• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: CHINA

చైనాపై పోప్‌, ఇస్లామిక్‌ దేశాల మౌనం ఎందుకు ?

02 Thursday Jan 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

China, Islam, Islam in China, Islamic Countries, Pope Francis, Religion in China

Image result for pope  china
ఎం కోటేశ్వరరావు
ఇటీవల చైనా గురించి మీడియాలో వస్తున్న అనేక అంశాలు చదువరులు, వీక్షకులను గందరగోళపరుస్తున్నాయి. వక్రీకరణలు, అవాస్తవాలను విశ్లేషణలు, వార్తల పేరుతో కుమ్మరిస్తున్నారు. వాటిలో కొన్నింటి మంచి చెడ్డల గురించి చూద్దాం. క్రైస్తవులను, ముస్లింలను అణిచి వేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై పోప్‌, ఇస్లామిక్‌ దేశాలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయి అనే ప్రశ ్నలు అనేక మందిలో తలెత్తుతున్నాయి. జర్మనీలో యూదులను లక్ష్యంగా చేసుకున్న హిట్లర్‌ మాదిరి మన దేశంలో ముస్లింలు, క్రైస్తవ మైనారిటీలపై ప్రచార, భౌతిక దాడులకు పాల్పడుతున్న ఫాసిస్టు తరహా పరివార్‌ పట్ల మన దేశంలోని మీడియా మౌనం వహించటం లేదా సమర్దించటాన్ని చూస్తున్నాము.
‘ బైబిల్‌ మరియు ఖురాన్‌లను తిరగరాసేందుకు చైనా పూనుకుంది ‘ ఇది ఇటీవలి ముఖ్యమైన వార్త !
అంతేనా 2018లో చైనాలో బైబిల్‌ అమ్మకాలను నిషేధిస్తున్నారు అని ప్రచారం జరిగింది.చట్టబద్దమైన మార్గాల ద్వారా బైబిల్‌ లేదా ఖురాన్‌ లేదా ఏ మత గ్రంధాన్ని అయినా చైనీయులు తెప్పించుకోవచ్చు. అందుకు ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సి ఉంది, అది అన్ని దేశాలకు వర్తించే నిబంధనే. చైనా సర్కార్‌ దగ్గర నమోదు గానీ లేదా అనుమతి లేని పుస్తకాలు, పత్రికల మీద అక్కడి ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. దాన్ని మతాల మీద దాడిగా చిత్రించారు. చైనాలో ఉన్న నిబంధనల ప్రకార బైబిళ్లను చర్చ్‌ల ద్వారానే తెప్పించుకోవాలి లేదా కొనుగోలు చేయాలి, పుస్తకాల దుకాణాల్లో అనుమతించరు. అక్కడి సామాజిక యాజమాన్య వ్యవస్ద ప్రకారం ఒక పుస్తకంగా ఒక్క బైబికే కాదు ఏ మత గ్రంధానికి పవిత్రతను ఆపాదించకూడదు. పశ్చిమ దేశాలను చైనా అనుకరించకపోతే దాన్ని మత వ్యతిరేకం, అణచివేతగా చిత్రిస్తున్నారు.

చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చి ఏడుపదులు దాటింది. మావో సేటుంగ్‌ నాయకత్వంలో కమ్యూనిస్టులు అధికారంలోకి రాగానే క్రైస్తవ మత చర్చీలు, ఇస్లామిక్‌ మసీదులను కూల్చివేశారు, మతాలను నాశనం చేశారని ప్రచారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. అదే నిజమైతే ఒక్కరూ ఇప్పటికి మిగిలి ఉండేవారు కాదు. 1953లో హాన్స్‌ జాతీయులు 93.94శాతంగా మిగిలిన 6.06శాతం బౌద్ద, క్రైస్తవ, ముస్లిం తదితర మైనారిటీలు ఉన్నారు. అదే 2010 లెక్కల ప్రకారం 91.40, 8.60శాతాలుగా ఉన్నారు. అంటే మైనారిటీలు పెరిగారు. వీరిలో ముస్లిం యుఘీర్‌లు 0.62 నుంచి 0.76శాతానికి పెరిగారు. దీనికి కారణం మైనారిటీలకు జనాభా నియంత్రణ నిబంధనను వర్తింప చేయలేదు. మన దేశంలో బాబరీ మసీదును కూల్చివేసిన మతోన్మాదుల చర్యను ప్రపంచమంతా చూసింది గానీ, చైనా, రష్యా(కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నపుడు) ఇతర దేశాల్లో కమ్యూనిస్టులు ప్రార్ధనా స్ధలాలను కూల్చివేసిన దాఖలాలు లేవు. అన్నీ సురక్షితంగానే ఉన్నాయి. రష్యాలో కమ్యూనిస్టుల అధికారం ముగిసిన తరువాత అనేక మంది అక్కడి చర్చ్‌లను చూసి ప్రభువా కమ్యూనిస్టులు చర్చ్‌లను కూల్చివేశారని చేసిన తప్పుడు ప్రచారాన్ని నమ్మి వ్యతిరేకించినందుకు మన్నించు అని ప్రార్ధించారంటే అతిశయోక్తి కాదు. కమ్యూనిస్టులు మత రాజకీయాలు చేయరు, మతాన్ని రాజకీయాల్లో అనుమతించరు.

Image result for famous churches in china
బైబిల్‌ విషయానికి వస్తే పాత నిబంధన, కొత్త నిబంధన అని ఆ మతాలకు చెందిన వారే రాసుకున్నారు. వాటిలో అనేక అంశాలను చొప్పించారని అనేక మంది విమర్శిస్తారు. వాటిని పక్కన పెడదాం. బైబిల్‌ రాసిన లేదా దేవుడు లేదా దేవుని కుమారుడు, దేవదూతలు ప్రవచించిన సమయానికి ప్రపంచంలో ఎక్కడా కమ్యూనిజం, దాని సిద్దాంతాల జాడలేదు. సోషలిజం, కమ్యూనిజాలకు క్రైస్తవం వ్యతిరేకం అని బైబిల్‌ లేదా ఖురాన్‌ లేదా మరొక మత గ్రంధంలో ఉన్న ఉన్న అంశాల మీద రాస్తున్న లేదా చేస్తున్న తప్పుడు భాష్యాలు పుంఖాను పుంఖాలుగా ఉన్నాయి. అలాంటి తప్పుడు వ్యాఖ్యానాలతో సోషలిజానికి వ్యతిరేకంగా జనాలను రెచ్చగొడుతూ ఉంటే అది తమ రాజ్యాంగానికి వ్యతిరేకం కనుక వాటి వ్యాప్తిని అరికట్టేందుకు చైనా చర్యలు తీసుకోవచ్చు. లేదా మత గ్రంధాల్లో ఉన్న అంశాలు కొన్ని సోషలిజం, కమ్యూనిజాలకు ఎలా వ్యతిరేకం కావో, సానుకూలమో వివరించి జనాల్లో ఉన్న పొరపాటు అవగాహనలను తొలగించేందుకు తమ రాజ్యాంగ లక్ష్యాలకు అనుకూలమైన భాష్యంతో పుస్తకాలను రాయాలని, చైనా లక్షణాలతో కూడిన మత వ్యవస్ధను నిర్మించాలని అక్కడి ప్రభుత్వం చెప్పిందే తప్ప, వాటిని తిరిగి రాయటం అంటూ ఎక్కడా ఉండదు.
మారుతున్న కాలానికి అనుగుణంగా లేని మత పరమైన గ్రంధాలకు సమగ్ర భాష్యాలు రాయాలని, కమ్యూనిస్టు పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా ఉన్న వాటిని నిరోధించాలని గతేడాది నవంబరులో జరిగిన చైనా మత వ్యవహారాల కమిటీ సమావేశంలో చెప్పారు తప్ప బైబిల్‌, ఖురాన్‌ అని ఎక్కడా చెప్పలేదు. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించి చెప్పినట్లుగా పశ్చిమ దేశాల మీడియా దానికి మత గ్రంధాల పేర్లను జోడించి కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి ఉపయోగించుకుంది. ఈ సమావేశంలో వివిధ మతాలకు చెందిన వారు, నిపుణులు, ప్రజాప్రతినిధులు 16 మంది పాల్గొన్నారు. మతాలను, వ్యక్తిగత మత విశ్వాసాలను చైనా కమ్యూనిస్టు పార్టీ అనుమతిస్తుంది తప్ప మతం, విశ్వాసాల ముసుగులో రాజ్యాంగ పరమైన సోషలిజం, కమ్యూనిస్టు, మత రహిత లక్ష్యాలను వ్యతిరేకించే శక్తులను చైనాలో అనుమతించరన్నది స్పష్టం. మన దేశంలో మత వి శ్వాసాలు కలిగి ఉన్నప్పటికీ కమ్యూనిస్టు పార్టీలలో సభ్యులుగా చేరవచ్చు. అలాంటి వారు అనర్హులు అనే నిబంధనలు లేవు.

Image result for why pope and islamic countries silence on china
” కైస్తవులను చైనా అణచివేస్తోంది, చర్చీలను కూల్చివేస్తోంది”
అంతే కాదు వాటికన్‌ను గుర్తించటం లేదు, వాటికన్‌ నియమించిన వారిని అరెస్టు చేస్తోంది, బిషప్పులను స్వంతంగా నియమించుకుంటోంది.ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారంలో ఇదొకటి. ముందుగా తెలుసుకోవాల్సిన అంశం. వాటికన్‌ ఇంతవరకు కమ్యూనిస్టు చైనాను ఒక దేశంగానే గుర్తించలేదు. ఇప్పటికీ దాని దృష్టిలో చైనా అంటే తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ మాత్రమే. కమ్యూనిస్టు పాలన ఏర్పడిన తరువాత ఒక్క పోప్‌ కూడా చైనా సందర్శనకు రాలేదు. అందువలన వాటికన్‌ అధికారాన్ని చైనా గుర్తించే ప్రశ్నే ఉదయించదు. రెండవది, చైనాలో ఉన్న క్రైస్తవులు తమ బిషప్పులను తామే నియమించుకుంటున్నారు అంటే అక్కడ క్రైస్తవులను అణచివేస్తే బిషప్పులు దేనికి ? అంటే అణచివేత కూడా వాస్తవం కాదు. మరి ఎవరిని అరెస్టు చేస్తున్నారు? చైనా సర్కార్‌ అనుమతి లేదా గుర్తింపు లేకుండా రహస్యంగా చర్చ్‌లను ఏర్పాటు చేస్తూ, రహస్య, చైనా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిని అరెస్టు చేస్తున్నారు. దేశవ్యతిరేక శక్తులను ఏ దేశంలో అయినా అదే చేస్తారు కదా ! సామాన్యులకు ఏసుక్రీస్తును ఆరాధించటానికి స్వేచ్చ ముఖ్యమా లేక వాటికన్‌ పెద్దలు చెప్పినట్లుగా చేయటం ముఖ్యమా ? ప్రపంచంలో అనేక దేశాలలో సాగుతున్న దోపీడీని, నియంతలను వాటికన్‌ లేదా క్రైస్తవం వ్యతిరేకించటం లేదు, సమసమాజం కోరుతున్న కమ్యూనిస్టులను ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. చైనాతో సంబంధాలు పెట్టుకోవాలని వాటికన్‌ పెద్దలు కొందరికి ఉన్నా, అమెరికా కనుసన్నలలో పని చేసే కమ్యూనిస్టు వ్యతిరేక చైనా జాతీయుడైన జోసెఫ్‌ జెన్‌ వంటి వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చివరికి వాటికన్‌ పెద్దలు కూడా రాజీపడి లొంగిపోతున్నారని, చైనాను సంతృప్తిపరచేందుకే ఎల్ల వేళలా పని చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశాడు. ఇంతకాలం చైనాలో క్రైస్తవులను అణచివేస్తున్నారని చేసిన ప్రచారం వాటికన్‌కు తెలియంది కాదు. వాటి వెనుక ఉన్న నిజానిజాలు కూడా తెలుసు. అందువల్లనే ఎన్ని విమర్శలు వచ్చినా, ఎందరు వ్యతిరేకించినప్పటికీ 2018లో పోప్‌ ఫ్రాన్సిస్‌ చైనాతో ఒప్పందం చేసుకున్నారు. చైనా నియమించిన బిషప్పులను కూడా గుర్తించారు. ఒప్పందం చేసుకుంటే ఇంతకాలం చైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ రహస్యంగా చర్చ్‌లను నిర్వహించిన నిజమైన విశ్వాసులను మోసం చేసినట్లే అని జోసెఫ్‌ జెన్‌ అన్నాడు. ఒప్పందం ప్రకారం రహస్యంగా ఉన్న చర్చ్‌లను వాటికన్‌ ప్రోత్సహించకూడదు.

Image result for why pope and islamic countries silence on china
” ముస్లింలను అణచివేస్తున్నారు, నిర్బంధ శిబిరాల్లో పెడుతున్నారు ”
చైనాలోని గ్జిన్‌జియాంగ్‌ రాష్ట్ర జనాభా రెండు కోట్లు. అది చైనా వాయువ్య సరిహద్దులో ఉంది. ఒక స్వయం పాలిత ప్రాంత హౌదా కలిగి ఉంది. ఒక వైపు మంగోలియా, కిర్కిజిస్తాన్‌, కజకస్తాన్‌, తజికిస్తాన్‌, రష్యా, ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్ధాన్‌,భారత్‌ సరిహద్దులుగా ఉంది. అయితే ఆక్సారు చిన్‌గా పిలుస్తూ మనది అని చెప్పుకుంటున్న ప్రాంతం గ్జిన్‌జియాంగ్‌లో భాగమైన తమది అని చైనా చెబుతోంది, అది ప్రస్తుతం చైనా అధీనంలో ఉన్న భారత-చైనా వివాదాస్పద ప్రాంతాలలో ఒకటి. ముస్లింలలో ఒక పెద్ద తెగ యుఘిర్‌కు చెందిన జనాభా దాదాపు 46శాతం ఉండటంతో దానిని యుఘిర్‌ రాష్ట్రం అని కూడా పిలుస్తారు.నలభైశాతం మంది హాన్‌ చైనా జాతీయులు, మిగిలిన వారు ఇతర ముస్లిం తెగలకు చెందిన వారున్నారు. కమ్యూనిస్టులు అధికారానికి రాక ముందు ఆ ప్రాంతంలోని యుద్ద ప్రభువులు నాటి కొమింటాంగ్‌ చైనా పాలకులకు వ్యతిరేకంగా సోవియట్‌ మద్దతుతో స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారని చెబుతారు గానీ స్వతంత్ర దేశంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత చైనాలో అంతర్భాగంగానే ఉంది. సోవియట్‌ కూలిపోయిన తరువాత ఇరుగు పొరుగు రాజ్యాలు, ఇతర విదేశీ జోక్యంతో కొంత మంది తప్పుదారి పట్టిన యుఘిర్‌లు కమ్యూనిస్టులు అధికారానికి రాకముందు కొంత కాలం తాము స్వతంత్ర దేశంగా ఉన్నామని, హాన్‌ జాతీయులు తమ మీద పెత్తనం చేస్తున్నారని, తమకు స్వాతంత్య్రం ఇవ్వాలంటూ వేర్పాటు వాదాన్ని ముందుకు తెచ్చారు. కొన్ని ఉగ్రవాద చర్యలకు సైతం పాల్పడ్డారు. మనకు కాశ్మీర్‌ ఎలాంటి కీలక ప్రాంతమో చైనాకు అది అంత ముఖ్యమైనది. ఈ నేపధ్యంలో చైనా ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యల గురించి చిలవలు పలవలుగా చిత్రిస్తున్నారు. ముస్లింలను అణచివేసేందుకు తీసుకున్న నిర్ణయాల పత్రాలు బయట పడ్డాయని కొన్ని పత్రికలు కథలు రాశాయి.
చైనా లక్షణాలతో సోషలిజాన్ని నిర్మిస్తామని చైనా కమ్యూనిస్టు పార్టీ చెబుతున్నది. దీనిని కొంత మంది కమ్యూనిస్టులే అంగీకరించటం లేదు. ఆ పేరుతో అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్దను నిర్మిస్తున్నారనే ప్రచారం చేస్తున్నారు కూడా. నూరు పూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్నట్లుగా ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలను వారిని వ్యక్తం చేసుకోనివ్వటం తప్ప మరొక మార్గం లేదు. పెట్టుబడిదారీ విధానం అన్ని దేశాల్లో ఒకే మూసగా అభివృద్ది చెందలేదు. అలాగే సోషలిజాన్ని కూడా అభివృద్ధి చేయలేమని, ఏ దేశానికి ఆదేశ ప్రత్యేక పరిస్ధితులను గమనంలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు సోషలిజాన్ని నిర్మించే క్రమంలో దశల గురించి తెలియదు, చైనీయుల అవగాహన ప్రకారం అనేక ద శల్లో తమది ఒకటి అంటున్నారు. మొత్తంగా చూసినపుడు వారి దారి ఎటు అన్నదే ముఖ్యం.

Image result for china islamic
సోషలిజం గురించే ఇలా ఉన్నపుడు ఇక మతాల గురించి చెప్పాల్సిందేముంది. ఎంతో సున్నితమైన అంశం, శత్రువులు కాచుకొని ఉంటారు. ఒక లౌకిక వ్యవస్దలో మతం పట్ల ఎలా వ్యవహరించాలి అన్నది ఒక ముఖ్యాంశం, అది కూడా కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న చోట(మన దేశంలో మాదిరి ఒకటో అరో రాష్ట్రంలో అధికారం పొందటం కాదు) మరింత సంక్లిష్టం. సోషలిస్టు సమాజ లక్ష్యం కలిగిన ఏ వ్యవస్దలో అయినా మతం దాని నిర్మాణానికి దోహదం చేసేదిగా ఉండాలి తప్ప వ్యతిరేకించేదిగా ఉండకూడదు. మత విశ్వాసాలు వ్యక్తి, కుటుంబానికి పరిమితం కావాలి తప్ప నా మతం చెప్పినట్లుగా పాలన నడవాలంటే కుదరదు. మతాలే దానికి అనుగుణ్యంగా మారాల్సి ఉంటుంది.అనేక దేశాల్లో అలా మారినపుడు సోషలిస్టు దేశాల్లో కుదరదంటే ఎలా ?
చైనాలోని ఎనిమిది ముస్లిం తెగల పెద్దలతో ప్రభుత్వం సమావేశం జరిపి సోషలిజానికి తగిన విధంగా ఇస్లాం మారాల్సిన అవసరం గురించి వివరించింది, అందుకు గాను ఐదు సంవత్సరాలలో శీఘ్రగతిన తెలియచెప్పేందుకు తీసుకోవాల్సిన చర్యలను వారి ముందుంచింది. పశ్చిమ దేశాల మీడియా దీన్ని దొరకబుచ్చుకొని యుఘిర్‌లో ఉగ్రవాద నిర్మూలన చర్యలుగా కొందరు చిత్రీకరిస్తే మరి కొందరు ఆ పేరుతో మతాన్ని అణచివేసేందుకు పూనుకున్నట్లు రాశారు. అనేక దేశాల్లో మితవాద శక్తులు మత పెత్తనాన్ని తిరిగి పునరుద్దరించేందుకు, పాలకుల మీద వత్తిడి తెచ్చేందుకు ఇటీవలి కాలంలో తీవ్రంగా ప్రయత్నిస్తున్న అంశాన్ని మరచిపోకూడదు. మతపరమైన దేశాల్లో పరిస్ధితులు ఎంత దారుణంగా ఉన్నాయో చూసిన తరువాత ప్రతి లౌకిక దేశం తన జాగ్రత్తలు తాను తీసుకోనట్లయితే అనేక కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంటర్నెట్‌ ఎంత వేగంగా చొచ్చుకుపోతోందో దాన్ని వినియోగించుకొని మత శక్తులు అంతగా రెచ్చిపోవటాన్ని మనం చూస్తున్నాం. ఇదే పరిస్ధితి ప్రపంచమంతటా ఉంది. పోప్‌ జాన్‌ పాల్‌ 2 పోలెండ్‌లో సోషలిస్టు వ్యవస్ధ కూల్చివేతకు ఎలా చేతులు కలిపిందీ మనం చూశాము. వాటికన్‌ కేంద్రం ఉన్న ఇటలీ ఉప ప్రధాని మాటియో సల్వవినీ 2018 ప్రారంభంలో ఒక ప్రకటన చేశాడు.’ మన మీద దాడి జరుగుతోంది, మన సంస్కృతి, సమాజం, సంప్రదాయాలు, జీవన విధానానికి ముప్పు ఏర్పడింది.’ అని మాట్లాడితే ఒక మీడియా 2019లో మత యుద్ధాలు తిరిగి రానున్నాయని రాసింది. ఛాందసవాదం వెర్రి తలలు వేస్తోంది, అది మితవాద జాతీయ వాద భావనలను ముందుకు తెస్తోంది, హింసాకాండకు, సామాజిక అస్ధిరతకు కారణం అవుతోంది. ఈ అనుభవాలను ప్రతి దేశం తీసుకోవాలి, అవసరమైన చర్యలు తీసుకోవాలి. చైనా దీనికి మినహాయింపుగా ఉండజాలదు.
సోషలిజానికి అనుగుణ్యంగా ఒక్క ఇస్లామే కాదు, చైనాలోని అన్ని మతాలూ మారాలని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అందుకు అనుగుణ్యమైన చర్యలు తీసుకొంటోంది. ఏ మతానికి మినహాయింపు లేదు. మన దేశంలో కేంద్రంలో, అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న సంఘపరివార్‌ నేతల మాదిరి హిందూ మతానికి ఇతర మతాల నుంచి, లౌకిక వాదుల నుంచి ముప్పు వస్తోందని చెబుతన్నట్లుగా చైనాలో మెజారిటీ మతానికి ముప్పు వస్తోందని చెప్పటం లేదు. ఒక మైనారిటీ మతాన్నుంచి వస్తోందనే ముప్పును మరొక మెజారిటీ మతోన్మాదం అరికట్టలేదు, అది తన ఉన్మాదాన్ని జనం మీద రుద్దుతుంది. జనాన్ని అణచివేస్తుంది. 2018లో చైనా విడుదల చేసిన ఒక శ్వేత పత్ర సమాచారం ప్రకారం 20 కోట్ల మంది మతాన్ని నమ్మేవారున్నారు. ప్రభుత్వం వద్ద నమోదైన ప్రార్దనా స్ధలాలు 1,44,000 ఉన్నాయి. వాటిలో 3,80,000 మంది మత పరమైన క్రతువులు నిర్వహించే వారున్నారు. ఉగ్రవాద నిరోధ చర్యలు, మత పరమైన స్వేచ్చ పూర్తిగా భిన్నమైన అంశాలు. ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకోవటం, దాన్ని నివారించటం మత స్వేచ్చను అడ్డుకోవటం కాదు. మన దేశంలో సంఘపరివార్‌ చేస్తున్న ప్రచారం మాదిరి ముస్లింలు మొత్తం ఉగ్రవాదులే అని లేదా అందరూ ఉగ్రవాదులు కాదు గానీ ఉగ్రవాదులుగా ఉన్నవారందరూ ముస్లింలే అనే తప్పుడు ప్రచారాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ చేయటం లేదు.
ముస్లిం దేశాలు చైనా చర్యను ఎందుకు ఖండించటం లేదు ?
చైనాలో ఒక రాష్ట్రంలోని ముస్లింలను ఇంతగా హింస పెడుతుంటే ఒక్క ముస్లిం దేశమూ ఖండిచదు ఎందుకు అని కొందరు సామజిక మాధ్యమం, మీడియాలో అమాయకంగా అడుగుతున్నట్లు కనిపిస్తారు. వారే వాటికి సమాధానం కూడా చెబుతారు.చైనాతో ఉన్న ఆర్దిక సంబంధాలే కారణం అన్నది అది. మరి అమెరికా ఎందుకు అంతగా గొంతు చించుకుంటున్నది, చైనాతో అందరి కంటే ఎక్కువ వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నది, చైనా దగ్గర పెద్ద మొత్తంలో డాలర్లు అప్పుగా తెచ్చుకున్నదీ అమెరికాయే కదా ? చైనా రాజకీయంగా, ఆర్ధికంగా తనకు నచ్చినట్లు లంగలేదు కనుక బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నది అనుకోవాలా ?
చైనా పదిలక్షల మంది యుఘిర్‌ ముస్లింలను నిర్బంధ శిబిరాల్లో పెట్టింది. దీనికి పశ్చిమ దే శాలూ, వాటి మీడియా చూపే ఆధారాలు లేవు, దగ్గరుండి సరిగ్గా లెక్క పెట్టినట్లు రాస్తున్నారు. కోటి మంది ముస్లింలు ఉన్న ప్రాంతంలో పది లక్షల మందిని నిర్భందిస్తే మిగిలిన వారంతా ఈ పాటికి పొరుగు దేశాలకు శరణార్దులుగా వెళ్లి ఉండాల్సింది. కానీ సరిహద్దుల్లో ఉన్న ఏ ఒక్క ముస్లిం దేశం, మరొక దేశం గానీ తమ దేశానికి అలాంటి సమస్య ఉన్నట్లు ఇంతవరకు ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయలేదు. దాదాపు పదకొండువేల కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు కలిగిన ప్రాంతమది, తప్పించుకోకుండా కట్టడి చేయటం ఏ దేశానికైనా సాధ్యమేనా ? ఉపగ్రహ చిత్రాలంటూ పత్రికల్లో టీవీల్లో కొన్ని భవనాలను చూపుతారు, అవి ఏ భవనాలైనా కావచ్చు. చైనాలో జరుగుతున్నట్లు చెబుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి అమెరికా తప్ప మరొక దేశం ఏదీ చొరవ తీసుకొని ఫిర్యాదు చేసేందుకు ఇంతవరకు ముందుకు రాలేదు.

