• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: BJP

మూడేండ్ల పాలన-తగ్గుతున్న మోజు !

16 Tuesday May 2017

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, BJP-led NDA, cotton farmers, Modi’s 3 years rule, Narendra Modi, Narendra Modi’s 3 years performance, NDA

ఎం కోటేశ్వరరావు

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలన్న ఆసక్తి జనాలలో కలగటంపై సామాజిక మీడియాలో కొందరు వ్యంగ్యంతో సహా తమకు నచ్చిన రూపాలలో స్పందించారు. ఈ రెండు అంశాలూ చైతన్య సూచికకు సంబంధించినవి. నిరాశా జీవికి గ్లాసులో నీళ్లు సగమే అనిపిస్తాయి. ఆశాజీవికి ఆ సగమే ధైర్యాన్నిస్తాయి. కట్టప్ప-బాహుబలికి సంబంధించి రాజమౌళి ఆసక్తి రేపి దాన్ని సొమ్ము చేసుకోవటంలో కొత్త రికార్డు సాధించాడు. మూడు సంవత్సరాల క్రితం నరేంద్రమోడీ అంతకంటే పెద్ద ప్రచార వ్యూహంతో, కట్టుకధలతో న్యూఢిల్లీ బాహుబలి బిగినింగు (ప్రారంభం) విజయం సాధించింది. మైనారిటీ ఓట్లా మెజారిటీ ఓట్లతోనా అన్న విషయాన్ని పక్కన పెడితే మైనారిటీ ఓట్లతోనే అయినప్పటికీ గత మూడు దశాబ్దాల దేశ రాజకీయ చరిత్రలో ఒక పార్టీ స్వంతంగా లోక్‌సభలో మెజారిటీ సాధించింది బిజెపి, దానికి సారధిగా మోడీ అన్నది తెలిసిందే. రాజమౌళి రెండో భాగాన్ని కూడా విజయవంతం చేశారు. ఒక కల్పిత కథతో నిర్మించిన సినిమా గురించి ఇంత ఆసక్తి పెంచుకున్న జనాలు తమ జీవితాలను ప్రభావితం చేస్తున్న వాస్తవ అంశాలపై ఎందుకు ఆసక్తి చూపటం లేదు అన్నది కాస్త బుర్రలో గుంజు వున్నవారికి కలగటం సహజం. వారికి ఒక దండవేస్తే అలాంటి ఆలోచనలను దరిదాపులలోకి రానివ్వని వారికి వంద దండలు వేద్దాం. తన సినిమా గురించి ఆసక్తి కలిగించటానికి రాజమౌళికి మీడియా ఇచ్చిన ప్రచారానికి ప్రతిఫలంగా ఆయన కూడా తనవంతు చేయాల్సింది చేశారు. న్యూఢిల్లీ బాహుబలి ఏం చేస్తున్నారు అని జనాలు ఆలోచించకుండా ఆసక్తిని వేరే వైపు మళ్లించటానికి మీడియా చేయాల్సిందంతా చేస్తోంది. అందుకు ఎన్నో రెట్ల ప్రతిఫలం కూడా అందుకుంటోంది. అదే రాజమౌళి-నరేంద్రమోడీకి వున్న తేడా అనిపిస్తోంది. మోడీ బాహుబలి కంక్లూషన్‌( ముగింపు) ఎలా వుండబోతోంది అన్నది ఆసక్తికరం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలలో పాలకులు మీడియాను నయానో భయానో తమ చేతుల్లోకి తీసుకున్నారు. స్త్రోత్ర పాఠాలు, విజయగానాలు తప్ప మరొకటి వినిపించటం లేదు.

మోడీ మూడు సంవత్సరాల పాలన గురించి సర్వేలు వెలువడుతున్నాయి.చరిత్రలో హిట్లర్‌ను ఇప్పటికీ అభిమానించే వారు, అసహ్యించుకొనే వారు ఎలా వుంటారో చరిత్రలో పేరుమోసిన ప్రతివారికీ అభిమానులు, వ్యతిరేకులు ఎప్పుడూ వుంటారు.తన తండ్రిని స్మగ్లర్‌గా, అధోజగత్తు నేతగా చిత్రిస్తూ సినిమా తీస్తే వూరుకోబోనని, అటువంటి కార్యకలాపాలకు ఏ కోర్టూ అతనిని శిక్షించలేదని గుర్తు చేస్తూ హాజీ మస్తాన్‌ అనే మస్తాన్‌ మీర్జా పెంపుడు కొడుకుగా చెప్పుకున్న ఒక వ్యక్తి రజనీకాంత్‌ను హెచ్చరిస్తూ లేఖ రాసిన వార్తలను చదివాం. గుజరాత్‌ మారణకాండకు నరేంద్రమోడీ కారకుడని వూరూ వాడా కోడై కూసిన విషయం, అమెరికా తన గడ్డమీద అడుగు పెట్టనివ్వని విషయం తెలిసిందే. హాజీ మస్తాన్‌ కొడుకు మాదిరే తాము మోడీ పెంపుడు కొడుకులం అని చెప్పుకోకపోయినా సరిగ్గా ఇదే మాదిరి నరేంద్రమోడీని ఏ కోర్టూ తప్పు పట్టలేదు కనుక గుజరాత్‌ మారణకాండకు బాధ్యుడు అంటే సహించబోమని సామాజిక మీడియాలో ఇప్పటికీ రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. అంటే చట్టం-అభిమానుల దృష్టిలో ఇద్దరూ మచ్చ లేనివారే !

మూడు సంవత్సరాల క్రితం అటు కేంద్రంలో నరేంద్రమోడీ, ఇటు తెలుగురాష్ట్రాలలో ఇద్దరు చంద్రులు అల్లావుద్దీను కంటే ఎక్కువగా రాజకీయ రంగంలో అద్బుతాలు చూపుతామని వాగ్దానాలు చేశారు. అవేమయ్యాయి, వారు దీపాన్ని రుద్దినట్లు జనం ముందు చూపటం తప్ప అద్బుతాలు కనిపించటం లేదు. నిజం మాట్లాడాల్సి వస్తే అసలు అద్బుతాలు చూపమని వారిని ఎవరు అడిగారు. చెప్పారు పో, ఎందుకు చూపటం లేదని అడిగేందుకు ముందుకు రాలేనంతగా మన జనం ఎందుకు నీరసించి పోతున్నారు అన్నది ఒక ప్రశ్న. దానికి ఈ మధ్య కొందరు చెబుతున్న సమాధానం ఏమంటే మన దేశంలో ‘వుత్తమ సంతతి’ తగ్గిపోయింది, అందువలన అలాంటి వారిని పుట్టించేందుకు ‘గర్భ సంస్కారం’ చేయాలి అంటూ కొందరు తయారయ్యారు, మనల్నందరినీ పనికిరాని వారిగా చిత్రిస్తున్న వారి గురించి తరువాత చూద్దాం.

మోడీ హయాంలో జనాన్ని బాగా ఆకట్టుకున్నదీ, అతి పెద్ద సంస్కరణగా చిత్రించినదీ, చర్చ జరిగిన అంశం పెద్ద నోట్ల రద్దు. ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్ల రద్దు ద్వారా దేశంలో అవినీతిని అరికడతామని, నల్లధనాన్ని బయట పెడతామని చెప్పారు. నల్లధనం రద్దుతో పాటు ధరలు తగ్గుతాయి, కార్డులను గీకటం ద్వారా పన్ను వసూలు పెరుగుతుంది, కాశ్మీరులో రాళ్లు వేయటం ఆగిపోయింది, నక్సలైట్లకు డబ్లు ఇచ్చే మార్గాలు బందు అయిపోయాయి. అన్ని రకాల వుగ్రదాడులు తగ్గుతాయి వంటి కబుర్లన్నీ విన్నత తరువాత పాఠశాల రోజుల్లో అశోకుడి చెట్లు, ఆవు-ప్రయోజనాలేమిటి అంటే టీచర్లను మెప్పించేందుకు ఠావుల కొద్దీ రాసిన వ్యాసాలు మరోసారి గుర్తుకు వచ్చాయి. ఇవేమీ జరగవు, నోట్ల రద్దు వలన జనానికి ఇబ్బందులు, కొత్త నోట్ల ముద్రణకు చేతి చమురు వదలటం తప్ప ఒరిగేదేమీ వుండదు అని చెప్పిన వారిని నల్ల ధన కుబేరులకు మద్దతు పలికేవారుగానూ, నల్లధనంతో లబ్ది పోతోందనే వుక్రోషంతో చెబుతున్న మాటలుగానో చెప్పటంతో పాటు నోట్ల రద్దుకు మద్దతు ఇవ్వటం దేశ భక్తి అని చెప్పారు.

ఇంకేముంది బ్యాంకుల ముందు క్యూలలో నిలబడుతూ పొరపాటున ఎవరైనా నోట్ల రద్దును తప్పుపడితే వారిపై జనం విరుచుకుపడ్డారు. ఏం కొద్ది రోజులు ఇబ్బంది పడలేరా, ఓపిక పట్టలేరా అంటూ మందలించారు. అయినా తప్పన్న వారిని ఎయిడ్స్‌ వ్యాధి వచ్చిన వారి మాదిరి చీదరించుకున్నారు. సినిమాలో మంచి వాడనుకున్న బాహుబలిని కట్టప్ప చంపాడు. నిజ జీవితంలో వెంకయ్య నాయుడి మాటల్లో చెప్పాలంటే భారతీయుల బతుకులు బాగు చేసేందుకు వచ్చిన దేవదూత నరేంద్రమోడీ అనే బాహుబలి పెద్ద నోట్లు అనే శత్రువును సంహరించి దేశానికి దీపావళిని తెచ్చాడు. మంచిదే !

పాత నోట్ల మార్పిడి గడువు వరకు వాటి ప్రయోజనాల గురించి మాట్లాడిన మోడీ తరువాత ఒక్క మాట చెబితే ఒట్టు ! ఎందుకు మాట్లాడటం లేదు? రిజర్వుబ్యాంకు దగ్గరకు వచ్చిన పాత నోట్ల విలువ ఎంత? నల్లధనం ఎంత బయట పడింది? దానిని ఏ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారు? కొత్త నోట్ల ముద్రణ ఎంతకాలం పడుతుంది? నోట్ల రద్దుకు ముందు మాదిరి ఎటిఎంలలో సరిపడా నోట్లు పెట్టటానికి ఎంతకాలం పడుతుంది? ఇవేవీ జాతీయ లేదా ప్రాంతీయ మీడియాకు పట్టలేదు.అసలేమీ జరగనట్లే, అంతా బాగున్నట్లే అన్నట్లుగా మోడీ భజనలో మునిగిపోయింది. నవంబరులో జరిగే నోట్ల రద్దు తొలి వార్షికోత్సవం నాటికి అవసరమైన నోట్లు అందుబాటులో వుంటాయని సం’ తృప్తి చెందుదాం. తెలివయ్య అద్దంకి వెళ్లనూ వెళ్లాడు, రానూ వచ్చాడు అన్నట్లుగా ప్రధాని చర్యను చూద్దాం !

రైతే రాజు, దేశానికి వెన్నెముక అనే నినాదాలు పాత బడ్డాయి. ఎందుకంటే రైతుల వెన్నెముకలు విరిగాయని గత ఏడు దశాబ్దాలలో తేలిపోయింది. అందువలన 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని నరేంద్రమోడీ కొత్త పల్లవి అందుకున్నారు. గుడ్డి కంటే మెల్ల ఎన్నో రెట్లు అన్న వేదాంతులం మనం. గత సంవత్సరాల గుడ్డి కంటే ముగిసిన పత్తి సీజన్‌లో ధరలు కొంత మెరుగ్గా వున్నాయని రైతులు సంతోషం వెలిబుచ్చారు. అయితే ఆ మేరకు మిర్చి రైతులకు ఆత్మహత్యల దారి చూపారనుకోండి. పత్తి ధర విషయానికి వస్తే కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లెక్కల ప్రకారం 2010-11 జె 4 అనే పొట్టి పింజరకం వార్షిక సగటు క్వింటాలు రు.5,771 వుంటే తెలుగు రాష్ట్రాలలో సాగు చేసే పొడవు పింజరకాలకు సమానమైన ఎస్‌ 6 రు.5,271 వుంది. అప్పటికీ ఇప్పటికీ పెరిగిన ఖర్చులు, రైతాంగ అవసరాలను చూసుకుంటే కనీసం ఏడెనిమిది వేల రూపాయలైనా రావాల్సి వుంది. అయితే సీజన్‌లో బాగా తగ్గి తరువాత ఐదున్నరవేలకు పెరిగి కొంత మంది రైతులను సంతోష పెట్టి తరువాత తగ్గిందనుకోండి. ఇంకాస్త పెరగటానికి వున్న అవకాశాలను నరేంద్రమోడీ సర్కార్‌ దెబ్బతీసింది అనే విషయం మన రైతు బిడ్డలు వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు మనకు చెప్పటం లేదు. దేశంలో పత్తి ధరలు పెరుగుతున్నప్పడల్లా దిగుమతులకు అనుమతించి రైతులను ఏడిపించి, మిల్లర్లను సంతోషపెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ది.అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు నరేంద్రమోడీ సర్కార్‌ ఎంత గుండెలు తీసిన బంటు అంటే పత్తి దిగుమతులలో గత వాజ్‌పేయి సర్కార్‌ 2001-02లో 25లక్షల బేళ్లతో రికార్డు దిగుమతులు చేసుకుంది. ఇప్పుడు 30లక్షలతో నరేంద్రమోడీ తన గురువు రికార్డును బద్దలు కొట్టారు.ఎవరికైనా అనుమానం వుంటే దిగువ లింక్‌లోని వార్త చదవండి.http://www.yarnsandfibers.com/news/textile-news/cotton-imports-touch-all-time-high-30-lakh-bales-season#.WRpwfcYlE2w అందువలన రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని అంటే నమ్మాలో లేదో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.

లోకల్‌ సర్కిల్స్‌ అనే ఒక వేదిక రెండు లక్షల మంది ఓటర్ల నుంచి సేకరించిన అభిప్రాయ సేకరణ ఫలితాలంటూ ఒక నివేదికను నరేంద్రమోడీ మూడు సంవత్సరాల పాలనపై తాజాగా విడుదల చేసింది. దానికి ఎలాంటి దురుద్ధేశ్యాలను, సదుద్ధేశ్యాలను అంట కట్టటం లేదు. ఇంకా ఇలాంటివి ఎన్నో రావచ్చు. దాని వివరాల ప్రకారం జనం ఎలా వున్నారో చూద్దాం. ద్రవ్యోల్బణం మూడుశాతానికి తగ్గినప్పటికీ ధరలు పెరుగుతున్నాయని 66శాతం మంది చెప్పారు, గతేడాది కంటే 11శాతం వీరి సంఖ్య పెరిగింది. వుపాధి కల్పన గురించి అసంతృప్తి చెందిన వారి సంఖ్య 43నుంచి 63శాతానికి పెరిగింది. అవునని చెప్పిన వారు 35 నుంచి కేవలం 21శాతానికి తగ్గారు. నోట్ల రద్దు వలన అవినీతి తగ్గిందని చెప్పిన వారు 39శాతం కాగా, సరైన చర్య అని చెప్పిన వారు 51శాతం మాత్రమే వున్నారు. మోడీ హయాంలో ప్రపంచంలో భారత ప్రతిష్ట పెరిగింది అని నమ్మిన వారు 90 నుంచి 81కి తగ్గగా లేదు, చెప్పలేము అన్నవారు 10 నుంచి 19శాతానికి పెరిగారు.పాకిస్ధాన్‌తో వ్యహరించిన తీరు బాగుంది అన్న వారు గతేడాది 34శాతం కాగా సర్జికల్‌ దాడుల తరువాత ప్రస్తుతం ఆ సంఖ్య 64శాతానికి పెరిగింది.దేశంలో అసహనం పెరుగుతోందా అన్న ప్రశ్నకు గతేడాది లేదని చెప్పిన 74శాతం తాజాగా 69కు పడిపోయింది. మొత్తం మీద 61శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఆశాభంగం చెందిన వారి సంఖ్య గతేడాదితో పోల్చితే 36 నుంచి 39కి పెరిగింది. వాగ్దానాలను నెరవేర్చగలరని నమ్ముతున్నవారు 59శాతం వున్నారు.

ఈ సర్వే వెల్లడించిన అంశాలను మొత్తంగా చూస్తే నరేంద్రమోడీ మీద ఇంకా విశ్వాసం వున్న వారు గణనీయంగా వున్నారు. ఇదే సమయంలో భ్రమలు కోల్పోతున్నవారు పెరుగుతున్నారు.అందుకు వుత్తర ప్రదేశ్‌ ఎన్నికలలో సీట్లు దండిగా వచ్చినప్పటికీ ఓట్లు 2014 కంటే తక్కువ రావటం, గోవా, పంజాబులలో వున్న అధికారాన్ని కోల్పోవటం ఒక రుజువు. పైన పేర్కొన్న సర్వే ప్రకారం పాకనతో వ్యవహరిస్తున్న తీరును జనం మెచ్చుకుంటున్నారని తేలింది.అందువలన మిగతా రంగాలలో వైఫల్యాలు లేదా ముందుకు పోలేని స్ధితిలో పాకిస్ధాన్‌, కాశ్మీరు పరిస్ధితులను ముందుకు తెచ్చి మధ్యంతర ఎన్నికలలో ఓట్లను కొల్లగొట్టే పధకం వేస్తున్నట్లు కొందరు పరిశీలకులు ఇలాంటి సర్వేల వివరాలు వెల్లడి కాక ముందే అంచనావేశారు. పరిణామాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. పాక్‌ రెచ్చగొట్టే చర్యలను ఎప్పటికప్పుడు సమర్ధవంతంగా ఎదుర్కోవాలనటం, తగిన బుద్ధి చెప్పాలనటంలో రెండో మాట లేదు.అదే సందర్భంలో వారి మాదిరి మన విశ్వహిందూ పరిషత్‌ తొగాడియా లాంటి వారు రెచ్చగొట్టే ప్రసంగాలు పరిస్థితిని మరింతగా దిగజార్చుతాయి తప్ప మెరుగుపరచవు. ఏదేశంతో అయినా సరిహద్దులలో ప్రశాంతత నెల కొల్పటంలోనే అసలైన రాజనీతి వుంటుంది. తగాదాలు పెట్టుకోవటం ఎంతసేపో పట్టదు. గతంలో కార్గిల్‌ యుద్ధాన్ని చూపి ఓట్లను కొల్లగొట్టిన అనుభవంతో అలాంటి వాటినే పునరావృతం చేయాలనే తప్పుడు ఎత్తుగడలకు ఎవరైనా పాల్పడితే అది దేశ ద్రోహం అవుతుంది తప్ప దేశ భక్తి కాదు. సరిహద్దులలో వుద్రిక్తతలు కొనసాగితే నష్టపోయేది మన సైన్యం, పంజాబ్‌, కాశ్మీరు పౌరులు, అమెరికా నుంచి కొనే ఆయుధాలకు ఖజానా ఖాళీ తప్ప తొగాడియాలు, సామాజిక మాధ్యమాలలో రెచ్చిపోయే వారు కాదు. మన దగ్గర వున్న మాదిరే అణ్వాయుధాలు, క్షిపణులు వారి దగ్గరా పుష్కలంగా వున్నాయి. ఏ పొరుగుదేశాన్నీ ఆయుధాలను చూపి, ప్రయోగించి అదుపు చేయలేరన్నది మన కంటే ఎన్నో రెట్లు పెద్దదైన అమెరికా అనుభవం.

పెద్ద నోట్ల సందర్భంగా వుగ్రవాదులు అంటే కాశ్మీరులో, ఈశాన్య రాష్ట్రాలలో వేర్పాటు వాదులు, మిగతా చోట్ల నక్సల్‌ వుగ్రవాదుల చర్యలు తగ్గకపోగా అంతకు ముందు మాదిరిగానే జరుగుతున్నాయి. కాశ్మీరులో నోట్ల రద్దుకు ముందు కాలేజీ విద్యార్ధులే రాళ్లు విసిరితే ఇప్పుడు హైస్కూలు పిల్లలు కూడా అదే పని చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. భద్రతా దళాలు తమ జీపు మీద ఒక యువకుడిని కట్టివేసి అతనిని రక్షణగా చేసుకొని ప్రయాణించిన వీడియోను ప్రపంచం యావత్తూ చూసింది. బహుశా ఎక్కడా ఇలాంటివి జరిగి వుండవు. వుగ్రవాద చర్యలు తగ్గిన దాఖలాలేమీ లేవు. ఎక్కడ అణచివేత పెరుగుతుందో అక్కడి జనం అంతగా వేరు పడిపోతారు, స్వార్దపరశక్తుల చేతులలో పావులుగా మారతారు. ఆఫ్‌ఘనిస్తాన్‌ అనుభవం అదే చెబుతోంది.తాలిబాన్లను అణచే పేరుతో అమెరికా, పాక్‌ దళాలు సామాన్య జనంపై దాడులు చేసిన కారణంగా అక్కడ తాలిబాన్లు తగ్గకపోగా పెరిగారు. విదేశాలకు విస్తరిస్తున్నారు.

నోట్ల రద్దుకు-వుగ్రవాదులకు సంబంధం లేదు, మోడీ బుర్ర నుంచి పుట్టింది తప్ప ఏ దేశంలోనూ అలా చెప్పలేదు. మోడీ చెప్పినట్లు డబ్బు అందటం ఆగిపోతే వారి కార్యకలాపాలన్నీ ఎలా సాగుతున్నాయి, పరిస్థితి మరింతగా ఎందుకు దిగజారింది అనే ప్రశ్నలు అడగలా వద్దా ? మన్‌కీ బాతంటూ తాను చెప్పదలచుకున్నదేదో చెప్పటం తప్ప దమ్మున్న కొద్ది మంది విలేకరులు అయినా అడిగేందుకు అవకాశం ఇవ్వకుండా ప్రధాని పత్రికా గోష్టులు ఎందుకు పెట్టటం లేదు? నిజానికి వుగ్రవాద కార్యకలపాలు జరగటానికి పాలకులు కల్పించిన అనువైన పరిస్థితులే సగం వూతమిస్తున్నాయి. వాటిని విదేశాలు, విచ్చిన్న శక్తులు వుపయోగించుకుంటున్నాయి. కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలలో వేర్పాటును కోరుతున్నవారందరినీ వుగ్రవాద శక్తుల కింద జమకట్టి బలప్రయోగం చేస్తే ఫలితం కంటే జరిగే నష్టమే ఎక్కువ.రాళ్లు వేసే ప్రతివారూ దేశ ద్రోహులు అనుకుంటే అంతకంటే పిచ్చిపని మరొకటి లేదు.చేతులారా వుగ్రవాదాన్ని, వుగ్రవాదాన్ని పెంచి పోషించటం తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా వుగ్రవాద ప్రభావ ప్రాంతాలలో జనాన్ని విశ్వాసంలోకి తీసుకొని వుగ్రవాదుల నిజస్వరూపాన్ని ఎండగట్టాలి. త్రిపురలో వామపక్ష ప్రభుత్వం అక్కడి వేర్పాటు, వుగ్రవాదులను శాంతి భద్రతల సమస్యగా చూడకుండా రాజకీయ వైఖరితో తీసుకున్న చర్యలు వారిని అదుపులోకి తెచ్చాయన్నది తెలిసిందే. అటువంటి చర్యలు మిగతా ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు, కాశ్మీరులో లేని కారణంగానే అవాంఛనీయ శక్తులు చెలరేగుతున్నాయి.అమాయక యువత బలౌతోంది.

