• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: BJP

ఆసక్తి గొలుపుతున్న తెలంగాణా రాజకీయాలు – ఈ సారీ ముందస్తు ఎన్నికలేనా !

20 Monday Sep 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Telangana, Telugu, Uncategorized

≈ Leave a comment

Tags

Bandi Sanjay, BJP, KCR, Revanth Reddy, Telangana Left, Telangana politics, trs

ఎం కోటేశ్వరరావు


తెలంగాణాలో రాజకీయాలు ఎంతో ఆసక్తి కలిగిస్తున్నాయి.ఈ నెల 27న భారత బంద్‌ను జయప్రదం చేసేందుకు, బిజెపి,టిఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు కాంగ్రెస్‌, వామపక్షాలు, టిజెఎస్‌ నేత కోదండరామ్‌, ఇంటి పార్టీ నేతలు ఒక్కటిగా కదలాలని నిర్ణయించటం సరికొత్త పరిణామం. ఇది కేవలం రెండు పాలక పార్టీల విధానాల మీద ఉద్యమించటం వరకే పరిమితం అవుతుందా ? రాబోయే ఎన్నికల సర్దుబాట్లకు దారి తీస్తుందా అన్నది ఇప్పుడే చెప్పలేము. అధికార టిఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు, తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు రంగంలోకి దిగిన కొత్త పార్టీ వైఎస్‌ షర్మిల నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌ పార్టీ, మాజీ ఐపిఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ రాజకీయ తీర్ధం పుచ్చుకున్న బిఎస్‌పి, మజ్లిస్‌, వామపక్షాలైన సిపిఎం, సిపిఐ, ఇతర పార్టీలు, శక్తులు తమ తమ అజెండాలతో ముందుకు పోతున్నాయి. అన్ని పార్టీలు ఒకే పద్దతిలో, ఒకే స్ధాయిలో లేవు. కాంగ్రెస్‌ తన శంఖారావాన్ని పూరించేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నియోజకవర్గమైన గజ్వేల్‌ను ఎంచుకోవటం అక్కడ భారీ బహిరంగసభ నిర్వహించటం గమనార్హం. మరోవైపున కాంగ్రెస్‌ నుంచి ఎదురవుతున్న సవాలను ఎదుర్కొనేందుకు బిజెపి కూడా నడుం కట్టింది. అమిత్‌షాను రప్పించి సెప్టెంబరు 17 తెలంగాణా విమోచన పేరుతో తన మత అజెండాను నిర్మల్‌లో ప్రారంభించింది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ హస్తినలో తిష్టవేసి జరిపిన మంత్రాంగం గురించి ఎవరికి తోచిన ఊహాగానాలతో వారు ఉన్నారు. వాటిని పూర్తిగా కొట్టిపారవేయనవసరం లేదు అలాగని యథాతధంగా తీసుకోవాల్సిన అగత్యమూ లేదు. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేము.


గత అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు, లేదా స్ధానిక సంస్థలకు వచ్చిన సాధారణ ఎన్నికల సమయంలో కొట్టవచ్చినట్లు కనిపించిన ఒక అంశం ఏమంటే వాగ్దానాల వరద. అది ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే తమ నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే ఎన్నికైన ప్రతినిధులు రాజీనామా చేయాలి, ఉప ఎన్నికలు జరిపించాలనే డిమాండ్లు తలెత్తేందుకు దోహదం చేశాయి. చేసిన వాగ్దానాలు, చెప్పిన ఊసులు అమల్లోకి వస్తాయా లేదా అని ఎవరూ చూడటం లేదు. అన్నీ జరగవనీ తెలిసి కూడా ఎందుకు కోరుకుంటున్నారు అంటే అసల్లేనిదాని కంటే ఎంతో కొంత జరుగుతుంది కదా అన్నది అంతర్గత తర్కం.

హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు ముందు జరిగిందేమిటి ? వరదల్లో మునిగిపోయిన వారికి, మునిగిపోయినట్లు నమోదైన వారికీ పదివేల రూపాయల చొప్పున చాలా మందికి ఇచ్చారు. ఎన్నికల నిబంధనల ఆటంకం కారణంగా మిగిలిన వారికి తరువాత ఇస్తామని వాగ్దానం చేశారు. ఏం జరిగింది, అధికారపక్షానికి అనుకున్న స్ధాయిలో స్ధానాలు రాలేదు. ఎన్నికలు ఐదు సంవత్సరాలు ఉన్నాయి గనుక అప్పుడు చూసుకుందాం లెమ్మని నిజమైన బాధితులకు సైతం ఎగనామం పెట్టారు. హుజూర్‌ నగర్‌, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల సమయంలో, తరువాత జరిగింది కూడా దీనికి భిన్నమేమీ కాదు.


ఇప్పుడు హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక. మిగతా రాష్ట్రాలతో పాటు దీనికి ప్రకటించలేదు. దానికి ఎవరి కారణాలను వారు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ గారే వాయిదా వేయించారన్నది ఒక కథనం. కేంద్ర ప్రభుత్వం లేదా ఎన్నికల కమిషన్‌ దగ్గర బిజెపి కంటే కెసిఆర్‌ పలుకుబడి ఎక్కువ కాదు, ఎలాగూ గెలిచేది తామే కనుక ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టేందుకు బిజెపి వారే వాయిదా వేయించారన్నది మరొక కథ. ఇక్కడ ఏ కధ వాస్తవం అయినా రాజ్యాంగ వ్యవస్దల విశ్వసనీయత ప్రశ్నార్దకం అవుతోంది. ఎన్నికను వాయిదా వేయాల్సినంతగా కరోనా తీవ్రత లేదన్నది నిజం.
మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ను ఎట్టి పరిస్ధితిలో అయినా ఓడించాలన్నది అధికారపక్ష పట్టుదల, ఎలాగైనా గెలిచి తమదే టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అని ఓటర్ల ముందుకు వెళ్లాలన్నది బిజెపి తాపత్రయం. ఈ నేపధ్యంలో వచ్చిందే దళిత బంధు. ఈ పధకాన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించే అవకాశం ఉండదు. బండి గుర్రానికి కళ్ల ముందు గడ్డి కట్ట పెట్టినట్లుగా దీన్ని ఆశచూపితే దళితులందరూ తమకే ఓట్లు వేస్తారని, ఓటు బ్యాంకుగా మారతారన్నది అధికారపక్ష ఎత్తుగడ. కాంగ్రెస్‌ పార్టీ దళిత బంధుతో పాటు గిరిజన బంధు ఎందుకు అమలు జరపరంటూ ముందుకు వచ్చింది. మిగిలిన సామాజిక తరగతుల్లో కూడా నిజమే కదా మాకూ బంధు ఎందుకు అమలు జరపరు అనే ఆలోచన ప్రారంభమైంది.తమ పధకంతో ప్రతిపక్షాలను దెబ్బకొట్టటంతో పాటు దళితులను బుట్టలో వేసుకుంటామన్నంత వరకే అధికారపార్టీ ఆలోచించింది తప్ప అది అంతటితో ఆగదు అన్నది ఊహించి ఉండరు. ఎవరికైనా తట్టినా ముఖ్యమంత్రికి చెప్పే సాహసం చేసి ఉండరు. అలాంటి వాతావరణం లేదు కదా !


మొత్తం మీద ఇతర కులాల్లో కూడా దళితబంధు ప్రచారం కావటంతో అధికారపక్షానికి సెగతగిలింది. అర్హులైన దళిత కుటుంబాలు ఎన్ని ? పన్నెండు లక్షలా, పదిహేను లక్షలా ? ఆ కుటుంబాల సంఖ్య పెరగదు, స్ధిరంగా ఉంటుంది అనుకుంటే పన్నెండు అయితే లక్షా ఇరవై, పదిహేను అయితే లక్షా యాభై వేల కోట్లు కావాలి.ఒకటో తారీఖున ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలే ఇవ్వని స్ధితిలో ఉన్న ప్రభుత్వం ఇంత మొత్తం ఎక్కడి నుంచి తెస్తుంది అన్నది ఒక ప్రశ్న. షెడ్యూలు కులాలు, గిరిజనులకు ఉప ప్రణాళికల నిధులు, వారికి అమలు జరుగుతున్న కొన్ని పధకాల నుంచి దళితుల వాటాను ఈ కొత్త పధకానికి మళ్లించే అవకాశం ఉంది. ఈ పధకంతో దళిత కుటుంబాలను ఉద్దరించినట్లే అని రికార్డుల్లో రాసి అమల్లో ఉన్న కొన్ని పధకాలకు మంగళం పాడినా, నామమాత్రం చేసినా ఆశ్చర్యం లేదు. ఏం జరుగుతుందన్నది అప్పుడే చెప్పలేము. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ముగిసే వరకు అది బ్రహ్మదార్ధమే. దళితులకు మూడెకరాల భూమి కొందామని చూస్తున్నా భూమి, దానికి అవసరమైన నిధులు లేవని చేతులెత్తేసిన పెద్దలు ఆ ఎన్నిక తరువాత దళిత బంధుకూ అదే గతి పట్టించినా ఆశ్చర్యం లేదు.


దళిత బంధును ఇప్పుడు హుజూరాబాద్‌కే అమలు జరిపి వచ్చే బడ్జెట్‌లో ఇరవైవేల కోట్ల నిధులు కేటాయిస్తాం అని కెసిఆర్‌ చెప్పారు. అది నెరవేరినా పన్నెండు లక్షల కుటుంబాలైతే ఆరు సంవత్సరాలు, పదిహేను అయితే ఎనిమిదేండ్లు పడుతుంది. ఇతర కులాల్లో అసంతృప్తి లేదా ఆశ ప్రారంభం కావటంతో వీలైతే వారికి కూడా అమలు చేస్తాం అని బండి గుర్రపు గడ్డి కట్టలను సిఎం ప్రదర్శించారు. పులిని ఎక్కిన వారు దాన్ని అదుపు చేయాలి లేకపోతే అది ఎక్కిన వారిని మింగివేస్తుంది. సంక్షేమ, ప్రజాకర్షక పధకాలు కూడా అంతే. పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు సంస్ధలను ఏర్పాటు చేసినందుకు పెద్ద ఎత్తున రాయితీలు, సబ్సిడీ ఇస్తున్నారు. వస్తువులను ఎగుమతులు చేసినందుకూ ప్రోత్సహకాల పేరుతో కట్టబెడుతున్నారు. అందువలన మన సమాజంలో రక్షణ లేని, అల్పాదాయ వర్గాలకు సంక్షేమ పధకాలను అమలు జరపాలనటంలో మరొక మాట ఉండనవసరం లేదు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా ఒక పరిమితి దాటితే వాటిని అమలు జరపటం ఎలా అన్నదే సమస్య. రాష్ట్ర వ్యాపితంగా పేదలు, మధ్యతరగతి వారు ఉపయోగించే ఆర్‌టిసికి వస్తున్న నష్టాలను భర్తీ చేసేందుకు ముందుకు రాకుండా దాన్ని మూసివేసేందుకు పావులు కదుపుతున్న సర్కార్‌ మరోవైపు హైదరాబాద్‌ మెట్రోకు వస్తున్న నష్టాలను భరించేందుకు ఆలోచిస్తామని సిఎం చెప్పారు.


రకరకాల సాకులు చూపి ఉద్యోగులకు పిఆర్‌ఎసి అమలు విషయంలో ఎంతదగా చేశారో చూశాము. ఒక ఏడాది మినహా మిగిలిన కాలానికి బకాయిలు ఇచ్చేది లేదన్నారు. ఆ ఏడాది మొత్తాలను కూడా పెన్షనర్లకు 36వాయిదాల్లో ఇస్తామన్నారు. సర్వీసులో ఉన్న వారికి వాటిని పిఎఫ్‌ ఖాతాల్లో జమచేసినా వాటి మీద నామమాత్ర వడ్డీ అయినా వచ్చేది. అలాగాక వారు ఉద్యోగవిరమణ సమయంలో ఆ మొత్తాలను ఇస్తారట.ప్రకటించిన నెలలో నూతన వేతనాలను అమలు చేయలేదు. ఆ కాలానికి నగదు వేతనాలు, పెన్షన్లతో పాటు ఇస్తామని చెప్పారు. వాటిని కూడా ఇంతవరకు చెల్లించలేదు. మూడు వాయిదాల డిఏ బకాయిలు ఉన్నాయి. జనవరి నాటికి మరోవాయిదా సిద్దం అవుతున్నది. ఇలా చేయించుకున్న పనికే చెల్లించటానికి ఎగనామం పెట్టి, ఇబ్బందులు పెడుతున్నవారు అవసరం తీరిన తరువాత సంక్షేమ పధకాలకు మంగళం పాడితే…!

ఎరువుల సబ్సిడీకి పరిమితి విధించిన కేంద్ర ప్రభుత్వం రైతాంగంలో తలెత్తిన ఆందోళనను తగ్గించేందుకు కిసాన్‌ యోజన పేరుతో ఆరువేల రూపాయలను మూడు విడతలుగా ఇచ్చే పధకాన్ని అమలు జరుపుతోంది. పెరిగిన ఎరువుల ధరల భారంతో పోల్చితే అది నామమాత్రం. ఇప్పుడు విద్యుత్‌ రాయితీలకు మంగళం పాడేందుకు కేంద్రం పూనుకుంది. దాంతో జరిగేదేమిటి ? ఒక యూనిట్‌ విద్యుత్‌ను వినియోగదారుడికి చేర్చేందుకు అయ్యే మొత్తం ఖర్చులో ఇరవై శాతానికి మించి రాయితీలు ఉండకూడదు. ఒక యూనిట్‌ ధర ఏడు రూపాయలైతే సబ్సిడీ 140 పైసలు మాత్రమే ఇవ్వాలి.ఇప్పటి వరకు రాష్ట్రాలు వివిధ వినియోగదారులకు వేర్వేరు ధరలను నిర్ణయించి రైతులకు ఉచితంగా ఇస్తున్నాయి. నూతన విద్యుత్‌ బిల్లు చట్టమైతే కొందరి వద్ద అదనంగా వసూలు చేసేందుకు, దాన్ని ఇతరులకు సబ్సిడీగా ఇచ్చేందుకు వీలు ఉండదు. అందువలన అనివార్యంగా రాష్ట్రాలు తమ బడ్జెట్ల నుంచి కేటాయింపులు జరపాలి. గత పది సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఎరువులకు నిర్ణీత మొత్తాలను కేటాయించి సరిపెట్టుకోమని చెప్పేస్తున్నాయి. విద్యుత్‌కూ అదే రాబోతున్నదని చెప్పవచ్చు. ఎరువుల ధరలు మార్కెట్లో ఎంత ధర ఉంటే అంత మొత్తం చెల్లించి రైతులు కొనుగోలు చేయాలి.ధరతో నిమిత్తం లేకుండా నిర్ణీత సబ్సిడీ మొత్తాన్ని దాన్నుంచి తగ్గిస్తారు. పెరిగితే ఆ భారాన్ని రైతులే పెట్టుకోవాలి.ఇప్పుడు వంట గ్యాస్‌కు దాన్ని వర్తింప చేశారు. టిఆర్‌ఎస్‌ విషయానికి వస్తే రాష్ట్రంలో ప్రధాన పంటగా మారిన వరి ఆ పార్టీకి ఉరిగా మారుతుందా అన్నట్లుగా పరిస్ధితి ఉంది. రైతులకు ఉన్నంతలో మెరుగైన ఫలితాలనిచ్చే ముతక బియ్యం(ఉప్పుడు బియ్యానికి పనికి వచ్చే రకాలు) రాష్ట్ర ప్రభుత్వానికి గుది బండగా మారవచ్చు. దాన్ని కేంద్ర బిజెపి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకొనే అవకాశమూ లేకపోలేదు. గతంలో అంగీకరించిన మేరకు తప్ప అదనంగా తమకు అవసరం లేదని ఎఫ్‌సిఐ ఇప్పటికే చెప్పేసింది. ఏం జరుగుతుందో తెలియదు. రైతులకు ఎంత ఆర్ధిక నష్టం జరిగితే టిఆర్‌ఎస్‌కు అంతమేరకు రాజకీయ ప్రతికూలత పెరుగుతుంది.

రాష్ట్రంలో ఇప్పుడు మూడు ప్రధాన పార్టీల తీరు తెన్నులు చూస్తుంటే ఈ సారి కూడా అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తాయా అన్న అనుమానాలు కొందరిలో ఉన్నాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నికవరకే అయితే ఇంత హడావుడి ఉంటుందా అన్నదే సందేహం. ఆ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్రంలో ఒక చర్చనీయాంశం అవుతుంది.కేంద్రం విద్యుత్‌ సంస్కరణల బిల్లును ఆమోదించి చట్టంగా మారితే టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తగిలే విద్యుత్‌ షాక్‌ దేనికి దారి తీస్తుందో తెలియదు. విద్యుత్‌, వరి, దళితబంధు వంటి పధకాలు-పర్యవసానాలు జనానికి తెలిసే ముందే ఏదో ఒకసాకుతో ఆకస్మికంగా ఎన్నికలకు పోయినా ఆశ్చర్యం లేదు. పోయిన సారి కాంగ్రెస్‌, బిజెపి బలహీనంగా ఉన్నపుడే తమకు లాభమని కెసిఆర్‌ భావిస్తే ఇప్పుడు తన వైఫల్యాలు మరింతగా జనం నోళ్లలో నానక ముందు, ఆ రెండు పార్టీలు పుంజుకోక ముందే అసెంబ్లీ ఎన్నికలు జరపటం మంచిదనే అంశం గురించి మల్లగుల్లాలు పడుతున్నారు. దాని గురించి మరోసారి చెప్పుకుందాం. ఇప్పుడున్న పరిస్ధితి ఏమిటి ? కేంద్రంలోని బిజెపితో అధికార పార్టీ టిఆర్‌ఎస్‌ దోబూచులాడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పర్యవసానాలేమిటి ?


దేశంలోని వివిధ రాష్ట్రాలల్లో ప్రాంతీయ పార్టీల తీరుతెన్నులను చూసినపుడు మొత్తంగా ఒక స్ధిరమైన వైఖరితో ఉండటం లేదు.రాష్ట్రాల హక్కుల పరిరక్షణ నేపధ్యంలో పుట్టిన పార్టీలన్నీ ఆ లక్ష్యాన్ని వదలివేశాయి. తెలంగాణా రాష్ట్ర సమితి కూడా అదే బాటలో నడుస్తున్నది. ఎప్పుడు ఏ అవకాశవాద వైఖరి తీసుకుంటుందో చెప్పలేము.ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలు జరపటం లేదని అమావాస్యకు పౌర్ణానికి విమర్శించటం తప్ప నిర్దిష్ట కార్యాచరణ లేదు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో జనాల మనోభావాలను ఉన్నత స్ధాయికి తీసుకుపోయారు. ఏడు సంవత్సరాలుగా నియామకాల ప్రహసనం ఎలా సాగుతోందో చూస్తున్నాం. నిధుల సమస్య ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన రోజు నుంచే పరిష్కారమైంది. ఉమ్మడి ఆస్తుల పంపకం మాత్రమే మిగిలి ఉంది. ఇక నీళ్ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌తో వివాదంతో మనోభావాలతో ఆడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో అమల్లో ఉన్న నీటి న్యాయానికి భిన్నమైన డిమాండ్లను ముందుకు తెచ్చారు.

తమిళనాడులో గతంలో మాదిరి లోక్‌సభ సీట్లను గణనీయంగా జాతీయ పార్టీకి అప్పగించి రాష్ట్ర అధికారం నిలుపుకొనేందుకు ప్రయత్నించిన డిఎంకె, అన్నాడిఎంకె మాదిరి మీకది మాకిది అన్నట్లు బిజెపితో ఒప్పందానికి రావటానికి కేసిఆర్‌కు ఇబ్బంది లేదు. అయితే వరుసగా అన్ని రాష్ట్రాలను కబళించేందుకు ప్రయత్నిస్తున్న బిజెపి అందుకు అంగీకరించటం లేదు. ఈ రాష్ట్రంలోని నేతలు ప్రతిఘటిస్తున్నారు. ఆ పంచాయతీ తెగేట్లు లేదు. పశ్చిమబెంగాల్‌ పరిణామాలను చూసిన తరువాత అనివార్యం అయితే టిఆర్‌ఎస్‌ బిజెపితో అమీతుమీ తేల్చుకుంటుంది. దానికి సిద్దపడగానే కేంద్రం ఇడి, సిబిఐ, ఇతర దర్యాప్తు సంస్దలను రంగంలోకి దించేందుకు అవసరమైన ఏర్పాట్లతో ఉంది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో తగులుతున్న ఎదురుదెబ్బల నేపధ్యంలో బిజెపి ఇప్పటికిప్పుడు టిఆర్‌ఎస్‌తో తెగేదాకా లాగకపోవచ్చు. కొన్ని తురుపు ముక్కలను అట్టి పెట్టుకుంటుంది. అదే ఎత్తుగడను టిఆర్‌ఎస్‌కూడా అనుసరిస్తుంది. ఈ లోగా బండి సంజయ-దానికి పోటీగా అధికారపార్టీ నేతల నోటిదూలతో జనానికి కిక్కు ఎక్కిస్తారు.


ఇప్పటికిప్పుడు చూస్తే టిఆర్‌ఎస్‌ ఒక రాజకీయ పార్టీగా మొదటి స్ధానంలో ఉంది. దాని ధనశక్తి, మీడియా మద్దతును తక్కువ అంచనా వేయలేము. జనంలో వాగ్దానాలను విస్మరించిందన్న అసంతృప్తి ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌,బిజెపి పట్ల ప్రత్యేకమైన అభిమానం లేదు. ఏమైనా సరే టిఆర్‌ఎస్‌ను ఓడించాలనే వాతావరణం ప్రస్తుతం ఉన్నట్లు చెప్పలేము. అయితే అది శాశ్వతం కాదని టిఆర్‌ఎస్‌ నేతలకు అర్దం అయింది. కొండమీది రాయి కిందికి జారనంత వరకు స్దిరంగా ఉన్నట్లే కనిపిస్తుంది. కదలటం ప్రారంభమైన తరువాత వేగం అందుకుంటుంది. జనంలో వ్యతిరేకత కూడా అంతే. అందుకే కొత్త కొత్త ప్రజాకర్షక నినాదాలతో, వివాదాలతో ముందుకు వస్తుంది. జనంలో అసంతృప్తి పెరిగితే వాటి కారణంగానే పతనం కూడా అవుతుంది.


దుబ్బాక ఉప ఎన్నిక, తరువాత హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వచ్చిన ఊపుతో బిజెపి తమదే రెండో స్ధానం అని చెప్పుకుంది. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీల నేతలు బిజెపి వైపు చూశారు, లోపాయకారీ సంబంధాలను కూడా పెట్టుకొన్నారు. ఇప్పటికీ టిఆర్‌ఎస్‌లోని అసంతృప్త నేతలను ఆకర్షించేందుకు బిజెపి పావులు కదుపుతోంది. అయితే అధికారమే పరమావధిగా ఉన్న నేతలు ఎంత వీలైతే అంత అధికార పక్షంలో ఉండి పిండుకొని ఎన్నికల ముందు వేరే పార్టీలోకి ఫిరాయించటం ఇటీవలి కాలంలో సాధారణమైంది. తెలంగాణా దానికి మినహాయింపు కాజాలదు. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో తగిలిన దెబ్బ, ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటమి బిజెపి ప్రచార గాలిని తీశాయి. దీనికి తోడు కాంగ్రెస్‌ సారధిగా నోటి దురుసులో ముఖ్యమంత్రి, బిజెపి నేతలకు పోటీగా ఉండే రేవంతరెడ్డి నియామకంతో కాంగ్రెస్‌ నుంచి వలసలకు బ్రేకు పడింది. బిజెపి కంటే మెరుగైన స్ధానానికి చేరుకుంది. అయితే అది నిలుస్తుందా లేదా అన్నది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, అంతకు ముందు బీహార్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరిస్ధితి పెద్దగా మెరుగుపడకపోయినా పెద్దగా దిగజారలేదు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల ఫలితాలు కూడా ఆ పార్టీ మీద ప్రభావం చూపవచ్చు. బిజెపికి తగిలే దెబ్బలు, ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కు లాభించే అవకాశం ఉంది.


తెలంగాణాలో వామపక్షాలు ఒక విధంగా చెప్పాలంటే తమ ఉనికిని నిలబెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఆందోళనను బలపరిచిన సిపిఐ బావుకున్నదేమీ లేదు. వ్యతిరేకించిన సిపిఎం సహజంగానే కొంత దెబ్బతిన్నది. అయితే ప్రజాసమస్యలపై ఆ పార్టీలు, అవి పనిచేస్తున్న ప్రజాసంఘాల కార్యకలాపాలు వాటి ఉనికిని కాపాడుతున్నాయి. అన్నింటికీ మించి నయా ఉదారవాద విధానాలు పాలకపార్టీల మీద జనంలో పెద్ద ఎత్తున భ్రమలు కొల్పాయి. ఈ నేపధ్యంలో వామపక్షాలు, వాటి నినాదాలు జనానికి అంత ఆకర్షణీయంగా కనిపించటం లేదు. అయితే ప్రపంచంలో ముఖ్యంగా అమెరికా, లాటిన్‌ అమెరికా దేశాలలో జరుగుతున్న పరిణామాలను చూసినపుడు వామపక్షాల వైపు తిరిగి జనం చూడకతప్పదనే భావం కలుగుతోంది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా జనం పట్ల నిబద్దతే వాటిని కాపాడుతుంది.


ముస్లిం మైనారిటీలు గణనీయంగా ఉన్న తెలంగాణాలో మరింతగా మతతత్వాన్ని రెచ్చగొట్టి బలపడాలని బిజెపి ప్రయత్నిస్తుంటే అదే అస్త్రంతో మజ్లిస్‌ కూడా తన పట్టును పెంచుకోవాలని చూస్తోంది. టిఆర్‌ఎస్‌-మజ్లిస్‌ బంధం గురించి బిజెపి ఎంత రెచ్చగొట్టినా దానికి ఆశించిన ఫలితాలు రావటం లేదు. వచ్చే అవకాశాలు కూడ కనిపించటం లేదు. రాబోయే రోజుల్లో టిఆర్‌ఎస్‌-బిజెపి అమీతుమీ తేల్చుకునేందుకు పూనుకుంటే మైనారిటీలు సహజంగా బెంగాల్లో మాదిరి టిఆర్‌ఎస్‌వైపే మొగ్గుతారు, లేదా కాంగ్రెస్‌ బలపడితే, బిజెపిని ఓడించే పార్టీ అదే అని భావిస్తే ఆ పార్టీ వైపు మొగ్గినా ఆశ్చర్యం లేదు. రెండవ అంశం ప్రస్తుతానికి ఊహాజనితమే. వైఎస్‌ షర్మిల నాయకత్వంలోని పార్టీ ప్రస్తుతానికి ఎవరి అవకాశాలను దెబ్బతీసే లేదా ప్రయోజనం కలిగించే పరిస్దితిలో లేదు. ఒక అధికారిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తీసుకున్న చర్యలు దళితుల్లోని మధ్య తరగతిలో ఆయనపట్ల అభిమానాన్ని పెంచటం సహజం. అయితే అది ఎన్నికల్లో ఫలితాలను ఇస్తుందని చెప్పలేము. ఉత్తర ప్రదేశ్‌లో గతంలో బిఎస్‌పికి ఉన్న పట్టు ఇప్పుడు లేదు, రాబోయే ఎన్నికల్లో వచ్చే అవకాశం కూడా లేదు. అలాంటి పొందిక తెలంగాణాలో వచ్చే అవకాశం లేదు గనుక బిఎస్‌పి, దాని సారధ్యం పుచ్చుకున్న ప్రవీణ్‌ కుమార్‌ భవిత్యం ఏమిటన్నది ఇప్పటికైతే ప్రశ్నార్దకమే. ఇక వ్యక్తులుగా ఉన్న వారు ఏ వైఖరి తీసుకున్నప్పటికీ వారు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గోమూత్ర, పేడ వినియోగదారులు, వ్యాపారులకు ఒక శుభవార్త !