Image result for pope  china
తామే తుమ్మి తామే తధాస్తు అనుకున్నట్లుగా తాము పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కారణంగా నిర్బంధ శిబిరాలను పెద్ద సంఖ్యలో మూసివేసిందని కూడా పశ్చిమ దేశాల వారు ప్రచారం చేస్తున్నారు. ముందే చెప్పుకున్నట్లుగా దేశ వ్యవస్ధకు అనుగుణ్యంగా వ్యవహరించాల్సిన తీరుతెన్నులను వివరించేందుకు పిల్లలు, యువతకు ప్రభుత్వం కొన్ని పాఠశాలలను ఏర్పాటు చేసింది. వాటిలో ఉగ్రవాదం, దానికి దూరంగా ఉండాల్సిన అవసరం, బతికేందుకు అవసరమైన నైపుణ్యాలలో శిక్షణ వంటివి అన్నీ అక్కడ వున్నాయని చైనా అధికారులే చెబుతున్నారు. వాటిని శత్రువులు నిర్భంద శిబిరాలంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో నక్సల్స్‌గా మారి నేరాలు చేసిన వారిని పట్టిస్తే బహుమతులు ప్రకటించటం లేదా వారే లొంగిపోతే ప్రభుత్వాలు ఆర్దిక సాయం చేసి జనజీవన స్రవంతిలోకి తెచ్చే పధకాలను అమలు జరపటం తెలిసిందే. చైనా నిర్వహిస్తున్న అలాంటి పాఠశాలలను సందర్శించాలని అనేక దేశాల, దౌత్యవేత్తలు, జర్నలిస్టులను ఆహ్వానించింది. వారందరూ చైనా అనుకూలురు అని ఒక నింద. వాటిలో ఖురాన్‌ చదవ నివ్వటం లేదని, పంది మాంసం బలవంతంగా తినిపిస్తున్నారంటూ రంజుగా కథలు చెబుతున్నారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని సామాజిక, మానవతా పూర్వక, సాంస్కృతిక వ్యవహారాల కమిటీ ముందు గతేడాది అక్టోబరు 23 యుఘీర్స్‌పై జరుగుతున్నదాడులంటూ అమెరికా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి 23దేశాలు ఫిర్యాదు చేశాయి,54దేశాలు చైనా తీసుకున్న చర్యలను సమర్ధించాయి. ఇస్లామిక్‌ దేశాలు పాలస్తీనియన్లు, మయన్మార్‌లో రోహింగ్యాల మీద జరుగుతున్న దాడులను ఖండించాయి గానీ, యుఘీర్స్‌ పట్ల కేవలం ఆందోళన మాత్రమే వ్యక్తం చేశాయని అమెరికన్లు కస్సుబుస్సుమంటున్నారు. పాలస్తీనియన్ల మీద జరుగుతున్నదాడులను అమెరికా ఎప్పుడైనా ఖండించిందా, ఖండించకపోగా ఐరాసలో ఇజ్రాయెల్‌ను సమర్దిస్తున్నది. సిరియాపై దాడికి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు పంపిన ఆల్‌ఖైదా ఉగ్రవాద ముఠాలలో యుఘీర్‌లు దొరికిపోయారు. వారిని అక్కడకు పంపిందెవరు చైనా వారా అమెరికన్లా ? ఆప్ఘన్‌ తాలిబాన్ల ముఠాలలో అనేక మంది యుఘీర్లు పట్టుబడ్డారు, వారిని తాలిబాన్లలోకి పంపిందెవరు ? ఈ విషయాలు ముస్లిం దేశాలకు తెలియవా ?చైనాను ఏమని విమర్శిస్తాయి?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాటో కూటమిలో విబేధాలు-తొలిసారిగా చైనా బూచి !

10 Tuesday Dec 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

2019 NATO Summit, Brain death of NATO, China challenges and threats, London Londres, NATO 70th anniversary

Image result for 2019 NATO Summit : first time mentioned china challenge

ఎం కోటేశ్వరరావు
గతవారం, డిసెంబరు 3,4 తేదీలలో లండన్‌లో జరిగిన నాటో కూటమి 70వార్షికోత్సవ సమావేశ ముగింపు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిర్వహించాల్సిన పత్రికా గోష్టిని రద్దు చేసుకున్నారు. ఈ పరిణామాన్ని నాటోలో ఉన్న సంక్షోభానికి నిదర్శనంగా వర్ణిస్తున్నారు. ఎందుకు రద్దు చేశారని విలేకర్లు ప్రశ్నిస్తే సమావేశ వివరాల గురించి రెండు రోజుల పాటు ఎన్నో వివరించారని, అందువలన ట్రంప్‌ కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు కనుక రద్దు చేసినట్లు తెలిపారు. అయితే అసలు విషయం ఏమంటే నాటో సభ్య రాజ్యాల మధ్య ఉన్న విబేధాలు మరింతగా ఎక్కడ బట్టబయలు అవుతాయో అన్న భయంతోనే ట్రంప్‌ కార్యక్రమాన్ని రద్దు చేశారని భావిస్తున్నారు. సమావేశం పూర్తిగా ముగియక ముందే ట్రంప్‌ వెళ్లిపోయారని కూడా వార్తలు వచ్చాయి. తొలిసారిగా నాటో చరిత్రలో చైనాను తొలిసారిగా ఒక బూచిగా చూపేందుకు ప్రయత్నం జరగటం ఈ సమావేశ విశేషం.
ఉత్తర అట్లాంటిక్‌ సంధి సంస్ధ, దీన్నే ‘నాటో’ అంటారు. మొత్తం 29 దేశాలలో అమెరికా,కెనడా మినహా మిగిలిన 27 సభ్య రాజ్యాలూ ఐరోపా ఖండానికి చెందినవే.ఈ సంస్ధ 70వ వార్షికోత్సవం గతవారం లండన్‌లో జరిగింది.రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌ను సోవియట్‌ కమ్యూనిస్టులు మట్టి కరిపించారు. అయినప్పటికీ జర్మనీ లేదా సోవియట్‌ నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు పరస్పరం సహకరించుకోవాలని 1947లో ఫ్రాన్స్‌, బ్రిటన్‌ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మరుసటి ఏడాది దాన్ని బెల్జియం, నెదర్లాండ్స్‌, లక్సెంబర్గ్‌లకు విస్తరించాయి.1949లో ఈ ఐదు దేశాలతో పాటు అమెరికా, కెనడా, ఇటలీ పోర్చుగల్‌, నార్వే, ఐస్‌లాండ్‌,డెన్మార్క్‌లను కూడా కలుపుకొని పన్నెండు దేశాలతో ‘నాటో’ ఏర్పడింది. తరువాత జర్మనీతో సహా మరో 17 దేశాలకు దాన్ని విస్తరించారు. ఇవిగాక దానిలో చేరాలనుకుంటున్న మరో ఐదు దేశాలను నాటో గుర్తించింది. శాంతికోసం కలసి పని చేస్తామనే సాకుతో మరో 21భాగస్వాములు అవుతున్నాయి, సంప్రదింపుల పేరుతో 15 దేశాలు నాటోతో సంబంధాలు కలిగి ఉన్నాయి. ప్రపంచం మొత్తం వంద రూపాయలు మిలిటరీ ఖర్చు చేస్తుంటే నాటో దేశాల వాటా 70గా ఉంది. ఈ సంస్ధ సభ్య రాజ్యాలపై ఇతరులెవరన్నా దాడి చేస్తే ఉమ్మడిగా ఎదుర్కోవాలన్నది లక్ష్యం. ఇంతవరకు అలాంటి దాడులేవీ జరగకపోగా నాటో కూటమే ఇతర దేశాలపై దాడులకు, జోక్యానికి తెగబడింది.

Image result for 2019 NATO Summit : first time mentioned china challenges and threats
ఏడు దశాబ్దాల నాటో కూటమి చరిత్రలో తొలిసారిగా తమ కూటమికి చైనా నుంచి తలెత్తుతున్న సవాళ్లంటూ లండన్‌ శిఖరాగ్ర సభ ప్రకటనలో పేర్కొనటం గమనించాల్సిన ముఖ్యపరిణామం. సంస్ద ప్రధాన కార్యదర్శి జేన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ మాట్లాడుతూ ప్రపంచంలో రక్షణ ఖర్చులో రెండవ పెద్ద దేశంగా చైనా ఉంది, భవిష్యత్‌లో అగ్రరాజ్యాల మధ్య కుదిరే ప్రధాన ఆయుధ నియంత్రణ ఒప్పందాల్లో చైనాను కూడా భాగస్వామిని చేయాలి. దీనర్దం దక్షిణ చైనా సముద్రంలోకి నాటో వెళుతోందని కాదు. చైనా మన సమీపానికి వస్తోన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. కొత్త శత్రువును నాటో సృష్టిస్తోందనటం వాస్తవం కాదు అని స్టోలెన్‌బర్గ్‌ చెప్పారు. ఎటు తిప్పి ఎటు చెప్పినా చైనా సంగతి చూడాలన్న దుష్ట ఆలోచన లండన్‌ సమావేశంలో చోటు చేసుకుంది.
కమ్యూ నిజం వ్యాప్తిని అరికట్టే ప్రధాన లక్ష్యంగా ముందుకు వచ్చిన నాటో కూటమి సోవియట్‌, తూర్పు ఐరోపా దే శాల సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసింది. ఇప్పుడు చైనా మీద కేంద్రీకరించాలని నిర్ణయించింది. అమెరికా-చైనా మధ్య సంబంధాలు దిగజారుతున్న నేపధ్యం, నాటో సారధి అమెరికాయే గనుక దాని ప్రమేయంతోనే తొలిసారిగా లండన్‌ సమావేశంలో చైనా ముప్పు గురించి ప్రస్తావించారు. దీన్నే పరిశీలకులు మరో ప్రచ్చన్న యుద్దంగా వర్ణిస్తున్నారు.ఈ ముఖ్యపరిణామాన్ని ప్రపంచ మీడియా కావాలనే విస్మరించిందా ? కొంత మంది అవుననే అంటుండగా మరి కొందరు నాటో కూటమి విబేధాలకు ఇచ్చిన ప్రాధాన్యత కారణంగా చైనా అంశం మరుగున పడిందని అన్నారు.
నాటోకు ప్రాణం ఉన్నా మెదడు చచ్చిందని ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ అన్నాడు. నాటోది కాదు ఫ్రెంచి అధ్యక్షుడి మెదడే ప్రాణం లేనిదిగా మారిందని టర్కీనేత ఎర్డోగన్‌ తిప్పికొట్టాడు. నాటో నేతల మందుకొట్టే కార్యక్రమంలో కెనడా నేత జస్టిన్‌ ట్రుదెవ్‌ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను పరిహాసాలాడాడు. దానికి ప్రతిగా కెనడాకు రెండు ముఖాలున్నాయంటూ ట్రంప్‌ జవాబిచ్చాడు. అగ్రరాజ్యాల నేతలు ఇలా మీడియాకు వినోదం పంచినప్పటికీ ఎక్కడన్నా బావే కాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా ఆర్ధికంగా తమకు సవాలు విసురుతున్న చైనా విషయాన్ని ప్రస్తావించటంలో మాత్రం ఒకే మాట మీద ఉన్నారు.అయితే చైనా విషయంలో నాటో నేతల్లో ఏకాభిప్రాయం లేదని ప్రకటనలో వినియోగించిన పదజాలం స్పష్టం చేసింది. అందుకే ఇలా పేర్కొన్నది.’ ప్రస్తుత పెరుగుతున్న చైనా ప్రభావం మరియు దాని అంతర్జాతీయ విధానాలు అవకాశాలతో పాటు సవాళ్లను కూడా విసురుతున్నాయి, వాటిని ఒక కూటమిగా ఐక్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు.
రష్యా ఇప్పుడు కమ్యూనిస్టు దేశం కానప్పటికీ పెట్టుబడిదారీ వ్యవస్ధలో మిగతా అగ్రరాజ్యాలకు అది మిలిటరీ, ఇతర సవాళ్లను విసరగలిగే స్ధితిలో ఉంది. ఆ కారణంగానే దాని ముంగిట్లోకి నాటోను విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. దానికి ప్రతిగా చైనాతో భాగస్వామ్యాన్ని అది పెంచుకుంటున్నది. తాజాగా దాదాపు మూడువేల కిలోమీటర్ల పొడవు గ్యాస్‌పైప్‌లైన్‌తో సహా అనేక అంశాలపై రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య ఉన్న నాలుగువేల కిలోమీటర్లకు పైగా ఉన్న సరిహద్దులో ఎలాంటి సమస్యలూ ప్రస్తుతం లేవు. నాటోలోని అనేక దేశాలలో గతంలో సోవియట్‌ యూనియన్‌, ఇతర తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలు- ప్రస్తుత చైనా వ్యవస్ధలను పోల్చుకొని చైనాతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. చైనాతో పోటీ-విబేధాలతో వచ్చే పర్యవసానాలను అంచనావేయటంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ప్రపంచంపై ఆమెరికా ప్రభావం తగ్గుతుండటం కూడా దీనికి ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. తగ్గినప్పటికీ అమెరికా ఇప్పటికీ ప్రపంచ అగ్రరాజ్యమే అన్నది గమనంలో ఉంచుకోవాలి.

Image result for 2019 NATO Summit : first time mentioned china challenge
తాజాగా అసోసియేటెడ్‌ ప్రెస్‌ ఏజన్సీ మూడు సంవత్సరాల ట్రంప్‌ పాలన తీరు తెన్నులపై వివిధ రంగాలకు చెందిన వారితో జరిపిన ఇంటర్వ్యూలలో మారుతున్న ప్రపంచ వ్యవస్ధలో అమెరికా కీలకపాత్ర పరిమితంగా ఉన్నట్లు తేలింది. లండన్‌ నాటో సమావేశాల్లో కూడా పెరుగుతున్న చైనా,తరుగుతున్న అమెరికా ప్రభావం గురించే గుసగుసలు సాగినట్లు మీడియా పేర్కొన్నది. గతంలో సన్నిహిత అనుయాయులుగా ఉన్న ఫ్రాన్స్‌,జర్మనీ, టర్కీ,ఈజిప్టు, పాకిస్ధాన్‌,మెక్సికో వంటి దేశాలు గత మూడు సంవత్సరాలలో మరింత దూరం జరిగాయి. కొన్ని సందర్భాలలో బహిరంగంగానే దానితో విబేధించాయి. దీర్ఘకాలంగా అమెరికాతో స్నేహంగా ఉన్న అనేక దేశాలు ఇటీవలి కాలంలో తరచుగా రష్యా , చైనాలవైపు చూస్తున్నాయి. టర్కీ, పాకిస్ధాన్‌, ఫిలిప్పీన్స్‌, ఈజిప్టు అందుకు ఉదాహరణలు.
ఐరోపాలో అమెరికా పాత్ర బలహీనపడితే రష్యా ప్రభావం అనివార్యంగా పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలి వరకు నాటో ఖర్చులో సింహభాగాన్ని అమెరికా భరించేది. ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత ఇతర సభ్యరాజ్యాలు పెద్ద మొత్తంలో ఖర్చులను భరించే విధంగా వత్తిడి తెచ్చారు. తామెంత కాలం భారాన్ని మోస్తామని ప్రశ్నించారు. అలాంటపుడు అమెరికాతో నిమిత్తం లేకుండా తమ వ్యూహాలను తాము రచించుకుంటామని ఐరోపా దేశాలు చెబుతున్నాయి.నాటో రక్షణ ఖర్చును భరించేందుకు సభ్యదే శాల జిడిపిలో రెండుశాతం కేటాయింపులు జరపాలని అమెరికా వత్తిడి చేస్తోంది. అంత రక్షణ కోసం ఖర్చు పెట్టేబదులు ఆ మొత్తాన్ని సంక్షేమానికి ఖర్చు చేస్తే ఫలితం ఎక్కువ అని అనేక దే శాలు భావిస్తున్నాయి. వాణిజ్య యుద్ధాల నుంచి ఇరాన్‌ అణు సమస్య వరకు ఐరోపా చూడాల్సింది చైనా వైపు మాత్రమే అని ఫ్రెంచి అధ్యక్షుడు మాక్రాన్‌ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఉత్తర సిరియా నుంచి అమెరికా సేనల ఉపసంహరణ గురించి చెబుతూ నాటో మెదడు చచ్చిపోతోందనటానికి సూచిక అని ఎకనమిస్టు పత్రిక ఇంటర్వ్యూ లో చెప్పారు. ఫసిఫిక్‌ భాగస్వామ్య ఒప్పందం నుంచి అమెరికా వెనక్కు తగ్గటం ద్వారా ప్రత్యామ్నాయ స్వేచ్చా వాణిజ్య ఒప్పందంతో ముందుకు పోవటానికి చైనాకు అవకాశం ఇచ్చినట్లయిందని ఐరోపా నిపుణులు భావిస్తున్నారు.
ఒకవైపు అమెరికా ప్రభావం తగ్గుతున్నట్లు భావిస్తుండగా, ఆ దేశ నాయకత్వంలో అసహనం పెరిగిపోతోంది. విమర్శలను సహించలేని స్ధితి. నాటో సమావేశాల సందర్భంగా కోపెన్‌హాగన్‌ నగరంలో జరిగే ఒక కార్యక్రమంలో అమెరికాకు చెందిన నిపుణుడు స్టాన్లీ ఆర్‌ సోలన్‌ ప్రధాన వక్తగా ప్రసంగించాల్సి ఉంది. దానిని అమెరికా, డెన్మార్క్‌లోని ఒక సంస్ధ నిర్వహిస్తోంది. అయితే డెన్మార్క్‌లోని అమెరికా రాయబారి కార్లా శాండ్స్‌ ఒక రోజు ముందుగా వర్తమానం పంపుతూ ఆ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. ట్రంప్‌ విధానాలను గతంలో సోలన్‌ విమర్శించటమే దీనికి కారణంగా పేర్కొన్నారు.
ఏడు దశాబ్దాల క్రితం అంటే రెండవ ప్రపంచ యుద్దం ముగిసేనాటికి అమెరికా తిరుగులేని అగ్రరాజ్యం.1945లో ఏకైక అణు శక్తి, ఆయుధాలను, ప్రపంచ జిడిపిలో సగం వాటా కలిగి ఉంది. ఇప్పుడు అది 15శాతానికి పడిపోయింది. ఉత్తర కొరియా వంటి చిన్న దేశం కూడా నేడు అణుశక్తిని కలిగి ఉంది.నాడు దుర్భరదారిద్య్రంతో ఉన్న చైనా నేడు అమెరికాను సవాలు చేసే స్ధాయికి ఎదుగుతోంది. ఒకనాడు అమెరికా ప్రపంచీకరణ ఛాంపియన్‌గా ఉంది, నేడు దానికి విరుద్దంగా అనేక ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది, ఏక పక్షంగా వైదొలుగుతోంది. ఈ నేపధ్యంలోనే నాటో సభలో ట్రంప్‌ వ్యవహరించిన తీరును చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్‌సిఇపికి బిజెపి అనుకూలం, కమ్యూనిస్టుల వ్యతిరేకత – ఎవరు దేశ భక్తులు !

03 Sunday Nov 2019

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Politics

≈ Leave a comment

Tags

BJP on RCEP, CPI(M) on RCEP, RCEP, RCEP INDIA, RCEP Narendra Modi, Regional Comprehensive Economic Partnership (RCEP)

Image result for rcep
ఎం కోటేశ్వరరావు
‘ ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ‘ ఒప్పందం(ఆర్‌సిఇపి)లో మన దేశం సహేతుకమైన ప్రతిపాదనలను చేసిందని ప్రధాని నరేంద్రమోడీ బ్యాంకాక్‌ పోస్ట్‌ అనే థారులాండ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఒప్పందం అమల్లోకి వస్తే రాగల ప్రతికూల పర్యవసానాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు, వ్యాపారవేత్తలకు అవేమిటో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. గత నెల రోజులుగా దీని గురించి ఎంతో ఉత్కంఠనెలకొన్నది. ఒప్పందంతో ప్రభావితులయ్యే వారితో బిజెపి చర్చించినట్లు మీడియాలో వార్తలు రాయించుకోవటం తప్ప ఏమి చర్చించారు, సర్కార్‌కు ఏమి సూచించారో తెలియదు. మరోవైపు కేంద్రం ఏమి చెబుతుందా అని ఎదురు చూసిన వారికి ఎలాంటి సమాచారం అందించలేదు. ప్రభావితులయ్యే తరగతులతో అధికారిక చర్చ అసలే లేదు. సోమవారం నాడు సదరు ఒప్పందం మీద సంతకాలు జరగాల్సి ఉంది. ఒక వేళ మన దేశానికి అంగీకారం కానట్లయితే ప్రదాని నరేంద్రమోడీ బ్యాంకాక్‌ పర్యటన రద్దయి ఉండేది.ఆయన అక్కడకు చేరుకొని ఎర్రతివాచీ స్వాగతం పొందారు. రెండవ తేదీ నుంచి నాలుగవ తేదీ వరకు ఆసియన్‌ దేశాల శిఖరాగ్ర సభ, ఆర్‌సిఇపి శిఖరాగ్ర సమావేశం జరగనున్నాయి. అసాధారణ పరిణామాలు జరిగితే తప్ప సంతకాలు జరగటం ఖాయంగా కనిపిస్తోంది.
పారదర్శకత గురించి కొందరు ఎంత ఎక్కువగా చెబుతారో అంత ఎక్కువగా తెరవెనుక పనులు చేస్తారనేది అందరికీ తెలిసిన సత్యం. అలాంటి వారు చేసేది చెప్పరు-చెప్పింది చేయరు. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేస్తామని బిజెపి ఎన్నడూ చెప్పకుండా ఆ పని చేయటం అందుకు నిదర్శనం. ఆర్‌సిఇపి ఒప్పందం విషయంలో కూడా నరేంద్రమోడీ సర్కార్‌ అదే పని చేస్తోందా ? 2017లో మోడీ ఏర్పాటు చేసిన నీతి అయోగ్‌ పత్రం కూడా ఒప్పందం మీద హెచ్చరికలు చేసింది. వ్యతిరేకతను వ్యక్తం చేసింది. అలాంటి దాని గురించి పార్లమెంట్‌లో ఎలాంటి చర్చ జరపలేదు. నిజానికి ఈ ఒప్పందంలోని అంశాలు పెద్ద నోట్ల రద్దు వంటి రహస్యమైనవేమీ కాదు.ఏ ఏ అంశాలను అంగీకరిస్తే ఎలా నష్టం జరుగనుందో ఇప్పటికే చర్చ జరిగింది. ఏఏ వస్తువుల మీద మన దేశం పన్నులను ఎంతమేరకు తగ్గిస్తుంది, వేటిని మినహాయిస్తుంది అనేది వెల్లడి కావాల్సి ఉంది. వీటిి మీద ప్రభుత్వం తన వైఖరిని చెప్పలేదు, రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోలేదు. ఒప్పందాన్ని మన దేశం అంగీకరించరాదని కోరుతూ 250 రైతు సంఘాలతో కూడిన ఐక్యవేదిక ఆందోళనకు పిలుపు నిచ్చింది. సోమవారం నాడు ప్రదర్శనలు జరగనున్నాయి. సిపిఎం దీనికి మద్దతు ప్రకటించింది. సంతకాలు చేయరాదని డిమాండ్‌ చేసింది. ఆరెస్సస్‌ సంస్ధ స్వదేశీ జాగరణ మంచ్‌ కూడా దీన్ని వ్యతిరేకిస్తోంది. అయినా ఏ అంశాలను కేంద్రం అంగీకరించిందో, వేటిని వ్యతిరేకించిందో జనానికి ఇంతవరకు తెలియదు. అంగీకరించిన వాటితో ఎలా లబ్ది చేకూరనుందో, ఎలాంటి ప్రతికూల ప్రభావాలు పడతాయో, వాటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏమి చేయనుందో జనానికి చెప్పాలా లేదా ?

Image result for rcep
పదహారు దేశాలు, 360కోట్ల జనాభా వున్న ప్రాంతాలతో కూడిన ఈ ఒప్పందం ప్రపంచంలో అతి పెద్ద స్వేచ్చావాణిజ్య అవగాహనగా చరిత్రకెక్కనుంది.2012లో ప్రారంభమైన ఈ చర్చలు భారత్‌ సంతకం చేస్తే సోమవారం నాటితో మరో అధ్యాయానికి నాంది పలుకుతాయి. మన దేశానికి సంబంధించి రాష్ట్రాల పరిధిలోని వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్న ఈ ఒప్పందం గురించి కేంద్రం రాష్ట్రాలను సంప్రదించకపోవటం రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులను బాహాటంగా ఉల్లంఘించటంతప్ప మరేమీ కాదని ప్రముఖ ఆర్ధికవేత్త ప్రభాత్‌ పట్నాయక్‌ అన్నారు. ఒప్పందంపై సంతకం చేయటానికి బదులు దాన్ని బహిర్గత పరచాలని, రైతులతో సంప్రదింపులు జరపాలని రైతు సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ డిమాండ్‌ చేసింది.ఈ ఒప్పందం అమల్లోకి వస్తే కేరళ తోటల రైతాంగం అందరికంటే ఎక్కువగా నష్టపోనుంది. ఈ కారణంగానే అక్కడి ఎల్‌డిఎఫ్‌ సర్కార్‌ వ్యతిరేకత తెలిపింది. ఇప్పటికే వియత్నాం నుంచి శ్రీలంక ద్వారా వస్తున్న మిరియాల కారణంగా వాటి ధరలు దారుణంగా పడిపోయాయి. కొబ్బరి, రబ్బరు, పామ్‌ ఆయిల్‌, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు తదితర పంటలకు తీవ్రమైన పోటీ ఎదురు కానుంది. ఇప్పటి వరకు అనేక దేశాలు చివరికి ఐరోపా యూనియన్‌-అమెరికా మధ్య స్వేచ్చావాణిజ్య ఒప్పందాల నుంచి కూడా వ్యవసాయాన్ని మినహాయించారు.

