• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: CHINA

నమో భజనలు, వాట్సప్‌ పుకార్లు, అమెరికా కుట్రలను ఆపలేకపోయిన కరోనా !

28 Saturday Mar 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Coronavirus, COVID- 19 pandemic

AAO Alert: Coronavirus Update for Ophthalmologists – Eyewire News

ఎం కోటేశ్వరరావు
కరోనా ! యావత్‌ ప్రపంచాన్ని భయపెడుతోంది అనుకుంటున్నారు అందరూ !! నిజమా !!! చూస్తే అలా లేదు మరి. కరోనాకు ముందు-కరోనా తరువాత అని వేరు చేసి చూస్తే కరోనా విలయతాండవం తప్ప మిగిలినవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఏదీ ఆగలేదు !
కాలరెగరేసిన చైనాలో కరోనా తోక ముడిచింది !! నిర్లక్ష్యం వహించిన ఇటలీలో విలయతాండవం చేస్తోంది !!! నాలుగు వందల వెంటిలేటర్లు పంపుతామని అన్నారు అవేమి చాలతాయి 30వేలైనా కావాలి అని న్యూయార్క్‌ రాష్ట్ర గవర్నర్‌ చేసిన వ్యాఖ్య మీద రాష్ట్రాలలో కరోనా పాజిటివ్‌ కేసుల గురించి ఎక్కువ చేసి చెబుతున్నారు అంటూ ట్రంప్‌ మహాశయుడు ఫాక్స్‌ న్యూస్‌తో నోరుపారవేసుకున్నాడంటే పౌరుల ప్రాణాల పట్ల నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం ఇంకా కొనసాగుతూనే ఉంది.
కరోనాను అదుపు చేసి ఊహాన్‌ నగరంలో సాధారణ జనజీవనానికి, మామూలు ప్రయాణాలకు చైనా తెరతీయగా తమకేమీ కాదులే, తమనేమీ చేయదులే అని నిర్లక్ష్యం చేసిన అనేక దేశాలలో తలుపులు మూస్తున్నారు. తలలోని మెదడు మోకాల్లోకి వచ్చిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడిలో అమెరికన్లను కాటు వేసేందుకు కోరలు చాస్తోంది, ఇది రాస్తున్న సమయానికి అగ్రస్ధానానికి చేరిన అమెరికాలో కరోనా కేసులు 104,205, మరణాలు 1,701గా ఉన్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనని జనం గంగవెర్రులెత్తుతున్నారు. దాంతో చివరకు …. తుడుచుకొనే టాయిలెట్‌ పేపర్లకోసం కూడా జనాలు ఎగబడుతున్నారు. దెబ్బలాటలకు సైతం దిగుతున్నట్లు వార్తలు. ఇంకేముంది ఒక చోట బకెట్‌ బీరు కొంటే ఒక టాయిలెట్‌ పేపర్‌ ఉండ(రోల్‌) ఉచితం అని ప్రకటించగానే బీరు మొత్తం అమ్ముడు పోయిందట.(వెనెజులా గురించి చెత్త రాసిన ”చూష్కోరా” రచయిత దీని గురించి ఏమంటారో తెలియదు). ఇదే సమయంలో అక్కడ ఎన్ని తుపాకులు కావాలంటే అన్ని పుష్కలంగా అమ్ముతూ లాభాలు పోగేసుకుంటున్నారు. దేశాలన్నీ జనబందీ లేదా గృహబందీలను పాటిస్తుంటే రేపో ఎప్పుడో మనం తిరిగి పనిలోకి పోవాల్సి ఉంటుందని చెబుతున్న ట్రంప్‌ ముది మది తప్పిన స్ధితిలో ఉన్నట్లే కదా !
కత్తులకు, తుపాకుల తూటాలకు, ఎంతో మహత్యం కలిగిందని ప్రచారం చేస్తున్న స్వదేశీ ఆవు మూత్రం, పేడకు, వేద మంత్రాలకు, పూజలు, పునస్కారాలకు, చర్చీలు, మసీదుల్లో ప్రార్ధనలకు లొంగేది కాదని జనానికి చెప్పటం కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. కరోనా వ్యాప్తితో సహా ఏ దుర్మార్గమూ ఆగటం లేదు. కరోనాను అందరం ఐక్యంగా ఎదుర్కొందాం అని చెప్పేది బూటకం. అనేక దేశాల మీద అమెరికా విధించిన దుర్మార్గపూరితమైన ఆంక్షల్లో ఏ ఒక్కదాన్నీ ఎత్తివేయలేదు. జనాన్ని మరింతగా బలిపెట్టేందుకు సిద్దపడుతున్నారు.
కరోనా వ్యాప్తి పూర్వరంగంలో తమ దేశ ఆరోగ్య వ్యవస్ధ పటిష్టతకు అత్యవసర రుణం ఐదు బిలియన్‌ డాలర్లు కావాలంటూ వెనెజులా చేసిన వినతిని ఐఎంఎఫ్‌ తిరస్కరించింది. ఎవరు అధికారంలో ఉన్నారో గుర్తించే విషయంలో సభ్యదేశాలకు స్పష్టత లేనందున దేశ అధ్యక్షుడు మదురో వినతిని పరిగణనలోకి తీసుకోవటం లేదని పేర్కొన్నది. అమెరికా ఆడిస్తున్న ఆటలో పావుగా మారకపోతే తన సభ్యదేశాలలో మదురోను వెనెజులా నేతగా గుర్తించిన రాజ్యాలను ఐఎంఎఫ్‌ ఎందుకు విస్మరించినట్లు ? ప్రపంచమంతా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతుంటే వెనెజులా మీద ఆంక్షలకు అమెరికా పూనుకోవటం కనీస మానవత్వ స్ఫూర్తికి వ్యతిరేకమని చైనా వ్యాఖ్యానించింది.
మరోవైపు అదే మదురో మాదక ద్రవ్యాల అక్రమరవాణాదారులతో చేతులు కలిపాడంటూ అమెరికాలో ఒక తప్పుడు కేసును తాజాగా బనాయించారు. ఇప్పటికే ఉన్న ఆంక్షలను మరింతగా అమలు జరిపి మదురో సర్కార్‌ను కూల్చివేసేందుకే ఈ యత్నం. అమెరికాకు అవసరమైన వైద్య సరఫరాల కోసం రష్యాను తప్ప ఇతర దేశాలను సంప్రదించాలంటూ అమెరికా విదేశాంగశాఖ రాయబారులను ఆదేశించింది.
ఒక వైపు తమను కరోనా కబళిస్తున్నా నిద్రపోతున్న ట్రంప్‌ సర్కార్‌ నిర్వాకాన్ని కప్పిపుచ్చేందుకు చైనా మీద ఆరోపణలను కొనసాగిస్తూనే ఉంది. అనేక దేశాలలో అది పెట్టిన చిచ్చు ఇంకా రాజుకుంటూనే ఉంది, ఎక్కడా దాడులు ఆగలేదు. ఇది దుష్ట రాజకీయం తప్ప జనాన్ని ఆదుకొనే వారు చేయాల్సిన పనేనా ? బాధితులైన అమెరికా జనం మీద ఎవరికీ కోపం ఉండాల్సినపనిలేదు గానీ ట్రంప్‌ బాధ్యతా రాహిత్యం, దుర్మార్గాలను ముక్త కంఠంతో ఖండించాల్సిందే. నైతికంగా అతగాడికి అధికారంలో ఉండే అర్హత ఏమాత్రం లేదు.
దేశాన్ని ఆర్ధికంగా దిగజార్చటం, నిరుద్యోగం పెరగటం అచ్చే దిన్‌కు బదులు జనాలకు చచ్చే దిన్‌ తెచ్చిన పూర్వరంగంలో ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమంలో నరేంద్రమోడీ భజన తగ్గింది. అయితే జనతా కర్ఫ్యూ, జనం ఇండ్లకే పరిమితం(లాక్‌డౌన్‌) కావటం నరేంద్రమోడీ మెదడులోంచి వచ్చిన తెలివితేటలు, మహత్తర ఆలోచనలంటూ తిరిగి భజన ప్రారంభమైంది. ఆయనకు ధన్యవాదాలు తెలిపేందుకు నమో జ్యోతి పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలట. చైనాలో రెండు నెలల పాటు జనబందీ అమలు జరిగిన తరువాత ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా అనివార్యమే అయినా ఆకస్మికంగా దేశవ్యాపిత కర్ఫ్యూను ప్రకటించి ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారో చూశాము. చైనాలో ఎలా అమలు జరిపారో కనీసంగా అధ్యయనం చేసినా ఇలా జరిగి ఉండేది కాదు. వలస కార్మికులు స్వస్ధలాలకు వెళ్లే ఏర్పాట్లు లేక కంటెయినర్లలో బిక్కు బిక్కు మంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్లినట్లు వచ్చిన వార్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు చూపు లేమికి, నిర్లక్ష్యానికి నిదర్శనం. విదేశాల్లో ఉన్నవారికోసం విమానాలు పంపిన వారికి స్వదేశంలో వలసపోయిన వారిని స్వస్ధలాలకు పంపే బాధ్యతను ఎందుకు తీసుకోరు ?
యావత్‌ సమాజం కష్టకాలంలో ఉన్నపుడు పాలకులు చేసిన సాయానికి వంకలు పెట్టటం ఏమిటి అని అనేక మందికి అనిపించవచ్చు. మన దేశంలో కష్టకాలానికి కరోనా తోడైంది. ఈ సమయంలోనే లీటరు డీజిల్‌, పెట్రోలుకు మూడేసి రూపాయల పన్ను పెంచారు. మరో ఎనిమిది లేదా పది రూపాయలను పెంచేందుకు పార్లమెంటులో ముందస్తు అనుమతి తీసుకున్నారు. ఇది కష్టకాలం అని జనం మీద కనికరం చూపాలని దయగల పాలకులకు అనిపించలేదు. అంతకు ముందు వేళ్ల మీద లెక్కించదగిన ధనికులకు 7.78లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేసిన చేతులతో 130కోట్ల మందికి లక్షా 75వేల కోట్ల రూపాయల పాకేజి ప్రకటించి తమ భుజాలను తామే చరుచుకుంటున్నారు. ఈ మొత్తంలో గత ఏడాదే ప్రకటించిన మూడు వాయిదాల ఆరువేల రూపాయల రైతు సాయంలో ఒకవిడత రెండువేల రూపాయలు కూడా ఇమిడి ఉన్నాయి. ఏటా 70వేల కోట్లు ఇందుకు అవసరమని గతంలో చెప్పినదాన్ని బట్టి మూడో వంతు ఇరవై వేలను మినహాయిస్తే కరోనా సాయం మరింత తగ్గినట్లే . అది వాస్తవం అయితే రెండు వేల రూపాయలను కరోనా సందర్భంగా రైతులకు చేస్తున్న సాయమని మభ్యపెడుతూనే ఉన్నారు.కంపెనీల యజమానులకు అందచేసే మొత్తాలను (పిఎఫ్‌ వాటా చెల్లింపు) కూడా జనం ఖాతాలో రాస్తున్నారు. బహుశా ఇది వేద గణితం అయి ఉండాలి. గతంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా బదులు ప్రత్యేక పాకేజి అని చెప్పారు. తీరా చూస్తే కేంద్ర పధకాలన్నింటినీ కలిపి చెప్పారు తప్ప అదనపు సాయం ఏమీ లేదు. ఇప్పుడు కరోనా సాయంలో కూడా కేంద్ర పధకాలు ఏమైనా కలిసి ఉన్నాయా అన్నది చూడాల్సి ఉంది.
డెమోక్రాట్ల వత్తిడితో అల్పాదాయవర్గాల వారికి ఈ ఏడాది చివరి వరకు నెలనెలా పెద్ద వారికి ఒక్కొక్కరికి పన్నెండువందల డాలర్లు, పిల్లలకు ఐదువందల డాలర్లు చెల్లించేందుకు ట్రంప్‌ సర్కార్‌ అంగీకరించాల్సి వచ్చింది.(డాలరుకు 75 రూపాయలు) ఆయన జిగినీ దోస్తు నరేంద్రమోడీ మాత్రం జనధన్‌ ఖాతాలున్న మహిళకు మూడు నెలల పాటు నెలకు ఐదు వందల రూపాయలు జమచేస్తామని చెప్పి తమలో తామే ఉబ్బితబ్బిబ్బు అవుతూ టాంటాం వేసుకుంటున్నారు. అమెరికా, ఇతర దాని తొత్తు దేశాల ఆంక్షలు, అష్టదిగ్బంధం కారణంగా ఇబ్బందులు పడుతున్న వెనెజులా ఆరునెలల పాటు జనానికి ఉపశమన చర్యలను ప్రకటించింది. మన ఆర్ధిక వ్యవస్ధను ఐదో స్ధానానికి చేర్చామని ఊరూవాడా ప్రచారం చేసిన పెద్దలు తీరా జనానికి సాయం విషయంలో ఎక్కడ ఉన్నారు. ప్రపంచ రాజకీయాల్లో నరేంద్రమోడీ తమ సహభాగస్వామి అని ట్రంప్‌నుంచి పొగడ్తలు అందుకున్నారు. అలాంటి ట్రంప్‌ 150లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్రకటిస్తే ఆ పెద్దమనిషి భాగస్వామి 1.75లక్షల కోట్లు మాత్రమే ప్రకటించారు. వ్యాధిని వారాల తరబడి నిర్లక్ష్యం చేసిన, సముద్రంలో కాకిరెట్ట మాదిరి సాయం ప్రకటించిన నాయకత్వానికి నీరాజనాలా ? సిగ్గు చేటు ! కేంద్రంలో నరేంద్రమోడీ లేదా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు తమ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. కేరళ ముందుగా మేలుకున్నట్లు అందరూ అంగీకరిస్తారు, కానీ అక్కడ అధికార సిపిఎం నేతలు మన తెలుగు రాష్ట్రాల్లో మాదిరి అక్కడి సిఎంను పొగడ్తలతో ముంచెత్తటం లేదు. పొగడ్తలు, భజనలతో అభిమానం సంపాదించుకొనేందుకు అలవాటు పడిన నేతలకు సమయం సందర్భం గురించి సృహ ఉండదని ఇప్పుడు రుజువు చేస్తున్నారు.
ఒక వైపు కరోనా మరణమృదంగాన్ని వాయిస్తుంటే ఇటలీలోని కార్పొరేట్‌ల యజమానులు చట్టాల్లోని లోపాలను వినియోగించుకొని లబ్ది పొందేందుకు ప్రయత్నించటం కంటే దుర్మార్గం మరొకటి లేదు. ఆరోగ్య సంబంధ సంస్ధలు మినహా మిగిలిన వాటన్నింటినీ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ అత్యవసర సేవల చట్టంలోని నిబంధనల లోపాలను వినియోగించుకొని ఆయుధ కంపెనీల యజమానులు ఫ్యాక్టరీలను మూసివేసేందుకు తిరస్కరిస్తున్నారు.దీనికి నిరసనగా కార్మికులు సమ్మెకు పిలుపు ఇవ్వాల్సి వచ్చింది.

Cartoons: Coronavirus outbreak classified as pandemic
గతంలో బ్రెజిల్‌ వామపక్ష ప్రభుత్వం క్యూబా వైద్యులను రప్పించి పెద్ద ఎత్తున వైద్య, ఆరోగ్యసేవలను అందించింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న మితవాద బోల్‌సోనోరో సర్కార్‌ క్యూబా మీద వ్యతిరేకతతో ఆదేశ వైద్యులను వెనక్కు పంపింది. మరి కొంత మందిని దేశంలో ఉండేందుకు          అనుమతించినప్పటికీ వారి సేవలను వినియోగించుకోవటం నిలిపివేసింది. . ఇప్పుడు కరోనా వ్యాప్తి కారణంగా అదే క్యూబా వైద్యులు తమకు సేవలు అందించాలని, క్యూబా వెళ్లిన వారు తిరిగి రావాలని బోల్‌సోనోరో సర్కార్‌ వేడుకున్నది.ఐదువేల మంది క్యూబన్‌ వైద్యులను ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో వినియోగించనున్నట్లు ఆరోగ్య మంత్రి జావో గబ్బార్డో ప్రకటించాడు.ఎన్నికల ప్రచారంలో క్యూబా వైద్యులను వ్యతిరేకించటం ఒక ప్రచార అంశంగా బోలోసోనారో ముందుకు తెచ్చారు. క్యూబా నుంచి వచ్చిన పదివేల మంది వైద్యులు బ్రెజిల్‌లో గెరిల్లా దళాలను ఏర్పాటు చేసేందుకు వచ్చారని, వారు నిజంగా వైద్యులు కాదని తాను అధికారంలోకి రాగానే వారిని వెనక్కు పంపినట్లు ప్రకటించాడు. క్యూబన్‌ వైద్యుల మీద తప్పుడు ప్రచారం చేసినందుకు బోలోసోనారో క్షమాపణ చెప్పాలని లూలా నాయకత్వంలోని వర్కర్స్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.
వాట్సప్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో కాషాయ దళాల ప్రచారం ముమ్మరంగా సాగుతూనే ఉంది. ఇటలీకి వచ్చిన క్యూబా వైద్యుల బృందం ఫొటోను మార్ఫింగ్‌ చేసి ఆర్‌ఎస్‌ఎస్‌ సేవా దళం అని చిత్రించింది వాటిలో ఒకటి. మూఢనమ్మకాలను పుంఖాను పుంఖాలుగా ముందుకు తెస్తున్నారు. కాషాయ దళాలతో పాటు ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టు వ్యతిరేకుల ప్రచారానికి కరోనా కలసి వచ్చింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనాను ఖాతరు చేయక ముప్పు తెచ్చిన అమెరికా,ఐరోపా పాలకులు !

21 Saturday Mar 2020

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Health, History, International, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

combat the coronavirus, COVID 19 China, COVID- 19 pandemic, COVID-19, COVID-19 in US, COVID-19 Robots

The Chinese navy’s Daishandao is the country’s only hospital ship, but that could be about to change. Photo: Reuters
ఎం కోటేశ్వరరావు
జనవరిలోనే వైరస్‌ తీవ్రత గురించి గూఢచార సంస్ధలు హెచ్చరించినా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పట్టించుకోలేదని వాషింగ్టన్‌ పోస్టు పత్రిక ఒక సంచలన విషయాన్ని తాజాగా వెల్లడించింది. చైనా కటువుగా వ్యవహరించి ఫలితాలు సాధిస్తే, స్వేచ్చా సమాజాల పేరుతో వ్యవహరించిన తీరు కారణంగా ఐరోపా, అమెరికాల్లో దానికి మూల్యం చెల్లించాల్సి వస్తోందంటూ న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి పత్రికలు వాపోతున్నాయి. ఇల్లినాయిస్‌ రాష్ట్రం కూడా జనాలు బయటకు రావద్దని ప్రకటించటంతో అమెరికాలో ఏడున్నర కోట్ల మంది జనాన్ని ఇండ్లకే పరిమితం చేసినట్లయింది. మరోవైపు తొలుత ఎక్కడైతే వైరస్‌ ప్రబలిందో చైనాలోని ఆ ఊహాన్‌ నగరం, పరిసరాల్లో సాధారణ పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఎవరు మహమ్మారిని నిర్లక్ష్యం చేశారు, ఎవరు బాధ్యతాయుతంగా వ్యవహరించారో ప్రపంచానికి వెల్లడైంది.
అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలో కరోనా కేసులు నమోదయ్యాయి. కేవలం ఆరు రోజుల్లోనే న్యూయార్క్‌ నగరం కరోనా కేంద్ర స్ధానంగా మారిపోయింది. న్యూయూర్క్‌ రాష్ట్రంలో 8,377 కేసులు నిర్దారణ కాగా ఒక్క న్యూయార్క్‌ నగరంలోనే ఆరు రోజుల వ్యవధిలో 183 నుంచి 5,151కి పెరిగాయి. ఇవి మొత్తం అమెరికాలో మూడో వంతు అని నగర మేయర్‌ పరిస్ధితి తీవ్రతను వివరించారు.రెండు మూడు వారాలకు సరిపడా మాత్రమే వైద్య సరఫరాలు ఉంటాయని కూడా చెప్పారు.
చైనాలో కొత్తగా కేసులేమీ నమోదు కావటం లేదన్న వార్తలను యావత్‌ ప్రపంచం హర్షిస్తోంది. మహమ్మారిని అదుపు చేయటం సాధ్యమే అని రుజువైంది. తాము ఒక మహమ్మారితో పోరాడుతున్నామని చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ తొలుత ప్రకటించారు, అదే విధంగా తొలిసారిగా ఆరోగ్య అత్యవసర పరిస్ధితిని ప్రకటించి సిపిఎం నాయకత్వంలోని కేరళ ప్రభుత్వం తన ప్రత్యేకతను వెల్లడించింది. కేరళలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదైనపుడు చైనా కమ్యూనిస్టు దేశంలో ప్రారంభమైన వైరస్‌ కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది కనుక అక్కడకు వచ్చిందని ప్రచారం చేసిన ప్రబుద్దులు లేకపోలేదు. వైరస్‌ గురించి చైనా సర్కార్‌ దాచి పెట్టిందని జీవ ఆయుధాన్ని తయారు చేస్తూ తన గోతిలో తానే పడిందని దుమ్మెత్తి పోయటంతో పాటు జనాన్ని నిర్బంధించిందని ప్రచారం చేసిన వారికీ కొదవ లేదు. ఇప్పుడు అవే నోళ్లు చైనా, కేరళ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నాయి. అవి నోళ్లా మరొకటా అన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.

