• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: RUSSIA

ఎన్నిబాంబులు వేస్తే అంతగా లాభాలు :యుద్ధం వద్దు శాంతి ముద్దు !

07 Wednesday Feb 2024

Posted by raomk in CHINA, Current Affairs, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

#Anti China, Anti Russia, Arms Trade, Donald trump, Gaza Deaths, imperialism, Joe Biden, MIDDLE EAST, NATO, NATO allies, NATO massive arms buildup, Ukraine crisis


ఎం కోటేశ్వరరావు


” అక్కడ మిగిలిందేమీ లేదు ” ఐరాస సహాయ సంస్థ గాజాలో పరిస్థితి గురించి తాజాగా చెప్పిన మాట ఇది. ఇజ్రాయెల్‌ ధ్వంసంగావించిన తమ ఒక ఆసుపత్రి చిత్రాన్ని చూపుతూ ఎక్స్‌లో వ్యాఖ్యానించింది. ఇజ్రాయెల్‌ నౌకల నుంచి జరుపుతున్న దాడుల కారణంగా తమ ఆహార సరఫరా వాహనాలకు ఆటంకం కలుగుతున్నదని సంస్థ డైరెక్టర్‌ థామస్‌ వైట్‌ పేర్కొన్నాడు. గాజాలో బందీలకు బదులుగా ఇజ్రాయెల్‌ జైళ్లలో ఉన్న పాలస్తీనా వాసుల విడుదల గురించి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ మధ్య ప్రాచ్యదేశాల పర్యటనలో ఉన్నాడు. అక్టోబరు ఏడు నుంచి ఇప్పటి వరకు గాజాలో 27,478 మందిని హత్య చేసిన ఇజ్రాయెల్‌ 66,835 మందిని గాయపరచింది. వారిలో 70శాతంపైగా మహిళలు, పిల్లలే ఉన్నారు.ఇరాక్‌, సిరియా, ఎమెన్‌లపై దాడులకు పూనుకున్న అమెరికా యుద్ధాన్ని విస్తరిస్తున్నదని భద్రతా మండలిలో రష్యా విమర్శించింది.తమ దాడులు ఆరంభం మాత్రమేనని అమెరికా అంతకు ముందు ప్రకటించింది. నాటోతో కలసి తమకు ముప్పు తలపెట్టిన ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య 713వ రోజులో ప్రవేశించింది.ఎంతగా వర్షాలు పడితే అంతగా పంటలు పండుతాయని రైతాంగం, జనం మురిసిపోతారు, కానీ యుద్ధోన్మాదులకు ఎన్ని బాంబులను కురిపిస్తే అంతగా లాభాలు వస్తాయని చరిత్ర రుజువు చేసింది. అందుకే ఏక్కడో ఒక దగ్గర ఉద్రిక్తతలను రెచ్చగొట్టి యుద్ధాల వరకు కొనిపోవటం నిత్యకృత్యంగా మారింది.ఐరోపాలో ఉక్రెయిన్‌ సంక్షోభం, మధ్య ప్రాచ్యంలో గాజాపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండ సారమిదే. 1990దశకంలో ప్రచ్చన్న యుద్ధంలో తామే గెలిచామని అమెరికా ప్రకటించుకున్నప్పటికీ వర్తమానంలో తిరిగి నాటి పరిస్థితిని అది సృష్టిస్తున్నది. దాని విదేశాంగ విధాన వైఫల్యాలు పెరుగుతున్న కొద్దీ ప్రపంచ మిలిటరీ ఖర్చు కూడా పెరుగుతున్నది. ఎనిమిది సంవత్సరాల వరుస పెరుగుదలలో 2022లో ప్రపంచ మిలిటరీ ఖర్చు 2.24లక్షల కోట్ల డాలర్లకు చేరింది.


గత సంవత్సరం అమెరికా విదేశాలకు అమ్మిన ఆయుధాల విలువ 238 బిలియన్‌ డాలర్లు.ఉక్రెయిన్‌ సంక్షోభం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా తేలింది.ఐరోపాలోని అనేక దేశాలు తమ వద్ద ఉన్న పాత ఆయుధాలను ఉక్రెయిన్‌కు బదిలీ చేసి కొత్తవాటిని కొనుగోలు చేస్తున్నాయి.ఐరోపా వెలుపల ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్‌, కెనడా, కతార్‌ తదితర దేశాలు ఎక్కువగా కొనుగోలు చేశాయి.ఆయుధాల అమ్మకం అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని ఇస్తున్నది. అమెరికా ప్రభుత్వం నేరుగా అమ్ముతున్న ఆయుధాలు, మిలిటరీ సేవల విలువ 2022తో పోలిస్తే గతేడాది 51.9బి.డాలర్ల నుంచి 80.9కి పెరిగింది. ఆయుధ వ్యాపారులు నేరుగా అమ్మిన వాటి విలువ 157.5బి.డాలర్లు. ప్రభుత్వమే నేరుగా ఆయుధ వ్యాపారం చేస్తున్నదంటే యుద్ధాలను ప్రోత్సహించే విదేశాంగ విధానాలను మరింతగా కొనసాగిస్తున్నదనేందుకు సూచిక. ఆయుధాలను అమ్ముతూ ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన రష్యాను దెబ్బతీసేందుకే తామీపని చేస్తున్నట్లు చెప్పుకొంటున్నది. పుతిన్‌ దళాల నుంచి ఐరోపాను రక్షించే పేరుతో ఉక్రెయిన్‌కు 50బిలియన్‌ డాలర్ల నిధులు ఇవ్వాలని ఐరోపా సమాఖ్య తాజాగా నిర్ణయించింది.అక్టోబరు ఏడున గాజాపై మారణకాండను ప్రారంభించిన ఇజ్రాయెల్‌ చర్య కూడా మిలిటరీ ఖర్చు, ఆయుధ విక్రయాలు పెరిగేందుకు దారి తీస్తున్నది.


అమెరికా తన ఆయుధాలను ఇతర ప్రాంతాలలో నేరుగా ప్రయోగించి వాటి పనితీరును ఎలా పరీక్షిస్తున్నదో ఇజ్రాయెల్‌ కూడా తన ఆయుధాలు, నిఘా పరికరాలను గాజా, పశ్చిమగట్టు ప్రాంతాలలో పాలస్తీనియన్లు ప్రయోగ సమిధలుగా వాడుకుంటున్న దుర్మార్గానికి పాల్పడుతున్నది. హైఫా నగర కేంద్రంగా ఉన్న ఎల్‌బిట్‌ సిస్టమ్స్‌ అనే సంస్థ తాను రూపొందించిన ఐరన్‌ స్టింగ్‌ అనే మోర్టార్‌ బాంబు ఎలా పని చేసేదీ 2021 నుంచి తన వెబ్‌సైట్‌లో ప్రచారం చేసుకుంటున్నది. గాజాలో ఇప్పుడు హమస్‌ను అణచేపేరుతో వాటిని ప్రయోగించి చూస్తున్నారు. పట్టణ ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాల్లో కూడా నిర్ణీత లక్ష్యాలను చేరేవిధంగా వీటిని తయారు చేశారు.గాజా జనసమ్మర్ధం గల పట్టణ ప్రాంతమన్నది తెలిసిందే. గురితప్పకుండా ఇక్కడ లక్ష్యాలను చేరితే ప్రపంచవ్యాపితంగా ఎవరికి కావాల్సివస్తే వారికి అమ్మేందుకు ఈ ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి ప్రయోగాల్లో మారణకాండను సృష్టించిన అనేక ఆయుధాలను ఇప్పుడు ఇజ్రాయెల్‌ ఎగుమతి చేస్తున్నది. అలాంటి వాటిలో ఏకంగా నలభై గంటల పాటు ప్రయాణించి నాలుగు క్షిపణులను మోసుకుపోగల ఇటాన్‌ అనే డ్రోన్ను ఇజ్రాయెల్‌ 2007లో గాజా పౌరుల మీద ప్రయోగించింది, అప్పుడు కూడా వీటి దాడిలో పిల్లలే ఎక్కువగా మరణించారు. ఇప్పుడు వాటిని భారీగా విక్రయిస్తున్నది. మన దేశం వందకు పైగా వీటిని కొనుగోలు చేసి అగ్రస్థానంలో ఉంది. ఇజ్రాయెల్‌ నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తున్న 130కి పైగా దేశాలలో కొలంబియా ఒకటి. అక్కడి అధ్యక్షుడు గుస్టావ్‌ పెట్రో గాజాలో జరుపుతున్న మారణకాండను ఉగ్రవాదంగా వర్ణిస్తూ ఖండించాడు.దాంతో కొలంబియాకు ఆయుధ విక్రయాలను ఇజ్రాయెల్‌ నిలిపివేసింది. ఆయుధ వ్యాపార ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ ఆమోదించలేదు.మారణకాండ, మానవాళిపై నేరాలకు పాల్పడేవారికి ఆయుధాల విక్రయాన్ని ఆ ఒప్పందం నిషేధిస్తున్నది. అందువలన ఇజ్రయెల్‌ జరిపే లావాదేవీలన్నీ రహస్యంగానే ఉంటాయి. ఎవరు, ఎవరికి అమ్మిందీ చెప్పదు, కొనుగోలు చేసిన వారు కూడా వెల్లడించరని 2019లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ప్రకటించింది. అందువలన లావాదేవీలు ఎంత అన్నది కూడా అంచనా కష్టం.దక్షిణాఫ్రికాలో స్థానిక ఆఫ్రికన్‌ జాతీయులను అణచివేసిన జాత్యహంకార పాలకులకు విక్రయించింది.అవసరమైతే అణ్వాయుధాలను కూడా ఇచ్చేందుకు సిద్దపడినట్లు బహిర్గతం కావించిన పత్రాలు వెల్లడించాయి. ఎల్‌ సాల్వడార్‌లో తిరుగుబాటుదార్లను అణచివేసేందుకు అక్కడి నియంతలకు నాపాం బాంబులు, ఇతర ఆయుధాలను విక్రయించింది, వాటితో 75వేల మంది పౌరులు మరణించారు. ఎనిమిది లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన ర్వాండా మారణకాండలో కూడా ఇజ్రాయెల్‌ తయారీ తుపాకులు, బుల్లెట్లు,గ్రెనేడ్‌లు వాడినట్లు తేలింది.బోస్నియా మీద దాడులు చేసిన సెర్బియాకూ, మయన్మార్‌ మిలిటరీ పాలకులకూ, అజర్‌బైజాన్‌కూ ఆయుధాలను విక్రయించింది. అమెరికా, ఐరోపా దేశాల మాదిరి ఎలాంటి ఆంక్షలనూ విధించదు గనుక ఇజ్రాయెల్‌ నుంచి ఆయుధాలను కొనుగోలు చేయాలని 2018లో నాటి ఫిలిఫ్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె ప్రకటించాడు. తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం ఎలాంటి అనుమతులతో నిమిత్తం లేకుండా ఎవరికైనా ఆయుధాలను విక్రయించవచ్చు. ప్రస్తుతం గాజాలో మరణించిన, గాయపడిన పాలస్తీనియన్లను పరీక్షించినపుడు కాలిన, ఇతర గాయాలను చూసినపుడు అవి ఎలా జరిగాయన్నది వైద్యులకు సమస్యగా మారింది. గతంలో ఇలాంటి వాటిని చూడలేదని చెప్పారు. దీన్ని బట్టి కొత్త ఆయుధాలను ప్రయోగించారని అనుమానిస్తున్నారు.


యుద్ధం అనేక అనర్ధాలకు మూలం అవుతున్నది. ప్రత్యక్షంగా ఎన్ని ప్రాణాలు పోతాయో, ఎంత మంది దిక్కులేనివారౌతారో, ఎన్ని కుటుంబాలు ఇబ్బందులు పడతాయో, ఎంత బాధ, వేదన కలుగుతుందో చెప్పలేము. పరోక్షంగా జనాల మీద ప్రత్యేకించి కష్టజీవుల మీద విపరీత భారాలను మోపుతుంది. కార్పొరేట్‌ మీడియా వార్తలను ఇస్తుంది తప్ప అది యుద్ధానికి వ్యతిరేకం కాదు. ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండను ఆత్మరక్షణ పేరుతో సమర్థిస్తున్న వారికి మద్దతు ఇస్తున్నది. రష్యాకు నాటో తలపెట్టిన ముప్పును మూసిపెట్టి అది జరుపుతున్న సైనిక చర్య మీద చిలవలు పలవలుగా వార్తలు ఇస్తున్నది. దీనంతటికి అమెరికా, దాన్ని సమర్ధించేదేశాల లాభాల కాంక్ష, యుద్ధోన్మాదమే కారణం. ఏ నేతా శాంతివచనాలు వల్లించటంలో వెనుకబడటం లేదు.ఆచరణలో ఏదో ఒకసాకుతో మిలిటరీ ఖర్చు పెంచుతున్నారు. గతంలో సోవియట్‌ యూనియన్ను మాత్రమే బూచిగా చూపే వారు, ఇప్పుడు రష్యా, చైనాలను పేర్కొంటూ ఆయుధాలను మరింత ఎక్కువగా అంటగట్టేందుకు పూనుకున్నారు. 2020లో డెమోక్రటిక్‌ పార్టీ మిలిటరీ ఖర్చును తగ్గిస్తామని చెప్పింది. గతంలో రిపబ్లికన్‌ డోనాల్డ్‌ ట్రంప్‌ మాదిరి జో బైడెన్‌ అధికారానికి వచ్చిన తరువాత ప్రతి ఏటా పెంచి మరోసారి ఎన్నికలకు సిద్దమౌతున్నాడు. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ యుద్ధాలను రెచ్చగొట్టటం, ఆయుధాల వ్యాపారం, లాభాలు పిండుకోవటం మామూలే. మిలిటరీ ఖర్చు విషయానికి వస్తే 230 దేశాల్లో ఒక్క అమెరికా చేస్తున్న ఖర్చు 227దేశాల మొత్తానికంటే ఎక్కువ. ఆయుధాల ఎగుమతుల్లో కూడా అదే విధంగా ఉంది. నాటో దేశాలు మిలిటరీ ఖర్చును పెంచాలని డోనాల్డ్‌ ట్రంప్‌ తెచ్చిన వత్తిడిని జో బైడెన్‌ కూడా కొనసాగిస్తున్నాడు. అమెరికా చేస్తున్న ఖర్చులో రష్యా మొత్తం పదిశాతం కంటే తక్కువే.
తాము ఎదురులేని శక్తి అని విర్రవీగుతున్న అమెరికాకు ప్రతి చోటా పరాభవమే మిగులుతోంది. దాన్ని నమ్మితే ఇంతే సంగతులని అనేక దేశాలు అంతర్గతంగా భావిస్తున్నప్పటికీ మిలిటరీ శక్తిగా ఉన్నందున భయపడుతున్నమాట వాస్తవం. చైనా, రష్యాల ముందు అమెరికా పప్పులుడకవని తేలిపోయింది. ఈ పూర్వరంగంలోనే ఐరోపాకు సోవియట్‌ నుంచి ముప్పు ఉందని చెప్పి నాటోను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే చెబుతూ రష్యాను చుట్టుముట్టేందుకు పూనుకున్నారు. దాన్ని మరింత బలపరుస్తున్నారు. మరోవైపు చైనా నుంచి ఆసియాకు ముప్పు అని ఏ క్షణంలోనైనా తైవాన్ను ఆక్రమిస్తుందని ప్రచారం చేస్తున్నారు.ఈ దశాబ్ద్ది చివరికి చైనా వెయ్యి అణ్వాయుధాలను సమకూర్చుకోనుందని అమెరికా రక్షణశాఖ తప్పుడు నివేదికలను ప్రచారంలో పెట్టింది. ఇవన్నీ చైనా ప్రపంచ మిలిటరీ శక్తిగా ఎదుగుతోంది జాగ్రత్త అని ఇరుగు పొరుగుతో పాటు ప్రపంచ దేశాలను ఆయుధపోటీకి ప్రోత్సహించే ఒక వ్యూహంలో భాగమే. అణ్వాయుధాలు ప్రపంచానికి ముప్పు అన్నది నిజం, ముందుగా ఎవరు మీట నొక్కినా కొద్ది క్షణాల్లో ఇతరులు కూడా అదేపని చేస్తారన్నది కూడా తెలిసిందే.అదే జరిగితే ప్రపంచం మిగలదు. ఎవరికి వారు తగుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర దేశాలన్నీ తమ మీద కుట్ర చేస్తున్నట్లు, ముప్పు తలపెట్టినట్లు స్వజనాన్ని నమ్మించటం అమెరికా నిత్యకృత్యాలలో ఒకటి. ఆ పేరుతో అన్ని ఖండాలలోని 80 దేశాలలో 800కు పైగా చిన్నా, పెద్ద సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. అంటే ఎక్కడికైనా కొద్ది గంటల్లోనే తన మిలిటరీని దింపగలదు. ఇంతవరకు అమెరికా మీద దాడి చేసిన దేశం ఒక్కటంటే ఒక్కటీ లేదు. బ్రిటన్‌ నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత 1,776 నుంచి ఇప్పటి వరకు అమెరికా 68 దేశాల మీద దాడి చేసింది.అందువలన ముప్పు అమెరికా నుంచి రావాలి తప్ప మరొకదేశం నుంచి వచ్చే అవకాశమే లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

షేక్‌ హసీనా విజయం : చైనాకు మరింత దగ్గరగా బంగ్లాదేశ్‌ !

10 Wednesday Jan 2024

Posted by raomk in Asia, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ 1 Comment

Tags

Awami League, Bangladesh Elections 2024, BNP, Joe Biden, Khaleda Zia, Narendra Modi Failures, Sheikh Hasina, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


డెబ్బయ్యారు సంవత్సరాల షేక్‌ హసీనా వరుసగా బంగ్లాదేశ్‌లో నాలుగవ సారి అధికారానికి వచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలో అధికారంలో ఉన్న మరే దేశ మహిళ ఎవరూ ఇంత దీర్ఘకాలం పదవిలో లేరు.పార్లమెంటులోని 350 స్థానాలకు గాను 300 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. మరో 50 సీట్లను మహిళలకు కేటాయించారు. పార్లమెంటులో తెచ్చుకున్న సీట్ల దామాషాకు అనుగుణంగా ఆయా పార్టీల నుంచి మహిళను నామినేట్‌ చేస్తారు. ఆదివారం నాడు జరిగిన ఎన్నికల్లో ఆమె నాయకత్వంలోని అవామీ లీగ్‌ పార్టీ 222 సాధించింది.ఆమెకు మద్దతు ఇస్తున్న కూటమిలోని చిన్న పార్టీలు, స్వతంత్రులను కూడా కలుపుకుంటే మద్దతు ఇంకా ఎక్కువే ఉంటుంది. రద్దయిన పార్లమెంటులో అవామీ లీగ్‌కు 306 స్థానాలున్నాయి. పదిహేడు కోట్ల మంది జనాభా ఉన్న ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బిఎన్‌పి), పరిమితమైన బలం కలిగిన కొన్ని కమ్యూనిస్టు, ఇతర వామపక్షాలతో కూడిన కూటమి, ఇతర చిన్న పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి. ఎన్నికలను తటస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరపాలని, ప్రతిపక్షాల అణచివేతకు నిరసనగా తాము పోటీ చేయటం లేదని అవి ప్రకటించాయి.


ఈ ఎన్నికలలో ఓటర్లు చాలా తక్కువ మంది పాల్గొనటాన్ని బట్టి పాలకపక్షం మీద తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు చెప్పవచ్చు.2018లో జరిగిన ఎన్నికల్లో 80.2, అంతకు ముందు 61.29శాతం ఓట్లు పోలుకాగా తాజాగా 41.8శాతమే నమోదైంది. బంగ్లాదేశ్‌లో ఎవరు అధికారంలో ఉన్నా ఎన్నికల అక్రమాల ఆరోపణలు, విమర్శలు, బహిష్కరించటాలు మామూలే. తమ ప్రభుత్వం మీద వచ్చిన విమర్శలను హసీనా తిరస్కరించారు, స్వేచ్చగా, న్యాయంగా ఎన్నికలు జరిగినట్లు చెప్పారు. పాకిస్థాన్‌ నుంచి స్వాతంత్య్రం కోసం సాగించిన పోరు ఫలించి 1971లో స్వతంత్ర బంగ్లాదేశ్‌ ఏర్పడింది. ఆ విముక్తి పోరాటానికి నాయకత్వం వహించి బంగ బంధుగా పేరు తెచ్చుకున్న తొలి ప్రధాని షేక్‌ ముజిబుర్‌ రహమాన్‌ కుమార్తె షేక్‌ హసీనా. 1975లో జరిగిన మిలిటరీ తిరుగుబాటులో ముజిబుర్‌ రహమాన్‌తో పాటు కుటుంబ సభ్యులందరినీ చంపివేశారు. ఆ సమయంలో విదేశాల్లో ఉన్న హసీనా, ఆమె సోదరి రెహనా, హసీనా భర్త ఎంఎ వాజెద్‌ మియా ఢిల్లీలో అణుశాస్త్రవేత్తగా పని చేస్తుండటతో అతను, వారి పిల్లలు కూడా హత్యా కాండ నుంచి తప్పించుకున్నారు. తొలుత వారు జర్మనీలో, తరువాత మనదేశంలో ఆశ్రయం పొందారు. ఆమె ప్రవాసంలో ఉండగానే 1981లో అవామీ లీగ్‌ నేతగా ఎన్నికయ్యారు. తొలుత ప్రతిపక్ష నేతగా ఆ తరువాత 1996 నుంచి 2001వరకు తొలిసారి ప్రధానిగా పని చేశారు.రెండవ సారి 2009లో బాధ్యతలు చేపట్టి అదే పదవిలో కొనసాగుతున్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు ఆమె మీద పందొమ్మిది సార్లు హత్యా ప్రయత్నాలు జరిగినట్లు చెబుతారు. మత తీవ్రవాదులను అణచివేసిన నేతగా పేరుతెచ్చుకున్నారు. ఆరుపదుల వయస్సులో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆమె ప్రకటించినప్పటికీ 76 సంవత్సరాలు వచ్చినా కొనసాగుతూనే ఉన్నారు.ఆమె సోదరి రెహనా లేదా కుమారుడు సాజిద్‌ వాహెద్‌ రాజకీయ వారసులుగా వస్తారని చెబుతున్నారు. ముజిబుర్‌ రహమాన్‌ హత్య తరువాత మిలిటరీ నియంత జియావుర్‌ రహమాన్‌ అధ్యక్షుడిగా అధికారానికి వచ్చాడు. 1978లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీని ఏర్పాటు చేశాడు.1981లో మిలిటరీ తిరుగుబాటులో హతమయ్యాడు. తరువాత ఆ పార్టీకి భార్య ఖలీదా జియా నేతృత్వం వహించటమే కాదు, రెండుసార్లు ప్రధానిగా పని చేశారు.తాజా ఎన్నికలను బహిష్కరించారు. జియాఉర్‌ రహమాన్‌ అధికారంలో ఉండగా ముస్లిం ఛాందసవాదులను ప్రోత్సహించి ఇస్లామిక్‌ దేశంగా మార్చేందుకు చూశాడు. వర్తమాన రాజకీయాల్లో బిఎన్‌పి మితవాద పార్టీగా ఉంది. దానికి జమాయతే ఇస్లామీ పార్టీ మద్దతు ఇస్తున్నది. మరో మిలిటరీ నియంత ఎర్షాద్‌ అధికారాన్ని చేజిక్కించుకోవటంతో అతగాడిని గద్దె దించేందుకు షేక్‌ హసీనా-ఖలీదా జియా ఇద్దరు చేతులు కలిపి ఆందోళనలు నిర్వహించారు. ఎర్షాద్‌ పదవి నుంచి దిగిన తరువాత ఇద్దరూ ప్రత్యర్దులుగా మారారు.