Image result for rcep
దేశీయ ఉత్పత్తిదారుల సామర్ధ్యాలను పెంచకుండా ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తే ప్రతికూల ప్రభావాలు పడతాని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌(ఎస్‌బిఐ) పరిశోధన నివేదిక కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.2018-19లో ఆర్‌సిఇపిలోని పదకొండు దేశాలతో మనకు వాణిజ్య లోటు 107.28 బిలియన్‌ డాలర్లు ఉంది. ఇతర దేశాలతో కూడా కలిపి చూస్తే మొత్తంగా మన వాణిజ్య లోటు 184బిలియన్‌ డాలర్లు. ఆర్‌సిఇపి దేశాలకు మన ఎగుమతులు 21శాతం జరగ్గా మన దిగుమతులు ఈ దేశాల నుంచి 34శాతం వున్నాయి. మన వాణిజ్యం వ్యవసాయం, సంబంధిత ఉత్పత్తులు, దుస్తులు, ఆభరణాల వంటి వాటిలో మాత్రమే మిగులు ఉంది. మొత్తం వాణిజ్యంతో పోలిస్తే అది నామమాత్రమే. ఈ ఒప్పందంలో మన దేశం భాగస్వామి అయితే ఈ మిగులు కూడా హరించుకుపోయి లోటు ఇంకా పెరుగుతుందని ఎస్‌బిఐ నివేదిక చెప్పింది.
సంప్రదింపుల్లో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా విజయం సాధిస్తే మనం పాల ఉత్పత్తుల దిగుమతుల మీద పన్నులు తగ్గిస్తే అది మరింత నష్టదాయకమని కూడా ఎస్‌బిఐ హెచ్చరించింది. స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను మనం ఉపయోగించుకోవటం 25శాతానికి లోపుగానే ఉందని కూడా పేర్కొన్నది. అయితే ఒప్పందంలో భాగస్వామి కాకపోయినా మన దేశానికి నష్టమే అని ఎగుమతులు కష్టమౌతాయని కూడా తెలిపింది.
ఆర్ధికవేత్త సూర్జిత్‌ ఎస్‌ భల్లా నాయకత్వంలోని హైలెవెల్‌ అడ్వయిజరీ గ్రూప్‌(హెచ్‌ఎల్‌ఏజి) బృందం ఆర్‌సిఇపి ఒప్పందం మీద సంతకాలు చేయాలని సూచించింది. స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల గురించి నిరంతరం తెలియ చేస్తూ వాటిని ఉపయోగించుకోవాలని కోరింది. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వశాఖ కోరిక మేర తన సిఫార్సులు, ఇతర అంశాల గురించి ఈనివేదికను రూపొందించారు. అయితే ఇది అందచేసే సమయానికే మన అధికారులు, మంత్రులు బ్యాంకాక్‌ తరలివెళ్లారు. ఒప్పందం మీద సంతకాలకు ఒక సాకుగా దీన్ని ఉపయోగించుకోనున్నట్లు కనిపిస్తోంది.
1991లో ప్రారంభమైన నూతన ఆర్ధిక విధానాల కారణంగా మన వ్యవసాయ రంగంలో తలెత్తిన సంక్షోభం లక్షలాది మంది రైతుల బలవన్మరణాలకు కారణాలలో ప్రధానమైనది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రంగంలో తలెత్తిన సమస్యలు ఇంకా అపరిషతృంగానే ఉన్నాయి. రైతుల్లో మరింత ఆగ్రహం తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ యోజన పేరుతో ఏటా ఆరువేల రూపాయల నగదు సాయాన్ని అందచేస్తున్నది. ఇదేమీ శాశ్వత పధకం కాదు. ఆర్‌సిఇపి ఒప్పందం అమలులోకి వస్తే మన వ్యవసాయ రంగ సంక్షోభం మరింత తీవ్రం కావటం అనివార్యం.అది గ్రామీణ ప్రాంతాలలో కొనుగోలు శక్తిని మరింత తీవ్రంగా ప్రభావితం చేయనుంది.
ఈ ఒప్పందానికి తెరలేపింది కాంగ్రెస్‌ అయితే బిజెపి తెర దించనుంది. రెండు పార్టీలూ దీన్నుంచి రాజకీయ లబ్దిపొందేందుకు చూస్తున్నాయి. అధికారంలో ఉండగా ఒప్పందానికి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్‌ ఇప్పుడు వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంది. నవంబరు ఐదు నుంచి ప్రదర్శనలకు పిలుపు ఇచ్చింది. అప్పుడేం చేశారని బిజెపి ఎద్దేవా చేస్తోంది తప్ప తన వైఖరి ఏమిటో చెప్పదు. ప్రతిపక్షంలో ఉండగా, ఇప్పుడు కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ స్వదేశీ జాగరణ మంచ్‌ ఈ ఒప్పందానికి వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నది తప్ప బిజెపిని ఒప్పించలేకపోయింది. ఈ ఒప్పందాన్ని అందరూ వ్యతిరేకించటం లేదమ్మా అంటూ బిజెపి నేతలు ఇతరుల మీద నెపాన్ని నెడుతున్నారు. మరీ ఎక్కువ లొంగిపోవద్దబ్బా అని ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. మొత్తం మీద అసలు విషయం చెప్పకుండా గత నెల రోజులుగా కేంద్ర పాలకులు, అధికారపక్షం మీడియాకు లీకులతో కాలం గడిపింది.
ఇక మిగతా దేశాల విషయానికి వస్తే ఒక వేళ భారత్‌ సంతకం చేయకున్నా మనం ముందుకు పోవాల్సిందే అని మలేషియా ప్రధాని మహతిర్‌ మహమ్మద్‌ జూన్‌లోనే వ్యాఖ్యానించాడు. గణనీయంగా దిగుమతి పన్నులు ఉన్నప్పటికీ ఇప్పటికే ఇండోనేషియా, మలేషియాల నుంచి వస్తున్న పామాయిల్‌ మన దుకాణాల్లో నిండిపోతోంది. ఈ ఒప్పందంలో చేరితే పన్నులను రద్దు చేయాల్సి ఉంటుంది. వినియోగదారులకు తక్కువ ధరలకు లభించవచ్చు, వ్యాపారులకు లాభాల పంట పండవచ్చుగానీ మన రైతాంగ పరిస్ధితి, మన దేశం నుంచి తరలిపోయే డబ్బు సంగతేమిటి? న్యూజిలాండ్‌,ఆస్ట్రేలియాల నుంచి వచ్చే పాల ఉత్పత్తులతో పాల రైతాంగ పరిస్ధితి అగమ్యగోచరం. ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో పంట, ఉత్పత్తుల రైతాంగం ప్రభావితం అవుతారు. బిజెపి చెప్పే గోమాత పవిత్రత సంగతి ఎలా ఉన్నా ఆవుపాలతో రాజస్ధాన్‌లో ఇంకా అనేక ప్రాంతాలలో అనేక కుటుంబాలు తమ అవసరాలు తీర్చుకుంటున్నాయి. పది కోట్ల మంది రైతులకు పాల రాబడి ఒక వనరుగా ఉన్నట్లు అంచనా.
ఇప్పుడు నరేంద్రమోడీకి మరో పెద్ద సమస్య వచ్చింది. ఆయన అంతర్జాతీయ నాయకుడని, అనేక అంశాలను ప్రభావితం చేస్తున్నారని, పెద్ద ఆర్ధిక నిపుణుడన్నట్లుగా ఇంతకాలం ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రపంచ జనాభాలో సగానికి ప్రాతినిధ్యం వహించే దేశాల ఒప్పందంపై సంతకం చేయకపోతే ఆయన ప్రతిష్టకు దెబ్బ అని వ్యాఖ్యానిస్తున్నవారు లేకపోలేదు. చేస్తే దేశీయంగా రైతాంగం, ఇతర తరగతుల ప్రజానీకం నుంచి వేరుపడిపోతే అసలుకే మోసం వస్తుంది అన్నది చెప్పుకోలేని సంశయం. ఒప్పందం మీద సంతకం చేస్తే చైనా, ఇతర దేశాల నుంచి ఒక్క వ్యవసాయ ఉత్పత్తులే కాదు, అన్ని రకాల వస్తువులు వెల్లువలా మన మార్కెట్‌ను ముంచెత్తుతాయి. పోనీ ఈ ఒప్పందానికి దూరంగా అమెరికా, ఇతర ఐరోపా దేశాలతో చేతులు కలిపితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని చూస్తే అవన్నీ కూడా మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌- మాయింటి కొస్తే మాకేం తెస్తావ్‌ అనే రకాలు తప్ప మనకు సాయపడేవి కాదు. ఎగుమతి ఆధారిత అభివృద్ధి అనే ఒక దివాలా కోరు ఆర్ధిక విధానాన్ని అనుసరిస్తున్న (మేకిన్‌ ఇండియా అంటే అదే) మోడీ సర్కార్‌ ఈ ఒప్పందంలో చేరకపోతే మన ఎగుమతులు ఇంకా పడిపోయేందుకు దోహదం చేసినట్లు అవుతుంది. ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్ధను రూపొందిస్తా అని చెప్పిన గొప్పల గురించి జనం అడిగితే పరిస్ధితి ఏమిటి అనే మనో వ్యాధి పట్టుకుంది. ఒప్పందంలో చేరక ముందే మన ఆర్ధిక వృద్ధి రేటు ఐదు శాతానికి పడిపోయింది. ఇక విదేశాల నుంచి వస్తు దిగుమతులు మరింత పెరిగితే మన పరిశ్రమలు, వ్యవసాయం మూతపడుతుంది. ఇప్పటికే 8.5శాతానికి చేరిన నిరుద్యోగం మరింత పెరుగుతుంది.

Image result for bjp cpim
ఇప్పటి వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రేణులు చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకతను ఎంతగా రెచ్చగొట్టాలో అంతగా చేయాల్సింది చేశాయి. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ఆర్‌సిఇపిలో చైనాదే ప్రధాన పాత్ర. చైనా వస్తువులను బహిష్కరించండి అంటూ ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నది వారే. కనీసం చైనా నుంచి వచ్చే సగం వస్తువులనైనా అడ్డుకోవాలన్నది కొందరి వత్తిడి.అలాంటి చైనాతో కలసి ఒప్పందం చేసుకోవటం ఏమిటన్నది వారికి మింగుడుపడటం లేదు. ఈ విషయంలో నరేంద్రమోడీ తక్కువేమీ తినలేదు. వాణిజ్య, పారిశ్రామికవేత్తల వత్తిడికి లంగి తన కుర్చీని కాపాడుకొనేందుకు చైనాతో సయోధ్యకు ముందుకు పోక తప్పని స్ధితి.మన దేశంలోని కమ్యూనిస్టులు చైనా అనుకూలురనే ప్రచారం చేస్తున్నది కూడా కాషాయ దళాలే అన్నది తెలిసిందే. ఇప్పుడు ఆ కమ్యూనిస్టులు ఈ ఒప్పందంపై సంతకాలు చేయరాదని డిమాండ్‌ చేస్తున్నారు. బిజెపి దేశభక్తి, స్వదేశీ అనుమానంలో పడింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్‌సిఇపి ఒప్పందం-మోడీ సర్కార్‌ 2024 ఓట్ల లెక్కలు !

19 Saturday Oct 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

ASEAN, free trade agreement, RCEP, RCEP INDIA, Regional Comprehensive Economic Partnership

Image result for RCEPఎం కోటేశ్వరరావు
ఇప్పటి వరకు వెలువడిన సూచనలు, ధోరణులను బట్టి ‘ ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యం(ఆర్‌సిఇపి)’ ఒప్పందంపై మన దేశం సంతకాలు చేసే అంశం చివరి నిమిషం వరకు ఉత్కంఠను కలిగించే అవకాశం వుంది. నవంబరు నాలుగవ తేదీన బ్యాంకాక్‌ సమావేశంలో సంతకాలు జరగనున్నాయి. దానికి మన ప్రధాని నరేంద్రమోడీ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం పునరాలోచన గురించి ఇంతవరకు ఎలాంటి వార్తలు లేవు. మన ఎగుమతిదార్లకు తగినన్ని రాయితీలు సంపాదించేందుకు ప్రయత్నించి ఒప్పందం మీద సంతకం చేయాలన్న వైఖరితో మన కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. ఆమేరకు కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఒప్పందం మన ఆర్ధిక వ్యవస్ధను మరింతగా దెబ్బతీస్తుందనే అభిప్రాయాల పూర్వరంగంలో మోడీ సర్కార్‌ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పటికీ స్పష్టం కాలేదు. అధికారిక అభిప్రాయాలు వెల్లడి కాలేదు.
ఎగుమతి, దిగుమతి వాణిజ్య లాబీయిస్టులు ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఉండి తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. మరోవైపు ఈ ఒప్పందం షరతులు అమలు జరిగితే ఇప్పటికే మన దేశ వ్యవసాయ, అనుబంధ రంగాలలో నెలకొన్న సంక్షోభం లేదా తీవ్ర సమస్యలు మరింతగా పెరిగే అవకాశం వుంది కనుక ఒప్పందంపై సంతకాలు చేయరాదని రైతు సంఘాలు మరోవైపున డిమాండ్‌ చేస్తున్నాయి.
ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ)లో భాగస్వాములు అయినప్పటికీ గత దశాబ్దకాలంగా అనేక దేశాలు రక్షణాత్మక చర్యలకు పూనుకుంటున్నాయి. అనేక దేశాలు ద్విపక్ష ఒప్పందాలు, ప్రాంతీయ ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దానిలో భాగమే ఆర్‌సిఇపి. గత ఐదు సంవత్సరాలుగా నరేంద్రమోడీ సర్కార్‌ ప్రచార ఆర్భాటం తప్ప మన దేశం నుంచి ఎగుమతులను పెంచటంలో ఘోరంగా విఫలమైంది. ఆర్‌సిఇపి విషయానికి వస్తే దీనిలో ఆగేయ ఆసియాలోని బ్రూనీ, కంపూచియా, ఇండోనేషియా, లావోస్‌, మలేసియా, మయన్మార్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థాయ లాండ్‌, వియత్నాం(వీటిని ఆసియన్‌ దేశాలని కూడా అంటారు)లతో పాటు చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలతో కూడిన కూటమి మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందం గురించి 2012 నవంబరు నుంచి చర్చలు జరుగుతున్నాయి.

ఈ కూటమి ఆసియన్‌ దేశాల 2012 సమావేశంలో పురుడుపోసుకుంది.గత కొన్ని సంవత్సరాలుగా సంప్రదింపులు జరుగుతున్నాయి. తుది ఒప్పంద దశకు చేరుకుంది. పదహారు దేశాలలో 340 కోట్ల మంది జనాభా ఉన్నారు.2017 వివరాల ప్రకారం ప్రపంచ జిడిపిలో 39శాతం అంటే 49.5 లక్షల కోట్ల డాలర్ల వాటా వుంది. ప్రపంచంలో అతి పెద్ద వాణిజ్య కూటమి కానుంది.2050 నాటికి ఈ దేశాల జిడిపి 250లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. అందువలన ఇంత పెద్ద కూటమికి దూరంగా ఉండేందుకు మన దేశంలోని బడా కార్పొరేట్‌ సంస్ధలు ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించవు. గత అనుభవాలను గమనంలో వుంచుకొని రైతు సంఘాలు భయపడుతున్నట్లుగా రైతాంగాన్ని బలిపెట్టి అయినా వాణిజ్య, పారిశ్రామిక, సేవారంగాల కార్పొరేట్లు తమ ప్రయోజనాలకోసం కృషి చేస్తాయని వేరే చెప్పనవసరం లేదు.చైనా నుంచి మరిన్ని రాయితీలను రాబట్టాలని అవి కేంద్రం మీద వత్తిడి చేస్తున్నాయి.

ఇక మన దేశం విషయానికి వస్తే ఈ ఒప్పందంలో భాగస్వామి అయితే సంభవించే నష్టాలేమిటి, కలిగే లాభాలేమిటి అన్న చర్చ గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది. ఆసియన్‌ దేశాలకు మన దేశం నుంచి 2018-19లో 9.56శాతం పెరిగి 37.47 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. అయితే ఇదే సమయంలో దిగుమతులు 25.87శాతం పెరిగి 59.32 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటం ఏ దేశానికీ క్షేమకరం కాదు. అందువలన వాణిజ్య మిగులు సంగతి తరువాత లోటును తగ్గించుకొనేందుకే మన ప్రయత్నాలన్నీ పరిమితం అవుతున్నాయి. సంప్రదింపుల ప్రారంభంలో అంటే 2010-11లో ఆసియన్‌ దేశాలతో మన వాణిజ్య లోటు 12 బిలియన్‌ డాలర్లు వుంటే 2018-19 నాటికి 22 బిలియన్లకు పెరిగింది.

ఆసియన్‌ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(ఆర్‌సిఇపి) విషయానికి వస్తే మన దేశం 74శాతం వరకు పన్నులను రద్దు చేసేందుకు అంగీకరించగా ఇండోనేషియా 50, వియత్నాం 70శాతం మాత్రమే అంగీకరించాయి. ఇది మన కార్పొరేట్‌లను కలవర పెడుతున్నది.కనీసం చైనా కంటే పదిశాతం మేరకు అయినా మనకు అనుకూలంగా వుండాలని కోరుతున్నాయి. ఇతర దేశాలతో దాదాపు ఒప్పందం తుది దశలో ఉండగా చైనాతో ఇంకా ఆదశకు రాలేదు. ఇటీవల చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ పర్యటన సందర్భంగా ఈ అంశం మంత్రుల స్ధాయిలో చర్చించాలని అనుకున్నారు. మన దేశం కూటమిలో భాగస్వామి కాకుండా ప్రయోజనం లేదని భావించిన దేశాలు సంప్రదింపులకు గడువును పెంచాయి.

ఇటీవల నీతి ఆయోగ్‌ వివిధ కూటములు, దేశాలతో మన ఎగుమతులు, దిగుమతుల గురించి చేసిన సమీక్షలో ఒక్క శ్రీలంక విషయంలో తప్ప మిగిలిన అన్నింటి విషయంలో నష్టం తప్ప లాభం లేదని తేలింది. రెండు వైపులా జరిగే వాణిజ్యంలో 75శాతం మేరకు ఆర్‌సిఇపి స్వేచ్చా వాణిజ్య ఒప్పంద పరిధిలోకి వస్తాయి. మొత్తం పన్నెండువేల ఉత్పత్తులకు సంబంధించి తొమ్మిదివేల వరకు పన్నులను తగ్గించాల్సి వుంటుంది. పదమూడు వందల ఉత్పత్తులు పన్నుల నుంచి మినహాయింపు పొందిన జాబితాలో , 1800 వస్తువులు ఆచితూచి వ్యవహరించాల్సిన జాబితాలో ఉన్నాయి. మన దేశం మినహాయింపు జాబితాలో పదిశాతం వస్తువులను చేర్చగా అనేక దేశాలు అంతకంటే ఎక్కువ వస్తువులనే తమ జాబితాల్లో చేర్చాయి.

మూడు సంవత్సరాల క్రితం మతిమాలిన పెద్ద నోట్ల రద్దు, తగినంత కసరత్తు లేకుండా జిఎస్‌టి ప్రవేశపెట్టటం, ఇతర కారణాలతో దేశం ప్రస్తుతం రోజురోజుకూ మాంద్యంలోకి కూరుకుపోతోంది. ఈనేపధ్యంలో మోడీ సర్కార్‌ రాజకీయంగా తన లాభనష్టాలను లెక్కవేసుకుంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఒప్పందం వ్యవసాయంతో పాటు అనుబంధ పాడి, సేవా రంగాలను దెబ్బతీస్తుందని రైతు సంఘాలు, ఇతర సంస్ధలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాయి. నవంబరులో ఆర్‌సిఇపి ఒప్పందం కుదిరితే దాని అంశాలు 2021-22 నాటికి అమల్లోకి వస్తాయి. వాటి ప్రభావం 2023-24లో కనిపిస్తుంది. ఒక వేళ అది ప్రతికూలమైతే ఆ ఏడాది జరిగే ఎన్నికల్లో తమ భవిష్యత్‌ ఏమిటన్నది బిజెపి తేల్చుకోలేకపోతున్నది.

Image result for RCEP

బిజెపి ప్రతిపక్షంలో ఉండగా ఇలాంటి ఒప్పందాలను అది వ్యతిరేకించింది, ముఖ్యంగా స్వదేశీ జాగరణ మంచ్‌ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన సంస్ధ ఇప్పటికీ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల కారణంగా 2018లో మన దేశం 530 కోట్ల డాలర్ల మేరకు ఆదాయాన్ని కోల్పోయింది. ఇప్పటికే అనేక దేశాల మార్కెట్లు మనకు అందుబాటులో వున్నాయని, ఈ ఒప్పందం ద్వారా కొత్తగా సాధించేదేమిటి అన్న ప్రశ్నకు సరైన సమాధానం రావటం లేదు. పాడి, పామోలిన్‌ రైతాంగం తీవ్రంగా నష్టపోతారని బయటకు వచ్చిన పత్రాల సమాచారం వెల్లడిస్తున్నది.

ఆలిండియా కిసాన్‌సభ (ఎఐకెఎస్‌) రాగల పర్యవసానాల గురించి ఒక ప్రకటనలో రైతాంగాన్ని హెచ్చరించింది. దేశంలో పది కోట్ల రైతు కుటుంబాలకు పాడి పరిశ్రమ జీవనాధారంగా వుందని, పాలధరలో 71శాతం రైతాంగానికి చేరుతోందని పేర్కొన్నది. ప్రస్తుతం పాల వుత్పత్తుల దిగుమతులపై విధిస్తున్న 64శాతం పన్ను రద్దు చేస్తే దిగుమతులతో పాల ధర పతనం అవుతుందని హెచ్చరించింది. న్యూజిలాండ్‌ తన పాలవుత్పత్తుల్లో 93శాతం ఎగుమతులు చేస్తోందని, మన దేశంలో పాలపొడి కిలో 260 రూపాయల వరకు వుండగా న్యూజిలాండ్‌ నుంచి 160-170కే లభిస్తుందని కిసాన్‌ సభ పేర్కొన్నది.దేశంలోని వ్యవసాయ రంగంలో 85శాతం మంది రైతులు చిన్న సన్నకారేనని ఆర్‌సిఇపి ఒప్పందం వారి పాలిట శాపం అవుతుందని హెచ్చరించింది. ఇప్పటికే ఆటోమొబైల్‌ తదితర అన్ని రంగాలూ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తరువాత విదేశాల నుంచి దిగుమతి అయ్యే చౌకధరల వుత్పత్తులతో సమస్య మరింత తీవ్రం కావటం అనివార్యమని ఆయా రంగాల నిపుణులు ఇ్పటికే హెచ్చరించారు.

Image result for RCEP

ఈనెల 11,12 తేదీల్లో బ్యాంకాక్‌లో జరిగిన ఆర్‌సిఇపి మంత్రుల సమావేశంలో మన దేశం లేవనెత్తిన అంశాల కారణంగా ఎలాంటి ప్రకటన చేయకుండానే సమావేశం ముగిసింది. ముందే చెప్పుకున్నట్లు గతంలో కుదిరిన అవగాహన ప్రకారం ఒప్పందం అమలు జరిగితే సంభవించే ప్రతికూల ప్రభావంతో 2024 ఎన్నికల్లో దెబ్బతగులుతుందనే అంచనాతో ఒప్పందం అమలు సంవత్సరాన్ని 2014కు బదులు 2019గా మార్చాలని మన వాణిజ్య మంత్రి ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. గత రెండు సంవత్సరాల్లో మన పరిశ్రమల పరిరక్షణ చర్యల్లో భాగంగా సగటున దిగుమతులపై పన్నును 13 నుంచి 17శాతం వరకు పెంచారు. ఇప్పుడు ఒప్పందంపై సంతకాలు చేస్తే వెంటనే పన్ను తగ్గించాల్సి వుంటుంది. వివిధ తరగతుల నుంచి వస్తున్న వత్తిళ్ల పూర్వరంగంలో మన దేశం గతంలో లేని కొన్ని కొత్త అంశాలను ఒప్పందంలో చేర్చాలని ప్రతిపాదించింది. దీని వెనుక రెండు వాదనలు వినిపిస్తున్నాయి. తాము చివరి వరకు మన ప్రయోజనాల రక్షణకే ప్రయత్నించామని, విధిలేని స్ధితిలో సంతకాలు చేశామని చెప్పుకొనేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇదే సమయంలో మొత్తంగా మన ఆర్దిక వ్యవస్ధకే ముప్పు వస్తుందని భావిస్తే తమ షరతులకు అంగీకరించలేదనే మిషతో ఒప్పందానికి దూరంగా వుండవచ్చు. ఈ నేపధ్యంలోనే భారత్‌ లేవనెత్తిన అంశాలపై మిగతా సభ్య దేశాలను అంగీకరింపచేసే బాధ్యత భారతే తీసుకోవాలని కొన్ని దేశాలు ఈనెల రెండవ వారంలో జరిగిన సమావేశంలో ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి.ఇంకా పక్షం రోజులు వున్నందున హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలు ముగిసిన తరువాత కేంద్ర సర్కార్‌ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈనెల పది నుంచి 20వ తేదీ వరకు ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధ స్వదేశీ జాగరణ మంచ్‌ నిరసన కార్యక్రమాలను ప్రకటించింది. అయితే వాటికి పెద్దగా స్పందన వున్నట్లు మీడియాలో మనకు కనపించదు. పైన చెప్పుకున్నట్లు ఓట్ల లెక్కలు కేంద్ర పాలకులను ప్రభావితం చేస్తాయా? కార్పొరేట్ల వత్తిడిది పై చేయి అవుతుందా చూడాల్సి వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గ్జీ జింపింగ్‌ మహాబలిపుర పర్యటన-మోడీ మితి మీరిన విశ్వాసం ?

12 Saturday Oct 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

China-India informal summit, Mamallapuram informal summit, narendra modi overconfidence, Narendra Modi with Xi Jinping in Mamallapuram, Xi Jinping mahabalipuram visit

Image result for China's Xi Jinping mahabalipuram visit : narendra modi overconfidence

ఎం కోటేశ్వరరావు
అంతర్జాతీయంగా ప్రధాని నరేంద్రమోడీ నాయక (ప్రజా) రంజకత్వం సహజంగా పెరిగిందా లేక కృత్రిమంగా పెంచారా అని తర్జన భర్జనలు పడేవారున్నారు. ఏది జరిగినప్పటకీ పెరిగిందనే ఎక్కువ మంది భావిస్తున్నారు. ఏకీభవించటమా లేదా అన్నది ఎవరిష్టం వారిదే.
ఎక్కువ మంది భావిస్తున్నదాని ప్రకారం మోడీ-ప్రపంచ నేతలు ఎవరి అవసరాల కోసం వారు పరస్పరం సహకరించుకుంటున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ హౌడీ మోడీ కార్యక్రమం సందర్భంగా హూస్టన్‌ స్డేడియంలో జరిగిన సభ. దానిలో మోడీ గారు ట్రంప్‌కు ఎన్నికల ప్రచారం చేశారు. దానికి ప్రతిగా మోడీ దేశపిత అని ట్రంప్‌ బదులు తీర్చుకున్నారు. హూస్టన్‌ అభిమానుల సంబరం అంబరాన్ని అంటితే, వెలుపల నిరసనకారుల అసమ్మతి కూడా వెల్లడైంది. అయితే ‘నిష్పాక్షికం’ అని చెప్పుకొనే మీడియా ఆనంద సమయంలో అసమ్మతి వినిపించటం, కనిపించటం అశుభం అని కాబోలు స్డేడియం లోపలి హేలనే చూపింది తప్ప వెలుపలి గోలను పట్టించుకోలేదు.
చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ మహాబలిపుర ఇష్టాగోష్టి సమావేశానికి రాక సందర్భంగా చైనాను మనం ఎలా కట్టడి చేయవచ్చో కథలతో పాటు మనకు నమ్మదగ్గ మిత్ర దేశం కాదని మీడియా హితవు చెప్పి కాషాయ దళాల ముందు తన దేశభక్తిని ప్రదర్శించుకుంది. జింపింగ్‌తో కలసి మహాబలిపుర సందర్శన చేస్తే వచ్చే ప్రచారంలో మోడీ వాటా సగమే. అందువలన పైచేయి సాధించేందుకు శనివారం పొద్దున్నే లేచి ఒక సంచి భుజాన వేసుకొని మహాబలిపురం బీచ్‌లో పడివున్న ప్లాస్టిక్‌ సీసాలను సేకరించి స్వచ్చ భారత్‌ గురించి చెప్పటమే కాదు ఆచరించి చూపిన ప్రధానిగా ప్రత్యేక ప్రచారాన్ని పొందారు.

ఇద్దరు మహానేతలు సందర్శనకు వచ్చే సమయంలో బీచ్‌లో వ్యర్ధాలను కూడా తొలగించరా ! ఇదేమి మర్యాద ? ప్రపంచ అగ్రనేతలు వచ్చే సమయాల్లో ఎంతో ముందుగానే ఆ ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకొని అణువణువూ గాలించి ఎలాంటి పేలుడు పదార్ధాలు సముద్ర తీరంలో లేవని నిర్ధారించుకుంటారు కదా ! పర్యటన ముగిసే వరకు సాధారణ పర్యాటకులను రానివ్వరు కదా ! అలాంటపుడు వ్యర్ధాలు వేయటాన్ని సిబ్బంది ఎలా అనుమతించారు? ఎలా వదలివేశారు అని అంతర్జాతీయ మీడియాలో కాస్త బుర్రవున్నవారు ప్రశ్నిస్తే సమాధానం ఏమిటి ? ఇలాంటి నాటకీయ చర్యలతో మోడీ ప్రతిష్ట పెరుగుతుందా ?