H/O: China Robots coronavirus CloudMinds robot in Wuhan with patients at field hospital
చైనా నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. వాటిలో కరోనా వైరస్‌ అదుపు కూడా చేరింది. దాని గురించి కొన్ని అంశాలను చూద్దాం. మహమ్మారి దండయాత్ర ప్రారంభమైన ఉహాన్‌ నగరంలోని హాంగ్‌షాన్‌ క్రీడా కేంద్రాన్ని రోబోట్లతో నడిచే ఆసుపత్రిగా మార్చివేశారు. స్మార్ట్‌ ఫీల్డ్‌ హాస్పటల్‌గా పిలిచిన ఆ కేంద్రంలో ఇరవై వేల మందికి వ్యాధిగ్రస్తులకు చికిత్స ఏర్పాట్లు చేశారు. వైరస్‌ విస్తరణ తగ్గుముఖం పడుతున్న సమయంలో తీసుకున్న ఈ చర్య ఆరోగ్యకార్యకర్తల మీద వత్తిడిని తగ్గించేందుకు అన్నది స్పష్టం. జనవరిలో కరోనా వైరస్‌ డైమండ్‌ ప్రిన్సెస్‌ అనే నౌకలో వ్యాపించి 712 మందికి సోకి ఏడుగురి ప్రాణాలు తీసింది. ఓడలోని ప్రయాణీకులకు ఆహారం సరఫరా చేసే పళ్లాల(ట్రే) ద్వారా వ్యాప్తి చెంది ఉండవచ్చని ఒక జపాన్‌ నిపుణుడు వ్యాఖ్యానించిన తరువాత రోబోల ప్రయోగం గురించి ఆలోచన వచ్చింది. చైనా, స్పెయిన్లలో డ్రోన్లను జనాన్ని కట్టడి చేసే ప్రచారానికి, ఔషధాల సరఫరాకు వినియోగించారు. దక్షిణ కొరియాలో వైరస్‌ ప్రబలిన ప్రాంతాలలో రోగ క్రిమి నిర్మూలన మందులు చల్లేందుకు వినియోగించారు. ఈ నేపధ్యంలోనే చైనాలోని క్రీడా కేంద్రాన్ని ఆసుపత్రిగా మార్చి అక్కడ పెద్ద ఎత్తున రోబోలను వినియోగించారు. రోగులు ఆసుపత్రిలోకి ప్రవేశిస్తుండగానే రోబోలు, ఇంటర్నెట్‌తో అనుసంధానించిన ఇతర పరికరాలతో రోగులను స్కాన్‌ చేశారు. వారి స్ధితిని తెరల మీద నుంచి వైద్యులు పర్యవేక్షించారు. సిబ్బందికి సైతం కొన్ని పరికరాలను అందచేశారు. అంతేనా రోగులకు అవసరమైన ఆహారం, మంచినీరు, ఔషధాలకే కాదు, ఆసుపత్రిని శుభ్రం చేయటం, రోగులకు ఉల్లాసం కలిగించటం కోసం చివరికి రోబోలతో డ్యాన్సులు కూడా చేయించారు. ఇప్పుడు తీవ్రత తగ్గిపోయినా తిరిగి ప్రబలితే పని చేయించేందుకు వాటిని సిద్దంగా ఉంచినట్లు క్లౌడ్‌ మైండ్స్‌ అనే సంస్ధ తెలిపింది.

GP: Coronavirus China robot disinfectant
రోబోలతో ఆహారాన్ని అందించటం ఇప్పటికే అనేక చోట్ల పరిమితంగా జరుగుతోంది కనుక ఇదేమీ కొత్త కాదు. ఆసుపత్రులలో వినియోగించటమే విశేషం. వందల కిలోమీటర్ల దూరం నుంచి వాటిని విమానాల్లో తెప్పించి ఊహాన్‌ నగరంలోకి ప్రవేశించే అనేక చోట్ల వాటిని వినియోగించారు.వైరస్‌ నిరోధ అవసరాలకు అనుగుణ్యంగా రోబోలలో కొన్ని మార్పులు చేశారు.ఇవి తమకు ఎంతో సహాయకారిగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనేక దేశాల నుంచి వీటిని తెప్పించారు. చైనా అనుభవం చూసిన తరువాత కరోనా బారిన పడిన ఇటలీ, ఇతర అనేక దేశాలలో రోబోల వినియోగం పెరిగింది. తాము తయారు చేసిన రోబో ఒక్కొక్కటి విద్యుత్‌ చార్జి చేసిన తరువాత రెండున్నర గంటల పాటు పని చేస్తుందని తొమ్మిది- పది గదులలలో క్రిమి నిర్మూలన మందులను చల్లి శుభ్రం చేస్తుందని, పది నిమిషాల్లో బాక్టీరియా, కొన్ని రకాల వైరస్‌లను నిర్మూలిస్తుందని డెన్మార్క్‌ కంపెనీ ప్రతినిధి చెప్పారు. రోబోలను తయారు చేసే అమెరికా గ్జెనెక్స్‌ కంపెనీ ఉత్పత్తి గత ఏడాది మొత్తంగా చేసిన వాటి కంటే ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 400శాతం పెరిగిందని వెల్లడించారు.

Image result for Covid 19 pandemic, trump cartoons
వైరస్‌ తీవ్రత గురించి చెప్పినప్పటికీ ట్రంప్‌ కొట్టిపారవేశారని, తీవ్రంగా పరిగణించలేదని, అమెరికాలో వ్యాపించే అవకాశం లేదని భావించినట్లు , చైనా అధ్యక్షుడు చెప్పినదానిని నమ్మాల్సిన పనిలేదని అన్నట్లు వాషింగ్టన్‌ పోస్టు పేర్కొన్నది. తొలి వారంలోనే నివేదించినప్పటికీ జనవరి 18వ తేదీ వరకు ఆరోగ్య, మానవ వనరుల శాఖల అధికారులు ట్రంప్‌కు నచ్చ చెప్పేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్లు తెలిపింది. తరువాత ఉన్నతాధికారులను కలసి వారిని ఒప్పించిన తరువాత సమీక్షలు ప్రారంభమైనట్లు కూడా పేర్కొన్నది. చివరకు అమెరికాలో వ్యాపించినట్లు వెల్లడైన తరువాత కూడా దాన్నొక ముప్పుగా ట్రంప్‌ పరిగణించలేదని, వ్యాధి నిరోధక కేంద్రం అధికారిణి నాన్సీ ఫిబ్రవరి చివరిలో హెచ్చరికలను కూడా పట్టించుకోకపోగా ఆమె మదుపుదార్లను భయపెడుతున్నారని ట్రంప్‌ ఫిర్యాదు చేసినట్లు కూడా వాషింగ్టన్‌ పోస్టు వ్యాఖ్యానించింది.
ఉహాన్‌లో యుద్ద ఓడలకు రూపకల్పన చేసే ప్రభుత్వ ఓడల నిర్మాణ సంస్ధ అత్యవసర వైద్య సహాయ ఓడలకు రూపకల్పన పూర్తి చేసినట్లుగా తాజాగా వార్తలు వెలువడ్డాయి. ఇది కరోనా వైరస్‌లకే కాదు, ఇతర వైరస్‌ చికిత్సలకు సైతం అనువుగా ఉంటుందని పత్రికలు రాశాయి. ప్రస్తుతం చైనా మిలిటరీ ఆధ్వర్యంలో 14వేల టన్నుల బరువు గల ఒక ఆసుపత్రి ఓడ ఉంది. దానిని విదేశాలకు మానవతా పూర్వక సాయం చేసేందుకు శాంతి ఓడ పేరుతో నిర్వహిస్తున్నారు. దీనిలో 20 ఇంటెన్సివ్‌ కేర్‌, పది క్వారంటైన్‌ పడకలతో సహా మూడు వందల మందికి ఒకేసారి చికిత్సలు చేయవచ్చు.చైనా కొత్తగా రూపకల్పన చేసిన ఓడ నిర్మాణం పూర్తయిన తరువాత మహమ్మారులు తలెత్తినపుడు బాధితులను తరలించేందుకు, చికిత్సలకు, సముద్రాల్లో రోగుల నుంచి వ్యా ధులు విస్తరించకుండా క్వారంటైన్‌ చేసేందుకు, ఇతర సందర్భాలలో ఇతర అవసరాలకు కూడా వినియోగించవచ్చు. ఈ ఓడ నమూనాతో ప్రయాణీకుల ఓడలను కూడా నిర్మిస్తే వాణిజ్య పరంగా కూడా ఎంతో లాభసాటిగా ఉంటాయని భావిస్తున్నారు.
చైనా కంటే కరోనా వైరస్‌ ఐరోపాను గట్టిగా తాకింది. ఇది స్వేచ్చా సమాజాలు చెల్లిస్తున్న మూల్యమా అని ప్రశ్నిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ ఒక వ్యాఖ్యానం, విశ్లేషణను ప్రచురించింది. ఇది వంకర బుద్ది నుంచి వెలువడిన ఉత్పత్తి అన్నది స్పష్టం. స్వేచ్చా సమాజమా, మరొకటా అన్న విచక్షణ వైరస్‌లు, బాక్టీరియాలకు ఉండన్నది వేల సంవత్సరాల చరిత్ర. అంతెందుకు వర్తమానానికి వస్తే ఫ్లూ(జలుబు)కారణంగా ఏటా అమెరికాలో 27 నుంచి 77వేల మంది వరకు మరణిస్తున్నారని ఇది ఫ్లూ(ఇన్‌ఫ్లూయంజా) కంటే పెద్ద ప్రమాదకరమైనదేమీ కాదన్నట్లుగా మార్చి నాలుగవ తేదీ డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. అమెరికా సిడిసి సమాచారం ప్రకారం 2010 నుంచి ఏటా అమెరికాలో 93లక్షల నుంచి 4.9 కోట్ల మంది వరకు ఫ్లూబారిన పడుతున్నారు, 37వేల నుంచి 2017-18వరకు 61వేల మధ్య మరణించారు. స్వేచ్చా సమాజానికి ప్రతీకగా ఉన్న అమెరికాలో ఉన్న పరిస్ధితి ఇది. దీనికి న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఏమి చెబుతుంది ?

Image result for Covid 19 pandemic, trump cartoons
ఫిబ్రవరి 28వ తేదీన కరోనా గురించి ట్రంప్‌ పత్రికా గోష్టిలో మాట్లాడినదేమిటో చూద్దాం. ఒక అద్భుతం లేదా మాయ మాదిరి ఒక్క రోజులో కరోనా మాయం అవుతుంది. వేడి వాతావరణం వైరస్‌ను హరిస్తుంది, వ్యాప్తిని అరికడుతుంది అని చెప్పాడు.(బహుశా ఆ ప్రభావంతోనే బ్లీచింగ్‌ పౌడర్‌, పారాసిటమాల్‌తో కరోనాను అరికట్ట వచ్చని తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు చెప్పారా ?) అలాంటి పెద్ద మనిషి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోని కారణంగా నేడు అమెరికాలో కూడా పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నది. స్వేచ్చా సమాజం కారణంగానా పాలకుల బాధ్యతా రాహిత్యం వలన ఇది జరిగిందా ? విశ్లేషకులకు ఈ మాత్రం కూడా తెలియదని అనుకోవాలా ? చైనా సకాలంలో స్పందించలేదని విమర్శిస్తున్న వారు అమెరికా, ఐరోపా పాలకుల, ప్రభుత్వాల నిర్లక్ష్య స్పందనను ఏ విధంగా వర్ణిస్తారు?
ఐరోపా సౌహాద్రత అనేది పుస్తకాలకే పరిమితమైన దేవతా కథల వంటివి. మీరు తప్ప మాకు సాయం చేసే వారు లేరు, డబ్బు మాకు సమస్య కాదు, ఐరోపా యూనియన్‌ నుంచి అవసరమైన పరికరాలు తెచ్చుకోవటం అసాధ్యమని దాని ప్రకటన వెల్లడించింది. ఈ స్ధితిలో మీరు తప్ప మాకు వేరే స్నేహితులు లేరు, మీరే ఆదుకోవాలి, మాకు డబ్బు అవసరం లేదు, మీరు ఏది పంపగలిగితే దాన్ని పంపండి, మేమేమీ దాచుకోవటం లేదు, మమ్మల్ని మేము రక్షించుకోలేని స్ధితిలో ఉన్నాం, చైనా సోదరుల సాయం కోసం ఎదురు చూస్తున్నాం అని ఐరోపా దేశమైన సెర్బియా అధ్య క్షుడు యుసినిక్‌ చైనా రాయబారికి చేసిన వినతిని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. కరోనా సమస్య తలెత్తక ముందు చైనా నుంచి దిగుమతులను తగ్గించుకోవాలని, ఐరోపా నుంచి పెంచుకోవాలని ఐరోపా ధనిక దేశాలు సెర్బియా మీద వత్తిడి తెచ్చాయి. ఇప్పుడు అవే దేశాలు కరోనా కారణంగా తాము వస్తు సరఫరా చేయలేమని చేతులెత్తాశాయి. పరస్పరం సాయం చేసుకోవాల్సిన తరుణంలో తోటి దేశం పట్ల స్వేచ్చా సమాజాల నిజస్వరూపమిది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా కట్టడికి గోమూత్ర విందులు – రెచ్చి పోతున్న ఫేక్‌ న్యూస్‌ !

07 Saturday Mar 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, USA

≈ Leave a comment

Tags

Coronavirus outbreak, COVID-19, fake news, Gaumutra party with cow-dung cakes

Image result for Cow Piss and Dung Cakes to Fight Coronavirus cartoons

ఎం కోటేశ్వరరావు
వంచన, దగా, అబద్దం దేని నుంచి వచ్చినా సరే లాభం ఆమోదయోగ్యంగానే ఉంటుంది అని గ్రీకు తత్వవేత్త సోఫిక్లస్‌ క్రీస్తుపూర్వమే చెప్పాడు. వ్యాపారమంటే ఒక నాడు వస్తు ఉత్పత్తి, విక్రయం, కొనుగోలు. తరువాత సేవలు కూడా వ్యాపార వస్తువులయ్యాయి. ఇప్పుడు వస్తూత్పత్తి ఉండదు, సేవలతో పని లేదు. జనం ముఖ్యంగా విద్యావంతుల మూఢనమ్మకాలు, విచక్షణారాహిత్యం వంటి వాటిని ఆధారంగా చేసుకొని కేవలం అబద్దాల అమ్మకాలతో కూడా అపరమిత లాభాలు సంపాదించవచ్చని ఆధునిక పెట్టుబడిదారీ విధానం రుజువు చేసింది. ఫేస్‌బుక్‌, దాని సోదరి వాట్సాప్‌, గూగుల్‌ ఇతర సామాజిక మాధ్యమ యజమానులు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. మన మందరం వారికోసం జీతం, భత్యం లేకుండా నిరంతరం నైపుణ్యాన్ని పెంచుకుంటూ పని చేస్తున్న శ్రమజీవులం. ముఖ్యంగా వాట్సాప్‌ ద్వారా అబద్దాల అమ్మకాలను మనమే పెంచుతున్నాం. ఈ దోపిడీ గురించి బహుశా ఏ ఆర్ధికవేత్తా ఊహించి ఉండరు. తాజాగా కరోనా వైరస్‌ను అలాగే సొమ్ము చేసుకుంటున్నారు.

Image result for Parties With Cow Piss and Dung Cakes to Fight Coronavirus
మన దేశంలో మూఢవిశ్వాసాలు, మనోభావాల వ్యాప్తికి కరోనా వైరస్‌ను వినియోగించుకొనే మతోన్మాద, తిరోగామి శక్తులు రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌లో బహిరంగంగా వేదికలపై మంత్రులు, ఇతర ప్రముఖులు కోడి మాంసం తిన్న తరువాతే కరోనా వైరస్‌ మన దేశంలోకి వచ్చిందని హిందూ మహాసభ నేతలు ప్రచారం చేస్తున్నారు. మాంసాహారాన్ని తినే వారిని శిక్షించేందుకు దేవుడు కరోనా వైరస్‌ అవతారం ఎత్తాడని, తెలంగాణా మంత్రులు కరోనాకు క్షమాపణ చెప్పాలని అన్నారు. శాఖాహారులకు దానితో ఎలాంటి ముప్పు లేదని అయితే ముందు జాగ్రత్త చర్యగా నివారణకు గోమూత్ర, ఆవు పేడ పిడకల పార్టీలు నిర్వహిస్తామని హిందూమహాసభ నేత చక్రపాణి మహరాజ్‌ ప్రకటించారు. ఆయనొక హిందూ మత ఉద్దారక స్వామీజీ. ఆవు మూత్రాన్ని తాగటం, ఒంటి మీద చల్లుకోవటం,పిడకలతో రాసుకోవటం, అగర్‌బత్తీల మాదిరి వెలిగించటం ద్వారా వైరస్‌ను నివారించవచ్చని చెబుతున్నారు. ఇక రామ్‌దేవ్‌ బాబా సర్వరోగ నివారిణి యోగా అని ప్రకటించారనుకోండి.
కరోనా వైరస్‌ గురించి ప్రపంచ వ్యాపితంగా అనేక మూఢనమ్మకాలను వ్యాపింప చేశారు, చేస్తున్నారు. మన దేశంలో కూడా అదే జరుగుతోంది. అలాంటి వాటితో ఇతర దేశాల్లో దేనిని ఆశిస్తున్నారో ఇక్కడ కూడా దాన్నే ఆశిస్తున్నారు. జనాన్ని చీకట్లో ఉంచటం. హైదరాబాదు శివార్లలోని చిలుకూరు బాలాజీ డాలర్‌ దేవుడిగా ప్రఖ్యాతి చెందారు. అక్కడికి వెళ్లి పూజలు చేస్తే అమెరికాకు వీసా వస్తుందని ఎందరో నమ్మి ప్రదక్షిణలు చేశారు. ఇప్పుడు ట్రంప్‌ కోత పెట్టారు, బాలాజీ ఏమి చేస్తున్నట్లు ? అమెరికా సర్కార్‌ అనుమతిస్తున్న కారణంగా వీసాలు వస్తున్నాయి తప్ప బాలాజీ మహిమ వల్ల కాదని అక్కడి పూజారులు ఎప్పుడూ చెప్పలేదు, ప్రోత్సహించారు. తాజాగా చైనాలో కరోనా వైరస్‌ వ్యాప్తి వార్తలు రాగానే సదరు వైరస్‌ను భారత్‌కు రాకుండా అడ్డుకొమ్మని బాలాజీని కోరుతూ అదే దేవాలయంలో పూజలు చేశారు. తీరా మన దేశంలో కేసులు బయట పడిన తరువాత వస్తే రానిచ్చారు గానీ ఇప్పుడు వ్యాప్తి చెందకుండా చూడు సామీ అని పూజలు చేస్తున్నారు. రెండు పూజల్లోనూ మూఢనమ్మకాలకు పెద్ద పీట వేశారు. సమాజంలో అలాంటి వాటిని వ్యాప్తి చెందించటమే వారు కోరు కుంటున్న లాభం, కానట్లయితే ఎందుకు చేస్తున్నట్లు ? వైరస్‌ వ్యాప్తి నిరోధంలో బాలాజీ విఫలమయ్యారు కదా అని ఎవరైనా అంటే అదిగో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ దెబ్బలాటలకు వస్తున్నారు. మరికొందరు ఇంకాస్త ముందుకు పోయి దాని వలన అక్కడి పూజారులేమీ లబ్ది పొందటం లేదు కదా అని ఎదురు దాడులు, వితండవాదనలు చేస్తున్నారు. ఆ పూజలను నమ్మి తగుజాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు తిరిగి వైరస్‌ను కొని తెచ్చుకొంటే బాధ్యత ఎవరిది ? పూజారిదా బాలాజీదా ? మూఢనమ్మకాలను వ్యాపింప చేయటం వలన వేలు లక్షలు తగలేసి దోష నివారణలు చేయిస్తున్నారు. ఇప్పుడు కరోనా దోష నివారణ పూజలకు తెరలేపరనే గ్యారంటీ ఏముంది? తమకేమీ లాభం లేదని చెప్పేవారు ఈ పూజల దోపిడీ గురించి ఏమి చెబుతారు? వారికేమీ సామాజిక బాధ్యత లేదా ? మూఢనమ్మకాల వ్యాప్తి విషయంలో హిందూ, క్రైస్తవం, ఇస్లాం ఏ మతమైనా ఒక్కటే !
కరోనా వైరస్‌ మూఢనమ్మకాలను, తిరోగామి భావాలనే కాదు, జాత్యహంకారశక్తులనూ ముందుకు తెచ్చింది. శుద్దీ బద్దం ఉండని చైనా జాతీయులు, యూదుల కారణంగానే కరోనా వైరస్‌ వ్యాపిస్తోందని, వారినే హతమారుస్తోందని శ్వేత జాతి జాత్యహంకారులు ఆరోపిస్తున్నారు. నయా నాజీలు యూదుల మీద విష ప్రచారం చేస్తున్నారు. టెలిగ్రామ్‌,4చాన్‌ వంటి వేదికలు వీటికి ఆలంబనగా ఉన్నాయి.శ్వేత జాతేతర దేశాల్లోనే కరోనా వ్యాపిస్తోందనే పోస్టులు, పోస్టర్లు వీటిలో విచ్చల విడిగా దర్శనమిస్తున్నాయి. కరోనా రోగులను ఇజ్రాయెల్‌కు పంపండి, మీరు మరణశయ్యమీద ఉంటే మీతో పాటు వీలైనంత మంది యూదులను తీసుకుపోండి, మీకు గనుక వ్యాధి సోకితే మన శత్రువులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఎక్కువగా తిరగండి వంటి పోస్టులు దర్శనమిస్తున్నాయి.
వాక్సిన్‌ వ్యాపారంలో ఎంతో ముందున్న బిల్‌గేట్స్‌(చాలా మందికి మైక్రోసాప్ట్‌ అధినేతగానే తెలుసు), ఇతర ఔషధ కంపెనీలు వైరస్‌ను వ్యాపింప చేస్తున్నాయనే పోస్టులు కూడా వస్తున్నాయి. చైనా 5జి నెట్‌వర్క్‌ పరిజ్ఞానంలో ముందుంది. దాన్ని దెబ్బతీసేందుకు కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రయత్నం జరుగుతోంది. చైనా 5జి వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ హుబెరు రాష్ట్రంలోని జనాల రోగనిరోధక శక్తిని బలహీన పరిచిందనే ప్రచారం వాటిలో ఒకటి. పైన పేర్కొన్నవన్నీ తప్పుడు ప్రచారాలే. గతంలో కొన్ని కంపెనీలు, కొన్ని ప్రభుత్వాలు ఇలాంటి అక్రమాలకు పాల్పడిన కారణంగానే కరోనా విషయంలో కూడా అదే జరిగి ఉంటుందనే అనుమానాల నుంచి ఇవన్నీ పుడుతున్నాయి. వాటికి జాత్యహంకారం, విద్వేషం తోడైతే ఇక చెప్పాల్సిందేముంది !