పైన పేర్కొన్న సర్వే వెలుగులో చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో విజయాలు చెప్పుకొనేందుకేమీ కనిపించటం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంతసేపూ నూతన రాజధాని నిర్మాణం, పోలవరం చుట్టూ, తెలంగాణాలో మిషన్‌ కాకతీయ, భగీరధో అంటూ ప్రాజక్టుల అంచనాలు పెంచటం తప్ప మరొకటి పట్టలేదు. ఇవన్నీ కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల మధ్య పంపకాలకు తెరతీసే మెగా ప్రాజక్టులు తప్ప వేరు కాదు. ఐటి రంగంలో దాదాపు అన్ని కంపెనీలు వయసుపై బడిన వుద్యోగులను వూడబెరికే పనిలో పడినట్లు, రానున్న రోజుల్లో అది మరింతగా పెరగనున్నదని వార్తలు వస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఐటి కంపెనీల సృష్టి జరుగుతోందన్నట్లు , దానికి చంద్రబాబు నాయుడి రాజకీయ వారసుడు లోకేష్‌ నడుం కట్టినట్లు చూపేందుకు పెద్ద ప్రయత్నం జరుగుతోంది. లక్షల కోట్ల మేరకు కుదుర్చుకున్నట్లు చెబుతున్న అవగాహనా ఒప్పందాలేమయ్యాయో, వుద్యోగాలెక్కడున్నాయో తెలియదు. వాటన్నింటి గురించి చెప్పకుండా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో అమెరికా పర్యటనలో తెలుసుకున్న సరికొత్త సాంకేతిక అంశాల గురించి జనానికి చెబుతున్నారు. అవి ఆయన కొత్తగా తెలుసుకున్నారేమో తప్ప జనానికి పాతవే. అవన్నీ వుపాధి రహిత వుత్పిత్తికి తోడ్పడేవే.ఆ కారణంగానే అమెరికాలో ట్రంప్‌ కొత్త వుద్యోగాలు ఇవ్వలేక విదేశీయుల రాకపై ఆంక్షలు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడికి మూడవ సంవత్సర కానుకగా ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు జగన్‌తో ప్రధాని నరేంద్రమోడీ భేటీని బిజెపి ఇచ్చింది. నరేంద్రమోడీ ఎవరు ఎపుడు అడిగినా ఇంటర్వ్యూలు ఇస్తూ వున్నట్లయితే దానికి పెద్ద ప్రాధాన్యత వుండేది కాదు. ఈ చర్య ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో ఒక సంచలనం. అది ఎటువైపు పయనిస్తుందన్నది చూడాల్సి వుంది. పైకి ఏమి చెప్పినా ప్రధాన రాజకీయపార్టీలన్నీ రాజకీయ లాభ నష్టాల లెక్కలలో వున్నాయి. అవి ఒక కొలిక్కి వస్తే రాజకీయాలలో కిక్కు ఎక్కుతుంది.

తెలంగాణా విషయానికి వస్తే గత ప్రభుత్వాలు లేదా అనుకూల పరిస్ధితుల కారణంగా హైదరాబాదులో అభివృద్ధి చెందిన ఐటి, ఐటి అనుబంధ పరిశ్రమలు, సహజంగానే వున్న అభివృద్ధి చెందిన ఫార్మా, ఇతర పరిశ్రమల కారణంగా చంద్రశేఖరరావు సర్కారు గత మూడు సంవత్సరాలుగా నెట్టుకు వచ్చింది. చేసిన వాగ్దానాలు గాలికిపోయాయి. దళితులకు భూమి, రెండు పడకగదుల ఇళ్లు, ప్రాజక్టుల నిర్మాణం, నీళ్లు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా వున్నాయి.వుద్యోగాల విషయానికి వస్తే మూడు నోటిఫికేషన్ల విడుదల ఆరునోటిఫికేషన్ల రద్దు మాదిరి వుంది. మిర్చి ధర పతనం గురించి ఆందోళనకు దిగిన రైతుల చేతికి బేడీలు వేసి నిరసన తెలిపిన వారికి ఇదే గతి అన్నట్లుగా అవమానకరంగా పోలీసులు వీధులలో తిప్పిన వుదంతం చంద్రశేఖరరావు సర్కార్‌ రైతులకు చేసిన వాగ్దానలన్నింటినీ తుడిచిపెట్టింది. ఇదేమని అన్యాయం అని అడగటానికి, నోరెత్తటానికి వీలు లేకుండా ఇందిరా పార్కువద్ద వున్న ఏర్పాటు చేసిన ధర్నా చౌక్‌ను ఎత్తివేసి నిరసన గళం విప్పటానికి వీలు లేకుండా చేసేందుకు ఆంక్షలు జారీ చేశారు. ధర్నా చౌకు తమకు ఆటంకంగా వుందంటూ కాలనీ వాసుల పేరుతో ఒక మహిళా సిఐ, కానిస్టేబుళ్లతో సాధారణ దుస్తులు వేయించి పోటీ ధర్నా చేయించటం గమనించాల్సిన అంశం. నగర పోలీసు అధికారులు అంత బుర్రతక్కువ పధకాలు ఎలా వేసినట్లు ? అసలు ధర్నాలకు అనుమతి ఇవ్వని పోలీసులు పోటీ ధర్నాను ఎందుకు అనుమతించినట్లు ? రాజకీయంగా టిఆర్‌ఎస్‌ నాయకత్వం సంతృప్తి చెందే అంశం ప్రతిపక్షాలలో చీలిక. తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు పూనుకున్న బిజెపి పెద్దన్న పాత్ర వహించి అనుచర పార్టీగా తెలుగుదేశం పార్టీని తయారు చేసుకోవచ్చు.ఈ క్రమంలోనే కేంద్రంలో బిజెపికి దగ్గర కావాలని చూస్తున్న తెరాసను దరి చేరనివ్వటం లేదు. పోయిన ప్రాభవాన్ని తెచ్చుకొనేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించవచ్చు. కాన్ని ప్రాంతాలకు పరిమితమైన వామపక్షాలు తమ బలాన్ని కాపాడుకొనేందుకు పూనుకుంటే మైనారిటీ ఓట్లతో తిరిగి అధికారానికి రాగలమన్నది తెరాస ధీమా. అందుకే ఆ పార్టీ చుట్టూ రాజకీయ తూనీగలు చేరుతున్నాయి. రెండు రాష్ట్రాలలోనూ ప్రజాందోళనలను అణచటం ఒకే విధంగా జరుగుతోంది. చంద్రబాబు నాయుడు ఎక్కడ పర్యటనకు పోతే అక్కడ వామపక్షాలు, వైఎస్‌ఆర్‌సిపి నేతలను ముందుగానే పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దానికి ఎలాంటి కారణాలు వుండటం లేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇతర మంత్రులను డమ్మీలుగా చేసి తమ కుమారులను యువరాజుల మాదిరి తిప్పుతున్నారు. ఒక పధకం ప్రకారం వారి ప్రతిష్టను పెంచేందుకు పూనుకున్నారు. కేంద్రంలోని బిజెపికి రాజకీయంగా లొంగుబాటు వైఖరిని ప్రదర్శిస్తున్నారు.

జిఎస్‌టితో ప్రారంభంలో రేట్లు పెరుగుతాయని ముందే చెబుతున్నారు. మేకిన్‌ ఇండియా, వుపాధి కల్పన, నోట్ల రద్దు బండారం వంటి అన్ని అంశాలు మరింత వేగంగా బహిర్గతం గాక తప్పదు. నరేంద్రమోడీ, తెలుగు రాష్ట్రాల ఇద్దరు చంద్రుల మూడు సంవత్సరాల పాలనను మొత్తంగా చూస్తే భ్రమలు కోల్పోయే రేటు వేగం అందుకునే స్పష్టంగా కనిపిస్తోంది.అందుకే అంతటా మధ్యంతర ఎన్నికల ఎత్తులు, జిత్తులతో పాలకులు, పార్టీల నేతలూ వున్నారు.

గమనిక : ఎంప్లాయీస్‌ వాయిస్‌ పత్రిక రానున్న సంచికలో ప్రచురణ నిమిత్తం రాసిన వ్యాసమిది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎట్టకేలకు మోడీ మోక్ష స్వర్గ సోపానాల దగ్గర వైఎస్‌ జగన్‌ ?

11 Thursday May 2017

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi, tdp, YS jagan, ys jagan vs chandrababu, ysrcp

ఎం కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం కొత్త మలుపు తిరిగింది. కాంగ్రెస్‌ బలంగా వున్నచోట దానిని దెబ్బతీసేందుకు ప్రాంతీయ పార్టీలతో జత కట్టిన బిజెపి ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రాంతీయ పార్టీతో బంధం వుండగానే మరొక పార్టీకి కన్నుగీటుతూ సరికొత్త రాజకీయానికి తెరలేపిందా ? బ్రహ్మంగారు మరి ఈ విషయంలో ఏం చెప్పారో తెలియదు. నిజానికి వైఎస్‌ఆర్‌సిపి ఎందుకోసం ప్రధాన మంత్రి దర్శన భాగ్యం కోరిందో, ప్రధాని ఎందుకు జగన్‌ పరివారంతో కలిశారో అధికారికంగా తెలియదు. ప్రధానిని కలిసి బయటకు వచ్చిన తరువాత జగన్‌మోహనరెడ్డి బృందం ప్రధానికి ఇచ్చినట్లు చెప్పిన మెమోరాండం, మీడియాతో మాట్లాడినదాని ప్రకారమే ఎవరైనా వ్యాఖ్యానించగలరు. పరకాయ ప్రవేశ విద్యతో కథనాలు రాసే విలేకర్ల నుంచి ఇంకా ఏమీ వెలువడలేదు కనుక వాటిని నమ్ముకున్న పాఠకులు నిరాశ చెందివుంటారు. కొద్ది వారాల క్రితమే చంద్రబాబు నాయుడు ప్రధానిని కలసి ఆంధ్రప్రదేశ్‌లో మునిగినా తేలినా రెండు పార్టీలు కట్టకట్టుకు వుండాలని నిర్ణయించుకున్నట్లుగా పరకాయ విలేకర్లు వార్తలు రాసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలపరుస్తానంటే ఎవరైనా వద్దన్నారా అంటూ వెంకయ్య నాయుడు బిజెపిలో తలెత్తిన సందేహాలను తీర్చిన విషయం బహిరంగమే. దానిలో భాగంగానే విశాఖలో బిజెపి పెద్ద ఎత్తున సభ జరిపేందుకు పూనుకుందని వార్తలు, వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఇపుడు జగన్‌ పరిణామాలను నిస్సందేహంగా మరో మలుపు తిప్పారు. బిత్తర పోయిన తెలుగు తమ్ముళ్లు కొందరు ఏం మాట్లాడుతున్నారో తెలియని విధంగా వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నాయుళ్లు విదేశాల్లో వున్న సమయంలో జగన్‌ ప్రధాన మంత్రిని కలిశారు అనేకంటే ప్రధాని కార్యాలయం అవకాశం కల్పించింది అని చెప్పటం సబబుగా వుంటుందేమో ?

ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అన్నది పాత సామెత, పాత టెక్నాలజీ. ఇప్పుడు ఒక అర గురించి మరొక అరకు తెలియకుండా పక్క పక్కనే అనేక కత్తులకు స్ధానం కల్పించటం కొత్త టెక్నాలజీ. ఎన్ని సినిమాలలో చూడటం లేదూ ! పార్టీలో, ప్రత్యర్ధులలో ముఠాలుగా, ఒకరి పొడ మరొకరికి గిట్ట మట్టుపెట్టే వారిని కూడా పార్టీలోని ఒకే వరలో ఇమిడ్చే నేర్పు చంద్రబాబుకు – రెండు రెళ్లు నాలుగు అన్నట్లు శాస్త్రీయంగా చెప్పాలంటే పాలకవర్గ రాజకీయ పార్టీ ప్రతిదానికీ – వున్నట్లే రెండు పార్టీలను కూడా పక్క పక్కనే వుంచేందుకు , ఆంధ్రప్రదేశ్‌ పౌరులను కొత్త బాటలో నడిపించేందుకు బిజెపి నేతలు పూనుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపికి ఇప్పటికిప్పుడు అంత సీను లేదు కనుక తమకు మద్దతు విషయంలో ఎవరు ఎంతగా వంగి విధేయత చూపుతారా అన్నదే వారికి ఇప్పుడు ముఖ్యం. కాల క్రమంలో పరిణామాలు ఎలా వుంటాయన్నది ఇప్పుడే చెప్పలేము. కాంగ్రెస్‌ అయినా తెలుగుదేశం అయినా ఎవరు అధికారంలో వుంటే వారి పంచనచేరి తమ వాటాలను రాబట్టుకొనేందుకు రాయలసీమ మొరటు ప్రత్యర్ధి ఫ్యాక్షనిస్టులే ఒకే పార్టీలో సర్దుకుపోదాం అన్నట్లుగా వుండటం చూశాం, చూస్తున్నాం. అలాగే అనేక చోట్ల రింగురోడ్లు, విమానాశ్రయాలు అటూ ఇటూ, అక్కడా ఇక్కడా అని ప్రచారం చేసి చివరికి తమకు గరిష్ట ప్రయోజనం చేకూరే విధంగా వాటి నిర్మాణాలు చేయటాన్ని చూస్తున్నాం. రాష్ట్ర రాజకీయబాట విషయంలో కూడా అదేవిధంగా జరగబోతోందా ? మేథావులు, వుడుకురక్తంతో వుండే యువతీ యువకులే అలాంటి తప్పుడు రాజకీయాలకు సలాం కొడుతుంటే ఇక సామాన్యుల సంగతి చెప్పనవసరం లేదు. రాజకీయాలలో ఏదైనా సాధ్యమే.

రాష్ట్రానికి వాగ్దానం చేసిన ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, ప్రత్యేక పాకేజీ పేరుతో మోసం చేసినా ఫర్లేదు, వాటి గురించి అడగకుండా వుంటాం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌తో మాత్రం ఎలాంటి రాజకీయ అనుబంధం పెట్టుకోకూడదని చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని ,చాణక్యనీతిని వుపయోగించి ఇంతకాలం అడ్డుకున్నారన్నది ఒక అభిప్రాయం. రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్దులెవరో తేలలేదు, నోటిఫికేషన్‌ ఇంకా వెలువడలేదు, మీడియాలో ఎలాంటి వూహాగానాలు రాయలేదు. ఆకస్మికంగా పిడుగులు పడినట్లుగా వైఎస్‌ఆర్‌సిపి ప్రతినిధి వర్గాన్ని కలుసుకొనేందుకు నరేంద్రమోడీ సిద్ధంగా వున్నారంటూ పిలుపు రావటం పొలోమంటూ జగన్‌ పరివారం ఢిల్లీ వెళ్లి కలవటం, రాష్ట్రపతి ఎన్నికలలో మద్దతు ప్రకటించటం అంతా కల మాదిరి జరిగిపోయింది. అదీ చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులు, కంపెనీలను రప్పించేందుకు అమెరికా వీధులలో కాలి నడకన తిరుగుతున్న సమయంలో జరగటం అనేక మందికి మింగుడు పడని అంశం. చంద్రబాబు నాయుడే కాదు వెంకయ్య నాయుడు కూడా దేశంలో లేనపుడు అని ఎవరైనా ముక్తాయింపు ఇవ్వవచ్చు.

మిగతా పత్రికలు ఏమి రాసినా సాక్షి పత్రికలో వక్రీకరణకు అవకాశాలు వుండవు. అదేమి రాసిందో చూడండి

‘ మీడియా : ప్రధాన మంత్రి వద్ద ఏదైనా ప్రస్తావన వచ్చిందా ?

జగన్‌ : రాష్ట్రపతి ఎన్నికలలో వారు పెట్టే అభ్యర్ధికి సంపూర&ణ మద్దతు ఇస్తామని ప్రధాన మంత్రిగారికి చెప్పాం.వైఎసనఆరన కాంగ్రెసు నుంచి సంపూర&ణ మద్దతు వుంటుంది. మాటల సందర&భంలో వారు తప్పనిసరిగా ప్రస్తావిస్తారు. మద్దతు కూడా ఇస్తాం. ఎలాగూ వాళ్లు పెట్టిన వ్యక్తే గెలుస్తారు. ఆ పదవికి పోటీ పెట్టడం కూడా తప్పే అని గట్టిగా నమ్ముతున్నాం. బిజెపికి సంబధించినంతవరకు మేం అన్ని వేళలా మద్దతు ఇచ్చాం. వారితో మాకు ఎప్పుడైనా వ్యతిరేకత వుందీ అంటే అది ప్రత్యేక హోదా విషయంలో, భూ సేకరణ బిల్లు విషయంలో మాత్రమే.అంటే ప్రజలకు మంచి జరుగుతుందంటే ప్రతి విషయంలో అధికార పార్టీకి తోడుగా నిలిచాం. వుంటాం కూడా. ప్రత్యేక హోదా, భూసేకరణ బిల్లు విషయంలోనే మేం బిజెపిని వ్యతిరేేకించాం. ‘

దీనిని చదివిన తరువాత తెలుగులో భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాల గురించి మరోసారి వెనక్కు చూసుకోవాల్సి వచ్చింది. మాటల సందర్భంగా వారు తప్పనిసరిగా ప్రస్తావిస్తారు, మేం ఇస్తాం అంటే భవిష్యత్‌లో అని అర్ధం. మరోవైపున మేం మద్దతు ఇస్తామని చెప్పాం అన్నారు. ప్రధానితో కలిసేందుకు వెళ్లగానే పాహిమాం అంటూ కాళ్లమీద పడినట్లు, విధేయులమై వుంటామని అడగకుండానే మద్దతు ప్రకటించారని అనుకోవాల్సి వస్తుంది. అయితే అది వారి అంతర్గత వ్యవహారం అనుకోండి. ఇక్కడ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమస్య ఏమంటే అనేక ఓదార్పు యాత్రలు చేసిన జగన్‌ ప్రత్యేక హోదా గురించి కంటి తుడుపు విమర్శలు తప్ప పొలో మంటూ జెపికి మద్దతు ప్రకటించి వచ్చారు. ఎలాగూ బిజెపి అభ్యర్ధి గెలుస్తారని చెబుతున్నారు. అంటే మీ మద్దతు ఆరోవేలు వంటిదే. మరో వైపు ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి అవుతుందని ప్రధానికి విన్నవించిన వైసిపి పెద్దలు హోదా విషయంలో అడ్డంగా మాట తప్పి ఇచ్చేందుకు తిరస్కరించిన బిజెపి విషయంలో కనీసం తటస్థంగా వుంటామని చెప్పి వుంటే కాస్త బెట్టుగా వుండేది. కేసుల నుంచి బయట పడవేయించుకొనేందుకే ఆరాటపడ్డారనే విమర్శ వచ్చి వుండేది కాదు. అయినా బిజెపి అభ్యర్ధి రాష్ట్రపతి అయితే మన రాష్ట్రానికేమి ఒరుగుతుంది, దీనిలో బిజెపి మనకు చేసే మంచేమిటి ? హోదా బదులు ప్రకటించిన ప్యాకేజీ కూడా వట్టిస్తరి మంచినీళ్లే అని తేలిపోయింది. ఏ రకంగానూ మనకు ఒరిగేదేమీ లేనపుడు, గడచిన మూడు సంవత్సరాలలో చేసిందేమీ లేనపుడు, రాబోయే రోజుల్లో ఏం చేస్తారో తెలియనపుడు అడగకుండానే దాని అభ్యర్ధికి మద్దతు అని ప్రకటించటం ఎందుకు ?ఎవరిని మోసం చేద్దామని ? అలాగాక మేం బిజెపితో వూరేగదలచుకున్నాం, కేసుల మీద కేంద్ర సంస్ధలు చూసీచూడనట్లు, వీలైతే బయటపడవేయించమని కోరాం అని చెప్పి వుంటే నిజాయితీగా వుండేది. నరేంద్రమోడీ అంటే అంటరాని వ్యక్తి కాదని 2013లోనే జగన్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తరువాత ఎక్కడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడిన దాఖలాలు లేవు. మోడీ-జగన్‌ కలయికపై తెలుగుదేశ వారి తొలి వ్యాఖ్యానాలు చూస్తే అనుకుంటున్నదొకటీ అయ్యింది ఒకటీ అన్నట్లుగా కనిపిస్తోంది. నూతన పరిస్థితిలో నూతన ఎత్తుగడలకు అగ్రనాయకత్వం బహుశా సమయం తీసుకోవచ్చు. ప్రత్యేక హోదాతో ప్రయోజనం లేదని పక్కన పెట్టిన పెద్దలు- జగన్‌ దొందూ దొందే అయినపుడు ఒకరి గురించి మరొకరు విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది.

ఇక రాష్ట్ర రాజకీయ అవనిక ఎలా వుండబోతోందో చూద్దాం. హోదా, పాకేజీలంటూ ఆంధ్రప్రదేశ్‌ పౌరులను మోసం చేసిన తెలుగుదేశం-బిజెపి కూటమి ఇతర అన్ని రంగాలలో కూడా విఫలబాటలోనే నడుస్తోంది. చెప్పుకొనేందుకు పట్టుమని పది మంచి పధకాలు కూడా లేవు.అందువలన ఈ కూటమి సర్కారుపై జనంలో వ్యతిరేకత పెరగటం ఖాయం. 2014లో వారికి కలసి వచ్చిన సానుకూల అంశాలు వచ్చే ఎన్నికలలో వుండవు. అందువలన ఇప్పుడున్న రాజకీయాన్ని ఇలాగే కొనసాగిస్తే రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లు తెలుగుదేశంతో పాటు బిజెపి కూడా బంగాళాఖాతంలో కలవటం ఖాయం. అందుకే తాము స్వంతంగా బలపడాలనే ఆరాటం బిజెపిలో రోజు రోజుకూ పెరుగుతోంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ లోగా ఒంటరిగా బిజెపి స్వంతంగా పోటీచేసే సీన్‌ లేదు. జనంలో గబ్బు పడుతున్న తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్‌ఆర్‌సిపితో వెళితే ఎలా వుంటుంది అని నాడి పరీక్షించేందుకే తొలి చర్యగా జగన్‌కు ప్రధాని ఇంటర్వ్యూ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. జగన్‌తోనే వాటంగా వుంటే ఏదో ఒక రూపంలో తెలుగుదేశం పార్టీని ఒదిలించుకుంటుంది. రాజకీయ పార్టీలకు సాకులు దొరక్కపోవు. పార్లమెంట్‌ సీట్లు తాను తీసుకొని అసెంబ్లీలో మెజారిటీ జగన్‌కు వదల వచ్చు. వరుస కుదిరితే సంకీర్ణ సర్కార్‌ను ఏర్పాటు చేయవచ్చు. తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపి వంటి పార్టీలకు వాటి నేతల ప్రయోజనాలు తప్ప మిగతావన్నీ పట్టవు. ఒకవేళ బిజెపితో కలిస్తే వైఎస్‌ఆర్‌సిపికి మద్దతు ఇచ్చిన దళితులు, ముస్లింలు ఎలా స్పందిస్తారన్నది ఒక ప్రశ్న. కొంత ఓటింగ్‌ను అనివార్యంగా కోల్పోవాల్సి వుంటుంది. ప్రత్యేక హోదా, భూసేకరణ బిల్లుల విషయంలో బిజెపిని వ్యతిరేకిస్తున్నామని చెప్పిన జగన్‌ ఒక వేళ సయోధ్య కుదిరితే వాటిని తూనాబొడ్డుబాలు అనటం పెద్ద సమస్య కాదు. ప్రత్యేక హోదాతో ప్రయోజనం లేదని తరువాత తమకు అర్ధమైందని తెలుగుదేశం సమర్ధించుకున్న మాదిరి జగన్‌ మాట మార్చలేరా ? భూ సేకరణ విషయంలో మడమ తిప్పలేరా ? ఎందరిని చూడలేదు !

తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఒంటరిగా లోకేష్‌ నాయకత్వాన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. లోకేష్‌ను ముందు పెట్టి ఓడిపోతే చెప్పుకొనేందుకు వైసిపి రోజా చెప్పిన ముద్దపప్పు అనే ఒక సాకు అయినా వుంటుంది. అదే చంద్రబాబు నాయకత్వాన అయితే అలాంటిదేమీ వుండదు. బిజెపి-వైఎస్‌ఆర్‌సిపి అవకాశాలు కనిపిస్తే అసలు తెలుగుదేశంలో ఎందరు మిగులుతారనేది ఒక పెద్ద ప్రశ్న. ఆయారాం గయారాంలకు కమ్యూనిస్టులు తప్ప అన్ని పార్టీలు పెద్ద పీట వేస్తున్నపుడు ఎవరేమనుకుంటే మాకేటి సిగ్గు అన్నట్లుగా చేరేవారు, చేర్చుకొనే వారూ ఎలాగూ వుంటారు. పార్టీ కార్యాలయాల ఆస్ధులను కబ్జా చేసేందుకు తెలుగుదేశం నామమాత్రంగా వుండవచ్చు.

అత్తారింటికి దారి చూసుకోవటంలో విజయం సాధించిన పవన కల్యాణ్‌ అధికారానికి దారి వెతుక్కోవటం అంత సులభం కాదు. సినిమా పేరును ముందుగా రిజిస్టరు చేసుకున్న మాదిరి పార్టీ పేరును నమోదు చేశారు తప్ప నిర్మాణం లేదు. జనతా మాదిరి అధికారానికి వచ్చిన తరువాత పార్టీ పెట్టిన లేదా, పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారానికి వచ్చిన ఎన్టీరామారావు నాటి రోజులు కావివి. గత ఎన్నికల్లో కాంగ్రెసు తాట తీసినట్లుగా ఈ ఎన్నికల్లో గతంలో బిజెపితో కలిసిన లేదా వచ్చే ఎన్నికలలో ఏదైనా కొత్తగా కలిస్తే వాటి తాటతీయాలి. ఈ నేపధ్యంలో వున్నంతలో వామపక్షాలతో కలసి ఎన్నికలలో పోటీ చేయటం తప్ప మరొక దారి లేదు. లేదా ఏదో ఒక పార్టీతో ఒప్పందం చేసుకొని అందరూ అనుకుంటున్నట్లుగా దానికి లేదా వాటికి కాలీ&షట్లు ఇచ్చి ఎన్నికల ప్రచారంలో నటించాల్సి వుంటుంది. వామపక్షాల విషయానికి వస్తే అవి గతం మాదిరి జనాన్ని ఆకట్టుకోలేకపోతున్నాయి. వివిధ తరగతుల ప్రయోజనాల కోసం అవి తప్ప మిగతా ఏ పార్టీలు గత మూడు సంవత్సరాలలో వుద్యమాలు నిర్వహించిన దాఖలాలు లేవు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినా వుద్యమాలు ఆగలేదు. ఎన్నికలలో గెలవటానికి అవి మాత్రమే చాలవన్నది గత అనుభవం.గత ఎన్నికలలో వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు అనే విమర్శలకు గురయ్యాయి. అందువలన అవి కొత్తగా పొగొట్టుకొనేదేమీ లేదు. కమ్యూనిస్టులకు దగ్గరదారులు లేవు, తెలియవు కనుక తమ సైద్ధాంతిక నిబద్దతకు కట్టుబడి, తమతో కలసి వచ్చే శక్తులు, వ్యక్తులతో కలసి మరోసారి ఒంటరి పోరాటం చేయటం తప్ప పెను మార్పులు వచ్చే సూచనలు ఇప్పటికైతే లేవు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మేడే ప్రాధాన్యత-వుద్యోగుల, కార్మికుల కర్తవ్యం

14 Friday Apr 2017

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Others

≈ Leave a comment

Tags

7th Pay Commission Recommendations, BJP, Central Government Employees, cps, EMPLOYEES, Government employees, heymarket, mayday, NDA, NPS, workers

Image result for mayday-haymarket

ఎం కోటేశ్వరరావు

మే డే ! కొంత మంది ఆ రోజును దినోత్సవంగా జరుపుతారు, మరి కొందరు దీక్షా దినంగా పాటిస్తారు. పశ్చిమార్ధ గోళంలో అనేక దేశాలలో, సమాజాలలో అది వసంత రుతు ఆగమన పండుగ రోజు. మే ఒకటవ తేదీని కార్మికులు వుత్సవంగా జరుపుకుంటే యజమానులకు పండుగ, వారు కూడా దానికి అవసరమైన నగదు మొత్తాలను సంతోషంతో సమకూర్చుతారు. అదే దీక్షా దినంగా పాటించే చోట సదరు కార్మిక సంఘాన్నే మొత్తంగా లేపేయటానికి, కార్మికులను భయపెట్టటానికి కూడా వెనుకాడరు. మే ఒకటవ తేదీ ప్రాధాన్యతను కార్మికవర్గం తెలుసుకోకుండా చేసేందుకు ఆ రోజుకు బదులు మరొక రోజును కార్మికదినంగా మార్చేందుకు మరోవైపున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక సంప్రదాయ వసంత రుతు వుత్సవాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. కార్మికుల బతుకులు మాడిపోతున్నా, యజమానులు, వారి అడుగులకు మడుగులొత్తే పాలకులు అణచివేస్తున్నా అవేమీ పట్టకుండా ప్రకృతి పరంగా చెట్లు చేమలు వికసిస్తాయి. కానీ మేడే వస్తే కార్మికుల బతుకులు వాటంతట అవే వికసించవని గుర్తించాలి. ఈ పూర్వరంగంలో కార్మికులు, ఇతర కష్ట జీవులు మే ఒకటవ తేదీని ఎలా జరుపుకోవాలో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. అది వారి చైతన్యానికి గీటురాయి.

ముందుగా మే డే చరిత్ర గురించి తెలుసుకుందాం. అబ్బో దీని గురించి మాకు తెలియందేముంది, ప్రతి ఏటా ఏదో ఒక రూపంలో ఎన్నోసార్లు విన్నది, చదువుకున్నదేగా అని పెద్దలు అనుకుంటారు. ప్రపంచ పువ్వుల రోజు, లవ్వుల రోజు, నవ్వుల రోజుల మాదిరిగా ఇది కూడా 365రోజుల్లో ఇదొక రోజేగా అని యువత భావించవచ్చు. అనేక దేశాలలో చాలా మందికి ఇప్పటికీ , చివరికి దీనికి నాంది పలికిన అమెరికాలో సైతం మే డే గురించి తెలియదంటే అతిశయోక్తి కాదు. ప్రతిమనిషీ యాదృచ్చికంగానో లేదా కొంత మంది అన్నట్లు ప్రమాదవశాత్తో ఏదో ఒక మతాన్ని అవలంభించే కుటుంబంలో పుట్టటం తెలిసిందే. ఆయా మతాల దేవుళ్ల లేదా దేవ దూతలు లేదా ఇతర ప్రతినిధుల ప్రవచనాలు అనేకసార్లు విన్నప్పటికీ కుటుంబ, సామాజిక వుత్సవాల సందర్భాలలో మరోసారి వినేందుకు డబ్చిచ్చి మరీ ఏర్పాట్లు చేసుకుంటారు. అలాగే ఒక యజమాని దగ్గర వేతనం తీసుకొని పని చేసే ఐటి ఇంజనీరు, కార్యాలయ బంట్రోతు, ప్రభుత్వ వుద్యోగి, కార్మికుడు, గుమస్తా ఇలా ఎవరైనా తెల్ల చొక్కా లేక యూనిఫాం వేసుకున్నా అందరూ కార్మికులే. అందువలన ప్రతి ఒక్కరూ తమ వర్గానికి చెందిన అంతర్జాతీయ రోజు గురించి మంత్ర తంత్రాలు, ప్రవచనాల క్రతువు మాదిరి అయినా తెలుసుకోవాల్సిన అవసరం వుందా లేదా ?

Image result for mayday-haymarket

చాలా మంది మే డే అంటే ఎర్రజెండాల పార్టీల రోజు, కమ్యూనిస్టుల వ్యవహారం అనుకుంటారు. నిజానికి దీనికీ కమ్యూనిస్టుపార్టీకి సంబంధం లేదు. రోజుకు ఎనిమిది గంటల పని దినాన్ని అమలు జరపాలని కోరుతూ అమెరికాలోని కార్మికవర్గం కమ్యూనిస్టుపార్టీ పుట్టక ముందే అనేక ఆందోళనలు చేసింది. వాటిలో భాగంగా 1886 ఏప్రిల్‌లో అనేక చోట్ల సమ్మెలు, ప్రదర్శనలు జరిగాయి.వాటి కొనసాగింపుగా మే ఒకటవ తేదీన అమెరికా అంతటా ఒక రోజు సమ్మె జరపాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.ప్రభుత్వం సమ్మెను అణచివేసేందుకు పూనుకుంది.దాంతో చికాగో నగరంలో మే మూడవ తేదీన నిరసన ప్రదర్శనలు జరిగాయి. అనేక చోట్ల పోలీసులు కార్మికులపై విరుచుకుపడ్డారు. అనేక మంది గాయపడ్డారు, కొంత మంది మరణించారు. దాంతో మరింతగా ఆగ్రహించిన కార్మికులు నాలుగవ తేదీన హే మార్కెట్‌ ప్రాంతంలో సభ జరిపేందుకు పిలుపునిచ్చారు. పోలీసు యంత్రాంగ కుట్రలో భాగంగా అక్కడకు వచ్చిన పోలీసులపై వారి ఏజంటుతో బాంబుదాడి చేయించారు. ఒక పోలీసు మరణించాడు. దానిని సాకుగా చూపి పోలీసులు జరిపిన కాల్పులలో అనేక మంది కార్మికులు మరణించారు. రక్తం ఏరులై పారింది. అయినా కార్మికులు వెనక్కు తగ్గలేదు. బాంబు పేలుడుపై ఎనిమిది మంది కార్మికులను ఇరికించి ఒక తప్పుడు కేసు పెట్టారు. వారిలో ఏడుగురికి దిగువ కోర్టు మరణశిక్ష విధించింది. పై కోర్టులలో అప్పీలులో శిక్షలను ఖరారు చేశారు. 1987 నవంబరు పదిన ఒక కార్మికుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. మరుసటి రోజు నలుగుర్ని వురితీశారు. తరువాత ఆరు సంవత్సరాలకు మిగిలిన ఇద్దరికి ఇల్లినాయిస్‌ గవర్నర్‌ క్షమాభిక్షతో వురిశిక్షను రద్దు చేశారు.

Image result for mayday-haymarket

1889 జూలైలో పారిస్‌లో సమావేశమైన అంతర్జాతీయ సోషలిస్టు, కార్మిక పార్టీల ప్రతినిధులు(రెండవ ఇంటర్నేషనల్‌) చికాగో కార్మికుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది మే ఒకటవ తేదీని కార్మికుల దీక్షా దినంగా పాటించాలని ప్రతిపాదించి ఆ మేరకు 1890లో మే ఒకటిన అంతర్జాతీయంగా ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చారు. మరుసటి ఏడాది సమావేశమైన రెండవ ఇంటర్నేషనల్‌ వార్షిక సమావేశం మే ఒకటవ తేదీని ఖరారు చేస్తూ ప్రతి ఏడాదీ జరపాలని పిలుపు ఇచ్చింది. ఇది జరిగిన మూడు దశాబ్దాల తరువాత అమెరికాలో 1919లో, తరువాత మన దేశంలో, ఇంకా అనేక దేశాలలో కమ్యూనిస్టుపార్టీలు ఏర్పడ్డాయి. అందువలన ఎవరైనా మే డేను కమ్యూనిస్టుపార్టీలకు చెందినదిగా చిత్రిస్తే అది చరిత్రను వక్రీకరించటం తప్ప మరొకటి కాదు. అది కార్మికవర్గ వుద్యమం నుంచి ఆవిర్భవించింది. కమ్యూనిస్టు పార్టీలు కార్మిక, కర్షక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి కనుక మేడేను విధిగా పాటించటంతో చివరికి అది కమ్యూనిస్టుల కార్యక్రమంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

కార్మికవర్గం కంటే పెట్టుబడిదారీ వర్గానికే ముందు చూపు ఎక్కువని అనేక సందరా&భలలో రుజువైంది. తన చావు గోపబాలుడి చేతిలోనే వుందని గ్రహించిన కంసుడు చంపటానికి పుట్టుక నుంచి ఎలా ప్రయత్నించాడో అలాగే తనకు సమాధికట్టేది కార్మికవర్గం అని గ్రహించిన పెట్టుబడిదారీ వర్గం కూడా అదే చేసింది. చికాగో అమరజీవుల త్యాగం ప్రపంచ కార్మికవర్గానికి వుత్తేజం కలిగించేందు మే ఒకటవ తేదీని అంతర్జాతీయ కార్మికదినంగా పాటించాలని రెండవ ఇంటర్నేషనలన చేసిన నిర&ణయం తమ దేశ కార్మికవర్గాన్ని ప్రభావితం చేయకుండా చూసేందుకు అమెరికా పాలకవర్గం ప్రారంభం నుంచీ ప్రయత్నించింది. అమెరికా కార్మికోద్యమంలో సోషలిస్టు భావాలున్న శక్తులు చురుకుగా వుండటాన్ని గమనించిన పెట్టుబడిదారీ వర్గం తమ చెప్పుచేతలలో వుండే వారిని కార్మికనేతలుగా ముందుకు తెచ్చేందుకు ప్రయత్నించింది. సోషలిజాన్ని వ్యతిరేకించే నైట్స ఆఫ్‌ లేబరన పేరుతో వ్యవహరించేవారితో 1869లో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయించారు. వారి ప్రతిపాదనలలో సెప్టెంబరులో కార్మికులకు ఒక రోజు సెలవు ఇవ్వాలనే ఒక డిమాండు వుంది. దానిని ఆసరా చేసుకొని మే డే వైపు తమ కార్మికవర్గం మొగ్గకుండా చూసేందుకు 1887లో ఓరేగాన్లో, తరువాత 1894 నుంచీ దేశ వ్యాపితంగా సెప్టెంబరులో మొదటి సోమవారాన్ని కార్మికదిన సెలవుగా, కార్మికదినోత్సవంగా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. మే ఒకటవ తేదీని కార్మికదినంగా చేస్తే చికాగోలో హేమార్కెటన మాదిరి కార్మికులు కొట్లాటలకు దిగుతారని పాలకవర్గం ప్రచారం చేసింది. అయినప్పటికీ అక్కడి కార్మికులు మే డేను పాటించారు. తరువాత 1958లో కార్మికులను గందరగోళపరిచేందుకు, యజమానులకు విధేయులుగా చేసేందుకు మే ఒకటవ తేదీని అమెరికా విధేయతా దినంగా ప్రకటించింది. దానికి స్వాతంత్య్రవుద్యమ వారసత్వం అనే మనోభావాన్ని జోడించింది. ఇలాంటి ప్రయత్నాలను ప్రపంచంలో అనేక చోట్ల పాలకవర్గం చేసింది, చేస్తోంది.

Image result for mayday-haymarket

మన దేశంలో కార్మికవర్గం సమరశీలంగా తయారు కాకుండా , సోషలిస్టు, కమ్యూనిస్టు భావాలవైపు మళ్లకుండా చూసేందుకు గాను 1953న భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. జాతీయవాదం ముసుగులో మే ఒకటవ తేదీకి బదులు విశ్వకర్మ జయంతి రోజు పేరుతో కార్మికదినాన్ని పాటించాలని ఆ సంస్ధ నిర్ణయించింది. అయితే దాని సభ్యులుగా వున్న కార్మికులు మే డేను పాటిస్తున్నా వద్దని నివారిస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయనే భయంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తుంది. ఇలాంటివే చరిత్రలో అనేకం గురించి చెప్పుకోవచ్చు.

ఇరవయ్యవ శతాబ్దం ప్రపంచ కార్మికవర్గానికి అనేక పాఠాలు నేర్పింది. ప్రపంచంలో తొలి కార్మికరాజ్యాన్ని, తరువాత అనేక దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలను వునికిలోకి తేవటంలో కార్మికవర్గం ముందు పీఠీన వుంది. అదే కార్మికవర్గం 1990 దశకంలో సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేస్తుంటే కళ్లప్పగించి చూడటమే కాదు, ఎండమావుల వంటి పెట్టుబడిదారీ వ్యవస్ద స్వర్గాలను చేరాలనే అత్యాశతో తాను కూడా సోషలిస్టు వ్యతిరేక శక్తులతో చేతులు కలపటం కూడా ఆ శతాబ్దంలోనే జరిగింది. కార్మికవర్గం సోషలిస్టు భావజాలం వైపు మొగ్గకుండా చూసేందుకు పెట్టుబడిదారీ వర్గం రెండవ ప్రపంచ యుద్దం తరువాత తన లాభాలను కాపాడుకొనేందుకు నూతన మార్గాలను వెతుకుతూనే కార్మికవర్గానికి కొన్ని రాయితీలు కల్పించి, సంక్షేమ కార్య క్రమాలను అమలు జరిపింది. సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్దలను కూల్చివేసిన తరువాత కమ్యూనిజం, సోషలిజాలకు కాలం చెల్లిందనే ప్రచారదాడితో పాటు అంతకు ముందు తాను అమలు జరిపిన అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయటం, కార్మికవర్గంపై కొత్త భారాలను మోపటం గత పాతిక సంవత్సరాలలో ఐరోపా, ఇతర ధనిక దేశాలలో చూశాము. ఇదే సమయంలో సోషలిస్టు వ్యవస్ధలను కాలదన్నుకున్న దేశాల కార్మికవర్గ పరిస్థితులు మరింతగా దిగజారాయి. అనేక సమస్యలున్నప్పటికీ ఇప్పటికీ సోషలిస్టు వ్యవస్దలున్న చైనా, వియత్నాం, క్యూబా వంటి చోట్ల కార్మికవర్గ పరిస్థితులు మెరుగ్గా వున్నాయన్నది దాచినా దాగని సత్యం.

పెట్టుబడిదారీ వర్గం అమలు జరుపుతున్న వుదారవాద విధానాల ప్రభావం, ప్రపంచ సోషలిస్టు శిబిరానికి తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలిన తరువాత యాజమాన్యవర్గాలదే పై చేయి అయింది. కార్మికవర్గాన్ని మరింతగా దోచుకొనేందుకు కార్మికవర్గంపై అనేక షరతులను రుద్దుతున్నారు. వాటిని వుల్లంఘిస్తే వుద్యోగాల నుంచి వూడగొడతామని బెదిరిస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నారు. ప్రభుత్వాలు సామాజిక బాధ్యతల నుంచి వైదొలుగుతున్నాయి. కార్మిక చట్టాలను నీరు గార్చటంతో పాటు వున్న చట్టాలను కూడా అమలు జరపకుండా, కనీసం తనిఖీ చేసే అధికారం కూడా కార్మికశాఖకు లేకుండా వ్యవస్ధను నిర్వీర్యం చేస్తున్నారు. అనేక చట్టాలను పూర్తిగా ఎత్తివేయటానికి పూనుకున్నారు. కార్మిక సంఘాలు కొన్ని వర్గసామరస్య విధానాల వూబిలో కూరుకుపోయాయి. పైరవీల ద్వారా కొన్ని రాయితీలను సాధించుకొనేందుకు పూనుకున్నాయి. భవిష్యత్‌ తరాల ప్రయోజనాలను గాలికి వదలి పెట్టాయంటే అతిశయోక్తి కాదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వుద్యోగులు, కార్మికులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. వుదాహరణకు కేంద్ర ప్రభుత్వ వుద్యోగుల వేతన సవరణ విషయమే చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది తీసుకోవటం తప్ప న్యాయంగా తమకు రావాల్సిందాన్ని సాధించుకొనేందుకు కనీసం అన్ని తరగతుల వుద్యోగులు, కార్మికులు ఒక రోజు సమ్మె చేసేందుకు కూడా అనువైన పరిస్ధితులు నేడు లేకపోవటానికి ప్రపంచవ్యాపితంగా మారిన పరిస్థితులు, వర్గ సామరస్య వైఖరే కారణం. ఇదే ధోరణి కానసాగితే భవిష్యత్‌లో మరింత దారుణ స్ధితిలోకి నెట్టబడతారని గుర్తించాలి. 2004 తరువాత ప్రభుత్వ వుద్యోగాలలో చేరిన వారు నూతన పెన్షన్‌ పధకం పేరుతో తమ పెన్షన్‌కు తామే డబ్బు చెల్లించుకుంటున్నారు. దానిని ప్రారంభం నుంచీ వామపక్ష పార్టీలు, ఆ పార్టీల కార్యకర్తలు పనిచేసే కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.కొంత మంది ఈ స్కీమును బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం వాజ్‌పేయి ప్రధానిగా వుండగా ప్రవేశపెట్టింది కనుక కమ్యూనిస్టులు వ్యతిరేకించారని కొందరు ఆ రోజుల్లో తప్పుడు వ్యాఖ్యానాలు చేసిన వారున్నారు. అసలు ఇప్పుడు చాలా మందికి ఇది బిజెపి సర్కార్‌ పుణ్యమే అని తెలియదు. 1998-2004 మధ్య కాలంలో అధికారంలో వున్న వాజ్‌పేయి సర్కార్‌ 1999లో ‘ఒయాసిస్‌ ‘(ఓల్డ్‌ ఏజ్‌ సోషల్‌ అండ్‌ ఇన్‌కమ్‌ ) పేరుతో ఒక ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. దాని సిఫార్సుల ప్రాతిపదికన నూతన పెన్షన్‌ పధకాన్ని రూపొందించింది. దాన్ని అమలు చేసేందుకు పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీని కూడా ఏర్పాటు చేశారు. 2003 డిసెంబరు 22న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం 2004 జనవరి ఒకటవ తేదీ తరువాత చేరిన సాయుధ దళాల సిబ్బంది తప్ప ప్రభుత్వ వుద్యోగులందరూ ఈ స్వచ్చంద పెన్షన్‌ స్కీములో విధిగా చేరాల్సి వచ్చింది. ఇది అమెరికాలో అమలులో వున్న 401(కె) పెన్షన్‌ స్కీముకు అనుకరణ తప్ప ‘భారతీయ’ పధకం కాదు. రాజకీయ పరిభాషలో చెప్పాలంటే బిజెపి అమలులోకి తెచ్చిన ఈ పధకాన్ని తరువాత పది సంవత్సరాలు అధికారంలో వున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం పక్కాగా అమలు చేసింది. ఆ నాడు వుద్యోగ సంఘాలు నామ మాత్ర వ్యతిరేకత తప్ప దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు, ప్రతిఘటించలేదు. అప్పటికే వుద్యోగులుగా వున్న వారు అది తమకు వర్తించదు కనుక రాబోయే వుద్యోగులే చూసుకొంటారు మనకెందుకు లెమ్మని వుదాసీనంగా వున్నారు. వారిలో తమ భవిష్యత్‌ కుటుంబ సభ్యులు వుంటారని కూడా ముందు చూపుతో ఆలోచించలేదంటే అతిశయోక్తి కాదు. ఈ రోజు ఆ పెన్షన్‌ స్కీము కింద చేరిన వుద్యోగులు దాని తీరుతెన్నులు చూసి గొల్లు మంటూ రద్దు కోసం ఆందోళనలు చేయాలని కోరుతున్నారు. చిత్రం ఏమిటంటే గతంలో వుద్యోగ సంఘాల నేతలుగా వుండి ఏ మాత్రం పట్టించుకోని నేతలు తగుదునమ్మా అంటూ ఇప్పుడు నూతన పెన్షన్‌ వ్యతిరేక ప్రకటనలు చేయటం గమనించాల్సిన అంశం. తెలంగాణా వంటి చోట్ల వుద్యోగ సంఘాల నేతలుగా పని చేసిన వారు ప్రభుత్వంలో కూడా భాగస్వాములుగా వున్నారు. అయినా ఆ ప్రభుత్వం నూతన పెన్షన్‌ స్కీమును అమలు చేస్తోంది తప్ప రద్దు చేసే విషయాన్ని కనీసం పరిశీలనలోకి కూడా తీసుకోలేదు.