Image result for narendra modi swachh bharat mahabalipuram
రోజూ ఎందరో యువతీ యువకులు సంచులను భుజాన వేసుకొని వీధుల్లో చెత్తను ఏరుకుంటూ పొట్టపోసుకొనే దృశ్యాలు మనం చూసేవే. దేశ రాజధాని ఢిల్లీలో అలాంటి వారి సంఖ్య ఐదు లక్షలని, దేశం మొత్తం మీద 15 నుంచి 40లక్షల మంది వరకు వున్నారని ఒక అంచనా. వారి గాధలను మీడియా ఏమేరకు ఇచ్చిందో మనకు తెలియదు. ప్రధానికి వచ్చే రేటింగ్‌కు వారికి రాదు. స్వచ్చ భారత్‌, ప్లాస్టిక్‌పై నిషేధం అమలు జరిగితే వారిలో కనీసం సగం మందికి ఆ వుపాధిపోవటం ఖాయం.( ఈ విశ్లేషణ రాసే సమయానికి మహాబలిపుర ఇష్టాగోష్టి ఫలితాలు వెలువడలేదు. కనుక మీడియాలో వెల్లడైన కొన్ని అంశాలకు మాత్రమే ఇది పరిమితం అని గమనించ మనవి)
కర్మ సిద్దాంతాన్ని నమ్మే వారి అంతరంగం ప్రకారం(బహిరంగంగా చెబితే మన ఖర్మ ఎలా కాలుతుందో అనే భయం కావచ్చు) రెండో సారి నరేంద్రమోడీకి అంతగా కలసి రావటం లేదట. అంతర్జాతీయంగా నేతల ప్రశంసలు తప్ప మిగతా అంశాలలో దేశీయ ఆర్ధిక రంగంలో అన్నీ అశుభాలే ఎదురవుతున్నాయని వాపోతున్నారు. అదే సిద్దాంతం ప్రకారం ఎవరు చేసిన దానిని వారు అనుభవించకతప్పదని ఎవరైనా అంటే మనోభావాలను కించపరిచే, దేశద్రోహలు అయిపోతారు.’ ఇదేమి ఖర్మమో ‘ !

Image result for China's Xi Jinping mahabalipuram visit : narendra modi overconfidence
గత ఐదు సంవత్సరాలుగా దేశాన్ని ప్రపంచ మార్కెట్లో పోటీకి తట్టుకొనేదిగా తయారు చేస్తున్నామని నరేంద్రమోడీ చెప్పుకోవటాన్ని కొందరు అంగీకరించకపోయినా ఎక్కువ మంది జేజేలు పలికారు. మరి అదేమిటో ఏ రోజు ఏ పత్రిక తిరగేస్తే, ఏ టీవీని చూస్తే ఆర్ధిక రంగంలో దిగజారుడు ఏ ఏడాదితో పోలుస్తారో అని సందేహించాల్సి వస్తోంది. దవోస్‌ కేంద్రంగా పనిచేసే ప్రపంచ అర్ధిక వేదిక(డబ్ల్యుఇఎఫ్‌) రూపొందిస్తున్న ప్రపంచ పోటీతత్వ సూచిక 2019లో మన దేశం గత ఏడాది కంటే పది పాయింట్లు దిగజారి 68వ స్ధానంలోకి పోయింది. 2008-09 నుంచి ప్రారంభమైన ఈ సూచికలో పదేండ్ల క్రితం చైనా 30వ స్ధానంలో వున్నది. స్ధిరంగా నిలుపుకోవటం లేదా మెరుగుపరచుకోవటం తప్ప అంతకంటే దిగజారలేదు, తాజా సూచికలో 28వ స్దానంలో వుంది. అదే మన దేశం విషయానికి వస్తే 50వ స్ధానంతో ప్రారంభమైంది. తాజా సూచిక 68. మెరుగుపడటం లేదా కనీసం స్ధిరంగా వుండటం లేదన్నది స్పష్టం. ఇదంతా ఎప్పుడు ? యాభై ఆరు అంగుళాల ఛాతీ విరుచుకొని ఐదేండ్లు సాము చేసిన తరువాత !

నరేంద్రమోడీ సర్కార్‌ సాధించిన విజయ గాధలలో వినిపించేది దేశపు సులభతర వాణిజ్య సూచిక. 2014లో 142గా వున్నది 2018 నాటికి 77వ స్ధానానికి ఎగబాకటం. ఇది రాస్తున్న సమయానికి 2019 సూచిక ఇంకా వెలువడలేదు. అది మరింత ఎగబాకినా, దిగజారినా నరేంద్రమోడీకి సంకటమే. సులభతరవాణిజ్య సూచిక ఇంకా ఎగబాకితే ఆర్ధిక వ్యవస్ధలో కనిపిస్తున్న ‘అశుభాల’ సంగతేమిటని జనం ప్రశ్నించకపోయినా ఆలోచిస్తారు. జనం మెదళ్లు పని చేయటం ప్రారంభించటం పాలకులకు ఎల్లవేళలా ప్రమాదరకమే. సూచిక దిగజారితే కబుర్లు తప్ప మాకు ఒరగబెట్టిందేమీ లేదని కార్పొరేట్‌ శక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తాయి. వారి సంఖ్య తక్కువ, వారేమనుకుంటే మాకేం జాతీయ భావాలతో ఓటేసే జనం వుండగా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. జనం రంగంలోకి రానంత వరకు ఏ పాలకుడిని ఎప్పుడు అందలమెక్కించాలో, ఎప్పుడు దించాలో నిర్ణయించేది వారే.
అమెరికా-చైనా వాణిజ్య యుద్దంతో దెబ్బలాడుకుంటుంటే చైనా కంపెనీలు మన దేశానికి తరలి వస్తాయని, మనం చైనా వస్తువుల దిగుమతులను నిలిపివేస్తే మనం చెప్పినట్లు చైనా వింటుందని నరేంద్రమోడీ సర్కార్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మీడియా ‘అగ్రహారీకులు’ కొందరు దీనికి అనుగుణ్యంగా అమెరికా తరువాత చైనా వస్తువులను ఎక్కువగా దిగుమతి చేసుకొనేది మనమే అన్నట్లుగా తాము నమ్మటమే కాదు, జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

2018 వివరాల ప్రకారం చైనా నుంచి వంద రూపాయల విలువగల వస్తువుల ఎగుమతి జరిగితే మన దేశానికి వచ్చినవి అక్షరాలా మూడు రూపాయల పదిపైసల కిమ్మత్తు కలిగినవి. మన కంటే ఎగువన వున్న ఆరు దేశాలు, ప్రాంతాలు 48.10 రూపాయల విలువగల వస్తువులను దిగుమతులు చేసుకున్నాయి. వాటిలో అమెరికా 19.20, హాంకాంగ్‌ 12.10, జపాన్‌ 5.40, దక్షిణ కొరియా 4.40, వియత్నాం 3.40, జర్మనీ 3.10 చొప్పున దిగుమతి చేసుకున్నాయి. అందువలన మన కోడి కూయకపోతే చైనాకు తెల్లవారదు అని ఎవరైనా అనుకుంటే చేయగలిగిందేమీ లేదు. దీన్ని మరొక విధంగా చెప్పాలంటే నరేంద్రమోడీ ప్రకటించిన మేకిన్‌ ఇండియా వస్తువుల ఎగుమతుల వైఫల్యం, మేడిన్‌ చైనా దిగుమతులు చేసుకుంటున్నట్లు అంగీకరించటమే.

గత రెండు దశాబ్దాలలో చూస్తే ఉభయ దేశాల మధ్య వాణిజ్య గణనీయంగా పెరిగింది.2000-01లో చైనా నుంచి దిగుమతులు 150 కోట్ల డాలర్లయితే మన ఎగుమతులు 83.1కోట్ల డాలర్లు, తేడా 67.1కోట్ల డాలర్లు. అదే 2008-09 నాటికి మన దిగుమతులు 32 బిలియన్లకు పెరగ్గా ఎగుమతులు 2007-08 నాటికి పదిబిలియన్‌ డాలర్లకు మించలేదు.2012 -13లో గరిష్టంగా 18 బిలియన్లకు చేరాయి తరువాత ఐదు సంవత్సరాల పాటు 13 బిలియన్‌ డాలర్లకు మించి జరగలేదు. చైనా నుంచి దిగుమతులు మాత్రం రెట్టింపు అయ్యాయి.2018లో మన ఎగుమతులు 16.5 బిలియన్‌ డాలర్ల కిమ్మత్తు కలిగినవి. మన కంటే చైనా దిగుమతులు 57.4బిలియన్‌ డాలర్లు ఎక్కువ, అంటే 74 బిలియన్‌ డాలర్ల మేర మనం దిగుమతులు చేసుకున్నాం. కమ్యూనిస్టు చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవటం నేరం, ఘోరం, దేశద్రోహం అని ఎవరైనా అంటే పై అంకెలను బట్టి అతల్‌ బిహారీ వాజ్‌పేయి, తరువాత ఏలుబడి సాగించిన మన్మోహన్‌ సింగ్‌ కంటే నరేంద్రమోడీ పెద్ద దేశద్రోహం చేసినట్లే ! చైనాతో పోలిస్తే ఘోరంగా విఫలమైనట్లే ? ఈ ఐదేండ్ల కాలంలో సామాజిక మీడియాలో చైనా వస్తువులను బహిష్కరించాలంటూ కాషాయ దళాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. నరేంద్రమోడీ ఆచరణ భిన్నంగా వుంది.

ఇటీవలి కాలంలో మన మీడియాలో చైనా నుంచి వలసపోతున్న కంపెనీల గురించి వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి. అది వాస్తవమే, అయితే చైనాలో వున్న ఫ్యాక్టరీలెన్ని వాటిలో తరలిపోయే వాటి శాతం ఎంత అన్న నిర్దిష్ట సమాచారం లేదు. సర్వేజనా సుఖినో భవంతు అన్నది మన సంస్కృతి అని ఒక వైపు చెబుతూనే మన దేశంలో రోజు రోజుకూ మూతబడుతున్న ఫ్యాక్టరీల గురించి పట్టని మీడియా చైనా ఫ్యాక్టరీల గురించి అత్యుత్సాహం ప్రదర్శించటాన్ని ఏమనాలి?
చైనా నుంచి తరలిపోతున్న ఫ్యాక్టరీలు ఎక్కువగా వియత్నాం, తైవాన్‌, చిలీలకు పోతున్నాయన్నది తాజాగా వెలువడిన ఒక విశ్లేషణ సారాంశం. దీనికి అమెరికాతో వాణిజ్య యుద్దం కంటే ఇతర కారణాలు ప్రధానంగా పని చేస్తున్నాయని, ఈ పోటీలో నష్టపోయేది దక్షిణాసియా అంటే భారత్‌ అని కూడా చెబుతున్నారు. రెనే యువాన్‌ సన్‌ అనే పరిశోధకురాలు ‘ తదుపరి ప్రపంచ ఫ్యాక్టరీ : చైనా పెట్టుబడులు ఆఫ్రికాను ఎలా పున:రూపకల్పన చేస్తున్నాయి ‘ అనే గ్రంధం రాశారు. ఆమె తాజాగా రాసిన విశ్లేషణ సారాంశం దిగువ విధంగా వుంది.

Image result for China's Xi Jinping mahabalipuram visit : narendra modi overconfidence
‘ గత దశాబ్దకాలంగా ముందుకు వస్తున్న ఒక ముఖ్యమైన ధోరణిని వాణిజ్యయుద్దం కేవలం వేగవంతం చేసింది. పెరుగుతున్న ఖర్చుల కారణంగా చైనా వుత్పత్తిదారులు కార్మికులను తగ్గించే యాంత్రీకరణ సాంకేతికతల మీద పెట్టుబడులు పెట్టటమా లేక ఫ్యాక్టరీలను వేరే చోట్లకు తరలించటమా అన్నది ఎంచుకోవాల్సి వుంది. రెండవ అంశాన్ని వారు ఎంచుకుంటున్నారు. తమ దేశంలో పెద్ద సంఖ్యలో జనాభా వుంది కనుక పెట్టుబడిదారులు వాలిపోతారనే మితిమీరిన విశ్వాసాన్ని భారత్‌ వదిలిపెట్టాలి.’
మరో విశ్లేషకుడు ఎమాన్‌ బారెట్‌ చెప్పిన అంశాల సారం ఇలా వుంది.’ తయారీదారులు చైనాను వదలి వెళ్లాలని చూస్తున్నారు, అయితే అదంతా వాణిజ్య యుద్దం వలన కాదు. అమెరికా వాణిజ్య యుద్దం ప్రకటించక ముందే చైనా వేతన ఖర్చులు పెరుగుతున్నాయి. 2008 గ్వాంగ్‌డూయింగ్‌ రాష్ట్రంలో కనీసవేతనం 4.12 యువాన్లు వుంటే 2018నాటికి 14.4యువాన్లకు పెరిగింది. జౌళి కర్మాగారాలు అంతకంటే తక్కువ వేతనాలకు కార్మికులు దొరికే దేశాలకు తరలిపోవాలని కోరుకుంటున్నాయి. సాంకేతికత తక్కువగా వుండే ఇలాంటివి తరలిపోవటం దీర్ఘకాలంలో చైనాకు అనుకూలంగా మారతాయి.2015లో చైనా ప్రకటించిన మేడిన్‌ చైనా 2025 ప్రకారం ఆధునిక తయారీ కేంద్రంగా మారాలన్నది లక్ష్యం. తక్కువ ఖర్చుతో పని చేసే ఫ్యాక్టరీలు తరలిపోతే మిగిలినవి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాల్సి వుంటుంది. జర్మనీ పరిశ్రమ 4.0 నవీకరణ చేసేందుకు బిలియన్ల డాలర్లను సమకూర్చుకుంటున్నది, చైనా విధానం కూడా దానికి దగ్గరగా వుంది. పశ్చిమ దేశాల సాయం లేకుండా ఆ లక్ష్యాన్ని చైనా చేరుకోగలదా అనే సమస్య వాణిజ్య యుద్ధాన్ని తొందరపరచింది. అనేక కంపెనీలు పూర్తిగా చైనాను వదలి పెట్టాలని అనుకోవటం లేదు. ప్రపంచంలో ప్రస్తుతం రెండవ పెద్ద మార్కెట్‌గా వున్న చైనాను వదలి పెట్టాలని ఎవరూ అనుకోవటం లేదు. ప్రధాన మైన భాగాలను చైనాలో తయారు చేసి వాటిని నౌకల ద్వారా ఇతర దేశాలకు తరలించి అక్కడ ఆ దేశాల పేరుతో అంతిమంగా వస్తువులను తయారు చేసి ఇవ్వాలనే అనే ఆలోచనతో వున్నాయి.(ఉదాహరణకు మన దేశంలో ఎక్కువ మంది వినియోగిస్తున్న మారుతీ కార్ల ప్రధాన భాగాలు జపాన్‌లో తయారు చేసి మన దేశంతో సహా ఇతర దేశాలకు తరలించి ఆయా దేశాల బ్రాండ్ల పేరుతో వాటిని విక్రయించిన మాదిరి) ”

Image result for China's Xi Jinping mahabalipuram visit : narendra modi overconfidence
ఈ నేపధ్యంలో చైనా నుంచి మన దేశానికి వచ్చే ఫ్యాక్టరీల మీద ఆశపెట్టుకోవటం మబ్బులను చూసి ముంతలోని నీరు పారపోసుకోవటం తప్ప వేరు కాదు. ఒక వేళ వచ్చినా అవి ఆధునికమైనవి కాదు. తాజా సాంకేతిక పరిజ్ఞానంతో వస్తూత్పత్తికి అవసరమైన నైపుణ్యం మన దేశంలో లేకపోవటం మన ప్రపంచ పోటీతత్వ సూచికలో మన వెనుకబడటానికి, దిగజారటానికి కారణాల్లో ఒకటన్నది స్పష్టం. జనాభా ఎంత మంది అన్నది కాదు, వారిలో ఎందరికి నైపుణ్య సామర్ధ్యం సమకూర్చామన్నది ముఖ్యం. ఈ విషయంలో నరేంద్రమోడీ సర్కార్‌ విజయం సాధించిందా ? వైఫల్యం చెందిందా ? యాభైఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో చేయలేనిదాన్ని ఐదేండ్లలో, 70 ఏండ్లలో చేయలేని దాన్ని 70 రోజుల్లో చేశామని చెప్పుకుంటున్నవారు ఈ విషయంలో ఏ గుడ్డి గుర్రానికి పండ్లు తోముతున్నట్లు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చంద్రయాన్‌ 2 ప్రయోగం : తీవ్ర ఆశాభంగం చెందింది నరేంద్రమోడీనా , శాస్త్రవేత్తలా !

09 Monday Sep 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Chandrayaan 2, ISRO scientists, Narendra Modi, Vikram Lander

Image result for chandrayaan 2

ఎం కోటేశ్వరరావు

చంద్రయాన్‌ -2 ప్రయోగం విఫలమైందా ? ఈ ప్రయోగం ఫలితంపై తీవ్ర ఆశాభంగానికి గురైంది ఇస్రో శాస్త్రవేత్తలా లేక రాజకీయవేత్త ప్రధాని నరేంద్రమోడీనా ? ప్రయోగం విజయవంతంగా కావాలని మఠాధిపతులు, గుడి పూజారులు, చిన్న దేవుళ్లు, దేవతలు, పెద్ద వెంకటేశ్వరస్వామి ఆశీర్వచనాలు, వాట్సాప్‌ భక్తుల పూజలు ఏమైనట్లు ? అసలు శాస్త్రవేత్తలకు కావాల్సింది ఏమిటి ? ఈ ప్రాతిపదికన కొన్ని అంశాల మీద వెల్లడించే అభిప్రాయాలు తమ మనోభావాలను గాయపరుస్తాయని భావించే వారు, భయపడే వారు ఇక్కడి నుంచి చదివేందుకు ముందుకు పోవాలా లేదా అన్నది వారి స్వేచ్చకే వదలి వేస్తున్నాను.

నూతన ఆవిష్కరణలు గావించే మానవాళి శాస్త్ర పరిశోధనా, ప్రయోగాలు నిర్దిష్టంగా ఫలానా రోజున ప్రారంభం అయ్యాయని చెప్పలేము. ప్రతి చిన్న ఆవిష్కరణ ఎంతో పెద్ద పరిణామాలు, పర్యవసానాలకు దారి తీసింది. పెద్ద బండరాయి కంటే అంచు వాడిగా వుండే చిన్న రాయి ఎంతో శక్తివంతమైనదని, పశువులను చంపి తినటం కంటే వాటిని పెంచి అవసరమైనపుడు ఆహారానికి వినియోగించుకోవచ్చన్న ఆలోచన రావటం, వాటిని భూమిని దున్నటానికి వినియోగించవచ్చని ప్రయోగించటం ఎన్నో విప్లవాత్మక మార్పులకు దారితీసిన చరిత్ర తెలిసిందే. అందువలన అది నిరంతర ప్రక్రియ, మానవుడి లక్షణాల్లో ఒకటి. శాస్త్రవిజ్ఞానమే కాదు, ఏ విజ్ఞాన అభివృద్ధికైనా ఎదురుదెబ్బలే స్ఫూర్తి,కసిని పుట్టిస్తాయి. పరిశోధనా, ప్రయోగాలు వ్యక్తిగతం కంటే సమిష్టి కృషి ఫలితాలు, పర్యవసానాలే. అయితే ప్రతి ఆవిష్కరణలోనూ వ్యక్తిగత పాత్ర లేదా అంటే వుంటుంది. దానిలో కూడా ఇతరుల అనుభవాల సారం వుంటుంది. విద్యుత్‌ బల్బ్‌ను కనుగొన్నది ఎవరంటే ధామస్‌ ఆల్వా ఎడిసన్‌ అని చెబుతాము. నిజానికి అంతకు ముందు ఎందరో దాని మీద చేసిన పరిశోధనలు ఆయనకు తోడ్పడ్డాయి. ప్రతి దేశ అంతరిక్ష పరిశోధనకూ ఇదే వర్తిస్తుంది.

గత ఆరు దశాబ్దాలలో చంద్రుడి మీద అడుగు పెట్టేందుకు చేసిన ప్రతి ప్రయోగం విజయవంతం కాలేదు. అయినప్పటికీ ఏ దేశమూ నీరసించి తన ప్రయత్నాలను మానుకోలేదు. అమెరికాకు చెందిన నాసా సంస్ధ నిర్వహిస్త్ను చంద్రుడి వాస్తవ పత్రం(మూన్‌ ఫ్యాక్ట్‌ షీట్‌)లో వున్న సమాచారం ప్రకారం వివిధ దేశాలు ఇప్పటి వరకు 109 ప్రయోగాలు జరపగా 61 విజయవంతం కాగా 48 విఫలమయ్యాయి. మన చంద్రయాన్‌-2కు ముందు 2019 ఫిబ్రవరిలో ఇజ్రాయెల్‌లో ఒక ప్రయివేటు సంస్ధ చేసిన ప్రయోగం ఏప్రిల్‌లో విఫలమైంది.

1958,59 సంవత్సరాలలో నాటి సోవియట్‌ యూనియన్‌, అమెరికా దేశాలు 14 ప్రయోగాలు చేశాయి. వాటిలో సోవియట్‌ లూనా 1,2,3 మాత్రమే విజయవంతమయ్యాయి. మొదటి విజయానికి ముందు సోవియట్‌ ప్రయోగాలు ఆరు విఫలమయ్యాయి. తరువాత 1964లో అమెరికా జరిపిన ఏడవ ప్రయోగం విజయవంతమైంది. 1966లో సోవియట్‌ లూనా 9 చంద్రుడి మీద దిగి చంద్రుడి వుపరితల చిత్రాలను తొలిసారిగా పంపింది. ఐదునెలల తరువాత అమెరికా అలాంటి ప్రయోగంలోనే విజయవంతమైంది. తొలుత సోవియట్‌ యూనియన్‌ అంతరిక్షంలోకి యూరీ గగారిన్‌ను పంపి చరిత్ర సృష్టిస్తే, తరువాత అపోలో 11వ ప్రయోగంలో నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ నాయకత్వంలో చంద్రుడి మీద తొలిసారి కాలుమోపిన చారిత్రాత్మక ఘటన తెలిసిందే. 1958 నుంచి 1979 వరకు అమెరికా, సోవియట్‌ యూనియన్‌ 90 ప్రయోగాలు జరిపాయి. తరువాత ఒక దశాబ్దం పాటు ఎలాంటి ప్రయోగాలు జరగలేదు. తరువాత జపాన్‌, ఐరోపాయూనియన్‌, చైనా, భారత్‌, ఇజ్రాయెల్‌ తమ ప్రయోగాలను ప్రారంభించాయి. 2009-19 మధ్య పది ప్రయోగాలు జరిగాయి. రష్యా, అమెరికా, చైనా మాత్రమే ఆ రంగంలో మొదటి మూడు స్ధానాలను ఆక్రమించాయి. మన చంద్రయాన్‌ 2 సఫలీకృతం అయితే మనది నాల్గో స్ధానం అవుతుంది. మన కంటే ఆర్ధికంగా బలమైన జపాన్‌ ఎంతో వెనుకబడి వుంది, అంతమాత్రాన దాని పలుకుబడి తగ్గలేదు. మిగతా కొన్ని రంగాలలో తన ప్రతిభ చూపింది.

ఒక ప్రయోగం విఫలమైనపుడు, మరొకటి సఫలమైనపుడు శాస్త్రవేత్తలు, సమాజం భావోద్వేగాలకు గురి కావటం సహజం. వస్తువు గురుత్వాకర్షణ, సాంద్రత, చలన శక్తి సూత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఆర్కిమెడిస్‌ గురించి ప్రచారంలో వున్న కధ తెలిసిందే. తన సింహాసనం పూర్తి బంగారంతో చేసింది కాదని తనకు అనుమానంగా వుందని దాన్ని రుజువు చేయాలని రాజుగారు ఒక కర్తవ్యాన్ని నిర్దేశించారు. ఒక రోజు ఆర్కిమెడిస్‌ స్నానం చేస్తుండగా ఆయన కూర్చున్న తొట్టెలోంచి నీరు పైకి వుబికింది. అది తన బరువుకు సమానంగా గుర్తించి భావోద్వేగానికి గురై యురేకా యురేకా ( నాకు అర్ధమైంది, నాకు అర్ధమైంది) అంటూ నీటి తొట్టెలోంచి లేచి బట్టల్లేకుండానే వీధుల్లో పరుగెత్తి రాజుగారి దగ్గరకు వెళ్లాడు. తరువాత బంగారంలో వేరే లోహాన్ని కలిపినట్లు బయటపెట్టాడు. అంతకు ముందు ఆర్కిమెడిస్‌తో పాటు అనేక మంది బంగారంలో కల్తీని కనుగొనేందుకు అనేక ఆలోచనలు, ప్రయోగాలు చేయకపోలేదు. అయితే తామెలా చేసేది చూడండని రాజుగారిని వారు పిలిచిగానీ, లేదా మీ ప్రయోగాన్ని స్వయంగా చూస్తానని రాజుగారు వచ్చి కూర్చున్న వుదంతాలుగానీ, ప్రయోగం లేదా వివరణలో విఫలమైతే శాస్త్రవేత్తలు కంటినీరు పెట్టుకున్నట్లు, వారిని రాజుగారు ఓదార్చినట్లు ఎక్కడా చదవలేదు. అసాధారణంగా ఎక్కడైనా జరిగిందేమో నాకు తెలియదు.

ప్రస్తుతం మన దేశంలో ప్రతి అంశం మీద జనంలో భావోద్వేగాలు, మనోభావాలు రేపే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని జరుగుతున్న పరిణామాలను బట్టి భావించాల్సి వస్తోంది. శాస్త్ర పరిశోధనల మీద దేశమంతటా ఆసక్తిని కలిగించే యత్నాలు, శాస్త్రంపట్ల ఆసక్తిని కలిగించేందుకు తీసుకొనే చర్యలు వేరు. అనేక దేశాల్లో అంతరిక్ష ప్రయోగాలు జరిగాయి, కానీ మన ప్రధాని నరేంద్రమోడీ మాదిరి ఒక దేశాధినేత స్వయంగా పరిశోధనా కేంద్రానికి వచ్చి కూర్చొని వీక్షించిన వుదంతం వుందేమో చెప్పమ్మా అని గూగులమ్మ తల్లిని అడిగితే చెప్పలేదు. ఎవరి దగ్గర అయినా అలాంటి సమాచారం వుంటే నా వ్యక్తీకరణను సవరించుకొనేందుకు సిద్దం. ఇస్రో చరిత్రలో విజయాలతో పాటు అపజయాలు కూడా వున్నాయి. అపజయాలు సంభవించినపుడు వుత్సాహం కొరవడ వచ్చుగానీ, ఎప్పుడూ కంటనీరు పెట్టుకున్నట్లు చదవలేదు. చంద్రయాన్‌ 2 వుదంతంలో రాజకీయం, మీడియా జనంలో భావోద్వేగాలను పెంచటంలో , వుపయోగించుకోవటంలో మాత్రం విజయం సాధించింది. మన దేశంలో క్రికెట్‌ మీద, మరొక దేశంలో మరొక క్రీడను సొమ్ము చేసుకొనేందుకు జనంలో పిచ్చిని పెంచే విధంగా మీడియా రాతలు, ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పొందే బిసిసిఐ తీరుతెన్నులను చూశాము.అది ముదిరిపోయి కొన్ని చోట్ల తాము ఆశించిన జట్టు విజయం సాధించని సందర్భాలలో అభిమానం దురభిమానంగా మారిన వుదంతాలు కూడా చూశాము. శాస్త్ర ప్రయోగాలు అలాంటివి కాదు. వాటి విజయం గురించి ఎవరూ హామీ ఇవ్వలేరు. మన చంద్రయాన్‌ మాదిరే ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తల మన ఖర్చులో సగంతో ఒక ప్రయోగం జరిపారు. అది ఏప్రిల్‌ 19వ తేదీన చివరిక్షణాల్లో సమాచార వ్యవస్ధతో సంబంధాలు తెగిపోయి, మన ప్రయోగం మాదిరే జయప్రదం కాలేదు. మన దేశంలో మాదిరి దృశ్యాలు,ఓదార్పు యాత్రలు అక్కడ లేవు. ప్రపంచంలో ఎక్కడా లేనిది మన దగ్గర ఎందుకో జనం ఆలోచించాలి.