Image result for Cow Piss and Dung Cakes to Fight Coronavirus cartoons
గోమూత్రం తాగితే, చల్లుకుంటే వైరస్‌ దూరం అవుతుందని హిందూ మత ఉద్దారకులుగా చెలామణి అవుతున్నవారు చెబుతున్నారు. అలాగే ఎన్నికల నాటికి వైరస్‌కు వాక్సిన్‌ కనుగొనండి అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన ఆతృత, తెలివి తక్కువ తనాన్ని బయట పెట్టుకున్నాడు. కరోనా వైస్‌ నివారణ అధికార యంత్రాంగం, ఔషధరంగ ప్రముఖులతో జరిపిన సమావేశంలో ఈ ప్రతిపాదన చేసి అభాసుపాలయ్యాడు. కరోనా వైరస్‌ కోవిడ్‌-19కు వాక్సిన్‌ కనుగొనేందుకు కనీసం పద్దెనిమిది నెలల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రకటించిన తరువాత కూడా ట్రంప్‌ అలా మాట్లాడటాన్ని గమనించాలి. నవంబరులోగా తయారీ సాధ్యం కాదని ఒక అధికారి వివరించబోయినా తెలుసులేవయ్యా అంటూ ట్రంప్‌ వినిపించుకోలేదు.
ఫేక్‌ న్యూస్‌ లేదా కుహనా వార్తలు, వాటి ఉత్పత్తి వివిధ రూపాల్లో ఉంటాయి.కరోనా వైరస్‌ గురించి వందలాది తప్పుడు, వక్రీకరణ వార్తలను ప్రపంచ వ్యాపితంగా వ్యాపింప చేస్తున్నారు. కుహనా వార్త తయారీలో శ్రామికులు ఉండరా అంటే ఏ ఉత్పత్తి అయినా ఏదో ఒక శ్రమ లేకుండా తయారు కాదు. ఇవి కూడా అంతే. వాటికి సైతం యంత్రాల(కంప్యూటర్లు, తదితరాలు)తో కూడిన ఫ్యాక్టరీలుంటాయి, మేథో శ్రమను అమ్ముకొనే వారు ఉంటారు. ఆ ఉత్పత్తులతో అమెరికాలో ట్రంప్‌, రష్యాలో పుతిన్‌, మన దేశంలో నరేంద్రమోడీ ఎన్నికల్లో, ఇతర విధాలుగా లబ్ది పొందిన వారిలో కొందరైతే, వినియోగదారులుగా మోసపోయిన వారు కోట్లలో ఉన్నారు. ఒక వస్తువు నకిలీదని తేలితే కేసు పెట్టటానికి, పరిహారం పొందటానికి చట్టాలున్నాయి. ఒక నకిలీ వార్తను నమ్మి మోసపోతే అలాంటి రక్షణ లేకపోగా వాటిని గుడ్డిగా నమ్మటానికి నీ బుర్ర ఏమైందని ఎదురు తిట్లు తినాల్సి ఉంటుంది. ఏ కోర్టులూ వాటి తయారీదార్లను ఏమీ చేయలేవు. అసలు ఉత్పత్తి కేంద్రాలు ఆయా దేశాల్లోనే ఉండవు,ఎక్కడుంటాయో కూడా తెలియదు.

Image result for Parties With Cow Piss and Dung Cakes to Fight Coronavirus
మన దేశంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీ మారేందుకు నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తల అభీష్టం అని నిస్సిగ్గుగా సమర్ధించుకున్నవారిని చూశాము. ఇప్పుడు అలాంటి వాటి సరసన జాతీయవాదం చేరింది. బిజెపిలో చేరాలనుకొనే వారు ఆ పార్టీ జాతీయవాదం, దేశ భక్తి నచ్చి చేరాలనుకున్నామని చెబుతున్నారు. తాము చెప్పే (కుహనా) జాతీయవాదం, దేశభక్తి వర్గీకరణలోకి రాని వారందరూ తుకడే తుకడే గ్యాంగ్స్‌, దేశ ద్రోహులే అని బిజెపి ముద్రవేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణాలు ఇథమిద్దంగా తెలియదు. కానీ దేశంలోని సాధారణ జనంలో(ఎంతశాతం అనేది వేరే సంగతి) అంతకంటే ప్రమాదకరమైన జాతీయవాద వైరస్‌ పెరగటానికి కారణం కుహనా వార్తల వ్యాప్తి చోదకశక్తిగా ఉందని కొంత కాలం క్రితం బిబిసి పరిశోధనలో వెల్లడైంది. భావోద్వేగ భరితమైన జాతీయవాదం పెరుగుదలలో వాస్తవాలకు ప్రాధాన్యత నామమాత్రమని తేల్చింది. ఎలాంటి సమాచారాన్ని జనం పొందుతున్నారు,ఇతరుల నుంచి ఎలా పొందుతున్నారు వంటి ప్రశ్నలతో ఈ పరిశోధన సాగింది. దాని సారాంశం ఇలా ఉంది. కుహనా జాతీయవాద కథల వ్యాప్తిలో మితవాద(సంఘపరివార్‌) సంస్ధలు ఎంతో సంఘటితంగా పని చేస్తున్నాయి. ప్రధాన స్రవంతి మీడియా చెబుతున్న అంశాలను విశ్వసించని కారణంగా ప్రత్యామ్నాయ వనరులవైపు జనం చూస్తున్నారు. నకిలీ వార్తా , కాదా అని నిర్ధారించుకొనే ప్రయత్నం చేయకుండానే తాము నిజమైన దానినే వ్యాపింప చేస్తున్నామని, ఏది నకిలీనో ఏది అసలైనదో తెలియనంత అమాయకులం కాదని తమ మీద తాము అతి నమ్మకంతో ఉంటారు. బిబిసి పరిశోధకులతో మాట్లాడిన వారు తామ వార్తల విశ్వసనీయతను నిర్ధారించుకొనేందుకు ఏ చిన్న ప్రయత్నం చేయలేదని, ప్రత్యామ్నాయ సమాచారం నిజమని నమ్మామని నిజాయితిగానే అంగీకరించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు పంపినవి గనుక వాస్తవమే అని గుడ్డిగా నమ్ముతున్నారు.వాట్సాప్‌లో తప్పుడు సమాచారాన్ని నిజమని నమ్మిన కారణంగా అది భారత్‌లో హింసాకాండ ప్రజ్వలనకు దోహదం చేసింది. పిల్లలను అపహరించేవారి గురించి, ఇతర సమాచారంతో తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, తమ సామాజిక తరగతిని చైతన్యపరచాలనే భావనతోనే అలాంటి పనులు చేస్తున్నారు. రెండు సంవత్సరాల కాలంలో ఇలాంటి తప్పుడు సమాచారం కారణంగా31 మంది హత్యకు గురైనట్లు బిబిసి గుర్తించింది. ఇలాంటి పరిణామం అనేక దేశాల్లో ఉంది.
2018లో రాండ్‌ కార్పొరేషన్‌ అన్ని రకాల కుహనా వార్తల మీద ఒక సర్వే చేసింది. వాటిలో ఆరోగ్యపరమైన వార్తలు మరీ దారుణంగా ఉన్నాయని తేల్చింది. అభిప్రాయాలకు-వాస్తవాలకు మధ్య ఉన్న తేడాను కోవిడ్‌-19 చెరిపివేసినట్లు వెల్లడైంది.కుహనా వార్తల మీద ఫేస్‌బుక్‌ యుద్దం ప్రకటించింది. నిజానికి అదంతా ఒక ప్రచార ప్రహసనం మాత్రమే. తప్పుడు వార్తల తయారీ, వ్యాప్తిదార్లకు అవి సొమ్ములను కురిపిస్తాయి, వాటిని ఉపయోగించుకొనే వారికి తగినంత ప్రచారాన్ని కల్పిస్తాయి. అనేక మందిని భ్రమింపచేసి మద్దతుదారులుగా మార్చివేస్తాయి. నియంత్రణలు, పర్యవేక్షణలేని ప్రాంతాలను ఎంచుకొని అక్కడి నుంచి ప్రపంచ వ్యాపితంగా వీటిని వ్యాపింప చేస్తాయి. తప్పుడు వార్తలను సొమ్ము చేసుకొనేందుకు ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటివి వారధులుగా ఉన్నాయి. అవి కూడా వాటిని సొమ్ము చేసుకుంటాయి గనుక ఎన్ని సుభాషితాలు పలికినా ఏదో ఒకదారిలో అనుమతిస్తూనే ఉంటాయి. అందుకు గాను అనేక వ్యాపార పద్దతులను అనుసరిస్తున్నాయి. మాసిడోనియా ప్రాంతం నుంచి అమెరికా ఎన్నికల మీద ఒక తప్పుడు వార్తను దిమిత్రి అనే యువకుడు ఇంటర్నెట్‌లో పెట్టాడు. గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి సంస్ధలు వాటిని జనం చూసే నడతను బట్టి వాణిజ్య ప్రకటనలను జోడిస్తాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ అభిమానులు ఆ వార్త మీద క్లిక్‌ చేసి చూసినందుకు గాను ఆరునెలల్లో 60వేల డాలర్లు తన వాటాగా పొందాడు. తప్పుడు వార్తలున్న పేజీలను గుర్తించి వాటి మీద వాణిజ్య ప్రకటనలు పెట్టటాన్ని అడ్డుకుంటామని ఫేస్‌బుక్‌, గూగుల్‌ ప్రకటించాయి.కానీ తరువాత చూస్తే తప్పుడు వార్తల మీద వాణిజ్య ప్రకటనలను అనుమతించి ఆదాయాన్ని పొందుతున్నట్లు తేలింది. దీంతో కొన్ని కంపెనీలు తమ ప్రకటనలను తప్పుడు వెబ్‌సైట్లలో పెడితే తమ బ్రాండ్‌(పేరు)కు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నందున డబ్బు చెల్లించేది లేదని చెప్పాల్సి వచ్చింది.

Image result for Cow Piss and Dung Cakes to Fight Coronavirus cartoons

విధానపరంగా నిషేధం విధించినప్పటికీ దొడ్డి దారిన గూగుల్‌ సంస్ద కరోనా వైరస్‌ నిరోధ ఉత్పత్తులు, పరిమితంగా అందుబాటులో ఉన్నాయనే సందేశాలతో ఎగబడి కొనే విధంగా కొన్ని ప్రకటనలను అనుమతించి సొమ్ము చేసుకుంటున్నది. విమర్శలు తలెత్తగానే తమ వేదికలను మూడవ పక్షాలు వుపయోగించుకుంటున్నాయని గూగుల్‌, అమెజాన్‌ వంటివి తమకేమీ సంబంధం లేదన్నట్లుగా ప్రకటించాయి. కరోనా వైరస్‌ నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం తప్ప నివారణకు ఎలాంటి చిట్కాలు పని చేయవు, నోరు, ముక్కులకు వేసుకొనే ముసుగులు , శానిటైజర్స్‌ కూడా అలాంటివే అని నిపుణులు చెబుతున్నా జనం బ్లాక్‌ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నారు, వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మిడతల దండుపై బాతులు, కోళ్లతో చైనా యుద్దం !

02 Monday Mar 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Environment, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

China duck troops, locust attack, Plague of Locusts, worst locust attack

Image result for china duck army

ఎం కోటేశ్వరరావు

అవును, వినటానికి ఆశ్చర్యంగానే ఉంది, పచ్చి నిజం. ఒక వైపు కోవిద్‌-19(కరోనా వైరస్‌)ను అదుపులోకి తెచ్చేందుకు అపూర్వరీతిలో ప్రయత్నిస్తున్న చైనా మరోవైపు ముంచుకు వస్తున్న మిడతల దండు ముప్పును ఎదుర్కొనేందుకు తన బాతులు, కోళ్ల వీరులను యుద్ధానికి తరలిస్తోంది. ఎత్తయిన, మంచుతో ఉండే హిమాలయాల కారణంగా మిడతలు చైనా మీద దాడి చేసే అవకాశాలు పరిమితమే అయినప్పటికీ ఇరుగుపొరుగుదేశాలకు సాయ పడేందుకు, తమ దేశంపై దాడి చేస్తే ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తలు తీసుకొంటోంది. రసాయనాలతో మిడతలను సంహరించే అవకాశాలున్నా పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ఎరిగిన చైనా సాధ్యమైన మేరకు వాటితో నిమిత్తం లేకుండా హానిలేని ఫంగస్‌లను కూడా పెద్ద ఎత్తున తయారు చేస్తోంది.
గత కొన్ని దశాబ్దాలలో లేని విధంగా కొద్ది వారాలుగా తూర్పు ఆఫ్రికాలోని అనేక దేశాలలో పంటలను తుడిచి పెట్టిన మిడతలు ఇప్పుడు సౌదీ అరేబియా, పాకిస్ధాన్‌, మన దేశం, చైనా వైపు పయనిస్తున్నాయి. దాదాపు 360 నుంచి 400 బిలియన్ల మిడతలు దాడుల్లో ఉన్నట్లు అంచనా. చైనా పశ్చిమ సరిహద్దు రాష్ట్రమైన గ్జిన్‌జియాంగ్‌ సరిహద్దుల్లో ఉన్న పాకిస్ధాన్‌, భారత్‌ ప్రాంతాలకు విస్తరిస్తున్న మిడతలను ఎదుర్కొనేందుకు ఇప్పటికే లక్ష బాతు సైన్యాన్ని చైనా సిద్దం చేసింది. వాటిని రాబోయే రోజుల్లో పాకిస్ధాన్‌లోని సింధు, పంజాబ్‌, బెలూచిస్తాన్‌ రాష్ట్రాలకు తరలించేందుకు ఇప్పటికే చైనా అధికారులు కొన్ని ప్రాంతాలను సందర్శించి తీసుకోవలసిన చర్యల గురించి అధికారులు, రైతులతో మాట్లాడారు. బాతులకు నీరు అవసరమైనందున నీరు లేని ఎడారి ప్రాంతాలలో వాటిని వినియోగించటం గురించి పరిశీలన చేస్తున్నారు. మిడతల దండు దాడులతో ఇప్పటికే పాక్‌ ప్రధాని జాతీయ అత్యవసర పరిస్ధితిని ప్రకటించారు. పంటల నష్టంతో ఆహారకొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

Image result for china duck army
రసాయనాలతో మిడతలను హతమార్చవచ్చుగానీ, అది మరికొన్ని కొత్త సమస్యలను సృష్టిస్తుంది, అందువలన చైనీయులు సహజంగా మిడతల పని పట్టే పద్దతులను పాతిక సంవత్సరాల క్రితమే ప్రయోగించి జయప్రదమయ్యారు. ఇప్పుడు పెద్ద ఎత్తున నివారణ చర్యలకు సిద్దం అవుతున్నారు. ఒక్కొక్క కోడి రోజుకు 70మిడతలను తింటే ఒక బాతు 200లను ఆరగిస్తుంది. ఒక బాతు నాలుగు చదరపు మీటర్ల విస్తీర్ణంలోని మిడతలను అదుపు చేయగలదు. ప్రకృతిలో మిడతలు ఒక భాగం. కొన్ని సందర్భాలలో అవి అలవిగాని రీతిలో విపరీతంగా పెరిగిపోవటానికి నిర్దిష్టంగా ఫలానా పరిస్ధితులు కారణమని చెప్పలేని స్దితి. అందువలన వాటిని పర్యవేక్షించి తీవ్రతను అంచనా వేసి చర్యలు తీసుకోవటం తప్ప మరొక మార్గం లేదు. బాతులతో పాటు గంటకు 16000 హెక్టార్లలోని మిడతలపై రసాయనాలు చల్లి హతమార్చేందుకు చైనా 50 డ్రోన్లను, విమానాలను కూడా అందచేసేందుకు పాక్‌ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. రసాయనాలను ఉపయోగించినపుడు మిడతలతో పాటు మానవాళి, పంటలకు ఉపయోగపడే పరపరాగ సంపర్కానికి దోహదం చేసే తేనెటీగల వంటివి కూడా అంతరిస్తాయి. దాని వలన జరిగే నష్టాలను కూడా పరిగణనలోకి తీసుకొని సహజ పద్దతుల్లో ఎదుర్కొనేందుకు, తక్కువ ఖర్చుతో కూడిన గువోషాఓ రకం బాతులు మిడతలను తినటంలో ఎంతో నైపుణ్యం గలవిగా పరిగణిస్తున్నారు. వాటిని చైనా ప్రత్యేకంగా ఉత్పత్తి చేస్తున్నది. గాలి వాలును బట్టి హిమాలయాలు అడ్డుగా ఉన్నందున, చలి కారణంగా చైనాకు మిడతల దండు ముప్పు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అయినా ముందు జాగ్రత్తగా బాతు, కోళ్ల సైన్యాన్ని సన్నద్ద పరుస్తున్నారు. అవసరమైన పాకిస్దాన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
తాజా దండు ప్రారంభాన్ని గతేడాది జూన్‌లో గమనించారు. అయితే అది ఈ ఏడాది జనవరి నాటికి అదుపు తప్పి పెరిగిపోయింది. తూర్పు ఆఫ్రికాలోని కెన్యాలో జనవరినెలలో ఐదువేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కేంద్రీకృతమై పదివేల కిలోమీటర్లకు పెరిగి అక్కడి పంటలు, పచ్చదనాన్ని హరించి నుంచి గాలివాలును బట్టి పరిసర దేశాల మీద దాడి చేస్తున్నాయి. ఆహార భద్రతకు అసాధారణ ముప్పు వచ్చిందని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్ధ ప్రకటించింది. గతేడాది చివరిలో ఎమెన్‌, మరికొన్ని దేశాలలో భారీ వర్షాలు పడటంతో మిడతలు తామర తంపరగా పెరగటానికి అనువైన పరిస్ధితి ఏర్పడింది.
ఒక చదరపు కిలోమీటరు ప్రాంతంలో పదిహేను కోట్ల మిడతలు ఉంటాయని, గాలి తీవ్రతను బట్టి రోజుకు గరిష్టంగా 150కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.ఒక రోజులో 35వేల మంది ఎంత ఆహారం తింటారో ఒక చదరపు కిలోమీటరులో విస్తరించిన మిడతలు రోజులో అంత మొత్తాన్ని ఖాళీ చేస్తాయని అంచనా. వాతావరణాన్ని బట్టి ఒక దండు దండయాత్ర ఒకటి నుంచి రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఏడాదిలో రెండు నుంచి ఐదు తరాలు వృద్ధి చెందుతాయి. ఒక మిడత గుడ్డు నుంచి సంపూర్ణంగా ఎదగటానికి మూడునెలల సమయం పడుతుంది. ఒకేసారి అనేక గుడ్లను పెడతాయి.
చైనా విషయానికి ముఖ్యంగా ఆహార భద్రతను గమనంలో ఉంచుకొని దేన్నీ తక్కువగా చూడటం లేదు. గతేడాది దాదాపు కోటి హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి, ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ కారణంగా దేశంలోని 44కోట్ల పందులలో సగాన్ని హతమార్చాల్సి వచ్చింది. అక్కడి వారి ఆహారంలో పంది మాంసం ప్రముఖపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

Image result for china duck army
కేవలం మిడతలను మాత్రమే హతమార్చే ఫంగస్‌కూడా అందుబాటులో ఉంది. పదిహేను సంవత్సరాల క్రితం మిడతల దండు నివారణకు దానిని ఉపయోగించి ఫలితాలు సాధించారు. అయితే అవి మిడతలను సంహరించేందుకు ఎక్కువ వ్యవధి తీసుకుంటున్నాయి. చైనాలో ఈ బయో ఫెస్టిసైడ్స్‌ను కూడా వినియోగిస్తున్నారు. తూర్పు ఆఫ్రికాలో ప్రస్తుత వినియోగానికి చైనాలోని ఫ్యాక్టరీలు వేలాది టన్నుల ఫంగస్‌ రకాలను తయారు చేస్తున్నాయి. వాటిలో కొన్ని జన్యుమార్పిడి రకాలు కూడా ఉన్నాయి. కరోనా వైరస్‌ కారణంగా తాత్కాలికంగా మూతవేసిన వాటిలో ఈ ఫంగస్‌ను తయారు చేసేవి కూడా ఉన్నాయి. అయితే ఆఫ్రికా అవసరాల రీత్యా వాటిని తెరిచి పెద్ద ఎత్తున ఫంగస్‌ను తయారు చేస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ -ట్రంప్‌ ఉల్లాసాన్ని దెబ్బతీసిన ఢిల్లీ ‘పధకం’ !