షేక్‌ హసీనా పదవీ కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు.కరోనా ముందు వరకు మెరుగ్గా కనిపించిన ఆర్థిక స్థితి తరువాత ఇప్పటి వరకు కోలుకోలేదు.దాంతో 470 కోట్ల డాలర్ల రుణం కోసం ఐఎంఎఫ్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. ధరలు ప్రత్యేకించి ఆహారద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది.కరెన్సీ విలువను తగ్గించటంతో జనజీవితాలు అతలాకుతలమయ్యాయి. దాంతో ప్రధాన ఎగుమతి పరిశ్రమ రెడీమేడ్‌ దుస్తుల తయారీ రంగంలో కార్మికులు సమ్మెలకు దిగారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు 40 నుంచి 17 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. అవి మూడు నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. ఈ ఏడాది విదేశీ చెల్లింపులు ఎక్కువగా ఉండటంతో పరిస్థితి ఇంకా దిగజారవచ్చని చెబుతున్నారు. బంగ్లా విముక్తి పోరాట సమయంలో పాకిస్థాన్‌ పాలకులతో చేతులు కలిపిన విద్రోహులను శిక్షించేందుకు ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. విచారణ జరిపి అనేక మందిని ఉరితీశారు. హేతువాదులను శిక్షించేందుకు, ఇస్లాంను కించపరిచేవారిని దండించేందుకు కొత్త చట్టాలను తేవాలంటూ హిఫాజత్‌ ఇ ఇస్లామ్‌ అనే మితవాద సంస్థ పుట్టుకు వచ్చింది.లౌకికవాదులు, హేతువాదులను ఇస్లామిక్‌ స్టేట్‌, ఆల్‌ఖైదా వంటి సంస్థలకు చెందిన వారు అనేక మందిని హత్య చేశారు. వారిపట్ల కఠినంగా వ్యవహరించి మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ అమెరికా, ఐరోపాలోని మానవహక్కుల నంస్థలు విమర్శలు చేశాయి. ఎన్నికలను తటస్థ ఆపద్దర్మ ప్రభుత్వం నిర్వహించాలన్న నిబంధనను 2014 ఎన్నికల్లో హసీనా ప్రభుత్వం రద్దు చేసింది. ఆ కారణంతో బిఎన్‌పి 2014 ఎన్నికలను బహిష్కరించింది. ఇప్పుడూ అదే చెప్పింది.


తాజాగా ఎన్నికలు స్వేచ్చగా జరగలేదని అమెరికా, బ్రిటన్‌ ఆరోపించాయి. వర్తమాన ప్రపంచ రాజకీయాల్లో బంగ్లాదేశ్‌ ఈ దేశాలకు అనుకూలంగా లేకపోవటమే దీనికి కారణం అని చెప్పవచ్చు. ఒక దేశ అంతర్గత అంశాల్లో మరొక దేశం జోక్యం చేసుకోవటం, వ్యాఖ్యానించటం తగనిపని, నిజంగా అక్రమాలు జరిగితే అక్కడి జనమే తేల్చుకోవాలి తప్ప మరొకరికి హక్కు లేదు.మరోవైపున చైనా, రష్యా, భారత్‌లు హసీనాను అభినందించాయి. ఆ మేరకు రాయబారులు ఆమెను కలిశారు. ప్రధాని నరేంద్రమోడీ ఫోన్‌ చేసి హసీనాకు అభినందనలు తెలిపారు. బంగ్లాదేశ్‌లో ఉన్న ఏకైక అణువిద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించిన రష్యా రానున్న రోజుల్లో మరింతగా సహకరిస్తామని ప్రకటించింది. ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్‌ విదేశాంగ విధానం గురించి అనేక కథనాలు వచ్చాయి. చైనా ఇస్తున్న అప్పులతో అది మరొక శ్రీలంకగా మారుతుందన్న ప్రచారం వాటిలో ఒకటి. ఇటీవలి కాలంలో రెండు దేశాలు మరింతగా సన్నిహితం కావటమే దీనికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అమెరికా, ఇతర దేశాల మాదిరి తాజా ఎన్నికల్లో ఫలానా చర్యలు తీసుకోవాలి అంటూ చైనా ఎలాంటి షరతులను బంగ్లా ప్రభుత్వం ముందు ఉంచలేదు. రెండు దేశాల మధ్య సంబంధాలు పెరగటానికి 2012లో జరిగిన పరిణామం ఒక ప్రధాన కారణం. గంగోత్రి నుంచి ప్రారంభమైన గంగానది ఉపనదిని బంగ్లాదేశ్‌లో పద్మ అంటారు. అది అక్కడ పెద్ద నది. పద్మానది మీద కట్టిన భారీ వంతెన నిర్మాణంలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రపంచబాంకు ఆ ఏడాది బహిరంగంగా ప్రకటించింది.నిధులు నిలిపివేయటంతో పరువు, ప్రతిష్టలకు సంబంధించిన అంశంగా భావించిన బంగ్లా ప్రభుత్వం చైనాను సంప్రదించగా 360 కోట్ల డాలర్లు ఇచ్చి దాన్ని పూర్తి చేయించింది. రాజధాని ఢాకాతో 21 జిల్లాలను అది అనుసంధానం గావించింది.తరువాత ఇతర దేశాల నుంచి తీసుకున్నట్లుగానే ప్రాజెక్టు రుణాలను చైనా నుంచి కూడా బంగ్లాదేశ్‌ పొందింది. 2016ay బిఆర్‌ఐ పధకంలో చేరి విద్యుత్‌ కేంద్రాలు, రైల్వే లైన్లు,రోడ్లు, రేవులు, సొరంగాల వంటి పదిహేడు ప్రాజెక్టులకు రుణాలు పొందింది. అంతే కాదు, తనకు అవసరమైన ఆయుధాల్లో 74శాతం చైనా నుంచి పొందుతున్నది. పశ్చిమ దేశాలతో ప్రత్యేకించి అమెరికా పోల్చుకుంటే ఎంతా లాభసాటిగా ఉండటమే చైనా పెట్టుబడుల వైపు మొగ్గుకు కారణం.


తన దారికి రాని దేశాల మీద మానవహక్కుల ఉల్లంఘన పేరుతో అమెరికా దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌ మీద కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించింది. ఈ కారణంగా కూడా హసీనా సర్కార్‌ చైనాకు మరింత చేరువైంది.2021లో అమెరికా నిర్వహించిన ప్రజాస్వామ్య సదస్సుకు బంగ్లాదేశ్‌ను ఆహ్వానించలేదు. అప్పుడు చైనా రాయబారి బంగ్లాకు మద్దతుగా నిలిచారు.తన ఇండో-పసిఫిక్‌ వ్యూహం(క్వాడ్‌)లో చైనాకు వ్యతిరేకంగా కలసి రావాలని జోబైడెన్‌ తెచ్చిన వత్తిడిని బంగ్లా తిరస్కరించింది. ప్రచ్చన్న యుద్ధ ఆలోచనలు, కూటమి రాజకీయాలకు బంగ్లాదేశ్‌ దూరంగా ఉండాలని 2022లో చైనా బహిరంగంగానే హితవు చెప్పింది. దాంతో తాము అలీన విధానంతో స్వతంత్ర వైఖరిని అనుసరిస్తామని తరువాత బంగ్లాదేశ్‌ ప్రకటించింది. అమెరికా చెబుతున్నదానికి భిన్నంగా తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమే అని ఒకే చైనా అని కూడా చెప్పింది.కొల్‌కతాకు 212 నాటికల్‌ మైళ్ల దూరంలో బంగాళఖాత తీరంలోని కాక్స్‌బజార్‌ రేవు ప్రాంతంలో నిర్మించిన జలాంతర్గామి కేంద్రానికి చైనా 120 కోట్ల డాలర్ల సాయంచేసినంత మాత్రాన భారత్‌ రక్షణకు ఎలాంటి ముప్పు లేదని బంగ్లాదేశ్‌ ప్రకటించింది. చైనా తమకు ఆర్థిక భాగస్వామి తప్ప రక్షణకు కాదని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌లో చైనా నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలతో భారత్‌ కూడా లబ్దిపొందుతుందని ఈశాన్య భారతానికి వేగంగా భూ, జలమార్గాల ద్వారా సరకు రవాణా చేయవచ్చని కొందరు నిపుణులు చెప్పారు. చైనా పెట్టుబడులతో బంగ్లాదేశ్‌కు ఎలాటి ముప్పు లేదని వాటి మీద పెట్టుబడి కంటే లాభాలు ఎక్కువ అని జహంగీర్‌ నగర్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ సాహెబా నామ్‌ ఖాన్‌ చెప్పాడు.


ఇక చైనా రుణాల గురించి తప్పుడు ప్రచారం బంగ్లాదేశ్‌ మీద కూడా చేస్తున్నారు.ప్రస్తుతం బంగ్లాదేశ్‌కు 2023లో 7,230 కోట్ల డాలర్ల విదేశీ రుణం ఉంది. వాటిలో ప్రపంచ బాంకు నుంచి 1,820, ఆసియన్‌ అభివృద్ధి బాంకు నుంచి 1,330, జపాన్‌ నుంచి 920, రష్యా నుంచి 510, చైనా నుంచి 480, భారత్‌ నుంచి 102 కోట్లు ఉన్నాయని బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి ఎంఎ అబ్దుల్‌ మోమెన్‌ చెప్పాడు. దీన్ని బంగ్లాదేశ్‌కు అన్ని దేశాల నుంచి రుణాలు కావాలి, తీసుకుంటున్నది. ఇవి గాక వివిధ పథకాలకు తీసుకొనే రుణాలు వేరు. అమెరికా తెస్తున్న వత్తిడి, సృష్టించిన పరిస్థితిని చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నదని మన నరేంద్రమోడీ సర్కార్‌ అమెరికాకు తెలిపినట్లు 2023 ఆగస్టు 28వ తేదీ హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక రియాజుల్‌ హెచ్‌ లస్కర్‌ పేరుతో ఒక సమీక్ష ప్రచురించింది.ప్రతిపక్ష బిఎన్‌పికి మతోన్మాద జమాతే ఇస్లామీ మద్దతు ఉంది, దానికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నందున షేక్‌ హసీనా గెలవటం మన దేశానికి ఊరట కలిగించే అంశమే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యాపై పనిచేయని పశ్చిమ దేశాల ఆంక్షలు ?

27 Wednesday Dec 2023

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

China, Joe Biden, Ukraine crisis, Vladimir Putin, Volodymyr Zelensky


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య మంగళవారం 671వ రోజులో ప్రవేశించింది. పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.మేనెలలో బఖ్‌మట్‌ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత మారింకా అనే మరో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా సోమవారం నాడు ప్రకటించింది. అబ్బే అలాంటిదేమీ లేదు, తమ సైనికులు ఇంకా అక్కడే ఉన్నారని ఉక్రెయిన్‌ మిలిటరీ అధికారి చెప్పాడు. తమ మీదకు వచ్చే క్షిపణులు, యుద్ధ విమానాలను కూల్చివేస్తున్నామని, విజయానికి చేరువలో ఉన్నామని జెలెనెస్కీ ప్రకటిస్తూనే ఉన్నాడు. కానీ తమ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్న మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప అడుగు ముందుకు పడటం లేదు. పశ్చిమదేశాల కారణంగా సంక్షోభం మూడవ సంవత్సరంలో కూడా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.ఈ పోరులో ప్రత్యక్షంగా నిమగమైన రష్యా-ఉక్రెయిన్లే కాదు ప్రపంచ దేశాలన్నీ అనేక విధాలుగా గుణపాఠాలు తీసుకుంటున్నాయి. ఇక ఆయుధ వ్యాపారులు, ఉత్పత్తిదారుల సంగతి చెప్పనవసరం లేదు. వాటిని ఎంత ఎక్కువగా ఆమ్ముకోవాలి, మరింతగా మారణకాండను సృష్టించేవిగా వాటిని ఎలా సానబట్టాలా అని చూస్తున్నాయి. ఉక్రెయిన్‌పై దాడిలో పట్టుకున్న లేదా ధ్వంసం చేసిన రష్యన్‌ టాంకులు, ఆయుధశకలాలను సేకరించి ఉత్పత్తిదారులకు అందచేసి పోటీగా రూపొందించే వాటిలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలో పరిశీలించండని కోరుతున్నట్లు బ్రిటీష్‌ మిలిటరీ అధికారి వెల్లడించారు.దొరికిన ప్రత్యర్ధుల ఆయుధాలు, వాహనాలను విశ్లేషించటం ప్రతిపోరులోనూ జరుగుతున్నదే. ఈ పోరులో డ్రోన్లతో దాడులు ఎలా చేయవచ్చో ప్రపంచం నేర్చుకుంటున్నది. ఉక్రెయిన్‌ సరిహద్దులకు ఆవల రష్యా తన వ్యూహాత్మక అంశాలను మరోసారి విశ్లేషించుకొనే విధంగా నాటో కూటమి దేశాల విస్తరణ పురికొల్పుతున్నది. కొత్త ఎత్తుగడలకు పుతిన్‌ తెరతీస్తాడు. అది ఒక్క రష్యాకే కాదు, ఐరోపా రక్షణ అంశాలను కూడా సమీక్షించాల్సిన అవసరాన్ని ముందుకు తెచ్చింది. కానీ అసలైన సమస్య ఎంతకాలం ఉక్రెయిన్‌ తట్టుకొని నిలబడుతుందనే ఆందోళన పశ్చిమ దేశాల్లో రోజురోజుకూ పెరుగుతోంది. రాజీకి సిద్దమేగానీ రష్యా చేతిలోకి వెళ్లిన తమ ప్రాంతాల సంగతేమిటని జెలెనెస్కీ అడుగుతున్నాడు. ఒకటి కావాలంటే మరొకదాన్ని వదులుకోవాల్సి ఉంటుందని పరోక్షంగా అమెరికా సూచిస్తున్నట్లు వార్తలు. ఆ ప్రాంతాల గురించి మరిచిపోండి, పశ్చిమ దేశాలు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఇంతకంటే జరిగే నష్టం మాకు ఉండడు, కావాలంటే రాజీ చర్చలకు నేను సిద్దమే అని పుతిన్‌ చెబుతున్నాడు. ఇటు ఉక్రెయిన్‌ ఓడిపోయి, రష్యా మీద ఆంక్షలను ఎత్తివేసే పరిస్థితి వస్తే తమ పరువేంగాను అని నాటో కూటమి దేశాలు అనుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు. మరోవైపు పాలస్తీనా ప్రాంతమైన గాజాలో పరువు దక్కించుకొని బయటపడటం ఎలా అన్న సమస్య పశ్చిమదేశాలకు తలెత్తింది.మధ్య ప్రాచ్యపరిస్థితిని చూస్తే ఎప్పుడేమౌతుందో తెలియటం లేదు.


వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఫిన్లండ్‌, తరువాత స్వీడెన్‌ నాటోలో ప్రవేశించనున్నాయి. అంటే మరోవైపు నుంచి రష్యా సరిహద్దులకు నాటో మిలిటరీ, ఆయుధాలు చేరనున్నాయి. ఫిన్లండ్‌-రష్యా మధ్య 1,300 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. 2026 నాటికి ఎఫ్‌-35 ఐదవతరం యుద్ధ విమానాలను అది సమకూర్చుకోనుంది. అమెరికాలో ఎన్నికల కారణంగా అక్కడి నుంచి ఉక్రెయిన్‌కు వచ్చే సాయానికి అంతరాయం కలిగితే ఆ ఖర్చును తట్టుకొనేదెలా అని ఐరోపా దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. వలసలను అనుమతించరాదంటూ మితవాద శక్తులు ప్రతి దేశంలోనూ జనాన్ని రెచ్చగొడుతున్నాయి, ఎన్నికల్లో వాటికి మద్దతు పెరుగుతోంది.తాము మిలిటరీ సాయాన్ని నిలిపివేస్తున్నట్లు స్లోవేకియా ప్రకటించింది. అది చిన్నదేశమే అయినప్పటికీ దాని ప్రభావం పెద్ద దేశాలు, జనం మీద పడుతుంది.అమెరికా, ఐరోపా ధనికదేశాలు కోరుకున్న విధంగా రష్యా మీద విధించిన ఆంక్షలు ఫలితాలనివ్వటం లేదు.పోరు ఆగేట్లు లేదు, మడిగట్టుకొని ఎంతకాలం కూర్చుంటాం రష్యాతో వాణిజ్యం చేస్తామని చెబుతున్నాయి. రష్యాను ఒంటరి చేయటంలో పశ్చిమ దేశాలు ఇంకా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాయి గానీ ఫలించటం లేదు. నల్లసముద్రం, బాల్టిక్‌ సముద్రం, ఆర్కిటిక్‌ సముద్రాల మీద పట్టు నిలుపుకోవాలన్నది రష్యా లక్ష్యం, దెబ్బతీయాలన్నది అమెరికా ఎత్తుగడ. అందుకోసం ఐరోపాలోని నాటో కూటమి దేశాల మీద ఆధారపడింది. ఫిన్లండ్‌, స్వీడన్‌లను నాటోలో చేర్చుకోవటం ద్వారా ఆపని చేయాలని చూస్తున్నది. తాము తలచుకుంటే రష్యా సెంట్‌పీటర్స్‌బర్గ్‌కు చేరే, తిరిగి వచ్చే మార్గాలను మూసివేయగలమని నాటో ప్రధాన కార్యదర్శి జనరల్‌ ఆండ్రెస్‌ ఫాగ్‌ రాస్‌ముసెన్‌ అన్నాడు. నార్వే గడ్డమీద నాలుగు మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేసి పట్టుసాధించేందుకు అమెరికా పూనుకుంది.