చంద్రయాన్‌ ప్రయోగానికి ముందు సామాజిక మాధ్యమంలో ఒక అంశం చక్కర్లు కొట్టింది. అది నిడివి పెద్దది అయినా ఇక్కడ పూర్తి పాఠం ఇస్తున్నాను. ” చంద్రయాన్‌-2 ప్రయోగానికి అంతా రెడీ, కానీ ఎక్కడో ఏదో చిక్కుముడి తెమలడం లేదు, తేలడం లేదు లెక్క తెగడమే లేదు.900 కోట్ల ప్రాజెక్టు. కోట్ల మంది భారతీయుల ఆశలు. ప్రపంచ కన్ను . ఇస్రో ఛైర్మన్‌కు ఓ సీనియర్‌ సైంటిస్టు ఓ సలహా ఇచ్చాడు. ఇస్రో శివన్‌ కూడా ప్రతిదీ వినే తరహా, దేన్నీ తేలికగా తీసేసే రకం కాదు. ఆ సలహా ఏమిటంటే..? ‘పూరి శంకరాచార్యను కలుద్దాం సార్‌, ఆయన ఏమైనా పరిష్కారం చెప్పవచ్చు తను ఓ క్షణం విస్తుపోయాడు ఆధునిక గణితవేత్తలు, అంతరిక్ష శాస్త్రవేత్తలు, భౌతికశాస్త్ర పరిశోధకులకే చేతకానిది ఓ కాషాయగుడ్డల సన్యాసికి ఏం తెలుసు అని బయటికి వెల్లడించలేదు తన మనసులో భావాన్ని..! కానీ వాళ్లు వెళ్లలేదు స్వామివారినే శ్రీహరికోటకు రమ్మని ఆహ్వానించారు ఆయన వచ్చాడు,చూశాడు. ఆ లెక్కను చిటికెలో సాల్వ్‌ చేసేశాడు శంకరాచార్య అలియాస్‌ నిశ్చలానంద సరస్వతి. ఆయన ఎదుట అక్షరాలా భక్తిభావంతో సాగిలపడ్డాడు ఇస్రో చీఫ్‌. ఆ తరువాత కొద్దిరోజులకే చంద్రయాన్‌-2 మన పతాకాన్ని రెపరెపలాడిస్తూ ఖగోళంలోకి చంద్రుడి వైపు దూసుకుపోయింది అబ్బే, ఏమాత్రం నమ్మబుల్‌గా లేదు, ఉత్త ఫేక్‌ అని కొట్టేసేవాళ్లు బోలెడు మంది ఉంటారు కదా ఈ వార్తను..! కానీ కాస్త అతిశయోక్తి ఉంది గానీ వార్త నిజమే. కాకపోతే మన మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాకు ఇలాంటివి పట్టవు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నయ్‌.ఈ స్వామి పూరి శంకరాచార్య నంబర్‌ 145, ఈయన 143వ శంకరాచార్యుడు భారతక ష్ణ తీర్థకు ప్రియమైన శిష్యుడు. ఆయన వేదగణితంలో దిట్ట. ఆధునిక గణితం వల్ల కాని అనేకానేక సంక్లిష్టమైన సూత్రాల్ని, సమీకరణాల్ని ఇట్టే సాల్వ్‌ చేసేవాడు. ఈ నిశ్చలానంద కూడా ఆయన దగ్గర నేర్చుకుని, పాత వేదగణిత గ్రంథాల్ని ఔపోసన పట్టి, తన జ్ఞానానికి మరింత మెరుగుపెట్టుకున్నాడు.

ఆహారానికి, భాషకు, మందులకు, ఆహార్యానికీ, అలవాట్లకూ మతాన్ని రుద్దినట్టుగా ఈ గణితానికి మతాన్ని రుద్దకండి.లెక్కలంటే లెక్కలే. ఆధునిక గణితం పోకడ వేరు, వేదగణితం పోకడ వేరు .రెండూ సొల్యూషన్సే చూపిస్తాయి. కాకపోతే వేదగణితం సులభంగా స్టెప్‌ బై స్టెప్‌ ఉంటుంది. ఆధునిక గణితం కాస్త సంక్లిష్టంగా ఉంటుంది.”ఇందులో వింత ఏమీ లేదు, ఇదేమీ మాయ కాదు, లీల కాదు, మహత్తు అసలే కాదు. వేల ఏళ్ల క్రితమే భారతీయ రుషులకు లెక్కలు, జ్యోతిష్యం, క్షిపణి పరిజ్ఞానం, ఖగోళ జ్ఞానం, గగనయానంపై బ్రహ్మాండమైన విద్వత్తు ఉంది. మన పురాణాల్లో, భగవద్గీతలో బోలెడు అంశాలు దొరుకుతాయి. నిశ్చలానంద సరస్వతి ఆధ్యాత్మక గురువే కాదు, వేదగణితంలో బోలెడంత సాధన చేశాడు.11 పుస్తకాలు రాశాడు తను. దీనిపై చాలా మంది విదేశీ గణిత పరిశోధకులు స్వామితో టచ్‌లో ఉంటారు. సందేహాలకు వేదగణితంలో పరిష్కారాలు వెతుక్కుంటారు అంటున్నాడు ఈ శంకరాచార్యుడి గోవర్ధన పీఠం పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ మనోజ్‌ రత్తా.

నిజానికి నిశ్చలానందుడికి ఇస్రో స్పేస్‌ సైన్స్‌తో పరిచయం కొత్తదేమీ కాదు. చాలాసార్లు తను ఇస్రో లెక్కలకు సాయం చేశాడు. రెండేళ్ల క్రితం అహ్మదాబాద్‌ స్పేస్‌ రీసెర్చ్‌ స్టేషన్‌కు వెళ్లి దాదాపు 1000 మంది సైంటిస్టులు, రీసెర్చ్‌ స్కాలర్లను ఉద్దేశించి ప్రసంగించాడు. అహ్మదాబాద్‌ ఐఐఎంలో ఏడాది క్రితం మేనేజ్‌మెంట్‌ పాఠాలు కూడా చెప్పాడు సో, స్వామి అనగానే కాషాయాలు (మన తెలుగు స్వాములతో అస్సలు పోల్చుకోవద్దు దయచేసి..) ఉపవాసాలు, పూజలు, ధ్యానాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలే అనుకోకండి. ఇదుగో, ఈ నిశ్చలానందులూ ఉంటారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి పురాతన జ్ఞానాన్ని అద్ది సుసంపన్నం చేస్తారు. తమ చుట్టూ ఛాందసాల మడి గీతలు గీసుకుని, వాటిల్లో బందీలుగా ఉండరు. విభిన్నరంగాల్లో ఇదుగో ఇలా తళుక్కుమంటారు. అవసరమైన వేళల్లో..!! ”

రోజూ సామాజిక మాధ్యమాల్లో ‘ మేకిన్‌ ఇండియా ‘ ఫ్యాక్టరీల్లో తయారవుతున్న ఫేక్‌ న్యూస్‌ల్లో పైదొకటి. ఇస్రో అంటే ఏదో గణిత శాస్త్ర సంస్ధ అన్నట్లు, లెక్కల చిక్కు ముడి పడినట్లు ? చిత్రించారు. చంద్రయాన్‌ 2 ప్రాజెక్టు 2007లో ప్రారంభమైంది. 2008లో కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. 2013లో ప్రయోగించాల్సిన ఈ ప్రాజెక్టు వివిధ కారణాలతో ఆలస్యమైంది. అలాంటిదానికి ప్రయోగించబోయే ముందు లెక్కల చిక్కుముడి పడిందని చెప్పటం నిజంగా మన శాస్త్రవేత్తలను అవమానించటం, స్వామీజీలు, బాబాలకే లేని ప్రతిభను ఆపాదించటం తప్ప మరొకటి కాదు. సదరు నిశ్చలానంద సరస్వతి తన శిష్యులతో ఇస్రోకు సమాంతరంగా ఇప్పటికైనా తన ప్రతిభతో ప్రయోగాలను చేపట్టమనండి.

విక్రమ్‌ లాండర్‌ను సులభంగా చంద్రుడి దక్షిణ ధృవం మీద దించటం, అది పద్నాలుగు రోజుల పాటు వుపరితలం మీద కదలాడుతూ సమాచారాన్ని సేకరించటం కీలకాంశం. దానికి ముందు వున్న దశలను మన శాస్త్రవేత్తలు ఎప్పుడో జయప్రదంగా అధిగమించారు. రష్యా సహకారంలో భాగంగా వారు లాండర్‌ను తయారు చేసి ఇవ్వాల్సి వుంది. అయితే వారికి తలెత్తిన సాంకేతిక సమస్యలు కావచ్చు, బయటికి తెలియని ఇతర కారణాలతో గానీ తాము ఇవ్వలేమని చెప్పిన తరువాత మన వారే స్వంతంగా తయారు చేశారు. ఇది కూడా ఆలశ్యానికి ఒక కారణం.

Image result for disappointed Narendra Modi at ISRO

మన దేశంలో ప్రతి అంతరిక్ష ప్రయోగానికి ముందు వాటి ప్రతిమలతో తిరుపతి వెంకన్న , సుళ్లూరు పేట చెంగాలమ్మ దేవాలయాల్లో పూజలు చేయటం చేస్తున్నారు. ఈ ఏడాది ఇస్రో అధిపతి కె శివన్‌ వుడిపి శ్రీకృష్ణ మఠాధిపతి ఆశీస్సులు కూడా అందుకున్నారు. ఇక వాట్సాప్‌ భక్తులు, ఇతరులు చేసిన వినతులకు కొదవ లేదు. ఈ వుత్తరం అందిన వారు మరొక పదకొండు మందికి లేఖలు రాయకపోతే అరిష్టానికి గురి అవుతారు అన్నట్లు గాక పోయినా అందరికీ పంపి ప్రార్ధనలు చేయండని కోరారు. మరి శంకరాచార్య లెక్కలేమయ్యాయి. దేవుళ్ల కరుణాకటాక్షం, మఠాధిపతుల, తిరుపతి వేద పండితుల ఆశీర్వాచనాల మహత్తు, శక్తి ఏమైపోయినట్లు ? మనం చేయాల్సింది చేయాలి, దేవుడి కటాక్షం కోరాలి అని చెప్పేవారు వుంటారు. అలాంటపుడు ఓదార్పు శాస్త్రవేత్తలకే ఎందుకు, ప్రయోగాన్ని కాపాడలేకపోయినందుకు దేవుళ్లు దేవతలు, స్వాములను కూడా ఓదార్చాలి లేదా అభిశంచించాలి. మూఢనమ్మకాలను పెంచే, శాస్త్రవిజ్ఞానం మీద పూర్తి నమ్మకంలేని తరాలను మనం తయారు చేస్తున్నాము.

ఆయుధాలు, అంతరిక్ష ప్రయోగాల కోసం దేశాలు పోటీ పడ్డాయి. దీనిలో సాంకేతికంగా, మిలిటరీ రీత్యా పై చేయి సాధించటంతో పాటు ‘రాజకీయ’ ప్రయోజనం కూడా చోటు చేసుకుంది. వుదాహరణకు హిట్లర్‌ నాయకత్వంలోని జర్మనీ, ఇటలీ, జపాన్‌ కూటమికి వ్యతిరేకంగా తమతో చేయి కలపాలని అమెరికా, బ్రిటన్‌ దేశాలు నాటి సోవియట్‌ను కోరాయి. 1945 జూలై 16న ప్రపంచంలో తొలిసారిగా అమెరికా అణుబాంబు పరీక్ష జరిపింది. మరుసటి రోజు అమెరికా అధ్యక్షుడు ట్రూమన్‌ బ్రిటన్‌ ప్రధాని చర్చిల్‌కు ఈ విషయం చెప్పాడు. అయితే అప్పటికే సోవియట్‌ నేత స్టాలిన్‌ వారితో కలవటానికి సూత్ర ప్రాయంగా అంగీకరించారు. మిత్రపక్షాల మధ్య ఒప్పందం కుదరలేదు. అందువలన ఈ విషయం తెలిస్తే ఒక వేళ స్టాలిన్‌ వెనక్కు తగ్గుతారేమో, కొత్త షరతులను పెడతారేమో అనే అనుమానంతో వెంటనే చెప్పవద్దని ఇద్దరు నేతలూ అనుకున్నారు. జపాన్‌ మీద యుద్దం చేసేందుకు స్టాలిన్‌ అంగీకరించిన తరువాత జూలై 25 తమ దగ్గర ప్రమాదకరమైన ఒక బాంబు వుందని ట్రూమన్‌ సూచన ప్రాయంగా స్టాలిన్‌కు చెప్పాడు. దీనిలో వున్న రాజకీయం ఏమంటే అప్పటికే అమెరికన్లు బాంబు ప్రయోగానికి నిర్ణయించుకున్నారు. ఆగస్టు పదిలోగా బాంబును ప్రయోగించాలని, అలాంటి బాంబులు హిట్లర్‌, స్టాలిన్‌ దగ్గర లేవని ట్రూమన్‌ తన డైరీలో రాసుకున్నాడు. అది జరిగిన తరువాత సోవియట్‌ యూనియన్‌ భయపడిపోయి యుద్ధానంతరం ఐరోపాను పంచుకొనే విషయంలో తమ షరతులకు అంగీకారానికి రాకతప్పదనే ఆలోచన దాగుంది. అయితే స్టాలిన్‌ ఆ సమాచారం విని తాపీగా అలాగా, సంతోషం, మంచికోసమే వుపయోగించాలి అనటం తప్ప ఎలాంటి భావాన్ని వ్యక్తం చేయలేదు. అప్పటికే యుద్ధం ముగింపుదశలో వుంది. మరో వారం రోజుల్లో సోవియట్‌ సేనలు జపాన్‌పై దాడికి వస్తాయనగా ట్రూమన్‌ ఆగస్టు ఆరున తొలి బాంబును, రెండు రోజుల తరువాత రెండవ బాంబును ప్రయోగించాలని ఆదేశించాడు.యుద్ధం ముగిసిన తరువాత మూడు సంవత్సరాల్లో అంటే 1949 ఆగస్టు 29న సోవియట్‌ యూనియన్‌ తొలి అణుపరీక్ష జరిపింది.అది ప్రపంచ రాజకీయాలను ఒక మలుపు తిప్పిన విషయం తెలిసిందే.

Image result for chandrayaan 2 : who disappointed most Narendra Modi or ISRO scientists

సోవియట్‌ పట్టుదల అంతటితో ఆగలేదు. అణుబాంబును మోసుకుపోయి లక్ష్యాల మీద వేసే క్షిపణుల తయారీకి పూనుంది. అమెరికా కంటే ముందుగా అలాంటి ఒక క్షిపణిని ప్రయోగించింది. అదే తరువాత కాలంలో అంతరిక్ష ప్రయోగాలకు ఎన్నో పాఠాలు నేర్పింది. తాము మరో రెండు సంవత్సరాలలో అంతరికక్ష వుపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు 1955లో అమెరికా ప్రకటించింది. దానికంటే ముందే సోవియట్‌ వుపగ్రహాన్ని ప్రయోగించింది, అంతటితో ఆగలేదు 1961లో యూరీ గగారిన్‌ అంతరిక్ష ప్రయాణం చేయించింది. అదే ఏడాది అమెరికన్లు క్యూబామీద దాడి చేసేందుకు ప్రయత్నించి ఎదురు దెబ్బతిన్నారు.దీంతో సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచంలో అమెరికాకు ఎదురు లేదన్న ప్రతిష్ట అడుగంటింది. ఈ పూర్వరంగంలో అమెరికా ఆధిపత్యానికి తిరుగులేదు అంటే ఏమి చెయ్యాలి? అంతరిక్షంలో ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసి మనం సోవియట్‌ను అధిగమించగలమా ? చంద్రుడి చుట్టూ తిరిగి రాగలమా, చంద్రుడి మీద రాకెట్లను దించగలమా ? రాకెట్లలో మనిషిని పంపి తిరిగి వెనక్కు తీసుకురాగలమా ? ఇవిగాక మన ఆధిపత్యాన్ని చాటి చెప్పేందుకు అవసరమైన నాటకీయ ఫలితాలను సాధించే అంతరిక్ష కార్యక్రమం ఏదైనా వుంటే చెప్పండి అని నాటి అమెరికా అధ్యక్షుడు కెన్నడీ తన సలహాదారులను అడిగాడు. రెండు వారాల తరువాత వుపాధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ నాయకత్వంలోని ఒక కమిటీ సోవియట్‌తో పోటీలో అధిగమించకపోయినా సమంగా అయినా వుండేట్లు చూడాలని కెన్నడీ కోరాడు. దాని ఫలితమే అపోలో కార్యక్రమం.

1961 మే 25న అమెరికా పార్లమెంట్‌, దేశ ప్రజలను వుద్దేశించి మాట్లాడుతూ ప్రపంచ వ్యాపితంగా వున్న మన స్నేహితులుా,శత్రువుల మధ్య జరుగుతున్న పోరులో మనం విజయం సాధించాల్సి వుంది. మనం సైనికుల హృదయాలను చూరగొన గలగాలి. అంతరిక్షంలో 1957లో స్పుత్నిక్‌(సోవియట్‌) సాధించిన నాటకీయ పరిణామాలు మనకు ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. ప్రతి చోటా ముందుకు పోవాలనే పట్టుదలతో వున్న మార్గంలో ప్రయాణిస్తున్న సైనికులపై ప్రభావం పడింది. మనం అంతరిక్షంలోకి పోవాలి. ఇలా సాగింది ఆ ప్రసంగం. అంతటి అమెరికన్లే తమ రాజకీయ, ఇతర ప్రయోజనాల కోసం అంతరిక్ష కార్యక్రమాన్ని వుపయోగించుకున్నారన్నది స్పష్టం.

ఇదే సమయంలో తమ సోషలిస్టు భావజాలం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేందుకు, ఇతర దేశాలను అమెరికా నుంచి దూరం చేసి తమ వైపుకు తిప్పుకొనే రాజకీయాల్లో భాగంగా సోవియట్‌ కూడా తన పాత్ర నిర్వహించింది. పెద్ద విజయంగా టాంటాం వేసుకుంటున్న కాశ్మీరు రాష్ట్ర విభజన, ఆర్టికల్‌ 370 గురించి ఎన్నో రోజులు వూదరగొట్టేందుకు నరేంద్రమోడీకి, బిజెపికి అవకాశం లేదు. ఎంత ఎక్కువగా ప్రచారం చేస్తే అంత ఎక్కువగా ఆ చర్య వలన ఇతర రాష్ట్రాలకు జరిగిన మేలు ఏమిటని జనం ప్రశ్నిస్తారు. ఇదిలా వుండగా దేశంలో ఆర్ధిక మాంద్యం సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగం మరింత పెరుగుతోంది, పరిశ్రమల మూతలు పెరుగుతున్నాయి. వాటిని గురించి ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడని నరేంద్రమోడీ అండ్‌కోకు జనం దృష్టిని మళ్లించే ఒక పెద్ద అంశం కావాలి. అందువలన ఈ పూర్వరంగంలో చంద్రయాన్‌ 2 ప్రయోగాన్ని తనకు అనుకూలంగా మలచుకొనేందుకు నరేంద్రమోడీ ప్రయత్నించారా అన్న సందేహం కలగటంలో తప్పేముంది. ప్రయోగాల వైఫల్యం ఇస్రో శాస్త్రవేత్తలకు కొత్త కాదు. అందువలన వారి కంటే నరేంద్రమోడీ ఎక్కువగా హతాశులయ్యారా ? చంద్రయాన్‌ అందినట్లే అంది అందకుండా పోయింది.

చంద్రయాన్‌ 2 విఫలం కాదు, ప్రయోగాలలో అది ఒక భాగమే. ఆర్యభట్ట నుంచి సాగుతున్న విజయాల పరంపరలో ఇదొక చిన్న ప్రయోగం. వైఫల్యాలతో గతంలో ఏ శాస్త్రవేత్త కుంగిపోలేదు. నిరాశపడలేదు. అది అసలు వారి లక్షణం కాదు. వారి ప్రయోగాలు విజయవంతం కావాలని, అది దేశానికి వుపయోగపడాలని అందరూ కోరుకుంటున్నారు. చంద్రయాన్‌ 1లో 2008లోనే దాదాపు 10 నెలలపాటు మన పరిశోధనలు చంద్రునిపై సాగాయి, కొన్ని లోపాలు ఉన్నా అది విజయమే, ప్రపంచంలో స్థానం ఆనాడే సాధించాము. గతకాలంలో ఎన్నో విజయాలు సాధించాము. తక్కువ ఖర్చుతో చేపట్టబోయే, 2024లో మొదలయ్యే చంద్రయాన్‌-3 విజయవంతం కావాలని కోరుకుంటున్నాము.. మన శాస్త్రవేత్తలు ప్రపంచంలో ఎవరికంటే తీసిపోరు, 104దేశ విదేశీ ఉపగ్రహాలను ఒక్కసారిగా ప్రయోగించిన ఘనత మనవారిదే కదా. అయినా.. కొంతమందికి బాధ అనిపించినా మన దేశానికి ముందు కావలసింది దేశ అభివ ద్ధికి ప్రత్యక్షంగా ఉపయోగపడే ప్రయోగాలు అని గుర్తించాలి. ప్రస్తుత చంద్రయాన్‌ 2 లో ఆర్బిటర్‌ లక్షణంగా పని చేస్తున్నది. లాండర్‌ మాత్రమే విఫలమైంది.

Image result for chandrayaan 2 : who disappointed most Narendra Modi or ISRO scientists

నరేంద్రమోడీ సర్కార్‌ వుగ్రవాదులు, నల్లధనం వున్న వారి మీద కంటే మేధావులు, శాస్త్ర పరిశోధనల మీద సమర్దవంతంగా మెరుపు దాడులు చేసిందని (సర్జికల్‌ స్ట్రెక్స్‌ ) ప్రముఖ చరిత్ర కారుడు రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు. 2014లో అధికారానికి వచ్చినప్పటి నుంచి మేథావుల మీద నిరంతరం యుద్ధం సాగిస్తున్నదని, ఒక విశ్వవిద్యాలయం తరువాత మరొక విశ్వవిద్యాలయాన్ని, పరిశోధనా సంస్ధలను లక్ష్యంగా చేసుకొని వాటి విశ్వసనీయతను దెబ్బతీస్తున్నదని పేర్కొన్నారు. మోడీ సర్కార్‌లో ఇద్దరు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులకు విద్య లేదా పరిశోధన చేసిన పూర్వరంగం లేదని వారు ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి సూచనలను స్వీకరించటం తప్ప నిపుణులు చెప్పేది వినటం లేదని అన్నారు. మన పూర్వీకులు ప్లాస్టిక్‌ సర్జరీ చేశారని, కృత్రిమ గర్భధారణ పద్దతులను అభివృద్ధి చేశారని స్వయంగా నరేంద్రమోడీయే చెప్పారు. ఇలాంటి ఆధారం లేని ఆశాస్త్రీయ ప్రచారాలను చేయటంలో మోడీని ఆయన మంత్రులు పెద్ద ఎత్తున అనుకరిస్తున్నారు.ఇలాంటి విషయాలను (చెప్పింది వినటం తప్ప ప్రశ్నించటానికి సాహసం చేయని) ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖల్లో లేదా ప్రయివేటు సంభాషణల్లో కాదు, ఏకంగా సైన్స్‌ కాంగ్రెస్‌లోనే చెప్పారని రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు.

యుపిఏ హయాంలో శాస్త్ర, పరిశోధనల మీద జిడిపిలో 0.8శాతం ఖర్చు చేస్తే మోడీ హయాంలో అది 0.69కి పడిపోయింది. అమెరికా అత్యధికంగా 3-4శాతం వరకు ఖర్చు చేస్తుండగా చైనా రెండుశాతంపైగా చేస్తున్నది. వైఫల్యాలన్నీ పరిశోధన బడ్జెట్‌ను బట్టే వుంటాయని చెప్పలేము గానీ,తగినన్ని నిధుల కేటాయింపు లేకపోయినా ప్రయోగాలు విజయవంతం కావు. పరిశోధనల మీద ఖర్చును పెంచాలని దేశవ్యాపితంగా శాస్త్రవేత్తలు ప్రదర్శనలు చేసిన విషయం తెలిసినదే.విజయం అంచున ఖ్యాతిని సొంతం చేసుకొనేందుకు పరిశోధనా కేంద్రాలకు చేరి తాపత్రయం పడే రాజకీయాలకు నేటి నేతలు స్వస్తి పలకాలి. అలాంటివి శాస్త్రవేత్తలను మరింత వత్తిడికి గురిచేస్తాయి. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఓదార్పులు, ఆ పేరుతో ప్రచారం కాదు. వర్తమానంలో వున్న ఆవిష్కరణలన్నింటినీ మన పూర్వీకులు ఎప్పుడో కనుగొని వాడిపారేశారు, ఆ విజ్ఞానమంతా వేదాల్లో , సంస్కృత గ్రంధాల్లో వుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. వాటిని వెలికి తీసి దేశానికి మేలు చేసి పక్కా దేశభక్తులని నిరూపించుకోండని చేసిన సూచనలను ఏ ఘనాపాఠీ, సంస్కృత పండితులు పట్టించుకోలేదు. ఎందుకంటే దేవుడు నైవేద్యం తినడనే నిజం పూజారికి తెలిసినట్లుగా మరొకరికి తెలియనట్లే వాటిలో కావలసినంత అజ్ఞానం తప్ప విజ్ఞానం లేదని పండితులకు బాగా తెలుసు. ఇస్రో లేదా మరొక శాస్త్ర పరిశోధనల్లో పని చేస్తున్న శాస్త్రవేత్తలు అలా కాదు, వారిలో నిజాయితీ వుంది, తాము నమ్మిన దాన్ని ఆచరణలో పెట్టేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు. వారిని మరింతగా ప్రోత్సహించాలంటే వాటిని నిరుత్సాహపరిచే అశాస్త్రీయ భావాల ప్రచారాన్ని కట్టిపెట్టాలి. ఆవు మూత్రం, పేడలో ఏముందని తెలుసుకొనేందుకు కాదు, జనానికి పనికి వచ్చే పరిశోధన, అభివృద్ధికి నిధులను గణనీయంగా పెంచాలి. అవి లేకుండా ఓదార్పుల వలన ప్రయోజనం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మంచి కోసం మాంద్యాన్ని భరించక తప్పదు : డోనాల్డ్‌ ట్రంప్‌

21 Wednesday Aug 2019

Posted by raomk in CHINA, Current Affairs, Economics, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

China, China–United States trade war, Donald trump, TRADE WAR, United States

China's President Xi Jinping (R) shakes hands with US President Donald Trump before a bilateral meeting on the sidelines of the G20 Summit in Osaka on June 29, 2019. (BRENDAN SMIALOWSKI/AFP/Getty Images)

ఎం కోటేశ్వరరావు

చైనాతో మెరుగైన వాణిజ్య ఒప్పందం కోసం రెండు నెలల మాంద్యం మూల్యం చెల్లించటానికి తాను అంగీకరిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం నాడు చెప్పారు. చైనా పట్ల దూకుడుగా అనుసరిస్తున్న వైఖరి స్వల్పకాలంలో బాధ పెట్టినా దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తుందని, రెండు నెలల పాటు మాంద్యాన్ని అమెరికా ఎదుర్కోగలదని అన్నారు. మాంద్యమనే భావన అసంగతం, చైనా మీద చర్య తప్పని సరి, స్వల్పకాలంపాటు మాంద్య మంచిదా కాదా అన్నది సమయాన్ని బట్టి వుంటుంది, మీరు మాంద్యం గురించి చెబుతున్నారు, మనం రెండు నెలల పాటు మాంద్యానికి గురవుతాం, ఎవరో ఒకరు చైనా మీద చర్య తీసుకోవాలి కదా అని విలేకర్లతో వ్యాఖ్యానించారు. మాంద్యానికి అమెరికా చాలా దూరంగా వుంది, ఫెడరల్‌ రిజర్వు ప్రామాణిక వడ్డీ రేట్లను తగ్గించాలని కూడా అన్నారు. తరువాత అధ్యక్ష ప్రతినిధి విలేకర్లతో మాట్లాడుతూ అమెరికా మాంద్యం వైపు వెళుతోందనటాన్ని అధ్యక్షుడు విశ్వసించటం లేదని, ఆయన విధానాల కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్ధ ఎంటో పటిష్టంగా వుందని అన్నారు.