01 Sunday Mar 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, USA

≈ Leave a comment

Tags

Delhi violence, Donald trump, Donald Trump India tour, Narendra Modi

Image result for delhi planned violence spoils modi-trump party

ఎం కోటేశ్వరరావు
నరేంద్రమోడీ అనుకున్నదొకటీ, అయింది ఒకటి. కొన్ని సందర్భాలలో ఎవరి పథకాలు, ఎత్తుగడలు వారినే దెబ్బతీస్తాయి. మోడీ ఆహ్వానం మేరకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబ సమేతంగా రెండు రోజుల పర్యటన జరిపి వెళ్లారు. ఆ పెద్దమనిషి ఢిల్లీలో ఉండగానే జరిపించిన, జరిగిన ఘటనలతో కాషాయ దళాల ముసుగు మరింతగా తొలిగింది, చాలా దగ్గరగా అనేక మంది వారిని చూడగలిగారు. దొంగకే తాళాలు ఇస్తే దొంగతనాలు ఆగిపోతాయని అనేక మంది భ్రమపడినట్లే మతోన్మాదులకే అధికారమిస్తే మత ఘర్షణలు జరగకుండా ప్రశాంతంగా బతకవచ్చు అనుకున్నవారికి కూడా ఢిల్లీ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మత ఘర్షణల చరిత్రను చూసినపుడు అవి ఎన్నడూ వాటంతట అవి పుట్టలేదు, ఎక్కడో ఒక దగ్గర రూపొందించిన పథకాలతోనే జరిగాయి. లేదా ఎక్కడైనా అనుకోకుండా జరిగిన ఘటనలను ఉపయోగించుకొనేందుకు సిద్దంగా ఉన్న వారు చెలరేగిపోయినపుడు తలెత్తాయి.
ఢిల్లీ ఎన్నికలకు ముందునుంచీ బిజెపి నేతల రెచ్చగొట్టుడు తీరు తెన్నులు, వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో అని అనేక మంది భయపడ్డారు. దానికి అనుగుణ్యంగానే అనేక మంది అనుమానిస్తున్నట్లుగా ఉత్తర ప్రదేశ్‌ నుంచి వచ్చిన అపర ‘జాతీయ వాదులు లేదా దేశ భక్తులు ‘ ఈశాన్య, తూర్పు ఢిల్లీలో జరిపిన హింసాకాండను చూశాము. దాన్ని ప్రతిఘటించే క్రమంలో కూడా కొందరు బలై ఉంటారు. హింసాకాండ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తి మురళీధర్‌ను రాత్రికి రాత్రే ఢిల్లీ హైకోర్టు నుంచి బదిలీ చేసిన తీరుతో హింసాత్మక శక్తులను రక్షించేందుకు కేంద్ర పాలకులు ఎంతకైనా తెగిస్తారని అనేక మందికి ఎవరూ చెప్పకుండానే అర్ధం అయింది. దీన్నుంచి తేరుకోక ముందే శుక్రవారం నాడు రికార్డు స్ధాయిలో స్టాక్‌ మార్కెట్‌ పతనం, వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మూడవ త్రైమాసిక అభివృద్ధి అంచనా 4.7శాతంగా ఉన్నట్లు ప్రభుత్వమే ప్రకటించింది. డోనాల్డ్‌ ట్రంప్‌ నుంచి పొందిన ప్రశంసలతో కొద్ది రోజులు కాలక్షేపం చేద్దామని సంబరపడిన మోడీ పరివారాన్ని వెంట వెంటనే జరిగిన ఈ ఘటనలన్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ పరిణామాలు దేశాన్ని ఎటు తీసుకుపోనున్నాయో, ఆర్ధిక సమస్యల నుంచి ఎలా బయటపడతామో తెలియని అయోమయంలో దేశం ఉంది.
సామాజిక మాధ్యమంలో కాషాయ దళాలు భారతమాతాకి జై అనే పేరుతో వ్యాపింప చేస్తున్న ఒక పోస్టులోని అంశాలు ఇలా ఉన్నాయి.” బీజేపీ దేశం కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.ఇప్పటి వరకు కొన్ని నిర్ణయాలు మాత్రమే తీసుకున్నాము, 1. జిఎస్‌టి,2.ట్రిపుల్‌ తలాఖ్‌ రద్దు 3. రామ మందిర్‌ 4.370ఆర్టికల్‌ రద్దు-5.( సిఎఎ)పౌరసత్వ సవరణ చట్టం,నోట్ల రద్దు.6. బినామీ చట్టం 7.కార్పొరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడం,8.త్రివిధ దళాల అధిపతి నియామకం (సీడీఎస్‌),ఇవన్నీ కేవలం సాంపిల్స్‌,మాత్రమే. ఇప్పటి నుంచి అసలు కథ . ఇండియా యాక్షన్‌ ప్లాన్‌ 2020. రాబోయే రోజులో ఇంకా చాలా ఉన్నాయి.1. ఎన్‌ఆర్‌సి,2. యుసిసి(ఉమ్మడి పౌరస్మృతి), 3.ఆక్రమిత కాశ్మీర్‌,4. కుటుంబ నియంత్రణ చట్టం,5. జమిలి ఎన్నికలు,6. మత మార్పిడి నిరోధక చట్టం. ఇలా చాలా చాలా చేస్తాము, చేస్తూనే ఉంటాము .. దేశ క్షేమమే మా లక్ష్యం..దేశం కోసం, దేశ శ్రేయస్సు కోసం, సనాతన భారతీయత ధర్మ పరి రక్షణ కోసం చేయవలసినది చేస్తాము .. తనకు ….సంపదన మీద ఆశ లేదు …. అవినీతి సంపాదన పోతుందీ అన్న బెంగా లేదు, తన ప్రాణం మీద ప్రీతీ లేదు,ఉన్నది ఒకటే, ఇదీ..మన దేశం… నా దేశం.అంతే..ఉంటే ఉంటాం పోతే పోతాం..దేశానికి మేలు చేసే పోతాం.”
పైన పేర్కొన్న అంశాలలో ఏ ఒక్కటీ దిగజారుతున్న దేశ ఆర్ధిక స్ధితిని మెరుగుపరచేది కాదు, ఉపాధిని పెంచేది కాదు, ఉద్యోగాలు ఇచ్చేదీ, ధరలు తగ్గించేదీ కాదు. వివాదాస్పద అంశాలతో సామాజికంగా అశాంతిని, విభజనను మరింతగా పెంచే భావోద్వేగ అంశాలు తప్ప దేశ ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపరచే చర్యలేవీ వాటిలో లేవు. గత ఆరు సంవత్సరాలలో కూడా చేసింది ఇదే. దేశ వృద్ధి రేటు గరిష్టంగా ఉన్న ఏడున్నరశాతం నుంచి ఏడేండ్ల కనిష్టానికి( ఐదుశాతానికి ) దిగజారింది. సామాజికంగా పరస్పరం అపనమ్మకాలు, విద్వేషాలు పెరిగాయి. అయినా ఇప్పటి వరకు నమూనా మాత్రమే, అసలైన అజెండా ముందుంది అంటూ కాషాయ దళాలు దేశాన్ని మరింతగా ఇబ్బందుల పాలు చేసే అజెండాను అమలు జరుపుతామని రెచ్చిపోతున్నాయి. భావోద్వేగాలు పరిస్ధితిని మరింత దిగజార్చుతాయి తప్ప మెరుగుపరచే అంశాలేమీ వాటిలో ఉండవు.
పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) దేశంలో చిచ్చు రేపింది. దీని వలన ఎవరికీ పౌరసత్వం పోదు కదా ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అంటూ కాషాయ దళాలు అమాయకంగా అడుగుతున్నాయి. దానివలన పౌరసత్వం పోతుందని ఎవరూ చెప్పటం లేదు. ఎన్‌ఆర్‌సి పేరుతో పౌరసత్వాన్ని నిరూపించుకొనేందుకు అవసరమైన పత్రాలు సమర్పించాలన్న అంశంతో అసలు ఆందోళన ప్రారంభమైంది.సిఎఎ తరువాత ఎన్‌ఆర్‌సి అని చెప్పింది బిజెపి వారే. సిఎఎ ద్వారా ఎందరికి పౌరసత్వం కల్పించనున్నారో చెప్పండని బిజెపి వారిని ఎవరినైనా అడిగితే వారి దగ్గర సమాధానం లేదు. పౌరసత్వం ఒకరు ఇచ్చేది కాదు, విదేశీయులకు ఏ గడ్డమీద అయినా పిల్లలు పుడితే అక్కడి పౌరులు కావటం అనేక దేశాలలో జన్మతహ: ఇస్తున్న హక్కు. మన దేశంలో పుట్టిన వారినే ఆధారాలు చూపమని అడుగుతున్నారు. ఈ విపరీత పోకడ ప్రపంచంలో ఎక్కడా లేదు. గత 70సంవత్సరాలుగా పౌరసత్వం రాని లక్షలు, కోట్లాది మందికి మందికి పౌరసత్వం ఇవ్వనున్నామని కాషాయ దళాలు చెప్పటం మోసకారితనమే.
తాము మత ప్రాతిపదికన దాడులకు గురయ్యామంటూ మన దేశ పౌరసత్వాన్ని కోరుకున్న విదేశీయుల సంఖ్య కేవలం 31,313 మంది మాత్రమే అని వారిలో హిందువులు 25,447, సిక్కులు 5,807, క్రైస్తవులు 55, బౌద్దులు ఇద్దరు మాత్రమే అని ఇంటెలిజెన్స్‌ బ్యూరో గతేడాది వెల్లడించింది. వీరందరూ నిజంగా మత పరమైన దాడులకు గురయ్యారా లేక మన దేశం రావటానికి ఆ మార్గం అయితే సులువుగా వుంటుందని ఆ కారణాలు చెబుతున్నారో అన్నది కూడా అనుమానమే. అంటే సిఎఎ ద్వారా లబ్ది పొందేది వీరు మాత్రమే. సిఎఎ దీనికి మాత్రమే పరిమితం అయితే సమస్య లేదు, దాని కొనసాగింపుగా జాతీయ పౌరసత్వ జాబితా తయారు చేస్తామని దానిలో పౌరసత్వాన్ని నిరూపించుకొనే పత్రాలు ఇవ్వాలని చెప్పటమే అసలు అందోళనకు మూలం. నిజానికి సిఎఎ ద్వారా పొరుగుదేశాల్లో ఉన్న హిందువులు, ఇతర ముస్లిమేతర మైనారిటీల మీద దాడులకు, ఆయా దేశాల నుంచి తరిమి వేయాలని అక్కడి మతోన్మాదులను ప్రోత్సహించటమే. ఇక్కడి మతోన్మాదులను మైనారిటీల మీదకు ఉసిగొల్పే దుష్ట ఆలోచనే. ఒక వేళ ఎక్కడైనా అలాంటి దాడులు జరిగితే ఆయా ప్రభుత్వాల మీద వత్తిడి తెచ్చి వాటిని ఆపాలి తప్ప మతం పేరుతో రాజకీయాలు చేయటం, ముస్లింలపై ద్వేషాన్ని రెచ్చగొట్టటం అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను అమలు జరపటమే. దానికోసం దేశాన్ని బలిపెట్టాలా ?

Image result for delhi violence
ఎన్‌ఆర్‌సి, ఎన్‌ఆర్‌పిలను వ్యతిరేకిస్తున్నది ఒక్క ముస్లింలే కాదు, హిందువులతో సహా అన్ని మతాల వారు వ్యతిరేకిస్తున్నారు. వారిలో ఎన్‌ఆర్‌సితో తమను ఇబ్బందులు పెట్టాలన్న ఎత్తుగడ ఉందని భయపడుతున్న ముస్లింలు గత కొద్ది నెలలుగా బహిరంగంగానే ఆందోళన చేస్తున్నారు. బిజెపి అజెండాలో తొలి దాడి ముస్లింల మీద ఉంది కనుక వారు ముందుగా మేలుకొని వీధుల్లోకి వచ్చారు తప్ప ఆధారాలు సమర్పించలేని కోట్లాది మంది ఇతర సామాజిక తరగతుల్లో కూడా అలాంటి ఆందోళన లేకపోలేదు. దేశ విభజన సమయంలో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అనేక మంది మారిపోయారు గనుక వెంటనే ఒక పౌరజాబితాను తయారు చేయాల్సి వచ్చింది. తరువాత బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన వారి సమస్య కారణంగా అసోంలో జాబితాను తయారు చేయాల్సి వచ్చింది తప్ప మిగతా దేశానికి అవసరం ఏమిటి? అక్రమంగా వచ్చే వారిని నిరోధిస్తున్నారు లేదా శరణార్ధులుగా వచ్చే వారికి పౌరసత్వం ఇవ్వాలా లేదా లేక వారిని పౌరసత్వం లేని పౌరులుగా గుర్తించి అనుమతించాలా అనేందుకు ఇప్పటికే చట్టాలు ఉన్నాయి. అలాగాక తలిదండ్రులు, తాతలతో సహా పుట్టిన ఆధారాలు సమర్పించి పౌరులని నిరూపించుకోవాల్సిన బాధ్యత మనకు లేదు. కానీ పౌరజాబితా తయారీని అమలు జరపాలని ఆందోళన చేస్తున్నవారెవరు ? దాని వెనుక ఉన్న లక్ష్యం ఏమిటి? ఎన్‌ఆర్‌సి, ఎన్‌ఆర్‌పి అమలు జరపాలనటానికి, జై శ్రీరామ్‌ నినాదాలతో పనేముంది ? ఈశాన్య ఢిల్లీలో జై శ్రీరాం పేరుతో చెలరేగిపోవటం, సిఎఎ వ్యతిరేక ఆందోళనను మత ఘర్షణలుగా మార్చటం వెనుక ఉన్నది ఎవరు ? వారు కూడా షాహిన్‌బాగ్‌ లేదా మరొక చోటో కూర్చొని శాంతియుత ఆందోళన చేసేందుకు అవకాశం ఉంది కదా ? లేదూ సిఎఎ వ్యతిరేకుల కుట్రే ఇది అని చెబుతున్న బిజెపి పెద్దలే ఢిల్లీ చుట్టుపట్ల ఉన్న రాష్ట్రాలన్నింటా అధికారంలో ఉన్నారు. వారి పోలీసు, గూఢచార, కేంద్ర గూఢచార వ్యవస్ధలన్నీ ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? అందునా ట్రంప్‌ పర్యటనకు వస్తున్నపుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా ? అయినా స్వేచ్చగా అల్లరి మూకలు చెలరేగటం, ఢిల్లీ పోలీసులు ప్రేక్షకపాత్ర వహించటాన్ని బట్టి సిఎఎ, ఎన్‌ఆర్‌సి వ్యతిరేకులు, ప్రతిపక్షాల మీద నిందమోపే ఒక కుట్రలో భాగంగానే ఢిల్లీ పరిణామాలు జరిగాయని అందరూ అనుకుంటున్నారు. అమెరికా సిఐఏ, ఇజ్రాయెల్‌ మొసాద్‌ల నుంచి నేర్చుకున్న ఇలాంటి చావు తెలివి తేటలను ప్రయోగించి చూస్తున్నారు. ఒక ఆప్‌ కౌన్సిలర్‌ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అతను నిజంగా అల్లర్లను ప్రేరేపించాడా లేక రాజకీయంగా ఆప్‌ను దెబ్బతీసేందుకు తప్పుడు కేసు బనాయించారా అన్నది చెప్పలేము. పేలని తుపాకులు, కమ్యూనిస్టు సాహిత్యాన్ని పక్కన పడవేసి బూటకపు ఎన్‌కౌంటర్లు చేయటం లేదా విప్లవ సాహిత్యం పేరుతో కేసులు నమోదు చేయటాన్ని చూస్తున్న మనకు పోలీసులు ఎంతకైనా తెగిస్తారన్నది తెలిసిందే.
గతేడాది అక్టోబరు రెండవ వారంలో చైనా అధిపతి గ్జీ జింపింగ్‌ మహాబలిపురం పర్యటనకు వచ్చారు, ఫిబ్రవరి చివరి వారంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా వచ్చారు. ఇద్దరినీ నరేంద్రమోడీ ఆహ్వానించారు. వారి పర్యటనల్లో ఎంత వ్యత్యాసం ఉందో మనం గమనించాము. గ్జీ పర్యటన సాదాసీదాగా సాగింది, ట్రంప్‌ పరస్పర పొగడ్తలు, కౌగిలింతలు, అదిరింపులు, బెదిరింపులను యావత్‌ ప్రపంచం చూసింది. ఈ పర్యటనల్లో ఉన్న తేడాలు ఏమిటి ? అమెరికాతో మన వాణిజ్యం మిగులులో ఉంది. చైనాతో లోటులో ఉంది. మనకు గతంలో ఇస్తున్న రాయితీలను ఎత్తివేసింది అమెరికా, మనలను అభివృద్ది చెందిన దేశంగా పరిగణించి మరికొన్ని రాయితీలను రద్దు చేసింది. మనం ప్రతిగా విధించిన పన్నులను చూపి మన మీద బెదిరింపులకు దిగింది. తమ వస్తువుల మీద పన్నులు తగ్గించాలని, ఎక్కువగా కొనుగోలు చేయాలంటూ ట్రంప్‌ వత్తిడి తెచ్చారు, మిలిటరీ హెలికాప్టర్ల ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో తమ దగ్గర నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతులను మరింతగా పెంచాలని, కోళ్ల ఉత్పత్తులు, పాల ఉత్పత్తులను ఎక్కువగా కొనుగోలు చేయకపోతే ఆలోచించాల్సి వస్తుందని బెదిరింపులతో కూడిన హెచ్చరికలు చేసి వెళ్లారు. అదే జింపింగ్‌ విషయానికి వస్తే నిర్దిష్ట అజెండా లేకుండానే వచ్చారు. రాబోయే రోజుల్లో మా వస్తువులను మరింతగా కొనుగోలు చేయాలంటూ నరేంద్రమోడీ సర్కార్‌ సాధారణపద్దతుల్లోనే కోరింది తప్ప వత్తిడి, డిమాండ్ల రూపంలో వ్యవహరించలేదు. చైనా నేత బెదిరింపులకు దిగలేదు.
2018-19లో అమెరికాతో మన వాణిజ్య మిగులు 16.85 బిలియన్‌ డాలర్లు, తరువాత సంవత్సరంలో కూడా అదే ధోరణి కొనసాగింది. నిజానికి అమెరికాతో మన మిగులు నరేంద్రమోడీ సర్కార్‌ సాధించిన ఘనత కాదు. అంతకు ముందు మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో కూడా మన దేశం మిగుల్లోనే ఉంది. కొద్ది పాటి హెచ్చు తగ్గులు తప్ప దాదాపు గత ఆరు ఏడు సంవత్సరాలుగా ఒకే మోస్తరులో ఉంది. ఇదే సమయంలో సంఘపరివార్‌ చైనాను ఎంతగా ద్వేషిస్తుందో దాని నేతగా ఉన్న నరేంద్రమోడీ హయాంలో వాణిజ్యంతో పాటు లోటు కూడా గణనీయంగా పెరిగిందన్నది చాలా మంది జీర్ణించుకోలేని అంశం. 2012లో మన దేశ వాణిజ్య లోటు చైనాతో 39.4 బిలియన్‌ డాలర్లు ఉంటే గతేడాది 74 బిలియన్‌ డాలర్లకు చేరింది.
ఈ కారణంగానే మన వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేయాలని మనం చైనాను డిమాండ్‌ చేస్తుంటే తమ వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేయాలని అమెరికా మనలను డిమాండ్‌ చేస్తోంది. అమెరికా నుంచి కొన్ని వస్తువులను కొనుగోలు మన మీద అధిక భారం పడుతుంది. కోళ్లు, పాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే వాటి మీద అమెరికా ఇచ్చే రాయితీలు, తక్కువ ధరల కారణంగా మన కోళ్ల, పాడిపరిశ్రమ మీద ఆధారపడిన దాదాపు పది కోట్ల మంది రైతాంగం, కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. ఈ రంగాలలో మనం సాధించిన స్వయం పోషకత్వం పోయి పరాయి దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది. అందుకే ఎవరు అధికారంలో ఉన్నా ఈ రంగాలలో అమెరికా లేదా మరొక దేశ వస్తువుల దిగుమతుల అనుమతికి జంకుతున్నారు తప్ప నేతల గొప్పతనం లేదా ట్రంప్‌ చెప్పినట్లు మోడీ కఠినంగా వ్యవహరించటమూ కాదు. ఇదే నరేంద్రమోడీ గారు కొన్ని విషయాల్లో బాంచన్‌ దొరా మీరు అనుకున్నట్లే చేస్తా అని ఎలా లొంగిపోతున్నారో మరోచోట చూద్దాం.
ఇక డోనాల్డ్‌ ట్రంప్‌ను ఆహ్వానించి నరేంద్రమోడీ తన పలుకుబడితో భారత్‌కు ఎంతో మేలు చేకూర్చుతారని ఎందరో ఆశించారు. అదే విధంగా ఎన్నికల సంవత్సరంలో తమ ట్రంప్‌ ప్రతి దేశంతోనూ గీచి గీచి బేరాలాడి లేదా బెదిరించి తమ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తారని అమెరికన్లు కూడా ఆశించారు. అక్కడ కార్పొరేట్లు ఆశలు పెట్టుకుంటే దిగజారుతున్న దేశ ఆర్ధిక పరిస్ధితిని మోడీ చక్కదిద్ది తమ జీవితాలను మరింతగా దిగజారకుండా చూస్తారా అని సామాన్యులు ప్రధానంగా ఇక్కడ ఎదురు చూశారు. జరిగిన పరిణామాలను బట్టి అక్కడ ట్రంప్‌, ఇక్కడ నరేంద్రమోడీ కూడా నిరాశపరిచారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తేడా అల్లా అక్కడ కొన్ని కార్పొరేట్లు తాత్కాలికంగా నిరాశచెందితే ఇక్కడ సామాన్యులు ఆశాభంగం పొంది ఇక మన బతుకులింతే అనే నిర్వేదానికి గురవుతున్నారు.
ట్రంప్‌ పర్యటన సమయంలోనే ఒక వార్త వెలువడింది. ట్రంప్‌ భజనలో మీడియాలో దానికి అంత ప్రాచుర్యం రాలేదని చెప్పాలి. ఇటీవలి వాణిజ్య లావాదేవీలలో మన వాణిజ్యం చైనాను అధిగమించి అమెరికాతో ఎక్కువ జరిగింది అన్నది వార్త సారాంశం. చైనా వ్యతిరేకులకు ఇది వీనుల వింపైన సంగీతం వంటిదే. అదే దేశభక్తి అని భావించేవారు కూడా లేకపోలేదు. ఇక్కడ ప్రశ్న ఏ దేశంతో అయినా వాణిజ్యం జరిపేది కార్పొరేట్‌ సంస్ధలే, సామాన్యులు కాదు అన్నది పచ్చినిజం. ఎవరి కోసం తొలి రోజు గుజరాత్‌ పర్యటనలో ట్రంప్‌-నరేంద్రమోడీ ఆరుసార్లు కౌగలించుకున్నట్లు ? నాటకంలో ప్రతి పాత్రధారి తన పాత్రను రక్తి కట్టించేందుకు ప్రయత్నించారు అని సమీక్షకులు రాస్తారు.ఈ కౌగిలింతల పర్వం కూడా అదే. దేశం కోసమే ఇదంతా అన్నట్లుగా ఎవరికి వారు నటించారని చెప్పవచ్చు. ఎన్నికల్లో మరోసారి విజయం కోసం ట్రంప్‌ తాపత్రయ పడుతుంటే రెండవ సారి గెలిచి రాజకీయంతో సహా అన్ని రంగాలలో వైఫల్యాలను ఎదుర్కొంటున్న నరేంద్రమోడీ తన పరపతి ఎలాంటిదో ఒక అగ్రరాజ్యనేత నోట వినిపించాలని తహతహలాడారు. ఆర్ధిక పరిస్ధితి, ఢిల్లీ పరిణామాలతో ట్రంప్‌ పొగడ్తలను నెమరు వేసుకొని ఆనందించే అవకాశం లేకుండా పోయింది. ట్రంప్‌ నోట కాశ్మీర్‌, సిఎఎ వంటి అంశాలపై ఎక్కడ ప్రతికూల వ్యాఖ్యలు వస్తాయో, రాకుండా చూడు గోమాతా అన్నట్లుగా బిజెపి నేతలు ఉగ్గపట్టుకు కూర్చున్నారు. భవిష్యత్‌లో మరింత పెద్ద అవసరానికి లేదా ప్రయోజనానికి తురుపు ముక్కగా ప్రయోగించుదాం అన్నట్లుగా విలేకర్లు అడిగినా ట్రంప్‌ తప్పించుకోవటానికి అర్దం ఇదే.