18 Saturday Sep 2021

Posted by raomk in BJP, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

BJP, cow urine, Narendra Modi, RSS, toilet-training cows


ఎం కోటేశ్వరరావు

రోజూ ఆవు మూత్రం తాగితే కరోనాను దూరంగా ఉంచవచ్చని,తాను అలా తాగి కరోనా బారి నుంచి తప్పించుకున్నానని భోపాల్‌ బిజెపి ఎంపీ, మాలెగావ్‌ పేలుళ్ల ఉగ్రవాద కేసు నిందితురాలు ప్రజ్ఞాసింగ్‌ చెప్పిన విషయం తెలిసిందే, అమె అంతకు ముందు కాన్సర్‌ నిరోధం గురించి కూడా సెలవిచ్చారు. నాలుగేండ్ల క్రితమే పతంజలి వ్యాపారి రామదేవ్‌ బాబా కంపెనీ సిఇఓ బాలకృష్ణ ఒక ప్రకటన చేస్తూ తాము రోజుకు ఐదువేల లీటర్ల గోమూత్రం తయారు చేస్తున్నామని, అది కాన్సర్‌, లివర్‌, కిడ్నీ తదితర సర్వరోగ నివారిణిగా పని చేస్తుందని చెప్పారు. ఇప్పుడు గోమూత్ర పానం చేసే వారు, వాటితో వ్యాపారం చేసే వారికి మరొక శుభవార్త.


ఆవు విసర్జనాలైన మూత్రం, పేడ పర్యావరణానికి కలిగిస్తున్న హాని నివారణకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. జర్మన్‌ ఫెడరల్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఎనిమల్‌ హెల్త్‌ మరియు రిసర్చి ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఫామ్‌ ఏనిమల్‌ బయాలజీ(ఎఫ్‌బిఎన్‌), న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌ విశ్వవిద్యాలయం వారు జర్మనీలో సంయుక్తంగా చేసిన పరిశోధనల ఫలితాలను తాజాగా వెల్లడించారు. ఆవులు మరుగుదొడ్లను వినియోగించే విధంగా శిక్షణ ఇచ్చి జయప్రదమయ్యారు.విదేశాల్లో రోజుకు ఒక్కో ఆవు 30 నుంచి 40కిలోల పేడ వేస్తుందని, 30 లీటర్ల మూత్ర విసర్జన చేస్తుందని అంచనా.(మన దేశ ఆవుల సామర్ధ్యం ఎంతో తెలియదు) మన దేశంలో మాదిరే అన్ని చోట్లా బయట తిరుగుతూ ఎక్కడబడితే అక్కడ, గోశాలల్లో అవి తమ పని కానిస్తాయి.ప్రపంచ వ్యాపితంగా ఆవులను పెంచుతారు, పాలు పిండుకుంటారు, బీఫ్‌కు వినియోగిస్తారు. బహుశా మన దేశంలో తప్ప ఎక్కడా ఆవు మూత్రం తాగరు, తాగమని ప్రోత్సహించేవారు కూడా లేరు.


ఆవు మూత్రం, పేడతో విషపదార్ధాలు తయారవుతాయి.( గోమాతను ఇలా అంటారా అని ఎవరైనా మనోభావాలను గాయపరచుకుంటే చేయగలిగిందేమీ లేదు. శాస్త్రం అలా చెబుతోంది మరి ) గోమూత్రం నుంచి నైట్రేట్‌ మరియు నైట్రస్‌ ఆక్సైడ్‌ ఉద్భవిస్తాయి. వాటితో జలాశయాలు, నదులు, చెరువులు, కుంటలు కూడా కలుషితం అవుతాయి. అవి ఎంత ప్రమాదకరం అంటే కార్బన్‌ డయాక్సైడ్‌ కంటే 300 రెట్లు ఎక్కువ శక్తి కలిగినవి. నైట్రేట్‌ కలిసిన నీరు గడ్డి మొక్కలతో పాటు నీటిలో విషపూరితమైన పాచి పెరిగేందుకు దోహదం చేస్తుంది. నైట్రస్‌ ఆక్సైడ్‌ ఎలా ఉంటుందంటే న్యూజిలాండ్‌లో పర్యావరణంలోకి విడుదలయ్యే రేడియో ధార్మిక పరిగ్రహణాన్ని హరించే గ్రీన్‌హౌస్‌ వాయువు వంద అనుకుంటే గోమాతలు 12శాతం వాటాను విడుదల చేస్తున్నాయట. బయట తిరిగే వాటి కంటే గోశాలల్లో ఉండే గోమాతలు మరొక ప్రమాదాన్ని కూడా తెస్తున్నాయని ఐరోపా, అమెరికాల్లో వెల్లడైంది. అదేమంటే వాటిని ఒక చోట కట్టివేసినపుడు విసర్జించే పేడ, మూత్రం రెండూ కలిస్తే అమ్మోనియా వాయువు పుడుతుంది.అది గోమాతల ఆరోగ్యానికేగాక, మానవాళికి కూడా ప్రమాదకారకమే.


ఈ ముప్పులను తప్పించేందుకు మార్గం ఏమిటి అనే ఆలోచనతో శాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగాలు చేశారు. అదేమంటే చిన్న పిల్లలకు ఎలా అయితే మరుగుదొడ్డిని అలవాటు చేస్తామో గోమాతల మీద కూడా అదే ప్రయోగం చేసి సఫలీకృతం అయ్యారు. జర్మనీలోని ఓక్స్‌వాగన్‌ ఫౌండేషన్‌ వారి సాయంతో ముందే చెప్పుకున్న ఎఫ్‌బిఎన్‌ సంస్ధలో ఒక నిర్ణీత ప్రదేశంలో మూత్రవిసర్జన చేసే విధంగా ఆవుదూడలకు శిక్షణ ఇచ్చారు. ఒక గదిని ఏర్పాటు చేసి ఒక వైపు దాణాగా బార్లీని ఒక గిన్నెలో పోసి ఆవులను వాటిలోకి వదిలారు. అవి దాణా తింటూ అక్కడే మూత్రం పోయటాన్ని అలవాటు చేసుకున్నాయి. తొలుత ఆవులను ఒక ఇరుకు సందులోకి తోలారట. అవి అక్కడ మూత్ర విసర్జనకు ఉపక్రమించగానే భయంకరమైన శబ్దాలను చేసి మరుగుదొడ్లోకి వెళ్లేట్లు ప్రయత్నించినా ఫలితం కనపడకపోవటంతో చివరికి వాటి మీద నీళ్లు చల్లి వెళ్లేట్లు చేశారు. పక్షం రోజుల పాటు ఇలా రోజుకు 45 నిమిషాల పాటు శిక్షణ ఇచ్చిన తరువాత 16ఆవుల్లో 11 మరుగుదొడ్లోకి వెళ్లటం అలవాటు చేసుకున్నాయట. పిల్లల్ని అలవాటు చేయటానికి పట్టే వ్యవధి కంటే ఆవులు తక్కువ సమయంలోనే ఆ పనిచేశాయట. ఈ ప్రయోగంతో అన్ని అవులు కొద్ది సంవత్సరాల్లో మరుగుదొడ్లకు వెళతాయని ఆవుల మానసిక నిపుణుడు డాక్టర్‌ లాంగ్‌ బెయిన్‌ అంటున్నారు.


అసలు సమస్య ఇక్కడే తలెత్తింది. మానవ ప్రయత్నం లేకుండా ఆవులకు మరుగుదొడ్డి అలవాటు చేయటం ఎలా, పెద్ద సంఖ్యలో బయట తిరిగే ఆవులతో పాటు గోశాల్లో మరుగుదొడ్లను ఏర్పాటు చేయటం ఎలా అన్న ఆలోచన మొదలైంది. ఇక్కడ మన దేశంలో ఆవు మూత్రం తాగే వారికి మరింత చౌకగా, విస్తృతంగా అందుబాటులోకి రావాలంటే పతంజలి వంటి ఆవు మూత్ర వ్యాపారులకు లభ్యత కూడా అవసరం. తక్కువ మొత్తమే అయినప్పటికీ మన దేశం అమెరికా, నెదర్లాండ్స్‌,జర్మనీ,ఫ్రాన్స్‌, న్యూజిలాండ్‌, థాయలాండ్‌ పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నది. వాటికి లేని అభ్యంతరాలు మూత్రం దిగుమతి చేసుకొనేందుకు ఉండాల్సిన అవసరం లేదు. అందువలన విదేశాల్లో ఆవు మరుగుదొడ్ల సంస్ధలతో ఒప్పందాలు చేసుకొని దిగుమతి చేసుకుంటే చౌకగా లభ్యం అవుతాయి. లేదా మన దేశంలోనే ఏర్పాటు చేసినా ఖర్చులు కలసి వస్తాయి. అయితే మనుషులకే ఇంకా పూర్తిగా మరుగుదొడ్లు లేని స్ధితిలో ఆవులకు సాధ్యమా ? కేంద్ర ప్రభుత్వం, యోగి ఆదిత్యనాధ్‌ వంటి ఆవు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తలచుకుంటే అసాధ్యం కాదేమో !


గుజరాత్‌లోని జునాఘడ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆవు మూత్రంలో బంగారాన్ని కనుగొన్నట్లు చెప్పారు. ఇతర ప్రభుత్వ సంస్ధలు ఆవు మూత్రంలో ఔషధ గుణాల గురించి పరిశోధనలు చేస్తున్నాయి. అందువలన విదేశాల్లో పనికి రాని ఆవు మూత్రాన్ని రవాణా, సేకరణ ఖర్చు చెల్లించి మనం ఉచితంగానే దిగుమతి చేసుకోవచ్చు. బంగారంగా మార్చుకోవచ్చు. అవి సర్వరోగ నివారిణి అని నమ్మేవారి కోసం వాటితో పనిచేసే ఆసుపత్రులను ఏర్పాటు చేసి చేరే వారికి చికిత్స చేయవచ్చు. ఈ ఆసుపత్రులకు నిపుణులైన వైద్యులు, సిబ్బంది, ఆధునిక పరికరాలు కూడా అవసరం లేదు. వలంటీర్లతో నడుస్తాయి. ప్రస్తుతం మన దేశంలో ఆవు పాల కంటే మూత్రం రేటే ఎక్కువగా ఉంది. అమెజాన్‌ ద్వారా తెప్పించుకుంటే లీటరు రు.260కి బదులు 198కే దొరుకుతుందనే ప్రకటనలను ఎవరైనా చూడవచ్చు. అందువలన దిగుమతి చేసుకుంటే ఇంకా తక్కువకే జనాలకు అందచేయవచ్చు. అనేక విదేశీ వస్తువులను తెప్పించుకుంటున్నమనం ఆవు మూత్రానికి అభ్యంతర పెట్టాల్సిన అవసరం లేదు.


విదేశీయులు పర్యావరణం అంటూ గొడవ చేస్తున్నారు గనుక వారెలాగూ ఆవు మూత్రాన్ని వదిలించుకోవాలని చూస్తారు. దాన్ని మనం తెచ్చుకుంటే ఉభయతారకంగా ఉంటుందేమో ! పూజకు పనికి వస్తుందని భావిస్తున్న ఆవు పేడను మనం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాము.ఈ ఏడాది మేనెలలో మన దేశం నుంచి ఎయిర్‌ ఇండియా విమానంలో అమెరికా వెళ్లిన ఒక ప్రయాణీకుడి సూట్‌ కేసులో ఆవు పేడ పిడకలను అక్కడి భద్రతా సిబ్బంది కనుగొన్నారు. మన వారు పవిత్రంగా భావించే ఆవు పేడను అధికారికంగా అవసరమైతే పెద్ద మొత్తంలో పన్నులు విధించి అయినా దిగుమతికి అనుమతించాలని నరేంద్రమోడీ తన పలుకుబడిని వినియోగించి అమెరికా ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నించాలని అక్కడి భారతీయులు కూడా కోరవచ్చు. అమెరికాకు మన అవసరం ఉందని చాలా మంది భావిస్తున్నారు గనుక బైడెన్‌ సర్కార్‌ అనుమతించవచ్చు కూడా. ఆవులకు మన దేశంలోనే మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తే వాటికి శిక్షణ ఇచ్చేందుకు జనం కావాలి కనుక కొంత నిరుద్యోగ సమస్య కూడా తగ్గుతుంది. పకోడీ బండి వేయటం కూడా ఉపాధి కల్పనకిందికే వస్తుందని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీయే చెప్పారు కనుక వీటి గురించి కూడా తీవ్రంగా ఆలోచించాలి. కావాలంటే ఆవు మూత్రం అపవిత్రం కాకూడదు అనుకుంటే గోవు పవిత్రతను కాపాడుతున్న వారికే వాటి నిర్వహణ కూడా పూర్తిగా అప్పగించవచ్చు. గో రక్షకుల నుంచి తలెత్తుతున్న శాంతి భద్రతల సమస్య కూడా పరిష్కారం అవుతుంది.


ఇక ఆవు రాజకీయాలకు వస్తే మన దేశంలోనే కాదు నైజీరియాలో కూడా నడుస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌, రాజస్తాన్‌, హర్యానాల్లోతప్ప ఇంతవరకు బిజెపి పాలనలోని గోవా, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడా బీఫ్‌ తినేవారి మీద గోరక్షకులు దాడులు చేసినట్లు వార్తలు లేవు. నైజీరియాలో గోపాలకులు ఎకె-47 తుపాకులు పట్టుకొని మరీ ఆవులను మేపుతున్నారనే వార్తలు, దృశ్యాలు ఎవరైనా చూడవచ్చు. దేశ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక సామాజిక తరగతికి చెందిన వారే ఎక్కువగా ఆవులను పెంచుతారు. వ్యాపారులు ఆవులను ఇచ్చి మేపేట్లు ఒప్పందాలు చేసుకుంటారు. బహిరంగంగా ఆవులు, ఇతర పశువులు గడ్డి మేయటాన్ని నిషేధించటం సైతాను చట్టం అని మియెట్టీ అల్లా కౌతల్‌ హౌర్‌ జాతీయ కార్యదర్శి సాలే అల్‌హసన్‌ ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. అది ముస్లిం దేశమని తెలిసిందే.2023లో అక్కడ జరిగే ఎన్నికల కారణంగా ఆవు రాజకీయాలు రంగంలోకి వచ్చాయి.ఈ చట్టం అనేక మంది జీవనోపాధికి, ప్రాధమిక హక్కులకు, వ్యాపారాలకు నష్టం కలిగిస్తున్నదని పేర్కొన్నాడు. నైజీరియా దక్షిణాది రాష్ట్రాలలో గోవుల పెంపకం పెద్ద ఎత్తున జరుగుతుంది. తుపాకులు పట్టుకొని ఆవులను మేపుతున్న వారిని బందిపోట్లని ప్రభుత్వం చిత్రిస్తున్నదని సాలే హసన్‌ విమర్శించాడు.


మనకు సహజమిత్రమని వాజ్‌పాయి నుంచి నరేంద్రమోడీ వరకు చెబుతున్న అమెరికాలో జరుగుతున్నదేమిటి ? ఆవుమాంసం తినటాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీనికి అవసరమైన ప్రచారం, ఇతర అవసరాల కోసం ప్రతి ఆవుకు పెంపకందార్లు ఒక డాలరు చెల్లిస్తున్నారు. గత మూడున్నర దశాబ్దాలుగా ఉన్న ఈ పధకాన్ని నిలిపివేయాలా లేదా అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. ప్రతి ఆవుకు చెల్లిస్తున్న ఒక డాలరుతో స్ధానిక బీఫ్‌ను ప్రత్యేకంగా ప్రోత్సహించటం లేదు కనుక నిలిపివేయాలన్నది ఒక వాదన.ప్రస్తుతం దిగుమతులు పెద్ద ఎత్తున వచ్చిపడుతున్నాయి, నకిలీ మాంస ఉత్పత్తిదారులు లబ్దిపొందుతున్నారన్నది ఆరోపణ. ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలనేందుకు ఓటింగ్‌ జరపాలని కొంత మంది సంతకాల సేకరణ ప్రారంభించారు. అందుకు అవసరమైన సంఖ్యలో సంతకాల సేకరణకు అక్టోబరు మూడవ తేదీ వరకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ కార్యక్రమం కింద చెల్లింపులు చేయాలని ప్రభుత్వమే ఆదేశించింది. అయితే ఈ నిధులతో పంది, కోడి మాంసం వంటి వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేయకూడదు, బీఫ్‌ కోసం ప్రచారం తప్ప లాబీయింగ్‌ కూడా చేయకూడదు.కానీ లాబీయింగ్‌కు ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం నాలుగు కంపెనీలు చౌకగా లభించే దేశాల నుంచి దిగుమతులు చేసుకొని తమ ముద్రవేసుకొని వినియోగదారులను మోసం చేసే ప్రచారానికి దేశీయ పెంపకందార్లు చెల్లిస్తున్న ఈ మొత్తాన్ని వినియోగిస్తున్నారన్నది విమర్శ.


తగిన ప్రచారం లేనట్లయితే దేశీయ బీఫ్‌ డిమాండ్‌ తగ్గిపోయి ఉండేదని, ఉద్యోగాలు చేసి అలసిపోయి ఇండ్లకు వచ్చే వారు దుకాణంలో కొన్న బీఫ్‌ను ఇలా స్టౌ మీద పెట్టి అలా తినేందుకు వీలుగా తయారు చేసిన వాటి కొనుగోలుకే మొగ్గుచూపుతున్నారు. కేవలం నాలుగు పాకింగ్‌ సంస్ధలు 80శాతం వాటాతో అమెరికా బీఫ్‌ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. వాటి గుత్తాధిపత్యాన్ని నిరోధించేందుకు బైడెన్‌ సర్కార్‌ చర్య తీసుకుంది. పోటీలేని కారణంగా బీఫ్‌ అమ్మకాల్లో రైతులకు వచ్చే వాటా గత ఐదు సంవత్సరాల్లో 51.5 నుంచి 37.3శాతానికి పడిపోయింది. మరోవైపు ధరలు పెరిగాయి. టైసన్‌, జెబిఎస్‌ యుఎస్‌ఏ, కార్గిల్‌, నేషనల్‌ బీఫ్‌ అనే సంస్ధలు కరోనా సమయంలో ఎగుమతులు జరపటంతో కొరత ఏర్పడి అమెరికా వినియోగదారులు ఇబ్బంది పడ్డారు.అమెరికాలో సరకులను విక్రయించే దుకాణాలు కూడా నాలుగు బడా కంపెనీల చేతుల్లోనే ఉన్నాయి. వాల్‌మార్ట్‌, టార్గెట్‌, ఆల్బర్ట్‌సన్స్‌, క్రోగర్‌ చేతిలో మొత్తంగా 40శాతం, పట్టణాల్లో 70శాతం దుకాణాలు ఉన్నాయి. నాలుగు మాంసకంపెనీలు సులభంగా మార్కెటింగ్‌ ఒప్పందం చేసుకోవటానికి ఈ పరిస్ధితి కూడా తోడ్పడింది.గత ఏడాది వాల్‌మార్ట్‌ కంపెనీ కూడా మాంస పాకింగ్‌ వ్యాపారంలో ప్రవేశించింది. మాంసపాకింగ్‌ కంపెనీల్లో ఒకటైన జెబిఎస్‌పై ఇటీవల సైబర్‌ దాడి జరగటంతో అమెరికాలో ఐదోవంతు మాంస పాకింగ్‌ కొన్ని రోజుల పాటు నిలిచిపోయింది. దీంతో సరఫరాలో సమస్యలు ఏర్పడ్డాయి. గుత్తాధిపత్యాన్ని తగ్గించాలని ఈ ఉదంతం బైడెన్ను పురికొల్పి ఉంటుంది. అమెరికా మాంస యుద్దం ఎలా ముగుస్తుందో తెలియదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏం సాధించారని నరేంద్రమోడీ స్తోత్ర పారాయణాలు !

07 Tuesday Sep 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi, Narendra Modi ‘Seva and Samarpan’, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి నరేంద్రమోడీ పుట్టిన రోజును సేవా దినంగా పాటించిన బిజెపి 71వ జన్మదినాన్ని ఇరవై రోజుల భజన దినోత్సవంగా పాటించేందుకు పిలుపునిచ్చింది.ఈ నెల 17 నుంచి ఇరవై రోజుల పాటు అక్టోబరు ఏడవ తేదీవరకు ప్రధాని నరేంద్రమోడీ రెండు దశాబ్దాల రాజకీయ సేవ మరియు అంకిత బాట గురించి స్తోత్ర పారాయణం చేయాలని బిజెపి పిలుపు ఇచ్చింది. ఆ సందర్భంగా మోడీకి కృతజ్ఞతలను తెలుపుతూ దేశ వ్యాపితంగా పెద్ద ప్రకటనల ఫలకాలు(హౌర్డింగ్‌లు) ఏర్పాటు చేస్తారు. వాటి మీద ఉచితంగా వాక్సిన్‌, ఆహార ధాన్యాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతూ మోడీ బొమ్మవేసి రాస్తారు. మోడీ జీవిత చిత్రమాలికలతో ప్రదర్శనలు,రక్తదానాలు, పారిశుధ్యకార్యక్రమాల వంటి వాటిని చేపడతారు. పార్టీ ప్రజాప్రతినిధులందరూ రేషన్‌ దుకాణాల వద్దకు వెళ్లి ఉచితంగా బియ్యం, గోధుమలను ఇచ్చింది ఇదిగో మా మోడీగారే అంటూ వీడియోలను చూపుతూ కృతజ్ఞతలు చెబుతారు. ఇంకా పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేశమంతటి నుంచీ ఐదు కోట్ల పోస్టు కార్డులతో ప్రతి ఎన్నికల బూత్‌ ప్రాంతం నుంచి కృతజ్ఞతలు చెబుతూ పోస్టు చేస్తారు. ఉత్తర ప్రదేశ్‌లో అయితే కార్యకర్తలు ప్రత్యేకంగా71 చోట్ల గంగా నదిని శుద్ధి, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలన్నింటికీ మేథావులు, ఇతర ప్రముఖులను ఆహ్వానిస్తారు. మీడియాలో వ్యాసాలు, విశ్లేషణలు రాయిస్తారు.ప్రధానికి వచ్చిన బహుమతులన్నింటినీ వెబ్‌సైట్‌ ద్వారా వేలం వేస్తారు. పార్టీ కిసాన్‌ మోర్చా కార్యకర్తలు ఈ సందర్భంగా రైతులు-జవాన్లను సన్మానిస్తారు. రాజు తలచుకొంటే దేనికైనా కొదవేముంది ! ఈ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన నలుగురు బిజెపి జాతీయ నేతలలో దగ్గుబాటి పురందరేశ్వరి ఉన్నారు.


నరేంద్రమోడీ ప్రభుత్వ పరంగా, రాజకీయంగా ఈ ఏడాది ఇప్పటి వరకు తిన్నన్ని ఎదురు దెబ్బలు గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ రుచిచూసి ఉండరు. అయినా అవేమీ తెలియనట్లు, దేశమంతా వెలిగిపోతున్నట్లు పొగడ్తలకు పూనుకున్నారంటే జనానికి జ్ఞాపకశక్తి తక్కువనే చిన్న చూపు తప్ప మరొకటేమైనా ఉందా ? మచ్చుకు కొన్నింటిని చూద్దాం. వర్తమాన అర్ధిక సంవత్సరం 2021-22 తొలి మూడు మాసాల్లో జిడిపి వృద్ధి 20.1శాతంతో రికార్డు సృష్టించిందని, దీనికి ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమన్నట్లుగా ప్రచారం సాగింది. దీన్ని ఘనవిజయం చెప్పుకుంటే ఇబ్బందుల్లో పడేది నరేంద్రమోడీ, పాలక బిజెపి ఎన్‌డిఏ కూటమే అని అభిమానులు గుర్తించాలి. కొంత మంది రిజర్వు బ్యాంకు తీసుకున్న చర్యల వలన ఇది సాధ్యమైందని అన్నారు. 2019-20 సంవత్సరం తొలి మూడు మాసాల్లో జిడిపి విలువ రు.35.96లక్షల కోట్లు. ఈ మొత్తం మీద 24.4శాతం దిగజారి మరుసటి ఏడాది 2020-21లో విలువ రు.26.95 లక్షల కోట్లకు తగ్గింది. ఈ మొత్తం మీద వర్తమాన సంవత్సరంలో అది 20.1శాతం పెరిగి రు.32.38లక్షల కోట్లకు చేరింది. దీన్నే ఘనతగా చిత్రిస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి దేశవ్యాపితమైన లాక్‌డౌన్‌ లేదు, కార్మికుల వలసలూ అంతగా లేవు. అఫ్‌కోర్సు ఉపాధి కూడా లేదనుకోండి. అయినా ఇలా ఉందంటే పరిస్ధితి ఆందోళనకరమే అన్నది స్పష్టం.


పెట్రోలు, డీజిలు ధరలు, వాటి పెరుగుదలకు మూలమైన పన్నుల గురించి జనానికి పట్టకపోయినా ప్రభుత్వానికి పెద్ద ఆదాయవనరుగా మారింది. వినియోగం ఎంత పెరిగితే కేంద్రానికి, ధరలు ఎంత పెరిగితే రాష్ట్రాలకు అంతగా ఆదాయం పెరుగుతున్నది. వెనెజులా మాదిరి దాదాపు ఉచితంగా జనానికి అందించకపోయినా స్ధానికంగా ఉత్పత్తి పెరిగితే వినియోగదారుల మీద భారం, అన్నింటికీ మించి విలువైన విదేశీమారక ద్రవ్యం ఎంతో ఆదాఅవుతుంది. తమ ప్రభుత్వ సామర్ద్యం గురించి బిజెపి చెప్పుకోని రోజు లేదు. 2013-14లో 37.8 మిలియన్‌ టన్నుల ముడి చమురు ఉత్పత్తిచేస్తే అది 2020-21 నాటికి 30.5 మి.టన్నులకు దిగజారింది. ఈ ఏడాది ప్రతినెలా తగ్గుదలే తప్ప ఉత్పత్తి పెరుగుదల లేదు. ఎందుకు ఈ వైఫల్యమో ఇంతవరకు చెప్పిన కేంద్ర పాలకులు లేరు. మరోవైపు దిగుమతులపై ఆధారం 2012లో 81శాతం ఉండగా 2020 నాటికి 87.6 శాతానికి పెరిగింది.కేంద్ర ప్రభుత్వం కొన్ని కంపెనీలతో తలెత్తిన వివాదాల కారణంగా వెనుకటి తేదీల నుంచి వసూలు చేయాల్సిన పన్నులను రద్దు చేయాలని నిర్ణయించి వేళ్ల మీద లెక్కించదగిన కార్పొరేట్‌ కంపెనీలకు లబ్దిని, సంతోషాన్ని కలిగించింది. కానీ కోట్లాది మంది చమురు వినియోగదారులకు గత ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ మొత్తాలకు కొన్ని రెట్లు అదనంగా ఇప్పుడు వినియోగదారుల నుంచి మోడీ సర్కార్‌ వసూలు చేస్తోంది. అడిగేవారు లేకపోవటం అంటే ఇదే. కాంగ్రెస్‌ హయాంలో జారీ చేసిన చమురు బాండ్ల భారం తమ మీద పడిందని, వాటిని తాము తీర్చాల్సి వస్తోందని గత ఏడు సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ ఆమొత్తం ఎంత ? లక్షా 34వేల కోట్లు. ఈ మొత్తం కూడా మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉండగా వినియోగదారులకు ఇచ్చిన రాయితీలకు గాను చమురు సంస్ధలకు ప్రభుత్వం చెల్లించాల్సిస సబ్సిడీ మొత్తం ఇది. ఆ మేరకు చమురు సంస్ధలకు బాండ్ల రూపంలో ఇచ్చారు. అంటే వడ్డీ మరియు అసలు చెల్లించే ప్రామిసరీ నోట్ల వంటివి ఇవి. మన్మోహన్‌ సింగ్‌ గారి ” చెడు ” రోజులు చివరిలో లేదా నరేంద్రమోడీ గారి ” మంచి రోజుల ” ప్రారంభంలో లీటరు పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వ పన్ను రూ.9.48, 3.56 చొప్పున ఉంటే క్రమంగా పెంచి రూ.32.98, 31.83 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ కారణంగా ఏడాదికి 2020-21లో కేంద్రానికి 3.35లక్షల కోట్లు సమకూరింది. వినియోగం పెరిగిన కొద్దీ ఆదాయం పెరుగుతుంది.