ఆంక్షలు విధించిన తరువాత 2023లో రష్యా రేవుల ద్వారా సరకు రవాణా 7.8శాతం పెరిగినట్లు సమాచారం తెలుపుతున్నది. బాల్టిక్‌ సముద్రాన్ని నాటో సరస్సుగా పశ్చిమ దేశాలు ప్రకటించినా ఆ ప్రాంత రేవుల ద్వారా కూడా రెండున్నరశాతం సరకు రవాణా పెరిగింది. వీటిలో చైనాకు చమురు కీలక పాత్ర పోషించింది.2019లో తొలి వాణిజ్య రవాణాలో 22లక్షల పీపాల చమురు ఎగుమతి జరగ్గా, 2023లో 104లక్షలకు పెరిగింది. పశ్చిమదేశాల వ్యూహాలను, రష్యాపై విధించిన ఆంక్షలను చూసిన తరువాత సూయజ్‌ కాలువ ద్వారా జరుగుతున్న రవాణాను మరో మార్గానికి మళ్లిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చైనా భావిస్తోంది. రష్యా కూడా ప్రత్యామ్నాయాల గురించి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నది. ఉత్తర ధృవ కేంద్రం ఉన్న ఆర్కిటిక్‌ సముద్ర ప్రాంతరేవుల ద్వారా రవాణాలో మూడో వంతుదూరం, సమయం, ఖర్చు కూడా కలసి వస్తుంది. సూయజ్‌ కాలువ మాదిరి దాటేందుకు సుంకం చెల్లించాల్సిన అవసరంగానీ, వేచి ఉండాల్సిన పరిస్థితిగానీ, సముద్రపు దొంగల బెడదా ఉండదు. అయితే ఊహించని వాతావరణ, మంచు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.పశ్చిమ దేశాలతో తలెత్తే వైరుధ్యాలను గమనంలో ఉంచుకొని రష్యా కూడా వాటిని అధిగమించే చర్యలకు పూనుకుంది.ఆర్కిటిక్‌ సముద్ర మార్గంలో మంచును బద్దలు చేసి ముందుకు పోయే నౌకలను సిద్దం చేస్తున్నది. రానున్న పదమూడు సంవత్సరాల్లో 22 బిలియన్‌ డాలర్లు వెచ్చించి 50 (ఐస్‌ బ్రేకర్స్‌ )మంచులో నడిచే నౌకలను నిర్మిస్తున్నది.ఇలాంటి వాటిని అమెరికా, చైనా కూడా నిర్మిస్తున్నది. అవసరమైన ఏర్పాట్లు జరిగితే రష్యాలోని సైబీరియా, అలాస్కా మీదుగా ఉత్తర చైనాకు సరకురవాణా జరపవచ్చు.ఆ మార్గంలో ఏ దేశాలూ లేవు.ఇరవై నాలుగు వేల ఆర్కిటిక్‌ సముద్ర తీరం ఉన్న రష్యా ఆ ప్రాంతం నుంచి వెలికి తీస్తున్న చమురు, గాస్‌ను ఐరోపాకు ప్రధానంగా ఎగుమతి చేసేది, ఇప్పుడు ఇతర ప్రాంతాలకు పంపుతున్నది. ఈ ప్రాంత వనరులను రష్యా ఎంతగా వెలికితీస్తే అంతగా ప్రపంచంలో దాని ఆర్థిక పలుకుబడి పెరుగుతుంది.బహుశా దీన్ని ఊహించే అమెరికా కూడా అలాస్కా, గ్రీన్‌లాండ్‌ ప్రాంతంలో ఇప్పుడున్న మిలిటరీ కేంద్రాలను మరింతగా పటిష్టపరుస్తున్నది, నార్వేలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. రష్యాను దెబ్బతీసే వ్యూహంలో భాగంగా ఫిన్లండ్‌, నార్వేలతో మిలిటరీ సహకారాన్ని పెంచుకుంటున్నది.ఆర్కిటిక్‌ ప్రాంతంలో తన సరిహద్దుల నుంచి రెండువందల నాటికల్‌ మైళ్లకు (370 కిలోమీటర్లు) ఆవల కూడా తమకు హక్కు ఉందని అమెరికా కొత్తగా వివాదాస్పద ప్రకటనగావించింది. సముద్ర చట్టాల ఐరాస ఒప్పందంలో ఇంతవరకు అది భాగస్వామి కాదు. ఆ ప్రాంతంలో ఉన్న విలువైన ఖనిజాలు ఉండటమే దీనికి కారణం.


పశ్చిమ దేశాల అండచూసుకొని ఉక్రెయిన్‌ ఎన్నిబెదిరింపులకు పాల్పడినప్పటికీ ఇటీవలి కాలంలో నల్లసముద్రం, అజోవ్‌ సముద్రాలలో రష్యా ఓడల రవాణా 17.2శాతం పెరిగింది. నాటో రష్యా మీద విధించిన ఆంక్షలను సభ్యదేశమైనప్పటికీ టర్కీ పాలకులు అమలు చేయటం లేదు, అంతేకాదు ఏజియన్‌ సముద్రం నుంచి నల్లసముద్రంలోకి దారి తీసే రెండు జలసంధులలోకి నాటో యుద్ధ నౌకలను అనుమతించటం లేదు.వాటికి రెండువైపులా టర్కీ ఉంది. నాటో తన బలగాలను విస్తరించుకొనేందుకు నల్లసముద్రంలో అమర్చిన మందుపాతరలను వెలికి తీసే పేరుతో రుమేనియా రూపంలో ముందుకు వస్తున్నదని చెబుతున్నారు. నాటోతో నిమిత్తం లేకుండా రుమేనియాతో పాటు టర్కీ, బల్గేరియా ఒక ఒప్పందం చేసుకొని మందుపాతరలను తొలగించేందుకు పూనుకున్నాయి.అమెరికా, ఐరోపా దేశాల ఎత్తుగడలను పసిగట్టిన వ్లదిమిర్‌ పుతిన్‌ నల్లసముద్ర తటస్థ జలాల మీద కాపలా కాసేందుకు హైపర్‌సోనిక్‌ క్షిపణులతో కూడిన జట్‌ విమానాలను మోహరించాలని అక్టోబరు నెలలో ఆదేశించాడు. సూయజ్‌ కాలువ ద్వారా కంటే తక్కువ దూరం ఉండే జలమార్గం కాస్పియన్‌ సముద్రం నుంచి ఉంది.దాన్ని పూర్తిగా వినియోగించుకొనేందుకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇరాన్‌, పర్షియన్‌ గల్ఫ్‌,మధ్య ఆసియా దేశాలు, పాకిస్థాన్‌, భారత్‌కు ఈ మార్గం నుంచి చేరటం దగ్గర అవుతుంది. ఈ సముద్ర తీరంలో ఉన్న తన నౌకాశ్రయాల నుంచి రవాణాను పెంచేందుకు రష్యా పూనుకుంది. ఇటీవల చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇరాన్‌లో 162కిలోమీటర్ల రైలు మార్గాన్ని రష్యా నిర్మిస్తుంది.పసిఫిక్‌ ప్రాంత దేశాలతో రష్యా సరకు రవాణా 5.7శాతం పెరిగింది.రష్యా దూరప్రాచ్య రేవుల నుంచి ఇది జరిగింది. గతేడాది సెప్టెంబరులో చైనాలోని క్వాంగ్‌ఝౌ నుంచి రష్యా వ్లాడీవోస్టాక్‌ వరకు ఒక నౌకా మార్గాన్ని ప్రారంభించాయి. దీన్ని ఐస్‌ సిల్క్‌ రోడ్‌ అని పిలుస్తున్నారు. యూరేసియా ప్రాంతంతో మరింత సన్నిహితం కావటానికి ఇది తోడ్పడుతుందని భావిస్తున్నారు.వ్లాడీవోస్టాక్‌ నుంచి ఆర్కిటిక్‌ ప్రాంతంలోని వివిధ రేవులకు ఈ మార్గాన్ని చైనా పొడిగించవచ్చని వార్తలు.


ఉక్రెయిన్‌ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో అంతకాలం రష్యా మీద ఆంక్షలు కొనసాగుతాయి. వాటిని తప్పించుకొని గ్రీస్‌ ఓడలు ఇరాన్‌, రష్యా చమురు రవాణా చేయటాన్ని గ్రహించిన అమెరికా యజమానులను బెదిరించింది. దాంతో ఆ తలనొప్పి ఎందుకు అంటూ ఓడలు, టాంకర్లను అమ్ముకొని లాభాలు పొందుతున్నట్లు తేలింది.టాంకర్లకు డిమాండ్‌ పెరిగింది. గడచిన పన్నెండు నెలల్లో నాలుగు వందల కోట్ల డాలర్ల విలువగల 125 చమురు టాంకర్లు, నౌకలను విక్రయించారు. అయితే వాటిని కొన్నవారి పేర్లు వెల్లడికాకుండా జాగ్రత్తపడుతున్నారు. ఎక్కువ భాగం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన వారు కొనుగోలు చేసినట్లు తేలింది. తరువాత చైనా, టర్కీ, భారత్‌ ఉన్నాయి. తమ మనుగడకే ముప్పు తెచ్చిన నాటో కూటమిని ఎదుర్కొనేందుకు రష్యా కూడా దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యూహాలను రూపొందించుకోవటం అనివార్యం.మిలిటరీ రీత్యా ఆయుధనవీకరణ ఒకటైతే ఐరోపాతో దెబ్బతిన్న వాణిజ్యం, ఎగుమతులకు ప్రత్యామ్నాయ ప్రాంతాలను చూసుకోవటం తప్పనిసరి.ఆర్థికంగా చైనా పెద్ద మద్దతుదారుగా ఉంది. మనదేశం దీర్ఘకాలంగా రష్యాతో ఉన్న మిలిటరీ, ఆర్థిక సంబంధాలను కొనసాగించక తప్పని స్థితి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ పోరుపై పశ్చిమ దేశాల మల్లగుల్లాలు, దిక్కుతోచని జెలెనెస్కీ !

13 Wednesday Dec 2023

Posted by raomk in Current Affairs, Economics, Europe, Germany, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, Ukrain failures, Ukraine crisis, Ukraine-Russia crisis, Vladimir Putin, vladimir putin's re election


ఎం కోటేశ్వరరావు


అదిగో పుతిన్‌ సేనలను తరిమి కొడుతున్నాం ఇదిగో రష్యా ఆధీనంలోకి వెళ్లిన ప్రాంతాలను తిరిగి తెచ్చుకుంటున్నాం అని గడచిన 658 రోజులుగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీ, అమెరికా, పశ్చిమదేశాల నేతలు చెబుతూనే ఉన్నారు.పరిస్థితిలో మార్పు లేదు, రష్యా సైనిక చర్య కొనసాగుతూనే ఉంది. తమ ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాలతో సహా త్వరలో ఎన్నికలు జరపబోతున్నామని ప్రకటించింది. దీంతో పశ్చిమ దేశాలు మరోసారి ఉక్రెయిన్‌ మీద దృష్టి సారించాయి.పోతున్న పరువును నిలుపుకొనేందుకు కొత్త ఎత్తుగడల గురించి మల్లగుల్లాలు పడుతున్నాయి.దాన్లో భాగంగానే హడావుడిగా జెలెనెస్కీని సోమవారం నాడు వాషింగ్టన్‌ రప్పించారు.ప్రారంభంలో తగిలిన ఎదురుదెబ్బల తరువాత రష్యా మిలిటరీ కొత్త వ్యూహాలను అనుసరిస్తున్నది. గతం కంటే ఎక్కువగా సైనికులు, క్షిపణులు, మందుగుండును సమకూర్చుకుంది. ఇరాన్‌ నుంచి పెద్ద సంఖ్యలో యుద్ధరంగంలో వినియోగించే డ్రోన్లను సమీకరించింది. పశ్చిమ దేశాలు మిలిటరీ, ఆర్థికసాయం ఎంతచేసినా ఫలితం లేకపోవటంతో అమెరికా యంత్రాంగంలో ఆందోళన మొదలైంది. సైనిక చర్య వచ్చే ఏడాది కూడా కొనసాగితే అది జో బైడెన్‌ ఎన్నికల మీద ప్రభావం చూపుతుంది. ఓడిపోతున్న ఉక్రెయిన్‌కు మనమెందుకు సాయం చేయాలని ప్రతిపక్ష రిపబ్లికన్లు ప్రశ్నిస్తున్నారు. దిక్కుతోచని జో బైడెన్‌ గత వారంలో పార్లమెంటులో మాట్లాడుతూ పుతిన్ను గెలవనివ్వకూడదు, అది మన జాతీయ, మన స్నేహితుల అంతర్జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉంది. ఉక్రెయిన్‌కు మన సాయంలో అంతరాయం ఏర్పడితే పుతిన్‌ స్థానం బలపడుతుందని వాపోయాడు. వచ్చే ఏడాది జర్మనీలో జరిపే యుద్ధ విన్యాసాల తరువాత కొత్త ఎత్తుగడలకు ఒక రూపం వస్తుందని భావిస్తున్నారు. కొత్త వ్యూహంతో ముందుకు పోనట్లయితే ఓడే అవకాశం ఉందని అమెరికా నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇప్పటికే 111బిలియన్‌ డాలర్ల సాయం చేశామని, అదంతా బూడిదలో పోసిన పన్నీరైనందున ఇంక సాయం అనవసరమని రిపబ్లికన్లు పెదవి విరుస్తున్నారు.ఇచ్చినదానితో సర్దుకొని పోరుసాగించాలి తప్ప ఎక్కువగా ఆశించవద్దని కూడా పరోక్షంగా సందేశాలిస్తున్నారు. ఎంత ఇస్తామనేది పక్కన పెడితే రానున్న సంవత్సరంలో గత రెండు సంవత్సరాలలో చేసిన మాదిరి సాయం చేసే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు.


రానున్న రోజుల్లో గట్టి ప్రతిఘటన ఇస్తే వచ్చే ఏడాది చివరికి లేదా 2025లో రష్యాతో సంప్రదింపులకు అర్ధం ఉంటుందని, భారం మొత్తం ఉక్రెయిన్‌ మీద పెట్టే విధంగా అమెరికన్లు మాట్లాడుతున్నారు. ఎత్తుగడలను మార్చకపోతే మొదటి ప్రపంచ యుద్ధంలో 1916లో పెద్ద సంఖ్యలో సైనికులను పోగొట్టుకున్నా సాధించిందేమీ లేనట్లుగా ఉక్రెయిన్‌ పరిస్థితి ఉంటుందని హెచ్చరించినట్లు న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక రాసింది. ఎదురుదాడుల పేరుతో ఉక్రెయిన్‌ ప్రారంభించిన చర్యల్లో పెద్ద సంఖ్యలో మరణించిన, గాయపడిన సైనికులు ఉన్నట్లుగా కూడా పేర్కొన్నది.వియత్నాం, ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా వైఫల్యం మాదిరి 2023లో ఉక్రెయిన్‌ పరిస్థితి ఉందని విమర్శకులు పేర్కొన్నారు. చివరి యత్నంగా అమెరికా స్వయంగా తన సీనియర్‌ కమాండర్లు ఆంటోనియో అగుటో జూనియర్‌ వంటి వారు ఎక్కువ సమయం కీవ్‌లో, జర్మనీలో ఉండి సమన్వయం చేసేందుకు పంపాలని నిర్ణయించింది. ఉక్రెయిన్‌ ఎదురుదాడుల్లో సాధించిందేమీ లేకపోగా అమెరికా అంచనావేసినదాని కంటే రష్యా సేనలు బలంగా ఉన్నట్లు తేలింది. అంతేకాదు రష్యా ఎంతగా తన సేనలను బలపరుచుకుంటున్నదన్న అంచనాలో కూడా అమెరికా విఫలమైంది. ప్రస్తుతం ఇరవై శాతం ఉక్రెయిన్‌ ప్రాంతం రష్యా ఆధీనంలో ఉంది. అక్కడ రష్యా పాతిన మందుపాతరలు 1950 దశకంలో కొరియా యుద్ధం తరువాత మరెక్కడా లేని విధంగా ఉన్నందున ఉక్రెయిన్‌ సేనలు ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. వాటిని తొలగించేందుకు పూనుకున్న ఉక్రెయిన్‌ సేనలపై రష్యా హెలికాప్టర్లతో దాడులు చేస్తూ ఊపిరి సలుపుకోనివ్వటం లేదు. ఇరాన్‌, చైనాల నుంచి సేకరించిన రకరకాల డ్రోన్లను రష్యా ఉపయోగిస్తుండటంతో యాంత్రిక యుద్ధ స్వభావంలోనే మార్పు వచ్చిందని అమెరికా నిర్ధారణకు వచ్చింది.రష్యా ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాలలో దేనిమీద కేంద్రీకరించాలనే అంశపై అమెరికా-ఉక్రెయిన్‌ నిపుణుల మధ్య ఏకాభిప్రాయం లేదని వెల్లడైంది. కోల్పోయిన ప్రాంతాలన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకోవాలని చూడవద్దని అమెరికా అంటోంది. యుద్ధం ముగియాలంటే ఉక్రెయిన్‌ కొంత భాగాన్ని రష్యాకు కోల్పోవాల్సి ఉంటుందని జెలెనెస్కీ రాక సందర్భంగా అమెరికా రిపబ్లికన్‌ సెనెటర్‌ జెడి వాన్స్‌ చెప్పాడు.


త్వరగా ముగియాలని మేము ఎంతగా కోరుకుంటున్నప్పటికీ సమీప కాలంలో ఉక్రెయిన్‌ పోరు ముగిసేట్లు లేదని, అందుకే వత్తిడిని మరింత పెంచాల్సి ఉంటుదని జర్మనీ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షుల్జ్‌ అధికార సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ సమావేశంలో చెప్పాడు. మేం వూరికే వదలి పెడతామని పుతిన్‌ అనుకోవద్దని కూడా అన్నాడు. అమెరికా తరువాత ఉక్రెయిన్‌కు అతిపెద్ద మద్దతుదారుగా జర్మనీ ఉంది, భారీ మొత్తంలో ఆయుధాలను అందిస్తున్నది.పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నందున ఉక్రెయిన్‌కు అమెరికా అదనపు సాయం అందకపోతే ఉక్రెయిన్‌ గతి ఏమిటని అనేక మంది పశ్చిమ దేశాల విశ్లేషకులు ఆందోళన వెల్లడిస్తున్నారు.మార్చి నాటికి పదిలక్షల ఫిరంగి గుండ్లను అందించాలన్న లక్ష్యం నెరవేరేట్లు కనిపించటం లేదని, మరోవైపు ఉత్తర కొరియా నుంచి అంతకంటే ఎక్కువగా రష్యా పొందవచ్చని చెబుతున్నారు. తమ కంటే పది నుంచి 30 రెట్ల వరకు ఫిరంగి గుండ్లు రష్యన్ల వద్ద ఉన్నాయని ఒక ఉక్రెయిన్‌ సైనికుడు చెప్పినట్లు జర్మన్‌ పత్రిక డెర్‌ స్పీగల్‌ రాసింది. పశ్చిమ దేశాలను మించి రష్యా ఫిరంగి గుండ్లను ఉత్పత్తి చేస్తుండగా ఉత్తరకొరియా నుంచి వస్తున్నవి అదనమని, పశ్చిమ దేశాల రాజకీయాల్లో ఉన్న అనిశ్చితి కారణంగా ఉక్రెయిన్‌ నిలబడగలదా అంటూ, అమెరికా సాయం లేకుంటే ఐరోపా మద్దతు కుప్పకూలిపోతుందని ఎకానమిస్ట్‌ పత్రిక రాసింది.


ఆంక్షలతో పశ్చిమ దేశాలు తమ బాంకుల్లో ఉన్న రష్యా సొమ్ము 300బిలియన్‌ యూరోలను స్థంభింప చేసినా, అనేక ఆంక్షలను విధించి అమలు జరుపుతున్నా ఇప్పటి వరకు పుతిన్‌ తట్టుకొని నిలిచాడు. పశ్చిమ దేశాలు వేసిన అంచనాలన్నీ తప్పాయి.చైనాతో సంబంధాలను పెంచుకొని పశ్చిమ దేశాల ఆంక్షలను నిర్వీర్యం చేశాడు. ఆంక్షల కారణంగా గతేడాది ఆర్థిక ఉత్పత్తి 2.1శాతం తగ్గినా ఈ ఏడాది 2.8శాతం పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. జనాభాలో 80శాతం మంది పుతిన్‌కు మద్దతు పలుకుతున్నట్లు సర్వేలు తెలిపాయి. అయితే రానున్న రోజుల్లో ఆర్థిక సవాళ్లను కూడా తక్కువగా అంచనా వేయనవసరం లేదు. తొలిదశలో మాదిరి దూకుడుగా ముందుకు పోకుండా మధ్యలో గట్టిదెబ్బలు కొడుతూ ఉక్రెయిన్‌కు ఊపిరి సలపకుండా రష్యా చూస్తున్నది.అలసిపోయి దారికి రాకతప్పదనే అంచనాలో ఉంది.వచ్చే ఏడాది మార్చినెల 17వ తేదీన జరిగే ఎన్నికల్లో మరోసారి పుతిన్‌ పోటీ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.


సరిగ్గా జెలెనెస్కీ వాషింగ్టన్‌ పర్యటనకు వెళ్లినపుడే తాము నిర్మిస్తున్న అణు జలాంతర్గాములలో రెండింటిని మిలిటరికీ అప్పగించినట్లు ప్రకటించారు.మొత్తం ఎనిమిదింటిని రష్యా నిర్మిస్తున్నది.రాజధాని కీవ్‌ నగరం మీద మంగళవారం తెల్లవారు ఝామున డ్రోన్లు, క్రూయిజ్‌ క్షిపణుల కంటే వేగంగా ప్రయాణించే ఎనిమిది ఖండాంతర దీర్ఘ శ్రేణి క్షిపణులను రష్యా ప్రయోగించింది. వాటిని మధ్యలోనే కూల్చివేయటం ఎంతో కష్టం. ఉక్రెయిన్‌కు మద్దతుగా బ్రిటన్‌ రెండు నౌకలను నల్లసముద్రంలోకి పంపుతున్నట్లు ప్రకటించింది. సముద్రంలోనూ భూమి మీద ప్రయాణించే సాయుధశకటాలను కూడా అది పంపుతున్నది. ఇటీవలి కాలంలో పుతిన్‌ రక్షణ ఖర్చును భారీగా పెంచుతున్నట్లు ఎకానమిస్ట్‌ పత్రిక పేర్కొన్నది. వచ్చే ఏడాది జిడిపిలో ఆరుశాతానికి పెంచనున్నారని, ఇది సోవియట్‌ యూనియన్‌ కూలిన తరువాత ఎక్కువ అని పేర్కొన్నది. రష్యా వృద్ధిరేటు ఈ ఏడాది ప్రారంభంలో ఒక ఒకశాతం ఉండగా మూడుశాతానికి పెరుగుతుందని రేటింగ్‌ సంస్థలు పేర్కొన్నాయి.