Image result for delhi planned violence spoils modi-trump party
మీ ప్రధాని నరేంద్రమోడీ ఎంతో గట్టిగా వ్యవహరిస్తారబ్బా అని ట్రంప్‌ పొగిడారు. ఇది మోడీని ఉబ్బవేయటానికి చెప్పిన మాటలు మాత్రమే. ఏ దేశంతో స్నేహం చేసినా మన దేశ ప్రయోజనాలను సదా గమనంలో ఉంచుకోవాలి.ఎదుటి వారి పొగడ్తల కోసం మనల్ని మనం మరిచిపోకూడదు. అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఐరోపా యూనియన్‌ కలసి ఇరాన్‌తో ఒక అణు ఒప్పందాన్ని చేసుకున్నాయి. దాన్నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అంతేకాదు, ఇరాన్‌తో వాణిజ్యలావాదేవీలు జరిపే దేశాల మీద ఆంక్షలు పెట్టింది. చిత్రం ఏమిటంటే ఒప్పందంలోని ఏ ఒక్కదేశ మూ అమెరికా వైఖరిని సమర్ధించలేదు, ఆంక్షలను ఖాతరు చేయలేదు. కానీ అమెరికాతో మనం సమాన భాగస్వాములుగా ఉన్నాం, ఎంతో కఠినంగా వ్యవహరిస్తాం, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తాం అని గొప్పలు చెప్పుకుంటున్న మోడీ సర్కార్‌ మాత్రం ఆంక్షలను అమలు జరిపేందుకు అమెరికాకు సాగిల పడింది. మన రూపాయలు ప్రపంచ మార్కెట్లో దేనికీ పనికి రావు, అయినా ఎప్పటి నుంచో ఉన్న స్నేహం కారణంగా వాటిని తీసుకొని చమురు విక్రయిస్తున్న ఇరాన్‌ దగ్గర కొనుగోలు చేయటం నిలిపివేసి అమెరికా నుంచి తెచ్చుకుంటున్నాం. అమెరికా నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేనపుడు కరాచీ రేవుతో పని లేకుండా ఇరాన్‌లోని చాబహార్‌ రేవును అభివృద్ధి చేయటం ద్వారా మన వాణిజ్య లావాదేవీలు నిర్వహించుకోవాలని నరేంద్రమోడీ సర్కార్‌ అక్కడ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది. అమెరికా బెదిరింపుల కారణంగా ఇప్పుడు ఆ పధకాన్ని పక్కన పడేసింది. ఇరాన్‌-అమెరికా మధ్య పంచాయతీ తలెత్తటం ఏమిటి? అమెరికాకు కోపం రాగానే మన ప్రయోజనాలకోసం నిర్మించే రేవును మధ్యలో వదలి వేసి రావటం ఏమిటి ? ఈ పరిణామం మన దేశం అమెరికాకు లొంగిపోవటాన్ని సూచిస్తున్నదా? లేక స్వతంత్ర వైఖరి, సమాన భాగస్వామిగా మన దేశ ప్రతిష్ట,మాన మర్యాదలను నిలబెట్టేదిగా ఉందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా వైరస్‌ – ముందే ”గ్రహించిన” రచన బండారం బట్టబయలు ?

22 Saturday Feb 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

COVID-19, Dean Koontz, dean koontz the eyes of darkness wuhan 400, dean koontz the eyes of darkness wuhan 400 truth, DeanKoontz the eyes of darkness

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ గురించి కంత్రీగాళ్లు జనాన్ని ఎంతగా బురిడీ కొట్టిస్తున్నారంటే కాస్త హేతుబద్దంగా ఆలోచిస్తారు అనుకొనే వారిని కూడా సందేహంలో పడవేస్తున్నారు. అలాంటి వాటిలో ఒకటి అమెరికన్‌ నవలా రచయిత డీన్‌ కూన్జ్‌ నాలుగు దశాబ్దాల క్రితమే కోవిద్‌-19 (కరోనా వైరస్‌) గురించి ఊహాన్‌-400పేరుతో ఊహించినట్లు వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది.దీనిలో వాస్తవాలేమిటి అన్నది చూడబోయే ముందు మరికొన్ని అంశాల గురించి చూద్దాం.
కలరా, మసూచి, ప్లేగు మహామారి మాదిరి కరోనా వైరస్‌ పేరుతో సమాచార మహామారి (మహమ్మారి అని కూడా కొందరు పిలుస్తారు) వ్యాపిస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్ధ వ్యాఖ్యానించాల్సి వచ్చింది. దీనికి బలికాని వారు చాలా అరుదుగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ మహామారిని ఎదుర్కొనేందుకు ఒక వాక్సిన్‌ అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఆరోగ్య అత్యవసర కార్యక్రమ అధిపతి డాక్టర్‌ మైక్‌ రియాన్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌ గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న పూర్వరంగంలో దాన్ని ఎదుర్కొనేచర్యల్లో భాగంగా వాస్తవాలను వెల్లడించేందుకు ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఒక కార్యక్రమాన్నే చేపట్టాల్సి వచ్చింది. దానికి ‘ఎపివిన్‌’ అని పేరు పెట్టారు. దాన్ని తెలుగులో చెప్పుకోవాలంటే ‘మహామారుల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్ధ సమాచార వ్యవస్ధ’ అని అర్ధం.
కరోనా వైరస్‌ ప్రధానంగా చైనాలోని హుబెరు ప్రాంతంలో కొన్ని చోట్లనే ఎక్కువగా వ్యాప్తి చెందింది. కానీ తప్పుడు సమచార మహామారి చైనాతో పాటు ప్రపంచమంతటా వేగంగా వ్యాపిస్తోంది. వాస్తవం ఒక కిలోమీటరు ప్రయాణించే సమయానికి అవాస్తవం వందకిలోమీటర్ల ముందు ఉంటోంది.ప్రపంచంలో 380 కోట్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదారులు ఉన్నట్లు అంచనా కాగా వారిలో 21శాతం చైనాలో ఉన్నారు. అందువలన వారికోసం కూడా వాస్తవాలను అందించాల్సి ఉంది. నువ్వుల నూనె రాసుకుంటే, మంట నుంచి వెలువడే పొగను పీల్చినా కరోనా వైరస్‌ అంటదు అనేది ఒక పెద్ద తప్పుడు ప్రచారం. ఇలా మరికొన్నింటి గురించి తెలిసిందే. ఆయా సంస్దలలో పని చేసే సిబ్బంది ఇతర వనరుల నుంచి వెలువడే దాని కంటే తమ యజమానులు చెప్పేదానిని ఎక్కువగా విశ్వసిస్తారన్నది ఒక తాజా అధ్యయనంలో తేలిన అంశం. అందువలన ప్రపంచ ఆరోగ్య సంస్ధ బడా కంపెనీల యజమానులతో సమావేశాలు జరిపి తమ సిబ్బందికి వాస్తవాలను వివరించాలని కోరుతోంది. కోవిద్‌-19కు సహజ లక్షణాలు లేవని, కృత్రిమంగా ఉహాన్‌ పరిశోధనాశాలలో తయారు చేశారనే కుట్ర సిద్ధాంతాలు, ప్రచారాన్ని తాము విశ్వసించటం లేదని 27 మంది ప్రముఖ ప్రజారోగ్య శాస్త్రవేత్తలు ఖండించినట్లు ఇటీవల లాన్‌సెట్‌ ప్రచురించింది.
ఇక అమెరికన్‌ రచయిత డీన్‌ కూన్జ్‌ జోశ్యం కథ చూద్దాం. అనేక మారు పేర్లతో రకరకాల ఇతివృత్తాలతో నవలలు రాసే డీన్‌ 1981లో రాసిన ది ఐస్‌ ఆఫ్‌ది డార్క్‌నెస్‌ అనే నవలలో పాత్రధారులతో ఊహాన్‌ -400 అనే జీవ ఆయుధం, అది పనిచేసే తీరు, జనాలను ఎలా హతమారుస్తుందో, దాన్ని ఎలా తయారు చేస్తారో చెప్పించాడు చూడండి అంటూ ఆయన అభిమానులు లేదా ఆ నవలను విక్రయించే అమెజాన్‌ కంపెనీకి చెందిన వారు గానీ 2008నాటి నవలా సమీక్ష చిత్రాన్ని వారం రోజుల క్రితం సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ఒక పేజీలో జీవ ఆయుధం గురించి మరొక పేజీలో నవల ముఖచిత్రం ఉంది. ఇంకేముంది పుస్తకం మన ముందు ఉంది కనుక వాస్తవమే అని చాలా మంది నమ్మారు. ఆ పేజీలో పేర్కొన్నదాని ప్రకారం సదరు జీవ ఆయుధం కరోనా వైరస్‌ అనో మరొకటనో చెప్పలేదు. దానికీ కరోనా వైరస్‌కు అసలు పోలికే లేదు. అనేక డిటెక్టివ్‌, సైన్స్‌ ఫిక్షన్‌ కధలు, సినిమాల్లో ఇలాంటివి మనకు కోకొల్లలుగా కనిపిస్తాయి.

Image result for dean koontz

ది ఐస్‌ ఆఫ్‌ ది డార్క్‌నెస్‌ నవలా రచయిత డీన్‌ కూన్జ్‌
ఈ నవల పేజీ ప్రచారంలోకి వచ్చిన తరువాత ఈ కథ ఊహించని మలుపు తిరిగింది. గూగుల్‌లో వెతికిన కొందరికి కొత్త అంశం కనిపించింది. అదే నవలలో అదే పాత్ర ధారులు రష్యన్‌లు గోర్కీ పట్టణంలో తయారు చేసిన గోర్కీ-400 జీవ ఆయుధం గురించి చర్చిస్తారు. ఆ పేజీ నవల 1981నాటి ముద్రణలో ఉంది. కానీ తరువాత గోర్కీ కాస్తా 2008 నాటికి ఊహాన్‌గా మారిపోయింది. రెండు ముద్రణల్లోని రెండు రకాల పేజీలను దీనితో పాటు ఇచ్చిన చిత్రాలలో చూడవచ్చు. ఇదెలా జరిగింది? ఊహించటం కష్టమేమీ కాదు. అమెరికా, ఐరోపాలోని అనేక మంది రచయితలు, సినిమా దర్శకులు, కథకులు 1991 ముందు వరకు సోవియట్‌ యూనియన్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలలోని సోషలిస్టు వ్యవస్దలను దుష్టమైనవిగా చిత్రించి సొమ్ము చేసుకోవటం పరిపాటి.అమెరికన్లు, సిఐఏ ఏజంట్లు అసాధారణ తెలివి తేటలు గలవారిగా, సోవియట్‌ ఏజంట్లను పిచ్చిపుల్లయ్యలుగా చిత్రించిన సినిమాలు అనేకం ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. సోవియట్‌, ఇతర సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత అలాంటి వారు సొమ్ము చేసుకొనేందుకు కొత్త కథలను అల్లటం ప్రారంభించారు. అమెరికా ప్రధాన ప్రత్యర్ధిగా అనూహ్యంగా చైనా ముందుకు వచ్చింది.1991 తరువాత వచ్చిన సినిమాల్లో, రష్యన్ల బదులు చైనీయులు విలన్లుగా, అపహాస్యపు పాత్రధారులుగా మారిపోవటాన్ని చూడవచ్చు. దానిలో భాగంగానే కొత్త నవల రాయటం దండగ పేర్లు, స్ధలాలను మారిస్తే చాలని రచయిత, ప్రచురణకర్తలు భావించి ఆ మేరకు మార్చి ప్రచురించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వివాదం గురించి నవలా రచయిత డీన్‌ కూన్జ్‌ వైపు నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన వెలువడలేదు. జనాలకు జ్ఞాపకశక్తి తక్కువ కనుక తాము ఏమి రాసినా, ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుంది అనుకొనే వారు ఆ జనాల్లో కూడా తెలివిగల వారు ఉంటారని తమ బండారాన్ని బయటపెడతారని గ్రహించటం మంచిది.

Image

1981నాటి ప్రచురణలో గోర్కీ -400 గురించి రాసిన పేజీ

Share this:

  • Tweet
  • More
Like Loading...

చరిత్రలో జీవ ఆయుధాల నేరగాండ్లెవరు?

19 Wednesday Feb 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

#China biological weapons, Biological weapons, China a victim of Biological weapons, japan bacteria bombs

Image result for japan bacteria bombs

– ఎం. కోటేశ్వరరావు

చైనాలోని హుబెయ్ రాష్ట్రంలో కోవిద్‌-19(కరోనా) వైరస్‌ ప్రబలి వందల మందిని బలిగొనటం వెనుక ఉన్నది వికటించిన చైనా జీవ ఆయుధ ప్రయోగాలే అని పశ్చిమ దేశాల మీడియా కథలను అల్లింది. వాటిని పొల్లుపోకుండా దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమన్నట్టు తెలుగు మీడియా పునశ్చరణ కావించింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని ఈనెల 15న ఆసియా టైమ్స్‌ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. గతంలో కొన్ని దేశాల చరిత్రను చూసినప్పుడు అప్పటికే గుర్తించిన వైరస్‌లు, బాక్టీరియాలతో జీవ ఆయుధాలను తయారు చేసి జనం మీద ప్రయోగించాయి. కోవిద్‌-19 వైరస్‌ కొత్తది. గతంలో గుర్తించిన 2019 నోవల్‌ కరోనా వైరస్‌కూ దీనికీ సంబంధం లేదు. అందువలన కోవిద్‌-19తో జీవాయుధాలు తయారు చేస్తున్నారనటానికి ఎలాంటి ఆధారాల్లేవని, ప్రధాన వైద్య నిపుణులెవరూ వివాదాస్పద కథనాలను అంగీకరించటం లేదని ఆసియా టైమ్స్‌ కథన రచయిత పేర్కొన్నారు.

చరిత్రలో ఇంతవరకు ఏ దేశంలోనూ జరగని విధంగా కోట్లాది మందిని ఇండ్లకే పరిమితం కావాలని వ్యాధినిరోధక చర్యల్లో భాగంగా చైనా సర్కార్‌ జనానికి సలహాయిచ్చింది. అది కూడా కొందరు ప్రబుద్దులకు జనాన్ని బందీలు చేయటంగా కనిపించిందంటే వారి చైనా వ్యతిరేక పిచ్చి తారాస్ధాయికి చేరిందనుకోవాలి. ప్రపంచ దేశాలన్నీ వైరస్‌ తగ్గుముఖం పట్టేవరకు చైనా ప్రయాణాలు మానుకోవాలని సలహా ఇచ్చాయి, అంటే దీని అర్ధం సేచ్చగా తిరగటాన్ని కట్టడి చేయటంగానూ, నిరంకుశ చర్యలుగా భావించాలా ? కోవిడ్‌-19 వైరస్‌ చైనాలో ఉహాన్‌ పరిశోధనశాలల నుంచే వెలువడిందనటానికి ఆధారాలు ఇంకా దొరకలేదని చెబుతూనే రుజువు చేసుకోవాల్సిన బాధ్యత చైనా కమ్యూనిస్టు పార్టీ మీద ఉందని అమెరికా రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ టామ్‌ కాటన్‌ చేసిన బాధ్యతారహిత ప్రకటనను ఆధారం చేసుకొని మీడియా రచ్చ చేస్తోంది. ఇండ్ల నుంచి బయటకు వచ్చిన వారిని చైనా కమ్యూనిస్టు పార్టీ పోలీసులు కొడుతున్నారని కాటన్‌ ప్రబుద్దుడు ఆరోపించాడు. ఇలాంటి వారి ప్రకటనలను ఆధారం చేసుకొని మీడియా సంచలనాత్మక కథనాలను వండుతోంది.

జీవ ఆయుధాలు ప్రపంచంలో తయారు కావటం లేదా, ఏ ఏదేశాలకు సామర్థ్యం ఉంది, అసలు ఎప్పటి నుంచి వీటిని వినియోగిస్తున్నారు, ఎవరు వినియోగిస్తున్నారో చూద్దాం. యుద్ధోన్మాదులు, ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలని చూసిన వారు మాత్రమే వీటిని ఉపయోగించినట్టు చరిత్ర చెబుతోంది. కమ్యూనిస్టులు అలాంటి వారు కాదు కాబట్టి, సోషలిస్టు చైనాకు అలాంటి ఆయుధాలను తయారు చేయాల్సిన అవసరం లేదు. వైరస్‌, బాక్టీరియా, ఫంగస్‌, ఇతర కొన్ని రసాయనాలను జీవ ఆయుధాలుగా పరిగణిస్తున్నారు. వీటివలన మానవులు, పశువులే కాదు, మొక్కలు కూడా నాశనం అవుతాయి, అనారోగ్యపాలవుతాయి. అయితే వాటిని తయారు చేసే సత్తా చైనాకు లేదా అంటే లేదని ఎవరూ చెప్పజాలరు. మానవ కల్యాణం కోసం ఒక ప్రమాదకర వైరస్‌ను హతమార్చేందుకు మరొక వైరస్‌ను రూపొందించేందుకు ప్రతి దేశానికీ అవకాశం ఉంది. అయితే ఆ ముసుగులో ఆయుధాలు తయారు చేస్తున్నాయన్నదే అసలు సమస్య.

చరిత్రను తిరగేస్తే క్రీస్తు పూర్వం ఆరువందల సంవత్సరంలో క్రిసాను ముట్టడి సమయంలో రాజు సోలోన్‌ కటుక రోహిణీ అనే పుష్పాల నుంచి తీసిన రసాన్ని ప్రయోగించి విరేచనాలు, ఇతర వ్యాధులు కలిగించినట్టు చరిత్రలో ఉంది. 1155లో రాజు బార్బోసా ఇటలీలోని టోరోంటానాలోని మంచి నీటి బావుల్లో శవాలను పడవేసి కలుషితం కావించాడు. 1495లో ఫ్రెంచి సైనికులను హతమార్చేందుకు స్పెయిన్‌ రాజులు ఇటలీలోని నేపుల్స్‌లో కుష్టువ్యాధి గ్రస్తుల రక్తం కలిపిన వైన్‌ సరఫరా అయ్యేట్టు చూశారు.1675లో విషంతో కూడిన బుల్లెట్లను వినియోగించరాదని జర్మనీ-ఫ్రెంచి సైన్యం అంగీకారానికి వచ్చాయి. 1710లో రష్యన్‌ చక్రవర్తి స్వీడన్‌ పట్టణాలలో ప్లేగుతో మరణించిన శవాలను ఫిరంగులకు కట్టి పడవేయించాడు. 1763లో అమెరికాలోని గిరిజనులను దెబ్బతీసేందుకు బ్రిటిష్‌ పాలకులు అమ్మోరు పోసిన వ్యాధిగ్రస్తులు వాడిన దుప్పట్లు పంపిణీ చేశారు. నెపోలియన్‌ చక్రవర్తి 1797లో ఇటలీలోని మంటువాలో మలేరియా వ్యాధి వ్యాపింప చేసేందుకు మైదానాలను వరదలతో నింపించాడు. అంతర్యుద్ధ సమయంలో1863లో అమెరికాలోని బానిస వ్యవస్థను కోరుకొన్న తిరుగుబాటు రాష్ట్రాలు యూనియన్‌ సైనికులకు ఎల్లోఫీవర్‌, అమ్మోరు సోకిన రోగులు వాడిన వస్త్రాలను విక్రయించేట్టు చూశాయి.