ఆత్మనిర్భర కార్యక్రమం పేరుతో 26లక్షల కోట్ల రూపాయల సాయాన్ని చేస్తున్నట్లుగా గొప్పగా ప్రచారం చేశారు.అసలా కార్యక్రమం ఏమిటో, సామాన్యులకు ఎలా ఉపయోగపడుతుందో అసలు ప్రయోజనమో కాదో కూడా ఇప్పటికీ, ఎప్పటికీ తెలియని వారెందరో. చట్ట సభల్లో అధికార పార్టీ సభ్యులు సాధారణంగా తమ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టని, గొప్పలు చెప్పుకొనేందుకు వీలయ్యే ప్రశ్నలే అడుగుతారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ సామాజిక సహాయపధకం(ఎన్‌ఎస్‌ఎపి-వృద్ధాప్య, ఇతర పెన్షన్‌ పధకాలు) కింద ఇస్తున్న మొత్తాన్ని రెట్టింపు చేసే ప్రతిపాదన ఏమైనా ఉందా అని బిజెపి సభ్యుడు వసంత కుమార్‌ పాండా లోక్‌సభలో అడిగారు. దానికి జాతీయ గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన జ్యోతి అలాంటి ప్రదిపాదన తమ వద్ద లేదు సార్‌ అంటూ ఆగస్టు మూడవ తేదీన రాతపూర్వక సమాధానంలో తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 41కింద సామాజిక సహాయ పధకాన్ని అమలు జరపాలని ఉంది. ఆ మేరకు 1995లో దీన్ని ప్రారంభించి రు.75గా నిర్ణయించారు. తరువాత 2006లో రు.200కు పెంచారు. 2013లో జాతీయ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ మొత్తాన్ని రు.300కు పెంచాలని సిఫార్సు చేసింది. ఎనిమిది సంవత్సరాల తరువాత తమ వద్ద అలాంటి ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిజాలు పలుకుతున్నారా, అబద్దాలు చెబుతున్నారా ?


అసలు ఒక వృద్దుడు లేదా వృద్దురాలు రెండువందల రూపాయలతో నెల రోజులు ఏ విధంగా గడపగలుగుతారో ఎవరైనా చెప్పగలరా ? మంత్రి సమాధానాన్ని బట్టి అపర మానవతా మూర్తులైన పాలకులకు అలాంటి ఆలోచన కూడా లేదన్నది స్పష్టం. మన దేశం జిడిపిలో సామాజిక భద్రతా పెన్షన్‌ పధకాలకు ఖర్చు చేస్తున్న మొత్తం 0.04శాతం కాగా, ఆఫ్రికాలోని బోట్సవానాలో 0.3, పొరుగునే ఉన్న నేపాల్లో 0.7, లాటిన్‌ అమెరికా ఖండదేశమైన బొలీవియాలో 1.3 శాతాల చొప్పున ఖర్చు చేస్తున్నారు. వృద్దులకు రు.200, ఎనభైశాతంపైగా వికలాంగులైన వారికి, నలభై దాటిన వితంతువులకు 300, ఎనభై దాటిన వృద్దులకు 500 రూపాయల చొప్పున ఇప్పుడు కేంద్రం చెల్లిస్తున్నది. ఈ మొత్తాలకు అదనంగా జతచేసి తెలంగాణాలో వృద్ధాప్య పెన్షన్‌ రు.2000, ఆంధ్రప్రదేశ్‌లో రు.2250 చెల్లిస్తున్నారు. హర్యానా, కేరళ వంటి రాష్ట్రాలలో కూడా ఇస్తున్నారు. దేశంలోని వృద్దులు, వికలాంగులు, వితంతువులలో పదికోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం నెలకు మూడువేల రూపాయల చొప్పున పెన్షన్‌ ఇస్తే ఏడాదికి రు.3.6లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఇది జిడిపిలో 1.8శాతం. అనేక దేశాలలో మాదిరి సంపదపన్ను, లేదా కార్పొరేట్‌ పన్ను ద్వారా ఈ మొత్తాన్ని సేకరించవచ్చు. లేదూ ప్రభుత్వమే ఖర్చు చేసినా నష్టం ఉండదు. పెన్షనర్లు ఆ మొత్తాన్ని తమ రోజు వారీ అవసరాలకే వినియోగిస్తారు తప్ప బ్యాంకుల్లో డిపాజిట్లు చేయరు లేదా నల్లధనంగా మార్చి విదేశీ బ్యాంకులో పెట్టరు. ఆ మొత్తం ఖర్చు చేస్తే జిడిపి రెట్టింపు 3.8శాతం అవుతుంది. దానిలో సగటున పదిహేనుశాతం పన్నుగా తిరిగి కేంద్రం, రాష్ట్రాలకు చేరుతుంది. ఆ మొత్తం జిడిపిలో 0.54శాతం అవుతుంది. అంటే కేంద్రం నిఖరంగా ఖర్చు చేసే మొత్తం 1.26శాతమే అవుతుంది. మరి కేంద్రానికి ఎందుకు చేతులు రావటం లేదు ?


వృద్దులు, అనాధల పరిస్ధితి ఇలా ఉంటే వారిని ఆదుకోవాల్సిన యువత పరిస్ధితి ఏమిటి ? జూలై నెలతో పోలిస్తే ఆగస్టు నెలలో పదిహేను లక్షల ఉద్యోగాలు తక్కువగా ఉన్నాయని సిఎంఐయి తెలిపింది. నిరుద్యోగశాతం 6.96 నుంచి 8.32కు చేరింది. వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోవటం ఉద్యోగ అవకాశాలు తగ్గటానికి కారణమని సదరు సంస్ధ అధిపతి మహేష్‌ వ్యాస్‌ చెప్పారు. ముందే చెప్పుకున్నట్లు ఆర్ధిక కార్యకలాపాలు పెరిగి తొలి మూడు మాసాల్లో జిడిపి 20.1శాతం వృద్ది చెందింది అని సంబరాలు చేసుకుంటున్న తరుణంలోని పరిస్ధితి ఇది. ఎనిమిది రాష్ట్రాల్లో హర్యానాలో 35.7, రాజస్తాన్‌లో 26.7, ఝార్ఖండ్‌ 16, బీహార్‌, జమ్మూ అండ్‌ కాశ్మీరులో 13.6, ఢిల్లీలో 11.6శాతాల చొప్పున నిరుద్యోగులను కలిగి ఉన్నాయి. తగినంత ఉపాధి లేని కారణంగా కరోనా కాస్త తగ్గుముఖం పట్టగానే కడుపు చేత పట్టుకొని వలస కార్మికులు తిరిగి పట్టణాలకు చేరుకుంటున్నారు.2021 జూలై నెలతో పోలిస్తే ఆగస్టు నెలలో ఉపాధి పధకం కింద పని చేసిన వారు 58శాతం తగ్గారు. దీనికి వ్యవసాయ పనులు కూడా ఒక కారణంగావచ్చుగానీ పట్టణాలకు వలసలే ప్రధానం అన్నది స్పష్టం. ఉపాధిని కల్పించే పర్యాటక, ఆతిధ్య రంగాలలో వృద్ధి లోటులోనే ఉంది. మన ఎగుమతులు పెరిగాయని సంతోషించవచ్చుగానీ, ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో ప్రయివేటు వినిమయం అంతకు ముందు మూడు మాసాలతో పోల్చితే 8.9శాతం తగ్గిపోయింది. ఉపాధిలేకపోవటం, అవసరమైన వాటినే జనం కొనుగోలు చేస్తున్నట్లు ఇది సూచిస్తోంది. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ధన ఆర్జన పధకం కింద ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు వారికి కట్టబెడితే పర్మనెంటు ఉద్యోగాలకు కోత పడటంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోతాయి. తక్కువ వేతనాలు, తక్కువ సిబ్బందితో ప్రయివేటు సంస్ధలు లాభాలు పిండుకొనేందుకు చూస్తాయన్నది తెలిసిందే.


ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం లేదన్నది స్పష్టం. అంకెల గారడీతో ఎంతగా దాచిపెట్టాలని చూసినా కుదరదు.ద్రవ్యోల్బణం పెరగటం అంటే ధరలు పెరగటం. ఉదాహరణకు జవహర్‌లాల్‌ నెహ్రూ ఏలుబడిలో 1961లో వంద రూపాయల వస్తువులు కొన్నాం. ఆ ఏడాది ద్రవ్యోల్బణం రేటు 1.7శాతం. మరుసటి ఏడాది ద్రవ్యోల్బణం 3.63శాతం పెరిగింది. ఆ కారణంగా అదే వస్తువులకు మనం 103.63 చెల్లించాం. అంటే మన రూపాయి విలువ తగ్గినట్లా పెరిగినట్లా ? మనం ఒక్కసారిగా బిజెపి వాజ్‌పాయి గారి పాలనకు వద్దాం. 1999లో ఆ వంద రూపాయల వస్తువుల విలువ రు.2,032.56 అయింది. వారి పాలనలో దేశం వెలిగిపోయింది అని చెప్పారు కదా ! 2004లో అది రు.2,464.60కు చేరింది. మన్మోహన్‌ సింగ్‌ గారు దిగిపోయిన 2014 నాటికి రు.5,483.69కి పెరిగింది. ఇక మంచి రోజులు తెస్తానని వాగ్దానం చేసిన నరేంద్రమోడీ గారి ఏలుబడిలో 2021నాటికి ఆ మొత్తం రు.7,646.39కి చేరింది.( 2021లో జూలైలో అంతకు ముందు పన్నెండు నెలల సగటు మేరకు వేసిన లెక్క. ఏడాది పూర్తయిన తరువాత ఇంకా మొత్తం పెరుగుతుందే తప్ప తగ్గదు). ఈ అంకెలకు ప్రపంచబ్యాంకు సమాచారం ఆధారం.ఆరు దశాబ్దాల సగటు ద్రవ్యోల్బణం రేటు 7.64శాతం. దీన్నే మరొక విధంగా చెప్పాలంటే నెహ్రూ కాలంలో ఒక రూపాయి ఇప్పుడు మోడీగారి హయాంలో 76.46కు సమానం. ఈ మేరకు కార్మికుల వేతనాలు, జన ఆదాయాలు పెరిగాయా ?


మనం తగినంత చమురును ఉత్పత్తి చేయని కారణంగా లేదా బంగారం వంటి నిరుత్పాదక వస్తువులను దిగుమతి చేసుకోవటం ద్వారా వాటితో పాటు ద్రవ్యోల్బణాన్ని కూడా దిగుమతి చేస్తున్నాం. ఎలా అంటే, నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన సమయంలో రూపాయి విలువ ఒక డాలరుకు 58 ఉంది. ఇప్పుడు 73-74 మధ్య కదలాడుతోంది. అంటే ఒక లీటరు పెట్రోలు దిగుమతి చేసుకుంటే ఏడు సంవత్సరాల్లో దాని ధర అంతర్జాతీయ మార్కెట్లో స్ధిరంగా ఉందని అనుకుంటే మన వినియోగదారులు చెల్లించాల్సిన మొత్తం 58 నుంచి 73-74 పెరుగుతుంది. అదే చమురు ధర పెరిగిందనుకోండి ఆ మేరకు అదనంగా పెరుగుతుంది. అదే మన రూపాయి విలువ దిగజారకుండా డాలరుతో స్ధిరంగా ఉంటే 58 మాత్రమే చెల్లించాలి.అంతర్జాతీయ మార్కెట్లో ఎంత పెరిగితే అంత అదనం అవుతుంది. నరేంద్రమోడీ, బిజెపి నేతల మాటల ప్రకారం రూపాయి విలువ 58 నుంచి 40కి తగ్గిందనుకోండి మనం చెల్లించే మొత్తం తగ్గి ఉండేది. మనం ఏడు సంవత్సరాల్లో రెండింటికీ చెడ్డాం. కరెన్సీ విలువ తగ్గితే ఎగుమతులు పెరగాలి. 2014లో జిడిపిలో ఎగుమతుల విలువ 25.43శాతం, డాలర్లలో 472.18 బిలియన్లు కాగా 2020 నాటికి అవి 18.08 శాతం, 474.15బిలియన్లుగా ఉన్నాయి. ఎగుమతులు పెరగకపోగా తగ్గాయి. మరోవైపు దిగుమతులు పెరిగాయి.


ఉచితంగా బియ్యం, గోధుమలు ఇస్తున్నందుకు, కరోనా వాక్సిన్‌ ఉచితంగా వేస్తున్నందుకు నరేంద్రమోడీ గారికి కృతజ్ఞతలు చెప్పాలట. మోడీగారు తాను చిన్న తనంలో అమ్మినట్లు చెబుతున్న టీ సంపాదన డబ్బు నుంచి తీసి జనానికి అందిస్తే నిజంగానే కృతజ్ఞతలు చెప్పాలి. అలాంటిదేమీ కాదే, జనం చెల్లించిన పన్నులు, కార్పొరేట్‌ టాక్సులు, జాతి మొత్తానికి చెందిన ప్రకృతి వనరుల నుంచి వచ్చిన ఆదాయం నుంచి ఏ మూలకూ చాలని ఐదు కిలోల బియ్యం, కిలో కందిపప్పు ఇచ్చినందుకు మోడీగారికి కృతజ్ఞతలు చెప్పాలంటూ బిజెపి ప్రచార కార్యక్రమం చేపట్టింది. ఎవడబ్బ సొమ్మనీ రామచంద్రా అన్న భక్తరామదాసు గుర్తుకు రావటం లేదూ ! కరోనా వాక్సిన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతగా జనం నోళ్లలో నానిందో, గబ్బుపట్టిందో తెలిసిందే. విధిలేని స్ధితిలో ఉచిత వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని అమలు జరుపుతున్నారు. దీనికీ జనం సొమ్మేగా ఖర్చు చేస్తోంది. ఆపద కాలంలో ఉన్న వారిని ఆదుకోవటం, మహమ్మారుల నుంచి జనాలను రక్షించటం పాలకుల బాధ్యత. దానికి కృతజ్ఞతలను ఆశించటం ఏమిటి ? ఏదో ఒక సందర్భాన్ని ఉపయోగించుకొని మోడీ స్తోత్రపారాయణం చేయటం ద్వారా పడిన మచ్చలను కనిపించకుండా చేయాలనే కార్యక్రమం తప్ప ఏం సాధించారని ఇరవై రోజుల పాటు మోడీ గారిని పొగడాలి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏడేండ్ల మోడీ ఏలుబడి : నాడు చెప్పింది ఆస్తుల వృద్ది – నేడు చేస్తున్నది ఉన్న వాటి అమ్మకం ?

29 Sunday Aug 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ 1 Comment

Tags

BJP, Monetisation, Narendra Modi Failures, National Monetisation Pipeline, Nirmala Sitharaman


ఎం కోటేశ్వరరావు


ప్రయివేటీకరణ విషయంలో కాంగ్రెస్‌కు -బిజెపికి ఉన్న మౌలికమైన తేడాలు ఏమిటన్నది కొందరికి సందేహం.సూటిగా చెప్పాలంటే ఆస్తులను సృష్టించిన ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహించిన పార్టీ కాంగ్రెస్‌, వాటిని తెగనమ్మేందుకు పూనుకున్న పక్షం బిజెపి. మొదటి పక్షానికి కాస్త బెరుకు ఉండేది, రెండో పార్టీకి అలాంటి వేమీ లేవు, ఎందుకంటే వారి ఏలుబడిలో సృష్టించిన ఆస్తులేమీ లేవు కదా ! కాకపోతే మిగతా అంశాల్లో ఎలా అయితే ముసుగులు వేసుకుందో ఈ విషయంలో కూడా అదే చేస్తోందన్నది పరిశీలకుల భావన. అదే పూర్తిగా కట్టబెట్టటం కాదు, నిర్వహించి ప్రభుత్వానికి కొంత ముట్టచెప్పటం అని చెబుతున్నది దానికే మోనిటైజేషన్‌ అని పేరు పెట్టారు. ప్రయివేటు రంగం గురించి దేశ ప్రజలకు భ్రమలు, మరులు కొల్పించటం, ఆశ్రితులకు కారుచౌకగా ప్రజల ఆస్తులను కట్టబెట్టటం కొత్త కాదు. నయావుదారవాద విధానంలో అవి ఒక ప్రధాన అంశం.జాతీయ మౌలిక సదుపాయాల గొట్టపు పధకం పేరుతో దానికి తెరతీశారు. గత మూడు దశాబ్దాలుగా చెప్పిన కబుర్లు సినిమా నిర్మాణానికి ప్రమోషన్‌ లేదా ప్రచారంలో భాగంగా చెప్పినవి అనుకుంటే ఇప్పుడు సినిమా చూపిస్తమామా అంటూ విడుదల గురించి ఆర్భాటం చేస్తున్నారు. పాలకులు, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు-కార్మికులు అసమర్ధులు, అవినీతి పరులని పరోక్షంగా అంగీకరిస్తూ ప్రయివేటు రంగ మంత్రం జపిస్తున్నారు. మన కళ్ల ముందే బడా కార్పొరేట్‌ కంపెనీలు ఎలా, ఎందుకు విఫలమయ్యాయో చెబితే వాటి బండారాన్ని జనం అర్ధం చేసుకుంటారు. కానీ ఎక్కడా అలాంటి సమాచారం నరేంద్రమోడీ గారు మిత్రోంకు అందచేసిన దాఖలాల్లేవు.


ప్రయివేటు రంగం ఎంత అవినీతి, అక్రమాలతో జనాలను పీక్కుతింటుందో, ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తుందో కరోనా మహమ్మారి వెల్లడించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌, కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌, ఎస్‌బ్యాంకు, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, టాటా టెలిసర్వీసెస్‌, ఓడాఫోన్‌, సత్యం కంప్యూటర్స్‌, ఇలా అనేక కంపెనీలు ఎలా మోసాలకు పాల్పడ్డాయో తెలిసిందే.ఇలాంటి వారికి ప్రభుత్వ ఆస్తులను అప్పగిస్తే వారు బాగుచేస్తారన్న హామీ ఏమిటి ? రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ -అనిల్‌ అంబానీ ఘోరవైఫల్యం గురించి తెలిసిందే. మన కళ్ల ముందు దివాలా తీసిన అతి పెద్ద ప్రయివేటు కంపెనీ. వారి సామర్ధ్యం ఏమైంది ? పద్దెనిమిది వేల కోట్ల ఆస్తులున్న సదరు కంపెనీ 50వేల కోట్ల అప్పులతో ఐపి( దివాలా పిటీషన్‌ ) పెట్టింది. దానికే రాఫెల్‌ విమానాల కాంట్రాక్టును కట్టపెట్టారు. పెద్ద మనిషిగా పేరు గాంచిన రతన్‌ టాటా గ్రూపుకు చెందిన టాటా సన్స్‌ లిమిటెడ్‌ కంపెనీ వివాదం గురించి తెలిసిందే. సైరస్‌ మిస్త్రీ నియామకం, తొలగింపు, కోర్టు వివాదాలు. అసలు ఏం జరుగుతోంది, వారు దేని గురించి దెబ్బలాడుకుంటున్నారో జనానికి తెలుసా ? పారదర్శకత ఉందా ! వారి సమస్యలనే వారు పరిష్కరించుకోలేక బజారుకు ఎక్కిన వారు దేశాన్ని ఉద్దరిస్తారంటే నమ్మటం ఎలా ? వారుగాకపోతే మరొకరు. బండారం బయటకు రానంతవరకే పెద్దమనుషులు. తెరతొలిగితే విశ్వరూపం కనిపిస్తుంది.


ఐసిఐసిఐ బ్యాంకు-వీడియోకాన్‌ బాగోతం ఏమిటి ? ఐసిఐసిఐ బ్యాంకు వీడియోకాన్‌కు 2009లో 300 కోట్ల రుణం ఇస్తే దానిలో 64కోట్లు మరుసటి రోజే నూపవర్‌ అనే కంపెనీకి బదలాయించారు. రుణం ఇచ్చింది ఎవరు ? చందాకొచ్చర్‌ నాయకత్వంలోని బ్యాంకు బృందం. ఐదోవంతు మొత్తాన్ని తరలించిన పవర్‌ కంపెనీ ఎవరిది, చందాకొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌ది. ఆ బృందంలోని మిగతా సభ్యులకు ఏమీ తెలియకుండానే ఈ వ్యవహారం జరిగిందా ? అది లంచం తప్ప మరొకటి కాదు అని కేసు నమోదు చేసి ఇడి, సిబిఐ దర్యాప్తు చేస్తున్నాయి.పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు-నీరవ్‌ మోడీ రు.11,400 కోట్ల అవినీతి బాగోతం గురించి చెప్పనవసరం లేదు. సత్యం కంప్యూటర్స్‌ అవినీతి గురించి తెలిసిందే. కార్పొరేట్‌ కంపెనీ నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు అవలంభించిన కంపెనీగా, అమెరికా అధ్యక్షుడి సరసన కూర్చున్న సత్యం కంప్యూటర్స్‌కు గోల్డెన్‌ పీకాక్‌ గ్లోబల్‌ అవార్డును కూడా బహుకరించారు.తప్పుడు లెక్కలను తయారు చేసి మదుపుదార్లను మోసం చేసింది ఆ కంపెనీ. తన కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న రెండు కంపెనీలు సత్యమ్‌ను తిరగేసి మైటాస్‌ అని పేరుపెట్టి ఏడువేల కోట్ల రూపాయల పెట్టుబడులను వాటికి మళ్లించేందుకు ప్రయత్నించారు. సత్యం కంపెనీతో ఎలాంటి లావాదేవీలు నిర్వహించకూడదంటూ ప్రపంచబ్యాంకు ఎనిమిది సంవత్సరాల నిషేధం విధించింది. పెద్దలు ఎలా మోసం చేస్తారో ప్రపంచానికి ఎంతో స్పష్టంగా ఈ ఉదంతం తెలిపింది.


ఇక సింగ్‌ సోదరులుగా పేరుమోసిన మాల్విందర్‌ సింగ్‌ – శివిందర్‌ సింగ్‌ ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన రాన్‌బాక్సీ తదితర కంపెనీల యజమానులు.రెల్‌గేర్‌ ఫిన్వెస్ట్‌ లిమిటెడ్‌ కంపెనీ పేరుతో లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ నుంచి రుణాలు తీసుకొని ఆ మొత్తాలను వేరే కంపెనీలకు మరలించి ఈ కంపెనీని దివాలా తీయించారు, 2,387 కోట్ల నష్టాల పాలు చేశారు.పది సంవత్సరాల కాలంలో వీరు 22,500 కోట్ల రూపాయలను నొక్కేశారని తేలింది.
మరో మోసకారి కంపెనీ దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌(డిహెచ్‌ఎఫ్‌ఎల్‌).కంపెనీ బాంద్రా శాఖ పేరుతో ఖాతా పుస్తకాలను తయారు చేశారు. అసలు అలాంటి శాఖే లేదు.బాంద్రాబుక్స్‌గా పిలుస్తున్న ఈ కంపెనీ కుంభకోణంలో జరిగిందేమిటి ? రు.23,815 కోట్లను 2,60,315 మందికి రుణాలు ఇచ్చినట్లు పుస్తకాల్లో రాశారు. వాస్తవంగా ఇచ్చింది రు.11,755 కోట్లు. వాటిలో కూడా కొన్నింటిని తనిఖీ చేస్తే రుణం తీసుకున్నవారు అదే యాజమాన్యంలోని ఇతర కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా తేలింది. లెక్కలను తారుమారు చేస,ి లేని ఆదాయాన్ని చూపి రు.24వేల కోట్ల మేరకు రుణసెక్యూరిటీల రూపంలో మదుపుదార్ల నుంచి వసూలు చేశారు.


ఇతర బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు తిరస్కరించిన వారికి రుణాలు ఇచ్చి పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేసిఅచిర కాలంలోనే పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించినదిగా పేరు మోసిన ఎస్‌ బ్యాంక్‌ చివరికి దివాలా తీసింది. ఎలాగూ ఎగవేసేవే గనుక బ్యాంకు కోరినంత ఫీజులు చెల్లించి మోసగాండ్లు రుణాలు తీసుకున్నారు.చివరికి బ్యాంకులో మదుపు చేసిన వారిని ఆదుకొనేందుకు ప్రభుత్వం ముందుకు రావాల్సి వచ్చింది. కేఫ్‌ కాఫీ డే కంపెనీ యజమాని సిద్దార్ద ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాఫీ గింజలను పండించటంలో 140 సంవత్సరాల చరిత్ర గల కుటుంబం నుంచి వచ్చి అత్యాశకు పోయి అప్పులపాలై చివరకు అలా ముగిసింది. విదేశీ కంపెనీల నుంచి రుణాలు తీసుకున్నారు, తగిన ఆదాయం లేక చివరకు 2,700 కోట్లకు అప్పు పెరిగి ఇచ్చిన వారి వత్తిళ్లను తట్టుకోలేక సిద్దార్ద ఆత్మహత్య చేసుకున్నాడు.దేశంలో రెండవ స్ధానంలో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ యజమానులు బ్యాంకులకు రు.8,500 కోట్ల బకాయి పడ్డారు. ఇతరులకు మరో 25వేల కోట్ల మేరకు ఇవ్వాల్సి ఉంది. కింగ్‌ఫిషర్‌, సహారా, డెక్కన్‌ ఇలాంటి విమాన సంస్ధలన్నీ తప్పుడు విధానాలకు పాల్పడి తాము మునిగి బ్యాంకులు, ఇతరులను ముంచాయి. పేరుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డులు ఉన్నా అవన్నీ వేలుముద్రలు లేదా ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేవారితో నిండి ఉంటాయి. ఇలాంటి ప్రయివేటు సంస్దలకు ప్రజల ఆస్తులను అప్పగించబోతున్నారు.
ఇక ప్రయివేటు బ్యాంకులు తీరు తెన్నులను చూద్దాం. గతంలో బ్యాంకులను జాతీయకరణ చేసినందుకు ఇందిరా గాంధీకి జనం బ్రహ్మరధం పట్టారంటే అమాయకులై కాదు. ప్రయివేటు రంగంలోని బ్యాంకులు, బీమా కంపెనీలు జనానికి టోపీ పెట్టాయి గనుకనే హర్షించారు. ఇప్పుడు జాతీయ సంపదలుగా ఉన్నవాటిని తిరిగి ప్రయివేటు రంగానికి కట్టబెట్టబోతున్నారు.1947 నుంచి 1969వరకు 559 ప్రయివేటు బ్యాంకులు దివాలా తీశాయి. ఈ కాలంలో 736 బ్యాంకులను విలీనం లేదా రద్దు చేశారు. ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులను తిరిగి ప్రయివేటీకరించాలని కోరుతున్నారు. వాటిని ప్రయివేటు వారు కరిమింగిన వెలగపండులా మారిస్తే ప్రజల సొమ్ముకు ఎవరు బాధ్యత తీసుకుంటారు.1969 బ్యాంకుల జాతీయకరణ తరువాత కూడా కొన్ని ప్రయివేటు బ్యాంకులను అనుమతించారు. వాటిలో ఇప్పటి వరకు 36 బ్యాంకులు అక్రమాలకు పాల్పడ్డాయి. అవేవీ ఇప్పుడు ఉనికలో లేవు. గ్ల్రోబల్‌ ట్రస్ట్‌ బ్యాంకు వాటిలో ఒకటి, దానిని ఓరియంటల్‌ బ్యాంకుతో విలీనం చేశారు.ప్రయివేటు యాజమాన్యాలు అంత సమర్ధవంతమైనవి అయితే ఈ పరిస్ధితి ఎందుకు తలెత్తింది. ఇప్పుడున్న ప్రయివేటు బ్యాంకులు తమ వాటాను ఎందుకు పెంచుకోలేకపోతున్నాయి.2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అమెరికాలో 563 ప్రయివేటు బ్యాంకులు విఫలమయ్యాయి. అక్కడ మొత్తం ప్రయివేటు రంగానిదే ఆధిపత్యం కదా !