ఇక ఏడవ వేతన కమిషన్‌ చేసిన దారుణమైన సిఫార్సులు, వాటిని అమలు జరిపేందుకు మోడీ సర్కార్‌ వుద్యోగుల మెడలు వంచిన తీరు గురించి తెలిసిందే. వాటి మంచి చెడ్డల గురించి ఇక్కడ చర్చించనవసరం లేదు. సాధ్యమైన మేరకు తాము ఇవ్వదలచుకున్నదానికే వుద్యోగుల చేత ఆమోదింపచేయించేందుకు చేయాల్సిందంతా చేశారు, చేస్తున్నారు. కేంద్ర వుద్యోగులకు ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి వర్తింప చేసే అలవెన్సుల గురించి ప్రకటన వెలువడుతుందని ఎంతో ఆశించి ఫూల్స్‌ అయ్యారు.అసలు ఎప్పుడు వాటిని ఖరారు చేస్తారో కూడా తెలియని స్ధితి ఇప్పుడు నెలకొందంటే అతిశయోక్తి కాదు. ఆర్ధికశాఖ కార్యదర్శి అశోక్‌ లావాస నాయకత్వంలోని అలవెన్సుల కమిటీ నివేదిక గతేడాది నవంబరునెలలోనే వెలువడాల్సి వుంది. ప్రభుత్వం దాని గడువును మూడు నెలలు పొడిగించింది. ఫిబ్రవరిలో వెలువడాల్సిస సిఫార్సుల నివేదికకు ఐదు రాష్ట్రాల ఎన్నికల కోడ్‌ అడ్డం వచ్చిందని చెప్పారు. ఎన్నికలైపోయాయి. ఏర్పడిన కొత్త ప్రభుత్వాలు పాతపడుతున్నాయి. ఇంతవరకు నివేదికను సమర్పించలేదు. ఎప్పుడు ఇస్తారో తెలియదు. దానిని ప్రభుత్వం పరిశీలించేది ఎప్పుడు ఖరారు చేసేది ఎన్నడో చెప్పనవసరం లేదు. కాలం గడిచే కొద్దీ గతేడాది జనవరి నుంచి అమలు కావాల్సిన అలవెన్సుల బకాయిల గురించి వుద్యోగులు ఆశలు వదులుకొని ఏదో ఒకటి అసలు అలవెన్సులు ప్రకటిస్తే చాలనే విధంగా పరిస్ధితిని తెచ్చేందుకు చూస్తున్నారన్నది స్పష్టం. తాజాగా మూడు శాతం డిఎ వస్తుందని చూసిన వుద్యోగులు రెండుశాతం ప్రకటనతో కంగుతిన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాల విషయానికి వస్తే వేతన బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో తెలియని స్ధితి. మరో వేతన సవరణ నాటి వరకు వాయిదా వేస్తారని చెప్పినా అతిశయోక్తి కాదు.

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడటం వలన ఆశాభంగమే తప్ప జరిగేదేమీ వుండదు. సంఘాలలో చేరటమే కాదు, వాటి నాయకత్వాలు అనుసరిస్తున్న రాజీపద్దతుల గురించి నిలదీయాలి. న్యాయమైన డిమాండ్లపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి. వుద్యోగులు తమకు న్యాయంగా రావాల్సిందానిని కోరుతున్నారు తప్ప గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. నేడు, నా సంగతి నేను చూసుకుంటే చాలు అని గాక రేపు, మన సంగతేమిటి అని కూడా విశాల దృక్పధంతో ఆలోచించటం అవసరం.

గమనిక:ఈ వ్యాసం ‘ ఎంప్లాయీస్‌ వాయిస్‌ ‘ పత్రిక కోసం రాసినది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆత్మవంచన మాని బిజెపి తన కింది నలుపును చూసుకుంటుందా !

27 Monday Mar 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, RELIGION

≈ Leave a comment

Tags

BJP, BJP values, Casinos, Goa, Goa BJP, Goa Casinos, RSS, RSS Duplicity, The hippocratic BJP, UP News, Yogi Adityanath

Image result for yogi adityanath sabka sath,sabka eek cartoons

ఎంకెఆర్‌

యోగులైనా, భోగులైనా తమ తమ మఠాలు, మందిరాలకు పరిమితమైనంత వరకే వారి చర్యలు ప్రయివేటు వ్యవహారాలు. గీత దాటి బహిరంగ జీవితంలోకి వస్తే వారి చర్యల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసేందుకైనా సభ్య సమాజానికి హక్కు, అవకాశం వుంటుంది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న, తలెత్తుతున్న చర్చలు, అభిప్రాయాలపై కొన్ని శక్తులు తమ అసహనాన్ని వెళ్ల గక్కుతున్నాయి. వాటిపై ప్రతి వ్యాఖ్య, విమర్శ వేరు, అవి చేయలేక అసహనం వ్యక్తం చేయటం మరో తీరు. గతంలో ఎన్నో నీతులు, రీతులు బోధించిన బిజెపి ఇప్పుడు వాటిని తానే దిగమింగి వ్యవహరిస్తోందనే విమర్శలను ఎదుర్కొంటోంది. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినవారిపై ఆ పార్టీ అనుచరగణం విరుచుకుపడిపోతున్నది. మిత్ర సూచనలు, హెచ్చరికలను కూడా ‘సహించ ‘టం లేదు. ఇది కచ్చితంగా భారతీయ సంస్కృతి కాదు.

Image result for yogi adityanath sabka sath,sabka eek cartoons

ప్రస్తుతం వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బిజెపి ఎంపిక చేసిన వ్యక్తి యోగి ఆదిత్యనాథ్‌. అయోధ్యలో బాబరీ మసీదును కూలదోసి దాని స్ధానంలో రామమందిరం కట్టాలన్న హిందూత్వ వాదుల నాయకత్వాన్ని చూసి వుత్తేజితుడై తన జీవితాన్ని రామమందిరం, హిందూత్వకోసం అంకితం చేయాలని చిన్నతనంలోనే నిర్ణయించుకున్నారు. అది ఆయన ఇష్టం, దానిలో భాగంగానే ముస్లింల వ్యతిరేక వ్యాఖ్యలు, ఇతరనేరపూరిత చర్యలకు పాల్పడిన కారణంగా కేసులు నమోదు చేసినా వెనక్కు తగ్గలేదు. చట్టం ఇంకా తనపని తాను చేయలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన హిందూత్వకు ప్రతీక, హిందూత్వను అమలు జరపటానికే బిజెపి, దాని మార్గదర్శ సంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంపిక చేసిందని కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలపై యోగి అనుయాయులు భజరంగ భళీ-బలి అంటున్నారు. వారు ఆత్మవంచనకు పాల్పడుతున్నారని ఎవరైనా అంటే తప్పేముంది.

ప్రజాసేవకోసం చిన్నతనంలోనే దేశ సేవకు, బ్రిటీష్‌ వారిని ఎదిరించేందుకు అంకితమైన అల్లూరి, భగత్‌సింగ్‌, సుందరయ్య వంటి వారి గురించి ఎన్నో విన్నాం. సామాన్యజనం వారిని విప్లవకారులని పిలిచినందుకు వారి జీవితాలను ఆదర్శంగా తీసుకున్నవారేమీ అభ్యంతర పెట్టలేదు, అసహనం వ్యక్తం చేయలేదు. వారి చర్యలతో తమకు ప్రమాదం అని భావించిన శక్తులు వాటికి ప్రాతినిధ్యం వహించిన నాటి ప్రభుత్వాలు వారిని సమాజంలో అశాంతిరేపేవారుగా చిత్రించి ఆరోపణలు చేయటాన్ని జనం అంగీకరించలేదు. అనేక మంది వారి బాటలో నడిచారు, ఇప్పటికీ నడుస్తున్నారు.

Image result for BJP, hippocracy, values cartoons

అలాగే ఆంగ్లేయుల పాలనను వ్యతిరేకించే వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి జైలు జీవితాన్ని తట్టుకోలేక అదే బ్రిటీష్‌ ప్రభుత్వానికి లొంగిపోయి లేఖలు రాసి తన రాణీగారీ భక్తిని ప్రదర్శించుకున్న విడి సావర్కర్‌ గురించి కూడా మనకు తెలుసు. ఆయనొక ఎత్తుగడలో భాగంగా ఆ లేఖలు రాశారని అందువలన ఆయన దేశభక్తుడే అన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ వారి వ్యాఖ్యానం. దాన్ని సమాజం అంగీకరించిన దాఖలాలు లేవు. కానీ ఆ తరువాత స్వాతంత్య్రపోరాటంలోకి దూకిన భగత్‌ సింగ్‌కు అలాంటి తెలివితేటలు, ఎత్తుగడలు లేవు, చిరునవ్వుతో ప్రాణాలు అర్పించటం తప్ప మరొకటి తెలియని అసలు సిసలు దేశ భక్తుడు. బ్రిటీష్‌ వారికి విధేయుడిగా వుంటానని లేఖ రాసిన సావర్కర్‌ ఆ తరువాత ఎక్కడా బ్రిటీష్‌ వ్యతిరేకపోరాటంలో కనపడరు. వారికి మరో రూపంలో సాయం చేసేందుకు హిందూత్వను ముందుకు తెచ్చారు. ఆయన రాసిన లేఖ బయటపడిన తరువాత కూడా సావర్కర్‌ను దేశభక్తుడిగా సమర్ధించేందుకు, భగత్‌ సింగ్‌ కంటే పెద్ద త్యాగధనుడిగా చిత్రించేందుకు, ఆయన ముందుకు తెచ్చిన హిందూత్వకు వారసులుగా చెప్పుకోవటానికి అనేక మందికి ఎలాంటి అభ్యంతరం వుండటం లేదు. అలాంటపుడు యోగి ఆదిత్యనాధ్‌ హిందూత్వవాది గురించి ఆయనను వ్యతిరేకించేవారు ఏమి అన్నప్పటికీ సరైన బాటలోనే నడుస్తున్నారని భావించే ఆయన అభిమానులు సంతోషంతో పులకించి పోవటానికి బదులు హిందూత్వ ప్రతినిధి అని వ్యాఖ్యానించిన వారిని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది. అలా చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నారా ?

కాంగ్రెస్‌ తాను ప్రవచించిన ఆదర్శాలను ఎప్పుడో వదలి పెట్టింది. అందుకు తగిన ఫలితాలు అనుభవిస్తున్నది. దానికి భిన్నమైన పార్టీ అని కదా బిజెపి చెప్పుకున్నది. మాంసం దగ్గర మంచోడి సంగతి తెలుస్తుందన్నది ఒక సామెత. ఇప్పుడు బిజెపికి అది చక్కగా వర్తిస్తుంది. దాని నిజరూపం వామపక్ష శక్తులు, ప్రజాతంత్ర శక్తులలో కొంత భాగానికి ముందే తెలిసినా సామాన్య జనానికి అర్ధం కావటం ఇప్పుడే ప్రారంభమైంది. ఆ పార్టీ ఆత్మవంచన, పరవంచన గురించి మచ్చుకు రెండు అంశాలను చూద్దాం.

Image result for yogi adityanath sabka sath,sabka eek cartoons

హాజ్‌యాత్రకు సబ్సిడీ లేదా రాయితీ ఇచ్చి ముస్లింలను సంతృప్తి పరచి ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకొనేందుకు ఇతర పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయని ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ సంస్ధలైన బిజెపి వంటివి ఎన్నో ఏళ్లుగా నానా యాగీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ రాయితీని క్రమంగా తగ్గించి 2022 నాటికి పూర్తిగా రద్దు చేయాలని 2012లో సుప్రీం కోర్టు ఆదేశించింది. చిత్రం ఏమంటే మానస సరోవర యాత్ర చేసేందుకు హిందువులకు లక్ష రూపాయల వరకు ఇవ్వటానికి నిర్ణయించినట్లు యోగి ఆదిత్యనాధ్‌ ప్రకటించారు. ముస్లింలకు హాజ్‌ హౌస్‌లు నిర్మించినట్లుగానే మానస సరోవర్‌ యాత్రీకులకూ ఢిల్లీ సమీపంలో భవనాలు నిర్మించనున్నట్లు కూడా ప్రకటించారు. ఇదేమిటి? ఒక మత యాత్రకు అభ్యంతరం తెలిపిన వారు మరొక మత యాత్రకు సబ్సిడీలు ఇవ్వటం ప్రారంభించటాన్ని ఏమనాలి? మైనారిటీ మత సంతుష్టీకరణ మాత్రమే తప్పు మెజారిటీది ఒప్పు అంటారా ?

ఇక బీఫ్‌ గురించి చూద్దాం. రీడ్‌ ఇండియా రైట్‌ ( ఇండియా మితవాదులు చెప్పేది చదవండి) అని టాగ్‌లైన్‌ పెట్టుకున్న పత్రిక ‘స్వరాజ్య ‘. దాని సారధి ఆర్‌ జగన్నాథన్‌. అక్రమంగా వున్న కబేళాల మూసివేతకు యోగి ఆదిత్యనాథ్‌ తొందర పడితే జరిగే మంచికంటే నష్టమే ఎక్కువ అనే శీర్షికతో ఆయనొక విశ్లేషణ రాశారు. ఇంకేముంది ఆ పత్రికను చదివే మితవాదులు అతగాడొక కమ్యూనిస్టు అని, వుద్యోగం నుంచి తొలగించాలంటూ దాడికి దిగారు. ఎన్నికలలో మెజారిటీ సంపాదించటం వేరు ప్రభుత్వాలు అందరికోసం పని చేయాలి. యోగి తొలి చర్యలు చూస్తుంటే సబ్‌కాసాత్‌ సబ్‌కా ఏక్‌ ను సాధించే అవకాశమే లేదని, పెద్ద సంఖ్యలో మైనారీటీల మనసులను విరిచివేస్తాయని జగన్నాధన్‌ వ్యాఖ్యానించారు.గోవధనిషేధం అంటే ఆవు ఆర్ధిక విలువ పడిపోవటమేనని, దున్న లేక బర్రె మాంసానికి డిమాండ్‌ పెరుగుతున్న కారణంగా ఆవుల రాష్ట్రాలుగా వున్న ప్రాంతాలలో వాటి స్ధానంలో గేదెలు పెరుగుతున్నాయని,2007 లెక్కల ప్రకారం దేశంలోని మొత్తం పశు సంపదలో గేదెలశాతం 34.6కాగా హర్యానాలో 79.3, పంజాబ్‌లో 74, వుత్తర ప్రదేశ్‌లో 55.8, ఆంధ్రప్రదేశ్‌లో 54.2, గుజరాత్‌లో 52.4, రాజస్తాన్‌లో 47.8, బీహార్‌లో 34.8శాతం వున్నాయి. గేదెల శాతం అతి తక్కువగా వున్న కేరళ 3.2, బెంగాల్‌ 3.8, ఈశాన్య రాష్ట్రాలలో 4.6శాతం కాగా అక్కడ గోవధ లేదా గొడ్డు మాంసం విక్రయాలపై నిషేధం లేదని జగన్నాధన్‌ పేర్కొన్నారు.అవు ప్రాంతాల హిందువులు తమ పార్టీకి ఓటు వేసిన చోట గేదెల కంటే తక్కువ ఆర్ధిక విలువ కారణంగా ఆవులను వదిలించుకుంటున్న విషయాన్ని యోగి ఆదిత్యనాధ్‌ గమనించవచ్చని ఈ నేపధ్యంలో పశువధ శాలలపై నిషేధం గురించి పునరాలోచించాల్సిన అవసరం వుందని వ్యాఖ్యానించారు. ఆవు మరియు దున్న-గేదె మాంసానికి తేడాను సులభంగా తెలుసుకోలేని స్ధితిలో అత్యధిక నిఘా బృందాలు వున్న కారణంగా యోగి ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారని ముగించారు.

దేశం నుంచి జరుగుతున్న దున్న-గేదె మాంస ఎగుమతుల్లో సగం వుత్తర ప్రదేశ్‌ నుంచే వున్నాయి. అనధికార కబేళాల మూసివేత పేరుతో తీసుకుంటున్న చర్యల వలన జరిగే ఆర్ధిక, వుపాధి నష్టాలను పూడ్చేందుకు ప్రత్యామ్నాయ చర్యలు లేకుండా మొరటుగా ముందుకు పోయినట్లయితే జరిగే నష్టం ముస్లింలకే కాదు, వాటిపై ఆధారపడిన ఇతర వెనుకబడిన తరగతులు, గిరిజనులు, దళితులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అనుమతి వున్న కబేళాల జోలికి తాను పోవటం లేదని, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు అనధికారికంగా నడుపుతున్నవాటి మీదే చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్న ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్‌ సమర్ధనలు జగన్నాధన్‌ వంటి బిజెపి భక్తులకు తెలియకుండానే ఇలాంటి వ్యాఖ్యానం చేసి వుంటారని అనుకోగలమా ? ఎన్నికల తరువాత ఇలా మాట్లాడుతున్న జగన్నాధన్‌ వంటి వారు బీఫ్‌ లేదా గొడ్డు మాంసాన్ని వివాదాస్పదం చేసి ఓట్ల లబ్ది పొందేందుకు చూస్తున్నపుడు ఎందుకు మౌనంగా వున్నట్లు ?

అనధికార కబేళాలను ఎవరూ సమర్ధించరు, అదే సమయంలో వాటివలన జరిగే నష్టమూ లేదు. సదుద్ధేశ్యంతో వాటిని క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకొని వుంటే అక్కడి మాంసం వ్యాపారులు సమ్మెకు దిగి వుండేవారు కాదు. బీఫ్‌ తినేవారు, తయారు చేసేవారు కేవలం ముస్లింలే కాదు ఇతరులు కూడా వున్నారని గ్రహిస్తే మంచిది. పురాణాల ప్రకారం ఆవులతో పాటు దున్నలు కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినవే. యముడి వాహనం దున్న. ఆవు పవిత్రత దున్నలు-గేదెలకు లేదా?ఎందుకీ ఆత్మవంచన?

ఎన్నో నీతులు చెప్పే బిజెపి ఏటా ఎన్నో కుటుంబాలలో చిచ్చు రేపుతున్న, జేబులను గుల్ల చేస్తున్న జూదశాలలను నిషేధించాలని గతంలో డిమాండ్‌ చేసింది. జూదం మనదే కాదు, ఏ సభ్య సమాజ సంస్కృతీ కాదు. కానీ మన సంస్కృతిని పరిరక్షించే ఏకైక రక్షకురాలిని అని చెప్పుకొనే బిజెపి గత ఐదు సంవత్సరాలుగా అధికారంలో వున్న గోవాలో అక్కడి జూదశాలలపై ఎలాంటి నిషేధం విధించలేదు. గోవా ఆర్ధిక వనరులను పెంచే పేరుతో గతంలో కాంగ్రెస్‌ పాలకులు జూదశాలలకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు గోవా గడ్డమీద, మాండవీ నది మీద కలిపి దాదాపు ఇరవై జూదశాలలున్నాయి. బిజెపి వాటిని కొనసాగించింది. ఈ ఐదు సంవత్సరాలలో గోవాలో ‘ఎంజాయ్‌’ చేసే వారి సంఖ్య పెరగటం తప్ప తగ్గిన దాఖలాలు లేవు. ఆర్‌ఎస్‌ఎస్‌ వారి భారతీయ సంస్కృతి పరిరక్షణ లక్ష్యం ఏమైనట్లు ? అక్కడ జరిగే పర్యావరణ హాని గురించి వారికి పట్టదు.గోవాలో అనధికారికంగా నడుస్తున్న జూదశాలల గురించి తెలిసినప్పటికీ వాటి గురించి పట్టించుకోలేదు.అదేమి చిత్రమో దేశమంతటా సంస్కృతి పరిరక్షణ పేరుతో ఏ పార్కులో ఏ ప్రేమికులున్నారో వెతికేందుకు, వారిపై దాడులు చేసేందుకు వివిధ సంస్ధల ముసుగులో వుత్సాహం చూపే ఆర్‌ఎస్‌ఎస్‌ ఖాకీ వాలాలు, గోవాలో మనకు ఎక్కడా కనపడరు.

అనధికారికంగా మాంసం దుకాణాలు నిర్వహిస్తున్నవారందరూ అక్రమాలకు పాల్పడుతున్నవారిగా జమకడితే అంతకంటే అన్యాయం మరొకటి వుండదు. కానీ యోగి గారు అదే తన ప్రాధాన్యత అంటున్నారు. ఇదే సమయంలో అదే పార్టీకి చెందిన గోవా పాలకులు ఎన్నో కుటుంబాలను బలితీసుకొనే, ఎందరో మహిళల జీవితాలను అతలాకుతలం గావించే అక్కడి జూదశాలలను మాత్రం అరికట్టరు. మాదక ద్రవ్యాలకు, అత్యాచారాలు, హత్యలు, అన్ని రకాల వ్యభిచారాలకు నిలయం గోవా అన్నది జగమెరిగిన సత్యం. అందుకే దేశ విదేశాల నుంచి వీటన్నింటినీ అనుభవించటానికి( ఎంజాయ్‌ చేయటానికి) వచ్చే వారికి మాత్రం టూరిజం పేరుతో సకల సౌకర్యాలను కల్పిస్తున్నారు.ఒకే పార్టీ ! ఎందుకీ ఆత్మవంచన?

Image result for goa bjp,casinos cartoons

అభివృద్ధి నినాదాన్ని నిత్యం పారాయణం చేస్తున్న బిజెపి, దాని మిత్రులైన చంద్రబాబు నాయుడి వంటి వారు టూరిజం అభివృద్ధి పేరుతో జూదశాలలకు తెరతీయటానికి ప్రయత్నిస్తున్నారు. సంస్కృతి పరిరక్షకులుగా ఫోజు పెడుతున్న మనువాదులు, నయా జాతీయ వాదులు, వారి మద్దతుదారులు జూదాన్ని ఎంత నాజూకుగా సమర్ధిస్తున్నారో ‘స్వరాజ్య’ పత్రికలో వెల్లడైన అభిప్రాయాలు చదివితే మతిపోతుంది. పశువధ నిషేధం ద్వారా యోగి ఆదిత్యనాధ్‌ చర్యలతో మంచికంటే చెడే ఎక్కువ వుంటుంది అని చెప్పిన జగన్నాధన్‌ను విమర్శించిన స్వరాజ్య పత్రిక పాఠకులు కొందరు గోవాలో జూదశాలల గురించి సమర్ధనకు పూనుకున్నారు. వేదాలలోనే జూదం గురించి వుందట. బలి ప్రతిపాద, లక్ష్మీపూజ అంటే ద్యూత క్రీడ అని టీకాతాత్పర్యాలు చెబుతున్నారు. బెట్టింగ్‌, నగదు అక్రమలావాదేవీలను అరికట్టాలంటే బ్రిటన్‌ మాదిరి జూదశాలలను అనుమతించాలని కొందరు, ఆదాయపన్ను కట్టేవారినే అలాంటి వాటిలో అనుమతించాలని మరికొందరు సూచించారు. కౌటిల్యుడు తన అర్ధశాస్త్రంలో వేశ్యావృత్తిని పూర్తిగా నిషేధించకుండా క్రమబద్దీకరించాలని మాత్రమే చెప్పాడని కొందరు సమర్ధించారు. ఎవరేమి చెప్పినా నీవు చేయాల్సిందాని గురించి తప్ప పర్యవసానాలపై నీ అదుపు వుండదని శ్రీకృష్ణుడు చెప్పారంటూ మద్దతు. ఇలాంటి వాదనలు దోపిడీదారులు లేదా దోపిడీ సమాజం వున్నదాన్ని వున్నట్లు వుంచాలని కోరుకొనే వారు చేసే వుద్ధేశ్యపూర్వక ప్రచారంలో భాగం లేదా వాటిని ఎందుకు అనే ప్రశ్న వేసుకోకుండా నమ్మి ప్రచారం చేసే వారు మరికొందరు. హానిలేని పశువధ శాలల మూసివేతకు వుత్తర ప్రదేశ్‌లో ఆతృపడుతున్న బిజెపి గోవాలో గత ఐదు సంవత్సరాలలో అధికారంలో వుండి, తాజాగా అడ్డదారిలో పాగావేసి జన జీవితాలను నాశనం చేసే జూదశాలల అనుమతుల రద్దుకు, అనుమతి లేని ఇతర అక్రమ చర్యల నివారణకు ఎందుకు చర్యలు తీసుకోదు ? పశ్చిమ దేశాలు ఆత్మవంచన చేసుకుంటున్నాయని విమర్శించే బిజెపి తన కింది నలుపును చూసుకుంటుందా ? జనాన్ని మభ్యపెట్టటం మానుకుంటుందా?