1346లో జెనోయీస్‌-తార్తార్ల మధ్య నేటి ఉక్రెయిన్‌లో ఆధిపత్య పోరు సమయంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఓటమి దశలో ఉన్న తార్తార్లు ప్లేగువ్యాధి సోకిన, మరణించిన తమ వారిని ఫిరంగులకు కట్టి శత్రు ప్రాంతాల మీద పడేశారు. దాంతో జెనోయీస్‌ దళాలు వెనక్కు తగ్గాయి. ఈ పరిణామం గురించి గాబ్రియల్‌ డే ముసిస్‌ నమోదు చేశాడు. వెనక్కు తగ్గిన జెనోయీస్‌(ఇటాలియన్లు)లు తమతో పాటు ప్లేగు వ్యాధి కూడా తీసుకు వెళ్లారు. ప్లేగు వ్యాధిగ్రస్తులు, బహుశా దానిని వ్యాపింప చేసే ఎలుకలను కూడా తమ నౌకల్లో తీసుకుపోయి ఉంటారని పేర్కొన్నాడు. ఆ తరువాత అది ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలో మన దేశంతో సహా అనేక దేశాలకు వ్యాపించింది. రెండున్నర కోట్ల మంది ఐరోపాలో దానికి బలయ్యారు. హైదరాబాదు సంస్థానంలో ప్లేగు వ్యాధి పదే పదే వస్తుండటంతో దాన్ని నివారించేందుకు 1591లో చార్మినార్‌ను నాటి నిజాం రాజు కట్టించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ తరువాత కూడా వస్తుండటంతో పాలకులు అనేక నివారణ చర్యలను తీసుకోవటం వేరే విషయం.

మొదటి ప్రపంచ యుద్ధంలో గుర్రాలకు సెంబరోగం (చీమిడి కారటం) వచ్చే ఆంత్రాక్స్‌ పౌడర్‌ను జర్మనీ, ఫ్రెంచి గూఢచారులు ప్రయోగించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ సైన్యాలు రష్యా, ఇతర అనేక దేశాలలో ప్లేగ్‌, అంతరాక్స్‌ వంటి వ్యాధులను వ్యాపింపచేసేందుకు ప్రయత్నించారు. జీవ ఆయుధాల తయారీ, ప్రయోగాలు నిర్వహించారు. 1980-88 మధ్య ఇరాక్‌-ఇరాన్‌ యుద్ధంలో అమెరికా అందచేసిన శరీన్‌, ఇతర గ్యాస్‌లను ప్రయోగించినట్టు ఇరాక్‌పై విమర్శలు వచ్చాయి. తరువాత కాలంలో వాటి నిల్వలు ఇంకా ఇరాక్‌ వద్ద ఉన్నట్టు అనుమానించిన అమెరికా సద్దామ్‌ హుసేన్‌ మానవవినాశక ఆయుధాలను గుట్టలుగా నిల్వచేసినట్టు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇరాక్‌లో అమెరికన్లకు అలాంటివేమీ దొరకలేదని తరువాత వెల్లడైంది.

అమెరికాను ఆక్రమించుకొనే క్రమంలో గిరిజనుల నుంచి ఎదురైన ప్రతిఘటనను అణచివేసేందుకు బ్రిటిష్‌ పాలకులు పైన చెప్పుకున్నట్టు మసూచి(అమ్మోరు)వ్యాప్తిని ఒక ఆయుధంగా వాడుకున్న దుర్మార్గం గురించి చరిత్రలో నమోదైంది. అవి ఎలా పనిచేశాయో వివరిస్తూ సమాచారాన్ని బ్రిటిష్‌ సైనిక అధికారులు నమోదు చేశారు. పర్యవసానంగా దాదాపు రెండువందల సంవత్సరాల పాటు అమెరికాలో మసూచి వ్యాప్తి చెందింది. ఇలాంటి వాటిని పని గట్టుకొని వ్యాపింప చేశారా లేక సహజంగానే తలెత్తాయా అనేది నిర్ధారించటం ఇప్పటికీ అంతసులభంగా అంతుబట్టటం లేదని నిపుణులు చెబుతున్నారు.

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 22సంవత్సరాలకు 179 దేశాలు జీవ ఆయుధాల నియంత్రణకు ఒప్పందంపై సంతకం చేశాయి. ఎట్టి పరిస్ధితుల్లోనూ వాటి తయారీ, సేకరణ, నిల్వ, వినియోగించబోమని ఆ దేశాలు అంగీకారం తెలిపాయి. అయితే వైద్య అవసరాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఉదాహరణకు ఒక ప్రాణాంతక వైరస్‌ను హతమార్చేందుకు మరొక వైరస్‌ తయారీకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు జీవ ఆయుధాలు తయారు చేస్తున్నవారు కూడా ఆ ముసుగుతోనే చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. అనేక దేశాలు రసాయనిక ఆయుధాలు తయారు చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. వాటికీ జీవ ఆయుధాలకు పెద్ద తేడా ఉండదు. ఉదాహరణకు వియత్నాంను ఆక్రమించుకొనేందుకు అమెరికా జరిపిన దాడుల సమయంలో కలుపు మొక్కలను నాశనం చేసే పేరుతో ఆరెంజ్‌ ఏజంట్‌ అనే రసాయనాన్ని పెద్ద ఎత్తున వియత్నాంలో చల్లారు. యాభై సంవత్సరాలు గడిచిన తరువాత కూడా అనేక చోట్ల కలుపు మొక్కలే కాదు అసలు ఏ మొక్కా బతకని పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతాలలో పుట్టుకతో పిల్లల్లో లోపాలు, కాన్సర్‌, మధుమేహం వంటి వ్యాధులకు అమెరికా చిమ్మిన విషం కారణమని తేలింది. అణ్వాయుధాలను అత్యాధునికంగా ఎలా తయారు చేస్తున్నారో వైరస్‌లను కూడా ఏదో ఒక ముసుగులో అలాగే తయారు చేస్తున్నట్టు అనేక మంది అనుమానిస్తున్నారు.

మొదటి ప్రపంచ యుద్దంలో రష్యా, రుమేనియాల్లో కలరా, ప్లేగు, అంత్రాక్స్‌ను వ్యాపింప చేసేందుకు నౌకల్లో అవి సోకిన గుర్రాలు, ఇతర పశువులను ఎగుమతి చేసేందుకు జర్మనీ పధకం వేసిందని వార్తలు వచ్చాయి. అయితే దాని మీద విచారణ జరిపిన నానాజాతి సమితి కమిటీ జీవ ఆయుధాలను ఉపయోగించలేదు గానీ జర్మన్లు రసాయనిక ఆయుధాలు వాడినట్లు పేర్కొన్నది. తరువాత రసాయనిక ఆయుధాలను రూపొందించకూడదని కోరుతూ 1925లో జెనీవా ఒప్పందం చేసుకున్నారు. అనేక దేశాలు సంతకాలు చేసినా 1975వరకు అమెరికా భాగస్వామి అయ్యేందుకు మొరాయించింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కొరియాపై దాడి సమయంలో అమెరికా జీవ ఆయుధాలను ఉపయోగించిందనే విమర్శలు వచ్చాయి. అయితే తమ దగ్గర జీవ ఆయుధాలు ఉన్నాయి తప్ప వాటిని ఉపయోగించలేదని అమెరికన్లు బుకాయించారు.

జపాన్‌ జీవ ఆయుధాల తయారీ బృందం నేత షిరోషి

రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ సామ్రాజ్యవాదులు ఆపరేషన్‌ చెర్రీ బ్లూసమ్స్‌ పేరుతో జీవ ఆయుధాలతో అమెరికా సహా అనేక దేశాల మీద దాడి చేయాలనే పథక రచన చేశారు. అందుకు ప్రత్యేక దళాన్నే ఏర్పాటు చేశారు. 1932 నుంచి 1942వరకు పరిశోధనలు చేసి రూపొందించారు. తొలుత ప్రయోగాల్లో భాగంగా తన ఆక్రమణలోని చైనాలోని హార్బిన్‌, కొరియా, మంచూరియా ప్రాంతంలో దాడి చేశారు. దానిలో కలరా, ప్లేగు, అంతరాక్స్‌, మసూచి వంటి ప్రమాదకర క్రిముల్ని వాడారు. 2002లో ఒక అంతర్జాతీయ సమావేశంలో జపాన్‌ మిలిటరీ జరిపిన బాక్టీరియా బాంబు దాడుల్లో మరణించిన వారు ఐదు లక్షల ఎనభైవేల మంది ఉన్నట్టు వక్తలు వెల్లడించారు. ఒక్క చైనాలోనే ప్లేగు, కలరా, ఆంత్రాక్స్‌ వంటి వాటితో నాలుగు లక్షలమంది మరణించారని అంచనా. అమెరికన్లు జపాన్‌ పెరల్‌ హార్బరు మీద దాడి చేసిన తరువాత పదిహేను కోట్ల ప్లేగు బాక్టీరియాను మోసుకుపోయే ఈగలు, ఎలుకలతో అమెరికా మీద దాడి చేయాలని జపాన్‌ ఏర్పాట్లు చేసుకుంది. అయితే కారణాలు ఏమైనా వాటిని మోసుకుపోయే బెలూన్‌ నిర్ణీత స్థలాన్ని చేరలేదు. తరువాత దాడి చేయాలనుకున్న తేదీకి కొద్ది వారాల ముందే జపాన్‌ లొంగిపోయింది. దాంతో పన్నాగం నెరవేరలేదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత జరిపిన విచారణలో జీవ ఆయుధాల తయారీ బృందం నేత షిరోషిని జపాన్‌ విడిచినా సోవియట్‌ విచారణలో 12మంది జపనీయులకు శిక్షలు తప్పలేదు.
జపాన్‌ జీవ ఆయుధాల తయారీకి 150 భవనాలను, ఐదు శివారు ప్రాంతాలను ఉపయోగించి మూడువేల మంది శాస్త్రవేత్తలతో పని చేయించారు. వాటి తయారీ సమయంలో కనీసం పదివేల మంది ఖైదీలపై వాటిని ప్రయోగించగా మరణించినట్టు తేలింది. వారిలో మూడువేల మంది కొరియా, చైనా, సోవియట్‌, మంగోలియా, అమెరికన్‌, బ్రిటిష్‌, ఆస్ట్రేలియన్‌ యుద్ద ఖైదీలు ఉన్నట్టు బయట పడింది. జపాన్‌ జీవ ఆయుధాల విషయం బయటపడిన తరువాత అమెరికా పెద్ద ఎత్తున 1942నుంచి వాటిని రూపొందించేందుకు పూనుకుంది. తాను పెద్ద ఎత్తున జీవ ఆయుధాలను తయారు చేసినట్టుగానే ఇతరులు కూడా తయారు చేసి తమ మీద ప్రయోగిస్తారని అమెరికా భయపడుతోంది.

ఇరాక్‌పై దాడి, దురాకక్రమణ సమయంలో 1990-91లో తన సైనికులను రసాయన ఆయుధాల నుంచి రక్షించుకొనేందుకు అవసరమైన ముఖతొడుగులు(మాస్క్‌) అందచేసింది. వాటిని ఎలా కనుగొనాలో శిక్షణ ఇచ్చింది. లక్షా 50వేల మంది సైనికులకు ఆంత్రాక్స్‌ నివారణ వాక్సిన్లు, వేసింది. ఆంత్రాక్స్‌ సోకినపుడు నివారణకు ఐదులక్షల మంది సైనికులకు ఒక నెలకు అవసరమైన ఔషధాల నిల్వల్ని అందుబాటులో ఉంచింది.
చరిత్రలో మానవాళి పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన సామ్రాజ్యవాదుల దుష్ట చరిత్రను మూసిపెడుతూ సోషలిజం, కమ్యూనిజం మీద ఉన్న వ్యతిరేకతను మరోసారి రెచ్చగొట్టేందుకు కార్పొరేట్‌ మీడియా చైనా జీవ ఆయుధాల తయారీ కథలను చెబుతున్నది.రెండవ ప్రపంచ యుద్దంలో జీవ ఆయుధాల దాడికి గురైన బాధిత దేశం చైనా అన్నది గుర్తు పెట్టుకోవాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా వైరస్‌ : కాసుల లాభనష్టాల బేరీజులో కార్పొరేట్‌ లోకం !

09 Sunday Feb 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Health, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Coronavirus, Coronavirus and pharmaceutical companies, Coronavirus outbreak, Novel Coronavirus, Wuhan

Image result for coronavirus corporates making profit and loss impact assessment

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ విసిరిన సవాలును ఎదుర్కొనేందుకు చైనా తన సర్వశక్తులను వడ్డుతోంది.కరోనా లేదా మరొక వైరస్‌ దేనికీ జాతి, మతం, రంగు, ప్రాంతం, ఖండం అనే విచక్షణ ఉండదు, సరిహద్దులను అసలే ఖాతరు చేయదని గతంలో వ్యాప్తి చెందిన అనేక వైరస్‌లు నిరూపించాయి. అందువలన అలాంటి వాటిని నిరోధించేందుకు యావత్‌ దేశాలు కృషి చేయాల్సి వుంది. కానీ అమెరికా వంటి కొన్ని రాజ్యాలు సహకరించకపోగా తప్పుడు ప్రచారాన్ని వ్యాపింప చేస్తున్నాయి. మరోవైపు వైరస్‌ వ్యాప్తివలన చైనా, ప్రపంచానికి కలిగే ఆర్ధిక నష్టం గురించి లెక్కలు వేసుకుంటున్నాయి. వాటి గురించి కూడా అతిశయోక్తులు, అర్ధ సత్యాలను వ్యాప్తి చేస్తున్నారు. మరికొందరు ప్రబుద్దులు చైనా కమ్యూనిస్టు పార్టీ, అక్కడి సోషలిస్టు వ్యవస్ధ మీద ఉన్న కసిని కరోనా పేరుతో తీర్చుకొని మానసిక సంతృప్తిని పొందుతున్నారు. ఒకవైపు వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుంటే మరోవైపు దాన్నుంచి లాభాలను ఎలా పిండుకోవాలా అని ఔషధ దిగ్గజ సంస్ధలు చూస్తున్నాయి.
ఆర్ధిక నష్టం గురించి ఎవరూ ఇదమిద్దంగా అంచనా వేయలేదు. వైరస్‌ ప్రభావం ఎంతకాలం ఉంటుంది, దాని తీవ్రత ఎప్పుడు తగ్గుతుంది అనేది కూడా ఇప్పటికిప్పుడే చెప్పలేరు. కరోనాతో నిమిత్తం లేకుండానే సోవియట్‌ యూనియన్‌ మాదిరి చైనా సోషలిస్టు వ్యవస్ధ కూడా కుప్పకూలిపోతుందని అనేక మంది కలలు కన్నారు, ఆకాంక్షించారు. ముహార్తాలు కూడా పెట్టారు. అవి నిజం గాకపోవటంతో నీరసపడిపోయారు. ఇప్పుడు కరోనా కూడా అలాంటి వారిని నీరసపరచటం ఖాయం.
ప్రపంచ కార్పొరేట్ల పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో ‘ ఆసియా నిజమైన వ్యాధిగ్రస్ధ చైనా ‘ శీర్షికతో వాల్టర్‌ రసెల్‌ మీడ్‌ అనే ఒక కాలేజీ ప్రొఫెసర్‌ తనలో ఉన్న విద్వేషాన్ని వెళ్లగక్కాడు. చైనీయులు మురికి, రోగిష్టి మనుషులనే గత కాలపు పశ్చిమ దేశాల దురహంకారం ఇంకా కొనసాగుతోందనేందుకు ఇది ఒక సూచిక. దీని మీద తీవ్రమైన ఆగ్రహం వెల్లడైంది, చైనా అధికారికంగా నిరసన కూడా తెలిపింది. వాటి మీద వ్యాఖ్యానించేందుకు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ నిరాకరించింది. శ్వేతజాతీయులకు వచ్చే రోగాల కంటే చైనీయులు, ఇతర ఆసియావాసులకు వచ్చే జబ్బులు ప్రమాదకరమైన వంటూ పందొమ్మిదవ శతాబ్దంలోనే పశ్చిమ దేశాల వారు జాత్యంహకారం వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కరోనాను కూడా చైనా జాతికి అంటకట్టే ప్రయత్నం జరుగుతోంది.
చైనా నిపుణుల అంచనా ప్రకారం ఫిబ్రవరి 15వరకు వైరస్‌ వ్యాప్తి చెందవచ్చు, తరువాత తగ్గుముఖం పడుతుంది. మేనెల మధ్యనాటికి పూర్తిగా అదుపులోకి వస్తుంది.ఈ లోగా చైనా ఆర్ధిక వ్యవస్ధకు జరిగే పరిమిత హాని తరువాత కాలంలో పూడ్చుకోవచ్చు. ఎంత ప్రభావం పడినా చైనా జిడిపి 5.6-5.8శాతం మధ్య వుండవచ్చని అంచనా వేస్తున్నారు.