అమెరికా – చైనా వాణిజ్య పోరు కారణంగా తలెత్తిన అనిశ్చితి కారణంగా 2021నాటికి 97లక్షల కోట్ల ప్రపంచ జిడిపి 585 బిలియన్‌ డాలర్ల మేరకు 0.6శాతం నష్టపోనుందని, ప్రపంచ జిడిపి బ్లూమ్‌బెర్గ్‌ ఆర్ధిక నివేదిక పేర్కొన్నది. ఈ పూర్వరంగంలోనే ప్రపంచ వత్తిడి లేదా పర్యవసానాలకు తమనే బాధ్యులుగా చేస్తారనే భయం, వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలను ప్రభావితం చేస్తుందనే అనే ఆలోచన తో గానీ చైనాతో వాణిజ్య పోరును ట్రంప్‌ కొంత కాలం పాటు వాయిదా వేశారు. బ్రిటన్‌, జర్మనీ, రష్యా,సింగపూర్‌, బ్రెజిల్‌తో సహా తొమ్మిది దేశాల ఆర్ధిక వ్యవస్ధలు మాంద్యపు అంచున లేదా మాంద్యంలోకి జారినట్లు భావిస్తున్నారు. తదుపురి వంతు 2021లో అమెరికాదే అని ఆర్ధిక వేత్తలు హెచ్చరించారు.

ఈ నేపధ్యంలో సెప్టెంబరు ఒకటి నుంచి చైనా వస్తువులపై పెంచదలచిన దిగుమతి పన్ను క్రిస్మస్‌ పండుగను నాశనం చేస్తుందనే హెచ్చరికలను సాకుగా చూపి డిసెంబరు 15 నాటికి డోనాల్డ్‌ ట్రంప్‌ వాయిదా వేసినట్లు వార్తలు వచ్చాయి. పండుగ అంటే బొమ్మలు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను కోట్లాది మంది అమెరికన్లు బహుమతులుగా ఇస్తారు. దిగుమతి పన్ను భారాన్ని వినియోగదారుల మీద మోపటం తప్ప మరొక మార్గం లేదని వాల్‌మార్ట్‌ తదితర దుకాణాల సంస్ధలు స్పష్టం చేశాయి. మరోవైపున చైనా నాయకత్వం కూడా తాము కూడా తగిన ప్రతీకార చర్యలు తీసుకుంటామని చెప్పటంతో తాను ప్రతిపాదించిన పన్నుల పెంపుదల క్రిస్మన్‌ కొనుగోళ్లకు సంబంధం లేనప్పటికీ వాటి మీద ప్రభావం పడుతుందంటున్నారు కనుక వాయిదా వేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించాడు. అదే నోటితో హాంకాంగ్‌లో జరుగుతున్న ఆందోళనకు వాణిజ్య యుద్ధానికి లంకె పెట్టేందుకు కూడా ప్రయత్నించిన ట్రంప్‌ రెచ్చగొట్టుడును మానుకోలేదు. హాంకాంగ్‌ పరిణామాలకు, వాణిజ్య యుద్ధానికి ఎలాంటి సంబంధం లేదని, ఇతరుల సలహాలు తమకు అవసరం లేదని చైనా ప్రకటించింది.

వాణిజ్య యుద్ధాలు మంచివి, వాటిలో విజయం సాధించటం తేలిక అని 2018 మార్చినెలలో ట్రంప్‌ చెప్పాడు. అయితే చైనాను వూబిలో దించబోయి ట్రంపే తన వూబిలో తానే పడ్డట్లు అనేక మంది విశ్లేషకులు పేర్కొన్నారు. చైనాతో వాణిజ్య యుద్దంలో ఎలా ఓటమి చెందనున్నారో వివరించారు. మీడియాలో వచ్చిన విశ్లేషణలు, వ్యాఖ్యల మేరకు దిగువ అంశాలు ట్రంప్‌ను ప్రభావితం చేశాయి. భద్రతా కారణాలతో చైనా టెలికాం కంపెనీ హువెయ్‌, దాని అనుబంధంగా వున్న 46కంపెనీలతో లావాదేవీలు జరపరాదన్న తమ అధినేత నిర్ణయాన్ని మరో 90 రోజుల పాటు నవంబరు 19 వరకు వాయిదా వేస్తున్నట్లు అమెరికా వాణిజ్య మంత్రి విల్‌బర్‌ రోస్‌ ప్రకటించాడు. అమెరికా కంపెనీలతో పాటు ఇతర దేశాలు కూడా హువెయ్‌ కంపెనీ పరికరాలను కొనుగోలు చేయరాదని అమెరికా ఆదేశించిన విషయం తెలిసిందే. అమెరికా విధించిన ఆంక్షలు హువెయ్‌ కంపెనీ పనితీరు మీద ఇప్పటి వరకు ఎలాంటి ప్రభావం చూపలేదు. ఈ ఏడాది తొలి ఆరుమాసాల్లో దాని ఆదాయం 23.2శాతం పెరిగినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు ఐదవ తరం(5జి) నెట్‌వర్క్‌ పరికరాల విషయమై ఇది 50వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. వాటిలో 28 ఐరోపాలోనే వున్నాయి. ఫిన్లండ్‌కు చెందిన నోకియా 43, స్వీడన్‌ కంపెనీ ఎరిక్సన్‌ 22 కాంట్రాక్టులు కుదుర్చుకుంది. మరోవైపు హువెయ్‌ పోటీదారు జడ్‌టియి 25వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రకటించింది.

మూడు వందల బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులపై ఆగస్టు ఒకటి నుంచి పన్ను విధిస్తామన్న ట్రంప్‌ తరువాత ఆ మొత్తాన్ని 160 బిలియన్లకు తగ్గించి సెప్టెంబరు ఒకటి నుంచి పన్ను వేస్తామని ప్రకటించాడు. క్రిస్మస్‌ పేరుతో ఇప్పుడు దాన్ని కూడా డిసెంబరు 15కు వాయిదా వేశాడు. అయితే కిందపడ్డా పైచేయి తనదే అని చెప్పుకొనేందుకు అమెరికా వ్యవసాయ వస్తువులను కొనుగోలు చేసేందుకు చైనా అంగీకరించిందని ట్రంప్‌ ఒక ట్వీట్‌ చేశాడు.అయితే అమెరికా రైతాంగం ఇబ్బందులు పడుతున్నదని రాయిటర్స్‌ ఒక వార్తను ఇచ్చింది. ఇటీవలి సంవత్సరాలలో రైతాంగానికి ఇస్తున్న రుణాలు 17.5శాతం తగ్గాయని, బకాయిల చెల్లింపునకు వత్తిడి, కొత్తగా రుణాలు నిలిపివేయటంతో అనేక మంది దివాలా చట్టాన్ని ఆశ్రయిస్తున్నట్లు తెలిపింది. చైనా, మెక్సికో దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే సోయా, ధాన్యం వంటి వుత్పత్తుల మీద పన్నుల విధించిన కారణంగా అక్కడి రైతాంగం ఇబ్బందులు పడుతున్నది. వారిని ఆదుకొనేందుకు కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అవి ఫలించలేదు. చైనా వుత్పత్తులపై పన్ను విధింపు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించగానే అమెరికా స్టాక్‌మార్కెట్‌ సంతోషపడింది. అయితే తాము కూడా ప్రతి చర్యలకు వెనుకాడబోమని చైనా వెల్లడించగానే డీలాపడటం అమెరికా బలహీనతకు సూచికగా విశ్లేషకులు పేర్కొన్నారు. ట్రంప్‌ వ్యూహం విఫలమౌతున్నదని బాహాటంగానే మీడియాలో వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.

ప్రస్తుతం ప్రపంచంలో అనేక దేశాలతో రోజు రోజుకూ చైనా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇదే సమయంలో అమెరికా ప్రతి వారి మీద బస్తీమే సవాల్‌ నాకు లొంగుతారా లేదా అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరిస్తారా లేదా అనే బెదిరింపులకు దిగుతున్నది. ఇది దాని ఆర్ధిక వ్యవస్ధతో పాటు రాజకీయ పలుకుబడిని కూడా దెబ్బతీస్తున్నదంటే అతిశయోక్తి కాదు. తమ చర్యల కారణంగానే చైనా అభివృద్ధి కూడా పడిపోయిందని ట్రంప్‌ చంకలు కొట్టుకోవచ్చు. నిజానికి అదొక చిన్న కారణమే తప్ప మరొకటి కాదు. అంతర్గతంగా తీసుకున్న చర్యలు అభివృద్ధి రేటు తగ్గటానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. తన వస్తువులను అమ్ముకొనేందుకు చైనా అవసరమైతే తన యువాన్‌ విలువను తగ్గించుకొనేందుకు సిద్ధంగా వుందన్న సూచనలు గతవారంలో వెలువడిన విషయం తెలిసిందే. అమెరికా తన డాలరు విలువను తగ్గించనట్లయితే ప్రపంచ మార్కెట్లో దాని వస్తువులను కొనుగోలు చేసే వారు వుండరు. తన కరెన్సీ విలువను తగ్గించుకుంటే ఇతర పర్యవసానాలు తీవ్రంగా వుంటాయని అమెరికా భయపడుతోంది. డాలరు విలువ తగ్గకుండా ప్రపంచ దేశాలను అదిరించి బెదిరించి తన వస్తువులను అంటగట్టాలని చూస్తోంది.

Image result for trade war us china

అమెరికాను ఒంటరిపాటు చేసేందుకు , మిత్రులను సంపాదించుకొనేందుకు చైనా తనదైన శైలిలో ముందుకు పోతోంది.2018 జనవరిలో చైనా తాను చేసుకొనే దిగుమతులపై సగటున ఎనిమిదిశాతం పన్ను విధించింది. అమెరికా ఎప్పుడైతే వాణిజ్య యుద్దానికి దిగిందో అమెరికా వస్తువులపై పన్ను మొత్తాన్ని 20.7శాతానికి పెంచి, మిగతా దేశాలపై సగటు పన్నును 6.7శాతానికి తగ్గించింది. అమెరికా నుంచి దిగుమతులను తగ్గించి ఇతర దేశాల నుంచి పెంచుకున్నదని, ఇతర దేశాలకు తన ఎగుమతులను పెంచిందని పీటర్సన్‌ ఇనిస్టిట్యూట్‌ పేర్కొన్నది. అమెరికా ఒక వైపు తన సోయా బీన్స్‌ నుంచి బోయింగ్‌ విమానాల వరకు ఏవేవి కొనాలో జాబితా ఇస్తోంది. అదే సమయంలో ప్రభుత్వ రంగం మీద ఎక్కువగా ఆధారపడుతున్న చైనా ఆర్ధిక విధానాన్ని మార్చాలని కూడా డిమాండ్‌ చేస్తోంది. భద్రత సాకుతో చైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరింప చేయకుండా చూసేందుకు ప్రయత్నిస్తోంది. చైనాతో వాణిజ్య యుద్ధానికి దిగావు సరే మిత్ర దేశాలైన మెక్సికో, ఐరోపా దేశాల మీద కూడా తొడగొట్టటం ఏమిటయ్యా బాబూ అని ట్రంప్‌ను చూసి కొందరు అమెరికా వాణిజ్యవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. మన బోయింగ్‌లు ఎక్కువగా కొనాలని చైనా మీద వత్తిడి తెస్తే తమ ఎయిర్‌బస్‌ల సంగతేమిటని ఐరోపా దేశాలు అమెరికాను ప్రశ్నించవా, చైనాతో సఖ్యతకు ప్రయత్నించవా అని చెబుతున్నా ట్రంప్‌ వినటం లేదు.

హాంకాంగ్‌లో నిరసన తెలుపుతున్న వారి మీద తియన్మెన్‌ తరహా అణచివేతను తాము వ్యతిరేకిస్తామని, హాంకాంగ్‌లో అణచివేత చర్యలు వాణిజ్య యుద్దం మీద ప్రభావం చూపుతాయని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించి వివాదాన్ని మరో కొత్త మలుపు తిప్పాడు. ఇది చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం తప్ప మరొకటి కాదు.ఇతర సమస్యల్లో కూడా జోక్యం చేసుకొంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. హాంకాంగ్‌ నిరసనలు చైనా అంతర్గత వ్యవహారం, దానికి వాణిజ్య యుద్ధానికి సంబంధం లేదు, తమకు ఇతరుల సలహాలు అవసరం లేదని చైనా విదేశాంగశాఖ స్పష్టం చేసింది. హాంకాంగ్‌ పరిణామాలకు, వాణిజ్య యుద్ధానికి ముడిపెడితే రెండు దేశాల మధ్య తదుపరి చర్చలకు అవకాశాలుండవని అనేక మంది హెచ్చరిస్తున్నారు. జూలై 30న షాంఘైలో జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం ఇవ్వకుండానే ముగిసిన విషయం తెలిసిందే.

ఇలాంటి హెచ్చరికలు అమెరికాలో చాలా కాలం నుంచి వినపడుతున్నా ట్రంప్‌ బింకాలు పోతున్నాడు. తనతో ఒప్పందానికి చైనా సిద్దంగా వుందని తాను సిద్దంగా లేనని, ముందు హాంకాంగ్‌ సమస్యను అదెలా పరిష్కరిస్తుందో చూస్తానంటూ ట్రంప్‌ వాచాలత్వాన్ని ప్రకటించాడు. మాంద్య భయాలేమీ లేవని, వాణిజ్య పోరుతో తమకేమీ నష్టం లేదని వైట్‌ హౌస్‌ యంత్రాంగం భావిస్తున్నదని రాయిటర్స్‌ పేర్కొన్నది. మాంద్య భయంతో గత బుధవారం నాడు అమెరికా స్టాక్‌ మార్కెట్‌ మూడుశాతం పతనమైంది. 2009 మాంద్య తరువాత అమెరికా ఫెడరల్‌ రిజర్వు, ఇతర 19దేశాల రిజర్వుబ్యాంకులు పెద్ద మొత్తంలో తమ వడ్డీరేట్లను తగ్గించాయి. ఈ అధ్యక్షుడు ప్రపంచ ఆర్ధిక వ్యవస్దనే మాంద్యంలోకి నెడుతున్నాడని డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులలో ఒకరైన బెటో ఒ రూర్కీ ఒక టీవీ ఛానల్‌లో పేర్కొన్నాడు.

Image result for DONALD Trump willing to trigger a two-month recession

విదేశాంగ విధానం అంటే న్యూయార్క్‌ రియలెస్టేట్‌లో పోటీదార్లను బెదిరించి తాను చేసుకున్న లాభదాయకమైన ఒప్పందాలు అనుకుంటున్నట్లుగా వుంది, రెండు దేశాల మధ్య సంబంధాలు అలా వుండవని తెలుసుకోవాలని ట్రంప్‌కు ఒక విశ్లేషకుడు సలహా ఇచ్చాడు. అదిరించి బెదిరించి చైనా నేత గ్జీ జింపింగ్‌ను దారికి తెచ్చుకుందామని చూస్తే కుదరదు.చైనా అమ్ముల పొదిలో అనేక అస్త్రాలున్నాయి. అమెరికా దాని దగ్గర తీసుకున్న 1.2లక్షల కోట్ల డాలర్ల రుణ పత్రాలు(బాండ్లు)న్నాయి. వాటిని గనుక అమ్మేస్తే అమెరికా పరిస్ధితి ఏమిటి? దాని దగ్గర ఎక్కడా దొరకని విలువైన ఖనిజం(మట్టి) వుంది, అన్నింటికీ మించి తన కరెన్సీ విలువను తగ్గించి నిలబడగల సత్తా వుందని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. అమెరికాలో చైనా ప్రత్యక్ష పెట్టుబడులు 2018లో 83శాతం తగ్గాయి. ఇప్పటికే వాణిజ్య యుద్దం అమెరికా వార్షిక వృద్ధి రేటును నాలుగు నుంచి రెండుశాతానికి దించింది. ప్రపంచం మరోసారి మాంద్యానికి దగ్గర అవుతోంది. ప్రపంచం దృష్టిలో స్వేచ్చా ప్రపంచపు రాజధాని వాషింగ్టన్‌ ఇప్పుడు బీజింగ్‌వైపు తిరిగింది. ఒక పోలీసు రాజ్యం బాధిత దేశంగా మారింది. స్వేచ్చా వాణిజ్యం గురించి వుదారవాద ప్రజాస్వామ్యాలకు కమ్యూనిస్టు నాయకత్వం ఇప్పుడు పాఠాలు చెబుతోంది అంటూ ఒక విశ్లేషకుడు వాపోవటం అమెరికా ఏ పరిస్ధితికి లోనైందో వెల్లడిస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తన వలలో తానే చిక్కుకున్న ట్రంప్‌ ?

07 Wednesday Aug 2019

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Currency war, Donald trump trade war, Rupee, TRADE WAR, Trump Sets Trap for China, US-CHINA TRADE WAR, yuan

Image result for worried Donald trump

ఎం కోటేశ్వరరావు

చైనాకు వలపన్నినట్లు సంబరపడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తానే దానిలో చిక్కుకున్నాడా ? అదే జరిగిందని బ్లూమ్‌బెర్గ్‌ మీడియా సంపాదకవర్గం వ్యాఖ్యానించింది. ‘చైనాతో వాణిజ్య యుద్దంలో ఎల్లవేళలా పైచేయిగా వున్నట్లు కనిపిస్తున్నారు. అయితే ఆర్ధిక బాధను తట్టుకొనే చైనా సామర్ద్యాన్ని తక్కువగా అంచనా వేశారు. ఎదుటి వైపు నుంచి ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు లేకుండానే గతవారంలో పన్నుల పెంపు బెదిరింపులకు పాల్పడ్డారు. అనేక విధాలుగా వాటిని తిప్పికొడుతున్న చైనా కరెన్సీ యుద్ధానికి కూడా తాను సిద్దం అన్న హెచ్చరిక చేసింది.అది స్టాక్‌ మార్కెట్‌కు మాత్రమే కాదు మాంద్య ముప్పును కూడా ముందుకు తెచ్చింది. ప్రత్యర్ధిని ఒక మూలకు నెట్టేందుకు ప్రయత్నించిన ట్రంప్‌ ఆర్ధిక వ్యవస్ధను రక్షించుకొనే చర్యలేమీ లేకుండానే తన వలలో తానే చిక్కుకున్నాడు.’ అని పేర్కొన్నది.

తాను విధించిన పన్నుల దెబ్బకు చైనా అతలాకుతలం అయిందని ట్రంప్‌ చెప్పింది అబద్దం అని తన కరెన్సీ పతనాన్ని అనుమతించిన చైనా చర్య స్పష్టం చేసిందని కార్ల్‌ స్మిత్‌ పేర్కొన్నాడు. రెండు పక్షాలూ ఫలవంతమైన చర్చలు జరపకుండా చైనాను కరెన్సీ బెదిరింపుల వైపు నెడితే అది చివరకు ప్రపంచ కరెన్సీ అంతానికి దారి తీస్తుందని జార్జి మాగ్నస్‌ వ్యాఖ్యానించాడు. ఫెడరల్‌ రిజర్వు(అమెరికాకు మన రిజర్వుబ్యాంకు వంటిది) విధి ఆర్ధిక వ్యవస్ధను స్ధిరంగా వుంచటం, కనుక ట్రంప్‌ ఎప్పుడు ఆర్ధిక వ్యవస్ధను అస్ధిరపరిస్తే అప్పుడు అది రంగంలోకి దిగి వడ్డీ రేట్లను తగ్గించాలి. ఈ విధంగా ఫెడరల్‌ రిజర్వును కూడా వూబిలోకి దించుతున్నట్లే అని, ఇది రాజకీయంగా కూడా రాజీపడుతున్నట్లు కనిపిస్తున్నదని కార్ల్‌ స్మిత్‌ వ్యాఖ్యానించాడు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో ఆర్ధిక మందగమనం లేదా మాంద్యానికి ఫెడరల్‌ రిజర్వు కారణమని విమర్శించాడు, ఇప్పుడు తనను తాను అంతకంటే పెద్ద బలిపశువుగా చేసుకుంటున్నారని, 2020వరకు మెరుగుపడే ధోరణి కనిపించటం లేదని బ్రెయిన్‌ చపట్టా పేర్కొన్నారు. ద్రవ్యవిధానం గురించి మౌలికమైన తప్పుడు అభిప్రాయాలతో ట్రంప్‌ పని చేస్తున్నట్లు కనిపిస్తోందని పొన్నూరు రమేష్‌ వ్యాఖ్యానించారు. ద్రవ్య పరిస్ధితిని సరళతరం మరియు డాలర్‌ను బలహీన పరచి వడ్డీ రేట్లను తగ్గించటం ద్వారా ఆర్ధిక వ్యవస్ధకు బలం చేకూర్చాలనుకోవటం వాటిలో ఒకటి అన్నారు. మిగతా ప్రపంచం కూడా అదే చేస్తే ఆ లబ్ది త్వరలోనే అంతర్దానం అవుతుంది. ప్రస్తుతం 14.5లక్షల కోట్ల ప్రపంచ రుణ మార్కెట్‌లో వస్తున్న వడ్డీ సున్నా కంటే తక్కువ వుండటంతో వడ్డీరేట్లు కృష్ణ బిలాల్లోకి పోతున్నాయని మార్క్‌ గిల్‌బర్ట్‌ వ్యాఖ్యానించారు. ప్రతికూల వడ్డీ రేట్లతో జర్మన్‌ పొదుపుదార్లను ఐరోపా కేంద్రబ్యాంకు శిక్షించకూడదని టైలర్‌ కోవెన్‌ పేర్కొన్నారు.

2008తరువాత తొలిసారిగా సోమవారం నాడు చైనా కరెన్సీ యువాన్‌ విలువ ఒక డాలర్‌కు ఏడుకు పడిపోయింది. అమెరికా సాగిస్తున్న వాణిజ్య యుద్దాన్ని ఎదుర్కొనేందుకు చైనా కరెన్సీదాడికి దిగిందని అమెరికన్లు ఆరోపిస్తున్నారు. సెప్టెంబరు ఒకటవ తేదీ నుంచి 300 బిలియన్‌ డాలర్ల చైనా వస్తువుల మీద పదిశాతం దిగుమతి విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించాడు. తాముగా యువాన్‌ విలువను పతనం చేయలేదని, అమెరికా తీసుకుంటున్న చర్యల పర్యవసానమని చెబుతోంది. దిగుమతి పన్నుల పెంపుతో తమ వస్తువుల ధర పెరగకుండా చూసుకొనేందుకు యువాన్‌ విలువ పతనాన్ని అడ్డుకోకుండా చైనా కేంద్రబ్యాంకు వ్యవహరించిందని వార్తలు వచ్చాయి. తాజా పరిణామాలతో వాణిజ్య యుద్దం మరింత తీవ్రం అవుతుందనే భయాలు వెల్లడయ్యాయి. ఇదే జరిగితే మన వంటి దేశాల మార్కెట్ల నుంచి పెట్టుబడిదారులు తమ సొమ్మును వెనక్కు తీసుకుంటారు.

యువాన్‌తో మన రూపాయి విలువ కూడా పతనమైంది. యువాన్‌ పతనమైతే వర్ధమాన దేశాలు తమ ఎగుమతులు గిట్టుబాటుగా వుండేందుకు తమ కరెన్సీ విలువలను కూడా తగ్గించుకుంటాయి. అయితే ప్రస్తుతం మన రూపాయి విలువ పతనం కావటానికి పూర్తిగా యువాన్‌ సంక్షోభం కాదని ఇతర అంశాలు తోడైనట్లు కొందరు, వుండాల్సినదాని కంటే విలువ ఎక్కువ వుందని మరి కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. రూపాయి పతనం చెడుకానప్పటికీ ఇతర పర్యవసానాలు వుంటాయి. వడ్డీ రేట్లను పెద్దగా తగ్గించేందుకు అవకాశాలు తగ్గుతాయి. వడ్డీ రేటు ఎక్కువగా, బలమైన రూపాయి వుంటేనే విదేశీ పెట్టుబడిదారులు మన దేశానికి రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తారు.యువాన్‌ పతనమైతే చైనా నుంచి సరకులను దిగుమతి చేసుకొనే వారికి లబ్ది కలుగుతుంది. ట్రంప్‌ కనుక దిగుమతులపై ఇంకా సుంకాలను పెంచితే యువాన్‌ విలువ ఇంకా పతనం అవుతుందని భావిస్తున్నారు.ఇదే జరిగితే రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు ఇంకా పెరిగి అమెరికా నష్టపోనుంది.

The days of this polite deference are over.

చైనాను రెచ్చగొట్టేందుకు అమెరికా అస్త్రాలు హాంకాంగ్‌, తైవాన్‌ !

