగంతో అణచివేసింది తప్ప ప్రజాభిప్రాయాన్ని మన్నించలేదు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఎంఎం కలుబర్గిని హిందూత్వ శక్తులు హత్య చేసిన కారణంగానే ఆ చర్యను ఖండించేందుకు అకాడమీ ముందుకు రాలేదన్నది తెలిసిందే. హైదరాబాదు విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో మెలిగే వ్యక్తిని వైస్‌ఛాన్సలర్‌గా నియమించిన వెంటనే మంత్రులు వత్తిడి చేయటం తదనంతర పరిణామాలో వేముల రోహిత్‌ అనే దళిత విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే. దానిలో కూడా అతడు దళితుడు కాదు, బిసి అని తప్పుడు ప్రచారం చేసి సమస్యను పక్కదారి పట్టించాలిని చూశారు. దళితుడు కాకపోతే బిసి అయినా ఒక విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడేట్లు చేయటం ఏమిటి ? అసలు సమస్య అతను దళితుడా, బిసి అని కాదు, సంఘపరివార్‌ భావజాలాన్ని వ్యతిరేకించాడు అందుకే అంతటి కక్షగట్టారు. ఇటువంటి సంఘపరివార్‌ వ్యతిరేక, వామపక్ష భావజాలానికి కేంద్రంగా వున్న ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలోనే తమ ఆధిపత్యాన్ని నెలకొల్పుకుంటే మిగతా విశ్వవిద్యాలయాలన్నీ తమ ఆధిపత్యంలోకి తెచ్చుకోవటం సులభం అని అక్కడ తమ పధకాన్ని అమలు జరుపుతున్నారు. అక్కడి పరిణామాలకు అదే మూలం. దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు దేశమంతటా వేర్పాటు వాదానికి వ్యతిరేక ప్రచారం పేరుతో జాతీయవాదాన్ని ప్రచారం చేయాలని బిజెపి పధకం వేసింది.

అన్నింటి కంటే కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ ఏలుబడికి ఇరవై నెలలు నిండింది. రూపాయి విలువ దగ్గర నుంచి ఎగుమతుల వరకు అన్ని రంగాలలో ప్రతికూల పరిస్ధితులు ముసురుకుంటున్నాయి.స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. నరేంద్రమోడీ వచ్చిననాటికి సూచీలు పతనమయ్యాయి. ధరలు తగ్గటం లేదు, అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమైనా పన్నులు విధిస్తూ స్ధానికంగా ధరలు తగ్గకుండా చూస్తున్నారు. కొత్తగా పరిశ్రమలు రావటం లేదు, వున్న పరిశ్రమలు మూతపడుతున్నాయి. అంకెల్లో చెబుతున్న అభివృద్ధి అంతా వుపాధి రహితమే. వేతన కమిషన్‌ సిఫార్సులపై వుద్యోగులు తీవ్ర అసంతృప్తితో వున్నారు. రైల్వే వంటి చోట్ల సమ్మె బ్యాలట్‌ తీసుకొనే వరకు వచ్చింది. మిగతా రంగాలలో కూడా ఆందోళనకు రంగం సిద్ధం అవుతోంది. స్వచ్ఛభారత్‌, మేకిన్‌ ఇండియా వంటి వన్నీ నినాదాలకే పరిమితం తప్ప మరొకటి కాదు. ఈ పూర్వరంగంలో ఒకవైపు సంఘపరివార్‌కు చెందిన భజరంగదళ్‌, విశ్వహిందూపరిషత్‌ వంటి సంస్ధలు రామాలయ నిర్మాణ సమస్యను మరోసారి ముందుకు తెస్తున్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న వైఫల్యాల నుంచి జనం దృష్టిని పక్కదారి పట్టించేవే. జెఎన్‌యు, ఇతర విశ్వవిద్యాలయాలలో రాజేసిన కాష్టం కూడా దానిలో భాగమే అంటే కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d