జాతీయ ధనార్జన గొట్టపు పధకాన్ని (మోనిటైజేషన్‌) ప్రకటించే ముందు ఆస్ట్రేలియా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్నారా అంటూ మీడియాలో వచ్చిన ఒక విశ్లేషణలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలు అలాంటి ప్రశ్నలు మన మీడియాలో వచ్చేదే అపురూపం, ఎందుకంటే మీడియా యాజమాన్యాలు ప్రయివేటీకరణకు అనుకూలం గనుక. ప్రయివేటీకరణ లేదా నిర్వహణకు ప్రయివేటు వారికి అప్పగించటం పేరు ఏది పెట్టినా మన పాలకులు వాటిని పాడి గేదెలు లేదా ఆవులుగా మారుస్తామని చెబుతున్నారు. ఒకసారి మన గేదె, ఆవును ఇతరులకు అప్పగించి మేపి, పాలు తీసి అమ్ముకొని మీరు నాలుగు డబ్బులు వెనకేసుకొని మాకు నాలుగు ఇమ్మని చెప్పిన తరువాత వారు ఎంత ధర చెబితే అంతకు మనం కూడా పాలు కొనాల్సిందే, ధర మీద మనకు అజమాయిషీ ఉండదు. ముసలిదైపోయి పాలిచ్చే అవకాశం లేని దశలో మనకు అప్పగిస్తారు.


అందువలన అలాంటి పనులు చేయబోయే ముందు పోటీ తత్వం ఉందో లేదో , వినియోగదారులను అధిక ధరలతో పిండకుండా చూసేందుకు ప్రభుత్వం బహిరంగ సమీక్షలు జరపాలని ఆస్ట్రేలియా పోటీతత్వ నిఘా సంస్ద అధ్యక్షుడు రోడ్‌ సిమ్స్‌ చెప్పారు. మరి తామే అసలైన జవాబుదారులం, చౌకీదారులం అని చెబుతున్న మోడీ సర్కార్‌ అలాంటి చర్చ ఎన్నడైనా, ఎక్కడైనా జరిపిందా ? ఆస్ట్రేలియాలో తరచుగా పోటీ లేకుండా ప్రయివేటు వారికి అప్పగిస్తున్నారని సిమ్స్‌ వాపోయాడు.నియంత్రణలు లేకపోతే జనాన్ని పీక్కుతింటారని అన్నాడు. ఆస్తులను పాడిగేదెల మాదిరి మారిస్తే ఆర్ధిక సామర్ధ్యానికి ప్రతిబంధకం అవుతుందన్నాడు. 2013లో పోటీ తత్వం లేకుండా బోటనీ అనే ఆస్ట్రేలియా రేవును ప్రయివేటు వారికి అప్పగించారు. తరువాత న్యూకాజిల్‌ ప్రాంతంలో మరొక కంటెయినర్‌ టెర్మినల్‌ను ప్రతిపాదించారు. దాన్ని నిర్మించితే రేవు నూతన యజమానులకు 510 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని కోర్టు తీర్పు చెప్పింది. ప్రయివేటీకరించిన రేవులు, విమానాశ్రయాలు యజమానుల మార్కెట్‌ శక్తిని తగ్గించటం లేదని సిమ్స్‌ పేర్కొన్నాడు. అంటే పోటీని అనుమతించటం లేదనే అర్దం. ఇదే సిమ్స్‌ ఏడు సంవత్సరాల క్రితం ఇదే హెచ్చరిక చేశాడు. పోటీకి అనుకూల సంస్కృతిని ఆస్ట్రేలియా కోల్పోతోందని చెప్పాడు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వేల్స్‌లో విద్యుత్‌ స్ధంభాలు, వైర్ల ప్రయివేటీకరణ చేసిన తరువాత ఐదు సంవత్సరాల్లో వినియోగదారులకు విద్యుత్‌ ఛార్జీలు రెట్టింపు అయ్యాయి. దాంతో ప్రభుత్వం వినియోగదారుల మీద భారం తగ్గించే చర్యలను చేపట్టింది.
సిడ్నీ నగరంలో నిర్మిస్తున్న భూగర్భ రోడ్డు మార్గంలో 51శాతం వాటాను ప్రయివేటు కంపెనీకి అమ్మివేశారు. దాని గురించి సమాచార హక్కు కింద వివరాలు ఇచ్చేందుకు అవకాశం లేకుండా చేశారని, ఆడిటర్‌కు కూడా పరిమితులు పెట్టారని సిడ్నీమోర్నింగ్‌ హెరాల్డ్‌ పత్రిక రాసింది.సింగపూర్‌లో రైల్వేలను కొంత మేరకు ప్రయివేటీకరించారు. తీసుకున్న యజమాని తగినంత పెట్టుబడి పెట్టని కారణంగా రైళ్లు ఆగిపోతున్నాయి. అందువలన తిరిగి జాతీయం చేయాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది.


పలు కంపెనీలు టెలికాం రంగంలోకి వచ్చినపుడు పోటీ పడి చార్జీలు తగ్గించిన విషయం తెలిసిందే. ఆలశ్యంగా మార్కెట్లోకి వచ్చిన రిలయన్స్‌ జియో వినియోగదారులను అతి తక్కువ ఛార్జీలతో ఆకర్షించింది. తన ఆర్ధికశక్తిని పెట్టుబడిగా పెట్టింది. గణనీయమైన మార్కెట్‌ను ఆక్రమించింది. పోటీ కంపెనీలు దివాలా దీసిన తరువాత చార్జీలు పెంచుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడున్న ఒకటి రెండు కంపెనీలు కూడా రంగం నుంచి తప్పుకుంటే ముకేష్‌ అంబానీ ఎంత చెబితే అంత చెల్లించకతప్పదు. రేపు రోడ్లయినా, విద్యుత్‌ మరొకటి ఏదైనా అంతే మొత్తం ప్రయివేటు వారి నిర్వహణకు పోతే వారెంత చార్జీ చెల్లించాలంటే అంత చెల్లించాల్సిందే. పజల ఆస్తులను ప్రయివేటు వారికి కట్టబెట్టటం మన దేశంలోనే కాదు అనేక దేశాల పాలకులు సమర్పించుకుంటున్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వాల దగ్గర ఉన్న వాటి విలువ కనిష్టంగా 75లక్షల కోట్ల డాలర్లని నాలుగు సంవత్సరాల నాటి ఒక అంచనా.రాష్ట్ర,స్ధానిక ప్రభుత్వాల వాటిని కూడా కలుపుకుంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వాల అప్పులు అనేక దేశాల్లో జిడిపికి వందశాతం దాటి నందున రాబోయే రోజుల్లో ఆర్ధిక వృద్ధి మరియు ఉపాధి కల్పనకు నిధుల కేటాయింపు మరింత ఇబ్బంది అవుతుందని, అవసరాలకు – కేటాయింపులకు మధ్య తేడా 2040 నాటికి 15లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. మన దేశంలో కూడా అదే జరుగుతోంది.


1998నాటికి మన కేంద్ర ప్రభుత్వ రుణం 9,896,997,300( దాదాపు పదిలక్షల కోట్లు), అది 2014లో నరేంద్రమోడీ అధికారానికి వచ్చే నాటికి 53లక్షల కోట్లకు పెరిగింది.2021 మార్చి నాటికి ఆ మొత్తం 116,217,806,400 కోట్లు( 116లక్షల కోట్లు) వర్తమాన ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి అది 132లక్షల కోట్లు అవుతుందని అంచనా. కేంద్రం-రాష్ర ప్రభుత్వాల రుణాల మొత్తం జిడిపిలో 2019-20నాటికి 70శాతం అయితే, మరుసటి ఏడాదికి అది 90శాతానికి చేరింది. వందశాతం మార్కు దాటటానికి ఎంతో దూరంలో లేము. అందువలన పాలకులు తెగబడి ప్రభుత్వ ఆస్తులను అయినకాడికి తెగనమ్మి లేదా అనుభవానికి అప్పగించి సొమ్ము చేసుకొని లోటు పూడ్చుకొనేందుకు లేదా అప్పులు తీర్చేందుకు పూనుకున్నారు. ఇవన్నీ అయిపోయిన తరువాత జనం మీద మరిన్ని భారాలు మోపటమే తరువాయి. నిరుపయోగంగా పడి ఉన్న ఆస్తులను ధనార్జన అని నిర్మలమ్మ నమ్మబలుకుతున్నా అసలు విషయం వేరే. 2021 ఫిబ్రవరి 24 మన ప్రధాని నరేంద్రమోడీ జాతికి ఒక సందేశం ఇచ్చారు. మోనిటైజ్‌ అండ్‌ మోడర్నయిజ్‌ (ధనార్జన మరియు నవీకరణ) అనే ఇతివృత్తంతో బడ్జెట్‌ను రూపొందించామని, ప్రభుత్వం ఉన్నది పాలన చేయటానికి తప్ప వాణిజ్యం చేయటానికి కాదు అన్నారు.కేంద్ర ప్రభుత్వశాఖ ” దీపం ”(డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌) ఏర్పాటు చేసిన ఒకవెబ్‌నార్‌లో మోడీ మాట్లాడారు. ప్రయివేటీకరణ మరియు ధనార్జన(మోనిటైజేషన్‌) ద్వారా వచ్చిన సొమ్మును ప్రజలకు వినియోగిస్తామన్నారు. అంటే వీలైన వాటిని తెగనమ్మేస్తారు, కాని వాటిని మోనిటైజేషన్‌ పేరుతో ప్రయివేటు వారి అనుభవానికి సమర్పిస్తారు. చిత్రం ఏమిటంటే బ్రిటన్‌ కంపెనీ అయిన వోడా ఐడియా కంపెనీ చేతులెత్తేసి మా వాటాలను అప్పగిస్తాం మమ్మల్ని ఊబి నుంచి బయటపడేయండి అని వేడుకోళ్లకు దిగింది. దాన్ని కొనుగోలు చేసేందుకు జియో ఇతరులు పోటీ పడుతున్నాయి. ఇంకా అనేక కంపెనీలు అదే స్ధితిలో ఉన్నాయి. ఇదే సమయంలో ఆస్తులతో ఆర్జన మాచేత కావటం లేదు వీటిని తీసుకొని మాకు నాలుగు రూకలిచ్చేవారు ఎవరైనా ఉన్నారా అంటూ మోడీ సర్కార్‌ వీధుల్లో నిలబడింది. ఏడు సంవత్సరాల క్రితం మీరు మాదేశానికి రండి, వస్తువులను తయారు చేయండి, ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోండి అని విదేశీ కార్పొరేట్‌లు, వాణిజ్య సంస్ధలకు విజ్ఞప్తి చేసిన నరేంద్రమోడీ ఇప్పుడు అవే సంస్ధలకు మా ఆస్తులను తీసుకోండి, నిర్వహించండి, మాకు కొంత సొమ్ము ముట్ట చెప్పండి అని వేడుకుంటున్నారు. ఎంతలో ఎంత మార్పు !


బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి కేంద్ర ప్రభుత్వ ధనార్జన గొట్టపు మార్గం గురించి చేసిన వ్యాఖ్యతో దీన్ని ముగిద్దాం.” ఆర్ధిక వ్యవస్ధ అధోగతి పాలైనపుడు ప్రజల ఆస్తులను అమ్మటం మానసిక దివాలా మరియు నిరాశకు ఒక సూచిక. ఇది ఆరోగ్యకరమైన సైద్దాంతిక విధాయకత కాజాలదు.2016 నుంచి జిడిపి వృద్ది రేటు ఏడాది తరువాత ఏడాది, త్రైమాసికం తరువాత త్రైమాసికం దిగజారుతున్నదని సిఎస్‌ఓ సమాచారం వెల్లడిస్తున్న అంశాన్ని మోడీ ప్రభుత్వం తిరస్కరించజాలదు.”
ఈ వ్యాసానికి మొదటి భాగ లింక్‌

బిడ్డా రాహుల్‌ గతంలో నోరెత్తలేదేం – నిలదీసిన నిర్మలక్క, స్మృతక్క

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిడ్డా రాహుల్‌ గతంలో నోరెత్తలేదేం – నిలదీసిన నిర్మలక్క, స్మృతక్క

27 Friday Aug 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ 1 Comment

Tags

BJP, Narendramodi, National Monetisation Pipeline, Nirmala Sitharaman, Niti Aayog, NMP, Rahul gandhi, Smriti Irani

!
ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వ ఆస్తుల ద్వారా 2025 నాటికి ఆరులక్షల కోట్ల రూపాయల ధన ఆర్జనకు నిర్ణయించినట్లు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆగస్టు 23వ తేదీన ప్రకటించారు. దీనికి నేషనల్‌ మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌-ఎన్‌ఎంపి( జాతీయ ధనార్జన గొట్టపు మార్గం ) అని నామకరణం చేశారు. గొట్టపు బావుల ద్వారా నీటిని తోడినట్లు ప్రభుత్వ ఆస్తులతో ధనాన్ని సంపాదిస్తామన్నది అర్ధం. సమర్ధించేవారు ముందుకు తెస్తున్న వాదనలు ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రభుత్వం ఒక కుటుంబం అనుకుందాం. మనింట్లో ఉన్న బావిని మన కుటుంబం ఒక్కటే వినియోగిస్తున్నది. నీళ్లు తోడమంటే కుటుంబసభ్యులే విసుక్కుంటున్నారు. ఎక్కువ సేపు నిరుపయోగంగా పడి ఉంటున్నది. దాన్ని ఇతరులకు అద్దెకు ఇచ్చి రోజంతా నీళ్లు తోడిస్తే మనకు కొంత సొమ్ము ముట్టచెబుతారు. నీళ్లు లేనివారికి నీటిని అమ్మి సొమ్ము చేసుకుంటారు. కొంత మందికి పని కల్పిస్తారు, తద్వారా ప్రభుత్వానికి పని కల్పించే, నీళ్లు అందించే ఖర్చు తప్పుతుంది. ఒప్పంద గడువు ముగిసే వరకు బావికి వచ్చే మరమ్మతులు, నిర్వహణకు తీసుకున్నవారే పెట్టుబడి పెడతారు. తిరిగి మన బావిని మనకు అప్పగిస్తారు. వారు ఇచ్చే మొత్తాన్ని వేరే అవసరాలకు వినియోగించి మరిన్ని సంపదలు సమకూర్చుకోవచ్చు.


మరొక ఉదాహరణ. మీకు ఒక ఇల్లు ఉంది. ఉద్యోగ రీత్యా వేరే ఊరు, రాష్ట్రం, దేశం పోతారు. దాన్ని అద్దెకు ఇచ్చుకుంటామా పాడు పెట్టుకుంటామా ? అలాగే ఖాళీ స్ధలం ఉంది, ఎవరికైనా అద్దె లేదా కౌలుకు ఇచ్చుకుంటే నాలుగు రూపాయలు వస్తాయా రావా? అలా చేస్తామా, చెట్లుచేమలను మొలిపిస్తామా, పాములు, పుట్టలను పెరగనిస్తామా ? ప్రభుత్వ ఆస్తులను అమ్మటం లేదు, పధకాలకు అవసరమైన డబ్బుకోసం వినియోగానికి మాత్రమే ప్రయివేటు వారికి ఇస్తున్నారు.యాజమాన్య హక్కు ప్రభుత్వానిదే, ప్రయివేటు వారు అభివృద్ధి చేసి గడువు తీరిన తరువాత తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తారు. దీని మీద రచ్చ చేయటం ఏమిటి ? ఇది తీరు ! దీనిలో వాస్తవం లేదా ? కాదని ఎలా అంటాం, ఎంత మంచి ఆలోచన !


దేశవ్యాపితంగా దీని గురించి చర్చ జరుగుతోంది. నరేంద్రమోడీ డీమానిటైజేషన్‌ షాకు తిన్న జనానికి ఇప్పుడు నిర్మలమ్మ మానిటైజేషన్‌ ఆశచూపుతున్నారు. సామాన్యులు ఎంతవరకు పట్టించుకున్నారో తెలియదు. ఆ పదానికి అసలైన అర్ధం ఏమిటి అని కొందరు పండిత చర్చ చేస్తున్నారు. నిఘంటు అర్ధం గురించి తీరికగా తెలుసుకుందాం. ప్రధాని గారూ డీమానిటైజేషన్‌ ఎందుకు అంటే ఉపయోగంలో లేకుండా ఎక్కడెక్కడో మూలుగుతున్న నల్లధనాన్ని వెలికి తీసేందుకు, తద్వారా పెట్టుబడులకు అందుబాటులోకి తెచ్చి అభివృద్ధి కోసం అని చెప్పారు. కమ్యూనిస్టులు, ఇతరులు కొందరు తప్ప అత్యధికులు ఆహౌ ఓహౌ మహత్తర ఆలోచన, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం అని నోట్లు మార్చుకొనేందుకు ఎలా వరుసలు కట్టి నిలుచున్నారో తెలిసిందే. ఇంకేముంది సమాంతర ఆర్ధిక వ్యవస్ధను నడుపుతున్న నల్లధనం నడుం విరిగిపోతుంది అని కొందరు జోశ్యం చెప్పారు. అసలు ఆ ”అవిడియా” నాదే అని చెప్పిన చంద్రబాబు గురించీ తెలిసిందే. ఆచర్యతో ఎంతో నష్టం తప్ప నల్లధనం వెలికి వచ్చిందీ లేదు,వృద్ది ఇంకా దిగజారింది తప్ప దేశానికి వీసమెత్తు ఉపయోగం లేదు. (ఇప్పుడు వీసం పదం వినియోగంలో లేదు గనుక సెంటీమీటరు లేదా పావలా ప్రయోజనం లేదు అనుకోవచ్చు) అనేక అంశాలలో తలలు బొప్పి కట్టిన తరువాత మోడీగారు ధనార్జన పధకాన్ని ప్రకటించటానికి నిర్మలమ్మగారికి అప్పగించారు. ఆచరణలో డబ్బు ఆర్జన జరుగుతుందని చెబుతున్నారు గనుక అలాగే పిలుద్దాం. ప్రభుత్వ అంటే ప్రజల ఆస్తులను కొంత మంది పెద్దలు కాజేయటం ఇప్పటికే ప్రారంభమైంది. ఇంకా మిగిలి ఉన్న ఏ ఆస్తిని ఎలా చేజిక్కించుకోవాలా అని చాలా కాలం నుంచే తన్నుకుపోయేందుకు రాబందుల్లా ఆకాశంలో కార్పొరేట్‌ శక్తులు తిరుగుతున్నాయి.గోతికాడ నక్కల్లా భూమ్మీద కాచుకు కూర్చున్నాయి.భూమి ప్రమేయం ఉన్న ఆస్తులను తెగనమ్మటానికి ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం కేంద్రానికి అధికారం లేదు. ఎవరికైనా వినియోగహక్కు మాత్రమే ఉంటుంది. అందువలన దాన్ని వేరే రూపంలో కట్టబెట్టేందుకు ఎంచుకున్న సరికొత్త మార్గం ఇది అన్నది స్పష్టం.అంతే కాదు తమ మాదిరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి ధనార్జనకు పూనుకుంటే ప్రోత్సాహక నగదు బహుమతి ఇస్తామని కూడా ప్రకటించారు.


బిజెపివారు, కేంద్ర ప్రభువులు, భుజం మార్చుకోకుండా వారిని మోస్తున్నవారు చెబుతున్నట్లుగా నిరుపయోగంగా ఉన్నవాటిని ఎవరైనా వృద్ది చేస్తామంటే ఎవరు అభ్యంతర పెడతారు. సామాన్య జనానికి ప్రయోజనం లేక కేవలం పెద్దల విలాసాలకు మాత్రమే ఉపయోగపడే, ఖజానాకు భారంగా మారిన హౌటళ్లను పశ్చిమబెంగాల్‌లో జ్యోతిబసు ప్రభుత్వం వదిలించుకుంది. చైనా తరువాత ప్రపంచంలో పెద్ద దేశమైన మనం ఒలింపిక్స్‌లో స్వర్ణం కోసం ఎంత తపించామో, ఏ స్ధితిలో ఉన్నామో తెలిసిందే. వినియోగంలో లేని స్టేడియాలను అభివృద్ధి చేసి క్రీడాకారులను ప్రోత్సహించితే ఎవరు వద్దన్నారు. ఆపని చేయకుండా వాటిని కార్పొరేట్లకు అప్పగించితే వాణిజ్య ప్రయోజనాలు తప్ప క్రీడలకు ప్రోత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది ? ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రణాళికలు లేకుండా ఏ దేశంలో అయినా క్రీడాకారులు అభివృద్ది చెందిన దాఖలా ఉందా ? లేదూ వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు అటువంటి లక్ష్యం ఉంటే ఏ సంస్ధ ఇప్పటి వరకు ఎంత మందిని తయారు చేసి ఎన్ని పతకాలు సాధించిందో చెప్పమనండి. నరేంద్రమోడీ గారు టీ అమ్మాను అని చెబుతున్న రైల్వే స్టేషన్ల వంటివి చాలా ఉన్నాయి. దేశభక్తులైన కార్పొరేట్‌ సంస్ధలు, వ్యాపారులు అలాంటి వాటిని అభివృద్ధి చేయమనండి ఇబ్బంది లేదు. కానీ విజయవాడ, సికిందరాబాద్‌ రైల్వే స్టేషన్లు నిరుపయోగంగా ఉన్నాయని బుర్రలో గుంజున్నవారు ఎవరైనా చెబుతారా ? తిరిగే వాహనాలు లేక జాతీయ రహదారులుపాడుపడి పోయాయని తలలో మెదడు ఉన్నవారు అనగలరా ? విశాఖ, కాకినాడ వంటి రేవులకు ఓడలు రాక బోసిపోతున్నాయని రుజువు చూపగలరా ? అందువలన నిరుపయోగంగా ఉన్నవాటిని ప్రయివేటు వారికి ఇచ్చి డబ్బు సంపాదిస్తామని బిజెపి వారు చెబుతున్నదానిలో వాస్తవం ఎంత ? అందుకే ప్రయివేటీకరణకు మారు పేరే మానిటైజేషన్‌ అంటున్నవారిని తప్పుపడితే ఎలా !


దేశం ముందుకు పోవాలంటే,ప్రపంచ స్ధాయి సౌకర్యాలను సామాన్యులకు అందుబాటులోకి తేవాలంటే మోనిటైజేషన్‌ ఒక్కటే ఏకైక మార్గం అని నీతి అయోగ్‌ సిఇఓ అమితాబ్‌ కాంత్‌ ఇండియా టుడే ఇంటర్వ్యూలో చెప్పారు. పూర్వం బ్రతుకు తెరువు కోసం గ్రామాల్లో బుర్రకథలు, హరికథలు చెప్పేవారు గ్రామీణులను ఉబ్బించి సొమ్ము చేసుకొనేందుకు అసలు మీ ఊరి గురించి మీకేమి తెలుసు చుట్టుపట్ల అరవై ఆరు ఊళ్లకు పోతుగడ్డ అనగానే నిజమే కదా అనుకొని పండిన ధాన్యం, పప్పు ధాన్యం వంటివి పెద్ద మొత్తంలో ఇచ్చి సత్కరించే వారు. ఇప్పుడు పాలకులు-అధికారులు ఎవరున్నా ప్రపంచ స్దాయి సౌకర్యాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకే చేస్తున్నవన్నీ అని చెప్పటం పోతుగడ్డలను గుర్తుకు తెస్తోంది.
ప్రపంచ స్ధాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటూ పంచ రంగుల చిత్రాన్ని చూపుతున్నారు. పేదలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చామని చెప్పినపుడు జరిగిన చర్చ ఏమిటి గ్యాస్‌ స్టౌవ్‌లు ఇస్తే చాలదు వాటి మీద వండుకొనేందుకు సరకులు, అవికొనుగోలు చేసేందుకు అవసరమైన ఆదాయానికి ఉపాధి సంగతి ఏమిటన్నదే కదా ! కరోనా సమయంలో ఆత్మనిర్భర పధకంలో చెప్పింది ఏమిటి ? కార్పొరేట్‌ ఆసుపత్రులను నెలకొల్పేందుకు తోడ్పాటు అందిస్తామనే కదా ? కార్పొరేట్‌లు గిరిజన ప్రాంతాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఆసుపత్రులు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? వినియోగించే జనం ఆర్ధిక స్ధాయి, చెల్లించేశక్తిని బట్టి క్రమంగా సౌకర్యాలను పెంచాలి తప్ప ప్రపంచస్ధాయి పేరుతో ధనికులకు మాత్రమే ఉపయోగపడే, కార్పొరేట్లకు లాభాలు తెచ్చే వాటిని అమలు జరిపితే అసమానతలు మరింతగా పెరుగుతాయి తప్ప అభివృద్ధి ఫలాలు అందరికీ అందవు. రోడ్ల నిర్మాణానికి పెట్రోలు, డీజిలు కొనుగోలు చేసేవారందరూ సెస్‌ పేరుతో పన్ను కడుతున్నారు. వాటితో వేశామని చెబుతున్న రోడ్లను ఉపయోగించినందుకు తిరిగి వారే టోలు టాక్సు కడుతున్నారు. జాతీయ రోడ్ల అభివృద్ది సంస్ద రోడ్లు వేయగలిగినపుడు వాటిని నిర్వహించలేదా ? అంత అసమర్ధంగా ప్రభుత్వం – అధికార యంత్రాంగం ఉందా ? గత కాంగ్రెస్‌కు బిజెపికి ఇంక తేడా ఏముంది ?


ధనార్జన గొట్టపు మార్గ పధకాన్ని ప్రకటించింది నిర్మలా సీతారామన్‌ అయినప్పటికీ ఇది నరేంద్రమోడీ గారి కలకు రూపకల్పన అని ఆమే చెప్పారు. గతంలో ప్రణాళికా సంఘం ద్వారా ఆస్తుల కల్పన జరిగింది. దాని స్ధానంలో మోడీగారు తెచ్చిన నీతి అయోగ్‌ వాటిని కొంత మందికి కారుచౌకగా కట్టబెట్టే పనిలో ఉంది. ఆ సంస్ధ నివేదిక విడుదల-జాతీయ ధనార్జన గొట్టపు మార్గం ప్రారంభం సందర్భంగా ఆర్ధిక మంత్రి ప్రభుత్వ లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు.వర్తమాన సంవత్సర బడ్జెట్‌లోనే ప్రభుత్వం దీని గురించి చెప్పిది. ఇదేమీ కొత్త కాదు, వినూత్న పధకమూ కాదు. ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య మెల్లగా అయినా రోజు రోజుకూ పెరుగుతోంది. ఇక్కడ జర్మన్‌ నాజీ నరహంతకుడు హిట్లర్‌ పాలన గురించి తొలుత భ్రమపడి చివరకు జైల్లో పడిన తరువాత కనువిప్పు కలిగిన ఒక మతాధికారి జైల్లోనే రాసిన ప్రఖ్యాత కవితను ఇక్కడ గుర్తుకు తేవటం సమయోచితంగా ఉంటుంది. మొదటి లైను జర్మను కవిత, రెండవది దానికి సామ్యం.
” వారు తొలుత కమ్యూనిస్టుల కోసం వచ్చారు నేను కమ్యూనిస్టును కాదు గనుక మౌనంగా ఉన్నాను-
తొలుత నష్టాలు తెచ్చే కంపెనీలను వదిలించుకుందాం అని చెప్పారు కనుక నిజమే పోతే పోనీ అనుకున్నా
వారు తరువాత కార్మిక నేతల కోసం వచ్చారు -నేను కార్మికుడిని కాదు కనుక మాట్లాడలేదు-
ప్రయోజనం లేని కంపెనీలు కొనసాగటం అనవసరం అమ్మేద్దాం, మూసేద్దాం అంటే కామోసు అనుకున్నాను
వారు తరువాత యూదుల కోసం వచ్చారు – నేను యూదును కాదు గనుక ప్రశ్నించలేదు-
కొన్ని కంపెనీల్లో కొన్ని వాటాలు అమ్ముతాం అన్నారు, కొన్నే కదా ఇబ్బందేముంది అనుకున్నా
వారు చివరికి నాకోసం వచ్చారు – తీరా చూస్తే నాగురించి ప్రశ్నించేవారు మిగల్లేదు –
చివరిగా లాభనష్టాలతోనిమిత్తం లేకుండా నేను పనిచేస్తున్న కంపెనీ ప్రయివేటుకు ఇస్తా మంటున్నారు, నాకు మద్దతుగా మాట్లాడేవారు లేకుండా పోయారు ”
అన్నట్లుగా అనేక మంది ఇప్పుడు ముప్పు ముంచుకు వస్తున్నందున వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. వారి సంఖ్య పెరిగే లోపు, ప్రతిఘటనకు సిద్దపడేలోగా లాభాలు, సంపదలను సృష్టించే కంపెనీలను కూడా వదిలించుకొనేందుకు విధానపరంగా పూనుకున్నారు. అందువలన ఇక దాచేదేముంది చెప్పేదేదో గట్టిగా చెబితే అటో ఇటో తేలిపోతుందని, ఇంక ఎంత వ్యతిరేకించినా జరిగేది జరగక మానదని జనం నిరుత్సాహంతో నీరుగారి పోవాలనే ఎత్తుగడతో ఆర్భాటంగా నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. తాము ఎంత కఠినంగా ఉండేది దేశానికి చూపేందుకు రైతులు ఢిల్లీకి రాకుండా రోడ్ల మీద మేకులు కొట్టి, ఎంతకాలం రోడ్ల మీద ఉంటారో ఉండండి అని భీష్మించుకున్న తీరును చూస్తున్నాము. దీనికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. కరోనా కారణంగా ఆర్ధిక వ్యవస్ధ దెబ్బతిన్నది కనుక దానికి నిధులు అవసరమని ఒక సాకుగా చూపవచ్చు. కొంత మందిని అయినా నమ్మించి వ్యతిరేకతను తగ్గించవచ్చు.