ఉక్రెయిన్‌ పోరు ప్రారంభంలో పశ్చిమదేశాల ఆర్థికవేత్తలు వేసిన అంచనాలన్నీ తలకిందులయ్యాయి.విధించిన ఆంక్షలు పని చేయటం లేదు, ఈ స్థితిలో రష్యాను ఎలా దారికి తేవాలా అన్నది పశ్చిమ దేశాలకు తోచటం లేదు. ఇటీవల బెర్లిన్‌లో జరిగిన ఐరోపా యూనియన్‌ సమావేశంలో జరిగిన సమీక్షలో డజనుకుపైగా చైనా కంపెనీలు రష్యా మిలిటరీకి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను అందిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. చైనాను వారేమీ అదుపు చేయలేరు. తొలి రోజుల్లో ఆంక్షలు పని చేసినట్లు కనిపించినా తరువాత కాలంలో వాటిని అధిగమించినట్లు నిర్ధారణకు వచ్చారు.నాటో సభ్యురాలు టర్కీ, కజకస్తాన్‌, ఇరాన్‌, ఉత్తర కొరియా వంటి దేశాలు రష్యాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నాయి. అమెరికా తయారీ మందుగుండు కూడా రష్యాకు చేరుతున్నట్లు సమావేశంలో వెల్లడైంది.కజకస్తాన్‌ వంటి దేశాల దిగుమతులు పెరిగిన తీరు చూస్తే మూడవ దేశాల ద్వారా ఐరోపా కంపెనీల యంత్రాలు, విడిభాగాలు రష్యాకు చేరుతున్నట్లు అనుమానిస్తున్నారు.హంగరీ, ఎస్తోనియా వంటి ఐరోపా దేశాలు రష్యాతో సంబంధాలను కలిగి ఉన్నట్లు సమీక్షలో పేర్కొన్నారు.గతంలో సోవియట్‌ మాదిరి ఇప్పుడు రష్యా తనకు అవసరమైన మిలిటరీ పరికరాలను నూటికి నూరుశాతం సమకూర్చుకోగలిగిన స్థితిలో ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు.ఆంక్షలను ఉల్లంఘించినట్లు ఒకవైపు చెబుతూనే అలాంటి కంపెనీలపై తీసుకున్న చర్యలేమిటో చెప్పలేని స్థితిలో ఐరోపా సమాఖ్య ఉంది.దాదాపు పదహారు వందల ఐరోపా కంపెనీలు రష్యాలో లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. కొన్ని మద్యం కంపెనీలు రష్యా నుంచి వెలువలికి వచ్చినట్లు ప్రకటించినా వాటి ఉత్పత్తులు అక్కడ దొరుకుతున్నాయని ఐరోపా సమాఖ్య అధికారులు వాపోతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రయోజనం లేని భద్రతా మండలి తీర్మానం – గాజాలో సొరంగాల అసలు కథేంటి !

17 Friday Nov 2023

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

2023 Israel–Hamas war, emmanuel macron, Gaza Tunnels, Joe Biden, Justin Trudeau, Narendra Modi Failures, UNSC Failures

ఎం కోటేశ్వరరావు


గాజాపై ఇజ్రాయెల్‌ మారణకాండ ప్రారంభమైన నలభై రోజుల తరువాత తొలిసారిగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మానవతా పూర్వక కోణంలో దాడులను ఆపాలని యూదు దురహంకారులను కోరుతూ 12-0 ఓట్లతో వేడుకోలు తీర్మానాన్ని ఆమోదించింది.అనేక దఫాల చర్చల అనంతరం మాల్టా ప్రతిపాదించిన ఈ తీర్మానంలో హమస్‌ను ఖండించలేదు గనుక తాము బహిష్కరించినట్లు అమెరికా, బ్రిటన్‌ ప్రకటించాయి. ఇజ్రాయెల్‌ను డిమాండ్‌ చేయకుండా వేడుకోవటం ఏమిటంటూ రష్యా నిరసనతో ఓటింగ్‌కు దూరంగా ఉంది.ప్రపంచంలో లక్షలాది మంది ప్రతి రోజూ ఏదో ఒక మూల నిరసన తెలుపుతున్నా, ఐరాస సాధారణ అసెంబ్లీ తీర్మానం చేసినా పెడచెవిన పెట్టిన ఇజ్రాయెల్‌ ఈ తీర్మానాన్ని మన్నిస్తుందా ! వెనక్కు తగ్గుతుందా ? గాజాలోని ప్రధాన ఆసుపత్రి కింద నేలమాళిగల్లో దాక్కున్న హమస్‌ తీవ్రవాదులను పట్టుకొనే పేరుతో మొత్తం ఆసుపత్రినే పనికి రాకుండా చేసిన ఇజ్రాయెల్‌ మిలిటరీ అక్కడ ఎంత మంది తీవ్రవాదులను పట్టుకున్నదీ చెప్పకుండా ఆయుధాలను కనుగొన్నామంటూ లోకాన్ని నమ్మింపచేసేందుకు కొన్ని ‘ సిత్రాలను ‘ చూపుతున్నది. ఇలాంటి ఫేక్‌ వీడియోలు ఎక్కడైనా తయారు చేయవచ్చు, తాన అంటే తందాన అనే బిబిసి లాంటి టీవీలు అవి నిజమే అంటూ ప్రపంచాన్ని నమ్మించేందుకు నానా గడ్డీ కరవవచ్చు తప్ప లోకజ్ఞానంతో ఆలోచించే వారెవరూ నమ్మరు. నివాస ప్రాంతాలు, జనాన్ని మానవ కవచాలుగా వాడుకుంటున్న ఉగ్రవాదులు అంటూ ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్నది.


గాజా ప్రాంతంలో సొరంగాలు ఉన్న అంశం కొత్తేమీ కాదు. వాటిపైన ఆసుపత్రులు, స్కూళ్లు, నివాసాలు, ఫ్యాక్టరీలు అన్నీ ఉన్నాయి. యూదు దురాక్రమణను ఎదిరించేందుకు పాలస్తీనా పోరాటయోధులు హమస్‌ ఆవిర్భవించక ముందు కొన్ని దశాబ్దాల క్రితమే ఏర్పాటు చేసుకున్నారు. అవి వారి పోరుబాటలో విడదీయలేనివిగా మారాయి.అక్కడేమీ అడవులు, ఎడారులు లేవు. అక్కడే నివాసాలు, అవే పోరాట కేంద్రాలు. అక్కడ పుట్టి పెరిగే ప్రతి బిడ్డా అక్షరాభ్యాసంతో పాటు పోరుబాట పాఠాలు కూడా నేర్చుకోక తప్పని స్థితిని సామ్రాజ్యావాదులు, వారి బంటుగా ఉన్న ఇజ్రాయెల్‌ కల్పించిన కఠిన సత్యాన్ని ఎవరూ విస్మరించకూడదు. నిత్యం ఎప్పుడేమౌతుందో ఇజ్రాయెల్‌ పోలీసు, మిలిటరీ, యూదు ఉగ్రవాదులు ఎప్పుడు దాడులు చేస్తారో తెలియని స్థితిలో కార్చటానికి కన్నీళ్లు కూడా లేకుండా దశాబ్దాల తరబడి పెరిగారు, అక్కడే మట్టిలో కలిశారు. ఇప్పుడు ఈజిప్టు నేతలు అమెరికా చంకనెక్కి ఇజ్రాయెల్‌తో సఖ్యంగా ఉంటున్నారు తప్ప గతంలో అధికారంలో ఉన్నవారి ప్రోత్సాహం, సాయంతోనే పాలస్తీనా వారు సొరంగాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదిరిన తరువాత తమ భూభాగంలో ఉన్నవాటిని ఈజిప్టు కొన్నింటిని కూల్చివేసి, మూసివేసి, గోడలు కట్టి పాలస్తీనియన్లను రాకుండా కట్టడి చేసింది.


గాజాపై ఇజ్రాయెల్‌ దురాక్రమణ, మారణకాండ ప్రారంభించిన అక్టోబరు ఏడవ తేదీ నుంచి అక్కడ ఉన్న సొరంగాల గురించి పెద్ద ఎత్తున ప్రసారమాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇజ్రాయెల్‌ అమలు చేసిన దిగ్బంధనాన్ని వమ్ము చేసేందుకు వాటిని తవ్వారు. ఈజిప్టు నుంచి గాజా అక్కడి నుంచి పశ్చిమగట్టుతో పాటు ఇజ్రాయెల్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా వాటిని విస్తరించారు.ఆహారం, ఇంథనం, ఔషధాలు, నిత్యావసర వస్తువులు వేటినీ అందనివ్వకుండా గాజా నుంచి పాలస్తీనియన్లు వారంతట వారే వేరే చోట్లకు తరలిపోయేట్లు చేసేందుకు అష్టదిగ్బంధనం చేశారు.ఈజిప్టు నుంచి వాటిని తెచ్చుకొనేందుకు తవ్విన సొరంగాలను స్మగ్లింగ్‌ మార్గాలుగా ప్రచారం చేశారు. గాంధీని మోసిన రైలు గాడ్సేను కూడా తీసుకువెళ్లింది అన్నట్లుగా కొన్ని సందర్భాలలో దొంగరవాణాకు ఉపయోగించిన వారు ఉంటే ఉండవచ్చు తప్ప అందుకోసమే వాటిని తవ్వలేదు. సరకులతో పాటు పాలస్తీనా యోధులకు ఇతర దేశాలు అందచేసిన ఆయుధాలను కూడా ఆత్మరక్షణకు ఆ మార్గాలద్వారా తీసుకురాబట్టే ఇజ్రాయెలీ మూకలు కొంత మేరకు అదుపులో ఉన్నాయి.

1979లో ఈజిప్టు-ఇజ్రాయెల్‌ మధ్య మైత్రి కుదిరింది.1987 నుంచి 1993వరకు సాగిన తొలి తిరుగుబాటుకు ఇజ్రాయెల్‌ రెచ్చగొట్టుడే కారణం. గాజాలోని జబాలియా ప్రాంతంలో ఏర్పాటు చేసిన నిర్వాసిత పాలస్తీనీయన్ల శిబిరం మీదకు ఒక ట్రక్కుతో ఇజ్రాయెల్‌ మిలిటరీ చేసిన దాడిలో ముగ్గురు మరణించారు. అది ప్రమాదమని నమ్మబలికినప్పటికీ కావాలనే చేసిందనే ఆగ్రహంతో పాలస్తీనియన్లు ప్రారంభించిన నిరసన, ప్రతిఘటన ఐదేండ్లు సాగింది. ప్రధానంగా రాళ్లు, సీసాల్లో మండే ద్రావకాలను నింపి వాటికి ఫీజులు అమర్చి(మాల్టోవ్‌ బాంబు) సైనికుల మీద దాడులు చేశారు. అందుకనే దాన్ని రాళ్ల తిరుగుబాటు అని కూడా కొందరు వర్ణించారు. ఆ సందర్భంగానే సొరంగాల ద్వారానే అవసరమైన ఆయుధాలు, పేలుడు పదార్దాలను తిరుగుబాటుదారులు సమకూర్చుకున్నారు. ఓస్లో ఒప్పందాలను ముందుకు తెచ్చిన తరువాత తిరుగుబాటు ముగిసింది. దాంతో ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టిన ఇజ్రాయెలీ మిలిటరీ సొరంగాలు ఉన్నట్లు 1983లో అధికారికంగా ప్రకటించింది. 2009లో కొత్త వాటిని తవ్వేందుకు, ఉన్నవాటిని వినియోగించేందుకు వీలు లేకుండా ఈజిప్టు తన ప్రాంతంలో భూగర్భ ఆటంకాలను నిర్మించింది. అనేక సొరంగాలను మూసివేసింది.భూమి మీద ఉన్న సరిహద్దుద్వారానే రాకపోకలకు అవకాశమిచ్చింది.2007లో గాజా ప్రాంతంలో హమస్‌ పట్టు సాధించి ఆ ప్రాంతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గాజా పౌరులు కదలకుండా మెదలకుండా ఉండేందుకు ఈజిప్టు-ఇజ్రాయెల్‌ రెండూ ఆంక్షలను మరింత కఠినతరంగావించాయి. దానిలో భాగంగానే ఈజిప్టు 2013,14 సంవత్సరాలలో పన్నెండు వందల సొరంగాలను నాశనం చేసింది.


గాజాను దిగ్బంధించిన కాలంలో అధికారికంగా అనుమతించిన వాణిజ్యం కంటే సొరంగాల ద్వారానే ఎక్కవగా జరిగినట్లు 2015 నివేదికలో ఆంక్టాడ్‌ పేర్కొన్నది.2008.09 సంవత్సరాలలో గాజాపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ధ్వంసమైన ఆరువేల ఇండ్లను నిర్మించేందుకు ఇజ్రాయెల్‌ అనుమతించిన మేరకు అవసరమైన సామగ్రిని తరలించేందుకు నిర్మాణం గావించేందుకు ఎనభై సంవత్సరాలు పట్టేది. కానీ సొరంగాల ద్వారా పాలస్తీనియన్లు వాటిని సమకూర్చుకొని కేవలం ఐదు సంవత్సరాల్లోనే పూర్తి చేశారు. గాజాలో ఉన్న ఏకైక విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నడవటానికి రోజుకు అవసరమైన పదిలక్షల లీటర్ల డీజిల్‌ను ఈజిప్టు నుంచి తెచ్చుకొనేందుకు కూడా అవే రవాణా మార్గాలు. గాజాలోని, మురుగు, ఉప్పునీటిని శుద్ధి చేసేందుకు అవసరమైన విద్యుత్‌ కోసం ఈ కేంద్రాన్ని వినియోగించారు. ఈజిప్టు తన ప్రాంతంలో ఉన్న సొరంగాలను మూసివేసిన తరువాత డీజిల్‌ దొరక్క ఆ కేంద్రం మూతపడింది. దాంతో మురుగు నీటిని సముద్రంలోకి వదలటంతో సముద్ర తీరంలో కాలుష్య సమస్య ఏర్పడింది. గాజాపై దిగ్బంధనాన్ని తొలగించి టన్నెల్‌ ఆర్ధిక వ్యవస్థకు స్వస్తి పలకాలని ఆంక్టాడ్‌ పేర్కొన్నది. నిర్మాణ సామాగ్ర రవాణాకు తాము అనుమతిస్తే వాటితో హమస్‌ మిలిటరీ అవసరాల కోసం వినియోగిస్తుందని ఇజ్రాయెల్‌ సాకులు చెప్పింది. రంజాన్‌ సందర్భంగా గాజా వెలుపలికి వెళ్లాలంటే ఈజిప్టు, ఇజ్రాయెల్‌ అనుమతించిన గేట్లద్వారానే వెళ్లాల్సి ఉండేది. సాకులు చెప్పి అనేక పరిమితులు విధించిన కారణంగా రాకపోకలకు కూడా ఆ సొరంగాలే పనికి వచ్చాయి. ఇజ్రాయెల్‌లో జనసమ్మర్ధం లేని, కాపాలా పెద్దగా లేని ప్రాంతాలకు ఈ సొరంగమార్గాలు విస్తరించి వాటి ద్వారా కూడా లావాదేవీలు నిర్వహించారు.


నెలరోజులకు పైగా టాంకులు, క్షిపణులతో ఒక్కో ఆసుపత్రిని ధ్వంస చేస్తున్న పూర్వరంగంలో ఒకవేళ నిజంగానే తీవ్రవాదులు ఎవరైనా ఆ సొరంగాల్లో ఉంటారా, ఇజ్రాయెల్‌, పశ్చిమదేశాల మీడియాలో చూపేందుకు ఆయుధాలను అక్కడే వదలి వెళతారా? 1967 యుద్దంలో ఈజిప్టు రక్షణలో ఉన్న గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ ఆక్రమించింది. ఓస్లో ఒప్పందాల్లో భాగంగా 1993లో పాలస్తీనా అధారిటీకి వాటిని అప్పగించినట్లు ప్రకటించినప్పటికీ 2005లో మాత్రమే సైన్యాన్ని, అక్కడ నివాసాలు ఏర్పాటు చేసి ప్రవేశపెట్టిన యూదు పౌరులను వెనక్కు తీసుకుంది. ఆ తరువాత కూడా ఈజిప్టు పాలకులతో చేతులు కలిపి గాజాను దిగ్బంధం చేసింది, హమస్‌ తీవ్రవాదులను అణచేపేరుతో అనేక సార్లు గాజా మీద దాడులు చేసి వేలాది మందిని బలితీసుకుంది.తాజాగా అదే సాకుతో చేస్తున్న దాడులు మరింత దుర్మార్గంగా ఉన్నాయి, ఆసుపత్రులను కూడా వదల్లేదు.భద్రతా మండలి తీర్మానం భాషలో తొలుత కాల్పుల విరమణ పాటించాలనే డిమాండ్‌ను పెట్టగా తరువాత దాన్ని తొలగించి పిలుపు అనే పదాన్ని చేర్చారంటేనే దాన్ని ఇజ్రాయెల్‌ దయాదాక్షిణ్యాలకు వదలి పెట్టారన్నది స్పష్టం. కాదని ఠలాయిస్తే మీద చర్యలు తీసుకొనేందుకు ఎలాంటి ప్రతిపాదనలూ దానిలో లేవు. గతంలో బాల్కన్‌ నుంచి సిరియా వరకు అనేక సందర్భాల్లో ఇలాంటి వాటిని ఆమోదించారు. వాటిని పట్టించుకున్నవారుగాని, ఎలాంటి ఫలితంగాని లేదు. సరిగ్గా ఈ తీర్మానం ఆమోదిస్తున్న తరుణంలోనే గాజాలో పోరు తరువాత బలమైన మిలిటరీ శక్తిని అక్కడ ఉంచుతాం అని ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఇసాక్‌ హర్‌జోగ్‌ చెప్పాడు. ఇదే సమయంలో గాజాను ఆక్రమించటం పెద్ద తప్పిదం అవుతుందని స్పష్టం చేసినట్లు అమెరికా అధినేత జోబైడెన్‌ కొత్త పల్లవి అందుకొన్ని నాటకంలో మరో అంకానికి తెరలేపాడు.


మారణకాండను సమర్ధించటంలో ఎవరి పాత్రను వారు పోషిస్తున్నారు. పౌరులను చంపివేస్తున్నారని తక్షణమే కాల్పుల విరమణ జరగాలంటూ అక్టోబరు 26న ఐరాసా సాధారణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై మన దేశం ఓటింగ్‌లో పాల్గొనలేదు, అంటే పరోక్షంగా ఇజ్రాయెల్‌ను సమర్ధించినట్లే. పేద దేశాల రెండవ వాణి సదస్సులో శుక్రవారం నాడు ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ గాజాలో సాధారణ పౌరులను చంపివేయటాన్ని ఖండిస్తున్నట్లు చెప్పటం విశేషం. దీన్నే ఏ రోటి దగ్గర ఆ పాటపాడటం అంటారు. ఐరాసలో ఇజ్రాయెల్‌ను ఖండిస్తే అమెరికాకు ఆగ్రహం కలుగుతుంది. పేద దేశాల సమావేశంలో ఖండించకపోతే వాటికి దూరం అవుతారు.పన్నెండు వేల మంది మరణించిన పూర్వరంగంలో ప్రపంచ మద్దతు కోల్పోతున్న ఇజ్రాయెల్‌ను నిస్సిగ్గుగా సమర్ధించిన వారే మాట మార్చిన తరువాత నలభై రెండవ రోజున నరేంద్రమోడీ నోరు విప్పారు. పిల్లలను చంపటాన్ని నిలిపివేయాలని గతవారంలో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రడెవ్‌, ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ ఇజ్రాయెల్‌ను కోరారు. వారు ప్రారంభం నుంచీ ఇజ్రాయెల్‌కు గట్టి మద్దతుదారులుగా ఉన్న సంగతి తెలిసిందే. తొలుత హమస్‌ తీవ్రవాదులను అణచివేస్తున్నామని బుకాయించిన ఇజ్రాయెల్‌ మాటలను ఎవరూ నమ్మని స్థితి వచ్చింది. పౌరుల మరణాలను తగ్గించటంలో తాము విజయవంతం కాలేదని చివరికి ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు కూడా చెప్పాల్సి వచ్చింది ప్రజాభిప్రాయానికి, ఆగ్రహానికి వారు తలొగ్గి మాట మార్చిన తరువాతే నరేంద్రమోడీ స్పందించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గాజాలో ఇజ్రాయెల్‌ శాశ్వత తిష్ట -తెరపైకి రష్యా, ఉక్రెయిన్‌ శాంతి చర్చలు !