మరో వైపు రెచ్చగొట్టేందుకు అమెరికా అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. దానికి ధీటుగా చైనా తాను చేయాల్సింది చేసుకుపోతోంది. ఒక వైపు హాంకాంగ్‌లో అల్లర్లను రెచ్చగొట్టి ఏదో ఒక పెద్ద వుదంతం జరిగేలా చూసేందుకు అమెరికా చేయాల్సిందంతా చేస్తోంది. మరోవైపున తైవాన్‌కు తాజాగా 220 కోట్ల డాలర్ల మేర ఆయుధాలను విక్రయించేందుకు నిర్ణయించి చైనాను రెచ్చగొడుతోంది. చైనా నుంచి 300బిలియన్‌ డాలర్ల దిగుమతులపై పదిశాతం సుంకాన్ని పెంచనున్నట్లు ట్రంప్‌ ప్రకటించాడు. దానికి ప్రతిగా చైనా యువాన్‌ విలువను తగ్గించటం లేదా పతనాన్ని నిరోధించకుండా చైనా వుపేక్షించిందని వార్తలు వచ్చాయి.

హాంకాంగ్‌ ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా నేరాలు చేసిన వారిని విచారించేందుకు ప్రధాన భూ భాగానికి అప్పగించేందుకు వుద్దేశించిన బిల్లును ఆమోదించరాదనే డిమాండ్‌తో అక్కడ తొమ్మిది వారాల క్రితం ఆందోళన ప్రారంభమైంది. ఆ ప్రతిపాదనను వెనక్కు తీసుకున్నామని, అది రద్దయినట్లే అని పాలక మండలి ప్రకటించిన తరువాత కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. అలాంటి బిల్లును ఎన్నడూ పెట్టకూడదు అంటూ ఆందోళనకారులు పాలనా మండలి భవనం మీద దాడి చేశారు. రోజుకో పేరుతో ఆందోళనకు వీధుల్లోకి వస్తూ పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది మీద దాడులు చేసి రెచ్చగొట్టటం, తద్వారా శాంతి భద్రతల పరిస్ధితిని సృష్టించేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు. అంతే కాదు, తమకు మరింత ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం కావాలని కూడా డిమాండ్‌ చేస్తున్నారు. దానికి బ్రిటన్‌, అమెరికా తదితర దేశాలు వంతపాడుతున్నాయి.

తాజాగా ఐదు రోజుల నిరవధిక ఆందోళన పిలుపులో భాగంగా సోమవారం నుంచి మెట్రో స్టేషన్లలో ప్రవేశించి ప్రయాణీకులను దించి వేయటం, తలుపులను మూసుకోకుండా చేసి రైళ్లను కదలనివ్వకుండా అడ్డుకుంటున్నారు. దానిలో భాగంగానే విమానాశ్రయాల్లో ప్రవేశించి తిష్టవేయటం, విధి నిర్వహణలో వున్న సిబ్బందిని అడ్డుకోవటం, ప్రయాణీకులను భయభ్రాంతులకు గురి చేయటం వంటి చర్యలనూ ప్రారంభించారు. ఇంతగా రెచ్చగొట్టినప్పటికీ పాలనా యంత్రాంగం, స్ధానిక పోలీసులు ఎంతో సంయమనం పాటిస్తున్నారు. ఇదే మరొక చోట అయివుంటే ఏమి జరిగి వుండేదో అర్ధం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా మిలిటరీ దళాలను రంగంలోకి దించేందుకు పాలక మండలికి అవకాశం వున్నప్పటికీ వాటిని వుపయోగించలేదు. ఆందోళనకారుల వెనుక అమెరికా ఇతర దేశాల హస్తం వుందని గ్రహిస్తున్న వారు రోజు రోజుకూ పెరుగుతున్నారు. మరోవైపు శాంతి భద్రతల సమస్యను సృష్టించే విధంగా ఆందోళనకారుల చర్యలు వున్నాయి. ఈ పూర్వరంగంలో చైనా ప్రభుత్వం ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు పూనుకున్నట్లు ముఖ్యంగా పశ్చిమ దేశాల మీడియాలో వీటి గురించి చిలవలు పలవలుగా కధనాలు వండి వార్చుతున్నది. మిలిటరీని దించబోతున్నారన్నది వాటిలో ఒకటి.

జూన్‌ తొమ్మిది నుంచి ఇప్పటి వరకు చట్టవిరుద్దంగా సమావేశాలు జరపటం, పోలీసుల మీద దాడి, కొట్లాటలకు దిగటం వంటి చర్యల్లో పాల్గొన్నందుకుగాను 420 మందిని అదుపులోకి తీసుకోగా వారిలో ఒక్క సోమవారం నాడు అరెస్టు చేసిన వారే 82 మంది వున్నారు. కొందరు సిబ్బంది సమ్మెకారణంగా 170 విమానాలు నిలిచిపోయాయి. వారాల తరబడి జరుగుతున్న ఆందోళనల కారణంగా ఆర్ధికంగా కొన్ని రంగాలు దెబ్బతిన్నాయి. టూరిజం, దాని సంబంధిత కార్యకలాపాలు, దుకాణాల్లో అమ్మకాలు, స్టాక్‌ మార్కెట్లో సూచీలు పడిపోయాయి. హాంకాంగ్‌ పాలనా మండలి అధ్యక్షురాలు లామ్‌ రాజీనామా చేయాలన్నది ఆందోళనా కారుల డిమాండ్లలో ఒకటి. అయితే తాను పదవి నుంచి తప్పుకోబోవటం లేదని,నగరంలో పరిస్ధితి ప్రమాదకరంగా మారుతోందని చెప్పారు. నిరసన తెలిపే హక్కును గౌరవిస్తామని అదే సమయంలో నిరసనకు దూరంగా వున్న వారి హక్కులను నిరసనకారులు కూడా గౌరవించాలని అన్నారు. ఆందోళన ప్రారంభంలో చేసిన డిమాండ్లకు బదులు ఇప్పుడు కొత్తవాటిని ముందుకు తెస్తున్నారని, ప్రాణాలకు సైతం తెగించి అమీ తుమీ తేల్చుకుంటామని చెబుతున్నారని ఆమె చెప్పారు.మరోవైపున ఆందోళన నిర్వహిస్తున్న వివిధ బృందాలలో అంతర్గత విబేధాలు కూడా వెల్లడయ్యాయి.శాంతియుత నిరసన స్ధానంలో హింసాపూరితమైన వేర్పాటు వాదశక్తులు ప్రవేశించారని సామాజిక మాధ్యమంలో కొందరు విమర్శించారు. 2016 జూలై ఒకటిన ఇచ్చిన నిరసన పిలుపు విఫలం కావటంతో తీవ్రవాద బృందాల మధ్య మీరంటే మీరు కారకులనే ఆరోపణలు చివరకు దెబ్బలాటలకు దారితీశాయని పరిశీలకులు గుర్తుచేశారు.

ఆందోళనకారులపై మిలిటరీ చర్య తీసుకుంటే చైనా ఆర్ధిక వ్యవస్ధకే నష్టమని అమెరికా టీవీ సిఎన్‌ఎస్‌ బెదిరించింది. హాంకాంగ్‌ వీధుల్లో చైనా మిలిటరీ కవాతు గురించి కొద్ది వారాల క్రితం వూహించ లేదని ఇప్పుడు ఆ అవకాశం కనిపిస్తోందని వ్యాఖ్యాత పేర్కొన్నారు. నిరసనకారుల హింసాకాండను సహించరాదని హాంకాంగ్‌లోని కమాండర్‌ గత వారంలో చేసిన వ్యాఖ్యను వుటంకిస్తూ మిలిటరీ రంగంలోకి దిగే అవకాశం వుందని అమెరికా మీడియా చెబుతోంది.1989లో తియన్మెన్‌ మాదిరి జరగవచ్చని వూహాగానాలను కుమ్మరిస్తోంది. హాంకాంగ్‌లో పరిస్ధితి చేయిదాటిపోయినపుడు అక్కడ వున్న ఆరువేల మంది సైన్య సహాయం కోరేందుకు అక్కడి పాలనా వ్యవస్ధకు చట్టబద్దమైన అవకాశం వుంది.

ఒకే దేశం రెండు వ్యవస్ధలు అనే విధానాన్ని అమలు జరిపి 2050వరకు చైనాలో విలీనమైన హాంకాంగ్‌, మకావో దీవుల్లో విలీనానికి ముందున్న వ్యవస్ధలనే కొనసాగిస్తామని చైనా వాటి అప్పగింతల సమయంలో బ్రిటన్‌, పోర్చుగీసులతో ఒక ఒప్పందం చేసుకుంది. అందువలన అనేక బహుళజాతి కంపెనీలకు ఇప్పటికీ హాంకాంగ్‌ ఒక కేంద్రంగా కొనసాగుతోంది. దీని వలన చైనాకు ఎంతో లబ్ది కలుగుతోంది. ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం పేరుతో ఆందోళన నిర్వహిస్తున్నవారి వెనుక ఆమెరికా హస్తం వుందని ఇప్పటికే చైనా విమర్శించింది. ఆందోళనలతో హాంకాంగ్‌ ఆర్ధిక వ్యవస్ధను చిన్నాభిన్నం చేయటం ద్వారా చైనాకు నష్టం కలిగించాలన్న దుష్టాలోచన కూడా అమెరికాకు వుందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. తన మార్కెట్‌ను అంతర్జాతీయ కంపెనీలకు పూర్తిగా తెరవకుండానే హాంకాంగ్‌ ద్వారా చైనా లబ్ది పొందుతోంది.2016లో చైనాకు వచ్చిన ఎఫ్‌డిఐలో 61శాతం హాంకాంగ్‌నుంచే వుందని సిఎన్‌ఎన్‌ పేర్కొన్నది. చైనా సైన్యం కనుక ఆందోళనకారులను అణచివేస్తే ప్రపంచ స్టాక్‌మార్కెట్లో హాంకాంగ్‌కు వున్న ఐదవ స్దానం తీవ్రంగా పడిపోతుందని, కంపెనీలు సింగపూర్‌కు తరలిపోతాయని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారు. హాంకాంగ్‌కు వున్న సానుకూల వాణిజ్య హోదాను రద్దు చేయాల్సి వుంటుందని కొంత మంది అమెరికా ఎంపీలు బెదిరించారు. ఒక వేళ సైన్యాన్ని దించి మరో తియన్మెన్‌ వుదంతం పునరావృతమైతే దాన్ని ప్రపంచానికంతటికీ ప్రత్యక్ష ప్రసారం చేస్తారని ఆస్ట్రేలియాకు చెందిన బెన్‌ బ్లాండ్‌ హెచ్చరించాడు.

తైవాన్‌ ఒక దేశం కాదు. ఐక్యరాజ్యసమితి వేదికలపై దాన్ని చైనాలో అంతర్భాగంగా గుర్తిస్తున్న అమెరికా శాంతియుత పద్దతుల్లో విలీనం కాకుండా చేయాల్సిందంతా చేస్తోంది.తమ కౌలు గడువు ముగిసిన తరువాత హాంకాంగ్‌ను బ్రిటీష్‌ వారు తిరిగి చైనాకు అప్పగించారు. తైవాన్‌ గత ఏడు దశాబ్దాలుగా తిరుగుబాటు రాష్ట్రంగా వుంది. దానిని స్వాధీనం చేసుకోవటానికి చైనాకు కొద్ది గంటలు చాలు, అయినా అక్కడి జనం అంగీకారంతో జరగాలి గనుక ఎలాంటి దుస్సాహసానికి పాల్పడటం లేదు.హాంకాంగ్‌ విలీనమైనా అక్కడి పరిస్ధితుల కారణంగా వెంటనే ప్రధాన భూభాగంతో మమేకం చేయకుండా ఒకే దేశం, రెండు వ్యవస్ధల పేరుతో 2050వరకు అక్కడ వున్న పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని, ప్రత్యేక పాలనా వ్యవస్ధను ఏర్పాటు చేస్తామని విలీన సమయంలో ఒక హామీ పత్రం రాసి ఇచ్చింది. ఇదే సూత్రాన్ని తైవాన్‌కు కూడా వర్తింప చేసేందుకు చైనా ఆ విధానాన్ని ఎంచుకుంది. పోర్చుగీసు కౌలు నుంచి విలీనమైన మకావో దీవులకు కూడా ఇదే సూత్రాన్ని వర్తింప చేసింది.

Image result for worried Donald trump

తాజాగా తైవాన్‌ ప్రభుత్వానికి 220 కోట్ల డాలర్ల విలువ గల ఆయుధాలను విక్రయించాలని అమెరికా నిర్ణయించుకుంది. తైవాన్‌ స్వాతంత్య్రానికి మద్దతు ఇస్తున్నాం కనుక తాము ఆయుధాలు విక్రయిస్తాం అంటూ అమెరికా అడ్డగోలు వాదనలు చేస్తోంది. అమెరికా చర్యకు ప్రతిగా చైనా మిలిటరీ విన్యాసాలు నిర్వహించింది. ఇంకేముంది చూడండి తైవాన్‌ స్వాతంత్య్రం కోరే వారిని భయపెట్టేందుకే అవని అమెరికా నానాయాగీ చేస్తోంది. సాధారణ కార్యకలాపాల్లో భాగంగానే మిలిటరీ విన్యాసాలు నిర్వహించాలని చైనా నిర్ణయించింది. అయితే ఈ చర్య తైవాన్‌ స్వాతంత్య్రం కోరుకొనే వారిని బెదిరించటమే అని అమెరికా మీడియా వక్రీకరిస్తోంది. తైవాన్‌ను చైనా స్వాధీనం చేసుకోకుండా వుండేందుకే తాము ఆయుధాలు అందచేస్తున్నామని, ఆ ప్రాంతానికి మిలిటరీని తరలిస్తున్నామని అమెరికా ఎప్పటి నుంచో చెబుతోంది.

ఈ పూర్వరంగంలో పరిస్ధితులు ఎటువైపు దారితీస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. నిరసనకారులు ఎంతగా రెచ్చగొడుతున్నా వారి మీద స్ధానికుల్లో వ్యతిరేకత మరింత పెరిగే వరకు మౌనంగా వున్నవారు నిరసనకు వ్యతిరేకంగా గళం విప్పే వరకు హంకాంగ్‌ విషయంలో చైనా వేచి చూసే అవకాశం వుంది. తైవాన్‌కు ఆయుధాలు విక్రయించటం అమెరికాకు ఇదే కొత్త కాదు. ఇక వాణిజ్య యుద్దం మరింత ముదురనున్నదనే వార్తల పూర్వరంగంలో చైనా కరెన్సీ యుద్ద రంగాన్ని తెరిచేందుకు నిర్ణయించిందా అనే సందేహాలు కలుగుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా వృద్ధి రేటు పతనం ఎవరికి లాభం, ఎవరికి నష్టం ?

17 Wednesday Jul 2019

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

China, china’s economic growth, china’s economic growth slides, Donald trump, world Trade

Image result for china’s economic growth slides

ఎం కోటే శ్వరరావు

ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో 6.4శాతంగా వున్న తమ వృద్దిరేటు రెండవ త్రైమాసిక కాలంలో 6.2శాతానికి తగ్గిందని, ఇది గడచిన ఇరవై ఏడు సంవత్సరాలలో కనిష్టం అని చైనా ప్రకటించింది. ఈ పరిస్ధితి లాభమా నష్టమా అనే చర్చ ప్రపంచ వ్యాపితంగా మీడియాలో ప్రారంభమైంది. అనుకూల వార్తలను తప్ప ప్రతికూల, విమర్శనాత్మక వైఖరులను సహించే పరిస్ధితి దేశంలో రోజు రోజుకూ దిగజారుతోంది. ఎదుటి వారి బలహీనతలను వినియోగించుకొని లబ్ది పొందాలని చెప్పేవారిని దేశ భక్తులుగానూ, మంచి చెడ్డలను వివరించి వైఖరులు మార్చుకోవాలని కోరే వారిని దేశద్రోహులనేంతగా పరిస్ధితులు వున్నాయి. ఎదుటి వారి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవాలని ఎలా చూస్తామో ఎదుటి వారు కూడా అదే ప్రయత్నం చేస్తారనే చిన్న తర్కం తట్టకపోతే వచ్చే సమస్య ఇది. ప్రపంచ వ్యాపితంగా ప్రతి దేశం స్వేచ్చా వాణిజ్యం, విధానాల గురించి ఎన్ని కబుర్లు చెప్పినా ఎవరికి వారు రక్షణాత్మక చర్యలను ఎక్కువగా తీసుకుంటున్న రోజులివి. ప్రతికూలతలను మనం మూసిపెడితే ప్రపంచానికి తెలియకుండా పోతుందా? మంచి చెడ్డలను చర్చించిన వారు దేశద్రోహులు కాదు అసలైన దేశ భక్తులని ముందుగా చెప్పాలి.

తాము విధించిన పన్నుల కారణంగానే చైనా ఆర్ధిక వ్యవస్ధ పతనమైందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. తమ చర్యలు పన్నులు లేని దేశాలకు తరలిపోవాలని అనుకుంటున్న కార్పొరేట్‌ కంపెనీల నిర్ణయాలను ప్రభావితం చేయటమే కాదు, అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొనేలా చైనాపై వత్తిడిని పెంచుతున్నాయని కూడా ట్రంప్‌ పేర్కొన్నారు. వేలాది కంపెనీలు వెళ్లిపోతున్న కారణంగానే తమతో ఒప్పందం చేసుకోవాలని చైనా కోరుకుంటోందని, తమకు పెద్ద మొత్తంలో ఆదాయం వస్తోందని, రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుందని, విలువ తగ్గించటం ద్వారా ఆ మొత్తం చైనాయే చెల్లిస్తోందని కూడా ఆ పెద్దమనిషి చెప్పాడు. అయితే అమెరికా ఆర్ధికవేత్తలు ఇలాంటి వైఖరులను తోసిపుచ్చుతున్నారు. చైనా వుత్పత్తులపై విధించే దిగుమతి పన్ను కారణంగా ధరల పెరుగుదల వలన ఆ మొత్తాన్ని వినియోగదారులే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. రెండువందల బిలియన్‌ డాలర్ల విలువగల చైనా వుత్పత్తులపై అమెరికా 25శాతం పన్ను విధిస్తే, అరవై బిలియన్‌ డాలర్ల విలువగల అమెరికా వస్తువులపై చైనా కూడా అంతే మొత్తంలో పన్ను విధిస్తోంది. మరో 325 బిలియన్‌ డాలర్ల చైనా వస్తువులపై పది నుంచి 25శాతం మేర పన్ను విధిస్తామని ట్రంప్‌ బెదిరిస్తున్నాడు. ఇరుదేశాల వాణిజ్యంలో చైనాది పైచేయిగా వుంది. అమెరికా దిగుమతులు 540 బిలియన్‌ డాలర్లుండగా చైనా దిగుమతులు కేవలం 120 బిలియన్‌ డాలర్లు మాత్రమే. ఈ తేడాను తగ్గించేందుకు తమ వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలంటూ అమెరికా బలవంతం చేస్తోంది.

చైనా ఆర్ధికవృద్ధి రేటు పడిపోవటం అమెరికాకు చెడు వార్త అని అసోసియేటెడ్‌ ప్రెస్‌ ఏజన్సీ విశ్లేషణ పేర్కొన్నది. దాని సారాంశం ఇలా వుంది. చైనా ఆర్ధిక మందగమనం వచ్చే ఏడాది కూడా కొనసాగవచ్చు. ఇది ప్రపంచవ్యాపిత పర్యవసానాలకు దారి తీస్తుంది.చిలీ రాగి మొదలు ఇండోనేషియా బొగ్గు వరకు చైనా ఫ్యాక్టరీలకు జరుగుతున్న ముడిసరకుల సరఫరాపై ప్రభావ చూపవచ్చు. దక్షిణాఫ్రికా వుత్పత్తిలో ఈ శతాబ్ది ప్రారంభంలో రెండుశాతం చైనాకు ఎగుమతి అవుతుండగా ప్రస్తుతం 15శాతానికి చేరాయి. కాంగో ఎగుమతుల్లో 45శాతం చైనాకే వున్నాయి. ఇలాంటి దేశాలన్నీ చైనా పెట్టుబడుల మీద ఆధారపడి వున్నాయి. పీటర్సన్‌ సంస్ధ వివరాల ప్రకారం ఏప్రిల్‌ నెలలో ఆస్ట్రేలియా ఎగుమతుల్లో 35, బ్రెజిల్‌ 30, దక్షిణకొరియా 24శాతం వుత్పత్తులు చైనాకు ఎగుమతి అవుతున్నాయి. మందగమనం కారణంగా చైనా అంతర్గత వినియోగం పడిపోతే ఈ దేశాలే కాదు చైనాలో వస్తువిక్రయాలు చేస్తున్న అమెరికన్‌ కంపెనీల ఆదాయం, లాభదాయకత, వాటాల విలువ మీద ప్రతికూల ప్రభావం పడుతుందని సిరాకాస్‌ విశ్వవిద్యాలయ ఆర్ధికవేత్త మేరీ లవ్లీ చెప్పారు. అంతిమంగా వాటాల ధరలు బలహీనమైతే అది అమెరికా వినియోగదారుల, ఆర్ధిక వ్యవస్ధపై వున్న విశ్వాసాన్నే దెబ్బతీస్తుందని కూడా ఆమె అన్నారు. చైనా ఆర్ధిక వ్యవస్ధ దిగజారిందని ట్రంప్‌ సంతోషంగా వుండవచ్చు గానీ ఇది జాగ్రత్తగా వుండాల్సిన పరిణామం అని ఆమె హెచ్చరించారు. ట్రంప్‌ ఒక్క చైనా మీదనే కాదు, ఇతర అనేక దేశాల మీద పన్నులు విధిస్తున్నారు. ఆ దేశాల వారు బదులు తీర్చుకుంటున్నందున మొత్తంగా ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులు దెబ్బతింటున్నాయి. వార్షిక అభివృద్ది లక్ష్యం 6నుంచి 6.5శాతం వుండే విధంగా వినియోగం పెంచేందుకు చైనా చర్యలు తీసుకుంటోంది.

చైనాలో జరిగే పరిణామం మన దేశం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ కూడా జరుగుతోంది.ఈ ఏడాది జనవరి 22 నాటి ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక విశ్లేషణ సారాంశం ఇలా వుంది. చైనా తొలిసారిగా వుత్పాదక కార్యకలాపాలు పడిపోయాయి. ఎగుమతులు, దిగుమతులూ తగ్గాయి. కొన్ని సంస్ధల సామర్ధ్య వినియోగం 40,50శాతం మధ్య వుంది. చైనాలో వస్తు డిమాండ్‌ పడిపోతే దాని ప్రభావం ప్రపంచవ్యాపితంగా వుంటుంది.ఈ శతాబ్ది ప్రారంభంలో ప్రపంచ ఆర్ధిక కార్యకలాపాల్లో చైనా వాటా ఏడుశాతం మాత్రమే వుండగా ఈ ఏడాది 19శాతానికి చేరనుంది. చైనా పరిశ్రమ అంతర్జాతీయ సరఫరా గొలుసుతో ముడిపడి వుంది. అనేక వస్తువుల ధరలను ప్రస్తుతం చైనా ఆర్ధిక వ్యవస్ధ నిర్ణయించే స్ధితిలో వుంది. ప్రపంచంలో వినియోగించే వుక్కు, రాగి, బొగ్గు, సిమెంట్‌లో సగం చైనాకు పోతోంది.అది కొనటం ఆపివేస్తే ధరలు పడిపోతాయి. డిమాండ్‌ పడిపోకుండా చూసేందుకు చైనా తక్షణ నిర్మాణ పధకాలను చేపట్టింది, పన్నులను తగ్గించింది. కొన్ని దిగుమతి పన్నులను తగ్గించింది.చిన్న సంస్ధలకు రుణాలను పెంచింది, బ్యాంకుల వద్ద నిల్వధనాన్ని తగ్గించింది.వడ్డీల తగ్గింపునకు చర్యలు తీసుకుంది. పెద్ద సంఖ్యలో వుద్యోగాలు రద్దు కాకుండా వుద్దీపన చర్యలు తీసుకుంది. ప్రస్తుతం భారత్‌ నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో చైనా వాటా 4.39శాతం.అక్కడి నుంచి 16శాతం వస్తువులను దిగుమతి చేసుకుంటున్న కారణంగా మన దేశం మీద ప్రభావం పెద్దగా పడకపోవచ్చు. అయితే చైనా కరెన్సీ యువాన్‌ బలహీనపడితే చైనా నుంచి దిగుమతులు చౌక అవుతాయి, దాంతో అక్కడి నుంచి వస్తువులను మన దేశంలో కుమ్మరిస్తారు. అది ఇక్కడి కంపెనీలను దెబ్బతీస్తుంది. చైనాకు ఎగుమతి చేసే ముడిసరకులు దెబ్బతింటాయి. చైనా కంపెనీలు భారత్‌కు వస్తాయి, ఇక్కడ వస్తువులను వుత్పత్తి చేస్తాయి, మౌలిక సదుపాయాల కల్పనలో చైనా సాయం తీసుకొని భారత్‌ లబ్ది పొందవచ్చు.

మరికొందరి విశ్లేషణల సారాంశం ఇలా వుంది. వాణిజ్య యుద్ధం కారణంగా కొంత మేరకు అమెరికా మార్కెట్‌ను చైనా కోల్పోవచ్చు. ఆ మేరకు మన దేశం ఆ స్ధానంలో ప్రవేశించవచ్చు అన్నది ఒక అభిప్రాయం. 2012-15 మధ్య కాలంలో ఎగుమతి మార్కెట్లో చైనా చొరబాటు 53-51శాతం మధ్య కదలాడగా దాటగా మన దేశం 27-28శాతం కలిగి వుంది. అమెరికా 48 నుంచి 43శాతానికి పడిపోయింది. 2016లో చైనా 42.57శాతానికి పడిపోగా మన దేశం 23.32కు, అమెరికా 37శాతానికి తగ్గిపోయింది. అంటే మూడు దేశాలకూ ఎగుమతుల అవకాశాలు తగ్గాయి. అయినా మన కంటే చైనా వాటా రెట్టింపుకు దగ్గరగా వుంది. పోయిన వాటాను పూడ్చుకొనేందుకు చైనా ఏం చేస్తుందనే అంశాన్ని పక్కన పెడితే మన దేశం మీద కూడా అమెరికా వాణిజ్య యుద్దం చేస్తోంది. చైనా స్ధానంలో మనం చొరబడాలంటే ఈ అంశం పరిష్కారం కావటం ఒకటి. చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వుత్పత్తుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగినవి వున్నాయి. వాటిని మనం తయారు చేసి ఎగుమతి చేయాలంటే అవసరమైన వుత్పాదక సామర్ధ్యాలను సమకూర్చుకోవటం తెల్లవారే సరికి జరిగే వ్యవహారం కాదు. 2016లో వుత్పాదక రంగంలో చైనా హైటెక్‌ వుత్పత్తుల ఎగుమతులు 25శాతం కాగా మన దేశంలో ఏడుశాతమే వున్నాయి. పన్ను ఒప్పందాలు చైనాకు 22 వుండగా మన దేశానికి రెండు మాత్రమే వున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో చొరబడాలంటే అందునా ప్రతి దేశం రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఇవి ఎంత ఎక్కువ వుంటే అంత ప్రయోజనం. ఇలాంటి తేడాలు అనేకం వున్న కారణంగా మన దేశం ఏ మేరకు లబ్దిపొందుతుంది అన్నది ప్రశ్న.