ఇప్పటికే ఉన్న ఆస్తుల ద్వారా స్ధిరమైన ఆదాయాన్ని పొందుతామని చెబుతున్నారు. జాతీయ మౌలిక సదుపాయాల గొట్టం(నేషనల్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ పైప్‌లైన్‌-నిప్‌) కోసం 43లక్షల కోట్ల రూపాయలతో రూపొందించిన పధకానికి ధన ఆర్జన గొట్టం ద్వారా ఆరు లక్షల కోట్ల రూపాయలు సమకూర్చాలని ప్రతిపాదించారు. మరికొన్ని లెక్కల ప్రకారం వీటితో సహా మొత్తం 111 లక్షల కోట్లతో అభివృద్ది అని చెబుతున్నారు. 2022-25 ఆర్ధిక సంవత్సరాల మధ్య రోడ్లను ప్రయివేటు వారికి అప్పగించటం ద్వారా రు.1,60,200 కోట్లు, రైల్వేల ద్వారా రు.1,52,496 కోట్లు, పవర్‌ ట్రాన్సిమిషన్‌ ద్వారా రు.45,200 కోట్లు, విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 39,832 కోట్లు, సహజవాయు పైప్‌లైన్‌ ద్వారా రు.24,462 కోట్లు, టెలికాం టవర్ల ద్వారా రు.35,100, గోదాముల ద్వారా రు.28,900, గనుల నుంచి రు.28,747, ప్రోడక్ట్‌ పైప్‌లైన్‌ ద్వారా రు.22,504, వైమానిక రంగం నుంచి రు.20,782, పట్టణ రియలెస్టేట్‌ నుంచి రు.15,000, రేవుల ద్వారా రు,12,828, స్టేడియంల ద్వారా రు.11,450 కోట్ల రూపాయలను ఆర్జించాలని ప్రతిపాదించారు. వీటిలో నిరర్దక ఆస్తులు లేదా ఆదాయం రాని ఆస్తులు ఏవో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. ఈ మధ్య బ్రౌన్‌ ఫీల్డ్‌ మరియు గ్రీన్‌ ఫీల్డ్‌ ఆస్తులు అనే పదాలు వాడుతున్నారు. ఇప్పుడు ఉనికిలో ఉన్న ఆస్తులు మొదటి తరగతి, కొత్తగా ఏర్పాటు చేసేవి రెండవ తరగతి. రెండవ తరగతిని ప్రయివేటు రంగానికి అప్పగించాలన్నది నిర్ణయం. ఉన్న వాటిని ప్రయివేటీకరించటం లేదా కౌలుకు ఇవ్వటం ద్వారా జనాల నుంచి పిండే మొత్తాల విషయాన్ని కూడా పాలకులు చెబితే నిజాయితీని అర్ధం చేసుకోవచ్చు.


ఆస్తులను ప్రయివేటు వారికి అప్పగించే కేంద్ర ప్రకటన, విధానాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. దాని మీద నిర్మలమ్మ, మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఇతరులకు ఆగ్రహం వచ్చింది. బిడ్డా 2008లో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ అభివృద్దికి ప్రయివేటు వారిని ఆహ్వానించినపుడు ఏం చేసినవ్‌, వాటి పత్రాలను నాడు ఎందుకు చించివేయలేదు ? ఎందుకు నోర్మూసుకున్నవ్‌ అని నిర్మలమ్మ ప్రశ్నించారు. మీ అమ్మ సోనియా గాంధీ అప్పుడు దేశాన్ని అమ్మేందుకు ప్రయత్నించారని స్మృతి ఇరానీ అన్నారు. కాంగ్రెస్‌ పాలనలోని రాష్ట్రాలు కూడా చేస్తున్నది ఇదే, దాని అర్ధం అవి కూడా ప్రయివేటీకరిస్తున్నాయా అని నిలదీశారు. ఒకటి స్పష్టం. గతంలో కాంగ్రెస్‌-ఇప్పుడు బిజెపి రెండూ ప్రజల ఆస్తులను ఏదో ఒక సాకుతో ప్రయివేటు పరం చేస్తున్నారని తేలిపోయింది. అప్పుడు పూర్తిగా చేయలేకపోయారు, ఇప్పుడు తెగించి సంపూర్ణం చేయదలచారు. కాంగ్రెస్‌, ఇతర ప్రాంతీయ పార్టీల పాలిత రాష్ట్రాలు కూడా వీటికి మినహాయింపు కాదు. ఏడు దశాబ్దాల్లో సమకూర్చిన రత్నాలను ఇద్దరు ముగ్గురు స్నేహితులైన వాణిజ్యవేత్తలకు బహుమతిగా కట్టబెడుతున్నారని రాహుల్‌ గాంధీ విమర్శించారు. మొత్తం ప్రయివేటీకరణ, మోనిటైజేషన్‌ గుత్తాధిపతులను సృష్టించేందుకే అని ఇదంతా ఎవరికోసం చేస్తున్నారో ప్రతి ఒక్కరికీ తెలుసు అన్నారు.


సుపరిపాలన అందిస్తామని చెబుతున్న పాలకులు ప్రభుత్వ రంగంలో పని చేసే వారిని దారిలో పెట్టి కమశిక్షణ కలిగిన జాతిగా రూపొందించే కృషిలో పని సంస్కృతిని అభివృద్ధి చేసేందుకు ఎందుకు ప్రయత్నించరు , వారు చెప్పే జాతి నిర్మాణం అంటే ఏమిటి ? ప్రభుత్వ రంగం అంటే అసమర్ధకు మారు పేరు అంటున్న వారు ప్రయివేటు రంగం అసమర్ధత గురించి ఎందుకు చెప్పరు ? నరేంద్రమోడీ ప్రపంచనేత అని చెబుతున్నారు, ధనార్జన ఆయన కలల సాకారం అని కూడా చెప్పారు. అనేక దేశాలను పర్యటించిన అనుభవం కూడా ఉంది. గనుక ఇలాంటి ధనార్జన చేస్తున్న ఇతర దేశాల అనుభవాలను జనానికి ఎందుకు చెప్పరు ? అన్ని దేశాల సంగతి వదిలేద్దాం. చతుష్టయంలో భాగమైన ఆస్ట్రేలియా గురించి అయినా ఎందుకు ప్రస్తావించలేదు ? అక్కడేం జరిగింది ? మరో భాగంలో చూద్దాం !

ఈ వ్యాసానికి రెండవ ముగింపు భాగ లింక్‌
https://vedikaa.com/2021/08/29/national-monetisation-pipeline-part-two-modi-inviting-failed-private-sector-to-take-over-public-assets/

Share this:

  • Tweet
  • More
Like Loading...

తాలిబాన్లు వద్దు – తాలిబానిజం ముద్దు ! మరోసారి ముందుకు వచ్చిన మనువాద చర్చ !!

22 Sunday Aug 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Women

≈ Leave a comment

Tags

Afghanistan Talibans, BJP, Hindu Fundamentalism, Hinduism, Manu Statue, Manusmriti, RSS, saffron talibans


ఎం కోటేశ్వరరావు


అమెరికా వాడు ఆఫ్ఘనిస్తాన్నుంచి పారిపోవటాన్ని ఎవరి కోణంలో వారు చూస్తున్నారు. మిగతా అంశాల గురించి రాబోయే రోజుల్లో ఎలాగూ చర్చించుకుంటాం. మన దేశానికి చేసిన ఒక మంచి గురించి చెప్పకతప్పదు. తమకు ఏది మంచి అయితే దాన్ని చేయటం తప్ప నమ్మిన వారిని పట్టించుకొనే అవసరం మాకు లేదు అని మన దేశంలో వారి మీద మరులు గొన్నవారికి చెంపచెళ్లు మనిపించి మరీ చెప్పాడు. మతశక్తుల మంచి చెడ్డల గురించి చర్చ, విశ్లేషణలు జరిగేందుకు దోహదం చేశాడు. ఇప్పుడు అదే జరుగుతోంది.అనేక మంది తాలిబాన్లు-ఆర్‌ఎస్‌ఎస్‌ పోలికలను ముందుకు తెస్తున్నారు. గతంలో ఏదైనా అడిగితే పాకిస్తాన్‌ వెళ్లండి అని చెప్పే బిజెపి నేతలు ఇప్పుడు బాణీ మార్చి ఆప్ఘనిస్తాన్‌ వెళ్లమని సలహా ఇస్తున్నారు. తమ ప్రత్యర్ధులను తాలిబాన్ల మాదిరి తన్నాలని పిలుపులు ఇస్తున్నారు.


మధ్య ప్రదేశ్‌లోని కట్ని జిల్లా బిజెపి అధ్యక్షుడు రామ్‌రతన్‌ పాయల్‌ను ద్రవ్యోల్బణం, పెట్రోలు ధరల గురించి ఒక విలేకరి అడిగితే దురదగొండి ఆకు పూసుకున్నట్లుగా ప్రవర్తించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో పెట్రోలు లీటరు 50రూపాయలైనా కొనేవారు లేరంట అక్కడికి వెళ్లి కొనుక్కోండి అంటూ మండిపడ్డారు. కరోనా మూడవ తరంగం వస్తుందని అందరూ అనుకుంటుంటే పెట్రోలు గురించి మాట్లాడుతున్నావు, కరోనా కనిపించటం లేదా అని ఎదురుదాడికి దిగిన వీడియో తెగ ప్రచారం అయింది. బీహార్‌లోని బిస్‌ఫీ నియోజకవర్గ బిజెపి ఎంఎల్‌ఏ హరిభూషన్‌ ఠాకూర్‌ను ఒక విలేకరి తాలిబాన్లు అధికారానికి వచ్చిన ప్రభావం భారత్‌ మీద ఎలా ఉంటుంది అని అడిగారు. ఆ పాపానికి ఇక్కడ భయపడేవారంతా అక్కడికి పోవచ్చు, పెట్రోలు, డీజిలు ధరలు చౌక అని ఎద్దేవా చేశారు. ఒకసారి అక్కడికి వెళితే ఇక్కడి ప్రత్యేకత తెలుస్తుంది అన్నారు. మతమేదైనా ఆప్ఘన్‌ శరణార్దులను అందరినీ అనుమతించాలన్న జెడియు నేత వ్యాఖ్యను గేలిచేస్తూ అప్పుడు మన దేశం కూడా తాలిబాన్లతో నిండిపోతుందన్నారు. తాలిబాన్లు మన దేశంలో స్వాతంత్య్ర సమర యోధుల వంటి వారు అని ఉత్తర ప్రదేశ్‌లోని సమాజవాది పార్టీ ఎంపీ షఫికుర్‌ రహమాన్‌ వ్యాఖ్యానించినందుకు యుపి బిజెపి ప్రభుత్వం దేశద్రోహ కేసు బనాయించింది. ఇటీవలనే కేంద్ర మంత్రిగా నియమితులైన ప్రతిమా భౌమిక్‌ గారిని సన్మానించేందుకు త్రిపురలోని బెలోనియా పట్టణంలో బిజెపి వారు ఒక సభను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు అడుగుపెడితే తాలిబాన్ల పద్దతుల్లో వారిని తరిమివేయాలని పార్టీ ఎంఎల్‌ఏ అరుణ్‌ చంద్ర భౌమిక్‌ బిజెపి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


తాలిబాన్లను ఎవరూ సమర్ధించటం లేదు. ఆప్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా పారిపోయినందుకు సంతోషం తప్ప మతఛాందసులు వచ్చినందుకు కాదు. అయినా మన దేశంలో తాము తప్ప మిగిలిన వారందరూ తాలిబాన్లకు మద్దతు ఇస్తున్నారన్నట్లుగా బిజెపి నేతలు ప్రచారం చేస్తున్నారు. తాలిబాన్లకు అధికారాన్ని అప్పగించేందుకు ఒప్పందం చేసుకున్నది అమెరికా, దాని సంతకాల కార్యక్రమానికి హాజరై సంతోషాన్ని వెలిబుచ్చింది నరేంద్రమోడీ సర్కార్‌. అమెరికా తప్పుకున్న తరువాత దేశం తాలిబాన్ల వశం అవుతుందన్న కనీస పరిజ్ఞానం మన ప్రభుత్వానికి లేదా ? ఎందుకు సమర్ధించినట్లు ? జనానికి బుర్రల్లేవనుకుంటున్నారా ? తాలిబాన్‌ షరియా చట్టాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న బిజెపి వారు ఇప్పటికే అమల్లో ఉన్న దేశాల్లో మహిళల గురించి ఎప్పుడైనా ఈ మాదిరి గుండెలు బాదుకున్నారా ? ముస్లింలు ఉన్న ప్రతి చోట దేశ రాజ్యాంగాలతో నిమిత్తం లేకుండా మత పెద్దలు అనధికారికంగా ఆ చట్టాలను అమలు జరుపుతున్నారు. ఇక పూర్తిగా లేదా పాక్షికంగా అధికారిక గుర్తింపు ఇచ్చిన దేశాలలో ఆఫ్ఘనిస్తాన్‌, ఇండోనేషియా, పాకిస్తాన్‌, ఈజిప్టు, ఎమెన్‌, ఇరాన్‌, ఇరాక్‌, మలేషియా, మాల్దీవులు, మారుటేనియా, కతార్‌, సౌదీ అరేబియా,నైజీరియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఉన్నాయి.


ఇక మనుస్మృతి విషయానికి వస్తే ఇస్లాంలో షరియత్‌ను ముస్లింలు అందరూ ఆమోదించారని, ఆ మాదిరి మనుస్మృతిని హిందువులందరూ ఆమోదించాలనే బలవంతం ఏమీ లేదని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఇస్లామిక్‌ రాజ్యాలుగా ప్రకటించుకున్నవి బలవంతంగా అమలు జరపటం తప్ప షరియత్‌ను పాటించటమా లేదా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకొనే స్వేచ్చ ఇస్తే అప్పుడు తెలుస్తుంది. మన దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని, సమాజాన్ని వేల సంవత్సరాల వెనక్కు తీసుకుపోవాలని చూస్తున్న మనువాదుల లక్ష్యం నెరవేరితే జరిగితే సంభవించే పరిణామం ఏమిటి ? మరో పాకిస్తాన్‌గా మారిపోతుంది. అవకాశం లేకగానీ లేకుంటే ఈ పాటికి దేశాన్ని ఎప్పుడో మతరాజ్యంగా మార్చి ఉండేవారు. అప్పుడు రాజ్యాంగం స్దానంలో మనుస్మృతిని అమలు చేసేవారు.ఇదేమీ నిరాధార ఆరోపణ కాదు. అనేక మంది ఈ దేశంలో ఇప్పుడు భయపడుతున్నది ఇదే.


ఆర్‌ఎస్‌ఎస్‌ వాణి ఆర్గనైజర్‌ పత్రిక 1949 నవంబరు 30వ తేదీ సంచికలో రాసిందేమిటి ? ” భారత నూతన రాజ్యాంగం గురించి చెప్పాలంటే అత్యంత చెడు ఏమంటే దానిలో భారతీయం లేకపోవటమే.రాజ్యాంగాన్ని రాసిన వారు బ్రిటీష్‌, అమెరికా, కెనడా, స్విస్‌ మరియు ఇతర రాజ్యాంగాలలోని అంశాలను చేర్చారు. పురాతన భారతీయ చట్టాల ఆనవాళ్లు, వ్యవస్ధలు, నామావళి,శబ్ద-శైలీ విన్యాసాలుగానీ లేవు. పురాతన భారత్‌లో జరిగిన అపూర్వమైన రాజ్యాంగ అభివృద్ది ప్రస్తావన గానీ లేదు. పురాతన గ్రీకు, పర్షియా చట్టాల కంటే ఎంతో ముందుగా రాసినవి మను చట్టాలు.మనుస్మృతిలో ఉద్ఘోషించిన చట్టాలు ప్రపంచవ్యాపితంగా ఉద్వేగ పరిచే, ఆరాధించేవి, అనుసరణకు పురికొల్పేవి, కానీ మన రాజ్యాంగ పండితులకు అర్ధం లేనివి.” కాశ్మీరు రాష్ట్రాన్ని , రాజ్యాంగంలోని మౌలిక అంశమైన ఆర్టికల్‌ 370 ఒక్క రోజులో ఎలాంటి చర్చ లేకుండా రద్దు చేసిన పెద్దలు రాబోయే రోజుల్లో మనుస్మృతి, పురాణాలు, వేదాలతో రాజ్యాంగాన్ని నింపివేయరనేే హామీ ఏముంది ?


మనుస్మృతిలో ఏముంది ? రెండున్నరవేల శ్లోకాలు ఉంటే వాటిలో బ్రాహ్మలు, క్షత్రియుల విధులు, కర్తవ్యాలు, పాలన,హక్కులకు సంబంధించి రెండువేలకు పైగా ఉంటే, వైశ్యులు, శూద్రుల బాధ్యతలు, మహిళల కట్టుబాట్లు, పరిమితుల గురించి మిగిలినవి ఉన్నాయి. పాలక – పురోహిత పెత్తనం తప్ప సామాన్యుల హక్కుల గురించి ఉన్నదేమిటో ఎవరైనా చెబితే సంతోషం. అలాంటి దాని ప్రాతిపదికన రాజ్యాంగ రచన అంటే కాషాయ తాలిబానిజం తప్ప మరొకటి ఏముంది? మనువాదం అంత గొప్పది, పురాతనమూ, ఆదర్శమూ అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అంటరానితనం, పిల్లలను కనటానికి, వంట, ఇంటికి మహిళలను ఎందుకు పరిమితం చేసినట్లు ?
మనుస్మృతిలో పరస్పర విరుద్ద అంశాలు కూడా ఉన్నాయి. ఎవరికి వారు తమకు అనుకూలమైన వాటిని తీసుకొని వాదనలను సమర్ధించుకుంటున్నారు. అయితే ఆచరణను గీటురాయిగా తీసుకుంటే వ్యతిరేకమైనవే అమల్లో ఉన్నాయి.ఉదాహరణకు మహిళల హక్కులకు సంబంధించి ఒక దగ్గర స్త్రీ పురుషులెవరూ వివాహాన్ని రద్దు చేసుకోరాదని ఉంది. మరికొన్ని చోట్ల చేసుకోవచ్చని ఉంది. కానీ హిందూకోడ్‌ బిల్లు వచ్చేంత వరకు అలాంటి హక్కులు అమలు జరుపుకున్నవారెంత మంది ? తన కులం గాని వారిని వివాహం చేసుకోవటాన్ని నిషేధించింది. ఇప్పుడు జరుగుతున్న అనేక హత్యలు, కులపంచాయతీలకు ప్రాతిపదిక అదే కదా ! బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, అవసానదశలో మగపిల్లల రక్షణలో ఉండాలని, భర్తను దేవుడిగా పూజించాలని చెప్పారు. మహిళలను ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతలు సంతోషిస్తారని ఒక చోట చెబుతారు. స్వంతంత్ర జీవనం కోరుకోరాదని మరోచోట అదేశిస్తారు. పురుషులను భ్రష్టు పట్టించటం మహిళల సహజలక్షణ మని చెబుతారు.ఇలా స్త్రీని కించపరిచే, ఆంక్షలు విధించే అంశాలు ఎన్నో ఉన్నాయి.


కొన్ని కులాల వారు ” గుట్టలు, చెట్లు, శ్మశానాల దగ్గర, కొండలు, తోపుల్లో ఉండాలి.జన్మసిద్దమైన కార్యకలాపాల జీవనంతో గుర్తు పట్టేవిధంగా ఉండాలి.” ” భరించలేని అంటరాని వారు,కుల భ్రష్ట జనితులు గ్రామాల వెలుపల ఉండాలి, పారవేసిన పాత్రలు, కుక్కలు, గాడిదలను తమ సంపదలుగా పరిగణించాలి. వారు మరణించిన వారి దుస్తులను ధరించాలి, పగిలిపోయిన పాత్రల్లో వారి ఆహారం ఉండాలి, ఆభరణాలు ఇనుముతో చేసినవిగా ఉండాలి, ఎప్పుడూ దూరంగానే తిరుగుతుండాలి. తన విధులు నిర్వర్తిస్తున్న పురుషుడు వారితో సంబంధాన్ని కోరుకోకూడదు, ఒకరి తరువాత ఒకరితో కార్యకలాపాలు నిర్వహించాలి.వారి మాదిరి ఉండేవారితోనే వివాహం చేసుకోవాలి. ఆహారం కోసం వారు ఇతరుల మీద ఆధారపడాలి.వారికి పగిలిపోయిన పాత్రల్లోనే ఆహారం పెట్టాలి. వారు పట్టణాలు,గ్రామాల్లో రాత్రుళ్లు నడవ కూడదు. పగలు తమ పనికోసం వారు తిరగవచ్చు. రాజు జారీ చేసిన ఆజ్ఞల ప్రకారం ప్రత్యేకమైన గుర్తులతో గుర్తుపట్టేవిధంగా వారు ఉండాలి. బంధువులు లేని వారి శవాలను వారు మోయాలి, ఇది తిరుగులేని నిబంధన. రాజాజ్ఞ ప్రకారం మరణశిక్షలను అమలు జరపాలి. మరణశిక్షకు గురైనవారి దుస్తులు, పక్కలు, ఆభరణాలను తమ కోసం తీసుకోవాలి.” ఈ మనుచట్టాలను రాజ్యాంగం రచనలో పరిగణనకు తీసుకోలేదనే వైఖరిని ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా ఆర్గనైజర్‌ మార్చుకున్నదా ? నాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు, ఎవరైనా చెబితే అంగీకరిద్దాం ! అంతేనా ? ” పూజారి పేరు శుభప్రదమైన, సౌకర్యవంతమైన పదంతో ఉండాలి, పాలకుడి పేరు బలాన్ని, రక్షణను సూచించాలి, సాధారణ జనానికి ఆస్తి సంబంధమైనవి, సేవకుడి పేరు సేవను సూచించే, చిరాకు పుట్టించేదిగా ఉండాలి.” ఇవి కూడా మనుధర్మంలో చెప్పినవే సుమా ! సినిమాల్లో అలాంటి ఉదంతాలను ఎవరైనా గుర్తు పట్టవచ్చు.

ముస్లిం మహిళల రక్షణకు ఎవరూ తీసుకురాని చట్టాన్ని తీసుకు వచ్చామని బిజెపి ఊరూ వాడా ప్రచారం చేసుకుంటున్నది. ఎప్పటికెయ్యది అప్పటికా అవసరాలు, అజెండాకు అనుగుణ్యంగా ఎత్తుగడలను మార్చుకోవటాన్ని చూసి ఊసరవెల్లులే సిగ్గుపడతాయి. హిందూ మహిళలకు ఆస్తి , వివాహ, విడాకుల హక్కులు ఇచ్చేందుకు, బహు భార్యాత్వాన్ని నిషేధించేందుకు ఉద్దేశించిన హిందూకోడ్‌ బిల్లు పట్ల అనుసరించిన వైఖరి ఏమిటి ? కేంద్ర మంత్రిగా అంబేద్కర్‌ ప్రతిపాదించిన బిల్లులను వ్యతిరేకిస్తూ 1949 డిసెంబరు 11న ఢిల్లీ రామలీలా మైదానంలో ఆర్‌ఎస్‌ఎస్‌ సభ నిర్వహించింది. హిందూ సమాజం మీద ఆటంబాంబు వంటిది ఈ బిల్లు అని ఒక వక్త సెలవిచ్చారు. అవి పార్లమెంట్‌ ముందుకు వచ్చినపుడు బెంగాల్‌ నుంచి స్వతంత్య్ర అభ్యర్ధిగా ఎన్నికైన హిందూమహాసభ నేత నిర్మల్‌ ఛటర్జీ( సిపిఎం నేత, లోక్‌సభ స్పీకర్‌గా పని చేసిన సోమనాధ్‌ చటర్జీ తండ్రి) వాటిని తీవ్రంగా వ్యతిరేకించారు. సంఘపరివార్‌, హిందూత్వశక్తులే కాదు, కాంగ్రెస్‌లోని మితవాదులు కూడా వాటికి వ్యతిరేకమే. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌ కూడా వారిలో ఒకరు. ఇలాంటి ప్రతిపాదనలను ముందు పార్టీల ఎన్నికల ప్రణాళికల్లో పెట్టి ఓటర్ల ముందు చర్చ తరువాత పార్లమెంట్‌కు తీసుకురావాలన్నారు. ఎందుకని మనుధర్మం వాటికి వ్యతిరేకం గనుక ! చివరికి నెహ్రూ అనేక రాజీలతో చట్టానికి ఆమోదం పొందారు.


మన రాజ్యాంగం ప్రకారం మనువు, మహమ్మద్‌, ఏసుక్రీస్తు మరొక మత బోధనలకు స్ధానం లేదు. అయినప్పటికీ రాజస్తాన్‌ హైకోర్టు ముందు 1989లో రాజస్తాన్‌ జుడీషియల్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ మను పేరుతో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి దానికి వ్యతిరేకంగా అనుకూలంగా నిరనసలు-సమర్ధనలు జరుగుతున్నాయి. అదే ఏడాది ఆ విగ్రహాన్ని తొలగించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఒక పాలనాపరమైన ఉత్తరువు జారీ చేసింది. దాన్ని సవాలు చేస్తూ విశ్వహిందూపరిషత్‌ నేతలు, ఇతరులు ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. దాని మీద ఆదేశాన్ని నిలుపు చేస్తూ హైకోర్టు ఆదేశించింది. ప్రదాన న్యాయమూర్తి ఆధ్వర్యాన ఏర్పడిన డివిజన్‌ బెంచ్‌ వాజ్యవిచారణ చేపట్టింది. గత మూడు దశాబ్దాలుగా ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదు. కొంత మంది దళిత సంఘకార్యకర్తలు ఆ కేసులో ప్రతివాదులుగా చేరారు. చివరి విచారణ 2015లో జరిగింది. బ్రాహ్మణ న్యాయవాదుల నిరసనల కారణంగా కేసు ముందుకు పోలేదు. ప్రతి ఏటా మను విగ్రహాన్ని తొలగించాలని కోరుతూ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా జరిగాయి. కేసు తేలేవరకు విగ్రహం కనపడకుండా ముసుగు కప్పాలని అధికారులు ఆపని చేయకపోతే తామే అందుకు పూనుకుంటామని కార్యకర్తలు హెచ్చరించారు.మనుధర్మం పేరుతో అమలు చేసిన అంశాలు దళితులు, మహిళలను అణచివేశాయని కొందరు చెబుతున్నారు. వాటికీ మను ధర్మానికి సంబంధం లేదు అని మరికొందరు అంటున్నారు. మరోనోటితో మను ధర్మాలు అమలు జరిగాయంటారు. ఏది నిజం ? మరి స్వేచ్చ లేకపోవటానికి, అణచివేత, అంటరానితనం, కులాలవారీ చీలిపోవటానికి కారణాలు ఏమిటి ? మనువాదుల నుంచి సరైన సమాధానం లేదు.వారు చెప్పేవి తర్కానికి నిలిచేవి కాదు. ఇదే సూత్రం షరియ చట్టాలకూ వర్తిస్తుంది.అదీ తర్కానికి నిలవదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ముందు ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్లాల్సింది ఎవరు ? నిర్మలక్క, స్మృతక్క, కంగనక్క, సాధ్వులు, ప్రచారక్‌లా ? ఇతరులా !!