Share this:

  • Tweet
  • More
Like Loading...

యుపి ముఖ్య మంత్రిగా ‘చెడ్డ పిల్లాడు’ ఆదిత్యనాథ్‌ !

22 Wednesday Mar 2017

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ 1 Comment

Tags

Anti Muslim, BJP, Hinduthwa, naughty boy, UP CM, YogiAdityanath

Image result for yogi adityanath

ఎం కోటేశ్వరరావు


ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి, కొత్త ప్రభుత్వాలు కొలువు తీరాయి. వుద్రేకాలు, వుద్వేగాలు, అధికార రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి నిజాయితీగా ఆలోచించాల్సిన సమయమిది. ప్రజాస్వామ్యాన్ని వమ్ము చేయటంలో కాంగ్రెస్‌ కంటే తామేమీ వెనుకపడలేదని, తమకూ ఆ సత్తా వుందని బాల్యంలోనే బిజెపి నిరూపించుకుంది. ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే ఈ క్రీడలో మాకు మేమే సాటి, బస్తీమే సవాల్‌ అంటూ తొడగొడుతున్న బిజెపిని ప్రస్తుతానికి ఎవరేమీ చేయలేరనే వాతావరణం అంతటా ఆవరించి వుంది. కాంగ్రెస్‌ అప్రజాస్వామిక, నియంతృత్వ రూపం బయట పడటానికి దేశానికి 28 సంవత్సరాలు పట్టింది.(1975 అత్యవసర పరిస్ధితి) మీడియా ఎంతగా మూసిపెట్టాలని చూసినా బిజెపి గురించి తెలుసుకోవటానికి అంత వ్యవధి అవసరం లేదు. స్వాతంత్య్ర వుద్యమం అనే ఒక ప్రజాతంత్ర ప్రవాహం నుంచి వచ్చిన కాంగ్రెస్‌ నేతలు అందుకు విరుద్దమైన మారుమనసు పుచ్చుకోవటానికి మూడు దశాబ్దాలు పట్టింది. బిజెపి పూర్తిగా తన సంఖ్యాబలంపై ఆధారపడి అధికారానికి వచ్చిన మూడు సంవత్సరాలు కూడా పూర్తిగాక ముందే తానేమిటో బహిర్గతం చేయటం ప్రారంభించింది. పురాణాల ప్రకారం నరకుడనే రాక్షసుడు విష్ణుమూర్తి-భూదేవికి పుట్టినట్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రారంభమే వివాదాస్పదం, భయానికి నాంది పలికింది. అందువలన ఇప్పుడు బిజెపికి మద్దతు ఇస్తున్నవారందరూ దాని గతాన్ని అంగీకరించి ఆ పని చేస్తున్నారని అనుకోలేము.నరకుడిని భరించలేని స్ధితిలో విష్ణువు మరో రూపంలో తల్లిచేతనే సంహరింపచేసిన దీపావళి కథ తెలిసిందే. చరిత్రలో ఇలాంటి పనులు చేసిన వ్యక్తులు, శక్తులు చివరికి ఏమయ్యాయో కూడా చూస్తూనే వున్నాం.

మన గొప్పతనం గురించి మాత్రమే కాదు, మన బలహీనతల గురించి కూడా వ్యాఖ్యానించే స్వేచ్చ మనకు వుండాలి. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో మూడు చోట్ల బిజెపి ఓడిపోయింది. రెండు చోట్ల గెలిచింది. నాలుగు చోట్ల మంత్రి వర్గాలను ఏర్పాటు చేసింది. ఇదెలా సాధ్యమైంది అని ప్రశ్నించేవారు లోకం పోకడ పట్టించుకోని, ఈ కాలానికి తగని వారు అనుకోవటం తప్ప మరొక విధంగా చెప్పలేం. అన్నయ్యా వాలిని, రావణుడిని రాముడు చంపా డాలేదా అని తప్ప ఎలా అన్నది ముఖ్యం కాదు అన్నట్లు, ప్రస్తుత పరిస్ధితుల్లో మనం ఆవు అంటే వీపులు పగులగొట్టే వారు సిద్ధంగా వున్నారు కనుక మరో విధంగా చెప్పుకుందాం. మన గేదె లేక బర్రె ఏ దొడ్లో కట్టింది అని కాదు మన దొడ్లో ఈనిందా లేదా అన్నదే ముఖ్యం అన్నట్లు అనుకున్న విజయం సాధించారా లేదా ఎలా అన్నది ముఖ్యం కాదంటూ దానిని కీర్తించేవారే ఎక్కువగా వున్నారు. మన సమాజ బలహీనత ఇది.

2014లోక్‌సభ, 2017 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓట్ల శాతం యూపీలో 42.3 నుంచి 39.7కు, వుత్తరాఖండ్‌లో 55.3 నుంచి 46.5కు పడిపోయింది. వీటికోసం నానా గడ్డీ కరిచిన తరువాత వచ్చిన ఫలితమిది. దీన్ని మద్దతు పెరగటంగా చెప్పటమంటే జనాన్ని చెవిలో పూలు పెట్టుకున్నవారిగా జమకట్టటమే. ఈ రీతిలో పెరుగుతున్న ‘మద్దతుతో ‘ రెండు సంవత్సరాల తరువాత జరగబోయే లోక్‌సభ ఎన్నికలలో మరోసారి మోడీ విజయం సాధించబోతున్నారనే ‘ప్రచారదాడికి ‘ నాంది పలికారు. మీడియాను ఆక్రమించిన కార్పొరేట్లు తమ లాభాలకు ఎవరు తోడ్పడతారో వారి ప్రచార కార్యకర్తలుగా మారటాన్ని చూశాము. అందువలన విజయగానాలకు కొదవేముంటుంది. ప్రతిపక్షం చీలికలు పేలికలు, జనం కులాలు, మతాలు, ప్రజావ్యతిరేకుల పట్ల వుపేక్ష వహిస్తే 2014 పునరావృతం కూడా కావచ్చేమో !

హిట్లర్‌ హయాంలో జన మెదళ్లను గందరగోళ పరచే ప్రచారదాడికి రూపకల్పన చేసిన గోబెల్స్‌ కనుక స్వర్గం లేదా నరకం నుంచో మన వేద లేద పురాణ కాల పుష్పక విమానమెక్కి మన దేశంలో దిగి చూస్తే తనకంటే ఎన్నో రెట్లు పెద్దవారిగా కనిపించే మీడియా గోబెల్స్‌ను చూసి ఇంత విపరీతమా అని సిగ్గుపడిపోతాడు. పెద్ద నోట్ల రద్దును జనం సమర్ధించారని చెప్పుకొనేందుకు రెండు రాష్ట్రాల ఫలితాను చూపుతున్నారు. గెలిచిన యూపిలో 60శాతం వ్యతిరేకంగా జనం ఓటు చేయటం సమర్ధించటమా? ఓడిపోయిన మూడు రాష్ట్రాల సంగతేమిటి? పోనీ గెలిచిన చోటయినా గతం కంటే ఓట్లెందుకు తగ్గాయి ? పెద్ద నోట్ల రద్దు వలన సాధించిందేమిటి ? అసలు ఎన్ని నోట్లు రిజర్వుబ్యాంకుకు తిరిగి వచ్చాయి? ఎన్నికలు ముగిసిన తరువాత కూడా దాని గురించి చెప్పరెందుకని, చన్నయ్‌ శేఖర రెడ్డి వంటి వారికి కొత్త రెండువేల నోట్ల రూపాయలకట్టలను నేరుగా అందించిన వున్నతాధికారులపై తీసుకున్న చర్యలేమిటి ? ఇలాంటి ప్రశ్నలన్నీ విజయగానాల ముందు వినిపించవు, మీడియాలో కనిపించవు.

నిప్పు, పట్టుకోవద్దు, కాలుతుంది అని చెబుతాం. ప్రశ్నించటం పిల్లల లక్షణం కనుక నీకెలా తెలుసు అని ఠకీమని అడగటం సహజం. వారితో పాటు వున్న వారు లేదు మీకు నిప్పంటే మొదటి నుంచి సదభిప్రాయం లేదు, అందుకే అలా చెబుతున్నారు అన్నారనుకోండి కాలేది పిల్లలకే, వారికి కాదు. డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి వస్తే అమెరికాలోనే కాదు, ప్రపంచమంతటా అల్లకల్లోలం తలెత్తుతుంది అని అతగాడి గురించి తెలిసిన వారు చెప్పారు. అయినా సరే అమెరికా సామాన్యుల కంటే ఆంగ్లం బాగా చదివి, రాయగలిగిన అక్షరాస్యులైన ప్రవాస భారతీయులతో సహా అనేక మంది తన్మయత్వంతో ఓటేసి గెలిపించారు. ఇప్పుడు ఏం జరుగుతోందో చూస్తున్నాము. అక్కడి జాత్యహంకార దాడికి బలైన తెలుగువాడు కూచిభొట్ల శ్రీనివాస్‌ అంత్యక్రియలలో ట్రంప్‌ వ్యతిరేక నినాదాల హోరులో వేదమంత్రాలు వినిపించలేదన్న వార్తలు చదువుకున్నాం. అందువలన జనం ఎల్లకాలం ఒకేలా వుంటారని అనుకోనవసరం లేదు. ఏ కమ్యూనిస్టులు ప్రేరేపిస్తే అంత్యక్రియలలో ట్రంప్‌ వ్యతిరేక నినాదాలు చేసినట్లు ? ఎవరి కాళ్ల కిందకు నీరు వస్తే గాని వారికి తెలియదు.

కనుక కేంద్రంలోని బిజెపి తన అధికారాన్ని మరింతగా విస్తరించుకోవటానికి గోవా, మణిపూర్‌ వంటి చోట్ల అప్రజాస్వామిక పద్దతులకు పాల్పడి ప్రజాతీర్పును వమ్ము చేసినా, గతం కంటే తక్కువ ఓట్లు తెచ్చుకొని తమ విధానాలకు మద్దతు పెరిగిందని పెద్ద నోళ్లు వేసుకొని అరిచినా, నోరు తెరిస్తే మతోన్మాదం, పరమత విద్వేషం, హంతక భాష తప్ప మరొకటి పలకటం రాని ‘యోగి ‘ ఆదిత్యనాథ్‌ను వుత్తర ప్రదేశ్‌ పీఠంపై కూర్చో బెట్టినా ముందే చెప్పినట్లు చరిత్ర తనపని తాను చేస్తుంది. విదేశీ దండయాత్రలను, ఆక్రమణను సమైక్యంగా అడ్డుకోలేకపోయిన కారణంగా మన దేశం అనుభవిస్తున్న పర్యవసానాలను చూస్తున్నాము. విదేశీయులు సోమనాధ దేవాలయాన్ని కొల్లగొట్టి దానిని నాశనం చేయటం తప్పని చెబుతున్న స్వదేశీయులు ఆయోధ్యలో బాబరీ మసీదును కూల్చివేయటాన్ని ఏమనాలి? చరిత్రనుంచి మనం ఏ పాఠాలు నేర్చుకున్నట్లు ?

మనం చరిత్రలో, పురాణాలు, ఇతిహాసాలలో అనేక మంది యోగులు, యోగినులు, సన్యాసులు, సన్యాసినుల గురించి చదివాం. కొంత మంది దృష్టిలో హిందూత్వను పునరుద్దరించే కారణ జన్ములుగా స్ధానం వున్న ఇలాంటి యోగులు ఎవరి వారసులో, ఎలా పుట్టుకు వచ్చారో, వారిని సమర్ధించేవారు అడ్డగోలుగా కాకుండా ఆధారాలతో చెప్పాలి. కులాల పరిభాషలో చెప్పాలంటే వెనుకబడిన తరగతుల మంత్రం జపించే బిజెపి ఒక వేళ ఒక యోగినే ఎంచుకోదలచుకుంటే క్షత్రియడు తప్ప వివాదాస్పదం కాని వెనుకబడిన తరగతుల యోగి దొరకలేదా ?

యోగి ఆదిత్యనాధ్‌ గురించి లోకానికి తెలిసిందానితో పాటు తానేమిటో తనపై వున్న నేరపూర్తి కేసులేమిటో పార్లమెంట్‌ ఎన్నికల నామినేషన్‌ పత్రాలలోనే స్వయంగా రాసుకున్నారు. మత రాజ్యాలుగా ప్రకటించుకున్న పాకిస్తాన్‌ వంటి దేశాల గురించి విమర్శలు తెలిసిందే. మరి వుత్తర ప్రదేశ్‌ సంగతేమిటి ? హిందూ మతానికి చెందిన గోరఖనాధ్‌ మఠాధిపతి అయిన ఆదిత్యనాధ్‌ దాన్ని వదులుకోకుండానే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. దీన్నేమనాలి ? మత రాజ్యం గాక పోతే మత రాష్ట్రం. ఒక చోట అధికారికంగా మతాన్ని రుద్దుతారు మరోచోట అనధికారికంగా అదే పని చేస్తారు. ఇలాంటి విపరీత పరిస్ధితిని మన లౌకిక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ వూహించి వుండరు.

యుపి ముఖ్యమంత్రిగా వివాదాస్పద యోగిని ఎంపిక చేయటాన్ని సమర్ధించుకోవటానికి బిజెపికి అడ్డగోలు వాదనలు తప్ప తర్కానికి నిలిచే మాటలు చెప్పటం లేదు. రాజ్యాంగం ప్రకారం మెజారిటీ వచ్చిన పార్టీ తమ నేతగా ఎవరిని నియమించుకోవాలన్నది ఆ పార్టీ ఇష్టం, ఒక ఎత్తుగడగానే ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించలేదు ఇలాంటి సారం లేని వాదనలు తప్ప తమ యోగికి వున్న అర్హతల సమర్ధించుకొంటూ మాట్లాడకపోవటం దాని బలహీనతను సూచిస్తోంది. ఎవరిని ఎంచుకోవాలన్నది మీ ఇష్టమైతే ముఖ్యమంత్రి ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తారు కనుక ఆ ఎంపికపై విమర్శలు చేసే అధికారం ప్రతిపక్షాలకు, ప్రజలందరికీ వుంటుంది. చెప్పుకొనేందుకేమీ లేకపోగా వివాదాస్పద నేపధ్యం వున్న కారణంగానే యోగికి ఒక అవకాశమిస్తే తప్పేమిటి, ఇటీవలి ఎన్నికలలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టలేదు కదా, ముఖ్యమంత్రి పాత్రలో ఎలా వుంటారో చూడకుండానే విమర్శలా అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరికొందరు ఇంకొక అడుగు ముందుకు వేసి ప్రధాని నరేంద్రమోడీ తన మంత్ర దండంతో ఇలాంటి వారందరినీ అదుపులో వుంచుతాడు అంటూ భరోసా ఇస్తున్నారు. రంజాన్‌ సమయంలో పూర్తి విద్యుత్‌ ఇచ్చారు, దీపావళికి కోతలు విధించారంటూ స్వయంగా సదరు మోడీయే యుపీ గల్లీలలో రెచ్చగొట్టే ప్రచారం చేసి ఓట్లడుక్కున్న దిగజారుడు తనం దాస్తే దాగుతుందా ? తానే మత భావనలను రెచ్చగొట్టే భాష మాట్లాడకుండా తమాయించుకోలేని వ్యక్తి ఆదిత్యనాధ్‌ వంటి యోగులను నియంత్రిస్తారంటే నమ్మటం ఎలా ? సదరు పెద్దమనిషి గత చరిత్ర చూస్తే బిజెపియే తన బాటలో నడవాలి తప్ప తాను నడవాల్సిన అవసరం లేదని చెప్పటమే కాదు, తన మత అజెండాను అమలు జరిపేందుకు ఒక సంస్ధనే ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరికీ తేడా ఏమంటే మాంసం తినండి గానీ ఎముకలు మెడలో వేసుకొని తిరగవద్దని బిజెపి చెబితే మాంసమంటూ తింటున్న తరువాత ఎముకలు వేసుకు తిరిగితేనే కదా జనానికి మనమీద నమ్మకం కలిగేదన్నది యోగి తీరు.

ఆదిత్యనాథ్‌ తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నట్లుగా తనపై వున్న హత్యాయత్నం, నేరపూరిత బెదిరింపులు, కొట్లాటలు, భిన్నమతాల జనం మధ్య శతృత్వాన్ని పెంచే నేరాలకు సంబంధించిన కేసులను ఎలా ఎత్తివేయించుకుంటారన్నది ఆసక్తికరం. ఎన్నికల సభలలో నోరు పారవేసుకున్నందుకు ఎన్నికల కమిషన్‌ ఆయన్ను మందలించింది. ప్రధాని నరేంద్రమోడీ అపరభక్తురాలైన జర్నలిస్టు తవ్లీన్‌ సింగ్‌ ‘బూతులు, దుర్భాషలు మాట్లాడే వున్మత్తుడని’ ఒక సందర్భంలో వర్ణించారు. రెండు సంవత్సరాల క్రితం లష్కరే తాయెబా స్ధాపకుడు హఫీస్‌ సయిద్‌కు సినీనటుడు షారూఖ్‌ ఖాన్‌కు తేడాలేదని యోగి సెలవిచ్చారు. ఆ మాటలు సరికాదని, తమ పార్టీ లేదా ప్రధాని నరేంద్రమోడీ మూల విశ్వాసాలకు అవి ప్రతిబింబాలు కాదని బిజెపి అధికార ప్రతినిధి నలిన్‌ కోహ్లీ స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తిని దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్య మంత్రిని చేశారు. ఒక యోగిగా ఏం చేశాడన్నది పక్కన పెట్టి ముఖ్యమంత్రిగా ఏం చేస్తారో చూసేందుకు ఒక అవకాశం ఇచ్చి చూడండంటూ వంది మాగధులచేత మాట్లాడిస్తున్నారు. అదే సరైన ప్రాతిపదిక అయితే మాకూ ఒక అవకాశమిచ్చి చూడండి అని అసదుద్దీన్‌ ఒవైసీ పార్టీ మజ్లిస్‌ కూడా ఓటర్లను అడుగుతోంది. ఒకరు గాడ్సే భావజాలానికి, కార్యాచరణకు, మరొకరు రజాకార్ల భావజాలం, కార్యాచరణకు వారసులన్నది విశ్లేషకుల అభిప్రాయం. అందువలన అవకాశమివ్వాల్సిన ‘అర్హతల’లో ఎవరు ఎవరికీ తీసిపోరు ! అవకాశం ఇచ్చి చూడాలనటం గురించి ఒక విశ్లేషకుడు పాఠకులకు ఒక ప్రశ్న వేశారు. పోటీగా వున్న ఒక స్కూలును తగులబెట్టి రమ్మని మీ పిల్లలు చదివే స్కూలు హెడ్మాస్టర్‌ ఒక పని అప్పగించారనుకోండి తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకు ఒక అవకాశం ఇచ్చి, వారి పనితీరు ఎలా వుంటుందో చూద్దామని అనుకుంటారా లేక ఆందోళన వ్యక్తం చేస్తారా ? అన్నదే ఆప్రశ్న.

ఐదుసార్లు ఎంపీగా గెలిచాడు, మీకు ఇష్టం లేకపోతే ఆరునెలల్లో అసెంబ్లీకి పోటీ చేయాలి గనుక అప్పుడు ఓడించండి అంటూ ఒక వుచిత సలహా. ఆ మాత్రం తెలియని అమాయకత్వంతో యోగిని విమర్శించే వారు వున్నారనుకుంటున్నారా ?

రాహుల్‌ గాంధీ కూడా మూడుసార్లు వరుసగా ఎన్నికైనప్పటికీ ఆయనకు పార్టీ నడిపే అర్హత లేదని బిజెపి విమర్శిస్తుంది. ఎన్నిక కావటమే అర్హత అయితే వుత్తర ప్రదేశ్‌లో ఆదిత్యనాధ్‌ కంటే పేరు మోసినవారు ఎందరో వున్నారు, వారికి ముందు అవకాశం ఇవ్వాలి. అక్కడ ఎన్నికైన ప్రతి నాలుగో ఎంఎల్‌ఏ మీద అత్యాచారం, హత్యల వంటి తీవ్ర నేరాల కేసులు వున్నాయి. కొత్త అసెంబ్లీకి నూట మూడు మంది ఎన్నికైనందున రొటేషన్‌ పద్దతులలో వారందరికీ ఒక్కో ఏడాది పాటు మంత్రి పదవుల అవకాశాలు ఇచ్చి కొత్త పాత్రను వారెలా పోషిస్తారో చూడాలి. బిజెపికి మాత్రమే అలాంటి అవకాశం అంటే ఆపార్టీలో వున్న 82 మందికి రెండున్నర సంవత్సరాల చొప్పున అవకాశం ఇవ్వాలి మరి. ముక్తార్‌ అన్సారీ అనే పేరుమోసిన కేసులున్న పెద్దమనిషి అదే యూపీలో తాజా ఎన్నికలతో సహా 1996 నుంచి ఆదిత్యనాధ్‌తో పాటు వరుసగా ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికౌతూనే వున్నాడు.అదీ నాలుగుసార్లు జైల్లో వుండే గెలిచాడు. మరో పెద్ద మనిషి వున్నాడు రాజా భయ్యాగా పేరుమోసిన రఘురాజ్‌ ప్రతాప్‌ సింగ్‌. మాజీ రాజకుటుంబానికి చెందిన ఆ పెద్దమనిషిపై కేసులు తక్కువేమీ లేవు.ఆదిత్యనాధ్‌ కంటే ముందునుంచి అంటే 1993 నుంచి వరుసగా ఎన్నికవుతూనే వున్నాడు.కేరళలో కెఎం మణి ఏకంగా 13 సార్లు వరుసగా ఎన్నికయ్యాడు. అందువలన ఈ రోజుల్లో ఐదుసార్లు ఎన్నికయ్యాడు కనుక సచ్చీలుడు అంటే కుదరదు. బిజెపి తరఫున తాజాగా ఎన్నికైన వారిలో నేరస్ధ నేపధ్యం వున్న ఇద్దరు మహిళలు కూడా ఎన్నికైన ఘనత ఆపార్టీ ఖాతాలో వుంది. అందులో ఒకరు ఇటీవల కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించి బిజెపిలో చేరి గెలిచిన ఒక డాక్టర్‌ కూడా వున్నారు.