చైనా వారు ప్రకటించిన లెక్కలు దాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేంతగా లేవు, నేను గతవారం చైనాలో వున్నాను. వుత్పాదక రంగంలో మందగించిందనేది సాధారణ అభిప్రాయంగా వుంది. వేగంగా పెరుగుతున్న సేవా రంగం తిరిగి వెనుకటి స్ధాయికి తీసుకు వస్తుందనే అభిప్రాయమూ వుంది అని ఏలే విశ్వవిద్యాలయ సీనియర్‌ ఆర్ధికవేత్త స్టీఫెన్‌ రోచి చెప్పారు. మోర్గాన్‌ స్టాన్లే ఆసియా అధ్యక్షుడిగా 2007-12 మధ్య ఆయన చైనాలో వున్నారు. ప్రస్తుతం సాగుతున్న వాణిజ్య పోరు గురించి కూడా వారిలో ఎలాంటి ఆత్రత కూడా కనిపించలేదన్నారు. ఆర్ధిక మందగమన నేపధ్యంలో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవాలనే ధోరణిలో కూడా వారు లేరని, ఒక వేళ పోరు ముదిరితే దాన్ని అదుపు చేసే వ్యూహాలు కూడా వారి దగ్గర వున్నాయని చెప్పారు.

చైనా ఆర్ధికం మందగిస్తే ఏం జరుగుతుందనే అంశంపై పైన పేర్కొన్న అభిప్రాయాలతో అందరూ ఏకీభవించాలని లేదు.చర్చలో ముందుకు వస్తున్న అంశాలకు ప్రతీకగా వాటిని చూడాలి. ప్రతి దేశ ఆర్ధిక వ్యవస్ధ తాను ఎదుర్కొంటున్న సమస్యలకు తమదైన పరిష్కారాలను చూసుకోవాలి తప్ప అనుకరిస్తే ప్రయోజనం వుండదు. అనేక మంది పరిశీలకులు చెబుతున్నదాని ప్రకారం చైనా ప్రస్తుతం పెట్టుబడుల కంటే వస్తు వినియోగాన్ని పెంచే ఆర్ధిక నమూనా దిశగా ప్రయాణిస్తోంది. 2007-17 మధ్య కాలంలో చైనా గృహ వినియోగం అమెరికాతో పోలిస్తే 13శాతం నుంచి 34శాతానికి పెరిగింది. జిడిపిలో దాని వినియోగం గతేడాది 40శాతం వుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ అంచనా ప్రకారం 2017-23 మధ్య చైనా ఆర్ధిక వ్యవస్ధ 42శాతం చొప్పున(వార్షిక వృద్ధి 6.1శాతం), అమెరికా వ్యవస్ధ 13శాతం(వార్షిక వృద్ధి రెండుశాతం) పెరుగుతాయి. తరువాత వాటి వృద్ధి రేటు 8, 4శాతాల చొప్పున వుంటాయి.2026 నాటికి డాలర్లలో అమెరికా ఆర్ధిక వ్యవస్ధ స్ధాయికి చైనా చేరుకుంటుంది. 2027 నాటికి అమెరికా వినియోగంలో 74శాతం కలిగి వుంటుంది. తరువాత చైనా జిడిపి వృద్ధి రేటు ఆరుశాతం, అమెరికా రేటు నాలుగుశాతం వుంటుంది.

ఈ లెక్కలు కొంత గజిబిజిగా అనిపించవచ్చు. ఈ నేపధ్యంలో మన దేశం ఎంచుకున్న మార్గం ఏమిటన్నది చూడాల్సి వుంది. ప్రపంచ బ్యాంకు విశ్లేషణ ప్రకారం మన దేశ అభివృద్ధి అత్యధికంగా అంతర్గత డిమాండ్‌ కారణంగా జరిగింది, ఎగుమతుల అభివృద్ధి నెమ్మదిగా వుంది. కనుక కొత్త ప్రభుత్వం ఎగుమతి ఆధారిత అభివృద్ది ప్రాతిపదికగా చూడాలని సలహాయిచ్చింది. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) అంచనా ప్రకారం 2018లో ప్రపంచ వాణిజ్య వృద్ది రేటు 3.9శాతం కాగా 2019లో 3.7శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. వుత్పత్తి కూడా 3.5 నుంచి 3.3శాతానికి తగ్గనున్నట్లు తెలిపింది. ప్రపంచం వాణిజ్యం తగ్గితే అది కొన్ని దేశాల మీదనే ప్రతికూల ప్రభావం చూపదు. చివరికి దుస్తుల ఎగుమతి విషయాల్లో కూడా మన దేశం బంగ్లాదేశ్‌, వియత్నాం వంటి దేశాలతో పోటీ పడలేకపోతోంది. భారత్‌లో అంతర్గత డిమాండ్‌ ఎక్కువగా వున్న కారణంగా దిగుమతులు రెండంకెల స్ధాయికి చేరుతున్నాయని, డిమాండ్‌ను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రపంచ బ్యాంకు సూచించింది.జిడిపిలో సాధారణంగా 30శాతం మేరకు ఎగుమతులు చేయాల్సి వుండగా ఇప్పుడు పదిశాతం మేరకే వుందని, రానున్న రోజుల్లో ఎగుమతులు పెంచాలని కోరింది.

Related image

తాజాగా కేంద్రం ప్రకటించిన ఆర్ధిక సర్వే, బడ్జెట్‌లోనూ ప్రయివేటు పెట్టుబడుల ద్వారా అభివృద్ది తద్వారా ఎగుమతుల గురించి వక్కాణించారు.గత ఐదు సంవత్సరాలలో మొత్తంగా చూస్తే ఎగుమతులు పడిపోవటంతో పాటు పారిశ్రామిక మరియు వస్తుతయారీ అభివృద్ది కూడా మందగించింది. వినియోగ వస్తువుల డిమాండ్‌ కూడా పడిపోయింది. దీనికి ఒక ప్రధాన కారణం వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టకపోవటం, ఇతర కారణాలతో తలెత్తిన సంక్షోభం అన్నది అందరూ చెబుతున్నదే. ఒక్క సేవారంగంలో తప్ప ఇతర రంగాలలో తీవ్ర సమస్యలున్నప్పటికీ మనం మాత్రం వేగంగా అభివృద్ది చెందుతున్న దేశమనే తోక తగిలించుకుంటూనే వున్నాం. లేకపోతే రాజకీయంగా చెప్పుకొనేందుకేమీ వుండదు. దేశాన్ని ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధగా మార్చాలనే తపనతో మేకిన్‌ ఇండియా అనో మరొక పిలుపో ఇచ్చినా దాని వలన ఫలితాలేమీ రాలేదు. గతంలో తూర్పు ఆసియా దేశాలు, కొన్ని లాటిన్‌ అమెరికా దేశాలు ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధలతో ఒక వెలుగు వెలిగిన మాట నిజం.నాటికీ నేటికీ ఎంతో తేడా వుంది. ప్రస్తుతం ధనికదేశాలు ఎదుర్కొంటున్న మాంద్యం, ప్రతి దేశం అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలు అలాంటి అభివృద్దికి అనేక ఆటంకాలు కలిగిస్తున్నాయి. అన్నింటినీ మించి గతంలో ఆసియన్‌ దేశాలు అభివృద్ధి చెందిన సమయంలో దిగ్గజ చైనా రంగంలో లేదు. అక్కడి నుంచి దిగుమతులను అడ్డుకొనేందుకు మన దేశంతో సహా ప్రతిదేశమూ ప్రతి రోజూ ప్రయత్నిస్తున్నది. అనేక సందర్భాలలో మన వుత్పత్తులు తగినంత నాణ్యత లేవనే సాకుతో ఐరోపా, అమెరికా తిరస్కరించిన వుదంతాల గురించి వస్తున్న వార్తల గురించి తెలిసిందే.అమెరికా మన దేశం మీద కూడా వాణిజ్యపోరు సాగిస్తున్నది, మనం కూడా మన ఎలక్ట్రానిక్‌పరిశ్రమ రక్షణ కోసం కొన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. వ్యవసాయరంగంలో అలాంటి చర్యలను మరింతగా తీసుకోవాల్సి వుంది.

వేగంగా అభివృద్ధి చెందటం గురించి ప్రతి ఒక్కరూ చైనాను పదే పదే చెబుతుంటారు.అక్కడి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం అనుసరించిన సమతుల విధానం దాని విజయానికి కారణం. వుత్పాదకత పెంపుదలతో పాటు అక్కడి జన జీవితాలను ఎంతో మెరుగుపరచటం, అందుకు అవసరమైన విధంగా వేతనాలు, ఇతర ప్రోత్సాహకాల రూపంలో ఆదాయాలు కూడా పెరిగాయి. ఈ రెండో కోణాన్ని అనేక మంది చూడటం లేదు. 2008లో ప్రపంచ ధనిక దేశాల్లో తలెత్తి ఇప్పటికీ ఏదో ఒక రూపంలో కొనసాగుతున్న ఆర్ధిక మాంద్యంతో తన విధానంలోని బలహీనతను చైనా నాయకత్వం గుర్తించింది. దాన్ని సరిచేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగానే అంతర్గత వినిమయాన్ని పెంచి తగ్గిన ఎగుమతుల సమస్యను కొంత మేరకు అధిగమించింది. ఎంతగా తగ్గినా ఆరుశాతం పైగా ఆర్ధిక వృద్ది రేటు చైనాలో కొనసాగుతోంది. ఇప్పటికే దాని దగ్గర పెద్ద మొత్తంలో డాలర్లు పోగుపడి వున్నాయి కనుక తన ఆర్ధిక వ్యవస్ధను తిరిగి పరుగు పెట్టించేందుకు అవసరమైన వుద్దీపన పధకాలను చేపట్టగల సత్తా వుంది. అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఠలాయిస్తే ఇతర మార్కెట్లను సంపాదించగల శక్తి వుంది. మన దేశంలో బ్యాంకులు నిరర్ధక ఆస్తులతో, పెట్టుబడుల కొరతతో సతమతమౌతున్నాయి. అంతర్గత డిమాండ్‌ను పెంచటంతో పాటు వుపాధి కల్పనలో లోటు రాకుండా చూసుకొనేందుకు చైనాలో ప్రయివేటు రంగానికి రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఒక బ్యాంకును ఏర్పాటు చేస్తున్నారు. ధనికదేశాలతో వాణిజ్య పోరును ఎదుర్కొంటూనే సవ్యసాచిలా చైనా నాయకత్వం అనేక చర్యలు తీసుకొంటున్నది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఫలితం లేదు. మన విధానాల లోపాల్ని ముందుగా సవరించుకోవాలి. వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు మన సర్కార్‌ చెబుతున్న తప్పుడు లెక్కలను ప్రశ్నించిన వారిని దేశ ద్రోహులుగా చూస్తున్నారు. ఈ పూర్వరంగంలో అసలు మనం చెప్పే అభివృద్ది ఇతర లెక్కలను విశ్వసించి ప్రయివేటు పెట్టుబడిదారులు ముందుకు వస్తారా అన్నదే అసలు సమస్య !

Share this:

  • Tweet
  • More
Like Loading...

తీవ్ర విబేధాలను వెల్లడించిన జి 20 ఒసాకా సభ !

30 Sunday Jun 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

G20, G20 Osaka 2019, G20 Osaka 2019 summit

Image result for G20 Osaka 2019 summit revealed deep divides

ఎం కోటేశ్వరరావు

అనేక మంది వూహించినట్లు ఒసాకాలో జరిగిన జి 20 శిఖరాగ్ర సమావేశం స్పష్టమైన నిర్ణయాలు, నిర్ధిష్ట కార్యాచరణ లేకుండానే ముగిసిందని చెప్పాలి. ఆతిధ్యం ఇచ్చిన జపాన్‌ ప్రధాని మర్యాద పూర్వకంగా సభ విజయవంతమైందని చెప్పవచ్చు తప్ప ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం లేకుండా కేవలం ఆశాభావాలతో ముగిసింది. ప్రపంచీకరణ మరింత ముందుకు పోతున్న వర్తమానంలో అనేక అంతర్జాతీయ వేదికల సందర్భంగా జరిగిన పరిణామాలే పునరావృతం అయ్యాయి. నేను కూడా రాజుగారి గంగాళంలో పాలుపోయటానికే వచ్చాను గానీ నీతో ముఖ్యవిషయాలు మాట్లాడాలి పక్కకు రా అన్నట్లుగా ఒసాకాలో నేతల ద్వైపాక్షిక సమావేశాలకే ప్రాధాన్యత ఏర్పడిందన్నది స్పష్టం. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మిగతా దేశాల నేతలతో-మన ప్రధాని నరేంద్రమోడీతో సహా- జరిపిన సంప్రదింపులన్నీ మా యింటికొస్తే మీరేమి తెస్తారు, మీ ఇంటికొస్తే మాకేమి పెడతారు అన్న పద్దతుల్లో అమెరికా ప్రయోజనాల చుట్టూ చర్చలను తిప్పారు. మద్దులాట-దెబ్బలాట పద్దతిలో ఒక వైపు ట్రంప్‌తో భాయీ భాయీ అంటూనే మరో ఏకపక్ష వ్యవహారాలను సహించరాదని మిగతా దేశాల నేతలతో పరోక్షంగా అమెరికా వైఖరిని విమర్శించే ప్రకటన జారీలో మన ప్రధాని నరేంద్రమోడీ భాగస్వామి అయ్యారు.

ఈ సమావేశాల సందర్భంగా వివిధ దేశాల మధ్య వున్న వివాదాలను కూడా పలువురు నేతలు ప్రస్తావించారు. నిజానికి వాటిని వేరే సందర్భాలలో చర్చించేందుకు అవకాశం వున్నప్పటికీ జి 20ని వేదిక చేసుకోవటాన్ని బట్టి ఎవరూ ఏ విషయంలోనూ వెనక్కు తగ్గే ధోరణిలో లేరన్నది స్పష్టమైంది.నాటోలో సభ్యరాజ్యమైన టర్కీ తన మిలిటరీ అవసరాల కోసం రష్యా తయారీ ఎస్‌-400 క్షిపణులను కొనుగోలు చేయటాన్ని ఈ సందర్భంగా ట్రంప్‌ ప్రస్తావించారు. కొనుగోలుతో ముందుకు పోతే ఆంక్షలు విధిస్తామని అమెరికా బెదిరించిన విషయం తెలిసిందే.తమ వ్యవహారాల్లో రష్యా బాధ్యతారహిత, అస్ధిర కార్యకలాపాలకు దూరంగా వుండాలని బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే చెప్పారు. గతేడాది శాలిస్బరీలో సెర్గీ స్కిరిపాల్‌ మీద విషపూరిత దాడికి పాల్పడిన ఇద్దరు రష్యన్లను తమకు అప్పగించాలని పుతిన్‌తో జరిపిన భేటీలో కోరినట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశాల సందర్భంగా హాంకాంగ్‌ అంశాన్ని లేవనెత్త కూడదని తాము కోరుకుంటున్నట్లు చైనా అధ్యక్షుడు జింపింగ్‌ చెప్పారు. అయినప్పటికీ జపాన్‌ ప్రధాని షింజో అబె దాన్ని ప్రస్తావించారు. హాంకాంగ్‌ స్వాతంత్య్రాన్ని పరిరక్షించాలని కోరారు.

పందొమ్మిది దేశాలు, ఐరోపా యూనియన్‌ సభ్యురాలిగా వున్న జి20 పద్నాలుగవ శిఖరాగ్ర సమావేశం జపాన్‌లోని ఒసాకాలో ఈనెల 28,29 తేదీలలో జరిగింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో 80శాతం వుత్పత్తి, మూడింట రెండువంతుల జనాభాను కలిగివున్న దేశాలకు ప్రాతినిధ్యం వహించే ఈ బృంద సమావేశం జపాన్‌లో జరగటం ఇదే తొలిసారి. ఒకవైపు వాణిజ్య యుద్ధాలు, మరోవైపు ఇరాన్‌ మీద భౌతిక దాడులు జరుపుతామని అమెరికా బెదిరింపులకు పాల్పడిన నేపధ్యంలో ఈ సమావేశం జరిగింది. ఇతర అనేక అంశాల గురించి దేశాల నేతలు ప్రస్తావించి చర్చించినప్పటికీ ఈ సమావేశాల అజెండాలో అగ్రస్ధానం వాణిజ్య యుద్ధం ఆక్రమించింది. భారత్‌ మార్కెట్లో మరింతగా ప్రవేశించేందుకు డోనాల్డ్‌ ట్రంప్‌ అనేక వలపు బాణాలు విసిరారు. అమెరికాతో దోస్తీకి నరేంద్రమోడీ తహతహలాడుతున్నప్పటికీ అంతర్జాతీయ పరిస్ధితి, దేశీయంగా పారిశ్రామిక, వాణిజ్యవేత్తల ప్రయోజనాలు ఇమిడి వున్నందున మోడీకి ఇష్టం వుందా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా ట్రంప్‌కు దూరంగా వుండాల్సి వచ్చినట్లు కనిపిస్తోంది. స్వేచ్చా, న్యాయమైన, వివక్షలేని, పారదర్శక, స్ధిరమైన వాణిజ్యం, పెట్టుబడుల వాతావరణాన్ని కల్పించేందుకు సభ్యదేశాలు పని చేయాలని సమావేశం జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచ వాంఛలకు విరుద్దంగా పర్యావరణ పరిరక్షణపై కుదిరిన పారిస్‌ ఒప్పందం నుంచి వైదొలగాలన్న తన నిర్ణయంతో మార్పు లేదని అమెరికా స్పష్టం చేయటంతో ఈ అంశంపై పడిన పీఠముడి విడిపోలేదు. పర్యావరణానికి హానిచేసే విషవాయువుల విడుదలను తగ్గించాలన్నది ఆ ఒప్పంద సారం. దాన్ని తాము అమలు జరిపితే తమ కార్మికుల, పన్ను చెల్లింపుదార్ల ప్రయోజనాలకు హాని కలుగుతుందంటూ అమెరికా ఆ ఒప్పందంతో తనకు సంబంధం లేదంటోంది.

తన పంతం నెగ్గించుకోవాలని, తన కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడాలని అమెరికా ఎంత ప్రయత్నించినప్పటికీ దాని ఆటలు సాగలేదనే చెప్పాలి. చైనాలోని హువెయ్‌ టెలికాం కంపెనీ వుత్పత్తులు ఇంతకాలం తన భద్రతకు ముప్పు అని ప్రకటించి వాటిని కొనుగోలు చేయరాదని ఇతర దేశాలను కూడా బెదిరించిన ట్రంప్‌ ఆ కంపెనీకి అమెరికన్లు విడిభాగాలను విక్రయించవచ్చు అని ఒసాకాలో ట్రంప్‌ ప్రకటించటం విశేషం. ఇదే విధంగా తాము ఇప్పటి వరకు 300 బిలియన్‌ డాలర్ల విలువగల చైనా వుత్పత్తులపై విధించిన పన్ను మినహా ప్రస్తుతానికి అదనంగా పన్నుపెంచటం లేదని కూడా చెప్పారు. అయితే ఇది డిసెంబరులో చేసిన ప్రకటన పునశ్చరణ తప్ప కొత్తదేమీ కాదు. చైనాతో తమ సంబంధాలు వూహించినదాని కంటే మెరుగ్గా వున్నాయని, రెండు దేశాలు తిరిగి పట్టాలు ఎక్కాయని, చైనా నేత గ్జీ జింపింగ్‌తో చాలా చాలా మంచి సమావేశం జరిగిందని ట్రంప్‌ విలేకర్లతో అన్నాడు. వుద్రిక్తతలను గమనంలో వుంచుకొని ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను ముందుకు తీసుకుపోవాలని సమావేశంలో నేతలు అంగీకరించినట్లు జపాన్‌ ప్రధాని షింజో అబే శిఖరాగ్ర సభ ముగింపు సమావేశంలో ప్రకటించారు.

ఒసాకా సమావేశాల్లో వుమ్మడిగా అజెండా అంశాలను చర్చించటంతో పాటు అనేక దేశాల నేతల మధ్య ద్విపక్ష సమావేశాలు చోటు చేసుకున్నాయి. ముదిరి వాణిజ్య యుద్ద నేపధ్యంలో ట్రంప్‌, గ్జీ జింపింగ్‌ మధ్య అలాంటి సమావేశం గురించి ప్రపంచం మొత్తం ఆసక్తితో ఎదురు చూసింది.వారు భేటీ అయ్యే ముందు మీడియాకు విడివిడిగా ప్రకటనలు చేశారు. 1970దశకంలో అమెరికాాచైనా మధ్య సంబంధాలు ఒక టేబుల్‌ టెన్నిస్‌ క్రీడతో ప్రారంభమయ్యాయని, ఒక చిన్న బంతి తరువాత కాలంలో ప్రపంచ పరిణామాలను ముందుకు తీసుకుపోవటంలో ఎంతో పెద్ద పాత్రపోషించిందని జింపింగ్‌ గత చరిత్రను గుర్తు చేశారు. గత నాలుగు దశాబ్దాల్లో అంతర్జాతీయ పరిస్ధితులు, వుభయ దేశాల సంబంధాల్లో ఎంతో మార్పు జరిగినా సహకారం ద్వారా రెండు దేశాలు లబ్ది పొందటం, ఘర్షణతో నష్టపడ్డాయన్న మౌలిక వాస్తవంలో మార్పులేదని అన్నారు.

Image result for G20 Osaka 2019 summit revealed deep divides

ఒసాకాలో ట్రంప్‌, జింపింగ్‌ ఏమి చెప్పినప్పటికీ వాణిజ్య యుద్దం విషయంలో ఎవరూ వెనక్కి తగ్గినట్లు కనిపించటం లేదని కొందరు విశ్లేషిస్తున్నారు. ప్రతి వారూ వాణిజ్యం గురించి మాట్లాడుతూ మనం తప్పు చేయకూడదని చెబుతున్నారు. వాటిని విన్నవారికి ఏదో ఒక పరిష్కారానికి వస్తారన్న ఆశకలుగుతుంది, కానీ వారి నడక తీరు చూస్తే మరింత ప్రతికూలంగా సాగుతున్నట్లు కనిపిస్తోందనే చెప్పవచ్చు. మరో 350బిలియన్‌ డాలర్ల వుత్పత్తుల మీద పన్నులు విధించాల్సి వున్నప్పటికీ ప్రస్తుతానికి ఆ పని చేయటం లేదని ట్రంప్‌ చెప్పారు. అయితే ఒసాకా నుంచి వాషింగ్టన్‌ చేరేలోగా ట్రంప్‌ వైఖరిలో మార్పు రాదని చెప్పలేము. ఎప్పుడు ఏమి మాట్లాడతారో, ఏం చేస్తారో వూహించలేము. రెండు దేశాల మధ్య చర్చలు నిలిచిపోయి మరింత సంక్లిష్టం అవుతుందా అన్నట్లుగా తయారైన అంశం తెలిసిందే. అదే జరిగితే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ అతలాకుతలం అయ్యే అవకాశం వుందని భయపడిన వారంతా ఈ సమావేశాల్లో రెండు దేశాల వైఖరి ఎలా వుంటుందా అని ఎంతో ఆసక్తితో ఎదురు చూశారు.

అగ్రరాజ్యాల మధ్య తలెత్తిన పోటీ నివారణకు గాను ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ)ను ఏర్పాటు చేసినప్పటికీ ఏ దేశానికి ఆదేశం రక్షణాత్మక విధానాలను చేపట్టటంతో దానితో నిమిత్తం లేకుండానే, సంస్ధ స్ఫూర్తికి విరుద్దంగా దాని వెలుపల దేశాలు ఒప్పందాలు కుదుర్చుకోవటం ఎక్కువైంది. దీంతో రక్షణాత్మక చర్యలను నిరోధించేందుకు సంస్కరణలు అవసరమనే అజెండా ముందుకు వచ్చింది. అవును నిజమే, సంస్కరణలు తేవాల్సిందే అనే అభిప్రాయం ఒసాకాలో కూడా వెల్లడైనప్పటికీ పిల్లి మెడలో గంట కట్టేదెవరన్నట్లుగా పరిస్ధితి తయారైందని చెప్పవచ్చు. బ్యూనోస్‌ ఎయిర్స్‌లో జరిగిన గత సమావేశంలో రక్షణాత్మక చర్యలకు దూరంగా వుండాలని అమెరికా కోరింది. అయితే ఆచరణలో ఈ కాలంలో చూస్తే అమెరికన్లు బస్తీమే సవాల్‌ అంటూ అనేక దేశాల మీద పన్నులు విధించి తమ షరతులకు అంగీకరించే విధంగా వత్తిళ్లకు పూనుకున్న విషయం తెలిసిందే. ఆంబోతుల వంటి అమెరికా-చైనాలు ముందుగా ఒక అంగీకారం, అవగాహనకు వస్తే తమ పని సులభం అవుతుందని అనేక దేశాలు భావిస్తున్నాయి. ఈ రెండింటి మధ్య వివాదం పరిష్కారం కావాలని తాము ఆశిస్తున్నట్లు ఎగుమతి ఆధారిత ఆర్దిక వ్యవస్ధ వున్న జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఒసాకాలో ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ అంశాల గురించి తాను ట్రంప్‌తో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. అమెరికన్లు ఒకవైపు జర్మనీ, రెండోవైపు చైనాతో కూడా లడాయి పడుతున్న విషయం తెలిసిందే.ప్రపంచ వాణిజ్య సంస్ధలో సంస్కరణలు అవసరమని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. బ్రిక్స్‌ దేశాలైన బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా నేతల సమావేశంలో మోడీ మాట్లాడుతూ ఏకపక్ష నిర్ణయాలు, వివాదాలతో ప్రపంచ వ్యవస్ధ నడుస్తోందని, ఈ పూర్వరంగంలో డబ్ల్యుటిఓను సంస్కరించాలని అన్నారు.

Image result for G20 Osaka 2019 summit revealed deep divides

ఏకపక్ష నిర్ణయాలను ఎదుర్కోవాలని ఈ సమావేశాల సందర్భంగా చైనా అధ్యక్షుడు జింపింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, భారత ప్రధాని నరేంద్రమోడీ ఒక సంయుక్త ప్రకటన చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ముగ్గురు నేతల సమావేశ అనంతరం ఈ ప్రకటన వెలువడింది.దీనిలో అమెరికా పేరు ప్రస్తావన లేనప్పటికీ దాని గురించే అన్నది స్పష్టం. అంతర్జాతీయ చట్టాల మీద ఆధారపడాలని, జాతీయ సార్వభౌమత్వాలను గౌరవించాలని, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ సమావేశాల్లో పర్యావరణ సమస్యల మీద ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. ఎవరి వైఖరికి వారు కట్టుబడి వున్నారు.అయితే పర్యావరణాన్ని కాపాడాలనే సాధారణ తీర్మానాన్ని ఒక తంతుగా ఆమోదించారు. విడిగా మాట్లాడినపుడు కొన్ని దేశాల వారు పారిస్‌ ఒప్పందానికి కట్టుబడి వుండాలని కోరారు. ఈ అంశంపై తయారు చేసిన ప్రకటనలో ఎక్కడా 2015నాటి పారిస్‌ ఒప్పందం గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవటంతో తాము సంతకం చేయటం లేదని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ ప్రకటించారు. పారిస్‌ ఒప్పందం నుంచి వైదొలగిన అమెరికా, జపాన్‌ కూడా దాని ప్రస్తాన ఒసాకా ప్రకటనలో వుండరాదని పట్టుబట్టాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d