20 Friday Aug 2021

Posted by raomk in BJP, CHINA, Communalism, Congress, CPI(M), Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Afghanistan Talibans, Akhand Bharat, BJP, BJP’s trolling army, China, Donald trump, Narendra Modi, Propaganda War, RSS


ఎం కోటేశ్వరరావు


” అరెస్టు స్వర భాస్కర్‌ ” ఇప్పుడు సామాజిక మాధ్యమంలో నడుస్తున్న మరుగుజ్జుదాడి. ఎందుకటా ! ఆ సినీ నటి తాలిబాన్ల భయానికి – హిందూత్వ భయానికి(టెర్రర్‌) పెద్ద తేడా లేదని తన అభిప్రాయాన్ని సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. ఏకీభావం ఉంటే సరే లేకపోతే విభేదించవచ్చు, అభిప్రాయం చెప్పినంత మాత్రాన్నే ఆమెను అరెస్టు చేయాలనటం ఏ ప్రజాస్వామిక న్యాయం? ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చింది ఎవరు ? ఇంతకీ స్వర భాస్కర్‌ చెప్పిందేమిటి ? ” తాలిబాన్‌ భయంతో దిగ్భ్రాంతికి గురైనట్లు, సర్వనాశనం అయిందని అనుకుంటున్నారు అందరూ, హిందూత్వ భయాన్ని కూడా మనం అంగీకరించకూడదు. తాలిబాన్‌ భయంతో నీరుగారి పోకూడదు, హిందూత్వ భయం మీద అందరం ఆగ్రహించాలి. అణిచివేసిన మరియు అణచివేతకు గురైన వారెవరు అన్న ప్రాతిపదికన మన మానవత్వం మరియు నైతిక విలువలు ఉండకూడదు.” దీన్లో తప్పేముంది. అమెఎవరినీ పేరు పెట్టి కూడా విమర్శ చేయలేదు.


ఆమె మీద ప్రచారదాడికి దిగిన వారు అంటున్నదేమిటి ? తాలిబాన్‌ – హిందుత్వ రెండింటినీ ఒకేగాటన కట్టకూడదు. ఆ మాటే చెప్పండి. అరెస్టు చేయాలనటం ఏమిటి ? ఈ డిమాండ్‌ ఎందుకు వచ్చింది ?మహారాష్ట్రలో బిజెపికి చెందిన ఒక లాయర్‌గారు ఆమె మీద పోలీసులకు ఒక ఫిర్యాదు ఇచ్చారు. మతం పేరుతో జనాల్లో శత్రుత్వాన్ని పెంచుతున్నారు అన్నది ఆరోపణ. అంతవరకే పరిమితం కాలేదు. స్వరభాస్కర్‌ను అరెస్టు చేయాలనే హాషటాగ్‌తో సామాజిక మాధ్యమంలో ప్రచారానికి కూడా దిగారు. దాన్ని అందుకొని మిగతావారు తలా ఒకరాయి వేస్తున్నారు. ఎవరు వారంతా… బిజెపి వారే. స్వర భాస్కర్‌ మీద కాషాయ తాలిబాన్ల దాడి కొత్త కాదు. గతంలో ఇజ్రాయెల్‌ చర్యలను వ్యతిరేకిస్తూ పాలస్తీనియన్ల నిరసనలకు ఆమె మద్దతు ప్రకటిస్తూ ఇజ్రాయెల్‌ను జాతివివక్ష దేశంగా వర్ణించారు. దానికి గాను ఆమెను తూలనాడుతూ దాడి చేశారు. ఇజ్రాయెల్‌ను ఆమె విమర్శిస్తే వారికి ఇబ్బంది ఏమిటి ? పెగాసెస్‌ ఉప్పు తిన్నందున కృతజ్ఞతగా ఇజ్రాయెల్‌ను పొగడండి, పూజించండి. ఎవరిష్టం వారిది. భగవద్గీతను కూడా అంత నిష్టగా, సంఘటిత పద్దతిలో పంచరు. హంతకుడు గాడ్సే నేనెందుకు గాంధీని చంపాను అంటూ కోర్టులో చేసిన వాదనను పుస్తకంగా ప్రచురించి పంచుతుంటే ఎవరైనా అడ్డుకున్నారా? ఏది సరైనదో జనం నిర్ణయించుకుంటారు. ఏ దేశాన్ని ఎలా విమర్శించకూడదో మీరే నిర్ణయిస్తారా ? విమర్శకుల మీద దాడి ఫాసిస్టు లక్షణం తప్ప మరొకటి కాదు. ఇస్లామ్‌కు షరియత్‌ ఎలాగో హిందూ మతం అని చెప్పుకొనే వారికి మనుస్మృతి కూడా అలాంటిదే కదా ! మన రాజ్యాంగంలో మనుస్మృతి ప్రతిబింబించలేదని, దానికి అడ్డుపడింది అంబేద్కరే అనే విమర్శలు చేస్తున్నదెవరు ? మనువాద భావజాలం ఉన్నవారే కదా ! స్వర భాస్కర్‌ వంటి వారు చెబుతున్నది అదే కదా !


ఇప్పుడు తాలిబాన్ల రాకతో ఆఫ్ఘన్‌ మహిళల ఉనికికే ముప్పు ముంచుకు వచ్చిందని సాంప్రదాయ, సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నిజమే, ఉగ్రవాదం అది మత లేదా మరొక ఉగ్రవాదం అయినా ముందు బలయ్యేది మహిళలే. భావజాలం రీత్యా, రాజకీయంగా వ్యతిరేకులైన మహిళానేతలు, కార్యకర్తలు, ప్రముఖులు, కొన్ని పార్టీల వారి పేర్లతో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ వెళతారా అని ఎద్దేవా చేస్తూ ఊరూ పేరూ లేకుండా కొందరు పోస్టులు పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఒక పోస్టులో ఇలా ఉంది.” సంధ్యక్క, దేవక్క, పుణ్యవతక్క, మలాలా,బర్ఖదత్‌, అమీర్‌ ఖాన్‌, జావేద్‌ అక్తర్‌, హమీద్‌ అన్సారీ, నసీరుద్దీన్‌ షా, దీపికా పడుకొనే, తమన్నా బాటిల్‌, మిర్చి దేశారు, రాజ్‌దీప్‌ సర్దేశాయి, దయచేసి ఆప్ఘాన్‌ ఆడపిల్లలను రక్షించండి. తక్షణమే మీ అవసరం వారికి ఉంది. మోడీ పెద్ద ఫాసిస్టు ….. ఆయన చేయలేరు. మీరే వెళ్లండి…. వారిని రక్షించండి. ఒవైసీ దయచేసి వారికి నేతృత్వం వహించండి. కావాలి అంటే దేశంలో పెద్ద యువకుడు కరాటే కుంగ్ఫు లాంటి విలువిద్యల్లో నైపుణ్యుడు రాహుల్‌ గాంధీని, పెళ్లికాని యువకురాలు, రెండు చేతులతో రాళ్లు రప్పలు సోడాలు విసరగల మమతా బేగాన్నీ సహాయకంగా తీసుకు వెళ్లండి. అంతర్జాతీయ న్యాయస్ధానాన్ని ఆశ్రయించండి. ఎలాగూ లాయర్‌ కప్ప చీబల్‌ ఉన్నాడు… మర్చి పోకండి పిల్లిజ్‌ ” అంటూ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌ పరిణామాల మీద సామాజిక మాధ్యమంలో ఊరూ పేరు చెప్పుకొనేందుకు సిగ్గుపడే కొంత మంది పేరు లేకుండా ఒక పధకం ప్రకారం లౌకివాదులు, కమ్యూనిస్టులు, ఇతర పార్టీల వారి మీద చేస్తున్న దాడి ఇది.


వారు వెళతారా లేదా అన్నది తరువాత చూద్దాం. ముందు వెళ్లాల్సిన వారు వెళ్లకుండా ఇతరుల మీద ఎదురుదాడికి దిగారు. కొంతమంది ప్రవచించే అఖండభారత్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ ఉందా లేదా ! అది ఉందని చెబుతూ మడికట్టుకున్నట్లు ప్రచారం చేసుకొనే ప్రచారక్‌లు, సాధ్వులు, సాధువులు, వారికి మద్దతు ఇస్తున్న కాషాయ దళాలు కదా ముందుగా ఆఫ్ఘన్‌ వెళ్లాల్సింది. ఒకనాడు అఖండభారత్‌లో భాగమై, ఇప్పుడు విడిగా ఉంటున్న దేశాలన్నీ( ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌, చైనా-టిబెట్‌, నేపాల్‌, భూటాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, మయన్మార్‌) ఎప్పటికైనా ఒకటి కావాల్సిందే అని చెబుతున్నవారు కదా ముందుగా కదలాల్సింది ! అందులోనూ నిన్నటి వరకు ఉగ్రవాదుల మీద పోరు సలిపామని చెప్పుకొనే వారు ఇప్పుడు ఇతరులు వెళ్లాలని చెప్పటం ఏమిటి ?తాలిబాన్లు వచ్చారు కనుక మహిళలకు ముప్పు వచ్చిందని ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నవారు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలున్నాయి. వారితో ఒప్పందం చేసుకున్నది అమెరికా ! దాన్ని హర్షించింది నరేంద్రమోడీ సర్కార్‌ ! తాము మారినట్లు తాలిబాన్లు ఇప్పుడు చెబుతున్నారు తప్ప ఒప్పంద సమయంలో స్వయంగా వారు గానీ-అమెరికా వారు గానీ చెప్పలేదు. అయినా దాన్ని దాన్ని మనంఎందుకు హర్షించినట్లు ? (2020 ఫిబ్రవరి 29, హిందూ పత్రిక) ఏమాత్రమైనా బాధ్యత ఉందా ? అమెరికా వాడు ఏది చేస్తే అదే కరెక్టు అనే గుడ్డి అనుసరణ కాదా ? దోహాలో జరిగిన సంతకాల కార్యక్రమానికి కతార్‌ ప్రభుత్వం మనలను ఆహ్వానించగానే మనం ఎందుకు హాజరు కావాలి? రాజుగారు నందంటే నంది పందంటే పంది అనాలన్నట్లుగా ఉగ్రవాదులుగా ప్రకటించిన తాలిబాన్లతో అమెరికా వాడు ఒప్పందం చేసుకోవటం ఏమిటి ? వారి మీద పోరాడుతున్నట్లు చెప్పుకున్న మనం దాన్ని హర్షించటం ఏమిటి ? మనకు ఒక స్వతంత్ర వైఖరి లేదా ? అమెరికాతో పాటు మనమూ తాలిబాన్లు ఉగ్రవాదులు కాదని చెప్పినట్లే కదా ? మరి ఇప్పుడు బిజెపి మద్దతుదార్లు తాలిబాన్ల గురించి గుండెలు బాదుకోవటం నటన తప్ప నిజాయితీ ఉందా ? ఏకత, శీలము ఉన్నవారు చేయాల్సిన పనేనా ?


ఈ ఒప్పందానికి ముందు డోనాల్డ్‌ ట్రంప్‌ – నరేంద్రమోడీ మధ్య భేటీ జరిగింది. ఆ తరువాతే తాలిబాన్‌ ఉగ్రవాదులతో ప్రజాస్వామ్య అమెరికా చేసుకున్న ప్రయివేటు ఒప్పంద సమయంలో మనం సాక్షులుగా దోహా సమావేశంలో పాల్గొన్నాం. ఆ సందర్భంగా మనకు వినిపించిన కహానీలను 2020 ఫిబ్రవరి 29వ తేదీ హిందూస్తాన్‌ టైమ్స్‌ కథనంలో చూడవచ్చు. ఏమిటటా ! పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కోరిన కోరికలు వ్యక్తిగత స్ధాయిలో ఏవగింపు కలిగించినా ఆఫ్ఘనిస్తాన్‌లో తమ లక్ష్యాల సాధనకు అతనితో మాట్లాడాల్సి వచ్చిందని అమెరికా మనకు చెప్పిందట.పాకిస్తాన్‌ తమకు నమ్మదగిన మిత్రుడు కాదని కూడా చెప్పారట. అలా అయితే సరే అని మనం అన్నామట. గత 19 సంవత్సరాలుగా మనం సాధించిన ఆఫ్ఘన్‌ రాజ్యాంగం, మహిళల, మైనారిటీల హక్కులు, ఆఫ్‌ఘన్‌ రక్షణ దళాలను నష్టపోకూడదనే అంశం గమనంలో ఉంచుకోవాలని కూడా అమెరికాకు చెప్పామట. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే బాణాకర్రను (బిక్‌ స్టిక్‌) ప్రయోగించే అవకాశాన్ని అట్టిపెట్టుకుంటామని అమెరికా మనకు చెప్పిందట. అమెరికా-తాలిబాన్ల మధ్య అవగాహనలో పాకిస్తాన్‌ కీలకపాత్రధారి అని ప్రపంచానికి కంతటికీ తెలిసినప్పటికీ మనకు ఇలాంటి లీకు కథలను వినిపించారు.


తీరా జరిగిందేమిటి ? గడువు కంటే ముందే బతుకు జీవుడా అంటూ అమెరికన్లు పారిపోయారు.తమకు సహకరించిన వారి రక్షణకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆప్ఘన్‌ సైన్యం చేతులెత్తేసి లొంగిపోయింది. రాజ్యాంగమూ లేదు పాడూ లేదు. తాలిబాన్లు చెప్పిందే వేదం. మహిళలకు రక్షణ లేకపోయిందని మన పరివార్‌ దళాలే చెబుతున్నాయి. మరి ఇంత జరుగుతుంటే అమెరికా బాణా కర్ర ప్రయోగం ఏమైనట్లు ? మనం ఎందుకు అడగలేకపోతున్నాము. నరేంద్రమోడీ నోరు మెదపటం లేదేం? ఆగస్టుమాసం అంతా భద్రతా మండలి అధ్యక్ష స్ధానం మనదేగా, అక్కడ మానవ హక్కుల రక్షణకు తీసుకున్న చర్యలు, దానికి చొరవ ఏమిటి ? అది చేతగాక మలాలా,సంధ్యక్క, దేవక్క, పుణ్యక్క ఆఫ్ఘనిస్తాన్‌ వెళతారా అని అడుగుతున్నారు. నిజానికి అఖండ భారత్‌లో ఎప్పటికైనా అంతర్భాగం చేస్తామని చెబుతున్న ఆఫ్ఘానిస్తాన్‌కు ముందుగా వెళ్లాల్సింది ఎవరు ? అక్కడి తోటి మహిళలను కాపాడే బాధ్యత నిర్మలక్క, స్మృతక్క, మీనాక్షక్క, కంగనక్క, శాపాలశక్తి గలిగిన సాధ్వీమణులకు లేదా ?


తాలిబాన్ల వెనుక చైనా ఉన్నదని పెద్ద ఎత్తున చెబుతున్నారు, రాస్తున్నారు ? మీడియా వంటవారికి ఈ విషయం ఎప్పుడు తెలిసింది ? అమెరికా వాడు ఒప్పందం చేసుకున్నపుడు, దాన్ని మనం హర్షించినపుడు గానీ ఎవరైనా తాలిబాన్ల వెనుక చైనా ఉంది అని చెప్పిన వారున్నారా ? ఎందుకు చెప్పలేదు ?తోటి ముస్లిం దేశంలో జనాన్ని ఇబ్బందులు పెడుతుంటే ఇతర ముస్లిం దేశాలు, వాటి మిత్ర దేశం చైనా ఎందుకు జోక్యం చేసుకోవు, అక్కడి శరణార్ధులకు ఆశ్రయం ఎందుకు కల్పించవు అంటూ ఒక ప్రచారం. మరికొందరైతే ఇంకొంచెం ముందుకు పోయారు. ఇప్పటి వరకు ముస్లిం దేశాల్లో పరిస్ధితులు బాగోలేనపుడు శరణార్ధులుగా వచ్చిన వారందరినీ పశ్చిమ దేశాల వారే ఆదరించారు. అయితే సదరు ముస్లింలందరూ అక్కడ తమ జనాభాను పెంచి వేసినందున ఇప్పుడు ఆయా దేశాల వారందరూ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ప్రపంచం మొత్తాన్ని ముస్లింలతో నింపటానికి వేసిన ఒక పధకం కనుక ఇతర దేశాల వారెవరూ వారిని అనుమతించటం లేదన్నది మరొక ప్రచారం. ఇలాంటి ప్రచారాలకు ప్రాతిపదికలు, వాస్తవాలతో నిమిత్తం లేదు. మన దేశాన్ని కూడా ముస్లింలతో నింపి వేయటానికి కుటుంబ నియంత్రణ పాటించటం లేదనే ప్రచారం తెలిసిందే.


ఆఫ్ఘనిస్తాన్‌లో 1978లో కొంత మంది అభ్యుదయ వాదులు అక్కడ వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని నాటి సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌ గుర్తించింది. అప్పుడు అక్కడ జనమూ ముస్లింలే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వారూ ముస్లింలే. ఆ ప్రభుత్వానికిి వ్యతిరేకంగా జోక్యం చేసుకున్నది ఎవరు ? అమెరికా, ఇతర పశ్చిమ దేశాల వారే కదా ! తొలుత ముజాహిదీన్లు, తరువాత తాలిబాన్లకు మద్దతు, ఆయుధాలు, శిక్షణ ఇచ్చింది ఎవరు ? ఒసామా బిన్‌ లాడెన్‌ను తయారు చేసింది ఎవరు ? వారు ఏకు మేకైన తరువాత అక్కడికి సైన్యాన్ని పంపి దాడులకు రెండు నుంచి మూడులక్షల కోట్ల డాలర్ల వరకు ఖర్చుచేసి దేశాన్ని సర్వనాశనం చేసింది ఎవరు ? పునర్‌నిర్మాణం చేస్తున్నామని చెప్పింది ఎవరు ? అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు, వారితో స్నేహం చేసిన మన దేశమే కదా ? ప్రపంచంలోని ఇతర ముస్లిం దేశాలేవీ ఏనాడూ జోక్యం చేసుకోలేదు, తమ సైన్యాన్ని పంపలేదు, దాడులకు దిగలేదు. పునర్‌నిర్మాణం చేస్తామని చెప్పలేదు, పెట్టుబడులూ పెట్టలేదు. చేసిందంతా అమెరికా, దాని మిత్రులుగా ఉన్న నాటో దేశాల వారైతే ముస్లిం దేశాలు ఆఫ్ఘన్లకు ఆశ్రయం ఇవ్వరెందుకంటూ అతి తెలివి ప్రదర్శనలెందుకు ? ఇప్పటి వరకు ఎంత మంది అలా శరణు కోరారు ? అంటే ఏది చెప్పినా బుర్ర ఉపయోగించకుండా వినే జనాలుంటారన్న చిన్న చూపా ? మానవత్వం మాయమై మతోన్మాదం పెరిగిపోయిన ప్రతి వారికి ప్రతిదానిలో అదే కనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా మత ప్రాతిపదికన శరణార్ధులను ఆదుకున్న దేశాలు ఉన్నాయా ?


ఈ ప్రచారం చేస్తున్న వారే చైనా గురించి చెబుతున్నదేమిటి ? ఆప్ఘన్‌ సరిహద్దులో ఉన్న చైనా రాష్ట్రమైన గ్జిన్‌గియాంగ్‌లో ముస్లింలను ప్రభుత్వం ఊచకోతకు గురి చేస్తుంటే ముస్లిం దేశాలు చైనాను ఖండించవు, దానితో లావాదేవీలను ఎందుకు నిలిపివేయవు అని ప్రచారం చేశాయి. ఇప్పుడు తాలిబాన్లకు-చైనాకు ముడిపెట్టి ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏమిటి ? అదే తాలిబాన్లు, అమెరికా ఇతర దేశాల మద్దతు ఉన్న ఉఘిర్‌ ముస్లిం తెగకు చెందిన కొందరు చైనాలో ఉగ్రవాద, విచ్చిన్న కార్యకలాపాలకు పాల్పడుతూ ఆప్ఘన్‌ గడ్డ మీద ఆశ్రయం పొందుతున్నారు. అమెరికా వెళ్లిపోయిన తరువాత మరొక దేశానికి వ్యతిరేకంగా తమ గడ్డను ఉపయోగించుకొనే శక్తులకు తాము తావివ్వబోమని తాలిబాన్లు రష్యాతో చెప్పారు. చైనాతో చర్చల సమయంలో ఇక ముందు తాము ఉఘిర్‌ తీవ్రవాదులకు మద్దతు, ఆశ్రయం ఇవ్వబోమని చెప్పారు. అయితే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత గుర్తింపు గురించి నిర్ణయిస్తామని చెనా చెప్పింది. తాలిబాన్లు తాము చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారా, ఉల్లంఘిస్తారా ? అప్పుడు చైనా ఏం చేస్తుంది అన్నది ఊహాజనిత ప్రశ్న. తాలిబాన్లు ఉగ్రవాదులా మరొకటా ఏమిటన్నది ఒక సమస్య. ఆఫ్ఘన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరైనా దానికి గుర్తింపు వేరే అంశం. మన పక్కనే ఉన్న మయన్మార్‌లో మిలిటరీ తిరుగుబాటు చేసి అక్కడి ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసి అధికారాన్ని చేపట్టింది. ఆ కారణంతో ఏ దేశమైనా వారితో దౌత్య సంబంధాలను రద్దు చేసుకుందా ? మిలిటరీ చర్య సరైనదే అని సర్టిఫికెట్లు ఇచ్చాయా ? అంతెందుకు, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ గోద్రా ఉదంతం అనంతర జరిగిన మారణకాండకు కారకుడంటూ అమెరికా సందర్శనకు అక్కడి ప్రభుత్వం వీసా ఇచ్చేందుకు నిరాకరించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు గనుక ఆపని చేయగలిగింది. అదే అమెరికా ప్రభుత్వం ప్రధాని అయిన తరువాత నరేంద్రమోడీపై చేసిన విమర్శను వెనక్కి తీసుకోకుండానే ఎర్రతివాచీ స్వాగతం పలికిందా లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

జాతీయ జండా ఆవిష్కరణ అంశం: సిపిఐ(ఎం) వైఖరిలో మార్పు ఏమిటి ? ఎందుకు ?

17 Tuesday Aug 2021

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, UK, Uncategorized, WAR

≈ 1 Comment

Tags

75 years India Independence, BJP, CPI(M), indian national flag matters, Narendra Modi, RSS


ఎం కోటేశ్వరరావు


ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. అలాంటపుడు ఆర్‌ఎస్‌ఎస్‌ అయినా సిపిఎం అయినా మారకుండా ఎలా ఉంటుంది. తన వైఖరిలో మార్పును ఆర్‌ఎస్‌ఎస్‌ సమర్ధించుకున్నపుడు, సిపిఎం వైఖరిలో మార్పు మీద వ్యాఖ్యాతలకు అంత ఉక్రోషం ఎందుకు ? మార్పు సరైనదిగాక పోతే విమర్శించవచ్చు. అది ఎవరికైనా ఉన్న హక్కు. సంఘపరివార్‌ దాని సోదర సంస్ధలు జమాతే ఇస్లామీ, ముస్లింలీగ్‌, మజ్లిస్‌ వంటివి మతాన్ని ఇంటికి పరిమితం చేసి ఆరోగ్యకర రాజకీయాల్లో పాల్గొంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అలాంటి పార్టీలు సరైన వైఖరి తీసుకోమనే ఎవరైనా చెప్పేది. అదే సూత్రంతో కమ్యూనిస్టులకూడా తప్పు చేస్తున్నారని ఎవరికైనా అనిపిస్తే వారికీ అలాంటి సలహా ఇవ్వవచ్చు. ఏ సంస్ధలు, పార్టీలు ఏం మార్చుకుంటాయి, ఏం మార్చుకోవు అన్నదాని మీద నిరంతరం చర్చ, విమర్శలు చేసేందుకు ఎవరికైనా హక్కుంది.” జాతీయ జెండా ఆవిష్కరణ అంశం : గురువు గోల్వాల్కర్‌నే పక్కన పెట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఊసరవెల్లి ” అనే శీర్షికతో ఆ సంస్ద తీరుతెన్నుల గురించి చర్చించాము. దిగువ లింకులో దాన్ని చదవవచ్చు. ఇప్పుడు సిపిఎం వైఖరిలో వచ్చిన మార్పు, కారణాల గురించి చూద్దాం.


స్వాతంత్య్ర పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర, ఆధునిక భారత నిర్మాణానికి చేసిన కృషి, భారత్‌ అన్న భావనను పటిష్టపరచటం, స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్‌ వారితో ఆర్‌ఎస్‌ఎస్‌ కుమ్మక్కు, వర్తమానంలో రాజ్యాంగ లౌకిక ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచటాన్ని 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివరించాలని, వివిధ కార్యక్రమాల్లో భాగంగా కార్యాలయాల ముందు జాతీయ జెండాలను ఆవిష్కరించాలని నిర్ణయించినట్లు ఆగస్టు తొమ్మిదిన సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.


స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరపటం, జాతీయ జెండాను ఎగురవేయటమే దేశభక్తికి నిదర్శనం అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అధికారిక సంస్దలు స్వాతంత్య్రదినం, రిపబ్లిక్‌ దినోత్సవం, గాంధీ జయంతి రోజులలో విధిగా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలనే నిబంధనలు ఉన్నాయి తప్ప ప్రయివేటు సంస్ధలు, పార్టీలు విధిగా జరపాలని, జాతీయ జెండాలను ఎగురవేయాలనే అంశం రాజ్యాంగంలో లేదు. ఇప్పుడు కొత్తగా మారిందేమీ లేదు. స్వాతంత్య్రదినోత్సవం జరుపుకోవటమా లేదా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు, బలవంతం ఏమీ లేదు. జాతీయ జెండాను ఎగురవేసేందుకు జండా నిబంధనలు అడ్డుగా ఉన్నాయని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పింది కనుకనే అది అవాస్తవం చెబుతోందని,పైన చెప్పిన మూడు రోజుల్లో ఎవరైనా ఆపని చేయవచ్చని ప్రభుత్వ నిబంధనలను పేర్కొనాల్సి వచ్చింది. కానీ ఎన్నడూ కమ్యూనిస్టులు అలాంటి నిబంధనల కుంటి సాకులు చెప్పలేదు. సిపిఎం నిర్ణయాన్ని కొందరు 75 సంవత్సరాల్లో తొలిసారి అని శీర్షికలు పెట్టి మరీ వ్యాఖ్యలు చేశారు. సిపిఎం ఏర్పడిందే 1964లో అంటే 57 సంవత్సరాల క్రితం ఏర్పడింది. రాయి వేసేవారికి ఈ చిన్న విషయం కూడా తెలియదంటే ఏమనుకోవాలి. ఇది చిన్న విషయం వదిలివేద్దాం.


కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఎం వారు తమ కార్యాలయాల మీద జాతీయ జెండాలను ఎగురవేసి ఉత్సవాలు జరపలేదుగాని ముఖ్యమంత్రులుగా లేదా స్ధానిక సంస్థల అధిపతులుగా ఎన్నికైన సందర్భాలలో రాజ్యాంగవిధిగా దాన్ని పాటించారు, పాటిస్తున్నారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలినప్పటి నుంచీ సిపిఐ జాతీయ జెండాలను ఎగురవేస్తూ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుతున్నది. సిపిఎం నుంచి విడిపోయి సాయుధ పోరాటం పేరుతో రహస్యంగా పని చేస్తున్న కమ్యూనిస్టు గ్రూపుల వారు అసలు స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగాన్నే గుర్తించటం లేదు గనుకు వారు ఎగురవేసే సమస్యే ఉత్పన్నం కాదు. తరువాత పలు ముక్కలై తమదే అసలైన కమ్యూనిస్టు పార్టీ అని ప్రకటించుకున్న వివిధ బృందాలలో కొన్ని రాజ్యాంగం ప్రకారం ఎన్నికల్లో పాల్గొంటున్నా జండా పండగలకు దూరంగా ఉంటున్నాయి.