08 Wednesday Nov 2023

Posted by raomk in Current Affairs, Europe, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

2023 Israel–Hamas war, Donald trump, Joe Biden, NATO allies, Ukraine crisis, Vladimir Putin, Volodymyr Zelensky


ఎం కోటేశ్వరరావు


హమస్‌ను అణచే సాకుతో పశ్చిమ దేశాల మద్దతు ఉన్న ఇజ్రాయెల్‌ గాజాలోని పాలస్తీనియన్ల మీద ప్రారంభించిన మారణకాండకు నెలదాటింది. అవే పశ్చిమ దేశాల అండచూసుకొని రష్యాను దెబ్బతీస్తామని బీరాలు పలికిన ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమై 622 రోజులు అవుతున్నది. ఇంతకాలం గడచినా సాధించలేనిది ముందు రోజుల్లో రష్యాను వెనక్కు కొడతారంటే ఎలా నమ్మాలనే సందేహాలు మొదలయ్యాయి. మరోసారి శాంతి చర్చలను తెరమీదకు తెచ్చారు. హమస్‌ సాయుధులను అణచివేసేందుకు నిరవధికంగా గాజా రక్షణ బాధ్యత తీసుకుంటామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించాడు.” మేము అక్కడ లేకపోతే ఏమి జరిగిందో చూశారు. హమస్‌ తీవ్రవాదం ఇంత పెద్ద ఎత్తున ఉంటుందని మేము ఊహించలేదు. నిరవధికంగా గాజా రక్షణ బాధ్యత తీసుకోవాలని అనుకుంటున్నాము ” అన్నాడు.ఇజ్రాయెల్‌ మారణకాండలో మంగళవారం ఉదయానికి అందిన సమాచారం మేరకు గాజాలో 4,100 మంది పిల్లలతో సహా 10,022 మంది మరణించగా 25,408 మంది గాయపడ్డారు. పశ్చిమగట్టు ప్రాంతంలో మరణించిన వారు 163 కాగా 2,100 మంది గాయపడ్డారు. గాజాలో ఉన్న 35 ఆసుపత్రులలో పదహారింటిని పనికిరాకుండాచేశారు. అదే విధంగా ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు 72కు గాను 51మూత పడ్డాయి. ఇజ్రాయెల్‌ మిలిటరీ బాంబులు, క్షిపణులతో దాడులు జరుపుతూ గాజా జనాభా 23లక్షలకు గాను 16.1లక్షల మందిని నివాసాల నుంచి తరిమివేశారు. మరణించిన వారిలో 88 మంది ఐరాస సహాయ సిబ్బంది ఉన్నారంటే హమస్‌ తీవ్రవాదుల స్థావరాల మీద దాడుఉ చేస్తున్నట్లు చేస్తున్న ప్రచార బండారం ఏమిటో అర్ధం అవుతున్నది. ఇంతవరకు ఏ ఒక్క దేశంలో ఒక ఉదంతంలో ఇంత మంది మరణించిన దాఖలా లేదు. మారణకాండను నిరసిస్తూ బహరెయిన్‌, ఛాద్‌, చిలీ, కొలంబియా, హొండురాస్‌, జోర్డాన్‌, దక్షిణాఫ్రికా, టర్కీ ఇజ్రాయెల్‌లోని తమ దౌత్యవేత్తలను వెనక్కు రప్పించాయి. బొలీవియా అన్ని రకాల సంబంధాలను తెగతెంపులు చేసుకున్నది. వందల కోట్ల డాలర్ల విలువగల మారణాయుధాలను అందిస్తున్న అమెరికా గతంలో ఎర్ర సముద్ర ప్రాంతానికి రెండు విమానవాహక యుద్ధ నౌకలు, క్షిపణి ప్రయోగ యుద్ధ నౌకలను పంపగా ఇప్పుడు ఒక జలాంతర్గామిని ఆ ప్రాంతానికి పంపి ఆ ప్రాంత దేశాలను బెదిరిస్తున్నది. .


తాము అంచనా వేసిన విధంగా రష్యా సేనలను ఎదుర్కోవటంలో ఉక్రెయిన్‌ విఫలం కావటంతో పశ్చిమ దేశాలు పునరాలోచనలో పడటమే గాక, ఏదో విధంగా రాజీచేసుకోవాలంటూ వత్తిడికి శ్రీకారం చుట్టినట్లు వార్తలు వచ్చాయి. రష్యా సైనిక చర్య ప్రారంభమై ఇరవై నెలలు దాటింది. తమ ప్రాంతాల్లోకి చొచ్చుకు వచ్చిన పుతిన్‌ సేనలను వెనక్కు కొట్టేందుకు ప్రతిదాడులను ప్రారంభించినట్లు ప్రకటించి ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ రష్యా సేనలు ఖాళీ చేసిన ఒకటి రెండు గ్రామాలు, ప్రాంతాలు తప్ప చెప్పుకోదగిన పరిణామాలేవీ లేవు. రష్యా మందుపాతరలను ఏర్పాటు చేసినందున వాటిని తొలగించేందుకు చాలా సమయం పడుతున్నదని ఉక్రెయిన్‌ చెప్పుకుంటున్నది. నిజానికి అదే వాస్తవమైతే ప్రతిదాడులతో ఆ ప్రాంతాలన్నింటినీ స్వాధీనం చేసుకోవటమే తరువాయి అన్నట్లుగా మే, జూన్‌ మాసాలలో మీడియాలో కథనాలను ప్రచురించారు. పశ్చిమ దేశాలన్నీ మధ్యప్రాచ్యం, ఇజ్రాయెల్‌ మీద కేంద్రీకరించటం, భవిష్యత్‌లో సాయం కొనసాగదేమో అన్న సందేహాలు తలెత్తటం, మరోవైపు రష్యా వైమానిక దాడులు నిరంతరం కొనసాగుతుండటం, చలికాలం ముందుంటంతో ఉక్రెయిన్‌ మిలిటరీ, పాలకులకు దిక్కుతోచటం లేదు.నవంబరు ఐదవ తేదీన ఉక్రెయిన్‌ మిలిటరీ అవార్డుల సభమీద జరిగిన దాడిలో కనీసం 20 మంది సైనికులు మరణించటంతో జెలెనెస్కీ కలవర పడ్డాడు.యుద్ధం సాగుతున్నపుడు ఆ ప్రాంతంలో అలాంటి కార్యక్రమం నిర్వహించటం ఏమిటని సామాజిక మాధ్యమంలో జనాలు ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు.


రష్యాతో చర్చలకు ఉక్రెయిన్ను ఒప్పించేందుకు పశ్చిమ దేశాలు పూనుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇన్ని నెలల తరువాత రాజీపడితే అసలు ఇంతకాలం ఎందుకు ఆపని చేయలేదనే ప్రశ్నలు తలెత్తుతాయి. ముందు మీరు రాజీకి అంగీకరిస్తే గౌరవ ప్రదంగా బయటపడటం గురించి మార్గాన్ని చూద్దామని నాటో కూటమి దేశాల ప్రతినిధులు అంటున్నారు. అందువలన అమెరికా కూటమి ముందుగా ఒక స్పష్టమైన వైఖరికి వస్తేనే చర్చలకు దారి ఏర్పడుతుంది.గత నెలలో జరిగిన ఒక సర్వేలో శాంతి కోసం కొంత భూభాగాన్ని వదులు కోవచ్చా అన్న ప్రశ్నకు ససేమిరా అంగీకరించం అని 74శాతం మంది చెప్పినట్లు తేలింది. వచ్చే ఏడాది ఉక్రెయిన్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది, అవి జరుగుతాయా లేదా అన్నది ఒకటైతే ఒకవేళ రాజీపడితే జెలెనెస్కీ ఇంటిదారి పట్టాల్సిందే.బహుశా అందుకనే యుద్ధంలో ఉన్నందున అసలు వచ్చే ఏడాదైనా ఎన్నికలేంటి అనేపల్లవిని ఎత్తుకున్నాడు. ఇప్పటికిప్పుడు కాకున్నా కొన్ని నెలల తరువాతైనా జెలెనెస్కీ చర్చలకు దిగిరాక తప్పదనే భావం రోజు రోజుకూ పెరుగుతున్నది. జెలెనెస్కీ ముందుకు తెచ్చిన పది అంశాల శాంతి పధకం గురించి మాల్టాలో జరిగిన సమావేశానికి చైనా హాజరుకాలేదు. ఈ పరిణామం ఉక్రెయిన్‌ కోరుకున్న శాంతి ప్రతిపాదనకు పెద్ద ఎదురుదెబ్బ.


రష్యాను కొద్ది వారాల్లో వెనక్కు నెట్టవచ్చన్న పశ్చిమ దేశాల అంచనాలు తలకిందులయ్యాయి.అక్కడ విజయం సాధించారు, ఇక్కడ ముందుకు పోయారు అంటూ పశ్చిమ దేశాల మీడియా చూపిన దృశ్యాలు, ఇచ్చిన వార్తలు వాస్తవం కాదని తేలిపోయింది.ఇప్పటికీ మద్దతు ఇస్తామని చెబుతున్నప్పటికీ కొనసాగుతుందన్న హామీ లేదు. 2022 మే నెలలో 400 కోట్ల డాలర్ల సాయం అందించాలన్న అమెరికా నిర్ణయానికి పార్లమెంటులో 368 అనుకూల, 57 వ్యతిరేక ఓట్లు వచ్చాయి. ఈ సెప్టెంబరులో జరిగిన 30కోట్ల డాలర్ల బిల్లు ఆమోదం పొందినప్పటికీ వ్యతిరేకించిన వారు 117 మంది ఉన్నారు.ప్రస్తుతం ప్రతిపక్ష రిపబ్లికన్లు పార్లమెంటులో మెజారిటీ ఉన్నారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో జో బైడెన్ను ఓడించాలని చూస్తున్న వారు ప్రతి ప్రతిపాదనను అడ్డుకొనేందుకు, ఎన్నికల్లో లబ్ది పొందేందుకు చూస్తారు.జాతీయ భద్రతా సహాయ నిధి పేరుతో అమెరికా పక్కన పెట్టిన 105 బిలియన్‌ డాలర్లలో ఉక్రెయిన్‌ ఒక్కదానికే 60బి.డాలర్లు ఇస్తామని చెప్పారు. అంత మొత్తం ఇచ్చేందుకు రిపబ్లికన్‌ పార్టీ సిద్దంగా లేదు. ఆ పార్టీ పార్లమెంటులో మెజారిటీగా ఉన్నందున వారి మద్దతు లేకుండా ఒక్క డాలరు కూడా జో బైడెన్‌ విడుదల చేయలేడు. అది లేకుండా ఉక్రెయిన్‌ ఎంతకాలం నిలబడుతుందన్నది సమస్య. ఇప్పుడు ఇజ్రాయెల్‌-పామస్‌ పోరు ముందుకు రావటంతో అమెరికా దృష్టి అటువైపు మళ్లింది,భారీ ఎత్తున ఇజ్రాయెల్‌కు నిధులు, ఆయుధాలు సమకూరుస్తోంది. ఇది కూడా ఉక్రెయిన్‌కు ఎదురు దెబ్బే. పశ్చిమ దేశాల మీడియా అంతటా నెల రోజుల క్రితం వరకు ఉక్రెయిన్‌ విజయగాధలతో ఉండేవి. ఇప్పుడు వాటి స్థానాన్ని ఇజ్రాయెల్‌ హమస్‌ దాడులు, మధ్యప్రాచ్య పరిణామాలు ఆక్రమించాయి. ఐరోపా యూనియన్‌ అక్టోబరు నెలలో వచ్చే నాలుగు సంవత్సరాల బడ్జెట్‌ గురించి బ్రసెల్స్‌లో జరిపిన సంప్రదింపులలో ఉక్రెయిన్‌కు మరింత సాయం చేయకూడదంటూ పోలాండ్‌, హంగరీ, స్లోవేకియా అడ్డం తిరిగాయి.ఉక్రెయిన్‌ తక్కువ ధరలకు ఆహార ధాన్యాల ఎగుమతి తమ రైతాంగానికి నష్టం కలిగిస్తున్నదంటూ పోలాండ్‌ అభ్యంతరం తెలుపుతున్నది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతున్నందున పోలాండ్‌ ప్రధాని మోరావిక్కీ తన గెలుపు గురించి ఆందోళన చెందుతున్నాడు, ధాన్య ధరలు తన పతనానికి కారణం అవుతాయోమనని భయపడుతున్నాడు.


పశ్చిమ దేశాలు ఇప్పటికే తమ వద్ద ఉన్న ఆధునిక విమానాలు తప్ప అన్ని రకాల ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందచేశాయి. వాటినే ఇంకా సరఫరా చేయటం తప్ప అంతకు మించి మరో అడుగువేయలేని స్థితి. జెలెనెస్కీని ముందుకు నెట్టటం తప్ప నేరుగా నాటో కూటమి దేశాలు రంగంలోకి దిగే అవకాశాలు ప్రస్తుతానికి కనిపించటం లేదు. ప్రస్తుతం ఎలాంటి స్థంభన లేదంటూ బింకాలు పలుకుతున్నప్పటికీ ఎంతకాలం అన్న ప్రశ్న ముందుకు వస్తున్నది.రష్యాతో శాంతి చర్చలకు ఉన్న అవకాశాలేమిటి అంటూ అమెరికా, ఐరోపా సమాఖ్య ప్రతినిధులు ఉక్రెయిన్‌ అధికారులను అడిగినట్లు అమెరికా ఎన్‌బిసి టీవి పేర్కొన్నది. ఉక్రెయిన్‌కు మద్దతునిస్తున్న 50కిపైగా దేశాల ప్రతినిధులతో అక్టోబరు నెలలో బ్రసెల్స్‌లో జరిగిన సమావేశం సందర్భంగా ఈ మేరకు కదిలించి చూసినట్లు అది వెల్లడించింది. దీని గురించి జెలెనెస్కీ స్పందిస్తూ చర్చలకు ఇది తరుణం కాదని, అందుకోసం పశ్చిమ దేశాల నేతలెవరూ తనను వత్తిడి చేయటం లేదని చెప్పుకున్నాడు. రష్యాతో తమ పోరు కదలిక లేని, ఘర్షణపూర్వక బలహీన స్థితి ఉండే దశలోకి ప్రవేశిస్తున్నదని, ఇలాంటి పరిస్థితి రష్యా తనమిలిటరీ శక్తిని తిరిగి సమకూర్చుకొనేందుకు వీలు కల్పిస్తుందని ఉక్రెయిన్‌ దళాధిపతి జనరల్‌ వాలెరీ జలుఝని ఎకానమిస్ట్‌ పత్రికలో రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు. ఆ తరువాతే ఎన్‌బిసి వార్త, దాని మీద జలెనెస్కీ స్పందన వెలువడింది. ” కాలం గడిచింది జనాలు అలసిపోయారు, కానీ ఇది ప్రతిష్ఠంభన కాదు ” అని కూడా అన్నాడు. 2014లో రష్యా విలీనం చేసుకున్న క్రిమియా ద్వీపంతో పాటు గత ఏడాది నుంచి ఉక్రెయిన్లో స్వాధీనం చేసుకున్న ప్రాంతాలన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఉక్రెయిన్‌ చెబుతున్నది. ప్రస్తుతం ఉక్రెయిన్లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న రెండు రిపబ్లిక్‌లను రష్యా గుర్తించింది. వాటితో సహా అంతర్జాతీయంగా గుర్తించిన ఉక్రెయిన్లో 17.5శాతం ప్రాంతం రష్యా దళాల అదుపులో ఉంది. ఉక్రెయిన్‌ నాటోలో చేరబోనని, పశ్చిమ దేశాలతో కలసి తమ భద్రతకు ముపు కలిగించబోమని హామీ ఇస్తే క్రిమియా మినహా తమ స్వాధీనంలో ఉన్న వాటిని వెంటనే అప్పగిస్తామని పుతిన్‌ మొదటి నుంచీ చెబుతున్నాడు. పశ్చిమ దేశాలు దాన్ని పడనివ్వకుండా అడ్డుపడటమే కాదు, ఫిన్లండ్‌, స్వీడన్‌లను నాటోలో చేర్చుకొని మరోవైపు నుంచి రష్యాను దెబ్బతీసేందుకు పూనుకున్నాయి.


ప్రస్తుతానికి పశ్చిమ దేశాల సాయం నిలిచిపోతుందని చెప్పలేము గానీ వచ్చే ఏడాది నుంచి జరగవచ్చని ఐరోపా విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న పద్దెనిమిది నెలలు ప్రస్తుత పోరులో కీలకంగా మారనున్నాయని, 2025 వసంత రుతువుకు ముందు రష్యన్లు విజయవంతమైన ఎదురుదాడి చేయలేరని, వచ్చే ఏడాది ఉక్రెయిన్‌ పెద్ద ముందడుగు వేయవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. తాము కోల్పోయిన ప్రాంతాలన్నింటినీ తిరిగి ఇస్తే తప్ప చర్చలు లేవని ఉక్రెయిన్‌ చెబుతుండగా, తమ ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాలను వదిలేదని రష్యా చెబుతున్నందున రెండు దేశాల మధ్య చర్చలకు ప్రస్తుతం ప్రాతిపదిక లేదనే పద్దతిలో విశ్లేషణలు సాగుతున్నాయి. రష్యా మమ్మల్నందరినీ చంపిన తరువాత వారు నాటో దేశాల మీద దాడి చేస్తారు, అప్పుడు గాని మీ కొడుకులూ, కుమార్తెలను పోరాటానికి పంపరా అని జెలెనెస్కీ ఒక అమెరికా టీవీ ఎన్‌బిసి ఇంటర్వ్యూలో నాటో కూటమి మీద అసహనాన్ని వెళ్లగక్కాడు. ఒకసారి డోనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశానికి వస్తే కేవలం 24 నిమిషాల్లో అంతా వివరిస్తానని గెలిస్తే 24 గంటల్లో యుద్ధాన్ని అంతం చేస్తాడని అన్నాడు. మొత్తం మీద ఉక్రెయిన్‌ సంక్షోభం మరో మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా కరెన్సీలో చమురు డబ్బు డిమాండ్‌ చేస్తున్న రష్యా – పరువు పోతుందని నరేంద్రమోడీ భావిస్తున్నారా ?

22 Sunday Oct 2023

Posted by raomk in BJP, CHINA, COUNTRIES, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, USA

≈ Leave a comment

Tags

BJP, China, De Dollarisation, Narendra Modi Failures, Russian oil, U.S. Dollar, yuan

ఎం కోటేశ్వరరావు

గత పదేండ్లలో ఎన్నడూ లేని కొత్త ఇరకాటంలో నరేంద్రమోడీ సర్కార్‌ చిక్కుకుందా ? చైనా కరెన్సీలో రష్యాకు డబ్బు చెల్లించి ముడి చమురు కొనుగోలు అవమానకరంగా భావిస్తోందా ? చైనా మీద కోపంతో అధిక ధరలకు ఇతర దేశాల నుంచి కొని జనం మీద భారం మోపేందుకు సిద్దపడుతుందా ? తాజాగా తలెత్తిన పరిస్థితి నుంచి పుట్టుకువస్తున్న అనుమానాలివి. తమ ముడి చమురుకు చైనా యువాన్లు చెల్లించాలన్న రష్యా డిమాండ్‌ను భారత ప్రభుత్వం తిరస్కరించే అవకాశం ఉందని అధికారులు చెప్పినట్లుగా బ్లూమ్‌బెర్గ్‌ మీడియా పేర్కొన్నది. ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తరువాత పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల కారణంగా రష్యన్లు తమ వద్ద కొనుగోలు చేసే దేశాలకు రాయితీ ధరలకు చమురును విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో గతం కంటే ఎంతో ఎక్కువగా చైనాపై ఆధారపడ్డారు. ఐరోపా యూరోలు, అమెరికా డాలర్లను మార్చుకొనేందుకు ఆంక్షలు అడ్డువస్తున్నందున తమకు చైనా యువాన్లలో చెల్లించాలని రష్యా మన దేశాన్ని కోరింది. దీనికి మనదేశం అంగీకరించే అవకాశాలు లేవని బ్లూమ్‌బెర్గ్‌ వ్యాఖ్యానించింది. అదే జరిగితే రష్యా నుంచి కొనుగోలు నిలిపివేసి డాలర్లు చెల్లించి అధిక ధరకు ఇతర మార్కెట్లో చమురు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గతంలో ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ యువాన్లలో చెల్లించినప్పటికీ, ఇప్పుడు హిందూస్తాన్‌ పెట్రోలియం, భారత పెట్రోలియం కార్పొరేషన్‌ చెల్లింపుల అంశానికి వస్తే ప్రభుత్వం విముఖంగా ఉందని రాయిటర్స్‌ వార్తా సంస్థ కొద్ది రోజుల క్రితం పేర్కొన్నది. కొత్తగా కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏమిటో తెలియదు. గతేడాది నవంబరు నాలుగున ఒపెక్‌ దేశాల నుంచి మనం కొనుగోలు చేస్తున్న ముడి చమురు పీపా ధర 93.86 డాలర్లు ఉండగా తరువాత మే మూడవ తేదీకి 70.52 డాలర్లకు తగ్గింది.సెప్టెంబరు 29న 97.03 డాలర్లకు పెరిగి తరువాత కాస్త తగ్గి అక్టోబరు 19న 91.71 డాలర్ల వద్ద ఉంది.

చైనాతో సరిహద్దు వివాదంలో ఎలాంటి పురోగతి లేకపోవటం, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల్లో చైనాకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలకు మరింత సన్నిహితం కావటం వంటి కారణాలు ఉండవచ్చు. లేదా రూపాయిని అంతర్జాతీయ మారక కరెన్సీగా మారుస్తామన్న మాటల ప్రచార బండారం సంగతేమిటని జనం అడుగుతారన్న భయం కావచ్చు. 2022-23లో రోజుకు 7.8లక్షల పీపాల రష్యా చమురు దిగుమతి చేసుకోగా 2023-24లో ఇప్పటి వరకు 17.6లక్షలకు పెరిగింది. ఈ మేరకు ఒపెక్‌(చమురు ఎగుమతి దేశాలు) నుంచి దిగుమతులు తగ్గాయి. 2022 ఏప్రిల్‌-సెప్టెంబరు కాలానికి మన మొత్తం అవసరాల్లో 63 శాతం ఒపెక్‌ నుంచి దిగుమతి చేసుకోగా ఈ ఏడాది తొలి ఆరునెలల్లో 40శాతానికి తగ్గింది. ఒపెక్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకొనే చమురుతో పోలిస్తే తక్కువ ధర, రూపాయల్లో చెల్లింపుల వెసులుబాటు వంటి సానుకూల కారణాలు ఉన్న కారణంగానే మనదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. మన రూపాయలతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు దొరకదు. అందుకోసం డాలర్లు ఖర్చు చేయాల్సిందే. వాటి బదులు యువాన్లలో చెల్లిస్తే మనకు పడే అదనపు భారం ఉండదు. మన వినియోగదారులకు మేలు కలుగుతున్నపుడు, ఖజానా మీద భారం పడనపుడు ఏ విదేశీ కరెన్సీలో చెల్లిస్తే ఏమిటి ? వివాదాలకు – వ్యాపారానికి సంబంధం లేదంటూ గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి చైనా నుంచి దిగుమతులు సజావుగానే మనం చేసుకుంటున్నాం.వాటి దగ్గర లేనిది యువాన్ల దగ్గర పట్టుదల అవసరమా ?అంతర్జాతీయ మార్కెట్లో యువాన్లను కొనుగోలు చేయటం అవమానంగా భావిస్తున్నామా ?