మా యోగి రాహుల్‌ గాంధీ మాదిరి కుటుంబ నేపధ్యం నుంచి రాలేదు అన్నది మరొక ముక్తాయింపు. నిజమే గోరఖ్‌ పూర్‌ మఠం ఒక మతానికి చెందినది. దాని అధిపతిగా వున్న మహంత్‌ అవైద్యనాధ్‌ మతాధికారిగా వుంటూనే రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన స్ధానంలో మతబాధ్యతలు స్వీకరించిన ఆదిత్యనాధ్‌ అదే మత పూర్వరంగంలో ఐదుసార్లు ఎన్నికయ్యారు. ఒకరికి కుటుంబం, మరొకరికి మత వారసత్వం ! తేడా ఏముంది? వారసత్వ పరంపరను కొనసాగిస్తున్న తెలుగుదేశం పార్టీ నలుపు మాత్రం బిజెపికి కనపడదు. నరేంద్రమోడీ ఒక ఎత్తుగడగా తన మత అజెండాను పక్కన పెట్టి గత ఎన్నికలలో అభివృద్ధి మంత్రం జపించారు. కానీ ఆదిత్యనాధ్‌ రికార్డులో నేరపూరిత, మతోన్మాదం తప్ప అభివృద్ధి జాడలు లేవు. తాజా ఎన్నికలలో అలాంటి ప్రసంగాలు, ప్రచారం చేసిన దాఖలాలు లేవు. అసలు ఆయనొక ప్రధాన ప్రచారకుడిగా కూడా లేరు. గతంలో ఆయన ప్రసంగాలన్నీ ముస్లింల చుట్టూ తిరిగాయి తప్ప అభివృద్ధి కాదు. చివరిగా ఒక ముక్క చెప్పాలి. ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ తనదైన శైలిలో ఆదిత్యనాధ్‌ను సమర్ధించారు. దొంగకు తాళాలిస్తే సొత్తుకు హామీ వుంటుందన్నట్లుగా ఒక తరగతిలో చెడు ప్రవర్తన కలిగిన పిల్లవాడిని తరగతి పర్యవేక్షకుడిగా చేస్తే మంచిగా ప్రవర్తించే మాదిరి యుపి ముఖ్య మంత్రిగా ఆదిత్యనాధ్‌ వ్యవహరిస్తారు అని కితాబునిస్తూ భగత్‌ ట్వీట్‌ చేశాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తమిళనాడులో తదుపరి ఏం జరగనుంది ?

18 Saturday Feb 2017

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

AIADMK, BJP, Congress, DMK, Tamil Nadu

Image result for tamil nadu assembly

సత్య

    తమిళనాడు ముఖ్యమంత్రి ఇకె పళనిస్వామి శనివారం నాడు అసెంబ్లీలో తన ‘బల’ నిరూపణ చేసుకున్నారు. తమిళ మురికి గుంటలో చేపలను పట్టాలని చూసిన బిజెపి, డిఎంకె దాని వెన్నంటి వున్న కాంగ్రెస్‌లకు శృంగభంగమైంది. పళని స్వామి నాయకత్వం రేపేమి చేస్తుంది, పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయి అని ఈ రోజు వూహించటం కష్టం. కొంతమంది వూహలు, వాంఛలకు భిన్నంగా అన్నాడిఎంకెలో మెజారిటీ సభ్యులు శశికళ నాయకత్వంలోని పళనిస్వామికి మద్దతుగా నిలిచారు. కాంపులో వున్న ఎంఎల్‌ఏలు బయటికి వస్తే మరొక కాంపులోకి దూరతారన్న అంచనాలు తారు మారు కావటంతో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా వున్న డిఎంకె, దాని మిత్రపక్షం కాంగ్రెస్‌ ఆశలు ఆవిరై సాధారణంగా జరగాల్సిన బలనిరూపణ ప్రక్రియను అపహాస్యం పాలు చేసినట్లుగా కనిపిస్తోంది.

    అసెంబ్లీలో అవాంఛనీయ వుదంతాలు జరగటం తమిళనాడుకు కొత్త కాదు. అలాంటి చర్యలకు పాల్పడిన వారిని తిరిగి ఎన్నుకోవటం కూడా సామాన్యంగా జరుగుతోంది. దాని కొనసాగింపుగానే శనివారం నాడు కూడా కుర్చీలు లేచాయి, చొక్కాలు చిరిగాయి. ఎంజిరామచంద్రన్‌ ముఖ్యమంత్రిగా మరణించినపుడు ఆయన భార్య జానకిని సిఎంను చేశారు. ఆమె బలనిరూపణ సమయంలో జరిగినదానితో పోలిస్తే శనివారం నాటి సంఘటనలు ఒక లెక్కలోవి కాదు. ఆ రోజు కొందరు గూండాలు అసెంబ్లీలోకి ప్రవేశించి ఎంఎల్‌ఏలను చితకబాదారని, తరువాత పోలీసులు లాఠీ ఛార్జీ చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఆరోజు కాంగ్రెస్‌ శాసనసభ్యులు నాటి స్పీకర్‌ చర్యను వ్యతిరేకించారు, దెబ్బలు తిన్నారు. ఇపుడు కూడా అదే జరిగింది. నాటి స్పీకర్‌ పిహెచ్‌ పాండియన్‌ ఇప్పుడు పన్నీరు సెల్వం శిబిరంలో, కాంగ్రెస్‌ వారు ఈసారి వారు డిఎంకె పక్షాన వున్నారు. మీడియాకు ప్రవేశం లేకుండా తలుపులు మూసి నిర్వహించిన బలనిరూపణ ప్రక్రియలో ఏం జరిగిందనేది ఎంఎల్‌ఏలు చెప్పిందే సమాచారం. శాసనసభ్యులు రౌడీల మాదిరి ప్రవర్తించినప్పటికీ వారిని గౌరవించాల్సిందేనని కమల్‌ హసన్‌ వ్యంగ్యంగా అన్నారు. కుష్బూ, సిద్ధార్ధ శశికళ వర్గానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు.

   అధికారం తప్ప మరొక పరమార్ధం ఎరుగని పాలక రాజకీయాలు నెరిపే అందునా రాష్ట్రాలలోని కుటుంబపార్టీల ( వాటినింకేమాత్రం ప్రాంతీయ పార్టీలని పిలవాల్సిన అవసరం లేదు) పరిణామాలు ఎటుతిరుగుతాయో తెలియని స్ధితి. స్వాతంత్య్ర వుద్యమానికి సారధ్యం వహించిన పార్టీగా 1947 తరువాత ప్రారంభమైన కాంగ్రెస్‌ను గల్లీ నుంచి ఢిల్లీ వరకు కుటుంబపార్టీగా మార్చివేసేందుకు ప్రయత్నించారు. ఐదుగురికి ఐదూళ్లు కాదు గదా సూది మోపినంత కూడా ఇచ్చేది లేదన్న కౌరవుల మాదిరి వ్యవహరించటంతో దానికి వెలుపల వున్న వారు అధికారం కోసం పడిన తపన అనేక చోట్ల ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి నాంది పలికింది. రాష్ట్రాలు, వాటి సమస్యలపట్ల అవలంభించిన నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రాల అధికారాల కోసమంటూ ప్రారంభమైన పార్టీలు గత నాలుగు దశాబ్దాల కాలంలో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీతో అంటకాగటం, తమ అధికారాన్ని నిలుపుకొనేందుకు ఏ పార్టీ వారు వస్తే ఆ పార్టీ వారిని రాష్ట్ర అభివృద్ధి కోసం అనే పేరుతో చేర్చుకోవటం ( ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ది పేరుతో జరుగుతోందనుకోండి) సాధారణంగా మారిపోయింది. ఇప్పుడు రాష్ట్రాలు-జనం- హక్కులు ఏమీ లేవు. అధికారం-సంపాదన-అధికారం అనే వలయంలో కుటుంబపార్టీలు తిరుగుతున్నాయి.

   ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల హక్కుల పేరుతో రంగంలోకి వస్తే బిజెపి అనేక పార్టీల రంగులు మార్చి(జన సంఘం-జనతా పార్టీ-భారతీయ జనతా పార్టీ) తమ రూటే సపరేటు, కాంగ్రెస్‌కూ మాకూ పోలికే లేదంటూ ముందుకు వచ్చింది. దీనిలో కాంగ్రెస్‌లో, ఇతర ప్రాంతీయ పార్టీలలో వున్న అన్ని అవలక్షణాలతో పాటు అధికారం కోసం అవసరమైతే మతోన్మాదాన్ని, ఘర్షణలను కూడా రెచ్చకొట్టేందుకు వెనుకాడదన్న విమర్శ, వాస్తవం గురించి తెలిసిందే. తమకు లొంగని రాష్ట్ర ప్రభుత్వాల, పార్టీల విషయంలో ఎలా జోక్యం చేసుకుంటున్నది గత మూడు సంవత్సరాలుగా చూస్తున్నదే. గవర్నర్లను ఎలా వుపయోగిస్తున్నదీ తెలిసిందే. కాంగ్రెస్‌ రంగు బయటపడటానికి యాభై సంవత్సరాలు పడితే ఈ పార్టీ అసలు రంగు బహిర్గతం కావటానికి ఐదు సంవత్సరాలు కూడా అవసరం లేదని నిరూపించుకుంది. అంత స్పీడుగా వుంది.

    అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక కావటాన్ని కొంత మంది ప్రశ్నించారు. నిజమే ఆమె జయలలిత స్నేహితురాలిగా తప్ప ఇతరత్రా పార్టీలో ఏమీ కాని మాట నిజమే. అది తప్పయినపుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడి కుమారుడిగా తప్ప లోకేశ్‌ ఏం చేశారని ఏకంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు అన్న ప్రశ్న వెంటనే వస్తుంది. తెలంగాణాలో తెరాస పరిణామాలను చూసినా అదే వైఖరి కనిపిస్తుంది. జయలలితకు కూడా కుటుంబం వున్నట్లయితే కూతురో కొడుకో నాయకత్వ స్ధానాన్ని ఆక్రమించేవారు. పార్టీకోసం, ప్రజల కోసం ఏ నాడూ ఏమీ చేయని వారు అధికారపీఠం కోసం అర్రులు చాస్తున్నపుడు, ఎవరినైనా ఆమోదించే స్ధితిలో జనం వున్నపుడు జయలలిత మేనకోడలిగా తాను కూడా ఎందుకు ప్రయత్నించకూడదని దీపా జయకుమార్‌ ప్రయత్నించటంలో ఆశ్చర్యం ఏముంది.

    ప్రజాస్వామ్యం పదికాలాలపాటు బతికి బట్టకట్టాలంటే ఇలాంటి పరిణామాలను జనం సహించాలా ? అనేక కారణాలతో వ్యతిరేకించటం లేదన్నది వాస్తవం. కాంగ్రెస్‌ అనుసరిస్తున్న విధానాలనే బిజెపి, ఇతర ప్రాంతీయ పార్టీలు అనుసరిస్తున్నా ప్రశ్నించే ధోరణి వ్యక్తం కావటం లేదు. అందుకే వాటి మధ్య విధానాల మీద రాజీ- అధికారం కోసం కుమ్ములాటలు తప్ప ఎలాంటి పేచీ వుండటం లేదు. మన చేత్తో మన కంటినే పొడుచుకుంటున్నామని గుర్తించే రోజు వచ్చినపుడే వుప్పు-కప్పురాలకు తేడా తెలుసుకోగలుగుతాము. కమ్యూనిస్టు పార్టీలు చిన్నవిగా వున్నా, కొన్ని చోట్ల అధికారానికి వచ్చినా ఎక్కడా ఇలాంటి అవలక్షణాలు ఆ పార్టీలలో కనిపించటం లేదు. అవినీతి, అక్రమాల గురించి వేలెత్తి చూపటానికి లేదు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్లుగా సైద్ధాంతిక , విధానాల ప్రాతిపదికగా అవినీతి రహిత పార్టీలు, శక్తులను ఎంచుకొనే క్రమాన్ని ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలు వేగవంతం చేయటం అనివార్యం.

    ప్రతి రాష్ట్రంలో జరిగే ప్రతి రాజకీయ పరిణామం ఒక గుణపాఠం నేర్పుతూనే వుంది. జయలలిత మరణంతో అన్నాడిఎంకె నాయకత్వ సమస్యను ఎదుర్కొన్న తరుణంలో ఆమెకు కేవలం స్నేహితురాలిగా, అక్రమ సంపాదనలో తోడుగా వున్న శశికళ పగ్గాలు చేపట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలమై అనూహ్య పరిణామాల మధ్య ఆమెకు శిక్ష పడి జైలు పాలయ్యారు. సమీప భవిష్యత్‌లో ఆమె చట్ట సభలకు పోటీ చేసే అవకాశం లేకపోవటంతో ఇతరులతో కథ నడిపించాల్సి వుంది. మరో నాలుగు సంవత్సరాల పాటు కొనసాగాల్సిన అసెంబ్లీ పూర్తికాలం నడుస్తుందా, అధికారం కోసం ఆతృపడుతున్న డిఎంకె, కాంగ్రెస్‌ కూటమి దానిలో చీలిక తెచ్చి ఆ వర్గం మద్దతుతో అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అన్నది సమస్య. కేంద్రంలో బిజెపి అధికారంలో వుంది. తన స్ధానాన్ని పటిష్టపరచుకోవాలంటే ఏ గడ్డి కరవటానికైనా వెనుకాడటం లేదని అనేక రాష్ట్రాలలో దాని చర్యలను చూస్తే అర్ధం అవుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత వాటిని బట్టి ఏరాష్ట్రాన్ని ఎలా మింగాలో ఆ పార్టీ నిర్ణయించుకుంటుంది. అసాధారణ సంక్షోభం తలెత్తితే తప్ప ఆరునెలల వరకు పళనిస్వామి మరోసారి బలనిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక వేళ అటువంటి పరిస్థితిని ప్రత్యర్ధులు తెచ్చిపెడితే అసెంబ్లీ రద్దుకు ఆదేశించి రాజకీయాలను మరోమలుపు తిప్పినా ఆశ్చర్యం లేదు.

   అన్నాడిఎంకెలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పని చేసిన పన్నీరు సెల్వం సామర్ధ్యంగల నేత అని గతంలో ఎవరూ చెప్పలేదు, భవిష్యత్‌లో చెప్పే అవకాశమూ వుండదు. అతని అధ్యాయం ముగిసిందని చెప్పవచ్చు. పన్నీరు సెల్వాన్ని అడ్డం పెట్టుకొని కథనడింపించాలని చూసిందనే విమర్శలు ఎదుర్కొన్న బిజెపి ఇప్పుడు మరోదారి చూసుకుంటుంది. డిఎంకెతో అంటకాగి అన్నాడిఎంకెను దెబ్బతీసినా ఆశ్చర్యం లేదు. లేదా ఎన్నికలకు సమయం వుంది కనుక రజనీకాంత్‌ వంటి మరొక సినిమా నటుడిని రంగంలోకి తెచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోనూ వచ్చు. అన్నా డిఎంకెలో శశికళ స్ధానంలో మరో నూతన అధికార కేంద్రం ప్రారంభం కావచ్చు, ఆ పార్టీలో మరో సంక్షోభం అంటూ తలెత్తాలంటే పళని స్వామికి మరో విభీషణుడు తయారు కావాలి. లేదా మరో రెండు సంవత్సరాలు కచ్చితంగా అధికారంలో వుండే బిజెపి ముందు పొలోమంటూ లొంగిపోయి, ప్రతిపక్ష డిఎంకె నుంచి రక్షణ అయినా పొందవచ్చు. డొల్లుపుచ్చకాయల వంటి ప్రాంతీయ, కుటుంబపార్టీలు ఎప్పుడేం చేస్తాయో ఎవరు చెప్పగలరు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మార్పు కోసం మోడీకి ఓటు వేశాను తప్ప ద్వేషం కోసం కాదు !

12 Thursday Jan 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, BJP's social media, BJP’s IT cell, BJP’s trolling army, I am a troll, Narendra Modi, Rahul gandhi, Trolls

సాధ్వి ఖోస్లా

    స్వాతంత్య్ర సమర యోధుల పరంపరనుంచి వచ్చిన కొంత మందికి రెండు విషయాలు మాత్రమే -దేశ భక్తి మరియు గాంధీజీ సిద్ధాంతాలు-ఎరుకలో వుంటాయి. నాకైతే నా రాష్ట్రం పంజాబ్‌ కూడా. పంజాబ్‌ మీద నాకున్న ప్రేమ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలకు మరియు వాటికి అనుకూలంగా వున్న రాష్ట రాజకీయ పరిసరాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు శక్తి నిచ్చింది. ద్వేష పూరితమైన భారతీయ జనతా పార్టీ మరియు తమను తాము వీరులుగా చెప్పుకొనే దాని సామాజిక మీడియా మరుగుజ్జు యోధులపై పోరాడేందుకు దేశం మీద నాకున్న ప్రేమ బలాన్నిచ్చింది.

    గత మూడు సంవత్సరాలుగా ప్రధాని నరేంద్రమోడీ ట్విటర్‌ మీద నన్ను అసుసరిస్తున్నారు.ఈ రోజు నేనేమీ కాదు మరియు బిజెపితో నా అనుబంధాన్ని ప్రశ్నిస్తున్నారు. స్వాతి చతుర్వేది పుస్తకం అయామ్‌ ఏ ట్రోల్‌ (నేనో వెంటాడే మరుగుజ్జును )లో నేను వెల్లడించిన వాస్తవాలతో మండిపడుతున్న బిజెపి సామాజిక మీడియా సేనలోని అజ్ఞాత ముఖాలు నన్నొక దుష్టశక్తిగా చిత్రిస్తున్నాయి. ప్రధాన మంత్రి, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిజాలు పలికే గొంతులేమైనా వుంటే వాటిని మూయిస్తారని నేను చెప్పింది వాస్తవమని వారు రుజువు చేస్తున్నారు.నేను బయటపడి వాస్తవాలను బహిరంగ పరచాలన్న నా నిర్ణయం కాంగ్రెస్‌తో నాకున్న స్వల్పకాల అనుబంధం వలన కాదు, అసత్యాలను వేద వాక్యంగా మార్చటాన్ని అపేందుకు చిత్తశుద్దితో చేస్తున్న ప్రయత్నమిది. ఎప్పటికప్పుడు వార్తలు అందుతున్న నేటి యుగంలో నిజం కంటే వ్యతిరేక సమాచార ప్రచారాన్ని వాట్సాప్‌, ట్విటర్‌ మరియు ఫేస్‌బుక్‌లలో జనం ఎక్కువగా నమ్ముతున్నారు. ఆ సమయానికి నిజం అడుగున పడిపోయి జరగాల్సిన హాని జరుగుతుంది.

    మన గొప్ప దేశాన్ని గత ప్రభుత్వాలు మలుచుతున్న తీరుతో ఇతర తరుణ వయస్సు భారత పౌరుల మాదిరే నేను కూడా 2013లో అసంతృప్తి చెందాను. నేను మొదటి సారిగా నా ఓటు హక్కును మోడీకి అనుకూలంగా వినియోగించాను, ఎందుకంటే మెరుగైన భారత్‌ గురించి ఆయన దర్శన కోణాన్ని, ఆయనను నమ్మాను. ఆ నమ్మకమే నన్ను 272 మంది మరియు వారితో పాటు వున్న వలంటీర్లతో కూడిన బిజెపి మిషన్‌ (ప్రచార దళం)లో చేరేందుకు ప్రేరణనిచ్చింది.ఆ ప్రచార దళపు ‘సరికొత్త ప్రచార పద్దతులు ‘ వెంటాడటంతో సహా అప్రతిష్టపాలు చేయటం, వాస్తవానికి వక్రభాష్యాలు చెప్పి జనాల న్యాయనిర్ణయాలను అయోమయంలోకి నెట్టటం గురించి నాకు ముందుగా ఏమాత్రం తెలియదు.

     2015 నవంబరులో అమీర్‌ ఖాన్‌ దేశంలో నాడున్న పరిస్ధితుల గురించి తన మనోభావాలను వ్యక్తం చేసినపుడు అరవింద గుప్తా నాయకత్వంలోని బిజెపి ఐటి విభాగం ఎలక్ట్రానిక్‌ వాణిజ్య సంస్ధ అయిన స్నాప్‌డీల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వున్న ఆ నటుడిని తప్పించేందుకు గాను ఒత్తిడి చేస్తూ ఒక సామాజిక మీడియా ప్రచారాన్ని నిర్వహించింది. ఆ నటుడిని వెంటాడాలని, వివిధ వేదికలపై అతనిపై బురద చల్లాలని, అతని సినిమాలు చూడకుండా జనాన్ని రెచ్చగొట్టాలని మాకు (బిజెపి ఐటి విభాగంలోని వలంటీర్లకు) ఆదేశాలు జారీ చేశారు. నా భావజాలం మరియు ఆత్మ బిజెపి మతోన్మాద దళంలో భాగస్వామి అయ్యేందుకు అనుమతించలేదు.భ్రమలు తొలిగిన నేను దాని నుంచి బయటపడ్డాను. వత్తిడి కారణంగా 2016 జనవరిలో స్నాప్‌డీల్‌ అమీర్‌ ఖాన్‌తో తన సంబంధాలను రద్దు చేసుకుంది.

     అటువంటి చర్యల తీవ్ర పర్యవసానాలను మనం గుర్తించలేదు. ఒక నటుడిగా ఎన్నో సంవత్సరాల నుంచి మన ఇండ్లలో వుంటూ మన హృదయాలను దోచుకున్న వ్యక్తి ఆకస్మికంగా ఒక ‘ముస్లింగా’ మారిపోయాడు. ద్వేషాన్ని వ్యాపింప చేయటానికి సామాజిక మాధ్యమం ఒక ప్రమాదకర సాధనంగా మారిపోయింది, అదికొన్ని సందర్భాలలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కూడా దారితీయవచ్చు. చివరికి మతం కూడా రాజకీయాల మాదిరి మనల్ని విడదీయలేదు.

జాతి వ్యతిరేకిగా ముద్ర

     దాదాపు రెండు సంవత్సరాలు తీవ్ర స్ధాయిలో ప్రధాన మంత్రికి ట్విటర్‌ మీద మద్దతు పలికాను, చురుకుగా బిజెపికి ప్రచారం చేశాను, వారి ఎజండాలలో భాగంగా స్మృతి ఇరానీ, కిరణ్‌ ఖేర్‌ వంటి బిజెపి నాయకులకు తోడ్పడ్డాను. నేను వ్యతిరేకించిన సమయంలో కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ కూటమికి నాయకత్వం లేకపోవటాన్ని, దిగజారిన విధానాలను కూడా విమర్శించాను. ఇదే సమయంలో పంజాబ్‌ మీద వున్న నా అభిమానం రాష్ట్రంలో వున్న భయంకరమైన మాదకద్రవ్యాల వ్యాప్తిని వెల్లడిస్తూ దాని మీద ఒక డాక్యుమెంటరీని తీయించేందుకు కూడా నడిపించింది. ఆందోళన కలిగించే వాస్తవాలను ప్రధాన మంత్రి దృష్టికి తెచ్చేందుకు ట్విటర్‌ ద్వారా ఒక వర్తమానం కూడా పంపాను. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడతామని మోడీ వాగ్దానం చేశారు, అయితే అందుకు సహాయం చేసేందుకు నేను చేసిన వినతులను విస్మరించారు.

  ప్రధాన మంత్రి నిర్లక్ష్యం నన్ను కాంగ్రెస్‌ వైపు తిరిగేట్లు చేసింది. నేను గట్టిగా బలపరిచిన నరేంద్రమోడీ విస్మరిస్తే నా వినతులను రాహుల్‌ గాంధీ విన్నారు. కాంగ్రెస్‌ వుపాధ్యక్షుడితో కలిసినప్పటి నా చిత్రాలను సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన బిజెపి వెంటాడే సేనకు నా కృతజ్ఞతలు. రహస్యంగా వుంచిన వారి క్రీడను నేను బయట పెట్టటాన్ని నా రాజకీయ అజండాలో భాగంగా చూపుతున్నారు. నేను నిర్మించిన డాక్యుమెంటరీని 2016 మార్చి 18న రాహుల్‌ గాంధీ విడుదల చేశారు. కాంగ్రెస్‌తో నా ఏకైక సంబంధం అది మాత్రమే.