Image result for coronavirus, corporates cartoons
కరోనా వైరస్‌ ప్రస్తుతం సోకిన ప్రాంత విస్తీర్ణం ఎంత? ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 70శాతం ఉహాన్‌ నగరం ఉన్న హుబెరు రాష్ట్రంలోనే ఉన్నాయి. మరణించిన వారిలో 97శాతం మంది ఈ రాష్ట్రానికి చెందిన వారే. తరువాత తూర్పు రాష్ట్రమైన ఝియాంగ్‌లో వెయ్యిలోపు కేసులు నమోదయ్యాయి. వలస వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉండే బీజింగ్‌, షాంఘై నగరాలలో ఒక్కొక్కరు మాత్రమే మరణించారు. చైనా జిడిపి తొలి మూడు నెలల్లో 5.2శాతం ఉంటుందని, తరువాత ఏడాది మొత్తం 5.8శాతం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కనిష్టంగా తొలి త్రైమాసికంలో 4.8శాతం, మొత్తం ఏడాదిలో 5.5శాతం ఉంటుందని మరొక అంచనా.చైనాలో అందరూ చెబుతున్నంత అభివృద్ధి లేదని, అంకెల గారడీ చేస్తారని చెప్పే నోళ్లు దీని గురించి ఏమంటాయో తెలియదు.
ఉహాన్‌ పరిసర ప్రాంతాలలో ఆటో, టెలికమ్యూనికేషన్స్‌,ఎలక్ట్రానిక్స్‌, బయోమెడిసిన్‌ సంబంధమైనవి పెద్ద పరిశ్రమలు.హుబెరు రాష్ట్రం, ఉహాన్‌ నగర ప్రాధాన్యత ఏమంటే దేశం మధ్యలో ఉండటంతో రవాణా, వాణిజ్యం, పెట్టుబడులు, టూరిజం వంటి సేవారంగం కీలకమైన అంశాలు. ఒకసారి వ్యాధి వ్యాప్తి అదుపులోకి వచ్చిన తరువాత అవన్నీ సాధారణ స్ధితికి చేరుకుంటాయి.
2003లో సారస్‌ వ్యాప్తి సమయంలో ప్రపంచ వాణిజ్యంలో చైనా వాటా కేవలం ఐదుశాతమే, ఇప్పుడు 16శాతానికి పెరిగినందున ప్రభావం ఎక్కువగా ఉంటుందని కొందరు చెబుతున్నారు. ఇటీవలి సంవత్సరాలలో చైనాలో వచ్చిన ప్రధాన మార్పుల్లో స్ధానిక వినియోగం పెరగటం ఒకటి. అందువలన మార్కెట్‌ చోదిత పెట్టుబడులు వెనక్కు పోవటం సాధ్యం కాదన్నది ఒక అభిప్రాయం. చైనాలో కార్మికుల వేతనాలు పెరగటం తదితర ఉత్పాదక ఖర్చుల పెరుగుదల కారణంగా లాభాలు తగ్గి ప్రస్తుతం విదేశీ పెట్టుబడులలో 70శాతం ఉత్పాదక రంగం నుంచి సేవారంగానికి మరలాయి. వ్యాధి తగ్గుముఖం పట్టిన తరువాత సేవారంగం తిరిగి పుంజుకుంటుంది. అందువలన తాము ఎలాంటి ఆందోళనకు గురికావటం లేదని చైనీయులు చెబుతున్నారు. ఇప్పటికే గట్టిగా తట్టుకొని నిలిచిన తమ సమాజాన్ని వ్యాధి గ్రస్త దేశమని నోరు పారవేసుకుంటున్నవారు త్వరలో వైరస్‌ను ఎలా ఓడిస్తామో కూడా చూస్తారనే విశ్వాసాన్ని వెల్లడిస్తున్నారు.
చైనా వ్యాధి నిరోధకానికి ప్రాధాన్యత ఇస్తున్నది. గతంలో స్పానిష్‌ ఫ్లూ వంటి ప్రమాదకర వైరస్‌ వ్యాప్తి సమయంలో అమెరికాతో సహా ఏ దేశంలోనూ ఇలాంటి చర్యలు తీసుకోలేదు. హుబెరు రాష్ట్రం, పరిసర ప్రాంతాలలో దాదాపు పది కోట్ల మంది జనాన్ని ఇండ్లకే పరిమితం చేసి వ్యాధి వ్యాపించకుండా చూస్తున్నది. వారికి అవసరమైన ఇతర సాయం చేస్తున్నది. ఇంత పెద్ద సంఖ్యలో జనం ఇండ్లకే పరిమితం అయితే అది ఆర్దిక వ్యవస్ధ మీద, ప్రభుత్వ ఖజానా మీద ప్రభావం చూపకుండా ఎలా ఉంటుంది. చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా, విడివస్తువులను అందచేసే గొలుసులో ఒక ప్రధాన లంకెగా ఉన్నందున ఆ గొలుసులో ఉన్న ఇతర దేశాలు కూడా ప్రతికూలంగా ప్రభావితం కాకుండా ఎలా ఉంటాయి. కనుకనే కార్ల నుంచి వీడియో గేమ్‌ల వరకు ప్రపంచ సరఫరా గొలుసుకు అంతరాయం కలిగితే తీవ్ర నష్టం జరగనుందని అనేక దేశాలు భయపడుతున్నాయి. అయితే జరిగే నష్టం, పడే ప్రభావం ఎంత ఉంటుందో ఎవరూ ఇదమిద్దంగా చెప్పలేకపోతున్నారు. లండన్‌ కేంద్రంగా పని చేసే కాపిటల్‌ ఎకనమిక్స్‌ అనే సంస్ధ ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో కరోనా వైరస్‌ ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు 280బిలియన్‌ డాలర్ల మేర నష్టం కలిగించవచ్చని అంచనా వేసింది.
షాంఘై, హాంకాంగ్‌లోని వినోద కేంద్రాలను గత వారం రోజులుగా మూసివేసిన కారణంగా రెండవ త్రైమాసికంలో తమ ఆదాయం 17.5కోట్ల డాలర్లు తగ్గిపోవచ్చని డిస్నీ ఆర్ధిక అధికారి చెప్పారు.చైనా నూతన సంవత్సరాది సందర్భంగా విడుదల చేయదలచిన ఐదు చిత్రాలను నిలిపివేసినట్లు కెనడా కంపెనీ ఐమాక్స్‌ పేర్కొన్నది. చైనాలోని మకావో దీవిలో 41కాసినోలను మూసివేశారు. వీటిలో ఎక్కువ భాగం అమెరికా జూదశాలలే. ప్రతి రోజూ తమకు 24 నుంచి 26 మిలియన్‌ డాలర్ల మేరకు నష్టమని వయన్‌ రిసార్ట్స్‌ తెలిపింది.
ఆపిల్‌,క్వాల్‌కామ్‌ కంపెనీలు తమ నష్టాలను అంచనా వేస్తున్నాయి. హుండరు వంటి కార్ల కంపెనీలు చైనా నుంచి విడిభాగాలు ఆలస్యమయ్యే కారణంగా దక్షిణ కొరియాలో ఉత్పత్తి కేంద్రాలను తాత్కాలిక మూసివేస్తున్నట్లు తెలపింది. చైనాలో పరిస్ధితులు మెరుగుపడుతున్నట్లు చైనా ప్రభుత్వం చెప్పగానే వారం రోజులు తిరిగి ఉత్పత్తిని ప్రారంభిస్తామని డైల్మర్‌, ఓక్స్‌వాగన్‌ ప్రకటించాయి. విడిభాగాల సరఫరా అంతరాయం కారణంగా ఐరోపాలోని తమ ఉత్పత్తి కేంద్రాలకు అంతరాయం ఉంటుందని ఫియట్‌ ఛిస్లర్‌ పేర్కొన్నది.
గత కొద్ది వారాలుగా అనేక విమాన సంస్ధలు చైనా సర్వీసులను రద్దు చేశాయి, వాటి నష్టాలను అంచనా వేస్తున్నారు. ఎయిర్‌ చైనా ఎక్కువగా ఆదాయాన్ని కోల్పోనుంది.స్టార్‌బక్స్‌ మెక్‌డోనాల్డ్‌ వంటి సంస్ధలు అనేక దుకాణాలను తాత్కాలికంగా మూసివేశాయి, మొత్తంగా చూస్తే తమ లాభాల మీద ప్రభావం పెద్దగా పడదని అంటున్నాయి.
వైరస్‌ ప్రభావం లేని ప్రాంతాలలో కార్మికుల కొరత కారణంగా వేతనాలు పెద్ద ఎత్తున పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. నూతన సంవత్సరాది సెలవులు, ఇదే సమయంలో వ్యాధి నిరోధక చర్యల్లో భాగంగా ఇండ్లకు పరిమితమై విధుల్లోకి రాని కార్మికులకు పొడిగించిన సెలవు రోజులకు సైతం వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చైనా నుంచి పర్యాటకులను అనుమతించరాదని థారులాండ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన విహారయాత్రల రంగానికి 10కోట్ల డాలర్ల మేర నష్టమని అంచనా వేశారు.
వైరస్‌ వార్తలు వెలువడిన తరువాత న్యూయార్క్‌, లండన్‌లోని చమురు మార్కెట్‌లో ధరలు 15శాతం పడిపోయాయి. చమురు ఆధారిత ఆర్ధిక వ్యవస్ధలున్న రష్యా, మధ్యప్రాచ్యం, పశ్చిమాసియా, గల్ఫ్‌ , ఇతర దేశాలకు, చివరికి అమెరికాలోని షేల్‌ చమురు కంపెనీలకు కూడా ఆ మేరకు నష్టం ఉండవచ్చు. ఇదే సమయంలో దిగుమతులపై ఆధారపడిన చైనాకు దిగుమతి బిల్లుతో పాటు అంతర్గతంగా చమురు డిమాండ్‌ తగ్గిపోయి అక్కడి ఆర్ధిక వ్యవస్ధకు ఆమేరకు లబ్ది కూడా చేకూరనుంది.
అమెరికా-చైనా మధ్య కుదిరిన సర్దుబాటు అవగాహన మేరకు అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ పెరిగే అవకాశాలకు ఇప్పుడు పరిమితంగా అయినా గండి పడింది. వైరస్‌ కారణంగా చైనాలో పరిశ్రమలు మూతపడితే ఆ మేరకు తమకు ఉపాధి, ఇతరత్రా మేలు జరుగుతుందని అమెరికా వాణిజ్యశాఖ మంత్రి విల్బర్‌ రోస్‌ సంతోషం వ్యక్తం చేశారు, అయితే మొత్తంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధకూ ప్రతికూలమే అని ఆర్ధికవేత్తలు చెబుతున్నారు. చైనా యువాన్‌ విలువ పడిపోతే అది అమెరికాకు దెబ్బ.

Image result for coronavirus political cartoons
చైనాతో పెద్దవ్యాపార భాగస్వామిగా ఉన్న మనదేశం మీద పడే ప్రభావం గురించి కూడా కార్పొరేట్‌ సంస్ధలు మదింపు వేస్తున్నాయి. మన దేశం గతేడాది మొత్తం దిగుమతుల్లో 14శాతం చైనా నుంచి తీసుకోగా ఎగుమతుల్లో మన వస్తువులు ఐదుశాతం చైనా వెళ్లాయి. ఆకస్మిక పరిణామంగా వైరస్‌ వ్యాప్తి వలన వెంటనే దిగుమతుల ప్రత్నామ్నాయం చూసుకోవటం అంత తేలిక కాదు, అదే సమయంలో పరిమితమే అయినా అసలే ఇబ్బందుల్లో ఉన్న మన ఆర్ధిక పరిస్దితి మీద ఎగుమతులు తగ్గితే ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా. ఎగుమతుల్లో ఎలక్ట్రానిక్స్‌మీద ప్రభావం ఎక్కువ. చైనా నుంచి పర్యాటకులు ఇటీవలి కాలంలో బాగా పెరిగినందున ఆ రంగం మీద ప్రభావం తీవ్రంగా పడవచ్చు, విమానరంగం కూడా ప్రభావం కానుంది. చైనాలో వ్యాధి వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా పెద్ద సంఖ్యలో సినిమా ధియేటర్లను మూసివేసినందున బాలీవుడ్‌ కూడా ఏంతో కొంత నష్టపోనుంది. అసలే కార్లు, ఇతర మోటారు వాహనాల అమ్మకాలు తగ్గాయి, ఇప్పుడు చైనా నుంచి విడిభాగాలు నిలిచిపోతే నష్టం ఇంకా పెరుగుతుందనే అందోళన ఉంది.
కరోనా వైరస్‌ గురించి ఒకవైపు అతిశయోక్తులు, చైనా వ్యతిరేకతను ప్రచారం చేస్తున్న పశ్చిమ దేశాలు మరోవైపు దాన్నుంచి లాభాలు పిండుకొనేందుకు పూనుకున్నాయి. వ్యాధుల నివారణ, చికిత్సకు వాక్సిన్‌లు, ఔషధాల తయారీ అవసరమే అయితే అయితే చరిత్రను చూసినపుడు జన కల్యాణం కోసం గాక కాసుల కోసమే కార్పొరేట్‌ కంపెనీలు ప్రయత్నించాయి. కరోనా వైరస్‌ వాక్సిన్‌ తయారీకి కొన్ని సంవత్సరాలు పడుతుందని, అందుకోసం వంద కోట్ల డాలర్లు ఖర్చవుతుందని పోలాండ్‌ నిపుణుడు ఒకరు చెప్పగా మరొక అంచనా 150 కోట్ల డాలర్ల వరకు ఉంది. అది ఎంతో ఖరీదైనదిగా ఉన్నప్పటికీ, తక్షణమే అది ఉపయోగంలోకి రాకపోయినా భవిష్యత్‌లో నష్టాల నివారణకు తోడ్పడుతుంది. అయితే ఇలాంటి వైరస్‌ల నిరోధానికి వాక్సిన్‌ల తయారీ యత్నాలు గతంలో పెద్దగా ముందుకు సాగలేదు. 2003లో వచ్చిన సారస్‌, 2012లో తలెత్తిన మెర్స్‌కే ఇంతవరకు తయారు కాలేదు. ఎబోలా వాక్సిన్‌ పరిస్దితీ అంతే. గతేడాది ఆమోదం పొందిన వాక్సిన్‌ మీద ప్రయోగాలు చేసేందుకు కొన్ని సంవత్సరాలు పడుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా వైరస్‌ కట్టడిలో చైనా-కట్ట్టు కథల వ్యాప్తిలో మీడియా !

05 Wednesday Feb 2020

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, Science, USA

≈ Leave a comment

Tags

Coronavirus outbreak, Novel Coronavirus, Wuhan, wuhan hospital construction

Image result for while china trying to control the coronavirus,media spreading misinformation"

ఎం కోటేశ్వరరావు
తప్పుడు సమాచారం రెండో అంటు వ్యాధి అనే శీర్షికతో అమెరికా పత్రిక లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ తాజాగా ఒక వ్యాఖ్యానాన్ని ప్రచురించింది. ఇది చైనా నుంచి అనేక దేశాలకు వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ గురించి అని వేరే చెప్పనవసరం లేదు. భయంకరమైన అంటు వ్యాధులు వ్యాపించటం పెద్ద సంఖ్యలో జనం, ఇతర జీవజాలం మరణించటం మనకు చరిత్ర తెలియనప్పటి నుంచీ వుంది. గతంలో వ్యాధుల గురించి తెలియనపుడు, నివారణ చర్యలను వెంటనే ఒకరికి ఒకరు తెలియచేసుకొనే సాధనాలు లేనపుడు అనేక వైరస్‌లు, బాక్టీరియాలు పెద్ద సంఖ్యలో నష్టం కలిగించాయి. క్షణాల్లో సమాచారం ప్రపంచానికంతటికీ తెలుస్తున్న ఈ రోజుల్లో జనానికి అవసరమైన దాని బదులు భయాన్ని పెంచేది, తప్పుడు సమాచారం ముందుగా జనానికి చేరుతోంది. దాన్ని అంటు వ్యాధితో పోల్చటాన్ని బట్టి ఎంత ప్రమాదకారిగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సామాజిక మాధ్యమం ఈ విషయంలో అగ్రస్ధానంలో ఉంటే ఎక్కడ వెనుకబడిపోతామో అన్నట్లు సాంప్రదాయక మాధ్యమం కూడా పోటీపడుతోంది. ఈ అంటు వ్యాధికి చికిత్స లేదు. వ్యాధి ఇతరులకు వ్యాపించకుండా తీసుకున్న చర్యల్లో భాగంగా ఊహాన్‌, ఇతర ప్రాంతాల పౌరులను ఇండ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం కోరింది. చివరికి దీన్ని తప్పు పడుతూ, వక్రీకరిస్తూ పశ్చిమదేశాల మీడియా కథనాలు రాస్తోంది. తాజా సమాచారం ప్రకారం వ్యాధి సోకిన దగ్గర నుంచి అంటే గత పదిహేను రోజుల్లో మరణించిన వారి సంఖ్య 490కి చేరింది. వారిని దహనం చేయటంతో కోటి మందికి పైగా జనాభా ఉన్న నగరమంతటా దట్టంగా పొగలు వ్యాపించాయని అతిశయోక్తులు రాశారు.
ఒక వైపు వ్యాధి లక్షణాలు నిర్దారణ కాగానే నివారణకు చైనా, ఇతర దేశాలు తీసుకున్న చర్యలను పొగడకపోయినా జనానికి తెలియ చెప్పటం కనీస ధర్మం. దానికి బదులు వ్యాధి గురించి తప్పుడు ప్రచారం చేసే వారు పొందే లబ్ది ఏమిటో తెలియదు. చైనాలో కోట్లాది మందికి వ్యాధి సోకిందని వీధుల్లో వేలాది మంది కుప్పకూలిపోతున్నారని, ఆరున్నర కోట్ల మంది వరకు మరణించే అవకాశం ఉందని బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌ అంచనా వేస్తోందని, మీ చేతిలో కనుక ఒరెగానో ఆయిల్‌ గనుక ఉంటే వారిలో మీరు ఒకరు కాకుండా ఉంటారని సామాజిక మాధ్యమంలో ప్రచారం జరుగుతున్నట్లు లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ పేర్కొన్నది. మన దేశంలో కూడా అదే స్ధాయిలో ప్రచారం ఉంది, భయాన్ని సొమ్ము చేసుకొనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. గతంలో స్వైన్‌ ఫ్లూ వచ్చినపుడు ఐదు రూపాయల విలువ చేసే మాస్క్‌లను ఎంతకు అమ్మారో,మనం కొన్నామో గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. చైనాలో కరోనా వైరస్‌ను ఎక్కువ భాగం అదుపు చేశారని, అయినా వ్యాపిస్తున్నదని, చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిపుణులుతీసుకున్న చర్యల కారణంగా వ్యాప్తి వేగం తగ్గిందని లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ పేర్కొన్నది.

Image result for wuhan hospital construction"
ఒక తీవ్రమైన అంటు వ్యాధి వ్యాప్తిని అరికట్టటానికి చైనాలో మాదిరి రోజూ ఇరవైనాలుగు గంటల పాటు ఎనిమిది రోజుల్లో వెయ్యికిపైగా పడకలున్న ఆసుపత్రి నిర్మాణం ఏ దేశంలో అయినా జరిగిందా ? జన చైనా ప్రజాసైన్య నిర్వహణలో సోమవారం నుంచి అక్కడ రోగులను చేర్చుకొని చికిత్స చేస్తున్నారు. 33,900 చదరపు మీటర్ల ప్రాంతంలో ఏడువందల మంది ఇంజనీర్ల స్దాయి నిపుణులు, నాలుగువేల మంది కార్మికులు ఈ మహత్తర నిర్మాణంలో పాలు పంచుకున్నారు.ఆసుపత్రి ప్లాన్‌ జనవరి 24కు సిద్ధం అయింది, అదే రోజు వందకు పైగా నేలను తవ్వే, చదును చేసే యంత్రాలను దించారు. 25వ తేదీన నిర్మాణాన్ని ప్రారంభించారు. ముందుగానే సిద్దం చేసిన పెట్టెల వంటి మూడు వందల గదులను 29న ఏర్పాటు చేశారు. శనివారం నాటికి వైద్య పరికరాలను అమర్చారు. ఆదివారం నాటికి ఆసుపత్రి పూర్తి కావటాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగా ఎనిమిది కోట్ల మంది ఇంటర్నెట్‌లో వీక్షించారు. టీవీల్లో సరేసరి. గతంలో సారస్‌ వైరస్‌ వ్యాప్తి సమయంలో బీజింగ్‌ శివార్లలో ఏడు రోజుల్లోనే ఆసుపత్రి నిర్మాణం చేశారు. ఆ అనుభవాన్ని ఇప్పుడు మరింతగా మెరుగుపరిచి ఉపయోగించారు. కరోనా వ్యాపించిన ఉహాన్‌, ఇతర నగరాల్లో కూడా ఇలాంటి త్వరితగతి ఆసుపత్రులను ఇంకా నిర్మిస్తున్నారు.
గతంలో చైనా, ఇరుగు పొరుగుదేశాలలో సారస్‌ వ్యాప్తి చెందినపుడు వ్యాధి సోకిన వారిలో పదిశాతం మంది మరణించగా ప్రస్తుతం కరోనా విషయంలో అది 2.09 మాత్రమేనని అందువలన అంతగా భయపడాల్సిన అవసరం లేదని అనేక మంది చెబుతున్నారు. మరణించిన వారిలో ఎక్కువ మంది వృద్దులు, ఇతర వ్యాధులు ఉన్నవారేనని, అంత మాత్రాన వైరస్‌ తీవ్రతను తగ్గించినట్లుగా భావించరాదని హెచ్చరిస్తున్నారు.
కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్ధ(డబ్ల్యుహెచ్‌ఓ) ప్రపంచ అత్యవసర పరిస్ధితిని ప్రకటించిందంటే దాని అర్ధం చైనా మీద విశ్వాసం లేదని కాదు. ఆరోగ్య వ్యవస్ధలు బలహీనంగా ఉన్న దేశాలలో వ్యాప్తి చెందకుండా చూడాలన్నదే ఉద్దేశ్యం. వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఉహాన్‌ పట్టణం, పరిసరాల్లో దాదాపు ఐదు కోట్ల మంది జనాన్ని అటూ ఇటూ ప్రయాణించకుండా ఇండ్లకే పరిమితం చేస్తూ కట్టడి చేశారు, వారికి కావలసినవన్నీ అందిస్తున్నారు. దక్షిణ కొరియా లేదా ఒక ఆస్ట్రేలియా జనాభా కంటే ఎక్కువ మందికి ఏర్పాట్లు చేయటం ఇంతవరకు మరొక దేశంలో ఎక్కడా జరగలేదు. వైరస్‌ గుర్తింపు తదితర చర్యలు తరువాత, ముందు వ్యాప్తిని అరికట్టటం ముఖ్యమనే వైఖరితో ఈ చర్యలు తీసుకున్నారు. చైనా జనాభా మొత్తానికి ముఖాలకు అవసరమైన వ్యాధి నిరోధక మాస్కుల తయారీని చేపట్టారు. వైరస్‌ను గుర్తించిన పది రోజుల్లోనే దాని డిఎన్‌ఏను గుర్తించిన చైనా శాస్త్రవేత్తలు ఆ వివరాలను ప్రపంచానికంతటికీ అందించారు. వైరస్‌ ప్రబలుతున్న సమయంలోనే ఇంత తక్కువ సమయంలో సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచటం గతంలో ఎన్నడూ జరగలేదు, దాన్ని ఎవరైనా అధ్యయనం చేయవచ్చు, టీకాల వంటి వాటిని తయారు చేయవచ్చు.
ఇలాంటి విపత్తులు వచ్చినపుడు నలుగురూ నాలుగు చేతులు వేసి పరస్పరం సాయం చేయాల్సి వుండగా రాజకీయాలు చేయటం నీచాతి నీచం. ఇలాంటివి జరిగినపుడు బలహీనులను బలిపశువులుగా చేసిన దురహం కారం, దుర్మార్గాన్ని చరిత్ర నమోదు చేసింది. చైనా జాతీయుల కారణంగానే కరోనా వ్యాపిస్తోందని ఆరోపిస్తూ వారిని దేశంలో ప్రవేశించకుండా నిషేధించాలని దక్షిణ కొరియా సియోల్‌ నగరంలో కొందరు ప్రదర్శన చేశారు. కొన్ని చోట్ల అసలు ఆసియా వాసులెవరినీ రానివ్వ వద్దనే వరకు పరిస్ధితి పోయింది. ఎంతగా విద్వేషాన్ని,భయాన్ని రెచ్చగొట్టారో తెలుసుకొనేందుకు ఒక ఉదాహరణ. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో చైనా టౌన్‌ రెస్టారెంట్‌ వెలుపల 60 ఏండ్ల ఒక చైనా జాతీయుడు గుండెపోటుతో పడిపోయాడు. అలాంటి వారి గురించి తెలియగానే కృత్రిమ శ్వాస అందించేందుకు ఏర్పాట్లు చేస్తారు. అయితే అతను కరోనా వైరస్‌ కారణంగానే పడిపోయాడని అలాంటి చికిత్సను అందించేందుకు తిరస్కరించారు.( కరోనా వైరస్‌ వార్త పేరుతో చైనాలోని ఒక రోడ్డుపై ఆకస్మికంగా పడిపోయిన వ్యక్తి దృశ్యాన్ని మన దేశంలో కూడా మీడియా చూపింది. నిజంగా అతనెందుకు అలా పడిపోయాడో తెలియదు. కరోనా వైరస్‌ వ్యాధి లక్షణాలలో అదొకటని ఎవరూ చెప్పలేదు)
ఇప్పుడు చైనాలో జనాన్ని ఒక చోటి నుంచి మరొక చోటికి కట్టడి చేసిన మాదిరి గతంలో కలరా సోకినపుడు చేయలేదు. వారిని నౌకల్లో అనుమతించిన కారణంగా అది ప్రపంచ వ్యాప్తమైంది.1832లో వలస వచ్చిన ఐరిష్‌ జాతీయులు కలరాను వ్యాప్తి చేస్తున్నారని అనుమానించి వారిని విడిగా ఉంచారు, తరువాత రహస్యంగా చంపిన దుర్మార్గం తరువాత బయటపడింది. తొలి రోజుల్లో ఎయిడ్స్‌ కారకులు హైతీయన్లు అంటూ వారి మీద దాడులు చేసి వేధించారు. 2003 చైనాలో సారస్‌ ప్రబలినపుడు కెనడాలోని చైనా జాతీయుల మీద దాడులు చేసి వారి ఇండ్లు, దుకాణాల నుంచి తరిమివేసిన దారుణాలు జరిగాయి. మధ్య అమెరికా దేశాల నుంచి వచ్చే జనం కుష్టువ్యాధి, మసూచిని తీసుకు వచ్చి అమెరికాను కలుషితం చేస్తున్నారంటూ 2018లో అమెరికాలోని ఫాక్స్‌ న్యూస్‌ వ్యాఖ్యాత నోరు పారవేసుకున్నాడు. నిజానికి మసూచిని 1980లోనే ప్రపంచం నుంచి తరిమివేశారు.
కరోనా వైరస్‌తో చైనీయులు జీవ ఆయుధాలు తయారు చేస్తుండగా తప్పించుకొని బయటకు వచ్చిందని, ఆ వైరస్‌ను వారు కెనడా ప్రయోగశాల నుంచి అపహరించారనే కట్టుకధలు అనేకం ప్రచారంలోకి వచ్చాయి. వెనక్కు వెళితే అనేక అంటు వ్యాధులు జనాన్ని సామూహికంగా హతమార్చాయి. వాటికి కారకులు ఎవరు ? 1918 జనవరి నుంచి 1920 డిసెంబరు వరకు ప్రపంచ వ్యాపితంగా 50 కోట్ల మందికి స్పానిష్‌ ఫ్లూ సోకింది, ఆర్కిటిక్‌ నుంచి పసిఫిక్‌ సముద్రదీవుల వరకు ఏ ప్రాంతాన్నీ వదల్లేదు. ఆరోజు నేటి మాదిరి విమానాలు లేవు, ప్రయాణాలు లేవు. కనీసం ఐదు నుంచి పది కోట్ల మంది వరకు మరణించినట్లు అంచనా. (అంటే నాటి ప్రపంచ జనాభాలో ప్రతి వందమందిలో ముగ్గురి నుంచి ఐదు మంది వరకు) ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలో అనేక అంటు వ్యాధులు ఎంతగా ప్రబలాయంటే అమెరికాలో సగటు జీవిత కాలం పన్నెండు సంవత్సరాలు తగ్గిపోయింది. ఫ్లూ పిల్లలను, ముసలి వారినీ ఎక్కువగా కబళిస్తుంది, కానీ అమెరికాలో యువత ఎక్కువ మంది మరణించారు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా అనేక దేశాలు వాస్తవాలను బయట పెట్టకుండా తొక్కిపెట్టాయి. అలాంటి పశ్చిమ దేశాలు ఇప్పుడు కరోనా వైరస్‌ గురించి చైనా మీద అలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. ఫ్లూ కారణంగా స్పెయిన్‌లో రాజు పదమూడవ ఆల్ఫోన్సోతో సహా అనేక మంది సామాన్యులు కూడా పెద్ద సంఖ్యలో మరణించారు. దాంతో అక్కడి నుంచే అది ప్రబలిందని అందువలన దానికి స్పెయిన్‌ ఫ్లూ అని పేరు పెట్టారు.