ప్రయివేటు సంస్థలు యువాన్లలో చెల్లింపులు జరపటంపై ఎలాంటి నిషేధం లేదని మన ప్రభుత్వం ప్రకటించింది. అయితే అలాంటి లావాదేవీలను ప్రోత్సహించటం గానీ, వీలు కల్పించటం గాని చేసేది లేదని కూడా పేర్కొన్నది. తాము డాలర్లను స్వీకరించేది లేదని, యువాన్లు లేదా రూబుళ్లను చమురు లావాదేవీల్లో అంగీకరిస్తామని రష్యా కంపెనీ గాజ్‌ ప్రోమ్‌ స్పష్టం చేసింది. ప్రపంచ లావాదేవీలు యువాన్లతో జరపాలన్న ప్రతిపాదనల పట్ల మనదేశం సంతోషంగా లేదని ఆర్థికశాఖ అధికారులు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఏ కరెన్సీతో లావాదేవీలు జరపాలన్న అంశం తేలకపోవటంతో రష్యాకు సెప్టెంబరు నుంచి ఏడు టాంకర్ల చెల్లింపులు నిలిచిపోయాయి.ఇప్పటికే తన దగ్గర భారీ మొత్తంలో రూపాయి నిల్వలు ఉన్నందున చమురు చెల్లింపులకు గాను తనకు యువాన్లలో చెల్లించాల్సిందేనని రష్యా పట్టుబట్టింది. తాను చైనా దిగుమతుల మీద ఆధారపడి నందున యువాన్ల అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ప్రయివేటు చమురుశుద్ధి సంస్థలు కొంత మేరకు చెల్లింపులు జరిపాయి. యుఏఇ దిర్‌హామ్స్‌లో కూడా రష్యాకు చెల్లించాము. కొన్ని రష్యన్‌ కంపెనీలు దిరహామ్స్‌ను కూడా అంగీకరించటం లేదు. పీపా ముడి చమురును 60 డాలర్లకు మించి రష్యా దగ్గర కొనుగోలు చేస్తే అమెరికా ఆంక్షలను అమలు జరుపుతున్న సంగతి తెలిసిందే. మన రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మారుస్తామని చెబుతున్న తరుణం, సరిహద్దు వివాదం కారణంగా చైనా కరెన్సీలో చెల్లింపులు చేసేందుకు మోడీ సర్కార్‌ ఇబ్బంది పడుతోంది.బ్రిక్స్‌ దేశాల కూటమిలో ఉమ్మడి కరెన్సీ ప్రతిపాదన రాగా మనదేశం మాత్రమే వ్యతిరేకించింది. ఒకవేళ అంగీకరిస్తే యువాను అవుతుందన్నభయం ఉందని వార్తలు. ప్రస్తుతం రూపాయి అంతర్జాతీయ లావాదేవీల్లో పూర్తిగా మారకం కావటం లేదు. అందువలన తన దగ్గర ఉన్న వందల కోట్ల రూపాయలను ఏం చేసుకోవాలని రష్యా అడుగుతోంది. ఇప్పటి వరకు స్థానిక కరెన్సీలో లావాదేవీలు జరిపిన కారణంగా రష్యాకు యువాన్లు వస్తున్నాయి. రష్యా రాయితీల వలన చైనా 10, భారత్‌ 7 బిలియన్ల డాలర్లను పొదుపు చేసుకున్నాయి.ప్రపంచంలో పరిస్థితులు మారుతున్నాయి, వాటికిి ప్రతికూలంగా నడిచే పరిస్థితి మనకు ఉందా అన్నది సమస్య.

అమెరికా డాలరు పెత్తనానికి రోజులు దగ్గర పడుతున్నాయా ? అనేక వైపుల నుంచి వస్తున్న వార్తలు ఏదో జరగబోతోందనే సూచిస్తున్నాయి. తన బిఆర్‌ఐ పధకం కింద గతంలో ఎక్కువగా డాలర్లు ఇచ్చిన చైనా ఇప్పుడు తన కరెన్సీ యువాన్‌ ఇవ్వటం ప్రారంభించింది. అక్టోబరు మూడవ వారంలో ఈ మేరకు అనేక ఒప్పందాలను కుదుర్చుకుంది. రాయిటర్స్‌ వార్తా సంస్థ కథనం ప్రకారం చైనా అభివృద్ధి బాంకు మలేషియా, ఈజిప్టు, పెరూ కేంద్ర బాంకులతో ఒప్పందాలు చేసుకుంది.చైనా ఎగుమతి-దిగుమతి బాంకు సౌదీ నేషనల్‌ బాంకుతో, బాంక్‌ ఆఫ్‌ చైనా ఈజిప్టుకు 47.9 కోట్ల డాలర్ల విలువగల యువాన్‌ పాండా బాండ్లను జారీ చేసింది. సిల్క్‌ రోడ్‌ నిధులకు గాను 80 బిలియన్ల యువాన్లను అదనంగా చైనా పక్కన పెట్టింది. అంతర్జాతీయ లావాదేవీల్లో డాలర్ల వాటా ఎంతో ఎక్కువగా ఉంది. ఆగస్టు నెలలో 83.95శాతంగా ఉన్నది సెప్టెంబరులో 84.15కు పెరిగింది. యూరో వాటా 6.43 నుంచి 5.43శాతానికి తగ్గగా చైనా యువాన్‌ లావాదేవీలు 4.82 నుంచి 5.8శాతానికి చేరి రెండవ స్థానంలో నిలిచింది. తరువాత స్థానాలలో యూరో, జపాన్‌ ఎన్‌, సౌదీ రియాల్‌ ఉన్నాయి.యువాన్‌ వాటా తక్కువే అయినప్పటికీ క్రమంగా పెరుగుతోంది. ఇరవై భాగస్వామ్య దేశాలతో చైనా ఇప్పటి వరకు పదిహేడింటితో యువాన్‌ మార్పిడి ఒప్పందాలు కుదుర్చుకుంది. అర్జెంటీనాలో ఆరున్నర బిలియన్‌ డాలర్ల విలువగల యువాన్‌ మార్పిడి ఒప్పందం చేసుకుంది.అంతర్జాతీయ వాణిజ్యంలో 15శాతం వాటా ఉన్న చైనా కరెన్సీయే అంత తక్కువగా ఉన్నపుడు కేవలం 1.8శాతం వాణిజ్యం ఉన్న మనదేశ కరెన్సీ వాటా ఎంత ఉంటుందో చెప్పనవసరం లేదు.

బ్లాక్‌ మార్కెట్‌ కారణంగా కరెన్సీ మారకపు విలువలో సంభవిస్తున్న హెచ్చు తగ్గుల వలన తమ దేశానికి పదిబిలియన్‌ డాలర్ల మేర నష్టం జరుగుతున్నదని ఇరాక్‌ కేంద్ర బాంకు పెట్టుబడులు, స్వీకరణల డైరెక్టర్‌ జనరల్‌ మజెన్‌ అహమ్మద్‌ చెప్పాడు.డాలరు దిగుమతుల్లో సగం అక్రమంగా జరుగుతున్నవే అన్నాడు. 2023లో స్వీకరించిన డాలరు డిపాజిట్లను వచ్చే ఏడాది ఉపసంహరిస్తామని,2024 జనవరి ఒకటి తరువాత స్వీకరించబోమన్నాడు. ఆంక్షల కారణంగా గత రెండు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న ఇరాక్‌ బ్రిక్స్‌ కూటమిలో చేరాలని, డాలరుతో నిమిత్తం లేకుండా ఆర్ధిక వ్యవస్థ నిర్వహణ జరపాలని చూస్తున్నది.ఆహ్వానం వస్తే బ్రిక్స్‌లో చేరేందుకు సిద్దంగా ఉన్నామని ఇరాక్‌ ప్రధాని మహమ్మద్‌ షియా అల్‌ సుదానీ ప్రకటించాడు.తమ ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసేందుకు అవసరమైన పెట్టుబడుల ఆకర్షణకు వ్యవస్థాగతమైన సంస్కరణలు చేపడుతున్నట్లు, తద్వారా స్థానిక కరెన్సీకి ఆసరా దొరుకుతుందని మలేసియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం చెప్పాడు. బ్రిక్స్‌ దేశాల స్ఫూర్తితో తమ కరెన్సీ రింగెట్‌ను స్థిరపరిచేందుకు చూస్తామన్నాడు. ఇండోనేషియా, చైనా, థాయిలాండ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలలో రింగెట్‌ను వినియోగిస్తామన్నాడు. డాలరు మీద పూర్తిగా ఆధారపడటం కష్టమన్నాడు.డాలరు బదులు స్థానిక కరెన్సీ బ్రిక్స్‌ దేశాలు గనుక తమతో జరిపే లావాదేవీలలో ముఖ్యంగా ఇంథనానికి తమకు స్థానిక కరెన్సీలలోనే చెల్లింపులు జరపాలని అమెరికా, ఐరోపా దేశాలను డిమాండ్‌ చేస్తే పరిస్థితి ఏమిటి అన్నది ఒక చర్చ. తమకు డాలర్లలోనే చెల్లింపులు జరపాలనేదేమీ లేదని స్థానిక కరెన్సీలను కూడా అంగీకరిస్తామని సౌదీ అరేబియా ప్రకటించింది. బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్‌ కూటమి న్యూ డెవలప్‌మెంట్‌ బాంక్‌ (ఎన్‌డిబి) ఏర్పాటు చేసింది. రానున్న మూడు సంవత్సరాల్లో సభ్య దేశాలు డాలరు బదులు ఆయా దేశాల కరెన్సీలలో లావాదేవీలు జరుపుకోవాలన్న లక్ష్యాన్ని ప్రకటించింది. ఇప్పటికే ఆయా దేశాల కరెన్సీలలో ఇతర దేశాలకు రుణాలు ఇవ్వాలని సూచించింది. 2026 నాటికి డాలర్‌ పెత్తనం తగ్గటం ప్రారంభమవుతుందని అంచనా.ప్రస్తుతం బ్రిక్స్‌ కూటమి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 30శాతం వాటా కలిగి ఉంది, దాన్ని మరింతగా విస్తరించాలనే యత్నాల్లో ఉన్నారు. ఈ కూటమిలో చేరాలని 40కి పైగా దేశాలు ఆసక్తి కనపరుస్తున్నాయి. సెప్టెంబరులో జరిగిన కూటమి సమావేశంలో సౌదీ అరేబియా, ఇరాన్‌, ఈజిప్టు, ఇథియోపియా,అర్జెంటీనా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ను చేర్చుకోవాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుంది. వీటిలో అర్జెంటీనా మినహా ఐదు దేశాలూ చమురు ఎగుమతి దేశాలే అన్నది తెలిసిందే. ఇప్పటి వరకు ఉన్న పశ్చిమ దేశాల పెత్తనం క్రమంగా తూర్పు దేశాలకు వస్తుందని భావిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జి 20 ఢిల్లీ శిఖరాగ్ర సభ : రష్యాను ఖండించకుండా పశ్చిమ దేశాలు ఎందుకు దిగి వచ్చాయి !

13 Wednesday Sep 2023

Posted by raomk in Africa, BJP, CHINA, COUNTRIES, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, China, G 20, G20 Delhi summit, Joe Biden, Narendra Modi, Ukraine crisis, Vladimir Putin, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు న్యూఢిల్లీలో జి 20 దేశాల 2023 శిఖరాగ్ర సమావేశం జయప్రదంగా జరిగింది. ప్రతి సంవత్సరం ఒక సభ్య దేశ ఆతిధ్యంలో సమావేశాలు జరుగుతాయి. గత ఏడాది ఇండోనేషియాలో జరగ్గా వచ్చే ఏడాది బ్రెజిల్‌ వేదిక కానుంది. మరుసటి ఏడాది దక్షిణాఫ్రికాలో జరుగుతుంది, కాగా 2026లో జరగాల్సిన సభకు అమెరికా వేదిక కావటాన్ని చైనా ప్రశ్నించినప్పటికీ చివరికి అంగీకరించింది. ప్రతి సమావేశం తరువాత విడుదల చేసే సంయుక్త ప్రకటన విడుదల అవుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తినప్పటికీ చివరికి విడుదల చేశారు. ఈ కూటమిలోని కొన్ని దేశాల మధ్య కొనసాగుతున్న తీవ్ర విబేధాలు, పరస్పర అనుమానాలు తదితర కారణాల వలన చైనా అధినేత షీ జింపింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ హాజరు కాలేదు. దీని గురించి ఎవరికి తోచిన ఊహాగానాలను వారుచేశారు తప్ప అధికారికంగా సదరు దేశాల నుంచి ఎలాంటి ప్రకటనలూ విడుదల కాలేదు. చైనా తరఫున ప్రధాని లీ చియాంగ్‌, రష్యా నుంచి విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావరోవ్‌ ప్రతినిధి వర్గాలకు నాయకత్వం వహించారు. ఈ కూటమిలో ఆఫ్రికా యూనియన్‌కు పూర్తి సభ్యత్వం ఇవ్వటంతో ఇప్పటి నుంచి అది జి21గా మారింది. దీనిలో 19 దేశాలు ఉన్నాయి. వాటిలో భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా,ఇండోనేషియా, రష్యా, చైనా, అర్జెంటీనా, జపాన్‌, దక్షిణ కొరియా, బ్రెజిల్‌, మెక్సికో, కెనడా, బ్రిటన్‌, జర్మనీ,ఫ్రాన్స్‌, టర్కీ, ఇటలీ, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా ఉన్నాయి. ఆఫ్రికా యూనియన్‌, ఐరోపా యూనియన్‌ పూర్తి సభ్యత్వం గల సంస్థలు, ఐరాసతో సహా కొన్ని శాశ్వత ఆహ్వానితుల జాబితా ఉన్నాయి. పశ్చిమ దేశాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తినపుడు ఒక పరిష్కార మార్గంగా ఈ కూటమి ఏర్పాటుకు 1999లో జి7 దేశాల కూటమి ఆలోచన చేసింది. 2008లో ధనిక దేశాల్లో తీవ్ర సంక్షోభం తలెత్తినపుడు ప్రతి ఏటా శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.


ఈ కూటమిలో ఇప్పటి వరకు ఆహ్వానితురాలిగా ఉన్న ఆఫ్రికా యూనియన్‌కు పూర్తి సభ్యత్వ హౌదా కల్పిస్తూ ఢిల్లీ సభ ఆమోదం తెలిపింది. దీనికి కారకులం తామంటే తామని మన దేశంతో పాటు రష్యా, చైనాలు కూడా ప్రకటించుకున్నాయి.ఈ చర్య ద్వారా పేద దేశాల గొంతుక వినిపించేందుకు అవకాశం వచ్చిందన్నది స్పష్టం. సభ్యత్వం ఇచ్చిన ఖ్యాతిని ఎవరి ఖాతాలో వేసుకోవటం అన్నది ముఖ్యం కాదు. వాటికి తోడ్పడుతున్నది ఎవరు అన్నదే గీటురాయి. దాన్ని పరిశీలించినపుడు ఇటీవలి కాలంలో ఆఫ్రికా ఖండంలో రష్యా, చైనా సాయంతో పాటు వాటి పలుకుబడి కూడా పెరుగుతోందన్నది అందరికీ తెలిసిందే. న్యూఢిల్లీ సభ జరిగిన తీరుతెన్నులు, పర్యవసానాలు, ఫలితాల గురించి సమీక్షలు వెలువడుతున్నాయి. తీసుకున్న నిర్ణయాలపై నవంబరు నెలలో వీడియో కాన్ఫరెన్సుద్వారా సమీక్ష జరుపుతారు. ఆమోదించాల్సిన తీర్మానాలు, నిర్ణయాల మీద ఏకాభిప్రాయం సాధించే బాధ్యత ఆతిధ్య దేశం కలిగి ఉంటుంది. అందుకు అనుగుణ్యంగానే దాన్ని మన దేశం కూడా నిర్వహించింది.ఐరాస తీర్మానాలు, పారిస్‌ ఒప్పందాల వంటి వాటినే అంగీకరించకుండా, అమలు జరపకుండా ఠలాయిస్తున్న దేశాలు ఈ కూటమిలో ఉన్నాయి.నిర్ణయాలను స్వచ్చందంగా అమలు జరపటం తప్ప విధి కాదు. కొన్ని స్పందనలు, కొన్ని అభిప్రాయాలకు భిన్నంగా దేశాలు వ్యవహరిస్తున్న తీరు తెన్నుల గురించి స్థూలంగా చూద్దాం. ఈ సమావేశాలను తన రాజకీయ ప్రయోజనాలకు నరేంద్రమోడీ ఉపయోగించుకుంటున్నారనే అభిప్రాయం మనదేశంలో ఇప్పటికే ఉంది. సభ జరిగిన తీరు మీద బిజెపి, నరేంద్రమోడీ మద్దతుదారుల స్పందన కూడా దానికి అనుగుణంగానే ఉంది.


పశ్చిమాసియాలో ప్రముఖ మీడియా సంస్థ ” అల్‌ జజీరా ” లో రాసిన ఒక విశ్లేషణ ఇలా ప్రారంభమైంది.” నరేంద్రమోడీ మోము, భారత దౌత్య మహత్తు(లేదా వివేకము) ప్రదర్శితమైంది.కానీ భారత భిన్నత్వ ప్రదర్శనకు అవకాశాన్ని నిరాకరించారు.భారత్‌ 140 కోట్ల జనాభా ఉన్న దేశం. కానీ సమావేశ రోజుల్లో రాజధాని నగరంలో ఎక్కడ చూసినా కేవలం ఒక ముఖమే కనిపించింది. జి 20 కూటమి నేతలకు ఆతిధ్యం ఇస్తున్న ప్రధాని నరేంద్రమోడీదే అది. కేవలం విమానాశ్రయం వద్దనే కాదు, సభకోసం ఇటీవల జరిపిన నిర్మాణం వరకు చూస్తే ప్రతి రోడ్డు, కొన్ని చోట్ల ప్రతి కొన్ని అడుగులకు, ఎక్కువ చోట్ల రెండుకార్ల పొడవునా ఒక వ్యక్తి ప్రదర్శన మాత్రమే కనిపించింది. దౌత్య ఆడంబర ప్రదర్శనలో మోడీ హీరో కాగా మధ్య ఢిల్లీలో సభ నిర్వహణ ప్రాంతానికి సమీపంలోని విదేశీరాయబార కార్యాలయాలు, హౌటళ్ల వద్ద సంచరించే కోతులను భయపెట్టేందుకు వాటి బొమ్మలతో కూడిన భారీ కటౌట్లను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. సభ జరిగిన చోట వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పోటీ చేసే భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతీకగా ఉన్న మోడీ బొమ్మలు ఎక్కువగా కనిపించాయి. ప్రగతి మైదాన్‌గా పిలుస్తున్న ప్రాంతంలో కొత్త సభా భవనాన్ని నిర్మించి దానికి భారత మండపం అని పేరు పెట్టారు. దీంతో లౌకిక ముద్ర నుంచి దూరంగా జరిగినట్లయింది. హిందూ దేవాలయాల్లో ముందు వసారాలను మండపం అని పిలుస్తారు. ” ఈ విశ్లేషణలో వీటితో పాటు మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు.


శిఖరాగ్ర సభ ఒక రోజు ముందే సంయుక్త ప్రకటనను ఆమోదించింది. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్‌ అని దానిలో పిలుపునిచ్చారు. ఈ సుభాషితంతో ఎవరికీ ఇబ్బంది లేదు, అభినందనీయమే. దానికి కట్టుబడి ఉన్నది ఎవరన్నదే ప్రశ్న. ఇది యుద్ధాలకు తగిన యుగం కాదు అన్నది ప్రకటనలోని ఒక అంశం. ఈ కూటమి ఉనికిలోకి వచ్చిన తరువాతనే ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్ల మీద ఈ కూటమిలోని దేశాలు దురాక్రమణలకు పాల్పడిన చరిత్ర, అనేక దేశాల మీద దాడులకు ఉగ్రవాదులను,కిరాయి మూకలను ఉసిగొల్పుతున్న తీరు తెలిసిందే. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఎగదోసిందీ, రష్యా ప్రాదేశిక భద్రత మీద ఎలాంటి హామీ ఇవ్వకుండా ఆయుధాలను సరిహద్దుల్లోకి చేర్చటం ప్రారంభించిన తరువాతే పుతిన్‌ సైనిక చర్యకు పాల్పడినదాన్ని ప్రపంచం చూసింది. దాన్ని పరిష్కరించాల్సిన పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు తమ ఆయుధ సంపత్తిని అందిస్తూ ప్రోత్సహిస్తూ మరోవైపు సుద్దులు చెప్పటం హాస్యాస్పదం. తైవాన్‌ ప్రాంతం చైనా అంతర్భాగమని ఐరాస గుర్తించింది. దాన్ని విలీనం చేసుకొనే హక్కు చైనాకు ఉంది. దానికి తగిన సమయం రాలేదంటూ తైవాన్‌కు ఆయుధాలు ఇస్తూ చైనా మీద దాడికి ఉసిగొల్పుతున్న దేశాల నిజాయితీ ఏమిటన్నది ప్రశ్న. దక్షిణ చైనా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో చైనా ఇంతవరకు ఏ దేశ నౌకనూ అడ్డుకున్న దాఖలా లేదు.