   2014 ఎన్నికలు భారత రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేశాయి. మీడియాలో ప్రచారం ఎలా పొందాలో తెలిసిన ప్రధాన మంత్రి ఇంటర్నెట్‌ ద్వారా జనాలకు చేరువ అవుతున్నారు. ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ద్వారా జనానికి తెలియచేస్తున్నారు. ఆయనను మిలియన్ల మంది అనుసరిస్తున్నారు, కానీ ఆయన మాత్రం కొద్ది మంది ఎంపిక చేసిన వారిని మాత్రమే అనుసరిస్తారు. వారిలో ఎక్కువ మంది దూషిస్తూ వెంటాడతారని బాగా తెలిసిన వారే. ప్రధానిని సందర్శించి, శుభాకాంక్షలు తెలిపేందుకు ఇలా దూషించే వారిని ఎప్పటికప్పుడు ఆహ్వానిస్తూ వుంటారు. ఇలా వెంటాడే వారిని ప్రోత్సహించనని బిజెపి చెప్పుకునేట్లయితే ఇలాంటి అక్రమ చర్యలకు వ్యతిరేకంగా ముఖ్యంగా తమ కార్ఖానా నుంచి తయారై బయటకు వస్తున్న వాటి గురించి ప్రధాని ఎందుకు మాట్లాడలేదు?

   సామాజిక మాధ్యమ వేదికను నిర్మాణాత్మక అభివృద్ధికి వినియోగించుకోవటానికి బదులు తమ వ్యతిరేక అభిప్రాయాలను వెల్లడించించిన వారిని అవమానించే విధంగా తన దిగువ సేనను వినియోగించుకుంటోంది. ఏ వ్యక్తి, సంస్ధ లేదా సమాజం అభివృద్ధి చెందాలంటే సానుకూల విమర్శలు ఆరోగ్యకరమైనవి, కానీ అసహ్యంగా విమర్శించటం, వ్యక్తిత్వాలను దెబ్బతీయటం అవాంఛనీయం. ప్రధానిని సమర్ధించే పేరుతో జనాలను మరియు వారి వ్యక్తిత్వాలను దెబ్బతీస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల చీకటి చిత్రాన్ని మాత్రమే ఇది బయట పెడుతోంది. వ్యతిరేకుల, జర్నలిస్టుల, రాజకీయనేతలు మరి ఇతరులెవరి ప్రతిష్టనైనా దెబ్బతీయాలని కిరాయి వలంటీర్లకు మార్గదర్శనం చేశారు. భిన్నమైన వైఖరి కలిగి వున్న ఎవరినైనా మోడీ మరియు జాతి వ్యతిరేకిగా వర్ణించారు. ఎంత అసహ్యంగా అయితే అంతగా మహిళలు, మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్నారు. రాహుల్‌ గాంధీ,ఆయన తల్లి సోనియాగాంధీలపై తప్పుడు ప్రచారం చేశారు, బర్ఖాదత్‌ వంటి జర్నలిస్టులను చంపేస్తామని, మాన భంగం చేస్తామని బెదిరింపులు చేశారు.

  బిజెపి ప్రచారాన్ని బయటపెట్టిన మాకు అన్ని జీవన రంగాల నుంచి ప్రజామద్దతు వెల్లువెత్తుతున్నది. ఈ అంశం దేశంలోని మారుమూలలకు కూడా ప్రయాణించింది. వ్యతిరేక భావజాలాన్ని అణచివేసేందుకు పాలకపార్టీ సామాజిక మీడియాను వినియోగించుకోవటాన్ని జనం ప్రశ్నిస్తున్నారు.అంతిమంగా బిజెపి సామాజిక మీడియా సేన మరియు మద్దతుదారుల లక్ష్యంగా పుస్తక రచయిత్రి స్వాతి చతుర్వేది మరియు నేను వుంటాము. వారు మాపై బూతులు, కించపరిచే ప్రచారం, బెదిరింపులతో దాడి చేస్తారు. ఇదంతా ఎందుకంటే వారి చీకటి రహస్యం బట్టబయలైంది, నిజం గాయపరుస్తుంది.

   నేను నా ఆత్మ చెప్పినట్లు నడిచాను. వ్యతిరేక భావాలు కలిగి వున్న వ్యతిరేకులు లేదా ప్రముఖులకు వ్యతిరేకంగా కించపరిచే ప్రచారం చేయటానికి సామాజిక మీడియాను ఎలా సాధనంగా చేసుకుంటున్నారో నా అందమైన దేశం, దాని ప్రజలు తెలుసుకోవాలన్నది నా ఆలోచన మరియు విధి.

ప్రేమ కంటే ద్వేషం త్వరగా విస్తరించటం విచారకరం !

నేను మార్పు కోసం నరేంద్రమోడీకి ఓటు వేశాను తప్ప ద్వేషం కోసం కాదు. !

నేను చెప్పాల్సింది చెప్పాను, నేను నమ్మిందే చేశాను, చేసిందే చెప్పాను. ఇది నేను చెబుతున్న నిజం !

స్క్రోల్‌.ఇన్‌ సౌజన్యంతో

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిర్లా, సహారా డైరీలు – జవాబు లేని ప్రశ్నలు !

24 Saturday Dec 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Others, Political Parties

≈ Leave a comment

Tags

birla sahara diaries, BJP, cbi, CORRUPTION, it, Modi

ఎం కోటేశ్వరరావు

    తన దగ్గరున్న సమాచారం గనుక బయట పెడితే ఏదో జరిగి పోతుందన్నట్లుగా రాహుల్‌ గాంధీ బిల్డప్‌ ఇవ్వటం, అది తుస్సుమనటం తెలిసిందే. చీకట్లను పారద్రోలుతూ వెలుగుతుందనుకున్న ఒక మతాబా, బాగా పేలుతుందనుకున్న దీపావళి బాంబు ఒక్కోసారి తుస్సుమనొచ్చు. అయితే అవి తుస్సుమన్నప్పటికీ వాటి అవశేషాలను తొలగించి వీధిని శుభ్రం చేయాల్సిన బాధ్యత గృహస్తు మీదో స్ధానిక సంస్ధల పారిశుధ్య సిబ్బందిమీదో వుంటుంది. ఇప్పుడు రాహుల్‌ గాంధీ చెప్పిన అంశాలు, ఆ మాటకు వస్తే అవి ఆయన కొత్తగా కనుగొన్నవీ కాదు, తాజాగా బయటపడినవీ కాదు, ఇప్పటికే ప్రముఖ లాయర్‌ ప్రశాంత భూషన్‌ కోర్టులో వేసిన కేసులోనివే. ఇక్కడ రెండు అంశాలున్నాయి.

    ఒకటి నరేంద్రమోడీని సమర్ధిస్తూ బిజెపి నేతలు అత్యంత బలహీనమైన వాదనలు చేశారు. రెండు ఆయన స్వయంగా రాహుల్‌ గాంధీని అపహాస్యం చేశారు. తమ నేత గంగ అంతటి స్వచ్చమైన ముత్యం అన్నది ఒకటి. గంగతో సహా ఏ నది అయినా పుట్టుక స్థానంలో ఎంతో స్వచ్చంగా వుంటుంది. తరువాతే కలుషితంగా మారుతోంది. హిమాలయాల నుంచి బయటపడిన తరువాత గంగ ఎంత కాలుష్యంగా మారిందో మోడీ సర్కార్‌ ప్రకటించిన గంగ శుద్ధి ప్రణాళిక తెలిసిందే.ఎవరైనా పుట్టినపుడు, బాల్యంలో ఎలాంటి మచ్చ లేకుండా వుంటారు. పెరిగేకొద్దీ కథ ప్రారంభం అవుతుంది.మోడీ అయినా అంతే. డైరీల నిగ్గు తేలే వరకు సహారా, బిర్లాల దగ్గర ముడుపులు తన స్వంతానికి తీసుకున్నారా పార్టీ కోసమా అన్నది వేరే విషయం.

    పారిశ్రామిక సంస్ధలు, వ్యక్తులు ఇచ్చే విరాళాలు లేదా ముడుపులు ఎక్కడా ఖాతాలలో పక్కాగా రసీదుల వివరాలతో సహా రాయరు. డైరీలలోనో మరొక చోటో పొట్టి లేదా నిక్‌నేమ్స్‌ పేరుతోనో నమోదు చేస్తారు. ఎందుకంటే ఆ పని చేసే వారు ఆ సొమ్ము స్వంతదారులకు జవాబుదారీగా ఏదో ఒక ఆధారాన్ని చూపాలి. నమ్మకస్తుల ద్వారానే అలాంటి పని చేయిస్తారు. వుదాహరణకు రెండు దశాబ్దాల క్రితం హవాలా కుంభకోణం బయటపడిన విషయం తెలిసిందే. అది కూడా ఎస్‌కె జైన్‌ అనే హవాలా వ్యాపారి నమోదు చేసిన డైరీల ఆధారంగా అని ఇక్కడ గుర్తు చేయాలి. ఆ డైరీలలో వామపక్షాలు తప్ప కాంగ్రెస్‌,బజెపి, జనతాదళ్‌ తదితర 18 పార్టీల నేతల పేర్లు వున్నాయి. ఆ వివరాలు బయటకు రాగానే ఆ జాబితాలో ఒకరైన బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ తన లోక్‌సభ సభ్వత్యానికి రాజీనామా చేసి ఆ మచ్చ తొలిగిన తరువాత గానీ తిరిగి సభలోకి అడుగు పెట్టనని ప్రకటించి నాడు ప్రశంసలు పొందారు. దాంతో అనేక మంది కాంగ్రెస్‌, బిజెపి నేతలు కూడా పదవుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా ఆ కేసులో తేలిందేమీ లేదు, నిర్దోషులుగా ప్రకటించారు.

   చిత్రం ఏమిటంటే అద్వానీ శిశ్యుషుడినని, ఆయన సభ్యుడిగా వున్న మార్గదర్శక మండలి సలహామేరకు పని చేస్తున్నానని చెప్పుకుంటున్న నరేంద్రమోడీ రాజీనామా సంగతి తరువాత, ముందసలు ఆ డైరీల సంగతి నిగ్గుదేల్చమని దర్యాప్తు సంస్ధలను ఆదేశించటానికి కూడా ముందుకు రాలేదెందున్నది అసలు ప్రశ్న. హవాలా డైరీలలో, సహారా, బిర్లా డైరీలలో బిజెపితో పాటు కాంగ్రెస్‌, ఇతర పార్టీల నేతలందరూ వున్నారు. అందుకే తేలు కుట్టిన దొంగ మాదిరి మోడీ సర్కార్‌ మౌనంగా వుండిపోయిందా ? సరే వెంకయ్య నాయుడు తన పాండిత్యాన్ని మొత్తాన్ని వుపయోగించి ఆ డైరీలు బయట పడింది కాంగ్రెస్‌ హయాంలో అప్పుడెందుకు వాటి గురించి చెప్పలేదని చెట్టుకింద లాయర్‌ మాదిరి ప్రశ్న వేశారు. ఆ డైరీలు 2013 అక్టోబరులో, 2014 నవంబరులో నరేంద్రమోడీ అధికారానికి వచ్చాక సిబిఐ, ఆదాయపన్ను శాఖ దాడులలో బయట పడ్డాయి.తమకు దొరికిన వాటిపై ఏ చర్య తీసుకోవాలన్నది ఆ సంస్ధల విధి. తమకు దొరికిన వాటి గురించి ఎటూ తేల్చకుండా మీన మేషాలు లెక్కించటాన్ని చూసిన తరువాత కామన్‌ కాజ్‌ అనే ఒక స్వచ్చంద సంస్ద 2015లో సుప్రీం కోర్టుకు వెళ్లింది.అంటే సిబిఐ, ఆదాయపన్ను శాఖలపై తెరవెనుక నుంచి వత్తిడి వచ్చిందన్నది స్పష్టం. ‘అవినీతి వ్యతిరేక నరేంద్రమోడీ హయాం ‘ ఇలా జరగటం ఏమిటి ? గంగ మాదిరి కాలుష్యం సోకిందా ?

     ఈ డైరీలపై దాఖలైన కేసులో సుప్రీం కోర్టు న్యాయమూర్తుల తర్కం అనేక ప్రశ్నలను ముందుకు తెచ్చింది. డైరీలలో పేర్లు వున్నంత మాత్రాన వాటిపై విచారించటం కుదరదని,ఇలాంటి వాటిపై దర్యాప్తులకు ఆదేశిస్తే పర్యవసానాలు తీవ్రంగా వుంటాయంటూ ఎవరైనా ఒకరు ప్రధానికి ఇంత డబ్బు ముట్టచెప్పామని తమ డైరీలలో రాసుకున్నంత మాత్రాన ఎలా విచారణ జరపాలి అంటూ మరింత స్పష్టమైన సాక్ష్యాలతో రావాలని చెప్పి చింతకాయల రవి సినిమాలో ప్రతిదానికీ సర్టిఫికెట్‌ల ఫ్రూఫ్‌ కావాలనే పాత్రధారిని గుర్తుకు తెచ్చింది. భవిష్యత్‌లో అక్రమంగా నిధులు ఇచ్చేవారు, పుచ్చుకొనే వారు కేసులు, శిక్షల నుంచి తప్పించుకొనేందుకు అనుసరించాల్సిన సులువైన పద్దతిని చెప్పినట్లు , తప్పించుకొనేందుకు అవసరమైన తర్కాన్ని సిద్ధం చేసినట్లుగా వుంది. బిర్లా డైరీలను నమోదు చేసిన వారు తమకు హవాలా మార్గంలో నగదు వస్తుందని, దానిని తమ యజమానుల ఆదేశాల మేరకు రాజకీయ నేతలకు అంద చేస్తాని విచారణలో చెప్పారు. బిర్లా కంపెనీ చైర్మన్‌ సుబేందు అమితాబ్‌ కూడా విచారణలో గుజరాత్‌ సిఎంకు 25 కోట్లు అందచేసినట్లు అంగీకరించారు. అయితే గుజరాత్‌ సిఎం అంటే గుజరాత్‌ ఆల్కలీస్‌ అండ్‌ కెమికల్స్‌ అని చెప్పారు. సి,ఎం అనే పదాలకు ఆ కంపెనీ పేరుకు పొంతన కుదరటం లేదు. దాని గురించి అడిగితే అదంతే అనటం తప్ప సరైన వివరణ ఇవ్వలేదు. పోనీ అక్రమ పద్దతుల్లో నగదు తీసుకున్న సదరు కంపెనీపై చట్టపరమైన చర్యలేమన్నా తీసుకున్నారా ? అదీ లేదు. దీని వాస్తవాలను తేల్చాల్సింది ఎవరు? అందుకే ఆ డైరీలపై దర్యాప్తు జరపాలని తాము డిమాండ్‌ చేస్తున్నట్లు న్యాయవాది ప్రశాంత భూషన్‌ చెబుతున్నారు. హవాలా కేసులో దొరికిన డైరీలలో పొట్టి పేర్లు మాత్రమే వున్నాయి. అయినప్పటికీ దర్యాప్తు జరపటానికి అవి చాలని అప్పుడు సుప్రీం కోర్టు చెప్పింది. ఇప్పుడు పేర్లు, డైరీలు మరింత స్పష్టంగా వున్నప్పటికీ మరింత స్పష్టమైన ఆధారాలు కావాలని అదే కోర్టు వ్యాఖ్యానించటం గమనించాల్సిన అంశం. రాహుల్‌ గాంధీ చెప్పిన అంశాలపై రాజకీయంగా అపహాస్యం చేయవచ్చు, సామాజిక మీడియాలోని తన భక్తులు, సైన్యానికి వుత్సాహం తెప్పించవచ్చు. అంతటితో అది అయిపోదు, కోర్టు లేదా మోడీ సర్కార్‌ దీనిపై ఏదో ఒక వైఖరిని వెల్లడించకతప్పదు. ఆ డైరీల నిగ్గు తేల్చనంత వరకు మోడీవైపు వేలు చూపుతూనే వుంటారు .

Share this:

  • Tweet
  • More
Like Loading...

అల్లుడికి బుద్ది చెప్పి మామ అంతకంటే పెద్ద తప్పు చేసినట్లు !

25 Friday Nov 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, BJP U TURN, Narendra Modi, Rupee, Rupee Fall, UPA

ఎం కోటేశ్వరరావు

‘ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు,రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు ‘ ఈ మాటలు అన్నదెవరో తెలుసా మిన్నువిరిగి మీద పడ్డా మాట్లాడేందుకు నిరాకరిస్తున్న నరేంద్రమోడీ ! మరి ఈ మాటలు ఎలా చెప్పారు అని వెంటనే అడిగేందుకు ఆయన భక్తులు కాచుకొని వుంటారు. కాస్త నిదానించండి. గురువారం(24వ తేదీ) మోడీ తన ఘన చరిత్రలో ఒక రికార్డును బద్దలు చేశారు. 2013 ఆగస్టు 28న రూపాయి విలువ డాలరుకు రు.68.85కు పడిపోయి ఒక రికార్డు నమోదు చేసింది. నరేంద్రమోడీ సర్కార్‌ 2016 నవంబరు 24న దాని రు.68.86కు దిగజార్చి పాత రికార్డును బద్దలు చేసింది. మరి పై వ్యాఖ్య ఎప్పుడు చేశారు ?http://www.business-standard.com/article/politics/modi-blames-upa-govt-s-inaction-for-falling-rupee-113082000623_1.html 2013 ఆగస్టు 19న, అప్పటికే రూపాయి విలువ పతన అవుతున్నది, దాని గురించి గుజరాత్‌ ముఖ్యమంత్రి హోదాలో చేసిన విమర్శ అది.మరి ఇపుడేమంటారు ? ఈ నెలాఖరులో మనసులోని మాటలో అయినా ఏదైనా చెబుతారేమో చూద్దాం ! అంతకు ఒక నెల రోజుల ముందు రూపాయి విలువ రు.60.15కు పతనమైన సమయంలో లాయరూ, ప్రస్తుతం మోడీ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా వుండి, అప్పుడు ప్రతిపక్ష నేతగా వున్న రవిశంకర ప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు.http://www.firstpost.com/politics/bjp-blames-upas–gross-mismanagement-for-rupee-fall-946409.html ‘పూర్తిగా ఆర్ధిక వ్యవస్ధ దుర్నిర్వహణ’ కారణంగా రూపాయి పతనం అవుతున్నదన్నారు. ‘ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) మరియు విదేశీ సంస్ధాగత పెట్టుబడుల (ఎఫ్‌ఐఐ)తో ఆర్ధిక వ్యవస్ధను నిర్వహించే యుపిఏ విధాన కారణంగానే ఇలా జరుగుతున్నదని చెప్పారు.అమెరికా ఫెడరల్‌ రిజర్వు వుద్దీపన పధకాన్ని వుపసంహరించిన కారణంగా మన దేశం నుంచి డబ్బు తరలి పోయినందున రూపాయి విలువ పడిపోయిందని లాయర్‌గారు వాదించారు. ‘యుపిఏ ఏర్పడినపుడు డాలరకు రూపాయి విలువ రాహుల్‌ గాంధీ వయస్సుతో సమంగా వుంది. ఈ రోజు సోనియా గాంధీ వయస్సుకు దగ్గర అవుతున్నది.అది మన్మోహన్‌ సింగ్‌ వయస్సుకు దగ్గర అవుతుందేమోనని భయంగా వుంది ‘ అని చమత్కరించారు.

     ఇప్పుడు రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది, యుపిఏ పాలనా విధానాలను మార్చి రూపాయి విలువను పెంచకుండా లేదా కనీసం పతనం చేయకుండా నిలువరించటంలో ఎవరు మోకాలడ్డారు ? ఎవరైనా సూటిగా సమాధానం చెప్పేవారున్నారా ?http://inr.fx-exchange.com/usd/2014_05_26-exchange-rates-history.html నరేంద్రమోడీ అధికారం స్వీకరించిన 2014 మే 26వ తేదీన డాలరుకు రూపాయి విలువ రు.58.73 వున్నట్లు పై ఆధారం తెలియ చేస్తున్నది. ఇప్పుడు మన ప్రధాని వయస్సు 66, రూపాయి విలువ ఇది రాస్తున్న సమయానికి రు.68.44 వుంది. ఇంతగా పతనం కావటానికి ఏ స్టెరాయిడ్స్‌ ఇచ్చారు ? యుపిఏ కంటే ఏ భిన్న విధానాలు అనుసరించిన కారణంగా ఈ పతనం సంభవించింది. త్వరలో 70 రూపాయలకు చేరనున్నదని విశ్లేషకులు ఎందుకు జోశ్యం చెబుతున్నట్లు ?

    2014 సాధారణ ఎన్నికలలో నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి విజయం సాధించనున్నదనే అంచనాలు వెలువడిన సమయంలో అమెరికా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌ ప్రతినిధులు అమిత్‌ ప్రకాష్‌, క్రిస్టిన్‌ ఆక్వినో రూపాయి విలువ పెరగటం నరేంద్రమోడీ నిర్ణయాత్మక విజయానికి సూచిక అని వ్యాఖ్యానించారు. దీర్ఘకాలంలో రూపాయి విలువ ఒక అమెరికన్‌ డాలరుకు 2014 మార్చి నెలలో వున్న 61.19 రూపాయల నుంచి 45-40కి పెరిగే క్రమంలో ఎన్నికల ఫలితం ఒక వుత్ప్రేరకంగా పని చేయగలదని, ఒక వేళ బలహీన సంకీర్ణం ఏర్పడితే 2013 అగస్టు 28 నాటి రికార్డు పతనం 68.85ను అధిగమించ వచ్చని సిటీ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ ఆసియా-పసిఫిక్‌ అధిపతి ఆడమ్‌ గిల్‌మౌర్‌ చెప్పిన మాటలను వారు వుటంకించారు. అంతే కాదు, మోడీ విజయం సాధిస్తే అది ఆట తీరునే మార్చివేస్తుందన్నది మార్కెట్‌ అభిప్రాయమని కూడా ఆడమ్‌ వ్యాఖ్యానించాడు. ఆసియాలోని మూడవ పెద్ద ఆర్ధిక వ్యవస్థ అయిన భారత్‌ 2008లో ప్రారంభమైన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తరువాత ఇప్పుడే పట్టాలపైకి వస్తున్నదని మోడీ స్టీరింగ్‌ పట్టుకుంటే మరింత వేగం అందుకుంటుందని బ్లూమ్‌బెర్గ్‌ వ్యాఖ్యాతలు చెప్పారు. బిజెపి పెద్ద పార్టీగా రావటం ఖాయమని, సంపూర్ణ మెజారిటీకి 40 స్థానాలు తగ్గితే మిత్ర పక్షాలపై ఆధార పడాల్సి వుంటుందని ఎన్నికల జోశ్యాలు పేర్కొన్నాయి. వాటిని అధిగమించి బిజెపి ఒక్కటే సంపూర్ణ మెజారిటీ సాధించింది. ఆ సమయానికి 2013 ఆగస్టు 28తో పోల్చుకుంటే రూపాయి విలువ 13శాతం పెరిగింది.

    రూపాయి విలువ పెరుగుతున్నదని, అది డాలరుకు 40కి పెరిగితే 2008 ఏప్రిల్‌ నుంచి బలమైన స్ధాయికి చేరినట్లు అవుతుందని ఈ తరుణంలో డాలర్లను అమ్ముకోవటం మంచిదని ఎన్నికల వరకు ఆగితే ఆది ఆలస్యం కూడా కావచ్చని గిల్‌మౌర్‌ జోస్యం కూడిన సలహా ఇచ్చారు. అయితే అది ఎంత కాలంలో జరుగుతుందన్నది ఆయన చెప్పలేదని, బ్లూమ్‌బెర్గ్‌ జరిపిన సర్వే ప్రకారం 2014 డిసెంబరు నాటికి రు.61.21 అవుతుందని 2016 చివరికి 58.50లకు పెరుగుతుందని ఆ సంస్థ వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా ఎందుకు జరుగుతోంది? కారణాలేమిటి ?