స్వాతంత్య్రానికి ముందే తెలంగాణాలో నిజాం నవాబుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు సాయుధ పోరాటం ప్రారంభించారు. వచ్చిన తరువాత నిజాం బదులు నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మిలిటరీని పంపి కమ్యూనిస్టులను అణచివేసిన చరిత్ర తెలిసిందే. ఆ నేపధ్యం, దానితో పాటు దేశ రాజ్యాంగం స్వాతంత్య్ర ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణ్యంగా లేదనే వైఖరి కారణంగా సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం కమ్యూనిస్టుల్లో ఉంది. స్వాతంత్య్రం ఒక మేడి పండు అన్నట్లుగా భావించారు. అంతే తప్ప తాము స్వాతంత్య్రాన్ని, జాతీయ పతాకాన్ని గుర్తించటం లేదని ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు, ఎక్కడా చెప్పలేదు.ఆర్‌ఎస్‌ఎస్‌ మాదిరి జండా గురించి రచ్చచేసిన దాఖలాలు అంతకంటే లేవు. సిపిఎం నుంచి విడిపోయిన తరువాత రాజ్యాంగాన్ని గుర్తించని నక్సల్‌ గ్రూపులు చెప్పిన అంశాలకు, భాష్యాలకు సిపిఎంకు సంబంధం ఉండదు. రాజ్యాంగాన్ని గుర్తించి దానికి అనుగుణ్యంగా తొలి సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ పాల్గొన్నది, ప్రతిపక్ష పార్టీగా ఎన్నికయింది. మరి ఇప్పుడు ఎందుకు ఎగురవేయాలని సిపిఎం నిర్ణయించింది అనే ప్రశ్న వస్తుంది.


కమ్యూనిస్టు సిద్దాంతం ఒక దేశానికి పరిమితమైంది కాదు. అందువలన దాన్ని పాటించిన వివిధ కమ్యూనిస్టు పార్టీలు వివిధ సమస్యల పట్ల ఎప్పుడు ఎలాంటి వైఖరులు తీసుకున్నాయో అర్ధం చేసుకుంటే తప్ప వాటిలో వచ్చిన మార్పులు తలకు ఎక్కవు. మార్క్సిజం-లెనినిజం అనే సిద్దాంతాలు గీతలో కృష్ణుడు ఇలా చెప్పాడు, వేదాల్లో, ఉపనిషత్తులో, మనుస్మృతి, ఫలానా పురాణం లేదా బైబిల్‌, ఖురాన్‌లలో ఫలాన చోట ఫలానా విధంగా చెప్పబడింది, అవి అంతే అన్నట్లుగా కమ్యూనిస్టు సిద్దాంతం పిడివాదం కాదు. అది ఒక పురోగామి శాస్త్రం. అనేక మార్పులకు లోనైంది. ఇప్పుడు జరుగుతున్నాయి, రాబోయే రోజుల్లో కూడా మార్పులు జరుగుతాయి. అదే విధంగా కమ్యూనిస్టు పార్టీలు కూడా మూసపోసినట్లుగా పిడుక్కీ బియ్యానికి ఒకే మంత్రం అన్నట్లుగా పని చేయవు.


పొరుగునే ఉన్న చైనా, ఇతర దేశాల కమ్యూనిస్టు పార్టీల చరిత్రను చదివిన వారికి అర్ధం అవుతుంది. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌ను ఓడించేందుకు సోవియట్‌ యూనియన్‌తో బ్రిటన్‌ చేతులు కలిపింది. సోవియట్‌ బలపడాలనే అభిప్రాయంతో భారత కమ్యూనిస్టులు ఆ రోజుల్లో బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఇచ్చిన క్విట్‌ ఇండియా పిలుపుకు దూరంగా ఉన్నారు. తరువాత కాలంలో అలా వ్యవహరించటం తప్పని గుణపాఠం నేర్చుకున్నారు. మరి ఆర్‌ఎస్‌ఎస్‌ ఎందుకు క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించినట్లు ? బ్రిటీష్‌ వారికి సహకరిస్తామని ఎందుకు చెప్పినట్లు ? కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి దూరంగా ఉంది తప్ప పాల్గొన్నవారిని తప్పు పట్టలేదు. ఉద్యమాన్ని అణచివేసేందుకు బ్రిటీష్‌ వారికి తోడ్పడలేదు. అలాంటి ఉదాహరణలు ఉంటే ఎవరైనా చూపవచ్చు.


ఇన్ని దశాబ్దాలుగా స్వాతంత్య్ర దినం పాటించని కమ్యూనిస్టులు ఎందుకు వైఖరి మార్చుకున్నారు ? పరిస్ధితులే వారిని అలా మారేందుకు పురికొల్పాయి. చైనాలో కొమింటాంగ్‌ పార్టీ స్వాతంత్య్రం కోసం, యుద్ద ప్రభువులను పక్కన పెట్టేందుకు పోరాడింది, విజయం సాధించి 1911లో రాజరికాన్ని కూలదోసి స్వాతంత్య్రాన్ని సాధించింది. అయితే రాజరిక పాలన అయితే తప్పింది గానీ సామాన్యులు ముఖ్యంగా రైతాంగంపై జరిగే దోపిడీకి అడ్డుకట్టపడలేదు. యుద్ద ప్రభువులు తిరిగి తలెత్తి సవాలుగా మారారు. దాంతో చైనా జాతిపితగా పరిగణించబడిన సన్‌ఏట్‌ సేన్‌ 1921లో ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీని ఆహ్వానించి 1924లో యునైటెడ్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి యుద్ద ప్రభువుల అణచివేతకు పూనుకున్నాడు. అయితే మరుసటి ఏడాదే కాన్సర్‌తో మరణించాడు. కొమింటాంగ్‌ పార్టీ పగ్గాలు చేపట్టిన చాంగ్‌కై షేక్‌ తమతో కలసి పోరాడుతున్న కమ్యూనిస్టులు రోజు రోజుకూ బలం పెంచుకోవటం చూసి వారిని ఊచకోత కోయించాడు. 1927 నాటికి రెండు పార్టీలు వైరిశిబిరాలుగా మారిపోయాయి.1931లో జపాన్‌ సామ్రాజ్యవాదులు చైనాను ఆక్రమించుకోవటం మొదలు పెట్టారు. దాంతో 1936లో తమ కార్యకర్తలను ఊచకోత కోయించిన ఆ చాంగ్‌కై షేక్‌తోనే ఐక్యసంఘటనగా ఏర్పడిన కమ్యూనిస్టులు జపాన్‌ సామ్రాజ్యవాదులను తరిమి వేశారు. తరువాత ఆ చాంగ్‌కై షేక్‌నే తరిమికొట్టి దేశాన్ని విముక్తి చేశారు. అనేక మంది ఈ పరిణామాన్ని అర్ధం చేసుకోలేకపోయారు. మన కార్యకర్తలు, నాయకులను చంపించిన వాడితో చేతులు కలపటం ఏమిటని చర్చ జరిగింది. అక్కడ అందరికీ ఉమ్మడి శత్రువైన జపాన్ను తరిమి వేయాల్సిన కర్తవ్యం కమ్యూనిస్టులను ఐక్య సంఘటనకు పురికొల్పింది.


జయప్రకాష్‌ నారాయణ ప్రారంభించిన ఉద్యమంలో నాటి జనసంఘం, ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక ముఖ్యపాత్రధారి. జయప్రకాష్‌ నారాయణ మతశక్తి కానప్పటికీ జనసంఘం ఉన్న కారణంగా దానిలో పాల్గొనాలా లేదా అన్న అంశం మీద సిపిఎంలో తీవ్ర చర్చలు జరిగాయి. తరువాత 1975లో ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితిని ప్రకటించి జనసంఘం, ఆర్‌ఎస్‌ఎస్‌, సిపిఎం, సోషలిస్టు ఇతర తనను రాజకీయంగా వ్యతిరేకించే పార్టీల వారందరినీ జైలు పాలు చేశారు. ఆ నాడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే అంశం ప్రధానంగా ముందుకు వచ్చింది. ఆ కారణంగానే అత్యవసర పరిస్ధితిని ఎత్తివేసిన తరువాత జనసంఘం, సోషలిస్టులు, స్వతంత్ర పార్టీ, ఇతర పార్టీలన్నీ కలసి జనతా పార్టీగా ఏర్పడ్డాయి. దానిలో జనసంఘం-ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక ముఖ్యపాత్రధారి అని తెలిసినప్పటికీ సిపిఎం తన రాజకీయ కర్తవ్యంలో భాగంగా జనతా పార్టీని బలపరిచింది. జనతా పార్టీతో సీట్ల సర్దుబాటు చేసుకున్న సిపిఎం అభ్యర్ధులకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా జనతా పార్టీలోని జనసంఘం కార్యకర్తలు కూడా మద్దతుగా ప్రచారం చేశారు. ప్రజాస్వామ్యం, పౌరహక్కుల రక్షణ కోసం తన వైఖరిని మార్చుకొనేందుకు నాడు సిపిఎం తన వైఖరిని సవరించుకుంది.


మన స్వాతంత్య్రానికి చైనాలో జరిగిన మాదిరి విదేశాల నుంచి ప్రత్యక్ష ముప్పు లేకపోయినా అంతర్గతంగా బిజెపి పాలకులు అనుసరిస్తున్న విధానాలు ముఖ్యంగా అన్ని వ్యవస్ధలను దిగజార్చటం ప్రజాస్వామ్యం, పౌరహక్కులకే ముప్పు తెచ్చేవిగా ఉన్నాయని కమ్యూనిస్టులు కాని వారు కూడా గత కొద్ది సంవత్సరాలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేకపోవటమే కాదు, బ్రిటీష్‌ వారితో చేతులు కలిపిన వారి వారసులు నేడు ఆ పరిమిత స్వాతంత్య్ర లక్ష్యాలు, ప్రజాస్వామ్యానికే ముప్పు తెచ్చే చర్యలకు పాల్పడుతున్నారని గత కొద్ది సంవత్సరాలుగా సిపిఎం హెచ్చరిస్తున్నది. స్వాతంత్య్ర దినోత్సవం, జాతీయ జెండాలకు దూరంగా ఉంటూ వాటిని కాపాడేందుకు జనం ముందుకు రావాలని పిలుపు ఇస్తే అర్ధం ఉండదు. అందుకే సిపిఎం వైఖరిలో ఈ మార్పు అన్నది స్పష్టం.
సంబంధిత వ్యాసం మొదటి భాగం లింకు దిగువ ఉంది. .

జాతీయ జండా ఆవిష్కరణ అంశం: గురువు గోల్వాల్కర్‌నే పక్కన పెట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఊసరవెల్లి ! https://vedikaa.com/2021/08/16/indian-national-flag-matter-why-rss-disowned-ms-golwalkar-thoughts/

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రం-1 : అమృత ఉత్సవమా ! హాలాహలమా !!

08 Sunday Aug 2021

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, UK, Uncategorized

≈ 1 Comment

Tags

75th anniversary of India's Independence, Azadi Ka Amrit Mahotsav, BJP, India independence @75, Indian national Congress, Mahatama Gandhi, Narendra Modi Failures, Nathuram Godse, RSS


ఎం కోటేశ్వరరావు


” ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం- నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం,
తారీఖులు దస్తావేజులు ఇవి కాదోయి చరిత్ర సారం ” అన్న శ్రీశ్రీని మనం ఇప్పుడు 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుర్తు తెచ్చుకోవటం అవసరం. స్వాతంత్య్రానికి ముందు పుట్టి తరువాత దేశాన్ని చూసిన వారి కలలు కల్లలయ్యాయి. తరువాత పుట్టిన వారు ఈ దేశం మాకేమిచ్చిందన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్ధితి. బిడ్డ పుట్టి పెరిగే క్రమంలో జరిగే పరిణామాల మాదిరే స్వాతంత్య్ర తరువాత దేశంలో కూడా మార్పులు వచ్చాయి. పుట్టిన బిడ్డ ఆరోగ్యంతోనా లేక ఈసురో మంటూ ఎదిగినట్లా అన్నదే అసలు సమస్య. స్వాతంత్య్ర దేశాన్ని కూడా అలాగే చూడాలి.


కాలం గడిచే కొద్దీ మెరుగు పరచాల్సిన ప్రజాస్వామ్య వ్యవస్ధలకు తూట్లు పొడుస్తున్నారు. విపరీత అర్ధాలు చెబుతున్నారు. పోరాడి సాధించుకున్న హక్కులు ఒక్కొక్కటి హరించుకుపోతున్నాయి లేదా కదలా మెదల్లేని బంధనాల్లో ఇరుక్కు పోతున్నాయి. మనకు నిజంగా స్వాతంత్య్రం వచ్చిందా ? స్వాతంత్య్రం అంటే ఇదా, ఇలాంటిది మనకు అవసరమా అనే ప్రశ్నలు అనేక మందిలో ఉన్నాయి. ఇంతకాలం తరువాత ఇలాంటి ఆలోచనలు కలగటం విచార, విషాదకర స్దితి. ప్రస్తుత తీరు తెన్నులు చూస్తుంటే రానున్న రోజుల్లో పరిస్దితి ఇంకా దిగజారుతుందా అన్న ఆందోళన తలెత్తుతోంది. సాగు, నిత్య పర్యవేక్షణ లేకపోతే పంట భూముల్లో కలుపు మొక్కలు పుట్టినట్లు లేదా కబ్జాకు గురైనట్లుగానే అనేక దేశాల్లో ఇలాంటి పరిస్ధితులు తలెత్తినపుడు నియంతలు ముందుకు వచ్చేందుకు అనువుగా ఉంటుంది. ఎవడొస్తే మనకేంలే మన మీద భారాలు, మనకు బాధలు తప్పవు అని జనం నిర్లిప్తతకు లోనవుతారు.


డెబ్బయి అయిదేళ్ల స్వాతంత్య్ర సందర్భాన్ని ఏమని పిలవాలి అన్నది ఒక మీమాంస. వజ్రోత్సవం లేదా ప్లాటినం వాటి నిర్వచనాలకు సరిపోదు. నూటయాభయ్యవ సంవత్సరాన్ని ఆంగ్లంలో సెస్‌కో సెంటెనియల్‌ అన్నారు. దీనికి తెలుగులో తగిన పదం లేదని గూగుల్తల్లి నిఘంటువు సమాధానం చెప్పింది. తెలిసిన వారెవరైనా సూచిస్తే దాన్నే ఉపయోగిద్దాం. డెబ్బయి అయిదు అంటే నూటయాభైలో సగం కనుక సెమీ సెస్‌కో సెంటినియల్‌ అనాలన్నారు. మన ప్రధాని నరేంద్రమోడీ గారు అమృత మహౌత్సవ్‌ అన్నారు. పేరులోనేమున్నది పెన్నిధి. వదిలేద్దాం. దానితో ఎవరికీ పేచీ లేదు.
జూలై ఒకటిన చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలైన సందర్భంగా వారు ఎంత గొప్పగా ఆ ఉత్సవాన్ని జరుపుకున్నారో, కమ్యూనిస్టు ఆశయాలకు ఎలా పునరంకితమయ్యారో యావత్‌ ప్రపంచం చూసింది. మనకంటే రెండు సంవత్సరాలు ఆలశ్యంగా అక్కడ కష్టజీవుల ప్రభుత్వం ఏర్పడింది, 75 ఏండ్ల ఉత్సవాన్ని వారెలా జరుపుకుంటారో తరువాత చూద్దాం. మోడీ గారు ఏడేళ్ల క్రితం అనేక మాటలు చెప్పారు. తరువాత చెప్పిన మాట చెప్పకుండా చేసేది చెప్పకుండా చెప్పింది చెయ్యకుండా అసాధారణ ప్రతిభతో ” నిత్య నూతనత్వంతో ” గడుపుకు వస్తున్నారు. నిజంగా మనం ఇప్పుడు అమృత మహౌత్సవం జరుపుకొనే స్ధితిలో ఉన్నామా హాలాహలం మింగాల్సిన దుస్దితిలో ఉన్నామో తెలియటం లేదు. అచ్చేదిన్‌ (మంచి రోజులు) తెస్తామని వాగ్దానం చేసిన ప్రస్తుత కేంద్ర పాలకులు జనం చేత దేన్ని మింగిస్తారో అర్ధం కావటం లేదు.


ప్రతి ఏడాదీ పంద్రాగస్టు పండగ జరుపుకుంటున్నాం. అదొక తంతులా మారిపోయిందని ఎవరైనా అంటే తప్పు పట్టాల్సిన పని లేదు. అంతకు మించి జరుగుతున్నదేమీ లేనపుడు ఎవరైనా అలాగే అనుకుంటారు మరి. పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు అయ్యవార్లకు చాలు ఐదు వరహాలు అన్నట్లుగా మార్చివేశారు. ఉదయాన్నే దేశభక్తి గీతాలు, పాటలను వినిపించటం, మూడు రంగుల జండా ఎగురవేయటం, ప్రతిజ్ఞలు, పప్పు బెల్లాల స్ధానంలో ఏదో ఒకటి తిని మిగిలిన రోజంతా సెలవుగా గడిపేయటానికి అలవాటు పడ్డాము. స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన సంస్దగా ఉన్న కాంగ్రెస్‌ను రాజకీయ పార్టీగా మార్చి వేశారు. ఆ ఉద్యమం ఏ లక్ష్యాలనైతే ముందుకు తెచ్చిందో వాటిని ఆ పార్టీ 1947 ఆగస్టు 16 నుంచే మరచి పోయింది. దాన్ని నీరుగార్చే, ముప్పు తెచ్చే, జనానికి విశ్వాసం కోల్పోయే చర్యలకు పాల్పడింది. చరిత్ర దాస్తే దాగేది కాదు. విజేతలే చరిత్రను రాస్తారు అన్నది తెలిసిందే. అందువలన అది వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఇప్పుడు జనం కూడా చరిత్రను రాస్తున్నారు. అందువలన దానిలో ఎలాంటి వివక్ష, పక్షపాతం ఉండదు. చరిత్ర నిర్దాక్షిణ్యంగా ఉంటుంది. కాంగ్రెస్‌ వైఫల్యాలను ఉపయోగించుకొనేందుకు స్వాతంత్య్ర ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేకపోవటమే కాదు బ్రిటీష్‌ వారికి సేవచేసుకుంటామని రాతపూర్వకంగా హామీ ఇచ్చిన వారి వారసులతో నిండిన బిజెపి రంగంలోకి దిగింది. బ్రిటీష్‌ పాలన నుంచి దేశ విముక్తి అన్న నినాదాన్ని కాపీ కొట్టి కాంగ్రెస్‌ విముక్త భారత్‌ అనే పేరుతో జనం ముందు మాట్లాడింది. కాంగ్రెస్‌ విధానాలనే వేగంగా అమలు చేస్తూ దేశం మరింత దిగజారే విధంగా ఏలుబడి సాగిస్తోంది.


ఎందుకీ పరిస్ధితి తలెత్తింది ? దీక్షా దినంగా పాటించాల్సిన స్వాతంత్య్ర దినాన్ని సెలవుగా మార్చినపుడే ఆ మహౌద్యమాన్ని జనం మరచి పోవాలన్న అంశం దానిలో ఇమిడి ఉంది. చివరకు అది ఎంతవరకు వచ్చిందంటే స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యాలకు ముప్పు వచ్చిందని చెబుతున్నవారిని ఇప్పుడు జనం అపహాస్యం చేస్తున్నారు. అవి ఉంటేనేం లేకపోతేనే అంటున్నారు. పంద్రాగస్టు పండగకు 75 వారాల ముందే ప్రధాని నరేంద్రమోడీ మార్చి 12న గుజరాత్‌లో అజాదీ కా అమృతమహౌత్సవాన్ని ప్రారంభించారు. 2022 ఆగస్టు 15న నాటికి డెబ్బయిఅయిదు సంవత్సరాలు నిండి 76వ ఏట ప్రవేశిస్తాము. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్రాలు కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాయి. ఇది రాసిన సమయానికి వాటిని ఖరారు చేయలేదు. అమృతమహౌత్సవాన్ని ప్రజాఉద్యమంగా నిర్వహించాలని దాని అమలుకు హౌమ్‌ మంత్రి అమిత్‌ షా నాయకత్వాన ఒక జాతీయ కమిటీ ఉంటుందని చెప్పారు. వారేమి చేస్తారో, అవెలా ఉంటాయో మరో సందర్భంగా చర్చించుకుందాం.


స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నవారు అందరూ ఒకే పార్టీలో లేరు, అనేక పార్టీలలో చేరారు. మెజారిటీ కాంగ్రెస్‌ పార్టీలో చేరినందున తామే దేశాన్ని విముక్తి చేశామని వారు చెప్పుకుంటారు. అలాంటి కాంగ్రెస్‌ దేశానికి శనిలా దాపురించిందని దాన్నుంచి ముక్తి కలిగిస్తామంటూ కాంగ్రెస్‌ ముక్త భారత్‌గా మారుస్తామని బిజెపి ప్రకటించుకుంది. దేశ రాజ్యాంగం ప్రకారం నాలుగు ఉన్నత పదవుల్లో అసలు స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేకపోవటమే కాదు, ముందే చెప్పుకున్నట్లు బ్రిటీష్‌ వారికి లొంగిపోయిన వారి రాజకీయ వారసులు ఇప్పుడు అధిష్టించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి,ప్రధాని,లోక్‌సభ స్పీకర్లుగా సంఘపరివార్‌ రాజకీయ విభాగమైన బిజెపికి చెందిన వారే ఉన్నారు. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాధూరామ్‌ గాడ్సే ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తి, హత్య సమయంలో అతను తమ సంస్ధలో లేడని వారు చెబుతారు గానీ గాడ్సే కుటుంబసభ్యులు సంఘపరివార్‌లోనే ఉన్నట్లు చెప్పారు. అది తేలేది కాదు గనుక ఆ వివాదాన్ని పక్కన పెడదాం. గాంధీని నేనెందుకు చంపాను అంటూ కోర్టులో గాడ్సే చేసిన వాదనలను పుస్తకరూపంలో ప్రచురించి ప్రచారం చేస్తున్నవారు, సామాజిక మాధ్యమంలో అవే వాదనలను చేస్తున్న వారెవరో మనకు తెలుసు, అయితే అదంతా అనధికారికంగానే అనుకోండి. అలాంటి వారికి స్వాతంత్య్రం , దాని లక్ష్యాల మీద , ప్రజాస్వామిక వ్యవస్ధల పట్ల గౌరవం ఉంటుందా ? ఒకవైపు గాంధీకి నివాళులు అర్పిస్తూ మరోవైపు గాడ్సేను ఆరాధించే వారు పెరుగుతున్నారు, వారు ఎంతకైనా తెగిస్తారు. ఇంతకంటే ఆందోళనకరమైన అంశం ఏముంటుంది ?


జనాభాలో సగ భాగం గురించి ఇన్నేండ్లుగా కబుర్లు చెప్పటమే తప్ప ఫ్యూడల్‌ భావజాలం నుంచి ఇంకా బయటపడలేని స్ధితి ఇప్పటికీ కొనసాగుతోంది. అనేక దేశాల చట్ట సభల్లో మహిళలు సగం మంది ఉన్నారు. తాజాగా చిలీ రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికలే అందుకు నిదర్శనం. మన దేశంలో చట్టసభల్లో 33శాతం గురించి ఎప్పటి నుంచో చర్చ. తమకు సంపూర్ణ మెజారిటీ ఉంటే అమలు జరుపుతామని బిజెపి చెప్పింది. ఇప్పుడు పార్లమెంట్‌ ఉభయ సభల్లో వారికి, వారిని బలపరిచే మిత్రపక్షాలతో కలిపి అవసరమైన మెజారిటీ ఉంది. మెజారిటీ రాష్ట్రాలూ వారివే. అయినా దాని గురించి ఎప్పుడైనా ప్రధాని మన్‌కీబాత్‌లో ప్రస్తావన చేశారా అంటే లేదు.


మన దేశం అనేక రంగాలలో అభివృద్ధి చెందింది అని చెబుతుంటాం, నిజమే. కానీ అది జనానికి ఏ మేరకు ఉపయోగపడిందన్నదే గీటురాయి. వేల కోట్ల రూపాయలను పెట్టి రాఫెల్‌ విమానాలను కొనుగోలు చేయటానికి, అవసరం లేకపోయినా కొత్త పార్లమెంట్‌ భవనం కట్టేందుకు నిధుల కొరత లేదు. కరోనా మహమ్మారి పోరు గురించి కబుర్లకూ అంతకంటే కొదవ లేదు. అంతరిక్ష రంగంలో అనేక విజయాలు సాధించి రాకెట్లను ఎగరేశాం గానీ చాలా చౌకగా లభించే ఆక్సిజన్‌ ఇవ్వలేకపోయారు. అనేక మంది కరోనా పీడితులు ఆ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆనందయ్య ఆకుల పసరు ఆక్సిజన్‌ అందిస్తుందంటే, పచ్చడి కరోనాను అరికడుతుందంటే నిజమని జనం నమ్మారు. దీన్ని ఎలా చూడాలి ? కరోనా నిరోధం కోసం లాక్‌డౌన్‌ పెట్టినపుడు రెక్కాడితే తప్ప డొక్కాడని వలస కార్మికులు స్వస్ధలాలకు వెళ్లేందుకు అయ్యే రైలు ఖర్చులను కేంద్రం – రాష్ట్రాలు ఎవరు భరించాలి అని వివాదపడిన అపర మానవతా వాదులను మనం తప్ప మరేదేశమూ చూడలేకపోయింది.

పది లక్షల కోట్ల రూపాయల పారుబాకీలను వేళ్ల మీద లెక్కించదగిన బడాబాబులకు రద్దు చేయటానికి ఉదారంగా నిర్ణయాలు చేసిన పాలకులకు వాక్సిన్లు వేయటానికి చేతులు రాలేదు. తాము స్వయంగా చెప్పిన ఉచితవాక్సిన్లు వేసేందుకు మధ్యలో ఠలాయించి సగం భారం రాష్ట్రాల మీద మోపేందుకు, చివరకు సుప్రీం కోర్టు వాక్సిన్ల పేరుతో కేటాయించిన సొమ్ముకు లెక్కలు చెప్పండని నిలదీస్తే తప్ప లొంగని నేతలు ఇప్పుడున్నారు. కరోనాను ప్రపంచ విపత్తుగా ప్రకటించారు. మనం దేశంలో విపత్తు సహాయ చట్టం ప్రకారం ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇస్తారు. కరోనా జాతీయ విపత్తుగా పరిగణించినపుడు నష్టపరిహారం ఎందుకు ఇవ్వరు. ఎవరి జేబులో డబ్బు ఇస్తున్నారు ? ఎవరు ఎవరికి జవాబుదారులుగా ఉన్నారు, ఎవరు ఎవరిని రక్షిస్తున్నారు ? రెండు విడతలుగా ఇరవై ఆరులక్షల కోట్ల ఆత్మనిర్భర తాయిలాలను అందించిన కేంద్ర పెద్దలు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మూడు వాయిదాల కరువు భత్యం చెల్లింపునకు ఎసరు పెట్టారు. నీవు నేర్పిన విద్యయే అన్నట్లుగా రాష్ట్రాలు కూడా అదే బాటలో పయనిస్తాయా అన్నది చూడాల్సి ఉంది. అనేక దేశాలలో కరోనా సహాయ చర్యలకు గాను ప్రభుత్వాలు కార్పొరేట్ల మీద ప్రత్యేక పన్ను విధించి నిధులు సమకూర్చుకున్నారు. మన దేశంలో అలాంటిదేమీ లేకపోగా ఉద్యోగుల పొట్టగొట్టేందుకు పూనుకున్నారు. నిలిపివేసిన కరవు భత్యాన్ని వాయిదాల రూపంలో లేదా పిఎఫ్‌ ఖాతాలకు జమ చేస్తామన్నా అదొక దారి, ఎగ్గొట్టటం ఏమిటి ?
(రెండవ భాగంలో ముగింపు https://vedikaa.com/2021/08/09/india-independence-75-what-is-happening-part-two/ )

Share this:

  • Tweet
  • More
Like Loading...

ముస్లిం సంతుష్టీకరణ : ఆర్‌ఎస్‌ఎస్‌ టక్కు టమార, గజకర్ణ గోకర్ణ విన్యాసాలు !