న్యూఢిల్లీ ప్రకటనలో పేర్కొన్న లక్ష్యానికి భిన్నంగా ప్రపంచంలో పరిణామాలు జరుగుతున్నాయి. అణ్వాయుధాల వినియోగం గురించి ప్రకటన హెచ్చరించింది. కానీ తానుగా వాటిని వినియోగించబోనని ప్రకటించేందుకు ఇంతవరకు అమెరికా అంగీకరించ లేదు. అణ్వాయుధాలను మోసుకుపోయే ఆధునిక క్షిపణులు, విమానాలను రోజు రోజుకూ మెరుగుపరుస్తోంది. ఐరాస నిబంధనావళి ప్రకారం ఏ దేశమూ బలప్రయోగం చేయకూడదని పేర్కొన్నది. దీని మీద కూటమి దేశాలు రాజీపడినట్లు ఉక్రెయిన్‌ మండిపడింది. ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడతామని రష్యా కూడా అంగీకరించిందని అందుకే దిగి వచ్చి సంతకం చేసిందని కొందరు పశ్చిమ దేశాల వారు వక్రీకరించారు. వాస్తవానికి పశ్చిమ దేశాల వలలో చిక్కుకొని నాటోలో చేరి తమ ప్రాదేశిక భద్రతకు ముప్పు తలపెట్టినందున ఉక్రెయిన్ను దారికి తెచ్చేందుకు సైనిక చర్య జరుపుతున్నాం తప్ప దాన్ని ఆక్రమించుకొనే లక్ష్యం లేదని రష్యా ప్రారంభం నుంచీ చెబుతున్నది. రష్యా,ఉక్రెయిన్ల నుంచి ఆహారం, ధాన్యాలు, ఎరువుల సరఫరాను పునరుద్దరించాలని, ఎగుమతి దిగుమతులను అడ్డుకోరాదని, అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కూడా జి21 కూటమి కోరింది. టర్కీ మధ్యవర్తిత్వంలో కుదిరిన ఒప్పందాన్ని పశ్చిమ దేశాలు ఉల్లంఘించి తమను దెబ్బతీస్తున్న కారణంగానే ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా ప్రకటించింది. ఈ కారణంగా అనేక పేద దేశాలు అధిక ధరలకు ఇతర దేశాల నుంచి ఆహారాన్ని దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితికి పశ్చిమ దేశాలే కారణం. రైతులు విదేశాలకు సైతం ఎగుమతులు చేసుకొని లబ్దిపొందవచ్చంటూ మూడు సాగు చట్టాలను రైతుల మీద రుద్దినపుడు కబుర్లు చెప్పిన నరేంద్రమోడీ జి20 అధ్యక్ష స్థానంలో ఉన్నపుడే గోధుమలు, బియ్యం, పంచదార, ఉల్లి ఎగుమతులను కూడా నిషేధించిన సంగతి తెలిసిందే.


ఢిల్లీ సమావేశానికి షీ జింపింగ్‌ హాజరు కాకపోవటం గురించి మీడియాలో అనేక కథనాలు వచ్చాయి.గతంలో జరిగిన ఇలాంటి శిఖరాగ్ర సమావేశాలకు కొన్ని దేశాల నేతలు రాకపోవటం తెలిసిందే. కానీ జింపింగ్‌ రాలేదంటే దాని వెనుక బలమైన కారణాలేమీ లేవంటే ఎవరూ నమ్మరు, తప్పుకుండా ఉండి ఉంటాయి. చతుష్టయ కూటమి(క్వాడ్‌) అమెరికా, భారత్‌,జపాన్‌, ఆస్ట్రేలియా కూటమి తనకు వ్యతిరేకమే అని చైనా భావిస్తున్నది. ఈ కూటమి నేతలను వచ్చే రిపబ్లిక్‌ దినోత్సవ అతిధులుగా పిలవాలని మన ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఢిల్లీలో ఒక గదిలో చైనా ప్రధాని ఉండగా మరొక పక్క గదిలో జో బైడెన్‌-నరేంద్రమోడీ సమావేశమై క్వాడ్‌ పటిష్టత గురించి, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్చా నౌకారవాణా గురించి చర్చలు జరిపారు. ఇవి చైనాను రెచ్చగొట్టేవే అన్నది స్పష్టం. వీటికంటే ముందే చైనా రూపొందించిన ప్రపంచ పటంలో మన భూభాగాలను కొన్నింటిని మినహాయించటం, దాని మీద వివాదం చెలరేగిన సంగతీ తెలిసిందే. గతేడాది ఇండోనేషియా నగరమైన బాలిలో జరిగిన సమావేశ ప్రకటనలో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ఖండిస్తూ చేర్చిన పేరా వివాదాస్పదమైంది. రాజీమార్గంగా చివరకు ఎక్కువ మంది సభ్యులు ఖండించారని, పరిస్థితి మీద ఇతరులు భిన్నమైన వైఖరులను వెల్లడించారని పేర్కొన్నారు. మొత్తం మీద ఖండన దానిలో కనిపించింది. ఆ సమావేశంలో వీడియో కాన్ఫరెన్సుద్వారా మాట్లాడిన ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ కూటమిని జి20 బదులు జి19 అని సంబోధించటం(రష్యాను గుర్తించకుండా) కూడా రచ్చకు దారి తీసింది. సమావేశం జరుగుతుండగా పోలాండ్‌లో క్షిపణి పేలుడు జరిగింది. వాస్తవాలు నిర్ధారించుకోకుండానే దానికి రష్యా కారణమని ఆరోపించటం, సభలో ఉన్న జి7, నాటో కూటమి దేశాల నేతలు అక్కడే విడిగా సమావేశం కావటం, వాటన్నింటికంటే ముందే రష్యా ప్రతినిధి వర్గ నేత లావరోవ్‌తో ఫొటో దిగేందుకు అనేక మంది నేతలు తిరస్కరించటంతో అసలు బాలిలో పాల్గన్నవారి కుటుంబ చిత్రమే లేకుండా పోయింది. తరువాత జరిగిన అనేక పరిణామాలు చైనా, రష్యాలతో అమెరికా, ఐరోపా పశ్చిమ దేశాల సంబంధాలు మరింతగా దిగజారాయే తప్ప మెరుగుపడలేదు. బాలిలో షీ జింపింగ్‌-జో బైడెన్‌ భేటీ జరిగింది, సంబంధాలను, మాటా మంతిని పునరుద్దరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటన వెలువడింది. కానీ ఆ వెంటనే అమెరికా పార్లమెంటు స్పీకర్‌ నానీ పెలోసీ చైనా అభ్యంతరాలను ఖాతరు చేయకుండా పంతంతో తైవాన్‌ వెళ్లటం తెలిసిందే. తరువాత అమెరికా సర్కార్‌ మరింతగా మిలిటరీ సాయాన్ని ప్రకటించింది. ఈ పూర్వరంగంలో వెళ్లకపోవటమే మంచిదని షీ జింపింగ్‌, పుతిన్‌ భావించి ఉండాలి.సంయుక్త ప్రకటనలో ఉక్రెయిన్‌ సంక్షోభానికి సంబంధించి బాలి ప్రకటనలో ఉన్న పదజాలానికి భిన్నంగా రష్యా పేరు లేకుండా యుద్ధం కారణంగా జనం పడుతున్న ఇబ్బందుల గురించి మాత్రమే పేర్కొన్నారు. ఇది పశ్చిమ దేశాలకు ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. బాలిలో మాదిరి ఖండిస్తే చైనా, రష్యా అంగీకరించకపోతే అసలు ప్రకటనే వెలువడి ఉండేది కాదు. అది జరిగితే తాము బలపరస్తున్న నరేంద్రమోడీ ప్రతిష్టకు భంగం అని భావించి పశ్చిమ దేశాలు అయిష్టంగానే రష్యా మిలిటరీ చర్య ప్రస్తావన లేకుండా అంగీకరించినట్లు కనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మన అగ్ని క్షిపణులు చైనాను భయపెడతాయా ? పరిజ్ఞానంలో ఏ దేశం ఎక్కడుంది ?

06 Wednesday Sep 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Agni V, BJP, China, Missile technology, Propaganda War, RSS


ఎం కోటేశ్వరరావు


చైనాను చంద్రయాన్‌-3 విజయవంతం కావటంతో యావత్‌ దేశం మన ఇస్రో శాస్త్రవేత్తలను వేనోళ్ల కొనియాడుతున్నది. ఊరందరిదీ ఒక దారైతే ఉలిపికట్టెది మరొక దారి అన్న సామెత తెలిసిందే.మన ఇస్రో విజయాన్ని కూడా మతకళ్లతో చూసే బాపతు రెచ్చిపోతున్నది. మన దేశంలో మిసైల్‌ మహిళగా పేరు తెచ్చుకున్న కేరళకు చెందిన టెసీ థామస్‌ గురించి సామాజిక మాధ్యమంలో తాజాగా ఒక పోస్టును పెట్టారు.యునైటెడ్‌ బ్రాహ్మిన్స్‌ ఫ్రెండ్స్‌(ఆల్‌ ఇండియన్‌ బ్రాహ్మిన్‌ కమ్యూనిటీస్‌)కు చెందిన ఒకరు పెట్టిన ఆ పోస్టులో ఉన్న అంశం ఏమంటే అగ్ని క్షిపణి రూపకర్త టెసీ థామస్‌ అనీ ఆమె నుదుట బొట్టు, దాని మీద చిన్న గంధపు గీత ఉందని రాశారు. ఆమె క్రిస్టియన్‌ అయినప్పటికీ హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు చెప్పటం దీని లక్ష్యం. క్షిపణి రూపకర్తలలో ప్రముఖురాలు ఆమె అనటంలో ఎవరికీ పేచీ లేదు. అందరూ అభినందించాల్సిన అంశమే. బిజెపి ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన కంగన రనౌత్‌ చంద్రయాన్‌-3 విజయం గురించి స్పందించారు. అందరికీ ఇస్రో శాస్త్రవేత్తల ప్రతిభ పాటవాలు కనిపిస్తే ఆమె వేరే విధంగా చూశారు. మహిళా శాస్త్రవేత్తలు ఉన్న ఒక ఫోటోను తన ఇనస్టాగ్రామ్‌లో పోస్టు చేసి వారంతా బిందీ, సింధూరాలు, తాళిడబొట్లు ధరించి ఉన్నారని, ఉన్నత ఆలోచనలు, సాధారణ జీవితాల భారతీయతకు ప్రతీకలని పేర్కొన్నారు. ఇలా చెప్పటం ద్వారా బొట్టు లేనివారు కాదని ఆమె జనాలకు సందేశం ఇవ్వదలచుకున్నారు. దాని తరువాతే టెసీ థామస్‌ బొట్టు, చందనం గురించి బ్రాహ్మణ సంఘాలు పోస్టు పెట్టాయి. రెండవ అంశం ఏమంటే 145 కోట్ల చైనీయుల గుండెల్లో భయం పుట్టించిన మహిళ అని చెప్పారు. ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి అణువార్‌ హెడ్‌తో చైనాలోని ఏ ప్రదేశాన్నైనా ఖచ్చితత్వంతో ఢకొీట్టగల అగ్ని-5 క్షిపణి రూపకర్త టెసీ థామస్‌ అని రాశారు.(ఆమె క్రిస్టియన్‌ అయినప్పటికీ బ్రాహ్మణ క్రైస్తవురాలని, అందుకే బ్రాహ్మణ సంఘాలు ఆమె గురించి రాసినట్లు సామాజిక మాధ్యమంలో కొందరు స్పందించారు ) ఆ క్షిపణిని 2018లోనే పరీక్షించారు, మిలిటరీకి అందచేశారు, ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమిటి ?


అన్నీ వేదాల్లోనే ఉన్నాయష అని చెప్పిన వారే ఇప్పుడు శాస్త్రవేత్తలకు మతం, కులం ఆపాదించుతున్న తీరును చూస్తున్నాం.వారిలో ఎవరైనా బొట్టు పెట్టుకోలేదో దేశవ్యతిరేక మతాల ముద్రవేస్తారు. వాటిని పక్కన పెడితే చంద్రయాన్‌ విజయం, అగ్ని క్షిపణితో మన మిలిటరీ సామర్ధ్యం పెరుగుతుందన్నది స్పష్టం. కానీ చైనీయులకు భయం పుట్టించిందని చెప్పటం అవసరమా ? అసలది నిజమా ? అతిశయోక్తులు మాత్రమే. అంతరిక్ష ప్రయోగాల్లో మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది, క్షిపణుల రంగంలోనూ అదే పరిస్థితి. తాజా సమాచారం ప్రకారం జూలై రెండవ వారంలో గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌(జిఎఫ్‌పి) అనే సంస్థ మిలిటరీ బల రాంకులు-2023 ప్రకారం శక్తివంతమైన పది దేశాల్లో వరుసగా అమెరికా, రష్యా, చైనా, భారత్‌,బ్రిటన్‌, దక్షిణ కొరియా,పాకిస్థాన్‌, జపాన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ ఉన్నాయి. నూటనలభై దేశాలలో అత్యంత బలహీనమైన దేశాల మిలిటరీలో భూటాన్‌ తొలి స్థానంలో ఉంది. ఈ రాంకులు ప్రతి ఏడాదీ మారుతుంటాయి. గతేడాది తొలి నాలుగు స్థానాల్లో ఉన్న దేశాల్లో ఇప్పుడు ఎలాంటి మార్పు లేదు. గతేడాది ఎనిమిదో స్థానంలో ఉన్న బ్రిటన్‌ తాజాగా ఐదవ స్థానంలోకి వచ్చింది. పాకిస్థాన్‌ తొలిసారిగా మొదటి పదిలో ఏడవ స్థానం పొందింది. ఇక ఈ రాంకులు ఇచ్చేందుకు అన్ని దేశాలు అంగీకరించిన ఒక ప్రామాణిక సంస్థ ఏదీ లేదు.


ఉదాహరణకు ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో వచ్చిన వార్తల ప్రకారం అమెరికాకు చెందిన ఫెయిర్‌ బృందం రాంకులను యుఎస్‌ న్యూస్‌ ప్రకటించింది. దాని ప్రకారం అత్యంత శక్తివంతమైన మిలిటరీలో చైనాకు రెండవ, భారత్‌కు 14స్థానం ఇచ్చారు. వీటిని తయారు చేసింది అమెరికా సంస్థలు, అక్కడి ఆయుధ తయారీదారుల హస్తం దీని వెనుక ఉన్నట్లు కనిపిస్తున్నది. చైనాతో పోల్చితే భారత్‌ ఎంతో వెనుకబడి ఉంది కనుక ఆయుధాలను మరింతగా కొనాలని వత్తిడి తెచ్చే ఎత్తుగడ ఉందన్నది స్పష్టం. ఎందుకంటే అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దు వెంట తన ఆధీనంలోని భూ భాగంలో గతంలో ఎప్పుడో నిర్మించిన గృహాల స్థానంలో చైనా కొత్తవాటిని నిర్మిస్తే ఇంకే ముంది అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా వారు గ్రామాలను నిర్మిస్తున్నట్లు మన దేశాన్ని తప్పుదారి పట్టించేందుకు అమెరికా సంస్థలు చూసిన సంగతి తెలిసిందే.మన దేశం ప్రపంచంలో అన్ని దేశాలు దిగుమతి చేసుకుంటున్న ఆయుధాల్లో పదకొండుశాతం వాటాతో ప్రధమ స్థానం కలిగి ఉండగా చైనా 4.6శాతమే కలిగి ఉంది. అంటే ఆయుధాల కోసం ఇతర దేశాల మీద ఆధారపడటం తక్కువగా ఉంది. గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ సంస్థ పేర్కొన్న సమాచారం ప్రకారం మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న చైనా-భారత్‌ మిలిటరీ బలాల పోలిక దిగువ విధంగా ఉంది.
అంశం ××××××× చైనా ××××× భారత్‌
రాంకు ××××××× 3 ××××× 4
అందుబాటులో జనం ××76,16,91,468×× 65,31,29,600
మిలిటరీకి అర్హులు ××62,48,69,113×× 51,55,55,492
ఏటా మిలిటరీవయస్సు వారు××1,97,47,552 ×× 2,36,23,837
రక్షణ బడ్జెట్‌, బి.డాలర్లు ×× 230 ×× 50.2
విమానాలు ×× 3,284 ×× 2,210
యుద్ద విమానాలు ×× 1,199 ×× 577
హెలికాప్టర్లు ×× 913 ×× 807
విమానాశ్రయాలు ×× 507 ×× 346
యుద్ద టాంకులు ×× 4,950 ×× 4,614
యుద్ద నౌకలు ×× 730 ×× 295
వి.వాహకనౌకలు ×× 3 ×× 2
హెలికాప్టర్‌ నౌకలు ×× 3 ×× 0
జలాంతర్గాములు ×× 78 ×× 18
డెస్ట్రాయర్లు ×× 50 ×× 11
రేవులు ×× 22 ×× 13
స్వయంచలిత ఆర్టిలరీ ×× 2,720 ×× 100
రాకెట్‌ ఆర్టిలరీ ×××××× 3,140 ×× 960
సాయుధ శకటాలు ×× 14,130 ××× 8,600


భారత్‌ వద్ద మిగ్‌-21 రకం 107, మిగ్‌-29 రకం 66 ఉన్నాయి. చైనా వద్ద స్వంత తయారీ జె-11 రకం 442, జె-7 రకం 388, జె-18 రకం 96, యస్‌యు-30 రకం 121 ఉన్నాయి. బహుముఖ పాత్ర పోషించే యుద్ద విమానాలు మన దేశం దగ్గర సుఖోరు -30 రకం 272, మిరేజ్‌ 49, మిగ్‌ – 29 రకం 36, రాఫెల్‌ 26, తేజస్వి 22, కమోవ్‌ 14 మొత్తం 393 ఉన్నాయి. అదే చైనా వద్ద అన్ని రకాలు కలసి 1,130 ఉన్నాయి. మన దగ్గర మిలిటరీ డ్రోన్లు 12 ఉండగా, చైనా వద్ద 151ఉన్నాయి. రాఫెల్‌ 4.5 తరం విమానాలను మనం కొనుగోలు చేయగా, దాని కంటే మెరుగైన స్వంత తయారీ 5వ తరం జె-20 విమానాలు చైనా వద్ద ఉన్నాయి.మిలిటరీ ఆయుధాలకు సంబంధించి ప్రపంచ సంస్థలు చెప్పే అంకెలు కొన్ని భిన్నంగా ఉన్నప్పటికీ మిలిటరీ బలాబలాల ధోరణులు తెలుసుకొనేందుకు ఉపయోగపడతాయి.వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ 2023 అంచనా ప్రకారం చైనా వద్ద 350, పాకిస్థాన్‌ దగ్గర 165, మనదగ్గర 156 అణ్వాయుధాలు ఉన్నాయి. అణ్వాయుధాలను ఉపయోగించబోమని భారత్‌-చైనా ప్రకటించాయి. అందువలన ఎవరి దగ్గర ఎంత ఎక్కువ దూరం ప్రయాణించే క్షిపణులు ఉన్నప్పటికీ వాటితో అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశం లేదు. ఎవరైనా దాన్ని ఉల్లంఘించి అణుదాడులకు పాల్పడితే ఎవరూ మిగలరు. అందువలన మన అగ్ని క్షిపణిని చూసి చైనా వారు గానీ వారి వద్ద 12 నుంచి 15వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే డిఎఫ్‌-41క్షిపణులను చూసి మన జనం భయపడుతున్నారా అంటే లేదు.మన అణుక్షిపణి పరిధి ఏడువేల కిలోమీటర్లని మన శాస్త్రవేత్తలు ప్రకటించిన సంగతి తెలిసిందే. మన దేశంతో సహా అన్ని దేశాలూ అలాంటివి మరింత వేగంతో, ఎక్కువ దూరం ప్రయాణించేందుకు నిరంతరం పరిశోధనలు జరుపుతూనే ఉంటాయి. ది కంట్రీస్‌ ఆఫ్‌ డాట్‌ కామ్‌ ఆగస్టు ఎనిమిదిన వెల్లడించిన సమాచారం ప్రకారం 2023లో క్షిపణి సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రస్థానంలో వున్న పది దేశాల వరుస ఇలా ఉంది. రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, భారత్‌, ఇజ్రాయెల్‌, పాకిస్థాన్‌, ఇరాన్‌, ఉత్తర కొరియా ఉన్నాయి.మన పొరుగునే ఉన్న పాకిస్థాన్‌ ఇప్పటికే 2,300 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల ఘౌరీ, షాహిన్‌ క్షిపణులను కలిగి ఉంది, వాటిని ఇంకా విస్తరించే పరిశోధనలో ఉంది. దాని దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. అంత మాత్రాన భారతీయులు భయపడాల్సిన అవసరం లేదు. మనకు పాక్‌, చైనా ఎంత దూరమో, మనం కూడా వాటికి అంతేదూరంలో ఉన్నాము.