    నిత్యం బలమైన కరెన్సీ గురించి బోధనలు చేయటం తప్ప మోడీ-జైట్లీ ద్వయం బ్రిటీష్‌ వలసవాద ఆర్ధిక విధానాలకు మద్దతు ఇస్తున్నారని, ఇంకా బలహీనమైన రూపాయి కొనసాగటం జాతి సిగ్గుపడాల్సిన అంశమని అంశుమన్‌ తివారీ అనే ఆర్ధిక వ్యవహారాల వ్యాఖ్యాత పేర్కొన్నారు.http://www.dailyo.in/business/rupee-narendra-modi-arun-jaitley-rbi-manmohan-singh-pv-narasimha-rao-dollar/story/1/6138.html ఒక దేశ కరెన్సీ జాతి గర్వించదగిన లేదా దగని అంశంగా వుండకూడదు, చేయకూడదని తెలిసినప్పటికీ బిజెపి 2013లో రూపాయి విలువ ఎదుర్కొన్న సంక్షోభాన్ని జాతి సిగ్గుపడే అంశంగా ప్రదర్శించిందని తివారీ పేర్కొన్నారు.

   ‘మారకపు విలువ కేవలం ఒక ధర మాత్రమే. నీవు అమ్మకపు వ్యాపారంలో వుండాలంటే నీ ధర పోటీలో నిలబడేట్లుగా వుండాలి’ అని 1991లో రూపాయి విలువను భారీగా తగ్గించిన సమయంలో ఆర్ధిక మంత్రిగా వున్న మన్మోహన్‌ సింగ్‌ చెప్పిన తర్కాన్ని అంగీకరించాలంటారు తివారి. మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చిన నరేంద్రమోడీ మన దేశంలో సరకులను తయారు చేసి చౌకగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు రూపాయి విలువను కావాలనే పతనం గావిస్తున్నారా ? ఎగుమతి ఆధారిత విధానాలను అనుసరించే దేశాలన్నీ తమ కరెన్సీ విలువలను తగ్గించిన చరిత్ర వుంది. నరేంద్రమోడీ సర్కార్‌ విధానం ఏమిటి ?

   1990 దశకంలో మన దేశం చెల్లింపుల సంక్షోభం ఎదుర్కొన్న కారణంగా మన ఎగుమతులను పెంచాలనే ఒక దివాళాకోరు ఆలోచనతో నాటి సర్కార్‌ ప్రపంచ బ్యాంకులో పని చేసిన మన్మోహన్‌ సింగ్‌ను ఆర్ధిక మంత్రిగా తీసుకొన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచబ్యాంకు ఆదేశాలతో ఈ పెద్ద మనిషి ఒక్కసారిగా నాలుగు రోజుల్లో రూపాయి విలువను తొమ్మిదిశాతం వరకు తగ్గించారు. అంతకు ముందు దేశ చరిత్రలో అలాంటి వుదంతం జరగలేదు. ఆ సమయంలో ప్రభుత్వ ఆర్ధిక సలహాదారుగా జైరాం రమేష్‌, రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా రంగరాజన్‌ వున్నారు.

    గతంతో అంటే 2013 రికార్డు పతనంతో పోల్చితే నాటికీ నేటికీ ఎంతో బేధం వుంది. అప్పుడు రూపాయి విలువ పతనం దేశ బలహీనతగా బిజెపి ప్రచారం ప్రారంభించింది. అ సమయంలో మన విదేశీ మారక ద్రవ్య నిల్వలపై తీవ్ర ప్రభావం చూపే చమురు పీపా ధర 100 డాలర్లకు పైగా వుంది. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 40-50 డాలర్ల మధ్య వుంటోంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా వివిధ కారణాలతో రికార్డు స్దాయిలో నవంబరు 11వ తేదీతో ముగిసిన వారంలో 368 బిలియన్‌ డాలర్లు వున్నాయి. అయినప్పటికీ 2013 నాటి మాదిరి రూపాయి విలువ పతనమౌతోంది. ఎందుకిలా జరుగుతోంది?

    రూపాయి పతనమైతే మనకు కలిగే లాభ నష్టాలు ఏమిటి ? మన దేశంలో చమురు ధరలపై నియంత్రణ ఎత్తివేసే సమయంలో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ధరల పెరుగుదల తగ్గుదల వుంటుందని ప్రభుత్వం జనానికి చెప్పింది. ఈ విధానం ప్రకారం పీపా వంద డాలర్లు వున్నప్పటి కంటే సగానికి సగం ధర తగ్గినందున మన దేశంలో పెట్రోలు ధర కూడా సగానికి తగ్గాలి. ఎందుకు తగ్గలేదో ఎప్పుడైనా మనం ఆలోచించామా? చమురుపై కేంద్ర సుంకాన్ని మోడీ సర్కార్‌ లీటరుకు పన్నెండు రూపాయల వరకు పెంచింది. దీనికి తోడు రూపాయి పతనంపై గుడ్లప్పగించి చూస్తుండటంతో దిగుమతి చేసుకొనే పెట్రోలు ధర పెరిగింది.

    మన దేశాన్ని కేవలం ముడి సరకులు ఎగుమతి దేశంగా వుంచాలని, పారిశ్రామికంగా అభివృద్ది కాకుండా వుంచేందుకు నాటి బ్రిటీష్‌ పాలకులు రూపాయి విలువను ఎక్కువగా వుంచారన్న అభిప్రాయం వుంది. యుపిఏ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు బిజెపి రూపాయి విలువ పతనాన్ని దేశానికి అవమానంగా చిత్రించింది. తాను అధికారంలోకి వచ్చిన తరువాత అదే పార్టీ ఇప్పుడు రూపాయి పతనమౌతోంటే గుడ్లప్పగించి చూస్తోంది. నోట మాట రావటం లేదు.

     నాడు మన్మోహన్‌ సింగ్‌ కరెన్సీ విలువ తగ్గింపును సమర్ధించుకుంటూ ‘మారకపు విలువ కేవలం ఒక ధర మాత్రమే. నీవు అమ్మకపు వ్యాపారంలో వుండాలంటే నీ ధర పోటీలో నిలబడేట్లుగా వుండాలి’ అన్నారంటే దాని అర్ధం తక్కువగా వుంచాలనే కదా. అప్పటి నుంచి చూస్తే 1970 నుంచి 1989 వరకు వాణిజ్య లోటుతో వున్న చైనా ఆ తరువాత నుంచి నేటి వరకు తన మిగులును పెంచుకుంటూ పోతూనే వుంది.1990 నుంచి 8.74 బిలియన్‌ డాలర్ల మిగులుతో ప్రారంభమై 2014లో 382 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నది. మరి మనం ఎక్కడ వున్నాం ? మన వాణిజ్యలోటు పెరగటం తప్ప ఏ ఒక్క సంవత్సరంలోనూ మిగులు లేదు. మన రూపాయి విలువను తగ్గించుకున్నా మన వస్తువులను ఎగుమతి చేయలేని స్ధితి. అయినప్పటికీ నిరుద్యోగ యువతను తప్పుదారి పట్టించేందుకు మేకిన్‌ ఇండియా నినాదంతో ప్రధాని నరేంద్రమోడీ కాలం గడుపుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ మన దేశం వచ్చి ఇక్కడ మన కార్మికుల చేత వస్తువులను తయారు చేయించుకొని ఎగుమతి చేసుకోవాలన్నది ఈ నినాదం వెనుక వున్న లక్ష్యం. ఇన్నేళ్లుగా మనం ఎందుకు విఫలమయ్యాము. అందునా ప్రపంచ ధనిక దేశాలన్నీ ఆర్ధిక మాంద్యం వుండగా ఇప్పుడున్న పరిశ్రమల వుత్పత్తులకే దిక్కు లేకపోతే కొత్తగా ఎవరు ప్రారంభిస్తారు అన్నది ప్రశ్న. అందువలన మన ఆర్ధిక విధానాన్ని మన అవసరాలకు తగినట్లు సమూలంగా మార్చుకొని అంతర్గతంగా వస్తువినియోగానికి డిమాండ్‌ పెంచుకుంటేనే ఏ రంగమైనా అభివృద్ది చెందుతుంది. మన యువతకు వుపాధి దొరుకుతుంది.

   విదేశాలకు తక్కువ ధరలకు ఎగుమతులు చేయటానికి మన వనరులన్నీంటినీ వుపయోగిస్తే మన వస్తువులు కొన్న వాడికి తప్ప మనకు లాభం ఏమిటి? ఏ కారణం చేత అయినా కొనే వారు ఎత్తుబడితే మన వస్తువులను ఎవరికి అమ్ముకోవాలి? ఇప్పుడు అమెరికా, ఐరోపా ధనిక దేశాలలో వస్తువులు కొనే వారు లేకనే మన వస్తువులు ఎగుమతి కావటం లేదని అందరూ చెబుతున్నదే. అలాంటపుడు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టి మన నరేంద్రమోడీ గారికి మేకిన్‌ ఇండియా పేరు తెచ్చేందుకు ఎవరు ముందుకు వస్తారు అన్నదే సమస్య?

Image result for On Rupee Fall: modi u turn

    ఏతా వాతా తేలేదేమంటే మన కరెన్సీ విలువ పతనాన్ని అలాగే కొనసాగనిస్తే అది మనకు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోగా అసలే అంతంతమాత్రంగా మన జీవితాలను మరింత దిగజార్చుతుంది. మోడీ మహాశయుడి అచ్చే దినాలకోసం ఎదురు చూస్తున్న జనానికి ఆకస్మికంగా బ్యాంకుల ముందు పడిగాపులు పడే చచ్చే దినాలు దాపురించాయి. రాబోయే రోజుల్లో రెండు వేల నోట్లు మార్చుకోవటం ఒక సమస్యగా మారే అవకాశం వుంది. ఇప్పుడు రూపాయి మరింతగా పతనమైతే తట్టల్లో డబ్బులు తీసుకు వెళ్లి బుట్టల్లో సరకులు తెచ్చుకొనే రోజులు వస్తాయి. మన సరకులను విదేశాల వారు చౌకగా కొనుక్కుపోతారు. వారిలో పాకిస్తాను వారు కూడా వుంటారని కాషాయ దేశభక్తులు గ్రహించాలి.ఎంకి పెళ్లి సుబ్సిచావుకు వచ్చిందన్నట్లుగా నరేంద్రమోడీ గారి మేకినిండియా పిలుపును జయప్రదం చేయటం కోసం రూపాయి విలువను మరింత పతనం గావిస్తే మనం దిగుమతి చేసుకొనే ఎరువులు, పురుగు మందులు, పెట్రోలియం వుత్పత్తుల వంటి వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. గుజరాత్‌ నమూనా అంటే ఇదేనా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ – నీరో చక్రవర్తికి తేడా ఏమిటి ?

24 Thursday Nov 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Demonetisation, Demonetisation standoff, Narendra, Narendra and Nero, Nero, Rajyasabha

ఎంకెఆర్‌

    ప్రధాని ప్రధాని నరేంద్రమోడీ మడమ తిప్పరు అని మన వెంకయ్య ప్రకటించి ఒక రోజు కూడా గడవక ముందే వెనక్కు తిరిగి గురువారం నాడు రాజ్యసభలో అడుగు పెట్టాల్సి వచ్చింది.మౌన మునిగా పేరు తెచ్చుకున్న మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చాలా కాలం తరువాత రాజ్యసభకు హాజరై నోట్ల రద్దుపై నోరు తెరిచారు. బయట హావభావ ప్రదర్శనలతో జనాన్ని ఆకట్టుకొనే న్రరేంద్రమోడీ కొద్ది సేపు రాజ్యసభలో కంటి చూపుతప్ప నోట మాటలేకుండా కూర్చున్నారు. రాజ్యసభలో కొద్దిసేపు ఇబ్బంది పడుతూ కూర్చున్నట్లు కనిపించిన ప్రధాని భోజన విరామం తరువాత హాజరు కాలేదు. దాంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చిన శుక్రవారం నాటికి రాజ్యసభ వాయిదా పడింది.

    ప్రతి అంశాన్ని నరేంద్రమోడీ చుట్టూ తిప్పుతూ ఆయన ప్రతిష్టను పెంచేందుకు ఒక పధకం ప్రకారం ఆయన చుట్టూ వున్నవారు నిరంతరం ఆలోచిస్తున్నారు. అందుకు ఏ అవకాశం వస్తుందా అని చూసే మంత్రాంగపు యంత్రాంగానికి దూరదృష్టి, పర్యవసానాల గురించి ఆలోచన లేదా లేక సమస్య వచ్చినపుడు చూసుకుందాం లెమ్మని పప్పులో కాలేశారా ? పాకిస్ధాన్‌పై సర్జికల్‌ దాడులు జరిపింది సైన్యం అయినప్పటికీ వాటి ఖ్యాతి ప్రధానికి దక్కించేందుకు చేసిన ప్రయత్నం తెలిసిందే. గతంలో కూడా అలాంటి దాడులు జరిపినప్పటికీ వాటికి పని గట్టుకొని ప్రచారం కల్పించలేదు. చరిత్రలో తొలిసారిగా మన మిలిటరీ సర్జికల్‌ దాడులు జరిపినట్లు, దానికి ప్రధాని రాజకీయ నిర్ణయమే కారణమని అందువలన ఆ ఖ్యాతి ప్రధానికి దక్కాలని బిజెపి నేతలు వాదించారు. దాడుల వీడియోలు కూడా తీశామని సైనికాధికారుల చేత చెప్పించారు. అయితే వాటిని బయట పెట్టాలని కోరటం, అవి రహస్యం కనుక బయట పెట్టేది లేదని ప్రభుత్వం తప్పించుకుంది.

    పెద్ద కరెన్సీ నోట్లను చరిత్రలో అనేక దేశాలలో రద్దు చేశారు. ఎక్కడా ఇలా రచ్చయినట్లు ఒక్క వుదంతం కూడా కనిపించటం లేదు. ఇదేదో నల్లధనాన్ని వెలికి తీసే పెద్ద చర్య అని ఆ ఖ్యాతి నరేంద్రమోడీ ఖాతాలో వేయాలని అట్టహాసంగా ఆయన చేత రద్దు ప్రకటన చేయించారు. కీర్తి కండూతి గురించి మోడీ పడుతున్న తిప్పలుగా వాటిని అర్ధం చేసుకుందాం. పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రసంగం చేసిన తరువాత దాని గురించి అధికారులు విలేకర్ల సమావేశాలలో వివరణ ఇవ్వటం ఒక ఆనవాయితీ. ఎందుకంటే బడ్జెట్‌ రూపకల్పన చేసేది వారే గనుక. నోట్ల రద్దు నిర్ణయం రిజర్వుబ్యాంకు ప్రమేయం లేకుండా జరగదు కదా ! ప్రధాని ప్రకటన చేసిన కొత్త నోట్ల మార్పిడి సమస్యల గురించి రిజర్వు బ్యాంకు గవర్నర్‌ పటేల్‌ ఇంతవరకు ఎందుకు నోరు విప్పలేదు. ప్రకటన చేసి రాజకీయ ఖ్యాతి పొందేందుకు మాత్రం సిద్దం సుమతీ అన్నట్లు నరేంద్రమోడీ తయారా ? తలెత్తిన సమస్యల గురించి వివరణ ఇవ్వటానికి మాత్రం నోరు విప్పరా? పోనీ మీడియా ముందుకు రావటానికి బిడియమైతే పార్లమెంట్‌ చర్చలో పాల్గొని, ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టి దేశ ప్రజలకు భరోసా ఇవ్వటానికి కూడా ముందుకు రారా ? ఇదెక్కడి చోద్యం. ఇబ్బందులు పడుతున్న వారంతా తమకు ఓటేయని వారని లేక నల్లధనం వున్నవారని భావిస్తున్నారా ?

   చరిత్రలో రోమ్‌ నగరం తగులబడుతుంటే చక్రవర్తి నీరో ఫిడేల్‌ వాయించుకుంటూ కాలక్షేపం చేశారని, జనం నరకయాతన అనుభవించారని చదువుకున్నాం. ఇప్పటికి 60 మంది వరకు నోట్ల మార్పిడి, నగదు తీసుకొనే సందర్భంగా మరణించినట్లు వార్తలు. రోజూ లక్షల మంది ఆఫీసులు, ఫ్యాక్టరీలకు సెలవులు పెట్టి బ్యాంకులు, ఏటిఎంల ముందు గంటల తరబడి వరుసలలో నిలబడటం. వివాహాలు చేసుకొనే వారికి ఆ ఆనందమే లేకుండా పోతోంది. ఎందుకు పెట్టుకున్నామురా ముహూర్తాలు అని నిట్టూర్చుతున్నారు. రోగులు చికిత్సలను వాయిదా వేసుకుంటున్నారు ? ఆరునెలలని కొందరు, ఇంకా ఎక్కువ కాలం కొనసాగుతుందని మరికొందరు, వున్న పాత నోట్లను మార్చుకోవటం ఒక సమస్య అయితే ఇస్తున్న రెండు వేల రూపాయల నోట్లను మార్చుకోవటం ఎలా అన్నది పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సమస్య ఎప్పటికి తీరుతుందో రిజర్వుబ్యాంకు అధిపతి చెప్పరు. యాభై రోజులు ఓపిక పట్టమని, పరిష్కారం అవుతుందని ప్రధాని పార్టీ సమావేశాలు, ప్రయివేటుగా చెప్పటం తప్ప బహిరంగంగా నోరు పిప్పరు. చివరకు వారాల తరబడి పార్లమెంట్‌కూ రారు. మరి ఏం చేస్తున్నట్లు ? పార్లమెంట్‌లో సమాధానం చెప్పటం అప్రతిష్టగా భావిస్తున్నారా ? పోనీ అదైనా ఏ వెంకయ్య నాయుడో మరొకరి చేతో చెప్పించండి,జనం అర్ధం చేసుకుంటారు.

   ప్రపంచంలో ఎక్కడైనా ఒక్కచోటైనా ఒక్కరంటే ఒక్కరు కరెన్సీ మార్పిడికి వచ్చి ఇలాంటి దిక్కుమాలిన చావుకు గురయ్యారా ? వుంటే బిజెపి సామాజిక మీడియా సైనికులు బయటపెట్టగలరా ? లేక అది కూడా రహస్యం అంటారా ? కార్మికులు ఒక రోజు సమ్మె, లేదా హర్తాళ్‌కు పిలుపు ఇస్తే రోజు ఎంత నష్టమో లెక్కలు వేసి రోజంతా బ్రేకింగ్‌ న్యూస్‌ పేరుతో సంచలనంగా ప్రకటించే మీడియాకు నవంబరు తొమ్మిది నుంచి పని పాటలు మాని వరుసలలో నిలబడుతున్న జనం కనిపించటం లేదా ? వారంత పని పాటలు లేనివారిగా కనిపిస్తున్నారా ? ఏడాది ఆఖరులో సెలవులు వుండవు, పెట్టాల్సి వస్తే జీతం నష్టం తప్ప మరొక మార్గం లేదు. నోట్ల రద్దు వలన వచ్చే లాభం ఏమిటో చెప్పరు. కనీసం క్యూల్లో నిలబడే జనానికి వచ్చే జీతం నష్టం గురించి మీడియా ఎందుకు మౌనం వహిస్తోంది?

     నోట్ల రద్దు కారణాలను రోజూ ఒకటే చెబితే జనానికి బోరు కొడుతుందనేమో రోజుకో కొత్త అంశాన్ని చేరుస్తున్నారు. దాన్నొక రాజకీయ క్రీడగా మార్చివేశారు. పార్లమెంట్‌లో పంతాలకు పోవటం, అధికార పార్టీ సభ్యులే రాజ్యసభలో పోడియం ముందుకు వచ్చి కేకలు వేయటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ? నక్సలైట్లను దెబ్బతీయటానికి నోట్ల రద్దు అన్నది ఒక ప్రచారం. ఇంత విశాల భారతంలో వారెంత మంది, ఎన్ని ప్రాంతాలకు విస్తరించారు? టెర్రరిస్టులు జమ్మూకాశ్మీర్‌, ఈశాన్య భారతంలో తప్ప ఆ సమస్య వున్న రాష్ట్రాలెన్ని ? ప్రపంచంలో అనేక చోట్ల మన కంటే వామపక్ష తీవ్రవాదులు, లాటిన్‌ అమెరికా వంటి చోట్ల వామపక్ష తిరుగుబాటు వుద్యమాలు, ఇతర చోట్ల ఐఎస్‌, తాలిబాన్‌ తీవ్రవాదుల సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్న దేశాలు వున్నాయి. ఇరాక్‌, సిరియా, లిబియా వంటి చోట్ల విస్తారమైన ప్రాంతాలే వారి చేతుల్లో వున్నాయి. మన పక్కనే వున్న శ్రీలంకలో దశాబ్దాల తరబడి తమిళతీవ్రవాదులు కొన్ని ప్రాంతాలను తమ ఆధీనంలో వుంచుకున్న విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో టర్కీతో సహా అనేక దేశాలలో కుర్దు తిరుగుబాటుదారుల సమస్య వుంది. వారిని ఎదుర్కొనేందుకు ఆ దేశాలేవీ తమ కరెన్సీ నోట్లను రద్దు చేయలేదు, వారి సమస్యను నోట్ల రద్దుతో పరిష్కరించలేదు.

    పొరుగు దేశం పాకిస్ధాన్‌ నకిలీ నోట్లను ముద్రించి మన దేశంలోకి పంపుతున్నదని చెబుతున్నారు. ఇదేమీ కొత్త సమస్య కాదు. మన దేశంలో కోయంబత్తూరు నోట్ల పేరుతో దొంగనోట్ల ముద్రణ చెలా మణి ఎప్పటి నుంచో వుంది. ఒక అంచనా ప్రకారం ప్రతి పదిలక్షల కరెన్సీ నోట్లలో 250 నకిలీవి వుండగా వాటిలో పట్టుకుంటున్నది పదహారింటినే అని కేంద్ర ప్రభుత్వ సమాచారమే వెల్లడిస్తున్నది. దేశంలో 2015-16లో 90.26 వందల కోట్ల కరెన్సీ నోట్లు చెలామణిలో వుంటే వాటిలో పట్టుకున్న దొంగ నోట్ల సంఖ్య 0.63 మిలియన్లు మాత్రమే అంటే మొత్తం నోట్లలో 0.0007 శాతమే. అందువలన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగి పోయిన ఈరోజుల్లో కొత్త నోట్లకు నకిలీవి తయారు చేయటం అసాధ్యమా ?

   పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయటానికి నరేంద్రమోడీకి స్ఫూర్తి నిచ్చింది పూనా నగరానికి చెందిన ‘అర్ధక్రాంతి ప్రతిష్టాన్‌ ‘ సంస్ధను నిర్వహిస్తున్న అనిల్‌ బొకిల్‌ అని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడా పెద్దమనిషి నేను చెప్పిందొకటి నరేంద్రమోడీ చేసిందొకటి, ఆయన మంచి వాడే కానీ చేసిందాని వలన నల్లధనం బయటకు రాదని మొత్తుకుంటున్నాడు. http://economictimes.indiatimes.com/news/economy/policy/banning-notes-will-not-curb-black-money-says-thinktank-that-called-for-demonetisation/articleshow/55550552.cms మరి ఎవరి సలహాతో ఈ పని చేసినట్లు ? ఒకవేళ పొరపాటు చేస్తే దేశ ప్రజల ముందుకు ఒప్పుకోవటానికి ఇబ్బంది ఏమిటి ? ప్రతిష్ట ఇంకా పెరుగుతుంది !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d