01 Sunday Aug 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Hindu Fundamentalism, Hinduthwa, Narendra Modi, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


చరిత్ర అడక్కు చెప్పింది విను ! ఇది ఒక సినిమాలో మాట.పాకిస్తాన్‌ జాతిపితగా పరిగణించే మహమ్మదాలీ జిన్నాను పొగిడినందుకు 2005లో ఎల్‌కె అద్వానీ పార్టీ అధ్యక్ష పదవిని పోగొట్టుకున్నారు. ఆ వ్యాఖ్యలకు ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్ర అభ్యంతరం తెలిపినట్లు వార్తలు వచ్చాయప్పుడు. కేంద్ర మంత్రిగా పని చేసిన జస్వంత సింగ్‌ రాసిన పుస్తకంలో జిన్నా గురించి చేసిన సానుకూల వ్యాఖ్యలకు గాను ఏకంగా పార్టీ నుంచే పంపేశారు. బిజెపి, అంతకు ముందు దాని పూర్వ రూపం జన సంఫ్‌ు చరిత్ర చూసినపుడు వారి పార్టీల గొప్పతనం కంటే తాము తప్ప ఇతర పార్టీలన్నీ ముస్లింలను సంతుష్టీకరించి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయన్న నిరంతర ప్రచారమే ఎక్కువగా ఉండేది. హిందువులు-ముస్లింల డిఎన్‌ఏ ఒకటే అని ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన భగవత్‌ జూలై నాలుగున వ్యాఖ్యానించారు. ఘజియాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కుదురులోని ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ సమావేశంలో ఉపన్యసించారు. దీని గురించి అనేక విమర్శలు, సమర్దనలూ వెలువడ్డాయి.భారత్‌లో ఇస్లాం ప్రమాదంలో పడిందని ఎవరూ భయవలయంలో చిక్కుకోవద్దని, మతం ఏదైనా భారతీయుల డిఎన్‌ఏ ఒకటే అని, అసలు హిందూ-ముస్లిం ఐక్యత అనేదే తప్పుదారి పట్టించే మాట అని భగవత్‌ చెప్పారు. తరువాత జూలై 21న గౌహతిలో ఒక పుస్తక ఆవిష్కరణ సభలో కూడా దాన్ని పునరుద్ఘాటించారు. భిన్నమైన మతాలలో ఉన్నప్పటికీ శతాబ్దాల తరబడి కలసి మెలసి ఉన్నారని, ఆహార అలవాట్లు, సంస్కృతి ఒకటే అని చెప్పారు. ఇంతవరకు అద్వానీ, జస్వంత్‌ ఉదంతాలు పునరావృతం కాలేదు. అయ్యే సూచనలు కూడా లేవు.


భగవత్‌ ప్రసంగం మీద వెల్లడైన, ఇంకా వెల్లడవుతున్న కొన్ని స్పందనల తీరు తెన్నులు చూద్దాం. ముస్లింలకు సన్నిహితం అయ్యేందుకు చేసిన సంతుష్టీకరణ వ్యవహారమిది అన్నది కొందరి అభిప్రాయం. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగా విరమించుకొనేందుకు మోహన్‌ భగవత్‌ తేదీని స్వయంగా ముందుకు జరిపారు అని మరుసటి రోజే మితవాద ప్రతీకగా ఉండే జర్నలిస్టు మధు కిష్వర్‌ ట్వీట్‌ చేశారు. ” హిందూ భావజాలాన్ని ప్రచారం చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్నదేమీ లేదు, వారు గాంధీ కంటే ఎక్కువ గాంధేయులుగా ఉన్నారు. స్వంత జనాలను, భావజాలాన్ని వారు రక్షించటం లేదు, వారు మంచి పిల్లలుగా కనిపించాలని కోరుకుంటున్నారు. వారికి మద్దతు ఇవ్వటానికి మేమేమీ ఆర్‌ఎస్‌ఎస్‌ నేపధ్యం నుంచి వచ్చిన వాళ్లం కాదు, కానీ హిందువులను రక్షించే చిత్తశుద్ది వారిలో లేదని తరువాత కనుగొన్నాం. వారి కంటే కాంగ్రెస్‌ ఎంతో నిజాయితీగా ఉంది.” అన్నారు. సిబిఐ తాత్కాలిక ఉన్నతాధికారిగా పనిచేసిన సంఘపరివార్‌కు చెందిన రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారి ఎం నాగేశ్వరరావు గౌహతిలో భగవతి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. ” కేవలం జిన్నాను పొగిడినందుకే అద్వానీని అవమానకరంగా బిజెపి జాతీయ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఎంఆర్‌ఎం, సర్వధర్మ సంభవ్‌ లేదా సమాదరణ, ఒకే డిఎన్‌ఏ, రోటీ-బేటీ సంపర్క తదితరాల ప్రచారంతో హిందూ సమాజానికి అంత (అద్వానీ) కంటే పదిలక్షల రెట్ల హాని చేశారు.” అని ట్వీట్‌చేశారు.


వక్రీకరణలకు, తప్పుడు వార్తలకు పేరు మోసిన ఒపిఇండియా వెబ్‌ సైట్‌ రాసిన వ్యాసంలో డిఎన్‌ఏ వ్యాఖ్యలు ఆర్‌ఎస్‌ఎస్‌ గాంధియన్‌ బలహీనత (దోషం) అని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంతో గౌరవం పొందిన సంస్ధ. లౌకికవాదం అనే అబద్దం గురించి మేలుకున్న సామాన్య హిందువులను దూరం చేసుకొనే ప్రమాదాన్ని కొని తెచ్చుకొంటోంది అని హెచ్చరించారు. ”ఆర్‌ఎస్‌ఎస్‌ను స్ధాపించిన గురు గోల్వాల్కర్‌ దాన్ని ఒక హిందూ సంస్దగా ఏర్పాటు చేశారు తప్ప ముస్లింల కోసం కాదు. ముస్లింలు, క్రైస్తవులకు ఓటు హక్కు నిరాకరించాలని కూడా గోల్వాల్కర్‌ చెప్పారు. హిందువులు-ముస్లింలకు సంబంధం లేని ఆయన స్పష్టం చేశారు. ముస్లింల మీద ఇవన్నీ కొత్తగా వృద్ది చెందిన ఆలోచనలు ” అని నయా ఇండియా అనే పత్రికలో శంకర షరాన్‌ అనే జర్నలిస్టు పేర్కొన్నారు. ” భగవత్‌ ప్రతి ఒక్కరి సంరక్షకుడు కాదు. ఆయన తన డిఎన్‌ఏ గురించి ఎలా అయినా మాట్లాడవచ్చు. బహుశా ఆయన ఔరంగజేబు డిఎన్‌ఏ పంచుకొని ఉండవచ్చు, అది అందరి విషయంలో వాస్తవం కాదు ” అని ఘజియాబాద్‌లోని దర్శన దేవి దేవాలయ వివాదాస్పద పూజారి యతి నరసింహానంద సరస్వతి వ్యాఖ్యానించారు. ఇక విశ్వహిందూ పరిషత్‌ నేత సాధ్వి ప్రాచీ అయితే ” ఆవు మాంసాన్ని తినేవారెవరినీ ఎన్నడూ మనలో కనుగొనలేము” అన్నారు.


ఆర్‌ఎస్‌ఎస్‌ నేత భగవత్‌ మీద ధ్వజమెత్తిన వారే కాదు, భజన చేసిన వారు కూడా ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి పుస్తకాలు రాసిన రతన్‌ శారద ఆయన ఉపన్యాసంలో కొత్తగా చెప్పిన విషయాలేమీ లేవన్నారు. సుదర్శన్‌ గారు అధిపతిగా ఉన్న 2000-09లో కూడా హిందూాముస్లిం ఐక్యత గురించి చెప్పారు. అందుకోసమే ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ను ఏర్పాటు చేశారు.ఆహార అలవాట్లు, పూజా పద్దతులు వేర్వేరుగా ఉండవచ్చుగానీ ఏకీకరణ మీద అవి పెత్తనం చేయలేవు, మెజారిటీ, మైనారిటీ అనేవి లేవు. ప్రార్ధించే పద్దతిని బట్టి సమాజంలో వర్గీకరణ చేయటమే ముస్లింల సంతుష్టీకరణ, ఓటు బ్యాంకు రాజకీయాలకు కారణం, ఆర్‌ఎస్‌ఎస్‌ దాన్ని వ్యతిరేకిస్తున్నది ” అన్నారు. భగవత్‌ డిఎన్‌ఏ ఉపన్యాసంతో తలెత్తిన ఆగ్రహాన్ని చల్లార్చేందుకు సంఘీయులు ఊహించినట్లుగానే సాము గరిడీలు చేస్తున్నారు. గురూజీ హిందూత్వను వదులుకున్నట్లు ప్రకటించలేదు, దానికే కట్టుబడి ఉన్నారు, ఐక్యతను మాత్రమే కోరుకుంటున్నారు. విశ్వహిందూ పరిషత్‌, ఇతర హిందూ సంస్ధలు చేపట్టిన ఘర్‌వాపసీ కార్యక్రమాన్ని ఆయన ప్రోత్సహించిన అంశాన్ని గుర్తు తెచ్చుకోండి. గోవధ హిందూత్వ వ్యతిరేకం అని కూడా చెప్పారు. సంఫ్‌ు ఇంతకాలంగా చెబుతున్నదానిని-భగవత్‌ ప్రసంగాన్ని విడదీసి చూస్తే కొత్తగా చెప్పినట్లు అనిపించవచ్చు తప్ప కొత్తేమీ లేదు అంటూ మొత్తం మీద సంఫ్‌ు అజెండాలో ఎలాంటి మార్పూ లేదు కనుక ఎవరూ కంగారు పడనవసరం లేదనే భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.భగవత్‌ ప్రసంగాన్ని విమర్శించిన వారిని ఎక్కడా తప్పు పట్టటం లేదు. ఆయన మాట్లాడింది ముస్లింలు పాల్గొన్నసభ, ఐక్యతను కోరుకుంటున్నది, రెండు మతాల మధ్య ఒక చర్చను ప్రారంభించాలనే లక్ష్యంతో మాట్లాడినవిగా గుర్తించాలని ఓదార్పు పలుకుతున్నారు. భారతీయత గురించి మాట్లాడటం అంటే దాని అర్ధం ముస్లింలు, ఇతర మైనారిటీలను తిరిగి మతమార్పిడి చేస్తామని కాదు, వారు ఈ గడ్డను స్వంతంగా చేసుకొని, విధేయులై జీవించాలన్నదే అని ముస్లింలకు హామీ ఇస్తున్నారు.


అయితే ఇప్పుడెందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత డిఎన్‌ఏ, హిందూ ముస్లిం ఐక్యత అంశాన్ని మరోసారి ముందుకు తెచ్చారు. ఊరకరారు మహాత్ములు అన్నట్లుగా ఎలాంటి ఉద్దేశ్యం లేకుండానే అలా మాట్లాడతారా ? ప్రతి పార్టీ తనకంటూ ఒక ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకొనేందుకు ప్రయత్నించటం రాజకీయాల్లో సహజం. బిజెపి పత్తిత్తేం కాదు. మెజారిటీగా ఉన్న హిందూ మత ఓటు బ్యాంకును సృష్టించుకొనేందుకు దాని మాతృ సంస్ధ సంఘపరివార్‌ ఎంచుకున్న మార్గం వారి సంతుష్టీకరణ. హిందువుల ఉనికికే ప్రమాదం ముంచుకు వస్తోందని, కొద్ది కాలంలో ముస్లింలు మెజారిటీగా మారేందుకు ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారని ప్రచార యుద్దం చేస్తున్న విషయం తెలిసిందే. సాధ్వి ప్రాచీ ఎవరు ఎంత మంది భార్యలను అయినా కలిగి ఉండండి, పిల్లలు మాత్రం ఇద్దరి కంటే ఎక్కువగా ఉండకూడదని చెప్పారు. 1990దశకం చివరిలో వాజ్‌పాయి అధికారానికి వచ్చారు. అందువలన భవిష్యత్‌లో 14శాతంగా ఉన్న ముస్లిం ఓట్లను గంపగుత్తగా ప్రతిపక్షాలకు వేయించటం మంచిది కాదు గనుక వారి పట్ల రాగం, తానం, పల్లవి మార్చాలనే ఆలోచన సంఘపరివార్‌లో ప్రారంభమైంది. ఈ సమయంలోనే 2002 మార్చినెలలో జరిగిన గుజరాత్‌ మారణకాండ ముస్లింలలో మరింత భయాన్ని రేకెత్తించటమే కాదు, బిజెపికి పెద్ద మచ్చగా మారింది. అంతకు ముందు వరకు ఇతర పార్టీల మీద తాను పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ముస్లిం సంతుష్టీకరణకు తానూ నాంది పలికింది. అదే ఏడాది డిసెంబరులో ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ కొత్త దుకాణాన్ని తెరిచింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో అంతకు ముందు వచ్చిన ఓట్లు సీట్లను కూడా బిజెపి నిలుపుకోలేకపోయింది. ఎన్నికలకు మూడు నెలల ముందే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన భగవత్‌ అదే ఏడాది డిసెంబరులో తొలిసారిగా డిఎన్‌ఏ ప్రస్తావన చేశారు. ఆ సమయంలో బిజెపి, దాని అభిమానులు ఓటమి విషాదంలో ఉన్నారు గనుక పెద్దగా పట్టించుకోలేదనిపిస్తుంది.
ఇటీవలి కాలంలో అభిమానులు విశ్వగురువుగా కీర్తించే నరేంద్రమోడీ పరువు ప్రపంచ వ్యాపితంగా పోయింది. అసహనం, ఢిల్లీ దాడులు, రైతుల ఉద్యమం సందర్భంగా రోడ్లపై మేకులు కొట్టటాలు, టూల్‌కిట్‌ కేసులు, కరోనాను నిర్లక్ష్యంలో పేరుమోసిన ప్రపంచ నేతల్లో ఒకరిగా మోడీ పేరు చేరటం వంటి అనేక కారణాలు అంతర్జాతీయంగా, జాతీయంగా పలుకుబడిని మసకబార్చాయి. మోడీ ఉంటే ఆర్‌ఎస్‌ఎస్‌ పెత్తనం, ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు ఉంటేనే మోడీకి పదవి అన్నది స్పష్టం కనుక పరస్పరం రక్షించుకోవటంలో భాగంగా మోహన్‌ భగవత్‌ డిఎన్‌ఏ సుభాషితాలకు తెరతీశారన్నది కొందరి అభిప్రాయం.
అన్నింటి కంటే ముఖ్యమైనది ఆఫ్ఘనిస్తాన్‌ పరిణామాలు అన్నది మరో బలమైన అభిప్రాయం. సంపాదించే ఇంటి యజమాని కరోనాతో అనూహ్యంగా మరణిస్తే ఆ కుటుంబం ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో ఇప్పుడు నరేంద్రమోడీ అదే స్ధితిలో ఉన్నారు. రవి గాంచనిది అజిత్‌ దోవల్‌కు కనిపించింది. నాటకీయ పరిణామాల మధ్య ఫిబ్రవరిలో పాకిస్తాన్‌తో మన ప్రభుత్వం సయోధ్య కుదుర్చుకుంది. ఒకేసారి పాక్‌, చైనాలతో వైరుధ్యం కొనసాగించటం సాధ్యం కాదు కనుక ఈ ఏర్పాటు అని కొందరు చెబితే, తాలిబాన్ల సమస్య దానికి పురికొల్పిందన్న వారు మరికొందరు. ఏ ఉగ్రవాదం మీద పోరు సలుపుతామని మోడీ సర్కార్‌ అమెరికాతో కలసి భీకర ప్రతిజ్ఞలు చేసిందో, ఆ ఉగ్రవాద తాలిబాన్లతో తెరముందు -వెనుక మంతనాలు ప్రారంభించింది. అమెరికా ట్రంపు లేడు, తిరిగి వచ్చే అవకాశాలూ లేవు, జో బైడెన్‌తో ఇంకా కౌగిలింతలు ప్రారంభం కాలేదు. చైనాతో సయోధ్యగా ఉంటామని ఆ తాలిబాన్లు ఏకపక్షంగా ప్రకటించటమే కాదు బీజింగ్‌ వెళ్లి మరీ ఆ దేశ నేతలను కలసి వచ్చారు. ఈ నేపధ్యం కూడా దేశంలోని ముస్లింలను సంతుష్టీకరించాల్సిన అవసరం ఉందని సంఘపరివార్‌ ఆలోచించి ఉండవచ్చన్నది కొందరి అభిప్రాయం. ఈ దశలో దేన్నీ తోసిపుచ్చలేము.
2009 డిసెంబరు నాలుగున ఢిల్లీలోని బాబా సాహెబ్‌ ఆప్టే స్మారక సమితి దేశ విభజన గురించి ఒక జాతీయ గోష్టిని ఏర్పాటు చేసింది. దానిలో మోహన భగవత్‌ ఒక వక్త.దేశంలో నివసిస్తున్న వారందరూ హిందూ వారసులే, ఈ ప్రాంతంలోని వారందరి డిఎన్‌ఏ ఒకటే అని సైన్సు కూడా నిరూపించింది. మనం కోరుకుంటే జాతీయ ఐక్యత మరియు ఏకత్వాన్ని పునరుద్దరించవచ్చు, మనల్ని విడదీస్తున్న విబేధాలను తొలగించుకోవచ్చు అని భగవత్‌ చెప్పారు. సరే హిందూత్వ గురించి అంతకు ముందు నుంచీ చెబుతున్నవాటినే పునశ్చరణ చేశారు. ఆ గోష్టిలో పాల్గొన్నవారందరూ కాషాయ దళానికి చెందిన వారే. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ నివేదించినదాని ప్రకారం బిజెపి నేత విజయకుమార్‌ మల్హోత్ర చేసిన ప్రసంగం ఎలా ఉందో చూడండి.ఐక్యతా యత్నాలతో పాటు దేశంలో నేడున్న పరిస్దితిని కూడా చూడాలంటూ ” హిందువుల జనాభా 90 నుంచి 80శాతానికి తగ్గింది. ముస్లింలు 13శాతానికి పెరిగారు. దేశంలోని అనేక ప్రాంతాలలో ముస్లింలు అధికులుగా ఉన్నారు. జాతీయ సంపదల మీద తొలి హక్కు ముస్లింలకే ఉందని చివరికి ప్రధాని కూడా బహిరంగంగా చెబుతున్నారు. ఇది సిగ్గు చేటు. పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల్లోని ముస్లిం జనాభా ప్రస్తుతం దేశంలోని ముస్లింలను కలుపుకుంటే మొత్తం నలభైశాతానికి పెరుగుతారు, అప్పుడు హిందువుల పరిస్ధితి ఎలా ఉంటుందో సులభంగానే ఊహించుకోవచ్చు.” అన్నారు.
ఇటీవలి సంవత్సరాలలో గోవులను తరలిస్తున్నారనో, గో మాంసం తింటున్నారనే సాకుతోనో గోరక్షకుల పేరుతో ముస్లింలను వధించటం తెలిసిందే. మోహన్‌ భగవత్‌ తన ప్రసంగంలో గోవులను వధించటం హిందూత్వకు వ్యతిరేకం అన్నారు. ఇది ఎదురుదాడి, గోరక్షణలో వాటిని వధించేవారి కంటే రక్షించేవారే ఎక్కువ మంది మరణిస్తున్నారని పరివార్‌ ప్రచారం తెలిసిందే. ముస్లింలందరూ గోవులను వధించకపోయినా వధిస్తున్నవారందరూ ముస్లింలే అని మాట్లాడుతున్నారు. ముస్లింలందరూ ఉగ్రవాదులు కాకపోయినా ఉగ్రవాదులందరూ ముస్లింలే అనే ప్రచారం తెలిసిందే. ఉగ్రవాదం, చర్యలు ఇస్లామ్‌కు వ్యతిరేకం అని అనేక సంస్ధలు ప్రకటించాయి. ఇలాంటి మాటలను ఎవరు చెప్పినా తప్పు పట్టాల్సిన పని లేదు. ఆచరణ ఏమిటన్నదే ముఖ్యం.


తాము మారిపోయామని చెప్పుకొనేందుకు, బిజెపికి వ్యతిరేకతను తగ్గించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ పడుతున్న తంటాలు ఒకటి రెండు కాదు, టక్కు టమార గోకర్ణ గజకర్ణ విద్యలన్నింటినీ ప్రయోగిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతుల్లో ఎంఎస్‌ గోల్వాల్కర్‌కు ప్రత్యేక స్దానం ఉంది. రెండవ అధిపతిగా దీర్ఘకాలం ఉన్నారు. బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌(ఆలోచనల గుత్తి ) పేరుతో ఆయన హిందూత్వ గురించి రాసిన అంశాలు పరివార్‌కు ప్రామాణికాలుగా ఉన్నాయి. రెండవసారి నరేంద్రమోడీ సర్కార్‌ తిరిగి అధికారానికి వచ్చే అవకాశాల్లేవనే అభిప్రాయం సర్వత్రా వెల్లడి అవుతున్న తరుణంలో ఎన్నికలకు ఆరునెలల ముందు 2018 సెప్టెంబరులో విజ్ఞాన్‌ భవన్‌లో మూడు రోజుల పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ ఉపన్యాసాల కార్యక్రమం జరిగింది. చివరి రోజు ప్రశ్నోత్తరాల సమయంలో మారిన పరిస్ధితులకు అనుగుణ్యంగా లేని గోల్వాల్కర్‌ చెప్పిన అంశాలను కొన్నింటిని తిరస్కరిస్తున్నట్లు భగవత్‌ చెప్పారు. ఇదేదో అనాలోచితంగా చెబుతున్నది కాదు, కొన్ని సంవత్సరాలుగా సంఫ్‌ు అంతర్గత మధనంలో ఉన్నదే, ఇప్పుడు బయటికి చెబుతున్నా, అందరికీ తెలియాల్సిన సమయం అసన్నమైందన్నారు. కొన్ని సందర్భాలలో చెప్పిన మాటలు అప్పటికి తగినవి కావచ్చు, అవే శాశ్వతంగా ఉండవు, కాలాలతో బాటు ఆలోచనలు కూడా మారుతుంటాయి.మారేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్దాపకుడు డాక్టర్‌ హెడ్గెవార్‌ అనుమతి ఇచ్చారు అన్నారు. అదే భగవత్‌ ఏడాది తరువాత 2019 అక్టోబరు 2న ఒక పుస్తకాన్ని విడుదల చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌కు హెడ్గేవార్‌ ప్రవచించిన హిందూ రాష్ట్ర తప్ప ప్రత్యేక సిద్దాంతం, సిద్దాంతకర్తలంటూ ఎవరు లేరు అని చెప్పారు. గోల్వాల్కర్‌ రాసిన ఆలోచనల గుత్తి పుస్తకంతో సహా ఏదీ ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రతినిధి కాదు, హెడ్గెవార్‌ కూడా సంఘగురించి తనకు పూర్తిగా తెలుసని ఎప్పుడూ చెప్పలేదు, అర్ధం చేసుకోవటం ప్రారంభించానని మాత్రమే చెప్పారు అని భగవత్‌ చెప్పారు. అందువలన గోల్వాల్కర్‌నే కాదంటున్న వారు రేపు మరో అధిపతి వచ్చిన తరువాత డిఎన్‌ఏ సిద్దాంతం కూడా మారదని భగవత్‌తో సహా ఎవరూ చెప్పలేరు. హిందూ రాష్ట్రతప్ప ప్రతిదీ మారుతుంటుంది, దానికోసం దేనికైనా సిద్దపడతారు.


అసలు సంతుష్టీకరణ అన్నదానిని కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ విదేశాల నుంచి అరువు తెచ్చుకున్నదే అని చెప్పవచ్చు.జర్మన్‌ కార్మికులు కమ్యూనిస్టుల వైపు ఎక్కడ మొగ్గుతారో అనే భయంతో వారిని సంతుష్టీకరించేందుకు మొదటి ప్రపంచ యుద్దం తరువాత ” నేషనల్‌ సోషలిస్టు జర్మన్‌ వర్కర్స్‌ పార్టీ ”ని 1920లో ఏర్పాటు చేశారు.ఒక ఏడాది పాటు వేరే అతను అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ 1921నుంచి 1945వరకు హిట్లర్‌ అధిపతిగా ఉన్నాడు.మెజారిటీ జర్మన్లను యూదుల మీద రెచ్చగొట్టటం, కుహనా జాతీయవాదాన్ని ముందుకు తీసుకురావటం వంటి అంశాలన్నీ తెలిసినదే. మన దేశంలో యూదులు లేరు గనుక హిందూత్వ శక్తులు ముస్లింలను ఎంచుకున్నాయి. అందువలన ఆ విధానాలన్నీ విదేశీ హిట్లర్‌ నుంచి అరువు తెచ్చుకున్నారని అంటే ఎవరూ ఉడుక్కోనవసరం లేదు. దానికి కాంగ్రెస్‌ అనుసరించిన దివాలా కోరు విధానాలు అవి పెరగటానికి దోహదం చేశాయి. హిందువుల చట్టాల్లో జోక్యం, మార్పులు చేసిన మాదిరి ఇతర మతాల వారి విషయంలో జరగలేదని సంఘపరివార్‌ చేస్తున్న ప్రచారాన్ని షా బానో కేసులో సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్‌ ప్రభుత్వం వమ్ము చేయటం నిర్దారించింది. వివాదాస్పద బాబరీ మసీదు గేట్లను తెరిచేందుకు రాజీవ్‌ గాంధీ సర్కార్‌ తీసుకున్న నిర్ణయం మెజారిటీ హిందువులను సంతుష్టీకరించేందుకే అన్నది స్పష్టం.1989 ఎన్నికల ప్రచారాన్ని తొలుత నాగపూర్‌ నుంచి ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ వేదికను అయోధ-ఫైజాబాద్‌కు మార్చటం ఆ రాజకీయాల కొనసాగింపే అన్నది స్పష్టం. తొలుత మైనారిటీ సంతుష్టీకరణ తరువాత మెజారిటీ సంతుష్టీకరణకు పూనుకుంది. చివరికి రెండిటికీ చెడ్డ రేవడిలా మారటాన్ని చూశాము.


కాంగ్రెస్‌కు భిన్నంగా సంఘపరివార్‌-బిజెపి తొలుత మెజారిటీ సంతుష్టీకరణ-మైనారిటీ విద్వేషాన్ని రెచ్చగొట్టింది. అధికారం వచ్చాక దాన్ని నిలుపు కొనేందుకు ఇప్పుడు మైనారిటీ సంతుష్టీకరణకు పూనుకుంది.నిత్యం ముస్లింలు, ఇతర మైనారిటీల పట్ల విద్వేష ప్రసంగాలు, ప్రచారం చేసే వారందరూ ఆర్‌ఎస్‌ఎస్‌ అంశ నుంచి వచ్చిన వారు లేదా అది తయారు చేసిన ప్రచార వైరస్‌ బాధితులే. దేశం మొత్తాన్ని మెజారిటీ మతోన్మాద పులిని ఎక్కించేందుకు తీవ్ర ప్రయత్నం జరుగుతోంది. వామపక్షాలు మినహా రాజకీయంగా బిజెపిని వ్యతిరేకించే ఇతర పార్టీల వారు కూడా గణనీయంగా పులిని ఎక్కారు. చెవులు కొరుకుతారు తప్ప బహిరంగంగా చెప్పరు. ఈ నేపధ్యంలో భగవత్‌ వ్యాఖ్యలు చేశారు. భగవత్‌ వ్యాఖ్యలలో నిజాయితీ ఉందా ? రెండు మతాలవారూ కలసి మెలసి ఉండాలని, డిఎన్‌ఏ ఒకటే అని చెబుతున్నవారు ఆర్‌ఎస్‌ఎస్‌లో ముస్లింలకు చోటు, నాయకత్వంలో భాగస్వామ్యం కల్పించ కుండా ఇతర వేదికలను ఎందుకు ఏర్పాటు చేసినట్లు ? ఇంతకాలం తాము నిర్వహించిన విద్వేష ప్రచారానికి స్వస్తి పలుకుతామని, ఇంతకు ముందు చేసిన దానికి చెంపలు వేసుకుంటున్నామని చెప్పి ఉంటే కాస్తయినా విశ్వసనీయత ఉండేది ! అవేమీ లేవు. అందుకే టక్కు టమార విద్యలని అనాల్సి వస్తోంది, కాదంటారా !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d