Image result for wuhan hospital construction"
గత మూడువందల సంవత్సరాలలో తొమ్మిది సార్లు ప్రమాదకరంగా ఫ్లూ వ్యాపించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ప్రతి దేశంలోనూ సగటున మూడు సార్లు ఫ్లూ వచ్చినట్లు తేలింది. అలాంటి భయంకరమైన వాటిలో 2009లో వచ్చిన ఫ్లూ ఒకటి.దీన్నే స్వైన్‌ ఫ్లూ అని పిలిచారు. మన దేశాన్ని కూడా ఎలా వణికించిందో తెలిసిందే. ఇది తొలుత అమెరికా పక్కనే ఉన్న మెక్సికోలో బయట పడింది. ప్రపంచమంతటా పాకి జనాభాలో పదకొండు నుంచి 21శాతం మందికి సోకినట్లు, 1,51,700 నుంచి 5,75,400 మంది వరకు మరణించినట్లు తేలింది. ఎంతో అభివృద్ది చెందింది, వైద్య పరంగా ముందున్నదని చెప్పుకొనే అమెరికాలో స్వైన్‌ ఫ్లూ 2009-10లో నాలుగు కోట్ల 30లక్షల మంది నుంచి 8.9 కోట్ల మందికి సోకిందని అంచనా. వారిలో లక్షా 95వేల నుంచి నాలుగు లక్షల మూడువేల మంది వరకు ఆసుపత్రి పాలయ్యారని, 8,870 నుంచి 18,300 మంది వరకు మరణించారని అంచనా. మరొక సమాచారం ప్రకారం ప్రతి ఏటా అమెరికాలో సగటున ఫ్లూ కారణంగా కొన్ని సంవత్సరాల సగటు 25వేలు ఉండగా మరికొన్ని సంవత్సరాలలో 36వేల మంది మరణించారని తేలింది. ఒక ఏడాది తక్కువ, మరొక ఏడాది ఎక్కువ ఉండవచ్చు ఇది సగటు అని అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పత్రిక వెల్లడించింది. కరోనాకు చైనా కారణం అని చెప్పేవారు అమెరికాలో జరిగే వాటికి కారకులు ఎవరని చెబుతారు ?
కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అమెరికా ఎలాంటి సాయం చేయకపోగా అతిగా స్పందిస్తున్నదని దానిలో భాగంగానే ఏ దేశమూ చేయని విధంగా ఉహాన్‌లోని తన రాయబార కార్యాలయ సిబ్బందిని వెనక్కు తీసుకొన్నదని చైనా విమర్శించింది. ఇది అనైతికం అయినా అమెరికా, దాన్ని సమర్ధించే మీడియా చర్యలు ఆశ్చర్యం కలిగించటం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాడు సారస్‌, నేడు చైనాను వణికిస్తున్న ఉహాన్‌ న్యుమోనియా

22 Wednesday Jan 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS

≈ Leave a comment

Tags

China, Novel Coronavirus, SARS


ఎం కోటేశ్వరరావు
ప్రస్తుతం ఊహాన్‌ న్యూమోనియాగా పిలుస్తున్న వ్యాధికి కారణమైన వైరస్‌ను అదుపు చేసేందుకు చైనా ప్రయత్నిస్తుండగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిపుణులు బుధవారం నాడు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాల గురించి చర్చించనున్నారు. చైనాతో పాటు మరో మూడు దేశాల్లో ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. గతంలో 2003లో వ్యాపించిన సారస్‌ మాదిరి వైరస్‌ మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తున్నదని చైనా ప్రకటించింది. దీని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని చెబుతున్నప్పటికీ అటు చైనాలోనూ, ఇటు ప్రపంచ వ్యాపితంగా ఆందోళన వ్యక్తం అవుతోంది.
మీడియాలో నోవెల్‌ కొరోనా వైరస్‌(2019-ఎన్‌సిఓవి), ఉహాన్‌ సీఫుడ్‌ మార్కెట్‌ న్యుమోనియా వైరస్‌, ఉహాన్‌ న్యుమోనియా, ఉహాన్‌ కొరోనావైరస్‌ అని ఏ పేరుతో పిలిచినా అవన్నీ ఒకటే. దీనికి గుడ్లగూబల నుంచి వ్యాప్తి చెందే ఒక వైరస్‌ లక్షణాలున్నట్లు ప్రాధమికంగా తేలింది. గతనెలలో గుర్తు తెలియని ఈ వైరస్‌తో బాధపడుతున్న వారిని గుర్తించారు. ఇప్పటి వరకు 9 మంది మరణించారని వార్తలు వచ్చాయి. బుధవారం ఉదయం ఏడు గంటల సమయానికి పద్నాలుగు రాష్ట్రాలలో 324 మందికి వైరస్‌ సోకినట్లు చైనా ప్రకటించింది. అంతకు రెండు రోజుల ముందు లండన్‌లోని ఇంపీరియల్‌ మెడికల్‌ కాలేజీ నిపుణులు కనీసం 1700కి సోకి వుండవచ్చునని పేర్కొన్నారు. చైనా వెలుపల దక్షిణ కొరియాలో ఒకరికి సోకినట్లు సోమవారం నాడు, చైనా నుంచి అమెరికా వెళ్లిన ఒక యువకుడికి వైరస్‌ సోకినట్లు మంగళవారం నాడు అమెరికా వెల్లడించింది. హాంకాంగ్‌లో 117 మందికి సోకినట్లు అనుమానం తప్ప నిర్దారణ కాలేదు.
మధ్యచైనా రాష్ట్రంగా పిలిచే హుబెరు రాష్ట్ర రాజధాని ఉహాన్‌ పట్టణం. చైనా నూతన సంవత్సర సందర్భంగా కోట్లాది మంది చైనీయులు బంధు, మిత్రులను స్వయంగా కలిసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేడుకలు జరుపుకుంటారు. పెద్ద ఎత్తున స్వదేశంలోనూ, విదేశాలకు విహార యాత్రలకు వెళతారు. ఈ సమయంలో చైనాలో 20 కోట్ల మంది ప్రయాణాలు చేస్తారని అంచనా కాగా ఒక్క ఉహాన్‌ నగరం నుంచి కోటిన్నర మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన నేపధ్యంలో ఇప్పటికే అనేక మంది తమ ప్రయాణాలను పరిమితం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనవరి 25 నుంచి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. ఇరవై అయిదు నుంచి 30వ తేదీ వరకు అధికారిక సెలవుదినాలుగా ప్రకటించారు. జనవరి పది నుంచి ఫిబ్రవరి 18వరకు వసంత రుతు ఉత్సవాలు జరుగుతాయి. ఈ కాలంలో కనీసం 20 కోట్ల మంది ప్రయాణాలు చేస్తారని అంచనా. ఉహాన్‌ నగర జనాభా కోటీ పదిలక్షలు, పెద్ద రవాణా కేంద్రం. జనవరి 20-27 తేదీల మధ్య దేశంలోని వివిధ ప్రాంతాలకు 2,105, విదేశాలకు 231 విమానాలను నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఉహాన్‌ న్యూమోనియా వైరస్‌ లక్షణాలు కనిపించిన వెంటనే చైనా సర్కార్‌ దేశవ్యాపితంగా శ్వాస సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్నవారిని గుర్తించి పరీక్షించిన కారణంగా నూతన కేసులు బయట పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్ధ పేర్కొన్నది. ఉహాన్‌ నుంచే గాక హుబెరు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి మీద కూడ వ్యాధిలక్షణాల గురించి నిఘావేశామని, హాంకాంగ్‌లో వంద మందిని పర్యవేక్షిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. అనేక దేశాల విమానాశ్రయాలలో చైనా నుంచి వచ్చేవారిని పరీక్షించే ఏర్పాట్లు చేశారు.
తాజా వైరస్‌ వార్తలతో యావత్‌ చైనా సమాజంలో ఒక విధమైన ఆందోళన, అప్రమత్తత కూడా వెల్లడి అయినట్లు వార్తలు వచ్చాయి. దీని గురించి దాయాల్సిన అవసరం లేదని, అదే సమయంలో గతంలో సారస్‌ మాదిరి పరిస్దితి లేదని చైనా మీడియా పేర్కొన్నది. 2004 తరువాత ఇంతవరకు చైనాలో సారస్‌ లక్షణాలు వెల్లడి కాలేదు. ఇదే సమయంలో సారస్‌ వైరస్‌ను నిరోధించే టీకాలను కూడా ఇంతవరకు రూపొందించలేకపోయారు. ఆ లక్షణాలున్న వారి నుంచి ఇతరులకు వ్యాపించకుండా నిరోధ చర్యలు మాత్రమే తీసుకుంటున్నారు, ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఇంటర్నెట్‌ అందరికీ అందుబాటులో ఉన్నందున ప్రభుత్వం సమాచారాన్ని దాచినా దాగదని, అంతర్జాతీయ మీడియా కూడా మిన్నకుండజాలదని చైనా అధికారులు చెబుతున్నారు. సంక్లిష్ట పరిస్ధితులు తలెత్తినపుడు వాస్తవాలను వెల్లడించటం ద్వారానే జనానికి భరోసా కల్పించవచ్చని అన్నారు. సారస్‌ వ్యాప్తి నుంచి చైనా వైద్యనిపుణులు ఎన్నో అనుభవాలను పొందారని, ఇలాంటి పరిస్ధితులను ఎలా ఎదుర్కోవాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని అంటున్నారు. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు యావత్‌ చైనా సమాజాన్ని కదిలించాల్సిన అవసరం ప్రస్తుతానికైతే లేదని చెబుతున్నారు.
గతంలో సారస్‌ వైరస్‌ దక్షిణ చైనాలోని గ్వాంగ్‌ డాంగ్‌ రాష్ట్రం షండే ప్రాంతం నుంచి ప్రారంభమై 2002 నవంబరు నుంచి 2003 జూలై మధ్యకాలంలో పద్నాలుగు దేశాల ( పదిహేడు ప్రాంతాలు)లో వ్యాపించింది. మొత్తం 8,273మందికి సోకగా 775 మంది ఐదు దేశాల(ఏడు ప్రాంతాలు)లో మరణించారు, వీరిలో సారస్‌ సోకినప్పటికీ ఇతర కారణాలతో మరణించిన వారు 60 మంది ఉన్నారు. సగటున 9.6శాతం మంది మృతి చెందారు. దేశాల వారీ చైనా ప్రధాన భూభాగంలో 5,328 మందికి సోకగా 349 మంది మరణించారు, చైనాలో భాగమైన హాంకాంగ్‌లో 1,755 మందికి గాను 299 మంది చనిపోయారు. కెనడాలో 251 మందికి 44, సింగపూర్‌లో 238 మందికి 33, చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌లో 346 మందికి 37, వియత్నాంలో 63కు ఐదు, ఫిలిప్పైన్స్‌లో 14కు రెండు మరణాలు సంభవించాయి. చైనా గ్వాంగ్‌ డాంగ్‌లో వైరస్‌ ప్రారంభమైన బీజింగ్‌ నగరంలో పెద్ద ఎత్తున వ్యాపించింది. ఆ సమయంలో అక్కడి ప్రాధమిక, మాధ్యమిక పాఠశాలలను మూసివేశారు. చైనాలో ప్రతి ఏటా వసంత రుతు సమయంలో జలుబు సాధారణంగా వస్తుంది. అయితే జలుబు చేసిన వారి శరీర ఉష్ణోగ్రత 37.3 సెంటీగ్రేడ్‌ డిగ్రీలు దాటితే వారికి ఉహాన్‌ న్యుమోనియా అనుమానంతో చికిత్స చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మీరు ఎక్కడెక్కడికి ప్రయాణాలు చేశారని వైద్య సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ఉహాన్‌ వెళ్లి వచ్చిన తరువాత జ్వరంలో కూడిన జలుబు చేస్తే పనులకు పోవద్దని, రక్షణ ముసుగులు ధరించాలని సలహా ఇస్తున్నారు. దేశంలో కొన్ని చోట్ల ఉహాన్‌ న్యుమోనియా లక్షణాలు,తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పెద్ద ఎత్తున బ్యానర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.
ప్రస్తుతం చైనాలో ప్రపంచంలోనే అతి పెద్దదైన వ్యాధికారక వైరస్‌, బాక్టీరియాలను పరిశీలించే ప్రయోగశాలల వ్యవస్ధ ఉంది. దేశంలో పన్నెండు ప్రధాన ప్రయోగశాలలు, 91 ప్రాంతీయ, 800 ఆసుపత్రుల ప్రయోగశాలలు ఉన్నాయి. ఇప్పటికి తెలిసిన 300 వ్యాధికారక వైరస్‌లను అక్కడ వెంటనే గుర్తించే ఏర్పాట్లు ఉన్నాయి. 2003 సారస్‌ విస్తరణ తరువాత వీటిని మరింత పటిష్ట పరిచారు. గుర్తు తెలియని వైరస్‌లను గుర్తించే నిరంతర పరిశోధనల గురించి చెప్పనవసరం లేదు. సారస్‌ తరువాత పెద్ద ఎత్తున వ్యాప్తి చెందే వ్యాధులను గుర్తించేందుకు 17ప్రత్యేక బృందాలకు శిక్షణ ఇచ్చారు. సాధారణ న్యూమోనియా వైరస్‌ పది రోజుల కంటే ప్రభావం చూపలేదు, అయితే సారస్‌ మూడు నెలలకు మించి ఉన్నట్లు విదేశీ నిపుణులు గుర్తించారు.
ప్రస్తుతం వ్యాపించిన ఉహాన్‌ న్యూమోనియా కోరోనా వైరస్‌ కేంద్రం నగరంలోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌గా గుర్తించారు. ఇతర ప్రాంతాల్లోని చేపలు, కోళ్ల మార్కెట్లలో అలాంటి లక్షణాలు కనిపించనందున వైరస్‌ సాధారణ లక్షణాలను నిర్ధారించటం ఆలస్యం అవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది ఉహాన్‌లో వైరస్‌ వ్యాప్తికి తోడ్పడే వాతావరణం ఉండటంతో వైరస్‌ల గుర్తింపు, నివారణ సవాలుగా మారింది. ఈ నగరంలో 198 మందిలో వైరస్‌ను గుర్తించారు, 25 మందికి చికిత్స చేసి ఆసుపత్రి నుంచి పంపారు, తొమ్మిది మంది పరిస్ధితి విషమంగా ఉంది. చికిత్స చేస్తున్న సిబ్బందిలో 15 మందికి సోకినట్లు గుర్తించగా వారిలో ఒకరి పరిస్ధితి తీవ్రంగా ఉంది. అవసరమైతే తప్ప జనాలు బయటకు రావద్దని నగరపాలక సంస్ధ సలహా ఇచ్చింది.
చైనాలో కలరా, ప్లేగ్‌ వంటి వాటికి కారణమయ్యే వైరస్‌ను మొదటి తరగతిగా వర్గీకరించి అధిక ప్రాధాన్యత ఇస్తారు, సారస్‌, ఎయిడ్స్‌ వంటి వైరస్‌ల వంటి బి తరగతిలో ఉహాన్‌ వైరస్‌ను చేర్చారు. అంటే వీటిని ఎదుర్కొనేందుకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. జపాన్‌, థారులాండ్‌, దక్షిణ కొరియాల్లో కూడా ఈ వైరస్‌ను గుర్తించిన కారణంగా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని దేశాధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ అధికారులను కోరారు.
ఈ వైరస్‌ గురించి దీని గురించి చైనా వాస్తవాలను బయటకు వెల్లడించటం లేదని పశ్చిమ దేశాల మీడియాలో కథనాలు రాస్తున్నారు. నిజానికి చైనా దాచిందీ లేదు, పశ్చిమ దేశాలు శోధించి కనుగొన్నదీ లేదు. డిసెంబరు 31న ఉహాన్‌లో అంతుబట్టని న్యుమోనియాను గుర్తించినట్లు చైనా ప్రపంచ ఆరోగ్య సంస్దకు తెలియ చేసింది. వ్యాధి వ్యాపించటానికి కారణమైన వైరస్‌ కేంద్రంగా అనుమానించిన సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌ను జనవరి ఒకటిన మూసివేశారు. ఈ వ్యాధి గురించి తమకు తెలిసిందని జనవరి రెండున సింగపూర్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. జనవరి ఒకటిన ఈ వైరస్‌ కారణంగా తమ దేశంలో తొలి మరణం సంభవించినట్లు చైనా తెలిపింది. ఉహాన్‌ నుంచి వచ్చిన ఒక మహిళకు వ్యాధి సోకినట్లు థారులాండ్‌లో జనవరి 13న గుర్తించారు, పదహారవ తేదీన జపాన్‌లో ఒక కేసు బయట పడింది.పదిహేడవ తేదీన రెండవ,20న మూడవ,21న నాల్గవ వ్యక్తి మరణించారు. ఉహాన్‌ నుంచి దక్షిణ కొరియాకు వచ్చిన ఒక వ్యక్తికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. చైనా నుంచి వచ్చే కొన్ని విమానాల ప్రయాణీకులకు పరీక్షలు జరుపుతామని ఆస్ట్రేలియా ప్రకటించింది.
ఇలాంటి అంతుతెలియని ప్రమాదకర వైరస్‌లు వ్యాప్తి చెందినపుడు వాటిని యావత్‌ అంతర్జాతీయ సమాజం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ప్రతి వారు తమ అనుభవం, పరిశోధనల సమాచారాన్ని ఏ దేశంలో అయితే వైరస్‌ ప్రారంభమైందో దానికి అందచేస్తే మానవాళికి మేలు కలుగుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d