ఒకరు బాంబులు విసురుతుంటే రెండోవారు గులాబ్‌ జాములు అందిస్తూ స్పందించేంత ఉత్తములు ఈ రోజుల్లో ఎవరూ ఉండరు. అలా ఉండాలన్నా ఉండనివ్వరు. శత్రుదేశాల ఉపగ్రహాల మీద దాడి చేసేందుకు అవసరమైన ఆయుధాలను చైనా రూపొందిస్తున్నట్లు, ఇతర దేశాల ఉప గ్రహాలను అదుపులోకి తెచ్చే సత్తా ఉన్నదని సిఐఏ నివేదించినట్లు బహిర్గతమైన అమెరికా గూఢచార, ఇతర కీలక పత్రాల్లో ఉంది.చైనా ఆయుధాల గురించి సిఐఏ పత్రాలను ఉటంకిస్తూ ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రికలో పేర్కొన్నారు. స్టాక్‌హౌమ్‌ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ(సిప్రి) విడుదల చేసిన 2022 వార్షిక నివేదికలో ప్రపంచంలో మిలిటరీ ఖర్చు కొత్త రికార్డు నెలకొల్పినట్లు పేర్కొన్నది. అంతరిక్షం, సైబర్‌ రంగాలలో అమెరికా ముందున్నది. తాజాగా చంద్రయాన్‌ -3 విజయం, ఇతర ఉపగ్రహాల ప్రయోగాలతో మన దేశం కూడా ధీటుగా ఉండేందుకు అవకాశాలు పెరుగుతున్నాయి. సైబర్‌ నిఘాలో అమెరికా ప్రపంచ ఛాంపియన్‌గా ఉంది. అమెరికాకు చెందిన స్టార్‌లింక్‌ ఉపగ్రహ సమాచార వ్యవస్థ ద్వారా రష్యా సేనల సమాచారం గురించి ఎప్పటికప్పుడు ఉక్రెయిన్‌కు అందచేస్తున్న సంగతి తెలిసిందే. దాని ద్వారా మనతో సహా ఏ దేశ సమాచారాన్నైనా అమెరికా తెలుసుకోవచ్చు. దీని మాతృసంస్థ ఎలాన్‌ మస్క్‌ అధిపతిగా ఉన్న స్పేస్‌ ఎక్స్‌ కంపెనీ ఇప్పటి వరకు 3,580 చిన్న ఉపగ్రహాలను పంపి 53 దేశాలకు సమాచారాన్ని అందచేస్తున్నది, వాటిని పన్నెండువేలకు పెంచాలని కూడా చూస్తున్నది. అంతరిక్షంలో అమెరికా ఆధిపత్యానికి ఇదొక నిదర్శనం.


అమెరికా, అది ఎగదోస్తున్న దేశాలు ఇటీవలి కాలంలో మిలిటరీ ఖర్చు పెంచటం, కొత్త కూటములను కడుతుండటంతో మన దేశం, చైనా కూడా తన ఖర్చును పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్టాక్‌హౌం సంస్థ పరిగణనలోకి తీసుకున్న అంశాల ప్రకారం ప్రపంచంలో 40దేశాలు గణనీయంగా ఖర్చు చేస్తున్నాయి. వాటిలో మన దేశం మూడవ స్థానంలో ఉండగా మన పొరుగునే ఉన్న పాకిస్తాన్‌ 24వదిగా ఉంది. ఏ దేశమైనా మిలిటరీ ఖర్చును పెంచి అది జనాల మీద భారం,జీవితాలు మెరుగుపడే అవకాశం లేదన్నది అనేక దేశాల అనుభవం చెబుతున్నది. ఉగ్రవాదం కారణంగా పక్కనే ఉన్న శ్రీలంక తన వనరులన్నింటినీ ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు గాను మిలిటరీని విపరీతంగా పెంచింది. ఉగ్రవాదులను నిర్మూలించినా వెంటనే దాని మిలిటరీ ఖర్చు వెంటనే తగ్గదని తేలింది.మనతో గిల్లికజ్జాలు పెట్టుకొనే పాకిస్తాన్‌ తలసరి ఖర్చు మనకంటే ఎక్కువే. అది ఇప్పుడు ఆర్థికంగా ఎంత దివాళా తీసిందో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నదో చూస్తున్నదే. మన దేశంలో ఉన్న కొంత మంది చైనాను బూచిగా చూపి మిలిటరీ బడ్జెట్‌ను గణనీయంగా పెంచాలని చెప్పటం వెనుక అమెరికా మిలిటరీ కార్పొరేట్‌ లాబీ ఉందన్నది స్పష్టం.మన జిడిపితో పోలిస్తే చైనా ఐదురెట్లు ఎక్కువ.అందువలన దానితో మిలిటరీ ఖర్చులో మనం పోటీ పడాలంటే వనరులన్నింటినీ మళ్లించాల్సి ఉంటుంది. అది జరిగితే ఆర్థికవృద్ది కుంటుపడుతుంది.అలాగని మన రక్షణ ఏర్పాట్లను నిర్లక్ష్యం చేయనవసరం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బ్రిక్స్‌ సదస్సులో ధనికదేశాలకు షీ జింపింగ్‌ హెచ్చరిక : రంకెలేసి, బలప్రదర్శన చేస్తే కుదరదు !

29 Tuesday Aug 2023

Posted by raomk in Africa, CHINA, COUNTRIES, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

BRICS 2023 Summit, BRICS expansion, BRICS nations, China, Narendra Modi, Vladimir Putin, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఆగస్టు 22 నుంచి 24వ తేదీ వరకు దక్షిణాఫ్రికా నగరమైన జోహన్నెస్‌బర్గ్‌లో ” బ్రిక్స్‌ (బిఆర్‌ఐసిఎస్‌)” కూటమి(బ్రెజిల్‌,రష్యా,ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) పదిహేనవ శిఖరాగ్ర సమావేశం జయప్రదంగా ముగిసింది.అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్‌, సౌదీ అరేబియా,యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ను ఈ కూటమిలో చేరాల్సిందిగా ఆహ్వానం పలికారు, వాటికి అంగీకారమైతే 2024 జనవరి ఒకటవ తేదీ నుంచి పూర్తి స్థాయి సభ్యులుగా పరిగణిస్తారు. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో 2006లో జరిగిన ఒక సమావేశంలో బ్రెజిల్‌, రష్యా,ఇండియా,చైనాలతో ఏర్పడిన ఆర్థిక కూటమిని బ్రిక్‌ అని పిలిచారు. తరువాత 2010లో దక్షిణాఫ్రికా చేరటంతో అది బ్రిక్స్‌ గా మారింది. ఇప్పుడు విస్తరణ బాటలో ఉన్నందున బ్రిక్స్‌ ప్లస్‌ అంటారా లేక మరేదైనా పేరు పెడతారా అన్నది చూడాల్సి ఉంది. బ్రిక్‌ లేదా బ్రిక్స్‌ కూటమి అని పేరు పెట్టటానికి గోల్డ్‌మన్‌ శాచస్‌ కంపెనీ ఆర్థికవేత్త జిమ్‌ ఓ నెయిల్‌ చేసిన వర్ణన ప్రేరణ అని చెబుతారు. ఇలాంటి కూటమి ఏర్పడితే అది 2050 నాటికి ప్రపంచ ఆర్థిక రంగంలో మిగతావాటిని వెనక్కు నెడుతుందని 2001లో జోశ్యం చెప్పాడు. బ్రిక్స్‌ విస్తరణ, దాని తీరు తెన్నులను చూస్తే అంతకంటే ముందే దాని ప్రభావం వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిదానమే ప్రదానం అన్నట్లుగా ముందుకు పోతున్న ఈ కూటమి నేడు పశ్చిమ దేశాల పెత్తనం,తంటాల మారి తనాన్ని ఎదుర్కొనే దిశగా ఉంది. నూతన ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవస్థకోసం చూస్తున్న ఈ కూటమి నడక నల్లేరు మీద బండిలా ఎలాంటి కుదుపులు లేకుండా సాగుతుందని చెప్పలేము. ఈ సమావేశాల్లో లూలా డిసిల్వా(బ్రెజిల్‌),సెర్గీలావరోవ్‌(రష్యా విదేశాంగ మంత్రి),నరేంద్రమోడీ(ఇండియా), షీ జింపింగ్‌ (చైనా), సిరిల్‌ రామఫోసా(దక్షిణాఫ్రికా) పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ మీద అంతర్జాతీయ కోర్టు వారంటు జారీ చేసింది. ఆ కోర్టును రష్యా అంగీకరించలేదు.

బ్రిక్స్‌కు ఆతిధ్యం ఇస్తున్న దక్షిణాఫ్రికా కోర్టు ఒప్పందంలో సభ్యురాలిగా ఉన్నందున తలెత్తే పరిస్థితి కారణంగా పుతిన్‌ హాజరు కాలేదు.
పారిశ్రామిక, సరఫరా గొలుసు నుంచి విడగొట్టుకోవాలి,విచ్చిన్నం, ఆర్థిక బలవంతం చేయాలని చూస్తున్న శక్తుల చర్యలను అడ్డుకోవాలని, చైనా అధినేత షీ జింపింగ్‌ తాజా సమావేశంలో పిలుపునిచ్చారు. ఇదే తరుణంలో డిజిటల్‌ ఎకానమీ, హరిత వృద్ధి,సరఫరా వ్యవస్థల వంటి రంగాలలో ఆచరణాత్మక సహకారం అందించుకోవాలని కోరారు. అంతర్జాతీయ రంగంలో పెద్ద గొంతులేసుకొని, కండల ప్రదర్శనలతో తమ స్వంత నిబంధనలను రుద్దాలని చూస్తున్నవారి తీరు ఆమోదం కాదని, ఐరాస నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.ఒక దేశం- ఒక కూటమి పెత్తనం లేకుండా ముందుకు వస్తున్న బహుముఖ ప్రపంచం, సాంప్రదాయక విలువలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు నూతన ఉదారవాద విధానాలు ముప్పు తెస్తున్నట్లు వీడియో ద్వారా పుతిన్‌ చేసిన ప్రసంగంలో పేర్కొన్నాడు. అమెరికా పేరు పెట్టకుండా దాని గురించే మాట్లాడినట్లు విశ్లేషకులు టీకా తాత్పర్యం చెప్పారు.పశ్చిమ దేశాలు బ్రిక్స్‌ కూటమి తమకు ముప్పుగానూ, జి-7కు పోటీగా దాన్ని మార్చేందుకు చైనా చూస్తున్నదనే అనుమానాలు పశ్చిమ దేశాల్లో రోజు రోజుకూ పెరుగుతున్నాయి. విస్తరణలో భాగంగా చేరుతున్న దేశాలు కూడా పశ్చిమ దేశాల బాధితులే కావటం గమనించాల్సిన అంశం. ప్రపంచంలో ఏ దేశమూ గతంలో మాదిరి ప్రచ్చన్న యుద్ధ వాతావరణలో నడవాలని కోరుకోవటం లేదు.


బ్రిక్స్‌ దేశాల్లోని జనాభా 2022 లెక్కల ప్రకారం 324 కోట్ల మంది, అంటే ప్రపంచంలో నలభై శాతం మంది.భారత్‌, చైనాల్లోనే 382 కోట్ల మంది ఉండగా మిగిలిన మూడింటిలో 42 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచ సాధారణ జిడిపిలో ఈ కూటమి వాటా 2000లో 11.74శాతం కాగా పదేండ్లలో 17.95, 2022 నాటికి 26శాతానికి పెరిగింది. అదే పిపిపి పద్దతిలో చూస్తే 31.5శాతానికి పెరిగి జి7 దేశాల 30శాతాన్ని దాటింది.2028 నాటికే బ్రిక్స్‌ వాటా 50శాతం దాట నుందని అంచనా. ఐఎంఎఫ్‌ సమాచారం ప్రకారం 2000 సంవత్సరం నుంచి 2022కు చూస్తే జనాభా వాటా 43.92 నుంచి 41.42శాతానికి తగ్గింది. ప్రపంచ ఎగుమతుల్లో వాటా 8.2 నుంచి 18, ప్రపంచ వాణిజ్యంలో 7.51 నుంచి 18 శాతానికి, విదేశీ మారకద్రవ్య నిల్వ 281.2 నుంచి 4,581 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఆంక్టాడ్‌ 2023 గణాంకాల ప్రకారం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) 2001-2021 కాలంలో 84 నుంచి 355 బి.డాలర్లకు పెరిగాయి.ఈ మొత్తంలో చైనా వాటా సగానికి పైగా ఉంది. ఒక్క జనాభాలో భారత్‌ ప్రధమ స్థానంలో ఉండటం తప్ప మిగిలిన అన్ని అంశాలలో చైనా ఎంతో ఎత్తున ఉంది.


జోహన్నెస్‌బర్గ్‌ శిఖరాగ్ర సభలో మొత్తంగా భిన్న నేపధ్యాల పూర్వరంగంలో దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక,ప్రపంచ సమస్యలపై ఏకీభావం సాధించేందుకు సంప్రదింపులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న సంకల్పం వెల్లడైంది. సమీకృత అభివృద్ధి,ప్రపంచ సవాళ్లు,దేశాల మధ్య సంబంధాలను పటిష్టపరుచుకోవాలన్న వాంఛను నేతలు వెలిబుచ్చారు. సభ జరిగింది ఆఫ్రికా ఖండంలో గనుక సహజంగానే దాని ఇతివృత్తానికి కేంద్ర స్థానం లభించింది.ప్రపంచ పేద దేశాలు ప్రత్యేకించి ఆఫ్రికా దేశాలతో సంబంధాలు, సహకారం గురించి నేతలందరూ మాట్లాడారు. ఈ సభకు పుతిన్‌ రాకపోవటం గురించి పశ్చిమ దేశాల్లో ఇంకేముంది బ్రిక్స్‌లో విబేధాలు, రష్యా పలుకుబడికి గండిపడింది అన్నట్లుగా విశ్లేషణలను వండివార్చారు. ముందే చెప్పుకున్నట్లు ఆతిధ్య దేశాన్ని ఇరకాటంలో పెట్టకూడదన్న పరిణితి పుతిన్‌, ఇతర దేశాధినేతల్లో వెల్లడైంది.స్వయంగా హాజరు బదులు వీడియో కాన్ఫరెన్సుద్వారా పాల్గొని నిర్ణయాల్లో భాగస్వామి అయ్యారు. బ్రిక్స్‌ను విస్తరించాలన్న ఆలోచన కొత్తగా వచ్చింది కాదు.2013లో దక్షిణాఫ్రికా అధ్యక్ష స్థానంలో ఉన్నపుడు ఆఫ్రికా యూనియన్‌కు స్థానం కల్పించాలని కోరింది. తరువాత 2017లో బ్రిక్స్‌ ప్లస్‌(బ్రిక్స్‌తో పాటు ఇతర దేశాలు) అన్న భావనను చైనా ముందుకు తెచ్చింది. తమకు సభ్యత్వం ఇవ్వాలని ఇరాన్‌, అర్జెంటీనా దరఖాస్తు చేసుకోవటంతో 2022లో బ్రిక్స్‌ సూత్ర ప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో మొత్తం నలభై దేశాలు ఆసక్తి వెల్లడించటంతో పాటు 23 లాంఛనంగా దరఖాస్తు చేశాయి. వాటిని పరిశీలించి పైన పేర్కొన్న ఆరు దేశాలకు వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి పూర్తి స్థాయి సభ్యత్వం ఇచ్చేందుకు నిర్ణయించారు.


ప్రపంచ జనాభాలో ఈ కూటమి దేశాల్లో 46.5శాతానికి, జిడిపి 30శాతానికి పెరగనుంది. దేశాల వారీగా జిడిపి బిలియన్‌ డాలర్లలో, బ్రాకెట్లలో ప్రపంచంలో దేశ వాటా శాతాలు దిగువ విధంగా ఉన్నాయి. చైనా 19,374(18.4), భారత్‌ 3,737(3.6), బ్రెజిల్‌ 2,081(2), రష్యా 2,063(2), సౌదీ అరేబియా 1,062(1), అర్జెంటీనా 641(0.6), యుఏఇ 491(0.5) దక్షిణాఫ్రికా 399(0.4), ఈజిప్టు 387(0.4), ఇరాన్‌ 368(0.4), ఇథియోపియా 156(0.1)బి.డాలర్లు. విస్తరణతో ఈ కూటమి దేశాల చమురు వాటా ప్రపంచంలో 20.4 నుంచి 43.1శాతానికి పెరగనుంది.ప్రపంచంలో దేశాల వాటాల శాతాలు ఇలా ఉన్నాయి. సౌదీ అరేబియా 12.9, రష్యా 11.9,చైనా 4.4, యుఏఇ 4.3, ఇరాన్‌ 4.1, బ్రెజిల్‌ 3.3శాతం కాగా అర్జెంటీనా, భారత్‌ 0.8శాతం చొప్పున, ఈజిప్టు 0.7శాతం కలిగి ఉండగా దక్షిణాఫ్రికా, ఇథియోపియాల్లో అసలేమీ లేదు. ప్రపంచ సహజవాయువులో 30శాతం కలిగి ఉన్నాయి, ప్రపంచ చమురు ఎగుమతుల్లో వాటా 18 నుంచి 25.1శాతానికి పెరగనుంది. ప్రపంచ ఆర్థికరంగం మీద పెత్తనం చేస్తున్న డాలరును వెనక్కు నెట్టి బ్రిక్స్‌ కరెన్సీని ప్రవేశపెట్టాలన్న ఆలోచన మీద కూడా జోహన్నెస్‌బర్గ్‌ సమావేశాల్లో చర్చ జరిగింది. కొన్ని దేశాల సందేహాల కారణంగా ముందుకు పోలేదు.ఉమ్మడి కరెన్సీని పంచుకోవటం గురించి బ్రెజిల్‌ ప్రతిపాదన ముందుకు తేడా మనదేశం భిన్న వైఖరిని వెల్లడించింది. ఈ అంశం ప్రస్తుత సమావేశ అజెండాల్లో లేదని దక్షిణాఫ్రికా పేర్కొన్నది. డాలర్లకు బదులు ఆయా దేశాల కరెన్సీలతో లావాదేవీలు జరపాలని చైనా, రష్యా పేర్కొన్నాయి. అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఈ దేశాలు సహజంగా డాలరును వ్యతిరేకిస్తున్నాయి.డాలర్లలో లావాదేవీల వాటా 2015లో వాటి వాటా 90శాతం ఉండగా 2020 నాటికి 46శాతానికి, తరువాత ఇంకా తగ్గింది. మన దేశం మాత్రం ఎగుమతులు-దిగుమతులకు 80శాతం డాలర్లనే వాడుతున్నది.


ప్రస్తుత విస్తరణ, రానున్న రోజుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న దేశాల పెరుగుదలను చూసినపుడు ప్రపంచ బలాబాల్లో ఈ కూటమి కీలకంగా మారనున్నదనేది స్పష్టం.మనదేశం, చైనాతో సహా మిగిలిన దేశాలన్నీ బహుముఖ ప్రపంచ వ్యవస్థ ఉండాలని కోరుతున్నాయి. ఈ కూటమిలో ఉన్న దేశాల ఆర్థిక రంగాలను చూసినపుడు తేడా చాలా ఎక్కువగా ఉంది. అందువలన వాటి ప్రయోజనాలు, ప్రాధాన్యతలు కూడా వేరుగా ఉంటాయి. ఉదాహరణకు మన దేశం చైనాను అధిగమించాలని చూస్తున్నట్లు బహిరంగంగానే వాంఛ వెల్లడిస్తున్నది.వివాదాస్పద అంశాలపై కూడా ఈ కూటమిలో పూర్తి ఏకీభావం లేనందున అంగీకృత అంశాల మీదనే కేంద్రీకరణ జరుగుతున్నది. ఇండో-పసిఫిక్‌ పేరుతో చైనా వ్యతిరేక కూటమి నిర్మాణానికి పూనుకున్న అమెరికాకు దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్చగా నౌకలు తిరిగేందుకు అవకాశం ఉండాలంటూ మన దేశం మద్దతు ఇస్తున్నది. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలను సమర్ధించనప్పటికీ అమెరికాకు ఆగ్రహం కలగకుండా ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు నిలిపివేసిన సంగతి తెలిసిందే.ఒక విధంగా చెప్పాలంటే ఎవరికీ నొప్పి తగలకూడదనే వైఖరితో మన దేశం గడసాము గరిడీలు చేస్తున్నది.


లండన్‌లోని సోయాజ్‌ చైనా సంస్థ డైరెక్టర్‌ స్టీవ్‌ సాంగ్‌ మాట్లాడుతూ బ్రిక్స్‌ సభ్యదేశాలు ఉపరితలంతో ఒకేవిధంగా లేవని, అయినప్పటికీ ఎవరూ పశ్చిమ దేశాల ఆధిపత్య ప్రపంచంలో జీవించకూడదని అందరూ అనుకుంటున్నట్లుగా చూపేందుకు షీ జింపింగ్‌ చూశారని, చైనా వారు చూపుతున్న ప్రత్యామ్నాయంలో నిరంకుశులు తమ స్వంత దేశాల్లో సురక్షితంగా ఉండవచ్చని, ప్రజాస్వామిక అమెరికా, ఐరోపా దేశాలు రుద్దిన షరతులను అంగీకరించకుండా ప్రత్యామ్నాయ అభివృద్ధి పధాన్ని కనుగొనవచ్చనే భావన ఉన్నదని అన్నాడు. తమకు గానీ మరొక దేశానికి గానీ ప్రత్యర్ధిగా రాజకీయ ప్రత్యర్ధి తయారవుతున్నట్లుగా తాము భావించటం లేదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సులవాన్‌ సమావేశ ప్రాధాన్యతను తక్కువ చేసి చూపేందుకు, వక్రీకరించేందుకు చూశారు.కొత్తగా బ్రిక్స్‌లో చేరిన ఆరు దేశాల్లో ఏ ఒక్కటీ అమెరికా వ్యతిరేకమైనది లేదని వాషింగ్టన్‌లోని క్విన్సీ సంస్థ డైరెక్టర్‌ సరంగ్‌ షిడోర్‌ అన్నాడు.ఈ సమావేశాల తరువాత పశ్చిమ దేశాలకు చెందిన విశ్లేషకులు, మీడియా వార్తల తీరు వక్రీకరణ, కూటమిలో అనుమానాలను రేకెత్తించేదిగా తంపులు పెట్టేదిగా ఉందని చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d